Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

IDFC First Bank Reports Steady Growth in Q4 no impact of 590 crore fraud1
ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌కు తగ్గని లాభాలు

గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ రూ. 319 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఇది క్రితం క్యూ4లో నమోదైన రూ. 304 కోట్లతో పోలిస్తే సుమారు 5 శాతం అధికం. సమీక్షాకాలంలో బ్యాంకు వడ్డీ ఆదాయం రూ. 9,413 కోట్ల నుంచి 12 శాతం వృద్ధి చెంది రూ. 10,553 కోట్లకు చేరింది.నికర వడ్డీ ఆదాయం (చెల్లించినది పోగా) రూ. 4,907 కోట్ల నుంచి రూ. 5,677 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్‌ (నిమ్‌) 2 బేసిస్‌ పాయింట్లు క్షీణించి 5.95 శాతం నుంచి 5.93 శాతానికి నెమ్మదించింది. వ్యాపారం 19 శాతం వృద్ధితో రూ. 5.75 లక్షల కోట్లకు ఎగిసింది. మొత్తం అసెట్స్‌లో మొండి పద్దులకు ప్రొవిజనింగ్‌ క్యూ1లో నమోదైన 1.92 శాతం నుంచి క్యూ4లో 1.52 శాతానికి తగ్గింది.మైక్రో ఫైనాన్స్‌ విభాగం మినహా అసెట్‌ క్వాలిటీ స్థిరంగా ఉందని బ్యాంకు ఎండీ వి. వైద్యనాథన్‌ తెలిపారు. పరిశ్రమవ్యాప్తంగా సూక్ష్మ రుణాల విభాగంలో సవాళ్లు ఎదురైనట్లు వివరించారు. ప్రస్తుతం స్థూల మొండిబాకీలు, నికర మొండిబాకీలు వరుసగా 1.61 శాతం, 0.48 శాతానికి దిగి వచ్చినట్లు చెప్పారు.ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌లో గత ఫిబ్రవరిలో బయటపడిన రూ.590 కోట్ల ఫ్రాడ్‌ ఉదంతం మార్చి త్రైమాసిక ఫలితాలపై (Q4FY26) ఎటువంటి ప్రభావం చూపలేదని బ్యాంకు ఎండీ వి. వైద్యనాథన్‌ తెలిపారు. ఇతర బ్యాంకులలో ఇలాంటి సంక్షోభాలు సద్దుమణగాలంటే దాదాపు సంవత్సరం పడుతుందని, కానీ ఇక్కడ అలా జరగలేదని పేర్కొన్నారు.

HDFC Bank Former Chief Aditya Puri Family Sells Mumbai Luxury Flat for 27 Crore2
ఆస్తి అమ్మేసిన HDFC బ్యాంక్ మాజీ చీఫ్‌ ఫ్యామిలీ

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మాజీ ఎండీ ఆదిత్య పూరి కుటుంబ సభ్యులు ముంబైలోని తమ లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను భారీ ధరకు విక్రయించారు. ఆదిత్య పూరి భార్య అనితా పూరి, కుమార్తె అమృతా పూరి కలిసి వర్లీ ప్రాంతంలోని తమ నివాసాన్ని రూ. 27 కోట్లకు అమ్మేసినట్లు రిజిస్ట్రేషన్ పత్రాల ద్వారా వెల్లడైంది. ముంబై రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖ బ్యాంకర్ ఆదిత్య పూరి కుటుంబం చేసిన భారీ ఆస్తి విక్రయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.లాభదాయకమైన విక్రయంఈ అపార్ట్‌మెంట్‌ను అనితా పూరి కుటుంబం మార్చి 2017లో రూ. 19.81 కోట్లకు కొనుగోలు చేసింది. తాజాగా జరిగిన విక్రయం ద్వారా వారికి దాదాపు రూ. 7 కోట్లకు పైగా లాభం చేకూరింది. ముంబైలోని అత్యంత విలాసవంతమైన 'ఓంకార్ 1973' భవనంలోని ఎత్తైన అంతస్తులో ఈ ఫ్లాట్ ఉంది. దీనిని సురేమ్య నెవాటియా, అక్షడా నెవాటియాలు కొనుగోలు చేశారు.మార్చి 24, 2026న ఈ లావాదేవీ అధికారికంగా నమోదైంది. ఈ డీల్ కోసం కొనుగోలుదారులు రూ. 1.62 కోట్ల స్టాంప్ డ్యూటీని, రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించారు. ఈ అపార్ట్‌మెంట్‌తో పాటు నాలుగు కార్ పార్కింగ్ స్థలాలు కూడా కొనుగోలుదారులు పొందారు.అయితే, ఈ విక్రయంపై పూరి కుటుంబం గానీ, కొనుగోలుదారులు గానీ ఇంతవరకు స్పందించలేదు.ఓంకార్ 1973 ప్రత్యేకతముంబైలోని వర్లీలో ఉన్న 'ఓంకార్ 1973' ఒక ఐకానిక్ ఆకాశహర్మ్యం. ఓంకార్ రియల్టర్స్ అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్ట్, అరేబియా సముద్రం వ్యూ, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో అల్ట్రా-ప్రీమియం జీవనశైలిని అందిస్తుంది. నగరంలోని అత్యంత ఖరీదైన చిరునామాలలో ఇది ఒకటి.అనితా పూరి, అమృతా పూరి గతంలో కూడా రియల్ ఎస్టేట్ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టారు. నవంబర్ 2020లో వారు ముంబైలోని మలబార్ హిల్స్‌లో రూ. 50 కోట్ల విలువైన మరో లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. లోధా సీమాంట్ ప్రాజెక్టులోని 19వ అంతస్తులో ఉన్న ఆ ఫ్లాట్‌కు ఏడు కార్ పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. అప్పట్లో ఆ లావాదేవీకి రూ. 1 కోటి స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు వార్తాలు వచ్చాయి.ఇదీ చదవండి: బెంగళూరులో ఇంటి ఓనర్స్‌ అయిపోయాం..

India’s Forex Reserves Climb Second Consecutive Weekly Rise3
మళ్లీ పెరిగిన బంగారం, ఫారెక్స్‌ నిల్వలు

ముంబై: భారత విదేశీ మారక (ఫారెక్స్‌) నిల్వలు రెండో వారమూ పెరిగాయి. ఏప్రిల్‌ 17తో ముగిసిన వారంలో 2.362 బిలియన్‌ డాలర్లు పెరిగి 703.308 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అంతకుముందు(ఏప్రిల్‌ 10) వారంలో ఇవి 3.825 బిలియన్‌ డాలర్లు పెరిగి 700.946 బిలియన్‌ డాలర్లుగా నమోదైన సంగతి తెలిసిందే.ఫిబ్రవరి 27తో ముగిసిన వారంలో ఫారెక్స్‌ నిల్వలు చరిత్రాత్మక గరిష్టం 728.494 డాలర్లుగా నమోదయ్యాయి. పశ్చిమాసియా యుద్ధం మొదలైన తర్వాత కొన్ని వారాలు పాటు తగ్గుతూ వచ్చాయి. రూపాయి మారకపు విలువపై తీవ్ర ఒత్తిడి ఏర్పడటంతో, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జోక్యం చేసుకుని డాలర్లు విక్రయించడమే కాక.. కొన్ని విధానపరమైన జాగ్రత్తలనూ తీసుకుంటోంది. ఏప్రిల్‌ 17తో ముగిసిన వారంలో విదేశీ మారకపు నిల్వల్లో కీలకమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 1.481 బిలియన్‌ డాలర్లు పెరిగి, 557.463 బిలియన్‌ డాలర్లకు చేరాయి. పసిడి నిల్వల విలువ 790 మిలియన్‌ డాలర్లు పెరిగి 122.133 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి.

RBL Bank Q4 Results Net Profit Jumps 3x to rs 230 Crore4
ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ లాభం మూడు రెట్లు జంప్‌

ముంబై: అస్తుల నాణ్యత మెరుగుదల, ప్రొవిజన్లకు పరిమిత కేటాయింపులు కారణంగా ఆర్‌బీఎల్‌ బ్యాంకు గత ఆర్థిక సంవత్సరం(2025–26) మార్చి త్రైమాసికంలో రూ.230 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకు ముందు ఏడాది(2024–25) ఇదే త్రైమాసికంలో నమోదు చేసిన రూ.69 కోట్లతో పోలిస్తే ఇది మూడు రెట్లకు పైగా పెరిగింది. వార్షిక ప్రాతిపదికన నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 7% పెరిగి రూ.1,563 కోట్ల నుంచి రూ.1,671 కోట్లకు ఎగసింది.అయితే నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) 4.89% నుంచి 4.41%కు తగ్గింది. త్రైమాసిక ప్రాతిపదికన కూడా 4.63% నుంచి క్షీణించింది. త్రైమాసికంలో ప్రొవిజన్లు 14% తగ్గి రూ.678 కోట్లకు పరిమితమవడంతో నిర్వహణ లాభం 11% పెరిగి రూ.955 కోట్లకు చేరింది. స్థూల నిరర్థక ఆస్తుల (జీఎన్‌పీఏ) నిష్పత్తి 2025 మార్చి చివరినాటి 2.60% నుంచి, 2026 మార్చి చివరికి జీఎన్‌పీఏ నిష్పత్తి 1.18 శాతానికి దిగివచ్చింది.ఆర్థిక ఫలితాల ప్రకటన సందర్భంగా ఎండీ, సీఈవో ఆర్‌ సుబ్రమణ్యకుమార్‌ మాట్లాడుతూ, ఆస్తుల నాణ్యత పరంగా బ్యాంకు లోన్‌బుక్‌లో నిరంతర మెరుగుదల కొనసాగుతోంది అన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటే, వచ్చే ఆర్థిక సంవత్సరం (ఎఫ్‌వై 2027)లో కూడా వృద్ధి నిలకడగా ఉంటుందన్నారు.ఎమిరేట్స్‌ ఎన్‌బీడీ నుంచి వచ్చే మూలధన పెట్టుబడి మార్జిన్ల పెరుగుదలకు దోహదపడుతుందన్నారు. ఇక విస్తరణ కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఖర్చుల నియంత్రణపై కూడా బ్యాంకు దృష్టి సారించిందన్నారు. వ్యూహాత్మక పెట్టుబడులు, విస్తరణ ఖర్చులు మినహా ఇతర వ్యయాలు తగ్గే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

PlaySimple Games Files for Rs 3150 Crore IPO5
పబ్లిక్‌ ఇష్యూకు ప్లేసింపుల్‌ గేమ్స్‌

ముంబై: స్వీడన్‌కు చెందిన గేమింగ్‌ దిగ్గజం మోడర్న్‌ టైమ్స్‌ గ్రూప్‌ (ఎంటీజీ ఏబీ)కి చెందిన భారతీయ అనుబంధ సంస్థ ప్లేసింపుల్‌ గేమ్స్‌ ఐపీఓ ద్వారా రూ.3,150 కోట్ల నిధుల సమీకరణకు సిద్ధమైంది. ఇందుకోసం సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది. ‘ఈ పబ్లిక్‌ ఇష్యూ పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) రూపంలో ఉంటుంది. ఇందులో ప్రమోటర్, సెల్లింగ్‌ షేర్‌హోల్డర్‌గా ఎంటీజీ వ్యవహరిస్తుంది. అందువల్ల, ఈ ఇష్యూ ద్వారా వచ్చే నిధులు ప్లేసింపుల్‌కి కాకుండా ఎంటీజీకే వెళ్తాయి’ అని డ్రాఫ్ట్‌ పత్రాల్లో తెలిపింది. ఐపీఓ పూర్తైన తర్వాత కూడా ప్లేసింపుల్‌లో మెజారిటీ వాటాను కొనసాగించాలనే ఉద్దేశం ఉందని ఎంటీజీ వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ఆఫర్‌ పరిమాణం రూ. 3,150 కోట్లుగా ఉన్నప్పట్టకీ.. నియంత్రణ పరిమితుల్లో ఆఫర్‌ పరిమాణం మారవచ్చు. పబ్లిక్‌ ఇష్యూ తేదీని త్వరలో నిర్ణయిస్తామని కంపెనీ తెలిపింది.

Axis Bank Q4 net profit slips marginally to Rs 7071 crore6
యాక్సిస్‌ బ్యాంక్‌ లాభం రూ. 7,071 కోట్లు

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం యాక్సిస్‌ బ్యాంక్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 7,071 కోట్ల నికర లాభం (స్టాండెలోన్‌) ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో నమోదైన రూ. 7,118 కోట్లతో పోలిస్తే లాభం స్వల్పంగా 0.64 శాతం మేర తగ్గింది. సమీక్షాకాలంలో బ్యాంకు నికర వడ్డీ ఆదాయం సుమారు 5 శాతం పెరిగి రూ. 14,457 కోట్లకు చేరింది.ఒక్కో షేరుపై రూ. 1 చొప్పున డివిడెండు ఇవ్వాలని డైరెక్టర్ల బోర్డు సిఫార్సు చేసింది. స్థూల ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ పరిస్థితులు అనూహ్యంగా మారుతున్న నేపథ్యంలో నాలుగో త్రైమాసికంలో వన్‌ టైమ్‌ ప్రాతిపదికన అదనంగా రూ. 2,001 కోట్ల ప్రొవిజనింగ్‌ చేసినట్లు బ్యాంకు తెలిపింది. అనిశ్చితి పెరిగినప్పుడు రిస్క్‌ గవర్నెన్స్‌లో పారదర్శకత, క్రమశిక్షణ పాటిస్తూ బ్యాలెన్స్‌ షీట్‌ పటిష్టంగా ఉండేలా చూసుకోవడంలో భాగంగా ఈ విధానాన్ని పాటిస్తున్నట్లు వివరించింది.గత ఆర్థిక సంవత్సరంలో పటిష్టమైన పనితీరును కనపర్చినట్లు యాక్సిస్‌ బ్యాంక్‌ ఎండీ అమితాబ్‌ చౌదరి తెలిపారు. కొత్త ఆర్థిక సంవత్సరంలోకి మరింత ఆశావహంగా అడుగుపెడుతున్నామని, సంస్థను మరింత బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెడతామని చెప్పారు. అదే సమయంలో అంతర్జాతీయ స్థూల ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అనుబంధ సంస్థ యాక్సిస్‌ ఫైనాన్స్‌కి కేదారా క్యాపిటల్‌తో కలిసి రూ. 2,250 కోట్లు సమకూరుస్తున్నట్లు బ్యాంక్‌ తెలిపింది. ఆర్థిక ఫలితాల్లో మరిన్ని విశేషాలు.. ⇒ 4వ త్రైమాసికంలో మొండిపద్దుల్లాంటి వాటికి కేటాయింపులు రూ. 3,522 కోట్లుగా ఉన్నాయి. ⇒ మార్చి 31 నాటికి బ్యాలెన్స్‌ షీట్‌ 17 శాతం వృద్ధితో రూ. 18,86,850 కోట్లకు చేరింది. కాసా (కరెంట్‌ అకౌంట్, సేవింగ్స్‌ అకౌంట్‌) డిపాజిట్లు 11 శాతం, సేవింగ్స్‌ డిపాజిట్లు 11 శాతం, టర్మ్‌ డిపాజిట్లు 16 శాతం పెరిగాయి. ⇒ మొత్తం డిపాజిట్లలో కాసా డిపాజిట్ల వాటా క్యూ3లో 39 శాతంగా ఉండగా, క్యూ4లో స్వల్పంగా పెరిగి 40 శాతానికి చేరింది. ⇒ రుణాలు 19 శాతం పెరిగి రూ. 12,33,57 కోట్లకు చేరాయి. రూ. 6,73,468 కోట్లతో మొత్తం రుణాల్లో రిటైల్‌ రుణాల వాటా 55 శాతంగా ఉంది. ఇందులో గృహ రుణాలు 26 శాతంగా ఉన్నాయి. స్మాల్‌ బిజినెస్‌ బ్యాంకింగ్‌ 17 శాతం, ప్రాపరీ్టపై రుణాలు 16 శాతం, వ్యక్తిగత రుణాలు 6 శాతం మేర పెరిగాయి. కార్పొరేట్‌ రుణాలు 38 శాతం వృద్ధి చెందాయి. ⇒ స్థూల మొండిబాకీలు డిసెంబర్‌ త్రైమాసికం ఆఖర్లో 1.40%గా ఉండగా 1.23 శాతానికి, నికర మొండిబాకీలు 0.42% నుంచి 0.37 శాతానికి నెమ్మదించాయి. రైటాఫ్‌ చేసిన ఖాతాల నుంచి రూ. 1,197 కోట్లు రికవర్‌ అయ్యాయి. ⇒ నాలుగో త్రైమాసికంలో స్థూల స్లిపేజీలు రూ. 4,709 కోట్లుగా నమోదయ్యాయి. ఇవి క్యూ3లో రూ. 6,007 కోట్లుగా, అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ. 4,805 కోట్లుగా ఉన్నాయి. తాజా క్యూ4లో మొండిబాకీల రికవరీ, అప్‌గ్రేడింగ్‌ రూ. 2,696 కోట్లుగా ఉంది. ఈ వ్యవధిలో దాదాపు రూ. 3,096 కోట్ల ఎన్‌పీఏలను బ్యాంకు రైటాఫ్‌ చేసింది. ⇒ పూర్తి ఆర్థిక సంవత్సరంలో సిబ్బంది సంఖ్య 3,000 తగ్గి, 1.01 లక్షలకు చేరింది. డిజిటల్, టెక్నాలజీపై పెట్టుబడులతో ఉత్పాదకత పెరగడం ఇందుకు కారణం.

Advertisement
Advertisement
Advertisement