Sri Sathya Sai
-
సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెలోకి..
పుట్టపర్తి అర్బన్: న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. దశల వారీ ఆందోళనలో భాగంగా మంగళవారం జిల్లాలోని ఐసీడీఎస్ కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకుంటే మరోసారి సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న మినీ సెంటర్లను మెయిన్కు మార్చాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవులు, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్లో ఉన్న సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయాలని, మే నెలంతా వేసవి సెలవులు మంజూరు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింపజేయాలన్నారు. కార్యక్రమంలో లీడర్లు సుజాత, నాగమణి, మంజుల, షర్మిల, భగవతి తదితరులు పాల్గొన్నారు. నిరసన తెలియజేసిన అంగన్వాడీలు -
సోమందేపల్లి తహసీల్దార్పై కలెక్టర్ ఆగ్రహం
ప్రశాంతి నిలయం: పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సోమందేపల్లి తహసీల్దార్ గొల్ల మారుతీపై కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మారుతీని కలెక్టరేట్కు పిలిపించి విచారణ చేపట్టారు. మారుతీ పని చేసిన ప్రతి మండలంలోనూ భూసమస్యలతో ప్రజలను ఇబ్బంది పెట్టడం, ఆయా మండలాల్లో మహిళలతో అక్రమ సంబంధాలు వంటి ఆరోపణలు రావడంతో జేసీ మౌర్య భరద్వాజ్, కలెక్టర్ శ్యాంప్రసాద్ విడివిడిగా విచారణ చేశారు. అలాగే సోమవారం జరిగిన పీజీఆర్ఎస్లో కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగి వేణు అనే వ్యక్తి తహసీల్దార్ మారుతీ తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకొని తన కాపురంలో చిచ్చుపెట్టారని వివరాలతో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మారుతీపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని, పూర్తి వివరాలతో సంజాయిషీ కోరినట్లు తెలిసింది. చర్యలు తీసుకోవాలని ఆర్డీఓకు వినతి పెనుకొండ రూరల్: సోమందేల్లి తహసీల్దార్ మారుతీపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు ఆర్డీఓ ఆనంద్ కుమార్కు వినతిప్రతం అందజేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తహసీల్దార్పై ఎన్నో ఆరోపణలు వచ్చాయన్నారు. వెంటనే తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు హనుమయ్య, గోవిందప్ప, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యడు పెద్దన్న, నారాయణ, వెంకటరాముడు, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు. -
జగన్ను విమర్శించే స్థాయి ‘కందికుంట’కు లేదు
కదిరి టౌన్: దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి, ప్రజానేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే స్థాయి నీకెక్కడిదంటూ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ను వైఎస్సార్సీపీ కదిరి సమన్వయకర్త బీఎస్ మక్బూల్ ప్రశ్నించారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రూ.100 కోట్లతో పారన్నపల్లి రిజర్వాయర్ నుంచి తాగునీటిని కదిరికి అందించిన ఘనత వైఎస్ కుటుంబానిదేనన్నారు. ఈ రోజు ఎమ్మెల్యే కందికుంట తాగుతున్న నీరు వైఎస్సార్ చలువతో సాధ్యపడిందేనని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచి రెండేళ్లవుతున్నా కదిరి ప్రాంత అభివృద్ధికి చేసింది ఏమీ లేదన్నారు. ఈ విషయంగా బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. స్థాయి మర్చిపోయి విమర్శలు చేస్తే సహించబోమన్నారు. వైఎస్సార్ అంటే గుర్తుకు వచ్చేది ఆరోగ్యశ్రీ,, జలయజ్ఞం, రుణమాపీ అని, వైఎస్ జగన్ అంటే గుర్తుకు వచ్చేవి నాడు నేడు, అమ్మఒడి, రైతు భరోసా ఇంకా ఎన్నెన్నో పథకాలు ఉన్నాయన్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబు సొంతంగా అమలు చేసిన పథకం ఒక్కటి కూడా లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. దిగుజారుడు మాటలు మాని సభ్యత కలిగిన అసెంబ్లీ సభ్యుడిగా ఉండాలని హితువు పలికారు. వైఎస్సార్సీపీ కదిరి సమన్వయకర్త మక్బూల్ -
ఓట్ల కోసం విష ప్రచారమా?
ధర్మవరం: ఓట్ల కోసం విష ప్రచారం చేయడం దారుణమని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ పట్టణాధ్యక్షుడుగా నియమితులైన బడన్నపల్లి నరసింహులు ఆధ్వర్యంలో స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో మంగళవారం సమావేశం జరిగింది. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనను గజమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. అసమానతలను దూరం చేసేందుకే రిజర్వేషన్లను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల జీవన ప్రమాణాలు పెంచేలా రిజర్వేషన్లను అంబేడ్కర్ తీసుకు వచ్చారన్నారు. అయితే ఓట్ల కోసం కులాల పేరుతో విభజించి వివక్ష చూపడం దారుణమన్నారు. చివరకు ఓట్ల కోసం ఆహార అలవాట్లపై కూడా విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పాలు కల్తీతో రాజమండ్రిలో 15మంది చనిపోతే ఎందుకు జరిగిందనేది విచారణ కూడా చేయకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు క్రీడా సంబారాల్లో మునిగి తేలారన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 64 మంది కల్తీ నీళ్లతో ఆస్పత్రి పాలైనా పట్టించుకునే వారు కరువయ్యారన్నారు. మార్కాపురం వద్ద యాక్సిడెంట్ జరిగితే ఓ మహిళ 20 సార్లు ఫోన్ చేసినా 108 అంబులెన్స్కు కనెక్ట్ కాలేదన్నారు. ఫలితంగా 14మంది మృత్యువాత పడాల్సి వచ్చిందన్నారు. నల్లచెరువులో యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ కదలక ఎస్ఐతో సహా దానిని ముందుకు తోయాల్సి వచ్చిందన్నారు. స్వచ్ఛమైన గాలి, తాగునీరు, మంచి చదువు, మంచి ఆరోగ్యం ఇచ్చేందుకు పాలకులు ప్రయత్నించాలి కానీ, దేవుడి పేరు చెప్పి ఓట్లు దండుకోవడం, రాజకీయాలు చేయడం, విధ్వేషాలు రగల్చడం సరికాదన్నారు. మతం మీద, కులం మీద రాజకీయం చేసేవారిని దూరం పెట్టాలని పిలుపునిచ్చారు. గతంలో చంద్రబాబు ఎవరైనా ఎస్సీ కులంలో పుట్టాలని అనుకుంటారా అని ఎద్దేవా చేశారని, ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా దేశం ఔన్నత్యానికి, సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేలా అన్ని మతాలు, కులాలను కలుపుకుని పోవాల్సిన లక్షణం లేని చంద్రబాబు ఎలా నాయకుడవుతాడని ప్రశ్నించారు. దేశం కోసం, రాష్ట్రం కోసం, మన ఊరు కోసం పోరాడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. సామాజిక న్యాయం అనే అంశం మీద ముందుకు వెళ్లిన ఏకై క పార్టీ వైఎస్సార్సీపీ అని గుర్తు చేశారు. కుల, మత విధ్వేషాల నుంచి బయటపడి ప్రగతివైపు ముందుకు వెళ్లేలా పాలకులు ఆలోచించాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి చౌడప్ప, రూరల్ ఎస్సీ అధ్యక్షుడు రాంగోపాల్, మాజీ కౌన్సిలర్ గుజ్జల శివ, జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, కేశగాళ్ల రంజిత్కుమార్, సాకే విజయ్కుమార్, అజంతా కిష్ట, గరుడంపల్లి నారాయణస్వామి, రామాంజనేయులు, కేశగాళ్ల కృష్ణమూర్తి, అంజి, రాఘవ, భాస్కర్, మల్లి, నాగేంద్ర, తేజ, గంటాపురం దాము, రమేష్, బొమ్మన్న, బాబయ్య తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి -
వేడుకలకు వేళాయె..
వేడుకలకు వేళాయే..ఓడీచెరువు/పుట్టపర్తి: ఉమ్మడి జిల్లాలోనే అతి పెద్ద ఉత్సవాలకు పేరొందిన అమడగూరు చౌడేశ్వరీదేవి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దాదాపు 850 సంవత్సరాల క్రితం అమరావతిగా పిలువబడిన అమడగూరులో వెలసిన చౌడేశ్వరీదేవి ఆలయానికి ఎంతో విశిష్ట చరిత్ర ఉంది. ‘కర్ణాటకకు చెందిన వడియార్ రాజులు వక్కల వ్యాపారం నిమిత్తం ఈ ప్రాంతంలో పర్యటించినట్లు చరిత్ర చెబుతోంది. ఆ సమయంలో వారి ఒక్కగానొక్క పాప చౌడమ్మ కనిపించకుండా పోవడంతో వారు ఆందోళనకు గురయ్యారు. ఆ సమయంలో పాప వాక్కులు వినపడ్డాయి. చిన్నారిని ఆవహించిన తాను చౌడేశ్వరీదేవినని, తనకు ఇక్కడే ఆలయం కట్టి నిత్య పూజలు చేస్తూ ఉండాలని ఆదేశించింది. దీంతో ఆలయాన్ని నిర్మించి పూజాదికాలు కొనసాగిస్తూ వస్తున్నట్లు పూర్వీకులు చెబుతున్నారు. కాగా, మరో కథనం ప్రకారం ఒకప్పుడు అమరావతి పట్టణాన్ని పాలిస్తున్న శ్రీరంగరాజు సంతానం కలగకపోవడంతో యజ్ఞయాగాదులు, దానధర్మాలు చేస్తూ వచ్చాడు. ఒక రోజు చౌడేశ్వరీ అమ్మవారు కలలో కనిపించి అమరావతికి (నేటి అమడగూరు) రెండు వైపులా రెండు చెరువులు తవ్వించి, ఆలయం నిర్మిస్తే సంతానం కలుగుతుందని చెప్పడంతో రాజు అలాగే చేశాడు. దీంతో రాజు కోరికలు నెరవేరాయి.’ అప్పటి నుంచి అమడగూరు చౌడేశ్వరీ ఆలయం దినదిన ప్రవర్ధనమానం చెందుతూ వచ్చింది. అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఇలా... ఏటా ఛైత్ర మాసంలో అమడగూరులో చౌడేశ్వరీ అమ్మవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో బుధవారం నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. వివరాలను ఆలయ ధర్మకర్త పొట్టా పురుషోత్తంరెడ్డి మంగళవారం వెల్లడించారు. బుధవారం కుంభకూడుతో ఉత్సవాలను ప్రారంభించనున్నారు. 2న ఊయల సేవ, 3న సూర్యప్రభ వాహన సేవ, 4న చంద్రప్రభ వాహన సేవ, 5న జ్యోతి ఉత్సవం, 6న అశ్వ వాహన సేవ, 7న సింహ వాహన సేవ, 8న హంస వాహన సేవ ఉంటుంది. భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న అమడగూరు చౌడేశ్వరీదేవి 5న జ్యోతి ఉత్సవం ఎనిమిది రోజుల పాటు సాగనున్న ఉత్సవాలు ఉత్సవాలకే తలమానికంగా.. అమ్మవారి ఉత్సవాలలో భాగంగా 5వ తేదీ నిర్వహించే జ్యోతి ఉత్సవానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ ఉత్సవాన్ని చూసేందుకు ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలనుండి వేలాదిగా భక్తులు తరలి వస్తారు. ఈ ఉత్సవాన్ని ఏటా ఎ.కొత్తపల్లికి చెందిన పొట్టా పురుషోత్తంరెడ్డి కుటుంబసభ్యులు నిర్వహిస్తూ వస్తున్నారు. స్వయంగా ఆలయ ధర్మకర్త ట్రాక్టర్ నడుపుతూ జ్యోతిని పురవీధులగుండా ఊరేగించేవారు. ఈ సారి రూ. 50 లక్షల వ్యయంతో నిర్మించిన జిల్లాలోనే రెండవ అతిపెద్ద తేరు (కదిరి తర్వాత)పై జ్యోతిని ఊరేగించనున్నారు. ఉత్పవాలకు వచ్చే భక్తులకు అన్నదానంతో పాటు, కాలక్షేపానికి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు గ్రామ పెద్దలు తెలిపారు. -
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
పుట్టపర్తి టౌన్: స్థానిక చిత్రావతి నది నుంచి సోమవారం అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టీడీపీ నేతలకు చెందిన మూడు ట్రాక్టర్లు, ఓ హిటాచీని పుట్టపర్తి అర్బన్ సీఐ తిమ్మారెడ్డి అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం కేసు నమోదు చేసి, మైనింగ్ అధికారులకు అప్పగించడంతో జరిమానా విధించారు. వ్యక్తి ఆత్మహత్య తనకల్లు: మండలంలోని అగ్రహారం గ్రామానికి చెందిన నరసింహారెడ్డి (50) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య, ఓ కుమార్తె ఉన్నారు. కొన్నేళ్లుగా క్యాన్సర్తో బాదపడుతున్న ఆయనకు ఇటీవల బెంగళూరులో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అయినా వ్యాధి పూర్తిగా నయం కాకపోవడంతో రెండు రోజుల క్రితం చికిత్స నిమిత్తం తిరుపతిలోని ఓ ఆసుపత్రికి వెళ్లాడు. పరీక్షించిన వైధ్యులు క్యాన్సర్ గడ్డ తొలగించాల్సి ఉందన్నారు. దీంతో స్వగ్రామానికి వస్తూ మంగళవారం తెల్లవారుజామున మార్గమధ్యంలో బీటీ క్రాస్ వద్ద రైల్వే అండర్బ్రిడ్జి పక్కన ఉన్న వేప చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నేడు రెవెన్యూ భవన్ ప్రారంభం పుట్టపర్తి అర్బన్: మండలంలోని మామిళ్లకుంట క్రాస్ వద్ద సుమారు రూ.1.10 కోట్ల వ్యయంతో నిర్మించిన రెవెన్యూ భవన్ను బుధవారం ప్రారంభించనున్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మంత్రులు సత్యప్రసాద్, సవిత, స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి హాజరు కానున్నారు. చంద్రబాబు వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళదాం ● వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి మడకశిర రూరల్: చంద్రబాబు ప్రభుత్వ మోసాలు, వైఫల్యాలు, దళితులపై జరుగుతున్న దాడులు, వేధింపులను ప్రజల్లోకి తీసుకెళదామంటూ జిల్లా వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నరసింహమూర్తి పిలుపునిచ్చారు. జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి రంగనాథ్తో కలసి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకూ ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పింఛన్ తదితర పథకాలపై స్పష్టత లేకుండా పోయిందన్నారు. దళితుల సంక్షేమాన్ని చంద్రబాబు ప్రభుత్వం విస్మరించిందన్నారు. కలిసి వచ్చే సంఘాలను కలుపుకుని గ్రామాల్లో పర్యటించి చంద్రబాబు ప్రభుత్వం దళితులకు చేస్తున్నా మోసాలను వివరిస్తామన్నారు. -
మొక్కజొన్నకు గిట్టుబాటు ధర కల్పించాలి
పరిగి: మొక్కజొన్నకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకేకేఎంఎస్) నాయకులు డిమాండ్ చేశారు. మండల వ్యాప్తంగా రైతుల సమస్యలు, ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై స్థానిక షాదీ మహల్లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఐకేకేఎంఎస్ జిల్లా కార్యదర్శి రంగనాయకులు మాట్లాడారు. గత ఖరీఫ్, రబీ సీజన్లో సాగు చేసిన మొక్కజొన్న పంటకు కనీసం పెట్టుబడులు కూడా రైతుల చేతికి అందలేదన్నారు. ఆదుకుంటామన్న ప్రభుత్వం రూ.2,500 మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకుందని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా అన్నదాతలను నిట్టనిలువునా మోసం చేసిందని మండిపడ్డారు. పెట్టుబడులు సైతం చేతికి అందక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారన్నారు. తక్షణమే మొక్కజొన్న పంటను గిట్టుబాటు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గిరీష్, మండల అధ్యక్షుడు సంజీవరాయప్ప తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం ఎంపిక అఖిల భారత రైతు వ్యవసాయ కూలీల సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా శంకరప్ప, ఉపాధ్యక్షుడిగా గోపాలరెడ్డి, కార్యదర్శిగా సంజీవరాయప్ప, సహాయ కార్యదర్శిగా వెంకటేష్, కోశాధికారిగా నంజేగౌడ, సభ్యులుగా శంకరప్ప, నరేష్, జయరామప్ప, వెంకటరమణప్ప, నరసింహప్పను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
పలు ప్రాంతాల్లో వర్షం
పుట్టపర్తి అర్బన్: పుట్టపర్తి మండల వ్యాప్తంగా మంగళవారం పలు గ్రామాల్లో వర్షం కురిసింది. సాయంత్రం ఉన్నఫలంగా ఆకాశం మేఘావృతమైంది. వెంటనే సుమారు అర గంట పాటు వర్షం కురిసింది. మండలంలోని మామిళ్లకుంట, ప్రశాంతి గ్రామం, కప్పలబండ, పెడపల్లి ,బత్తలపల్లి గ్రామాల్లో వాన పడింది. దీంతో ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు కాస్తా ఉపశమనం కలిగింది. అయితే అకాల వర్షానికి మామిడి, మొక్కజొన్న, వేరుశనగ రైతుల్లో ఆందోళన మొదలైంది. సచివాలయ ఉద్యోగి సస్పెన్షన్ మడకశిర: మండలంలోని సీ కొడిగేపల్లి గ్రామ సచివాలయంలో పని చేస్తున్న ఎనర్జీ అసిస్టెంట్ రామాంజనేయులును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇటీవల ఆ గ్రామంలో ఓ బడా వ్యక్తికి నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ సామగ్రిని ఇచ్చారని తేలింది. దీంతో రామాంజనేయులుపై సస్పెన్షన్ వేటు వేసినట్లు విద్యుత్శాఖ డీఈ రఘు తెలిపారు. అలాగే విద్యుత్శాఖ ఏఈపై కూడా ఆరోపణలు రావడంతో ఆయనపై కూడా విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం. రాత్రివేళ గస్తీ పెంచండిరొద్దం: అసాంఘిక కార్యకలాపాలపై గట్టి నిఘా ఉంచి అడ్డుకట్ట వేయాలని ఎస్పీ సతీష్కుమార్ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను ఎస్పీ తనిఖీ చేశారు. కేసులకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ రాత్రి వేళ గస్తీ పెంచి నైట్ విజన్ డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా పెట్టాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సైబర్ నేరాలు, మహిళా చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో పెనుకొండ డీఎస్పీ నరసింగప్ప, సీసీ చిరంజీవి, ఎస్ఐ వీరాంజినేయులు తదిరుతలున్నారు. -
లాలేపల్లిలో విషజ్వరాలు
లాలేపల్లిలో మురుగు కాలువప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న గ్రామస్తుడుచిలమత్తూరు: మండల పరిధిలోని లాలేపల్లిలో విషజ్వరాలు ప్రబలాయి. జ్వరం, దగ్గు, నొప్పులు వంటి లక్షణాలతో గ్రామస్తులు మంచం పట్టారు. ఆస్పత్రుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా జ్వరాలు మాత్రం తగ్గడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. పట్టించుకునే నాథుడే లేకపోవడంతో డ్రైనేజీల్లో మురుగు పేరుకుపోయింది. దోమల వ్యాప్తి ఎక్కువకావడంతో ప్రజలు జ్వరాలు బారిన పడుతున్నారని చెబుతున్నారు. పంచాయతీ కార్యదర్శితో పాటు సచివాలయ సిబ్బంది స్పందించడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామంలో సుమారు 30 నుంచి 40 మందికిపైగా జ్వరాల బారిన పడ్డారని చెబుతున్నారు. డెంగీ, మలేరియా వంటి జ్వరాలు వేగంగా విస్తరించే అవకాశాలు ఉండటంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. చాలా మంది ప్రభుత్వాస్పత్రుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో చూపించుకుంటున్నారు. కనిపించని వైద్య సిబ్బంది అపరిశుభ్రత , కలుషిత నీరు ప్రభావంతో లాలేపల్లిలో జ్వరాలు ప్రబలినా పర్యవేక్షించాల్సిన అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకూ జ్వర పీడితుల సంఖ్య పెరుగుతున్నా కనీసం ఏఎన్ఎం, ఆశా వర్కర్లు కూడా చర్యలు చేపట్టలేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పడకేసిన పారిశుధ్యం.. పెరిగిన దోమలు ఇంటింటా జ్వర పీడితులు పట్టించుకోని అధికారులు -
అనుమానం పెనుభూతమై..
గుత్తి రూరల్: అనుమానం పెనుభూతం కాగా, భర్త చేతిలో ఓ భార్య హతమైంది. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం ఓబుళాపురం గ్రామానికి చెందిన శివలింగయ్యకు కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కట్టేకల్లు గ్రామానికి చెందిన కొటేలీ లక్ష్మి(45)తో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. రెండు నెలలుగా శివలింగయ్య పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తూ జులాయిగా తిరగసాగాడు. ఈ నేపథ్యంలో భార్యపై అనుమానాలు పెంచుకుని ఆమెతో తరచూ గొడవ పడేవాడు. పలుమార్లు హత్యాయత్నం కూడా చేశాడు. దీంతో గుంతకల్లు మండలం గొల్లలదొడ్డిలో ఉంటున్న పెద్ద కుమార్తె శ్రీవిద్య తన తల్లిని పిలుచుకెళ్లి రక్షణ కల్పిస్తూ వచ్చింది. ఈ నెల 29న శివలింగయ్య గొల్లలదొడ్డికి వెళ్లి తన భార్య లక్ష్మిని పిలుచుకుని గుంతకల్లు మండలం కదిరిపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. జాతరకు వెళదామంటూ... శివలింగయ్య, లక్ష్మి దంపతుల చిన్న కుమార్తె స్పందనకు కర్ణాటకలోని బళ్లారికి చెందిన యువకుడితో ఈ నెల 11, 12న వివాహం జరిగేలా నిశ్చయించారు. ఈ క్రమంలో పెళ్లికి ముందు వరుడి ఇంట ఆచారం మేరకు మంగళవారం బళ్లారిలోని దుర్గమ్మ ఆలయంలో జాతరకు ఏర్పాట్లు చేశారు. వియ్యంకుల ఆహ్వానం మేరకు శివలింగయ్య కదిరిపల్లికి వెళ్లి తన భార్య లక్ష్మిని పిలుచుకుని గొల్లలదొడ్డిలో ఉన్న పెద్ద అల్లుడు మురళీకృష్ణ, మరో బంధువుతో కలిసి బళ్లారికి బయలుదేరాడు. మార్గ మధ్యంలో మురళీకృష్ణను తప్పించి పూలకుంట గ్రామ శివారున మూతపడిన కంకర క్రషర్ యూనిట్ వద్దకు భార్యను పిలుచుకెళ్లి పై నుంచి కిందకు తోసేశాడు. ఈలోపు గుంతకల్లుకు చేరుకున్న మురళీ కృష్ణ తన మామకు ఫోన్ చేశాడు. లిఫ్ట్ చేయకపోవడంతో మరోసారి కాల్ చేశాడు. ఆ సమయంలో లక్ష్మి ఫోన్ ఎత్తి మాట్లాడుతూ... తనను ప్రాంతానికి తీసుకొచ్చి చంపే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పబోతుండగా ఫోన్ను శివలింగయ్య లాక్కొని కట్ చేశాడు. అనంతరం బండరాళ్లను ఆమె తలపై వేసి హతమార్చాడు. పొంతన లేని సమాధానాలు ఫోన్ కట్ కావడంతో అనుమానం వచ్చిన మురళీకృష్ణ, బంధువులు వెంటనే చెర్లోపల్లి, పూలకుంట, తదితర ప్రాంతాల్లో గాలిస్తూ కదిరప్పస్వామి కొండ వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో వారికి తారసపడిన శివలింగయ్యను ఆపి లక్ష్మి గురించి ఆరా తీశారు. ఆ సమయంలో పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో దేహశుద్ధి చేశారు. దీంతో పెద్ద అల్లుడుకి విషయం తెలిపి లక్ష్మిని హతమార్చిన చోటుకు పిలుచుకెళ్లాడు. సమాచారం అందుకున్న విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీనివాస్, సీఐ రామారావు, ఎస్ఐ సురేష్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. భార్యను హతమార్చిన భర్త పోలీసుల అదుపులో నిందితుడు -
హాకీ రాష్ట్ర జట్టులో చోటు
ధర్మవరం అర్బన్: ఈ నెల 11వ తేదీ వరకు జార్ఖండ్లోని రాంచీ వేదికగా జరిగే 16వ జాతీయస్థాయి సబ్ జూనియర్ బాలికల హాకీ చాంపియన్షిప్ టోర్నీలో ప్రాతినిథ్యం వహిస్తున్న ఏపీ జట్టులో ధర్మవరానికి చెందిన వైష్ణవి, నవ్య, శ్రీలేఖ, భవ్యకు చోటు దక్కింది. ఈ సందర్భంగా వారిని జిల్లా గౌరవాధ్యక్షులు బండి వేణుగోపాల్, పల్లెం వేణుగోపాల్, అధ్యక్షుడు బీవీ శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు ఉడుముల రామచంద్ర, గౌరీప్రసాద్, మహమ్మద్ అస్లాం, ఊకా రాఘవేంద్ర, ట్రెజరర్ అంజన్న, జాయింట్ కార్యదర్శి అరవింద్ గౌడ్, జెన్నే చంద్రశేఖర్, డైరెక్టర్లు మారుతీప్రసాద్, ఇర్షాద్, అమీనుద్దీన్, కిరణ్, కోచ్ హస్సేన్ అభినందించారు. ఉత్సాహంగా ఉట్ల పరుష గాండ్లపెంట: విశ్వకవి యోగి వేమన బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉట్ల పరుష ఉత్సాహంగా సాగింది. ఆలయం ఎదుట ఇనుప స్తంభం ఏర్పాటు చేసి పై భాగాన కట్టిన ఉట్టిని అందుకునేందుకు పలువురు యువకులు పోటీ పడ్డారు. చివరకు మద్దివారిగొందికి చెందిన సాయికుమార్ బృందం విజయం సాధించింది. విజేతలను నిర్వాహకులు అభినందించారు. రాత్రి 9గంటలకు ఆగ్నిసేవ కార్యక్రమం నిర్వహించారు. కాగా, ఉత్సవాల్లో భాగంగా బుధవారం గొడుగుల మెరవణి, రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు కేరళ ఛండ వాయిద్యం, కథాకళి నృత్య ప్రదర్శన, తదితర సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. -
పన్ను కట్టకపోతే చెత్త డంప్ చేస్తాం!
● మున్సిపల్ అధికారుల హెచ్చరిక ● చివరి రోజు రూ.80 లక్షల వసూలు హిందూపురం: ఆస్తి పన్ను చెల్లించాలంటూ ఇన్ని రోజులుగా హిందూపురం మున్సిపల్ అధికారులు ప్రాధేయపడుతున్నా కొందరు స్పందించలేదు. పన్ను చెల్లింపులపై 50 శాతం వడ్డీ మాఫీని ప్రకటించారు. అయినా ఆశించిన ఫలితం దక్కలేదు. పన్నులు చెల్లించకపోతే మున్సిపల్ సేవలు నిలిపి వేస్తామంటూ మున్సిపల్ రెవెన్యూ అధికారి విజయభారతి జారీ చేసిన నోటీసులు కూడా బేఖాతరయ్యాయి. మార్చితో ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో బుధవారం ఆర్ఐలతో కలసి ఆర్ఓ విజయభారతి రంగంలో దిగారు. చివరి అస్త్రంగా ట్రాక్టర్ల నిండా చెత్త తీసుకెళ్లి పన్ను బకాయిదారుల గృహాలు, వాణిజ్య సముదాయల ఎదుట నిలిపి పన్ను చెల్లించకపోతే చెత్త డంప్ చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ మంత్రం ఫలించింది. బకాయిదారులు ఆగమేఘాలపై స్పందించి పన్నులు చెల్లించేందుకు ముందుకు వచ్చారు. దీంతో బుధవారం అర్ధరాత్రి 12 గంటల వరకూ అధికారులు పన్నులు కట్టించుకున్నారు. చివరి రోజు ఏకంగా రూ.80 లక్షల వరకు వసూలైనట్లు అధికారులు చెబుతున్నారు. -
రెండేళ్లుగా నిరీక్షిస్తున్నా ..
నా భర్త మరణించి రెండేళ్లు కావస్తోంది. అయితే వితంతు పింఛన్కు దరఖాస్తు చేసుకునేందుకు నేటికీ అవకాశం లభించలేదు. అధికారులను అడిగితే వెబ్సైట్ ఓపెన్ కావడం లేదని చెబుతున్నారు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు, పాలకులు స్పందించాలి. కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలి. – జయలక్ష్మమ్మ, రామగిరి గ్రామం, మడకశిర మండలం మాట నిలబెట్టుకోవాలి ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం 50 ఏళ్లు దాటిన బీసీలకు పింఛన్ మంజూరు చేయాలి. ప్రస్తుతం నా వయసు 55 సంవత్సరాలు. నేను బీసీ కులానికి చెందిన వ్యక్తి. చంద్రబాబు ప్రభుత్వంలో పింఛన్ వస్తుందని ఆశించా. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతున్నా పింఛన్కు దరఖాస్తు చేసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదు. – సూర్యశేఖర్, చిన్నపల్లోళ్లపల్లి, నల్లచెరువు మండలం -
ఏసీబీ వలలో గుడిబండ తహసీల్దార్
● మ్యుటేషన్ కోసం రూ.లక్ష డిమాండ్ ● రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు గుడిబండ: మ్యుటేషన్ కోసం ఓ రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ గుడిబండ తహసీల్దార్ శ్రీధర్ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ ప్రసాద్రెడ్డి వివరాల మేరకు... గుడిబండ పరిధిలోని ఎస్.రాయాపురంకు చెందిన రైతు షేక్సద్దాం కొన్నేళ్లుగా పెనుకొండ మండలంలో ఉంటున్నారు. ఎస్.రాయాపురంలో తన పూర్వికుల ఆస్తి నాలుగు ఎకరాలు భూమి ఉండగా... ఆస్తి పంపకంలో అన్నదమ్ముల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ ఆస్తి వివాదం పెనుకొండ ఆర్డీఓ కోర్టుకు చేరింది. కేసు విచారించిన ఆర్డీఓ కోర్టు ఎస్.రాయాపురంలోని నాలుగు ఎకరాల భూమిని షేక్సద్దాంకు మ్యుటేషన్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో షేక్సద్దాం కుమారుడు సద్దాంహుస్సేన్ ఆర్డీఓ కోర్టు ఆదేశాల ప్రకారం తమకు చెందాల్సిన నాలుగు ఎకరాల భూమికి పట్టాదారు పాసుబుక్ చేసి ఇవ్వాలని తహసీల్దార్ శ్రీధర్ను కోరారు. అయితే నెలలుగా తిరుగుతున్నా తహసీల్దార్ పట్టించుకోలేదు. మధ్యవర్తుల ద్వారా సంప్రదించగా తహసీల్దారు శ్రీధర్ రూ.లక్ష డిమాండ్ చేశారు. అయితే లంచం ఇవ్వడం ఇష్టలేని సద్దాంహుస్సేన్ ఏసీబీ అధికారులను సంప్రదించారు. వారి సూచన మేరకు తొలుత రూ.20 వేలు ఇస్తానని తహసీల్దార్కు తెలిపి మంగళవారం ఏసీబీ అధికారులు ఇచ్చిన డబ్బుతో కార్యాలయానికి వెళ్లాడు. అనంతరం తహసీల్దార్ శ్రీధర్కు రూ.20 వేలు ఇస్తుండగా... అక్కడ కాపుకాసిన ఏసీబీ అధికారులు తహసీల్దార్ శ్రీధర్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వెంటనే పంచనామా పూర్తి చేశారు. తహసీల్దార్ను కర్నూలు ఏసీబీ కోర్టు ఎదురు హాజరుపర్చనున్నట్లు డీఎస్పీ ప్రసాద్రెడ్డి, సీఐ హమీద్ఖాన్ తెలిపారు. -
అంకితభావంతో పనిచేసే వారికి గుర్తింపు
అనంతపురం: పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేసే వారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకరబాబు అన్నారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు అధ్యక్షతన ఎస్సీ సెల్ రాయలసీమ జోనల్ స్థాయి సమావేశం అనంతపురం నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో సోమవారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీజేఆర్ సుధాకరబాబు, విశిష్ట అతిథిగా ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు హాజరై, మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వంలో దళితులపై దాడులు అధికమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. హత్యలు, అత్యాచారాలు, భూ కబ్జాలతో ఎస్సీల పరిస్థితి ఇబ్బందికరంగా మారిందన్నారు. దీంతో ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయిందని, రానున్న రోజుల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో ఎస్సీల అభ్యున్నతి కేవలం వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమైందన్నారు. ఏడాదికి రూ.13 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో ఎస్సీ వర్గాల అభ్యున్నతికి రూ.77వేల కోట్లను అప్పటి సీఎం వైఎస్ జగన్ ఖర్చు చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్లలో ఇప్పటి వరకూ ఎస్సీల సంక్షేమానికి నయా పైసా కూడా ఖర్చు పెట్టలేదన్నారు. ఈ లెక్కన ఇప్పటికే రూ.26 వేల కోట్లను ఎస్సీలు నష్టపోయారని వివరించారు. దళితులకు విద్య, వైద్యం అందుబాటులో ఉండాలని నాడు వైఎస్ జగన్ ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టారన్నారు. నేడు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ చేస్తే తొలుత నష్టపోయేది ఎస్సీ విద్యార్థులేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎస్సీల హక్కుల సాధనకు రాబోవు రోజుల్లో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో తలపెట్టనున్న కార్యక్రమాలను వివరించారు. జిల్లా స్థాయి కార్యాచరణ ప్రకటించి ఆ మేరకు కార్యక్రమాలను చేపడతామని పేర్కొన్నారు. ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమమే వైఎస్ జగన్ లక్ష్యమని, ఆ దిశగానే ఆయన పాలన సాగిందని గుర్తు చేశారు. 70 శాతం బడుగు, బలహీన, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు తన మంత్రి వర్గంలో స్థానం కల్పించారన్నారు. ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు మాట్లాడుతూ.. రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో దళిత బాలిక పట్ల జరిగిన అమానుష ఘటనకు సంబంధించి దళితుడై ఉండి కూడా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఏనాడూ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదన్నారు. దళిత బిడ్డల మానప్రాణాలు పోతున్నా పట్టించుకోకుండా.. కేవలం చంద్రబాబు తొత్తుగా మారాడని విమర్శించారు. ఇలాంటి తరుణంలో దళితులందరూ సంఘటితం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్, ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎగ్గుల శ్రీనివాసులు మాట్లాడుతూ... వైఎస్ జగన్ పాలనలో సంక్షేమ పథకాల్లో అగ్రస్థానం ఎస్సీలకే దక్కిందన్నారు. దళితుల ఆత్మబంధువు వైఎస్ జగన్ అని కొనియాడారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లాని బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి లబ్బే రాఘవ, జిల్లా పరిశీలకులు శరత్బాబు, శ్రీ సత్యసాయి జిల్లా పరిశీలకులు మిద్దె కుళ్లాయప్ప, నంద్యాల పరిశీలకులు యోబు, కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఆర్.వెంకటేశ్వర్లు, నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లాపురం తిరుపతి, శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడు జి. నరసింహమూర్తి, వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షుడు ఎస్.వెంకటేశ్వర్లు, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆర్. కమలాకర్, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు తలారి రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్బాబు -
వైభవంగా బండ్ల మెరవణి
గాండ్లపెంట: వేమన బ్రహ్మోత్సవాల్లో భాగంగా గాండ్లపెంట మండలం కటారుపల్లిలో రెండవ రోజు సోమవారం బండ్ల మెరవణి కార్యక్రమం వైభవంగా సాగింది. ఎద్దుల బండ్లతో ప్రదక్షిణలు చేస్తూ మొక్కులు తీర్చుకున్నారు. కదిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ సోమవారం వేమన సమాధిని సందర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట పార్టీ మండల కన్వీనర్ గజ్జల రవీంద్రారెడ్డి, మాజీ జెడ్పీటీసీ భాస్కరరెడ్డి, మండల వైస్ కన్వీనర్ వైవీ శంకర్నాయుడు, మలమీదపల్లి పంచాయతీ రాజ్ కార్యదర్శి చలపతి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉల్ల తిరునాల నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆర్టీఈ ఉచిత సీట్ల ఫలితాల విడుదలపుట్టపర్తి: బాలల ఉచిత, నిర్బంధ విద్య హక్కు చట్టం కింద 2026–27 విద్యా సంవత్సరానికి గాను ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాలకు సంబంధించి తొలివిడత లాటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు డీఈఓ కిష్టప్ప సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తొలి విడతలో 874 మంది విద్యార్థులు ఎంపికయ్యారని, వీరందరూ దరఖాస్తు చేసుకున్న పాఠశాలల్లో ఏప్రిల్ 7వ తేదీ లోపు అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు. సత్యసాయి వైద్య సంస్థకు వైద్య పరికరాల వితరణకడప సెవెన్రోడ్స్: పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్కు రూ.కోటి విలువైన 6 సెర్వో–సీ వెంటిలేటర్లు, 3 ఎఫ్ఎక్స్–8 సర్జికల్ యూనిట్లను ఎల్ఐసీ తరుఫున అందజేసినట్లు ఆ సంస్థ కడప సీనియర్ డివిజనల్ మేనేజర్ జీకేఆర్వీ రవికుమార్ తెలిపారు. ఎల్ఐసీ శ్రీసత్యసాయి సంస్థల ముఖ్యుల సమక్షంలో సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్రాజ్కు ఈ పరికరాలను ఎల్ఐసీ జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ అందజేశారన్నారు. -
ఈతకు వెళ్లి విద్యార్థి మృతి
ధర్మవరం రూరల్: సెలవు రోజు ఈతకు వెళ్లి ఓ విద్యార్థి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు... ధర్మవరం మండలం గొట్లూరు గ్రామానికి చెందిన నారాయణస్వామి, ఆదెమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నాడు. చిన్నవాడైన కుమారుడు వెంకీ స్థానిక ఓ ప్రైవేట్ పాఠశాలలో 6వ తరగతి చదువుతుఆన్నడు. ఆదివారం సెలవు కావడంతో తన స్నేహితులతో కలసి సరదాగా ఈత కోసమని గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్దకెళ్లాడు. గట్టు అంచు పట్టుకుని ఈత కొడుతూ ప్రమాదవశాత్తు నీట మునిగిపోయాడు. ఆలస్యంగా విషయాన్ని తెలుసుకున్న కుటుంబసభ్యులు, గ్రామస్తులు అక్కడకు చేరుకుని గాలింపు చేపట్టారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు సైతం అక్కడకు చేరుకున్నారు. ఆదివారం రాత్రంతా బావిలోని నీటిని బయటకు తోడేశారు. సోమవారం ఉదయం నీటి అడుగున చెట్ల మొద్దుకు తగులుకుని ఉన్న వెంకీ మృతదేహాన్ని వెలికి తీశారు. కుమారుడి మృతితో తల్లిదండ్రుల రోదన పలువురిని కంట తడి పెట్టించింది. గుర్తు తెలియని యువకుడి ఆత్మహత్యపావగడ: స్థానిక పీఎస్ పరిధిలోని బొమ్మతనహళ్లి మార్గంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం అక్కడకు చేరుకుని పరిశీలించారు. డ్రిప్ పైపుల ఫ్యాక్టరీ వద్ద వేప చెట్టుకు వేసుకున్న ఉరికి విగతజీవిగా వేలాడుతున్న యువకుడి మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. గుర్తు తెలియని యువకుడి ఆత్మహత్య కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. మిస్సింగ్ కేసులో సంబంధీకులు ఎవరైనా ఉంటే 94808 02941 కు సమాచారం అందించాలని పావగడ పీఎస్ సీఐ సురేష్ కోరారు. ఏపీఓపై దాడికి యత్నం పరిగి: విధుల నిర్వహణలో నిర్లక్ష్యమెందుకని ప్రశ్నించిన ఏపీఓ అప్పస్వామినాయుడిపై హోన్నంపల్లి పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ సతీష్ దాడికి ప్రయత్నించాడు. సోమవారం పరిగి ఎంపీడీఓ కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తీరు మార్చుకోవాలని పలుమార్లు ఉపాధి అధికారులు హెచ్చరించినా మార్పు రాకపోవడంతో సోమవారం ఎంపీడీఓ కార్యాలయానికి రావాలని అధికారులు సూచించారు. దీంతో మద్యం మత్తులో కార్యాలయానికి చేరుకున్న సతీష్ దూర్భాషలాడుతూ ఏపీఓపై దాడికి ప్రయత్నించాడు. వెంటనే అధికారులు, సిబ్బంది అడుడకున్నారు. ఘటనపై ఏపీఓ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
యువకుడి బలవన్మరణం
పరిగి: ఒంటరి జీవితాన్ని తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... పరిగి మండలం మోదా గ్రామ ఎస్సీ కాలనీలో నివాసముంటున్న ఆంజనేయులు కుమారుడు సతీష్కుమార్ (25)కు ఐదు నెలల క్రితం వివాహమైంది. ఈ నేపథ్యంలో సతీష్కుమార్ ఫిట్స్తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ఆమె భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఒంటరి జీవితాన్ని భరించలేక మనోవేదనకు లోనైన సతీష్కుమార్ సోమవారం ఉదయం గ్రామ శివారులోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు పరిశీలించి, మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. 213 మంది గైర్హాజరు పుట్టపర్తి: పదో తరగతి పరీక్షల్లో భాగంగా సోమవారం నిర్వహించిన సోషల్ పరీక్షకు 213 మంది విద్యార్థులు గైర్హాజౖరయ్యారు. ఈ మేరకు డీఈఓ కిష్టప్ప వెల్లడించారు. 107 పరీక్షా కేంద్రాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 21,441 మంది విద్యార్థులకు గాను 21,228 హాజరయ్యారు. -
పరిష్కార వేదికకు 62 వినతులు
