Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Wipro Microsoft AI Partnership Innovation Hub Launch1
చేతులు కలిపిన మైక్రోసాఫ్ట్‌, విప్రో

దేశీ ఐటీ దిగ్గజం విప్రో తాజాగా గ్లోబల్‌ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపింది. ఎంటర్‌ప్రైజ్‌లకు ఏఐ సొల్యూషన్లు అందించేందుకు వీలుగా వ్యూహాత్మక భాగస్వామ్యానికి తెరతీసింది. తద్వారా బెంగళూరులోని పార్ట్‌నర్‌ ల్యాబ్స్‌లో మైక్రోసాఫ్ట్‌ ఇన్నోవేషన్‌ కేంద్రం(హబ్‌)ను ఏర్పాటు చేయనుంది.మూడేళ్లపాటు అమల్లోఉండే సహకారం ద్వారా ఎంటర్‌ప్రైజెస్‌కు కీలక కార్యకాలపాలలో ఏఐ అమలుకు వీలు కల్పించనుంది. ఒప్పందం ద్వారా విప్రోకున్న కన్సల్టింగ్, ఇంజినీరింగ్‌ ఆధారిత సామర్థ్యాలకు మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్, ఏఐ స్టాక్‌ను జత కలుపుకోనుంది.ఏఐ స్టాక్‌లో భాగంగా అజ్యూర్, మైక్రోసాఫ్ట్‌ 365 కోపైలట్, గిట్‌హబ్‌ కోపైలట్, అజ్యూర్‌ ఏఐ ఫౌండ్రీ తదితరాలను భాగం చేసుకోనుంది. వెరసి ఎంటర్‌ప్రైజ్‌లకు కార్యకలాపాలలో టెక్నాలజీ వినియోగానికి వీలుగా విభిన్న ఏఐ సొల్యూషన్లు సమకూర్చనుంది.

Gold prices jump sharply this week yellow metal surges by Rs2
బంగారం ధరలు: ఒక్క వారంలో ‘ఎంత’ మారిపోయాయో..

దేశంలో బంగారం అంటే అందరికీ ప్రీతే. అవకాశం ఉన్నప్పుడల్లా కాస్తయినా పసిడిని కొంటుంటారు. ఇందుకోసం ఎప్పటికప్పుడు ధరల్ని గమనిస్తూ ఉంటారు. తగ్గినప్పుడు కొనేసుకుందాం అనుకుంటారు. పెరిగినప్పుడు అయ్యో.. అంటూ నిరాశపడతారు. ఈ నేపథ్యంలో గడిచిన వారం రోజుల్లో తెలుగురాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా మారాయి.. ఎంత పెరిగాయి.. ఎంత తగ్గాయి.. ఆ విశ్లేషణ ఇప్పుడు చూద్దాం..తీవ్రమైన హెచ్చుతగ్గులు, బలమైన రికవరీతో గడిచిన ఏడు రోజుల్లో హైదరాబాద్‌ సహా తెలుగురాష్ట్రాల్లో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారంతోపాటు ఆభరణాలకు వినియోగించే 22 క్యారెట్ల పసిడి లోహం ధరలు భారీ పెరుగుదలను నమోదు చేశాయి. మధ్యలో తగ్గుదల ఉన్నప్పటికీ వారాంతంలో బలమైన పెరుగుదలతో వారం ముగిసింది.ధరలు పెరిగాయిలా..డిసెంబర్ 7న 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.1,30,150గా ఉండగా, మరుసటి రోజు రూ.1,30,420కు కొద్దిగా పెరిగింది. డిసెంబర్ 9న అనూహ్యంగా రూ.1,29,440కు పడిపోయింది. అయితే మార్కెట్ త్వరగా రికవరీ అయింది. డిసెంబర్ 10న రూ.1,30,310కు, 11న రూ.1,30,750కు పెరిగింది.ఇక వారాంతంలో అసలైన ఊపు వచ్చింది. డిసెంబర్ 12న 24 క్యారెట్ బంగారం రూ.1,34,180కు ఎగిసింది. డిసెంబర్ 13, 14న రూ.1,33,910కు కొద్దిగా తగ్గినా, నికరంగా వారంలో రూ.3,760 ఖరీదైంది.ఇక 22 క్యారెట్ల బంగారం ధోరణి కూడా ఇదే. డిసెంబర్ 7న రూ.1,19,300తో ప్రారంభమై, 9న రూ.1,18,650కు తగ్గి, మధ్యలో రూ.1,19,450, రూ.1,19,850కు రికవరీ అయింది. డిసెంబర్ 12న రూ.1,23,000కు ఎగసి, వారాంతంలో రూ.1,22,750కు స్థిరపడింది. మొత్తంగా వారంలో రూ.3,450 పెరిగింది.పెళ్లిళ్ల సీజన్ డిమాండ్, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు, మిడిల్ ఈస్ట్ సంఘర్షణలు వంటి అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులతో బంగారం ధరలు పెరుగుతున్నాయని స్థానిక జువెలర్స్‌ పేర్కొంటున్నారు.

