Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

West Asia Conflict Puts 11 8 Billion of Indias Farm Exports at Risk1
వ్యవసాయ ఎగుమతులకు యుద్ధం సెగ

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ సంక్షోభం వల్ల భారత వ్యవసాయ, ఆహారోత్పత్తుల ఎగుమతులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనీషియేటివ్‌ (జీటీఆర్‌ఐ) వెల్లడించింది. జలరవాణా మార్గాల్లో ఆటంకాలు, పెరుగుతున్న బీమా వ్యయాలు, లాజిస్టిక్స్‌కి సంబంధించి అనిశ్చితితో దాదాపు 11.8 బిలియన్‌ డాలర్ల ఎగుమతులకు రిస్క్‌లు నెలకొన్నాయని పేర్కొంది.భౌగోళికంగా భారత్‌కి దగ్గరగా ఉండటంతో పాటు పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు ఉంటుండటంతో ఆ ప్రాంతం చారిత్రకంగా మన ఎగుమతులకు కీలక మార్కెట్‌గా నిలుస్తోందని జీటీఆర్‌ఐ పేర్కొంది. 2025లో పశ్చిమాసియాకు భారత్‌ దాదాపు 11.8 బిలియన్‌ డాలర్ల విలువ చేసే తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు మొదలైన వ్యవసాయ, ఆహారోత్పత్తులను ఎగుమతి చేసింది. ఈ విభాగంలో మొత్తం ఎగుమతుల్లో వీటి వాటా 21.8 శాతంగా నిల్చింది. వీటిలో 7.48 బిలియన్‌ డాలర్ల విలువ చేసే తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి.పశ్చిమాసియా దేశాలకు బియ్యం, అరటిపళ్లు, ఉల్లి, పప్పు ధాన్యాలు, కాఫీ, టీ మొదలైన వాటిని కూడా భారత్‌ ఎగుమతి చేస్తోంది. ‘అత్యధికంగా బియ్యం మీద ప్రభావం పడొచ్చు. పశ్చిమాసియాకు భారత్‌ 4.43 బిలియన్‌ డాలర్ల బియ్యం ఎగుమతి చేసింది. ఇది అంతర్జాతీయంగా మన దేశం నుంచి బియ్యం ఎగుమతుల్లో 36.7 శాతం. తద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్‌లాంటి రాష్ట్రాలకు గల్ఫ్‌ దేశాలు కీలక మార్కెట్‌గా ఉంటున్నాయి‘ అని జీటీఆర్‌ఐ ఫౌండర్‌ అజయ్‌ శ్రీవాస్తవ తెలిపారు.పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల షిప్పింగ్‌ రూట్లలో ఆటంకాలు ఏర్పడి, బీమా వ్యయాలు పెరిగిపోయి ఎగుమతిదారులకు సందిగ్ధ పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు. ఇది దేశీయంగా పలు రాష్ట్రాల్లోని రైతులు, ఫుడ్‌ ప్రాసెసర్లపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉందని వివరించారు. నివేదికలోని మరిన్ని వివరాలు.. గత దశాబ్దకాలంగా వ్యవసాయ ఎగుమతుల కోసం పశ్చిమాసియా మార్కెట్‌పై భారత్‌ ఆధారపడటం పెరిగింది. బియ్యం, అరటిపళ్లు, సుగంధ ద్రవ్యాలు, డెయిరీ ఉత్పత్తులు మొదలైనవి వీటిలో ఉన్నాయి. 2025లో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇరాన్, బహ్రెయిన్‌ తదితర గల్ఫ్‌ దేశాలకు 396.5 మిలియన్‌ డాలర్ల విలువ చేసే అరటిపళ్లు, 111 మిలియన్‌ డాలర్ల ఉల్లి, వెల్లుల్లి ఎగుమతయ్యాయి. యాలకులు, జాజికాయలాంటివి (295.5 మిలియన్‌ డాలర్లు), జీలకర్ర–ధనియాల్లాంటివి (163 మిలియన్‌ డాలర్లు), అల్లం–పసుపు (173 మిలియన్‌ డాలర్లు), కాఫీ (240.7 మిలియన్‌ డాలర్లు), టీ (410.1 మిలియన్‌ డాలర్లు), ప్రాసెస్డ్‌ ఫుడ్, షుగర్‌ తదితరాలు (1.35 బిలియన్‌ డాలర్లు), చేపలు, మాంసం, ఫ్రోజెన్‌–ప్రాసెస్డ్‌ ఉత్పత్తులు (1.81 బిలియన్‌ డాలర్లు) మొదలైనవి ఎక్స్‌పోర్ట్‌ అవుతున్నాయి. 281.1 మిలియన్‌ డాలర్ల డెయిరీ ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. ఇవి భారత్‌ నుంచి మొత్తం డెయిరీ ఎగుమతుల్లో 28.9 శాతం. 197.5 మిలియన్‌ డాలర్ల విలువ చేసే ఆల్కహాలిక్, నాన్‌–ఆల్కహాలిక్‌ పానీయాలను పశ్చిమాసియాకి భారత్‌ ఎగుమతి చేసింది.

