Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Gold Rates changes by Evening 4th February in Telugu States1
మారిన బంగారం ధరలు.. సాయంత్రానికి కాస్త ఊరట!

బంగారం ధరలు వేగంగా మారిపోతున్నాయి. గంటల్లోనే రూ.వేలల్లో వ్యత్యాసాన్ని నమోదు చేస్తున్నాయి. బుధవారం ఉదయం అత్యంత భారీగా పెరిగిన బంగారం ధరలు.. సాయంత్రాని​కి కాస్త ఊరటనిచ్చాయి.హైదరాబాద్‌, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల (తులం) ధర బుధవారం ఉదయం రూ.6050 పెరిగి రూ. 1,47,150 లకు చేరుకోగా సాయంత్రానికి ఆ పెరుగుదల రూ.5050లకే పరిమితమై రూ.1,46,150లకు దిగివచ్చింది.ఇక 24 క్యారెట్ల పసిడి తులం ధర బుధవారం ఉదయం రూ.6600 ఎగిసి రూ. 1,60,530 లను తాకగా సాయంత్రానికి పెరుగుదల రూ.5510 లకు నెమ్మదించి రూ.1,59,440లకు చేరుకుంది.అంతర్జాతీయ అనిశ్చితులు అంతకంతకూ పెరుగుతుండటంతో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగానే బంగారం ధరల్లో ఈ స్థాయిలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Jio BlackRock Can Turn Indias Savings Into Investments Mukesh Ambani 2
ఇంటి పొదుపును ఇన్వెస్ట్‌మెంట్‌గా మారుస్తాం: అంబానీ

భారతదేశంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న దీర్ఘకాలిక పొదుపు సంస్కృతి ఉన్నప్పటికీ, అది ఇప్పటివరకు ఉత్పాదక సంపద సృష్టిగా పూర్తిగా మారలేదన్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ. గృహ పొదుపులను పెట్టుబడుల వైపు మళ్లించడంలో జియో–బ్లాక్‌రాక్ కీలక పాత్ర పోషించే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.ముంబైలో నిర్వహించిన జియో–బ్లాక్‌రాక్ ఫైర్‌సైడ్ చాట్‌లో బ్లాక్‌రాక్ సీఈవో లారీ ఫింక్‌తో సంభాషిస్తూ అంబానీ ఈ వ్యాఖ్యలు చేశారు. భారతీయులు గత ఐదు నుంచి ఆరు దశాబ్దాలుగా క్రమంగా పొదుపు చేస్తున్నప్పటికీ, ఆ మూలధనం ఎక్కువగా దీర్ఘకాలిక రాబడులు అందించే విధంగా ఉపయోగించబడలేదని ఆయన తెలిపారు. రాబోయే 20-30 ఏళ్లలో భారతదేశం 25 నుండి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే అవకాశం ఉందని, ఈ కాలం దేశంలోని యువ తరానికి అద్భుతమైన పెట్టుబడి అవకాశాన్ని అందిస్తుందని అన్నారు. పొదుపుదారులను పెట్టుబడిదారులుగా మారుస్తూ, పనికిరాని పొదుపును ఆదాయం తీసుకొచ్చే ఆస్తులుగా మార్చే మార్గాలను అందించడంలో జియో–బ్లాక్‌రాక్‌కు పెద్ద అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. “భారతీయులను కేవలం పొదుపు చేయడానికే కాదు, ఆ పొదుపులను సంపాదనగా మార్చుకునే ఎంపికలు అందించడమే మా లక్ష్యం” అని అంబానీ చెప్పారు.రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్లాక్‌రాక్ మధ్య ఉన్న భాగస్వామ్య తత్వాన్ని కూడా అంబానీ ప్రస్తావించారు. మూలధన కేటాయింపునకు సంబంధించిన విస్తృత దృష్టికోణంపై లారీ ఫింక్‌తో జరిగిన చర్చను గుర్తు చేస్తూ, “బ్లాక్‌రాక్ లక్ష్యం కేవలం స్వల్పకాలిక లాభాలు లేదా పెట్టుబడిదారులకు రాబడులు ఇవ్వడం మాత్రమే కాదు. ఆ మూలధనం సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడితేనే ఆ లక్ష్యం పూర్తైనట్టుగా భావిస్తారు. అదే తత్వం రిలయన్స్‌లో కూడా ఉంది” అని అంబానీ అన్నారు.

Olectra Greentech Sets New Milestone with Blade Battery Electric Buses3
బ్లేడ్‌ బ్యాటరీతో కొత్త బస్సులు

అధునాతన బ్లేడ్‌ బ్యాటరీ టెక్నాలజీతో కొత్త ఎలక్ట్రిక్‌ బస్సుల ఉత్పత్తిని వచ్చే త్రైమాసికం నుంచి ప్రారంభించనున్నట్లు ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ తెలిపింది. దేశీయంగా ఎలక్ట్రిక్‌ బస్సుల రంగంలో తొలిసారిగా తాము రూపొందించిన ఈ ప్యాక్‌కి సర్టిఫికేషన్‌ లభించడం కంపెనీ ప్రస్థానంలో కీలక మైలురాయని సంస్థ ఎండీ మహేష్‌ బాబు చెప్పారు.మౌలిక రంగ దిగ్గజం ఎంఈఐఎల్‌ అనుబంధ సంస్థ అయిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 46.68 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఆదాయం 29 శాతం వృద్ధితో రూ. 663.60 కోట్లకు చేరుకుంది. నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం వల్ల ఆకర్షణీయమైన ఫలితాలను సాధించినట్లు మహేష్‌ బాబు తెలిపారు.ఒక్క త్రైమాసికంలోనే అత్యధికంగా 385 ఎలక్ట్రిక్‌ వాహనాలను డెలివరీ చేసి కొత్త రికార్డును నెలకొల్పినట్లు వివరించారు. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 37 శాతం పెరిగినట్లు చెప్పారు. ఇప్పటివరకు 3,639 వాహనాలను డెలివరీ చేయగా, 9,439 వాహనాలకు ఆర్డర్‌ బుక్‌ ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

Stock Market Highlights February 4 20264
Stock Market: ఐటీ షేర్లు తలకిందులు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో ఫ్లాట్‌గా ముగిశాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో పురోగతి గురించి ఆందోళనలు ఇన్వెస్టర్లను భయపెట్టడంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) స్టాక్స్‌ అమ్మకాల ఒత్తిడితో తలకిందులయ్యాయి. మార్కెట్ ముగింపు సమయానికి నిఫ్టీ 48.45 పాయింట్లు లేదా 0.19 శాతం లాభంతో 25,776.00 వద్ద, సెన్సెక్స్ 78.56 పాయింట్లు లేదా 0.09 శాతం లాభపడి 83,817.69 వద్ద ముగిసింది. ఏఐ స్టార్టప్ ఆంత్రోపిక్ అంతర్గత న్యాయవాదుల కోసం ఉత్పాదకత సాధనాన్ని విడుదల చేసిన తరువాత వాల్ స్ట్రీట్ సాఫ్ట్ వేర్ సంస్థల షేర్లు పడిపోవడంతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 6 శాతం పడిపోయింది. అటువంటి ఏఐ సాధనాల అభివృద్ధి సాఫ్ట్‌వేర్ కంపెనీలను దెబ్బతీస్తుందని, పరిశ్రమ అంతటా లాభదాయకతను దెబ్బతీస్తుందని పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. సెన్సెక్స్ లో ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్‌ టెక్, టెక్ మహీంద్ర, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. మరోవైపు ఎటర్నల్, ట్రెంట్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.63 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.27 శాతం పెరిగాయి. నిఫ్టీ ఐటీని పక్కన పెడితే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 0.34 శాతం నష్టపోయింది. నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ వరుసగా 2.6 శాతం, 2 శాతం లాభాలతో అగ్రస్థానంలో ఉన్నాయి.

ITR Filing Deadline Extension Who Gets More Time and Who Doesnt5
ఐటీ రిటర్న్స్‌ గడువు పెంపు అందరికీనా?

ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఐటీఆర్ దాఖలు గడువును ఆగస్టు 31 వరకు పెంచుతున్నట్లు ఇటీవల 2026-27 బడ్జెట్‌లో ప్రకటించడంతో, ఈ పొడిగింపు పన్ను చెల్లింపుదారులందరికీ వర్తిస్తుందని చాలామంది భావిస్తున్నారు. కానీ అది పూర్తిగా నిజం కాదు.పీక్ ఫైలింగ్ సీజన్‌లో ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వం దశలవారీ ఫైలింగ్ టైమ్‌లైన్‌ను ప్రవేశపెట్టింది. అయితే ఈ సడలింపు ఎంపిక చేసిన కొన్ని కేటగిరీల ట్యాక్స్‌ పేయర్స్‌కు మాత్రమే పరిమితం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలోనే, అదనపు సమయం నిర్దిష్ట పన్ను చెల్లింపుదారులకు మాత్రమే ఉంటుందని, మిగతావారు ప్రస్తుత గడువునే పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.జూలై 31 గడువు ఎవరికీ వర్తిస్తుంది?వేతన పన్ను చెల్లింపుదారులు, పెన్షనర్లు, ఐటీఆర్-1 లేదా ఐటీఆర్-2 దాఖలు చేసే వ్యక్తులు, జీతం, వడ్డీ లేదా మూలధన లాభాల ద్వారా ఆదాయం పొందేవారికి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్స్‌ ఫైలింగ్‌కు జూలై 31 గడువే కొనసాగుతుంది. వీరికి ఎలాంటి గడువు పొడిగింపు లేదు. అందువల్ల, వారు మునుపటిలాగే తమ ఫైలింగ్ ప్రణాళికలను కొనసాగించాలి.ఆగస్టు 31 ఎవరికి?ఆడిట్ అవసరం లేని వ్యాపార సంస్థలు, ఫ్రీలాన్సర్లు, డాక్టర్లు, కన్సల్టెంట్లు వంటి వృత్తి నిపుణులు (నాన్-ఆడిట్ బిజినెస్ కేసులు), అర్హత కలిగిన కొన్ని ట్రస్టులు మాత్రమే జూలై 31కి బదులుగా ఆగస్టు 31 వరకు ఐటీఆర్ దాఖలు చేయవచ్చు. ఆదాయపు పన్ను చట్టం, 2025 లోని సెక్షన్ 263(1)(c) కింద ఈ పొడిగింపు వర్తిస్తుంది.ఎప్పటి నుంచి అమల్లోకి..?ఈ కొత్త గడువు పన్ను సంవత్సరం 2026–27 నుంచి వర్తిస్తుంది. ఆదాయపు పన్ను చట్టం, 2025 కింద సవరణలు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. 2026–27 అసెస్‌మెంట్‌ సంవత్సరానికి, ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం, 1961లో కూడా ఇదే మార్పులు అమలు చేస్తారు.

