Parvathipuram Manyam
-
మనోహరమైన విజయం
పాలకొండ: గేట్–2026 ఫలితాల్లో పాలకొండకు చెందిన బొత్స మనోహరనాయుడు ప్రతిభ కనబరిచి ఆల్ ఇండియా స్థాయిలో 50వ ర్యాంకు సాధించాడు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 872 స్కోర్ 69.33 మార్కులతో ఆల్ ఇండియా స్థాయిలో 50వ ర్యాంకు, ఇన్స్ట్రుమెంట్ ఇంజినీరింగ్లో 705 స్కోర్ 65.67 మార్కులతో ఆల్ ఇండియా స్థాయిలో 122వ ర్యాంకు సాధించాడు. విద్యార్థి తండ్రి బొత్స వెంకటరమణ పాలకొండ పట్టణంలోని వెంకమ్మపేట ప్రభుత్వ పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తుండగా, తల్లి ప్రభావతి గృహిణి. ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థిని పాలకొండ వాసులు అభినందించారు. -
రామతీర్థానికి శ్రీరామనవమి శోభ
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం రామ స్వామి వారి దేవస్థానానికి శ్రీరామనవమి శోభ సంతరించుకుంది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా గురువారం నుంచి కల్యాణ వసంతోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. వేకువజామున స్వామికి సుప్రభాత సేవ, బాలభోగం తదితర కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. అనంతరం ఆస్థాన మండపంలోని స్వామివారిని ఆశీనులను చేసి విశ్వక్సేరాధన, అంకురారోపణ, రుత్విగ్వరణం, తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. రాత్రి 7 గంటలకు స్వామివారిని రామతీర్థం తిరువీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఉగాది పర్వదినం మొదలుకొని శ్రీరామ నవమి వరకు తొమ్మిది రోజుల పాటు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన 40 మంది వేదపండితులతో శతసహస్ర నామ తులసీ దళార్చన, కుంకుమార్చన కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 27న శ్రీరామనవమిని పురస్కరించుకొని సీతారాముల కల్యాణాన్ని రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో వేడుకగా జరిపిస్తామని చెప్పారు. కార్యక్రమంలో అర్చకులు సాయిరామాచార్యులు, నరిసింహాచార్యులు, కిరణ్, పవన్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వైభవంగా ప్రారంభమైన కల్యాణ వసంతోత్సవాలు వేద పండితులతో శాస్త్రోక్తంగా పారాయణాలు ఈ నెల 27న ప్రభుత్వ లాంఛనాలతో సీతారాముల కల్యాణం -
సాయితేజకు 423వ ర్యాంక్
గజపతినగరం రూరల్: గేట్ (గ్రాడ్యూయేట్ ఆప్టిట్యూట్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్)లో గజపతినగరం మండలం లోగిస గ్రామానికి చెందిన సామంతల జీవన్సాయితేజ ఆలిండియా స్థాయిలో 423 ర్యాంకు సాధించాడు. 100 మార్కులకు 58 మార్కులు స్కోర్ లభించడంతో సాయితేజకు ఈ ర్యాంక్ వచ్చింది. సాయితేజ ప్రస్తుతం హైదరాబాద్లో డీఆర్డీఓలో ట్రైయినీ రీచర్చ్ ఫెలోగా పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు సామంతుల సోంబాబు, తల్లి పైడిరాజు వ్యవసాయదారులు. మరోవైపు సాయితేజ కోల్ ఇండియా లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజ్మెంట్ ట్రెయినీ, ఎయిర్ఫోర్ట్ ఆఽథారిటీ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. కుమారుడు అటు చదువు, ఇటు ఉద్యోగ పరీక్షల్లో విజేతగా నిలవడంతో తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు. -
బాధ్యతల స్వీకరణ
విజయనగరం: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఉత్తర్వుల మేరకు విజయనగరం నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారిగా కలెక్టర్ ఎం.రాంసుందర్రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యమిస్తానన్నారు. నగర ప్రజలకు మౌలిక సదుపాయాలు, కనీస అవసరాలను సంపూర్ణగా కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల సంరక్షణ వంటి అత్యవసర సేవలు నిరంతరాయంగా కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని, వాటిని మరింత మెరగుపరిచే దిశగా కార్యాచరణ చేపడతాన్నారు. నగరపాలక సంస్థ అధికారులు, పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రజలకు మరిం మెరుగైన సేవలందించేలా కృషి చేయాలని సూచించారు. ● పూల సోయగం -
మీకో మోసం..!
రైతన్నా.. సాక్షి, పార్వతీపురం మన్యం: ‘రైతన్నా.. మీకోసం’ అంటూ రాష్ట్ర ప్రభుత్వం వారోత్సవాలు నిర్వహిస్తోంది. ప్రజాప్రతినిధులను, అధికారులను గ్రామాలకు పంపిస్తోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకుంటున్నామని చెబుతున్నప్పటికీ.. ఆచరణలో అది ఒట్టిదేనని నిరూపితమవుతూనే ఉంది. పంటలకు మద్దతు ధర దక్కక రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నా పట్టించుకునేవారే లేరు. పంటను అమ్ముకునే అవకాశం లేక రైతన్నలు నష్టపోతున్నారు. ప్రభుత్వం తీరుతో మోసపోతున్నారు. ఆశల పంట.. నష్టాల బాట జిల్లాలో వరి తర్వాత అధిక శాతం మంది మొక్కజొన్ననే సాగు చేస్తుంటారు. వరి, పత్తితో పోల్చుకుంటే.. ఈ పంటలో కాస్త లాభాలు చూడవచ్చని ఆశ పడతారు. పార్వతీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, పాలకొండ, సీతంపేట, సాలూరు, పాచిపెంట, మక్కువ, తదితర ప్రాంతాల్లో ఎక్కువ సాగులో ఉంది. ఈ ఏడాది ప్రస్తుత సీజన్లో 31వేల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంట వేశారు. తొమ్మిది లక్షల క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. పంట చేతికొస్తున్నా.. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో రైతులు మధ్యవర్తులు, వ్యాపారులనే ఆశ్రయిస్తున్నారు. ఏటా ప్రభుత్వం పేరుకే మద్దతు ధర ప్రకటిస్తున్నా.. మార్క్ఫెడ్ ద్వారా ఎక్కడా కొనుగోలు కేంద్రాలు మాత్రం కానరావడం లేదు. నాసిరకం విత్తనాలతో దగా.. ఓ వైపు కొనుగోలు కేంద్రాలు లేక రైతులు దిగాలు చెందుతుంటే.. మరోవైపు నాసిరకం మొక్కజొన్న సీడ్ సరఫరాతో కొన్ని మండలాల్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొమరాడ మండలంలోని గుణానపురం, గంగరేగువలస, దుగ్గికంభవలస, కల్లికోట, సోమినాయుడువలస తదితర గ్రామాల్లో నకిలీ విత్తనాల వల్ల పంట దిగుబడి తగ్గిపోయింది. ఈ విత్తనాల వల్ల పొత్తుపై గింజలు పది లోపే ఉంటున్నాయి. దీనివల్ల ఎకరాకు రూ.లక్ష వరకు నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా 2 వేల ఎకరాలకుపైగా ఈ పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల కిందట సీపీ ఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుబ్బరావమ్మ, ఇతర నాయకులు కొమరాడ మండలంలోని సోమినా యుడువలస సమీపంలోని ఉన్న నాగభూషణం అనే రైతుకు చెందిన మొక్కజొన్న పంటను పరిశీలించారు. నాసిరకం విత్తనాల వల్ల పంట దిగుబడి తగ్గిపోయిందని వారి ఎదుట రైతు వాపోయాడు. రైతులను మోసం చేసి, కావేరి సీడ్ యాజమాన్యం నాసి రకం విత్తనాలు సరఫరా చేసిందని సీపీఎం నాయకులు ఆరోపిస్తున్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.1.50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని, మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొక్కజొన్న క్వింటాకు ప్రభుత్వం రూ.2,400 మద్దతు ధర ప్రకటించింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో వ్యాపారులకే విక్రయించుకోవాల్సి వస్తోంది. రూ.1,600 నుంచి రూ.1,700కి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో క్వింటా వద్ద రూ.800 వరకు రైతు నష్టపోతున్నాడు. అనేక కష్టనష్టాలకు ఓర్చి, బోరుబావుల వద్ద పంటను పండిస్తున్నారు. ఆశించిన స్థాయిలో పంట ఉంటే... ఎకరా విస్తీర్ణంలో 25 నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఈ లెక్కన ఎకరా వద్ద రైతు దాదాపు రూ.25 వేల వరకు నష్టపోతున్నాడు. దళారులు, వ్యాపారులు తూకంలోనూ మోసాలకు పాల్పడుతున్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న ఎన్నికల అధికారి
సీతంపేట: సీతంపేటలో టీటీడీ నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని గురువారం ఉగాది పర్వదినాన దర్శించుకున్నారు. అర్చకులు ఆమెకు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. పాలకొండ సబ్కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీఓ పవార్ స్వప్నిల్తో కాసేపు ముచ్చటించారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు ● కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి పార్వతీపురం: పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు, ముస్లింలకు కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి గురువారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. క్రమశిక్షణ, దానగుణం, భక్తికి రంజాన్ పండగ ప్రతీక అని పేర్కొన్నారు. నెలరోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేపట్టి, క్రమశిక్షణతో కూడిన జీవనం సాగించడం అభినందనీయమన్నారు. జిల్లాలోని ప్రజలందరూ కులమతాలకు అతీతంగా, సోదరభావంతో పండగను జరుపుకోవాలని, జిల్లా ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు, సంతోషాలు నింపాలని ఆయన ఆకాంక్షించారు. పక్కుడుభద్ర వైపు ఏనుగులు భామిని: తివ్వకొండలకు సమీపంలోని పక్కుడుభద్ర పరిసరాల్లోకి ఏనుగులు గురువారం చేరుకున్నాయి. నేరడి బ్యారేజ్ సమీపంలో సంచరిస్తూ తివ్వకొండల వద్దకు చేరుకోవడంతో ఆ ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. పచ్చని పంట పొలాల్లో సంచరిస్తూ నాశనం చేస్తున్నాయని గగ్గోలు పెడుతున్నారు. ఏనుగుల మళ్లింపునకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మన్యంలో భారీ వర్షం గుమ్మలక్ష్మీపురం: పార్వతీపురం మన్యం జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం భారీవర్షం కురిసింది. సుమారు గంట సమయం పాటు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. గుమ్మలక్ష్మీపురం, ఎల్విన్పేట, జె.కె.పాడు, ఎస్.కె.పాడు, తాడికొండ, తోలుఖర్జ, ఇరిడి తదితర గ్రామాల పరిధిలో గాలులు, ఉరుములతో కూడిన వర్షం కురిసింది. వాతావరణం చల్ల బడడంతో ప్రజలంతా ఉపశమనం పొందారు. -
గెలుపు గేట్ తెరిచారు..
ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు గురువారం విడుదలైన గేట్ ఫలితాల్లో సత్తా చూపారు. ఉత్తమ ర్యాంకులు సాధించారు. జిల్లాకు, ఊరికి పేరుతెచ్చారు. ఉన్నత విద్యాభ్యాసానికి అర్హత సాధించారు. వీరఘట్టం: మండలంలోని మొట్ట వెంకటాపురం గ్రామానికి చెందిన కుర్రోడు కందల రాజశేఖర్ గేట్ ఫలితాల్లో సత్తాచాటాడు. రెండు పేపర్లలో పరీక్షలు రాయగా ఆలిండియా స్థాయిలో ఈసీఈలో 735 స్కోర్ పాయింట్లతో 423వ ర్యాంకు, ఇనిస్ట్రిమెంటేషన్లో 275 స్కోర్ పాయింట్లతో 273వ ర్యాంకు సాధించాడు. తల్లిదండ్రులు రాములమ్మ, రామారావు, సోదరుడు తిరుపతిరావు వ్యవసాయం చేస్తూ రాజశేఖర్ను చదివించారు. గేట్లో మంచి ర్యాంకు సాధించడంతో మురిసిపోతున్నారు. గేట్లో మెరిసిన ఎం.వి.పురం కుర్రోడు -
ఉత్సాహంగా ఉగాది వేడుకలు
పార్వతీపురం రూరల్: పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలోని మన్యం కళావేదికలో గురువారం పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఉత్సాహంగా సాగాయి. కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేద పండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా పండితుడు దార్లపూడి లక్ష్మీనరసింహారావు నూతన సంవత్సర రాశిఫలాలు, వర్షపాతం, వ్యవసాయ పరిస్థితులపై పంచాంగ పఠనం చేశారు. అనంతరం కురుకుట్టి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. కవి సమ్మేళనంలో కవులు సిరికి స్వామినాయుడు, బౌరోతు శంకరరావు, కిలపర్తి దాలినాయిడు తమకవితలను వినిపించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అధికారులు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచుల ప్రాముఖ్యతను వివరించి, జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పండితులను, కవులను దుశ్శాలువలతో సత్కరించారు. జాయింట్ కలెక్టర్ సి.యస్వంత్కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్ వైశాలి, జిల్లా రెవెన్యూ అధికారి హేమలత, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. -
వ్యక్తి ఆత్మహత్య
లక్కవరపుకోట: చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపానికి గురై ఒడిశాకు చెందిన గజేంద్ర బెహరా (31) ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని సీతారాంపురం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. గజేంద్ర బెహరా తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన దేవిని పదేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి మండల పరిధిలోని పలు కంపెనీల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొద్ది నెలల కిందట సోంపురం జంక్షన్ సమీపంలో గల అట్టల కంపెనీలో పనికి కుదిరి.. సీతారాంపురం గ్రామంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నారు. ఈక్రమంలో జీవనోపాధి నిమిత్తం అప్పులు చేశాడు. ఇతని భార్య దేవి కొద్దిరోజుల కిందట పుట్టింటికి వెళ్లగా.. గజేంద్ర ఒక్కడే ఉంటున్నాడు. అయితే అప్పులు ఎక్కువ కావడంతో గజేంద్ర బెహరా ఇంటిలో ఉన్న ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా.. హెడ్కానిస్టేబుల్ పాపారావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి భార్య దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం.. కొత్తవలస మండలంలోని 202 కాలనీ సమీపంలో గల లెజెండ్ లే అవుట్లో గల తుప్పల్లో గుర్తు తెలియని పురుషుడు మృతదేహాన్ని స్థానికులు గురువారం గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, ఐదారు రోజుల కిందట మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఆ వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడా..? లేదా ఎవరైనా చంపి ఇక్కడికి తీసుకొచ్చి పడేసారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతి ఆత్మహత్యాయత్నం పార్వతీపురం రూరల్: తండ్రి మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండలంలోని మార్కొండపుట్టి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన విద్యార్థిని ఎ.సౌజన్య ఇటీవల ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి ఇంట్లోనే ఉంటోంది. గురువారం ఉగాది పండుగ సందర్భంగా తన తండ్రిని విధులు ముగించుకుని ఇంటికి త్వరగా రావాలని ఆమె కోరింది. ఈ క్రమంలో నువ్వు నాకు చెప్పవద్దు అని సౌజన్యను తండ్రి మందలించడంతో తీవ్ర ఆవేదనకు గురైన సౌజన్య ఇంట్లో ఉన్న చీమల మందును నీటిలో కలిపి తాగేసింది. వెంటనే కుటుంబ సభ్యులు గుర్తించి ఆమెను జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతోంది. భవనంపై నుంచి జారిపడి కార్మికుడి మృతి లక్కవరపుకోట: భవనంపై నుంచి ప్రమాదవశాత్తూ జారిపడి కార్మికుడు మృతి చెందిన సంఘటన మండలంలోని సీతాగొర్లెవానిపాలెం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. కొత్తవలస మండలం మింది రామచంద్రపురం గ్రామానికి చెందిన దాడి చిన్నప్పారావు (35) ఈ ప్రమాదంలో మృతి చెందాడు. ఏఎస్సై శ్రీనివాసరావు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. చిన్నప్పారావు మండలంలోని సీతాగొర్లెవానిపాలెంలో ఓ భవనానికి డెకింగ్ పనులు చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే సహచర కూలీలు ఆయన్ను సమీపంలో గల ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
టేకు తోటలో మంటలు
బలిజిపేట: మండలంలోని వెంగాపురం అగ్రహారం వీధి వెనుకున్న టేకుతోటల్లో గురువారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇదే సమయంలో ఈదురుగాలులు వీయడంతో మంటలు ఎగసిపడ్డాయి. కొద్ది సేపటి తర్వాత వర్షం పడడంతో మంటలు చల్లారాయి. చుట్టో, సిగరెట్టో కాల్చి పారేయడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పామాయిల్ తోటలో.. గజపతినగరం రూరల్: మండలంలోని బంగారమ్మపేటలో పల్లా చంద్రరావుకు చెందిన 30 ఎకరాల పామాయిల్ తోటలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తోటలో గల డ్రిప్ ఇరిగేషన్ పైపులు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. సుమారు రూ.లక్ష వరకు నష్టం జరిగినట్లు అగ్నిమాపక అధికారి ప్రసాద్ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి సిగరెట్, బీడీ కాల్చి పడేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. చెరకు తోటలో.. బాడంగి: మండలంలోని భీమవరంలో జరిగిన అగ్ని ప్రమాదంలో విశ్వనాథం వెంకట సుబ్రహ్మణ్యంనకు చెందిన సుమారు నాలుగు ఎకరాల్లోని చెరకు పంట అగ్నికి ఆహుతైంది. ఇదే సమయంలో గాలి వీయడంతో పక్కనే ఉన్న రెండు గడ్డి కుప్పలు కూడా బూడిదయ్యాయి. డొంకినవలస నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. -
మంచానికి పరిమితమైనా.. కనికరం లేదా..?
చీపురుపల్లి: పై చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి చీపురుపల్లి పట్టణంలోని అన్నపూర్ణకాలనీకు చెందిన దువ్వూరి సాయికృష్ణ. ఈయన 2023 ఏడాది చివరిలో అనారోగ్యం బారిన పడడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా బైలేటరల్ లోవర్ లింబ్, ఇంపైర్డ్ రీచ్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది. దీంతో విశాఖపట్టణం, హైదరాబాద్లో చికిత్స తీసుకున్నాడు. ఇందుకోసం అతను సంపాదించిన సొమ్మంతా ఖర్చు కాగా ఇంకా అప్పులు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఇంటివద్దే ఉంటూ వైద్యం చేయించుకుంటున్నారు. ఇతనికి ఛాతి నుంచి కింద భాగం అచేతనంగా మారిపోయింది. దీంతో అన్నీ మంచంపైనే జరుగుతుండడంతో ఆయన భార్య సేవలు అందిస్తోంది. వీరికి పిల్లలు కూడా లేరు. అయితే ప్రస్తుతం వీరు డైపర్లు, యూరిన్ బ్యాగులు కొనుక్కునే పరిస్థితుల్లో కూడా లేరు. అనాథలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రభుత్వం ఇచ్చే పింఛన్ కోసం పీజీఆర్ఎస్లో పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదు. ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయారు. కనీసం పింఛన్ మంజూరైనా గంజినీళ్లు తాగి బతుకుతామని భార్యాభర్తలు అంటున్నారు. ఇలాంటి వారెందరో.. ఇది సాయికృష్ణ లాంటి ఎంతో మంది ఆదరణ లేని వారి ఆవేదన. టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో ఒక్క కొత్త ఫించన్ కూడా ఇవ్వకపోవడంతో ఇలాంటి ఎంతో మంది పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. పాత పింఛన్ల పంపిణీ కోసం ప్రతినెలా ఒకటో తేదీన ఎమ్మెల్యేల నుంచి సీఎం వరకు కోట్లాది రూపాయలతో ప్రచారం చేసుకుంటున్నారే తప్ప ఇలాంటి ఎంతోమంది అర్హులకు న్యాయం చేయలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 90 శాతం వికలాంగత్వం ఉన్నా పింఛన్ మంజూరు చేయని అధికారులు, ప్రజాప్రతినిధులు అరుదైన వ్యాధితో బాధపడుతున్న సాయికృష్ణ కనీసం డైపర్లు, యూరిన్ బ్యాగ్లు కొనుగోలు చేయలేని పరిస్థితి దుర్భర జీవితం అనుభవిస్తున్న భార్యాభర్తలు -
అలరించిన భరతనాట్య ప్రదర్శన
చికెన్● ఉగాది వేడుకల్లో భాగంగా విద్యార్థినులకు ప్రశంసాపత్రాల అందజేత విజయనగరం టౌన్: ఉగాది సందర్భంగా నగరంలోని రామనారాయణం వేదికగా జరిగిన భరతనాట్య ప్రదర్శన భక్తులు, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. గురువారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో వరలక్ష్మి నాట్యాలయం విద్యార్థినులు తమ అద్భుత కళా ప్రదర్శనతో అలరించారు. నాట్యాలయం గురువు పేరి వరలక్ష్మి పర్యవేక్షణలో విద్యార్థినులు ప్రదర్శించిన భరతనాట్య భంగిమలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రదర్శన అనంతరం ఆలయ నిర్వాహకులు కళాకారులను అభినందిస్తూ ప్రశంసా పత్రాలను అందజేశారు. భారతీయ సంస్కతి, కళలను భావితరాలకు అందించడంలో ఇటువంటి ప్రదర్శనలు దోహదపడతాయని నిర్వాహకులు కొనియాడారు. ప్రత్యేక ఆకర్షణగా లేజర్ షో.. నాట్య ప్రదర్శన అనంతరం ఆలయ ప్రాంగణంలోని భారీ ఆంజనేయ స్వామి విగ్రహంపై ఏర్పాటు చేసిన లేజర్ షో భక్తులను మంత్రముగ్ధులను చేసింది. కాంతి పుంజాల మధ్య స్వామివారి రూపం విద్యుత్ దీపాల వెలుగులో కాంతులీనుతూ భక్తి పారవశ్యాన్ని నింపింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, విద్యార్థినుల తల్లిదండ్రులు, భక్తులు పాల్గొన్నారు. -
కారుణ్య నియామకం
విజయనగరం క్రైమ్: గజపతినగరంలోని పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ, ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టి.తిరుపతిరావు భార్య దమయంతికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించారు. ఈ మేరకు గురువారం స్థానిక పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆమెకు నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కానిస్టేబుల్ టి.తిరుపతిరావు కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేవలం రెండు నెలల్లో ఆయన భార్య దమయంతికి పోలీసుశాఖలో టైపిస్ట్గా ఉద్యోగం కల్పించామన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి. సౌమ్యలత, డీపీఓ ఏఓ పి. శ్రీనివాసరావు, జూనియర్ సహాయకురాలు చాముండేశ్వరి, తదితరులు పాల్గొన్నారు. -
ఎన్ఎంఎంఎస్ ఫలితాల విడుదలెప్పుడో..?
రామభద్రపురం: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) ప్రతిభా పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో గతేడాది డిసెంబర్ 7న నిర్వహించిన ఎన్ఎంఎంఎస్ ప్రతిభా పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 4009 మంది హాజరుకాగా.. ఇందులో రామభద్రపురం మండలానికి చెందిన వారు 55 మంది ఉన్నారు. అయితే పరీక్షలు నిర్వహించి మూడు నెలలు దాటినా ప్రభుత్వం ఫలితాలు విడుదల చేయకపోవడంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, తదితర జిల్లాల్లో ఇప్పటికే ఎన్ఎంఎంఎస్ ప్రతిభా పరీక్షల ఫలితాలు విడుదల చేశారన్న సమాచారం ఉందని.. మన జిల్లాలో ఎందుకు ఆలస్యం అవుతుందో అర్థం కావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. అధికారులు స్పందించి ఫలితాలు త్వరితగతిన విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ పరీక్షలో ప్రతిభ చాటిన విద్యార్థులకు తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏటా రూ.12 వేలు చొప్పున్న నాలుగేళ్లు ఉపకార వేతనం అందించనున్నారు. ఆకట్టుకున్న ఎడ్లబళ్ల పందాలు వేపాడ: మండలంలోని వావిలపాడులో నూకాలమ్మ పండగ సందర్భంగా గురువారం నిర్వహించిన ఎడ్లబళ్ల పందాలు ఆకట్టుకున్నాయి. ఈ పోటీల్లో 15 ఎడ్ల బళ్లు పాల్గొనగా.. విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. అంతకుముందు నూకాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్
పార్వతీపురం రూరల్: మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, పట్టణ అభివృద్ధిపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో పారిశుధ్య నిర్వహణ పక్కాగా ఉండాలని.. చెత్త సేకరణ, కాలువల్లో పూడికతీత పనుల్లో ఎటువంటి జాప్యం జరగకూడదని ఆదేశించారు. వేసవి దృష్ట్యా ప్రజలకు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఇంజినీరింగ్ సిబ్బందికి సూచించారు. పట్టణంలో కొనసాగుతున్న రోడ్లు, భవనాల నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మున్సిపాలిటీకి వచ్చే అర్జీలను తక్షణమే పరిష్కరించి, బాధితులకు న్యాయం చేయాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
రౌడీషీటర్ ఘాతుకం.. యువకుడి హత్య
● కత్తిపోట్లకు 19 ఏళ్ల యువకుడు బలి ● మరొకరి పరిస్థితి విషమం ● ఇసుకతోటలో దారుణం ఎంవీపీకాలనీ: నగరంలోని ఇసుకతోట రామాలయం సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన హత్యోదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పాతకక్షల నేపథ్యంలో బొచ్చు వెంకటేష్(19) అనే యువకుడు రౌడీషీటర్ చేతిలో దారుణ హత్యకు గురవగా, బాకీ సంతోష్ అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం సంతోష్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో రౌడీషీటర్ పల్లా అనీల్ ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడికావడంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. నిత్యం రౌడీషీటర్లను పర్యవేక్షిస్తున్నా, తరచూ కౌన్సిలింగ్లు ఇస్తున్నా.. ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాలివి.. రణస్థలం, పూసపాటిరేగ ప్రాంతాలకు చెందిన బొచ్చు వెంకటేష్, బాకీ సంతోష్ వరుసకు అన్నదమ్ములు. ఉపాధి నిమిత్తం వీరిద్దరూ విశాఖలో ఉంటున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న పల్లా అనీల్పై ఎంవీపీకాలనీ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ ఉంది. గతంలో ఇతని ఆగడాలు మితిమీరడంతో పోలీసులు నగర బహిష్కరణ కూడా చేశారు. కొంతకాలం రణస్థలంలో ఉన్న అనిల్, ఇటీవల మళ్లీ నగరానికి చేరుకున్నాడు. రణస్థలంలోనే అనీల్కు, వెంకటేష్కు పరిచయాలు ఉన్నాయి. కాగా.. వెంకటేష్ భార్య విషయంలో ఇద్దరి మధ్య కొంతకాలంగా తగాదాలు నడుస్తున్నాయి. దీనిపై గతంలోనే వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, మూడు నెలల కిందట పోలీసులు ఇరువర్గాలకు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. అయినా వీరి మధ్య వివాదం సద్దుమణగలేదు. ఇటీవల మరోసారి గొడవ జరగడంతో ‘చూసుకుందాం రా’ అంటూ వెంకటేష్ సవాల్ విసిరినట్లు సమాచారం. ఈ క్రమంలో బుధవారం రాత్రి అర్ధరాత్రి సమయంలో ఇసుకతోట రామాలయం వద్ద వెంకటేష్, అనీల్ తరఫు వాళ్లు తలపడ్డారు. ముందస్తు పథకం ప్రకారం కత్తితో సిద్ధంగా వచ్చిన అనీల్, ఒక్కసారిగా వెంకటేష్, సంతోష్లపై దాడి చేశాడు. బలమైన కత్తిపోట్లు తగలడంతో వెంకటేష్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సంతోష్ తీవ్ర గాయాలపాలవగా, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నైట్ బీట్ పోలీసులు అక్కడికి చేరుకుని సంతోష్ను వెంటనే కేజీహెచ్కు తరలించారు. ఈ ఘటనలో సుమారు 12 మంది యువకులు పాల్గొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించి, నిందితులను వెంటనే పట్టుకోవాలని ఆదేశించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీపీ నరసింహమూర్తి గురువారం తెలిపారు. -
పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలి : ఎస్పీ
● నేర సమీక్షా సమావేశంలో అధికారులకు ఆదేశం ● హెల్మెట్పై అవగాహన లఘుచిత్రం ఆవిష్కరణపార్వతీపురం రూరల్ : జిల్లాలో పెండింగ్లో ఉన్న గ్రేవ్, పోక్సో, ఎన్డీపీఎస్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మాసాంతపు నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి కేసులో దర్యాప్తు పూర్తి చేసి, సకాలంలో చార్జ్షీట్లు దాఖలు చేయాలని, కోర్టులతో సమన్వయం చేసుకొని సీసీ, ఎస్సీ నంబర్లు పొందాలని సూచించారు. పోలీసింగ్లో సాంకేతికత నేర నియంత్రణలో కృత్రిమ మేధ (ఏఐ) కీలక పాత్ర పోషిస్తోందని ఎస్పీ తెలిపారు. ఏఐ4 ఏపీ పోలీస్ లోని సోషియంట్, 360న్యూస్ సేవలను అధికారులు వినియోగించుకోవాలన్నారు. గంజాయి రవాణా అడ్డుకట్టకు డ్రోన్ల ద్వారా నిఘా పెట్టాలని, హాట్ స్పాట్లను గుర్తించి నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పశువుల అక్రమ రవాణాపై దృష్టి సారించాలన్నారు. రహదారి భద్రతపై పార్వతీపురం పట్టణ సీఐ వెంకట్రావు రూపొందించిన హెల్మెట్ అవగాహన లఘుచిత్రాన్ని ఎస్పీ ఆవిష్కరించారు. నిబంధనలు అతిక్రమించే వారిపై ఈ–చలాన్లు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. రాబోయే ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా ప్రార్థనా మందిరాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత పెంచాలని సూచించారు. విధి నిర్వహణలో, వార్షిక ఫైరింగ్ ప్రాక్టీసులో ప్రతిభ కనబరిచిన అధికారులకు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలను అందజేశారు. అదనపు ఎస్పీ వెంకటేశ్వరరావు, డీఎస్పీలు రాంబాబు, థామస్ రెడ్డి, వివిధ విభాగాల సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
రెవెన్యూ అంశాల పరిష్కారంలో జాప్యం వద్దు : జేసీ
విజయనగరం: జిల్లాలోని వివిధ రెవెన్యూ అంశాలపై జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ బుధవారం ఆన్లైన్ ద్వారా తమ చాంబర్ నుంచి మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల నుంచి వచ్చే రెవెన్యూ దరఖాస్తులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ముఖ్యంగా మీసేవ ద్వారా అందిన 22ఎ నిషేధిత జాబితా సవరణ దరఖాస్తులను 22ఎ–(1)(ఎ), 22ఎ–(1)(బి) విభాగాల వారీగా సమీక్షించారు. జేసీ, ఆర్డీఓ, ఎమ్మార్వో కార్యాలయాల స్థాయిలో ఏ దశలోనైనా దరఖాస్తులు నిలిచిపోకుండా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. వెనుకబడ్డ తహసీల్దార్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రీ సర్వే ప్రక్రియలో భాగంగా వెబ్ల్యాండ్ పోర్టింగ్ను వేగవంతం చేయాలని, ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు తక్షణమే పంపిణీ చేయాలని సూచించారు. ఏప్రిల్ నెలలో చేపట్టాల్సిన పంపిణీపై సమీక్షించారు. వీటితో పాటు మ్యుటేషన్లు, జీరో ఖాతాల సవరణ, ఫిలైన్ మరియు సబ్ డివిజన్ల ప్రక్రియను నిబంధనల ప్రకారం పూర్తి చేయాలన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా వచ్చే వినతులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని, రెవెన్యూ క్లినిక్ల సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సంక్షేమ పథకాలకు సంబంధించి సివిల్ సప్లైస్ విభాగంలో కొత్త రైస్ కార్డుల దరఖాస్తుల స్థితిగతులను, ఇ–ఆఫీస్ ఫైళ్ల కదలికను పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ సిహెచ్.సత్తిబాబు, సీపీఓ పి.బాలాజీ, డీఎస్ఓ మురళీనాథ్, డీఎం బి.శాంతి, ఆర్డీఓ వెంకటేశ్వరరావు, సర్వే ఏడీ విజయకుమార్, జిల్లాలోని ఆయా విభాగాల అధికారులు, తహసీల్దార్లు, సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
పది పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
జియ్యమ్మవలస: మండలంలోని చినమేరంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ప్రభాకర రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ, వసతులను పరిశీలించి తాగునీరు, వెలుతురు, ఫ్యాన్ల పనితీరుపై ఆరా తీశారు. పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ కఠినంగా అమలు చేసి మాల్ ప్రాక్టీస్కు తావులేకుండా చూడాలని ఆదేశించారు. ఎండ తీవ్రత దృష్ట్యా మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సంబంధిత ఉద్యోగులకు సూచించారు. మామిడి పంటకు ఆశించే తెగుళ్లపై అవగాహన విజయనగరం ఫోర్ట్: జిల్లాలో సుమారు 21,060 హెక్టార్లలో మామిడి పంట సాగులో ఉందని, ఇందులో 28,500 హెక్టార్లలో కాపు దశలో ఉన్నాయని జిల్లా ఉద్యాన శాఖాధికారి పి.చిట్టిబాబు బుధవారం తెలిపారు. డిసెంబర్ నెలలో కురిసిన అకాల వర్షాలు, ప్రస్తుతం పగలు అధిక ఉష్ణోగ్రతలు, రాత్రిపూట పొగ మంచు వంటి ప్రతికూల వాతావరణం వల్ల మొదటి దఫా పూతకు కొంత నష్టం వాటిల్లిందన్నారు. దీని వల్ల తామర పురుగులు, తేనే మంచు పురుగులు, బూడిద తెగులు ఉధృతి పెరిగిందన్నారు. 21 నుంచి గజపతినగరంలో ఇంటర్మీడియట్ మూల్యాంకనం విజయనగరం అర్బన్: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు బుధవారంతో ముగిశాయని, జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఈ నెల 21 నుంచి గజపతినగరంలోని ప్రగతి జూనియర్ కళాశాలలో ప్రారంభిస్తామని ఆర్ఐఓ ఎస్.తవిటినాయుడు తెలిపారు. జిల్లాకు వచ్చిన రెండు లక్షల 30 వేల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను రెండు విడతలుగా చేపడతామని తెలియజేశారు. జిల్లాకు వచ్చిన వాటిలో ఇంగ్లిష్, హిందీ, తెలుగు, మాథ్స్, హిస్టరీ, సంస్కృతం సబ్జెక్టు పేపర్లతో పాటు 85 వేల వరకు ఒకేషనల్ జవాబు పత్రాలు ఉన్నట్టు వెల్లడించారు. రెండో విడత మూల్యాంకన ప్రక్రియను ఈ నెల 25 నుంచి చేపడతామని స్పష్టంచేశారు. బేకరీలపై విజిలెన్స్ దాడులు రాజాం సిటీ: పట్టణంలోని పలు బేకరీలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. బుధవారం చేపట్టిన ఈ దాడుల్లో అక్రమంగా వినియోగిస్తున్న గృహ అవసరాలకు వాడే గ్యాస్ సిలిండర్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కమర్షియల్ సిలిండర్లకు బదులుగా డొమెస్టిక్ సిలిండర్లు వినియోగించడంతో తొమ్మిది సిలింబర్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు సంబంధిత యజమానులపై కేసులు నమోదు చేశారు. -
వ్యక్తి అరెస్ట్
వంగర: మండల పరిధి అరసాడలో గత నెల ఫిబ్రవరి 13న దొంతల దుర్గారావు స్క్రాప్ షాపులో జరిగిన దొంగతనం కేసులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు ఎస్సై షేక్ శంకర్ బుధవారం తెలిపారు. 96 కేజీల ఇత్తడి సామగ్రి, 100 ఫ్యాన్ కోన్స్, ఒక ఎలక్ట్రిక్ కాటా, రూ.4600 నగదు చోరీ జరిగినట్టు ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేశామన్నారు. ఈ కేసులో విశాఖపట్నం పరిధి పాతగాజువాకకు చెందిన ఆసనాలు కృష్ణ గుర్తించామన్నారు. అరసాడలో మిగిలిన స్క్రాప్ షాపుల్లో దొంగతనం చేసేందుకు ఈ ప్రాంతంలో సంచరించడంతో నిందితుడు పట్టుబడ్డాడని, అరెస్ట్ చేసి పాలకొండ జ్యుడీషియల్ కస్టడీకి తరలించామని ఎస్సై తెలిపారు. మత సామరస్యం పాటించాలి : ఎస్పీ విజయనగరం క్రైమ్ : ఉగాది, రంజాన్ పర్వదినాల సందర్భంగా మత సామరస్యం పాటించాలని ఎస్పీ దామోదర్ ఒక ప్రకటనలో కోరారు. ఈ రెండు పండగలు సాంప్రదాయాలకు ప్రతీకలని పేర్కొన్నారు. పండగల సందర్భంగా మత సామరస్యం పాటించాలని, శాంతిభద్రతలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండాలని కోరారు. సోషల్ మీడియా వదంతులు, అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. మతపరమైన కార్యక్రమాలు నిర్వహించే సమయంలో పోలీసుల సూచలను తప్పకుండా పాటించాలని కోరారు. మసీదులు, దేవాలయాల వద్ద పటిష్ట ముందస్తు భద్రత చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు. మోటారుసైకిలు ఢీకొని వ్యక్తి మృతి సీతానగరం: మండలంలోని విశాఖ– రాయగడ రహదారిపై మరిపివలస వద్ద మంగళవారం మోటారు సైకిలు ఢీకొట్టిన ప్రమాదంలో గాయపడిన వ్యక్తి విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. స్థానిక పోలీసులు అందించిన వివరాలు.. మంగళవారం సాయంత్రం మరిపివలస గ్రామానికి చెందిన గెంబలి మోహనరావు (66) తన ఇంటి నుంచి సరుకులు కొనుగోలు నిమిత్తం రోడ్డు దాటుతుండగా పార్వతీపురం నుంచి సీతానగరం వైపు వస్తున్న మోటారుసైకిలు ఢీ కొట్టడంతో గాయాల పాలయ్యాడు. పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రిలో చికిత్స పొందినప్పటికీ పరిస్థితి విషమించడంతో కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందినట్టు తెలిపారు. స్థానికుడు బి.చిట్టిరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతదేహానికి పంచనామా చేసిన అనంతరం హెచ్సీ సోమరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 23న మెగా జాబ్ మేళా విజయనగరం అర్బన్: స్థానిక టీఏటీ ఐటీఐ కాలేజీ ప్రాంగణంలో ఈ నెల 23న మేగా జాబ్ మేళా నిర్వహించనున్నట్టు కాలేజీ డైరెక్టర్ కొయిలాడ వెంకటేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఆర్ఓ కార్యాలయం సమీపంలోని బొడ్దువారి జంక్షన్ వద్ద ఉన్న కాలేజీలో ఈ కార్యక్రమం జరగనుంది. హెచ్ఎస్ఎన్ టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేళాలో డిక్సన్, ప్రీమియర్, రేడియంట్, స్కైక్వాడ్ ఎలక్ట్రానిక్స్, టీసీఎల్ వంటి సంస్థలు పొల్గొననున్నాయి. ఎంఎఫ్జీ ఆపరేటర్, ఎస్ఎంఏటీ ఆపరేటర్, టెక్సీషియన్, ప్రొడక్షన్, అసెంబ్లీ ఆపరేటర్ వంటి పోస్టులకు నియామకాలు చేపడతారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ అర్హత కలిగిన పురుషులు, మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అభ్యర్థుల వయస్సు గరిష్టంగా 28 సంవత్సరాలు ఉండాలని, ఎంపికై న వారికి రూ.13 వేల నుంచి 25 వేల వరకు నెలసరి వేతనంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ, భోజనం, రవాణా సౌకర్యాలు కల్పించనున్నట్టు తెలిపారు. వెయ్యికి పైగా ఉద్యోగాలు అందుబాటులో ఉండగా స్పాట్ ఆఫర్లు కూడా ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 9866902665, 9908472726 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. సారా ధ్వంసం పాలకొండ రూరల్: పాలకొండ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన 172 లీటర్ల నాటుసారా, 10 లీటర్ల మద్యం సీసాలను బుధవారం ధ్వంసం చేసినట్టు ఆ శాఖ సీఐ కిమిడి సూర్యకుమారి తెలిపారు. సంబంధిత శాఖ కమిషనర్, జిల్లా సూపరింటెండెంట్ ఎ.సంతోష్కుమార్ సూచనలతో అక్రమ మద్యం, సారా తరలింపులో పట్టుబడిన మూడు వాహనాలకు బహిరంగ వేలం ద్వారా ఔత్సాహికులకు అందించినట్టు తెలిపారు. -
బాసంగి సమీపంలో ఏనుగులు
జియ్యమ్మవలస: మండలంలోని వెంకటరాజపురం – సుభద్రమ్మవలస పంట పొలాల్లో బుధవారం ఉదయం ఏనుగులు సంచరిస్తూ కనిపించాయి. దీంతో పార్వతీపురం నుంచి గుమ్మలక్ష్మీపురం ప్రాంతాల ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ మార్గంలో రోజూ వేల సంఖ్యలో ద్విచక్ర వాహనదారులతో పాటు బస్సులు ఇతరత్రా ప్రయాణ వాహనాల ద్వారా తమ గమ్యానికి ప్రజలు చేరుకుంటారు. ప్రస్తుతం ఈ మార్గంలో ఏనుగులు సంచరిస్తుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. మంగళవారం ఉదయం జొన్న, పామాయిల్ తోటల నుంచి బాసంగి ముంపుడు గుండా వెళ్లడంతో ప్రయాణికులు గంటల తరబడి ఎక్కడికక్కడ నిలిచిపోయారు. మధ్యాహ్నం బాసంగి ముంపుడులో తిష్ట వేశాయి. బుధవారం కూడా ఈ ప్రాంతంలోనే ఉండడంతో సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి. -
మారథాన్ పరుగులో రాణిస్తున్న ‘బుగత’
● అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న శ్రీను ● ఆర్మీలో ఉద్యోగం చేస్తూ.. దేశం తరఫున ప్రాతినిధ్యం గజపతినగరం రూరల్: మండలంలోని బంగారమ్మపేట గ్రామానికి చెందిన బుగత శ్రీను అంతర్జాతీయ స్థాయి మారథాన్ పరుగులో రాణిస్తూ అందరి మన్నలు పొందుతున్నాడు. ఓ వైపు దేశ సేవలో తరిస్తూ అథ్లెటిక్స్లో రాణిస్తున్నారు. 2010లో ఆర్మీలో జనరల్ డ్యూటీలో సిపాయిగా చేరిన శ్రీను ప్రస్తుతం మహారాష్ట్రలోని పుణేలో సుబేధార్గా పని చేస్తున్నాడు. ఇదే సమయంలో అథ్లెటిక్స్పై ఉన్న ఆసక్తితో జాతీయ, అంతర్జాతీయ పరుగు పందెంలో దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ ఇప్పటి వరకు సుమారు వంద పతకాలు సాధించాడు. ఈ క్రమంలోనే ఈ నెల 14న న్యూఢిల్లీలో జరిగిన ఐఏయూ 50 కిలోమీటర్ల ప్రపంచ చాంపియన్షిప్లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించి రజిత పతకం సాధించాడు. వివిధ దేశాల నుంచి 42 మంది పాల్గొనగా శ్రీను 14వ స్థానంలో నిలిచాడు. 50 కిలోమీటర్ల పరుగును రెండు గంటల 57 నిమిషాల 49 సెకన్ల వ్యవధిలో ఛేదించి ఈ మైలురాయిని అందుకున్నాడు. అథ్లెటిక్స్పై ఆసక్తి బుగత శ్రీనును సాక్షి బుధవారం కలవగా తనకు చిన్నప్పటి నుంచి పరుగు పందెం అంటే ఇష్టమని చెప్పాడు. చదువుకున్న రోజుల నుంచే పరుగు పందెంలో పాల్గొనేవాడినని, దీని వల్లే తనకు ఆర్మీలో ఉద్యోగం లభించిందని చెప్పుకొచ్చాడు. ఆర్మీలో శిక్షకుల వద్ద తర్ఫీదు పొందానని చెప్పాడు. ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వంద పతకాలు సాధించినట్టు తెలిపాడు. యువత తమ లక్ష్యాలను నిర్దేశించుకుని క్రీడల వైపు పయనించాలని సూచించాడు. -
కాసులతోనే... కు.ని. ఆపరేషన్..!
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో అనేక మంది మహిళలు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స కోసం రూ.వేలల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ సర్కార్ హయాంలో ఈ ఆపరేషన్లకు సొంత డబ్బులు పెట్టుకోవాల్సి రావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జనాభా నియంత్రణలో ప్రధానమైన కుటుంబ నియంత్రణ పట్ల టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో అనేక ప్రభుత్వ ఆస్పత్రులు ఉన్నా.. ప్రైవేటులో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకోవాల్సి రావడం పట్ల మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 48 పీహెచ్సీలు జిల్లాలో 48 పీహెచ్సీలు ఉన్నాయి. బాడంగి, బొబ్బిలి, భోగాపురం, నెల్లిమర్ల సీహెచ్సీలు ఉన్నాయి. ఎస్.కోట, చీపురుపల్లి, రాజాం, గజపతినగరం ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. ఘోషాస్పత్రి, పట్టణంలో కుటుంబ సంక్షేమ కేంద్రం, బొబ్బిలిలో కుటుంబ సంక్షేమ కేంద్రం ఉన్నాయి. వీటిల్లో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేస్తారు. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయడానికి పీహెచ్సీ వైద్యులకు శిక్షణ కూడా ఇచ్చారు. అయినప్పటకీ వీటిల్లో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకోవడానికి వెళ్లిన వారికి ఏదో ఒక కుంటి సాకులు చెప్పి చేయకుండా పంపించేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.20 వేల వరకు వసూలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయకపోవడం వల్ల మహిళలు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. అక్కడ మహిళలు నుంచి రూ.10 వేల నుంచి రూ.20 వేలు వరకు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి బాగోలేని మహిళలు ఒకరు, ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకుంటున్నారు. కొంతమంది ఒక పిల్లతో శస్త్రచికిత్స చేయించుకోగా, మరికొందరు ఇద్దరు పిల్లలతో చేయించుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేయని వైనం! ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న మహిళలు ఉచితంగా జరగాల్సిన వాటికి డబ్బులు చెల్లింపు మెంటాడ మండలానికి చెందిన కె.కొండ ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రిని ఆశ్రయించింది. అక్కడ ఆమెకు ఈ శస్త్రచికిత్స చేసేందుకు సదరు ఆస్పత్రి వారు రూ.10వేలు తీసుకున్నారు. ఉచితంగా చేయాలి.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు ఉచితంగా చేయాలి. ఎక్కడైనా చేయకపోతే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. – డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఎంహెచ్ఓ, విజయనగరం -
కానిస్టేబుల్ కుటుంబానికి చేయూత
విజయనగరం క్రైమ్ : కానిస్టేబుల్ టి.తిరుపతిరావు కుటుంబానికి తోటి సిబ్బంది, బ్యాచ్మేట్స్ తమ వంతు ఆర్థిక సాయం చేశారు. గజపతినగరం పోలీసు సర్కిల్, జుడిషియల్ సిబ్బంది రూ.4.30 లక్షల నగదును ఎస్పీ ఏఆర్ దామోదర్ చేతుల మీదుగా డీపీఓలో ఈ మేరకు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సహోద్యోగి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. 2012 బ్యాచ్కు చెందిన గజపతినగరం కానిస్టేబుల్ టి.తిరుపతిరావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. తిరుపతిరావు కుటుంబ పరిస్థితిని గుర్తించిన సహచర సిబ్బంది, అతని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు నగదు సేకరించి కుటుంబ సభ్యులకు అందజేశారు. తిరుపతిరావు కుటుంబానికి జిల్లా పోలీసు శాఖ అండగా ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు. అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, గజపతినగరం సీఐ జీఏవీ రమణ, ఎస్ఐ కె.కిరణ్కుమార్నాయుడు తదితరులు ఉన్నారు. -
భామిని తహసీల్దార్పై వీఆర్ఏల ఫిర్యాదు
భామిని: భామిని తహసీల్దార్ శివన్నారాయణపై భామిని మండల గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ)లు బుధవారం సబ్కలెక్టర్ స్వప్నిల్ జగన్నాథ్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వీఆర్ఏలతో తహసీల్దార్ వెట్టిచాకిరీ చేయిస్తున్నారని, సమయపాలన లేకుండా అర్ధరాత్రి వరకు విధుల పేరున వేధిస్తున్నారని ఆరోపించారు. తహసీల్దార్ తాత్కాలికంగా ఉంటున్న బత్తిలి ఇంటిలోనూ, సీతా నగరం మండలం మరిపువలస గ్రామంలోని సొంత ఇంటి వద్ద వీఆర్ఏలతో వెట్టిచాకిరీ పనులు చేయిస్తున్నారని వాపోయారు. కులంపేరుతో దూషిస్తూ, తహసీల్దార్ కార్యాలయం వద్ద సిమెంట్ కట్టు పను లు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంత రం పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణకు కూడా ఫిర్యాదు చేసినట్టు వీఆర్ఏల సంఘం జిల్లా కార్యదర్శి బుడుమూరు మిన్నారావు, మండలాధ్య క్షుడు నిమ్మల కర్ణ తెలిపారు. కార్యక్రమంలో 16 మంది వీఆర్ఏలు పాల్గొన్నారు. -
జీఓ 5ను ఉపసంహరించుకోవాలి
పార్వతీపురం రూరల్ : దుకాణాలు, వాణిజ్య సంస్థలను 24 గంటల పాటు తెరిచి ఉంచేందుకు అనుమతినిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబరు 5ను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం పార్వతీపురంలోని సుందరయ్య భవనం నుంచి కలెక్టరేట్ వరకు ఆ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బారావమ్మ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయం కార్మిక చట్టాల మౌలిక లక్ష్యాలకు విరుద్ధంగా ఉందన్నారు. అహోరాత్రులు సంస్థలు తెరిచి ఉంచడం వల్ల అసంఘటిత రంగంలోని చిన్న దుకాణాలు, హోటళ్లు, మాల్స్ కార్మికులపై పని భారం పెరిగి శ్రమదోపిడీకి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే లేబర్ కోడ్ల వల్ల ఉద్యోగ భద్రత దెబ్బతింటుందని, తాజా జీఓ కార్మికులకు మరింత నష్టం చేస్తుందని పేర్కొన్నారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే కార్మిక సంఘాలను ఏకం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నేతలు డి.రమణారావు, వై.మన్మధరావు, ఎన్.వై.నాయుడు, వి.ఇందిర, రెడ్డి వేణు, జి.జ్యోతి పాల్గొన్నారు. -
అన్ని రంగాల్లోనూ ప్రభుత్వ వైఫల్యం
● రైతాంగం నడ్డివిరిస్తోన్న చంద్రబాబు ప్రభుత్వం ● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విజయనగరం: సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. ధర్మపురిలోని సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదిమందికి పట్టెడన్నం పెట్టే రైతాంగాన్ని ప్రభుత్వం ఇబ్బందులు పాలుజేస్తోందన్నారు. ఎన్నికలకు ముందు అన్నదాత సుఖీభవ పేరిట రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.20వేలు ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు... గడిచిన రెండేళ్లలో రూ.40వేలు జమ చేయాల్సి ఉండగా... ఇప్పటి వరకు కేవలం రూ.14వేలు మాత్రమే జమ చేశారన్నారు. కౌలురైతులకు పథకం అందని ద్రాక్షగా మార్చారని విమర్శించారు. పంట పండించేందుకు అవసరమైన యూరియా కావాలంటే రైతన్నలు లాఠీదెబ్బలు తినాల్సిన దుస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సహకార సంఘాల ద్వారా రుణాలు అందక రైతు కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయన్నారు. వివిధ రకాల పంటలకు మార్కెట్లో గిట్టుబాటు ధరలేక ఉగాదివేళ రైతన్నలు ఘోషిస్తున్నా ఎమ్మె ల్యేలు, మంత్రులు, అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరించడం అన్యాయమన్నారు. ● జిల్లాలో వరి తరువాత అత్యధికంగా సాగుచేసే మొక్కజొన్న పంటకోత ప్రారంభమైందని, తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి క్వింటా రూ.2,400 చొప్పున కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ● పాలన ముగిసిన స్థానిక సంస్థల పాలకవర్గాలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని మజ్జి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఐదేళ్ల పాలనను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఉమ్మడి విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థలైన విజయనగరం కార్పొరేషన్, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీలు, నెల్లిమర్ల నగర పంచాయతీల పాలకవర్గాలను అభినందించారు. -
● ఉద్యోగాల ఎర.. ● నిరుద్యోగ యువతే లక్ష్యం ● రూ.లక్షల్లో దోచేస్తున్న ప్రబుద్ధులు
సాక్షి, పార్వతీపురం మన్యం: ఉద్యోగాలు.. ఉపాధి పేరిట నిరుద్యోగులను కొంతమంది బురిడీ కొట్టిస్తున్నారు. అమాయకులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని కొందరు.. వివిధ యూనిట్లు ఇప్పిస్తామని మరికొందరు ఎరవేసి రూ.లక్షలు కాజేస్తున్నారు. జిల్లాలో ఈ ఘటనలు పెరిగిపోతున్నా యి. వెలుగులోకి వచ్చిన ఘటనలు కొన్ని అయితే.. మోసపోయామని గ్రహించి, పోలీసులకు ఫిర్యాదుచేస్తే ఆ డబ్బులు కూడా వస్తాయో, రావో అని భయంతో ఇంకొందరు బాధితులు లబోదిబోమంటున్నారు. ఉద్యోగం వస్తుందన్న ఆశతో అప్పులు చేసి అడిగినంత కడుతున్నారు. అవి తీర్చలేక అవస్థ లు పడుతున్నారు. ఇటువంటి ఘటనలపై పోలీసులకు పరిమిత సంఖ్యలోనే ఫిర్యాదులు వెళ్తున్నాయి. కొన్నిచోట్ల ఏజెన్సీలు, థర్డ్ పార్టీ సంస్థల పేరిట టోకరా వేస్తున్నారు. రాజకీయ పార్టీల నేతలూ తక్కువ తినడం లేదు. ఇటీవల అంగన్వాడీ ఉద్యోగాలు, కేజీబీవీల్లో పోస్టులపేరిట భారీగా నొక్కేశా రు. ఉద్యోగాలు రాని బాధితులు అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఈ తరహా ఘటనలు కొద్ది రోజులుగా కురుపాం, పార్వతీపురం, సాలూరు వంటి చోట్ల వెలుగులోకి వచ్చాయి. పార్వతీపురంలో ఉద్యోగాల వ్యవహారమై టీడీపీకి చెందిన వ్యక్తుల మధ్య ఆడియో సంభాషణ బయట పడిన విషయం విదితమే. వారి మాటల్లో రూ.కోట్లు చర్చకు రావడం గమనార్హం. తమకు ఉన్న పలుకుబడిని ఉపయోగించుకుని నిరుద్యోగులకు అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎర వేస్తున్నారు. ●ఇటీవల కురుపాం నియోజకవర్గానికి చెందిన సుమారు 75 మంది గిరిజన యువత కలెక్టరేట్ పీజీఆర్ఎస్కు వచ్చారు. స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర లో ఉద్యోగాలు అంటూ తమ వద్ద ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షల వరకూ కాజేశారని వాపోయారు. వీరికి ఇచ్చిన నియామక పత్రాలతో నాలుగైదు నెలలు తమకు అప్పగించిన పంచాయతీల్లో విధులు కూడా చేపట్టారు. ఎంతకీ జీతాలు రాకపోవడంతో ఆరా తీయగా.. అప్పటికి గానీ, తెలియలేదు.. వారంతా మోసపోయారని. ●బలిజిపేట మండలం గళావల్లి గ్రామానికి చెంది న టొంపల పరశురామ్కు పీఎంఈజీపీ పథకం కింద రూ.10 లక్షల రుణాన్ని ఇప్పిస్తామని పలగర -
నమ్మితే.. నట్టేట ముంచేస్తారు!
గ్రామానికి చెందిన వి.రామకృష్ణ నమ్మించాడు. రూ.35 వేలు నగదు తీసుకొని మోసగించారని బాధితుడు బలిజిపేట పోలీసులకు రెండు రోజుల కిందట ఫిర్యాదు చేశాడు. అదే గ్రామానికి చెందిన మరికొంతమంది వద్ద కూడా మొత్తం రూ. 1,56,000 వసూలు చేసినట్లు బాధితులు ఆరోపించారు. తిరిగి డబ్బులు ఇవ్వాలని కోరితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ●వీరఘట్టం మండలానికి చెందిన ఓ వ్యక్తి నకిలీ ఆర్డర్ కాపీ, ఫేక్ ఐడీ కార్డు చూపించి, విశాఖకు చెందిన మరొకరితో కలిసి రైల్వేలో ఉద్యోగాలపేరిట మోసాలకు పాల్పడ్డాడు. రూ.లక్షల్లో దోచేశారు. బాధితులు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ●సీతంపేట మండలం బెనరాయికి చెందిన ముగ్గు రు గిరిజన యువకులకు ఉద్యోగాలిప్పిస్తామని నమ్మించి వారి నుంచి రూ.2.50 లక్షల చొప్పున అదే మండలానికి చెందిన దంపతులు దోచేశారు. -
పరాభవనామ సంవత్సరాదికి స్వాగతం
గురువారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2026పొట్టకూటి కోసం వెళ్లిన శ్రమజీవులు... కష్టాన్ని ‘మూట’గట్టుకుని తిరుగుపయనమయ్యారు. గరుగుబిల్లి మండలం సింగ నాపురం గ్రామానికి చెందిన సుమారు 25 మంది కూలీలు 12 రోజుల కిందట మచిలీ పట్నం వెళ్లారు. అక్కడ మినప చేలల్లో కూలిపనులు ముగించుకుని వచ్చిన డబ్బు లతో ఉగాది వేళ ఊరికి చేరుకున్నారు. పార్వతీపురం బస్టేషన్కు చేరుకుని అక్కడి నుంచి తమ గ్రామానికి వెళ్తున్న కూలీలను చిత్రంలో చూడొచ్చు. – పార్వతీపురం రూరల్ చైత్రమాసం.. వసంత రుతువు.. శిశిరంలో మోడైపోయిన చెట్లన్నీ చిగుళ్లు తొడిగే ఆహ్లాదకర వాతావరణంలో వచ్చే పరాభవనామ తెలుగు సంవత్సరాదికి విజయనగరం బాబామెట్టలోని వరలక్ష్మి నాట్యాలయం విద్యార్థినులు సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. షడ్రుచుల సమ్మేళనమే జీవితమని చెబుతూ ఉగాది పచ్చడిని బుధవారం పంచిపెట్టారు. తెలుగు సంవత్సరాది జిల్లా ప్రజలందరికీ శుభాలివ్వాలని ఆకాంక్షించారు. – సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం -
మహనీయుడు పొట్టి శ్రీరాములు : డీఈఓ
విజయనగరం టౌన్: భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు విశేష కృషి చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములని డీఈఓ మాణిక్యం నాయుడు అన్నారు. మహారాజా ప్రభుత్వ సంస్కృత ఉన్నత పాఠశాల ఆవరణలో మంగళవారం పొట్టి శ్రీరాముల విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 58 పాఠశాలల్లో అమరజీవి విగ్రహం ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. ఎంఈఓ ఆనందమూర్తి మాట్లాడుతూ తెలుగువారికి ఆంధ్రరాష్ట్రం ప్రత్యేకంగా ఉండాలని ఆమరణ దీక్ష చేసిన మహనీయుడన్నారు. ఎంఈఓ 2వ అధికారిణి సత్యవతి పొట్టి శ్రీరాములు త్యాగ నిరతని వివరించారు. హెచ్ఎం లలిత విగ్రహ ఏర్పాటు చేసిన సమితి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సమితి వ్యవస్ధాపక అధ్యక్షుడు చెరుకూరి నాగరాజు, ముఖ్య సలహాదారు రవ్వా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బత్తుల కామేష్, కోశాధికారి ఆరిశెట్టి సందీప్, ఉపాధ్యక్షుడు డిమ్స్ రాజు, కోచైర్మన్ సముద్రాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
నిరసన తెలిపితే నిర్బంధమా?
సీతంపేట: టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడు వెంటనే తన పదవి నుంచి వైదొలగాలంటూ మహిళలు తిరుపతిలో ఆయన బస చేసిన హోటల్ వద్ద నిరసన వ్యక్తం చేస్తే టీడీపీ గుండాలతో దాడి చేయించడం ఎంతవరకు సమంజసమని పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పార్టీ నాయకులతో కలసి అంబేడ్కర్ చిత్ర పటం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. కళంకితుడిగా తేలినా ప్రశ్నిస్తే దాడిచేయడం, విజిలెన్స్ వారితో బెదిరించడం, ఇంకా కేసులు పెట్టడం, పదవి పట్టుకుని వ్రేలాడడం, జాతీయ మీడియా ఏకి పారేస్తున్నా చంద్రబాబులో మాత్రం ఎటువంటి చలనం లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన సమయం ఇదేనని వెంటనే బీఆర్ నాయుడుని టీడీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలన్నారు. అడ్డంగా వీడియో, ఫొటోలతో దొరికిపోయినా నిస్సిగ్గుగా మళ్లీ తిరుమలకు వచ్చి వెంకటేశ్వరస్వామి క్షేత్రాన్ని అపవిత్రం చేస్తున్నాడన్నారు. చంద్రబాబు ప్రోత్సాహంతోనే ఇవన్నీ జరుగుతున్నాయన్నారు. తనను లైంగికంగా వేధిస్తున్నారని ఇలాంటి వ్యక్తికి ఎటువంటి బాధ్యతలు ఇవ్వొద్దని, ఒక మహిళ స్వయంగా గతంలో పూర్తి వివరాలతో లేఖ రాసినా చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
కుప్పిలి పద్మకు పతంజలి పురస్కారం
విజయనగరం టౌన్: కెఎన్వై.పతంజలి సాహితీ పురస్కారానికి ఈ ఏడాది ప్రముఖ సీ్త్రవాద రచయిత్రి కుప్పిలి పద్మని ఎంపిక చేసినట్టు పతంజలి సాంస్కృతిక వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి పేర్కొన్నారు. ఈ మేరకు గురజాడ స్వగృహంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 29న గురజాడ కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించే పతంజలి జయంతి కార్యక్రమంలో పురస్కారాన్ని ఆమెకు ప్రదానం చేస్తామన్నారు. ఇప్పటివరకూ మోహన్, దేవీప్రియ, సతీష్ చందర్, జిఆర్.మహర్షి, గంటేడ గౌరునాయుడు, అట్టాడ అప్పలనాయుడు, చింతకింది శ్రీనివాసరావు, రౌతు బంగారునాయుడు, అరుణ పప్పు, తాడి ప్రకాష్లకు అందజేశామన్నారు. ఈ ఏడాది కుప్పిలి పద్మను కమిటీ ఎంపిక చేసిందన్నారు. ఆమె వార్తలో మైదానం శీర్షికన సమకాలీన అంశాలపై స్పందించిన తీరు తెలుగు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారన్నారు. సుమారు 159 కథలు రాశారన్నారు. వాటిలో ఆరు నవలలు ఉన్నాయని, ప్రధానంగా కరోనా సమయంలో మళ్లీ తేయాకు తోటలోకి పేరిట కార్మికుల జీవితాల్లోని ఒడిదుడుకులను చాలా హృద్యంగా రచించారన్నారు. ఆమె ప్రతిభా పాటవాలకు గుర్తుగా ఎన్నో అవార్డులు ఆమెను వరించాయన్నారు. పద్మ మన ఉత్తరాంధ్రాకు చెందిన ప్రముఖ మహిళా రచయిత్రి కావడం మరింత గర్వకారణమన్నారు. సమావేశంలో వేదిక కార్యదర్శి ఎన్కె.బాబు, ప్రతినిధులు విఎమ్కె.లక్ష్మణరావు, బి.నాగేంద్రప్రసాద్, పి.ప్రభాకరరావు, జలంత్రి రామచంద్ర, తాడేపల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
‘ఉపాధి’ని నిర్వీర్యం చేస్తున్న పాలకులు
జామి: ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. జామిలో ఎస్.కోట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ గేదెల తిరుపతి ఆధ్వర్యంలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా మంగళవారం రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పేరు మార్చిందన్నారు. వేతనదారులకు అన్యాయం చేసిందన్నారు. ఎక్కడ కూడా వంద రోజుల పనిదినాలు కల్పించడం లేదని, చేసిన పనులకు సకాలంలో బిల్లులు చెల్లించడం లేదని ధ్వజమెత్తారు. ఉపాధి పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం భరించాలని బీజేపీ ప్రభుత్వం చెప్పడం కేవలం పథకాన్ని నీరుగార్చడమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఫ్రీ బస్సుల పుణ్యమా అని విద్యార్థులకు బస్సులు ఆపడం లేదన్నారు. పలువురు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంటు విడుదల చేయడం లేదని దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తాండ్రంగి, విజినిగిరి తదితర గ్రామాలకు బస్సులు లేవని కళాశాలలకు వెళ్లాలంటే నానా అవస్థలు పడుతున్నామని విద్యార్థులు చెప్పడంతో బస్సులు లేకుండా ఫ్రీ బస్సు పథకం ఎందుకని ప్రశ్నించారు. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు కూటమిలోని నేతలు ఇచ్చిన హామీలు మరచిపోయారన్నారు. ఎస్.కోట మండలంలో జిందాల్ కంపెనీ బాధిత రైతులను మోసం చేసిందన్నారు. జామిలో ఇనాం భూముల సమస్య తీవ్రంగా ఉందని, రైతులు ఇబ్బందులు పడుతున్నామని షర్మిలకు తెలిపారు. కలెక్టర్తో ప్రత్యేకంగా మాట్లాడతానని, కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎంకు లేఖ రాస్తానని చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎం.విద్యాసాగర్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు సుంకరి గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల -
ప్రతిభ కనబరిస్తే ప్రోత్సాహకం : ఎస్పీ
విజయనగరం క్రైమ్ : విధి నిర్వహణలో ప్రతిభ కనబరిస్తే ప్రోత్సాహకాలు అందిస్తామని ఎస్పీ దామోదర్ అన్నారు. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడడంతో, చోరీలు, హిట్ అండ్ రన్ కేసులను ఛేదించడం తదితర అంశాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన పోలీసు అధికారులు, సిబ్బందిని డీపీలో మంగళవారం ఎస్పీ అభినందించారు. ప్రోత్సాహక నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు సిబ్బందిని ప్రోత్సహిస్తే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయన్నారు. క్షేత్ర స్థాయిలో క్రియాశీలకంగా పని చేసే వారిని గుర్తించి ప్రోత్సహిస్తే మిగతా వారు స్ఫూర్తిగా తీసుకుంటారన్నారు. ప్రశంసా పత్రాలు అందుకున్న వారిలో సీఐలు టి.శ్రీనివాసరావు, ఎల్.అప్పలనాయుడు, హెచ్ ఉపేంద్ర, ఎస్ఐలు డి.సాయికృష్ణ, వై.వీరజనార్దన్, యు.మహేష్, ఎస్.సుదర్శన్, చంద్రశేఖర్, ఆర్.గోపాలరావు, కె.లక్ష్మణరావు, హెచ్సీలు ఎండీ ఇమ్రాన్ఖాన్, డి.శంకరరావు, పీసీలు ఎరుబోతు సురేష్కుమార్, ఎం.వాసు, కేవీ గణేష్, షేక్ షపీ, ఆర్.శివరావు, బి.నర్సింగరావు, సీహెచ్ జగ్గునాయుడు, పి.శివ, ఎ.సంతోష్, వై.సురేష్కుమార్, ఎం.రమేష్, జి.సింహాచలం, ఎన్.కృష్ణకిశోర్, టి.సురేష్, కె.అప్పారావు, సీహెచ్ పవన్కుమార్, జె.చంద్రరావు, పి.పాపినాయుడు, ఎం.వెంకటరమణ, బొంతు రాంబాబు తదితరులు ఉన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సైలెన్స్ర్లు ధ్వంసం భారీ శబ్దాలు, దట్టమైన పొగలతో సైలెన్స్ర్లు వాడితే సంబంధిత బైక్స్ను సీజ్ చేస్తామని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా బైక్లకు అమర్చిన 550 సెలెన్స్ర్లను సీజ్ చేశారు. అనంతరం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఎస్పీ సమక్షంలోనే నగరంలోని ట్యాంక్ బండ్ వద్ద రోడ్డు రోలరుతో వాటిని ధ్వంసం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సైలెన్స్ర్లు అమర్చిన వారికి ఒక్కొక్కరికీ రూ.1500 జరిమానా విధించారు. ఇన్చార్జ్ డీఎస్పీ ఆర్.గోవిందరావు, ట్రాఫిక్ సీఐ సూరినాయుడు, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, టుటౌన్ సీఐ టి.శ్రీనివాసరావు, వన్టౌన్ ఎస్ఐ శంభాన రవి, ట్రాఫిక్ ఎస్ఐలు ఎస్.భాస్కరరావు, నూకరాజు, చిన్నారావు, హెచ్సీ సింహాచలం, భాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు. -
పనుల్లేక..
నా చిన్నతనం నుంచి టైలరింగ్ చేస్తున్నా.. గతంలో ఎంతో వైభవంగా ఉండే ఈ వృత్తి ప్రస్తుతం రడీమేడ్ రాకతో కుదేలైంది. ప్రస్తుతం పనుల్లేక ఖాళీగా ఉంటున్నాం. పండగల సమయంలో కూడా పనులు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఇంతకు ముందు పండగల సమయంలో రాత్రి పగలు పనిచేసేవాళ్లం. –డి.సూర్యగణపతి, టైలర్, రాజాం ప్రభుత్వం ఆదుకోవాలి.. టైలరింగ్ పనిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. పనుల్లేక చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. చాలా మంది రడీమేడ్ దుస్తులు వాడడంతో కుట్టించుకునే వారి సంఖ్య తగ్గిపోతుంది. ఇతర వృత్తి చేసుకోలేక జీవనాన్ని నెట్టుకొస్తున్నాం. రోజు కూలి గిట్టుబాటు అయితే చాలు అన్న చందంగా టైలర్ల పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఆదుకోవాలి. – కె.సత్యం, టైలర్, వస్త్రపురి కాలనీ, రాజాం -
నిబంధనల మేరకే క్వారీ నిర్వహణ జరగాలి : జేసీ
సీతానగరం: మండలంలోని నిడగల్లు గ్రామ పరిధిలో రెండు ప్రతిపాదిత క్వారీల నిర్వహణపై మంగళవారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తుల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను ఆయన స్వయంగా స్వీకరించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ క్వారీ నిర్వహణలో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలని, కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను తు.చ తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులు, నిర్వాహకులను ఆదేశించారు. క్వారీ వల్ల చుట్టుపక్కల పొలాలకు, గాలికి ఎటువంటి నష్టం కలగకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలన్నారు. గ్రామస్తులు లేవనెత్తిన అంశాలను రికార్డు చేశామని, వాటిని నివేదిక రూపంలో ప్రభుత్వానికి, పర్యావరణ కమిటీకి పంపిస్తామని జేసీ తెలిపారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. -
రామతీర్థంలో వైభవంగా మాసశివరాత్రి పూజలు
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థాన క్షేత్ర పాలకులగా విరాజిల్లుతున్న ఉమాసదాశివస్వామి వారి ఆలయంలో మాస శివరాత్రి పూజలు మంగళవారం వైభవం జరిగాయి. ఆలయ అర్చకులు రేజేటి మల్లిఖార్జున శర్మ ఆధ్వర్యంలో ముందుగా గణపతి పూజ, ప్రత్యేక హోమం అనంతరం శివుడికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, వివిధ రకాల ఫల రసాలతో విశేష అభిషేకాలు జరిపించారు. అనంతరం కామాక్షి అమ్మవారి సన్నిధిలో కుంకుమ పూజలు చేపట్టి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కా ర్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
అవగాహన ఒప్పందం
విజయనగరం రూరల్: విజయనగరం జేఎన్టీయూ–జీవీ, హైదరాబాద్కు చెందిన మెటా–గేట్ కోచింగ్ సంస్థ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. స్థానిక జేఎన్టీయూ జీవీలో మంగళవారం జరిగిన ఎంఓయూలో ఇరు సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా జేఎన్టీయూ జీవీ ప్రిన్సిపాల్ కేసీబీ రావు మాట్లాడుతూ మెటా–గేట్ కోచింగ్ విద్యా సంస్థ మెటలర్జికల్ ఇంజినీరింగ్ విభాగంలో దేశంలోనే చురుగ్గా పని చేస్తున్న సంస్థని తెలిపారు. ఇంజినీర్ల కోసం గేట్ ప్రవేశ పరీక్షకు సిద్ధం చేయడంలో సహాయపడుతుందని తెలిపారు. ఆనన్లైన్ శిక్షణ, స్టడీ మెటీరియల్స్, కెరీర్ గైడెన్స్ అందిస్తారని పేర్కొన్నారు. గతంలో ఉత్తీర్ణులైన కొందరు విద్యార్థులు వారి శిక్షణ ద్వారా ప్రయోజనం పొందుతున్నారని తెలియజేశారు. మెటలర్జికల్ ఇంజినీరింగ్లో బీటెక్/ఎం.టెక్ చదువుతున్న, ప్రతిభావంతులైన, ఆర్థికంగా వెనుకబడిన జేఎన్టీయూ–జీవీ విద్యార్థులకు సహాయం చేయడానికి, గేట్ పరీక్షకు నాణ్యమైన శిక్షణను అందించడానికి మెటా–గేట్ కోచింగ్ ముందుకు వచ్చిందన్నారు. విశ్వవిద్యాలయం విద్యార్థులకు గేట్ ఆన్లైన్ వీడియో లెక్చర్లను చూసేందుకు యాక్సెస్ అందించడం, ఆన్లైన్ టెస్ట్ సిరీస్లను రాసేందుకు యాక్సెస్ అందించడం, ప్రత్యేక సందేహల నివృత్తి సందేహాలను నిర్వహించడం, బార్క్ పరీక్షకు ప్రిపరేషన్, ఇంటర్వ్యూలపై మార్గదర్శకత్వం అందిస్తుందన్నారు. పీఎస్యూ, ప్రభుత్వ పరీక్షల (మెటలర్జికల్ – మెటీరియల్స్ ఇంజినీరింగ్కు సంబంధించినవి) ప్రిపరేషన్ ఇంటర్వ్యూల కోసం మార్గదర్శకత్వం వంటి సేవలను అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో మెటలర్జీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ కె.శ్రీనివాస ప్రసాద్, మెటా–గేట్ కోచింగ్ సంస్థ ప్రతినిధి సుభ్రదీప్ పాల్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యునిగా బెల్లాన
విజయనగరం లీగల్: రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యునిగా బెల్లాన రవి ఘన విజయం సాధించారు. ఈ మేరకు రాష్ట్ర బార్ కౌన్సిల్ మంగళవారం ప్రకటించింది. రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. బెల్లాన రవి విజయనగరం న్యాయవాదుల సంఘం అధ్యక్షునిగా, జిల్లా వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షునిగా పని చేశారు. ఈయన చీపురుపల్లికి చెందిన ప్రముఖ న్యాయవాది, దివంగత బెల్లాన సింహాచలం రెండవ కుమారుడు. చీపురుపల్లిపల్లికి చెందిన బెల్లాన రవి విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్కి స్వయానా సోదరుడు. ఈయన ఎంపిక పట్ల బార్ కౌన్సిల్ మాజీ వైస్ చైర్మన్ కోలగట్ల తమ్మన్న శెట్టి, జిల్లా వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఏఎన్వీకే అంజనీకుమార్ హర్షం వ్యక్తం చేశారు. విజయనగరం న్యాయవాదుల సంఘం అధ్యక్షులు కలిశెట్టి రవిబాబు, కార్యదర్శి నళితం సురేష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. బాక్సింగ్లో మోడల్ స్కూల్ విద్యార్థుల సత్తా భామిని: స్థానిక ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు బాక్సింగ్లో సత్తా చాటారు. ఈ నెల 16న విశాఖపట్నంలో జరిగిన జూనియర్ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో పలు విభాగాల్లో విజేతలుగా నిలిచారు. ఎస్.శ్రావ్య, పి.ప్రసన్న, సీహెచ్ వాహిని, సీహెచ మనీషా, డి.చందు, ఎ.అమృతవల్లి పలు స్థానాల్లో నిలిచారు. వీరిని ప్రిన్సిపాల్ బాబూరావు, పీజీటీ శివరాంప్రసాద్, కోచ్ కె.సోమేష్తో పాటు సిబ్బంది తదితరులు సన్మానించారు. దుర్గాదేవి ఆలయంలో చోరీ గుర్ల: మండలంలోని పున్నపురెడ్డిపేట దుర్గాదేవి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. సుమారు అర తులం బంగారు, 240 గ్రాముల వెండి అభరణాలు అపహరణకు గురయ్యాయని ఆలయ ధర్మకర్త పి.రామరావు గుర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ పి.నారాయణరావు సంఘటన స్థలానికి చేరుకొని దుర్గాదేవి ఆలయాన్ని పరిశీలించారు. జిల్లా కేంద్రం నుంచి డాగ్, క్లూస్ టీంలు రంగంలోకి దిగి ఆలయ ప్రాంగణాన్ని క్షుణంగా పరిశీలించి క్లూస్ సేకరించారు. వారం రోజులు కిందట కూడా పున్నపురెడ్డిపేటలో ఒక ఇంట్లో సుమారుగా ఆరు తులాలు బంగారు అభరణాలు దొంగతనానికి గురయ్యాయి. వరుసగా జరుగుతున్న దొంగతనాలతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. దుర్గాదేవి ఆలయంలో బంగారు అభరణాలు దొంగతనంపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని ఎస్ఐ నారాయణరావు తెలిపారు. ఎస్పీ ఇఫ్తార్ విందు విజయనగరం క్రైమ్ : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఎస్పీ ఏఆర్ దామోదర్ ముస్లిం పోలీసు అధికారులు, సిబ్బందికి జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రంజాన్ మాసం శాంతి, సహనం, సేవాభావానికి ప్రతీకని పేర్కొన్నారు. మనందరం భారతీయులమని అన్నారు. మన మధ్య కుల, మత బేధాలు లేవని, సోదర భావం మాత్రమే ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ముస్లిం పోలీసు అధికారులు, సిబ్బంది ఎస్పీని వారి మత సాంప్రదాయం ప్రకారం సత్కరించారు. అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎస్పీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బైక్ అదుపు తప్పి ఇద్దరికి తీవ్ర గాయాలు పార్వతీపురం రూరల్ : కొమరాడ మండలంలోని చంద్రంపేట గ్రామానికి చెందిన మోజేషు, గణేష్ మంగళవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తమ గ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై తోటపల్లి వైపు వెళ్తుండగా, దేవస్థానం సమీపంలో వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న మోజేషుతో పాటు వెనుక కూర్చున్న గణేష్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, వారిని చికిత్స నిమిత్తం పార్వతీపురం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులు అక్కడ చికిత్స పొందుతున్నారు. -
టిప్పర్ పట్టివేత
బొబ్బిలి రూరల్: మండలంలోని ఎం బూర్జివలస వద్ద ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా జేసీబీతో చెరువులో మట్టిని తవ్వి తరలిస్తున్న టిప్పర్ను రెవెన్యూ అధికారులు సోమవారం రాత్రి దాడి చేసి పట్టుకున్నారు. జేసీబీ డ్రైవర్ తప్పించుకుని అక్కడ నుంచి పారిపోగా.. మట్టితో నిండిన టిప్పర్ను స్వాధీనం చేసుకున్నామని ఆర్ఐ రామ్కుమార్ తెలిపారు. ఈ మేరకు మైనింగ్ శాఖ సూచనలతో మట్టితో దొరికిన టిప్పర్కు 16,200 రూపాయిలు జరిమానా విధించిందని తహసీల్దార్ ఎం.శ్రీను తెలిపారు. ఇక మీదట మట్టి, గ్రావెల్ అక్రమ తవ్వకాలు, తరలింపులకు పాల్పడితే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. -
న్యూరోసర్జరీ పరికరంపై పరిశోధనకు గుర్తింపు
విజయనగరం ఫోర్ట్: అధునాతన న్యూరోసర్జరీ పరికరంపై పరిశోధనకు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి న్యూరోసర్జరీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రెడ్డి శంకరరావు, వైద్య కళాశాల ఎంబీబీఎస్ విద్యార్థి వి. డానీకి గుర్తింపు లభించింది. ఈ నెల 16న విశాఖపట్నంలోని గీతం మెడికల్ కాలేజీలో జరిగిన సమ్మిట్లో సమర్పించిన ‘ సర్టన్ లెడ్ నోవెల్ క్రానియోటోట్ అడాప్టర్ టు కన్వర్ట్ సర్టిఫైడ్ ఇంటి/డెంటల్ డ్రిల్ సిస్టమ్ ఆన్ ఎ న్యూరోసర్జరీ డ్రిల్ సిస్టం’ అనే విన్నూత పరిశోధన పత్రానికి ద్వితీయస్థానం లభించింది. రూ.34 వేలు నగదు లభించింది. పరిశోధకులను స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ బి.దేవీమాధవి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లోక్నాఽథ్, సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ అభినందించారు. -
3 కిలోల క్యాబేజీ బుట్ట రూ.5
ఏరువాకకు సన్నద్ధం తెలుగు సంవత్సరాది ఉగాదికి ఏరువాకకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 19వ తేదీన ఏరువాకకు వీలుగా కొత్తనాగళ్లను తయారుచేయిస్తున్నారు. గరుగుబిల్లి, చినగుడబ, వల్లరగుడబ, పెద్దూరు, లఖనాపురం, కొత్తపల్లి, తదితర గ్రామాల్లో కొత్తనాగళ్ల తయారీలో వడ్రంగులు బిజీ అయ్యారు. గతంలో రూ.800 ఉన్న నాగళి ఈ ఏడాది రూ.1000 నుంచి రూ.1200 పలుకుతున్నట్టు రైతులు చెబుతున్నారు. – గరుగుబిల్లి క్యాబేజీ బుట్ట ధర అమాంతం పడిపోయింది. నెల రోజుల కిందట మార్కెట్లో మూడుకిలోల బరువుతూగే బుట్ట ధర రూ.100 పలికేది. ఇప్పుడు రూ.5కు విక్రయించినా కొనుగోలుచేసేవారు కరువయ్యారంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. పంట చేతికొచ్చినా కోత, రవాణా ఖర్చులు రాకపోవడంతో పొలంలోనే విడిచిపెడుతున్నారు. కళ్లముందే ఎండిపోతున్న పంటను చూసి కన్నీరుపెడుతున్నారు. రైతు కష్టాలను పట్టించుకోని ప్రభుత్వతీరుపై నిట్టూర్చుతున్నారు. – వీరఘట్టం -
గ్యాస్ బండ రూ.2000..!
● బ్లాక్మార్కెట్లో విక్రయం ● తప్పనిసరి పరిస్థితిలో హోటల్ వ్యాపారుల కొనుగోలు కురుపాం: ఇరాన్– ఇజ్రాయిల్ మధ్య సాగుతున్న యుద్ధంతో వంటగ్యాస్ కొరత అక్రమ వ్యాపారులకు కాసుల వర్షం కురుపిస్తోంది. ఇదే అదునుగా తీసుకున్న గ్యాస్ అక్రమ నిల్వదారులు తమవద్ద ఉన్న సిలిండర్లను స్థానిక హోటల్స్కు, టిఫిన్ సెంటర్లకు గుప్ చుప్గా అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఒక్కో సిలిండర్ను రూ.2000కు విక్రయిస్తున్నట్టు సమాచారం. ఒక గ్యాస్ సిలిండర్ ధర రూ.980కు గ్యాస్ ఏజన్సీ నుంచి వినియోగదారునికి సరఫరా అయ్యేది . ప్రస్తుతం గ్యాస్ కొరత కారణంగా వ్యాపారులు అవసరాన్ని బట్టి అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. మూత పడుతున్న చిరువ్యాపార సముదాయాలు గ్యాస్ కొరత కారణంగా బ్లాక్ మార్కెట్లో ఎక్కువ ధరను పెట్టి కొనుగోలు చేయలేని ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, టీ పాయింట్స్, టిఫిన్ సెంటర్లు మూతపడగా మరికొంత మంది మాత్రం అధిక ధరకు గ్యాస్ దిమ్మలను కొనుగోలు చేసి తమ వ్యాపారం కొనసాగిస్తున్నారు. టిఫిన్ ధరలను కూడా పెంచేశారు. సివిల్ సప్లై అధికారులు దృష్టి సారించి అక్రమ అమ్మకాలకు అడ్డుకట్టవేయాలని, సరఫరా సాఫీగా జరిగేలా చూడాలని వ్యాపారులతో పాటు స్థానికులు కోరుతున్నారు. -
అనైతిక పాలనపై జనాగ్రహం
–8లోకుదేలు...! ఫ్యాషన్ ప్రపంచంలో దర్జీల జీవనం దయనీయంగా మారింది. అటు ప్రభుత్వం నుంచి సాయం అందక, ఇటు చేతికి పనిలేక ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2026 బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ అయినప్పటి నుంచి తిరుమల పవిత్రత దెబ్బతింటోంది. ఆయన వ్యక్తిగత ప్రవర్తన, గత చరిత్ర హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయి. తిరుమల ప్రతిష్టను కాపాడటానికి ఆయన వెంటనే రాజీనామా చేయాలి. నిరసన తెలిపిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళలపై గూండాలతో దాడి చేయించడం, వారిపై అక్రమంగా పి.డి.యాక్ట్ కేసులు పెట్టడం ప్రజా స్వామ్య విరుద్ధం. ఆ కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలి. రెండేళ్ల పాలనలో కూటమి ప్రభు త్వం చేసిందేమీ లేదు. పవన్ కల్యాణ్ ఫొటో షూట్లకు పరిమితమయ్యారు. గత ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీలు, రోడ్లు వారికి కనిపించడం లేదా? చంద్రబాబు అభివృద్ధి అంటే కేవలం హైదరాబాద్ హైటెక్ సిటీ చూపిస్తారు తప్ప, ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదు. ఇప్పుడు అమరావతి, లడ్డు వివాదాలతో కాలక్షేపం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా పద్ధతి మార్చుకోకపోతే, గతంలో వలే మళ్లీ సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితమయ్యేలా ప్రజలు బుద్ధిచెబుతారు. – శత్రుచర్ల పరీక్షిత్రాజు, వైఎస్సార్సీపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు పార్వతీపురం రూరల్: కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల పవిత్రతను కాపాడాలని, అశ్లీల వీడియోలతో అడ్డంగా దొరికిపోయిన టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడును తక్షణమే పదవి నుంచి తొలగించాలని వైఎసా్స్ర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు నేతృత్వంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్రాజుతో కలిసి మంగళవారం నిరసన గళం వినిపించారు. చంద్రబాబు అరాచక పాలనపై అంబేడ్కర్ విగ్రహం సాక్షిగా ఆందోళన చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. తిరుమల క్షేత్ర పవిత్రను కాపాడాలని తిరుపతిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ మహిళా నేతలు, కార్యకర్తలపై టీడీపీ గూండాల దాడులు, పోలీసుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా గొంతు వినిపిస్తున్న వారిపై పి.డి.యాక్టులు నమోదు చేయడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమంటూ నినదించారు. టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడు అశ్లీల లీలలను సీఎం చంద్రబాబు పట్టించుకోకుండా పదవి కట్టబెట్టడం భక్తుల విశ్వాసాలను దెబ్బతీయడమేనని విమర్శించారు. రాజ్యాంగపరమైన పాలన అందించేలా చూడాలంటూ అంబేడ్కర్ విగ్రహానికి వినతులు అందజేశారు. నిరసన కార్యక్రమంలో కురుపాం, పార్వతీపురం, పాలకొండ, సాలూరు నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్ పర్సన్, వైఎస్ చైర్మన్లు, వైఎస్ ఎంపీపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.ప్లకార్డుతో నిరసన వీడియో సాక్ష్యాలతో దొరికినా బీఆర్ నాయుడు సిగ్గులేకుండా సమర్థించుకుంటున్నారని, ప్రశ్నించిన మహిళలపై గూండాలతో దాడులు చేయించడం ఆయన అహంకారానికి నిదర్శనంగా ఉంది. ఇంత జరుగుతున్నా సీఎం చంద్రబాబు కళ్లు, చెవులు మూసుకుని బీఆర్ నాయుడిని వెనకేసుకు రావడం దౌర్భాగ్యం. డ్రగ్స్ కేసులో దొరికిన ఎంపీకి స్టేషన్ బెయిల్ ఇప్పించి కాపాడినట్లే, ఇక్కడ కూడా తన పార్టీ వారి తప్పులను చంద్రబాబు సమర్థిస్తున్నారు. తక్షణమే బీఆర్ నాయుడిని పదవి నుంచి తొలగించాలి. అక్రమంగా అరెస్టు చేసిన వైఎస్సార్సీపీ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. – అలజంగి జోగారావు, మాజీ ఎమ్మెల్యే, పార్వతీపురం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే తొలగించాలి పార్వతీపురం అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన పెద్ద సంఖ్యలో పాల్గొన్న వైఎస్సార్సీపీ శ్రేణులు చంద్రబాబు ఆరాచక పాలనపై ఆగ్రహం -
పురం.. ఇక ప్రత్యేకమే!
