Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

ChatGPT Adds Million Users in an Hour Ghibli AI Art effect1
60 నిమిషాల్లో కొత్తగా 10 లక్షల మంది యూజర్లు

ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్‌జీపీటీ కేవలం ఒకే గంటలో పది లక్షల మంది యూజర్లను సంపాదించినట్లు కంపెనీ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ తెలిపారు. కంపెనీ ఇటీవల ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ట్‌ స్టూడియో జీబ్లీకి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఇలా చాట్‌జీపీటీకి వినియోగదారులు పెరుగుతున్నట్లు చెప్పారు. ఈమేరకు ఆల్ట్‌మన్‌ తన ఎక్స్‌(గతంలో ట్విట్టర్) ఖాతాలో ఈ విషయాన్ని పంచుకున్నారు.26 నెలల క్రితం చాట్‌జీపీటీ ప్రారంభించిన సమయంలో అత్యంత క్రేజ్‌తో క్షణాల్లో ఈ ప్లాట్‌ఫామ్‌ వైరల్‌ అయి ఐదు రోజుల్లో 10 లక్షల మంది యూజర్లను సంపాదించుకున్నట్లు ఆల్ట్‌మన్‌ చెప్పారు. కానీ కొత్తగా ప్రవేశపెట్టిన బీజ్లీ స్టూడియో ద్వారా చాట్‌జీపీటీ గతంలో కంటే మరింత వైరల్‌ అయి కేవలం గంటలోనే 10 లక్షల మంది యూజర్ల బేస్‌ను సంపాదించిందని వివరించారు. ప్రస్తుతానికి కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్యను విడుదల చేయలేదు. ఈ కొత్త ఫీచర్‌ను ఓపెన్‌ఏఐ గత వారం జీపీటీ-4ఓలో ప్రవేశపెట్టారు. దీని ద్వారా ఎలాంటి ఎక్స్‌టర్నల్‌ టూల్స్ అవసరం లేకుండా నేరుగా చాట్‌జీపీటీలోనే టెక్ట్స్‌, యూజర్ ఫొటోలు అప్‌లోడ్‌ చేసి బీజ్లీ ఇమేజ్‌లను పొందవచ్చు.ఇదీ చదవండి: భగ్గుమన్న బంగారం.. ఒకేరోజు భారీగా పెరిగిన ధరఇప్పటికే చాలామంది యూజర్లు తమ సెల్ఫీలు, పెంపుడు జంతువులు, కుటుంబ చిత్రాలు.. చాట్‌జీపీటీలో అప్‌లోడ్‌ చేసి జీబ్లీ ఫొటోలను పొందుతున్నారు. వాటిని తమకు చెందిన వివిధ సామాజిక మాధ్యమ ఖాతాల్లో షేర్‌ చేస్తున్నారు. జీబ్లీ ఇమేజ్‌ క్రియేట్‌ చేసేందుకు అనువైన మౌలిక సదుపాయాలు కావాల్సి ఉంటుంది. దీనివల్ల భారీగా జీపీయూ(గ్రాఫిక్స్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌) కరిగిపోతుంది. దీనిపై కొంత ఆందోళనలు వ్యక్తమవుతున్నా కొత్త ఫీచర్‌ను సులభంగా ఉపయోగించాలని ఆల్ట్‌మన్‌ వినియోగదారులను కోరారు.

Gold and Silver rates today on market in Telugu states2
భగ్గుమన్న బంగారం.. ఒకేరోజు భారీగా పెరిగిన ధర

స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు ఇటీవల కొంత శాంతించినట్లు కనిపించినా తిరిగి జీవితకాల గరిష్టాలను చేరుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో మంగళవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rate) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.85,100 (22 క్యారెట్స్), రూ.92,840 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.850, రూ.930 పెరిగింది.ఇదీ చదవండి: కొత్త ఆర్థిక సంవత్సరం.. 1,160 పాయింట్లు పడిన సెన్సెక్స్‌చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.850, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.930 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.85,100 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.92,840 (24 క్యారెట్స్ 10 గ్రామ్‌ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.850 పెరిగి రూ.85,250కు చేరుకోగా..24 క్యారెట్ల ధర రూ.930 పెరిగి రూ.92,990 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు పెరుగుతున్నట్లు వెండి ధరల్లోనూ మంగళవారం మార్పులు వచ్చాయి. నిన్నటితో పోలిస్తే ఈ రోజు వెండి ధరలు పెరిగాయి. కేజీ వెండి రేటు(Silver Price) సోమవారంతో పోలిస్తే రూ.1000 పెరిగి రూ.1,14,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Stock market losses on 2026 financial year starting day3
కొత్త ఆర్థిక సంవత్సరం.. 1,160 పాయింట్లు పడిన సెన్సెక్స్‌

కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజు స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీగా పతనమవుతున్నాయి. బీఎస్‌ఈకి చెందిన సెన్సెక్స్‌ ఏకంగా 1160 పాయింట్లు పడిపోయి 76,261కు చేరింది. ఎన్‌ఎస్‌ఈ ఆధ్వర్యంలోని నిఫ్టీ 280 పాయింట్లు పడిపోయి 23,243 మార్కు వద్ద కదలాడుతుంది. దాంతో ఈరోజు మార్కెట్‌ సెషన్‌లో ప్రస్తుత సమయం వరకు మదుపర్ల సంపద దాదాపు రూ.4 లక్షల కోట్లు ఆవిరైంది. భారీగా మార్కెట్‌ సూచీల పతనానికిగల కారణాలను మార్కెట్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఇదీ చదవండి: తగ్గిన ఎల్‌పీజీ గ్యాస్‌ ధరలు2025 ఏప్రిల్ 2న అమెరికా సుంకాల విధింపు నిర్ణయాలపై స్పష్టత ఇవ్వనున్నట్లు యూఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.టారిఫ్ విధానాలపై అనిశ్చితి నెలకొనడం వాణిజ్య యుద్ధ భయాలను రేకెత్తిస్తుంది. దాంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.అమెరికా భారత్‌ను నేరుగా టార్గెట్ చేయనప్పటికీ, ప్రపంచ మార్కెట్ సెంటిమెంట్ ప్రభావం భారత మార్కెట్లపై కనిపిస్తుంది.ఐటీ, బ్యాంకింగ్‌, ఫార్మా షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించడంతో సూచీలు పతనమవుతున్నాయి. ఎఫ్ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్ మినహా చాలా రంగాల సూచీలు నష్టాల్లో కదలాడుతున్నాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా భారీగానే క్షీణించాయి.ఇటీవల మార్కెట్లు పడి క్రమంగా పుంజుకున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ప్రాఫిట్‌ బుకింగ్‌కు పూనుకుంటున్నారు.అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలతో అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ తగ్గుతుంది. దాంతో దేశీయ దిగుమతులకు అధికంగా చెల్లింపులు చేయాల్సి వస్తుంది.

Commercial LPG Cylinder Prices Reduced4
తగ్గిన ఎల్‌పీజీ గ్యాస్‌ ధరలు

ఆయిల్‌ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) ఏప్రిల్ 1, 2025 నుంచి 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌ ధరను రూ.41 తగ్గించాయి. సవరించిన రిటైల్ సేల్ ధర వల్ల ఢిల్లీలో దీని రేటు రూ.1,762గా ఉంది. ఈ తగ్గింపుతో హోటళ్లు, రెస్టారెంట్లతో సహా ఎల్‌పీజీపై ఆధారపడే వ్యాపారాలకు కొంత ఉపశమనం కలిగినట్లయింది. అంతర్జాతీయ ముడిచమురు రేట్లలో హెచ్చుతగ్గులు, ఇతర ఆర్థిక అంశాల ప్రభావంతో ఈ ధరలను సవరిస్తుంటారు. కమర్షియల్‌ గ్యాస్‌ ధరలను తగ్గించినా, గృహాల్లో ఉపయోగించే ఎల్‌పీజీ ధరలను మాత్రం మార్చలేదు.ధరల హెచ్చుతగ్గులుగత నెలలో మార్చి 1, 2025న ఓఎంసీలు ప్రధాన నగరాల్లో వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరలను రూ.6 పెంచాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ ఇండేన్ ప్రకారం.. ఫిబ్రవరిలో అంతకుముందు నెలతో పోలిస్తే 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.7 తగ్గించారు. మార్చి నెలలో రూ.1,797 నుంచి రూ.1,803కు పెరిగింది. తాజాగా రూ.41 తగ్గించారు. అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో మార్పులకు అనుగుణంగా ఇంధన ధరల్లో అస్థిరత నెలకొంటుంది.ఇదీ చదవండి: రెండేళ్లలో తొలిసారి ధరలు పెంపునగరాల వారీగా ధరలుఢిల్లీ-రూ.1,762 (రూ.1,803 నుంచి తగ్గింది)కోల్‌కతా-రూ.1,872 (రూ.1,913 నుంచి తగ్గింది)ముంబయి-రూ.1,714.50 (రూ.1,755.50 నుంచి తగ్గింది)చెన్నై-రూ.1,924.50 (రూ.1,965.50 నుంచి తగ్గింది)