Only 20pc of Women in India Have Adequate Health Insurance Coverage2
మహిళల్లో ఆరోగ్య బీమా కవరేజీ అంతంతే..

దేశీయంగా బీమా కవరేజీ ఉన్న జనాభాలో మహిళల వాటా 47 శాతంగా ఉన్నప్పటికీ, వారికి ఆరోగ్య బీమా కవరేజీ మాత్రం అంతంత మాత్రంగానే ఉంటోంది. కేవలం 20 శాతం మంది మహిళలకు మాత్రమే తగినంత కవరేజీ ఉంటోందని టాటాఏఐజీ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ వెల్లడించింది.కార్డియాక్, క్యాన్సర్‌లాంటి తీవ్ర అనారోగ్యాల చికిత్స వ్యయాలకు సాధారణంగా రూ. 20 లక్షలకు పైగా కవరేజీ అవసరమవుతోందని పేర్కొంది. కానీ 80 శాతం మందికి ఆ స్థాయిలో బీమా ఉండటం లేదని పేర్కొంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో కార్డియాక్‌ రిసు్కలు ప్రస్తుతం ఎక్కువగా ఉంటున్నాయని 34 శాతం మంది కార్డియాలజిస్టులు వివరించినట్లు తెలిపింది.అయితే, మహిళల్లో వ్యాధి లక్షణాలను చాలా సందర్భాల్లో సకాలంలో గుర్తించకపోవడం లేదా తప్పుగా నిర్ధారించడం వల్ల చికిత్స అందడంలో జాప్యం చోటు చేసుకుంటోందని సంస్థ తెలిపింది. ఇక చికిత్స వ్యయాల విషయానికొస్తే.. నేషనల్‌ హెల్త్‌ అకౌంట్స్‌ (2021–22) గణాంకాల ప్రకారం 39.4 శాతం ఖర్చులు జేబునుంచే పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటోందని వివరించింది.ఆరోగ్య బీమా తీసుకోవడం పెరుగుతున్నప్పటికీ దాన్ని కొనసాగించకపోవడం, తక్కువ కవరేజీ తీసుకోవడంలాంటి ధోరణులను బట్టి చూస్తే చాలా మటుకు మహిళలకు తగినంత కవరేజీ ఉండటం లేదనే విషయం తెలుస్తోందని కంపెనీ హెడ్‌ (కన్జూమర్‌ బిజినెస్‌ క్లెయిమ్స్‌) రాజగోపాల్‌ రుద్రరాజు తెలిపారు.మహిళల్లో క్యాన్సర్, తీవ్ర అనారోగ్యాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక సన్నద్ధత గతంలో కన్నా మరింత కీలకంగా మారిందని పేర్కొన్నారు. తగినంత కవరేజీ తీసుకోవడం, ప్రివెంటివ్‌ హెల్త్‌కేర్‌పై దృష్టి పెట్టడం అవసరమని వివరించారు.

