ప్రధాన వార్తలు
కార్మిక శక్తి సర్వే: నిరుద్యోగం రేటు ఇలా..
దేశీయంగా 15 ఏళ్లు పైబడిన వారిలో నిరుద్యోగం ఫిబ్రవరిలో స్వల్పంగా తగ్గింది. జనవరిలో నిరుద్యోగిత రేటు (యూఆర్) 5 శాతంగా ఉండగా, గత నెల 4.9 శాతానికి నెమ్మదించినట్లు కార్మిక శక్తి సర్వే (పీఎల్ఎఫ్ఎస్) నివేదికలో వెల్లడైంది. పట్టణ ప్రాంతాల్లో ఇది 6.6 శాతంగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి మార్పు లేకుండా 4.2 శాతంగా కొనసాగింది.గత నెలలో మహిళల్లో (15 సంవత్సరాలు పైబడిన వారు) యూఆర్ జనవరిలో 5.6 శాతంగాను ఉండగా, గత నెల 5.1 శాతానికి దిగివచి్చంది. పట్టణ ప్రాంతాల్లో 9.8 శాతం నుంచి 8.7 శాతానికి, గ్రామీణ ప్రాంతాల్లో 4.3 శాతం నుంచి 4 శాతానికి తగ్గింది. దేశవ్యాప్తంగా మొత్తం 3,74,879 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. ప్రజల్లో ఉద్యోగాలు, నిరుద్యోగాన్ని తెలుసుకునేందుకు ఉపయోగపడే పీఎల్ఎఫ్ఎస్ని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) నిర్వహిస్తుంది.
ప్రకృతి వ్యవసాయం.. అనివార్యం!
మానవ మనుగడకు ఆరోగ్యకరమైన ఆహారం చాలా ముఖ్యం. కానీ, ప్రస్తుత రోజుల్లో రసాయన ఎరువులపై మితిమీరి ఆధారపడటం, మారుతున్న వాతావరణ పరిస్థితులు, అస్థిరమైన గ్లోబల్ మార్కెట్లు మన ఆహార భద్రతను ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ వ్యవసాయ రంగం ప్రకృతి సాగువైపు అడుగులు వేయడం కేవలం పర్యావరణ హితం మాత్రమే కాదు.. దేశ ఆర్థిక, ఆరోగ్య భద్రతకు అత్యవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.ప్రస్తుత ఆధునిక వ్యవసాయం శిలాజ ఇంధనాలతో విడదీయలేని విధంగా ముడిపడి ఉంది. ఐపీఈఎస్-ఫుడ్ 2024-25 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా లభించే పెట్రోకెమికల్స్లో 40%, శిలాజ ఇంధనాల్లో 15 కేవలం ఆహార వ్యవస్థలకే వినియోగిస్తున్నారు. అంటే, అంతర్జాతీయ ఇంధన ధరల్లో వచ్చే స్వల్ప మార్పు కూడా సామాన్యుడి కంచంలోని ఆహార ధరను ప్రభావితం చేస్తోంది.రసాయన ఎరువుల సెగప్రపంచవ్యాప్త ప్రోటీన్ వినియోగంలో 40% కేవలం ‘హేబర్-బోష్’(గాలిలో ఉండే నైట్రోజన్ను మొక్కలకు ఉపయోగపడే అమ్మోనియాగా మార్చే పద్ధతి) ప్రక్రియ ద్వారా తయారయ్యే సింథటిక్ నైట్రోజన్ ఎరువులపైనే ఆధారపడి ఉంది. ప్రస్తుతం యూరియా ధర టన్నుకు 585 డాలర్ల వద్ద ఉండగా భవిష్యత్తులో ఇది 650-700 డాలర్లకు చేరే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. భారతదేశం తన అమ్మోనియా, సల్ఫర్ దిగుమతుల్లో 2/3 వంతు గల్ఫ్ దేశాల నుంచే పొందుతోంది. అక్కడ తలెత్తే రాజకీయ అనిశ్చితి మన పొలాల్లో ఎరువుల కొరతకు దారితీస్తోంది.శాస్త్రీయ వాస్తవాలుఐపీసీసీ(ఇంటర్గవర్న్మెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమెట్ చేంజ్) హెచ్చరికల ప్రకారం పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పంట కాలాలను కుదించేస్తున్నాయి. దేశంలో ఇది ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోంది. ఉష్ణోగ్రత పెరుగుదల వల్ల గోధుమల దిగుబడి తగ్గుతోంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వరిసాగులో గింజ గట్టిపడే ప్రక్రియ దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యాంత్రాంగం స్పందించి వరి, గోధుమలపైనే కాకుండా పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాల వైపు సాగును మళ్లించాల్సిన సమయం ఆసన్నమైంది.రసాయన సాగు వల్ల నేలతోపాటు మానవులు రోగాల బారిన పడుతున్నారు. డబ్ల్యూహెచ్ఓ నివేదికల ప్రకారం, ఆహారంలో రసాయన అవశేషాల వల్ల అంటువ్యాధులు కాని రోగాలు (ఎన్సీడీ) వేగంగా పెరుగుతున్నాయి. జీవవైవిధ్యం దెబ్బతినడం వల్ల పరాగ సంపర్కం చేసే కీటకాలు అంతరించిపోతున్నాయి. ఇది దిగుబడుల స్థిరత్వాన్ని దెబ్బతీస్తోంది.మార్పు కోసం వ్యూహంప్రకృతి సాగు వైపు మార్పు అనేది ఒక్కరోజులో జరిగే పనికాదు. ఇది క్రమబద్ధంగా శాస్త్రీయంగా జరగాలి. దీనికోసం ప్రభుత్వం అనుసరించాల్సిన కొన్ని సూత్రాలను నిపుణులు సూచిస్తున్నారు.రసాయన ఎరువుల స్థానంలో జీవ ఎరువులను ప్రోత్సహించాలి.నేల ఆరోగ్యం, సూక్ష్మజీవుల పాత్ర, చెట్లు-పశువులు-పంటల కలయికపై వ్యవసాయ పరిశోధనా సంస్థలు దృష్టి సారించాలి.ఎరువుల కోసమే కాకుండా నేల ఆరోగ్యాన్ని కాపాడే రైతులకు, జీవవైవిధ్యాన్ని పెంపొందించే వారికి ప్రోత్సాహకాలు అందించాలి.ప్రకృతి సాయంతో తయారైన ఉత్పత్తులకు ప్రత్యేక సరఫరా గొలుసును నిర్మించి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలి.యుద్ధాలను, అంతర్జాతీయ ఇంధన మార్కెట్లను వెంటనే నియంత్రించలేకపోవచ్చు. కానీ, మన ఆహారాన్ని ఎలా పండించుకోవాలో మనం నిర్ణయించుకోగలం. పెట్టుబడి తగ్గించి, ప్రకృతితో మమేకమయ్యే సాగు ద్వారానే మన భూమిని, భావితరాల ఆరోగ్యాన్ని కాపాడుకోగలమని గుర్తుంచుకోవాలి.
2026 రెనాల్ట్ డస్టర్ లాంచ్: ధర ఎంతంటే?
