ప్రధాన వార్తలు

60 నిమిషాల్లో కొత్తగా 10 లక్షల మంది యూజర్లు
ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్జీపీటీ కేవలం ఒకే గంటలో పది లక్షల మంది యూజర్లను సంపాదించినట్లు కంపెనీ సీఈఓ శామ్ ఆల్ట్మన్ తెలిపారు. కంపెనీ ఇటీవల ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ట్ స్టూడియో జీబ్లీకి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఇలా చాట్జీపీటీకి వినియోగదారులు పెరుగుతున్నట్లు చెప్పారు. ఈమేరకు ఆల్ట్మన్ తన ఎక్స్(గతంలో ట్విట్టర్) ఖాతాలో ఈ విషయాన్ని పంచుకున్నారు.26 నెలల క్రితం చాట్జీపీటీ ప్రారంభించిన సమయంలో అత్యంత క్రేజ్తో క్షణాల్లో ఈ ప్లాట్ఫామ్ వైరల్ అయి ఐదు రోజుల్లో 10 లక్షల మంది యూజర్లను సంపాదించుకున్నట్లు ఆల్ట్మన్ చెప్పారు. కానీ కొత్తగా ప్రవేశపెట్టిన బీజ్లీ స్టూడియో ద్వారా చాట్జీపీటీ గతంలో కంటే మరింత వైరల్ అయి కేవలం గంటలోనే 10 లక్షల మంది యూజర్ల బేస్ను సంపాదించిందని వివరించారు. ప్రస్తుతానికి కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్యను విడుదల చేయలేదు. ఈ కొత్త ఫీచర్ను ఓపెన్ఏఐ గత వారం జీపీటీ-4ఓలో ప్రవేశపెట్టారు. దీని ద్వారా ఎలాంటి ఎక్స్టర్నల్ టూల్స్ అవసరం లేకుండా నేరుగా చాట్జీపీటీలోనే టెక్ట్స్, యూజర్ ఫొటోలు అప్లోడ్ చేసి బీజ్లీ ఇమేజ్లను పొందవచ్చు.ఇదీ చదవండి: భగ్గుమన్న బంగారం.. ఒకేరోజు భారీగా పెరిగిన ధరఇప్పటికే చాలామంది యూజర్లు తమ సెల్ఫీలు, పెంపుడు జంతువులు, కుటుంబ చిత్రాలు.. చాట్జీపీటీలో అప్లోడ్ చేసి జీబ్లీ ఫొటోలను పొందుతున్నారు. వాటిని తమకు చెందిన వివిధ సామాజిక మాధ్యమ ఖాతాల్లో షేర్ చేస్తున్నారు. జీబ్లీ ఇమేజ్ క్రియేట్ చేసేందుకు అనువైన మౌలిక సదుపాయాలు కావాల్సి ఉంటుంది. దీనివల్ల భారీగా జీపీయూ(గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్) కరిగిపోతుంది. దీనిపై కొంత ఆందోళనలు వ్యక్తమవుతున్నా కొత్త ఫీచర్ను సులభంగా ఉపయోగించాలని ఆల్ట్మన్ వినియోగదారులను కోరారు.

భగ్గుమన్న బంగారం.. ఒకేరోజు భారీగా పెరిగిన ధర
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు ఇటీవల కొంత శాంతించినట్లు కనిపించినా తిరిగి జీవితకాల గరిష్టాలను చేరుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో మంగళవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rate) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.85,100 (22 క్యారెట్స్), రూ.92,840 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.850, రూ.930 పెరిగింది.ఇదీ చదవండి: కొత్త ఆర్థిక సంవత్సరం.. 1,160 పాయింట్లు పడిన సెన్సెక్స్చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.850, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.930 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.85,100 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.92,840 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.850 పెరిగి రూ.85,250కు చేరుకోగా..24 క్యారెట్ల ధర రూ.930 పెరిగి రూ.92,990 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు పెరుగుతున్నట్లు వెండి ధరల్లోనూ మంగళవారం మార్పులు వచ్చాయి. నిన్నటితో పోలిస్తే ఈ రోజు వెండి ధరలు పెరిగాయి. కేజీ వెండి రేటు(Silver Price) సోమవారంతో పోలిస్తే రూ.1000 పెరిగి రూ.1,14,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

కొత్త ఆర్థిక సంవత్సరం.. 1,160 పాయింట్లు పడిన సెన్సెక్స్
కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజు స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా పతనమవుతున్నాయి. బీఎస్ఈకి చెందిన సెన్సెక్స్ ఏకంగా 1160 పాయింట్లు పడిపోయి 76,261కు చేరింది. ఎన్ఎస్ఈ ఆధ్వర్యంలోని నిఫ్టీ 280 పాయింట్లు పడిపోయి 23,243 మార్కు వద్ద కదలాడుతుంది. దాంతో ఈరోజు మార్కెట్ సెషన్లో ప్రస్తుత సమయం వరకు మదుపర్ల సంపద దాదాపు రూ.4 లక్షల కోట్లు ఆవిరైంది. భారీగా మార్కెట్ సూచీల పతనానికిగల కారణాలను మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఇదీ చదవండి: తగ్గిన ఎల్పీజీ గ్యాస్ ధరలు2025 ఏప్రిల్ 2న అమెరికా సుంకాల విధింపు నిర్ణయాలపై స్పష్టత ఇవ్వనున్నట్లు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.టారిఫ్ విధానాలపై అనిశ్చితి నెలకొనడం వాణిజ్య యుద్ధ భయాలను రేకెత్తిస్తుంది. దాంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.అమెరికా భారత్ను నేరుగా టార్గెట్ చేయనప్పటికీ, ప్రపంచ మార్కెట్ సెంటిమెంట్ ప్రభావం భారత మార్కెట్లపై కనిపిస్తుంది.ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించడంతో సూచీలు పతనమవుతున్నాయి. ఎఫ్ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్ మినహా చాలా రంగాల సూచీలు నష్టాల్లో కదలాడుతున్నాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా భారీగానే క్షీణించాయి.ఇటీవల మార్కెట్లు పడి క్రమంగా పుంజుకున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్కు పూనుకుంటున్నారు.అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలతో అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ తగ్గుతుంది. దాంతో దేశీయ దిగుమతులకు అధికంగా చెల్లింపులు చేయాల్సి వస్తుంది.

తగ్గిన ఎల్పీజీ గ్యాస్ ధరలు
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) ఏప్రిల్ 1, 2025 నుంచి 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.41 తగ్గించాయి. సవరించిన రిటైల్ సేల్ ధర వల్ల ఢిల్లీలో దీని రేటు రూ.1,762గా ఉంది. ఈ తగ్గింపుతో హోటళ్లు, రెస్టారెంట్లతో సహా ఎల్పీజీపై ఆధారపడే వ్యాపారాలకు కొంత ఉపశమనం కలిగినట్లయింది. అంతర్జాతీయ ముడిచమురు రేట్లలో హెచ్చుతగ్గులు, ఇతర ఆర్థిక అంశాల ప్రభావంతో ఈ ధరలను సవరిస్తుంటారు. కమర్షియల్ గ్యాస్ ధరలను తగ్గించినా, గృహాల్లో ఉపయోగించే ఎల్పీజీ ధరలను మాత్రం మార్చలేదు.ధరల హెచ్చుతగ్గులుగత నెలలో మార్చి 1, 2025న ఓఎంసీలు ప్రధాన నగరాల్లో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలను రూ.6 పెంచాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ ఇండేన్ ప్రకారం.. ఫిబ్రవరిలో అంతకుముందు నెలతో పోలిస్తే 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.7 తగ్గించారు. మార్చి నెలలో రూ.1,797 నుంచి రూ.1,803కు పెరిగింది. తాజాగా రూ.41 తగ్గించారు. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో మార్పులకు అనుగుణంగా ఇంధన ధరల్లో అస్థిరత నెలకొంటుంది.ఇదీ చదవండి: రెండేళ్లలో తొలిసారి ధరలు పెంపునగరాల వారీగా ధరలుఢిల్లీ-రూ.1,762 (రూ.1,803 నుంచి తగ్గింది)కోల్కతా-రూ.1,872 (రూ.1,913 నుంచి తగ్గింది)ముంబయి-రూ.1,714.50 (రూ.1,755.50 నుంచి తగ్గింది)చెన్నై-రూ.1,924.50 (రూ.1,965.50 నుంచి తగ్గింది)

నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్తో పోలిస్తే మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ(Nifty) 67 పాయింట్లు నష్టపోయి 23,454కు చేరింది. సెన్సెక్స్(Sensex) 303 పాయింట్లు దిగజారి 77,113 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 104.1 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 74.97 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.19 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో మిశ్రమంగా ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.55 శాతం లాభపడింది. నాస్డాక్ 0.14 శాతం దిగజారింది.ఎఫ్పీఐలు, రిటైలర్ల పెట్టుబడుల దన్నుతో ఒక్క మార్చి నెలలోనే మార్కెట్లు భారీగా టర్న్అరౌండ్ అయ్యాయి. సెన్సెక్స్ 4,217 పాయింట్లు(5.8 శాతం) ఎగసింది. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3,555 పాయింట్లు(8.3%) జంప్చేస్తే, మిడ్క్యాప్ 2,939 పాయింట్లు(7.6%) బలపడింది. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు తలెత్తినప్పటికీ దేశీయంగా సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు, విధానాల కొనసాగింపుపై అంచనాలు ఇన్వెస్టర్లలో మార్కెట్లపట్ల విశ్వాసాన్ని పెంచాయి. ఫలితంగా గతేడాది పలు ఆటుపోట్ల మధ్య మార్కెట్లు నికరంగా లాభపడ్డాయి.ఇదీ చదవండి: రెండేళ్లలో తొలిసారి ధరలు పెంపుట్రంప్ సుంకాలపై ఏప్రిల్ 2న మరింత స్పష్టత రాబోతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సుంకాల ప్రభావం ఆటో, ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాలపై ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. అమెరికా టారిఫ్ల వార్తలు మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీస్తున్నాయి. దీనికి తోడు ముడిచమురు ధరలు పెరగడం, అమెరికా డాలర్ బలపడటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) ఇటీవల నికర కొనుగోలుదారులుగా మారడం కొంత కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

రెండేళ్లలో తొలిసారి ధరలు పెంపు
దేశీయంగా ఉత్పత్తి అయ్యే సహజవాయువు ధరలను భారత్ రెండేళ్లలో తొలిసారిగా పెంచింది. ఏప్రిల్ 1 నుంచి ఏపీఎం(అడ్మినిస్ట్రేటెడ్ ప్రైసింగ్ మెకానిజం) గ్యాస్ ధరను 10 లక్షల థర్మల్ యూనిట్లకు 6.50 డాలర్ల నుంచి 6.75 డాలర్లకు పెంచినట్లు పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖకు చెందిన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ విభాగం నోటిఫికేషన్లో పేర్కొంది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఓఎన్జీసీ), ఆయిల్ ఇండియా లిమిటెడ్లు నామినేషన్ ప్రాతిపదికన కేటాయించిన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే సహజ వాయువును ఏపీఎం గ్యాస్ అంటారు. ఈ గ్యాస్ను ‘అడ్మినిస్ట్రేటెడ్ ప్రైసింగ్ మెకానిజం’ వద్ద వినియోగదారులకు విక్రయిస్తారు.ఇంట్లో వంట అవసరాలకు పైపుల ద్వారా సహజ వాయువుగా ఈ గ్యాస్ను సరఫరా చేస్తారు. ఆటోమొబైల్స్ అవసరాల కోసం కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్గా మారుస్తారు. ప్రభుత్వం రూపొందించిన రోడ్ మ్యాప్కు అనుగుణంగా రెండేళ్లలో తొలిసారి ధరల పెంపును అమలు చేశారు. 2023 ఏప్రిల్లో దేశీయంగా ఉత్పత్తి అయిన సహజ వాయువు ధరలను మిలియన్ థర్మల్ యూనిట్లకు 4 డాలర్లు నుంచి గరిష్టంగా 6.5 డాలర్లుగా పరిమితిని విధించారు. ధరల పెంపుకు సంబంధించి నిపుణుల కమిటీ నివేదికను గతంలో కేంద్ర కేబినెట్ ఆమోదించింది. 2027 వరకు 0.5 డాలర్లు పెంచాలని సూచించింది. 2023 నుంచి రెండేళ్లపాటు ఎలాంటి పెంపు తీసుకోలేదు. ఈ గడువు ముగియడంతో తాజాగా 0.25 డాలర్ల పెంపు అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వచ్చే రెండేళ్ల పాటు రేట్లు మారవని, ఆ తర్వాత మరో 0.25 డాలర్లు పెంచాలని కేంద్ర కేబినెట్ ఇప్పటికే నిర్ణయించింది.ఇదీ చదవండి: నేటి నుంచి అమల్లోకి కొత్త ఆర్థిక మార్పులుకంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) అనేది అధిక పీడనం వద్ద నిల్వ చేసి ఉపయోగించేందుకు వీలైన గ్యాస్. దీన్ని ప్రధానంగా మీథేన్, గ్యాసోలిన్, డీజిల్ లేదా బొగ్గు వంటి సాంప్రదాయ శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా వినియోగాస్తున్నారు. కార్లు, బస్సులు, ట్రక్కులు, ఆటోరిక్షాలు సహా ఆటోమొబైల్స్కు ప్రత్యామ్నాయ ఇంధనంగా సీఎన్జీని విస్తృతంగా వాడుతున్నారు. గ్యాసోలిన్ లేదా డీజిల్, పెట్రోల్తో పోలిస్తే తక్కువ ఉద్గారాలు విడుదల చేస్తుంది.

రెనో చేతికి నిస్సాన్ వాటా
న్యూఢిల్లీ: దేశంలోని జపనీస్ కంపెనీ నిస్సాన్ వాటాను ఫ్రెంచ్ ఆటో రంగ దిగ్గజం రెనో కొనుగోలు చేయనుంది. దాంతో దేశీ భాగస్వామ్య కంపెనీ(జేవీ) రెనో నిస్సాన్ ఆటోమోటివ్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్(ఆర్ఎన్ఏఐపీఎల్)ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ జేవీలో నిస్సాన్కుగల 51 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు రెనో తాజాగా పేర్కొంది. తద్వారా జేవీలో 100 శాతం వాటా పొందనున్నట్లు, కొనుగోలు ఒప్పందం(ఎస్పీఏ) కుదిరినట్లు తెలియజేసింది. అయితే వాటా విలువను వెల్లడించలేదు. ఈ లావాదేవీ తదుపరి రెనో నిస్సాన్ జేవీలో రెనో గ్రూప్ వాటా 100 శాతానికి చేరనుంది. చెన్నైలోగల ప్లాంటు ద్వారా రెనో, నిస్సాన్ బ్రాండ్ల వాహనాలను జేవీ రూపొందిస్తోంది. ఈ ప్లాంటు 6,300 ఉద్యోగులతో వార్షికంగా 4.8 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రస్తుతం సీఎంఎఫ్ఏ, సీఎంఎఫ్ఏ ప్లస్ ప్లాట్ఫామ్లపై కైగర్, ట్రైబర్, క్విడ్ వాహనాలను తయారు చేస్తున్నట్లు రెనో గ్రూప్ సీఎఫ్వో డంకన్ మింటో పేర్కొన్నారు.ఐటీసీ గూటికి సెంచరీ పల్ప్డీల్ విలువ రూ.3,498 కోట్లున్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్ (ఏబీఆర్ఈఎల్)లో భాగమైన సెంచరీ పల్ప్ అండ్ పేపర్ను డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ తాజాగా కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ. 3,498 కోట్లు. దీనితో కీలకమైన రియల్ ఎస్టేట్ విభాగంపై మరింతగా దృష్టి పెట్టేందుకు వెసులుబాటు లభిస్తుందని ఏబీఆర్ఈఎల్ ఎండీ ఆర్కే దాల్మియా తెలిపారు. అలాగే ఏబీఆర్ఈఎల్ వాటాదార్లకు అధిక విలువ చేకూర్చేందుకు తోడ్పడుతుందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: నేటి నుంచి అమల్లోకి కొత్త ఆర్థిక మార్పులు

నేటి నుంచి అమల్లోకి కొత్త ఆర్థిక మార్పులు
నూతన ఆర్థిక సంవత్సరంలో కొన్ని కీలక ఆర్థిక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆదాయపన్ను దగ్గర్నుంచి క్రెడిట్ కార్డు రివార్డులు, టీడీఎస్ వరకు జరిగే ఈ మార్పుల ప్రభావం.. వ్యక్తిగత బడ్జెట్, ఆర్థిక ప్రణాళికలపై కచ్చితంగా ఉంటుంది. వీటిపై ఓసారి దృష్టి సారిద్దాం.2025–26 బడ్జెట్లో కొత్త ఆదాయపన్ను విధానంలో కలి్పంచిన పన్ను ప్రయోజనాలు 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చేశాయి. నూతన విధానంలో రూ.12 లక్షలకు మించకుండా ఆదాయం ఉన్న వారు పన్ను చెల్లించక్కర్లేదు. వేతన జీవులు అయితే స్టాండర్డ్ డిడక్షన్ రూ.75వేలతో కలుపుకుని రూ.12.75 లక్షలకు మించని ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉపశమనం కల్పించారు.వేతన జీవులు, పెన్షనర్లకు ఇంతకుముందు వరకు నూతన పన్ను విధానంలో రూ.50 వేలుగానే ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం రూ.75 వేలకు పెరిగింది. 60 ఏళ్లు నిండిన వృద్ధులకు (సీనియర్ సిటిజన్స్) బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50వేలు మించితే టీడీఎస్ అమలు చేసేవారు. ఇప్పుడు ఈ పరిమితి రూ.లక్షకు పెంచారు. దీంతో వృద్ధులకు పెద్ద ఉపశమనం దక్కింది. 60 ఏళ్లలోపు ఉన్న డిపాజిట్లకు వడ్డీ ఆదాయం రూ.40వేలు మించితే టీడీఎస్ అమలు చేస్తుండగా, ఈ పరిమితి రూ.50వేలకు పెరిగింది. ఇన్సూరెన్స్ బ్రోకర్లకు వచ్చే కమీషన్ ఆదాయం ఏడాదిలో రూ.15,000 మించితే టీడీఎస్ అమలు చేస్తుండగా, ఈ పరిమితి రూ.20,000కు పెరిగింది. యాక్టివ్గా లేని (కార్యకలాపాల్లేని) ఖాతాలకు అనుసంధానమైన యూపీఐ ఐడీలు ఇక పనిచేయవు. భద్రత దృష్ట్యా వీటిని డీయాక్టివేట్ చేయనున్నారు. తమ ఖాతాలను యాక్టివ్గా మార్చుకుని తిరిగి యూపీఐ ఐడీ క్రియేట్ చేసుకోవచ్చు. సెబీ ఆదేశాల ప్రకారం మ్యూచువల్ ఫండ్స్ కొత్త పథకాల (ఎన్ఎఫ్వోలు) రూపంలో ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసిన నిధులను, ఇష్యూ ముగిసిన తర్వాత 30 పనిదినాల్లో ఇన్వెస్ట్ చేయడం తప్పనిసరి.ఇదీ చదవండి: యాపిల్పై రూ.1,350 కోట్లు జరిమానాస్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (సిఫ్) పేరుతో సెబీ ప్రకటించిన కొత్త తరహా పెట్టుబడుల విభాగం ఆచరణలోకి రానుంది. ఇన్వెస్టర్లు కనీసం రూ.10 లక్షలతో ఇందులో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఇన్వెస్టర్లు తమ డీమ్యాట్ అకౌంట్ స్టేట్మెంట్లు, కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్లను నేరుగా డిజీలాకర్లోకి వెళ్లేలా చేసుకోవచ్చు. తద్వారా ఇన్వెస్టర్లు, వారి నామినీలు ఈక్విటీ పెట్టుబడుల వివరాలను కోరుకున్నప్పుడు సులభంగా పొందేందుకు వీలుంటుంది. ఎస్బీఐ తన క్రెడిట్ కార్డుల్లో కొన్ని రకాలపై రివార్డు పాయింట్ల పరంగా చేసిన మార్పులు అమల్లోకి వచ్చేశాయి. దీంతో సింప్లీ క్లిక్ ఎస్బీఐ కార్డు దారులు స్విగ్గీ షాపింగ్పై ప్రస్తుతం పొందుతున్న పది రెట్ల రివార్డు పాయింట్లు కాస్తా ఐదు రెట్లకు తగ్గిపోయాయి. అమెరికా డిమాండ్ల మేరకు ఆ దేశం నుంచి దిగుమతయ్యే కొన్ని రకాల ఉత్పత్తులపై భారత్ టారిఫ్లు తగ్గించాలనుకుంటోంది. దీని ఫలితంగా అమెరికా నుంచి వచ్చే యాపిల్స్, బాదం, ఆటో ఉత్పత్తుల ధరలు దిగిరావొచ్చు.

హల్దీరామ్లో వాటా విక్రయం
న్యూఢిల్లీ: ఫాస్ట్ఫుడ్ కంపెనీ హల్దీరామ్ స్నాక్స్ ఫుడ్ తాజాగా యూఏఈ సంస్థ ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ(ఐహెచ్సీ)తోపాటు ఇన్వెస్ట్మెంట్ సంస్థ అల్ఫా వేవ్ గ్లోబల్కు మైనారిటీ వాటా విక్రయించనుంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం రెండు సంస్థలు సంయుక్తంగా హల్దీరామ్లో 6 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. స్నాక్, ఫుడ్ బ్రాండ్ హల్దీరామ్స్లో ఇప్పటికే టెమాసెక్ ఈక్విటీ పెట్టుబడులకు సిద్ధపడగా.. మరో రెండు సంస్థలు ఐహెచ్సీ, అల్ఫా వేవ్ గ్లోబల్ సైతం వాటా కొనుగోలు చేయనున్నట్లు హల్దీరామ్ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే డీల్ వివరాలు వెల్లడించలేదు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ టెమాసెక్కు ఇప్పటికే మైనారిటీ వాటా విక్రయించేందుకు ఒప్పందం కుదిరిన నేపథ్యంలో హల్దీ రామ్ తాజా ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది. కాగా.. 10 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 85,000 కోట్లు) విలువలో హల్దీరామ్ లో మైనారిటీ వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు అంచనా.

చిన్న షేర్ల జోష్
తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరం(2024–25)లో దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్పంగా బలపడ్డాయి. ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 5 శాతం లాభపడింది. అయితే అత్యధిక శాతం ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడంతో చిన్న షేర్ల ఇండెక్స్ బీఎస్ఈలో 8 శాతం పురోగమించింది. ఇందుకు ప్రధానంగా మార్చి నెల మద్దతిచ్చింది.న్యూఢిల్లీ: పలు ఆటుపోట్ల మధ్య 2024–25లో స్టాక్ మార్కెట్లు నికరంగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 3,764 పాయింట్లు(5.1 శాతం) పుంజుకోగా.. బీఎస్ఈలో స్మాల్క్యాప్ ఇండెక్స్ 3,472 పాయింట్లు(8 శాతం) ఎగసింది. ఈ బాటలో మిడ్క్యాప్ సైతం 2,209 పాయింట్లు(5.6 శాతం) వృద్ధి చెందింది. ఇందుకు ప్రధానంగా మార్చి నెల దన్నుగా నిలిచింది. గతేడాది అక్టోబర్ నుంచి అమ్మకాల బాట పట్టిన విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) గత నెలలో ఉన్నట్టుండి కొనుగోళ్ల యూటర్న్ తీసుకోవడంతో మార్కెట్లు భారీ నష్టాల నుంచి రికవరీ సాధించాయి. దీంతో పూర్తి ఏడాదికి లాభాలతో నిలిచాయి. ప్రధానంగా రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపడం మిడ్, స్మాల్క్యాప్ కౌంటర్లకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. నష్టాలకు చెక్ గతేడాది అక్టోబర్ మొదలు వరుసగా 5 నెలలపాటు నష్టాలతో ముగిసిన మార్కెట్లు గత నెలలో బౌన్స్బ్యాక్ అయ్యాయి. తద్వారా గతేడాది నికరంగా లాభాలతో నిలిచినట్లు లెమన్ మార్కెట్స్ డెస్క్ విశ్లేషకులు సతీష్ చంద్ర ఆలూరి పేర్కొన్నారు. ప్రధానంగా మిడ్, స్మాల్క్యాప్ ఇండెక్సులు మార్కెట్లను మించి బలపడినట్లు తెలియజేశారు. అందుబాటు విలువలకు చేరిన పలు షేర్లకుతోడు దేశీయంగా నెలకొన్న ఆశావహ పరిస్థితులు, ఎఫ్పీఐల పెట్టుబడులు ఇందుకు కారణమైనట్లు వివరించారు. దీంతో ప్రస్తుతం చరిత్రాత్మక సగటులకు పలు కౌంటర్లు చేరినట్లు అభిప్రాయపడ్డారు. ఈక్విటీల విలువలు ఖరీదుగా మారడంతో అక్టోబర్ నుంచి ఎఫ్పీఐలు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. వెరసి దేశీ స్టాక్ మార్కెట్లు ‘బేర్’ ట్రెండ్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎఫ్పీఐలు పెట్టుబడులవైపు మళ్లడంతోపాటు.. భారీ సంఖ్యలో రిటైల్ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో మార్కెట్లు నష్టాలనుంచి బయటపడినట్లు నిపుణులు తెలియజేశారు. ఇది చివరికి మార్కెట్లు సానుకూల ధోరణిలో ముగిసేందుకు దోహదం చేసినట్లు వివరించారు. ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల యూఎస్ ఫెడరల్ రిజర్వ్ 2025లో వడ్డీ రేట్ల కోత సంకేతాలు ఇవ్వడం సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు పేర్కొన్నారు. ప్రీమియం విలువల ఎఫెక్ట్ నిజానికి బుల్ మార్కెట్లలో ప్రధాన ఇండెక్సులతో పోలిస్తే మిడ్, స్మాల్ క్యాప్స్ మరింత అధికంగా ర్యాలీ చేయవలసి ఉన్నట్లు హైబ్రో సెక్యూరిటీస్ వ్యవస్థాపకులు తరుణ్ సింగ్ పేర్కొన్నారు. గతేడాది చిన్న షేర్ల ఇండెక్సులు రెండంకెల స్థాయిలో వృద్ఢి చూపకపోవడానికి మార్కెట్ల ర్యాలీ చాలా ముందుగానే ప్రారంభంకావడంతో షేర్ల ధరలు భారీగా పెరిగాయని, ఇందుకు తగిన స్థాయిలో కంపెనీల పనితీరు లేకపోవడం ఇన్వెస్టర్లను నిరాశపరచిందని వివరించారు. గత రెండు త్రైమాసికాలలో అంచనాలకంటే దిగువన వెలువడిన ఫలితాలు షేర్ల ప్రీమియం ధరలకు మద్దతివ్వలేకపోయినట్లు తెలియజేశారు. మరోవైపు యూఎస్ కొత్త ప్రెసిడెంట్ ట్రంప్ భారత్సహా పలు దేశాలపై ప్రతీకార టారిఫ్లకు తెరతీయడం సెంటిమెంటును బలహీనపరచినట్లు మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ డైరెక్టర్ పాల్క అరోరా చోప్రా పేర్కొన్నారు. సరికొత్త రికార్డులు గతేడాది(2024) సెప్టెంబర్ 27న సెన్సెక్స్ చరిత్రాత్మక గరిష్టం 85,978 పాయింట్లను అధిగమించగా.. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ అదేనెల 24న 49,701ను తాకి సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. ఈ బాటలో స్మాల్క్యాప్ సైతం 2024 డిసెంబర్ 12న 57,828 పాయింట్ల వద్ద లైఫ్టైమ్ గరిష్టానికి చేరింది. నిజానికి బ్లూచిప్స్ లేదా లార్జ్క్యాప్ స్టాక్స్ను ఎఫ్పీఐలు అత్యధికంగా కొనుగోలు చేస్తే.. రిటైలర్లు చిన్న షేర్లపట్ల ఆకర్షితులవుతుంటారని విశ్లేషకులు వివరించారు. అయితే ఇకపై ఆయా కంపెనీల ఫలితాల ఆధారంగా స్టాక్ విలువలు సర్దుబాటుకానున్నట్లు తెలియజేశారు. కొత్త ఆర్థిక సంవత్సరం(2025–26)లో అడుగుపెడుతున్న నేపథ్యంలో దేశీ ఈక్విటీ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య వృద్ధి బాటలో సాగే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ పరిస్థితులు, మార్కెట్ల ట్రెండ్సహా దేశీయంగా కార్పొరేట్ ఫలితాలు, ప్రభుత్వ, ప్రయివేట్ పెట్టుబడులు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు వివరించారు.మార్చిలో బూస్ట్ఎఫ్పీఐలు, రిటైలర్ల పెట్టుబడుల దన్నుతో ఒక్క మార్చి నెలలోనే మార్కెట్లు భారీగా టర్న్అరౌండ్ అయ్యాయి. సెన్సెక్స్ 4,217 పాయింట్లు(5.8 శాతం) ఎగసింది. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3,555 పాయింట్లు(8.3%) జంప్చేస్తే, మిడ్క్యాప్ 2,939 పాయింట్లు(7.6%) బలపడింది. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు తలెత్తినప్పటికీ దేశీయంగా సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు, విధానాల కొనసాగింపుపై అంచనాలు ఇన్వెస్టర్లలో మార్కెట్లపట్ల విశ్వాసాన్ని పెంచాయి. ఫలితంగా గతేడాది పలు ఆటుపోట్ల మధ్య మార్కెట్లు నికరంగా లాభపడ్డాయి.
బిజినెస్ పోల్
కార్పొరేట్

రెనో చేతికి నిస్సాన్ వాటా

హల్దీరామ్లో వాటా విక్రయం

యాపిల్పై రూ.1,350 కోట్లు జరిమానా

అంకురా ఆసుపత్రికి ఏడీబీ రూ.165 కోట్ల నిధులు

పీఎల్ఐను మించిన విధానాల రూపకల్పన

ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలు

బ్యాంక్టెక్లో బిలియన్ డాలర్ల పెట్టుబడులు

బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ప్రభుత్వరంగ బీమా సంస్థ టైఅప్

ఇండిగోకు రూ.944 కోట్ల జరిమానా

రూ.8000 కోట్లకు కంపెనీ అమ్మేసి.. ఫిజిక్స్ చదువుతున్నాడు

ఐపీవోకు హైదరాబాద్ కంపెనీ
హైదరాబాద్: ఇంజినీరింగ్ సంబంధ సేవలందించే హైదరాబాద...

రియల్టీ లావాదేవీల్లో సీబీఆర్ఈ టాప్
న్యూఢిల్లీ: గతేడాది అత్యధిక స్థాయిలో కమర్షియల్ రి...

అమాంతం పెరిగిపోతున్న బంగారం ధరలు: నాలుగు రోజుల్లో..
ఉగాదికి ముందే బంగారం ధరలు తారాస్థాయికి చేరుతున్నాయ...

రూ.26 లక్షల కోట్లు: 2024-25కు నష్టాలతో వీడ్కోలు
ముంబై: దలాల్ స్ట్రీట్ ఇన్వెస్టర్ల సంపద మార్చి 28...

రూ.5.91 లక్షల కోట్లు బాకీ.. కట్టాల్సినవారు మాయం!
న్యూఢిల్లీ: ఆదాయపన్ను చెల్లింపుదారులకు సంబంధించి ఆ...

రెస్టారెంట్ సర్వీసుల్లో జీఎస్టీపై స్పష్టత
న్యూఢిల్లీ: రెస్టారెంట్ల సర్వీసులపై విధించే జీఎస్...

రైల్వే టికెట్ కౌంటర్లో కొన్నా.. ఆన్లైన్లో క్యాన్సిల్ చేసుకోవచ్చు
రైల్వే టికెట్లను.. రైల్వే కౌంటర్లలో కొనుగోలు చేస్త...

ఆర్థిక తారతమ్యాల భారతం!
భారత్తోపాటు అనేక దేశాల్లో ఆర్థిక అసమానతలు అధికం అ...
ఆటోమొబైల్
మనీ మంత్ర

నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

చిన్న షేర్ల జోష్

ఎఫ్ఎంసీజీ దిగ్గజాల షాపింగ్

నష్టాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు

స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

ఆన్లైన్ ప్రకటనలపై డిజిటల్ ట్యాక్స్ తొలగింపు

ఒక్కరోజులో 1000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

మార్కెట్లకు విదేశీ జోష్
టెక్నాలజీ

నిమిషాల్లో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ - వీడియో
డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయడం గురించి అందరికీ తెలుసు. ముందుగా ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లి.. వ్యాలిడిటీ ముగిసిన డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్ ఇవ్వాల్సి, రెన్యువల్ కోసం ఫామ్ 9 ఫిల్ చేయాలి. మెడికల్ సర్టిఫికెట్, ఐడెంటిటీ ప్రూఫ్, రెసిడెన్సీ ప్రూఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు వంటివి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.అవసరమైన డాక్యుమెంట్స్ అందించిన తరువాత.. బయోమెట్రిక్, ఫీజు చెల్లింపులు వంటివి చేయాలి. ఇలా అన్నీ పూర్తి చేసిన తరువాత మీ చేతికి రెన్యూవల్ డ్రైవింగ్ లైసెన్స్ అందటానికి కనీసం 15 నుంచి 30 రోజుల సమయం పడుతుంది. అయితే దుబాయ్లో కేవలం రెండే నిమిషాల్లో రెన్యువల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.వీడియోలో గమనించినట్లయితే.. ఒక మహిళ ఆర్టీఏ స్మార్ట్ కియోస్క్ ద్వారా రెన్యువల్ డ్రైవింగ్ లైసెన్స్ కార్డును పొందటం చూడవచ్చు. మహిళ మెషీన్ దగ్గరకు వెళ్లి డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవడానికి అవసరమైన ఆప్షన్స్ ఎంచుకుని.. కేవలం నిమిషాల్లో డ్రైవింగ్ లైసెన్స్ కార్డును పొందుతుంది. ఇది చూడటానికి ఓ ఏటీఎం మెషీన్స్ మాదిరిగా ఉంటుంది. ఇలాంటి మెషీన్స్ దుబాయ్లో అక్కడక్కడా కనిపిస్తాయి.ఇదీ చదవండి: బ్రిటన్ వీడనున్న స్టీల్ టైకూన్ లక్ష్మీ మిత్తల్?: కారణం ఇదే..ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తూ.. ఇలాంటిది మనదేశంలో కూడా ఉండుంటే బాగుంటుందని అంటున్నారు. రెన్యువల్ డ్రైవింగ్ లైసెన్స్ కోడం వేచి చూడాల్సిన అవసరం లేకుండా ఇవి ఉపయోగపడతాయని చెబుతున్నారు.Compare this to the process of renewal of driving licence in India. pic.twitter.com/Xs2eXygI99— Tushar (@Tusharufo2) March 27, 2025

వాట్సప్ మేసేజ్లతో రూ.90 కోట్లు రికవరీ
పన్ను ఎగవేతదారులు, ఆర్థిక నేరగాళ్లపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా ఎన్క్రిప్టెడ్ సందేశాలు, ఈమెయిల్స్ను యాక్సెస్ చేసే వెసులుబాటును పన్ను అధికారులకు కల్పించే ఆదాయపు పన్ను బిల్లు 2025ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్థించారు. అక్రమ సిండికేట్ నుంచి రూ.90 కోట్లకు పైగా క్రిప్టోకరెన్సీకి సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి వాట్సాప్ సందేశాలను డీక్రిప్ట్ చేయడం ఎంతో తోడ్పడిందని గుర్తు చేశారు. కొత్త ఆదాయ పన్ను బిల్లులోని నిబంధనలపై పార్లమెంట్లో ఆమె మాట్లాడారు.ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ఛానళ్ల దుర్వినియోగం పెరుగుతోందని, మనీలాండరింగ్, పన్ను ఎగవేత వంటి కార్యకలాపాల కోసం నేరగాళ్లు వాట్సాప్ వంటి ప్లాట్ఫామ్లను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ‘1961 ఆదాయపు పన్ను చట్టంలో ఫిజికల్ బుక్స్ ఆఫ్ అకౌంట్, లెడ్జర్లు, మాన్యువల్ రికార్డుల గురించే ప్రస్తావించారు. డిజిటల్ రికార్డులను ప్రస్తావించలేదు. ఫిజికల్ లెడ్జర్లను చూపించినప్పటికీ డిజిటల్ రికార్డులు ఎందుకు అవసరమని కొందరు ప్రశ్నించవచ్చు. అయితే ఇది ఎంతో అవసరం. ఈ రెండింటి మధ్య లోటును పూడ్చడమే కొత్త బిల్లు లక్ష్యం’ అని ఆమె పార్లమెంటులో అన్నారు.‘ఎన్క్రిప్టెడ్ మెసేజ్లు, మొబైల్ ఫోన్లలోని వివరాలు స్కాన్ చేయడం ద్వారా ఆదాయపు పన్ను అధికారులు ఇప్పటికే రూ.250 కోట్లు లెక్కల్లోకి రాని నిధులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రూ.200 కోట్ల బోగస్ బిల్లులకు పాల్పడిన సిండికేట్లు, తప్పుడు పత్రాలతో భూముల అమ్మకంలో మూలధన లాభాలను తారుమారు చేసిన ఉదంతాలున్నాయి. ఇవి వాట్సాప్ ద్వారా బట్టబయలయ్యాయి. లెక్కల్లోకి రాని లావాదేవీలను ట్రాక్ చేయడానికి గూగుల్ మ్యాప్స్ హిస్టరీలను కూడా ఉపయోగించాం. బినామీ ఆస్తులను గుర్తించడానికి ఇన్స్టాగ్రామ్లోని ప్రొఫైల్స్ సహాయపడ్డాయి’ అని ఆమె అన్నారు. అయితే ఎన్క్రిప్టెడ్ సందేశాలు ఎలా యాక్సెస్ అయ్యాయో మాత్రం ఆమె వివరించలేదు.ప్రపంచవ్యాప్తంగా మూడు బిలియన్ల(300 కోట్ల) మంది యూజర్లు ఉన్నారని చెప్పుకునే మెటా యాజమాన్యంలోని వాట్సాప్ కేంద్ర ప్రతిపాదిత చట్టంపై స్పందించలేదు. మెటా ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ సందేశాలను షేర్ చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. అంటే మీరు కమ్యూనికేట్ చేస్తున్న వ్యక్తికి, మీకు మధ్య వ్యక్తిగత సందేశాలను షేర్ చేస్తుంది. దీన్ని సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఎవరూ చదవలేరు, వినలేరు, షేర్ చేయలేరని కంపెనీ గతంలో తెలిపింది. కానీ ఈ డేటాను ప్రభుత్వం ఎలా ఉపయోగించిందో తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: కోహ్లీ లేకపోతే.. టీసీఎస్ లేదువాట్సాప్, భారత ప్రభుత్వం మధ్య కొన్నేళ్లుగా విభేదాలు ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021 కింద సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు మెసేజ్ ముందుగా షేర్ చేసిన మూలకర్తను గుర్తించాలని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై) ఆదేశాలను సవాలు చేస్తూ వాట్సాప్ 2021లో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా దావా వేసింది. తన ఎన్క్రిప్షన్ ప్రమాణాల విషయంలో రాజీపడవలసి వస్తే భారత మార్కెట్ నుంచి నిష్క్రమించేందుకై వెనుకాడబోమని 2024 ఏప్రిల్లో వాట్సప్ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది.

జ్యూస్ అమ్మే వ్యక్తికి రూ.7.79 కోట్ల ట్యాక్స్ నోటీస్
2024-25 ఆర్ధిక సంవత్సరం ముగుస్తున్న తరుణంలో అందరూ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంది. అయితే ఉత్తరప్రదేశ్లోని అలీఘర్కు చెందిన ఒక జ్యూస్ వ్యాపారి.. తనకు వచ్చిన ట్యాక్స్ నోటీస్ చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఉత్తరప్రదేశ్లోని అలీఘర్కు చెందిన మొహమ్మద్ రహీస్ జ్యూస్ అమ్ముకుంటూ జీవినం సాగిస్తున్నారు. మార్చి 18న అతనికి ఆదాయపు పన్ను శాఖ ట్యాక్స్ నోటీస్ పంపించింది. అందులో రూ. 7.79 కోట్లు ట్యాక్స్ చెల్లించాలని ఉంది. ఇది చూడగానే అతడు షాక్కు గురయ్యాడు. దీనిపై మార్చి 28 లోపల స్పందించాలని ఉండడంతో అతనికి ఏమి చేయాలో పాలుపోలేదు.భారీ మొత్తంలో చెల్లించాలని వచ్చిన ట్యాక్స్ నోటీసు గురించి కనుక్కోవడానికి.. స్నేహితులను సంప్రదించారు. వారు సంబంధిత అధికారులను కలుసుకోమని సలహా ఇచ్చారు. అధికారులు సైతం అతనికి వచ్చిన ట్యాక్స్ చూసి ఆశ్చర్యపోయారు. తాను రోజుకు కేవలం రూ. 500 నుంచి రూ. 600 మాత్రమే సంపాదిస్తానని, పెద్ద లావాదేవీలు ఎప్పుడూ చేయాలని.. అధికారులతో చెప్పాడు.ఇదీ చదవండి: మార్చి 31 డెడ్లైన్.. ఇవన్నీ పూర్తి చేశారా?బాధితుని పాన్ కార్డు వివరాలు ఎవరో వినియోగించి ఉండవచ్చని ఆదాయపన్ను శాఖ అధికారులు వెల్లడించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయమని సలహా ఇచ్చారు. తన వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దోషులను శిక్షించి జైలుకు పంపాలని రహీస్ కోరుకున్నాడు.

ఖరీదైన ఫోన్పై కళ్లు చెదిరే డిస్కౌంట్!
ఖరీదైన ప్రీమియం ఫోన్ తక్కువ ధరకు కొనాలనుకుంటున్నారా.. అయితే మీ కోసమే ఈ గుడ్ న్యూస్. ప్రీమియం ఫోన్లలో ఒకటైన శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా 5జీ (Samsung Galaxy S23 Ultra 5G) భారీ డిస్కౌంట్ లభిస్తోంది. గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా 5జీ ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్లో రూ .42,000 భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. రూ.1,29,999 ధరకు లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ క్వాడ్ కెమెరా సెటప్, ఎస్ పెన్ సపోర్ట్, పవర్ ఫుల్ స్నాప్ డ్రాగన్ 8 సిరీస్ ప్రాసెసర్, 5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో పాటు మరెన్నో ఫీచర్లను అందిస్తుంది.కాబట్టి తక్కువ ఖర్చుతో ప్రీమియం ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కు అప్ గ్రేడ్ కావాలనుకుంటే, ఫ్లిప్ కార్ట్ లో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా 5జీ డీల్ను అందుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా 5జీ అసలు ధర రూ .1,19,900 కాగా ప్రస్తుతం రూ .37,190 భారీ తగ్గింపుతో రూ .81,990 కు లిస్ట్ అయింది. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డును ఉపయోగించడం ద్వారా వినియోగదారులు 5 శాతం అపరిమిత క్యాష్ బ్యాక్ పొందవచ్చు. దీంతో రూ .77,890 కంటే తక్కువకే ఖరీదైన ఫోన్ను సొంతం చేసుకోవచ్చు. నెలకు రూ.2,883 నుంచి ప్రారంభమయ్యే ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి. పాత ఫోన్ను ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా మరింత తగ్గింపు పొందవచ్చు.శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా 5జీ స్పెసిఫికేషన్లుశాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రాలో 6.8 అంగుళాల డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ క్యూహెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,750 నిట్స్ పీక్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఉన్నాయి. అడ్రినో 740 జీపీయూతో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ సెట్ పై పనిచేసే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ 7 అప్ డేట్ కు అర్హత సాధించింది. ఐపీ 68-రేటెడ్ హ్యాండ్ సెట్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది 45 వాట్ వైర్డ్, 15 వాట్ వైర్ లెస్ ఛార్జింగ్ను సపోర్ట్ చేస్తుంది.ఇక కెమరా విషయానికి వస్తే.. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 200 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్, 10 మెగాపిక్సెల్ 3ఎక్స్ టెలీఫోటో, 10 మెగాపిక్సెల్ 10ఎక్స్ పెరిస్కోప్ జూమ్, 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. కనెక్టివిటీ ఆప్షన్లలో వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్సీ, అల్ట్రా-వైడ్బ్యాండ్, యూసెస్బీ 3.2 జెన్ 1 పోర్ట్ ఉన్నాయి.
పర్సనల్ ఫైనాన్స్

అరుదైన వ్యాధులు వస్తే.. ఇదిగో ఈ ఇన్సూరెన్స్..
హీమోఫీలియా, మర్ఫాన్ సిండ్రోమ్ లాంటి అరుదైన వ్యాధులు కొద్ది మందికి మాత్రమే వస్తాయి. కానీ వాటి తీవ్రత మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మంది 7 వేల పైగా రకాల అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారని అంచనా. ఇలాంటి వాటికి నాణ్యమైన చికిత్స దొరకడం కష్టంగానే ఉంటోంది.. అలాగే చికిత్స వ్యయాలు భారీగానే ఉంటున్నాయి.భారత్ విషయానికొస్తే 7 కోట్ల మంది అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారని అంచనాలున్నాయి. అవగాహనారాహిత్యం, వైద్యపరీక్షల వ్యయాలు భారీగా ఉండటం, ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు అంతగా లేకపోవడం వంటి అంశాల కారణంగా వారు సమయానికి సరైన చికిత్సను పొందలేకపోతున్నారు.ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) 4,001 అరుదైన వ్యాధులను గుర్తించింది. కానీ, 450 వ్యాధుల రికార్డులు మాత్రమే ఆస్పత్రుల్లో అధికారికంగా అందుబాటులో ఉంటున్నాయి. వైద్యపరీక్షలు, డేటా సేకరణపరమైన సవాళ్లను ఇది సూచిస్తోంది. 80 శాతం అరుదైన వ్యాధులు జన్యుపరమైనవే కాగా మిగతావి ఇన్ఫెక్షన్లు, ఆటోఇమ్యూన్ లేదా పర్యావరణంపరమైన అంశాల వల్ల వస్తున్నాయి.50 శాతం పైగా అరుదైన వ్యాధుల లక్షణాలు ఎక్కువగా పిల్లల్లోనే ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత ముందుగా వైద్యపరీక్షలు చేసి గుర్తించడం కీలకంగా ఉంటుంది. అరుదైన వ్యాధులకు ప్రత్యేకమైన చికిత్సలు, జీవిత కాల సంరక్షణ, కొన్ని సందర్భాల్లో ప్రయోగాత్మక చికిత్సలు కూడా అవసరమవుతాయి. అందుకే తగినంత బీమా కవరేజీ ఉండాలి. ఈ నేపథ్యంలో సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్, క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ల మధ్య వ్యత్యాసాలు, వాటితో ఏయే ప్రయోజనాలు ఉంటాయో తెలియజేసేదే ఈ కథనం. క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ అంటే.. సాధారణ ఆరోగ్య బీమాతో పోలిస్తే క్రిటికల్ ఇల్నెస్ (సీఐ) స్వరూపం భిన్నంగా ఉంటుంది. ఆస్పత్రిలో చికిత్స వ్యయాలకు మాత్రమే చెల్లించడం కాకుండా, వ్యాధి నిర్ధారణయినప్పుడు ఏకమొత్తంగా బీమా మొత్తాన్ని కంపెనీ చెల్లిస్తుంది. దీన్ని చికిత్స వ్యయాల కోసం కావచ్చు, కోల్పోయిన ఆదాయాన్ని భర్తీ చేసుకోవడం కోసం కావచ్చు, ఇతరత్రా ప్రత్యామ్నాయ చికిత్స కోసం కావచ్చు, పాలసీదారు తనకు కావాల్సిన విధంగా ఉపయోగించుకోవచ్చు.లూపస్ లేదా స్లెరోడెర్మాలాంటి అరుదైన ఆటోఇమ్యూన్ వ్యాధులకు సీఐ ప్లాన్తో ఆర్థికంగా కొంత ఉపశమనం లభించవచ్చు. సాధారణంగా ముందస్తుగా నిర్ణయించిన వ్యాధుల కేటగిరీలకు మాత్రమే సీఐ ప్లాన్లు బీమా మొత్తాన్ని చెల్లిస్తాయి. ఒకవేళ ఏదైనా అరుదైన వ్యాధికి కవరేజీ నుంచి మినహాయింపు ఉంటే, పాలసీదారుకు ఆర్థిక ప్రయోజనం దక్కదు. కవరేజీల్లో వ్యత్యాసం.. ఏది మెరుగైనది.. అరుదైన వ్యాధుల విషయంలో ప్రాథమిక ఆరోగ్య బీమా, హాస్పిటలైజేషన్, తక్షణ వైద్య వ్యయాలకు ఉపయోగపడుతుంది. డాక్టర్లను సంప్రదించడం, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేరడం, అవసరమైన ప్రొసీజర్లు మొదలైన వాటికి పాలసీ చెల్లిస్తుంది. అయితే, ఆదాయ నష్టం, దీర్ఘకాల సంరక్షణలాంటి పరోక్ష వ్యయాలకు కవరేజీనివ్వదు. మరోవైపు, క్రిటికల్ ఇల్నెస్ పాలసీ అనేది ఏకమొత్తంగా చెల్లిస్తుంది. దాన్ని పాలసీదారు తనకు కావాల్సిన విధంగా ఉపయోగించుకోవచ్చు.అయితే, సదరు వ్యాధి గురించి పాలసీలో ప్రస్తావిస్తేనే ఇది వీలవుతుంది. లేకపోతే కవరేజీ లభించదు. సాధారణంగా సీఐ పాలసీలు చాలా మటుకు అరుదైన వ్యాధులకు కవరేజీనివ్వవు. కాబట్టి ఆర్థిక భద్రత కోసం వాటిని మాత్రమే నమ్ముకోవడానికి ఉండదు. అరుదైన సమస్యలు ఉన్న వారు అధిక కవరేజీ ఉండే బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్, క్రిటికల్ ఇల్నెస్ పాలసీని కలిపి తీసుకుంటే ఆర్థికంగా భరోసాగా ఉంటుంది. అసాధారణ వ్యాధుల కోసం ఆర్థిక ప్రణాళిక.. అరుదైన వ్యాధులతో అధిక రిస్కులున్న వారు రెండు రకాల బీమాను తీసుకుంటే భరోసాగా ఉంటుంది. అధిక కవరేజీ ఉండే సాధారణ ఆరోగ్య బీమా పాలసీ, ఆస్పత్రి.. వైద్య వ్యయాలకు కవరేజీనిస్తుంది. ఇక క్రిటికల్ ఇల్నెస్ పాలసీ (ఒకవేళ తీసుకుంటే) వైద్యయేతర వ్యయాలకు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తుంది. కవరేజీల్లో అంతరాలను తగ్గించుకునేందుకు టాప్ అప్ ప్లాన్లు, నిర్దిష్ట వ్యాధి సంబంధిత పాలసీల్లాంటివి పరిశీలించవచ్చు.రెగ్యులర్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే.. సమగ్ర ఆరోగ్య బీమా పాలసీలనేవి హాస్పిటలైజేషన్ చార్జీలు, డాక్టర్ల కన్సల్టేషన్లు, వైద్య పరీక్ష ప్రొసీజర్లు, ఆస్పత్రిలో చేరడానికి ముందు అలాగే ఆ తర్వాత తలెత్తే వ్యయాలకు కవరేజీనిస్తాయి. హంటింగ్టన్స్ డిసీజ్ లేదా రెట్ సిండ్రోమ్లాంటి నరాల సంబంధిత అరుదైన వ్యాధుల విషయంలో హాస్పిటలైజేషన్.. సపోర్టివ్ కేర్కి, జీవక్రియ సంబంధ గౌచర్ వ్యాధి లేదా ఫ్యాబ్రీ వ్యాధి, ఎంజైమ్ మార్పిడి థెరపీ కూడా కవరేజీ లభిస్తుంది. అయితే, సాధారణ పాలసీల్లో అన్ని రకాల అరుదైన వ్యాధులూ కవర్ కావు. కాబట్టి, జేబు నుంచి భారీగా పెట్టుకోవాల్సి వస్తుంది.అమితాబ్ జైన్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్

కొత్త ఏడాది.. తెలివైన పెట్టుబడి
వైద్య ఖర్చులు అనూహ్యంగా పెరుగుతున్న ఈ కాలంలో వాటి కోసం కేవలం సొంత డబ్బుపైనే ఆధారపడితే ఇబ్బందులు తప్పవు. ఊహించని అత్యవసర వైద్య పరిస్థితులు పొదుపు సొమ్మును హరించేస్తాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్య బీమా పెరుగుతున్న వైద్య ఖర్చుల నుండి ఒక ముఖ్యమైన రక్షణ కవచంగా నిలుస్తుంది. ఆర్థిక ఒత్తిడి లేకుండా నాణ్యమైన వైద్య సంరక్షణను అందిస్తుంది. గుర్తుంచుకోండి.. మీరు ఆరోగ్యంపై పెట్టుబడి పెడుతున్నారంటే.. మీతోపాటు కుటుంబ భవిష్యత్తు కోసం కూడా పెట్టుబడి పెడుతున్నారని అర్థం.సంపూర్ణ కవరేజీ ఆధునిక ఆరోగ్య బీమా ఆసుపత్రిలో చేరినప్పుడు మాత్రమే కాదు.. ఓపీడీ సంప్రదింపులు, టెలిమెడిసిన్, ప్రివెంటివ్ చెకప్లు, వెల్నెస్ కార్యక్రమాలను కూడా కవర్ చేస్తుంది. చాలా పాలసీలు ఇప్పుడు ప్రసూతి సంరక్షణ, మానసిక ఆరోగ్యం, రీహాబిలిటేషన్ థెరపీ వంటి సేవలతో సంపూర్ణ కవరేజీ అందిస్తున్నాయి. మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక రక్షణ చాలా కీలకం. వ్యాధి-నిర్దిష్ట విధానాలు, క్రిటికల్ ఇల్నెస్ రైడర్లు దీర్ఘకాలిక భద్రతను నిర్ధారిస్తాయి.పన్ను ప్రయోజనాలూ..ఇటు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80డి కింద గణనీయమైన పన్ను ప్రయోజనాలను అందించడంతో పాటు అటు అవసరమైన ఆరోగ్య సంరక్షణ కవరేజీని అందించే రెండు వైపులా పదునుండే కత్తిలా హెల్త్ ఇన్సూరెన్స్ పనికొస్తుంది. ఆరోగ్య బీమా కోసం చెల్లించే ప్రీమియంలకు పన్ను మినహాయింపులు ఉంటాయి. ఇది ఆర్థికంగా తెలివైన పెట్టుబడిగా మారుతుంది. 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు తమ ఆరోగ్య బీమా ప్రీమియంపై సంవత్సరానికి రూ .25,000 వరకు మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక సీనియర్ సిటిజన్ల సిటిజన్ల విషయానికి వస్తే.. వారికి వైద్య ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి ఈ పరిమితి రూ .50,000 వరకు ఉంటుంది.ఎస్బీఐ జనరల్ హెల్త్ ఇన్సూరెన్స్లో విభిన్న ప్లాన్లుఎస్బీఐ జనరల్ హెల్త్ ఇన్సూరెన్స్ విభిన్న ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా సరసమైన, సౌకర్యవంతమైన ప్లాన్లను అందిస్తోంది. ఈ పాలసీలు హాస్పిటలైజేషన్, ఓపీడీ కన్సల్టేషన్లు, ప్రసూతి ప్రయోజనాలు, క్రిటికల్ ఇల్నెస్తో సహా విస్తృతమైన కవరేజీతో పాలసీదారులరకు బలమైన ఆర్థిక భద్రతను అందిస్తాయి.మనం కొత్త ఆర్థిక సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో, ఆరోగ్య బీమా పాలసీలో పెట్టుబడి పెట్టడం ఆర్థిక ఆరోగ్యం, స్థిరత్వానికి ఒక ముఖ్యమైన దశ. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కేవలం ఖర్చు మాత్రమే కాదు, ఇది మీ ఆర్థిక, శారీరక శ్రేయస్సు కోసం తెలివైన పెట్టుబడి.

పోస్టాఫీస్ పథకాల వడ్డీ రేట్లు ప్రకటించిన కేంద్రం
పోస్టాఫీస్ పొదుపు పథకాలకు వడ్డీ రేట్లలో.. కేంద్ర ప్రభుత్వం ఎటువంటి మార్పును ప్రకటించలేదు. కొత్తగా ప్రకటించిన రేట్లు 2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - జూన్ త్రైమాసికాలకు వర్తిస్తాయి. ఆర్థిక వ్యవహారాల శాఖ జారీ చేసిన సర్క్యులర్ ద్వారా దీనిని ధ్రువీకరించింది.కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, సుకన్య సమృద్ధి ఖాతా, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) మొదలైనవాటికి వర్తిస్తుంది. ఈ పథకాలకు 2024-25 ఆర్ధిక సంవత్సరంలో నిర్ణయించిన వడ్డీ రేట్లే వర్తిస్తాయి.ఏప్రిల్ 1, 2025 & జూన్ 30, 2025 మధ్య పోస్టాఫీస్ స్కీమ్ వడ్డీ రేట్లు➜పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా: 4 శాతం➜పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్: 6.7 శాతం➜పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ పథకం: 7.4 శాతం➜పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (1 సంవత్సరం): 6.9 శాతం➜పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (2 సంవత్సరాలు): 7 శాతం➜పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (3 సంవత్సరాలు): 7.1 శాతం➜పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (5 సంవత్సరాలు): 7.5 శాతం➜కిసాన్ వికాస్ పత్ర (KVP): 7.5 శాతం➜పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF): 7.1 శాతం➜సుకన్య సమృద్ధి యోజన: 8.2 శాతం➜నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్: 7.7 శాతం➜సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ (SCSS): 8.2 శాతంచిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం త్రైమాసికానికి ఒకసారి నిర్ణయిస్తుంది. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కేంద్రం చివరగా వడ్డీ రేట్లను నిర్ణయించింది. ఆ తరువాత ఇప్పటి వరకు వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. ఇప్పుడు కూడా అదే వడ్డీ రేట్లను నిర్ణయిస్తూ నిర్ణయం తీసుకుంది.వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచాలనే నిర్ణయానికి ప్రధాన కారణం.. మార్కెట్ పరిస్థితులనే చెప్పాలి. మార్కెట్లు నష్టాల్లో సాగుతున్న సమయంలో వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచడం వల్ల ఈ పథకాలలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపేవారి సంఖ్య ఎక్కువవుతుంది. ఈ చిన్న పొదుపు పథకాలు సాధారణ ప్రజలకు స్థిరమైన పెట్టుబడి అవకాశాలను అందించడం ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి.

ఏప్రిల్లో బ్యాంకులు పనిచేసేది 15 రోజులే!
మార్చి 2025 ముగుస్తోంది. దేశంలోని బ్యాంకుల నియంత్రణ సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఏప్రిల్లో బ్యాంకులు ఎన్ని రోజులు పనిచేస్తాయి, ఎన్ని రోజులు క్లోజ్లో ఉంటాయనే జాబితాను (Bank Holidays) విడుదల చేసింది. వచ్చే నెలలో వివిధ పనుల నిమిత్తం బ్యాంకులకు వెళ్లాల్సినవారు తప్పకుండా ఈ సెలవుల జాబితాను తెలుసుకోవాలి. తద్వారా మీ ప్రాంతంలో బ్యాంకులు ఎన్ని రోజులు మూసిఉంటాయో.. ఏయే రోజుల్లో పనిచేస్తాయో తెలుస్తుంది. తదనుగుణంగా బ్యాంకింగ్ పనిని ప్లాన్ చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది.ఏప్రిల్లో బ్యాంక్ హాలిడేస్➤1 ఏప్రిల్: యాన్యువల్ బ్యాంక్ క్లోజింగ్➤5 ఏప్రిల్: బాబూ జగ్జీవన్ రామ్ పుట్టినరోజు (తెలంగాణ/ హైదరాబాద్లోని బ్యాంక్లకు సెలవు)➤6 ఏప్రిల్: ఆదివారం (శ్రీరామనవమి)➤10 ఏప్రిల్: మహావీర్ జయంతి (గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ్ బెంగాల్, తెలంగాణలోని బ్యాంక్లకు సెలవు)➤12 ఏప్రిల్: రెండవ శనివారం➤13 ఏప్రిల్: ఆదివారం➤14 ఏప్రిల్: అంబేద్కర్ జయంతి ➤15 ఏప్రిల్: బెంగాలీ నూతన సంవత్సరం, భోగ్ బిహు (అసోం, పశ్చిమ్ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లోని బ్యాంక్లకు సెలవు)➤18 ఏప్రిల్: గుడ్ ఫ్రైడే (ఛండీగఢ్, త్రిపుర, అసోం, రాజస్థాన్, జమ్ము, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్లోని బ్యాంక్లకు సెలవు)➤20 ఏప్రిల్: ఆదివారం➤21 ఏప్రిల్: గరియా పూజ (త్రిపురలోని బ్యాంక్లకు సెలవు)➤26 ఏప్రిల్: నాల్గవ శనివారం➤27 ఏప్రిల్: ఆదివారం➤29 ఏప్రిల్: పరశురామ జయంతి (హిమాచల్ ప్రదేశ్లోని బ్యాంక్లకు సెలవు)➤30 ఏప్రిల్: బసవ జయంతి, అక్షయ తృతీయ (కర్ణాటకలోని బ్యాంక్లకు సెలవు)బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి.(బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్లో ఏవైనా అప్డేట్లు లేదా రివిజన్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది).
రియల్టీ
Business exchange section
Currency Conversion Rate
Commodities
Name | Rate | Change | Change% |
---|---|---|---|
Silver 1 Kg | 114000.00 | 1000.00 | 1.00 |
Gold 22K 10gm | 85100.00 | 850.00 | 1.00 |
Gold 24k 10 gm | 92840.00 | 930.00 | 1.00 |
Egg & Chicken Price
Title | Price | Quantity |
---|---|---|
Chicken (1 Kg skin less) | 277.00 | 1.00 |
Eggs | 66.00 | 12.00 |