Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Gold and Silver rates on January 5th 2026 in Telugu states1
పసిడి, వెండి రివర్స్‌.. దౌడు తీసిన ధరలు

దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ దౌడు తీశాయి. ఒక్కసారిగా భారీ స్థాయిలో ఎగిశాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆదివారంతో పోలిస్తే సోమవారం బంగారం ధరలు (Today Gold Price) రూ.1500 పైగా పెరిగాయి. వెండి ధరలు అమాంతం ఎగిశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Stock market updates on January 5th 20262
Stock Market Updates: ఫ్లాట్‌గా సెన్సెక్స్‌.. నిఫ్టీ

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం ఫ్లాట్‌గా స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ(Nifty) 9 పాయింట్లు నష్టంతో 26,318 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 117 పాయింట్లు క్షీణించి 85,644 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 98.5బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 60.9 డాలర్లుయూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.20 శాతానికి చేరాయి.గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.2 శాతం లాభపడింది.నాస్‌డాక్‌ 0.03 శాతం పెరిగింది.Today Nifty position 05-01-2026(time: 9:35 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Changes in Salary Taxation under the New Tax Law3
Income Tax: కొత్త చట్టంలో జీతాల మీద ఆదాయం

ముందుగా టాక్స్‌ కాలమ్‌ పాఠకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు... అరవై ఏళ్లు దాటిన ఆదాయపన్ను చట్టంకు బదులుగా దాని స్థానంలో కొత్త ఆదాయపు పన్ను 2025 వస్తోంది. పేరులో 2025 అని ఉన్నా అమలు మాత్రం 1.4.2026 నుంచి వస్తోంది. ఈ వారం జీతాలకు సంబంధించిన అంశాలు తెలుసుకుందాం. ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సంవత్సరం 31–3–2026తో ముగుస్తుంది. దీనికి, అంటే 2025–26 ఆర్థిక సంవత్సరానికి 2026–27ని అస్సెట్‌మెంట్‌ ఇయర్‌ అంటారు. ఆర్థిక సంవత్సరం 2024–25 సంవత్సరం వరకు 1961 చట్టం వరిస్తుంది. 2024–25, అంతకుముందు ఆర్థిక సంవత్సరం వర్తించే 1961 చట్టంలో జీతం నిర్వచనం, దీని పరిధి, పలు అంశాలు ఉన్నాయి. ఏ పేరుతో పిలిచినా, యజమాని తన ఉద్యోగికి ఇచ్చిన డబ్బుకి ఇవి వర్తిస్తాయి.