stock market updates on april 1 20255
నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే మంగళవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ(Nifty) 67 పాయింట్లు నష్టపోయి 23,454కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 303 పాయింట్లు దిగజారి 77,113 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 104.1 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 74.97 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.19 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో మిశ్రమంగా ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.55 శాతం లాభపడింది. నాస్‌డాక్‌ 0.14 శాతం దిగజారింది.ఎఫ్‌పీఐలు, రిటైలర్ల పెట్టుబడుల దన్నుతో ఒక్క మార్చి నెలలోనే మార్కెట్లు భారీగా టర్న్‌అరౌండ్‌ అయ్యాయి. సెన్సెక్స్‌ 4,217 పాయింట్లు(5.8 శాతం) ఎగసింది. బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 3,555 పాయింట్లు(8.3%) జంప్‌చేస్తే, మిడ్‌క్యాప్‌ 2,939 పాయింట్లు(7.6%) బలపడింది. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు తలెత్తినప్పటికీ దేశీయంగా సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు, విధానాల కొనసాగింపుపై అంచనాలు ఇన్వెస్టర్లలో మార్కెట్లపట్ల విశ్వాసాన్ని పెంచాయి. ఫలితంగా గతేడాది పలు ఆటుపోట్ల మధ్య మార్కెట్లు నికరంగా లాభపడ్డాయి.ఇదీ చదవండి: రెండేళ్లలో తొలిసారి ధరలు పెంపుట్రంప్‌ సుంకాలపై ఏప్రిల్‌ 2న మరింత స్పష్టత రాబోతుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సుంకాల ప్రభావం ఆటో, ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాలపై ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. అమెరికా టారిఫ్‌ల వార్తలు మార్కెట్‌ సెంటిమెంటును దెబ్బతీస్తున్నాయి. దీనికి తోడు ముడిచమురు ధరలు పెరగడం, అమెరికా డాలర్ బలపడటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) ఇటీవల నికర కొనుగోలుదారులుగా మారడం కొంత కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

India raised prices of natural gas for the first time in two years6
రెండేళ్లలో తొలిసారి ధరలు పెంపు