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే పురాలపై వివక్ష ప్రారంభం అయ్యింది. అభివృద్ధి పనులకు ఎమ్మెల్యేలు మోకాలడ్డారు. ఫలితంగా పురపాలక సంఘాల్లో సమస్యలు పేరుకుపోయాయి. తాగునీటికీ ఇబ్బందులు పడే పరిస్థితి. అభివృద్ధికి సహకారం అందించాల్సింది పోయి.. పాలక వర్గాలను పడగొట్టేందుకే ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. పార్వతీపురంలో పలువురు సభ్యులను తమవైపు తిప్పుకుని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. తగిన బలం లేక, భంగపాటుకు గురయ్యారు. సాలూరులో సైతం కొంతమందిని జనసేనలోకి లాక్కొని పాలకవర్గాన్ని ఇబ్బందులకు గురిచేశారు. పాలకొండలో కూడా చైర్ పర్సన్ రాధా కుమారి రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఎన్నిక నిర్వహించగా.. ఆ సీటు కోసం పెద్ద డ్రామానే నడిచింది. అడ్డదారిలో కుర్చీని స్వాధీనం చేసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పురాల అభివృద్ధి కంటే అవరోధాలకే శాసన సభ్యులు ప్రాధాన్యమిచ్చారు. సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలోని పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో పాలక వర్గాల పదవీ కాలం మంగళవారంతో ముగిసింది. బుధవారం నుంచి పూర్తి స్థాయిలో ప్రత్యేక అధికారుల చేతుల్లోకి వెళ్లనుంది. జిల్లాలో పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీలు కాగా.. పాలకొండ నగర పంచాయతీగా ఉంది. 2021 మార్చిలో నిర్వహించిన ఎన్నికల్లో గెలుపొందిన కౌన్సిలర్లతో పాలకవర్గాలు అప్పట్లో కొలువుదీరాయి. రిజర్వేషన్ ప్రకారం పాలకవర్గ సభ్యులు వారిలో ఒకరిని చైర్మన్గా ఎన్నుకున్నారు. ఇద్దరు చొప్పున వైస్ చైర్మన్లను ఎన్నుకున్నారు. ఐదేళ్ల పదవీ కాలం మంగళవారంతో ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం కొద్ది రోజుల కిందటే ప్రత్యేక అధికారులను నియమించింది. పార్వతీపురం పురపాలక సంఘానికి సంయుక్త కలెక్టర్.. సాలూరు, పాలకొండలకు సబ్ కలెక్టర్లు ప్రత్యేక అధికారులుగా వ్యవహరించనున్నారు. మారిన పట్టణ రూపు రేఖలు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన పురాలు... వైఎస్సార్ సీపీ పాలక వర్గాల హయాంలో అభివృద్ధి బాట పట్టాయి. 2019 నుంచి 2024 వరకూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో పూర్తి స్థాయిలో నిధులు మంజూరయ్యాయి. పనులు వేగవంతం కావడంతో పట్టణాల రూపు రేఖలు మారాయి. ● పార్వతీపురం మున్సిపాలిటీలోని 30 వార్డుల్లో దాదాపు రూ.కోట్ల వ్యయంతో రహదారులు నిర్మించారు. తాగునీటి కోసం రూ.55 కోట్లు మంజూరు చేసి రూ.3 కోట్లతో పైపులైను కొనుగోలు చేశారు. దాదాపు 3 వేల మందికి ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేశారు. ఎన్నో ఏళ్లుగా సొంతిల్లు లేక అవస్థలు పడుతున్న నెల్లిచెరువు గట్టు నివాసులు 63 మందికి పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చారు. గతంలో టీడీపీ హయాంలో అధ్వానంగా విడిచిపెట్టిన బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. గడపగడపకు కార్యక్రమం ద్వారా 30 వార్డుల్లో 12 కోట్ల రూపాయల నిధులతో మౌలిక సదుపాయాలు కల్పించారు. రూ కోటీ 80 లక్షలతో అర్బన్ హెల్త్ సెంటర్ మంజూరు చేసి, నిర్మాణం పూర్తి చేశారు. కొత్తవలస చెరువును రూ.కోటి వ్యయంతో అభివృద్ధి చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూ.2.30 కోట్ల వ్యయంతో ఆధునికీకరణ చేపట్టారు. జిల్లా కేంద్రంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం దాదాపు 70 శాతం పూర్తయ్యింది. ● సాలూరు మున్సిపాలిటీలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఏఐఐబీ కింద రూ.63 కోట్లతో ఇంటింటికీ కుళాయి ప్రాజెక్టును తీసుకొచ్చారు. అప్పట్లోనే టెండర్లు కూడా పిలిచారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా మిగిలిపోయిన టిడ్కో గృహాలను పూర్తిచేసి, వందలాది మందికి సొంతింటి కలను నిజం చేశారు. ఈ పాలకవర్గ హయాంలోనే వంద పడకల ఆస్పత్రి 90 శాతం పూర్తయింది. 15వ ఆర్థిక సంఘం నిధులతో పెద్ద ఎత్తున రహదారులు, డ్రైన్లు నిర్మించారు. మున్సిపాలిటీలో చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా రాష్ట్రపతి అవార్డు, రాష్ట్ర స్థాయిలో అవార్డులు కూడా వరించాయి. మాజీ మంత్రి రాజన్నదొర సహకారంతో సాలూరు పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని పుర అధ్యక్షురాలు పువ్వుల ఈశ్వరమ్మ తెలిపారు. – గత ఐదేళ్ల కాలంలో పాలకొండ నగర పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. పోతుల గెడ్డ ఖానా మీదుగా రూ.70 లక్షలతో వంతెన నిర్మాణం చేపట్టారు. ఏరియా ఆసుపత్రి మార్గంలో రూ.42 లక్షలతో సీసీ రహదారి పూర్తి చేశారు. ప్రధానంగా ఐదు వార్డులకు ఉపయోగపడేలా కనెక్టివిటీ రోడ్లు నిర్మించారు. రూ.50 లక్షల వ్యయంతో అర్బన్ హెల్త్సెంటర్ పూర్తి చేశారు. 20 వార్డుల్లో సుమారు 180 వీధులు ఉన్నాయి. 60 శాతం వీధుల్లో సీసీ రోడ్లు, కాలువలు నిర్మించారు. రూ.70 లక్షలతో డంపింగ్ యార్డు సమస్యకు పరిష్కారం చూపగా.. టీడీపీ వారు అడ్డుకున్నారు. పురపాలక సంఘాల్లో ముగిసిన పాలక వర్గాల పదవీ కాలం అభివృద్ధి కార్యక్రమాలతో మారిన పట్టణ రూపురేఖలు కొవిడ్లో రెండేళ్లు గడ్డు కాలం చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గత 20 నెలల్లో పాలక వర్గాలకు సహకారం కరువు -
వడగాడ్పులపై అప్రమత్తతే ప్రధానం
పార్వతీపురం: వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులకు ఆదేశించారు.‘వడగాల్పుల నివారణ కార్యాచరణ ప్రణాళిక–2026’పై జిల్లా అధికారులతో మంగళవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వడగాల్పులు కారణంగా ఒక్క ప్రాణం కూడా నష్టం జరగరాదని, అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని పీహెచ్సీలలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. వడదెబ్బకు గురైన వారికి తక్షణమే అందించాల్సిన ప్రాథమిక చికిత్సపై గ్రామస్థాయిలో శిక్షణ ఇవ్వాలన్నారు. వడగాల్పులు, పిడుగుల బారినుంచి రక్షణ పొందేలా కరపత్రాలను, ఐఈసీ మెటీరియల్తో ప్రజలను చైతన్య పరచాలన్నారు. మండలాల వారీగా ఉష్ణోగ్రత సూచీ, గరిష్ఠ ఉష్ణోగ్రతలను ఎప్పటికప్పుడు వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారాన్ని చేరవేయాలన్నారు. సమావేశంలో జేసీ యశ్వంత్కుమార్ రెడ్డి, డీఆర్వో కె.హేమలత, సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ఎస్డీసీ ఎస్.దిలీప్చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు. పాసుపుస్తకాల పంపిణీ వేగంగా పూర్తికావాలి ● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి విజయనగరం: జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టాదారు పాసుపుస్తకాలు, రీసర్వే, 22 ఏ భూములు, తదితర రెవెన్యూ అంశాలపై దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని పరిస్థితులను సీఎస్కు కలెక్టర్ వివరించారు. ఈ వీసీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతినెలా 9వ తేదీలోగా నిర్దేశించిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని పూర్తిచేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మ్యుటేషన్లను వీలైనంత వేగంగా వేగంగా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో జేసీ ఎస్.సేతుమాధవన్, డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, ఆర్డీఓలు వెంకటేశ్వరరావు, సుధారాణి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన ● ముగిసిన కార్పొరేషన్ పాలకవర్గం పదవీ కాలం విజయనగరం: విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లో బుధవారం నుంచి ప్రత్యేక అధికారి పాలన ప్రారంభం కానుంది. ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం మంగళవారంతో ముగియనుంది. బుధవారం నుంచి కార్పొరేషన్ ప్రత్యేకాధికారిగా కలెక్టర్ రామ సుందర్ రెడ్డి వ్యవహరించనున్నారు. కార్పొరేషన్ ఎన్నికలు జరిగేంత వరకు ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో పాలన సాగనుంది. విజయనగరం ఆర్డీఓగా సుధాసాగర్ విజయనగరం: విజయనగరం రెవెన్యూ డివిజనల్ అధికారిగా సనపల సుధాసాగర్ నియామకమయ్యారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఆయనను ఆర్డీఓగా బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు ఆర్డీఓ గా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు బాధ్యతలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా విజయనగరం ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న ఎం.నూకరాజును అల్లూరి సీతారామరాజు జిల్లా రెవెన్యూ అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నూకరాజు నెల రోజుల వ్యవధిలో ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఫైర్ ఆఫీసర్కు ఉగాది పురస్కారం విజయనగరం క్రైమ్: విశిష్టసేవలందించే వారికి రాష్ట్ర ప్రభు త్వం ఏటా ఉగాది పురస్కారాలను ప్రదానం చేస్తుంది. ఈ ఏడాది ఉమ్మడి విజయనగరం జిల్లా అగ్నిమాపక ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రమేష్ ఉగాది పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన పార్వతీపురం అగ్నిమాపక కేంద్రం అధికారిగా పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో అంకిత భావం, సేవను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం ఇచ్చే పురస్కారానికి రమేష్ ఎంపిక కావడంపై ఆ శాఖ ఉద్యోగులు హర్షం వ్యక్తంచేశారు. -
ఐక్యత, సోదర భావానికి ప్రతీక రంజాన్ వేడుక
కురుపాం: ఐక్యత, సోదర భావానికి ప్రతీక రంజాన్ పండగ అని వైఎస్సార్సీపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్రాజు, మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. మండల కేంద్రంలోని శివ్వన్నపేటలో ముస్లిం సోద రులు సోమవారం ఇచ్చిన విఫ్తార్ విందులో వారు పాల్గొని విందును స్వీకరించారు. అనంతరం నిరుపేదలకు రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రంజాన్ మాసం క్రమశిక్షణ, పేదల పట్ల కరుణను అలవర్చుకోవాల ని గుర్తు చేస్తుందన్నారు. నెలరోజులపాటు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కఠిన ఉపవాసం పాటిస్తూ ఇఫ్తార్ విందులను పంచుకుంటూ ఐక్యత సోదరభావాన్ని ఈ పండగ చాటి చెబుతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా కో ఆప్షన్ సభ్యుడు షేక్ నిషార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యు డు షేక్ నూరెళ్ల, షేక్ ఆదిల్, మండల కో ఆప్షన్ సభ్యుడు షేక్ జిలాని, కురుపాం ఎంపీపీ శెట్టి పద్మావతి, జెడ్పీటీసీ గొర్లి సుజాత, వైస్ ఎంపీపీలు బిడ్డిక అన్నాజీరావు, రంగారావు, మాజీ ఎంపీపీ ఆనిమి ఇందిరాకుమారి, వివిధ పంచాయతీలకు చెందిన సర్పంచ్లు, వైఎస్సార్ సీపీ నాయకులు శెట్టి నాగేశ్వరరావు, ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు. -
నిఘా నీడన పదో తరగతి పరీక్షలు
● పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి ● తొలిరోజు 10,530 మంది రెగ్యులర్ విద్యార్థుల హాజరు పార్వతీపురం రూరల్: జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం పకడ్బందీగా ప్రారంభమయ్యాయి. పార్వతీపురంలోని డీవీఎం హైస్కూల్ పరీక్షా కేంద్రాన్ని జేసీ సి.యశ్వంత్ కుమార్రెడ్డి పరీక్షించారు. తెలుగు పరీక్ష నిర్వహణ తీరు, సౌకర్యాలపై ఆరా తీశారు. జిల్లా వ్యాప్తంగా 68 కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 10,561 మంది రెగ్యులర్ విద్యార్థులకు 10,530 మంది హాజరయ్యారు. 31 మంది గైర్హాజరయ్యారు. ప్రైవేటు విద్యార్థులు 14 మందికి 7గురు హాజరయ్యారు. ఓపెన్ స్కూల్ పరీక్షలు ప్రారంభం జిల్లాలో ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షలు కూడా సోమవారం ప్రారంభమయ్యాయి. తెలు గు (205), ఒరియా (233) సబ్జెక్టులకు సంబంధించి మొత్తం 7 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. వీటికి మొత్తం 522 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 483 మంది హాజరయ్యారని, 39 మంది గైర్హాజరైనట్లు డీఈఓ పి.బ్రహ్మాజీరావు ఒక ప్రకటనలో తెలిపారు. విజయనగరం కలెక్టరేట్: రీఫ్ 2025–26 సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ జిల్లాలో ఈ నెల 28 వరకు రైతుసేవా కేంద్రాల నుంచి కొనుగోలు చేస్తామని జేసీ ఎస్.సేతుమాధవన్ తెలిపారు. జిల్లాలోని 367 ఆర్ఎస్కేల నుంచి 4.15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొను గోలు చేసినట్లు వెల్లడించారు. రైతులకు రూ.974 కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమచేసినట్టు తెలిపారు. జిల్లాలో 88,877 మంది రైతులు లబ్ధి పొందారని జేసీ వివరించారు. -
విచారణ చీకట్లోకి!
నిబంధనల ప్రకారం ప్రతి ఎకరాకు 70 మొక్కలు, మరణించిన మొక్కల స్థానంలో మరో 14 మొక్కలు ఇవ్వాలి. ప్రతి మొక్కకూ రూ.28 ధర నిర్ణయించగా.. ఎరువుల కోసం ఒక్కో మొక్కకు రూ.25 చెల్లించాల్సి ఉంది. 2017–18లో చెల్లించాల్సిన రూ.25ల్లో కేవలం రూ.12 మాత్రమే చెల్లించి, మిగిలిన నిధులు పక్కదారి పట్టించారన్నది ప్రధాన ఆరోపణ. ●2018–19లో ఎరువుల కోసం చెల్లించాల్సిన మొత్తం కూడా రైతులకు ఇవ్వలేదు. ఆ లెక్కన రూ.1.33 కోట్లకుపైగా నిధులు గల్లంతయ్యాయన్నది ఆరోపణ. మొక్కల కొనుగోలులోనూ అవినీతి చోటుచేసుకుంది. ప్రభుత్వం రూ.28 చొప్పున మంజూరు చేస్తే.. రూ.15– రూ.16కే కొనుగోలు చేసి మిగలిన మొత్తం స్వాహా చేశారన్న ఆరోపణలు వచ్చాయి. మూడు సంవత్సరాలపాటు ఇవ్వాల్సిన నిర్వహణ ఖర్చులను సైతం.. ఏడాదికే చెల్లించి, మిగిలిన మొత్తం దోచేశారన్నది ప్రధానంగా వినిపించింది. విచారణ అధికారి సుధారాణి.. పలు అంశాల్లో అవినీతి జరిగినట్లు గుర్తించారు. కొన్ని ఆరోపణలను ఖండించేలా ఎటువంటి ఆధారాలూ సమర్పించలేదని సమాచారం. ఇదే విషయమై తన నివేదికలో ఆమె స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిసింది. ●2017–18 సంవత్సరంలో 2,098 ఎకరాల విస్తీర్ణంలో తోటల పెంపకం చేపట్టారు. సమ్మతి ఇచ్చిన కొంతమంది రైతులు గుంతలు వేయడానికి ముందుకు రాలేదు. 2,098 ఎకరాల విస్తీర్ణంలో గుంతల చెల్లింపులు జరిగాయని పత్రాలను సమర్పించలేకపోయారు. విచారణ అధికారికి ఆర్థిక లావాదేవీలను ధ్రువీకరించేలా ఎటువంటి ఆధారాలూ చూపలేదు. విచారణ సమయంలో ఎటువంటి రికార్డులూ అందంచలేదని తెలిసింది. ●ఎరువుల సరఫరా సంస్థకు చేసిన చెల్లింపు, తోటల పరిస్థితి సరిపోలలేదు. 2018–19 సంవత్సరానికి కిలోకు రూ.12 చొప్పున 108.941 మెట్రక్ టన్నుల ఎరువును సరఫరా చేయడానికి ఇండెంట్ పెట్టినట్లు తెలిసింది. 2017–18లో ఎరువుకు కిలోకు రూ.6 ధర నిర్ణయించగా.. దీనికి విరుద్ధంగా 2018–19 సంవత్సరానికి కిలోకు రూ.12 చొప్పున కొటేషన్లు పొందారు. రెట్టింపు మొత్తం అయినప్పటికీ ప్రాజెక్టు అధికారి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లలేనట్లు తెలిసింది. ●చాలా వరకు పనులకు, ఇతర కార్యకలాపాలకు రికార్డులు, ఫైళ్లు, నగదు బుక్ వంటివి నిర్వహించలేదని తెలిసింది. సామాజిక ఆడిట్లో ప్రతిపాదించిన మొత్తాన్ని కూడా రికవరీ చేయలేదు. 2019లో నిర్వహించిన 12వ సామాజిక తనిఖీలో రూ. 23,30,243 మొత్తాన్ని దుర్వినియోగం చేసినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. దీనిపైనా ఎటువంటి వివరణా ఇవ్వలేదు. రూ.75,75,993 మొత్తా నికి సోషల్ ఆడిట్ బృందానికీ రికార్డులు సమర్పించలేదు. నేమ్ బోర్డుల ఏర్పాటు విషయంలోనూ ఎటువంటి ఆధారాలూ చూపలేదని తెలుస్తోంది. -
వాట్సాప్ గవర్నెన్స్ స్టాండింగ్ బోర్డులు ప్రారంభం
పార్వతీపురం: ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా వాట్సాప్ గవర్నెన్స్ను స్టాండింగ్ బోర్డులను సోమవారం కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి ప్రారంభించారు. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా జిల్లాకు 81 స్టాండింగ్ బోర్డు మంజూరైనట్లు డీపీఆర్ఓ కె. బాల్మన్సింగ్ తెలిపారు. బోర్డులో ఉన్న క్యూ ఆర్ కోడ్తో 300లకు పైగా ప్రభుత్వ సేవలను ఇంటివద్దనే పొందవచ్చని చెప్పారు. కార్యక్రమంలో జేసి సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, సమాచార శాఖ అధికారులు ఎం. గజపతిరావు, జీవీ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం రూరల్: తమ గ్రామానికి పర్యాటక గుర్తింపు తెచ్చినందుకు కృతజ్ఞతగా కుశ గ్రామస్తులు కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డికి ‘తొలి పంట’ను కానుకగా అందజేశారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్లో ఆయనను సోమవారం కలిసి తమ పొలాల్లో పండిన పంటలో మొదటి భాగాన్ని మర్యాదపూర్వకంగా అందజేశారు. గిరి శిఖర గ్రామమైన కుశ సమీపంలోని సహజసిద్ధ జలపాతాలను గుర్తించి, వాటిని వెలుగులోకి తేవడంలో కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపారు. ఫలితంగా ఈ గ్రామం రాష్ట్రస్థాయి పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఈ అభివృద్ధికి గుర్తింపుగా సర్పంచ్ కుశమ్మ ఆధ్వర్యంలో గ్రామస్తులు కలెక్టరేట్కు చేరుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు. అధికారుల సహకారంతో గ్రామాభివృద్ధి సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. గరుగుబిల్లి: డా.వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకటరామన్న గూడెంలో నిర్వహించిన 12వ అంతర కళాశాల క్రీడా పోటీల్లో డా.వైఎస్సార్ ఉద్యాన కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు కళాశాల అసోసియేట్ డీన్ డా.డి.రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. అథ్లెటిక్స్ విభాగంలో షాట్పుట్లో పృద్వీరాజ్ బంగారు, జావిలిన్త్రోలో నాని శ్రీ హర్ష, మౌనిక బంగారు, షార్ట్పుట్లో మౌనిక రజతం, జావిలిన్ త్రో, హైజంప్లో లక్ష్మి రజతాలు, డిస్కస్త్రో ట్రిపుల్ జంప్లో పూజిత రజతం సాధించినట్లు వివరించారు. అలాగే వాలీబాల్, కోకో, కబడ్డీలో విద్యార్థినులు ప్రతిభను కనబరిచినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను సోమవారం అసోసియేట్ డీన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల పీడీ జి.లక్ష్మణరావు తదితరులు ఉన్నారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
● ఇద్దరు చిన్నారులు మృతి ● తల్లిదండ్రులకు కడుపుకోత ● గ్రామంలో అలముకున్న విషాదం గుమ్మలక్ష్మీపురం: పాఠశాలలకు ఒంటిపూట బడులు ఆరంభమయ్యాయి. పాఠశాల నుంచి ఇంటికి వచ్చి శుభకార్యంలో సంతోషంగా గడిపారు. పిల్లలతో కలిసి ఆడుకున్నారు. అనంతరం స్నేహితుడితో కలిసి సరదాగా స్నానం కోసం చెరువుకు వెళ్లారు. అంతే.. ఈత సరదా ఇద్దరు చిన్నారులను ముంచేసింది. కుటుంబ సభ్యులకు కన్నీరుమిగిల్చింది. గ్రామస్తుల్లో విషాదం నింపింది. వివరాల్లోకి వెళ్తే... గుమ్మలక్ష్మీపురం మండలం లక్కగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గౌడు శిభో(9), గౌడు హర్ష(9) నాలుగో తరగతి చదువుతున్నారు. సోమవారం నుంచి పాఠశాలకు ఒంటిపూట బడు లు ప్రారంభమయ్యాయి. పాఠశాల విడిచిపెట్ట డంతో ఇళ్లకు వెళ్లిన చిన్నారులు కుటుంబీకులతో కలిసి గ్రామంలోని బంధువుల ఇంట్లో జరిగిన ఓ శుభకార్యంలో పాల్గొన్నారు. భోజనాలు చేసిన అనంతరం ఇంటికొచ్చారు. మరో స్నేహితుడితో కలిసి చెరువులో స్నానం చేసేందుకు, ఈత కొట్టేందుకు సరదాగా వెళ్లారు. వరుసకు బావమరుదులైన వీరిరువురు ముందుగా చెరువులో దిగి ఈతకొట్టేందుకు లోపలికి వెళ్లగా మునిగిపోయారు. దీనిని గమనించిన మరో చిన్నారి గ్రామంలోకి వచ్చి విషయం చెప్పడంతో పరుగున వెళ్లారు. అప్పటికే ఇద్దరు చిన్నారులు నీటిపై తేలియాడుతూ కనిపించారు. శిభో మృతదేహాన్ని తల్లిదండ్రులు గౌడు సులోచన, రమో, బంధువులు ఇంటి కి తీసుకెళ్లగా.. కొన ఊపిరి ఉందన్న అనుమానంతో హర్షను తల్లిదండ్రులు గౌడు షర్మిల, లిట్టి, బంధువులు భద్రగిరి సీహెచ్సీకి తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యులు హర్ష మృతి చెందినట్లు నిర్థారించారు. ఇరువురు చిన్నారులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుపెట్టారు. ఎల్విన్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. చదువులో హర్ష టాపర్ ఎంతో చలాకీగా ఉన్న హర్ష గ్రామంలోని ప్రభు త్వ ప్రాథమిక పాఠశాలలో నాల్గో తరగతి చదువుతున్నాడు. చదువులో ఎప్పుడూ టాపర్గానే ఉండేవాడని ఉపాధ్యాయుడు శ్యాంసుందర్తో పాటు తల్లిదండ్రులు చెబుతున్నారు. శిభో మీదే తల్లిదండ్రుల ఆశలు నలుగురు పిల్లలు చనిపోయక రాఘవ, శిభోలు పుట్టినప్పటికీ, రాఘవ కంటే శిభో ఎంతో ఉత్సహంగా ఉండేవాడని, ఆశలన్నీ వాడిమీదే పెట్టుకు న్నామంటూ గౌడు సులోచన, రమో కన్నీరుపెడుతున్నారు. -
ఉద్యోగాల పేరుతో యువతకు మస్కా
వారంతా అమాయక గిరిజనులు. ఏదో ఒక పనిచేసి బతుకుదామని ఆశపడ్డారు. ‘స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర’లో భాగంగా తడిపొడిచెత్తపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్యోగాలని చెబితే చేరేందుకు ఆసక్తిచూపారు. దీనిని శ్రీ శబరి నిరుద్యోగ పారిశుద్ధ్య వర్కర్స్ యూనియన్కు చెందిన ఓ ముగ్గురు సభ్యులు సొమ్ము చేసుకునేందుకు పక్కాస్కెచ్ వేశారు. ఉద్యోగాలంటూ ఊరించి పోస్టును బట్టి సొమ్ముదండేశారు. ఐదారునెలలుగా గిరిజన నిరుద్యోగులు విధులు నిర్వహిస్తున్నా జీతాలు ఇవ్వకపోవడంతో... మోసపోయామంటూ లబోదిబోమంటున్నారు. తమకు ఇచ్చిన నియామకపత్రాలను చూపిస్తూ కన్నీరుపెడుతున్నారు. ఇలాంటి మోసం ఎన్నడూ చూడలేదు బాబూ అంటూ అధికారుల వద్ద గోడు వెళ్లబోస్తున్నారు. కువలు, బిన్ బ్యాగ్ పద్ధతిలో చెత్త సేకరణపై అవగాహన కల్పించే బాధ్యతను శ్రీ శబరి నిరుద్యోగ పారిశుద్ధ్య వర్కర్స్ సంఘానికి అప్పగించారు. ఇదే విషయమై గతేడాది అక్టోబర్ నెలలో డీపీవో నుంచి వచ్చిన సర్క్యులర్ను చూపిస్తూ.. కేవలం గిరిజన యువతకే ఈ అవకాశమంటూ మస్కా కొట్టారు. శానిటేషన్ వర్కర్స్ యూనియన్ పేరిట నియామక పత్రాలిచ్చారు. బీవీవీఎస్ సత్యనారాయణమూర్తి, మజ్జి నారాయణరావు, కొండగొర్రి కృష్ణారావు ఇందులో కీలకంగా వ్యవహరించినట్లు బాధితుల ఆరోపణ. ఒక్కొక్కరి వద్ద పోస్టును బట్టి రూ.1.70 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేశారు. సూపర్వైజర్, మండల సమన్వయకర్త, జిల్లా సమన్వయకర్త, ఫీల్డ్ మేనేజర్ అంటూ కొన్ని పోస్టులిచ్చారు. ఇలా ఒక్క కురుపాం నియోజకవర్గంలోనే 75 మంది వరకు డబ్బులు కట్టారు. ఇలా నియామక పత్రాలతో ఆయా మండలాల్లో అధికారుల వద్దకు వెళ్తే.. అప్పటికే డీపీవో నుంచి ఆదేశాలు రావడంతో విధుల్లో చేర్చుకున్నారు. నాలుగు నెలలైతేనే గానీ తామంతా మోసపోయినట్లు బాధితులు గుర్తించలేకపోయారు. నాలుగు మండలాల్లోనే రూ.అర కోటికిపైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. సాక్షి, పార్వతీపురం మన్యం: ‘తడి, పొడి చెత్త సేకరణపై అవగాహన కల్పించేందుకు శ్రీ శబరి నిరుద్యోగ పారిశుద్ధ్య వర్కర్స్ సంఘం (అనపర్తి మండలం, తూర్పుగోదావరి) జిల్లా వారు విచ్చేసిన సమయంలో సదరు గ్రామ పంచాయతీల్లోని దుకాణ యజమానులు– సర్పంచ్లతో సమావేశం ఏర్పాటు చేయడం గురించి..’ అంటూ గతేడాది అక్టోబర్ నెలలో జిల్లా పంచాయ తీ అధికారి నుంచి కురుపాం, వీరఘట్టం, సీతంపేట, గుమ్మలక్ష్మీపురం, మక్కువ, జియ్య మ్మవలస ఉప మండల పరిషత్తు అభివృద్ధి అధికారులకు ఓ సర్క్యులర్ వెళ్లింది. ఆయా మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీల్లో ఐఈసీ బృంద సభ్యుల సందర్శన సమయంలో పూర్తి సహాయ సహకారాలు అందించాలని అందులో డీపీవో పేర్కొన్నారు. ఇదే లేఖను చూపిస్తూ.. కొంతమంది ప్రబుద్ధులు ఉద్యోగాలు సృష్టించారు. గిరిజన యువతే ప్రధాన లక్ష్యంగా రూ.లక్షలు వసూలు చేశారు. ఎంత జీతం ఇవ్వనున్నామో వివరిస్తూ, అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇచ్చేశారు. వారితో రూ.లక్షకు ఈ స్టాంప్తో అఫిడవిట్ కూడా చేయించారు. గిరిజన నిరుద్యోగులు ఈ ఉత్తర్వులు చూపిస్తూ.. పంచాయతీల్లో ‘విధులకు’ వెళ్లిపోయారు. నాలుగైదు నెలలుగా పని చేస్తున్నారు. జీతం గురించి అడిగితే.. ఎవరికీ తెలియదంటున్నారు. చివరికి డీపీవోను వచ్చి కలిస్తే.. ‘ప్రభుత్వం నుంచి ఎలా వస్తుంది? మిమ్మల్ని ఎవరు నియమించారో వారిని అడగండి’ అంటూ సమాధానం రావడంతో వారంతా అవాక్కయ్యారు. సంస్థ ప్రతినిధులను అడిగితే పొంతన లేని జవాబు లు చెబుతున్నారు. దీంతో బాధితులంతా లబోది బోమంటున్నారు. ఒకరిద్దరు కాదు.. కురుపాం, సూపర్వైజర్ ఉద్యోగం.. రూ.17 వేల జీతమంటే ఆశపడ్డాం. ఎల్విన్పేట పంచా యతీలో పనిచేస్తున్నా. ఉద్యో గం ఆశ చూపి నా దగ్గర రూ. 2.55 లక్షల వరకు వసూలు చేశారు. మూడు నెలలుగా పనిచేస్తున్నా జీతం లేదు.. మోసపోయామని గ్రహించాం. అధికారులే మా డబ్బులిప్పించాలి. – కిల్లక కమలప్రియ, గుమ్మలక్ష్మీపురం మండలం జియ్యమ్మవలస, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం మండలాల్లోనే 75 మంది వరకు ఉన్నారు. వీరితో నాలుగైదు నెలలుగా పనులు చేయించుకున్నారు. మిగిలిన మండలాల్లోనూ తమలాంటి బాధితులున్నారని వారంతా చెబుతున్నారు. రూ.లక్షల్లో వసూలు స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా తడి చెత్త–పొడి చెత్త సేకరణ, తీసుకోవాల్సిన మెలఉద్యోగమంటే ఆశ పడ్డాం. ఆరు నెలలుగా జిల్లా కోఆర్డినేటర్ హోదాలో పని చేస్తున్నా. మోసపోయామని గ్రహించాం. కలెక్టర్ వద్దకు వచ్చి కలిశాం. ఎస్పీ కార్యాలయానికి వెళ్లమన్నారు. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాం. – రామకృష్ణ, చిలకలవానివలస, జియ్యమ్మవలస మండలం అదనపు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అంటూ నియామక పత్రం ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగ మని ఆశపడి, అడిగినంత డబ్బులు కట్టాం. ముగ్గురు వ్యక్తులు కీలకంగా వ్యవహరించారు. నేను రూ.1.70 లక్షలిచ్చా. నా లుగు నెలల నుంచి పని చేస్తున్నా. జీతాలు లేవు. అడిగితే ఎవరికీ సంబంధం లేదంటున్నారు. – రాఘవేంద్రరావు, దిగువమండ, గుమ్మలక్ష్మీపురం మండలం -
చేతివృత్తులకు కష్టకాలం..
మంగలి, చాకలి వృత్తులు కూడా అంతంతమాత్రమే..పూర్వం గ్రామాల్లో మంగలి, కలి వృత్తులకు ప్రత్యేక గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు ఆధునిక సెలూన్లు, వాషింగ్ మెషీన్లు, లాండ్రీలు పెరగడంతో ఈ వృత్తుల ప్రాధాన్యం తగ్గిపోయింది. ఇతర కులస్తులు పట్టణాల్లో ఆధునిక సెలూన్లు, లాండ్రీ షాపులు నిర్వహిస్తుంటే.. అసలైన కులవృత్తిదారులు వారితో పోటీ పడలేక వృత్తినే వదిలేస్తున్నారున.విజయనగరం గంటస్తంభం: ఒకప్పుడు గ్రామాలు అన్నిరకాల వృత్తిదారులతో సందడిగా ఉండేవి. సూర్యోదయం నుంచే చేతివృత్తిదారులు తమ పనుల్లో బిజీగా కనిపించేవారు. ప్రతి రోజూ కుమ్మరి ఇంట్లో మట్టిచక్రం తిరిగేది. చేనేత కార్మికుడి ఇంట్లో మగ్గం సవ్వడి చేసేది. కంసాలి పనిముట్ల శబ్దం ఊరంతా వినిపించేది. మంగలి కత్తెర చప్పుడు.. చాకలి ఇస్సు ఇస్సు శబ్దాలతో గ్రామాలన్నీ కళకళలాడేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయింది. గ్రామం అంటే కేవలం ఇళ్లు, పొలాలకే పరిమితమైపోయింది. ఆధునిక జీవన విధానం పెరిగింది. యంత్రాలు, ఫ్యాక్టరీలు, ప్లాస్టిక్ వస్తువులు మార్కెట్ను ఆక్రమించాయి. ఫలితంగా శతాబ్దాలుగా కొనసాగిన సంప్రదాయ కులవృత్తులు నిశ్శబ్దంగా కనుమరుగవుతున్నాయి. ఈ వృత్తులు కేవలం జీవనోపాధి మాత్రమే కాదు..మన సంస్కృతీ, సంప్రదాయాలకు పునాది. కానీ నేడు ఆ వృత్తులపై ఆధారపడి జీవించే కుటుంబాలు తీవ్ర కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. కంసాలి వృత్తికి కాలం పరీక్ష.. వ్యవసాయ పనులకు కావాల్సిన పరికరాలు గొడ్డళ్లు, కొడవళ్లు, కత్తులను గతంలో గ్రామాల్లో ఉండే కంసాలులే తయారు చేసేవారు. ఇప్పుడు ఫ్యాక్టరీల్లో తయారయ్యే వస్తువులు మార్కెట్ను ఆక్రమించడంతో కంసాలి వృత్తి కూడా క్షీణిస్తోంది. ఇనుప మోగులు మసకబారుతున్నాయి. ఆ వృత్తిపై ఆధారపడి జీవించిన కుటుంబాలు ఆర్థికంగా బలహీనపడుతున్నాయి. తండ్రి వృత్తి కొనసాగించని కొత్త తరం.. పూర్వం తండ్రి చేసే వృత్తినే కొడుకు కొనసాగించడం సంప్రదాయంగా వచ్చేది. కానీ నేటి పరిస్థితుల్లో యు వత ఆ వృత్తులపై ఆసక్తి చూపడం లేదు. తక్కువ ఆ దాయం, కష్టమైన పని, భవిష్యత్పై భయం కారణంగా యువత పట్టణాలకు వెళ్లి ఇతర ఉద్యోగాలు వెతు క్కుంటోంది. దీంతో పూర్వీకుల వృత్తుల కొత్త తరానికి చేరకుండా నెమ్మదిగా కనుమరుగవుతున్నాయి. గ్రామ సంస్కృతికి ముప్పు.. కులవృత్తులు కేవలం పనులు కాదు. అవి గ్రామ జీవన విధానానికి ప్రతిబింబం. ఆ వృత్తులు మాయమ్తెతే గ్రామ సంస్కృతీ, సంప్రదాయాలు కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఇప్పుడు అవి గతకాల జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోతున్నాయి. ప్రభుత్వం – సమాజం కలిసి రక్షించాలి.. ఈ సంప్రదాయ వృత్తులను కాపాడాలంటే ప్రభుత్వంతో పాటు సమాజం కూడా ముందుకు రావాలి. సంప్రదాయ వృత్తులకు ప్రోత్సాహక పథకాలు, మార్కెట్ అవకాశాలు కల్పించడం, హస్తకళల పదర్శనలు నిర్వహించడం, యువతకు శిక్షణ ఇవ్వడం. వంటి చర్యలు తీసుకుంటేనే ఈ వృత్తులు తిరిగి బతికే అవకాశం ఉంటుంది. చేతిలో పని లేక ఇబ్బంది పడుతున్న వృత్తిదారులు పాత వృత్తులను దెబ్బతీస్తున్న ఆధునికత కనమరుగవుతున్న గ్రామ సంస్కృతి -
ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధి..
● కలెక్టర్ ప్రభాకరరెడ్డిపార్వతీపురం రూరల్: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కారవేదిక (పీజీఆర్ఎస్)లో ఆయన పాల్గొని అర్జీదారుల నుంచి 110 వినతులు స్వీకరించారు. ఇందులో రెవెన్యూ విభాగానికి 40, ఇతర శాఖలకు 70 దరఖాస్తులు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, క్షేత్రస్థాయిలో పరిశీలన తప్పనిసరని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వచ్చిన వినతుల్లో కొన్ని.. ● పార్వతీపురం బైపాస్ రోడ్డు ధూళి సమస్యను పరిష్కరించి, మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరారు. ● కురుపాం మండలం దొమ్మిడిని కొత్త పంచాయతీగా ప్రకటించాలని సర్పంచ్ ఎం. గౌరి, తదితరులు అర్జీ సమర్పించారు. ● గరుగుబిల్లి మండలంలో చెరువుల ఆక్రమణలను తొలగించాలని.. కొమరాడ, ఉక్కాడవలస ప్రాంతాల్లో భూములను ఆన్లైన్ చేయాలని అర్జీలు సమర్పించారు. ● బీఈడీ పూర్తి చేసిన తమకు ఉద్యోగ అవకాశం కల్పించాలని, వ్యవసాయానికి బోర్ మంజూరు చేయాలని గిరిజన యువకులు కోరారు. ● నాగావళి నదిపై 20 ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్న పూర్ణపాడు – లాభేసు వంతెన నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు వంగల దాలినాయుడు డిమాండ్ చేస్తూ జేసీ యశ్వంత్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ● గిరిజన వేతనదారుల నుంచి సొమ్ము వసూలు చేస్తున్న డ్వామా పీడీని సస్పెండ్ చేయాలని.. డీఈఓ కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న డిప్యుటేషన్లను రద్దు చేయాలని గిరిజన సంక్షేమ సంఘం నేత పాలక రంజిత్కుమార్ కోరుతూ వినతిపత్రం అందజేశారు. -
25న న్యాయవాదుల సంఘం ఎన్నికలు
విజయనగరం లీగల్: ప్రతిష్టాత్మకమైన జిల్లా కేంద్ర న్యాయవాదుల సంఘ ఎన్నికలు ఈనెల 25 న జరుగనున్నాయి. సంఘంలో సుమారు 600 మంది సభ్యులున్నారు. అధ్యక్ష పదవికి నళితం రమేష్కుమార్, గువ్వల తిరుపతిరావు పోటీపడుతున్నారు. వీరిద్దరూ తమ మద్దతుదారులతో సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఈనెల 25న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఓటింగ్ నిర్వహిస్తామని ముఖ్య ఎన్నికల అధికారి కంటుభుక్త శ్రీనివాస్ తెలిపారు. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తామన్నారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ ఆదేశాలు, సూచనల మేరకు ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అధ్యక్ష పదవితో పాటు కార్యదర్శి, ఉపాధ్యక్ష, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, గ్రంథాలయ కార్యదర్శి, స్పోర్ట్స్ సెక్రటరీ, సీనియర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యుల పదవికి ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. నామినేషన్ల ప్రక్రియలో ఎన్నికల అధికారులు వై. హరికృష్ణ, దాసరి పద్మ పాల్గొన్నారు. -
ఈసీహెచ్ఎస్ పాలిక్లినిక్ ప్రారంభం
చికెన్విజయనగరం అర్బన్: మాజీ సైనికులు, వారి కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ముఖ్యమైన అడుగు వేసింది. మాజీ సైనికుల కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ఈసీహెచ్ఎస్) పరిధిలో విజయనగరంలో కొత్త పాలిక్లినిక్ను ఏర్పాటు చేశారు. ఈ వైద్య కేంద్రాన్ని ఈస్టర్న్ నేవల్ కమాండ్ చీఫ్ స్టాఫ్ ఆఫీసర్ (పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్) రియర్ అడ్మిరల్ ఎం.మురళీమోహన్ రాజు సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో కమాండ్ మెడికల్ ఆఫీసర్ సర్జన్ రియర్ అడ్మిరల్ దిలీప్ రాఘవన్, మాజీ సైనికుల ప్రతినిధులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా పరిధిలో నివసిస్తున్న సుమారు 15 వేల మంది ఈసీహెచ్ఎస్ లబ్ధిదారులకు ఈ పాలీక్లినిక్ ద్వారా వైద్య సేవలు అందనున్నాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఎం. మురళీ మోహన్రాజు మాట్లాడుతూ.. దేశానికి సేవలందించిన మాజీ సైనికులకు సమయానుకూలంగా నాణ్యమైన వైద్య సేవలు అందించడం ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో రీజినల్ సెంటర్ ఈసీహెచ్ఎస్ సెల్ అధికారి కెప్టెన్ ఎంవీఎస్ కుమార్, మాజీ సైననికులు పాల్గొన్నారు. -
వ్యవస్థ మెరుగుపడేలా కథనాలు..