ఇక టాక్సబిలిటీ విషయాకొస్తే, చేతికొచ్చినా, రాకపోయినా హక్కుగా ఏర్పడ్డా, జీతం పన్ను పరిధిలోకి వస్తుంది. డిడక్షన్ల జోలికొస్తే సాండర్డ్‌ డిడక్షన్‌ను, వృత్తి పన్ను డిడక్షన్‌ చేస్తారు. పాత పద్ధతిలో అయితే ఛాప్టర్‌ VI ప్రకారం మినహాయింపులు ఇస్తారు. ఇవి చాలా ఉన్నాయి. కొత్త పద్ధతి ప్రకారం డిడక్షన్లు చాలా తక్కువ. పాత పద్దతి చూస్తే తక్కువ శ్లాబులు .. ఎక్కువ రేట్లు. కొత్త పద్ధతిలో బేసిక్‌ శ్లాబ్‌ ఎక్కువ. శ్లాబులు ఎక్కువ. రేట్లు చాలా తక్కువ.ఇప్పుడు రాబోయే మార్పులు: 🔸 చట్టం సులభరీతిలో ఉంది. 🔸 నిర్వచనాలు, పన్ను పరిధి అంశాల్లో ఎటువంటి మార్పులేదు. 🔸 ఇక నుంచి అకౌంటింగ్‌ ఇయర్, అస్సెస్‌మెంట్‌ సంవత్సరం అని ఉండదు. 🔸 ఒకే ఒక పదం... దానిపేరే ఆదాయపు సంవత్సరం. కావున ఎటువంటి పొరబాటుకి తావులేదు. 🔸 2025–26 ఆర్థిక సంవత్సరం నుంచి మొత్తం నికర ఆదాయం .. అంటే టాక్సబుల్‌ ఇన్‌కం .. సంవత్సరానికి రూ.12,00,000 వరకు పన్ను పడదు. ఉద్యోగస్తులకు స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.75వేల వరకు ఉంటుంది. కాబట్టి ఉద్యోగస్తులకు రూ.12,75,000ల వరకూ ఎటువంటి పన్ను పడదు. 🔸 మీ ఆదాయం... నికర ఆదాయం రూ.12,00,00 లోపల ఉన్నట్లు అయితే ట్యాక్స్‌ పడదు. 🔸 దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రణాళిక చేసుకోవచ్చు. ఉదాహరణకు, ఇంటి మీద హక్కులు జాయింట్‌గా ఉంటే, ఆ అద్దెని ఇద్దరికి అకౌంటులో సర్దుబాటు చేయడం. రెండవ ఉదాహరణగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ... ఒకరి పేరు మీదనే అన్ని డిపాజిట్లు ఉంచుకోకుండా ఇతర భాగస్వామి మీద బదిలీ చేయడం. అయితే ఈ రెండింట్లో ఏది చేసినా కాగితాలు ముఖ్యం. మరే, అగ్రిమెంట్లు రాసుకోకపోయినా ఓనర్‌షిప్‌.. టైటిల్‌ డీడ్స్‌లో ఇద్దరి పేరుండటం, అలాగే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఆయా వ్యక్తి పేరు మీద ఉండటం. 🔸 రిబేటు రూపంలో బేసిక్‌ లిమిట్‌ రూ.12,00,000 పెంచినట్లే తప్ప, ఆదాయం రూపంలో కాదు. గతంలో ఎన్నో ఉదాహరణలు ఇచ్చాం. 🔸 2025–26 ఆర్థిక సంవత్సరం కొత్త పద్ధతి ప్రకారం బేసిక్‌ లిమిట్‌... శ్లాబులు... రేట్లు మీకు సుపరిచితమే. 🔸 అలాగే పాత పద్ధతిలో కూడా...చివరిగా, ప్రాథమిక, మౌలిక విషయాల్లో మార్పు లేనప్పటికీ, విషయ విశదీకరణలో, సరళత్వం కన్పిస్తుంది. కొత్త పద్ధతిలో వెళ్లడానికి ప్రోత్సాహకరంగా ఉంది. అవే సర్కిళ్లు, అవే డివిజన్లు, అవే పద్ధతులు, అదే మదింపు పద్దతి విధానం, నోటీసులు, సమన్లు, జవాబులు, వడ్డీలు, పెనాల్టీలు, అధికార్ల అభిమతం, హక్కులు, అధికారాలు, బాధ్యతలు, విధివిధానాలు మారవు. అలాగే కొనసాగుతాయి. పాతసీసాలో కొత్త నీరు. పేరు మారితే పెత్తనం పోతుందా. భాషను మార్చినా, వేషము మార్చినా అధికార్లు అలాగే ఉండాలి.

Gold in Indian Homes The Silent Creator of Trillion Dollar Wealth4
బంగారు గృహాల భారతదేశం

ప్రముఖ వజ్రాల వ్యాపార సంస్థ డీ బియర్స్‌ వజ్రాలను ‘‘స్త్రీలకు అత్యంత ప్రియమైనవిగా’’ ప్రచారం చేసినా, భారత మహిళల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నది మాత్రం బంగారమే. ఆభరణాలుగా అలంకరణకు మాత్రమే కాకుండా, విలువ తగ్గని ఆస్తిగా (ఖరీదైన కారు లేదా తాజా ఐఫోన్‌ లాగా కాదు) బంగారం భారతీయులకు సంపద సృష్టిలో విప్లవాత్మక పాత్ర పోషించింది.బిలియన్‌ డాలర్ల సంపద సృష్టి 2011 నుంచి 2024 మధ్య భారత్‌ భారీగా బంగారం దిగుమతి చేసుకుంది. దీనివల్ల వాణిజ్య లోటు పెరిగిందనే విమర్శలు వచ్చాయి. కానీ నేటి ధరలతో చూసుకుంటే, ఈ బంగారం భారత కుటుంబాలకు అసాధారణమైన సంపదను సృష్టించింది.ఈ కాలంలో దిగుమతి చేసిన బంగారం విలువ సుమారు ఒక ట్రిలియన్‌ డాలర్లకు పెరిగింది.దాదాపు 175% పెరుగుదల. భారతదేశ ప్రస్తుత విదేశీ మారక నిల్వలకంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం. అప్పట్లో వాణిజ్య లోటుపై ఆందోళన వ్యక్తం చేసిన విశ్లేషకులు, దీర్ఘకాల సంపద సృష్టిని అంచనా వేయలేకపోయారు.ఆభరణాల రీ–ఎగుమతులు – గ్లోబల్‌ జువెలరీ హబ్‌గా భారత్‌ దిగుమతి చేసిన బంగారంలో కొంత భాగం ఆభరణాల రూపంలో మళ్లీ విదేశాలకు ఎగుమతి అవుతోంది. ఇది ప్రపంచ ఆభరణాల తయారీ, వ్యాపార కేంద్రంగా భారతదేశానికి ఉన్న స్థానాన్ని ప్రతిబింబిస్తుంది. అయితే దేశీయంగా నిల్వ ఉన్న అపారమైన బంగారం సంపద ప్రాధాన్యతను ఏమాత్రం తగ్గించదు.భారత కుటుంబాల వద్ద 25,000–30,000 టన్నుల బంగారం అంచనాల ప్రకారం భారత కుటుంబాల వద్ద 25,000 నుంచి 30,000 టన్నుల బంగారం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్‌ నిల్వలలో ఒకటి. ప్రస్తుత ధరలతో దీని విలువ 3.4 ట్రిలియన్‌ డాలర్ల నుంచి 4.1 ట్రిలియన్‌ డాలర్ల మధ్య ఉంటుంది. ఇది భారత గృహ సంపదలో బంగారం ఎంత కీలక భాగమో స్పష్టం చేస్తోంది.2025లో బంగారం బ్లాక్‌బస్టర్, 2026పై అంచనాలు భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ భయాలు, కేంద్ర బ్యాంకుల భారీ కొనుగోళ్లు ఇవన్నీ కలిసి 2025లో బంగారాన్ని బ్లాక్‌బస్టర్‌ ఆస్తిగా మా ర్చాయి. భారతదేశంలో పెళ్లిళ్లు, పండుగలు, పెట్టుబడుల కారణంగా డిమాండ్‌ నిలకడగా కొనసాగింది. అయితే 2026కి చూస్తే, బంగారంపై దృక్పథం సానుకూలంగానే ఉన్నా కొంత జాగ్రత్త అవసరం. ద్రవ్య విధానాలు, వడ్డీ రేట్లు, కరెన్సీ మార్పులు బంగారం ధర విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి. ద్రవ్యోల్బణం దీర్ఘకాలం కొనసాగితే బంగారం కొనుగోలు శక్తిని కాపాడే కీలక రక్షణగా నిలుస్తుంది. వడ్డీ రేట్లు తీవ్రంగా పెరిగినా, దీర్ఘకాలంలో బంగారం విలువ నిలకడగా ఉంటుంది.