Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

JSW MG Motor India to Hike Car Prices1
జనవరి 1 నుంచి ఈ కార్ల ధరల పెంపు

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్స్‌ ఇండియా తమ వాహన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. వాహన మోడల్, వేరియంట్‌ను బట్టి పెంపు 2% వరకు ఉంటుందని వివరించింది. ముడిసరకు ధరలు పెరగడం, ఉత్పత్తి వ్యయాలు భారం కావడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంది.మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా, బీఎమ్‌డబ్ల్యూ వాహన ధరలు సైతం జనవరి 1 నుంచి పెరుగనున్న సంగతి తెలిసిందే. అటు బీఎండబ్ల్యూ మోటోరాడ్‌ కూడా తమ బైక్‌ల ధరలను 6 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. డాలరు, యూరోలతో పోలిస్తే రూపాయి మారకం కొద్ది నెలలుగా గణనీయంగా పడిపోతుండటం, ముడి పదార్థాలు .. లాజిస్టిక్స్‌ వ్యయాలు పెరిగిపోతుండటం రేట్ల పెంపునకు కారణమని బీఎండబ్ల్యూ గ్రూప్‌ ఇండియా ప్రెసిడెంట్‌ హర్‌దీప్‌ సింగ్‌ బ్రార్‌ తెలిపారు.భారత్‌లో తయారు చేసే జీ 310 ఆర్‌ఆర్, సీఈ 02 బైక్‌లతో పాటు ఎఫ్‌ 900 జీఎస్, ఎఫ్‌ 900 జీఎస్‌ఏలాంటి దిగుమతి చేసుకున్న ప్రీమియం బైక్‌లను కంపెనీ విక్రయిస్తోంది. వీటి ధర రూ. 2.81 లక్షల నుంచి రూ. 48.63 లక్షల వరకు ఉంది.

Restaurants Want To leave Food Delivery Apps2
ఫుడ్‌ డెలివరీ యాప్‌లు వద్దు బాబోయ్‌..

దేశంలో ఫుడ్‌ డెలివరి యాప్‌లు విస్తృతంగా పెరిగిపోయాయి. వాస్తవంగా ఈ యాప్‌లు రెస్టారెంట్‌ పరిశ్రమకు కస్టమర్లను, ఆదాయాన్ని అందిస్తున్నాయి. ఈ యాప్స్‌ను నమ్ముకుని హోటళ్లు, రెస్టారెంట్లు నడుస్తున్నాయా.. లేక రెస్టారెంట్లపై ఆధారపడి ఫుడ్‌ డెలివరి యాప్‌లు పనిచేస్తున్నాయా అంటే చెప్పడం కష్టం.అయితే ఇవే ఫుడ్‌ డెలివరి యాప్‌లు రెస్టారెంట్లకు ఆర్థికంగా, కార్యాచరణపరంగా ఒత్తిళ్లను కూడా తెస్తున్నాయి. ప్రోసస్ సౌజన్యంతో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (NCAER) దేశవ్యాప్తంగా నిర్వహించిన తాజా అధ్యయనం ఫుడ్‌ డెలివరి యాప​్‌లు, రెస్టారెంట్ల మధ్య నలుగుతున్న వివాదాస్పద ఘర్షణను వెలుగులోకి తెచ్చింది.దేశవ్యాప్తంగా వివిధ నగరాలు, ప్రాంతాల్లోని రెస్టారెంట్లతో నిర్వహించిన వివరణాత్మక సర్వేలో కీలక వివరాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం.. ప్రస్తుతం ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్‌లను ఉపయోగిస్తున్న రెస్టారెంట్లలో 35 శాతం అవకాశం ఉంటే ఈ యాప్‌ల నుండి నిష్క్రమించాలనే అనుకుంటున్నాయి. అదే సమయంలో దాదాపు మూడింట రెండు వంతుల రెస్టారెంట్లు మాత్రం ఫుడ్‌ డెలివరీ యాప్‌లతో కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నాయి.రెస్టారెంట్ల బేజారుకు కారాణాలివే..అధిక కమీషన్లు ఫుడ్‌ డెలివరీ యాప్‌లపై రెస్టారెంట్ల అసంతృప్తికి ప్రధాన కారణం ప్రతి ఆర్డర్‌పై అవి వసూలు చేపసే కమీషన్. నివేదిక ప్రకారం.. ప్లాట్ ఫామ్ కమీషన్లు కొన్నాళ్లుగా పెరిగిపోయాయి. బిల్లు మొత్తంలో వాటి వాటా గణనీయంగా ఉంటోంది. చాలా మంది రెస్టారెంట్ యజమానులకు, ఆర్డర్ వాల్యూమ్‌లు బలంగా ఉన్నప్పటికీ, కమీషన్ల కారణంగా ఆర్డర్‌కు వచ్చే నికర ఆదాయాలు తగ్గిపోయాయి. "సగటు 'పర్ ఆర్డర్' కమిషన్ 2019లో 9.6 శాతం ఉండగా 2023 వచ్చేసరికి అది 24.6 శాతానికి పెరిగింది. సొంత డెలివరీ యాప్‌ల వైపు రెస్టారెంట్లుఅధిక కమిషన్లు, నియంత్రణల కారణంగా అనేక రెస్టారెంట్లు ఇప్పుడు తమ సొంత డెలివరీ యాప్‌లు, వెబ్‌సైట్లను అభివృద్ధి చేసుకుంటున్నాయి. దీనివల్ల మధ్యవర్తుల అవసరం తగ్గుతుంది. కమిషన్ల భారం ఉండదు. కస్టమర్ డేటాపై పూర్తి నియంత్రణ ఉంటుంది. లాభాల మార్జిన్ మెరుగుపడుతుందని రెస్టారెంట్ల నిర్వాహకులు భావిస్తున్నారు. పెద్ద చైన్ రెస్టారెంట్లు మాత్రమే కాకుండా, మధ్యస్థ స్థాయి హోటళ్లు కూడా వాట్సాప్ ఆర్డర్లు, లోకల్ డెలివరీ బాయ్స్ సహాయంతో ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నాయి.బ్రాండ్ విలువకు దెబ్బఫుడ్ డెలివరీ యాప్‌లు తరచూ భారీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, ఫెస్టివ్ డీల్స్ వంటి వాటిని రెస్టారెంట్లపై ఒత్తిడి చేసి అమలు చేయిస్తున్నాయి. దీని వల్ల రెస్టారెంట్ ధరల స్వతంత్రత కోల్పోతుంది. బ్రాండ్ విలువ తగ్గుతోంది. ఆఫ్‌లైన్ కస్టమర్లతో ధరల అసమతుల్యత ఏర్పడుతుంది.

Gold prices changes last week yellow metal surges by Rs3
వారం రోజులు.. మారిన బంగారం ధరలు

దేశంలో బంగారం ధరలు రోజురోజుకీ మారిపోతున్నాయి. తీవ్రమైన హెచ్చుతగ్గులు, బలమైన రికవరీతో గత వారం రోజుల్లో (డిసెంబర్ 14 – డిసెంబర్ 21) హైదరాబాద్‌ సహా తెలుగురాష్ట్రాల్లో బంగారం ధరలు గణనీయ మార్పులు నమోదు చేశాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారంతోపాటు ఆభరణాలకు వినియోగించే 22 క్యారెట్ల పసిడి లోహం ధరలు మొత్తంగా చూస్తే స్వల్పంగా పెరిగాయి.ధరల మార్పు ఇలా..డిసెంబర్ 14న రూ.1,33,910గా ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర.. పెరుగుతూ.. తగ్గుతూ డిసెంబర్ 21 నాటికి రూ.1,34,180 వద్దకు చేరింది. అంటే ఏడు రోజుల అనంతరం నికరంగా రూ.270 పెరిగింది.ఇక 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే డిసెంబర్ 14న రూ.1,22,750తో ప్రారంభమై, డిసెంబర్ 21న రూ.1,23,000 వద్ద కొనసాగుతోంది. నిరకంగా చూస్తే వారం రోజుల్లో రూ.250 ఎగిసింది.ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుబంగారాన్ని ప్రస్తుతం గ్లోబల్ ఇన్వెస్టర్లు ‘సేఫ్-హేవెన్’గా కొనుగోలు చేస్తున్నారు. ఆర్థిక అనిశ్చితుల సమయంలో బంగారం డిమాండ్.. ధరలు పెరుగుతున్నాయి.అంతర్జాతీయ బంగారం ధరలు యూఎస్ డాలర్ బలం, అంతర్జాతీయ వడ్డీ రేట్ల నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి. డాలర్ బలంగా మారితే బంగారం ఫ్యూచర్స్‌పై ప్రభావం పడుతుంది. ఇది స్థానిక ధరలను ప్రభావితం చేస్తుంది.డిసెంబర్‌లో పండుగలు, శుభదినాలు, పెళ్లి సీజన్ మొదలైన సందర్భాల నేపథ్యంలో బంగారం కొనుగోలు ఎక్కువగా ఉంటుంది. ఈ డిమాండ్ కూడా ధరల పెరుగుదలకు దోహదం చేస్తోంది.ఇక స్థానికంగా ఉన్న పన్నులు, సరఫరా, డిమాండ్ కూడా రోజువారీ పసిడి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. సీజనల్ డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు పెరిగే అవకాశం ఉంది.

Updated Bajaj Pulsar 220F New KTM Duke 160 Variant Launched in India4
అదే బైక్‌.. అప్‌డేటెడ్‌ వెర్షన్‌

బజాజ్‌ ఆటో లిమిటెడ్‌ ‘2026 పల్సర్‌ 220ఎఫ్‌’ మోటార్‌సైకిల్‌ను కొత్త అప్‌డేట్‌లతో మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. దీని ఎక్స్‌–షోరూం ధర రూ. 1.28 లక్షలు. స్వల్ప స్టైలింగ్, రంగులతో పాటు ప్రధానంగా కాస్మెటిక్, ఫీచర్లపై కంపెనీ దృష్టి పెట్టింది. రైడింగ్‌ సేఫ్టీని పటిష్టం చేసేందుకు సింగిల్‌–ఛానల్‌ ఏబీఎస్‌ నుంచి డ్యూయల్‌–ఛానల్‌ ఏబీఎస్‌కి అప్‌గ్రేడ్‌ చేశారు.మరింత స్పష్టంగా కనిపించేలా, మోడ్రన్‌ లుక్‌తో ఎల్‌ఈడీ టర్న్‌–సిగ్నల్స్‌(ఇండికేటర్స్‌) అమర్చారు. బ్లూటూత్‌ కనెక్టివిటీతో కూడిన డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ కన్సోల్‌ ఈ మోడల్‌లో ముఖ్యమైన ఆకర్షణగా నిలుస్తుంది. బ్లాక్‌ చెర్రీ రెడ్, బ్లాక్‌ ఇంక్‌ బ్లూ, బ్లాక్‌ కాపర్‌ బీయి, బ్లాక్‌ కాపర్‌ బేజ్‌ గ్రీన్‌ లైట్‌ కాపర్‌ మొత్తం నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంది.అత్యుత్తమ పనితీరుతో అభిమానులను ఆకట్టుకున్న 220సీసీ ట్విన్‌ స్పార్క్‌ డీటీఎస్‌–ఐ ఇంజిన్‌ను మాత్రం కంపెనీ యథాతథంగా ఉంచేసింది. ఇది ఫ్యూయల్‌ ఇంజెక్షన్‌ టెక్నాలజీతో, ఆయిల్‌–కూల్డ్‌ సింగిల్‌ సిలిండర్‌ సెటప్‌లో వస్తుంది. ఈ ఇంజిన్‌ 8,500 ఆర్‌పీఎం వద్ద 20.9 పీఎస్‌ శక్తిని ఉత్పత్తి చేస్తూ బలమైన పనితీరును ప్రదర్శిస్తుంది.‘కేటీఎం డ్యూక్‌ 160’ కొత్త వేరియంట్‌ప్రీమియం బైక్‌ విభాగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు కేటీఎం సంస్థ ’160 డ్యూక్‌’లో మరింత అధునాతన వేరియంట్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర రూ. 1.78 లక్షలు (ఢిల్లీ ఎక్స్‌–షోరూం). అయిదు అంగుళాల కలర్‌ టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఇందులో ప్రధాన ఆకర్షణగా ఉంది. జెన్‌–3 కేటీఎం 390 డ్యూక్‌ నుంచి దీనిని ప్రేరణగా తీసుకున్నారు.రైడర్‌ తన అభిరుచికి తగ్గట్లు డిస్‌ప్లే థీమ్‌ను మార్చుకోవచ్చు. రైడర్‌ మెనూలు, కనెక్టివిటీ వంటి బైక్‌ ఫంక్షన్‌లను నియంత్రించేందుకు 4–వే స్విచ్‌ క్యూబ్‌ కూడా ఉంటుంది. నావిగేషన్, బ్లూటూత్‌ కనెక్టివిటీ ఉన్నాయి. ఈ బైక్‌ను కేటీఎం మై రైడ్‌ యాప్‌కు కనెక్ట్‌ చేసుకోవచ్చు.

RBI slaps Rs 61 95 lakh penalty on Kotak Mahindra Bank5
కొటక్‌ బ్యాంక్‌పై కొరడా.. ఆర్బీఐ భారీ జరిమానా

ప్రముఖ ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ సంస్థ కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌పై కేంద్ర బ్యాంక్‌ ఆర్బీఐ కొరడా ఝుళిపించింది. నిబంధనలు పాటించడంలో విఫలమైనందుకు భారీ మొత్తంలో జరిమానా విధించింది. బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ అకౌంట్‌ నిబంధనలు పాటించనందుకు గానూ రూ.61.95 లక్షలు జరిమానా చెల్లించాలని కొటక్‌ మహీంద్రా బ్యాంకుకు ఆర్బీఐ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఇదే విషయాన్ని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.జరిమానా ఇందుకే.. ‘బ్యాంకింగ్ సేవలు అందించడం - బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతా’ 'బిజినెస్ కరస్పాండెంట్లు (బీసీ) చేపట్టాల్సిన కార్యకలాపాల పరిధి'పై ఆదేశాలను పాటించనందుకు అలాగే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ రూల్స్, 2006 నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ జరిమానా విధించినట్లు ఆర్బీఐ తెలిపింది.2024 మార్చి 31 నాటికి బ్యాంకు ఆర్థిక స్థితికి సంబంధించి బ్యాంక్ సూపర్వైజరీ మూల్యాంకనాన్ని (ISE 2024) తనిఖీ చేసిన ఆర్బీఐ.. ఇప్పటికే కనీస సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతాలు కలిగి ఉన్న కొంతమంది కస్టమర్లకు అలాంటి మరో ఖాతాను తెరిచినట్లు గుర్తించింది. అలాగే అనుమతించిన పరిధికి మించిన కార్యకలాపాలను చేపట్టడానికి బ్యాంకు బిజినెస్ కరస్పాండెంట్లకు అవకాశం కల్పించినట్లు కూడా గమనించింది. అంతేకాకుండా కొంతమంది రుణగ్రహీతలకు సంబంధించి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు (సిఐసి) తప్పుడు సమాచారాన్ని అందించినట్లు తేల్చింది.

Uncertainty Clears in Hyderabads Real Estate Market House Construction Tips6
ఇల్లు.. ఇక కొందామా.. తొలగిన డైలమా!

