breaking news
Parvathipuram Manyam
-
సత్ప్రవర్తనతో శిక్ష పూర్తిచేయండి
● విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత పార్వతీపురం: సత్ప్రవర్తనతో ఖైదీలు శిక్షను పూర్తిచేయాలని విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత సూచించారు. శుక్రవారం జిల్లా పర్యటనలో భాగంగా ఆమె సబ్ జైలును తనిఖీచేసి వసతులను, రికార్డులను, జైలు పరిస్థితులు, ఆహారం, వైద్య సౌకర్యాలు, ఖైదీల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నాణ్యమైన ఆహారం అందుతోందా? లేదా? అని ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. నిబంధనల మేరకు నడుచుకోవాలని, నైతిక విలువలను పెంపొందించుకుంటే మానసిక ప్రఽశాంతత లభిస్తుందని ఖైదీలకు తెలిపారు. ఖైదీల ఫిర్యాదులు, అభ్యర్ధనలు, ఏవైనా సమస్యలుంటే వాటిని వెంటనే పరిష్కరించాలని సబ్ జైలు అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో పార్వతీపురం జిల్లా రెండవ అదనపు జడ్జి ఎస్.దామోదరరావు, విజయనగరం సీనియర్ జడ్జి బీహెచ్వీ లక్ష్మీకుమారి, పార్వతీపురం అడిషనల్ జ్యుడిషియల్ ఫస్టుక్లాస్ మెజిస్ట్రేట్ జె.సౌమ్య జాస్పిన్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి హామీ చట్టాన్ని కాపాడాలి
● చట్టాన్ని పథకంగా మారిస్తే కూలీల హక్కులు కోల్పోతారు ● కలెక్టరేట్ దగ్గర గాంధీజీ విగ్రహం వద్ద సీపీఎం నిరసనవిజయనగరం గంటస్తంభం: గ్రామీణ పేదలకు ఉపాధిని హక్కుగా కల్పించే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పథకంగా మార్చడం ద్వారా ఉపాధికి ఉన్న గ్యారంటీని తొలగించే ప్రయత్నం జరుగుతోందని సీపీఎం జిల్లా కార్యదర్మి తమ్మినేని సూర్యనారాయణ విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం విజయనగరం కలెక్టరేట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఉపాధి హామీ చట్టంలో ఉన్న హక్కులను బలహీనపరిచేందుకే గాంధీజీ పేరు తొలగించి చట్టాన్ని సాధారణ పథకంగా మార్చారని ఆరోపించారు. వామపక్షాలు, ప్రజాసంఘాలు సాధించుకున్న ఈ చట్టంపై గాంధీజీపై ఉన్న వ్యతిరేకతతోనే కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తోందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, పార్లమెంటులో ఉన్న మోజారిటీతో కూలీలకు హక్కుగా ఉన్న చట్టాన్ని మార్చే ప్రమాదకర నిర్ణయాలు తీసుకుంటోందని పేర్కొన్నారు. చట్టం స్థానంలో పథకం అమలులోకి వస్తే ఉపాధికి గ్యారంటీ ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి నేతలు స్పందించాలి ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను 90 శాతం నుంచి 60 శాతానికి తగ్గించడం వల్ల రాష్ట్రాలపై తీవ్ర భారం పడుతోందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా, అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేంద్రానికి వ్యతిరేకంగా స్పందించడం లేదని విమర్శించారు. ఇప్పటికై నా టీడీపీ, జనసేన పార్టీలు ఈ విషయంలో స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ, ఈ చట్టాన్ని కాపాడుకునే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జగన్మోహన్, వెంకటేష్, విజయనగరం పట్టణ నాయకులు బుల్లి రమణతో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
సాలూరు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి పూదోట ప్రకాష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక ఏరియా ఆస్పత్రి వద్ద నిర్వహించిన ధర్నాకు ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంట్రాక్ట్ ఏజెన్సీల చట్ట ప్రకారం కార్మికులకు పీఎఫ్, బీమా చెల్లింపులు చెల్లించకుండా ఒక్కో చోట ఒకలా చెల్లిస్తున్నారని ఆరోపించారు. పేదరోగులకు సేవచేసుకుంటూ జీవిస్తున్న బడుగు బలహీన వర్గాలకు చెందిన కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు బుగత అశోక్, బలగ రాధ తదితరులు పాల్గొన్నారు. -
సైన్స్ ఫెయిర్ విజయవంతం
విజయనగరం అర్బన్: జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్–2025ను పాఠశాల జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం విజయనగరంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. తొలుత పదర్శన కార్యక్రమాన్ని ఆర్డీఓ దాట్ల కీర్తి ప్రారంభించారు. ఈ సైన్స్ ఫెయిర్లో జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ‘సస్టైనబుల్ అగ్రికల్చర్, పర్యావరణ నిర్వహణ, గ్రీన్ ఎనర్జీ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, క్రీడలు అండ్ వినోదం, ఆరోగ్యం అండ్ పరిశుభ్రత, నీటి సంరక్షణ, వ్యర్థాల నిర్వహణ’ వంటి అంశాలపై వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించారు. ప్రదర్శన అనంతరం ఉత్తమ వైజ్ఞానిక ప్రాజెక్టులను జ్యూరీ సభ్యులు ప్రకటించారు. విద్యార్థుల గ్రూప్ కేటగిరి విజేతలలో అంశాల వారిగా ఏడు ప్రదర్శనలు ఎంపిక చేశారు. జిల్లా స్థాయి విజేతలు వీరే సైన్స్ ఫెయిర్లో సస్టైన్బుల్ అగ్రికల్చర్ అంశంలో జెడ్పీహెచ్ఎస్ చీపురుపల్లి (బాలికలు), ‘పర్యవరణ నిర్వహణ–పర్యావరణ హిత ప్రత్నామ్నాయాలు’ అనే అంశంలో జెడ్పీహెచ్ఎస్ జామి, ‘గ్రీన్ ఎనర్జీ–ఈవీ చార్జింగ్ స్టేషన్’ అనే అంశంలో జెడ్పీహెచ్ఎస్ రామభద్రపురం, ‘అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు–మాగ్నటిక్ గేర్స్’ అనే అంశంలో వల్లాపురం జెడ్పీహెచ్ఎస్, ‘నీటి సంరక్షణ–డ్రైయిన్ ఓవర్ఫ్లో గుర్తింపు వ్యవస్థ’ అనే టాపిక్లో రామతీర్ధం జెడ్పీహెచ్ఎస్, ‘ఆరోగ్యం అండ్ పరిశుభ్రత–స్మోక్ అబ్జార్బర్స్’ అనే అంశంపై కెల్ల జెడ్పీహెచ్ఎస్, ‘వాటర్ లీకేజ్ అండ్ డ్రైయిన్ ఓవర్ఫ్లో డిటెక్షన్ సిస్టమ్’ అనే అంశంలో కొండవెలగాడ జెడ్పీహెచ్ఎస్ ప్రాజెక్టులు విజేతలుగా నిలిచాయి. ఉపాధ్యాయుల కేటగిరిలో రామతీర్థం జెడ్పీహెచ్ఎస్ టీచర్ బల్లా శ్రీనివాసరావు (నీటి పొదుపు, పరిశుభ్రతకు పర్యావరణ హిత స్థూపాకార యూరినల్ బ్లాక్ డిజైన్), కొట్టాం జెడ్పీహెచ్ఎస్ టీచర్ పి.స్వప్న (స్కూల్ గ్రీన్ ల్యాబ్) విజేతలుగా ఎంపికయ్యారు. విద్యార్థుల వ్యక్తిగత కేటగిరి విజేతలుగా వియ్యంపేట కొత్తవలస ఏపీఎస్డబ్ల్యూఆర్ఎస్ (బాలికలు) విద్యార్థులు రూపొందించిన ‘ఎఫిషియంట్ ట్రైన్ ప్లాట్ ఫాం క్రాసింగ్ సిస్టం’ ప్రదర్శన, దేవుపల్లి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు రూపొందించిన వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు’ ఎంపికయ్యాయి. అనంతరం జరిగిన ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు చేతుల మీదుగా విజేతలకు జ్ఞాపికలు, బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా డీఈఓ యూ.మాణిక్యంనాయుడు, డిప్యూటీ ఈఓలు విజేతలైన విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులను అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా విజేతలు జిల్లా సైన్స్ కోఆర్డినేటర్ టి.రాజేష్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో విజేతలుగా ఎంపికై న గ్రూప్ కేటగిరిలో ఏడు ప్రాజెక్టులు, టీచర్ కేటగిరిలో రెండు ప్రాజెక్టులు, వ్యక్తిగత విద్యార్థి కేటగిరిలో రెండు ప్రాజెక్టులు ఈ నెల 23, 24 తేదీల్లో విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరఫున పాల్గొంటాయని తెలిపారు. రాష్ట్రస్థాయి విజేతలు ఆ తరువాత జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. విజేతలకు బహుమతుల ప్రదానం -
నేర పరిశోధనలో రాష్ట్రస్థాయి అవార్డు
పార్వతీపురం రూరల్: నేర పరిశోధనలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను పార్వతీపురం మన్యం జిల్లా పోలీసులకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు దక్కింది. దర్యాప్తులో చాకచక్యం ప్రదర్శించిన కేసులకు ఇచ్చే ‘ఏబీసీడీ’ అవార్డుల్లో జిల్లా పోలీసు శాఖ రాష్ట్రంలోనే రెండో స్థానాన్ని దక్కించుకుంది. శుక్రవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చేతుల మీదుగా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి, గత ఏఎస్పీ అంకిత సురానా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. సాలూరు మండలం చీపురువలస సమీపంలోని ఒక జీడితోటలో యువతి మృతదేహం లభ్యమైన కేసును పోలీసులు సవాలుగా తీసుకున్నారు. తొలుత అనుమానాస్పద మృతిగా నమోదైన ఈ కేసును, ఎస్పీ ఆదేశాల మేరకు సాంకేతిక ఆధారాలతో విశ్లేషించారు. కాల్డేటా, సీసీటీవీ ఫుటేజీ. సెల్ టవర్ లొకేషన్ సాయంతో అది ’హత్య’ అని తేల్చడమే కాకుండా, కేవలం 48 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. 2025 మొదటి త్రైమాసికంలో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఈ దర్యాప్తు అత్యుత్తమమైనదిగా నిలిచింది. ఈ కేసులో కీలక పాత్ర పోషించిన సాలూరు రూరల్ సీఐ పి.రామకృష్ణ, ఎస్సైలు నరసింహమూర్తి, వెంకట సురేష్, రమణ, క్లూస్ టీం సభ్యులను డీజీపీ అభినందించారు. -
గోడకూలి విద్యార్థికి గాయాలు
శృంగవరపుకోట: పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలో పై అంతస్తులో ఉన్న వాటర్ట్యాంక్ గోడకూలి ఓ విద్యార్థి తీవ్రగాయాల పాలయ్యాడు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని గాంధీనగర్ నాల్గవవీధిలో ఉన్న త్రినేత్ర డిఫెన్స్ కాన్సెప్ట్ స్కూల్లో పందిరప్పన్న జంక్షన్కు చెందిన వేమలి భార్గవ్ 6వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం 4గంటల సమయంలో భార్గవ్ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి పాఠశాల వెనుక వైపు ఉన్న రేకుల బాత్రూమ్కు మూత్రవిసర్జనకు వెళ్లాడు. మూత్రవిసర్జన చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పాఠశాల భవనం మూడవ అంతస్తుపైన ఉన్న వాటర్ట్యాంక్ గోడ కూలిపోయి బాత్రూమ్పైన పడిపోవడంతో భార్గవ్ రేకులు, గోడ శిథిలాల మధ్య చిక్కుకు పోయాడు. హఠాత్తుగా వచ్చిన శబ్దంతో వెనుక వీధిలో ఉన్న కార్పెంటర్ వాసు, చిల్డ్రన్ హాస్పిటల్లోని నర్స్లు వచ్చి శిథిలాలను తొలగించి విద్యార్థిని కాపాడారు. భార్గవ్ తలకు కుడివైపు లోతైన గాయం కాగా, ఎడమకాలు విరిగిపోయింది. స్కూల్కు పక్కనే ఉన్న అభినవ్ ఆస్పత్రిలో ప్రాథమిక వైద్యం చేయించారు. విషయం తెలిసి విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిపై నిలదీశారు. అనంతరం మాట్లాడుతూ ఈ ఘటనలో పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యవైఖరి, నిర్మాణంలో లోపాలే ప్రమాదానికి కారణం ఆరోపించారు. స్థానిక పోలీసులు ఘటనాస్థలిని సందర్శించి విచారణ చేశారు. గాయపడిన భార్గవ్కు వైద్యం చేసిన ఆస్పత్రి నిర్వాహకులు మాట్లాడుతూ విద్యార్థికి ఎటువంటి ప్రాణాపాయం లేదని చెప్పారు. -
ఎస్పీ దామోదర్కు ఏబీసీడీ అవార్డు
● అభినందించిన డీజీపీ హరీష్కుమార్ గుప్తా విజయనగరం క్రైమ్ : డీజీపీ హరీష్ గుప్తా చేతుల మీదుగా ఎస్పీ దామోదర్ అవార్డు ఫర్ బెస్ట్ ఇన్ క్రైం డిటెక్షన్ (ఏబీసీడీ) అవార్డును శుక్రవారం అందుకున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పోలీసులు ఛేదించిన ముఖ్య కేసుల దర్యాప్తును పరిశీలించి, వాటిలో ఉత్తమంగా దర్యాప్తు చేసిన కేసులకు ఇచ్చే ఏబీసీడీ (అవార్డు ఫర్ బెస్ట్ ఇన్ క్రైం డిటెక్షన్) అవార్డును ఎస్పీ దామోదర్ అందుకున్నారు. ప్రకాశం జిల్లాలో మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసును ఛేదించినందుకు గాను అప్పటి ప్రకాశం జిల్లా ఎస్పీగా పని చేసిన దామోదర్ను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రత్యేకంగా అభినందించి, ఏబీసీడీ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ గతేడాది ఏప్రిల్ 22 వ తేదీన ప్రకాశం జిల్లా, ఒంగోలు మెయిన్ రోడ్డు వద్ద నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు స్కూటీపై వచ్చి ముప్పవరపు వీరయ్య చౌదరిని కత్తులతో విచక్షణా రహితంగా 49 పోట్లు పొడిచి అక్కడ నుంచి పారిపోయారన్నారు. అనంతరం ఒంగోలు తాలూకా పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేయగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ హత్య కేసును తొందరగా ఛేదించి నిందితులను పట్టుకుని చట్టం ముందు నిలపాలని ఎస్పీకి ఆదేశాలు ఇవ్వడంతో ఈ కేసు మరింత ప్రాధాన్యం పెంచిందన్నారు. అప్పటి జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ డీఎస్పీ స్థాయి అధికారులతో వెంటనే 60 క్రైమ్ బృందాలను ఏర్పాటు చేసి, రాత్రింబవళ్లు శ్రమించి, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తక్కువ వ్యవధిలోనే సంచలన హత్య కేసులో నిజాలు నిగ్గు తేల్చి, 9మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారన్నారు. సంచలన హత్య కేసును తక్కువ వ్యవధిలో ఛేదించిన ఎస్పీ దామోదర్ను డీజీపీ ప్రత్యేకంగా అభినందించి, కేసు ఛేదనలో క్రియాశీలకంగా వ్యవహరించిన అధికారులు, సిబ్బందికి నగదు బహుమతి ప్రదానం చేశారు. -
తపాలా బీమా పథకాలపై అవగాహన తప్పనిసరి
విజయనగరం టౌన్: తపాలా బీమా పథకాలపై ఉద్యోగులందరూ అవగాహన తప్పనిసరిగా పెంపొందించుకోవాలని విశాఖపట్నం రీజియన్ పోస్ట్మాస్టర్ జనరల్ వీఎస్.జయశంకర్ సూచించారు. ఈ మేరకు స్థానిక జెడ్పీసమావేశమందిరంలో శుక్రవారం ఉద్యోగులకు బీమా సంకల్ప్ 2.0పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ నెలలో నిర్దేశించిన కోటి రూపాయల ప్రీమియానికి ఇప్పటివరకూ రూ.70లక్షలకు పైగా టార్గెట్ సాధించడం అభినందనీయమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా తపాలా ఉద్యోగుస్తులందరూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తపాలా బీమా సేవలపై అవగాహన కల్పించాలని కోరారు. తద్వారా తమ సేవలను విస్తృతం చేయాలని సూచించారు కార్యక్రమంలో విజయనగరం డివిజన్ సూపరింటెండెంట్ కె.శ్రీనివాస్, సహాయ సూపరింటెండెంట్లు జీవీ.రమణారావు, టి.సుందరనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
చోరీ కేసులో ఇద్దరు ముద్దాయిలకు మూడేళ్ల జైలు
● రూ.13వేలు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు పార్వతీపురం రూరల్: తాళం వేసిన ఇళ్లే వారి టార్గెట్. రాత్రి వేళ ఇళ్లలో చొరబడి చేతివాటం ప్రదర్శించిన దొంగలకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. పదేళ్ల క్రితం నాటి దొంగతనం కేసులో నేరం రుజువు కావడంతో ఇద్దరు ముద్దాయిలకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ సాలూరు జ్యుడిషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ హర్షవర్ధన్ శుక్రవారం తీర్పు వెలువరిచారు. ఎస్పీ మాధవ్రెడ్డి తెలియజేసిన ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. సాలూరు మండలంలోని యరగాడ వలస గ్రామానికి చెందిన కొత్తపల్లి సత్తిపండు 2015లో పని నిమిత్తం రాజమండ్రి వెళ్లాడు. ఈ క్రమంలో ఇల్లంతా ఖాళీగా ఉండడం గమనించిన అదే గ్రామానికి చెందిన కొండగొర్రి రమేష్, ఆలూరి గణపతిలు ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అప్పటిలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి నిందితులపై సమర్పించిన సాక్ష్యాధారాలు, ఏపీపీ మాధవి వినిపించిన బలమైన వాదనలతో నేరం రుజువైంది. దీంతో ముద్దాయిలిద్దరికీ మూడేళ్ల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.13వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చినట్లు ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి వివరించారు. చికిత్స పొందుతూ వృద్ధుడి మృతిభోగాపురం: మండలంలోని అమటాం గ్రామానికి చెందిన కోరాడ సూరి (70) అనే వృద్ధుడు విశాఖపట్నం కేజీహెచ్లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కోరాడ సూరి కొబ్బరి చీపుళ్లు తయారు చేసి వాటిని విశాపట్నంలో విక్రయిస్తూ కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 4న విశాఖపట్నంలో చీపుళ్లను విక్రయించి ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంతలో ఏమైందో ఏమో తెలియదు గానీ ఇంట్లో పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. పరిస్థితిని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే సూరిని తగరపువలస ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్య కోసం విశాఖపట్నం కేజీహెచ్లో చేర్చగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఏఎస్సై తిరుపతి తెలిపారు. జాతీయస్థాయి ఫుట్ బాల్ పోటీలకు నెల్లిమర్ల క్రీడాకారులునెల్లిమర్ల: నెల్లిమర్ల నగర పంచాయతీకి చెందిన ముగ్గురు క్రీడాకారులు జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికై నట్లు నెల్లిమర్ల రిక్రియేషన్ ఫుట్బాల్ క్లబ్ ప్రతినిధులు కె.సురేష్, ఎం.నాని తెలిపారు. ఈ నెల 22 నుంచి కేరళ రాష్ట్రంలో జరగనున్న ఆంధ్ర యూనివర్సిటీ జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు బి.రామకృష్ణ, బి. వరుణ్లు ఎంపికై నట్లు తెలిపారు. అలాగే ఇదే ప్రాంతానికి చెందిన సంతోష్ కుమార్ అనంతపురం జిల్లాలో జరగనున్న జాతీయ స్థాయి సంతోష్ ట్రోఫీకి ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. క్రీడాకారులు రామకృష్ణ, వరుణ్, సంతోష్ కుమార్ జాతీయస్థాయి పోటీల్లో రాణించి, విజేతలుగా నిలవాలని క్లబ్ ప్రతినిధులు, పూర్వ శిక్షకుడు కోల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. రోడ్లపై పశువులను విడిచిపెడితే కేసులు విజయనగరం క్రైమ్ : రోడ్లపై పశువులను విడిచిపెడితే సంబంధిత యజమానులపై కేసులు పెడతామని ఎస్పీ దామోదర్ శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. జిల్లాలో రహదారులపై పశువులు విచ్చలవిడిగా స్వేచ్ఛగా సంచరించే విధంగా విడిచిపెడితే చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొన్నారు. వీటి విచ్చలవిడి సంచారం వల్ల పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. -
22 నుంచి కానిస్టేబుల్స్కు శిక్షణ ప్రారంభం
విజయనగరం క్రైమ్: ఈ నెల 22 వ తేదీ నుంచి కానిస్టేబుల్స్ అభ్యర్థుల శిక్షణ ప్రారంభమవుతుందని ఎస్పీ దామోదర్ గురువారం తెలిపారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో కానిస్టేబుల్స్గా ఎంపికై న 133 మంది పురుష, మహిళా అభ్యర్థులు ఈ నెల 20 వతేదీన జిల్లా పోలీసు కార్యాలయం వద్ద ఉదయం 8గంటలకు హాజరు కావాలని సూచించారు. తొమ్మిది నెలల పాటు కానిస్టేబుల్స్కు శిక్షణ ఉంటుందన్నారు. కానిస్టేబుల్స్గా ఎంపికై న పురుష, మహిళా అభ్యర్థులు తొమ్మిది నెలల పాటు శిక్షణలో ఉండేందుకు లగేజీతో హాజరు కావాలని సూచించారు. శిక్షణ నిమిత్త పురుష అభ్యర్థులను చిత్తూరు పీటీసీకి, మహిళా అభ్యర్థులను ఒంగోలు పీటీసీకి పంపుతామని ఎస్పీ తెలిపారు. అభ్యర్థులు తమ వెంట విలువైన వస్తువులను తీసుకురాకూడదని, శిక్షణ కేంద్రానికి అభ్యర్థుల వెంట బంధువులను అనుమతించరని ఎస్పీ ఏఆర్.దామోదర్ స్పష్టం చేశారు. ఎస్పీ దామోదర్అభ్యర్థులు తీసుకురావాల్సిన పత్రాలు 5 పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫొటోలు 2 స్టాంప్ సైజ్ కలర్ ఫొటోలు ఒరిజినల్ సర్టిఫికెట్లు రూ.100/ నాన్ జ్యుడిషియల్ బాండ్ పేపర్ 2 బ్లాంకెట్స్ రూ.10,000లు తిరిగి ఇవ్వబడే కాషన్ డిపాజిట్, మెస్ చార్జీల కోసం తీసుకుని రావాలని ఎస్పీ దామోదర్ స్పష్టం చేశారు. -
సైన్స్ సంబరానికి వేళాయె..
● నేడు జిల్లాస్థాయి సైన్స్ఫెయిర్ పోటీలు ● ముగిసిన మండల, నియోజకవర్గ పోటీలు ● జిల్లాకు ఎంపికై న 150 ప్రాజెక్టులుపార్వతీపురం రూరల్ : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను, విద్యార్థుల శాసీ్త్రయ జ్ఞానాన్ని, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏటా మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. దీనిలో విద్యార్థులు, తమ ప్రాజెక్టులను ప్రదర్శిస్తున్నారు. తద్వారా రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమిటంటే విద్యార్థుల్లో శాసీ్త్రయ అవగాహన, ఆలోచన శక్తి పెంచడం, కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు చేయడానికి విద్యార్థులను ప్రోత్సహించడం, ప్రయోగాత్మక నైపుణ్యాలు, సిద్ధాంతాలను ప్రయోగాత్మకంగా నిరూపించే అవకాశం కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. విద్యార్థులు, ఉపాధ్యాయులకు కొత్త పాత్రలను స్వీకరించడానికి, లోతైన విజ్ఞానాన్ని పెంపొందించడానికి ప్రేరణ కల్పించడమే పరమార్థం. భావిశాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దే సైన్స్ ఇన్స్పైర్ విజ్ఞాన సంబరానికి వేళైంది. గడిచిన 15 రోజులుగా మండల, నియోజక వర్గ స్థాయిలో సైన్స్ ఫెయిర్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు శుక్రవారం జిల్లాస్థాయి ప్రదర్శనలు నిర్వహించనున్నారు. సైన్స్ ఫెయిర్ పట్ల విద్యార్థుల్లో ఆసక్తి గత ఏడేళ్లుగా ఎక్కువైంది. పార్వతీపురం మన్యం జిల్లా నుంచి 1010 మంది విద్యార్థులు తమ ప్రాజెక్టులతో మండల స్థాయిలో పాల్గొన్నారు. అందులో ప్రతిభ చూపించిన 150 ప్రాజెక్టులు జిల్లా స్థాయికి ఎంపికయ్యాయి. గతేడాది పోటీల్లో జిల్లా నుంచి జెడ్పీహెచ్ఎస్ తలవరం విద్యార్థులు నిర్వహించిన ప్రాజెక్టు జాతీయస్థాయికి వెళ్లడమే కాకుండా జాతీయస్థాయిలో ద్వితీయ బహుమతిని సాధించింది. ఈ ఏడాది మరిన్ని ప్రాజెక్టులు జాతీయస్థాయికి వెళ్లి బహుమతులు సాధిస్తాయని ఆశిస్తున్నారు నేడు జిల్లా స్థాయి పోటీలు మండల, నియోజకవర్గ స్థాయిలో పాల్గొన్న 1010మంది తయారు చేసిన ప్రాజెక్టుల్లో అత్యుత్తమమైన 150 ప్రాజెక్టులను జిల్లా స్థాయికి ఎంపిక చేశారు. వాటిలో గ్రూప్స్థాయిలో 105 ప్రాజెక్టులు, వ్యక్తిగతంగా 30 ప్రాజెక్టులు, ఉపాధ్యాయుల సహకారంతో రూపొందించిన 15 ప్రాజెక్టులను జిల్లాస్థాయికి ఎంపిక చేశారు. జిల్లా కేంద్రంలో గల డీవీఎం ఉన్నత పాఠశాలలో ఈ వైజ్ఞానిక ప్రదర్శనలను నిర్వహించనున్నారు. కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి, ప్రజాప్రతినిధులు, సైన్స్ కమిటీ ఈ పోటీలలో ప్రదర్శించే 11 ప్రాజెక్టులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను హైదరాబాద్లో నిర్వహించనున్న జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు. ప్రతిభ కనబరుస్తున్న మన్యం విద్యార్థులు గత ప్రభుత్వం విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం, క్లాస్ రూమ్లలో డిజిటల్ బోధన, బైజూస్ విధానంలో విద్యాభ్యాసం వంటి మార్పుల కారణంగా గిరిజన విద్యార్థులు విద్య, విజ్ఞాన ప్రదర్శనలపై మక్కువ చూపుతున్నారు. ఫలితంగా గత ఏడేళ్లుగా జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనల్లో మంచి ప్రతిభ కనబరిచి మన్యం జిల్లాకు మంచి పేరు తీసుకువస్తున్నారు. ఫలితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మండల స్థాయిలో 1010 మంది విద్యార్థులు తమ ప్రాజెక్టులతో సైన్స్ఫెయిర్లో పాల్గొనడం గమనార్హం. ఈ ఏడాది జాతీయ స్థాయిలో మన్యం విద్యార్థులు మంచి ప్రతిభ కనబరుస్తారని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల్లో జ్ఞానం పెంపొందించడానికే.. విద్యార్థుల్లో వైజ్ఞానాన్ని, సృజనాత్మకతను వెలికి తీసేందుకే ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది జిల్లా స్థాయికి 150 సైన్స్ ప్రాజెక్టులను ఎంపిక చేశాం. విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో వారి ప్రదర్శనను కనబరుస్తారన్న నమ్మకం ఉంది. కేవలం పారదర్శకంగా మాత్రమే ప్రాజెక్టులను ఎంపిక చేసేలా చర్యలు చేపట్టాం. జాతీయస్థాయిలో మన్యం జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాం. – లక్ష్మణరావు, జిల్లా సైన్స్ అధికారి, పార్వతీపురం మన్యం ఉత్తమ ప్రదర్శనలు తేవాలి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులు తమ ఆలోచనలతో ప్రాజెక్టులు చేసి ఉత్తమమైన వాటిని తీసుకురావాలి. జిల్లా నుంచి జాతీయ స్థాయి పోటీలకు విద్యార్థుల ప్రాజెక్టులు గతంలో ఎంపికయ్యాయి. ఈ ఏడాది కూడా జాతీయ స్థాయికి ఎంపికవుతాయనే అశిస్తున్నాం. జిల్లా కేంద్రంలో డీవీఎంఎం పాఠశాలలో జిల్లాస్థాయి పోటీలకు సర్వం సిద్ధం చేశాం. పి.బ్రహ్మాజీరావు, డీఈఓ, పార్వతీపురం మన్యం -
జాతీయ పారా పవర్ లిఫ్టింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
విజయనగరం: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరగబోయే పారా (దివ్యాంగుల) పవర్ లిఫ్టింగ్ జాతీయస్థాయి పోటీలకు జిల్లాకు చెందిన ఇద్దరు దివ్యాంగ క్రీడాకారులు అర్హత సాధించినట్లు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి.రామస్వామి, జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ తెలిపారు. ఈ మేరకు ఎంపికై న క్రీడాకారులకు వారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల విజయనగరంలోని రాజీవ్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పారా పవర్ లిఫ్టింగ్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వడ్డి సతీష్ కుమార్ సాహు, తాళ్లపూడి గౌతమిలు పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం అర్హత సాధించడంతో జాతీయ పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 16 నుంచి 18 వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరగబోయే పారా జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు వీరు బయలుదేరి వెళ్లనున్నారన్నారు. ఇదే స్ఫూర్తి తో జాతీయ స్థాయి పోటీలలోనూ ప్రతిభ చాటి జిల్లాకు మంచి పేరు తీసుకుని రావాలని కోరారు. వారిద్దరి ఎంపిక పట్ల కలెక్టర్ రాం సుందరరెడ్డి, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్. వెంకటేశ్వరరావులు అభినందనలు తెలిపారు. -
అటవీశాఖ, గిరిజనుల మధ్య వాగ్వాదం
సీతంపేట: అటవీశాఖ అధికారులు, గిరిజనుల మధ్య గురువారం అడ్డాకులగూడ గ్రామంలో వాగ్వాదం జరిగింది. సీతంపేట మండలంలోని కర్రగూడ, పాలమానుగూడ, అడ్డాకులగూడ, కారిమానుగూడ పరిధిలో వీఎస్ఎస్ భూముల్లో నగరవనం నిర్మాణానికి అటవీశాఖ తవ్వకాలు జరుపుతుండగా పలు గ్రామాల గిరిజనులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పాలకొండ అటవీశాఖ రేంజర్ రామారావుతో పాటు సిబ్బంది మాట్లాడుతూ పనులు జరుగుతాయని, అటవీశాఖకు సంబంధించిన భూములు కాబట్టి ఇక్కడ నగరవనం నిర్మిస్తామని పట్టుబట్టారు. ఈ క్రమంలో తీవ్రవాగ్వాదం నెలకొంది. 25 ఎకరాల్లో వనసంరక్షణ సమితులు, అటవీశాఖ జాయింట్ పట్టాలు ఉన్నాయని సర్పంచ్ ఎస్.సిమ్మయ్య, గిరిజన నాయకులు ఎ.భాస్కరరావు, ఎం.లక్ష్మణరావులు తెలిపారు. గతంలో నీలగిరి మొక్కలు వేసినప్పటికీ ఒక్కపైసా కూడా గిరిజనులకు ఇవ్వలేదన్నారు. ఇక్కడ నగరవనం నిర్మిస్తే గిరిజనులు సాగుచేసుకుంటున్న భూములకు నష్టం వాటిల్లుతుందని వాపోయారు. ఈ భూములు గిరిజనులకే దక్కాలని, ఈ విషయమై ఐటీడీఏ పీఓకు కూడా వినతిపత్రం ఇచ్చామన్నారు. ఇప్పుడు అటవీశాఖ అధికారులు గిరిజనులకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా పనులు చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయమై ఎఫ్ఆర్వో రామారావు మాట్లాడుతూ 15 ఏళ్ల క్రితం నుంచే నగరవనం ప్రతిపాదన ఉందన్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నగరవనాలు మంజూరు కావడంతో పాలకొండ నియోజకవర్గానికి ఇక్కడ మంజూరైందన్నారు. గిరిజనులకు ఎటవంటి నష్టం ఉండదన్నారు. -
వైభవంగా గోదాదేవి పల్లకి సేవ
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో ధనుర్మాస పూజలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. వేకువజామున స్వామికి ప్రాతః కాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత గోదాదేవి పల్లకి సేవను అర్చకులు చేపట్టారు. అమ్మవారిని ప్రత్యేక పల్లకిలో ఉంచి మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ ఆలయం చుట్టూ ఊరేగించారు. అనంతరం యాగశాలలో విశేష హోమాలు, స్వామి సన్నిధిలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని జరిపించారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని స్వామి సన్నిధిలో తిరుప్పావై సేవా కాలములు జరిపించి స్వామికి ఆరాధన చేశారు. చెరకు తోట దగ్ధంరేగిడి: మండల కేంద్రం రేగిడిలో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 20 ఎకరాల చెరకు తోట దగ్ధమైంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో చెరకు చెత్తకు అగ్గిపెట్టడంతో ప్రమాదవశాత్తు చెరకు తోటలకు నిప్పంటుకుంది. దీంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో లావేటి విష్ణుమూర్తి, ముంజేటి సన్యాసినాయుడు, జల్లు సాయిరాం జల్లు సింహాద్రి, కరణం గోవింద, ముంజేటి వెంకటప్పలనాయుడు తదితర రైతులకు చెందిన చెరకు పంట దగ్ధమైంది. స్థానికుల సమాచారం మేరకు పాలకొండ అగ్నిమాపక శకటం సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసింది. చక్కెర కర్మాగారం యాజమాన్యం స్పందించి కాలిన చెరకుకు కటింగ్ ఆర్డర్ ఇప్పించి తరలించాలని బాధితులు కోరుతున్నారు. పాపం పసివాళ్లకు సాయం● ముందుకు వచ్చిన దాతలు గజపతినగరం: జామి మండలం జన్నివలస గ్రామానికి చెందిన మైలపల్లి విజయ్, మైలపల్లి గౌతమ్లతో పాటు రామయ్యపాలెం కొత్తూరుకు చెందిన మరో పిల్లవాడు ముంతాగౌతమ్లకు గజపతినగరం మండల ఉపాధ్యాయ బృందం దాతృత్వంతో రూ.20వేల నగదు, నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ పిల్లల తల్లిదండ్రులు మృతి చెందడంతో వారు అనాథలయ్యారు. ఆ పిల్లలకు గురువారం గజపతినగరం మండల కేంద్రంలో మండల విద్యాశాఖ అధికారిణి విమలమ్మ, ఎంఈఓ–2 సాయిచక్రధర్ల చేతులు మీదుగా నగదు, వస్త్రాలను, నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అంద జేశారు. పాపం పసివాళ్లు అనే శీర్షికన ఇటీవల సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనం చూసిన దాతలు స్పందించి ముందుకు వచ్చి అనాథ పిల్లలకు సహకారం అందజేశారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతిదత్తిరాజేరు: మండలంలోని ఎం.లింగాలవలస గ్రామానికి చెందిన అలజింగి సన్యాసప్పడు(55)ను కొద్ది రోజుల క్రితం వెనుక నుంచి ట్రాక్ట ర్ ఢీకొనడంతో గాయపడగా వైజాగ్లోని కేజి హెచ్లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు పెదమానాపురం ఎస్సై ఆర్ జయంతి తెలిపారు. ఈనెల 12వ తేదీన అదే గ్రామాని కి చెందిన ఇనుముల సత్యనారాయణ ట్రాక్టర్ ను నిర్లక్ష్యంగా, వేగంగా, నడిపి సన్యాసప్పడును వెనుక నుంచి ఢీకొట్టడంతో అప్పటి నుంచి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య ఆదిలక్ష్మి, ముగ్గురు కుమారులు ఉన్నారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. మహిళ ఆత్మహత్యసీతంపేట: మండలంలోని అంబలగండి గ్రామానికి చెందిన గేదెల లక్ష్మి (35) అనే గిరిజన మహిళ కడుపునొప్పి తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఆరునెలలుగా కడుపులో నొప్పితో ఆమె బాధపడుతోంది. ఈనెల 15న కడుపులో నొప్పి ఎక్కువవడంతో ఇంటిలో ఉన్న గడ్డిమందును తాగేసింది. దీంతో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను భర్త శోభన్బాబు స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించాడు. పరీక్షించిన వైద్యులు శ్రీకాకుళం రిమ్స్కు రిఫర్ చేయగా రిమ్స్లో చికిత్సపొందుతూ గురువారం మృతిచెందినట్లు ట్టు దోనుబాయి ఎస్సై ఐ మస్తాన్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి నట్లు చెప్పారు. మృతురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలుగా నిలవాలి
● సత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సాయిదేవమణి విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న సీనియర్స్ పురుషుల ఖోఖో పోటీల్లో జిల్లా జట్టు ఉత్తమ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలవాలని సత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సాయిదేవమణి పిలుపునిచ్చారు. ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు గుడివాడలో జరగనున్న అంతర్ జిల్లాల పురుషుల ఖోఖో పోటీల్లో పాల్గొనబోయే జిల్లా జట్టు కోచింగ్ క్యాంప్ను ఆమె కళాశాల ప్రాంగణంలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కబడ్డీ, ఖోఖో క్రీడల్లో విజయనగరం జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, ఎంతో మంది క్రీడాకారులు జాతీయస్థాయికి ప్రాతినిధ్యం వహించిన ఘనత ఉందని గుర్తు చేశారు. త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాలని సూచించారు. కళాశాలలో శిక్షణ పొందుతున్న జట్టుకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఖోఖో పితామహుడు పి.చిన్నంనాయుడు, కళాశాల పీడీ ప్రసాద్, జిల్లా ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి కె.గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
గురుకులంలో భోజన సమస్య లేదు
● డీసీఓ మాణిక్యం భామిని: స్థానిక సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో విద్యార్థులకు భోజన సమస్య లేదని గుర్తించినట్లు విజయనగరం గురుకులాల సమన్వయ కర్త(డీసీఓ) మల్లా మాణిక్యం గురువారం స్పష్టం చేశారు. గురుకులం ప్రిన్సిపాల్ విజయ నిర్మలతో కలిసి గురుకుల విద్యార్థులతో మాట్లాడినట్లు వివరించారు. ఇటీవల ఆదివారం మధ్యాహ్న భోజనం ఆలస్యంపై విద్యార్థుల ఆకలికేకలపై విచారణ చేసినట్లు తెలిపారు. ఆ భోజన జాప్యానికి గ్యాస్ రెగ్యులేటర్ మరమ్మతు కారణమని గుర్తించామన్నారు.మిగతా రోజుల్లో యథావిధిగా సమయ పాలనతో భోజనాలు అందుతున్నట్లు విద్యార్థులు తెలిపారన్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే ఫోన్లో సిబ్బందితో మాట్లాడానని డీసీఓ మాణిక్యం వివరించారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్న తీరు పరిశీలించానని, వంట గది, భోజనశాల అన్నీ పరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. -
దివ్యాంగులకు రీవెరిఫికేషన్ కష్టాలు
● కాటికి కాలు చాచే వయసులో ఇవేం కష్టాలంటూ వాపోతున్న బాధితులువిజయనగరం ఫోర్ట్: ఇలా వీరిద్దరే కాదు. నిత్యం అధిక సంఖ్యలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి సదరం రీవెరిఫికేషన్ కోసం దివ్యాంగులు వస్తున్నారు. జిల్లా నలుమూలల నుంచి దివ్యాంగులు అష్టకష్టాలు పడి వస్తూ ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తున్నారు. ముఖ్యంగా నడవలేని స్థితిలో ఉన్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాటికి కాలుచాచే వయసులో ఇవేమి కష్టాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం సదరం రీవెరిఫికేషన్ కోసం పదేపదే తిప్పుతుండడం వల్ల దివ్యాంగులు అవస్థలు పడక తప్పడం లేదు. ముఖ్యంగా ఈఎన్టీ విభాగానికి చెందిన దివ్యాంగుల్లో చాలా మందికి రీవెరిఫికేషన్ పూర్తయినప్పటికీ మళ్లీ రీ వెరిఫికేషన్ చేయాలని పిలుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇచ్చే పింఛన్ మాట దేవుడెరుగు. వెరిఫికేషన్కు వెళ్లడానికి ఇబ్బంది పడాల్సి వస్తోందని దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రూ.283 కోట్ల సీ్త్రనిధి రుణ లక్ష్యం
రామభద్రపురం: జిల్లాలో ఈ ఏడాది రూ.283 కోట్లు సీ్త్రనిధి రుణ లక్ష్యమని సీ్త్రనిధి ఏజీఎం వై.చిట్టిబాబు అన్నారు. ఈ మేరకు రామభద్రపురంలోని వెలుగు కార్యాలయాన్ని గురువారం ఆయన సందర్శించి సిబ్బందితో సమీక్ష నిర్వహించి సీ్త్రనిధి రుణ వసూళ్లను వేగవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రూ.193 కోట్లు రుణాల వసూలు అయిందన్నారు. సీ్త్రనిధి రుణం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. బ్యాంకులో రుణం తీసుకుంటే డాక్యుమెంట్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు, ఇన్స్పెక్షన్ ఫీజులు వంటి అదనపు వసూళ్లు ఉంటాయని, సీ్త్రనిధి రుణం తీసుకుంటే అదనపు వసూళ్లు ఉండవన్నారు.అలాగే నూటికి నెలకు 92 పైసలు మాత్రమే వడ్డీ పడుతుందని చెప్పారు. రుణం తీసుకున్న సభ్యులు సకాలంలో సక్రమంగా వాయిదాలు చెల్లిస్తే అదనపు వడ్డీ ఉండదన్నారు. దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లో నగదు సభ్యుల ఖాతాలో పడుతుందని చెప్పారు. గ్రూప్లో ఒక్క సభ్యురాలికై నా రుణం ఇస్తామని, ఆ రుణంతో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. కార్యక్రమంలో సీ్త్రనిధి మేనేజర్ వై ఎర్రినాయుడు, సీసీలు సింగరాజు తదితరులు పాల్గొన్నారు. సీ్త్రనిధి ఏజీఎం వై చిట్టిబాబు -
●కళాశాలలు పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
ప్రజలతో ఎన్నికై న సర్కారు ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిందిపోయి ప్రైవేట్ శక్తులకు దోచిపెట్టేలా వ్యవహరించడం సరికాదు. సామాన్యులకు వైద్యవిద్యను అందుబాటులోకి తేవడంతో పాటు పేదప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను పూర్తి చేయాల్సిన బాధ్యత కూటమి సర్కారుపై ఉంది. పీపీపీ విధానం పేరిట తీసుకున్న నిర్ణయం సహేతుకం కాదని ప్రజలే తమ సంతకాల ద్వారా తెలియజేశారు. ఈ క్రమంలో ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వం గౌరవించాలి. కేవలం భేషజాలకు పోయి ప్రజలకు అందాల్సిన ఉచిత వైద్యసేవలను, భవిష్యత్తు తరాలకు అండగా నిలవాల్సిన వైద్యవిద్యార్థులకు అన్యాయం చేసే యత్నం మానుకోవాలి. –తిర్లంగి ఉపేంద్రకుమార్, లుంబూరు, పాలకొండ -
ఉపాధ్యాయులకు వాచ్మెన్ విధులా?
సాక్షి, పార్వతీపురం మన్యం: గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులకు రాత్రి కాపలాదారు విధులు వేయడం ఎంతవరకు సమంజసమని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.మురళీమోహన్రావు ప్రశ్నించారు. పాఠశాలల్లో రాత్రి బస చేసి 9 గంటలకు, అర్ధరాత్రి 12గంటలకు, తెల్లవారుజామున 6 గంటలకు ఫొటోలు అప్లోడ్ చేయాలని ఒత్తిడి చేయడం సరికాదన్నారు. ఎటువంటి సౌకర్యాలూ కల్పించకుండా మహిళా ఉపాధ్యాయులు సైతం పాఠశాలలో బస చేయాలని చెప్పడం దుర్మార్గమన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ గురువారం సాయంత్రం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. జీవో కాపీలను మంటల్లో తగలబెట్టారు. మోకాళ్లపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. సీనియర్ ఇన్సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ రాయాలని నిర్దేశించడం సరికాదన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య సమస్యలకు ఉపాధ్యాయులను బాధ్యులను చేయడమేమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కె.భాస్కరరావు, కార్యదర్శి కృష్ణారావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పార్వతీపురం రూరల్: ’వైరస్ రహిత సమాజం–వ్యాధి రహిత బాల్యం’ అనే నినాదంతో జిల్లాలో పల్స్ పోలియో సమరానికి వైద్యారోగ్య శాఖ సర్వం సిద్ధం చేసింది. ఈనెల 21వ తేదీన ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ ఎస్. భాస్కరరావు గురువారం కార్యాలయంలో ప్రకటించారు. ఈ మేరకు పల్స్ పోలియో పోస్టర్ను అధికారులతో కలిసి గురువారం ఆవిష్కరించారు. జిల్లావ్యాప్తంగా 99,507 మంది చిన్నారులకు రక్షణ కవచంలా రెండు చుక్కల మందు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందుకోసం 905 కేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రయాణాల్లో ఉన్న పిల్లల కోసం 19 ట్రాన్సిట్ బూత్లు, గిరిజన మారుమూల ప్రాంతాల కోసం 42 సంచార (మొబైల్) బృందాలను రంగంలోకి దించుతున్నట్లు వివరించారు. ఆదివారం బూత్లకు రాలేని వారి కోసం 22, 23 తేదీలలో వైద్య సిబ్బంది ’ఇంటింటికీ–చుక్కల మందు’ కార్యక్రమం చేపడతారని తెలిపారు. ఆశ, అంగన్వాడీ కార్యకర్తల సమన్వయంతో సాగే ఈ యజ్ఞంలో తల్లిదండ్రులు భాగస్వాములై తమ పిల్లలకు వైకల్యం లేని భవితను అందించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి విజయ మోహన్, డా.వినోద్, డా.రఘు తదితరులు పాల్గొన్నారు. -
శ్మశానం కబ్జా!
సాక్షి, పార్వతీపురం మన్యం: సీతంపేట మండలం కొండపల్లి గ్రామంలో తరతరాలుగా గిరిజనులు ఉపయోగించుకుంటున్న శ్మశానవాటికను ఓ వ్యక్తి కబ్జా చేస్తున్నాడు. కొద్దిరోజులుగా జేసీబీతో చదును పనులు సైతం చేయిస్తున్నాడు. ఆర్వోఎఫ్ఆర్ పరిధిలోని ఈ స్థలాన్ని ఎలా ఆక్రమించుకుంటారని గిరిజనులు ప్రశ్నిస్తే.. ‘మీకు దిక్కున్నచోట చెప్పుకోండ’ని బెదిరిస్తున్నట్లు గ్రామస్తులు వాపోతున్నారు. ‘అధికారులకు చెప్పుకున్నాం. ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నాం. ఎక్కడా న్యాయం జరగడం లేదని’.. వారంతా గురువారం పార్వతీపురం కలెక్టరేట్కు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. -
వైద్యవిద్యపై ప్రైవేట్ నీడ వద్దు
పార్వతీపురం రూరల్: ప్రభుత్వ వైద్య కళాశాలలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్(పీపీపీ) విధానంలోకి నెట్టడం పేద విద్యార్థుల పాలిట శరాఘాతమని సీపీఐ నేతలు మండిపడ్డారు. ఈ మేరకు గురువారం పార్వతీపురంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వద్ద పార్టీ జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి కె.మన్మథరావు, ఏఐటీయూసీ నేత ఆర్వీఎస్ కుమార్ మాట్లాడుతూ..ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి, మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసేందుకు జీవో 590 తీసుకురావడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు. పీపీపీ అమలులోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు వైద్యవిద్య అందని ద్రాక్షగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్యులకు వైద్యం భారమవుతుందని అసంతృప్తి వెలిబచ్చారు. విద్యాశాఖ మంత్రి తన ’యువగళం’ హామీని నిలబెట్టుకోవాలని, తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి బి. రవికుమార్, పలువురు విద్యార్థులు, సీపీఐ కార్యకర్తలు పాల్గొన్నారు. సీతంపేట: స్థానిక ఐటీడీఏ పరిధిలోని వివిధ ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో పనిచేస్తున్న 32 మంది పీడీ, పీఈటీలకు మోమోలు జారీ చేసినట్లు ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అన్నదొర గురువారం తెలిపారు. ఆయా విద్యాసంస్థల్లో విద్యార్థుల రోజువారీ ఫిజికల్ యాక్టివిటీస్ కొద్ది రోజులుగా లేకపోవడంతో మోమోలు జారీచేసినట్లు స్పష్టం చేశారు. -
దాచేస్తే దాగుతాయా.. మరణాలు ఆగుతాయా!
