Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

AI Disruption Reshapes Hiring Trends TeamLease Digital CEO Neeti Sharma1
ఏఐతో హైరింగ్‌ ధోరణుల్లో మార్పులు

కృత్రిమ మేథ (ఏఐ)తో నియామకాల ధోరణుల్లో గణనీయంగా మార్పులు వస్తున్నాయని టీమ్‌లీజ్‌ డిజిటల్‌ సీఈవో నీతి శర్మ తెలిపారు. దీని వల్ల ఉద్యోగుల తొలగింపు అనేది ఆర్థికాంశాలతో కన్నా ఎక్కువగా టెక్నాలజీతో ముడిపడి ఉన్న వ్యవహారమని పేర్కొన్నారు. ఏఐతో ఉత్పాదకత పెరుగుతుండటంతో కంపెనీలకు పెద్ద సంఖ్యలో ఉద్యోగుల అవసరం తగ్గుతోందన్నారు. తక్కువ మంది సిబ్బందితోనే విస్తృతంగా కార్యకలాపాలని నిర్వహించుకోవడంపై అవి దృష్టి పెడుతున్నాయని శర్మ వివరించారు.అంతేగాకుండా కోవిడ్‌ సమయంలో భారీ స్థాయిలో నియమించుకున్న ఉద్యోగులను కంపెనీలు ప్రస్తుతం వ్యాపార అవసరాలకు అనుగుణంగా తగ్గించుకుంటూ ఉండటం కూడా ఉద్వాసనలకు కారణమవుతోందని తెలిపారు. ఈ అంశాలన్నీ కలిసి ఉద్యోగుల్లో అభద్రత భావన పెరుగుతోందని, 60 శాతం మంది పైగా టెక్‌ వర్కర్లలో స్థిరత్వంపై ఆందోళన నెలకొందని తెలిపారు. గత కొన్నాళ్లుగా టెక్నాలజీ రంగంలో నిర్దాక్షిణ్యంగా కోతలు అమలవుతున్న నేపథ్యంలో శర్మ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ట్రాకింగ్‌ సైట్‌ లేఆఫ్స్‌.ఎఫ్‌వైఐ ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకు అంతర్జాతీయంగా 70 పైగా టెక్‌ కంపెనీలు ఏకంగా 40,480 మంది ఉద్యోగులను తొలగించాయి. ఉత్పాదకత 30 శాతం వరకు అప్‌..ఏఐతో కోడింగ్, సపోర్ట్‌లాంటి కార్యకలాపాల్లో ఉత్పాదకత 10–30 శాతం వరకు పెరిగిందని నీతి శర్మ చెప్పారు. ప్రొడక్టివిటీ కస్టమర్‌ సపోర్ట్‌లో 14–15 శాతం, కోడింగ్, టాస్క్‌ల రైటింగ్‌లాంటి కొన్ని విధుల్లో 40 శాతం మేర పెరిగినట్లు పేర్కొన్నారు. దీనితో ఇలాంటి పనుల కోసం పెద్ద ఎత్తున సిబ్బంది అవసరం ఉండటం లేదని, తక్కువ మంది ఉద్యోగులు సరిపోతున్నారని వివరించారు. లేఆఫ్‌లతో మిగిలే నిధులను సంస్థలు టెక్నాలజీపై ఇన్వెస్ట్‌ చేస్తున్నాయని చెప్పారు. స్వల్పకాలికంగా రాబడులపై అనిశ్చితి నెలకొన్నా దీర్ఘకాలికంగా ఉపయోగపడే సామర్థ్యాలను పెంచుకోవడం వైపు మళ్లే విధంగా వ్యవస్థాగతంగా వస్తున్న మార్పులను ఇది సూచిస్తోందన్నారు. బడా టెక్‌ కంపెనీలు సైతం బ్యాలెన్స్‌ షీట్స్‌ పటిష్టంగా ఉన్నప్పటికీ ఏఐపై బిలియన్ల కొద్దీ డాలర్లను ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, చాలా కంపెనీలు ఏఐని వినియోగించుకోవడంలో ఇంకా ప్రాథమిక స్థాయిలో ఉన్నాయని వివరించారు. నిపుణులకే డిమాండ్‌..ఏఐ వల్ల రొటీన్‌ ఉద్యోగాలకు ప్రాధాన్యత తగ్గుతోందని, విశిష్ట నైపుణ్యాలున్న వారికి డిమాండ్‌ పెరుగుతోందని శర్మ చెప్పారు. గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్స్‌ (జీసీసీ)లో ఏఐ, డేటా, సైబర్‌ సెక్యూరిటీ నియామకాలు వార్షికంగా 18–27 శాతం పెరుగుతుండగా, ఐటీ సరీ్వసుల విభాగంలో 4–6 శాతం వృద్ధి ఉంటోందని తెలిపారు. అదే సమయంలో నిపుణుల కొరత 25–60 శాతం మేర ఉంటోందన్నారు. దీని వల్ల వేతన వృద్ధి 10–12 శాతం ఉంటోందని శర్మ వివరించారు. సీనియర్‌ హోదాలకు రూ. 60 లక్షల వరకు ప్రీమియం స్థాయిలో వేతనాలు ఉంటున్నాయన్నారు. అత్యధిక నైపుణ్యాలు, ఏఐ ఆధారిత ఉద్యోగాల వైపు పరిశ్రమ మళ్లుతుండటాన్ని ఇది సూచిస్తోందని శర్మ తెలిపారు.ఏఐ వల్ల ఉద్యోగ విధుల స్వరూపం మారుతోందని, ఇందుకోసం కంపెనీలు తమ ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో శిక్షణనివ్వడంపై మరింతగా దృష్టి పెట్టడం కీలకమని ఆమె చెప్పారు. అధికారికంగా శిక్షణ పొందుతున్న ఉద్యోగుల సంఖ్య పాతిక శాతం లోపే ఉంటోందన్నారు. కాబట్టి ఉద్యోగులకు ఎప్పటికప్పుడు శిక్షణనివ్వడం, అంతర్గతంగా వేరే వేరే విభాగాల్లోకి మారే వెసులుబాట్లు కల్పించడంపై కంపెనీలు ఇన్వెస్ట్‌ చేయాలని, విధాన నిర్ణేతలు కూడా భారీ స్థాయి శిక్షణ కార్యక్రమాలకు ప్రోత్సాహకాలిచ్చేలా చర్యలు తీసుకోవాలని శర్మ చెప్పారు. ఇక ఉద్యోగులు కూడా కొత్త నైపుణ్యాలను సంతరించుకోవడానికి ప్రాధాన్యమిచ్చే ఆలోచనా ధోరణితో ముందుకెళ్లాలని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఇరాన్‌తో భారత్ సహా పలు దేశాల ఒప్పందాలు

Indian IT services are facing a subdued fourth quarter for fiscal 20262
క్యూ4లో ఐటీ డీలా!

ముంబై: భారతీయ ఐటీ సేవల రంగం 2025–26 ఆర్థిక సంవత్సరాన్ని నిస్తేజంగా ముగించే అవకాశముందని బ్రోకరేజ్‌ సంస్థల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా నాలుగో త్రైమాసికంలో (క్యూ4) త్రైమాసికవారీ(సీక్వెన్షియల్‌) వృద్ధి మందగించవచ్చని భావిస్తున్నారు. అయితే రూపాయి బలహీనత అనుకూలతకావడంతో వార్షిక ప్రాతిపదికన కొంత మెరుగుదల కనిపించవచ్చని పేర్కొంటున్నారు. డిమాండ్‌ స్థిరంగా ఉన్నప్పటికీ, భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు, జనరేటివ్‌ ఏఐ వల్ల ధరలు నిర్ణయించే విధానంలో మార్పులు, ఒప్పందాలు కుదుర్చుకోవడంపై అనిశ్చితి పెరుగుతోందని వివరించారు. మార్చి త్రైమాసిక ఫలితాల కంటే, ఆర్థిక సంవత్సరం 2026–27 అంచనాలు(గైడెన్స్‌)పైనే మార్కెట్‌ దృష్టి కేంద్రీకృతమైనట్లు తెలియజేశారు. ప్రధానంగా వృద్ధి అవకాశాలపై స్పష్టత, ఆదాయంపై ఏఐ ప్రభావాలు, మార్జిన్ల నిలకడకు ప్రాధాన్యమున్నట్లు అభిప్రాయపడ్డారు.వృద్ధి మందగమనం, ఏడాది చివర్లో రికవరీత్రైమాసిక ప్రాతిపదికన (సీక్వెన్షియల్‌గా) చూస్తే, ఎఫ్‌వై 26 నాలుగో త్రైమాసికం (క్యూ4) పనితీరు నిరుత్సాహకరంగానే ఉండవచ్చని బ్రోకరేజ్‌ సంస్థలు భావిస్తున్నాయి. టైర్‌–1 ఐటీ కంపెనీల వృద్ధి అంతంత మాత్రంగానే ఉండే అవకాశం ఉంది. ‘‘స్థిర మారకపు విలువల ఆధారంగా టైర్‌–1 కంపెనీల వృద్ధి –1.1 శాతం నుంచి 0.9 శాతం మధ్య ఉండవచ్చు. మధ్యస్థాయి (మిడ్‌–టైర్‌) కంపెనీల వృద్ధి –1.8 శాతం నుంచి 3.4 శాతం వరకు ఉండొచ్చు’’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కూడా క్యూ4ను ‘సాధారణ త్రైమాసికం’గానే అభివర్ణించింది. పెద్ద కంపెనీల (లార్జ్‌ క్యాప్‌) వృద్ధి –1.0 శాతం నుంచి 1.5 శాతం మధ్య ఉండవచ్చని, మిడ్‌–క్యాప్‌ కంపెనీలు మాత్రం మెరుగైన ప్రదర్శన కొనసాగిస్తాయని పేర్కొంది. మూడో త్రైమాసికం (క్యూ3)తో పోలిస్తే, నాలుగో త్రైమాసికంలో (క్యూ4) సెలవులు లేదా తాత్కాలిక విరామాలు లేకపోవడం కొంత మద్దతు ఇచి్చంది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ), రిటైల్‌ రంగాలకు ఇది ఉపయోగపడింది. అయితే తక్కువ పని దినాలు, ఐచ్చిక ఖర్చులపై (డి్రస్కిషనరీ స్పెండింగ్‌) కొనసాగుతున్న అప్రమత్తత వైఖరి కారణంగా ఈ ప్రభావం కొంత మేర తగ్గింది. ఇక నాలుగో త్రైమాసికంలో వృద్ధి ప్రధానంగా డీల్‌ల విస్తరణ, విలీనాలు/కొనుగోళ్లు వల్లనేనని, డిమాండ్‌ పెరుగుదల వల్ల కాదని బ్రోకరేజ్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు.మార్జిన్లకు కరెన్సీ ఆసరాదేశీయ ఐటీ కంపెనీలకు నాలుగో త్రైమాసికంలో (క్యూ4) మార్జిన్లు స్థిరంగా ఉండే అవకాశముందని బ్రోకరేజీలు అంచనా వేస్తున్నాయి. రూపాయి బలహీనత కారణంగా కొద్దిపాటి మెరుగుదల కనిపించవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్, కోటక్‌ బ్రోకరేజ్‌ సంస్థలు అంచనా వేస్తున్నాయి. కరెన్సీ ప్రభావంతో 35 నుంచి 320 బేసిస్‌ పాయింట్ల వరకు మార్జిన్‌ విస్తరణ సాధ్యమని భావిస్తున్నాయి. అయితే ఇది స్థిరమైన వృద్ధి కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేతనాల పెంపు, కొత్త డీల్‌ల ప్రారంభ ఖర్చులు, ఉత్పాదకత ఆధారిత ధరల విధానం మార్జిన్లపై ఒత్తిడిని కొనసాగిస్తున్నాయి. మొత్తం మీద, స్వలకాలంలో రూపాయి బలహీనత మార్జిన్లకు కొంత ఊరటనిచి్చనా, దీర్ఘకాలంలో స్థిరమైన వృద్ధికి నిర్మాణాత్మక మార్పులు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.విలీనాలు–కొనుగోళ్లు, నియామకాల ప్రభావంప్రధాన ఐటీ కంపెనీలు ఆర్థిక సంవత్సరంలో భారీగా విలీనాలు, కొనుగోళ్లు (ఎం–ఏ) చేపట్టాయి. టీసీఎస్‌ కూడా దశాబ్దం తర్వాత ఈ దిశగా అడుగుపెట్టింది. కృత్రిమ మేధ, డేటా, సెమీకండక్టర్ల వంటి అనుబంధ సామర్థ్యాల కోసం ఈ కొనుగోళ్లు జరిగాయి. అయితే జనరేటివ్‌ ఏఐ ప్రభావంతో ఈ సామర్థ్యాలపై కూడా డిఫ్లేషన్‌ ఒత్తిడి ఉండొచ్చని కోటక్‌ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ విలీనాలు, కొనుగోళ్లు ఆదాయ వృద్ధిపై ఎలా ప్రభావం చూపుతాయన్నది కీలకం. ఇదే సమయంలో కంపెనీల్లో నియామకాలు మందగించే అవకాశముందని బ్రోకరేజీలు అంచనా వేస్తున్నాయి. టీసీఎస్, హెచ్‌సీఎల్‌టెక్, టెక్‌ మహీంద్రా సంస్థలు ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెట్టాయి. తాజా నియామకాలకు ప్రాధాన్యం పెరుగుతుండగా, మధ్యస్థాయి ఉద్యోగాల నియామకాలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.ఏఐ ప్రభావంతో వాల్యుయేషన్లకు కొత్త సవాలుకృత్రిమ మేధ కారణంగా ఏర్పడే ‘ధరల తగ్గుదల’ (డిఫ్లేషన్‌) అనేది మధ్యకాల ఆందోళన నుంచి ఇప్పుడు ఐటీ రంగం వాల్యుయేషన్లు, భవిష్యత్‌ అంచనాలను ప్రభావితం చేసే ప్రధాన అంశంగా మారింది. ‘‘ఈ డిఫ్లేషన్‌ భయాలతో ఐటీ షేర్లలో గణనీయమైన పతనం చోటుచేసుకుంది. ఐటీ సేవల ఫీజు ఇప్పుడు ‘ఏజెంట్‌–ఆగ్మెంటెడ్‌’ (ఏఐ సహాయంతో నిర్ణయించబడే విధంగా) మారుతుండగా, ఒప్పందాల పునరుద్ధరణలు తగ్గింపు ధరలతో జరుగుతున్నాయి’’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తెలిపింది. ‘‘ఏఐ ప్రభావం తక్షణ ఫలితాలకంటే భవిష్యత్‌ మార్పులపైనే ఆధారపడి ఉంటుంది. ఇక పెట్టుబడిదారుల ప్రధాన ప్రశ్న ఏఐ ప్రభావం ఉంటుందా కాదా అనేది కాదు; కంపెనీలు కొత్త ఏఐ ఒప్పందాల ద్వారా ఈ డిఫ్లేషన్‌ ప్రభావాన్ని ఎంత త్వరగా తగ్గించగలవన్నదే కీలకం’’ అని మోతీలాల్‌ ఓస్వాల్‌ తెలిపింది.యుద్ధం ఎఫెక్ట్‌...ఆర్థిక సంవత్సరం 2026 తొలి మూడు త్రైమాసికాల్లో టీసీఎస్, హెచ్‌సీఎల్‌టెక్‌ వంటి దిగ్గజాలు బలమైన ఆర్డర్‌బుక్స్‌తో ఆర్థిక సంవత్సరం 2027 వృద్ధిపై ఆశావహంగా ఉన్నా.., పల్చిమాసియా యుద్ధం తీవ్రతరమవడంతో పరిస్థితి మారింది. భారత ఐటీ కంపెనీలకు కీలకమైన క్లయింట్‌ సెగ్మెంట్లపై యుద్ధ ప్రభావం పడే అవకాశముంది.యుద్ధ పరిస్థితుల కారణంగా నిర్ణయాలలో జాప్యం, ఏఐ డిఫ్లేషన్‌ ప్రభావంపై మేనేజ్‌మెంట్‌ వ్యాఖ్యలు ముఖ్యమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తెలిపింది. అయితే భౌగోళిక ఉద్రిక్తతలు పూర్తిస్థాయి ఖర్చు తగ్గింపునకు దారి తీసే అవకాశాలు తక్కువేనని కోటక్‌ అభిప్రాయపడింది. మొత్తంగా ఆర్థిక సంవత్సరం 2027 డిమాండ్‌పై స్పష్టత ఇంకా అనిల్చితంగానే ఉంది.

West Asia crisis has evolved into systemic tremor3
పెట్టుబడులకు బూస్ట్‌.. వడ్డీరేట్ల కట్‌!

న్యూఢిల్లీ: ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులు నెలకొన్నప్పటికీ అటు పెట్టుబడులకు ఊతమిస్తూనే ఇటు పశ్చిమాసియా సంక్షోభంతో దెబ్బతిన్న రంగాలను ఆదుకునేలా వడ్డీ రేట్లను కూడా తగ్గించగలిగే సామర్థ్యాలు భారత్‌కి ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. దశాబ్దకాలంగా పాటిస్తున్న ఆర్థిక క్రమశిక్షణ ప్రతిఫలం ఇదని ఆమె పేర్కొన్నారు. కఠినతరమైన పరిస్థితులను అధిగమించాలంటే మేలైన ఆర్థిక విధానాలు పాటించడం అవసరమని ఆమె పేర్కొన్నారు. భారీ రుణ భారాలు, ద్రవ్య లోటుతో సతమతమవుతున్న కొన్ని దేశాల్లో భారత్‌లో ఉన్నటువంటి వెసులుబాటు లేదని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీ (ఎన్‌ఐపీఎఫ్‌పీ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె చెప్పారు. ముందుంది గడ్డుకాలం... పశ్చిమాసియాలో ఉద్రిక్తతలనేవి ప్రాంతీయ భద్రతా సవాళ్ల స్థాయి నుంచి వ్యవస్థాగతంగా ప్రకంపనలు సృష్టించే స్థాయికి విస్తరించాయని, అంతర్జాతీయంగా ఇంధన సరఫరాకు కీలకమైన మార్గాలకు పెను ముప్పుగా మారాయని మంత్రి చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత కఠినతరంగా ఉండబోతోందని తెలిపారు. గతేడాది వాణిజ్యపరమైన ఉద్రిక్తతలతో గ్లోబల్‌ సరఫరా వ్యవస్థల్లో అనిశ్చితి నెలకొని, గ్లోబల్‌ వృద్ధి అంచనాలను దిగువముఖంగా తిరగరాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. అయినప్పటికీ భారత్‌ పరిస్థితి మెరుగ్గానే ఉందన్నారు. జీడీపీలో ప్రభుత్వ రుణభారం సుమారు 81 శాతమేనని, జర్మనీ మినహాఅతి పెద్ద ఎకానమీల్లో ఇదే తక్కువ స్థాయని నిర్మలా సీతారామన్‌ చెప్పారు.

Wipro to acquire Olam Group IT and digital services4
విప్రో రూ. 9,300 కోట్ల డీల్‌

న్యూఢిల్లీ/సింగపూర్‌: ఐటీ సర్వీసుల దేశీ దిగ్గజం విప్రో తాజాగా ఫుడ్, అగ్రి బిజినెస్‌ల సింగపూర్‌ దిగ్గజం ఓలమ్‌ గ్రూప్‌తో భారీ డీల్‌ కుదుర్చుకుంది. 8 ఏళ్లపాటు అమల్లో ఉండే ఈ ట్రాన్స్‌ఫార్మేషన్‌ కాంట్రాక్టు విలువ బిలియన్‌ డాలర్లు(సుమారు రూ. 9,300 కోట్లు)కాగా.. దీనిలో భాగంగా ఓలమ్‌ గ్రూప్‌నకు చెందిన ఐటీ, డిజిటల్‌ సర్వీసుల విభాగం మైండ్‌స్ప్రింట్‌ పీటీఈను కొనుగోలు చేయనుంది. ఇందుకు 37.5 కోట్ల డాలర్లు(రూ. 3,494 కోట్లు) వెచ్చించనున్నట్లు విప్రో వెల్లడించింది. పీఈ దిగ్గజం టెమాసెక్‌ మెజారిటీ వాటా కలిగిన ఓలమ్‌ గ్రూప్‌ 50 బిలియన్‌ డాలర్లకుపైగా ఆదాయంతోపాటు 40,000 మంది సిబ్బందిని కలిగి ఉన్నట్లు్ల పేర్కొంది. సింగపూర్‌ కేంద్రంగా 2007లో ఏర్పాటైన మైండ్‌స్ప్రింట్‌కు భారత్‌సహా.. సింగపూర్, యూఎస్, యూకే, పశ్చిమాసియాలో 3,200 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. 2025 కేలండర్‌ ఏడాదిలో 13.56 కోట్ల డాలర్ల కన్సాలిడేటెడ్‌ ఆదాయం అందుకుంది. ఓలమ్‌ గ్రూప్‌తో కుదుర్చుకున్న వ్యూహాత్మక డీల్‌లో భాగంగా ఎండ్‌ టు ఎండ్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ సర్వీసులను అందించనున్నట్లు విప్రో తెలియజేసింది. ఏఐ ఆధారిత కన్సల్టింగ్‌ సేవలు సమకూర్చనున్నట్లు పేర్కొంది. పూర్తి నగదురూపేణా 2026 జూన్‌ 30కల్లా మైండ్‌స్ప్రింట్‌లో 100 శాతం వాటా కొనుగోలు చేసే వీలున్నట్లు వెల్లడించింది. ఐపీ ఆధారిత సొల్యూషన్లలో మైండ్‌స్ప్రింట్‌కున్న డొమైన్‌ నైపుణ్యాలకు ఏఐతోకూడిన విప్రో కన్సల్టింగ్‌ ఆధారిత సామర్థ్యాలు జత కలవనున్నట్లు విప్రో సీఈవో, ఎండీ శ్రీని పాలియా పేర్కొన్నారు. ఒప్పందం ప్రకారం విప్రోకు పూర్తి అనుబంధ కంపెనీగా మైండ్‌స్ప్రింట్‌ అవతరించనుంది. అయితే సంస్థ ప్రస్తుత సీఈవో సురేష్‌ సుందరరాజన్‌ బాధ్యతలను కొనసాగించనున్నారు. బీఎస్‌ఈలో విప్రో షేరు 1.25% బలపడి రూ. 197 వద్ద ముగిసింది.

India Healthcare, pharma sector to create 2-2. 5 million new jobs by 20305
హెల్త్‌కేర్, ఫార్మాలో.. ఉద్యోగ‘మస్తు’!

ముంబై: ఆరోగ్య సంరక్షణ (హెల్త్‌కేర్‌), ఫార్మాస్యూటికల్స్‌ రంగాల్లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు రానున్నాయి. డిమాండ్‌ పెరుగుతున్న క్రమంలో 2030 నాటికి కొత్తగా 20–25 లక్షల ఉద్యోగాలు రానున్నట్టు అడెకో ఇండియా నివేదిక అంచనా వేసింది. 30–35% సిబ్బందికి కొత్త నైపుణ్యాలపై శిక్షణ అవసరం పడుతుందని తెలిపింది. హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్‌ రంగాలు సామర్థ్య ఆధారిత వృద్ధి దశలోకి అడుగుపెట్టాయని పేర్కొంది. ఆస్పత్రులు, ఆయుష్, హోమ్‌కేర్, వృద్ధుల సంరక్షణ, ఫార్మా, లైఫ్‌ సైన్సెస్, డయాగ్నొస్టిక్స్, టెలి మెడిసిన్, క్లినికల్‌ పరిశోధన, ప్రజారోగ్యం వంటి విభాగాల్లో ప్రత్యేక నైపుణ్యాలు, టెక్నాలజీ వినియోగం పెరుగుతున్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. దేశ ఆర్థిక వ్యవస్థలో విస్తరిస్తున్న ఈ రంగం వాటాకు అనుగుణంగా ఈ వృద్ధి ముడిపడి ఉన్నట్టు తెలిపింది. 2022 నాటికి జీడీపీలో హెల్త్‌కేర్, ఫార్మాస్యూటికల్స్‌ వాటా 3.3%గా ఉంటే.. 2030 నాటికి 5 శాతానికి విస్తరించనున్నట్టు అడెకో నివేదిక అంచనా వేసింది. ముఖ్యంగా క్లినికల్‌ పరిశోధనలు, డిజిటల్‌ హెల్త్‌కు పెరుగుతున్న ప్రాధాన్యత, ఔషధాల అభివృద్ధి, తయారీ కార్యకలాపాల అవుట్‌సోర్స్‌కు అంతర్జాతీయంగా ప్రాముఖ్యం పెరు గుతుండడం వృద్ధికి మద్దతునిచ్చే అంశాలుగా పేర్కొంది. ఇక్కడ డిమాండ్‌ ఎక్కువ.. డయాగ్నొస్టిక్స్, వ్యాధి నిరోధక ముందస్తు చెకప్‌లు, టెలిమెడిసిన్‌ విభాగాల్లో 20–25% మేర ఉపాధి అవకాశాలు పెరగనున్నట్టు ఈ నివేదిక అంచనా వేసింది. ముఖ్యంగా టైర్‌–2, 3 పట్టణాల నుంచి ఎక్కువగా ఉంటాయని పేర్కొంది. అలాగే, కాంప్లెక్స్‌ జనరిక్స్, బయోలాజిక్స్, స్పెషాలిటీ చికిత్సలకు ప్రాధాన్యం పెరుగుతుండడంతో.. అత్యాధునిక పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ), నియంత్రణ పరమైన విభాగాల్లోనూ ఉద్యోగాలకు 25–30% మేర డిమాండ్‌ పెరుగుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం ఈ రంగంలో ఎక్కువగా ఉద్యోగాలు బెంగళూరు, హైదరాబాద్, ముంబై, చెన్నై, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లోనే ఉన్నప్పటికీ.. పుణే, అహ్మదాబాద్, కోయంబత్తూరు వంటి టైర్‌–2, 3 నగరాల్లో కూడా అవకాశాలు పెరుగుతున్నట్టు తెలిపింది. ఈ నగరాల్లో ఆస్పత్రుల నెట్‌వర్క్‌ విస్తరణను ప్రస్తావించింది. విదేశాల్లో భారతీయ ఆరోగ్య రంగ నిపుణులకు డిమాండ్‌ 25–30% పెరగనుందని, ముఖ్యంగా మధ్యప్రాచ్యం, దక్షిణాసియా, యూకే వంటి ప్రాంతాల్లో అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వెల్లడించింది.

Laid Off but Not Worried Oracle Techie Finds Stability Driving Uber6
'ఒరాకిల్‌'లో ఉద్యోగం పోయినా లైఫ్ సెట్: ఈ ప్లానింగ్ మీకుందా?

ఓ సంస్థలో ఉద్యోగం కోల్పోయిన తరువాత.. చాలామంది ఉద్యోగులు భయపడతారు, బాధపడతారు. కానీ ఒరాకిల్ కంపెనీ తొలగించిన ఒక ఉద్యోగి మాత్రం ఇందుకు భిన్నం. ఉబెర్ డ్రైవర్‌గా పనిచేసుకుంటూ కుటుంబంతో సంతోషంగా ఉన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నా సన్నిహితులలో ఒకరిని ఒరాకిల్ బెంగళూరు సంస్థ.. ఉద్యోగం నుంచి తొలగించింది. అతడు ఎలాంటి ఆందోళన, ఒత్తిడికి లోను కాకపోవడమే కాకుండా.. సోషల్ మీడియాలో కూడా ఆ విషయాలను వెల్లడించలేదు. జాబ్ కోల్పోయిన తరువాత వెంటనే తన సొంత ఊరైన భువనేశ్వర్‌కు తిరిగి వచ్చేశాడు.అయితే.. అతనికి రెండు జాయింట్ అకౌంట్స్ ఉన్నాయి. వాటిలో.. ఒక్కొక్కదానిలో రూ.15 లక్షల చొప్పున పోస్టల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసుకున్నాడు. ఒకటి అతని తల్లిదండ్రుల పేరు మీద, మరొకటి అతని, అతని భార్య పేరు మీద ఉంది. అతని పిల్లల ఖాతాలో కూడా ఒకటి ఉంది. వీటన్నింటి ద్వారా అతనికి ప్రతి నెలా దాదాపు రూ.28,000 వడ్డీ వస్తుంది.పోస్టల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు కాకుండా.. అతనికి కొన్ని బ్యాంకులలో దాదాపు రూ.30 లక్షల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా ఉన్నాయి, వీటి ద్వారా అతనికి నెలకు మరో రూ.15,000 వస్తుంది. అతను ఇప్పుడు తన తల్లిదండ్రులతో కలిసి సొంత ఇంట్లో నివసిస్తున్నాడు. అతనికి డ్రైవింగ్ వచ్చు, కాబట్టి అతను వెంటనే తనకు వీలైనప్పుడు ఉబెర్ డ్రైవర్‌గా పనిచేస్తూ మంచి సంపాదన పొందుతున్నాడు.ఇదీ చదవండి: ఆ రైల్వే స్టేషన్‌కు వెళ్లాలంటే.. పాస్‌పోర్ట్, వీసా ఉండాల్సిందే!అతనికి ఈఎంఐలు లేవు, ఏ మెట్రో నగర ఫ్లాట్‌కు లోన్స్ లేవు. అదే సమయంలో, అతను తన తల్లిదండ్రుల సహాయంతో ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రశాంతంగా ప్రణాళిక వేస్తున్నాడు. ఆయన ఎప్పుడూ ఇన్‌ఫ్లుయెన్సర్లను అనుసరించలేదు, SIPలు చేయలేదు, ఆర్థిక హడావుడికలకు దూరంగా ఉన్నారు. పూర్తిగా పాత పద్ధతుల మనస్తత్వం, స్థిరమైన ప్రక్రియ, క్రమశిక్షణ.కాబట్టి.. ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ ముందుగానే ప్రణాళిక వేసుకోవాలి. జాబ్ ఉన్నా.. లేకున్నా మీ ఆర్ధిక క్రమ శిక్షణ మిమ్మల్ని కాపాడుతుంది. పరిస్థితులు ఎలా ఉన్నా, ఎల్లప్పుడూ చిరునవ్వుతో సిద్ధంగా ఉండటమే నేను నేర్చుకున్న అతిపెద్ద పాఠం అని నాయక్ సత్య అనే ట్విటర్ యూజర్ ఈ విషయాలు షేర్ చేశారు.One of my close friends was fired from Oracle Bangalore.No panic, no stress, and no crying on social media. He straight away came back to his hometown Bhubaneswar He had postal fixed deposits in two joint accounts ₹15 lakh each. One with his parents, and the other in his…— Nayak Satya (@NayakSatya_SG) April 5, 2026

Advertisement
Advertisement
Advertisement