2026 గణతంత్ర దినోత్సవం రోజు గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయిన రెనాల్ట్ డస్టర్ కారు.. ఎట్టకేలకు దేశీయ విఫణిలో అడుగుపెట్టింది. ఐదు వేరియంట్లు, మూడు ఇంజిన్ ఎంపికలతో లభించే ఈ కారు.. ఆరు రంగుల్లో లభిస్తుంది. దీని ధరలు రూ. 10.49 లక్షలు (ఎక్స్ షోరూమ్).రెనాల్ట్ కంపెనీ 2026 డస్టర్ కోసం ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కాబట్టి డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఇది హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి విక్టోరిస్, కియా సెల్టోస్ వంటి ప్రముఖ మోడళ్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.ఇంజిన్ ఆప్షన్స్ విషయానికి వస్తే.. 2026 రెనాల్ట్ డస్టర్ టాప్ వేరియంట్లో 1.8-లీటర్ ఫోర్-సిలిండర్ డైరెక్ట్ ఇంజెక్షన్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. దీనిని రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో జతచేసి E-టెక్ 160 హైబ్రిడ్ సెటప్తో రూపొందించారు. ఇది 160 bhp పవర్, 172 Nm టార్క్ అందిస్తుంది.160 bhp పవర్, 280 Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (టర్బో TCe 160) కూడా ఉంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ఆప్షన్ రెండింటితోనూ అందుబాటులో ఉంది. బేస్ మోడల్ విషయానికి వస్తే.. ఇది 100 bhp పవర్, 160 Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.0 లీటర్ త్రీ-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఎంపికలో లభిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో వస్తుంది.కొత్త రెనాల్ట్ డస్టర్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లేతో కూడిన 10.1 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్, 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 6 వే పవర్డ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ టెయిల్గేట్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది.భద్రతకు సంబంధించిన ఫీచర్ల జాబితాలో ఆరు ఎయిర్బ్యాగ్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేకులు, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ వంటి అంశాలు ఉన్నాయి. ఈ SUVకి లెవెల్ 2 ADAS కూడా లభిస్తుంది.
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 514.24 పాయింట్ల లాభంతో 76,017.09 వద్ద, నిఫ్టీ 150.00 పాయింట్ల లాభంతో 23,558.80 వద్ద నిలిచాయి.డిసిఎం శ్రీరామ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, గోకుల్ ఆగ్రో రిసోర్సెస్ లిమిటెడ్, MOIL లిమిటెడ్, ఆయిల్ కంట్రీ ట్యూబులర్ లిమిటెడ్, మిట్టల్ లైఫ్ స్టైల్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. LMW లిమిటెడ్, ప్రుడెన్షియల్ షుగర్ కార్పొరేషన్ లిమిటెడ్, జెల్ప్మాక్ డిజైన్ అండ్ టెక్ లిమిటెడ్, శ్యామ్ టెలికాం లిమిటెడ్, ధని సర్వీసెస్ లిమిటెడ్ మొదలైన సంస్థలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.
భారత్లో పాగా వేసేందుకు అమెజాన్ దూకుడు!
భారతీయ శాటిలైట్ ఇంటర్నెట్ కమ్యునికేషన్ (శాట్కామ్) విభాగంలో ఆధిపత్యం కోసం ప్రపంచ దిగ్గజ కంపెనీల మధ్య పోటీ ముదురుతోంది. ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ ఇప్పటికే రేసులో ముందంజలో ఉండగా జెఫ్ బెజోస్ నేతృత్వంలోని అమెజాన్ తన ‘ప్రాజెక్ట్ కూపర్’ కోసం అనుమతులను వేగవంతం చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ మేరకు అమెజాన్ ప్రతినిధులు భారత టెలికాం శాఖ (డాట్)ను సంప్రదించినట్లు తెలుస్తోంది.అనుమతుల కోసం..భారత్లో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలను ప్రారంభించేందుకు అవసరమైన గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ (జీఎంపీసీఎస్) లైసెన్స్ కోసం అమెజాన్ గత కొంతకాలంగా వేచి చూస్తోంది. ఇతర పోటీదారులతో పోలిస్తే అనుమతుల ప్రక్రియలో జాప్యం జరుగుతుండటంతో దీన్ని వేగవంతం చేయాలని కోరుతూ అమెజాన్ వరుస లేఖలు రాసినట్లు సమాచారం.స్టార్లింక్ వర్సెస్ కూపర్ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో పాగా వేయడమే కాకుండా భారత్లో కూడా అనుమతుల ప్రక్రియలో తుది దశకు చేరుకుంది. స్టార్లింక్తో పోలిస్తే అమెజాన్ తన సాటిలైట్ లాంచింగ్ షెడ్యూల్లో కొంత వెనుకబడి ఉంది. ఈ గ్యాప్ను భర్తీ చేయడానికి, భారతీయ వినియోగదారులకు త్వరగా చేరువ కావడానికి అమెజాన్ వేగంగా చర్యలు చేపడుతోంది.భారీ కెపాసిటీతో సవాలుస్టార్లింక్ సేవలతో పోలిస్తే తమ శాటిలైట్ నెట్వర్క్ భారత్లో గణనీయమైన స్థాయిలో డేటా కెపాసిటీని అందించగలదని అమెజాన్ ధీమా వ్యక్తం చేస్తోంది. వేగవంతమైన ఇంటర్నెట్, నిరంతర కనెక్టివిటీ విషయంలో స్టార్లింక్కు గట్టి పోటీ ఇస్తామని కంపెనీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.టెలికాం రంగంలో కొత్త విప్లవంకేవలం నగరాలకే పరిమితం కాకుండా మారుమూల గ్రామాలకు, ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రాంతాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించడమే లక్ష్యంగా ప్రాజెక్ట్ కూపర్ పనిచేస్తోంది. అయితే, స్పెక్ట్రమ్ కేటాయింపులు, ధరల విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఈ కంపెనీల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.భారత ప్రభుత్వం ఇప్పటికే స్పెక్ట్రమ్ కేటాయింపులను వేలం ద్వారా కాకుండా అడ్మినిస్ట్రేటివ్ పద్ధతిలో కేటాయించాలని నిర్ణయించడంతో అంతర్జాతీయ సంస్థలకు సానుకూల వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో అమెజాన్ ఎంత త్వరగా లైసెన్స్ పొందుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అమెజాన్ రంగంలోకి దిగితే ధరల యుద్ధం మొదలై అంతిమంగా భారతీయ వినియోగదారులకే మేలు జరుగుతుందని కొందరు మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇన్సూరెన్స్ ప్రీమియంల మోత.. నో లాజిక్!
ఆరోగ్య బీమా ప్రీమియంల పెంపుపై బీమా కంపెనీలు చెబుతున్న వాదనలకు, వాస్తవాలకు పొంతన లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసింది. వైద్య ఖర్చుల పెరుగుదల (మెడికల్ ఇన్ఫ్లేషన్) కారణంగానే ప్రీమియంలు పెంచుతున్నామన్న కంపెనీల వాదనను బలపరిచేలా ఎలాంటి అధికారిక అధ్యయనాలు లేవని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభకు వెల్లడించారు. గత కొన్నేళ్లుగా సామాన్యులపై భారంగా మారిన హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంల వ్యవహారంపై కేంద్రం చేసిన ఈ ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశమైంది.అధ్యయనం లేదు.. ఆధారాల్లేవు!బీమా రంగ నియంత్రణ సంస్థ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఏఐ) వద్ద దీనిపై నిర్దిష్టమైన డేటా లేదని మంత్రి తెలిపారు. మెడికల్ ఇన్ఫ్లేషన్ రేటుకు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంల పెంపునకు మధ్య గల సంబంధంపై ఐఆర్డీఏఐ ఎటువంటి ప్రత్యేక అధ్యయనం నిర్వహించలేదు.కేవలం వైద్య ఖర్చులే కాకుండా పాలసీదారుల సగటు వయసు పెరగడం, క్లెయిమ్ హిస్టరీ, మెరుగైన పాలసీ ఫీచర్లు వంటి అనేక అంశాలు ప్రీమియం పెంపులో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో కేవలం వైద్య ద్రవ్యోల్బణం వల్ల మాత్రమే ఎంత శాతం ప్రీమియం పెరిగిందో విడదీసి చూడటం సాధ్యం కాదని మంత్రి వివరించారు.కంపెనీల వాదన.. వాస్తవ పరిస్థితిసాధారణంగా బీమా కంపెనీలు దేశంలో మెడికల్ ఇన్ఫ్లేషన్ 12-14 శాతం మధ్య ఉందని, ఇది సాధారణ ద్రవ్యోల్బణం కంటే రెట్టింపు అని వాదిస్తుంటాయి. కరోనా అనంతర కాలంలో కొన్ని కంపెనీలు తమ ప్రీమియంలను ఏకంగా 100 శాతం వరకు పెంచేశాయి. కొన్ని కంపెనీలు గత ఏడాది తమ 65 శాతం ఉత్పత్తుల ధరలను పెంచడానికి వైద్య ఖర్చులే కారణమని పేర్కొన్నాయి. అయితే ప్రభుత్వం తాజా వివరణతో కంపెనీల ‘ద్రవ్యోల్బణ సాకు’ బలహీనపడింది.బీమా కంపెనీలు తమ లాభాలను పెంచుకోవడానికి వైద్య ఖర్చులను సాకుగా చూపిస్తున్నాయనే ఆరోపణలకు కేంద్ర మంత్రి సమాధానం బలాన్ని చేకూర్చింది. పారదర్శకత లేని ప్రీమియం పెంపుదలపై వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో ఐఆర్డీఏఐ మరింత పకడ్బందీగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కొందరు చెబుతున్నారు.
