Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Stock Market April 29 2026 Sensex rises 500 pts1
లాభాల్లోకి స్టాక్‌మార్కెట్‌.. ఎగిసిన సెన్సెక్స్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. మిశ్రమ ప్రపంచ సంకేతాల మధ్య ఆటో, రియాల్టీ స్టాక్స్ పురోగమించడంతో నిఫ్టీ 50, సెన్సెక్స్ సూచీలకు ప్రారంభం వద్ద నష్టాలు తప్పాయి. ఉదయం 9:49 గంటల సమయానికి నిఫ్టీ 0.68 శాతం లేదా 163.30 పాయింట్ల లాభంతో 24,159.00 వద్ద, సెన్సెక్స్ 535.81 పాయింట్లు లేదా 0.70 శాతం పెరిగి 77,422.72 వద్ద ట్రేడవుతున్నాయి. మారుతి సుజుకి ఇండియా, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్, ఐషర్ మోటార్స్ నిఫ్టీ 50 ఇండెక్స్ లో టాప్ గెయినర్స్ గా నిలిచాయి. సెన్సెక్స్ లో మారుతి సుజుకి, భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా టాప్ గెయినర్స్ గా నిలిచాయి.విస్తృత మార్కెట్లు బెంచ్ మార్క్ సూచీలను అధిగమించాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 0.57 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.68 శాతం పెరిగాయి.రంగాల వారీగా, నిఫ్టీ ఆటో, నిఫ్టీ రియాల్టీ టాప్ గెయినర్లుగా ఉండగా, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ తక్కువ పనితీరు కనబరిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Australia Proposes To Tax Meta Google TikTok To Fund Journalists2
గూగుల్, మెటాలకు షాక్‌.. ఆస్ట్రేలియా కొత్త పన్ను

సోషల్ మీడియా దిగ్గజాలు మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్), గూగుల్, టిక్‌టాక్‌లకు ఆస్ట్రేలియా ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. జర్నలిజం మనుగడ కోసం, వార్తా సంస్థలకు చెల్లింపులు చేయని పక్షంలో భారీగా పన్ను వసూలు చేసేలా రూపొందించిన కొత్త ముసాయిదా చట్టాన్ని విడుదల చేసింది.వార్తలకు విలువివ్వాల్సిందేజర్నలిస్టుల కష్టానికి తగిన ద్రవ్య విలువ ఉండాలని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సృజనాత్మకమైన వార్తా కంటెంట్‌ను ఉపయోగించుకుని బహుళజాతి సంస్థలు లాభాలు గడించడం తగదు. ఆ కంటెంట్‌ను ఉత్పత్తి చేసే వారికి తగిన పరిహారం అందాలి. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి నాణ్యమైన జర్నలిజం వెన్నెముక వంటిది’ అని పేర్కొన్నారు.ప్రతిపాదిత చట్టం ముఖ్యాంశాలువార్తా సంస్థలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి నిరాకరించే ప్లాట్‌ఫారమ్‌లపై ఈ చట్టం కొరడా ఝుళిపించనుంది.వార్తా ప్రచురణకర్తలతో ఒప్పందాలు చేసుకోని పక్షంలో, సదరు కంపెనీల వార్షిక ఆదాయంపై 2.25 శాతం పన్ను విధిస్తారు.వార్తా సంస్థలకు చెల్లింపులు చేసే ప్లాట్‌ఫారమ్‌లకు పన్ను మినహాయింపులు (ఆఫ్‌సెట్లు) లభిస్తాయి.ఈ పన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని (సుమారు 200 - 250 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు), ఆయా వార్తా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వం పంపిణీ చేయనుంది.పాత చట్టంలో లొసుగులు 2021లో తెచ్చిన 'న్యూస్ మీడియా బేరసారాల కోడ్' నుండి తప్పుకోవడానికి కొన్ని సంస్థలు తమ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి వార్తలను తొలగించాయి. తాజా చట్టాన్ని అటువంటి లొసుగులను అరికట్టేలా రూపొందించారు.భగ్గుమంటున్న టెక్ దిగ్గజాలుప్రభుత్వ నిర్ణయంపై మెటా, గూగుల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాయి. ‘వార్తా సంస్థలు తమ ప్రయోజనం కోసమే మా ప్లాట్‌ఫారమ్‌లపై కంటెంట్‌ను పోస్ట్ చేస్తాయి. ఇది కేవలం ఒక పరిశ్రమ నుంచి మరో పరిశ్రమకు సంపదను బదిలీ చేసే పన్ను మాత్రమే’ అని మెటా విమర్శించింది. ఇప్పటికే తాము వార్తా సంస్థలతో ఒప్పందాలు కలిగి ఉన్నామని, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ వంటి ప్లాట్‌ఫారమ్‌లను మినహాయించి కేవలం తమనే లక్ష్యంగా చేసుకోవడం సరికాదని గూగుల్ పేర్కొంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో వార్తల ప్రాముఖ్యతను కాపాడటమే లక్ష్యమని ఆస్ట్రేలియన్ ప్రభుత్వం చెబుతుండగా, ఇది డిజిటల్ రంగంపై అనవసరపు భారమని టెక్ సంస్థలు వాదిస్తున్నాయి. ఈ ప్రతిపాదన చట్టరూపం దాల్చితే ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలు కూడా ఇదే బాట పడతాయేమో చూడాలి.

