Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Zoho Layoffs Spark Outrage 300 Trainees Axed Without Notice1
నోటీసు లేకుండానే 300 మంది తొలగింపు!

ఐటీ రంగంలో మానవీయ విలువలకు, గ్రామీణ ప్రతిభకు పెద్దపీట వేస్తుందని పేరున్న ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ‘జోహో’లోనూ లేఆఫ్స్‌ కలకలం రేపుతున్నాయి. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే దాదాపు 300 మంది ట్రైనీలను కంపెనీ ఒక్కసారిగా విధుల్లోంచి తొలగించినట్లు తెలుస్తోంది. టెక్ నిపుణుల వేదిక ‘బ్లైండ్’లో బాధిత ఉద్యోగి ఒకరు చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఏం జరిగింది? ఈ నిర్ణయానికి కారణమేంటి?బాధితుడి కథనం ప్రకారం.. కంపెనీలో అంతర్గతంగా జరిగిన కొన్ని పరిణామాలే ఈ తొలగింపులకు కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఒక సీనియర్ ఉద్యోగి, ‘మీరు మమ్మల్ని (అనుభవజ్ఞులను) తీసేసి తక్కువ జీతానికే వచ్చే ట్రైనీలతో ఖాళీలు భర్తీ చేయాలని చూస్తున్నారా?’ అని యాజమాన్యాన్ని ప్రశ్నించినట్లు సమాచారం. ఈ చర్చ జరిగిన కొద్ది రోజుల్లోనే ఫ్రెషర్లను భర్తీ చేస్తున్నారనే అపవాదు పోగొట్టుకోవడానికి కంపెనీ ఏకంగా 300 మంది ట్రైనీలను తొలగించిందని సదరు యూజర్ ఆవేదన వ్యక్తం చేశారు.ఫ్రెషర్ల ఆవేదన‘నేను ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం నుంచి వచ్చాను. ఈ ఉద్యోగం నాకు కెరీర్‌తోపాటు నా కుటుంబానికి జీవనాధారం. టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలను వదులుకుని జోహోలో చేరాను. అక్కడైతే కనీసం బెంచ్ మీద ఉన్నా భద్రత ఉండేది. ఇక్కడ కనీసం నోటీసు పీరియడ్ కూడా ఇవ్వకుండా రోడ్డున పడేశారు’ అని ఒక బాధిత యువకుడు ‘బ్లైండ్’లో వాపోయాడు.వెంబు మాటలకు, చేతలకు పొంతన లేదు!జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు తరచుగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, చిన్న పట్టణాల నుంచి ప్రతిభను వెలికితీయడం గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని బాధితులు విమర్శిస్తున్నారు. ‘చిన్న పట్టణాల నుంచి నియామకాలు చేపడుతున్నామని గొప్పగా చెప్పుకోవడం కాదు, వివరణ లేకుండా వందలాది మంది యువత భవిష్యత్తును దెబ్బతీయడం ఏ రకమైన సంస్కృతి?’ అని బాధితులు ప్రశ్నిస్తున్నారు.టెక్ వర్గాల్లో తీవ్ర నిరసనఈ వ్యవహారంపై గూగుల్, గోల్డ్‌మన్ సాక్స్, హెచ్‌పీ వంటి దిగ్గజ సంస్థల ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘300 మంది కెరీర్లతో ఆటలాడటం దారుణం. ఫ్రెషర్లను పావులుగా వాడుకుంటున్నారు’ అని గోల్డ్‌మన్ సాక్స్‌లో పనిచేసే ఒక ఉద్యోగి వ్యాఖ్యానించారు. ‘అంతర్గత రాజకీయాల క్రాస్‌ఫైర్‌లో ఎప్పుడూ అమాయక ఫ్రెషర్లే బలిపశువులవుతున్నారు’ అని మరొకరు పేర్కొన్నారు.కంపెనీ స్పందన కోసం నిరీక్షణఈ ఆరోపణలపై వివరణ కోరుతూ జోహో సంస్థకు కొన్ని మీడియా సంస్థలు ఈమెయిల్ పంపాయని తెలుస్తుంది. అయితే దీనిపై కంపెనీ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ అంశాలను కంపెనీ అధికారికంగా ధృవీకరించలేకపోయినా, సోషల్ మీడియాలో వస్తున్న వరుస పోస్టులు మాత్రం ఐటీ నిపుణుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.ఇదీ చదవండి: ‘మధ్య తరగతి’ బండి సాగేదెలా?

Buffett Exit Casts Shadow on Apple Greg Abel Berkshire Valuation Test2
యాపిల్ పెట్టుబడిపై నీలినీడలు!

‘ఒరాకిల్ ఆఫ్ ఒమాహా’గా పిలవబడే దిగ్గజ పెట్టుబడిదారు వారెన్ బఫెట్ బెర్క్‌షైర్ హాత్వే సీఈఓ బాధ్యతల నుంచి డిసెంబర్ 31న తప్పుకున్నప్పటి నుంచి యాపిల్‌ పెట్టుబడులపై నీలినీడలు కమ్ముకున్నాయి. తన అర్ధ శతాబ్దపు ప్రస్థానంలో బెర్క్‌షైర్ క్లాస్-ఏ షేర్లను ఏకంగా 61,00,000 శాతం వృద్ధి పథంలో నడిపించిన బఫెట్, ఆ పగ్గాలను ఇటీవల తన వారసుడు గ్రెగ్ అబెల్‌కు అప్పగించారు. అయితే, అబెల్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బెర్క్‌షైర్ అత్యంత కీలకమైన యాపిల్ పెట్టుబడి బఫెట్ నిర్దేశించిన ప్రాథమిక సూత్రాలనే ఉల్లంఘిస్తోందనే చర్చ ఆసక్తికరంగా మారింది.విలువే ప్రాణం.. కానీ..వారెన్ బఫెట్ పెట్టుబడి శైలిలో అత్యంత ముఖ్యమైన నియమం ‘వాల్యుయేషన్’. ఒక సంస్థకు తిరుగులేని మార్కెట్ పట్టు, సమర్థవంతమైన నాయకత్వం ఉన్నప్పటికీ ఆ సంస్థ షేరు ధర దాని అసలు విలువ కంటే ఎక్కువగా ఉంటే బఫెట్ అటువైపు చూడరు. గ్రెగ్ అబెల్ తాను రాసిన మొదటి వార్షిక లేఖలో యాపిల్‌ను తన ‘ఫరెవర్ హోల్డింగ్స్’ (ఎప్పటికీ కొనసాగించే పెట్టుబడులు) జాబితాలో చేర్చారు. కానీ ప్రస్తుత మార్కెట్ గణాంకాలను పరిశీలిస్తే యాపిల్ షేరు ధర బఫెట్ సూత్రాలకు విరుద్ధంగా చాలా ఖరీదుగా కనిపిస్తోంది.స్తంభించిన వృద్ధిఇటీవలి కాలంలో యాపిల్ అమ్మకాల వృద్ధి ఆశించిన స్థాయిలో లేదు. ఐఫోన్, ఐప్యాడ్, మాక్ వంటి ఉత్పత్తుల ఆదాయం మందగించింది. కేవలం సర్వీసెస్ విభాగం మాత్రమే స్వల్ప వృద్ధిని కనబరుస్తోంది. ఏప్రిల్ 10 నాటికి యాపిల్ షేర్లు తమ ఆర్జన కంటే 33 రెట్లు (33 రెట్లు ఈపీఎస్‌-ఎర్నింగ్‌ పర్‌ షేర్‌) ఎక్కువ ధరకు ట్రేడ్ అవుతున్నాయి. 2016లో బఫెట్ తొలిసారి యాపిల్‌లో వాటాలను కొనుగోలు చేసినప్పుడు, ఆ స్టాక్ కేవలం 10 నుంచి 15 రెట్ల పీఈ రేషియోలో లభించేది. బఫెట్ సీఈఓగా ఉన్న చివరి తొమ్మిది త్రైమాసికాల్లోనే యాపిల్‌లోని సుమారు 75 శాతం వాటాను (687.6 మిలియన్ షేర్లు) విక్రయించడం గమనార్హం. కేవలం వాల్యుయేషన్ పరంగా ఆకర్షణీయంగా లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.ఏఐ ఆశలు వర్కౌట్ అవుతాయా?యాపిల్ ఇంటెలిజెన్స్ ద్వారా కృత్రిమ మేధ రంగంలోకి కంపెనీ అడుగుపెట్టడం ఇన్వెస్టర్లలో కొంత ఉత్సాహాన్ని నింపినప్పటికీ అది తక్షణ ఆదాయ వృద్ధికి ఎంతవరకు దోహదపడుతుందనేది ప్రశ్నార్థకమే. యాపిల్ తన సొంత షేర్లను తిరిగి కొనుగోలు చేసే కార్యక్రమం(బైబ్యాక్‌) కోసం 2013 నుంచి 841 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసినప్పటికీ ఆదాయ వృద్ధి లేకపోవడం పెద్ద లోపంగా కనిపిస్తోంది.ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించాలా?గ్రెగ్ అబెల్ యాపిల్‌ను దీర్ఘకాలిక సంపద సృష్టికర్తగా చూస్తున్నప్పటికీ బఫెట్ మార్గంలోనే నడిస్తే మాత్రం రాబోయే త్రైమాసికాల్లో బెర్క్‌షైర్ తన యాపిల్ వాటాను మరింత తగ్గించుకునే అవకాశం ఉంది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో కేవలం బ్రాండ్ విలువను చూసి పెట్టుబడి పెట్టడం కంటే, ఆ సంస్థ ఇచ్చే రాబడి, వాల్యుయేషన్ మధ్య సమతుల్యతను గమనించడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. యాపిల్ వంటి దిగ్గజ సంస్థలే వృద్ధి కోసం ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోను పునసమీక్షించుకోవడం ఉత్తమం.గమనిక: పై కథనం కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. షేర్ మార్కెట్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.ఇదీ చదవండి: ‘మధ్య తరగతి’ బండి సాగేదెలా?

India Middle Class Crisis Rising Costs Stagnant Incomes Threaten Economic Growth3
‘మధ్య తరగతి’ బండి సాగేదెలా?

భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి మధ్యతరగతి ప్రజలే కీలకం. దేశంలో తయారయ్యే సగటు వస్తువులను అధికంగా కొనేది వీరే. ప్రభుత్వానికి సింహభాగం పన్నులు కట్టేదీ వీరే. కానీ, ప్రస్తుతం వారు ఆర్థికంగా, సామాజికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం పేదల కోసం పథకాలు ఇస్తోంది. ధనికుల కోసం ప్రోత్సాహకాలు అందిస్తోంది. కానీ, ఈ రెండింటి మధ్య ఉన్న మధ్యతరగతి ప్రజల కష్టాలను మాత్రం విస్మరిస్తోంది.వచ్చే జీతం చాలడం లేదుమునుపటితో పోలిస్తే ఇప్పుడు వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ సామాన్యుడి జీతం మాత్రం పెరగడం లేదు. దాదాపు 10 ఏళ్ల క్రితం ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కో లేదా ఆఫీస్ ఉద్యోగికో వచ్చే ప్రారంభ జీతం ఎంత ఉందో, నేటికీ దాదాపు అంతే ఉంది. కానీ, అప్పటితో పోలిస్తే ఇళ్ల అద్దెలు, పెట్రోల్, కూరగాయల ధరలు రెట్టింపు అయ్యాయి. మన దేశంలో 70 శాతం మంది సంపాదన దేశ సగటు ఆదాయం కంటే తక్కువగానే ఉంది. అంటే, కొద్దిమంది ధనికులు రోజురోజుకు మరింత ధనవంతులు అవుతుంటే మెజారిటీ ప్రజలు మాత్రం బతుకు బండి అంతంతమాత్రంగానే నెట్టుకొస్తున్నారు.