కార్పొరేట్
ఇన్సూరెన్స్ ప్రీమియంల మోత.. నో లాజిక్!
డిమాండ్కి తగినంత బొగ్గు సరఫరా
శామ్సంగ్తో ఆర్ఐఎల్ డీల్
యూఏఈలో ఉపాధి.. వీసా, విమాన టికెట్ ఉచితం
గ్యాస్ కొరత.. ఇండక్షన్ స్టౌలకు ఎంత డిమాండో!!
కార్పొరేట్ సారథులకు అగ్నిపరీక్ష
గిగ్ కార్మికుల ఆదాయంపై యుద్ధ మేఘాలు!
భారీగా పెరిగిన ఆకాశ ఎయిర్ ఫ్లయిట్ టికెట్ చార్జీలు
సిక్ లీవ్ అడిగితే జీతం కోత!
కీలక రంగాల్లో భాగస్వామిగా తెలంగాణ.. టాంజానియా బృందంతో మంత్రి
పతనమౌతున్న పసిడి.. మరింత తగ్గిన తులం బంగారం ధర
దేశంలో పసిడి ధరల పతనం కొనసాగుతోంది. నాలుగు రోజులుగ...
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో కద...
గణాంకాలు, ఫెడ్ సమీక్షపై దృష్టి
దేశ, విదేశీ గణాంకాలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలస...
ఎఫ్డీ కన్నా బెటర్ గురూ..
ఈ ఏడాది ఆరంభం నుంచి ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్క...
వాణిజ్య లోటు ఊరట
న్యూఢిల్లీ: దేశం నుంచి గత నెలలో వివిధ వస్తువుల (మె...
కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కేటాయింపు షురూ
దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, కేటరింగ్ విభ...
ప్రపంచంలోనే అధికంగా వంటగ్యాస్ ఉత్పత్తి చేసే దేశం
భారతదేశంలో సగటు సామాన్యుడి వంటింటి బడ్జెట్ను తలకి...
బ్రిక్స్లో ఏకాభిప్రాయ గండం!
పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్-అమెరి...
ఆటోమొబైల్
టెక్నాలజీ
వాట్సాప్లో కొత్త ఫీచర్.. పేరెంట్ మేనెజ్డ్ అకౌంట్
వాట్సాప్ చిన్న పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని.. ఒక కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. ఇది ముఖ్యంగా 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం రూపొందించిన 'పేరెంట్ మేనెజ్డ్ అకౌంట్'. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.గతంలో వాట్సాప్ను పిల్లలు కూడా పెద్దవాళ్ల మాదిరిగానే ఉపయోగించేవారు. అప్పుడు తల్లిదండ్రులకు వారి చాట్స్ లేదా కాంటాక్ట్స్పై ఎక్కువ నియంత్రణ ఉండేది కాదు. ఇప్పుడు వచ్చిన పేరెంట్ మేనెజ్డ్ అకౌంట్ ద్వారా తల్లిదండ్రులు నేరుగా పిల్లల ఖాతాను పర్యవేక్షించవచ్చు. ఎవరు పిల్లలకు మెసేజ్ చేయాలి, ఏ గ్రూపుల్లో చేరాలి, ప్రైవసీ సెట్టింగ్స్ ఎలా ఉండాలి వంటి విషయాలను తల్లిదండ్రులు నిర్ణయించవచ్చు.పేరెంట్ మేనెజ్డ్ అకౌంట్ సెటప్● ముందుగా పిల్లల ఫోన్లో వాట్సాప్ యాప్ను ఇన్స్టాల్ చేయాలి. ● తరువాత యాప్ను ఓపెన్ చేసి భాషను ఎంచుకుని అగ్రీ అండ్ కంటిన్యూ అనే ఎంపికపై క్లిక్ చేయాలి.● తరువాత మోర్ ఆప్షన్స్లోకి వెళ్లి.. క్రియేట్ పేరెంట్ మేనెజ్డ్ అకౌంట్ అనే ఎంపికను ఎంచుకోవాలి● పిల్లల ఫోన్ నంబర్ను నమోదు చేసి వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి.● తరువాత పిల్లల పుట్టిన తేదీ నమోదు చేయాలి. దీని ద్వారానే వారి వయస్సు 13 సంవత్సరాల కంటే తక్కువ అని వాట్సాప్ నిర్ధారిస్తుంది.● ఇవన్నీ పూర్తయిన తరువాత.. పిల్లల ఖాతాను తల్లిదండ్రుల ఖాతాతో లింక్ చేయడానికి కంటిన్యూపై క్లిక్ చేయాలి.పిల్లల ఖాతాతో ఎలా లింక్ చేయాలిపిల్లల ఫోన్ స్క్రీన్పై ఒక QR కోడ్ కనిపిస్తుంది. తల్లిదండ్రుల ఫోన్తో ఆ కోడ్ను స్కాన్ చేయాలి. ఆ తరువాత వాట్సాప్ తల్లిదండ్రుల పర్యవేక్షణను నిర్ధారించడానికి అగ్రీ అండ్ కంటిన్యూ అనే ఎంపికను చూపిస్తుంది. తరువాత తల్లిదండ్రులు ఒక 6 అంకెల పేరెంట్ పిన్ సెట్ చేసుకోవాలిసెట్ చేయాలి. ఈ పిన్ ద్వారా మాత్రమే పిల్లల ఖాతాకు సంబంధించిన ప్రైవసీ & సేఫ్టీ సెట్టింగ్స్ను మార్చగలుగుతారు. ఈ పిన్ నెంబరును పిల్లలతో షేర్ చేసుకోకూడదు.
ఏఐ వైద్యం.. జాగ్రత్త సుమీ!
ఇటీవలికాలం వరకు సందేశాలకు, సెర్చ్ ఇంజిన్లకు మాత్రమే పరిమితమైన మీ స్మార్ట్ ఫోన్.. ఏఐ పుణ్యామా అని విభిన్న పనులకు ఉపయోగపడుతోంది. ప్రస్తుతం ఏఐ మీ నాడిచూసి, గుండె వేగం నుంచి ఆసుపత్రి రిపోర్టుల వరకు అన్నింటినీ విశ్లేషించడానికి సిద్ధమవుతోంది. మైక్రోసాఫ్ట్ తన ఏఐ చాట్బాట్ కోపైలట్ ద్వారా తీసుకువచ్చిన కొత్త హెల్త్ ఫీచర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెజాన్, ఓపెన్ఏఐ చాట్జీపీటీ , ఆంత్రోపిక్ వంటి సంస్థలు కూడా ఇదే బాటలో నడుస్తుండటంతో ఆరోగ్య సంరక్షణ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త విప్లవానికి నాంది పలుకుతోందా లేక ఆరోగ్య రికార్డుల గోప్యతకు నీళ్లు వదులుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.ఏమిటీ మైక్రోసాఫ్ట్ కోపైలట్ హెల్త్ ఫీచర్?మైక్రోసాఫ్ట్ తాజాగా ఆవిష్కరించిన ఈ టూల్ వినియోగదారులు తమ ఆరోగ్య రికార్డులను నేరుగా చాట్బాట్తో పంచుకోవడానికి అనుమతిస్తుంది. యాపిల్ వాచ్, ఫిట్బిట్, స్లీప్ ట్రాకర్ వంటి పరికరాల నుంచి సేకరించిన ఫిట్నెస్ డేటాను ఇది విశ్లేషిస్తుంది.వివిధ ఆసుపత్రుల రికార్డులను కలిపి వినియోగదారుడికి ఉన్న ఆరోగ్య సమస్యలపై నిమిషంలో పూర్తి సమచారాన్ని అందిస్తుంది.‘నేను సరిగ్గా నిద్రపోవడం లేదు’ అని మీరు చాట్బాట్తో అంటే చాలు.. మీ పాత మెడికల్ రిపోర్టులను, స్లీప్ ట్రాకర్ డేటాను పరిశీలించి అది మీకు ఉన్న నిద్రలేమి లేదా డయాబెటిస్ వంటి ముప్పులను హెచ్చరిస్తుంది. ప్రస్తుతానికి ఉచితంగా అందుబాటులోకి రానున్న ఈ సేవలకు భవిష్యత్తులో సబ్స్క్రిప్షన్ ఫీజు వసూలు చేయాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది.ప్రయోజనాలు..సాధారణంగా ఒక రోగి వివిధ వైద్యులను సంప్రదించినప్పుడు వారి రికార్డులు వేర్వేరు డేటాబేస్ల్లో ఉంటాయి. ఒక జనరల్ ఫిజీషియన్ రోగి గత చరిత్రను అర్థం చేసుకోవడానికి గంటల సమయం పడుతుంది. మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగం హెల్త్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ డొమినిక్ కింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏఐ సెకన్లలోనే సంక్లిష్టమైన రికార్డులను విశ్లేషిస్తుంది. పెరుగుతున్న వైద్య ఖర్చుల దృష్ట్యా సామాన్యులకు ఇది తక్కువ ఖర్చుతో కూడిన ప్రాథమిక విశ్లేషణ సాధనంగా ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.నష్టాలు లేవా?టెక్ కంపెనీల చేతికి అత్యంత సున్నితమైన ఆరోగ్య డేటా వెళ్లడంపై సైబర్ భద్రతా నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఆరోగ్య రికార్డులన్నీ ఒకే చోట కేంద్రీకృతమై ఉంటే అవి సైబర్ నేరగాళ్లకు ప్రధాన లక్ష్యంగా మారుతాయి’ అని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాథ్యూ గ్రీన్ హెచ్చరించారు. అమెరికా వంటి దేశాల్లో రోగి గోప్యతను కాపాడే ‘హిప్పా’ చట్టాలు సాంప్రదాయ ఆసుపత్రులకు వర్తిస్తాయి కానీ, ఈ టెక్ కంపెనీలకు వర్తించవు. దీనివల్ల కంపెనీలు రోగుల డేటాను ప్రకటనల కోసం లేదా తమ ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి వాడుకునే ప్రమాదం ఉంది. గర్భస్రావాలపై నిషేధం ఉన్న ప్రాంతాల్లో మహిళల పునరుత్పత్తి ఆరోగ్య రికార్డులను కొన్ని సంస్థలు టెక్ కంపెనీల నుంచి సులభంగా పొందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.ఏఐ వైద్యుడికి ప్రత్యామ్నాయమా?మైక్రోసాఫ్ట్ స్వయంగా ఒక గమనికను(Disclaimer) తెలియజేసింది. ఈ చాట్బాట్ కేవలం సమాచార విశ్లేషణకు మాత్రమేనని, ఇది వైద్యుడి స్థానాన్ని భర్తీ చేయదని స్పష్టం చేసింది. వ్యాధులను నిర్ధారించడానికి లేదా చికిత్స చేయడానికి దీన్ని ప్రామాణికంగా తీసుకోకూడదని సూచించింది. అయితే ఏఐ ఇచ్చే తప్పుడు సమాచారం వల్ల అనవసరమైన ఆందోళన చెంది ప్రజలు ఆసుపత్రులకు పరుగులు తీసే ప్రమాదం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: దిగొస్తున్న పసిడి ధరలు.. వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..
విద్వేష ప్రసంగాలకు చెక్ పెట్టే ‘హోడియో’!
సోషల్ మీడియా వేదికలపై విచ్చలవిడిగా సాగుతున్న విద్వేషపూరిత ప్రసంగాలకు (హేట్ స్పీచ్) అడ్డుకట్ట వేసేలా స్పెయిన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను నడిపే టెక్ దిగ్గజాలను జవాబుదారీలుగా చేసే దిశగా స్పెయిన్ సంచలన నిర్ణయం తీసుకుంది. డిజిటల్ వేదికలపై ఏ స్థాయిలో ఈ ప్రసంగాలు విస్తరిస్తున్నాయో లెక్కగట్టేందుకు ‘హోడియో’ (Hodio) అనే టెక్నాలజీ టూల్ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రధాని పెడ్రో సాంచెజ్ ప్రకటించారు. మాడ్రిడ్లో జరిగిన ఒక ప్రత్యేక ఫోరమ్లో ఆయన మాట్లాడుతూ, టెక్ సంస్థల యజమానుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.ఏమిటీ ‘హోడియో’?డిజిటల్ ప్లాట్ఫారమ్ల్లో ద్వేషపూరిత కంటెంట్ ఉనికిని, అది వ్యాపిస్తున్న తీరును, దాని ప్రభావ పరిధిని శాస్త్రీయంగా కొలవడానికి ఈ సాధనం ఉపయోగపడుతుంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ టూల్ సమగ్ర నివేదికను రూపొందిస్తుంది. ‘స్పానిష్ అబ్జర్వేటరీ ఆఫ్ రేసిజం అండ్ జెనోఫోబియా’ ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తుంది. ఏ సంస్థ ద్వేషాన్ని ఆపుతోంది, ఏ సంస్థ ప్రేక్షక పాత్ర వహిస్తోంది, ఈ వ్యవహారం ద్వారా ఎవరు వ్యాపారం చేస్తున్నారో ప్రపంచానికి తెలియజేస్తామని సాంచెజ్ స్పష్టం చేశారు.గత దశాబ్ద కాలంలో స్పెయిన్లో ద్వేషపూరిత నేరాలు 41% పెరగడంపై పెడ్రో సాంచెజ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇప్పటి నుంచి సోషల్ మీడియా సంస్థలు తాము అనుమతించే ప్రతి విద్వేషపూరిత అంశానికి బహిరంగంగా సమాధానం చెప్పుకోవాల్సిందే’ అని తెలిపారు.మస్క్, దురోవ్లతో ఢీ!స్పెయిన్ ప్రభుత్వం తీసుకుంటున్న వరుస నిర్ణయాలు గ్లోబల్ టెక్ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించే ప్రణాళికను ఫిబ్రవరిలోనే ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం ఎక్స్ (గతంలో ట్విట్టర్) యజమాని ఎలాన్ మస్క్, టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్లతో వాగ్వివాదానికి దారితీసింది. ఏఐ సృష్టించిన చైల్డ్ పోర్నోగ్రఫీని నిరోధించడంలో విఫలమైనందుకు ఎక్స్, మెటా, టిక్టాక్లపై దర్యాప్తు చేయాలని స్పెయిన్ ఇప్పటికే ప్రాసిక్యూటర్ కార్యాలయాన్ని కోరింది.యూరోపియన్ యూనియన్లో డిజిటల్ సేవల చట్టం (డీఎస్ఏ) ఇప్పటికే అమలులో ఉన్నప్పటికీ స్పెయిన్ సొంతంగా ‘హోడియో’ వంటి సాధనాన్ని తీసుకురావడం గమనార్హం. ఇది కేవలం నియంత్రణ మాత్రమే కాదు, టెక్ కంపెనీల వ్యాపార నమూనాలను సైతం సవాలు చేసే వ్యూహంలా కనిపిస్తోందని కొందరు భావిస్తున్నారు.ఇదీ చదవండి: దిగొస్తున్న పసిడి ధరలు.. వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..