Wild waters Bumper sale Year end offer3
వైల్డ్ వాటర్స్‌లో బంపర్ సేల్! టికెట్లు సగం ధరలోనే..

హైదరాబాదీ మూవీ లవర్స్ , ఫుడ్ లవర్స్ , అడ్వెంచర్ లవర్స్ అందరికీసూపర్ న్యూస్! శంఖర్‌పల్లిలోని వైల్డ్ వాటర్స్ లో సంవత్సరాంతం కోసం ప్రత్యేక ఆఫర్ వచ్చింది.డిసెంబర్ 14, 15, 16 తేదీల్లో టికెట్ ధరలను దాదాపు సగానికితగ్గిస్తున్నా రు. సాధారణంగా రూ.1,590 ఉండేఎంట్రీటికెట్ ఇప్పు డు కేవలం రూ.849!అయితేఅందులో బెస్ట్ పార్ట్ ఏమిటంటే- ఈ టికెట్ మార్చి 31, 2025 వరకు వాలిడ్ గా ఉంటుంది. అంటేమీకు ఎప్పు డైనా వీకెండ్ ప్లాన్ చేసుకునేవెసులుబాటు ఉంటుంది. మరింత ఎగ్జైటింగ్ వార్తఏమిటంటే, "Book, Refer & Win" ప్రోగ్రామ్ కూడా కొనసాగుతోంది (డిసెంబర్ 11 నుండి 16 వరకు). మీరు మీ టికెట్ బుక్ చేసుకుని రిఫరల్ లింక్ షేర్ చేస్తే, బహుమతులు గెలిచేఅవకాశం మీ సొంతం!వైల్డ్ వాటర్స్ మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ, “ఈ సీజన్ లో హైదరాబాద్ ప్రజలకు ప్రత్యేక గిఫ్ట్ కావాలని మేము అనుకున్నాం. ఇదిమా కృతజ్ఞత సూచన మాత్రమే కాదు, కుటుంబాలందరికీమరచిపోలేని అనుభవం అందించేఅవకాశం కూడా,” అన్నారు.వైల్డ్ వాటర్స్ లో ఉన్న 50కిపైగా రైడ్స్, పెద్దఎత్తున ఫుడ్ కోర్ట్స్, ప్రతిరోజు జరిగే సేఫ్ టీచెక్స్ వంటి ఫీచర్లు దీన్ని రాష్ట్రంలోని ప్రీమియం థీమ్ డెస్టినేషన్ గా నిలిపాయి. మరి ఇలాంటి ఆఫర్లు ఎక్కువ కాలం ఉండవు! ఇప్పుడే బుక్ చేసుకుని, మీ ఫ్రెండ్స్ ని కూడా ఆనందంలో భాగం చేయండి.

SBI slashes lending rate by 25 bps after RBI rate cut4
స్టేట్‌ బ్యాంకు శుభవార్త.. అప్పు తీసుకున్నోళ్లకు..