Indias domestic air passenger traffic grows 1 4pc to 1677 lakh in FY26 Report3
దేశంలో 16.77 కోట్ల మంది విమానమెక్కారు..

ముంబై: గత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య అంచనాలకు అనుగుణంగా పెరిగింది. రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా 0–3 శాతం అంచనా వేయగా 1.4 శాతం వృద్ధి నమోదైంది. 16.77 కోట్ల మంది ప్రయాణికులను దేశీ ఎయిర్‌లైన్స్‌ గమ్యస్థానాలకు చేర్చాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇది 16.54 కోట్లుగా నమోదైంది. ఈ ఏడాది మార్చిలో దేశీయంగా విమాన ప్రయాణికుల ట్రాఫిక్‌ 1 శాతం పెరిగి 1.47 కోట్లుగా ఉంది.మార్చిలో ప్యాసింజర్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ 89.5 శాతంగా ఉన్నట్లు, గతేడాది ఇదే వ్యవధిలో ఇది 86 శాతంగా ఉన్నట్లు ఇక్రా పేర్కొంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా ముడిచమురు రేట్లు భారీగా పెరిగినప్పటికీ దేశీయంగా విమాన ఇంధనం రేట్ల పెంపు భారం తక్కువగా ఉన్నట్లు వివరించింది. నెలవారీగా చూస్తే మార్చిలో క్రూడాయిల్‌ రేట్లు 45.5 శాతం పెరిగినా, ఏటీఎఫ్‌ ధరలపై కేంద్ర పౌర విమానయాన శాఖ 25 శాతం పరిమితి విధించినట్లు తెలిపింది.దేశీయంగా ఏవియేషన్‌ రంగంపై ప్రభావం పడకుండా ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు సీక్వెన్షియల్‌గా ఏప్రిల్‌లో ఏటీఎఫ్‌ రేట్లను 9.2 శాతం మాత్రమే పెంచాయి. అయితే, క్రూడాయిల్‌ ధరలు అధిక స్థాయిలోనే కొనసాగుతున్నందున భవిష్యత్తులో ఏటీఎఫ్‌ రేట్లపై ప్రభావం పడొచ్చని, డాలరుతో పోలిస్తే రూపాయి విలువ పడిపోతుండటం మరో ఆందోళనకరమైన విషయమని ఇక్రా తెలిపింది.

Digital Public Infrastructure Could Quadruple GDP By 2030 Niti Aayog4
జోరు మీదున్న డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రా

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వృద్ధిలో డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (డీపీఐ) కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం జీడీపీలో 1 శాతం వాటా కలిగి ఉండగా, 2030 నాటికి ఇది 4 శాతానికి చేరుకుంటుందని నీతి ఆయోగ్‌ నివేదిక అంచనా వేసింది. చరిత్రాత్మక మార్పు మలుపు దశలో భారత్‌ ఉన్నట్టు పేర్కొంది. రానున్న రోజుల్లో ఈ డిజిటల్‌ వ్యవస్థలు సామాజిక, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తాయని తెలిపింది.ఈ లక్ష్యాలను చేరుకోవడానికి నీతి ఆయోగ్‌ కొన్ని ముఖ్యమైన సూచనలు చేసింది. రాష్ట్రాల నాయకత్వంలో సాగే వినూత్న కార్యక్రమాల ద్వారానే డీపీఐ 2.0 విజయవంతమవుతుందంటూ.. దీనికి కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్‌ మార్గదర్శకులుగా వ్యవహరిస్తాయని పేర్కొంది. రంగాల వారీ మార్పులు తీసుకురావడానికి రెండేళ్ల కార్యాచరణను అనుసరించాలని సూచించింది. తొలి ఏడాది ఎంపిక చేసిన కొన్ని రాష్ట్రాల్లో ప్రయోగాత్మక ప్రాజెక్టులను చేపట్టి, వాటి ఫలితాలను విశ్లేషించాలని పేర్కొంది. మొదటి ఏడాది సాధించిన విజయాలను రెండో ఏడాది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని సూచించింది. ఉపాధి కల్పన కీలకం.. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ సాధించాలంటే అందరికీ సమాన అవకాశాలు కల్పించే అభివృద్ధి మార్గాలు అవసరమని నీతి ఆయోగ్‌ మాజీ ఉపాధ్యక్షుడు సుమన్‌ బేరీ ఈ నివేదికను విడుదల చేసిన సందర్భంగా పేర్కొన్నారు. ‘‘గత దశాబ్ద కాలంలో సేవలను ప్రజలకు చేరవేయడంలో, ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో డిజిటల్‌ వ్యవస్థలు అద్భుతమైన పనితీరు చూపించాయి. రాబోయే దశలో డిజిటల్‌ అనుసంధానానికే పరిమితం కాకుండా, ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడం, సామర్థ్యాలను పెంచడంతోపాటు.. రంగాలు, ప్రాంతాల వారీ కొత్త చోదక కేంద్రాలను సృష్టించడంపై దృష్టి సారించాలి’’అని సూచించారు.

Increasing Female Employment in India5
మహిళే మహారాణి

న్యూఢిల్లీ: మహిళలకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని కేంద్ర కార్మీక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ప్రకటించారు. ఉపాధి కల్పన రేటు 2017లో ఉన్న 22 శాతం నుంచి 2025లో 39 శాతానికి పెరిగినట్టు చెప్పారు. మహిళా కార్మీకుల భాగస్వామ్య రేటు 2017–18లో 23.3 శాతంగా ఉంటే, 2025లో 40 శాతానికి చేరినట్టు వెల్లడించారు.మహిళల నిరుద్యోగ రేటు ఇదే కాలంలో 5.6 శాతం నుంచి 3.1 శాతానికి తగ్గిందని.. ఉపాధి కోరుకుంటున్న మహిళలు నేడు ఆ దిశగా అవకాశాలను సొంతం చేసుకుంటున్నట్టు మంత్రి చెప్పారు. ఉద్యోగాల్లో పురుషులతో సమానంగా మహిళలూ భాగస్వాములు కావడం అత్యావశ్యకమే కాకుండా.. ఆర్థికంగానూ తప్పనిసరి అని అభిప్రాయం వ్యక్తం చేశారు. వికసిత్‌ భారత్‌ నిర్మాణానికి మహిళా సాధికారతను కేంద్రబిందువుగా పేర్కొన్నారు. మెరుగైన సామాజిక భద్రత సామాజిక భద్రత కవరేజీ గత పదేళ్లలో మూడు రెట్లు పెరిగినట్టు మంత్రి మాండవీయ తెలిపారు. 2015లో ఉన్న 19 శాతం నుంచి 2025లో 64.3 శాతానికి చేరినట్టు చెప్పారు. కార్మీక సంస్కరణలు, డిజిటల్‌ సేవలు, లకిష్యత సంక్షేమ ఫలాల బదిలీ కోసం చేపట్టిన స్థిరమైన విధానాలు ఇందుకు దోహదం చేసినట్టు తెలిపారు. గిగ్, ప్లాట్‌ఫామ్‌ కార్మీకులను అధికారికంగా గుర్తిస్తూ 2020లో కోడ్‌ ఆన్‌ సోషల్‌ సెక్యూరిటీ (సీవోఎస్‌ఎస్‌)ను ప్రవేశపెట్టినట్టు మంత్రి మాండవీయ గుర్తు చేశారు.వీరిలో ఇప్పుడు చాలా మంది మహిళలు ఉన్నారని.. వారికి చట్టపరమైన గుర్తింపుతోపాటు సామాజిక భద్రత ఏర్పడినట్టు చెప్పారు. మహిళా డెలివరీ కార్మీకులు వారి కుటుంబాలకు మద్దతుగా నిలవడమే కాకుండా, సామాజిక పురోగతికి పాటుపడుతున్నట్టు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలోనే స్విగ్గీ ఫుడ్, ఇన్‌స్టామార్ట్‌ ప్లాట్‌ఫామ్‌లకు చెందిన మహిళా డెలివరీ పార్ట్‌నర్‌లను మంత్రి సన్మానించారు. స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు, గ్రూప్‌ సీఈవో శ్రీహర్ష మాజేటి, ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Maruti Suzuki Q4 net profit fell 6. 5 percent to Rs 3659 crore6
మారుతీ క్యూ4 రికార్డులు