● ఏం జరుగుతోంది.. ఆశ్రమాల్లో? ● ముస్తాబులు సరే.. పిల్లల ఆరోగ్యంపై ఏం చెబుతాం! ● ఇటీవల జిల్లాలోని ఓ ఆశ్రమ పాఠశాలలో చదు వుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కారణాలేమైనా.. విషయాన్ని బయ టకు రాకుండా తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. ● కొద్దిరోజుల కిందట గుమ్మలక్ష్మీపురం మండలం దొరజమ్ము ఆశ్రమ పాఠశాల పదో తరగతి విద్యార్థి మరణించాడు. విషయం చాలా రోజుల వరకూ బయటకు రాలేదు. చేతికి అందొచ్చిన కుమారుడిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రుల నుంచి పాఠశాల ఉపాధ్యాయులు.. విద్యార్థి మరణంతో తమకేమీ సంబంధం లేదని ఏకంగా పూచీపత్రం రాయించుకోవడం విమర్శలకు తావిస్తోంది. ● విద్యార్థుల మరణాలు సంభవిస్తే సహించేది లేదని.. సిబ్బందిని సస్పెండ్ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ప్రతి నెలలోనూ ఒకట్రెండు మరణాలు సంభవిస్తున్న జిల్లాలో ఎంతమంది సిబ్బందిని సస్పెండ్ చేయాలి.. ఎందరిని బాధ్యులు చేస్తారన్న గిరిజన సంఘాల ప్రశ్నకు సమాధానం లేదు. ● జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ముస్తాబు కార్యక్రమాన్ని చేపడుతున్నారు. విద్యార్థుల ఆరోగ్య రక్షణ.. క్రమశిక్షణ, శుభ్రత అలవాటు చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. కోట్లాది రూపాయలు నిధులు ఖర్చు చేసి పౌష్టికాహారం అందిస్తున్నా.. అది సక్రమంగా అందకనే రక్తహీనత వంటి కేసులు వెలుగు చూస్తున్నాయి. ఆశ్రమ పాఠశాలల్లో చిన్నపాటి జ్వరానికి వైద్యం అందించలేని పరిస్థితుల్లో విద్యార్థుల మరణాలు సంభవిస్తున్నాయి. వీటిని సరి చేయలేకపోతున్న యంత్రాంగం.. ఎన్ని ముస్తాబులు చేసినా ఏం లాభం? అన్నది గిరిజన సంఘాల వాదన -
జనకోటి సమరం
శుక్రవారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2025● స్వచ్ఛందంగా తరలివచ్చి సంతకాలు చేసిన విద్యార్థులు, యువత, పెద్దలు, మహిళలు ● పీపీపీ విధానం రద్దు చేయాలంటూ కోటి సంతకాల సేకరణకు పిలుపు నిచ్చిన వైఎస్సార్సీపీ అధినేత ● స్పందించిన రాష్ట్ర ప్రజలుసాక్షి నెట్వర్క్: చినుకు చినుకు వానగా మారి..వాన వరదై..వరద తుఫాన్గా రూపాంతరం చెందినట్లు కోటి సంతకాల సేకరణ ఉద్యమం నిరూపించింది. కలంతో చేసిన సంతకానికి తిరుగులేదని నిరూపించారు రాష్ట్రంలోని విద్యార్థులు, యువత, పెద్దలు, మహిళలు, మేధావులు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రానికి 17 వైద్య కళాలలు మంజూరు చేయించి వాటి నిర్మాణం చేపట్టి 5 కళాశాలలను పూర్తి చేశారు. పూర్తి చేసిన కళాశాలల్లో తరగతులు కూడా జరుగుతున్నాయి. అయితే మిగిలిన వైద్య కళాశాలల నిర్మాణం పూర్తి చేయాల్సిన కూటమి ప్రభుత్వం వాటిని పీపీపీ పద్ధతిలో కార్పొరేట్లకు అప్పగించేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టి కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని విజయవంతం చేశారు. కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, యువత, పెద్దలు, మేధావులు, మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. -
విజయవంతం
ప్రభుత్వ వైద్యం..సామాన్యుడికి ప్రాణవాయువు వంటిది. కానీ నేడు చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ విధానం పేరుతో ప్రభుత్వ వైద్య కళాశాలలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలని చూడడం శోచనీయం. ప్రభుత్వ రంగంలో ఉండాల్సిన వైద్య విద్యను ప్రైవేటు గడప దాటించడం అంటే, పేద విద్యార్థుల కలలను చిదిమేయడమే. ఫీజుల భారం మోయలేక మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్యకు స్వస్తి చెప్పాల్సి వస్తుంది. లాభాపేక్షే పరమావధిగా సాగే ప్రైవేటు యాజమాన్యాల చేతుల్లో విద్యార్థుల భవితవ్యం చిక్కుకుంటే, అది విద్యార్థి లో కానికే తీరని నష్టం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, వైద్య విద్యను ’ప్రజాహితం’ గానే ఉంచాలని, ’లాభసాటి’ వ్యాపారంగా మార్చవద్దని కోరుతున్నాం. –ఎల్. మణి, డిగ్రీ పట్టభద్రురాలు, పార్వతీపురం -
క్వారీ అనుమతులపై ప్రజాభిప్రాయం
పాచిపెంట: మండలంలోని మంచాడవలస సమీపంలో సర్వే నంబర్ 531లో గల సుమారు 15 హెక్టార్ల క్వారీ అనుమతులకు సంబంధించి గురువారం పనుకువలస వద్ద పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. సబ్కలెక్టర్ యశ్వంత్కుమార్ రెడ్డి పర్యావరణ శాఖ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు హాజరై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ మేరకు మెజారిటీ ప్రజలు క్వారీ ఏర్పాట వల్ల ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు. స్టోన్ క్రషర్ క్వారీ ఏర్పాటు చేయడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఉపాధి లభించడంతో పాటు ఇళ్ల నిర్మాణాలు, రోడ్లు, వివిధ అభివృద్ధి పనులకు స్టోనన్స్ అందుబాటులో ఉంటాయని జీగిరాం సర్పంచ్తో పాటు పణుకువలస సర్పంచ్ సీతారాం ఎంపీటీసీ లక్ష్మి తమ అభిప్రాయాలను వెల్లడించారు. ముఖ్యంగా క్వారీ ఏర్పాటు చేయడం వల్ల పర్యావరణం దెబ్బతినకుండా చుట్టూ మొక్కలు నాటడం వంటి పర్యావరణ పరిరక్షణ చర్యలను క్వారీ నిర్వాహకులు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలు స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు తెలిపారు. క్వారీకి అతి సమీపంలో గల శివాలయం దెబ్బతినకుండా చూడాలని చుట్టుపక్కల ప్రాంతాల రైతులు పంటలు నాశనం కాకుండా చూడాలని మంచాడవలస గ్రామస్తులు కోరారు. క్వారీ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న నవదుర్గ మైనింగ్ మేనేజింగ్ నిర్వాహకుడు నెక్కంటి శ్రీనివాసరావు మాట్లాడుతూ నిబంధనల మేరకు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా క్వారీ నిర్వహణ చేపట్టేందుకు అనుమతులు ఇప్పించాలని కోరారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ విషయాన్ని ప్రభుత్వం దష్టికి తీసుకువెళ్లి పై స్థాయి కమిటీ నిర్ణయాల మేరకు క్వారీ అనుమతులపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. పర్యావరణ శాఖ ఇంజినీర్ అరుణశ్రీ తహసీల్దార్ రవి ఎంపీడీఓ బీవీజే పాత్రో తదితరులు పాల్గొన్నారు. -
సచివాలయ సిబ్బంది నిర్వాకం
వీరఘట్టం: మండలంలోని కంబరవలస గ్రామానికి చెందిన రెట్టి కమల భర్త కామయ్య 2.7.2023న మృతి చెందాడు. వారి రేషన్కార్డులో భార్యాభర్తలు మాత్రమే ఉన్నారు. వారికి ప్రతి నెలా పది కిలోల బియ్యం వస్తున్నాయి. సచివాలయ సిబ్బంది కామయ్య చనిపోయినట్లు సివిల్ సప్లయిస్ పోర్టల్లో నమోదు చేశారు. దీంతో వారి రేషన్కార్డు రద్దయింది. 1.8.2023 నుంచి కమలకు రేషన్ సరుకులు నిలిచిపోయాయి. కొత్త రేషన్కార్డు కోసం ఆమె దరఖాస్తు చేస్తే ఆమె ఆధార్కార్డు నంబర్ ఎంటర్ చేయగానే డెత్ అని ఆన్లైన్లో చూపిస్తోంది. తన భర్తతో పాటు తాను కూడా డెత్ అని నమోదు చేయడంతోనే తన రేషన్కార్డు రద్దయిందని కమల వాపోతోంది. తాను బతికుండగానే తన రేషన్కార్డు రద్దు చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఒంటరి మహిళను అయిన తనకు అంత్యోదయ కార్డు మంజూరు చేసి 35 కిలోల బియ్యం ఇప్పించాలని ఆమె కోరుతోంది. -
నేరాలు,దారుణాలు పట్టించుకోరా?
● పోలీసులకు సవాల్గా నిలుస్తున్న దోపిడీలు, చోరీలు, హత్యలు కొత్తవలస: మండలంలో వరుస దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, యథేచ్ఛగా గంజాయి రవాణా జరుగుతున్నా కనీసం పట్టించుకునే పోలీసులే కరువయ్యారు. ఈ అంశాలపై కేసులు నమోదు చేయడమే తప్ప అరెస్టులు, రికవరీలు, దొంగలను పట్టుకునే పరిస్థితి ఏమీ లేకపోవడం గమనార్హం. కొత్తవలస మండలంలోని జరిగిన ఘటనల వివరాలు ఆగస్టు 26, 2024లో ఒక లారీలో 450 కేజీల గంజాయిని విశాఖపట్నం తరలిస్తుండగా అరకు–విశాఖ రోడ్డులో అప్పన్నపాలెం గ్రామం సమీపంలో పోలీస్లకు అజ్ఞాత వ్యక్తి సమాచారం ఇవ్వండంతో లారీని పట్టుకున్నారు. కాగా పోలీసులను చూసి నిందితులు పరరయ్యారు. లారీని సీజ్ చేసి 450 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే నేటికీ నిందితులను పట్టుకోలేదు. కేసును మూసే ప్రయత్నంలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. ● మండలంలోని గురుదేవా చారిటబుల్ ట్రస్టు చైర్మన్ రాపర్తి జగదీష్బాబు ఇంటో ఈ ఏడాది మే నెల 28వ తేదీన దొంగలు పడి సుమారు మూడు కేజీల బంగారం, రూ 5 లక్షలకు పైగా నగదు దోచుకు పోయారు.ఈ కేసును పోలీసులు ప్రతిస్టాత్మకంగా తీసుకుని అప్పటి జిల్లా ఎస్పీ స్వయంగా ఇన్వెస్టిగేషన్ చేశారు. అయినా నేటికీ అనుమానితులను పోలీసులు అరెస్టు చేయలేకపోయారు. ఒక్క పైసా నగదు, గ్రాము బంగారం రికవరీ చేయలేదు. ఈ దొంగతనం జిల్లా చరిత్రలోనే అతి పెద్దది కావడం విశేషం. ● అలాగే ఈ ఏడాది నవంబర్ 14న చింతలపాలెం గ్రామం సమీపంలో గల మీసాల రవిప్రకాష్ ఇంటిలో రాత్రి 12 గంటల సమయంలో కుటుంబ సభ్యులు అందరూ నిద్రిస్తుండగా బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి కుటుంబ సభ్యులను కొట్టి బంధించి రూ.24 వేల నగదు, కొంత బంగారాన్ని దోచుకుపోయారు. నేటికీ ఈ కేసులో అనుమానితులను పోలీసులు పట్టుకోలేకపోయారు. ● గత నెల 15న వియ్యంపేట గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ దూది రాము (మహిళ)ను ఇంటిలోనే దుండగులు హత్య చేశారు. ఈ హత్య కేసులో అనుమానితులను నేటికీ పట్టుకోలేకపోయారు. ● ఇలా చెప్పుకుంటూ పోతే మంగళపాలెం గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయంలోను, ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో గల ఆటోమైబెల్ షాపులోను దొంగలు పడి దోచుకుపోయినా నేటికీ పోలీసులు గుర్తించలేదు. ● స్వయాన రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ఉన్నా పట్టించుకోకపోవడం ఈ ప్రభుత్వం చేతకాని తనానికి నిదర్శనంగాా నిలుస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
వెబ్ల్యాండ్ ప్రాతిపదికన రీసర్వే చేయాలి
పార్వతీపురం: వెబ్ల్యాండ్ ప్రాతిపదికన భూముల రీసర్వేను పక్కాగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన కలెక్టరేట్లోని సమావేశమందిరంలో రెండవ విడత రీసర్వేపై గ్రామ సర్వేయర్లు, వీఆర్ఓలు, వీఆర్ఏలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాత రికార్డులు, కొత్త డిజిటల్ మ్యాపింగ్ వివరాలను సరి పోల్చి ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా రీసర్వే చేపట్టాలని సూచించారు. రైతులనుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించి రీసర్వేపై నమ్మకం కలిగించాలని చెప్పారు. తహసీల్దార్లు, సర్వేయర్లు సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రతి మండలంలో రోజువారీ పురోగతి నివేదికలను పంపించాలని కోరారు. ప్రతి గ్రామంలో అసైన్మెంట్ రిజిస్టర్ను మెయింటైన్ చేయాలని చెప్పారు. ఒరిజినల్ పట్టాదారు కానప్పుడు వారికి పీఓటీ యాక్ట్ ప్రకారం నోటీసులు జారీచేయాలని ఆదేశించారు. ప్రభుత్వ భూమిని జిరాయితీగా మార్చే అవకాశం లేదన్నారు. ఒకవేళ ఎక్కడైనా ప్రభుత్వ భూమి జిరాయితీగా మార్చితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సెటిల్ చేసిన ఈనామ్ భూములకు ఈనామ్ రైత్వారీ పట్టా అని క్లాసిఫికేషన్ పెట్టాలని సూచించారు. సమావేశంలో జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారి పి.లక్ష్మణరావు, పార్వతీపురం, పాలకొండ డీఐఓఎస్లు, రీసర్వే తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. జేసీ యశ్వంత్కుమార్ రెడ్డి -
స్వచ్ఛగ్రామంగా అంటిపేట రూపుదిద్దుకోవాలి
సీతానగరం: మండలంలోని అంటిపేట పంచాయతీ స్వచ్ఛగ్రామంగా రూపుదిద్దు కోవాలని సబ్కలెక్టర్ ఆర్ వైశాలి అన్నారు. ప్రతిపాదిత స్వచ్ఛగ్రామం అంటిపేటను సబ్కలెక్టర్ ఆర్ వైశాలి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వచ్ఛగ్రామంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. గ్రామంలో ఎక్కడా చెత్తకనిపించరాదని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిసరాలు శుద్ధి చేసుకుని స్వచ్ఛమైనగ్రామంగా తీర్చి దిద్దుకోవాలని గ్రామస్తులను కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ కె.ప్రసన్నకుమార్, ఎంపీడీఓ ఎంఎల్ఎన్ ప్రసాద్, సర్పంచ్ బి.తిరుపతిరావు, ఎంఈఓ సూరిదేముడు,ఇంజినీరింగ్ అధికారులు, గ్రామపెద్దలు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. కోటసీతారాంపురంలో మౌలికవసతుల కల్పనమండలంలోని కోటసీతారాంపురం గ్రామంలో ప్రజావసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రాధాన్యం ఇవ్వడం నిమిత్తం సబ్కలెక్టర్ ఆర్. వైశాలి బుధవారం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరాతీశారు. గ్రామాన్ని వ్యవసాయ, ఆర్ధిక,వాణిజ్య, విద్యాపరంగా అభివృద్ది పధకంలో నడిపించడానికి అవసరమైన వసతులు కల్పించడానికి వనరులపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం రైతు సేవాకేంద్రం ఆవరణలో గ్రామ పెద్దలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శి, సచివాలయ ఉద్యోగుల నుంచి గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడానికి అభిప్రాయాలను సేకరించారు. -
జిల్లా ఆస్పత్రిలో ‘బర్త్ వెయిటింగ్ హోమ్’
● పరిశీలించిన జిల్లా జేసీ యశ్వంత్ కూమర్ రెడ్డి పార్వతీపురం రూరల్: మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే గర్భిణులకు మెరుగైన ప్రసవ సేవలందించేందుకు జిల్లా ఆస్పత్రిలో ‘బర్త్ వెయిటింగ్ హోమ్’ ఏర్పాటు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ కేంద్రాస్పత్రిలో రూ. 11.50 లక్షల వ్యయంతో సమకూర్చిన ఆధునిక వైద్య పరికరాలను జిల్లా జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో, సి.యశ్వంత్ కుమార్ రెడ్డి బుధవారం రాత్రి నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ఆస్పత్రికి వచ్చే రోగులకు, ముఖ్యంగా గర్భిణులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన వైద్యసేవలు అందించాలని సిబ్బందికి స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారిణి డాక్టర్ పద్మావతి, ఆర్ఎంవో డాక్టర్ శ్యామల పాల్గొన్నారు.రెండు గడ్డివాములు దగ్ధంబొండపల్లి: మండలంలోని గొల్లుపాలెం గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు గడ్డివాములు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి గజపతినగరం అగ్నిమాపక కేంద్రం అధికారి ఎంఎస్వీ.రవిప్రసాద్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో గొర్లె బంగారునాయుడికి చెందిన రెండు గడ్డివాములపై గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్ కాల్చిపడేయడంతో మంటలు వ్యాపించి అగ్నికి ఆహుతయ్యాయి. సూమారు రూ.15 వేలు ఆస్తినష్టం సంభవించగా, పక్కన ఉన్న గడ్డివాములకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. రెండు తులాల బంగారం చోరీజియ్యమ్మవలస రూరల్: మండలంలోని పలు గ్రామాల్లో వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. దొంగలు ఒంటరి మహిళలను టార్గెట్ చేసి బరి తెగిస్తున్నారు. బుధవారం సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో చినకుదమ గ్రామంలోని విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో పొలం నుంచి ఇంటికి వస్తున్న నల్ల నారాయణమ్మ ముఖానికి మత్తు మందు కొట్టి ఆమె మెడలో ఉన్న రెండు తులాల బంగారం తాడును ఎత్తికెళ్లినట్టు బాధితురాలు పోలీసులకు తెలిపింది. తాను పొలం నుంచి ఇంటికి వస్తున్న సమయంలో ఎదురుగా మోటార్ బైక్పై వచ్చిన వ్యక్తి కనీసం ముఖానికి మాస్క్, హెల్మెట్ కానీ లేకుండా వచ్చి మత్తు మందు చల్లడంతో ఆ క్షణంలో ఏం జరిగిందో తనకు తెలియలేదని తెలిపింది. పరజపాడు గ్రామంలోని శివాలయంలో హుండీ కానుకలను మంగళవారం రాత్రి 12 గంటల సమయంలో ఓ దొంగ చాకచక్యంగా దోచుకున్న ఘటనపై చినమేరంగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్టు ఎస్సై అనీష్ తెలిపారు. వైఎస్సార్సీపీలో నూతన నియామకాలువిజయనగరం: రాష్ట్రంలో బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన నియామకాలకు సంబంధించిన జాబితాను పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ప్రకటించింది. ఇందులో భాగంగా వైఎస్సార్సీపీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గజపతినగరానికి చెందిన ఇజ్జరోతు రామునాయుడు, కార్యదర్శిగా బొబ్బిలికి చెందిన బొమ్మి అప్పలనాయుడు నియామకమయ్యారు. అదేవిధంగా జిల్లా ఫెడరేషన్ అధ్యక్షుడిగా రాజాంకు చెందిన మరిశర్ల గంగారావుకు బాధ్యతలు అప్పగించగా.. ఎస్కోట నియోజకవర్గ అధ్యక్షుడిగా గోపాల కృష్ణారావు, విజయనగరం నియోజకవర్గం అధ్యక్షుడిగా ఎం.పరమేశ్వరరావు, చీపురుపల్లి నియోజకవర్గం అధ్యక్షుడిగా సింగవరపు రామకృష్ణ, నెల్లిమర్ల నియోజకవర్గం అధ్యక్షుడిగా బోని చంద్రరావు నియామకమైనట్లు జాబితాలో పేర్కొన్నారు. -
ఘనంగా పెన్షనర్స్ డే
విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్ల వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెన్షనర్స్ దినోత్సవాన్ని బుధవారం స్థానిక సంఘం భనవనంలో ఘనంగా నిర్వహించారు., జిల్లా శాఖ అధ్యక్షుడు రామచంద్రపాండా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత అసోసియేషన్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 75 సంవత్సరాలు దాటిన పలువురు సీనియర్ రిటైర్డ్ ఉద్యోగులను సంఘం ఘనంగా సత్కరించింది. అనంతరం పలువురు మాట్లాడుతూ పీఆర్సీని ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు కలిపి బకాయిలు ఉన్న సుమారు రూ.35 వేల కోట్లను తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు పి.రామచంద్రరావు, ఏపీజీఈఏ రాష్ట్ర కార్యదర్శి ఎల్వీ యుగంధర్, జిల్లా కార్యదర్శి బలివాడ బాల భాస్కర్రావు, కార్యనిర్వాహక కార్యదర్శి పక్కి భూషణ్రావు, పెన్షనర్స్ ఎస్టీఓ నూకరాజు, కోశాధికారి సొంటి కామేశ్వరరావు, కార్యనిర్వాహక కార్యదర్శి కె.ఆదినారాయణ, ఉపాధ్యక్షులు కృష్ణంరాజు, డ్రైవర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు రామారావు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 100 మంది పెన్షనర్లకు సన్మానంఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆలిండియా పెన్షనర్స్డే కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంగా 100 మంది వృద్ధ పెన్షనర్లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పట్టణ శాఖ అధ్యక్షుడు వి.సూర్యనారాయణ, కార్యదర్శి త్రినాఽథ్ ప్రసాద్తో పాటు సంఘం కార్యవర్గ సభ్యులు, జిల్లావ్యాప్తంగా పెన్షనర్లు హాజరయ్యారు. -
లగ్జరీ బస్సును ఢీకొట్టిన లారీ
గజపతినగరం: మండలంలోని మరుపల్లి గ్రామం జంక్షన్ వద్ద లగ్జరీ ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు గాయాలపాలయ్యారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విజయనగరం నుంచి గజపతినగరం మీదుగా ప్రయాణిస్తూ మరుపల్లి గ్రామం సమీపంలో ఒక ఆర్టీసి పల్లె వెలుగు బస్సు ఆగి ఉంది. దాని వెనుక వస్తున్న వస్తున్న లగ్జరీ ఆర్టీసీ ఎక్స్ప్రెస్బస్సు ఆగి కొంతసమయం తరువాత ఆగి ఉన్న పాసింజర్ బస్సును తప్పించి కుడివైపు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో వెనుక నుంచి లగ్జరీ ఆర్టీసీ బస్సును లారీ డ్రైవర్ బలంగా ఢీకొట్టాడు.ఆతరువాత బైక్ను కూడా లారీ డ్రైవర్ ఢీకొట్టాడు. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రమాదంలో గాయాలపాలయిన డి.అప్పలనాయుడు(రేగిడి),కె.సూర్యప్రకాష్ (మిర్తివలస),పి.శ్రీను(గజపతినగరం మండలం మరుపల్లిగ్రామం),కె.మురళీకృష్ణ(గజపతినగరం మండలం మరుపల్లి గ్రామం),ఎన్.అప్పారావు(గంట్యాడ మండలం నరవ గ్రామం)లను గజపతినగరం ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించారు.బస్సు డ్రైవర్ సూర్యప్రకాష్ ఫిర్యాదు మేరకు ఎస్సై కె.కిరణ్ కుమార్ నాయుడు లారీని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐదుగురికి గాయాలు -
ఆ తల్లిదండ్రుల దాతృత్వానికి సత్కారం
● రోడ్డు ప్రమాదంలో మరణించిన కుమారుడి అవయవ దానం ● తల్లిదండ్రుల గొప్పతనాన్ని గుర్తించి సత్కరించిన మానవీయత సంస్థచీపురుపల్లిరూరల్(గరివిడి): కన్నకొడుకు మరణించాడని తెలిసినా, ఇక ముందు తమ కుమారుడు తమముందు కనిపించడని తెలిసినా, తమ కొడుకు మరణం మరో పది మందికి జన్మనివ్వాలనే ఆశయంతో దుఃఖంలో కూడా కొడుకు అవయవాలను దానం చేసి ఆ తల్లిదండ్రులు తమ దాతృత్వం చాటుకున్నారు. గరివిడి మండలంలోని కాపుశంభాం గ్రామానికి చెందిన టొంపల సుమంత్ రాజాంలో ఓ ప్రైవేట్ కంపెనీలో ఏజెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు.ఈనెల 13న విధులు ముగించుకుని రాజాం నుంచి చీపురుపల్లి వైపు ఆటోలో వస్తుండగా ఓ వ్యాన్ ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడిన సుమంత్ను శ్రీకాకుళం జెమ్స్ ఆస్పత్రికి తీసుకువెళ్లగా బ్రెయిన్డెడ్గా వైద్యాధికారులు నిర్ధారించారు. ఈ మేరకు సుమంత్ తల్లిదండ్రులు రమణ, ఆరుద్రలు కొడుకు మరణించిన బాధలో ఉండి కూడా కొడుకు అవయవాలను దానం చేశారు. ఆ తల్లిదండ్రుల దాతృత్వాన్ని గుర్తించిన చీపురుపల్లి పట్టణానికి చెందిన మానవీయత స్వచ్చంద సంస్థ వ్యవస్ధాపకుడు, రెడ్ క్రాస్ చైర్మన్ బీవీ గోవిందరాజులు గ్రామంలోనికి బుధవారం వెళ్లి సుమంత్ తల్లిదండ్రులను సత్కరించారు. 12 మందికి పునర్జీవం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో కొడుకు అకాల మరణంతో చెప్పలేని దుఖంలో ఉన్నప్పటికీ కొడుకు అవయవాలైన కిడ్నీలు, కాలేయం, హృదయం, నేత్రాలు దానం చేసి మరో 12 మందికి పునర్జీవం కల్పించారని ప్రశంసించారు. శ్రీకాకుళం జిల్లాలోని జెమ్స్ హాస్పిటల్లో జరిగిన ఈ అవయవాల దానం గ్రీన్ఫీల్డ్ ద్వారా పంపించి అవసరమైన వారికి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ జనరల్ సెక్రటరీ రామ్మూర్తినాయుడు, స్థానిక ఎంపీటీసీ టి.సంజీవ్ ఉన్నారు. -
టీచర్ల కామన్ సర్వీస్ రూల్స్కు తొలగిన అడ్డంకులు
● ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడువిజయనగరం అర్బన్: కొన్నేళ్లుగా కోర్టుల్లో వివాదాలతో నడుస్తున్న టీచర్ల కామన్ సర్వీసు రూల్స్ అంశానికి అడ్డంకులు తొలగాయని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీనివాసులు నాయుడు అన్నారు. ఈ మేరకు స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో తెలిపారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన 26 జిల్లాలను రాష్ట్రపతి అనుమతించి గెజిట్ ఇటీవల విడుదలైందని ఈ నేపథ్యంలో గతంలో ఉమ్మడి రాష్ట్రంలోని జోన్, డివిజన్, జిల్లా ప్రామాణికాలు రద్దవుతాయన్నారు. నూతనంగా ఏర్పడిన 26 జిల్లాలు, జోన్లు ప్రామాణికంగా తీసుకుని జిల్లాపరిషత్, మున్సిపాలిటీ, ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలలన్నింటి నిర్వహణ విద్యాశాఖలోకి తీసుకురావడానికి రాష్ట్రప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని తెలిపారు. గెజిట్ను అమలు చేయడానికి ముందుగా ఉన్నతాధికారులతో కమిటీ వేసి రాష్ట్రప్రభుత్వం అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. కామన్ సీనియారిటీ ఆధారంగా లోకల్ కేడర్, నిబంధనలు, పదోన్నతుల ప్రక్రియకు మార్గదర్శకాలను కమిటీ కనీసం 27 రోజుల మినిమమ్ కాలవ్యవధిలో రూపకల్పన చేయాల్సి ఉంటుందని వివరించారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ సెలవుల వయోపరితిని సర్వీసులో ఉన్నంత వరకు పెంచడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపిందని చెప్పారు. 2004 సెప్టెంబర్ తరువాత ఉద్యోగాల్లో ప్రవేశించిన వారికి వర్తింప చేసిన సీపీఎస్ పెన్షన్ స్కీం అప్పడికే నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు రాసి ఉద్యోగాలకు పెంపికై న వారికి సీపీఎస్ కాకుండా పాత పెన్షన్ స్కీం అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.రవీంద్రనాయుడు, డి.శ్రీనివాస్, పీఆర్టీయూ ఉత్తరాంధ్ర మీడియా ఇన్చార్జ్ బంకపల్లి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఇదెక్కడి తీరు ‘బాబూ’..!
● బస్తా యూరియా కోసం పొటాష్, గడ్డి మందు కొనుగోలు చేయాలా? ● వాటికోసం వేల రూపాయలు ఖర్చుపెట్టాలా? ● చీపురుపల్లిలో రైతుల ఆందోళన ● ఎరువుల దుకాణదారు తీరుపై ఆగ్రహం చీపురుపల్లి: ఒకే ఒక్క యూరియా బస్తా కోసం వేలకు వేలు ఖర్చు చేయాలంటే ఎక్కడి నుంచి అప్పులు తేవాలి?.. వ్యవసాయం ఎలా చేయాలి?.. పంటలు పండించొద్దు అంటే చెప్పండి.. మానేస్తాం... కానీ ఇలా బస్తా యూరియా కోసం వేలకువేలు ఖర్చు చేయలేం.. ఇదెక్కడి అన్యాయం ‘బాబూ’ అంటూ రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ఎరువుల కోసం ఇన్నిపాట్లా అంటూ నిట్టూర్చారు. చీపురుపల్లి పట్టణంలోని శివరాం రోడ్డులో ఉన్న మనగ్రోమోర్ కేంద్రం వద్ద బుధవారం యూరియా కోసం వచ్చిన రైతులకు చేదు అనుభవం ఎదురైంది. యూరియా కావాలంటే పొటాష్, డీఏపీ, గడ్డి మందు కొనుగోలు చేయాలని, లేదంటే యూరియా ఇవ్వమని అక్క డి సిబ్బంది చెప్పడంతో రైతులు ఖంగుతిన్నారు. కొద్ది రోజుల కిందట నాలుగైదు వేలు వెచ్చించి మనగ్రోమోర్ సిబ్బంది చెప్పినవన్నీ కొనుగోలు చేశామని, అయినప్పటికీ యూరియా ఇవ్వడం లేదంటూ బిల్లుల తీసుకుని వచ్చిన మరికొందరు రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. డీఏపీ, పొటాష్, గడ్డి మందు కొనుగోలు చేసిన వారికి కూడా యూరి యా ఇవ్వకపోవడంతో వారంతా ఆందోళనకు దిగా రు. చంద్రబాబు ప్రభుత్వంలో రైతన్న కష్టాలపై ఏకరువుపెట్టారు. రైతంటే గౌరవం పోయిందంటూ వాపోయారు. విషయం తెలుసుకున్న వ్యవసాయ శాఖ ఏడీ ఎన్.కోటేశ్వరరావు, ఏఓ సూర్యకుమారి దుకాణం వద్దకు చేరుకున్నారు. ఏఓ సూర్యకుమారి స్వయంగా మనగ్రోమోర్ కౌంటర్లో కూర్చుని రైతులకు ఎలాంటి అదనపు కొనుగోళ్లు లేకుండా యూరియా పంపిణీ చేశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని స్పష్టంచేశారు. -
ఇలాగైతే కష్టం.. వెళ్లిపోతాం..
● భార్య అధికారంతో అధికారులపై భర్త స్వారీ ● గ్రామాల్లో తాము చెప్పే పనులే చేపట్టాలని హుకుం ● ఉపాధి హామీ పనుల్లో జోక్యం ● అనుమతులు ఇవ్వద్దని అధికారులపై ఒత్తిడి ● సామూహికంగా సెలవుకు ఇంజినీరింగ్ అధికారుల నిర్ణయం సాక్షిప్రతినిధి, విజయనగరం: ఏమయ్యా ఆఫీసర్లు.. నేను చెబితే వినరా..? ఏం.. నాకేం తక్కువ.. నాకు పవర్ లేదా..? నేను మీ అమ్మగారికే అయ్యగార్ని.. అంటే నేనే ఎక్కువ పవర్ ఫుల్.. కాబట్టి నేను చెప్పేది టకటకా నోట్ చేసుకుని ఫటఫటా చేసేయాలి. నేను వద్దన్న చోట ఉపాధి హామీ పనులు గట్రా శాంక్షన్ ఇవ్వకండి.. అంతా మనం చెప్పినట్లే అవ్వాలి.. మనం చెప్పినవాళ్లకే ఇవ్వాలి. ఇదీ ఆయనగారి దాదాగిరి. మళ్లీ గెలుస్తామో లేదో.. ఇప్పుడే ఎంతైనా పవర్ చూపేయాలి.. అనే ఆతృతతో అసంబద్ధంగా ఇష్టానుసా రం అధికారులపై స్వారీ చేస్తున్నారు. ఈయన తొందర.. తుత్తర వ్యవహారంతో భరించలేని అధి కారులు ‘ఈయనకు తెలియదు.. చెబితే వినడు.. ఇక్కడ ఉద్యోగం చేయడం కన్నా సెలవుపై పోవ డం’ మేలు అంటూ ఒక్కొక్కరుగా విధుల నుంచి తప్పుకుంటున్నారట. నెల్లిమర్ల నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో మొత్తం 105 పంచాయతీలు ఉండగా ఆయా పంచాయతోల్లో అభివృద్ధి పనుల నిమిత్తం ఒక్కో మండలానికి రూ.20 కోట్ల చొప్పున కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపాధి హామీ నిధులు మంజూరయ్యాయి. పంచాయతీలు తీర్మానం చేసుకుని ఆ నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉంది. చాన్నాళ్లకు నిధులు రావడంతో పల్లె ప్రజల అవసరాలు తీర్చేలా సర్పంచులు, ఎంపీటీసీలు సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణాలు వంటివి చేపట్టేందుకు శ్రీకారం చుట్టారు. నిబంధనల ప్రకా రం అధికారులు కూడా పనులకు ఆమోదం తెలిపారు. అంతే... ‘లోకం’మెచ్చిన పనులను అడ్డుకునేందుకు అమ్మగారి భర్త రంగంలోకి దిగారు. తా ము ఎక్కడ చెబితే అక్కడే పనులు చేపట్టాలంటూ అధికారులను బెదిరిస్తున్నారు. అమ్మగారి పీఏ కూ డా ‘రాజు’ అవతారంలో అధికారులకు ఆదేశాలు జారీచేసేస్తున్నారు. ఇప్పటికే ప్రారంభమైన పనుల ను కూడా ఆపాలని చెబుతుండడంతో అధికారు లు ఇరకాటంలో పడ్డారు. చేస్తే మేము చెప్పినట్లు చేయండి.. లేదా సెలవుపై వెళ్లిపోండి అని వాళ్లిద్ద రూ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని ఒక జేఈ స్థా యి అధికారి ఆవేదన వ్యక్తం చేయడంగమనార్హం. ఆధిపత్య పోరుతో జనం ఇబ్బందులు టీడీపీ తరఫున ఎమ్మెల్యే సీటు వస్తుందని బంగార్రాజు ఆశించారు. ఆయనకు పార్టీ క్యాడర్ నుంచి సపోర్ట్ ఉంది. పైగా స్థానికుడు. పొత్తులో భాగంగా ఎమ్మెల్యే టికెట్టు జనసేనకు ఇచ్చారు. ఆయన సహకారంతో గెలిచినా... అనంతర కాలంలో ఇరువర్గాల మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతోంది. ఆయన ప్రాబల్యాన్ని అడ్డుకునేందుకు అభివృద్ధి పనులను అడ్డుకుంటూ ‘లోకం’ దృష్టిలో దంపతు లు పలచన అయిపోతున్నారన్నది జనంమాట. అసంబద్ధమైన ఆలోచనలతో తమను బెదిరిస్తున్న ప్రజాప్రతినిధి భర్తతో వేగలేక పోతు న్నాం అంటూ ఉపాధిహామీ అధికారులు లోలో న బాధపడుతున్నారు. ఈయనకు పాలసీ తెలియదు.. చెబితే వినేరకం కాదు. ఇలా అడ్డదిడ్డంగా వాదిస్తూ విరుచుకుపడితే ఉద్యోగాలు ఎలా చేస్తాం అని మదనపడుతూ అధికారులు సెల వుపై వెళ్లిపోతున్నారని ఉద్యోగవర్గాల సమాచారం. ఇప్పటికే నెల్లిమర్ల, డెంకాడ జూనియర్ ఇంజినీర్లు, డీఈ సెలవుపై వెళ్లిపోయారు. కొన్నాళ్లు ఆగి వద్దాం.. అప్పటికి వేరే చోట పోస్టింగ్ వెతుక్కుందాం.. ఈ తలనొప్పులు లేకుండా ఉద్యోగం చేసుకునే చోట పోస్టింగ్ దొరికితే మేలు అనే భావనలో వారున్నారని తెలుస్తోంది. భోగాపురం, పూసపాటిరేగ జూనియర్ ఇంజినీర్లు కూడా అయ్యగారి మెహర్బా నీతో భరించలేక సెలవుమీద వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. పనులు నిలిపివేసి... నెల్లిమర్ల ఎంపీపీ అంబళ్ల సుధారాణి స్వగ్రా మం ఒమ్మి పంచాయతీలో చాన్నాళ్లుగా పెండింగ్లో ఉన్న డ్రైనేజీ నిర్మాణాన్ని ఉపాధిహామీ నిధులతో ఇటీవల శ్రీకారం చుట్టారు. జేసీబీల ను ఏర్పాటు చేసి కాలువ పనులు ప్రారంభించారు. సమాచారం తెలుసుకున్న అయ్యగారు, సహాయకుడు ఫీల్డ్లోకి వెళ్లి రచ్చరచ్చ చేశారు. ఎవరికి చెప్పి పనులు చేస్తున్నారని అక్కడున్న కూలీలతో వాగ్వాదానికి దిగారు.వెంటనే జేఈ, డీఈలకు ఫోన్చేసి తక్షణమే పనులు ఆపాలంటూ హుకుంజారీచేశారు. అభివృద్ధి పనులు ఆపడంతో అక్కడున్న స్థానికులు తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశారు. మేము లేనప్పుడు వచ్చి పనులు ఆపారని... ఈ సారి గ్రామంలోకి వస్తే తమ సత్తా చూపిస్తామని హెచ్చరికలు జారీ చేశారట. కొత్తపేట గ్రామంలో కూడా సీసీ రోడ్డు పనులను ఇదే తరహాలో నిలిపివేశారు. -
క్లాట్లో బొబ్బిలి కుర్రాడి ప్రతిభ
బొబ్బిలి: పట్టణానికి చెందిన వేమిరెడ్డి నితిన్ చంద్ర మంగళవారం విడుదలైన క్లాట్ (కామన్ లా అడ్మిషన్ టెస్ట్–26) ఫలితాల్లో జాతీ య స్థాయిలో 90వ ర్యాంకు సాధించాడు. ఓబీసీలో 5వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. క్లాట్లో కుమారుడు ప్రతిభ చూపడంతో తల్లిదండ్రులు శ్యామల, బాబూరావు సంతోషం వ్యక్తం చేశా రు. పట్టణ వాసులు, విద్యావేత్తలు, న్యాయవాదులు నితిన్చంద్రను అభినందించారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన బెంగళూరు లా యూనివర్సిటీలో మాస్టర్స్ లా చేసి ప్రజలకు న్యాయ సేవలందించడమే ఆశయమని నితిన్ తెలిపాడు. విజయనగరం అర్బన్: ప్రతి గ్రామంలో పశుగ్రాస కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల పాడి పరిశ్రమను మరింత అభివృద్ధి చేయవచ్చని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం ప్రారంభమైన ముఖ్యమంత్రితో కలెక్టర్ల సమావేశంలో ఆయన ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పశుగ్రాస కేంద్రాల ఏర్పాటువల్ల పాలఉత్పత్తి పెరగడంతో రైతులు, పాడి రైతుల ఆదాయం మెరుగుపడుతుందన్నారు. గ్రామీణ ప్రజల ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుందని తెలిపారు. చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ కళాశాలకు చెందిన విద్యార్థులు క్విజ్ పోటీల్లో ప్రతిభ చూపారు. సొసైటీ ఆఫ్ యానిమల్ ఫిజియాలజిస్టు ఆఫ్ ఇండియా ఆధ్వ ర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన దక్షిణ భారత క్విజ్ పోటీల్లో కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న బి.జ్ఞాన సంధ్యారాణి, తృతీయ సంవత్సరం చదువుతున్న వి.సంజనశర్మ విజేతలుగా నిలిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విజేతలను కళాశాలలో బుధవారం నిర్వహించిన అభినందన సభలో అసోసియేట్ డీన్ మక్కేన శ్రీను అభినందించి దుశ్శాలువతో సత్కరించారు. క్విజ్ పోటీలు విద్యార్థుల మేధోశక్తికి దోహదపడతాయన్నారు. జాతీయ స్థాయి పోటీల్లో రాణించి కళాశాలకు పేరు తీసుకురావా లని ఆకాంక్షించారు. కార్యక్రమంలో విద్యార్థి వ్యవహారాల అధికారి డా.వై.ఆర్.అంబేడ్కర్, అకడమిక్ అధికారి దీపిక, డిపార్ట్మెంట్ హెడ్ టి.ప్రసాదరావు, గంగునాయుడు, రాజీవ్, విద్యార్థులు పాల్గొన్నారు. ● యూరియా కోసం.. -
విద్యార్థి మరణానికి పూచీకత్తు..!
గుమ్మలక్ష్మీపురం: ఇటీవల కాలంలో వివిధ ఆరోగ్య సమస్యలతో పార్వతీపురం మన్యం జిల్లాలోని పలువురు విద్యార్థులు ఆస్పత్రుల్లో చేరడం, కొందరు మరణించడం షరామామూలుగా మారింది. అయితే... ఓ పదో తరగతి విద్యార్థి మృతిని దాచిపెట్టడం, మృతికి తాము కారణం కాదంటూ నిరక్షరాస్యులైన తల్లిదండ్రులతో పాఠశాల హెచ్ఎం పేరున పూచీకత్తుపత్రం రాయించుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఇది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పాఠశాల సిబ్బంది తీరుపై గిరిజన సంఘాలు భగ్గుమంటున్నాయి. మరణానికి కారణం ఏదైనా కావచ్చని, పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులతో పూచీకత్తు రాయించడం గతంలో ఎన్నడూ చూడలేదంటూ మండిపడుతున్నారు. గిరిజన సంక్షేమశాఖకు ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి సంధ్యారాణి సొంత జిల్లాలోనే గిరిజనుల ఆరోగ్యానికి భరోసా లేకుండా పోయిందంటూ విమర్శిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే... గుమ్మలక్ష్మీపురం మండలం దొరజమ్ము ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న తాడంగి అవిష్ (15) అనారోగ్యంతో ఈ నెల 14న మృతి చెందాడు. అవిష్ది గుమ్మలక్ష్మీపురం మండలం వాడజంగి గ్రామం. విద్యార్థి చిన్నాన్న కుమార్తె ఈ నెల 13న మృతి చెందింది. ఆమె అంత్యక్రియల కోసం పాఠశాలకు వచ్చి అవిష్ను ఇంటికి తీసుకెళ్లారు. మరుసటిరోజు అవిష్ అకస్మాత్తుగా మృతిచెందాడు. ఈ విషయం బయటకు పొక్కకుండా పాఠశాల సిబ్బంది జాగ్రత్తపడ్డారు. ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో అవిష్ మృతి చెందాడని, ఈ ఘటనకు పాఠశాల సిబ్బందికి ఎలాంటి సంబంధం లేదంటూ నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు డెక్కన్న, డోరమ్మ రాతపూర్వకంగా తెలియజేసినట్టు వారితో వేలిముద్రలు వేయించారు. పాఠశాల హెచ్ఎంకు అడ్రస్ చేస్తూ అమానవీయంగా రాయించుకున్న పూచీకత్తు పత్రం ఇప్పుడు వెలుగు చూడడంతో గిరిజన సంఘాల నాయకులు, మేధావులు విస్తుపోతున్నారు. ఆదుకుంటాడనుకున్న కుమారుడి మృతితో పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులను ఓదార్చాల్సిన సిబ్బంది ఎవరి సూచనల మేరకు ఇలా పూచీకత్తు పత్రం రాయించారన్న అంశం చర్చనీయాంశంగా మారింది. మరణానికి కారణాలు ఏవైనా కావచ్చని, నిరక్షరాస్యులైన గిరిజనులతో వేలిముద్రలు వేయించడం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. వాస్తవంగా మృతిచెందిన అవిష్ ఏడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలిసింది. విద్యార్థికి వైద్యసేవలందించడంలో నిర్లక్ష్యం చేసినట్టు సమాచారం. విద్యార్థి మృతిని గోప్యంగా ఉంచడంలో ఆంతర్యం అర్థంకాని ప్రశ్నగా మారింది. -
రెవెన్యూ వేదన.. క్లినిక్లో చికిత్స అందేనా!