Finance Minister Nirmala Sitharaman comments on tariffs cut6
టారిఫ్‌ల కోతపై ఆర్థిక మంత్రి ఏమన్నారంటే..

భారత ఉత్పత్తులపై టారిఫ్‌లను తగ్గించాలన్న అమెరికా నిర్ణయంతో ఎగుమతులకు ఊతం లభిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. కొత్తగా మరిన్ని మార్కెట్లు కూడా అందుబాటులోకి రావడంతో ఇకపై మన ఎగుమతులు పుంజుకోగలవని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అమెరికాతో ఒప్పందం వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని ఆమె చెప్పారు.‘మేడిన్‌ ఇండియా ఉత్పత్తులకు గుడ్‌ న్యూస్‌. ఇక వాటిపై టారిఫ్‌లు 18 శాతానికి తగ్గుతాయి‘ అని ఎక్స్‌లో ఆమె పోస్ట్‌ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఏకంగా 50 శాతం సుంకాలు విధించడంతో భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. ఉక్కు, అల్యుమినియం, టెక్స్‌టైల్స్, ఇంజినీరింగ్, ఇతరత్రా కొన్ని వ్యవసాయోత్పత్తుల ఎక్స్‌పోర్ట్స్‌ గణనీయంగా తగ్గాయి. తాజాగా వాణిజ్య అవరోధాలను తొలగించి, రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కూడా నిలిపివేసి అగ్రరాజ్యం నుంచి క్రూడ్‌ కొనుగోళ్లు పెంచుకుంటామన్న భారత హామీకి ప్రతిగా టారిఫ్‌లను 18 శాతానికి తగ్గించేందుకు అంగీకరించినట్లు ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో 15–19 శాతం స్థాయిలో టారిఫ్‌లు ఎదుర్కొంటున్న ఇతర ఆసియా దేశాల సరసన భారత్‌ కూడా చేరుతుంది. మరోవైపు ఫ్యూచర్స్, ఆప్షన్స్‌పై (ఎఫ్‌అండ్‌వో) సెక్యూరిటీస్‌ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌ (ఎస్‌టీటీ)ని పెంచాలన్న నిర్ణయం స్పెక్యులేటివ్‌ ట్రేడింగ్‌ వల్ల చిన్న ఇన్వెస్టర్లు నష్టాల పాలవకుండా కాపాడేందుకే తప్ప ఆదాయాన్ని పెంచుకునేందుకు తీసుకున్నది కాదని నిర్మలా సీతారామన్‌ చెప్పారు.సాగు, డెయిరీ ప్రయోజనాలు పదిలం: గోయల్‌అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే విషయంలో దేశీయంగా కీలకమైన వ్యవసాయం, డెయిరీ రంగాల ప్రయోజనాలను పరిరక్షించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్‌ గోయల్‌ తెలిపారు. పోటీ దేశాల కన్నా అమెరికాతో భారత్‌కి ‘చాలా మంచి‘ డీల్‌ కుదిరిందని మంత్రి చెప్పారు. వాణిజ్య ఒప్పందం తుది దశలో ఉందని, త్వరలోనే పూర్తి వివరాలతో ఇరు దేశాలు సంయుక్త ప్రకటన జారీ చేస్తాయని పేర్కొన్నారు. కీలక రంగాల ప్రయోజనాలను కాపాడుతూ, ప్రజలకు భారీగా అవకాశాలు కల్పించే విధంగా ఒప్పందం ఉంటుందని చెప్పారు. కార్మిక శక్తి ఎక్కువగా ఉండే టెక్స్‌టైల్స్, ప్లాస్టిక్స్, దుస్తులు, సేంద్రియ రసాయనాలు, రత్నాభరణాలు తదితర రంగాలకు అవకాశాలు పెరుగుతాయన్నారు.ఇదీ చదవండి: ధర తగ్గిందనుకునేలోపే మళ్లీ.. తులం ఎంతంటే..

Advertisement
Advertisement
Advertisement