దేశీయంగా ఉత్పత్తి అయ్యే సహజవాయువు ధరలను భారత్ రెండేళ్లలో తొలిసారిగా పెంచింది. ఏప్రిల్ 1 నుంచి ఏపీఎం(అడ్మినిస్ట్రేటెడ్ ప్రైసింగ్‌ మెకానిజం) గ్యాస్‌ ధరను 10 లక్షల థర్మల్ యూనిట్లకు 6.50 డాలర్ల నుంచి 6.75 డాలర్లకు పెంచినట్లు పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖకు చెందిన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ విభాగం నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఓఎన్‌జీసీ), ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లు నామినేషన్ ప్రాతిపదికన కేటాయించిన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే సహజ వాయువును ఏపీఎం గ్యాస్ అంటారు. ఈ గ్యాస్‌ను ‘అడ్మినిస్ట్రేటెడ్ ప్రైసింగ్ మెకానిజం’ వద్ద వినియోగదారులకు విక్రయిస్తారు.ఇంట్లో వంట అవసరాలకు పైపుల ద్వారా సహజ వాయువుగా ఈ గ్యాస్‌ను సరఫరా చేస్తారు. ఆటోమొబైల్స్ అవసరాల కోసం కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్‌గా మారుస్తారు. ప్రభుత్వం రూపొందించిన రోడ్ మ్యాప్‌కు అనుగుణంగా రెండేళ్లలో తొలిసారి ధరల పెంపును అమలు చేశారు. 2023 ఏప్రిల్‌లో దేశీయంగా ఉత్పత్తి అయిన సహజ వాయువు ధరలను మిలియన్ థర్మల్ యూనిట్లకు 4 డాలర్లు నుంచి గరిష్టంగా 6.5 డాలర్లుగా పరిమితిని విధించారు. ధరల పెంపుకు సంబంధించి నిపుణుల కమిటీ నివేదికను గతంలో కేంద్ర కేబినెట్ ఆమోదించింది. 2027 వరకు 0.5 డాలర్లు పెంచాలని సూచించింది. 2023 నుంచి రెండేళ్లపాటు ఎలాంటి పెంపు తీసుకోలేదు. ఈ గడువు ముగియడంతో తాజాగా 0.25 డాలర్ల పెంపు అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వచ్చే రెండేళ్ల పాటు రేట్లు మారవని, ఆ తర్వాత మరో 0.25 డాలర్లు పెంచాలని కేంద్ర కేబినెట్ ఇప్పటికే నిర్ణయించింది.ఇదీ చదవండి: నేటి నుంచి అమల్లోకి కొత్త ఆర్థిక మార్పులుకంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) అనేది అధిక పీడనం వద్ద నిల్వ చేసి ఉపయోగించేందుకు వీలైన గ్యాస్‌. దీన్ని ప్రధానంగా మీథేన్, గ్యాసోలిన్, డీజిల్ లేదా బొగ్గు వంటి సాంప్రదాయ శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా వినియోగాస్తున్నారు. కార్లు, బస్సులు, ట్రక్కులు, ఆటోరిక్షాలు సహా ఆటోమొబైల్స్‌కు ప్రత్యామ్నాయ ఇంధనంగా సీఎన్‌జీని విస్తృతంగా వాడుతున్నారు. గ్యాసోలిన్ లేదా డీజిల్‌, పెట్రోల్‌తో పోలిస్తే తక్కువ ఉద్గారాలు విడుదల చేస్తుంది.

French auto major Renault acquire alliance partner Nissan stake7
రెనో చేతికి నిస్సాన్‌ వాటా

న్యూఢిల్లీ: దేశంలోని జపనీస్‌ కంపెనీ నిస్సాన్‌ వాటాను ఫ్రెంచ్‌ ఆటో రంగ దిగ్గజం రెనో కొనుగోలు చేయనుంది. దాంతో దేశీ భాగస్వామ్య కంపెనీ(జేవీ) రెనో నిస్సాన్‌ ఆటోమోటివ్‌ ఇండియా ప్రయివేట్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎన్‌ఏఐపీఎల్‌)ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ జేవీలో నిస్సాన్‌కుగల 51 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు రెనో తాజాగా పేర్కొంది. తద్వారా జేవీలో 100 శాతం వాటా పొందనున్నట్లు, కొనుగోలు ఒప్పందం(ఎస్‌పీఏ) కుదిరినట్లు తెలియజేసింది. అయితే వాటా విలువను వెల్లడించలేదు. ఈ లావాదేవీ తదుపరి రెనో నిస్సాన్‌ జేవీలో రెనో గ్రూప్‌ వాటా 100 శాతానికి చేరనుంది. చెన్నైలోగల ప్లాంటు ద్వారా రెనో, నిస్సాన్‌ బ్రాండ్ల వాహనాలను జేవీ రూపొందిస్తోంది. ఈ ప్లాంటు 6,300 ఉద్యోగులతో వార్షికంగా 4.8 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రస్తుతం సీఎంఎఫ్‌ఏ, సీఎంఎఫ్‌ఏ ప్లస్‌ ప్లాట్‌ఫామ్‌లపై కైగర్, ట్రైబర్, క్విడ్‌ వాహనాలను తయారు చేస్తున్నట్లు రెనో గ్రూప్‌ సీఎఫ్‌వో డంకన్‌ మింటో పేర్కొన్నారు.ఐటీసీ గూటికి సెంచరీ పల్ప్‌డీల్‌ విలువ రూ.3,498 కోట్లున్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా రియల్‌ ఎస్టేట్‌ (ఏబీఆర్‌ఈఎల్‌)లో భాగమైన సెంచరీ పల్ప్‌ అండ్‌ పేపర్‌ను డైవర్సిఫైడ్‌ దిగ్గజం ఐటీసీ తాజాగా కొనుగోలు చేసింది. ఈ డీల్‌ విలువ రూ. 3,498 కోట్లు. దీనితో కీలకమైన రియల్‌ ఎస్టేట్‌ విభాగంపై మరింతగా దృష్టి పెట్టేందుకు వెసులుబాటు లభిస్తుందని ఏబీఆర్‌ఈఎల్‌ ఎండీ ఆర్‌కే దాల్మియా తెలిపారు. అలాగే ఏబీఆర్‌ఈఎల్‌ వాటాదార్లకు అధిక విలువ చేకూర్చేందుకు తోడ్పడుతుందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: నేటి నుంచి అమల్లోకి కొత్త ఆర్థిక మార్పులు

key financial changes from april 1st8
నేటి నుంచి అమల్లోకి కొత్త ఆర్థిక మార్పులు

నూతన ఆర్థిక సంవత్సరంలో కొన్ని కీలక ఆర్థిక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆదాయపన్ను దగ్గర్నుంచి క్రెడిట్‌ కార్డు రివార్డులు, టీడీఎస్‌ వరకు జరిగే ఈ మార్పుల ప్రభావం.. వ్యక్తిగత బడ్జెట్, ఆర్థిక ప్రణాళికలపై కచ్చితంగా ఉంటుంది. వీటిపై ఓసారి దృష్టి సారిద్దాం.2025–26 బడ్జెట్‌లో కొత్త ఆదాయపన్ను విధానంలో కలి్పంచిన పన్ను ప్రయోజనాలు 2025 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చేశాయి. నూతన విధానంలో రూ.12 లక్షలకు మించకుండా ఆదాయం ఉన్న వారు పన్ను చెల్లించక్కర్లేదు. వేతన జీవులు అయితే స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.75వేలతో కలుపుకుని రూ.12.75 లక్షలకు మించని ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉపశమనం కల్పించారు.వేతన జీవులు, పెన్షనర్లకు ఇంతకుముందు వరకు నూతన పన్ను విధానంలో రూ.50 వేలుగానే ఉన్న స్టాండర్డ్‌ డిడక్షన్‌ ప్రయోజనం రూ.75 వేలకు పెరిగింది. 60 ఏళ్లు నిండిన వృద్ధులకు (సీనియర్‌ సిటిజన్స్‌) బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, రికరింగ్‌ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50వేలు మించితే టీడీఎస్‌ అమలు చేసేవారు. ఇప్పుడు ఈ పరిమితి రూ.లక్షకు పెంచారు. దీంతో వృద్ధులకు పెద్ద ఉపశమనం దక్కింది. 60 ఏళ్లలోపు ఉన్న డిపాజిట్లకు వడ్డీ ఆదాయం రూ.40వేలు మించితే టీడీఎస్‌ అమలు చేస్తుండగా, ఈ పరిమితి రూ.50వేలకు పెరిగింది. ఇన్సూరెన్స్‌ బ్రోకర్లకు వచ్చే కమీషన్‌ ఆదాయం ఏడాదిలో రూ.15,000 మించితే టీడీఎస్‌ అమలు చేస్తుండగా, ఈ పరిమితి రూ.20,000కు పెరిగింది. యాక్టివ్‌గా లేని (కార్యకలాపాల్లేని) ఖాతాలకు అనుసంధానమైన యూపీఐ ఐడీలు ఇక పనిచేయవు. భద్రత దృష్ట్యా వీటిని డీయాక్టివేట్‌ చేయనున్నారు. తమ ఖాతాలను యాక్టివ్‌గా మార్చుకుని తిరిగి యూపీఐ ఐడీ క్రియేట్‌ చేసుకోవచ్చు. సెబీ ఆదేశాల ప్రకారం మ్యూచువల్‌ ఫండ్స్‌ కొత్త పథకాల (ఎన్‌ఎఫ్‌వోలు) రూపంలో ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసిన నిధులను, ఇష్యూ ముగిసిన తర్వాత 30 పనిదినాల్లో ఇన్వెస్ట్‌ చేయడం తప్పనిసరి.ఇదీ చదవండి: యాపిల్‌పై రూ.1,350 కోట్లు జరిమానాస్పెషలైజ్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌ (సిఫ్‌) పేరుతో సెబీ ప్రకటించిన కొత్త తరహా పెట్టుబడుల విభాగం ఆచరణలోకి రానుంది. ఇన్వెస్టర్లు కనీసం రూ.10 లక్షలతో ఇందులో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఇన్వెస్టర్లు తమ డీమ్యాట్‌ అకౌంట్‌ స్టేట్‌మెంట్‌లు, కన్సాలిడేటెడ్‌ అకౌంట్‌ స్టేట్‌మెంట్లను నేరుగా డిజీలాకర్‌లోకి వెళ్లేలా చేసుకోవచ్చు. తద్వారా ఇన్వెస్టర్లు, వారి నామినీలు ఈక్విటీ పెట్టుబడుల వివరాలను కోరుకున్నప్పుడు సులభంగా పొందేందుకు వీలుంటుంది. ఎస్‌బీఐ తన క్రెడిట్‌ కార్డుల్లో కొన్ని రకాలపై రివార్డు పాయింట్ల పరంగా చేసిన మార్పులు అమల్లోకి వచ్చేశాయి. దీంతో సింప్లీ క్లిక్‌ ఎస్‌బీఐ కార్డు దారులు స్విగ్గీ షాపింగ్‌పై ప్రస్తుతం పొందుతున్న పది రెట్ల రివార్డు పాయింట్లు కాస్తా ఐదు రెట్లకు తగ్గిపోయాయి. అమెరికా డిమాండ్ల మేరకు ఆ దేశం నుంచి దిగుమతయ్యే కొన్ని రకాల ఉత్పత్తులపై భారత్‌ టారిఫ్‌లు తగ్గించాలనుకుంటోంది. దీని ఫలితంగా అమెరికా నుంచి వచ్చే యాపిల్స్, బాదం, ఆటో ఉత్పత్తుల ధరలు దిగిరావొచ్చు.

Haldiram sells stake to IHC and Alpha Wave Global9
హల్దీరామ్‌లో వాటా విక్రయం

న్యూఢిల్లీ: ఫాస్ట్‌ఫుడ్‌ కంపెనీ హల్దీరామ్‌ స్నాక్స్‌ ఫుడ్‌ తాజాగా యూఏఈ సంస్థ ఇంటర్నేషనల్‌ హోల్డింగ్‌ కంపెనీ(ఐహెచ్‌సీ)తోపాటు ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ అల్ఫా వేవ్‌ గ్లోబల్‌కు మైనారిటీ వాటా విక్రయించనుంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం రెండు సంస్థలు సంయుక్తంగా హల్దీరామ్‌లో 6 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. స్నాక్, ఫుడ్‌ బ్రాండ్‌ హల్దీరామ్స్‌లో ఇప్పటికే టెమాసెక్‌ ఈక్విటీ పెట్టుబడులకు సిద్ధపడగా.. మరో రెండు సంస్థలు ఐహెచ్‌సీ, అల్ఫా వేవ్‌ గ్లోబల్‌ సైతం వాటా కొనుగోలు చేయనున్నట్లు హల్దీరామ్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే డీల్‌ వివరాలు వెల్లడించలేదు. గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ టెమాసెక్‌కు ఇప్పటికే మైనారిటీ వాటా విక్రయించేందుకు ఒప్పందం కుదిరిన నేపథ్యంలో హల్దీ రామ్‌ తాజా ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది. కాగా.. 10 బిలియన్‌ డాలర్ల(సుమారు రూ. 85,000 కోట్లు) విలువలో హల్దీరామ్‌ లో మైనారిటీ వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు అంచనా.

BSE smallcap index jumps 8 pc in FY25 on retail investors10
చిన్న షేర్ల జోష్‌

తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరం(2024–25)లో దేశీ స్టాక్‌ మార్కెట్లు స్వల్పంగా బలపడ్డాయి. ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 5 శాతం లాభపడింది. అయితే అత్యధిక శాతం ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడంతో చిన్న షేర్ల ఇండెక్స్‌ బీఎస్‌ఈలో 8 శాతం పురోగమించింది. ఇందుకు ప్రధానంగా మార్చి నెల మద్దతిచ్చింది.న్యూఢిల్లీ: పలు ఆటుపోట్ల మధ్య 2024–25లో స్టాక్‌ మార్కెట్లు నికరంగా లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 3,764 పాయింట్లు(5.1 శాతం) పుంజుకోగా.. బీఎస్‌ఈలో స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 3,472 పాయింట్లు(8 శాతం) ఎగసింది. ఈ బాటలో మిడ్‌క్యాప్‌ సైతం 2,209 పాయింట్లు(5.6 శాతం) వృద్ధి చెందింది. ఇందుకు ప్రధానంగా మార్చి నెల దన్నుగా నిలిచింది. గతేడాది అక్టోబర్‌ నుంచి అమ్మకాల బాట పట్టిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) గత నెలలో ఉన్నట్టుండి కొనుగోళ్ల యూటర్న్‌ తీసుకోవడంతో మార్కెట్లు భారీ నష్టాల నుంచి రికవరీ సాధించాయి. దీంతో పూర్తి ఏడాదికి లాభాలతో నిలిచాయి. ప్రధానంగా రిటైల్‌ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపడం మిడ్, స్మాల్‌క్యాప్‌ కౌంటర్లకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. నష్టాలకు చెక్‌ గతేడాది అక్టోబర్‌ మొదలు వరుసగా 5 నెలలపాటు నష్టాలతో ముగిసిన మార్కెట్లు గత నెలలో బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి. తద్వారా గతేడాది నికరంగా లాభాలతో నిలిచినట్లు లెమన్‌ మార్కెట్స్‌ డెస్క్‌ విశ్లేషకులు సతీష్‌ చంద్ర ఆలూరి పేర్కొన్నారు. ప్రధానంగా మిడ్, స్మాల్‌క్యాప్‌ ఇండెక్సులు మార్కెట్లను మించి బలపడినట్లు తెలియజేశారు. అందుబాటు విలువలకు చేరిన పలు షేర్లకుతోడు దేశీయంగా నెలకొన్న ఆశావహ పరిస్థితులు, ఎఫ్‌పీఐల పెట్టుబడులు ఇందుకు కారణమైనట్లు వివరించారు. దీంతో ప్రస్తుతం చరిత్రాత్మక సగటులకు పలు కౌంటర్లు చేరినట్లు అభిప్రాయపడ్డారు. ఈక్విటీల విలువలు ఖరీదుగా మారడంతో అక్టోబర్‌ నుంచి ఎఫ్‌పీఐలు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. వెరసి దేశీ స్టాక్‌ మార్కెట్లు ‘బేర్‌’ ట్రెండ్‌లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎఫ్‌పీఐలు పెట్టుబడులవైపు మళ్లడంతోపాటు.. భారీ సంఖ్యలో రిటైల్‌ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో మార్కెట్లు నష్టాలనుంచి బయటపడినట్లు నిపుణులు తెలియజేశారు. ఇది చివరికి మార్కెట్లు సానుకూల ధోరణిలో ముగిసేందుకు దోహదం చేసినట్లు వివరించారు. ఫైనాన్షియల్‌ మార్కెట్లను ప్రభావితం చేయగల యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ 2025లో వడ్డీ రేట్ల కోత సంకేతాలు ఇవ్వడం సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు పేర్కొన్నారు. ప్రీమియం విలువల ఎఫెక్ట్‌ నిజానికి బుల్‌ మార్కెట్లలో ప్రధాన ఇండెక్సులతో పోలిస్తే మిడ్, స్మాల్‌ క్యాప్స్‌ మరింత అధికంగా ర్యాలీ చేయవలసి ఉన్నట్లు హైబ్రో సెక్యూరిటీస్‌ వ్యవస్థాపకులు తరుణ్‌ సింగ్‌ పేర్కొన్నారు. గతేడాది చిన్న షేర్ల ఇండెక్సులు రెండంకెల స్థాయిలో వృద్ఢి చూపకపోవడానికి మార్కెట్ల ర్యాలీ చాలా ముందుగానే ప్రారంభంకావడంతో షేర్ల ధరలు భారీగా పెరిగాయని, ఇందుకు తగిన స్థాయిలో కంపెనీల పనితీరు లేకపోవడం ఇన్వెస్టర్లను నిరాశపరచిందని వివరించారు. గత రెండు త్రైమాసికాలలో అంచనాలకంటే దిగువన వెలువడిన ఫలితాలు షేర్ల ప్రీమియం ధరలకు మద్దతివ్వలేకపోయినట్లు తెలియజేశారు. మరోవైపు యూఎస్‌ కొత్త ప్రెసిడెంట్‌ ట్రంప్‌ భారత్‌సహా పలు దేశాలపై ప్రతీకార టారిఫ్‌లకు తెరతీయడం సెంటిమెంటును బలహీనపరచినట్లు మాస్టర్‌ క్యాపిటల్‌ సరీ్వసెస్‌ డైరెక్టర్‌ పాల్క అరోరా చోప్రా పేర్కొన్నారు. సరికొత్త రికార్డులు గతేడాది(2024) సెప్టెంబర్‌ 27న సెన్సెక్స్‌ చరిత్రాత్మక గరిష్టం 85,978 పాయింట్లను అధిగమించగా.. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ అదేనెల 24న 49,701ను తాకి సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. ఈ బాటలో స్మాల్‌క్యాప్‌ సైతం 2024 డిసెంబర్‌ 12న 57,828 పాయింట్ల వద్ద లైఫ్‌టైమ్‌ గరిష్టానికి చేరింది. నిజానికి బ్లూచిప్స్‌ లేదా లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ను ఎఫ్‌పీఐలు అత్యధికంగా కొనుగోలు చేస్తే.. రిటైలర్లు చిన్న షేర్లపట్ల ఆకర్షితులవుతుంటారని విశ్లేషకులు వివరించారు. అయితే ఇకపై ఆయా కంపెనీల ఫలితాల ఆధారంగా స్టాక్‌ విలువలు సర్దుబాటుకానున్నట్లు తెలియజేశారు. కొత్త ఆర్థిక సంవత్సరం(2025–26)లో అడుగుపెడుతున్న నేపథ్యంలో దేశీ ఈక్విటీ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య వృద్ధి బాటలో సాగే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ పరిస్థితులు, మార్కెట్ల ట్రెండ్‌సహా దేశీయంగా కార్పొరేట్‌ ఫలితాలు, ప్రభుత్వ, ప్రయివేట్‌ పెట్టుబడులు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు వివరించారు.మార్చిలో బూస్ట్‌ఎఫ్‌పీఐలు, రిటైలర్ల పెట్టుబడుల దన్నుతో ఒక్క మార్చి నెలలోనే మార్కెట్లు భారీగా టర్న్‌అరౌండ్‌ అయ్యాయి. సెన్సెక్స్‌ 4,217 పాయింట్లు(5.8 శాతం) ఎగసింది. బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 3,555 పాయింట్లు(8.3%) జంప్‌చేస్తే, మిడ్‌క్యాప్‌ 2,939 పాయింట్లు(7.6%) బలపడింది. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు తలెత్తినప్పటికీ దేశీయంగా సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు, విధానాల కొనసాగింపుపై అంచనాలు ఇన్వెస్టర్లలో మార్కెట్లపట్ల విశ్వాసాన్ని పెంచాయి. ఫలితంగా గతేడాది పలు ఆటుపోట్ల మధ్య మార్కెట్లు నికరంగా లాభపడ్డాయి.

బిజినెస్ పోల్

Advertisement
Advertisement
Advertisement
 

Business exchange section

Currency Conversion Rate

Commodities

Name Rate Change Change%
Silver 1 Kg 114000.00 1000.00 1.00
Gold 22K 10gm 85100.00 850.00 1.00
Gold 24k 10 gm 92840.00 930.00 1.00

Egg & Chicken Price

Title Price Quantity
Chicken (1 Kg skin less) 277.00 1.00
Eggs 66.00 12.00

Stock Action