ఈయన పేరు గుణుపూరు పారినాయుడు, సీతానగరం మండలం కృష్ణరాయపురం గ్రామం. ఆయనకు సర్వే నంబర్ 160–1లో 52.50 సెంట్ల భూమి ఉంది. రీసర్వే సమయంలో 50 సెంట్లు పడితే అదే భూమి కొలిచారు. తన భూమిని అదే సర్వే నంబరులో ఇంకొకరి పేరులో ఉంది. వారికి 91.50 సెంట్లు ఉంటే.. దానిని 98 సెంట్లుగా ఆన్లైన్ చేశారు. సర్వే నంబరు 160–3లో పాస్ పుస్తకం ప్రకారం 29 సెంట్లు ఉంటే.. ఆన్లైన్లో 27 సెంట్లుగా చూపించారు. తర్వాత 27 సెంట్లను కాస్త 23 సెంట్లుగా మార్చి చూపారు. రీసర్వే జరిపి, తప్పులను సరి చేయాలని.. అందుకయ్యే మొత్తం భరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన మొర పెట్టుకుంటున్నా ప్రయోజనం లేకపోతోంది. బలిజిపేటకు చెందిన చోడవరపు సూర్యనారాయణ పేరు మీద ఉన్న 48 సెంట్ల భూమిని.. తన కుమార్తె కెల్ల లక్ష్మి పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకు కొద్దిరోజుల కిందట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు. తీరా, అందులో 40 సెంట్ల భూమి మాత్రమే ఉన్నట్లు చూపించడంతో సమస్యను పరిష్కరించాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే మూడు దఫాలు కలెక్టరేట్కు వచ్చానంటూ ఆయన వాపోయారు. సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో రెవెన్యూపరమైన సమస్యలు కోకొల్ల లు. ప్రతి వారం కలెక్టరేట్లో జరిగే ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే వినతుల్లో రెవెన్యూ సంబంధితమైనవే అధికం. దాదాపు సగానికిపైగా భూ సంబంధిత సమస్యలే. చాలా వరకు వివాదాల్లో ఉన్నవే. వీటిని పరిష్కరించడానికి సమ యం పట్టవచ్చు. ఇదే విషయం అర్జీదారులకు అర్థ మయ్యేలా, సంతృప్తికర స్థాయిలో చెప్పడం అధికారుల బాధ్యత. రెవెన్యూ శాఖలో అది జరగడం లే దు. అధికారులకు, సిబ్బందికి డబ్బులిచ్చినా, ప్రజాప్రతినిధుల సిఫారసులున్నా.. ఎలాంటి పనైనా ఇట్టే పూర్తి చేస్తారన్న ఆరోపణలు ఈ శాఖ మీద ఉన్నా యి. అదే సామాన్యులు ఏళ్ల తరబడి కాళ్లరిగేలా తిరిగినా ప్రయోజనం ఉండదు. ఈ కారణం వల్లే ఎక్కువగా ఏసీబీ వలలో పడే అధికారుల్లో రెవెన్యూవారే ఉంటున్నారు. రెవెన్యూ సమస్యలకు చెక్ పెట్టేలా.. సంయుక్త కలెక్టర్ నాయకత్వంలో జిల్లాలో రెవెన్యూ క్లినిక్కు కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి శ్రీకారం చుట్టారు. కలెక్టరేట్లోనే ప్రతి సోమవారం ఒకవైపు పీజీఆర్ఎస్ జరగగా.. మరోచోట రెవెన్యూ క్లినిక్ను నిర్వహిస్తున్నారు. దీనిని సెప్టెంబర్ 29న ప్రారంభించారు. ఇప్పటి వరకు 10 ‘క్లినిక్’లు చేపట్టారు. ప్రత్యేకంగా ఐదు కౌంటర్లు ఏర్పాటు చేసి, వీలైన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నట్లు అధికారులు అంటున్నారు. దీర్ఘకాలిక సమస్యలున్నప్పుడు వాటిని ప్రాథమికంగా విచారణ చేయడానికి మండలాల తహసీల్దార్లు, ఇద్దరు సబ్ కలెక్టర్లు, జేసీని ఉంచి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ క్లినిక్కు మొదటి ఆరు వారాల్లో 227 ఫిర్యాదులు అందగా.. అవన్నీ పరిష్కరించేశామని ప్రకటించుకోవడం గమనార్హం. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రయత్నిస్తే.. 173 మంది ఫోన్ తీసి, తమ సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పుకొంటున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. విజ్ఞప్తులు ఇచ్చిన వారే మరలామరలా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రతివారం పెరుగుతున్న వినతుల సంఖ్యే ఇందుకు నిదర్శనం. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో అధిక శాతం మంది నిరక్షరాస్యులే. ఐవీఆర్ఎస్ కాల్స్ పట్ల వారికి ఉన్న అవగాహన కూడా తక్కువే. అటువంటి వారి నుంచి అభిప్రాయాలు సేకరించి, వంద శాతం పూర్తి చేసేశామని అధికారులు చెప్పుకోవడంపై ప్రజాసంఘాల నుంచి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చిన్నపాటి ఆన్లైన్ సమస్యలకే మోక్షం చూపడం లేదని, క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తే.. ఇక్కడి వరకు రావాల్సిన అవసరం ఏముంటుందని సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ చిత్రంలోని వ్యక్తి పేరు చింతా సత్యనారా యణ. పెద్దగైశీల గ్రామం. తల్లి పేరిట ఉన్న డీ పట్టా భూమిని తన పేరున మార్చాలని కోరుతూ.. ఇటీవల కలెక్టరేట్లో జరిగిన ‘రెవెన్యూ క్లినిక్’కు వచ్చాడు. ప్రజాసమస్యల పరిష్కార వేదికకు ఆయన రావడం ఇది మూడోసారి. అది అవుతుందా? లేదా?.. అవ్వకపోతే ఎందు కు మారదు? వంటి సహేతుకమైన కారణాన్ని గ్రా మ, మండల స్థాయిలోనే చెప్పి సమస్యను పరిష్కరించవచ్చు. ఆ పనిని రెవెన్యూ యంత్రాంగం సక్రమంగా చేయలేకపోవడంతో కొన్నాళ్లుగా ఆయన అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. -
జాతీయస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఆరికతోట విద్యార్థులు
రామభద్రపురం: ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో జరిగిన రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన మండలంలోని ఆరికతోట ఉన్నత పాఠశాల విద్యార్థులు జాతీయస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికై నట్లు ఆ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు బి.రత్నకిషోర్ తెలిపారు.అండర్ 17 విభాగంలో రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ క్రీడా పోటీల్లో జిల్లా బాలికల జట్టు ప్రథమ స్థానం సాధించింది. బాలుర జట్టు ద్వితీయ స్థానం సాధించిందన్నారు. అందులో ఆంఽధ్రప్రదేశ్ తరఫున జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే 16 మంది సభ్యులలో తమ పాఠశాలకు చెందిన రేజేటి శ్రావణి, బాలుర జట్టు తరఫున ఎం.రంజిత్ కుమార్లు ఎంపికై నట్లు తెలిపారు. జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికై న విద్యార్థులను పాఠశాల హెచ్ఎం జి కృష్ణవేణి, ఉపాధ్యాయులు మంగళవారం అభినందించారు. -
మనమిత్రతో పోలీసు సేవలు సులభతరం
● ఎస్పీ ఏఆర్ దామోదర్విజయనగరం క్రైమ్: ‘మనమిత్ర‘ అనే వాట్సాప్ గ్రూప్తో పోలీసు సేవలు మరింత సులభతరం చేస్తున్నట్లు ఎస్పీ దామోదర్ మంగళవారం అన్నారు. డిజిటల్ పాలనలో భాగంగా పోలీస్ సేవలు మరింత సులభతరంగా, త్వరితంగా, పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతో వాట్సాప్ గవర్నెన్స్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకువ చ్చామన్నారు. ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇంటి నుంచే పోలీసు సేవలను పొందవచ్చునన్నారు. ఎఫ్ఐఆర్, ఎఫ్ఐఆర్ ప్రస్తుత స్థితి, ఈచలాన్ వివరాలు వంటివి సంబంధిత పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండానే సులభంగా పొందవచ్చన్నారు. ఈ సేవలను పొందేందుకు ప్రజలు ముందుగా 9552300009 సెల్ నంబరును వారి మొబైల్ ఫోన్లో సేవ్ చేసుకుని, ఆ నంబర్కు ఏజీ అని మెసేజ్ చేయగానే వివిధ రకాల ప్రభుత్వ సేవలు వివరాలు మొబైల్ కు వస్తాయన్నారు. అందులో పోలీసుశాఖ సేవలను ఎంచుకుని, ఎఫ్ఐఆర్, ఎఫ్ఐఆర్ స్థితి, ఈచలాన్ వివారాలు సులభంగా ఇంటివద్ద నుంచే పొందవచ్చన్నారు. క్యుఆర్ కోడ్ ను స్కాన్ చేసి కూడా పైన తెలిపిన పోలీసు సేవలు తక్షణమే పొందవచ్చునన్నారు. ఈ క్యూఆర్ కోడ్ ను జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో, పోలీసు ఆఫీసులలో అందుబాటులో ఉంచామన్నారు. ఈ మనమిత్ర (వాట్సాప్ గవర్నెన్స్)ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దీని ద్వారా ప్రజల సమయాన్ని ఆదా చేసుకోవడమే కాకుండా, ప్రభుత్వం, ప్రజల మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. -
తిరుగు ప్రయాణంలో భవానీ భక్తుడి మృతి
చికెన్● గుర్తు తెలియని వాహనం ఢీకొని ప్రమాదంపాలకొండ రూరల్: ఆధ్యాత్మిక చింతనతో భవానీ మాల ధరించిన పట్టణంలోని 16వ వార్డు కుమ్మరివీధికి చెందిన ద్రాక్షవరపు రాంబాబు(36) కూరగాయల మార్కెట్లో కలాసీగా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దీక్ష ముగింపులో భాగంగా ఈ నెల 12న సహ దీక్షాధారులు 19 మందితో కలసి ప్రత్యేక వాహనంలో విజయవాడ పయనమయ్యారు. అమ్మవారి దర్శనం అనంతరం మాల విసర్జన పూర్తి చేసి 13వ తేదీన తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో రాత్రి 10 గంటల సమయంలో తమ వాహనం పుణ్యక్షేత్రం అన్నవరం సమీపంలో పత్తిపాడు ప్రాంతం వద్దకు చేరుకున్న క్రమంలో బహిర్భూమికి వెళ్లేందుకు వాహనం దిగివెళ్లిన రాంబాబు ఎంతసేపటికీ వాహనం దగ్గరకు చేరలేదు. తన వద్ద సెల్ఫోన్కుడా లేకపోవడంతో సహచరులు ఆచూకీ తెలుసుకోలేకపోయారు. ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో మరునాటి ఉదయం వరకూ వాహనం నిలిపిన ప్రదేశంలో ఎదురు చూసి 14వ తేదీ ఉదయం అన్నవరం పోలీస్ స్టేషన్లో సహ భవానీలు ఫిర్యాదు చేశారు. పాలకొండ వచ్చిన వారికి మంగళవారం రాంబాబు గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందిన నట్లు పోలీసుల నుంచి సమాచారం అందింది. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకుడు, ఆ వార్డు కౌన్సిలర్ కడగల వెంకట రమణ అన్నవరం పయనమయ్యారు. దగ్గరుండి పోస్టుమార్టం పూర్తి చేయించి, రాంబాబు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు. మృతునికి భార్య రాజేశ్వరి, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. అమ్మవారి దర్శనానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయావా అంటూ బంధువులు కన్నీరుపెట్టారు. -
ఇంటర్ యూనివర్సిటీ బేస్బాల్ పోటీలకు గరివిడి విద్యార్థుల ఎంపిక
చీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి ఎస్డీఎస్ కళాశాలకు చెందిన విద్యార్ధులు ఎం.అజయ్, ఎస్.ప్రవల్లికలు ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ బేస్బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఆంధ్రాయూనివర్సిటీలో ఈ నెల 15న జరిగిన బేస్బాల్ టీమ్ సెలక్షన్లో ఈ విద్యార్ధులు అర్హత సాధించారు. వచ్చే ఏడాది జనవరి 4 నుంచి 8 వరకు మహారాష్ట్రలోని పూణేలో జరగనున్న ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ బేస్బాల్ పోటీల్లో ఆంధ్ర యూనివర్సిటీ తరఫున ఈ విద్యార్థులు ప్రాతినిధ్యం వహిస్తారు. తమ కళాశాల విద్యార్థులు ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ బేస్బాల్ పోటీలకు ఎంపిక కావడం పట్ల కరస్పాండెంట్ బి.రవి, ప్రిన్సిపాల్ డా.ఎ.రామకృష్ణ, వైస్ ప్రిన్సిపాల్ సీహెచ్.సురేష్కుమార్, పీడీ ఎం.భానుమూర్తి విద్యార్థులను మంగళవారం అభినందించారు. -
ఇంటర్ పరీక్షల నిర్వహణ పకడ్బందీగా జరగాలి
● ఇంటర్ బోర్డు రిసోర్స్ పర్సన్, ప్రొఫెసర్ ఎన్.మోహన్కుమార్విజయనగరం అర్బన్: రానున్న మార్చి 2026లో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను (ఐపీఈ–2026) ఎటువంటి లోపాలు లేకుండా కట్టుదిట్టంగా నిర్వహించాలని ఇంటర్ బోర్డు రిసోర్స్ పర్సన్, ప్రొఫెసర్ ఎన్.మోహన్కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం తోటపాలెంలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలో జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి శివ్వాల తవిటినాయుడు అధ్యక్షతన వివిధ కళాశాలల యాజమాన్యాల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులతో మంగళవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్.మోహన్ కుమార్ మారిన సిలబస్, ప్రశ్నపత్రాల రూపకల్పన, పరీక్షల విధానాలపై పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. 2025–26 విద్యా సంవత్సరంలో ప్రథమ సంవత్సరానికి సైన్స్, ఆర్ట్స్ గ్రూపుల్లో (భాషా సబ్జెక్టులు మినహా) 14 సబ్జెక్టులకు నూతన సిలబస్ అమలులోకి వచ్చినట్లు తెలిపారు. ప్రశ్నపత్రాలు పూర్తిగా సీబీఎస్ఈ తరహాలో రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. బోటనీ, జూవాలజీని బయాలజీగా కలిపి ఒకే సబ్జెక్టుగా చేయడం, గణితాన్ని 1ఏ, 1బీగా కాకుండా ఒకే ప్రశ్నపత్రంగా ప్రవేశపెట్టడం, సైన్స్ పేపర్ల సంఖ్యను 6 నుంచి 5కు తగ్గించడం వంటి కీలక సంస్కరణలను వివరించారు. సిలబస్ మారిన 14 సబ్జెక్టులకు 32 పేజీల సమాధానం బుక్లెట్లు, బయాలజీ (బోటనీ–జూవాలజీ)కి 24 పేజీల బుక్లెట్లు అందించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది నుంచి పబ్లిక్ పరీక్షలు 30 రోజుల పాటు నిర్వహించే నేపథ్యంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు (డీఓలు) అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రశ్నపత్రాల భద్రత, తరలింపు ప్రక్రియలో నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ఏర్పాట్లు పూర్తి డీవీఈఓ శివ్వాల తవిటినాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల నేపథ్యంలో అధ్యాపకులు మారిన సిలబస్, పరీక్షల విధానాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. జిల్లాలోని 66 పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు. సమన్వయంతో పరీక్షలను విజయవంతంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ ఎం.సత్యనారాయణ, ఎన్ఎల్వీజగన్నాథరావు, కె.అప్పారావు, పీఎల్ఎస్ప్రకాష్ పట్నాయక్, వీకేవీకృష్ణారావు, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికలు
లక్కవరపుకోట: మండల కేంద్రంలో గల ఏపీ మోడల్ స్కూల్ మైదానంలో జిల్లా స్కూల్గేమ్స్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికలను మంగళవారం నిర్వహించారు. ఈ ఎంపికల్లో జిల్లాస్థాయి జట్టుకు అండర్ 14,17,19 విభాగాల్లో బాల,బాలికలను ఎంపిక చేశారు. జిల్లాలోని 17 పాఠశాలల నుంచి 173 మంది విద్యార్థులు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఎంపికల్లో 30 మంది బాలికలను, 30 మంది బాలురును ఎంపిక చేసినట్లు చెప్పారు. వారు త్వరలో రాష్ట్రస్థాయిలో జరగబోయే పోటీల్లో విజయనగరం జిల్లా జట్లుకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు.కార్యక్రమంలో ఎంఈఓ సీహెచ్.కూర్మారావు, జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి జి.లక్ష్మణరావు, చందులూరు పీడీ డాక్టర్ పి.శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ ఆదా ప్రాజెక్టుకు తృతీయస్థానం
పాలకొండ రూరల్: మండలంలోని ఎం.సింగుపురం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు అలజంగి వినోద్కుమార్, ఆర్నాల కార్తీక్, శంబాన గణేష్ విద్యుత్ఆదాపై రూపొందించిన షార్ట్ ఫిలిమ్ రాష్ట్ర స్థాయిలో తృతీయ స్థానంలో నిలిచింది. పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు కె.సంతోష్ కుమారస్వామి దర్శకత్వంలో విద్యుత్ ఆదాపై రూపొందించిన రెండు నిమిషాల నిడివిగల షార్ట్ ఫిలిమ్ను పోటీల్లో ప్రదర్శించారు. విద్యుత్ ఆదా.. భవిష్యత్తు తరాలకు విద్యుత్ పొదుపు అనే అంశాన్ని ప్రస్పుటించారు. బహుమతి సాధించిన విద్యార్థులను పాఠశాల హెచ్ఎం బి.సంగంనాయుడు, ఉపాధ్యాయులు మంగళవారం అభినందించారు. విజయవాడలో త్వరలో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థులు రూ.5వేలు నగదు అందుకోనున్నారు. ‘కౌశల్’ విజేతలకు బహుమతుల ప్రదానం ● రాష్ట్రస్థాయి పోటీలకు 12 మంది ఎంపిక పార్వతీపురం టౌన్: భారతీయ విజ్ఞాన మండలి, ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కౌశల్ ఆన్లైన్ పోటీల జిల్లా స్థాయి విజేతలకు డీఈఓ బ్రహ్మాజీ బహుమతులు ప్రదానం చేశారు. నవంబర్ 26, 27 తేదీల్లో ఆన్లైన్లో నిర్వహించిన పోటీల్లో 8, 9, 10వ తరగతి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో క్విజ్, పోస్టర్ ప్రజెంటేషన్ (8, 9 తరగతులకు), రీల్స్ (10వ తరగతికి) విభాగాల్లో విజేతలను ఎంపిక చేశారు. పార్వతీపురం డీవీఎం హైస్కూల్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో మొదటి ఇద్దరు విజేతలకు రూ.1500, రూ.1000 చొప్పున బహుమతులు అందజేశారు. జిల్లా స్థాయిలో బహుమతులు పొందిన 12 మంది విద్యార్థులు ఈ నెల 27వ తేదీన తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో జరగనున్న రాష్ట్రస్థాయి కౌశల్ పోటీల్లో తలపడనున్నారు. కార్యక్రమంలో కౌశల్ జిల్లా కోఆర్డినేటర్ కోట అయ్యప్ప, అకాడమీ కోఆర్డినేటర్ బెహరా సంతోష్ కుమార్, జిల్లా సైన్స్ ఆఫీసర్ జి.లక్ష్మణరావు, పార్వతీపురం ఎంఈఓ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. క్విజ్: ప్రథమ బహుమతి: ఎన్.లోకేష్ (8వ తరగతి, జెడ్పీ హెచ్ఎస్, ఎంఆర్ నగరం), డి.పవన్ కల్యాణ్ (9వ తరగతి, జెడ్పీహెచ్ఎస్, మక్కువ 3) కె.సాయి శరత్కుమార్ (10వ తరగతి, జెడ్పీహెచ్ఎస్ రావివలస) ద్వితీయ బహుమతి: కె.ప్రసన్న (8వ తరగతి, జెడ్పీహెచ్ఎస్, రావివలస), ఎం.హిజ్కియారాజు (9వ తరగతి, జెడ్పీహెచ్, ఎంఆర్ నగరం), పి.రోహిత్ (10వ తరగతి, జెడ్పీహెచ్ఎస్, కురుపాం) ● పోస్టర్ ప్రజెంటేషన్ (8వ తరగతి పోటీలు)లో ఎం.లిఖిత (జెడ్పీహెచ్, ఎం.ఆర్.నగరం) ప్రథమ, ఎస్.భారతమ్మ (జీటీ డబ్ల్యూఏ హెచ్ఎస్, హడ్డుబంగి) ద్వితీయ. ● పోస్టర్ ప్రెజెంటేషన్ (9వ తరగతి)లో... ఏ.కీర్తన (జెడ్పీహెచ్ఎస్–ఎం.ఆర్.నగరం) ప్రథమ, టి.హారిక (జెడ్పీహెచ్ఎస్–మక్కువ) ద్వితీయ. ● రీల్స్ (10వ తరగతి) పోటీల్లో బి.లిఖిత్ (ఏపీ ఎంఎస్, భామిని) ప్రథమ, వి.సుజ్విన్ (జెడ్పీహెచ్ఎస్, కురుపాం) ద్వితీయ. వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు కుడి ప్రధాన కాలువకు అధికారులు సాగునీటి సరఫరాను పెంచారు. రబీ పంటల సాగుకోసం ఇటీవల 200 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టగా... ప్రస్తుతం మరో 200 క్యూసెక్కుల నీటిని పెంచి 400 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నట్టు ఏఈ నితిన్ తెలిపారు. ప్రాజెక్టు వద్ద 64.60 మీటర్ల నీటిమట్టం నమోదైనట్టు ఆయన వెల్లడించారు. -
చేతి వృత్తిదారులకు శఠగోపం
పార్వతీపురంటౌన్: చేతివృత్తులు, కులవృత్తులపై ఆధారపడి జీవించేవారి అభ్యున్నతికి కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వకర్మయోజన అమలులో నీరుగారిపోయింది. లక్ష్యాలు ఘనంగా ఉన్నా అమలు మాత్రం తూతూ మంత్రంగానే ఉంది. మొక్కుబడిగా లబ్ధిదారులను ఎంపిక చేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. పథకం చేరువ కాక పూర్తిస్థాయిలో నష్టపోతున్నామని లబ్ధిదారులు వా పోతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలో విశ్వకర్మ కోసం అనేకమంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే అర్హత ఉన్నా సాంకేతికత, ఽధ్రువీకరణ పత్రాల అప్లోడేషన్ వంటి కారణాలతో లబ్ధిదారులను ఎంపిక చేయకపోవడం గమనార్హం. బ్యాంకర్లు విశ్వకర్మ పథకం అమలుకు అసలు సహకారం అందించడం లేదని లబ్ధిదారుల నుంచి విమర్శలు చాలా ఉన్నాయి. బ్యాంకర్లను రుణాలు ఇచ్చేందుకు ఒప్పించడంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం విఫలమయ్యాయి. చేతివృత్తులను ప్రోత్సహించేందుకు పీఎం విశ్వకర్మ పథకాన్ని కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. చేతివృత్తులు, కళాకారులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వారికి ఆర్థిక సహాయం, పనిముట్లు అందించడం పథకం ముఖ్య ఉద్దేశం. ఆధునిక పనిముట్లు, వస్తువుల కొనుగోళ్లలో రాయితీ అందించడం, చేతివృత్తుల ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయం కల్పించడం ద్వారా సంప్రదాయ కళలు, చేతి వృత్తులను ప్రోత్సహించడం ఈ పథక ఉద్దేశం. ఈ మేరకు ఎంపిక చేసిన లబ్ధిదారులకు ప్రాథమిక, ఆధునిక నైపుణ్యాలపై శిక్షణ ఇస్తారు. ప్రోత్సాహకం కింద రూ.15వేల కిట్లను అందజేశారు. శిక్షణ పొందిన వారికి బ్యాంకు నుంచి తొలి విడతలో తక్కువ వడ్డీకి రూ.లక్ష, అనంతరం రూ.3లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది. కుమ్మరి, వడ్రంగి, కమ్మరి, శిల్పి, స్వర్ణకారులు, దోబి, పూలమాలలు అల్లేవారు. చేపలు పట్టేవారు. ఇలా 18 రకాల వృత్తుల వారికి విశ్వకర్మ పథకం వర్తిస్తుంది. చేతి వృత్తుల వారు విశ్వకర్మ పథకం కోసం దరఖాస్తు చేసుకోగా మొక్కుబడిగా మాత్రమే రుణాలు మంజూరు చేయడం గమనార్హం. విశ్వకర్మ పథకం అమలులో నిర్లక్ష్యం వేలల్లో దరఖాస్తులు.. వందల్లో లబ్ధిదారుల ఎంపిక జిల్లాలో 25,816 మంది దరఖాస్తులు ఎంపిక చేసింది కేవలం982మందిని మాత్రమే -
కుంకీలొచ్చేనా? కరి కలత తీర్చేనా..?
సాక్షి, పార్వతీపురం మన్యం: ఒడిశా నుంచి అటవీ ప్రాంతం మీదుగా మన్యం భూభాగంలోకి వచ్చిన గజరాజులు.. దాదాపు రెండు దశాబ్దాలుగా ఇక్కడే తిష్ట వేశాయి. జిల్లాలో రెండు ఏనుగుల గుంపులు నాగావళి, వంశధార తీర ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. పార్వతీపురం, కొమరాడ, జియ్యమ్మవలస, భామిని పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం 12 ఏనుగులు తిరుగుతున్నాయి. వీటివల్ల అటు ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లడమే కాక.. సమీప గ్రామాల ప్రజలకు కంటిమీద నిద్ర కరవవుతోంది. వీటిని దారిలోకి తెచ్చేందుకు కుంకీ ఏనుగులను తీసుకొస్తామని ఏళ్లుగా చెబుతున్న మాట నేటికీ కార్యరూపం దాల్చలేదు. వచ్చే సంక్రాంతినాటికి జిల్లాకు కుంకీలొస్తాయని ఇన్చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇటీవల డీఆర్సీలో చెప్పారు. ఆ మాట.. ఈసారైనా అమలవుతుందో లేదో చూడాలి. తరలింపా.. ఇక్కడే ఉంచుతారా? ఎలిఫెంట్ జోన్, కుంకీలు.. తరలింపు ఇలా రకరకాల ఆలోచనల్లో అధికార యంత్రాంగం ఉంది. అందుకు కొన్ని ప్రాంతాలనూ గుర్తించారు. ఏదీ ముందుకు సాగడం లేదు. పునరావాస కేంద్రం కోసం స్థానికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు జోన్ అయితే రూ.30 కోట్ల వరకు అవసరం అవుతుంది. పెద్దమొత్తంలో ఆహారం తీసుకునే ఏనుగులకు.. ఇక్కడ ఉంచిన తర్వాత ఆ స్థాయిలో ఆహారం కల్పించడమూ కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో తాత్కాలిక కేంద్రంవైపే అధికారులు మొగ్గు చూపుతున్నారు. కుంకీలొచ్చాక వాటి ద్వారా జిల్లాలోని ఏనుగులను కొన్నాళ్లు గుచ్చిమి కేంద్రం వద్ద ఉంచి.. అనంతరం శేషాచలం అడవులకు తరలించే యోచన చేస్తున్నారు. లేకుంటే ఒడిశా ప్రభుత్వం, అధికారులను సమన్వయం చేసుకుని అక్కడి లఖేరి ప్రాంతానికి తరలించాలని భావిస్తున్నారు. కుంకీలు రాగానే.. భామిని వైపు ఉన్న గుంపును తొలుత కేంద్రానికి తరలించాలని చూస్తున్నారు. త్వరలోనే కుంకీలొచ్చే అవకాశం ఉంది. అవి రాగానే.. జిల్లాలో ఉన్న గుంపును గుచ్చిమి వద్ద నిర్మిస్తున్న టెంపరరీ ఎలిఫెంట్ హోల్డింగ్ ఏరియాకు తరలిస్తాం. కేంద్రం నిర్మాణ పనులు దాదాపు 80 శాతం పూర్తయ్యాయి. ఏనుగుల కదలికలను నిత్యం గమనిస్తూ.. ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. పంట నష్టపోయిన రైతులకు పరిహారం కూడా జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు అందిస్తున్నాం. – జీఏపీ ప్రసూన, జిల్లా అటవీశాఖాధికారిణి పసుకుడి చేరిన ఏనుగులు భామిని: మండలంలోని పసుకుడి గ్రామ సమీపంలోకి నాలుగు ఏనుగుల గుంపు మంగళవారం చేరింది. వంశధార నది ఆవల ఒడిశా గ్రామాల నుంచి ఏనుగులు తరలివచ్చాయి. పంటపొలాల్లో సంచరిస్తుండడంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. పంటలకు నష్టం చేకూర్చుతున్నాయంటూ గగ్గోలుపెడుతున్నారు. -
చట్ట ప్రకారం పిల్లల దత్తత
● ఐసీడీఎస్ పీడీ విమలరాణి విజయనగరం ఫోర్ట్: పిల్లలను చట్ట ప్రకారం దత్తత ఇవ్వనున్నట్లు ఐసీడీఎస్ పీడీ టి.విమలరాణి అన్నారు. ఈ మేరకు పట్టణంలోని కేఎల్ పురంలో ఉన్న శిశు గృహాన్ని ఆకస్మికంగా ఆమె మంగళవారం తనిఖీ చేశారు. పిల్లలను అనధికారికంగా దత్తత తీసుకోవడం చట్ట రీత్యానేరమని తెలిపారు. పిల్లలు లేని తల్లిదండ్రులకు చట్ట ప్రకారం దత్తత ఇవ్వనున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. శిశుగృహలో ఉన్న పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు, ప్రతిరోజూ మెనూ కచ్చితంగా అమలు చేయాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని స్పష్టం చేశారు. ఆ తర్వాత మహారాణి పేటలో ఉన్న బాలసదన్ను తనిఖీ చేశారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న బాలికలకు బాలసదన్లో ఉచిత విద్య, వసతి సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. 6 నుంచి11 సంవత్సరాల వయసు గల బాలికలు బాలసదన్లో ఆశ్రయం పొందుతారన్నారు. కార్యక్రమంలో డీఎంసీ సుజాత, శిశు గృహ మేనేజర్ త్రివేణి తదితరులు పాల్గొన్నారు.రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేతబొబ్బిలిరూరల్: మండలంలోని పారాది వద్ద వేగావతి నదిలో అక్రమంగా ఇసుకను తవ్వి బొబ్బిలి పట్టణానికి తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను ఆర్ఐ కొల్లి రామకుమార్ మంగళవారం పట్టుకుని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు.ఇసుక అక్రమ రవాణాలో మొదటిసారి దొరికినందున ఒక్కో ట్రాక్టర్కు రూ.10 వేలు చొప్పున జరిమానా విధించినట్లు ఆర్ఐ తెలియజేశారు. వేగావతి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలపై రెవెన్యూ విభాగం నిఘా ఉందని తవ్వకాలు చేపడితే చర్యలు తప్పవని, మరో మారు అక్రమ ఇసుకతో పట్టుబడితే కేసులు పెడతామని ట్రాక్టర్ యజమానులను ఆర్ఐ హెచ్చరించారు. గంజాయి కేసులో ముద్దాయికి ఎనిమిదేళ్లు జైలు శిక్షవిజయనగరం క్రైమ్: గంజాయితో పట్టుబడిన నిందితుడికి ఎనిమిదేళ్లు జైలు శిక్ష, రూ.75 వేల జరిమానాను కోర్టు విధించిందని జీఆర్పీ ఎస్సై బాలాజీరావు మంగళవారం తెలిపారు. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే..గతేడాది ఫిబ్రవరి 8 వ తేదీన దక్షిణ ఢిల్లీకి చెందిన నీరజ్ సింగ్(25)విజయనగరం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం 4,5లలో జీఆర్పీ సిబ్బంది తనిఖీ చేస్తుండగా ఒడిశా రాష్ట్రం నుంచి ఢిల్లీకి గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకుని, 17.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై అప్పటి విజయనగరం రైల్వే ఎస్సై వి.రవి వర్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, నిందిడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించి దర్యాప్తు అనంతరం కోర్టులో అభియోగ పత్రాలను దాఖలు చేశారు. కోర్టు విచారణలో నిందితుడిపై నేరారోపణలు రుజువు కావడంతో ముద్దాయికి విజయనగరం ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ఎం.మీనాదేవి జైలు శిక్ష విధించారని, జరిమానా చెల్లించని ఎడల మరో ఆరు నెలలు జైలు శిక్ష వర్తిస్తుందని జీఆర్పీ ఎస్సై బాలాజీరావు తెలిపారు. బైక్, మినీ వ్యాన్ ఢీకొని మహిళ మృతిచీపురుపల్లి: పట్టణంలోని జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట చీపురుపల్లి–రాజాం ప్రధాన రహదారిలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పొందూరు ఆదిలక్ష్మి(25) మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజాంకు చెందిన బల్ల జగదీష్, ఆర్.ఠాగూర్లతో కలిసి చీపురుపల్లి పట్టణంలోని కూరాకుల వీధికి చెందిన పొందూరు ఆదిలక్ష్మి ద్విచక్ర వాహనంపై చీపురుపల్లి నుంచి రాజాం వెళ్తున్నారు. జీవీఆర్ కళాశాల వద్ద ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేస్తుండగా ఎదురుగా వస్తున్న మినీ లగేజ్ వ్యాన్ను బైక్తో ఢీకొ ట్టారు. దీంతో ఆదిలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. జగదీష్కు చేయి విరిగింది. ఠాగూర్ అక్కడి నుంచి పరారయ్యాడు. మృతదేహాన్ని చీపురుపల్లి ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సీఐ జి.శంకరరావు ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తోటపాలెంలో పశువైద్య సేవలు విజయనగరం అర్బన్: స్థానిక పట్టణంలోని తోటపాలెం సత్య డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఆ గ్రామంలో గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం పశువైద్య సేవలు అందించారు. పశు వైద్యులు మోహన్..పాడిరైతులు తీసుకువచ్చిన మూగజీవాలకు ఆరోగ్య తనిఖీలు నిర్వహించి, అవసరమైన వాటికి మందులు అందజేశారు. అలాగే వ్యాధులు రాకుండా నివారణ టీకాలు వేశారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీ సాయిదేవమణి తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన యువకుడి ఆత్మహత్య
సీతంపేట: కొండపోడు పనికి నాతో రా, లేకపోతే అన్నయ్య కుమారుడికి జ్వరంగా ఉంది పాలకొండ ఆస్పత్రికి అయినా తీసుకువెళ్లు అని తాత చెబితే వినకుండా వాగ్వాదానికి దిగిన మనుమడు చివరకు క్షణికావేశంలో కత్తితో పీక కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీతంపేట మండలంలో మంగళవారం జరిగిన ఈ సంఘటనపై స్థాని కులు, పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. చాకలిగూడ గ్రామానికి చెందిన సవర ప్రేమ్కుమార్(23) తండ్రి రాజేష్, వెంకటమ్మలు పదేళ్ల కిందట అనారోగ్యంతో బాధపడుతూ మృతిచెందారు. తాతయ్య గోపాలు, నాన్నమ్మ సుక్కమ్మ వద్ద ప్రేమ్కుమార్ ఉంటున్నాడు. వారితో పాటు అన్నయ్య శాంతకుమార్, వదిన వారి కుమారుడు అందరూ కలిసి ఉమ్మడి కుటుంబంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం ఉదయం ఎవరి పనుల్లో వారు ఉండగా తాత గోపాలు కొండపోడు పనులకు వెళ్దామని చెప్పి ఒక సంచిలో కత్తి, వాటర్ బాటిల్ సిద్ధం చేసి పడుకుని ఉన్న ప్రేమ్కుమార్ను లేపి పనికి వెళ్దాం రమ్మని పిలిచాడు. నేను రాను అని చెప్పగా అయితే అన్నయ్యను పనికి తీసుకువెళ్తాను. అన్నయ్యకుమారుడికి జ్వరంగా ఉండడంతో వదినతో పాటు పాలకొండ ఆస్పత్రికి వెళ్లమని చెప్పాడు. అక్కడికి కూడా వెళ్లనని ప్రేమ్కుమార్ చెప్పడంతో కొద్ది సేపు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలో తాత వంటింటిలోకి అన్నం పెట్టిన బాక్సు తీసుకురావడానికి వెళ్లాడు. దీంతో సంచిలో ఉన్న కత్తిని ప్రేమ్కుమార్ తీసుకుని పీక కోసేసుకున్నాడు. కుటుంబసభ్యులు గమనించి ఆటోలో స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మర్గమధ్యంలో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అన్నయ్య శాంతకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వై.అమ్మన్నరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. -
‘పది’ంతల ఉత్సాహంతో.. పరీక్షలకు సన్నద్ధం
వీరఘట్టం: పదోతరగతి పరీక్షలకు పార్వతీపురం మన్యం జిల్లా విద్యార్థులను ఉపాధ్యాయులు సంసిద్ధం చేస్తున్నారు. పాఠశాలల్లో వంద రోజుల విద్యాప్రణాళికను పకడ్బందీగా అమలుచేస్తున్నారు. వరుసగా మూడేళ్లు పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో మన్యం జిల్లా ముందంజలో నిలిచింది. ఈ ఏడాది కూడా ఉత్తమ ఫలితాలు సాధనకు విద్యాశాఖ అధికారులు కృషిచేస్తున్నారు. జిల్లాలోని 187 సర్కారు బడుల్లో ఈ ఏడాది 10,856 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నారు. వీరిలో చదువులో వెనుకబడిన వారిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. సులభ పద్ధతుల్లో బోధిస్తున్నారు. ఉత్తీర్ణత మార్కు లు సాధించేలా తర్ఫీదు ఇస్తున్నారు. చదువులో ప్రతిభ చూపినవారికి అధిక మార్కులు సాధించేలా బోధన సాగిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా మార్చి 13వ తేదీ వరకు తరగతులు నిర్వహించనున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించడం ద్వారా విద్యార్థులు చదవడం, రాయడం వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నారు. గత మూడేళ్లలో సాధించిన టెన్త్ ఫలితాలు పునరావృతం చేసేందుకు విద్యార్థులకు వందరోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధంచేశాం. ప్రతిరోజు స్లిప్ టెస్టులు నిర్వహిస్తున్నాం. ఆదివారం కూడా సబ్జెక్టు టీచర్లతో ప్రత్యేక తరగతులు చెప్పిస్తున్నాం. – పి.బ్రహ్మాజీరావు, డీఈఓ, పార్వతీపురం మన్యం జిల్లా ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే టెన్త్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. శతశాతం ఫలితాలు సాధించేందుకు సబ్జెక్టు టీచర్లు ప్రత్యేక ప్రణాళిక సిద్ధంచేశారు. ఇంగ్లిష్, గణితం, సైన్సు సబ్జెక్టులపై ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నాం. హిందీ, తెలుగు, సోషల్ సబ్జెక్టులపై విశ్లేషణాత్మకంగా తరగతులు నిర్వహిస్తున్నాం. – సీహెచ్ రత్నాకరరావు, హెచ్ఎం, బిటివాడ హైస్కూల్, వీరఘట్టం మండలం పకడ్బందీగా వంద రోజుల ప్రణాళిక ఈ ఏడాది కూడా పదోతరగతి ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ సాధించేలా కార్యాచరణ చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పరీక్షలు రాయనున్న విద్యార్థులు 10,869 మంది -
గురుకులంలో ఆకలికేకలపై స్పందించిన అధికారులు
భామిని: సాంఘిక సంక్షేమ బాలికల గురుకులాన్ని ఎంపీడీవో ఎస్.వసంతకుమారి మంగళవారం సందర్శించారు. ఈ నెల 15న ‘గురుకులంలో ఆకలికేకలు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. ఎంపీడీవో వసంతకుమారి గురుకులాన్ని సందర్శించారు. ప్రిన్సిపాల్ విజయనిర్మలతో కలిసి వంట గదిని నిశితంగా పరిశీలించారు. పరిశుభ్రత లేకపోవడంపై సిబ్బందికి సూచనలు చేశారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల వరకు విద్యార్థులకు భోజనం పెట్టకపోవడంపై కారణాలను అడిగి తెలుసుకున్నారు. దీనికి పూర్తి బాధ్యత ప్రిన్సిపాల్, సిబ్బంది వహించాలన్నారు. చేసిన వంటలను పరిశీలించి మెనూ ప్రకారం అమలు చేయా లని సూచించారు. గురుకుల సిబ్బంది ఉన్నారు. -
ఆటోలకు సీరియల్ నంబర్లు కేటాయిస్తాం
విజయనగరం క్రైమ్: నగరంలో తిరుగాడుతున్న ఆటోలకు త్వరలో సీరియల్ నంబర్లు జారీ చేస్తామని విజయనగరం ట్రాఫిక్ సీఐ సూరినాయుడు తెలిపారు. ఇదే విషయమై ఆయన స్థానిక ట్రాఫిక్ పోలీస్స్టేషన్ వద్ద ఆటో యూనియన్ నాయకులతో మంగళవారం సమావేశమయ్యారు. ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ఆదేశాల మేరకు ఆటోల క్రమబద్ధీకరణకు ప్రత్యేకంగా సీరియల్ నంబర్లు కేటాయించనున్నామన్నారు. ఆటోడ్రైవర్ల భద్రతా ప్రమాణాలు కాపాడడంతో పాటు ఆటోల్లో ప్రయాణించే వారి రక్షణకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. ఆటోల్లో ప్రయాణికులు పోగొట్టుకున్న వస్తువులను కొనుగొనేందుకు కూడా ఇది దోహదపడుతుందన్నారు. సీరియన్ నంబర్ చూడగానే ఇది ఎవరి ఆటో, ఏ ఆటోస్టాండ్, యూనియన్కు చెందినది..ఇలా అన్ని వివరాలు తెలుస్తాయన్నారు. సమావేశంలో ట్రాఫిక్ ఎస్ఐ ఎస్.భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. ఆటోస్టాండ్లు మంజూరు చేయండి.. విజయనగరం గంటస్తంభం: జిల్లా కేంద్రంలోని చాలామంది ఆటోవాలాలకు సంబంధించిన ఆటోలను నిలుపుదల చేసేందుకు ఆటోస్టాండ్లు లేవని తక్షణమే ఆటోస్టాండ్లు మంజూరు చేయాలని ఆటో యూనియన్ నాయకులు కనకారావు, అప్పలరాజు కోరారు. ఆటోస్టాండ్లు లేని కారణంగా ఆటోడ్రైవర్లు రన్నింగ్ ఆటోవాలాలుగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. -
ప్రభుత్వం ఎందుకు నిర్వహించలేదో చెప్పండి?
● మెడికల్ కాలేజీలపై మీ ప్రాధాన్యత ఏమిటి? ● ప్రైవేటుకు అప్పగిస్తే ఉచిత వైద్యం అందుతుందా? ● పేదవాడి వైద్యానికి శంషాబాద్ ఎయిర్ పోర్ట్తో పోలికా ● మంత్రి శ్రీనివాస్ వ్యాఖ్యలను ఖండించిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విజయనగరం: రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాల ఆరోగ్యమే లక్ష్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన మెడికల్ కాలేజీలను ప్రభుత్వ పరంగా ఎందుకు నిర్వహించలేరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పాలని విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ పరంగా అవలంభించే విధానాన్ని తెలియజేయాలని కోరారు. నగరంలోని ధర్మపురిలో గల సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ విజయనగరం జిల్లా కేంద్రంలో సోమవారం తలపెట్టిన ప్రజాఉద్యమ ర్యాలీకి అపూర్వ స్పందన లభించిందన్నారు. జిల్లా ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పేదవాడి వైద్యానికి, శంషాదాబాద్ విమానాశ్రయానికి పోలికచేస్తూ మంత్రి చేసిన వాఖ్యలు అర్ధరహితమని పేర్కొన్నారు. మంత్రి కొండపల్లి తన నేపథ్యాన్ని, స్థానిక పరిస్థితులను పదవీ వ్యామోహంలో విస్మరించడం దురదృష్టకరమన్నారు. వైఎస్సార్సీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణపై ఆరోపణలు చేస్తున్న మంత్రి క్షేత్ర స్థాయిలోకి వెళ్లి ప్రజలు ఇష్టపూర్వకంగా ఎందుకు సంతకాలు చేశారో తెలుసుకోవాలని హితవుపలికారు. అవసరమైతే వారి వివరాలు తామే ఇస్తామని చెప్పారు. ● పీపీపీ విధానంలో ప్రభుత్వమే కళాశాలలను నిర్మించి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి అప్పగించిన తరువాత ప్రభుత్వం ఏం చేయగలుగుతుందని జెడ్పీ చైర్మన్ ప్రశ్నించారు. అలా చేస్తే ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు ఇంకెందుకని ధ్వజమెత్తారు. జిల్లాలో ఉన్న మిమ్స్ మెడికల్ కాలేజీతో పాటు, పక్కనే విశాఖ జిల్లాలోని గీతం మెడికల్ కాలేజీలో రోగులకు ఉచితంగా సేవలందించగలరా అని ప్రశ్నించారు. అదే తరహాలో ప్రస్తుత ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరిస్తే పేదలు డబ్బులిచ్చి వైద్యం చేయించుకోగలరా అని నిలదీశారు. దశాబ్దాల కిందట విశాఖలో నిర్మించిన కేజీహెచ్లో ఎంత మంది ఉచితంగా వైద్యసేవలు పొందుతున్నారో మంత్రి తెలుసుకోవాలని హితవుపలికారు. ప్రభుత్వానికి సత్తా లేకే ఇటువంటి వాఖ్యలు చేస్తు న్నారని దుమ్మెత్తి పోశారు. ● రాష్ట్రప్రజలంతా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్తో పాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగించారని మజ్జి శ్రీని వాసరావు గుర్తు చేశారు. వైఎస్సార్ హయాంలో అమలు చేసిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వల్ల ఎంతో మంది నిరుపేదలు ఉన్నత చదువులు అభ్యసించి డాక్టర్లు, ఇంజినీర్లుగా స్థిరపడ్డారని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ, వైద్యకళాశాలలో ఆరోగ్య భరోసా కల్పించారన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు అందించే సేవల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవాలని మంత్రికి హితవుపలికారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు కె.వి.సూర్యనారాయణరాజు, నెక్కల నాయుడుబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్కుమార్, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసులనాయుడు, ఉపాధ్యక్షుడు పతివాడ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. జీతాల చెల్లింపులో తప్పుడు ప్రకటనలా...? అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు నెలవారీ చెల్లించాల్సిన జీతాల విషయంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందన్న విషయం బాధ్యత గల మంత్రికి తెలియకపోవడం దురదృష్టకరమన్నారు. నవంబర్ నెలలో పంచాయతీరాజ్, ఇంజినీరింగ్, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ సహా 7 శాఖలకు చెందిన ఉద్యోగులకు 7 నుంచి 10వ తేదీల మధ్య జీతాలు చెల్లించారన్న విషయాన్ని మంత్రి తెలుసుకోవాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి ఆరు నెలలు మాత్రమే జీతాలు సక్రమంగా వేశారని, అనంతరం కాలంలో ఎప్పుడు వేస్తున్నారో తెలియని పరిస్థితిలో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మంత్రి వ్యాఖ్యలు చూస్తుంటే ప్రజాప్రతినిధులకు, అధికారులకు మధ్య ఉన్న సమన్వయం తేటతెల్లమవుతుందన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయాల్సిన ధాన్యంలో పారదర్శకత పాటిస్తున్నమంటూ మంత్రి కొండపల్లి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. క్వింటా దగ్గర 10 కేజీలు ధాన్యం రైతుల వద్ద నుంచి మిల్లర్లు దోపిడీ చేయడమేనా మీ పారదర్శకత అంటూ ఎద్దేవాచేశారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి చెందిన అనుకూల పత్రికలో ప్రత్యేక కథనం ఇచ్చారని, ఆ కథనాన్ని ఖండించి మాట్లాడాలని సవాల్ విసిరారు. -
నిధులు లేకుండా ముస్తాబులేమిటి?
సాక్షి, పార్వతీపురం మన్యం: ‘ఉత్తి మాటలతో ఊరు శుభ్రమవుతుందా.. పారిశుద్ధ్య కార్మికుల జీతాలకే దిక్కులేదు.. నిధుల ఊసెత్తితే దాటవేస్తున్నారు.. ఖర్చు లేకుండా గ్రామాల్లో ‘ముస్తాబు’ అమలు చేయాలంటే ఎలా సాధ్యం?’ ఇదీ.. పలువురి సర్పంచ్ల ఆవేదన. పార్వతీపురంలోని ప్రైవేట్ కల్యాణ మండపంలో జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సర్పంచ్ల సమీక్షా సమావేశం నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి సర్పంచ్లకు దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామంలోనూ కుటుంబం ముస్తాబు కావాలన్నారు. ప్లాస్టిక్ రహిత గ్రామాలు, పల్లెలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సర్పంచులే గ్రామాల కు బాస్లని.. ఆ దిశగా తమ గ్రామాలను అభివృద్ధిపరచాలని ఆకాంక్షించారు. ముస్తాబుపేరిట గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుతూ, బహిరంగ మలమూత్ర విసర్జనకు కృషి చేయాలని కోరారు. కాలు వల శుభ్రత, చెత్తకుప్పలు లేకుండా గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఎలాంటి ఖర్చూ లేకుండా ఇలాంటి పనులు నిర్వహించవచ్చ ని చెప్పారు. దీనిపై సర్పంచ్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు పారిశుద్ధ్య కార్మికులకు జీతాలిచ్చేందుకే పంచాయతీల్లో నిధులు లేవని చెప్పా రు. ఎన్నోసార్లు విన్నవించుకున్నా రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన జరగడం లేదన్నారు. పలు సమస్యలపై సర్పంచ్లు చెప్పేందుకు ప్రయత్నించగా.. అధికారులు మధ్యలోనే బ్రేక్ వేశారు. దీంతో కలెక్టర్కు తమ పంచాయతీల్లో సమస్యలపై నామమాత్రంగానే సర్పంచ్లు వినతిపత్రాలిచ్చి సరిపెట్టుకున్నారు. నిధులు నిల్.. నీతులు ఫుల్: సర్పంచుల ఆవేదన జిల్లా యంత్రాంగం తీరుపై సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు నిల్.. నీతులు ఫుల్ మాదిరి అధికారుల తీరు ఉందని అసహనం వ్యక్తం చేశారు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా ముస్తాబు పేరిట హడావిడి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఉత్తి మాటలతో ఊరు శుభ్రపడదని పేర్కొన్నారు. నిధులు ఊసెత్తితే దాటవేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులెవరికీ బాధ్యత లేదని విమర్శించారు. గ్రామాల్లో మిల్లర్ల దోపిడీ, రైతుల ఇబ్బందులపైనా పలువురు నిలదీశారు. మంచినీరు, మౌలిక సదుపాయాల సమస్యలనూ ప్రస్తావించారు. -
ప్రజల ఆకాంక్ష
●కోటి సంతకాలే కాదు.. దేశంలో ఏ రాష్ట్రంలో నూ ఒకే దశలో 17 మెడికల్ కళాశాలల ను తీసుకొచ్చిన పరి స్థితి లేదు. జగన్మోహన్రెడ్డి ఆ చరిత్ర సృష్టించారు. అటువంటి కళాశాలలను ప్రైవేట్కు కట్టబెట్టేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారు. ఈ ప్రభు త్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాల ను ప్రజలు చేశారు. జిల్లాలోనూ జగన్ సంకల్పానికి మద్దతుగా 2 లక్షలకుపైగా సంతకాల ను ప్రజలు చేశారు. నేడు ఆరోగ్యశ్రీ.. రోగశ్రీగా మారింది. ఈ రోజు కోటి సంతకాల గర్జనే కాదు.. కోటి గళాల గర్జనగా దీన్ని చూడాలి. గవర్నర్ న్యాయం చేయాలి. ప్రజల ఆకాంక్షలను గౌరవించాలి. ఇది ప్రజావ్యతిరేక పాలన. రైతులు, విద్యార్థులు.. ఇలా అన్ని వర్గాలవారూ ఇబ్బందులు పడుతున్నారు. ఎరువులు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. నేడు 92 మంది ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. వీరు ప్రజలకు ఏమీ మేలు చేయడం లేదు. ఈ ప్రభుత్వంలో సంపద సృష్టి కాదు.. అప్పులు సృష్టిస్తున్నారు. 18 నెలల కాలంలో లక్షల కోట్లు అప్పులు తెచ్చారు. – పీడిక రాజన్నదొర, మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు ప్రజారోగ్యం కోసం.. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్యం, వైద్య విద్య అందించాలన్న ఉద్దేశంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి జగన్ 17 వైద్యకళాశాలలను తీసుకొచ్చారు. అందులో ఏడు కాలేజీలను గత ఎన్నికలకు ముందే పూర్తి చేశాం. మిగిలిన 10 కళాశాలలను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్కు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ప్రతిదీ ప్రైవేట్పరం చేయాలన్నది ఈ ప్రభుత్వ సంకల్పం. ప్రజావైద్యాన్ని ప్రైవేట్పరం చేసే కుట్ర. మొత్తం రూ.8,500 కోట్ల ఈ ప్రాజెక్టులో మిగిలిన 10 కళాశాలలకు రూ.5 వేల కోట్లు సరిపోతాయి. అమరావతికి రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకొంటున్న చంద్రబాబు.. వైద్యకళాశాలల నిర్మాణానికి మాత్రం ఖజానాలో డబ్బులు లేవంటూ ప్రైవేటుకు కట్టబెట్టేందుకు కుఠిల నిర్ణయాలు తీసుకున్నారు. చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా, జగన్ సంకల్పానికి మద్దతుగా కోటి సంతకాలను ప్రజలు చేశారు. అన్ని జిల్లాల్లోనూ ఈ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ఇది చూసైనా చంద్రబాబు కళ్లు తెరవాలి. ఆయన మనసు మారాలి. – పాముల పుష్పశ్రీవాణి, మాజీ ఉప ముఖ్యమంత్రి -
జాతీయస్థాయి పోటీలకు కంచరాం విద్యార్థి
రాజాం సిటీ: మండల పరిధిలోని కంచరాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న అలజంగి సంతోషిణి జాతీయస్థాయి పెంటాథ్లాన్ పోటీలకు ఎంపికై ందని పీడీ టి.దుర్గారావు, పీఈటీ బి.నారాయణనాయుడులు సోమవారం తెలిపారు. ఇటీవల శ్రీకాకుళంలోని కోడిరామ్మూర్తి స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో చక్కని ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి ఎంపికై ందన్నారు. విద్యార్థిని ఎంపికపట్ల హెచ్ఎం వీవీ వసంతకుమార్తోపాటు పాఠశాల స్టాఫ్ కార్యదర్శి మజ్జి మదన్మోహన్, ఉపాధ్యాయులు అభినందించారు. విద్యార్థిని ఆత్మహత్యా యత్నంపై ఎటీడబ్ల్యూఓ విచారణసాలూరు: మండలంలోని కురుకుట్టి ఆశ్రమ పాఠశాలలో ఓ విద్యార్థిని ఆదివారం ఫినాయిల్తాగి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటనపై ఏటీడబ్ల్యూఓ కృష్ణవేణి విచారణ చేపట్టారు. ఈ మేరకు సోమవారం ఆమె పాఠశాలకు వెళ్లి విద్యార్థినులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినితో మాట్లాడారు.ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగితెలుసుకున్నారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని ఆమె తెలిపారు. రెండు బైక్లు ఢీకొని ఒకరికి గాయాలుపాచిపెంట: ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన పాచిపెంట మండలంలోని పణుకువలస సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగింది. దీనిపై పోలీసులు సోమవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొత్తవలస గ్రామానికి చెందిన మాదిరెడ్డి సత్యనారాయణ(35) రామభఽధ్రపురం మండల కేంద్రంలో కారు మెకానిక్గా పనిచేస్తున్నాడు. మెకానిక్ పని నిమిత్తం ప్రతిరోజూ రామభధ్రపురం వెళ్లి వస్తూ ఉంటాడు. రోజులాగానే ఆదివారం పని ముగించుకుని తన ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సత్యనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108లో సాలూరు ఏరియా ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెచ్సీ కృష్ణారావు తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతిరాజాం సిటీ: మండల పరిధి ఇప్పిలిపేట సమీపంలో ఈ నెల 13న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన టొంపల సుమంత్ (26) చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. రాజాంలో విధులు ముగించుకుని స్వగ్రామమైన గరివిడి మండలం కాపుశంభాం గ్రామానికి ఆటోలో వెళ్తుండగా ఇప్పిలిపేట సమీపంలో వెనుక నుంచి వచ్చిన బొలెరో వాహనం ఢీకొనడంతో ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సుమంత్ను స్థానికులు రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం శ్రీకాకుళం కిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పోలీసులు వివరించారు. చికిత్స పొందుతూ మరో వ్యక్తి..గంట్యాడ: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. విజయనగరంలోని కణపాకకు చెందిన కోరాడ పైడిరాజు ఈనెల 12వతేదీన ఉదయం మార్నింగ్ వాక్కు వచ్చి తిరిగి వెళ్తుండగా రామవరం పప్పుల మిల్లు వద్ద నరవ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బైక్తో వెనుక నుంచి ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు తొలుత ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడినుంచి విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖపట్నం కేజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో మృతి చెందాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై డి. సాయికృష్ణ తెలిపారు. మర్మాంగాన్ని కోసుకున్న మతిస్థిమితం లేని యువకుడుబొబ్బిలి: విశాఖకు చెందిన మతిస్థిమితం లేని ఓ యువకుడు తన మర్మాంగాన్ని సోమవారం రాత్రి కోసుకున్నాడు. ఈ ఘటనపై స్థానికుల కథనం ప్రకారం స్థానిక ఫ్లైఓవర్ వద్ద ఓ యువకుడు కాళ్ల వెంబడి రక్తమోడుతూ తిరుగుతుండడంతో స్థానికులు అంబులెన్స్కు సమాచారమందించారు. అంబులెన్స్లో ఎక్కేటప్పుడు ముప్పుతిప్పలు పెట్టిన యువకుడు గడియకోమాట చెబుతూ అర్థంలేని విధంగా ప్రవర్తించాడు. చివరికి ఆస్పత్రిలో చికిత్సకూ ఇబ్బందులు పెట్టాడు. ఆస్పత్రి ప్రధానవైద్యాధికారి జి.శశిభూషణ రావు పరీక్షించి విశాఖ రిఫర్ చేశారు. ఈ లోగా యువకుడు చెప్పిన మేరకు సమాచారం అందడంతో వివరాలు తెలుసుకుని తల్లిదండ్రులు కూడా బొబ్బిలి చేరుకున్నారు. యువకుడిని చికిత్స నిమిత్తం వెంట తీసుకెళ్లారు. -