Flexible Walls for Compact Homes House construction tips3
ఇరుకు ఇళ్లకు ఇకమతు! ఇలాంటి గోడలు

వినియోగదారుడికి నచ్చిన విధంగా ఇంట్లో ఉన్న విస్తీర్ణాన్ని అవసరానికి తగిన విధంగా సద్వినియోగం చేసుకునేలా నిర్మాణదారులు సరికొత్త సాంకేతిక ఆలోచనలు చేస్తున్నారు. ఇటుకలు, సిమెంట్‌ బ్లాక్స్‌ ఇంట్లో ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుండటంతో వాటి స్థానంలో ప్యానల్స్‌ వంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగిస్తున్నారు. ఇవి తక్కువ మందంతో పాటు పటిష్టంగా ఉండి ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. స్క్రూలతో బిగింపు.. ఇంటి లోపల అంతర్గత గోడల కోసం ఈ ప్యానెల్స్‌ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. అయితే గతంలో వీటిని కదలించడానికి వీలు లేకుండా స్క్రూలతో బిగించేవారు. ప్రస్తుతం కదిలేలా ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో స్థలాన్ని వినియోగించుకునే అవకాశం ఏర్పడుతోంది. చిన్న పిల్లల గదిని పగటి పూట తగ్గించుకొని హాల్‌ పెంచుకునేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇవి ఇంటీరియర్స్‌లో కలిసిపోయి అందంగా ఉంటాయి కాబట్టి ఎవరూ ఇవి గోడలని గుర్తించలేరు.నిర్మాణ వ్యయం ఎక్కువ స్టూడియో అపార్ట్‌మెంట్స్‌లలో స్థలం తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ తరహా గోడలనే ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఉదయంలో బెడ్‌ను కాస్త గోడకు నిలబెట్టేస్తే అదొక డిజైన్‌ మాదిరి కనిపిస్తుంటుంది. అయితే సంప్రదాయ గోడల కంటే వీటి నిర్మాణానికి వ్యయం ఎక్కువ అవుతుంది. చదరపు అడుగు వాల్‌ ప్యానెల్స్‌ రూ.75–రూ.80 నుంచి ప్రారంభమవుతాయి. బహిరంగ మార్కెట్‌తో పాటు ఆన్‌లైన్‌లోనూ వివిధ రకాల డిజైన్లు లభ్యమవుతాయి.

Reliance Consumer Products Partners with Fazer to Introduce Premium Chocolates in India4
భారత్‌కు ఫిన్లాండ్‌ చాక్లెట్లు తీసుకొస్తున్న రిలయన్స్‌

న్యూఢిల్లీ: ఫిన్లాండ్‌కి చెందిన ఆహారోత్పత్తుల దిగ్గజం ఫేజర్‌తో రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ (ఆర్‌సీపీఎల్‌) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఫేజర్‌ ప్రీమియం చాక్లెట్లను భారత్‌లో ఉత్పత్తి, మార్కెటింగ్, పంపిణీ కార్యకలాపాలను ఆర్‌సీపీఎల్‌ చేపట్టనుంది. ఫిన్లాండ్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ స్టబ్‌ భారత పర్యటన సందర్భంగా ఇందుకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి.పోలాండ్, చైనా తదితర 40 పైగా దేశాలకు ఫేజర్‌ ఉత్పత్తులు ఎగుమతవుతున్నాయి. 2022లో ప్రారంభమైనప్పటి నుంచి ఆర్‌సీపీఎల్‌ సంస్థ టాఫీమ్యాన్, పాన్‌ పసంద్, లోటస్‌ చాక్లెట్స్‌లాంటి పలు దేశీ బ్రాండ్లను పునరుద్ధరించింది. అలాగే మాలిబాన్, నెక్స్‌బా, పేస్‌లాంటి గ్లోబల్‌ బ్రాండ్స్‌ని కూడా ప్రవేశపెట్టింది.