మొబైల్ డేటాపై పన్ను.. కేంద్రం కొత్త ఆలోచన!
దేశంలో పన్ను వసూళ్లను క్రమబద్ధీకరించి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో మొబైల్ డేటా వినియోగంపై పన్ను విధించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జనవరిలో జరిగిన సీనియర్ అధికారుల సమావేశంలో చర్చ జరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.సమావేశంలో ప్రధానంగా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే కొత్త మార్గాలపై చర్చ జరిగింది. అందులో భాగంగా దేశంలో రోజువారీ డేటా వినియోగంపై చిన్న మొత్తంలో పన్ను విధించే ప్రతిపాదనను పరిశీలనకు తీసుకున్నట్లు తెలుస్తోంది.భారీగా పెరిగిన డేటా వినియోగం భారతదేశంలో చౌకైన ఇంటర్నెట్ సేవల కారణంగా మొబైల్ డేటా వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక డేటా వినియోగించే మార్కెట్లలో భారత్ ఒకటిగా నిలిచింది. ఈ నేపథ్యంలో టెలికాం రంగం ద్వారా కొత్త ఆదాయ వనరులు సృష్టించాలనే ఉద్దేశంతో టెలీకాం శాఖ ఇప్పటికే ఈ ప్రతిపాదనపై అధ్యయనం ప్రారంభించినట్లు సమాచారం. వచ్చే సెప్టెంబర్ నాటికి దీనిపై సమగ్ర ప్రణాళికను సమర్పించాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది.జీబీకి రూ.1 పన్ను వేధించినా..ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో మొబైల్ వినియోగదారులు మొత్తంగా సుమారు 229 బిలియన్ జీబీల డేటాను వినియోగించారు. ఈ నేపథ్యంలో ఒక్కో జీబీకి కేవలం రూ.1 పన్ను విధించినా ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.22,900 కోట్లు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.వినియోగదారులపై ప్రభావంప్రస్తుతం మొబైల్ రీఛార్జ్ ప్లాన్లపై 18 శాతం జీఎస్టీ ఇప్పటికే అమల్లో ఉంది. ఇదిలా ఉండగా టెలికాం కంపెనీలు గత కొంతకాలంగా ప్లాన్ ధరలను పెంచుతున్నాయి. ఇలాంటి సమయంలో డేటా పన్ను అమల్లోకి వస్తే వినియోగదారులపై మరింత భారం పడే అవకాశం ఉంది. ఉదాహరణకు, జీబీకి రూ.1 పన్ను విధిస్తే రోజుకు 2 జీబీ డేటా ఉపయోగించే వినియోగదారుడు నెలకు సుమారు రూ.60 అదనంగా చెల్లించాల్సి వస్తుంది.అయితే ఈ ప్రతిపాదన ప్రస్తుతం చర్చ దశలో మాత్రమే ఉందని, ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
పర్సనల్ ఫైనాన్స్
గోల్డ్ లోన్లో.. రిస్కులూ ఉంటాయి!
బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నా... ఊగిసలాట ఇంకా పెరుగుతోంది. నెలన్నర కిందట గరిష్ఠ స్థాయిలకు చేరిన ధర... అప్పటితో పోలిస్తే ప్రస్తుతం 7–8 శాతం వరకూ పతనమైంది. క్రయవిక్రయాలైతే ఈ కదలికలకు అనుగుణంగా చేయొచ్చు. ధర పడుతుంటే కొంత వేచిచూడటం.. తక్కువ స్థాయిల్లో కొనటం వంటివి చేయొచ్చు. మరి రుణాలు తీసుకునేవారి సంగతేంటి? ఎందుకంటే ఆర్థిక అనిశ్చితుల్లో ఎంతో మందికి బంగారమనేది విశ్వసనీయ సాధనం. పెట్టుబడులకే కాకుండా అత్యవసర సాధనంగా, అత్యవసర నిధిగా ఇది ఎన్నో కుటుంబాలను ఆదుకుంటోంది.వాస్తవానికి బంగారంపై రుణం చాలా ఈజీ. గంటలోపే డబ్బుతో ఇంటికెళ్లిపోవచ్చు. బహుశా... అందుకేనేమో!. 2026 మార్చి నాటికి సంఘటిత రంగంలో బంగారం రుణాలు ఏకంగా 15 లక్షల కోట్లకు చేరుకున్నట్లు అంచనా. ధరలు బాగా పెరగటంతో రుణ మొత్తం కూడా ఎక్కువే దొరుకుతోంది. దీంతో చాలామంది రుణాలను ఆశ్రయిస్తున్నారు. అయితే బంగారం ధరలు ఇక్కడి నుంచి మరింతగా పెరుగుతాయని.... దిద్దుబాటుకు గురవుతాయని భిన్న విశ్లేషణలున్నాయి. ఈ పరిస్థితుల్లో పసిడిపై రుణాలు తీసుకునే వారు అందులోని రిస్్కలనూ తెలుసుకోవాలి. ధరల ఊగిసలాట వల్ల రుణ గ్రహీతలు కొన్ని సవాళ్లనూ ఎదుర్కోవాల్సి రావచ్చు. అవేంటో వివరించేదే ఈ ‘వెల్త్’ స్టోరీ... రుణ పరిమితులు.. ⇒ బంగారం విలువలో రుణం ఎంత ఇవ్వాలన్న దానికి ఒక పరిమితి ఉంది. దీన్నే లోన్ టు వ్యాల్యూ నిష్పత్తి (ఎల్టీవీ)గా చెబుతుంటారు. ⇒ ఎల్టీవీకి సంబంధించి ఆర్బీఐ మూడు రకాల శ్లాబులను తీసుకొచ్చింది. ⇒ బంగారం విలువ 2.5 లక్షల వరకు ఉంటే... అందులో 85 శాతం వరకూ రుణంగా ఇవ్వొచ్చు. ⇒ అదే బంగారం విలువ రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఉంటే 80 శాతం ఎల్టీవీ అమలవుతుంది. ⇒ కుదువ పెట్టే బంగారం విలువ రూ.5 లక్షలు కంటే మించితే అప్పుడు ఎల్టీవీ 75 శాతం మించకూడదు. అంటే... తక్కువ రుణం తీసుకునేటపుడు మీ బంగారం ధరలో ఎక్కువ మొత్తం మీకు రుణంగా దొరుకుతుంది. రుణం పెరుగుతున్న కొద్దీ ఈ మొత్తం తగ్గుతుంది. ఉదాహరణకు రూ.3 లక్షల విలువైన బంగారాన్ని కుదువ పెడితే ప్రతి లక్షకు గరిష్టంగా రూ.75,000 నుంచి రూ.85,000 వరకు రుణంగా పొందవచ్చు. ఉన్నట్టుండి ధరలు పతనమైతే..? ⇒ ఇతర రుణాలకు, బంగారంపై రుణానికీ మధ్య స్పష్టమైన లక్ష్మణ రేఖ ఉంటుంది. అదే బంగారం ధరలు. ⇒ వ్యక్తిగత రుణం తీసుకుంటే కాల వ్యవధి ముగిసే వరకు ప్రతి నెలా నిరీ్ణత మొత్తం చెల్లిస్తూ వెళితే సరిపోతుంది. ⇒ బంగారంపై రుణం అలా కాదు. రుణం తీసుకున్న తర్వాత బంగారం ధరలు పతనమైతే.. అప్పుడు తనఖాలోని మొత్తం బంగారం విలువ పడిపోతుంది. ఆర్బీఐ విధించిన ఎల్టీవీ పరిమితిని రుణం మించిపోతుంది. అంత మేర రుణ గ్రహీత అదనపు బంగారాన్ని తనఖా పెట్టాల్సిందే. ⇒ లేదంటే ఎల్టీవీలో ఎంత తగ్గిందో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించినా సరిపోతుంది. ⇒ ఈ రెండూ చేయలేకపోతే