తమ బ్యాంకులో అప్పు తీసుకున్నోళ్లకు ప్రభుత్వ అతిపెద్ద బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) శుభవార్త చెప్పింది. కేంద్ర బ్యాంకు ఆర్బీఐ ఇటీవల రెపో రేటును తగ్గించిన తరువాత, ప్రధాన బ్యాంకులు ఈ ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేసే పనిలో ఉన్నాయి. తాజాగా ఎస్‌బీఐ కూడా తన కీలక రుణ రేట్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది.ఇందులో మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్), ఎక్స్‌టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేట్ (ఈబీఎల్ఆర్), రెపో లింక్డ్ లెండింగ్ రేట్ (ఆర్ఎల్ఎల్ఆర్), బెంచ్మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ (బీపీఎల్ఆర్), బేస్ రేట్లో కోతలు ఉన్నాయి. డిసెంబర్ 15 నుండి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. మారిన వడ్డీ రేట్లతో ఈ బ్యాంకులో రుణ గ్రహీతలకు వడ్డీ భారం తగ్గనుంది. నెలవారీ వాయిదాలు (EMI) తగ్గుతాయి.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల రెపోరేటు అంటే వాణిజ్య బ్యాంకులకు తాత్కాలికంగా ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్ల తగ్గించింది. దీంతో ఇది 5.25 శాతానికి తగ్గింది. వృద్ధికి తోడ్పడటానికి ఈ ఏడాది నాల్గవసారి కీలక వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించాలని గత వారం ఆర్‌బీఐ విధాన కమిటీ నిర్ణయం తీసుకుంది.సవరించిన ఎంసీఎల్ఆర్ రేట్లుచాలా రిటైల్ రుణాలకు కీలకమైన ఎంసీఎల్ఆర్ రేటును అన్ని కాలపరిమితిలలోనూ ఎస్‌బీఐ తగ్గించింది. ఓవర్‌నైట్‌, ఒక నెల రేట్లు 7.90% నుండి 7.85%కి తగ్గాయి. మూడు నెలల ఎంసీఎల్ఆర్ 8.30 శాతం నుంచి 8.25 శాతానికి రాగా, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.65 శాతం నుంచి 8.60 శాతానికి తగ్గింది. అనేక గృహ, వాహన రుణాలకు ఉపయోగించే క్లిష్టమైన ఒక సంవత్సరం కాలపరిమితి రుణ రేటు 8.75% నుండి 8.70%కి దిగొచ్చింది. ఇక రెండేళ్ల టెన్యూర్‌ రుణాలపై 8.80% నుండి 8.75%, మూడేళ్ల కాలపరిమితి లోన్లపై 8.85 % నుండి 8.80 శాతానికి వడ్డీని ఎస్‌బీఐ సవరించింది.ఈబీఎల్ఆర్, ఆర్ఎల్ఎల్ఆర్ కోతలుక్రెడిట్ రిస్క్ ప్రీమియం (CRP), బ్యాంక్ స్ప్రెడ్ (BSP)తో కూడిన ఈబీఎల్‌ఆర్‌ను ఎస్‌బీఐ 8.15% నుండి 7.90%కి తగ్గించింది. ఆర్బీఐ రెపో రేటుతో నేరుగా ముడిపడి ఉన్న ఆర్ఎల్ఎల్ఆర్ 7.75% + CRP నుండి 7.50% + CRP కి దిగొచ్చింది. ఫలితంగా రుణగ్రహీతలు తమ రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా ఈఎంఐలలో తగ్గింపులను చూస్తారు.బీపీఎల్‌ఆర్‌, బేస్ రేటు మార్పులుతమ అత్యంత విశ్వసనీయ కస్టమర్లకు (prime customers) వసూలు చేసే కనీస వడ్డీ రేటు బీపీఎల్ఆర్‌ను ఎస్‌బీఐ 14.65 శాతానికి తగ్గించింది. దీంతోపాటు బేస్ రేటును కూడా 9.90 శాతానికి తగ్గించింది. ఈ తగ్గింపులు వినియోగదారుల స్థోమతను పెంచుతాయి. గృహ కొనుగోలు, వ్యాపార పెట్టుబడులను ప్రోత్సహిస్తాయి.