న్యూఢిల్లీ: కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 6 శాతం నీరసించి రూ. 3,659 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2024–25) ఇదే కాలంలో రూ. 3,911 కోట్లు ఆర్జించింది. అయితే వాహన విక్రయాలు 12 శాతం ఎగసి 6,76,209 యూనిట్లను తాకాయి. ఒక త్రైమాసికంలో ఇది సరికొత్త రికార్డ్‌కాగా.. దేశీ అమ్మకాలు 5,38,994 యూనిట్లను తాకగా, ఎగుమతులు రికార్డ్‌ సృష్టిస్తూ 1,37,215 యూనిట్లకు చేరాయి.మార్క్‌టు మార్కెట్‌(ఎంటూఎం)తోపాటు.. నిర్వహణేతర ఆదాయం తగ్గడం, బాండ్‌ ఈల్డ్స్‌లో మార్పు కారణంగా నష్టం నమోదు చేయడం(తదుపరి దశలో రికవరీకి వీలుంది) ఈ క్యూ4 లాభాలను ప్రభావితం చేసినట్లు కంపెనీ పేర్కొంది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 140 చొప్పున డివిడెండ్‌ ప్రకటించింది. ఇది అత్యధికంకాగా 2024–25లో రూ. 135 డివిడెండ్‌ చెల్లించింది. మొత్తం ఆదాయం మాత్రం 28 శాతం ఎగసి రూ. 52,462 కోట్లను అధిగమించింది. అంతక్రితం క్యూ4లో రూ. 40,920 కోట్ల టర్నోవర్‌ మాత్రమే అందుకుంది. వెరసి కంపెనీ చరిత్రలోనే తొలిసారి ఒక క్వార్టర్‌లో రూ. 50,000 కోట్ల అమ్మకాల మైలురాయిని అధిగమించింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 37,556 కోట్ల నుంచి రూ. 48,125 కోట్లకు పెరిగాయి. పూర్తి ఏడాదికి మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి మారుతీ నికర లాభం నామమాత్ర వృద్ధితో రూ. 14,680 కోట్లకు చేరింది. 2024–25లో రూ. 14,500 కోట్ల లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 1,52,913 కోట్ల నుంచి రూ. 1,83,316 కోట్లకు జంప్‌చేసింది. మొత్తం వాహన అమ్మకాలు 22,34,266 యూనిట్ల నుంచి 24,22,713 యూనిట్లకు బలపడ్డాయి. దేశీయంగా 19,74,939 యూనిట్ల అమ్మకాలు సాధించగా.. 4,47,774 యూనిట్లను ఎగుమతి చేసింది. గతేడాది ద్వితీయార్ధంలో జీఎస్‌టీ రేట్ల సవరణల కారణంగా దేశీ మార్కెట్లో అమ్మకాలు పుంజుకున్నట్లు కంపెనీ పేర్కొంది. ఏడాది చివరికల్లా 1.9 లక్షల పెండింగ్‌ ఆర్డర్లు నమోదైనట్లు వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో ఈ షేరు బీఎస్‌ఈలో 2.5% క్షీణించి రూ. 12,892 వద్ద ముగిసింది.ఇక పెట్టుబడుల జోరు..సామర్థ్య విస్తరణకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27)లో మారుతీ సుజుకీ రూ. 14,000 కోట్ల పెట్టుబడులు వెచ్చించనుంది. ఇది సరికొత్త రికార్డ్‌కాగా.. పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా ఖార్ఖోడా(హరియాణా), హన్సల్‌పూర్‌ (గుజరాత్‌)లో రెండు లైన్లను జత చేయనున్నట్లు కంపెనీ చైర్మన్‌ ఆర్‌సీ భార్గవ పేర్కొన్నారు. ప్రస్తుత ప్లాంట్ల సామర్థ్య వినియోగం 100 శాతానికి చేరిన నేపథ్యంలో కొత్తగా 5 లక్షల యూనిట్ల వార్షిక సామర్థ్యాన్ని జత చేయనున్నట్లు వెల్లడించారు. ప్రధానంగా చిన్న కార్లకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలియ జేశారు.

Advertisement
Advertisement
Advertisement