● కలెక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డిపార్వతీపురం: వ్యవస్థను మెరుగుపరిచేలా, ప్రజలకు ఉపయోగపడేలా వార్త కథనాలు ఉండాలని కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా మీడియా అక్రిడేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు 196 కార్డులు అందజేసినట్లు చెప్పారు. జర్నలిజం సూత్రాలపై రిపోర్టర్లకు ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేయాలని పలువురు జర్నలిస్టులు కోరారు. కార్యక్రమంలో జేసీ యశ్వంత్కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్లు ఆర్. వైశాలి, పవర్ స్వప్నిల్ జగన్నాథ్, డీపీఆర్ఓ కె. బాల్మాన్సింగ్, తదితరులు పాల్గొన్నారు. -
అలసత్వం వహిస్తే సహించేది లేదు..
● కలెక్టర్ ఎస్. రాంసుందరరెడ్డి ● పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లకు పోటెత్తిన అర్జీదారులువిజయనగరం కలెక్టరేట్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్లో అర్జీదారులు తెలియజేసిన సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ ఎస్. రాంసుందరరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు రాగా.. అధికారులు 233 వినతులు స్వీకరించారు. ఇందులో 130 వినతులు రెవెన్యూ శాఖకు సంబంధించినవి కావడం విశేషం. ఈ సందర్భంగా కలెక్టర్ రాంసుందరరెడ్డి మాట్లాడుతూ.. అర్జీలను సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ విభాగానికి సంబంధించి 130 వినతులు రాగా..డీఆర్డీఏ –13, పంచాయతీరాజ్ – 20, మున్సిపల్–9, విద్యుత్ శాఖ–7, హౌసింగ్–3, డీసీహెచ్ఎస్–1, గ్రామ సచివాలయ శాఖ–6, విద్య శాఖ–2, ఇతర శాఖలకు సంబంధించి 42 వినతులు వచ్చాయన్నారు. డిజిటల్ పర్యవేక్షణ.. పీజీఆర్ఎస్ కార్యక్రమంపై డిజిటల్ పర్యవేక్షణ చేస్తున్నట్లు కలెక్టర్ ఎస్. రాంసుందరరెడ్డి అన్నారు. 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా అందిన కాల్స్ పట్ల బాధ్యతగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. అర్జీదారునితో మాట్లాడిన తేది, సమయం కూడా వారికిచ్చే రిపోర్ట్లో నమోదు చేయాలన్నారు. పీజీఆర్ఎస్ టోల్ఫ్రీ నంబర్ 1100పై ప్రజలకు అవగాహన కలిగించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్.సత్తిబాబు, జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కళావతి, సీపీఓ బాలాజీ, విజయనగరం, చీపురుపలి, బొబ్బిలి ఆర్డీఓలు, జిల్లా సర్వే శాఖ ఎ.డి. ఆర్.విజయకుమార్, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పాణి, హౌసింగ్ పీడీ మురళీధర్, మైక్రో ఇరిగేషన్ పీడీ లక్ష్మీనారాయణ, జెడ్పీ సీఈఓ సత్యనారాయణ, మార్క్ఫెడ్ మేనేజర్ డి.వెంకటేశ్వరరావు, డీఎంహెచ్ఓ జీవనరాణి, కలెక్టరేట్ పరిపాలనాధికారి దేవీప్రసాద్, జిల్లా పరిషత్ సీఈఓ బీవీ సత్యనారాయణ, జిల్లా అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. 48 ఫిర్యాదుల స్వీకరణ.. విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యాక్రమంలో పోలీస్ ఉన్నతాధికారులు 48 ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో భూతగాదాలు, కుటుంబ కలహాలు, చీటింగ్, నగదు వ్యవహారాలకు సంబంధించిన కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఈ సందర్భంగా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ.. ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. -
క్రికెట్ టోర్నీ పోస్టర్ల ఆవిష్కరణ
పార్వతీపురం: జియ్యమ్మవలస మండలం ఆర్ఆర్బీ పురం జీటీడబ్ల్యూఏహెచ్ఎస్లో ఈనెల 19 నుంచి 21 వరకు నిర్వహించనున్న మన్యం లీగ్ – 2026 జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్కు సంబంధించిన వాల్పోస్టర్లను కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి సోమవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతలో దాగి ఉన్న క్రీడలను వెలికితీసేందుకు ఈ టోర్న్మెంట్ ఎంతో దోహదపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో జేసీ సి.యశ్వంత్కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్, డీఎస్డీఓ కె. శ్రీధరరావు, తదితరులు పాల్గొన్నారు. న్యాయం చేయండి.. విజయనగరం క్రైమ్: ఓ ఆకతాయి నుంచి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని నిండు గర్భిణి వేడుకుంది. ఈ మేరకు సోమవారం స్థానిక పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. డెంకాడ మండలం చింతలవలస ఏపీఎస్పీ బెటాలియన్ దగ్గర్లో ఉన్న కృష్ణాపురంలో అనురాధ, కల్యాణ్ దంపతులు నివసిస్తున్నారు. వీరి ఇంటిలో ఉన్న మామిడిచెట్టు కాయలు ఎదురుగా ఉన్న పృథ్వి ఇంటి ఆవరణలో పడడంతో వాటిని తీసుకునేందుకు ఇటీవల అనురాధ వెళ్లింది. దీంతో నా అనుమతి లేకుండా ఇంటిలోకి ఎందుకువచ్చావంటూ అనురాధతో పృథ్వి గొడవపడ్డాడు. తర్వాత అనురాధ ఇంటి నుంచి ఆమె కుమార్తె, అత్త, మరిది ఇలా ఎవరు ఇంటి బయటకు వచ్చినా బూతులు తిట్టడంతో పాటు దుస్తులు విప్పి అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. దీంతో బాధిత కుటుంబం ఈ నెల 11న స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో సోమవారం స్థానిక పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసింది. ఆకతాయి నుంచి తమకు రక్షణ కల్పించాలని వేడుకుంది. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం ● తెగిపడిన విద్యుత్ తీగలు పార్వతీపురం రూరల్: పట్టణంలో సోమవారం సాయంత్రం త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకుని ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని తెలుగుతల్లి విగ్రహం వద్ద విద్యుత్ తీగలు ఒక్కసారిగా తెగిపడ్డాయి. రోడ్డుపక్కనే ఉన్న ద్విచక్ర వాహనాలు, ఓ కూరగాయల దుకాణంపై తీగలు పడ్డాయి. అయితే ఈ సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. వెంటనే స్థానికుల సమాచారంతో విద్యుత్ శాఖాధికారులు స్పందించి సరఫరాను నిలిపివేశారు. దీంతో వాహనదారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్ పార్వతీపురం రూరల్: మండల పరిధిలోని వైకేఎం కాలనీ, చర్చి వీధిలో జరిగిన వరుస దొంగతనాలకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 8వ తేదీ రాత్రి జరిగిన ఈ చోరీలపై బాధితురాలు మత్స తవిటమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు ఏఎస్పీ మనీషా రెడ్డి సారథ్యంలో రూరల్ సీఐ పి. రంగనాథం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్కు చెందిన షేక్ అస్రాఫుల్, షేక్ బాబు, ఒడిశాకు చెందిన రూపేష్ నాగ్లను సోమవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 18 గ్రాముల బంగారు ఆభరణాలు, 200 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకుని, నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై ఎం. రాజేష్ తెలిపారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ఫిర్యాదులపై చర్యలు చేపట్టాలి
● ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డిపార్వతీపురం రూరల్: అర్జీదారులు తెలియజేసిన సమస్యలను పరిష్కరించాలని ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఏడుగురు అర్జీదారులు తమ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. ప్రధానంగా కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, భూ వివాదాలు, ఆన్లైన్ దగా, వేధింపులు, అధిక వడ్డీలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి. అధికారులకు ఆదేశం.. బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న ఎస్పీ.. అక్కడికక్కడే సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఫిర్యాదులపై క్షుణ్ణంగా విచారణ జరిపి, వాస్తవాల ఆధారంగా చట్టపరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యలపై నివేదికను జిల్లా కార్యాలయానికి పంపాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ సీఐ ఆదాం, ఎస్సై రమేష్నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు. -
బాధను దిగమింగి..
● తల్లి మరణించిన మరుచటి రోజే పరీక్షకు హాజరురామభద్రపురం: తండ్రి ఎలా ఉంటాడో తెలియదు.. అన్నీ తానై పెంచిన తల్లి అనారోగ్యంతో మృతి చెందింది.. తల్లి కళ్లెదుటే విగతజీవిగా పడి ఉంటే కుమిలి కుమిలి ఏడ్చిన కుమారుడు అంతటి బాధను కూడా దిగమింగుకుని మరుచటి రోజు పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కొట్టక్కి గ్రామానికి చెందిన ముల్లు రామలక్ష్మి (33) గర్భిణిగా ఉన్నప్పుడు ఆమె భర్త విడిచిపెట్టి మరో మహిళతో వెళ్లిపోయాడు. అప్పటి నుంచి రామలక్ష్మి ఇళ్లల్లో పనులు చేసుకుంటూ బిడ్డను (కోటేశ్వరావు) సాకుతూ వచ్చింది. కుమారుడిని గారాబంగా పెంచుకుంటూ పదో తరగతి వరకు చదివించింది. ఇక పై చదువులు చదివి తనను ఆదుకుంటాడనుకున్న సమయంలో విధి వక్రించింది. అనారోగ్యంతో రామలక్ష్మి ఆదివారం కన్నుమూసింది. దీంతో గుండెలవిసేలా ఏడ్చిన కోటేశ్వరరావు.. ఇంతటి బాధలోనూ సోమవారం జరిగిన పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు. -
ఇస్కో 'యువికా'కు ఇలా దరఖాస్తు చేసుకోండి..
పాలకొండ రూరల్: విద్యార్థి దశ నుంచే అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి పెంపొందించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ‘యువ విజ్ఞాని కార్యక్రమ్ (యువికా)–2026’ను నిర్వహిస్తోంది. విద్యార్థులకు సాంకేతికత, అంతరిక్ష పరిశోధన, అనువర్తనాలపై ప్రాథమిక స్థాయి నుంచి విజ్ఞానాన్ని అందించడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని సైన్స్ ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి నాటికి 9వ తరగతి చదువుతున్న భారతీయ విద్యార్థులు ‘యువ విజ్ఞాని కార్యక్రమ్’నకు అర్హులు.ఇందులో పాల్గొనేందుకు ఈ ఏడాది ఫిబ్రవరి 27 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుండగా.. మార్చి 31 వరకు గడువు ఉందని ఐస్రో అధికారులు చెబుతున్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను ఎంపిక చేసి వారికి రానున్న మే నెలలో14 రోజులు ప్రత్యేక వసతిగృహంలో ఉంచి శిక్షణ అందిస్తారు. ఇస్రో సెంటర్లలో ప్రాక్టికల్ సెషన్లు, ప్రాజెక్ట్లు, ఇంటరాక్టివ్ సెషన్లపై సంపూర్ణ అవగాహన కల్పించనున్నారు.దరఖాస్తు చేయడం ఇలా... అర్హులైన విద్యార్థులు https://jigyasa.iirs.gov.in/yuvika వెబ్సైట్ను ఓపెన్ చేసి యువికా – 2026 (yuvika 2026 Registration) లింక్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేయదలచిన విద్యార్థి పేరు, తండ్రి పేరు, పాఠశాల వివరాలను నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి. వీటితో పాటు వ్యక్తిగత, విద్య, ఇతర వివరాలతో దరఖస్తు పత్రాన్ని పూర్తి చేయాలి. అవసరమైన పత్రాలు (మార్క్షీట్లు, సర్టిఫికెట్లు) స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 8వ తరగతి మార్కులు, క్విజ్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఈ ఏడాది మే 11 నుంచి 22 వరకు శిక్షణ ఇస్తారు. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంగల పాఠశాల విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తారు. ఆసక్తి గల విద్యార్థులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసిన వెంటనే ఆన్లైన్లో క్విజ్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.శిక్షణ కేంద్రం ఎంచుకోవాలి.. దేశ వ్యాప్తంగా సతీష్ ధావన స్పేస్ సెంటర్– శ్రీహరికోట, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్–హైదరాబాద్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్– డెహ్రాడూన్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్–తిరువనంతపురం, యూఆర్ రావు శాటిలైట్సెంటర్– బెంగుళూరు, స్పేస్ అప్లికేషన్– అహ్మదాబాద్, నార్త్ ఈస్ట్రన్ స్పేస్ అప్లికేషన్ సెంటర్– షిల్లాంగ్, తదితర కేంద్రాల్లో ఎదో ఒక సెంటర్ను విద్యార్థి ఎంపిక చేసుకోవచ్చు. తద్వారా విద్యార్థులు ఇస్రో శాస్త్రవేత్తలతో నేరుగా కలవడం, అక్కడి ల్యాబ్లను స్వయంగా సందర్శించడంతో పాటు స్పేస్టెక్ ప్రాజెక్టుల చేసే అవకాశం ఉంటుంది. పరిశోధనాత్మకత, సైన్స్ రంగాలకు చెందిన కొలువులపై ఆశక్తి ఉన్నవారు ఈ ఆవకాశం అందిపుచ్చుకోవాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు.ఏప్రిల్ 13న మొదటి జాబితా.. ఎంపిక ప్రక్రియ పూర్తి చేసిన వెంటనే మొదటి జాబితా ఏప్రిల్ 13న విడుదల చేస్తారు. జిల్లా పరిధిలో గల 213 ఉన్నత పాఠశాలల ద్వారా విద్యార్థుల నుంచి దరఖాస్తుల రిజిస్టేషన్ ప్రక్రియ సాగుతోంది. ఆసక్తి గల విద్యార్థులు గుర్తించాలి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈనెల 31లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. – పాటోజు బ్రహ్మాజీరావు, జిల్లా విద్యాశాఖాధికారి, పార్వతీపురం మన్యం ఎంపికలో ప్రాధాన్యం.. యువికా ఎంపిక ప్రక్రియంలో మార్కులకు ఉండే ప్రాధాన్యతను విద్యార్థులు గుర్తించాలి. ముఖ్యంగా 8వ తరగతిలో వచ్చే మార్కులకు 50 శాతం, రాష్ట్ర, జాతీయ స్థాయి సైన్స్ ప్రదర్శనలు, ప్రతిభా పరీక్షల్లో తొలి మూడు స్థానాలు సాధించిన విద్యార్థులకు 10 శాతం, స్కౌట్, ఎన్సీసీ విభాగాలకు చెందిన విద్యార్థులకు 5 శాతం రిజర్వేషన్లు ఉంటాయి. ఎంపికైన విద్యార్థుల ఖర్చులు ఇస్రో భరిస్తుంది. దేశంలో ఉన్న ఏడు ఇస్రో కేంద్రాల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ ప్రాంత పరిధిలో ఉండే శ్రీహరికోట, హైదరాబాద్ కేంద్రాల్లో శిక్షణ పొందే అవకాశం ఉంటుంది. – గిరడ లక్ష్మణరావు, జిల్లా సైన్స్ అధికారి, పార్వతీపురం మన్యం -
రూ.3.20 కోట్ల గంజాయి పట్టివేత
బొండపల్లి: ఒడిశా కేంద్రంగా విశాఖపట్నంకు భారీగా తరలిస్తున్న గంజాయిని విశాఖకు చెందిన నార్కోటిక్ సెంట్రల్ బ్యూరో(ఎన్సీబీ) పోలీసులు ఆదివారం వేకువజామున పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు.. ఒడిశాలోని సిమిలిగూడ ప్రాంతానికి చెందిన అజయ్రాయ్ తన బొలెరో వ్యాన్లో వేకువజామున వ్యాన్లో కింద గంజాయి ప్యాకెట్లు పేర్చి పైన క్యాబేజీలను వేసి రవాణా చేస్తుండగా ఎన్సీబీ పోలీసులకు అందిన సమాచా రం మేరకు బొండపల్లి పోలీస్స్టేషన్ మీదుగా వెళ్తు న్న బొలెరో వాహనాన్ని పట్టుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. 647 కేజీల గంజాయి స్వాధీనం విశాఖపట్నం ఎన్సీబీకి అందిన సమాచారం మేర కు ఒడిశాలోని సిమిలిగూడ నుంచి విశాఖపట్నం తరలిస్తున్న 647కేజీల గంజాయిని పట్టుకోవడంతో పాటు వ్యాన్ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. దాడుల్లో ఎన్సీబీ పోలీసులు, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్ఐలతో పాటు సిబ్బంది పాల్గొని బొలెరో వ్యాన్ను పట్టుకున్నారు. ఆరా తీ యగా కాయగూరలు రవాణా మాటున గంజాయి తరలింపు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గంజాయి విలువ రూ.3.20 కోట్లు పోలీసులకు పట్టుబడిన గంజాయి విలువ సుమా రు రూ.3.20 కోట్లు ఉంటుందని పోలీసులు గుర్తించారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకోవడంతో పాటు అందుకు సహకరించిన వారిపై ఆరా తీసే పనిలో ఎన్సీబీ పోలీసులు నిమగ్నమయ్యారు. -
షర్మిల రచ్చబండలో ‘జగనన్న’ నామస్మరణ!
● గత వైఎస్సార్సీపీ పాలనపై గిరిజనుల ప్రశంసలు ● అవాకై ్కన పీసీసీ చీఫ్ షర్మిల పార్వతీపురం రూరల్/కొమరాడ : ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ‘ఉపాధి హామీ బచావో సంగ్రామ్’ యాత్రలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ వేదికపై గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి గిరిజన మహిళలు ఎలుగెత్తి చాటడంతో అక్కడ ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. తన పర్యటనలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం కొమరాడ మండలం డంగభద్ర గ్రామంలో ఏర్పా టు చేసిన రచ్చబండ కార్యక్రమంలో షర్మిల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటుండగా, పార్వతీపురం మండలం కొత్త ఊరు గిరిజన గ్రామానికి చెందిన గిరిజన మహిళ హిమరిక నూకమ్మ గళమెత్తి వినిపించిన వాస్తవాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో... నూకమ్మ మాట్లాడుతూ.. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో తమ గ్రామానికి మహర్దశ పట్టిందని కొనియాడారు. అప్పటి ఎమ్మెల్యే అలజంగి జోగారావు కృషితో తమ గ్రామానికి రోడ్లు, ఇంటింటికీ మంచినీటి కుళాయిలు అందాయని, ‘గడప గడపకు’ పాలనలో తమ సమస్యలు తక్షణమే పరిష్కారమయ్యేవని గుర్తు చేసుకున్నారు. అయితే, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో పరిస్థితి తలకిందులైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పండుగ కాలం నుంచి ఉపాధి హామీ కూలి డబ్బులు అందక, తాగడానికి గుక్కెడు మంచి నీరు లేక అవస్థలు పడుతున్నామని సభలో ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై అసహనం స్థానిక సచివాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు, ఐటీడీఏ పీఓ కార్యాలయం గడప తొక్కినా తమ గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యారని నూకమ్మ కుండబద్దలు కొట్టారు. ప్రజా క్షేత్రంలో విమర్శలే ఆయుధంగా యాత్ర చేస్తున్న షర్మిలకు, జగన్మోహన్రెడ్డి హయాంలో జరిగిన మేలును సాక్షాత్తూ ఒక గిరిజన మహిళ ప్రశంసించడం ఆమెకు విస్మయం కలిగించింది. గత ప్రభుత్వ అభివృద్ధి ఫలాలను ప్రజలు ఇంకా నెమరువేసుకుంటున్న తీరు చూసి షర్మిలారెడ్డి సైతం కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారు. -
వైభవంగా శ్రీవారి తెప్పోత్సవం
హంస వాహనంపై శ్రీదేవి, భూదేవితో విహరిస్తున్న శ్రీనివాసుడు డెంకాడ: చింతలవలస ఐదవ ఏపీఎస్పీ బెటాలియన్ వద్ద ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారి తెప్పోత్సవం ఆదివారం సాయంత్రం వైభవంగా జరిగింది. వెంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవంలో భాగంగా ఆదివారం ఉదయం సుప్రభాతసేవ, వేదపండితులు పూజలు ప్రారంభించారు. అర్చన, మంత్రపుష్పం, నైవేద్యం, సేవాకాలం, భక్తుల దర్శనాలు, తులసి అర్చన పూజలు చేశారు. యాగశాల పూజలు, విశేష హోమాలు, నీరాజనం, మంత్రపుష్పం పూజలు నిర్వహించారు. లక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన పూజ చేశారు. అనంతరం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేరులో పూలు, రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరణ చేసి హంస వాహనంపై స్వామివారు శ్రీదేవి, భూదేవి సమే తంగా విహరించారు. చింతలవలస ఐదవ ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ వై.రవిశంకర్రెడ్డి తదితరులు తెప్పోత్సవంలో భాగంగా పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
ఏరియా ఆస్పత్రిని సందర్శించిన వైద్య బృందం
సీతంపేట: స్థానిక ఏరియా ఆస్పత్రిని రాష్ట్ర కాయకల్ప వైద్య బృందం ఆదివారం సందర్శించింది. ఆస్పత్రి సర్టిఫికేషన్కు అర్హత ఉందా.. లేదా.. అనేది పరిశీలించారు. ఆస్పత్రి పరిసరాలు, పారిశుధ్యం, బయో వేస్ట్ మేనేజ్మెంట్ ఇతర అంశాలను క్షుణ్నంగా తనిఖీ చేశారు. బెడ్ల సౌకర్యాలు, రోగుల వివరాలు తెలుసుకున్నారు. రక్త పరీక్షల రికార్డులు, కిట్లు చూశారు. రోగులతో ఆస్పత్రిలో కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో టీం లీడర్ ప్రవీణ్, బయో మెడికల్ ఇంజినీర్ సంతోష్, ఎన్క్వాస్ నోడల్ ఆఫీసర్ మణికంఠ, ప్రాంతీయ ఆస్పత్రి సూపరింటెండెంట్ బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
దుర్గాదేవి నిజరూప దర్శనానికి పోటెత్తిన భక్తులు
వీరఘట్టం: స్థానిక శ్రీకోటదుర్గ తల్లి ఆలయ తృతీయ వార్షికోత్సవం ఆదివారం కనులపండువగా నిర్వహించారు. యజ్ఞకర్త ఎస్.వి.ఎల్.ఎన్ శర్మయాజీ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, పరిషత్ కృఛ్చత్రయం, పంచగవ్వ ఆరాధన, అఖండ దీపారాధన, ఋత్విక్ వరుణ ప్రధానం, యాగశాల ప్రవేశ ద్వారపూజ, ధ్వజ పతాకావిష్కరణ, మండల మండపారాధనతో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు అమ్మవారి నిజరూప దర్శనాన్ని భక్తులు తిలకించారు. నిజరూపంలో ఉన్న దుర్గాదేవికి భక్తులు మట్టి కుండలతో తెచ్చిన పాలతో అర్చకులు దుర్గాదేవిరి క్షీరాభిషేకాలు చేశారు. సాయంత్రం దుర్గాదేవి భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద ఎత్తున దుర్గాదేవిని దర్శించుకుని పూజలు చేశారు. విజయనగరం అర్బన్: వయోజన విద్యా శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ఉల్లాస్ అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉల్లాస్ ఎఫ్ఎల్ఎన్ఏటీ పరీక్ష ఆదివారం నిర్వహించారు. జిల్లాలోని 27 మండలాలు, 4 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 1,11,369 మంది అభ్యాసకులు 1,356 పరీక్ష కేంద్రాలలో పరీక్ష రాశారని వయోజన విద్య నోడల్ అధికారి ఎ.వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని తెలిపారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్రెడ్డి స్థానిక ధర్మపురిలోని ఎల్డీజీ జూనియర్ కళాశాలలోని పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల పర్యవేక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన వయోజన విద్యా విభాగానికి చెందిన ప్రదీప్ బి.హెదాపూ జిల్లాలో పర్యటించారు. అదే విధంగా జిల్లా సమన్వయ కమిటీతో పాటు మండల స్థాయి లో ఎంపీడీఓలు, ఏపీఎంలు, సీడీపీఓలు, మున్సిపల్ స్థాయిలో సీఎంఎంలు, వయోజన విద్యా శాఖ పర్యవేక్షకులు పరీక్షల నిర్వహణను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించారు. గజపతినగరం రూరల్: స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు పదో తరగతి పరీక్ష కేంద్రం కేటాయించకపోవడం వెనుక దాగి ఉన్న వాస్తవాలేంటని స్థానికులు చర్చించుకుంటున్నారు. 1959లో ఏర్పాటైన ఈ పాఠశాలలో పదో తరగతి పరీక్ష కేంద్రం కేటాయించకపోవడం ఇదే తొలిసారి కావడం స్థానికులను, పూర్వ విద్యార్థులను విస్మయానికి గురి చేసింది. ప్రతీసారి ఏదో ఒక పరీక్షకు కేంద్రంగా నిలిచే ఈ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఈ ఏడాది పది పరీక్షలకు కేంద్రం కేటాయించకపోవడం వెనుక గల కారణమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం కేటాయించలేదని ఆల స్యంగా తెలుసుకున్న స్థానికులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. సోమవారం నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు మండలంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, శ్రీకృష్ణ విద్యాపీఠ్, ఆర్సీఎం హైస్కూల్, మోడల్ హైస్కూల్ కేంద్రాలను ఎంపిక చేశారు. వీటిలో రెండు ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఆర్సీఎం హైస్కూల్ గజపతినగరానికి చాలా దూరంగా ఉండడంతో విద్యార్థులకు కొంత ఇబ్బందులు తప్పవు. నగరం నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ బాలుర పాఠశాలను కాదని దూరంగా ఉన్న పాఠశాలను ఎంపిక చేయడాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు తప్పుపడుతున్నారు. దశాబ్దాల తరబడి ఈ ప్రాంత టెన్త్ విద్యార్థులకు పరీక్ష కేంద్రంగా ఉండే ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఈసారి ఎందుకు ఇలా జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వరరావు వద్ద సాక్షి ఆదివారం ప్రస్తావించగా.. కేంద్రం ఎంపిక విషయం తన పరిధిలోనిది కాదని, కారణం తనకు తెలియదని చెప్పారు. -
పాలనపై పట్టులేని చంద్రబాబు
● ఇచ్చిన హామీలు గాలికొదిలేశారు.. ● ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ రేగిడి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు 40 సంవత్సరాల అనుభవమని డప్పు కొట్టుకోవడమే తప్ప పాలనపై పట్టులేదని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. మండలంలోని అక్కన్నఅగ్రహా రం గ్రామానికి ఆదివారం వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి కాకుండా కేవలం అబద్దపు ప్రచారాలకే పరిమితమైందని అన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో చేసి న అప్పు కంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కాకముందే రూ.3.35 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ప్రజలకున్న అభిమానాన్ని చూసి ఓర్వలేకే పార్టీపై బురదజల్లే కార్యక్రమం చేపడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా గాలికొదిలేసి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని డబ్బా కొట్టుకోవడమేనని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇంత వరకు బడుగు బలహీన వర్గాల వారికి ఇళ్లు, అర్హులైన వారికి పింఛన్లు అందజేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను చంద్రబాబు ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా రద్దు చేసిందని మండిపడ్డారు. గతంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రైతులకే ఏటా రూ.13వేలు పెట్టుబడి సాయం అందించి ఆదుకుందని, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో రూ.20 వేలు పెట్టుబడి సాయం ఇస్తామని హామీ ఇచ్చి మొండి చేయి చూపించారని విమర్శించారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు టి.అచ్చెన్నాయుడు, మండల పార్టీ కన్వీనర్ వి.జగన్మోహనరావు, మండల పార్టీ ఉపాధ్యక్షులు కె.వెంకటేశ్వరరావు, బీసీ సెల్ అధ్యక్షులు కరణం శ్రీనివాసరావు, సర్పంచ్లు కె.గోవిందరావు, గార రమణ, ఉప సర్పంచ్ బాలి తవిటినాయుడు, పి.ధవళేశ్వరరావు ఉన్నారు. -
నేటి నుంచే పది పరీక్షల సమరం
సోమవారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2026పది పరీక్షలకు పోలీస్ పహారా పార్వతీపురం/పార్వతీపురం రూరల్ : వరుస విజయాల వెలుగులో, హ్యాట్రిక్ ఘనతను సొంతం చేసుకున్న పార్వతీపురం మన్యం జిల్లా మరో కీలక విద్యా పరీక్షకు సిద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఈ పరీక్షలను అత్యంత ప్రశాంత వాతావరణంలో, ఎటువంటి చిన్న పొరపాటుకు తావులేకుండా నిర్వహించాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన వివిధ శాఖల సమన్వయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి, పరీక్షల నిర్వహణపై దిశా నిర్దేశం చేశారు. నిబంధనలు కఠినం.. నిఘా నిరంతరం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. అయితే, విద్యార్థులు ఉదయం 9 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల ప్రవేశంపై కఠిన నిషేధం విధించారు. పరీక్ష సమయాల్లో కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను తప్పనిసరిగా మూసివేయాలని ఆదేశించారు. ప్రశ్నపత్రాల భద్రత విషయంలో రాజీ పడకూడదని, స్ట్రాంగ్ రూముల నుంచి కేంద్రాల వరకు పోలీసు బందోబస్తు మధ్య పంపిణీ జరగాలని సూచించారు. విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు మండు వేసవిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల ఆరోగ్యానికి పెద్దపీట వేశారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద తాగునీరు, ఫ్యాన్లు, వెలుతురు వంటి కనీస వసతులతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రాథమిక చికిత్స పరికరాలను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ బస్సులలో సైతం విద్యార్థుల కోసం ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఉంచనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు నిరంతరం అందుబాటులో ఉంటారు. పరీక్షలు ముగిసిన వెంటనే సమాధాన పత్రాలను సురక్షితంగా పోస్ట్ ఆఫీసులకు చేరవేయాలని కలెక్టర్ సూచించారు. మరోసారి అగ్రస్థానమే లక్ష్యం జిల్లా ఏర్పడిన నాటి నుంచి విద్యా రంగంలో పార్వతీపురం మన్యం జిల్లా తనదైన ముద్ర వేస్తోంది. 2023లో 87.47 శాతం, 2024లో 96.37 శాతం, గత ఏడాది 2025లో 93.90 శాతం ఉత్తీర్ణతతో వరుసగా మూడుసార్లు రాష్ట్రంలోనే ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకుని హ్యాట్రిక్ సాధించింది. గిరిజన ప్రాంతాలు అధికంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేటుకు ధీటుగా రాణిస్తుండటం గమనార్హం. ఈ ఏడాది కూడా అదే విజయపరంపరను కొనసాగించి, రాష్ట్ర స్థాయిలో జిల్లా కీర్తి పతాకాన్ని ఎగురవేయాలన్న సంకల్పంతో అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులు కఠినంగా శ్రమించారు. సమీక్ష సమావేశంలో ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాధమిక అక్షరాస్యత పరీక్ష సక్సెస్ వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా వ్యాప్తంగా ప్రాధమిక అక్షరాస్యత పరీక్ష(ఎఫ్ఎల్ఎన్ఏటీ) విజయవంతమైందని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. జిల్లాలో 1415 కేంద్రాల్లో 67,686మంది అభ్యాసకులు పరీక్షలు రాయాల్సి ఉండగా 66,467మంది పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి 222 కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు : ఎస్పీ హ్యాట్రిక్ ఉత్సాహంతో సిద్ధమైన మన్యం జిల్లా పొరపాటుకు తావు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుపార్వతీపురం రూరల్: జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల కోసం పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 222 పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతర నిఘా ఉంచనున్నట్టు ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు ముగిసే వరకు కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, డ్రోన్ కెమెరాలు, మొబైల్ పెట్రోలింగ్ బృందాలతో నిరంతరం పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని, ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపిస్తామని స్పష్టం చేశారు. పరీక్షలు జరిగే సమయంలో పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు మూసి వేయాలని ఆదేశించారు. ప్రశ్న పత్రాలు, సమాధాన పత్రాల తరలింపునకు పటిష్ట ఎస్కార్ట్ ఏర్పాటు చేశామని తెలిపారు. మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ వంటి చర్యలకు పాల్పడినా.. సహకరించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ఆయన ఆకాంక్షించారు. -
స్టీల్ప్లాంట్ ఏర్పాటుకు వ్యతిరేకం
● జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణగుర్ల: మండలంలోని కెల్ల, బెల్లానపేట, దమరసింగి, వల్లాపురం, మన్యపురిపేట గ్రామాలలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేయునున్న ఇంటిగ్రేటేడ్ స్టీల్ ప్లాంట్కు జనసేన వ్యతిరేకమని జనసేన రాష్ట్ర నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ స్పష్టం చేశారు. మండలంలోని బెల్లానపేటలో ఐదు గ్రామాల రైతులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టీల్ప్లాంట్కు వ్యతిరేకంగా, రైతుల పక్షాన పోరాటం చేస్తామని హమీ ఇచ్చారు. పరిశ్రమలు మొట్ట ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని, మూడు పంటలు పండే పల్లం ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం వల్ల రెతులుకు అన్యాయం జరుగుతుందన్నారు. సాగు భూములను పరిశ్రమలకు కట్టబెట్టడాన్ని తప్పుబట్టారు. పంచాయతీల తీర్మానం లేకుండా ప్లాంట్లు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఈ సమస్యను జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. కార్యక్రమంలో జనసేన చీపురుపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు, జనసేన నేత రమేష్ రాజు ఉన్నారు. -
కాపాడాల్సిన మీరే ఆక్రమిస్తే ఎలా..?
● బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయనకు ఫోన్ చేసి ప్రశ్నించిన పీసీసీ చీఫ్ షర్మిలబొబ్బిలి: ప్రజల ఆస్తులను కాపాడాల్సిన మీరే సమస్యగా మారితే ఎలా అని.. బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయనను పీసీసీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. మండలంలోని పారాదిలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర – రచ్చబండ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సమయంలో బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట గ్రామానికి చెందిన ఏడుగురు పేదలు ఆమెను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. 1991లో ప్రభుత్వం తమకు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ భూములను పంపిణీ చేయగా..సాగు చేసుకుంటున్నట్లు బాధితులు పీసీసీ చీఫ్ దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఇటీవల బేబినాయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ భూమిని రియల్టర్లకు అప్పగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ దగ్గర భూమికి సంబంధించి ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలు, బ్యాంకుల్లో చెల్లిస్తున్న క్రాప్లోన్లు, రైతుభరోసా వచ్చిన వివరాలు వైఎస్ షర్మిలకు చూపిస్తూ న్యాయం చేయాలని కోరారు. దీంతో ఆమె వెంటనే ఎమ్మెల్యే బేబి నాయనకు ఫోన్ చేయగా.. ఆ భూముల విషయం తర్వాత వివరిస్తానని బదులిచ్చారు. నాకు చెప్పవద్దు.. బాధితులకు వివరించాల్సిన బాధ్యత మీపై ఉంది కాబట్టి వెంటనే సమాధానం చెప్పాలని పీసీసీ చీఫ్ పట్టుబట్టగా, ఎమ్మెల్యే స్పందిస్తూ వారి ఆరోపణల్లో నిజం లేదు.. వారు చెప్పిన సర్వే నంబర్ వేరు.. ఈ సర్వే నంబర్ వేరు.. నేను ఇప్పుడు రాజాంలో ఉన్నాను. తర్వాత చెప్తాను అంటూ ఫోన్ కట్ చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, బాధితుల వినతి మేరకు ఆమె అధికారులకు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు విద్యాసాగర్, ఇన్చార్జ్ మువ్వల శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ సక్సెస్ మీట్
విజయనగరం అర్బన్: నగరంలోని ఓ ప్రైవేట్ సమావేశ మందిరంలో ఆర్ఎస్ రెడ్డి ఇన్న్స్టిట్యూట్ సక్సెస్ మీట్ ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆఫ్లైన్ కోచింగ్తో పాటు ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ యాప్ ద్వారా ఆన్లైన్ శిక్షణ అందించడం గొప్ప విషయమన్నారు. గ్రూప్ వన్లో ఒకరు, గ్రూప్–2లో 66 మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించడం విజయనగరం జిల్లాకే గర్వకారణమన్నారు. అనంతరం గ్రూప్స్ విజేతలను సన్మానించారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, మాజీ ఎమ్మెల్సీ రఘువర్మ, ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డి. రామకృష్ణ, ఎయిమ్స్ గ్రూప్స్ ప్రతినిధి కడగల ఆనంద్, ఏఎంసీ ప్రతినిధి గేదెల రాజారావు, సువ్వాడ రవిశేఖర్, తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయులపై పనిభారం తగ్గించాలి..
● పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్యగజపతినగరం రూరల్: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులపై తీవ్రమైన పని ఒత్తిడి ఉందని.. వెంటనే ప్రభుత్వం స్పందించి పనిభారం తగ్గించాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య డిమాండ్ చేశారు. మండలంలోని మరుపల్లిలో గల బాలాజీ పాలిటెక్నిక్ కళాశాలలో పీఆర్టీయూ ఐదో జిల్లా కార్యనిర్వాహక వర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఆర్టీయమూ సంఘాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, అందుకు అవసరమైన సభ్యత్వ నమోదు మరింత ఎక్కువ స్థాయిలో చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏఎం గిరిప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉపాధ్యాయలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో పోరాటాలు చేయక తప్పదన్నారు. అనంతరం జనరల్ సెక్రెటరీ డి. శ్రీనివాస్ సంఘ వార్షిక నివేదికను సభకు సమర్పించారు. ఈ సందర్భంగా మూడోసారి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా తమ సంఘం తరఫున ఎన్నికై న గాదె శ్రీనివాసులునాయుడును రాష్ట్ర నాయకులు ఘనంగా సత్కరించారు. అంతకుముందు ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు వలిరెడ్డి రవీంద్రనాయుడు, జిల్లా జనరల్ సెక్రెటరీ డి.శ్రీనివాస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రావాడ రాంబాబు, బైరి అప్పారావు, పప్పల రాజశేఖర్, ఆల్తి రాంబాబు, డెక్క వెంకటరావు, బండారు రవికుమార్, బూడి వెంకటరావు, పీఆర్టీయూ మండల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పీడీఓ జిల్లా కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవం
విజయనగరం రూరల్: పంచాయతీ అభివృద్ధి అధికారుల (పీడీఓ) జిల్లా సంఘం ఎన్నిక ఏకగ్రీవమైంది. పట్టణంలోని ఏపీ ఎన్జీఓ భవనంలో పంచాయతీ అభివృద్ధి అధికారుల జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా మంత్రి రమణ, కార్యదర్శిగా కె. శ్రీకాంత్ ఎన్నికయ్యారు. అసోసియేట్ అధ్యక్షుడిగా తాడి వెంకటరావు.. ఉపాధ్యక్షులుగా ఎం.జగదీష్, సీహెచ్ ప్రసాద్, ఎ. ప్రవీణ్కుమార్, ఎస్.సురేష్, బి.భవానీ.. సంయుక్త కార్యదర్శులుగా ఎస్.హేమాంజలి, పి. రాంబాబు, కె. వెంకటరావు, ఎ. ముజీబ్, టి. రజని.. కోశాధికారిగా వి. శ్రీనివాస్.. కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎం.స్వామినాయుడు.. గౌరవ అధ్యక్షుడిగా యర్ర రమణలతో పాటు 8 మంది సభ్యులు ఎన్నికయ్యారు. అలాగే ప్రధాన సలహాదారుగా అచ్యుతరావు, న్యాయ సలహాదారునిగా పప్పు త్రినాథ్ ఎన్నికై నట్లు ఏపీ ఎన్జీఓ జిల్లా ఉపాధ్యక్షుడు కె. శ్రీనివాసరావు తెలిపారు. సహాయ ఎన్నికల అధికారిగా ఎం. శ్రీనివాసరావు, ఎన్నికల పరిశీలకుడిగా కె. చంద్రశేఖర్ వ్యవహరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు ఎ. సురేష్ మాట్లాడుతూ.. పీడీఓల సమస్యలపై పోరాటం చేయడానికి ఏపీ ఎన్జీఓ అండగా ఉంటుందన్నారు. వన్ పీడీఓ – వన్ యూనియన్ నినాదంతో సభ్యులందరూ ఏకమై సమస్యల పరిష్కరానికి కృషి చేయాలని తీర్మానించారు. కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా సుమారు 300 పైగా పీడీఓలు హాజరయ్యారు. -
వడగాడ్పులపై తస్మాత్... : కలెక్టర్
విజయనగరం కలెక్టరేట్: రాబోయే ఎండా కాలంలో ఎండ తీవ్రత, వడగాడ్పుల ప్రభావం పెరిగే అవకాశం ఉన్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సూచించారు. ప్రజలు పలుచటి కాటన్ దుస్తులు ధరించడం, తలపై టోపీ లేదా రుమాలు ధరించడం, తరచుగా మంచినీరు, మజ్జిగ, నిమ్మరసం వంటి ద్రవాలు తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఎండలో ఎక్కువసేపు పని చేయకూడదని తెలిపారు. వడదెబ్బకు గురైన వారిని వెంటనే నీడ ఉన్న చల్లటి ప్రదేశానికి తరలించి తడి గుడ్డతో శరీరాన్ని చల్లబరచాలని, అవసరమైతే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించాలని సూచించారు. జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపడుతున్నందున ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరూ అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు. -
కనులపండువగా సాంస్కృతికోత్సవం
విజయనగరం: ఉగాది సంబరాలు పేరిట విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో తెలుగు భాషా పరిరక్షణ సమితి, ఘంటసాల సంగీత సాంస్కృతిక సమాఖ్య, చిన్న శ్రీను సోల్జర్స్ సంస్థ సంయుక్తంగా శనివారం నిర్వహించిన సాంస్కృతికోత్సవంలో పదనిసలు పల్లవించాయి. ప్రదర్శనలు పరవళ్లు తొక్కాయి. చిన్నారుల నృత్య ప్రదర్శనలు కనువిందు చేశాయి. కళాకారుల గీతాలు వీనుల విందుగావించాయి. మొత్తంగా సాంస్కృతికోత్సవం పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించింది. సమాఖ్య వ్యవస్థాపకులు సముద్రాల గురుప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరిసహస్ర జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నవ చైతన్యానికీ విశ్వసౌందర్యానికీ ప్రతీక ఉగాది పర్వదినమని పేర్కొన్నారు. కొత్త ఆశల చిగుళ్లను ఆవిష్కరించే ఉగాది తెలుగువారి తొలి పండుగగా చెప్పారు. వసుధ మీదకు వసంతం వస్తోందని త్వరలో రానున్న ఉగాది విజయనగరం ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. సముద్రాల గురుప్రసాద్ మాట్లాడుతూ కాలం మార్పుల ప్రవాహమని, సుఖ దుఃఖాలు, శుభాశుభాల నిరంతర పరంపరగా వాఖ్యానించారు. 2026 ఉగాదిని పురస్కరించుకుని నృత్య రంగంలో వరలక్ష్మీత్యాగరాజ కళాశాలకు చెందిన గాయత్రి, అమృతవర్షిణి డ్యాన్స్ స్కూల్కు చెందిన తెలికిచెర్ల సౌమ్య, లయ లాస్య డ్యాన్స్ స్కూల్కు చెందిన బెల్లాన రాజు, విశ్వకర్మ డ్యాన్స్ అకాడమీకి చెందిన ప్రవీణ్కుమార్ ఆచార్య, కుమారి హర్షితలకు, సేవారంగం నుంచి ముళ్లపూడి సుభద్రాదేవి, డివి.సత్యనారాయణ, డిమ్స్ రాజు, తాడేపల్లి నాగేశ్వరరావులకు, పాత్రికేయ రంగం నుండి కె.జె.శర్మ, మజ్జి శివకుమార్లకు, వెంట్రిలాక్విజమ్ నుంచి శ్రీనివాస పండిట్, ఫొటోగ్రఫీ రంగం నుంచి బుర్రా శ్రీనివాసరావులకు, కళారంగం నుంచి గంటాలక్ష్మీలకు ఉగాది పురస్కారాలను సమాఖ్య అధ్యక్షులు గురుప్రసాద్తో కలసి చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముందుగా చిన్నారులు ప్రదర్శించిన నృత్యప్రదర్శనలు అందరినీ అలరించాయి. చిన్నారులను వరలక్ష్మీ త్యాగరాజ నృత్య కళాశాల వ్యవస్థాపకురాలు లక్ష్మిరామదాసు ఆశీర్వదించారు. -
19 నుంచి వసంత నవరాత్రి మహోత్సవాలు
గరుగుబిల్లి: తోటపల్లిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి, కోదండరామస్వామి ఆలయాల్లో ఈ నెల 19 నుంచి 27 వరకు శ్రీరామ వసంత నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శ్రీమద్రామాయణ పారాయణం, శ్రీరామలక్ష్మీ జపంతో పాటు అష్టోత్తర, సహస్ర నామార్చనలు నిర్వహించనున్నారు. ఈ నెల 27న ఉదయం శ్రీ సీతారామస్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం శ్రీ స్వామివారి పట్టాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు. కల్యాణంలో పాల్గొనే దంపతులు తమ గోత్రనామాలతో రూ.500లు చెల్లించి పాల్గొనాలని ఆలయ కార్యనిర్వహణాధికారి బి.శ్రీనివాస్ తెలిపారు. కల్యాణంలో పాల్గొనే దంపతులకు ప్రసాదం, శేష వస్త్రాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ నెల ఉదయం 19న తోటపల్లి దేవాలయ ప్రాంగణంలో తెలుగు పండితులు పొందూరు సుధాకుమార్ శర్మచే ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు తోటపల్లిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలోని స్వామివారిని, పద్మావతి అమ్మవార్లను శనివారం భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకొని మొక్కులను చెల్లించుకున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తల నీలాలను సమర్పించుకున్నారు మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అన్నదానంలో పాల్గొన్నారు. -
లక్ష్యం అడగకు..!
ఆదివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2026● వన్ధన్ కేంద్రాలు.. అధికారులకే వం‘ధనం’ ● నిరుపయోగంగా పప్పులు, చిరుధాన్యాల యూనిట్లు ● గిరి ‘వెలుగంతా’ అవినీతి చీకటే.. లక్షల ఖర్చు.. సాక్షి, పార్వతీపురం మన్యం : గిరిజనులను ఆర్థికంగా బలోపేతం చేసే ఉద్దేశంతో ఏర్పడిన వన్ధన్ వికాస కేంద్రాలు(వీడీవీకే).. అధికారులకే వం‘ధనం’ అయ్యాయి. గిరిజన సంక్షేమం, అభివృద్ధి కోసం ఏర్పడిన ఐటీడీఏలో ఉన్న గిరి వెలుగంతా అవినీతిమయమైంది. శిక్షణలు, అడ్వాన్సులు, కొనుగోలు, విక్రయాలు, ఇతర కార్యకలాపాల్లో భారీగా అవకతవకలు చోటుచేసుకున్నాయి. వీడీవీకేలకు ఇచ్చిన నిధులు పెద్ద ఎత్తున దుర్వినియోగమైనట్టు ఆరోపణలున్నాయి. వీటిపై న్యాయబద్ధంగా జరగాల్సిన విచారణ సైతం.. వాస్తవాలను మరుగనపర్చింది. నివేదికలను తుంగలో తొక్కి, ‘మమ’ అనిపించేశారు. లక్ష్యం లేకుండా నిధులను వినియోగించినట్టు తేల్చినా.. అప్పటి ఏపీడీపై చర్యలు లేవు. ఫలితంగా గిరిజనుల ఆర్థికాభివృద్ధికి వెచ్చించాల్సిన రూ.లక్షల నిధులు దుర్వినియోగమైన పరిస్థితి ఏర్పడింది. ఆ మాత్రం తెలీదనుకోవాలా? యంత్రాలనైతే హడావిడిగా కొనుగోలు చేశారుగానీ.. వీటి ఏర్పాటు కోసం ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. కనీసం షెడ్లు ఏర్పాటు చేయలేదు. యంత్రాలు పని చేయాలంటే.. త్రీ ఫేజ్ కరెంటు ఉండాలి. ఇప్పుడు కరెంటు సమస్య వల్ల వినియోగించలేదని చెప్పుకొస్తున్నారు. త్రీ ఫేజ్ కరెంటు ఉండాలన్న ఆలోచన కూడా లేకుండా యంత్రాలు కొనుగోలు చేసేశారా? పోనీ, తర్వాతైనే ఏర్పాటు చేయడానికి ఎందుకు చర్యలు తీసుకోలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏళ్ల తరబడి నిరుపయోగంగా వదిలేసిన అధికారులు.. ఇప్పుడేమో వాటిని ఆసక్తి గల వ్యక్తులొస్తే వారికి కేటాయించి, పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు చేపడతామని చెప్పడం కొసమెరుపు. చింతపండు కేకులన్నారు.. శిక్షణలన్నారు! కొండ చీపుర్లు, చింతపండు కేకుల తయారీ యూనిట్లదీ అదే పరిస్థితి. ఎనిమిది మండలాలకు యంత్రాలు సరఫరా చేయగా.. చాలా చోట్ల వినియోగించడం లేదు. చింతపండును వీడీవీకేలతో కొనుగోలు చేయించి, పిక్క తీసి, కేకుల్లా మార్చి విక్రయించేందుకు పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని ఎనిమిది మండలాలకు రూ.11.43 లక్షలతో ఎనిమిది యంత్రాలను అప్పట్లో కొనుగోలు చేశారు. జియ్యమ్మవలస, పాచిపెంట మండలాల్లో యంత్రాలు నిరుపయోగంగా మిగిలిపోయాయి. మిగిలిన చోట్ల మార్కెటింగ్ చేయలేక నష్టాలు చవిచూశాయి. కొండచీపుర్లు, కటింగ్ మిషన్ల సంగతి ఏమిటో తెలియని పరిస్థితి. ఎన్ని చీపుర్లు తయారు చేశారో.. ఎంతకు అమ్మారో.. లాభనష్టాలేమిటో కూడా బయటకు రావు. ఆయా యంత్రాలను కమీషన్ల కోసమే కొనుగోలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. పుట్టగొడుగులు, ఊదొత్తుల తయారీ శిక్షణ వల్ల ఒనగూరే ప్రయోజనం శూన్యం. అగరబత్తుల తయారీ ద్వారా రూ.50,830 లాభం వచ్చినట్లు చెబుతున్న అధికారులు.. బకాయిలున్న రూ.1,03,875 వసూలుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. అప్పటి సిబ్బంది ప్రమేయంతో ఆ నిధులు సైతం దుర్వినియోగమయ్యాయన్న ఆరోపణలున్నాయి. నిధుల దుర్వినియోగం వెనుక అప్పటి గిరి వెలుగు ఏపీడీపైనే విమర్శలొచ్చాయి. సదరు అధికారి మీద చర్యలు తీసుకోకపోగా.. మరింత ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడం ఇంకాస్త విమర్శలకు తావిచ్చింది. -
ప్రత్యేక ఏర్పాట్లు
రామభద్రపురం: పదో తరగతి విద్యార్థుల్లో ప్రత్యేక అవసరాల పిల్లలకు పబ్లిక్ పరీక్షలలో వెసులుబాటు కల్పించారు. వీరికున్న శారీరక వైకల్యాన్ని బట్టి అర్హులైన వారికి సహాయకులను నియమించుకునేందుకు అవకాశం కల్పించారు. 9వ తరగతి చదివే బాల బాలికలను సహాయకునిగా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. చూపు సరిగా లేని విద్యార్థులు ఏదైనా ఒక భాష (లాంగ్వేజ్ సబ్జెక్టు) పరీక్ష రాయకుండా మినహాయింపు ఉంది. మిగిలిన పరీక్షల్లో 20 మార్కులు పొందితే ఉత్తీర్ణులవుతారు. వినికిడి లోపం ఉన్నవారు రెండు భాషలు రాయనవసరం లేదు. మిగిలిన పరీక్షల్లో సబ్జెక్టుకు 20 మార్కులు చొప్పున్న పొందాల్సి ఉంటుంది. మాట లోపం గల విద్యార్థులు ఒక్కో సబ్జెక్టులో 20 మార్కులు సాధించాలి. పరీక్ష సమయం అదనంగా అరగంట కేటాయిస్తారు. -
గూడ్స్ రైలులో మంటలు
● అర్ధ గంట పాటు కనిమెరక గేటు సమీపంలో నిలిచిపోయిన రైలు ● మంటలు ఆర్పిన తర్వాత బయలుదేరిన రైలు బొండపల్లి: మండలంలోని కనిమెరక – దావాలపేట రెల్వేగేట్లకు సమీపంలో విశాఖపట్టణం నుంచి గజపతినగరం వైపు బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలులో బొగ్గు వ్యాగిన్లో శనివారం మంటలు రావడంతో అర్ధ గంట పాటు నిలిపేశారు. బొగ్గు వ్యాగన్లో మంటలు రావడాన్ని గ్యాంగ్మన్లు పైడి సీతారాం, బి.సూర్యనారాయణ గమనించి అప్రమత్తమై రైలుకు ఎర్ర జెండా ఊపి నిలిపేశారు. దీంతో గూడ్స్ డ్రైవర్ల వద్ద ఉన్న మంటలను ఆర్పే యంత్రాలతో వాటిని అదుపు చేశారు. తరువాత రైలును యధావిధిగా పంపించారు. దీంతో ఆ మార్గంలో కాసేపు రైళ్ల రాకపోకలను నిలిపేశారు. అదే మార్గంలో వస్తున్న వందేభారత్ రైతులను వేరే మార్గం ద్వారా పంపించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా రైల్వే అధికారులు చర్యలు తీసుకున్నారు. -
రామతీర్థంలో శ్రీరామనవమి ఉత్సవాలకు ఆహ్వానం
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో ఈ నెల 27న ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్న శ్రీరామనవమి ఉత్సవాలకు జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు ఆలయ అధికారులు శనివారం ఆహ్వానం పలికారు. విజయనగరంలోని ఆయన నివాసంలో ఈఓ వై.శ్రీనివాసరావు, అర్చకులు, మర్యాదపూర్వకంగా కలిసి శ్రీరామనవమి ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా రామతీర్థంలో జరుగుతున్న నవమి ఏర్పాట్లపై జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వారిని అడిగి తెలుసుకున్నారు. శ్రీరామచంద్రస్వామి కల్యాణోత్సవంలో సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఈఓకు సూచించారు. డెంకాడ మండలం మోపాడలో మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడును కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది సాయిరామాచార్యులు, రామారావు, తదితరులు పాల్గొన్నారు. -
‘పది’ పరీక్షలకు సర్వం సిద్ధం
● జిల్లాలో 68 కేంద్రాల ఏర్పాటు ● హాజరుకానున్న 10,646 మంది విద్యార్థులు పార్వతీపురం రూరల్: జిల్లాలో ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) బ్రహ్మాజీరావు శనివారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 222 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన మొత్తం 10,646 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందుకోసం జిల్లాలో 68 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసినట్టు ఆయన వివరించారు. పరీక్షలు ప్రతి రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్షల పర్యవేక్షణ కోసం 68 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 68 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 612 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. నిరంతర తనిఖీల కోసం మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు, ఐదు సిట్టింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించినట్టు వెల్లడించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్న్ అమలులో ఉంటుందని, సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను తప్పనిసరిగా మూసివేయాలని ఆదేశించారు. కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, ఫర్నిచర్ వసతులతో పాటు ప్రత్యేకంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విద్యార్థులు హాల్టికెట్ చూపిస్తే ఏపీఎస్సార్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతిస్తారని పేర్కొన్నారు. విద్యార్థులు నిర్ణీత సమయానికి ముందే హాల్ టికెట్లతో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని డీఈఓ సూచించారు. -
బస్సులో ప్రయాణం.. నరకప్రాయం
● యూఎన్ఓకు విద్యార్థిని ఫిర్యాదు భామిని: పాఠశాలలకు వెళ్లడానికి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్న బాలికలు శారీరక హింస, అసభ్యకరమైన మాటలు, దూషణలకు గురవుతున్నట్టు హోలీక్రాస్ గ్రో క్లబ్ సభ్యురాలు చాందిని ఐక్యరాజ్యసమితికి శనివారం ఫిర్యాదు చేశారు. జనాలతో నిండిన బస్సుల్లో ప్రయాణంతో విద్యార్థులు నిత్యం నరకం అనుభవిస్తున్నట్టు వివరించారు. ఐక్యరాజ్యసమితి నిర్వహించే మహిళల స్థితిగతుల కమిషన్ సమావేశం (సీఎస్డబ్ల్యూ – 70) సందర్భంగా జరిగిన అంతర్జాతీయ వర్చువల్ కార్యక్రమంలో గర్ల్స్ రోడ్ మ్యాప్ టు జస్టీస్లో యువ ప్యానల్ స్పీకర్గా చాందిని తన అభిప్రాయాలు వెల్లడించారు. బాలికలు హింసకు గురైనప్పుడు వారి తల్లిదండ్రులు నిర్భయంగా పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయగలిగే స్నేహపూర్వక పోలీస్ వ్యవస్థ ఉండాలన్నారు. పిర్యాదు చేసే వారి వివరాలు గోప్యంగా ఉంచాలని కోరారు. హోలీక్రాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గ్లో క్లబ్లు బాలికల అవసరాలను గుర్తించి చైతన్యపరుస్తున్నట్టు డైరెక్టర్ ప్రభుదాస్ తెలిపారు. -
యంత్రాలున్నాయ్.. మూలన భద్రంగా!
గిరి వెలుగు ప్రాజెక్టు అధికారులు ఒక లక్ష్యం లేకుండా, కేవలం కమీషన్లకు ఆశపడి.. పలు రకాల యంత్రాలను కొనుగోలు చేసి, వాటిని వినియోగంలోకి తీసుకురాకుండా వృథాగా పడేశారు. 2022లో కురుపాం, మక్కువ, పార్వతీపురం పరిధిలోని నాలుగు వీడీవీకే కేంద్రాలకు రూ.29.43 లక్షలతో పసుపు, పప్పు ధాన్యాల ప్రాసెసింగ్ యంత్రాలను కొనుగోలు చేశారు. మక్కువ మండలంలో 3–ఫేజ్ విద్యుత్తు సౌకర్యం ఉన్నందున అక్కడ యంత్రాలతో పనులు చేస్తున్నారు. మిగిలిన మూడు చోట్ల కరెంటు సమస్య అంటూ అటకెక్కించేశారు. రూ.లక్షలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన పప్పులు, చిరు ధాన్యాల యూనిట్లు ప్రస్తుతం పార్వతీపురంలోని వైకేఎం కాలనీలో ఉన్న జిల్లా మహిళా సమాఖ్య కార్యాలయంలో నిరుపయోగంగా పడి ఉన్నాయి. -
లోక్ అదాలత్లతో వేగవంతమైన పరిష్కారం
పార్వతీపురం: లోక్ అదాలత్లతో సమస్యలు పరిష్కారం వేగవంతంగా జరుగుతుందని పార్వతీపురం రెండవ అదనపు జిల్లా జడ్జి ఎస్.దామోదరరావు అన్నారు. శనివారం కోర్టు ఆవరణలో నిర్వహించిన లోక్ అదాలత్లో రాజీ పడదగ్గ సివిల్, క్రిమినల్, చెక్బౌన్స్ తదితర కేసులను రాజీ చేశారు. ఇందులో మోటార్ ఏక్సిడెంట్ కేసులు 8, సివిల్ దావాలు 29, క్రిమినల్ కేసులు 855 ఉన్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్లతో విలువైన సమయం, వ్యయం ఆదా అవుతుందన్నారు. లోక్ అదాలత్లో పరిష్కారం అయిన కేసులకు సంబంధించి కక్షిదారులు గతంలో చెల్లించిన కోర్టు ఫీజును తిరిగి పొందవచ్చునని న్యాయ సేవాధికార సంస్థ పేర్కొందన్నారు. సదస్సులో అడిషనల్ జుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ జె.సౌమ్య జోస్పిన్, లోక్ అదాలత్ సభ్యులు ఎన్.శ్రీనివాసరావు, వెంకటరావు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. 108లో ప్రసవం సీతంపేట: మండలంలోని వెదుల్లవలస గ్రామానికి చెందిన గర్భిణి శనివారం 108లో ప్రసవమైంది. సవర సుమిత్ర అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. వెంటనే ఈఎంటీ రవిబాబు, పైలేట్ రమణ గ్రామానికి చేరుకొని గర్భిణీని తీసుకువస్తుండగా దిబ్బగూడ గ్రామం వద్దకు వచ్చేసరికి పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో వాహనాన్ని పక్కకు ఆపి సిబ్బంది సుమిత్రకు ప్రసవం చేయించారు. సుమిత్ర మూడో కాన్పులో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలను స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. వీరు చేసిన సేవలకు గ్రామస్తులు కుటుంబ సభ్యులు అభినందించారు. కాట్రగడ వైపు ఏనుగుల పయనం భామిని: మండలంలోని కాట్రగడ వైపు ఏనుగులు శనివారం పయనమయ్యాయి. గ్రామ సమీపంలోని మొక్కజొన్న పంటలను ఆహారంగా తీసుకుంటుండడంతో పంట మొత్తం నాశనం అవుతున్నట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం రాత్రి నేరడి బ్యారేజి వద్ద వరద కాలువలో దిగి ఆవలకు దాటినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రస్తుతం నేరడి, కాట్రగడ, బొమ్మిక ప్రాంత పంట పొలాలను తీవ్ర నష్టం కలిగిస్తున్నట్టు రైతులు వాపోతున్నారు. ముగిసిన ప్రపంచ గ్లకోమా వారోత్సవాలు పార్వతీపురం రూరల్: జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా సాగిన ప్రపంచ గ్లకోమా వారోత్సవాలు శనివారం ముగిశాయి. జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో నేత్ర వైద్య అధికారి జీరు నగేష్రెడ్డి పర్యవేక్షణలో ఆఫ్తాల్మిక్ అధికారులు, నేత్ర వైద్య సహాయకులు కార్యక్రమాలను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు, స్క్రీనింగ్ పరీక్షలు, ర్యాలీలు చేపట్టి నీటి కాసుల వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు కంటి చూపు సంరక్షణపై సూచనలు చేశారు. ముందస్తు గుర్తింపుతోనే నివారణ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కంటి వైద్య నిపుణులు డాక్టర్ వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో రోగులకు నేత్ర పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అంధత్వ నివారణ సంస్థ మేనేజర్ డాక్టర్ సూరయ కౌశిక్ మాట్లాడుతూ గ్లకోమా బాధితులను గుర్తించి ప్రాధమిక దశలో ఉన్న వారికి చికిత్స అందించి మందులు పంపిణీ చేసినట్టు తెలిపారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వారిని మెరుగైన చికిత్స, శస్త్రచికిత్సల కోసం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు సిఫార్సు చేస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆఫ్తాల్మిక్ ఆఫీసర్ కృష్ణారావు, ఆప్టో మెట్రిస్ట్ స్వాతి, శిక్షణ పొందుతున్న నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. -
కనులపండువగా శ్రీనివాసుని కల్యాణం
డెంకాడ: చింతలవలస ఐదో ఏపీఎస్పీ బెటాలియన్లో గల వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామి కల్యాణం శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువజాము నుంచే సుప్రభాత సేవ, అర్చనలు, ప్రత్యేక హోమాలు చేపట్టారు. సాయంత్రం వేదపండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల జయజయ ధ్వానాల మధ్య స్వామి కల్యాణాన్ని కనులపండువగా నిర్వహించారు. బెటాలియన్ కమాండెంట్ వై.రవిశంకర్, ఉమాదేవి దంపతులు శ్రీదేవి, భూదేవి సహిత శ్రీనివాసునికి కల్యాణంలో పాల్గొన్నారు. వందలాది మంది భక్తులు, బెటాలియన్ అధికారులు, సిబ్బంది కల్యాణాన్ని తిలకించారు. -
హెచ్పీవీ టీకాతో క్యాన్సర్కు చెక్..
సీతానగరం: మహిళలకు ఆశించే ప్రమాదకర గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్ నుంచి రక్షణకు హెచ్పీవీ టీకా ఉపయోగపడుతుందని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి ఎస్. భాస్కరరావు తెలిపారు. స్థానిక పీహెచ్సీలో చేపడుతున్న హెచ్పీవీ వ్యాక్సినేషన్ ప్రక్రియను జిల్లా ఎన్సీడీ అధికారి టి. జగన్మోహన్రావుతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ భాస్కరరావు మాట్లాడుతూ.. 14 సంవత్సరాలు నిండి పదిహేనేళ్ల లోపున్న బాలికలకు ఈ టీకా వేస్తున్నట్లు చెప్పారు. ఏ ఒక్క బాలిక సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం టీకా ఉచితంగా వేస్తోందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు పది వేల బాలికలకు టీకాలు వేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. వ్యాక్సినేషన్కు ముందు ఆభా ఐడీతో యువిన్లో రిజిస్ట్రేషన్ చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వైద్యాధికారి పి. ఉషారాణి, యుడీసీ మురళి, సూపర్వైజర్ వెంకటరమణ, ఆ రోగ్య పర్యవేక్షకులు భవానీ, రవణమ్మ, గోపాల్నాయుడు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ భాస్కరరావు -
సమాజాన్ని చైతన్యపరచాలి
● యూటీఎఫ్ మహిళా సదస్సులో సీఐటీయూ రాష్ట్ర నాయకురాలు పి.మణివిజయనగరం అర్బన్: మహిళలపై జరుగుతున్న అణచివేత, లింగవివక్ష, భౌతిక దాడులలను ఎదుర్కొనేందుకు ఉపాధ్యాయులు సమాజంలో చైతన్యం తీసుకురావాలని సీఐటీయూ రాష్ట్ర నాయకురాలు పి.మణి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని యూటీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక జిల్లా పరిషత్ మినిస్ట్రీరియల్ హాల్లో ‘సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర’ అనే అంశంపై జరిగిన సదస్సుకు ఆమె ముఖ్యవక్తగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల మూసివేత కారణంగా బాలికలు విద్యకు దూరమవుతున్నారని, ఇది సమాజాభివృద్ధికి ప్రతికూలమన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహనరావు మాట్లాడుతూ.. మహిళా ఉపాధ్యాయుల కోసం పాఠశాలల్లో మౌలిక వసతులు, ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ డిమాండ్ల సాధనకు యూటీఎఫ్ పోరాటం చేస్తోందన్నారు. మహిళా కమిటీ కన్వీనర్ జి.సుశీల, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కె.కస్తూరి, రాష్ట్ర కౌన్సిలర్ బీబీఎల్ మాధవీలత, తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ భాస్కరరావు, కోశాధికారి సీహెచ్ తిరుపతినాయుడు, జిల్లా కార్యదర్శులు కె.ప్రసాద్, ఎ.శంకరరావు, జి.రాజారావు, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు జేఆర్సీ పట్నాయక్, రాష్ట్ర కుటుంబ సంక్షేమ డైరెక్టర్ జేఏవీఆర్కే ఈశ్వరరావు, సీనియర్ నాయకుడు డి.రాము, తదితరులు పాల్గొన్నారు. -
ఎంపికలో ప్రాధాన్యం..
యువికా ఎంపిక ప్రక్రియంలో మార్కులకు ఉండే ప్రాధాన్యతను విద్యార్థులు గుర్తించాలి. ముఖ్యంగా 8వ తరగతిలో వచ్చే మార్కులకు 50 శాతం, రాష్ట్ర, జాతీయ స్థాయి సైన్స్ ప్రదర్శనలు, ప్రతిభా పరీక్షల్లో తొలి మూడు స్థానాలు సాధించిన విద్యార్థులకు 10 శాతం, స్కౌట్, ఎన్సీసీ విభాగాలకు చెందిన విద్యార్థులకు 5 శాతం రిజర్వేషన్లు ఉంటాయి. ఎంపికై న విద్యార్థుల ఖర్చులు ఇస్రో భరిస్తుంది. దేశంలో ఉన్న ఏడు ఇస్రో కేంద్రాల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ ప్రాంత పరిధిలో ఉండే శ్రీహరికోట, హైదరాబాద్ కేంద్రాల్లో శిక్షణ పొందే అవకాశం ఉంటుంది. – గిరడ లక్ష్మణరావు, జిల్లా సైన్స్ అధికారి, పార్వతీపురం మన్యం -
ఎక్స్పోలో సీతం విద్యార్థుల ప్రతిభ
విజయనగరం అర్బన్: విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో విశాఖపట్నంలో శనివారం నిర్వహించిన ఎలెక్సెంట్రా – 2026లో భాగంగా నిర్వహించిన ప్రాజెక్ట్ ఎక్స్పోలో పట్టణానికి చెందిన సీతం ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో సీతం కళాశాల విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్ట్కు ద్వితీయ బహుమతి అభించింది. కళాశాల ఈసీఈ విభాగానికి చెందిన బీటెక్ రెండో సంవత్సరం విద్యార్థులు ఎం.హైమ, ఎస్.తేజశ్రీవల్లి, పి.అఖిల్, కె.శ్రీనివాసరావు బృందం ‘ఓపెన్ సివిని ఉపయోగించి వర్చువల్ డాష్బోర్డ్’ అనే వినూత్న ప్రాజెక్ట్ రూపొందించారు. కంప్యూటర్ వెబ్కెమెరా ద్వారా చేతి కదలికలను గుర్తించి సంబంధిత లోడ్లను పనిచేయించే విధంగా ఈ సిస్టమ్ పనిచేస్తుంది. ఈ సాంకేతికతను ముఖ్యంగా ఏటీఎంలు, పరిశ్రమలలో వినియోగించవచ్చని విద్యార్థులు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు, ఈసీఈ విభాగాధిపతి టి.దామోదరనాయుడు విజేతలకు సర్టిఫికెట్లు, బహుమతులు అందజేసి అభినందించారు. ముగిసిన ఎలక్ట్రిక్ వెహికల్ డిజైన్ శిక్షణ సీతం ఇంజినీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (ఈఈఈ) విభాగం ఆధ్వర్యంలో ‘ఎలక్ట్రికల్ వెహికల్ డిజైన్’ అంశంపై వారం రోజుల పాటు నిర్వహించిన నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతితిగా హాజరైన ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రతినిధి ఎస్.విష్ణువర్థన్ ఎలక్ట్రిక్ వెహికల్ డిజైన్, సిమ్యులేషన్ ప్రాజెక్ట్ల రూపకల్పనపై అవగాహన కల్పించారు. అనంతరం కళాశాల డైరెక్టర్ డాక్టర్ శశిభూషణరావు ఆయన్ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీ రామమూర్తి, ఈఈఈ విభాగాధిపతి డాక్టర్ వై.నరేంద్రకుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన అజాగ్రత్త..
● లారీ టైర్ కింద పడి డ్రైవర్ మృతి కొత్తవలస: మండలంలోని కంటకాపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఒక డ్రైవర్ అజాగ్రత్త వల్ల మరో డ్రైవర్ ప్రాణం పోయింది. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో మొయ్యి శ్రీను (53) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. లక్కవరపుకోట మండలం జమ్మాదేవిపేట గ్రామానికి చెందిన మొయ్యి శ్రీను లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో కొత్తవలస మండలం కంటకాపల్లి గ్రామ సమీపంలో గల రైల్వేస్టేషన్ బొగ్గు యార్డు నుంచి లారీలో బొగ్గు లోడ్ చేసుకుని సమీపంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఆపాడు. లారీ నుంచి బొగ్గు ధూళి పైకి ఎగరకుండా ఉండేందుకు టార్పాలిన్ కప్పుతున్నాడు. ఈ క్రమంలో లారీ కింద పడుకుని తాడు కడుతుండగా.. అదే సమయంలో అక్కడే ఉన్న మరో లారీ రివర్స్గా వస్తూ శ్రీను తలపైనుంచి వెళ్లిపోయింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. లారీని రివర్స్ చేస్తున్న డ్రైవర్ అజాగ్రత్త వల్ల మరో లారీ డ్రైవర్ మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. నేడు ఉల్లాస్ ఎఫ్ఎల్ఎన్ఏటీ పరీక్ష విజయనగరం అర్బన్: వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ఉల్లాస్ అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఉల్లాస్ ఎఫ్ఎల్ఎన్ఏటీ పరీక్ష ఆదివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు వయోజన విద్య నోడల్ అధికారి ఎ.వేణుగోపాలకృష్ణ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని 27 మండలాలు, 4 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 1,11,369 మంది అభ్యాసకులు పరీక్షకు హాజరుకానుండగా ఇందుకు 1,356 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు ఎస్జీటీలు, అంగన్వాడీ ఉపాధ్యాయులను ఇన్విజిలేటర్లుగా నియమించినట్లు తెలిపారు. పరీక్షల పర్యవేక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం వయోజన విద్యా విభాగానికి చెందిన ప్రదీప్ బి.హెదాపూను జిల్లా పరిశీలకుడిగా నియమించిందని తెలిపారు. అదేవిధంగా జిల్లా సమన్వయ కమిటీతో పాటు మండల స్థాయిలో ఎంపీడీఓలు, ఏపీఎంలు సీడీపీఓలు, మున్సిపల్ స్థాయిలో సీఎంఎంలు, వయోజన విద్యాశాఖ పర్యవేక్షకులు పరీక్షల నిర్వహణను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించనున్నారన్నారు. మృతిపై అనుమానాల్లేవు.. విజయనగరం క్రైమ్: విజయనగరం వన్టౌన్ పీఎస్ పరిధిలోని తోటపాలెం రామ మందిరం సమీపంలో నివసిస్తున్న మోహన్ అనే వ్యక్తి శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈయన రక్తపు మడుగులో పడి ఉండడంపై మొదట్లో అనుమానాలు వ్యక్తం చేసినా ప్రస్తుతం ఎటువంటి అనుమానాలు లేవని సీఐ చౌదరి తెలిపారు. ఈ మేరకు మృతుని భార్య పద్మావతి కుమార్తెతో కలిసి శనివారం స్టేషన్కు వచ్చి తన భర్త మృతిపై ఎటువంటి అనుమానాల్లేవని చెప్పిందన్నారు. మద్యం మత్తులో మంచంపై పడిపోవడం వల్ల తలకు గాయమై రక్తం కారినట్లు క్లూస్ టీమ్ సభ్యులు కూడా తేల్చారన్నారు. ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన విజయనగరం రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన రామనారాయణంలో శనివారం నిర్వహించిన బాలల నృత్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. బొబ్బిలి గ్రామానికి చెందిన పవిత్ర నృత్యాలయం బృందంచే ప్రదర్శించిన వివిధ నృత్య రూపకాలు అలరించాయి. అనంతరం బాలలకు ఆలయ మేనేజర్ ఏవీ రమణ ప్రశంసాపత్రాలు అందించారు. ఉచిత నేత్ర వైద్యశిబిరానికి స్పందన విజయనగరం టౌన్: నగరంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో స్వామి కంటి ఆస్పత్రి సౌజన్యంతో శనివారం నిర్వహించిన ఉచిత నేత్ర వైద్యశిబిరానికి విశేష స్పందన లభించింది. బీఎస్ఎన్ఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ దోసూరి దాలినాయుడు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగస్తులతో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో మురళీధర్, శ్రీధర్, అశోక్, సాయి ప్రసాద్, ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఆలుగు వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు. -
వాహనాల్లో కుక్కేసి ప్రమాదాల్లోకి నెట్టేసి..
ఒక్క నిమిషం ఆలోచిస్తే ప్రమాదాలకు దూరంగా ఉండొచ్చు.. ఆలస్యమైనా సురక్షితంగా ఇంటికి వెళ్లాలన్నా ఆలోచనా ఉన్నా ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఓవర్ లోడ్ వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా అటు ఆటో డ్రైవర్లలో గాని ఇటు ప్రయాణికుల్లో గాని మార్పు రావడం లేదు. ముగ్గురు, నలుగురు ఎక్కాల్సిన ఆటోలో పదుల సంఖ్యలో ప్రయాణికులను కుక్కేస్తున్నారు.. దీంతో ఏమాత్రం అదుపు తప్పినా విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోక తప్పదు. అలాగే ద్విచక్ర వాహనదారులు కూడా ప్రమాదకర ప్రయాణాలు సాగిస్తున్నారు.. జిల్లా కేంద్రంలో శనివారం సాక్షి కంట పడిన ప్రమాదకర ప్రయాణాలు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం లగేజ్ వాహనంలో ప్రయాణికులుఆటోల్లో కిక్కిరిసిన ప్రయాణికులు -
ఫోన్ మీది.. ఓటీపీ వారిది.. చివరకు ఖాతా ఖాళీ!
పార్వతీపురం రూరల్ : మాయమాటల గారడీ.. మాటల వెనుక మర్మం.. వెరసి మీ కష్టార్జితం మాయం! ఆపదలో ఉన్నామంటూ అపరిచితులు అడిగే సాయం, మీ బ్యాంక్ ఖాతాకు శాపంగా మారే ప్రమాదముందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆధునిక సాంకేతికతను ఆసరాగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు సరికొత్త పంథాలో సామాన్యులను బురిడీ కొట్టిస్తున్నారని, ముఖ్యంగా కాల్ ఫార్వర్డింగ్ ఉచ్చులో పడకుండా జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.అడగడమే ఆలస్యం.. అరచేతిలో వైకుంఠం! రద్దీగా ఉండే బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు లేదా బహిరంగ ప్రదేశాల్లో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి.. అర్జంటుగా ఇంట్లో మాట్లాడాలి, ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది.. ఒక్క నిమిషం మీ ఫోన్ ఇస్తారా? అంటూ ప్రాధేయపడతారు. ఆపన్న హస్తం అందించాలనే ఉద్దేశంతో ఫోన్ ఇస్తే, వారు ఫోన్ చేసే నెపంతో 21, 61 లేదా 67తో ప్రారంభమయ్యే రహస్య కోడ్లను డయల్ చేసి, చివరన వారి మొబైల్ నంబరును జత చేస్తారు. దీంతో మీ ప్రమేయం లేకుండానే మీ నంబరుకు వచ్చే ఇన్ కమింగ్ కాల్స్ అన్నీ వారి ఫోన్కు మళ్లించబడతాయి.ఓటీపీల చోరీ.. నిలువు దోపిడీ! కాల్ ఫార్వర్డింగ్ సక్రియం కాగానే అసలు ఆట మొదలవుతుంది. బ్యాంకులు, కొరియర్ సంస్థలు లేదా ఇతర సేవల నుంచి వచ్చే ధ్రువీకరణ కాల్స్ నేరుగా దుండగుడి చేతికి వెళ్తాయి. మీ మొబైల్కు ఎలాంటి సమాచారం రాదు, కానీ సైలెంట్గా మీ అకౌంట్ల నుంచి నగదు మాయమవుతుంది. ముసుగులో గుద్దులాట లేకుండా, నిలువు దోపిడీకి ఇదొక సులువైన మార్గంగా నేరగాళ్లు ఎంచుకున్నారని పోలీసులు ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో సైతం అవగాహన కల్పిస్తున్నారు.చదవండి: ఏసీ క్లీనింగ్ ఇలా ఈజీ!అప్రమత్తతే రక్ష.. కోడ్లతో శిక్ష! సైబర్ దొంగల బారిన పడకుండా ఉండాలంటే అపరిచితులకు ఫోన్ ఇచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఒకవేళ పొరపాటున ఎవరికైనా ఫోన్ ఇచ్చి ఉంటే లేదా మీ కాల్స్ ఫార్వర్డ్ అవుతున్నాయని అనుమానం కలిగితే, వెంటనే మొబైల్ నుంచి ##002# కోడ్ను డయల్ చేసి కాల్ ఫార్వర్డింగ్ సేవలను నిలిపివేయాలి. సైబర్ నేరాలకు గురైతే ఆలస్యం చేయకుండా 1930 టోల్ ఫ్రీ నంబరుకుగానీ లేదా సైబర్ పోర్టల్ వెబ్సైట్లోగానీ ఫిర్యాదు చేయాలి. ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఈ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. – బి.వెంకట్రావు, పార్వతీపురం పట్టణ సీఐ -
గ్యాస్ కొరత వస్తే హోటల్ రంగం కుదేలు
● కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే... ● ఏపీ హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ విజయనగరం: పశ్చిమ ఆసియా దేశాల్లో నెలకొన్న యుద్ధసంక్షోభం కారణంగా దేశంలో గ్యాస్ కొరత ఏర్పడిన విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ హోటల్ అసోసి యేషన్ అధ్యక్షుడు జి.శ్రీనివాస్ కోరారు. విజయనగరం జిల్లా హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. వాసుతో కలిసి నగరంలో శుక్రవారం ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్యాస్ కొరతను దష్టిలో పెట్టుకుని పది రోజులు ముందు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు అసోసియేషన్ తరఫున అందజేశామన్నా రు. ప్రస్తుత ప్రభుత్వం గ్యాస్ కొరత లేదని చెబుతు న్నా, వాస్తవానికి తమ హోటల్స్కు తగినంత గ్యాస్ సరఫరా కావడం లేదన్నారు. సరఫరాపై గ్యాస్ డీలర్లు చేతులెత్తేశారని వివరించారు. ఇదే పరిస్థితి కొన్నిరోజులు కొనసాగితే హోటల్స్, రెస్టారెంట్లు మూసివేసే అవకాశం ఉందన్నారు. లక్షల మందికి ఉపాధి దూరమవుతుందన్నారు. గ్యాస్ బ్లాక్ మార్కెట్కు తరలిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పి.వాసు మాట్లాడుతూ విజయనగరం జిల్లాలో అనేకమంది అద్దె భవనాలలో హోటల్స్ నిర్వహిస్తున్నారని, గ్యాస్కు ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యలు వినియోగించేందుకు భవన యజమానులు అంగీకరించడం లేదని తెలిపారు. ఈ పరి స్థితి కొనసాగితే హోటల్స్ నడపడం సాధ్యం కాదన్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 25న ఒంగోలు పట్టణంలో అన్ని జిల్లాల అసోసియేషన్లతో సమావేశం నిర్వహిస్తున్నామని, ఈ సమావేశంలో తగిన నిర్ణ యం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బాబూరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నవీన్, టి.అనిల్, జిల్లా అసోసి యేషన్ కార్యదర్శి కాళ్ల సునీల్ కుమార్పాల్గొన్నారు. -
పరిశ్రమల్లో మెటలర్జీ విభాగానికి అధిక ప్రాధాన్యం
విజయనగరం రూరల్: మెటలర్జీ విభాగం విద్యార్థులకు పరిశ్రమల్లో అధిక ప్రాధాన్యం ఉంటుందని మెటలర్జీ విభాగం పరిశోధకుడు డాక్టర్ బి.శివకుమార్ అన్నారు. విజయనగరం జేఎన్టీయూ జీవీ లో మెటలర్జికల్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో శుక్రవా రం నిర్వహించిన ‘ఈఐఎన్ఈఎన్– 2026’ 11వ జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. ఆధునిక పరిశ్రమల్లో మెటలర్జీ ప్రాముఖ్యత, మెటీరియల్ సైన్స్ అభివృద్ధిపై అవగాహన కల్పించారు. డాక్టర్ జి.వేణుగోపాల్నాయుడు బియాండ్ ది డిగ్రీ అంశంపై ప్రేరణాత్మకంగా వివరించారు. డిగ్రీకి మించి నైపుణ్యాల అభివృద్ధి, ఉపాధి అవకాశాలపై మార్గదర్శనం చేశారు. అనంతరం అతిథులుగా హాజరైన వారిని ఘనంగా సత్కరించారు. సదస్సు చైర్మన్ కె.శ్రీనివాస ప్రసాద్, వర్సిటీ ప్రిన్సిపాల్ డాక్టర్ కెసీబీ రావు, వివిధ కళాశాల ఆచార్యు లు, వివిధ సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
బీజేపీకి నిమ్మక జయరాజు రాజీనామా
కురుపాం: బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు శాసన సభ మాజీ సభ్యుడు నిమ్మక జయరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కుటుంబ పరిస్థితు లు, వ్వక్తిగత కారణా ల దృష్ణ్యా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోవడంతో సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు బీజేపీ ప్రధాన కార్యాలయానికి రాజీనామా లేఖను పంపించామన్నారు. విజయనగరం: వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావును ఆ పార్టీ నియోజకవర్గ పరిశీలకులుగా నూతనంగా నియామకమైనవారు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ధర్మపురిలోని సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్లో గజపతినగరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ పరిశీలకులుగా నియమితులైన జెడ్పీ మాజీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, అనకాపల్లి పార్లమెంటరీ జిల్లా పరిశీలకురాలు శోభా హైమావతి పూలమొక్క ను అందజేశారు. ఈ సందర్భంగా ఇద్దరికీ మజ్జి శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి, బలోపేతానికి అందరం కలిసికట్టు గా కృషి చేయాలని ఆకాంక్షించారు. భామిని: మండలంలో నేరడి–బి నుంచి నాలుగు ఏనుగుల గుంపు నేరడి–బ్యారేజ్ వైపు శుక్రవారం వెళ్లాయి. కాట్రగడ, నేరడి రైతులు సాగుచేసిన మొక్కజొన్న, అరటి పంటలకు నష్టం కలిగిస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. ఏనుగుల మళ్లింపులనకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గుర్ల: మండలంలోని జమ్ముపేటకు చెందిన రైతు కురుమునెల్లి దాలినాయుడు (33) పురుగులు మందు తాగి శుక్రవారం మృతి చెందాడు. వివరాల్లోకి వేళ్తే... దాలినాయుడు గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు . ఇటీవల కాలంలో పంటలకు పెట్టిన పెట్టుబడి రాకపోవడం, తెచ్చిన అప్పులు తీరకపోవడంతో మనోవేదనకు గురై గురువారం రాత్రి పురుగుల మందు తాగినట్లు స్థానికులు చెబుతున్నారు. గమనించి కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స జరుగుతుండ గా శుక్రవారం మృతి చెందాడు. గుర్ల పోలీసు లు కేసు నమోదు చేశారు. మృతునికి భార్య నీలవేణి, కుమార్తెలు ఉష, ఝాన్సీ ఉన్నారు. రాజాం: కొత్తవలస గ్రామంలో రేషన్ డిపో డీలర్పై చర్యలు తీసుకోవాలని, అక్రమాలకు పాల్పడుతున్న డీలర్ను తొలగించాలంటూ గ్రామానికి చెందిన 200 మంది రేషన్ లబ్ధిదారులు తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా చేశారు. డీలర్ ఆగడాలను తహసీల్దార్ ఎం.రాజశేఖరానికి వివరించారు. -
తప్పులు దిద్దలే.. కోతలు తప్పలే!
ఎకరాన్నరపైగా భూమిని కౌలు కు తీసుకుని సాగు చేస్తున్నాను. సేద్యంపై పెట్టుబడి డబ్బులు కూడా రావడం లేదు. ప్రభుత్వ సాయం లేదు. గత ప్రభుత్వంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రైతుల భరోసా వచ్చేది. ప్రస్తుతం రావడం లేదు. పలుమార్లు అధి కారులను కలసి విజ్ఞప్తులు ఇచ్చినా ఫలితం లేకపోతోంది. నాలాంటి రైతులు చాలా మంది ఉన్నారు. – కె.గురుమూర్తి, కౌలురైతు, లంబూరు గ్రామం, పాలకొండ నాకున్న 84 సెంట్లతోపాటు, రెండున్నర ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటున్నా. ఇదే మా కుటుంబ పోషణకు ఆధారం. గత ప్రభుత్వంలో రైతు భరోసా అందేది. ప్రస్తుతం ఎటువంటి ఆర్థిక సాయ మూ లభించడం లేదు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయాం. మదుపులు, కౌలు చెల్లించేందుకు చేతిలో చిల్లిగవ్వ ఉండటం లేదు. అప్పులపాలయ్యాను. – తిర్లంగి సింహాచలం, రైతు, గరుగుబిల్లి గ్రామం, పాలకొండ సాక్షి, పార్వతీపురం మన్యం/పాలకొండ రూరల్: పీఎం కిసాన్తోపాటు, అన్నదాత సుఖీభవ నిధులను శుక్రవారం రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. అధిక శాతం మందికి రాత్రయినా.. ఆ మొత్తం జమ కాలేదు. మరోవైపు రెండో విడత జమ చేసిన రైతులకే.. మూడో విడత కూడా లబ్ధి చేకూర్చారు. వివిధ సాంకేతిక సమస్యలు, ఇతర తప్పిదాల కారణంగా వేలాది మంది పథకానికి దూరమయ్యారు. వారంతా అప్పట్లోనే అధికారులను కలసి వినతిపత్రాలు అందజేశారు. పరిశీలించి న్యాయం చేస్తామని చెప్పిన యంత్రాంగం.. ఏ ఒక్కరి విజ్ఞప్తినీ పరిగణనలోకి తీసుకోలేదని తాజా గణాంకాలే చెబుతున్నాయి. ఈసారి కూడా కౌలు రైతులకు ఉత్తచేయినే చూపారు. రైతాంగానికి పంటల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ అవసరాల కోసం ఈ మొత్తం ఎంతగానో ఉపయోగపడుతుంది. పథకంలో కోత.. వారికి శాపంగా మారుతోంది. అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద ఏటా రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.20 వేలు అందిస్తామన్న కూటమి ప్రభుత్వం... వివిధ కారణాలు చూపుతూ లబ్ధిదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించింది. అధికారంలోకి వచ్చిన మొద టి ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను పూర్తిగా ఎగ్గొట్టింది. కేంద్రం అందించే పీఎం కిసాన్ నిధులు రూ.6 వేలే రైతుల కు అందా యి. రెండో ఏడాదిలో మొదటి విడత గత ఆగస్టులోనూ, రెండో విడత నవంబరులోనూ జమ చేశారు. ప్రస్తుతం కేంద్రం రూ.2 వేలు, రాష్ట్రం రూ.4 వేలు కలిపి మొత్తం రూ.6 వేలు జమ కావాల్సి ఉంది. జిల్లాలో ఈ–పంటను ప్రామాణికంగా తీసుకుని అన్నదాత సుఖీభవ పథకానికి గత ఆగస్టులో 1,22,260 మంది రైతులను అర్హులుగా గుర్తించారు. లబ్ధిదారుల వివరాలను ప్రదర్శించి, అభ్యంతరాలు కూడా స్వీకరించారు. ప్రస్తుతం కూడా మూడో విడత కింద 1,22,268 మంది రైతుల ఖాతాల్లో రూ.71.03 కోట్ల సాయాన్ని జమ చేస్తున్నట్లు ప్రకటించారు. వీరిలో పీఎం కిసాన్తోపాటు, అన్నదాత సుఖీభవ తీసుకుంటున్న వారు 1,10,650 మంది. ఒకటి, రెండో విడతల తర్వాత అర్హత కోల్పోయిన వందలాది మంది ఇచ్చిన విజ్ఞప్తులు బుట్టదాఖలే అయ్యాయి. ఒకట్రెండు విడతల్లో కొంతమందికి పీఎం కిసాన్ వాటా రూ.2 వేలే బ్యాంకు ఖాతాకు జమైంది. రాష్ట్ర వాటా అందలేదు. ఇదే విషయమై సచివాలయాల్లోనూ, కలెక్టరేట్ పీజీఆర్ఎస్లోనూ పలు మండలాల రైతులు వినతిపత్రాలు అందించారు. వారిలో ఏ ఒక్కరికీ న్యాయం జరగలేదు. పీఎం కిసాన్కు అర్హులైన తాము.. అన్నదాత సుఖీభవకు ఎందుకు అనర్హులవుతామంటూ అధికారులను ప్రశ్నించారు. ఆధార్ నమోదు సక్రమంగా లేకపోవడం, భూమికి వేరే ఆధార్తో లింకు కావడం, పాస్ పుస్తకంలో పేరు మారకపోవడం, మ్యుటేషన్, వెబ్ల్యాండ్లో సమస్యలతో కొంతమంది పథకానికి దూరమయ్యారు. వారి సమస్యలు నేటికీ అలానే ఉండిపోయాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్ని సంవ త్సరాలూ రైతుభరోసా నిధులు కర్షకులకు సకాలంలో అందేవి. గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా పథకం కింద ఏడాదికి 1.45 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. చంద్ర బాబు ప్రభుత్వం వివిధ కారణాలు చూపుతూ 23 వేల మందికిపైగా కుదించింది. జిల్లాలో 10 వేల మందికిపైగా కౌలురైతులు ఉన్నారు. పథకంలో నిబంధనల కారణంగా వీరెవరికీ నిధులు అందడం లేదు. ‘కౌలుకు తీసుకున్నా.. ఖర్చులన్నీ పెట్టుకునేది మేమే. నష్టం వస్తే భరించేది మేమే.. అన్నదాత సుఖీభవ నిధులు గానీ, నష్ట పరిహారం గానీ మాకు ఎందుకు ఇవ్వడం లేద’ని వారంతా ప్రశ్నిస్తున్నారు. -
ఒకే ఒక్కడు!
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లా సంయుక్త కలెక్టర్ సి. యశ్వంత్కుమార్రెడ్డిపై అదనపు భారం పడుతోంది. రోజురోజుకూ ఆయన విధులు, చూడాల్సిన బాధ్య తలు ఎక్కువవుతున్నాయి. జిల్లా పరిపాలనలో కలెక్టర్ తర్వాత, సంయుక్త కలెక్టర్ కీలకం. రెవెన్యూ, పౌరసరఫరాలు, వ్యవసాయం, సర్వే వంటి కీలక విభాగాల పర్యవేక్షణ ఆయనదే. ప్రస్తుతం కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి కలెక్టర్ల సమావేశంలో పాల్గొనేందుకు అమరావతి వెళ్లారు. రెండు రోజులపాటు ఆయన సమావేశాల్లో ఉంటారు. ఆ తర్వాత స్థానంలో ఉన్న జేసీనే కలెక్టర్ బాధ్యతలనూ చూడాల్సి వ స్తోంది. ఇదే సమయంలో ఐటీడీఏ ఇన్చార్జి పీఓగా యశ్వంత్కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. సబ్ కలెక్టర్ డిపార్ట్మెంట్ పరీక్షల నిమిత్తం వెళ్లడంతో ఆ బాధ్యతలవైపూ దృష్టి పెట్టాల్సి వస్తోంది. మరోవైపు ప్రత్యేకాధికారుల పాలనలో భాగంగా పార్వతీపు రం మున్సిపాలిటీ బాధ్యతలనూ జేసీకే అప్పగించా రు. ఇటు సమీక్షలు, అటు తనిఖీలంటూ ఆయనకు క్షణం కూడా తీరిక దొరకడం లేదు. ప్రస్తుతం జిల్లాకు సంబంధించి పెద్ద దిక్కుగా ఆయనే అన్ని పనులనూ పర్యవేక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
సమస్యలకు పరిష్కారం చూపుతాం.. : పీఓ
పార్వతీపురం రూరల్: గిరిజన గడపలో సమస్యల సవ్వడి వినిపిస్తే.. అధికార యంత్రాంగం అప్రమత్తమై పరిష్కారం చూపాలన్నదే ప్రభుత్వ సంకల్పమని జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ ప్రాజెక్టు అధికారి సి.యశ్వంత్కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలోని గిరిమిత్ర ప్రాంగణంలో శుక్రవారం గిరిజన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం పీఓ అధ్యక్షతన నిర్వహించారు. వివిధ మండలాల నుంచి తరలివచ్చిన అడవి బిడ్డల ఆవేదనలు అర్జీల రూపంలో అధికారుల ముందుకు వచ్చాయి. అర్జీల పరిశీలన.. పరిష్కారానికి ఆదేశాలు ఈ వేదికపై 18 మంది గిరిజనులు తమ సామాజిక, ఆర్థిక, మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఇబ్బందులను విన్నవించుకున్నారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించిన పీఓ.. బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యల తీవ్రతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. అందిన ప్రతి వినతిని నిర్ణీత కాల పరిమితిలో పరిష్కరించాలని, ఇందులో అలసత్వానికి తావుండకూడదని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కార తీరును అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. గిరిజన ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి యంత్రాంగం కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీఓ ఎ.మురళీధర్తో పాటు పలు విభాగాల అధికారులు, వివిధ మండలాల గిరిజనులు పాల్గొన్నారు. -
వనమిత్ర కేంద్రాల అభివృద్ధికి ప్రతిపాదనలు
బొండపల్లి: వనమిత్ర కేంద్రాల అభివృద్ధికి ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నట్టు ఏపీసీఎఫ్ (ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఫారెస్టు ) అధికారి రాహుల్ పాండే తెలిపారు. మండల కేంద్రంలోని వనమిత్ర కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని వనమిత్ర కేంద్రాల్లో ప్రసుత్తం ఉన్న పరిస్థితులను తెలుసుకునేందుకు పర్యటిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఉన్న మౌలిక వసతులతో పాటు అదనపు వసతులు కల్పించడానికి పరిశీలించి సంబంధిత నివేదికలను ప్రభుత్వానికి పంపనున్నట్టు చెప్పారు. ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు అందాల్సిన వేతన బకాయిలకు సంబంధించి నివేదికలను కూడా పంపనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ డీఎఫ్ఓ రవీంద్ర దామో, ఎఫ్ఆర్ఓ సింధు, వనమిత్ర కేంద్రం సహాయకుడు పడాల అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
వరల్డ్ పారా అథ్లెటిక్స్లో లలిత ప్రతిభ
విజయనగరం: న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రు స్టేడియం వేదికగా మార్చి 8 నుంచి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ పోటీల్లో మన్యం జిల్లాకు చెందిన పారా క్రీడాకారిణి కిల్లక లలిత సత్తా చాటింది. టి–11 కేటగిరికి సంబంధించి 400 మీటర్ల పరుగులో అద్భుతమైన ప్రతిభ కనబరచి రజిత పతకం సాధించింది. ఈ విజయం జిల్లాకు గర్వకారణమని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె.దయానంద్ పేర్కొన్నారు. గత పదేళ్లుగా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందిస్తున్న ప్రోత్సాహంతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బెంగళూరులో కోచ్లు రాహులు, బాలకృష్ణన్ల శిక్షణలో, గైడ్ రన్నర్ తబరీష్ల సహకారంతో వరుసగా విజయాలు సాధిస్తున్న లలిత గ్రాండ్ ప్రిక్స్ పోటీలలోనూ తానేంటో మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. ఇండియా తరఫున ఎంపికై న ఆరుగురు క్రీడాకారుల జట్టులో స్థానం సంపాదించిన లలిత అసాధారణ ప్రతిభతో మరో విజయాన్ని దేశానికి అందించిందని పేర్కొన్నారు. -
జోయలుక్కాస్ ఆభరణాల షోరూం ప్రారంభం
విజయనగరం: జోయలుక్కాస్ అంటేనే నమ్మకమైన బ్రాండ్ అని విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితిగజపతిరాజు, నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జోయలుక్కాస్ విజయనగరం జిల్లా కేంద్రంలోని సీఎంఆర్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన నూతన షోరూంను వారు ప్రారంభించారు. అనంతరం షోరూంలో విక్రయానికి ఉంచిన ఆభరణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న విజయనగరంలో కార్పొరేట్ సంస్థలు తమ వ్యాపారాలు విస్తరించటం మంచి పరిణామంగా పేర్కొన్నారు. వినియోగదారులు మెచ్చే నాణ్యమైన ఆభరణాలను సరసమైన ధరలకు అందించాలని ఆకాంక్షించారు. కేరళలోని కొట్టాయంలో ప్రారంభించిన జోయలుక్కాస్ వివిధ దేశాల్లో 190 షోరూమ్లు నిర్వహిస్తుండగా... భారతదేశంలో 113 షోరూమ్లు నిర్వహిస్తోందన్నారు. నమ్మకం, విశ్వాసం, మన్నికకు పేరెన్నికగన్న సంస్థగా పేరుగాంచిన జోయలుక్కాస్ విజయనగరంలో షోరూం ప్రారంభించటం శుభపరిణామంగా పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన డైమండ్లను అందిస్తోందన్నారు. జోయలుక్కాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ థామస్ మాథ్యు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వరుసగా మూడు రోజుల్లో నాలుగు కొత్త షోరూమ్లు ప్రారంభిస్తున్నట్టు వివరించారు. శుక్రవారం ఒక్క రోజే విజయనగరంతో పాటు శ్రీకాకుళం ప్రాంతాల్లో నూతన షోరూంలు ప్రారంభించామన్నారు. దేశంలో వ్యాపార విస్తరణలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా పేర్కొన్నారు. జోయలుక్కాస్లో ఒకే చోట బంగారం, వజ్రాలు, విలువైన రాళ్లు, ప్లాటినం, వివాహ ఆభరణాల విస్తృత శ్రేణిని చూడొచ్చని వివరించారు. వ్యక్తిగతీకరించిన సేవల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఈ బ్రాండ్ గుర్తింపు పొందిందన్నారు. ఈ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని జోయలుక్కాస్ ఈ నెల 29 వరకు తయారీ చార్జీలపై ఫ్లాట్ 40 శాతం తగ్గింపుతో పరిమిత కాలపు ప్రారంభ ఆఫర్ అందిస్తోందన్నారు. జోయలుక్కాస్ సీఓఓ హెన్రీ జార్జ్, మార్కెటింగ్ హెడ్ అనిష్ వర్గీస్, రిటైల్ హెడ్ రాజేశ్ కృష్ణన్, వైఎస్సార్సీపీ యువజన విభాగం నాయకుడు జి.ఈశ్వర్కౌశిక్ తదితరులు పాల్గొన్నారు. -
అఖిల భారత తైక్వాండో పోటీలకు యశస్విని
విజయనగరం అర్బన్: ఒడిశాలోని ఫకీర్ మోహన్ యూనివర్సిటీలో ఈ నెల 15 నుంచి జరగనున్న అఖిల భారత అంతర విశ్వవిద్యాలయ మహిళల తైక్వాండో పోటీలకు స్థానిక సీతం ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థిని సీహెచ్ యశస్విని ఎంపికై ంది. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీ రామమూర్తి శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల విశాఖ జిల్లా తగరపువలసలోని అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన అంతర్ కళాశాల తైక్వాండో పోటీల్లో కుర్గి ఓవర్ వెయిట్ 73 కిలోల విభాగంతో పాటు పూమ్సే వ్యక్తిగత, టీం ఈవెంట్లలో ప్రతిభ కనబరిచి జేఎన్టీయూ జీవీ జట్టుకు అర్హత సాధించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు యశస్వినిని అభినందించారు. -
బెల్ట్షాపులపై ఎకై ్సజ్ పోలీసుల దాడులు
పూసపాటిరేగ: భోగాపురం మండల పరిధిలో అనధికార మద్యం విక్రయాలపై ఎకై ్సజ్ శాఖ ఉక్కుపాదం మోపుతోంది. భోగాపురం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ వి.రవికుమార్ ఆదేశాల మేరకు శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడులకు సంబంధించిన వివరాలు.. మండలంలోని పోలిపల్లి గ్రామంలో అనధికారికంగా మద్యం విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ఎకై ్సజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఒక మహిళ నుంచి 180 ఎం.ఎల్. పరిమాణం కలిగిన ఏడు మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. సదరు మహిళను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్టు ఇన్స్పెక్టర్ రవికుమార్ వెల్లడించారు. దాడుల్లో ఎకై ్సజ్ ఎస్సై చంద్రమోహన్, హెడ్ కానిస్టేబుళ్లు సత్యనారాయణ, ప్రతాప్, కానిస్టేబుల్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఒకరి అరెస్టు -
ట్రాక్టర్ బోల్తా
బొండపల్లి: మండల కేంద్రానికి సమీపంలో చలి చెరువు వద్ద జాతీయ రహదారిపై బొండపల్లి నుంచి గజపతినగరం వైపు వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి శుక్రవారం బోల్తా పడింది. వివరాలు.. బొండపల్లి గ్రామానికి చెందిన వీరాస్వామి, బంగారయ్య, చంద్రరావు ట్రాక్టర్ ట్రక్కులో వస్తుండగా చలి చెరువు అదుపు తప్పి బోల్తా పడి ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. వీరిని గజపతినగరంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉంది. ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొని వ్యక్తి దుర్మరణం పూసపాటిరేగ : భోగాపురం మండలం పోలిపల్లి వద్ద ఆగి వున్న లారీని ఆటో వెనుక నుంచి వచ్చి ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్లే.. శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వెళ్తున్న ఆటో పోలిపల్లి సమీపంలో ఆగి వున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న శీల రాంబాబు మృతి చెందాడు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. భోగాపురం సీఐ కె.దుర్గాప్రసాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం దుకాణంలో చోరీ బొండపల్లి: మండల కేంద్రంలోని నవీన్ వైన్స్ దుకాణంలో శుక్రవారం వేకువజామున చోరీ జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గురువారం రాత్రి మద్యం దుకాణం మూసేసిన తరువాత సిబ్బంది ఇంటికి వెళ్లిపోగా శుక్రవారం తెల్లవారుజామున దొంగలు తాళాలను విరగ్గొట్టినట్టు స్థానికులు గుర్తించి పోలీసులకు, షాపు నిర్వాహకులకు సమాచారం అందజేశారు. దీంతో ఎస్ఐ యు.మహేష్తో పాటు సిబ్బంది వెళ్లి పరిశీలించగా షాపులో ఉంచిన రూ.12వేల నగదు అపహరించుకుపోయినట్టు గుర్తించారు. విజయనగరం నుంచి క్లూస్ టీం వచ్చి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. షాపులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను పరిశీలించి నిందితులను పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. షాపు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వ్యక్తి ఆత్మహత్య పాలకొండ: మండలంలోని కొండాపురం గ్రామానికి చెందిన కల్లేపల్లి గణపతి(39) గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాకుళంలోని తపాల శాఖలో విధులు నిర్వహిస్తున్న గణపతి బుధవారం విధులు ముగించుకుని ఇంటికి వచ్చి అర్ధరాత్రి సమయంలో గడ్డి మందు తాగడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు గుర్తించి పాలకొండలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. భార్య నిరోషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై వెంకన్న తెలిపారు. కడుపునొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారని వివరించారు. మృతుడికి భార్య నిరోషాతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రైతులకు అండగా ప్రభుత్వం గజపతినగరం: వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ప్రతీ రైతు పక్షాన తెలుగుదేశం పార్టీ (కూటమి ప్రభుత్వం)అండగా ఉంటుందని డీసీసబీ చైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో శుక్రవారం జరిగిన నియోజకవర్గ స్థాయి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ మూడో విడత నగదు అందజేసే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులకు పెట్టుబడి సాయంతో పాటు అనేక రకాల ప్రయోజనాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయన్నారు. ఈ సందర్భంగా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ చెక్కును విడుదల చేశారు. వ్యవసాయ శాఖ ఏడీఏ ఎ.నిర్మలాజ్యోతి, ఏఓ కిరణ్కుమార్ పాల్గొన్నారు. కేసు నమోదు రాజాం సిటీ: మండల పరిధి ఆగూరు కంచరాం గ్రామంలో అక్రమంగా పీడీఎస్ బియ్యం తరలిస్తున్న వ్యాపారం నిర్వహిస్తున్న వ్యక్తిపై శుక్రవారం కేసు నమోదు చేశామని టౌన్ సీఐ కె.అశోక్కుమార్ తెలిపారు. ఆగూరు కంచరాంలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్టు విజిలెన్స్ అధికారులకు సమాచారం రావడంతో రెవెన్యూ అధికారులతో ఈ నెల 6న దాడి నిర్వహించారు. గ్రామానికి చెందిన మురపాక శ్రీను ఇంటి వద్ద ఆటోలో రవాణాకు సిద్ధం చేసిన 603 కేజీల బియ్యాన్ని పట్టుకుని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారని తెలిపారు. ఈ మేరకు సీఎస్డీటీ అనంతకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
ప్రశ్నించినప్పుడే వినియోగదారుడికి న్యాయం : జేసీ
పార్వతీపురం: వినియోగదారులు తమకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తినప్పుడే ఆశించిన న్యాయం లభిస్తుందని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా స్థానిక కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ వినియోగదారులకు ప్రభుత్వం కల్పించిన హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కొనుగోలు చేసే ప్రతి వస్తువుపై నిర్దేశించిన బరువు, కాల పరిమితి, ఎం.ఆర్.పి విలువలను తప్పనిసరిగా తనిఖీ చేయాలి. వస్తువు ధరలో అన్ని రకాల పన్నులు కలిపే ఎం.ఆర్.పిని నిర్ణయిస్తారని, అంతకంటే ఎక్కువ వసూలు చేయడం చట్టవిరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. కొన్న ప్రతి వస్తువుకు రసీదు తీసుకోవడం వినియోగదారుడి ప్రాథమిక బాధ్యత అని, అది భవిష్యత్తులో ఏదైనా అన్యాయం జరిగితే ఫిర్యాదు చేయడానికి ప్రధాన ఆయుధంగా పని చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం సాంకేతికత అందుబాటులోకి వచ్చిందని, వినియోగదారులు తమ సమస్యలను ఆన్లైన్ ద్వారా లేదా ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కూడా అధికారుల దృష్టికి తీసుకురావచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి బి.అశోక్, డాక్టర్ జగన్మోహన్రావు, లీగల్ అడ్వైజర్ టి.జోగారావు వివిధ పాఠశాలల విద్యార్థులు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులకు వినియోగదారుల చట్టాలపై అవగాహన కల్పిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
డైట్లో టీచ్ టూల్స్పై శిక్షణ
నెల్లిమర్ల: స్థానిక వేణుగోపాలపురంలోని జిల్లా ఉపాధ్యాయ విద్య శిక్షణ సంస్థలో టీచ్ టూల్స్ శిక్షణ కార్యక్రమం గురువారం జరిగింది. కళాశాలలో గత నెల 28 నుంచి ఈ నెల 12 వరకు రెండవ దశ టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమం జరిగినట్టు ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ దత్తి అప్పలనాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఆదేశానుసారం డైట్ ఫ్యాకల్టీ పాఠశాలల సందర్శన సమయంలో పరిశీలించాల్సిన అంశాలపై శిక్షణ ఇచ్చామని తెలిపారు. అలాగే టీచ్ టూల్ రిసోర్స్పర్సన్ రమేష్ బాబు, పద్మజ మాట్లాడుతూ తరగతి గది పరిసరాలు, సమదృష్టితో బోధన విధానం, విద్యార్థుల సానుకూల ప్రవర్తన, అవగాహన, విశ్లేషణాత్మక ఆలోచన, సహచర విద్యార్థుల పరస్పర నైపుణ్య మార్పిడి, అంశాల వారి ప్రతిస్పందన దృష్టిలో ఉంచుకుని ప్రధానంగా పాఠశాలల సందర్శన సమయంలో పరిశీలించాలని ఐఎఫ్ ప్యానల్లో వీడియోలతో శిక్షణలో వివరించారు. స్టాఫ్ సెక్రటరీ వాక చిన్నంనాయుడు, ఫ్యాకల్టీ రమేష్, మురళి, సూరిబాబు, శ్రీనివాసరావు, అన్నారావు, అప్పారా వు, లక్ష్మణరావు, సత్యారావు, రజిత, సౌమ్య, సూర్యకళ, శర్మ, సోమయాజులు, శశి భూషణ్, గోపాలకృష్ణ, ఉమా మహేష్ పాల్గొన్నారు. -
చెరకు తోటలు దగ్ధం
● రూ.రెండున్నర లక్షల ఆస్తి నష్టం బాడంగి: మండల కేంద్రంలోని ఐసీడీఎస్ కార్యాలయానికి ఆనుకొని ఉన్న పంట పొలాల్లో ప్రమాదవశాత్తు గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. లచ్చుపతుల శ్రీరాముకు చెందిన సుమారు రెండెకరాల నిలవరం, బల్జి రమణకు చెందిన 0.25 సెంట్లలో విత్తనానికి ఉంచిన చెరకు కాలిపోయి నష్టం సంభవించినట్టు రైతులు తెలిపారు. సుమారు రూ.రెండు లక్షల వరకు నష్టం జరిగినట్టు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న ఎంఆర్ఐ జగదాంబ, వీఆర్ఓ ఆర్వీ రమణమూర్తినాయుడు ప్రమాద స్థలానికి చేరుకొని నష్టాన్ని అంచనా వేశారు. డొంకినవలసలోని అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం మెంటాడ: మండలంలోని లోతుగెడ్డ పంచాయతీ ఎస్టీ కాలనీలో గురువారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో అద్దాల చిన్నమ్మి, అప్పన్న దంపతులకు చెందిన పూరిల్లు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో రూ.85 వేల నగదు, తులమున్నర బంగారు ఆభరణాలు, కొద్ది మొత్తంలో వెండి కాలిపోయాయి. ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న నగదు కాలిపోవడంతో బాధితులు లబోదిబోమన్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వారు కోరారు. విజయనగరం క్రైమ్ : అప్పులిచ్చి అధిక వడ్డీల పేరిట వేధిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. డబ్బులిచ్చి అధిక వడ్డీ వసూలు చేయడం, అప్పు తీసుకున్న వారిని బెదిరించడం ఇచ్చిన అప్పు కంటే అధికంగా అసలుతో పాటు వడ్డీని వసూలు చేయడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో కొందరు బయట వ్యక్తులకు జిల్లాకు వచ్చి అవసరాల్లో ఉన్న వారిని గుర్తించి వారికి అప్పులిచ్చి అధిక వడ్డీ వసూలు చేస్తూ ఆర్థికంగా, మానసికంగా వేధిస్తూ వ్యాపారం చేస్తున్నట్టు తమ దృష్టి వచ్చిందని తెలిపారు. డబ్బులిచ్చి బ్లాంక్ ప్రామిసరీ నోటు, బాండ్ పేపరు, తెల్లకాగితం మీద సంతకాలు చేయించుకుంటూ డబ్బులు సకాలంలో ఇవ్వకుంటే కొల్కత్తా, బిహార్ వంటి బయట రాష్ట్రాల కోర్టుల్లో కేసులు వేసి భయపెట్టి భయబ్రాంతులకు గురి చేస్తూ వేధిస్తున్నారని పేర్కొన్నారు. దీన్నే కాల్మనీ వ్యాపారం అంటారని తెలిపారు. అటువంటి వారిపై కేసులు నమోదు చేసి వారి ఆస్తులను జప్తు చేయడంతో పాటు రౌడీషీట్లు తెరుస్తామని హెచ్చరించారు. 15న అండర్– 23 పురుషుల క్రికెట్ జట్టు ఎంపికలు విజయనగరం: అండర్– 23 పురుషుల జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు ఈ నెల 15న నిర్వహించనున్నట్టు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి పి.సీతారామరాజు (రాంబాబు) గురువారం తెలిపారు. జిల్లా కేంద్రంలోని బాబా మెట్ట శివారు విజ్జి స్టేడియంలో ఆదివారం ఉదయం 7.30 గంటలకు ఎంపిక పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు వారి సొంత క్రికెట్ కిట్టు, ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రంతో పాటు తెలుపు దుస్తులు ధరించి రావాలని సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో.. మెరుగైన ఫలితాలు సాధించాలివిజయనగరం: స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో మున్సిపల్ కార్పొరేషన్కు మెరుగైన ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ బి.బాలస్వామి సూచించారు. ఇదే విషయమై ఆయన నగరపాలక సంస్థ కార్యాలయంలోని తన చాంబర్లో అన్ని విభాగాల అధికారులు, సిబ్బందితో గురువారం సమావేశమై దిశానిర్దేశం చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2026 సర్వే నిమిత్తం నిర్దేశిత అన్ని అంశాల్లోనూ ప్రణాళికాబద్దమైన పనితీరును కనబరచాలన్నారు. అధికారులంతా సమన్వయం చేసుకుని, మంచి ర్యాంకు వచ్చేలా చూడాలన్నారు. సామాజిక మరుగుదొడ్ల నిర్వహణలోని లోపాలు, ఇబ్బందులను అధిగమించాలన్నారు. ఒక్క సర్వే సమయంలోనే పరిశుభ్రంగా ఉంచడం కాకుండా నిత్యం శుభ్రత ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ, వినిమయ నీటి నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, పారిశుధ్య కార్మికుల సంక్షేమం, ప్రజాభిప్రాయ సేకరణ, ప్రజా సమస్యల పరిష్కార విధానాలు వంటి అంశాల్లో మెరుగైన ఫలితాలు నమోదు కావాలన్నారు. ఈ విషయంలో గతంలో కన్నా మెరుగైన ర్యాంకులు సాధించాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ కిల్లాన అప్పలరాజు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి, ఉద్యానశాఖ అధికారి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
వాడీవేడిగా కౌన్సిల్ సమావేశం
● మెప్మా ఆర్పీ అక్రమాలపై సభ్యుల నిలదీత ● 20 ఉద్యోగాల భర్తీకి సభ్యుల తీర్మానంనెల్లిమర్ల: నగరపంచాయతీ కౌన్సిల్ సమావేశం గురువారం వాడీవేడిగా జరిగింది. సభ్యులు పలు సమస్యలను సమావేశంలో ప్రస్తావించారు. ఆశీలు వసూలు కోసం ఇద్దరు ఉద్యోగులు తిరుగుతున్నారని, వారు రోజంతా వసూలు చేసిన మొత్తం వారి జీతాలకే సరిపోదని కౌన్సిలర్ లెంక హైమావతి అన్నారు. వేలంపాట వెంటనే వేయాలని సూచించారు. మున్సిపాలిటీ ఆధీనంలోని బైరెడ్డి సూర్యనారాయణ కల్యాణ మండపం విస్తరణకు సభ్యులు తీర్మానించారు. అలాగే రూ.40 లక్షల వ్యయంతో పట్టణంలో 21 అభివృద్ధి పనులకు తీర్మానం చేసి ఆమోదించారు. వేసవి దృష్ట్యా తాగునీటి బోర్లకు మరమ్మతులు ఎప్పుడు చేపడతారని సభ్యులు ప్రశ్నించారు. వార్డుకు కనీసం మూడు తాగునీటి బోర్లు అయినా అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పది ఉద్యోగాలతో పాటు మరో పది ఉద్యోగాల భర్తీకి సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. సదరు ఉద్యోగాలను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయాలని ప్రతిపాదించారు. ఓ మెప్మా ఆర్పీ సభ్యుల డబ్బును స్వాహా చేశారని, వాటిని ఎందుకు రికవరీ చేయడం లేదని పలువురు సభ్యులు నిలదీశారు. డబ్బు తిరిగి కట్టకపోతే సదరు ఉద్యోగిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. త్వరలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలు.. నగర పంచాయతీకి చెందిన 576 టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని సదరు సంస్థ ప్రతినిధి వెంకటరమణ సమావేశంలో తెలిపారు. ఇప్పటికే 80 శాతం మేర నిర్మాణం పూర్తయ్యిందన్నారు. అలాగే 257 మంది చెల్లించిన డిపాజిట్లు రూ.96 లక్షలను ఈ నెలాఖరులోగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఏప్రిల్ నుంచి మిగిలిన నిర్మాణ పనులు ప్రారంభించాలని కాంట్రాక్టరుకు ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసినట్లు వెంకటరమణ చెప్పారు. పట్టణంలో సొంత స్థలాలు ఉన్నవారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 140 ఇళ్లకు ఇప్పటికే పొజిషన్ సర్టిఫికెట్లు జారీ అయినట్లు హౌసింగ్ ఏఈ పవన్ కుమార్ వెల్లడించారు. మరో 152 పెండింగ్ ఉన్నట్లు చెప్పారు. సమావేశంలో నగరపంచాయతీ చైర్పర్సన్ బంగారు సరోజిని, కమిషనర్ జనార్ధనరావు, వైస్ చైర్మన్లు సముద్రపు రామారావు, కారుకొండ కృష్ణ, కౌన్సిలర్లు చిక్కాల సంతోష్కుమార్, నల్లి కృష్ణవేణి, నరవ రామలక్ష్మి పాల్గొన్నారు. -
సరిహద్దు గ్రామాల్లో ఎకై ్సజ్ దాడులు
పార్వతీపురం రూరల్ : నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ – ఒడిశా సరిహద్దు గ్రామాల్లో గురువారం ఎకై ్సజ్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పార్వతీపురం ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ ఎస్.శిరీష ఆధ్వర్యంలో ఒడిశాలోని కోరాపుట్ జిల్లా కర్లీ, కప్పలాడ, పిప్పలబద్ర గ్రామాల్లో సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సారా తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు 4,800 లీటర్ల బెల్లపు ఊటతో పాటు 170 లీటర్ల నాటుసారాను గుర్తించి అక్కడికక్కడే ధ్వంసం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ముగ్గురిపై ఒడిశా ఎకై ్సజ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. దాడుల్లో పార్వతీపురం, బొబ్బిలి, గజపతినగరం, సీతానగరం, సాలూరు ఎకై ్సజ్ స్టేషన్ల సిబ్బంది, విజయనగరం ఎన్ఫోర్స్మెంట్, ఇ.ఎస్.టి.ఎఫ్ బృందాలు, సాలూరు బీఎంపీపీ సిబ్బంది పాల్గొన్నారు. 4,800 లీటర్ల ఊట ధ్వంసం -
వరల్డ్ పారా అథ్లెటిక్స్లో గౌతమ్కు కాంస్య పతకం
విజయనగరం: న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా మార్చి 8 నుంచి 13 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ – 2026 పోటీలలో భారతదేశం తరఫున పాల్గొన్న విజయనగరం జిల్లాకు చెందిన పారా అథ్లెట్ కరణం గౌతమ్ (టీ–12 కేటగిరి ) 100 మీటర్ల పరుగులో కాంస్య పతకం సాధించడం హర్షణీయమని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె.దయానంద్ పేర్కొన్నారు. ఇది అంతర్జాతీయ వేదిక మీద జిల్లాకు దక్కిన గౌరవమని ఆనందం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ పోటీలకు భారత్ నుంచి ఆరుగురు (6) పారా క్రీడాకారులు ఎంపిక కాగా అందులో విజయనగరం జిల్లాకు చెందిన కరణం గౌతమ్ ఒకరని తెలిపారు. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచి కాంస్యం గెలుచుకున్న గౌతమ్ అంతర్జాతీయ వేదికపై జిల్లా కీర్తిని మరింతగా పెంచాడని అభినందించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్లో దేశానికి మరిన్ని విజయాలు అందించాలని ఆకాంక్షించారు. -
చికిత్స పొందుతూ మహిళ మృతి
రామభద్రపురం: మండల కేంద్రంలోని బొబ్బిలి రూట్లో పెట్రోల్ బంకు వద్ద ఈ నెల 11వ తేదీన లారీని ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు.. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం బర్లి గ్రామానికి చెందిన ఇజ్జాడ గౌరీశ్వరి (64) ఇటీవల సాలూరులో తమ బంధువు మృతి చెందిన నేపథ్యంలో 11వ తేదీన పెద్దకర్మ కార్యాక్రమానికి సాలూరు వెళ్లేందుకు బొబ్బిలి వచ్చింది. అక్కడ పార్వతీపురం డిపోకు చెందిన ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు ఎక్కింది. సరిగ్గా రామభద్రపురం గ్రామ సమీపంలోని బొబ్బిలి రూట్లో ఉన్న పెట్రోల్ బంకు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గౌరీశ్వరి తీవ్రగంగా గాయపడింది. వెంటనే స్థానికులు, పోలీసులు కలిసి ప్రధమ చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో బాడంగి సీహెచ్సీకి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందింది.కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బండ గండం..
వీరఘట్టం మండలం వండువలో పండగ వాతావరణంలో వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరిస్తున్న జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్రాజు సాక్షి, పార్వతీపురం మన్యం: వంట గ్యాస్ కొరత ప్రచారం ఓవైపు జోరుగా సాగుతుంటే.. మరోవైపు ఏజెన్సీలు, వ్యాపార వర్గా లు ముందుగానే సిలిండర్లను బ్లాక్ చేస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కసారిగా గ్యాస్ బుకింగ్ పెరగడంతో ఏజెన్సీలు సైతం సిలిండర్లు ఇవ్వడానికి వెనుకాడుతున్నాయి. దీంతో వినియో గదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని 15 గ్యాస్ ఏజెన్సీలను జేసీ యశ్వంత్కుమార్రెడ్డి, పౌరసరఫరాల అధికారి అశోక్కుమార్, సబ్ కలెక్టర్లు, తహసీల్దార్లు తనిఖీ చేశారు. గ్యాస్ నిల్వలు, పంపిణీ తీరును పరిశీలించారు. పెరుగుతున్న ముందస్తు బుకింగ్లు యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడనుందన్న ప్రచారం నేప థ్యంలో వినియోగదారుల నుంచి ముందస్తు బుకింగ్లు పెరుగుతున్నాయి. జిల్లాలోని ఏజెన్సీల ద్వారా సుమారు 1.20 లక్షల మంది వినియోగదారులకు గ్యాస్ సరఫరా అవుతోందని అంచనా. అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం గోదాముల్లో 9వేలకు పైగా సిలిండర్ల నిల్వలు ఉన్నాయి. విశాఖపట్న ంలోని బాట్లింగ్ ప్లాంట్ల నుంచి ప్రతిరోజూ జిల్లాకు గ్యాస్ సరఫరా అవుతోందని అధికారులు అంటున్నారు. రోజువారీ 3 వేల నుంచి 4 వేల వరకు బుకింగ్లు సజావుగా సాగుతున్నాయని, యుద్ధ వాతావరణంవల్ల కొరత ఉండవచ్చ న్న అపోహతో దాదాపు 80 శాతం మేర ఒక్కసారిగా పెరిగాయని చెబుతున్నారు. ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా కంట్రోల్రూం గ్యాస్ సరఫరాలో ఇక్కట్లు, పెరిగిన బుకింగ్ల నేపథ్యంలో పంపిణీకి ఇబ్బంది ఎదురవుతోంది. కొంతమంది వ్యాపారులు సిలిండర్లను బ్లాక్ చేస్తున్నారన్న ప్రచారం జోరుగా ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా పౌరసరఫరాల కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్రూం ఏర్పాటు చేశారు. గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్, అధిక ధరల వసూలు, బుకింగ్ చేసినా సరఫరా రాకపోవడం వంటి సమస్యలుంటే కంట్రోల్రూం ఫోన్ 70130 60665 నంబర్కు ఫిర్యాదు చేయవచ్చని సంయుక్త కలెక్టర్ యశ్వంత్కుమార్రెడ్డి తెలిపారు. జిల్లాలో సమృద్ధిగా గ్యాస్ నిల్వలు ఉన్నాయి. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అపోహలకు గురి కావద్దు. అవసరం లేకపోయి నా, గ్యాస్ బుక్ చేసుకుని, కృత్రిమ కొరత సృష్టించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎప్ప టికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాం. ఎక్కడైనా ఇబ్బందులుంటే కంట్రోల్ రూం నంబరుకు ఫిర్యాదు చేయవచ్చు. 24 గంటల్లో సమస్య పరిష్కరిస్తాం. – సి.యశ్వంత్కుమార్రెడ్డి, సంయుక్త కలెక్టర్ -
బోర్డు తిప్పేసిన పుట్టగొడుగుల శిక్షణ కేంద్రం
పాలకొండ/వీరఘట్టం: పాలకొండ గజాలఖానా సమీపంలో నిర్వహిస్తున్న ఆర్గానిక్ పుట్టగొడుగుల శిక్షణ కేంద్రాన్ని ఉన్నఫళంగా మూసేశారు. కేంద్ర నిర్వాహకుడు, పాలకొండ నగరపంచాయతీకి చెందిన వప్పంగి సంతోష్కుమార్ పట్నాయక్ సుమారు రూ.2 కోట్లతో పరారయ్యాడు. ఆయన కొద్దినెలల ముందు గారమ్మతల్లి ఆర్గానిక్ పుట్టగొడుగుల కేంద్రాన్ని ప్రారంభించాడు. ఇక్కడ పుట్టగొడుగుల తయారీపై శిక్షణ ఇస్తామని నిరుద్యోగులను నమ్మించాడు. ఇక్కడ పని చేయాలంటే ప్రతిఒక్కరూ రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకు చెల్లించాలనే నిబంధన పెట్టి సుమారు 250 మంది నుంచి రూ.2 కోట్ల వరకు వసూలు చేశాడు. డబ్బుచెల్లించిన వారిని శిక్షణ పేరుతో పనిలోకి తీసుకుని వారికి ప్రతినెలా రూ.12 వేలు జీతం ఇచ్చాడు. డిపాజిట్లు ఇచ్చిన వారికి పది నెలలు తర్వాత చెల్లుబాటు అయ్యేలా బ్యాంకు చెక్కులు కూడా అందజేశాడు. నాలుగు నెలలు నిర్వహించిన ఈ కేంద్రాన్ని ఇప్పుడు మూసేసి శిక్షణకోసం చేరిన వారికి కుచ్చుటోపీ పెట్టాడంటూ బాధితులు లబోదిబోమంటున్నారు. శిక్షణ కేంద్రం తీరుపై గతంలో ‘నిరుద్యోగులూ జాగ్రత్త’ శీర్షిక ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. నిరుద్యోగులను అప్రమత్తం చేసింది. అప్పుడు మేల్కొని ఉంటే మోసపోయేవారం కాదని బాధితులు అంటున్నారు. పుట్టగొడుడుల కేంద్రం నిర్వహణపై ఎటువంటి ఫిర్యాదులు రాలేదు. పుట్టగొడుగుల కేంద్రంలో పనిచేయడానికి డిపాజిట్లు ఎవరైనా ఇచ్చి మోసపోయామనుకుంటే పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. – ఎం.రాంబాబు, డీఎస్పీ, పాలకొండ -
అవినీతే సంకల్పం!
● విచారణలో కాలయాపన.. చర్యలకు తాత్సారం ● ‘సీ్త్ర నిధి’లో పెద్ద ఎత్తున అక్రమాలు ● ‘వెలుగు’లో చీకటి కోణాలు సాక్షి, పార్వతీపురం మన్యం: ‘వెలుగు’లో చీకటి కోణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఫిర్యాదులు వెళ్తున్నా, ‘ఉన్నత’ స్థాయిలో అండదండలు.. తప్పించుకుని తిరగడానికి ఆస్కారమిస్తున్నాయి. జిల్లాలో దారిద్య్ర నిర్మూలన సంస్థ(సెర్ప్) అక్రమాల పుట్టగా మారిందన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నా యి. అక్రమంగా నిధుల మళ్లింపు చేశార ని ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చినా.. విచారణల పేరుతోనే కాలయాపన అవుతోంది. 2017 నుంచి 2024 కాలంలో చేపట్టిన వివిధ కార్యక్రమా లకు సంబంధించి నిధుల దుర్వినియోగం వ్యవహారంపై బాధ్యులను గుర్తించి, షోకాజ్ నోటీసులకే పరిమితం చేశారు. చర్యలకు మాత్రం వెనుకాడుతు న్నారు. సీ్త్రనిధి, సంకల్ప డిపాజిట్ల వ్యవహారంలో నిబంధనలకు తిలోదకాలిచ్చిన విషయంపై అనేక ఫిర్యాదులున్నాయి. గుమ్మలక్ష్మీపురం మండల సమాఖ్య పరిధిలోని వెలుగు/సెర్ప్ ద్వారా అమలైన హెల్త్ అండ్ న్యూ ట్రిషన్ ప్రాజెక్టు సందర్భంగా పెద్ద స్థాయిలో ఆర్థిక అవినీతి చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్టు ముగింపు సమయంలో మొత్తం 107 గ్రామ సంఘాల(వీవో) హెచ్ఎన్ ఖాతాలకు సంబంధించిన నిధులు ‘సంకల్ప’ పథకం కింద ఉన్న సీ్త్ర నిధి ఖాతాలో జమయ్యాయి. ఆ నిధులపై లభించిన వడ్డీని ప్రతినెలా సంబంధిత గ్రామ సంఘాల ఖాతాలకు జయ చే యాల్సి ఉంది. దశాబ్దకాలంగా వచ్చిన వడ్డీ మొత్తాలను అక్రమంగా మళ్లించినట్లు విచారణలో గుర్తించారు. సుమారు రూ.85 లక్షల నుంచి రూ.1.30 కోట్ల వరకు వడ్డీ మొత్తాలు దారి మళ్లించిన ట్లు సమాచారం. సీ్త్ర నిధి బ్యాంకుకు చెందిన ఇద్దరు ఏజీఎంలు కొన్నాళ్ల క్రితం విచారణ నిర్వహించి, తప్పు జరిగిన ట్లు నిర్ధారించారు. ఈ నేప థ్యంలో సీ్త్ర నిధి బ్యాంకు ఎండీ నుంచి సంబంధిత బ్యాంకు సిబ్బందికి మెమోలు కూడా వెళ్లాయి. అనంతరం మరో ఏజీఎం సుమారు నాలుగు నెలల కిందట బ్యాంక్ స్టేట్మెంట్లు పరిశీలించి రూ.70 లక్షల వరకు దారి మళ్లింద ని గుర్తించి, నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పటి వరకు బాధ్యులపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయంలో విచారణ పేరుతో కాలయాపన సాగుతోందన్న విమర్శలున్నాయి. ఇప్పటికే సుమారు ముగ్గురు ఏజీఎంలు నెలల తరబడి విచారణ చేశారు. బ్యాంకుల నుంచి పది సంవత్సరాల స్టేట్మెంట్లు కూడా తీశారు. రూ.57 లక్షల మేర అవినీతి జరిగిందని విచారణలో తేల్చారు. ఇద్దరు ఏపీఎంలు, ఆరుగురు సీసీలు, ఒక ఏజీఎం, ఒక డీపీఎం(ఫైనాన్స్), ఒక ఏపీడీ ఇందులో ఉన్నట్లు ఆరోపణలున్నాయి. అక్రమాలకు పాల్పడిన వారికి మంత్రి పేషీ నుంచి అండదండలు పుష్కలంగా ఉన్నట్లు వినిపిస్తోంది. దీనివల్లే చర్యలకు వెనుకాడుతున్నారన్న గుసగుసలు సొంత శాఖ నుంచే వినిపిస్తున్నాయి. -
ఊరూరా.. వైఎస్సార్సీపీకి జేజేలు
–8లోసాక్షి, పార్వతీపురం మన్యం: వైఎస్సార్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు గురువారం పండగ వాతావరణంలో నిర్వహించారు. జిల్లాలోని నాలు గు నియోజకవర్గాల్లోనూ వేడుకలు అట్టహాసంగా సాగాయి. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల ఇన్చార్జిలు వైఎస్సార్సీపీ జెండా ఎగురవేశారు. కేక్లు కట్చేసి పంచిపెట్టారు. దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ లక్ష్యాలను వివరించారు. సామాజిక సేవాకార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ●పార్వతీపురంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాల యం వద్ద మన్యం జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్రాజు, ఉమ్మడి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మరిశర్ల బాబూజీ, నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండా ఎగురవేశారు. కేక్ కట్చేసి అభిమానులకు పంచిపెట్టారు. ●పార్వతీపురం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి జోగారావు, నియోజకవర్గ పరిశీలకులు మావుడి శ్రీనివాసరావు తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేక్ కోసి పంచిపెట్టారు. పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. సీతానగరం, బ లిజిపేట మండలాల్లోనూ వేడుకలు నిర్వహించారు. ●పాలకొండలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, నియోజకవర్గ ఇన్చార్జి విశ్వాసరాయి కళావతి ఆధ్వ ర్యంలో వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పాలకొండ, భామిని, సీతంపేట, వీరఘట్టం మండలాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. జై వైఎస్సార్సీపీ అంటూ నినదించారు. ●కురుపాం నియోజకవర్గంలోని కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి, కొమరా డ మండలాల్లో పార్టీ కన్వీనర్లు, ఇతర ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ●సాలూరు నియోజకవర్గ కేంద్రంలో బోసు బొ మ్మ కూడలి వద్దనున్న వైఎస్సార్ విగ్రహానికి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి పంచిపెట్టారు. పాచిపెంట, మక్కువ మండలాల్లోనూ వేడుకలు జరిగాయి. -
9 మందికి 14 ఏళ్ల జైలు శిక్ష
గంజాయి కేసులో ● ఒక్కొక్కరికి రూ.లక్ష జరిమాన విజయనగరం క్రైమ్: గంట్యాడ పోలీసు స్టేషన్లో తొమ్మిదేళ్ల కిందట నమోదైన గంజాయి కేసులో అరెస్టయిన 9 మంది నిందితులపై నేరారోపణ రుజువుకావడంతో ఒక్కొక్కరికి 14 ఏళ్ల కారాగార శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ విజయనగరం ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ఎం.మీనాదేవి గురువారం తీర్పు చెప్పారు. దీనికి సంబంధించి జిల్లా పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 2017 ఆగస్టు 23వ తేదీన గంజాయి తరిలిస్తున్నారన్న సమాచారం మేరకు గంట్యాడ పోలీసులు కొటారుబిల్లి కూడలి వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. బొడ్డవర నుంచి వస్తున్న మూడు వాహనాలను తనిఖీ చేశారు. అందులో సుమారు 641కిలోల గంజాయిని తరలిస్తున్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 10 మంది నిందితులను అదుపులోకి తీసుకుని, అప్పటి గంట్యాడ ఎస్ఐ పి.నారాయణరావు కేసు నమోదుచేశారు. అప్పటి విజయనగరం రూరల్ సీఐ డి.లక్ష్మణరావు కేసు దర్యాప్తు చేపట్టి కోర్టులో అభియోగపత్రం దాఖలుచేశారు. ఏఎస్ఆర్ జిల్లా అరకు మండలం లోతేరుకి చెందిన పట్టాసి చంద్రశేఖర్, అనంతగిరి మండలం శివలింగాపురానికి చెందిన శెట్టి ఉమామహేశ్వరరావు అలియాస్ హుస్సేన్, అరకు మండలం చోలెంకికి చెందిన కొర్న మోసెస్ అలియాస్ ఆలీ, డుంబ్రిగూడకు చెందిన మధ్యగురు సింహాద్రి, ఎస్.కోట మండలం టి.బొడ్డవరకు చెందిన శోభా నాగరాజు, డుంబ్రిగూడ మండలం పెదఅంజోడకి చెందిన పంగి సన్యాసిరావు, అనంతగిరి మండలం ఎగువబూడికి చెందిన జన్ని అప్పారావు, శివలింగాపురానికి చెందిన దుడ్డు వీరభద్రరాజు, విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం సత్యనారాయణపురానికి చెందిన మద్దుల శరత్పై నేరారోపణలు రుజువు కావడంతో జడ్జి మీనాదేవి శిక్ష విధిస్తూ తీర్పుచెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఏడాది జైలుశిక్ష అనుభవించాలని తీర్పులో వెల్లడించారు. మరో నిందితుడైన ఏఎస్ఆర్ జిల్లా అనంతగిరి మండలం తొకురుకి చెందిన గేదెల ధర్మతేజ కేసు విచారణ సమయంలో అనారోగ్యంతో మృతి చెందాడు. శెట్టి ఉమామహేశ్వరరావు అలియాస్ హుస్సేన్పై వివిధ జిల్లాల్లో 7 గంజాయి కేసులు ఉన్నాయి. ఇతనిపై ఏఎస్ఆర్ జిల్లాలో పి.డి.యాక్ట్ ఉంది. ఆయన గంజాయి వ్యాపారంతో సంపాదించిన సుమారు రూ.2.5 కోట్ల విలువైన ఆస్థిని జప్తుచేసినట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి. ఈ కేసులో ముద్దాయిలకు శిక్షపడేలా వ్యవహరించిన విజయనగరం రూరల్ సీఐ బి.లక్ష్మణరావు, గంట్యాడ ఎస్ఐ సాయికృష్ణ, ఇతర పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అభినందించారు. -
42 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి చూడలేదు
పార్వతీపురం మన్యం జిల్లా: పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు టీడీపీ ఎమ్మెల్యే, గిరజన శాఖామంత్రి గుమ్మిడి సంధ్యారాణి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్దేవ్ల మధ్య విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. మంత్రి సంధ్యారాణి పీఎస్ సతీష్ ఓ మహిళా ఉద్యోగినిపై ఆర్థిక, లైంగిక వేధింపుల కేసు విషయంలో పట్టణ, రూరల్ సీఐలు అప్పలనాయుడు, రామకృష్ణ బుధవారం భంజ్దేవ్ ఇంటికి వెళ్లి విచారణ జరిపారు. బాధితురాలి ఫోన్ నుంచి భంజ్దేవ్కు పలుమార్లు ఫోన్లు రావడం, భంజ్దేవ్ ఫోన్ నుంచి ఆమెకు ఫోన్ వెళ్లడంపై ప్రశ్నించారు. తనకు అన్యాయం జరిగిందని పలుమార్లు ఆమె ఫోన్లో తెలిపిందని, పార్టీకి చెడ్డపేరు వస్తుందన్న భావనతో మంత్రి సంధ్యారాణితో మాట్లాడి పరిష్కరించుకోవాలని సూచించినట్టు భంజ్దేవ్ తెలిపారు. వివాదం పెద్దదికావడంతో సీఎంవో కార్యాలయం నుంచి ఫోన్లు వచ్చాయని, టీడీపీ అరకు పార్లమెంట్ ఆఫీస్ ఇన్చార్జి నాగేశ్వరరావు సైతం ఫోన్ చేసి, ఆమెతో (ఫిర్యాదుదారురాలితో) ఫోన్లో మాట్లాడించాలని చెప్పడంతో ఆమెకు ఫోన్ చేసి ఇంటికి పిలిపించానని, నాగేశ్వరరావు వాట్సాప్కాల్లో తనఫోన్ నుంచి బాధితురాలితో మాట్లాడినట్టు వివరించారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఘటన తీరును వివరించానన్నారు. విచారణ జరిపించడం బాధాకరం పోలీసుల విచారణ తర్వాత భంజ్దేవ్ మీడియాతో మాట్లాడారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశానని, అధికార పార్టీలో ఉన్న మాజీ ప్రజాప్రతినిధినైన తనకు చాలా మంది బాధితులు ఫోన్ చేస్తారని పేర్కొన్నారు. 42 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న తనను ఇలాంటి విషయాలపై ఏ రోజు పోలీసులు విచారణ జరపడం తెలియదని, బాధాకరమంటూ వాపోయారు. మంత్రి పీఎస్ కేసులో తన కాల్డేటాను అనుమానించి పోలీసులతో విచారణ జరిపించడం బాధకలిగిస్తోందన్నారు. ఎవరి ప్రోద్బలంతో పోలీసులు విచారణకు వచ్చారో అందరికీ అర్థమవుతుందని, జరిగిన విషయాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని భంజ్దేవ్ స్పష్టం చేశారు. -
గమ్యస్థానాలకు చేరుకునేలోపే...
ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు ● సీసీ కెమోరాలు పరిశీలించిన పోలీసులు.. రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతం పక్కనే పెట్రోల్ బంకు వద్ద ఉన్న సీసీ కెమోరాలను పోలీసులు పరిశీలించారు. అందులో బస్సు డ్రైవర్ ఇయర్ ఫోన్స్ను చెవిలో పెట్టుకుని నిర్లక్ష్యంగా బస్సును అతివేగంగా నడుపుతూ లారీని ఢీకొట్టి ప్రమాదానికి కారకుడయ్యాడని గుర్తించారు. పార్వతీపురం డిపోలో 10 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరడం... ఆ సమయాన్ని కలిపేందుకు అతివేగంగా బస్సు నడిపినట్టు ప్రాథమికంగా గుర్తించారు. డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్పై గతంలో ప్రయాణికుల నుంచి ఫిర్యాదు లు అందడంతో సాలూరు డిపో పరిధిలో పనిచేస్తున్న డ్రైవర్ను పార్వతీపురం డిపోకు బదిలీచేసినట్టు సమాచారం. బస్సు డ్రైవర్ పాలకొండ తిరుపతిపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వి.ప్రసాదరావు తెలిపారు. ● తీవ్రగాయాలపాలై... కొట్టక్కి సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న బొబ్బిలికి చెందిన మాసాబత్తుల ఝాన్సీ, శనగల సూర్యనారాయణమ్మ, రామభద్రపురం గ్రామానికి చెందిన దేవతన లక్ష్మి, చిన బూర్జవలసకు చెందిన గేదెల దాడమ్మ, గొర్లి రాజేశ్వరమ్మ, ఇజ్జాడ గౌరమ్మ, గొడ్డె చిన్నయ్య, పారాది నాగరాజు తదితరులను మెరుగైన వైద్యం కోసం విజయనగరం జిల్లా కేంద్రాస్ప్రత్రికి తరలించారు. యజ్జల లక్ష్మమ్మ, బూరాడ గౌరమ్మ, సాలూరు మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఎస్.శోభారాణి, బస్సు కండక్టర్ బెహరా చిన్నమ్మ తదితరులు బాడంగి సీహెచ్సీలో చికిత్స పొందుతున్నారు. స్వల్ప గాయాలైన ఎస్ఎంబి మైలాలి, మత్స దివ్య, సీహెచ్ రాజీవ్, కర్రి కాంతారావు, పాలవలస శ్రీనివాసపరావు, కర్రి పద్మ, పైల భారతి, శిరిపురపు భారతి, నక్కేళ్ల అమరామణి, నక్కేళ్ల భారతి తదితరులు బాడంగి, బొబ్బిలి, రామభద్రపురం ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యసేవలు పొందుతున్నారు. డిపో నుంచి పది నిమిషాలు ఆలస్యంగా బయలుదేరిన బస్సు ఆ సమయాన్ని కలిపేందుకు అతివేగంగా బస్సును నడిపిన డ్రైవర్ రోడ్డు మలుపులో లారీని ఢీకొట్టిన బస్సు బస్సులోని 60 మందిలో 50 మందికి గాయాలు సాయం కోసం ప్రయాణికుల ఆర్తనాదాలు 9 మందిని జిల్లా కేంద్రాస్పత్రికి తరలింపు మిగిలిన వారికి బాడంగి, రామభద్రపురం ఆస్పత్రుల్లో చికిత్స బస్సు డ్రైవర్పై కేసు నమోదు బస్సులో అధికమంది రామభద్రపురం, తారాపురం, కొట్టక్కి, సాలూరు తదితర గ్రామాల స్టాప్లలో దిగాల్సినవారే అధికం. కొద్ది సమయంలో గమ్యస్థానాలకు చేరుకుంటామన్న సమయంలో బొబ్బిలి వైపు వెళ్తున్న మధ్యప్రదేశ్కు చెందిన లారీని బస్సు ఢీకొట్టడంతో ప్రమాదంలో చిక్కుకున్నారు. గాయపడిన వారిలో 20 మంది వరకు కాళ్లు, చేతులు విరిగిపోయాయి. తల, గుండె, వీపు, కడుపు భాగంలో తీవ్రగాయాలయ్యాయి. మరో 25 మందికి పెదవులు, ముక్కు, నాలుక, దంతాల వద్ద గాయాలయ్యాయి. -
చెట్టును ఢీకొట్టిన కారు
గుమ్మలక్ష్మీపురం: అతివేగం వల్ల నిండు ప్రాణం బలైన సంఘటన మండలంలోని పి.ఆమిటి జంక్షన్ వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయనగరానికి చెందిన బట్టల వ్యాపారి అనిల్ జైన్ (47) తన భార్య జ్యోతిజైన్తో కలిసి సొంతకారులో డ్రైవర్ తారాడ రాంబాబుతో పాటు నగదు కలెక్షన్ నిమిత్తం గుమ్మలక్ష్మీపురం మీదుగా ఒడిశాలోని గుమడకు బుధవారం ఉదయం బయలుదేరాడు. సరిగ్గా మండలంలోని పి.ఆమిటి జంక్షన్ వద్దకు రాగానే రోడ్డు పక్కనున్న చెట్టును బలంగా ఢీ కొనడంతో ముందు సీట్లో కూర్చున్న అనిల్జైన్తో పాటు డ్రైవర్ రాంబాబు, వెనుక సీట్లో కూర్చున్న జ్యోతిజైన్ గాయపడ్డారు. వెంటనే స్థానికులు స్పందించి 108 వాహనానికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది చేరుకుని క్షతగాత్రులను భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అనిల్జైన్ మృతి చెందాడు. మెరుగైన వైద్యం నిమిత్తం మృతుడి భార్య జ్యోతి జైన్తో పాటు డ్రైవర్ రాంబాబును పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న ఎల్విన్పేట ఎస్సై బి.శివప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. శవపంచనామా అనంతరం అనిల్జైన్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. ఒకరి మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు -
గ్యాస్ మంట..
గురువారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2026చిరు వ్యాపారులకు తంటా!● ఎల్పీజీ సిలిండర్ల కొరత ● దుకాణాలు మూసుకుంటున్న వ్యాపారులు ● హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లోనూ వంటకు తంటా..సాక్షి, పార్వతీపురం మన్యం: పశ్చిమాసియాలో యుద్ధం వేళ.. చమురు సంస్థల నిర్ణయాలు ప్రజలను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎల్పీజీ గ్యాస్ సంక్షోభ ప్రచారం ఓవైపు ఉండగా.. జిల్లాలో గతం మాదిరి వంట గ్యాస్ లభ్యత కాకపోవడంతో ఆ ప్రభావం ఇటు గృహావసరాల వినియగదారులపైనా, చిరుహోటళ్లపైనా పడుతోంది. ఇటీవలే చమురు సంస్థలు గ్యాస్ ధరలను పెంచిన విషయం విదితమే. ఇప్పుడు గ్యాస్ బుక్ చేసిన 21 రోజుల తర్వాతే సిలిండర్ వస్తుందని చెప్పడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అడిగిన వెంటనే ఇవ్వలేం.. గ్యాస్ కొరతతో ప్రధానంగా చిన్న హోటళ్లు, రహదారి పక్కన తినుబండారాలు, ఫాస్ట్ఫుడ్ సెంటర్ నడిపేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో 16 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటి పరిధిలో 2.72 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. సగటున ప్రతినెలా 1.50 లక్షల సిలిండర్ల వినియోగమవుతాయని అంచనా. గృహావసరాలకు సాధారణంగా నెలకు ఒక సిలిండర్ చొప్పున వినియోగమవుతుంది. చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్ల వారు ఎక్కువగా గృహావసర సిలిండర్లనే వినియోగిస్తుంటారు. ఇది అక్రమమని తెలిసినా.. వాణిజ్య సిలిండర్ ధర రూ.1,900 వరకు ఉండడంతో అంత మొత్తం వెచ్చించలేక, వీటిపైనే ఆధారపడుతున్నారు. రెండు, మూడు రోజులకో సిలిండర్ వీరికి వినియోగమవుతుంటోంది. గ్యాస్ ఏజెన్సీలు సైతం అనధికారికంగా వీరికి సిలిండర్లు సరఫరా చేయగా.. మరికొంతమంది తెలిసిన వారి ఇళ్ల నుంచి వీటిని విడిపించుకుంటున్నారు. గతంలో సిలిండర్ బుక్ చేసుకున్న ఒకట్రెండు రోజుల్లోనే సరఫరా అయ్యేది. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడంలేదు. మూతపడుతున్న దుకాణాలు జిల్లాలో ప్రతి సందులోనూ చిన్న టిఫిన్ కొట్టులు, ఫాస్ట్ ఫుడ్సెంటర్లు దర్శనమిస్తున్నాయి. పార్వతీపురం వంటి పట్టణంలోనే 200కుపైగా ఉన్నాయి. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడటంతో ఆ ప్రభావం వీరిపై పడుతోంది. ఇప్పటికే ఉన్న నిల్వలు అయిపోవడం.. సిలిండర్ అడిగినా ఏజెన్సీలు 25 రోజుల వరకు ఇవ్వలేమని చెప్పడంతో కొంతమంది కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. మరి కొందరు హోటళ్లకు, ఫాస్ట్ ఫుడ్సెంటర్లకు విరామం ఇస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో మరిన్ని టిఫిన్ దుకాణాలు, రోడ్డు పక్కన బళ్లు మూత పడే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. హాస్టళ్లకు తప్పని తంటా.. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాలు, అంగన్వాడీ సెంటర్లనూ గ్యాస్ కొరత వెంటాడుతోంది. విద్యార్థులకు వంటకాలు చేసేందుకు గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయంటూ నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు. గ్యాస్ కొరత లేకుండా చూడాలని కోరుతున్నారు. పార్వతీపురం: జిల్లాలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలకు ఎల్పిజీ సిలెండర్లను నిరంతరాయంగా ఎలాంటి జాప్యం లేకుండా సరఫరా చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్రెడ్డి ఆదేశించారు. తన కార్యాలయంలో జిల్లా పౌరసరఫరా శాఖాధికారి, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ ఉప సంచాలకులతో ఆయన సమీక్షించారు. క్షేత్రస్థాయిలో గ్యాస్ సరఫరా స్థితిగతులను పర్యవేక్షించి ఎక్కడా ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. గ్యాస్ సరఫరాలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షణకు నోడల్ అధికారిని నియమించామన్నారు. నోడల్ అధికారితో సమన్వయం చేసుకొని గ్యాస్ ఇబ్బందిలేకుండా చూసుకోవాలని సూచించారు. వేసవి దృష్ట్యా విద్యార్థులు, ప్రజలు వడగాడ్పులకు గురికాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఆర్ఓ కె. హేమలత, ఎస్డీసీ ఎస్.దిలీప్చక్రవర్తి పాల్గొన్నారు. -
నన్ను అవమానించారు
సాలూరు: పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు టీడీపీ ఎమ్మెల్యే, గిరజన శాఖామంత్రి గుమ్మిడి సంధ్యారాణి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్దేవ్ల మధ్య విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. మంత్రి సంధ్యారాణి పీఎస్ సతీష్ ఓ మహిళా ఉద్యోగినిపై ఆర్థిక, లైంగిక వేధింపుల కేసు విషయంలో పట్టణ, రూరల్ సీఐలు అప్పలనాయుడు, రామకృష్ణ బుధవారం భంజ్దేవ్ ఇంటికి వెళ్లి విచారణ జరిపారు. బాధితురాలి ఫోన్ నుంచి భంజ్దేవ్కు పలుమార్లు ఫోన్లు రావడం, భంజ్దేవ్ ఫోన్ నుంచి ఆమెకు ఫోన్ వెళ్లడంపై ప్రశ్నించారు. తనకు అన్యాయం జరిగిందని పలుమార్లు ఆమె ఫోన్లో తెలిపిందని, పార్టీకి చెడ్డపేరు వస్తుందన్న భావనతో మంత్రి సంధ్యారాణితో మాట్లాడి పరిష్కరించుకోవాలని సూచించినట్టు భంజ్దేవ్ తెలిపారు. వివాదం పెద్దదికావడంతో సీఎంవో కార్యాలయం నుంచి ఫోన్లు వచ్చాయని, టీడీపీ అరకు పార్లమెంట్ ఆఫీస్ ఇన్చార్జి నాగేశ్వరరావు సైతం ఫోన్ చేసి, ఆమెతో (ఫిర్యాదుదారురాలితో) ఫోన్లో మాట్లాడించాలని చెప్పడంతో ఆమెకు ఫోన్ చేసి ఇంటికి పిలిపించానని, నాగేశ్వరరావు వాట్సాప్కాల్లో తనఫోన్ నుంచి బాధితురాలితో మాట్లాడినట్టు వివరించారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఘటన తీరును వివరించానన్నారు. విచారణ జరిపించడం బాధాకరం పోలీసుల విచారణ తర్వాత భంజ్దేవ్ మీడియాతో మాట్లాడారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశానని, అధికార పార్టీలో ఉన్న మాజీ ప్రజాప్రతినిధినైన తనకు చాలా మంది బాధితులు ఫోన్ చేస్తారని పేర్కొన్నారు. 42 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న తనను ఇలాంటి విషయాలపై ఏ రోజు పోలీసులు విచారణ జరపడం తెలియదని, బాధాకరమంటూ వాపోయారు. మంత్రి పీఎస్ కేసులో తన కాల్డేటాను అనుమానించి పోలీసులతో విచారణ జరిపించడం బాధకలిగిస్తోందన్నారు. ఎవరి ప్రోద్బలంతో పోలీసులు విచారణకు వచ్చారో అందరికీ అర్థమవుతుందని, జరిగిన విషయాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని భంజ్దేవ్ స్పష్టం చేశారు. 42 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి చూడలేదు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భంజ్దేవ్ మంత్రి సంధ్యారాణి పీఎస్ కేసులో భంజ్దేవ్ను విచారించిన పోలీసులు -
అదనపు ఎస్పీగా వెంకటేశ్వరరావు
పార్వతీపురం రూరల్: జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్)గా ఎం.వెంకటేశ్వరరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ తాత్కాలిక అదనపు ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఆయనను పూర్తిస్థాయిలో నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలోని తన చాంబర్లో బాధ్యతలు చేపట్టారు. ఏనుగుల బెడద వీడెదెన్నడో..? గరుగుబిల్లి: గత ఐదు రోజులుగా మండలంలోని గిజబ, నందివానివలస, తోటపల్లి గ్రామాల పరిసరాల్లో సంచరిస్తున్న ఏనుగులు బుధవారం తోటపల్లి పంచాయతీ నందివానివలస గ్రామ పరిసరాల్లో సంచరించాయి. ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న తామర చెరువులో జలకాలాడాయి. ఏనుగుల సంచారంతో రోడ్డుపై రాకపోకలకు ప్రజలు భయపడుతున్నారు. పంట పొలాలకు వెళ్లేందుకు రైతులు సాహసించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ప్రాంత ప్రజలకు ఏనుగుల బెడద ఎన్నడు వీడుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
సాలూరు ఏరియా ఆస్పత్రిని తనిఖీచేసిన డీసీహెచ్ఎస్
సాలూరు: వైద్యసేవలు అందించడంలో సాలూరు ఏరియా ఆస్పత్రి వైద్యులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ గిరిజన సంఘాల నాయకులు జేసీ యశ్వంత్కుమార్రెడ్డికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆయన ఆదేశాల మేరకు డీసీహెచ్ఎస్ నాగభూషణరావు ఆస్పత్రిని బుధవారం సందర్శించారు. ఆస్పత్రిలో అందుతున్న సేవల తీరుపై ఆరా తీశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆస్పత్రిలోనే సినీగీతాలకు వైద్యులు, సిబ్బంది నృత్యాలు చేసిన అంశంపై పలువురిని ప్రశ్నించారు. నివేదికను కలెక్టర్, జేసీలకు అందిస్తానని తెలిపారు. మిమ్స్ విద్యార్థుల ప్రతిభ నెల్లిమర్ల: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వ ర్యంలో ఇటీవల నిర్వహించిన ఇంటర్ కాలేజ్ అథ్లెటిక్ మీట్లో నెల్లిమర్ల మిమ్స్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో ఈ నెల 5, 6 తేదీల్లో నిర్వ హించిన క్రీడా పోటీల్లో పతకాలు సాధించారు. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని పల్లా ప్రమీల 100, 200 మీటర్ల పరుగులో మొదటిస్థానం.. లాంగ్జంప్లో రెండో స్థానం సాధించింది. ఫైనల్ ఇయ ర్ విద్యార్థి అద్యాస సమంత్రాయ్ డిస్క్త్రోలో మొదటి స్థానం.. జావెలిన్త్రోలో రెండో స్థానం సాధించినట్లు పీడీ కళా వెంకటరావు తెలిపారు. -
అమ్మో... సర్కిల్ సార్..
సాక్షి ప్రతినిధి,విజయనగరం: ఏమయ్యా వన్ నాట్ టూ... ఊళ్లో ఏం జరుగుతోంది? దర్పంగా అడిగారు సర్కిల్ పెద్దసార్... ఏం లేదుసార్... ఏముంటాయి.. పక్క ఊళ్లో పండగ...మర్నాడు ఈ ఊళ్లో జాతర.. ఆ డ్యూటీలు ఉన్నాయి సార్... వినయంతో చెప్పాడు కానిస్టేబుల్. ఏంటయ్యా ఊరి జనాలు పండగ చేసుకుంటే మనం ఎండలో చెమటలు కక్కుకుంటూ డ్యూటీలు చేయాలా?.. వాళ్ల బళ్లకు మనం కాపలా కాయాలా? వాళ్ల పిల్లలు తప్పిపోతే మనం వెతికి తెచ్చి ఇవ్వాలా? ముసలి ముతక జనాలనురోడ్లు దాటించాలా? ఇలా చేస్తే పేపర్లో మనపేర్లు ? ఫొటోలు వస్తాయా? ఈ పేర్లు.. ఫొటోలు ఎవరిక్కావాలయ్యా... మనకు పండగ లేదా? ఉండాలి.. మనం కూడా పండగ చేద్దాం... పోలీసుల పండగ అంటే ఎలా ఉంటుందో జనానికి.. వ్యాపారులకు చూపిద్దాం పదా అంటూ లాఠీ పట్టుకుని జీపెక్కారు. ఇదీ రాజాం టౌన్ సర్కిల్ ‘కుమారు’లు మార్క్. ● జనానికి జాతర.. ఆయనకు పండగ.. రాజాంతో పాటు చుట్టుపక్కల జాతరయ్యిందంటే చాలు రాజాం పట్టణ సర్కిల్ బాస్కు పెద్ద పండగేనట. ఇక్కడ బాగా ఆరితేరి ఉండడంతో పాటు అందరితో పరిచయాలు బాగా కలిసివస్తున్నాయి. గ్రామా దేవత పండగల్లో గుండాట, అట్టాటలు, బెల్ట్ షాపులకు అనఽఽధికార అనుమతులు ఇస్తూ ఒక్కో వ్యాపారానికి ఒక్కోరేటు వసూళ్లు చేస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అలా కుదరని చోట పెద్ద వ్యాపారులను స్పాన్సర్ల రూపంలో పిండేస్తున్నారు. అడిగేవారు, ప్రశ్నించే వారు లేకపోవడంతో ‘అశోక’వనంలో ప్రజల శోకాలు ఎవరికి వినిపించడం లేదు. భక్షక భటుడి అక్రమార్జనకు అడ్డూలేకుండా పోతోంది. ● అట్టాటకు అడ్డగోలు అనుమతులు.. అంతకాపల్లిలో ఏటా జరిగే మజ్జిగౌరమ్మ జాతర పోలీసులకు నిజమైన పండగ తెచ్చింది. పండగన్నాక జూదం లేకుంటే ఎలా.. జూదం పెట్టుకోండి.. మాకు ఓ లక్ష ఇచ్చుకోండి అంటూ పోలీస్ బాస్ ఆఫర్ ఇవ్వడంతో ఒక్క రాత్రికే లక్షల జూదం నడిచినట్టు సమాచారం. జూదం జరిగిన తీరును వీడియోల రూపంలో కొందరు నిక్షిప్తం చేసి.. ఇదంతా ఖాకీబాస్ అనుమతితోనే జరిగిందంటూ చూపిస్తుండడం గమనార్హం. రాజాం పట్టణంలో ఎటువంటి వివాదాలు వచ్చినా పోలీస్ స్టేషన్ అంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఆ మధ్య మల్లికార్జున కాలనీలో ఓ వ్యక్తి ఇంటి జాగాను మరో వ్యక్తి ఆక్రమించి నిర్మాణాలు చేస్తే దీన్ని అడ్డుకోవాల్సిన పోలీస్ బాస్ వన్ సైడ్ వ్యవహారం నిర్వహించారు. దీనిపై బాధితుడు డీఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించగా, కొద్ది రోజులు నిర్మాణాలు ఆపి, ఇరు వర్గాల వద్ద ఆధారాలు పరిశీలించాలని ఆదేశాలిచ్చారు. దీనిపై మండిపడుతూ సదరు బాధితుడికి సర్కిల్ అధికారి ఏకంగా హెచ్చరికలు జారీచేశారు. రౌడీ షీటర్ ఓపెన్ చేస్తానంటూ బెదిరించడంతో బాధితుడు భయపడుతున్నాడు. ఏదైనా వివాదంలో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులతో పాటు రెండో వర్గాన్ని కూడా పిలిచి, ఎవరు ఎక్కువ ఇస్తే వారికే సపోర్ట్ చేస్తున్నారన్న ఆరోపణలు ఇక్కడ బోలెడు. ఎవరైనా మొండికేస్తే పోలీస్ స్టేషన్లో పేరుబడిన కొంతమంది పాత నేరస్తులతో భయపెట్టించడం సంబంధిత అధికారికి వెన్నతో పెట్టిన విద్యగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్పాన్సర్ల పేరిట భారీగా దండకం పెద్ద వ్యాపారులే టార్గెట్ రాజాం టౌన్ సర్కిల్ పేరు చెబితే హడల్ అంతకాపల్లిలో అట్టాట, రూ.లక్షల్లో జూదం పోలిపల్లి పైడితల్లి జాతరలో డ్రోన్, సీసీ కెమెరాల పేరిట భారీగా వసూళ్లు రాజాం చుట్టుపక్కల జాతర అయిందంటే పండగే జూదం చట్టవిరుద్ధం.. అరికడతాం రాజాం పట్టణ పోలీసు అధికారిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఉంటేమాకు ఇవ్వండి... కచ్చితంగా దర్యాప్తు చేస్తాం. జాతరల్లో అట్టాటలు, గుండాట వంటి జూదాలు నిషిద్ధం. ఇలాంటివి ఎవరు చేసినా శిక్షార్హులు. అలాంటి ఆటలు ఆడినా...వాటిని ప్రోత్సహించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – రాఘవులు, డీఎస్పీ, చీపురుపల్లి సబ్ డివిజన్ -
జాతీయ లోక్అదాలత్ను సద్వినియోగం చేసుకోండి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత విజయనగరం: జిల్లాలో ఈనెల 14న నిర్వహించనున్న జాతీయలోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత సూచించారు. జిల్లా కోర్టు సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లా పోలీస్ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజీకాదగ్గ అన్ని క్రిమినల్, చెక్బౌన్స్ కేసులను గుర్తించి స్పెషల్డ్రైవ్ చేపట్టి వాటిని లోక్ అదాలత్లో పరిష్కరించాలని సూచించారు. దీనివల్ల కక్షిదారులకు డబ్బు, సమయం ఆదా అవుతుందన్నారు. సమావేశంలో న్యాయసేవా సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎ.కృష్ణప్రసాద్, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన 80 మంది పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
ఇక్కడ చెమటలు!
అక్కడ తనిఖీలు.. ● రాష్ట్రంలోని పలు నగర పాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు ● టెన్షన్లో మున్సిపల్ ఉద్యోగులు సాక్షి, పార్వతీపురం మన్యం: రాష్ట్రవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ ఏకకాలంలో సోదాలు చేపట్టింది. అవినీతికి ఎక్కువ ఆస్కారం ఉన్న టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతో.. జిల్లాలోని మున్సిపల్ కార్యాలయాల్లో ఉద్యోగులు హడలిపోయారు. తమ కార్యాలయంలో ఎక్కడ తనిఖీలు చేస్తారేమోనని భయంతో వణికిపోయారు. కొంతమంది అప్పటికప్పుడు సెలవు పెట్టేయగా.. మరికొందరు కార్యాలయ పనులంటూ బయట గడిపేయడానికే ప్రాధాన్యం ఇచ్చారు. జిల్లాలో పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీలతో పాటు.. పాలకొండ నగర పంచాయతీగా ఉంది. గత జూన్లోనూ పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణల నేపథ్యంలో సాలూరు మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గతంలో రూ.20 వేలు లంచం తీసుకుంటూ పాలకొండ నగర పంచాయతీ కమిషనర్ నడిపేన రామారావు అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. గతంలోనూ పలువురు కమిషనర్లు ఏసీబీ వలలో చిక్కారు. ఆ విభాగమే కీలకం.. మున్సిపల్ కార్యాలయాల్లో టౌన్ ప్లానింగ్ విభాగం కీలకం. భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్ అప్రూవల్స్, ప్లాన్ మార్పులు వంటి విషయాల్లో అధికారులకు ఎక్కువ నిర్ణయాధికారం ఉంటుంది. దీనిని కొందరు వ్యక్తిగత లాభం కోసం ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నిర్మాణ రంగంలో పెద్ద మొత్తంలో డబ్బు, రియల్ ఎస్టేట్, బిల్డింగ్ నిర్మాణాల్లో కోట్ల రూపాయల లావాదేవీలు ఉంటాయి. అనుమతులు త్వరగా రావడానికి లేదా నిబంధనలు సడలించడానికి లంచాలు ఇచ్చే పరిస్థితి ఉంది. పార్వతీపురం, సాలూరు వంటి ప్రాంతాల్లో ప్లాన్ అప్రూవల్ లేని భవనాలు వేల సంఖ్యలో ఉన్నాయి. ఇల్లు కట్టాలన్నా, మాల్ కట్టాలన్నా అధికారులకు, నాయకులకు తాంబూలం చెల్లించాలి. పార్వతీపురం మున్సిపాలిటీలో ప్లాన్ లేకుండానే హోటళ్లు, భవనాలకు అనుమతులిచ్చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. పట్టణంలోని పలు పెద్ద హోటళ్లలో చాలావాటికి అనుమతులు లేనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా నగర పాలక సంస్థల్లో ఏసీబీ దాడులు జరగడంతో ఇక్కడ ఉద్యోగులకు చెమటలు పట్టాయి. చివరికి కార్పొరేషన్లలోనే తనిఖీలు చేస్తున్నారని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
ఉత్తమ పద్ధతుల మ్యాగ్జైన్లో పార్వతీపురానికి చోటు
పార్వతీపురం: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రచురించే ఉత్తమ పద్ధతుల మ్యాగ్జైన్లో పార్వతీపురం మన్యం జిల్లాకు చోటుదక్కింది. జిల్లాలో చేపట్టిన పనులు, వినూత్న ఆవిష్కరణలకు గాను సోమవారం విశాఖపట్నంలో నిర్వహించిన ప్రాంతీయ ఉత్తమ పద్ధతుల సెమినార్లో ఏడీపీ అండ్ ఏబీపీ మిషన్ డైరెక్టర్ రోహిత్కుమార్ ఈ పుస్తకాన్ని అధికారికంగా విడుదల చేశారు. కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డికి జాతీయ స్థాయిలో గౌరవం దక్కింది. కిడ్నీ బాధితులకు సురక్షిత నీరు పాలకొండ రూరల్: ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాలకొండ ఏరియా ఆస్పత్రిలోని డయాలసిస్ యూనిట్ను నెఫ్రోప్లస్ ప్రతినిధి రోహిత్సింగ్ మంగళవారం సందర్శించారు. ఇక్కడ రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. డయాసిస్ యూనిట్కు కేటాయించిన ఆర్వో యూనిట్ నుంచి నిత్యం దాదాపు 10వేల లీటర్ల నీరు శుద్ధి చేయడంతో పాటు కిడ్నీ బాధితులకు రక్షితనీటిని అందిస్తున్నట్టు వెల్లడించారు. ఈ క్రమంలో విడుదలయ్యే వ్యర్థజలాలను భవననిర్మాణ సమయంలో, పంట పొలాలకు వాడుకోవచ్చన్నారు. ఇందులో భాగంగా వ్యర్థజలాలను శ్రీనివాసరావు అనే రైతు పొలానికి మళ్లించారు. సురక్షిత నీటిని వాడడం వల్ల కలిగే ప్రయోజనాలు, కిడ్నీ సమస్యను అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ కడియం చిరంజీవి, సిబ్బంది పాల్గొన్నారు. తోటపల్లి పరిసరాల్లో ఏనుగులు గరుగుబిల్లి: మండలంలోని గిజబ, నందివానివలస తదితర గ్రామాల్లో నాలుగురోజులుగా సంచరిస్తున్న ఏనుగులు సోమవారం తోటపల్లి పరిసరాల్లోకి చేరాయి. ప్రధాన రహదారికి సమీపంలో ఏనుగుల గుంపు సంచరిస్తుండడంతో వాహన చోదకులు, ప్రజలు రాకపోకలకు భయాందోళన చెందుతున్నారు. అరటి, వరి పంటలు నాశనం చేయకముందే ఏనుగుల తరలింపునకు అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి విజయనగరం అర్బన్: విద్యార్థులకు విద్యతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు డీఈఓ యూ.మాణిక్యంనాయుడు సూచించారు. విజయనగరం కస్పా మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ‘స్కూల్ హెల్త్–వెల్నెస్’ కార్యక్రమంపై ఒక రోజు ఓరియెంటేషన్ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. వైద్యశాఖ జిల్లా సమన్వయకర్త డాక్టర్ సుబ్రహ్మణ్యం పాఠశాల విద్యార్థుల్లో సాధారణంగా కనిపించే ఆరోగ్య సమస్యలు, వెల్నెస్ అంశాలపై అవగాహన కల్పించారు. మారు‘మోగిన’ జాతర రాజాం సిటీ: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దేవత, రాజాం–బొబ్బిలి రోడ్డులోని పోలిపల్లిపైడితల్లి మారుజాతర మంగళవారం ఘనంగా నిర్వహించారు. గత నెల 22 నుంచి 24వ తేదీవరకు అమ్మ వారి శతవార్షిక జాతర నిర్వహించిన విషయం విదితమే. ఈ నెల 3న నిర్వహించా ల్సిన మారుజాతర గ్రహణం కారణంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అమ్మవారిని దర్శించుకోలేని భక్తులు మంగళవారం దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. కార్యక్ర మంలో ఆలయ ధర్మకర్త దుర్గాప్రసాద్, ఈఓ బీవీ మాధవరావు, ఆలయ కమిటీ సభ్యులు సలాది తులసీదాస్ పాల్గొన్నారు. -
పురాల్లో ప్రత్యేక పాలన
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలోని పాలకొండ నగర పంచాయతీ, పార్వతీపురం, సాలూరు పురపాలక సంఘాలకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో పాలక వర్గాల పదవీ కాలం ఈ నెల 17వ తేదీతో ముగుస్తుండడంతో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పార్వతీపురం గ్రేడ్–1 మున్సిపాలిటీకి సంయుక్త కలెక్టర్ యశ్వంత్కుమార్రెడ్డి ప్రత్యేకాధికారిగా నియమితులయ్యారు. సాలూరు గ్రేడ్–2 మున్సిపాలిటీకి పార్వతీపురం ఆర్డీవో వైశాలి, పాలకొండ నగర పంచాయతీకి పాలకొండ డివిజన్ ఆర్డీవో పవర్ స్వప్నిల్ జగన్నాథ్ ప్రత్యేకాధికారులుగా వ్యవహరిస్తారు. పాలకొండ ఆర్డీవో ఇప్పటికే సీతంపేట ఐటీడీఏ పీవో ఇన్చార్జిగానూ వ్యవహరిస్తున్నారు. ‘స్థానికం’ ఇప్పట్లో లేనట్లేనా? మున్సిపాలిటీలు, పంచాయతీల్లో ఉన్న ప్రస్తుత పాలకవర్గం త్వరలో ముగియనుంది. స్థానిక ఎన్ని కలకు చంద్రబాబు ప్రభుత్వం వెళ్తుందా, లేదా? అన్న సంశయాలకు తెర పడినట్లే. ఆరు నెలల పాటు ప్రత్యేకాధికారులు కొనసాగుతారని జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. దీన్నిబట్టి మరో ఆరు నెలలైతేనే గానీ.. ఎన్నికల నిర్వహణ, కొత్త పాలకవర్గం కొలువుదీరే అవకాశం లేదని స్పష్టమవుతోంది. వాస్తవానికి పంచాయతీల వారీగా ఓటరు జాబితాను ఈ నెల 9వ తేదీన ప్రకటించాలని ఎన్నికల సంఘం భావించింది. సాంకేతిక సమస్యల కారణంగా పంచాయతీల వారీ జాబితాల రూపొందించడం సాధ్యం కావకపోవడంతో ఈ నెల 18న గడువు ఇచ్చింది. జిల్లా పరిషత్, మండల పరిషత్లకు జూన్ వరకు గడువు ఉంది. ఓటరు జాబితా, రిజర్వేషన్ల కసరత్తు, ఇతర సాంకేతిక అవరోధాలను అధిగమించేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఆగస్టులోనే స్థానిక ఎన్నికలకు వెళ్లవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలకు వెళ్లే సాహసం చేస్తుందా, లేక ప్రత్యేకాధికారులతోనే ఇంకొన్నాళ్లు నెట్టుకొస్తుందా? అన్నది చూడాలి. కొత్త పాలక వర్గం బాధ్యతలు స్వీకరించే వరకూ ప్రత్యేకాధికారుల పాలనే సాగనుంది. పార్వతీపురానికి ప్రత్యేకాధికారిగా జేసీ సాలూరు, పాలకొండలకు ఆర్డీవోల నియామకం ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఈ నెల 17వ తేదీతో ముగియనున్న ప్రస్తుత పాలకవర్గాల పదవీ కాలం ‘స్థానిక’ ఎన్నికలకు ప్రభుత్వం వెనుకడుగు -
పైడితల్లికి పుష్పాలంకరణ
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీపైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మూడులాంతర్ల జంక్షన్ వద్ద ఉన్న చదురుగుడి, రైల్వేస్టేషన్ దగ్గరున్న వనంగుడిలో కొలువైన అమ్మవారికి ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు. సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, ఏడిద రమణ, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్లు శాస్త్రోక్తంగా పూజాధికాలు చేశారు. మహిళా భక్తులంతా అమ్మవారిని దర్శించుకుని పసుపు, కుంకుమలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. -
సవాళ్లను అధిగమించి మున్ముందుకు..
● ఎమ్మెల్సీ విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే కళావతి ● రేపు వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవంపాలకొండ రూరల్: ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో సవాళ్లను అధిగమించి ప్రజా మన్ననలు పొందిందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అన్నారు. పాలవలస స్వగృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పార్టీ ద్వారా తన పాలనలో రాష్ట్ర ప్రజలకు అందించిన సంక్షేమం ఏ ఒక్కరూ మరువలేరని గుర్తు చేశారు. అదే సమయంలో అభివృద్ధిని కూడా పరుగులు పెట్టించారన్నారు. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో పాలన సాగిందని పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భవించి 15 ఏళ్ల ప్రస్తానం పూర్తి చేసుకుని ఈ నెల 12న 16వ వసంతంలోకి అడుగిడుతుందన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కేంద్రం పాలకొండలోని వైఎస్సార్ కూడలి వద్ద గురువారం ఉదయం 10 గంటలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద ఘన నివాళులర్పించనున్నట్టు తెలిపారు. అనంతరం వైఎస్సార్సీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ స్ఫూర్తిని ఘనంగా చాటాలని కోరారు. తద్వారా ఇప్పటి నుంచే క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమం ద్వారా పునరంకితం అవుదామని అన్నారు. తద్వారా రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రజా వ్యతిరేక పాలనను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి ప్రజల మద్దతు కూడగడదామన్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ మన పార్టీయే అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. -
రెవెన్యూ ఉద్యోగుల తీరుపై ఎమ్మెల్సీ మండిపాటు
శృంగవరపుకోట: పీఓటీ అంటే పవర్ చూపించు... ఆక్రమించు.. తొలగించు... అన్న చందంగా రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ రఘురాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో పెదఖండేపల్లి గ్రామానికి చెందిన జిందాల్ భాదిత రైతులు, ఎంపీపీ సోమేశ్వరరావు, సర్పంచ్ యాళ్ల వెంకటరమణ, ఎంపీటీసీ బోదల దేముడు సహ పలువురు రైతులతో కలిసి తహసీల్దార్ శ్రీనివాసరావు కార్యాలయం వద్ద మంగళవారం బైఠాయించారు. పీఓటీ రైతులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వాళ్ల భూములు జిందాల్ ఎలా లాక్కుంటుందని, మీరెలా మద్దతు ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కలెక్టర్కు వాస్తవాలు చెప్పాలని నిలదీశారు. తరువాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిందాల్ యాజమాన్యం, రెవెన్యూ అధికారులు పీఓటీ భూములు 18 మంది రైతులకు చెందిన 74 ఎకరాలను కబ్జా చేశారన్నారు. 18 మంది రైతుల పీఓటీ భూములను జిందాల్కు ఎలా విక్రయించారని, 2002లో జిందాల్కు ఎలా రిజిస్ట్రేషన్ చేశారని ప్రశ్నించారు. నాటి నుంచి నేటి వరకూ రైతుల ఆధీనంలో ఉన్న భూములను లాక్కొని గెంటేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇళ్లు ఉంటూ.. పన్నులు కడుతూ.. విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నా పోలీసులను ఉసిగొల్పి బెదిరించి లాక్కుంటున్నారని ఆరోపించారు. కేసులు పెడితే రూ.2లక్షలు కట్టి బయటకు రావాల్సి ఉంటుందని చెప్పి భయపెడుతున్నారని పేర్కొన్నారు. అసలు ఈ ప్రాంతంలో ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయా.. అధికారులు, ప్రజాప్రతినిదులు కార్పొరేట్ కంపెనీలకు కార్పెట్లు పరచడానికే ఉన్నారంటూ మండిపడ్డారు. వాల్టా చట్టానికి తూట్లు పొడిచి నాలుగు దశాబ్దాలు వయసు గల భారీ చెట్లు, తోటలు ధ్వంసం చేస్తుంటే రెవెన్యూ, పోలీసు శాఖలు కళ్లు మూసుకుంటూ జిందాల్ అక్రమాలకు కాపలా కాస్తున్నారని ఆరోపించారు. కోర్టును ఆశ్రయించిన 33 మంది రైతులను ఆ భూములను తరలించకూడదని ఆదేశిస్తే వారిలో చలుమూరి రామారావు తాలూకా రెండెకరాల భూమిని ఆక్రమించుకున్నారని పేర్కొన్నారు. బీరువాల్లో ముక్కిపోయిన నోటీసులను కలెక్టర్ చూడాలని, 18 మంది రైతుల భూములను దోచేస్తున్న రెవెన్యూ లీలలను డీఆర్ఓ పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా అధికారులు స్పందించకుంటే రైతుల కోసం తానే నిరాహార దీక్షకు కూర్చుంటానని తేల్చి చెప్పారు. -
రెడ్క్రాస్ సూపర్వైజర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
విజయనగరం ఫోర్ట్: ఇండియన్ రెడ్క్రాస్ సోసైటీ బ్లడ్ బ్యాంక్లో టెక్నికల్ సూపర్వైజర్ పోస్టులకు అర్హత, అసక్తి గల అభ్యర్థులు నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు చైర్మన్ ప్రసాదరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ ఎంఎల్టీ, డీఎంఎల్టీ చదువుకొని, రెండేళ్లు పాటు బ్లడ్ బ్యాంక్లో పని చేసిన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. రూ. 20 వేలు నుంచి రూ. 22వేల వరకు జీతం ఉంటుందన్నారు. ఇతర వివరాలకు 9493092700, 7995435952 నంబర్లకు సంప్రదించాలని సూచించారు. పేలుడు పదార్ధాలే లక్ష్యంగా ప్రత్యేక తనిఖీలు : ఎస్పీవిజయనగరం క్రైమ్: పేలుడు పదార్ధాలు లక్ష్యంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని నాటు తుపాకులు, లైసెన్స్ లేకుండా వెపన్స్ కలిగిన వాటి కోసం కార్డన్ సెర్చ్ నిర్వహించాలని ఎస్పీ దామోదర్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. నాటు తుపాకుల ఏరివేత, పేలుడు పదార్ధాలు, గంజాయి, నాటు సారా నియంత్రణే లక్ష్యంగా ముందుగా గుర్తించిన గ్రామాల్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాలని ఆదేశించారు. నాటు తుపాకులు కలిగి ఉండడం, లైసెన్సు లేకుండా తుపాకులు వినియోగించడం చట్టరీత్యా నేరమన్న విషయాన్ని గ్రామస్తులకు అర్ధమయ్యే రీతిలో వివరించి, అవగాహన కల్పించాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో నాటు తుపాకులు వినియోగించే వ్యక్తుల సమాచారాన్ని సేకరించాలని ఆదేశించారు. గ్రామ సందర్శనలు చేసే సమయంలో నాటు తుపాకులు కలిగి ఉండడం ఇండియన్ ఆర్మ్స్ యాక్టు ప్రకారం తీవ్రమైన నేరం పరిగణించడం జరుగుతుందన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలపాలని పేర్కొన్నారు.చిన్నారి హత్య కేసులో నిందితుడికి యావజ్జీవం పార్వతీపురం రూరల్: మూడేళ్ల చిన్నారిని దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడికి విజయనగరం మొదటి అదనపు జిల్లా కోర్టు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించింది. పార్వతీపురం మన్యం జిల్లా ఎల్విన్పేట పోలీస్స్టేషన్ పరిధిలో 2021లో జరిగిన ఈ ఘటనపై మంగళవారం న్యాయమూర్తి ఎం.మీనాదేవి తీర్పు వెలువరించారు. గుమ్మలక్ష్మీపురం మండలం పెంగువ గ్రామానికి చెందిన కిల్లక వినోద్ (20), 2021 జూన్ 11న రాత్రి సమయంలో తన తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారి గొంతు కోసి హత్య చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేశారు. కోర్టులో పకడ్బందీగా సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టడంతో నేరం రుజువైంది. ఈ మేరకు నిందితుడికి యావజ్జీవ శిక్షతో పాటు రూ.11,000 జరిమానా విధిస్తూ న్యాయస్థానం ఆదేశించింది. జరిమానా చెల్లించకుంటే మరో ఏడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు ● ఒకరి పరిస్థితి విషమం కొత్తవలస: మండలంలోని అరకు – విశాఖపట్నం జాతీయ రహదారిలో మంగళపాలెం జంక్షన్ రాజా సినిమా హాల్ వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్లు సోమవారం రాత్రి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎస్.కోటకు చెందిన జి.లీలాహర్షవర్దన్ తన బావమరిది కంచర్ల సాయితో కలిసి విశాఖపట్నం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో రాజా సినిమా హాల్ వద్ద ఎదురుగా వచ్చిన మరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో లీలాహర్షవర్దన్, సాయి తీవ్రంగా గాయపడ్డారు. సాయి తలకు బలమైన గాయం కావడంతో పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ జోగారావు తెలిపారు. గంజాయి నిందితుడి అరెస్టు విజయనగరం క్రైమ్: గంజాయి కేసులో ఒడిశా రాష్ట్రానికి చెందిన దాస్ తాయాసబ్ అనే వ్యక్తిని అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినట్టు రూరల్ సీఐ లక్ష్మణరావు మంగళవారం తెలిపారు. నిందితుడు దాస్ మరొక ఐదుగురితో కలిసి ఒడిశా నుంచి విశాఖపట్నంకు కారులో గంజాయి తరలిస్తూ పోలీసులను చూసి గంజాయితో ఉన్న కారును విడిచిపెట్టి పరారయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసి ఎట్టకేలకు నిందితుడిని అరెస్టు చేశామని సీఐ తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేసి జైలుకు తరలించామని చెప్పారు. గంజాయికి సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమాజంలో ఎక్కడ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. -
ప్రజా సమస్యలపై మండలిలో గళం విప్పిన ‘పెనుమత్స’
● అభినందించిన జిల్లా పౌరవేదికవిజయనగరం గంటస్తంభం: శాసనమండలి సమావేశాల్లో జిల్లాకు సంబంధించిన కీలకమైన ప్రజా సమస్యలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ డా.పెనుమత్స సురేష్బాబు ప్రస్తావించడం శుభసూచికమని, ప్రజా సమస్యలే తన గళంగా వినిపించడం అభినందనీయమని జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు. ఈ మేరకు జిల్లా పరిషత్ అతిథిగృహంలో పౌర వేదిక ప్రతినిధులు ఎమ్మెల్సీ సురేష్బాబును మంగళవారం సత్కరించారు. ఈ సందర్భంగా బాబ్జి మాట్లాడుతూ శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం జిల్లాల్లో కేన్సర్ బాధితుల సంఖ్య అధికంగా ఉండడంతో విజయనగరంలో ప్రభుత్వ కేన్సర్ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని సురేష్బాబు మండలిలో ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారని గుర్తు చేశారు. జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి మెడికల్ కళాశాలకు తరలించాలని కోరడం సముచితమని పేర్కొన్నారు. జిల్లాలో తాగునీరు, సాగునీరు సమస్యలు, మూతపడిన భీమసింగి సుగర్స్ పునరుద్ధరణ, యువత ఉపాధి, రైతు సమస్యలపై అధికార పార్టీ నేతలు శాసనసభలో స్పందించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పౌర వేదిక నేతలు జలంత్రి రామచంద్రరాజు, దవడ కొండబాబు, పట్నాల శ్రీనివాస్, అల్లంశెట్టి నాగభూషణం, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఈ–క్రాప్ నమోదు తప్పనిసరి
పూసపాటిరేగ: రైతులంతా తాము పండించే పంటలకు సంబంధించి, ఈ–క్రాప్ నమోదు తప్పనిసరిగా చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ జేడీ వీటీ రామారావు అన్నారు. మండలంలోని కుమిలి గ్రామంలో మంగళవారం పర్యటించిన ఆయన..అక్కడి రైతులతో సమావేశమై పలు సూచనలు చేశారు. మార్చి 15వ తేదీలోగా ఈ–క్రాప్ నమోదు చేసుకుని, ఆ తర్వాత ఈ–క్రాప్ నమోదు చేసుకున్న వారి జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేవో రైతులు చూసుకోవాలన్నారు. పంట నమోదు చేసుకున్న వారు ఏదైనా ప్రకృతి విపత్తు వల్ల పంట నష్టపోతే వారికి పంట నష్టపరిహారం వస్తుందన్నారు. రైతులంతా నవధాన్యాల సాగు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ నాగభూషణరావు, మండల వ్యవసాయాధికారి కె.నీలిమ తదితరులు పాల్గొన్నారు. -
బూత్ ఏజెంట్ వివరాలు ఇవ్వాలి : ఆర్డీఓ
బొబ్బిలి: ప్రతీ పోలింగ్ బూత్కు ఒక ఏజెంటు నియమించి వారి వివరాలను ఇవ్వాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను ఆర్డీఓ జేవీవీఎస్ రామమోహనరావు కోరారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 264 పోలింగ్ బూత్లలో ఆయా వివరాలను రెండు రోజుల్లో ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం ఉన్న పోలింగ్ కేంద్రాల భవనాలు, పరిసరాలపై ఎవరికై నా అభ్యంతరాలుంటే స్థానిక తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలకు తెలియపర్చాలని సూచించారు. సమావేశంలో ఎన్నికల ఉప తహసీల్దార్ బలివాడ గౌరీశంకర్, వైఎస్సార్సీపీ మండల పార్టీ అధ్యక్షుడు తమ్మిరెడ్డి దామోదరరావు, టీడీపీ మండల అధ్యక్షుడు వాసిరెడ్డి సత్యనారాయణ, బీజేపీ అధ్యక్షుడు తాడ్డి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ప్రత్యేకాధికారిగా రామమోహనరావు బొబ్బిలి పురపాలక సంఘ పాలక వర్గం పదవీ కాలం గడువు తీరిపోవడంతో కొత్తగా ప్రత్యేకాధికారుల పాలనకు కూటమి ప్రభుత్వం తెరలేపింది. దీంతో మంగళవారం దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. బొబ్బిలి మున్సిపల్ ప్రత్యేకాధికారిగా బొబ్బిలి ఆర్డీఓ జేవీఎస్ఎస్ రామోహనరావును నియమిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. -
నిర్దేశిత లక్ష్యాలు చేరుకోవాలి
గజపతినగరం: పోస్టల్ సిబ్బందికి నిర్దేశించిన లక్ష్యాలను త్వరితగతిన సాధించాలని విజయనగరం డివిజనల్ పోస్టల్ సూపరింటెండెంట్ కె.శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని సబ్పోస్టాఫీస్ కార్యాలయంలో సిబ్బందితో మంగళవారం సమావేశమైన ఆయన..మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున మన ముందున్న లక్ష్యాలను చేరుకోవాలని, అలాగే పోస్టాఫీస్లో అందించే ఆధార్ సేవలను ప్రజలు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం పోస్టాఫీస్ ప్రగతి నివేదికను వివరించారు. కార్యక్రమంలో సబ్డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ ఉపేంద్ర, సబ్ పోస్ట్మాస్టర్ అప్పలకృష్ణ పాల్గొన్నారు. -
పారా బ్యాడ్మింటన్ పోటీల్లో సత్తిబాబు సత్తా
విజయనగరం: తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలోని గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ వేదికగా మార్చి 6 నుంచి జరుగుతున్న 7వ పారా బ్యాడ్మింటన్ జాతీయ స్థాయి పోటీల్లో జిల్లాకు చెందిన పారా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు యాళ్ల సత్తిబాబు బ్రాంజ్ మెడల్ సాధించి సత్తా చాటాడని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ మంగళవారం తెలిపారు. ఎస్.యూ. 5 కేటగిరి మెన్స్ డబుల్స్లో కర్ణాటకకు చెందిన జంషద్తో కలిసి ఆడిన సత్తిబాబు అత్యుత్తమ ప్రతిభ కనబరచి బ్రాంజ్ మెడల్ సాధించడం అభినందనీయమన్నారు. ఈ విజయం వెనుక సత్తిబాబు కృషి, పట్టుదల, ధృడ సంకల్పం, నిరంతర సాధన ఉన్నాయని, భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని అకాంక్షించారు. జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పేరు మారుమోగించిన సత్తిబాబును పారా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు, కార్యదర్శి వి.రామస్వామి తదితరులు అభినందించారు. -
‘గ్లకోమా..’ అప్రమత్తతే అసలైన రక్షణ
● జిల్లాలో గ్లకోమా వారోత్సవాలుపార్వతీపురం రూరల్: చాపకింద నీరులా విస్తరించి, కంటి చూపును కబళించే గ్లకోమా (నీటి కాసుల వ్యాధి) పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ డా. భాస్కరరావు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ గ్లకోమా వారోత్సవాల (మార్చి 8 నుంచి 14 వరకు) నేపథ్యంలో, మన్యం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి నేత్ర వైద్య విభాగం, జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వ్యాధి నిర్ధారణ శిబిరం నిర్వహించారు. శిబిరంలో రోగులకు ఉచితంగా దృష్టి దోష పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ, గ్లకోమా లక్షణాలను తొలి దశలోనే గుర్తిస్తే అంధత్వ నివారణ సాధ్యమని స్పష్టం చేశారు. నేత్ర వైద్య నిపుణులు డా. వెంకటేష్, అధికారులు శ్రీనివాసరావు, కృష్ణారావు రోగులకు పరీక్షలు నిర్వహించి తగిన సలహాలు అందించారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారి నగేష్రెడ్డి పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ప్రత్యేక శిబిరాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలకు మెరుగైన నేత్ర వైద్య సేవలు అందించి, చూపు కోల్పోకుండా తగిన జాగ్రత్తలు చేపడుతున్నామని జిల్లా అంధత్వ నివారణ అధికారి డా. సూర్యకౌశిక్ తెలిపారు. -
గ్రంథాలయాలు, పార్కులే చదువు కేంద్రాలు
ఉద్యోగ సాధనే ప్రధానం గ్రామం నుంచి నగరానికి వచ్చి చిన్న గదిలో ఉంటూ చదువుకుంటున్నాం. అద్దె, పుస్తకాలు, అప్లికేషన్ ఫీజులన్నీ భారంగా ఉన్నా ఉద్యోగం సాధించాలనే ఆశతో కష్టపడుతున్నాం. మా కష్టం ఫలిస్తుందనే నమ్మకం ఉంది. – కె.గంగయ్య, నిరుద్యోగి, కోటబొమ్మాళి గ్రామం లక్ష్యంతో చదువుతున్నా.. కొన్నాళ్లుగా విజయనగరం జిల్లా కేంద్రంలోనే ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాను. ప్రతిరోజు గ్రంథాలయంలో ఎక్కు వ సమయం చదువుకుంటున్నాను. ఆర్ఆర్బీ పరీక్షకు సిద్ధమవుతున్నాను. పోటీ ఎక్కువగా ఉన్నా పట్టుదలతో ముందుకు సాగుతున్నాను. – భవానీశంకర్, నిరుద్యోగి, విజయనగరం కంటోన్మెంట్ గురజాడ గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత విజయనగరం గంటస్తంభం: విద్యకు నిలయంగా పేరొందిన విజయనగరం నిరుద్యోగ యువత కొలువుల సాధనకు ఆశల కేంద్రంగా మారింది. కొలువుల సాధనే లక్ష్యంగా పల్లెల నుంచి నిరుద్యోగ యువత నగరబాట పడుతున్నారు. చిన్నచిన్న అద్దెగదుల్లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. కొలువుల సాధన కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే అయినా.. మంచి ఉద్యోగం సాధించి తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టాలనే పట్టుదలతో రోజంతా పుస్తకాలతో కుస్తీపడుతున్నారు. పార్కులు, చెట్ల కింద, మైదానాలు, గ్రంథాలయాలను చదువు వేదికలుగా మలచుకుంటూ... కలిసికట్టుగా కొలువుల సాధనకు కష్టపడుతున్నారు. విజయనగరం పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యార్థులు చిన్నచిన్న గదులను అద్దెకు తీసుకుంటున్నారు. కొన్నిచోట్ల ఇద్దరు, మరికొన్ని చోట్ల ముగ్గురు లేదా నలుగురు కలిసి ఒకే గదిలో ఉంటూ చదువుకుంటున్నారు. చదవడానికి సరైన వాతావరణం లేకపోయినా ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. చిన్నగదుల్లోనే పెద్ద లక్ష్యాలతో చదువుతున్న యువత కష్టాలు.. వారి జీవిత పోరాటాన్ని ప్రతిబింబిస్తున్నాయి. నగరానికి వచ్చే యువతలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే. తల్లిదండ్రులు వ్యవసాయం, కూలిపనులు చేస్తూ కష్టపడి సంపాదించిన డబ్బులో కొంత భాగం పిల్లలకు పంపిస్తున్నారు. నగరంలో జీవనం సులభం కాదు. అద్దె గదులు, పుస్తకాలు, అప్లికేషన్ ఫీజులు, కోచింగ్ ఖర్చులు.. ఇవన్నీ కలిపి వారికి పెద్ద భారంగా మారుతున్నాయి. ఒక పరీక్షకు అప్లై చేయాలంటే రూ.200 నుంచి రూ.500 వరకు ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. ఉద్యోగ సాధన కోసం ఆర్థిక కష్టా లు భరిస్తూనే పుస్తకాలతో నేస్తం చేస్తున్నారు. పలు శిక్షణ సంస్థల్లో శిక్షణ పొందుతున్నారు. ఎన్నికల సమయంలో ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేవరకు నిరుద్యోగ భృతికింద ప్రతినెలా రూ.3వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. కనీసం ఆ డబ్బులు ఇచ్చినా ఉద్యోగ సాధన శిక్షణకు ఉపయోగపడేవని, పరీక్ష ఫీజులు చెల్లించేందుకు ఆర్థిక ఇబ్బందులు ఉండేవికాదని కొందరు యువకులు అభిప్రాయపడుతున్నారు. నిరుద్యోగులను మోసం చేయడం చంద్రబాబుకు తగదని చెబుతున్నారు. రోజంతా గదుల్లో చదవడం కష్టంగా ఉండడంతో చాలా మంది విద్యార్థులు గ్రంథాలయాలను ఆశ్రయిస్తున్నారు. విజయనగరం పట్టణంలోని గురజాడ గ్రంథాలయం యువతకు ప్రధాన చదువు కేంద్రంగా మారింది. ఇంకొందరు ప్రశాంత వాతావరణం కోసం పెద్దచెరువు, మయూరి పార్క్ వంటి ప్రదేశాలకు వెళ్లి చెట్లనీడలో కూర్చుని చదువుతున్నారు. గ్రూప్ డిస్కషన్స్తో ముందుకు సాగుతున్నారు. గ్రూప్స్, రైల్వే, బ్యాంక్, ఎస్ఎస్సీ వంటి ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారు. గ్రామాల నుంచి నగరానికి వస్తున్న యువత ఉద్యోగ సాధనకు అహర్నిశలు శ్రమిస్తున్న నిరుద్యోగులు పార్కులు, గ్రంథాలయాలే చదువుల వేదికలు ఇరుకు గదుల్లో పుస్తకాలతో కుస్తీ వివిధ సంస్థల్లో శిక్షణ -
17న ‘ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర’
పార్వతీపురం రూరల్: ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిలరెడ్డి ఈ నెల 17న పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించనున్నారు. ‘ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర’లో భాగంగా కురుపాం నియోజకవర్గం డంగభద్రలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బత్తిన మోహన్ తెలిపారు. యాత్రను జయప్రదం చేయాలని కోరుతూ చొక్కాపువానివలస, లక్ష్మీ నారాయణ పురం, కొత్తపట్నం గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో తీసుకొచ్చి న కొత్త చట్టంలోని లోపాలను, వేతనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పార్టీ అధ్యక్షు రాలి దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు తీళ్ల గౌరీ శంక రరావు, నాయకులు మర్రాపు తిరుపతిరావు, మామిడి చంద్రకాంత్, బాలు, పట్ల సింగ్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. 14న జాతీయ లోక్అదాలత్ విజయనగరం: జాతీయ లోక్అదాలత్ను ఈ నెల 14న విజయనగరం హనుమాన్ నగర్లోని ఎంఆర్ పీజీ కళాశాల హాస్టల్ ప్రాంగణంలో నిర్వహిస్తామని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. లోక్అదాలత్లో వాహన ప్రమాదాలు, బ్యాంకులకు సంబంధించిన కేసులు, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, ఎన్ఐ యాక్టు, ఎకై ్సజ్ కేసులు, కుటుంబ తగదాలు, కార్మిక సంబంధిత కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభయ్యే లోక్అదాలత్ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విజయనగరం క్రైమ్: ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన గజపతినగరం కానిస్టేబుల్ టి.తిరుపతిరావు కుటుంబానికి పోలీస్ సిబ్బంది అండగా నిలిచారు. ‘చేయూత’ కింద సేకరించిన రూ.1,47,800లను చెక్కురూపంలో కానిస్టేబుల్ భార్య దమయంతికి అదనపు ఎస్పీ సౌమ్యలత తన కార్యాలయంలో సోమవారం అందజేశారు. కార్యక్రమంలో ఏఓ పి.శ్రీనివాసరావు, ఆఫీస్ సూపరింటెండెంట్ వి.లలిత, అడహాక్ కమిటీ అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు. నెల్లిమర్ల: జిల్లాలోని విద్యుత్స్టోర్స్లో పనిచేస్తున్న హమాలీల సమస్యలను పరిష్కరించాలని ఏపీ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిక్ట్ స్టోర్స్ హమాలీస్ యూనియన్ (సీఐటీయూ) సభ్యులు ఏపీ ఈపీడీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఇ.పృద్విరాజ్కు విన్నవించారు. యూనియన్ నాయకులు కెల్ల గోవిందరావు, ఎ.భాష తదితరులు విశాఖపట్నంలో సోమవారం ఎం.డిని కలిశారు. ఏపీ ఈపీడీసీఎల్ కంపెనీ పరిధిలోని ఐదు జిల్లాల జట్టు కార్మికుల లోడింగ్, అన్లోడింగ్ బిల్లులను త్వరితగతిన చెల్లించాలని, సోర్స్ సిబ్బందికి ఉద్యోగభద్రత కల్పించాలని, నెలవారీ వేతనాలు చెల్లించాలని కోరారు. ఎస్ఎస్ఆర్ రేట్లు 50 శాతం పెంచి, లోడింగ్, ఆన్ లోడింగ్ బిల్లులు త్వరితగతిన చెల్లించాలన్నారు. విజయనగరం ఫోర్ట్: వీబీ–జీ రామ్జీ కింద పనులు కల్పించి గ్రామీణ ప్రాంతాల్లో వలసలను అరికట్టడమే లక్ష్యమని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో వీబీ–జీరామ్జీ చట్టంపై రూపొందించిన అవగాహన వాల్ పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. ఏటా ప్రతి కుటుంబానికి 125 రోజుల ఉపాధిహామీ కల్పిస్తామన్నారు. పనిచేసిన 15 రోజుల్లోగా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో వేతనం జమచేయాలని, పనికోరిన 15 రోజు ల్లో పని కల్పించని పక్షంలో నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చెప్పారు. కృత్రిమ మేధ(ఏఐ) యాప్లతో పనుల పర్యవేక్షణ చేస్తామన్నారు. -
పోలీసుల అదుపులో బంగారం దొంగ
చికెన్విజయనగరం క్రైమ్: నిద్రిస్తున్న వదిన మెడలో బంగారాన్ని దొంగిలించిన మరిదిని విజయనగరం టూటౌన్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి టుటౌన్ సీఐ శ్రీనివాస్ తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. రాయఘడకు చెందిన బుడుపూరు మణికంఠ సుబుద్ది ఈ ఏడాది జనవరి 10న విజయనగరంలోని తన అన్న బుడుమూరు రామారావు ఇంటికి వచ్చాడు. కొద్ది రోజులు మంచిగానే ఉన్న మణికంఠ అదే నెల 25న నిద్రిస్తున్న వదిన మెడలోనుంచి పుస్తెలతాడు, నల్లపూసలను దొంగిలించి పరారయ్యాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అప్పటి నుంచి నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులకు విజయనగరం రైల్వేస్టేషన్ వద్ద సోమవారం పట్టుబడ్డాడు. సుమారు 3 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు రికవరీ చేశారు. గంజాయి నిందితుడు.. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన గంజాయి నిందితుడిని విజయనగరం రూరల్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. 2020లో దాదాపు 30 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డాడు. అప్పటి నుంచి రూరల్ సీఐ లక్ష్మణరావు, క్రైమ్ పార్టీ సిబ్బంది వెతుకుతుండగా.. ఎట్టకేలకు పట్టుకున్నారు. -
పార్వతీపురంలో వరుస చోరీలు
● రెండిళ్లల్లో బంగారం, వెండి ఆభరణాల అపహరణపార్వతీపురం రూరల్: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో దొంగలు పంజా విసిరారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రెండు వేర్వేరు చోట్ల భారీ చోరీలకు పాల్పడ్డారు. పార్వతీపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైకేఎం కాలనీలో మత్స తవిటమ్మ అనే మహిళ ఇంట్లో ఆదివారం రాత్రి దొంగతనం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు గేట్ తాళాలు పగులగొట్టి ఇంటి లోపలికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న తులం బంగారం, 20 తులాల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై ఎం. రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలాగే పట్టణంలోని చర్చి వీధిలో గల దేశెట్టి రామారావు ఇంట్లో సుమారు 4 తులాల బంగారం చోరీకి గురైంది. ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఈ చోరీకి పాల్పడినట్లు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. వీరు పశ్చిమ బెంగాల్కు చెందిన ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. పట్టణ సీఐ బి. వెంకటరావు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. -
అర్జీల పరిష్కారానికి సత్వర చర్యలు
● ఎస్పీ మాధవ్రెడ్డిపార్వతీపురం రూరల్: అర్జీదారులు తెలియజేసిన సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఎస్వీ మాధవ్రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, భూ వివాదాలు, ఆన్లైన్ వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులను ఆయన పరిశీలించారు. అనంతరం సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ.. ఫిర్యాదులపై చట్టపరిధిలో విచారణ జరిపి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ ఆదాం, ఎస్సై రమేష్నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారమే లక్ష్యం
● కలెక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డిపార్వతీపురం: పీజీఆర్ఎస్లో ప్రజలు తెలియజేసిన సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో జేసీ సి. యశ్వంత్కుమార్ రెడ్డి , డీఆర్ఓ కె. హేమలత, ఎస్డీసీ దిలీప్ చక్రవర్తితో కలిసి అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ అర్జీని వ్యక్తిగత బాధ్యతగా తీసుకుని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమయపాలన, ప్రజాస్పందన, పారదర్శకత మీదే పరిపాలన ఆదారపడి ఉంటుందన్నారు. ఫిర్యాదులకు తక్షణం పరిష్కారం చూపితే అర్జీదారుల్లో విశ్వాసం పెరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. వచ్చిన వినతుల్లో కొన్ని.. ● గుమ్మలక్ష్మీపురం మండలం మంత్రజోల గ్రామానికి ప్రభుత్వం మంజూరు చేసిన బీటీ రహదారి నిర్మాణ పనులు పూర్తిగా చేపట్టాలని గ్రామస్తులు సురేష్ కుమార్, తదితరులు వినతిపత్రం అందించారు. ● మక్కువ మండలం బురదగెడ్డ గ్రామంలోని ఐటీడీఏ ట్రైబుల్ వెల్ఫేర్ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, కార్యాలయ సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని గ్రామానికి చెందిన డి. లక్ష్మి కోరుతూ అర్జీ అందజేశారు. ● పార్వతీపురం పట్టణంలోని మజ్జిగౌరీ కాలనీలో ఉన్న అపార్ట్మెంట్ ట్రాన్స్ఫార్మర్ రహదారి మధ్యలో ఉండడంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. వెంటనే ట్రాన్స్ఫార్మర్ను మార్చాలని పట్టణానికి చెందిన కేబీకే ప్రసాద్ అర్జీ సమర్పించారు. ● పదో తగరతి మార్కుల లిస్ట్లో ఇంటిపేరు తప్పుగా పడిందని..రైతుభరోసా డబ్బులు జమకాలేదని.. పాస్పుస్తకాల్లో మార్పులకోసం..భూ ఆక్రమణలను అరికట్టాలని పలువురు అర్జీలు అందజేశారు. -
ఎస్ఐ అక్రమాలపై ఆరా!
చీపురుపల్లి: చీపురుపల్లి ఎస్ఐ అవినీతి వ్యవహారం రాష్ట్ర స్థాయిలో సంచలనంగా మారింది. సాక్షాత్తూ పోలీస్శాఖ అత్యున్నత కార్యాలయమైన డీజీ కార్యాలయం నుంచి అంతర్గత విచారణ జరుగుతోంది. మరోవైపు సబ్ డివిజిన్ స్థాయిలోనూ దర్యాప్తు ప్రారంభమైంది. రోడ్డుపై తోపుడుబళ్లు నిర్వహించుకునేవారు, చిరువ్యాపారులు, వివిధ కేసులపై స్టేషన్కు వచ్చే పేదలు, రాజకీయనాయకుల నుంచి, అమ్మవారి జాతర్లో పట్టాట, గుండాటను ప్రోత్సహిస్తూ రూ.లక్షల్లో వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అక్రమాలకు కేరాఫ్గా మారాన్న అపవాదు ఉంది. ఇదే విషయంపై ‘పోలీస్ దందా’ ‘శీర్షిక’న ఈ నెల 2న ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. ఎస్ఐ తీరుపై ప్రత్యేక నిఘా పెట్టారు. దీంతో ఎస్ఐ గ్యాంగ్లో బీపీ పెరిగింది. ఎప్పుడు ఏమవుతుందోనన్న ఆందోళన నెలకొంది. మరోవైపు ఎస్ఐపై విచారణ జరుగుతుండడంతో ఆయన బాధిత వర్గం సంతోషపడుతున్నట్టు సమాచారం. ప్రజల సంగతి పక్కన పెడితే పోలీస్ స్టేషన్లో కొందరు సిబ్బంది కూడా ఆయన వేధింపులు తట్టుకోలేక, ఉన్నతాధికారులకు చెప్పుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్టు తెలిసింది. ఎస్ఐ తీరుపై పోలీస్ ఉన్నతాధికారుల దర్యాప్తు ను స్వాగతిస్తూ, అరాచకాలు, అక్రమాలపై తమ కు తెలిసిన సమాచారం ఇస్తున్నట్టు తెలిసింది. రాష్ట్ర స్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు స్పెషల్ బ్రాంచి, ఇంటలిజెన్స్ వర్గాలు క్షేత్ర స్థాయిలో దర్యాప్తు నిర్వహించి నివేదిక సిద్ధం చేసినట్టు సమాచారం. జాతరలో జూదంను ప్రోత్సహించడమే కాకుండా గతంలో జరిగిన అవినీతి ఉదంతాలు కూడా ఆ నివేదికలో పొందుపరిచినట్లు పోలీసుశాఖలో చర్చ జరుగుతోంది. తోపుడుబళ్లు, చిరువ్యాపారులు, పలువురు రాజకీయనాయకుల నుంచి ఎస్ఐ వసూళ్ల వివరాల సమాచా రం సేకరించినట్టు బోగట్టా. నకిలీ ఉద్యోగ ప్రకటనలు నమ్మవద్దు విజయనగరం ఫోర్ట్: వైద్యారోగ్యశాఖలో నోటిఫికేషన్ లేకుండా స్టాఫ్నర్స్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ వందల మందికి ఎన్హెచ్ఎం ఉద్యోగినంటూ కిరణ్ అనే వ్యక్తి ఫోన్చేసి మోసంచేస్తున్న యత్నంపై డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి స్పందించారు. ‘దగా చేసే యత్నం..!’ శీర్షికన ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనంపై స్పందిస్తూ వైద్యారోగ్యశాఖలో ఎలాంటి ఉద్యోగాల భర్తీ జరగడంలేదన్నారు. ఎటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కాలేదన్నారు. సోషల్ మీడియా, ఇతర మార్గాల ద్వారా వస్తున్న నకిలీ కాల్స్, మెసేజ్లు నమ్మి ఎవరూ మోసపోవద్దన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు అడిగితే అస్సలు నమ్మవద్దన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన అధికారక సమాచారం ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికార వెబ్సైట్లలో ప్రకటిస్తామని తెలిపారు. చీపురుపల్లి ఎస్ఐ తీరుపై డీజీ ఆఫీస్ నుంచి విచారణ ఎస్బీ, ఇంటలిజెన్స్ వర్గాల నుంచి సమాచార సేకరణ చిరువ్యాపారులు, తోపుడుబళ్ల నిర్వాహకుల నుంచి వసూళ్ల వివరాలు సేకరణ -
మహమ్మారిపై టీకాస్త్రం
మంగళవారం శ్రీ 10 శ్రీ మార్చి శ్రీ 2026అర్హులైన బాలికలందరూ తల్లిదండ్రులను వెంటబెట్టుకుని వచ్చి, వారి అంగీకారంతో టీకా వేయించుకోవాలి. ఈ అవకాశాన్ని ప్రతిఒక్క రూ సద్వినియోగం చేసుకోవాలి. దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలువుతున్న ఈ కార్యక్ర మాన్ని జిల్లాలో కూడా అధికారులు పకడ్బందీ గా నిర్వహించాలి. రాబోయే మూడు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. – డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి, కలెక్టర్ సాక్షి, పార్వతీపురం మన్యం: కేన్సర్.. ప్రాణాంతకమైన రోగం. మన జీవన శైలి, మారుతున్న ఆహారపు అలవాట్లు కారణంగా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ముందుగా గుర్తించి చికిత్స అందిస్తే.. నివారణ సులువే! ఆలస్యమైతే ప్రాణాలనే తినేస్తుంది. పురుషుల కంటే.. మహిళలే ఎక్కువగా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ముందే మందేసేద్దాం.. మహిళల్లో వచ్చే భయంకరమైన గర్భాశయ కేన్సర్ను నివారించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హెచ్పీవీ టీకా పంపిణీ కార్యక్రమం పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రారంభమైంది. జిల్లా ఆస్పత్రిలో అధికారికంగా ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి సోమవారం ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 15 మండలాల పరిధిలో 14 ఏళ్లు నిండిన సుమారు 10 వేల మంది బాలికలు/యువతులను ఈ టీకా కోసం గుర్తించారు. బహిరంగ మార్కెట్లో ఒక్కో డోస్ ధర రూ.4 వేలు పైనే. కేంద్ర ప్రభుత్వం ఈ టీకాలను పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. గర్భాశయ కేన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యల నుంచి మహిళలకు దీర్ఘకాలిక రక్షణ కల్పించేందుకు ఈ టీకా ఎంతో దోహదపడుతుందని వైద్యులు అంటున్నారు. -
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
● జేసీ యశ్వంత్కుమార్ రెడ్డి పార్వతీపురం: రెవెన్యూ క్లినిక్లో తెలియజేసిన సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్ రెడ్డి ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కలెక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పారు. పెండింగ్లో ఉన్న రెవెన్యూ ఫైళ్లను సకాలంలో పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో ఎస్డీసీ ఎస్. దిలీప్చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు. ముగిసిన ‘ఎజెంటిక్ ఏఐ’ వర్క్షాప్ విజయనగరం అర్బన్: పట్టణంలోని గాజులరేగ పరిధిలో గల సీతం ఇంజినీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఏపీఎంఎస్ఎంఈ, జేఎన్టీయూ జీవీ సంయుక్తంగా గత నెల 13వ తేదీ నుంచి నిర్వహిస్తున్న ‘ఏజెంటిక్ ఏఐ’ వర్క్షాపు సోమవారంతో ముగిసింది. ప్రపంచ బ్యాంక్ సహకారంతో అమలు చేస్తున్న ర్యాంప్ పథకం కింద ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆధునిక కృత్రిమ మేధస్సు నైపుణ్యాలపై అవగాహన కల్పించారు. 20 రోజుల పాటు జరిగిన ఈ శిక్షణలో కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ విభాగానికి చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథులను నిర్వాహకులు సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీ రామ్మూర్తి, వివిధ శాఖల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. గిరిజాప్రసన్నకు ఉత్తమ మహిళా పురస్కారం విజయనగరం: జిల్లా కేంద్రంలోని ది వైజాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇంగ్లిష్ టీచర్ సముద్రాల గిరిజాప్రసన్నను ఉత్తమ మహిళా పురస్కారం వరించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని, హైదరాబాద్లోని బిర్లా సైన్స్ సెంటర్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతులమీదుగా ఆమెకు పురస్కారం ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని మొత్తం 20 మంది మహిళలకు ఈ అరుదైన గౌరవం దక్కగా గడిచిన 23 ఏళ్లుగా ఉపాధ్యాయ రంగంలో అందిస్తున్న విశేష సేవలకు గాను తనకు ఈ గుర్తింపు లభించినట్లు గిరిజాప్రసన్న తెలిపారు. -
పొట్టిశ్రీరాముల త్యాగం మరువలేనిది
విజయనగరం టౌన్: ప్రత్యేక రాష్ట్ర సాధనకు అమరజీవి పొట్టిశ్రీరాములు చేసిన ప్రాణత్యాగం మరువలేనిదని నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి కొనియాడారు. మండల పరిధిలోని జొన్నగుడ్డి నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన పొట్టిశ్రీరాములు విగ్రహాన్ని ఆమె సోమవారం ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగు మాట్లాడే వారందరికీ ప్రత్యేక రాష్ట్రం కేటాయించి, ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణాలు విడిచిన గొప్ప పోరాటయోధుడు పొట్టిశ్రీరాములు అని, ఆయన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీక అయిన అమరజీవిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సేవా సమితి ప్రొగ్రాం చైర్మన్ బండారు చంద్రశేఖర్ పాల్గొని, మాట్లాడుతూ జిల్లాలో పొట్టి శ్రీరాముల విగ్రహాలు 58 ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు చెరుకూరి నాగరాజు, ప్రధాన కార్యదర్శి బత్తుల కామేష్, విగ్రహ దాత గూడూరు నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.