కొందామా.. మరికొన్నాళ్లు వేచి చూద్దామా..? కొనగానే ధరలు పడిపోతే..? పోనీ, ధైర్యం చేసి కొన్నా అనుకున్నంత వేగంగా అభివృద్ధి చెందకపోతే? ..ఏడాది కాలంగా హైదరాబాద్‌ స్థిరాస్తి రంగంలో ఇలాంటి ఎన్నో సందేహాలు. ఏ నిర్ణయం తీసుకోకుండా తర్జన భర్జనలో పడేశాయి. 2025లో ఈ ఊగిసలాటకు తెరపడింది. స్థిరాస్తి మార్కెట్‌లో కొన్నాళ్లుగా నెలకొన్న అనిశ్చితి ఈ ఏడాదితో తొలగిపోవడంతో కొనుగోలుదారుల్లో అభివృద్ధిపై ఆశలు చిగురించాయి. కొనుగోళ్లు పెరగడంతో స్థిరాస్తి సంస్థలు నిర్మాణాలు పూర్తి చేయడంలో వేగం పెంచాయి. రాష్ట్ర ప్రభుత్వం మెగా మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌ల కార్యాచరణలో వేగంగా అడుగులు వేయడంతో ఈ రంగంలో సానుకూల అడుగులు వేసేందుకు ప్రధానంగా ఊతమిచ్చాయి.భూముల ధరలు పెరగడం తప్ప తగ్గడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. ఈ రంగంలోని అనుభవజ్ఞులు చెబుతున్న మాట ఇది. మరి అలాంటప్పుడు కొనడానికి ఎందుకు ఊగిసలాట అనే సందేహం సహజం. గతంలో కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధిని అతిగా చూపించి వాస్తవ ధరకంటే ఎంతో ఎక్కువకు స్థలాలను విక్రయించారు.. ఇవి పెరగకపోగా.. అత్యవసరంగా అమ్ముకోవాల్సి వస్తే తక్కువ ధరకే విక్రయించి కొందరు నష్టపోయారు. సాధారణంగా కొనుగోలుదారుల మనస్తత్వం.. ధరలు పెరుగుతుంటే కొనేందుకు పోటీపడతారు. అదే తగ్గుతుందంటే మాత్రం ఎవరూ ముందుకురారు. ఇలాంటప్పుడే డిమాండ్‌ పడి ధరలు మరింత పతనమయ్యే అవకాశాలు ఉంటాయి. ధరలు పెరగాలంటే అభివృద్ధి నిలకడగా ఉండటం, రాజకీయ సుస్థిరత వంటి అంశాలు ఇంధనంగా పనిచేస్తాయి. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రభావవంతమైన పారిశ్రామిక విధానాలను అవలంభిస్తోంది. నగరంలో ఐటీ, ఫార్మాలతో పాటు విమానయాన, ఎల్రక్టానిక్స్‌ తదితర రంగాలలో పరిశ్రమలు, సంస్థల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి. తద్వారా సహజంగానే ఇళ్ల నిర్మాణానికీ డిమాండ్‌ పెరుగుతోంది. కంపెనీల ఏర్పాటుతో ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన జరిగి చుట్టుపక్కల స్థిరాస్తి రంగం వృద్ధి చెందడానికి మార్గం సుగమం అవుతుంది.నలువైపులా అభివృద్ధి.. నగరం ఒకవైపే అభివృద్ధి కాకుండా నలువైపులా విస్తరించేలా ఆధ్యాత్మిక, ఐటీ, ఉత్పత్తి, ఫార్మా కారిడార్ల ప్రణాళికలు నిర్మాణ రంగంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. ప్రతికూల పరిస్థితుల నుంచి సానుకూల దిశగా స్థిరాస్తి మార్కెట్‌ అడుగులు పడేందుకు ఇవి దోహదం చేశాయి. కేంద్ర ప్రభుత్వం స్థిరాస్తి రంగంలో విదేశీ పెట్టుబడులపై నిబంధనలను సరళతరం చేసింది. నిధులు లేక సతమతమవుతున్న నిర్మాణ పరిశ్రమలో ఈ నిర్ణయంతో ఆశలు చిగురించాయి. పెద్ద ప్రాజెక్ట్‌లకే కాదు చిన్న ప్రాజెక్ట్‌లకూ ఆర్థిక అండ లభించింది. తద్వారా హైదరాబాద్‌ స్థిరాస్తి మార్కెట్‌లోకి మరిన్ని పెట్టుబడులతో పాటుగా అంతర్జాతీయ స్థాయి నిర్మాణాలకు అవకాశం ఏర్పడింది. టౌన్‌షిప్‌ల అభివృద్ధి, గృహ, వాణిజ్య సముదాయాల నిర్మాణానికి నిధులు సమకూరాయి.ఇది చదివారా? ఇ‍ల్లు ఇలా కట్టు.. ఇది ఇంకో కొత్త టెక్నిక్కు..రెరాతో జవాబుదారితనం.. స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి బిల్లుతో మార్కెట్‌పై సామాన్యుల్లో భరోసా పెరిగింది. దీంతో డెవలపర్లు, కొనుగోలుదారుల్లో సానుకూలత ఏర్పడింది. నిర్మాణం పూర్తయ్యి కొనుగోలుదారులకు అప్పగించాక ఐదేళ్లలో ఏదైనా లోపాలుంటే నిర్మాణదారుడిదే బాధ్యత వహించాలనేది స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి బిల్లులోని మరో ముఖ్యమైన అంశం. నిర్మాణం మొదలుపెట్టాక ప్లాన్‌ను మార్చడానికి వీల్లేకుండా కొన్ని మంచి నిబంధనలలూ ఇందులో పొందుపరిచారు. వీటిని ఉల్లంఘిస్తే మూడేళ్ల జైలు శిక్ష వంటి కఠిన నిర్ణయాలతో స్థిరాస్తి మార్కెట్‌లో జవాబుదారితనం పెరిగింది.

Advertisement
Advertisement
Advertisement