Hyderabad ranks second in GCC leasing in India5
జీసీసీ లీజింగ్‌లో హైదరాబాద్‌ హవా 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీయంగా గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్స్‌ (జీసీసీ) లీజింగ్‌కి సంబంధించి హైదరాబాద్‌ అత్యంత వేగంగా ఎదుగుతోంది. 2020–24 మధ్య కాలంలో 18.6 మిలియన్‌ చ.అ. ఆఫీస్‌ స్పేస్‌తో దేశం మొత్తం మీద 17 శాతం వాటా దక్కించుకుంది. బెంగళూరు తర్వాత రెండో స్థానంలో నిలి్చంది. జీసీసీలపై శావిల్స్‌ ఇండియా రూపొందించిన తాజా నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం దేశవ్యాప్తంగా 112 మిలియన్‌ చ.అ. జీసీసీల లీజింగ్‌లో టెక్‌ సిటీల త్రయం (బెంగళూరు, హైదరాబాద్, పుణె) 70 శాతం వాటా దక్కించుకుంది. ప్రతిభావంతుల లభ్యత, నాణ్యమైన మౌలిక సదుపాయాలు, అట్రిషన్‌ రేటు (ఉద్యోగుల వలస) తక్కువగా ఉండటం మొదలైనవి హైదరాబాద్‌కి సానుకూలాంశాలుగా ఉంటున్నాయి. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు.. → 2020–24 మధ్య కాలంలో మొత్తం కమర్షియల్‌ ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ 262 మిలియన్‌ చ.అ.లుగా ఉండగా, అందులో జీసీసీ లీజింగ్‌ వాటా 112 మిలియన్‌ చ.అ.తో 43 శాతంగా నమోదైంది. → హెల్త్‌కేర్, ఫార్మా జీసీసీల విషయంలో బెంగళూరు, పుణెలతో పాటు హైదరాబాద్‌ అగ్రగామిగా ఉంది. జీనోమ్‌ వేలీలాంటి వ్యవస్థలు ఇందుకు దన్నుగా నిలుస్తున్నాయి. బీఎఫ్‌ఎస్‌ఐ, ఇంజినీరింగ్‌ రంగాల జీసీసీలకు కూడా నగరం కేంద్రంగా నిలుస్తోంది. → దేశీయంగా ప్రస్తుతం 1,800 జీసీసీలు ఉండగా, 19 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 2030 నాటికి ఈ సంఖ్య 2,200 జీసీసీలు, 28 లక్షల మంది ఉద్యోగులకు చేరనుంది. → సాఫ్ట్‌వేర్, ఐటీ సర్వీసులు, బీఎఫ్‌ఎస్‌ఐ, ఇంజినీరింగ్‌–తయారీ, ఫార్మా, రిటైల్, కన్జూమర్‌ సర్వీసుల ఆధిపత్యం కొనసాగనుంది. → సంప్రదాయ ఐటీ సరీ్వసుల ఉద్యోగాలతో పోలిస్తే జీసీసీల్లో జీతభత్యాలు 12–20 శాతం అధికంగా ఉంటున్నాయి. ఏఐ/ఎంఎల్, డేటా ఇంజినీరింగ్, సైబర్‌సెక్యూరిటీ, ఇంటెలిజెంట్‌ ఆటోమేషన్, క్లౌడ్‌ ప్లాట్‌ఫామ్స్‌లాంటి అధునాతన అంశాలకు ప్రాధాన్యత ఉంటోంది. → రాబోయే రోజుల్లో 2030 నాటికి జీసీసీల లీజింగ్‌ ఏటా 30 మిలియన్‌ చ.అ. మేర పెరగనుంది. → 2025–30 మధ్య కాలంలో భవిష్యత్తులో దేశీయంగా ఏర్పాటయ్యే జీసీసీల్లో ఆటోమోటివ్, లైఫ్‌ సైన్సెస్, సెమీకండక్టర్‌ కేంద్రాల వాటా 30 శాతంగా ఉంటుంది. → అంతర్జాతీయంగా 100 మిలియన్‌ డాలర్ల నుంచి 1 బిలియన్‌ డాలర్ల వరకు ఆదాయాలు ఉండే జీసీసీ సెగ్మెంట్‌ కంపెనీలకు వృద్ధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. → నిపుణుల లభ్యత, తక్కువ నిర్వహణ వ్యయాలు, పాలసీ సంస్కరణలు, కొత్త ఆవిష్కరణలు మొదలైనవి భారత్‌ను అగ్రగామి జీసీసీ హబ్‌గా నిలుపుతాయి.

Automakers extend sales surge beyond festive season in November6
ప్యాసింజర్‌ వాహన అమ్మకాల్లో 19% వృద్ధి 

ముంబై: పండగ సీజన్‌ తర్వాత కూడా ప్యాసింజర్‌ వాహనాలకు (కార్లు, ఎస్‌యూవీలు, వ్యాన్లు) డిమాండ్‌ కొనసాగింది. ఈ నవంబర్‌లో కంపెనీల నుంచి డీలర్లకు మొత్తం 4,12,405 యూనిట్ల ప్యాసింజర్‌ వాహనాలు సరఫరా అయ్యాయి. గతేడాది ఇదే నవంబర్‌లో సరఫరా 3,47,522తో పోలిస్తే ఇది 19% అధికంగా ఉందని భారత వాహన తయారీదారుల సంఘం సియామ్‌ తెలిపింది. కార్ల తయారీ అగ్రగామి మారుతీ సుజుకీ సరఫరా 1,41,312 నుంచి 21 % పెరిగి 1,70,971 యూనిట్లకు చేరింది. మహీంద్రా అండ్‌ మహీంద్రా 56,336 యూనిట్లను సరఫరా చేసింది. ఇదే నవంబర్‌లో హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా డీలర్లకు 50,340 యూనిట్లను పంపిణీ చేసింది. ∙ద్వి చక్రవాహనాల పంపిణీలో 21% వృద్ధి నమోదైంది. ఈ నవంబర్‌లో మొత్తం సరఫరా 16,04,749 యూనిట్ల నుంచి 19,44,475 చేరింది. మోటార్‌సైకిల్‌ విభాగంలో 11,63,751 యూనిట్లు, స్కూటర్ల విభాగంలో 7,35,753 యూనిట్ల సరఫరా జరిగింది. అయితే మోపెడ్‌ సిగ్మెంట్‌లో 2% క్షీణత నమోదైంది. మొత్తం 45,923 యూనిట్ల నుంచి 44,971 యూనిట్లకు పరిమితమయ్యాయి. త్రీ వీలర్స్‌ అమ్మకాలు 21% వృద్ధితో 71,999 యూనిట్లుగా నమోదయ్యాయి. ‘‘పండుగ డిమాండ్‌ కొనసాగింపు, కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ 2.0 సంస్కరణ దన్ను భారతీయ ఆటో పరిశ్రమ నవంబర్‌లోనూ అమ్మకాల జోరును కనబరించింది. ప్యాసింజర్, టూ వీలర్స్, త్రీ వీలర్స్‌ విభాగాలకు సంబంధించి ఈ ఏడాదిలో నవంబర్‌ అత్యధికంగా అమ్ముడైన నెలగా రికార్డు సృష్టించింది. ప్రజారంజకనమైన ప్రభుత్వ సంస్కరణలు, మెరుగుపడుతున్న మార్కెట్‌ సెంటిమెంట్‌తో వచ్చే ఏడాది (2026)లోనూ ఇదే వృద్ధి నమోదవుతుందని పరిశ్రమ ఆశాభావంతో ఉంది’’ అని సియామ్‌ డైరెక్టర్‌ రాజేశ్‌ మీనన్‌ తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement