Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

pnb-launched-upi-credit-card-how-to-link-in-telugu1
కొత్త క్రెడిట్ కార్డు.. మొబైల్ ఫోన్ ఉంటే చాలు!

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తన కస్టమర్ల కోసం డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేస్తూ ఫిన్‌టెక్‌ కంపెనీ కివితో కలిసి యూపీఐ క్రెడిట్ కార్డ్ (UPI Credit Card) సేవలను ప్రారంభించింది. రూపే (RuPay) నెట్‌వర్క్‌తో అనుసంధానమైన ఈ క్రెడిట్ కార్డుల ద్వారా వినియోగదారులు నేరుగా యూపీఐ యాప్‌ల ద్వారా చెల్లింపులు చేసుకునే వెసులుబాటు కలిగింది.సాధారణంగా క్రెడిట్ కార్డులను స్వైప్ మిషన్ల వద్ద మాత్రమే వాడతాము, కానీ ఈ కొత్త విధానంతో కస్టమర్లు తమ క్రెడిట్ కార్డ్‌ను భీమ్ (BHIM) లేదా ఇతర యూపీఐ యాప్‌లకు లింక్ చేసి, క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయడం ద్వారా సులభంగా నగదు రహిత లావాదేవీలు నిర్వహించవచ్చు.ఈ సదుపాయం వల్ల కస్టమర్లకు అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. ముఖ్యంగా జేబులో భౌతికమైన కార్డు లేకపోయినా, మొబైల్ ఫోన్ ఉంటే చాలు క్రెడిట్ లిమిట్‌ను వాడుకోవచ్చు. అంతేకాకుండా, ఈ కార్డు ద్వారా జరిపే లావాదేవీలపై రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా లభిస్తాయి. చిన్న తరహా వ్యాపారుల వద్ద సైతం క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్స్ చేసే అవకాశం ఉండటంతో, కస్టమర్ల కొనుగోలు శక్తి పెరుగుతుందని బ్యాంక్ వర్గాలు భావిస్తున్నాయి.సెటప్ చేసుకోవడం ఎలా?పీఎన్‌బీ కస్టమర్లు తమ వద్ద ఉన్న రూపే క్రెడిట్ కార్డును యూపీఐ యాప్‌లో సెటప్ చేసుకోవడం చాలా సులభం.💸 ముందుగా మీ యూపీఐ యాప్‌ను ఓపెన్ చేసి 'Add Credit Card' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.💸అక్కడ 'PNB' బ్యాంకును సెలెక్ట్ చేసుకుంటే మీ క్రెడిట్ కార్డ్ వివరాలు కనిపిస్తాయి.💸ఆ తర్వాత మీ కార్డుకు సంబంధించిన ఆరు అంకెల పిన్ సెట్ చేసుకుంటే లావాదేవీలకు సిద్ధమైనట్లే.బ్యాంకింగ్ రంగంలో వస్తున్న ఈ మార్పులు సామాన్య వినియోగదారుడికి నగదు కొరత లేకుండా డిజిటల్ చెల్లింపుల వైపు అడుగులు వేయడానికి ఎంతో దోహదపడతాయి. పీఎన్‌బీ తీసుకున్న ఈ నిర్ణయం డిజిటల్ ఇండియా లక్ష్యానికి మరింత బలాన్ని చేకూరుస్తోంది.

uae-to-automate-50-percent-govt-services-with-ai2
ప్రభుత్వ ఉద్యోగాల్లో సగం AIతోనే.. యూఏఈ సంచలనం!

సాంకేతిక రంగంలో ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా నిలుస్తున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) మరో ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2028 నాటికి ప్రభుత్వ సేవల్లో కనీసం 50 శాతాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా నిర్వహించాలని నిర్ణయించింది. (UAE AI Government Services) ఈ ఘనత సాధించనున్న ప్రపంచంలోని మొట్టమొదటి దేశంగా యూఏఈ రికార్డు సృష్టించనుంది.ఈ వినూత్న విధానం ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో పనితీరును వేగవంతం చేయడమే కాకుండా, పౌరులకు అందించే సేవల్లో జాప్యాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏఐ వినియోగం వల్ల కేవలం సమయం ఆదా అవ్వడమే కాకుండా, ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుందని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. వివిధ శాఖల సమన్వయం, డేటా విశ్లేషణలో కృత్రిమ మేధ కీలక పాత్ర పోషించనుంది.ఇప్పటికే పలు కీలక సంస్కరణలుయూఏఈ ప్రభుత్వం ఇప్పటికే 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్ట్రాటజీ 2031'లో భాగంగా పలు కీలక సంస్కరణలను చేపట్టింది. అందులో భాగంగానే ఈ సరికొత్త 2028 గడువును ఖరారు చేసింది. రవాణా, ఆరోగ్యం, విద్య, భద్రత వంటి కీలక రంగాలలో ఏఐ అల్గారిథమ్స్‌ను అనుసంధానించడం ద్వారా డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో అగ్రగామిగా నిలవాలని యూఏఈ లక్ష్యంగా పెట్టుకుంది.ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగంపై చర్చలు జరుగుతున్న తరుణంలో, యూఏఈ తీసుకున్న ఈ నిర్ణయం టెక్నాలజీ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ పాలనను ఆధునీకరించడంలో ఈ ప్రాజెక్టు ఒక మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.Under the directives of the President of the UAE, we launch a new government model. Within two years, 50% of government sectors, services, and operations will run on Agentic AI, making the UAE the first government globally to operate at this scale through autonomous systems.AI… pic.twitter.com/53OQLe7RXl— HH Sheikh Mohammed (@HHShkMohd) April 23, 2026

bangalore-couple-first-home-buying-journey-viral-story3
బెంగళూరులో ఇంటి ఓనర్స్‌ అయిపోయాం..

సొంత ఇల్లు.. సగటు మధ్యతరగతి మనిషి జీవితకాల కల. అదీ ముంబై తర్వాత అత్యంత ఖరీదైన రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌గా (Real Estate Market) చెప్పే బెంగళూరు నగరంలో. ఆ సొంతింటి కలని నిజం చేసుకోవడం వెనుక ఎన్ని నిద్రలేని రాత్రులు ఉంటాయో, ఎన్ని ఆర్థిక సవాళ్లు ఉంటాయో వివరిస్తూ బెంగళూరుకు చెందిన ఓ జంట పంచుకున్న కథనం ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.అడుగు ముందుకు వేయడమే అతిపెద్ద సాహసం!సుమారు 18 నెలల క్రితం జెనిత్ రాయ్ చక్రవర్తి, ఆమె భర్త బెంగళూరులోని ఒక ప్రైమ్‌ లొకేషన్‌లో ఇల్లు కొనాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఆ సమయంలో వారి ఆర్థిక పరిస్థితికి అది కొంత భారము అయినా, ఆ రిస్క్ తీసుకోవడానికే వారు సిద్ధపడ్డారు. రియల్ ఎస్టేట్ రంగంపై కనీస అవగాహన గానీ, సరైన మార్గదర్శకులు గానీ లేకపోయినా.. ధైర్యమే పెట్టుబడిగా ముందుకెళ్లారు.నిద్రలేని రాత్రులు.. ఎన్నో సందేహాలుఈ ప్రయాణం పూల బాట ఏమీ కాదని జెనిత్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. వారు ఎదుర్కొన్న సవాళ్లు ఇవే.. ఇల్లు ఇంకా నిర్మాణంలో ఉంది, ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి. గృహ రుణాలు (Home Loans), ప్రాపర్టీ మార్కెట్ నిబంధనలు అర్థం చేసుకోవడానికి సొంతంగా రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. ‘మేము సరైన నిర్ణయమే తీసుకున్నామా?’ అనే భయం, నిద్రలేని రాత్రులు వారిని వెన్నెంటే ఉన్నాయి.‘మేము దాదాపు శూన్యం నుంచి మొదలుపెట్టాం. ప్రతి అడుగులోనూ భయం ఉన్నా, ఒకరికొకరం అండగా నిలబడ్డాం. మా కుటుంబ సభ్యుల మద్దతు మమ్మల్ని ముందుకు నడిపించింది’ అని జెనిత్ భావోద్వేగానికి గురయ్యారు. View this post on Instagram A post shared by Zenith Roy Chakraborty (@zenithroyofficial)నిర్మాణంతో పాటే.. ఆత్మవిశ్వాసం కూడా!వందల సార్లు సైట్ విజిట్లు చేయడం, డాక్యుమెంట్లు సరిచూసుకోవడం, బ్యాంకుల చుట్టూ తిరగడం.. ఇలా ప్రతి దశలోనూ వారు కొత్త విషయాలు నేర్చుకున్నారు. ఇల్లు రూపుదిద్దుకుంటున్న కొద్దీ, వారిలో ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. చివరకు ఆ ఇల్లు పూర్తి కావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇది కేవలం ఇల్లు మాత్రమే కాదు..‘ఇది ఇతరులకు కేవలం ఒక ఆస్తిలా కనిపించవచ్చు. కానీ మాకు మాత్రం ఇది మా కష్టానికి, పట్టుదలకు నిదర్శనం’ అని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ జంట వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఎవరైనా కష్టపడితే, సరైన ప్రణాళికతో ముందడుగు వేస్తే తమ కలను ఎలా నిజం చేసుకోవచ్చో చెప్పడానికి ఈ జంట ప్రయాణమే ఒక నిదర్శనం.ఇదీ చదవండి: EMI మిస్ అయింది.. ఇంటిని సీల్ చేస్తారా?

apartment-prices-may-increase4
అపార్ట్‌మెంట్ల ధరలు పెరిగే అవకాశం!

పశ్చిమ ఆసియా యుద్ధం నేపథ్యంలో (Impact of West Asia War) నిర్మాణ రంగం కష్టాల్లో కూరుకుపోయింది. అసలే మార్కెట్‌ లేక అయోమయంలో ఉన్న బిల్డర్లకు యుద్ధం రూపంలో మరో బాంబ్‌ పేలింది. దాంతో సామాన్య మధ్యతరగతి ప్రజల సొంతింటి కల చెదిరే పరిస్థితులు ఏర్పడ్డాయి. నిర్మాణ రంగంలో అన్ని వస్తువుల ధరలు పెరిగిపోవడంతో రానున్న రోజుల్లో ఇళ్లు, ఫ్లాట్ల ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్‌ వంటి ముడి చమురు, సహజ వాయువు కొరత, సరుకు రవాణాకు అంతరాయం, తగ్గిన ముడి పదార్థాల దిగుమతులు నిర్మాణ రంగాన్ని షేక్‌ చేస్తున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోఇంధన వనరులపై ఆధారపడిన నిర్మాణ సామగ్రి తయారీ సంస్థలపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీంతో సిమెంట్, స్టీల్, (Cement and Steel rates) అల్యూమినియం, శానిటరీ, రంగులు, ప్లంబింగ్‌ పైపులు, యూపీవీసీ వంటి గృహ నిర్మాణ సామగ్రి ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. నెల రోజుల వ్యవధిలో ఆయా ఉత్పత్తుల ధరలు 20–50 శాతం మేర పెరిగిపోయాయి. దీంతో నిర్మాణ వ్యయం అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయి గృహ నిర్మాణదారులు, డెవలపర్లు హడలెత్తిపోతుండగా, వారు ఇళ్లు, ఫ్లాట్ల ధరలు పెంచక తప్పని పరిస్థితి నెలకొంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉత్పత్తుల తయారీలో చమురు కీలకం..నిర్మాణ రంగంలో సిమెంట్, స్టీల్‌ తయారీ దేశీయంగానే ముడి పదార్థాలపై ఆధారపడి ఉండటంతో ఆయా ఉత్పత్తులపై పెద్దగా ప్రభావం లేదు. కానీ రవాణా అంతరాయం కారణంగా వీటి ధరలు 10–15 శాతం వరకు పెరిగాయి. కాగా టైల్స్, శానిటరీ, అల్యూమినియం, రంగులు, యూపీవీసీ, పీవీసీ పైపులు, ఎలక్ట్రిక్‌ వైర్లు వంటి ఉత్పత్తుల తయారీలో గ్యాస్, పెట్రోల్, డీజిల్‌ అత్యంత కీలకం∙ప్రస్తుతం గల్ఫ్‌ దేశాల నుంచి చమురు సరఫరా తగ్గడంతో ఆయా ఉత్పత్తుల తయారీపై తీవ్ర ప్రభావం పడుతోంది.దీంతో పీవీసీ కోసం ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా దిగుమతి చేసుకునే యూపీవీసీ కిటికీలు, తలుపులు, గ్లాస్‌లు, శానిటరీ వేర్‌ వంటి వాటి ధరలు 40 శాతం పైనే పెరిగాయి. మొత్తం మీద నిర్మాణ సామగ్రి సరఫరాలో అంతరాయం, కొరత కారణంగా భవన నిర్మాణ వ్యయం 15–20 శాతం మేర పెరిగింది. ఈ భారాన్ని డెవలపర్లు చివరిగా గృహ కొనుగోలుదారులకు బదిలీ చేయడం తప్పనిసరి. ఫలితంగా అపార్ట్‌మెంట్ల ధరలు (Apartment Prices) చదరపు అడుగు (చ.అ.)కు రూ.250–300 వరకు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.ఎన్నికల ప్రభావంనిర్మాణ సామగ్రి సరఫరాలో అంతరాయంతో పాటు నిర్మాణ రంగంపై ఎన్నికల ప్రభావం కూడా పడింది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం వంటి రాష్ట్రాలలో ఎన్నికల నేపథ్యంలో నిర్మాణ రంగ కార్మికులు సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. దీంతో నిర్మాణ కార్యకలాపాలు నెమ్మదించాయి. నిర్మాణ వ్యయం, వినియోగ ఖర్చులు, వడ్డీల భారం డెవలపర్లపై పడుతోంది. దీంతో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు డెవలపర్లకు అధిక పెట్టుబడులు అవసరం అవుతాయి. దీంతో నిర్మాణ పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మరో ఆరు నెలల పాటు ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే నిర్మాణ సామగ్రి తయారీ సంస్థలు కుదేలవడంతో పాటు వడ్డీ రేట్లు పెరిగే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు.ఇదీ చదవండి: EMI మిస్ అయింది.. ఇంటిని సీల్ చేస్తారా?

jaguar-land-rover-1.7-lakh-vehicles-recall-power-loss-issue5
1.70 లక్షల ల్యాండ్ రోవర్ కార్లు రీకాల్‌

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) అమెరికాలో సుమారు 1.70 లక్షల హైబ్రిడ్ వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. కారులోని విద్యుత్ వ్యవస్థలో తలెత్తిన క్లిష్టమైన లోపం వల్ల వాహనం అకస్మాత్తుగా ఆగిపోయే ప్రమాదం ఉందని కంపెనీ గుర్తించింది.సమస్య ఏమిటంటే?ఈ వాహనాల్లోని DC-DC కన్వర్టర్‌లోని బూస్ట్ కంట్రోల్ మైక్రోచిప్‌లో అంతర్గత లోపం ఉన్నట్లు నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఈ భాగం 12-వోల్ట్ బ్యాటరీ సిస్టమ్ ఛార్జింగ్‌ను నియంత్రిస్తుంది. ఇది విఫలమైతే, వాహనానికి అందే విద్యుత్ సరఫరా ఒక్కసారిగా నిలిచిపోతుంది. దీనివల్ల కారు ప్రొపల్షన్ (ముందుకు కదిలే శక్తి), బాహ్య లైట్లు అకస్మాత్తుగా ఆగిపోవచ్చు, ఇది తీవ్రమైన ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది.హెచ్చరిక సంకేతాలుసిస్టమ్ పూర్తిగా విఫలమవ్వడానికి ముందు, డ్యాష్‌బోర్డ్ పై "Stop Safely Electric Fault Detected" అనే హెచ్చరిక కనిపిస్తుంది. ఒకవేళ డ్రైవర్ దీనిని గమనించకుండా డ్రైవింగ్ కొనసాగిస్తే గేర్‌బాక్స్ సరిగ్గా పనిచేయదు. కారు 'న్యూట్రల్' మోడ్‌లోకి వెళ్తుంది.సెంట్రల్ డిస్‌ప్లే, ఎయిర్ కండిషనింగ్ ఆగిపోతాయి. చివరగా ఇంజిన్, బాహ్య లైట్లు పనిచేయడం నిలిచిపోయి వాహనం ఆగిపోతుంది.ప్రభావితమైన మోడళ్లు మొత్తం 1,70,169 ఎస్‌యూవీలు ఈ రీకాల్ పరిధిలోకి వస్తాయి. వీటిలో రేంజ్ రోవర్ ఎవోక్ (2020-2023), స్పోర్ట్ (2019-2024), వెలార్ (2021-2024), రేంజ్ రోవర్ స్టాండర్డ్ (2020-2024) మోడళ్లు ఉన్నాయి. అలాగే ల్యాండ్ రోవర్ డిస్కవరీ(2021-2024), డిస్కవరీ స్పోర్ట్(2020), డిఫెండర్ (2020-2024), జాగ్వార్ ఇ-పేస్ (2021-2022), ఎఫ్-పేస్ (2021-2024) వాహనాలకూ రీకాల్‌ వర్తిస్తుంది.పరిష్కారం ఇంకా సిద్ధం కాలేదురాయిటర్స్ నివేదిక ప్రకారం, ఈ సమస్యకు జాగ్వార్ ల్యాండ్ రోవర్ వద్ద ప్రస్తుతానికి శాశ్వత పరిష్కారం సిద్ధంగా లేదు. సాఫ్ట్‌వేర్ లేదా హార్డ్‌వేర్ అప్‌డేట్ కోసం కంపెనీ కసరత్తు చేస్తోంది. వాహన యజమానులకు ప్రమాదం గురించి హెచ్చరిస్తూ జూన్ 12, 2026 నాటికి నోటీసులు అందుతాయి. పరిష్కారం సిద్ధమైన తర్వాత తుది మరమ్మతు లేఖలు కంపెనీ పంపుతుంది.భారత్‌పై ప్రభావం?ప్రస్తుతానికి ఈ రీకాల్ కేవలం అమెరికా మార్కెట్‌కే పరిమితం చేసింది కంపెనీ. అయితే, భారతీయ యజమానులు (ముఖ్యంగా దిగుమతి చేసుకున్న మోడళ్లు వాడుతున్న వారు) గ్లోబల్ VIN (వెహికల్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌) తనిఖీల ద్వారా తమ కారు సురక్షితంగా ఉందో లేదో సరిచూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: కియోసాకి కొత్త వార్నింగ్‌.. ఈవీలపై కీలక కామెంట్స్‌

Missed Your Train? Here’s What Indian Railways Rules Say About Your Ticket6
రైలు మిస్ అయితే.. సేమ్ టిక్కెట్టుతో ఇంకో రైలు ఎక్కొచ్చా?

ప్రయాణికులు ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఒక్కోసారి ట్రాఫిక్ జాంలు లేదా ఇతర అనివార్య కారణాల వల్ల రైలు మిస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సమయంలో ప్రయాణీకుల్లో ఒకటే ఆందోళన.. "నేను కొన్న టిక్కెట్టు ఏమవుతుంది..? దీనితో మరో రైలులో ప్రయాణించవచ్చా?" అని ఆందోళన కలుగుతుంది. అయితే, దీనిపై ఇండియన్ రైల్వేస్‌కు స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. అవేంటో ఓసారి తెలుసుకుందాం..ఒకవేళ మీరు తీసుకున్నది జనరల్ టిక్కెట్టు అయితే, రైలు మిస్ అయినా అదే టిక్కెట్టుతో నెక్స్ట్ అందుబాటులో ఉన్న రైలులో ప్రయాణించే వీలుంటుంది. కానీ, ఇక్కడ ఒక షరతు ఉంది. సాధారణంగా జనరల్ టిక్కెట్లు కొనుగోలు చేసిన సమయం నుంచి 3 గంటలు లేదా ఆ మార్గంలో వెళ్లే మొదటి రైలు వచ్చే వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఆ సమయం దాటితే ఆ టిక్కెట్టు చెల్లదు.ఒకవేళ రిజర్వేషన్ టిక్కెట్టు ఉంటే కుదరదు..ఒకవేళ మీరు స్లీపర్, ఏసీ లేదా ఏదైనా కేటగిరీలో ముందస్తుగా బెర్త్ రిజర్వ్ చేసుకుని, ఆ రైలును మిస్ అయితే మాత్రం అదే టిక్కెట్టుతో మరో రైలు ఎక్కడానికి వీల్లేదు. మరో టిక్కెట్టు తప్పనిసర..తదుపరి రైలులో వెళ్లాలంటే మీరు కొత్తగా టిక్కెట్టు తీసుకోవాల్సిందే. రీఫండ్ అవ్వదు..రైలు మిస్ అయిన సందర్భంలో రిజర్వేషన్ టిక్కెట్టుపై రీఫండ్ పొందే హక్కు ప్రయాణీకుడికి ఉండదు.కేటగిరీ మారినా.. మీ దగ్గర ఉన్నది ఆర్డినరీ రైలు టిక్కెట్టు అయి ఉండి, మీరు మెయిల్, ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ లేదా రాజధాని, శతాబ్ది, వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లలో ప్రయాణించాలనుకుంటే ఆ టిక్కెట్టు చెల్లదు. ఆయా రైళ్ల కేటగిరీని బట్టి మీరు అదనపు రుసుము చెల్లించి కొత్త టిక్కెట్టు తీసుకోవాలి.టీటీఈ చెకింగ్‌లో దొరికితే జరిమానా!..చెల్లని టిక్కెట్టుతో లేదా పాత రిజర్వేషన్ టిక్కెట్టుతో మరో రైలులో ప్రయాణిస్తూ టీటీఈ కి దొరికితే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.ఒకవేళ జరిమానా చెల్లించడానికి నిరాకరిస్తే, రైల్వే పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తీవ్రతను బట్టి జైలు శిక్ష కూడా పడవచ్చని రైల్వే నిబంధనలు హెచ్చరిస్తున్నాయి.కాబట్టి, రైలు ప్రయాణానికి కనీసం గంట ముందే స్టేషన్‌కు చేరుకోవడం ఉత్తమం. ఒకవేళ పొరపాటున రైలు మిస్ అయితే, రిస్క్ తీసుకోకుండా నిబంధనల ప్రకారం కొత్త టిక్కెట్టు తీసుకోవడమే బెటర్.. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది.

Advertisement
Advertisement
Advertisement