ప్రధాన వార్తలు
బడ్జెట్: బ్రీఫ్కేస్ నుంచి టాబ్లెట్ వరకు ఇలా..
యూనియన్ బడ్జెట్ అనేది భారతదేశంలో కేవలం ఆదాయ-వ్యయాల లెక్కలు మాత్రమే కాదు. అది దేశ ఆర్థిక దిశను సూచించే ముఖ్యమైన పత్రం. అయితే స్వాతంత్య్రం రాకముందు ప్రారంభమైండ్ ఈ బడ్జెట్లో.. పార్లమెంటులో సమర్పించే విధానంలో కూడా కాలక్రమేణా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు బ్రీఫ్కేస్లో బడ్జెట్ పత్రాలను తీసుకెళ్లిన ఆర్థిక మంత్రులు, నేడు టాబ్లెట్ ద్వారా పూర్తిగా కాగిత రహితంగా బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఈ మార్పు వెనుక ఉన్న చరిత్ర, ఆలోచన, ఆధునికత మొదలైన విషయాలను ఈ కథనంలో చూసేద్దాం.తొలినాళ్లలో.. భారతదేశపు తొలి ఆర్థిక మంత్రి ఆర్.కె. షణ్ముఖం చెట్టి బడ్జెట్ పత్రాలను బ్రీఫ్కేస్లో పార్లమెంటుకు తీసుకెళ్లారు. ఈ బ్రీఫ్కేస్ బ్రిటిష్ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచింది. బ్రిటన్లో అప్పటి ఆర్థిక మంత్రి విలియం ఎవార్ట్ గ్లాడ్స్టోన్ ఉపయోగించిన “గ్లాడ్స్టోన్ బాక్స్”కు అనుకరణగా ఇది ఉండేది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఈ సంప్రదాయం అలాగే కొనసాగింది. దశాబ్దాల పాటు చాలామంది ఆర్థిక మంత్రులు తమ బడ్జెట్ ప్రసంగానికి బ్రీఫ్కేస్తోనే వెళ్లడం ఆనవాయితీగా మారింది.ఇదీ చదవండి: 2019 నుంచి 2025 వరకు: 8 బడ్జెట్లు.. 13 గంటలు!కాలం మారింది.. ఆలోచనలు మారాయి. 2019లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బ్రీఫ్కేస్ సంప్రదాయానికి ముగింపు పలికారు. బ్రీఫ్కేస్ స్థానంలో భారతీయ సంప్రదాయానికి ప్రతీక అయిన 'బహి ఖాతా'ను ప్రవేశపెట్టారు. ఆ తరువాత 2021లో సీతారామన్ పూర్తిగా కాగిత రహిత బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 'మేడ్ ఇన్ ఇండియా' టాబ్లెట్ను ఉపయోగించి బడ్జెట్ పత్రాలను డిజిటల్ రూపంలో పార్లమెంటుకు సమర్పించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఆ టాబ్లెట్ను కూడా బహి ఖాతా ఆకృతిని తలపించే ఎరుపు రంగు కవర్లో తీసుకెళ్లడం విశేషం. ఇది సంప్రదాయం & ఆధునికత కలయికకు ప్రతీకగా నిలిచింది.బడ్జెట్ మార్పుకు కారణం!బడ్జెట్ సమర్పించడంలో మార్పు రావడానికి ప్రధాన కారణం.. కాగిత వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటం, డిజిటలైజేషన్ ద్వారా బడ్జెట్ పత్రాలను వేగంగా, సులభంగా అందరికీ అందుబాటులోకి తీసుకురావడం. అంతే కాకుండా.. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు అనుగుణంగా ప్రభుత్వ పనితీరును ఆధునీకరించడం అని తెలుస్తోంది.
బియ్యం అందించే ఏటీఎం: దీని గురించి తెలుసా?
ఏటీఎం అంటే అందరికీ తెలిసింది డబ్బులు విత్డ్రా చేసుకునే మెషిన్ అని మాత్రమే. కానీ ఇకపై ధాన్యం కూడా ఏటీఎం నుంచి వస్తాయి. ఇప్పటికే ఇలాంటి ఏటీఎంలను బీహార్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇంతకీ ఇదెలా పనిచేస్తుంది. ఇందులో ఏమేమి వస్తాయి అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.కేంద్ర ప్రభుత్వ పైలట్ ప్రాజెక్ట్ కింద, బీహార్ ప్రభుత్వం పాట్నాలో మూడు ధాన్యం ఏటీఎంలను ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చింది. నిజానికి మనదేశంలో మొట్టమొదటి ధాన్యం ATM.. 2024 ఆగస్టులో ఒడిశా రాజధాని భువనేశ్వర్లో మొదలైంది. ఇప్పుడు బీహార్లో కూడా ఈ ప్రయోగం ప్రారంభించనున్నారు.ధాన్యం ATM అనేది పూర్తిగా ఆటోమేటెడ్ యంత్రం. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద.. లబ్ధిదారులు తమ ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు పత్రాల ద్వారా తమను తాము ధృవీకరించుకుంటారు. ఆ తరువాత బియ్యం, గోధుమలు వంటి అవసరమైన ధాన్యం సెలక్ట్ చేసుకుంటారు. ఎంపిక చేసుకున్నదాన్ని బట్టి.. ఆ మెషిన్ ధాన్యం అందిస్తుంది. దీనికి సంబంధించిన లావాదేవీలన్నీ కూడా డిజిటల్గా పూర్తవుతాయి.ఒక ధాన్యం ATM ఐదు నిమిషాల్లో 50 కిలోల వరకు ధాన్యాన్ని పంపిణీ చేయగలదు. గంటకు కేవలం 0.6 వాట్స్ విద్యుత్ మాత్రమే వినియోగిస్తుంది. సోలార్ ఫలకాలు & ఇన్వర్టర్లతో కూడా నడిచే విధంగా వీటిని రూపొందించారు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీటిని సమర్థవంతంగా ఉపయోగించవచ్చు.బీహార్లో ప్రస్తుతం 8.5 కోట్లకు పైగా PDS లబ్ధిదారులు ఉన్నారు. 50,000కి పైగా రేషన్ దుకాణాలు పనిచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ధాన్యం ATMలు ప్రవేశపెట్టడం వల్ల అక్రమ రవాణా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రేషన్ డీలర్లు తక్కువ ధాన్యం ఇవ్వడం.. లేదా బ్లాక్ మార్కెట్లో అమ్మడం వంటి సమస్యలకు ఇది అడ్డుకట్ట వేస్తుందని నిపుణుల అభిప్రాయం.
2019 నుంచి 2025 వరకు: 8 బడ్జెట్లు.. 13 గంటలు!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. భారతదేశ బడ్జెట్ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖిస్తున్నారు. ఆదివారం, ఫిబ్రవరి 1న ఆమె యూనియన్ బడ్జెట్ 2026ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆమె వరుసగా ప్రవేశపెడుతున్న 9వ కేంద్ర బడ్జెట్ కావడం విశేషం. ఇప్పటికే ఎనిమిది బడ్జెట్లను విజయవంతంగా ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ అరుదైన రికార్డు సృష్టించారు. అయితే ప్రారంభం నుంచి ఏ బడ్జెట్ ప్రసంగం ఎంత సమయం?, సుదీర్ఘ ప్రసంగం ఎప్పుడు అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.2019లో కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. దేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసే కీలక బడ్జెట్లను నిర్మలా సీతారామన్ అందించారు. కరోనా వంటి అసాధారణ పరిస్థితుల్లో కూడా.. ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్లు చరిత్రలో నిలిచిపోయాయి. ముఖ్యంగా 2020లో ఆమె చేసిన బడ్జెట్ ప్రసంగం సుమారు 2 గంటలు 42 నిమిషాలు కొనసాగి, భారత పార్లమెంట్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగంగా గుర్తింపు పొందింది.కాలక్రమంలో నిర్మలా సీతారామన్ ప్రసంగ శైలిలో మార్పు కనిపించింది. ప్రారంభంలో సుధీర్ఘంగా సాగిన బడ్జెట్ ప్రసంగాలు, తరువాతి సంవత్సరాల్లో.. క్రమంగా సంక్షిప్తంగా మారాయి. 2024 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగం 56 నిమిషాల్లో (గంట లోపు) పూర్తయింది. ఇది ఇప్పటివరకు ఆమె చేసిన అత్యంత చిన్న ప్రసంగంగా నిలిచింది. అలాగే 2025 బడ్జెట్ ప్రసంగం కూడా తక్కువ సమయం (74 నిముషాలు)లోనే పూర్తి కావడం విశేషం.బడ్జెట్ - ప్రసంగ సమయం➤2019 బడ్జెట్: 140 నిముషాలు (2 గంటల 20 నిముషాలు)➤2020 బడ్జెట్: 160 నిముషాలు (2 గంటల 40 నిముషాలు - అతిపెద్ద బడ్జెట్ ప్రసంగం)➤2021 బడ్జెట్: 100 నిముషాలు (1 గంట 40 నిముషాలు)➤2022 బడ్జెట్: 91 నిముషాలు (1 గంట 31 నిమిషాలు)➤2023 బడ్జెట్: 87 నిముషాలు (1 గంట 27 నిముషాలు)➤2024 ఫిబ్రవరి బడ్జెట్: 56 నిముషాలు➤2024 జులై బడ్జెట్: 85 నిమిషాలు (1 గంట 25 నిముషాలు)➤2025 బడ్జెట్: 74 నిముషాలు (1 గంట 14 నిముషాలు) మొత్తం 8 బడ్జెట్లు.. 793 నిముషాలు / 13 గంటల 13 నిముషాలుఇక 9వ బడ్జెట్తో ఆమె మరోసారి చరిత్ర సృష్టించబోతున్నారు. ఈ బడ్జెట్ ప్రసంగం ఎంత సమయం సాగుతుంది, ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు అనే ఆసక్తి దేశవ్యాప్తంగా నెలకొంది. 2026 బడ్జెట్కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి.
గంటల వ్యవధిలో.. పతనమైన బంగారం, వెండి!
గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. శుక్రవారం గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 9000కంటే ఎక్కువ తగ్గింది. ఇదే బాటలో వెండి కూడా అడుగులు వేసింది. దీంతో ఉదయం ధరలకు.. తాజా ధరలకు చాలా మార్పు కనిపించింది.హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,69,200 వద్ద ఉండగా, 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు 1,55,100 రూపాయల వద్ద ఉంది.ఢిల్లీ, చెన్నై నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు వరుసగా రూ. 169350 & రూ. 158500 వద్ద నిలిచాయి. 22 క్యారెట్ల తులం పసిడి విషయానికి వస్తే.. రూ. 155250 & రూ. 158500 వద్ద ఉన్నాయి.వెండి ధరలు రూ. 4.25 లక్షల నుంచి.. రూ. 4.05 లక్షల వద్దకు పడిపోయాయి. అంటే గంటల వ్యవధిలో కేజీ సిల్వర్ రేటు 25వేల రూపాయలు తగ్గిందన్నమాట.బంగారం ధరలపై విలియం లీ స్పందనబంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీన్ని చూసి చాలామంది గోల్డ్ కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. రేట్ల పెరుగుదల విషయంలో ప్రజలు గాబరాపడాల్సిన అవసరం లేదు. పెరిగిన ధరలకు కారణం.. ప్రపంచ రాజకీయ, సామాజిక పరిస్థితులే అని గ్లోబల్ ఎకనామిక్ అడ్వైజర్స్ చీఫ్ ఎకనామిస్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'విలియం లీ' పేర్కొన్నారు.పసిడి ధరల పెరుగుదలను లీ.. నీటి బుడగ(బబుల్)తో పోల్చారు. ఈ బుడగ ఎప్పుడైనా పగిలిపోయే అవకాశం ఉంది. అంటే గోల్డ్ రేటు ఏ సమయంలో అయినా భారీగా తగ్గిపోతుందని అన్నారు. కాబట్టి ధరలు పెరుగుతున్నాయి, భవిష్యత్తులో బంగారం దొరకదేమో అని ఎగబడి బంగారం కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని హెచ్చరించారు.ఇదీ చదవండి: రూ.4000 విలువైన ప్రీమియం.. ఏడాదిపాటు ఉచితం!
సామాజిక, ఆర్థిక అవగాహనతోనే వృద్ధికి బూస్ట్!
ప్రపంచం మొత్తమ్మీద అతివేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి. అయితే దేశీ వార్షిక వృద్ధి రేటు ఏడు శాతం కంటే ఎక్కువగా ఉండటం, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ ద్రవ్యలోటును తగ్గించుకోవడంతోపాటు రుణ భారాన్ని కూడా తగ్గించుకోవాలి. దీని ద్వారా ద్రవ్యపరమైన స్థిరీకరణపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.మరోవైపు రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలి కాలంలో చేపట్టిన చర్యలను పరిశీలిస్తే.. విధానపరమైన రేట్లను తగ్గించే దిశగా అడుగులేస్తున్నట్లు స్పష్టమవుతుంది. తద్వారా వృద్ధికి తోడ్పాటు అందించాలని వ్యాపారాలు, కుటుంబాలపై ఖర్చులను తగ్గించే ప్రయత్నం చేస్తోంది. ఇదే సమయంలో రాజకీయ, ఆర్థికవేత్తల అభిప్రాయం కొంచెం భిన్నంగా కనిపిస్తోంది. కార్మిక, వ్యవసాయ చట్టాల సవరణ, రైల్వే, రహదారులపై భారీ పెట్టుబడులు, ఆర్థిక ప్రోత్సాహకాలు, తక్కువ పన్నుల రూపంలో ప్రభుత్వం ఇప్పటికే వృద్ధికి అవసరమైన వాతావరణం కల్పించిందని, ఇప్పుడు ప్రైవేట్ రంగం దేశీ అభివృద్ధిపై పెట్టుబడులు పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తోంది.అంతేకాదు.. యూరోపియన్ యూనియన్తో ఇటీవల కుదుర్చుకున్న ఫ్రీ ట్రేడ్ ఒప్పందం కూడా అమెరికా వాణిజ్య విధానాలు, అంతర్జాతీయ జియోపాలిటిక్స్ ద్వారా ఏర్పడుతున్న అనిశ్చితులను అధిగమించేందుకు ఉపయోగపడుతుందని అంచనా వేస్తోంది. ఇవన్నీ నాణేనికి ఒక వైపు అయితే.. వాస్తవం మరింత సంక్లిష్టంగా ఉంది.సామాజిక ఆర్థిక పరిస్థితులుభారత్ కచ్చితంగా చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థ కానీ.. తలసరి ఆదాయం మూడు వేల డాలర్ల కంటే తక్కువ. చైనాసహా ఇతర ధనిక దేశాల తలసరి ఆదాయాలు మనకు నాలుగు రెట్లు ఎక్కువ.దేశంలో యాభై శాతం జనాభాకు రేషన్ బియ్యం కావాలని ప్రభుత్వం విశ్వసిస్తోంది. అలాగే దిగువ, మధ్య తరగతి వర్గాల వారు మరిన్ని కొనుగోళ్లు చేసేలా చేసే లక్ష్యంతో ప్రభుత్వం జీఎస్టీ రేట్లను తగ్గించింది కూడా.నిరుద్యోగం, తగినన్ని అవకాశాలు లేకపోవడం ఇప్పటికీ దేశంలో అధికంగా ఉంది. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం చాలా తక్కువగా ఉంది.పోషకాహార లోపం సమస్యను ఇప్పటివరకూ పరిష్కరించలేకపోయారు. అలాగే ఆరోగ్య సంరక్షణకు తగిన మౌలిక సదుపాయాలు లేవు.మూలధన, శ్రామిక ఉత్పాదకత కూడా ఇతర దేశాలతో పోలిస్తే తక్కువగానే ఉంది. ఇది ఇటీవలి కాలంలో వేగంగా తగ్గిపోతోంది.రూపాయి బలహీనపడిపోవడం, విదేశీ పెట్టుబడిదారులు భారతీయ మార్కెట్ల నుంచి వేగంగా వైదొలగుతూండటం కూడా ఏమంత మంచి పరిణామాలు కావు. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు భారీగా ఉన్నప్పటికీ విదేశీ రుణభారం తగ్గకపోవడాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి.చాలాకాలంగా దేశీ ఎగుమతుల్లో పెరుగుదల లేకుండాపోయింది. పైగా చైనా ఉత్పత్తులపై ఆధారపడటం ఏటికేటా పెరిగిపోతోంది.బ్యాంకింగ్ వ్యవస్థలో రిస్క్ క్యాపిటల్ తగినంత ఉన్నప్పటికీ అందుకు తగ్గట్టుగా రుణాల కోసం డిమాండ్ పెరగడం లేదు. అయితే డిపాజిట్ల క్రెడిట్ల నిష్పత్తి మాత్రం గత కొన్ని నెలల్లో గణనీయంగా పెరిగిపోయింది. పొదుపు తగ్గడం లేదా పెట్టుబడి విషయంలో ప్రాథమ్యాలు మారిపోవడం దీనికి కారణం కావచ్చు. బంగారం, రియల్ ఎస్టేట్, క్రిప్టో తదితర ఇతర పెట్టుబడి మార్గాలను ఎంచుకుంటూ ఉండవచ్చు.పెద్ద పెద్ద వ్యాపారాలు, అధికాదాయ, ధనిక కుటుంబాలకు మినహా చిన్న, ప్రైవేట్ రంగ వ్యాపార వర్గాలు పెట్టుబడులు పెట్టేందుకు జంకుతున్నారు.ఎగుమతులు పెరగకపోవడం, అంతర్జాతీయ వాణిజ్య విపణిలో చైనా ఆధిపత్యం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దిగుమతులపై ఉన్న నిబంధనలను కొన్నింటిని తొలగించింది.భారతీయ నగరాలు కొన్ని ప్రపంచంలోనే అత్యంత కాలుష్యభరిత నగరాల జాబితాలోకి చేరాయి. మహా నగరాల్లో ట్రాఫిక్ నిర్వహణ నత్తనడకన సాగుతోంది.రైతులకు గిట్టుబాటు ధర లభించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాలపై రుణభారం పెరిగిపోతోంది.క్లుప్తంగా చెప్పాలంటే.. మనం భారీ ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు, తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న సమాజంగా పరిణమించేందుకు ఇంకా చాలా సమయం పడుతుందన్నమాట. కాబట్టి.. అభివృద్ధిని మరింత పెంచేందుకు ప్రభుత్వ రంగంలో పెట్టుబడులు పెరగాలి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలతోపాటు చాలా కుటుంబాలు రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే భారీ పెట్టుబడులతో సామాజిక, ఆర్థిక పురోగతికి పునాదులు వేయాలి.ప్రజలందరికీ అవసరమైన మౌలిక సదుపాయాలను అందరికీ సమానంగా అందుబాటులోకి తేలేకపోతే మన ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది. ఇది కాస్తా దీర్ఘకాలంలో మధ్యాదాయ దేశంగానే మిగిలిపోయేలా చేస్తుంది. ఈ ట్రాప్ నుంచి తప్పించుకోవాలంటే...ద్రవ్య స్థిరీకరణను వాయిదా వేయాలి. ఎందుకంటే.. వడ్డీరేట్లు స్థిరంగా ఉన్నాయి.. తగినంత లిక్విడిటీ అందుబాటులో ఉంది.స్పెక్యులేషన్కు అవకాశమున్న రంగాల్లో పెట్టుబడులను నియంత్రించాలి. తద్వారా అందుబాటులో ఉన్న మొత్తం రిస్క్ క్యాపిటల్ను మెరుగ్గా వాడుకునేందుకు వీలు ఏర్పడుతుంది.నగర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వమే భారీగా పెట్టుబడులు పెట్టాలి. కాలుష్య నివారణకు, ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు, పారిశుద్ధ్యాన్ని పెంచేందుకు, గృహ వసతి కల్పనకు ప్రయత్నాలు ముమ్మరం కావాలి.చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగానికి ఈక్విటీ మద్దతు కల్పించాలి. రుణ సౌకర్యం కల్పించడం ఒక్కటే సరిపోదు.ప్రభుత్వ రంగ సంస్థల వద్ద వృథాగా పడిఉన్న మొత్తాలను పెట్టుబడుల రూపంలోకి మార్చేలా ప్రోత్సహించాలి. కొన్నేళ్లపాటు డివిడెండ్లను త్యాగం చేయాల్సి వచ్చిన వెనకాడరాదు.ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు లేకుండా చూడాలి. ఎనిమిదో పే కమిషన్ ద్వారా గ్రామీణ, నగర ప్రాంతాలు రెండింటిలోనూ తగిన వేతన పరిమితులు ఏర్పాటయ్యేలా చూడాలి.పరోక్ష పన్నుల భారాన్ని తగ్గించి, ద్రవ్యోల్బణ నియంత్రణకు చర్యలు తీసుకోవాలి.యూరప్తో కుదిరిన ఫ్రీట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా గరిష్టంగా లాభం పొందేందుకు చిన్న, మధ్య తరహా పరిశ్రమలతోపాటు పెద్ద కంపెనీలకు కూడా లక్ష్యాల ఆధారిత ప్రోత్సాహకాలు అందించాలి.ఇన్నోవేషన్ ద్వారా విలువను జోడించడంలో భారీ కార్పొరేషన్ల పాత్రను గుర్తించి తగు విధంగా ప్రోత్సహించాలి.మొత్తమ్మీద చూస్తే.. ఆర్థికాభివృద్ధి విషయంలో ప్రభుత్వ, ఆర్థికవేత్తల వ్యూహంపై పునరాలోచన జరగాలి. వివిధ దేశాలతో చేసుకున్న ఫ్రీట్రేడ్ అగ్రిమెంట్ ఇస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ప్రభుత్వ సేవల రంగంలో పెట్టుబడులు గణనీయంగా పెంచాలి. భారీ కార్పొరేషన్లకు కాకుండా చిన్న, మధ్యతరహా పరిశ్రమలతోపాటు ఆర్థికపరమైన మద్దతుకు ప్రాధాన్యత కల్పించాలి. అంతర్జాతీయ స్థాయిలో పోటీతత్వం ఉండేందుకు కార్మిక, పెట్టుబడి ఉత్పాదకతలను పెంచే విషయమై దృష్టి పెట్టాలి. యువతకు పబ్లిక్ సర్వీసుల్లో అవకాశాలను సృష్టించాలి.- అనిల్ కె.సూద్, అధ్యాపకులు, ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ కాంప్లెక్స్ ఛాయిసెస్, హైదరాబాద్.
బడ్జెట్ 2026: సీనియర్ సిటిజన్లకు తీపి కబురు?
త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2026 నేపథ్యంలో దేశంలోని కోట్లాది మంది సీనియర్ సిటిజన్లకు ప్రభుత్వం శుభవార్త అందించే సూచనలు కనిపిస్తున్నాయి. కొవిడ్-19 సమయంలో నిలిపివేసిన రైల్వే ప్రయాణ రాయితీలను తిరిగి పునరుద్ధరించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనిపై ఆర్థిక, రైల్వే మంత్రిత్వ శాఖల మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి.ఆరేళ్ల నిరీక్షణకు తెర పడనుందా?రైల్వే రాయితీల పునరుద్ధరణపై గ్రీన్ సిగ్నల్ లభిస్తే దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత సీనియర్ సిటిజన్ ప్రయాణికులు తక్కువ ఛార్జీలతో రైలు ప్రయాణం చేసే అవకాశం లభిస్తుంది.గతంలో ఉన్న రాయితీ వివరాలు..పురుషులు (60 ఏళ్లు పైబడిన వారు): టికెట్ ధరలో 40 శాతం రాయితీ.మహిళలు (58 ఏళ్లు పైబడిన వారు): టికెట్ ధరలో 50 శాతం రాయితీ.వర్తించే తరగతులు: స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ వంటి దాదాపు అన్ని క్లాసుల్లో ఈ సదుపాయం ఉండేది.రాయితీ నిలిపివేతకు కారణాలేంటి?మార్చి 2020లో కరోనా సమయంలో దేశవ్యాప్తంగా రైలు సర్వీసులు నిలిచిపోయాయి. ఆ సమయంలో రైల్వే ఎదుర్కొన్న తీవ్ర ఆర్థిక లోటును అధిగమించేందుకు ఈ రాయితీలను రద్దు చేశారు. సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీల వల్ల భారతీయ రైల్వేపై ఏటా రూ.1,600 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల వరకు అదనపు ఆర్థిక భారం పడుతుందని అంచనా. కరోనా తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుని, రైలు సర్వీసులు పూర్తిస్థాయిలో పునరుద్ధరించబడినప్పటికీ ఆర్థిక భారం దృష్ట్యా ప్రభుత్వం ఇప్పటివరకు ఈ రాయితీలను పునప్రారంభించలేదు.బడ్జెట్ 2026పై ఆశలుప్రస్తుతం పెరుగుతున్న ప్రయాణ ఖర్చులు, ఆరోగ్య సంరక్షణ వ్యయాలను దృష్టిలో ఉంచుకుని వృద్ధులకు ఉపశమనం కలిగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2026లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపితే రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి సీనియర్ సిటిజన్లు మళ్లీ పాత పద్ధతిలోనే వయసు ధ్రువీకరణ ద్వారా ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా కౌంటర్లలో రాయితీ టికెట్లు పొందవచ్చు.ఇదీ చదవండి: అలసిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..
కార్పొరేట్
యూఏసీతో ఫ్లెమింగో ఏరోస్పేస్ జట్టు
రష్యా నుంచి మళ్లీ చమురు దిగుమతి
వింగ్స్ ఇండియా 2026లో విమానాల కొనుగోలు ఒప్పందం
30 బోయింగ్ విమానాలకు ఎయిరిండియా ఆర్డరు..
కమర్షియల్ విమానాలు మూడు రెట్లు వృద్ధి
‘సెప్టెంబర్ నుంచి మేడిన్ ఇండియా సీ295ల డెలివరీ’
సివిల్ ఏవియేషన్పై హెచ్ఏఎల్ మరింతగా ఫోకస్
కొత్తగా 7 రూట్లపై ఎతిహాద్ ఎయిర్వేస్ దృష్టి
ఏజెంటిక్ ఏఐ నిపుణులకు డిమాండ్
గోల్డ్లోన్ సూపర్ రన్
స్టాక్ మార్కెట్ అప్డేట్: నష్టాల నుంచి లాభాల్లోకి..
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మా...
ఊహకందని రేటు.. రికార్డు స్థాయికి చేరిన వెండి!
బంగారం ధరలు పెరిగిపోతున్నాయని ఆందోళన చెందుతున్న వా...
గోల్డ్ ధర.. గుండె దడ!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్...
రెండు రోజుల లాభాలకు బ్రేక్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో ...
ఎకనామిక్ సర్వే 2026.. మారథాన్ వేగం అవసరం: సీఈఏ
దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే ఆర్థిక సర్వే 2026న...
ఆర్థిక సర్వే 2025-26.. ముఖ్యాంశాలు
దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని ఆవిష్కరిస్తూ కేంద్ర ఆర్థి...
పార్లమెంట్లో ఆర్థిక సర్వే 2025-26 విడుదల
దేశ ఆర్థిక వ్యవస్థ గమనానికి దిక్సూచిగా భావించే ఆర్...
పటిష్టంగానే పారిశ్రామికరంగం
దేశ పారిశ్రామిక రంగం డిసెంబర్లో బలమైన పనితీరు చూప...
ఆటోమొబైల్
టెక్నాలజీ
రిలయన్స్ జియో చొరవ.. ఏఐ ఎడ్యుకేషన్
విద్యా రంగానికి అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నైపుణ్యాలను అందించడం ద్వారా డిజిటల్ వ్యత్యాసాన్ని తగ్గించడానికి రిలయన్స్ జియో తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తృతమైన విద్యా ప్రచారాన్ని ప్రారంభించింది. ఆధునిక యుగంలో అభ్యాస & బోధనా పద్ధతులను మెరుగుపరచడానికి 'గూగుల్ జెమిని ప్రో' యొక్క ఆచరణాత్మక అప్లికేషన్పై ఈ చొరవ దృష్టి పెడుతుంది. అత్యాధునిక ఏఐ సాధనాలను తరగతి గదుల్లోకి తీసుకురావడం ద్వారా, సాంకేతికతతో కూడిన వృత్తిపరమైన రంగంలో రాణించగల డిజిటల్ నైపుణ్యం కలిగిన విద్యార్థులను మరియు ఉపాధ్యాయులను తయారు చేయడమే జియో లక్ష్యం.ఈ ప్రచారం ఇప్పటికే గణనీయమైన పురోగతిని సాధించి.. రెండు రాష్ట్రాల్లో 2200 కంటే ఎక్కువ పాఠశాలలకు విజయవంతంగా చేరుకుంది. జియో సీనియర్ ఎగ్జిక్యూటివ్ల నేతృత్వంలో జరుగుతున్న ఈ ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలలో 27,000 కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు & విద్యార్థులు పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో1500 కంటే ఎక్కువ పాఠశాలల్లో 20వేల మంది, తెలంగాణలో 700 పాఠశాలల్లో 7000 వేల మందికిపైగా ఈ శిక్షణ పొందుతున్నారు.ఈ ఇంటరాక్టివ్ వర్క్షాప్లు గూగుల్ జెమిని వ్యవస్థను పరిచయం చేయడానికి ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. పాఠ్యాంశాల నోట్స్ తయారు చేయడం, అసైన్మెంట్లు రాయడం & సంక్లిష్టమైన కోడింగ్ ప్రాజెక్ట్లలో సహాయం పొందడం వంటి పనులను ఈ సాంకేతికతతో ఎలా సులభతరం చేయవచ్చో ఇందులో వివరించారు. దీర్ఘకాలిక వృత్తిపరమైన వృద్ధి కోసం ప్రాజెక్ట్ ఐడియేషన్, గ్రాఫిక్ డిజైన్ మరియు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కోసం AIని ఉపయోగించడంపై కూడా ఈ శిక్షణ ప్రాధాన్యతనిస్తుంది.ఈ డిజిటల్ సాధికారత ప్రచారంలో ప్రధాన అంశం ఏమిటంటే, వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా ప్రీమియం సాంకేతికతను అందించడం. జియో తన అన్లిమిటెడ్ 5జీ సబ్స్క్రైబర్లకు రూ.35,100 విలువైన 'గూగుల్ జెమిని ప్రో ప్లాన్'ను 18 నెలల పాటు ఉచితంగా అందిస్తోంది. వినియోగదారులు నేరుగా మైజియో (MyJio) యాప్ ద్వారా యాక్టివేట్ చేసుకునే ఈ సబ్స్క్రిప్షన్, అత్యాధునిక 'జెమిని 3 ప్రో' మోడల్తో పాటు హై-ఎండ్ క్రియేటివ్ టూల్స్కు ప్రాప్యతను కల్పిస్తుంది.ఇందులో AI సహాయంతో చిత్రాలను రూపొందించే 'నానో బనానా ప్రో' (Nano Banana Pro), వీడియో జనరేషన్ కోసం 'వీయో 3.1' (Veo 3.1) వంటి సాధనాలు ఉన్నాయి. అకడమిక్ రీసెర్చ్ కోసం 'నోట్బుక్ ఎల్ఎమ్' (NotebookLM) మరియు డిజిటల్ డేటాను భద్రపరుచుకోవడానికి 2 TB క్లౌడ్ స్టోరేజ్ కూడా ఈ ప్లాన్లో భాగంగా ఉన్నాయి.యువత నైపుణ్యాభివృద్ధికి ఉన్న నిబద్ధతను మరింత ముందుకు తీసుకెళ్తూ, కంపెనీ 'జియో ఏఐ క్లాస్రూమ్' అనే ఉచిత నాలుగు వారాల ఆన్లైన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ను కూడా ప్రవేశపెట్టింది. విద్యార్థులు డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ ద్వారా వారి స్వంత వేగంతో ఏఐ సాంకేతికతలపై ఆచరణాత్మక పరిజ్ఞానాన్ని పొందేలా ఈ కోర్సు రూపొందించబడింది. తెలంగాణ & ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులు Jio.com/ai-classroom పోర్టల్ను సందర్శించడం ద్వారా ఈ శిక్షణను పొందవచ్చు. ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో పోటీ పడటానికి అవసరమైన పునాది జ్ఞానాన్ని ఇది అందిస్తుంది, తద్వారా ప్రాంతీయ శ్రామిక శక్తి సాంకేతిక ఆవిష్కరణలలో ముందంజలో ఉండేలా జియో నిర్ధారిస్తుంది.
వర్క్ ఫ్రమ్ హోమ్.. కొత్త కండీషన్
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), విప్రో అడుగుజాడల్లో నడుస్తూ మరో దేశీ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్.. తన వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) విధానాన్ని మరింత కఠినతరం చేసింది. అదనపు వర్క్ ఫ్రమ్ హోమ్ రోజులను కోరుకునే ఉద్యోగుల కోసం కొత్త షరతులను ప్రవేశపెట్టింది.బెంగళూరు ప్రధాన కార్యాలయంగా ఉన్న ఇన్ఫోసిస్, ఇకపై ఒక్కో త్రైమాసికంలో గరిష్టంగా ఐదు అదనపు వర్క్ ఫ్రమ్ హోమ్ రోజులు లేదా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ (WFO) మినహాయింపులకు మాత్రమే అనుమతి ఇస్తుంది. ఉద్యోగి లేదా అతనిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు సంబంధించిన క్లిష్టమైన వైద్య పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే దీనికి మినహాయింపు ఉంటుంది. అలాంటి సందర్భాల్లో డాక్టర్ వెరిఫికేషన్తో పాటు అవసరమైన డాక్యుమెంట్లు తప్పనిసరిగా సమర్పించాలి.ప్రస్తుతం జాబ్ లెవల్ 5, అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్న ఉద్యోగులు నెలకు కనీసం 10 రోజులు కార్యాలయం నుంచి పని చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు, అదనంగా సహాయక వర్క్ ఫ్రమ్ హోమ్ రోజులు కోరే అభ్యర్థనలపై మరింత నియంత్రణకు ఉద్దేశించినవిగా కంపెనీ తెలిపింది.ఉద్యోగులకు మేనేజర్లు పంపిన ఈమెయిల్స్ ప్రకారం.. అదనపు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆమోదం కోసం వచ్చే అభ్యర్థనల సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ అభ్యర్థన ఉంటే ఈమెయిల్ ద్వారా కాకుండా సిస్టమ్ ద్వారా ముందస్తు ఆమోదం పొందాలని స్పష్టం చేశారు. చివరి నిమిషంలో సమస్యలు తలెత్తకుండా ఉద్యోగులు ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. “పాలసీ ప్రకారం అభ్యర్థన ఆమోదించబడకపోతే, మేనేజర్లుగా తాము చేయగలిగేదేమీ లేదు” అని పేర్కొన్నారు.ఇది చదివారా? ఉద్యోగుల కరెంటు బిల్లులు అడుగుతున్న ఇన్ఫోసిస్..దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ సంస్థగా ఉన్న ఇన్ఫోసిస్లో 3 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. కంపెనీ 2023 నవంబర్ 20న రిటర్న్-టు-ఆఫీస్ విధానాన్ని ప్రకటించినప్పటికీ, దాన్ని 2024 మార్చి 10 నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయడం ప్రారంభించింది. ఈ విధానం ప్రకారం ఉద్యోగులు కార్యాలయంలో కనీసం మూడు గంటలు గడపాల్సి ఉంటుంది.
ఈ-గేమింగ్ రంగంలో నియామకాలు భళా!
భారతీయ గేమింగ్ పరిశ్రమ ప్రస్తుతం ఒక కీలక మలుపులో ఉంది. రియల్ మనీ గేమింగ్ (RMG)పై ఉన్న ఆంక్షలు సుమారు రెండు లక్షల ఉద్యోగాలపై ప్రభావం చూపుతాయనే ఆందోళనల మధ్య, ఈ-గేమింగ్ రంగం అనూహ్య రీతిలో పుంజుకుంటోంది. గడిచిన ఐదు నెలలుగా పరిశ్రమ తన వ్యూహాలను మార్చుకుంటూ, ప్రతిభను నిలుపుకోవడమే కాకుండా కొత్త విభాగాల్లో ఉపాధి అవకాశాలను సృష్టిస్తోంది.కోర్ డెవలప్మెంట్కు క్రేజ్ప్రస్తుతం భారతీయ గేమింగ్ మార్కెట్ కేవలం వినోదం కోసమే కాకుండా హై-ఎండ్ గేమ్ డెవలప్మెంట్ హబ్గా మారుతోంది. ఇన్స్టాహైర్ గణాంకాల ప్రకారం, ప్రస్తుతం ఈ రంగంలో 50,000 నుంచి 60,000 వరకు ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. యూనిటీ (Unity), అన్రియల్ (Unreal) డెవలపర్లు, సీ++ ఇంజినీర్లు, 3డీ ఆర్టిస్టులు, గేమ్ డిజైనర్లకు గిరాకీ పెరిగింది. మొత్తం ఉద్యోగాల్లో వీటి వాటా 70-80 శాతంగా ఉంది. భారతీయ స్టూడియోలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి AAA క్వాలిటీ టైటిల్స్ రూపొందించడంపై దృష్టి పెట్టాయి. టోర్నమెంట్ మేనేజర్లు, కంటెంట్ క్రియేటర్లు, అనలిస్ట్ ఉద్యోగాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2026 చివరి నాటికి గేమింగ్ రంగంలో ఉపాధి 60-70 శాతం వృద్ధి చెందుతుందని ఇన్స్టాహైర్ అంచనా వేసింది.నియంత్రణలతో భరోసా‘ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ చట్టం, 2025’ అమల్లోకి రావడం పరిశ్రమకు ఒక వరంలా మారిందని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఇది ఆర్ఎంజీ, సాధారణ ఈ-గేమ్స్ మధ్య స్పష్టమైన సరిహద్దులను ఏర్పరిచినట్లు తెలుపుతున్నారు. ‘75 శాతం భారతీయ ఈ-స్పోర్ట్స్ ప్లేయర్లు ఈ రంగాన్ని ఒక గౌరవప్రదమైన కెరీర్గా భావిస్తున్నారు. కేవలం ప్లేయర్లుగానే కాకుండా కోచ్లు, ఈవెంట్ మేనేజర్లుగా మారేందుకు 56 శాతం మంది ఆసక్తి చూపుతున్నారు’ అని జెంట్సింథసిస్ సర్వే తెలిపింది.ప్రతిభను వదులుకోని కంపెనీలుఆర్ఎంజీ కంపెనీల్లో గతంలో నియామకాలు తాత్కాలికంగా నెమ్మదించినప్పటికీ అక్కడ ఉన్న నైపుణ్యం కలిగిన సిబ్బందిని ఇతర గేమింగ్ విభాగాలు అందిపుచ్చుకుంటున్నాయి. డ్రీమ్ స్పోర్ట్స్ (Dream Sports) తమ వద్ద ఉన్న ప్రతిభను వదులుకోకుండా తమ గ్రూప్లోని ఇతర ఏడు ప్లాట్ఫారమ్ల్లో ఉద్యోగులను సర్దుబాటు చేస్తామని ప్రకటించింది. ఫెలిసిటీ గేమ్స్ (Felicity Games) గతంలో ఆర్ఎంజీ విభాగాల్లో పనిచేసిన హెడ్ ఆఫ్ ఇంజినీరింగ్, అనలిటిక్స్ వంటి కీలక నిపుణులను నియమించుకుంది. పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆర్ఎంజీపై ఆంక్షలు ఒక రకంగా ఇతర గేమింగ్ విభాగాలు గ్లోబల్ స్థాయిలో ఎదిగేందుకు మార్గం సుగమం చేశాయి.ఇదీ చదవండి: నిర్మాణంలో ఉన్న ఇల్లు బెటరా?
జియో మంత్లీ రీచార్జ్.. ఆల్ ఇన్ వన్ ప్లాన్!
మీరు జియో సిమ్ వాడుతున్నారా? ఎక్కువ ప్రయోజనాలున్న మంచి నెలవారీ రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నారా? అయితే మీ కోసమే ఈ సమాచారం. రిలయన్స్ జియో ఇటీవల ‘హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్’ పేరుతో రూ.500 ప్రత్యేకమైన ప్రీపెయిడ్ ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ ప్లాన్తో డేటా, అపరిమిత కాలింగ్, అలాగే ఉచిత యూట్యూబ్ ప్రీమియం సహా అనేక ఓటీటీ (OTT) సబ్స్క్రిప్షన్లు లభిస్తాయి. ఈ ప్లాన్ వివరాలను ఇప్పుడు చూద్దాం.జియో రూ.500 ప్లాన్ఈ జియో రీఛార్జ్ ప్లాన్ ధర రూ .500. వ్యాలిడిటీ 28 రోజులు ఉంటుంది. ఈ ప్లాన్ మొత్తం 56 జీబీ డేటాను అందిస్తుంది. అంటే వినియోగదారులు రోజుకు 2 జీబీ హై-స్పీడ్ డేటాను పొందుతారు. అదనంగా, ఈ ప్లాన్ లో అదనపు ఛార్జీ లేకుండా ఏ నెట్ వర్క్ కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ ఉంటుంది. ప్రతిరోజూ 100 SMSలు పంపుకోవచ్చు.ఈ ప్లాన్ లో అనేక ఓటీటీ యాప్స్ కు ఉచిత సబ్స్క్రిప్షన్ కూడా ఉంది.ఉచిత ఓటీటీ సబ్స్క్రిప్షన్లు ఇవే..యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, జియో హాట్ స్టార్ (టీవీ/మొబైల్), సోనీ లివ్, జీ5, లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ+, సన్ నెక్ట్స్, కంచా లంకా, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, హోయిచోయ్, ఫ్యాన్ కోడ్, జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్.. ఈ సబ్స్క్రిప్షన్లన్నీ ఈ ప్లాన్తో ఉచితంగా లభిస్తాయి.ఈ ఓటీటీలు మాత్రమే కాకుండా ఈ ప్లాన్ తో కొన్ని అదనపు ప్రయోజనాలను కూడా జియో అందిస్తోంది. జియో హోమ్ 2 నెలల ఉచిత ట్రయల్, జియో ఏఐ క్లౌడ్లో 50 జీబీ స్టోరేజ్ కూడా కొత్త కనెక్షన్లతో అందుబాటులో ఉన్నాయి. అదనంగా, ఈ ప్లాన్ లో 18 నెలల ఉచిత గూగుల్ జెమిని ప్రో ప్లాన్ కూడా ఉంది.
పర్సనల్ ఫైనాన్స్
నిర్మాణంలో ఉన్న ఇల్లు బెటరా?
సొంత ఇల్లు కొనాలన్నా, బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలన్నా సామాన్యుడికి ఎన్నో లెక్కలు.. మరెన్నో సందేహాలు. కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే భద్రంగా ఉంటుంది? ఎక్కడ పెడితే లాభసాటిగా ఉంటుంది? అన్నదే ప్రతి ఒక్కరి ఆలోచన. రియల్ ఎస్టేట్ నుంచి స్టాక్ మార్కెట్ వరకు, బంగారం నుంచి ఇన్సూరెన్స్ వరకు పెట్టుబడిదారుల మదిలో మెదిలే కీలక ప్రశ్నలకు ఆర్థిక నిపుణుల విశ్లేషణాత్మక సమాధానాలు మీకోసం..రియల్టీ..నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేయటం మేలా... లేక నిర్మాణం పూర్తయిన ఇంటిని కొనుగోలు చేయాలా?రెండింట్లోనూ దేనికుండే లాభాలు, దేనికి ఉండే ఇబ్బందులు దానికున్నాయి. ఎందుకంటే నిర్మాణం పూర్తయి తక్షణం వెళ్లగల ఇంటిని కొనుక్కోవటం సురక్షితం. వెంటనే వెళ్లిపోవచ్చు. వేచి చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇలాంటి ఇళ్ల ధర సహ జంగానే ఎక్కువ ఉంటుంది. ఇక నిర్మాణంలో ఉన్న ఇల్లయితే ధర కాస్త తక్కువగా ఉంటుంది. కాకపోతే ఎప్పటికి పూర్తవుతుంది... ఎప్పుడు డెలివరీ ఇస్తారు అనే విషయాలకు గ్యారంటీ ఉండదు. ఇవన్నీ బిల్డరు పూర్వ చరిత్రను చూసి ముందుకు వెళ్లాల్సిన విషయాలే. కాకపోతే ఎంత పేరున్న బిల్డరయినా ఒకోసారి ఇబ్బందులో పడొచ్చు. దానివల్ల మనకు ఇవ్వాల్సిన ఇల్లు ఆలస్యం కావచ్చు. అందుకని మీ అవసరం, వేచిచూసే సామర్థ్యాన్ని బట్టి దేన్ని తీసుకోవాలో నిర్ణయించుకోవాలి. బ్యాంకింగ్..ఎఫ్డీ చేయాలనుకుంటున్నాను. వడ్డీ రేటును బట్టి బ్యాంకును ఎంచుకోవాలా? లేక సర్వీసును చూశా?మీరు ఎంత మొత్తాన్ని ఎఫ్డీ చేయాలనుకుంటున్నారనేది ఇక్కడ ముఖ్యం. ఎందుకంటే అది తక్కువ మొత్తమే అనుకోండి. వడ్డీ రేటు చూసి ఎఫ్డీ చెయ్యండి. అలాకాకుండా ఎక్కువ మొత్తాన్ని డిపాజిట్ చేయాలనుకున్నానుకోండి. అపుడు బ్యాంకు అందిస్తున్న సేవలు, డిజిటల్ సౌకర్యాలు, ఆ బ్యాంకు ఎంత సురక్షితమైనది... అనే అంశాలన్నీ చూడాలి. 0.1 లేదా 0.25 వడ్డీ శాతం కన్నా మన సొమ్ము భద్రంగా ఉండటం ముఖ్యం కదా!. అందుకే మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారనే అంశాన్ని బట్టి బ్యాంకును ఎంచుకోండి. మీరు చేసే ఎఫ్డీ గనక రూ.5 లక్షలు లేదా అంతకన్నా తక్కువ ఉంటే.. అది ఏ బ్యాంకులో డిపాజిట్ చేసినా ఆ మొత్తానికి డిపాజిట్ క్రెడిట్ గ్యారంటీ పథకం కింద బీమా ఉంటుంది. కాబట్టి సురక్షితం. బంగారం సావరిన్ గోల్డ్ బాండ్స్ సురక్షితమేనా? అందులో ఇన్వెస్ట్ చేయొచ్చా?సావరిన్ గోల్డ్ బాండ్లు పూర్తిగా సురక్షితం. వాటికి ఆర్బీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వ గ్యారంటీ ఇస్తోంది. కాకపోతే ప్రస్తుతం ఈ సావరిన్ గోల్డ్ బాండ్లను జారీ చెయ్యటాన్ని కేంద్రం నిలిపేసింది. గతంలో జారీ చేసినపుడు కొన్నవాటికి మాత్రం మెచ్యూరిటీ అయిన వెంటనే చెల్లింపులు జరుగుతున్నాయి. ఇవి మరికొన్ని సంవత్సరాలు జరుగుతాయి కూడా. ఈ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసినవారికి బంగారం ధర ఎంత పెరిగితే అంత చెల్లించటంతో పాటు ఏటా 2.5 శాతం మొత్తాన్ని అదనంగా కూడా చెల్లిస్తారు. భౌతికంగా బంగారం కొనటం కన్నా ఇదే ఎక్కువ లాభం కదా!. కాకపోతే ఇందులో ఉండే రిస్కల్లా ఒకటే. బంగారం ధర తగ్గితే చెల్లించేటపుడు తగ్గిన ధరే చెల్లిస్తారు. ఏడేళ్ల పాటు కాలపరిమితి ఉండటంతో పాటు ఐదేళ్ల లాకిన్ కూడా ఉంది.స్టాక్ మార్కెట్...1న బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కనక ఆదివారమైనా స్టాక్ మార్కెట్ పనిచేస్తుందని ప్రకటించారు. బడ్జెట్కు, స్టాక్ మార్కెట్కు సంబంధమేంటి?బడ్జెట్ ప్రవేశపెట్టిననాడు సెలవు దినమైతే ఆ రోజున స్టాక్ మార్కెట్ ప్రత్యేకంగా పనిచేయటమన్నది ప్రస్తుత ప్రభుత్వ హయాంలో మొదలైన సంప్రదాయం. గత సంవత్సరం కూడా ఫిబ్రవరి 1 శనివారం వచి్చంది. ఆ రోజునా స్టాక్ మార్కెట్లు పనిచేశాయి. ఇపుడు ఆదివారం కూడా పనిచేస్తాయని ప్రకటించారు. వాస్తవానికి బడ్జెట్ అనేది పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాదని గతంలో కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. కానీ ఇపుడు బడ్జెట్ సమయంలో మార్కెట్ ఎలా ప్రతిస్పందిస్తుందనేది లైవ్లో దేశ ప్రజలకు తెలుస్తుందని, తమ నిర్ణయాలకు మార్కెట్ ఆమోదం ఉందో లేదో కూడా తెలిసిపోతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.మ్యూచువల్ ఫండ్స్...సాధారణ డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయటం సురక్షితమేనా?షేర్లలో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్తో పోలిస్తే బాండ్లలో ఇన్వెస్ట్ చేసే డెట్ ఫండ్స్ చాలా సురక్షితం. అలాగని వాటిలో రిస్కు ఉండదని కాదు. అవి ఏ బాండ్లు కొంటున్నాయనేదాన్ని బట్టి అవెంత సురక్షితమో చెప్పొచ్చు. సాధారణంగా డెట్ఫండ్స్ ప్రభుత్వ సెక్యూరిటీల్లోను, ట్రెజరీ బిల్స్లోను, కార్పొరేట్ బాండ్లలోను, మనీమార్కెట్ సాధనాల్లోను ఇన్వెస్ట్ చేస్తుంటాయి. వీటిలో హెచ్చుతగ్గులు తక్కువ. తక్కువైనా... స్థిరమైన రాబడులుంటాయి. అయితే ఈ ఫండ్లు కార్పొరేట్ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. సదరు కంపెనీ క్రెడిట్ రేటింగ్ తగ్గితే అది కొంతమేర రిస్కే. ఇక వడ్డీరేట్లు పెరిగినపుడు బాండ్ల ధరలు తగ్గుతాయి. మార్కెట్ పరిస్థితులు బాగులేకుంటే ఫండ్లు తమ బాండ్లను అమ్మటానికి ప్రయత్నించినా ఎవరూ కొనకపోవచ్చు. ఈ రిస్క్లు దృష్టిలో పెట్టుకోవాలి.ఇన్సూరెన్స్ఆయుష్ ట్రీట్మెంట్కు అయ్యే ఖర్చులు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ పరిధిలోకి వస్తాయా?మన దేశంలో ఇపుడు చాలా పాలసీలు ఆయుష్ ట్రీట్మెంట్కు కవరేజీ ఇస్తున్నాయి. కొన్ని షరతులుంటున్నాయి. ఆయుర్వేద, యోగ, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియో పతి వంటి చికిత్సలన్నీ ఆయుష్ పరిధిలోకి వస్తా యి. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలోనో, లేక ప్రభు త్వ గుర్తింపు పొందిన ఆసుపత్రిలోనో, ఎన్ఏబీహెచ్ అక్రిడిటేషన్ ఉన్న ఆయుష్ ఆసుపత్రిలోనో తీసుకున్న చికిత్సకే కవరేజీ ఇస్తున్నారు. ఔట్పేషెంట్ చికిత్సలకు కాకుండా... ఆసుపత్రిలో చేరిన చికిత్స లకే ఇది వర్తిస్తుంది. గుర్తింపు లేని ప్రయివేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నా, నేరుగా మందులు కొనుక్కున్నా, వెల్నెస్ థెరపీ, స్పా, రిజువనేషన్ చికిత్సలకు ఇది వర్తించదు. పైపెచ్చు చాలా పాలసీలు కవరేజీ మొత్తాన్ని ఏడాదికి రూ.25వేల నుంచి రూ.50 వేలకు పరిమితం చేస్తున్నాయి.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2026: బయో ఇం‘ధనం’ కావాలి..
విశ్రాంత జీవనంలోనూ ‘ఫండించొచ్చు!
స్టాక్ మార్కెట్ పెట్టుబడులంటేనే కాస్త టెన్షన్. ఎందుకంటే ఇక్కడ రాబడుల వెనకాల రిస్కూ ఉంటుంది. వయసులో ఉన్నవారికైతే ఓకే. మార్కెట్లు పడినా కొన్నాళ్లు వేచిచూస్తే మళ్లీ సర్దుకుంటాయి. మరి రిటైరీల మాటేంటి? నెలవారీ ఆదాయంతోనే నెట్టుకురావాల్సిన సీనియర్ సిటిజన్లు ఈ టెన్షన్లతో సుఖవంతమైన జీవితాన్ని ఆస్వాదించటం సాధ్యమా? అలాగని ఎఫ్డీలపైనే ఆధారపడితే అంతకంతకూ వడ్డీ రేట్లు తగ్గుతూ పోతున్నాయి. పైపెచ్చు జీవన వ్యయాలు, వైద్యం ఖర్చుల్లాంటివి పెరిగిపోతున్నాయి. మరి విశ్రాంత జీవనం గౌరవప్రదంగా, ఆర్థికంగా స్వేచ్ఛతో సాగించాలంటే దారేంటి? ద్రవ్యోల్బణాన్ని మించి కాకపోయినా బ్యాంకు ఎఫ్డీలకన్నా మెరుగైన రాబడి అందించే సాధనాలు ఏమున్నాయి? మ్యుచువల్ ఫండ్స్ వైపు మళ్లొచ్చా? అసలు సీనియర్ సిటిజన్లకు అవి మంచివేనా అనే ప్రశ్నలకు అంత తేలిగ్గా సమాధానాలు దొర కవు. కాకపోతే ఆచి తూచి, సరైన వ్యూహంతో ఎంచుకుంటే సీనియర్ సిటిజన్లకూ ఫండ్స్ ప్రయోజనకరంగానే ఉంటాయనేది నిపుణుల మాట. దాన్ని వివరించే ప్రయత్నమే ఈ వెల్త్ స్టోరీ....ప్రాధాన్యాలు మారుతాయి.. వయస్సు పెరిగే కొద్దీ ప్రాధాన్యాలు మారుతాయి. యువ ఇన్వెస్టర్లతో పోలిస్తే సీనియర్ సిటిజన్ల ఆర్థిక అవసరాలు, ప్రణాళికలు వేరుగా ఉంటాయి. వారికి రాబడికన్నా తమ పెట్టుబడిని కాపాడుకోవటం ముఖ్యం. క్రమం తప్పకుండా, కచ్చితంగా కొంత మొత్తం ఆదాయంగా చేతికి అందటం అంతకన్నా ముఖ్యం. అది కూడా పెరిగే ధరలను తట్టుకునే భరోసానివ్వాలి. ఆరోగ్యం పరంగానో లేక మరొకటో అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే చేతిలో నగదు ఉండాలి. ఇలా ఒకటా, రెండా.. పెట్టుబడి పెట్టేటప్పుడు ఎన్నో విషయాలు చూసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే, సంప్రదాయ పెట్టుబడి సాధనాలకు తోడుగా ఉంటూ, ఈ లక్ష్యాలను సాధించుకోవడంలో సహాయకరంగానూ ఉంటాయి. సౌకర్యవంతంగా జీవించాలంటే... ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో, అద్దెను మినహాయించి తక్కువలో తక్కువగా, ఓ మధ్యతరగతి సీనియర్ సిటిజన్ కుటుంబ ఖర్చులు ఇలా ఉంటున్నాయి... → కరెంటు, ఇంటి మెయింటెనెన్సు మొదలైనవి: రూ. 8,000–10,000 → నిత్యావసరాలు : రూ. 10,000–12,000 → వైద్యం, ఔషధాల ఖర్చులు: రూ. 5,000–7,000 → ప్రయాణాలు, వ్యక్తిగత అవసరాల ఖర్చులు: రూ. 5,000–6,000 → ఇలా, ఒక మోస్తరు సౌకర్యవంతంగా జీవించాలంటే నెలకు సింపుల్గా రూ. 30,000 నుంచి రూ. 40,000 వరకు అవసరమవుతోంది. → మరికాస్త సౌకర్యవంతంగా ఉండాలంటే (ట్రావెల్, హాబీలు, పని మనుషులు) ఖర్చులు నెలకు రూ. 45,000–60,000 వరకు పెరుగుతాయి.ఇంత ఆదాయం రావాలంటే ఎంత దాచిపెట్టాలి? రిటైర్మెంట్ తర్వాత కూడా ఖర్చుల కోసం నెలకు రూ. 30,000 నుంచి రూ. 60,000 వరకు అందుకోవాలంటే, అందుకు ఏ స్థాయిలో పెట్టుబడులు ఉండాలి? వార్షికంగా ఎంత మొత్తం రాబడిని ఆశించవచ్చు అనేది మరో ప్రశ్న. సీనియర్ సిటిజన్లకు, పెట్టుబడి భారీగా వృద్ధి చెందడం కన్నా, రాబడిపరమైన భద్రత అవసరం కాబట్టి తక్కువలో తక్కువగా ఏటా 6–7 శాతం రాబడిని ఆశించవచ్చు. దాన్ని బట్టి, పెద్దగా రిస్కులు ఉండని, పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ప్రాతిపదికన చూస్తే..సీనియర్ సిటిజన్లకు పెట్టుబడి ఆప్షన్లు.. → బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీములు – స్థిరత్వం కోసం ఇవి పెట్టుబడులకు భద్రతనిచ్చేలా, రాబడులు అంచనాలకు తగ్గట్లుగా ఉంటాయి. క్రమం తప్పకుండా వడ్డీ ఆదాయం వస్తుంది. కాకపోతే పెరిగే ధరలకు తగ్గ స్థాయిలో రాబడి ఉండకపోవచ్చు. కాబట్టి పోర్ట్ఫోలియోలో వీటికి 30–40 శాతం పెట్టుబడిని కేటాయించవచ్చు. → డెట్ మ్యూచువల్ ఫండ్స్ వీటిలో వివిధ కేటగిరీలున్నా.. సీనియర్ సిటిజన్లకు ఈ కిందివి అనువైనవిగా ఉంటాయి. → సంప్రదాయ హైబ్రిడ్ ఫండ్స్ → స్వల్పకాలిక ఫండ్స్ → కార్పొరేట్ బాండ్ ఫండ్స్ వీటిని ఎందుకు పరిశీలించవచ్చంటే, ఇవి ఎఫ్డీలతో పోలిస్తే పన్నుల అనంతరం మరింత మెరుగైన రాబడిని అందిస్తాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు నగదు కింద మార్చుకునే (లిక్విడిటీ) వీలుంటుంది. విత్డ్రాయల్ సులభతరంగా ఉంటుంది. వీటికి 30–35 శాతం కేటాయించవచ్చు. → ఎస్డబ్ల్యూపీ (సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్) – పొదుపు మొత్తం నుంచి నెలవారీ జీతం ఎస్డబ్ల్యూపీ అనేది మ్యుచువల్ ఫండ్స్ నుంచి ప్రతి నెలా ఇంత మొత్తాన్ని విత్డ్రా చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. దీన్ని పెన్షనో లేదా శాలరీగానో అనుకోవచ్చు. వడ్డీ ఆదాయంతో పోలిస్తే దీనిపై పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. ఎంత విత్డ్రా చేసుకోవాలనేది ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. డెట్ లేదా కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్తో కలిపి ఉపయోగించుకోవచ్చు. → ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ – పరిమిత స్థాయిలోనే, కాకపోతే కీలకం సీనియర్ సిటిజన్స్ అయినంత మాత్రాన షేర్లకు పూర్తిగా దూరంగా ఉండాల్సిన పనిలేదు. లార్జ్ క్యాప్ లేదా ఇండెక్స్ ఫండ్స్ లాంటివి ఎంచుకోవచ్చు. పెట్టుబడుల్లో 10–20 శాతానికి మించకుండా ఈక్విటీలకు కేటాయించవచ్చు. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణం నుంచి పొదుపు మొత్తాలను కాపాడుకోవడానికి ఈ ఫండ్స్ ఉపయోగపడతాయి. శాంపిల్ రిటైర్మెంట్ పోర్ట్ఫోలియో (రూ. 1 కోటి నిధి) → బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు + ఎస్సీఎస్ఎస్: రూ. 35 లక్షలు → డెట్/కన్జర్వేటివ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్: రూ. 35 లక్షలు → ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ / ఇండెక్స్ ఫండ్స్: రూ. 15 లక్షలు → ఎమర్జెన్సీ నగదు – సేవింగ్స్: రూ. 15 లక్షలు పోర్ట్ఫోలియోను ఇలా తీర్చిదిద్దుకుంటే ఒక మోస్తరు స్థిరత్వంతో ప్రతి నెలా సుమారు రూ.45,000 నుంచి రూ. 55,000 వరకు అందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ గుర్తుంచుకోతగిన కీలకమైన అయిదు సూత్రాలు .. → భారీ రాబడుల హామీలతో ఊరించే స్కీములకు దూరంగా ఉండాలి → వడ్డీపై మాత్రమే ఆధారపడకుండా ఎస్డబ్ల్యూపీని ఉపయోగించుకోవాలి→ చేతిలో ఉన్న మొత్తం నిధిని ఒకే సాధనంలో ఇన్వెస్ట్ చేయొద్దు.→ నామినేషన్లు, వీలునామా అప్డేటెడ్గా ఉండేలా చూసుకోవాలి → తగినంత స్థాయిలో హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి.
రూ.లక్షల బంగారం.. లాకర్లో సేఫేనా?
ఇటీవల బంగారం ధర భారీగా పెరిగిపోయింది. ఒక్క తులం (10 గ్రాములు) బంగారమే రూ.1.5 లక్షలు దాటిపోయింది. ఈ క్రమంలో బంగారు ఆభరణాల భద్రత గురించి ఆందోళనలు సైతం ఎక్కువయ్యాయి. బంగారు ఆభరణాలను బ్యాంకు లాకర్లో ఉంచితే పూర్తిగా సురక్షితం అని చాలామంది భావిస్తారు.నిజానికి, బ్యాంకు లాకర్లు బలమైన భౌతిక భద్రత అందించినప్పటికీ, ఆభరణాలు పోయినా లేదా దెబ్బతిన్నా పూర్తి ఆర్థిక రక్షణ ఇవ్వవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం.. లాకర్ విషయంలో బ్యాంకుల బాధ్యత పరిమితమైనదే. చాలా సందర్భాల్లో నష్టాన్ని కస్టమరే భరించాల్సి వస్తుంది.లాకర్లోని వస్తువులకు బీమా ఉంటుందా?లాకర్లో ఉంచిన ఆభరణాలకు బ్యాంకు బీమా చేస్తుందనేది ఒక పెద్ద అపోహ. వాస్తవానికి, లాకర్ కంటెంట్కు బ్యాంకులు ఎలాంటి బీమా ఇవ్వవు. దొంగతనం, అగ్నిప్రమాదం లేదా ఇతర కారణాల వల్ల ఆభరణాలు నష్టపోయినా, బ్యాంకు ఆటోమేటిక్గా పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు.భద్రతా వైఫల్యం, సిబ్బంది నిర్లక్ష్యం లేదా మోసం, లాకర్ నిర్వహణ లోపాలు వంటి సందర్భాల్లో మాత్రమే బ్యాంకు బాధ్యత వహిస్తుంది. బ్యాంకు తప్పిదం నిరూపితమైనా, పరిహారం మొత్తానికి పరిమితి ఉంటుంది. ఆర్బీఐ నియమాల ప్రకారం, బ్యాంకు చెల్లించే గరిష్ట పరిహారం వార్షిక లాకర్ అద్దెకు 100 రెట్లు మాత్రమే. ఉదాహరణకు మీ లాకర్ అద్దె సంవత్సరానికి రూ.4,000 అయితే, మీ ఆభరణాల విలువ ఎంత ఎక్కువైనా గరిష్ట పరిహారం రూ.4 లక్షలు మాత్రమే.వరదలు, భూకంపాలు, అగ్నిప్రమాదాలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల లాకర్కు నష్టం జరిగితే, బ్యాంకు నిర్లక్ష్యం నిరూపించబడనంత వరకు బ్యాంకు బాధ్యత వహించదు. అటువంటి పరిస్థితుల్లో మొత్తం ఆర్థిక నష్టం కస్టమరుదే.ప్రత్యేక ఆభరణాల బీమా అవసరంవిలువైన బంగారు ఆభరణాలకు ప్రత్యేక జ్యువెలరీ ఇన్సూరెన్స్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి పాలసీలు సాధారణంగా దొంగతనం, అగ్నిప్రమాదం, డ్యామేజ్, బ్యాంకు లాకర్లో ఉన్నప్పుడూ జరిగే నష్టం వంటి వాటికి కవరేజ్ ఇస్తాయి.క్లెయిమ్ సులభంగా రావాలంటే..ఆభరణాల ఫోటోలు భద్రపరుచుకోండి. తాజా వాల్యుయేషన్ సర్టిఫికెట్లు దగ్గర ఉంచుకోండి. ఆభరణాలు లాకర్లో ఉన్నాయని బీమా కంపెనీకి తెలియజేయండి. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం, ఇప్పుడు అన్ని బ్యాంకులు ప్రామాణిక లాకర్ ఒప్పందం అనుసరించాలి. మీరు సంతకం చేసిన అగ్రిమెంట్లో మీ హక్కులు, బ్యాంకు బాధ్యతలు, పరిహార నిబంధనలు స్పష్టంగా ఉన్నాయో లేదో తప్పకుండా పరిశీలించండి.బ్యాంకు లాకర్ భౌతిక భద్రతకు మంచి ఎంపికే కానీ, పూర్తి ఆర్థిక రక్షణ ఉండదు. పరిమిత బ్యాంకు బాధ్యతలు, ఆటోమేటిక్ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల, లాకర్ + ఆభరణాల బీమా కలిపి ఉపయోగించడమే అత్యంత సురక్షితమైన మార్గం.
లైఫ్ ఇన్సూరెన్స్.. ఎందుకు తీసుకోవాలంటే?
అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో.. అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో ప్రజల జీవన విధానం కూడా ఒకటి. ఉమ్మడి కుటుంబాలు తగ్గుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ కూడా వ్యవసాయం నుంచి పారిశ్రామిక రంగాలవైపు పరుగులు పెడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం చేస్తున్నవారికి పదవీ విరమణ తర్వాత జీవితం.. సురక్షితంగా, ఆర్థికంగా స్థిరంగా ఉండాలంటే ముందుగానే సరైన ప్రణాళిక అవసరం. వయసు పెరిగేకొద్దీ.. వైద్య ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. మనం ఈ కథనంలో పదవీ విరమణ ప్రణాళికలో జీవిత బీమా ఎందుకు ముఖ్యమో చూసేద్దాం.పదవీ విరమణ తర్వాత ఆదాయంఉద్యోగం చేస్తున్న వ్యక్తి పదవీ విరమణ చేస్తే జీతం ఆగిపోతుంది. అలాంటి సమయంలో.. ఖర్చుల కోసం స్థిరమైన ఆదాయం అవసరం. కొన్ని జీవిత బీమా పథకాలు పదవీ విరమణ తర్వాత నెలవారీ లేదా వార్షిక ఆదాయం అందిస్తాయి. ఎండోమెంట్ పాలసీలు, ULIP (యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్)లు వంటి అనేక ప్రణాళికలు ఒకేసారి మొత్తం ఇవ్వడం కాకుండా.. నిరంతర ఆదాయం అందించే అవకాశాన్ని కల్పిస్తాయి. ఇవి పదవీ విరమణ జీవితం ప్రశాంతంగా సాగేందుకు సహాయపడుతుంది.వైద్య ఖర్చులువయస్సు పెరిగే కొద్దీ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల చికిత్సకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. జీవిత బీమాతో పాటు క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ఉంటే.. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక భారం తగ్గుతుంది. ఖర్చుల గురించి ఆందోళన లేకుండా మంచి వైద్యం పొందే అవకాశం ఉంటుంది.అప్పులు తీర్చేందుకుకొన్ని సందర్భాల్లో హోమ్ లోన్స్ లేదా ఇతర లోన్లు పదవీ విరమణ తర్వాత కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. అలాంటి అప్పులు వృద్ధాప్యంలో తప్పకుండా భారం అవుతాయి. జీవిత బీమా పాలసీ నుంచి వచ్చే మెచ్యూరిటీ మొత్తాన్ని ఉపయోగించి మిగిలిన అప్పులను తీర్చేయవచ్చు. దీంతో అప్పుల ఒత్తిడి లేకుండా జీవించవచ్చు.ఖర్చుల నుంచి రక్షణకాలక్రమంలో ఖర్చులు పెరగవచ్చు. దీనికోసం డబ్బు దాచుకుంటే సరిపోదు. డబ్బును పెంచుకునే మార్గాలు ఉండేలా చూడాలి. దీనికోసం ULIPల వంటి మార్కెట్ ఆధారిత జీవిత బీమా పథకాలు. పెట్టుబడికి అవకాశం కల్పిస్తాయి. మార్కెట్ అనుకూలంగా ఉన్నప్పుడు మంచి వృద్ధి పొందుతాయి.తక్షణ నగదు లభ్యతభూములు, ఇళ్లు వంటి స్థిర ఆస్తులను అవసరమైనప్పుడు వెంటనే అమ్మడం కష్టం. కానీ జీవిత బీమా నుంచి వచ్చే మొత్తాన్ని సులభంగా పొందవచ్చు. అంతే కాకుండా.. ఈ మొత్తంపై ట్యాక్స్ ప్రయోజనాలు కూడా లభిస్తాయి. కుటుంబానికి అవసరమైన సమయంలో ఇది చాలా ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: సాయంత్రానికి సగం తగ్గిన ధర!.. లేటెస్ట్ గోల్డ్ రేటు ఇలా..