రుణం ఇచి్చన సంస్థ తనఖాలోని బంగారాన్ని వేలం వేస్తుంది. ⇒ రుణ ఈఎంఐలు లేదా వడ్డీ చెల్లించని సందర్భాల్లోనూ నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసి, బంగారాన్ని వేలం వేస్తారు. బంగారం వేలానికి గురైతే.. ఇక ఆ ఆభరణాలను తిరిగి పొందలేరు. దాంతో ఉన్న అనుబంధం ముగిసిపోతుంది. ⇒ ధరలు తగ్గిపోవడం వల్ల విలువ పతనమై.. చెల్లించలేని పరిస్థితుల్లో కుదువ పెట్టిన బంగారాన్ని వేలంలో తక్కువకు విక్రయించే రిస్్కనూ గమనించాలి. దీనివల్ల మరింత నష్టం ఏర్పడుతుంది. ⇒ వేలం వేయగా వచ్చిన మొత్తం నుంచి బకాయిలను మినహాయించి మిగిలినది రుణ గ్రహీతకు వెనక్కిచ్చేస్తారు. బకాయిల చెల్లింపులు కూడా చాలకపోతే అప్పుడు మిగిలిన మొత్తాన్ని వసూలు చేసుకునేందుకు చట్టప్రకారం చర్యలు చేపడతారు. ⇒ వేలానికి ముందు రుణ గ్రహీతకు తప్పకుండా నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. వేలం చివరి నిమిషం వరకు బకాయిలు చెల్లించేందుకు అనుమతి ఉంటుంది. ⇒ కొన్ని సందర్భాల్లో బంగారం విలువ మదింపులో తప్పులకు అవకాశం లేకపోలేదు. గోల్డ్ అప్రైజర్ బంగారం విలువను పొరపాటున అధికంగా నిర్ణయించి, ఆ మేరకు అధిక రుణం మంజూరు చేసినట్లు తర్వాత ఆడిట్లో గుర్తించినట్టయితే.. అదనపు మొత్తాన్ని జమ చేయాలని బ్యాంక్/ఎన్బీఎఫ్సీ కోరుతుంది. వడ్డీ రేట్లు – చార్జీలు⇒ బంగారంపై రుణ రేట్లు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో తక్కువ. వీటికంటే ప్రైవేటు బ్యాంకుల్లో కొంత అధికంగా ఉంటాయి. ఇక బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు మరింత అధిక రేట్లపై రుణాలు ఇస్తుంటాయి. ⇒ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో అయితే 8– 10.5 శాతం మధ్య... ప్రైవేటు బ్యాంకుల్లో 9–18 శాతం మధ్య, ఎన్బీఎఫ్సీల్లో 10.75–27 శాతం మధ్య రుణ రేట్లు ఉన్నాయి. ⇒ ఎన్బీఎఫ్సీలు కొంత అధికంగా వడ్డీ వసూలు చేసినప్పటికీ.. పలు రకాల ఆకర్షణీయ పథకాలతో రుణ గ్రహీతలను ఆకట్టుకుంటాయి. తక్కువ ఎల్టీవీపై తక్కువ రేటు, అధిక రేటుపై గరిష్ట పరిమితి మేరకు రుణాన్ని మంజూరు చేస్తాయి. బ్యాంక్లు– ఎన్బీఎఫ్సీల మధ్య పోటీ పెరిగిపోవడంతో.. రుణ గ్రహీతలకు ఎన్నో రకాల పథకాలు అందుబాటులోకి వస్తున్నాయి. ⇒ బంగారం రుణాలపై ప్రాసెసింగ్ చార్జీ, గోల్డ్ అప్రైజర్ చార్జీలు, డాక్యుమెంటేషన్ చార్జీలను బ్యాంక్లు వసూలు చేస్తుంటాయి. ⇒ సకాలంలో రుణాన్ని చెల్లించలేని సందర్భాల్లో అదనపు చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఇవి 2 శాతం వరకు ఉంటాయి. ముఖ్యంగా పెనాల్టీ చార్జీ పేరుతో అసలు, వడ్డీ మొత్తంపై ప్రతి నెలా 0.5 శాతం చొప్పున కలుపుతూ వెళతారు. ⇒ అరుదుగా తనఖా పెట్టే బంగారం విషయంలో మోసాలకు అవకాశం లేకపోలేదు. తనఖాలోని ఆభరణాలు దుర్వినియోగానికి గురయ్యే రిస్క్ ఉంటుంది. ⇒ బంగారం వేలం వేసే పరిస్థితి ఏర్పడితే అందుకయ్యే ఖర్చలనూ బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు తీసుకుంటాయి. బంగారం విలువ మదింపు ఎలా..?‘లోయర్ ఆఫ్ టూ’ నిబంధన తెలియాలి: రుణం ఇచ్చే సంస్థ ఆ రోజు మార్కెట్ ధరను ఆధారం చేసుకోదు. క్రితం రోజు ముగింపు ధర? గత 30 రోజుల్లో సగటు ధర ఈ రెండింటిలో తక్కువ ధరను పరిగణనలోకి తీసుకుంటారు. ధరలు ఉన్నట్టుండి పెరిగిపోతే వాటి ఆధారంగా రుణం మంజూరు చేయకుండా ఈ సూత్రాన్ని అనుసరిస్తారు. బంగారానికే విలువ: బంగారం ఆభరణాల్లో నికర బంగారం ఎంతన్న దానిపైనే ఎల్టీవీని నిర్ణయిస్తారు.ఆభరణాల్లో రాళ్లు, ఇతరత్రా ఉంటే వాటి బరువును ఉజ్జాయింపుగా మినహాయిస్తారు. ఉదాహరణకు 50 గ్రాముల ఆభరణాలు తీసుకెళ్లినప్పుడు అందులో రాళ్లు, పూసలు వంటివి ఉంటే 5–10 గ్రాముల వరకు బరువు తగ్గిపోతుంది. పైగా బంగారం ఆభరణాల స్వచ్ఛతను కూడా అంచనా వేస్తారు. 24, 22, 18 క్యారట్ లేదా అసలు ప్యూరిటీ ఎంతుందని చూస్తారు. ఆ తర్వాతే బంగారం నికర విలువను ఖరారు చేస్తారు.ఇలా చేస్తే బెటర్..⇒ బంగారంపై గరిష్ట పరిమితి మేరకు రుణాన్ని తీసుకోకపోవడమే మంచిది. తనఖా పెట్టే రోజున ఉన్న విలువలో రుణం 60 శాతం మించకుండా చూసుకోవాలి. దీనివల్ల ధరలు కొంత పడిపోయినప్పటికీ నిశ్చింతంగా ఉండొచ్చు. అదనపు బంగారం లేదా డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఏర్పడదు. బంగారం ధరలు పెరగడం వల్ల తనఖా బంగారంపై అధిక రుణ మొత్తాన్ని పొందొచ్చు. కానీ, ధరలు పతనం అవుతున్నప్పుడు అదనంగా సర్దుబాటు చేయాల్సి రిస్క్ కూడా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ⇒ దీర్ఘకాలం కోసం కాకుండా స్వల్పకాల అవసరాల కోసమే బంగారంపై రుణాలను పరిశీలించాలి. రుణం తీసుకున్న తర్వాత నుంచి బంగారం ధరలను గమనిస్తూ ఉండాలి. ⇒ బంగారం విలువ మదింపు, వాటి భద్రత విషయంలో రిస్్కలు వద్దనుకుంటే పేరున్న సంస్థల నుంచి రుణం తీసుకోవడం మంచి నిర్ణయం. ఈ విషయంలో ప్రముఖ బ్యాంక్లు, ప్రముఖ ఎన్బీఎఫ్సీలను పరిశీలించొచ్చు. రుణ కాల వ్యవధులు..⇒ సాధారణంగా 6– 12 నెలల కాలానికి బంగారంపై రుణాలు లభిస్తుంటాయి. కొన్ని బ్యాంక్లు, ముత్తూట్ ఫైనాన్స్ వంటి కొన్ని సంస్థలు అయితే ఏడాదికి మించిన కాలానికీ రుణాలు ఇస్తున్నాయి. ⇒ తక్కువ కాల వ్యవధికి తీసుకున్నప్పటికీ, గడువులోపు ఆ మొత్తాన్ని చెల్లించి, వెంటనే అప్పటి విలువ ప్రకారం మళ్లీ రుణం పొందొచ్చు.