State Bank of India Launches 500 Million Loan Facility to Boost Women Empowerment5
మహిళా సాధికారతకు ఎస్‌బీఐ 50 కోట్ల డాలర్ల రుణ సదుపాయం

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) 50 కోట్ల డాలర్ల సిండికేటెడ్‌ సోషల్‌ టర్మ్‌ రుణ సదుపాయాన్ని ప్రకటించింది. ఇందులో గ్రీన్‌షూ ఆప్షన్‌ కూడా ఉంటుంది.లింగ సమా నత్వం, సమగ్ర ఆర్థిక వృద్ధి లక్ష్యంగా ఈ రుణం అందించనున్నట్లు బ్యాంకు తెలిపింది. పర్యావరణ, సామాజిక, గవర్నెన్స్‌ (ఈఎస్‌జీ) సిద్ధాంతాలపై బ్యాంకు చిత్తశుద్ధిని ఇది ప్రతిబింబిస్తుందని ఎస్‌బీఐ చైర్మన్‌ సీఎస్‌ శెట్టి తెలిపారు.

indian Pharma loses Rs 5000 crore6
ఫార్మాకు రూ.5,000 కోట్ల నష్టం

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల్లో దేశీ ఫార్మా రంగం రూ.2,500 కోట్ల నుంచి రూ.5,000 కోట్ల వరకు నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యుద్ధంతో సరుకు రవాణా, సరఫరా వ్యవస్థల్లో ఏర్పడే ప్రతికూలతలు ఇందుకు దారితీయనున్నట్టు ఫార్మాస్యూటికల్స్‌ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మెక్సిల్‌) పేర్కొంది. దేశ ఫార్మా ఎగుమతుల్లో గల్ఫ్‌ దేశాల (జీసీసీ) వాటా 5.58 శాతం ఉన్నట్టు తెలిపింది.2020–21లో పశ్చిమాసియాకు ఎగుమతులు 1,320 మిలియన్‌ డాలర్లుగా ఉంటే, 2024–25లో 1,749 మిలియన్‌ డాలర్లకు పెరిగినట్టు పేర్కొంది. అందుబాటు ధరలకే ఔషధాల కోసం యూఏఈ, సౌదీ అరేబియా, ఒమన్, కువైట్, యెమెన్‌ భారత్‌పై ఎక్కువగా ఆధారపడి ఉన్నట్టు తెలిపింది. ఒక్కో షిప్‌మెంట్‌కు 4,000–8,000 డాలర్ల మేర సర్‌చార్జీతో భారత ఎగుమతులు, దిగుమతుల రవాణా చార్జీలు పెరిగిపోతాయని, భారత ఫార్మాస్యూటికల్‌ కంపెనీలపై భారం పడుతుందని ఫార్మెక్సిల్‌ పేర్కొంది. మార్బి సిరామిక్‌ పరిశ్రమపై పిడుగు గ్యాస్‌ సరఫరా నిలిచిపోవడంతో గుజరాత్‌లోని మార్బిలో 350 వరకు సిరామిక్‌ టైల్స్‌ తయారీ పరిశ్రమలు మూతపడే ప్రమాదం ఏర్పడింది. సహజవాయువు (ప్రొపేన్‌) కొరత ఇక్కడి పరిశ్రమను వేధిస్తోంది. మార్చి 15 నాటికి సరఫరా పునరుద్ధరించకపోతే మొత్తం పరిశ్రమ మూసివేసే ఆలోచనతో ఉన్నట్టు మార్బి సిరామిక్స్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు కేజీ కుందారియా తెలిపారు. ‘‘మార్బిలో 750 వరకు పరివ్రమలు ఉన్నాయి.దేశ టైల్స్‌ ఉత్పత్తిలో వీటి వాటా 90 శాతం. గ్యాస్‌ సరఫరా లేకపోవడంతో శుక్రవారం నాటికి 350 పరిశ్రమలు మూతపడనున్నాయి’’ సిరామిక్‌ ప్యానెల్‌ చైర్మన్‌ జెటా్పరియా తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం మొదలైన నాటి నుంచి ప్రొపేన్‌ సరఫరా సరిగ్గా ఉండడం లేదని, మార్బిలో కేవలం 30 శాతం పరిశ్రమలే గుజరాత్‌ గ్యాస్‌ పంపిణీ సంస్థ కనెక్షన్‌ కలిగి ఉన్నట్టు చెప్పారు. ఈ సంస్థ 50 శాతం తగ్గించి సరఫరా చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement