breaking news
Sri Sathya Sai
-
రీసర్వేతో భూములు గుర్తించడం సులభం
హిందూపురం: భూమి సర్వేనంబర్లు గుర్తించాడన్ని హక్కుదారులకు సులభతరం చేయడానికే ప్రభుత్వం రీసర్వే చేస్తోందని జాయింట్ కలెక్టర్ అభిషేక్కుమార్ అన్నారు. గురువారం హిందూపురం మండలంలోని తూమకుంట పంచాయతీ పరిసరాల్లో భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అడంగళ్ ఆధారంగా సర్వేనంబర్లు భూమి విస్తీర్ణం వంటి వివరాలను రెవెన్యూఅధికారులు, రికార్డులను పరిశీలించారు. లేపాక్షి: లేపాక్షి పంచాయతీలో జరుగుతున్న భూ రీసర్వేను జాయింట్ కలెక్టర్ అభిషేక్కుమార్ గురువారం పరిశీలించారు. ఎంతమేరకు సర్వే నిర్వహించారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది బదిలీపై వెళ్లడంతో కొత్త టీంను పెనుకొండ, హిందూపురం మండలాల నుండి నియమించి రీసర్వేను వేగవంతం చేయాలని తెలిపారు. రాజకీయ పార్టీలతో సమావేశం.. హిందూపురం: ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, సమర్థత, ప్రజల నైతిక భాగస్వామ్యం పెంపొందించడమే లక్ష్యంగా ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తోందని ఎలెక్షన్ రిజిస్ట్రేషన్ అధికారి, జాయింట్ కలెక్టర్ అభిషేక్కుమార్ అన్నారు. గురువారం తహసీల్దార్ కార్యాలయంలో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అన్ని రాజకీయపార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కొత్తగా ఏర్పాటు చేయాల్సిన పోలింగ్ స్టేషన్లు, బూత్ రేషనలైజేషన్, తదితర వాటిపై చర్చించారు. ఫారమ్ 6 ద్వారా 18 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు ఓటుహక్కు నమోదు చేసుకోవచ్చునన్నారు. పార్టీల ప్రతినిధులు తమ ప్రాంతాల్లో పౌరులకు అవగాహన కల్పించి ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం పొందేలా కృషిచేయాలని సూచించారు.కార్యక్రమములో తహసీల్దార్లు వెంకటేష్, సౌజన్యలక్ష్మి, నటరాజ్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, డిప్యూటీ తహసీల్దార్ మైనుద్దీన్, ఆర్ఐ అమరేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
వెంటాడిన మృత్యువు
పెనుకొండ రూరల్: బతుకు తెరువు కోసం కర్ణాటక నుంచి వలస వచ్చిన వ్యక్తిని ప్రమాదం రూపంలో వెంటాడి మృత్యువు కబళించింది. స్థానికులు తెలిపిన మేరకు.. కర్ణాటకలోని బళ్లారికి చెందిన ఫకృద్దీన్ (36), ఫర్హానా దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మూడేళ్ల క్రితం బతుకు తెరువు కోసం పెనుకొండకు వలస వచ్చాడు. పంచర్ షాఫును నిర్వహిస్తు కుటుంబాన్ని పోషించుకొనేవాడు. ఈ క్రమంలో రెండు వారాల క్రితం దుద్దేబండ మలుపు సమీపంలో 44వ జాతీయ రహదారి పక్కన పంచర్ షాపును ఏర్పాటు చేసుకున్నాడు. రోజు లాగే గురువారం పంచర్ షాపును తెరిచి తన పనిలో నిమగ్నమైన సమయంలో ఊహించని రీతిలో మృత్యువు వెంటాడింది. బెంగళూరు నుంచి అనంతపురం వైపు వెళుతున్న లారీ అదుపుతప్పి డివైడర్ను ఢీ కొని నేరుగా పంచర్ షాపు వైపుగా దూసుకెళ్లింది. షాపు ముందు పని చేసుకుంటున్న ఫకృద్దీన్పై బోల్తాపడింది. ఘటనలో ఫకృద్దీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన కుమారుడు ముస్తాక్ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. సమాచారం అందుకున్న కియా పీఎస్ ఎస్ఐ రాజేష్ అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. నీటి కుంటలో పడి వృద్ధురాలి మృతి పరిగి: మండలంలోని శీగిపల్లికి చెందిన గంగమ్మ(74) నీటి కుంటలో పడి మృతి చెందింది. కుమారుడు హనుమంతరాయప్ప కుటుంబంతో కలిసి నివాసముంటున్న ఆమె గురువారం ఉదయం బహిర్భూమికి వెళ్లిన సమీపంలో ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడిపోయింది. గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. హనుమంతరాయప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. వ్యక్తి ఆత్మహత్యధర్మవరం: స్థానిక మారుతీనగర్కు చెందిన మంచిరెడ్డి రామ్మోహన్రెడ్డి(45) గురువారం సాయంత్రం పోతుకుంట వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లమాడ పంచాయతీరాజ్ కార్యాలయంలో కాంట్రాక్ట్ పద్ధతి కింద కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆయనకు భార్య మాధవి, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై హిందూపురం రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి అదృశ్యం కొత్తచెరువు: మండలంలోని నారేపల్లి గ్రామానికి చెందిన గజ్జి ప్రశాంత్ కుమార్ కనిపించడం లేదని తండ్రి క్రిష్టప్ప ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు కొత్తచెరువు పీఎస్ సీఐ మారుతీ శంకర్ తెలిపారు. వివరాలు... పల్నాడు జిల్లా మాచర్లలో బీటెక్ చదువుతున్న ప్రశాంత్కుమార్.. కొన్ని రోజులు క్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఈ నెల 19న కళాశాలకు తిరుగు ప్రయాణమయ్యాడు. అయితే కళాశాలకు ప్రశాంత్ చేరుకోలేదని తెలుసుకున్న కుటుంబసభ్యులు గాలింపు చేపట్టినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో తండ్రి ఫిర్యాదు మేరకు గురువారం మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నలుగురు విద్యార్థుల అదృశ్యం అనంతపురం: నగరంలోని మూడో రోడ్డులో ఉన్న బీసీ బాలుర హాస్టల్–2లో ఉంటూ ఒకటో రోడ్డులో ఉన్న పొట్టిశ్రీరాములు ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న నలుగురు విద్యార్థులు కనిపించకుండా పోయారు. వీరిలో పదో తరగతి చదువుతున్న నార్పల మండలం నడిమిదొడ్డి గ్రామానికి చెందిన బాబు, కూడేరు మండలం అరవకూరు గ్రామానికి చెందిన జి.నవదీప్, 8వ తరగతి చదువుతున్న గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామానికి చెందిన ఎస్.మణికంఠ, తొమ్మిదో తరగతి చదువుతున్న శ్రీసత్యసాయి జిల్లా తోటమాకులపల్లి గ్రామానికి చెందిన కె.మణికంఠ ఉన్నారు. పాఠశాలకు సక్రమంగా హాజరు కాకపోవడంత పాటు.. పాఠ్యాంశాలల్లో వెనుకబడి ఉండడంతో గురువారం హెచ్ఎం శ్రీదేవి మందలించారు. దీంతో మధ్యాహ్నం పాఠశాల నుంచి బయటకు వెళ్లిపోయిన విద్యార్థులు ఆ తర్వాత హాస్టల్కు కూడా చేరలేదు. గమనించిన వార్డెన్ మస్తాన్ వెంటనే అప్రమత్తమై పాఠశాలలో ఆరా తీశాడు. మధ్యాహ్నం నుంచి వారు తరగతులకు హాజరు కాలేదని తెలుసుకుని వెంటనే చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చేపట్టాడు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో రాత్రి మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టినట్లు సీఐ కె.శాంతిలాల్ తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 94906 18679కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. కనిపించకుండా పోయిన విద్యార్థులు -
ఎంపీఈఓల సర్దుబాటుపై కసరత్తు
అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి జిల్లా పరిధిలో పనిచేస్తున్న 189 ఎంపీఈఓలను సర్దుబాటు చేయడానికి వ్యవసాయశాఖ అధికారులు కసరత్తు చేపట్టారు. గురువారం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో జేడీఏ ఉమామహేశ్వరమ్మ సమక్షంలో ఏడీఏలు, టెక్నికల్ ఏఓలు, సూపరింటెండెంట్లు హాజరై రేషనలైజేషన్ ఆధారంగా... ఇటీవల వీఏఏలు, వీహెచ్ఏలు, వీఎస్ఏల బదిలీలను దృష్టిలో ఉంచుకుని ఎంపీఈఓలను నియమించేందుకు చర్యలు చేపట్టారు. ఏడీఏల ప్రతిపాదనలను పరిగణలోకి ఖాళీగా ఉన్న ఆర్ఎస్కేలకు కొందరిని, పంటల విస్తీర్ణం అధికంగా ఉన్న ప్రాంతాలకు మరికొందరిని సర్దుబాటు చేయనున్నారు. సమావేశంలో ఏడీఏలు అల్తాఫ్అలీఖాన్, వెంకటరాముడు, సత్యనారాయణ, పద్మజ తదితరులు పాల్గొన్నారు. ఆదాయ పన్ను చెల్లింపుతోనే దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చిలమత్తూరు: ఆదాయం పొందే ప్రతి ఒక్కరూ పన్ను చెల్లించినప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని ఆదాయపు పన్ను శాఖ అధికారులు పి.రవి, శరత్కుమార్, లక్ష్మీకాంత్ పేర్కొన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ డేను పురస్కరించుకుని ఆదాయపు పన్ను చెల్లింపులపై ఆదాయపు పన్ను శాఖ ఆధ్వర్యంలో హిందూపురంలోని వివేకానంద మిలీనియం పాఠశాలలో గురువారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. పౌరులు ఆదాయపు పన్ను చెల్లింపు అంశంలో బాధ్యతతో వ్యవహరించాలన్నారు. ఈ విషయంగా తల్లిదండ్రులను చైతన్య పరచాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటి నీరు పోశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ హరీష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
మానవాళి మహానేస్తాలు చిత్రం ఆవిష్కరణ
ధర్మవరం అర్బన్: సమాజాభివృద్ధికి కొత్త బాటలు వేసిన 102 మంది ప్రపంచ మేధావులతో కూడిన చిత్రపటాన్ని ధర్మవరంలోని కేహెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ఆవిష్కరించారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ.. సమాజాన్ని మేలుకొల్పేవారే నిజమైన వైతాళికులన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆల్బర్ట్ ఐన్స్టిన్, మహాత్మాగాంధీ, విలియం షేక్స్పియర్, మదర్థెరిస్సా, ఆల్బర్ట్ నోబెల్, విన్స్టన్ చర్చిల్, నెపోలియన్, రవీంద్రనాథ్ ఠాగూర్, కారల్ మార్క్స్, కన్ఫ్యూషియస్, లెనిన్, పికాసో, కోఫీఅన్నన్ వంటి పేరు గాంచిన కవులు, రచయితలు, కళాకారులు, సంఘ సంస్కర్తలు, సామాజిక, శాస్త్ర సాంకేతిక, వైజ్ఞానిక, తత్వ రాజకీయ, క్రీడా, వ్యాపార, ఆర్థిక విద్యావేత్తలతో కూడిన 102 మంది మేధావుల చిత్రాలు ఆకట్టుకుంటున్నాయన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ గోపాల్నాయక్, వైస్ ప్రిన్సిపాల్ చిట్టెమ్మ, అధ్యాపకులు త్రివేణి, షమీవుల్లా, పావని, హైమావతి, వెంకటలక్ష్మి, తాహిర్ఆలి, ఆనంద్, మీన, ధనుంజయ తదితరులు పాల్గొన్నారు. డి.చెర్లోపల్లిలో పర్యటించిన కేంద్ర బృందం బత్తలపల్లి: స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్లో భాగంగా కేంద్ర బృందం సభ్యులు గురువారం బత్తలపల్లి మండలం డి.చెర్లోపల్లిలో పర్యటించారు.ప్రాథమికోన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మసీదు, గ్రామ సచివాలయం, చెత్తతో సంపద తయారీ కేంద్రంతో పాటు గ్రామంలోని గృహాలు, మరుగుదొడ్లను, నీటివసతి, పరిసరాలు పరిశుభ్రతను, మురుగునీటి నిర్వహణను ప్రత్యక్షంగా పరిశీలించారు. కార్యక్రమంలో కేంద్ర బృందం సభ్యుడు బి.రామచంద్ర, జిల్లా ఎస్బీఎం కోఆర్డినేటర్లు వి.శ్రీనివాసులు, డి.సాయినాథ్బాబు, మండల అధికారులు ఎంపీడీఓ నరసింహనాయుడు, ఈఓఆర్డీ క్రిష్టప్ప, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ జ్యోతిబాయి, గ్రామ సర్పంచ్ గుజ్జల రమాదేవి, పంచాయతీ కార్యదర్శి నారాయణస్వామి, ఎంసీఓ ఆదినారాయణరెడ్డి, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించండి ● సీటీఐఓ లక్ష్మానాయక్ అనంతపురం అగ్రికల్చర్: ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నాచురల్ ఫార్మింగ్ (ఎన్ఎఫ్) చీఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ (సీటీఐఓ) వి.లక్ష్మానాయక్ అన్నారు. స్థానిక జెడ్బీఎన్ఎఫ్ కార్యాలయంలో రాష్ట్రంలో వివిధ జిల్లాలకు చెందిన డీపీఎంయూ సిబ్బందికి 8 రోజుల వర్క్షాపు గురువారం ప్రారంభమైంది. నేలలు, రకాలు, ఆగ్రో క్లైమాటిక్ జోన్స్, జలవనరులు, ప్రాజెక్టులు, రైతుల అవసరాలు, ప్రకృతి వ్యవసాయ ఆవిష్కరణలు, ఏటీఎం, ఏ–గ్రేడు, పీఎండీఎస్, డాక్టర్ పీఎం, రుతుపవనాలు, వర్షపాతం, తేమశాతం, నేలల్లో తేమ సంరక్షణా విధానం, మానవులు, పశువుల మధ్య వ్యవసాయ సంబంధాలు తదితర అంశాలపై ఈనెల 24 వరకు వర్క్షాపు ఉంటుందని తెలిపారు.ఈ సందర్భంగా లక్ష్మానాయక్ మాట్లాడారు. సాధ్యమైనంత ఎక్కువ మంది రైతులను ప్రకృతి వ్యవసాయం చేపట్టేలా ప్రోత్సహించాలన్నారు. విచ్చలవిడి రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం వల్ల అధిక పెట్టుబడులు, తగ్గుతున్న దిగుబడులు కారణంగా రైతులకు వ్యవసాయం భారమవుతున్న తరుణంలో ప్రకృతి వ్యవసాయ విధానాలు పాటించడమే శరణ్యమన్నారు. ఏడాది పొడవునా పంటలు పండించే పద్ధతులు తెలియజేయాలన్నారు. -
ఆహార భద్రతా ప్రమాణాలు పాటించాలి
పుట్టపర్తి టౌన్: రెస్టారెంట్లు, హోటళ్లలో యజమానులు ఆహార భద్రతా ప్రమాణాలు పాటించాలని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి రామచంద్రయ్య సూచించారు. గురువారం పుట్టపర్తి మున్సిపాలిటీలో రెస్టారెంట్లు, హోటళ్లు, ఫాస్ట్ పుడ్ సెంటర్లను మున్సిపాలిటీ అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హోటళ్లు, రెస్టారెంట్ల యమానులు పరిశభ్రత పాటిస్తూ తిను బండారాలపై దృష్టి సారించాలన్నారు. సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు దేశ విదేశాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పుట్టపర్తి విచ్చేయనున్నారని, వారికి ఇబ్బంది కలగకుండా సరసమై ధరలతో,నాణ్యమైన భోజనం అందించాలన్నారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవన్నారు. -
మండల సర్వేయర్పై పచ్చ దౌర్జన్యం
బత్తలపల్లి: అధికారంలో ఉన్నాం కాబట్టి అందరూ తమ మాటే వినాలనే ధోరణితో మండల సర్వేయర్పై టీడీపీ నాయకులు దౌర్జన్యానికి తెరలేపారు. మాట వినకపోతే నానా దుర్భాషాలు ఆడుతూ రెచ్చిపోయారు. గురువారం బత్తలపల్లిలోని తహసీల్దార్ కార్యాలయంలో, తహసీల్దార్ స్వర్ణలత సమక్షంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు.. మాల్యవంతం పంచాయతీ పరిధిలోని ఎం.చెర్లోపల్లికి చెందిన టీడీపీ సానుభూతిపరులు రేవతి, గంగాదేవి, లక్ష్మీదేవి, నారాయణమ్మ, ఓబులేసు, నిర్మలమ్మకు 2002లో సర్వే నంబర్ 31–6 లో డీ పట్టాలను అప్పటి ప్రభుత్వం పంపిణీ చేసింది. అయితే ఆ భూములు సాగు చేయకుండా బీడుగా ఉంచుకోవడంతో అదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ సానుభూతిపరులు చిన్న వెంకటరెడ్డి, పెద్ద వెంకటరెడ్డి గత ఆరేళ్లుగా చీనీ చెట్లు సాగు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ భూమిలో సాగులో ఉన్న తమ పేరున పట్టాలు ఇవ్వాలంటూ చిన్న వెంకటరెడ్డి, పెద్ద వెంకటరెడ్డి ఇటీవల స్పందన కార్యక్రమంలో అర్జీ ఇచ్చారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్వేయర్ జోసఫ్ ఆ గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. రైతులకు డి.పట్టా ఉందని, పట్టాదారు పాసుపుస్తకం ఉందని అయితే భూమి సాగులో లేరని, పెద్ద వెంకటరెడ్డి, చిన్న వెంకటరెడ్డి ఇరువురి వద్ద ఎలాంటి పత్రాలు లేకపోయినా వారు ఆ భూమిలో సాగులో ఉన్నట్లు నివేదికను తహసీల్దార్కు అందజేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం తహసీల్దార్ కార్యాలయం చేరుకుని నిలదీశారు. ఆ భూమిపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించామని, ఈలోపు మీరేందుకు సర్వే చేశారంటూ మండిపడ్డారు. తహసీల్దార్ ఎంత సర్ది చెప్పబోయినా వినలేదు. పరిస్థితి అదుపు తప్పి దాడికి తెగబడే అవకాశముండడంతో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని టీడీపీ నాయకులు, రైతులకు సర్దిచెప్పారు. అనంతరం టీడీపీ నేతలు, మండల సర్వేయర్ వాదనలను తహసీల్దార్ స్వర్ణలత విని సమస్య పరిష్కారానికి శుక్రవారం గ్రామానికి రానున్నట్లు తెలిపారు. రైతులు నష్టపోకుండా న్యాయం జరిగేలా చూస్తామన్నారు. -
హామీలపై కూటమిని నిలదీయండి
పరిగి: ‘ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా సుపరిపాలన పేరుతో కూటమి నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. ఎక్కడికక్కడ వారిని నిలదీయండి’ అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ అన్నారు. పరిగి మండలంలో గురువారం రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమంలో భాగంగా విట్టాపల్లి, పీ నరసాపురం, కొడిగెనహళ్లి మేజర్ పంచాయతీ బిందూనగర్, మోదా గ్రామాల్లో ‘బాబు ష్యూరిటీ...మోసం గ్యారెంటీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఒరగబెట్టిందేమీలేదని, కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితమైందని విమర్శించారు. యువతకు ఉపాధి ఎక్కడా? ఈ ప్రాంతంలోని ప్రీకాట్ మెరీడియన్ స్పిన్నింగ్ మిల్లు మూత పడిందన్నారు. అధికారంలోకి వస్తే ఉపాధి అవకాశాలను మెరుగు పరిచి, చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధిని కల్పిస్తామని నమ్మబలికించి ఇలా ఉన్న ఉద్యోగాలను ఊడగొడట్టేందుకే మీకు అవకాశమిచ్చారా అంటూ మంత్రి సవితపై ధ్వజమెత్తారు. బీసీ సంక్షేమశాఖ మంత్రిగా ఉంటూ కనీసం బీసీలకు ఏమాత్రం న్యాయం చేశారో మంత్రి సవిత ఆత్మ విమర్శ చేసుకోవాన్నారు. దళిత బాలికకు ఏం న్యాయం చేశారు? రాష్ట్రాన్ని కుదిపేసిన ఏడు గుర్రాలపల్లిలో ఓ దళిత బాలికపై జరిగిన అత్యాచార ఘటనపై హోం మంత్రి అనిత స్పందించకపోవడం దారుణమన్నారు. ఇటీవల ఆమె మడకశిరలో పర్యటించినప్పటికీ రాప్తాడు నియోజకవర్గంలో జరిగిన సంఘటనపై స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ కూటమి ప్రభుత్వం చట్ట వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతోందని విమర్శించారు. కేవలం వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించడానికి మాత్రమే మంత్రులు పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బెదిరింపులకు భయపడే వారెవరూ వైఎస్సార్సీపీలో లేరని.. తప్పు చేసింటే నేడు ప్రజలతో ఇలా మమేకమయ్యే పరిస్థితి ఉండేది కాదన్నారు. నిత్యం అబద్దాలతో కూటమి నాయకుల చేస్తున్న వాగ్ధానాలను నమ్మవద్దని హితవుపలికారు. కార్యక్రమాల్లో మండల కన్వీనర్ నరసింహమూర్తి, ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సుపరిపాలన పేరుతో టీడీపీ దుష్ప్రచారం బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత ప్రగల్బాలకే పరిమితం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ -
ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలి
మడకశిర: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సరిహద్దు నియోజకవర్గాల ప్రజలకు రాయదుర్గం – తుమకూరు రైల్వేలైన్ ఎంతో ఉపయోగకరం ఉంటుంది. ఇది పూర్తయితే సరిహద్దులో ఆంధ్ర–కర్ణాటక మధ్య రవాణా సౌకర్యం పూర్తిగా మెరుగుపడుతుంది. అలాగే సరిహద్దు నియోజకవర్గాల రైతులు ఉత్పత్తి చేసే వ్యవసాయోత్పత్తులను తుమకూరు, బెంగళూరు మార్కెట్లకు తరలించి గిట్టుబాటు ధరకు అమ్మకోవడానికి సులభంగా ఉంటుంది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ రైల్వేలైన్ నిర్మాణాన్ని పూర్తిచేయడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో.. రాయదుర్గం–తుమకూరు రైల్వేలైన్ నిర్మాణానికి 2011 అక్టోబర్లో శంకుస్థాపన చేశారు. అప్పట్లో కేంద్రంలో అధికారంలో యూపీఏ ప్రభుత్వం ఈ రైల్వేలైన్ను మంజూరు చేసింది. ఇది పూర్తయితే కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు నుంచి బెంగళూరు, ఇతర ముఖ్య పట్టణాలతో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సరిహద్దు నియోజకవర్గాలకు అనుసంధానం ఏర్పడి రవాణా సౌకర్యం మరింత మెరుగవుతుందనే ఉద్దేశంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం రైల్వేలైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కేవలం 83 కిలో మీటర్లే పూర్తి.. రైల్వేలైన్ మంజూరై దాదాపు 14 ఏళ్లు కావస్తోంది. మొత్తం 206.53 కిలోమీటర్ల రైల్వేలైన్లో ఇంత వరకూ కేవలం 83 కిలోమీటర్ల రైల్వేలైన్ మాత్రమే పూర్తయింది. మిగిలిన 123.53 కిలోమీటర్ల రైల్వేలైన్ పూర్తి కావాల్సి ఉంది. ఇందులో కూడా పావగడ, మడకశిర, తుమకూరు నియోజకవర్గాల్లో 49 కిలోమీటర్ల రైల్వేలైన్ పనులు మాత్రమే జరుగుతున్నాయి. ఈ పనులు కూడా నత్తనడకన జరుగుతున్నాయి. అసలు 79.53 కిలోమీటర్ల రైల్వేలైన్ పనులు ప్రారంభం కాలేదు. ప్రస్తుతం ఈరైల్వేలైన్లో కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కదిరేదేవరపల్లి వరకు మాత్రమే ఒక రైలు నడుస్తోంది. అలాగే కదిరిదేవరపల్లి నుండి పావగడ నియోజకవర్గంలోని దొడ్డహళ్లి వరకు రైల్వేలైన్ నిర్మాణం పూర్తయింది. రైల్వే అధికారులు రైలును ట్రయల్ రన్ కూడా పూర్తి చేసిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ మడకశిర నియోజకవర్గంలో రైల్వేలైన్ నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పూర్తిస్థాయిలో సహకారం అందించారు. భూసేకరణలో జాప్యం జరగకుండా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. మడకశిర ప్రాంతంలో రైల్వేలైన్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ చేసి సకాలంలో రైల్వేశాఖకు అప్పగించిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుంది. భూములిచ్చిన రైతులకు జాప్యం చేయకుండా నష్టపరిహారం అందించారు. ఈ నేపథ్యంలోనే రైల్వేలైన్ నిర్మాణానికి అవకాశం ఏర్పడింది. గడువులోపు కష్టమే.. కర్ణాటక రాష్ట్రంలోని మధుగిరి, కొరటగెరె నియోజకవర్గాల్లో ఈరైల్వేలైన్ పనులు ఇంత వరకు ప్రారంభం కాలేదు. మధుగిరి నియోజకవర్గానికి ఆరాష్ట్ర సహకారశాఖ మంత్రి రాజన్న, కొరటగెరె నియోజకవర్గానికి ఆ రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర్ ప్రాతినిథ్యం వహిస్తున్నా ఆ నియోజకవర్గాల్లో రైల్వేలైన్ పనులు ప్రారంభం కాకపోవడం గమనార్హం. రైల్వేలైన్ నిర్మాణానికి అవసరమైన భూమిని సమయానికి సేకరించి రైల్వేశాఖకు అప్పగించడంలో కర్ణాటక ప్రభుత్వం విఫలం కావడంతో ఈపరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గాల్లో కూడా భూసేకరణ పూర్తయింది. ఈ రైల్వేలైన్ నిర్మాణం 2026లోగా పూర్తి చేయాల్సి ఉంది. కొన్ని చోట్ల ప్రారంభం కాకపోవడంతో గడువులోపు పూర్తి కావడం కష్టమేనని రైల్వే అధికారులే చెబుతున్నారు. కేంద్ర మంత్రి హామీ ఇచ్చినా.. మడకశిర నియోజకవర్గానికి ఆనుకునే కర్ణాటక రాష్ట్రానికి చెందిన తుమకూరు లోకసభ నియోజకవర్గం నుంచే కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి సోమన్న ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఏడాది క్రితమే రైల్వేశాఖమంత్రి సోమన్న మడకశిరలో పర్యటించి రైల్వేలైన్ పనులను పరిశీలించారు. రెండేళ్లలోగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆయన పర్యటించి ఏడాది గడుస్తున్నా మడకశిర వద్ద రైల్వేలైన్ పనుల్లో ఎలాంటి పురోగతి లేదు. రాయదుర్గం– తుమకూరు రైల్వేలైన్ నిర్మాణంలో తీవ్ర జాప్యం 206 కి.మీలకు గాను కేవలం 86 కి.మీటర్లే పూర్తి 14 ఏళ్లుగా సా...గుతున్న పనులు గడువు ముంచుకొస్తున్నా పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల కల నెరవేర్చండి రాయదుర్గం–తుమకూరు రైల్వేలైన్ నిర్మాణంతో అంతర్ రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. ప్రధానంగా బెంగళూరు, బళ్లారి వెళ్లేందుకు సరిహద్దు నియోజకవర్గ ప్రజలకు సులభమవుతుంది. మడకశిర ప్రజలు రైల్వే సేవలు పొందే కల కూడా నెరవేరుతుంది. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా రైల్వేలైన్ పనులు పూర్తి అయ్యే విధంగా చూడాలి. – అశ్వత్థనారాయణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, మడకశిరరైల్వేలైన్ నిర్మాణంపై ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలి. ఈ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే సరిహద్దు నియోజకవర్గాల రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఈ ప్రాంతం రైతులు తమ వ్యవసాయోత్పత్తులను తుమకూరు, బెంగళూరు తదితర మార్కెట్లకు తరలించి గిట్టుబాటు ధరకు అమ్ముకోవచ్చు. – ఆనందరంగారెడ్డి, రైతు సంఘం నాయకుడు,రాయదుర్గం – తుమకూరు రైల్వే పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిర్దేశించిన గడువు ముంచుకొస్తున్నా చాలా చోట్ల అసలు పనులే ప్రారంభంకాలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టిసారించకపోవడంతో పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియడం లేదు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో కూటమి నాయకులు కూడా విఫలం కావడంతో ఆయా ప్రాంతాల ప్రజలు పెదవి విరుస్తున్నారు. -
ఏడు గుర్రాలపల్లి బాధితురాలికి న్యాయం చేస్తాం
పుట్టపర్తి అర్బన్: రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన రామగిరి మండలం ఏడు గుర్రాలపల్లి బాలికకు న్యాయం జరిగేలా చూస్తానని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. గురువారం పుట్టపర్తి సాయి ఆరామంలో జరిగిన మహిళల సంక్షేమం, భద్రత, హక్కులపై జిల్లాస్థాయి అవగాహన కార్యక్రమానికి ఆమె అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఏడు గుర్రాలపల్లి సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. బాలిక కుటుంబానికి ఆర్థికంగా సామాజికంగా అండగా ఉంటామన్నారు. బాలిక ఎంత వరకూ చదివితే అంత వరకూ చదివిస్తామన్నారు. పోక్సో చట్టం కింద వచ్చే పరిహారం అందజేస్తామన్నారు. అఘాయిత్యానికి పాల్పడిన 17 మంది నిందితులకు శిక్ష పడేలా చూస్తామన్నారు. ఆడ బిడ్డలు ఇబ్బంది పడకుండా ఉండాలన్నా, సమస్యలు పరిష్కరించుకోవాలన్నా విద్య చాలా ముఖ్యమని పేర్కొన్నారు. చట్టాలపై మహిళందరికీ అవగాహన అవసరమని చెప్పారు. తమ దృష్టికి వచ్చే కొన్ని కేసులను సుమోటాగా తీసుకొని విచారిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో 500 శక్తి టీంలు ఏర్పాటు చేశామని , 900 హాట్స్పాట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. సమావేశం ఎస్పీ రత్న, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో దుర్గం ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్
అనంతపురం/కళ్యాణదుర్గం:కళ్యాణదుర్గం ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్ నారాయణస్వామి ఏసీబీ వలకు చిక్కారు. గురువారం రాత్రి అనంతపురం నగరంలోని రామ్నగర్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ పట్టుబట్టారు. కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సూపరింటెండెంట్గా ఉన్న నారాయణస్వామికి ఇటీవల ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్గా బాధ్యతలు అప్పగించారు. కొన్ని రోజుల క్రితం కళ్యాణదుర్గం మండలం నుసికొట్టాల గ్రామానికి చెందిన రియల్ఎస్టేట్ వ్యాపారి నాగేంద్రనాయక్ కళ్యాణదుర్గంలో 1.5 ఎకరాలకు సంబంధించి రిజిస్ట్రేషన్, ల్యాండ్ కన్వర్షన్ నిమిత్తం కార్యా ల యానికి వెళ్లగా రూ.7 లక్షలు ఇవ్వాలని సబ్ రిజిస్ట్రార్ డిమాండ్ చేశారు. చివరకు రూ.5 లక్షలకు ఒప్పుకున్నారుు. ఈ క్రమంలోనే నాగేంద్రనాయక్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. గురువారం రాత్రి డబ్బు ముట్టజెప్పేందుకు అనంత పురం రామ్నగర్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్దకు రావాలని కోరాడు. నారాయణస్వామి డబ్బు తీసుకుంటుండగా, అప్పటికే కాపుకాసిన ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రూ.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. డాక్యుమెంటేషన్ పరిశీలనకు కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తీసుకెళ్లారు. చర్చనీయాంశం.. కళ్యాణదుర్గం ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నారాయణ స్వామిని అటు కార్యాలయంలోనూ, ఇటు అధికార టీడీపీలోని ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. అధికార టీడీపీలో కేవలం ఒక వర్గానికి మాత్రమే అనుకూలంగా ఉంటున్నారన్న కారణంతో పలుమార్లు నారాయణస్వామిపై టీడీపీలోని మరో వర్గం జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేసింది. ఇటీవల రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన ఈ–స్టాంప్ కుంభకోణంలో సైతం ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్ నారాయణస్వామి పాత్ర ఉన్నట్లు టీడీపీలోని ఓ వర్గం ఆరోపించింది. కంబదూరు, కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం మండలాల తహసీల్దార్ల సంతకాల ఫోర్జరీ, భూ బదలాయింపుపై కూడా ఆరోపణలు వినిపించాయి. అలాగే, జిల్లాకు చెందిన కీలక మంత్రి భూమి విషయంలో నారాయణస్వామిపై కన్నెర్ర చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన ఏసీబీ వలలో పడడం చర్చనీయాంశమైంది. -
పనులపై పూర్తి సమాచారమివ్వండి
ప్రశాంతి నిలయం: గ్రామీణాభివృద్ధి పనులపై జాతీయ కేంద్ర బృందం ఎనిమిది రోజుల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టనుందని, ఈ నేపథ్యంలో ఆయా శాఖల పరిధిలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై పూర్తి సమాచారం కేంద్ర బృందానికి సమర్పించాలని కలెక్టర్ చేతన్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్వహిస్తున్న గ్రామీణాభివృద్ధి పథకం అమలుపై జాతీయ కేంద్ర బృందం సభ్యులు దయాకర్రెడ్డి, చూడామణి రెడ్డితో కలసి కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులతో సమీక్షా నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి ఆగస్టు 1వ తేదీ వరకూ అమరాపురం, గాండ్లపెంట, రామగిరి మూడు మండలాల్లో 8 గ్రామ పంచాయతీల్లో కేంద్ర బృందం పర్యటిస్తుందన్నారు. వివిధ అంశాలపై ఈ బృందం దృష్టిసారించనుందన్నారు. కలెక్టర్ టీఎస్ చేతన్ ప్రభుత్వ సేవలు అందేలా..రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ4 పథకం విజయవంతం అయ్యేలా అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. గురువారం రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో పీ4, బంగారు కుటుంబాల దత్తత, మార్గదర్శి, గ్రామ సభలు, ప్రభుత్వ పథకాలు సేవల ప్రజా స్పందన తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్తో కలసి పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ చేతన్ మాట్లాడారు. పీ4పై జిల్లా అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించాలన్నారు. ప్రభుత్వ సేవలు సంతృప్తికరస్థాయిలో అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు. -
జైళ్లలో సదుపాయాలు సక్రమంగా ఉండాలి
● జిల్లా జడ్జి భీమరావు ధర్మవరం అర్బన్/పెనుకొండ: సబ్ జైళ్లలో ఖైదీలకు సదుపాయాలు సక్రమంగా ఉండాలని జిల్లా ప్రిన్సిపల్ జడ్జి భీమరావు అన్నారు. ధర్మవరం, పెనుకొండ సబ్జైళ్లను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగదులు, ఖైదీలు ఉండే గదులు, సరుకులు నిల్వ ఉంచే గదులతో పాటు పలు రికార్డులను పరిశీలించారు. ఖైదీలు నిద్రించే గదులు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ధర్మవరం సబ్జైలు సూపరింటెండెంట్ శివప్రసాద్ను ఆదేశించారు. అనంతరం ఖైదీలో సమావేశం నిర్వహించారు. సత్ప్రవర్తనతో మెలిగితే శిక్ష తగ్గింపు కూడా ఉంటుందని తెలిపారు. ఎవరికై నా న్యాయవాదులు లేకుంటే ఉచితంగా ఏర్పాటు చేస్తామని సూచించారు. ప్రతినెలా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఖైదీలకు పరీక్షలు నిర్వహించేలా చూడాలని సూపరింటెండెంట్ను ఆదేశించారు. కార్యక్రమంలో ధర్మవరం సీనియర్ సివిల్ జడ్జిలు వెంకటేశ్వర్లు, వాసుదేవన్, జడ్జిలు బొజ్జప్ప, రాకేష్, న్యాయవాదులు బిల్లే రవీంద్ర, బాలసుందరి, సుమలత, జైలు సిబ్బంది పాల్గొన్నారు. 22 మండలాల్లో వర్షం పుట్టపర్తి అర్బన్: తుపాను ప్రభావంతో జిల్లాలోని 22 మండలాల్లో వర్షం కురిసినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకూ జిల్లాలోని బుక్కపట్నం మండలంలో 8.2 మి.మీటర్లు, అమరాపురంలో 6.2 , సోమందేపల్లిలో 5.8, పెనుకొండలో 5.6 , చిలమత్తూరులో 5.6 , హిందూపురంలో 4.8 మి.మీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. అలాగే రొద్దంలో 4.4 మి.మీటర్లు, ఓడీ చెరువులో 4.2, నల్లచెరువులో 4.2, లేపాక్షిలో 4.2, గుడిబండలో 3.8, మడకశిరలో 3.6, పుట్టపర్తిలో 3.4, కొత్తచెరువులో 3.2, కదిరిలో 2.8, గాండ్లపెంటలో 2.4, రొళ్లలో 2.4, సీకేపల్లిలో 2.2, అమడగూరులో 2.2, గోరంట్లలో 2.2, తలుపులలో 1.6, ఎన్పీ కుంటలో 1.2 మి.మీటర్ల వర్షం కురిసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో 22 మండలాల్లో మొత్తం 84.2 మి.మీటర్ల వర్షం పడినట్లే తెలియజేశారు. అల్పపీడన ప్రభావం కొనసాగుతోందని మరికొన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గొట్లూరు సర్పంచ్కు అరుదైన అవకాశం ● స్వాతంత్య్ర వేడుకలకు ఆహ్వానం ధర్మవరం రూరల్: మండలంలోని గొట్లూరు సర్పంచ్ పిట్టా నరసమ్మకు అరుదైన అవకాశం దక్కింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కేంద్రం నుంచి ఆహ్వానం అందింది. ఈమేరకు గురువారం ఎంపీడీఓ సాయి మనోహర్ ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తమ పంచాయతీల జాబితాలో గొట్లూరు పంచాయతీ ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు పంచాయతీలు ఎంపిక కాగా అందులో గొట్లూరు పంచాయతీ కూడా ఉందన్నారు. మాజీ సర్పంచ్పై సైబర్ వల బొమ్మనహాళ్: మండలంలోని ఉద్దేహాళ్ గ్రామ మాజీ సర్పంచ్ మారుతీప్రసాద్పై సైబర్ నేరగాళ్లు వల విసిరారు. అయితే ఆయన తెలివిగా వ్యవహరించడంతో వల నుంచి తప్పించుకున్నారు. గతేడాది ఫోన్ కాల్ చేసి రూ.25 వేలు దోచుకున్న విషయం మరువకనే తాజాగా గురువారం 99915 17668 నంబరు నుంచి కాల్ వచ్చింది. ‘మీ అమ్మకు సంబంధించిన పెన్షన్ వచ్చింది. బ్యాంకు లింక్ లేదు. మీ అకౌంట్కు వేస్తాం. మీ అకౌంట్ నంబరు చెప్పండి’ అని అవతలి వ్యక్తి అడిగాడు. దీంతో నంబర్ చెప్పిన తర్వాత నగదు బదిలీ కావడం లేదని, ఫోన్ పే నంబర్కు వేస్తాం ఫోన్ పే యాప్ ఓపెన్ చేయాలని సూచించాడు. దీంతో మారుతీప్రసాద్కు అనుమానం వచ్చి మందలించి ఫోన్ కట్ చేశాడు. అనంతరం విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు పరిశీలించి అది సైబర్ నేరగాళ్ల పనిగా నిర్ధారించారు. -
దళిత బిడ్డకు న్యాయం చేయండి
అనంతపురం కార్పొరేషన్: మృగాళ్ల చేతిలో అత్యాచారానికి గురైన దళిత బిడ్డకు న్యాయం చేయాలని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నేతలు కోరారు. బుధవారం నగరంలోని ఎస్ఎస్బీఎన్ కళాశాలలో ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజను వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నేతలు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో దళితులు, గిరిజన మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయన్నారు. దౌర్జన్యాలు, దాడులు అధికమయ్యాయన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ఏడుగుర్రాలపల్లిలో దళిత మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. అనంతపురం నగరంలోని రామకృష్ణ కాలనీకి చెందిన గిరిజన విద్యార్థిని తన్మయిని అత్యంత కిరాతకంగా హత్య చేశారన్నారు. ఈ రెండు ఘటనలపై ఫాస్ట్ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ చేపట్టి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం మేరకు ఎక్స్గ్రేషియా అందించాలని కోరారు. తన్మయి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇంటి స్థలం, వ్యవసాయ భూమి మంజూరు చేయాలన్నారు. అనంతరం శైలజ విలేకరులతో మాట్లాడారు. యువత, అమ్మాయిలపై సినిమాల ప్రభావం తీవ్రంగా ఉంటోందని అన్నారు. అనంతరం ఆమె సామూహిత అత్యాచారానికి గురై ప్రభుత్వ సర్వజనాస్పత్రి లేబర్ వార్డులో ఉన్న బాధిత బాలికను ఆమె పరామర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నగరాధ్యక్షురాలు సాకే చంద్రలేఖ, అంజలి, హజర, ఉష, రాధాయాదవ్, భారతి, లీలా, ఎస్సీ, ఎస్టీ సెల్ నాయకులు చిరంజీవి, నాగరాజు నాయక్, మణికంఠ, సంగమేష్ పాల్గొన్నారు. గిరిజన విద్యార్థిని తన్మయి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి మహిళా కమిషన్ చైర్పర్సన్కు వైఎస్సార్ సీపీ మహిళా విభాగం వినతి -
యథేచ్ఛగా జీరో దందా
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో జీరో బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. దీంతో ఏటా ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయలు గండి పడుతోంది. పన్నుల రూపంలో రావాల్సిన ఆదాయం అక్రమార్కుల జేబుల్లోకి చేరుతోంది. ఇక్కడి నుంచి వెళ్లే, ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాలోకి వచ్చే సరుకుకు వే బిల్లులే ఉండటం లేదు. జీరో బిజినెస్ కారణంగా ఏడాదికి రూ.100 కోట్లకు పైగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోందని అధికారుల అంచనా. జీఎస్టీ అధికారులకు ఇదంతా తెలిసే జరుగుతున్నా నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు. రకరకాల మార్గాల్లో సరుకు.. ఉమ్మడి జిల్లాలో ప్రధాన ఆదాయ సర్కిళ్లు అనంతపురం, హిందూపురం, తాడిపత్రి, గుంతకల్లు. అయితే, ఆయా ప్రాంతాలకు సరుకు ఎప్పుడొస్తుందో, ఎప్పుడు షాపులకు చేరిపోతుందో అంతుచిక్కని పరిస్థితి. ముఖ్యంగా గ్రానైట్, టైల్స్, సిరామిక్ వంటి సరుకు జీఎస్టీ అధికారులకు తెలియకుండానే అర్ధరాత్రి చేరిపోతోంది. చెక్పోస్టుల్లో చెల్లించడం మినహా జీఎస్టీ చెల్లించిన దాఖలాలు లేవు. ఎంత సరుకు ఉన్నా రూ.48 వేలే.. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి హైదరాబాద్, చైన్నె, బెంగళూరు ప్రాంతాలకు రోజూ వందల ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు వెళ్తుంటాయి.. వస్తుంటాయి. ఇందులో ప్యాసింజర్ల కంటే సరుకు రవాణా ఎక్కువ. సాధారణంగా సరుకు విలువ రూ.50 వేలు కంటే ఎక్కువ ఉంటే వే బిల్లు విధిగా ఉండాలి. ఉదాహరణకు 30 సెల్ఫోన్లు కొంటే రూ.3 లక్షలు. కానీ నాలుగు పేర్లమీద బిల్లు వేసి తెస్తారు. రూ. 5 లక్షల సరుకై నా రూ.49 వేల లోపు విలువ చూపించి ఇన్వాయిస్తో మాత్రమే సరిపెడుతున్నారు. మార్కెట్లో బిల్లులు లేవు.. అనంతపురం, పుట్టపర్తి, హిందూపురం, కదిరి, తాడిపత్రి వంటి పట్టణాల్లో బిల్లులు లేని బిజినెస్సే ఎక్కువ. ఉదాహరణకు అనంతపురంలోని కమలానగర్లో ఏ ఒక్క షాపులోనూ కంప్యూటర్ జనరేటెడ్ బిల్లు ఉండదు. మొత్తం చేతిరాతతో ఉండే చిట్టీలపైనే బిల్లులు ఉంటున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో జీరో దందా నడుస్తున్నా అడిగే నాథుడే లేరు. జీఎస్టీ అధికారులను అడిగితే.. తమకు రాష్ట్రస్థాయిలో అధికారులు ఆదేశిస్తేనే వారిపై దాడులు చేస్తామని, లేదంటే చేయలేమని చెబుతున్నారు. నో... ‘వే’ రూ.50 వేలు దాటితే వే బిల్లు ఉండాలనే నిబంధన బేఖాతరు పది లక్షల సరుకై నా 48 వేలకే చూపించి పన్ను ఎగవేత ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి -
ప్రాణహాని ఉంది.. కాపాడండి
● భార్య, ఆమె ప్రియుడిపై బాధితుడి ఫిర్యాదు ● రెడ్హ్యాండెడ్గా పట్టుకుని అప్పగించినా స్పందించని పోలీసులు ● భార్య ఫిర్యాదు చేస్తే గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేస్తామంటూ బెదిరింపులు ● న్యాయం చేయాలంటూ వేడుకుంటున్న బాధితుడు హిందూపురం: తన భార్య, ఆమె ప్రియుడి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఓ భర్త వాపోయాడు. ఈ విషయంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని, పైగా భార్య ఫిర్యాదు చేస్తే గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేసి, జైలుకు పంపిస్తామంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. బుధవారం ‘సాక్షి’తో బాధితుడు మాట్లాడుతూ తనకు జరిగిన అన్యాయాన్ని వివరించాడు. హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని ఓ కాలనీలో నివాసముంటున్న రామకృష్ణ.. ప్రైవేట్ బస్సు డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానన్నారు. ఈ క్రమంలో తాను విధులకు వెళ్లగానే తన భార్య.. ప్రియుడిని రప్పించుకోవడం పరిపాటిగా మారిందన్నారు. ఈ విషయంపై పలుమార్లు ఆమెకు నచ్చచెప్పినా ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు. గత శనివారం మరో డ్రైవర్ తనను రిలీవ్ చేయడంతో రాత్రి 9.30 గంటలకు ఇంటికి చేరుకున్నానన్నారు. అప్పటికే ఇంట్లో తన భార్య, ఆమె ప్రియుడు శ్రీకాంత్ ఏకాంతంగా ఉండడం గమనించి, బంధువుల సాయంతో వారిని అదే రోజు రాత్రి 1 గంటల సమయంలో వన్టౌన్ పీఎస్కు పిలుచుకెళ్లి ఫిర్యాదు చేశానన్నారు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న పోలీసులు ఉదయాన్నే రావాలని తెలపడంతో తన భార్య, ఆమె ప్రియుడిపై రాత పూర్వకంగా ఫిర్యాదు చేసి ఇంటికి చేరుకున్నామన్నారు. మరుసటి రోజు ఉదయాన్నే పోలీసు స్టేషన్కు వెళితే.. కేసు నమోదు చేసి, తన సంసారాన్ని నిలబెట్టాల్సిన పోలీసులు ఇందుకు విరుద్ధంగా మాట్లాడారని వాపోయాడు. తనకు వ్యతిరేకంగా భార్య ఫిర్యాదు చేస్తే గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేసి, జైలుకు పంపాల్సి వస్తుందని, చట్టాలు మహిళలకే వర్తిస్తాయని బెదిరింపులకు దిగారన్నారు. మహిళలు తప్పు చేసినా.. చట్టాలు వారిపై మొగ్గుచూపుతున్నాయని నచ్చచెప్పే ప్రయత్నం చేశారన్నారు. తన భార్య, ఆమె ప్రియుడి నుంచి తనకు ప్రాణహాని ఉందని మొరపెట్టుకున్నా పోలీసులు ఏకపక్షంగా తనపై కేసు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారని వాపోయాడు. ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. యువతి అదృశ్యం కదిరి టౌన్: స్థానిక గొల్లమ్మ మంటపం వద్ద నివాసముంటున్న బాల రాధమ్మ కుమారై బి.మౌనిక బుధవారం ఉదయం నుంచి కనిపించడం లేదు. తల్లి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టినట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. ఉదయం దుకాణానికి వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి బయటకు వచ్చిన యువతి.. తిరిగి ఇంటికి చేరుకోలేదు. కుటుంబసభ్యులు గాలించినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవళం బజారులో నివాసముంటున్న లక్ష్మీనారాయణ కుమారుడు రెడ్డప్పతో తన కుమార్తె చనువుగా ఉండేదని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. యువతి అదృశ్యంపై కేసు నమోదు కదిరి పట్టణంలోని అడపాల వీధికి చెందిన యువతి అదృశ్యంపై కేసు నమోదు చేనట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్లో నర్సింగ్ చేస్తున్న అడపాల వీధికి చెందిన లింగాల ఈశ్వరయ్య కుమార్తె నవ్య రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చింది. మంగళవారం ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు, బంధువులు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో యువతి తల్లి పద్మావతి ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టారు. రైతు బలవన్మరణం చెన్నేకొత్తపల్లి: అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు.. సీకేపల్లి మండలం నామాల గ్రాఆమనికి చెందిన రామ్మూర్తి (38)కి భార్య అంజలి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తనకున్న మూడెకరాల పొలంలో అప్పులు చేసి 4 బోరు బావులు వేసి పంటలు సాగుతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో పంటల సాగు చేసిన అప్పులకు వడ్డీల భారం పెరిగి రూ.15 లక్షలకు చేరుకున్నాయి. అప్పులు తీర్చాలంటూ వడ్డీ వ్యాపారుల నుంచి ఒత్తిళ్లు తీవ్రం కావడంతో మనస్తాపం చెందిన రామ్మూర్తి రెండు రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. ఆలస్యంగా ఇంటికి చేరుకున్న కుటుంబసభ్యులు అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న రామ్మూర్తిని వెంటనే అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సిఫారసు మేరకు కర్నూలుకు తరలించారు. చికిత్స స్పందించక బుధవారం సాయంత్రం ఆయన మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. వ్యక్తి ఆత్మహత్య తలుపుల: మండలంలోని గాంధీనగర్లో నివాసమంటున్న ఎన్.వెంకటరమణ (42) ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడాది క్రితం తన పెద్దకుమారుడు అనారోగ్యానికి గురి కావడంతో బంగారునగలు తాకట్టు పెట్టి చూపించాడు. అనంతరం తల్లి చనిపోయింది. ఈ క్రమంలో అప్పులు ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురైన ఆయన బుధవారం ఊజీ గుళికలు మింగి విషయాన్ని భార్యకు తెలిపాడు. దీంతో కుటుంబసభ్యులు వెంటనే కదిరి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. భార్య రత్నమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
సామాజిక బాధ్యతతో మెలగాలి
పుట్టపర్తి టౌన్: ప్రయాణికులను గమ్య స్థానానికి చేర్చడమే కాకుండా వారి పట్ల సామాజిక బాధ్యతతో మెలగాలని ఆటో డ్రైవర్లకు ఎస్పీ రత్న సూచించారు. ఆటో డ్రైవర్లకు భద్రత– బాధ్యత అనే అంశంపై బుధవారం సాయి ఆరామంలో అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమానికి ఎస్పీ రత్న, డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజాబేగం ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్లకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. సత్యసాయి శతజయంతి వేడుకలకు దేశవిదేశాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని, వారిని రవాణా చేయడంలో ఆటో డ్రైవర్ల పాత్ర కీలకమన్నారు. ఇలాంటి తరుణంలో ఆటోలు నడిపే సమయంలో తమ కుటుంబాలతో పాటు ప్రయాణికుల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకోవాలన్నారు. చిన్నారులతో, విద్యార్థులతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. ప్రతి ఆటోకూ వెహికల్ ట్రాఫికింగ్ సిస్టమ్ తప్పనిసరిగా అమర్చుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం రెండు, మూడు భాషలపై పట్టు కలిగి ఉండాలన్నారు. మహిళలపై జరుగుతున్న నేరాలను అడ్డుకోవడంలో ఆటోడ్రైవర్లు కీలక పాత్ర పోషించాలన్నారు. అసాంఘిక శక్తుల సమాచారాన్ని పోలీసులకు చేరవేయడంలో ఆటో డ్రైవర్లు ముందుండాలన్నారు. ఎంవీఐ వరప్రసాద్ మాట్లాడుతూ.. ప్రమాదాలు జరిగిన వెంటనే ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించే వారికి ప్రభుత్వాలు అందజేసే పారితోషకంపై అవగాహన కల్పించారు. డాక్టర్ ఫైరోజాబేగం మాట్లాడుతూ.. గుట్కా, పాన్పరాగ్, గుట్కా, మద్యం వంటి వాటి వల్ల ప్రాణాంతకమైన జబ్బులబారిన పడే ప్రమాదముందని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎస్పీ విజయకుమార్, పుట్టపర్తి నల్లమాడ, పుట్టపర్తి సీఐలు సునీత, నరేంద్రరెడ్డి, సురేష్, మారుతీశంకర్, ఎస్ఐలు మల్లికార్జునరెడ్డి, కృష్ణమూర్తి, వైద్య సిబ్బంది, 800మంది ఆటో కార్మికులు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్లకు ఎస్పీ రత్న సూచన -
నీటిపై పన్నుకు కూటమి కుట్ర
పెనుకొండ రూరల్: ‘‘ఏడాది పాలనలోనే ఎడాపెడా అప్పులు చేసిన కూటమి సర్కార్.. ప్రజలపై పన్నుల మీద పన్ను వేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే తాగునీటిపై ప్రభుత్వం లోన్లు తీసుకువచ్చింది. వాటిని తీర్చేందుకు వాటర్ మీటర్లు బిగించాలని డీపీఆర్లో పేర్కొంది. తాగునీటిపై కూడా ట్యాక్స్లను వేసే చరిత్ర గతంలో ఎన్నడు చూడలేదు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ను సగం తాకట్టు పెట్టింది. త్వరలోనే రాష్ట్రాన్ని అమ్మేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు’’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. తొలిఅడుగు అంటూ కూటమి నేతలు తమ ఏడాది పాలన గురించి చెప్పేందుకు జనం వస్తున్నారని, కానీ జనానికి మాత్రం అభివృద్ధి కంటే కూటమి సర్కార్ చేసిన లక్షా యాభై వేల కోట్ల అప్పే కనిపిస్తోందన్నారు. అందువల్లే ఇటీవల మంత్రి అచ్చెన్నాయుడు ఆడబిడ్డ పథకం అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ను అమ్మడం తప్ప మరోదారి లేదని తేల్చేశారన్నారు. ఎన్నికల వేళ అలివిగాని హామీలు గుప్పించిన కూటమి నాయకులు.. అధికారం చేపట్టిన తర్వాత వాటిని అమలు చేయలేమని బహిరంగానే చెబుతున్నారన్నారు. ఎన్నికల వేళ రెట్టింపు పథకాలు ఇస్తామన్న నాయకులు, ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న పథకాలను కూడా సంపూర్ణంగా ఇవ్వలేక పోతున్నారన్నారు. పథకాలు అమలుపై ప్రజల మధ్య చర్చ రాకుండా ఉండేందుకే, వైఎస్సార్ సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ... డైవర్షన్ పాలిటిక్స్కు కూటమి ప్రభుత్వం తెరలేపిందన్నారు. పవన్ కల్యాణ్ఎక్కడున్నారో రాష్ట్రంలో మహిళల పట్ల దాడులు, అత్యాచారాలు జరుగుతున్నప్పటికీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వాటి గురించి మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. ఆయనకు తన సినిమా ప్రమోషన్పై ఉన్న శ్రద్ధ..మహిళల రక్షణపై లేదన్నారు. గతంలో 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని ఆరోపించిన పవన్ కల్యాణ్.. డిప్యూటీ సీఎంగా వారిని కనిపెట్టేందుకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు. శ్రీకాళహస్తిలో సొంత కార్యకర్తను చంపితే కూడా ఆయన మాట్లాడక పోవడం బాధాకరమన్నారు. -
దాహం తీరదు
నీరు పారదు..పుట్టపర్తి వాసుల తాగునీటి ఆశలపై కూటమి సర్కార్ నీళ్లు చల్లింది. పట్టణ తాగునీటి అవసరాలు తీర్చేందుకు వైఎస్ జగన్ సర్కార్ రూ.100 కోట్లతో మొదలుపెట్టిన తాగునీటి పథకానికి పూర్తిగా మంగళం పాడింది. ఇప్పటికే రూ.18 కోట్ల పనులు పూర్తయిన పథకాన్ని రద్దు చేసింది. ప్రాజెక్టు అంచనాలను రూ.154 కోట్లకు పెంచి మళ్లీ టెండర్లు పిలిచింది. ఈ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయో.. తమ దాహార్తి ఎప్పుడు తీరుతుందోనని పుట్టపర్తి వాసులు ఎదురుచూస్తున్నారు. పుట్టపర్తి అర్బన్: సత్యసాయి నడయాడిన పుట్టపర్తిలో తాగునీటికి తరచూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జిల్లా కేంద్రం అయ్యాక శివారు ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. పట్టణ జనాభా పెరుగుతూ వస్తోంది. దీంతో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లోని కాలనీవాసులు తాగునీటి కోసం రోడ్డెక్కి నిరసనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో గత వైఎస్సార్ సీపీ సర్కార్ పుట్టపర్తి తాగునీటి సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం చూపేందుకు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు (ఏఐఐబీ) నిధులు రూ.100 కోట్ల వ్యయంతో తాగునీటి పథకానికి శ్రీకారం చుట్టింది. బుక్కపట్నం చెరువు నుంచి నీరు.. పుట్టపర్తికి నీరందించే పథకానికి జగన్ సర్కార్ సమగ్ర ప్రణాళిక రూపొందించింది. బుక్కపట్నం చెరువులో ఇన్టేక్ వెల్ ఏర్పాటు చేసి దాని ద్వారా నీటిని ప్రశాంతి గ్రామంలో ఏర్పాటు చేసే ట్రీట్మెంట్ ప్లాంట్ వరకూ సరఫరా చేయాలి. అక్కడ శుద్ధిచేసిన నీటిని మున్సిపాలిటీ పరిధిలోని బీడుపల్లి, బ్రాహ్మణపల్లి, ప్రశాంతిగ్రామం, పెద్ద కమ్మవారిపల్లి, ఎనుములపల్లి, చిత్రావతి గుట్ట, ఎద్దులకొండ, కర్ణాటక నాగేపల్లి తదితర 8 చోట్ల నిర్మించే ఓవర్ హెడ్ ట్యాంకులకు పంపింగ్ చేయాలి. ఆయా ట్యాంకుల నుంచి ప్రతి ఇంటికీ సరఫరా చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసింది. 18 శాతం పనులు పూర్తి.. వీలైనంత త్వరగా పుట్టపర్తి వాసుల తాగునీటి కష్టాలు తీర్చాలని భావించిన జగన్ సర్కార్ తాగునీటి పథకం పనులను శరవేగంగా చేపట్టింది. సుమారు రూ.18 కోట్లతో నాలుగు ఓవర్ హెడ్ ట్యాంకులతో పాటు ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం చేపట్టింది. మొత్తంగా 18 శాతం పనులు పూర్తయ్యాక రాష్ట్రంలో ఎన్నికలు జరగడం...ఆ తర్వాత కూటమి సర్కార్ కొలువుదీరడంతో పుట్టపర్తికి నీరందించే పథకానికి గ్రహణం పట్టింది. కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని పట్టించుకోకపోవడంతో పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ప్రశాంతి గ్రామం సమీపంలో నిర్మిస్తున్న ట్రీట్మెంట్ ప్లాంట్ పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. ఫలితంగా కొన్ని పిల్లర్లకు, ట్రీట్మెంట్ ప్లాంట్కు వేసిన ఇనుప చువ్వలు తుప్పు పట్టాయి. ఇక నిర్మాణ పనులకు ఉపయోగించే సిమెంట్ బస్తాలు గడ్డకట్టి పాడైపోయాయి. టెండర్లు రద్దు.. సుమారు 18 శాతం పనులు పూర్తయిన పథకానికి సంబంధించిన టెండర్లను సైతం కూటమి సర్కార్ రద్దు చేసింది. ప్రస్తుత ధరల ప్రకారం మళ్లీ టెండర్లు పిలవడానికి రూ.154 కోట్లతో అంచనాలు వేయించింది. అలాగే గతంలో ‘మెగా’ కంపెనీ పనులు దక్కించుకోగా... కూటమి ప్రభుత్వం మాత్రం హైబ్రిడ్ యూనిట్ మోడల్ తరహాలో రాయలసీమలోని 8 జిల్లాల్లోని తాగునీటి పనులన్నీ కలిపి ఒకే టెండర్ పిలించేందుకు సిద్ధమైంది. దీనికి వరల్డ్ బ్యాంకు అనుమతి ఇవ్వడంతో 2029లోపు పనులు పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. కానీ జిల్లా కేంద్రమైన పుట్టపర్తి శివారు ప్రాంతాల్లో విపరీతంగా నూతన గృహాలు వెలియడంతో పాటు జనాభా కూడా పెరగడంతో తాగునీటి ఇబ్బందులు తీవ్ర రూపం దాల్చాయి. తాజాగా కూటమి సర్కార్ తాగునీటి పథకం పనులను 2029లోపు పూర్తి చేస్తామని చెబుతుండటంతో ప్రజలంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా తమకు తాగునీరివ్వాలని కోరుతున్నారు. పుట్టపర్తికి తాగునీరందించే పథకానికి గ్రహణం ఏఐఐబీ ఫండ్స్ రూ.100 కోట్లతో పనులు ప్రారంభించిన జగన్ సర్కార్ ఇప్పటికే రూ.18 కోట్లతో పనులు రాష్ట్రంలో కూటమి కొలువుదీరాక ఆగిన ప్రాజెక్టు పనులు పూర్తికాని ట్రీట్మెంట్ ప్లాంట్.. తుప్పు పడుతున్న ఇనుము పాత వాటిని రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలిచిన సర్కార్ కొత్త రేట్లను సాకుగా చూపి ప్రాజెక్టు విలువ రూ.154 కోట్లకు పెంపు కమిటీ నివేదిక తర్వాతే పనులు పుట్టపర్తికి తాగునీరందించే పథకం పనులకు ప్రభుత్వం టెండర్లు పిలవనుంది. త్వరలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కానీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల నాటికి పనులు పూర్తి కాకపోవచ్చు. ప్రస్తుతం జరిగిన 18 శాతం పనుల పరిశీలనకు కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. కమిటీ సభ్యులు నాణ్యతను పరీక్షించి నివేదిక ఇచ్చిన తర్వాతే పనులు ప్రారంభిస్తారు. – నరసింహమూర్తి, డీఈ, పబ్లిక్ హెల్త్ -
10 మండలాల్లో వర్షం
పుట్టపర్తి అర్బన్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకూ జిల్లాలోని 10 మండలాల్లో మోస్తరు నుంచి తుంపర వర్షం కురిసింది. అమరాపురం మండలంలో 6.4 మి.మీ, కొత్తచెరువు 2.2, గుడిబండ 2.2, సోమందేపల్లి 2.2, పెనుకొండ 2, రొద్దం 1.8, బత్తలపల్లి 1.4, పుట్టపర్తి 1.4, ధర్మవరం 1.2, ముదిగుబ్బ మండలంలో 1.2 మి.మీ మేర వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో మరో నాలుగు రోజులు జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు వెల్లడించారు. సేవలతో పోలీస్ శాఖ ప్రతిష్ట పెంచాలి● ప్రొబేషనరీ సబ్ఇన్స్పెక్టర్లకు ఎస్పీ రత్న సూచన పుట్టపర్తి టౌన్: విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించి ప్రజల్లో పోలీస్శాఖ ప్రతిష్ట పెంచాలని ఎస్పీ రత్న ప్రొబేషనరీ సబ్ఇన్స్పెక్టర్లకు సూచించారు. ప్రభుత్వం జిల్లాకు 15 మంది ప్రొబేషనరీ ఎస్ఐలను కేటాయించింది. దీంతో వీరు బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రత్నను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ రత్న వారికి దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. నేరస్తులు, అనుమానితులపై నిఘా ఉంచి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసే విధంగా విధులు నిర్వహించాలన్నారు. విధి నిర్వహణలో పక్షపాతం లేకుండా అందరికీ న్యాయం జరిగే విధంగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, ఆర్ఐలు వలి, మహేష్, సోషల్ మీడియా ఎస్ఐ మునిపత్రాప్ పాల్గొన్నారు. స్టీల్ ఫ్యాక్టరీలో ప్రమాదం.. కాలు కోల్పోయిన కార్మికుడు హిందూపురం: మండల పరిధిలోని గోళ్లాపురం పారిశ్రామికవాడలోని బ్లూ గోల్డ్ స్టీల్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు కుడికాలు కోల్పోయాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనకు సంబంధించి కార్మికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బ్లూ గోల్డ్ స్టీల్స్ పరిశ్రమలో ఉత్తరప్రదేశ్కు చెందిన అనూప్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతనికి ఫ్యాక్టరీ యాజమాన్యం ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కూడా కల్పించ లేదు. సోమవారం రాత్రి విధుల్లోకి వెళ్లిన అనూప్ దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురికాగా, కుడికాలు తెగి పక్కన పడింది. విషయాన్ని గోప్యంగా ఉంచిన కంపెనీ యాజమాన్యం వెంటనే అతన్ని బెంగళూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తోంది. ఈ ఘటనపై తూమకుంట పారిశ్రామికవాడ కార్మిక సంఘం అధ్యక్షుడు రవికుమార్ మాట్లాడుతూ... బ్లూ గోల్డ్ స్టీల్స్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే అనూస్ అంగవికలుడయ్యాడని, అతనికి మెరుగైన చికిత్స అందించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందన్నారు. అలాగే అతను పూర్తిగా కోలుకొనే వరకూ వేతనం ఇస్తూ, కార్మిక చట్టం ప్రకారం నష్ట పరిహారం కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. -
దళిత ద్రోహి ఎంఎస్ రాజు
● దళిత బిడ్డకు న్యాయం చేయలేని అసమర్థుడు ● వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్ర ధ్వజం అనంతపురం కార్పొరేషన్: ‘శ్రీసత్యసాయి జిల్లా ఏడుగుర్రాలపల్లిలో ఓ దళిత మైనర్ బాలికకు అన్యాయం జరిగితే న్యాయం చేయలేని నువ్వు నిజంగా దళిత ద్రోహివే’ అంటూ మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేసిన వైఎస్సార్సీపీ ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులను సన్యాసులంటూ మాట్లాడుతావా? అంటూ మండిపడ్డారు. ఇటీవల ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకుని బాధితురాలికి అండగా నిలవాలని హితవు పలికారు. మైనర్ బాలిక కేసులో 14 మందిని అరెస్ట్ చేసినంత మాత్రనా.. న్యాయం చేసినట్లు కాదన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నగరంలోని అశోక్నగర్లో ఓ దళిత యువతి హత్యకు గురైతే అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణమే స్పందించి యువతి కుటుంబంలో ఒకరి ఉద్యోగంతో పాటు, ఐదెకరాల భూమిని కేటాయించేలా చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. అప్పటి ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి సమక్షంలో మృతురాలి కుటుంబానికి ఎక్స్గ్రేషియాను ప్రభుత్వం అందజేసిందన్నారు. ఆ సమయంలో ఉనికి కోసం ఓవరాక్షన్ చేసిన టీడీపీ నాయకులు.. నేడు ఓ దళిత మైనర్ బాలికకు, మరో గిరిజన యువతికి అన్యాయం జరిగినా కనీసం నోరు కూడా మెదపడం లేదన్నారు. ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే కూటమి ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎవరెన్ని కేసులు పెట్టినా, అరెస్ట్లు చేసినా భయపడే ప్రసక్తి లేదన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు సాకే శ్రీనివాసులు, యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు దాదాఖలందర్, ఎస్సీ సెల్ శింగనమల నియోజకవర్గ అధ్యక్షుడు అంజి, పార్టీ నగర కార్యదర్శి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
మాదకద్రవ్యాల నిరోధానికి పటిష్ట చర్యలు
ప్రశాంతి నిలయం: మాదకద్రవ్యాల వినియోగం, రవాణాను అరికట్టడానికి జిల్లాలో పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఎస్పీ రత్నతో కలిసి జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిరోధంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, వర్కర్లను లక్ష్యంగా చేసుకొని మాదక ద్రవ్యాల రవాణా ఎక్కువగా సాగే అవకాశం ఉందని, ఆయా ప్రాంతాల్లో గట్టి నిఘా ఉంచాలన్నారు. గంజాయి నేరస్తులపై ‘పీఐటీపీఎన్డీఎస్ యాక్ట్ 1988’ కింద కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే డ్రగ్స్ సరఫరా ద్వారా సంపాదించిన ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించారు. విద్యా సంస్థలకు 100 మీటర్లు పరిధిలో పొగాకు ఉత్పత్తులను విక్రయించరాదని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే సీఓటీపీఏ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే ప్రతి విద్యా సంస్థలో ‘ఈగల్ క్లబ్లు’ త్వరగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మత్తు పదార్థాల వల్ల జరిగే నష్టాల గురించి పాఠశాల, కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ మెడికల్ షాపులోనూ ఎన్ఆర్ఎక్స్ ట్యాబ్లెట్స్ విక్రయించరాదన్నారు. యువత కూడా డ్రగ్స్కు అలవాటు పడి జీవితం నాశనం చేసుకోకూడదన్నారు. జిల్ల్లాలో ఎక్కడైనా డ్రగ్స్ వాడకం, రవాణాపై సమాచారం తెలిసిన వారు 1972 టోల్ఫ్రీకి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. జిల్లాలో నిఘా పెంచాం ఎస్పీ రత్న మాట్లాడుతూ... జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, రవాణా అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో ఈగల్ టీమ్స్ ద్వారా మాదక ద్రవ్యాల నిరోధం, వాడకంపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టళ్లలో డ్రగ్స్ వినియోగం జరగకుండా పర్యవేక్షణ ఉంచాలన్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలిప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై అధికారులు దృష్టి సారించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వివిధ అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో అంతరాయం లేని విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. లోవోల్టేజీ సమస్యలపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఉచిత ఇసుక సరఫరాకు పటిష్ట చర్యలు జిల్లాలో ఉచిత ఇసుక సరఫరాకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా స్థాయి ఉచిత ఇసుక సరఫరా కమిటీ సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్, కలెక్టర్ టీఎస్ చేతన్ మాట్లాడుతూ.. సీసీ రేవు, పీసీ రేవు ఇసుక రీచ్లలో రెవెన్యూ, పోలీస్ సిబ్బందితో పర్యవేక్షణ ఏర్పాటు చేయాలన్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు సరిహద్దు చెక్ పోస్టుల్లో నిఘా ఏర్పాటు చేయాలన్నారు. నదీ ప్రవాహాలకు సమీపంలోని గ్రామాల వారు సొంత అవసరాలకు ఇసుకను తవ్వుకుని తరలించుకోవచ్చన్నారు. సమావేశంలో ఎస్పీ రత్న, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ధర్మవరం ఆర్డీఓ మహేష్, డీపీఓ సమత, భూగర్భ జల శాఖ డీడీ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ టీఎస్ చేతన్ -
వాహనం ఢీకొని వృద్ధుడి మృతి
చిలమత్తూరు: మండలంలోని టేకులోడు క్రాస్ వద్ద 544ఈ జాతీయ రహదారిపై బుధవారం ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో గోరంట్ల మండలం గౌనిపల్లికి చెందిన అంజినప్ప (70) అక్కడికక్కడే మృతిచెందాడు. చిలమత్తూరు మండలం దేమకేతేపల్లి ఎస్సీ కాలనీకి చెందిన శివకుమార్కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన మరో ద్విచక్ర వాహనదారుడు అక్కడి నుంచి పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ మునీర్ అహమ్మద్ తెలిపారు. బాలుడి దుర్మరణం సోమందేపల్లి: మండలంలోని వెలుగుమాకులపల్లి గ్రామ సమీపంలో బస్సును ద్విచక్రవాహనం ఢీ కొన్న ఘటనలో ఓ బాలుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. హిందూపురం మండలం బాలంపల్లికి చెందిన రాజురెడ్డి కుమారుడు నరేష్రెడ్డి(14) రాచూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. బుధవారం ద్విచక్ర వాహనంపై పాలసముద్రం వైపు వెళుతూ వెలుగుమాకులపల్లి సమీపంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ రమేష్బాబు తెలిపారు. -
సంతకాల కోసమే పనికొస్తామా?
ధర్మవరం రూరల్: కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా ఇప్పటి వరకూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలు చెల్లించడం లేదని, పంచాయతీల అభివృద్ధికి సైతం నిధులను మంజూరు చేయకుండా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారంటూ ఎంపీటీసీలు, సర్పంచ్లు ధ్వజమెత్తారు. బుధవారం ధర్మవరం మండల పరిషత్ కార్యాలయానికి వచ్చిన ఎంపీటీసీలు, సర్పంచ్లు మండల సర్వసభ్య సమావేశాన్ని గంట పాటు బహిష్కరించి ఎంపీడీఓ సాయిమనోహర్, డిప్యూటీ ఎంపీడీఓ వెంకటేష్ను చుట్టుముట్టి ఘోరావ్ చేశారు. ప్రభుత్వం నిధులు కేటాయించకపోతే పంచాయతీల అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. గ్రామాలలో తాగునీరు, వీధిలైట్లు, రహదారుల నిర్మాణాలు తదితర మౌలిక వసతుల కోసం నిధులు అడిగితే పైసా కూడా లేదని అధికారులు చెపుతున్నారంటూ సర్పంచ్లు మండి పడ్డారు. కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లిందేకు కూడా నిధులు మంజూరు చేయకుంటే ఎలా నిలదీశారు. గ్రామాలలో ప్రభుత్వ కార్యక్రమాలకు స్థానిక సర్పంచ్లు, ఎంపీటీసీలను ఆహ్వానించకుండా పార్టీ నాయకులను అందలం ఎక్కిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాప్రతినిధులకు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదన్నారు. 22 నెలలుగా ఎంపీటీసీలకు గౌరవ వేతనాలు చెల్లించకుండా సహనాన్ని పరీక్షిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కుబడిగా జరిగే మండల సర్వ సభ్య సమావేశాలకు ఆహ్వానించి రిజిస్టర్లో సంతకాలు చేయించుకుంటున్నారని, బయటి కార్యక్రమాల్లో తమకు ఎలాంటి గౌరవం ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు. గ్రామాలలో సర్పంచ్ల తీర్మానాలు లేకుండానే ఉపాధి హామీ పథకం పనులు చేయిస్తున్నారన్నారు. దీంతో స్పందించిన ఎంపీడీఓ.. త్వరలోనే ప్రజాప్రతినిధులకు వేతనాలు చెల్లించడం జరుగుతుందని, ప్రభుత్వ కార్యక్రమాలకు గ్రామాలలో సర్పంచ్లు, ఎంపీటీసీలకు ప్రాధాన్యతను ఇస్తామని భరోసానివ్వడంతో ఆందోళనను విరమించారు. గౌరవం లేదు.. గౌరవ వేతనమూ లేదు 22 నెలలుగా ఎంపీటీసీలకు అందని వేతనం అధికారులను నిలదీసిన ఎంపీటీసీలు, సర్పంచ్లు -
ఉల్లి .. సాగు సన్నగిల్లి!
అంతర్జాతీయ వాణిజ్య పంటగా గుర్తింపు పొందిన ఉల్లి సాగు జిల్లాలో సన్నగిల్లుతోంది. వివిధ కారణాలతో ఉల్లి సాగుపై రైతులు ఆసక్తి కనపరచడం లేదు. ఖరీప్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు కావొస్తున్నా పది శాతం కూడా సాగులోకి రాకపోవడమే ఇందుకు నిదర్శనం. రాయదుర్గం: జిల్లాలోని రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల్లో ఐదు వేల ఎకరాల్లో, మరి కొన్ని మండలాల్లో కొద్ది మేరకు రైతులు ఉల్లిని సాగు చేస్తున్నారు. ఇందులో ఒక్క గుమ్మఘట్ట మండలంలోనే రైతులు 2 వేల నుంచి 2,500 ఎకరాల్లో ఉల్లిని సాగు చేస్తున్నారు. ఆ తర్వాత వెయ్యి నుంచి 1,500 ఎకరాలతో బ్రహ్మసముద్రం, బెళుగుప్ప మండలాలు రెండో స్థానంలో నిలిచాయి. మరో 12 మండలాల్లో 2 వేల ఎకరాల్లో ఉల్లి సాగులో ఉంటోంది. అయితే ఈ సారి కనీసం 600 ఎకరాలు కూడా దాటని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పాటికి సుమారు 3 వేల ఎకరాలకు పైగా సాగు చేయాల్సి ఉండగా 10 శాతం కంటే తక్కువ విస్తీర్ణంలో ఉల్లి సాగులోకి వచ్చింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉల్లి ధరలు ఆకాశానికి అంటడం ఖాయమనే వాదనలు వినవస్తున్నాయి. సాధారణంగా ఉల్లి సాగుకు ఎకరాకు ఐదు లేదా ఆరు కిలోల విత్తనాలు అవసరం కాగా, కిలో విత్తనం నాణ్యత ఆధారంగా రూ.1,800 నుంచి రూ.2,200 వరకు బయట మార్కెట్లో రైతులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కలుపు ఇతర ఖర్చులు వెరసి ఎకరాకు ఎంత తక్కువన్నా రూ.50వేల నుంచి రూ.60 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. గిట్టుబాటు ధర లేకపోవడంతో కనీస పెట్టుబడులు కూడా చేతికి అందవనే భావన రైతుల్లో వ్యక్తమవుతోంది. పెట్టుబడుల భారంతో చేతులెత్త్తేసిన రైతులు రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల్లో ఏటా ఉల్లి సాగు తగ్గుతూ వస్తోంది. లక్షల క్వింటాళ్ల దిగుబడి ఉన్న చోట ప్రస్తుతం వేళ్లతో లెక్కించే పరిస్థితి నెలకొంది. సారవంతమైన భూములు కావడంతో ఎకరాకు 300 నుంచి 350 ప్యాకెట్ల ఉల్లి పండించిన రైతులూ ఉన్నారు. క్వింటా రూ.2 వేలు ధర లభించినా రూ.2 లక్షల నుంచి రూ.2.20 లక్షలు చేతికి దక్కేది. పదెకరాల్లో సాగుచేసిన రైతు రూ.20 లక్షల నుంచి రూ.22 లక్షలకు పైగా ఆదాయాన్ని గడించారు. తాజాగా ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడంతో ఉల్లి సాగుకు రైతులు మొగ్గు చూపడం లేదు. ఉల్లి విత్తనాలు రాయితీతో అందించడంలోనూ, కనీస మద్దతు ధర ప్రకటించడంలోనూ, సరైన మార్కెట్ సదుపాయం కల్పించడంలోనూ ప్రభుత్వం ఘోరంగా విఫలం కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పండించిన పంటను అమ్ముకోవాలంటే రాజమండ్రి, బెంగళూరు, పూణే లాంటి పెద్ద మార్కెట్లను రైతులు ఆశ్రయించాల్సి వస్తోంది. దీనికి తోడు కొత్త రకం తెగుళ్లు వెంటాడటం, సరైన అవగాహన లేక ఇష్టారీతిన పురుగు మందులు వినియోగిస్తుండడంతో పెట్టుబడులు తడిసి మోపెడవుతున్నాయి. దీంతో జిల్లా రైతులు చేతులు ఎత్తేయడంతో.. కర్ణాటకలో పండిస్తున ఉల్లిపైనే ఆధారపడాల్సి వస్తోంది. సాగు వదులుకున్నా మా గ్రామ పరిసరాల్లో ఎంత తక్కువన్నా 300 ఎకరాల్లో పోటాపోటీగా ఉల్లిని రైతులు సాగు చేసేవారు. ఇప్పుడా పరిస్థితులు కనిపించడం లేదు. ఏటా 20 ఎకరాలకు తక్కువ కాకుండా ఉల్లి సాగు చేసే నేనే ఈ సారి సాగు వదులుకున్నా. రెండు ఎకరాలకు విత్తనాలు చల్లుకుంటే ఓసారి వడగళ్ల వర్షం, మరోసారి విత్తన లోపం కారణంగా రూ.40 వేలు నష్టపోయాను. దీంతో సాగు పూర్తిగా వదిలేసి మొక్కజొన్న పెట్టుకున్నాను. అధిక తెగుళ్లు, సరైన విత్తనాల కొరత, మార్కెటింగ్ సౌకర్యం లేక రైతులు ఉల్లి సాగుకు దూరమవుతున్నారు. ప్రభుత్వం ఆదుకునే చర్యలు చేపడితే సాగు విస్తీర్ణం పెంచుకోవచ్చు. – హరినాథరెడ్డి, ఉల్లి రైతు, ఆర్.కొత్తపల్లి, గుమ్మఘట్ట మండలం గణనీయంగా తగ్గిన సాగు రాయితీ విత్తనాలు అందించడంలో సర్కార్ విఫలం మద్దతు ధర, మార్కెట్ సౌకర్యమూ కరువే -
జిల్లాలో బుధవారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఆకాశం మేఘావృతమై పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం నుంచి తుంపర్లు పడ్డాయి. గంటకు 8 నుంచి 14 కి.మీ వేగంతో గాలి వీచింది.
ఇసుక ట్రాక్టర్ ఢీ.. విద్యార్థి మృతి ● మరో విద్యార్థికి తీవ్ర గాయాలు పరిగి: ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఓ ట్రాక్టర్ వేగంగా వచ్చి ఢీ కొనడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ విద్యార్థి మృతి చెందాడు. మరో విద్యార్థి గాయపడ్డాడు. ఈ ఘటన బుధవారం మండలంలోని శాసనకోట సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... పరిగి మండలంలోని ఊటుకూరు గ్రామానికి చెందిన రుతుపూర్ణ చక్రవర్తి, గంగాదేవి దంపతుల ఏకై క కుమారుడు అఖిల్కుమార్(17) హిందూపురంలోని ఓ ఐటీఐ కళాశాలలో చదువుతున్నాడు. ఎప్పటిలాగే బుధవారం ద్విచక్రవాహనంలో కళాశాలకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో తన మిత్రుడు లోకేష్తో కలిసి స్వగ్రామం ఊటుకూరుకు బయలుదేరాడు. నేతులపల్లి సమీపంలోని రాగానే పెన్నా, జయమంగళీ నదుల సంగమ పరివాహక ప్రాంతం నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టరు వేగంగా వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టి వెళ్లిపోయింది. దీంతో ద్విచక్రవాహనం నడుపుతున్న అఖిల్కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో విద్యార్థి లోకేష్ తీవ్రంగా గాయపడ్డాడు. స్పందించిన స్థానికులు లోకేష్ను చికిత్స నిమిత్తం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అఖిల్కుమార్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ప్రమాదానికి కారణమైన ట్రాక్టరు, డ్రైవరు ఆచూకీ కోసం గాలింపు చర్యలను చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. నేడు పుట్టపర్తికి మహిళా కమిషన్ చైర్పర్సన్ ప్రశాంతి నిలయం: రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ గురువారం పుట్టపర్తి రానున్నారు. ఉదయం 10 గంటలకు పుట్టపర్తిలోని సాయిఆరామంలో నిర్వహించనున్న మహిళా సంక్షేమం, భద్రత సదస్సులో ఆమె పాల్గొంటారని డీపీఆర్ఓ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమం అనంతరం సాయిఆరామంలోనే ఆమె విలేకరులతో మాట్లాడతారని పేర్కొన్నారు. -
గూగూడులో ‘హుండీ మాయం’!
నార్పల: మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గూగూడులో హుండీ మాయమైన ఘటన కలకలం రేపింది. గూగూడు కుళ్లాయిస్వామి మొహర్రం ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో తాత్కాలికంగా నాలుగు హుండీలు ఏర్పాటు చేశారు. వాటిలో మూడింటిని ఈ నెల 18న తెరిచి కానుకలను లెక్కించారు. తర్వాత ఆ హుండీలను ఓ ట్రాక్టర్లో తీసుకెళ్లారు. ఈ క్రమంలో లెక్కించని నాలుగో హుండీని కూడా తరలించినట్లు తెలిసింది. గూగూడు గ్రామస్తుల నుంచి కూడా దీనిపై ఆరోపణలు వచ్చాయి. ఇదే క్రమంలో ట్రాక్టర్లో హుండీలను తరలిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఈఓకు టీడీపీ నాయకుల వత్తాసు.. ‘హుండీ మాయం’ ఘటనపై బుధవారం దేవదాయ శాఖ ఈఓ శోభారాణి గూగూడులో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకర్లు సీసీ కెమెరా ఫుటేజీ చూపాలని, దీంతో అనుమానాలన్నీ తొలగిపోతాయని ఈఓను కోరగా.. పొంతనలేని సమాధానాలిచ్చారు. ఈ క్రమంలోనే ఆమె వెంటే ఉన్న టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. విలేకర్లపై దురుసుగా ప్రవర్తించారు. ఈఓకు టీడీపీ నేతలు వత్తాసు పలకడం సర్వత్రా అనుమానాలకు తావిచ్చింది. టీడీపీ నేతలను ఎందుకు వెంట తెచ్చుకున్నారని ఈఓను ప్రశ్నిస్తే.. వారు అనధికారిక కమిటీ మెంబర్లంటూ ఆమె సమాధానం చెప్పడం గమనార్హం. ఏదిఏమైనా రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన గూగూడు ఆలయంలో హుండీ మాయమైన ఘటన గ్రామస్తులు, భక్తులకు ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు చొరవ తీసుకొని ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సీసీ ఫుటేజీని బయటకు తీయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. భక్తులు, గ్రామస్తుల ఆందోళన సీసీ ఫుటేజీ చూపాలని కోరితే ఈఓ పొంతనలేని సమాధానం ఆమెకు టీడీపీ నాయకుల వత్తాసు పలకడంపై సర్వత్రా అనుమానాలు -
టీడీపీ నేతను వదిలేసి.. కార్యకర్తల సస్పెన్షన్
సాక్షి టాస్క్ఫోర్స్: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో మహిళా శానిటరీ వర్కర్ను ఉద్యోగం నుంచి తొలగించి.. ఆపై ‘కమిట్మెంట్’ ఇస్తే తిరిగి ఉద్యోగం ఇప్పిస్తామని బెదిరించిన వ్యవహారంలో అసలు సూత్రధారి అయిన టీడీపీ నేతను వదిలేసి ఇద్దరు కార్యకర్తలను ఆ పార్టీ బలి చేసింది. శానిటరీ వర్కర్ ఉద్యోగం కోసం ‘కమిట్మెంట్’ ప్రతిపాదన చేయించిన టీడీపీ నేత యుగంధర్ అలియాస్ చింటూపై టీడీపీ ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం చర్చనీయాంశమైంది.అసలు నిందితుడిని వదిలేసి ఫోన్లో మాట్లాడిన వ్యక్తులపై మాత్రమే చర్యలు తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కమిట్మెంట్ ఇవ్వాలంటూ మహిళను టీడీపీ కార్యకర్తలు ఫోన్లో వేధించిన ఆడియో రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. మహిళతో ఫోన్ సంభాషణ సాగించిన వ్యక్తి.. చింటూ తన మాట వింటాడని చెప్పడం, డబ్బు అతనికి అవసరం లేదని, కమిట్మెంట్ కావాలని అడగడం వంటి అంశాలు ఆడియోలోనే ఉన్నాయి. దీనినిబట్టే ఈ అంశంలో చింటూ ప్రధానంగా ఉన్నట్టు తెలుస్తోంది. అతనిపై టీడీపీ అధిష్టానం ఎలాంటి చర్యలూ తీసుకోకుండా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వెనకేసుకొస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.పోలీసులు సైతం చింటూపై కేసు నమోదు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. చింటూ అధిక వడ్డీలకు అప్పులు ఇస్తూ ప్రజలను వేధింపులకు గురి చేస్తుంటాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఇతడి బారిన పడినవారుతమ ఆస్తులను తాకట్టు పెట్టి మరీ అప్పులు తీర్చారని సమాచారం. ఇలాంటి వ్యక్తిపై టీడీపీ అమితమైన ప్రేమ చూపించడాన్ని ఆ పార్టీ శ్రేణులే తప్పుబడుతున్నాయి. ఇద్దరు కార్యకర్తలపై వేటు..ఈ వ్యవహారానికి సంబంధించి ఇద్దరు టీడీపీ కార్యకర్తలను ఆ పార్టీ బుధవారం సస్పెండ్ చేసింది. మహిళతో అసభ్యంగా మాట్లాడిన టీడీపీ కార్యకర్తలు కగ్గలప్ప, అతని సోదరుడు నగేష్ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనలో బాధిత మహిళకు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ బలంగా వినిపించిన విషయం విదితమే. -
పెద్దిరెడ్డి కుటుంబంపై కక్ష సాధింపు తగదు
మడకశిర: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై కక్ష సాధింపు తగదని సీఎం చంద్రబాబుకు మడకశిర నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప హితవు పలికారు. పద్ధతి మార్చుకోకపోతే రాజకీయ పరాభవం తప్పదని హెచ్చరించారు. ఎంపీ మిథున్రెడ్డి అక్రమ అరెస్ట్ను ఖండిస్తూ ఈరలక్కప్ప ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ శ్రేణులు మంగళవారం మడకశిరలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తొలుత అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నల్లబ్యాడ్జీలు ధరించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మిథున్రెడ్డిని వెంటనే విడుదల చేయాలంటూ గంటపాటు నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఈరలక్కప్ప మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ అరెస్ట్లకు వైఎస్సార్సీపీ నాయకులు భయపడరన్నారు. అభివృద్ధిని విస్మరించి వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. లేని లిక్కర్ కేసును సృష్టించి, ఎలాంటి సంబంధం లేని ఎంపీ మిథున్రెడ్డిని అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. కడిగిన ముత్యంలా మిథున్రెడ్డి ఈ కేసు నుంచి బయటకు వస్తారన్నారు. చంద్రబాబు హయాంలో జరిగింది లిక్కర్ స్కాం అని తెలిపారు. వైఎస్ జగన్ హయాంలో లిక్కర్ స్కాం జరగకున్నా చంద్రబాబు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు. రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం మానుకోపోతే ప్రజలు ఎదురు తిరగడం ఖాయమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వైసీ గోవర్ధన్రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఆనందరంగారెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు నరసింహమూర్తి, మున్సిపల్ మాజీ చైర్మన్ జయరాజ్, ఎంపీపీ సత్యనారాయణరెడ్డి, మండల కన్వీనర్లు రామిరెడ్డి, త్రిలోక్నాథ్, పట్టణ అధ్యక్షుడు వాల్మీకి సతీష్కుమార్, పార్టీ అనుబంధ కమిటీల అధ్యక్షులు శేషు, మల్లికార్జునగౌడ్, మంజునాథ్, శివన్న, నరసింహ, సికిందర్, మాజీ డైరెక్టర్ నాగరాజు, జిల్లా బీసీ సెల్ కార్యదర్శి శ్రీరాములు, పార్టీ అనుబంధ కమిటీల సభ్యులు అంజలి, నగేష్, గోపి, నాగభూషణ్రెడ్డి, రంగనాథ్, సైఫుల్లా, హనుమంతు, మధు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబుకు రాజకీయ పరాభవం తప్పదు వైఎస్సార్సీపీ మడకశిర సమన్వయకర్త ఈరలక్కప్ప -
రాజకీయ దురుద్దేశంతోనే అక్రమ అరెస్ట్
కదిరి: రాజకీయ దురుద్దేశంతోనే రాజంపేట ఎంపీ మిథున్రెడ్డిని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిందని వైఎస్సార్సీపీ ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన కదిరిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి, జైలుకు పంపి ప్రభుత్వం శునకానందం పొందుతోందన్నారు. పాలన మరిచి ప్రతిపక్షం గొంతునొక్కే ప్రయత్నం చేస్తే భవిష్యత్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను చంద్రబాబు పక్కనబెట్టి, అక్రమ అరెస్ట్లతో డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సరైన సమయంలో ప్రజలే ఆయనకు తగిన బుద్ది చెప్పడం ఖాయమన్నారు. లిక్కర్ స్కాం అనేది పూర్తిగా చంద్రబాబు కల్పితమని, ఈ కేసులో అక్రమంగా అరెస్ట్ అయిన మిధున్రెడ్డితో పాటు మిగిలిన వారు కూడా కడిగిన ముత్యంలా బయటకు రావడం ఖాయమన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బి.ఎస్.మక్బుల్ అహ్మద్, రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్బాషా, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లోకేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.విలేకరుల సమావేశంలో పాల్గొన్న వై.విశ్వేశ్వరరెడ్డి, మక్బుల్ అహ్మద్, తదితరులు -
‘సూపర్’కు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి
● మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ అనంతపురం మెడికల్: ఉమ్మడి జిల్లా ప్రజలకు వైద్య సేవలు మరింత మెరుగుపరిచేలా అనంతపురంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేసే ఆలోచనను మానుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్, ప్రజారోగ్య వేదిక జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొండయ్య డిమాండ్ చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాంటూ ఆస్పత్రి ఎదుట ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆస్పత్రుల అభివృద్ధిపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సత్యకుమార్ ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో నిర్వహించడం సబబు కాదన్నారు. ఆరోగ్యాన్ని హక్కుగా ప్రకటించాలన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఉన్న 8 స్పెషాలిటీ వైద్య సేవలను విస్తృతం చేసేలా వైద్యులు, సిబ్బంది నియామకాలు చేపట్టాలన్నారు. క్రిటికల్ కేర్ యూనిట్ను త్వరితగతిన ప్రారంభించాలన్నారు. న్యూరో, కార్డియో, తదితర కేసులను నేరుగా ఇక్కడే అడ్మిట్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించాలన్నారు. అనంతరం డిమాండ్లపై సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ప్రజారోగ్యవేదిక జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ప్రసూన, డాక్టర్ వీరభద్రయ్య, ఏజీ రాజమోహన్, సీఐటీయూ, రైతు సంఘం, ఏపీఎంఎస్ఆర్యూ, పెన్షనర్స్ అసోసియేషన్, హ్యూమన్ రైట్స్ ఫోరం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.జూదరుల అరెస్ట్ తలుపుల: మండలంలోని ఎనమలదొడ్డివారిపల్లి సమీపంలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ నరసింహుడు తెలిపారు. జూదరుల నుంచి రూ.25,070 నగదు, ఐదు ద్విచక్ర వాహనాలు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వివరించారు. -
వైభవంగా మస్తానయ్య ఉరుసు
గుంతకల్లు: స్థానిక పాత గుంతకల్లు ప్రాంతంమస్తానయ్య నామస్మరణతో మార్మోగింది. హజరత్ మస్తాన్వలి ఉరుసు ఉత్సవాల్లో భాగంగా అత్యంత కీలకమైన షంషీర్ ఊరేగింపు మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. వేకువజామున పుష్పాలతో అందంగా అలకంరించిన షంషీర్ను గుర్రంపై కొలువుదీర్చి మేళాతాళలతో దర్గా నుంచి గణాచారిరెడ్డి కులస్తుల ఇంటికి చేర్చారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం తిరిగి దర్గాకు తీసుకువచ్చారు. వేలాది భక్తులు తరలిరావడంతో పాత గుంతకల్లు జనసంద్రమైంది. ఊరేగింపులో ఎండ కొబ్బరి కాల్చేందుకు భక్తులు ఎగబడ్డారు. చక్కెర చదివింపులు, తులభారాలు, జంతుబలులతో మొక్కులు తీర్చుకున్నారు. బుధవారం జియారత్ కార్యక్రమంతో మస్తానయ్య ఉరుసు ఉత్సవాలు ముగిస్తాయని వక్ఫబోర్డు అధికారి రహీం, దర్గా కమిటీ సభ్యులు తెలిపారు. వరి సాగులో జాగ్రత్తలు పాటించండి ● ఏరువాక కేంద్రం కో–ఆర్డినేటర్ డాక్టర్ రామసుబ్బయ్య పుట్టపర్తి అర్బన్: నారు దశ నుంచి నాటే వరకూ జాగ్రత్తలు తీసుకుంటే వరికి రోగాలు ఆశించకుండా మంచి దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఏరువాక కో–ఆర్డినేటర్ డాక్టర్ కె.రామసుబ్బయ్య తెలిపారు. నారు మడి తీయడానికి వారం ముందు సెంటు నారు మడికి 160 గ్రాముల కార్బోపిరాన్ గుళికలు ఇసుకలో కలిపి పలుచగా నీరు ఉంచి చల్లాలన్నారు. నారు పీకిన తరువాత కొనలను తుంచి వేయాలన్నారు. నారు నాటే సమయంలో దుక్కిలోకి 200 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్, 25 కిలోల పొటాష్, 50 కిలోల యూరియా వేయాలన్నారు. నారు నాటే సమయంలో ప్రతి రెండు మీటర్లకు 20 సెంటీమీటర్ల కాలి బాటలు తీయాలన్నారు. దీంతో కలుపు సమస్య నివారించుకోవచ్చన్నారు. నాటిన మూడు రోజుల్లోపు ఎకరాకు బుటాక్లోరో ఒక లీటరును 20 కిలోల ఇసుకలో కలిపి చల్లాలన్నారు. -
అప్పులు తీర్చలేక చేనేత కార్మికుడి ఆత్మహత్య
ధర్మవరం అర్బన్: అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. ధర్మవరంలోని ఇందిరమ్మ కాలనీలో నివాసముంటున్న లక్ష్మీప్రసాద్(39)కు భార్య కుసుమ, ఓ కుమార్తె ఉన్నారు. చేనేత పనులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. కొన్నేళ్లుగా మద్యానికి బానిసైన లక్ష్మీప్రసాద్.. సక్రమంగా పనికి పోకుండా కుటుంబ పోషణకు ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు చేశాడు. ఈ క్రమంలో అప్పులు తీర్చే మార్గం కానరాక మనోవేదనకు లోనైన ఆయన సోమవారం రాత్రి ఇంట్లో తాడుతో ఉరి చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మూడురోజుల క్రితం ఆడబిడ్డకు అనారోగ్యంగా ఉండటంతో అనంతపురం వెళ్లిన భార్య కుసుమ మంగళవారం ఫోన్ చేసినా భర్త ఎంతసేపటికి లిఫ్ట్ చేయకపోవడంతో వెంటనే ఇంటి పక్కనున్న గురుమూర్తికి ఫోన్ చేసి తెలిపింది. దీంతో ఆయన వెళ్లి కిటికీలో నుంచి చూడగా ఉరికి విగతజీవిగా వేలాడుతున్న లక్ష్మీప్రసాద్ కనిపించాడు. విషయాన్ని తెలుసుకున్న కుసుమ వెంటనే తన మామ మస్తానప్పకు ఫోన్ చేయడంతో ఆయన ఇందిరమ్మ కాలనీలోని ఇంటికి వెళ్లి కుమారుడిని ఆస్పత్రికి తరలించాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తండ్రి మస్తానప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు రెండో పట్టణ సీఐ రెడ్డప్ప తెలిపారు. హెడ్ పోస్టాఫీసులో డిజిటల్ సేవలు ● హిందూపురం పోస్టల్ సూపరింటెండెంట్ విజయకుమార్ హిందూపురం: పోస్టల్ నెట్వర్క్ని ఆధునీకరించి గ్రామీణ ప్రాంతాల్లోనూ డిజిటల్ సేవలు అందుబాటులో తీసుకురానున్నట్లు హిందూపురం పోస్టల్ సూపరింటెండెంట్ యు.విజయకుమార్ తెలిపారు. మంగళవారం హిందూపురంలోని హెడ్పోస్టాఫీసులో అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ–2.0 పోర్టల్ను ఆయన ప్రారంభించి, మాట్లాడారు. జిల్లాలోని మొత్తం పోస్టుఫీసులలో ఈ–సేవలను మంగళవారం నుంచి ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని పోస్టల్ సేవలను బలోపేతంతో చేయడం ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందుతాయన్నారు. పీఎం విశ్వకర్మ పథకం ద్వారా టూల్ కిట్లను కూడా పోస్టల్ ద్వారా దేశవ్యాప్తంగా పంపిణీ జరుగుతోందని వివరించారు. కార్యక్రమంలో పోస్టల్ అసిస్టెంట్ సూపరిటెండెంట్ మల్లికార్జున, శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ విమల్ కుమార్, హెడ్ పోస్ట్మాస్టర్ మార్కండేయ, బ్యాంకు మేనేజర్ మురళి, పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు. చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతి గాండ్లపెంట: ఈ నెల 12న దుండగుడి దాడిలో గాయపడిన గాండ్లపెంట మండలం బనాన్చెరువుపల్లికి చెందిన ఎం.సరస్వతమ్మ(80) చికిత్సకు స్పందించక మంగళవారం మృతిచెందింది. ఈ మేరకు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, దాడి జరిగిన రోజు తలపై లోతైన గాయాలతో బాధపడుతున్న సరస్వతమ్మను కుటుంబసభ్యులు మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. తొలుత వృద్దురాలిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని మృతురాలి అల్లుడు నరసింహారెడ్డి ఈ నెల 16న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన ఎన్పీ కుంట ఎస్ఐ వలీబాషా.. కదిరి రూరల్ సీఐ నాగేంద్ర పర్యవేక్షణలో లోతైన విచారణ చేపట్టారు. ఆదే గ్రామానికి చెందిన సోమశేఖర్ అనే వ్యక్తి డబ్బు కోసం ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై పట్టపగలే కట్టెతో తలపై దాడి చేసినట్లుగా నిర్ధారణ కావడంతో నిందితుడిని అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. బైక్పై విరిగిపడిన చెట్టు కొమ్మ.. వివాహిత మృతి గుడిబండ: చెట్టు కొమ్మ విరిగి మీద పడడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వివాహిత మృతిచెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. గుడిబండ మండలం మోరుబాగల్ గ్రామానికి చెందిన అరుణ (32), నాగప్ప దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. కరికెర గ్రామ సమీపంలో ఉన్న కేజీబీవీలో చదువుకుంటున్న కుమార్తెను చూసేందుకు సోమవారం సాయంత్రం దంపతులు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. రోడ్డుకు ఇరువైపుల ఉన్న చింత చెట్లలోని ఓ చెట్టు కొమ్మ విరిగి ద్విచక్ర వాహనం మీద వెళుతున్న అరుణపై పడింది. తలకు బలమైన గాయం కావడంతో వెంటనే మడకశిరలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక అదేరోజు రాత్రి ఆమె మృతి చెందింది. ఘటనపై ఎస్ఐ రాజకుళ్లాయప్ప మంగళవారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.‘నాటుసారాపై నిఘా పెంచాలి’ ధర్మవరం అర్బన్: ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న నాటుసారా అడ్డుకట్టకు నిఘా పెంచాలని ప్రొహిబిషన్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య, పుట్టపర్తి అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ నరసింహులు సూచించారు. మంగళవారం ధర్మవరంలోని ఎకై ్సజ్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. అనంతరం ఎకై ్సజ్ సీఐ చంద్రమణి, ఎస్ఐ చాంద్బాషా, నాగరాజు, సిబ్బందితో మాట్లాడారు. నాటుసారా నిర్మూలనకు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహించాలని సూచించారు. ప్రత్యేకంగా సభలు నిర్వహించి నాటుసారా నిర్మూలనపై ప్రజలను చైతన్య పరచాలన్నారు. నవోదయం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. -
సకల పాప హరం.. హనుమద్ దర్శనం
రాయదుర్గం/బొమ్మనహాళ్/గుంతకల్లు రూరల్: అంజనీ సుతుడిని శ్రావణ మాసంలో దర్శించుకుంటే అన్ని కష్టాలు దూరమవుతాయని భక్తుల నమ్మకం. జిల్లాలో ప్రముఖంగా చెప్పుకునే నేమకల్లు, మురడి, కసాపురం ఆలయాల్లో శ్రావణ మాసంలో హనుమద్ దర్శనానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ మూడు ఆలయాలను ఒకే రోజులో దర్శించుకుంటే అంతా మంచే జరుగుతుందని భక్తుల విశ్వాసం. భక్తుల పాలిట కొంగుబంగారమై.. జిల్లాలో భక్తుల పాలిట కొంగుబంగారంగా, భక్తజన వరదాయకుడిగా నేమకల్లు, మురడి, కసాపురంలో వెలసిన ఆంజనేయస్వామి ఆలయాలు విరాజిల్లుతున్నాయి. క్రీ.శ. 15వ శతాబ్దంలో వ్యాసరాయమహర్షి ఒకే రోజున ఈ ఆలయాల్లో విగ్రహాలను ప్రతిష్టించినట్లు చరిత్ర తెలుపుతోంది. శ్రావణ మాసంలో వచ్చే మంగళ, శని వారాల్లో ఈ మూడు ఆలయాలను దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ నెల 26న వచ్చే తొలి శ్రావణ శనివారం నుంచి నేమకల్లు, మురడి, కసాపురం ఆలయాల్లో శ్రావణ మాస ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రత్యేక పూజలు, భజనలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, రథోత్సవాలతో ఆలయాల్లో సందడి నెలకొననుంది. ఈ నేపథ్యంలో మూడు ఆలయాలను సర్వాంగ సుందరంగా అలకరించారు. భక్తుల సౌకర్యార్థం బారికేడ్లు, వసతి గృహాలు సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 26, ఆగస్టు 2, 9, 16, 23వ తేదీల్లో వచ్చే శనివారాలు, ఈ నెల 29, ఆగస్టు 5, 12, 19వ తేదీల్లో వచ్చే మంగళవారాల్లో మూడు ఆలయాలను సందర్శించి మొక్కులు తీర్చుకునేందుకు భక్తలు పోటెత్తుతుంటారు. ఆలయాల విశేషం జాతక దోషంతో సింహాసనం కోల్పోయిన శ్రీకృష్ణదేవరాయలు.. ఆ దోషం తొలగిపోయేందుకు 732 ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్టించాలని వ్యాసరాయలు సూచించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ముందుగా హంపీలో యంత్రోధారక ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు చరిత్ర చెబుతోంది. అనంతరం పెనుకొండ వద్ద 103 ఆంజనేయస్వామి విగ్రహాలను ప్రతిష్టించారు. చివరకు నేమకల్లు, మురడి, కసాపురంలో ఆంజనేయస్వామి విగ్రహాలను ప్రతిష్టించే సమయంలో వ్యాసరాయ మహర్షి దివ్య దృష్టితో విష్టుమూర్తి వామన రూపంలో వచ్చి మూడు అడుగుల స్ధలాన్ని తీసుకున్న ప్రాంతాలు ఇవేనని గుర్తించి, మూలవిరాట్లకు ప్రాణప్రతిష్ట గావించారు. శ్రావణ మాసంలో ఈ మూడు ఆలయాలను ఒకే రోజు శ్రీకృష్ణదేవరాయలు దర్శించుకోవడంతో జాతక దోషం తొలిగిపోయింది. అప్పటి నుంచి ఈ మూడు ఆలయాలను శ్రావణ మాసంలో ఒకే రోజు దర్శించుకుంటే ఎంతటి కష్టమైనా తొలగిపోతుందని భక్తులు విశ్వసిస్తూ వస్తున్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు శ్రావణమాసంలో ఒకే రోజు మూడు ఆలయాలను దర్శించుకునేలా ఉమ్మడి జిల్లాలోని అన్ని డిపోల నుంచి ఆర్డీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ప్రతి శని, మంగళవారాల్లో అనంతపురం జిల్లాలోని 7 ఆర్డీసీ డిపోల నుంచి దాదాపు 100 బస్సులు నడిపేలా అధికారులు ప్రణాళికలు సిద్దం చేశారు. అలాగే శ్రీసత్యసాయి జిల్లాలోని ఆరు డిపోల నుంచి కూడా ప్రత్యేక బస్సులను నడపనున్నారు. కనీసం 50 మంది భక్తులు ఏకతాటిపైకి వచ్చి మూడు ఆలయాల సందర్శనకు ముందుకు వస్తే వారు కోరుకున్న ప్రాంతానికి ప్రత్యేకంగా బస్సును పంపేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధంగా ఉన్నారు. ప్రతి శనివారం ప్రాకారోత్సవం ఉత్సవాల్లో భాగంగా ఈనెల 26వ తేదీన మొదటి శనివారం కసాపురంలో స్వామివారిని వజ్రకవచంతో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. సాయంత్రం సీతారామచంద్ర లక్ష్మణ సహిత ఆంజనేయస్వామి వార్లను శేషవాహనంపై కొలువుదీర్చి ఆలయ పురవీధుల్లో ప్రాకారోత్సవం నిర్వహిస్తారు. అదేవిధంగా ఆగస్టు 2వ తేదీ రెండో శనివారం ఉత్సవమూర్తులను హనుమద్ వాహనంపై, ఆగస్టు 9 మూడో శనివారం గజ వాహనంపై, ఆగస్టు 16 నాల్గవ శనివారం గరుడ వాహనంపై, ఆగస్టు 23 ఐదో శనివారం ఒంటె వాహనంపై స్వామివారిని కొలువుదీర్చి ఆలయ పురవీధుల్లో ప్రాకారోత్సవం నిర్వహిస్తారు. శ్రావణమాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు కూడా ఉత్సవమూర్తులను వెండిరథంలో కొలువుదీర్చి ప్రాకారోత్సవం నిర్వహిస్తారు. శ్రావణ మాసంలో మూడు ఆలయాలను దర్శించుకుంటే పుణ్యఫలం ప్రత్యేక ఏర్పాట్లలో దేవదాయశాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా 100 బస్సులు నడిపేలా ఆర్డీసీ కార్యాచరణ ఈ నెల 26న తొలి శ్రావణ శనివారం ఆధ్యాత్మిక, ఆనందాల సమ్మేళనాల శ్రావణ మాసం శనివారంతో ప్రారంభం కానుంది. నాగుల పంచమి, రాఖీపౌర్ణమి, వరలక్ష్మీవ్రతం, మంగళగౌరి వ్రతం, శ్రీకృష్ణ జన్మాష్టమి, పొలాల అమాస్య తదితర ముఖ్యమైన వ్రతాలు ఈ మాసంలోనే వస్తాయి. మహిమాన్వితమైన శ్రావణ మాసంలో హనుమద్ దర్శనం సకల పాపాలను హరిస్తుందని నమ్మకం. ప్రత్యేకించి వ్యాసరాయలు ప్రతిష్టించిన మూడు హనుమద్ క్షేత్రాలను ఒకే రోజు దర్శించుకుంటే ఎంతటి కష్టమైనా ఇట్టే దూరమవుతుందని భక్తుల విశ్వాసం. దీంతో ఈ శ్రావణ మాసంలో జిల్లాలోని నేమకల్లు, మురడి, కసాపురంలోని హనుమద్ క్షేత్రాల సందర్శనకు భక్తులు పోటెత్తనున్నారు.ఏర్పాట్లు పూర్తి.. ఆలయంలో నెల రోజుల పాటు వైభవంగా జరిగే శ్రావణమాస ఉత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశాం. స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. భక్తుల కోసం గుంతకల్లు రైల్వే స్టేషన్, బస్టాండ్ నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు. – కె.వాణి, ఆలయ ఈఓ, కసాపురం ఆలయాల్లో ప్రత్యేక సౌకర్యాలు ఈ ఏడాది శ్రావణ మాసంలో భక్తుల సంఖ్య అధికంగానే ఉంటుందని ముందస్తుగా అంచనాకు వచ్చాం. ఇందుకు తగినట్లుగానే భద్రత, సౌకర్యాలు కల్పించాం. వాహనాల పార్కింగ్కు ప్రత్యేక స్థలాన్ని కేటాయించాం. శని, మంగళవారాల్లో అన్నదానం లాంటి కార్యక్రమాలు ఉంటాయి. – నరసింహారెడ్డి, ఈఓ, రాయదుర్గం -
క్షణికావేశం.. బైక్ ధ్వంసం
సాక్షి, పుట్టపర్తి: క్షణికావేశం సుమారు రూ.25వేల మూల్యం చెల్లించేలా చేసింది. ఓ యువకుడు ఆవేశంతో రగిలిపోతూ బైక్ను రాళ్లతో ధ్వంసం చేసి నిప్పు పెట్టబోయాడు. గమనించిన స్థానికులు అడ్డుకోవడంతో మంటలు రేగలేదు. అనంతరం పోలీసుల జోక్యంతో తప్పు తెలుసుకుని బైక్ రిపేరీకి అయ్యే ఖర్చు భరిస్తానని అంగీకరించాడు. వివరాలు.. మామిళ్లకుంట క్రాస్కు చెందిన తిరుమలేష్.. మంగళవారం ఉదయం పుట్టపర్తి నుంచి ప్యాషన్ ప్రో బైక్పై వెళుతూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సమీపంలో వై–జంక్షన్ వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న బాలుడి స్కూటర్ పరస్పరం ఢీకొన్నాయి. ఆ సమయంలో తిరుమలేష్ గట్టిగా కేకలు వేయడంతో భయపడిన బాలుడు తన స్కూటర్ను వదిలేసి పారిపోయాడు. అప్పటికే ఆవేశంతో రగిలిపోతున్న తిరుమలేష్.. రాళ్లతో స్కూటర్ను చిత్తుచిత్తు చేశాడు. విడి భాగాలను చెల్లాచెదురు చేశాడు. నిప్పు పెట్టేందుకు సిద్ధమవుతుండగా స్థానికులు అడ్డుకున్నారు. అంతలోనే పోలీసులు అక్కడకు చేరుకోవడంతో సమస్య సద్దుమణిగింది. కాగా, ఒంగోలుకు చెందిన ఓ కుటుంబం దిన కూలి నిమిత్తం ప్రశాంతి గ్రామ్లో నివాసముంటున్నారు. మొహర్రం కావడంతో కుమారుడికి స్కూటర్ ఇచ్చి చికెన్ కోసం పంపించారు. వై–జంక్షలో ఎదురుగా బైక్ దూసుకురావడంతో అయోమయంలో అటు.. ఇటు వాహనం తిప్పి కిందపడ్డాడు. అవతలి వ్యక్తి కేకలు వేయడంతో పారిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు అక్కడకు చేరుకునేలోపు స్కూటర్ను సదరు వ్యక్తి ధ్వంసం చేయడంతో ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ధ్వంసమైన వాహనాన్ని తానే రిపేరీ చేయిస్తానని తిరుమలేష్ అంగీకరించడంతో సమస్యకు పరిష్కారం దొరికింది. స్కూటర్ విలువ రూ.20 వేల వరకు ఉండవచ్చునని, ప్రస్తుతం రిపేరీకి రూ.25 వేల వరకు అవుతుందని అంచనా వేసిన స్థానికులు క్షణికావేశం ఎంత పని చేసిందని చర్చించుకున్నారు. -
డాక్యుమెంట్లు సరి చూసుకోవాలి
ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ అయిన వాహనాలను జిల్లాలు కొని ఇక్కడకు తెచ్చుకుంటున్నారు. అయితే ఒక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ వాహనం ఏపీలో తిప్పాలంటే మళ్లీ మన వద్ద ట్యాక్స్ కడితే ఏపీ రిజిస్ట్రేషన్ చేస్తాం. అలాగే ఒక రాష్ట్రంలో నమోదైన వాహనాలను మరో రాష్ట్రానికి తరలించేందుకు తప్పనిసరిగా రవాణా శాఖ అనుమతి అవసరం. రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇన్సూరెన్స్, వాహన యజమాని చిరునామా ఉన్న వాటినే కొనుగోలు చేయాలి. ఎన్ఓసీ (నో అబ్జక్షన్ సర్టిఫికెట్) ఉన్న వాటిని ఎక్కడైనా విక్రయించవచ్చు. అయితే కొనుగోలు చేసిన తర్వాత వినియోగదారుడి పేరు మీద రిజిస్ట్రేషన్ మార్చుకోవాలి. – ఎన్ఎన్ కరుణసాగర్రెడ్డి, జిల్లా రవాణా శాఖాధికారి● -
కూటమి అసలు రంగు బట్టబయలైంది
‘సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే డబ్బు కావాలి.. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ను అమ్మాలి’ అని వ్యాఖ్యానించిన అచ్చెన్నాయుడు మాటలతో కూటమి అసలు రంగు బయటపడింది. చంద్రబాబు డైరెక్షన్లో రాజకీయం చేసే కూటమి నేతలు ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నీ ఇప్పుడు తుంగలో తొక్కుతున్నారు. అందుకే వారి అబద్ధపు హామీలు నమ్మొద్దని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ హెచ్చరించారు. అదే ఇప్పుడు నిజమైంది. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలతో కూటమి సర్కార్ ఆడబిడ్డలను మోసం చేసిందని అర్థం అయిపోయింది. – టీఎన్ దీపిక, వైఎస్సార్సీపీ సమన్వయకర్త, హిందూపురం -
అప్పుల సంగతి అప్పుడు తెలియదా ?.
అధికారం కోసం అలవిగాని హామీలిచ్చే సమయంలో ఆంధ్రప్రదేశ్ అప్పుల సంగతి కూటమి నాయకులకు తెలియదా..? ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే, రాష్ట్రాన్ని అమ్మేయాలని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించడం సిగ్గుచేటు. ఎన్నికల వేళ ఆడబిడ్డలందరికీ అన్ని పథకాలు అందిస్తామని పలికిన నేతలు, అధికారం చేపట్టగానే అమలు చెయ్యలేమని బహిరంగంగా చెప్పడం వారి దిగజారుడు రాజకీయానికి నిదర్శనం. పూర్తి స్థాయిలో పథకాలు అమలు చేయకున్నా.. ఏడాదికే రూ.లక్ష కోట్లపైబడి అప్పులు ఎందుకు చేశారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. మరో నాలుగు ఏళ్ల కూటమి పాలన పూర్తి కావాలంటే, రాష్ట్ర ప్రజలపై ఎన్ని రూ.లక్షల కోట్ల అప్పు మోపుతారో తెలియడం లేదు. – ఉషశ్రీ చరణ్, జిల్లా అధ్యక్షురాలు, వైఎస్సార్ సీపీ -
జగతి మెచ్చేలా జయంత్యుత్సవం
ప్రశాంతి నిలయం: సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాన్ని జగతి మెచ్చేలా చేద్దామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో కలెక్టర్ టీఎస్ చేతన్తో కలిసి సత్యసాయి శత జయంత్యుత్సవాల ముందస్తు ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. సత్యసాయి శత జయంత్యుత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సమష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏర్పాట్లన్నీ అక్టోబర్ 15వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. జయంత్యుత్సవాలు ప్రారంభమయ్యాక మామూలు రోజుల్లో రోజూ 10 వేల మంది, ముఖ్యమైన రోజుల్లో 60 వేల నుంచి 70 వేల మంది పాల్గొనే అవకాశం ఉందన్నారు. భక్తుల రాకకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, చైన్నె వంటి మహానగరాల నుంచి కూడా భక్తులు తరలివస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రవాణా ఏర్పాట్లు చేయాలన్నారు. తాగునీరు, పారిశుధ్యం, మొబైల్ టాయిలెట్లు, వీధి దీపాలు వంటి ప్రాథమిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. జయంత్యుత్సవాలకు విచ్చేసే భక్తులకు ఇబ్బంది కలగకుండా బెంగళూరు–పుట్టపర్తి రోడ్డు మార్గాన్ని మరమ్మతులు చేయాలన్నారు. కొత్తచెరువు – పెనుకొండ, బ్రాహ్మణపల్లి – ఎనుములపల్లి మార్గాలను యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేయాలన్నారు. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉండేలా ఇంటర్నల్ రింగ్రోడ్లు అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని, ట్రాఫిక్ మేనేజ్మెంట్తో పాటు పార్కింగ్కు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని చర్యలు తీసుకుంటున్నాం కలెక్టర్ టీఎస్ చేతన్ మాట్లాడుతూ, సత్యసాయి శత జయంత్యుత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటికే అధికారులకు సూచనలు జారీ చేశామన్నారు. ట్రాఫిక్, మౌలిక సదుపాయాల కల్పన, సెక్యూరిటీ ప్లానింగ్కు సంబంధించి అన్ని చర్యలూ తీసుకుంటున్నామన్నారు. ఎస్పీ వి.రత్న మాట్లాడుతూ, భద్రత పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అత్యవసర వాహనాలతో పాటు, సీసీటీవీ కెమెరాలు ఏర్పాట్లు చేస్తామన్నారు. కమ్యూనికేషన్ కోసం రిపీటర్ స్టేషన్, పార్కింగ్ ప్రాంతాల్లో కెమెరాలు, సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సత్యసాయి శత జయత్యుత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించడం సంతోషదాయకమన్నారు. అనంతరం సత్యసాయి శత జయంత్యుత్సవాలకు చేపట్టిన ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రదర్శించారు. సమీక్ష అనంతరం అజయ్ జైన్, కలెక్టర్, ఎస్పీలతో కలసి సత్యసాయి ఎయిర్ పోర్ట్, వెస్ట్గేట్ రోడ్డు, ఎన్హెచ్–342, చిత్రావతి హారతి ఘాట్, సత్యసాయి హిల్వ్యూ స్టేడియం తదితర ప్రాంతాలను పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్ఓ విజయసారథి, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ బృందం, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సత్యసాయి జయంతి వేడుకలను వైభవంగా నిర్వహిద్దాం అక్టోబర్ 15 నాటికి ఏర్పాట్లు పూర్తి చేయాలి దేశ విదేశాల నుంచి వచ్చే ప్రముఖులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్ కలెక్టరేట్లో సత్యసాయి శత జయంత్యుత్సవాల ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష -
ఖాద్రీశుడి ఆర్జిత కల్యాణం.. భక్తులకు అవకాశం
కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణం చేయించాలనుకునే భక్తులకు ఆలయ పాలక మండలి అవకాశం కల్పిస్తోంది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని దాదాపు 17 రోజుల పాటు నిర్వహించే ఆర్జీత కల్యాణోత్సవాలను భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఆసక్తి కలిగిన భక్తులు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని ఆలయ ఈఓ వెండి దండి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రావణమాసం శుక్ల పాఢ్యమి (ఈనెల 25వ తేదీ) నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు కల్యాణోత్సవాలు జరుగుతాయని వెల్లడించారు. కల్యాణం నిర్వహించే తేదీల్లో రోజుకు 5 టికెట్లు మాత్రమే జారీ చేస్తామన్నారు. ఒక్కో టిక్కెట్ ధర రూ.6,500 ఉంటుందని, ఒక టిక్కెట్పై ఐదుగురికి మాత్రమే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈనెల 25, 27, 30, 31 తేదీల్లో, ఆగస్టు 3, 4, 5, 10, 11, 12, 13, 18, 19, 20, 21, 24, 25 తేదీల్లో మాత్రమే శ్రీవారి కల్యాణోత్సవాలు ఉంటాయన్నారు. ఆయా రోజుల్లో ఉదయం 10.30 గంటల నుంచి శ్రీస్వామి వారి ఆర్జీత కల్యాణోత్సవం ప్రారంభమవుతుందని ఈఓ పేర్కొన్నారు. ఏడు మండలాల్లో వర్షం పుట్టపర్తి అర్బన్: తుపాను ప్రభావంతో జిల్లాలో మూడో రోజు మంగళవారం కూడా జల్లులు కురిశాయి. ఇక సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకూ 7 మండలాల పరిధిలో వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తాడిమర్రి మండలంలో 10.2 మి.మీ, ధర్మవరం 5.2, బత్తలపల్లి 2.4, ముదిగుబ్బ 2.2, ఎన్పీ కుంట 2.0, తలుపుల 1.6, కదిరి మండలంలో 1.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. ఖరీఫ్ పంటలు సాగు చేసిన రైతులు కొన్ని రోజులుగా వానదేవుడికి మొరపెట్టుకుంటున్నారు. మూడు రోజులుగా ఆకాశం మేఘావృతమవుతున్నా... తుంపర్లతోనే సరిపెడుతుండటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఖరీఫ్ సీజన్లో సరైన వర్షం లేక రైతులు లక్షలాది ఎకరాల్లో ఇంకా విత్తనం వేయలేదు. ఇక అరకొర సాగు చేసిన పంటకు నెలన్నర నుంచి నీరులేక పోవడంతో ఇబ్బంది కరంగా మారిందని రైతులు వాపోతున్నారు. జిల్లాకు చేరుకున్న కృష్ణా జలాలువజ్రకరూరు/ఉరవకొండ: కృష్ణా జలాలు అనంతపురం జిల్లాలోకి ప్రవేశించాయి. ఈ నెల 17న కర్నూలు జిల్లా మాల్యాల వద్ద శ్రీశైలం జలాశయం బ్యాక్వాటర్ నుంచి కృష్ణా జలాలను సీఎం చంద్రబాబు విడుదల చేయగా.. అధికారులు హంద్రీ–నీవా కాలువకు నీటి పంపింగ్కు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం కర్నూలు జిల్లాను దాటుకుని జిల్లాలోని వజ్రకరూరు మండలం ఛాయపురం వద్ద 134 కిలోమీటరు వద్దకు చేరుకున్నాయి. హంద్రీ–నీవా చీఫ్ ఇంజినీర్ నాగరాజు, ఇతర అధికారులు, గ్రామస్తులతో కలిసి జలహారతి ఇచ్చారు. రాగులపాడు లిఫ్ట్ వద్ద నీటిని పంపింగ్ చేసి జీడిపల్లి రిజర్వాయర్కు పంపనున్నారు. కార్యక్రమంలో ఎస్ఈ రాజాస్వరూప్, ఈఈ శ్రీనివాస్నాయక్, డీఈఈ రమణ, ఏఈ సురేష్నాయక్, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. గురుకులాల్లో అందుబాటులో ఇంటర్ సీట్లు అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలోని ఉరవకొండ, బ్రహ్మసముద్రం, నల్లమాడలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో ఇంటర్ హెచ్ఈసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో మొదటి సంవత్సరం (బాలికలకు మాత్రమే) ప్రవేశాలకు సీట్లు అందుబాటులో ఉన్నాయని గురుకుల పాఠశాలల ఉమ్మడి జిల్లా సమన్వయ అధికారి కె.జయలక్ష్మీ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2024–25 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినులు మాత్రమే అర్హులన్నారు. ఆసక్తిగల విద్యార్థినులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్లను సంప్రదించాలని కోరారు. -
జిల్లా అంతటా మంగళవారం ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా తేలికపాటి నుంచి తుంపర్లు పడ్డాయి. నైరుతి దిశగా గంటకు 6 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
రాజకీయ కుట్రతోనే మిథున్ రెడ్డి అరెస్ట్ సాక్షి పుట్టపర్తి: ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ కుట్ర పూరితమైందని ఎమ్మెల్సీ మంగమ్మ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. లేని మద్యం కేసును వైఎస్సార్ సీపీ నాయకులకు అంటగడుతున్నారన్నారు. కూటమి సర్కార్ రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందని, అందులో భాగంగానే ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తోందని మండిపడ్డారు. ఎన్నికల వేల అలివిగాని హమీలు గుప్పించిన కూటమి నేతలు.. అధికారంలోకి వచ్చాక హామీల అమలు పక్కన పెట్టి...ప్రశ్నించిన వారిపై కక్ష గడుతోందన్నారు. కేవలం వైఎస్సార్ సీపీ కేడర్ను అణచి వేయడంపైనే కూటమి ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధ చూపుతోందనన్నారు. ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు, అక్రమ అరెస్టులకు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులెవరూ భయపడబోరన్నారు. రానున్న రోజుల్లోనూ వైఎస్సార్ సీపీ ప్రజలకోసం పోరాడుతుందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను తప్పక ఎండగడుతుందని మంగమ్మ అన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు గొట్లూరు విద్యార్థులు ధర్మవరం రూరల్: రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ సబ్ జూనియర్, జూనియర్స్ పోటీలకు గొట్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. సబ్ జూనియర్ జట్టుకు సాయి జోష్నవి, జయవర్ధన్, జూనియర్ జట్టుకు వినయ్, కమలాక్షి ఎంపికై నట్లు పీడీ రమేష్బాబు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఈ విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు జగన్నాథం, ఉపాధ్యాయులు అభినందించారు. -
భక్తిశ్రద్ధలతో జలధికి పీర్లు
పుట్టపర్తి టౌన్: మున్సిపాలిటీ పరిధిలోని బీడుపల్లి, ఎనుములపల్లి గ్రామాల్లో మంగళవారం పీర్ల జలధి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయమే గుండం వద్ద పొట్టేళ్లను బలిచ్చారు. సాయంత్రం ఉల్లాసంగా అలావ్ తొక్కారు. అనంతరం చావిడి ముందున్న గుండం చుట్లూ పీర్ల స్వాములను ప్రదక్షిణలు చేయించి అగ్ని ప్రవేశం చేయించారు. అగ్ని గుండంలోకి భక్తులు కొబ్బరి గిన్నెలు, బెల్లం వేశారు. హిందువులు, ముస్లింలు చక్కెర చదివించారు. అనంతరం అగ్నిగుండం పూడ్చివేసి పీర్లను జలధికి తరలించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐ సునీత బందోబస్తు చేపట్టారు. -
జెడ్పీ ఉద్యోగి ఆకస్మిక మృతి
అనంతపురం సిటీ: స్థానిక హౌసింగ్ బోర్డులో నివాసముంటున్న జెడ్పీ ఉద్యోగి శివనారాయణరెడ్డి(56) సోమవారం తెల్లవారుజామున మృతిచెందారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కోలుకోలేక తుదిశ్వాస వదిలినట్లు వివరించారు. మొన్నటి వరకు అనంతపురంలోని జెడ్పీ కార్యాలయంలో టైపిస్ట్గా పని చేసిన శివనారాయణరెడ్డి.. ఇటీవల బదిలీపై పెనుకొండలోని ఆర్డబ్ల్యూఎస్ సబ్ డివిజన్ కార్యాలయానికి వెళ్లారు. ఆయన మృతి విషయం తెలుసుకున్న జెడ్పీ ఉద్యోగులు పలువురు ఇంటికి వెళ్లి శివనారాయణరెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, సీఈఓ శివశంకర్, డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య తదితరులు సంతాపం తెలిపారు. -
కూటమి ప్రభుత్వ తీరు దుర్మార్గం
● వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప గుడిబండ: ప్రతిపక్ష పార్టీల నాయకులను అక్రమంగా అరెస్టు చేయించి వారి గొంతునొక్కేందుకు ప్రయత్నిస్తున్న కూటమి ప్రభుత్వ తీరు దుర్మార్గంగా ఉందని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప మండిపడ్డారు. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత సోమవారం మడకశిర నియోజకవర్గ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఈరలక్కప్పను హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. 14 నెలల పాలనలో కూటమి సర్కార్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో ఓ దళిత మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే రాష్ట్రం యావత్తూ కన్నీరుపెట్టుకుందన్నారు. కానీ ఆ మాత్రం జాలి కూడా కూటమి నేతలకు లేకపోయిందన్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన హోంమంత్రి జిల్లా పర్యటనకు వచ్చినా.. బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు ఆపాలని కోరుతూ డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఇద్దామని మడకశిరకు బయలు దేరిన తనను పోలీసులు గృహ నిర్భంధం చేయడం సిగ్గుచేటన్నారు. కూటమి నాయకుల కుట్రలు, కుతంత్రాలు మానుకోవాలని, లేని పక్షంలో ప్రజాక్షేత్రంలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అక్రమ అరెస్టులతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను భయపెట్టలేరన్నారు. వైఎస్సార్ సీపీ ఎప్పుడూ ప్రజల పక్షమేనని, ప్రజలకోసం ఎంతకై నా పోరాడుతుందన్నారు. -
హోం మంత్రికి దళితుల పట్ల బాధ్యత లేదా?
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ సాక్షి పుట్టపర్తి: రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితకు దళితుల పట్ల బాధ్యత లేదా అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీ చరణ్ ప్రశ్నించారు. సోమవారం మడకశిర నియోజక వర్గంలో పర్యటించిన హోంమంత్రి అనిత రాప్తాడు నియోజకవర్గంలో అత్యాచారానికి గురై బిడ్డకు జన్మనిచ్చి దిక్కుతోచని స్థితిలో ఉన్న దళిత మైనర్ బాలికను పరామర్శించక పోవడం బాధాకరమన్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన హోం మంత్రి అనితకు దళిత మహిళల కష్టాలు పట్టవా అని ప్రశ్నించారు. కూటమి నేతలు వైఎస్సార్ సీపీ నాయకుల అక్రమ అరెస్టులపై చూపించే శ్రద్ధ, ప్రజా సమస్యల పరిష్కారంపై చూపడం లేదన్నారు. హోంమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లాలోని పలువురు వైఎస్సార్ సీపీ నాయకులను హౌస్ అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ పాలన సాగుతోందనేందుకు ఈ అక్రమ అరెస్టులే నిదర్శనమన్నారు. కూటమి సర్కార్ నిరంకుశ పాలనను ప్రజలంతా గమనిస్తున్నారని, సరైన సమయంలో సరైన విధంగా సమాధానం చెబుతారన్నారు. -
‘సీజనల్’ బారులు
హిందూపురం టౌన్: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని చాలా ప్రాంతాల్లో పారిశుధ్యం లోపించింది. దోమలు విపరీతంగా పెరగడంతో సీజనల్ వ్యాధులు విరుచుకుపడ్డాయి. ప్రతి ఇంట్లో ఒకరు జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. వారంతా చికిత్స కోసం హిందూపురంలోని జిల్లా ఆస్పత్రికి వస్తున్నారు. ఫలితంగా సోమవారం ఓపీ 1000 దాటిపోయింది. ఓపీ చీటీల కోసం జ్వరపీడితులంతా ఆస్పత్రి ఎదుట బారులు తీరారు. చిన్నారుల ఓపీ కూడా కిక్కిరిసిపోయింది. మధ్యాహ్నం 12 గంటలు దాటినా ఓపీకి వచ్చే వారి సంఖ్య తగ్గలేదు. జ్వరపీడితులు భారీగా పెరగడంతో పరీక్షల కోసం వచ్చిన గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వైద్యం పొందడానికి గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని వాపోయారు. వైద్య పరీక్షలు చేయించుకోవడానికి బారులు తీరిన గర్భిణులురోగులతో కిక్కిరిసిన జిల్లా ఆస్పత్రి -
వైఎస్సార్ సీపీ ఉమ్మడి జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్గా పెద్దిరెడ్డి
అనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్ సీపీ ఉమ్మడి జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ మేరకు కేంద్ర కార్యాలయం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కూటమి ప్రభుత్వం అక్రమ కేసు బనాయించడంతో పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ పీవీ మిథున్ రెడ్డి అందుబాటులో లేరు. ఆయన అందుబాటులోకి వచ్చే వరకు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉమ్మడి జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. జేసీ ప్రభాకర్రెడ్డిపై చర్యలు తీసుకోవాలి ● జిల్లా ఎంపీడీఓల సంఘం డిమాండ్ ● కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమంపుట్టపర్తి అర్బన్: అనంతపురం జిల్లా పంచాయతీ అధికారి నాగరాజునాయుడుపై నోరు పారేసుకున్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎంపీడీఓల సంఘం, డిప్యూటీ ఎంపీడీఓల సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఇటీవల అనంతపురం జెడ్పీ కార్యాలయానికి వచ్చిన జేసీ ప్రభాకర్రెడ్డి తన స్థాయి మరచి డీపీఓ నాగరాజునాయుడిని దుర్భాషలాడటాన్ని వారు తీవ్రంగా ఖండించారు. జేసీ వ్యాఖ్యలను నిరసిస్తూ సోమవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎంపీడీఓలు, ఈఓఆర్డీలు కలెక్టరేట్కు విచ్చేసి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు ఎంపీడీటీఓలు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో పంచాయతీ రాజ్ శాఖ కీలకంగా పని చేస్తుందన్నారు. అంతటి కీలకమైన శాఖకు జిల్లా అధికారిగా ఉన్న నాగరాజునాయుడిని జేసీ ప్రభాకర్రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు సమన్వయం అవసరమన్నారు. జేసీ ప్రభాకర్రెడ్డి అత్యంత దురుసుగా వ్యవహరించిన తీరు, వాడిన పరుష పదజాలంతో ఉద్యోగుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కలెక్టర్ చేతన్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. -
జిల్లా అంతటా వర్షం
● 300.6 మి.మీ వర్షపాతం నమోదు పుట్టపర్తి అర్బన్: తుపాను ప్రభావంతో జిల్లాలో వరుసగా రెండో రోజూ వర్షాలు కురిశాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకూ 300.6 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా అమరాపురం మండలంలో 40.8 మి.మీ, కదిరిలో 40 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక నల్లమాడ మండలంలో 36.8 మి.మీ, గుడిబండ 27.8, మడకశిర 25.2, నల్లచెరువు 15.8, ధర్మవరం 13.4, కనగానపల్లి 10.2, ఎన్పీకుంట 9.0, బుక్కపట్నం 7.6, తలుపుల 7.4, హిందూపురం 6.8, ముదిగుబ్బ 6.4, రొళ్ల 6.4, ఓడీచెరువు 6.4, గాండ్లపెంట 6.2, తనకల్లు 6.0, అగళి 5.2, కొత్తచెరువు 4.2, పుట్టపర్తి 3.8, లేపాక్షి 3.4, రొద్దం 2.2, చిలమత్తూరు 2.2, రామగిరి 2.0, పరిగి 2.0, బత్తలపల్లి మండలంలో 1.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. కాగా, మరో రెండురోజులూ జిల్లాలో అక్కడక్కడా జల్లులు నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. పరిష్కార వేదికకు 260 వినతులు ప్రశాంతి నిలయం: ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వివిధ సమస్యలపై 260 వినతులు అందాయి. కలెక్టర్ చేతన్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటిని ఆయాశాఖలకు పంపారు. అనంతరం ఆయన అధికారులతో సమావేశమై అర్జీల పరిష్కారంపై దిశానిర్దేశం చేశారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపాలన్నారు. అలాగే ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు తదితర ప్రజలు ఎక్కువగా గుమిగూడే ప్రాంతాల్లో తాగునీరు, మరుగుదొడ్లు తదితర మౌలిక సౌకర్యాలను కల్పించాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో కల్పించిన సౌకర్యాలను తెలుపుతూ సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఆర్ఓ విజయ సారథి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సూర్యనారాయణరెడ్డి, రామసుబ్బయ్య, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు. రీసర్వే త్వరితగతిన పూర్తి చేయండి: జేసీ ప్రశాంతి నిలయం: జిల్లాలోని 32 గ్రామాల్లో చేపట్టిన రీ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఆదేశించారు. నెలాఖరులోగా డీఎల్ఆర్ పూర్తి చేయాలన్నారు. సోమవారం ఆయన కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెవెన్యూ అంశాలతో పాటు రీసర్వేపై సమీక్షించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. ముఖ్యంగా అర్జీదారులతో స్వయంగా మాట్లాడి సమస్యను తెలుసుకొని పరిష్కార చర్యలు తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, సర్వే, ల్యాండ్ ఏడీ విజయశాంతి బాయి తదితరులు పాల్గొన్నారు. వసతి గృహాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానంప్రశాంతి నిలయం: విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వసతి గృహాల్లో (2025–26 విద్యా సంవత్సరానికి) ప్రవేశాలకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని ఆ శాఖ సహాయ సంచాలకులు అర్చన సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. 3వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివే ఉమ్మడి అనంతపురం జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు దరఖాస్తుకు అర్హులన్నారు. బాలురకు అనంతపురంలోని హెచ్ఎల్సీ కాలనీలో, బాలికలకు అనంతపురం అరవింద నగర్లో వసతి గృహాలు ఏర్పాటు చేశామన్నారు. వసతి గ్రహంలో చేరే వారికి ఉచిత భోజన, వసతితో పాటు దుస్తులు, నోటు పుస్తకాలు, ట్రంక్ పెట్టె, ప్లేట్లు, గ్లాసులు, కాస్మోటిక్స్ అందిస్తామన్నారు. -
నిందలు.. నిష్టూరాలు
మడకశిర: హోం మంత్రి వంగలపూడి అనిత ‘తొలి అడుగు’ కార్యక్రమం నిందలు.. నిష్టూరాలతో సాగింది. సోమవారం ఆమె మడకశిర నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఎక్కడికి వెళ్లినా...ఏ కార్యక్రమంలో పాల్గొన్నా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రె డ్డి, ఆ పార్టీ నేతలను విమర్శించడానికే ప్రాధాన్యత ఇచ్చారు. ప్రజల కష్ట సుఖాలను తెలుసుకోవడానికే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపినా... ఒక్కరంటే ఒక్కరి సమస్య కూడా వినలేదు. కూటమి ప్రభుత్వం ఈ ఏడాది కాలంలో ప్రజలకు ఏం చేసిందో చెప్పేందుకు పట్టణంలోని వైఎస్సార్ సర్కిల్లో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అధ్యక్షతన జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు సభలో మాట్లాడిన హోంమంత్రి అనిత... ఏడాది పాలనలో ఏం చేసారో చెప్పడం పక్కన పెట్టి.. వైఎస్సార్సీపీ పాలనపై నిందలు వేస్తూ నిష్టూరమాడారు. దీంతో ప్రజలు విస్మయం చెందారు. ఏడాది పాలనలో కూటమి సర్కార్ మడకశిరకు ఏం చేయలేకపోయిందని, అందుకే చెప్పేందుకు ఏం లేక హోంమంత్రి ఇలా విమర్శలతో డైవర్షన్ పాలిటిక్స్ చేశారని జనం చర్చించుకున్నారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా జగన్పై విమర్శలు చేస్తే ఏం లాభమని వ్యాఖ్యానించారు. మహిళల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పడంతో సభలో ఉన్న వారు ఏడుగుర్రాలపల్లిలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనను గుర్తు చేసుకుని ఇదేనా మహిళా సంక్షేమం అంటూ చర్చించుకున్నారు. మరో మంత్రి సవిత కూడా మడకశిర ఎమ్మెల్యేను పొగడ్తలతో ముంచెత్తి మడకశిర అభివృద్ధి గురించి మాట్లాడకుండా వెళ్లి పోవడంతో స్థానికులు అసహనానికి లోనయ్యారు. అంతకుముందు హోంమంత్రి అనిత బీసీ సంక్షేమశాఖ మంత్రి సవితతో కలిసి ఇండియన్ డిజైన్స్ గార్మెంట్స్ పరిశ్రమను సందర్శించారు. అన్న క్యాంటీన్ను పరిశీలించారు. మడకశిర అప్గ్రేడ్ పోలీస్స్టేషన్ను తనిఖీ చేశారు. కాగా, హోంమంత్రి అనిత పర్యటనలో జిల్లాలోని మిగతా నియోజకవర్గాల కూటమి ఎమ్మెల్యేలు పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎంపీ పార్థసారథి కూడా పార్లమెంట్ సమావేశాల పేరుతో గైర్హాజరు కావడం విశేషం. ‘తొలి అడుగు’లో హోంమంత్రి అనిత తీరిది ఆద్యంతం వైఎస్సార్సీపీపై విమర్శలకే ప్రాధాన్యం ఏడాది పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పుకోలేని వైనం -
‘పరిష్కార వేదిక’కు 58 వినతులు
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 58 వినతులు అందాయి. ఎస్పీ ఆదేశాలతో డీఎస్పీ హేమంత్కుమార్ వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్ సాయినాథరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసినా కేసు నమోదు చేయలేదు.. తన పొలంలో ఏర్పాటు చేసుకున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి, రాగి వైర్ అపహరించారని, ఈ విషయంగా పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకూ కేసు నమోదు చేయలేదంటూ డీఎస్పీ హేమంత్కుమార్ ఎదుట గోరంట్లకు చెందిన రైతు మురళి వాపోయాడు. జూన్ 29 రాత్రి ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేశారని తెలిపారు. అదే నెల 30న గోరంట్ల పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వివరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కేసు నమోదు చేయలేదని, ఇదేమని అడిగితే ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం చేసిన దుండగులు దొరికితే కేసు నమోదు చేస్తామని సీఐ రాజశేఖర్ అంటున్నారని వాపోయాడు. ఎఫ్ఐఆర్ నకలు ఇస్తే కొత్త ట్రాన్స్ఫార్మర్ను విద్యుత్ శాఖ అధికారులు కేటాయిస్తామంటున్నారని, లేకుంటే రూ.80 వేలు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎఫ్ఐఆర్ కాఫీ ఇప్పించి, తన సమస్యకు పరిష్కారం చూపాలని వేడుకున్నాడు. -
కొనసాగుతున్న కార్మికుల ఆందోళన
పుట్టపర్తి టౌన్: సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె సోమవారానికి తొమ్మిదవ రోజుకు చేరింది. సీఐటీయూ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శనతో భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, ఎన్నికల సమయంలో మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, తల్లికి వందనం వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చాలని, ఉద్యోగ విరమణ వయస్సు 62కు పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, పుట్టపర్తి పట్టణ ప్రధాన కార్యదర్శి నాగార్జున, ట్రెజరర్ గోవిందు, సహాయ కార్యదర్శి పెద్దన్న, రామయ్య, కార్మికులు నరసింహులు, వెంకటేష్, రామాంజనమ్మ, సరోజమ్మ, వెంకటలక్ష్మి, నారాయణమ్మ, మారెప్ప, రమణ, సద్దాం, రామాంజినాయక్, సాయినాథరెడ్డి, గంగాద్రి తదితరులు పాల్గొన్నారు. -
జెడ్పీ ఉద్యోగి ఆకస్మిక మృతి
అనంతపురం సిటీ: స్థానిక హౌసింగ్ బోర్డులో నివాసముంటున్న జెడ్పీ ఉద్యోగి శివనారాయణరెడ్డి(56) సోమవారం తెల్లవారుజామున మృతిచెందారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కోలుకోలేక తుదిశ్వాస వదిలినట్లు వివరించారు. మొన్నటి వరకు అనంతపురంలోని జెడ్పీ కార్యాలయంలో టైపిస్ట్గా పని చేసిన శివనారాయణరెడ్డి.. ఇటీవల బదిలీపై పెనుకొండలోని ఆర్డబ్ల్యూఎస్ సబ్ డివిజన్ కార్యాలయానికి వెళ్లారు. ఆయన మృతి విషయం తెలుసుకున్న జెడ్పీ ఉద్యోగులు పలువురు ఇంటికి వెళ్లి శివనారాయణరెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, సీఈఓ శివశంకర్, డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య తదితరులు సంతాపం తెలిపారు. -
బదిలీ టీచర్లకు వేతన కష్టాలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,200 మంది ఉపాధ్యాయుల్లో పదోన్నతి దక్కిన ఆనందం ఆవిరైపోయింది. బదిలీపై కొత్త ప్రాంతానికి వెళ్లిన వారు జీతాలు అందక నానా అగచాట్లు పడుతున్నారు. కీలకమైన జూన్ మాసంలో పిల్లల ఫీజులు, బ్యాంకు లోన్లు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు. మరో పది రోజుల్లో జూలై మాసం కూడా ముగియనున్న తరుణంలో రెండు నెలల జీతాలు ఆగస్టులో ప్రభుత్వం చెల్లిస్తుందో.. లేదో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనంతపురం ఎడ్యుకేషన్: కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘ఉపాధ్యాయ బదిలీ చట్టం’ ద్వారా ఇటీవల పలువురు టీచర్లకు పదోన్నతులు, బదిలీలు జరిగాయి. వీరిలో వేలాది మందికి పొజిషన్ ఐడీలు రాక జూన్ నెల జీతం ఇప్పటి వరకూ అందలేదు. మరో వారం గడిస్తే రెన్నెళ్ల జీతం అందాల్సి ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 7,152 మంది టీచర్లు బదిలీ అయ్యారు. వీరిలో గ్రేడ్–2 హెచ్ఎంలు 133 మంది, పీఎస్హెచ్ఎంలు 193 మంది, స్కూల్ అసిస్టెంట్లు 3,478 మంది, ఎస్జీటీలు 3,208 మంది, పండిట్లు 111 మంది, పీఈటీలు 29 మంది ఉన్నారు. సాధారణంగా ఉపాధ్యాయ, ఉద్యోగులకు వారు బదిలీ అయిన ప్రాంతాల్లో జీతాలు తీసుకునేలా అక్కడి డీడీఓలకు సమాచారం అందిస్తారు. గతంలో రెగ్యులర్ జీతాలు తీసుకుంటున్నా...వీరి స్థానం మారడంతో బదిలీ అయిన స్థానానికి పొజిషన్ ఐడీ కేటాయించాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే సీఎఫ్ఎంఎస్లో వారి వివరాలు కనిపిస్తాయి. అప్పుడు జీతాలు చెల్లించడానికి వీలుంటుందని ఉద్యోగ, ఉపాధ్యాయులు చెబుతున్నారు. జీతాల కోసం ఎదురు చూస్తున్న 5 రకాల పాఠశాలల టీచర్లు.. కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పది రకాల పాఠశాలల్లో 5 రకాల పాఠశాలల ఉపాధ్యాయులు జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని కేడర్ల టీచర్లు దాదాపు 2,200 మందికి జూన్ నెల వేతనాలు జమకాలేదు. అప్గ్రేడ్ అయిన ప్రాథమికోన్నత పాఠశాలలు, కొత్తగా ఏర్పాటైన మోడల్ ప్రైమరీ పాఠశాలలు, కొత్తగా పదోన్నతులు పొందిన స్కూల్ అసిస్టెంట్లు, గ్రేడ్–2 హెచ్ఎంలకు జీతాలు రాలేదు. వీరందరికీ పొజిషన్ ఐడీలు కేటాయించాల్సి ఉంది. ముఖ్యంగా మోడల్ ప్రైమరీ పాఠశాలలకు పలువురు స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలను కేటాయించారు. వాస్తవానికి ఆ పాఠశాలల్లో గతంలో కేడర్ స్ట్రెంత్కు అనుగుణంగా ఉన్న పోస్టులకు జీతాలు చేసే వీలుంటుంది. కొత్తగా వచ్చిన పోస్టులకు పొజిషన్ ఐడీలు కేటాయించిన తర్వాతనే జీతాలకు అవకాశం ఉంటుంది. అప్గ్రేడ్ అయిన యూపీ స్కూళ్ల టీచర్లకు ఇదే ప్రధాన సమస్యగా మారింది. ఇక్కడ డీడీఓ మారడంతో ఏ ఒక్కరికీ జీతభత్యాలు అందలేదు. పొజిషన్ ఐడీలు మండల స్థాయిలో నిర్ధారించి, జిల్లాకు.. ఇక్కడి నిర్ధారించి రాష్ట్రానికి పంపాల్సింది పోయి, నేరుగా రాష్ట్ర స్థాయిలో కేటాయించే చర్యలు చేపట్టడంతో సమస్య ఉత్పన్నమవుతోందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు వాపోతున్నారు. రాష్ట్రస్థాయిలో స్పష్టత రాక తిరిగి జిల్లా నుంచి 8 నుంచి 10 మంది సాంకేతిక నిపుణులను పిలిపించి వారం రోజులకు పైగా సరి చేయాల్సి వచ్చింది. పిల్లల ఫీజులు, బ్యాంకులోన్ల కంతులకు అగచాట్లు.. కీలకమైన జూన్ నెలకు సంబంధించిన వేతనాలు రాకపోయేసరికి చాలామంది టీచర్లు పిల్లల చదువులకు ఫీజులు, బ్యాంకు లోన్ల కంతులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేయాల్సి వస్తోందంటూ వాపోతున్నారు. వారం రోజులు గడిస్తే జూలై జీతం రావాల్సి ఉందని, రెన్నెళ్ల జీతమైనా ఆగస్టులో వచ్చేలా అధికారులు చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పదోన్నతులు, బదిలీల టీచర్లకు పొజిషన్ ఐడీలు రాక అందని జీతాలు ఇబ్బందుల్లో ఉమ్మడి జిలాలోని 2,200 మంది ఉపాధ్యాయులు పిల్లల ఫీజులు, బ్యాంకు లోన్ల కంతులకు అగచాట్లు -
ఖరీఫ్ సాగు.. డీలా
పుట్టపర్తి అర్బన్: ఖరీఫ్ సాగు ముందుకు సాగడం లేదు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు పంటల సాగుపై ఆశలు వదులుకున్నారు. ఇప్పటికే మంచి ఆదను మించిపోవడంతో వేరుశనగ, కంది సాగు చేసే పరిస్థితి లేదు. బోర్లు ఉన్న రైతులు మాత్రమే సాగు చేస్తున్నారు. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో పశువులు, జీవాలకు మేత దొరకడం కూడా కష్టంగా మారింది. గత ఐదేళ్ల సాగు గణాంకాలు పరిశీలిస్తే ఏటా సాధారణంగా 2,19,950 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ఈ ఏడాదిలో ఈ నెల ఐదో తేదీ వరకు వరకు ,15,333 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగులోకి వచ్చాయి. ఇందులో వేరుశనగ 10,365 హెక్టార్లు, మొక్కజొన్న 1,696, కంది 1,614, పత్తి 1,208, రాగి 267, ఆముదం 53, వరి 54, సజ్జ 50, జొన్న 26 హెక్టార్లలో వేశారు. మొదటి తర్వాత నుంచి జల్లులు కురుస్తున్నా ఉపయోగం లేకుండా పోతోంది. దీంతో రెండు లక్షల హెక్టార్లకు పైగా భూమి బీడుగా పెట్టారు. ఇలా అయితే వ్యవసాయం చేసేదెలా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. రెండు లక్షల హెక్టార్లు బీడు వర్షాభావంతో సన్నగిల్లిన ఆశలు పశువులకు మేత కూడా గగనమే -
అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి
మడకశిర: దళిత విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించి, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మడకశిర పర్యటనకు వచ్చిన ఎస్పీ రత్నను వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి, దండోరా నాయకుడు గంగాధర్, వైఎస్సార్సీపీ నాయకులు రంగనాథ్, సికిందర్ తదితరులు కలసి వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో దళితులకు రక్షణ కరువైందని, దళితుల సమస్యలపై హోంమంత్రికివినతి పత్రం ఇవ్వడానికి వెళుతుంటే పోలీసులు అడ్డుకోవడం అన్యాయమని అన్నారు. దళిత మహిళలు, విద్యార్థినులపై జరుగుతున్న లైంగిక దాడులు, దౌర్జన్యాలను అరికట్టాలని, బాధ్యలైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. 26 నుంచి ‘హనుమాన్ దర్శన్’ ● ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు పుట్టపర్తి టౌన్: శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని అనంతపురం జిల్లాలోని మురడి, నేమకల్లు, కసాపురం గ్రామాల్లో వెలసిన ఆంజనేయస్వామి ఆలయాలను ఒకే రోజు సందర్శించుకునేలా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు జిల్లా ప్రజారవాణాధికారి మధుసూదన్ సోమవారం వెల్లడించారు. ఈ నెల 26 నుంచి ప్రతి శని, మంగళవారాల్లో హనుమాన్ దర్శన్ పేరుతో జిల్లాలోని అన్ని డిపోల నుంచి బస్సులు బయలుదేరుతాయి. ఈ నెల 26, 29, ఆగస్టు 2, 5, 9, 12, 16, 19 బస్సులు బయలుదేరుతాయి. రద్దీకి అనుగుణంగా 50 మంది ఒకే బ్యాచ్గా ప్రయాణించాలనుకుంటే వారి ప్రాంతానికే ప్రత్యేకంగా బస్సును పంపిస్తారు. పూర్తి వివరాలకు ధర్మవరం (99592 25859), హిందూపురం (99592 25858), కదిరి (99592 25860), మడకశిర (99592 25865), పెనుకొండ (99592 29966), పుట్టపర్తి (99592 25857) డిపో మేనేజర్లను సంప్రదించవచ్చు. -
డివైడర్ను ఢీకొని వ్యక్తి మృతి
పరిగి: స్థానిక జాతీయ రహదారిపై ఉన్న డివైడర్ను ఢీకొని ఓ ద్విచక్ర వాహన చోదకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... లేపాక్షి మండలం వడ్డిపల్లికి చెందిన చిన్నకొండప్ప గారి గంగాధరప్ప (41) బేల్దారి పనులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం తన భార్య సునందమ్మతో కలసి కర్ణాటకలోని పావగడ తాలూకా అచ్చంపల్లికి ద్విచక్రవాహనంపై వెళ్లాడు. అక్కడ భార్యను పుట్టింట్లో వదిలి అదే రోజు రాత్రి స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. పరిగి మండలం ధనాపురం క్రాస్ సమీపంలో ప్రయాణిస్తుండగా రాత్రి 9 గంటల సమయంలో నియంత్రణ కోల్పోయి జాతీయ రహదారిపై ఉన్న డివైడర్ను ఢీకొన్నాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన గంగాధరప్పను అటుగా వెళుతున్న వారు గుర్తించి వెంటనే హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బంధువులు బెంగళూరుకు తీసుకెళుతుండగా సోమవారం వేకువజామున మార్గ మధ్యంలో మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
పచ్చిరొట్టతో నేల సారవంతం
● కలెక్టర్ టీఎస్ చేతన్ ప్రశాంతి నిలయం: పచ్చిరొట్ట ఎరువు వాడకంతో నేల సారవంతం అవుతుందని కలెక్టర్ టీఎస్ చేతన్ అన్నారు. పచ్చిరొట్ట పైర్ల వినియోగంపై వ్యవసాయ శాఖ రూపొందించిన పోస్టర్లను కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం కలెక్టర్ ఆవిష్కరించి, మాట్లాడారు. ఆధునిక సాంకేతిక వ్యవసాయ పద్ధతులు, ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డీఆర్వో విజయసారథి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సూర్యనారాయణరెడ్డి, రామసుబ్బయ్య, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు, ఉద్యాన శాఖ డీడీ చంద్రశేఖర్, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన విద్యను అందించాలి ● జిల్లా విద్యాశాఖాధికారి క్రిష్టప్ప మడకశిర: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖాధికారి క్రిష్టప్ప సూచించారు. సోమవారం మడకశిరలోని బాలికోన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. విద్యార్థులకు పంపిణీ చేసిన కిట్లను పరిశీలించారు. పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఆ దిశగా విద్యార్థులను ఇప్పటి నుంచే సన్నద్ధం చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. రికార్డు అసిస్టెంట్కు నివాళి.. విద్యాశాఖలో రికార్డు అసిస్టెంట్గా పని చేస్తున్న అక్కంపల్లి గొట్టహట్టి గ్రామానికి చెందిన చిత్ర లింగప్ప సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయాన్ని తెలుసుకుని డీఈఓ క్రిష్టప్ప ఆ గ్రామానికి చేరుకుని చిత్రలింగప్ప మృతదేహానికి నివాళులర్పించారు. స్థానిక ఎంఈఓలు భాస్కర్, నరసింహమూర్తి ఆయన వెంట ఉన్నారు. జల్సాలకు అలవాటు పడి బైకుల చోరీ అనంతపురం: జల్సాలకు అలవాటు పడి బైకులను చోరీ చేస్తున్న నలుగురు మైనర్లతో పాటు ముగ్గురిని అనంతపురం టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం టూటౌన్ పోలీసుస్టేషన్లో అనంతపురం అర్బన్ డీఎస్పీ వి. శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించిన వివరాల మేరకు... ఆకుతోటపల్లికి చెందిన బైనేని యతీంద్ర అలియాస్ శివా, బోగిశెట్టి యోగీశ్వర్ అలియాస్ యోగి, అనంతపురంలోని గంగానగర్కు చెందిన సి. యశ్వంత్ కుమార్ అలియాస్ బన్నీ జల్సాలకు అలవాటు పడ్డారు. మరో నలుగురు మైనర్లతో కలిసి ఓ ముఠాగా ఏర్పడి బైకులను చోరీ చేయడం ప్రారంభించారు. శనివారం ప్రసన్నాయపల్లి రైల్వేస్టేషన్ వైపు నుంచి లగేజీ ఆటోలో ఈ ఏడుగురు అనుమానాస్పదంగా వెళ్తుండడం చూసిన కొందరు.. సమాచారం ఇవ్వడంతో టూ టౌన్ సీఐ శ్రీకాంత్, ఎస్ఐ రుష్యేంద్ర బాబు, సిబ్బందితో అక్కడకు చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. విచారిస్తే బాగోతం బయటపడింది. అనంతపురం నగరంతో పాటు ధర్మవరం, నల్లచెరువు తదితర ప్రాంతాల్లో రెండేళ్లుగా బైక్లను చోరీ చేస్తున్నట్లు నిందితులు వెల్లడించారు. వారి నుంచి 19 బైక్లు, ఒక లగేజీ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.19 లక్షలు ఉంటుందని డీఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. బైనేని యతేంద్ర అలియాస్ శివా ముఠాలో ముఖ్యుడని, ఇతనిపై ఇది వరకే 8 బైక్ చోరీ కేసులు ఉన్నట్లు వెల్లడించారు. అలరించిన నృత్య రూపకం ప్రశాంతి నిలయం: పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి విచ్చేసిన మిడిల్ ఈస్ట్, గల్ఫ్ దేశాలకు చెందిన బాలవికాస్ చిన్నారులు సోమవారం సాయంత్రం సత్యసాయి మహాసమాధి చెంత సంగీత నృత్య రూపకం నిర్వహించారు. అబుదాబి, దుబాయ్, ఓమన్, కువైట్, ఖతార్ దేశాలకు చెందిన చిన్నారులు పాల్గొన్నారు. -
గడువులోపు పనులన్నీ పూర్తి కావాలి
● పంచాయతీరాజ్ సీఈ అశోక్కుమార్ ● ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఏపీఆర్ఆర్పీ రోడ్ల పురోగతిపై సమీక్ష ● హాజరైన ఉమ్మడి జిల్లాల పీఆర్ ఇంజినీరింగ్ అధికారులు అనంతపురం సిటీ: ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్స్ ప్రాజెక్ట్ (ఏపీఆర్ఆర్పీ) కింద మంజూరైన పనులన్నీ వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకల్లా పూర్తి చేయాల్సిందేనని సంబంధిత అధికారులను ఆ విభాగం ప్రాజెక్ట్ డైరెక్టర్, సీఈ అశోక్కుమార్ ఆదేశించారు. ఏపీఆర్ఆర్పీ రోడ్ల పురోగతిపై సీఈ కార్యాలయ ఈఈ రమణమూర్తితో కలసి అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాలకు సంబంధించిన పీఆర్ ఇంజినీరింగ్ అధికారులతో అనంతపురంలోని సర్కిల్ కార్యాలయంలో సోమవారం ఆయన సమీక్షించారు. అనంతపురం సర్కిల్ కార్యాలయ సూపరింటెండెంట్ ప్రభాకర్రెడ్డి, పీఏ రాజేంద్ర ప్రసాద్, పీఐయూ ఈఈ నవీన్కుమార్, ఈఈలు శంకరయ్య, రఘునాథరెడ్డి, డీఈఈలు, ఏఈఈలు హాజరయ్యారు. నాలుగేళ్లలో అనంతపురం జిల్లాకు సంబంధించి రూ.209 కోట్లతో 138 రోడ్లు మంజూరు కాగా, ఇప్పటి వరకు 52 పనులు పూర్తయ్యాయని, 42 పనులు ప్రోగ్రెస్లో ఉండగా, 44 పనులు రద్దయినట్లు ఇంజినీరింగ్ అధికారులు వివరించారు. మొత్తం రూ.101 కోట్లు ఖర్చు పెట్టి 195.71 కిలోమీటర్ల మేర రహదారులను నిర్మించినట్లు తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లాకు రూ.230 కోట్లతో 194 పనులు మంజూరు కాగా, 119 పనులు పూర్తయినట్లు ఇంజినీర్లు వివరించారు. 28 పనులు వివిధ దశల్లో ఉండగా, 47 పనులు రద్దయ్యాయని తెలిపారు. మొత్తం 193.91 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించినట్లు పేర్కొన్నారు. అలాగే కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పరిస్థితిపైనా ఆయన సమీక్షించారు. గడువులోపు పనులన్నీ పూర్తి నాణ్యతగా చేయాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
నేరాల నియంత్రణ ఎలా..?
మడకశిర: అంతర్రాష్ట్ర నేరాలు అధికంగా నమోదవుతున్న మడకశిర నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్లలో సిబ్బంది కొరత అధికంగా ఉంది. గుర్తు తెలియని మృతదేహాలకు సంబంధించి నమోదైన కేసుల్లో కొన్నింటిని మాత్రమే పోలీసులు ఛేదించారు. చాలా కేసులు మిస్టరీగానే మిగిలిపోయాయి. మడకశిర అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్తో పాటు రూరల్ సర్కిల్ పరిధిలోని అగళి, రొళ్ల, అమరాపురం, అగళి స్టేషన్ల పరిధిలో కానిస్టేబుళ్ల కొరత తీవ్రంగా ఉంది. 105 మంది కానిస్టేబుళ్లు ఉండాల్సి ఉండగా సగం స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 20 మంది హెడ్కానిస్టేబుళ్లకు 10 మంది మాత్రమే ఉన్నారు. చాలామంది కానిస్టేబుళ్లు డిప్యుటేషన్పై ఇతర పోలీస్స్టేషన్లకు కూడా వెళ్లారు. సబ్డివిజన్ ఏర్పాటుపై నిర్లక్ష్యం.. మడకశిర కేంద్రంగా పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అంతలోనే ప్రభుత్వం మారింది. అయితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సబ్ డివిజన్ ఏర్పాటుపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. దీంతో సబ్డివిజన్ ఏర్పాటు ప్రక్రియ ప్రతిపాదనలకే పరిమితమైపోయింది. రూరల్ పోలీస్ సర్కిల్ ఏర్పాటైనా కార్యాలయం మాత్రం మడకశిరలోనే కొనసాగుతోంది. ఈ సర్కిల్ పరిధిలోని అగళి, రొళ్ల, అమరాపురం, గుడిబండ మండలాల ప్రజలు ఏదైనా పనిమీద సీఐని కలవలంటే మడకశిరకే రావాల్సిన పరిస్థితి నెలకొంది. కండీషన్ లేని వాహనాలతో తంటాలు.. ప్రతి పోలీస్స్టేషన్కు ఒక వాహనం ఉండాలి. అయితే గుడిబండ పోలీస్స్టేషన్కు వాహన సౌకర్యం లేదు. ఈ వాహనం కండీషన్ లేకపోవడంతో ఉన్నతాధికారులు తీసుకెళ్లారు. మళ్లీ కొత్త వాహనాన్ని కేటాయించలేదు. ప్రస్తుతం గుడిబండ పోలీస్స్టేషన్కు వాహనం లేకపోవడంతో విధులు నిర్వర్తించడానికి పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు. మిగిలిన పోలీస్స్టేషన్లకు కేటాయించిన వాహనాలు కూడా కండీషన్లో లేకపోవడంతో పోలీసులు తంటాలు పడుతున్నారు. శిథిలావస్థలో పోలీస్ గృహాలు.. మడకశిరలో పోలీస్ నివాస గృహాలు శిథిల దశకు చేరుకున్నాయి. వర్షం వస్తే కారుతున్నాయి. అమరాపురంలో ఉన్న పోలీస్ నివాస గృహాలను కూలదోశారు. వాటి స్థానంలో కొత్త గృహాలను నిర్మించలేదు. అగళి, రొళ్ళ, గుడిబండలో పోలీస్ నివాస గృహాలు లేవు. అద్దె ఇళ్లల్లో ఉంటున్నారు. హోం మంత్రి దృష్టి సారించేరా? రాష్ట్ర హోం మంత్రి అనిత సోమవారం మడకశిర నియోజకవర్గంలో పర్యటించనున్నారు. తమ సమస్యలపై దృష్టి సారించి పరిష్కరిస్తారేమోనని పోలీసులు ఆశతో ఎదురు చూస్తున్నారు. పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటుపైనా ప్రకటన చేయాలని ప్రజలు కోరుతున్నారు. నేడు హోం మంత్రి రాక మడకశిర: రాష్ట్ర హోంమంత్రి అనిత సోమవారం మడకశిర నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు మడకశిరలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడతారు. 10.30 గంటలకు చీపులేటి వద్ద ఉన్న ఇండియన్ డిజైన్స్ గార్మెంట్స్ను సందర్శిస్తారు. 11 గంటలకు గుడిబండలో పర్యటిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు మడకశిర పోలీస్స్టేషన్ను సందర్శిస్తారు. 4.45 గంటలకు వైఎస్సార్ సర్కిల్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. హోం మంత్రి పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ నరసింగప్ప ఆదివారం తెలిపారు. హోం మంత్రి అనితకు ‘సమస్యల హారం’ కర్ణాటక సరిహద్దు స్టేషన్లలో పోలీసుల కొరత మిస్టరీగానే మిగిలిపోతున్న అంతర్రాష్ట్ర నేరాల కేసులు పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితం శిథిల దశలో పోలీసుల నివాస గృహాలు ఇది అగళి పోలీస్ స్టేషన్. నియోజకవర్గ కేంద్రం మడకశిరకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్ణాటక సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ స్టేషన్ పరిధిలో అంతర్రాష్ట్ర నేరాలు నమోదవుతుంటాయి. ఇందుకు ప్రధాన కారణం ఇక్కడి పోలీస్ స్టేషన్లో సిబ్బంది కొరతే. 21 మంది కానిస్టేబుళ్లకు గాను ఐదుగురు మాత్రమే ఉన్నారు. 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక రెండు హెడ్కానిస్టేబుళ్ల పోస్టులకు గాను -
సాయి బోధనలతో స్వీయ పరివర్తన
ప్రశాంతి నిలయం: సత్యసాయి బోధనలు ఆచరించడం ద్వారా ప్రతి ఒక్కరూ స్వీయపరివర్తనతో పరిపూర్ణులు అవుతారని వక్తలు పేర్కొన్నారు. ‘స్వీయ పరివర్తన కోసం యువత నాయకత్వం’ పేరిట రెండు రోజులుగా ప్రశాంతి నిలయంలో జరుగుతున్న సదస్సు ఆదివారం ముగిసింది. సాయంత్రం సత్యసాయి మహాసమాధి చెంత గ్రాడ్యుయేషన్ కార్యక్రమం నిర్వహించారు. వేదపఠనంతో కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 18 దేశాలకు చెందిన యువతీ యవకులు పాల్గొన్నారు. యువతలో స్వీయ పరివర్తన కోసం సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో చేపట్టిన కోర్సును పూర్తి చేసుకున్న యువ నాయకులు మలేషియాకు చెందిన విమల్ రాజ్, యునైటెడ్ కింగ్డమ్కు చెందిన రిషా తదితరులు ప్రసంగించారు. సత్యసాయి బోధించిన సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసలను ఆచరించడం ద్వారా మహనీయులుగా మారుతారన్నారు. అనంతరం యువత సంగీత కచేరీ నిర్వహించారు. తర్వాత సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్ రాజు, ట్రస్ట్ సభ్యుడు చక్రవర్తిలు కోర్సు పూర్తి చేసుకున్న యువతకు సరిఫికెట్లు ప్రదానం చేశారు. -
బది‘లీలల’పై హైకోర్టుకు..
అనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వ పాలనలో న్యాయం అందని ద్రాక్షగా మారింది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు జిల్లా యంత్రాంగంపై స్వారీ చేస్తున్నారు. అధికారులు కూడా వారికి దాసోహమై... విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రజాప్రతినిధుల సిఫారసులకు తలొగ్గి నిబంధనలకు తుంగలో తొక్కి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ తప్పిదాలు చివరికి అధికారుల మెడకే చుట్టుకునే పరిస్థితి నెలకొంది. ఇటీవల నిర్వహించిన సచివాలయ ఉద్యోగుల బది‘లీలల్లో’ సరిగ్గా ఇదే జరిగింది. బదిలీల ప్రక్రియలో తమకు అన్యాయం జరిగిందంటూ సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్లు హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో రాష్ట్రస్థాయి నుంచి జిల్లాస్థాయి అధికారులను బాధ్యులను చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఖాతరు చేయని వైనం.. వ్యవసాయ శాఖ పరిధిలోని సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్ల బదిలీల ప్రక్రియను గత నెల 28న అధికారులు నిర్వహించారు. ఈనెల ఒకటో తేదీన బదిలీల ఉత్తర్వులు జారీచేశారు. ప్రక్రియలో అధికారులు నియమ, నిబంధనలు పాటించకపోవడం ద్వారా తొలి ర్యాంకులో ఉన్న తమకు అన్యాయం జరిగిందని పలువురు ఆరోపించారు. అగ్రికల్చర్ అసిస్టెంట్ సుస్మితది ఉమ్మడి జిల్లాలో 5వ ర్యాంక్, శ్రీ సత్యసాయి జిల్లాలో 2వ ర్యాంక్. జనార్దన్కు ఉమ్మడి జిల్లాలో 6వ ర్యాంక్, శ్రీ సత్యసాయి జిల్లాలో 3వ ర్యాంక్. ఇక శిరీషకు పీహెచ్ కోటా అమలు కాలేదు. ఇలా అర్హులైన పలువురు బదిలీల్లో వారు పెట్టుకున్న ఆప్షన్ స్థానాలు ఖాళీగా ఉన్నా ఇవ్వకుండా తరువాతి ర్యాంక్ వాళ్లకు ఇచ్చారని ఆరోపించారు. ఒక్క అగ్రికల్చర్ అసిస్టెంట్ల విషయంలోనే కాదు... సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో ప్రజాప్రతినిధుల సిఫారసులకు అధికారులు పెద్దపీట వేసి నిబంధనలు తుంగలో తొక్కారనే ఆరోపణలు వచ్చినా ఖాతరు చేయలేదు. కలెక్టర్ను కలిసినా అంతే... బదిలీల ప్రక్రియలో తమకు అన్యాయం జరిగిందని అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్కుమార్ను బాధిత అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఈనెల 2న కలిసి ఆధారాలతో సహా వినతిపత్రం అందజేశారు. విచారణ చేస్తామని కలెక్టర్ చెప్పి పంపించారు. అటు తరువాత కూడా కలెక్టర్ను అగ్రికల్చర్ అసిస్టెంట్లు మూడు, నాలుగు దఫాలు కలిసి తమ గోడు చెప్పుకుని న్యాయం చేయాలని కోరారు. అయితే వారి గోడును ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. దీంతో న్యాయం కోసం 11 మంది అగ్రికల్చర్ అసిస్టెంట్లు హైకోర్టును ఆశ్రయించారు. అధికారులను బాధ్యుల్ని చేస్తూ... బదిలీల ప్రక్రియలో తమకు జరిగిన అన్యాయానికి అధికారులను బాధ్యులను చేస్తూ అగ్రికల్చర్ అసిస్టెంట్లు కె.హరినాథ్రెడ్డి, హెచ్.జహీర్, జె.రేణుకా, ఎం.సుస్మిత, కె.జనార్దన్, వి.తరుణ్రెడ్డి, బి.శిరీష, కడపల రజిత, బీఏ సంధ్య, పి.నేత్ర, జి.సర్తాజ్ హైకోర్టులో రిట్ పిటిషన్ (17050 ఆఫ్ 2025) వేశారు. గ్రామ సచివాలయ, వార్డు సచివాలయ శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో పాటు 19 మంది అగ్రికల్చర్ అసిస్టెంట్లను బాధ్యులను చేశారు. అగ్రికల్చర్ అసిస్టెంట్లు వేసిన రిట్ పిటిషన్పై హైకోర్టు ఇంటీరియం ఆర్డర్ ఆఫ్ స్టేటస్కో ఈనెల 16న ఇచ్చింది. ఆ రోజు నుంచి రెండు వారాల పాటు స్టేటస్కో కొనసాగించాలని అధికారులను ఆదేశించడం గమనార్హం. కోర్టు మెట్లెక్కిన సచివాలయ ఉద్యోగులు కలెక్టర్కు పలుమార్లు విన్నవించినా ప్రయోజనం శూన్యం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అగ్రికల్చర్ అసిస్టెంట్లు స్టేటస్కో ఇచ్చిన ఉన్నత న్యాయస్థానం -
ఓర్వలేకే అక్రమ అరెస్టులు
● కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ ధ్వజం పెనుకొండ రూరల్: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వస్తున్న ఆదరణ కూటమి ప్రభుత్వం ఓర్వలేకపోతోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ విమర్శించారు. కుట్రలు పన్ని పార్టీ నేతలను అక్రమంగా అరెస్టు చేయడం ద్వారా జగన్ను ఒంటరి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆమె ఆదివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. జగన్ పర్యటనలకు ప్రజలు పోటెత్తుతుండటంతో కూటమి నేతల్లో భయం పట్టుకుందన్నారు. అందుకే కుట్రలు పన్ని ఓఎస్డీ కృష్ణమోహన్, ధనుంజయరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్రెడ్డిలను అరెస్ట్ చేశారన్నారు. లేని మద్యం కుంభకోణాన్ని సృష్టించి అక్రమ అరెస్టులకు తెరలేపారన్నారు. గతంలో కూటమి నాయకులు ఒకసారి రూ.50 వేల కోట్ల కుంభకోణం అని, తర్వాత రూ.30 వేల కోట్లు అని, ఇప్పుడు రూ.18 వేల కోట్లు.. రూ.2 వేల కోట్ల స్కాం అని అంటున్నారని మండిపడ్డారు. తప్పుడు ఆరోపణలు, అక్రమ అరెస్ట్లను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారన్నారు. పొంతనలేని మాటలతో కూటమి నాయకులు ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. ఎటువంటి ఆధారాలూ లేకుండా అరెస్ట్లకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నియంత్రణతో మద్యం అమ్మకాలు చేపట్టిందన్నారు. నేడు ప్రతి గల్లీలోనూ బెల్టు షాపుల ద్వారా మద్యం విక్రయాలు చేస్తున్నారన్నారు. అసలైన విచారణ ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద సిట్ అధికారులతో చేయించాలన్నారు. లేని మద్యం కుంభకోణం నుంచి ఎంపీ మిథున్రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని స్పష్టం చేశారు. నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రశాంతి నిలయం: కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ చేతన్ తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు హాజరవుతారని, ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేయాలని సూచించారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. ఎస్పీ కార్యాలయంలో.. పుట్టపర్తి టౌన్: ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ రత్న తెలిపారు. అర్జీదారులు తమ ఆధార్కార్డును తప్పని సరిగా వెంట తీసుకురావాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగిన ఐదుగురికి జరిమానా హిందూపురం: స్థానిక రహమత్ సర్కిల్ వద్ద బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తున్న ఐదుగురికి రెండో పట్టణ సీఐ అబ్దుల్ కరీం జరిమానా విధించారు. ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కొక్కరికి రూ.200 చొప్పున జరిమానా విధించారు. బహిరంగంగా పొగతాగడం, పాన్మసాలు తింటూ ఉమ్మి వేయడం వంటివి నిషేధమని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. -
18 మండలాల్లో వర్షం
పుట్టపర్తి అర్బన్: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు జిల్లాలోని 18 మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. లేపాక్షి మండలంలో 19.2 మి.మీ, హిందూపురం మండలంలో 11.2, అమరాపురంలో 9.8, ఎన్పీ కుంటలో 7.4, గుడిబండలో 7.4, సోమందేపల్లిలో 7.4, బత్తలపల్లిలో 7.2, తాడిమర్రిలో 6.8, రొళ్లలో 6.2, తనకల్లులో 5.8, గాండ్లపెంటలో 5.4, తలుపులలో 5.2, మడకశిరలో 5.2, అగళిలో 4.6, పెనుకొండలో 4.4, కదిరిలో 2.4, ధర్మవరంలో 2.2, నల్లచెరువులో 2 మి.మీ వర్షపాతం నమోదైంది. దీంతో పాటు ఆదివారం సాయంత్రం ధర్మవరం, కొత్తచెరువు, పుట్టపర్తి మండలాల్లో జల్లులు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రెయినేజీలు పొంగి పొర్లాయి. జిల్లాలో మరో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. -
అసభ్య ప్రవర్తన, దాడి కేసులో నిందితుడి అరెస్ట్
కొత్తచెరువు: అసభ్యకర ప్రవర్తన, మహిళలపై దాడి ఘటన కేసులో నిందితుడైన మండల కేంద్రం కొత్తచెరువుకు చెందిన శ్రీనివాసులును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ మారుతీ శంకర్ శనివారం మీడియాకు వెల్లడించారు. ఈ నెల 11న ఓ కాలనీకి చెందిన శ్రీనివాసులు ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు అడ్డు చెప్పబోయిన ఆమె తల్లిపై విచక్షణారహితంగా కాలనీలో అందరూ చూస్తుండగా దాడి చేశాడు. బాధిత మహిళల ఫిర్యాదు మేరకు 15న పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఈ మేరకు నిందితుడు శ్రీనివాసులును పోలీసులు శనివారం అతని ఇంటివద్దనే అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్కు పంపినట్లు సీఐ తెలిపారు. సీ్త్రలు, పిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా, దౌర్జన్యం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. -
గుండెపోటుతో కాలువలో పడి వ్యక్తి మృతి
ధర్మవరం అర్బన్: పట్టణంలోని లోనికోటకు చెందిన పటాన్ షామీర్బాషా (55) శనివారం ఉదయం మార్కెట్ వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా గుండెపోటు రావడంతో పక్కనే ఉన్న మురుగుకాలువలోకి పడి మృతి చెందాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న వన్టౌన్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు ఆరా తీశారు. అనంతరం తమ్ముడు మహమ్మద్బాషా, కుటుంబ సభ్యులు వచ్చి షామీర్బాషా మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. షామీర్ బాషా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, ఈ క్రమంలోనే గుండెపోటు వచ్చి ఉంటుందని వారు తెలిపారు. పాడి ఆవుల అపహరణ కొత్తచెరువు: మండల కేంద్రంలో నాలుగు పాడి ఆవులు అపహరణకు గురయ్యాయి. నామగుండ్ల వీధికి చెందిన నంబి క్రిష్ణమూర్తి వ్యవసాయంతో పాటు పాడి పెంపకంతో జీవనం సాగిస్తున్నాడు. కొత్తచెరువు సమీపంలోని శిలేబడ్డు వద్దనున్న పొలంలోని షెడ్డులో కట్టేసిన నాలుగు పాడి ఆవులను ఈ నెల 12వ తేదీ రాత్రి దుండగులు అపహరించుకుపోయారు. మరుసటిరోజు ఉదయం ఆవులు కనిపించకపోవడంతో నంబిక్రిష్ణమూర్తి చుట్టు పక్కల ప్రాంతాల్లో గాలించారు. అయినా ఎక్కడా ఆచూకీ లభించలేదు. రూ.1.05లక్షలు విలువ చేసే నాలుగు పాడి ఆవులు అపహరణకు గురయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. -
ఏడీఏగా అల్తాఫ్ అలీఖాన్
అనంతపురం అగ్రికల్చర్: అత్యంత కీలకమైన వ్యవసాయశాఖ అనంతపురం డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ)గా జీఎం అల్తాఫ్ అలీఖాన్ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం కమిషనరేట్ నుంచి బదిలీ ఉత్తర్వులు వెల్లడయ్యాయి. ఈ స్థానం కోసం పోటీలో ఉన్న జి.క్రిష్ణయ్యను హిందూపురం ఏడీఏగా బదిలీ చేశారు. అల్తాఫ్ అలీఖాన్ ప్రస్తుతం హిందూపురం ఏడీఏగా ఉన్నారు. ఇప్పటి వరకు అనంతపురం ఏడీఏగా ఉన్న జి.రవిని తాడిపత్రికి బదిలీ చేసిన విషయం తెలిసిందే. బదిలీ సమయంలో ధర్మవరంలో పనిచేస్తున్న క్రిష్ణయ్య తాడిపత్రి కావాలని దరఖాస్తు చేసుకున్నారు. అనంతపురం స్థానం కోసం ఆయన కోరుకోకున్నా... బది‘లీల’ల్లో భాగంగా పోటీలోకి తెచ్చారు. కాగా సాధారణ బదిలీల్లో భాగంగా గత నెల 9న విడుదల చేసిన మొదటి జాబితాలోనే ఈ ఇరువురు అధికారులకు ఇవే స్థానాలు కేటాయించారు. అయితే అదే రోజు ఉన్నఫళంగా వెనక్కు తీసుకున్నారు. అప్పటి నుంచి నాటకీయ పరిణామాలు, పైరవీలు, సిఫారసులు, రాజకీయ జోక్యం అధికం కావడంతో దాదాపు 40 రోజుల పాటు ఎటూ తేల్చకుండా ఉంచారు. అనంతపురం ఏడీఏ స్థానం అంశం సీఎం, మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడుతో పాటు ఉన్నతస్థాయి అధికారుల వరకు మరోసారి వెళ్లినట్లు చెబుతున్నారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, కొందరు డీలర్లు అల్తాఫ్ కావాలని, కమిషనరేట్ అధికారులు, అసోసియేషన్ నాయకులు క్రిష్ణయ్య కావాలంటూ పట్టుపట్టినట్లుగా చెబుతున్నారు. ఇలా వ్యవసాయశాఖ పరిధిలో అనంతపురం ఏడీఏ స్థానం కీలకం కావడంతో క్రిష్ణయ్య అంటూ ఉదయం, అల్తాఫ్ అంటూ సాయంత్రం ఇలా రోజూ ఇరువురు అధికారుల పేర్లు చక్కర్లు కొడుతూ వచ్చాయి. ఎట్టకేలకు అల్తాఫ్ అలీఖాన్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువరించి ఉత్కంఠకు తెరదించారు. ఉత్తర్వులు వెలువడిన గంటల వ్యవధిలోనే అల్తాఫ్ అలీఖాన్ సత్యసాయి జిల్లాలో రిలీవ్ అయ్యి అనంతపురం జేడీఏ ఉమామహేశ్వరమ్మను కలిసి జాయినింగ్ రిపోర్టు ఇచ్చారు. 40 రోజుల తర్వాత వెల్లడైన బదిలీ జాబితా ఉత్తర్వులు వచ్చిన గంటల వ్యవధిలోనే జాయినింగ్ -
వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీలో పలువురికి చోటు
పుట్టపర్తి టౌన్: వైఎస్సార్సీపీ కమిటీలో ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన పలువురు నాయకులకు చోటు దక్కింది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం పార్లమెంట్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా కె.రమేష్రెడ్డి, నిట్టూరు రఘునాథ్రెడ్డి, నార్పల సత్యనారాయణరెడ్డి, హిందూపురం పార్లమెంట్ పరిధిలో రాష్ట్ర కార్యదర్శులుగా ఎల్ఎం మోహన్రెడ్డి, చౌళూరు మధుమతిరెడ్డి, బోయ తిప్పేస్వామి నియమితులయ్యారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలను వీరికి కేటాయించనున్నారని, వీరు పార్టీ కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ సంబంధిత రీజినల్ కో ఆర్డినేటర్లు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులకు సహాయకారిగా వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.పాత వాహనాల వేలానికి ఏర్పాట్లుఅనంతపురం అర్బన్: కలెక్టరేట్ ఆవరణలో ఉంచిన పాత వాహనాలను వేలం వేసేందుకు మోక్షం కలిగింది. ఈ నెల 7న ‘ఇతరులకు చెబుతాం... ఆచరించం’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. పాత వాహనాలు వేలం వేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో కలెక్టరేట్ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టి వాహనాలను ఒక క్రమంలో ఏర్పాటు చేయించారు. వాటి విలువ నిర్ధారించేందుకు ఆర్టీఏ అధికారులకు లేఖ రాశామని చెప్పారు. ఇదిలా ఉండగా వాహనాల స్థితిని పరిశీలిస్తే అవి గుజిరీకి తప్ప మరెందుకూ పనికిరావని పలువురు ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేశారు.నేటి నుంచి మస్తానయ్య ఉరుసుగుంతకల్లు: పాతగుంతకల్లులో వెలిసిన హజరత్ సయ్యద్ మస్తాన్వలి స్వామి 390వ ఉరుసు ఉత్సవాలు ఆదివారం అర్ధరాత్రి ప్రారంభమవుతాయని వక్ఫ్బోర్డు ఇన్స్పెక్టర్ రహీం తెలిపారు. కులమతాలకు అతీతంగా మూడు రోజులు పాటు జరిగే ఈ ఉరుసు ఉత్సవాలకు దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారని పేర్కొన్నారు. భక్తుల కోసం తాగునీరు, తాత్కాలిక టాయిలెట్లు, దర్గా ఖాళీ ప్రదేశాల్లో షామియానాలు తదితర సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. మున్సిపల్ అధికారుల సహాయంతో నీటి ట్యాంకర్లు కూడా అందుబాటులో ఉంచామన్నారు. తొలిరోజు ఆదివారం గంధం మహోత్సవం, సోమవారం షంషీర్ (ఉరుసు ఉత్సవం), మంగళవారం జియారత్ కార్యక్రమంతో ఉరుసు ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు. దర్గా ఉత్తర, దక్షిణ భాగాల్లో ఉన్న ఆర్చ్లతో పాటు దర్గా ప్రాంగణాలు విద్యుత్ దీపాలతో అందంగా అలకరించామని తెలిపారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీసీ కెమెరాల నిఘా నీడలో వందలాది మంది పోలీసులుచే భారీ బందోబస్తు నిర్వహించనున్నట్లు చెప్పారు. -
సీమకు తీరని అన్యాయం
అనంతపురం కార్పొరేషన్: రాయలసీమకు చంద్రబాబు తీరని అన్యాయం చేశారని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు గాజుల ఉమాపతి ధ్వజమెత్తారు. శనివారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కర్నూలులో లా యూనివర్సిటీ, హెచ్ఆర్సీ, హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటే.. కూటమి ప్రభుత్వం వాటిని అమరావతికి తరలించి రాయలసీమకు తీరని అన్యాయం చేశారన్నారు. లోకాయుక్తను తరలించేందుకు సీఎం చంద్రబాబు కుట్ర చేస్తున్నారన్నారు. హంద్రీ–నీవాను ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది చంద్రబాబేనన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కారణంగానే హంద్రీ–నీవా నీరు వస్తోందన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌని నాగన్న, ఆర్టీఐ విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, న్యాయవాదులు రాజశేఖర్ యాదవ్, బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్ర విభజనలో భాగంగా అనంతపురం జిల్లాకు ఎయిమ్స్ మంజూరైతే.. దాన్ని అమరావతికి తరలించిన దుర్మార్గుడు చంద్రబాబు అని మండిపడ్డారు. ఎయిమ్స్ ఏర్పాటై ఉంటే జిల్లాలో వైద్య సేవల్లో నాణ్యత పెరగడమే కాకుండా వందలాది మందికి ఉపాధి లభించేదన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు, న్యాయవాదులు మురళీధర్, రమణారెడ్డి, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబుపై వైఎస్సార్సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు ఉమాపతి ధ్వజం -
ఉద్యానం వైపు.. రైతు చూపు
పుట్టపర్తి అర్బన్: సంప్రదాయ పంటల్లో నష్టాలు వస్తుండటంతో రైతులు బహుళ పంటల వైపు దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. క్రమంగా వీటి సాగు విస్తీర్ణం కూడా పెరుగుతోంది. సాధారణంగా ఖరీఫ్ సీజన్లో వేరుశనగ, కంది, మొక్కజొన్న, సజ్జ పంటలు సాగయ్యేవి. ఏటా నష్టాలు వస్తుండడంతో ఇబ్బంది పడుతున్న రైతులు ఆలోచన మార్చుకున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించలేకున్నా ప్రైవేటు మార్కెట్లపై ఆధార పడి పలు రకాల కూరగాయలు, పూల తోటలు సాగు చేస్తున్నారు. ఏటా ఉద్యాన శాఖ సహకారంతో జిల్లాలో సుమారు 64 వేల హెక్టార్లలో పంటలు సాగు చేస్తారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 64,359 హెక్టార్లలో పండ్ల తోటలు, కూరగాయలు, పూలు, మసాలా దినుసులు వంటి పలు రకాల తోటలను సాగు చేశారు. 16,137 హెక్టార్లలో కూరగాయలు జిల్లాలో చీనీ, మామిడి, బొప్పాయి, అరటి, జామ, దానిమ్మ, సపోట, ద్రాక్ష, కళింగర, దోస పంటలు దాదాపు 42,679 హెక్టార్లలో సాగవుతున్నాయి. ఇక ఉల్లి, టమాట, ఆలూ, బెండ, వంకాయ, దోస, బీన్స్ తదితర రకాల కూరగాయల పంటలు 16,137 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. మసాలా దినుసులు ఎండు మిర్చి, చింతపండు, పసుపు, ధనియాలు, కొత్తిమీర, తమలపాకు తోటలు 3,702 హెక్టార్లు, పూల మొక్కలైన రోజా, జాస్మిన్, బంతి పూలు, కనకాంబరాలు, చామంతి తదితర రకాలను 619 హెక్టార్లలో సాగు చేశారు. గత ప్రభుత్వంలో ఉచితంగా బోర్లు వేయించడంతో రైతులు సద్వినియోగం చేసుకొని ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచారు. బోర్లలో నీళ్లు సమృద్ధిగా ఉండడంతో దీర్ఘకాలిక పంటలతో పాటు సీజనల్గా కూరగాయలు, ఆకు కూరలు పంటలు సాగు చేస్తూ లబ్ధి పొందుతున్నారు. జిల్లా వాసులకు బెంగళూరు, మదనపల్లి, బాగేపల్లి, డీక్రాస్, హిందూపురం, అనంతపురం తదితర మార్కెట్లలో పంట ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. సంప్రదాయ పంటల్లో తరచూ నష్టాలు పంట మార్పిడి కోసం రైతుల ఆసక్తి కూరగాయలు, పండ్లు, పూల తోటల సాగుకు మొగ్గు -
అనంతపురంలో విషాదం.. చిన్నారి ప్రాణం తీసిన దోశ
అనంతపురం: అనంతపురంలో దోశ ముక్క గొంతులో ఇరుక్కుని రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. అనంతపురంలోని తపోవనంలో నివాసం ఉండే అభిషేక్, అంజినమ్మ దంపతుల రెండేళ్ల కుమారుడు కుషాల్. శనివారం ఉదయం స్థానిక తపోవనం సర్కిల్లోని ఓ హోటల్లో తల్లిదండ్రులు దోశ తినిపిస్తుండగా, దోశ ముక్క చిన్నారి గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది.హుటాహుటిన స్థానిక ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించారు. చిన్నారిని కాపాడేందుకు వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. కొద్దిసేపటికే కుషాల్ మృతి చెందాడు. కళ్ల ముందే చిన్నారి మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. -
తింటే.. కడుపు మంటే
సత్యసాయి జిల్లా పుట్టపర్తి నుంచి నల్లమాడ వెళ్లే దారిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఓ రెస్టారెంటులో నలుగురు స్నేహితులు వెళ్లి పార్టీ చేసుకున్నారు. తినేందుకు ఆర్డర్ ఇవ్వగా.. చికెన్ ముక్కలపై విపరీతమైన ఎరుపు రంగు ఉంది. రుచి తేడాగా ఉండటంతో నిర్వాహకులను ప్రశ్నిస్తే.. కొత్తగా ఏర్పాటు చేశామని.. నిబంధనల గురించి తెలియదని చెప్పారు. రుచి కోసం మాస్టర్ ఏం చేస్తున్నాడో సరిగా తెలియదని సమాధానం ఇవ్వడంతో కస్టమర్లు అవాక్కయ్యారు.ధర్మవరం తహసీల్దార్ కార్యాలయం నుంచి కొద్దిగా ముందుకెళ్లిన తర్వాత బ్రిడ్జి పక్కన ఓ ఇంట్లో మెస్ ఏర్పాటు చేశారు. అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాల్లోనే వండుతూ వడ్డిస్తున్నారు. గత్యంతరం లేని ప్రజలు బస్టాండుకు సమీపంలో ఉంటుందని అక్కడే తిని వెళ్తుంటారు. అపరిశుభ్రత గురించి నిర్వాహకులను అడిగితే... ‘తింటే తినండి.. లేదంటే లేదు’ అని చెబుతున్నారు.సాక్షి, పుట్టపర్తి: జీవన శైలిలో వచ్చిన మార్పులతో ఆహారపు అలవాట్లు కూడా చాలా వరకు మారిపోయాయి. ప్రస్తుతం ఉరుకుల పరుగులు జీవితంలో చాలా మంది ఇంటి భోజనం కంటే హోటళ్లు, డాబాలు, రెస్టారెంట్లు, బేకరీ ఫుడ్కు ఓకే చెబుతున్నారు. ఇక వారంతాల్లో చాలామంది కుటుంబాలతో సహా బయటకు వెళ్లి బిర్యానీలు, స్పైసీ ఫుడ్ తినేందుకు ఇష్టపడుతున్నారు. కానీ హోటళ్ల నిర్వాహకులు మాత్రం డబ్బులు తీసుని ఆహారం పేరుతో అనారోగ్యాన్ని వడ్డిస్తున్నారు. నిల్వ ఉన్న పదార్థాలు, పలు రసాయనాలతో చేసిన వంటకాలు వడ్డిస్తూ జనం ప్రాణాలతో ఆడుకుంటున్నారు.పెరిగిన పార్టీ కల్చర్..పాతికేళ్ల క్రితం వరకు ఎక్కడికైనా వెళ్లినా భోజనం సమయానికి ఇంటికి వచ్చేవారు. రాలేని పరిస్థితులు ఉన్నపుడే మాత్రమే హోటళ్లలో తినేవారు. కొందరు ఎంత సమయమైనా ఇంటికి వచ్చే భోజనం చేసేవారు. బయటి ఆహారాన్ని తీసుకునేవారు కాదు. సంపాదనలో తక్కువ ఖర్చు చేసి, ఎక్కువ దాచుకునేవారు. కానీ ఇప్పుడు ‘కల్చర్’ మారింది. ‘సోషియల్ బిహేవియర్’లో తేడా వచ్చింది. నగరాలు, పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోకి ‘పార్టీ కల్చర్’ చొచ్చుకువచ్చేసింది. బర్త్డే, మ్యారేజ్డే, ప్రమోషన్, ట్రాన్స్ఫర్.. సందర్భం ఏదైనా ‘పార్టీలు’ ఇస్తున్నారు.ఇంటి భోజనం కంటే రెస్టారెంట్లలోని ఆహారం తినడానికే మొగ్గు చూపుతున్నారు. నలుగురు స్నేహితులు కలిస్తే డిన్నర్ బయట చేస్తున్నారు. ఖరీదైన ఆహారం తింటున్నామనే భ్రమలో ఉన్నారు కానీ, ఆరోగ్యకర, పోషకాహారాన్ని తింటున్నామా? లేదా? అనేది గ్రహించలేకపోతున్నారు. పైగా ఏ కల్తీ ఆహారమో కూడా కనిపెట్టలేక...హోటల్ యజమాని పెట్టింది తింటున్నారు.నిబంధనలు తూచ్..జిల్లాలో చిన్నా, పెద్ద హోటల్స్, రెస్టారెంట్స్, దాభాలు, చాట్, నూడుల్స్ షాపులు అన్ని కలుపుకుని 4 వేలకుపైగా ఉంటాయి. వీటి ద్వారా ఏటా రూ. కోట్ల వ్యాపారం జరుగుతోంది. వాస్తవానికి హోటళ్లు ఆహార పరిరక్షణ, నాణ్యత ప్రమాణాల సంస్థ నుంచి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంది. ఆ శాఖ నిబంధనల మేరకు ఆహారం తయారు చేయాలి. ఈ చట్టం 2006 నుంచి అమల్లో ఉంది. ఆ శాఖ పరిధిలో జిల్లా స్థాయి అధికారితో పాటు ఓ గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్, మరో ఇద్దరు ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. వీరు వివిధ హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు కనీసం 12 శాంపిల్స్ సేకరించాలన్నది నిబంధన.వీరు సేకరించిన శ్యాంపిల్స్ను ప్రయోగశాలకు పంపి, పరిశీలన తర్వాత కేసులు నమోదు కూడా వీరి బాధ్యతే. ఆహారం కల్తీ జరిగినట్లు తేలితే క్రిమినల్ లేదా సివిల్ కేసులు నమోదు చేసి జరిమానాలు విధించే వీలుంది. కానీ జిల్లాలో ఇవేమీ జరగడం లేదు. దీన్ని ఆసరగా చేసుకున్న వ్యాపారులు చెలరేగిపోతున్నారు. విచ్చలవిడిగా ఆహారాన్ని కల్తీ చేస్తున్నారు.అనుమతి లేని వ్యాపారాలు..హోటల్ ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా ఆహార పరిరక్షణ, నాణ్యత ప్రమాణాల సంస్థ నుంచి అనుమతి తీసుకోవాలి. పరిశుభ్రత విషయంలో గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్కు దరఖాస్తు చేయాలి. నిర్ణీత రుసుము చెల్లించి అనుమతి పొందాలి. కానీ జిల్లాలో ఇలా అనుమతి తీసుకుని వ్యాపారం చేసే సంస్థలు నూటికి 25 శాతానికి మించి ఉండవనేది బహిరంగ రహస్యం. పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు మినహా అధిక శాతం హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రోడ్డుసైడు హోటళ్లలో పరిశుభ్రత గురించి పట్టించుకోవడం లేదు.నాసిరకం ఆహార పదార్థాలు వాడటం, రోజుల తరబడి ఫ్రిడ్జిలో నిల్వ ఉంచిన వాటిని వేడి చేసి విక్రయిస్తున్నారు. ఆహారం వండే ప్రాంతాలూ తీవ్ర అపరిశుభ్రంగా ఉన్నా.... పట్టించుకునే నాథుడు లేడు. పట్టణాల్లో అధిక శాతం మురుగుకాల్వలు, చెత్తకుప్పల పక్కన ఫాస్ట్ఫుడ్ సెంటర్లు దర్శనమిస్తున్నా పర్యవేక్షణ కరువైంది.నామమాత్రంగా తనిఖీలు..జిల్లాలో ఏడాదికి 360 శ్యాంపిల్స్ తీసి ల్యాబ్కు పంపించాల్సి ఉంది. అయితే అధికారులు జిల్లాలో నెలకు 12 శాంపిల్స్ మాత్రమే తీసి ల్యాబ్కు పంపిస్తున్నారు. ఇందులో ఒక్కో నెల కేవలం రెండు, మూడు మాత్రమే కేసులు నమోదవుతున్నాయి. సీజన్ను బట్టి పండ్ల దుకాణాలపైనా నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారు. కల్తీ జరిగిన, రంగులు కలిపిన ఆహార పదార్థాలకు నాన్ స్టాండర్డ్ పేరిట ల్యాబ్ నుంచి రిపోర్ట్ వస్తే వారికి నామమాత్రపు జరిమానా వేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా ఫుడ్సేఫ్టీ అధికారులు మేల్కొని హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించి ప్రజారోగ్యాన్ని కాపాడాలని పలువురు కోరుతున్నారు.ఆహార కల్తీ ఇలా..⇒ చిక్కదనం కోసం పాలల్లో నాసిరకం పాలపౌడర్లు, యూరియా, పిండి, నూనె కలిపి విక్రయిస్తున్నారు. అలాగే పరిమాణం పెంచేందుకు బోరు నీటిని కలుపుతారు.⇒ పశువుల ఎముకలను బట్టీల్లో అత్యధిక ఉష్ణోగ్రతపై మరిగించి ద్రావణాన్ని తీసి వంటనూనెల్లో కలిపి విక్రయిస్తున్నారు. దీనివల్ల జీర్ణకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.⇒ ఆకర్షణీయంగా ఉండేందుకు చికెన్, మటన్ బిర్యానీలు, తందూరి చికెన్లో ఎక్కువగా హానికరమైన రంగులను కలుపుతున్నారు. ప్రమాదాల్లో చనిపోయిన గొర్రెలు, పొట్టేళ్లు, మేకలతో పాటు అనారోగ్యానికి గురైన వాటిని వధించి బిర్యానీలో కలిపి విక్రయిస్తున్నారు.⇒ కారం ఎర్రగా ఉండేందుకు మిరపకాయల్లో సూడాన్ రంగులు కలుపుతున్నారు. పసుపులో మెటానిల్ ఎల్లో అనే పదార్థాన్ని కలుపుతున్నారు. వీటిని వంటలో వినియోగిస్తే కేన్సర్ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.⇒ ఒకసారి ఉపయోగించిన నూనెను మళ్లీ కాచి ఆహార పదార్థాలు వండుతున్నారు. దీనివల్ల కేన్సర్, అల్సర్లు వచ్చే ప్రమాదమున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.తనిఖీలు చేస్తున్నాంజిల్లా వ్యాప్తంగా ఆహార తనిఖీలు చేస్తూనే ఉన్నాం. నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపిస్తున్నాం. ఆహారం కల్తీ అవుతోందని ఎవరైనా ఫిర్యాదు చేసినా... అక్కడకు వెళ్లి నమూనాలు సేకరిస్తున్నాం. ఆహారం కల్తీ జరగకుండా అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. వ్యాపారులను పిలిచి హెచ్చరిస్తున్నాం. – రామచంద్ర, ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారి -
సమష్టి కృషితోనే ప్లాస్టిక్ రహిత సమాజం
ధర్మవరం అర్బన్: సమష్టి కృషితోనే ప్లాస్టిక్ రహిత సమాజం సాధ్యమని కలెక్టర్ టీఎస్ చేతన్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకారం అందించాలని కోరారు. శనివారం పట్టణంలో ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, అధికారులు, పట్టణ ప్రజలతో కలిసి నిర్వహించిన ర్యాలీకి కలెక్టర్ చేతన్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కాలేజీ సర్కిల్లో మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... మానవాళి మనుగడకు ప్లాస్టిక్ను నిర్మూలించడం ఎంతో ముఖ్యమన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లకు బదులుగా జూట్ బ్యాగులు వినియోగించాలని సూచించారు. షాపింగ్కు వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ జూట్ బ్యాగు వెంట తీసుకువెళ్లాలన్నారు. వ్యాపారులు కూడా ప్లాస్టిక్ కవర్లకు బదులు జూట్, క్లాత్ బ్యాగులను వినియోగదారులకు ఇవ్వాలన్నారు. ప్లాస్టిక్ నిర్మూలనలో భాగంగా జూట్ బ్యాగులు, స్టీల్ వాటర్ బాటిల్స్ వినియోగంపై ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా అందరితో స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. స్వచ్ఛతా కార్మికులు పుల్లన్న, కాటమయ్యను కలెక్టర్ శాలువాలతో సన్మానించారు. అనంతరం గాంధీనగర్లో ఏర్పాటు చేసిన బటర్ ఫ్లై పార్కు, రైల్వేస్టేషన్ రోడ్డులోని మున్సిపల్ పార్కులను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీఓ మహేష్, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్కుమార్, తహసీల్దార్ సురేష్బాబు, మున్సిపల్ టీపీఓ పెనుబోలు విజయభాస్కర్, మెప్మా సీఓలు, ఆర్పీలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయాలపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలి ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ ర్యాలీలో కలెక్టర్ టీఎస్ చేతన్ పిలుపు -
మామిళ్లకుంట క్రాస్లో ‘గ్రీవెన్స్’ భవనం
పుట్టపర్తి అర్బన్: ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా స్థాయి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (గ్రీవెన్స్) కోసం నూతన భవనాన్ని నిర్మిస్తున్నారు. పుట్టపర్తి మండలంలోని మామిళ్లకుంట క్రాస్లో రూ.80 లక్షల వ్యయంతో చేపట్టిన నూతన భవన నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం కార్యక్రమాన్ని కలెక్టరేట్లో నిర్వహిస్తుండగా జిల్లా నలుమూలల నుంచి జనం తరలిరావడం.. వివిధ సమస్యల పరిష్కారానికి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కలెక్టరేట్ ఎదుటే సోమవారం ధర్నా నిర్వహిస్తుండటంతో పట్టణవాసులతో పాటు ప్రశాంతి నిలయం వచ్చే సత్యసాయి భక్తులకు, సత్యసాయి జనరల్ ఆస్పత్రికి వచ్చే రోగులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ సమస్యపై ఇప్పటికే సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్కు, జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. వేదిక మార్పునకు నిర్ణయం కలెక్టరేట్ వద్ద ప్రతి సోమవారం నిర్వహించే నిరసన కార్యక్రమాల వల్ల కలుగుతున్న ఇబ్బందులను గుర్తించిన కలెక్టర్ చేతన్ ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమ నిర్వహణను కలెక్టరేట్లో కాకుండా మరోచోటకు మార్చాలని నిర్ణయించారు. ఇందుకోసం మామిళ్లకుంట క్రాస్లో ప్రశాంతి రైల్వే స్టేషన్ పక్కన సెరికల్చర్ కార్యాలయానికి సంబంధించిన ఎకరా విస్తీర్ణంలోని భూమిని సేకరించారు. అనంతరం రూ.80 లక్షల వ్యయంతో పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో భవన నిర్మాణానికి టెండర్ పిలవగా... ధర్మవరానికి చెందిన ఓ కంట్రాక్టర్ పనులు దక్కించుకున్నాడు. ఈ నూతన భవనంలో అర్జీలు ఇచ్చేందుకు వచ్చే ప్రజలు వేచి ఉండడానికి విశాలమైన హాలు, కలెక్టర్ విశ్రాంతి గది నిర్మిస్తున్నారు. అలాగే 50 మంది అధికారులు కూర్చునేందుకు వీలుగా వేదిక, 300 మందికిపైగా ప్రజలు కూర్చునేందుకు వీలుగా హాలు, మరుగుదొడ్లు, ర్యాంప్ సిద్ధమవుతున్నాయి. ఆగస్టు నాటికి భవనం అందుబాటులోకి వస్తుందని పంచాయతీ రాజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు నుంచే నూతన భవనంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించాలని యంత్రాంగం భావిస్తోంది. రూ.80 లక్షల వ్యయంతో నిర్మాణం నెలరోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం -
పాత వాహనాలపై పచ్చ కన్ను
సాక్షి టాస్క్ఫోర్స్: దౌర్జన్యం చేయడం, దోచుకోవడం టీడీపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. అధికారం ఉందన్న ధైర్యంతో అందిన వచ్చిన ప్రతి అవకాశాన్నీ వాడుకునే టీడీపీ నేతలు..చివరకు పాత సామగ్రి కోసం పోటీపడుతున్నారు. ఇందుకోసం ముఖ్య నాయకుడి వద్దే పంచాయితీ పెట్టారు. ‘తమ్ముళ్ల’ నిసిగ్గు వ్యవహారం బయటకు పొక్కితే పరువుపోతుందని భావించిన సదరు నాయకుడు ప్రస్తుతానికి వివాదం సద్దుమణిగించారు. తుక్కు వాహనాల కోసం పోటీ పుట్టపర్తి ప్రాంతంలో పదేళ్ల క్రితం హంద్రీ–నీవా రెండో దశ కాలువ పనులను పల్లవి కన్స్ట్రక్షన్స్ సంస్థ చేపట్టింది. పనులు పూర్తయ్యాక మరమ్మతుకు గురైన హిటాచీ, టిప్పర్లను బుక్కపట్నం మండలం కింకిరివాండ్లపల్లి వద్ద ఉంచేసింది. ఆ తర్వాత వాటి గురించి సదరు సంస్థ మరచిపోయింది. ఈలోపు వాహనాలన్నీ తుప్పుపట్టిపోయాయి. ప్రస్తుతం గుజిరీకి విక్రయించేందుకు తప్ప ఎందుకూ పనికి రావు. అయితే ఈ వాహనాలు గుజిరీకి విక్రయించినా రూ.50 లక్షల దాకా వచ్చే అవకాశం ఉండటంతో స్థానిక టీడీపీ నాయకులు కన్నేశారు. గుట్టుగా తరలించి విక్రయించేందుకు సిద్ధమయ్యారు. అయితే.. టీడీపీలోనే మరో వర్గం వారు తమకూ భాగం కావాలని పట్టుబట్టడంతో వివాదం రేగింది. అడ్డుకున్న ‘తమ్ముళ్లు’ టీడీపీ నేతలు తమ వాహనాలను తుక్కు కింద విక్రయించేందుకు సిద్ధమైన విషయం తెలుసుకున్న పల్లవి కన్స్ట్రక్షన్స్ సంస్థ ప్రతినిధులు వాటిని తీసుకెళ్లేందుకు రెండు రోజుల క్రితం వచ్చారు. నేరుగా పోలీసు స్టేషన్కు వెళ్లి పోలీసుల సాయంతో వాహనాలు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే అప్పటికే వాటిపై కన్నేసిన టీడీపీ నాయకులు తమకు కనీసం కమీషన్ అయినా ఇవ్వాలని పట్టుబట్టారు. అందుకు సంస్థ ప్రతినిధులు అంగీకరించకపోవడంతో నానా యాగీ చేసి వాహనాల తరలింపును అడ్డుకున్నారు. పంచాయితీ చేసిన ముఖ్యనేత టీడీపీ నేతల దిగజారుడు వ్యవహారం తెలుసుకున్న ‘ముఖ్య నేత’..ఈ విషయం ప్రజలకు తెలిస్తే పరువుపోతుందని భావించారు. వెంటనే టీడీపీ నాయకులను, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులను పిలిపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వాహనాలను ఎవరూ తరలించవద్దని ఆదేశాలిచ్చారు. దీంతో ప్రస్తుతానికి ‘పాత వాహనాల పంచాయితీ’కి బ్రేక్ పడింది. పదేళ్ల క్రితం హంద్రీ–నీవా పనులు పూర్తయ్యాక వాహనాలు వదిలేసి వెళ్లిన కన్స్ట్రక్షన్ సంస్థ గుజిరీకి విక్రయించేందుకు ‘తమ్ముళ్ల’ యత్నం వాటిని కంపెనీ ప్రతినిధులు తీసుకెళ్లకుండా అడ్డుకున్న వైనం -
సమాచారం కోరితే ఇవ్వాల్సిందే
పుట్టపర్తి అర్బన్: సమాచార హక్కు చట్టం ద్వారా ఎవరైనా వివరాలు కోరితే కచ్చితమైన సమాచారం అందించాలని ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్, జిల్లా ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్ అధికారులకు సూచించారు. శనివారం స్థానిక వ్యవసాయ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం అమలుపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ప్రజలకు వజ్రాయుధం లాంటిదన్నారు. దీనిని ఎవరూ చులకన చేయరాదన్నారు. అనంతరం ఆర్టీఐ అర్జీలకు ఎన్ని రోజుల లోపు సమాధానం ఇవ్వాలి, సమాచారం ఏవిధంగా రికార్డు చేయాలో పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమాచార హక్కు చట్టం అమల్లో నిర్లక్ష్యం వహిస్తే తలెత్తే పరిణామాలు తెలియజేశారు. సమవేశంలో హెచ్ఓలు, ఎంఐఏఓలు, ఎంఐ ఇంజినీర్లు, రైతు సేవా కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. ఆర్టీఐ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి సిబ్బందికి ఏపీఎంఐపీ పీడీ, ఉద్యానశాఖ అధికారి ఆదేశం -
హైకోర్టు జడ్జికి ఘన స్వాగతం
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ జి. రామకృష్ణ ప్రసాద్కు శనివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ ఘన స్వాగతం పలికారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలెక్టర్ కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్ కూడా ఉన్నారు. ● అదే విధంగా ఉమ్మడి జిల్లా ఎస్పీలు పి. జగదీష్, వి. రత్న మర్యాదపూర్వకంగా జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ను కలిశారు. -
హత్యాయత్నం కేసులో నలుగురి అరెస్ట్
హిందూపురం: హత్యాయత్నం కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సోమందేపల్లి మండలం పోలేపల్లికి చెందిన నరసింహులు ఈ నెల తొమ్మిదో తేదీన ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వెళ్తుండగా మలుగూరు గ్రామం వద్ద వెనుకనుంచి వచ్చిన నలుగురు వ్యక్తులు కత్తితో తలపై దాడిచేశారు. గాయపడిన నరసింహులు గట్టిగా కేకలు వేయడంతో దుండగులు పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కింద కేసు నమోదైంది. కేసులో నిందితులైన పోలేపల్లికి చెందిన శ్రీనివాసులు, చిన్న అంజినప్ప, హిందూపురం నేతాజీనగర్కు చెందిన సాయివినయ్, త్యాగరాజనగర్కు చెందిన నాగేష్ను శనివారం మలుగూరు రైల్వేస్టేషన్ వద్ద అరెస్టు చేసినట్లు సీఐ ఆంజనేయులు చెప్పారు. వ్యక్తిగత కక్షల నేపథ్యంలోనే దాడి చేసినట్లు విచారణలో తేలిందన్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంిపినట్లు తెలిపారు. లింకు నొక్కితే.. రూ.2.35 లక్షలు మాయం కొత్తచెరువు: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. లింకులు పంపించి.. అవతలి వ్యక్తి నొక్కగానే.. ఫోన్ను హ్యాక్ చేసి.. బ్యాంకు ఖాతాల నుంచి నగదు దోచేస్తున్నారు. ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కదిరేపల్లికి చెందిన టి.నాగభూషణ, గాయత్రి దంపతులు. వీరిద్దరి బ్యాంకు ఖాతాలకు ఒకే ఫోన్ నంబర్ లింక్ అయ్యింది. ఈ క్రమంలో నాగభూషణ ఫోన్కు ఈ నెల ఏడో తేదీన గుర్తు తెలియని నంబర్ నుంచి లింకు వచ్చింది. ఆ లింకును ఆయన నొక్కగానే ఫోన్ను హ్యాక్ అయ్యింది. ఆ తర్వాత నుంచి నాగభూషణ సెల్లో ఫోన్ పే పనిచేయలేదు. వారం రోజుల తర్వాత బ్యాంకు వెళ్లి ఆరా తీయగా నాగభూషణ, గాయత్రి ఖాతాల నుంచి మొత్తం రూ.2,35,000 కట్ అయినట్లు చెప్పారు. దీంతో సైబర్ మోసం జరిగిందని గ్రహించిన బాధితుడు శనివారం కొత్తచెరువు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్లాస్టిక్ నిర్మూలనతో పర్యావరణ పరిరక్షణ ● బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పిలుపు పెనుకొండ: ప్లాస్టిక్ను నిర్మూలించి పర్యావరణాన్ని కాపాడుకుందామని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళీ శాఖ మంత్రి సవిత పిలుపునిచ్చారు. ‘స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం పెనుకొండ పట్టణంలో విద్యార్థులు, అధికారులు, పట్టణ ప్రజలతో కలసి మంత్రి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్కు దూరంగా ఉండాలని, పేపర్ బ్యాగ్లను వాడాలని కోరారు. పర్యావరణ సమతుల్యత లోపించకుండా జాగ్రత్త వహించాలన్నారు. అనంతరం గాంధీ సర్కిల్లో మానవహారం నిర్వహించారు. -
నాణ్యత తుంగపాలు
హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులు ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నాయి. కాంట్రాక్టర్ల స్వార్థం... అధికారుల కమీషన్ల కక్కుర్తి కారణంగా ఇప్పటి వరకు పనులు పూర్తి నాసిరకంగా జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. రెండ్రోజుల్లోనే పనులు ముగించేస్తే ఆ తర్వాత నీళ్లొచ్చేస్తాయని, ఇక నాణ్యత గురించి అడిగేదెవరనే ధీమా కాంట్రాక్టర్లు, అధికారుల్లో వ్యక్తమవుతోంది. ● హెచ్చెల్సీ ఆధునికీకరణ పనుల్లో ఇష్టారాజ్యం ● అధికారుల పర్యవేక్షణ లోపం.. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ● ఇంకా కొనసాగుతున్న బ్రిడ్జిల నిర్మాణ పనులు బొమ్మనహాళ్/కణేకల్లు: జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న హెచ్చెల్సీపై ఇటు రైతులు.. అటు ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సాగునీటితోపాటు జిల్లా ప్రజల దాహార్తిని ఈ ప్రాజెక్ట్ తీర్చుతోంది. అయితే రూ.35.06 కోట్లతో చేపట్టిన ఆధునికీకరణ పనులు నాసిరకంగా సాగుతుండడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారులు ఈ ఏడాది మార్చి నెలలో టెండర్లు నిర్వహించారు. అగ్రిమెంట్ల ప్రక్రియ ముగిసిన వెంటనే పనులు ప్రారంభించి ఉంటే ఈ పాటికి వందశాతం పనులు పూర్తయ్యేవి. అయితే ఇందుకు విరుద్ధమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పనులు ప్రారంభించే విషయంలో కాంట్రాక్టర్లు అనవసరంగా కాలయాపన చేశారు. చేపట్టిన పనులు కూడా నత్తనడకన కొనసాగిస్తూ వచ్చారు. కనీసం చేసిన పనులైనా నాణ్యతతో ఉన్నాయంటే అది కూడా లేదు. హెచ్చెల్సీ లైనింగ్, యూటీ, కాలువలో కాంక్రీట్ బెడ్డింగ్ పనులు నాసికరంగా జరిగాయి. 48 గంటల్లోనే బయట పడిన పనుల్లో డొల్లతనం హెచ్చెల్సీ లైనింగ్ పనులు పూర్తి నాసిరకంగా జరిగాయి. మైలాపురం, నాగలాపురం, యర్రగుంట యూటీ వద్ద చేపట్టిన లైనింగ్ పనుల్లో నాణ్యత డొల్లతనం కేవలం 48 గంటల్లోనే బయట పడింది. పూర్తయిన పనుల్లో ఇసుక, కంకర తేలి అధికారుల పర్యవేక్షణ లోపాన్ని ఎత్తి చూపుతున్నాయి. పనుల్లో ఎటు చూసినా హెచ్చుతగ్గులు... ఇసుక ప్యాచ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మైలాపురం వద్ద గతంలో కాలువకు గండి పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ ప్రాంతంలో పూర్తయిన పనుల్లో నాణ్యత లోపం స్పష్టంగా అవగతమవుతోంది. నిబంధనల ప్రకారం ఎర్రమట్టితో కాలువ గట్టును పూడ్చి బాగా గట్టు పటిష్టపడేలా రోలింగ్ చేయాల్సి ఉంది. అయితే ఇందుకు విరుద్ధంగా కట్టకు సమాంతరంగా ఎర్రమట్టి పోసి వదిలేశారు. కాలువ గట్టు బలోపేతానికి నాణ్యమైన ఎర్రమట్టిని వాడాల్సి ఉండగా, లూజ్ సాయిల్ వేసి వాడి పడేసిన పాత రాళ్లను పరిచి పనులు ముగించేశారు. నాణ్యత లేని కారణంగా భవిష్యత్తులో పగుళ్లు ఏర్పడే ప్రమాదముందని రైతులు పేర్కొంటున్నారు. లైనింగ్కు ఉపయోగించే సిమెంట్ కాంక్రీట్ మిశ్రమంలో ఇసుక, కంకర ఎక్కువ వాడి సిమెంట్ తక్కువ వేశారని అంటున్నారు. కనిపించని అధికారులు హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులను దగ్గరుండి పర్యవేక్షించాల్సిన ఇంజినీర్లు పనుల వద్ద కన్పించకుండాపోయారు. హెచ్చెల్సీ ఎస్ఈ, ఈఈలు విధిగా పనులు జరిగేచోట ఏఈఈలను నియమించినా వారు మాత్రం ఉండకుండా పోవడం గమనార్హం. ముఖ్యమైన పనులుంటే ఫోన్లోనే ఆదేశాలిచ్చి పనులు సాగేలా చేశారన్న ఆరోపణలున్నాయి. దీంతో ఆధునికీరణ పనుల్లో కాంట్రాక్టర్లు ఆడిందే ఆట... పాడిందే పాటగా సాగింది. నీళ్లొస్తున్నా... కొనసాగుతున్న పనులు హెచ్చెల్సీకి శుక్రవారం ఉదయం ఆంధ్రా సరిహద్దున 105 కిలోమీటర్ వద్ద నీటిని విడుదల చేశారు. ఓ వైపు కాలువలో నీరు ప్రవహిస్తుండగా మరోవైపు పనుల్లో కాంట్రాక్టర్ల హడావుడి కన్పించింది. లైనింగ్, కాలువగట్ల పటిష్టత పనులు చేస్తూనే ఉన్నారు. ఉద్దేహళ్–మళ్లికేతి బ్రిడ్జి, నాగలాపురం బ్రిడ్జి పనులు పూర్తి కాలేదు. దీంతో నీటి ప్రవాహానికి ఆటంకం కలగకుండా ఓ వైపు వదిలి, మరో వైపు బ్రిడ్జి పనులు చేస్తున్నారు. ఈ పనులు పూర్తయ్యేందుకు వారం రోజులు సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు. ప్రారంభం కాని కణేకల్లు చెరువు అవుట్ఫాల్ రెగ్యులేటర్ కణేకల్లు చెరువు అవుట్ఫాల్ రెగ్యులేటర్ పనులు ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ప్రస్తుతం హెచ్చెల్సీకి నీరు రావడంతో ఈ పనులు చేయలేని పరిస్థితి నెలకొంది. హెచ్చెల్సీకి నీటి సరఫరా బంద్ అయిన తర్వాత అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పనులు ప్రారంభించాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. -
‘ఎంటీఎస్’పై కూటమి కక్ష
ఇటీవల జరిగిన బదిలీల్లో మడకశిర నియోజకవర్గానికి కేటాయించిన ఎంటీఎస్ టీచర్లు మండలం ఎంటీఎస్ టీచర్ల సంఖ్య అమరాపురం 72 గుడిబండ 54 రొళ్ల 56అగళి 34 మడకశిర 04 మొత్తం 220మడకశిర: ఉమ్మడి అనంతపురం జిల్లాలో పని చేస్తున్న 1998 డీఎస్సీ ఎంటీఎస్ (మినిమమ్ టైం స్కేల్) టీచర్లపై కూటమి సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ను పాటించకుండా ఎంటీఎస్ టీచర్లను బదిలీ చేయడమే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కర్ణాటక సరిహద్దులో మారుమూల గ్రామాలకు తమను బదిలీ చేసి, ఇబ్బందులకు గురిచేస్తోందని వాపోతున్నారు. సీఎం చంద్రబాబు వక్ర దృష్టి.. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న 1998 డీఎస్సీ అర్హుల ఇబ్బందులను గుర్తించిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారి పట్ల సానుకూలంగా వ్యవహరించింది. ఈ క్రమంలో 2023 ఏప్రిల్లో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవ తీసుకుని 1998 డీఎస్సీలో అర్హత సాధించిన వారికి మినిమమ్ టైం స్కేల్ కింద ఉద్యోగ అవకాశాలు కల్పించారు. నెలకు గౌరవ వేతనంగా రూ.32,670 నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1998 డీఎస్సీకి సంబంధించి 4,032 మందికి ఉద్యోగాలు దక్కగా, ఇందులో ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి 594 మంది ఉన్నారు. అలాగే 2008 డీఎస్సీకి సంబంధించిన 1,900 మందికీ ఉద్యోగాలు దక్కాయి. అయితే వైఎస్ జగన్ హయాంలో ఉద్యోగాలు దక్కాయనే ఒకేఒక్క కారణంతోనే ఎంటీఎస్ టీచర్లపై సీఎం చంద్రబాబు వక్ర దృష్టి సారించినట్లుగా విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో అందరికీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ను వర్తింపజేసిన ప్రభుత్వం.. ఎంటీఎస్ టీచర్ల విషయంలో మాత్రం కాలరాసిందనే ఆరోపణలున్నాయి. రెగ్యులర్ టీచర్లతో సమానంగా కాకుండా వారి బదిలీల ప్రక్రియ ముగిసిన తర్వాత ఎంటీఎస్ టీచర్ల బదిలీలను చేపట్టింది. పథకం ప్రకారం సాగించిన ఈ కుట్రలో ఎంటీఎస్ టీచర్లు బలిపశువులయ్యారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 594 మంది ఎంటీఎస్ టీచర్లకు గాను ఒక్క మడకశిర నియోజకవర్గానికే 220 మందిని బదిలీ చేశారు. వీరందరూ కర్ణాటక సరిహద్దున మారుమూల పల్లెల్లో విధుల్లో చేరాల్సి వచ్చింది. మిగిలిన 374 మంది కూడా రాయదుర్గం నియోజకవర్గంలోని కర్ణాటక సరిహద్దున ఉన్న మారుమూల గ్రామాలకు బదిలీ అయ్యారు. గ్రామీణ విద్యార్థులను ఆదుకున్న వైఎస్ జగన్ నిర్ణయం.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యారంగం నిర్వీర్యమై పోతోంది. అనాలోచిత నిర్ణయాలతో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సరిహద్దు మండలాల్లో పెద్ద ఎత్తున టీచర్ పోస్టులు ఖాళీ పడ్డాయి. దీంతో సరిహద్దు మండలాల్లోని విద్యార్థుల చదువులు కుంటుపడే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో వైఎస్ జగన్ నియమించిన ఎంటీఎస్ టీచర్లు విద్యా ప్రదాతలుగా నిలిచారు. ఒకవేళ వైఎస్జగన్ ఈ ఎంటీఎస్ టీచర్లను నియమించకపోయి ఉంటే సరిహద్దు మండలాల్లోని పాఠశాలలన్నీ ఈ రోజు మూతపడే పరిస్థితి ఏర్పడేది. సరిహద్దు మండలాల బడులకు నియమించిన ప్రభుత్వం దివ్యాంగులనూ కనికరించని కూటమి ప్రభుత్వం ఒక మడకశిర నియోజకవర్గానికే 220 మంది కేటాయింపు వైఎస్ జగన్ హయాంలో ఉద్యోగాలొచ్చాయనే కక్షతోనే వేధింపులంటున్న ఎంటీఎస్ టీచర్లు ఎంటీఎస్ టీచర్గా ఉద్యోగం వచ్చిన ప్రారంభంలోనే ఆయనకు 50 ఏళ్లు. మడకశిర పట్టణ సమీపంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో పనిచేసే వారు. కొన్ని నెలల క్రితం అనుకోని విధంగా ప్రమాదానికి గురై కాలు కోల్పోవాల్సి వచ్చింది. ఆస్పత్రిలో చికిత్స పొంది ఇటీవల ఇంటికొచ్చారు. ఇంకా నడవడానికి కూడా కాలు పూర్తి స్థాయిలో సహకరించడం లేదు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఆ టీచర్ని ప్రభుత్వం కర్ణాటక సరిహద్దులోని మారుమూల ఉన్న ఓ ప్రాథమిక పాఠశాలకు బదిలీ చేసింది. ... ఎంటీఎస్ టీచర్లపై ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. ఇందుకు నిదర్శనమే ఇటీవల చేపట్టిన ఉపాధ్యాయుల బదిలీలు. అనారోగ్యంతో బాధపడుతున్నవారు, దివ్యాంగులనే కనికరం కూడా లేకుండా వారిని సుదూరంగా కర్ణాటక సరిహద్దు గ్రామాలకు బదిలీ చేసింది. ఈ లెక్కన ఒక్క మడకశిర నియోజకవర్గంలోనే 220 మంది ఎంటీఎస్ టీచర్లు విధుల్లో చేరాల్సి వచ్చింది. -
లోపాలను సరిదిద్దుకోండి : డీఎంహెచ్ఓ
పుట్టపర్తి అర్బన్: లోపాలను సరిదిద్దుకొని జిల్లాలో మాతాశిశు మరణాలను పూర్తిగా అరికట్టేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజాబేగం ఆదేశించారు. జూన్ నెలలో జిల్లాలో చోటు చేసుకున్న మాతాశిశు మరణాలపై సంబంధిత వైద్యాధికారులతో శుక్రవారం తన కార్యాలయంలో ఆమె సమీక్షించారు. సోమందేపల్లి, పుట్టపర్తి, బోయపేట, కొక్కంటి, ఎనుములపల్లి, పెనుకొండలో ఒక్కొక్కటి చొప్పున, రామగిరిలో రెండేసి శిశు మరణాలు సంభవించాయని గుర్తు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైద్య సేవలను చేరువ చేశామని, అయినా మరణాలు సంభవించడం వెనుక ఉన్న లోపాలను గుర్తించాలని సూచించారు. ప్రతి పీహెచ్సీలోనూ ప్రతి నెలా గర్భిణులను సమావేశ పరిచి ఆరోగ్య సూత్రాలు తెలియజేయాలన్నారు. ప్రతి కాన్పునూ స్వయంగా పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ మధుసూదన్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ మంజువాణి, గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రత్యూష, పీడీయాట్రిషియన్ డాక్టర్ శ్రీనునాయక్, డీపీహెచ్ఎన్ఓ వీరమ్మ, పీహెచ్సీ వైద్యాధికారులు, ఆరోగ్య, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. జీతాల మంజూరులో జాప్యం తగదు : ఎస్టీయూ గాండ్లపెంట: బదిలీలు, పదోన్నతుల్లో భాగంగా కొత్తగా మంజూరైన పోస్టుల్లో చేరిన ఉపాధ్యాయుల జీతాల మంజూరులో జాప్యం చేయరాదని ప్రభుత్వానికి ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు హరిప్రసాదరెడ్డి సూచించారు. ఎస్టీయూ సభ్యత్వ నమోదులో భాగంగా ఎన్పీ కుంట మండల కేంద్రంలోని పాఠశాల వద్ద ఆయన శుక్రవారం మాట్లాడారు. పునర్వవస్థీకరణలో భాగంగా ప్రభుత్వం ఆదర్శ పాఠశాలలను, ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా ఉన్నతీకరణ చేసి మోడల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులను, అదనపు ఉపాధ్యాయులను గ్రేడ్–2 హెచ్ఎంలుగా నియమించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అయితే ఆయా స్దానాలలో కేటాయించిన ఉపాధ్యాయులకు జూన్ నెల వేతనాలు ఇప్పటి వరకూ మంజూరు చేయకపోవడం అన్యాయమన్నారు. సాంకేతిక లోపాలను సరిచేసి జూన్, జూలై నెలల వేతనాలు తక్షణమే మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింప చేయాలని, పాఠశాల స్దాయిలో బోధనేతర పనులను రద్దు చేయాలని, పెండింగ్ డీఏ, 30 శాతం మద్యంతర భృతిని తక్షణమే ప్రకటించాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా కౌన్సిలర్ వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు రామాంజనేయులు, తిరుమల ప్రసాద్, రమేష్, హెచ్ఎం శాంతమ్మ, గంగయ్య, రాజశేఖర్, సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రీ పీహెచ్డీ పరీక్ష షెడ్యూల్ మార్పుఅనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో ప్రీ పీహెచ్డీ పరీక్ష షెడ్యూల్ను మార్పు చేశారు. ఈ మేరకు వర్సిటీ డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ జి. వెంకటరమణ శుక్రవారం వెల్లడించారు. ఈ నెల 22, 23, 24 తేదీల్లో నిర్వహించాల్సిన ప్రీ పీహెచ్డీ పరీక్షలు ఆగస్టు 5, 6, 7వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఏపీపీఎస్సీ డిగ్రీ లెక్చరర్ల రాత పరీక్ష నేపథ్యంలో ఈ మార్పు చేశారు. ఆగస్టు 5వ తేదీ రీసెర్చ్ మెథడాలజీ (పేపర్–1), 6న అడ్వాన్సెడ్ సబ్జెక్టు పేపర్/రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ ద సబ్జెక్టు(పేపర్–2), 7న పేపర్ ఆన్ రీసెర్చ్ ఏరియా (పేపర్–3) పరీక్షలు జరుగుతాయి. ప్రతి పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నారు. -
బెదిరింపులకు పాల్పడడం హేయం
తలుపుల: అనంతపురం జిల్లా పంచాయతీ అధికారి నాగరాజునాయుడుని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి పరుష పదజాలంతో దూషిస్తూ బెదిరింపులకు పాల్పడడం హేయమని పంచాయతీ కార్యదర్శులు ఖండించారు. జేసీ ప్రభాకరరెడ్డి వైఖరిని తప్పు పడుతూ శుక్రవారం తలుపుల ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. నిబద్ధతతో పనిచేసే జిల్లా స్థాయి అధికారిపైనే ఇంతటి దౌర్జన్యం చేస్తున్న జేసీ ప్రభాకరరెడ్డి ఇక తన పరిధిలోని మండల, గ్రామస్థాయి అధికారులను ఎంతటి భయభ్రాంతులకు గురి చేస్తుంటారో ఊహించలేమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జేసీ ప్రభాకరరెడ్డిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. హోంగార్డు కుటుంబాలకు చేయూత అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో గత నెలలో వేర్వేరు కారణాలతో మృతి చెందిన ముగ్గురు హోంగార్డులకు సంబంధించి వారి కుటుంబాలకు ఎస్పీ పి.జగదీష్ శుక్రవారం ఆర్థిక చేయూతనందించారు. శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన హోంగార్డు బి.తిరుపాల్నాయక్ కుటుంబానికి జిల్లా హోంగార్డుల ఒక్క రోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తం రూ.4,33,200తో పాటు ఫ్లాగ్ ఫండ్ కింద రూ.10 వేలు, అనంతపురం జిల్లాలో పని చేస్తూ మరణించిన లక్ష్మీరెడ్డి కుటుంబానికి ఫ్లాగ్ ఫండ్ కింద రూ.10 వేలు, శ్రీసత్యసాయి జిల్లా హోంగార్డుగా పనిచేస్తూ చనిపోయిన నరసింహులు కుటుంబానికి ఫ్లాగ్ ఫండ్ కింద రూ.10 వేలు ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని ఎస్పీ చాంబర్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు పవన్కుమార్, రాముడు, ఆర్ఎస్ఐ జాఫర్, తదితరులు పాల్గొన్నారు. వ్యక్తి ఆత్మహత్య రాప్తాడు రూరల్: జీవితంపై విరక్తితో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురం రూరల్ మండలం రాచానపల్లికి చెందిన రామప్ప (47), రామాంజనమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రైవేట్ వాహన డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న రామప్ప కొంత కాలం క్రితం సెల్యులైటిస్ వ్యాధి బారిన పడ్డాడు. ఎడమకాలు మోకాలి నుంచి కింద పాదం వరకూ బాగా దెబ్బతినింది. చాలాచోట్ల చూపించినా నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన ఆయన శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లోనే ఫినాయిల్ తాగాడు. అపస్మారక స్థితిలో చేరుకున్న రామప్పను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సర్వజనాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
ఎస్టీఎల్కు ‘ఎన్ఏబీఎల్’ గుర్తింపు
అనంతపురం అగ్రికల్చర్: స్థానిక భూసార పరీక్షా ప్రయోగశాల (సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ – ఎస్టీఎల్)కు కేంద్ర ప్రభుత్వం ఎస్ఏబీఎల్ (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్) గుర్తింపు దక్కినట్లు వ్యవసాయశాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ తెలిపారు. శుక్రవారం స్థానిక భూసార పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా ఎన్ఏబీఎల్ అక్రిడిటేషన్ను ఆమెకు ఎస్టీఎల్ ఏడీఏ రోజాపుష్పలత చూపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 29 ప్రయోగశాలలు ఉండగా అనంతపురంతో పాటు గుంటూరు, గొల్లపూడి, ఆముదాలవలసలోని ప్రయోగశాలలకు అక్రిడిటేషన్ దక్కిందన్నారు. ఈ గుర్తింపు 2028 వరకు ఉంటుందన్నారు. మట్టి సేకరణ, వాటి ద్వారా స్ఫూల, సూక్ష్మపోషకాల శాతం తెలుసుకునేందుకు 12 రకాల పరీక్షలు నిర్వహించడం, వాటిని అన్లైన్ చేయడం, వాటి ఫలితాలను సకాలంలో రైతులకు అందించడం, అలాగే లక్ష్యం మేరకు పరీక్షలు పూర్తి చేయడం, కేంద్రంలో మౌలిక సదుపాయాల కల్పన, మానవ వనరుల లభ్యత తదితర అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఎన్ఏబీఎల్ అధికారులు అక్రిడిటేషన్ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ ఏడాది కూడా 25 వేల మట్టి పరీక్షలు చేయాలని లక్ష్యంతో ఉన్నామని, ఇప్పటికే 17,750 వరకు మట్టి శ్యాంపిల్స్ ప్రయోగశాలకు చేరగా.. పరీక్షలు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది 25 వేల మట్టి పరీక్షల లక్ష్యం -
21న జాబ్మేళా
అనంతపురం ఎడ్యుకేషన్: ఎంఎన్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో పార్ట్టైం, ఫుల్టైం ఉద్యోగాల కోసం ఈ నెల 21న ఉదయం 10.30 గంటలకు అనంతపురం జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో జాబ్మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా ఉపాధి కల్పనాధికారి పల్లవి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మొత్తం 43 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతీయువకులు అర్హులు. జీతం రూ.10 వేల నుంచి రూ. 30 వేల వరకు ఉంటుంది. ఎంపికై న వారు అనంతపురంలో పనిచేయాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు బయోడేటా ఫారం, విద్యార్హత ఒరిజినల్, జిరాక్స్ పత్రాలు, ఆధార్, బ్యాంకు అకౌంట్, పాన్కార్డు వెంట తీసుకెళ్లాలి. కలుషిత నీరు తాగి 27 గొర్రెల మృతి రామగిరి: కలుషిత నీరు తాగి 27 గొర్రెలు మృతి చెందిన ఘటన రామగిరి మండలం పెద్ద కొండాపురంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ రైతు తన పొలానికి మందు కొట్టేందుకు యూరియాను నీటి తొట్టెలో కలిపి పిచికారీ చేశాడు. అయితే ఈ విషయం తెలియని గొర్రెల కాపరులు గంగన్న, పెద్దన్న తమ జీవాలను మేపునకు తోలుకెళ్లినప్పుడు దాహంతో ఉన్న గొర్రెలు తొట్టెలోని నీటిని తాగాయి. 27 గొర్రెలు మృతి చెందాయి. సమాచారం అందుకున్న పశువైద్యాధికారి మౌలిలీబాషా అక్కడకు చేరుకుని పరిశీలించారు. ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న మరికొన్ని గొర్రెలకు తక్షణమే చికిత్స అందజేశారు. ఘటనతో రూ.3 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధిత కాపరులు వాపోయారు. పట్టపగలే రెండిళ్లలో చోరీ పావగడ: స్థానిక శ్రీనివాసనగర్లో మున్సిపల్ మాజీ అధ్యక్షురాలు సుమ అనిల్, ఉపాధ్యాయుడు పాండు ఇళ్లలో గురువారం మధ్యాహ్నం చోరీ జరిగింది. సుమ, ఆమె భర్త అనిల్ ఇంటికి తాళం వేసి ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు. ఆ సమయంలో దుండగులు తాళం బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించారు. బీరువాలో దాచిన రూ.4 లక్షల విలువైన బంగారు ఆభరణాలు అపహరించారు. అనంతరం నల్లరాళ్ల గంగమ్మ గుడి వీధిలో నివాసముంటున్న ఉపాధ్యాయుడు పాండు ఇంట్లోకి చొరబడి నగదు, బంగారు ఆభరణాలు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. -
హెచ్ఎన్ఎస్ఎస్ పనులు వేగవంతం చేయండి
ప్రశాంతి నిలయం: హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) పథకం పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్సు హాలులో హెచ్ఎన్ఎస్ఎస్ పనులపై సమీక్షించారు. జిల్లా పరిధిలోని పనులను మూడు కాంట్రాక్టు సంస్థలకు అప్పగించామని, అధికారులు పనులు నిత్యం పర్యవేక్షిస్తూ వేగవంతం చేయాలన్నారు. టన్నెల్ మట్టి పనులు నెలాఖరులోగా పూర్తి చేస్తామని అధికారులు కలెక్టర్కు తెలిపారు. లైనింగ్, టన్నెల్తో పాటు బెడ్ వర్క్ పనులన్నీ ఆగస్టు 20వ తేదీలోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో హెచ్ఎన్ఎస్ఎస్ ఈఈ రాజా స్వరూప్కుమార్, ఈఈలు మురళి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు శెట్టి, హెచ్ఎన్ఎస్ఎస్ భూసేకరణ విభాగం అధికారి ఇంతియాజ్, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని, ఇందులో నిర్లక్ష్యంగా ఉండే వారిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ టీఎస్ చేతన్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పీ–4, పీజీఆర్ఎస్, వసతి గృహాల తనిఖీ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... పీ–4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాల పునఃపరిశీలనకు నిర్వహించే గ్రామ సభల గురించి ఆయా గ్రామాల్లో ముందుగానే ప్రచారం చేసి ప్రజలంతా పాల్గొనేలా చూడాలన్నారు. ‘స్వర్ణాంధ్ర విజన్’లో భాగంగా అధికారులంతా ఆయా మండలాల పరిధిలోని వసతి గృహాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసి తగు చర్యలు తీసుకోవాలన్నారు. వసతి గృహాల్లో నీరు, భోజన వసతిపై నివేదిక పంపాలన్నారు. స్వచ్ఛ ఓటరు జాబితాకు సహకరించండి తప్పుల్లేని స్వచ్ఛ ఓటరు జాబితాకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ కోరారు. శుక్రవారం ఆయన డీఆర్ఓ విజయసారథితో కలసి కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో ఉన్న మృతులు, శాశ్వతంగా వలసవెళ్లిన వారు, డబుల్ ఎంట్రీల తొలగింపునకు సహకరించాలని కోరారు. అలాగే మార్పులు, చేర్పుల కోసం 1,576 మంది బూత్ స్థాయి అధికారులను నియమించామన్నారు. వీరిని సమన్వయం చేసుకుని మార్పులు, చేర్పులుంటే చేసుకోవాలని సూచించారు. 1 జనవరి 2026 నాటికి 18 ఏళ్లు నిండిన వారందరినీ ఓటర్లుగా నమోదు చేయించాలన్నారు. సమావేశంలో రవినాయక్ (వైఎస్సార్ సీపీ), సతీష్కుమార్ (బీజేపీ), సామకోటి ఆదినారాయణ (టీడీపీ) తదితరులు పాల్గొన్నారు. -
తాగునీరు కరువు.. నడిచేందుకు రోడ్డు లేదు
పుట్టపర్తి టౌన్: ‘‘వార్డుల్లో కనీస సౌకర్యాలు కూడా కల్పించలేకపోతున్నాం. వీధిలైట్లు, తాగునీరు, రోడ్లు అన్నీ సమస్యే. ప్రజలు నిలదీస్తే ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు. ఈ సమస్యలపై పలుమార్లు కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చినా ఉపయోగం లేదు. సమస్యలు పరిష్కరించనప్పుడు సమావేశాలు ఎందుకు నిర్వహించాలి. టీ తాగి... స్నాక్స్ తిని వెళ్లేందుకా’’ అంటూ టీడీపీ కౌన్సిలర్లే ఏడాది కూటమి పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో చైర్మన్ తుంగా ఓబుళపతి ఆధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, కమిషనర్ క్రాంతికుమార్, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ కౌన్సిలర్లు నాగమణి (12వ వార్డు), రమణమ్మ (10వ వార్డు) మాట్లాడుతూ..పుట్టపర్తి అభివృద్ధి గురించి ప్రశ్నల వర్షం కురిపించారు. టీడీపీ అధికారంలోకి ఉన్నా..తాము అధికార పార్టీ కౌన్సిలర్లమే అయినా వార్డుల్లో ప్రజల కనీస అవసరాలు తీర్చలేని దుస్థితిలో ఉన్నామని వాపోయారు. రోడ్లు ఆధ్వానంగా ఉన్నాయని, పారిశుధ్యంలోపించడంతో వీధుల్లోకి వెళ్లలేని పరిస్థితి ఉందని కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. టీడీపీ కౌన్సిలర్లే ఎదురుదాడి చేయడంతో వేదికపై ఉన్న ఎమ్మెల్యే సింధూరారెడ్డి, కమిషనర్ దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అనంతరం తేరుకున్న ఎమ్మెల్యే... సమష్టి కృషితో పుట్టపర్తిని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. సత్యసాయి బాబా శత జయంత్యుత్సవాలకు దేశవిదేశాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అభివృద్ధి కార్యక్రమాలతో పుట్టపర్తికి నూతన శోభ తీసుకురావాలన్నారు. వీధిలైట్లు, తాగునీరు, రహదారులు, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. పన్నులు వసూలు చేస్తేనే అభివృద్ధి.. ప్రజల నుంచి పన్నులు వసూలు చేయకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అధికారులను ప్రశ్నించారు. అవసరమైతే పాలకసభ్యుల సహకారం తీసుకుని ప్రజల నుంచి పన్నులు వసూలు చేయాలన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ క్రాంతికుమార్ మాట్లాడుతూ... ఆస్తి, నీటి... ఇతర పన్నులు దాదాపు రూ.12 కోట్ల మేర బకాయిలు ఉన్నాయన్నారు. పన్ను వసూలుపై ప్రత్యేక దృష్టి సారించామని, కౌన్సిలర్లు కూడా చొరవ తీసుకుంటే వసూళ్లు పెరుగుతాయన్నారు. పట్టణాభివృద్ధికి దాతలు కూడా ముందుకు రావాలని కోరారు. అనంతరం అజెండాలోని అంశాలపై చర్చ జరపకుండానే వాటికి ఆమోదం తెలిపారు. సమావేశంలో వైస్ చైర్మన్లు శ్రీలక్ష్మి, తిప్పన్నతోపాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రొటోకాల్ కూడా పాటించరా? 5వ వార్డు కౌన్సిలర్ సూర్యాగౌడ్ మాట్లాడుతూ... అభివృద్ధి పనులు చేపట్టే సమయంలో కనీసం ఆ వార్డు కౌన్సిలర్కు కూడా సమాచారం ఇవ్వడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ పాటించకుండా భూమి పూజ ఎలా చేస్తారని నిలదీశారు. ఇంజినీరింగ్ కార్మికులు సమ్మెలోకి వెళ్తున్నామని నాలుగురోజుల కిందటే నోటీసులిచ్చినా అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 4 వార్డు కౌన్సిలర్ చెరువు భాస్కర్రెడ్డి మాట్లాడుతూ... వార్డుల్లో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు మూలన పడిన కాంప్యాక్టర్లు, ఎలక్ట్రికల్ బ్యాటరీలు మరమ్మతులు చేయించాలన్నారు. రోడ్లు అధ్వానంగా మారాయని, సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని కోరారు. ఏడాదిలో మనం చేసిన అభివృద్ధి ఇదేనా..? జనం ప్రశ్నిస్తుంటే ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదు పుట్టపర్తి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్ల ఆవేదన ప్రజల నుంచి పన్ను వసూళ్లకు గట్టి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశం -
పంచాయతీ బోరు.. పంటకు నీరు!
సాక్షి టాస్క్ఫోర్స్: రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువుదీరాక టీడీపీ నాయకుల అరాచకాలకు అంతేలేకుండా పోయింది. ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గంలో ‘తెలుగు తమ్ముళ్లు’ ప్రకృతి వనరులన్నీ దోచేస్తూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. తాజాగా రామగిరి మండలం పేరూరు పంచాయతీ పి.కొత్తపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త గ్రామంలో తాగునీటి అవసరాల కోసం వేసిన బోరునీటిని తన పొలానికి మళ్లించుకుంటూ దర్జాగా జొన్న, వరి, వేరుశనగ తదితర పంటలను సాగు చేసుకుంటున్నాడు. దీంతో బోరులో నీటిమట్టం తగ్గిపోగా తాగునీటి అవసరాలకు పి.కొత్తపల్లి వాసులంతా సమీపంలో ఉన్న పేరూరు గ్రామానికి వెళ్తున్నారు. ప్రజలు కి.మీ దూరం వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్నా... ‘తెలుగు తమ్ముడు’ మాత్రం తనకేం పట్టనట్లు పంటకు నీరు పారించుకుంటున్నారు. ఇప్పటికై నా అధికారులు చొరవ తీసుకొని పంచాయతీ బోరునీటిని గ్రామస్తులు తాగునీటి అవసరాలకే ఉపయోగపడేలా చూడాలని పి.కొత్తపల్లివాసులు కోరుతున్నారు. పి.కొత్తపల్లిలో కొన్నినెలలుగా ‘తమ్ముడి’ దందా తాగునీరులేక ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు -
నేడు జిల్లాకు భారీ వర్ష సూచన
అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి జిల్లాకు శనివారం భారీ వర్ష సూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 40 మి.మీ మేర సగటు వర్షపాతం నమోదు కావచ్చన్నారు. తర్వాత నాలుగు రోజులు కూడా వర్ష సూచన ఉందని తెలిపారు. 20న 14 మి.మీ, 21న 10 మి.మీ, 22న 15 మి.మీ, 23న 12 మి.మీ. చొప్పున వర్షం కురిసే సూచన ఉన్నట్లు వెల్లడించారు. సునీతమ్మా.. నోరు అదుపులో పెట్టుకో ● దద్దమ్మ ఎవరో ప్రజలందరికీ తెలుసు ● వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గంగుల సుధీర్ రెడ్డి సాక్షి, పుట్టపర్తి: రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత నోరు అదుపులో పెట్టుకోవాలని.. దద్దమ్మలు ఎవరో ప్రజలందరికీ తెలుసునని వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గంగుల సుధీర్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగానే రామగిరి ఎంపీపీ ఎన్నికను వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలు బహిష్కరించారన్నారు. ఈ ఏడాది మార్చిలో ఎంపీపీ ఎన్నికకు వస్తుండగా.. టీడీపీ కార్యకర్తలు విధ్వంసాలకు పాల్పడుతున్నా.. పోలీసులు చేష్టలుడిగి చూశారన్నారు. గతంలో (2017) కనగానపల్లిలో వైఎస్సార్ సీపీకి మెజార్టీ ఉన్నప్పటికీ.. పరిటాల సునీత మంత్రి హోదాలో సమావేశానికి హాజరై వైఎస్సార్ సీపీ సభ్యులతో బలవంతంగా చేతులు ఎత్తించి సరిపూటి గీతను ఎంపీపీ చేసిన సంగతిని గుర్తు చేశారు. బలం లేకున్నా.. అధికార దాహంతో దౌర్జన్యాలకు పాల్పడుతూ.. బెదిరింపులకు దిగుతూ ఎన్నికల కోసం తహతహలాడుతున్నదెవరో ప్రజలందరికీ తెలుసన్నారు. కూటమి సర్కారు తీరు.. పోలీసుల వైఖరికి నిరసనగానే ఎన్నికలు బహిష్కరించినట్లు వివరించారు. జిల్లా స్థాయి అధికారుల సమక్షంలో ఎన్నికలు నిర్వహిస్తే.. హాజరై ఎంపీపీ సీటు కై వసం చేసుకుంటామన్నారు. ఎలుగుబంటి దాడిలో రైతుకు గాయాలు గుడిబండ: పొలం నుంచి ఇంటికి వస్తున్న ఓ రైతుపై ఎలుగుబంటి దాడి చేయగా... రైతు తీవ్రంగా గాయ పడ్డాడు. ఈ ఘటన శుక్రవారం గుడిబండ మండల పరిధిలోని ఎస్.రాయాపురం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన భూతరాజు తన పొలంలో వేరుశనగ సాగు చేశాడు. అడవి జంతువుల బారి నుంచి పంటను కాపాడుకునేందుకు గురువారం రాత్రి పొలానికి కాపలా వెళ్లాడు. శుక్రవారం ఉదయం ఇంటికి వస్తుండగా..మార్గమధ్యంలో హఠాత్తుగా ఎలుగుబంటి దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన భూతరాజును కుటుంబ సభ్యులు గుడిబండ పీహెచ్సీకి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం మడకశిర ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. 430 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం మడకశిర: విజిలెన్స్ అధికారులు శుక్రవారం మడకశిరలోని పలు దుకాణాల్లో దాడులు చేశారు. ఈ సమయంలోనే అటుగా వెళ్తున్న లారీని తనిఖీ చేయగా... 430 బస్తాల రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. దీంతో లారీతో పాటు రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ సీఐ జమాల్బాషా తెలిపారు. -
లేపాక్షిలో కేంద్ర బృందం పర్యటన
లేపాక్షి: స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణ్–2025లో భాగంగా కేంద్ర బృందం సభ్యులు రామాంజనేయులు, అనంత్ గురువారం లేపాక్షిలో పర్యటించారు. మురుగునీటి కాలువలు, పరిసరాల పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణను పరిశీలించారు. చెత్తను బయట వేయరాదని, ప్లాస్టిక్ వాడరాదని, స్వచ్ఛమైన నీరు సేవించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నరసింహమూర్తి, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. పట్టపగలే రెండిళ్లలో చోరీ మడకశిర: స్థానిక పావగడ రోడ్డులోని రెండు ఇళ్లలో పట్టపగలే చోరీ జరిగింది. ఆర్టీసీ బస్డాండ్ సమీపంలో నివాసముంటున్న కొలిమి నాగేంద్ర గురువారం ఉదయం 11గంటల సమయంలో ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలసి పనిపై బ్యాంకుకు వెళ్లారు. అక్కడ పని ముగించుకుని ఇంటికి వచ్చే లోపు తలుపులు తెరిచి ఉన్నాయి. లోపలకు వెళ్లి చూడగా వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బీరువాలో దాచిన రూ.70 వేల నగదు, జత బంగారు కమ్మలు, ఓ ఉంగరం అపహరించినట్లుగా గుర్తించి, సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ● నాగేంద్ర ఇంటి పక్కనే మేడపై నివాసముంటున్న శకుంతల ఇంట్లోనూ చోరీ జరిగింది. పెనుకొండ సమీపంలోని కియా పరిశ్రమలో పనిచేస్తున్న ఆమె గురువారం ఉదయం 7 గంటలకు ఇంటికి తాళం వేసి విధులకు వెళ్లిపోయారు. ఆ సమయంలో ఇంట్లోకి చొరబడిన దుండగులు వస్తువులను చెల్లాచెదురు చేసి బంగారు నగలు అపహరించారు. కాగా, ఇంటి యజమానురాలు వచ్చి ఎంత మేర సొత్తు చోరీ అయింది నిర్ధారించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఇప్పటికే నాగేంద్ర ఫిర్యాదు స్వీకరించామని, శకుంతల వచ్చిన తర్వాత ఆమె నుంచి ఫిర్యాదు తీసుకుని కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపడతామని సీఐ నగేష్బాబు తెలిపారు. క్లూస్టీంను రంగంలో దించి దొంగల వేలి ముద్రలను సేకరించినట్లు తెలిపారు. వేధింపులపై యువతి ఫిర్యాదు ధర్మవరం రూరల్: తనను ధర్మవరం మండలం తుంపర్తి గ్రామానికి చెందిన ప్రణవ్ అనే యువకుడు వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఓ యువతి ఫిర్యాదు చేసింది. వివరాలు.. ధర్మవరం పట్టణంలోని శివానగర్కు చెందిన ఓ యువతి బీటెక్ పూర్తి చేసి, పోటీ పరీక్షలకు హైదరాబాద్లోని కోచింగ్ తీసుకుంటోంది. అక్కడే తన స్నేహితురాలి పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు ప్రణవ్ పరిచయమయ్యాడు. అనంతరం తరచూ పోన్ చేస్తుండేవాడు. ఆమె ఉంటున్న హాస్టల్ వద్దకూ వెళుతుండేవాడు. ఈ క్రమంలో తాను ప్రేమిస్తున్నానంటూ వెంట పడుతూ అసభ్యంగా మాట్లాడడం మొదలు పెట్టాడు. తనకు అలాంటి ఉద్దేశం లేదని చెప్పినా వినకుండా వెంటపడేవాడు. వారం రోజుల క్రితం యువతి హైదరాబాద్ నుంచి ధర్మవరానికి చేరుకుంది. అయిన ప్రణవ్ వదలకుండా ఇతరుల ఫోన్ నుంచి కాల్స్ చేయడంతో పాటు అసభ్యంగా మెసేజ్లు పెడుతూ వచ్చాడు. తాను చెప్పినట్లుగా నడుచుకోకపోతే హతమారుస్తానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో విషయాన్ని తల్లిదండ్రలకు తెలిపి వారి సమక్షంలో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్లు ధర్మవరం రెండో పట్టణ పోలీసులు తెలిపారు. -
దిక్కు లేకుండా పోయింది
మా ఊరి పంచాయతీ స్థలంలో చాలా ఏళ్ల క్రితం పశువుల కోసం తాగునీటి తొట్టె నిర్మించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ తొట్టెను తొలగించి.. పక్కనే నివాసం ఉంటున్న నరసింహులు ఆక్రమించి తన స్వప్రయోజనాలకు వినియోగించేందుకు రూమ్ నిర్మించాడు. మొదట్లోనే ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశాం. ఎంపీడీఓ వచ్చి బాత్రూమ్ కట్టడాలను అడ్డుకుని తిరిగి తాగునీటి తొట్టె నిర్మిస్తామని చెప్పారు. అయితే ఆ తర్వాత గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. టీడీపీ బడానేతల అండతో అధికారులను గ్రామంలోకి రానీవ్వకుండా చేసి నిర్మాణం పూర్తి చేశాడు. ప్రస్తుతం ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు కూడా ఇబ్బందిగా ఉంది. – బయపురెడ్డి, గుంతపల్లి, కనగానపల్లి మండలం -
‘తమ్ముడి’ దౌర్జన్యం
సాక్షి, టాస్క్ఫోర్స్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకులు గ్రామాల్లో అమాయకుల భూములతో పాటు ప్రభుత్వ భూములు, పంచాయతీ స్థలాలను కబ్జా చేయడమే పనిగా పెట్టుకున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అండతో ‘తెలుగు తమ్ముళ్లు’ గ్రామ స్థాయి నుంచి అరాచకాలకు తెగబడుతున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. గ్రామస్తులు తిరగబడితే.. కేసులు పెట్టిస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో టీడీపీ నేతల అవినీతి, అక్రమాలను ప్రజలు మౌనంగానే భరిస్తున్నారు. పశువుల కోసం కేటాయించిన స్థలం కబ్జా.. కనగానపల్లి మండలం గుంతపల్లి గ్రామంలో ఎన్నో ఏళ్ల క్రితం పశువుల తాగునీటి కోసమని కొంత స్థలాన్ని పంచాయతీ కేటాయించి, నీటి తొట్టెను ఏర్పాటు చేసింది. ఆ స్థలంపై కన్నేసిన స్థానిక టీడీపీ నేత నరసింహులు... తొట్టెను ధ్వంసం చేసి బాత్రూమ్ను నిర్మించాడు. ఆరంభంలోనే గుర్తించిన గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత ఎంపీడీఓ గ్రామ పర్యటనకు వెళ్లిన సమయంలోనూ సమస్య వివరించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో జిల్లా కేంద్రానికి చేరుకుని కలెక్టరేట్లో ప్రజా సమస్య పరిష్కార వేదికలోనూ ఫిర్యాదు చేశారు. అయినా ఎవరూ స్పందించలేదు. ఈ మూడు నెలల వ్యవధిలోనే తొట్టె మాయమై బాత్రూమ్ వెలసింది. అడ్డుకునే వారు కరువు.. అధికారాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ నేతలు కబ్జాలకు పాల్పడుతున్నా అడిగే వారు ఎవరూ లేకుండా పోయారు. అడ్డుకోవాల్సిన అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. గ్రామస్తులు ఎవరయినా అభ్యంతరం వ్యక్తం చేస్తే.. అధికారంలో ఉన్నామని.. కేసుల్లో ఇరికించి జైలు పాలు చేస్తామని బెదిరిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రెండు, మూడు సార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పించారని గ్రామానికి చెందిన కొందరు వాపోయారు. తాగునీటి తొట్టె సంగతిని ఎవరూ పట్టించుకోకపోతే భవిష్యత్తులో గ్రామంలోని మిగులు పంచాయతీ స్థలాలను కబ్జా చేసే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరంభంలోనే ఇలాంటి దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. గుంతపల్లిలో పశువుల స్థలం కబ్జా నీటి తొట్టెను ధ్వంసం చేసి బాత్రూం నిర్మాణం గ్రామస్తులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు -
కర్నూలులో హాస్పిటల్పై పామిడి వాసుల దాడి
కర్నూలు(హాస్పిటల్): జ్వరం కారణంగా చికిత్సకు వచ్చి యువతి మృతి చెందడంతో ఆమె కుటుంబసభ్యులు గురువారం కర్నూలులోని శ్రీ చక్ర హాస్పిటల్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఆస్పత్రిపై దాడి చేసి గాజు కిటికీలు, తలుపులు ధ్వంసం చేశారు. వంద మందికి పైగా నిర్వహించిన ఈ దాడితో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. వివరాలు... అనంతపురం జిల్లా పామిడికి చెందిన అనిత(21)కు కర్నూలులోని కల్లూరు ఎస్టేట్ పోలీస్ కాలనీకి చెందిన ప్లాట్ల రమణ కుమారుడు నాగేంద్రతో ఏడాది క్రితం వివాహమైంది. తండ్రితో కలిసి నాగేంద్ర రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అనితకు ఈ నెల 15న జ్వరం రావడంతో సమీపంలో ఉన్న శ్రీచక్ర హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడి క్యాజువాలిటీలో ఆమెకు అవసరమైన చికిత్సను అందించి సాయంత్రం ఇంటికి పంపించారు. మరుసటి రోజు బుధవారం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అదే రోజు రాత్రి ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి ఆమె మరణించినట్లు ధ్రువీకరించారు. కాగా, గురువారం ఉదయం పామిడి నుంచి వచ్చిన అనిత కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో శ్రీచక్ర హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. అనితకు సకాలంలో వైద్యం అందించలేదని, మెరుగైన వైద్యం అందించి ఉంటే బతికేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన ప్రారంభించారు. ఈ ఆందోళన క్రమంగా ఉద్రిక్తతకు దారి తీసింది. ఒక దశలో ఆస్పత్రిపై రాళ్లు విసిరి అద్దాలు పగులగొట్టారు. బయట ఉన్న మెడికల్షాపు అద్దాన్ని, గాజు తలుపును ధ్వంసం చేశారు. ఆస్పత్రిలోకి చొరబడి కనిపించిన ప్రతి వస్తువునూ ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో క్యాజువాలిటీ, ఆరోగ్యశ్రీ కియోస్క్, కిటికీలు దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న డీఎస్పీ బాబుప్రసాద్, సీఐలు రామయ్య యాదవ్, నాగరాజురావు, శేషయ్య, విక్రమసింహ, తబ్రేజ్, సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనిత మృతితో సంబంధం లేదు.. అనిత మృతికి ఆస్పత్రికి ఎలాంటి సంబంధం లేదని శ్రీచక్ర హాస్పిటల్ అధినేత డాక్టర్ విజయకుమార్రెడ్డి తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనిత అనే యువతి మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జ్వరంతో బాధపడుతూ చికిత్స నిమిత్తం వచ్చిందన్నారు. క్యాజువాలిటీలోనే సాయంత్రం వరకు ఆమెకు అవసరమైన మందులు ఇచ్చి, ఫ్లూయిడ్స్ పెట్టామన్నారు. ఆమె కోలుకోవడంతో ఇంటికి వెళ్తానంటే పంపించామన్నారు. మరుసటి రోజు రాత్రి అత్యవసర పరిస్థితిలో కుటుంబసభ్యులు ఆమెను క్యాజువాలిటీకి తీసుకొచ్చారని, అప్పటికే ఆమె మృతి చెంది ఉందన్నారు. ఆమె మృతికి, ఆస్పత్రికి ఎలాంటి సంబంధం లేదని, అయినా ఆస్పత్రిపై దాడి చేయడం దారుణమన్నారు. దాడికి పాల్పడిన వారిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఈ ఘటనపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. సమావేశంలో ఐఎంఏ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ రామచంద్రనాయుడు, డాక్టర్ ఎస్వీ రామమోహన్రెడ్డి, డాక్టర్ బాలమద్దయ్య, ప్రైవేటు ఆసుపత్రుల సంఘం అధ్యక్షులు డాక్టర్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. యువతి మృతితో కుటుంబ సభ్యుల ఆందోళన ఆస్పత్రి అద్దాల ధ్వంసం -
నేడు రైల్వే ఇన్స్టిట్యూట్ పాలక వర్గం ఎన్నికలు
గుంతకల్లు: స్థానిక రైల్వే ఇన్స్టిట్యూట్ పాలక మండలి ఎన్నికలు శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు సీనియర్ డీపీఓ కోర్డినేషన్ హెచ్ఎల్ఎన్ ప్రసాద్ గురువారం వెల్లడించారు. రెండేళ్ల కాల వ్యవధి ఉన్న రైల్వే ఇన్స్టిట్యూట్ పాలక మండలికి నిర్వహించే ఈ ఎన్నికల్లో కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారితో పాటు ఆరుగురు సభ్యులను రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నుకోనున్నారు. గుంతకల్లు రైల్వే ఇన్స్టిట్యూట్లో మొత్తం 943 మంది ఓటర్లు ఉన్నారు. శుక్రవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటలకు వరకు రైల్వే ఇన్స్టిట్యూట్ పోలింగ్ ప్రక్రియ ఉంటుంది. అనంతరం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి, వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు. కాగా, ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ మజ్దూరు యూనియన్, ఎంప్లాయీస్ సంఘ్ మధ్యనే ఉంది. మజ్దూర్ యూనియన్ తరఫున కార్యదర్శిగా కె.యల్లప్ప, సంయుక్త కార్యదర్శిగా ప్రవీణ్కుమార్, కోశాధికారిగా ఎస్.సతానియల్తోపాటు ఆరుగురు కమిటీ సభ్యులుగా పోటీ చేస్తున్నారు. ఎంప్లాయీస్ సంఘ్ తరపున కార్యదర్శిగా మల్లికార్జున, సంయుక్త కార్యదర్శిగా షెక్షావలి, కోశాధికారిగా నాగరాజుతోపాటు ఆరుగురు కమిటీ సభ్యులుగా బరిలో నిలిచారు. కాగా డివిజన్ వ్యాప్తంగా ఇప్పటి వరకూ జరిగిన రైల్వే ఇన్స్టిట్యూట్ ఎన్నికల్లో మజ్దూర్ యూనియన్ హవా కొనసాగింది. పాకాల రైల్వే ఇన్స్టిట్యూట్లో యూనియన్ 6 పోస్టులు, సంఘ్ 3 పోస్టులు కై వసం చేసుకుంది. ఇక రేణిగుంట, నందలూరు, కడప ఇన్స్టిట్యూట్ పాలక మండళ్లను మజ్దూర్ యూనియన్ ఏకగ్రీవంగా కై వసం చేసుకుంది. గుత్తి రైల్వేఇన్స్టిట్యూట్లో క్లీన్ స్వీప్ చేసింది. -
వ్యాధుల నియంత్రణలో పురోగతి
హిందూపురం: సీజనల్, అంటువ్యాధుల నియంత్రణలో వంద శాతం పురోగతి సాధించినట్లు డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ మంజువాణి తెలిపారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యలపై పెనుకొండ డివిజన్లోని పీహెచ్సీ, యూపీహెచ్సీ వైద్యులతో గురువారం ఆమె సమీక్షించారు. పీహెచ్సిలోని వైద్య సదుపాయలు, రోగులకు అందించిన సేవలు, పిల్లల ఆరోగ్య పరిస్థితి, రెగ్యులర్ హాస్టల్ విజిట్స్పై ఆరా తీశారు. ప్రమాదకరమైన వ్యాధులు, క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లయితే హయ్యర్ సెంటర్స్కు రెఫర్ చేయాలని సూచించారు. ఆంధ్రా క్రికెట్ జట్టు ప్రాబబుల్స్కు ఆరుగురి ఎంపిక అనంతపురం: ఆంధ్రా అండర్–23 క్రికెట్ జట్టు ప్రాబబుల్స్ ఎంపిక గురువారం ముగిసింది. అనంతపురానికి చెందిన ఆరుగురికి చోటు దక్కింది. వీరిలో మచ్చా కె.దత్తారెడ్డి, పి.అర్జున్ టెండూల్కర్, జి.మల్లికార్జున, ఎస్.మహమ్మద్ కమిల్, టి. హేంద్ర రెడ్డి, ఎం.దీపక్ ఉన్నారు. మచ్చా దత్తారెడ్డి కుడిచేతి ఓపెనర్గా, వికెట్ కీపర్గా రాణిస్తున్నాడు. ఆంధ్ర అండర్ 23 రంజీ టోర్నీలో ప్రతిభ చాటాడు. అలాగే కుడిచేతి ఓపెనర్గా, ఆఫ్ స్పిన్నర్గా రాణిస్తున్న పి.అర్జున్ టెండూల్కర్ ఇప్పటికే ఆంధ్ర అండర్ 23, 19 జట్లలో ప్రాతినిథ్యం వహించారు. ఎడమ చేతి వాటం స్పిన్నర్ అయిన మల్లికార్జునకు అంతర జిల్లా మ్యాచ్ల్లో పది వికెట్లు తీసిన రికార్డు ఉంది. అలాగే ఎడమ చేతి మీడియ పేస్ బౌలర్ దీపక్ సైతం అంతర్ జిల్లా మ్యాచ్లో 11 వికెట్లు సాధించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. కమిల్ ఎడమ చేతి స్పిన్నర్. ఎడమ చేతి వాటం మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా ఆల్రౌండ్ ప్రతిభ కనబరుస్తున్నాడు. మహేంద్ర రెడ్డి కుడిచేతి వాటం మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. అండర్–19, అండర్–23 మ్యాచ్ల్లో ఒక సెంచరీ, మరో అర్ధసెంచరీ సాధించాడు. -
బంగారు గొలుసు అపహరణ
గుంతకల్లు టౌన్: స్థానిక హనుమేష్నగర్ ఎల్ఐసీ కార్యాలయం గురువారం రాత్రి చైన్స్నాచింగ్ జరిగింది. తన సోదరి ఇంటికి నడుచుకుంటూ వెళుతున్న మల్లీశ్వరి అనే మహిళ మెడలో నుంచి నాలుగు తులాల బంగారు గొలుసును దుండగుడు లాక్కొని ఉడాయించాడు. బాధితురాలు తెలిపిన మేరకు.. మల్లీశ్వరి కర్నూలు జిల్లా మద్దికెర సుబ్రమణ్యస్వామి ఆలయంలో పనిచేస్తోంది. పనిపై తన ఇంటి నుంచి పక్క వీధిలో ఉంటున్న తన అక్క సులోచన ఇంటికి గురువారం రాత్రి నడుచుకుంటూ వెళుతుండగా బైక్పై వచ్చిన దుండగుడు ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని ఉడాయించాడు. ఈ ఘటనతో ఆమె మెడపై గాయమైంది. గట్టిగా కేకలు వేసినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను విచారించారు. చుట్టుపక్కల గాలించినా దుండగుడి ఆచూకీ లభ్యం కాలేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు గుంతకల్లు వన్టౌన్ సీఐ మనోహర్ తెలిపారు. -
చోరీలపై అప్రమత్తంగా ఉండండి : డీఎస్పీ
కదిరి అర్బన్: చోరీలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి సూచించారు. పట్టణ పోలీస్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రొబేషనరీ డీఎస్పీ ఉదయపావనితో కలసి ఆయన మాట్లాడారు. జిల్లాలో మధ్యప్రదేశ్ చెందిన చెడ్డీ, పార్థీ, బిళ్లూ గ్యాంగ్లతో పాటు నంద్యాలకు చెందిన చెంచు జాతి దొంగల సంచారం ఎక్కువగా ఉందన్నారు. ఈ ముఠాలు జిల్లాలోని పుట్టపర్తి, గాండ్లపెంట, ధర్మవరం, రాప్తాడు, తిరుపతి, కర్ణాటకలోని గౌరీబిదనూర్లో చోరీలకు పాల్పడ్డాయన్నారు. వీరు రాత్రి 12 నుంచి 3 గంటల మధ్య విశాలమైన పెద్ద ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతుంటారన్నారు. కదిరిలోని ఎన్జీఓ కాలనీ, వాణి స్ట్రీట్, మగ్గాల క్వార్టర్స్, సైదాపురం, వైఎస్సార్ నగర్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చోరీలను అరికట్టేందుకు రాత్రి గస్తీలు ముమ్మరం చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు కూడా ఇందుకు సహకరించాలన్నారు. ఎవరైనా కొత్త వ్యక్తుల సంచారం ఉంటే డయల్ 100, టౌన్ సీఐ 94407 96851 కు సమాచారం అందించాలని కోరారు. అనంతరం పెట్రోలింగ్ కోసం నూతనంగా ఏర్పాటు చేసిన మూడు ద్విచక్ర వాహనాలను ప్రారంభించారు. -
ఎరువుల దుకాణంలో విజిలెన్స్ తనిఖీలు
బత్తలపల్లి: మండలంలోని పలు ఎరువుల దుకాణాలను విజిలెన్స్ అధికారులు గురువారం తనిఖీ చేశారు. పుంగనూరు ఏడీఏ శివకుమార్, విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ఎం.శివన్న, వ్యవసాయాధికారి ప్రసాద్, బత్తలపల్లి ఏఓ ఓబిరెడ్డి పాల్గొన్నారు. పలు రికార్డులు, నిల్వలు పరిశీలించారు. నిల్వల్లో వ్యత్యాసమున్న రూ.3.05 లక్షల విలువైన 15.105 మెట్రిక్ టన్నుల ఎరువుల విక్రయాలను నిలుపుదల చేస్తూ నోటీసులు ఇచ్చారు. ఎరువులు, క్రిమిసంహారక మందులు, విత్తనాల విక్రయాలకు సంబంధించి ప్రతి రైతుకూ తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని నిర్వాహకులను ఆదేశించారు. కాగా, విజిలెన్స్ తనిఖీలతో అప్రమత్తమైన పలువురు తమ దుకాణాలకు తాళం వేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వ్యక్తి దుర్మరణం గోరంట్ల (సోమందేపల్లి): వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. గోరంట్ల మండలం గుంతపల్లికి చెందిన నరసింహారెడ్డి గురువారం సొంత పనిపై గోరంట్లకు వెళ్లాడు. పని ముగించుకున్న అనంతరం రాత్రి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన ఆయన గుంతపల్లి సమీపంలోకి చేరుకోగానే గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనం నిలపకుండా దూసుకెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న గోరంట్ల పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. -
సాగు కృష్ణార్పణం
265 ఎంబీసీ పరిధిలోని చెరువుల సంఖ్యమడకశిర: జిల్లాలోని హెచ్ఎన్ఎస్ఎస్ (హంద్రీనీవా సుజల స్రవంతి) మడకశిర బ్రాంచ్ కెనాల్ పరిధిలోని రైతులకు కృష్ణా జలాలు అందక గగ్గోలు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా పూర్తి స్థాయిలో కృష్ణా జలాలను అందించకపోవడంతో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. మడకశిర బ్రాంచ్ కెనాల్ పరిధిలో పెనుకొండ, హిందూపురం, మడకశిర నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ మూడు నియోజకవర్గాల్లో 265 చెరువులు ఉన్నాయి. ఈ చెరువులన్నీ కృష్ణా జలాలతో నింపి సాగునీరు అందించాల్సిన కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందని రైతులు మండిపడుతున్నారు. తూతూ మంత్రంగా కృష్ణా జలాలు.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది. మడకశిర నియోజకవర్గంలో మొత్తం 165 చెరువులున్నాయి. అందులో కేవలం 23 చెరువులకు మాత్రమే కృష్ణా జలాలను విడుదల చేశారు. పెనుకొండ నియోజకవర్గంలో 19 చెరువులకు, హిందూపురం నియోజకవర్గంలో 4 చెరువులకు మాత్రమే కూటమి ప్రభుత్వం కృష్ణా జలాలను విడుదల చేసింది. మూడు నియోజకవర్గాల్లోని 219 చెరువులకు కృష్ణా జలాలు అందించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గతమెంతో ఘనం.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో మడకశిరకు క్రమంప్పకుండా కృష్ణా జలాలు వచ్చాయి. 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మడకశిర మండలంలో కృష్ణా జలాలు పారాయి. ఆ తర్వాత వరుసగా రెండేళ్ల పాటు మడకశిరకు కృష్ణా జలాలు రావడం విశేషం. అలాగే మడకశిర చెరువును రెండుసార్లు నింపిన ఘనత కూడా వైఎస్ జగన్కే దక్కుతుంది. అయితే కూటమి ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చింది. మొదటి ఏడాది కూడా కృష్ణా జలాలు రాలేదు. ప్రస్తుత ఏడాది కూడా కృష్ణా జలాలను అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. అటకెక్కిన బైపాస్ కెనాల్.. మడకశిర నియోజకవర్గంలోని అన్ని చెరువులకు కృష్ణా జలాలను అందించడానికి వీలుగా వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మడకశిర బైపాస్ కెనాల్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. ఇందుకు కోసం రూ.214.85 కోట్ల నిధులను కూడా మంజూరు చేసి టెండర్లను కూడా పూర్తి చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ కెనాల్ పనులను చేపట్టకుండా నిర్లక్ష్యం చేస్తోంది. బైపాస్ కెనాల్ను అటకెక్కించారని రైతులు మండిపడుతున్నారు. హడావుడికే పరిమితమైన నేతలు.. మడకశిర నియోజకవర్గానికి కృష్ణా జలాలు వచ్చేశాయంటూ ప్రారంభంలో కూటమి నేతలు హడావుడి చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఒక అడుగు ముందుకేసి కూటమి నేతలను వెంటేసుకుని హంద్రీనీవా కాలువలను పరిశీలించారు. మంత్రి సవిత, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కృష్ణా జలాలతో చెరువులను సస్యశ్యామలం చేస్తామని గొప్పలు చెప్పారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా కృష్ణా జలాలు రాకపోవడంతో రైతులు కూటమి నేతల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. చెరువులన్నీ నింపేందుకు అవసరమైన నీరు5టీఎంసీలుకృష్ణా జలాలు అందని చెరువులుమడకశిర నియోజకవర్గంలో కృష్ణా జలాలు అందని చెరువులు ఎంబీసీ పరిధిలోని 265 చెరువులకు కృష్ణాజలాలు విడుదల చేస్తామని మంత్రి సవిత, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గొప్పలు కంటితుడుపుగా కేవలం 46 చెరువులకే నీళ్లు సాగునీరు లేక అందక రైతుల గగ్గోలు వైఎస్ జగన్ హయాంలో వరుసగా మూడేళ్లు కృష్ణా జలాలు 219142ఇది అగళి మండలంలోని కోడిపల్లి చెరువు. వర్షాకాలంలోనూ నీరులేక ఇలా వెలవెలబోతోంది. ఈ చెరువుపై ఆధారపడి దాదాపు 180 మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు. దాదాపు 200 ఎకరాల ఆయకట్టు ఉంది. సరైన వర్షాలు రాకపోవడంతో ఈచెరువులోకి ఇంత వరకు నీరు చేరలేదు. దీంతో రైతులు కృష్ణాజలాలపై ఆశలు పెట్టుకున్నారు. ఈ చెరువుకే గాక అగళి మండలంలోని మిగిలిన చెరువులకు కూడా కృష్ణా జలాలు రావాలంటే హంద్రీనీవా అగళి మైనర్ కాలువను పూర్తి చేయాల్సి ఉంది. కానీ కూటమి ప్రభుత్వం ఇంత వరకు కాలువను పూర్తి చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇది అగళి మండలంలోని హంద్రీనీవా మైనర్ కాలువ. ప్రస్తుతం ఈ కాలువ నిరుపయోగంగా మారింది. కృష్ణా జలాలు పారక పోవడంతో కంపచెట్లు విపరీతంగా పెరిగాయి. అమరాపురం, అగళి మైనర్ కాలువ పనులను పూర్తి చేయడానికి వైఎస్ జగన్ హయాంలో రూ.69.90 కోట్ల నిధుల విడుదలకు రంగం సిద్ధమైంది. అంతలోనే ప్రభుత్వం మారడంతో ఈ కాలువల పనులకు నిధులు విడుదల ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం పనులను చేపట్టకపోవడం రైతులకు శాపంగా మారింది. పంటలు సాగుకు నీళ్లు లేకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. -
సర్వేలతో కూటమి ఎమ్మెల్యేల హడల్
సాక్షి ప్రతినిధి, అనంతపురం: పాలన మొదలుపెట్టి ఏడాది తిరక్కుండానే టీడీపీ ఎమ్మెల్యేల్లో సర్వేల గుబులు మొదలైంది. సంవత్సరంలోనే నాలుగేళ్ల వ్యతిరేకతను మూటగట్టుకున్నట్టుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఓ వైపు ముఖ్యమంత్రే స్వయానా ఐవీఆర్ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం) ద్వారా సర్వే చేయిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం తరఫున వ్యూహకర్త రాబిన్ శర్మ సర్వే చేస్తున్నారని తెలుస్తోంది. ఈ రెండింట్లోనూ.. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఇద్దరు మంత్రులతో సహా 8 మంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్టు వెల్లడైనట్లు తెలిసింది. మరికొన్ని నెలల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో దీని ప్రభావం తీవ్రంగా పడనుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్టు ఉమ్మడి జిల్లాలో ప్రచారం జరుగుతోంది.మెజారిటీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత..ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్థులే గెలిచారు. కూటమి పాలన మొదలెట్టి ఈ ఏడాది జూన్ 12 నాటికి ఏడాది దాటింది. తాజా సర్వేల ప్రకారం 8 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులపై వ్యతిరేకత పెల్లుబికుతోందని చర్చ జరుగుతోంది. ఐవీఆర్ఎస్ ద్వారా జరిగిన సర్వేలో 60 శాతం మందికి పైగా ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇద్దరు మంత్రులపైనా నిప్పులు చెరిగినట్టు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చి స్వల్పకాలమే అయినా ఎమ్మెల్యేలు, మంత్రుల వ్యవహారంపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నట్టు సర్వేలు చెబుతున్నట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది.వ్యతిరేకతకు ప్రధాన కారణాలివే..అన్ని నియోజకవర్గాల్లో ఉచిత ఇసుక అని చెప్పి.. ఎమ్మెల్యేలే అక్రమంగా తరలిస్తూ సామాన్యులకు అందకుండా చేస్తున్నారు. పలు నియోజవర్గాల్లో మట్టిని అక్రమంగా తోలుతూ సామాన్యులతో మాత్రం వేలకు వేలు వసూలు చేస్తున్నారు.సామాన్యులకు సంబంధించిన ఖాళీ స్థలాలు కనిపిస్తే ఎమ్మెల్యేల అనుచరులం అని చెప్పి పాగా వేసి కంచె వేస్తున్నారు. అధికారులకు చెప్పుకుంటున్నా పరిష్కారం లేదు.మద్యం సిండికేటు అయి పర్మిట్రూములు, బెల్టుషాపుల ద్వారా పల్లెల్లో విచ్చలవిడిగా మద్యం అమ్ముతుండటం వల్ల మహిళలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు.చాలామంది ఉద్యోగులు బదిలీలు, పోస్టింగ్ల విషయంలో సిఫార్సు లేఖలకు భారీగా వసూలు చేయడంతో ఉద్యోగ వర్గాల్లో వ్యతిరేకత వచ్చింది. అర్బన్ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం చేపడితే మున్సిపాలిటీ అధికారులను పంపించి లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారు. -
చంద్రబాబు అంటేనే మోసం
గోరంట్ల (సోమందేపల్లి): ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబును మించిన నాయకుడు లేడని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ అన్నారు. గురువారం గోరంట్ల మండలం రెడ్డిచెరువుపల్లి, వడిగేపల్లి, పాలసముద్రం పంచాయతీలో జరిగిన బాబు ష్యూరిటీ .. మోసం గ్యారెంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ నవరత్నాల కార్యక్రమంలో భాగంగా జగనన్న ఇచ్చిన మాట ప్రకారం 2.70 లక్షల కోట్లను ప్రజల ఖాతాల్లోకి జమ చేశారని గుర్తు చేశారు. 50 ఏళ్లు దాటిన వారికి పింఛన్, నిరుద్యోగ భృతి, అన్నదాన సుఖీభవ కింద రూ.20 వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటికే సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందాయన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. అధికారంలోకి వచ్చి 13 నెలలు కావస్తున్నా ఇచ్చిన హామీలు అమల చేయకుండా ప్రజలకు మోసం చేస్తున్నారని, అవన్నీ ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎవరూ అధైర్య పడొద్దని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ వెంకేటేష్, మేదర శంకర, జెడ్పీటీసీ సభ్యుడు జయరాంనాయక్, ఎంపీపీ ప్రమీల, వైఎస్సార్సీపీ ప్రచార విభాగం జిల్లా అధ్యక్షుడు ఫకృద్దీన సాబ్, నాయకులు జయచంద్రరెడ్డి, ఈశ్వరప్ప, శ్రీనివాసరెడ్డి, పోతుల రామకృష్ణరెడ్డి, రఘురాంరెడ్డి, శంకర్నాయక్, శ్రీధర్రెడ్డి, బాబావలి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ -
20న ఫుట్బాల్ జట్ల ఎంపిక
హిందూపురం టౌన్: పట్టణంలోని ఎంజీఎం క్రీడా మైదానంలో జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 20న జిల్లా ఫుట్బాల్ సీనియర్ సీ్త్ర, పురుషుల జట్ల ఎంపిక చేపడుతున్నట్లు జిల్లా అధ్యక్షుడు జేవీ అనిల్కుమార్ పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు ఆధార్కార్డు, బర్త్ సర్టిఫికెట్, మూడు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో ఆదివారం ఉదయం 9 గంటలకు హాజరుకావాలన్నారు. 2009 డిసెంబర్ 31వ తేదీ లోపు జన్మించిన వారు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు అసోసియేషన్ కార్యదర్శి బీకే మహమ్మద్ సలీమ్ సెల్ నంబర్ 80995 98958కు సంప్రదించాలని సూచించారు.14 మండలాల్లో వర్షంపుట్టపర్తి అర్బన్: తుపాను ప్రభావంతో జిల్లాలోని 14 మండలాల్లో వర్షం కురిసినట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు జిల్లాలో మోస్తరు వర్షం కురిసింది. కొన్ని చోట్ల జల్లులు కురిశాయి. అత్యధికంగా పెనుకొండలో 21.4 మి.మీటర్లు, గోరంట్లలో 17.2 మి.మీ వర్షం కురిసింది. అలాగే రొద్దంలో 9.8, కొత్తచెరువులో 9.2, ధర్మవరంలో 5.8, పుట్టపర్తిలో 5.4, సోమందేపల్లిలో 5.4, చిలమత్తూరులో 3.8, రామగిరిలో 2.6, అమరాపురంలో 2.4. ఓడీసీలో 2.4, బత్తలపల్లిలో 2.2, సీకే పల్లిలో 1.6, బుక్కపట్నంలో 1 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో మరో నాలుగు రోజులు వర్షాలు కురవచ్చని పేర్కొన్నారు.ఇంటి నుంచే తపాలా సేవలుహిందూపురం: అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ 2.0తో ఇకపై వివిధ రకాల పోస్టల్ సేవలను ఇంటి నుంచే సెల్ఫోన్ ద్వారా పొందేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు హిందూపురం పోస్టల్ సూపరింటెండెంట్ విజయకుమార్ తెలిపారు. గురువారం డివిజనల్ ఆఫీసులో ఆయన విలేకరులతో మాట్లాడారు. అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీని ఈ నెల 22 నుంచి హిందుపురం డివిజన్ పరిధిలోని 472 పోస్ట్ ఆఫీసుల్లో అమలు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ సేవలను ప్రారంభించేందుకు వీలుగా ఈ నెల 21న డివిజన్ పరిధిలోని పోస్టు ఆఫీసులలో ఎలాంటి లావాదేవీలు నిర్వహించబోమన్నారు. ఆ రోజు అన్ని రకాల సేవలను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. వేగవంతమైన సర్వీస్ డెలివరీ, కస్టమర్లకు స్నేహపూర్వక సేవలు అందించేందుకు చర్యలు చేపడుతునట్లు పేర్కొన్నారు. పెరిగిపోతున్న సాంకేతికత పరిజ్ఞానానికి అనుగుణంగా పోస్టల్శాఖ కూడా మార్పుచెందుతోందన్నారు. -
మమ్మల్నెవడ్రా ఆపేది?
గోరంట్ల (సోమందేపల్లి): అధికార అండతో టీడీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. గోరంట్ల మండల కేంద్రంలో ఏకంగా ప్రభుత్వ ఆస్తినే ధ్వంసం చేశారు. పట్టణంలోని ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద ప్రహరీని స్థానిక టీడీపీ నాయకులు నిమ్మల యువ శేఖర్, వృషుభ దేవుడుతో పాటు మరో 14 మంది జేసీబీతో గోడను కూల్చి 10 చెట్లను తొలగించారు. దీనిపై ఆర్అండ్బీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణానికి చెందిన దినేష్, ప్రసాద్లకు చెందిన స్థలం ఆర్అండ్బీ అతిథి గృహం పక్కనే ఉంది. అయితే తమ స్థలానికి గోడతో పాటు చెట్లు అడ్డుగా ఉన్నాయని వారు టీడీపీ నాయకులను ఆశ్రయించారు. తమకు డబ్బు ముట్ట చెబితే వాటిని తొలగిస్తామని నాయకులు హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా లక్షలు చేతులు మరాయి. గురువారం ప్రహరీని కూల్చి వేయడంతో ఆర్అండ్బీ ఏఈ శ్రీనివాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిమ్మల యువశేఖర్, వృషుభ దేవుడు, జయ, మోహన్, నరేష్, కట్ట నారాయణ, జై కృష్ణ, ప్రకాష్, ఆచారి విటలాచారి, మహేష్, మన్సూర్, గంగాధర్ టెంపో ఆదినారాయణ, రాము, దినేష్ , ప్రసాద్లపై కేసు నమోదు చేసినట్లు సీఐ శేఖర్ తెలిపారు. గోరంట్లలో ఆర్అండ్బీ ప్రహరీ కూల్చివేత టీడీపీ నాయకులపై కేసు నమోదు -
బంగారు కుటుంబాలను గుర్తించండి
ప్రశాంతి నిలయం: జిల్లాలో పెద్ద ఎత్తున గ్రామసభలను నిర్వహించి పీ4 కార్యక్రమం ద్వారా బంగారు కుటుంబాలను, మార్గదర్శులను గుర్తించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులు, సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో పీ4 కార్యక్రమంపై బంగారు కుటుంబాలు, మార్గదర్శకులలు గుర్తింపు అంశంపై ఆర్డీఓలు, సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి జిల్లాలోని అన్ని మండలాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు బంగారు కుటుంబాలను, మార్గదర్శులను గుర్తించాలన్నారు. బంగారు కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? ఎన్ని అర్హతలేనివి ఉన్నాయో గుర్తించి ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. బంగారు కుటుంబాల నమోదు, తొలగింపులను జాగ్రత్తగా చేయాలని సూచించారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై మానిటరింగ్ చేయాలన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సేవల విషయంలో ప్రజల్లో సంతృప్తి స్థాయిని పెంచేందుకు అధికారులు చోరవ తీసుకోవాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. గురువారం రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ సేవలు అమలు తీరుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ చేతన్, జేసీ అభిషేక్ కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ చేతన్ మాట్లాడారు. ప్రభుత్వ పథకాల అమలులో ప్రజల నుంచి సానుకూలత పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్డీఓలు సువర్ణ, మహేష్, ఆనంద్కుమార్, ఎస్ఎస్వీ శర్మ, సీపీఓ విజయ్ కుమార్, పరిశ్రమలశాఖ జీఎం నాగరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, సాంఘిక సంక్షేమశాఖ డీడీ శివరంగ ప్రసాద్, డీఎస్ఓ వంశీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ టీఎస్ చేతన్ -
రాష్ట్రస్థాయి రోల్ బాల్ పోటీలకు ఎంపిక
ధర్మవరం రూరల్: మండల పరిధిలోని గొట్లూరు వద్ద ఉన్న నైరా ఎరుడైట్ ఈఎం స్కూల్కు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి రోల్బాల్ పోటీలకు ఎంపికై నట్లు ఆ పాఠశాల కరస్పాండెంట్ శ్వేతా తెలిపారు. చార్విక్ దేవ్ (అండర్–11), గగన్దీప్ (అండర్–11), ఫణిబాబు(అండర్–14), నందకిషోర్ (అండర్–14), లోచన్ (అండర్–17) ఎంపియ్యారన్నారు. జూలై 19, 20 తేదీల్లో కాకినాడలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి రోల్ బాల్ పోటీల్లో వీరు పాల్గొంటారన్నారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న విద్యార్థులను కరస్పాండెంట్ శ్వేతా, ప్రిన్సిపాల్ వెంకటేష్, కోచ్ భార్గవ్ తదితరులు అభినందించారు. -
బ్లాస్టింగ్తో భయాందోళన
● పోలీసులకు ఫిర్యాదు చేసిన రెండు గ్రామాల ప్రజలు నల్లమాడ: గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణంలో భాగంగా చెరువువాండ్లపల్లి, సి.కొత్తపల్లి గ్రామాలకు సమీపంలో కాంట్రాక్టర్లు చేపట్టిన బ్లాస్టింగ్లతో ఆయా గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. భయంకరమైన శబ్దాలతో పాటు రాళ్లు ఎగిసిపడి పంట పొలాలు, గ్రామంల్లోని ఇళ్లపై వచ్చి పడుతున్నట్లు పలువురు వాపోయారు. భారీ శబ్ధాలకు భవనాలు కంపిస్తున్నాయన్నారు. టీవీలు పేలిపోతున్నాయని గ్రామాలకు చెందిన రామచంద్ర, రమేష్రెడ్డి, ఎం.కృష్ణారెడ్డి, వేణుగోపాలరెడ్డి, శ్రీనివాసులు, గంగరాజు, వనజ, సుజాత, రాధమ్మ తదితరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, రాళ్లు మీదపడి ప్రాణాలు కోల్పోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఓపెన్ బ్లాస్టింగ్ జరపకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ నెల 14న స్థానిక పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు పెనుకొండ రూరల్: పట్టణంలోని పలు ఎరువుల దుకాణాను విజిలెన్స్ అధికారులు శివకుమార్, శివన్న, ప్రసాద్ బుధవారం తనిఖీ చేశారు. పురుగు మందులు, ఎరువులు, విత్తనాలకు సంబంధించిన రికార్డులు, నిల్వలు పరిశీలించారు. ఎస్ఎల్వీ, మన ఆగ్రో దుకాణాల్లో రికార్డులు సరిగాలేని 46 క్వింటాళ్ల విత్తనాలను గుర్తించారు. రూ.13.27 లక్షల విలువైన సరుకు విక్రయాలను నిలుపుదల చేస్తూ నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా వారి వెంట స్థానిక ఏఓ చందన ఉన్నారు. వృద్ధురాలిపై దాడి ● ఆలస్యంగా వెలుగులోకి ఘటన గాండ్లపెంట: మండలంలోని మలమీదపల్లి పంచాయతీ బనాన్చెరువుపల్లికి చెందిన 78 ఏళ్ల వయసున్న ఎం.సరస్వతిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దీంతో ఆమె తలపై లోతైనా గాయాలయ్యాయి. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనకు సంబంధించి వివరాలు.. ఈ నెల 12న ఉదయం 10.30 గంటలకు ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. గుర్తించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి చేర్చి, విషయాన్ని అన్నమయ్య జిల్లా మదనపల్లిలో నివాసముంటున్న కుమారుడు సుబ్బారెడ్డికి తెలిపారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో సమాచారాన్ని బావ నరసింహరెడ్డికి చేరవేశాడు. అప్పటికే నల్లచెరువు మండలం పాలపటిదిన్నె ఆంజనేయస్వామి దర్శనానికి వచ్చిన ఆయన వెంటనే బనాన్చెరువుపల్లికి చేరుకుని పరిశీలించాడు. బాత్రూమ్లో పడి గాయపడి ఉంటుందని భావించి కదిరిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వృద్ధురాలి తలపై లోతైన గాయాలను గుర్తించిన వైద్యులు అవి బలంగా కొట్టడం వల్ల అయిన గాయాలుగా నిర్ధారించారు. దీంతో ఆగమేఘాలపై అనంతపురంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. బుధవారం ఉదయం నరసింహారెడ్డి బనాన్చెరువు పల్లికి చేరుకుని ఇంటిని క్షుణ్ణంగా పరిశీలంచాడు. ఇంటి వద్ద రక్తపు మరకలైన కట్టెతో పాటు గుర్తు తెలియని వ్యక్తుల చెప్పులు, టవాలు పడి ఉండడం గుర్తించి ఫిర్యాదు చేయడంతో ఎన్పీకుంట ఎస్ఐ వలీబాషా, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. నరసింహారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
పన్ను వసూలులో నిర్లక్ష్యం వద్దు : డీపీఓ
పరిగి: గ్రామ పంచాయతీల పరిధిలో నీటి, ఇంటి పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం వీడాలని పంచాయతీ కార్యదర్శులను జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) సమత ఆదేశించారు. బుధవారం ఆమె పరిగి మండలంలో పర్యటించారు. తొలుత పి.నరసాపురం గ్రామానికి చేరుకున్న ఆమె డ్రైనేజ్ వ్యవస్థను పరిశీలించారు. కాలువలు అధ్వానంగా ఉన్నాయని, వెంటనే పారిశుధ్య పనులు చేపట్టాలని కార్యదర్శి తిప్పన్నను ఆదేశించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ.. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు పక్కన చెత్త వేయకుండా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. నీటి నిల్వ ప్రదేశాలను బ్లీచింగ్ చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రెడ్డప్ప, వివిధ గ్రామ పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు. నేత్రదానంధర్మవరం అర్బన్: మరణానంతరం తన నేత్ర దానంతో ఇద్దరికి కంటిచూపును అందించారు ధర్మవరం మండలం గొట్లూరుకు చెందిన బండ్ల నారాయణ(80). బుధవారం ఆయన అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న విశ్వదీప సేవా సంఘం వ్యవస్థాపకుడు కోళ్లమొరం చంద్రశేఖరరెడ్డి వెంటనే బాధిత కుటుంబసభ్యులను కలసి నేత్రదానంపై అవగాహన కల్పించడంతో వారు అంగీకరించారు. దీంతో మృతుని నేత్రాలను జిల్లా అంధత్వ నివారణ సంస్థ, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ డాక్టర్ కుళ్లాయప్ప, కంటి రెట్రావైల్ సెంటర్ టెక్నీషియన్ రాఘవేంద్ర సేకరించారు. నేత్రదానానికి సహకరించిన మృతుని కుమారుడు బండ్ల మంజునాథ్, కోడలు శ్రీవనిత, కుమార్తె భాగ్యలక్ష్మి, తమ్ముడు బండ్ల రామాంజనేయులుకు విశ్వదీప సేవా సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు సురేష్, ఉపాధ్యక్షుడు టి.చంద్రశేఖర్రెడ్డి, సభ్యులు ఖమ్మం మాధవ, జుజారు రఘు, ప్రభాకర్రెడ్డి, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ధర్మవరం యాదవ వీధిలో.. ● ధర్మవరం: స్థానిక యాదవవీధికి చెందిన వేల్పుమడుగు ఆంజనేయులు(62) బుధవారం అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న యువర్స్ ఫౌండేషన్ సభ్యులు వైకే శ్రీనివాసులు, డాక్టర్ బీవీ సుబ్బారావు, కౌన్సిలర్ కేతా లోకేష్.. మృతుని కుటుంబ సభ్యులను కలిసి నేత్రదానంపై అవగాహన కల్పించడంతో వారు అంగీకరించారు. దీంతో మృతుని నేత్రాలను జిల్లా అంధత్వ నివారణ సంస్థ డాక్టర్ కుళ్లాయప్ప, కంటి రెట్రావైల్ సెంటర్ టెక్నీషియన్ రాఘవేంద్ర, ఆప్తమాలిక్ ఆఫీసర్ షేక్ సికిందర్ సేకరించారు. నేత్రదానానికి సహకరించిన మృతుని సోదరులు రాము, ప్రసాద్కు యువర్స్ ఫౌండేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయంలో చోరీతనకల్లు: మండల పరిధిలోని పెద్దపల్లిలో వెలసిన గంగమ్మ ఆలయంలో బుధవారం చోరీ జరిగింది. ఆలయ తాళాలను తొలగించి లోపలకు ప్రవేశించిన దుండగులు హుండీని పగులగొట్టి అందులోని నగదుతో పాటు గర్భగుడిలోని ఇతర సామగ్రిని అపహరించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. యువకుడి ఆత్మహత్య గుడిబండ: మండలంలోని బాలేపట్టికి చెందిన మంజునాథ్ (30) ఆత్మహత్య చేసుకున్నాడు. బాలేపల్లి ఎస్సీ కాలనీలో నివాసముంటున్న రామలింగప్పకు ముగ్గురు సంతానం కాగా, మంజునాథ్ రెండో కుమారుడు. ఇంకా వివాహం కాలేదు. తరచూ కడుపు నొప్పితో బాధపడేవాడు. పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా నయం కాలేదు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి నొప్పి తీవ్రత తట్టుకోలేక స్టోర్ రూమ్లోకి వెళ్లి దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజ్కుళ్లాయప్ప తెలిపారు. పాము కాటుతో మహిళా రైతు మృతి ముదిగుబ్బ: మండలంలోని సిద్దన్నగారిపల్లికి చెందిన మహిళా రైతు సువర్ణ (44) పాముకాటుతో మృతి చెందారు. తన భర్త శివారెడ్డితో కలసి బుధవారం వ్యవసాయ తోటలో పని చేస్తుండగా చేతిపై పాము కాటు వేసింది. వెంటనే బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. పరీక్షించిన అక్కడి వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. -
కేంద్ర బృందం పర్యటన
మడకశిర రూరల్: మండలంలోని మెళవాయి పంచాయతీలోని గ్రామాల్లో బుధవారం స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్–2025 కేంద్ర బృందం సభ్యులు రామాంజనేయులు, శ్రీనివాసులు పర్యటించారు. యూ.రంగాపురం, మెళవాయి, జక్కేపల్లి గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణ, భోజన పథకం, అంగన్వాడీ సేవల అమలు తదితర వాటిని పరిశీలించారు. గ్రామాల్లో పారిశుధ్యం పరిస్థితి, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్వహణ, తడి.. పొడి చెత్త సేకరణ, చెత్త నుంచి సంపద తయారీ తదితర అంశాలపై ఆరా తీశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ రంగనాథ్, ఈఓఆర్డీ నాగరాజు నాయక్, కార్యదర్శి అశ్వత్థరెడ్డి, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. కొండకు తరలిన ఓబుళ లక్ష్మీనృసింహుడు చెన్నేకొత్తపల్లి: మండల కేంద్రంలో కొలువైన ఓబుళ లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 6న గ్రామ సమీపంలోని కొండపై ఉన్న ఆలయం నుంచి తీసుకువచ్చిన ఉత్సవమూర్తులను బుధవారం తిరిగి కొండపైకి చేర్చారు. ఈ 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం ఉత్సవ మూర్తులను నూతన వస్త్రంలో ఉంచి పూజలు చేసిన అనంతరం ఊరేగింపుగా కొండకు తరలించారు. ఈ ఉత్సవాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది. రేషన్ బియ్యం స్వాధీనం పెనుకొండ రూరల్: అనంతపురం నుంచి బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని బుధవారం మధ్యాహ్నం పెనుకొండ మండలం అమ్మవారిపల్లి వద్ద కియా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బొలెరో వాహనంలో 60 సంచుల్లో (ఒక్కో సంచిలో 50 కిలోలు) ఉన్న రేషన్ బియ్యాన్ని గుర్తించి, వాహనాన్ని సీజ్ చేశారు. డ్రైవర్ ముత్యాలుతో పాటు బియ్యం వ్యాపారి సోమును అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని సీఎస్డీటీ ప్రభావతికి అప్పగించారు. -
జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలు అతి తెలివిని ప్రదర్శిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు దొరక్కుండా తిరుగుతున్నారు. ప్లాన్ చేసి దొరికిన కాడికి దోచుకుంటూ ఇటు బాధితుడికి, అటు పోలీసులకు నిద్రలేని రాత్రులను మిగుల్చుతున్నారు. దీంతో వారిని పట్టుకోవడం పోలీసులక
సాక్షి, పుట్టపర్తి: జిల్లాలో చోటు చేసుకుంటున్న వరుస దొంగతనాలు పోలీసుల పనితీరును సవాల్ చేస్తున్నాయి. జిల్లా కేంద్రంలో కలెక్టర్ బంగ్లా పక్కనే.. ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే వరుస చోరీలు చోటు చేసుకున్నాయి. తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేసుకుని రాత్రి, పగలు తేడా లేకుండా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇంటి బయట రాత్రి ఉంచిన బైకులు తెల్లవారేసరికి మాయం అవుతున్నాయి. ఏడాది క్రితం ఎన్నికలకు ముందు సాక్షాత్తూ కలెక్టర్ బంగ్లాలోనే బంగారం అపహరించిన ఘటన జిల్లాను కుదిపేసింది. అయితే ఇప్పటి వరకూ ఏఒక్క కేసు దర్యాప్తులోనూ పోలీసులు పురోగతి సాధించలేకపోయారు. బాధితులకు న్యాయం జరిగిన దాఖలాలూ లేవు. ఏడాది వ్యవధిలోనే.. ● పుట్టపర్తిలోని జానకీరామయ్య కాలనీలో నివాసముంటున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉదయం 9 గంటల సమయంలో ఇంటికి తాళం వేసి మెయిన్ రోడ్డుపైకి చేరుకుని టిఫిన్ తిని ఇంటికెళ్లాడు. అప్పటికే తాళం బద్ధలుగొట్టి ఉంది. లోపలకెళ్లి చూస్తే చార్జింగ్ పెట్టి ఉన్న మొబైల్ కనిపించలేదు. ఘటనపై పోలీసులు కేసు సైతం నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకూ రికవరీ చేయలేకపోయారు. ● సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి క్వార్టర్స్ గేటు ఎదురుగా చిల్లర దుకాణం నిర్వహిస్తున్న వ్యక్తి రోజూ ఉదయాన్నే తన బైకును పగటి పూట చెట్టు కింద పార్క్ చేసి వ్యాపార లావాదేవీలు చూసుకుంటూ ఉంటాడు. ఓ రోజు ఉదయం పార్క్ చేసిన బైక్.. చీకటి పడే లోపు మాయమైంది. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. ఇప్పటి వరకూ కేసు నమోదు చేయలేదని బాధితుడు వాపోతున్నాడు. ● చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురానికి చెందిన ఓ వ్యక్తి ఉదయం 7 గంటలకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి వచ్చాడు. టోకెన్ తీసుకుని.. వైద్యం పొందిన తర్వాత 11.30 గంటలకు బయలకు వచ్చి చూడగా.. బైక్ కనిపించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశాాడు. ఇప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. ● ఎన్నికలకు ముందు కలెక్టర్ నివాసముంటున్న బంగ్లాలోనే బంగారం ఎత్తుకెళ్లారు. కేసు దర్యాప్తు ఏమైందో? దొంగ ఎవరో? ఇప్పటికీ వెల్లడించలేదు. కొన్ని రోజుల పాటు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయినా ఇప్పటికీ అరెస్ట్ చూపలేదు. ● మూడు నెలల క్రితం పుట్టపర్తి పట్టణ పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో జనరల్ ఆస్పత్రికి వచ్చిన ధర్మవరం మండలం పోతుకుంటకు చెందిన ఓ వ్యక్తి బైక్ గంట వ్యవధిలోనే మాయమైంది. ఇప్పటికీ రికవరీ చేయలేదని బాధితుడు పేర్కొన్నాడు. ● కర్ణాటక నాగేపల్లి వద్ద ఉన్న సందీప్ విల్లాలో నివాసముంటున్న ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో సుమారు రూ.25 లక్షలు విలువ చేసే బంగారం చోరీకి గురైంది. ఈ కేసు దర్యాప్తులోనూ పురోగతి లేదు. ● పుట్టపర్తి మున్సిపాలిటీ వెస్ట్ గేట్కు వెళ్లే దారిలో ఓ మహిళ మెడలో చైన్ లాక్కెళ్లారు. ఇప్పటి వరకూ రికవరీ చేయలేదని బాధిత మహిళ వాపోతోంది. మరిచే లోపు మరో ఘటన పుట్టపర్తిలో చోరీల కలకలం.. నిత్య వార్తగా మారింది. ఒక ఘటన మరిచే లోపు మరో చోరీ వెలుగు చూస్తోంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత (బుధవారం వేకువజాము 3.52 గంటల సమయంలో.. సీసీటీవీ ఫుటేజీల ప్రకారం) పుట్టపర్తిలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి క్వార్టర్స్ ఎఫ్ బ్లాక్లో 9 ఇళ్లలో వరుస చోరీలు జరిగాయి. రూ.8.25 లక్షల నగదు, 34 తులాల బంగారాన్ని దుండగులు అపహరించారు. తన కుమార్తె పెళ్లి కోసం దాచిన మొత్తం బంగారాన్ని ఎత్తుకెళ్లారంటూ ఎలక్ట్రీషియన్ శ్రీనివాసులు కన్నీటి పర్యంతమయ్యారు. సవాల్ విసురుతున్న దొంగలు జిల్లాలో నిత్యమూ ఏదో ఒక చోట చోరీలు ఇప్పటి వరకూ ఏ ఒక్క కేసులో రికవరీ చూపని పోలీసులు ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే.. పుట్టపర్తి టౌన్: ఎస్పీ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్టాఫ్ క్వార్టర్స్లోని తొమ్మిది ఇళ్లలో దుండగులు ప్రవేశించి, విలువైన బంగారు ఆభరణాలను అపహరించారు. బుధవారం వేకువజామున ఈ ఘటన చోటు చేసుకుంది. క్వార్టర్స్లోని మూడు బ్లాకుల్లో ఉన్న తొమ్మిది ఇళ్లల్లో ఏకకాలంలో బీభత్సం సృష్టించి రూ.9లక్షల నగదు, 34 తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లు బాధితులు చెబుతున్నారు. క్వార్టర్స్లో నివాసం ఉంటున్న ఎలక్ట్రీషియన్ శ్రీనివాసులు ఒక్కడి ఇంట్లోనే రూ.8లక్షల నగదు, 29 తులాల బంగారు నగలను దుండగులు అపహరించారు. నగదు, బంగారాన్ని తన కుమార్తె వివాహం కోసం సిద్ధం చేసి ఉంచినట్లు బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీంను రంగంలో దించి దుండగుల వేలి ముద్రల ఆధారాల కోసం జల్లెడ పట్టారు. స్నిప్పర్ డాగ్ను రప్పించి దుండగుల కదలికలను పసిగట్టారు. ఆయా ఘటనలపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, ఇదే ప్రాంతంలో కలెక్టర్ నివాసం ఉంటున్నారు. వీఐపీ ప్రాంతం కావడంతో భద్రత పటిష్టంగానే ఉంటోంది. అయినా వరుస చోరీలు చోటు చేసుకోవడంతో పోలీసుల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
తమ్ముడూ.. అమ్మను బాగా చూసుకో
గుత్తి రూరల్: ‘తమ్ముడూ.. అమ్మను బాగా చూసుకో’ అంటూ ఓ యువకుడు వీడియో కాల్లో తన సోదరుడికి సూచించి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు తెలిపిన మేరకు.. గుత్తి మండలం టి.కొత్తపల్లికి చెందిన సూర్యనారాయణ, శారదమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు నంద్యాల రేవంత్ కుమార్ (28) ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటూ తమకున్న 8 ఎకరాల్లో తమ్ముడు కిరణ్ కుమార్తో కలసి పంటలు సాగుతో పాటు బొలెరో వాహనం నడుపుతూ జీవనం సాగించేవాడు. పంటల సాగుతో పాటు బొలెరో వాహనం కొనుగోలుకు అప్పులు చేశాడు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు పండక నష్టపోయాడు. అలాగే బొలెరో వాహనానికి సరైన బాడుగలు లేకపోవడంతో నెలవారీ కంతులు కట్టుకోలేక రూ.16లక్షల వరకూ అప్పుల పాలయ్యాడు. దీంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదంటూ తరచూ మదనపడేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి గుత్తి నుంచి మిరపకాయల లోడు తీసుకుని హైదరాబాద్కు బయలుదేరిన రేవంత్కుమార్... తెలంగాణలోని వనపర్తి జిల్లా పెబ్బేరు వద్దకు చేరుకోగానే వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి తమ్ముడికి వీడియో కాల్ చేశాడు. ‘ఇక నేను మీకు భారం కాను... అమ్మను బాగా చూసుకో’ అని చెప్పి పురుగుల మందు తాగాడు. గమనించిన బొలెరో వాహన క్లీనర్ వెంటనే అప్రమత్తమై వనపర్తి జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే రేవంత్ మృతి చెందినట్లు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు పోలీసులు అప్పగించారు. తెలంగాణలో గుత్తి మండలానికి చెందిన యువకుడి ఆత్మహత్య -
‘నగదు బదిలీ పథకం ఉపసంహరించుకోవాలి’
పుట్టపర్తి టౌన్: హమాలీలకు శాపంగా మారే నగదు బదిలీ పథకం అమలు ఆలోచనను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర పౌరసరఫరాల హమాలీల వర్కర్ల యూనియన్ అధ్యక్షుడు ఆర్.కృష్ణ డిమాండ్ చేశారు. స్థానిక సాయి ఆరామంలో బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా హమాలీ యూనియన్ 5వ మహాసభలు జరిగాయి. అంతకు ముందు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుంచి సాయి ఆరామం వరకూ హమాలీలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో కృష్ణ మాట్లాడారు. హమాలీలను 4వ తరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. ప్రతి నెలా 5న వేతనాలు చెల్లించాలని, సరుకు లోడింగ్.. అన్లోడింగ్ పనిని ఐదు రోజులకు కుదించాలని, హమాలీల ప్రాణాలకు ముప్పు తెచ్చే విధానాన్ని రద్దు చేసి 12 రోజుల పనిదినాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. హమాలీల కుటుంబాలకు అందాల్సిన పరిహారం త్వరగా అందించాలని కోరారు. అనంతరం జిల్లా హమాలీ యూనియన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా నేలకోటప్ప, ఉపాధ్యక్షులుగా శ్రీరాములు, చుక్కలింగం, ప్రధాన కార్యదర్శిగా నాగరాజు, కోశాధికారిగా రామదాసుతో పాటు 11మంది సభ్యలను ఎన్నుకున్నారు. -
‘కేఎస్ఎన్’ డిగ్రీ ఫలితాల విడుదల
అనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను బుధవారం ప్రిన్సిపాల్ కేసీ సత్యలత, పరీక్షల విభాగాధిపతి హెచ్.శివశంకర్ బుధవారం విడుదల చేశారు. 623 మంది విద్యార్థినులు పరీక్ష రాయగా 71.75 శాతంతో 447 మంది ఉత్తీర్ణత సాధించారు. బీఏ (అనర్స్)లో 85 మందికి గాను 61 మంది. బీకాం (ఆనర్స్)లో 221 మందికిగాను 160 మంది, బీఎస్సీ (ఆనర్స్)లో 228 మందికి గాను 214 మంది, బీబీఏలో 29 మందికిగాను 12 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను కళాశాల ఎగ్జామినేషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. రీవాల్యుయేషన్, పర్సనల్ వెరిఫికేషన్కు సంబంధించి ఈ నెల 21 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. రీవాల్యూషన్కు ఒక్కో పేపర్కు రూ.300, పర్సనల్ వెరిఫికేషన్కు రూ.600 చెల్లించాలని ప్రిన్సిపాల్ తెలిపారు. కార్యక్రమంలో పరీక్షల ఉప విభాగాధిపతి రమణ నాయుడు, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీరంగయ్య, రామలింగారెడ్డి, నాగభూషణం, సింధు, రామకృష్ణ, రామాంజనేయులు, రేణుకాదేవి, ఆదినారాయణ, పర్వీన్, అనురాధ, రమాదేవి, లక్ష్మి, యూడీసీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉల్లాసంగా ఉట్ల పరుష
బత్తలపల్లి/ధర్మవరం రూరల్: మండలంలోని అప్పరాచెరువు గ్రామంలో మొహర్రం ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన ఉట్ల పరషను ఉత్సాహంగా సాగింది. పీర్ల చావిడి ఎదుట ఏర్పాటు చేసిన 40 అడుగుల ఎత్తైన ఉట్లమానును ఎక్కేందుకు సాయంత్రం 5 గంటలకు గ్రామంలోని వాల్మీకి (బోయ) సామాజిక వర్గానికి చెందిన 20 మంది యువకులు పోటీ పడ్డారు. వేడుకను చూసేందుకు చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో అప్పరాచెరువు జనసంద్రమైంది. చివరికి రవితేజా అనే యువకుడు ఉట్లమాను పైకి ఎక్కడంతో ప్రజలు చప్పట్లు కొట్టి అభినందించారు. అంతకు ముందు మరగాళ్లు, కోలాటం, కీలుగుర్రాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అలాగే ధర్మవరం మండలం చిగిచెర్లలోనూ బుధవారం ఉత్సాహంగా ఉట్ట పరుషను గ్రామస్తులు నిర్వహించారు. అంతకు ముందు పీర్ల మకాన్లో ఉన్న మౌలాలీ స్వామికి చక్కెర చదివింపులు చేసి గజమాలలతో అలంకరించారు. -
అండర్–16 జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక
అనంతపురం: ఈ నెల 17 నుంచి 31వ తేదీ వరకూ వైఎస్సార్ జిల్లా కడపలో జరిగే అండర్–16 సౌత్ జోన్ క్రికెట్ టోర్నీలో ప్రాతినిథ్యం వహించే జిల్లా జట్టును బుధవారం ఎంపిక చేశారు. ఎంపికై నా వారిలో ఆర్.సాత్విక్ (కెప్టెన్, అనంతపురం), ఎన్.సంజయ్కుమార్ (వైస్ కెప్టెన్, నార్పల), జి.కౌశిక్ (వికెట్ కీపర్, అనంతపురం), కె.అశ్విన్, యు.తన్మయ్ కార్తీక్రెడ్డి, అభినవ్ సాత్విక్ రెడ్డి, కుషాల్ సాయి, దేవాన్ష్, టి.కిరణ్కుమార్, వై.లిఖిత్, పి.నిహార్, ఎస్.కార్తీక్ (అనంతపురం), జియాద్ (హిందూపురం), జె.సంతోష్ (కదిరి), బి.అఖిల్ కుమార్ (గోరంట్ల), ఆదినారాయణ రెడ్డి (ఆత్మకూరు), బి.అఖిల్ కుమార్ (గొట్లూరు) ఉన్నారు. -
నవీన్ నిశ్చల్, కొండూరు సస్పెన్షన్
● పార్టీ వ్యతిరేక కార్యకలాపాల నేపథ్యంలో వైఎస్సార్ సీపీ నిర్ణయం చిలమత్తూరు: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో నవీన్ నిశ్చల్, కొండూరు వేణుగోపాల్రెడ్డిలను వైఎస్సార్ సీపీ సస్పెండ్ చేసింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో వైఎస్సార్ సీపీ హిందూపురం సమన్వయకర్తలుగా పనిచేసిన నవీన్ నిశ్చల్, కొండూరు వేణుగోపాల్రెడ్డి కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. వాటిని విచారించిన క్రమశిక్షణ కమిటీ నివేదిక ఆధారంగా వారిద్దరినీ సస్పెండ్ చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. విద్యార్థి అనుమానాస్పద మృతి ● నెల్లూరు జీజీహెచ్ ఎదుట స్నేహితుల ఆందోళన నెల్లూరు సిటీ: ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలానికి చెందిన జానా శ్రీకాంత్ (23) నెల్లూరు రూరల్ పరిధిలోని కాకుపల్లి గ్రామంలో ఉన్న సన్ ఫార్మసీ కళాశాలలో పీజీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద రమణయ్య హాస్పిటల్లో ఫార్మసిస్ట్గా పార్ట్టైం పనిచేస్తున్నాడు. బుధవారం శ్రీకాంత్ హాస్పిటల్లో విధుల్లో ఉండగా కింద పడిపోయాడు. దీంతో సిబ్బంది ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. దీంతో మృతదేహాన్ని జీజీహెచ్కు తరలించారు. విషయం తెలుసుకున్న శ్రీకాంత్ స్నేహితులు జీజీహెచ్కు చేరుకుని ఆందోళనకు దిగారు. శ్రీకాంత్ ఆస్పత్రిలో విద్యుదాఘాతానికి గురై చనిపోయాడని ఆరోపించారు. అయితే సిబ్బంది మాత్రం హార్ట్ ఎటాక్ అని చెప్పడంపై అనుమానం వ్యక్తం చేశారు. వారి నిర్లక్ష్యంతోనే తమ స్నేహితుడు మృతిచెందాడని ఆగ్రహించారు. ఈ క్రమంలో జీజీహెచ్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జవాన్ భూమిపై ‘పచ్చ’ పాగా
సాక్షి, పుట్టపర్తి దేశ సరిహద్దులో పని చేసే ఆర్మీ ఉద్యోగుల భూములకు కూటమి ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయింది. జిల్లాలో రెండు నెలల వ్యవధిలోనే ముగ్గురు జవాన్లు తమ భూములు ఆక్రమణలకు గురయ్యాయంటూ కలెక్టరేట్ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా కొత్తచెరువు మండలం మైలసముద్రానికి చెందిన జవాన్ తన భూమిని టీడీపీ నేతలు ఆక్రమించారని, దయచేసి తన భూమిని రక్షించాలని వేడేకుంటూ సెల్ఫీ వీడియో రూపొందించి విడుదల చేయడంతో టీడీపీ నేతల భూ ఆక్రమణల పర్వం మరోసారి చర్చనీయాంశమైంది. ఏళ్లుగా కన్నేసి.. కూటమి రాగానే ఆకమ్రించి కేశాపురం రెవెన్యూ పొలం సర్వే నంబరు 326–2ఏలోని 2.75 ఎకరాలకు ప్రభుత్వం 1983లోనే మైలసముద్రం గ్రామానికి చెందిన కేశాని పెద్దక్కకు పట్టా ఇచ్చింది. పక్కనే సర్వే నంబరు 326–2బీలోని 2.35 ఎకరాలను మైలసముద్రం గ్రామానికి చెందిన కిలారి జానకమ్మకు పట్టా ఇచ్చింది. అయితే కేశాని పెద్దక్క పొలంపై కన్నేసిన కిలారి జానకమ్మ కుటుంబీకులు ఏళ్లుగా ఆక్రమించాలని ప్రయత్నం చేసి విఫలమయ్యారు. కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు దీరగానే మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అండదండలతో కిలారి జానకమ్మ భర్త కిలారి రామమోహన్, తనయుడు కిలారి గోవర్ధన్నాయుడు.. 2024 సెప్టెంబరులో 2.75 ఎకరాలను ఆక్రమించారు. పోలీసుల రక్షణతో (అప్పటి సీఐ ఇందిర) కేశాని పెద్దక్క పేరుతో ఉన్న భూమిలో టీడీపీకి చెందిన కిలారి రామమోహన్ తదితరులు మామిడి చెట్లు నాటారు. ఆ తర్వాత బోరుబావులు కూడా తవ్వించారు. దీంతో ఆ భూమి తమదని ఆక్రమణ సరికాదని కేశాని పెద్దక్క కుమారుడైన జవాన్ కేశాని రమేష్ టీడీపీ నాయకులను వేడుకున్నా వారు వినిపించుకోలేదు. పైగా పొలంలోకి వస్తే అంతుచూస్తామంటూ రమేష్ కుటుంబ సభ్యులను బెదిరించారు. దీంతో జవాన్ రమేష్ కుటుంబీకులు ఏడాది కాలంలో అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో... జవాన్ రమేష్ ఓ సెల్ఫీ వీడియో రూపొందించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు మంత్రి లోకేశ్కు చెప్పినా ఫలితం లేదు.. మా భూమికి సంబంధించి 1983 నుంచి ఆధారాలున్నాయి. ఏడాది క్రితం వరకు పొలం మా ఆధీనంలోనే ఉంది. ప్రస్తుతం ఎకరా రూ.10 లక్షలపైనే పలుకుతోంది. దీంతో కొందరు టీడీపీ నేతలు మా పొలాన్ని ఆక్రమించారు. అధికారులకు మొరపెట్టినా ఎవరు పట్టించుకోలేదు. ఇటీవల మంత్రి నారా లోకేశ్ పుట్టపర్తికి వచ్చిన సమయంలో విమానాశ్రయం వద్ద వినతిపత్రం అందజేశా. అయినా స్పందనలేదు. అవతలి వ్యక్తులు టీడీపీకి చెందిన వారు... అగ్రవర్ణాల వారు కావడంతో అధికారుల మా మొర ఆలకించడం లేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నా. – రమేశ్, జవాన్ ఏడాది క్రితం దౌర్జన్యంగా ఆక్రమించిన ‘తమ్ముళ్లు’ కొత్తచెరువు మండలం మైలసముద్రంలో ఘటన అసోంలో విధులు నిర్వర్తిస్తున్న జవాన్ కేసాని రమేశ్ -
ఎకై ్సజ్పై ఎమ్మెల్యేల పెత్తనం!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం’ అన్న చందాన మారింది ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎకై ్సజ్ అధికారుల పరిస్థితి. మద్యం అక్రమాలకు అడ్డు తగిలితే ‘మీకు శంకరగిరి మాన్యాలు చూపిస్తాం’ అని ఎమ్మెల్యేల బెదిరింపులు... కేసులు రాయకుండా ఏం చేస్తున్నారంటూ విజయవాడ నుంచి ఉన్నతాధికారుల ఆదేశాలు వెరసి వారి విధులు దినదినగ గండంలా తయారయ్యాయి. ఓ వైపు కేసులు రాయలేక, మరోవైపు ఎమ్మెల్యేల ఒత్తిళ్లు తట్టుకోలేక పలువురు అధికారులు సెలవులో వెళ్లేందుకు సిద్ధపడ్డారు. ఇప్పటికే కొంతమంది దరఖాస్తు చేసుకున్నారు. గతంలో ప్రశాంతంగా.. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో గరిష్ట చిల్లర ధర (ఎంఆర్పీ) కంటే ఎక్కువ అమ్ముతున్నారు. ఇలా ఇష్టారాజ్యంగా వసూళ్లు చేయడం నిబంధనలకు విరుద్ధం. ఎకై ్సజ్ చట్టం ప్రకారం రూ.5 లక్షలు జరిమానా రాయాలి. కానీ రైడింగ్ చేసి కేసులు రాద్దామంటే వెంటనే ఎమ్మెల్యేలు ఫోన్ చేసి కేసులు నమోదు చేయొద్దంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఇటీవల పామిడిలో ఓ ప్రజాప్రతినిధి షాపుపై కేసు రాసినందుకు ఎకై ్సజ్ అధికారులపై మండిపడినట్టు తెలిసింది. దీంతో ఎమ్మెల్యేల ఒత్తిడితో ఎక్కడా కేసులు నమోదు చేసే పరిస్థితి లేదని వాపోతున్నారు. గతంలో ప్రశాంతంగా విధులు నిర్వహించామని.. ఇప్పుడా పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైడ్స్ చేసినందుకు ఏసీ బదిలీ.. హిందూపురంలో రెండు మాసాల క్రితం ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ మునిస్వామి కల్తీ కల్లు దుకాణాలపై దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో కేసు నమోదు చేశారు. దీంతో ఆయన్ను ఏకంగా బదిలీ చేశారు. కేసు రాసిన వారంలోనే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏలు బదిలీ చేయించడంతో మిగిలిన అధికారులు భయపడుతున్నారు. కేసులు నమోదు చేస్తే ఎక్కడ బదిలీ చేస్తారో అంటూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇలాగైతే ఎంతకాలం ఉద్యోగం చేస్తామని శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన ఎకై ్సజ్ సీఐ ఒకరు వాపోయారు. ఇప్పటికే బెల్టుషాపులు, పర్మిట్ రూములు విచ్చలవిడిగా నిర్వహిస్తున్నా ఏమీ అనలేని పరిస్థితిలో ఉన్నామని చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. బెల్టుషాపులు, పర్మిట్ రూములు అందుబాటులోకి రావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. గడిచిన 10 నెలల్లో కూటమి సర్కారు తెచ్చిన కొత్త మద్యం పాలసీతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో రూ.1,400 కోట్లకు పైగా విలువైన మద్యం వినియోగమైంది. రోజూ సగటున రూ.4.69 కోట్ల విలువైన మద్యం వినియోగమవుతుండగా.. ఇటీవల వారం రోజుల పాటు జరిగిన పీర్ల పండగ సందర్భంగా రోజుకు రూ.7 కోట్ల మద్యం తాగినట్లు వెల్లడైంది. ఎమ్మార్పీకి మించి వసూలు చేసినా కేసులు కట్టొద్దంటూ హుకుం ఇటీవల ‘పురం’లో కల్లు దుకాణాలపై దాడులు చేశారని ఏసీ బదిలీ అక్రమాలపై కేసులు రాయాలంటూ మరోవైపు ఉన్నతాధికారుల ఆదేశాలు ఒత్తిళ్ల నడుమ నలిగిపోతున్న ఎకై ్సజ్ అధికారులు ఒత్తిడి భరించలేక సెలవులకు దరఖాస్తు చేసుకుంటున్న వైనం రూ.1,400 కోట్ల మార్కు దాటేసింది.. -
ప్రలోభపెట్టి.. పదవులు పొంది
మడకశిర: ప్రలోభపెట్టారు... అందుకు లొంగనివారిని భయపెట్టారు.. అధికారం కోసం పూర్తిగా దిగజారి ప్రవర్తించారు. చివరకు 9 మంది వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ల మద్దతుతో మడకశిర నగర పంచాయతీ చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలను టీడీపీ నేతలు కై వసం చేసుకున్నారు. చైర్మన్గా నరసింహరాజు, వైస్ చైర్పర్సన్గా ప్రభావతి.. మడకశిర నగర పంచాయతీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం అధికారులు బుధవారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం సమావేశం నిర్వహించారు. పెనుకొండ ఆర్డీఓ ఆనందకుమార్ ఎన్నికల అధికారిగా వ్యవహరించగా.. ఎక్స్ అఫిషియో సభ్యుడి హోదాలో స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పాల్గొన్నారు. నగర పంచాయతీలో 20 మంది కౌన్సిలర్లు ఉండగా... సమావేశానికి 14 మంది కౌన్సిలర్లు, ఎక్స్ అఫిషియో సభ్యుడు ఎంఎస్ రాజు హాజరయ్యారు. చైర్మన్ స్థానానికి టీడీపీకి చెందిన 15వ వార్డు కౌన్సిలర్ నరసింహరాజు, వైస్ చైర్మన్ స్థానానికి టీడీపీకి చెందిన 4వ వార్డు కౌన్సిలర్ ప్రభావతి నామినేషన్లను దాఖలు చేయగా.. మిగతా వారు బలపరిచారు. దీంతో నరసింహరాజు చైర్మన్గా, ప్రభావతి వైస్ చైర్పర్సన్గా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ఆనందకుమార్ ప్రకటించారు. కాగా, పదవుల ఆశతో టీడీపీలో చేరిన 9 మంది వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లలో ఏ ఒక్కరికీ పదవులు దక్కలేదు. చైర్మన్ పదవిపై ఆశతో టీడీపీలో చేరిన 17వ వార్డు కౌన్సిలర్ సుభద్రను కూడా టీడీపీ నేతలు మోసం చేశారు. ఎన్నికను బహిష్కరించిన కౌన్సిలర్లు అప్రజాస్వామిక పద్ధతిలో నిర్వహించిన మడకశిర చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు బహిష్కరించారు. మడకశిరలో 20 వార్డులుండగా... గత మున్సిపల్ ఎన్నికల్లో 15 స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. టీడీపీ 5 స్థానాలతో సరిపెట్టుకుంది. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే పీఠంపై కన్నేసిన టీడీపీ నేతలు...వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసి 9 మందిని లాక్కున్నారు. తాగా ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ల మద్దతుతోనే పదవులు దక్కించుకున్నారు. అయితే టీడీపీ నేతలు ఎంతగా ప్రయత్నించినా... లక్ష్మీనరసమ్మ, రామచంద్రారెడ్డి, సతీష్రెడ్డి, అన్సర్, శ్రీనివాసులు, అంజన్ కుమార్ యాదవ్ వైఎస్సార్ సీపీని వీడలేదు. తాజాగా ఎన్నికను బహిష్కరించి తాము ప్రజలపక్షమని చాటారు. మడకశిర నగర పంచాయతీ చైర్మన్, వైస్ చైర్పర్సన్ పదవులు టీడీపీ కై వసం చైర్మన్గా నరసింహరాజు, వైస్ చైర్పర్సన్గా ప్రభావతి ఎన్నిక ఎన్నికను బహిష్కరించిన ఆరుగురు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు -
సికింద్రాబాద్–తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు
గుంతకల్లు: తిరుమల వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్–తిరుపతి మధ్య ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైళ్లు (07009, 07010) నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31 నుంచి ఆగస్టు 28 వరకు ప్రతి గురువారం (5 సర్వీసులు మాత్రమే) రైళ్లు రాకపోకలు సాగిస్తాయన్నారు. కాచిగూడ, ఉందానగర్, షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, వనపర్తి రోడ్డు, గద్వాల, కర్నూలు, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట, రేణుగుంట స్టేషన్ల మీదుగా వెళ్తాయన్నారు. నాందేడ్–ధర్మవరం మధ్య.. నాందేడ్–ధర్మవరం మధ్య ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు ప్రతి శుక్రవారం, ఆదివారం రైళ్లు నడుపుతున్నట్లు శ్రీధర్ తెలిపారు. నాందేడ్ జంక్షన్ (07189) నుంచి ఆగస్టు 1 (శుక్రవారం) రైలు బయలు దేరుతుందన్నారు. అలాగే, ఆగస్టు 3 (శనివారం) తిరుపతి జంక్షన్ నుంచి బయలుదేరుతుంది. ధర్మబాద్, బాసర, నిజామబాద్, కామారెడ్డి, నెలగొండ, మిర్యాలగూడ, నడికుడి, రంపిచర్ల, వినుకొండ, కంభం, గిద్దలూరు, నంద్యాల, జమ్మలమడుగు, యర్రగుంట్ల, కడప, రాజంపేట, కోడూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, పీలేరు, కదిరి సేష్టన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టీడీపీ నేతలకు పతనం తప్పదు మడకశిర: రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న టీడీపీ నేతలకు రాజకీయ పతనం తప్పదని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప అన్నారు. బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. మడకశిర నగర పంచాయతీ ఎన్నికలో టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రజాతీర్పును అగౌరవపరచిన టీడీపీ నేతలను రానున్న ఎన్నికల్లో ప్రజలే ఓటుతో శిక్షించడం ఖాయమన్నారు. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసి తమవైపునకు తిప్పుకుని నగర పంచాయతీ దక్కించుకున్నామని సంబరపడుతున్న టీడీపీ నేతలకు దమ్ము, ధైర్యం ఉంటే నేరుగా ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలన్నారు. ఏడాది కాలంలో టీడీపీ నేతలు కుట్రలు, కుతంత్రాలు, రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేయడంపైనే నిమగ్నమై... మడకశిర అభివృద్ధిని పూర్తిగా పక్కనపెట్టారని ఈరలక్కప్ప ఆరోపించారు. మంచికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.. టీడీపీ నేతల ప్రలోభాలకు లొంగకుండా మంచికి అండగా నిలిచిన కౌన్సిలర్లందరికీ ఈరలక్కప్ప ధన్యవాదాలు తెలిపారు. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎంతమంది భయపెట్టినా వైఎస్సార్ సీపీకి అండగా నిలిచిన కౌన్సిలర్లు అందరినీ పార్టీ తప్పకుండా గుర్తిస్తుందన్నారు. నగర పంచాయతీని కోల్పోయినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన పనిలేదని, మరో 8 నెలల్లో మళ్లీ నగర పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని అప్పుడు ప్రజా మద్దతు సత్తా చాటుదామని ఆయన పిలుపునిచ్చారు. -
కాలుష్య రహిత గ్రామాలే లక్ష్యం
హిందూపురం టౌన్: కాలుష్య రహిత గ్రామాలే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయని, ఇందుకోసం సౌరశక్తిని విరివిగా వినియోగించాలని భావిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ శాఖా మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. బుధవారం పట్టణంలో శివారులోని జేవీస్ ప్యాలెస్ ఫంక్షన్ హాలులో కలెక్టర్ టీఎస్ చేతన్తో కలిసి ‘ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన సబ్సిడీ పథకం’పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని మాట్లాడుతూ.. పీఎం సూర్య ఘర్ పథకంలో మహిళల భాగస్వామ్యం ఎంతో కీలకమన్నారు. కోటి ఇళ్ల మీద రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏ గ్రామంలో అయితే వేగంగా అన్ని ఇళ్ల మీద రూఫ్ టాప్ సోలార్ను ఏర్పాటు చేసుకుంటే ఆ గ్రామానికి రూ.కోటి అందిస్తామన్నారు. ఆ నిధులతో గ్రామాన్ని సమగ్రాభివృద్ధి చేసి మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు ప్రభుత్వ సబ్సిడీ ఇస్తుందని, బ్యాంకులు రుణ సౌకర్యాన్ని అందిస్తాయని తెలిపారు. మహిళలు ఆర్థికంగా బాగుపడితే ఆ కుటుంబంతో పాటు ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల మీద రూఫ్ టాప్ సోలార్ను ఏర్పాటు చేసుకుని పర్యావరణాన్ని కాపాడాలన్నారు. సోలార్ ఏర్పాటు వల్ల విద్యుత్తు బిల్లు తగ్గుతుందని తెలిపారు. అనంతరం ‘రాయితీతో మీ ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోండి, విద్యుత్తు బిల్లు తగ్గించుకోండి‘ బ్రోచర్ను విడుదల చేశారు. అలాగే ఇప్పటికే తమ ఇళ్ల మీద రూఫ్ టాప్ సోలార్ను ఏర్పాటు చేసుకున్న వారికి సన్మానం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రమేష్, పెనుకొండ ఆర్డీఓ ఆనంద్ కుమార్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, డీఆర్డీఏ పీడీ నర్సయ్య, డీపీఓ సమత, ట్రాన్స్కో ఎస్ఈ సంపత్ కుమార్తో పాటు అధికారులు పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ సుపరిపాలనలో సమస్యల ఏకరువు హిందూపురం: సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా ఇన్చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో పర్యటించగా జనం సమస్యలు ఏకరువు పెట్టారు. బుధవారం ఉదయం మంత్రి చిలమత్తూరు మండలం కోడూరు పంచాయతీ నల్లరాళ్లపల్లి గ్రామంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండు, మూడు ఇళ్లకు వెళ్లి ప్రజలతో సంక్షేమ పథకాలు అందాయా అంటూ ఆరా తీశారు. ఈ సందర్భంగా కొందరు మహిళలు సమస్యలు ఏకరువు పెట్టారు. దీంతో ఏం చేయాలో తెలియని మంత్రి సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని చెబుతూనే...‘వాటి గురించి చూడండయ్యా’ అంటూ అధికారులపై రుసరుసలాడుతూ ముందుకు సాగారు. అనంతరం లేపాక్షి మండలంలోనూ పర్యటించారు. రచ్చబండ వద్ద మహిళలతో గ్యాస్ సిలిండర్ వచ్చిందా.. అంటూ ఆరా తీయగా.. మహిళలు సిలిండర్లు అందలేదని సమాధానం ఇచ్చారు. -
వైఎస్సార్ సీపీ నుంచి పలువురి సస్పెండ్
చిలమత్తూరు: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న పలువురిని వైఎస్సార్ సీపీ నుంచి ఆ పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం రాత్రి పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. సస్పెండ్ అయిన వారిలో హిందూపురం 17వ వార్డు కౌన్సిలర్ వై. మాజీన్, 31వ వార్డు కౌన్సిలర్ పీసీ చిన్నమ్మ, టౌన్ బ్లాక్ కన్వీనర్ సీఎన్పీ నాగరాజు, హిందూపురం మున్సిపాలిటీకి చెందిన హబీబ్ ఉన్నారు. వీరిపై పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో విచారణ జరిపి క్రమశిక్షణా కమిటీ సిఫార్సు మేరకు సస్పెండ్ చేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం ● ప్రభుత్వాన్ని హెచ్చరించిన పెన్షనర్ల సంఘం ● కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం ప్రశాంతి నిలయం: తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల సంఘం నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మంగళవారం ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల సంఘం జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో గోకులం నుంచి కలెక్టరేట్ వరకు పెన్షనర్లు ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు రామకృష్టయ్య, ప్రధాన కార్యదర్శి నాగార్జున శెట్టి మాట్లాడుతూ, పెన్షనర్ల అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. పెన్షనర్లకు నష్టం కలిగించే కేంద్ర ప్రభుత్వ ఫైనాన్స్ బిల్తో పాటు పెన్షన్ వ్యాలిడేషన్ అమిడ్మెంట్ బిల్లును రద్దు చేయాలన్నారు. కేంద్రం 8వ పే కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం 12వ పే కమిషన్ను వెంటనే నియమించాలని, పెండింగ్లో ఉన్న డీఆర్ బకాయిలు తక్షణం చెల్లించాలన్నారు. ఆస్పత్రుల్లో హెల్త్ కార్డుపై నగదు రహిత సేవలు అందేలా చూడాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీఆర్ఓకు అందజేశారు. కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆత్మారెడ్డి, జేఏసీ చైర్మన్ లింగా రామ్మోహన్, పెనుకొండ, హిందూపురం, మడకశిర, కదిరి, ధర్మవరం యూనియన్ కార్యవర్గ సభ్యులు, జిల్లా నలుమూల నుంచి తరలివచ్చిన పెన్షనర్లు పాల్గొన్నారు. -
15 నుంచి గ్రామ సభలు నిర్వహించాలి
ప్రశాంతి నిలయం: పీ–4 సర్వేలో ఎంపికై న బంగారు కుటుంబాలను మరోసారి పరిశీలించేందుకు ఈ నెల 15 నుంచి 25వ తేదీ వరకూ గ్రామసభలు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో పీ–4 కార్యక్రమంపై అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామ సభల్లో ఇప్పటికే ఎంపికై న బంగారు కుటుంబాలను పరిశీలించి అర్హులైన వారిని తుది జాబితాలో చేర్చడంతో పాటు అనర్హులను జాబితా నుంచి తొలగించాలన్నారు. బంగారు కుటుంబాల తుది జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయం నోటీసు బోర్డులో ప్రదర్శించాలన్నారు. సమావేశంలో విజయవాడ నుంచి వచ్చిన అబ్జర్వర్ తమ్మిశెట్టి సాయి సాత్విక్, సీపీఓ విజయ్ కుమార్, పరిశ్రమల శాఖ జీఎం నాగరాజు, గ్రామ/వార్డు సచివాలయాల నోడల్ అధికారి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హల్కూరుకు అరుదైన అవకాశం ● ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ యోజన కింద ఎంపిక ప్రశాంతి నిలయం: షెడ్యూల్డ్ కులాల వారు ఎక్కువగా ఉన్న గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ యోజనకు అమరాపురం మండలంలోని హల్కూరు గ్రామం ఎంపికైందని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో హల్కూరు గ్రామ అభివృద్ధి ప్రణాళిక అమోదం జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జేసీ అభిషేక్ కుమార్ మాట్లాడుతూ... ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ యోజన కింద ఎంపికై న హల్కూరుకు కేంద్రం రూ.20 లక్షలు మంజూరు చేస్తుందన్నారు. వీటితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు మంజూరు చేసి ఇంతకు ఐదురెట్లు పనులు చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతుందన్నారు. గ్రామ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా అంగన్వాడీ భవన నిర్మాణం, ఆర్వో వాటర్ ప్లాంట్, ఎస్సీ కాలనీలో కరెంట్ స్తంభాల ఏర్పాటు, ఎస్హెచ్జీ రిసోర్స్ సెంటర్ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి, జిల్లా కన్వీనర్ శివరంగ ప్రసాద్, డీఆర్డీఏ పీడీ నరసయ్య, ఎల్డీఎం రమణకుమార్, డీఎస్ఓ వంశీకృష్ణారెడ్డి, డ్వామా పీడీ విజయేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.టీడీపీ నేతల బాహాబాహీ ● సహకార సంఘం అధ్యక్ష పదవి కోసం రగడ ● పార్టీ కార్యాలయంలోనే సవిత, బీకే వర్గాల ముష్టి యుద్ధం గోరంట్ల: టీడీపీ నేతలు ముష్టి యుద్ధానికి దిగారు. గౌనివారిపల్లి సహకార సంఘం అధ్యక్ష పదవి కోసం రెండు వర్గాలుగా విడిపోయి పార్టీ కార్యాలయంలోనే బాహాబాహీకి దిగారు. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఏం జరిగిందంటే... గౌనివారిపల్లి సహకార సంఘం అధ్యక్ష పదవి కోసం హిందూపురం ఎంపీ పార్థసారథి, బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత వర్గాల మధ్య పోటీ నెలకొంది. ఎవరికి వారు తమకే పదవి కావాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో సోమవారం పార్టీ కన్వీనర్ బాలకృష్ణ చౌదరి ఆధ్వర్యంలో సహకార సంఘం అధ్యక్ష పదవికి అభ్యర్థిని ఎంపిక చేయడానికి పార్టీ కార్యాలయంలో గౌనివారిపల్లి, కొండాపురం ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించారు. ఎంపీ పార్థసారథి వర్గం నుంచి గౌనివారిపల్లి పంచాయతీకి చెందిన వడ్డే రవి, మంత్రి సవిత వర్గం నుంచి కొండాపురం పంచాయతీకి చెందిన కృష్ణమూర్తి అధ్యక్ష పదవికోసం పట్టుబట్టారు. ఇరువురికీ సర్దిచెప్పేందుకు మండల నాయకులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే మాటామాటా పెరగడంతో ఇరు వర్గాల నాయకులు పార్టీ కార్యాలయంలోనే ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకుని ముష్టి యుద్ధానికి దిగారు. ఈ ఘటనలో పార్టీ కన్వీనర్కు గాయాలైనట్లు తెలుస్తోంది. దీంతో గౌనివారిపల్లి సహకార సంఘం అధ్యక్ష ఎంపిక మరోసారి వాయిదా పడింది. -
అప్రజాస్వామిక ఎన్నికను బహిష్కరిస్తున్నాం
మడకశిర: అప్రజాస్వామికంగా బుధవారం నిర్వహిస్తున్న మడకశిర నగర పంచాయతీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను వైఎస్సార్ సీపీ బహిష్కరిస్తోందని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప, పలువురు కౌన్సిలర్లు స్పష్టం చేశారు. నగర పంచాయతీ ఎన్నికలో టీడీపీ నాయకులు అంబేడ్కర్ రాజ్యాంగానికి తిలోదకాలిచ్చారని వారు ఆరోపించారు. మంగళవారం ఈరలక్కప్ప పట్టణంలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల సమావేశమై ఎన్నికపై చర్చించారు. టీడీపీ అరాచక పాలన, అనుసరిస్తున్న అప్రజాస్వామ్య చర్యలకు వ్యతిరేకంగా ఎన్నికను బహిష్కరించాలని నిర్ణయించారు. అనంతరం వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు రామచంద్రారెడ్డి, జయరాజ్, శ్రీనివాసులు, అంజన్కుమార్ యాదవ్, అన్సర్, వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ వాల్మీకి సతీష్కుమార్తో కలిసి ఈరలక్కప్ప విలేకరులతో మాట్లాడారు. నగర పంచాయతీ చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలను టీడీపీ నాయకులు అడ్డదారుల్లో గెలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఏమాత్రం బలం లేకపోయినా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. అడ్డదారుల్లో ఎన్నికలో గెలవడం చేతగాని వారి పని అన్నారు. టీడీపీ నాయకులకు దమ్ము, ధైర్యం, సత్తా ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలని సవాల్ విసిరారు. దళిత సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీనరసమ్మను, బీసీ సామాజిక వర్గానికి చెందిన రామచంద్రారెడ్డిని పదవుల నుంచి దించిన టీడీపీ... దళితులు, బీసీలకు తీరని అన్యాయం చేసిందన్నారు. ప్రజలు వారిని క్షమించరు పార్టీ మారి తల్లి లాంటి వైఎస్సార్ సీపీకి ద్రోహం చేసిన కౌన్సిలర్లను తాము క్షమించినా ప్రజలు క్షమించరని ఈరలక్కప్ప అన్నారు. పార్టీ ఫిరాయించిన వారెవరూ వచ్చే ఎన్నికల్లో గెలవలేరన్నారు. వారికి రాజకీయ సమాధి తప్పదన్నారు. ఈ ఎన్నిక తర్వాత పార్టీ మారిన కౌన్సిలర్లకు కూటమి నాయకులు గౌరవం ఇచ్చే పరిస్థితి ఉండదన్నారు. వారంతా పార్టీ మారి తప్పు చేశామని కుమిలిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని తెలిపారు. టీడీపీ నాయకులు చేస్తున్న అరాచకాలను ప్రజలకు వివరించి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ధి చెప్పాలని ప్రజల్ని కోరుతామన్నారు. అంతేకాకుండా పార్టీకి ద్రోహం చేసిన కౌన్సిలర్లను పార్టీ నుంచి బహిష్కరిస్తామన్నారు. మడకశిరలో అంబేడ్కర్ రాజ్యాంగానికి టీడీపీ తిలోదకాలు పార్టీకి ద్రోహం చేసిన కౌన్సిలర్లకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదు వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప, కౌన్సిలర్లు -
80,109 జిల్లాలో రక్తపోటు బాధితులు 60,639 జిల్లాలో మధుమేహ బాధితులు
● ధర్మవరానికి చెందిన 32 ఏళ్ల సచివాలయ ఉద్యోగి ఇటీవల జ్వరంతో బాధపడుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ పరీక్షించిన వైద్యులు మధుమేహం (షుగర్) వచ్చిందని, ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని సూచించారు. అయితే తమ ఇంట్లో ఎవరికీ షుగర్ లేదని, అయినా ఇంత చిన్న వయసుకే తనకు ఎలా వస్తుందని వైద్యులతో వాదనకు దిగాడు. మరోచోట పరీక్షించున్నా ఫలితంలో మార్పులేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. ● హిందూపురం పట్టణానికి చెందిన 37 ఏళ్ల ప్రైవేటు ఉద్యోగికి వారం రోజుల పాటు నిరంతరంగా తలనొప్పి రావడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికెళ్లి చికిత్స చేయించుకున్నాడు. రక్తపోటు అధికమైందని వైద్యులు చెప్పారు. ఒకే విషయాన్ని పదే పదే ఆలోచించడం.. ఆహారపు అలవాట్లలో తేడా కారణంగా బీపీ పెరిగి ఉండవచ్చని పేర్కొన్నారు. మసాలా, కారం, ఉప్పు తగ్గించాలని సూచించారు. ● 30 ఏళ్లకే బీపీ బారిన పడుతున్న వైనం ● ప్రతి ఒక్కరినీ వెంటాడుతున్న మధుమేహం ● బద్ధకంతో అనారోగ్యం బారిన యువత ● జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులుసాక్షి, పుట్టపర్తి మారిన ఆహార అలవాట్లు, జీవన శైలి మనిషిని జబ్బుల బారిన పడేస్తోంది. ముఖ్యంగా ఒత్తిడితో కూడిన ఉద్యోగాలతో చాలా మంది చిన్న వయస్సులోనే రక్తపోటు, మధుమేహం బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నలుగురు కలిస్తే అందులో ఇద్దరికి బీపీ, మధుమేహం ఉంటోంది. ఇక వయసు మీద పడే కొద్దీ రోగాల బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మూడు పదుల వయస్సులోనే... మారిన జీవనశైలి కారణంగా మూడు పదుల వయసులోనే.. బీపీ, షుగర్ బారిన పడుతున్న వారి సంఖ్య కూడా రోజురోజుకూ రెట్టింపు అవుతోంది. ఇక తీవ్ర ఒత్తిడితో మానసికంగా ఇబ్బందులు పడుతున్న వారు చాలా మందే ఉన్నారు. పోటీ ప్రపంచంలో ప్రతి రంగంలోనూ పోటీ పెరిగింది. ఫలితంగా ప్రతి ఒక్కరూ ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలోనే సమయానికి ఆహారం తీసుకోకపోవడం.. ఫాస్ట్ ఫుడ్కు అలవాటు పడటం తదితర కారణాలతో లేని పోని రోగాలు కొనితెచ్చుకుంటున్నారు. అయితే తాము బీపీ, షుగర్ బాధితులమని సగం మందికి తెలియకపోవడం గమనార్హం. ఏదైనా అనారోగ్య సమస్యలతో ఆస్పత్రికి వెళ్తే.. ఉన్నఫలంగా ఈ రెండూ బయటపడుతున్నాయి. ఆ తర్వాత పదే పదే ఆరోగ్యం గురించి ఆలోచించడంతో మరిన్ని రోగాలు వెంటాడుతున్నాయి. వయసు మీరిన తర్వాత రావాల్సిన రోగాలు.. సగం వయసులోనే సోకుతుండటంతో జీవితం ఒక్కసారిగా తలకిందులవుతోంది. చిన్న వయసులోనే ఆస్పత్రుల చుట్టూ.. పుట్టుకతోనే ఆస్పత్రులు చూడాల్సిన కాలంలో బతుకుతున్న సమాజంలో.. డాక్టర్ల చుట్టూ తిరగడం నిరంతర ప్రక్రియగా మారింది. చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరిన వెంటనే ఏదో రోగం వెంటాడుతోంది. మానసిక ఒత్తిళ్లతో బీపీ, షుగర్ వెంటనే పలకరిస్తున్నాయి. కంప్యూటర్ కాలంలో నిత్యం బిజీబిజీగా గడిపే వారంతా రోజులో గంటసేపు కూడా శారీరక వ్యాయామం గురించి పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఎక్కువ మంది మధుమేహం బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఏదో రోగం సోకిన తర్వాత క్రమం తప్పకుండా వ్యాయామం చేసినా పెద్దగా ఫలితం ఉండటం లేదు. పట్టణాల్లోనే అధికం రక్తపోటు, మధుమేహం బాధితుల సంఖ్యను ప్రాంతాల వారీగా పరిశీలిస్తే.. గ్రామాల కంటే పట్టణాలోనే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో మంచి ఆహారపు అలవాట్లతో పాటు ప్రతి ఒక్కరూ శారీరకంగా శ్రమిస్తారు. అలాగే మసాలా, ఫాస్ట్ ఫుడ్ అందుబాటులో ఉండవు. సమయానికి తింటూ నిత్యం ఏదో పనిలో ఉంటారు. అయితే పట్టణ ప్రజలు నిత్యం బిజీగా ఉండటంతో పాటు సమయానికి భోజనం తినరు. శారీరక వ్యాయామం చేయరు. పైగా పిజ్జాలు, ఫాస్ట్ఫుడ్, మసాల ఆహారానికి అలవాటు పడుతున్నారు. దీంతో చిన్న వయసులోనే బీపీ, షుగర్ రోగాల బారిన పడుతున్నారు. ఈక్రమంలో బీపీ, మధుమేహం మందుల విక్రయాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. మారిన జీవన శైలితో జబ్బుల బారిన జనంనియంత్రణే శ్రీరామరక్ష ప్రతి మనిషికీ ఆరోగ్యమే ప్రధానం. ఆరోగ్యం బాగుంటే కుటుంబంలో అందరూ ప్రశాంతంగా ఉంటారు. ముందు జాగ్రత్తలు తీసుకుంటే రోగాల బారిన పడకుండా ఉండవచ్చు. ఆహారపు అలవాట్లు బాగుంటే రోగాలు దరి చేరవు. శారీరక శ్రమ అవసరం. సోమరితనంతో లేనిపోని రోగాలు రావడం ఖాయం. ముందస్తు నియంత్రణ మార్గాలే ఆరోగ్యానికి శ్రీరామరక్ష. – డాక్టర్ ఫైరోజాబేగం, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి -
మడకశిర పీఠానికి నేడు ఎన్నిక
మడకశిర: అధికారం ఉంది.. ఇక తమకు అడ్డేముందన్నట్లుగా వ్యవహరిస్తున్న టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. కుట్రలు, కుతంత్రాలతో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికై న ప్రజాప్రతినిధులను పీఠాల నుంచి కూలదోస్తూ రెడ్బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు. ఈ క్రమంలోనే మడకశిర నగర పంచాయతీ పీఠంపై కన్నేసిన టీడీపీ నేతలు కేవలం 5 స్థానాలతో విజయం సాధించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే వైఎస్సార్ సీపీకి చెందిన చైర్పర్సన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి వారిని పదవీచ్యుతులను చేసిన పచ్చ నేతలు బుధవారం జరిగే ఎన్నికలో తమవారిని పీఠాలపై కొలువుదీర్చేందుకు సిద్ధమయ్యారు. ఉదయం 11 గంటలకు ఎన్నిక మడకశిర నగర పంచాయతీ చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలకు బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నిక నిర్వహించనుంది. ఈ మేరకు ఈనెల 12న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఉదయం 11 గంటలకు నగర పంచాయతీ కార్యాలయంలోని మీటింగ్ హాలులో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కౌన్సిలర్లు, ఎక్స్అఫీషియో సభ్యులంతా సమావేశానికి తప్పకుండా హాజరు కావాలని ఆహ్వానాలు పంపారు. అలాగే ఎన్నిక అధికారిగా పెనుకొండ ఆర్డీఓ ఆనందకుమార్ను ఈసీ నియమించింది. టీడీపీకి 5 స్థానాలే నగర పంచాయతీ పరిధిలో 20 వార్డులుండగా...గత మున్సిపల్ ఎన్నికల్లో 15 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయదుందుభి మోగించారు. టీడీపీ కేవలం ఐదుగురు స్థానాలను మాత్రమే నిలబెట్టుకోగలిగింది. దీంతో వైఎస్సార్సీపీకి చెందిన లక్ష్మీనరసమ్మ చైర్పర్సన్గా, రామచంద్రారెడ్డి వైస్ చైర్మన్గా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యారు. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరగానే... నగర పంచాయతీపై టీడీపీ నేతలు కన్నేశారు. మెజార్టీ లేకపోయినా ఎలాగైనా చైర్మన్ పీఠం దక్కించుకోవాలని కుట్రలు చేశారు. ఈ క్రమంలోనే కొందరు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను భయపెట్టి, పలు రకాలుగా ప్రలోభాలకు గురి చేశారు. దీంతో 9 మంది కౌన్సిలర్లు టీడీపీ కండువా వేసుకున్నారు. అనంతరం వైఎస్సార్సీపీకి చెందిన చైర్పర్సన్ లక్ష్మీనరసమ్మ, వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డిపై అవిశ్వాస తీర్మాణం పెట్టి విజయం సాధించారు. దీంతో చైర్పర్సన్, వైస్ చైర్మన్ పదవులు కోల్పోగా.. మడకశిర నగర పంచాయతీ చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలకు ఎన్నిక అనివార్యమైంది. పదవులపై ఉత్కంఠ చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలకు బుధవారం ఎన్నిక జరుగనుండడంతో ఎవరికి దక్కుతాయోనని ఉత్కంఠ నెలకొంది. చైర్మన్ స్థానం ఎస్సీ జనరల్కు రిజర్వ్ కావడంతో 15వ వార్డు కౌన్సిలర్ నరసింహరాజు చైర్మన్ గిరీపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. అదే విధంగా వైఎస్సార్ సీపీ గుర్తుపై గెలిచి పచ్చకుండువా కప్పుకున్న 17వ వార్డు కౌన్సిలర్ సుభద్ర కూడా చైర్పర్సన్గా కొలువుదీరాలని ఉవ్విళ్లూరుతున్నారు. వీళ్లిద్దరిలోనే ఎవరో ఒకరికి పీఠం దక్కడం ఖాయంగా తెలుస్తోంది. ఇక వైస్ చైర్మన్ పదవిని వైఎస్సార్ సీపీ హయాంలో వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన రామచంద్రారెడ్డికి ఇచ్చారు. నగర పంచాయతీలో వాల్మీకి సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నందున ఈసారి కూడా వాల్మీకి వర్గానికి చెందిన వారికే వైస్ చైర్మన్ పదవిని కట్టబెట్టాలని పలువురు కోరుతున్నారు. అయితే టీడీపీ నేతలు వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన కౌన్సిలర్లకు ప్రాధాన్యం ఇస్తారా...లేదా అన్నది బుధవారం తేలనుంది. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులపై కన్నేసిన టీడీపీ రెడ్బుక్ రాజ్యాంగం అమలుతో అరాచకం ప్రలోబాలతో ఇప్పటికే పలువురు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లకు పచ్చకండువా ఎన్నిక దూరంగా వైఎస్సార్ సీపీభారీ పోలీస్ బందోబస్తు ఎన్నికల సందర్భంగా మడకశిర నగర పంచాయతీ కార్యాలయం వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు మడకశిర పట్టణ సీఐ నగేష్ తెలిపారు. కౌన్సిలర్లను మాత్రమే లోనికి అనుమతిస్తామని ఇతరులకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
నా జోలికొస్తే అంతు చూస్తా
చిలమత్తూరు: తన అవినీతి అక్రమాలను బయటపెడుతున్న సాక్షి విలేకరిపై ఓ టీడీపీ నేత రెచ్చిపోయాడు. ‘నా జోలికొస్తే ఊరుకోను... నీ అంతు చూస్తా జాగ్రత్త’ అంటూ బెదిరింపులకు దిగాడు. హిందూపురం నియోజకవర్గంలో ఏడాది కాలం పరిస్థితులపై ఈనెల 13న ‘‘హిందూపురం.. అభివృద్ధి శూన్యం’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. ఈ కథనంలోనే చిలమత్తూరులో జరిగిన నాసిరకం రహదారి పనులు... ఆ పనుల పరస్థితిని తెలిపే చిత్రాలను సైతం ప్రచురించింది. దీంతో సదరు రహదారి పనులు చేసిన టీడీపీ నేత నాగరాజు యాదవ్ సాక్షి విలేకరిపై కక్షగట్టాడు. మంగళవారం విలేకరి శ్రీధర్రెడ్డికి ఫోన్ చేసి దుర్బాషలాడాడు. తనను గెలుక్కుంటే అంతు చూస్తానంటూ బెదిరింపులకు దిగాడు. వాస్తవాలు రాస్తే చంపేస్తారా..అని ప్రశ్నిస్తే... నువ్వు అలాంటి రాతలు రాస్తే అదే జరుగుతుందంటూ భయపెట్టాడు. నాగరాజు యాదవ్పై చర్యలు తీసుకోండి సాక్షి విలేకరిపై టీడీపీ నేత నాగరాజు యాదవ్ గూండాగిరీని చిలమత్తూరు పాత్రికేయ సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు. నేతల అరాచకాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా..? దుర్భాషలాడుతూ బెదిరింపులకు దిగుతారా అంటూ ప్రశ్నించారు. ఇలాంటి చర్యలను ఉపేక్షించబోమన్నారు. సదరు టీడీపీ నేత నాగరాజు యాదవ్పై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయాలని ఎస్ఐ మునీర్ అహ్మద్ను జర్నలిస్టులు కోరారు. దాడులు, బెదిరింపులు సరికాదు రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి విలేకరులపై, పత్రికా కార్యాలయాలపై కూటమి నేతలు చేస్తున్న దాడులు ప్రజాస్వామ్యానికి హాని కలిగించేలా ఉన్నాయని జర్నలిస్టు నేతలు ఆంజనేయులు, నరసింహారెడ్డి మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జర్నలిస్ట్లపై దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతటి నియంతృత్వ పాలన మునుపెన్నడూ చూడలేదన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛకు ప్రత్యేకమైన స్థానం ఉందని, అలాంటి కలంపై దౌర్జన్యాలు సహించబోమన్నారు. కార్యక్రమంలో జర్నలిస్టులు ఆంజనేయులు, శంకర్, సురేష్రెడ్డి, పవన్, నరసింహారెడ్డి, విశ్వనాథ్, వనం శ్రీనివాసరెడ్డి, నారాయణస్వామి, నాగార్జున, శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘సాక్షి’ విలేకరికి టీడీపీ నేత బెదిరింపులు చిలమత్తూరు పీఎస్లో ఫిర్యాదు చేసిన జర్నలిస్టులు -
‘పోలీస్ స్పందన’కు 61 వినతులు
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 61 వినతులు అందాయి. ఎస్పీ రత్న స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని, అర్జీల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని సంబంధిత ఎస్హెచ్ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో మహిళా డీఎస్పీ ఆదినారాయణ, లీగల్ అడ్వైజరీ సాయినాథరెడ్డి పాల్గొన్నారు జాతీయ హాకీ జట్టులో చోటు కదిరి టౌన్: హర్యానాలోని హిసార్ వేదికగా ఇటీవల జరిగిన ఆల్ ఇండియా ఐపీఎస్సీ బాలికల అండర్ 17 ప్రీ నెహ్రూ కప్ హాకీ టోర్నీలో కదిరికి చెందిన సి.వి.లక్షిత ప్రతిభ చాటి జాతీయ జట్టులో చోటు దక్కించుకుంది. కదిరిలోని చిన్న పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ సి.వి.మదన్కుమార్ కుమారై లక్షిత.. కర్ణాటకలోని కిట్టూరులో ఉన్న రాణి చెన్నమ్మ సైనిక స్కూల్లో చదువుతోంది. హాకీలో గోల్కీపర్గా ప్రతిభ చాటుతోంది. ఐపీఎస్సీ టోర్నీలో ఉత్తమ ప్రతిభ చూపడంతో లక్షితను హాకీ అండర్ 16 జాతీయ జట్టుకు ఎంపిక చేసినట్లు సైనిక స్కూల్ కోచ్ జయలక్ష్మి వెల్లడించారు. ఈ సందర్భంగా లక్షితను కదిరి వాసులు అభినందిస్తున్నారు. -
జేఎన్టీయూలో కొత్త కోర్సు
అనంతపురం: జేఎన్టీయూ (ఏ) క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలలో కొత్త కోర్సు అమలు చేస్తున్నట్లు వీసీ హెచ్.సుదర్శనరావు సోమవారం వెల్లడించారు. వర్సిటీ పరిధిలోని అన్ని అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలలకు త్వరలో అటానమస్ హోదా దక్కనున్న నేపథ్యంలో క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచుకోవాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. అయితే కొత్త కోర్సులను ప్రవేశపెట్టడంలో జాప్యం నెలకొని పేద, మధ్య తరగతి విద్యార్థులు క్యాంపస్లో చదివే అవకాశం లేకుండా పోతోంది. ఈ అంశంపై ‘విశ్వ ఖ్యాతి.. అధోగతి’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో వెలువడిన కథనంపై వీసీ స్పందించారు. ఉన్నత విద్యామండలితో ఫోన్లో సంప్రదించి కొత్త కోర్సు అమలుకు చర్యలు తీసుకున్నారు. ఏపీ ఈఏపీసెట్ –2025 వెబ్ ఆప్షన్లలో ఈ కొత్త కోర్సును ఎంపిక చేసుకునే వెసులుబాటును అందుబాటులోకి తెచ్చారు. కొత్త కోర్సు వివరాలు ఇలా: జేఎన్టీయూ (ఏ) క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లర్నింగ్ అనే కొత్త కోర్సును సెల్ఫ్ ఫైనాన్స్ కింద ప్రవేశపెట్టారు. కన్వీనర్ కోటాలో 66 సీట్లను కేటాయించారు. కోర్సు ఫీజు రూ.75 వేలుగా నిర్ధారించారు. వీటికి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుంది. ● కంప్యూటర్ సైన్సెస్లో ప్రస్తుతమున్న సీట్లకు అదనంగా 66 సీట్లు కొత్తగా కేటాయించారు. ఒక్కో సీటుకు రూ.1.50 లక్షలుగా నిర్ధారించారు. సెల్ఫ్ సపోర్టింగ్ కేటగిరిలో ఈ సీట్లు కేటాయిస్తారు. వీటికి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు. ● ఈసీఈలో ఇప్పుడు ఉన్న సీట్లకు అదనంగా 66 సీట్లు కేటాయించారు. ఒక్కో సీటుకు కోర్సు ఫీజు రూ.1.25 లక్షలుగా నిర్ధేశించారు. వీటికి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు. ఈ కోర్సులన్నింటినీ 2025–26 విద్యా సంవత్సరంలో అమల్లోకి తెచ్చారు. బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులకు వర్తిస్తుంది. -
అందని ప్రయోజనాలు.. పెన్షనర్ల దిగాలు
అనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పెన్షనర్ల పరిస్థితి దయనీయంగా మారింది. వారిపై బాబు సర్కారు కనికరం చూపడం లేదు. ఉద్యోగ విరమణ తరువాత రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను నెలలు గడుస్తున్నా అందించకపోవడంతో ఆవేదన వర్ణనాతీతంగా మారింది. ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ, ఎర్న్ లీవ్ వంటి ఆర్థిక ప్రయోజనాలు గత ఏడాది అక్టోబరు నుంచి పెండింగ్లో ఉంచారు. ఈ మొత్తం రూ.48 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. మట్టిఖర్చులూ పెండింగ్ పెన్షనర్ చనిపోతే అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు తక్షణ సాయంగా మట్టిఖర్చుల (ఫ్యునరెల్ చార్జెస్) కింద రూ.25 వేలు ఇస్తారు. అయితే, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకూ 100 మంది వరకూ పెన్షనర్లు మరణిస్తే వీరికి సంబంధించి మట్టి ఖర్చులను ఇవ్వకుండా ప్రభుత్వం పెండింగ్లో ఉంచినట్లు తెలిసింది. 100 మందికి రూ.25 లక్షలు చెల్లించాల్సి ఉన్నట్లు సమాచారం. మట్టిఖర్చుల కింద తక్షణ సాయంగా అందించాల్సిన డబ్బునూ పెండింగ్లో పెట్టడం ప్రభుత్వ కర్కశత్వానికి అద్దం పడుతోంది. గ్రాట్యూటీ, ఈఎల్కు ఎదురుచూపులు ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు ప్రభుత్వం గ్రాట్యుటీ కింద గరిష్టంగా రూ.16 లక్షలు చెల్లి స్తుంది. జిల్లాలో గత ఏడాది అక్టోబరు నుంచి ఇప్పటి వరకు వివిధ హోదాల్లో దాదాపు 200 మంది ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేసినట్లు సమాచారం. వీరికి సంబంధించి గ్రాట్యుటీ సగటున రూ.14 లక్షలుగా చూసినా రూ.28 కోట్లు రావాల్సి ఉంటుంది. ● సర్వీసులో ఉండగా ఉద్యోగులు మిగుల్చుకున్న ఎర్న్ లీవ్లను (ఈఎల్) ఉద్యోగ విరమణ సమయంలో ప్రభుత్వానికి వెనక్కి ఇచ్చి వాటికి డబ్బులు తీసుకుంటారు. ఇలా ఒక్కో ఉద్యోగి దాదాపు 300 రోజులు (పది నెలలు) ఎర్న్ లీవులను వెనక్కి ఇస్తారు. ఒక్కో ఉద్యోగికి ఈఎల్కు సంబంధించి 10 నెలల వేతనం ప్రభుత్వం చెల్లించాలి. సగటున నెలకు రూ.లక్ష వేసుకున్నా పది నెలలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలుగా 200 మందికి రూ.20 కోట్లను ప్రభుత్వం గత తొమ్మిది నెలలుగా చెల్లించ కుండా పెండింగ్లో ఉంచిందని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తమ సమస్యల పరిష్కారం కోసం మంగళవారం (నేడు) కలెక్టరేట్ వద్ద ప్రభుత్వ పెన్షనర్లు ధర్నాకు పిలుపునిచ్చారు.● మూడునెలలుగా మట్టి ఖర్చులనూ అందించని చంద్రబాబు సర్కారు ● పేరుకుపోయిన గ్రాట్యుటీ, ఈఎల్ బకాయిలు ● నేడు కలెక్టరేట్ వద్ద పెన్షనర్ల ధర్నా ● రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న మల్లికార్జున (పేరు మార్చాం) గత ఏడాది నవంబరులో ఉద్యోగ విరమణ చేశారు. ఆయనకు గ్రాట్యుటీ రూ.16 లక్షలు, ఈఎల్ (ఎర్న్ లీవ్) డబ్బులు సుమారు రూ.10 లక్షలు నేటికీ అందలేదు. ఉద్యోగ విరమణ తరువాత పింఛను తప్ప ఇతర ఆర్థిక ప్రయోజనాలు ఇప్పటికీ తనకు అందలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ● ఒక ఉపాధ్యాయుడు గత ఏడాది అక్టోబరులో ఉద్యోగ విరమణ పొందారు. ఆయనకు గ్రాట్యుటీ రూ.16 లక్షలు, ఈఎల్ రూ.12 లక్షలు నేటికీ అందలేదు. ఉద్యోగ విరమణ చేసి తొమ్మిది నెలలు అవుతున్నా బెనిఫిట్లు అందించలేదని, ఇటీవల ఇంట్లో శుభకార్యం చేసేందుకు రూ.10 లక్షలు అవసరమైతే తెలిసిన వారి నుంచి వడ్డీకి డబ్బు తీసుకున్నానని వాపోయారు. -
మంత్రి ఇలాకాలో విద్యార్థులకు అందని కోడిగుడ్లు
పరిగి: మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కోడి గుడ్లు అందకపోవడాన్ని నిరసిస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం జైభీమ్ పార్టీ నాయకుడు ఊటుకూరు నాగరాజు ఆధ్వర్యంలో ఎంఈఎఫ్ నాయకుడు చౌళురు రవి తదితరులు మోకాలిపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం డప్పు కొడుతూ ఏజెన్సీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ తహసీల్దారు హనుమంతుకు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం ఇవ్వడం లేదని మండిపడ్డారు. సాక్షాత్తు రాష్ట్ర మంత్రి సవితమ్మ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఇలాంటి దుస్థితి ఉంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించలేమన్నారు. ఇప్పటికై నా మంత్రి సవిత తన నియోజకవర్గంలో కోడిగుడ్ల ఏజెన్సీ నిర్వాహకుల అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ఇటీవల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగిన రోజున సమావేశానికి వచ్చిన తల్లిదండ్రులకు మద్యాహ్న భోజనంలో కోడిగుడ్లను ఇవ్వడం జరిగిందని ఎంఈఓలు లక్ష్మీదేవి, శేషాచలం తెలిపారు. దీంతో కొరత కారణంగా సోమవారం కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కోడి గుడ్లను ఇవ్వలేకపోయారని వివరించారు. డప్పు కొడుతూ నిరసన వ్యక్తం చేసిన జైభీం నాయకులు -
రైలు కింద పడి రైతు మృతి
చెన్నేకొత్తపల్లి: ప్రమాదవశాత్తు రైలు కింద పడి ఓ రైతు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. చెన్నేకొత్తపల్లి మంలడం ఆమిదాలకుంట గ్రామానికి చెందిన రామాంజనేయులు (40)కు భార్య శమంతకమణితో పాటు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి పొలం వద్దకు కాపలాకు వెళ్లిన ఆయన సోమవారం తెల్లవారుజామున ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యంలో పట్టాలు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన రైలు ఢీకొని, అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై హిందూపురం రైల్వే పోలీసులు కుఏసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. జేఎన్టీయూలో 1,935 సీట్ల తగ్గింపు అనంతపురం: జేఎన్టీయూ (ఏ) పరిధిలోని అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల పరిధిలో సీట్ల ఖరారు పూర్తయింది. జేఎన్టీయూ (ఏ) పరిధిలో మొత్తం 69 అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలలకు గాను ఈ విద్యాసంవత్సరానికి 59,244 సీట్ల ఏఐసీటీఈ మంజూరు చేసింది. కళాశాలల నిజనిర్ధారణ కమిటీల సిఫార్సు మేరకు 1,935 సీట్లను తగ్తిస్తూ మొత్తం 57,309 ఇంజినీరింగ్ సీట్లను ఖరారు చేశారు. వీటిని ఏపీఈఏపీసెట్ –2025 వెబ్ ఆప్షన్ల ఎంపికకు అందుబాటులో తెచ్చేందుకు ఉన్నత విద్యామండలికి నివేదించారు. బీబీఏ, బీసీఏ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ కోర్సులకు సంబంధించి 77,296 సీట్లకు ఏఐసీటీఈ ఆమోదం తెలపగా, 74,145 సీట్లను భర్తీ చేసుకునేందుకు వర్సిటీ తుది ఆమోదం తెలిపింది. కారులో నగదు చోరీ గోరంట్ల: స్థానిక పోలీస్ స్టేషన్కు కూత వేటు దూరంలో ప్రధాన రహదారి పక్కనే ఆపిన కారులో నుంచి నగదును దుండగులు అపహరించారు. వివరాలు.. గోరంట్ల మండలం మల్లాపల్లి గ్రామానికి చెందిన వసంతరావు, ఆయన సోదరుడు రామచంద్రరావు సోమవారం ఉదయం గోరంట్లలోని ఎస్బీఐ శాఖకు చేరుకుని రూ.7 లక్షలు డ్రా చేశారు. ఈ మొత్తాన్ని కారులో ఉంచుకుని రామచంద్రరావు కుమారుడి వివాహా వేడుకలు నిర్వహించేందుకు పోలీస్ స్టేషన్కు కూత వేటు దూరంలో ఉన్న వాసవీ మహాల్ ఫంక్షన్ హాల్ను చూసేందుకు వెళ్లారు. ఫంక్షన్ హాల్ ఎదుట కారు నిలిపి లాక్ చేసుకుని లోపలకు వెళ్లిన వారు తిరిగి వచ్చే లోపు కారు డోర్ అద్దం పగులగొట్టి ఉంది. కారులో ఉంచిన నగదు కనిపించలేదు. నగదు అపహరించారని నిర్ధారించుకుని సమాచారం ఇవ్వడంతో పెనుకొండ డీఎస్పీ నర్శింగప్ప, సీఐ శేఖర్ తదితరులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. విద్యుత్ షాక్తో బాలికకు తీవ్రగాయాలు ధర్మవరం అర్బన్: స్థానిక శారదా నగర్లో నిర్మాణంలో ఉన్న కట్టడంలో ఆడుకుంటున్న ఓ బాలిక విద్యుత్ షాక్తో తీవ్రంగా గాయపడింది. పోలీసులు తెలిపిన మేరకు ఒంగోలుకు చెందిన హరి, రిపిక దంపతులు ధర్మవరం పట్టణానికి వలస వచ్చి గృహ నిర్మాణ పనులతో జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం శాంతినగర్లో ఇంటి నిర్మాణ పనులకు వెళ్లిన వారు తమతో పాటు 11 ఏళ్ల కుమార్తె వెంకటేశ్వరినీ పిలుచుకెళ్లారు. కట్టడం వద్ద ఇనుపరాడ్పై పడిన విద్యుత్ తీగను గమనించని వెంకటేశ్వరి ఆడుకుంటూ వెళ్లి దానిని తాకింది. దీంతో షాక్కు గురై కుప్పకూలడంతో తల్లిదండ్రులు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. దాదాపు 50 శాతం కాలిన గాయాలతో ఉన్న బాలికకు వైద్యులు ప్రథమ చికిత్స అందజేసి, అనంతపురానికి రెఫర్ చేశారు. ఘటనపై రెండో పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గోల్డ్ స్కీమ్ పేరిట చీటింగ్ గుంతకల్లు టౌన్: గోల్డ్ స్కీమ్ పేరిట గుంతకల్లుకు చెందిన జ్యువెలరీ షాప్ నిర్వాహకుడు నూరుల్లా రూ.లక్షల్లో కుచ్చుటోపీ పెట్టి ఉడాయించాడు. విషయం తెలియగానే బాధితులు పెద్ద సంఖ్యలో సోమవారం సాయంత్రం పాత గుత్తిరోడ్డులోని ఓ నర్సింగ్హోమ్ వద్ద ఉన్న సుల్తానియా జ్యువెలరీ షాపు వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. జ్యువెలరీ షాపును అద్దెకిచ్చిన యజమాని ఖాళీ చేయిస్తామని అక్కడికి వెళ్లడంతో బాధితులంతా అతడితో వాదించారు. పిల్లల పెళ్లిళ్లు, ఇతర అవసరాల నిమిత్తం బంగారు షాపు నిర్వాహకుడు నూరుల్లాకి తాము పోగు చేసుకున్న డబ్బును నెలానెల చెల్లించి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అతడిని ఇక్కడికి రప్పించి తమ డబ్బును తమకు ఇప్పించాలని బాధితులు కోరుతూ ఆర్డీఓ, టూటౌన్ పోలీసులను కలసి విన్నవించారు. -
హెచ్చెల్సీకి నవంబర్ నెలాఖరు వరకూ నీరు
బొమ్మనహాళ్: హెచ్చెల్సీకి నవంబర్ నెలాఖరు వరకు తుంగభద్ర జలాలను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని టీబీ డ్యాం ఎస్ఈ నారాయణ నాయక్ తెలిపారు. సోమవారం బొమ్మనహాళ్ వద్ద ఆంధ్రా సరిహద్దులోని 105వ కిలోమీటర్ వద్ద కాలువను, రెగ్యులేటర్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ టీబీ డ్యాంకు ఇన్ఫ్లో తగ్గుముఖం పట్టిందన్నారు. ఇటీవల డ్యాం నంచి 1,400 క్యూసెక్కుల నీటిని హెచ్చెల్సీకి వదిలామన్నారు. 105వ కిలోమీటర్ వద్దకు 500 క్యూసెక్కుల మేర వస్తున్నట్లు తెలిపారు. నవంబర్లో వర్షాలు వస్తే హెచ్చెల్సీకి నీటి వాటా పెంచుతామన్నారు. ఆంధ్రాలో అత్యవసర మరమ్మతు పనులు జరుగుతున్న నేపథ్యంలో నీటిని తీసుకునేందుకు ఆలస్యం కావొచ్చన్నారు. టీబీ డ్యాం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 100 టీఎంసీలు కాగా.. 33 క్రస్ట్ గేట్లకు మరమ్మతులు చేయాల్సిన నేపథ్యంలో 80 టీఎంసీలకు కుదించామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జూలై మొదటి వారంలోనే డ్యాం పూర్తి స్థాయిలో నిండిందన్నారు. ప్రస్తుతం 39,667 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 25,181 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదవుతోందన్నారు. డ్యాం 5 క్రస్ట్ గేట్లను రెండున్నర అడుగుల మేర ఎత్తి 14,590 క్యూసెక్కులను నదికి విడుదల చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్డీఓ ప్రవీణ్కుమార్రెడ్డి, జేఈ రంజిత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అర్జీదారుడు సంతృప్తి చెందాలి
● పీజీఆర్ఎస్లో అందే ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలి ● అధికారులకు జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఆదేశం ప్రశాంతి నిలయం: ‘‘క్షేత్రస్థాయికి వెళ్లండి..సమస్యను స్వయంగా పరిశీలించండి.. అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపండి’’ అని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ చూపి ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 281 అర్జీలు అందగా... వాటి పరిష్కారం కోసం ఆయా శాఖలకు పంపారు. అనంతరం జేసీ అభిషేక్ కుమార్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...కలెక్టరేట్లో అర్జీ ఇస్తే తమ సమస్య పరిష్కారం అవుతుందని ప్రజలు ఎంతో నమ్మకంతో ఇక్కడిదాకా వచ్చి అర్జీ ఇస్తారని, అధికారులు బాధ్యత వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ విజయసారథి, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, డీఆర్డీఏ పీడీ నరసయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రేపు మడకశిర చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ● ఎన్నికల అధికారిగా పెనుకొండ ఆర్డీఓ ఆనందకుమార్ మడకశిర: స్థానిక నగర పంచాయతీ చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలకు బుధవారం ఎన్నిక జరుగనున్నట్లు మున్సిపల్ కమిషనర్ జగన్నాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. పెనుకొండ ఆర్డీఓ ఆనందకుమార్ ఎన్నికల అధికారిగా వ్యవహరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఉదయం 11 గంటలకు నగర పంచాయతీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సమావేశానికి కౌన్సిలర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులంతా తప్పకుండా హాజరు కావాలని కోరారు. పది, ఇంటర్ ప్రవేశాలకు 16న కౌన్సెలింగ్అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పదో తరగతి, ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం సీట్ల భర్తీకి ఈనెల 16న కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు సమన్వయ అధికారి జయలక్ష్మి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కురుగుంట స్కూల్లో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. పదో తరగతికి సంబంధించి ఉరవకొండ స్కూల్లో ఎస్టీ–1, బీసీ–1, ఓసీ–1, హిందూపురం బాలికల పాఠశాలలో ఎస్సీ–7, అమరాపురంలో ఎస్టీ–1, ఓసీ–1, మలుగూరులో ఎస్సీ–2, ఎస్టీ–1 ఖాళీలున్నాయన్నారు. సీనియర్ ఇంటర్కు సంబంధించి... ఉరవకొండ ఎస్సీ–48, ఎస్టీ–3, బీసీ–3, ఓసీ–2, నల్లమాడలో 55, కురుగుంటలో ఎస్సీ–1, ఎస్టీ–2, బీసీ–2, హిందూపురం (బాలికలు)లో ఓసీ–1, అమరాపురంలో ఎస్సీ–1, ఓసీ–1, మలగూరులో ఎస్సీ–19, బీసీ–1 సీటు ఖాళీ ఉందన్నారు. 16న నేరుగా స్పాట్ కౌన్సెలింగ్కు హాజరుకావాలని సూచించారు. బీమా ప్రీమియం చెల్లింపునకు నేడు ఆఖరు అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్లో వాతావరణ బీమా పథకం కింద గుర్తించిన పంటలకు ప్రీమియం చెల్లింపు గడువు మంగళవారంతో ముగియనుంది. బీమా కింద నోటిఫై చేసిన వేరుశనగ ఎకరాకు రూ.640 ప్రకారం ప్రీమియం కట్టాలి. పత్తికి రూ.1,140, దానిమ్మకు రూ.3,750, చీనీ, బత్తాయికి రూ.2,750, టమాటకు రూ.1,600, అరటికి రూ.3 వేల ప్రకారం జూలై 15 లోపు ప్రీమియం కట్టాలంటూ వారం క్రితం వ్యవసాయశాఖ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇంకా వేలాది మంది ప్రీమియం చెల్లించాల్సిన ఉంది. ఈ క్రమంలో ఈనెలాఖరు వరకు గడువు పొడిగించాలని జిల్లా వ్యవసాయశాఖ కమిషనరేట్ అధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. -
అలవాటు.. గ్రహపాటు
● హిందూపురానికి చెందిన ముగ్గురు కుర్రాళ్లు ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 11 గంటలు దాటిన తర్వాత కారులో బయలుదేరి బెంగళూరు విమానాశ్రయం వెళ్తారు. తెల్లవారుజామున 3 గంటలకు తిరుగు పయనమవుతారు. తెల్లవారుజామున 5.30 గంటలకు పడుకుని ఉదయం 10.30 గంటలకు లేస్తారు. ఆ తర్వాత నేరుగా మధ్యాహ్న భోజనం తింటారు. దీంతో ఉదయం టిఫిన్ తినడం మానేశారు. ఫలితంగా ముగ్గురికూ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. పైగా మిగతా రోజుల్లో తెల్లవారుజాము వరకూ నిద్ర పట్టక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ● ‘కియా’ ఉద్యోగులు ఆరుగురు ఒకే విల్లాలో ఉంటారు. రోజూ రాత్రి 10 గంటలు దాటిన తర్వాత టీ తాగేందుకు బాగేపల్లి టోల్ గేట్ వరకు వెళ్తుంటారు. తిరిగి వచ్చేసరికి అర్ధరాత్రి 1 నుంచి 2 అవుతోంది. నిద్రపట్టేందుకు మరో గంట పడుతుంది. దీంతో అందరూ నిద్రలేచే సమయంలో నిద్రకు ఉపక్రమిస్తారు. మధ్యాహ్నం ఎప్పుడో నిద్రలేచి ఉన్నఫలంగా పది నిమిషాల్లో రెడీ అయి డ్యూటీకి వెళ్తున్నారు. నీరసం, నిద్ర ఒకేసారి వస్తుండటంతో విధులు కూడా సరిగా నిర్వహించలేక చివాట్లు తింటున్నారు.కొంపముంచుతోన్న కల్చర్ సిటీ కల్చర్ పేరుతో జిల్లా యువత కొత్త హంగులకు వెళ్లి లేనిపోని రోగాల బారిన పడుతున్నారు. కొత్త కొత్త విధానాలకు అలవాటు పడి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ పెడదారి పడుతున్నారు. పుట్టపర్తి వంటి పట్టణాల్లో విదేశీయులు ఉండటంతో వారితో పరిచయం ఉన్నోళ్లు.. అర్ధరాత్రి వరకూ కాలయాపన చేయడం అలవాటుగా మార్చుకున్నారు. ఫలితంగా జీవనశైలిలో ఒక్కసారిగా వచ్చే మార్పులతో ఇబ్బందులు పడుతున్నారు. సాక్షి, పుట్టపర్తి: జిల్లాలోని హిందూపురంతో పాటు చిలమత్తూరు, కొడికొండ చెక్పోస్టు, పెనుకొండ, పుట్టపర్తి ప్రాంతాల నుంచి యువత నిత్యం బెంగళూరుకు రాకపోకలు సాగిస్తుంటారు. టీ తాగాలంటే ఓ ప్రాంతం.. టిఫిన్ తినాలంటే మరో ప్రాంతానికి వెళ్లడం అలవాటుగా మార్చుకున్నారు. ఫలితంగా రాత్రింబవళ్లు తేడా లేకుండా తిరగడం మొదలుపెట్టారు. దీంతో జీవనశైలిలో మార్పులు రాగా రోగాల బారిన పడుతున్నారు. అర్థరాత్రి చక్కర్లు..అనర్థాలు జిల్లా యువకులు మెట్రో సిటీ యువతతో పోటీ పడాలని భావిస్తున్నారు. ఈక్రమంలో అర్ధరాత్రి వేళ కార్లలో చక్కర్లు కొట్టడం ఫ్యాషన్గా మార్చుకున్నారు. ఈ క్రమంలో జిల్లా నుంచి బెంగళూరుకు రయ్యిమంటూ దూసుకెళ్తున్నారు. అయితే జాతీయ రహదారి కావడంతో చాలామంది ప్రమాదాల బారిన పడి జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. మరికొందరు ఇలా అర్ధరాత్రి తిరుగుళ్లకు అలవాటు పడి నిద్రలేమితో ఆస్పత్రుల బాట పడుతున్నారు. బెంగళూరు పక్కనే ఉండటంతో గంట వ్యవధిలో వెళ్లి రావచ్చనే ఉద్దేశంతో టక్కున వెళ్లి వస్తున్నారు. పగటి పూట పనుల్లో బిజీగా ఉంటూ రాత్రివేళ తిరిగేందుకు అలవాటు పడి నిద్రకు దూరమైన లేనిపోని రోగాల కొని తెచ్చుకుంటున్నారు. యువకులే అధికం అర్ధరాత్రి వేళ చక్కర్లు కొట్టే వారిలో యువకులే 90 శాతం మంది ఉండటం విశేషం. విధులు ముగించుకుని వారంతపు సెలవుల్లో అయితే మద్యం తాగుతారు. ఆ తర్వాత కారుతో రోడ్డెక్కుతారు. రయ్ రయ్ మంటూ బెంగళూరు వరకు వెళ్లాలని గ్యాంగ్లో ఎవరో ఒకరు పట్టుబడుతారు. ఫలితంగా ఇష్టం లేని వారు కూడా ప్రమాదమని తెలిసినా.. వెళ్లాల్సి వస్తోంది. ప్రయాణం రద్దు చేసుకుంటే సెల్ ఫోన్లలో బిజీబిజీగా గడుపుతున్నారు. మిగతా రోజుల మాదిరిగా నిద్ర రాకపోవడంతంతో అరచేతిలో స్మార్ట్ ఫోన్ తీసుకుని నొక్కుతూ కాలయాపన చేస్తున్నారు. బయట తిరగడం మానేసిన తర్వాత సెల్ ఫోన్తో బిజీ అవుతున్నారు. ఫలితంగా నిద్రకు దూరం అవుతున్నారు. నిద్రలేమి సమస్యలో ఆస్పత్రులకు చేరడం అలవాటుగా మార్చుకున్నారు. యువత.. పెడదోవ స్నేహితులతో కలిసి బెంగళూరు వరకూ షికారు అర్ధరాత్రి రయ్రయ్ మంటూ రోడ్డుపై పయనం మరికొందరు పొద్దుపోయే వరకూ సెల్ఫోన్లలో బిజీ ప్రమాదాలు, అనారోగ్యం బారిన పడుతోన్న యువత మానసిక, శారీరక సమస్యలతో సతమతం -
తుపాకీతో కాల్చుకుని సీఆర్పీఎఫ్ జవాన్ ఆత్మహత్య
కనగానపల్లి: ఆర్థిక సమస్యలు తాళలేక శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన సీఆర్పీఎఫ్ జవాను కంచుకుంట మురళి (30) తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి సొంతూరు కనగానపల్లి మండలంలోని శివపురం కొట్టాల. ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని రాయపూర్లో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. శివపురం కొట్టాల గ్రామానికి చెందిన బోయ ముత్యాలప్ప కుమారుడు కంచుకుంట మురళి సీఆర్పీఎఫ్ జవాన్గా ఏడేళ్ల నుంచి ఛత్తీస్గఢ్లోని రాయపూర్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. మురళి తల్లిదండ్రులు నాగలక్ష్మి, ముత్యాలప్ప వ్యవసాయ కూలీలు.ఇంటర్ వరకు చదువుకున్న మురళి సీఆర్పీఎఫ్ జవాన్గా ఎంపికయ్యాడు. ఐదేళ్ల క్రితం అనంతపురానికి చెందిన పావనిని వివాహం చేసుకోగా.. వీరికి నాలుగేళ్ల బాబు, రెండేళ్ల పాప ఉన్నారు. తండ్రి ముత్యాలప్పకు స్కిన్ క్యాన్సర్ రావడంతో వైద్యం కోసం రూ.30 లక్షల దాకా ఖర్చు చేశాడు. అయినా తండ్రి ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. దీనికి తోడు చెల్లికి వివాహం చేయలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడు. అలాగే ఏడాది క్రితం పెనుకొండ సమీపంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మురళి కారు కింద పడి దంపతులు మృతి చెందారు.దీంతో మృతుల కుటుంబానికి పరిహారం చెల్లించాల్సి రావడంతో ఆర్థిక ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన మురళి ఆదివారం రాత్రి అనంతపురంలోని పుట్టింట్లో ఉంటున్న తన భార్య పావనికి ఫోన్ చేసి కుటుంబ సమస్యలపై కొంతసేపు మాట్లాడాడు. ఆ తర్వాత కాసేపటికే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఆర్పీఎఫ్ అధికారులు చెప్పారు. మురళి మృతదేహానికి మంగళవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. -
అధికార పార్టీకి తొత్తులుగా మారిన అధికారుల
బత్తలపల్లి: అధికార పార్టీ నాయకులు ఏమి చెబితే అది చేస్తూ తమ అధికారాలను ప్రభుత్వాధికారులు దుర్వినియోగం చేస్తున్నారని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. బత్తలపల్లి మండలం డి.చెర్లోపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత, సింగిల్విండో మాజీ అధ్యక్షుడు చల్లా శ్రీరాములుకు చెందిన భూమి కోర్టు పరిధిలో ఉన్నా.. లెక్క చేయకుండా రెవెన్యూ, పోలీసు అధికారులు అక్రమంగా కంచె తొలగించిన విషయం తెలుసుకున్న ఆయన ఆదివారం గ్రామానికి చేరుకుని పరిశీలించారు. కోర్టు పరిధిలో ఉన్న భూ సమస్యలో అధికారులు జోక్యం చేసుకోవడం తగదన్నారు. టీడీపీ నాయకులు చెప్పినట్లు వ్యవహరించి తమ అధికారాలను వారు దుర్వినియోగం చేశారన్నారు. రైతుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం బాధిత రైతుతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కేతిరెడ్డి వెంట జెడ్పీ వైస్ చైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకరరెడ్డి, మండల కన్వీనర్ మాదిరెడ్డి జయరామిరెడ్డి, నాయకులు చల్లా కృష్ణమనాయుడు, చల్లా శ్రీరాములు, చల్లా మహేష్, చల్లా రంగానాయుడు, కల్చరల్ వింగ్ ప్రెసిడెంట్ షరాబ్ యోగానంద ఆచారి, పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి అధికారులు తొలగించిన కంచెను పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి -
‘విశ్వ’ ఖ్యాతి..అధోగతి
అనంతపురం: రాయలసీమకే తలమానికంగా భాసిల్లుతున్న జేఎన్టీయూ (అనంతపురం) క్రమంగా ప్రాభవం కోల్పోతోంది. అనుబంధ కళాశాలలన్నీ అటానమస్ (స్వయం ప్రతిపత్తి) హోదా పొందుతుండడంతో వర్సిటీ పాత్ర పరిమితం కానుంది. అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలలే వర్సిటీకి వెన్నుదన్ను. ఆయా కళాశాలల విద్యార్థులు చెల్లించే యూనివర్సిటీ కామన్ సర్వీసెస్ (యూసీఎస్) ఫీజులు వర్సిటీకి అతిపెద్ద ఆర్థిక వనరు. అయితే.. అనుబంధ కళాశాలల నుంచి స్వయం ప్రతిపత్తి కళాశాలలు (అటానమస్)గా మార్పు చెందుతున్నాయి. నూతన జాతీయ విద్యా విధానం–2020 ప్రకారం ప్రతి ఇంజినీరింగ్ కళాశాల అటానమస్గా మార్పు చెందాలని నిర్దేశించడం ఇందుకు ఊతంగా నిలుస్తోంది. జేఎన్టీయూ (అనంతపురం) పరిధిలో రాయలసీమ, నెల్లూరు జిల్లాలో మొత్తం 69 ఇంజినీరింగ్ కళాశాలలు అనుబంధంగా ఉండేవి. ఇందులో ఇప్పటికే 45 కళాశాలలు అటానమస్ హోదా దక్కించుకున్నాయి. మిగిలిన 24 ఇంజినీరింగ్ కళాశాలలు ప్రస్తుత (2025–26) విద్యా సంవత్సరానికి అనుబంధ కాలేజీలుగా వర్సిటీకి దరఖాస్తు చేసుకున్నాయి. వచ్చే సంవత్సరం నుంచి ఇవి కూడా స్వయం ప్రతిపత్తి పొందనున్నాయి. న్యాక్లో ఏ రకమైన గ్రేడ్ ఉన్నా అటానమస్ హోదా వస్తుంది. ఈ నేపథ్యంలో దరఖాస్తు చేసుకుంటే అటానమస్ హోదా ఇచ్చేస్తున్నారు. అనుబంధ కాలేజీలన్నీ అటానమస్ పొందితే జేఎన్టీయూ కేవలం క్యాంపస్ కళాశాల, పులివెందుల, కలికిరి, ఓటీపీఆర్ఐ కాలేజీలకే పరిమితం కానుంది. వర్సిటీ బాధ్యతలు నామమాత్రం అనుబంధ కాలేజీలన్నీ అటానమస్ పొందితే జేఎన్టీయూ(ఏ) కేవలం డిగ్రీలు అందించే కార్యాలయంలా మారిపోనుంది. సిలబస్ రూపకల్పన, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, మార్కుల కేటాయింపులో అటానమస్ కళాశాలలు స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. మార్కులు వర్సిటీకి పంపితే స్నాతకోత్సవ డిగ్రీ మాత్రం అందజేస్తుంది. ఈ నేపథ్యంలో వర్సిటీ బాధ్యతలు నామమాత్రం కానున్నాయి. ఒకప్పుడు ఏటా లక్ష మంది విద్యార్థులు వర్సిటీ కింద ఉండేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 10 వేలకు పడిపోయింది. వచ్చే ఏడాది మరింత తగ్గి కేవలం మూడు వేలకు పరిమితం కానుంది. దీంతో యూసీఎస్ ఫీజులు కూడా వర్సిటీకి రావు. పురోగతికి కానరాని చర్యలు జేఎన్టీయూ (ఏ) పరిధిలో విద్యార్థులు లేని పరిస్థితి ఏర్పడనుంది. ఈ క్రమంలో క్యాంపస్ కళాశాలలో అడ్మిషన్లు గణనీయంగా పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కాలానుగుణంగా పరిశ్రమల అవసరాలకు తగిన మానవ వనరులను అందించే దిశగా ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు సరికొత్త కోర్సులు అమలు చేస్తూ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. అయితే 78 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన జేఎన్టీయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రతిభావంతులైన విద్యార్థులు చదువుకునే క్యాంపస్ కళాశాలలో కొత్త కోర్సుల అమలుకు యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. బీటెక్ కంప్యూటర్ సైన్సెస్ విభాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లర్నింగ్ కోర్సును ప్రవేశపెట్టేందుకు 2023లోనే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. పాలకమండలి ఆమోదం సైతం లభించింది. అయితే, ఇందుకు సంబంధించిన ఫైలు రాష్ట్ర ఉన్నత విద్యా మండలిలో పెండింగ్ పడిపోయింది. దీనిపై వర్సిటీ అధికారులు శ్రద్ధ పెట్టడం లేదు. తగ్గిపోతున్న జేఎన్టీయూ(ఏ) ప్రాభవం ఇప్పటికే 45 కళాశాలలకు అటానమస్ వచ్చే ఏడాది అన్ని కళాశాలలకూ స్వయం ప్రతిపత్తి క్యాంపస్, పులివెందుల, కలికిరి కళాశాలలకే పరిమితం కానున్న వర్సిటీ -
అద్భుతం.. అద్వితీయం
పట్టు వస్త్రంపై దేశంలోని అన్ని భాషలలో శ్రీరామ నామాలను రూపొందించిన దృశ్యం ధర్మవరం: అతడో సాధారణ చేనేత కార్మికుడు.. అద్భుతమైన మేఽథాసంపత్తి ఉంది.. పట్టుచీరల డిజైన్లను రొటీన్కు భిన్నంగా కళాత్మకంగా రూపొందించడం అతడి ప్రత్యేకత. 2009లో హ్యాండ్లూమ్ విభాగంలో క్లస్టర్ డిజైనర్గా ఉద్యోగం పొందారు. అప్పటి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డులు, ప్రశంసా పత్రాలు పొందారు. తనలోని కళను పలువురికి నేర్పుతూ పట్టు విశిష్టతను ప్రపంచానికి డిజైన్ల రూపంలో చాటుతున్న ధర్మవరానికి చెందిన నాగరాజు ఈ ఏడాది ఆగస్టు 7న చేనేత దినోత్సవం సందర్భంగా ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ డిజైనర్ అవార్డు అందుకోనున్నారు. సాంబ సినిమాతో ఆరంభం ధర్మవరం పట్టణానికి చెందిన జూజారు నాగరాజు మగ్గం నేసుకుంటూ డిగ్రీ వరకు చదివారు. డిజైనింగ్ మీద మక్కువతో బెంగుళూరు, హైద్రాబాద్లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేశారు. అనంతరం పట్టుచీరలపై కళాత్మకంగా వైరెటీ డిజైన్లు రూపొందిస్తూ తనలోని కళాకారుడిని ఈ లోకానికి పరిచయం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన సాంబ చిత్రంలో ఓ సన్నివేశానికి గానూ శంఖు, చక్రం, నామాలతో కూడిన డిజైన్ను బంగారు తాపడంతో పట్టు వస్త్రంపై 2004లో నాగరాజు రూపొందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిజైన్ ప్రాచూర్యం పొందడంతో నాగరాజుకు పేరు వచ్చింది. ఆ తర్వాత 2009లో అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం ప్రతిభ ఉన్న వారికి ఔట్ సోర్సింగ్ ద్వారా హ్యాండ్లూమ్లో డిజైనర్ ఉద్యోగాలకు ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో ధర్మవరం హ్యాడ్లూమ్ క్లస్టర్ డిజైనర్గా నాగరాజుకు ఉద్యోగం వచ్చింది. ధర్మవరంతో పాటు ముదిరెడ్డిపల్లి, మంగళగిరి తదితర ప్రాంతాలలో చేనేత కార్మికులకు డిజైనింగ్ రంగంలో శిక్షణ ఇచ్చారు. అందుకున్న అవార్డులు ● 2006లో ఉమ్మడి రాష్ట్రంలో డిజైన్ డెవలప్మెంట్లో ప్రతిభ చాటినందుకు గాను రాష్ట్ర స్థాయి అవార్డును అందుకున్నారు. ● 2020, మార్చిలో ఢిల్లీలో నేషనల్ హ్యాండ్లూమ్ డెవల్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాతీయ అవార్డును అందుకున్నారు. మహాత్ముని ఉప్పు సత్యాగ్రహం చిత్రాలను పట్టు వస్త్రంపై రూపొందించినందుకు గాను ఈ అవార్డు దక్కింది. ● 2024, ఆగస్టు 15న ఏపీ అట్ హోం కార్యక్రమంలో భాగంగా రాజ్భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో చేనేతల తరపున పాల్గొనే అవకాశం దక్కింది. ● ఈ ఏడాది మార్చిలో రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన వివిధ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో పాల్గొని చేనేత విశిష్టతను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు వివరించారు. ● ఈ ఏడాది ఆగస్టు 7న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే చేనేత దినోత్సవంలో ఉత్తమ డిజైనర్ అవార్డును నాగరాజును అందుకోనున్నారు. పట్టు వస్త్రాలపై విభిన్నమైన డిజైన్లతో ఆకట్టుకుంటున్న నాగరాజు ఉత్తమ డిజైనర్గా జాతీయస్థాయి అవార్డులు అందుకున్న సాధారణ చేనేత కార్మికుడు ఎంతో ఆనందంగా ఉంది ప్రశంసలు అందుకున్న డిజైన్లు ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎగ్జిబిషన్లో పట్టు వస్త్రాలపై తాజ్మహల్ చిత్రాలను రూపొందించి ప్రదర్శించారు. 2016లో లేపాక్షి ఆలయంలోని శిల్పాలను పట్టు వస్త్రంపై చేనేత మగ్గం సాయంతో అద్భుతంగా తయారు చేసి ప్రదర్శించారు. 2017, ఫిబ్రవరిలో ఇస్రో రాకెట్ ప్రయోగాల విజయవంపై హర్షం వ్యక్తం చేస్తూ ఇస్రో శాటిలైట్లు, రాకెట్ చిత్రాలను పట్టు వస్త్రంపై తయారు చేసి విజయవాడలో ప్రదర్శించారు. ప్రముఖ పుణ్య క్షేత్రం పానకాల లక్ష్మీనరసింహస్వామి చిత్రం, గాలి గోపురాన్ని పట్టు వస్త్రంపై డిజైన్ చేసి ఆలయానికి అందజేశారు. 2019లో గాంధీ జయంతిని పురస్కరించుకుని మహాత్ముని దండీ యాత్రను పట్టు వస్త్రంపై రూపొందించి ఢిల్లీలో జరిగిన నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో రాష్ట్రం తరపున ప్రదర్శించారు. 2019, డిసెంబర్లో సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి జన్మదినం సందర్భంగా పట్టు వస్త్రంపై సీఎం జగన్ చిత్రాన్ని రూపొందించి హ్యాండ్లూమ్ కార్యాలయం తరపున నేతన్న నేస్తం పథకం ప్రారంభంలో ధర్మవరంలో జగనన్నకు బహూకరించారు. ఆర్డీటీ వ్యవస్థాపకుడు ఫాధర్ ఫెర్రర్ సతీమణి అన్నే ఫెర్రర్ చిత్రాన్ని పట్టు వస్త్రంపై తయారు చేసి ఆమెకు అందజేశారు. 2021లో అయోధ్యలోని రామయ్యకు కానుకగా శ్రీరామ కోటి పట్టు వస్త్రాన్ని తయారు చేసి పంపారు. 2022లో త్రీడీ శారీ తయారు చేసి ఒకే పట్టు చీరపై మూడు డిజైన్లు రూపొందించి అబ్బుర పరిచాడు. ఈ ఏడాది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ చిత్రంతో కూడిన పట్టు వస్త్రాన్ని తయారు చేసి ఆమెకు బహూకరించారు. సాధారణ చేనేత కార్మికుడిగా జీవనం సాగిస్తున్న నేను.. ఆసక్తితో డిజైనర్గా శిక్షణ తీసుకుని ఎన్నో విభిన్నమైన డిజైన్లను రూపొందించాను. చేనేతల సత్తాను జాతీయ స్థాయిలో చాటాలన్నదే నా సంకల్పం. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో పలు అవార్డులతో పాటు ఎన్హెచ్డీసీ తరపున జాతీయ అవార్డు అందుకున్నా. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఉత్తమ డిజైనర్గా జాతీయస్థాయి అవార్డుకు ఎంపిక చేయడం ఎంతో ఆనందంగా ఉంది. –నాగరాజు, డిజైనర్, ధర్మవరం -
టిప్పర్ ఢీ – వృద్ధుడి మృతి
ముదిగుబ్బ: టిప్పర్ ఢీ కొనడంతో ముదిగుబ్బ మండలం రామస్వామినాయక్ తండాకు చెందిన శ్రీనివాసులునాయక్ను(62) దుర్మరణం పాలయ్యాడు. స్వగ్రామం నుంచి ముదిగుబ్బ–పుట్టపర్తి రహదారిపై ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ ఢీకొంది. మృతునికి భార్య తులసీబాయి, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివాహిత ఆత్మహత్యపరిగి: మండలంలోని మోదా పంచాయతీ పుట్టగూర్లపల్లిలో వివాహిత మంజుల(22) ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ రంగడుయాదవ్ తెలిపిన మేరకు.. పుట్టగూర్లపల్లి నివాసి శ్రీనివాసులు తన కుమార్తె మంజులను అదే గ్రామానికి చెందిన సమీప బంధువు కుమారుడు జయచంద్రకు ఇచ్చి నాలుగేళ్ల క్రితం వివాహం జరిపించాడు. కూలి పనులతో జీవనం సాగించేవారు. ఏడాది కాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమె ఆదివారం నొప్పి భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుంది. గమనించిన బంధువులు వెంటనే హిందూపురంలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి తండ్రి శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నేడు ప్రజాసమస్యల పరిష్కార వేదిక ప్రశాంతి నిలయం: కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ చేతన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పీజీఆర్ఎస్ మందిరంలో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ప్రజాసమస్యల పరిష్కార వేదిక ఉంటుందని, ప్రజలు తమ సమస్యలపై నేరుగా అర్జీలు అందజేయవచ్చని పేర్కొన్నారు. నేడు పోలీస్ కార్యాలయంలో... పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ రత్న తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అందజేస్తే పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఆంధ్రా క్రికెట్ జట్టులో చోటుఅనంతపురం: ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకూ ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులో జరిగే వన్డే క్రికెట్ పోటీల్లో ప్రాతినిథ్యం వహించే ఆంధ్రా అండర్–19 పురుషుల క్రికెట్ జట్టులో జిల్లాకు నుంచి ఐదుగురికి చోటు దక్కింది. వీరిలో కోగటం హనీష్ వీరారెడ్డి, టీవీ సాయి ప్రతాపరెడ్డి, ఎ.జయంత్ కృష్ణ (తాడిపత్రి), ఎం.భువనేశ్వర్ (గుత్తి), ఎస్.రెహాన్ (గుంతకల్లు) ఉన్నారు. -
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది
సాక్షి పుట్టపర్తి: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ శంకర్ నారాయణ అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో జిల్లా పరిషత్తు చైర్పర్సన్ హారికపై టీడీపీ నేతలు దాడి చేయడం దారుణమన్నారు, మహిళ అని కూడా చూడకుండా దాడులకు పాల్పడడం రెడ్ బుక్ రాజ్యాంగానికి నిదర్శనమని అభివర్ణించారు. దౌర్జన్యాలు, దాడులతో ఆంధ్రప్రదేశ్ బిహర్ను తలపిస్తోందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయన్నారు. మహిళలు స్వేచ్ఛగా బయట తిరగాలన్నా భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. చైర్పర్సన్పై దాడి జరిగితే ఇంతవరకు ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ‘ఆశల్ని’ ఆపేశారు! అధికారుల అలసత్వం.. రైతులకు అశనిపాతం ● హెచ్చెల్సీలో పూర్తి కాని మరమ్మతు పనులు ● సరిహద్దులో ఆగిన తుంగభద్ర జలాలు బొమ్మనహాళ్: రైతుల ఆశలపై అధికారులు నీళ్లు చల్లారు. ముందస్తుగా నీరొచ్చాయని పడిన సంతోషాన్ని ఆదిలోనే దూరం చేశారు. గంగపూజ నిర్వహించి స్వాగతించాల్సిన సమయంలో ఇలా జరగడం దురదృష్టకరమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుంగభద్ర జలాశయం నుంచి ఈనెల 10న నీటిని హెచ్చెల్సీ కాలువకు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం రాత్రికి బొమ్మనహాళ్ సరిహద్దులోని 105–272 కిలోమీటర్ వద్దకు నీళ్లు చేరుకున్నాయి. అయితే, హెచ్చెల్సీలో మరమ్మతు పనులు ఇంకా కొనసాగుతుండడంతో ఇబ్బంది లేకుండా 105వ కిలోమీటర్ వద్ద రెగ్యులేటర్లను కిందికి దించి వేసి నీరు ఆంధ్రాలోకి ప్రవేశించకుండా ఆపేశారు. పర్యవేక్షణ కరువై ఇష్టారాజ్యం.. కాంట్రాక్టర్ల అలసత్వం.. పర్యవేక్షణ ఇంజినీర్ల నిర్లక్ష్యం కారణంగా హెచ్చెల్సీలో మరమ్మతు పనులు అనుకున్నట్లుగా సాగడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 115 నుంచి 138 కిలోమీటర్ల వరకు లైనింగ్ పనులు, నాగలాపురం వద్ద, ఉద్దేహాళ్–మల్లికేతి బ్రిడ్జిలు పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో పనుల పూర్తికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటివరకూ నీటిని సరిహద్దుల్లోనే ఆపేయాల్సి ఉంటుంది. మరోవైపు రైతులు ఇప్పటికే బోర్ల కింద వరి నారు, మిరప నార్లు పోసుకున్నారు. తుంగభద్ర జలాలు వచ్చి ఉంటే నారుకు బాగుండేదని, బోరు నీటికి నారు పైరు ఎర్రగా మారుతుందని రైతులు వాపోతున్నారు. ఈ క్రమంలో మరమ్మతు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయించి తమకు సాంత్వన చేకూర్చాలని రైతులు కోరుతున్నారు. -
దిగజారుతున్న విద్యా ప్రమాణాలు
అనంతపురం ఎడ్యుకేషన్: మెగా పీటీఎం, యోగాంధ్ర, ట్రైనింగులు తదితర బోధనేతర కార్యక్రమాలకు ఉపాధ్యాయులను మళ్లించడంతో రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.రామాంజనేయులు ఆందోళన వ్యక్తం చేశారు. కాకినాడ వేదికగా ఎస్టీయూ రాష్ట్ర ద్వితీయ కార్యవర్గ సమావేశం ఆదివారం జరిగింది. జిల్లా నుంచి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శితో పాటు పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి .రామాంజనేయులు మాట్లాడారు. ప్రశాంతమైన వాతావరణంలో బోధన అభ్యసన కార్యక్రమాలు జరిగేలా విద్యాశాఖ దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు 11వ పీఆర్సీ బకాయిలు చెల్లించాలన్నారు. పెండింగ్లో ఉన్న మూడు డీఏలు, 12వ పీఆర్సీ వేసి వెంటనే ఐఆర్ ప్రకటించాలన్నారు. అలాగే సీపీఎస్ బకాయిలు చెల్లించాలని, సరెండర్ లీవ్ ఎన్క్యాస్మెంట్ మూడేళ్లయినా చెల్లించలేదన్నారు. పురపాలక, నగరపాలక పాఠశాలల్లో మిగిలిపోయిన స్కూల్ అసిస్టెంట్ పోస్టులను అర్హత కలిగిన ఉపాధ్యాయులతో నెలవారీ ప్రమోషన్ల ద్వారా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఎస్టీయూ జిల్లా ప్రధానకార్యదర్శి రామాంజనేయులు -
● చూసిన కనులదే భాగ్యం..
పుట్టపర్తి అర్బన్: మండలంలోని సుబ్బరాయునిపల్లి సమీపంలో చౌటవంకలో వెలసిన సప్తమాతృక అక్కమ్మ దేవతల జాతర ఆదివారం వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మూడు రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో భాగంగా ఆదివారం బాలికల కుంకుమార్చన, బాలుర నెమలి ఈకల నివేదన కార్యక్రమంతో జాతర పూర్తయింది. ఈ సందర్భంగా అక్కమ్మ దేవతల మూల విరాట్లను విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం సాయంత్రం అక్కమ్మ దేవతలకు ప్రతీకగా ఏడుగురు బాలికలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గద్దైపె కుంకాలు చెరిగారు.ఎడ్ల బండ్లను ఊరేగించారు. -
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు కోర్టు సమన్లు
సాక్షి టాస్క్ఫోర్స్: ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం సివిల్ జడ్జి కోర్టు సమన్లు జారీ చేసింది. తన పరువుకు భంగం కలిగించేలా అసత్యాలతో కూడిన వార్తను ప్రచురించిన ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని గతంలో హిందూపురం టూటౌన్ సీఐగా పనిచేసిన సీఐ రియాజ్ అహ్మద్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు.వ్యక్తిగత అంశాలను ఏబీఎన్ చానల్, ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురించి తన పరువుకు నష్టం కలిగించారంటూ సదరు సీఐ 2024లో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసును విచారించిన కోర్టు శుక్రవారం ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో పాటు స్థానిక విలేకరులకూ నోటీసులు పంపింది. ఆగస్టు 18న కోర్టుకు హాజరు కావాలని అందులో పేర్కొంది.కాగా.. తనకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సంబంధాలున్నాయని, ఎన్నికల సమయంలో సహకరించేందుకే తనను హిందూపురం పంపించారని అబద్ధపు ప్రచారం చేసినట్టు సీఐ రియాజ్ అహ్మద్ తన పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాకుండా తాను 2024 జూన్ 6న సస్పెండ్ కాగా, 3వ తేదీనే సస్పెండ్ అయినట్టు కథనాలు ప్రసారం చేశారని, దురుద్దేశ పూర్వకంగానే ఇలా ప్రసారం చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. -
హిందూపురం.. అభివృద్ధి శూన్యం
చిలమత్తూరు: రాష్ట్రంలో కూటమి సర్కారు కొలువుదీరి ఏడాది పూర్తయింది. అయితే ఎన్నికల హామీల అమలును విస్మరించడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనలోనూ విఫలమైంది. అయినా ఏడాది పాలనలో హిందూపురం నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెట్టిందంటూ టీడీపీ నేతలు కరపత్రాల ద్వారా ప్రచారం చేసుకోవడం విమర్శలకు తావిస్తోంది. అభివృద్ధి కోసం ఏకంగా రూ.171.2 కోట్లు ఖర్చు చేసినట్టు పేర్కొంటున్నా పనులు ఎక్కడ చేశారు.. ఎంత వెచ్చించారు అన్న వివరాలు పొందుపరచలేదు. ప్రజాప్రతినిధి పీఏలు, టీడీపీ నాయకులు, కాంట్రాక్టర్ల జేబులు నింపుకోవడానికి కొన్ని పనులు చేపట్టి, బిల్లులు చేసుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చేసిన పనులకే బిల్లులు! హిందూపురం పట్టణంలో సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేదు. రోడ్లపైనే మురుగు పారుతున్నా పట్టించుకునే వారు లేరు. పూడికతీత పనుల్లో కాంట్రాక్టర్లు అక్రమాలకు పాల్పడి పనులు చేస్తున్నట్టు జియో ట్యాగ్ చేసి, చేసిన పనులకే బిల్లులు పెట్టించుకునే ఎత్తుగడ వేశారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు కౌన్సిల్లో ప్రశ్నించినా జియో ట్యాగింగ్ చూపి నిధుల మంజూరుకు మార్గం సుగుమం చేసుకున్నారు. ఇలా పట్టణంలో నాసిరకం పనులు చేసి రూ.లక్షలు దండుకుంటున్న వైనాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ● పట్టణంలో తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న కాలనీలు అనేకం ఉన్నాయి. రూ.18.5 కోట్లు ఖర్చు చేసి సీసీ డ్రెయిన్లు, రోడ్లు, వీధి దీపాలు వేశామని ప్రచారం చేసుకుంటున్న నాయకులు.. మరి రోడ్లపైకి మురుగు ఎందుకు వస్తుందో సమాధానం చెప్పలేకపోతున్నారు. మున్సిపాలిటీలో రోడ్లు అధ్వానం.. ఏడాది పాలనపై ముద్రించిన కరపత్రంలో పేర్కొన్నట్లు హిందూపురం మున్సిపాలిటీలో రోడ్లు లేవు. ఏడాది క్రితం పరిగి బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే బాలకృష్ణ భూమిపూజ చేసిన రోడ్డు పనులు ఇప్పటికీ మొదలు కాలేదు. రైల్వే రోడ్డు విస్తరణ ముందుకు సాగలేదు. ఇరుకై న గుంతల రోడ్డులోనే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో ఇది ప్రధానమైన రోడ్డు కాగా.. ఆక్రమణదారులకు సహకరించే క్రమంలో విస్తరణ పనులు కావాలనే ఆలస్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొటిపి రహదారి గుంతలమయంగా మారింది. డీబీ కాలనీలో రోడ్లే లేవు. అక్కడక్కడా గుంతలు పూడ్చి వాటిని రోడ్ల మరమ్మతుల కింద పాలకులు జమకట్టేశారు. వీటి కోసం రూ.12 కోట్లు ఖర్చు చేశామని పేర్కొనడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ● నియోజకవర్గంలోని లేపాక్షి, చిలమత్తూరు మండలాల్లో పొలాలకు దారుల ఏర్పాటు పేరుతో ఉపాధి హామీ నిధులు వెచ్చించారు. అయితే రియల్టర్ల భూములున్న ప్రాంతాలకు రోడ్లు వేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. చిలమత్తూరు మండలంలో రోడ్లు లేని గ్రామాలున్నా వాటిని ఏమాత్రమూ పట్టించుకోలేదు. చిలమత్తూరులో జనవరిలో అంబేడ్కర్ విగ్రహం నుంచి వడ్డి చెన్నంపల్లి వరకు, ప్రభుత్వ ఆస్పత్రి వరకు రహదారి నాసిరకంగా వేసి బిల్లులు చేసుకున్నారు. ఆ రోడ్లు కూడా పెద్ద వర్షం వస్తే కంకర తేలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. సంజీవరాయునిపలి రహదారి గుండా రోడ్డు మరమ్మతులు నాసిరకంగా చేసి మమ అనిపించారు. ఎస్.ముద్దిరెడ్డిపల్లి, మదిరేపల్లి వంటి రహదారుల దుస్థితి కూడా అధ్వానంగానే ఉంది. అభివృద్ధి అంతా బూటకం ఎమ్మెల్యే బాలకృష్ణ ఏడాది పాలనలో నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.కోట్లు ఖర్చు చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఎన్నికల సమయం తప్ప ఆయన ఏనాడైనా ప్రజల బాగోగులు విన్నారా..? చుట్టం చూపుగా అలా రావడం.. వెళ్లిపోవడం తప్పితే ప్రజలకు చేసిందేమీ లేదు. స్థానికేతరులకు పట్టం కట్టిన ప్రజలపై ఇలా చిన్నచూపు చూడటం సరికాదు. ప్రజల ఆలోచనల్లోనూ మార్పు రావాలి. – టీఎన్ దీపిక, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, హిందూపురం మౌలిక సదుపాయాలూ కరువే ప్రజల సమస్యలు వినేవారెవరు? అతిథిగా అలా వచ్చి వెళ్లిపోతున్న ఎమ్మెల్యే బాలకృష్ణ ఇదీ హిందూపురం నియోజకవర్గంలోని దుస్థితి -
ఆరోగ్య పరిరక్షణపై దృష్టి
ధర్మవరం రూరల్: ప్రజలు జీవనశైలి, ఆహార నియమాలు, శారీరక శ్రమ, వ్యాధులపై అవగాహన కలిగి ఉండటంతో పాటు ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజాబేగం సూచించారు. శనివారం ఆమె పోతుకుంట బీసీ కాలనీలో పర్యటించారు. ఇటీవల గుండెపోటుతో మరణించిన వినయ్ కుటుంబాన్ని కలసి, మరణానికి గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం ప్రాథమిక పాఠశాలలో కాలనీ ప్రజలతో సమావేశం నిర్వహించారు. బీపీ, షుగర్, గుండె జబ్బులు, ఇతర సాంక్రమిక వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరి దినచర్యలో యోగా ఒక భాగం కావాలన్నారు. ముఖ్యంగా యువత జీవనశైలి, ఒత్తిడి మీద విస్తృతంగా అవగాహన కలిగి ఉండాలన్నారు. గుండె జబ్బుల మీద రాష్ట్ర ప్రభుత్వం ‘స్టెమీ’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ చెన్నారెడ్డి, మండల వైద్యాధికారులు పుష్పలత, దిలీప్, హెల్త్ సూపర్వైజర్ రాజశేఖర్రెడ్డి, ఎంఎల్హెచ్పీ గౌతమి, ఏఎన్ఎం శ్యామల, హెల్త్ అసిస్టెంట్ తిరుపాల్ నాయక్, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బంగారు దుకాణాలపై మెరుపు దాడులు హిందూపురం: కర్ణాటక పోలీసులు చోరీలకు సంబంధించి ఆభరణాల రికవరీలో భాగంగా హిందూపురంలోని బంగారు దుకాణాలపై శనివారం రాత్రి మెరుపు దాడులు చేశారు. మెయిన్ బజారులోని పలు షాపుల వద్ద విచారణ చేపట్టారు. ఒకటి, రెండు షాపుల వద్ద కొంత బంగారు సొత్తు రికవరీ చేసినట్లు సమాచారం. దొంగ ఏ షాపు పేరు చెప్తే ఆ షాపు నిర్వాహకుడిని వేధింపులకు గురిచేస్తారని పలువురు దుకాణదారులు భయపడిపోతున్నారు. పోలీసులు మాత్రం దొంగసొత్తులను హిందూపురం, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో కొందరు వ్యాపారులు కొంటుంటారని చెబుతున్నారు. బాలికపై అసభ్య ప్రవర్తనఅనంతపురం: బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీసులు ‘పోక్సో’ కేసు నమోదు చేశారు. వివరాలు.. అనంతపురానికి చెందిన బాలిక తల్లిదండ్రులు వ్యాపారం నిమిత్తం రోజూ బయటకు వెళ్లేవారు. 9వ తరగతి చదువుతున్న బాలిక శనివారం సాయంత్రం 4 గంటలకు పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వెళ్లింది. ఇంట్లో ఉన్న తాతకు కాఫీ చేసి ఇవ్వడానికి స్టవ్ వెలిగించింది. ఈ క్రమంలోనే గ్యాస్ లీకవుతోందని గమనించిన బాలిక... విషయాన్ని తన తాతకు చెప్పింది. వెంటనే ఆయన తమ ఇంటి సమీపంలో కిరాణా కొట్టు నిర్వహిస్తున్న శివారెడ్డి కుమారుడు ఆనంద రెడ్డికి తెలియజేశాడు. ఈ క్రమంలోనే ఇంటి లోపలికి వెళ్లిన ఆనంద రెడ్డి బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దంటూ బెదిరించాడు. దీనిపై బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నాలుగో పట్టణ పోలీసులు ‘పోక్సో’ చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. -
అవగాహన కల్పిస్తున్నాం
సాధారణ ప్రసవానికి.. సిజేరియన్కు మధ్య తేడాల గురించి, సిజేరియన్ వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పిస్తున్నాం. ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్లు ఎక్కువగా చేస్తున్నారనే విషయం మా దృష్టికి రాలేదు. అలాంటి ఫిర్యాదులు వస్తే తప్పకుండా విచారణ చేపట్టి తగిన చర్యలకు సిఫారసు చేస్తాం. ప్రజారోగ్యం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. ప్రభుత్వాస్పత్రుల్లో పని చేసే వైద్యులు నిర్ణీత సమయంలో ఆస్పత్రుల్లోనే ఉండాలి. ఆ తర్వాత ప్రైవేటు ఆస్పత్రుల్లో పని చేసినా డ్యూటీ కాల్ వస్తే.. వెంటనే వెళ్లాలనే నిబంధన అమలు చేస్తున్నాం. – ఫైరోజాబేగం, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి -
జనాభా పెరుగుదల అభివృద్ధికి అవరోధం
● డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజాబేగం పుట్టపర్తి అర్బన్: జనాభా పెరుగుదల అభివృద్ధికి అవరోధమని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఫైరోజాబేగం అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శుక్రవారం వైద్య, ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని డీసీహెచ్ మధుసూదన్తో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జనాభా పెరుగుదల వల్ల అన్ని రకాలుగా ఇబ్బందులు ఉంటాయన్నారు. జనాభా నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సునీల్, డెమో బాబాఫకృద్ధీన్, సీహెచ్ఓ శివరాం, ఐసీడీఎస్, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాద కారకుడికి జైలు పెనుకొండ: వాహనాన్ని అజాగ్రత్తగా నడిపి తనతో పాటు మరో ముగ్గురిని క్షతగాత్రులను చేసిన ఓ వ్యక్తికి పెనుకొండ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ బొజ్జప్ప 3 నెలల జైలు శిక్ష విధించారు. ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు... అనంతపురం జిల్లా కూడేరు మండలం కమ్మూరు గ్రామానికి చెందిన అమర్నాథరెడ్డి, రఘునాయక్, సుధాకర్, కుళ్లాయప్ప తదితరులు ఓ పని నిమిత్తం 2018 జూన్ 18న క్రూజర్ వాహనంలో పెనుకొండకు బయలుదేరారు. వాహనం అమర్నాథరెడ్డి నడుపుతున్నాడు. వీరి వాహనం ఆర్టీఓ చెక్పోస్ట్, రబ్బర్ ఫ్యాక్టరీ మధ్యకు రాగానే టైరు పేలి బోల్తా పడింది. ఈ ఘటనలో వాహనంలోని వ్యక్తులందరూ గాయపడ్డారు. ఈ మేరకు అప్పట్లో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తులో ప్రమాదానికి అమర్నాథ్రెడ్డి కారకుడిగా నిర్ధారించి కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన పెనుకొండ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ బొజ్జప్ప నేరం రుజువు కావడంతో ముద్దాయి అమర్నాథ్రెడ్డికి 3 నెలల జైలు, రూ.1,500 జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పారని ఎస్ఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. డెంగీతో బాలింత మృతి గార్లదిన్నె: డెంగీ జ్వరంతో ఓ బాలింత మృత్యువాతపడింది. ఈ ఘటనతో కల్లూరులో విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. బుక్కరాయసముద్రం మండలం పి.కొత్తపల్లికి చెందిన షేక్ చాందిని (22)కి ఏడాదిన్నర క్రితం గార్లదిన్నె మండలం కల్లూరుకు చెందిన షేక్ సాదిక్ అనే కూలీతో వివాహమైంది. రెండు నెలల క్రితం చాందిని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో ఈ నెల ఆరో తేదీన చాందినికి జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు పామిడి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి డెంగీ జ్వరం అని తేల్చారు. దీంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని సవీర ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స చేయించినా జ్వరం తగ్గకపోవడంతో చాందిని శుక్రవారం మృతి చెందింది. భార్య మరణాన్ని భర్త జీర్ణించుకోలేకపోయాడు. పసికందును ఎత్తుకుని.. తల్లిలేని లోటు ఎవరు తీరుస్తారంటూ కన్నీరుమున్నీరయ్యాడు. -
పెద్దమ్మతల్లికి ఆషాఢ అలంకరణ
ధర్మవరం రూరల్: పట్టణంలోని సాలే వీధిలో వెలసిన పెద్దమ్మతల్లి ఆషాఢ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢ శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చకుడు వెంకటేష్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారిని చీరలతో ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా మహిళలు లలితా సహస్రనామ పారాయణం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లాకు వర్ష సూచన బుక్కరాయసముద్రం: రాగల ఐదు రోజులూ ఉమ్మడి అనంతపురం జిల్లాకు వర్ష సూచన ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. భారీ గాలులతో కూడిన చిరు జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు రేకులకుంటలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ శంకర్బాబు, వాతావరణ విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నారాయణస్వామి తెలిపారు. ఈ మేరకు వారు శుక్రవారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. -
16న రామగిరి ఎంపీపీ ఎన్నిక
రామగిరి: టీడీపీ అరాచకంతో రెండుసార్లు వాయిదా పడిన రామగిరి మండల పరిషత్ అధ్యక్ష పదవికి ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈనెల 16వ తేదీ ఎన్నిక ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెజార్టీ లేకపోయినా ఎలాగైనా రామగిరి ఎంపీపీ పీఠం దక్కించుకునేందుకు టీడీపీ కుయుక్తులు, కుట్రలు, అల్లర్లకు పాల్పడగా... ఇప్పటికే రెండు సార్లు ఎన్నిక వాయిదా పడింది. తాజాగా అధికారులు మరోసారి నోటిఫికేషన్ ఇవ్వగా..ఈసారైనా ఎన్నిక సజావుగా జరిగేనా అంటూ మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. 10 స్థానాల్లో 9 మంది వైఎస్సార్సీపీ అభ్యర్థులే.. రామగిరి మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలుండగా... గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పేరూరు– 1, పేరూరు– 2, పెద్దకొండాపురం, ఎంసీ పల్లి, పోలేపల్లి, కుంటిమద్ది, గంతిమర్రి, మాదాపురం, రామగిరి ...ఇలా 9 స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులే విజయ కేతనం ఎగురవేశారు. కేవలం నసనకోట స్థానాన్ని మాత్రం టీడీపీ దక్కించుకోగలిగింది. రామగిరి ఎంపీపీ స్థానాన్ని ప్రభుత్వం అన్రిజర్వడ్ మహిళకు కేటాయించడంతో రామగిరి స్థానం నుంచి గెలిచిన మీనుగ నాగమ్మను వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ ఎంపీపీ పీఠంపై కూర్చోబెట్టారు. అయితే ఆమె అనారోగ్యంతో 2024 డిసెంబర్ 30న మృతి చెందగా...రామగిరి ఎంపీపీ ఎన్నిక అనివార్యమైంది. కుట్రలు.. అల్లర్లతో వాయిదాల పర్వం.. ఎంపీపీ మీనుగ నాగమ్మ మృతి నేపథ్యంలో 2025 మార్చి 27న ఎంపీపీ ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో ప్రస్తుతం అధికారంలోకి ఉన్న టీడీపీ నాయకురాలు ఎలాగైనా తన సొంత మండలం రామగిరి పీఠం దక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నించారు. కేవలం ఒక్క ఎంపీటీసీ స్థానంతోనే పీఠంపై జెండా ఎగురవేయాలని కుట్ర చేశారు. ఈ క్రమంలోనే వైఎస్సార్ సీపీ గుర్తుపై గెలిచిన పేరూరు–1, మాదాపురం ఎంపీటీసీ సభ్యులకు టీడీపీ కండువాలు కప్పి తమవైపునకు తిప్పుకున్నారు. అంతేకాకుండా మిగతా వారినీ భయపెట్టి ఎలాగైనా ఎంపీపీ స్థానం దక్కించుకోవాలని భావించారు. ఈ క్రమంలోనే వైఎస్సార్ సీపీ తమ అభ్యర్థులకు రక్షణ కల్పించేందుకు మరో ప్రాంతానికి తరలించింది. సరిగ్గా ఎన్నిక రోజున వారందరినీ రామగిరికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో పేరూరు–2 ఎంపీటీసీ సభ్యురాలిని టీడీపీ నాయకులు బలవంతంగా తీసుకువెళ్లారు. దీంతో ఘర్షణ వాతావరణం చేటుచేసుకోగా, ఎన్నిక సమయానికి ఎంపీటీసీ సభ్యులు రామగిరి చేరుకోలేక పోయారు. దీంతో కోరం లేక ఎన్నికను వాయిదా వేశారు. అనంతరం మే 19న మరోసారి రామగిరి ఎంపీపీ ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చినా ...టీడీపీ నేతల బెదిరింపులతో ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు ఎంపీటీసీలు ప్రకటించారు. దీంతో ప్రభుత్వం తాజాగా మరోసారి నోటిఫికేషన్ ఇచ్చింది. ఒక్క అభ్యర్థితో పీఠం కోసం టీడీపీ పాకులాట రామగిరి ఎంపీపీ మహిళకు రిజర్వ్ అయ్యింది. టీడీపీ తరఫున గెలిచింది ఒకే ఒక ఎంపీటీసీ...పైగా మహిళ కాదు. అయినప్పటికీ స్థానిక టీడీపీ నాయకులు రామగిరి ఎంపీపీ స్థానాన్ని దక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈనెల 16న జరిగే ఎన్నికలో ఎలాగైనా విజయం సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం టీడీపీ వైపు నిలిచిన ముగ్గురు ఎంపీటీసీలూ పురుషులే కాగా, మహిళా స్థానం ఎలా దక్కించుకుంటారోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈసారైనా ప్రక్రియ సజావుగా జరిగేనా..? ఇప్పటికే టీడీపీ ఓవరాక్షన్తో రెండుసార్లు వాయిదా మెజార్టీతో పీఠం దక్కించుకునేందుకు సిద్ధమైన వైఎస్సార్ సీపీ -
కళ్లలో కారం కొట్టి.. కత్తితో పొడిచి!
కదిరి అర్బన్: వివాహేతర సంబంధం ఓ యువకుడి హత్యకు దారి తీసింది. ఇంటి పెద్ద మృతితో ముగ్గురు చిన్నారులు అనాథలయ్యారు. ఈ ఘటన కదిరి మండలం బందార్లపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు వివరాలిలాఉన్నాయి. బందార్లపల్లికి చెందిన నవీన్కుమార్ (35)కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మగ్గం పనితో కుటుంబాన్ని పోషించుకునేవాడు. నాలుగేళ్ల క్రితం అనారోగ్యం కారణంగా భార్య మృతి చెందింది. అప్పటి నుంచి చిన్నారుల ఆలనాపాలన చూసుకుంటూ వారిని నవీన్కుమార్ అల్లారుముద్దుగా పెంచుకుంటూ వస్తున్నాడు. పెడదోవ పట్టించిన పరిచయం.. బందార్లపల్లికి చెందిన విశ్వనాథ్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కదిరిలోని ఓ హోటల్లో విశ్వనాథ్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ నేపథ్యంలో కొన్నేళ్ల క్రితం విశ్వనాథ్ భార్యతో నవీన్కుమార్కు పరిచయమైంది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయాన్ని పసిగట్టిన విశ్వనాథ్ పలుమార్లు నవీన్కుమార్ను మందలించాడు. పద్ధతి మార్చుకోవాలని హితవు పలికాడు. నవీన్కుమార్ తీరులో మార్పు రాకపోవడంతో చివరకు కుటుంబ సభ్యులను పిలుచుకుని విశ్వనాథ్ కదిరికి మకాం మార్చాడు. అయినా నవీన్కుమార్ తరచూ తన భార్యతో చాటింగ్ చేస్తూ.. అప్పుడప్పుడు వచ్చి కలిసి వెళ్లిపోవడాన్ని గమనించిన విశ్వనాథ్ ఎలాగైనా నవీన్కుమార్ను అడ్డు తొలగించి, తన కుటుంబాన్ని కాపాడుకోవాలని అనుకున్నాడు. పథకం ప్రకారం.. ఈ క్రమంలో నవీన్కుమార్ హత్యకు పథకం రచించిన విశ్వనాథ్.. అతని ప్రతి కదలికపై నిఘా ఉంచాడు. శుక్రవారం ఉదయం బందార్లపల్లికి చేరుకుని గ్రామ శివారున కాపుకాశాడు. బహిర్భూమికని ఒంటరిగా వస్తున్న నవీన్కుమార్ ఎదురుపడగానే ఒక్కసారిగా కళ్లలో కారంపొడి చల్లాడు. అనంతరం సిద్ధంగా ఉంచుకున్న కత్తితో కడుపు, ఛాతీపై పలుమార్లు పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో నవీన్కుమార్ ప్రాణాలు కోల్పోయిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న కదిరి రూరల్ యూజీపీఎస్ సీఐ నిరంజనరెడ్డి, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, విశ్వనాథ్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. యువకుడి ప్రాణం బలిగొన్న వివాహేతర సంబంధం -
హిందీ టీచర్ను నియమించండి
హిందూపురం: తమకు హిందీ టీచర్ను నియమించాలని హిందూపురం మండలం తూముకుంట గ్రామ పాఠశాల విద్యార్థులు వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. తూముకుంటలోని పారిశ్రామిక వాడలో బిహార్, యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఎక్కువ సంఖ్యలో పనిచేస్తున్నారు. వీరి పిల్లలు 50 మంది స్థానిక పాఠశాలలో చదువుకుంటున్నారు. అయితే భాష తెలియని కారణంగా మరో వంద పిల్లలు పాఠశాలకు దూరమయ్యారు. విషయాన్ని పలుమార్లు అధికారులకు విన్నవించినా హిందీ టీచర్ను నియమించకపోవడంతో చివరకు స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ, మంత్రి సవిత దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి నాలుగు నెలల క్రితమే ఆర్జేడీతో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ఆదేశించారు. అయినా ఇప్పటి వరకూ హిందీ టీచర్ను నియమించకపోవడంతో వలస కార్మికుల పిల్లలు బడికి దూరమవుతున్నారు. దీంతో హిందీ టీచర్ను ఏర్పాటు చేసి, తమ పిల్లలు భవిష్యత్తును కాపాడాలని వలస కార్మికులు కోరుతున్నారు. బాలికలకు రక్షణ కరవు.. ప్రస్తుతం తూముకుంట పాఠశాలకు ప్రహరీ లేదు. ఈ పాఠశాలలోని రెండే గదుల్లో 1 నుంచి 5వ తరగతి వరకు వంద మంది విద్యార్థులు ఉన్నారు. ప్రహరీ లేకపోవడంతో తరచూ తాగుబోతులు పాఠశాలలో చేరి బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. రెండు నెలల క్రితం ఓ బాలికపై అఘాయిత్యం కూడా జరిగింది. అధికారులు స్పందించి పాఠశాలకు ప్రహరీ నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ప్రాణాలు బలిగొన్న చేపల వేట సరదా
గుమ్మఘట్ట: చేపల వేట సరదా ఇద్దరి ప్రాణాలు బలిగొంది. స్థానికులు తెలిపిన మేరకు.. రాయదుర్గం పట్టణానికి చెందిన మన్సూర్ బాషా (34), కర్ణాటకలోని రాంపుర గ్రామానికి చెందిన జబీవుల్లా (28) ఇద్దరూ మంచి స్నేహితులు. మన్సూర్బాషాకు భార్య టబూ, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. టైలరింగ్తో కుటుంబాన్ని పోషించుకునేవాడు. అలాగే జబీవుల్లాకు భార్య గుల్జార్భాను, ఇద్దరు కుమారులు ఉన్నారు. డ్రైవింగ్ పనులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. చేపల వేట అంటే ఎంతో ఆసక్తి ఉన్న ఇద్దరూ గురువారం గాలాలు తీసుకుని ద్విచక్ర వాహనంపై గుమ్మఘట్ట మండలంలోని బీటీ ప్రాజెక్ట్కు చేరుకున్నారు. గాలం వేసే సమయంలో ప్రమాదవశాత్తు మన్సూర్బాషా అదుపు తప్పి నీటిలో పడిపోవడంతో స్నేహితుడిని కాపాడేందుకు తనకు ఈత రాకపోయినా జబీవుల్లా దిగాడు. లోతు ఎక్కువగా ఉండడంతో ఇద్దరూ నీట మునిగి ఊపిరాడక మృతిచెందారు. శుక్రవారం ఉదయం నీటిలో మృతదేహాలు తేలియాడుతుండడం గమనించిన స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను వెలికి తీయించారు. ద్విచక్ర వాహనం నంబర్ ఆధారంగా సమాచారం ఇవ్వడంతో కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని మృతులను మన్సూర్బాషా, జబీవుల్లాగా నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నీట మునిగి ఇద్దరు యువకుల మృతి -
రాజీమార్గమే రాజమార్గం
హిందూపురం: రాజీమార్గమే రాజమార్గమని, దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వర్లునాయక్ అన్నారు. శుక్రవారం స్థానిక సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణంలో మధ్యవర్తిత్వంపై న్యాయవాదులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. న్యాయవాదులు మధ్యవర్తిత్వంపై అవగాహన పెంచుకొని కక్షిదారుల సమస్యలను పరిష్కరించడంలో సహకరించాలన్నారు. ఇరువర్గాలు ఒక అవగాహనకు వచ్చి రాజీ కావడంతో డబ్బు, సమయం ఆదా అవుతుందన్నారు. ఇందుకు లోక్అదాలత్ బాగా ఉపయోగపడుతుందన్నారు. సమావేశంలో న్యాయవాదులు సిద్ధు, రాజశేఖర్, కళావతి, సంతోషికుమారి తదితరులు పాల్గొన్నారు. జాబిలికి ఇంటర్నేషనల్ గ్లోరీ పురస్కారం పెనుకొండ: పట్టణానికి చెందిన ప్రముఖ కవి జాబిలి చాంద్బాషాకు ఇంటర్నేషనల్ గ్లోరీ పురస్కారం దక్కింది. శుక్రవారం హైదరాబాద్లోని శ్రీత్యాగరాయ గానసభ వేదికగా మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన తెలుగు మహాకవి సమ్మేళనంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న చాంద్బాషాకు ప్రముఖ కవులు రమణాచారి, రఘువీర్ప్రతాప్, డాక్టర్ చక్రవర్తి తదితరులు పురస్కారం అందజేసారు.