ATMలలో రూ.10 నోట్లు రానున్నాయా?
డిజిటల్ పేమెంట్ వ్యవస్థ ప్రజల జీవితాన్ని చాలా సులభతరం చేసింది. అయితే అదే సమయంలో చిన్న నోట్ల కొరత ఉన్నట్లుగా అనిపించే పరిస్థితి కూడా ఏర్పడుతోంది. కొన్నిసార్లు రూ.100 లేదా రూ.500 నోటుతో చిన్నపాటి కొనుగోళ్లు చేయాలనుకుంటే, దుకాణదారులు చిల్లర లేదని చెప్పే సందర్భాలు ఎదురవుతున్నాయి. ఎక్కువ మంది ఆన్లైన్ చెల్లింపులు చేయడం వల్ల చిన్న నోట్ల వినియోగం తగ్గింది.ఈ నేపథ్యంలో దేశంలో చిన్న నోట్ల కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మంగళవారం పార్లమెంటులో మాట్లాడుతూ ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి దేశంలో ఇప్పటికే రూ.10, రూ.20, రూ.50 నోట్లు సమృద్ధిగా చలామణిలో ఉన్నాయని తెలిపారు.సాధారణంగా ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరించుకునే సమయంలో ఎక్కువగా రూ.500 నోట్లు, కొన్నిసార్లు రూ.100 లేదా రూ.200 నోట్లు మాత్రమే వస్తున్నాయి. దీంతో చిన్న ఖర్చుల సమయంలో చిల్లర సమస్య ఎదురవుతోంది.ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని కొత్త చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఉన్న సాంప్రదాయ ఏటీఎంలు చిన్న నోట్లను పంపిణీ చేయడానికి ప్రత్యేకంగా రూపకల్పన చేయలేదని మంత్రి వివరించారు. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించినట్లు చెప్పారు.ఈ ప్రాజెక్ట్ కింద ప్రత్యేకంగా “స్మాల్ డినామినేషన్ డిస్పెన్సర్లు” అనే యంత్రాలను పరీక్షిస్తున్నారు. ఈ యంత్రాల ద్వారా ప్రజలు రూ.10, రూ.20, రూ.50 నోట్లను నేరుగా ఏటీఎంల నుంచి ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. దీంతో నగదు తీసుకునేటప్పుడు చిల్లర సమస్య కొంతవరకు తగ్గే అవకాశం ఉంది.చిన్న నోట్ల చలామణి ఎంత?ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి 26 వరకు దేశంలో పెద్ద మొత్తంలో చిన్న నోట్లు చలామణిలో ఉన్నాయి. రూ.10 నోట్లు సుమారు రూ.439.4 కోట్లు, రూ.20 నోట్లు సుమారు రూ. 193.7 కోట్లు, రూ.50 నోట్లు సుమారు రూ.130.3 కోట్లు విలువైనవి ఉన్నాయి. ఇక గత ఆర్థిక సంవత్సరంలో రూ.10 నోట్లు రూ.180 కోట్లు, రూ.20 నోట్లు రూ.150 కోట్లు, రూ.50 నోట్లు రూ.300 కోట్లు విలువైనవి చలామణిలో ఉన్నట్లు వెల్లడించారు.
ఈఎంఐతో ఐఫోన్.. కనిపించని ఆర్థిక నిజాలు!
ఒకప్పుడు భారతదేశంలో యాపిల్ ఐఫోన్ కొనడం అంటే.. డబ్బున్నవారికి మాత్రమే సాధ్యమయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితి చాలా మారింది. బ్యాంకులు & ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫార్మ్లు ఇచ్చే సులభమైన ఈఎంఐ ఆప్షన్స్ వల్ల చాలా మంది ఖరీదైన స్మార్ట్ఫోన్లను సులభంగా కొనుగోలు చేస్తున్నారు. రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న ఫోన్ను కూడా నెలకు చిన్న చిన్న చెల్లింపులుగా చెల్లిస్తూ కొనడం ఇప్పుడు సాధారణంగా మారింది.ఎలక్ట్రానిక్స్ షాపుల్లోకి వెళ్లినా లేదా ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లు చూసినా ఖరీదైన ఫోన్లు, ముఖ్యంగా ఐఫోన్లకు చాలా డిమాండ్లో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఈఎంఐ ఆప్షన్ వల్ల ఒకేసారి పెద్ద మొత్తం చెల్లించాల్సిన అవసరం లేకపోవడం వల్ల చాలా మంది దీనిని కొనడానికి సిద్దపడుతున్నారు. ఈఎంఐ సౌకర్యం అనేది మీకు తెలియని ఆర్ధిక భారం మోపుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.నెలవారీ ఖర్చులుఇప్పటికే చాలామంది యువ ఉద్యోగులు కార్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ లేదా క్రెడిట్ కార్డ్ బకాయిల కోసం ఈఎంఐలు చెల్లిస్తున్నారు. అలాంటి పరిస్థితిలో ఫోన్ కోసం మరో ఈఎంఐ తీసుకుంటే వారి నెలవారీ ఖర్చులు పెరిగి ఆర్థిక ఒత్తిడి ఎక్కువవుతుంది. కాబట్టి ఈఎంఐ తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలని ఆర్థిక సలహాదారులు సూచిస్తున్నారు.ఒక వ్యక్తి మొత్తం అప్పులు తన ఆదాయంతో పోలిస్తే ఎంత ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవాలి. సాధారణంగా మన నెలవారీ ఆదాయంలో 30% కంటే ఎక్కువ భాగం ఈఎంఐలకు వెళ్ళకూడదు. 40% దాటితే అది ప్రమాదకరంగా మారుతుంది. 50% కంటే ఎక్కువైతే అది అప్పుల బారిన పడే పరిస్థితికి దారితీయవచ్చు. అంతే కాకుండా.. ప్రతి వ్యక్తి వద్ద కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడే ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. ఉద్యోగం కోల్పోయినా లేదా ఇతర సమస్యలు వచ్చినా ఈఎంఐలు చెల్లించడానికి ఇది ఉపయోగపడుతుంది.ఎక్కువ సంపాదిస్తేరూ.1,34,900 ధర ఉన్న ఒక ఐఫోన్ను 12 నెలల నో కాస్ట్ ఈఎంఐతో కొనుగోలు చేస్తే.. ప్రతి నెల సుమారు రూ.11,242 చెల్లించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి నెలకు రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ సంపాదిస్తే ఈ ఈఎంఐ అతని ఆదాయంలో సుమారు 11% మాత్రమే అవుతుంది. అప్పుడు ఇది కొంతవరకు ఆర్థికంగా సౌకర్యంగా ఉంటుంది. కానీ తక్కువ ఆదాయం ఉన్నవారికి ఇది భారంగా మారే అవకాశం ఉంది.చాలా మంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే.. ఈఎంఐ మొత్తం చిన్నదిగా కనిపిస్తే చాలు కొనుగోలు చేస్తున్నారు. కానీ వారు ఒక ముఖ్యమైన విషయం మర్చిపోతున్నారు. ఈఎంఐ చెల్లిచడానికి పెట్టే డబ్బును.. పెట్టుబడిగా పెట్టితే భవిష్యత్తులో ఎక్కువ సంపాదించవచ్చు. కానీ ఫోన్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కాలక్రమేణా విలువ కోల్పోతాయి. ఇంకో విషయం ఏమిటంటే.. ఈఎంఐ కొనుగోళ్లలో ప్రాసెసింగ్ ఫీజులు వంటి అదనపు ఖర్చులు కూడా ఉండే అవకాశం ఉంటుంది.వన్ మంత్ రూల్ఆర్థిక నిపుణులు ఒక సాధారణ నియమాన్ని సూచిస్తున్నారు. దాన్ని వన్ మంత్ రూల్ అంటారు. అంటే మనం కొనబోయే ఫోన్ ధర మన నెల జీతాన్ని మించకూడదు. మరొకటి ట్వైస్ ఓవర్ రూల్. అంటే మన వద్ద ఆ ఫోన్ను రెండు సార్లు కొనగలిగేంత లిక్విడ్ క్యాష్ ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఖరీదైన ఫోన్ కొనవచ్చు.మొత్తం మీద ఈఎంఐతో ఐఫోన్ కొనడం తప్పు కాదు. కానీ అది మన పొదుపులు, పెట్టుబడులు & భవిష్యత్తు ఆర్థిక భద్రతపై ప్రభావం చూపకూడదు. అందుకే ఖరీదైన ఫోన్ కొనుగోలు చేయడానికి ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం అని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: 2026లో అతిపెద్ద ఆర్ధిక సంక్షోభం!.. కియోసాకి హెచ్చరిక
దగ్గరపడుతున్న డెడ్లైన్.. పన్ను చెల్లింపులపై కీలక సూచనలు!
ఆర్ధిక సంవత్సరంలో మార్చి నెల అత్యంత క్లిష్టం.. అత్యంత కీలకం. అలాంటిదే ఈ 2026 మార్చి కూడా. వ్యక్తులుగా మీ ఇన్కంట్యాక్స్ వ్యవహారాల్లో మీరు చేయవలసిన ముఖ్యమైన బాధ్యతలను తెలుసుకుని వాటిని సకాలంలో పూర్తి చేసే పని చేపడదాం.ఆర్థిక వ్యవహారాల్లో కూడా మార్చి ముఖ్యమైనది. వ్యవహారాలు పూర్తి దశకి రావడానికి, బడ్జెట్ ప్రకారం నిధులు ఖర్చు పెట్టడానికి, గ్రాంట్లను పూర్తి చేయడానికి, ప్రాజెక్టుల పూర్తికి.. ఇలా ఎన్నో పన్నుయేతర వ్యవహారాలకు మార్చి కటాఫ్లాంటిది. ఈ గడువు ఓ గండంలాంటిది. బుక్స్ క్లోజ్ చేయాలి. మీరు బుక్స్ రాయకపోయినా, వాటి నిర్వహణ కంపల్సరీ. రాయకపోయినా ఒకసారి వ్యవహారాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి.ఏప్రిల్ నుంచి మీ బ్యాంకు అకౌంటు స్టేట్మెంట్లు, లోన్ చెల్లింపులు, ఇన్సూరెన్స్ చెల్లింపులు, ఇంటి మున్సిపల్ పన్నుల చెల్లింపులు, మెడిక్లెయిమ్, మీ దగ్గర పని చేసే ఉద్యోగులకు సంబంధించి చట్టబద్ధమైన చెల్లింపులు, పిల్లల చదువులకు సంబంధించిన ట్యూషన్ ఫీజులు, 80సీ కింద అర్హత ఉన్న చెల్లింపులు.. ఇలా ఎన్నో ఉంటాయి. తెలుసుకోండి. తేల్చుకోండి. ఇందులో ఎక్కువ చెల్లింపులకు పాత పద్ధతిలోనే మినహాయింపు దొరుకుతుంది. అయినా చెల్లింపులు చేయడం.. ఒక మంచి అలవాటు. క్రమశిక్షణకు దారి తీస్తుంది.ఆర్ధిక చెల్లింపులలో ముందు, వెనుకలు కాకుండా నిలకడకు దారి తీస్తుంది. ఒక నిశ్చితి పరిస్థితికి దోహదపడుతుంది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం రావాల్సిన ప్రయోజనాలు వస్తాయి. కాబట్టి, అశ్రద్ధ చేయవద్దు. మీ వ్యాపారం చిన్నదే కావొచ్చు. జీఎస్టీ పరిమితులలోపు ఉండొచ్చు. ఆడిట్ అవసరం లేకపోవచ్చు. కానీ అకౌంట్స్ విషయంలో బద్ధకం వద్దు. ముఖ్యంగా క్యాపిటల్ ఖర్చు, రెవెన్యూ ఖర్చు, సరుకుల నిల్వ మొదలైనవి ముఖ్యమైనవి.జీఎస్టీ టర్నోవరు రిటర్నులతో మీ ఇన్వాయిస్ల ప్రకారం టర్నోవరు, మీ బుక్స్ ప్రకారం టర్నోవరు చెక్ చేసుకోండి. స్థూల ఆదాయం పూర్తిగా పన్నుకి గురికాదు. ఆదాయం కొన్ని సందర్భాల్లో అడ్వాన్స్గా వచ్చి, జరగాల్సిన పని ఏప్రిల్లో జరగొచ్చు. ఈ వ్యవహారాల్లో టీడీఎస్ అంశం ఉంటుంది. అనుమానం ఉంటే అటు పక్క వెండార్స్తో ఉత్తరప్రత్యుత్తరాలు జరపండి. ఇద్దరి రికార్డుల్లో అంకెలు, వివరణ, అకౌంటింగ్ సర్దుబాటు, సమన్వయం ఒకేలాగా ఉండాలి. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించండి. 2026 మార్చి 31 నాటికి మీ ఆదాయం విషయంలో టీడీఎస్ సరిపోతే సరే సరి. లేదంటే కొన్ని సందర్భాల్లో అడ్వాన్స్ ట్యాక్స్ బాధ్యత ఏర్పడుతుంది.ఆదాయం అంచనాల్లో వ్యత్యాసాలు ఏర్పడవచ్చు. పన్ను భారం పెరగొచ్చు. గత మూడు వాయిదాల్లో షార్ట్ఫాల్ ఉండొచ్చు. అలాంటి వాటిని మళ్లీ లెక్కించి, కచ్చితమైన లెక్కలు తేల్చండి. రివైజ్ చేసిన లెక్కల ప్రకారం అడ్వాన్స్ ట్యాక్స్ మార్చి 15 లోపల చెల్లించండి. పాత సంవత్సరాల విషయంలో నోటీసులు రావచ్చు. మిమ్మల్ని హెచ్చరిస్తారు. సూచనలు చేస్తారు. ఒక రాయి విసురుతారు. వాటి సారాంశాన్ని బట్టి మీరు రిటర్నులను రివైజ్ చేసుకోవచ్చు. ముందు రాబోయే ఆపదల కన్నా, ఎంక్వైరీలకన్నా, అసెస్మెంట్ కన్నా, పెనాల్టీల కన్నా ఉత్తమమైనది, శాంతియుతంగా క్లోజ్ అయ్యేది.. రివైజ్ రిటర్ను వేయడం. అనివార్యమైతే వెంటనే రంగంలోకి దూకండి.ఇవి కాకుండా జీఎస్టీలోని కొన్ని స్కీములకు, టీడీఎస్ల డిపాజిట్లకు, టీసీఎస్ఐ చెల్లింపులకు, వృత్తి పన్ను చెల్లింపులకు, పీఎఫ్, ఈఎస్ఐ చెల్లింపులు, రిటర్నులకు, ముఖ్యంగా టీడీఎస్ తక్కువ రేట్లతో వర్తింప చేసేందుకు లేదా వద్దనుకునేందుకు ఫారం 13 వేయాలి. అది కూడా 2026 మార్చి 15లోగా దాఖలు చేయాలి. 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త చట్టం, కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయి. కొత్త ఫారాలు వాడుకలోకి వస్తాయి. కొత్త ఫారంలో సమాచారం ఇవ్వడానికి 2026 మార్చి ముగిసేలోగా సర్వం సిద్ధం చేసుకోండి.


