Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Vehicle Sales Surge 18pc in January Rural Demand Drives Growth FADA1
జోరుగా వాహన విక్రయాలు

న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి మొత్తం 27,22,558 వాహనాలు రిటైల్‌గా విక్రయమయ్యాయని వాహన డీలర్ల సమాఖ్య ఫాడా వెల్లడించింది. గతేడాది ఇదే నెలలో అమ్ముడైన 23,14,940 యూనిట్లతో పోలిస్తే ఇవి 18% అధికంగా ఉన్నాయి. జీఎస్‌టీ సంస్కరణల ఉత్సాహం కొనసాగడం, పంట దిగుమతి, పెళ్లిళ్ల ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లో నగదు సరఫరా పెరగడం, సరుకు రవాణా రంగంలో డిమాండ్‌ స్థిరంగా కొనసాగడంతో వాహనాలకు గిరాకీ పెరిగిందని ఫాడా వివరణ ఇచ్చింది.‘‘ప్యాసింజర్‌ వాహనాలకు డిమాండ్‌ పెద్ద నగరాలకే పరిమితం కాకుండా, నిర్మాణాత్మకంగా విస్తరిస్తోంది. వార్షిక ప్రాతిపదికన ప్రయాణికుల వాహన విక్రయాల వృద్ధి గ్రామీణ ప్రాంతాల్లో 14.43%, పట్టణ ప్రాంతాల్లో 2.75%గా ఉంది. కస్టమర్లకు ఎస్‌యూవీ/కాంపాక్ట్‌ ఎస్‌యూవీలపై అమితాసక్తి, ఎంట్రీ లెవల్‌ కార్ల తిరిగి మార్కెట్లోకి విడుదల కావడం, డిమాండ్‌కు తగ్గట్లు ఉత్పత్తి, కంపెనీల ఆఫర్లు, స్కీములు కొనసాగడం వాహన విక్రయాల వృద్ధికి తోడ్పడ్డాయి’’ అని ఫాడా ప్రెసిడెంట్‌ సీ ఎస్‌ విఘ్నేశ్వర్‌ తెలిపారు.వచ్చే మూడు నెలలపై ఫాడా అవుట్‌లుక్‌ రాబోయే మూడు నెలలపై ఫాడా ఆశావహ దృక్పథం వ్యక్తం చేసింది. డీలర్‌ విశ్వాసం బలంగా కొనసాగుతోందని, సర్వేలో పాల్గొన్నవారిలో 79.70% వృద్ధిని ఆశిస్తున్నారని, కేవలం 1.88% మాత్రమే క్షీణత ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది. వృద్ధి ఆధారిత బడ్జెట్‌ 2026లో కేంద్రం మౌలిక సదుపాయాలు, వ్యవసాయ రంగాలపై దృష్టి సారించింది.జీఎస్‌టీ 2.0 సంస్కరణల కొనసాగింపు, వడ్డీ రేట్లలో స్థిరత్వం, ఫైనాన్సింగ్‌ సౌలభ్యం తదితర అంశాలు కొనుగోళ్ల సామర్థ్యాన్ని పెంచవచ్చని ఫాడా అభిప్రాయపడింది. ముఖ్యంగా టూ వీలర్స్, వాణిజ్య వాహనాలు, ప్యాసింజర్‌ వాహనాల విభాగాల్లో డిమాండ్‌ సానుకూలంగా కొనసాగుతుందని అంచనా వేసింది. అయితే ఎన్నికల ప్రభావం, సీజనాలిటీ, కొన్ని ప్రాంతాల్లో మోడల్‌ లభ్యత అంశాలు వాహన విక్రయాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపొచ్చని ఫాడా పేర్కొంది.

LTIMindtree is now LTM unveils new identity and positioning2
పేరు మార్చుకున్న ప్రముఖ ఐటీ కంపెనీ

ప్రముఖ దేశీయ ఐటీ సేవల సంస్థ ఎల్‌టీఐ మైండ్‌ట్రీ (LTIMindtree) తన పేరును మార్చుకుంది. కంపెనీ కొత్త పేరును ఎల్‌టీఎం లిమిటెడ్‌ (LTM Limited)గా ప్రకటించింది. తన కొత్త బ్రాండ్ గుర్తింపు, లోగోను ఆవిష్కరించింది. వేణు లాంబును చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO), మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించిన సంవత్సరం తర్వాత తన పేరును అధికారికంగా మార్చుకుంది."వ్యాపార సృజనాత్మకత భాగస్వామి" (Business Creativity Partner)గా కొత్త గుర్తింపు, స్థానాన్ని ప్రకటిస్తూ, ఎల్‌టీఎం తన సాంకేతిక సామర్థ్యాలు, లోతైన డొమైన్ నైపుణ్యం కలిసి వాటాదారులకు అర్థవంతమైన విలువను ఎలా సృష్టిస్తాయో వివరించింది. ఈ విషయాన్ని కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది."మార్కెట్లు మారుతున్నాయి, క్లయింట్ల అంచనాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో, మన ప్రస్తుత సామర్థ్యాలు, భవిష్యత్తు దృష్టిని ప్రతిబింబించే బ్రాండ్‌తో ముందుకు సాగుతున్నాము. బిజినెస్ క్రియేటివిటీ భాగస్వామిగా, మనం పని చేసే కొత్త మార్గాలు, కొత్త ఉత్పాదకత నమూనాలు, విలువ సృష్టించే కొత్త విధానాలను రూపొందిస్తున్నాము" అని సీఈఓవేణు లాంబు తెలిపారు.ఎల్‌టీఐ మైండ్‌ట్రీ లిమిటెడ్‌.. లార్సెన్ & టుబ్రో గ్రూప్‌కు చెందిన ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కన్సల్టింగ్ అండ్‌ డిజిటల్ సొల్యూషన్స్ సంస్థ. ఎల్‌అండ్‌టీఐ ఇన్ఫోటెక్, మైండ్‌ట్రీ విలీనంతో ఏర్పడిన ఈ సంస్థ, ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల సంస్థలకు డిజిటల్ మార్పు, క్లౌడ్, డేటా అనలిటిక్స్, కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత సేవలను అందిస్తోంది. ఇటీవల విడుదల చేసిన డిసెంబర్ త్రైమాసిక (Q3) ఆర్థిక ఫలితాల ప్రకారం.. కంపెనీ ఆదాయం సుమారు 11 శాతం పెరిగి రూ. 10,781 కోట్లకు చేరుకోగా, పునరావృతం కాని (one-off) వ్యయ ప్రభావాల కారణంగా నికర లాభం సుమారు 12 శాతం తగ్గి రూ. 960 కోట్లుగా నమోదైంది.ఇదీ చదవండి: ఉద్యోగం వద్దనుకుంటే.. గూగుల్‌ ఆఫర్‌ ఇదే..

PLI Scheme Attracts 55 Companies Commits Rs 13203 Crore Investments3
పీఎల్‌ఐ పథకానికి 55 కంపెనీలు సై..

న్యూఢిల్లీ: స్పెషాలిటీ స్టీల్‌ విభాగంలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల(పీఎల్‌ఐ) పథకం మూడో రౌండ్‌ను కేంద్ర స్టీల్‌ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి తాజాగా ప్రవేశపెట్టారు. అప్‌గ్రేడెడ్‌ అలాయ్‌ స్టీల్‌ తయారీలో 8.7 మిలియన్‌ టన్నులను అదనంగా జత చేసుకునే లక్ష్యంతో తాజా రౌండ్‌కు తెరతీశారు. ఇందుకు అనుగుణంగా 55 కంపెనీల మధ్య 85 అవగాహనా ఒప్పందాలు(ఎంవోయూలు) కుదిరాయి.వీటిలో పీఎస్‌యూ దిగ్గజం సెయిల్‌ సేలం స్టీల్‌ ప్లాంట్‌తో స్టీల్‌ శాఖ ఒప్పందం సైతం కలసి ఉంది. వెరసి పీఎల్‌ఐ 1.2లో భాగంగా రూ. 13,203 కోట్ల విలువైన పెట్టుబడులకు తెరలేవనుంది. ప్రధాని నరేంద్ర మోడీ విజన్‌కు అనుగుణంగా ప్రపంచస్థాయి పోటీతత్వ స్పెషాలిటీ స్టీల్‌ ఎకోసిస్టమ్‌ ఏర్పాటులో పీఎల్‌ఐ 1.2 కీలక ముందడుగుగా మంత్రి కుమారస్వామి పేర్కొన్నారు.మేకిన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ భారత్‌.. లక్ష్యాలు రెండింటికీ తాజా పథకం ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వివరించారు. తద్వారా దేశీయంగా ఆధునిక, వ్యూహాత్మక స్టీల్‌ ప్రొడక్టుల తయారీ సామర్థ్యాలకు ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు తెలియజేశారు. తాజా ప్రాజెక్టులతో 2030–31కల్లా 8.7 మిలియన్‌ టన్నుల స్పెషాలిటీ స్టీల్‌ సామర్థ్యాలు జత కలిసే వీలున్నట్లు అంచనా వేశారు.

Reliance Acquires Southern Health Foods Takes Over Manna Brand4
రిలయన్స్‌ చేతికి సదరన్‌ హెల్త్‌ ఫుడ్స్‌

న్యూఢిల్లీ: అనుబంధ ఎఫ్‌ఎంసీజీ విభాగం రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌(ఆర్‌సీపీఎల్‌) తాజాగా తమిళనాడు కంపెనీ సదరన్‌ హెల్త్‌ ఫుడ్స్‌ను సొంతం చేసుకుంటున్నట్లు డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వెల్లడించింది. అయితే డీల్‌ విలువను తెలియజేయలేదు.తాజా కొనుగోలు ద్వారా తృణ ధాన్యాల(మిల్లెట్స్‌) ఆధారిత ఫుడ్‌ విభాగంలో రిలయన్స్‌ కన్జూమర్‌ విస్తరించనుంది. రెండు దశాబ్దాలుగా ఆరోగ్యకర ఆహార విభాగంలో మన్నా బ్రాండ్‌తో సదరన్‌ హెల్త్‌ ఫుడ్స్‌ విభిన్న ప్రొడక్టులను విక్రయిస్తోంది. ఆర్‌సీపీఎల్‌ ఇటీవలే ఆ్రస్టేలియా సంస్థ గుడ్‌నెస్‌ గ్రూప్‌ గ్లోబల్‌ పీటీవైను సొంతం చేసుకున్న నేపథ్యంలో తాజా కొనుగోలుకి ప్రాధాన్యత ఏర్పడింది. తద్వారా బెటర్‌ ఫర్‌ యు బ్రాండ్‌ పానీయాల బిజినెస్‌ను సొంతం చేసుకున్న విషయం విదితమే.

Stock Market Close Highlights February 11 2026 IT shares slip5
స్టాక్‌ మార్కెట్‌ ర్యాలీకి బ్రేక్‌.. పడిపోయిన ఐటీ షేర్లు

భారత ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ బుధవారం మ్యూట్ నోట్‌తో సెషన్‌ను ముగించాయి. యూఎస్-ఇండియా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో నడిచిన ర్యాలీకి బ్రేక్‌ పడింది. ముగింపులో బీఎస్ఈ సెన్సెక్స్ 40.28 పాయింట్లు లేదా 0.05 శాతం నష్టపోయి 84,233.64 వద్ద ఉండగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 18.7 పాయింట్లు లేదా 0.07 శాతం పెరిగి 25,953.85 వద్ద ఉంది. విస్తృత మార్కెట్లో ఎన్ఎస్ఈ మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.03 శాతం, 0.02 శాతం లాభపడ్డాయి.సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) 3 శాతానికి పైగా ర్యాలీ చేసి, మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో టీసీఎస్‌ను అధిగమించి నాలుగో అతిపెద్ద కంపెనీగా అవతరించింది. మారుతి సుజుకి, ట్రెంట్ ఇతర టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. మరోవైపు ఐటీ షేర్లు పడిపోయాయి. టీసీఎస్ 2 శాతానికి పైగా క్షీణించింది. హెల్‌సీఎల్ టెక్నాలజీస్, ఎటర్నల్, ఐటీసీ ఇతర టాప్‌ లూజర్స్‌లో జాబితాలో చేరాయి. రంగాలవారీగా నిఫ్టీ హెల్త్ కేర్ 1.62 శాతం లాభపడగా, నిఫ్టీ ఆటో 1.3 శాతం లాభపడ్డాయి. దీనికి విరుద్ధంగా, నిఫ్టీ ఐటీ సెషన్ లో అతిపెద్ద లూజర్‌గా ఉద్భవించింది.

Google Offers Voluntary Exit Packages Amid AI First Shift6
ఉద్యోగం వద్దనుకుంటే.. గూగుల్‌ ఆఫర్‌ ఇదే..