చదువు, వైద్యం, ఇల్లుమధ్యతరగతి బడ్జెట్‌ను ఈ మూడు అంశాలు పూర్తిగా చిన్నాభిన్నం చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత లేక, ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు భరించలేక తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. ఏటా ప్రైవేట్‌ రంగంలో ఫీజులు 10-20% పెరుగుతున్నాయి. పిల్లల భవిష్యత్తు కోసం సొంత అవసరాలను త్యాగం చేసి మరీ ఫీజులు కడుతున్నారు. మరోవైపు పెరిగిన వైద్య ఖర్చుల దృష్ట్యా ఒక్కసారి ఆసుపత్రిలో చేరితే లక్షల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. ఇన్సూరెన్స్ ఉన్నా అది అన్నింటికీ సరిపోవడం లేదు. వైద్యం కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. నగరాల్లో అద్దెలు విపరీతంగా పెరిగిపోయాయి. సొంత ఇల్లు కొందామంటే బ్యాంక్ వడ్డీలు భయం పుట్టిస్తున్నాయి. దీంతో సంపాదనలో సగం అద్దెకో లేదా ఈఎంఐకో సరిపోతోంది.‘ప్రభుత్వం లెక్కించే ధరల పెరుగుదల పాత పద్ధతిలో ఉంది. అది పప్పులు, ఉప్పుల ధరల మీద దృష్టి పెడుతుంది కానీ, మనం ఎక్కువగా ఖర్చు చేసే స్కూల్ ఫీజులు, హాస్పిటల్ ఖర్చులను సరిగ్గా లెక్కలోకి తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. అందుకే ప్రభుత్వ లెక్కల్లో ధరలు తక్కువగా ఉన్నా సామాన్యుడికి మాత్రం ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి’పొదుపు మాయం.. అప్పులే శరణ్యంఒకప్పుడు మధ్యతరగతి వారు భవిష్యత్తు కోసం డబ్బు దాచుకునేవారు. కానీ ఇప్పుడు నెలవారీ జీతం క్షణాల్లో అయిపోతోంది. దాచుకోవడానికి రూపాయి మిగలడం లేదు. అవసరాల కోసం అప్పులు చేయడం, క్రెడిట్ కార్డులు వాడటం పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా ప్రజల పొదుపు తగ్గిపోయి, అప్పులు పెరగడం ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరం.ఆశలు నీరుగారుతున్నాయిమధ్యతరగతి వారు కష్టపడి పైకి రావాలని కోరుకుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాల్లో ప్రమోషన్లు లేవు. కొత్త ఉద్యోగం చూద్దామంటే రిస్క్ ఎక్కువగా ఉంది. కొత్త టెక్నాలజీలు సంప్రదాయ కొలువులకు గొడ్డలిపెట్టుగా మారుతున్నాయి. కొంతమంది సంపన్నులకే మంచి చదువు దొరుకుతుండటంతో పేద/దిగువ మధ్యతరగతి వారు పైకి రావడం ఒక యుద్ధంలా మారింది.‘మధ్యతరగతి వారు కేవలం పన్నులు కట్టే యంత్రాలు కాదు. దేశం ఆర్థికంగా బలంగా ఉండాలంటే ఈ వర్గం కూడా బలంగా ఉండాలి. పెరిగిన పన్నుల భారం తగ్గించి విద్య, వైద్యం వంటి ప్రాథమిక అవసరాలు సామాన్యుడికి అందుబాటులోకి వచ్చేలా ఏ ప్రభుత్వమైనా చర్యలు తీసుకోవాలి. లేకపోతే దేశ ప్రగతి ప్రమాదపు అంచులకు చేరుతుంది’ఇదీ చదవండి: ఆరోగ్య బీమా.. ఆదుకునే కవచమా? చక్రవ్యూహమా?

Health Insurance Claims Rejected Why Policyholders Face Rising Denials4
ఆరోగ్య బీమా.. ఆదుకునే కవచమా? చక్రవ్యూహమా?

ఆరోగ్య బీమా అనేది ఆపద సమయంలో ఆదుకునే ఒక రక్షా కవచం. కానీ, అవసరానికి ఆ కవచం పనిచేయకపోతే పరిస్థితి ఏమిటి? ప్రస్తుతం దేశంలో ఇలాంటి సంఘటనలే ఎక్కువగా జరుగుతున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగి ఆసుపత్రి ఖర్చుల కోసం క్లెయిమ్ చేస్తే.. ఇన్సూరెన్స్ కంపెనీలు ఏదో ఒక కారణంతో తిరస్కరించడం లేదా సగం డబ్బులే ఇవ్వడం వంటివి సాధారణమయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారిక గణాంకాలు, నిపుణుల విశ్లేషణతో రూపొందించిన ప్రత్యేక కథనం మీ కోసం..క్లెయిమ్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది?వైద్య ఖర్చులు ఆకాశాన్నంటుతున్న తరుణంలో సామాన్యుడికి ఆరోగ్య బీమా కొండంత అండ. అయితే, క్లెయిమ్ సెటిల్‌మెంట్ విషయంలో పాలసీదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం, 2026 ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో ‘బీమా భరోసా’ పోర్టల్‌లో నమోదైన ఫిర్యాదులు, 2025 ఆర్థిక సంవత్సరం మొత్తం ఫిర్యాదుల సంఖ్యను మించిపోయాయి. ఫిబ్రవరి 2026 నాటికి ఈ పోర్టల్‌లో సుమారు 73,729 ఫిర్యాదులు నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇందులో దాదాపు 69% ఫిర్యాదులు కేవలం క్లెయిమ్ తిరస్కరణ లేదా జాప్యానికి సంబంధించినవే కావడం గమనార్హం.క్లెయిమ్ తిరస్కరణకు ప్రధాన కారణాలుబీమా సంస్థలు క్లెయిమ్‌లను తిరస్కరించడానికి నిబంధనలతోపాటు పాలసీదారుల అవగాహన లోపం కూడా ఒక కారణం. క్లెయిమ్ రిజెక్ట్ కావడానికి ప్రధానంగా ఐదు కారణాలు కనిపిస్తున్నాయి.ముందస్తు వ్యాధులను చెప్పకపోవడం..పాలసీ తీసుకునేటప్పుడు బీపీ, షుగర్ వంటి పాత జబ్బుల గురించి దాచడం అతిపెద్ద తప్పు. 36 నెలల నిరీక్షణ కాలం (మారటోరియం పీరియడ్‌) ముగియకముందే ఇలాంటివి బయటపడితే కంపెనీలు క్లెయిమ్‌ను నేరుగా తిరస్కరిస్తాయి.వెయిటింగ్ పీరియడ్కొత్తగా పాలసీ తీసుకున్న వెంటనే అన్ని వ్యాధులకు కవరేజీ ఉండదు. సాధారణంగా మొదటి 30 రోజులు (ప్రమాదాలు మినహా) నిర్దిష్ట వ్యాధులకు (హెర్నియా, క్యాటరాక్ట్.. వంటివి) 2-4 ఏళ్ల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఈలోపు క్లెయిమ్ చేస్తే అది రిజెక్ట్ అవుతుంది.వైద్య అవసరం లేకుండానే ఆసుపత్రిలో చేరికకేవలం డయాగ్నోస్టిక్ పరీక్షల కోసం లేదా ఇంట్లోనే చికిత్స పొందే అవకాశం ఉన్న జబ్బులకు ఆసుపత్రిలో చేరితే క్లెయిమ్ రాదు. కనీసం 24 గంటల ఆసుపత్రి చేరిక తప్పనిసరి (డే కేర్ చికిత్సలు మినహా).కాస్మెటిక్ సర్జరీలు, దంత చికిత్సలు, విటమిన్ సప్లిమెంట్స్ వంటివి చాలా పాలసీల్లో కవర్ కావు. మీరు పాలసీ తీసుకునే ముందే వీటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి.ఆసుపత్రిలో చేరిన 24-48 గంటల్లోపు బీమా సంస్థకు సమాచారం ఇవ్వాలి. రీయింబర్స్‌మెంట్ విషయంలో డిశ్చార్జ్ అయిన 15-30 రోజుల్లోపు పత్రాలు సమర్పించకపోతే సమస్యలు ఎదురవుతాయి.పాలసీ కొనే ముందు చెక్ చేయాల్సినవి..పాలసీ డాక్యుమెంట్ అనేది కేవలం కాగితాల కట్ట కాదు, అది ఒక చట్టపరమైన ఒప్పందం. కొనే ముందు కీలక అంశాలపై స్పష్టత తెచ్చుకోవాలి.గది అద్దెపై పరిమితి ఉందో లేదో చూడండి. గది అద్దె పరిమితి మించితే, మొత్తం బిల్లులో కంపెనీ కోత విధిస్తుంది.బిల్లులో కొంత శాతం మీరే చెల్లించాలనే నిబంధన(కో-పేమెంట్‌) ఉంటే ప్రీమియం తగ్గుతుంది కానీ, క్లెయిమ్ సమయంలో మీ జేబుకు చిల్లు పడుతుంది.మీ ఇంటికి దగ్గరలో ఉన్న ప్రముఖ ఆసుపత్రులు ఆ బీమా నెట్‌వర్క్‌లో ఉన్నాయో లేదో సరిచూసుకోండి.ఒకే ఏడాదిలో ఒకటికంటే ఎక్కువసార్లు అనారోగ్యం పాలైతే బీమా మొత్తం (సమ్‌ అస్యూర్డ్‌) తిరిగి రీఛార్జ్ అయ్యే సౌకర్యం ఉందో లేదో చూడండి.ఇన్సూరెన్స్ ఏజెంట్ చెప్పే మాటల కంటే పాలసీలోని ‘కీ ఫీచర్స్ డాక్యుమెంట్’ చదవడం ఉత్తమం. ఏదైనా ఫిర్యాదు ఉంటే మొదట బీమా సంస్థకు, అక్కడ పరిష్కారం లభించకపోతే ఐఆర్‌డీఏఐ ‘బీమా భరోసా’ పోర్టల్ లేదా ఇన్సూరెన్స్ అంబడ్స్‌మన్‌ను ఆశ్రయించవచ్చు.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు

West Asia Tensions Threaten India Remittance Flows Export Growth5
రెమిటెన్సులకు యుద్ధం సెగ

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో భారత్‌కు వచ్చే రెమిటెన్స్‌ ప్రవాహం తగ్గే అవకాశం ఉందని క్రిసిల్‌ రేటింగ్స్‌ అభిప్రాయపడింది. ప్రవాస భారతీయుల నుంచి వచ్చే మొత్తం రెమిటెన్స్‌ల్లో సుమారు మూడో వంతు గల్ఫ్‌ కో ఆపరేషన్‌ కౌన్సిల్‌ (జీసీసీ) దేశాల నుంచే వస్తుందని పేర్కొంది. అక్కడి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగితే ఈ ప్రవాహం మందగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రవాస భారతీయుల ఆదాయాలు తగ్గితే కరెంట్‌ ఖాతా లోటు (సీఏడీ)పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే వాణిజ్య లోటు ఒత్తిడిలో ఉన్న సమయంలో రెమిటెన్స్‌ తగ్గుదల ఆర్థిక సమతౌల్యంపై మరింత ప్రభావం చూపవచ్చని పేర్కొంది. ప్రవాసుల నుంచి రెమిటెన్స్‌లు అత్యధికంగా పొందుతున్న దేశంగా భారత్‌ ప్రపంచంలో ముందంజలో ఉంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో దేశానికి ఈ రూపంలో 135 బిలియన్‌ డాలర్లకు పైగా వచ్చాయి. ఎగుమతుల వృద్ధిపై ఒత్తిడిపశ్చిమాసియా ఘర్షణల కారణంగా గ్లోబల్‌ వాణిజ్య ప్రవాహాల్లో అంతరాయం, ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమనం వల్ల భారత ఎగుమతుల వృద్ధిపై ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉందని క్రిసిల్‌ తెలిపింది. అయితే అమెరికా సుంకాలు తగ్గడం కొంతమేర మద్దతు ఇస్తుందని పేర్కొంది. మరోవైపు ముడి చమురు ధరలు సంవత్సరానికి 8–9% పెరగడం వల్ల దిగుమతి బిల్లు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. లాజిస్టిక్‌ సమస్యలు, సరఫరా గొలుసు పునర్‌వ్యవస్థీకరణ కారణంగా పశ్చిమాసియాకు ఎగుమతులు ప్రభావితమవుతున్నాయని తెలిపింది. ఎగుమతులు ఇలాజీసీసీ దేశాలకు భారత్‌ 57 బిలియన్‌ డాలర్లు (మొత్తం ఎగుమతుల్లో 13%), ఇతర పశ్చిమ ఆసియా దేశాలకు 9 బిలియన్‌ డాలర్లు (2%) ఎగుమతులు చేసింది. బాస్మతి బియ్యం (70% పైగా), బోవైన్‌ మీట్‌ (30%), సిరామిక్‌ ఉత్పత్తులు (25%), పెట్రోలియం ఉత్పత్తులు (15%), రత్నాలు – ఆభరణాలు (20%) వంటి ఉత్పత్తుల్లో ఆ ప్రాంతానికి అధిక ప్రాధాన్యం ఉందని నివేదిక వెల్లడించింది. రవాణా సమస్యలు, సరఫరా విధానాల్లో మార్పుల కారణంగా పశ్చిమాసియాకు ఎగుమతులు తగ్గడం లేదా ఆలస్యం కావచ్చని క్రిసిల్‌ రేటింగ్స్‌ పేర్కొంది.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు

Why Women Need Term Insurance and Retirement Planning?6
మహిళలకూ ఉండాలి టర్మ్‌ పాలసీ

మరింత మంది మహిళలు ఉద్యోగాల్లోకి చేరుతున్న నేపథ్యంలో వారికి కూడా టర్మ్‌ ఇన్సూరెన్స్, రిటైర్మెంట్‌ ప్రణాళికల ఆవశ్యకత నెలకొందని ఇన్సూరెన్స్‌ ఎవేర్‌నెస్‌ కమిటీ (ఐఏసీ–లైఫ్‌) సభ్యులు రుషభ్‌ గాంధీ, పరాగ్‌ రాజా తెలిపారు. కుటుంబ సంరక్షణ బాధ్యతలు నిర్వర్తించేందుకు వారు తాత్కాలికంగా గానీ శాశ్వతంగా గానీ ఉద్యోగాలకు దూరం కావడం వల్ల పొదుపు, రిటైర్మెంట్‌ నిధిపై ప్రభావం పడుతుందన్నారు.పురుషులతో పోలిస్తే మహిళల జీవితకాలం సగటున నాలుగేళ్లు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారికి తమతో పాటు తమపై ఆధారపడే వారి కోసం కూడా దీర్ఘకాలికమైన, మెరుగైన పొదుపు ప్రణాళికలు అవసరమవుతాయని తెలిపారు. ఆదాయార్జన వ్యవధి తక్కువగా ఉండటం, జీవితకాలం అధికంగా ఉండటమనేది మహిళలు ఎదుర్కొనే విశిష్టమైన సవాలని వివరించారు. ఈ నేపథ్యంలో ఆర్థిక అక్షరాస్యత దన్నుతో వారు ఆర్థిక ప్రణాళికల్లో చురుగ్గా పాల్గొంటున్నారని తెలిపారు. యాన్యుటీలు, గ్యారంటీడ్‌ ఇన్‌కం ప్లాన్‌లు వారు స్థిరమైన ఆదాయాన్ని అందుకునేందుకు తోడ్పడతాయని వారు చెప్పారు. తమ ఆర్థిక ఆరోగ్యాన్ని సంరక్షించుకునేలా మహిళల్లో స్ఫూర్తి నింపేందుకు బీమా పరిశ్రమ నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు

Advertisement
Advertisement
Advertisement