వినతుల పరిష్కారంలో ఆలస్యం తగదు
● పీజీఆర్ఎస్లో కలెక్టర్ రాంసుదర్రెడ్డివిజయనగరం అర్బన్: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో ప్రజల నుంచి అందే వినతులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ఎస్.రాంసుందర్రెడ్డి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. వినతుల పరిష్కారంలో ఆలస్యం ప్రదర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్తో పాటును జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మురళి, డి.వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, ప్రమీలాగాంధీ, బి.శాంతి, కళావతి తదితరులు పాల్గొన్నారు. ప్రజల నుంచి సమర్పించిన ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో మొత్తం 186 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారులతో నేరుగా మాట్లాడిన తర్వాతనే ఎండార్స్మెంట్ ఇవ్వాలని, మాట్లాడిన తేదీ, సమయాన్ని రిపోర్టులో నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సర్వేశాఖ ఎ.డి ఆర్.విజయకుమార్, కలెక్టరేట్ పరిపాలనాధికారి దేవీప్రసాద్, సీపీఓ బాలాజీ, డీఈఓ యూ.మాణిక్యం నాయుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదుల పరిష్కారంపై ఆడిట్ టీమ్కు శిక్షణ ప్రజా వినతుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే ఫిర్యాదుల పరిష్కారంపై ఆడిట్ ఆధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. రీ ఓపెన్ కేసులు, ఫ్రీ ఆడిట్, ఆడిట్, ప్రజల సంతృప్తి తదితర అంశాలు కచ్చితంగా ఉండేలా మరోసారి శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు సంబంధించిన ఫిర్యాదులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా పెండింగ్లో ఉన్న ధరఖాస్తులు, గడువు దాటినవి, రీ ఓపెన్ అయినవాటిపై వివరంగా సమీక్షించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, డీఆర్ఓ మురళి, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆన్లైన్ ద్వారా మండల ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ గ్రీవెన్స్ సెల్కు 25 ఫిర్యాదులు ● ఏఎస్పీ చాంబర్లో కార్యక్రమం నిర్వహణ విజయనగరం క్రైమ్: ప్రతి వారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ఈ వారం 25 ఫిర్యాదులు వచ్చాయి. ఎస్పీ ఆదేశాలతో ఏఎస్పీ సౌమ్యలత సోమవారం డీపీఓలోని తన చాబర్లో ఫిర్యాదులు స్వీకరించారు.ఈ మేరకు ఫిర్యాదుదారుల నుంచి వినతులను స్వీకరించిన ఏఎస్పీ సౌమ్యలత వారి సమస్యలను శ్రద్ధగా విని, సంబంధిత సిబ్బందితో ఫోన్లో మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యలను వివరించారు. ఏఎస్పీ స్వీకరించిన ఫిర్యాదుల్లో భూతగాదాలకు సంబంధించి 8, కుటుంబ కలహాలకు సంబంధించి 4, మోసాలకు పాల్పడినట్లు 3, ఇతర అంశాలకు సంబంధించి 10 ఫిర్యాదులు వచ్చాయి. వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, విచారణ చేపట్టి, ఏడు రోజుల్లో పరిష్కరించాలని ఏఎస్పీ పోలీస్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, డీసీఆర్బీ సీఐ కె. కుమారస్వామి, ఎస్సై ప్రభావతి, సిబ్బంది పాల్గొన్నారు. -
కోటి గళాల గర్జన
–10లోమంగళవారం శ్రీ 16 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ఆధ్యాత్మికం.. ధనుర్మాసం పల్లెలు, పట్టణాల్లోని దేవాలయాలు ధనుర్మాసం పూజలకు సిద్ధమయ్యాయి. ఆధ్యాత్మిక వెలుగులు పంచనున్నాయి. కొమరాడ: కూనేరు జీసీసీ డిపోకు వెళ్లి రేషన్ తీసుకోవాలంటే ఐదు కిలోమీటర్ల ప్రయాణించాలి... నాగావళి నదిని దాటాలి.. తీరా అక్కడి కి వెళ్లాకు సేల్స్మన్ రేషన్ ఇవ్వడంలేదు... రోజుల తరబడి తిరగాల్సి వస్తోంది.. శనివా రం వస్తే సోమవారం రావాలని చెప్పారు... సోమవారం కూడా రేషన్ ఇవ్వకపోవడంతో కొమరాడ మండలం చోళ్లపదం పంచాయతీ పరిధిలోని రెబ్బ, వనధార గ్రామాలకు చెందిన 80 కుటుంబాల లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. సేల్స్మన్ అలసత్వంపై అభ్యంతరం చెబుతూ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. డీటీ స్పందించి బియ్యం అందజేస్తామని, ఆందోళన విరమించాలని సర్దిచెప్పారు. పార్వతీపురం: ప్రభుత్వ సేవలను మరింత విస్తృతం చేయాలని జేసీ పి.యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పార్వతీపురం, పాలకొండ, సబ్కలెక్టర్లు, మండల తహసీల్దార్ల తో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ధాన్యం కొనుగో లు చేయాలన్నారు. రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి ప్రజల మన్ననలు పొందాలన్నారు. రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో సబ్కలెక్టర్లు ఆర్. వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్ పాల్గొన్నారు. వీరఘట్టం/ పాలకొండ: ఎలాంటి పనినైనా తనకు అనుకూలంగా మార్చుకుని ప్రచార ఆర్భాటం చేయడం, అబద్ధాలను నిజమని నమ్మించడం.. హామీలిచ్చి మోసం చేయడంలో సీఎం చంద్రబాబునాయుడుని మించిన వారు ఉండరన్నది రాజకీయ విశ్లేషకులు తరచూ చెప్పేమాట. పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసేందుకు చంద్రబాబు చేస్తున్న హడావుడి దీనికి అద్దం పడుతోంది. విమర్శలకు తావిచ్చింది. కానిస్టేబుల్ పోస్టులకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 30–11–2022న నోటిఫికేషన్ ఇచ్చింది. 22–01–2023న రాతపరీక్ష కూడా నిర్వహించింది. అనంతరం కోర్టు కేసులతో పోస్టుల భర్తీ వాయిదా పడింది. 2024లో ప్రభుత్వం మారింది. కోర్టు కేసుల పరిష్కారంతో అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. వాస్తవంగా నియామక పత్రాలు ఎస్పీ చేతుల మీదుగా అందజేయాలి. అయితే, పోస్టుల భర్తీ తమ ప్రభుత్వమే చేపట్టిందని ప్రచారం చేసుకునేందుకు నియామక పత్రాలను మంగళగిరిలో మంగళవారం అందజేసేందుకు చంద్రబాబు ఏర్పాట్లు చేయించారు. పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులను ప్రత్యేక బస్సుల్లో రాజధానికి తరలిస్తున్నారు. ప్రచార యావ కోసం ప్రజాధనం దుర్వినియోగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్పీ కార్యాలయాల్లో అందుకోవాల్సిన నియామక పత్రాలకోసం చలిలో కుటుంబ సభ్యులతో కలిసి వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి రావడంపై కొందరు అభ్యర్థులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. పేదలకు వైద్యం.. విద్యార్థులకు వైద్యవిద్య ఉచితంగా అందాల్సిందేనని జనం నినదించారు. వైద్యకళాశాలలు ప్రైవేటీకరించాలన్న చంద్రబాబు ప్రభుత్వ తీరును దుమ్మెత్తిపోశారు. వైఎస్సార్సీపీ తలపెట్టిన కోటి సంతకాల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. ప్రభుత్వ మెడలు వంచేందుకు తాము సైతం అంటూ ముందుకు కదిలారు. సంతకాల ప్రతులతో జిల్లా కేంద్రంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ చేసిన సంతకం ప్రతులను గవర్నర్వద్దకు చేర్చే బృహత్తర క్రతువులో భాగస్వాములయ్యారు. సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్: ప్రభుత్వ వైద్యకళాశాలలను ప్రైవేటీకరించాలన్న చంద్రబాబు ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. ప్రజా ఉద్యమంలో భాగంగా కోటి సంతకాల పేరుతో ప్రజల అభిప్రాయాలను వైఎస్సార్సీపీ సేకరించిన విషయం విదితమే. జిల్లావ్యాప్తంగా 2 లక్షలకుపైగా సంతకాలను సేకరించి, పార్టీ కేంద్ర కార్యాలయానికి సోమవారం ప్రత్యేక వాహనంలో తరలించారు. ఇందులో భాగంగా నాలుగు నియోజకవర్గాల నుంచి వందలాది మందితో జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టారు. పార్వతీపురం పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపాన వైఎస్సార్ కూడలి వద్ద దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ నుంచి ర్యాలీగా కలెక్టరేట్ వరకు వెళ్లారు. సంతకాల ప్రతులతో ప్రదర్శనగా సాగారు. ప్రభుత్వ వైద్యకళాశాలలను పరిరక్షించాలని.. ప్రైవేట్ భాగస్వామ్యంతో పేదలకు వైద్యాన్ని, వైద్యవిద్యను దూరం చేయ వద్దని నినాదాలు చేశారు. అనంతరం ఐటీడీఏ పెట్రోల్ బంకు వద్ద నుంచి వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించి, సంతకాల ప్రతులను పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. అక్కడే మీడియా తో నాయకులు మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్రాజు, అరకు పార్ల మెంట్ పరిశీలకులు ఎ.చిన్నప్పలనాయుడు, మాజీ ఉప ముఖ్యమంత్రులు పీడిక రాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణి, పాలకొండ, పార్వతీపురం మాజీ ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, అలజంగి జోగారావు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో పది మెడికల్ కళాశాలల ప్రైవే టీకరణకు సిద్ధమయ్యా రు. అందులో పార్వతీపు రం నియోజకవర్గంలో చేపట్టాల్సిన మెడికల్ కాలేజీ కూడా ఉంది. ఇది కుట్రపూరితమైన చర్య. రూ.150 కోట్ల విలువ చేసే స్థలాన్ని ఇచ్చాం. రూ.70 కోట్లు వెచ్చించి ఆస్పత్రి నిర్మాణాలు కూడా చేపట్టాం. 80 శాతం పనులు పూర్తయ్యాయి. నేడు ప్రజల ఆస్తిని ప్రైవేట్కు కట్టబెట్టేందుకు చూస్తున్నారు. చేతగాని దద్దమ్మ ప్రభుత్వాన్ని ఒకటే అడు గుతున్నాం.. రూ.3 లక్షల బడ్జెట్ పెట్టి, రూ.లక్షల కోట్లు అప్పులు తెస్తున్న చంద్రబాబూ.. కేవలం రూ.5 వేల కోట్లు వెచ్చించి ప్రభుత్వ వైద్యకళాశాలలను పూర్తి చేయలేవా? అంత దయనీ య స్థితిలో ఉన్న చేతకానివారా? ప్రశ్నిస్తానన్న పవన్కల్యాణ్కు పేదవర్గాల మేలు అవసరం లేదా? ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్తా పోరాటం చేస్తారు. ప్రభుత్వం మెడలు వంచేదాకా విశ్రమించం. – అలజంగి జోగారావు, మాజీ ఎమ్మెల్యే, పార్వతీపురం నియోజకవర్గం విద్య, వైద్యం, ప్రజారవాణా వ్యవస్థల విషయంలో ప్రభుత్వమే బాధ్యత వహించి, మార్గదర్శకంగా నిలవాలి. ప్రభుత్వ వైద్యకళాశాలల ప్రైవేటీకరణ అంశాన్ని శాసన మండలిలో పలుమార్లు ప్రస్తావించాం. రాష్ట్రంలోని రెడ్బుక్ పాలనలో ప్రజల సంక్షేమం అవసరం లేదు. ప్రైవేట్ వ్యక్తుల కోసమే చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రభుత్వ వైద్యకళాశాలల పరిరక్షణకు వైఎస్సార్సీపీ కట్టుబడి ఉంది. మా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ప్రజా ఉద్యమంలో భాగంగా కోటి సంతకాల సేకరణ చేపట్టాం. మళ్లీ వచ్చేది జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమే. ప్రజావైద్యం, ప్రభుత్వ వైద్యకళాశాలలను మళ్లీ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. రాష్ట్రంలో సామాన్యుల హక్కులను కాలరాస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్లలో ఈ ఏడాదిన్నర తరహా పాలనను ఎన్నడూ చూడలేదు. – పాలవలస విక్రాంత్, ఎమ్మెల్సీ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగింది. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను ఎలా వంచన చేయాలో చూస్తోంది. పేదలకు వైద్యం.. విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేలా నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో ఏడాదిన్నర కాలంగా ఎక్కడ చూసినా అవినీతి, కక్షసాధింపులే. – మావుడి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ పార్లమెంట్ కార్యదర్శి గత ప్రభుత్వ హయాంలో వైద్యానికి అధిక ప్రాధాన్యమిచ్చాం. పీహెచ్సీల ఆధునికీకరణతో పాటు, ఏరియా ఆస్పత్రులనూ అప్గ్రేడ్ చేశాం. అన్ని సౌకర్యాలు కల్పించాం. మందులు అందుబాటులోకి తెచ్చాం. 108 వాహన సేవలను బలోపేతం చేశాం. ఇప్పుడు వాటన్నింటినీ నిర్వీర్యం చేశారు. ఆరోగ్యశ్రీని అమలు చేయలేకపోతున్నారు. ప్రజలకు ఆరోగ్య ఆసరా ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. జగన్ ఆలోచనలకు అనుగుణంగా ఐదు ఐటీడీఏల పరిధిలో సూపర్స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం చేపట్టారు. కేవలం జగన్కు పేరు రాకూడదనే ఉద్దేశంతో వీటి నిర్మాణాలను చంద్రబాబు నిలిపివేశారు. వైద్యకళాశాలలను ప్రైవేట్కు కట్టబెడుతన్నారు. చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా గిరిశిఖర గ్రామాల ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేశారు. ప్రజల ఆకాంక్షలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తున్నాం. ఇప్పటికై నా చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకోవాలి. లేకుంటే ప్రజాగ్రహానికి గురి కాక తప్పదు. – విశ్వాసరాయి కళావతి, మాజీ ఎమ్మెల్యే, పాలకొండ నియోజకవర్గం ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ప రం చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా ఒక ఉద్య మం సాగింది. కోటి సంతకాల కార్యక్రమానికి పార్టీలకతీతంగా ప్రజలు మద్దతు గా నిలిచి, సంతకాలు చేశారు. ఈ స్థాయి లో ప్రజా ఉద్యమం చూసినా ప్రభుత్వంలో చలనం లేదు. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని గత ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కల్యాణ్ చెప్పారు. ఇప్పుడు మాట తప్పి, దశలవారీగా ప్రైవేట్పరం చేస్తున్నారు. – శరగడం చినప్పలనాయుడు, పార్లమెంట్ పరిశీలకులు మన్యం జిల్లాలోని పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడేలా ప్రభుత్వ వైద్యకళాశాలను తీసుకొచ్చారు. మాకు రాక రాక వచ్చిన వైద్యకళాశాలను ప్రైవేట్పరం చేయడమేమిటి? రహదారులను కూడా ప్రైవేట్పరం చేస్తారంట. ఇంకెందుకు.. ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కూడా ప్రైవేట్పరం చేసేయండి. ప్రజాస్వామ్యం ఎందుకు? ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకో దు. ప్రభుత్వ వైద్యకళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాల ను 18వ తేదీన గవర్నర్కు అందజేస్తాం. ఈ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురి కాక తప్పదు. తగిన మూల్యం చెల్లించుకుంటుంది. – శత్రుచర్ల పరీక్షిత్రాజు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పార్వతీపురం మన్యం -
సీఎస్పీపై మహిళా సంఘాల ఫిర్యాదు
రేగిడి: మండలంలోని తునివాడ గ్రామానికి చెందిన స్వయం సహాయ సంఘాల మహిళలు సోమవారం రేగిడి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గ్రామంలో సంఘాలకు సంబంధించిన పొదుపు నగదును గ్రామానికి చెందిన సీఎస్పీ అల్లు శ్రీధర్ స్వాహా చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. బ్యాంకులకు ప్రతి నెలా చెల్లించాల్సిన సొమ్మును అల్లు శ్రీధర్కు అందజేశామని, ఆ నగదు బ్యాంకు ఖాతాలకు జమ కాలేదని ఆవేదన చెందారు. పొదుపు, రుణ చెల్లింపులకు సంబంధించి రూ.43 లక్షలు స్వాహా చేశాడని, బాధ్యుడిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. -
అర్జీలను సొంత సమస్యగా భావించాలి
చికెన్ ● కలెక్టర్ ప్రభాకరరెడ్డి పార్వతీపురం: ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందిన అర్జీలను సొంత సమస్యగా భావించి నాణ్యమైన పరిష్కారాన్ని ఇవ్వాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి మండల స్థాయి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన ప్రజలు 117 వినతులు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీలను ఆడిట్ చేయనున్నట్లు తెలిపారు. జిల్లా అధికారులు అర్జీలను స్వయంగా పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. నాణ్యంగా అర్జీలను పరిష్కరించకపోతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. అర్జీలను స్వీకరించినవారిలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్రెడ్డి, డిఆర్ఓ కె.హేమలత, సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అలాగే కలెక్టరేట్లోని రెవెన్యూ క్లినిక్లో కూడా కలెక్టర్ వినతులను స్వీకరించారు. వినతులలో కొన్ని.. ● పార్వతీపురం మండలం చందలింగి గ్రామ రెవెన్యూ సర్వే నంబర్ 28–5లో గల ఆర్ఓఎఫ్ఆర్ భూములను అక్రమంగా సాగు చేస్తున్నారని, ఆక్రమణ దారుల తొలగించి ఫారెస్టు భూములను కాపాడాలని ఆర్.ప్రభాకర్ అర్జీ అందజేశారు. ● తన ఇంటి వెనుక భాగంలో ఉన్న ఖాళీ స్థలాన్ని కొంతమంది ఆక్రమించి ప్రహరీ నిర్మించారని, ఆక్రమణలను తొలగించాలని కోరుతూ భామిని మండలం బాలేరు గ్రామానికి చెందిన నిమ్మక వసంతకుమార్ వినతిపత్రం అందజేశాడు. . ● సీతానగరం మండలం నిడగల్లు గ్రామానికి చెందిన జి. సత్యం తనకు దివ్యాంగుల పింఛన్ మంజూరు చేయాలని కోరాడు. ● పార్వతీపురం పట్టణానికి చెందిన సీహెచ్. పైడిరాజు గ్యాస్ సబ్సిడీ నగదు బ్యాంకు ఖాతాలో జమ కావడం లేదని నగదు జమ అయ్యేలా చూడాలని వినతిని అందజేశారు. ● పార్వతీపురం మండలం వెంకంపేట గ్రామానికి చెందిన డి. శ్రీరాములు గృహ నిర్మాణం పథకం ద్వారా ఇల్లు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశాడు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 19 వినతులు సీతంపేట: సీతంపేట ఐటీడీఏలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం ఐటీడీఏ ఏపీఓ ఎస్.వి.గణేష్ నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు 19 వినతులు వచ్చాయి. కొండచీపుళ్ల తయారీ యూనిట్ పెట్టుకోవడానికి రుణం ఇప్పించాలని అడ్డంగి గ్రామస్తుడు గోవిందరావు, మేకల యూనిట్ నిర్వహణకు లోన్ ఇప్పించాలని ఎం.సింగుపురం గ్రామస్తుడు సింహాచలం అర్జీలు అందజేశారు. జన్నోడుగూడ గ్రామస్తులు అంతర్గత సీసీరోడ్డు గ్రామానికి నిర్మించాలని విన్నవించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పారదర్శకంగా పరిష్కరించాలి: ఎస్పీ పార్వతీపురం రూరల్: జిల్లా పోలీసుశాఖ కార్యాలయంలో సోమవారం ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ఫిర్యాదుదారుల నుంచి వచ్చిన 9 అర్జీలను నేరుగా స్వీకరించి అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఫిర్యాదుల పరిష్కారం దిశగా సంబంధిత అధికారులకు ఫోన్లో ఎస్పీ ఆదేశాలను జారీ చేస్తూ ఫిర్యాదుల పూర్వా పరాలను విచారణ చేసి వాస్తవాలైనట్లైతే చట్టపరిధిలో తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అమర జీవికి ఘనంగా నివాళి ఆంధ్ర రాష్ట్రం కోసం ఆత్మార్పణం చేసుకున్న అమర జీవి పొట్టి శ్రీరాములు సేవలు మరువలేనివని ఆయన ఆశయాలు, సేవలను స్ఫూర్తిగా చేసుకుని విధుల్లో పునరంకితం కావాలని ఎస్పీ మాధవ్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. -
విద్యుత్ పొదుపు ప్రగతికి మార్గం
● కలెక్టర్ రాంసుందర్ రెడ్డివిజయనగరం ఫోర్ట్: విద్యుత్ పొదుపు చేయడం ద్వారా ప్రగతికి మార్గం వేయవచ్చునని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే కచ్చితంగా విద్యుత్ పొదుపు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఏపీఈపీడీసీఎల్ సోమవారం నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి ఆర్అండ్బీ జంక్షన్, మయూరి జంక్షన్ మీదుగా బాలాజీ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంధనాన్ని ఎంత పొదుపు చేస్తే, అంత అదనంగా ఉత్పత్తి చేసినట్లునన్నారు. రోజురోజుకు విద్యుత్ డిమాండ్ ప్రస్తుతం పెరుగుతోందని, ప్రతి ఒక్కరూ విద్యుత్ ఆదాపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. దీనికోసం విద్యుత్ను ఆదా చేసే 5స్టార్ పరికరాలను వినియోగించాలని సూచించారు. అవసరమైనప్పడు విద్యుత్ ఉపకరణాలను వినియోగించాలని కోరారు. తమ ఇళ్లలోని విద్యుత్ వినియోగాన్ని ఆడిట్ చేసుకుని విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాలని చెప్పారు. విద్యుత్ను వృథా చేయవద్దన్నారు. కార్యక్రమంలో ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ మువ్వల లక్ష్మణరావు, ఈఈలు పి.త్రినాథరావు, జి.సురేష్బాబు, బి.రఘు, ఏడీఈ కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇందన పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత పార్వతీపురం: ఇంధన పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత అని, విద్యుత్ ఆదా చేసే విధానంపై అందరికీ అవగాహన కల్పించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో జాతీయ ఇంధనపొదుపు వారోత్సవాల ర్యాలీని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. అనంతరం సమావేశ మందిరంలో మాట్లాడుతూ ఇంధన పొదుపు కచ్చితంగా అమలు కావాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలు, వసతిగృహాలు, సచివాలయాలు, మండల, జిల్లా స్థాయి కార్యాలయాల్లో ఇంధనాన్ని పొదుపు చేసేలా అలవాటు చేసుకోవాలని హితవు పలికారు. ప్రతి ప్రభుత్వ భవనంలో విద్యుత్ను ఆదా చేయాలని సూచించారు. గత నెలలో విద్యుత్ బిల్లు ఆదారంగా వీలైనంతవరకు విద్యుత్ పొదుపు చేసి ఆదా చేయాలని కోరారు. విద్యుత్ను ఆదా చేయడమంటే విద్యుత్ను ఉత్పత్తి చేయడమేనని పేర్కొన్నారు. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు జిల్లాలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించి నాణ్యమైన విద్యుత్ పరికరాల వినియోగం, పొదుపు చేయడం తదితర అంశాలపై అవగాహన సమావేశాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, డీఆర్ఓ కె.హేమలత, సబ్కలెక్టర్ ఆర్.వైశాలి, విద్యుత్శాఖ ఎస్ఈ పాల్గొన్నారు. -
ఆధ్యాత్మికం.. ధనుర్మాసం
బలిజిపేట: పల్లెలు, పట్టణాల్లో దేవాలయాల ద్వారా ధనుర్మాసంలో ఆధ్యాత్మిక వెలుగులు విరజిమ్ముతాయి. ఆలయాల్లో నిత్య కై ంకర్య సేవలు, విశేష రోజులు, సేవలు, శ్రీ గోదా రంగనాఽథ స్వామివార్ల కల్యాణం, ప్రత్యేక పాశురాలు, పులకింపజేసే తిరుప్పావై ప్రవచనాలు, పూజా కార్యక్రమాలు, భోగి, సంక్రాంతి, కనుమ పర్వదినాలతో ధనుర్మాసం శ్రీమహా విష్ణువుకు అత్యంత్ర ప్రీతికరమైనదిగా ప్రాచుర్యం పొందింది. వేదాల్లో సామవేదం, మాసాల్లో మార్గశిరం అత్యంత పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ఈ మాసంలో రంగనాథుడిని పరమభక్తితో సేవించడం ద్వారా గోదాదేవి ఆయనను వరించి, తన భక్తిని చాటుకుంది. సూర్యుడు వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశిలోకి ఈనెలలోనే ప్రవేశిస్తాడు. విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి గోదాదేవి రోజుకో రీతిలో తిరుప్పావై పాశురాలను ఆలపించడం విశేషం. ధనుర్మాసంలో పండగ నెల ప్రారంభం కావడంతో పట్టణ, పల్లె ప్రాంతాలు పరవశిస్తాయి. నెల మొదలైన నాటినుంచి సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి. హరిదాసు కీర్తనలతో పల్లెలు పులకిస్తాయి. గొబ్బెమ్మల కొలువు పండగ నెల ప్రారంభమైన నాటి నుంచి ప్రతి ఇంటిముందు కళ్లాపు చల్లి అందమైన ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి గోదాదేవి, లక్ష్మీదేవి, గౌరీమాతగా భావిస్తారు. గోవుపేడతో పేడతో చేసిన గొబ్బెమ్మలను ముగ్గుల మధ్యలో ఉంచుతారు. భోగిభాగ్యాలు గ్రామాలు, పట్టణాల్లో భోగి మంటలు వేస్తారు. దీంతో సకల దోషాలకు పరిహారం లభిస్తుందని భావిస్తారు. కనుమతో ధనుర్మాసం పూర్తి కనుమ పండుగతో ధనుర్మాసం ముగుస్తుంది. దీన్నే పశువుల పండుగ అని అంటారు. ఏడాది పొడవునా వ్యవసాయ పనుల్లో సాయం చేసిన పశువులకు రైతులు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ధనుర్మాసం ప్రారంభం కాగానే పండగ వాతావరణంతో పల్లెలు కళకళలాడుతాయి. శ్రీమహావిష్ణువుకు ప్రీతిపాత్రం ధనుర్మాసం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. వేకువనే స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు చేస్తారు. తిరుప్పావై నిర్వహిస్తారు. సంక్రాంతి..పితృదేవతలకు శాంతి మకర సంక్రాంతిని పెద్దల పండగ అంటారు. ఈ రోజున పితృదేవతలకు కొత్త బట్టలు పెట్టుకుని తర్పణాలు వదులుతారు. పంచభక్ష్య పరమాణ్నాలతో నైవేద్యం సమర్పించి పెద్దల ఆశీర్వచనం పొందుతారు. ధనుర్మాసంలో విశిష్టమైన రోజులు 2025, డిసెంబరు 24వ తేదీన వేశేష ధూప్ సేవ(తూమని మాడత్తు) డిసెంబరు 30వ తేదీన వైకుంఠ ఏకాదశి (ఉత్తరద్వార దర్శనం) 2026, జనవరి 3వ తేదీన విశేష దీపాలంకరణ సేవ(కుత్తు విళక్కెరియ) జనవరి 8వ తేదీన పొన్నాకుల హారతి (అన్జు ఇవ్వులగం) జనవరి 11వ తేదీన విశేష ప్రసాద సేవ (కూడారై వెల్లుం) జనవరి 14వ తేదీన భోగి రోజున పూలంగి సేవ, శ్రీగోదారంగనాథుల కల్యాణం నేటి నుంచి వచ్చేనెల 14వరకు శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరం భోగి, సంక్రాంతి, కనుమల సమాహారం సంస్కృతి, సంప్రదాయాలకు ఆలవాలంఎంతో పవిత్రమైనది ధనుర్మాసం ఎంతో పవిత్రమైనది. శ్రీగోదారంగనాథులను కొలుచుకుని వారి ఆశీస్సులను పొందినవారికి ఎంతోమేలు జరుగుతుంది. అధ్యాత్మికంగా ఈమాసం అందరినీ మేలుకొలుపుతుంది. – సురేష్, అర్చకుడు, బలిజిపేట వైష్ణవాలయాల్లో తిరుప్పావై ప్రవచనాలు శ్రీవైష్ణవులకు తిరుప్పావై వ్రతం ముఖ్యమైనది. ఈ వ్రతంలో నెలరోజులపాటు రోజుకో పాశురం చొప్పున విన్నపం చేస్తారు. ఒకటి నుంచి 5రోజులు నియమ, నిబంధనలకు సంబంధించిన పాశురాలు. 6వ రోజునుంచి 15 పాశురాలతో తన తోటి చెలికత్తెలను నిద్రలేపి నందగోపుని గృహానికి వెళ్లడం, 16,17,18పాశురాలలో నందగోపుడు, యశోద, బలరాములను మేల్కొలపడం, 23వ పాశురంలో మంగళాశాసనం, 25, 26పాశురాలలో స్వామికి అలంకారాలైన ఆయుధాలలో పరా అనే వాయిద్యాన్ని తమ శరణాగతి అనుగ్రహించి, తమ సంకల్పాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తారు. ఆఖరి రోజున గోదారంగనాథుల కల్యాణం అట్టహాసంగా నిర్వహిస్తారని అర్చకులు చెబుతున్నారు. గోదాదేవితో కూడుకుని ఉండే నారాయణ అర్చన సేవయే ఈమాసపు ప్రాధాన్యంగా పేరొందిందని, భగవంతుని ఏవిధంగా చేరుకోవాలో తెలిపే మాసం ఇది అని అర్చకులు తెలియజేస్తున్నారు. భక్తులు ఈమాసంలో స్వామివారి సేవలో పాల్గొని చూసి, విని తరించాలని అర్చకులు కోరుతున్నారు. -
విశాఖలో కార్మిక గర్జనకు సన్నాహాలు
విజయనగరం గంటస్తంభం: డిసెంబర్ 31నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరగనున్న సీఐటీయూ జాతీయ మహాసభలను కార్మికులంతా విజయవంతం చేయాలని సీఐటీయూ నాయకులు రెడ్డి శంకరరావు, ఎ.జగన్మోహనరావులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మహాసభల ప్రచారంలో భాగంగా సోమవారం స్థానిక కోట జంక్షన్ ఆటోస్టాండ్ వద్ద సీఐటీయూ జెండాను రెడ్డి శంకరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కార్మిక హక్కులు, కార్మిక చట్టాల పరిరక్షణ కోసం సీఐటీయూ సాగించిన పోరాటాలకు గొప్ప చరిత్ర ఉందన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కార్మిక కోడ్ల పేరుతో కార్మికులు సాధించుకున్న హక్కులను కుదిస్తోందని విమర్శించారు. అలాగే రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. రాబోయే జాతీయ మహాసభల్లో కార్మిక చట్టాల పరిరక్షణ, ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకత, అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం తీసుకురావాలనే అంశాలపై తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు. జనవరి 4న విశాఖపట్నం బీచ్లో జరిగే బహిరంగ సభలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బి.రమణ, పాపారావులతో పాటు ఆటో, కలాసీ కార్మికులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీలకు గురుకుల కళాశాల విద్యార్థిని
గుమ్మలక్ష్మీపురం: జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలకు గుమ్మలక్ష్మీపురం మండలంలోని భద్రగిరి గిరిజన సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాల(పీటీజీ)లో సెకెండ్ ఇయర్ బైపీసీ చదువుతున్న తోయక ప్రవల్లిక ఎంపికై నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డి.భారతి, ఫెన్సింగ్ కోచ్ పి.బాలరాజు సోమవారం విలేకరులకు తెలిపారు. ఈ మేరకు గుంటూరు జిల్లా వెనిగండ్లలోని శ్రీవేమన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా ఈనెల 13, 14వ తేదీల్లో జరిగిన 69వ స్టేట్ లెవెల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఛాంపియన్ షిప్ ఫెన్సింగ్ పోటీల్లో ఫోయిల్ వ్యక్తిగత విభాగంలో ప్రవల్లిక పాల్గొ ని ఉత్తమ ప్రతిభ కనబరిచి కాంస్య పతకం సాధించిందన్నారు. ఈ విద్యార్థిని త్వరలో ఇంఫాల్లో జరగనున్న జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొననున్నట్లు తెలియజేస్తూ..జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థినికి అభినందనలు తెలియజేశారు. -
ఆంధ్రరాష్ట్ర సాధకుడు పొట్టి శ్రీరాములు
పార్వతీపురం: ఆంధ్రరాష్ట్ర సాధకుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. పొట్టి శ్రీరాములు వర్ధంతిని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టిశ్రీరాములు ప్రాణత్యాగ ఫలితంగా భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటయ్యాయన్నారు. అలాగే, ఉక్కుమనిషిగా పేరుగాంచిన సర్ధార్ వల్లభాయ్పటేల్ వర్ధంతిని పురస్కరిచుకుని ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలువేసి నివాళులర్పించారు. స్వదేశీ సంస్థానా లను భారతదేశంలో విలీనం చేయడంలో ఎంతో కృషి చేశారన్నారు. కార్యక్రమంలో జేసీ సి.యశ్వంత్కుమార్ రెడ్డి, డీఆర్వో కె.హేమలత, సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాఽథ్, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి పాల్గొన్నారు. -
చోరీకి గురైన బంగారు ఆభరణాల రికవరీ
వేపాడ: మండలంలోని పలు గ్రామాల్లో పట్టపగలు చోరీలకు పాల్పడిన వ్యక్తిని వల్లంపూడి పోలీసులు సోమవారం పట్టుకుని దొంగిలించిన బంగారాన్ని రికవరీ చేశారు. ఇందుకు సంబంధించి ఎస్.కోట రూరల్ సీఐ అప్పలనాయుడు సోమవారం రాత్రి విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లో వావిలపాడు, వల్లంపూడి, రామస్వామిపేట గ్రామాల్లో పట్టపగలు ఇళ్లలో ఎవరూ లేని సమయంలో దొంగతనాలు జరిగిన విషయం విదితమే. దీనిపై వల్లంపూడి ఎస్సై సుదర్శన్, సిబ్బందితో నిర్వహించిన తనిఖీల్లో సోమవారం కుమ్మపల్లి జంక్షన్ వద్ద అనకాపల్లి జిల్లా, చోడవరం మండలం, లక్ష్మీపురం గ్రామానికి చెందిన పిల్లా నూకరాజును నిందితుడిగా గుర్తించి పట్టుకున్నారు. పట్టుబడిన వ్యక్తివద్ద రామస్వామిపేటలో దొంగిలించిన ఐదున్నర తులాలు, వావిలపాడులో దొంగిలించిన తులంన్నర బంగారం రికవరీ చేసినట్లు సీఐ తెలిపారు. వల్లంపూడిలో చోరీ చేసిన బంగారం చోడవరంలోని ఓ ప్రైవేట్ బ్యాంకులో తాకట్టు పెట్టినట్లు సీఐ చెప్పారు. పట్టుబడిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిని కోర్టుకు తరలిస్తామన్నారు. -
రామతీర్థసాగర్పై నిర్లక్ష్యం
● ఏడాదిన్నరగా ముందుకు సాగని పనులు ● ప్రాజెక్టు పూర్తయితే 24,710 ఎకరాలకు సాగునీరు ● విజయనగరం పట్టణానికి తాగునీరు ● కూటమిసర్కారు తీరుతో ఆందోళనలో రైతులుపూసపాటిరేగ: కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర సమయం పూర్తవుతున్నా ఒక్క పైసా కూడా విదల్చకపోవడంతో రామతీర్థసాగర్ రిజర్వాయర్ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. రిజర్వాయర్ ట్యాంకులో అడవిని తలపించినట్లు తుప్పలు పెరిగాయి. రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ, నెల్లిమర్ల మండలాల్లోని 24,710 ఎకరాలకు సాగునీరు, విజయనగరం పట్టణానికి తాగునీరు అందుతుంది. గుర్ల మండలం కోటగండ్రేడు వద్ద చంపావతినదిలో బ్యారేజీ నిర్మించి కాలువ ద్వారా రోజుకు 1200 క్యూసెక్కుల నీరు మళ్లించి 2.728 టీఎంసీల నీరు రిజర్వాయర్లో నిల్వ ఉండే విధంగా డిజైన్ చేశారు. రిజర్వాయర్ కుడి, ఎడమ కాలువలు 25.22 కిలోమీటర్లు కాగా, సుమారు 12 కిలో మీటర్ల మేర పనులు మాత్రమే ఇప్పటికి పూర్తయ్యాయి. మిగిలిన 13.22 కిలో మీటర్ల పనులు జరగాల్సి ఉంది. రిజర్వాయర్ డెడ్ స్టోరేజీ 0.48 టీఎంసీల నీటితో విజయనగరం పట్టణానికి తాగునీరు అందించడానికి ప్రణాళిక సిద్ధమైంది. అయితే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత 18 నెలల కాలంగా రిజర్వాయర్ పనులు ముందుకు సాగలేదు. 2006లో రామతీర్థసాగర్ రిజర్వాయర్ను రూ.220 కోట్ల ఖర్చు అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారు. దఫదఫాలు అంచనా వ్యయం పెంచిన ప్రభుత్వాలు 2025 ఫిబ్రవరి నాటికి రూ.808 కోట్లు అంచనా వ్యయంగా ఖరారు చేసింది. ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలకు సుమారు రూ.100 కోట్ల వరకు అవసరం అవుతుందని అధికారులు అంచనా వేశారు. రామతీర్ధసాగర్ ప్రాజెక్టు ద్వారా భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అవసరమైన నీటితో పాటు జిల్లాలో నూతనంగా నిర్మాణం అవుతున్న పరిశ్రమలకు కావాల్సిన నీరు ప్రాజెక్టు ద్వారానే అందించడానికి సన్నాహాలు చేశారు. ప్రాజెక్టు ప్రారంభమై 19 సంవత్సరాలు అవుతున్నా నేటికీ పనులు పూర్తికాని పరిస్థితి. ఇప్పటివరకు సుమారు 55 శాతం వరకు పనులు మాత్రమే జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2026 నాటికి పనులు పూర్తి చేయడానికి ఒప్పందం జరిగినప్పటికీ పనుల్లో మాత్రం కదలిక లేదు. నెల్లిమర్ల నియోజకవర్గం ప్రజలు సాగునీరు, విజయనగరం పట్టణ ప్రజలు తాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు రామతీర్థసాగర్ రిజర్వాయర్ పనులు సకాలంలో పూర్తిచేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. పనులు సకాలంలో పూర్తి చేయాలి రామతీర్థసాగర్ రిజర్వాయర్ పనులు సకాలంలో పూర్తి చేయాలి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే 55 శాతం పనులు పూర్తి అయ్యాయి. నేటి పరిస్థితి చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పనులు నిలిచిపోయాయి. నియోజకవర్గంలో ప్రజలకు సాగునీరు అందేవిధంగా చర్యలు తీసుకోవాలి. తాళ్లపూడి అప్పలనాయుడు, రైతు, పూసపాటిరేగ ఆర్ఆర్ ప్యాకేజీ మంజూరు చేయాలికోరాడపేట, ఏటీ అగ్రహారం గ్రామాలకు ఆర్ఆర్ ప్యాకేజీ మంజూరు చేయాలి. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించి సుమారు 19 సంవత్సరాలు అవుతున్నా పనులు పూర్తి కాలేదు. సకాలంలో పునరావాసం కల్పించాలి. నిర్వాసితుల కాలనీలకు నిధులు మంజూరు చేసి గృహాలు తక్షణమే నిర్మాణం జరిగే విధంగా చూడాలి. కె.కృష్ణ, కోరాడపేట నిర్వాసితుడు -
సూర్యప్రకాష్కు ఇన్స్పైరింగ్ ఇండియన్స్ అవార్డు
గరుగుబిల్లి: ప్రముఖ కార్డియాలజిస్టు డా. గుల్ల సూర్యప్రకాష్కు ఇన్స్పైరింగ్ ఇండియన్స్ అవార్డును ఢిల్లీలో ఇన్స్పైర్ మనక్ సంస్థ ప్రధానం చేసింది. ఈయన గ్రామీణ నేపథ్యం నుంచి వైద్య రంగంలో అత్యున్నత స్థాయికి చేరి వైద్య రంగంతో పాటు ప్రజల మన్ననలను కూడా అందుకుంటున్నారు. వైద్యాన్ని లాభసాటిగా కాకుండా పేదలకు సేవలు చేస్తూ ప్రజలకు చేరువయ్యారు. నగరాలకే పరిమితమైన కార్డియాక్ట్ పరీక్షలను గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా ఉచిత వైద్య శిబిరాలను, స్క్రీనింగ్ క్యాంపులను నిర్వహించి అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. వైద్యాన్ని ఒక వృత్తిగా కాకుండా సామాజిక సేవగా భావించి యువ వైద్యులను, వాలంటీర్లను సేవా మార్గంలో నడిపించేలా వైద్యం ఒక మిషన్ అనే భావనను కల్పించారు. ఈయన వైద్య రంగంలో చేస్తున్న సేవలను గుర్తించి ఢిల్లీలో ఇన్స్పైర్ మనక్ సంస్థ ఇన్స్పైరింగ్ అవార్డును ప్రధానం చేసి ఆయనకు ప్రత్యేక గుర్తింపునిచ్చింది. సూర్యప్రకాష్ మండలంలోని రావుపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. ఈయనను సర్పంచ్ బి.మహేశ్వరరావుతో పాటు పలువురు అభినందించారు. -
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు జిల్లా జట్ల ఎంపిక
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న జూనియర్స్ బాల, బాలికలు, సీనియర్స్ సీ్త్ర, పురుషుల ఖోఖో పోటీల్లో పాల్గొనబోయే జిల్లా జట్ల ఎంపికలు ఆదివారం పూర్తయ్యాయి. జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని కార్పొరేషన్ కస్పా ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి 170 మంది క్రీడాకారులు హాజరయ్యారు. హాజరైన క్రీడాకారులకు జూనియర్స్, సీనియర్స్ విబాగాల్లో ఎంపిక పోటీలు నిర్వహించగా ఆద్యంతం ఉత్కంఠభరితంగా పోటీలు సాగాయి. ఎంపికల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 30 మంది క్రీడాకారులను జూనియర్స్ విభాగంలో ఎంపిక చేయగా.. సీనియర్స్ విభాగంలో మరో 30 మంది అర్హత సాధించారు. జూనియర్స్ విభాగంలో ఎంపికై న బాల, బాలికల క్రీడాకారులు ఈనెల 19,20,21 తేదీల్లో ప్రకాశం జిల్లా పంగులూరులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా నుంచి పాల్గొననున్నారు. అదేవిధంగా సీనియర్స్ విభాగంలో అర్హత సాధించిన క్రీడాకారులు ఈనెల 24,26 తేదీల్లో గుడివాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఎంపిక పోటీలను జిల్లా ఖోఖో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు వీవీ రమణమూర్తి, అధ్యక్షుడు ఏఎంఎన్ కమలనాభరావు, ప్రధాన కార్యదర్శి కె.గోపాల్, కోశాధికారి ప్రసాద్, ఆర్గనైజింగ్ కార్యదర్శి మల్లి కార్జునారావు, ఎస్జీఎఫ్ కార్యదర్శి ఎస్.విజయలక్ష్మి, పీడీ వరలక్ష్మి, రామకృష్ణ, రాంబాబు, హరీష్, సత్యనారాయణ, శ్రీను తదితరులు పర్యవేక్షించారు. -
మీ కోసం వెబ్సైట్లో పీజీఆర్ఎస్ అర్జీల వివరాలు
పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీల వివరాలు మీ కోసం వెబ్సైట్లో నమోదు చేయవచ్చని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరించడం జరుగుతుందని ఆయన తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రతి రోజూ ప్రజల నుంచి వినతులు స్వీకరించుటకు సెల్లార్లో ప్రత్యేకంగా సెల్ను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. అర్జీదారులు మీకోసం.ఏపీజీఓవీ.ఇన్ వెబ్సైట్లో అర్జీలు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అర్జీల నమోదు, నమోదైన అర్జీల స్థితి, దానికి సంబంధించి సమాచారం తెలుసుకునేందుకు 1100 నంబరుకు డయల్ చేయాలని సూచించారు. విజయనగరం టౌన్: గోవా గవర్నర్గా కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ వేత్త పూస పాటి అశోక్ గజపతిరాజు ఎంపికవ్వడం తెలు గు వారందరికీ గర్వకారణమని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు పేర్కొన్నారు. క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక క్షత్రియ కల్యాణ మండపంలో ఆదివారం ఆత్మీ య సత్కార సభను నిర్వహించారు. కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో విలువలకు, విశ్వసనీయతకు మారుపేరు గా నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో క్షత్రియ పరిషత్ ప్రతినిధులు పాల్గొన్నారు. రాజాం : స్థానిక జీఎంఆర్ వరలక్ష్మీ కళాక్షేత్రంలో రాజాంకు చెందిన శ్రీ పోలిపల్లి పైడితల్లి కళాకారుల సంక్షేమ సేవా సంఘం నెలవారీ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆదివా రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు పద్మశ్రీ యడ్ల గోపాలరావు కత్తులకవిటికి చెందిన ఎన్ఆర్ఐ, సామాజిక సేవా కార్యకర్త దాము గేదెలను సేవారత్న అవార్డుతో సత్కరించారు. అవార్డు అందుకున్న దాము మాట్లాడుతూ తనకు చిన్నప్పటి నుంచి సేవా కార్యక్రమాలు అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. కుటుంబీకులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ ఉత్సాహం రెట్టింపు అయ్యిందని, సేవా కార్యక్రమాలు బాధ్యతను, సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెట్టాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దామును పలువురు కళాకారులు, ఆయన బంధువులు ఘనంగా సత్కరించారు. అంతకు ముందు జగన్మోహిని పద్య నాటక ప్ర దర్శన, కేవీ పద్మావతి శిష్య బృందంతో భరత నాట్య నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. కా ర్యక్రమంలో పోలిపల్లి పైడితల్లి కళాకారుల సంక్షేమ సేవా సంఘం కమిటీ సభ్యులు, రాజాంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బొబ్బిలి: పట్టణంలో క్రిస్మస్ సందడి ప్రారంభమైంది. మెయిన్ రోడ్డు, బజార్లోని పలు దుకాణాల వద్ద క్రిస్మస్ స్టార్లు, ట్రీలు లైటింగ్ డెకరేషన్ల లైట్లు విక్రయిస్తున్నారు. వస్త్ర దుకాణాలు క్రైస్తవ సోదరులు, పిల్లలతో సందడిగా కనిపిస్తున్నాయి. బొబ్బిలిలోని వందేళ్ల పైబడ్డ చరిత్ర ఉన్న స్థానిక సీబీఎం చర్చి రంగులేసుకుని రాత్రి వేళల్లో విద్యుద్దీపాలతో తణుకులీనుతున్న దృశ్యాలు పట్టణంలో కనుల పండువగా కనిపిస్తున్నాయి. -
ప్రజాగ్రహం
నేడు జిల్లా కేంద్రాల్లో ప్రజా చైతన్య ర్యాలీలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించ తల పెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 15న సోమ వారం విజయనగరం, పార్వతీపురం–మన్యం జిల్లా కేంద్రంలో ఆయా జిల్లా పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో ప్రజా చైతన్య ర్యాలీలు నిర్వహించనున్నారు. పార్టీ ఆదేశాల మేరకు ఇప్పటికే నియోజకవర్గ కేంద్రాల నుంచి సేకరించిన కోటి సంతకాల ప్రతులను జిల్లా కేంద్రాల నుంచి విజ యవాడలోని పార్టీ కార్యాలయానికి తరలించనున్నారు. అనంతరం ఈ నెల 18న పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర గవర్నరుకు కోటి సంతకాలు అందజేసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని కోరనున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో విస్తృత పరించేందుకు చేపట్టిన ర్యాలీలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని మద్దతు తెలియజేయటం ద్వారా ర్యాలీలను విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ నేతలు పిలుపునిచ్చారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం : ప్రజా వైద్యాన్ని ప్రైవేటుపరం చేస్తూ తమనెవ రూ ఆపలేరని... తన మాటే శాసనమని విర్రవీగిన చంద్రబాబు ప్రభుత్వ అహంకారాన్ని కలంతో ప్రజ లు నిలదీశారు. తమ ప్రాణాలకు విలువ లేదా.. ఆరోగ్యమంటే లెక్కలేదా..? అంటూ ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రజా వైద్యానికి ఇచ్చిన ప్రాధాన్యాన్ని.. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చేసిన కృషిని నేటి కార్పొరేట్ ప్రభుత్వం తుంగలోకి తొక్కుతూ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించేందుకు చేస్తున్న యత్నాన్ని ప్రజలు గొంతెత్తి ప్రశ్నించారు. తమ పట్ల ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్రను.. మోసాన్ని సహించలేని ప్రజలు ఆగ్రహోగ్రులయ్యారు. ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని దించేసి అధికారం ఉంటే కచ్చితంగా దించేసేవారే... కానీ దానికింకా టైముంది.. అందుకే అందాకా సంతకాలతో తమ నిరసన తెలియజేశారు. కోటి సంతకాల సేకరణకు స్వచ్ఛంద ప్రజా మద్దతు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజాగ్రహం పెల్లుబికింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా 17 మెడికల్ కాలేజీలు నిర్మించేందుకు గత ప్రభుత్వంలో నిర్ణయం తీసుకోగా.. అందులో 5 కాలేజీలు నిర్మాణం పూర్తి చేసుకుని తరగతులు ప్రారంభమయ్యాయి. మరో రెండు కాలేజీలు నిర్మాణాలు పూర్తి చేసుకోగా.. మిగిలిన 10 కాలేజీలు వివిధ దశల్లో ఉన్నాయి. వాటిని పూర్తి చేయాల్సిన కూటమి ప్రభుత్వం ఆర్థిక భారం పేరిట పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేయటాన్ని బాధ్యత గల ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యతిరేకించారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పార్టీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమానికి ఊరూ వాడా మద్దతు పలికింది. భవిష్యత్తు మీద ఆందోళనతో విద్యార్థి లోకం.. ఆరో గ్య భద్రతపై బెంగతో వృద్ధులు సైతం ఈ సంతకా ల్లో మేము సైతం అని పాల్గొన్నారు. మన్యం ప్రజ లు ఈ ఉద్యమానికి మోసులెత్తగా.. పట్టణ ప్రజలు పరుగులెత్తారు. పల్లెలు పట్టుగొమ్మలయ్యాయి.. విద్యార్థులు వీరులై కదలివచ్చారు. దీంతో మొత్తానికి విజయనగరం... పార్వతీపురం మన్యం జిల్లాల్లో కోటి సంతకాల ఉద్యమం ఘనంగా సాగింది. ఈ సంతకాల ప్రతులు ఇప్పుడు గ్రామాలూ.. మండలాలు.. పట్టణాలను దాటుకుని జిల్లా కేంద్రాలకు చేరుతున్నాయి. ఇవి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకొని అక్కడి నుంచి గవర్నరుకు అందజేస్తారు. ప్రజా వ్యతిరేకతను గవర్నరుకు వివరించడం ద్వారా ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు.. దమననీతిని దేశవ్యాప్తం చేసేందుకు వైఎస్సార్సీపీ కంకణం కట్టుకుంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నియోజకవర్గాల వారిగా సేకరించిన సంతకాల వివరాలు.. విజయనగరం : 54,889 ఎస్.కోట : 52,000 గజపతినగరం : 60,000 చీపురుపల్లి : 62,500 నెల్లిమర్ల : 67,019 బొబ్బిలి : 52,500 రాజాం : 51,000 పాలకొండ : 63,000 కురుపాం : 55,000 పార్వతీపురం : 64,000 సాలూరు : 35,000 -
పతకాలు పట్టిన పైలెట్
శృంగవరపుకోట: వెటరన్ అథ్లెట్గా పతకాలు పట్టేస్తున్న ఆ పైలెట్ మరోమారు సత్తాచాటి పతకాలు పట్టేశాడు. 108వాహనంలో పైలెట్గా విధులు నిర్వహిస్తున్న ఎంఎస్ఎన్ మూర్తి బాపట్లలోని ఆర్ట్స్ ఎండ్ సైన్స్ కళాశాల మైదానంలో డిసెంబర్ 13,14 తేదీల్లో నిర్వహించిన 7వ ఏపీ స్టేట్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్–2025 పోటీలకు జిల్లాకు ప్రాతినిధ్యం వహించాడు. నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో 45+ విభాగంలో పోటీపడిన ఎంఎస్ఎన్.మూర్తి జావెలిన్ త్రోలో స్వర్ణం, డిస్క్త్రోలో స్వర్ణం, హేమర్ త్రోలో రజత పతకాలను సాధించాడు. వరుసగా పతకాల పంట పండిస్తున్న వెటరన్ పైలెట్ను స్థానిక క్రీడాకారులు అభినందించారు. -
ఉత్సాహంగా వెటరన్స్ బ్యాడ్మింటన్ పోటీలు
విజయనగరం: జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన జిల్లాస్థాయి బ్యాట్మింటన్ పోటీలు ఉల్లాసంగా సాగాయి. విజయనగరం జిల్లా కేంద్రంలో గల ఇండోర్ స్టేడియంలో వెటరన్స్ విభాగంలో సీ్త్ర, పురుషులకు నిర్వహించిన బాడ్మింటన్ పోటీలను బ్యాడ్మింటన్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ప్రారంబించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 100మంది క్రీడాకారులు పోటీలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్సీ మాట్లాడుతూ బాడ్మింటన్కు జిల్లాలో పెరుగుతున్న ఆదరణ చూసి ఆనందంగా ఉందన్నారు. మానసిక ఆరోగ్యంతో పాటు, శారీరక ఆరోగ్యం ఎంతగానో మెరుగు పడతాయన్నారు. వెటరన్స్ ఇంతమంది ఆడడం వల్ల యువతకు కూడా స్ఫూర్తిగా నిలిచినవారవుతున్నారనారు. జిల్లాస్థాయి పోటీల్లో క్రీడా స్ఫూర్తితో ఆడి రాష్ట్ర పోటీల్లో సత్తా చాటాలని ప్రోత్సహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు, మాజీ ఎమ్మెల్సీ ద్వారాపురెడ్డి జగదీశ్, అసోసియేషన్ నాయకులు డా.వీఎస్ ప్రసాద్, కుసుంబచ్చన్, కార్యదర్శి నున్నా సురేష్, అసోసియేషన్ సభ్యులు అధిక సంఖ్యలో వెటరన్ క్రీడాకారులు పాల్గొన్నారు. ధాన్యం కుప్పలు దగ్ధంబాడంగి: మండలంలోని రావివలస గ్రామానికి చెందిన గొర్లిలక్ష్మి అనే మహిళా రైతుకు చెందిన మూడు ధాన్యం కుప్పలు ఆదివారం కాలిపోయినట్లు బాధితురాలు తెలిపింది. పాల్తేరు రెవెన్యూ పరిధిలోగల పెద్దచెరువు పొలంలో రెండెకరాల వరిచేనును ఒకేచోట మూడుకుప్పలుగా వేయగా కాలిపోయినట్టు కన్నీటి పర్యంతమైంది. మూడుకుప్పలను నూర్చితే సుమారు లక్షరూపాయలకు ధాన్యం వచ్చేవని విలపించింది. ఎవరో కావాలనే తనపై కక్షతో ఈపనిచేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. రెవెన్యూ సిబ్బంది, పోలీసులు కల్పించుకుని తమకు న్యాయంచేయాలని మొరపెట్టుకుంటోంది. ఐదు దేవాలయాల్లో చోరీవేపాడ: ఒకే రాత్రి..ఒకే ఊరు..ఒకే రహాదారిని ఆనుకుని ఉన్న ఐదు దేవాలయాల్లో హుండీలను దుండగులు పగులగొట్టి సొమ్ము దొంగిలించారు. ఈ సంఘటనతో గ్రామస్తులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇందుకు సంబంధించి ఎస్సై సుదర్శన్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వేపాడ మండలంలోని బానాది గ్రామంలో ఎం.సింగవరం బల్లంకి వెళ్లే రహాదారిని ఆనుకుని ఉన్న ఐదు దేవాలయాల్లో ఏడు హుండీలు పగులగొట్టి శనివారం రాత్రి గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ.41 వేల నగదు ఉంటుందని ప్రాథమిక అంచనా వేసినట్లు ఎస్సై తెలిపారు. ఆదివారం ఉదయం ప్రజలు, ఆలయ అర్చకులు వచ్చేసరికి హుండీలు పగలగొట్లి ఆలయం బయట ఉండడంతో ఆవాకై ్క వెంటనే గ్రామపెద్దలు, పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై ఆలయ ఆర్చకుడు మేడపాటి కిశోర్శర్మ ఇచ్చిన ఫిర్యాదుమేరకు వల్లంపూడి ఎస్సై సుదర్శన్ కేసు నమోదు చేశారు. ఎస్.కోట రూరల్ సీఐ అప్పలనాయుడు ఐదు ఆలయాల్లో చోరీ సంఘటనపై పరిశీలించి గ్రామస్తులను ఆరాతీశారు. క్లూస్ టీమ్ హుండీలు, ప్రధానగేట్పై వేలిముద్రలు సేకరించారు. బైక్పై నుంచి జారిపడి మహిళ మృతిసీతానగరం: మండలంలోని జాతీయరహదారిపై అంటిపేట వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందింది. ఈ మేరకు స్థానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి. రామవరం పంచాయతీ, రెడ్డివాని వలస గ్రామానికి చెందిన రెడ్డి విజయలక్ష్మి గ్రామంలో నుంచి ఓ వ్యక్తి మోటార్ సైకిల్పై ఎక్కి వస్తుండగా ప్రమాదవశాత్తు బైక్పై నుంచి జారి పడిపోవడంతో తలకు గాయాలయ్యాయి. గాయాల పాలైన విజయలక్ష్మిని అదే మోటార్ సైకిల్పై చికిత్స నిమిత్తం బొబ్బిలి ప్రాంతీయ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. -
యూత్ ఏషియన్ పారా గేమ్స్లో గోల్డ్ మెడల్
విజయనగరం: దుబాయ్ వేదికగా జరుగుతున్న యూత్ ఏషియన్ పారా గేమ్స్ 2025 పారా బాడ్మింటన్లో విజయనగరం జిల్లా క్రీడాకారుడు పొట్నూరు ప్రేమ్ చంద్ గోల్డ్ మెడల్ సాధించడం జిల్లాకు గర్వకారణమని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు విజయాలు సాధించడం వెనుక ప్రేమ్ చంద్ సంకల్పం, నిరంతర సాధనతో పాటు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి వి.రామస్వామి అందించిన ప్రోత్సాహం ఉన్నాయన్నారు. ఈ నెల 7 నుంచి 14 వరకు దుబాయ్లో జరుగుతున్న యూత్ ఏషియన్ పారా గేమ్స్లో గతం కంటే పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ బాడ్మింటన్ ఎస్.హెచ్ 6 కేటగిరిలో గోల్డ్ మెడల్ సాధించి జిల్లా పేరును అంతర్జాతీయ స్థాయిలో మారు మోగేలా చేశాడని ప్రశంసించారు. పొట్నూరు ప్రేమ్ చంద్ విజయం పట్ల మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ రాం సుందర రెడ్డి, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్. వెంకటేశ్వర రావులు అభినందనలు తెలియజేశారు. -
గురుకులంలో ఆకలి కేకలు
భామిని: మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో విద్యార్థులు ఆదివారం మధ్యాహ్నం ఆకలితో అలమటించారు. రోజూ మధ్యాహ్నం 12.30 గంటలకే పెట్టాల్సిన భోజనాన్ని మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు విద్యార్థులకు పెట్టలేదు. దీంతో పలువురు విద్యార్థులు ఆకలితో ఇబ్బందులు పడ్డారు. గురుకులంలో 460 మంది విద్యార్థులున్నారు. భోజనం ఆలస్యం కావడంతో గదుల్లో, వరండాల్లో చేరి భోజనం కోసం పడిగాపులు కాశారు. గురుకులంలో సరైన పర్యవేక్షణ లేకే ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత కొన్నాళ్లుగా గురుకులంలో వంట ఏజెన్సీకి, నిర్వాహకులకు మధ్య వివాదం రేగుతోంది. దీంతో కావాలనే జాప్యం చేస్తూ విద్యార్థులను ఆకలికి గురి చేస్తున్నట్ట్టు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక విలేకరులు గురుకులానికి వెళ్లగా ప్రిన్సిపాల్ విజయనిర్మల అడ్డుకొని భోజన సమస్య పరిష్కరిస్తున్నట్టు సర్ది చెప్పారు. గ్యాస్ రెగ్యులేటర్ మరమ్మతులకు గురవడంతోనే భోజనంలో జాప్యం జరిగిందని పొంతన లేని సమాధానం ఇచ్చారు. చివరకు మధ్యాహ్నం 3.30 గంటల తరువాత విద్యార్థులకు భోజనం పెట్టారు. -
పంచాయతీ స్థలం ఆక్రమణ
● ఇంటి నిర్మాణానికి టీడీపీ నాయకుల యత్నం ● అడ్డుకున్న గ్రామస్తులు, మహిళలుబొబ్బిలిరూరల్: మండలంలోని పారాది గ్రామంలో పంచాయతీ స్థలాన్ని ఆక్రమించి ఇంటినిర్మాణానికి పూనుకున్న టీడీపీ నాయకుల ఆగడాలను స్థానికులు అడ్డుకున్నారు. గ్రామంలో మెయిన్ రోడ్డును ఆనుకుని ఉన్న సుమరు 150 గజాల స్థలంపై టీడీపీ నాయకుల కన్నుపడింది. కొత్తగా ప్రభుత్వం ఇంటినిర్మాణాలకు రుణసహాయం చేస్తామని ప్రకటించడంతో ఇంటి నిర్మాణానికి అనుమతి తెస్తానని గ్రామ పంచాయతీకి చెందిన కాలువ, రోడ్డును ఆక్రమించుకుని ఇంటి నిర్మాణం చేపట్టవచ్చని గ్రామ టీడీపీ నాయకుడి సూచనతో శనివారం రాత్రి జేసీబీతో అక్కడి మట్టిని తొలగించేందుకు ఆక్రమణ దారు ప్రయత్నించాడు. దీంతో గ్రామస్తులు, మహిళలు తిరగబడ్డారు. గ్రామంలో ఉన్న ప్రధాన మురుగునీరు పోయే కాలువను, రోడ్డును ఆక్రమించి చేపడుతున్న నిర్మాణాన్ని అడ్డుకున్నారు. ఈ ఆక్రమణపై పంచాయతీ సెక్రటరీ ఇప్పటికే నోటీసులిచ్చినా తోసిరాజని నిర్మాణానికి ప్రయత్నించడంపై పంచాయతీ శాఖ డీఈఈ వెంకటప్పారావుకు విషయాన్ని చేరవేశారు. జేఈతో సమగ్ర దర్యాప్తుకు డీఈఈ ఆదేశించగా ఇంతలోనే నిర్మాణానికి యత్నించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో మురుగునీరు పారే కాలువ, వేగావతికి వెళ్లే రహదారి పూర్తిగా మూసుకుపోతుందని వెంటనే చర్యలు చేపట్టాలని ఇటీవల గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో కలెక్టర్ నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్లో సైతం ఫిర్యాదు చేసినా ఆక్రమణను అధికారులు అడ్డుకోకపోవడం, అధికార పార్టీ నాయకుల అండదండలతో ఇంటి నిర్మాణానికి పూనుకుం టుండంతో గ్రామస్తులంతా మూకుమ్మడిగా అక్కడి పనులను అడ్డుకున్నారు. పంచాయతీ అధికారులనుంచి స్పందన రాకపోవడంతో స్థానిక పోలీస్స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశారు. ఆక్రమణ దారు అధికార పార్టీకి చెందిన వాడు కావడంతో దౌర్జన్యంగా జేసీబీతో పనులు చేపడుతున్నాడని, పంచాయతీ అధికారులు ఇచ్చిన నోటీసులను సైతం పట్టించుకోకుండా ఇంటినిర్మాణానికి పూనుకుంటున్నట్లు, అడ్డగించిన వారిపై దౌర్జన్యం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పంచాయతీ తీర్మానాలు, అనుమతులు లేకుండా చేస్తున్న నిర్మాణానికి అధికార తెలుగుదేశం పార్టీ నాయకుడి అండదండలున్నాయని ఈ దురాక్రమణను అడ్డుకోవాలని కోరారు. దీంతో ప్రస్తుతం నిర్మాణం ఆగిపోయినా మళ్లీ చేపడితే తీసుకోవాల్సిన చర్యలపై ఇరు వర్గాలను పిలిచి చర్చిస్తామని పోలీసులు తెలిపారు. -
రాజాంలో శ్రీలీల సందడి
రాజాం: పట్టణంలోని పాలకొండ రోడ్డులో సీఎంఆర్ షాపింగ్ మాల్ 44వ స్టోర్ను సినీనటి, డ్యాన్స్ క్వీన్ శ్రీలీల ఆదివారం ప్రారంభించారు. తొలుత షాపులో జ్యోతి ప్రజ్వలన చేసి షోరూమ్లోని పలు రకాల వస్త్రాలను సందర్శించారు. షాపింగ్మాల్ను ప్రారంభించిన అనంతరం పక్కన ఏర్పాటుచేసిన ఓపెన్ స్టేజ్పైనుంచి అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. డ్యాన్స్తో అలరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎంఆర్ షాపింగ్ మాల్తో తనకెంతో అనుబంధం ఉందని వెల్లడించారు. సీఎంఆర్ అంటే నమ్మకమని వెల్లడించారు. నాణ్యమైన వస్త్రాలు, జ్యూవెలరీ అందరికీ అందుబాటులో సీఎంఆర్ అందిస్తుందన్నారు. రాజాం పట్టణంలో ఈ షాపింగ్ మాల్ ప్రారంభించడంతో పాటు ఈ ప్రాంత ప్రజలు అందరికీ సరసమైన ధరలకు వస్త్రాలు లభిస్తాయని, ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. సీఎంఆర్ మేనేజింగ్ డైరెక్టర్ మావూరి వెంకటరమణ మాట్లాడుతూ రాజాంలో కొన్ని నెలల క్రితం సీఎంఆర్ జ్యూయలరీ ప్రారంభించామని, ప్రజలు ఎంతో ఆదరించారని తెలిపా రు. ఇప్పుడు వస్త్రదుకాణాన్ని ప్రారంభించామని, 20 మండలాల ప్రజలకు ఈ షాపింగ్ మాల్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. నాణ్యమైన వస్త్రాలును అందుబాటు ధరలో ఉంచుతున్నామని, అన్ని రకాల వస్త్రాలపై క్రిస్మస్, సంక్రాంతి ఆఫర్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్, సీఎంఆర్ డైరెక్టర్ బాలాజీ, లింగమూర్తి, సీవీ జగన్నాథస్వామి, కోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది, దొరబాబు, రైజింగ్ రాజు తదితరులు ప్రేక్షకులును అలరించారు. -
త్రుటిలో తప్పిన పెనుప్రమాదం
● మద్యం మత్తులో టిప్పర్ను ఢీకొన్న ద్విచక్ర వాహదారు భోగాపురం: మద్యం మత్తులో ఓ యువకుడు ద్విచక్ర వాహనానంపై వస్తూ ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీకొట్టాడు. అయితే ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారు స్వల్ప గాయాలతో బయట పడగా పెనుప్రమాదం తప్పడంతో ముంజేరు గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. భోగాపురం మండలంలోని ముంజేరు గ్రామంలో ఆర్అండ్బీ రహదారిపై ఆదివారం జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని దేవరాపల్లి గ్రామానికి చెందిన యువకుడు గండ్రేటి పాలవెల్లి రెడ్డికంచేరు సమీపంలో నిర్మాణంలో ఉన్న విమానాశ్రయంలో జేసీబీ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో పూటుగా మద్యం తాగి బైక్పై భోగాపురం బయలు దేరాడు. భోగాపురం నుంచి ముక్కాం వైపు వస్తున్న టిప్పర్ ముంజేరు వద్దకు చేరుకునేసరికి మద్యం మత్తులో ఉండి ఎదురుగా బైక్పై వస్తున్న వాహదారును గమనించిన టిప్పర్ డ్రైవర్ రోడ్డుపై ఆపివేశాడు. అయినప్పటికీ మద్యం మత్తులో ఉన్న ద్విచక్ర వాహనదారు ఆగి ఉన్న టిప్పర్ను ఢీకొట్టి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అక్కడే ఉన్న గ్రామస్తులు స్వల్ప గాయాలపాలైన పాలవెల్లిని లేపి సపర్యలు చేసి, టిప్పర్కు అడ్డంగా ఉన్న ద్విచక్ర వాహనాన్ని పక్కకు తీసి ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చేశారు. -
ప్రమాదకరంగా జలాశయంలో నీటి నిల్వ
తోటపల్లి జలాశయంలో ప్రస్తుతం నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయని, రానున్న వేసవిలో మరిన్ని నీటి ఇబ్బందులు తప్పవని అధికారులు పేర్కొంటున్నారు. జలాశయం ద్వారా ప్రతీ ఏటా ఖరీఫ్లో పాత ఆయకట్టులోని 64 వేల ఎకరాలకు, కుడి ప్రధాన కాలువలో 1.35 లక్షల ఎకరాలకు నీరందిస్తున్నారు. వీటితో పాటు పార్వతీపురం జిల్లా కేంద్రంలోని రక్షిత మంచినీటి పథకానికి కూడా తోటపల్లి నీరే అందిస్తున్నారు. వర్షాకాలం, శీతాకాలం మినహాయిస్తే డిసెంబర్ నుంచి వచ్చే జూన్ వరకు ఇన్ప్లోస్ ఉండవు. ప్రస్తుతం నీటి నిల్వ 2.1 టీఎంసీలు ఉంది. పాత కుడి, ఎడమ కాలువల నుంచి గత నెల రోజులుగా 0.66 టీఎంసీల నీరు వృథాగా పోతోంది. ఈ నీటి వృథాను తక్షణమే అరికట్టకపోతే మరో రెండు నెలల్లో ప్రాజెక్టులో నీటి నిల్వ ప్రమాదకర స్థితికి చేరే అవకాశం ఉందని సర్వత్రా ఆందోళన చెందుతున్నారు. -
వృథాగా.. నాగావళి నీరు
వీరఘట్టం: ప్రతీ ఏటా ఖరీఫ్లో తోటపల్లి ప్రాజెక్టులో కుడి, ఎడమ కాలువ పరిధిలో ఉన్న పాత ఆయకట్టులో సాగునీటి కోసం రైతులు అవస్థలు పడుతునే ఉన్నారు. శివారు ఆయకట్టుకు సకాలంలో నీరందక రైతులు రోడ్డెక్కుతునే ఉన్నారు. ఇంతలో ఖరీఫ్ ముగిసేలోపు శివారు ఆయకట్టుకు నీరందిస్తున్నారు. అయితే ఖరీఫ్ ముగిసిన తర్వాత కూడా కాలువల ద్వారా నిరంతరంగా సాగునీరు పంట పొలాల్లోకి వస్తుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కోత కోసిన వరి పంటను కుప్పలుగా వేయగా నాగావళి నీరు కుప్పల చుట్టూ చేరడంతో శివారు ప్రాంత రైతులు నూర్పులు చేసేందుకు అవస్థలు పడుతున్నారు. ఖరీఫ్లో సకాలంలో నీరందక ఇబ్బందులు పడిన తమకు ఇప్పుడు పొలంలో ఉన్న పంటను కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెల నవంబర్ 15తో ఖరీఫ్ సీజన్ ముగిసినా కుడి, ఎడమ కాలువల గుండా నీటి సరఫరా ఆగకుండా రావడంతో ప్రస్తుతం వేసిన అపరాల పంటలకు నష్టం తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏం జరుగుతోంది.. తోటపల్లి జలాశయం నుంచి పాత ఆయకట్టుకు నీరందించే కుడి, ఎడమ కాలువల రెగ్యులేటర్ల షట్టర్లు మరమ్మతులకు గురయ్యాయి. ఖరీఫ్ సీజన్లో ఎడమ కాలువ ద్వారా 400 క్యూసెక్కులు, కుడి కాలువ ద్వారా సీజన్లో నీటిని విడిచిపెట్టారు. ప్రస్తుతం సీజన్ ముగియడంతో నీటిని నిలుపుదల చేసేందుకు షట్టర్లు మొరాయిస్తుండడంతో ఇటీవల షట్టర్లు ఆపరేట్ చేశారు. కొంత వరకు షట్టర్లు కిందకు దిగి ఆగిపోయాయి. దీంతో ప్రస్తుతం ఎడమ కాలువకు 200 క్యూసెక్కుల నీరు, కుడి కాలువకు 60 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఈ నీటిని కంట్రోల్ చేయలేక జల వనరుల శాఖ అధికారులు చేతులెత్తేసారు. దీంతో గత నెల రోజులుగా కుడి, ఎడమ కాలువల ద్వారా సాగునీరు వృథాగా పోతోంది. అంతేకాకుండా పొలాల్లో వేసిన వరి కుప్పలు చుట్టూ నీరు చేరడంతో నూర్పులు చేసేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. నెల రోజులుగా వృథా గత నెల రోజులుగా తోటపల్లి ప్రాజెక్టు నుంచి 0.66 టీఎంసీల నీరు వృథాగా ప్రవహిస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. పాత ఆయకట్టులోని ఎడమ కాలువ ద్వారా 200 క్యూసెక్కులు నీరు విడిచి పెడుతున్నారు. ఈ లెక్కన గత నెల రోజులుగా ఎడమ కాలువ 0.51 టీఎంసీలు నీరు వృథాగా పోతోంది. అలాగే కుడి కాలువ ద్వారా 60 క్యూసెక్కులు నీటిని విడిచి పెడుతున్నారు. ఈ లెక్కన గత నెల రోజులుగా కుడి కాలువ 0.15 టీఎంసీల నీరు వృథా అవుతోంది. మొత్తం కుడి, ఎడమ కాలువల నుంచి గత నెల రోజులుగా 0.66 టీఎంసీల నీటి వృథా జరుగుతోంది. తోటపల్లి ప్రాజెక్టు నీటి సామర్థ్యం 2.5 టీఎంసీలు కాగా ఆదివారం నాటికి నీటి నిల్వ 2.1 టీఎంసీలు ఉంది. నీటి వృథాను అరికట్టకపోతే రానున్న వేసవికి నీటి ఎద్దడి తప్పదని జల వనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఎగువ ప్రాంతంలో ప్రారంభమైన రెండో పంట కుడి, ఎడమ కాలువలకు ఎగువ ప్రాంతంలో (1వ బ్రాంచ్ దిగువ ప్రాంతం) ప్రతీ ఏటా ఖరీఫ్ సీజన్ తొందరగా ప్రారంభమై, దిగువ ప్రాంతం కంటే వేగంగా ముగుస్తోంది. వెంటనే వీరు రెండో పంటగా వరినే వేస్తున్నారు. వీరికి నీరందించేందుకు కొంత మంది అధికారులు ముడుపుల కోసం షట్టర్లు మరమ్మతులకు గురైనట్టు చెబుతున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. ప్రతీ ఏటా ఖరీఫ్ ముగిసినా షట్టర్లు మూతపడకపోవడం, కొంత కాలం తర్వాత మళ్లీ మూతపడడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తోటపల్లి ప్రాజెక్టు వద్ద పాత రెగ్యులేటర్లు మరమ్మతులకు గురయ్యాయి. నీటి నిలుపుదల చేయడం సాధ్యం కావడం లేదు. ఈ షట్టర్లు మరమ్మతులకు రూ.18 లక్షలతో టెండర్లు పిలిచాం. ఎవరూ ముందుకు రాలేదు. పూర్తి వివరాలతో ఓ నివేదికను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి, షట్టర్లు మరమ్మతులు చేపట్టి, నీటి వృథాను అడ్డుకుంటాం. – డి.వి.రమణ, ఏఈ,, కుడి, ఎడమ కాలువల పర్యవేక్షణ ఇంజినీరు ప్రస్తుతం తోటపల్లి జలాశయం పరిధిలోని రెగ్యులేటర్లు మొరాయిస్తుండడంతో నీటి సరఫరాను కంట్రోల్ చేయలేకపోతున్నామని అధికారులు పేర్కొంటున్నారు. వాస్తవానికి ఈ షట్టర్లు మరమ్మతులకు రూ.18 లక్షలతో మూడు నెలల క్రితం అధికారులు టెండర్లు పిలిచారు. అయితే ఎవరూ టెండర్లుకు ముందుకు రాలేదు. దీంతో షట్టర్లు బాగుపడక లక్షల కూసెక్కుల నీరు వృథాగా పోతోంది. ఖరీఫ్ ముగిసినా..నిర్విరామంగా ప్రవాహం పొలాల్లోకి వస్తున్న నీటితో అపరాల పంటలకు తీవ్ర నష్టం నెల రోజులుగా పాత కుడి, ఎడమ కాలువల్లో వృథాగా ప్రవహిస్తున్న నీరు ఎడమ కాలువ ద్వారా విడిచిపెడుతున్న నీరు 200 క్యూసెక్కులు నెల రోజులుగా ఎడమ కాలువ ద్వారా వృథాగా పోయిన నీరు 0.51 టీఎంసీలు కుడి కాలువ ద్వారా విడిచిపెడుతున్న నీరు 60 క్యూసెక్కులు తోటపల్లి ప్రాజెక్టు నీటి సామర్థ్యం 2.5 టీఎంసీలు ఆదివారం నాటికి నిల్వ ఉన్న నీరు 2.1 టీఎంసీలు వేసవికి ముందే తోటపల్లి ప్రాజెక్టులో తగ్గిపోయిన నీటి నిల్వలు -
24/7 అందుబాటులో మద్యం
● మద్యం కేరాఫ్ మన్యం జిల్లా ● జిల్లా వ్యాప్తంగా యథేచ్ఛగా బెల్ట్ షావుల నిర్వహణగఅనధికార విక్రయాలపై ప్రత్యేక నిఘా అనధికార విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టాం. ఎప్పటికప్పుడు గ్రామాల్లో, పట్టణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాం. జిల్లాలో బెల్ట్ షావులపు గుర్తించి కేసులు నమోదు చేస్తున్నాం. సారా రవాణా తయారీ అమ్మకాలపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేస్తున్నాం. అనధికార మద్యం, సారా వంటివి విక్రయిస్తూ ప్రజారోగ్యానికి ఇబ్బందులు కలిగిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. జిల్లావ్యాప్తంగా పీడీయాక్ట్లను నమోదు చేస్తాం. బి.శ్రీనాథుడు, ఎకై ్సజ్ ఈఎస్, ఉమ్మడి విజయనగరం జిల్లా పార్వతీపురం టౌన్: ఓ వైపు ప్రభుత్వ వైఫల్యం, మరోవైపు ఎకై ్సజ్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రజారోగ్యానికి తూట్లు పడుతున్నాయి. గడిచిన ఏడాదిన్నరగా జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలు, పారిశుద్ధ్య లోపం, తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న మన్యం వాసులకు మద్యం కష్టాలు తెచ్చి పెడుతోంది. జిల్లాలో గ్రామ గ్రామాన మద్యం, సారా ఏరులై పారుతోంది. జిల్లా కేంద్రంలో వేకువ జాము నుంచే మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. దానికి తోడు మన్యం జిల్లా వ్యాప్తంగా, ఏఓబీ గ్రామాల్లో, గిరిజన సీమల్లో, గిరిశిఖర గ్రామాల్లో మద్యం, సారా ఏరులై పారుతోంది. దాదాపు అన్ని గిరిజన గ్రామాలు, మైదాన ప్రాంతాలు, గ్రామాల్లో, పట్టణాల్లో బహిరంగంగానే క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. జిల్లాలోని ఏఓబీ గ్రామాల్లో సారా తయారీ చేస్తున్న కేంద్రాలు కుటీర పరిశ్రమలుగా ఏర్పడ్డాయి. విస్తారంగా వర్షాలు కురుస్తుండడం, గెడ్డలు, వాగులు, నిండుగా ప్రవహిస్తుండడంతో ఆయా ప్రాంతాలను వ్యాపారులు తమకు అనువుగా మార్చుకుని బెల్లపు ఊటలను తయారు చేస్తున్నారు. రాత్రి సమయాల్లో అక్రమంగా సారాను తయారు చేస్తూ జిల్లా కేంద్రంగా అనేక జిల్లాలకు దాటిస్తున్నారు. నెలలో ఏదో ఒకరోజు ఎకై ్సజ్ అధికారులు తామున్నామంటూ తూతూ మంత్రంగానే దాడులు నిర్వహిస్తూ మమ అనిపిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. పూర్తిస్థాయిలో నిఘా లేకపోవడంతో మన్యం జిల్లా మద్యం, సారా క్రయ విక్రయాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. ప్రతి నెలా మంత్లీలు బెల్ట్ షావు నిర్వహణకు ఎకై ్సజ్ దిగువ స్థాయి సిబ్బంది నుంచి పై అధికారుల వరకు ఒక్కొకరికి భారీ మొత్తంలో ముడుపులు అందిస్తున్నారన్న బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి. రవాణా అంతా రాత్రివేళలోనే.. గిరిజన ప్రాంతాల్లో తయారు చేసిన సారాను కొంతమంది వ్యాపారులు రాత్రివేళల్లో ఆటోలు, బైక్ల ద్వారా మైదానం, పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్నారు. మన్యంలో సరిహద్దు గ్రామాలైన జయకోట, బొత్తరాపల్లి, మూలకర్ని, విక్రాంపురం, అలమండ, సోరుపల్లి, సందుబడి. రేగులపాడు, సంబలబాయి, ఎగువ పిల్లిడ్డి, జీడివలస, అత్తిగడ, జగ్గూడ, టికరపాడు, కప్పలాడ, మానిక్యంవలస, ఎడుగుమ్మలవలస, పొల్ల, చిన్నబగ్గ, కడగండి, ఓండ్రుజోల, వలగజ్జి, వలగజ్జి గ్రామాల మీదుగా జనసంచారం లేని మార్గాలగుండా సారాను తరలిస్తున్నారు. పార్వతీపురం, కురపాం, పాలకొండ, సాలూరు నియోజకవర్గాల్లో పలు ప్రాంతాలకు ఇక్కడనుంచి ప్లాస్టిక్ కేన్లలో రవాణా చేస్తున్నారు. దీనిపై ఎకై ్సజ్ శాఖ నిఘా కొరవడింది. దీంతో రోజుకు కొన్ని వేల లీటర్ల సారా రవాణా అవుతోంది. జిల్లాలో అనధికారికంగా 600 పైగా మద్యం బెల్టు దుకాణాలు ఉన్నాయి. ఏడాదిన్నరగా ఇప్పటి వరకు 700 కేసులు నమోదు చేశామని అధికారులు చెబుతున్నారు. ఏఓబీ గ్రామాల్లో 18 అంతరాష్ట్ర దాడులు నిర్వహించి 4లక్షల లీటర్ల పులిసిన బెల్లపు ఉటలు ధ్వంసం చేశారు. 21 వేల లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. మద్యం మత్తులో బతుకులు ఛిద్రం శుభకార్యాలు, పండుగల సమయాల్లో ఎక్కువగా మద్యాన్ని తాగుతారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిత్యం మద్యం లభిస్తుండంతో వేకువజాము నుంచే మందుబాబులు బెల్ట్ షావుల వద్ద క్యూ కడుతున్న పరిస్థితి నెలకొంది. గతం కంటే అధిక ధరకే లభిస్తున్నా వెనుకంజ వేయడం లేదు. దీనికి బానిసలై బతుకులను ఛిద్రం చేసుకుంటున్నారు. కాయకష్టం చేసి సంపాదించిన మొత్తం మద్యానికి తగలేసి కుటుంబాలను వీధిన పడేస్తున్నారు. కిడ్నీ, కాలేయం, గుండె సంబంధిత వ్యాధులతో ఆస్పత్రి పాలవుతున్నారు. మద్యం, సారా తాగడం వల్ల కలిగే అనర్థాలపై గ్రామస్థాయిలో పెద్దగా అవగాహన సదస్సులు నిర్వహించడం లేదు. దీంతో గిరిజనుల్లో చైతన్యం కొరవడింది. -
ఆంగ్ల భాషపై పట్టు సాధించాలి
రాజాం సిటీ: విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీని ఎదుర్కోవాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ డవలప్ చేసుకోవడంతో పాటు ఆంగ్ల భాషపై పట్టు సాధించాలని పార్లమెంట్ సభ్యురాలు, ఇన్ఫోసిస్ ఫౌండర్ చైర్పర్సన్, మూర్తి ట్రస్టు చైర్పర్సన్ సుధామూర్తి అన్నారు. స్థానిక జీఎంఆర్ ఐటీలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంగ్లంలో పట్టు సాధించడంతో పాటు మాతృభాషను చిన్నచూపు చూడకూడదన్నారు. మాతృభాష, ఆంగ్లభాష శ్రీకృష్ణుడికి ఇద్దరు తల్లులైన దేవకి, యశోదలు వంటివన్నారు. ఆ రెండు భాషలు మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయని పేర్కొన్నారు. లక్ష్య సాధనలో మనసులను ఇతర ప్రభావాల నుంచి దూరం చేయడానికి నిరంతర కృషి, సాధన చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఉద్బోధించారు. విద్య, వైద్య రంగాలతో పాటు గ్రామీణాభివృద్ధి రంగాల్లో జీఎంఆర్ చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ వారిని ఉత్తేజపరిచారు. అనంతరం జీఎంఆర్ కేర్, నైరెడ్లను సందర్శించారు. 19 మంది గిఫ్టెడ్ చిల్డ్రన్స్కు స్కూల్ బ్యాగులను అందించారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన 10 మంది విద్యార్థులను సత్కరించారు. అంతకుముందు జీఎంఆర్ గ్రూపు సంస్థల చైర్మన్ గ్రంథి మల్లిఖార్జునరావు మాట్లాడుతూ సంఘ సంస్కర్తగా, విద్యావేత్తగా రచయితగా పేరుగాంచిన సుధామూర్తి ఎంతో మందికి ఆదర్శమని కొనియాడారు. కార్యక్రమంలో జీఎంఆర్ గ్రూపు చైర్మన్లు బీవీ నాగేశ్వరరావు, జీబీఎస్ రాజు, బొమ్మిడాల రమాదేవి, గ్రంథి పెదబాబు, పీడీకే రావు, ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్వీఆర్ఎస్వీ ప్రసాద్, ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ జె.గిరీష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
సాంకేతిక నైపుణ్యాలపై పరిజ్ఞానం అవసరం
● విశాఖ ఎఫ్ అండ్ ఓఐసీ, ఎస్టీపీఐ శాస్త్రవేత్త డాక్టర్ సురేష్ బాత ● జేఎన్టీయూ జీవీలో ఘనంగా జెన్ ఏఐ హ్యాకథాన్ ప్రోగ్రామ్ విజయనగరం రూరల్: ప్రపంచ సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలపై పరిజ్ఞానం పెంపొందించుకోవాల్సిన అవపరం ఎంతైనా ఉందని విశాఖపట్నానికి చెందిన ఎఫ్ అండ్ ఓఐసీ, ఎస్టీపీఐ శాస్త్రవేత్త డాక్టర్ సురేష్ బాత అన్నారు. స్థానిక జేఎన్టీయూ – జీవీలో హైదరాబాద్కు చెందిన జెన్ ఏఐ వర్సిటీ, జేఎన్టీయూ జీవీ సంయుక్త ఆధ్వర్యంలో ‘జెన్ ఏఐ హ్యాక్థాన్ ఫరధ నెక్ట్స్ జనరేషన్ జాబ్స్’ సాంకేతిక కార్యక్రమాన్ని శనివారం జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన శాస్త్రవేత్త సురేష్ బాత మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్య పూర్తయిన తరువాత విద్యార్థులకు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని అన్నారు. వాటిని సమర్థంగా ఎదుర్కోవడానికి సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. ప్రతీ విద్యార్థి ఇటువంటి హ్యాక్థాన్ కార్యక్రమాలకు హాజరవడంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. తద్వారా కృత్రిమ మేధస్సును (ఏఐ) ఉపయోగించి సమాజానికి మేలు చేస్తూ, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. గౌరవ అతిథిగా హాజరైన జెన్ ఏఐ వర్సిటీ చీఫ్ అకాడమీ అధికారి నరేంద్ర అల్లం మాట్లాడుతూ ఏఐలో నైపుణ్యం ఉన్న వారికి ఉజ్వల భవిష్యత్తు ఉందని, మానవ మనుగడలో ఏఐ కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు. జేఎన్టీయూ జీవీ రిజిస్ట్రార్ జి.జయసుమ మాట్లాడుతూ కృత్రిమ మేధస్సుతో భావి తరాల నాయకులు, ఆవిష్కర్తలు, సమస్యలకు పరిష్కారాలు చూపే వారిని రూపొందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. ఈ సందర్భంగా నరేంద్ర అల్లం రచించిన పైథాన్ ప్రోగ్రామింగ్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం శాస్త్రవేత్త సురేష్ బాతను ఘనంగా సత్కరించారు. ప్రోగ్రామ్ కన్వీనర్, జేఎన్టీయూ జీవీ ప్రిన్సిపాల్ ఆర్.రాజేశ్వరరావు, సమన్వయకర్తలు డాక్టర్ జిజె.నాగరాజు, ఆర్డిడివి.శివరామ్, ఆచార్యులు కె.బాబు, జి.స్వామినాయుడు, కెసిబి.రావు, డి.రాజ్యలక్ష్మి, కలేషావలి, ఆర్.గురునాధ, కె.అచ్యుతకుమార్, సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుని మృతి శృంగవరపుకోట : అరుకు ఘాట్ రోడ్డులో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృత్యువు పాలయ్యాడు. ఎస్.కోట పట్టణంలో జగనన్న కాలనీలో నివాసం ఉంటున్న షేక్ ఇర్ఫాన్(19) శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఎస్.కోట నుంచి మేక మాంసం తీసుకుని, స్నేహితునితో కలిసి అనంతగిరిలో ఇటీవల ప్రారంభించిన దుకాణానికి రాత్రి 9.30గంటల సమయంలో వెళ్తుండగా కాశీపట్నం టోల్గేట్ సమీపంలో ఎదురుగా వస్తున్న కారుని ఢీకొట్టాడు. దీంతో ఇర్ఫాన్ బైక్ పై నుంచి ఎగిరి తీవ్ర గాయాల పాలయ్యాడు. క్షతగాత్రుడిని ఎస్.కోట ప్రభుత్వాసుపత్రికి తెచ్చి అక్కడి నుంచి విశాఖకు తరలిస్తుండగా మార్గం మద్యలోనే ఇర్ఫాన్ మృతి చెందాడు. ఇర్ఫాన్ తండ్రి మదీనా బైక్ మెకానిక్గా పని చేస్తుండగా, తల్లి, తమ్ముడు ఉన్నారు. -
గడ్డివాములు దగ్ధం
తెర్లాం: మండలంలోని గొలుగువలస గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు గడ్డివాములతో పాటు ధాన్యం పాక్షికంగా కాలిపోయాయి. దీనికి సంబంధించి బాధితులు శనివారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సాకేటి శ్రీనివాసరావు, అప్పలనాయుడులకు చెందిన గడ్డివాములు అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయాయి. గడ్డివాముల పక్కనే నూర్పిడి చేసి నిల్వ ఉంచిన ఽగొట్టిపల్లి గణపతికి చెందిన ధాన్యం కూడా పాక్షికంగా మంటలకు కాలిపోయాయి. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే వెళ్లి మంటలను ఆదుపు చేయడంతో ధాన్యం పూర్తిగా కాలిపోకుండా నివారించగలిగామని రైతులు అంటున్నారు. గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాద విషయం తెలుసుకున్న తహసీల్దార్ హేమంత్కుమార్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు గ్రామానికి వెళ్లి కాలిపోయిన గడ్డివాములను, పాక్షికంగా దెబ్బతిన ధాన్యాన్ని పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడారు. ఆయనతో పాటు జెడ్పీటీసీ ప్రతినిధి గర్భాపు రామారావు, గొలుగువలస సర్పంచ్ ప్రతినిధి గులివిందల శంకరరావు, ఎంపీటీసీ సభ్యురాలు సాకేటి నాగమణి, పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు, స్థానిక నాయకులు ఉన్నారు. నాకౌట్ దశకు సాఫ్ట్బాల్ పోటీలు వీరవాసరం: వీరవాసరం ఎంఆర్కే జడ్పీహెచ్ఎస్ పాఠశాల క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న 69వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అండర్ 17 సాఫ్ట్బాల్ పోటీలు నాకౌట్ దశకు చేరుకున్నాయని పశ్చిమగోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి పీఎస్ఎన్ మల్లేశ్వరరావు, దాసరి సునీత తెలిపారు. రెండవ రోజు విజయనగరం జిల్లా బాలికల జట్టు గుంటూరు జట్టుపై 02:01 తేడాతో.. విజయనగరం జట్టు కృష్ణా జిల్లా జట్టుపై 04–01 తేడాతో గెలుపొందాయి. బాలికల క్వార్టర్ ఫైనల్లో విజయనగరం జట్టు శ్రీకాకుళం జట్టుపై 12–01 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. అలాగే బాలుర ఫలితాల్లో విజయనగరం జట్టు విశాఖ జట్టుపై 03–00 తేడాతో, విజయనగరం జట్టు చిత్తూరు జట్టుపై 05–00 తేడాతో విజయం సాధించాయి. బాలుర క్వార్టర్ ఫైనల్లో విజయనగరం జట్టు ప్రకాశంపై గెలిచి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఆదివారం ముగింపు కార్యక్రమం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ బాల బాలికల జట్లను ఎంపిక చేయడం జరుగుతుందని పశ్చిమగోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శులు పీఎస్ఎన్ మల్లేశ్వరరావు, దాసరి సునీత, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బాచింకి శ్రీనివాస్ తెలిపారు. ప్రారంభమైన పారా రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు విజయనగరం: పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 4వ పారా రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు శనివారం స్థానిక రాజీవ్ క్రీడా మైదానంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్, మాజీ ఎంపీ డాక్టర్ డీవీజీ శంకరరావు పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంకల్పం ఉంటే సాధించలేనిది ఏది ఉండదని దివ్యాంగ క్రీడాకారులు నిరూపిస్తున్నారని కొనియాడారు. పారా రాష్ట్ర స్థాయి పోటీలను తొలిసారిగా విజయనగరంలో నిర్వహించడం సంతోషదాయకమని పేర్కొన్నారు. దివ్యాంగులు ఎవరికి తక్కువ కాదని, జిల్లాలో ప్రతిభ గల దివ్యాంగ క్రీడాకారులకు కొదవ లేదని వారిని గుర్తించి క్రీడల్లో ప్రోత్సహిస్తున్న పారా స్పోర్ట్స్ అసోసియేషన్ వారికి అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. అనంతరం విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్స్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్.వెంకటేశ్వరరావు, మాజీ రోటరీ గవర్నర్ డాక్టర్. ఎం.వెంకటేశ్వరరావు, రాష్ట్ర స్థాయి పోటీల కన్వీనర్ నాలుగెస్సుల రాజు, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి.రామస్వామి, జిల్లా గౌరవ అధ్యక్షులు కె.దయానంద్, విశాఖపట్నం గౌరవ అధ్యక్షులు డాక్టర్ షీతల్ మదాన్, వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి గణేష్, సారధి వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు ప్రదీప్, ప్రతాప్ వర్మ తదితరులు పాల్గొన్నారు. -
ఆశ్రమ పాఠశాలను సందర్శించిన కలెక్టర్
మక్కువ: మండలంలోని ఎర్రసామంతవలస ఆశ్రమ పాఠశాలను శనివారం రాత్రి కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఆశ్రమ పాఠశాలలో తరగతి గదులు, వంటశాల, డార్మెటరీలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. మెనూ ప్రకారం భోజనాలు అందిస్తున్నారా? లేదా? అని ఆరా తీశారు. శతశాతం ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు సూచించారు. చదువుతోపాటు, క్రీడలపై మక్కువ చూపించాలన్నారు. 15న సర్పంచ్ల సమావేశం గరుగుబిల్లి: పార్వతీపురం పట్టణంలోని రోయల్ కన్వెన్షన్ హాల్లో ఈ నెల 15న సర్పంచ్లతో కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఎంపీడీఓ జి.పైడితల్లి శనివారం తెలిపారు. పంచాయతీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ సర్పంచ్లతో చర్చిస్తారన్నారు. కార్యక్రమానికి సర్పంచ్లంతా హాజరుకావాలని కోరారు. ఉడకని అన్నం.. రుచిలేని కూర..? ● పోటీల నిర్వహణకు ఏర్పాట్లు లేమి ● ఉపాధ్యాయుల డివిజన్ స్థాయి క్రీడాపోటీల నిర్వహణపై అసంతృప్తి విజయనగరం: ఉపాధ్యాయుల క్రీడాపోటీల నిర్వహణలో చంద్రబాబు ప్రభుత్వానికి ఆర్భాటం ఎక్కువ... సౌకర్యాలు తక్కువ అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు పురుషుల విభాగంలో క్రికెట్, సీ్త్రల విభాగంలో త్రోబాల్ పోటీలు నిర్వహించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మండల స్థాయి విజేతలకు విజయనగరం విజ్జి స్టేడియం వేదికగా శని, ఆదివారం డివిజిన్ స్థాయి పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. దీనికోసం రూ.20వేలు చొప్పున కేటాయించారు. విజయనగరం డివిజన్ పరిధిలోని 11 మండలాలకు చెందిన క్రీడా పోటీల నిర్వహణపై ఉపాధ్యాయులు పెదవి విరుస్తున్నారు. నిర్దేశిత సమయానికి పోటీలు ప్రారంభించకపోవడం, కనీస సదుపాయాలు కల్పించకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. క్రికెట్ పోటీల్లో కార్క్ బాల్ను వినియోగించగా... అందుకు అవసరమైన బ్యాట్లు, ప్యాడ్లు, హెల్మెట్, గార్డ్స్ వంటి పరికరాలు సమకూర్చలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభించాల్సిన పోటీలను 11 గంటల వరకు ప్రారంభించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉదయం అల్పాహారం ఏర్పాటు చేయకపోగా... మధ్యాహ్నం భోజనం కూడా ఉడకని అన్నం... సాంబారు, ఒక్క కూరతో వడ్డించడాన్ని ఆక్షేపించారు. మొదటి రోజు పోటీలను ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు ప్రారంభించారు. అంతర్జాతీయ వైజ్ఞానిక దృక్పథం అవసరం విజయనగరం అర్బన్: ఇంజినీరింగ్ విద్య కోర్సుల్లో అంతర్జాతీయ దృక్పథం ఉండాలని, అప్పుడే డిగ్రీ పూర్తయిన తరువాత విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని జర్మనీ స్మోల్ట్సిక్ అండ్ పార్ట్నర్ ప్రాజెక్టు మేననేజర్ సురేష్ టంకాల అన్నారు. సీతం ఇంజినీరింగ్ కళాశాలలో ‘సిద్ధాంతం నుంచి వాస్తవంలో రూపంలోకి–ఇంజినీరింగ్ విద్యలో అంతర్జాతీయ దృక్పథాలు’ అనే అంశంపై జరిగిన సెమినార్లో ఆయన మాట్లాడారు. సిద్ధాంతాత్మక జ్ఞానాన్ని ప్రాయోజిత ఇంజినీరింగ్ పనులతో అనుసంధానం చేయాలన్నారు. కళాశాల డైరెక్టర్ మజ్జి శశిభూషణరావు, ప్రిన్సిపాల్ డి.వి.రామమూర్తి, వైస్ ప్రిన్సిపాల్ సీహెచ్ వెంకటలక్ష్మి, సివిల్ ఇంజినీరింగ్ విభాగాధితి జి.రవికిషోర్ ఆధ్వర్యంలో జరిగిన సెమినార్కు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం.భార్గవి సమన్వయ కర్తగా వ్యవహరించారు. -
జిల్లాలో రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం
● జిల్లా పర్యటనలో టీఆర్ అండ్ బీ, ఐ అండ్ ఐ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు విజయనగరం అర్బన్: రాష్ట్రంలో సాస్కి (ఎస్ఏఎస్సీఐ) పథకం ద్వారా వచ్చే నిధులతో జిల్లాలో రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని టీఆర్ అండ్ బీ, ఐ అండ్ ఐ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వీటీ కృష్ణబాబు తెలిపారు. శనివారం ఆయన జిల్లాలో విస్తృతంగా పర్యటించి పలు రహదారులను పరిశీలించారు. పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఆర్అండ్బీ అతిథిగృహాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డితో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో రహదారుల పరిస్థితిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ ఈ ఏడాది సాస్కి పథకం కింద రూ.500 కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టామని, వచ్చే ఏడాది నుంచి రూ.2 వేల కోట్లతో మరింత విస్తృతంగా పనులు చేపడతామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని రోడ్లను గుంతలు లేని రహదారులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, మార్చి నాటికి ఈ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం రోడ్డు నిర్మాణానికి అనుకూల సమయమని గుంతల పూడ్చే పనులను వేగవంతం చేయాలని ఆర్అండ్బీ అధికారులకు సూచించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు వేగంగా చెల్లించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సిబ్బంది కొరతను అధిగమించేందుకు సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లను పదోన్నతి ఇచ్చి గ్రేడ్–1 వర్క్ ఇన్స్పెక్టర్లుగా తీసుకునేందుకు ప్రతిపాదనలు చేస్తున్నట్టు తెలిపారు. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైల్వే సంబంధిత సమస్యలు పరిష్కారానికి పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఆర్డీఓ, రైల్వే అధికారులతో కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టర్ రాంసుందర్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో రహదారుల అభివృద్ధికి తక్షణ చర్యలు తీసుకుంటామని, ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్, ఆర్అండ్బీ ఈఎన్సీ వి.రామచంద్ర, సూపరింటెండెంట్ ఇంజినీర్ కాంతిమణి, ఆర్డీవో దాట్ల కీర్తి, ఆర్అండ్బీ ఈఈలు, డీఈలు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. -
బంగారం కోసం వృద్ధురాలి హత్య
● ఆర్అండ్ఆర్ కాలనీ ముడసర్లపేటలో దారుణం భోగాపురం: రెండు తులాల బంగారం కోసం వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన సంఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని ఆర్అండ్ఆర్ కాలనీ ముడసర్లపేట గ్రామానికి చెందిన ముడసర్ల అప్పయ్యమ్మ (70) ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఆమెను హత్య చేసి ముక్కు, చెవి, మెడలో ఉన్న సుమారు రెండు తులాల బంగారు నగలను అపహరించుకుని మృతదేహాన్ని సమీపంలో ఉన్న వాటర్ ట్యాంకు వద్ద వదిలేసి పారిపోయారు. దీంతో ఒక్కసారిగా గ్రామంలోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు జీవనోపాధి కోసం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం వెళ్లాడు. చిన్న కుమారుడు భవానీ మాల వేసుకుని కుటుంబంతో కలిసి కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు విజయవాడ కొండకు వెళ్లాడు. దీంతో ఇంట్లో ఎవరు లేకపోవడంతో దుండగులు ఇంట్లోకి చొరబడి అప్పయ్యమ్మను దారుణంగా హత్య చేసి ముక్కు, చెవి, మెడలో ఉన్న బంగారాన్ని అపహరించుకుని పారిపోయారు. స్థానికులు ఉదయం వాటర్ట్యాంకు దగ్గర విగతజీవిగా పడి ఉన్న అప్పయ్యమ్మ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ ఆర్.గోవిందరావు, సీఐ దుర్గాప్రసాద్, ఎస్సై పాపారావులు విశాఖపట్నం రీజినల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నిపుణులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టి వివరాలు సేకరించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సుందరపేట సీహెచ్సీకి తరలించారు. మృతురాలి పెద్ద కోడలు ముడసర్ల లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే హత్య చేసిన దుండగులను గుర్తించి అరెస్టు చేస్తామని డీఎస్పీ తెలిపారు. -
కె.సీతారాంపురంలో ఘోర అగ్ని ప్రమాదం
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆర్డీవో కె.సీతారాంపురంలో అగ్ని ప్రమాదం జరిగిన విషయాన్ని తహసీల్దార్ జి.హేమంత్కుమార్ జిల్లా కలెక్టర్, ఆర్డీవోల దృష్టికి తీసుకువెళ్లడంతో ఆర్డీవో రామమోహన్రావు శనివారం గ్రామానికి వచ్చి పాపమ్మ మృతదేహాన్ని, బాధితులను పరామర్శించారు. రెవెన్యూ పరంగా ఐదు రోజులకు సరిపోయే ఆహార పదార్ధాలను బాధితులకు అందజేశారు. స్థానిక అంగన్వాడీ కేంద్రంలో బాధితులకు పునరావాస కేంద్రాన్ని తహసీల్దార్ ఏర్పాటు చేశారని, ఇల్లు కాలిపోయిన బాధితులకు నష్టపరిహారంగా రూ.13వేలు చొప్పున అందించనున్నట్టు చెప్పారు. ఉప తహసీల్దార్ సత్యనారాయణ, ఆర్ఐ కృష్ణమూర్తి, వీఆర్వోలు గణపతి, రాము, శ్రీనివాసరావు, సుధాకర్, రవి తదితరులు సంఘట జరిగిన నుంచి గ్రామంలోనే ఉండి వివరాలు సేకరించడంతో పాటు, బాధితులకు సేవలు అందించారు. బొబ్బిలి రూరల్ సీఐ కె.నారాయణరావు, తెర్లాం ఎస్ఐ సాగర్బాబు సంఘటనా స్థలానికి వచ్చి అగ్ని ప్రమాదంలో మృతి చెందిన పాపమ్మ మృతదేహాన్ని పరిశీలించారు. సంఘటనా స్థలంలోనే మృతురాలికి శవపంచనామ నిర్వహించి పోస్టుమార్టం చేయించారు.తెర్లాం: మండలంలోని కొరటాం గ్రామ పంచాయతీ కె.సీతారాంపురం(చిన గొలుగువలస) గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో 12 పూరిళ్లు పూర్తిగా కాలిపోగా, 85ఏళ్ల వృద్ధురాలు సజీవ దహనమైంది. దీనికి సంబంధించి శనివారం స్థానికులు, బాధితులు, రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని యాతవీధి(కల్లుగీత కార్మికులు)లో శుక్రవారం రాత్రి 10.30గంటల సమయంలో కోష్టు లక్ష్మి ఇంట్లో ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించడంతో అదే వరుసలో ఉన్న 12 పూరిళ్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో కోష్టు లక్ష్మి ఇంట్లో ఉంటున్న ఆమె అత్త కోష్టు పాపమ్మ(85)మంటల్లో చిక్కుకొని సజీవ దహనమైంది. ప్రమాదంలో గ్రామానికి చెందిన ఎద్దుమంటి వెంకటమ్మ, కోష్టు చినవెంకటయ్య, పోలారావు, లక్ష్మి, గురువులు, ఆదమ్మ, పెదవెంకట రమణమ్మ, పెదనర్సయ్య, అప్పడు, నక్క రవణమ్మ, చోడి సింహాచలం, రాములుకు చెందిన ఇళ్లన్నీ పూర్తిగా కాలిపోయాయి. అగ్ని ప్రమాదంలో సుమారు రూ.6లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని రాజాం అగ్నిమాపక కేంద్రం అధికారులు, రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. సజీవ దహనమైన వృద్ధురాలు పాపమ్మ గ్రామంలో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం జరగడంతో ఇంట్లో ఉన్న కోడలు, పిల్లలు భయంతో బయటకు వెళ్లిపోయారు. మంచంపై ఉన్న కోష్టు పాపమ్మ(85) అనే వృద్ధురాలు బయటకు రాలేకపోవడంతో మంటల్లో చిక్కుకుంది. గ్రామస్తులు స్పందించి ఆమెను మంటల్లో నుంచి బయటకు తీసేటప్పటికే కాలిపోయి మృతి చెందింది. మృతురాలు పాపమ్మకు కోడలు లక్ష్మి, ఆమె కుమారుని పిల్లలు మాత్రమే ఉన్నారు. పాపమ్మ అగ్ని ప్రమాదంలో మృతి చెందడంతో కోడలు, ఆమె మనవరాళ్లు కన్నీరుమున్నీరుగా విలపించారు. కట్టుబట్టలతో... ఈ అగ్ని ప్రమాదంలో బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. ప్రమాదంలో ఇళ్లల్లో ఉన్న సామగ్రి, బట్టలు, తిండి గింజలు, బంగారం, వెండి, నగదు, ఇండేన్ గ్యాస్ సిలెండర్లు, ధ్రువీకరణ పత్రాలు, రేషన్కార్డులు, పెన్షన్ కార్డులు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన కోష్టు గురువులకు చెందిన రెండున్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.80వేలు నగదు, 50తులాల వెండి, తిండి గింజలు కాలిపోయాయి. కోష్టు అప్పన్నకు చెందిన అర తులం బంగారు వస్తువులు, సారి సామాన్లకు ఉంచిన రూ.లక్ష నగదు కాలి బూడిదైంది. కోష్టు పెదనర్సయ్యకు చెందిన 10 తులాల వెండి, రూ.20 వేలు నగదు కాలిబూడిదైంది. కోష్టు లక్ష్మికి చెందిన పావు తులం బంగారం, 10తులాల వెండి పట్టీలు, రూ.8వేలు నగదు ఈ ప్రమాదంలో కాలిపోయాయని బాధితులు లబోదిబోమంటూ రోదిస్తున్నారు. బాధితులందరికీ కట్టు బట్టలు మినహా ఒక్క వస్తువు కూడా మిగలకుండా కాలిపోయాయి. ప్రమాద విషయాన్ని రాజాం అగ్ని మాపక కేంద్రానికి స్థానికులు సమాచారం ఇవ్వడంతో సంబంధిత అధికారులు, సిబ్బంది శకటంతో వచ్చి మంటలను అదుపు చేశారు.కె.సీతారాంపురం అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించి అధికారులతో మాట్లాడుతున్న జెడ్పీ చైర్మన్ చిన్నశ్రీను, బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు కాలిపోయిన 12 పూరిళ్లు మంటల్లో సజీవ దహనమైన వృద్ధురాలు కోష్టు పాపమ్మ బాధితులను పరామర్శించిన జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి ప్రమాద స్థలాన్ని పరిశీలించిన బొబ్బిలి ఆర్డీవో, తహసీల్దార్ రూ.6 లక్షల ఆస్తి నష్టం కె.సీతారాంపురం(చినగొలుగువలస) గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాద వార్తను తెలుసుకున్న జెడ్పీ చైర్మన్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను) బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడుతో కలిసి శనివారం ఉదయం గ్రామానికి వచ్చి అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించారు. ప్రమాద వివరాలను స్థానిక నాయకులను, రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సహాయక చర్యలు చేపట్టాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అగ్ని ప్రమాద బాధితులకు అండగా ఉంటామని, ప్రభుత్వపరంగా అందాల్సిన సహాయం అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వారితో పాటు తెర్లాం ఎంపీపీ, జెడ్పీటీసీ ప్రతినిధులు నర్సుపల్లి బాబ్జీరావు, గర్భాపు రామారావు, వైస్ ఎంపీపీలు చేపేన సత్యనారాయణ, అప్పలరాజు, కొరటాం ఎంపీటీసీ సాకేటి నాగమణి, గొలుగువలస సర్పంచ్ ప్రతినిధి గులివిందల శంకరరావు, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు ఉన్నారు. అగ్ని ప్రమాద బాధితులను బుడా చైర్మన్, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు పరామర్శించారు. -
పోలమాంబ జాతరకు ఏర్పాట్లే ప్రధానం
● అమ్మవారి జాతర ఏర్పాట్లపై సమీక్ష ● అధికారులకు సూచనలిచ్చిన మంత్రి సంధ్యారాణి, కలెక్టర్ ప్రభాకర రెడ్డి మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి పండగను కనులపండువగా జరిపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి సంధ్యారాణి, కలెక్టర్ ప్రభాకరరెడ్డి అధికారులకు సూచించారు. అమ్మవారి చదురుగుడి వెనుకున్న క్యూల ప్రాంగణంలో జాతర ఏర్పాట్లపై శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతరలో చేపట్టబోయే ఏర్పాట్లపై శాఖల వారీగా సమీక్షించారు. ముందుగా పార్వతీపురం, సాలూరు ఆర్టీసీ డిపో మేనేజర్లు జి.లక్ష్మణరావు, పి.చారీలు మాట్లాడుతూ గతేడాది జాతరలో సిరిమానోత్సవం రోజు 75 బస్సులు నడిపినట్టు తెలిపారు. వచ్చేఏడాది జనవరి 27న జరిగే సిరిమానోత్సవానికి ఉచితబస్సు సౌకర్యం ఉండడంతో మహిళలు అధికమంది వచ్చే అవకాశం ఉందని, 100 బస్సులు వరకు నడపాలని మంత్రి, కలెక్టర్ సూచించారు. తొలేళ్లు, అనుపోత్సవం నాడు కూడా భక్తులకు అవసరమైన మేరకు బస్సులు నడపాలన్నారు. మక్కువ నుంచి వయా బాగువలస మీదుగా సాలూరు పట్టణానికి వెళ్లే రోడ్డును ఈ నెల 28వ తేదీ నాటికి మరమ్మతులు పూర్తిచేయాలని ఆర్అండ్బీ జేఈ విజయకుమార్ను ఆదేశించారు. శంబర గ్రామానికి వచ్చే రోడ్లకు ఇరువైపులా జంగిల్ క్లియరెన్స్ చేయించాలని, ట్రాఫిక్కు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. జాతరకు 800 మంది పోలీసులతో బందోబస్తు విధులు నిర్వహించనున్నట్టు పోలీస్ అధికారులు రామకృష్ణ, ఎస్.వెంకటరమణ తెలిపారు. 140 మంది పారిశుద్ధ్య కార్మికులతో జాతరలో పారిశుద్ధ్యపనులు చేయనున్నామని డీఎల్పీఓ కొండలరావు తెలపగా, 250 మంది సిబ్బందిని కేటాయించాలని కలెక్టర్ ఆదేశించారు. సిరిమానోత్సవం రోజు సాయంత్రం వరకు మద్యం దుకాణాలు మూసివేసేలా పంచాయతీ తీర్మానం చేయాలన్నారు. సబ్ కలెక్టర్ అధ్యక్షతన మరో 15 రోజుల్లో సమావేశం నిర్వహిస్తారని, ఆయా శాఖల అధికారులు పక్కాగా ఏర్పాట్లపై సిద్ధంకావాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ మనీషారెడ్డి, జిల్లా దేవదాయశాఖాధికారి రాజారావు, జిల్లా విపత్తుల నివారణ అధికారి సింహాచలం, జిల్లా రవాణాశాఖాధికారి దుర్గాప్రసాద్ రెడ్డి, జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ వినోద్కుమార్, సర్పంచ్ సింహాచలమమ్మ, ఎంపీటీసీ పోలినాయుడు, వైస్ సర్పంచ్ వెంకటరమణ, ఎంపీడీఓ అర్జునరావు, తహసీల్దార్ భరత్కుమార్, ట్రస్టుబోర్డు చైర్మన్ ఎన్.తిరుపతిరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
దళారుల భోజ్యం..!
రైతుల పేరిట..● రైతుల పేరిట మిల్లులకు ధాన్యం తరలింపు ● కొనుగోలు కేంద్రాల సిబ్బందితో కుమ్మక్కు! ● రైతుల పేరుతో బిల్లులు వీరఘట్టం: రైతులకు మేలు చేయాల్సిన ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు.. దళారుల అక్రమ వ్యాపారానికి కేరాఫ్గా మారాయి. రైతుల నుంచి కొనుగోలుచేసిన ధాన్యంను దళారులు నేరుగా రైతుల పేరిట దర్జాగా మిల్లులకు తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. నేరుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తే రైతుకు మద్దతు ధర లభిస్తుంది. దీనిపై అవగాహన లేని రైతులు కళ్లాంలోనే వ్యాపారులకు తక్కువ ధరకు ధాన్యం విక్రయిస్తున్నారు. వాటిని మిల్లులకు తరలించి రైతుల పేరిట దళారులు విక్రయిస్తున్నారు. రైతుల ఖాతాల నుంచి సొమ్మును తీసుకుని లాభసాటి వ్యాపారం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో క్షేత్రస్థాయి సిబ్బంది కమీషన్లకు కక్కుర్తిపడి దళారులకు సహకరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులు నేరుగా మిల్లులకు ధాన్యం తరలిస్తే తేమశాతం పేరుతో కొర్రీలు పెడుతూ... దళారులకు పరోక్షంగా సహకరిస్తున్నారని కొందరు రైతులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. జిల్లాలో ఏర్పాటుచేసిన 180 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ దళారుల హవాయే సాగుతోందని, ఓ సిండికేట్గా మారి రైతు నుంచి అధిక ధాన్యం కాజేస్తున్నారని చెబుతున్నారు. ఉన్నతాధికారులు నిఘాపెడితే అసలు విషయం తెలుస్తుందని, రైతులకు మేలు జరుగుతుందన్న వాదన వినిపిస్తున్నారు. రైతుకు దక్కని మద్దతు ధర ఈ ఏడాది సాధారణ రకం ధాన్యం క్వింటా రూ.2,369లకు, గ్రేడ్–1 రకం ధాన్యం రూ.2,389కు కొనుగోలు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, క్షేత్రస్థాయిలో రైతులకు ఈ మద్దతు ధర అందడం లేదు. క్వింటా రూ.2000 నుంచి 2050లకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. రైతుల వివరాలను కొనుగోలు కేంద్రాల్లో వ్యాపారులే నమోదు చేయిస్తూ ప్రభుత్వం నుంచి వచ్చే గరిష్ట మద్దతు ధరను వ్యాపారులు పొందుతున్నారు. రైతులతో చేసుకున్న ముందస్తు ఒప్పందం ప్రకారం రైతుల ఖాతాల్లో పడే డబ్బులను వారికి ఇవ్వాల్సింది ఇచ్చేసి మిగిలిన డబ్బులను వ్యాపారులే తీసుకుంటున్నారు. ధాన్యం కొనుగోలులో రైతులను దగా చేయాలని చూసే దళారుల ఆగడాలకు కళ్లెంవేస్తాం. ధాన్యం కొనుగోలులో రైతులకు గరిష్ట మద్దతు వచ్చేలా నేరుగా కొనుగోలు కేంద్రాల సిబ్బందే రైతుల కళ్లాలకు వెళ్లి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటాం. – యశ్వంత్కుమార్రెడ్డి, జాయింట్ కలెక్టర్, పార్వతీపురం మన్యం జిల్లా -
ఆటలతో ఉల్లాసం.. బోధనలో వికాసం
● ఉత్సాహంగా టీచర్ల క్రికెట్ పోటీలు ● ప్రారంభించిన డీఈవో బ్రహ్మాజీరావుపార్వతీపురం రూరల్: క్రీడలతోనే ఉపాధ్యాయులకు మానసిక వికాసం, శారీరక దృఢత్వం లభిస్తాయని పార్వతీపురం మన్యం జిల్లా విద్యాశాఖ అధికారి బ్రహ్మాజీరావు పేర్కొన్నారు. పార్వతీపురం మండలం నర్సిపురం జడ్పీ హైస్కూల్ మైదానంలో శనివారం డివిజన్్ స్థాయి టీచర్ల క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు అందించే చురుకుదనం వల్ల తరగతి గదిలో ఉపాధ్యాయులు మరింత సమర్థంగా బోధించగలుగుతారన్నారు. క్రీడల నిర్వహణ పట్ల ఎంఈవో–1 సింహాచలం హర్షం వ్యక్తం చేశారు. కొమరాడ ఎంఈవో నారాయణస్వామి పర్యవేక్షణలో, ఎస్జీఎఫ్ బాధ్యులు సబ్బాన మురళి, మండంగి మురళి ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో బలిజిపేట, సాలూరు, పార్వతీపురం తదితర మండలాల జట్లు తలపడ్డాయి. బొత్స రవికుమార్ తనదైన వ్యాఖ్యానంతో అలరించగా హెచ్ఎం సత్యనారాయణ, పీడీలు పాల్గొన్నారు. -
అంతా బాగుందనుకున్నారు... ఇంతలోనే...
● చికిత్స పొందుతూ మృత్యు ఒడికి చేరిన పాలిటెక్నిక్ విద్యార్థి ● కన్నీరుమున్నీరుగా విలపించిన తండ్రి ● ప్రాణం మీదకి తెచ్చిన ట్రాక్టర్ లిఫ్ట్చీపురుపల్లి: తానొకటి తలచితే.. దైవం మరొకటి తలచింది.. అన్న సామెత అక్షరాల ఆకాష్ విషయంలో స్పష్టమయ్యింది. ప్రతీ రోజూ మాదిరిగా కళాశాల విడిచిపెట్టారు. ఆకాష్ ఇంటికో.. వసతిగృహానికో.. వెళ్లిపోవాలనే రోడ్డెక్కాడు. స్నేహితులతో కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ రోడ్డుపై నడుస్తున్నాడు. కానీ విధి ఆ యువకుడుని మృత్యువు వైపు లాగుతుండడంతో వెనుక నుంచి వస్తున్న ట్రాక్టర్ను లిఫ్ట్ అడిగేలా చేసింది. ఆ ట్రాక్టర్ లిఫ్ట్ కాస్త నిండు నూరేళ్లు జీవించాల్సిన ఆకాష్ను తిరిగి రాని లోకాలకు తీసుకెళ్లింది. ఐదు రోజులుగా కేజీహెచ్లో చికిత్స పొందుతున్న పాలిటెక్నిక్ విద్యార్థి ఆకాష్(17) శనివారం మృతి చెందాడు. వెల్డింగ్ పని చేసుకుంటూ కొడుకుని బాగా చదివించుకోవాలని ఎంతో కోరికతో పాలిటెక్నికల్ విద్య చదివిస్తున్న ఆకాష్ తండ్రి కన్న కలలు చెదిరిపోయాయి. ఎంతో ప్రయోజకుడు అవుతాడనుకున్న కొడుకు కళ్ల ముందు విగతజీవిగా పడి ఉండడంతో కన్నీరు మున్నీరుగా విలపించాడు. ప్రాణాల మీదకు తెచ్చిన ట్రాక్టర్ లిఫ్ట్ జామి మండలంలోని అలమండ గ్రామానికి చెందిన జి.ఆకాష్ పట్టణంలోని జీవీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. స్థానిక ఎస్సీ కళాశాలల బాలుర వతిసగృహంలో ఉంటూ చదువుతున్నాడు. ఈ నెల 6న కళాశాల ముగించుకుని ఇంటికి వెళ్లిన ఆకాష్ తిరిగి 8న నేరుగా కళాశాలకు వచ్చాడు. ఆ రోజు కూడా తరగతులు ముగించుకుని పట్టణ శివారున ఉన్న కళాశాల నుంచి స్నేహితులతో కలిసి రోడ్డెక్కాడు. వెనుక నుంచి వస్తున్న ట్రాక్టర్ను లిఫ్ట్ అడిగాడు. కుర్రాళ్లు లిఫ్ట్ అడిగారు కదాని ట్రాక్టర్ డ్రైవరు ఆపి లిఫ్ట్ ఇచ్చాడు. నలుగురు స్నేహితులతో కలిసి ట్రాక్టర్ ఎక్కిన ఆకాష్ ట్రాక్టర్ కదిలిన కాసేపటికే ఇంజన్ – తొట్టె మధ్య భాగంలో ప్రమాదవశాత్తూ జారి పడిపోయాడు. దీంతో ఆకాష్పై నుంచి ట్రాక్టర్ వెళ్లింది. చికిత్స పొందుతూ మృత్యు ఒడిలోకి ఈ నెల 8న కేజీహెచ్లో చేరిన ఆకాష్కు కలెక్టర్ ఆదేశాల మేరకు సాంఘిక సంక్షేమ శాఖ పర్యవేక్షణలో శస్త్ర చికిత్స కూడా నిర్వహించారు. గత ఐదు రోజులుగా వసతిగృహ సంక్షేమాధికారి మంగళగిరి శ్రీనివాసరావు కేజీహెచ్ వద్దనే ఉంటూ ఆకాష్ యోగక్షేమాలు చూసుకుంటున్నాడు. శుక్రవారం నాటికి ఆరోగ్యం కుదుటపడినట్లు వైద్యులు కూడా చెప్పారు. కానీ ఇంతలోనే ఏమైందోగాని శనివారం మృతి చెందడం కలచివేసింది. ఈ మేరకు చీపురుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆమె అడుగుపై.. అనుమానపు నీడ!
పార్వతీపురం రూరల్: ఇంటికి దీపం ఇల్లాలు అని కీర్తించే సమాజంలోనే.. ఆ దీపం ఆరని కన్నీటితో అడుగంటి పోతోంది. ఆకాశంలో సగం అని గొప్పలు చెప్పుకుంటున్నా.. అవనిపై ఆమెకు అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో గత రెండేళ్లుగా నమోదైన నేరాల చిట్టాను నిశితంగా పరిశీలిస్తే.. అంకెల గారడీలో తగ్గుదల కనిపిస్తున్నా, వాస్తవంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగానే మిగిలిపోయిందని స్పష్టమవుతోంది. నమ్మించి మోసం చేసే ‘వంచన’ కేసులు పెరగడం సభ్యసమాజాన్ని కలవరపెడుతోంది. కట్న పిశాచి.. కాటేస్తూనే ఉంది! వరకట్న నిషేధ చట్టం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా.. కాసుల కక్కుర్తి మాత్రం పోలేదు. గత ఏడాది 324 వరకట్న వేధింపులు కేసులు నమోదయ్యాయి. దాదాపుగా రోజుకో చోట ఓ మహిళ అత్తింటి వేధింపులకు బలవుతూనే ఉంది. ఇదే క్రమంలో పోలీస్ స్టేషన్ గడప తొక్కని, నాలుగు గోడల మధ్య నలిగిపోతున్న బాధితుల సంఖ్య వేలల్లో ఉంటుంది. జిల్లాలోనే ఒక్క ఏడాదిలో 200కు పైగా గృహ హింస కేసులు వెలుగు చూడటం, వన్ స్టాప్ సెంటర్లలో 270కి పైగా దాంపత్య తగాదాలు నడుస్తుండడమే ఇందుకు సాక్ష్యం. ప్రేమ ముసుగులో.. ప్రాణాంతక క్రీడ కొన్ని తరహా నేరాలూ తగ్గుముఖం పట్టినా.. అత్యాచారం, మోసం కేసులు పెరగడం ప్రమాదకర పరిణామంగా కనిపిస్తోంది. సాంకేతికత పెరిగాక సోషల్ మీడియా పరిచయాలు, ప్రేమ పేరుతో వల వేయడం, శారీరకంగా వాడుకుని ఆపై ముఖం చాటేయడం వంటి ఘటనలు ఎక్కువవుతున్నాయి. యువతను ఆకర్షించి, పక్కదోవ పట్టించే ముఠాల పట్ల పోలీసులు మరింత కఠినంగా ఉండాలన్న వాదన వినిపిస్తోంది. కౌన్సెలింగ్ ఇస్తున్నా.. మళ్లీ అదే నరకంలోకి.. కుటుంబ తగాదాల విషయంలో పోలీసులు, వన్ స్టాప్ సెంటర్ల పాత్ర చాలా కీలకం. వివాదాలు వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్లలో, వన్ స్టాప్ కేంద్రాల్లోని కౌన్సిలర్లు ముందుగా భార్యాభర్తల మధ్య సఖ్యత కోసం ప్రయత్నిస్తారు. ‘మీరిద్దరూ మళ్లీ చక్కగా కలిసి ఉండాలి, కుటుంబానికి విలువ ఇవ్వాలి’ అని వారికి హితబోధ చేసి, సయోధ్య కుదిర్చి పంపుతున్నారు. ఈ ప్రయత్నం వెనుక, కుటుంబ వ్యవస్థను నిలబెట్టాలనే సదుద్దేశం ఉంది. అయితే, ఈ కౌన్సెలింగ్ తర్వాత మళ్లీ అదే వేధింపుల వాతావరణంలోకి బాధితులను పంపించడం వల్ల.. సమస్య సమసిపోకుండా కేవలం వాయిదా పడుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. పోలీసులు ఎంత మంచి మాటలు చెప్పినా, ఇంటి పోరు తగ్గడం లేదనే నిజాన్ని తెలుపుతున్నాయి. అవసరం.. మరింత ‘కఠిన నిఘా’! లైంగిక వేధింపులు, అత్యాచార ఘటనల్లో దోషులకు వెంటనే శిక్ష పడేలా చట్టపరమైన ప్రక్రియను వేగవంతం చేయాలన్న వాదన వినిపిస్తోంది. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన షీ టీమ్స్, పెట్రోలింగ్ బృందాలు బహిరంగ ప్రదేశాల్లో నామమాత్రంగా కాకుండా కఠినమైన పర్యవేక్షణ చేపట్టాలి. మహిళా కళాశాలలు, హాస్టళ్లు, రద్దీగా ఉండే ప్రాంతాలపై నిరంతరం దృష్టి సారించాలి. ప్రేమ పేరుతో మోసం చేసి, వంచనకు పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలి. అపహరణ, బ్లాక్మెయిలింగ్ కేసుల్లో పకడ్బందీ విచారణ జరిపి, తక్షణ న్యాయం అందించగలిగితేనే.. ‘మృగాళ్ల’లో భయం పెరుగుతుందన్నది మహిళా సంఘాల అభిప్రాయం. కుటుంబ కలహాలు వచ్చినప్పుడు పోలీసులు ‘చక్కగా కలిసి ఉండాలని’ హితబోధ చేసి పంపినా.. అదే వేధింపుల వాతావరణంలోకి పంపడం వల్ల న్యాయం వాయిదా పడుతోంది. అందుకే పోలీస్ శాఖ కఠిన నిఘాను, పర్యవేక్షణను పెంచాల్సిన అవసరం ఉంది. మందలింపులు కాదు.. వేధించినవారికి సరైన గుణపాఠం చెప్పాలి. దోషులకు త్వరితగతిన శిక్షలు పడేలా ఫాస్ట్ట్రాక్ కోర్టులను సమర్థంగా నిర్వహించినప్పుడే మృగాళ్లలో భయం పెరుగుతుంది. కఠిన చట్టాలను అమలు చేసే చిత్తశుద్ధి పెరిగినప్పుడే ‘ఆడబిడ్డ’కు రక్షణ లభిస్తుంది. న్యాయం కూడా జరుగుతుంది. – రెడ్డి శ్రీదేవి, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు, పార్వతీపురం మన్యం మగువకు ఇంటా బయటా అభద్రత.. జిల్లాలో ఆందోళన కలిగిస్తున్న నేరాలు తగ్గని వరకట్న వేధింపులు కలవరపెడుతున్న ప్రేమ మోసాలు గతేడాది ఉమ్మడి విజయనగరం జిల్లాలో వరకట్న వేధింపుల కేసులు: 324 లైంగిక వేధింపుల కేసులు: 137 -
ఏమైనట్టు..?
రూ.కోటి నిధులు విజయనగరం ఫోర్ట్: యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణ కోసం ప్రభుత్వం విజయనగరం జిల్లాకు రూ.కోటి నిధులు మంజూరు చేసింది. ఆ నిధులను ఆయుష్శాఖకు కేటాయించామని, ఖర్చుల వివరాలు తెలియజేయాలంటూ ఆ శాఖ కమిషనర్ నుంచి ఆయుష్ వైద్యులకు తాజాగా లేఖ అందింది. దీనిని చూసిన వైద్యులు బిక్కమొహం వేశారు. అసలు ఒక్క రూపాయి కూడా చేతికి అందజేయకుండా... రూ.కోటి విడుదల చేశామని, లెక్కలు చెప్పాలని కోరడంపై ఆవేదన చెందుతున్నారు. నిధులు అందలేదంటూ తిరిగి లేఖ రాశారు. అయితే... యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణకు అంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరైనట్టు ఆయుష్శాఖలో పనిచేస్తున్న హోమియో, ఆయుర్వేద వైద్యులకు, యోగాంధ్ర కో ఆర్డినేటర్కు తెలియకపోవడం గమనార్హం. ఆయుష్ శాఖకు మంజూరు చేసినట్టు చెబుతున్న రూ.కోటి నిధులు ఎక్కడకు మళ్లాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. చేతిచమురు వదిలించుకున్న ఆయుష్ వైద్యులు యోగాడే సందర్భంగా ఈ ఏడాది జూన్ 21వ తేదీన విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీని నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతిజిల్లాకు నిధులు కేటాయించింది. విజయనగరం జిల్లాకు కూడా రూ.కోటి నిధులు విడుదల చేసింది. అయితే, ఆ నిధులు ఆయుష్శాఖకు చేరకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా రూ.కోటి నిధులు ఎవరు దారి మళ్లించారన్న అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆయుష్ విభాగంలో పనిచేస్తున్న వైద్యులు సైతం దీనిపై విస్మయం చెందుతున్నారు. కార్యక్రమం నిర్వహణకు చేతిసొమ్ము ఖర్చుచేశామని, నిధులు విడుదల అంశమే తెలియదని చెబుతున్నారు. యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణకు జిల్లాకు రూ.కోటి నిధులు మంజూరు చేశారు. ఈ నిధుల ఖర్చుకు సంబంధించిన బిల్లుల వివరాలు కమిషనర్ అడిగారు. మాకు ఒక్కరూపాయి కూడా రాలేదని కమిషనర్కు తెలియజేశాం. మా చేతి డబ్బులే రూ.20 వేలు వరకు ఖర్చుచేశాం. – జి.వరప్రసాద్, సీనియర్ హోమియో వైద్యుడు యోగాంఽధ్ర కార్యక్రమం నిర్వహణకు విడుదల చేసిన నిధులపై ఖర్చుల వివరాలు ఆయుష్శాఖ కమిషనర్ అడిగారు. మాకు రూపాయి కూడా రాలేదని రాసిచ్చేశాం. – డాక్టర్ ఎం.ఆనందరావు, యోగాంధ్ర కో ఆర్డినేటర్ యోగాంధ్ర నిర్వహణకు విజయనగరం జిల్లాకు రూ.కోటి నిధులు విడుదల ఖర్చుచేసిన నిధులకు వివరాలు అందజేయాలని ఆయుష్శాఖ వైద్యులకు కమిషనర్ లేఖ ఒక్కరూపాయి కూడా నిధులు రాలేదని కమిషనర్కు తిరిగి లేఖరాసిన ఆయుష్ వైద్యులు ఆ నిధులు ఏమయ్యాయి? జిల్లాలో జోరుగా సాగుతున్న చర్చ -
కారుణ్య నియామకపత్రం అందజేత
విజయనగరం రూరల్: బాడంగి మండలానికి చెందిన జి.జోజమ్మను గంట్యాడ మండలంలోని వసంత జెడ్పీ ఉన్నత పాఠశాలలో కార్యాలయ సహాయకురాలిగా నియమిస్తూ జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు శుక్రవారం నియామకపత్రం అందజేశారు. బాడంగి మండలం డొంకినవలస పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడు జి.లక్ష్మణరావు మరణించడంతో ఆయన భార్య జోజమ్మకు కారుణ్య నియామకంలో ఉద్యోగం కల్పించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో బీవీ సత్యనారాయణ, ఏవో రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి బీచ్ వాలీబాల్ పోటీలకు అలుగోలు విద్యార్థినెల్లిమర్ల రూరల్: మండలంలోని అలుగోలు ఉన్నత పాఠశాల విద్యార్థి గణేష్ రాష్ట్రస్థాయి బీచ్ వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడు. చింతపల్లి సముద్ర తీరంలో ఇటీవల జరిగిన జిల్లా స్థాయి బీచ్ వాలీబాల్ పోటీల్లో అండర్–14 విభాగంలో పాల్గొని సత్తా చాటాడు. ఈ నెల 20 నుంచి బాపట్లలోని సూర్యలంక బీచ్లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు హజరుకానున్నాడు. ఈ మేరకు శుక్రవారం హెచ్ఎం కస్తూ రి, పీడీలు ధర్మారావు, మహేశ్వరరావు గణేష్ను అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటాలని ప్రోత్సహించారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. 14న జిల్లా స్థాయి ఖోఖో పోటీలువిజయనగరం: జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 14న జిల్లాస్థాయి సీనియర్స్ సీ్త్ర, పురుషుల ఖోఖో పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఏఎంఎన్ కమలనాభ రావు, కె.గోపాల్లు తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు నగరంలోని కస్పా కార్పొరేషన్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనేందుకు 2008 జనవరి 1వ తేదీ అనంతరం జన్మించి ఎత్తు, బరువు, వయస్సు కలిపి 250 పాయింట్ల లోపు కలిగి ఉండాలని స్పష్టం చేశారు. జిల్లా స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి క్రీడాకారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హత్యకేసులో ముద్దాయికి జీవిత ఖైదు, జరిమానావిజయనగరం క్రైమ్: మూడేళ్ల క్రితం జరిగిన హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు, రూ.2000 జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి ఎం.బబిత తీర్పు ఇచ్చారని ఎస్పీ దామోదర్ శుక్రవారం తెలిపారు. ఈ హత్య కేసు వివరాలిలా ఉన్నాయి. చీపురపల్లికి చెందిన బంగారి రామ్మోహనరావును ఆగస్టు 18, 2022లో గుర్తుతెలియని వ్యక్తి గాయపరిచినట్టు తమ్ముడు వెంకటేష్ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై సన్యాసినాయుడు కేసు నమోదు చేశారు. అయితే గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయమై మృతుని తల్లి లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆల్టరేషన్ మెమో ద్వారా పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. దీంతో అప్పటి చీపురుపల్లి సీఐ సంజీవరావు కేసు దర్యాప్తు చేపట్టి విచారణ చేసి హత్య నేరానికి పాల్పడినట్లు రాయిపల్లి మురళిని అరెస్ట్ చేసి రి మాండ్ తరలించి కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేశారు. కోర్ట్ విచారణలో రాయిపల్లి మురళిపై నేరారోపణలు రుజువు కావడంతో వి జయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత పై విధంగా శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యంవిజయనగరం క్రైమ్: విజయనగరం వన్ టౌన్ పీఎస్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు శుక్రవారం గమనించారు. నగరంలోని ఎన్సీఎస్ థియేటర్ ఎదురుగా సులబ్ కాంప్లెక్స్వద్ద ఫుట్ పాత్పై మెరూన్ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తి మృతిచెంది ఉండడాన్ని సీఐ ఆర్వీఆర్కే చౌదరి గుర్తించారు. ఈ మేరకు గుర్తు తెలియని మృతదేహం కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిసిన వారు వన్ టౌన్లో సంప్రదించాలని సీఐ చౌదరి కోరారు. -
● కోటదుర్గమ్మ దేవస్థానం నుంచి ర్యాలీ ● సబ్ కలెక్టర్కు వినతిపత్రం అందజేత
పాలకొండ రూరల్: ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకుందామంటే మిల్లర్లు సిండికేట్గా మారి దోచుకుంటున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ రైతు సంఘం, వివిధ రాజకీయ పక్షాలతో కలిసి పాలకొండలో శుక్రవారం ఆందోళన చేశారు. కోటదుర్గమ్మ దేవస్థానం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని యా లం కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్కు తమ సమస్యల తో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు బుడితి అప్పలనాయుడు, జి.అప్పలనాయుడు తదితరులు మాట్లాడుతూ ప్రస్తుత ఏడాది జిల్లాలో లక్ష 70 వేల ఎకరాల్లో దాదాపు 78 వేల మంది రైతులు వరి సాగు చేసినట్లు తెలిపారు. 2 లక్షల 80 వేల టన్నుల ధాన్యం రైతుల నుంచి ప్రభుత్వం సేకరించాల్సి ఉందన్నారు. రైతు సేవా కేంద్రాలు ఉత్సవ విగ్రహాల్లా మారడంతో రైతులు దగా పడుతున్నట్టు వాపోయారు. నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలో మిల్లర్ల కనుసన్నల్లో ధాన్యం సేకరణ జరుగుతోందన్నారు. మ్లిలర్లు సిండికేట్గా మారి క్వింటాకు 5 కేజీలు అదనంగా రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్నారన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే జిల్లాలో రైతులు రమారమి రూ.72 కోట్లు నష్టపోతారన్నారు. దీనిపై సబ్ కలెక్టర్ స్పందిస్తూ మిల్లర్లు నిబంధనలు అతిక్రమిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రైతుల నుంచి అధికంగా ధాన్యం సేకరించినట్లు నిర్ధార ణ అయితే మిల్లులు సీజ్ చేస్తామని స్పష్టం చేశా రు. కార్యక్రమాల్లో వి.అప్పలనాయుడు, వెంకట జగన్నాథం, ద్వారపూడి అప్పలనాయుడు, వైఎస్సార్ సీపీ యువజన విభాగం నాయకులు అల్లు సురేష్కుమార్, వారాడ నాగేంద్రనాయుడు, పి. వైకుంఠరావు, రైతులు పాల్గొన్నారు. -
కదం తొక్కిన అంగన్వాడీలు
నిర్బంధాలను అధిగమించి.. సాక్షి, పార్వతీపురం మన్యం: జీతాల పెంపు సమస్య పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు కదం తొక్కారు. అంగన్వాడీ వర్క ర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో పార్వతీపురంలోని సుందరయ్య భవనం నుంచి కలెక్టరేట్ వరకు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల్లో ప్రస్తుత సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశా రు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని.. మినీల ను మెయిన్ వర్కర్లుగా మార్చాలని.. కనీస వేతనం అమలు చేయాలని కోరుతూ కలెక్టరేట్ గేటు వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించారు. జీతాలు పెంచడంతో పాటు, సంక్షేమ పథకాలు అమలు చేయా లని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు హామీలిచ్చిన చంద్రబాబు అధికారం చేపట్టి 18 నెలలు గడుస్తున్నా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోవడంపై ఆందోళన వ్యక్తంచేశారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారిణి హేమలతకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి అమరవేణి, కార్యదర్శి జి.జ్యోతిలక్ష్మి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్మథరావు, శ్రామిక మహిళా నాయకులు ఇందిర, జిల్లాలోని 10 ప్రాజెక్టుల నుంచి తరలివచ్చిన అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు పాల్గొన్నారు. ఎక్కడికక్కడ నిర్బంధం రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు అంగన్వాడీలు తలపెట్టి న ధర్నా కార్యక్రమానికి పోలీసులు అడుగడుగునా ఆటంకం కలిగించారు. యూనియన్, సీఐటీయూ నాయకులను గృహ నిర్బంధం చేశారు. జిల్లా కేంద్రానికి బయల్దేరిన వర్కర్లను, నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. బస్సులు, ఆటోల్లో వస్తున్న వారిని మార్గంమధ్యంలోనే నిలుపుదల చేసి వెనక్కి పంపారు. కలెక్టరేట్ వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. నిర్బంధాలను అధిగమించి అంగన్వాడీలు భారీగా నిరసన కార్యక్రమానికి తరలివచ్చారు. -
సెలవుల్లోనూ పాఠశాలలా?
సాక్షి, పార్వతీపురం మన్యం: ప్రభుత్వ పాఠశాల లు రెండో శనివారం కూడా తెరుస్తుండటంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యాసంవత్సరంలో 220 రోజు లు కచ్చితంగా పాఠశాలలు పని చేయాలి. తుఫాన్ల సమయంలో అత్యవసరంగా కొన్ని రోజులు సెలవులు ప్రకటించాల్సి వస్తోంది. ఆ రోజులను పూరించేందుకు రెండో శనివారాల్లోనూ పాఠశాలలు తెరవాల్సి ఉంటుంది. ఈ విద్యాసంవత్సరంలోనూ కొద్దిరోజులు అదేవిధంగా నడిచాయి. జిల్లాకు సంబంధించి 220 వర్కింగ్ డేస్కు ప్రస్తుతానికి ఇబ్బంది లేనప్పటికీ.. రెండో శనివారం కూడా స్కూళ్లు పని చేస్తున్నాయి. పరీక్షలు దగ్గరకు వస్తున్నందువల్ల పదో తరగతి వరకు మినహాయించినప్పటికీ.. మిగిలిన తరగతులకు సెలవు అమలు చేయాల ని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. పాచిపెంట: మండలంలోని కూనం బందవలస గ్రామానికి చెందిన ఇద్దరు గిరిజన విద్యార్థులు కోట సుహాసిని (4వ తరగతి), మజ్జిదినేష్ (ఒకటో తరగతి) పచ్చకామెర్లతో బాధపడుతూ సాలూరు సీహెచ్సీలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మండల ప్రత్యేక అధికారి, ఎంపీడీఓ శుక్రవారం కూనంబందవలస గ్రామానికి వెళ్లి పిల్లల కుటుంబ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్టు తెలిస్తే వెంటనే పాచిపెంట పీహెచ్సీలో చేర్పించాలని సూచించారు. నిధుల స్వాహాపై అధికారుల విచారణ ● రూ.43.44లక్షలు స్వాహా అయినట్టు నిర్ధారణ రేగిడి: మండలంలోని తునివాడ గ్రామానికి చెందిన బ్యాంకు మిత్ర (సీఎస్పీ) ఆ గ్రామానికి చెందిన 39 సంఘాలకు సంబంధించి రూ.43.44 లక్షల నగదు సొంతానికి వాడుకున్నట్టు అధికారులు నిర్ధారించారు. సెర్ప్ డీపీఎం ఎ.చిరంజీవి, బ్యాంకు లింకేజీ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ జె.లక్ష్మునాయుడు, సీ్త్రనిధి మేనేజర్ సుధాకర్తో పాటు రేగిడి యూనియన్ బ్యాంకు అధికారులు గ్రామంలోని మహిళా సంఘాల సభ్యులతో శుక్రవారం సమావేశమయ్యారు. సభ్యుల వద్ద నగదుకు సంబంధించి వివరాలు సేకరించారు. సంఘాల నిధుల స్వాహాకు పాల్పడిన సీఎస్పీ అల్లు శ్రీధర్పై చర్యలకు సిఫార్స్ చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీపీఎం మాట్లాడుతూ సీ్త్ర నిధికి సంబంధించి రూ.2 లక్షలు, పొదుపు, బ్యాంకు లింకేజీలకు సంబంధించి రూ.41లక్షలకు పైగా నిధులు దుర్వినియోగం అయినట్లు గుర్తించామని చెప్పారు. మహిళా సంఘాలకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో ఏపీఎం బాసిన గోవిందరావు, సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరం అర్బన్: జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని ఈ నెల 24న నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవ్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 18 నుంచి వారోత్సవాలను నిర్వహించాలని సూచించారు. జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్లో సంబంధిత అధికారులు, వినియోగదారుల సంఘాల సభ్యులతో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లా డారు. ‘డిజిటల్ న్యాయపాలన ద్వారా సమర్ధ సత్వర పరిష్కారం’ అనే ఇతివృత్తంతో ఈ ఏడాది వినియోగదారుల వారోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనిపై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు పాఠశాల, ఇంటర్ స్థాయివారికి తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో వరుస ముగ్గురు విజేతలకు రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.2 వేల నగదు బహుమతులు అందజేస్తామని వెల్లడించారు. మొదటి బహుమతి సాధించిన విద్యార్థులను విశాఖపట్నంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామని చెప్పారు. -
చెరకు రైతుకు ఊరట
రేగిడి: విజయనగరం జిల్లాలోనే కాకుండా పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో చెరకు సాగుచేస్తున్న రైతులకు ఈ ఏడాది ఎట్టకేలకు ఊరట లభించింది. ప్రభుత్వ అలసత్వం కారణంగా చెరకు రైతులు ఇప్పటికే సాగు తగ్గించేశారు. కాస్తో కూస్తో సాగుచేస్తున్న రైతులను ఆదుకునే పరిస్థితిలో కూటమిప్రభుత్వం లేదు. గతేడాది వరకూ మూడు జిల్లాల చెరకు రైతులకు ఆసరాగా మిగిలిన రేగిడి మండలంలోని సంకలి వద్ద గల ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారం ఈ ఏడాది విశాఖపట్నం జిల్లాలోని కొన్ని ప్రాంతాల నుంచి చెరకును సేకరిస్తోంది. గతంలో రాయితీపై విత్తనాలు, ఎరువులు అందించే ఈ ఫ్యాక్టరీ ఈ ఏడాది ఎటువంటి రాయితీలు ఇవ్వలేదు. మరో వైపు ప్రతి ఏటా దసరాకు చెరకు క్రషింగ్ ప్రారంభించే ఫ్యాక్టరీ ఈ ఏడాది ఆలస్యంగా క్రషింగ్ ప్రారంభించింది. తగ్గిన క్రషింగ్ లక్ష్యం గతేడాది కంటే ఈ ఏడాది క్రషింగ్ లక్ష్యాన్ని ఈఐడీ కర్మాగారం తగ్గించింది. గతేడాది 3.50 లక్షల మెట్రిక్ టన్నుల క్రషింగ్ లక్ష్యం కాగా, ఈ ఏడాది 2.64 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే క్రషింగ్ లక్ష్యంగా చేసుకుంది. విజయనగరం, శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లాలతో పాటు అనకాపల్లి జిల్లా చోడవరం ప్రాంతంలోని చెరకు క్రషింగ్కు అనుమతిలిచ్చింది. ఈ ఏడాది ఈ నాలుగు ప్రాంతాల్లో కేవలం 9300 ఎకరాల్లో మాత్రమే చెరకు క్రషింగ్కు రిజిస్ట్రేషన్ నమోదైంది. ఈ మేరకు మాత్రమే సాగును అధికారులు చూపిస్తున్నారు. గతంలో ఒక్క విజయనగరం జిల్లాలోనే ఇంతటి సాగు ఉండేది. ఈ ఏడాది సాగు తగ్గడం, క్రషింగ్ లక్ష్యం తగ్గడం చూస్తుంటే భవిష్యత్తులో ఈఐడీ ప్యారీ నడపడం కష్టంగా కనిపిస్తోంది. గతేడాది రూ.3,150 ఉన్న టన్ను చెరకు మద్దతు ధర ఈ ఏడాది రూ.3360గా చెరకు మద్దతు ధర ప్రకటించారు. పెట్టుబడులు పోను రైతుకు ఎకరా సాగులో కనిపించే ఆదాయం చాలా తక్కువగా ఉండడంతో రైతులు ఈ మద్దతు ధరపై పెదవి విరుస్తున్నారు. బొబ్బిలి జోన్లో 75 వేల టన్నుల చెరకును, భీమసింగి ప్రాంతంలో 6వేల టన్నుల చెరకును, చోడవరంలో 20 వేల టన్నుల చెరకును క్రషింగ్కు తీసుకోగా, మిగిలిన చెరకును విజయనగరం జిల్లా నుంచి తీసుకుంటున్నట్లు ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రకటించింది. ప్రతికూల వాతావరణంగతేడాది కంటే ఈ ఏడాది చెరకు పంట దిగుబడి తగ్గింది. ప్రతికూల వాతావరణం కారణంగా పంటకునష్టం సంభవించినట్లు రైతులు వాపోతున్నారు. గతేడాది ఎకరా సాగులో 30 టన్నుల చెరకు దిగుబడి వస్తే ఈ ఏడాది సగటున 25 టన్నుల చెరకు ఒక ఎకరాపొలంలో దిగుబడి వస్తున్నట్లు వెల్లడించారు. ఎకరా సాగుకు రూ.35 వేలు పెట్టుబడి అవుతుండగా, ఈ ఏడాది రూ.40 వేల వరకూ పెట్టుబడులు పెరిగాయని ఆందోళన చెందుతున్నారు. తుఫాన్ వర్షాల నేపథ్యంలో దిగుబడి తగ్గిందని పేర్కొంటున్నారు. సకాలంలో ఎరువులు అందకపోవడం మరో సమస్యగా రైతులు చెబుతున్నారు. ఎట్టకేలకు క్రషింగ్ ప్రారంభం సంకిలి ఈఐడీ ప్యారీ కర్మాగారంలో నెలరోజులు ఆలస్యంగా క్రషింగ్ చెరకు టన్ను ధర రూ.3,360 2.64 లక్షల మెట్రిక్ టన్నుల క్రషింగ్ లక్ష్యం గ్రామాల్లో వడివడిగా చెరకు కటింగ్ పనులుఏప్రిల్ వరకు క్రషింగ్ ఈఐడీ ప్యారీస్ ఫ్యాక్టరీ వద్ద చెరకు క్రషింగ్ ప్రారంభించాం. తొలుత మా ఫ్యాక్టరీ సమీపంలోని రైతులకు కటింగ్ ఆర్డర్లు ఇస్తున్నాం. మాకు విల్లింగ్ ఇవ్వడంతో పాటు చెరకును యాజమాన్య పద్ధతుల్లో సాగుచేసి దిగుబడి సాధిస్తున్న ఇతర ప్రాంతాల రైతులను కూడా గుర్తించాం. ఈ ఏడాది క్రషింగ్ లక్ష్యం మేరకు మార్చి, ఏప్రిల్ నెలవరకూ గానుగ కొనసాగించే ఆలోచనలో ఉన్నాం. బి. వెంకటసూర్యనారాయణ,జనరల్ మేనేజర్, ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారం, సంకిలి, విజయనగరం జిల్లా -
చింతూరు బస్సు దుర్ఘటనపై దిగ్బ్రాంతి
● మృతుల కుటుంబాలకు రూ.15 లక్షలు, ● క్షతగాత్రులకు రూ.5 లక్షలు ప్రభుత్వం అందించాలి ● మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొరసాలూరు: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసిపాకలు ఘాట్రోడ్డులో బస్సు ప్రమాద దుర్ఘటనపై మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం సాలూరు పట్టణంలోని తన స్వగృహంలో విలేకరులతో ఆయన మాట్లాడారు.భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తున్న యాత్రికుల ప్రైవేట్ బస్సు లోయలో పడి పలువురు మృతిచెందడం బాధాకరమన్నారు. ఈ దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం మానవత్వంతో స్పందించి ,శ్రీకాకుళంలోని కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మరణించిన భక్తులకు రూ.15 లక్షలు ఇచ్చినట్లే, తీర్థయాత్రలకు వెళ్తూ మరణించిన భక్తులకు ఒక్కొక్కరికి రూ.15 లక్షలకు తక్కువ కాకుండా ఇవ్వాలన్నారు. కేంద్రప్రభుత్వం రూ.2 లక్షలు ఇవ్వాలని విజ్ఙప్తి చేశారు. ఈ ప్రమాదంలో క్షతగాత్రులకు ప్రభుత్వమే ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స అందించడంతో పాటు వారికి రూ.5 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. ఈ రహదారిలో భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా సంబంధిత అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చర్యలు చేపట్టాలని కోరారు. -
పేదోడి పళ్లెంలో ప్రోటీన్ మాయం
పిండి ఇచ్చి.. పప్పు ఎగ్గొడతారా? జనవరి నుంచి కిలో గోధుమపిండిని రూ.16కే ఇస్తామని, ప్యాకెట్ల రూపంలో సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నారు. విజయనగరం జిల్లాకు 580.15 టన్నులు, మన్యం జిల్లాకు 280.93 టన్నుల పిండి అవసరమని లెక్కలు వేశారు. అయితే, గోధుమపిండితో సరిపెట్టి, అత్యంత ఖరీదైన కందిపప్పును మాత్రం ఎగ్గొట్టే ప్లానన్లో ప్రభుత్వం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాత బకాయిలు, పాత సరుకులు సక్రమంగా ఇవ్వకుండా కొత్తవాటితో మసిపూసి మారేడుకాయ చేయడం తగదని ప్రజలు వాపోతున్నారు. కందిపప్పు పునరుద్ధరణపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఈ కొత్త సరుకులు ఏ మూలకు? అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.పార్వతీపురం రూరల్: సూపర్ సిక్స్ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం పేదవాడికి కనీస అవసరమైన ‘కందిపప్పు’ను అందించడంలో చేతులెత్తేసింది. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తామంటూ గొప్పలు చెబుతున్న సర్కారు..ఆచరణలో మాత్రం పేదోడి కడుపు కొడుతోంది. గత ఏడాది కాలంగా రేషన్ డిపోల్లో కందిపప్పు జాడ లేదు. ఇప్పుడు కొత్తగా జనవరి నుంచి గోధుమపిండి, రాగులు ఇస్తామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం..‘చేతితో ఇచ్చి చేటతో లాక్కున్నట్లు’ ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కందిపప్పు కరువై..ముద్ద దిగేదెలా? పేదలకు చౌకగా నిత్యావసరాలు అందించాల్సిన బాధ్యతను చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేసింది. బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధరలు మండుతుంటే, రేషన్ ద్వారా అందించాల్సిన పప్పును ఏడాదిగా నిలిపివేయడం చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. పప్పు అన్నానికి కరువైన సామాన్యుడు..బయట మార్కెట్లో రూ.160కి పైగా పెట్టి కొనలేక నానా అవస్థలు పడుతున్నాడు. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న ప్రభుత్వం..ఇప్పుడు పప్పు గురించి మాట్లాడకుండా గోధుమపిండి, రాగులంటూ కొత్త పల్లవి అందుకోవడం ‘కంటితుడుపు చర్య’గానే కనిపిస్తోంది. ఇచ్చే బియ్యానికి ఎసరు ప్రభుత్వం కొత్తగా రాగులు ఇస్తున్నామంటూ గొప్పగా చెబుతున్నా..దాని వెనుక ఉన్న మెలిక చూసి లబ్ధిదారులు ముక్కున వేలేసుకుంటున్నారు. రాగులను అదనంగా ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఇస్తున్న బియ్యం కోటాలో కోత విధించి మరీ ఇస్తున్నారు. ఉదాహరణకు 20 కిలోల బియ్యం తీసుకునే కుటుంబానికి..ఇకపై 17 కిలోల బియ్యం మాత్రమే ఇచ్చి, మిగతా 3 కిలోల బదులు రాగులు ఇస్తారు. అంటే ఉన్న బియ్యాన్ని తగ్గించి, కొత్త సరుకు పేరుతో మభ్యపెట్టడమేనని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ఏడాదిగా లబ్ధిదారులకు అందని కందిపప్పు ఇప్పుడు బియ్యంలోనూ కోత పట్టించుకోని ప్రభుత్వం బియ్యం తగ్గించి..రాగులు ఇవ్వడంపై సర్వత్రా విస్మయంపౌష్టికాహార పంపిణీపై పాలకులకు లేని చిత్తశుద్ధి అత్యంత కీలకమైన కందిపప్పును ఏడాది కాలంగా ఇవ్వకుండా పేదలకు మొండిచేయి చూపడం దారుణం. పేదవాడికి చౌకగా ప్రొటీన్లు అందించాల్సిన బాధ్యతను చంద్రబాబు ప్రభుత్వం విస్మరించింది. ‘కొత్తగా రాగులు ఇస్తున్నామంటూ ఆర్భాటం చేస్తూ, ఇప్పుడు ఇస్తున్న బియ్యం కోటాలో మూడు కిలోలు తగ్గించడం అన్యాయం. అదనంగా సరుకులు ఇవ్వాల్సింది పోయి, ఉన్న కోటానే తగ్గిస్తున్నారు. ఇది ప్రజలను మోసగించడమే. గోధుమపిండి వంటి కొత్త సరుకులు సరే.. కానీ, ముందుగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందే బియ్యం, ఇతర సరుకుల నాణ్యతను పెంచడంపై దృష్టి సారించాలి. కేవలం కొత్త పథకాల పేరుతో పాత లోపాలను కప్పిపుచ్చే ప్రయత్నం మానుకోవాలి. ప్రభుత్వం తక్షణమే కందిపప్పు సరఫరాను పునరుద్ధరించాలి.పాకల సన్యాసిరావు, సీపీఎం, పౌరసరఫరాల సంఘం నాయకుడు, పార్వతీపురం -
మేము నేరస్తులం కాదు బాబూ..
బలిజిపేట/సీతంపేట: చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశత్వ పాలనపై అంగన్వాడీలు అక్కసు వెళ్లగక్కారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అంగ్వాడీ సిబ్బందిని పోలీసులతో అడ్డుకోవడం, బస్సుల్లోంచి బలవంతంగా మధ్యదారిలో దించేయడంపై మండిపడ్డారు. మేము నేరస్తులం కాదు ‘బాబూ’... ఓటేసి గెలిపించిన అంగన్వాడీ ఉద్యోగులం... హామీలు అమలుచేయమంటే మీకు శత్రువులుగా కనిపిస్తున్నామంటూ సీతంపేటలోని కుశిమి కూడలిలో రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమానికి వెళ్తున్నవారిని బస్సు ఆపి నడిరోడ్డుమీద దించివేయడం అమానుషమ ని, ఇంతవరకు ఇటువంటి దుశ్చర్యలు చూడలే దని సీఐటీయూ జిల్లా ప్రధానకార్యదర్శి మన్మథరావు, ఎ.భాస్కరరావు అన్నారు. ప్రభుత్వ తీరును ఖండించారు. అణచివేతతో ఉద్యమాలను ఆపలేరని స్పష్టంచేశారు. -
సెంచూరియన్ వర్సిటీతో ఫోరెన్సిక్ ల్యాబ్ ఎంఓయూ
భువనేశ్వర్: ఒడిషా, ఆంధ్రప్రదేశ్లోని సెంచూరియన్ యూనివర్సిటీ, చత్తీస్గఢ్ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ మధ్య అకడమిక్, పరిశోధన భాగస్వామ్యానికి ఎంఓయూ కుదిరింది. ఎస్ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ ఎస్సీ ద్వివేది, సెంచూరియన్ రిజిస్ట్రార్ డాక్టర్ అనిత పాత్ర ఈ మేరకు సంతకాలు చేశారు. ల్యాబ్ సదుపాయాలు, శాసీ్త్రయ నైపుణ్యాలను పరస్పరం పంచుకోవడం, సంయుక్త శిక్షణ–పరిశోధన కార్యక్రమాలు ఈ ఎంఓయూ లక్ష్యాలు. విద్యా పరిశోధన–ప్రాయోగిక ఫోరెన్సిక్ సేవల మధ్య అంతరం తగ్గించి, నైపుణ్యాభివృద్ధికి బలమైన వేదిక సృష్టిస్తామని ద్వివేది అన్నారు. విద్యార్థులు ఫోరెన్సిక్ రంగంలో పోటీ సామర్థ్యం, ఉపాధి అవకాశాలు పొందుతారని అనిత తెలిపారు. సెంచూరియన్ను ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా ప్రభుత్వం గుర్తించిన సంగతి తెలిసిందే. -
కంటి తనిఖీ కోసం వెళ్లి మృతి
● మృతుడి నేత్రాలు దానం చేసిన కుటుంబసభ్యులు చీపురుపల్లి: ఆ ఇంటి పెద్ద అకాల మరణం కుటుంబాన్ని కుంగదీసింది. చీపురుపల్లిలో బయల్దేరి విజయనగరం కంటి వైద్య పరీక్షల కోసం వెళ్లిన ఆయన గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించడంతో ఆ కుటుంబం శోకసంద్రంలోకి వెళ్లిపోయింది. మనిషి లేడనే బాధలో దుఃఖంలో ఉన్నప్పటికీ నేత్రదానం చేసేందుకు ముందుకొచ్చిన ఆ కుటుంబం ఆదర్శం కాగా ఆయన నేత్రాలు సజీవంగా మిగలనున్నాయి. పట్టణానికి చెందిన రిటైర్డ్ డిప్యూటీ ఎంపీడీఓ కర్రోతు అప్పారావు(73) శుక్రవారం ఉదయం విజయనగరంలో కంటి వైద్య పరీక్షల కోసం వెళ్లిన ఆయన ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడే మృతిచెందారు. దీంతో ఆయన మృతదేహాన్ని పట్టణంలోని జి.అగ్రహారం తీసుకొచ్చారు. నేత్రదానం కోసం స్థానిక బాలుర ఉన్నత పాఠశాల పీఎంసీ చైర్మన్ గవిడి సురేష్ మృతుని కుటుంబసభ్యులకు వివరించగా దీనికి వారు అంగీకరించడంతో మానవీయత స్వచ్ఛంద సంస్థ ద్వారా జిల్లా రెడ్క్రాస్ నుంచి టెక్నీషియన్ హాజరై మృతుడు అప్పారావు నుంచి కార్నియా సేకరించారు. ఇక్కడ సేకరించిన కార్నియాను విశాఖపట్నంలోని ఎల్వీ.ప్రసాద్ ఆస్పత్రికి తరలించినట్లు గోవిందరాజులు తెలిపారు. విజయనగరం క్రైమ్: ఈ నెల 5న జరిగిన అగ్నిప్రమాదంలో గాయాలపాలైన నిండు గర్భిణి మౌనిక (28) కేజీహెచ్లో చిక్సిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు టూ టౌన్ ఎస్సై చంద్ర తెలిపారు. వివరాల్లోకి వెళ్తే..తోటపాలెంకు చెందిన గర్భిణి మౌనిక లంకాపట్నంలోని కన్నవారింటికి వచ్చింది. ఇంట్లో వంట చేస్తుండగా నైటీకి నిప్పంటుకోవడంతో ప్రమాదం సంభవించింది. దీంతో చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. -
8,900 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
● 70 లీటర్ల సారా స్వాధీనం ● ఏఓబీలో ఎకై ్సజ్శాఖ విస్తృత దాడులు కురుపాం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లో ఎకై ్సజ్శాఖ ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా ఎకై ్సజ్ సూపరిండెంట్ బి.శ్రీనాఽథుడు ఆదేశాల మేరకు ఏఈఎస్ ఎ.సంతోష్ ఆధ్వర్యంలో శుక్రవారం దాడులు నిర్వహించినట్లు కురుపాం ఎకై ్సజ్శాఖ సీఐ పి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన స్థానిక విలేకరులతో శుక్రవారం మాట్లాడుతూ ముందస్తు సమాచారం మేరకు ఆంధ్రా–ఒడిశా ఎకై ్సజ్శాఖల సంయుక్త దాడులను సరిహద్దు గ్రామాలైన సందుబడి, తంలబాయి, రేగలపాడు గ్రామాల్లో దాడులు నిర్వహించగా సారా తయారీ కోసం సిద్ధం చేసి 8,900 లీటర్ల పులిసిన బెల్లం ఊట ధ్వంసం చేయడంతో పాటు అక్రమంగా తరలించేందుకు ఉంచిన 70 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు తెలి పారు.ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ వీవీవీ శేఖర్ బాబు, బోర్డర్ మొబైల్ పార్టీ ఇన్స్పెక్టర్ వెంకటరాజు, రాజాం, చీపురుపల్లి, పాలకొండ ఎకై ్సజ్ స్టేషన్ల సిబ్బందితోపాటు కురుపాం ఎకై ్సజ్ ఎస్సై శేఖర్ బాబు, సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు. -
పట్టా ఉన్నా.. సాయం సున్నా..!
పోడు వ్యవసాయంలో నిమగ్నమైన గిరిజన రైతులు అన్నదాత సుఖీభవ జమకాకపోవడంతో అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ప్రతి సోమ వారం నిర్వహించే ప్రజాసమస్యల పరిష్కార వేదికలో వినతులు అందజేస్తున్నా ఫలితం లేకపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో అన్నదాత సుఖీభవ నిధులు అర్హులందరికీ జమ అవుతాయి. ఇప్పటి వరకు 9,500ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు నిధులు జమయ్యాయి. ఇంకా 7 వేల మందికి అన్నదాత సుఖీభవ రావాల్సి ఉంది. డీకేటీ, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్న రైతుల భూముల కు ఆధార్ సీడింగ్ లేదు. రాష్ట్రస్థాయిలో ఆప్షన్ ఆగింది. గతంలో నాన్వెబ్ల్యాండ్ ఆప్షన్ ఉండేది. వ్యవసాయాధికారి, తహసీల్దార్ అప్రూవ్ ఇచ్చేవారు. ఆప్షన్ వచ్చిన వెంటనే సమస్య పరిష్కారమవుతుంది. – వాహిణి, వ్యవసాయాధికారి, సీతంపేట సీతంపేట: గిరిజన రైతులపై చంద్రబాబు ప్రభుత్వం కన్నెర్రచేసింది. పెట్టుబడి సాయం అందజేయడంలో వివక్ష చూపుతోంది. డీకేటీ, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు అన్నదాత సుఖీభవను అందని ద్రాక్షగా మార్చింది. కొండపోడులో పంటలు సాగుచేసే రైతులకు పెట్టుబడి సాయం అందక ఆందోళన చెందుతున్నారు. ఒక ఏడాది సాయం ఎగ్గొట్టిన ప్రభుత్వం... రెండో ఏడాది అయినా సాయం అందజేస్తుందని ఎదురుచూసిన గిరిజన రైతులకు నిరాశే ఎదురైంది. పెట్టబడి సాయం డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమకాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో రైతుభరోసా పథకం కింద సాగుసాయం ఠంచన్గా ఖాతాల్లో జమయ్యేదని, ప్రస్తు తం ఆ పరిస్థితి లేదంటూ వాపోతున్నారు. పోడు వ్యవసాయంలో పండించే పైనాపిల్, పసుపు, కొండచీపుర్లు తదితర అటవీఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేవు. మరోవైపు ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయమూ అందడంలేదు. అన్నివిధా లా నష్టపోతున్న తమను ఆదుకునే దిక్కులేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. 7వేల మందికి అందని సాయం సీతంపేట ఐటీడీఏ పరిధిలో 16,800ల మంది కొండపోడు పట్టాలు కలిగిన రైతులు అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులు. వైఎస్సార్సీపీ హయాంలో 25 వేల ఎకరాల్లో సాగు భూమిపై పూర్తి హక్కులు కల్పించి, సుమారు 17 వేల మందికి పట్టాలు ఇచ్చి రైతు భరోసా నిధులు రూ. 13.500లు జమచేశారు. పీఎం కిసాన్ సాయం కింద రూ.6 వేలు, వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.7,500లు కలిపి మొత్తం రూ.13,500ల మొత్తాన్ని రైతు ఖాతాల్లో జమచేసేవారు. ఇప్పటి ప్రభుత్వంలో 7 వేల మందికి పైగా రైతులకు రెండేళ్లుగా ఎదురుచూపు లే మిగులుతున్నాయి తప్ప ఎటువంటి లబ్ధి కలగడం లేదు. గత వైఎ స్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఖరీఫ్ సీజన్ వచ్చిందంటే రైతుల ఖాతాల్లో నిధులు జమయ్యేవి. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. వ్యవసాయ పెట్టుబడులకు నిధులు లేక ఇబ్బందులు పడుతున్నాం. –ఎస్.వెంకటేష్, ఈతమానుగూడ గత వైఎస్సార్సీపీ ప్రభు త్వ హయాంలో ఆర్ఓ ఎఫ్ఆర్, డీకేటీ పట్టాదారులకు రైతు భరోసా ఇచ్చి అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సాగును ప్రోత్సహించారు. ఇప్పుటి చంద్రబాబు ప్రభుత్వం రైతులను ఎలా వంచించాలా?అని చూస్తోంది. – విశ్వాసరాయి కళావతి, పాలకొండ మాజీ ఎమ్మెల్యే -
అన్నదాత ఆగ్రహం
తమే. తేమ 17 శాతంలోపు.. మట్టిబెడ్డలు, రాళ్లు 1 శాతంలోపు, అపరిపక్వ, వంకర గింజలు మూడు శాతం, మొలకెత్తిన రంగు మారిన, పురుగు తిన్న గింజలు 5 శాతానికి మించకుండా ఉండాలి. వీటిన్నటింటిపైనా రైతుకు అవగాహన కల్పించేలా ప్రతి మిల్లు వద్ద బోర్డులు ఉండాలి. జిల్లాలోని ఏ మిల్లు వద్ద కూడా ఇవి కానరావడం లేదు. కొనుగోలు కేంద్రాల సిబ్బంది నేరుగా రైతు కళ్లాం వద్దకే వెళ్లి ధాన్యాన్ని తూకం వేసి, కొనుగోలు చేస్తారని అధికారులు చెబుతున్నా... మిల్లర్లు మాత్రం ధాన్యం పంపించే రైతు వచ్చే వరకూ వాటిని అన్లోడు చేయ డం లేదు. ఎన్ని రోజులైనా మిల్లు వద్ద అలానే ఉంచేస్తున్నారు. మిల్లర్లకు అధికారులు, సిబ్బందే పరోక్షంగా సహకరిస్తే.. రైతు కష్టం ఎవరు వింటారని రైతు సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో రైస్ మిల్లర్లు ఎక్కువగా అధికార పార్టీకి చెందినవారే కావడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ధాన్యంలోనే నాణ్యతాలోపం ఉందని, అందుకే కొనుగోలు ధరలు తగ్గుతున్నాయని మిల్లర్ల సంఘం నాయకులు బహిరంగంగానే ప్రకటనలు చేస్తూ.. తాము చేస్తున్న పనిని సమర్దించుకుంటున్నారు. వాస్తవానికి ఇటీవల సంభవించిన తుఫాన్ల వల్ల పంట నష్టాన్ని ఇప్పటికీ అధికారులు, ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. మిల్లర్లు మాత్రం తుఫాన్ వల్ల ధాన్యం పాడయ్యాయని, నాణ్యత లేదని సాకులు చెబుతూ కొర్రీలు పెడుతున్నారు. రైతులకు ప్రభుత్వం మద్దతు ధర గ్రేడ్–ఏ రకానికి క్వింటాకు రూ.2,389.. సాధారణ రకానికి రూ.2,369గా నిర్ణయించిన విషయం విది -
● పసివారికి సాయం
జామి: తల్లిదండ్రుల మృతితో అనాథలుగా మారి, పూరిగుడిసెలో నివసిస్తూ.. పాఠశాలలో పెట్టిన మధ్యాహ్న భోజనంతో కాలంగడుపు తున్న జామి మండలం జన్నవిస గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారుల దీనస్థితిపై ‘పాపం పసివాళ్లు’ శీర్షికన ‘సాక్షి’లోశుక్రవారం ప్రచురితమైన కథనానికి పలువురు స్పందించారు. జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ న్యాయమూర్తి ఎ.కృష్ణ ప్రపాద్ శుక్రవారం గ్రామానికి వెళ్లి చిన్నారులు గౌతమ్, విజయ్ ఇంటిని చూసి వారి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల విద్యాభ్యాసానికి భరోసా ఇచ్చారు. వసతి గృహల్లో విద్యాభ్యాసానికి నచ్చిన చోట తగిన ఏర్పాట్లు చేయిస్తానని భరోసా కల్పిడంతోపాటు చిన్నారులకు, వారి పెద్దమ్మకు కౌన్సెలింగ్ ఇచ్చారు. స్కట్ స్వచ్ఛంద సంస్థ వారు చిన్నారులకు బట్టలు, నిత్యావసర సరుకులను గ్రామసర్పంచ్ శీరెడ్డి చందునాయుడు, మాతృభూమి సేవాసంఘం సభ్యుడు కొట్యాడ రవి చేతుల మీదుగా వితరణగా అందించారు. కొత్తవలస ఎంపీడీఓ కార్యాలయంలో ఏఓగా పనిచేస్తున్న కృష్ణాపురం గ్రామానికి చెందిన బొజ్జ ప్రసాద్ గ్రామానికి చెందిన రామారావు చేతుల మీదుగా రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించారు. ఐసీడీఎస్ పీఓ అచ్యుతకుమారి మిషన్ వాత్సల్య పథకం మంజూరుకు హామీ ఇచ్చారు. పలువురు దాతలు, స్వచ్ఛంద సేవాసంస్థలు, స్థానికులు వారికి అండగా నిలవడానికి ముందుకు వస్తున్నారు. స్పందించిన హృదయాలు చిన్నారుల పరిస్థితి తెలుసుకున్న జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ న్యాయమూర్తి నిత్యావసర సరుకులు, నగదు వితరణ ‘సాక్షి’ కథనానికి స్పందన -
పూరిల్లు దగ్ధం: వృద్ధురాలికి గాయాలు
రాజాం సిటీ: మండల పరిధి బొమ్మినాయుడువలస పంచాయతీ విజయరాంపురం గ్రామంలో ఓ పూరిల్లు దగ్ధంకాగా అందులో నిద్రిస్తున్న వృద్ధురాలు గాయాల పాలైంది. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన లింగాల పైడమ్మ అనే వృద్ధురాలి పూరిల్లు శుక్రవారం వేకువజామున విద్యుత్షార్ట్ సర్క్యూట్కు గురైంది. ఈ ప్రమాదంలో కూడా ఇల్లు పూర్తిగా దగ్ధం కాగా నిద్రలో ఉన్న వృద్ధురాలి శరీరం కాలిపోవడంతో ఒక్కసారిగా కేకలు వేసింది. స్థానికులు అప్రమత్తమై ఆమెను ఎలాగోలా బయటకు తీసి ఫైర్స్టేషన్కు సమాచారం అందించారు. ఫైర్ ఎస్సై పి.అశోక్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపుచేశారు. అప్పటికే ఇంట్లో ఉన్న సామగ్రి పూర్తిగా కాలిపోయింది. వృద్ధురాలిని గ్రామానికి చెందిన మాజీ వలంటీరు, ఆటో డ్రైవర్ దాలి అప్పలనాయుడు రాజాం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. -
విశాఖ నుంచి వస్తూ కారు ప్రమాదం
పాలకొండ రూరల్: మండలంలోని అట్టలి గ్రామ మలుపు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికులను భయోత్పాతానికి గురిచేసింది. విశాఖ నుంచి దంపతులు పాలకొండ వయా పార్వతీపురం మీదుగా జియమ్మవలసకు తమ కారులో వెళ్తుండగా అట్టలి మలుపు దగ్గరకు చేరుకుంటున్న క్రమంలో వారి కారు అదుపు తప్పి కుడివైపు పంటపొలాల్లోకి దూసుకువెళ్లబోతూ అక్కడే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నవగాం విద్యుత్ సబ్స్టేషన్ ద్వారా గ్రామాలకు విద్యుత్ సరఫరా చేసే 11–కేవీ విద్యుత్ స్తంభం విరిగిపోయింది. నిప్పులు చిమ్ముతూ సిమెంట్ స్తంభం కారుపైకి ఒరిగిపోవటంతో అక్కడివారు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. అదృష్టవశాత్తు కారు ముందు భాగం నుజ్జవడం మినహా అందులో ప్రయాణిస్తున్న దంపతులకు ఎటువంటి గాయాలు కాలేదు. స్థానికుల సహాయంతో దంపతులు సురక్షితంగా బయటపడి స్వగ్రామం పయనమయ్యారు. విద్యుత్ శాఖ అధికారులు నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. -
మంత్రి చుట్టూ.. వివాదాల ఉచ్చు..
సాక్షి, పార్వతీపురం మన్యం : కొద్దిరోజుల కిందట రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అనధికార పీఏ, కుమారుడు తనపట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డారని.. మంత్రికి చెప్పుకున్నా న్యాయం జరగలేదని, పైగా తననే దూర ప్రాంతానికి బదిలీ చేయించారని ఓ మహిళా ఉద్యోగిని పోలీసులను ఆశ్రయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన సంచలనంగా మారినా బాధితురాలికి న్యాయం జరగలేదు. » మంత్రి సంధ్యారాణి కారు డ్రైవర్ రౌతు హరికుమార్ సోషల్ మీడియాలో తనపై అసభ్యకర రీతిలో పోస్టులు పెడుతున్నాడని.. తప్పుడు పోస్టులు పెడుతూ వేధిస్తున్నాడని మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర వ్యక్తిగత సహాయకుడు అధికార్ల నాగరాజు పోలీసులను ఆశ్రయించాడు. గతంలో టీడీపీలో ఉన్న తాను వైఎస్సార్సీపీలో చేరానని.. తిరిగి ఆ పార్టీ లోకి తాను చేరనందువల్ల ఇలా క్షోభకు గురిచేస్తున్నారని వాపోయాడు. » సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం డి.శిర్లాం గ్రామానికి చెందిన ఆశ వర్కరు కొద్దిరోజుల కిందట తీవ్ర మనోవేదనతో గుండెపోటుకు గురై మృతిచెందింది. ఆమె ఆరోగ్యంగా ఉన్నప్పటికీ.. అనారోగ్యం పేరిట విధుల నుంచి తప్పుకోవాలని అధికార పార్టీకి చెందిన నాయకులు చాలా కాలంగా వేధిస్తున్నారు. అందుకు వైద్యాధికారి సహకరించారన్న ఆరోపణలున్నాయి. అయితే, బాధితురాలితో కలిసి తామంతా మంత్రి వద్దకు వెళ్లి వేడుకున్నా ఫలితంలేకపోయిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. » రాష్ట్ర మహిళాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చుట్టూ నెలకొంటున్న వివాదాలకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై, రెండు కీలక శాఖలకు మంత్రిగా పనిచేస్తున్న ఆమె తీరు మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంటోంది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తన నియోజకవర్గంలో ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు, లష్కర్లు, కేజీబీవీ సిబ్బంది, మధ్యాహ్న భోజన కార్మికుల తొలగింపుపై పెద్ద రాద్ధాంతమే జరిగింది. కొద్దిరోజుల కిందట మంత్రి కాన్వాయ్ రామభద్రపురం వద్ద మరో వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో అటువైపు ఉన్న వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురు గాయపడ్డారు. డ్రైవర్ పూటుగా మద్యం సేవించి వాహనం నడిపాడని ఆ సమయంలో మంత్రి చెప్పారు. వాస్తవానికి.. ఆ వ్యక్తికి అసలు మద్యం తాగే అలవాటేలేదని గ్రామస్తులు చెబుతున్నారు. మరోసారి.. సాలూరు నియోజకవర్గంలోనే మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర ప్రయాణిస్తున్న వాహనాన్ని మంత్రి కాన్వాయ్లోని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో రాజన్నదొరకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. కనీసం కాన్వాయ్ ఆపకుండానే మంత్రి వెళ్లిపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా.. ఓ ఉద్యోగినిపట్ల ఆమె అనధికార పీఏ వేధింపులు, రాజన్నదొర వ్యక్తిగత సహాయకుడిపైన మంత్రి కారు డ్రైవరు అసభ్యకర పోస్టులు.. మంత్రి అనుచరులవల్లే తమ అమ్మ ప్రాణాలు కోల్పోయిందని ఓ యువతి ఆరోపించడం.. ఇలా వరుస వివాదాలు ఆమెను చుట్టుముట్టాయి. సొంత పార్టీలోనే గుర్రు..ఇక మంత్రి తీరుతో పార్వతీపురం మన్యం జిల్లాలోని సొంత పార్టీ నేతలే విసిగిపోతున్నారు. ఆమెకు చెక్ పెట్టేందుకే జిల్లా ఇన్చార్జి మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడును పట్టుబట్టి అధిష్టానం నియమించిందని ఊహాగానాలు వచ్చాయి. సీనియర్ నేత భంజ్దేవ్ వర్గంతో మొదటి నుంచి ఆమెకు విభేదాలున్నాయి. జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యేతోనూ ఆమెకు పొసగడంలేదని సమాచారం. ఇద్దరూ ఎడమొహం, పెడమొహంగానే ఉంటున్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలో ఐసీడీఎస్కు సంబంధించి జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి తీరుతో విసిగిపోయిన ఆ ఎమ్మెల్యే మధ్యలోనే లేచి వెళ్లిపోయారట. ఇటీవల ముఖ్యమంత్రి పర్యటనలో మంత్రి ఎక్కడా కనపడలేదు. దీంతో.. సీఎం పర్యటనలో సొంత జిల్లా మంత్రి లేకపోవడం రాజకీయంగా చర్చకు దారితీసింది. ఇదిలా ఉంటే.. మంత్రి అనుచరుల వేధింపులవల్లే ఇటీవల ఆశ వర్కరు మృతిచెందినట్లు బాధిత కుటుంబ సభ్యులు కలెక్టర్కు ఫిర్యాదుచేశారు. దీని వెనక జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే అంశమై గతంలోనూ ఆ ఎమ్మెల్యే జిల్లా పర్యటనకు వచ్చిన ఎస్సీ కమిషన్ చైర్మన్ వద్ద ప్రస్తావించారు. ఇలా.. ఇంటాబయట వివాదాలతో మంత్రి సంధ్యారాణి నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో.. త్వరలో ఆమె పదవికి ఉద్వాసన తప్పకపోవచ్చని జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. -
ఐదు తులాల బంగారం అపహరణ
వేపాడ: మండలంలోని రామస్వామిపేట గ్రామంలో దొంగలు బంగారం అపహరించిన సంఘటనపై వల్లంపూడి ఎస్సై సుదర్శన్ కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బెహరా ఈశ్వర్రావు, చిలకమ్మ దంపతులు గురువారం ఉదయం బయటకువెళ్లారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి దొంగలు తలుపులు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బీరువా సీక్రెట్ లాకర్ పగలగొట్టి ఐదు తులాలు బంగారం అపరించుకుని పోయినట్లు గుర్తించారు. దీంతో ఈశ్వర్రావు కుమారుడు శంకరరావు ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. గత నెలలో వల్లంపూడిలో ఇదే తరహాలో పట్టపగలే దొంగతనం జరిగిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై కోరుతున్నారు. కురుపాం: జిల్లాలోని సీతంపేట మండలం చింతమానుగూడ గ్రామానికి చెందిన పదిమంది కురుపాం మండలం సూర్యనగరం గ్రామానికి బంధువుల ఇంటికి ఆటోలో వస్తుండగా రస్తాకుంటుబాయి గ్రామసమీపంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో 8 మందికి గాయాలు కాగా స్థానికులు 108 వాహనంలో కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు, వైద్యులు ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఎవరికీ ఎటువంటి ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు.ఆటోను ఢీకొన్న స్కూల్ బస్సురాజాం సిటీ: మండల పరిధి కొత్తపేట జంక్షన్ నుంచి అరసబలగ వెళ్లే దారిలో గురువారం ఆటోను స్కూల్ బస్సు ఢీకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తెర్లాం మండలంలోని మాదంభట్లవలస, అరసబలగ గ్రామాల నుంచి స్కూల్ విద్యార్థులు ఆటోలో రాజాం వస్తున్నారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న స్కూల్ బస్సు ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న విద్యార్థి చింతా దుర్గాప్రసాద్ కుడిచేతికి తీవ్రగాయమైంది. వెంటనే రాజాంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా వైద్యులు అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం రిఫర్ చేశారు. ఆటో డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై పి.జనార్దనరావు తెలిపారు. -
రెండు బైక్ల కాల్చివేత
విజయనగరం క్రైమ్: విజయనగరం టుటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేదరవీధిలో బుధవారం రాత్రి ఇంటి ముందు పార్కింగ్ చేసిన రెండు బైక్లను గుర్తు తెలియని వ్యక్తి అగ్గిపెట్టెతో కాల్చివేశాడు. మేదరవీధికి చెందిన పూజారి పోలిపల్లి వీరబాబు బంధువు ఇంటి ముందు పల్సర్తో పాటు ఫ్యాషన్ బైక్ను గుర్తు తెలియని వ్యక్తి గంజాయి మత్తులో కాల్చివేశాడు. ఈ మేరకు వీరబాబు టూటౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయగా సీఐ శ్రీనివాస్ క్రైమ్పార్టీ బృందం వాసు, షఫీజ్ లను ఘటనా స్థలానికి పంపించి ఆధారాలు సేకరించారు. గంజాయి మత్తులోనే గుర్తు తెలియని వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించామని సీఐ తెలిపారు. ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతామని ,త్వరలో ఆ వ్యక్తిని పట్టుకుంటామన్నారు. -
వృద్ధురాలికి అరుదైనశస్త్రచికిత్స
● విజయవంతంగా నిర్వహించిన సర్వజన ఆస్పత్రి వైద్యురాలు విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వృద్ధురాలికి ఎముకలవైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. దీనికి సంబంధించి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. లక్ష్మీకాంతం అనే 74 ఏళ్ల వృద్ధురాలికి 15 ఏళ్ల క్రితం ఎడమ కాలు విరిగితే విశాఖపట్నం కేజీహెచ్లో ఆపరేషన్ చేసి కృత్రిమ తుంటి ఎముక వేశారు. అయితే కొద్ది రోజుల క్రితం బూత్రూమ్లో ఆమె కాలు జరి పడిపోవడంతో మళ్లీ తుంటి ఎముక విరిగిపోయింది. పలు ప్రైవేట్ ఆస్పత్రులకు తిరిగినప్పటికీ ఎవరూ చేయలేమని చెప్పడంతో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వృద్ధురాలు చేరింది. ఆస్పత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు చేయగా హెచ్బి 5 గ్రాములు ఉండడంతో 5 యూనిట్లు రక్తం ఎక్కించారు. క్లిష్టతరమైన శస్త్రచికిత్సను ఆర్ధో విభాగం హెచ్ఓడీ డాక్టర్ లోక్నాఽథ్, తోటి ఎముకల వైద్యురాలు, మత్తు వైద్యుల సహాయంతో ఆపరేషన్ విజయవంతం గా నిర్వహించారు. పాత కృతిమ తుంటి ఎముక తీసివేసి కొత్తది వేశారు. -
విహారంలో విషాదం
● వంతెనను కారు ఢీకొని విద్యార్థి మృతి ● మరో ఇద్దరికి తీవ్ర గాయాలుహుకుంపేట (అల్లూరి సీతారామరాజు జిల్లా): విహారయాత్రకు వచ్చిన ఇంజినీరింగ్ విద్యార్థుల బృందంలో ఒకరు మృతి చెందడంతో విషాదం నెలకొంది. విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు వంతెన గోడలను బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రముఖ పర్యాటక ప్రాంతం వంజంగి హిల్స్ను గురువారం వేకువజామున సందర్శించారు. తిరుగు ప్రయాణంలో భాగంగా అరకు బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న కారు మండలంలోని జాతీయరహదారిలో రాళ్లగెడ్డ వద్ద వంతెనను ఢీకొట్టింది. దీంతో డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న ఇంజనీరింగ్ విద్యార్థి గుడివాడ రుద్రసాయి(19) సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. మరో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు నారికంట్ల శ్రీయన్ నిహర్(19), శ్రీవాత్సవ(19)కు కూడా తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యసేవల అనంతరం హుటాహుటిన విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. మృతుడు రుద్రసాయి విజయనగరం జిల్లా గరివిడి మండలం వెదుళ్లవలస గ్రామానికి చెందినవాడు. మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రిలోని పోస్ట్మార్టం గదిలో భద్రపరిచారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న తండ్రి రామ్మూర్తినాయుడు, కుటుంబసభ్యులు జిల్లా ఆస్పత్రికి చేరుకుని గుండెలవిసేలా రోదిస్తున్నారు. పొగమంచు అధికంగా ఉండడంతో రోడ్డు కనిపించక ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్సై సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పేర్కొన్నారు. -
పెన్షన్ పంపిణీలో ‘విద్యుత్ షాక్’..!
బలిజిపేట: మండలంలోని పలగర పంచాయతీ గుడివాడ కాలనీలో లింగాల అసరయ్యకు ఈనెల పింఛన్ పంపిణీ చేస్తూ విద్యుత్ బిల్లు షాక్ ఇచ్చారు ఆ శాఖ అధికారులు. విద్యుత్ బిల్లులో వెయ్యి రూపాయలను విద్యుత్శాఖ సిబ్బంది కట్చేసినట్లు బాధితుడు వాపోయాడు. గుడివాడకాలనీకి చెందిన దళితుడు ఎల్.అసిరయ్యకు గతనెల విద్యుత్ రీడింగ్ తీయగా రూ.5వేలకు పైగా బిల్లు రావడంతో డిసెంబరు నెలలో అసిరయ్యకు పింఛన్ ఇచ్చే సమయంలో విద్యుత్శాఖ సిబ్బంది విద్యుత్ బిల్లులో పాక్షికంగా వెయ్యి రూపాయలు కట్ చేసి తీసుకున్నారు. పింఛన్లో ఈ విధంగా విద్యుత్ బిల్లు బకాయి విరుపుకోవడంపై బాధితుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడని సీఐటీయూ నాయకుడు మన్మథరావు తెలిపారు. దీనిపై ఆయన మాట్లాడుతూ ఎటువంటి ఆధారం లేక వచ్చిన పింఛన్పై బతుకుతున్న నిరుపేద కుటుంబాలకు చెందిన దళితుల వద్ద ఈ విధంగా డబ్బులు వసూలు చేయడం దారుణమన్నారు. విజయనగరం క్రైమ్: విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయితో పట్టుబడిన ఇద్దరు యువకులను ఎస్సై అశోక్ గురువారం అరెస్టు చేశారు. చెల్లూరు సమీపంలో బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులను తనిఖీ చేసి విచారణ చేసి అక్రమంగా 5 కేజీల గంజాయిని రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఆ ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసి ఫింగర్ ప్రింట్స్ తీసుకుని కోర్టుకు తరలిస్తున్నట్లు ఎస్సై అశోక్ చెప్పారు. -
పాపం పసివాళ్లు..!
జామి: జామి మండలం జన్నివలస గ్రామానికి చెందిన పైలపల్లి పైడిరాజు, దేవి దంపతులకు ఇద్దరు కుమారులు విజయ్(12), గౌతమ్(10). విజయ్ జామి జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో 7వ తరగతి, గౌతమ్ జన్నివలస ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నారు. తండ్రి పైడిరాజు వారి చిన్నతంలోనే మృతిచెందాడు. అప్పటి నుంచి తల్లి దేవి కూలిపనులు చేస్తూ ఇద్దరు కుమారులను సాకుతూ వచ్చింది. విధి ఆ కుటుంబపై పగబట్టింది. ఏడు నెలల కిందట దేవి గుండెపోటుతో మృతిచెందింది. తల్లిదండ్రుల మృతితో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలారు. జీవనానికి ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం, రాత్రి పస్తులుంటూ.. పాఠశాలలో పెట్టిన ఒక్కపూట మధ్యాహ్నభోజనంతోనే సరిపెట్టుకుంటున్నారు. పాఠశాలకు సెలవు అయితే ఆ రోజు ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి. వారి పెద్దమ్మ కొండమ్మ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే అయినా.. చిన్నారుల దుస్థితి చూసి అప్పుడప్పుడు కాస్త ఆకలి తీర్చుతోంది. ఇద్దరు చిన్నారులు ఊరిలో ఉన్న పూరిగుడిసెలో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. చదువుకుంటే ప్రయోజకులవుతారన్న తల్లి మాటను గుర్తుచేసుకుంటూ ప్రతిరోజు పాఠశాలకు వెళ్తున్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ మృతిచెందడంతో ప్రభుత్వం ఇస్తున్న తల్లికి వందనం పథకం కూడా వీరికి వర్తించలేదు. తల్లి బయోమెట్రిక్ ఉండాలన్న నిబంధన వీరికి శాపంగా మారింది. దుస్తులు కొందామంటే డబ్బులు లేవు... మాకు ఎవరూ లేరు. సంక్రాంతికి బట్టలు కొనుక్కుందామన్నా, అమ్మకి, నాన్నకి సంక్రాంతికి దుస్తు లు కొని చూపుదామన్నా డబ్బులు లేవు. వర్షం కురి స్తే పూరిగుడిసె మొత్తం కారిపోతోంది. పుస్తకాలు తడిసిపోతున్నాయి. రాత్రిపూట నిద్రపోవాలంటేనే భయం వేస్తోంది. పాఠశాలలో పెట్టిన మధ్యాహ్న భోజనంతోనే ఆకలి తీర్చుకుంటున్నాం. ఉదయం, రాత్రి భోజనం ఉండదు. చక్కగా చదువుకోవాలని అమ్మ చెప్పింది. అందుకే.. ప్రతిరోజు పాఠశాలకు వెళ్తున్నాం. ఉన్నతాధికారులు, దాతలు స్పందించి తమను ఆదుకోవాలంటూ చిన్నారులు రెండు చేతులూ జోడించి ప్రార్థిస్తున్నారు. ఆదుకునే హస్తం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. తల్లిదండ్రుల మృతితో అనాథలైన చిన్నారులు ఒకరికి ఒకరు తోడుగా పూరిగుడిసెలో నివాసం పాఠశాలలో పెట్టిన మధ్యాహ్నభోజనంతోనే జీవనం తిండిలేక పస్తులతో అల్లాడుతున్న చిన్నారులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూపుసహాయం చేయాల్సిన వారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ : 76740 96919 -
బైక్ అదుపు తప్పి యువకుడి మృతి
సీతంపేట: మండల కేంద్రం సీతంపేటకు చెంది న యువకుడు శేషపు చంద్రశేఖర్ (23) గడిగుడ్డి సమీపంలో జరిగి న బైక్ అదుపుతప్పి గురువారం వేకువ జామున మృతిచెందా డు. బుధవారం రాత్రి ఐటీడీఏ నుంచి సీతంపేటలో తాను నివాసముంటున్న ఎస్టీ కాలనీకి ద్విచక్రవాహనంపై వస్తుండగా మార్గమధ్యంలో గడిగుడ్డి సమీపానికి వచ్చేసరికి వాహనం అదుపుతప్పి కిందపడడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే 108లో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించగా వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం జెమ్స్కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ తెల్లారు జామున మృతిచెందినట్లు ఎస్సై వై.అమ్మన్నరావు తెలిపారు. మృతుడికి తండ్రి గోవిందరావు, సోదరుడు వంశీ ఉన్నారు. యువకుడి మృతివార్త విన్న కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. అందరితోనూ సరదాగా ఉంటూ, మంచికి మారుపేరైన చంద్రశేఖర్ అకస్మాత్తుగా మృతిచెందడంతో స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు. -
ఆరోగ్యానికి అభాయం
పార్వతీపురం రూరల్: పాత డాక్టర్ చీటీలు ఎక్కడ పెట్టామో తెలియక ఇల్లంతా వెతుకులాట..అత్యవసరంగా ఆస్పత్రికి వెళ్తే పాత రిపోర్టులు దొరక్క మళ్లీ కొత్తగా టెస్టులు. ఈ తిప్పలు పడని మధ్యతరగతి కుటుంబం ఉండదంటే అతిశయోక్తి కాదు. కానీ ఇక ఆ బాధలకు కాలం చెల్లింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘‘ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్’’ (అభా)కార్డు ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఉండాల్సిన డిజిటల్ అస్త్రం. దీని గురించి చాలా మందికి తెలిసినా, ఇందులో ఉన్న అసలు కిటుకు తెలియక అయోమయంలో ఉన్నారు. అభా అంటే బీమాకా ర్డా? లేక ఆరోగ్య రికార్డా, దీన్ని అసలు ఎలా వాడా లి అనే సందేహాలకు సమాధానమే ఈ కథనం. అసలు ఏమిటీ ఈ ఆభా..? సింపుల్గా చెప్పాలంటే..ఇది మన ఆరోగ్య జాతకం. బ్యాంకు ఖాతాలో డబ్బులు దాచుకున్నట్లు ఈ ఆభా ఖాతాలో మన ఆరోగ్య సమాచారం (హెల్త్ రికార్డ్స్) మొత్తం భద్రంగా ఉంటుంది. ఇది 14 అంకెలు ఉండే ఒక యూనిక్ ఐడీ కార్డు. దేశంలో ఎక్కడికి వెళ్లినా మెడికల్ హిస్టరీని(పాత జబ్బులు, మందుల చీటీలు, టెస్టు రిపోర్డులు) కాగితాల కట్టలుగా మోసుకెళ్లాల్సిన పనిలేకుండా డిజిటల్ రూపంలో డాక్టర్లకు చూపించడమే దీని ప్రధాన లక్ష్యం. చాలా మంది ఈ ఆభాకార్డును ఆయుష్మాన్ భారత్ కార్డు రూ.5లక్షల బీమాతో కలిపి తికమక పడుతున్నారు. ఇది డిజిటల్ రికార్డుల కోసం మాత్రమే. ఇది బీమాకార్డు కాదు. దీన్ని ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ పొందవచ్చు. కుటుంబానికి అభా ఎందుకు అవసరం..? ఒక ఇంటి యజమానిగా కుటుంబ ఆరోగ్య భద్రతకు ఆభా ఎలా ఉపయోగపడుతుందంటే పిల్లలు పుట్టినప్పుడు వేసిన టీకాల నుంచి చిన్నప్పుడు వచ్చిన జబ్బుల వరకు అన్నీ ఈ కార్డులో నిక్షిప్తమై ఉంటాయి. భవిష్యత్లో వారికి ఏదైనా సమస్య వస్తే పాత రికార్డులన్నీ ఒక్క క్లిక్తో వైద్యులు చూడగలుగుతారు. దీనివల్ల సరైన వైద్యం అందుతుంది. అలాగే వృద్ధులకు, వయస్సు మళ్లిన వారికి బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి. ఊరు మారాం కదా అని డాక్టర్ను మారిస్తే మళ్లీ మొదటి నుంచి టెస్టులు చేయించే ఖర్చు, శ్రమ తప్పుతుంది. అలాగే ఎమర్జెన్సీలో పేషెంట్ అపస్మారక స్థితిలో ఉంటే ఈ అభా నంబర్ ద్వారా డాక్టర్లు వెంటనే వారి బ్లడ్ గ్రూపు, అలర్జీలు, వాడుతున్నమందులు తీసుకుని వెంటనే చికిత్సను మొదలు పెట్టవచ్చు. నమోదుకు కావాల్సిన పత్రాలు ఆధార్ కచ్చితంగా మొబైల్ నంబర్కు లింక్ అయి ఉండాలి. ఆధార్ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ ద్వారా కూడా చేసుకోవచ్చు. కానీ ఆధార్తో సులభంగా రిజిస్ట్రేషన్ అవుతుంది. ఆధార్ లింక్తో వచ్చిన ఓటీపీని కచ్చితంగా ఇచ్చి నమోదు చేసుకోవచ్చు. ఇంట్లోనే కూర్చుని 5 నిమిషాల్లో(ఏబీహెచ్ఏ.ఏబీడీఎం.జీఓవీ.ఇన్)వెబ్సైట్ ద్వారా లేదా ఆభా యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆధార్ ఎంపికను చేసి యూజింగ్ ఆధార్ ఆప్షన్ను ఎంచుకుని ఆధార్కు జతచేసి ఫోన్ నంబర్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే పేరు, ఆధార్లో ఉన్న ముఖ చిత్రం కనిపిస్తాయి. ఒక వేళ రానట్లైతే పొందుపరచాలి. ఈ మేరకు ఈమెయిల్ ఐడీ మాదిరిగా క్రియేట్ చేసుకోవాలి. వెంటనే మీ అభా కార్డు జనరేట్ అవుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని జాగ్రత్త చేసుకోవాలి. ఆస్పత్రిలో ఎలా వాడాలి ఆస్పత్రికి వెళ్లినప్పుడు రిసెఫ్షన్ దగ్గర ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. మీ ఫోన్లో అభా యాప్ ద్వారా దాన్ని స్కాన్చేసి ప్రొఫైల్ను షేర్చేయాలి. ఇలా చేయడం వల్ల గంటల తరబడి లైన్లో నిలబడి ఓపీ చీటీకోసం వేచి ఉండాల్సిన పనిలేదు. మీ వివరాలు నేరుగా రిసెప్షన్ సిబ్బంది కంప్యూటర్లోకి వెళ్తాయి. వెంటనే ఓపీ స్లిప్ వచ్చేస్తుంది. డాక్టర్ రాసిన మందులు, చేసిన టెస్ట్ రిపోర్టులన్నీ ఆటోమెటిక్గా ఆభా యాప్లోకి వచ్చేస్తాయి. ఇక ఆ కాగితాలు పోతాయన్న భయం లేదు. ఫైళ్ల బరువు మోసే తిప్పలకు చెల్లిన కాలం దేశమంతా చెల్లుబాటయ్యేలా డిజిటల్ హెల్త్ రికార్డులు 14 అంకెలతోనే సంపూర్ణ ఆరోగ్య చరిత్ర జిల్లాలో ఇప్పటికే 8,41,503 రిజిస్ట్రేషన్లు చేతిలో ఫోన్ ఉంటే..నిమిషాల్లో నమోదు -
25వ బ్యాచ్ ఆర్టీసీ డ్రైవర్స్ శిక్షణ ప్రారంభం
విజయనగరం అర్బన్: ఆర్టీసీలో డ్రైవింగ్ శిక్షణ క్వాలిటీతో కూడినదని అభ్యర్థులు క్రమశిక్షణతో నేర్చుకోవాలని జిల్లా ప్రజా రవాణా అధికారిణి జి.వరలక్ష్మి అన్నారు. స్థానిక ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్స్ ట్రైనింగ్ కళాశాలలో 25వ బ్యాచ్ శిక్షణ తరగతులను ఆమె గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్స్ ట్రైనింగ్ కళాశాల రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన సంస్థ అని శిక్షణ పొందిన వందలాది మంది అభ్యర్ధులు వివిధ డిపోల్లో ఉద్యోగాలు సాధించి స్థిరపడ్డారని గుర్తు చేశారు. ప్రస్తుత 25వ బ్యాచ్ అభ్యర్థులు కూడా క్రమశిక్షణ, మెలకువలు, సాఽంకేతిక నైపుణ్యాలు సమపాళ్లలో నేర్చుకుని ఉత్తమ డ్రైవర్లుగా పేరు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ శిక్షణ బ్యాచ్లో చేరిన మహిళా అభ్యర్థిని ఎన్.గీతను అభినందించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ జె.శ్రీనివాసరావు, శిక్షకులు డీఎన్రాజు తదితరులు పాల్గొన్నారు. -
ట్రావెల్ బస్సులో రూ.69 లక్షల చోరీ
పూసపాటిరేగ: మండలంలోని చోడమ్మ అగ్రహారం సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులో బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో భారీ చోరీ జరిగింది. ఈ చోరీలో రూ.69 లక్షలు పోయినట్లు శ్రీకాకుళంలోని గుజరాతి పేటకు చెందిన జామి చంద్రశేఖరరావు ,వి.వినోద్ బాబు తెలియజేశారు. బాధితులు రియల్ ఎస్టేట్ వ్యాపార నిమిత్తం శ్రీకాకుళం నుంచి విజయవాడకు రెండు బ్యాగుల్లో రూ.కోటి 29లక్షలతో బస్సు ఎక్కారు. మార్గమధ్యంలో పూసపాటిరేగ మండలం చోడమ్మ అగ్రహారం సమీపంలో గల హోటల్ వద్ద భోజన విరామం కోసం బస్సును నిలుపుదలచేశారు. బాధితుల్లో ఒకరు బస్సులో భోజనం చేయగా, మరొకరు హోటల్కు వెళ్లారు. ఇంతలో గుర్తు తెలియని దుండగులు ఒకబ్యాగు పట్టుకుని పరుగులు పెట్టినట్లు బస్సులోని ప్రయాణికులు చెబుతున్నారు. బాధితులు వెంటనే పూసపాటిరేగ పోలీస్స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో ఎస్సై దుర్గాప్రసాద్ రంగప్రవేశం చేసి బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. -
భవిష్యత్లో తప్పనిసరి.. అపోహలు వద్దు
అభా కార్డుపై ప్రజల్లో ఎలాంటి అపోహలు వద్దు. ఇది కేవలం హెల్త్ రికార్డులను దాచి ఉంచే డిజిటల్ ఐడీ మాత్రమే. దీని వినియోగం పూర్తిగా సురక్షితం. నీ అనుమతి (ఓటీపీ)లేకుండా మీ హెల్త్ రికార్డులు డాక్టర్లు కూడా చూడలేరు. భవిష్యత్లో పెద్ద ఆస్పత్రుల్లో చికిత్స పొందాలన్నా, టెలిమెడిసిన్ కావాలన్నా ఆభా ఐడీ కీలకం కానుంది. స్మార్ట్ఫోన్ లేనివారు సమీప ఏఎన్ఎం, ఆశ కార్యకర్తల వద్ద వెంటనే నమోదు చేసుకోవాలి. లేదా సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలి. – తెర్లి జగన్మోహన్రావు, జిల్లా ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి, పార్వతీపురం మన్యం -
’కానిస్టేబుల్ కుటుంబానికి రూ. 10 లక్షల చెక్కు అందజేత
పార్వతీపురం రూరల్: విధి చిన్న చపు చూసినా పోలీసు శాఖ మాత్రం ఆ కుటుంబానికి పెద్ద దిక్కులా నిలిచింది. బ్రెయిన్ కేన్సర్తో పోరాడి ఇటీవల మృతిచెందిన సీతంపేట కానిస్టేబుల్ పాడి బాబూరావు కుటుంబానికి ఎస్బీఐ శాలరీ ప్యాకేజీ అండగా నిలిచింది. ప్యాకేజీ నిబంధనల ప్రకారం మంజూరైన రూ.10 లక్షల బీమా చెక్కును ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి మృతుని సతీమణి మాధురికి గురువారం అందజేసి ధైర్యం కల్పించారు. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.కోటి, సాధారణ మరణానికి రూ.10లక్షల సాయం అందుతుందని, ఈ మొత్తాన్ని కుటుంబ అవసరాలకు పొదుపుగా వాడుకోవాలని ఎస్పీ సూచించారు. బాధితులకు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కార్యక్రమంలో ఏఆర్డీఎస్పీ థామస్ రెడ్డి, పాలకొండ ఎస్బీఐ మేనేజర్ హిమాన్షు తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోలులో మధ్యవర్తుల ప్రమేయమేంటి?
వీరఘట్టం: ధాన్యం కొనుగోలు చేసే ప్రతిచోట మధ్యవర్తులు చొరబడుతున్నారు.. ప్రతి బస్తాకు 5 నుంచి 8 కిలోల ధాన్యం అదనంగా తీసుకుంటున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి.. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ధాన్యం కొనుగోలు చేయలేమా..? అసలు ధాన్యం కొనుగోలులో మధ్యవర్తుల ప్రమేయమెందుకు? అంటూ జేసీ యశ్వంత్కుమార్రెడ్డి అధికారులను ప్రశ్నించారు. వీరఘట్టం మండలం నడుకూరు రైతు సేవా కేంద్రాన్ని ఆయన గురువారం ఆకస్మికంగా సందర్శించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ట్రక్షీట్ ఎలా జనరేట్ చేస్తున్నారని టెక్నికల్ అసిస్టెంట్ను అడగగా అతని వద్ద నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ట్రక్షీట్ జనరేట్ చేయడం రానివారిని టెక్నికల్ అసిస్టెంట్స్గా ఎలా నియమించారని జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని టెక్నికల్ అసిస్టెంట్స్కు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు వెంటనే ధాన్యం కొనుగోలు ప్రక్రియపై శిక్షణ ఇవ్వాలని తహసీల్దార్ ఎ.ఎస్.కామేశ్వరరావు, ఏఓ సౌజన్యను ఆదేశించా రు. అనంతరం నడిమికెల్ల రైతు సేవా కేంద్రాన్ని జేసీ తనిఖీచేశారు. ధాన్యం కొనుగోలుపై ఆరా తీశా రు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఇప్పటి జిల్లా వ్యాప్తంగా 68,500 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలులో అక్రమాలకు పాల్పడినట్టు ఫిర్యాదు లు వస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. అంతకు మందు నడుకూరు సమీపంలోని ఇండియన్ ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్ను తనిఖీ చేశారు. -
వైకల్యాన్ని అధిగమించి... ఆటలో రాణించి..
శ్రీలంకలో చాంపియన్స్ ట్రోఫీతో శివదుర్గాప్రసాద్ పాలకొండ రూరల్: వైకల్యాన్ని అధిగమించి.. ఆటలో రాణించి.. అంతర్జాతీయ వేదికపై ఔరా అనిపించాడు.. పాలకొండ పట్టణానికి చెందిన యువకుడు శివదుర్గాప్రసాద్ బెహరా. ఈ నెల 6, 7 తేదీల్లో శ్రీలంకలో జరిగిన తొలి సౌత్ ఏషియన్ పారా చాంపియన్షిప్ త్రోబాల్ గేమ్స్లో ద్వితీయ స్థానంలో నిలిచి గురువారం పాలకొండ చేరుకున్న శివదుర్గాప్రసాద్కు స్థానికులు అపూర్వ స్వాగతం పలికారు. ఘన సన్మానం చేశారు. పాలకొండ లోగిడి వీధికి చెందిన సన్యాసిరావు, పార్వతి దంపతుల ఏకై క కుమారుడు శివదుర్గాప్రసాద్. అతడికి చిన్నతనం నుంచి ఎడమచేయి పనిచేయదు. కుమారుడు చదువుతో పాటు క్రీడల్లో చూపుతున్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ప్రోత్సహించారు. పెద్దకాపువీధి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు ఆర్.రాములు, పుష్పనాథం తర్ఫీదుతో త్రోబాల్, ఖోఖో, క్రికెట్, వాలీబాల్, అథ్లెటిక్స్లో ప్రావీణ్యం సంపాదించాడు. ఎడమ చేయి పూర్తిగా సహకరించకున్నా చిన్నతనం నుంచి కఠోర శ్రమ, కృషితో క్రీడల్లో ముందడుగు వేశాడు. పదో తరగతి అనంతరం రాజాం ఐటీసీలో ఫిట్టర్ కోర్సు చదువుతూ క్రీడల్లో తలపడి పతకాల పంట పండిస్తున్నాడు. తొలుత ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా స్థాయి క్రికెట్ పోటీల్లో తలపడిన శివదుర్గాప్రసాద్ ఆల్ రౌండర్గా పేరు సంపాదించాడు. ఇదే స్ఫూర్తితో విశాఖలో జరిగిన రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో తలపడి జిల్లా జట్టును తృతీయ స్థానంలో నిలిపాడు. నాలుగేళ్ల కిందట భువనేశ్వర్లో జరిగిన అథ్లెటిక్స్లో వంద మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానం, 2024లో చైన్నెలో జరిగిన జాతీయ స్థాయి పారా కబడ్డీ పోటీల్లో ఏపీ జట్టును ద్వితీయ స్థానంలో నిలపడంలో కీలక భూమికి పోషించాడు. గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి పారా క్రికెట్ పోటీల్లో పార్వతీపురం మన్యం జిల్లా జట్టు కెప్టెన్గా వ్యవహరించి జట్టును ప్రథమ స్థానంలో నిలిపాడు. దేశం తరఫున సత్తా చాటిన శివదుర్గా ప్రసాద్కు పాలకొండలో అపూర్వ స్వాగతం లభించింది. తన స్నేహితులు, క్రీడాభిమానులు, తల్లితండ్రులు, కుటంబ సభ్యులు ఆయనకు అభినందలు తెలిపారు. కేక్ కట్చేసి సందడి చేశారు. తన ఇంటి వద్ద పౌర సన్మానం చేశారు. ఈ సందర్భంగా శివదుర్గాప్రసాద్ మాట్లాడుతూ క్రీడల్లో రాణించాలంటే ప్రత్యేక తర్ఫీదు కేంద్రాలను అందుబాటులోకి తేవాలన్నారు. ప్రభుత్వం అన్నివిధాల సహకరిస్తే మరిన్ని పతకాలు సాధిస్తామన్న ధీమా వ్యక్తంచేశారు. -
కోయంబత్తూరులో....
ఈ ఏడాది ఆగస్టు 29, 31 తేదీల మధ్య కోయంబత్తూరులో జరిగిన పారా త్రోబాల్ నేషనల్ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్జి జట్టును ప్రథమ స్థానంలో నిలిపాడు. తొలి సౌత్ ఏషియన్ పారా చాంపియన్షిప్ త్రో బాల్ గేమ్స్లో స్థానం దక్కించుకున్నాడు. ఇటీవల శ్రీలంకలోని రత్నపూర్లో జరిగిన క్రీడల్లో శ్రీలంకతో పాటు, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ తదితర ఆరు దేశాల క్రీడాకారులతో తలపడ్డాడు. ఫైనల్లో శ్రీలంక, ఇండియా తలపడగా ద్వితీయ స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో దేశం తరఫున ట్రోఫీ అందుకుని తిరిగి స్వగ్రామం చేశారు. -
భయపెడుతున్న స్క్రబ్ టైఫస్..!
● జిల్లాలో 10 కేసుల నమోదు ● ఆందోళన చెందుతున్న జనం ● సకాలంలో చికిత్స తీసుకోవాలంటున్న వైద్యులు ●సకాలంలో చికిత్స అవసరం.. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి నిర్ధారణ అయితే వెంటనే చికిత్స తీసుకుంటే వ్యాధి నయం అవుతుంది. వ్యాధి పట్ల అలసత్వం వహించరాదు. ●ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని జ్వరం తగ్గక పోవడం, శ్వాసలో ఇబ్బంది, మతిమరుపు, గందర గోళం, మూత్రం తగ్గడం లాంటివి సంభవిస్తే వెంటనే ప్రభుత్వాస్పత్రికి వెళ్లి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలి. విజయనగరం ఫోర్ట్: జిల్లా ప్రజలను స్క్రబ్ టైఫస్ వ్యాధి కలవరపెడుతోంది. వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతుండడంతో జనం భయాందోళన చెందుతున్నారు. వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 10 కేసులు నమోదైనట్టు వైద్యారోగ్యశాఖ అధికారులు ధ్రువీకరించారు. చీపురుపల్లి, బొండపల్లి, గరివిడి తదితర మండలాల్లో కేసులు బయటపడ్డాయి. వ్యాధి నివారణకు సకాలంలో వైద్యసేవలు పొందడంలో అలసత్వం వహి స్తే మృత్యువాత పడే ప్రమాదం ఉండడంతో భయ పడుతున్నారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంట నే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. పురుగులు కరిచినప్పుడు వ్యాధి వ్యాప్తి : మైట్స్ అనే చిన్న పురుగులు కరిచినప్పడు స్క్రబ్ టైఫస్ జ్వరం వస్తుంది. తీవ్రమైన తలనొప్పి, శరీర నొప్పులు, అలసట, కళ్లు ఎర్రబడినట్టు కనిపించడం, దగ్గు, శ్వాసలో స్వల్ప ఇబ్బంది, పొట్టలో అసౌకర్యం వ్యాధి లక్షణాలు. పురుగు కరచినచోట చిన్న నల్లమచ్చ లేదా గాయం లాంటి బొట్టు కనిపిస్తుంది. ఇది దుస్తులు కింద ఉండే భాగాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. నొప్పి ఉండదు. శరీరంలో ఎర్రబడిన దద్దర్లు వల్ల ఆహారం తినాలనిపించకపోవడం లాంటివి ఉంటాయి. జిల్లాలో 10 స్క్రబ్టైఫస్ కేసులు నమోదయ్యాయి. బాధితులు వివిధ ప్రభు త్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వ్యాధి నిర్ధారణ అయిన వారందరూ ఆరోగ్యంగానే ఉన్నారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం. – డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఎంహెచ్ఓప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని ల్యాబ్లో స్క్రబ్ టైఫస్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం. వ్యాధి నిర్ధారణ అయిన వారికి చికి త్స కూడా అందిస్తున్నాం. వారికి అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయి. – డాక్టర్ అల్లు పద్మజ, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి -
జనకోటి వ్యతిరేకత
–8లోవైద్యకళాశాలల ప్రైవేటీకరణపై.. ‘వసతి’ గృహాలకు గ్రహణం వసతి గృహాలు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాయి. పేద విద్యార్థులకు ఆసరాగా నిలవాల్సిన ఆశ్రమ పాఠశాలలు, పాలకుల నిర్లక్ష్యంతో అవస్థల నిలయాలుగా మారుతున్నాయి.సాక్షి, పార్వతీపురం మన్యం: ప్రభుత్వ వైద్యకళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకా ల సేకరణ ఉద్యమానికి పార్వతీపురం మన్యం జిల్లాలో అనూహ్య స్పందన లభించింది. విద్యార్థు ల నుంచి వృద్ధుల వరకు స్వచ్ఛందంగా సంతకాలు చేశారు. ప్రైవేటీకరణపై వ్యతిరేకత తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం తీరుపై నిరసన తెలిపారు. జన‘కోటి’ సంతకాల ప్రతులను జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల నుంచి బుధవారం ర్యాలీగా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు, నియోజకవర్గ స్థాయి నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ జాతీయ అధ్య క్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కురుపాం నియోజకవర్గంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ విజయవంతంగా సాగింది. సేకరించిన 55 వేల సంతకాల ప్రతులను మాజీ డిప్యూ టీ సీఎం పాముల పుష్పశ్రీవాణి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా పార్వతీపురంలోని పార్టీ కార్యాలయానికి తరలించారు. నిధులు లేక మెడికల్ కళాశాలలను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటుపరం చేయడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో ఎంపీపీలు శెట్టి పద్మావతి, శెట్టి శ్యామల, దీనమయ, జెడ్పీటీసీ సభ్యులు సుజాత, శశికళ, ద్వారపురెడ్డి లక్ష్మి, మండంగి రాధిక, జెడ్పీ వైస్ చైర్మ న్ బాపూజీ నాయుడు, జిల్లా కో ఆప్షన్ సభ్యుడు షేక నిషార్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకి స్తూ పాలకొండలో చేపట్టిన కోటి సంతకాల ఉద్య మం విజయవంతమైంది. సంతకాల ప్రతులతో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి సమక్షంలో పార్టీ నాయకు లు, కార్యకర్తలు పాలకొండలో భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గపు పాలనపై నిరసన తెలిపారు. వైద్యకళాశాలల ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలను వివరించారు. అనంతరం సంతకాల ప్రతులను ప్రత్యేక వాహనంలో జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయానికి చేర్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కణపాక సూర్యప్రకాష్, దమలపాటి వెంకటరమణనాయుడు, బోదెపు శ్రీనివాసరావు, బిడ్డిక ఆదినారాయణ, వెలమల మన్మథరావు తదితరులు పాల్గొన్నారు. -
అంతర్జాతీయ స్థాయిలో బాగెంపేట యువకుడి సత్తా
● శ్రీలంకలో జరిగిన ఫైనల్స్లో పారాత్రోబాల్ జట్టులో కీలక ప్రదర్శనవంగర: మండల పరిధి బాగెంపేట గ్రామానికి చెందిన బేపల పవన్కుమార్ పారాత్రోబాల్ విభాగంలో సత్తాచాటాడు. రాష్ట్రస్ఙాయి, జాతీయస్థాయి జట్టులో స్థానం సంపాదించి ప్రతిభకనబరచడంతో ఇండియా జట్టుకు ఎంపికయ్యాడు. ఈ నెల 4వ తేదీ నుంచి 10 వ తేదీ వరకు శ్రీలంక దేశంలోని రత్నపూర్ నగరంలో జరిగిన సౌత్ ఏషియన్ పారాత్రోబాల్ చాంపియన్షిప్ ట్రోఫీలో పాల్గొన్నాడు. బంగ్లాదేశ్, నేపాల్, భూఠాన్ దేశాలతో తలపడి అక్కడే జరిగిన ఫైనల్స్లో భారత జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. 21 ఏళ్ల యువ క్రీడాకారుడు తనదైన అద్భుత ప్రదర్శన చూపడంతో అక్కడి నిర్వాహకులు ప్రత్యేక మెమెంటో అందించారు. ఇంటర్ విద్య పూర్తి చేసుకున్న తరువాత ఈ క్రీడపై ప్రత్యేక శ్రద్ధ వహించాడు. కొంతకాలంగా తమిళనాడులో పారాత్రోబాల్ విభాగంలో శిక్షణ పొంది ఇండియా జట్టు తరఫున శ్రీలంక వెళ్లి జట్టులో రాణించాడు. తల్లిదండ్రులు ఝంగం, మంగమ్మలు, గ్రామ పెద్దలు ఈ సందర్భంగా యువకుడిని అభినందించారు. -
జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఐదుగురు ఎంపిక
తెర్లాం: జాతీయస్థాయిలో జరగనున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 సాఫ్ట్బాల్ పోటీలకు జిల్లాకు చెందిన ఐదుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. 2026 జనవరిలో నాగపూర్లో జాతీయస్థాయి స్కూల్గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 సాఫ్ట్బాల్ పోటీలు జరగనున్నాయి. ఈనెల 6 నుంచి 8వరకు గుంటూరు జిల్లా మోదుకూరులో జరిగిన స్కూల్గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి అండర్–19 పోటీల్లో జిల్లాకు చెందిన బాలురు, బాలికల జట్లు విశేష ప్రతిభ కనబరిచాయి. ఈ పోటీల్లో జిల్లాకు చెందిన బాలుర జట్టు రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానాన్ని, బాలికల జట్టు తృతీయ స్థానాన్ని కై వసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా జట్లలోని పలువురి సభ్యులను జాతీయస్థాయి పోటీలకు నిర్వాహకులు ఎంపిక చేశారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నచ వారిలో పి.జనార్దనసాయి(డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులం–సాలూరు), ఎస్.చరణ్(జెడ్పీ హైస్కూల్–ఉల్లిభద్ర), టి.మోహన్సాయి(జెడ్పీ హైస్కూల్–పారాది), బాలికల జట్టుకు యు.లోకేశ్వరి(జెడ్పీ హైస్కూల్–తూడెం), ఎం.ప్రసన్న(జెడ్పీ హైస్కూల్–బాడంగి)లు ఉన్నారు. వారంతా వచ్చే ఏడాది జనవరిలో నాగపూర్లో జరగనున్న జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 సాఫ్ట్బాల్ పోటీల్లో పాల్గొననున్నారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికై న జిల్లా క్రీడాకారులను ఎస్జీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, పలువురు పీడీలు, పీఈటీలు, జిల్లా జట్ల మేనేజర్ సీహెచ్.సత్యనారాయణ, కోచ్లు శివ, మహేష్లు అభినందించారు. -
ప్రకృతి సేద్యంతో నిత్య ఆదాయం
పార్వతీపురం రూరల్: పుడమి తల్లి పులకించేలా.. రైతు ఇల్లు సిరులతో తులతూగేలా ప్రకృతి సేద్యం సాగాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి ఆకాంక్షించారు. బందలప్పి గ్రామంలో రైతు కె.మురళి ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని ఆయన బుధవారం సందర్శించారు. రసాయనాల ఘాటులేని, ఆరోగ్యానికి మేలు చేసే ప్రకృతి వ్యవసాయ విధానం అందరికీ ఆదర్శమన్నారు. కేవలం 0.20 ఎకరా ల్లో ఏటీఎం నమూనాలో దొండ, చిక్కుడు, మిరప, ఆకుకూరలను సాగుచేస్తూ ఏడాదికి రూ.80,000 వరకు నికర ఆదాయం ఆర్జించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు పాల్గొన్నారు. -
జీతాలేవి బాబూ..?
సాక్షి, పార్వతీపురం మన్యం: చంద్రబాబు సర్కారులో ప్రభుత్వ ఉద్యోగుల కు నెలనెలా గండమే అవుతోంది. ఒకటో తేదీనే ఠంఛన్గా జీతాలు చెల్లిస్తామని ఊదరగొట్టిన చంద్రబా బు.. పదో తేదీ వచ్చినా ఉత్తిచేతులే చూపుతున్నా రు. ఓవైపు పండగ నెల వస్తోంది. డిసెంబర్ నెలలో ఇప్పటికీ సుమారు 14 శాఖల సిబ్బందికి జీతాలు జ మ కాలేదు. ఉద్యోగుల జేబులు ఖాళీ అయిపో యా యి. ఉన్నదంతా ఊడ్చేయడంతో బ్యాంకు ఖాతాలు జీరో బ్యాలెన్స్కు చేరుకున్నాయి. ఇంటి అవసరాల కు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నా రు. గడువు దాటినా ఈఎంఐ మొత్తం కట్టకపోవడంతో అటు నుంచి వరుసగా ఫోన్లు మోగుతున్నాయి. చేసింది సర్కారు కొలువే గానీ.. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు నేతృత్వంలో ని కూటమి నేతలు ఉద్యోగులపై హామీల జల్లు కురి పించారు. పీఆర్సీ, పెండింగ్ డీఏలు అంటూ ఊద రగొట్టారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రతి నెలా ఒకటో తేదీ నాటికే జీతాలు, పింఛన్లు జమ అవుతా యని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మొత్తం రివర్స్ గేర్లో నడుస్తోంది. చేసింది సర్కారు కొలువే గానీ.. నెలయ్యే సరికి జీతం భరోసా లేదంటూ ప్రభుత్వ ఉద్యోగులు వాపోతున్నారు. ప్రతినెలా జీతాల కో సం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో రాష్ట్ర ప్రభు త్వ ఉద్యోగులు సుమారు 12,500 మంది, ఉపాధ్యాయులు 9,700 మంది, పోలీసులు 900 మంది వరకు ఉన్నారు. వీరు కాక.. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వందల సంఖ్యలో పనిచేస్తున్నా రు. ప్రస్తుతం డిసెంబర్ 11వ తేదీ వచ్చినప్పటికీ.. ఇరిగేషన్, పంచాయతీరాజ్, సంక్షేమ శాఖలు, వ్యవ సాయం, ప్రణాళికా విభాగం ఇలా దాదాపు 14 శాఖలపైగా ఉద్యోగులకు నేటికీ జీతాలు జమ కాలే దు. ఉపాధ్యాయులు, మెడికల్, పోలీసులకు మాత్ర మే జమ చేసినట్లు తెలుస్తోంది. ఒక్కొక్కరికీ ఒక్కో తేదీన ప్రభుత్వం చెల్లింపులు చేస్తోంది. దీంతో వారంతా ఎప్పటికప్పుడు తమ బ్యాంకు ఖాతాలను పరిశీలించుకుంటున్నారు. నెలవారీ అవసరాలను తీర్చుకోలేక.. ఒకటో తేదీ నాటికి జీతాలు జమ చేస్తే.. ఉద్యోగులు తమ నెలవారీ అవసరాలను తీర్చుకుంటారు. ప్రస్తు తం పిల్లలకు చెల్లించాల్సిన ఫీజులు.. క్రిస్మస్, కొత్త సంవత్సరం, సంక్రాంతి పండగలు ముందు ఉండడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. పేరుకు రూ.వేలల్లో జీతాలైనా.. అధిక శాతం మంది మధ్య తరగతి ఉద్యోగులకు ఒకటో తేదీ వస్తే గుండె దడే. ఇంటి అద్దె, కరెంటు బిల్లు, పాలవాడు, కిరాణా వంటివే కాక.. ఈఎంఐలు, తీసుకున్న రుణాలకు వడ్డీ లు చెల్లించాలి. వీటికే ఖాతా ఖాళీ అయిపోతోంది. నెల మొత్తం గడవాలంటే.. మళ్లీ అప్పులు చేయా ల్సి వస్తోందని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. పండగ నెలలో ఇప్పటికీ జీతాలు రాకపోతే ఎలా తట్టుకోగలమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల కోసమని రూ.వేల కోట్లు ఖర్చు చేస్తోంది. లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తోంది. ఉద్యోగుల విషయానికి వచ్చేసరికి నిర్లక్ష్యం చూపడం భావ్యం కాదు. నిధుల కొరత పేరుతో ఉద్యోగుల జీతాలను ప్రతి నెలా ఆలస్యం చేయడం ఏమిటీ? ఇచ్చిన హామీల్లో వేటినీ అమలు చేయలేదు. ఇప్పుడు జీతాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారు. ఉద్యోగుల బాధలను, పరిస్థితులను అర్థం చేసుకుని, సకాలంలో జీతాలు జమ చేయాలి. – జీవీఎల్ కిశోర్, జిల్లా అధ్యక్షుడు, ఏపీఎన్జీవో సంఘం, పార్వతీపురం మన్యం -
13 తులాల బంగారం చోరీ
రేగిడి: మండల పరిధిలోని బాలకవివలస గ్రామంలో బంగారం చోరీ అయ్యింది. ఈ ఘటనపై పోలీసులు అందించిన సమా చారం మేరకు గ్రామానికి చెందిన కిల్లారి రమణ, భార్య కమల పొలం పనులకోసం ఇంటికి తాళం వేసి వెళ్లారు. పొలం పనులు ముగించుకుని తిరిగి వచ్చి చూసేసరికి ఎప్పటిలాగానే ఇంటికి వేసిన తాళం వేసినట్లే ఉంది. బీరువాలో ఉన్న 13 తులాల బంగారం చోరీకి గురైందని బాధితులు ఫిర్యాదు చేశారు. గడిచిన వారం రోజుల క్రితం ఇంటికి సంబంధించిన ఒక తాళం పోయిందని బాధితులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న రాజాం రూరల్ సీఐ ఉపేంద్ర బుధవారం గ్రామానికి వెళ్లి ఇంటిని పరిశీలించి బాధితుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
ప్రణాళికాబద్ధంగా పరీక్షలకు సన్నద్ధం
● అంబేడ్కర్ గురుకులాల జిల్లా కన్వీనర్ మాణిక్యంరేగిడి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న పది, ఇంటర్ విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు ప్రణాళికా బద్ధంగా సిద్ధం చేయాలని గురుకులాల జిల్లా కన్వీనర్ ఎం.మాణిక్యం అన్నారు. ఈ మేరకు బుధవారం ఆమె మండల పరిధి ఉంగరాడమెట్టలో ఉన్న డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ బాలుర గురుకులంలో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల పరిధిలో ఉన్న ప్రిన్సిపాల్స్కు ఒక్కరోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించడానికి విద్యార్ధులకు ఇప్పటి నుంచే తగిన తర్ఫీదునివ్వాలని సూచించారు. గురుకులాల్లో ప్రతి తరగతిలో శతశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ప్రణాళికా బద్ధంగా పాఠ్యాంశాల బోధన చేయాలని హితవు పలికారు. పాత ప్రశ్నపత్రాలను ఎంపిక చేసుకుని తరచూ వస్తున్న ప్రశ్నలను గుర్తించి అటువంటి ప్రశ్నలకు వెనుకబడి ఉన్న విద్యార్థుల బోధనలో ప్రత్యేక అవగాహన కల్పించాలని కోరారు. రెండు జిల్లాల్లో బాలురు–5, బాలికలు–8 గురుకులాలున్నాయి. వాటిలో పదోతరగతిలో ఈ ఏడాది 911 మంది విద్యార్ధులు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం 639 మంది, ద్వితీయ సంవత్సరంలో 653 మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నారని ఆమె వెల్లడించారు. అనంతరం డార్మిటరీ, వంటగది, తరగతి గదులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పి.రఘురామనాయుడు, వైస్ప్రిన్సిపాల్ డి.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయంలో యాంత్రీకరణ
● కూలీల కొరతను అధిగమించేందుకు రైతుల మొగ్గువిజయనగరం ఫోర్ట్: వ్యవసాయం పూర్తిగా వ్యయసాయంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో రైతులు సాగు ఖర్చు తగ్గించుకునే విధంగా అలోచిస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ కూలీల కొరతతో పాటు కూలీల ధరలు పెరగడంతో రైతులు యాంత్రీకరణవైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా వరి పంటలో యాంత్రీకరణను వినియోగించుకుంటున్నారు. వరి పంటలో కోత సమయంలో సాగు ఖర్చు పెరిగింది. యంత్రాల ద్వారా వరి కోతలు చేపట్టడం వల్ల రైతులకు డబ్బులు కూడా ఆదా అవుతున్నాయి. జిల్లాలో ముమ్మురంగా వరి కోతలు జరుగుతున్నాయి. దీంతో జిల్లాలోని అన్ని మండలాల్లోనూ వరి కోత యంత్రాల ద్వారా వరి పంటను కోస్తున్నారు. జిల్లాలో 1.25 లక్షల హెక్టార్లలో వరి పంట సాగైంది. ఇప్పటి వరకు 60 శాతం వరకు కోతలు అయ్యాయి. పెరిగిన కూలీ ధరలు వరి పంటను కోసే కూలీల ధరలు పెరిగాయి. కూలీల ద్వారా కోయడానికి ఎకరాకి రూ. 4 వేల నుంచి రూ.5 వేల వరకు తీసుకుంటున్నారు. మళ్లీ ఆపంటను పొలం నుంచి కళ్లానికి తీసుకురావడానికి మరో రూ.5 వేల వరకు ఖర్చవుతుంది. పంటను నూర్పు చేయడానికి ట్రాక్టర్, కూలీలకు మరో రూ.5 వేలు వరకు ఖర్చవుతుంది. మొత్తంగా వరిపంటను కోయడానికి, మోయడానికి, నూర్చడానికి రూ.14 వేల నుంచి రూ.15 వేల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. యంత్రం ద్వారా ఎకరాకి రూ.3500 వరి పంటను వరికోత యంత్రం ద్వారా కోయడానికి కేవలం రూ. 3500 సరిపోతుంది. కోత, మోత, నూర్పు లేకుండా నేరుగా వరి కోత యంత్రం ద్వారా కోయడం వల్ల నేరుగా ధాన్యం వచ్చేస్తాయి. దీంతో ఎకరాకి రైతుకు రూ.10, 500 నుంచి రూ.11,500 రకు మిగులుతుంది. దీంతో రైతులు యంత్రాలు ద్వారా కోయడానికి అసక్తి చూపుతున్నారు.రెండేళ్లుగా మిషన్తోనే కోత గడిచిన రెండేళ్లుగా మిషన్ ద్వారా కోత కోయిస్తున్నాను నాకు రెండు ఎకరాల పొలం ఉంది. మరో నాలుగు ఎకరాలు కౌలుకు చేస్తున్నాను. కూలీల ద్వారా అయితే ఎకరాకి కోతకు, మోతకు, నూర్పుకు రూ.15 వేలు అయ్యేది. ఇప్పడు రూ. 3500 సరిపోతోంది. – ఎస్. సత్యారావు, రైతు, పెదవేమలి గ్రామం కూలీల అవసరం లేదు వరిపంటను కోయడానికి, మోయడానికి, నూర్పుచేయడానికి కూలీలు దొరక్క ఇబ్బంది పడేవాడిని. రెండేళ్లుగా వరికోత యంత్రాలు రావడం వల్ల కూలీల కోసం వెతుక్కోవాల్సిన అవసరం తీరింది. ఒక్క రోజులోనే ధాన్యం కళ్లానికి వచ్చేస్తున్నాయి. – కె.అప్పలనాయుడు, రైతు, రాకోడు గ్రామం -
బస్సు, ద్విచక్రవాహనం ఢీ● ముగ్గురికి గాయాలు
మక్కువ/సాలూరు రూరల్: మక్కువ మండలంలోని ఎస్.పెద్దవలస గ్రామం సమీపంలో బుధవారం ఆర్టీసీబస్సు, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. సాలురు మండలం మావుడి గ్రామానికి చెందిన చోడిపల్లి సాయి 9నెలల గర్భవతి. ఆమె చోడిపల్లి గణేష్, చోడిపల్లి పరుసుతో కలిసి, మామిడిపల్లి పీహెచ్సీకి సీఎన్సీ పరీక్షలు నిమిత్తం వచ్చి, వైద్యపరీక్షలు జరిపించుకుంది. ఆస్పత్రినుంచి, గ్రామానికి ద్విచక్రవాహనంపై ముగ్గురూ వెళ్తుండగా, మక్కువ మండలం ఎస్.పెద్దవలస గ్రామం సమీపంలో చెరువు వద్ద, ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ముగ్గురూ గాయాలపాలయ్యారు. వెంటనే స్థానికులు 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని గాయాలపాలైన వారిని సాలూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన చికిత్సకోసం విజయనగరం తరలించారు.రోడ్డు ప్రమాదంలోవ్యక్తికి తీవ్రగాయాలుగంట్యాడ: మండలంలోని రావివలస గ్రామానికి ఆర్.అదినారాయణ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఎలక్ట్రికల్ హెల్పర్గా పనిచేస్తున్న ఆదినారాయణ బుధవారం రాత్రి 7 గంటల సమయంలో తామరాపల్లి నుంచి గంట్యాడకు పల్సర్ బైక్పై వస్తుండగా గింజేరు జంక్షన్ సమీపంలో శ్రీను అనే వ్యక్తి భార్యతో కలిసి రోడ్డుపై మేకలు తోలుకుని వెళ్తుండగా బైక్తో ఆదినారాయణ మేకలను ఢీకొట్టాడు. దీంతో రెండు మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి. మేకలను ఢీకొట్టి కింద పడిపోయిన ఆదినారాయణ తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు హైవే అంబులెన్సులో విజయనగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
అటవీహక్కుల చట్టంపై అవగాహన కలిగించాలి
● జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్కుమార్ రెడ్డి పార్వతీపురం: ఎన్జీఓలు అటవీహక్కుల చట్టాలపై గిరిజనులకు అవగాహన కల్పిస్తే చాలా సమస్యలు పరిష్కరమవుతాయని జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్కుమార్ రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన గిరిమిత్ర సమావేశమందిరంలో అటవీ హక్కుల యాజమాన్య పద్దతుల గురించి అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్జీఓ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అటవీహక్కుల చట్టం దాని అమలు, అమలులో నెలకొన్న సమస్యల పరిష్కారం దిశగా ఏం చేయాలనే అంశంపై సమావేశంలో చర్చించనున్నామన్నారు. అటవీహక్కుల చట్టాలపై గిరిజనులకు పూర్తిస్థాయిలో అవగాహన గిఉండాలన్నారు. సమస్యలు, క్లెయిమ్లకు సంబంధించి పూర్తి ఆధారాలను సమర్పిస్తే పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్ఏ రాష్ట్ర కో ఆర్డినేటర్ బి. ఆదినారాయణరావు, ఏపీఓ పి.మురళీధర్, పార్వతీపురం, సీతంపేట, విజయనగరం ప్రాంతాలకు చెందిన ఆర్ఓఎఫ్ఆర్ జిల్లా కోఆర్డినేటర్లు పొల్గొన్నారు. -
నేల బావిలో పడి వ్యక్తి మృతి
రామభద్రపురం: మండలకేంద్రంలోని దిగువ హరిజన వీధికి చెందిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నేల బావిలో పడి మృతిచెందాడు. బుధవారం జరిగిన ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు మేరకు రామభద్రపురం దిగువ హరిజన వీధికి చెందిన రేజేటి మురళి(33) బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు నేల బావిలో పడి మృతిచెందాడు. భార్య పెంటమ్మ ఫిర్యాదు మేరకు ఎస్సై వి.ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్సీకి తరలించారు. మురళి స్థానిక అంతరరాష్ట్ర కూరగాయల మార్కెట్లో వ్యాపారులకు చెందిన కూరగాయల బస్తాలు మూతలు కుడుతూ వచ్చిన కూలి డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుటుంబ పెద్ద దికు కోల్పోవడంతో కుటుంబ జీవనం సాగేదెలా అని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. -
వసతి గృహాలకు గ్రహణం
● అగమ్యగోచరంగా ఆశ్రమ పాఠశాలలు ● అనాథల్లా మారిన విద్యార్థులు ● కొరవడిన అధికారుల పర్యవేక్షణ ● జిల్లాలో సగం మంది వార్డెన్లే లేరు పార్వతీపురం రూరల్: జిల్లాలోని వసతి గృహాలు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాయి. పేద విద్యార్థులకు ఆసరాగా నిలవాల్సిన ఆశ్రమ పాఠశాలలు, పాలకుల నిర్లక్ష్యంతో అవస్థల నిలయాలుగా మారుతున్నాయి. ‘బడికి పంపిస్తే బుద్ధి నేర్చుకుంటారు‘ అని తల్లిదండ్రులు ఆశపడితే..అక్కడ పర్యవేక్షణ కొరవడి విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోంది. ప్రధానంగా చంద్రబాబు నేతృత్వంలోని ఈ ప్రభుత్వం వసతి గృహాల నిర్వహణను గాలికి వదిలేసిందనడానికి జిల్లాలో నెలకొన్న పరిస్థితులే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. భయంతో పరుగులు..చీకటిలో ఆక్రందనలు విద్యాలయాలు విజ్ఞానాన్ని పంచాల్సింది పోయి, రౌడీయిజానికి అడ్డాగా మారుతున్నాయి. తాజాగా కొమరాడ మండలం పెదఖేర్జిల గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఘటనే ఇందుకు తార్కాణం. సెల్ఫోన్ అనే చిన్న కారణంతో జూనియర్లపై సీనియర్లు విచక్షణారహితంగా దాడి చేయడం, ఆ దెబ్బలకు తట్టుకోలేక, ప్రాణభయంతో ఇద్దరు విద్యార్థులు అర్ధరాత్రి వేళ కాలినడకన ఇరవై, ముప్పై కిలోమీటర్లు పరుగులు తీయడం..వసతి గృహాల్లోని భద్రతా డొల్లతనానికి అద్దం పడుతోంది. ఆదుకోవాల్సిన యంత్రాంగం గాఢనిద్రలో ఉండడం గమనార్హం. సంరక్షకులు కరువు..సమస్యలు బరువు జిల్లావ్యాప్తంగా ఎస్సీ, బీసీ, ఎస్టీ వసతి గృహాలు 116 వరకు ఉండగా, సుమారు 28 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే వారిని కంటికి రెప్పలా కాపాడాల్సిన వార్డెన్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. జిల్లాలో 65 గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఉంటే, అందులో సగం చోట్ల కూడా సంరక్షకులు (వార్డెన్లు) లేకపోవడం శోచనీయం.వార్డెన్ లేని చోట విద్యార్థులకు దిక్కు ఎవరు? అనే ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానం లేదు. దీంతో పిల్లలపై పర్యవేక్షణ ’శూన్యం’గా మారింది. ఫలితంగా క్రమశిక్షణ గాడితప్పుతోంది. ప్రభుత్వ వైఫల్యం..బాలల భవితకు గండం చంద్రబాబు ప్రభుత్వం విద్యావ్యవస్థపై చేస్తున్న గొప్ప ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో ఉన్న దుస్థితికి పొంతనే లేదు. వందల మంది విద్యార్థులు ఉన్న చోట కనీస పర్యవేక్షణ కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. సంరక్షకులను నియమించడంలో తాత్సారం, ఉన్న సిబ్బందిపై నియంత్రణ లేకపోవడం..వెరసి వసతి గృహాలు అరాచకానికి ఆనవాళ్లుగా మారుస్తున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరిచి, ఖాళీగా ఉన్న వార్డెన్ పోస్టులను భర్తీ చేసి, పటిష్టమైన పర్యవేక్షణ చేపట్టకపోతే.. మరిన్ని ‘పెదఖేర్జిల‘ ఘటనలు పునరావృతమయ్యే ప్రమాదం పొంచి ఉంది.సర్కారు నిర్లక్ష్యానికి పరాకాష్టపేద విద్యార్థుల ప్రాణాలంటే ప్రభుత్వానికి పూచికపుల్లతో సమానమైంది. వసతిగృహాల్లో వార్డెన్లను ని యమించకుండా, పర్యవేక్షణను గాలికి వదిలేయడం వల్లే నేడు విద్యార్థులు అనాథలుగా మారుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం, ప్రభుత్వ ఉదాసీనత వల్లే వసతి గృహాల్లో సీనియర్లు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. బడికి వెళ్లిన బిడ్డలు అర్ధరాత్రి ప్రాణభయంతో రోడ్లపై పరుగులు తీస్తుంటే ఈ ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్టయినా లేదు. తక్షణమే ఖాళీగా ఉన్న వార్డెనన్ పోస్టులను భర్తీ చేసి, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికై నా సరిపడా సిబ్బందిని నియమించాలి, అలాగే సంబంధిత శాఖ పరమైన ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకుంటూ, ఆకస్మిక తనిఖీలు వసతి గృహాల్లో నిర్వహించాలి. బి.రవికుమార్ ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, పార్వతీపురం మన్యం జిల్లా -
వాటర్షెడ్ మహోత్సవ్– 2025పై సోషల్మీడియా పోటీలు
పార్వతీపురం: భారత గ్రామీణాభివృద్ధి మంత్రి త్వశాఖకు చెందిన భూసంసాదన విభాగం ఆధ్వర్యంలో వాటర్షెడ్ మహోత్సవ్– 2025పై సోషల్ మీడియాలో పోటీలు నిర్వహించనున్న ట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాటర్ షెడ్ అభివృద్ధి పనులు, నీటి సంరక్షణ నిర్మాణాలు, ఆగ్రోఫారెస్ట్రీ/హార్టికల్చర్ కార్యకలాపాలపై రీల్స్ (30నుంచి 60 సెకెన్లు నిడివి) సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చునన్నారు. వాటర్షెడ్ మహోత్సవ్ ఆంధ్ర, ఇండియా హ్యష్ట్యాగ్ ఉపయోగించి తమ పోస్టులను డిసెంబర్ 31వ తేదీలోగా పంపించాలని స్పష్టం చేశారు. అలాగే వాటి లింక్లనుకూడా వెబ్సైట్లో రిజిస్టర్ చేయాలన్నారు. ఉత్తమ రీల్కు రూ.50వేల చొప్పున ఐదు అవా ర్డులు, ఉత్తమ ఫొటోకు రూ.1,000 చొప్పున 100 అవార్డులు ఇవ్వనున్నామన్నారు. రీల్స్ పంపేవారి నుంచి ఆర్గానిక్ రీచ్, ప్రామాణిక కంటెంట్ మాత్రమే పరిగణనలోకి తీసుకుంటా మన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పోటీల్లో పొల్గొనేందుకు అర్హత లేదని పేర్కొన్నారు. సీతంపేట: వారం రోజుల్లో సబ్డివిజనల్ కమిటీ సమావేశం, జిల్లా కమిటీ ఆమోదం అయిన వెంటనే నారాయణ గూడ గిరిజనులకు ల్యాండ్ పొజిషన్ షర్టిఫికెట్లు అందజేస్తామని పాలకొండ సబ్కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8న ‘ఇళ్లు పీకి పందిరి’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. నారాయణగూడలో 13 మంది గిరిజనులకు ఇళ్ల స్థలాలు పీఎంజన్మన్ స్కీమ్లో మంజూరయ్యాయని, ఇల్లు నిర్మించుకోవడానికి ఎల్పీసీ అవసరం ఉందన్నారు. లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకోవడానికి పొజిషన్ షర్టిఫికెట్లు కావా లని దరఖాస్తుచేసుకున్నవెంటనే క్షేత్రస్థాయిలో సర్వేయర్ను పంపించి పరిశీలించామన్నారు. మ్యాపింగ్ చేసి పాలకొండ సబ్కలెక్టర్ కార్యాలయానికి పంపించారన్నారు. దీనిపై త్వరలోనే తగు చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. సాలూరు: ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఇంజిన్ పై నుంచి పడిన వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గజపతినగరం నుంచి అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ కోటపర్తివలసకు బుధవారం ట్రాక్టర్పై ఇటుకల లోడును తరలిస్తున్నారు. మెంటాడ మండలం గుర్ల గ్రామం వద్దకు వచ్చేసరికి అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ మూలవలస గ్రామానికి చెంది కోటపర్తి గణేష్ అలియాస్ పండు (18) ట్రాక్టర్ డ్రైవర్ పక్కన కూర్చొని ప్రమాదవశాత్తు జారిపడి ట్రాక్టర్ కిందపడిపోయాడు. ఆయన పైనుంచి ట్రాక్టర్ టైరు వెళ్లిపోవడంతో తల నుజ్జయ్యింది. ఆండ్ర ఎస్ఐ కె. సీతారాం కేసు నమోదుచేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గజపతినగరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మానవ హక్కులపై అవగాహన విజయనగరం అర్బన్: మానవ హక్కులపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ఎ.కృష్ణప్రసాద్ అన్నారు. జాతీయ న్యాయసేవాధికార సంస్థ రాష్ట్ర విభాగం ఆదేశాల మేరకు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార ఆధ్వర్యంలో బుధవారం అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించారు. మహారాజా అటానమస్ కళాశాలలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.సాంబశివరావు అధ్యక్షతన జరిగి న కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ హక్కు ల కోసం ప్రశ్నించడం నేర్చుకోవాలని, ప్రశ్నిస్తేనే సమాధానం దొరుకుతుందని పిలుపునిచ్చారు. కళాశాలలో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజేతలు రాకేష్, సంధ్యకు బహుమతు లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వన్ టౌన్ ఎస్ఐ ప్రసన్నకుమార్, అడ్వకేట్ కరుణాకర్, జిల్లా ఎన్ఎస్ఎస్ నోడల్ అధికారి జి.చంద్రశేఖ ర్, ఎన్ఎస్ఎస్ ప్రొగ్రాం అధికారులు సీహెచ్ చిన్నమనాయుడు, పీఎన్బీ శర్మ, ఎన్.వై.విష్టు, తదితరులు పాల్గొన్నారు. -
ఏఆర్ డీఎస్పీ మానవత్వం
విజయనగరం క్రైమ్: కాఠిన్యంతో ఎప్పుడూ ఉండే ఖాకీ గుండె కరిగింది. ఈ మేరకు ప్రమాదవశాత్తు గాయపడిన వ్యక్తికి విజయనగరం ఏఆర్ డీఎస్పీ కోటిరెడ్డి సపర్యలు చేసి, స్వయంగా హాస్పిటల్కు చికిత్స కోసం తరలించి శభాష్ పోలీస్ అని అనిపించుకున్నారు. విజయనగరం ఆర్మ్డ్ రిజర్వ్ డీఎస్పీగా పని చేస్తున్న ఈ.కోటిరెడ్డి విధుల్లో భాగంగా గంట్యాడ మండలం రామవరం వైపు బుధవారం వెళ్లారు. తిరిగే వస్తున్న క్రమంలో బైక్పై విజయనగరం నుంచి వస్తున్నఓ వ్యక్తి సెల్ఫ్ యాక్సిడెంట్కు గురై, రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడినట్లు డీఎస్పీ గుర్తించారు. వెంటనే తన వాహనాన్ని ఆపి, గాయపడిన వ్యక్తికి సపర్యలు చేసి, మంచినీరు అందించి, 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చి..స్థానికుల సహకారంతో అంబులెన్స్ లోకి స్వయంగా ఎక్కించి, విజయనగరం మహారాజా ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. స్థానికులు, బంధువులు డీఎస్పీ ఈ.కోటిరెడ్డి అందించిన సేవల పట్ల కృతజ్ఞతలు తెలిజేశారు. రోడ్డు ప్రమాద బాధితుడికి సహాయం -
లోక్ అదాలత్లో కేసులు పరిష్కారం కావాలి
● సిబ్బందికి ఎస్పీ దామోదర్ ఆదేశాలు విజయనగరం క్రైమ్: లోక్ అదాలత్లో కేసులు పరిష్కారమయ్యే విధంగా చర్యలు చేపట్టాలని ఎస్పీ దామోదర్ అన్నారు. ఈ నెల 13న జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యే విధంగా సంబంధిత పోలీసు అధికారులు, సిబ్బంది అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ సిబ్బందిని బుధవారం ఆదేశించారు. పోలీస్స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల్లో ఇరు వర్గాలు రాజీ అయ్యేందుకు అవకాశం ఉన్న కుటుంబ వివాదాలు, ఆస్తి తగాదాలు, చిన్న క్రిమినల్ కేసులు, ట్రాఫిక్ కేసులు, ఎకై ్సజ్, రోడ్డు ప్రమాద కేసులు, పెండింగ్ ఈ చలాన్లు, ఇతర కాంపౌండ్ కేసులను ముందుగా గుర్తించాలని సూచించారు. ఆయా కేసుల్లో ఇరు వర్గాలతో సంప్రదించి, సమావేశాలు నిర్వహించి, వారు రాజీ అయ్యే విధంగా మానవతా దృక్పధంతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. ముత్తూట్ ఫిన్ కార్ప్లో బంగారం మాయంవిజయనగరం క్రైమ్: విజయనగరంలోని ముత్తూట్ ఫిన్కార్ప్లో బంగారం మాయమైందని ముత్తూట్ ఫైనాన్స్ లో కాదని విజయనగరం వన్ టౌన్ పోలీసులు బుధవారం తెలిపారు. ఈ ఈ మేరకు ముత్తూట్ ఫైనాన్స్ నుంచి బంగారం మాయం అంటూ బుధవారం వార్త ప్రచురితమైన విషయంవిదితమే. ముత్తూట్ ఫిన్కార్ఫ్ లో బంగారం మాయమైంటూ తమకు సమాచారం రావడంతో దర్యాప్తు చేస్తున్నామని వన్ టౌన్ ఏఎస్ఐ జగన్మోహన్ రావు తెలిపారు. అసలు ముత్తూట్ ఇద్దరు అన్నదమ్ముల పేరుతో ఉందని విజయనగరంలో ఈ ఫిన్కార్ప్ ఒక్కటే ఉందని ఏఎస్సై తెలిపారు. ముత్తూట్ పైనాన్స్లో గోల్డ్ గల్లంతు కాని, మాయం కానీ జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు. కానిస్టేబుల్స్ అభ్యర్థులు 15న హాజరు కావాలివిజయనగరం క్రైమ్: కానిస్టేబుల్స్గా ఎంపికై న జిల్లా అభ్యర్థులు ఈ నెల 15వ తేదీన డీపీఓ వద్ద ఉదయం 5గంటలకు హాజరుకావాలని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ బుధవారం కోరారు. జిల్లాలో కానిస్టేబుల్స్గా ఎంపికై న స్థానిక పురుష, మహిళా అభ్యర్థులు వారితో పాటు మరో ఇద్దరు (తల్లిదండ్రులు లేక దగ్గర బంధువులు) మొత్తం ముగ్గురు హాజరుకావాలన్నారు. పురుష అభ్యర్ధులు నీట్ షేవింగ్, కటింగ్లో రావాలన్నారు. ఇక్కడి నుంచి వారిని సురక్షితంగా విజయవాడ తీసుకువెళ్తామన్నారు. ఈ నెల 16న మంగళగిరి బెటాలియన్ లోని పరేడ్ మైదానంలో కానిస్టేబుల్ అభ్యర్థులతో ముఖాముఖి నిర్వహించి వారికి దిశానిర్దేశం చేస్తారన్నారు. అనంతరం అక్కడే అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. తదుపరి అభ్యర్థులను మళ్లీ విజయనగరం తీసుకురానున్నట్లు ఎస్పీ తెలిపారు. అభ్యర్థులు తిరిగి వారి సొంత ఊళ్లకు వెళ్లి, ఈ నెల 22 నుంచి శిక్షణ ప్రారంభం కానుందని, కావున వారికి కేటాయించిన పీటీసీ, డీటీసీలలో అభ్యర్ధులు ఈ నెల 21న రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నారు. 1400 లీటర్ల పులిసిన బెల్లం ఊటలు ధ్వంసంసీతంపేట: మండలంలోని కర్రగూడ సమీపంలోని పరిసరాల్లో సారా బట్టీలపై బుధవారం చేసిన దాడుల సందర్భంగా 1400 లీటర్ల పులిసిన బెల్లం ఊటలు ధ్వంసం చేసినట్లు ఎస్సై వై.అమ్మన్నరావు తెలిపారు. మొత్తం 14 డ్రమ్ములు స్వాధీనం చేసుకుని నిర్వాహకులపై కేసు నమోదు చేశామన్నారు. గొర్రె పందాల రాయుళ్ల అరెస్ట్జియ్యమ్మవలస: మండలంలోని చినమేరంగి పోలీస్ స్టేషన్ పరిధిలో సింగనాపురం గ్రామం ఊరు శివారులో గొర్రె పందాలు ఆడిస్తుండగా మెరుపుదాడి రెండు గొర్రెపోతులు, ఐదుగురు నిందితులను పట్టుకుని రూ.1025 స్వాధీనం చేసుకున్నామని ఎస్టీఎఫ్ పోలీసులు తెలిపారు. పట్టుకున్న నిందితులపై చినమేరంగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
రెవెన్యూ క్లినిక్ను సద్వినియోగం చేసుకోవాలి
● కలెక్టర్ ప్రభాకరరెడ్డి పార్వతీపురం: రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 29 నుంచి నేటి వరకు తొమ్మిది రెవిన్యూ క్లినిక్లను నిర్వహించామన్నారు. జేసీ ఆద్వర్యంలో తహసీల్దార్లందరూ రెవెన్యూ ఫిర్యాదుల పరిష్కారానికి కృషిచేస్తున్నారని చెప్పారు. దీర్ఘకాలిక రెవెన్యూ సమస్యల పరిష్కారానికి జేసీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్లు, తహసీల్దార్లను ఓ రోజంతా ఒకే చోట ఉంచడమే రెవెన్యూ క్లినిక్ ప్రధాన ఉద్దేశమన్నారు. సీనియర్ సిటిజన్ యాక్ట్, సిర్టిఫికెట్లు, సర్వీస్ రిక్వెస్ట్ రేజింగ్లో ఇష్యూస్, టెక్నికల్ ఇష్యూస్ వంటివి అక్కడికక్కడే పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. జేసీ స్థాయి అధికారి ప్రతి పిటిషన్ను ఆడిట్ చేస్తారన్నారు. తొమ్మిది వారాలకు గాను ఆరు వారాల్లో వచ్చిన 227 ఫిర్యాదులను పరిష్కరించినట్టు వెల్లడించారు. మిగిలిన వూడు వారాల్లో వచ్చిన సమస్యలు పరిశీలనలో ఉన్నాయన్నారు. జేసీ సి.యశ్వంత్ కుమార్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని రెవెన్యూ సిబ్బంది అంతా ఒకే వేదికవద్ద పాల్గొని సమస్యలు పరిష్కారానికి చొరవ చూపడంతో సమస్యలు పరిష్కారానికి మార్గం సుగమం అయ్యిందన్నారు. సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి కె.హేమలత, సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు. -
● రబీలోనూ వీడని యూరియా వెతలు
ఖరీఫ్లో యూరియా కోసం తిప్పలు పడిన రైతులకు రబీలోనూ కష్టాలు తప్పడం లేదు. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో యూరియా కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం సాగులో ఉన్న కూరగాయలు, మొక్కజొన్న, ఉద్యానవన పంటలకు జల్లేందుకు యూరియా దొరకడం లేదు. చీపురుపల్లి మండలంలోని అలజంగి, గొల్లలములగాం, పెదనడిపల్లి, చీపురుపల్లి రైతు సేవా కేంద్రాల్లో మంగళవారం పంపిణీ చేసిన యూరియా కోసం రైతులు బారులు తీరారు. మండలానికి 49 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే రావడం, డిమాండ్ ఎక్కువగా ఉండడంతో పంపిణీకి వ్యవసాయ అధికారులు తలలుపట్టుకుంటున్నారు. పోలీసుల సమక్షంలో రైతుకు ఒక బస్తా చొప్పున పంపిణీ చేస్తున్నారు. – చీపురుపల్లి -
అంతర్జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
● కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పార్వతీపురం: పాఠశాల నుంచి కళాశాల స్థాయి వరకు గల క్రీడాకారుల ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించేలా ఒక ప్రత్యేక శిక్షణ ఇచ్చి అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన కలెక్టరేట్లోని సమావేశమందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లాలో క్రీడాకారులకు కొదవలేదన్నారు. అర్జున అవార్డు గ్రహీతలు, కోడిరామూర్తినాయుడు లాంటి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వెయిట్ లిఫ్టర్లున్నారన్నారు. అలాగే జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడాకారుల్లో రాణించిన వారు ఎంతో మంది ఉన్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా 13 క్రీడా విభాగాల్లో జిల్లాస్థాయిలో ఎంపికలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను గుర్తించి తగిన తర్ఫీదు ఇవ్వనున్నట్లు తెలిపారు. పాఠశాల స్థాయిలో ఈనెల 12, 13 తేదీలలో, ఈనెల 15, 16, 17వ తేదీలలో జిల్లా స్థాయిలో పోటీలు జరుగుతాయన్నారు. అలాగే జిల్లాలో వాటర్ స్పోర్ట్స్ (జలక్రీడలు) నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతాయని చెప్పారు. దీనికి సంబంధించి శాప్తో చర్చించగా అంగీకారం తెలిపిందన్నారు. 2030లో కామన్వెల్త్ గేమ్స్ భారతదేశానికి కేటాయించనున్న తరుణంలో క్రీడల్లో మరింత ప్రతిభ కనబరిచి కామన్వెల్త్ క్రీడలలో పాల్గొనేలా శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. స్పోర్ట్స్ కోటాలో 3శాతం రిజర్వేషన్ ఉందని ఈమేరకు స్పోర్ట్స్లో ప్రతిభ కనబరిచిన వారికి ఉద్యోగాలు, ప్రవేశాలలో రిజర్వేషన్ వర్తిస్తుందన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్కుమార్ రెడ్డి పొల్గొన్నారు. -
13న పారా రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు
విజయనగరం: పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 13న స్థానిక రాజీవ్ క్రీడా మైదానంలో 4వ రాష్ట్రస్థాయి పారా పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్–2025 పోటీలు నిర్వహించనున్నామని జిల్లా క్రీడాధికారి ఎస్. వెంకటేశ్వర రావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన తన కార్యాలయంలో పోటీలకు సంబంధించిన పోస్టర్స్ను పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు కె.దయానంద్తో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలిసారిగా పారా రాష్ట్ర స్థాయి పోటీలు విజయనగరంలో నిర్వహించడం శుభపరిణామమన్నారు. ఈ పోటీలకు అన్ని జిల్లాల నుంచి పారా క్రీడాకారులు హాజరు కానున్నారని, జూనియర్, సబ్ జూనియర్, సీనియర్ విభాగాలకు సంబంధించి పోటీలు నిర్వహించనున్నారన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరచిన క్రీడాకారులను ఉత్తరాఖండ్లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఉన్న పారా పవర్ లిఫ్టర్ లు ఈ పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ చాటాలని కోరారు. మరిన్ని వివరాల కోసం ఫోన్ 9849377577 నంబర్ ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు కె. దయానంద్, కోచ్ తదితరులు పాల్గొన్నారు. -
వెనుకబడిన విద్యార్థులపై నిర్లక్ష్యం
పార్వతీపురం రూరల్: ర్యాంకుల రేసులో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపాలన్న అధికారుల తాపత్రయం పదో తరగతి విద్యార్థుల పాలిట శాపంగా మారుతోందా? ‘వంద రోజుల ప్రణాళిక’ పేరుతో విద్యాశాఖ అమలు చేస్తున్న కార్యాచరణ విద్యార్థులను తీర్చిదిద్దడం పక్కన పెడితే..వారిని మానసిక ఒత్తిడిలోకి నెట్టివేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘అందరికీ ఒకే మందు’ అన్న చందంగా.. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా రూపొందించిన ఈ షెడ్యూల్ వల్ల విద్యార్థులు లాభం కంటే నష్టమే ఎక్కువ పొందే ప్రమాదం ఉందని ఉపాధ్యాయ లోకం హెచ్చరిస్తోంది. బోధన కన్నా..‘యాప్’ల గోలే మిన్న పదో తరగతి ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలన్న సంకల్పం మంచిదే అయినా.. ఆచరణలో ఉపాధ్యాయులపై పడుతున్న పని భారం అసలు లక్ష్యాన్ని దెబ్బతీస్తోంది. రోజూ ఉదయం జిల్లా కార్యాలయం నుంచి వచ్చే వాట్సాప్ ప్రశ్నపత్రాలను జిరాక్స్ తీయించడం, పరీక్ష పెట్టడం, ఆ వెంటనే మార్కులను సాయంత్రం లోపు ‘లీప్ యాప్’లో అప్లోడ్ చేయడం..ఇదంతా ఒక ప్రహసనంగా మారింది. బోధన కంటే ఈ సాంకేతిక పనులకే ఉపాధ్యాయుల సమయం హరించుకుపోతోంది. పిల్లలకు పాఠం చెప్పాలా? లేక యాప్ లో మార్కులు ఎక్కించాలా? అన్న సందిగ్ధంలో టీచర్లు కొట్టుమిట్టాడుతున్నారు. విరామం ఎరుగని ‘యంత్రాలు’ పిల్లలంటే యంత్రాలు కాదు..రక్తమాంసాలున్న మనుషులు. కానీ విద్యాశాఖ మాత్రం రెండవ శనివారాలు, ఆదివారాలు కూడా క్లాసులు పెట్టి వారిని రోబోల్లా మార్చేస్తోంది. ఇప్పటికే సిలబస్ పూర్తయిన తరుణంలో.. విద్యార్థులకు స్వయంగా చదువుకునేందుకు, పునశ్చరణ చేసుకునేందుకు సమయం ఇవ్వాలి. కానీ, సెలవు రోజుల్లో కూడా బడికి రప్పించడం వల్ల విద్యార్థులు తీవ్ర అలసటకు, మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ‘మెదడుకు కాస్తంత విశ్రాంతి దొరికితేనే చదివింది వంటబడుతుంది. ఇలా ఊపిరి ఆడనివ్వకుండా చదివిస్తే..అసలుకే ఎసరు వస్తుంది’ అని సీనియర్ ఉపాధ్యాయులు సైతం వాపోతున్నారు. పది పరీక్షలకు వంద రోజుల ప్రణాళికతో ‘స్లో లెర్నర్స్’ బలి! అందరికీ ఒకే విధానం.. ఎలా సాధ్యం? జిల్లాలో 187 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ర్యాంకుల పరుగులో విద్యార్థులకు గండం వందరోజుల ప్లాన్తో ఒత్తిడి -
బ్రెయిన్ యోగా ఒక అద్భుతం
● అంతర్జాతీయ బ్రెయిన్ యోగా గురువు పిడుగు శ్రీనివాసులువిజయనగరం: బ్రెయిన్ యోగా ఒక అద్భుతమని బెంగళూరుకు చెందిన ప్రముఖ బ్రెయిన్ యోగా గురువు, అంతర్జాతీయ శిక్షకుడు పిడుగు శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లాశాఖ అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ ఆధ్వర్యంలో గురజాడ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొని మాట్లాడారు. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, మానసిక స్పష్టతను పెంచడం, ఆందోళనను తగ్గించడం, నాడీ వ్యవస్థను ఉత్తేజపరచడం, మెదడుకు రక్త ప్రసరణను పెంచడం, న్యూరోన్ల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయడం వంటివి బ్రెయిన్ యోగాతో సాధ్యమన్నారు. ఈ సందర్భంగా వివిధ ముద్రలతో బ్రెయిన్ ఎక్సర్సైజ్ విద్యార్థులతో చేయించడమే కాక వాటి విశిష్టతను విపులంగా వివరించారు. ఈ సందర్భంగా యోగా గురువు పిడుగు శ్రీనివాసులును, రోటరీ లీడ్ ఇండియా చైర్మన్ దుర్గాబాలాజీ, పాఠశాల ప్రిన్సిపాల్ పూడి శేఖర్తో కలిసి గురుప్రసాద్ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రోటరీ లీడ్ ఇండియా ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ చైతన్య, జగదీష్, లత తదితరులు పాల్గొన్నారు.