గూగుల్ తన గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్ (GBO) ఉద్యోగుల కోసం మరోసారి స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజీలను (Voluntary Exit Packages - VEP) ప్రకటించింది. ఏఐ (AI) ఆధారిత భవిష్యత్తుకు పూర్తిగా కట్టుబడి ఉన్న సంస్థగా మారేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.“కొత్త సంవత్సరాన్ని మనం బలమైన స్థితిలో ప్రారంభిస్తున్నాం. 2025లో మీరు అందించిన సహకారానికి కృతజ్ఞతలు. అయితే టెక్నాలజీ రంగం వేగంగా మారుతోంది. పోటీ తీవ్రంగా ఉంది. కాబట్టి మన ఏఐ మిషన్‌కు పూర్తిగా అనుగుణంగా పనిచేసే శ్రామిక శక్తి అవసరం” అని గూగుల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్ అంతర్గత మెమోలో ఉద్యోగులకు తెలిపారు.ఏఐ-ఫస్ట్ దిశగా అడుగులుగూగుల్ ఇప్పుడు పూర్తిగా “ఏఐ-ఫస్ట్” సంస్థగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే వ్యాపార విభాగంలోని ప్రతి ఉద్యోగీ ఏఐని స్వీకరించి, ఎక్కువ ప్రభావాన్ని చూపాలని సంస్థ స్పష్టం చేసింది. “ఈ వేగానికి సరిపోలలేనివారు లేదా ముందుకు సాగడానికి సిద్ధంగా లేనివారు స్వచ్ఛందంగా నిష్క్రమించేందుకు కంపెనీ అవకాశం ఇస్తుంది” అని షిండ్లర్ పేర్కొన్నారు.ఎవరిపై ప్రభావం?ఈ స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజీలు ముఖ్యంగా సొల్యూషన్స్ టీమ్స్, సేల్స్ విభాగం, కార్పొరేట్ డెవలప్‌మెంట్, ఇతర సంబంధిత వ్యాపార విభాగాల వారికి వర్తిస్తాయి. అయితే, అమెరికాలోని పెద్ద కస్టమర్ సేల్స్ టీమ్స్, కొన్ని కస్టమర్-ఫేసింగ్ పాత్రలకు ఈ ఆఫర్ వర్తించదని స్పష్టం చేశారు. “మా వినియోగదారులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నాము” అని షిండ్లర్ తెలిపారు.ఏడాదిలో మూడోసారి.. ఇది గూగుల్ అమలు చేస్తున్న మూడో స్వచ్ఛంద నిష్క్రమణ ప్రణాళిక. గతంలో కూడా ఇలాంటి చర్యలు తీసుకుంది. 2025 జూన్‌లో ‘రిటర్న్-టు-ఆఫీస్’ విధానం కఠినతరం చేసిన సమయంలో యూఎస్ ఉద్యోగులకు ఇలాంటి ఆఫర్లు ఇచ్చింది. మళ్లీ 2025 అక్టోబర్‌లోనూ యూట్యూబ్ విభాగంలో పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఎగ్జిట్ ప్యాకేజీలు ప్రకటించింది.వీఈపీ ప్యాకేజీలో ఏం ఉంటాయంటే..గూగుల్‌ వీఈపీ (Voluntary Exit Program) ప్యాకేజీని ఎంచుకుని స్వచ్ఛందంగా నిష్క్రమించే ఉద్యోగులకు సాధారణంగా వారి సర్వీస్‌ పీరియడ్‌, దా ఆధారంగా లంప్‌సమ్‌ సెవరెన్స్ పే (కొన్ని వారాలు/నెలల జీతం), ప్రోరేటెడ్ బోనస్ చెల్లింపు, ఉపయోగించని సెలవులకు నగదు, కొంతకాలం వరకు ఆరోగ్య బీమా కొనసాగింపు, ఇప్పటికే వెస్ట్ అయిన RSUs/స్టాక్‌లపై హక్కులు, అలాగే కొత్త ఉద్యోగం కోసం కెరీర్ ట్రాన్సిషన్ లేదా అవుట్‌ప్లేస్‌మెంట్ సపోర్ట్ వంటి ప్రయోజనాలు అందిస్తారు.

Advertisement
Advertisement
Advertisement