పోర్ట్‌ఫోలియోలో బంగారం ఆర్థిక నిపుణులు సాధారణంగా పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో 5–10% బంగారానికి కేటాయించమని సూచిస్తారు. ఇది ఈక్విటీల వృద్ధితో సమతుల్యతను కలిగిస్తుంది. ఇప్పటికే భౌతిక బంగారం ఎక్కువగా కలిగి ఉన్నవారు, లిక్విడిటీ కోసం గోల్డ్‌ ఫండ్స్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. కొత్త ఏడాదిలో బంగారంలో పెట్టుబడులకు కొత్త మార్గాలు తెరుచుకోనున్నాయి. సావరిన్‌ గోల్డ్‌ బాండ్లు, గోల్డ్‌ ఈటీఎఫ్‌లు, డిజిటల్‌ గోల్డ్‌ వంటి మార్గాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.ఇటీవల ప్రభుత్వ నిబంధనల మార్పులతో, ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు బంగారం వంటి కమోడిటీల్లో పెట్టుబడి పెట్టే కొత్త ఫండ్స్‌ను ప్రారంభించనున్నాయి. గుజరాత్‌లోని గిఫ్ట్‌ సిటీ కేంద్రంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో, భౌతిక బంగారం ఆధారిత, ప్రొఫెషనల్‌గా నిర్వహించే గోల్డ్‌ ఫండ్స్‌ అందుబాటులోకి రానున్నాయి. ఇవి రెసిడెంట్‌ ఇండియన్లు, ప్రవాస భారతీయులకు ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాలను కల్పిస్తాయి.ముగింపు ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్న నేపథ్యంలో, 2026లో కూడా బంగారం భారత పెట్టుబడిదారుల వ్యూహాత్మక ఆస్తిగా కొనసాగనుంది. ధరల్లో హెచ్చుతగ్గులు సహజమే అయినా, సంస్కృతి, గ్లోబల్‌ ఆర్థిక పరిస్థితులు, అపారమైన నిల్వ విలువ ఇవన్నీ బంగారాన్ని సంపద రక్షణలో అనివార్య భాగంగా నిలుపుతున్నాయి. సంప్రదాయ బంగారంతో పాటు ఆధునిక పెట్టుబడి సాధనాలను కూడా వినియోగించుకుంటే, పెట్టుబడిదారులు లాభాలను పొందుతూనే ఆర్థిక ఉపద్రవాలను సమర్థంగా ఎదుర్కొగలరు.

Stock Market Experts Views and Advice5
కోటి ఆశలతో కొత్త ఏడాది

కొత్త కేలండర్‌ ఏడాదిలో దేశీ స్టాక్‌ మార్కెట్లు బుల్‌ దౌడు తీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటివరకూ రికార్డ్‌ స్థాయిలో అమ్మకాలు చేపట్టిన విదేశీ ఇన్వెస్టర్లు యూటర్న్‌ తీసుకోవచ్చనే అంచనాలు, క్యూ3 ఫలితాలపై ఆశలు, ఊపందుకుంటున్న వినియోగం ఇందుకు దోహదపడచ్చని అంచనా. గత వారం సాంకేతిక అంచనాలకు అనుగుణంగా మార్కెట్లు సరికొత్త గరిష్టాలకు చేరడం దీనిని బలపరుస్తోంది! వివరాలు చూద్దాం.. ఈ వారం ప్రధానంగా భారత్‌సహా యూఎస్, చైనా పీఎంఐ ఇండెక్సుల గణాంకాలు వెలువడనున్నాయి. ఇప్పటికే ఆశావహ ఆటోరంగ విక్రయాలు, జోరుమీదున్న ఆర్థిక పురోగతి, పెరుగుతున్న ప్రభుత్వ వ్యయాలు సెంటిమెంటుకు ప్రోత్సాహాన్నివ్వనున్నాయి. అయితే డాలరుతో మారకంలో రూపాయి బలహీనతలు, వాణిజ్య టారిఫ్‌లు కొంతమేర ప్రతికూల ప్రభావానికి కారణంకాన‡ున్నాయి. దేశీయంగా చూస్తే → గత నెల హెచ్‌ఎస్‌బీసీ సరీ్వసుల పీఎంఐ, కాంపోజిట్‌(తయారీ) పీఎంఐ తుది గణాంకాలు వెలువడనున్నాయి. → వచ్చే వారం ప్రారంభంకానున్న క్యూ3 కార్పొ రేట్‌ ఫలితాల సీజన్‌పై ఆశావహఅంచనాలున్నాయి. 12న ఐటీ దిగ్గజాలు టీసీఎస్, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3) పనితీరును వెల్లడించనున్నాయి. → 2025లో దేశీ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలోనే అత్యధికంగా విదేశీ ఇన్వెస్టర్లు 18.9 బిలియన్‌ డాలర్ల(రూ. 1.66 లక్షల కోట్లు) పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. ఈ బాటలో 2026 తొలి రెండు రోజుల్లో సైతం నికరంగా రూ. 7,608 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. అయితే గతంలో ఇలా జరిగిన తదుపరి ఏడాది విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్ల యూటర్న్‌ తీసుకున్న అంశాన్ని నిపుణులు ప్రస్తావిస్తున్నారు. విదేశీ అంశాలు ఇలా → ఈ వారం 2025 డిసెంబర్‌ నెలకు చైనా తయారీ, సరీ్వసుల రంగ పీఎంఐ ఇండెక్సుల వివరాలు విడుదలకానున్నాయి. విదేశీ నిల్వలు, ద్రవ్యోల్బణ గణాంకాలు సైతం వెల్లడికానున్నాయి. మరోవైపు వివిధ యూఎస్‌ గణాంకాలు వెలువడనున్నాయి. సరికొత్త రికార్డ్‌ గత వారం నిఫ్టీ ఇంట్రాడేలో 26,340 పాయింట్లను తాకింది. సరికొత్త గరిష్టానికి చేరి రికార్డ్‌ నెలకొల్పింది. గత వారం నికరంగా సెన్సెక్స్‌ 721 పాయింట్లు(0.84%) పుంజుకుని 85,762 వద్ద నిలవగా.. నిఫ్టీ 286 పాయింట్లు(1.1%) ఎగసి 26,329 వద్ద స్థిరపడింది.బుల్లిష్‌ వేవ్‌లో.. యూఎస్‌ వెనెజువెలా ప్రెసిడెంట్‌ను బందీగా పట్టుకుని స్వదేశానికి తరలించిన నేపథ్యంలో ఈ వారం అంతర్జాతీయంగా ఆందోళనకర పరిస్థితులు తలెత్తవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఈ వారం సైతం స్టాక్‌ మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనుకావచ్చని అంచనా వేస్తున్నారు. అయితే జీడీపీ వృద్ధి, క్యూ3 ఫలితాలపై అంచనాలు, ప్రభుత్వ వ్యయాలు వంటి అంశాలు సెంటిమెంటుకు ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు చెబుతున్నారు. వెరసి మార్కెట్లు బలాన్ని పుంజుకునేందుకే అధికంగా వీలున్నట్లు సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. → గత వారం అంచనాలకు అనుగుణంగా నిఫ్టీ 26,000 స్థాయికి ఎగువన నిలుస్తూ 26,340 వద్ద కొత్త గరిష్టాన్ని అందుకుంది. దీంతో ఈ వారం నిఫ్టీ 26,720– 26,900 పాయింట్ల వరకూ బలపడవచ్చు. ఒకవేళ బలహీనపడితే 26,000– 25,750 పాయింట్ల స్థాయిలో మద్దతు లభించే వీలుంది. → గత వారం 85,350 పాయింట్లను దాటి 85,762కు ఎగసింది. వెరసి ఈ వారం 86,800, 87,200 పాయింట్లవరకూ పురోగమించవచ్చు. ఇలాకాకుండా నీరసిస్తే 84,800– 84,000 పాయింట్ల స్థాయిలో సపోర్ట్‌ కనిపించే అవకాశముంది. – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Explanation of ULIP vs Term Insurance, special story6
మీ ‘లైఫ్‌’ పాలసీ సరైనదేనా..?

గుడ్డివాళ్లు ఏనుగును తాకితే...? తోక పట్టుకున్నవారికి అదో తాడులా... తొండం తాకిన వారికి అదో పాములా... నడుము భాగాన్ని తాకినవారికి అదో గోడలా అనిపించింది. అంతేతప్ప ఎవ్వరికీ అదో ఏనుగులా అనిపించలేదు. దేన్నయినా సమగ్రంగా చూడాలి తప్ప ఒకే కోణంలో చూడొద్దని చెప్పేటపుడు పురాణాల్లోని ఈ తత్వాన్ని గుర్తు చేస్తుంటారు. ప్రస్తుతం మనవాళ్లు కొంటున్న బీమా పాలసీలకూ ఇదే తత్వం వర్తిస్తోంది. ఎందుకంటే నూటికి 90 శాతం మంది బీమా అవసరాన్ని అర్థం చేసుకుని కొనటం లేదు. రకరకాల కోణాల్లో దాన్ని చూసి డబ్బులు వృథా చేస్తున్నారన్నది తాజా సర్వేల సారాంశం. ఈ సర్వేల ప్రకారం... కొందరేమో బంధుమిత్రులు బలవంతపెట్టారనో, ఏజెంట్ల ఒత్తిడి తట్టుకోలేకో మొహమాటానికి బీమా పాలసీ తీసుకుంటున్నారు. మరికొందరేమో దీన్నో పెట్టుబడి సాధనంగా, పన్ను ఆదా చేసే పాలసీగా భావించి కొంటున్నారు. ఇంకొందరేమో గడువు తీరిన తరువాత తమ చేతికి ఎంత వస్తుందన్నదానిపైనే దృష్టి పెడుతున్నారు. నిజానికి ఈ మూడూ సరికాదు. బీమా అవసరాన్ని అర్థం చేసుకుని, ఆ అవసరం కోసమే దాన్ని తీసుకోవాలి. ప్రతి ఒక్కరికీ బీమా తప్పనిసరిగా ఉండాలి కూడా. అసలు బీమా అవసరమేంటో... డబ్బులు ఎలా వృథా అవుతున్నాయో... వీటినెలా నివారించాలో వివరించే ‘వెల్త్‌’ స్టోరీ ఇది... ‘ఎండోమెంట్‌’ ఇష్టమైతే... కష్టమే జీవిత బీమా తీసుకోవాలనుకున్నవారు ఎక్కువగా ఎండోమెంట్‌ ప్లాన్‌లను ఇష్టపడుతుంటారు. ఎందుకంటే ఇందులో లో పాలసీదారు మరణించినట్టయితే ఎంపిక చేసుకున్న కవరేజీ (సమ్‌ అష్యూర్డ్‌) మేర పరిహారం లభిస్తుంది. అలాకాకుండా పాలసీ గడువు ముగిసే వరకు పాలసీదారు జీవించి ఉన్నా సరే... ఈ ప్లాన్‌లో ఇస్తామని చెప్పిన అంతిమ ప్రయోజనాన్ని అందిస్తారు. చాలా మందికి నచ్చేది ఇదే. ఎందుకంటే భారతీయ భావనలో ‘మనం లేకపోతే’ అనే పదం చాలామందికి నచ్చదు. మనం జీవించి ఉంటామన్న ఆశే అందరికీ ఉంటుంది. దానివల్లే... జీవించి ఉంటే ఇంత మొత్తం వస్తుందని ఎండోమెంట్‌ ప్లాన్లలో చెబుతుంటారు. చాలామంది దీన్ని చూసే కొంటుంటారు. కానీ ఇది సరికాదన్నది నిపుణుల మాట.తప్పనిసరిగా ‘టర్మ్‌’ ఉండాలి... అసలు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ అనే పేరులోనే ఉంది కదా... అది జీవితానికిచ్చే బీమా అని. మరి జీవితానికి బీమా చేసుకుంటే చాలు కదా! ఆ బీమా మొత్తం నుంచి కూడా పెట్టుబడి తరహాలో లాభాన్ని ఆశించటమెందుకు? లైఫ్‌ ఇన్సూరెన్స్‌ టర్మ్‌ ప్లాన్లు అన్నవి కేవలం రక్షణ కల్పించడానికే పనికొస్తాయి. పాలసీ కాల వ్యవధిలో పాలసీదారు మరణించిన సందర్భాల్లోనే ఇవి పరిహారాన్ని చెల్లిస్తాయి. ఒకవేళ పాలసీ గడువు తీరాక కూడా పాలసీదారు జీవించి ఉంటే చేతికి రూపాయి కూడా రాదు. చాలా మందికి ఇదే నచ్చదు. ఒక్కసారి తేడా చూద్దాం!. 30 ఏళ్ల ఆరోగ్యవంతుడైన వ్యక్తి ఏడాదికి రూ.10–12 వేల ప్రీమియాన్ని చెల్లిచండానికి సిద్ధపడతే... ఎండోమెంట్‌ ప్లాన్‌ను ఎంపిక చేసుకున్న సందర్భంలో రూ.2 లక్షల సమ్‌ అష్యూర్డ్‌తో కవరేజీ లభిస్తుంది. కాకపోతే టర్మ్‌ ఇన్సూరెన్స్‌ అయితే ఇంతే ప్రీమియానికి రూ.50 లక్షల వరకూ కవరేజీ లభిస్తుంది. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి దురదృష్టవశాత్తూ మరణిస్తే రూ.2 లక్షలు సరిపోతుందా? రూ.50 లక్షలయితే కొన్నాళ్లయినా ఆ కుటుంబం నిలదొక్కుకోగలదు కదా? పాలసీ గడువు ముగిశాక కూడా బతికి ఉంటే ఆ 2 లక్షలు వెనక్కి వస్తాయన్న ఉద్దేశంతో కంటే ఎండోమెంట్‌ పాలసీ మంచిదా? లేక పాలసీ గడువు ముగిశాక రూపాయి రాకపోయినా... ఈ మధ్యలో ఏదైనా జరిగితే కుటుంబాన్ని ఆదుకోగల రూ.50 లక్షల పాలసీ మంచిదా? ఇదిగో... ఈ కోణంలో సమగ్రంగా ఆలోచిస్తే బీమా విషయంలో డబ్బులు వృథా కావు. తక్కువ కాలం... తక్కువ కవరేజీ వద్దు కొంతమంది జీవిత బీమా పాలసీలను 5 ఏళ్ల కాలానికి, పదేళ్ల కాలానికి, 15 ఏళ్ల కాలానికి కూడా తీసుకుంటూ ఉంటారు. చాలామంది ఇన్సూరెన్స్‌ ఏజెంట్లు వీటినే అంటగట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇలాంటి పాలసీలు అమ్మితే వారికి వచ్చే లాభం ఎక్కువ. ఎందుకంటే ఐదేళ్లు తిరిగేసరికి మీరు మళ్లీ ఇంకో పాలసీ తీసుకోక తప్పదు కదా... అందుకని!. ఇది కూడా డబ్బు వృథా చేయటమే. ఎందుకంటే పాలసీదారుకు కనీసం 70 ఏళ్లు వచ్చేవరకైనా కవరేజీ ఉండాలి. అది 30 ఏళ్ల వయసులో తీసుకున్నా... లేక 40 ఏళ్ల వయసులో తీసుకున్నా సరే!. ఎందుకంటే సాధారణ అంచనాల ప్రకారం పాలసీదారుకు , 70 ఏళ్లు వచ్చేసరికి తన పిల్లలు కూడా పెద్దవాళ్లయి ఉంటారు. 70లోగా ఏమైనా జరిగితే... బీమా కవరేజీ మొత్తం కుటుంబాన్ని ఆదుకుంటుంది. ఒకవేళ 70 ఏళ్లు పూర్తయినా తను జీవించి ఉంటే పాలసీగడువు ముగిసిపోయినా పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే అప్పటికే కుటుంబం ఎంతో కొంత సెటిలై ఉంటుంది. ఈ కోణంలో ఆలోచించి దీర్ఘకాలానికి జీవితబీమా తీసుకోవాలి తప్ప... స్వల్ప కాలానికి తీసుకుంటే అది డబ్బులు వృథా చేయటమే. దీనికితోడు చిన్నచిన్న కవరేజీ కుటుంబానికి సరిపోదని గుర్తుంచుకోవాలి. కుటుంబ పెద్ద వార్షిక సంపాదనకు కనీసం 10 నుంచి 20 రెట్ల వరకు కవరేజీ ఉంటే మంచిది. ఈ స్థాయి కవరేజీకి ప్రీమియం కట్టడం కేవలం టర్మ్‌ ప్లాన్లలోనే సాధ్యం.యులిప్‌లూ ఎండోమెంట్‌ లాంటివే... యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్స్‌ (యులిప్స్‌) కూడా ఒక రకంగా ఎండోమెంట్‌ లాంటివే. ఎండోమెంట్‌లో బీమా చార్జీలు పోను మిగిలిన మొత్తాన్ని డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసి, వచ్చిన రాబడిని పాలసీదారులకు చెల్లిస్తారు. యులిప్‌లలో మోరా్టలిటీ, ప్రీమియం అలోకేషన్‌ తదితర చార్జీలు మినహాయించుకుని, మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తారు. దీంతో ఎండోమెంట్‌ కంటే యులిప్‌లలో కొంచెం అదనపు రాబడి (8 శాతం వరకు) ఆశించొచ్చు. కానీ, వీటిల్లో మొదటి ఐదేళ్లు లాకిన్‌ పీరియడ్‌ ఉంటుంది. బీమా సంస్థలు చార్జీల రూపంలో ఎక్కువ మినహాయించుకుంటూ ఉంటాయి. పైగా ఇది కూడా బీమా, పెట్టుబడి కలిపిన సాధనం. కనుక కవరేజీ మెరుగ్గా ఉండదు. పన్ను మినహాయింపు చూడొద్దుఎండోమెంట్‌ ప్లాన్లలో మెచ్యూరిటీ గడువు తీరాక చేతికి అందే మొత్తంపై ఆదాయపు పన్ను ఉండదు. పైపెచ్చు చెల్లించే ప్రీమియాన్ని సెక్షన్‌ 80సీ కింద (పాత పన్ను విధానం) చూపించుకుని పన్ను ఆదా చేసుకోవచ్చు. చాలా మంది ఈ ప్రయోజనం కోసం ఎండోమెంట్‌ ప్లాన్‌ కొనుగోలు చేస్తుంటారు. వాస్తవానికి టర్మ్‌ ప్లాన్‌కు చెల్లించే ప్రీమియంపైనా ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. కాకపోతే ఎండోమెంట్‌ ప్లాన్లతో చివర్లో వచ్చే మొత్తాన్ని చూసుకుంటే అది మనం చెల్లించిన ప్రీమియానికి సరిపడా ఉంటుంది. దీనికి బదులు తక్కువ ప్రీమియంతో వచ్చే టర్మ్‌ ప్లాన్‌ తీసుకుని, మిగతా మొత్తాన్ని ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల పన్ను పోను నికర రాబడి.. ఎండోమెంట్‌ ప్లాన్లలో కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలంలో ఇంకా పెరుగుతుంది. రైడర్లూ అవసరమే.. → జీవిత బీమాలో అదనపు రైడర్లూ మంచివే. ఎందుకంటే దేశంలో జీవిత బీమా క్లెయిమ్‌లలో 70 శాతం ప్రమాద మరణాలు లేదా ప్రమాదం కారణంగా వైకల్యానికి సంబంధించినవే ఉంటున్నాయి. అయినాసరే చాలామంది ఈ రైడర్లను తీసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు. వీటి కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయక్కర్లేదు. ఏటా రూ.200 నుంచి 1,000కే రైడర్‌లను పొందొచ్చు. → యాక్సిడెంటల్‌ డెత్, యాక్సిడెంటల్‌ టోటల్‌ అండ్‌ పర్మనెంట్‌ డిజేబిలిటీ (ప్రమాద మరణం లేదా అంగ వైక ల్యం) రైడర్‌ల ను తప్పకుండా జోడించుకోవాలి. → వేవర్‌ ఆఫ్‌ ప్రీమియం రైడర్‌ కూడా అవసరమే. దీనికి ప్రీమియం రూ.100–200 వరకే ఉంటుంది. ప్రమాదాల్లో వైకల్యం పాలైన సందర్భాల్లో భవిష్యత్తు ప్రీమియం చెల్లించాల్సిన అవసరాన్ని ఈ రైడర్‌ తప్పిస్తుంది. → జీవిత బీమా అయినా, ఆరోగ్య బీమా అయినా, చివరికి హోమ్‌ ఇన్సూరెన్స్‌ అయినా.. కనీసం రెండేళ్లకోసారి సమీక్షించుకోవాలి. ఆదాయంతోపాటు కుటుంబ బాధ్యతలూ పెరుగుతుంటాయి. తీసుకున్న కవరేజీ, అందులోని సదుపాయాలు తమ అవసరాలకు అనుగుణంగా ఉన్నాయా? అన్నది పరిశీలించుకోవాలి. అవసరమైతే, అదనపు కవరేజీ తీసుకోవాలి.

Advertisement
Advertisement
Advertisement