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 62 వినతులు అందాయి. ఎస్పీ సతీష్కుమార్ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్ట పరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్హెచ్ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆంకిత సురానా, లీగల్ అడ్వైజర్ సాయినాథ్రెడ్డి పాల్గొన్నారు. వివాహిత ఆత్మహత్యాయత్నం ధర్మవరం అర్బన్: స్థానికగీతానగర్కు చెందిన బేల్దారి ఏడుకొండలు భార్య పావని సోమవారం రాత్రి 10 గంటలకు ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తతో గొడవ పడిన ఆమె గొంతు, చెయ్యి కోసుకున్నట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయింది. ఘటనపై వన్ టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. వాహనం ఢీకొని జింక మృతిముదిగుబ్బ: మండల కేంద్రం సమీపంలోని జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ జింక మృతి చెందింది. సోమవారం బీఎస్ఎన్ఎల్ టవర్ వద్ద పడి ఉన్న జింక కళేబరాన్ని గుర్తించిన స్థానికుల సమాచారంతో అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. పశువైద్యాధికారితో పంచనామా నిర్వహించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. రేపు నిరాహార దీక్ష : యూటీఎఫ్పుట్టపర్తి: ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యల పరిష్కారం కోరుతూ ఏప్రిల్ 1న యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు యూటీఎఫ్ నాయకులు వెల్లడించారు. ఈ మేరకు దీక్షకు అనుమతులు ఇవ్వాలంటూ జేసీ మౌర్య భరద్వాజ్ను సోమవారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణానాయక్, కోశాధికారి లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శి అమర్ నారాయణరెడ్డి మాట్లాడారు. పీఆర్సీ నియామకంతో పాటు 29 శాతం ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, పెన్షనర్ల బకాయిల చెల్లింపునకు రూట్ మ్యాప్ ప్రకటించాలని, సీపీఎస్ రద్దు చేయాలని, హెల్త్ కార్డులు... మెడికల్ బిల్లుల సమస్యలు పరిష్కరించాలని, కోవిడ్ సమయంలో మరణించిన 953 మంది పీఆర్ ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు శివ, సురేష్, కృష్ణతేజ, జనార్దన్బాబు తదితరులు పాల్గొన్నారు. -
క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలు పరిష్కరించండి
ప్రశాంతి నిలయం: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వివిధ సమస్యలపై 247 వినతులు అందాయి. కలెక్టర్ శ్యాంప్రసాద్, జేసీ మౌర్య భరద్వాజ్, డీఆర్ఓ విజయసారథి, ఆర్డీఓ సువర్ణ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించి, నాణ్యతతో పరిష్కరించాలని ఆదేశించారు. పెండింగ్, గడువు దాటినవి ఉండకూడదన్నారు. ఓటరు జాబితా పక్కాగా ఉండాలి ఎన్నికల సంఘం నిబంధలన మేరకు ఓటరు జాబితా పక్కాగా తయారు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలు నుంచి ప్రజా సంక్షేమం, పరిపాలన అంశాలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జనగనణ ప్రక్రియకు సంబంధించి కసరత్తు ప్రారంభమైందన్నారు. జిల్లాలో ఎన్యూమరేటర్ల నియామకం, శిక్షణ, మ్యాపింగ్ పనులను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. సమగ్ర భూ సర్వే ప్రక్రియ వేగవంతం చేసి భూ యజమానుల సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జేసీ మౌర్య భరద్వాజ్, డీఆర్ఓ విజయసారథి, ల్యాండ్ సర్వే శాఖ ఏడీ విజయశాంతి తదితరులు పాల్గొన్నారు. పేదల సమగ్ర అభివృద్ధే లక్ష్యం పుట్టపర్తి టౌన్: నిరుపేద కుటుంబాల సమగ్ర అభ్యున్నతే లక్ష్యంగా ప్రతి ఇంటిని బంగారు కుటుంబంగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ శ్యాం ప్రసాద్ అన్నారు. పీ–4 కార్యక్రమం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం స్థానిక సాయి ఆరామంలో తొలి వార్షికోత్సవం నిర్వహించారు. కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎమ్మెల్యే సింధూరారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం పీ–4 కార్యక్రమం ద్వారా పేదల అండగా నిలిచిన బంగారు కుటుంబాలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఆర్టీఓ సువర్ణ, సీపీఓ విజయకుమార్తోపాటు అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తాం అర్హులందరికీ పక్కా గృహాలు మంజూరు చేస్తామని కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. సోమవారం జిల్లా గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో పుట్టపర్తిలో జిల్లా స్థాయి సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి ముత్తూ నాగమ్మ, వడ్డి యశోదలకు చెందిన నూతన గృహాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా 3,084 గృహాలు, పుట్టపర్తి నియోజకవర్గంలో 1,144 నూతన గృహాలు పూర్తి చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ వెంకటనారాయణ, పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ క్రాంతికుమార్, డీఈ శ్రీనివాసులు, ఏఈ ప్రవళ్లికతోపాటు సిబ్బంది పాల్గొన్నారు. అధికారులకు కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశం ‘పరిష్కార వేదిక’కు 247 అర్జీలు -
అవినీతి జలగలు
● భూములు భాగ పరిష్కారం నిమిత్తం తాను పుట్టపర్తి ఆర్డీఓ కార్యాలయంలో పని చేసే డిప్యూటీ తహసీల్దార్ అశోక్ కుమార్ను కలవగా... రూ.20 వేలు డబ్బులు డిమాండ్ చేశాడని, అతను అడిగినంత ఇచ్చినా పని చేయకుండా ఉడాయించాడని కర్ణాటక నాగేపల్లికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. వారసత్వంగా తనకు వచ్చిన 20 సెంట్ల స్థలాన్ని తన పేరిట ఇచ్చేందుకు లంచం రూపంలో ఇతరుల ఫోన్ పే నంబరుకు డబ్బులు వేయించుకునట్లు తెలిపాడు. ● సోమందేపల్లి తహసీల్దార్ గొల్ల మారుతి ప్రసాద్ తన భార్యను వేధిస్తూ.. కుటుంబంలో చిచ్చు పెట్టారని వేణు అనే వ్యక్తి సోమవారం కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. అన్యోన్యంగా ఉన్న తమ దాంపత్య జీవితంలోకి ప్రవేశించి.. మాయ మాటలు చెప్పి భార్యను తనకు కాకుండా చేస్తున్నాడన్నారు. కొన్ని నెలలుగా ఆమె తనకు దూరంగా ఉంటూ.. తహసీల్దార్కు దగ్గర అవుతున్నట్లు అనుమానం వ్యక్తం చేశాడు. ఈ మేరకు కలెక్టరేట్లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో అర్జీ ఇచ్చాడు. సాక్షి, పుట్టపర్తి రెవెన్యూ వ్యవస్థలోని కొందరు అధికారులు ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నారు. అధికారం చెలాయిస్తూ డబ్బులు డిమాండ్ చేయడం...పనికోసం వచ్చే మహిళల జీవితాల్లో ప్రవేశిస్తూ మొత్తం రెవెన్యూ శాఖకే తలవంపులు తెస్తున్నారు. ముఖ్యంగా పైసలు ఇవ్వందే ఫైలు కదలడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందువల్లే మండల స్థాయిలో పరిష్కారం కావాల్సిన కేసులన్నీ జిల్లా కేంద్రంలో నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు చేరుతున్నాయి. ప్రజలు ఇచ్చే ఫిర్యాదులు పట్టించుకోకుండా.. అవతలి వర్గంతో అధికారులు కుమ్మకై ్క నిజమైన యజమానులకు అన్యాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కొందరు అధికారులు వివిధ పనుల నిమిత్తం తమ వద్దకు వచ్చే మహిళలతో సన్నిహితంగా మెలుగుతూ వారి జీవితాలను అతలాకుతలం చేస్తున్నారు. దీంతో బాధితులు న్యాయం కోసం కలెక్టరేట్కు పరుగులు తీస్తున్నారు. అయితే కలెక్టరేట్లో అందే ఫిర్యాదులను ఆర్డీఓలకు పంపగా... వారు మళ్లీ తహసీల్దార్లకే పంపుతున్నారు. ఫలితంగా ఎలాంటి ఫలితమూ ఉండటం లేదు. మరోవైపు రాజకీయ అండదండలతో మండల స్థాయిలో తహసీల్దార్లు అక్కడే కొనసాగుతూ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఆ సబ్ డివిజన్లలోనే అధికంగా.. పుట్టపర్తి, పెనుకొండ సబ్ డివిజన్ల పరిధిలోని అధికారుల్లో చాలామందిపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఆయా సబ్ డివిజన్లలో భూముల విలువ భారీగా పెరగడంతో పాటు నిత్యం క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. ఇదే అదనుగా భావించిన కొందరు..అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రతి పనికీ ఓ రేటు ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అయితే తమ భూమిని తమపేరిట ఆన్లైన్లో ఎక్కించుకునేందుకు డబ్బులు ఎందుకు ఇవ్వాలంటూ ప్రజలు తిరగబడటం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఇటీవల అధికారుల పని తీరు, వ్యవహార శైలిపై కలెక్టర్కు ఫిర్యాదులు భారీగా అందుతున్నాయి. పెడపల్లిలో ‘భూ మాఫియా’ పుట్టపర్తి మండలం పెడపల్లిలో భూ మాఫియాకు తెరలేపినట్లు తెలుస్తోంది. టీడీపీకి చెందిన ఒకరిద్దరు ప్రభుత్వ భూములను కబ్జా చేశారు. దీనిపై చాలా ఫిర్యాదులు వచ్చాయి. ఆర్డీఓ స్థాయి నుంచి ఆదేశాలు అందినా.. మండల కార్యాలయంలో ఆగిపోతున్నాయి. ఎవరు.. ఎవరికి సపోర్టు ఇస్తున్నారన్న విషయం చర్చనీయంగా మారింది. టీడీపీ నాయకుల చేతుల్లోని ప్రభుత్వ భూములను ఎందుకు కాపాడుకోలేకపోతున్నారని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మారుతిపై లెక్కలేనన్ని ఫిర్యాదులు.. గోరంట్ల తహసీల్దార్గా ఉన్న సమయంలో మారుతిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. భూముల భాగపరిష్కారం కోరగా.. తనకు రెండు ఎకరాలు రాసిస్తేనే పని చేస్తానని డిమాండ్ చేసినట్లు బాధితులు అప్పట్లోనే కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆయన్ను గోరంట్ల నుంచి సోమందేపల్లికి బదిలీ చేశారు. ప్రస్తుతం చిక్కబళ్లాపురకు చెందిన ఓ మహిళతో సన్నిహితంగా ఉంటూ ఆమె కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. రెవెన్యూశాఖలో లంచావతారాలు ప్రజలను పట్టిపీడిస్తున్న అధికారులు రాజకీయ అండదండలతో అరాచకం పుట్టపర్తి, పెనుకొండ సబ్ డివిజన్ల పరిధిలోనే అధికం కలెక్టరేట్కు తరలి వస్తున్న బాధితులు ఆర్డీఓ ఆదేశించినా.. పట్టించుకోని తహసీల్దార్లు -
క్వింటా చింతపండు రూ.25 వేలు
హిందూపురం: స్థానిక వ్యవసాయ మార్కెట్లో క్వింటా చింతపండు గరిష్టంగా రూ.25 వేలు పలికింది. సోమవారం మార్కెట్కు 3,600 క్వింటాళ్ల చింతపండు వచ్చింది. అందులో కరిపులి రకం క్వింటా గరిష్టంగా రూ.25 వేలు, కనిష్టంగా రూ.10 వేల చొప్పున క్రయ విక్రయాలు జరిగాయి. అలాగే ఫ్లవర్ రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ.13 వేలు, కనిష్టంగా రూ.6,100 ప్రకారం పలికినట్లు మార్కెట్ కార్యదర్శి నరసింహమూర్తి తెలిపారు. మార్కెట్లో ప్రతి సోమ, గురువారాల్లో చింతపండు, మంగళ, శుక్రవారాల్లో ఎండుమిర్చి క్రయ విక్రయాలు జరుగుతున్నాయని, రైతులు నాణ్యమైన సరుకు తీసుకొచ్చి అధిక ధరలు పొందాలని ఆయన సూచించారు. -
ఈతకు వెళ్లి తిరిగిరాని లోకాలకు
నల్లచెరువు: సరదాగా ఈతకు వెళ్లిన తండ్రి, ఎనిమిదేళ్ల కుమారుడు కాలువలో మునిగిపోయిన ఘటన నల్లచెరువు మండలం బందార్లపల్లిలో విషాదం నింపింది. వివరాలు.. బందార్లపల్లికి చెందిన రాము (40) కూలి పనులు చేసుకుంటూ భార్య, ఇద్దరు కుమారులను పోషించుకుంటున్నాడు. తన చిన్న కుమారుడు చిన్నోడు (8)తో కలిసి ఆదివారం బందార్లపల్లిలో హెయిర్ కటింగ్ చేయించుకున్న రాము అనంతరం గ్రామ సమీపంలో ప్రవహిస్తున్న హంద్రీ–నీవా కాలువ వద్దకు స్నానం చేసేందుకు వెళ్లారు. నీటి ప్రవాహ ఉధృతి గుర్తించక కాలువలో దిగిన ఇద్దరూ కొట్టుకుపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రాము మృతదేహం లభ్యమైంది. చిన్నోడి ఆచూకీ లభించలేదు. గ్రామంలో విషాద ఛాయలు.. ఘటనతో బందార్లపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాము మృతదేహం వద్ద కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. అప్పటిదాకా తమతో మాట్లాడిన రాము విగతజీవిగా పడి ఉండడం చూసి పలువురు కంటతడి పెట్టుకున్నారు. ‘గతంలోనే నా ఇద్దరు కుమారులు అనారోగ్యంతో మరణించారు.. ఇప్పుడు ఉన్న ఒక్కగానొక్క కుమారుడిని కూడా తీసుకెళ్లావా దేవుడా’ అంటూ రాము తల్లి రమణమ్మ రోదించిన తీరు అందరినీ కలచివేసింది. ప్రభుత్వం ఆదుకోవాలి.. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి కోరారు. ఘటన గురించి తెలుసుకున్న ఆయన గ్రామంలో పర్యటించి బాధిత కుటుంబసభ్యులను ఓదార్చారు. చిన్నోడు ఆచూకీని వీలైనంత త్వరగా కనుగొనాలని అధికారులకు విష్ణువర్దన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. హంద్రీ–నీవా కాలువలో కొట్టుకుపోయిన తండ్రి,కుమారుడు తండ్రి మృతదేహం లభ్యం.. కుమారుడి ఆచూకీ గల్లంతు నల్లచెరువు మండలం బందార్లపల్లిలో విషాదం -
మట్టి అక్రమ రవాణాపై ఆగ్రహం
లేపాక్షి: మండల కేంద్రమైన లేపాక్షిలో సామాన్య రైతు పేరుతో ఓ పెద్ద భూస్వామి వందలాది ట్రాక్టర్ల మట్టిని తన పొలాలకు తరలిస్తుండగా సీపీఐ నాయకులు అడ్డుకున్నారు. సుమారు 70 ఎకరాల్లో ముగ్గురు రైతుల పేరుతో వందలాది ట్రాక్టర్ల మట్టిని మామిడిమాకులపల్లి కుంట నుంచి పొలాలకు తరలిస్తున్న విషయం తెలుసుకున్న స్థానిక సీపీఐ నాయకులు కంచిసముద్రం రోడ్డుపై ట్రాక్టర్లకు అడ్డంగా బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు శివప్ప మాట్లాడుతూ 90 క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించుకోవడానికి అనుమతులు ఇస్తే నాలుగు జేసీబీల ద్వారా 25 ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తున్నారని, అదే చిన్న, సన్నకారు రైతులు మట్టి తరలించుకోవడానికి అధికారుల వద్దకు అనుమతి కోసం వెళితే తిరకాసు పెట్టి తిప్పకుంటున్నారని విమర్శించారు. రెండు రోజులుగా మట్టి రవాణా చేస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. అక్రమ మట్టి రవాణాను వెంటనే నిలిపి వేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. దీంతో అధికారులు అప్రమత్తమై మట్టి రవాణాను తాత్కాలికంగా ఆపేశారు. ట్రాక్టర్ల ముందు సీపీఐ నాయకుల నిరసన -
బాబు అంతులేని ధనదాహం
ధర్మవరం: సీఎం చంద్రబాబు ధనదాహానికి అమరావతి రైతులు బలవుతున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఫైర్ అయ్యారు. ఆదివారం స్థానిక ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు అండ్ కో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రాజధాని అమరావతి వేదికైందన్నారు. రియల్ఎస్టేట్ వ్యాపారులకేమో మంచి ప్లాట్లు చూపిస్తారని, అదే వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతులకు మాత్రం కంప్యూటర్లో తప్ప ఫీల్డ్లో ప్లాట్లు చూపించకుండా మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజధానిగా అమరావతికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదని, గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం అమరావతిని శాసన రాజధానిగా ఏర్పాటు చేసి అభివృద్ధిని వికేంద్రీకరించే విధంగా చర్యలు చేపట్టారని, అయితే, చంద్రబాబు ఈ విషయంపై దుష్ప్రచారం చేశారన్నారు. పదేళ్ల క్రితం రాజధాని రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ ద్వారా 33 వేల ఎకరాలకు పైగా భూమిని సేకరించినా ఒక్కటంటే ఒక్కటి కూడా శాశ్వత నిర్మాణం చేపట్టకుండా తాత్కాలిక నిర్మాణాల పేరిట అస్మదీయ కాంట్రాక్టర్ల కంపెనీలకు దోచి పెట్టడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అది చాలదన్నట్లు మళ్లీ 20 వేల ఎకరాల భూసేకరణకు సిద్ధమవ్వడం చూస్తే చంద్రబాబు ధనదాహం ఎంతలా ఉందో అర్థమవుతోందన్నారు. ఎక్కడైనా కిలోమీటర్ రింగ్రోడ్డు రూ.22 కోట్లతో నిర్మిస్తారని మన రాజధానిలో మాత్రం రూ.175 కోట్లతో నిర్మిస్తున్నారంటే ఎన్ని కోట్ల అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చన్నారు. రైతుల ఆవేదన పట్టదా..? రాజధానిలో పదేళ్లుగా భూములిచ్చిన రైతులు నిత్యం సీఆర్డీఏ ఆఫీస్కు వెళ్లడం, తమ ప్లాట్లు ఎక్కడున్నాయో అడగడం, ఆవేదనతో ఇంటికి వెళ్లడం పరిపాటిగా మారిందని కేతిరెడ్డి అన్నారు. కొంత మందికి మోకాల్లోతు నీళ్లు, వంకలు ఉన్న ప్రాంతంలో ప్లాట్లు ఇవ్వడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. ఇటీవల రాజధానిలో మంత్రి నారాయణ, కేంద్ర మంత్రి పెమ్మసాని పెట్టిన మీటింగ్ ద్వారా సమస్యకు పరిష్కారం దొరకక పోవడంతో ఆవేదనతో రైతు గుండె ఆగినా ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదన్నారు. పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు డబ్బు అవసరమొస్తే భూమి అమ్మే వీలు లేకుండా పోయిందన్నారు. జగన్ అంటే భయం మొదలైంది చంద్రబాబు ప్రభుత్వానికి మళ్లీ జగన్ వస్తాడనే భయం మొదలైందని కేతిరెడ్డి పేర్కొన్నారు. మళ్లీ జగన్ వస్తే తమ అవినీతి బండారం బట్టబయలవుతుందనే భయంతోనే శాసనసభలో సమావేశాలు పెట్టి మరీ చర్చించుకుంటున్నారన్నారు. జగనన్నను తిట్టేందుకే గంటల పాటు శాసనసభలో గడపడం చూస్తే వారిలో ఎంత కలవరం మొదలైందో అర్థమవుతోందన్నారు. రాజధానికి అడ్డుపడితే కాల్చివేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారని, మరో మంత్రి సత్యకుమార్ నల్లమల కాలిపోతోందని ప్రేలాపనలు చేస్తున్నారని, మీ నిర్వాకంతో రాష్ట్రం కాలిపోతోందని గతంలో చంద్రబాబుపై సత్యకుమార్ చేసిన విమర్శలను ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. పూటకోమాట మాట్లాడే నాయకులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధి, రైతులకు న్యాయం జరిగే వరకూ వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందని, అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాలకూ వికేంద్రీకరణ జరగాలన్నదే తమ స్టాండ్ అని స్పష్టం చేశారు. రాజధాని ముసుగులో విచ్చలవిడిగా అవినీతి అమాయక రైతులనూ బలి చేస్తున్నారు జగన్ అంటే ‘కూటమి’ నేతల్లో భయం మొదలైంది మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి -
పీ4 వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
ప్రశాంతినిలయం: పీ4 కార్యక్రమం ఏడాది పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఆదివారం అన్ని నియోజకవర్గాల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పీ4 కార్యక్రమంలో మార్గదర్శులను, బంగారు కుటుంబాలను భాగస్వాములను చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఓ విజయ్కుమార్, ఆర్డీఓలు, ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు. మద్యం మత్తు .. హైవేపై నిద్రపెనుకొండ రూరల్: మద్యం మత్తులో ఓ యువకుడు రోడ్డుపై నిద్రించిన ఘటన పెనుకొండ 44వ జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్గా మారాయి. పెనుకొండ వైపు నుంచి అనంతపురం వైపు ద్విచక్ర వాహనంలో వెళ్తున్న యువకుడు, ఫూటుగా మద్యం సేవించాడు. అయితే మార్గ మధ్యలో హరిపురం సమీపంలోకి రాగానే తన ద్విచక్ర వాహనాన్ని రోడ్డుకు అడ్డంగా ఆపి నిద్రపోయాడు. గమనించిన స్థానికులు మందు బాబుని, ద్విచక్ర వాహనాన్ని పక్కకు జరిపారు. స్థానికులు అతన్ని నిద్ర లేపి వివరాలు సేకరించగా పొంతనలేని సమాధానాలు ఇచ్చాడు. పోలీసులు వస్తున్నారని చెప్పడంతో అతను అనంతపురం వైపు వెళ్లిపోయాడు. వేమన ఉత్సవాలకు అంకురార్పణ గాండ్లపెంట: మండల పరిధిలోని కటారుపల్లిలో ఆదివారం కుంభాభిషేకంతో యోగి వేమన ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. ప్రతి ఇంటి నుంచి మహిళలు జొన్నలను ఆలయానికి తీసుకువచ్చి కుప్పగా పోశారు. ఈ జోన్నలను ఆలయ పీఠాధిపతులు ఆలయం ఎదుట రాసిగా పోసి పసుపు, కుంకుమ కలిపి మహాశక్తి పూజ చేసిన అనంతరం గ్రామస్తులకు పంచి పెట్టారు. ఈ ప్రసాదం కొన్ని రకాల వ్యాధులకు మందుగా కూడా వినియోగిస్తారు. వేమన సమాధి వద్ద పూజలు ఉత్సవాలను పురస్కరించుకుని వేమన సమాధి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. బెంగళూరుకు చెందిన కళాకారుల నాట్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సోమవారం వేమన ఉత్సవాల్లో భాగంగా బండ్లమెరవణి, పానక పందార్యము నిర్వహిస్తారు. రాత్రి 9 గంటల నుంచి పాటల కచేరి ఏర్పాటు చేసినట్లు ఆలయ పీఠాధిపతి నంద వేమారెడ్డి తెలిపారు. డీఎస్పీ శివనారాయణస్వామి, కదిరి రూరల్ సీఐ నాగేంద్ర, ఎస్ఐ సుమతి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
బెట్టింగ్కు పాల్పడితే కఠిన చర్యలు
పుట్టపర్తి టౌన్: క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పనవి ఎస్పీ సతీష్కుమార్ హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమైన నేపథ్యంలో యువత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బెట్టింగ్ మాయలో పడి జీవితాలను చిన్నాభిన్నం చేసుకోవద్దని హితవు పలికారు. తల్లిదండ్రులు పిల్లలపై నిఘా ఉంచాలన్నారు. బెట్టింగ్ అనేది వినోదం కాదని, అది ఒక వ్యసనమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. క్రికెట్ను కొందరు జూద క్రీడగా మార్చి అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్నారని, అలాంటి వారి ఉచ్చులో పడొద్దని యవతకు సూచించారు. జిల్లాలో ఎక్కడైనా బెట్టింగ్లు నిర్వహించినా, ప్రోత్సహించినా చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో ఎవరైనా బెట్టింగ్ నిర్వహిస్తుంటే 100, 112 నంబర్లకు ఫోన్ చేసి తెలియజేయాలని, లేకుంటే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. అలాంటి వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. -
కమ్ముకొస్తున్న కరువు
కనగానపల్లి: కరువు మేఘాలు జిల్లాపై కమ్ముకుంటున్నాయి. పలు చోట్ల అప్పుడే ఆ ఛాయలు కనిపిస్తున్నాయి. కనగానపల్లి మండలంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత హంద్రీ–నీవా, పీఏబీఆర్ కాలువల ద్వారా చెరువులు, కుంటలకు సరిగా నీరు చేరలేదు. దీంతో మండలంలోని చాలా గ్రామాల్లో చెరువులు నీరు లేక బోసిపోయాయి. హంద్రీ–నీవా కాలువకు సిమెంట్ లైనింగ్ వేయడంతో భూమిలోకి చుక్కనీరు ఇంకక భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఈ క్రమంలో వ్యవసాయ బోరుబావులు ఎండిపోతున్నాయి. మండల వ్యాప్తంగా ఇప్పటికే 40 శాతం పైగా బోర్లు ఎండిపోయినట్లు సమాచారం. పంటలను గొర్రెలకు వదిలేస్తున్న రైతులు.. బోరుబావుల నుంచి నీరందక సాగుచేసిన పంటలు నిలువునా ఎండిపోతున్నాయి. దీంతో ఎండిన పంటలను రైతులు గొర్రెలు, పశువులకు వదిలేస్తున్నారు. కనగానపల్లి మండలంలో హంద్రీ–నీవా కాలువ పక్కనే ఉన్న పాతపాళ్యం గ్రామంలో సుబ్బిరెడ్డి అనే రైతు రబీ సీజన్లో బోరుబావి కింద ఆరు ఎకరాల్లో వేరుశనగ విత్తనాలు వేశాడు. పంట సాగు చేసిన కొన్నిరోజులకే బోరుబావిలో నీరు ఇంకిపోయాయి. పంటను కాపాడుకునేందుకు రూ.4 లక్షలతో మళ్లీ నాలుగు బోర్లు తవ్వించినా చుక్క నీరు పడలేదు. ఈ క్రమంలో సాగు చేసిన పంట ఎండిపోవడంతో గొర్రెలకు వదిలేశాడు. బోరుబావుల్లో నీరు అడుగంటిపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు ప్రభుత్వం హంద్రీ–నీవా కాలువకు సిమెంట్ లైనింగ్ చేయటమేనని రైతులు చెబుతుండడం గమనార్హం. జిల్లాలో అడుగంటుతున్న భూగర్భ జలాలు బోరుబావుల్లో నీరు ఇంకి నిలువునా ఎండుతున్న పంటలు తీవ్ర ఆందోళనలో అన్నదాతలు -
అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ మండిపాటు పెనుకొండ రూరల్: రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ విమర్శించారు. ఆదివారం పెనుకొండ పట్టణంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అమరావతిపై చంద్రబాబు ప్రభుత్వం అత్యవసరంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి బిల్లు ప్రవేశ పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజధాని అమరావతికి వైఎస్సార్సీపీ ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నారు. తాకట్టు పెట్టేందుకే ఈ ప్రభుత్వం రెండో విడత భూ సేకరణ చేపడుతోందని ఆరోపించారు. గతంలో 30 వేల ఎకరాల పైబడి చేసిన భూ సేకరణలో ఎంత అభివృద్ధి చేశారు.. భూములిచ్చిన రైతులకు ఎలాంటి న్యాయం చేశారు.. బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టి తీసుకొచ్చిన డబ్బును ఎందుకు ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలను మభ్య పెట్టి సోపు టాపు చేసేందుకు రెండో విడత భూ సేకరణకు తెరలేపారని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వంలో ఐదేళ్ల కాలంలో కేవలం రూ. 2.35 లక్షల కోట్లు అప్పు చేస్తే.. రెండేళ్ల కాలంలోనే చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రూ. 3.40 లక్షల కోట్ల అప్పు చేసిందని, ఒక్క పథకం కూడా ప్రజలకు పరిపూర్ణంగా అందకున్నా అప్పులు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయన్నారు. చేసిన అప్పుల్లో రూ. 3 వేల కోట్లు ఆరోగ్యశ్రీ పథకానికి కేటాయించినా ప్రజలకు అరోగ్య సేవలు మెరుగ్గా అందేవన్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకంతో ఆరోగ్య శ్రీ అనారోగ్యశ్రీగా మారిందన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కరోనా వంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎక్కడా సంక్షేమ పథకాలు ఆగలేదని గుర్తు చేశారు. పార్టీలకు అతీతంగా పారదర్శకంగా పథకాలు అందించామన్నారు. అప్పట్లో సంక్షేమంతో పాటు అభివృద్ధి పరుగులు పెట్టిందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి లేదు..సంక్షేమమూ లేదని విమర్శించారు. కార్యక్రమంలో సోమందేపల్లి జెడ్పీటీసీ సభ్యుడు అశోక్, పెనుకొండ వైఎస్సార్ సీపీ పట్టణ, మండల కన్వీనర్లు బోయ నరసింహ, సుధాకర్ రెడ్డి, సర్పంచులు అంజినాయక్, కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు. నేడు కలెక్టరేట్లో పరిష్కార వేదికప్రశాంతినిలయం: కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీజీఆర్ఎస్ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలపై వారికి అర్జీలు సమర్పించుకోవచ్చని సూచించారు. గతంలో ఇచ్చిన అర్జీలకు పరిష్కారం దొరకని వారు 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనూ అర్జీలు సమర్పించవచ్చన్నారు. -
1న రణభేరి 3.0
ధర్మవరం అర్బన్: ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ 1న జిల్లా కేంద్రంలో చేపట్టనున్న రణభేరి 3.0ను జయప్రదం చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో ఆదివారం యూటీఎఫ్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శెట్టిపి జయచంద్రారెడ్డి మాట్లాడుతూ పీఆర్సీ కమిషన్ ఛైర్మన్ను వెంటనే నియమించాలని, 29 శాతం ఐఆర్ వెంటనే ప్రకటించాలని, పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, ఉద్యోగుల, పెన్షనర్ల బకాయిల చెల్లింపునకు రూట్ మ్యాప్ ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణనాయక్, జిల్లా కార్యదర్శి అమర్నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నీటితో దీపాలు వెలిగించారని శిరిడి సాయిబాబా జీవిత చరిత్ర ద్వారా వెల్లడవుతోంది. సైన్స్కి అంతు చిక్కని ఈ అద్భుతం నేటికీ మిస్టరీగానే ఉండిపోయింది. ఇలాంటి మిస్టరీనే ధర్మవరం మండలం ధర్మపురి గ్రామంలోనూ ఆచారంగా కొనసాగుతూ వస్తోంది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో
ధర్మవరం: మండలంలోని ధర్మపురి గ్రామంలో వెలసిన రామస్వామి ఆలయానికి దాదాపు 300 సంవత్సరాల చరిత్ర ఉంది. అనునిత్యం ఈ ఆలయంలో నిత్య కై ంకర్యాలు జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయంలో ఏటా శ్రీరామనవమి నాడు క్షత్రియ వంశానికి చెందిన వారు నీటితో దీపం వెలిగిస్తుంటారు. ఈ నేపథ్యంలో గత శుక్రవారం శ్రీరామనవమి నాడు ఈ అద్భుతాన్ని కనులారా చూసేందుకు వేలాదిగా భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. శ్రీరామ నవమి రోజున ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ ఆలయంలో క్షత్రియ వంశానికి చెందిన రాఘవరాజు ఉపవాస దీక్షతో పూజలు చేస్తూ ధ్యానంలో నిమగ్నమై ఉంటారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయానికి చేరుకున్న వేలాది మంది భక్తులతో కలసి గ్రామ శివారున ఉన్న వంక వద్దకు చేరుకుంటారు. స్నానం ఆచరించిన తర్వాత మడి దుస్తులతో రాగి చెంబులో నీటిని తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. అప్పటికే ఆవు నెయ్యితో వెలుగుతున్న దీపంలోకి నీటిని పోయగానే అది ఆరిపోకుండా మరింత దేదీప్యమానంగా వెలగడం గమనించిన భక్తులు జయజయధ్వానాలతో హోరెత్తిస్తుంటారు. సాధారణంగా వెలుగుతున్న దీపంలోకి నీటిని పోయగానే అది చిటపటలాడుతూ ఆరిపోవడం సహజం. అయితే ఇందుకు విరుద్ధంగా నీటిని పోయగానే దేదీప్యమానంగా వెలుగొందే దీపాన్ని తీసుకుని భజనలు చేస్తూ గ్రామంలో ఉన్న నరసింహస్వామి ఆలయానికి ఊరేగింపుగా చేరుకుంటారు. ఈ క్రమంలో మధ్య మధ్యలో రాగి చెంబులోని నీటిని దీపంలో పోస్తూ ఉంటారు. ఇలా మరుసటి రోజు ఉదయం వరకూ ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది. దీపం బాగా ప్రకాశిస్తే ఆ ఏడు పంటలు బాగా పండుతాయని, వర్షాలు సకాలంలో కురుస్తాయని ఇక్కడి ప్రజల నమ్మకం. ఈ వేడుకను చూసేందుకు రాష్ట్రం నుంచే కాక తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. పురాతన రామాలయంలో నీళ్లతో వెలుగుతున్న దీపం ధర్మవరం మండలం ధర్మపురిలో వింత శ్రీరామనవమి రోజున వేడుక చూసేందుకు వేలాదిగా తరలివస్తున్న భక్తులు దేదీప్యమానంగా వెలిగే దీపం భారీగా భక్తులు తరలివస్తారు రామస్వామి ఆలయంలో నీటితో దీపం వెలిగించడం, ప్రభలతో స్వామి వారిని ఊరేగించడం వంటి వేడుకలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ వేడుకల్లో పాల్గొని, మొక్కులు తీర్చుకునేందుకు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. గ్రామస్తుల సహకారంతో భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా చర్యలు తీసుకుంటారు. – గోవర్ధనరాజు, ధర్మపురి గ్రామం తరతరాల ఆచారమిది మేము తరతరాలుగా రామస్వామి ఆలయంలో శ్రీరామ నవమి నాడు పూజలు నిర్వహిస్తున్నాం. ఆ రోజున ఉపవాసంతో ఉదయం నుంచి స్వామిని ధ్యానిస్తూ అర్ధరాత్రి నీటితో దీపాన్ని వెలిగించడం ఆనవాయితీగా వస్తోంది. నీరు పోయగానే దీపం చాలా ప్రకాశవంతంగా వెలుగుతుంటుంది. ఇది పూర్తిగా స్వామి వారి మహిమగానే విశ్వసిస్తున్నాం. – రాఘవరాజు, ధర్మపురి గ్రామం -
నేడు జంగంపల్లికి ‘రణబలి’
యల్లనూరు: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఆదివారం యల్లనూరు మండలం జంగంపల్లి గ్రామంలో పర్యటించనున్నట్లు ‘రణబలి’ చిత్ర యూనిట్ మేనేజర్ సుబ్బు తెలిపారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో విజయ్ దేవరకొండ ‘రణబలి’గా, రష్మిక ‘జయమ్మ’గా కనిపించనున్న విషయం తెలిసిందే. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనలో జరిగిన యధార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఆ కాలంలోని సామాజిక పరిస్థితులు, స్వాభిమాన పోరాటాలు, భావోద్వేగ బంధాలను ప్రతిబించించేలా జంగంపల్లి కోట (బ్రిటీష్ పాలనలో నిర్మించిన) లో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విజయ్ దేవరకొండపై పలు సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. పల్లెల్లో వన భోజనాలు బత్తలపల్లి: మండలంలోని గుమ్మల్లకుంట, అప్పరాచెరువు, వేల్పుమడుగు, లింగారెడ్డిపల్లి, సంజీవపురం, ఎం.చెర్లోపల్లి, అనంతసాగరం గ్రామాల వాసులు శనివారం వనభోజనాలకు తరలివెళ్లారు. ఇళ్లకు తాళాలు వేసి వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి రోజంతా చెట్ల కిందనే గడిపారు. అనంతరం సాయంత్రం గ్రామంలో ఏర్పాటు చేసిన తోరణం కింద నుంచి ఇళ్లకు చేరుకున్నారు. -
గోల్షాట్ బాల్.. శైలజ సూపర్!
కదిరి అర్బన్: గోల్షాట్ పోటీల్లో కదిరి ప్రాంత విద్యార్థి కొత్తపల్లి శైలజ సత్తా చాటింది. ఏప్రిల్ 24 నుంచి 29వ తేదీ వరకు శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగే సౌత్ ఏషియా కప్ పోటీల్లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికై ంది. అంచెలంచెలుగా ఎదుగుతూ... కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లికి కె. ప్రసన్నకుమార్, చంద్రకళావతి దంపతుల కుమార్తె కొత్తపల్లి శైలజ గోల్షాట్ బాల్ పోటీల్లో సత్తా చాటుతోంది. తండ్రి ప్రసన్నకుమార్ కదిరి మండలం ఎరుకులవాండ్లపల్లి హరీష్ పాఠశాలలో పీఈటీగా పని చేస్తున్నారు. తల్లి గృహిణి. శైలజ ఇదే పాఠశాలలో ప్రస్తుతం 9వ తరగతి చదువుతోంది. శైలజ చిన్నప్పటి నుంచే క్రీడలపై మక్కువ పెంచుకుంది. తండ్రి పీఈటీ కావడం...హ్యాండ్బాల్ కోచ్ కావడంతో ఆయన వెంటే ఎక్కువగా మైదానంలో గడిపేది. ఈ క్రమంలో తొలుత హ్యాండ్ బాల్ ఎక్కువగా ఆడేది. తండ్రి ప్రసన్నకుమార్ కోచింగ్తో ఆ క్రీడలో రాటుదేలింది. ఈ క్రమంలో 2023లో జరిగిన స్కూల్ గేమ్స్ అండర్–14 విభాగంలో హ్యాండ్బాల్ పోటీల్లో అనంతపురం జిల్లా జట్టు తరఫున పాల్గొంది. ఆ తర్వాత 2024లో స్కూల్ గేమ్స్ అండర్ –14 విభాగంలో పాల్గొన్న శైలజ తెనాలిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటి జాతీయ జట్టుకు ఎంపికై ంది. చత్తీస్ఘడ్లో జరిగిన జాతీయ స్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో మన రాష్ట్రం తరపున పాల్గొని సత్తా చాటింది. ఆట మార్చి.. అంతర్జాతీయ స్థాయికి ఎదిగి హ్యాండ్బాల్ క్రీడలో జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదిగిన శైలజ.. ఉన్నట్టుండి గోల్షాట్ బాల్ను ఎంచుకుంది. నిరంతరం సాధన చేస్తూ గోల్షాట్ బాల్ క్రీడలో తిరుగులేని క్రీడాకారిణిగా పేరుగాంచింది. గోల్షాట్బాల్లోనూ అంచెలంచెలుగా ఎదుగుతూ జూనియర్ విభాగంలో జాతీయ స్థాయికి ఎదిగింది. గత నవంబర్లో బీహార్ రాష్ట్రంలో జరిగిన పోటీల్లో రాష్ట్రం తరఫున ప్రాతినిథ్యం వహించింది. ఇటీవల తిరుపతిలో జరిగిన 3వ సబ్ జూనియర్ బాలురు, బాలికలు జాతీయస్థాయి పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు నుంచి ప్రాతినిథ్యం వహించిన శైలజ అత్యుత్తమ ప్రతిభ కనబరచింది. దీంతో సెలక్టర్లు ఆమెను సౌత్ ఏషియా కప్లో పాల్గొనే గోల్షాట్ బాల్ భారత జట్టుకు ఎంపిక చేశారు. సత్తా చాటుతున్న కదిరి విద్యార్థిని భారత జట్టుకు ఎంపిక సౌత్ ఏషియా కప్ పోటీల్లో దేశం తరఫున ప్రాతినిథ్యం ఆనందంగా ఉంది ఏదైనా క్రీడలో భారత్ జట్టు తరఫున ఆడాలనేది నా కల. గోల్షాట్ బాల్ రూపంలో అది నెరవేరబోతోంది. మా నాన్నను చూసే క్రీడల్లోకి అడుగుపెట్టా. తొలుత హ్యాండ్బాల్ ఆడినా ఆ తర్వాత గోల్షాట్ బాల్ నచ్చి అందులోకి మారాను. సౌత్ ఆసియా కప్లోనూ తప్పక సత్తా చాటుతూ. చదువులోనూ రాణించి ఐపీఎస్ సాధించి ప్రజలకు సేవ చేయాలన్నదే నా లక్ష్యం. – కొత్తపల్లి శైలజ, గోల్షాట్ బాల్ ప్లేయర్ -
కార్యాలయాల్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయండి
హిందూపురం: పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజల దాహార్తీని తీర్చేందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. శనివారం హిందూపురం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించి, మాట్లాడారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అంతకు ముందు పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, తహసీల్దార్ జి. వెంకటేశు, డీటీ మైనుద్దీన్, పాల్గొన్నారు. స్వచ్ఛ ఆంధ్ర ర్యాలీ ‘స్వచ్ఛ ఆంధ్ర– స్వర్ణ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా హిందూపురంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే అధిక జరిమానాలు విధించడంతో పాటు అవసరమైతే సదరు వ్యాపారాల లైసెన్సులు రద్దు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సైకిల్ ర్యాలీ చేపట్టి చైతన్య పరిచారు. నాణ్యమైన భోజనం ఇవ్వాలి. హిందూపురంలోని చిన్న మార్కెట్లో ఉన్న అన్నా క్యాంటిన్ను కలెక్టర్ పరిశీలించి, భోజనం రుచి చూశారు. భోజనంలో నాణ్యత లోపించరాదని, ఫిర్యాదులు అందితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అట్రాసిటీ కేసుల్లో బాధితులకు ఉద్యోగ అవకాశం ప్రశాంతి నిలయం: అట్రాసిటీ కేసుల్లో బాధిత కుటుంబాల్లోని అర్హులకు ప్రభుత్వ నిబంధనల మేరకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కలెక్టర్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమంపై జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ (డీవీఎంసీ) సమావేశం శనివారం కలెక్టరేట్లో జరిగింది. ఎస్పీ సతీష్కుమార్, ఆర్టీఓ కరుణ సాగర్రెడ్డి, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి కమిటీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు కలెక్టర్ వివరణాత్మక సమాధానాలు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే ఆలోచన ఉందన్నారు. దీనిపై త్వరలో స్పష్టమైన ప్రకటన జారీ చేస్తామన్నారు. అంబేడ్కర్ భవన నిర్మాణానికి సంబంధించి సాంఘిక సంక్షేమశాఖకు ప్రతిపాదనలు పంపుతామన్నారు. అలాగే పౌర హక్కుల దినోత్సవాన్ని ఏటా క్రమం తప్పకుండా నిర్వహిస్తూ హక్కులపై ప్రజలను చైతన్య పరచాలని ఆర్డీఓలను ఆదేశించారు. కలెక్టర్ శ్యాం ప్రసాద్ -
రాష్ట్ర హాకీ జట్టులో జిల్లా క్రీడాకారుడు
ధర్మవరం: బిహార్లోని రాజ్గిరి వేదికగా ఏప్రిల్ 1నుంచి 11వ తేదీ వరకూ జరిగే 16వ జాతీయస్థాయి సబ్ జూనియర్ బాలుర హాకీ చాంపియన్షిప్ టోర్నీలో ప్రాతినిథ్యం వహించే ఏపీ జట్టులో ధర్మవరానికి చెందిన క్రీడాకారుడు విక్కీకి చోటు దక్కింది. ఈ మేరకు హాకీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడు సూర్యప్రకాష్, జిల్లా హాకీ కోచ్ హస్సేన్ శనివారం వెల్లడించారు. ఎంపికై న క్రీడాకారుడిని ధర్మవరంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో వారు అభినందించారు. కార్యక్రమంలో హాకీ అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షులు బండి వేణుగోపాల్, పల్లెం వేణుగోపాల్, జిల్లా అధ్యక్షుడు బీవీ శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు ఉడుముల రామచంద్ర, గౌరీ ప్రసాద్, మహమ్మద్ అస్లాం, ఊకా రాఘవేంద్ర, ట్రెజరర్ అంజన్న, జాయింట్ సెక్రటరీ అరవింద్ గౌడ్, జెన్నే చంద్రశేఖర్, డైరెక్టర్లు మారుతీప్రసాద్, ఇర్షాద్, అమునొద్దీన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
బెట్టింగ్ హీట్ !
ఐపీఎల్తో ఊరూరా క్రికెట్ హీట్ పెరుగుతోంది. రెండు నెలల పాటు సాగే ఐపీఎల్తో క్రికెట్ అభిమానులు పండుగ చేసుకోనుండగా.. బెట్టింగ్ రాయుళ్లు అదే స్థాయిలో బరిలోకి దిగుతున్నారు. ఆన్లైన్ ద్వారా బెట్టింగ్ను గ్రామస్థాయికి తీసుకొచ్చారు. యువతకు గాలం వేసి మరీ ముగ్గులోకి దింపి వారి జేబులు గుల్ల చేస్తున్నారు. పుట్టపర్తి టౌన్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ –2026 (ఐపీఎల్ ) 19వ సీజన్ మొదలైంది. ఉత్కంఠంగా సాగే ఈ మ్యాచ్లు అభిమానులు ఎంతో ఉత్సాహంగా చూస్తున్నారు. ఈ సీజన్లో 10 జట్లు పాల్గొంటుండగా, 74 మ్యాచ్లు రెండు నెలల పాటు జరగనున్నాయి. దీంతో అభిమానుల ఉత్సాహాన్ని సొమ్ము చేసుకోవడానికి బుకీలు రంగంలోకి దిగారు. ‘‘మీ ఫెవరెట్ టీం గెలుస్తుందా... నిజంగా మీ టీంపై అభిమానం ఉంటే బెట్టింగ్ కట్టవచ్చుకదా... సరదాగా డబ్బులు గెలుచుకోవచ్చు’’ అంటూ యువతను ముగ్గులోకి దించుతున్నారు. బహిరంగమే.. ఆన్లైన్లో సాగే బెట్టింగ్.. అంతా బహిరంగంగానే సాగుతోంది. క్రికెట్ బెట్టింగ్ కోసమే వివిధ యాప్లు పుట్టుకురాగా, జిల్లాలోని హిందూపురం, కదిరి, పెనుకొండ, ధర్మవరం, మడకశిర తదితర పట్టణాలకే కాకుండా మండల కేంద్రాలు, చివరకు గ్రామాలకూ బెట్టింగ్ హీట్ తాకుతోంది. బెట్టింగ్ నిర్వహించే వారు..బెట్ వేసే వారు ఫోన్లోనే కాంటాక్ట్ చేసి పందేలు కాస్తున్నారు. గెలుపొందిన వారినుంచి కమీషన్లు పొందేలా ఏర్పాట్లు చేయిస్తున్నారు. పట్టణాల్లో, పల్లెల్లో యవకులను టార్గెట్ చేస్తున్నారు. అంతా ఆన్లైనే.. సెల్ ఫోన్ ద్వారానే క్రికెట్ బెట్టింగ్ ఆడేవారు. కొన్ని యాప్లు డౌన్లోడ్ చేసుకొని మ్యాచ్లు ప్రత్యక్షంగా పరిశీలిస్తూ పందేలు కాయడం, మ్యాచ్ చూసేందుకు ఒకటి బెట్టింగ్ ఆడేందుకు మరొక మొబైల్ వినియోగిస్తారు. ఆన్లైన్లో క్రికెట్ బుకీలతో సంప్రదింపులు జరుపుతూ కమీషన్లు పొందుతారు. కోడ్ లాంగ్వేజ్.. బెట్టింగ్ వ్యవహారం అంతా కోడ్ లాంగ్వేజ్ ద్వారా సాగేలా ఏర్పాటు చేసుకున్నారు. సెల్ ఫోన్తోనే ఎస్... నో... ఓకే... డన్... వంటి పదాలు వాడుతున్నారు. చాలా మంది యువత మ్యాచ్లు జరిగే సమయంలో బెట్టింగ్ ఆడేందుకు తమకు అనువైన ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. మ్యాచ్లో ఎవరు గెలుస్తారు... ఎవరు ఓడిపోతారు... ఎవరెన్ని పరుగులు చేస్తారు... ఈ ఓవర్లో బ్యాటర్లు ఎన్ని పరుగులు చేస్తారు...అనే వాటిపై పందేలు కాస్తున్నారు. కానీ జిల్లాలో చాలా మంది సెల్ఫోన్, టీవీల ద్వారా మ్యాచ్ చూస్తూ పందేలు కాస్తున్నారు. అయితే టీవీల్లో మ్యాచ్ చూసే వారికి కనీసం 10 నుంచి 20 సెకండ్ల తేడాతో లైవ్ వస్తూ ఉంటుంది. ఒక్కోసారి రెండు మూడు బంతులు సమయం తేడా ఉంటుంది. అది తెలుసుకోకుండా బెట్టింగ్ ఆడేవారి జేబులకు చిల్లులు పడుతున్నాయి. ప్రతిదానికి ఒక రేటు.. టాస్ నుంచే బెట్టింగ్ ప్రారంభమవుతుంది. ముందుగా ఎవరు బ్యాటింగ్ తీసుకుంటారు...ఏ బౌలర్ మొదటి ఓవర్ వేస్తారు...ఓ బ్యాటర్ ఎన్ని పరుగులు తీస్తారు. ఫలానా ఓవర్లో ఎన్ని వికెట్లు పడతాయి... ఎవరు గెలుస్తారు... ఎన్ని పరుగులతో మ్యాచ్ పూర్తవుతుంది....ఇలా ప్రతి దానికీ బెట్టింగ్ ఉంటుంది. ప్రతిదానికి ఒక రేటు ఉంటుంది. జస్ట్ రూ.100 బెట్టింగ్ కాస్తే రూ.1,000పైనే అంటూ ఊరిస్తుండటంతో యువత బెట్టింగ్ వలలో చిక్కుకుపోతున్నారు. ఇలా జిల్లాలోని చాలా మంది యువకులు బెట్టింగ్లో ఓడి అప్పులు పాలైన సంఘటనలు గతంలో వెలుగుచూశాయి. మరికొందరు పీకల్లోతు అప్పుల్లోకి కూరుకుపోయి అవి తీర్చలేక అఘాయిత్యాలకూ పాల్పడిన ఉదంతాలు జిల్లా వాసులందరికీ తెలిసినవే. అందువల్ల బెట్టింగ్ జోలికి వెళ్లకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మొదలైన ఐపీఎల్ సందడి అభిమానుల ఆసక్తిపై బుకీలు వల బెట్టింగ్లోకి దింపి గుల్ల చేస్తున్న వైనం ఊరూరా ఐపీఎల్ సందడి.. పట్టణాలు, గ్రామాల్లో ఐపీఎల్ బెట్టింగుల జోరు కనిపిస్తోంది. ప్రధానంగా ఏయే తేదీల్లో ఎవరెవరి మధ్య మ్యాచ్ జరుగుతుందో తెలుస్తుండంతో బెంగళూరు, హైదరాబాద్, చైన్నె, ముంబై టీంల మధ్య ఎక్కుగా బెట్టింగులు కాసేందుకు సిద్ధమయ్యారు. దీంతో బుకీలు కూడా ఆయా మ్యాచ్లపై ప్రత్యేక దృష్టి సారించి క్రీడాభిమానులను ఊరిస్తూ వారి డబ్బులు కాజేస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలోని హిందూపురం, ధర్మవరం, కదిరి, పెనుకొండ, పుట్టపర్తి పట్టణాల్లో కాకుండా మండల కేంద్రాల్లో యువత పోగై తనకు అనువైన ప్రదేశాలు ఎంచుకుని అక్కడకు చేరుకొని నేరుగా బెట్టింగ్లోకి దిగుతున్నారు. -
రోగులకు మెరుగైన సేవలందించాలి
● జిల్లా ప్రభుత్వ వైద్యులు, సిబ్బందికి కలెక్టర్ ఆదేశం హిందూపురం టౌన్: ‘‘ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. ఇందుకోసం ప్రతి ఒక్కరూ పనితీరు మెరుగుపర్చుకోవాలి. విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించబోం’’ అని కలెక్టర్ శ్యాంప్రసాద్ హిందూపురం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, సిబ్బందిని హెచ్చరించారు. శనివారం ఆయన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని వివిధ విభాగాలను, రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. నేరుగా రోగులతో మాట్లాడారు. ఓపీ, ఐపీ వార్డులను తనిఖీ చేశారు. ఆస్పత్రి ప్రాంగణం, వార్డులను శుభ్రంగా ఉంచాలని, పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించకూడదన్నారు. ఓపీ వద్ద వీల్ చైర్, స్ట్రెక్చర్లు లేకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే వాటిని ఏర్పాటు చేయాలన్నారు. అలాగే వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. మాతాశిశు కేంద్రం పైభాగంలో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ యూనిట్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, లిఫ్ట్ పనులు చేపట్టాలని సూచించారు. జిల్లా ఆస్పత్రిలో మార్చురీ నిర్మాణం, వంట గది నిర్మాణాలు చేపట్టాలని సంబంధిత ఇంజినీర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు నర్సులు ఆస్పత్రిలో సిబ్బంది కొరత గురించి కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కలెక్టర్ వెంట డీసీహెచ్ఎస్ మధుసూదన్, ఆస్పత్రి సూపరింటెండెంట్ జనార్దన్, ఆర్ఎంఓ, వైద్యులు ఉన్నారు. -
అమడగూరు ఎంపీపీపై అవిశ్వాసం
ఓడచెరువు(అమడగూరు): అమడగూరు ఎంపీపీ ప్రసాద్రెడ్డిపై ఎంపీటీసీల అవిశ్వాస తీర్మానంపై శనివారం ఓటింగ్ జరిగింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ ఓటింగ్ నివేదికను సీల్డ్కవర్లో కోర్టుకు పంపారు. పార్టీ ఫిరాయింపుతో అవిశ్వాసం.. అమడగూరు మండల పరిషత్లో 8 ఎంపీటీసీ స్థానాలుండగా గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నింటినీ వైఎస్సార్ సీపీ కై వసం చేసుకుంది. అనంతరం ఆ పార్టీ నిర్ణయం మేరకు కొట్టువారిపల్లి ఎంపీటీసీ సభ్యుడు ప్రసాద్రెడ్డి ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎంపీపీ ప్రసాద్ రెడ్డి టీడీపీ పంచన చేరాడు. దీంతో మిగతా ఎంపీటీసీలు అతనిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అవిశ్వాస తీర్మానం నోటీసును స్థానిక అధికారులకు తీసుకోలేదు. దీంతో ఎంపీటీసీలు హైకోర్టును ఆశ్రయించగా... అమడగూరు ఎంపీపీపై సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై మార్చి 28న ఓటింగ్ నిర్వహించాలని, ఫలితాలను సీల్డ్ కవర్లో హైకోర్టుకు నివేదించాలని ఉత్తర్వులిచ్చింది. ఎన్నికల అధికారిగా పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణను నియమించింది. దీంతో శనివారం ఆర్డీఓ సువర్ణ ఎంపీపీపై సభ్యులిచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఓటింగ్కు జయమ్మ (జేకే పల్లి), గంగులమ్మ (చినగానిపల్లి), కళావతి (గుండువారిపల్లి), వెంకటలక్ష్మమ్మ (మహమ్మదాబాద్), శకుంతల (పూలకుంటపల్లి), వెంకటరమణ (అమడగూరు) హాజరు కాగా, లక్ష్మీపతి (తుమ్మల), ఎంపీపీ ప్రసాద్ రెడ్డి గైర్హాజరయ్యారు. సీల్డ్ కవర్లో హైకోర్టుకు పంపాం హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం అమడగూరు ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం ప్రక్రియ నిర్వహించాం. ఆరుగురు ఎంపీటీసీలు హాజరై ఓటు వేశారు. నివేదికను హైకోర్టుకు పంపుతున్నాం. కోర్టు ఇచ్చే ఉత్తర్వుల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం. – సువర్ణ, ఆర్డీఓ, పుట్టపర్తి ఓటింగ్లో పాల్గొన్న ఆరుగురు ఎంపీటీసీలు నివేదికను సీల్డ్ కవర్లో హైకోర్టుకు పంపిన ఆర్డీఓ -
నర్సరీల్లో నాసిరకం నారు
నర్సరీల నిర్వహణలో ప్రమాణాలు లేవు. పర్యవేక్షించే తీరిక ఉద్యాన అధికారులకు లేదు. ఇంకేముంది నర్సరీ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా నాసిరకం నార్లు–మొక్కలను రైతులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. పంట దిగుబడులపై ప్రభావం.. పెట్టుబడుల వ్యయం పెరిగిపోవడంతో రైతులు నష్టపోతున్నారు. అనంతపురం అగ్రికల్చర్: నర్సరీల్లో పెంచే కల్తీ నార్లను గుర్తించలేక తీసుకెళ్లి సాగు చేసి రైతులు నష్టాలపాలవుతున్నారు. జిల్లాలో 450 నుంచి 500 వరకు ఉన్న ఉద్యాన నర్సరీల ద్వారా వైరస్ ఉన్న పండ్ల మొక్కలు, నాసిరకం కూరగాయ పంటల నార్లపై ఫిర్యాదులు వస్తున్నాయి. పంట కాలంలో చీడపీడల బెడద ఎక్కువై పెట్టుబడుల ఖర్చు భారీగా పెరగడంతో పాటు దిగుబడులపై ప్రభావం చూపిస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. నర్సరీ చట్టంలో ఉన్న లొసుగులను అసరా చేసుకుని నిర్వాహకులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నా ఉద్యాన శాఖ నియంత్రించలేక పోతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నార్లకు డిమాండ్ సంప్రదాయ వేరుశనగ, ఇతర వ్యవసాయ పంటల సాగు తగ్గించిన రైతులు గత కొన్నేళ్లుగా అంతో ఇంతో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ రకరకాల కూరగాయ పంటలు, కర్భూజా, కళింగర, బొప్పాయి, ఇతర పండ్లతోటలు సాగు చేస్తున్నారు. నార్ల కోసం చాలావరకు నర్సరీలపై ఆధారపడుతున్నారు. దీంతో నార్లకు భారీగా డిమాండ్ ఏర్పడుతోంది. ఈ క్రమంలో చాలామంది నర్సరీ నిర్వాహకులు నిబంధనలు పక్కనపెట్టి ఇష్టారాజ్యంగా నార్లు పెంచుతూ వాటినే రైతులకు అంటగడుతున్నారు. నమ్మకంతో వాటిని తీసుకెళ్లి సాగు చేస్తే.. పంటలు తెగుళ్లబారిన పడుతున్నాయి. టమాట, మిరప కల్తీ నారు కారణంగా పంటకు తెగుళ్లబెడద ఎక్కువగా ఉంటోందని రైతులు చెబుతున్నారు. చీనీ మొక్కల్లో వైరస్ గుర్తింపు నర్సరీ యాక్ట్ ఉన్నట్లు ఉద్యానశాఖ చెబుతున్నా అమలు చేయడానికి వెనకాడుతోంది వాటి అనుమతులు, రిజిస్ట్రేషన్లు, పర్యవేక్షణపై ఉద్యానశాఖ దృష్టి సారించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నర్సరీలు లైసెన్సులు రెన్యూవల్ చేసుకోవడం లేదని చెబుతున్నారు. మూడు నెలలకోసారి ఉద్యానశాఖ తనిఖీలు కూడా చేయాల్సి ఉంటుంది. కూరగాయల నర్సరీల్లో మదర్బ్లాక్ తప్పనిసరిగా ఉండాల్సి ఉన్నా ఎక్కడా పాటించడం లేదని చెబుతున్నారు. ఇటీవల కాలంలో అక్కడక్కడా కూరగాయల మొక్కలు నాటుకుని దిగుబడులు లేక చీడపీడల బెడదతో భారీగా నష్టపోయినట్లు రైతుల నుంచి ఫిర్యాదులు కూడా అందాయి. దీంతో చాలావరకు కూరగాయల నర్సరీల్లో కల్తీ విత్తనాల నుంచి పెంచిన నాసిరకం నారు పెంచుతున్నట్లు ఆ శాఖ వర్గాలు గుర్తించాయి. గతేడాది జిల్లాకు వచ్చిన శాస్త్రవేత్తల బృందం చీనీ తోటల్లో అధ్యయనం చేసింది. జిల్లా నుంచి 50 వరకు నమూనాలు (శాంపిల్స్)ను తిరుపతిలో ఉన్న చీనీ, నిమ్మ పరిశోధనా కేంద్రానికి పంపించారు. అందులో 20 వరకు నమూనాల్లో చిన్న మొక్కల్లోనే వైరస్ ఉన్నట్లు వెల్లడైనా.. చర్యలు తీసుకునేందుకు ఉద్యానశాఖ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. వైరస్ వ్యాపించడం వల్ల చీనీ తోటల మనుగడపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా నర్సరీలకు సంబంధించి లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్స్, లేబులింగ్, మదర్బ్లాక్, నారుమడి పెంపకం పద్ధతులు, వాడుతున్న కంపెనీ విత్తనాలు, రైతులకు ఇస్తున్న రసీదు, రైతు పూర్తి వివరాలు, ఇతరత్రా రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించి నర్సరీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఉద్యానశాఖ అధికారులను రైతులు కోరుతున్నారు. విడపనకల్లు సమీపంలో తెగుళ్లు ఆశించిన మిరపను పరిశీలిస్తున్న ఉద్యానశాఖ డీడీ ఉమాదేవి (ఫైల్) గార్లదిన్నె మండలంలో నర్సరీని పరిశీలిస్తున్న ఉద్యానశాఖ ఏడీ దేవానందకుమార్ (ఫైల్) కన్నెత్తి చూడని ఉద్యాన శాఖ గతేడాది చీనీ నర్సరీల్లో సేకరించిన శాంపిల్స్ చాలావరకు ఫెయిల్ టమాట, మిరపలో కల్తీనారు వల్ల తెగుళ్ల బెడదతో రైతులకు నష్టాలు వైరస్ వ్యాపించడంతో చీనీ తోటల మనుగడపై శాస్త్రవేత్తల ఆందోళన -
ఉత్సాహంగా యువకుల బల ప్రదర్శన పోటీలు
గార్లదిన్నె: శ్రీరామ నవమి సందర్భంగా గార్లదిన్నె మండలం కొప్పలకొండ, పాత కల్లూరు, కల్లూరు (ఆర్ఎస్) గ్రామాల్లో శుక్రవారం గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన యువకుల బలప్రదర్శన పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఆయా గ్రామాల్లో ఇసుక మూట యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 120 కిలోల ఇసుక బస్తాను స్వయంగా ఎత్తుకుని 10 నిమిషాల వ్యవధిలో ఎవరైతే ఎక్కువ దూరం వెళ్తారో వారిని విజేతలుగా ప్రకటించారు. పాత కల్లూరులో 9 మంది యువకులు పోటీల్లో పాల్గొనగా పెద్దవడుగూరు మండలం చిత్రచేడు గ్రామానికి చెందిన సుధాకర్ మొదటి స్థానం, పాత కల్లూరుకు చెందిన అక్షింతల ఆనంద్ రెండో స్థానం, పామిడి మండలం వంకరాజుకాలువ నివాసి ఎర్రిస్వామి మూడో స్థానంలో నిలిచారు. విజేతలను నగదు పురస్కారాలతో గ్రామస్తులు సత్కరించారు. ఉత్కంఠగా ట్రాక్టర్ రివర్స్ పోటీలు శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా పాత కల్లూరులో శుక్రవారం నిర్వహించిన ట్రాక్టర్ రివర్స్ పోటీలు ఉత్కంఠగా సాగాయి. పోటీల్లో 26 మంది యువకులు పోటీల్లో పాల్గొన్నారు. వీరిలో పామిడికి చెందిన నరేష్ మొదటి స్థానం, వంకరాజుకాలువకు చెందిన నరేంద్ర రెండోస్థానం, గార్లదిన్నె మండలం కేశవాపురం గ్రామానికి చెందిన హరి మూడో స్థానంలో గెలుపొందారు. విజేతలను నగదు పురస్కారాలతో గ్రామస్తులు సత్కరించారు. మేలు జాతి పశు సంతతి పెంపుపై దృష్టి● డీఎల్డీఏ ఈఓ డాక్టర్ జి.వెంకటేష్ అనంతపురం అగ్రికల్చర్: లింగనిర్ధారిత వీర్యం (సెక్స్ సార్టెడ్ సెమన్–ఎస్ఎస్ఎస్) విధానాన్ని పటిష్టంగా అమలు చేసిన కారణంగా వచ్చే ఏడాది నుంచి వాటి ఫలితాలు వాస్తవ రూపం దాల్చనున్నాయని జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ (డిస్ట్రిక్ లైవ్స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ–డీఎల్డీఏ) ఈఓ డాక్టర్ జి.వెంకటేష్ తెలిపారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు కుప్పం ప్రాంతంలోనూ కృత్రిమ గర్భోత్పత్తి కింద పాడి పశువులు, గేదెలకు ఎస్ఎస్ఎస్ విధానం ద్వారా ఉచితంగా ఎద సూదులు వేసినట్లు గుర్తు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు 35 వేల డోసులు ఎస్ఎస్ఎస్ వీర్యం సరఫరా కాగా అందులో 20 వేలకు పైగా డోసులు పశువులు, గేదెలకు వేశామన్నారు. ఇక నుంచి ప్రతి నెలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5 వేల పశువులకు ఎదసూదులు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. వచ్చే ఏడాది వాటి ఫలితాలు వెల్లడవుతాయన్నారు. దీని ద్వారా భవిష్యత్తులో మేలుజాతి పశుసంతతి, పాడి ఉత్పత్తి గణనీయంగా పెరిగే పరిస్థితి ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈనెలాఖరు నాటికి లేగదూడల ప్రదర్శన పూర్తవుతుందన్నారు. పశుశాఖ, డీఎల్డీఏ తరపున ఎస్ఎస్ఎస్ పథకం ప్రయోజనాలపై విస్తృతంగా అవగాహన కల్పించి ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. -
బాలుడి అదృశ్యంపై కేసు నమోదు
గాండ్లపెంట: మండలంలోని జీనులకుంట గ్రామానికిచెందిన కొర్రపాటి తులసీధరరెడ్డి కుమారుడు సోమేశ్వరరెడ్డి కనిపించడం లేదు. ఓడీసీలోని విజ్ఞాన్ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సోమవేశ్వరరెడ్డి వారం క్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఈ నేపథ్యంలో గురువారం పాఠశాలకు వెళ్లేందుకు సిద్ధం కావడంతో గాండ్లపెంటలో తండ్రి బస్సు ఎక్కించాడు. అయితే బాలుడు పాఠశాలకు వెళ్లలేదు. దీంతో తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టారు. హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్అనంతపురం సెంట్రల్: పాత కక్షల నేపథ్యంలో యువకుడిని హతమార్చేందుకు ప్రయత్నించిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు అనంతపురం వన్టౌన్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం వన్టౌన్ పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. పట్టుబడిన వారిలో పాతూరులోని ఆసార్ స్ట్రీట్కు చెందిన కటిక మహమ్మద్ సాధు, మున్నా నగర్ నివాసి షేక్ షౌకత్ ఆలీ, మూడో రోడ్డుకు చెందిన కట్టుబడి జహీర్బాషా ఉన్నారు. వీరు ఇటీవల పాతూరులోని ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఆకుల శ్రీనివాసులుపై ఇనుపరాడ్లతో దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం నిందితులను అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. -
డివైడర్ను ఢీకొన్న కారు – పలువురికి గాయాలు
పుట్టపర్తి అర్బన్: కారు బోల్తా పడిన ఘటనలో నలుగురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన మేరకు... ప్రశాంతి నిలయంలో శుక్రవారం జరిగే శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొనేందుకు బెంగళూరులోని యలహంకలో నివాసముంటున్న మంజునాథ్ కుటుంబం అదే రోజు ఉదయం కారులో బయలుదేరారు. పుట్టపర్తి మండలం పెడపల్లి వద్ద 432వ జాతీయ రహదారిపై కారు ముందరి టైర్ పేలింది. ఆ సమయంలో వాహనం అదుపు తప్పి కల్వర్టుకు కట్టిన రక్షణ గోడను బలంగా ఢీకొని రోడ్డు పై బోల్తాపడింది. అందులో ప్రయాణిస్తున్న మంజునాథ్, ఆయన భార్య అనిత, కుమారులు దర్శన్, కౌశిక్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఏడాది వయసున్న కౌశిక్ పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగళూరుకు వైద్యులు రెఫర్ చేశారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ క్రాంతి తెలిపారు. -
రేపటి నుంచి యోగి వేమన తిరునాల
గాండ్లపెంట: విశ్వ కవి యోగి వేమన తిరునాల ఈ నెల 29న ప్రారంభం కానున్నాయి. గాండ్లపెంట మండలం కటారుపల్లిలోని యోగి వేమన ఆలయంలో ఏటా ఉగాది తర్వాత వారం రోజులకు తిరునాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఆలయ పీఠాధిపతి ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు తిరునాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం రాత్రి కుంభాభిషేకం, విశేష పూజలు నిర్వహించనున్నారు. సాయంత్రం శాసీ్త్రయ నృత్య ప్రదర్శనలు ఉంటాయి. 30వ తేదీ పానక పందేరం, బండ్ల మెరవణి, సాంస్కృతిక కార్యక్రమాలు, 31న ఉట్ల తిరునాల, అగ్ని సేవ, ఏప్రిల్ 1న గొడుగుల మెరవణి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఉత్సవాలకు తరలి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకార్యలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ పీఠాధిపతి తుంగా చెన్నారెడ్డి తెలిపారు. వేమన ఆలయాన్ని పరిశీలించిన డీఎస్పీ గాండ్లపెంట మండలం కటారుపల్లిలోని విశ్వకవి యోగి వేమన ఆలయాన్ని కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి శుక్రవారం పరిశీలించారు. ఈ నెల 29 నుంచి 4 రోజుల పాటు యోగి వేమన తిరునాల జరుగనున్న నేపథ్యంలో అక్కడ చేపట్టాల్సిన భద్రతా చర్యలపై ఆలయ నిర్వాహకులు తుంగా నందవేమారెడ్డితో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన వెంట కదిరి రూరల్ సీఐ నాగేంద్ర, ఎస్ఐ సుమతి ఉన్నారు. అరటి, కొబ్బరి తోటల దగ్ధంరామగిరి: గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు రాజేయడంతో అరటి, కొబ్బరి తోటలు దగ్ధమయ్యాయి. స్థానికులు తెలిపిన మేరకు... రామగిరికి చెందిన రైతులు అనిల్, నాగరాజు పొలాలు పక్కపక్కనే ఉన్నాయి. తనకున్న రెండు ఎకరాల్లో అనిల్ అరటి పంటను సాగు చేశాడు. శుక్రవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు రాజేయడంతో మంటలు చెలరేగి అరటి తోటతో పాటు పక్కనే ఉన్న నాగరాజు పొలంలోని 17 కొబ్బరి చెట్లు, చింత చెట్టును చుట్టుముట్టాయి. మంటలు అదుపు చేసేలోపు అనిల్కు రూ.3 లక్షలు, నాగరాజుకు రూ.50 వేల నష్టం వాటిల్లింది. ఘటనపై బాధితులు పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. -
● నేత్రపర్వం... సీతారాముల కల్యాణం
ప్రశాంతి నిలయం: సీతారాముల కళ్యాణం ఒక పురాణ ఘట్టం కాదు.. ఒక సంపూర్ణ జీవన పాఠం. నేటి తరం యువతకు బంధాల పట్ల ఉండాల్సిన నిబద్ధతను, అచంచలమైన విశ్వాసాన్ని గుర్తు చేస్తోంది. కష్టాల్లో కుంగిపోకుండా.. సుఖాల్లో పొంగిపోకుండా క్రమశిక్షణ, ఓర్పు, సహనంతో ముందుకు సాగాలని నేర్పుతోంది. కుటుంబ విలువల పట్ల ఉండాల్సిన గౌరవాన్ని తెలియజేస్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా భాగస్వామి పట్ల పరస్పర గౌరవం, నమ్మకం ఉండాలని సూచిస్తోంది. ఇవన్నీ ఉంటేనే సంసార జీవితం బాగుంటుందని.. సంసార జీవితం బాగుంటేనే సమాజంలో గౌరవం దక్కుతుందని తెలియజేస్తోంది. ఇంతటి విశిష్టమైన సీతారాముల కల్యాణోత్సవం పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో శుక్రవారం నేత్రపర్వంగా సాగింది. శ్రీరామ నవమి వేడుకలను పురస్కరించుకుని సాయి కుల్వంత్ మందిరంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలో దేశవిదేశాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు ఆద్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సత్యసాయి మహాసమాధిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. తెలంగాణ భక్తులు స్వయంగా వడ్లను గోటితో వలచి తలంబ్రాలను చేసి తీసుకువచ్చారు. తెలంగాణ, కర్ణాటక భక్తులు సుమారు 300 రకాల నైవేద్యాలను సమర్పించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణం నేత్రపర్వంగా సాగింది. వేంకటేశ్వరాలయం.. చరిత్రకు చిహ్నం గడ్డి వాముల దగ్ధంవిడపనకల్లు: ఆరు గాలం శ్రమంచి పశువుల కోసం పోగు చేసుకున్న గ్రాసం అగ్నికి ఆహుతైంది. స్థానికులు తెలిపిన మేరకు... విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామానికి చెందిన ఎస్సీలు, బీసీలు, దూదేకుల కులాలకు చెందిన చిన్న, సన్న కారు రైతులందరూ కలసి గాజుల మల్లాపురానికి వెళ్లే మార్గంలో గడ్డి వాములు వేసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు రాజేయడంతో మంటలు చెలరేగాయి. ఏక మొత్తంగా గడ్డివాములన్నింటినీ మంటలు చుట్టుముట్టడంతో రైతులు హాహాకారాలు పెడుతూ అక్కడకు చేరుకున్నారు. మంటలను అదుపు చేయడం గ్రామస్తులకు సాధ్యం కాలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకునే లోపు రూ. 20 లక్షల విలువైన గడ్డి వాములు కాలి బూడిదయ్యాయి. ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం నుంచి వచ్చిన ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. ఘటనతో వన్నూరుసాహెబ్, వన్నూరువలి, ఓబులేసు, రహమత్ హుస్సేన్, చౌడిక హనుమంతు, చౌడిక యల్లప్ప, చౌడిక రామయ్య, బొమ్మయ్య గారి చిన్న మారెయ్య, మహేష్, రాముడు, పెన్నయ్య, సూరి, పంపా, వన్నారెడ్డి, హనుమంతు, ఓబులేసు, రంజాన్, యల్లప్ప మరికొందరు రైతులు తీవ్రంగా నష్టపోయారు. వీరిలో వన్నూరు సాహెబ్కు చెందిన ఓ ఎద్దును సైతం మంటలు చుట్టుముట్టడంతో 60 శాతానికి పైగా కాలిన గాయాలయ్యాయి. అలాగే మాళాపురం గ్రామంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో రైతు నాగన్న గౌడుకు చెందిన నర్సరీ కాలిపోయింది.కనగానపల్లి: మండల పరిధిలోని తిరుమలదేవర గుట్టపై వెలసిన వేంకటేశ్వరస్వామి ఆలయం చరిత్రకు చిహ్నంగా నిలిచింది. గ్రామానికి సమీపంలో సుమారు ఐదు శతాబ్దాల క్రితం వేంకటేశ్వరాలయాన్ని నిర్మించినట్లు గ్రామస్తులు చెప్తున్నారు. గుట్టపై శ్రీకృష్ణదేవరాయుల వంశీకులు 1550లో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు స్థానికులు చెప్తున్నారు. అయితే కాలక్రమంలో ఈ ఆలయం కొంత దెబ్బతిని శిథిలావస్థకు చేరుకుంది. భక్తుల సహకారంతో ఈ ఆలయంలో రోజూ ధూపదీప నైపధ్యాలు జరుగుతున్నాయి. 16వ శతాబ్దంలో నిర్మించినట్లు ఆలయ వద్ద శాసనాలు: తిరుమలదేవర గుట్టపై వెలసిన వేంకటేశ్వరాలయాన్ని 16 శతాబ్దంలోని నిర్మించినట్లు ఆలయం ముందు శాసనాలు కూడా లిఖించారు. అప్పటి ద్రవిడ లిపిలో ఒక బండరాయిపై లిఖించిన ఈ శాసనంలో ఆలయం చరిత్రను తెలియజేస్తుందని పెద్దలు చెప్తున్నారు. గతంలో ఈ ఆలయం చుట్టూ మంటపాలు, పెద్ద సత్రాలు ఉండేవని, కాని కాలక్రమంలో అవి పాడైపోయాయని గ్రామస్తులు తెలిపారు. ఇక గర్భగుడి ముందు ఒక చిన్న చేదబావి ఉండేదని, అందులో ఊరిన నీటితోనే స్వామి వారికి అభిషేక పూజలు చేసేవారంటున్నారు. గ్రామానికి ఎగువున గుట్టపై ఆలయం ఉండటంతో వాస్తుకు, పవిత్రతకు చిహ్నంగా నిలిచిందని భక్తులు చెప్తున్నారు. దాతలు, భక్తులు సహకారంతో అభివృద్ధి: పురాతన కాలంలో నిర్మించిన ఆలయాన్ని తిరిగి పునరుద్ధరణ చేయటంలో దాతలు, స్వామి భక్తులు ఎంతో సహకరిస్తున్నారని గ్రామస్తులు చెపుతున్నారు. వీరి సహకారంతోనే ఆలయం చుట్టూ గుట్టపై పెరిగిన ముళ్ల చెట్లు, రాళ్లు తొలగించి ఆలయంపైకి వెళ్లటానికి మెట్లు, దారి ఏర్పాటు చేశారు. ఇక దాతల సహకారంతో ఆలయం వద్ద కొత్తగా సత్రాలు, నీటి ట్యాంకులు ఏర్పాటు చేశారు. ఇక ప్రజాప్రతినిధులు సహకారంతో గతంలో ముళ్ల కంపలతో మూసుకొనిపోయిన రహదారిని బాగుచేసి ఆలయం వరకు సిమెంట్ రోడ్డు కూడా వేశారు. దీంతో పాటు ఆలయం వద్ద సుమారు రూ.కోటి వరకు వెచ్చించి, కల్యాణ మంటపాన్ని కూడా నిర్మిండటానికి ఏర్పాట్లు చేసినట్లు గ్రామస్తుడు, భక్తుడు వీరా తెలిపారు. 16వ శతాబ్దంలో తిరుమలదేవర గుట్టపై వెలసిన దేవదేవుడు భక్తులు, దాతల సహకారంతో ఆలయ పునర్నిర్మాణం -
బిల్లులు పెండింగ్ పెట్టొద్దు
కదిరి అర్బన్: హార్టికల్చర్కు సంబంధించి క్యాటిల్ షెడ్, నీటి తొట్టెలకు సంబంధించిన బిల్లులు పెండింగ్లో పెట్టొద్దని, వెంటనే చెల్లించాలని డ్వామా పీడీ విజయేంద్రప్రసాద్ ఉపాధి సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం స్థానిక డ్వామా కార్యాలయంలో కదిరి డివిజన్ పరిధిలోని ఐదు మండలాలకు సంబంధించిన ఉపాధి సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి 20 మందికి ఒక మేట్ను నియమించాలని, కూలీల సంఖ్య పెంచాలని సూచించారు. మే నుంచి వీబీ రామ్జీ పథకం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. సమావేశంలో ఏపీడీ శకుంతల, ఏపీఓలు, ఈసీలు, టీఏలు, ఎఫ్ఏలు పాల్గొన్నారు. ఎలుగుబంటి హల్ చల్మడకశిర రూరల్: మండల పరిధిలోని సిద్ధిగిరి, గుండుమల ప్రధాన రోడ్డులో శుక్రవారం ఎలుగు బంటి హల్ చల్ చేసింది. ఉదయం ఎలుగు బంటి రోడ్డు దాటుతున్న సమయంలో గమనించిన ఆటోలో వెళ్తున్న కూలీలు కేకలు వేయడంతో పొలాల మీద పొదల్లోకి పరుగులు తీసింది. దీంతో రాత్రి సమయంలో వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లే రైతులు ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుని అటవీ ప్రాంతం నుంచి వన్యప్రాణులు పొలాల్లోకి రాకుండా చూడాలని కోరుతున్నారు. ‘పురం’లో నాకాబందీ హిందూపురం: అసాంఘిక కార్యక్రమాల నియంత్రణతో పాటు డ్రగ్స్ నివారణే లక్ష్యంగా శుక్రవారం తెల్లవారుజామున హిందూపురంలో పోలీసులు నాకాబందీ చేపట్టారు. ఎస్పీ సతీష్కుమార్ ఆదేశాలతో అహమ్మద్ కాలనీలో డీఎస్పీ కేవీ మహేష్ నేతృత్వంలో సీఐలు రాజగోపాలనాయుడు, ఆంజనేయులు, అబ్దుల్కరీం ఆధ్వర్యంలో సిబ్బంది ప్రత్యేక బృందాలుగా విడిపోయి అనుమానితుల గృహాలతో పాటు బయలు ప్రదేశాలు, ఖాళీ భవనాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. రికార్డులు సక్రమంగా లేని 37 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు సీజ్ చేశారు. రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలను చైతన్య పరిచారు. కార్యక్రమంలో ఎస్ఐలు, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు. 30న ఉద్యోగ మేళా అనంతపురం అగ్రికల్చర్: ఏఎఫ్ ఎకాలజీ సెంటర్లో ఈ నెల 30న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వైవీ మల్లారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10 పాస్ నుంచి ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీ–టెక్ కోర్సుల్లో పాస్ , ఫెయిల్ అయిన యువతీ యువకులు అర్హులని పేర్కొన్నారు. 12 కంపెనీల ద్వారా 500 వరకు ఉద్యోగ నియామకాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. 30న సోమవారం ఆర్డీటీ స్టేడియం ఎదురుగా, ఉప్పరపల్లి రోడ్డులో ఉన్న ఎకాలజీ సెంటర్లో హాజరు కావాలని సూచించారు. -
జగమంతా రామమయం
జై శ్రీరామ్.. జై శ్రీరామ్.. రాజారామ్ అంటూ భక్తులు శ్రీరాముడి నామస్మరణలో మునిగితేలారు. జిల్లా వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుంచే శ్రీరామ, ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకుల మంత్రోచ్ఛారణల మధ్య భక్తిశ్రద్ధలతో సీతారామ కల్యాణాలను జరిపించారు. ఆయా ప్రాంతాల్లోని భక్తులు కల్యాణోత్సవాలను చూసి తరించారు. అలాగే ఊరూరా పెద్ద ఎత్తున పానకాన్ని పంపిణీ చేశారు. సాయంత్రం వేళ ఉట్ల పరుషలు ఎంతో ఉత్సాహంగా జరిగాయి. – సాక్షి బృందం, శ్రీసత్యసాయి జిల్లా -
టీఏ బిల్లుల అవినీతిలో ఉద్యోగి సస్పెన్షన్
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీస్శాఖలో టీఏ బిల్లులకు సంబంధించి జరిగిన అవినీతి వ్యవహారంలో డీపీఓలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ ఎస్.విశ్వతేజ సస్పెండ్ అయ్యారు. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు ఎస్పీ సతీష్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 2022 నుంచి 2025 జనవరి 26 వరకు టీఏ బిల్లుల్లో అవకతవకలు జరిగాయని, నాలుగురోజుల క్రితం ఈ వ్యవహారం తన దృష్టికి రావడంతో విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. విచారణలో 2022–2026 మధ్య కాలంలో విశ్వతేజ సుమారు రూ 8.9 లక్షలను అక్రమంగా తన కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి మళ్లించినట్లు గుర్తించామని తెలిపారు. జిల్లా పోలీస్శాఖలో అవినీతి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. -
సోలార్లోనూ సొంత లాభం
చిలమత్తూరు: సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా తమ ఇళ్లకు విద్యుత్ వినియోగించడంతో పాటు మిగిలిన విద్యుత్ను ప్రభుత్వానికి విక్రయించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ‘పీఎం సూర్య ఘర్’ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ పథకం హిందూపురం నియోజకవర్గంలో వెండర్ల జేబులు నింపుతోంది. మున్సిపాలిటీలోని కీలక అధికారి ఓ వెండర్కు అండగా నిలిచి ప్లాంట్ సామగ్రి అంతా అతని వద్దే కొనాలంటూ మెలిక పెట్టారు. అంతేకాకుండా మహిళా సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి మరీ మహిళా సంఘాలను సోలార్ వైపు మళ్లించి ఆ వెండర్ ద్వారానే కొనుగోలు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు గాను సదరు వెండర్ నుంచి భారీగానే దండుకుంటున్నట్లు తెలుస్తోంది. ‘మిత్ర’పై ఆ అధికారి దాతృత్వం మున్సిపాలిటీలో పీఎం సూర్య ఘర్ ప్లాంట్ ఏర్పాటుకు సామగ్రి విక్రయించే ఓ వెండర్కు మున్సిపాలిటీలో ముఖ్య అధికారి అండగా నిలవడం చర్చనీయాంశంగా మారింది. మెప్మాలో అధికారులను తనదారికి తెచ్చుకొని ఆ వెండర్ ద్వారా ప్లాంట్ కొనుగోలు చేసేలా ప్రణాళిక రూపొందించి మరీ ఆ వెండర్కు లబ్ధి చేకూరుస్తున్నారు. అందుకోసం భారీగా ముడుపులు చేరుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ అధికారి తాజాగా పీఎం సూర్య ఘర్ ను దుర్వినియోగం పరుస్తూ ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కు కావడం సంచలనంగా మారింది. మిగిలిన వెండర్లకు వేధింపులు ‘పీఎం సూర్య ఘర్’ పథకం లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుండగా చాలా మంది ఇళ్లపై సోలార్ పలకలు అమర్చుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో కొంతమంది చిన్న చిన్న వెండర్లు కూడా నాణ్యమైన సామగ్రి అందిస్తామంటూ ముందుకు వచ్చారు. అయితే అలాంటి వెండర్లుకు అవకాశం ఇవ్వకుండా తనకిష్టమైన వెండర్కు మాత్రమే మున్సిపల్ అధికారి అవకాశం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి భార్య సోలార్ రూఫ్టాప్ సామగ్రి వెండర్గా ఉండగా...వెండర్షిప్ను విత్డ్రా చేసుకోవాలంటూ ఆ అధికారి బలవంతం చేశారు. మాట వినలేదన్న కారణంతో సదరు ఉద్యోగిని ‘పురం’ నుంచి బయటకు పంపించివేసినట్టుగా ఆరోపణలున్నాయి.. మిగతా వెండర్ల నుంచి సామగ్రి కొనుగోలు చేస్తే సబ్సిడీ రాదంటూ అందరినీ భయపెడుతున్నారు. దీంతో చాలా మంది సదరు వెండర్ ఇచ్చే పరికరాలు నచ్చకపోయినా తప్పని సరి పరిస్థితుల్లో అతనివద్దే సోలార్ రూఫ్టాప్ సామగ్రి కొనాల్సి వస్తోంది. పెనుకొండపై కన్ను ఇప్పటికే హిందూపురంలో తిష్టవేసిన వెండర్.. తాజాగా పెనుకొండ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. మంత్రి సవిత అండదండలతో వ్యాపారం సాగించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా ఓ వెండర్ ఏకచక్రాధిపత్యాన్ని ఎండగట్టాల్సిన అధికారులే చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. ‘పీఎం సూర్య ఘర్’ దుర్వినియోగం హిందూపురం మున్సిపాలిటీలో ఆ అధికారే ‘మిత్ర’కు అండ ఒక్క వెండర్ నుంచే సామగ్రి కొనుగోలు చేయాలంటూ హుకుం -
మహిళా కూలీ దుర్మరణం
ఉరవకొండ రూరల్: ఆటో బోల్తాపడిన ఘటనలో ఓ మహిళా కూలీ దుర్మరణం పాలైంది. పోలీసులు తెలిపిన మేరకు... కణేకల్లు మండలం హనకనహాళ్ గ్రామానికి చెందిన కూలీలు గురువారం ఉదయం ఉరవకొండ మండలం నెరిమెట్ల గ్రామంలో మిరప పంట కోతకు ఆటోలో బయలుదేరారు. నింబగల్లు గ్రామ సమీపంలోకి చేరుకోగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనలో హనకనహాళ్కు చెందిన మహిళా కూలీ హసీనా (45) అక్కడికక్కడే మృతి చెందింది. రామలక్ష్మి, వరలక్ష్మి, పద్మ, లక్ష్మి, నిర్మలకు స్వల్ప గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ సురేష్ తీవ్రంగా గాయపడ్డాడు. అటుగా వెళుతున్న వారు గుర్తించి క్షతగాత్రులను వెంటనే ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఆకట్టుకుంటున్న ‘అయోధ్య రామ మందిరం’
తనకల్లు: శ్రీరామనవమిని పురస్కరించుకుని తనకల్లు మండలం పెద్దపల్లి వద్ద 89 అడుగుల ఎత్తుతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన అయోధ్య శ్రీరామమందిరం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. గ్రామానికి చెందిన డాక్టర్ ముక్తియార్బాషా ఆధ్వర్యంలో ఐదు రోజులుగా ఢిల్లీ, ముంబయి నుంచి వచ్చిన కళాకారులు ఈ ఆలయ నమూనాను తీర్చిదిద్దారు. మందిరం అంతర్భాంగా సీతారామ, లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆలయం ఎదుట ఉన్న శ్రీరాముడి భారీ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శుక్రవారం నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు ఈ ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలను నిర్వహించనున్నట్లు డాక్టర్ ముక్తియార్బాషా తెలిపారు. ఇక్కడకు వచ్చే భక్తుల కోసం తనకల్లు మండలం కొక్కంటి క్రాస్, అనమయ్య జిల్లా మొలకలచెరువు, కర్ణాటకలోని చాకివేలు నుంచి ఉచిత బస్సులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. -
పన్ను వసూళ్లలో మున్సిపల్టీ
రాయదుర్గం టౌన్: ఆస్తి పన్ను వసూళ్లలో జిల్లాలోని నగర పాలక సంస్థతో పాటు ఐదు మున్సిపాలిటీలు వెనుకంజలో ఉన్నాయి. మరో ఐదు రోజుల్లో 2025–26 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా గురువారం సాయంత్రం నాటికి 53.35 శాతం పన్ను వసూళ్లు మాత్రమే జరిగాయి. ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీలో 50 శాతం వరకు మాఫీ ఇచ్చినా ఆశించిన మేర ఫలితాలు దక్కలేదు. పూర్తి వడ్డీ మాఫీ వస్తుందని ఆశించిన యజమానులు... కేవలం 50 శాతం మాత్రమే ఇవ్వడంతో నిరాశకు గురయ్యారు. లక్ష్య సాధనలో సుదూరంగా... ఈ నెలాఖరులోపు వంద శాతం పన్ను వసూళ్లు చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ క్రమంలో రేయింబవళ్లూ శ్రమిస్తున్నారు. అనంతపురం కార్పొరేషన్, తాడిపత్రి, రాయదుర్గం, గుత్తి, గుంతకల్లు, కళ్యాణదుర్గం మున్సిపాలిటీల్లో 1,59,133 అసిస్మెంట్లు ఉండగా రూ.113.03 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ఇందులో ఇప్పటి వరకూ కేవలం రూ.60.32 కోట్లు మాత్రమే వసూళ్లయ్యాయి. 71.26 శాతంతో తాడిపత్రి మొదటి స్థానంలో ఉండగా, 69.75 శాతంతో రాయదుర్గం రెండో స్థానంలో నిలిచింది. 60.98 శాతంతో మూడో స్థానంలో గుత్తి, 50.87 శాతంతో నాల్గో స్థానంలో అనంతపురం, 47.67 శాతంతో ఐదో స్థానంలో గుంతకల్లు, 44.70 శాతంతో ఆరో స్థానంలో కళ్యాణదుర్గం మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ క్రమంలో నిర్ణీత గడువులోపు లక్ష్యాన్ని సాధించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇక ఐదురోజులే గడువు లక్ష్య సాధనలో వెనుకంజ 71.26 శాతంతో మొదటిస్థానంలో తాడిపత్రి 69.75 శాతంతో రెండోస్థానంలో రాయదుర్గం -
తాగునీటి సమస్య తలెత్తరాదు : జెడ్పీ సీఈఓ
అమరాపురం: గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జెడ్పీ సీఈఓ శివశంకర్ ఆదేశించారు. డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్యతో కలిసి గురువారం అమరాపురం మండలంలో ఆయన పర్యటించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో రికార్డులను పరిశీలించిన అనంతరం అధికారులతో మాట్లాడారు. తాగునీటి సమస్యపై ఆరా తీశారు. మండలంలోని 32 గ్రామాల్లో శ్రీరామరెడ్డి పథకం కింద తాగునీరు సక్రమంగా అందడం లేదని అధికారులు వివరించారు. దీంతో వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా చూసే బాధ్యత అధికారులదేనన్నారు. లోపాలను వెంటనే సరిచేసుకోవాలన్నారు. ఆస్తి పన్ను వసూళ్లు వందశాతం పూర్తి చేయాలన్నారు. చెత్తతో సంపద తయారీ కేంద్రాల నిర్వహణ సక్రమంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రామారావు, ఈఓఆర్డీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం హేమావతి గ్రామంలో వెలసిన సిద్దేశ్వరస్వామి ఆలయాన్ని జెడ్పీ సీఈఓ, డిప్యూటీ సీఈఓ సందర్శించారు. ప్రత్యేక పూజల అనంతరం తీర్థ ప్రసాదాలను అర్చకులు అందజేశారు. ఈ సందర్భంగా వారి వెంట కార్యదర్శి ఈరన్న ఉన్నారు. -
ఎస్ఎస్బీఎన్ యూజీ ఫలితాల విడుదల
అనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక సాయిబాబా జాతీయ డిగ్రీ కళాశాల (అటానమస్) యూజీ మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ (రెగ్యులర్, సప్లిమెంటరీ) పరీక్షా ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ ఎవాల్యూయేషన్ విడివిజన్ డైరెక్టర్ ప్రొఫెసర్ జి.వెంకటరమణ, కె.శ్రీరాములు నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కళాశాల కరస్పాండెంట్, సెక్రటరీ, పాలకవర్గ సభ్యులు, ప్రిన్సిపాల్, స్టూడెంట్ ఎవాల్యూషన్ డివిజన్ సిబ్బంది, బోధన సిబ్బంది పాల్గొన్నారు. ఫలితాలను www. ssbnc. in వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ సరిత తెలిపారు. ‘పురం’ మార్కెట్కు 3,200 క్వింటాళ్ల చింతపండుహిందూపురం: స్థానిక వ్యవసాయ మార్కెట్కు గురువారం 3,200 క్వింటాళ్ల చింత పండును విక్రయానికి రైతులు తీసుకువచ్చారు. మొదటి రకం కరిపులి క్వింటా గరిష్టంగా రూ.27వేలు, కనిష్టంగా రూ.10,100తో సగటున రూ.14,500తో అమ్ముడు పోయింది. అలాగే రెండో రకం ఫ్లవర్ క్వింటా గరిష్టంగా రూ.14 వేలు, కనిష్టంగా రూ.6,100తో సగటున రూ.9 వేలతో క్రయవిక్రయాలు సాగాయి. ప్రతి సోమ, గురువారాల్లో చింతపండు, మంగళ, శుక్రవారాల్లో ఎండుమిర్చి క్రయవిక్రయాలు చేపట్టనున్నట్లు మార్కెట్ కార్యదర్శి నరసింహమూర్తి తెలిపారు. గుత్తిలో వరుస చోరీలు గుత్తి: స్థానిక తాడిపత్రి మార్గంలోని మూడు దుకాణాల్లో గురువారం తెల్లవారు జామున దొంగలు పడ్డారు. మురళీకృష్ణ జనరల్ స్టోర్స్, గంగాగౌరీ ట్రేడర్స్, శ్రీలక్ష్మీ ఎంటర్ ప్రైజెస్ దుకాణాల్లో చొరబడిన దుండగులు కొంత నగదు, విలువైన సామగ్రిని అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఆర్ఓ ప్లాంట్ల నిర్వహణ లేకనే సమస్య అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ల నిర్వహణ సరిగా లేకనే సమస్య తలెత్తి తాగునీటికి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని సమగ్ర శిక్ష ఏపీసీ టీ.శైలజ పేర్కొన్నారు. ఆర్ఓ ప్లాంట్ల నిర్వహణపై అనంతపురం జిల్లాలోని 107 పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు గురువారం స్థానిక సైన్స్ సెంటర్లో ఓరియెంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఆర్ఓ ప్లాంట్లు సరఫరా చేసిన ఆహ్లాద కంపెనీ, ఇన్నోవేటివ్ కంపెనీ ప్రతినిధులు పాల్గొని డెమో ద్వారా ప్లాంట్ల నిర్వహణ, వినియోగ విధానాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏపీసీ మాట్లాడారు. చిన్నపాటి సమస్యలను సైతం పరిష్కరించకుండా అలాగే వదిలేస్తుండడంతో అవి పెద్ద సమస్యగా మారుతున్నాయన్నారు. సమస్యలు నెలకొన్న పాఠశాలల వివరాలు తెలియజేస్తే కంపెనీలతో చర్చించి పరిష్కారం చూపిస్తామన్నారు. ఇంజనీర్ రమణారెడ్డి మాట్లాడుతూ.. నీటి కొరత, పైప్లైన్ లేకపోవడం, విద్యుత్ సమస్యలు వంటి అంశాలను తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. అసిస్టెంట్ ఏఎంఓ నారాయణస్వామి మాట్లాడుతూ.. జిల్లాలో ఆర్ఓ ప్లాంట్లు సరఫరా చేసిన ప్రతి కంపెనీతో కలిసి పాఠశాల స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. ఏపీఓ నారాయణస్వామి మాట్లాడుతూ.. చిన్న పాటి సమస్యలను పాఠశాల స్థాయిలోనే పరిష్కరించుకోవాలని, పెద్ద సమస్యలను సమగ్ర శిక్ష ద్వారా పరిష్కరిస్తామని సూచించారు. -
పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు
తాడిపత్రి రూరల్: ద్విచక్ర వాహనదారుడిని తప్పించే క్రమంలో ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. వివరాలు... తాడిపత్రి డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు బుధవారం ఉదయం ఊరుచింతల గ్రామం నుంచి 50 మంది ప్రయాణికులతో తాడిపత్రికి బయలు దేరింది. అవుల తిప్పాయపల్లి సమీపంలో రోడ్డు డైవర్షన్ కారణంగా 544డీ జాతీయ రహదారిపైకి చేరుకున్న బస్సు వెంకటరెడ్డిపల్లి సమీపంలోకి చేరుకోగానే ఉన్నఫళంగా ఓ ద్విచక్ర వాహనదారుడు రాంగ్ రూట్లో ఓవర్టేక్ చేసే ప్రయత్నం చేస్తూ దూసుకెళ్లాడు. ఏ కాస్త అజాగ్రత్తగా వ్యవహరించిన ద్విచక్ర వాహనదారుడు బస్సు చక్రాల కిందపడే ప్రమాదముండడంతో డ్రైవర్ అప్రమత్తమై వాహనాన్ని కుడి వైపుగా మళ్లించే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో పక్కనే ఉన్న భారీ వాహనాన్ని ఢీకొనే అవకాశం ఉండడంతో వెంటనే ఎడమ వైపుగా మళ్లించడంతో బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న డిపో అధికారుల సూచన మేరకు ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానానికి చేర్చారు. సంఘటనా స్థలాన్ని అధికారులు పరిశీలించి బస్సును డిపోకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలను విచారిస్తున్నట్లు డిపో మేనేజర్ మురళీధర్ తెలిపారు. -
విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి
హిందూపురం: స్థానిక మున్సిపాల్టీలో వాటర్ పైప్లైన్ మరమ్మతులు చేసే కార్మికుడు రమేష్ (45) విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. బుధవారం ఉదయం పట్టణంలోని మోత్కుపల్లి రోడ్డులోని మున్సిపల్ పంప్హౌస్ సమీపంలో లీక్ అవుతున్న వాటర్ పైప్లైన్కు హాట్ జాయింట్ చేసే క్రమంలో విద్యుత్ షాక్కు గురై కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి కార్మికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై వన్టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గంజాయి విక్రేత అరెస్ట్ గుంతకల్లు: స్థానిక హనుమన్ సర్కిల్లో గంజాయి విక్రయిస్తున్న భాగ్యనగర్కు చెందిన షికారీ సోమిని అరెస్ట్ చేసినట్లు ఎకై ్సజ్ సీఐ జి.శివసాగర్ తెలిపారు. అందిన సమాచారం మేరకు బుధవారం ఉదయం తనిఖీలు చేపట్టిన సమయంలో గంజాయి విక్రయిస్తూ సోమి పట్టుబడ్డాడన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి 515 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. -
మున్సిపాల్టీ ఆదాయానికి సిండికేట్ గండి
హిందూపురం: స్థానిక మున్సిపాల్టీ పరిధిలోని ఆదాయ వనరులపై బుధవారం నిర్వహించిన వేలం ప్రక్రియ టీడీపీ నేతల జోక్యంతో పక్కదారి పట్టింది. అధికార పార్టీకి చెందిన నాయకులు సిండికేట్గా మారి తక్కువ ధరకే టెండర్లు దక్కించుకున్నారు. దీంతో గత ఏడాదితో పోల్చుకుంటే మున్సిపాల్టీకి రూ.15.76 లక్షల ఆదాయం తగ్గింది. ఏటా ఆదాయ వనరులపై 30 శాతం పెంచుతూ వేలం నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఈ సారి టీడీపీ నేతల ఒత్తిళ్లు తాళలేక అధికారులు తక్కువ మొత్తానికే టెండర్లు ఖరారు చేయడం గమనార్హం. తూతూమంత్రంగా వేలం ప్రక్రియ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున సమక్షంలో బుధవారం పెద్ద కూరగాయల మార్కెట్, చిన్న పశువుల మార్కెట్, పెద్ద పశువుల మార్కెట్, పరిగి బస్టాండ్లోని ఖాళీ స్థలాలపై సుంకం వసూళ్లకు వేలం నిర్వహించారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు కుమ్మకై తక్కువ ధరకే టెండర్లు కై వసం చేసుకున్నారు. కూరగాయల మార్కెట్ వేలం రూ. 50.25 లక్షలకే ఖరారైంది. చిన్న పశువుల మార్కెట్ రూ. 7.36 లక్షలు, పెద్ద పశువుల మార్కెట్ రూ.1.18 లక్షలు, పరిగి బస్టాండ్లో ఖాళీ స్థలం రూ. 20.02 లక్షలతో వేలం దక్కించుకున్నారు. ఈ నాలుగు మార్కెట్ల ద్వారా కేవలం రూ.78.81 లక్షల ఆదాయం మాత్రమే సమకూరింది. అలాగే ఇందిరాపార్క్లోని వాణిజ్య సముదాయాల్లో ఉన్న 26వ నంబర్ గదికి రూ.7 వేల అద్దె చెల్లించేలా టెండర్ దక్కించుకున్నారు. మున్సిపల్ లైబ్రరీ కాంపెక్స్, మున్సిపల్ బస్టాండ్లోని ఐదు వాణిజ్య దుకాణాల వేలం ప్రక్రియ వాయిదా పడింది. ఈ ప్రక్రియ మొత్తం తూతూమంత్రంగా అధికారులు నిర్వహించారంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజలపై భారం పడకూడదంటూ బుకాయింపు గత ఏడాది మున్సిపాల్టీ ఆదాయ వనరులపై నిర్వహించిన వేలం ప్రక్రియలో రూ.94.57 లక్షల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది ఏకంగా రూ.15.76 లక్షల ఆదాయం తగ్గి రూ.78.81 లక్షలకు చేరుకుంది. ఈ వ్యత్యాసంపై కమిషనర్ మల్లికార్జున మాట్లాడుతూ.. కలెక్టర్ ఆదేశాల మేరకే వేలం పాటదారులకు అనుమతులు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. టెండర్ దారులు పోటీ పడి హెచ్చు ధరకు వేలం పాడితే ఆ మొత్తాన్ని సమీకరించుకునేందుకు వ్యాపారులు, ప్రజలపై భారం వేస్తారని, అలా ప్రజలపై భారం పడకూడదనే టెండర్లు ఖరారు చేసినట్లు వివరించారు. నిర్ణీత ధర కంటే ఎక్కువ సుంకం వసూలు చేస్తే కాంట్రాక్టర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే తగ్గిన రూ.15.76 లక్షల ఆదాయం టీడీపీ నేతల జోక్యంతో పక్కదారి పట్టిన వేలం ప్రక్రియ -
జీజీహెచ్లో అరుదైన శస్త్రచికిత్స
అనంతపురం: ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్సతో ఓ మహిళకు పునర్జన్మను ప్రసాదించారు. వివరాలను బుధవారం జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి వెల్లడించారు. పెనుకొండ మండలం బక్సంపల్లి గ్రామానికి చెందిన అనిత మూడో కాన్పు నిమిత్తం జీజీహెచ్లో చేరింది. గతంలో రెండు కాన్సులు సిజేరియన్ అయ్యాయి. మూడో కాన్పు కూడా సిజేరియన్ చేయాల్సి ఉంటుందని వైద్యులు నిర్ధారించారు. అయితే గర్భిణి అనిత మెదడుకు వెళ్లే రెండు రక్తనాళాలు పూర్తిగా మూసుకుపోయి రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆర్టీఎల్, కెరటిక్ పద్ధతుల్లో శస్త్ర చికిత్స చేసి, అనిత ప్రాణాలు కాపాడారు. అయితే పురిటిలోనే నవజాత శిశువు మృతి చెందింది. ప్రస్తుతం అనిత కోలుకోవడంతో కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అరుదైన శస్త్రచికిత్సతో రోగి ప్రాణాలు కాపాడిన గైనకాలజిస్ట్ హెచ్ఓడీ డాక్టర్ షంషాద్బేగం, డాక్టర్ పద్మశ్రీ, డాక్టర్ అరుణ జ్యోతి, డాక్టర్ సౌజన్య, అనస్తీషియా హెచ్ఓడీ డాక్టర్ నవీన్కుమార్, డాక్టర్ జగదీష్, డాక్టర్ సోమశేఖర్, డాక్టర్ సాహితీ బృందాన్ని సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి అభినందించారు. -
తప్పని పడిగాపులు
పెద్దవడుగూరు: గ్యాస్ సిలిండర్ కోసం రేయింబవళ్లూ ఎదురు చూడాల్సిన దుస్థితికి అద్దం పడుతోంది ఈ దృశ్యం. దాదాపు 4 వేలకు పైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్న పెద్దవడుగూరులో వంట గ్యాస్ కొరత కారణంగా స్థానిక ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ కొన్ని రోజులుగా మూతపడింది. అయితే అప్పటి నుంచి గుత్తికి చెందిన గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు ప్రత్యేక వాహనం ద్వారా పెద్దవడుగూరు గ్రామానికి వచ్చి సిలిండర్లను అందజేస్తున్నారు. ఈ క్రమంలో మండలంలోని రాంపురం, గంజిగుంటపల్లి, కొట్టాలపల్లి, పి.వీరన్నపల్లి తదితర గ్రామాలకు చెందిన వినియోగదారులు బుధవారం వేకువ జాము 1 గంటకే పెద్దవడుగూరులోని రచ్చకట్ట వద్దకు ఖాళీ సిలిండర్లతో చేరుకుని అక్కడే నిద్రించారు. ఉదయం 7 గంటలకు వందకు పైగా ఖాళీ సిలిండర్లు అక్కడకు చేరుకున్నాయి. మధ్యాహ్నమైనా వాహనం రాకపోవడంతో వినియోగదారులు పడిగాపులు కాస్తూ రచ్చకట్టపైనే నిద్రిస్తూ కనిపించారు. -
ప్రియురాలి మోసం.. యువకుడి బలవన్మరణం
తాడిపత్రి రూరల్: ప్రియురాలు మోసం చేసిందన్న బాధలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు... వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలోని అంకంపల్లికి చెందిన నాగమల్లారెడ్డి, పద్మావతి దంపతులకు ఇరువురు కుమారులున్నారు. పెద్ద కుమారుడు శివపవన్కుమార్రెడ్డి వాటర్ బాటిళ్లను దుకాణాలకు వేస్తూ వచ్చిన కమీషన్ను కుటుంబ అవసరాలకు ఇచ్చేవాడు. ఈ క్రమంలో పరిచయమైన యువతితో ప్రేమలో పడ్డాడు. ఇటీవల యువతి తనను మోసం చేస్తున్నట్లుగా గుర్తించిన శివపవన్కుమార్రెడ్డి మనోవేదనకు లోనయ్యాడు. దీంతో జీవితంపై విరక్తి పెంచుకుని చెంది ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం పులివెందుల నుంచి తాడిపత్రికి బస్సులో వచ్చి ఆర్టీసీ బస్టాండ్ నుంచి రైల్వేస్టేషన్కు ఆటోలో చేరుకున్నాడు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు పట్టాలపై నడుచుకుంటూ వెళుతుండగా తమ్ముడు శివనాగార్జునరెడ్డి ఫోన్ చేశాడు. కాల్ రిసీవ్ చేసుకున్న శివపవన్కుమారెడ్డి మాట్లాడుతూ.. తాను ఎక్కడున్నానో తనకే తెలియదని, ఇక ఇంటికి రానని, ప్రేమ విఫలం కావడంతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తెలిపాడు. ఆందోళనకు గురైన తమ్ముడు వెంటనే సర్ది చెబుతూ ఎక్కడున్నావో లోకేషన్ షేర్ చేయాలని అడగడంతో శివపవన్కుమార్రెడ్డి ఫోన్ లోకేషన్ షేర్ చేశాడు. అప్పటికే కోమలి సమీపంలోకి చేరుకున్న శివపవన్కుమార్రెడ్డి ఎదురుగా వస్తున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కో–పైలెట్ సమాచారంతో ఘటనా స్థలానికి జీఆర్పీ హెచ్సీ వరప్రసాద్ చేరుకుని పరిశీలించారు. కాసేపటి తర్వాత ఫోన్ లోకేషన్ ఆధారంగా ప్రత్యేక వాహనంలో తల్లిదండ్రులతో కలసి శివనాగార్జునరెడ్డి చేరుకున్నాడు. పట్టాలపై ఛిద్రమై పడి ఉన్న కుమారుడి శరీర భాగాలు చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
కిరాణా దుకాణంలో అగ్నిప్రమాదం
కనగానపల్లి: మండలంలోని తల్లిమడుగుల గ్రామంలో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకుని కిరాణా దుకాణం దగ్ధమైంది. స్థానికులు తెలిపిన మేరకు... గ్రామంలోని ప్రధాన రహదారి పక్కన ఫకృద్దీన్ (మూగ), నసీమా దంపతులు కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. నిత్యావసర సరుకులతో పాటు స్నాక్స్, కూల్ డ్రింక్స్, టీ విక్రయిస్తుంటారు. మంగళవారం రాత్రి దుకాణాన్ని బంద్ చేసి ఇంటికెళ్లి నిద్రించారు. బుధవారం తెల్లవారుజామున దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల వారు గమనించి మంటలను ఆర్పేశారు. అప్పటికే నిత్యావసర సరుకులు, విద్యుత్ సామగ్రి కాలిబూడిదయ్యాయి. రూ.4 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు. మామిడి సాగుపై అవగాహన పెంచుకోవాలి● ఉద్యాన అధికారి చంద్రశేఖర్ పుట్టపర్తి అర్బన్: మారుతున్న కాలానికి అనుగుణంగా మామిడి ఆధునిక సాగు విధానాలపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని రైతులకు జిల్లా ఉద్యాన అధికారి చంద్రశేఖర్, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్, సెర్ప్ డీపీఎం రామమోహన్ సూచించారు. బుక్కపట్నం మండలం రాసింపల్లిలో మామిడి రైతులకు బుధవారం సీస్కో ప్రాజెక్టులో భాగంగా డిజిటల్ గ్రీన్ ట్రస్ట్, ఉద్యాన శాఖ, సెర్ప్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. అధిక సాంద్రత సాగు విధానాలు, కీటకాలు, వ్యాధుల నివారణ, నీటి ఆదా, సేంద్రియ ఎరువులు, సమగ్ర పోషకాల నిర్వహణ, మామిడిని ఆశించే కీటకాలు, ప్రతికూల పరిస్థితుల నుంచి పంటను రక్షించుకునే విధానాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బుక్కపట్నం, ముదిగుబ్బ, నల్లమాడ, కదిరి, తలుపుల, ఓడీచెరువు, పుట్టపర్తి, కొత్తచెరువు మండలాల రైతులు, ఉద్యానశాఖ అధికారి నవీన్కుమార్, డిజిటల్ గ్రీన్ డాక్టర్ శ్రీకాంత్ పాల్గొన్నారు. ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోండి● డీఎల్ఎస్ఏ కార్యదర్శి రాజశేఖర్ హిందూపురం: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) ద్వారా అందజేస్తున్న ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రిమాండ్ ఖైదీలకు ఆ సంస్థ కార్యదర్శి రాజశేఖర్ సూచించారు. బుధవారం హిందూపురంలోని సబ్జైలును ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఖైదీల బ్యారెక్లు, వంట గదితో పాటు రికార్డులు పరిశీలించారు. అనంతరం ఖైదీలతో సమావేశమై మాట్లాడారు. అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. తప్పులు చేసి జైలుకు వచ్చిన నిందితులకు ఆర్థిక ఇబ్బందులుంటే దరఖాస్తు చేసుకుంటే అర్హత ఉన్న వారికి ఉచితంగా న్యాయవాదులను ఏర్పాటు చేసి కేసులు వాదించేలా చర్యలు తీసుకుంటామన్నారు. జైలులో కులవివక్ష ప్రదర్శిస్తుంటే వెంటనే తన దృష్టికి తీసుకువస్తే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. కార్యక్రమంలో సబ్జైలు అధికారి హనుమప్ప, న్యాయవాదులు నవేరా, దివ్య, శివ తదితరులు పాల్గొన్నారు. -
సీఎస్ఆర్ నిధులతో సర్వతోముఖాభివృద్ధి : కలెక్టర్
ప్రశాంతి నిలయం: కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్)లో భాగంగా నిధులు అందజేసి జిల్లా సర్వతోముఖాభివృద్ధికి సహకరించాలని జిల్లాలోని పరిశ్రమల నిర్వాహకులకు కలెక్టర్ శ్యాంప్రసాద్ సూచించారు. సీఎస్ఆర్ నిధుల సమీకరణ అంశంపై బుధవారం కలెక్టరేట్లో వివిధ పరిశ్రమల మేనేజర్లు, కమిటీ సభ్యులతో కలెక్టర్ సమీక్షించారు. తాగునీటి సమస్య, చెత్త సేకరణ ప్రక్రియ, రైతు బజార్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ప్రభుత్వ హాస్టళ్లకు ప్రహరీ నిర్మాణాలు, అంగన్వాడీ స్కూళ్ల నిర్మాణానికి సహకరించాలని కోరారు. అర్హులైన నిరుద్యోగులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. పర్యాటక రంగ అభివృద్ధికి తోడ్పాటునందించాలన్నారు. కార్యక్రమంలో సీపీఓ విజయ్కుమార్, డీఆర్డీఏ పీడీ నరసయ్య, పరిశ్రమల జీఎం నాగరాజు, జెడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య, డీఎస్డీఓ హరికృష్ణ పాల్గొన్నారు. ఎంఎన్ఓ ఆత్మహత్యాయత్నం అనంతపురం: ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో కాంట్రాక్ట్ పద్దతిలో ఎంఎన్ఓగా విధులు నిర్వర్తిస్తున్న యువకుడు మధుకుమార్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇటుకలపల్లి పరిసర ప్రాంతాల్లో బుధవారం కూల్డ్రింక్లో విషం కలుపుకుని తాగాడు. ధర్మవరం ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఇద్దరూ కలసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోక మరో యువకుడితో పెళ్లి నిశ్చయించారు. దీంతో మనస్తాపం చెందిన మధుకుమార్ ఆత్మహత్యయత్నానికి పాల్బడ్డాడు. ప్రస్తుతం సర్వజనాసుపత్రిలో చికిత్స పొందుతున్న మధుకుమార్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. గవి మఠం హుండీ లెక్కింపు ఉరవకొండ: గవిమఠం చంద్ర మౌళీశ్వరస్వామి శాశ్వత హుండీ లెక్కింపు బుధవారం నిర్వహించారు. మఠం ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవ రాజేంద్రస్వామి, మఠం ఇన్చార్జ్ సహాయ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ పర్యవేక్షించారు. శాశ్వత హుండీ ద్వారా రూ 2.9లక్షలు వసూలైంది. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ మాట్లాడుతూ 2025లో శాశ్వత హుండీ ద్వారా 1,78,175 ఆదాయం రాగా, ప్రస్తుతం అదనంగా రూ30,949 ఆదాయం వచ్చిందన్నారు. లెక్కింపులో మఠం జూనియర్ అసిస్టెంట్ గోపి, మధు తదితరులు పాల్గొన్నారు. -
గవర్నర్కు స్నాతకోత్సవ ఆహ్వానం
అనంతపురం: ఏప్రిల్లో జరగనున్న జేఎన్టీయూ (అనంతపురం) 15వ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని చాన్సలర్/ గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ను వీసీ ప్రొఫెసర్ హెచ్.సుదర్శనరావు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను వీసీ స్వయంగా గవర్నర్కు అందజేసి విన్నవించారు. యూనివర్సిటీ చేపట్టిన కార్యక్రమాలు, గౌరవ డాక్టరేట్ ఎంపిక తదితర అంశాలపై చర్చించారు. గౌరవ డాక్టరేట్ను భారత దేశ క్షిపణి పుత్రి టెస్సీ థామస్కు ఇవ్వనున్నారు. ఈ అంశంపై గవర్నర్..వీసీని అభినందించినట్లు తెలిసింది. -
ప్రజలకు మెరుగైన సేవలందిస్తాం
● లేపాక్షిలో పోలీసు స్టేషన్ భవనానికి భూమి పూజ చేసిన ఎస్పీ లేపాక్షి: ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. ఈ క్రమంలోనే లేపాక్షిలో ఆధునిక సౌకర్యాలతో కూడిన నూతన పోలీస్ కార్యాలయ భవనాన్ని నిర్మిస్తున్నామన్నారు. బుధవారం ఆయన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల ద్వారా పోలీసు భవన నిర్మాణానికి సహకారం అందిస్తున్న బాలాజీతో కలిసి భూమిపూజ చేశారు. అనంతరం ఎస్పీ సతీష్కుమార్ స్థానిక విలేకరులతో మాట్లాడారు. లేపాక్షిలో నూతన పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయ భవనాలు నిర్మించడం వల్ల ఈ ప్రాంత వాసులకు మెరుగైన సేవలు అందించే అవకాశం కలుగుతుందన్నారు. లేపాక్షి, చిలమత్తూరు మండలాలకు సంబంధించి పోలీస్ సేవలు అందుబాటులో ఉండే విధంగా, నూతనంగా నిర్మిస్తున్న భవనం పైఅంతస్థులో సర్కిల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. హిందూపురంలోని సర్కిల్ కార్యాలయాన్ని లేపాక్షికి మార్చడం వల్ల ప్రజలకు మరింత వేగంగా సేవలందించడం సాధ్యమవుతుందన్నారు. సీఎస్ఆర్ నిధులు ద్వారా పోలీసు కార్యాలయ నిర్మాణానికి సహకారం అందించిన బాలాజీని ఎస్పీ ఈ సందర్భంగా అభినందించి పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హిందూపురం డీఎస్పీ మహేష్, హిందూపురం అప్గ్రేడ్ స్టేషన్ సీఐ ఆంజనేయులు, తహసీల్దార్ సౌజన్యలక్ష్మి, ఎస్ఐ నరేంద్ర, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కోనుప్పలపాడులో బాలుడి కిడ్నాప్ తాడిపత్రిటౌన్: కోనుప్పలపాడులో స్కూలు బస్సు దిగి ఇంటికెళ్తున్న బాలుడిని ఓ దుండగుడు కిడ్నాప్ చేశాడు. బంధువుల మధ్య ఉన్న పాత కక్షల నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. వివరాలిలా ఉన్నాయి. యాడికి మండలం కోనుప్పలపాడు గ్రామానికి చెందిన గోవిందు, లక్ష్మీకాంతమ్మ దంపతులు. వీరి కుమారుడు వేమచంద్ర యాడికిలోని ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. రోజులాగే బుధవారం పాఠశాల ముగియగానే వేమచంద్రను స్కూల్ బస్సులో తీసుకొచ్చి స్వగ్రామంలో దింపారు. అప్పటికే అక్కడ ముఖానికి మాస్క్ వేసుకున్న ఓ వ్యక్తి నడుచుకుంటూ వస్తున్న వేమచంద్రను కిడ్నాప్ చేసి ద్విచక్రవాహనంపై తీసుకెళ్లాడు. సాయంత్రం పొలం నుంచి ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులకు కుమారుడు కనిపించలేదు. ఎక్కడికెళ్లాడో అని ఊరంతా గాలించారు. ఫలితం లేకపోవడంతో ఆందోళనకు గురైన వారు.. స్కూలు బస్సు దింపే చోట సమీపంలోని దుకాణంలోని సీసీ కెమెరాను పరిశీలించారు. ముసుగు వ్యక్తి కిడ్నాప్ చేసినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ద్విచక్రవాహనం కుందనకోట వైపు వెళ్లినట్లు గుర్తించారు. బాలుడి తండ్రి గోవిందుకు పాత గొడవలు ఏమైనా ఉన్నాయా.. ఎవరిౖపైనెనా అనుమానం ఉందా... అని ఆరా తీసిన పోలీసులు.. బంధువైన వినోద్ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. వినోద్ తన స్నేహితుని ద్వారా బాలుడిని కిడ్నాప్ చేయించినట్లు తెలుసుకున్నారు. అయినా అర్ధరాత్రి వరకు బాలుడి ఆచూకీ దొరక్కపోవడంతో ఏఎస్పీ రోహిత్కుమార్తో పాటు నియోజక వర్గంలోని పోలీస్ సిబ్బంది బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కుందనకోటలో కిడ్నాప్నకు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని గుర్తించినట్లు తెలిసింది. -
సైబీరియన్ పక్షుల సంరక్షణకు చర్యలు
చిలమత్తూరు: సైబీరియన్ పక్షులకు కష్టం కలగనివ్వకుండా వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. సైబీరియన్ పక్షుల విడిది కేంద్రాలైన వీరాపురం, వెంకటాపురం గ్రామాలను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తామన్నారు. బుధవారం ఆయన వీరాపురం, వెంకటాపురం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వాచ్ టవర్ ఎక్కి బైనాక్యులర్ ద్వారా పక్షులను వీక్షించారు. కెమెరాతో స్వయంగా పక్షుల ఫొటోలు తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... సైబీరియన్ పక్షులకు అవసరమైన ఆహారం, నీరు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. చెట్ల పైనుంచి పడే సైబీరియన్ పక్షుల పిల్లలను కాపాడేందుకు ఓ సంరక్షుడిని నియమించామన్నారు. పక్షి పిల్లలకు మెరుగైన చికిత్స, ఆహారం అందించేందుకు నిపుణులైన అనిమల్ ప్రొటెక్షన్ ఎన్జీఓలతో సమన్వయం చేసుకుంటున్నట్టు వెల్లడించారు. వీరాపురం, వెంకటాపురం, చిలమత్తూరు గ్రామాల సప్లై చానళ్ల పూడిక తీత పనులు చేపట్టి భవిష్యత్లో నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పుట్టపర్తి, లేపాక్షి సందర్శించే పర్యాటకులు వీరాపురం, వెంకటాపురం గ్రామాల్లోని సైబీరియన్ పక్షులను చూసేందుకు వీలుగా రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. కలెక్టర్ వెంట జిల్లా అటవీశాఖ అధికారి చక్రపాణి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య, డీపీఓ సమత, మత్స్యశాఖ ఏడీ చంద్రశేఖర్, తహసీల్దార్ మనోజ్కుమార్, సర్పంచ్ లక్ష్మీపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పక్షుల విడిది కేంద్రాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం కలెక్టర్ శ్యాంప్రసాద్ వెల్లడి -
భూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
● జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పుట్టపర్తి అర్బన్: భూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన ఆర్డీఓ సువర్ణతో కలిసి నల్లమాడ రెవెన్యూ కార్యాలయాన్ని, వేళ్లమద్ది, ఎర్రవంకపల్లి గ్రామ సచివాలయాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా జేసీ... మ్యుటేషన్, పట్టాదారు పాసు పుస్తకాల కోసం అందిన అర్జీలు, పెండింగ్లో ఉన్న రెవెన్యూ అర్జీలు, మీ–సేవ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించారు. సిబ్బంది పనితీరు, బయోమెట్రిక్ హాజరు తనిఖీ చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. తహసీల్దార్ మనోజ్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం జేసీ మౌర్య భరద్వాజ్.. రీసర్వే పూర్తయిన వేళ్లమద్దిలో డ్రాప్ట్ పట్టాదారు పాసుపుస్తకాలకు సంబంధించి ఈ–కేవైసీ ప్రక్రియను పరిశీలించారు. అక్కడే ఉన్న రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎల్పీఎం భూమలును విభజించడం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు. -
పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం
ప్రశాంతి నిలయం: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలకు తగిన ప్రోత్సాహం అందిస్తామని కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పారిశ్రామిక అనుమతులు, ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... వివిధ శాఖల ద్వారా పరిశ్రమలకు రావాల్సిన అనుమతులను వెంటనే మంజూరు చేయాలన్నారు. గత ఏడాది విశాఖ పట్నం గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు జిల్లాలో ఏర్పాటవుతున్న పరిశ్రమలపై, పీఎం విశ్వకర్మ పథకాల పురోగతిని సమీక్షించారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూ కేటాయింపులు, ఇతర సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సర్క్యులర్ ఎకానమీ పాలసీలో భాగంగా వ్యర్థ పదార్థాలతో నూతన ఉత్పత్తులు తయారు చేసే పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. అనంతరం పారిశ్రామిక పాలసీ ద్వారా దరఖాస్తు చేసుకున్న 15 పరిశ్రమలకు సంబంధించి పెట్టుబడి, వడ్డీ రాయితీ మంజూరు చేశారు. కార్యక్రమంలో ఎల్డీఎం రమణయ్య, జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ నాగరాజు, శ్రీకాంతమ్మ, డీపీఓ సత్యనారాయణ జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈవీఎంల భద్రతకు అధిక ప్రాధాన్యంధర్మవరం అర్బన్: ఈవీఎంల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఇందుకోసం ఈవీఎం గోడౌన్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. బుధవారం ఆయన పట్టణంలోని మార్కెట్ యార్డులో ఉన్న ఈవీఎం గోడౌన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈవీఎం యంత్రాలు, వీవీ ప్యాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్ల వద్ద భద్రత కట్టుదిట్టం చేయాలని అధికారులను ఆదేశించారు. గోడౌన్ వద్ద సీసీ కెమెరా వ్యవస్థ, ఫైర్ సేఫ్టీ, నిరంతర భద్రతా ఉండాలన్నారు. కలెక్టర్ వెంట ఇన్చార్జ్ ఆర్డీఓ సూర్యనారాయణరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య, తహసీల్దార్ సురేష్బాబు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉన్నారు. -
ధర్మవరంలో సీఐ భార్య ఆత్మహత్య
ధర్మవరం అర్బన్: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం జీఆర్పీ (రైల్వే) సీఐ అశోక్కుమార్ భార్య చాముండేశ్వరి (40) ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ధర్మవరం శివరామ్నగర్లో అశోక్కుమార్ దంపతులు నివాసముంటున్నారు. వీరి కుమార్తె వర్షితారాణి అనంతపురంలో డిగ్రీ ఫస్టియర్, కుమారుడు పునీత్రాయ్ ఇంటర్ సెకండియర్ చదువుతున్నారు. మంగళవారం రాత్రి భోజనం ముగించుకున్న అనంతరం దంపతులిద్దరూ నిద్రించారు. బుధవారం తెల్లవారుజామున నిద్రలేచిన అశోక్కుమార్ భార్య పక్కన కనిపించకపోవడంతో ఆమెను పిలుస్తూ మరో బెడ్రూమ్లోకి వెళ్లారు. అప్పటికే ఆ గదిలోని ఫ్యాన్కు వేసుకున్న ఉరికి విగత జీవిగా వేలాడుతున్న చాముండేశ్వరిని గమనించి.. ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. టూ టౌన్ సీఐ రెడ్డప్ప, మృతురాలి కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చాముండేశ్వరి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుని ఉంటుందని మృతురాలి అన్న శివకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలి
ప్రశాంతినిలయం: జిల్లాలో రెవెన్యూ పాలనను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా పని చేయాలని జేసీ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సాంకేతిక సమస్యలు అధిగమించి రీసర్వే పూర్తి చేయాలన్నారు. 22ఏ చుక్కల భూముల సమస్యలు, సరిహద్దు వివాదాలు, రెవెన్యూ క్లినిక్లో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ఎక్కడా గ్యాస్ కొరత లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ విజయసారధి, డీఎస్ఓ వంశీక్రిష్ణారెడ్డి, ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
గృహ నిర్మాణంలో వేగం పెంచాలి
ప్రశాంతి నిలయం: గృహ నిర్మాణం, తాగునీరు, గ్రామీణ పరిశుభ్రత అంశాల్లో వేగం పెంచాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని అన్ని మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘సాసా’ కార్యక్రమం అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని, గ్రామ పంచాయతీల్లో తడి, పొడి చెత్తను వేరు చేసే విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలన్నారు. మండలాల వారీగా పంచాయతీలకు ర్యాంకులు ఇచ్చి పోటీతత్వాన్ని సృష్టించాలన్నారు. తాగునీటి ఎద్దడి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ధర్మవరంలో 165, హిందూపురం అర్బన్లో 43, కదిరి అర్బన్లో 41 గృహాలు పెండింగ్లో ఉన్నాయన్నారు. దీంతో పాటు ముదిగుబ్బ, గోరంట్ల మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. శానిటరీ కాంప్లెక్స్ల పురోగతి తక్కువగా ఉందని, పీఎం సూర్యఘర్ అమలు కూడా వేగవంతం చేయాలన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తనిఖీ కదిరి టౌన్: కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో రికార్డులు, రిజిస్ట్రేషన్ ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పారదర్శకంగా సేవలు అందించాలన్నారు. పెండింగ్ ఉన్న ఫైళ్లను వెంటనే పరిష్కంచాలని సూచించారు. అనంతరం కార్యాలయ పరిసరాలను పరిశీలించి, నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కదిరి 9వ వార్డు సయ్యద్ వీధిలో షాహిదా, నిసార్ అనే లబ్ధిదారుల ఇంటిపైన సూర్యఘర్ పథకం కింద ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెళ్లను పరిశీలించారు. కలెక్టర్ వెంట కదిరి ఆర్డీఓ వీవీఎస్ శర్మ, మున్సిపల్ కమిషనర్ కిరణ్కుమార్, తహసీల్దార్ రెడ్డి శేఖర్, విద్యుత్శాఖ డీఈ కృష్ణదేవ తదితరులు పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలి
● ఎస్పీ సతీష్కుమార్ పుట్టపర్తి టౌన్: రానున్న స్థానిక సంస్థలఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని ఎస్పీ సతీష్కుమార్ పోలీస్ అధికారులకు సూచించారు. మంగళవారం స్థానిక సాయి ఆరామంలో అన్ని సబ్డివిజన్లకు చెందిన డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నెలవారి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. శాంతిభద్రతలు, రోడ్డు ప్రమాదాల నివారణ తదితర వాటిపై దిశా నిర్దేశం చేశారు. వివిధ కేసుల్లో ధైర్య సాహసాలు, ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులకు క్యాష్ రివార్డులు, ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. ఎస్పీ మాట్లాడుతూ చాలా కాలంగా పెండింగ్లో ఉన్న వివిధ కేసుల్లో త్వరగా పురోగతి సాధించాలన్నారు. మహిళలు, చిన్నపిల్లలపై జరుగుతున్న నేరాలు, చోరీలు, గొడవలతో పాటు రౌడీషీటర్ల కదలికలపై దృష్టి సారించాలన్నారు. రాత్రి సమయాల్లో గస్తీ ముమ్మరం చేయాలన్నారు. ఆర్టీసీ బప్టాండ్లలో చోరీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ పదే పదే కేసుల్లో ఉన్న నేరస్తులపై పీడీ యాక్ట్ నమోదుకు సిద్ధం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురానా, పోలీసు లీగల్ అడ్వైజర్ సాయినాథ్రెడ్డి, డీఎస్పీలు విజయకుమార్, మహేష్, నర్సింగప్ప, శివన్నారాయస్వామి, ఏఓ వేషుగోపాల్, డీసీఆర్బి సీఐ నరేంద్రరెడ్డి, డీటీఆర్బీ సీఐ లక్ష్మీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోలీసు శాఖలో బిల్లుల దొంగ● రహస్యంగా సాగుతున్న విచారణ పుట్టపర్తి టౌన్: ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడంటారు. అందుకే ఓ ఉద్యోగి పోలీసు కార్యాలయంలోనే అవినీతికి తెర లేపారు. గతంలో ఏఓగా పనిచేసిన ఓ అధికారి ఎడాపెడా బిల్లులు చేసుకుని భారీగా మింగేశారు. ఇటీవలే సదరు ఏఓ బదిలీల్లో భాగంగా మరో ప్రాంతానికి వెళ్లిపోయారు. తన గుట్టు ఎవరికీ తెలియలేదని సంబరపడ్డారు. అయితే స్టేషనరీ పేరుతోనే రూ.లక్షలు దారి మళ్లించిన అంశాన్ని ఎస్పీ సతీష్కుమార్ ఇటీవల పసిగట్టారు. పోలీసు శాఖలోనే దొంగలున్నట్లు బయటకు తెలిస్తే శాఖ పరువుకు భంగమని భావించి రహస్యంగా సమగ్ర విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. సదరు ఇంటి దొంగకు ఎవరు సహకరించారు. ఎవరి ఖాతాలో ఎంత వేసుకున్నారు. తదితర వివరాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానంగోరంట్ల: మండల పరిధిలోని పాలసముద్రం సమీపంలోని నాసిన్ కేంద్రీయ విద్యాలయంలో 1వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ బట్న కృష్ణారావు పేర్కొన్నారు. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందని, ఏప్రిల్ 2 వరకూ ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మిగిలిన తరగతుల్లో ఏర్పడే ఖాళీలకు ఏప్రిల్ 2 నుంచి 8 వరకూ ఆఫ్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. 40 సీట్లు కేంద్రీయ విద్యాలయ సంఘటన్లో 1వ తరగతికి 40 సీట్లు కేటాయించారు. మొదట కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర రంగ సంస్థలు, ఎక్స్సర్వీస్మెన్ పిల్లలకు ప్రాధాన్యత కల్పిస్తారు. అందలోనూ ఎస్సీ కుటుంబాల పిల్లలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం, దివ్యాంగులకు 3 శాతం, ఇతరులకు మిగిలిన సీట్లు కేటాయించనున్నారు. http:// admission. kvs. gov. in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
నీటి కేటాయింపులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
అనంతపురం ఎడ్యుకేషన్: ‘హంద్రీ–నీవా ద్వారా చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఎనిమిది నెలల్లో 52 టీఎంసీల నీటిని రాయలసీమ జిల్లాలకు తీసుకొచ్చాం. ఇందులో ఉమ్మడి అనంతపురం జిల్లాకు 43 టీఎంసీలు చేరినట్టు ప్రచారం చేస్తున్నారు. అయితే చిత్తూరు జిల్లా కుప్పంకు ఎంత నీరు ఇచ్చారో చెప్పడం లేదు. చిత్తూరు జిల్లాకు ఎంత నీరు తీసుకెళ్లారో, చెరువులకు ఎంత నింపారో, భూగర్భజలాలకు ఎంత చేరిందో స్పష్టంగా వెల్లడించాలి. చెవుల్లో పూలు పెట్టొద్దు లెక్కలు చూపండి. శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హంద్రీ–నీవా ద్వారా కుప్పంకు నీరు తీసుకెళ్లేందుకు రూ.3,850 కోట్లతో కాలువకు లైనింగ్ పనులు చేపట్టారన్నారు. ఈ భారీ ఖర్చు కుప్పంకు నీళ్లు అందించేందుకా.. కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకా.. లేక నేతల కమీషన్ల కోసమా అంటూ ప్రశ్నించారు. హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పనుల వల్ల రాప్తాడు, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లో భూగర్భజలాలు దారుణంగా పడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పశువులకు తాగునీరు కూడా దొరకని పరిస్థితి నెలకొందన్నారు. లైనింగ్ పనుల్లో సుమారు రూ.వెయ్యి కోట్ల దోపిడీ జరిగిందన్నారు. ఈ నిధులతో గాలేరు–నగరి నుంచి చిత్తూరు జిల్లాకు హంద్రీ–నీవా నీటిని తీసుకెళ్లే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తి చేసి ఉండొచ్చన్నారు. ఫేజ్–2లో 4 లక్షల ఎకరాలకు డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ ఏర్పాటు చేయొచ్చని తెలిపారు. పేరూరు డ్యాంకు ఒక్క టీఎంసీ కూడా ఇవ్వలేదేం? వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో వరుసగా మూడేళ్లు పేరూరు డ్యాంను నీటితో నింపామని తోపుదుర్తి ప్రకాష్రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు 52 టీఎంసీల నీరు తెచ్చామని చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం ఒక్క టీఎంసీ కూడా పేరూరు డ్యాంకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈ డ్యాం కింద రాప్తాడు, కళ్యాణదుర్గం నియోజకవర్గాలకు ఆయకట్టు ఉందన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు పరిటాల సునీత, అమిలినేని సురేంద్రబాబుకు ఏమాత్రమూ చిత్తశుద్ధి లేదన్నారు. డ్యాంకు నీటిని వదిలితే కింద ఉన్న ఇసుకను అమ్ముకోలేమనే స్వార్థంతో పేరూరు డ్యాంకు నీళ్లు రాకుండా చేశారన్నారు. పెన్నానది నుంచి రోజుకు 500 ట్రాక్టర్ల ఇసుక తరలించేస్తున్నారన్నారు. ఇసుక తవ్వకాల ద్వారా పరిటాల సునీత దాదాపు రూ.వెయ్యి కోట్ల మేర దోపిడీ చేశారని ఆరోపించారు. 2002కు ముందు ఉన్న కరువు పరిస్థితులు మళ్లీ కనిపిస్తున్నాయని, రైతులు వలస వెళ్లే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. టమాట, అరటి, ఉల్లి పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శించారు. 110 గ్రామాలకు తాగునీరు అందించేందుకు పీఏబీఆర్ నుంచి రూ.90 కోట్లతో ప్రారంభించిన పనులు నిలిచిపోయాయన్నారు. గ్రామాల్లో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కుతున్నారని వాపోయారు. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి రామగిరి, సీకేపల్లి మండలాలకు నీరు అందించే పథకం కూడా నిలిచిపోయిందని ఆరోపించారు. కమీషన్ల కోసం పనులు నిలిపేస్తున్నారని విమర్శిస్తూ, ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు రంగంపేట గోపాల్రెడ్డి, అమర్నాథ్రెడ్డి, బండి పవన్, మీనుగ నాగరాజు, సాకే వెంకటేశు, ఆకుల మునిశంకరయ్య, గుగ్గిళ్ల ప్రసాద్రెడ్డి, రాజశేఖర్రెడ్డి, చిరంజీవి, విశ్వనాథ్రెడ్డి పాల్గొన్నారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి -
ఫలించిన వైఎస్సార్సీపీ పోరాటం
అనంతపురం: వైఎస్సార్సీపీ అలుపెరగని పోరాటం ఫలించింది. కరువు సీమ వాసుల జీవనాడిగా ఉన్న ఆర్డీటీపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలను ఎత్తి వేస్తూ విదేశీ నిధులు అందేలా ఎఫ్సీఆర్ఏ ను పునరుద్ధరించింది. 2031 సంవత్సరం వరకు ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆర్డీటీ సేవలు యథాతథంగా కొనసాగనున్నాయి. ఐక్య పోరాటాలతో కేంద్ర ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ తీసుకెళ్లిన ఒత్తిడి కారణంగా ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ సాధ్యమైందని మేధావులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ క్రెడిట్ చోరీ చేసేందుకు సీఎం చంద్రబాబు, లోకేష్ చేస్తున్న ప్రయత్నాలపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 2025లో ఆర్డీటీ ఖాతాలు ఫ్రీజ్ ఆర్డీటీ అనంతపురంలో 1969లో ఏర్పాటైంది. నాటి నుంచి నేటి వరకూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పేదల అభ్యున్నతికి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తూ వస్తోంది. అలాంటి సంస్థను చంద్రబాబు ప్రభుత్వం పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేసింది. 2025 ఏప్రిల్ 21న ఆర్డీటీ విదేశీ ఖాతాలను ఫ్రీజ్ అయ్యాయి. ఫలితంగా ఆర్డీటీ సంస్థ సేవలు నిలిచిపోవడంతో పేద, మధ్యతరగతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో చేయి చేయి కలిపారు. వైఎస్సార్సీపీ చేపట్టిన పోరాటంలో భాగస్వాములయ్యారు. కళ్యాణదుర్గం నుంచే ప్రజా పోరాటం ఆర్డీటీకు ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణ కాకపోవడంతో నిధులు ఖర్చు చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజాగ్రహం పెల్లుబుకింది. ఆందోళనలు, ర్యాలీలు, ధర్నాలతో జిల్లా అట్టుడికింది. మరో వైపు ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయాలంటూ వైఎస్సార్సీపీ పోరుబాట పట్టింది. జిల్లాలో తొలుత ఆర్డీటీ ఎక్కడైతే కార్యకలాపాలు ప్రారంభించిందో అక్కడి నుంచే ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఈ బాధ్యతలను భుజానకెత్తుకున్న తలారి రంగయ్య కళ్యాణదుర్గం నియోజకవర్గం బెళుగుప్ప మండలం గొంచితండా నుంచి పాదయాత్ర చేపట్టారు. 18 రోజులు సాగిన ఈ పాదయాత్ర 203 కిలోమీటర్ల మేర సాగి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 63 గ్రామాలు చుట్టేసింది. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డితో పాటు పార్టీ సమన్వయకర్తలు డాక్టర్ సాకే శైలజానాథ్, వై. విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, మెట్టు గోవిందరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, రాష్ట్ర కార్యదర్శి బీసీ రమేష్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం 2025 మే 17న బైక్ ర్యాలీ చేపట్టారు. ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చారు. ఈ ఏడాది మార్చిలో కుందుర్పిలో లక్ష పోస్టుకార్డుల ఉద్యమానికి శ్రీకారం చుట్టి ప్రధానికి చేరవేశారు. అనంతరం ఈ నెల 16న కేంద్ర హోంమంత్రి అమిత్షాను కలిశారు. అదే రోజు న్యూఢిల్లీలో పార్లమెంట్ వద్ద పార్టీ ఎంపీలతో కలసి నిరసన వ్యక్తం చేశారు. ఇలా వరుస ఉద్యమాలతో ఢిల్లీని అట్టుడుకించి కేంద్రంపై ఒత్తిడి తీసుకెళ్లారు. క్రెడిట్ చోరీకి సిద్ధమైన టీడీపీ నాయకులు ఆర్డీటీ పరిరక్షణకు కృషి చేయాల్సిన అధికార పక్షానికి చెందిన టీడీపీ నాయకులు ఏ ఒక్క రోజూ ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. కనీసం ఒక్క నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టలేకపోయారు. పేదల పక్షాన పోరాటం చేయని టీడీపీ నాయకులు తాజాగా తమ వల్లే ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ అయ్యిందంటూ ప్రచారం చేసుకోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. పది నెలలుగా జిల్లాలో ఆర్టీటీ కోసం వైఎస్సార్సీపీ సాగించిన సుదీర్ఘ పోరాటానికి అఖిలపక్షం నేతలు, ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాలు తోడయ్యారని, దీంతో దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఆర్టీటీకి ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరించిందని అంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పోరాటాలు సాగించిన ప్రతి వైఎస్సార్ సీపీ నాయకుడిని ప్రశంసిస్తున్నారు. ఈ నెల 16న కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలసి ఆర్డీటీ అంశంపై చర్చిస్తున్న మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆర్డీటీ పరిరక్షణకు చేపట్టిన ఉద్యమంలో భాగంగా ప్రధానికి రాసిన పోస్టుకార్డులను చూపుతున్న మాజీ ఎంపీ తలారి రంగయ్య (ఫైల్) ఆర్డీటీకు ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరించిన కేంద్ర ప్రభుత్వం వైఎస్ జగన్ ఆదేశాలతో ఆర్డీటీ కోసం జిల్లాలో ఉవ్వెత్తున ఎగిసిన ప్రజా ఉద్యమం మాజీ ఎంపీ తలారి రంగయ్య నేతృత్వంలో బైక్ ర్యాలీలు, 19 రోజుల పాదయాత్ర లక్ష పోస్టు కార్డుల ఉద్యమంతో నేరుగా ప్రధానికి విజ్ఞప్తులు ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణ ప్రజా పోరాటానికి లభించిన విజయం ఏటా రూ.400 కోట్ల ఖర్చు ఏటా అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్లను ప్రజల శ్రేయస్సు కోసం ఆర్డీటీ ఖర్చు చేస్తోంది. పేద విద్యార్థులకు ఉన్నత విద్య, క్రీడలు, పేదలకు మెడికల్ బిల్లుల చెల్లింపు, పక్కా ఇళ్లు తదితర కార్యక్రమాలు కొనసాగిస్తూ వస్తోంది. ఇప్పటికే దాదాపు మూడు సంవత్సరాలు ఖర్చు చేసేంత మొత్తం ఆర్డీటీ ఖాతాల్లో ఉంది. అయితే ప్రభుత్వానికి సమాంతరంగా నడుస్తన్న ఆర్డీటీ కార్యకలాపాలపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కన్నెర్ర చేశాయి. దీంతో ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ కాకుండా తిరకాసు పెడుతూ వచ్చాయి. ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణ చేసేంత వరకూ నిధులు ఖర్చు చేయడానికి వీలు లేకుండా పోయింది. ప్రస్తుతం ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరించడంతో సంక్షేమానికి తెర తీసినట్లైంది. ప్రజా నాయకుడికి అధినేత ఫోన్ కాల్ ఆర్డీటీకు ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయాలంటూ అలుపెరగని పోరాటం చేసిన మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్యకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ జరిగిన విషయం తెలుసుకున్న ఆయన వెంటనే ఫోన్చేసి ప్రత్యేకంగా అభినందించడం గమనార్హం. -
హామీలు నెరవేర్చే వరకూ ఉద్యమాలు
ధర్మవరం అర్బన్: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకూ ఉద్యమాలు కొనసాగిస్తామని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి స్పష్టం చేశారు. డిమాండ్ల సాధనలో భాగంగా ధర్మవరంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష ప్రారంభమైంది. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణనాయక్, రాష్ట్ర కౌన్సిలర్ మేరీ వరకుమారి, జిల్లా కార్యదర్శి నాగేంద్రమ్మ, నాయకురాలు లతాదేవి, చెన్నేకొత్తపల్లి మండలాధ్యక్షుడు పెద్దకోట్ల సురేష్కుమార్, పట్టణ గౌరవాధ్యక్షుడు కేజీవీ నాగిరెడ్డి, పట్టణ కార్యదర్శి హెచ్.రామాంజనేయులు, రామగిరి మండల నాయకులు కృష్ణతేజ, అజయ్కుమార్ దీక్ష చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన శెట్టిపి జయచంద్రారెడ్డి మాట్లాడుతూ.. పీఆర్సీని వెంటనే నియమించాలని, 29 శాతం ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, ఉద్యోగ, పెన్షనర్ల బకాయిల చెల్లింపునకు రూట్ మ్యాప్ ప్రకటించాలని, సీపీఎస్ రద్దు చేయాలని, మెమో 57 ప్రకారం 2004కు ముందు నియామక ప్రక్రియ పూర్తయిన వారికి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. హెల్త్కార్డులు, మెడికల్ బిల్స్ సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. కోవిడ్ సమయంలో మరణించిన 953 మంది పంచాయతీరాజ్ ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు కల్పించాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా హామీలు నెరవేర్చకపోతే ఏప్రిల్ 1 రెండు రోజుల పాటు అన్ని జిల్లా కేంద్రాల ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపడుతామని, అప్పటికీ స్పందించకపోతే విజయవాడ కేంద్రంగా ఏప్రిల్ 15 నుంచి 19వ తేదీ వరకు ఐదు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపడుతామని హెచ్చరించారు. అనంతరం ఏప్రిల్ 28న సెక్రటేరియట్ను ముట్టడించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం తహసీల్దార్ సురేష్కు వినతిపత్రం అందించారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి అమర్నారాయణరెడ్డి, పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షుడు చలపతి, అల్లా బకాష్, నాగేంద్ర, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఆదిశేషు, సీఐటీయూ నాయకులు రమణ, ఆదినారాయణ, ఏపీ ఎన్జీఓ నాయకులు శ్రీనివాసులు, యూటీఎఫ్ నాయకులు ఆంజనేయులు, లక్ష్మయ్య, లతాదేవి, గోపాల్రెడ్డి, వెంకటకిషోర్, ఆదినారాయణ, నారాయణస్వామి, రాంప్రసాద్, బిల్లే రామాంజనేయులు, ఆదిశేషు, బాలగొండ్ల ఆంజనేయులు, గడ్డం రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి -
శిరివరంలో తాగునీటి సమస్య
● సచివాలయం ఎదుట మహిళల ధర్నాలేపాక్షి: మండలంలోని శిరివరం గ్రామంలో తాగునీటి సమస్య తీవ్ర స్థాయికి చేరుకుంది. దీంతో సమస్య పరిష్కరించాలంటూ మంగళవారం స్థానిక సచివాలయం ఎదుట మహిళలు ఖాళీ బిందెలతో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో ఉన్న ఐదు బోరుబావుల్లో నీరు సమృద్ధిగా ఉన్నా.. సరఫరా చేయడంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఐదారు నెలలుగా తాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. నీటి కోసం పొలాల్లోని బోరుబావుల వద్దకు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొందని వాపోయారు. సమస్య పరిష్కరించాలని అధికారులకు పలుమార్లు విన్నవించినా ప్రయోజనం లేక పోయిందన్నారు. గ్రామాల్లో కనీసం సౌకర్యాలు సమకూరుస్తారని బాలకృష్ణకు ఓట్లు వేసి గెలిపిస్తే ఆయన తమ గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్య పరిష్కరించేవరకూ అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు. స్పందించిన స్థానిక అధికారులు సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటామని హామీనివ్వడంతో ఆందోళనను విరమించారు. కేజీబీవీల్లో పూర్తి స్థాయిలో సౌకర్యాలు మడకశిర: జిల్లాలోని కేజీబీవీలో సౌకర్యాలు పూర్తి స్థాయిలో ఉన్నాయని జీసీడీఓ అనిత తెలిపారు. మంగళవారం మడకశిర ఎంఈఓ కార్యాయలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కార్పొరేట్ కళాశాలలకు దీటుగా కేజీబీవీల్లో సౌకర్యాలు కల్పించినట్లు వివరించారు. కొత్తగా ఎంపీహెచ్ఈఓ కోర్సును కూడా ప్రారంభించామన్నారు. వచ్చే విద్యాసంవత్సరానికి గాను ఒక్కో కేజీబీవీలో ఇంటర్ మొదటి సంవత్సరంలో 40 సీట్లు, 6వ తరగతిలో 40 సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైందని, అర్హులైన వారు ఏఫ్రిల్ 1వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏడు నుంచి తొమ్మిది వరకు ఆయా పాఠశాలల్లో ఉన్న ఖాళీల మేరకు సీట్లు భర్తీ చేస్తామన్నారు. ఇందులో ఎస్సీలకు 15, ఎస్టీలకు 6, బీసీ 29, ఓసీ 50 శాతం మేర రిజర్వేషన్ వర్తిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.44 లక్షలు ఆదాయం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సమావేశంలో ఎంఈఓలు భాస్కర్, నరసింహమూర్తి, రొళ్ల కేజీబీవీ ప్రిన్సిపాల్ మున్వర్జాన్ పాల్గొన్నారు. కుమారుడి హత్య కేసులో తండ్రి అరెస్ట్అనంతపురం సెంట్రల్: యువకుడి హత్య కేసులో కన్న తండ్రిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలను మంగళవారం అనంతపురం వన్టౌన్ పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. బుక్కరాయసముద్రం మండలం పసులూరు గ్రామానికి చెందిన చింతమాను సురేంద్ర కుటుంబం కొన్నేళ్లుగా అనంతపురంలోని వైఎస్సార్కాలనీలో నివాసముంటోంది. సురేంద్ర కుమారుడు ప్రదీప్ తాగుడకు బానిసై జులాయిగా తిరిగేవాడు. ఈ క్రమంలో గతనెల 11న రాత్రి తండ్రితో గొడవ పడ్డాడు. నిన్ను చంపుతానంటూ తండ్రి సురేంద్రను మత్తులో ఉన్న ప్రదీప్ బెదిరించాడు. దీంతో తనను చంపుతాడనే భయంతో ఇనుపరాడ్తో సురేంద్ర దాడి చేయడంతో ప్రదీప్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని కర్నూలులోని ప్రభుత్వాస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో అప్పటి నుంచి పరారీలో ఉన్న తండ్రిని మంగళవారం కలెక్టరేట్ సమీపంలో పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. -
ఐక్య పోరాటాల ఫలితమే ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్
బత్తలపల్లి: పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఆర్టీటీకి కేంద్రం ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయడంతో ఆ సంస్థ ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమైంది. విషయం తెలియగానే బత్తలపల్లిలోని ఫెర్రర్ ఘాట్కు క్షీరాభిషేకం చేశారు. వివిధ రకాల పూలతో అలకరించి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీతో పాటు అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థుల సమష్టి పోరాటాల ఫలితంగా దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆర్టీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేసిందని పేర్కొన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య వైఎస్సార్సీపీ ఎంపీలతో ఇటీవల పార్లమెంట్ ఎదుట ఆందోళన చేపట్టి, కరువు జిల్లాలో ఆర్డీటీ అంటే సంస్థ కాదని, అది జిల్లా పేదల జీవనాధారమంటూ చేసిన వ్యాఖ్యలు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షాని కదిలించాయని, ఫలితంగా ఆర్టీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ కు మార్గం సుగమమైదంటూ హర్షం వ్యక్తం చేశారు. ఎఫ్సీఆర్ఏ పునరుద్దరణతో సేవలు మరింత విస్తరించనున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్టీటీ ఉద్యోగులు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
‘పురం’ పోలీసులకు రివార్డులు
హిందూపురం: స్థానిక పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో పలువురికి రివార్డులు దక్కాయి. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కావిడి నాగేంద్రను అరెస్ట్ చేసినందుకు గాను డీఎస్పీ కేవీ మహేష్.అప్గ్రేడ్ సీఐ ఆంజనేయులు, రూరల్ సీఐ జనార్ధన్, ఎస్ఐలు నరేంద్ర, మునీర్ అహమ్మద్, కానిస్టేబుళ్లు రవి, సుబ్రహ్మణ్యంతో పాటు బైండోవర్ కేసుల్లో నిబద్ధత చూపిన హిందూపురం రూరల్ సీఐ జనార్ధన్, లేపాక్షి ,చిలమత్తూరు ఎస్ఐలు నరేంద్ర, మునీర్ అహమ్మద్ను అభినందిస్తూ రివార్డులు, ప్రశంసా పత్రాలను ఎస్పీ సతీష్కుమార్ మంగళవారం అందజేశారు. క్షయ రహిత జిల్లాగా మార్చాలి : డీఎంహెచ్ఓ పుట్టపర్తి అర్బన్: క్షయ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజాబేగం, జిల్లా టీబీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ అనుపమా జేమ్స్ పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి వై జంక్షన్ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. క్షయ వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న ఉచిత వైద్య సేవలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఐఓ డాక్టర్ సురేష్బాబు, డీపీఓ సమత, ఆర్డీఓ సువర్ణ, టీబీ మెడికల్ ఆపీసర్ డాక్టర్ గాయత్రి, ప్రోగ్రాం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం నల్లచెరువు: మండలంలోని పి. కొత్తపల్లిలో రాయలసీమ వాసన్ సంస్థ ఇన్చార్జ్ ఉత్తప్ప ఆధ్వర్యంలో వేరుశనగ కాయల ప్రాసెసింగ్ యూనిట్ను ఏపీ వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్, కలెక్టర్ శ్యాం ప్రసాద్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... 30 ఎఫ్యూఓలతో కలిసి యూనిట్ను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతి రైతూ ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే ఓరువాయి పంచాయతీ మద్దేపల్లిలో ఎస్సీ రైతుల సాగునీటి సమస్య పరిష్కారానికి వాటర్ షేరింగ్ విధానంపై అవగాహన కల్పించారు. అనంతరం వాటర్ షేరింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వీవీఎస్ శర్మ, తహసీల్దార్ రవినాయక్, ఎంపీడీఓ అశోక్ కుమార్రెడ్డి, వ్యవసాయాధికారి చంద్రశేఖర్, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్, ఏఓ లక్ష్మీప్రియ, హెచ్ఓ లావణ్య పాల్గొన్నారు. వేటగాళ్ల ఉచ్చుకు చిరుత కూన బలి కళ్యాణదుర్గం రూరల్: వేటగాళ్లు పన్నిన ఉచ్చులో ఓ చిరుత కూన చిక్కుకుని ప్రాణాలు విడిచింది. చాపిరి సమీపంలో వేటగాళ్లు కుందేళ్ల కోసం పలు చోట్ల ఉచ్చులు ఏర్పాటు చేశారు. మంగళవారం అటువైపు వెళ్లిన కాపరులకు ఉచ్చులో చిక్కుకున్న రెండు చిరుత కూనలు కనిపించాయి. ఇందులో ఒకటి బయటపడేందుకు ప్రయత్నించి చివరకు మృతి చెందింది. మరొక కూనను తల్లి చిరుత నోటకరచుకుని రక్షించుకుంది. చిరుతల సంచారంపై అటవీ శాఖ అధికారులకు అనేకసార్లు సమాచారం ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని గ్రామస్తులు వాపోయారు. -
● 1,200 ఏళ్ల నాటి సూర్య దేవుడి విగ్రహం లభ్యం
హిందూపురం: ఒకట్రెండు కాదు... ఏకంగా 1,200 ఏళ్ల నాటి సూర్యదేవుడి విగ్రహం సోమవారం హిందూపురం మండలం కిరికెర గ్రామంలో లభ్యమైంది. శిల్పం పక్కనే ప్రాచీన శిలా శాసనాలు, శివలింగం, నంది, వినాయకుడి ప్రతిమలు ఉన్నాయి. వీటిని చరిత్రకారుడు బుక్కపట్నం గోపి గుర్తించి, వివరాలు వెల్లడించారు. విగ్రహాలు, శాసనాలు క్రీస్తు శకం 8వ శతాబ్దంలో కోలార్, తలకాఢ్ రాజధానులుగా చేసుకుని దక్షిణ కర్ణాటకను పాలించిన గంగ వంశరాజుల కాలం నాటివని తెలిపారు. శిల్పం లభ్యమైన ప్రాంతంలో 8వ శతాబ్దంలో సూర్యదేవర ఆలయం ఉన్నట్లుగా తెలుస్తోందన్నారు. అరుదైన సూర్య దేవుడి విగ్రహం ఎలాంటి రక్షణ లేకుండా పడి ఉండడం బాధాకరమన్నారు. ఇప్పటికై నా పురావస్తు శాఖ అధికారులు స్పందించి దేశ చరిత్ర, సంస్కృతిని భావితరాలకు అందజేయాలని కోరారు. -
నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం
కదిరి: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో సోమవారం ప్రధాన అర్చకుడు పార్థసారధి ఆచార్యులు పర్యవేక్షణలో శ్రీవారి స్నపన తిరుమంజనం వైభవంగా సాగింది. ఉత్సవానికి ఉభయదారులుగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎస్.విష్ణువర్దన్రెడ్డి, సీనియర్ న్యాయవాది సుబ్బరాజుగుప్త కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులకు శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. పసుపుతో శ్రీదేవి, భూదేవి సమేత నారసింహుడిని అలంకరించి తులసిమాల ధరింపజేసి స్నపనం గావించారు. కార్యక్రమంలో ఈఓ శ్రీనివాసరెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.గణితం పరీక్షకు 214 మంది గైర్హాజరు పుట్టపర్తి: పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. సోమవారం 107 కేంద్రాల్లో నిర్వహించిన గణితం పరీక్షకు 21,413 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 21,241 మంది హాజరయ్యారని, 172 మంది గైర్హాజరయ్యారని డీఈఓ కిష్టప్ప తెలిపారు. ఇక ప్రైవేటు విద్యార్థుల్లో 408 మందికి గాను, 366 మంది విద్యార్థులు హాజరుకాగా, 42 మంది గైర్హాజరైనట్లు ఆయన వెల్లడించారు. మొత్తం 214 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. ఏడుగురు జిల్లా స్థాయి పరిశీలకులు, నలుగురు విద్యాశాఖ అధికారులు, అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ నుంచి వచ్చిన ఆరుగురు, 81 మంది ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు కలిపి మొత్తం 81 మంది అధికారులు పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు డీఈఓ వెల్లడించారు. -
విహార యాత్రలో విషాదం
పెనుకొండ రూరల్: విహార యాత్ర కాస్త విషాదంగా ముగిసింది. స్నేహితులతో కలసి గొల్లపల్లి రిజర్వాయర్కు చేరుకున్న ఓ యువకుడు నీట మునిగి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... మణిపూర్లోని ఉక్రూల్ జిల్లా చోయ్థార్ గ్రామానికి చెందిన ఖరియ్ అహుంగ్షీ ఫిలిమెన్ (25) బెంగళూరులోని ఓ సెలూన్ షాపులో పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో స్నేహితులతో కలసి సోమవారం విహార యాత్రలో భాగంగా గొల్లపల్లి రిజర్వాయర్కు వచ్చాడు. స్నేహితులందరూ కలసి రిజర్వాయర్లో దిగి నీటిలో కేరింతలు కొడుతుండగా ప్రమాదవశాత్తు ఫిలిమెన్ లోతైన ప్రాంతంలోకి వెళ్లాడు. ఈత సరిగా రాకపోవడంతో నీట మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు స్థానికుల సాయంతో గాలింపు చేపట్టి వెలికి తీసేలోపు మృతి చెందాడు. సమాచారం అందుకున్న కియా పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు. రిజర్వాయర్లో నీట మునిగి యువకుడి మృతి -
పోలీసు బదిలీలు పూర్తి
● రెండోరోజు 50 మందికి స్థాన చలనం పుట్టపర్తి టౌన్: ఒకే సబ్ డివిజన్లో ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లు, హెడ్కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలకు నిర్వహించిన బదిలీల కౌన్సెలింగ్ సోమవారం పూర్తయ్యింది. సీనియార్టీ ఽఆధారంగా పూర్తి పారదర్శకతతో బదిలీలు చేపట్టినట్టు ఎస్పీ సతీష్కుమార్ తెలిపారు. సోమవారం పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో రెండో రోజు జిల్లావ్యాప్తంగా ఉన్న ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుల్కు ఎస్పీ సతీష్కుమార్ బదిలీ కౌన్సెలింగ్ చేపట్టారు. 20 మంది ఏఎస్ఐలు, ముగ్గురు హెడ్కానిస్టేబుళ్లు, 27 మంది మహిళా కానిస్టేబుళ్లు కౌన్సెలింగ్లో పాల్గొన్నారు. ముందుగా ఒకే సబ్డివిజన్లో ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారి సీనియార్టీ జాబితాను ప్రొజెక్టర్పై ప్రదర్శించి ఖాళీలు చూపారు. అనంతరం సీనియార్టీ ప్రకారం నిబంధనలు అనుసరించి ఒక సబ్ డివిజన్ నుంచి మరొక సబ్డివిజన్కు సిబ్బంది కోరుకున్న చోటకు బదిలీ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురానా, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఏఓ వేణుగోపాల్, స్పెషల్బ్రాంచ్ సీఐ వెంకటేశ్వర్లు, ఆర్ఎస్ఐలు ప్రదీప్ సింగ్, ప్రసాద్, వీరన్నతోపాటు డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు. -
6న జేఎన్టీయూ(ఏ) స్నాతకోత్సవం
అనంతపురం: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (అనంతపురం) 15వ స్నాతకోత్సవం ఏప్రిల్ ఆరో తేదీన నిర్వహించనున్నారు. భారతదేశ క్షిపణి మహిళ (మిస్సైల్ ఉమెన్)గా ఖ్యాతి దక్కించుకున్న టెస్సీ థామస్ను గౌరవ డాక్టరేట్కు ఎంపిక చేశారు. ఛాన్సలర్ /గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై జేఎన్టీయూ(ఏ) గౌరవ డాక్టరేట్ను అందజేయనున్నారు. ఈ మేరకు స్నాతకోత్సవ ఏర్పాట్లు మొదలయ్యాయి. అగ్ని పుత్రి టెస్సీ థామస్ భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ)లో టెస్సీ థామస్ ఏరోస్పేస్ ఇంజినీర్ పనిచేస్తున్నారు. ఈమెను అగ్నిపుత్రిగా పిలుస్తారు. అగ్ని–4 క్షిపణికి ప్రాజెక్ట్ డైరెక్టర్గా వ్యవహరించి, మిస్సైల్ ప్రాజెక్ట్ను నడిపించిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు. ఈమె కేరళలోని త్రిశూర్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్, పుణెలో ఎంటెక్, మిస్సైల్ గైడెన్స్లో పీహెచ్డీ పూర్తి చేశారు. 1988లో డీఆర్డీఓలో చేరి, అగ్ని సిరీస్ క్షిపణుల అభివృద్ధిలో, ముఖ్యంగా అగ్ని–2, 3, 4, 5 క్షిపణుల గైడెన్స్, నావిగేషన్ సిస్టమ్లో కీలక పాత్ర పోషించారు. టెస్సీ థామస్కు మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మార్గదర్శకులు. గౌరవ డాక్టరేట్కు టెస్సీ థామస్ ఎంపిక -
రాజకీయ కక్షతో బిల్లులు ఆపారు
ప్రశాంతి నిలయం: ‘‘రాజకీయ కక్షతో మమ్మల్ని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో మా సొంత డబ్బులు వెచ్చించి పనులు చేశాం. ఇప్పుడు మంత్రి సవిత మాకు బిల్లులు మంజూరు చేయవద్దని అధికారులకు ఆదేశాలిచ్చారు. మీరైనా బిల్లులు మంజూరు చేయించండి’’ అని సోమందేపల్లి మండలానికి చెందిన పలువురు సర్పంచ్లు కలెక్టర్, జేసీ ఎదుట వాపోయారు. వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుటాల రమణారెడ్డితో కలిసి కలెక్టరేట్లో జరిగిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు వచ్చిన సోమందేపల్లి మండల సర్పంచ్లు రామాంజనేయులు, లక్ష్మీ నరసింహప్ప, శ్రీనివాసరెడ్డి, నాగరత్నమ్మ, ప్రతాపరెడ్డి, నారాయణరెడ్డి తదితరులు ఈమేరకు అర్జీ ఇచ్చారు. అనంతరం వారు జేసీకి తమ సమస్య విన్నవించారు. కేతగాని చెరువు పంచాయతీలో రూ.6.80 లక్షలు, చాలకూరులో రూ.7.38 లక్షలు, వెలిదడకలలో రూ.4 లక్షలు, చాలకుంటలో రూ.8.90 లక్షలు, తుంగోడులో రూ.2.37 లక్షల బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఇవన్నీ ఆయా గ్రామ పంచాయతీల విద్యుత్ సరఫరా, మోటర్ల మరమ్మతులకు వినియోగించినవేనన్నారు. వీటికి పంచాయతీల తీర్మానం ఉన్నా... అందుబాటులో నిధులున్నా మంత్రి సవిత బిల్లులు మంజూరు చేయకూడదని ఆదేశించారని, దీంతో ఎంపీడీఓలు బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. తమపై దయచూపి బిల్లులు మంజూరు చేయించాలని కోరారు. ప్రతి అర్జీకీ పరిష్కారం చూపాలి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో అందే ప్రతి అర్జీకీ శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ‘పరిష్కార వేదిక’కు వివిధ సమస్యలపై 214 అర్జీలు అందగా.. వాటిని స్వీకరించిన కలెక్టర్ పరిష్కారం కోసం ఆయా శాఖలకు పంపారు. మంత్రి సవిత తీరని అన్యాయం చేస్తున్నారు ‘పరిష్కార వేదిక’లో సర్పంచ్ల ఫిర్యాదు -
●అరటికి ఈతాకు రక్ష
అరటి పంటకు ఈతాకును రక్షణగా ఉంచిన దృశ్యం పెరుగుతున్న ఎండలతో పంటలను కాపాడుకునేందుకు రైతులు కూడా వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే మండలంలోని బోరంపల్లి – గంగవరం గ్రామాల మధ్య అరటి రైతులు అరటి పిలకలకు రక్షణగా ఈతాకును ఏర్పాటు చేశారు. మొక్కను మొత్తం ఎండ నుంచి కాపాడుకునేందుకు రక్షణగా ఓ గొడుగులా చుట్టూ ఏర్పాటు చేశారు. అరటి మొదటి దశలో ఉండగా అంతర పంటగా పలువురు రైతులు టమాట, పప్పుశనగను సైతం సాగు చేశారు. – కళ్యాణదుర్గం: -
ఇంటర్ మూల్యాంకనం ప్రారంభం
పుట్టపర్తి: ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ (మూల్యాంకనం) ప్రారంభమైనట్లు డీఐఈఓ చెన్నకేశవప్రసాద్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా కొత్తచెరువు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లకు ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 169 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 33 మంది చీఫ్ ఎగ్జామినర్లు, ఐదుగురు అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్లు మూల్యాంకన విధుల్లో ఉంటారన్నారు. హిందీ, ఇంగ్లిష్, తెలుగు, హిస్టరీ, ఎకనమిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల వాల్యుయేషన్ ప్రారంభమైందన్నారు. మొత్తం 1,09,715 పేపర్లు వచ్చాయన్నారు. ఇంగ్లిష్ సబ్జెక్టుకు అధికంగా పేపర్లు వచ్చాయన్నారు. బోర్డు ఆర్డర్ వచ్చిన అన్ని కళాశాలల అధ్యాపకులు వాల్యుయేషన్కు హాజరుకావాలని, రాని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి కనగానపల్లి: మండల పరిధిలోని తగరకుంట గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు యువకులు గాయపడ్డారు. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు... మండలంలోని నెమలివరం గ్రామానికి చెందిన బొమ్మలాట గంగాధర్ (35), భాస్కర్, రాజు ముగ్గురు తగరకుంట నుంచి కనగానపల్లి వైపు ద్విచక్ర వాహనంలో వస్తున్నారు. అలాగే కనగానపల్లి వైపు నుంచి అటుగా వస్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనం నుంచి కిందపడి ముగ్గురూ గాయపడ్డారు. స్థానికులు గుర్తించి క్షతగాత్రులను 108 వాహనం ద్వారా అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన గంగాధర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య సుశీల, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రమాదంపై కనగానపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ముదిగుబ్బలో మరొకరు.. ముదిగుబ్బ: మండల పరిధిలోని దొరిగిల్లు వద్ద ఆదివారం ద్విచక్ర వాహనం అదుపు తప్పి రాము (52) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పుట్టపర్తికి చెందిన రాము పని నిమిత్తం వెళ్తుండగా దొరిగిల్లు వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పింది. తీవ్రంగా గాయపడిన రామును చికిత్స నిమిత్తం ముదిగుబ్బకు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతునికి భార్య చెన్నమ్మ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పెద్దమ్మ ఆలయంలో చోరీ పుట్లూరు: మండలంలోని కుమ్మనమల గ్రామంలోని పెద్దమ్మ ఆలయంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. ఆలయంలో ఉన్న 60 తులాల వెండి ఆభరణాలను దొంగలు అపహరించినట్లు గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ సురేంద్రబాబు చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
నిబంధనలకు నీళ్లు
అనంతపురం ఎడ్యుకేషన్: ‘వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా పరవాలేదు’ అనే నానుడి ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి (ఆర్ఐఓ)గా పని చేస్తున్న వెంకటరమణనాయక్కు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ప్రిన్సిపాల్గా అత్యంత జూనియర్గా ఉన్న ఆయనను నిబంధనలకు విరుద్ధంగా ఆర్ఐఓగా కొనసాగిస్తుండమే ఇందుకు నిదర్శనం. ఈ వ్యవహారం ఆర్ఐఓ, డీవీఈఓ కార్యాలయాలతో పాటు జిల్లా వ్యాప్తంగా జూనియర్ అధ్యాపకుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రెగ్యులర్ డీవీఈఓ వచ్చినా.... జీఓ నంబర్ 8 మేరకు హైకోర్టు ఆదేశాలతో అన్ని ఉమ్మడి జిల్లాలకు రెగ్యులర్ డీవీఈఓలను నియమించే సందర్భంలో సీనియార్టీ జాబితాలో 57, 59, 65, 66, 71, 73, 75 స్థానాల్లో ఉన్న వారిని కాదని 327వ స్థానంలో ఉన్న వెంకటరమణనాయక్ను డీవీఈఓ (ఎఫ్ఏసీ)గా కొనసాగించారు. ఇందుకు ఇంటర్ బోర్డులో పని చేస్తున్న ఓ రిటైర్డ్ అధికారి అండగా ఉంటూ కీలకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కొందరు సీనియర్లు కోర్టుకు వెళ్లడంతో 2025 జనవరి 5న ఆయనను డీవీఈఓ బాధ్యతల నుంచి తప్పించి రెగ్యులర్ డీవీఈఓగా గురువయ్యశెట్టిని నియమించారు. అదే ఏడాది జూలైలో ఆయా జిల్లాల్లో రెగ్యులర్ డీవీఈఓలకు ఆర్ఐఓ బాధ్యతలు అప్పగించారు. కానీ ఇక్కడ మాత్రం వెంకటరమణనాయక్నే ఎఫ్ఏసీ ఆర్ఐఓగా కొనసాగిస్తూ వస్తున్నారు. ఎఫ్ఏసీ హోదాలో మూడేళ్లు మాత్రమే ఉండొచ్చని అధ్యాపకులు చెబుతున్నారు. ఆయన మాత్రం నిబంధనలకు విరుద్ధంగా నాలుగేళ్లకు పైగా కొనసాగుతున్నారని అంటున్నారు. ● డీవీఈఓ అనుమతి లేకుండా ఉద్యోగులకు ఓడీ (ఆన్ డ్యూటీ) ఇవ్వకూడదు. 2019 మార్చి పరీక్షల సమయంలో ఒక రికార్డు అసిస్టెంట్కు ఆర్ఐఓ వెంకటరమణనాయక్ ఏకంగా 30 రోజులు ఓడీ ఇవ్వడాన్ని అధ్యాపకులు తప్పుపడుతున్నారు. ఈ విషయంపై 2021లో అప్పటి సెక్రటరీకీ కొందరు సాక్షాధారాలతో ఫిర్యాదు చేశారు. దీంతో అప్పట్లో ఈయనను ఆర్ఐఓ బాధ్యతల నుంచి తప్పించారని చెబుతున్నారు. అయితే కమిషనర్ మారిన వెంటనే మళ్లీ చక్రం తప్పి డీవీఈఓగా తెచ్చుకున్నారనే ఆరోపణలున్నాయి. 2024 ఏప్రిల్లో తిరిగి ఆర్ఐఓ బాధ్యతలూ చేపట్టారు. ● 2025 మార్చిలో జరిగిన పరీక్షల సమయంలో డీఈసీ మెంబరుగా నిబంధనలకు విరుద్ధంగా తనమిత్రుడికి లైబ్రేరియన్గా అవకాశం కల్పించారు. ఈ వ్యవహారంలో ఓ ప్రజాప్రతినిధి నేరుగా ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేయడంతో ఈసారి డీఈసీ కమిటీలో సదరు లైబ్రేరియన్ను తప్పించారని చెబుతున్నారు. ఈయన హయాంలో జరిగిన , జరుగుతున్న అక్రమాలపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశిస్తే మరిన్ని వెలుగులోకి వస్తాయని అధ్యాపకులు చెబుతున్నారు. రాష్ట్రమంతా రెగ్యులర్ డీవీఈఓలకు ఆర్ఐఓ బాధ్యతలు ఇక్కడ మాత్రం ఏళ్లుగా ఎఫ్ఏసీ ఆర్ఐఓగా వెంకటరమణనాయక్ సీనియర్లను కాదని జూనియర్ను కొనసాగిస్తుండడంపై అనుమానాలు -
అబ్బురం.. పంటల వైవిధ్యం
అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్రంలో మరే జిల్లాలోనూ లేనివిధంగా ‘అనంత’లో పంటల వైవిధ్యం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దేశంలో పండే ప్రధాన పంటలన్నీ జిల్లాకు పరిచయం అవుతుండటం విశేషం. చివరకు కశ్మీర్, సిమ్లా లాంటి అతిశీతల వాతావరణంలో పండే యాపిల్ లాంటి పంట కూడా ఇక్కడి రైతులు సాగు చేస్తున్నట్లు వెల్లడి కావడం గమనార్హం. ఈ–క్రాప్ సర్వేతో జిల్లాలో పంటల వారీగా దాదాపుగా కచ్చితమైన లెక్కలు అందుబాటులోకి వస్తున్నాయి. వ్యవసాయ, ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖల పరిధిలో ఎన్ని రకాల వ్యవసాయ పంటలు, ఎన్ని రకాల పండ్లతోటలు, కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ పంటలు, పూల తోటలు సాగు చేస్తున్నారనేది వెల్లడవుతోంది. దీంతో గతంలో 15 నుంచి 20 వరకు వ్యవసాయ పంటలు, 20 నుంచి 25 వరకు ఉద్యాన పంటలు.. ఇలా ఏటా ఖరీఫ్లో 40 నుంచి 50 పంటలు, రబీలో అయితే 20 నుంచి 25 పంటలు చూపించే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలా కాకుండా వందల సంఖ్యలో పంటలు సాగు చేస్తున్నట్లు వెల్లడవుతోంది. గత ఖరీఫ్లో ఏకంగా 150 రకాల పంటలు సాగు చేసినట్లు నమోదు చేశారు. రబీలో 127 రకాల పంటలు రబీలో జిల్లా వ్యాప్తంగా 3,93,958 ఎకరాల్లో 127 రకాల పంటలు సాగు చేసినట్లు ఈ–క్రాప్ ద్వారా వెల్లడైంది. అయితే ఇందులో కేవలం ఏడు రకాల వ్యవసాయ పంటలే 3,47,163 ఎకరాల్లో సాగులోకి రాగా.. మిగతా 46,795 ఎకరాల్లో 100 రకాల పంటలు వేశారు. అందులో పప్పుశనగ, వరి, వేరుశనగ, సజ్జ, మినుము, ఆముదం, బేబీకార్న్, పాప్కార్న్, పత్తి, అలసంద, పెసర, ఉలవ, జొన్న, మొక్కజొన్న, కొర్ర, కంది, కుసుమ, నువ్వులు, సోయాబీన్, చెరకు, పొద్దుతిరుగుడు, పత్తి, పొగాకు, గోధుమ, రాగి, మల్బరీ, ఉసిరి, చీనీ, నిమ్మ, సపోట, జామ, ద్రాక్ష, దానిమ్మ, అరటి, అంజూర, మామిడి, సీతాఫలం, పనస, మకాడమియా, అజ్వాన్, అమరాంథస్, ఆకు, వక్క, ఆపిల్, ఆపిల్ బేర్, అశ్వగంధ, అవకాడో, వెదురు, టమాట, వంగ, బెండ, బీన్స్, బీట్రూట్, బ్రాడ్బీన్స్, గుమ్మడి, కాకర, సొర, బీర, బూడిద గుమ్మడి, క్యాబేజ్, క్యాప్సికం, బెర్రీ, రేగు, క్యారెట్, కాలీఫ్లవర్, లిల్లీ, మల్లె, రోజ్, ట్యూబ్రోజ్, కనకాంబరం, చామంతి, బంతి, కొబ్బరి, ధనియాలు, దోస, కర్భూజ, కళింగర, బొప్పాయి, కస్టర్డ్ యాపిల్, ఖర్జూరం, డ్రాగన్, మునగ, ఫీల్డ్బీన్, ఫ్లాక్స్ సీడ్, గోంగూర, పచ్చిమిరప, ఎండుమిరప, ఉల్లి, పొటాటో, స్వీట్ పొటాటో, ముల్లంగి, రాజ్మాబీన్, ఎర్రచందనం, శీకాకాయి, పసుపుతో పాటు మరికొన్ని కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ పంటలు.. మొత్తంగా 127 రకాలు సాగైనట్లు ఈ–క్రాప్లో నమోదు చేశారు. రబీలో 3,93,958 ఎకరాల విస్తీర్ణంలో 127 రకాల పంటల సాగు గత ఖరీఫ్లోనూ ఏకంగా 150 రకాల పంటలు సాగైనట్లు ఈ–క్రాప్లో వెల్లడి సత్ఫలితాలిస్తున్న ఈ–క్రాప్ కచ్చితమైన సాగు గణాంకాలు తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం తరఫున అర్హులైన రైతులకు అందాల్సిన ప్రయోజనాలు కల్పించడానికి వీలుగా గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు తీసుకువచ్చిన ఈ–క్రాప్ (పంట నమోదు) ప్రక్రియ మంచి ఫలితాలను ఇస్తోంది. ఈ –క్రాప్ (డిజిటల్ క్రాప్ సర్వే) లేనప్పుడు అధికారులు, ఆయా శాఖల సిబ్బంది ఇచ్చిన కాకిలెక్కలే అన్నింటికీ ప్రామాణికంగా తీసుకునే పరిస్థితి ఉండేది. అయితే 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొలువుతీరాక వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఆర్బీకే వ్యవస్థతో గ్రామ స్థాయిలో వ్యవసాయ, అనుబంధ రంగాల ప్రణాళికలు అమలు చేయడంతో రైతులకు అన్ని రకాలుగా వెసులుబాటు లభించింది. ఈ క్రమంలో ఈ–క్రాప్ ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రభుత్వం నుంచి నేరుగా లబ్ధి చేకూరి రైతులకు ఉపశమనం లభించింది. -
మధుర స్వరం.. పరవశ భరితం
ప్రశాంతినిలయం: శ్రోతలను మైమరపించేలా భక్తి రస మాధుర్యంతో సత్యసాయిని కీర్తిస్తూ సాగిన సంగీత కచేరీ పరవశభరితంగా సాగింది. ఆదివారం సాయంత్రం సత్యసాయి విద్యాసంస్థలకు చెందిన నందిగిరి క్యాంపస్ విద్యార్థులు సంగీత కచేరీ నిర్వహించారు. సత్యసాయిపై కృతజ్ఞతతో కూడిన భక్తి భావనను చాటుతూ కచేరీ చేపట్టారు. సత్యసాయి ఆధ్యాత్మిక లీలలను, సేవా స్ఫూర్తిని, ప్రేమ తత్వాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. సాయి కుల్వంత్ సభా మందిరంలో ఆశీనులైన భక్తకోటి సంగీత స్వరాన్ని వింటూ మంత్రముగ్ధులయ్యారు. పిదప విద్యార్థులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. ప్రశాంతి మందిరం వేళల్లో మార్పులు.. ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో నిత్యం సాయంత్రంపూట జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ వేళల్లో మార్పులు చేసినట్లు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వర్గాలు తెలిపాయి. 5 గంటల నుంచి 5.45 వరకూ వేదం, 5.45 నుంచి 6.30 వరకూ భక్తి గీతాలాపన, అనంతరం సత్యసాయి మహాసమాధి దర్శనం ఉంటుందన్నారు. భక్తులు గమనించాలని కోరారు. ఆకట్టుకున్న సాయి విద్యార్థుల సంగీత కచేరీ -
క్రమబద్ధీకరణ లేకుండా బదిలీలు చేయండి
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో క్రమబద్దీకరణ చేయకుండా టీచర్ల బదిలీలు మాత్రమే చేపట్టాలని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఆదివారం స్థానిక ఉపాధ్యాయ భవనంలో వైఎస్సార్టీఏ జిల్లా సబ్ కమిటీ అత్యవసర సమావేశం జరిగింది. క్రమబద్ధీకరణ జరిగి ఒక సంవత్సరం కూడా కాలేదని, ఒక విద్యా సంవత్సరంలో పాఠశాలల రోల్ పెరగడం అనేది అసాధ్యమని, ఫలితంగా చాలా పాఠశాలలు మూతపడే అవకాశం ఉందని నాయకులు తెలిపారు. అలాగే గత సంవత్సరంలో బదిలీ అయిన ఉపాధ్యాయులు ఇప్పుడు కూడా క్రమబద్ధీకరణకు గురైతే తీవ్ర ఇబ్బందులు పడతారన్నారు. ఈ పరిస్థితుల్లో కేవలం టీచర్ల బదిలీలు మాత్రమే నిర్వహించాలని, క్రమబద్ధీకరణ చేయకూడదని డిమాండ్ చేశారు. వైఎస్సార్టీఏ జిల్లా అధ్యక్షుడు ఎస్.నాగిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు గోపాల్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.గోవిందరెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్ రాధాకృష్ణారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటరమణప్ప, రవీంద్రారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటరెడ్డి, ఓబిరెడ్డి, సిద్ధప్రసాద్ జిల్లా కార్యదర్శి కృష్ణా నాయక్, విశ్వనాథరెడ్డి, రామకృష్ణ పాల్గొన్నారు. -
చేనేత కార్మికుడి ఆత్మహత్య
ధర్మవరం రూరల్: మండల పరిధిలోని గొట్లూరు గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు శ్రీనివాసులు (35) శనివారం రాత్రి కుటుంబ కలహాలతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్ పోలీసుల వివరాల మేరకు... శ్రీనివాసులు కూలి మగ్గం నేసుకుంటూ జీవించేవాడు. ఆరేళ్ల క్రితం మహేశ్వరి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితం కుటుంబ కలహాలతో ఆమె మృతి చెందింది. భార్య చనిపోవడంతో శ్రీనివాసులు మద్యానికి బానిసయ్యాడు. మరో పెళ్లి చేస్తే మద్యం మాని బాగుడతాడని తల్లిదండ్రులు భావించారు. ముదిగుబ్బ మండలం సిరిగారిపల్లికి చెందిన నందు అనే అమ్మాయితో మరో పెళ్లి చేశారు. అయితే రెండో పెళ్లి తరువాత కూడా శ్రీనివాసులు మద్యం తాగి తరచూ భార్యతో గొడవపడేవాడు. దీంతో విసుగు చెందిన భార్య నాలుగు నెలల కిత్రం పుట్టింటికి వెళ్లింది. కొద్ది రోజులుగా మృతుడు తన ఇంట్లో ఒంటరిగా ఉండేవాడు. జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తమ్ముడు ఆదివారం శ్రీనివాసులును నిద్ర లేపడానికి తలుపు తట్టగా ఇంట్లో ఉరివేసుకున్న దృశ్యాన్ని చూసి తల్లిదండ్రులకు తెలిపాడు. వెంటనే రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతునికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి తండ్రి ఆదెప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పారదర్శకంగా కానిస్టేబుళ్ల బదిలీలు
● ఎస్పీ సతీష్కుమార్ పుట్టపర్తి టౌన్: పారదర్శకత, నిబంధనలే ప్రామాణికంగా కానిస్టేబుళ్ల బదిలీలు చేపట్టినట్టు ఎస్పీ సతీష్కుమార్ తెలిపారు. ఆదివారం పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా వ్యాప్తంగా ఉన్న 90 మంది కానిస్టేబుళ్లకు ఎస్పీ సతీష్కుమార్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టారు. జిల్లాలోని ఐదు సబ్ డివిజన్లలో ఒకే పోలీసుస్టేషన్లో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సిబ్బంది జాబితాను సిద్ధం చేసి కౌన్సెలింగ్కు పిలిచారు. ఖాళీల జాబితాను ప్రొజెక్టర్పై ప్రదర్శించారు. బదిలీల నిబంధనలు ఎస్పీ స్పష్టంగా వివరించారు. అనంతరం సీనియార్టీ ప్రకారం నిబంధనలు అనుసరించి ఒక సబ్ డివిజన్ నుంచి మరొక సబ్ డివిజన్కు సిబ్బంది కోరుకున్న చోటుకు బదిలీ చేశారు. బదిలీల ప్రక్రియ పారదర్శకంగా జరగడంతో సిబ్బంది సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురానా, ఏఓ వేణుగోపాల్, స్పెషల్ బ్రాంచ్ సీఐ వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ నాగరాజు, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు. -
గంగమ్మ తల్లీ.. కరుణించమ్మా
కదిరి అర్బన్: మండలంలోని యర్రదొడ్డి గంగమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఉగాది అనంతరం తొలి ఆదివారం కావడంతో పెద్దఎత్తున భక్తులు గంగమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి తమ మొక్కులను సమర్పించుకున్నారు. రాత్రి అమ్మవారికి గ్రామెత్సవం నిర్వహించారు. బత్తలపల్లి: మండల కేంద్రంలోని గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు అమ్మవారిని పూలు, నిమ్మ, వేప, ఆకులతో అలంకరించారు. భక్తులు అమ్మవారికి బోనం నైవేద్యంగా సమర్పించారు. అనంతరం అమ్మవారికి జంతుబలులు ఇచ్చారు. అలాగే మండల వ్యాప్తంగా ప్రజలు జంతుబలులిచ్చి, పంటలు పుష్కలంగా పండాలని గ్రామదేవతలను వేడుకున్నారు. అనంతరం ఆయా గ్రామాల్లో టెంకాయలు, చీనీపండ్లు విసురుతూ యువకులు పందేలు ఆడారు. -
ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయాలి
అనంతపురం: కరువు సీమలో కల్పతరువుగా విరాజిల్లుతున్న ఆర్డీటీని పరిరక్షించాలన్న డిమాండ్తో ఏప్రిల్ 9న సీపీఐ ఉమ్మడి అనంతపురం జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ , సీపీఎం మద్దతు ఇవ్వాలని సీపీఐ కోరింది. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డితో పాటు సీపీఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప, నగర కార్యదర్శి రామిరెడ్డి, బాలరంగయ్యలను సీపీఐ జిల్లా బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్ మాట్లాడుతూ.. ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందన్నారు. ఎన్నో ఆందోళనలు, నిరసనలు చేపట్టినా ఫలితం లేకపోయిందన్నారు. ఆదివారం వైఎస్సార్సీపీ, సీపీఎం నాయకులను మాత్రమే కలిశామని, తక్కిన రాజకీయ, కుల సంఘాలను కలిసి బంద్ను విజయవంతం చేయాలని కోరతామన్నారు. ఏప్రిల్ 3న అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి, భవిష్యత్ కార్యాచరణకు శ్రీకారం చుడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పాల్యం నారాయణస్వామి, సహాయ కార్యదర్శి మల్లికార్జున, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీరాములు, కేశవ రెడ్డి, రామకృష్ణ, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుళ్లాయిస్వామి , నరేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు, సీపీఐ జిల్లా సమితి సభ్యులు అల్లిపీర, ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ధనుంజయ తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 9న ఉమ్మడి జిల్లాల బంద్కు సీపీఐ పిలుపు వైఎస్సార్సీపీ, సీపీఎం మద్దతు కోరిన సీపీఐ నాయకులు -
ఒత్తిడిలోను పుత్తడికి జై!
పుట్టపర్తి టౌన్: బంగారు తాకట్టు పెట్టి రుణాలు పొందేవారి సంఖ్య జిల్లాలో ఇటీవల పెరిగింది. గ్రామీణ, పట్టణ తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ అధికంగా బంగారు రుణాలు పొందుతుండడం గమనార్హం. జిల్లాలో ప్రస్తుతం బ్యాంకులు, వివిధ ప్రైవేటు సంస్థల ద్వారా బంగారు రుణాలు నెలకు దాదాపు రూ. 20 కోట్లు తీసుకొంటున్నారు. గతంలో రూ. 12 కోట్ల వరకు బంగారు రుణాల లావాదేవీలు ఉంటే ఇప్పుడు రూ. 20 కోట్లకు పెరిగినట్లు తెలిసింది. 80 శాతం మంది బ్యాంక్లో తాకట్టు పెడుతున్నారు. మిగిలిన 20 శాతం ప్రైవేటు సంస్థల్లో కుదవ పెట్టి రుణం పొందుతున్నారు. బంగారు రుణాలపై బ్యాంకులు ఏడాదికి 9 శాతం వరకు, ప్రైవేటు సంస్థల్లో 10 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి. సులువుగా రుణం .. సాధారణంగా రుణం కోసం బ్యాంకులకు వెళితే సవాలక్ష నిబంధనలు పెడతారు. కొన్ని సార్లు నెలల తరబడి బ్యాంకుల చుట్టూ తిరిగినా రుణం పొందలేని పరిస్థితి. పైగా బడా బాబులు ష్యూరిటీ ఇస్తే తప్ప లోన్లివ్వరు. ఒక్కోసారి అటు తిప్పి ఇటు తిప్పి రుణం మంజూరు చేయకుండా కొర్రీలు పెడతారు. గోల్డ్ లోన్ అలా కాదు.. చేతిలో బంగారు నగలు ఉంటే చాలు బ్యాంకర్లు, ఫైనాన్స్ సంస్థల్లో క్షణాల్లో రుణం మంజూరవుతోంది. దీంతో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారు తమ ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు గోల్డ్ లోన్లు తీసుకుంటున్నారు. మారుమూల ప్రాంతాల్లోనూ ఫైనాన్స్ సంస్థలు.. అవసరాలకు అప్పులు పుట్టని చాలా మంది గోల్డ్ లోన్లు తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద తీసుకొనే రుణానికి వడ్డీ ధర అధికంగా ఉండడంతో చాలామంది బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను సంప్రదిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా పట్టణాల్లోనే కాకుండా మారుమూల గ్రామాల్లో కూడా ఫైనాన్స్ కంపెనీలు వెలిశాయి. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు బంగారు నాణ్యతను బట్టి లోన్లు మంజూరు చేస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్లో పది గ్రాముల బంగారానికి రూ. 90 వేల దాకా రుణం ఇస్తున్నారు. జిల్లాలో ప్రధాన బ్యాంక్లతోపాటు పలు ప్రైవేటు సంస్థలు విరివిగా బంగారు రుణాలు మంజూరు చేస్తున్నాయి. కొందరు బంగారు కుదువ పెట్టి లోన్ తీసుకొని ఆ డబ్బుతో వ్యాపారాలు చేస్తున్నారు. లాకర్లవైపు మక్కువ కరువు.. డబ్బు ఉన్నవారు సైతం బంగారాన్ని లాకర్లలో ఉంచు కోవడం తగ్గించేశారు. బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకొని పలు రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. లేదంటే రుణం తీసుకున్న 90 శాతం నెలలోపు చెల్లిస్తున్నారు. మిగిలిన్న మొత్తాన్ని ఏడాదిలోపు వడ్డీతో చెల్లిస్తున్నారు. మళ్లీ బంగారు లోన్ కోసం బ్యాంకులో పెట్టేస్తున్నారు.జిల్లాలో ప్రధాన కేంద్రాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వివిధ బ్యాంక్ శాఖల్లో కిలోల కొద్దీ బంగారం ఉంది. ధర పెరిగినా కొనుగోళ్లు బంగారు ఆభరణాలు ఒంటిపై ఉంటే సమాజంలో గౌరవంగా ఉంటుందని చాలా మంది అనుకుంటారు.అత్యవసర సమయంలో ఉపయోగపడే నిధిగా భావిస్తుంటారు. అందుకే ధరలు భగ్గుమంటున్నా కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో పెరుగుతున్న గోల్డ్ లోన్లు వడ్డీ రేటు తక్కువ.. రిస్కూ తక్కువే లోన్లు ఇవ్వడానికి ప్రైవేటు సంస్థలు కూడా ఆసక్తి ప్రైవేటుగా అప్పయితే అధిక వడ్డీ కట్టాల్సిన దుస్థితి అందుకే ధరలు పెరిగినా బంగారు కొనుగోళ్లపై ఆసక్తి -
కనుల పండువగా సిడిమాను ఉత్సవం
నేడు కలెక్టరేట్లో పరిష్కార వేదికప్రశాంతినిలయం: కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.పీజీఆర్ఎస్ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలపై వారికి అర్జీలు సమర్పించుకోవచ్చని సూచించారు. గతంలో ఇచ్చిన అర్జీలకు పరిష్కారం దొరకని వారు 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనూ అర్జీలు సమర్పించవచ్చన్నారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మునిసిపల్, మండల కార్యాలయాల్లోనూ కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోలీస్ కార్యాలయంలో.. పుట్టపర్తి టౌన్: పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యలను అర్జీల ద్వారా తెలియజేయాలని, ఆధార్కార్డు వెంట తీసుకురావాలన్నారు.రాయదుర్గంటౌన్: రాయదుర్గం పట్టణ సమీపంలోని కొండపై రస సిద్ధేశ్వరస్వామి సిడిమాను ఉత్సవం ఆదివారం సాయంత్రం అశేష భక్తజన సందోహం నడుమ కనులపండువగా జరిగింది. సాయంత్రం ఆరు గంటలకు సిడిమానుకు బాలుడిని కట్టి తిప్పారు. అంతకుముందు ఉత్సవ విగ్రహానికి గంగపూజ నిర్వహించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు మున్సిపల్ సీనియర్ అకౌంటెంట్ ఈశ్వర్ స్నేహితుల బృందం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జైన సంస్కృతికి ప్రతీక.. శ్రీరస సిద్ధేశ్వర స్వామి ఆలయానికి ప్రాచీన చరిత్ర ఉంది. జైన సంస్కృతికి ప్రతీకగా రససిద్ధేశ్వర స్వామి ఆలయంలో శిలలపై జైన విద్యా పీఠ రూపం మలచబడి ఉంది. మొదటి వరుసలో ఆచార్యులు విద్యార్థులకు బోధిస్తున్న దృశ్యం, ఆ తరువాత రాణులు కూడా ఆచార్యుల ఉపన్యాసాలను వింటున్నట్లు దృశ్యాలు కనిపిస్తాయి. వీటన్నింటిని పరిశీలించిన చరిత్రకారులు ఇక్కడ జైన విద్యా పీఠం వెలసి ఉండవచ్చని, జైనాచార్యుడైన రససిద్ధుడు బోధన చేసి ఉంటారని పేర్కొంటారు. ఆది నుంచి ఆలయ నిర్వహణ బాధ్యతను పాలెగాండ్ర వంశస్తులే నిర్వహిస్తూ వస్తున్నారు. -
నేత్రపర్వం... లంకా దహనం
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో మూడు రోజులుగా కొనసాగుతున్న ఉగాది ఉత్సవాలు శనివారం ముగిశాయి. శనివారం సాయంత్రం నెట్టికంటి ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తిని ఒంటె వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం పల్లకీపై ఊరేగిస్తూ అనుబంధ దేవాలయమైన కాశీవిశ్వేశ్వరాలయం వరకూ తీసుకెళ్లారు. అక్కడ ఈఓ ఎం.విజయరాజు, సిబ్బంది ఆధ్వర్యంలో కాశీవిశ్వేశ్వరుడికి పూజలు నిర్వహించిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుని ఒంటె వాహనంపై కొలువుదీరిన ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తిని ఆలయ ప్రాంగణానికి చేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం లంకాదహనం వేడుకను ప్రారంభించారు. తిరిగి అక్కడ నుంచి ఊరేగింపుగా ఆలయం ఎదురుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదేశానికి చేరుకుని అక్కడ లంకాదహనం వేడుకలను నిర్వహించారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ వేడుకను చూసేందుకు తరలి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. -
అరటి రైతుల కష్టాలు కనిపించలేదా?
అనంతపురం అర్బన్: ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు అరటి రైతుల కష్టాలు కనిపించడం లేదా అని రైతులు నిలదీశారు. అరటి రైతులను ఆదుకోవాలని కోరుతూ రైతు సంఘం ఆధ్వర్యంలో అరటి గెలలు, బోదెలతో శనివారం అనంతపురంలోని కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జున మాట్లాడుతూ యుద్ధం నేపథ్యంలో అరటి పంట ఎగుమతులు నిలిచిపోయాయన్నారు. దీంతో ధర పతనమై రైతులు తీవ్ర నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఆదుకునే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. 20 రోజుల క్రితం అరటి టన్ను రూ.22 వేల నుంచి రూ.25 వేలు ధర పలికిందన్నారు. ప్రస్తుతం టన్ను ధర ఐదారు వేల రూపాయలకు పడిపోయిందన్నారు. రైతులకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామని, ధరలు లేకపోతే గిట్టుబాటు ధర కల్పిస్తాంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో గొప్పలు చెప్పారన్నారు. క్షేత్రస్థాయిలో అరటి రైతులు నష్టపోతుంటే మాత్రం పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం తక్షణం స్పందించి టన్ను రూ.25 వేలతో అరటి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు, ఈదురుగాలులకు అరటి, బొప్పాయి, మొక్కజొన్న, మామిడి, తదితర పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నప్పయాదవ్, నాయకులు వన్నారెడ్డి, నారాయణస్వామి, రామకృష్ణ, వెంకటరాముడు, రామాంజినేయులు, తదితరులు పాల్గొన్నారు. నేడు ‘కడపటి యుద్ధం’ ఆవిష్కరణ అనంతపురం కల్చరల్: విలక్షణ రచయిత బండి నారాయణస్వామి కలం నుంచి జాలు వారిన ‘కడపటి యుద్ధం’ నవల ఆదివారం ఆవిష్కరణ కానుంది. స్పందన అనంత కవుల వేదిక ఆధ్వర్యంలో ఎన్జీఓ హోమ్ వేదికగా జరిగే ఈ కార్యక్రజుమానికి ప్రజాకవి గోరేటి వెంకన్న, భూమన్, లక్ష్మీనరసయ్య, నాగోలు కృష్ణారెడ్డి హాజరు కానున్నారు. రాతిదూలం లాగుడు పోటీలు కూడేరు: ఉగాది పండుగ నేపథ్యంలో కూడేరు మండలం కొర్రకోడులో గ్రామస్తుల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి రాతి దూలం లాగుడు పోటీలు పోటాపోటీగా సాగాయి. 14 జతల వృషభాలను పోటీకి రైతులు తీసుకువచ్చారు. బొమ్మనహళ్ మండలం గోవిందవాడ గ్రామ రైతు గురుస్వామి వృషభాలు ప్రథమ స్థానంలో నిలవగా, అదే గ్రామానికి చెందిన రైతు నరసింహులు వృషభాలు ద్వితీయ స్థానం దక్కించుకున్నాయి. మూడో స్థానంలో విడపనకల్లు మండలం పెంచలపాడుకు చెందిన రైతు భీమలింగ వృషభాలు, నాల్గో స్థానంలో బొమ్మనహళ్ మండలం లింగాదహళ్కు చెందిన వృషభాలు, ఐదో స్థానంలో కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామ రైతు మస్తానయ్య వృషభాలు, ఆరో స్థానంలో పత్తికొండ మండలం పులికొండ గ్రామ రైతు మాధవరాజులు వృషభాలు, ఏడో స్థానంలో వజ్రకరూరు మండలం ధర్మపురికి చెందిన రైతు అజిత్కుమార్ వృషభాలు, ఎనిమిదో స్థానంలో బొమ్మనహళ్ మండలం ఉద్దేహళ్కు చెందిన బసన్న వృషభాలు నిలిచాయి. విజేత వృషభాల యజమానులను నగదు పురస్కారాలతో గ్రామస్తులు సత్కరించారు. -
పండగ పూట ‘నారాయణ’ నిర్వాకం
హిందూపురం టౌన్: ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ పండుగ సెలవుల్లోనూ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్ధులను మానసికంగా ఒత్తిడికి గురిచేస్తున్న ఘటన హిందూపురం పట్టణంలో వెలుగు చూసింది. శనివారం దేశవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు, ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించింది. అయినా హిందూపురంలోని నారాయణ పాఠశాల యాజమాన్యం మాత్రం విద్యార్థులకు సెలవు ఇవ్వకుండా మార్కుల కోసం, ర్యాంకుల కోసం ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతరు చేసింది. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులపై, ఉపాధ్యాయులపై ఒత్తిడి తీసుకువస్తోంది. ర్యాంకులు, మార్కుల ఒత్తిడి భరించలేక రాష్ట్రంలో నారాయణ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు అనేక మంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇన్ని జరుగుతున్నా.. యాజమాన్యం మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తూ విద్యార్థులను మానసికంగా వేధింపులకు గురి చేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్నీ తెలిసినా స్థానిక విద్యాశాఖ అధికారులు మాత్రం నోరుమెదపక పోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తున్న నారాయణ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యార్ధి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై ఎంఈఓ గంగప్పను వివరణ కోరగా.. విద్యార్థుల తల్లిదండ్రులు కోరితేనే తరగతులు ఏర్పాటు చేసినట్లు నారాయణ పాఠశాల యాజమాన్యం తెలుపుతోందని వివరించారు. సెలవు రోజుల్లోనూ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు మార్కుల కోసం విద్యార్థులు, ఉపాధ్యాయులపై ఒత్తిడి ప్రభుత్వ నిబంధనలు బేఖాతర్ -
కష్టాల్లో అరటి రైతులు
● భారీగా అరటి ధరల పతనం ● ఈదురుగాలులకు నేలవాలిన చెట్లు ● రైతుల గురించి పట్టించుకోని చంద్రబాబు సర్కారు అనంతపురం అగ్రికల్చర్: అరటి రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఒక వైపు ధరల్లేక దిక్కులు చూస్తుంటే.. మరోవైపు ఈదురుగాలులకు తోటలు నేలవాలుతుండటంతో నష్టాలు రెట్టింపవుతున్నాయి. కోతకు వచ్చిన నాణ్యమైన మొదటి పంటను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఆసక్తి చూపించడం లేదు. టన్ను రూ.20 వేలకు పైగా ఉండాల్సిన ధర ఒక్కసారిగా నేలచూపు చూడటంతో టన్ను రూ.5 వేల నుంచి రూ.7 వేల మధ్యనే విక్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. ● గత నవంబర్లోనే రెండో పంటను అమ్ముకోలేక ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్న రైతులు ఈ ఏడాది మొదటి పంటకే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు నాలుగు రోజులుగా 25 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో పలు మండలాల్లో అరటి తోటలు నేలవాలాయి. ఉద్యానశాఖ అధికారులు మాత్రం 33 శాతం దెబ్బతింటేనే నష్టం నమోదు చేస్తున్న పరిస్థితి. ఇలా పది మండలాల్లో 120 హెక్టార్లలో అరటి తోటలు దెబ్బతినడంతో రూ.4.10 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నట్లు రైతులు వాపోతున్నారు. అరటి తోటలకు రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు నష్టం జరిగినట్లు రైతులు చెబుతున్నారు. అలాగే మరికొన్ని కూరగాయల పంటలు దెబ్బతినడంతో రూ.ఒక కోటి, మొక్కజొన్న, వరి పంటల నష్టం రూ.రెండు కోట్ల వరకు ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద అరటి తోటల రైతులకు ఈ ఏడాదీ కలిసిరాక పెట్టుబడులు కూడా దక్కించులేని దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం, జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు అరటి రైతుల గురించి ఆలోచించే తీరికలేకపోయింది. ఉద్యానశాఖ మాత్రం మొక్కుబడిగా నష్టం అంచనాలు వేసి చేతులు దులుపుకునే పరిస్థితి నెలకొంది. -
తల్లీబిడ్డల అదృశ్యంపై కేసు నమోదు
పుట్టపర్తి టౌన్: స్థానిక చిత్రావతి రోడ్డులో నివాసముంటున్న ఆది ఆంధ్ర సత్యం భార్య మేదర సోమేశ్వరి తన ఇద్దరు పిల్లలతో కలసి కనిపించకుండా పోయిందంటూ భర్త చేసిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు సీఐ తిమ్మారెడ్డి తెలిపారు. వివరాలను శనివారం ఆయన వెల్లడించారు. రెండు రోజులుగా ఆమె కనిపించకపోవడంతో పరిసర ప్రాంతాలు, బంధువుల నివాసాలు గాలించినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు భర్త ఫిర్యాదు చేశాడన్నారు. బైక్ బోల్తా – యువకుడికి గాయాలు గాండ్లపెంట: ద్విచక్ర వాహనం బోల్తాపడిన ఘటనలో ఓ యువకుడు గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన మేరకు.. అన్నమయ్య జిల్లా గాలివీడుకు చెందిన పవన్కుమార్ శనివారం ఉదయం ద్విచక్ర వాహనంపై కదిరికి బయలుదేరాడు. గాండ్లపెంట మండలం వేపరాల క్రాస్ వద్దకు చేరుకోగానే నియంత్రణ కోల్పోవడంతో బైక్ అదుపు తప్పి కిందపడ్డాడు. తలకు బలమైన గాయమైన పవన్కుమార్ను స్థానికులు వెంటనే 108 వాహనం ద్వారా కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. కారు అదుపు తప్పి... నల్లచెరువు: కారు అదుపు తప్పి పల్టీలు కొట్టిన ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన మేరకు... చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన సంతోష్, శ్రావణి శనివారం ఉదయం కదిరి లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి కారులో బయలుదేరారు. నల్లచెరువు మండలం రాట్నాలపల్లి సమీపంలోకి చేరుకోగానే 42వ జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి పల్టీలు కొడుతూ రోడ్డు పక్కన ముళ్ల పొదల్లోకి దూసుకెళ్లింది. కారు నుజ్జునుజ్జయింది. గాయపడిన సంతోష్, శ్రావణిని స్థానికులు 108 వాహనం ద్వారా కదిరిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
మాజీ ఎమ్మెల్యే ఉన్నం కన్నుమూత
కళ్యాణదుర్గం రూరల్: టీడీపీ సీనియర్ నేత, కళ్యాణదుర్గం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా గుండె, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో శనివారం ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలియగానే వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అభిమానులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. శనివారం ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామం ఎర్రంపల్లిలోని స్వగృహానికి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య, కాంగ్రెస్ నేత ఎన్.రఘువీరారెడ్డి తదితరులు ఎరరంపల్లికి చేరుకుని ఉన్నం హనుమంతరాయచౌదరి పార్థివదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉన్నం కుటుంబసభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు. -
విద్యార్థిని బలిగొన్న ఈత సరదా
వజ్రకరూరు: ఈత సరదా ఓ విద్యార్థి ప్రాణాలు బలిగొంది. వజ్రకరూరు మండలం పీసీపీ కొత్తకోట గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.గ్రామానికి చెందిన చిన్న మాదుల రాజేష్, సోమావతి దంపతులకు ముగ్గురు కుమారులు కాగా, వీరి చిన్న కుమారుడు అరుణ్తేజ్ (13) స్థానిక జెడ్పీహెచ్ఎస్లో 8వ తరగతి చదువుతున్నాడు. శనివారం పాఠశాలకు సెలవు కావడంతో అరుణ్తేజ్ మరో నలుగురు విద్యార్థులతో పాటు తన కుటుంబసభ్యులతో కలిసి గ్రామానికి సమీపంలోని ఉన్న సొంత పొలానికి వెళ్లాడు. కాసేపు ఆడుకున్న తర్వాత స్నేహితులతో కలిసి బావిలో ఈత కొడుతూ నీటి అడుగు భాగానికి వెళ్లిన అరుణ్తేజ్ ఎంత సేపటికీ పైకి రాలేదు. కంగారు పడిన స్నేహితుల కేకలు విన్న కుటుంబసభ్యులు వెంటనే అక్కడకు చేరుకుని బావిలో దూకి గాలింపు చేపట్టారు. నీటి అడుగున పూడికలో ఇరుక్కుపోయిన అరుణ్తేజ్ను వెలికి తీసి ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అరుణ్తేజ్ మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న జెడ్పీ హెచ్ఎస్ హెచ్ఎం రాజ్కుమార్, ఉపాధ్యాయులు ఆస్పత్రికి చేరుకుని బాధిత కుటుంబసభ్యులను ఓదార్చారు. విద్యార్థి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఈద్.. తక్బీర్
పుట్టపర్తి టౌన్: ఈద్ –ఉల్ –ఫితర్ (రంజాన్) సందర్భంగా జిల్లాలో శనివారం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈద్గాలు, మసీదుల్లో ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేశారు. ఒకరినొకరు అలింగనం చేసుకొని ఈద్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పెద్దలు, తల్లిదండ్రులు పట్ల విధేయత చూపాలని, మత సామరస్యం, సోదరభావం, సౌభ్రాతృత్వం పెంపొందించుకోవాలని మత పెద్దలు సందేశం ఇచ్చారు. మత సామరస్యాన్ని చాటుతూ ఇచ్చిన విందుల్లో హిందువులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు మస్లింలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్గాలు, మసీదుల వద్ద పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా డ్రోన్ల ద్వారా నిఘా ఉంచారు. భక్తిశ్రద్ధలతో రంజాన్ ప్రార్థనలు కిటకిటలాడిన మసీదులు, ఈద్గాలు -
అకాల నష్టంపై సమగ్ర నివేదిక
● జిల్లా వ్యవసాయాధికారి కృష్ణయ్య బత్తలపల్లి: అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటల వివరాలన్నీ నమోదు చేసి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపనున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) కృష్ణయ్య తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే మండల స్థాయి వ్యవసాయాధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. శుక్రవారం ఆయన సాంకేతిక శాస్త్రవేత్త రామసుబ్బయ్యతో కలిసి బత్తలపల్లి మండలంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ... అకాల వర్షాలతో పంటలు కోల్పోయిన రైతులందరికీ పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు పలు గ్రామాల్లో పంటలు కోల్పోయిన రైతులతో మాట్లాడారు. తమను ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు కన్నీరు పెట్టుకున్నారు. జిల్లా వ్యవసాయాధికారి వెంట తహసీల్దార్ స్వర్ణలత, ఎంపీడీఓ నరసింహనాయుడు, మండల వ్యవసాయాధికారి ఓబిరెడ్డి, విస్తరణ అధికారి శ్రీనివాసులు, గ్రామ వ్యవసాయ సహాయకులు శ్రీకాంత్రెడ్డి, రవి, బాలరాజు నాయక్, రాగిరి సోమశేఖర్ తదితరులు ఉన్నారు. రేపటి నుంచి ఇంటర్ ‘స్పాట్’ పుట్టపర్తి: శనివారం జరగాల్సిన ఇంటర్మీడియెట్ స్పాట్ వాల్యుయేషన్ ఆదివారం కొత్తచెరువు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభమవుతుందని ఇంటర్మీడియెట్ విద్య జిల్లా అధికారి చెన్నకేశవప్రసాద్ తెలిపారు. ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు 21వ తేదీ శనివారం ఇంగ్లిష్, మ్యాథ్స్, తెలుగు, హిందీ, హిస్టరీ, ఎకనామిక్స్ సబ్జెక్టుల స్పాట్ వ్యాల్యుయేషన్ క్యాంప్ రంజాన్ సెలవు దృష్ట్యా ఆదివారానికి మార్చినట్లు వెల్లడించారు. ఆయా సబ్జెక్టులకు సంబంధించిన పరిశీలకులు 23వ తేదీ సోమవారం నుంచి హాజరుకావాలన్నారు. ఈ సబ్జెక్టుల అధ్యాపకులు అందరూ తప్పనిసరిగా క్యాంపునకు హాజరు కావాలన్నారు. -
రైతులపై రాజకీయ పెత్తనం
ధర్మవరం రూరల్: రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని సర్కార్ కొలువుదీరాక రైతులపై రాజకీయ పెత్తనం పెచ్చుమీరిపోయింది. కబ్జాలు, ఆక్రమణలకు అంతేలేకుండా పోయింది. టీడీపీ నాయకులు తలచుకుంటే రోడ్లు, విద్యుత్ లైన్ల అలైన్మెంట్ కూడా మారిపోతోంది. తాజాగా ధర్మవరం మండలంలోని ఓ టీడీపీ నాయకుడి కోసం విద్యుత్ అధికారులు 33 కేవీ విద్యుత్ లైనుఅలైన్మెంట్ మార్చి ఇతర రైతుల పొలాల్లో స్తంభాలు నాటారు. దీనిపై బాధితులు కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చినా ఏమాత్రం లెక్కచేయలేదు. టీడీపీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ఏకంగా పోలీసులను వెంట బెట్టుకుని వెళ్లి స్తంభాలు నాటారు. అలైన్మెంట్ మార్చేసి.. అడ్డుకున్న వారిని ఈడ్చేసి ధర్మవరం మండలం గొట్లూరు వద్ద సర్వే నంబర్ 624లో శ్రీరామరెడ్డి, నరసింహారెడికి 4.60 ఎకరాల పొలం ఉంది. పొలం పక్కనే తారురోడ్డు వెళ్తోంది. వీరికి రోడ్డుకు అటు వైపున కూడా కొంత భూమి ఉంది. ఇటీవల గొట్లూరు నుంచి సుబ్బరావుపేట వైపు 33 కేవీ విద్యుత్ లైను లాగుతున్నారు. విద్యుత్ శాఖకు చెందిన కాంట్రాక్టర్ విద్యుత్ స్తంభాలను శ్రీరామరెడ్డి, నరసింహారెడ్డి పొలం వద్దకు రాగానే రోడ్డుకు ఇటు పక్కన భూమిలో తొలుత విద్యుత్ స్తంభాలను నాటారు. ఆ లైను అలాగే టీడీపీ నాయకుని పొలం గుండా వెళ్లాల్సి ఉంటుంది. దీంతో టీడీపీ నాయకుడు ఆ శాఖ అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు తెచ్చాడు. అప్పటికే నాటిన విద్యుత్ స్తంభాలను పడగొట్టాడు. అంతేకాకుండా రాజకీయ నాయకులతో అధికారులకు ఫోన్లు చేయించాడు. దీంతో విద్యుత్ అధికారులు 33 కేవీ విద్యుత్ లైను అలైన్మెంట్ మార్చి శ్రీరామరెడ్డి, నరసింహారెడ్డి పొలంలో స్తంభాలు నాటేందుకు సిద్ధమయ్యారు. దీంతో బాధిత రైతులు కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చారు. ఈక్రమంలోనే శుక్రవారం ఏకంగా 50 మంది పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని విద్యుత్ స్తంభాలను రోడ్డుకు అటువైపున ఉన్న శ్రీరామరెడ్డి, నరసింహారెడ్డి చీనీ తోటలో నాటించారు. రైతు కుటుంబ సభ్యులు కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ చూపినా పట్టించుకోలేదు. తమకు అన్యాయం చేయొద్దని వేడుకున్నా... వినకుండా వారందరినీ బలవంతంగా జీపులో ఎక్కించి రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం విద్యుత్ స్తంభాలను నాటించారు. టీడీపీ నాయకుడి కోసం విద్యుత్ లైను అలైన్మెంట్ మార్పు తమ పొలంలో స్తంభాలు నాటవద్దని వేడుకున్నా.. వినని అధికారులు రైతు కుటుంబ సభ్యులను ఈడ్చుకెళ్లిన పోలీసులు స్టే ఆర్డర్ చూపినా పట్టించుకోని వైనం న్యాయ పోరాటం చేస్తాం.. తొలుత అధికారులు మా చీనీతోటకు అటు వైపు ఉన్న మా స్థలంలోనే స్తంభాలను నాటారు. మా స్థలం తర్వాత టీడీపీ నాయకుడి పొలం ఉంది. దీంతో అతను తన స్థలంలో స్తంభాలు నాటడానికి ఒప్పుకోలేదు. నాటిన విద్యుత్ స్తంభాలనూ తొలగించాడు. దీంతో అధికారులు ఇటువైపున ఉన్న మా చీనీతోటలో విద్యుత్ స్తంభాలు నాటేందుకు ప్రయత్నించగా...హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ను తీసుకొచ్చాను. వీటిని చూపినా... పోలీసులు లెక్క చేయలేదు. అడ్డుకున్న మా కుటుంబీకులను పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. దీనిపై న్యాయపోరాటం చేస్తాం. – నరసింహారెడ్డి, రైతు -
రంజాన్ను ప్రశాంతంగా జరుపుకోవాలి
● ఎస్పీ సతీష్కుమార్ పుట్టపర్తి టౌన్: పవిత్ర రంజాన్ పండుగను ముస్లింలంతా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ సతీష్కుమార్ సూచించారు. జిల్లాలోని ముస్లింలందరికీ ఆయన రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పర్వదినం శాంతి, సహనం, గౌరవం, దాతృత్వానికి ప్రతీక అన్నారు. అల్లాహ్ దీవెనలు జిల్లా ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రార్థనా స్థలాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నేటి ‘పది’ పరీక్ష ఏప్రిల్ 2కు వాయిదా ● ఓపెన్ స్కూల్ పరీక్షలు ఈనెల 30కు వాయిదా సాక్షి, పుట్టపర్తి: రంజాన్ పండుగ నేపథ్యంలో శనివారం జరగాల్సిన పదో తరగతి ఇంగ్లిష్ పరీక్ష ప్రభుత్వ వాయిదా వేసిందని జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. వాయిదా పడిన ఇంగ్లిష్ పరీక్షను ఏప్రిల్ 2న ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిస్తామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షల్లో భాగంగా శనివారం 211–గణితం, 223–భారతీయ సంస్కృతి, వారసత్వం పరీక్షలు ఈనెల 30కు వాయిదా వేసినట్లు వెల్లడించారు. ఆరోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయన్నారు. -
రంజాన్కు సర్వం సిద్ధం
నెలవంక కనిపించడంతో ముస్లింలు ఉపవాస దీక్షలను విరమించారు. సత్య నిష్ట, ధర్మాచరణ, దానధర్మాలు, ఉపవాసాలతో సాగిన రంజాన్ మాసం ముగియడంతో శనివారం పండుగ జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు జిల్లా అంతటా రంజాన్ వేడుకలకు మసీదులు, ఈద్గాలలో ఏర్పాట్లు చేశారు. నెలరోజుల ఉపవాస దీక్షల్లో చివరిరోజు శుక్రవారం ఇఫ్తార్ వేళ మసీదులన్నీ ముస్లింలతో రద్దీగా మారాయి. మసీదుల ఇమామ్లు, మౌజన్లు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కుల మతాలకతీతంగా ఇఫ్తార్ విందు ఇచ్చి ఐక్యత చాటిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. – సాక్షి బృందం, శ్రీసత్యసాయి జిల్లా -
హోరాహోరీగా వృషభాల బలప్రదర్శన
యాడికి: ఉగాది పండుగ సందర్భంగా యాడికి మండలం రాయలచెరువులోని లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయం వద్ద శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి వృషభాల బలప్రదర్శన పోటీలు హోరాహోరీగా సాగాయి. పోటీలకు 14 జతల వృషభాలను రైతులు తీసుకువచ్చారు. ప్రథమ స్థానంలో పుట్లూరు మండలం రంగసానిపల్లి రైతు వెంకట సుబ్బారెడ్డి వృషభాలు నిలిచాయి. ద్వితీయ స్థానంలో నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పీఆర్పల్లి రైతు నాగయ్య వృషభాలు, తృతీయ స్థానంలో వైఎస్సార్ కడప జిల్లా అక్కంపేట గ్రామ రైతు ఆదిల్ వృషబాలు, నాల్గో స్థానంలో పుట్లూరు మండలం రంగసానిపల్లి రైతు వెంకటసుబ్బారెడ్డి రెండో జత వృషబాలు, ఐదో స్థానంలో గార్లదిన్నె మండలానికి చెందిన రైతు రామాంజనేయులు వృషభాలు, ఆరో స్థానంలో తాడిపత్రిలోని గన్నేవారిపల్లి రైతు రమేష్బాబుయాదవ్ వృషభాలు నిలిచాయి. విజేత వృషభాల యజమానులను నగదు పురస్కారాలతో కొండుపల్లి చిలమకూరు జయప్రకాష్, ముత్తలూరు నరేష్ చౌదరి, న్యూ వికాష్ స్కూల్ రామకృష్ణ, జొన్నల వ్యాపారి పెద్దన్న, రాజ పుల్లయ్య, రంగస్వామి, నాగరంగయ్య, మదమంచి శివప్రసాదనాయుడు సత్యరించారు. నేత్రపర్వంగా నెట్టికంటుడి రథోత్సవంగుంతకల్లు రూరల్: ఉగాది ఉత్సవాల్లో భాగంగా కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో శుక్రవారం స్వామివారి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన వేలాది మంది భక్తులతో ఆలయ పురవీధులు పోటెత్తాయి. ఆంజనేయ రక్షమాం.. పవన పుత్ర పాహిమాం అంటూ భక్తులు భక్తి పారవశ్యంతో తన్మయత్వం పొందారు. శుక్రవారం వేకువజామునే నెట్టికంటి ఆంజనేయస్వామి వారికి అభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక పుష్పాలతో అలకరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం ఆలయ ప్రధాన గోపురం ఎదుట రథాన్ని నిలిపి రథాంగహోమం, బలిహరణ పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను రథంపై అధిష్టింపజేసి ఆలయ పురవీధుల్లో భక్తులు లాగారు. కార్యక్రమంలో గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మరూరు జయరాం కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ మేడేపల్లి విజయరాజు, ఆలయ అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ పర్యవేక్షించారు. ●ఉల్లాసంగా ఉట్ల పరుషబుక్కరాయసముద్రం: ఉగాది పండుగ సందర్భంగా శుక్రవారం బుక్కరాయసముద్రంలో ఉట్ల పరుష ఉల్లాసంగా సాగింది. స్టేట్ బ్యాంక్ ఎదుట ఉట్ల మాను ఏర్పాటు చేసి, ఎక్కడానికి యువకులు పోటీ పడ్డారు. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు తరలిరావడంతో ఆ ప్రాంతం జనసంద్రమైంది. -
నమో చౌడేశ్వరీమాత..
పెనుకొండ/హిందూపురం: జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో చౌడేశ్వరీ దేవి ఉత్సవాలు శుక్రవారం నేత్రపర్వంగా సాగాయి. మండల కేంద్రం సోమందేపల్లిలో శుక్రవారం తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రత్యేక పూజల అనంతరం ఊరేగింపుగా తీసుకురాగా, తొగటవీర క్షత్రియులు తలలపై జ్యోతులు ఉంచుకుని నృత్యం చేస్తూ ముందుకు సాగారు. వేలాదిగా జనం వీధుల్లోకి వచ్చి ఉత్సవాన్నిచూసి పులకించిపోయారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ ధర్మకర్త డీసీ ఈశ్వరయ్య, తొగటవీర క్షత్రియ సంఘం అధ్యక్షుడు సీసీ హరిదాస్, డీఏ నారాయణస్వామి తదితరులు పర్యవేక్షించారు. అలాగే హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని ముదిరెడ్డిపల్లిలో తోగట వీరక్షత్రియుల ఆరాధ్యదైవమైన చౌడేశ్వరిదేవి జ్యోతుల ఉత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా సాగింది. తెల్లవారుజామునే ఆలయంలో మూలవిరాట్కు విశేష పూజలు నిర్వహించిన అనంతరం 3 గంటల సమయంలో జ్యోతులను తలలపై ఎత్తుకుని నృత్యం చేస్తూ గ్రామోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం జంతు బలులతో మొక్కులు తీర్చుకున్నారు. వేలాదిగా జనం తరలి రావడంతో ముదిరెడ్డిపల్లి జనసంద్రమైంది. భక్తులకు మజ్జిగ, తాగునీరు, చల్లని పానీయాలను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ జయరాములు, ఆలయ కమిటీ నాయకులు బండారు బాలాజీ, వైఎస్సార్సీపీ నాయకులు చంద్రశేఖర్రెడ్డి, నాగభూషణరెడ్డి ఆర్పీ భాస్కర్, మనోహర్, సాయితేజా శ్రీనివాస్ పాల్గొన్నారు. ● హిందూపురం మండలం కొటిపి గ్రామంలో చౌడేశ్వరీ దేవి రథోత్సవాన్ని శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున ఆలయంలో మూలవిరాట్కు విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి ఉత్సవ మూర్తిని రథంపై అధిష్టింపజేసి పురవీధుల్లో భక్తులు లాగారు. వడి బియ్యం సమర్పిణ, జంతుబలులతో మొక్కులు తీర్చుకున్నారు. సోమందేపల్లి, ముదిరెడ్డిపల్లిలో వైభవంగా జ్యోతుల ఉత్సవం కొటిపిలో నేత్రపర్వంగా సాగిన రథోత్సవం -
కనుల పండువగా సిరిమాను ఉత్సవం
యల్లనూరు: మండలంలోని కొడవండ్లపల్లిలో వేదపండితుల మంత్రోచ్చారణ నడుమ శుక్రవారం పెద్దమ్మ సిరిమాను ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తిమ్మంపల్లి తిమ్మమ్మ గుడి నుంచి పెద్దమ్మ గుడి వరకూ ఎద్దుల బండిపై సిరిమానును ఊరేగింపుగా తీసుకువచ్చారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, రమాదేవి దంపతులు, కుమారుడు కేతిరెడ్డి సాయి ప్రతాప్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెద్దమ్మ సిరిమాను ఉత్సవాన్ని పెద్దారెడ్డి ప్రారంభించారు. 70 ఏళ్ల తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన ఈ ఉత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున జంతు బలులతో మొక్కులు తీర్చుకున్నారు. కొడవండ్లపల్లి పెద్దమ్మ ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసింది. తిమ్మంపల్లి తిమ్మమ్మగుడి వద్ద, కొడవండ్లపల్లి పెద్దమ్మ గుడి వద్ద హాజరైన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. చింతకాయమందలో పెద్దమ్మ, అంకాలమ్మ, యల్లనూరులో పెద్దమ్మ, చిలమకూరులో యల్లమ్మ ఆలయాల వద్దనూ ఉత్సవాలు పెద్ద ఎత్తున జరిగాయి. 70 ఏళ్ల తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో వేడుక పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి -
రంజాన్ శుభాకాంక్షలు
పెనుకొండ రూరల్: నెల రోజుల ఉపవాస దీక్షల అనంతరం శనివారం రంజాన్ పర్వదినాన్ని జరుపుకుంటున్న ముస్లింలకు పెనుకొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త కేవీ ఉష శ్రీచరణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. అల్లాహ్ ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. దెబ్బతిన్న పంటల పరిశీలన ముదిగుబ్బ: అకాల వర్షాల కారణంగా మండలంలో దెబ్బతిన్న పంటలను శుక్రవారం జిల్లా వ్యవసాయ అధికారి కృష్ణయ్య, వ్యవసాయ శాస్త్రవేత్తలు రామసుబ్బయ్య, కిరణ్కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను రెవెన్యూ, వ్యవసాయ సిబ్బంది క్షేత్ర స్థాయిలో పరిశీలించి నష్టంపై నివేదికలను ఉన్నతాధికారులకు నివేదిస్తారన్నారు. అనంతరం నల్లచెర్లోపల్లిలో దెబ్బతిన్న మొక్కజొన్న పంటను పరిశీలించారు. కార్యక్రమంలో ఏఓ రవీంద్ర, విస్తరణ అధికారి మనోహర్, ఉద్యానశాఖ సిబ్బంది ప్రియాంక, వీఆర్ఓ చరణ్కుమార్, రైతులు పాల్గొన్నారు. జాతీయ సమైక్యత శిబిరానికి ధర్మవరం విద్యార్థి ధర్మవరం అర్బన్: ఈ నెల 23 నుంచి 29వ తేదీ వరకు కర్ణాటకలోని మైసూరు యూనివర్సిటీ వేదికగా నిర్వహిస్తున్న జాతీయ సమైక్యత శిబిరానికి ధర్మవరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి సాకే నరహరి ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా నరహరిని ఆ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకరరెడ్డి, అధ్యాపకులు శుక్రవారం అభినందించారు. ఏపీ నుంచి 10 మంది ఎన్ఎస్ఎస్ వలంటీర్లు ఎంపిక కాగా, అందులో తమ కళాశాల విద్యార్థి ఉండటం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ చిట్టెమ్మ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ గోపాల్నాయక్, అధ్యాపకులు కిరణ్కుమార్, త్రివేణి, షమీవుల్లా, పావని, భువనేశ్వరి, హైమావతి, పుష్పావతి, సరస్వతి, ఆనంద్, మీనా, ధనుంజయ తదితరులు పాల్గొన్నారు. వ్యక్తి ఆత్మహత్య గుత్తి: జీవితంపై విరక్తితో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. గుత్తిలోని సీపీఐ కాలనీకి చెందిన రమేష్ (40) మద్యానికి బానిసయ్యాడు. కుటుంబసభ్యులు ప్రాధేయపడడంతో ఇటీవల మద్యం తాగడాన్ని పూర్తిగా మానేశాడు. అయితే స్వీయ నియంత్రణ కోల్పోయి విచిత్రంగా ప్రవర్తిస్తుండడంతో కుటుంబసభ్యులు అతన్ని ఇంటి నుంచి బయటకు పంపకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. శుక్రవారం ఇంట్లో ఎవరికి తెలియకుండా బయటపడిన రమేష్ నేరుగా తురకపల్లి రైల్వే స్టేషన్కు చేరుకుని అప్పటికే పట్టాలపై వస్తున్న గూడ్స్ రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. కాగా, రమేష్కు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. -
యువ స్ఫూర్తి.. సాయి అనుగ్రహ దీప్తి
పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి చేరుకున్న ఏపీ సత్యసాయి యూత్ బృందం శుక్రవారం సాయంత్రం సాయికుల్వంత్ సభామందిరంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. నేటి యువత ఎదుర్కొంటున్న పలు సమస్యలకు సత్యసాయి బోధనలు చక్కటి పరిష్కారాన్ని చూపుతాయనే సందేశంతో సాగిన నాటిక దేశవిదేశీ భక్తులను ఆకట్టుకుంది. యువ స్ఫూర్తి – సాయి అనుగ్రహ దీప్తి అనే పేరుతో ప్రదర్వించిన నృత్య రూపకం ఆకట్టుకుంది. అంతకు ముందు ఉదయం సాయి ప్రేమాతరంగిణి పేరుతో నిర్వహించిన సంగీత కచేరీ అలరించింది. ఈ సందర్భంగా మారుమూల ప్రాంతాలకు చెందిన 504 మంది భక్తులకు సత్యసాయి పాదుకలను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు బహూకరించారు. ప్రశాంతి నిలయం: -
‘పురం’ ప్రజలకు మెరుగైన సేవలందిస్తాం
హిందూపురం: జిల్లాలో పెద్ద పట్టణమైన హిందూపురంలో తాగునీరు, పారిశుధ్యం, ప్రజారోగ్యం ప్రధాన అంశాలు తీసుకుని ప్రజలకు మెరుగైన సేవలందిస్తామని కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన హిందూపురం మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... హిందూపురం మున్సిపాలిటీలో వివిధ సమస్యలపై ఆరు నెలలుగా సమీక్షలు నిర్వహిస్తున్న దృష్ట్యా ఇక్కడి పరిస్థితులు, సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. అనుభవం కలిగిన కమిషనర్ మల్లికార్జున, అధికారులు, ప్రజలను సమన్వయం చేసుకుని ముందుకు సాగుతూ మెరుగైన పాలన అందిస్తామన్నారు. ముఖ్యంగా పట్టణాన్ని శుభ్రంగా, అందంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టనున్నట్లు వివరించారు. పట్టణంలో రోజువారీ చెత్త సేకరణను కచ్చితంగా అమలయ్యేలా చూస్తామన్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి వార్డుకు సమయానికి తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడైనా లీకేజీలుంటే మరమ్మతు చేసి నీటి సరఫరాకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్ల మరమ్మతులపై కూడా దృష్టి సారిస్తామన్నారు. ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే విధానం అమలు చేస్తామన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఆనంద్కుమార్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, పలువురు అధికారులు పాల్గొన్నారు. స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ -
చెట్టుపై నుంచి కింద పడి వ్యక్తి మృతి
రొళ్ల: చింత చెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు... రొళ్ల మండలం హులికుంట గ్రామానికి చెందిన రంగశామప్ప (58)కు భార్య కామాక్షమ్మ, ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకునేవారు. ఈ క్రమంలో తన పొలంలో పెంచిన చింత చెట్లలోని కాయలు కోసేందుకు శుక్రవారం తన భార్యతో కలసి వెళ్లిన రంగశామప్ప అక్కడ చెట్టు పైకి ఎక్కాడు. కాయలు కోస్తూ అదుపు తప్పి కింద పడ్డాడు. ఛాతీ, వెన్నెముకపై బలమైన దెబ్బలు తగలడంతో అపస్మారకస్థితిలోకి చేరుకున్నాడు. కామాక్షమ్మ నుంచి సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు, గ్రామస్తులు అక్కడకు చేరుకుని ప్రైవేట్ వాహనంలో రొళ్లలోని సీహెచ్సీకి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే రంగశామప్ప మృతి చెందినట్లు నిర్ధారించారు. కత్తులతో పరస్పర దాడిహిందూపురం: కుటుంబ కలహాల నేపథ్యంలో ఇరు వర్గాలు కత్తులు దూసుకున్నాయి. పోలీసులు తెలిపిన మేరకు... హిందూపురంలోని మేళాపురంలో నివాసముంటున్న హరీష్రెడ్డి చెల్లెల్ని విశ్వనాథరెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో హరీష్రెడ్డి, విశ్వనాథరెడ్డి మధ్య కొంత కాలంగా మనస్పర్థలు చెలరేగాయి. అప్పటి నుంచి తరచూ మాటాలతో గొడవ పడేవారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మరోసారి ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఆవేశంతో ఇద్దరూ కత్తులు దూసుకున్నారు. ఘటనలో ఇద్దరికీ గాయాలయ్యాయి. క్షతగాత్రులను కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. హరీష్రెడ్డి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో బెంగళూరుకు తరలించారు. ఘటనపై వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
పెన్నానది ఒడ్డున వ్యక్తి మృతదేహం
హిందూపురం: మండలంలోని చౌళూరు గ్రామ సమీపంలో ఉన్న పెన్నానది ఒడ్డున ఓ గుర్తు తెలియని వ్యక్తి (40) మృతదేహాన్ని స్థానికులు గురువారం గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. కాగా, కర్ణాటక ప్రాంతానికి చెందిన వ్యక్తి అని, కల్లు తాగేందుకు వచ్చి ఉంటాడనే అనుమానాలను వ్యక్తమయ్యాయి. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి పోలీసులు తరలించారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
పీడలను దూరం చేసే శక్తి స్వరూపిణి
హిందూపురం: రాష్ట్ర సరిహద్దులోని కొటిపి గ్రామంలో గ్రామదేవతగా కొలువై కర్ణాటక, ఆంధ్ర తమిళనాడు, తెలంగాణ రాష్ల్రా భక్తుల పాలిట కొంగు బంగారమై చౌడేశ్వరీ అమ్మవారు పూజలందుకుంటోంది. సుమారు ఐదు శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ప్రతి మంగళ, శుక్రవారాల్లో భక్తులు పోటెత్తుతుంటారు. కొటిపి చౌడేశ్వరీ దేవి అంటే సత్య వాక్కు కలిగిన అమ్మవారిగా భక్తుల విశ్వాసం. ఎలాంటి దుష్ట పీడలైనా దూరం చూసే శక్తిస్వరూపిణిగా కొలుస్తుంటారు. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో విశేష పూజలు జరుగుతుంటాయి. కోర్కెలు తీరిన భక్తులు అమ్మవారికి వడిబియ్యం సమర్పిస్తుంటారు. జంతు బలులతో మొక్కులు తీర్చుకుంటారు. ఆలయం ఆవరణలోని చెరువు కట్టపై జంతు బలులు చేస్తుంటారు. అయితే బలిదానం చేసినప్పుడు రక్తఽధారలు భూమిలోనే ఇంకిపోతాయని, అవి కనిపించవని పూర్వీకులు చెబుతున్నారు. ఎంతటి విలువైన చీరైనా సరే.. మొక్కుబడుల్లో భాగంగా కొటిపి చౌడేశ్వరీదేవి అమ్మవారికి వడిబియ్యంతో పాటు సమర్పించిన ఎంతటి విలువైన చీరయినా సరే ఒక్కసారి అమ్మవారి మూలవిరాట్కు అలంకరించి ఆ తర్వాత తీసి చెరువు కట్టపై వదిలేస్తారు. అది ఎంతటి విలువైన చీరయినా దానిని ఎవరూ ముట్టరు. అలా భక్తులు సమర్పించిన చీరలు చెరువు కట్టపై గుట్టలుగా పేరుకుపోయి కనిపిస్తున్నాయి. ఇందుకు బలమైన పూర్వ కథనం ఒకటి ప్రాచుర్యంలో ఉంది. ‘వందల ఏళ్ల నాటి క్రితం అమ్మవారికి కానుకల రూపంలో భక్తులు సమర్పించిన చీరలను విక్రయించాలని నిర్ణయించుకున్న గ్రామస్తులు ఓ వ్యాపారిని సంప్రదిస్తారు. అతను ఖరీదైన చీరలను తీసి కట్ట కట్టి మరుసటి రోజు వచ్చి తీసుకెళతానని చెప్పి వెళతాడు. గ్రామ పొలిమేర దాటగానే ఉన్నఫళంగా తీవ్ర అస్వస్థతకు గురై కాలు కూడా కదపలేని స్థితిలో అక్కడే చతికిల పడిపోయిన వ్యాపారిని గమనించిన గ్రామస్తులు వెంటనే అమ్మవారి మహిమగా నిర్ధారించుకుని ఆలయానికి చేరుకుని చౌడేశ్వరీదేవిని శరణు కోరుతారు. వ్యాపారి కట్టలు కట్టిన చీరలను తీసి అమ్మవారి మూలవిరాట్ ఎదుట పెడతారు. ఆశ్చర్యంగా అదే రోజు వ్యాపారి ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆ రోజు రాత్రి వ్యాపారి కలలో అమ్మవారు కనిపించి తాను కట్టిన చీర ఎవరూ తీసుకెళ్లరాదని చెప్పడంతో ఉదయాన్నే వ్యాపారి కొటిపి గ్రామానికి చేరుకుని అమ్మవారి మహత్యాన్ని గ్రామస్తులకు తెలుపుతాడు. అప్పటి నుంచి అమ్మవారికి సమర్పించిన చీరలను ముట్టడానికి ఎవరూ సాహించడం లేదు.’ నేడు రథోత్సవం హిందూపురం మండలం కొటిపి గ్రామంలో వెలసిన చౌడేశ్వీరీదేవి అమ్మవారి బ్రహ్మ రథోత్సవం శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు గురువారం వెల్లడించారు. ఏటా ఉగాది పండుగ సందర్భంగా మూలవిరాట్కు ప్రత్యేకపూజలు, ప్రాకార ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. అలాగే మంగళ, శుక్రవారాల్లో బ్రహ్మ రథోత్సవాన్ని నిర్వహించడం అనావాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 20న రథోత్సవాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను గ్రామస్తులు పూర్తి చేశారు. కొలిచిన వారి కొంగుబంగారమై విరాజిల్లుతున్న కొటిపి చౌడేశ్వరీ దేవిసర్వజ్ఞే, సర్వశక్తే, సర్వైశ్వర్యప్రదాయిని, సర్వజ్ఞానమయి, సర్వవ్యాధివినాశిని, సర్వాధారస్వరూపే, సర్వపాపహరే, సర్వానందమయి, సర్వరక్షాస్వరూపిణి, సర్వేప్సితఫలప్రదే, సర్వరక్షాకరచక్రస్వామిని, నిగర్భయోగిని.. ... అంటూ ఒక్కసారి చౌడేశ్వరీ ఖడ్గమాలను పఠిస్తే అభీష్ట సిద్ధితో పాటు సమస్త పీడలు దూరమవుతాయి. శారీరక ఆరోగ్యం, మానసిక ఆనందం సొంతమవుతాయి. ఛైత్ర మాసం రాకతో జిల్లాలో శక్తి స్వరూపిణి ఆరాధనలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే సమస్త దేవతా స్వరూపంగా భక్తులు కొలిచే కొటిపిలోని చౌడేశ్వరీ దేవి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో మొదలయ్యాయి. -
కర్రసాము పోటీలు
గార్లదిన్నె: ఉగాది పండుగ సందర్భంగా మండలంలోని పాత కల్లూరులో కర్రసాము, ఇరుసు పైకి ఎత్తే పోటీలు నిర్వహించారు. ఏటా గ్రామంలో యువకులకు గ్రామీణ క్రీడల పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం కర్రసాము, ఇరుసు ఎత్తే పోటీలు నిర్వహించారు. కర్రసాము పోటీల్లో ఆరుగురు పాల్గొనగా వారిలో వెంకటనరసింహ, శ్రీకర్ ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలవగా వారికి రూ.4 వేలు, రూ.3 వేల నగదు బహుమతి అందజేశారు. ఇరుసు పైకెత్తే పోటీల్లో ఆరుగురు పాల్గొనగా ఉప్పరపల్లి నారాయణ, నాగిరెడ్డిపల్లి రామానంద ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. వారికి రూ.6వేలు, రూ.3 వేల నగదు బహుమతి అంద జేశారు. జనం అధిక సంఖ్యలో తరలివచ్చి పోటీలను తిలకించారు. -
శిల్పారామంలో ఉగాది శోభ
పుట్టపర్తి టౌన్: స్థానిక శిల్పారామంలో ఉగాది సంబరాలు వైభవంగా సాగాయి. శిల్పారామం ఏఓ ఖాదర్వలి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం పురోహితుడు నాగరాజుశర్మ పంచాంగం చదివి వినిపించారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు అలరించారు. స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో శిల్పారామంలో సందడి నెలకొంది. గుండెపోటుతో ఏఆర్ ఎస్ఐ మృతి పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఆర్ ఎస్ఐగా పనిచేస్తున్న మహేశ్వరరెడ్డి బుధవారం గుండె పోటుతో మృతి చెందారు. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు మండలానికి చెందిన ఆయన 1990లో ఏఆర్ విభాగంలో చేరారు. బుధవారం రాత్రి గుండెపోటుకు గురై కోలుకోలేక మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎస్పీ సతీష్కుమార్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంత్యక్రియల నిమిత్తం వారి కుటుంబసభ్యులకు రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. గురువారం అనంతపురంలోని రుద్రంపేట బైపాస్ శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఆర్ఐ వలి, పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు సూర్యకుమార్, అడహక్ కమిటీ సభ్యుడు త్రిలోక్నాథ్, సిబ్బంది షౌకత్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
సందడిగా ఉగాది వేడుక
పుట్టపర్తి టౌన్: పరాభవ నామ సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ జిల్లా యంత్రాంగం ఉగాది వేడుకను సందడిగా నిర్వహించింది. గురువారం ఉదయం పుట్టపర్తి పట్టణంలో సాయి ఆరామంలో ప్రాచీన కళలు, సాహిత్యం, సంప్రదాయాల మేలు కలయికగా ఉగాది వేడుకలు నిర్వహించారు. బీసీ సంక్షేమశాఖామంత్రి సవిత, కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్కుమార్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఏఎస్పీ అంకిత సురానాతో పాటు జిల్లా అధికారులు హాజరయ్యారు. అధికారులు తెలుగుతనం ఉట్టిపడేలా సంప్రదాయ పంచెకట్టుతో హాజరై ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.... జిల్లాను సమగ్ర అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యమన్నారు. మంత్రి సవిత, ఎస్పీ సతీష్కుమార్ మాట్లాడారు. జిల్లాకు చెందిన ప్రముఖుల ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు. జాబిలి జయచంద్ర, వల్లం రమేష్బాబు, డాక్టర్ ఉద్దండం చంద్రశేఖర్, డాక్టర్ శివన్న, శోభారాణి, మాణిక్యం ఇషాక్, ముద్ద రంగప్ప కొండసాని రజిత తమ కవితలతో అలరించారు. చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం, కోలాటం ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం కవులు, రచయితలను సత్కరించారు. నలుగురు అర్చకులకు ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. పంచెకట్టుతో అలరించిన కలెక్టర్, జేసీ, ఎస్పీ ఉట్టిపడిన తెలుగు సంస్కృతి అలరించిన కవి సమ్మేళనం -
● వర్షాలు మధ్య రకం.. పంటలు సమృద్ధి
కదిరి టౌన్: పరాభవ నామ సంవత్సరంలో ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తారని, వర్షాలు మధ్య రకంగా కురిసినా.. పంటలు మాత్రం సమృద్ధిగా పండుతాయని శివాలయ అర్చకుడు సుబ్రహ్మణ్య శర్మ పేర్కొన్నారు. ఉగాది సందర్భంగా గురువారం రాత్రి కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. ఊంజల్ సేవ అనంతరం పంచాంగాన్ని అర్చకుడు సుబ్రహ్మణ్య శర్మ చదివి వినిపించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ వీవీఎస్ శర్మ, డీఎస్పీ శివనారాయణస్వామి, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
కారు ఢీ – యువకుడి మృతి
మడకశిర రూరల్: కారు ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... మడకశిర మండలం చీపులేటి గ్రామానికి చెందిన తిప్పేస్వామి(19), చంద్రమౌళి గురువారం బుళ్లసముద్రం వైపు నుంచి మడకశిర వైపుగా ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. అయ్యవారిపల్లి సమీపంలోకి చేరుకోగానే 544ఈ జాతీయ రహదారిపై మలుపు వద్ద ఉన్నఫళంగా కారు దూసుకువచ్చి ఢీకొనడంతో తిప్పేస్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన చంద్రమౌళిని చికిత్స నిమిత్తం హిందూపురానికి తరలించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
ప్రశాంతి నిలయంలో ఉగాది వేడుక
ప్రశాంతి నిలయం: సత్యసాయి మహాసమాధి చెంత గురువారం ఉగాది వేడుకలు శోభాయమానంగా జరిగాయి. ఈ సందర్భంగా సాయికుల్వంత్ మందిరాన్ని మామిడి తోరణాలు, వేప చిగుర్లు, విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా అలంకరించారు. దేశవిదేశాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం సత్యసాయి విద్యార్థుల వేదపఠనంతో వేడుకలు ప్రారంభించగా.. డాక్టర్ వేదాంతం రాజగోపాలచక్రవర్తి పంచాంగ శ్రవణం గావించారు. పరాభవ నామ సంవత్సర విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా వేదాంతం రాజగోపాల చక్రవర్తిని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు, సభ్యుడు చక్రవర్తి ఘనంగా సత్కరించారు. అనంతరం సంగీత కచేరీతో సత్యసాయి యూత్ సభ్యులు అలరించారు. సాయంత్రం ప్రముఖ సంగీత విద్వాంసురాలు కొల్లూరు వందన బృందం సంగీత కచేరీ ఆకట్టుకుంది. -
గ్యాస్ ఏజెన్సీల ఎదుట బారులు
హిందూపురం: గ్యాస్ సిలిండర్ల కొరతతో హిందూపురం పట్టణంలోని రైల్వేరోడ్డులోని హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు బారులు తీరుతున్నారు. పాసుపుస్తకాలతో ఏజెన్సీ వద్దకు వస్తున్నారు. దీంతో బుధవారం గ్యాస్ ఏజెన్సీ కార్యాలయం కిటకిటలాడింది. సిలిండర్లు బుక్ చేసినా డిలివరీ కావడం లేదని వాగ్వాదానికి దిగారు. ఏజెన్సీ నిర్వాహకులు మాత్రం 7, 8 తేదీల్లో బుక్ చేసిన వారికి వరుస క్రమంలో సిలిండర్లు ఇస్తున్నామని చెబుతున్నారు. ఇక హిందూపురం మండలంలోని వివిధ గ్రామాల్లోని రోడ్లపై ఎక్కడ చూసినా ఖాళీ గ్యాస్ సిలిండర్లే కనిపిస్తున్నాయి. గ్యాస్ బండి రాగానే సిలిండర్ల కోసం ఎగబకే పరిస్థితి ఏర్పడుతోంది. -
అకాల వర్షం.. అపార నష్టం
పుట్టపర్తి అర్బన్: అకాల వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయి. రెండు రోజులుగా జిల్లాలో అక్కడక్కడా కురుస్తున్న వర్షంతో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వానతో మామిడి కాయలన్నీ నేలరాలాయి. కలింగర, దోస పంటలకు కూడా అకాల వర్షాలు తీవ్ర నష్టం కలిగించాయి. ప్రస్తుతం కలింగర, దోస పంటలు కోత దశలో ఉండగా... వడగండ్ల వానతో కాయలు పగిలి పోతున్నాయి. గాలీ వాన బీభత్సం బుధవారం సాయంత్రం గాలీవీన బీభత్సం సృష్టించింది. గంటన్నర పాటు కురిసిన వడగండ్ల వానతో బుక్కపట్నం మండలం ధూపంపల్లిలో భాస్కర్, బాలకృష్ణ అనే మామిడి రైతులకు తీవ్ర నష్టం కలిగింది. వారిద్దరూ ఐదు ఎకరాల్లో 350 మామిడి చెట్లు సాగు చేస్తుండగా...బుధవారం రాత్రి కురిసిన వర్షాలతో కాయలన్నీ నేలరాలాయని రైతులు వాపోయారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. అలాగే చెన్నేకొత్తపల్లి మండలం గంగినేపల్లిలో 60 ఎకరాల్లోని మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కాయలన్నీ రాగిపోగా రైతులకు లక్షలాది రూపాయల నష్టం జరిగింది. ఇక పుట్టపర్తి, గోరంట్ల, కొత్తచెరువు, బుక్కపట్నం, చిలమత్తూరు, ధర్మవరం, కదిరి తదితర మండలాల్లోనూ మోస్తరు వర్షం కురిసింది. కొత్తచెరువు, లోచర్లలో వడగండ్ల వాన దంచికొట్టింది. మంగళవారం రాత్రి చిలమత్తూరు మండలంలో 13.6 మి.మీ వర్షపాతం నమోదైంది. అలాగే రొళ్లలో 7.2 మి.మీ, హిందూపురం 2.6, పరిగిలో 2 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. నేలరాలిన మామిడి ఆందోళనలో రైతులు -
దివ్యాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం : కలెక్టర్
పుట్టపర్తి టౌన్: దివ్యాంగ శక్తి పథకం కింద ఆర్టీసీలో విభిన్న ప్రతిభావంతులకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. బుదవారం పుట్టపర్తి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో దివ్యాంగ శక్తి పథకాన్ని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డితో కలసి కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం దివ్యాంగులతో కలసి బస్సులో 20 కిలోమీటర్ల మేర ప్రయాణించి వారి సమస్యలపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... దివ్యాంగులు బలహీన వర్గం కాదని, వారికి సరైన అవకాశాలు కల్పిస్తే అసాధారాణ ప్రతిభ కనబరుస్తారని అన్నారు. దివ్యాంగులు ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి ఉచిత ప్రయాణ సౌకర్యం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్ఎం మధుసూదన్, ఆర్డీఓ సువర్ణ, డీఆర్డీఏ పీడీ నరసయ్య, తహసీల్దార్ కళ్యాణ్ చక్రవర్థితోపాటు దివ్యాంగులు పాల్గొన్నారు. ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎస్పీకదిరి టౌన్: స్థానిక మదనపల్లి మార్గంలోని బళ్లారి కాంపౌండ్ వద్ద గల ఉన్న వలీవుల్లా మసీదుల్లో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఎస్పీ సతీష్కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. డీఎస్పీ శివనారామణస్వామి, సీఐ వి.నారాయణరెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల్లో ఎస్పీ పాల్గొని ఉపావాస దీక్షలు కొనసాగిస్తున్న ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. విద్యుదాఘాతంతో మహిళ మృతిపరిగి: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై ఓ మహిళ మృతి చెందింది. స్థానికులు తెలిపిన మేరకు.. పరిగి మండలం శ్రీరంగరాజుపల్లిలోని ఎస్సీ కాలనీలో నివాసముంటున్న రామాంజప్ప, నరసమ్మ (52) దంపతులకు కుమారుడు గంగాధరప్ప, కోడలు శివమ్మ, ఇద్దరు మనవళ్లు ఉన్నారు. మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్న సమయంలో ఇంటి ఆవరణలో ఉన్న విద్యుత్ స్తంభానికి ఉన్న స్టే వైర్కు ఆరేసిన దుస్తులను నరసమ్మ తీస్తుండగా కరెంట్ షాక్ గురై గట్టిగా కేకలు వేసింది. రక్షించేందుకు ప్రయత్నించిన కుమారుడు గంగాధరప్ప, భర్త రామాంజినప్ప, మనవళ్లు నవీన్, కళ్యాణ్ సైతం విద్యుత్ షాక్కు గురయ్యారు. క్షతగాత్రులను బంధువులు వెంటనే హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళుతుండగా మార్గ మధ్యంలో నరసమ్మ మృతి చెందింది. మిగిలిన వారిని ఆస్పత్రిలో చేర్పించారు. నవీన్ పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురంలోని జీజీహెచ్కు వైద్యులు రెఫర్ చేశారు. మృతురాలి కోడలు శివమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
ఇసుక అక్రమ రవాణాపై రైతుల కన్నెర్ర
●ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకుని నిరసన రొద్దం: ఇసుక అక్రమ రవాణాపై రైతులు కన్నెర్ర చేశారు. ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్లను అడ్డుకుని నిరసన తెలిపారు. మరోసారి పెన్నా నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తే సహించబోమని హెచ్చరించారు. మండల పరిధిలోని కందుకూర్లపల్లి పెన్నానది పరివాహక ప్రాంతం నుంచి కొందరు అనుమతులు లేకుండా ఇసుక ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న రైతులు అక్కడికి వెళ్లి ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు. దీంతో ఇసుక తరలిస్తున్న వారు రైతులతో వాగ్వాదానికి దిగారు. అయినా రైతులు వెనక్కి తగ్గలేదు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుని తీరుతామంటూ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ...ఇసుక అక్రమ రవాణాతో పెన్నా పరివాహక ప్రాంతంలో భూగర్భ జలమట్టం పడిపోతోందని, దీంతో నదిలో వేసుకున్న ఫిల్టర్ బోర్లు బోర్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు వ్యవసాయమే జీవనాధారమని, సాగునీరు లేకపోతే కుటుంబాలు వీధిన పడతాయన్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని కోరారు. లేకపోతే తామే రంగంలోకి దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. పది పరీక్షల్లో 219 మంది గైర్హాజరుపుట్టపర్తి: పదో తరగతి పరీక్షల్లో భాగంగా బుధవారం నిర్వహించిన సెకండ్ లాంగ్వేజ్ పరీక్షకు 219 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఈ మేరకు డీఈఓ కిష్టప్ప వెల్లడించారు. 107 పరీక్షా కేంద్రాల్లో 21,492 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 21,273 మంది హాజరయ్యారు. అలాగే ఇంటర్ ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ పరీక్షకు 113 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ చెన్నకేశవప్రసాద్ వెల్లడించారు. 6,520 మందికి గాను 6,407 మంది హాజరయ్యారు. -
గ్యాస్ అందక.. పొయ్యి వెలగక
కదిరి: గ్యాస్ బండ సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. రోజుల తరబడి ప్రయత్నిస్తున్నా...సిలిండర్ బుక్ కావడం లేదు. సిలిండర్ బుక్ అయినా రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో సైతం చాలా వరకూ హోటళ్ల నిర్వాహకులు వాణిజ్య సిలిండర్లు దొరక్క తల్లడిల్లుతున్నారు. కొందరైతే కొద్ది రోజులుగా హోటళ్లను మూసివేశారు. ఇంకొందరు కట్టెల పొయ్యి మీద చేస్తూ ధరలు పెంచేశారు. నాలుగు రోజుల్లోనే 56,215 బుకింగ్స్.. జిల్లాలోని వినియోగదారులకు ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ కంపెనీలకు చెందిన ఏజెన్సీల ద్వారా వంట గ్యాస్ సరఫరా అవుతోంది. సాధారణంగా రోజుకు సగటున 9,325 ఎల్పీజీ సరఫరా ఉంటుంది. ఇరాన్–ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో బుకింగ్స్ బాగా పెరిగాయి. గడచిన నాలుగు రోజుల్లోనే 56,215 బుకింగ్స్ జరిగాయి. వినియోగదారుల డిమాండ్కు తగ్గట్లు ప్రభుత్వం సిలిండర్లు సరఫరా చేయలేక పోతోంది. దీంతో రోజు రోజుకూ గ్యాస్ కష్టాలు పెరుగుతున్నాయి. దీనికి తోడు సర్వర్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. పండుగ పూట పస్తులేనా? హిందువులకు అతి పెద్ద పండుగ ఉగాది. మరోవైపు ముస్లింలకు ముఖ్యమైన పండుగ రంజాన్ ఈసారి ఒక్క రోజు తేడాతో వచ్చాయి. దీంతో గ్యాస్ సిలిండర్లకు డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో గ్యాస్ సిలిండర్ ఖాళీ కావడంతో వారం రోజులుగా ఎదురు చూస్తున్నారు. విధి లేని పరిస్థితుల్లో గంటల తరబడి ఏజెన్సీల వద్ద క్యూలో ఉంటూ అవస్థలు పడుతున్నారు. ఇంకొందరు గ్యాస్ బుకింగ్ నంబర్ పని చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సందట్లో సడేమియా అన్నట్లు కొందరు గ్యాస్ ఏజెన్సీ నిర్వహకులు కృత్రిమ డిమాండ్ సృష్టిస్తూ క్యాష్ చేసుకుంటుంటే, గ్యాస్ డెలివరీ బాయ్స్ గృహావసర గ్యాస్ సిలిండర్ను డిమాండ్ను బట్టి రూ.1,700 నుంచి రూ.2 వేల వరకూ అమ్ముతూ జేబులు నింపుకుంటున్నారు. ఆంక్షలతోనూ ఇబ్బందులే.. గ్యాస్ సిలిండర్ బుక్ చేశాక... మరో సిలిండర్ బుక్ చేయాలంటే పట్టణాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల గ్యాప్ ఉండాలనే ప్రభుత్వ ఆంక్షలు కూడా చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పటి వరకూ కొందరు ఏజెన్సీ నిర్వాహకులే వినియోగదారుడికి తెలియకుండా వారి పేరు మీద గ్యాస్ బుక్ చేసి మరొకరికి ఇచ్చేవారు. సబ్సిడీ తమ ఖాతాలో జమ అవుతున్నందున వినియోగదారులు సైతం ఇన్ని రోజులూ పెదవి విప్పలేకపోయారు. ఇలాంటి వారు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. వాణిజ్య సిలిండర్కూ తప్పని తిప్పలు.. వాణిజ్య సిలిండర్ సరఫరా నిలిచిపోవడంతో హోటళ్లు, ఇతర చిరు వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర సర్వీసులకు సంబంధించి వాణిజ్య గ్యాస్ సిలిండర్లను మాత్రం సరఫరా చేస్తున్నామని గ్యాస్ ఏజెన్సీలు చెబుతున్నాయి. సామాన్యులపై భారం.. గృహావసర వినియోగ సిలిండర్పై రూ.60, కమర్షియల్ సిలిండర్పై రూ.115 మేర ధర పెంచేశారు. పెంచిన ధరలు రాత్రికి రాత్రి అమల్లోకి వచ్చేశాయి. జిల్లాలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్ర స్థాయిలో గ్యాస్ కష్టాలు స్పష్టంగా కనబడుతున్నాయి.మూడు రోజుల క్రితం ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోవడంతో నల్లమాడ మండలానికి చెందిన నరసింహులు బుక్ చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నాడు. బుక్ చేసే ఫోన్ నంబర్ పనిచేయడం లేదు. ఏజెన్సీ నిర్వాహకులను కలిస్తే... బుకింగ్ లేకుండా సిలిండర్ ఇవ్వడం కుదరదన్నారు. పండుగకు బంధువులంతా వచ్చారని, ఈ పరిస్థితుల్లో ఇంట్లో గ్యాస్ లేకపోతే ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. బంధువులు, స్నేహితులందరికీ ఫోన్లు చేసి సిలిండర్ కోసం ఆరా తీస్తున్నాడు. ప్రస్తుతం ఇలాంటి వారు జిల్లాలో చాలా మందే ఉన్నారు. ఇబ్బందులు పడుతున్న సామాన్యులు బ్లాక్ మార్కెట్లో గ్యాస్ సిలిండర్ రూ.1,700 కృత్రిమ కొరత సృష్టిస్తున్న ఏజెన్సీలు, డెలివరీ బాయ్స్ -
జాయింట్ పట్టాలు విభజిస్తేనే మేలు: జేసీ
ధర్మవరం రూరల్: జాయింట్ పట్టాల విభజనతోనే మేలు జరుగుతుందని రైతులకు జేసీ ఎం.మౌర్య భరద్వాజ్ వివరించారు. మండల పరిధిలోని గొట్లూరులో జాయింట్ పట్టా సబ్ డివిజన్ ప్రక్రియపై బుధవారం నిర్వహించిన గ్రామ సభలో జేసీ మాట్లాడారు. భూ క్రయ విక్రయాల్లో, బ్యాంక్ల ద్వారా రుణాలు పొందడంలో, ప్రభుత్వ పథకాల వర్తింపజేయడంలో జాయింట్ పట్టాల వల్ల సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. వ్యక్తిగత పట్టాలు ఉంటేనే పూర్తి హక్కులు ఉంటాయన్నారు. జాయింట్ పట్టా ఉన్న రైతులు వెంటనే సబ్ డివిజన్ చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామసుబ్బయ్య, జిల్లా సర్వే అధికారి విజయశాంతి, తహసీల్దార్ సురేష్, సర్వేయర్లు పాల్గొన్నారు. -
కొలిచిన వారి కొంగుబంగారమై..
ఏర్పాట్లు పూర్తి గురువారం రాత్రి జరిగే చౌడేశ్వరీదేవి పంచమ జ్యోతుల ఉత్సవానికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. గ్రామమంతా విద్యుద్దీపాలతో అలంకరించాం. ఉత్సవానికి 30 వేల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేశాం. రాత్రి 3 గంటలకు జ్యోతుల ఉత్సవం ప్రారంభమవుతుంది. – డి.సి.ఈశ్వరయ్య, ఆలయ ధర్మకర్త పరస్పర సహకారంతో.. ఏటా అమ్మవారి జ్యోతుల ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాం. అమ్మవారిపై ఉన్న భక్తి భావంతో ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. చౌడేశ్వరీమాత అంటే ఇక్కడి ప్రజలకు ఎంతో నమ్మకం. ఉత్సవం సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. – చింతా హరిదాస్, తొగటవీర క్షత్రియ సంఘం అధ్యక్షుడు, సోమందేపల్లి పెనుకొండ:(సోమందేపల్లి): కొలిచిన వారి ఇంట కొంగుబంగారమని సోమందేపల్లిలోని చౌడేశ్వరీదేవి అమ్మవారు భక్తుల నీరాజనాలు అందుకుంటోంది. తొగటవీర క్షత్రియుల ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న చౌడేశ్వరీదేవి జ్యోతుల ఉత్సవానికి సోమందేపల్లి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఏటా ఉగాది పర్వదినాన అమ్మవారి పంచమ జ్యోతుల ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో గురువారం రాత్రి జ్యోతుల ఉత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఉత్సవానికి వివిధ గ్రామాలతో పాటు కర్ణాటక నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. ఇప్పటికే బంధుమిత్రులతో సోమందేపల్లిలోని గృహాలు కిటకిటలాడుతున్నాయి. దాదాపు 30 వేల మందికి పైగా భక్తులు అమ్మవారి ఉత్సవంలో పాల్గొననున్నట్లు అంచనా. రాత్రి 3 గంటల అనంతరం ఆలయంలో చౌడేశ్వరీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఉత్సవ విగ్రహాన్ని పల్లకీపై ఊరేగించనున్నారు. ఈ సందర్భంగా జ్యోతులను తలపై ఉంచుకుని అమ్మవారిని స్తుతిస్తూ లయబద్ధంగా చేసే నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. తొగటవీర క్షత్రియుల ఆరాధ్య దైవం చౌడేశ్వరీదేవి .. నేడు సోమందేపల్లిలో జ్యోతుల ఉత్సవం -
ఆకట్టుకున్న ‘ఆనందం తవ దర్శనం’
ప్రశాంతి నిలయం: ఆంధ్రప్రదేశ్ సత్యసాయి సేవాదళ్ ఆధ్వర్యంలో బుధవారం సాయికుల్వంత్ సభా మందిరంలో నిర్వహించిన సంగీత కచేరీ ఆకట్టుకుంది. ‘ఆనందం తవ దర్శనం’ పేరుతో బుధవారం సాయంత్రం నిర్వహించిన ఈ కార్యక్రమంలో సత్యసాయిని స్తుతిస్తూ పలు భక్తి గీతాలను ఆలపించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ సత్యసాయి సేవాదళ్ అధ్యక్షుడు లక్ష్మణరావు ప్రసగించారు. సత్యసాయి సేవలను కొనియాడారు. పట్టపగలే చోరీ కనగానపల్లి: మండల కేంద్రం చెన్నేకొత్తపల్లిలోని ఓ ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. చెన్నేకొత్తపల్లికి చెందిన ఆదినారాయణరెడ్డి చిరు వ్యాపారాలతో జీవనం సాగిస్తున్నాడు. కొంత కాలం క్రితం భార్య చనిపోయింది. కుమారుడు, కుమార్తె మరో ప్రాంతంలో చదువుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒంటరిగా ఉన్న ఆదినారాయణరెడ్డి బుధవారం ఉదయం ఇంటికి తాళం వేసి పనిపై బయటకు వెళ్లాడు. సాయంత్రం 4 గంటలకు తిరిగి వచ్చాడు. అప్పటికే తలుపులు తీసి ఉండడం గమనించి లోపలకు వెళ్లి పరిశీలించారు. 30 తులాల బంగారు, రూ.1.05 లక్షల నగదు కనిపించకపోడంతో చోరీ జరిగినట్లుగా నిర్ధారించుకుని సమాచారం ఇవ్వడంతో సీకే పల్లి పీఎస్ ఎస్ఐ సత్యనారాయణ, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
జీవితాల్లో ఉషస్సులు వెల్లివిరియాలి
● జిల్లా ప్రజలకు ఉషశ్రీచరణ్ ఉగాది శుభాకాంక్షలు పెనుకొండ రూరల్: ఈ ఉగాది అందరి జీవితాల్లో ఉషస్సులు నింపాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు, అధికారులకు, వైఎస్సార్ సీపీ శ్రేణులకు పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పచ్చడిలో తీపి, చేదు, కారం, పులుపు, ఉప్పు, వగరు ఉన్నట్లే...జీవితంలోనూ మంచి, చెడు, కష్టాలు, సుఖాలు ఉంటాయని, వాటన్నింటినీ ఒకేలా తీసుకుంటూ ముందుకు సాగాలన్నారు. ప్రజలకు ఎస్పీ శుభాకాంక్షలు పుట్టపర్తి టౌన్: జిల్లా ప్రజలకు, పోలీస్ సిబ్బందికి ఎస్పీ సతీష్కుమార్ ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు సంవత్సరాది ఉగాది అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఉగాది వేడుకలు అందరూ ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. అలాగే రంజాన్ను ముస్లింలంతా సంతోషంగా జరుపుకోవాలన్నారు. ఎలుగుబంటి కలకలం గుడిబండ: మండల పరిధిలోని ఎస్ రాయపురం గ్రామంలో ఓ ఎలుగుబంటి కలకలం రేపింది. బుధవారం ఉదయం గ్రామంలో అటుఇటూ తిరుగుతూ హల్చల్ చేసింది. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. పొలాల్లోకి వస్తున్న ఎలుగుబంట్లు పంటల మధ్య దాక్కుని రైతులపై దాడులు చేస్తున్నాయని వాపోయారు. పంటలను కూడా నాశనం చేస్తున్నాయన్నారు. అటవీ శాఖ అధికారులు వన్య ప్రాణుల నుంచి రైతులను కాపాడాలన్నారు. -
విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు
హిందూపురం: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మాతా శిశు మరణాలు పునరావృతం కాకూడదని, విధులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ ఫైరోజ్బేగం, డీసీహెచ్ మధుసూదన్ హెచ్చరించారు. ‘తల్లీబిడ్డను చంపేశారు’ శీర్షికన ‘సాక్షి’లో మంగళవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. హిందూపురం ఆస్పత్రిలో కొటిపికి చెందిన బాలింత అనూరాధమ్మ, శిశువు మృతి ఘటనపై వారు వైద్యులు, సిబ్బందితో విచారణ చేపట్టారు. మృతురాలు తీసుకున్న వైద్యం, క్షేత్రస్థాయిలో అందించిన సేవలు తదితర వాటిపై వివరాలు సేకరించారు. మృతురాలు ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి జరిగిన పరిణామాలను గైనికాలాజిస్ట్ బాబా బుడెన్తో అడిగి తెలుసుకున్నారు. ఘటనపై పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు. అనంతరం ఆస్పత్రిలోని కాన్ఫరెన్స్హాల్లో వైద్యులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ క్షేత్రస్థాయి సిబ్బంది హైరిస్క్ గర్భిణులు సుఖ ప్రసవం అయ్యేవరకు నిరంతరం గమనిస్తూనే ఉండాలన్నారు. తల్లీబిడ్డల ప్రాణాలు చాలా అమూల్యమైనవన్న విషయాన్ని మరువకూడదన్నారు. సకాలంలో స్పందిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు రావన్నారు. సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజగోపాల్, డాక్టర్ జనార్దన్, డీపీహెచ్ఎన్ఓ వీరమ్మ తదితరులు పాల్గొన్నారు. 180 మంది గైర్హాజరుపుట్టపర్తి: జిల్లాలో ఇంటర్ పరీక్షలు సజావుగా జరుగుతున్నాయి. మంగళవారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం కెమిస్ట్రీ పరీక్షకు 180 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ చెన్నకేశవప్రసాద్ తెలిపారు. జిల్లాలోని 41 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాశారు. 6,575 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 6,385 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. మొత్తం 180 మంది గైర్హాజరైనట్లు వివరించారు. ఇంటర్ పరీక్షల రాష్ట్ర పరిశీలకులు సౌజన్య హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరులో పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. విద్యాశాఖ అధికారులు, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు, ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ సభ్యులు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. అనుమతులు తీసుకోకుండా బోర్లు తవ్వకూడదు. అలాంటి బోర్లు గుర్తించి సీజ్ చేస్తాం. బోరు తవ్వాలంటే మండల రెవెన్యూ అధికారి నుంచి అనుమతులు తప్పనిసరి. భూగర్భ జలాలను కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. భవిష్యత్లో నీటి సమస్య రాకుండా ఉండాలంటే వాల్టా చట్టం ప్రకారం నిబంధనలు పాటించాలి. నీటి వినియోగం అవసరానికి మించి చేయరాదు. – రాజశేఖర్రెడ్డి, జిల్లా భూగర్భ జలశాఖాధికారి భూగర్భ జలాన్ని కాపాడుకోవాలి -
డిమాండ్లు నెరవేర్చకపోతే పోరుబాట
పుట్టపర్తి: ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే పోరుబాట తప్పదని చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు హెచ్చరించారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి వైఎస్సార్టీఏ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు దశల వారీ పోరాటంలో భాగంగా మంగళవారం అన్ని జిల్లాల్లో అధికారులకు వినతిపత్రాల సమర్పణ నిర్వహించారు. ఇందులో భాగంగా ఆ శాఖ జిల్లా అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్ శ్యాం ప్రసాద్ను నాయకులు కలిసి వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా నేటికీ పీఆర్సీ ప్రకటించకపోవడం, ఐఆర్ ఇవ్వకపోవడం, నాలుగు డీఏలను పెండింగ్లో ఉంచడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సీపీఎస్ రద్దుపై ఇచ్చిన హామీని అమలు చేయకపోవడాన్ని నిరసించారు. ఆర్థిక సమస్యలతో పాటు యాప్స్ పేరుతో ఉపాధ్యాయులపై అదనపు భారం మోపుతూ బోధనకు దూరం చేస్తున్న ప్రభుత్వ విధానాలను తప్పుబట్టారు. ఉపాధ్యాయుల న్యాయపరమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చకపోతే భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లీలా ఇంద్ర ప్రసాదరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంషీద్, నాయకులు భాస్కర్రెడ్డి, ప్రతాపరెడ్డి, శివయ్య, శ్రీనివాసరెడ్డి, కిష్టప్ప, శ్రీనివాసులు, మనోహర్రెడ్డి, సునీత, అనిత, ఇందిర, సురేష్, మహమ్మద్ అలీ, జమీర్, ప్రభాకర్రెడ్డి, హర్షవర్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శాంతియుతంగా ధర్నా చేస్తే కేసులు పెడతారా?
పుట్టపర్తి అర్బన్: ‘బాధ్యత గల పదవిలో ఉండి తప్పుడు పనులు చేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే తొలగించాలి. తిరుపతిలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గం’ అని వైఎస్సార్సీపీ నాయకులు మండిపడ్డారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల మంగళవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాస లీలలు చేస్తూ దొరికిపోయిన బీఆర్ నాయుడు వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేసినా ఇప్పటి వరకూ చంద్రబాబు ఆయనపై చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని నాయకులు విమర్శించారు. దానిపై పచ్చ మీడియా సైతం కిమ్మనకుండా ఉండిపోయిందన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్తచెరువులో వైఎస్సార్సీపీ నాయకులు బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి నిరసన తెలిపారు. నల్లరిబ్బన్లు జేబుకు ధరించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అలాగే కదిరి పట్టణంతో పాటు నియోజక వర్గంలోని తనకల్లు, పెనుకొండ నియోజకవర్గం పరిగిలో పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. పరిగిలో జరిగిన ధర్నాలో వైఎస్సార్సీపీ మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి చౌళూరు మధుమతి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించడం తప్ప చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు చేసింది శూన్యమని విమర్శించారు. పగలు భక్తి .. రాత్రి రాసలీలు, తిరుమల గౌరవాన్ని కాపాడండి, తప్పు చేసిన వారు పదవిలో.. ప్రశ్నించే వారు బోనులో, బీఆర్ నాయుడు దిగిపో అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. టీటీడీ చైర్మన్ పదవి నుంచి బీఆర్ నాయుడును తొలగించాల్సిందే జిల్లా వ్యాప్తంగా నిరసనకు దిగిన వైఎస్సార్సీపీ శ్రేణులు -
ధర్మవరం ఆర్డీఓగా ప్రేమంత్కుమార్
ధర్మవరం అర్బన్: ధర్మవరం ఆర్డీఓగా ప్రేమంత్ కుమార్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన కడపలో సర్వశిక్ష అభియాన్లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ధర్మవరంలో ఇన్చార్జ్ ఆర్డీఓగా రామసుబ్బయ్య విధులు నిర్వహిస్తున్నారు. త్వరలో నూతన ఆర్డీఓగా ప్రేమంత్కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. సీ.కొడిగేపల్లిలో చిరుత సంచారం మడకశిరరూరల్: మండల పరిధిలోని సి.కొడిగేపల్లి గ్రామ సమీపంలో చిరుత సంచరిస్తుండడంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. మంగళవారం రాత్రి గ్రామ సమీపంలోని పొదల్లో ఉన్న చిరుత తనకు సంబంధించిన గొర్రెల మందపై దాడి చేసి పొట్టేలును చంపేసిందని గొర్రెల కాపరి దాళప్ప తెలిపారు. దాదాపు రూ.20 వేలు నష్టం వాటిల్లిందని ఆయన వాపోయారు. వారం రోజుల నుంచి గ్రామ సమీపంలోని పొదల్లో చిరుత సంచరిస్తున్నదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుత భయంతో పొలాల వద్దకు వెళ్లలేక పోతున్నామన్నారు. అటవీశాఖాదికారులు చర్యలు తీసుకుని చిరుత సంచారం లేకుండా చూడాలన్నారు. చిరుత దాడిలో మృతి చెందిన గొర్రెల కాపరికి ఆర్థిక సహాయం అందించాలని కోరారు. పోక్సో కేసు నమోదు ముదిగుబ్బ: ముదిగుబ్బ మండలంలోని ఓ మారుమూల గ్రామంలో 9వ తరగతి చదువుతున్న బాలికను నమ్మించి గర్భవతిని చేసిన వ్యక్తిపై పట్నం పోలీస్స్టేషన్లో పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. భూగర్భ జలాలపై పరిశోధన ● కలెక్టర్కు నివేదిక సమర్పించిన సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు ప్రశాంతినిలయం: హిందూపురం నియోజకవర్గంలో భూగర్భ జలాలపై పరిశోధనలు జరిపిన సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు అధికారులు కలెక్టర్ శ్యాంప్రసాద్కు నివేదికలు అందజేశారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో మంగళవారం సాయంత్రం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలోని హిందూపురం, లేపాక్షి మండలాల్లో భూగర్భ జలాలపై పరిశోధన చేయగా తక్కువ జలాలు ఉన్నట్లు , భూగర్భ జలాల పెంపునకు పలు సూచనలు చేసినట్లు సభ్యులు వివరించారు. ఇందులో చోళసముద్రాన్ని మోడల్గా తీసుకొని పరిశోధన చేశామన్నారు. పరిశోధనల్లో శాస్త్రవేత్తలు పండిత్ మగ్నూర్, మాధవ్రేష్మాపిళ్లై, స్వరూప్ కళ్యాణ్ సాహూ, ప్రతీక్, డ్వామా పీడీ విజయ్ప్రసాద్, గ్రౌండ్ వాటర్ జిల్లా అధికారి రాజశేఖర్రెడ్డి, ఇరిగేషన్ ఈఈ గురుమూర్తి, డీఈ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ప్రొకై ్లనర్, ఇసుక ట్రాకర్ల సీజ్పుట్టపర్తి అర్బన్: స్థానిక చిత్రావతి నది నుంచి అక్రమంగా ఇసుకను తోడుతున్న ప్రొకై ్లనర్తో పాటు ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ ఆదేశాల మేరకు అధికారులు సీజ్ చేశారు. రాత్రి సమయాల్లో చిత్రావతి నది నుంచి పెద్ద ఎత్తున ఇసుకను టీడీపీ నేతలు అక్రమంగా తరలిస్తున్నట్లుగా సమాచారం అధికారులు సోమవారం రాత్రి తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ప్రొకై ్లనర్, రెండు ట్రాక్టర్లు పట్టుబడ్డాయి. వీటిని పుట్టపర్తి రూరల్ పీఎస్కు తరలించారు. తనిఖీల్లో గనుల శాఖ ఏడీ అమీర్బాషా, రాయల్టీ ఇన్స్పెక్టర్ షేక్ ఖాజావలి, తహసీల్దార్ కళ్యాణచక్రవర్తి, ఏఈ సుధాకర్ పాల్గొన్నారు. -
ప్రయాణికుల భద్రతే లక్ష్యం
గుంతకల్లు: ప్రయాణికుల భద్రతే ప్రథమ కర్తవ్యమని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీ వాస్తవ పేర్కొన్నారు. మంగళవారం భద్రతా తనిఖీల్లో భాగంగా గుంతకల్లు రైల్వే డివిజన్లోని గుంతకల్లు–బళ్లారి సెక్షన్లో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన డీఆర్ఎం చంద్రశేఖర్గుప్తాతో కలిసి ప్రత్యేక రైలులో రియర్ విండో ద్వారా రైలు మార్గాన్ని పరిశీలించారు. ఈ సెక్షన్లోని రైల్వే ట్రాక్ ఒంపులు, లెవల్ క్రాసింగ్లు, సిగ్నల్ వ్యవస్థతోపాటు రైల్వే బ్రిడ్జిలు పరిశీలించి భద్రతా అంశాలపై చర్చించారు. ఈ సెక్షన్ ఎక్కవగా రద్దీగా ఉండటంతో రైళ్ల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను ఆరా తీశారు. రైళ్లు సమయ పాలనను పాటించేలా ఇంజినీరింగ్, సిగ్నల్, ఆపరేషన్ విభాగం సిబ్బంది సమన్వయంతో పని చేయాలని జీఎం ఆదేశించారు. అంతేకాకుండా ఈ సెక్షన్లోని కీలకమైన, సున్నితమైన ప్రాంతాలపై నిఘా పెంచడంతోపాటు ట్రాక్ పట్టిషం చేయడానికి, రైళ్ల వేగాన్ని పెంచడానికి అందుబాటులో ఉన్న ప్రణాళికపై నిశితంగా అధికారులకు తెలియజేశారు. భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆయా విభాగాలు అధికారులు తదితరులు పాల్గొన్నారు. రైల్వే జీఎం సంజయ్కుమార్ శ్రీవాస్తవ -
డ్రగ్స్కు దూరంగా ఉండండి
మడకశిర: డ్రగ్స్కు దూరంగా ఉండాలని యువతకు ఎస్పీ సతీష్కుమార్ పిలుపునిచ్చారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలు, హెల్మెట్ వినియోగంపై ప్రజలను చైతన్య పరుస్తూ సోమవారం మడకశిరలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో బహిరంగ అవగాహన సభ జరిగింది. కార్యక్రమానికి ఎస్పీతో పాటు సినీనటులు శ్రీవిష్ణు, రఘు, అనన్య, హెబ్బాపటేల్, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వెంకట్, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ బోర్డు సభ్యుడు శ్రీనివాసమూర్తి, అంధ మహిళల టీ20 క్రికెట్ ఇండియా టీం కెప్టెన్ దీపిక ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హెల్మెట్ వినియోగంపై ప్రజలను చైతన్య పరుస్తూ తొలుత పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైఎస్సార్ సర్కిల్లో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అధ్యక్షత జరిగిన అవగాహన సభలో ఎస్పీ మాట్లాడారు. డ్రగ్స్కు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని కోరారు. డ్రగ్స్ కేసుల్లో ఒక్కసారి చిక్కుకుంటే ఇతర దేశాలకు వెళ్లడానికి కూడా అనుమతులు దక్కవన్నారు. అలాగే హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపితే ఎలాంటి శిక్షలు ఉంటాయో వివరించారు. కార్యక్రమంలో కుంచిటి వక్కలిగ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ చైర్మన్ నరసింహరాజు, డీఎస్పీ నర్శింగప్ప, సీఐలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్సీ సతీష్కుమార్ -
దానిమ్మ తోట దగ్ధం
తాడిమర్రి: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా తాడిమర్రి మండలం పుల్లంపల్లికి చెందిన రైతు మారినేని పురుషోత్తం రెడ్డి దానిమ్మ తోట దగ్ధమైంది. తనకున్న 17 ఎకరాల్లో పదేళ్ల క్రితం 3 వేల దానిమ్మ, జామ మొక్కలను రైతు నాటాడు. ప్రస్తుతం దానిమ్మ చెట్లను వాడు పెట్టాడు. సోమవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల నిప్పు రవ్వలు ఎగిసి ఎండు గడ్డిపై పడి మంటలు రాజుకున్నాయి. సమాచారం అందుకున్న బాధిత రైతు, బంధువులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని మంటలు ఆర్పేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసే లోపు 3 వేల చెట్లు, డ్రిప్పు వైరు, పైపులు, తోట చుట్టూ ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ కాలిపోయింది. ఘటనతో సుమారు రూ.45 లక్షల నష్టం వాటిల్లినట్లు రైతు వాపోయాడు. -
ఉర్దూ పరీక్షకు ఒకరు గైర్హాజరు
పుట్టపర్తి: జిల్లా వ్యాప్తంగా సోమవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఉర్దూ పరీక్షకు ఒకరు గైర్హాజరైనట్లు డీఐఈఓ చెన్నకేశవప్రసాద్ తెలిపారు. మొత్తం మూడు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 46 మంది విద్యార్థులకు గాను 45 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. ఉర్దూ విద్యార్థులకు మోడ్రన్ లాంగ్వేజ్ పీరక్ష, జనరల్ బైపీసీ విధ్యార్థులకు బ్రిడ్జి కోర్సు (గణితం) పరీక్షలు జరిగాయి. గర్భం దాల్చిన విద్యార్థిని! ముదిగుబ్బ: బత్తలపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఓ బాలిక గర్భం దాల్చిన అంశం కలకలం రేపింది. ముదిగుబ్బ మండలంలోని మారుమూల గ్రామానికి చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థిని గర్భం దాల్చినట్లుగా తెలియగానే అధికారులు అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు. సమీప బంధువే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా, ఈ అంశంపై సీడీపీఓ సరస్వతిని ఫోన్లో సంప్రదించగా తనకు ఎలాంటి సమాచారమూ లేదని పేర్కొన్నారు. ఖాద్రీశుడి హుండీల లెక్కింపుకదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకల హుండీలను ఆలయంలో సోమవారం లెక్కించారు. 35 రోజులకు గాను రూ.1,15,10,416 నగదు, 2 గ్రాముల బంగారు, 305 గ్రాముల వెండి సమకూరినట్లు ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో హుండీల పర్వేక్షాణాధికారి వెంకటేశ్వరులు, ఏపీజీబీ మేనేజర్ బి.రామకృష్ణారెడ్డి, ఆలయ సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. -
నేడు ముసలమ్మ ఆలయంలో కుంభాభిషేకం
బుక్కరాయసముద్రం: మండల కేంద్రంలోని తాడిపత్రి రహదారి పక్కన చెరువు కట్ట సమీపంలో నూతనంగా నిర్మించిన ముసలమ్మ దేవాలయంలో సోమవారం 6వ వార్షికోత్సవ కుంభాభిషేకం నిర్వహిస్తున్నారు. ముసలమ్మ వంశస్తులైన సుశీల సూర్యనారాయణరెడ్డి సొంత నిధులతో పాటు గ్రామస్తుల ఆర్థిక సహకారంతో ఆలయ నిర్మాణం చేపట్టారు. 17న ఆలయంలో ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు మూల దేవతా ప్రార్థన, గురు ప్రార్థన, గణపతి పూజ, స్వస్తి వాచనము, రక్షా బంధనము నిర్వహించనున్నారు. 18న ఉదయం 6 గంటకు అమ్మవారికి అభిషేకం, కళశ స్థాపన గణపతి హోమం, పంచామృతాభిషేకం, కలశ స్థాపన ఆదిత్యా నవగ్రహ హోమం, ముసలమ్మ అమ్మవారి మూల మంత్ర హోమం, ఉదయం 10 గంటలకు మహా పూర్ణాహుతి, మధ్యాహ్నం 12 గంటలకు మహా మంగళ హారతి నిర్వహించన్నారు. 19న సాయంత్రం 5 గంటలకు చిక్క వడియార్ చెరువులో ముసలమ్మ తల్లి అమ్మవారి తెప్పోత్సవం నిర్వహిస్తున్నామని ఆలయ ధర్మకర్త సుశీలమ్మ తెలిపారు. -
విద్యుత్ షాక్తో యువకుడి మృతి
ఓడీచెరువు: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై ఓ యువకుడు మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన మేరకు.. ఓడీ చెరువు మండలగం తంగేడుకుంట గ్రామానికి చెందిన తుంగ నవీన్(26) సోమవారం సాయంత్రం అరకబావిపల్లి వద్ద ఎరువు తోలడానికి ట్రాక్టర్తో వెళ్లాడు. ఆ సమయంలో దిబ్బలో ఉన్న విద్యుత్ స్తంభం స్టే వైర్ తగిలి షాక్ గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన నవీన్ను స్థానికులు వెంటనే ఓడీచెరువులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఈ సందర్భంగా గ్రామస్తులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని విచారణ చేపట్టారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ మల్లికార్జున రెడ్డి తెలిపారు. కాగా, కూలి పనులతో కుటుంబానికి చేదోడుగా నిలిచిన నవీన్ మృతితో కుటుంబ సభ్యులు ఆవేదనకు అంతు లేకుండా పోయింది. బంగారు నగల అపహరణరొళ్ల: మండలంలోని కె.గొల్లహట్టి గ్రామానికి చెందిన మూడ్లప్ప ఇంట్లోకి గుర్తు తెలియని దుండగులు చొరబడి 60 గ్రాముల రెండు బంగారు గొలుసులతో పాటు రూ.10 వేలు నగదు అపహరించారు. బాధితుడు తెలిపిన మేరకు.. ఆదివారం మూడ్లప్ప ఇంటికి తాళం వేయకుండా పొలం వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో ఇంటి వద్ద ఉన్న తల్లి తలుపులు దగ్గరగా లాగి పక్కింటికి చేరుకుని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉండిపోయింది. ఇదే అదునుగా భావించిన దుండగులు ఇంట్లోకి చొరబడి బీరువా తాళం తీసి అందులో భద్ర పరిచిన రెండు బంగారు గొలుసులు, రూ.10 వేలు నగదు అపహరించికెళ్లారు. రాత్రికి ఇంటికి చేరుకున్న మూడ్లప్ప బీరువా తలుపులు తీసి ఉండడం గమనించి పరిశీలించాడు. అందులో బంగారు నగలు, నగదు కనిపించకపోవడంతో సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. క్లూస్టీంను రంగంలో దించి నిందితుల వేలిముద్రలను సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పరిష్కార వేదికకు 81 వినతులు పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వివిధ సమస్యలపై 81 వినతులు అందాయి. ఎస్పీ సతీష్కుమార్ స్వయంగా వినతులు స్వీకరించి బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్హెచ్ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురానా, సీఐ బొజ్జప్ప, లీగల్ అడ్వైజర్ సాయినాథ్రెడ్డి పాల్గొన్నారు. కగ్గళ్లు భూ వివాదంపై నేడు ఎస్సీ కమిషన్ విచారణ హిందూపురం: మండలంలోని కగ్గళ్లు గ్రామంలో భూమి ఆక్రమణపై అందిన ఫిర్యాదుపై మంగళవారం ఎస్సీ కమిషన్ క్షేత్ర స్థాయి విచారణను చేపట్టనుంది. సర్వే నెం:105/2బి, 106–4డిలో భూములు ఆక్రమణకు గురయ్యాయని కగ్గళ్లు గ్రామానికి చెందిన వై. హనుమంతరాయుడు ఫిర్యాదు చేశాడు. దీంతో కమిషన్ సభ్యులు మేకల భిక్షం, ఎన్.టి.రామాంజినమ్మ మంగళవారం ఉదయం హిందూపురం తహసీల్దార్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం కానున్నారు. అనంతరం కగ్గళ్లులో పర్యటించి వివాదాస్పద భూములను పరిశీలించి వివరాలను ఆరా తీయనున్నారు. -
లారీ కిందకు దూసుకెళ్లిన కారు
పెనుకొండ రూరల్: టమాట పైరు కోసం వచ్చిన తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ రైతు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం సంతాపూర్ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ అంజయ్య(45) తన పొలంలో టమాట సాగు చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో కర్ణాటక సరిహద్దున ఉన్న నర్సరీల్లో టమాట పైరు కొనుగోలు కోసమని సమీప బంధువు శ్రీకాంత్తో కలసి కారులో ఆదివారం రాత్రి బయలుదేరాడు. సోమవారం ఉదయం 6 గంటల సమయంలో పెనుకొండ మండలం గుట్టూరు సమీపంలోకి రాగానే ముందు వెళుతున్న లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. కారు డ్రైవర్ శ్రీనివాసులు నియంత్రణ కోల్పోవడంతో లారీ కిందకు దూసుకెళ్లాడు. ఘటనలో శ్రీనివాసులు పాటు అతని పక్కనే ముందు సీటులో కూర్చొని ఉన్న అంజయ్యకూ తీవ్ర గాయాలయ్యాయి. కారు నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న కియా పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆగమేఘాలపై పెనుకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే అంజయ్య మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులుకు ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. వెనుక సీటులో కూర్చొని ఉన్న శ్రీకాంత్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ఘటనపై కియా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. తెలంగాణలోని సంతాపూర్ ఉప సర్పంచ్ దుర్మరణం మరొకరి పరిస్థితి విషమం -
ద్విచక్ర వాహనాల ఢీ – ఒకరి మృతి
బత్తలపల్లి: ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందారు. పోలీసులు తెలిపిన మేరకు... తాడిమర్రి మండలం మరువపల్లి నివాసి మదన్మోహన్, మరో ఇద్దరితో కలసి ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఆర్డీటీ ఆస్పత్రి వద్దకు వచ్చాడు. అదే సమయంలో బత్తలపల్లి మండలం గంటాపురం నివాసి అక్కిం రెడ్డప్ప(35) ద్విచక్ర వాహనంపై వేగంగా వస్తూ ఆస్పత్రి ప్రధాన ద్వారం ఎదుట మదన్మోహన్ ఆపిన ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొని, ఎగిరి రోడ్డుపై పడడంతో తలకు తీవ్ర గాయమైంది. క్షతగాత్రుడిని వెంటనే ఆర్డీటీ ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సకు స్పందించక సోమవారం ఉదయం మృతి చెందాడు. మృతుడు అక్కిం రెడ్డప్పకు భార్య వరలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. వరలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ‘స్థలం అమ్మి అడ్డం తిరిగారు’కదిరి టౌన్: రిజిస్టర్ చేయించుకున్న పొలం తిరిగి మాదే అని ఉద్దేశ పూర్వకంగా కోర్టులో పిటిషన్ వేసి మోసం చేయడమే కాకుండా ఆ విషయాన్ని ప్రశ్నించినందుకు తమతో గొడవపడి బెదిరించారని సోమవారం బత్తలపల్లికి చెందిన చిత్ర శివయ్య పట్టణ పోలీస్స్టేషన్ ఫిర్యాదు చేశారు. వివరాలు .. కదిరికి చెందిన మాతంగి వెంకటాద్రి, బత్తలపల్లి మండలం వెంకటాపురానికి చెందిన వెంకటాద్రి తమ్ముడు మాతంగి వెంకటేష్ వారి కుటుంబ సభ్యుల నుంచి చిత్ర శివయ్య బత్తలపల్లి గ్రామ పొలంలో 97 సెంట్లు స్థలాన్ని కొనుగోలు చేసి రిజిస్టర్ చేయించుకున్నారు. అప్పుడు వారి కుటుంబ సభ్యులందరూ సంతకాలు చేశారు. అయితే ఆ తర్వాత మళ్లీ వెంకటాద్రి, వెంకటేష్ వారి బంధువులు మాటమార్చారు. దీనిపై ఉద్దేశ పూర్వకంగా కోర్టులో పిటిషన్ పెట్టడంతో పాటు అంతు చూస్తామని బెదిరిస్తున్నట్లు చిత్ర శివయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ వి.నారాయణరెడ్డి తెలిపారు. మోటార్ల కేబుల్ చోరీ బొమ్మనహాళ్: గ్రామాలకు తాగునీరు సరఫరా చేసే మోటార్లకు అమర్చిన కేబుల్ను దొంగలు కట్చేసి తీసుకెళ్లిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని గోవిందవాడ, కల్లుదేవనహళ్లి గ్రామాలకు వేదావతి హగరి నది నుంచి నాలుగు విద్యుత్ మోటార్లు ద్వారా తాగునీరు సరఫరా అవుతోంది. రెండు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు నాలుగు విద్యుత్ మోటార్లకు అమర్చిన కేబుల్ చోరీ చేశారు. దాదాపు 350 మీటర్లు కేబుల్ చోరీ చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు అధికారులు, గ్రామస్తులు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి తాగునీటి మోటార్లకు కేబుల్ ఏర్పాటు చేసి నీటి సరఫరాను అందించాలని ప్రజలు కోరుతున్నారు. కొబ్బరి చెట్టుపై పిడుగు బెళుగుప్ప: శీర్పి గ్రామంలోని ఫెర్రర్ కాలనీలో ఏకాంబరప్ప ఇంటి వెనుక ఉన్న కొబ్బరిచెట్టుపై సోమవారం రాత్రి పిడుగుపడింది. చిరుజల్లులు పడే సమయంలో పెద్ద శబ్దంతో పిడుగుపడటంతో కాలనీవాసులు ఉలిక్కిపడి ఇళ్లలోంచి బయటకు వచ్చారు. అప్పటికే కొబ్బరి చెట్టు కాలుతూ కనిపించింది. అప్రమత్తమైన కాలనీవాసులు విద్యుత్ సరఫరాను నిలిపివేయించి.. కొబ్బరిచెట్టును మొత్తం యంత్రంతో కోసి వేయించారు. పిడుగు పడిన సమయం రాత్రి కావడంతో కాలనీలోని వారంతా ఇళ్లల్లో ఉన్నారు. లేకుంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని చర్చించుకున్నారు. -
జిల్లాలో విద్యుత్ షాక్తో మరణిస్తున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ప్రజల నిర్లక్ష్యమో.. విద్యుత్ అధికారులు, సిబ్బంది అలసత్వమో గానీ నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అధికారికంగా నమోదవుతున్న కేసులే పదుల సంఖ్యలో ఉండగా, అనధికారిక లెక్కల ప్రకారం మరింత ఎక
పుట్టపర్తి టౌన్: సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలోనూ విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకుని పలువురు మృత్యువాత పడుతున్నారు. జిల్లాలో విద్యుత్ ప్రమాదాలు నాటినాటికీ పెరిగి పోవడమే ఇందుకు నిదర్శనం. విద్యుత్ సిబ్బంది అలసత్వం, సేవల్లో జాప్యం, వినియోగదారుల అవగాహన లోపం, సొంత మరమ్మతులు తదితరాల వల్లనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లుగా స్పష్టమవుతోంది. విద్యుత్ ప్రమాదాలు నియంత్రణ, నష్ట తీవ్రత తగ్గించేందుకు విద్యుత్ అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకూ చోటు చేసుకున్న విద్యుత్ ప్రమాదాల్లో 32 మంది అకాల మృత్యువాత పడ్డారు. ఈ నెలలో ఇప్పటి వరకూ నలుగురు మృతి చెందారు. విద్యుత్ ప్రమాదాల్లో మరణించిన వారికి పరిహారం కూడా ఏళ్లతబడి పెండింగ్లో ఉంచుతున్నారు. విద్యుత్ పరికరాల వినియోగంపై అవగాహన కల్పించకపోవడం, విద్యుత్ సరఫరా వ్యవస్థల వద్ద సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో మనుషులు చనిపోతుండగా, మూగ జీవాలు కూడా బలవుతున్నాయి. ప్రమాద బాధితులకు పరిహారం అందజేతలోనూ నిర్లక్ష్యం వహిస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. పిట్టల్లా రాలుతున్న రైతులుం వైఎస్ జగన్ పాలనలో జిల్లాలో రైతులకు నాణ్యమైన 24 గంటల కరెంట్ సరఫరా అయ్యింది. కొత్తగా సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా వ్యవస్థను అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం బలోపేతం చేసింది. దీంతో లోఓల్టేజీ సమస్య తీరింది. వ్యవసాయానికి రాత్రిపూట కరెంట్ సరఫరా బాధ తప్పింది. దీంతో వైఎస్ జగన్ హయాంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటలు పండించారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులను కరెంట్ కష్టాలు వెన్నాడసాగాయి. ఓ వైపు లో ఓల్టేజీ సమస్య, మరో వైపు ఎక్కడికక్కడ నిర్వహణ లోపం కారణంగా తరచూ మరమ్మతులకు గురవుతున్న విద్యుత్ తీగలతో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. సమస్యను విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సకాలంలో వారు స్పందించకపోవడం గమనార్హం. ‘ఎల్సీ ఇచ్చేస్తున్నాం మీరే మరమ్మతు చేసుకోండి’ అంటూ ఉచిత సలహాలిస్తూ అన్నదాతల జీవితాలతో చెలగాటమాడారు. ఫలితంగా విద్యుత్ షాక్కు గురై రైతులు పిట్టల్లా రాలిపోతున్నారు. పెరుగుతున్న విద్యుత్ ప్రమాదాలు ఈ నెలలో నలుగురి మృతి మరమ్మతులపై సకాలంలో స్పందించని విద్యుత్ సిబ్బంది అవగాహన లోపంతో ప్రాణాలు కోల్పోతున్న వైనం జాగ్రత్తలే శ్రీరామరక్ష తడిచేతులు, నీటిలో నిలబడి విద్యుత్తు మోటార్లను, స్విచ్లను తాకరాదు. వ్యవసాయ మోటారు, స్టార్టర్లకు ఎర్తింగ్ తప్పని సరి. పంట పొలాల్లోకి జంతువులు రాకుండా ఫెన్సింగ్కు ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్తు సరఫరా ఇవ్వకూడదు. మోటారుకు సొంతంగా మరమ్మతులు చేయరాదు. విద్యుత స్తంభాలు, ట్రాన్సఫార్మర్ల వద్ద ఫ్యూజులు పోయినప్పుడు సొంతంగా సరిచేయరాదు. సంబంధిత ఉద్యోగులు, సిబ్బందితో మరమ్మతు చేయించాలి. ఇళ్లలో, పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్తు తీగల నాణ్యతను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి. పాడైనట్లు గుర్తిస్తే వెంటనే మార్చేయాలి. ఇళ్లకు దగ్గరగా తీగలు వెళుతున్న, ఇళ్లపై తెగిపడినా, ట్రాన్సఫార్మర్లు తక్కువ ఎత్తులో ప్రమాదకరంగా ఉన్నా..అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి. ప్రమాదవశాత్తు షాక్కు గురైన వ్యక్తిని రక్షించే క్రమంలో చేతులతో తాకకుండా కర్రతో వ్యక్తి నుంచి తీగలను దూరం చేయాలి. ఎక్కడైనా ప్రమాదకరంగా విద్యుత తీగలు, స్తంభాలు ఉన్నట్లయితే వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేయాలి. 1912 టోల్ఫ్రీ నెంబరుకు ఫిర్యాదు చేయాలి. ఈ నెంబరుకు ఫిర్యాదు చేయడం వలన తక్షణ స్పందన కూడా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. -
చీనీకి చీడపీడలు..
తాడిమర్రి: చీనీ రైతును చీడపీడలు వణికిస్తున్నాయి. ఎన్ని మందులు పిచికారీ చేసినా ప్రయోజనం లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నల్లితో కాయలకు మంగు సోకడంతో పంటను కొనేందుకు వ్యాపారులు ముందుకు రాక కాయలు చెట్లపైనే పండి రాలిపోతున్నాయి. మరోవైపు పులుసు పురుగు విజృంభించడంతో చెట్లు ఎండిపోతుండగా.. రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పెరిగిన సాగు విస్తీర్ణం జిల్లాలో ఎర్ర మట్టి నేలలు అధికంగా ఉండటం, ఇక్కడ పండించే చీనీ కాయలు తీపిగా ఉండటంతో మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. నీటి సౌకర్యం తక్కువగా ఉన్నా... కేవలం డ్రిప్పు ద్వారా నీటి తడులు అందిస్తే పంటను కాపాడుకునే అవకాశం ఉంది. దీంతో జిల్లా రైతులు ఎక్కువ మంది చీనీ తోటల సాగుకు మొగ్గు చూపుతున్నారు. ప్రధానంగా ధర్మవరం నియోజకవర్గంలోని తాడిమర్రి, బత్తలపల్లి, ధర్మవరం, ముదిగుబ్బ మండలాల్లో ఏకంగా 37,500 ఎకరాల్లో 4.50 లక్షలు చెట్లు సాగు చేస్తున్నారు. వర్షాభావం..తెగుళ్ల దాడి రెండేళ్లుగా జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బోరు బావుల్లో నీటి మట్టం తగ్గింది. అయినప్పటికీ డ్రిప్పు ద్వారా అష్టకష్టాలు పడి చెట్లను కాపాడుకుంటూ వస్తున్న రైతులకు చీడపీడలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చీడపీడలతో దిగుబడిపై దెబ్బ పడగా..కాస్తో కూస్తో పండిన పంట కూడా నాణ్యత సరిగా లేదని వ్యాపారులు కొనుగోలు చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో రైతులు నష్టాలపాలయ్యారు. వ్యాపారులు కొనడం లేదు ఈ ఏడాది చీనీ దిగుబడి కోసం ఎరువులు అధికంగా వేశా. కాయలు మంచి సైజు వచ్చాయి. దిగుబడి కూడా బాగానే వచ్చింది. అయితే నల్లి పురుగు దెబ్బకు కాయలకు మంగు సోకింది. ఎన్ని రసాయన మందులు పిచికారీ చేసినా ఫలితం లేకుండా పోయింది. చీనీకాయలు కోతకు వచ్చినా అడిగే వారే లేరు. –కుమ్మర ఓబుళపతి, తాడిమర్రి చెట్లు ఎండిపోతున్నాయి పులుసు పురుగు సోకడంతో చీనీచెట్లు వాడు పట్టి ఎండిపోతున్నాయి. ఎన్ని మందులు పిచికారీ చేసినా ప్రయోజనం లేదు. ఇప్పటికై నా ఉద్యాన శాఖ అధికారులు తోటల్లో పర్యటించి తగిన సూచనలు, సలహాలివ్వాలి. –అల్లే సాయినాథ్రెడ్డి, శివంపల్లి, తాడిమర్రి నల్లితో కాయలపై నల్లని మంగు పులుసు పురుగుతో ఎండుతున్న చెట్లు ఆందోళన చెందుతున్న రైతన్నలు -
ఘనంగా ఇఫ్తార్ విందు
పుట్టపర్తి టౌన్: రంజాన్ను పురస్కరించుకుని ఎనుములపల్లి గణేష్ కూడలి సమీపంలోని డాక్టర్ అబ్దుల్ కలాం షాదీమహల్లో ప్రభుత్వం తరుఫున ముస్లింలకు ఆదివారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ రంజాన్ క్రమశిక్షణకు, దాతృత్వానికి నిలువుటద్దమన్నారు. కఠిన ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లింలకు ఇఫ్తార్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. రంజాన్తో పాటు హిందువులు ఘనంగా జరుపుకునే ఉగాది పండుగ ఒకేసారి వస్తున్నాయని, అందరూ కలసి మెలసి శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకుందామన్నారు. భూగర్భ జలాలు పెంచుదాంకదిరి అర్బన్: జిల్లాలో అన్ని చెరువులను హంద్రీనీవా నీటితో నింపి భూగర్భ జలాలను పెంచుదామని కలెక్టర్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం కదిరి మండల పరిధిలోని యర్రదొడ్డి సమీపంలో ‘మన పల్లె – మన నీరు’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్తో కలిసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని చెరువులను హంద్రీనీవా నీటితో నింపితే భూగర్భజలాలు పెరుగుతాయన్నారు. భూగర్భ జలాలు ప్రస్తుతం 14 మీటర్లలో ఉన్నాయన్నారు. చాలా వరకు చెరువుల సప్లయ్ ఛానళ్లు మెయిన్టెయిన్ చేయకపోడంతో పాడయ్యాయని చెప్పారు. 90 రోజుల పాటు కాలువల పూడికతీత కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ వీవీఎస్ శర్మతో పాటు స్వచ్ఛాంద్ర కమిషన్ డైరెక్టర్ పర్విన్భాను పలువురు అధికారులు పాల్గొన్నారు. నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు అనంతపురం: ఏఎఫ్ ఎకాలజీ సెంటర్లో రిటైల్ మేనేజ్మెంట్, కంప్యూటర్ కోర్సులో నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు డైరెక్టర్ డాక్టర్ వైవీ మల్లారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 30 రోజుల పాటు శిక్షణ ఇస్తారన్నారు. పదో తరగతి, ఇంటర్, డిప్లొమో, డిగ్రీ ఉత్తీర్ణులైనవారు అర్హులని పేర్కొన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తారని, శిక్షణ అనంతరం వందశాతం ఉద్యోగ సహకారం అందిస్తామన్నారు. మార్చి 23 నుంచి నూతన బ్యాచ్ను ప్రారంభిస్తామని వివరించారు. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 7780752418 ను సంప్రదించాలన్నారు. అగ్నికి ఆహుతైన మామిడి చెట్లు పుట్టపర్తి: గుర్తు తెలియని వ్యక్తులు సమీపంలోని అటవీ ప్రాంతానికి నిప్పు పెట్టడంతో బుక్కపట్నం సమీపంలోని రైతులకు చెందిన మామిడి తోటలు అగ్నికి ఆహుతయ్యాయి. ఆదివారం బుక్కపట్నం గ్రామానికి చెందిన అవుటాల రవీంద్రరెడ్డికి చెందిన వంద మామిడి చెట్లు కాలిపోగా, పక్కనే ఉన్న మరో రైతు చెన్నకృష్ణకు చెందిన 25 చెట్లు కాలిపోయినట్లు బాధితులు తెలిపారు. కాపుకు వచ్చిన చెట్లు కాలి పోవడంతో లక్షలాది రూపాయలు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొండలకు నిప్పు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ దిమ్మె తగిలి వ్యక్తి మృతి హిందూపురం: హిందూపురం కిరికెర పంచాయతీలోని బసనపల్లిలో ఆదివారం శివాలయానికి విద్యుత్ కనెక్షన్ సరిచేస్తుండగా జారిపడి జయచంద్రారెడ్డి (58) మృతి చెందారు. మృతుడు ఆలయంలో సేవలు అందిస్తూ గ్రామస్తులకు అవసరమైన సహాయం చేస్తుండేవాడని స్థానికులు తెలిపారు. ఆలయానికి అవసరమైన విద్యుత్ లైట్లు అమర్చడం కోసం కనెక్షన్లు చేస్తున్నారని, చిన్న దిమ్మైపె ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి కనెక్షన్ ఇచ్చి దిగుతున్న సమయంలో జారీ పడటంతో తలకు దిమ్మెకట్ట తగిలిందన్నారు. బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడన్నారు. ఆయనకు భార్య ఇందిరమ్మతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. రూరల్ పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆధ్యాత్మికతను ప్రపంచానికి చాటిన వ్యక్తి సాయికాళేశ్వర్
పెనుకొండ: ఆధ్యాత్మికత విలువను ప్రపంచానికి చాటిన మహనీయుడు సాయికాళేశ్వర్ అని షిర్డీసాయి గ్లోబల్ ట్రస్ట్ అధ్యక్షురాలు శిల్పా అనుపాటి పేర్కొన్నారు. సాయికాళేశ్వర్ 14వ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం పట్టణంలోని శివసాయి మందిరంలో సాయికాళేశ్వర్ సమాధి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. షిర్డీసాయి గ్లోబల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్లు చేయించుకున్న 85 మందికి శిల్ప కంటి అద్దాలను అందజేశారు. ట్రస్ట్ సభ్యులకు వస్త్రాలు, అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షురాలు శిల్పా మాట్లాడుతూ సాయికాళేశ్వర్ పెనుకొండలోనే కాక ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారన్నారు. ఎంతోమంది పేద విద్యార్థుల చదువులకు, పాఠశాలలు, కళాశాల అభ్యున్నతికి, తాగునీటి సమస్య పరిష్కారానికి ఎంతో సహకారం అందించారన్నారు. ఆయన బాటలో గ్లోబల్ ట్రస్ట్ తరఫున నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామన్నారు. నిరవధికంగా కంటి ఆపరేషన్లు ఇతర ఉచిత వైద్య సేవలు కొనసాగించడమే కాక ఉచితంగా వినికిడి పరికరాలు, కంటి అద్దాలు అందజేస్తున్నామని తెలిపారు. దేశ విదేశాల నుంచి వైద్యులు ఈ సేవా కార్యక్రమంలో పాలుపంచుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. వివిధ దేశాల నుంచి వచ్చిన స్వామి భక్తులు, షిర్డీసాయి గ్లోబల్ ట్రస్ట్ సిబ్బంది మదన్కుమార్రెడ్డి, చిట్టిబాబు, హరి, బాబు, గ్లోబల్జెన్, ప్రగతి పాఠశాలల కరస్పాండెంట్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడండి
ప్రశాంతినిలయం: వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వేసవి సంసిద్ధత, స్వచ్ఛ భారత్ మిషన్ పనులు, అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు తదితర అంశాలపై సమీక్షించారు. స్వచ్ఛభారత్ మిషన్ కింద జిల్లాకు మంజూరైన 4,923 వ్యక్తిగత మరుగు దొడ్లలో ఇప్పటి వరకూ 3,725 నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. తక్కిన 1,198 మరుగుదొడ్ల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఐసీడీఎస్ గ్రాంట్ ద్వారా తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలు కల్పించాలన్నారు. ఎస్బీఎం, ఐసీడీఎస్ గ్రాంట్ల కింద అంగన్వాడీల్లో 52.15 శాతం మరుగుదొడ్లు, 89.84 శాతం తాగునీటి సరఫరా పురోగతి నమోదైందన్నారు. మడకశిర డివిజన్లో 130 కేంద్రాలకు గాను 127 కేంద్రాల్లో పూర్తయ్యాయన్నారు. మార్చి నుంచి జూలై వరకూ తాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. కరువు ప్రభావిత మండలాల్లో నీటి రవాణా కోసం రూ.210.92 కోట్లు కేటాయించామన్నారు. మడకశిర నియోజకవర్గంలోని పంచాయతీలకు తాగునీటి ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని డీపీఓను ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అభ్యాసకులంతా పరీక్షకు హాజరుకావాలి పుట్టపర్తి అర్బన్: అక్షర ఆంధ్ర (ఉల్లాస్) ఫైనల్ పరీక్షకు అభ్యాసకులందరూ హాజరవ్వాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ అన్నారు. ఆదివారం పుట్టపర్తి మండలం ప్రశాంతిగ్రామంలోని అక్షర ఆంధ్ర పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలన్నదే కార్యక్రమ లక్ష్యమన్నారు. అందరూ అక్షరాస్యులుగా మారి జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. పరీక్ష ముగిసిన అనంతరం జవాబు పత్రాలు, అటెండెన్స్, అవార్డు లిస్ట్లను సంబంధిత వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకు అప్పగించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వయోజన విద్య నోడలాఫీసర్ జనార్దన్ గౌడ్, సీఎంఎం రమాదేవి, సీఓ ధరణి, ఇన్విలేజర్లు నర్మద, పుష్ప పాల్గొన్నారు. కలెక్టర్ శ్యాంప్రసాద్ -
‘స్పెల్ బీ’లో రొద్దం విద్యార్థి ప్రతిభ
రొద్దం: మండల కేంద్రంలోని శ్రీటీచ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని లహరి స్పెల్బి కాంపిటీషన్లో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి పోటీలకు ఎంపికై నట్లు ఆ పాఠశాల కరస్పాండెంట్ ఆర్కే తిమ్మారెడ్డి తెలిపారు. అనంతపురం పట్టణంలో విశ్వ ఎడ్యుటెక్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలో తమ పాఠశాలకు చెందిన లియా, హుస్సేన్, సంజయ్, లహరి పాల్గొన్నారన్నారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎం లహరి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు వివరించారు. ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ హేమచంద్రారెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నట్లు పేర్కొన్నారు. జాతీయ స్థాయికి ఎంపికై విద్యార్థిని లహరిని పాఠశాల ఉపాధ్యాయు బృందం అభినందించింది. జాతీయస్థాయికి ఎంపిక -
ఒత్తిళ్లు.. ఉద్యోగుల బెంబేలు
అనంతపురం ఎడ్యుకేషన్: పంచాయతీల్లో పన్నుల వసూళ్లకు చంద్రబాబు ప్రభుత్వం పెడుతున్న భారీ లక్ష్యాలు పంచాయతీ అధికారుల ప్రాణాలమీదకు వస్తున్నాయి. ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉదయం నుంచి రాత్రిదాకా ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేక కొందరు ఉద్యోగులు మానసిక ఆందోళనకు గురవుతూ అనారోగ్యాల పాలవుతున్నారు. రెండు రోజుల క్రితం గుమ్మఘట్ట డిప్యూటీ ఎంపీడీ చంద్రశేఖర్ గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన పన్నుల వసూళ్ల ఒత్తిడితోనే జరిగిందని ఉద్యోగులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో చంద్రశేఖర్ ఫొటో పెట్టి...‘పన్నుల వసూళ్లకు డిప్యూటీ ఎంపీడీఓ బలయ్యాడు’ అంటూ పోస్టులు పెట్టారు. ఇలాంటి ఒత్తిడి ఎన్నడూ చూడలేదు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక విలేజ్ డెవలప్మెంట్ అధికారి పంపిన వాయిస్ మెసేజ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అనంతపురం జిల్లాలోని పలు వాట్సాప్ గ్రూపుల్లో ఈ మెసేజ్ విస్త్తృతంగా ఫార్వర్డ్ అవుతోంది. ఆ వాయిస్ మెసేజ్ లో ఏముందంటే... ‘రోజుకు రూ.10 లక్షల పన్నుల వసూళ్ల లక్ష్యం విధించారు. నా వయసు 57 సంవత్సరాలు. 32 సంవత్సరాలుగా సేవలందిస్తున్నా. అయినా ఇంతటి ఒత్తిడి ఎప్పుడూ చూడలేదు. పన్నుల వసూళ్ల ఒత్తిడితో తీవ్ర మానసిక టెన్షన్ ఎదు ర్కొంటున్నా. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాజీనామా చేయాల్సి వస్తుంది. రోజుకు రూ.10 లక్షలు వసూలు చేయాలంటున్నారు.స్వయంగా డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ వచ్చినా అంత మొత్తం వసూలు చేయడం సాధ్యం కాదు. కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు అంటూ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. మాకు కుటుంబాలు లేవా? రెండో శనివారం, ఆదివారం కూడా ఇదే పని చేయాలా? ఒత్తిళ్లు కొనసాగితే తీవ్ర నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుంది. అందుకు ఈఓఆర్డీ, ఎంపీడీఓ, డీపీఓ, కమిషనర్ బాధ్యులవుతారు’ అని మెసేజ్ పెట్టాడు. ప్రస్తుతం ఈ వాయిస్ మెసేజ్ పంచాయతీ శాఖ ఉద్యోగుల్లో కలకలం రేపుతోంది. ప్రభుత్వం పునరాలోచించాలి జిల్లాలో పని చేస్తున్న గ్రామ అభివృద్ధి అధికారులు (వీడీఓ) తీవ్రంగా మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ప్రభుత్వం పునరాలోచించి నిర్ణయాలు మార్చుకోకపోతే తాము అతి తొందరలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ‘మాకూ కుటుంబాలు ఉన్నాయి.. చిన్న వయసులోనే అరోగ్యాలు దెబ్బతింటే మా కుటుంబాలు ఏమి కావాలని’ ప్రశ్నిస్తున్నారు. డిప్యూటీ సీఎం ఎక్కడో కూర్చుని సంస్కరణల పేరుతో హోదాలు మార్చడం కాదని, ప్రశాంతంగా పని చేసుకునే వాతావరణం కల్పించాలని మండిపడుతున్నారు. జిల్లా అధికారులు కూడా ఈ విషయంలో వైఖరి మార్చుకోవాలని కోరుతున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో యూనియన్ల నాయకులకూ చురకలంటిస్తున్నారు. ‘పనికిరాని ఇన్ని యూనియన్లు ఉండడం వల్లే ప్రతి ఒక్కరూ మనల్ని పురుగులు చూసినట్టు చూస్తున్నారు’ అని పేర్కొన్నారు. ప్రభుత్వ ఒత్తిళ్లతో పంచాయతీ ఉద్యోగుల తీవ్ర ఆవేదన గుమ్మఘట్ట డిప్యూటీ ఎంపీడీఓ గుండెపోటుతో మరణించాడంటున్న వీడీఓలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శ్రీకాకుళం జిల్లా వీడీఓ వాయిస్ మెసేజ్ -
సందడిగా గుత్తి కోట ఉత్సవాలు
గుత్తి: చారిత్రక సంపద, సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని డీఆర్ఓ మలోల అన్నారు. రెండు రోజులుగా గుత్తిలో అత్యంత వైభవంగా గుత్తి కోట ఉత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ క్రమంలో ఆదివారం కోట సంబరాలు అంబరాన్నింటాయి. హెరిటేజ్ వాక్ అందరినీ ఆకట్టుకుంది. స్థానిక ఎంఎస్ ఫుట్ బాల్ క్రీడామైదానం వద్ద జెండా ఊపి డీఆర్ఓ హెరిటేజ్ వాక్ను ప్రారంభించారు. జిల్లా యంత్రాంగం, గుత్తి కోట సంరక్షణ సమితి, పురావస్తు, పర్యాటక శాఖలు, రైల్వే డీజిల్షెడ్, వాకర్స్ అసోసియేషన్, ఐసీడీఎస్, మెప్మా, స్వచ్ఛంద సేవా సంస్థలు, ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు ఆధ్వర్యంలో ర్యాలీ సాగింది. కోట ప్రాముఖ్యతను వివరిస్తూ కళాకారులు ప్రజలకు అభివాదం చేశారు. ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా, అంగన్వాడీ టీచర్లతో కలిసి వేసిన డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది. డీఆర్ఓ మలోల అల్లూరి సీతారామరాజు, గుత్తి కోట సంరక్షణ సమితి వ్యవస్థాపకులు విజయ భాస్కర్ అలియా రాయల్, వెంకటరామిరెడ్డి వీర నరసింహం రాయల్, నాయుడు శ్రీకృష్ణ దేవరాయలు, హేమలత రాణి రుద్రమ దేవి వేష ధారణలతో ఆకట్టుకున్నారు. గురవయ్యల నృత్య ప్రదర్శనలు అలరించాయి. ఈ సందర్భంగా ఆర్డీఓ మలోల మాట్లాడుతూ గుత్తి కోటకు ఎంతో చరిత్ర ఉందన్నారు. కళలు, చరిత్ర, సంస్కృతి, చారిత్రక కట్టడాలను పరిరక్షించడం మనందరి బాధ్యతన్నారు. చారిత్రక ప్రదేశాలు ఆక్రమణలకు గురి కాకుండా చూడాలన్నారు. గుత్తి కోట అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అనంతరం జిల్లా పర్యాటకశాఖ అధికారి విజయకుమార్ మాట్లాడుతూ ప్రపంచ పటంలో గుత్తి కోటకు స్థానం కలిగే విధంగా అందరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, పురావస్తుశాఖ అధికారి స్వామి నాయక్, తహసీల్దార్ పుణ్యవతి, ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, మెప్మా విశ్వజ్యోతి, ఏఓ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్లతో స్టెప్పులేస్తున్న మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా గురవయ్యల ప్రదర్శన


