Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Gold and Silver rates on 11th December 2025 in Telugu states 1
పసిడి ఊరట.. వెండి మంట!

దేశంలో వెండి ధరల మంటలు కొనసాగుతున్నాయి. మరోవైపు బంగారం ధరలు మాత్రం ఊరటనిచ్చాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరలలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధరలు (Today Gold Price) కాస్త తగ్గాయి. ఇక వెండి ధరలు మాత్రం అలాగే వరుసగా నాలుగో రోజూ ఎగిశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

stock market updates on December 11th 20252
ఫ్లాట్‌గా కదలాడుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే గురువారం ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:17 సమయానికి నిఫ్టీ(Nifty) 15 పాయింట్లు తగ్గి 25,736కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 81 పాయింట్లు నష్టపోయి 84,332 వద్ద ట్రేడవుతోంది.Today Nifty position 11-12-2025(time: 9:20 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advantages and disadvantages of Data Centers3
డేటా సెంటర్లు.. సవాళ్లపై భారత్‌ నజర్‌ వేయాల్సిందే!

అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు భారతదేశంలో డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపడం దేశ డిజిటల్ విప్లవంలో ఒక కీలక ఘట్టం. ఇంటర్నెట్, క్లౌడ్ సేవలు, కృత్రిమ మేధస్సు (AI), ఆన్‌లైన్ చెల్లింపులు (UPI), ఈ-కామర్స్ వంటి ఆధునిక డిజిటల్‌ సేవలకు డేటా సెంటర్లు మూలస్తంభాలు. భారతదేశంలో ప్రస్తుతం డేటా సెంటర్ల సంఖ్య ప్రపంచంలోని వాటితో పోలిస్తే అతి తక్కువగా (కేవలం 3% వాటా) ఉన్నప్పటికీ 2030 నాటికి వీటి సామర్థ్యం పెరుగుతుందని అంచనా. అయితే, ఈ వేగవంతమైన వృద్ధి కొన్ని కీలకమైన పర్యావరణ, మౌలిక సదుపాయాల సవాళ్లను కూడా ముందుకు తెస్తోంది.డేటా సెంటర్ల ఏర్పాటుతో లాభాలుడేటా సెంటర్ల కోసం భారత్‌లోకి దాదాపు రూ.2.6 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తుంది. మల్టీనేషనల్ కంపెనీల నుంచి విదేశీ పెట్టుబడులు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల్లో డిమాండ్ పెరిగి అనుబంధ రంగాలకు లబ్ధి చేకూరుతుంది. ఐటీ, నెట్‌వర్క్ నిర్వహణ, భద్రత, నిర్వహణ వంటి రంగాల్లో ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయి.సప్లయ్ చైన్, రవాణా, హోటల్ వంటి సేవల రంగాలలో పరోక్ష ఉద్యోగాలు వస్తాయి. డేటా సెంటర్ల అవసరాల కోసం ఫైబర్ కనెక్టివిటీ, విద్యుత్ సరఫరా వ్యవస్థలు మెరుగుపడతాయి. ఇది స్థానిక స్టార్టప్‌లు, చిన్న వ్యాపారాలకు మెరుగైన డిజిటల్ మౌలిక సదుపాయాలను అందించి, టెక్నాలజీ రంగంలో పురోగతికి దోహదపడుతుంది.డేటా స్థానికీకరణ ద్వారా భారతీయ డేటా భద్రత మెరుగుపడుతుంది.సవాళ్లు లేవా..?డేటా సెంటర్ల కోసం విద్యుత్‌, నీరు చాలా అవసరం. భారతదేశంలో ఇప్పటికే ఈ వనరుల లభ్యత, వినియోగంపై ఆందోళనలు ఉన్నాయి. డేటా సెంటర్లలో సర్వర్‌లు నిరంతరం పనిచేయడం వల్ల భారీగా వేడిని ఉత్పత్తి చేస్తాయి. దీన్ని చల్లబరచడానికి, సర్వర్‌లకు శక్తిని అందించడానికి అధిక విద్యుత్ అవసరం. భారతదేశం అధికంగా థర్మల్ విద్యుత్‌పై ఆధారపడుతున్నందున డేటా సెంటర్ల ఏర్పాటుతో కార్బన్ ఉద్గారాలు గణనీయంగా పెరిగే ప్రమాదం ఉంది.పెద్ద డేటా సెంటర్‌లు పట్టణ విద్యుత్ సరఫరా వ్యవస్థలపై ఒత్తిడి పెంచి విద్యుత్ కొరతకు దారి తీయవచ్చు. అయితే గూగుల్ వంటి కంపెనీలు తమ సెంటర్లకు పునరుత్పాదక శక్తి (Green Energy)వినియోగాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం సానుకూల అంశం. అయితే, మొత్తం డిమాండ్‌ను థర్మల్ విద్యుత్ నుంచి పునరుత్పాదక ఇంధనానికి మార్చడం తక్షణ సవాలు. దీనికి సంబంధించి మౌలిక సదుపాయాలు మెరుగుపడేలా ప్రభుత్వాలు, కంపెనీలు చర్యలు తీసుకోవాలి.నీటి నిర్వహణసర్వర్ల వేడిని తగ్గించడానికి శీతలీకరణ (Cooling) ప్రక్రియకు లక్షలాది లీటర్ల నీరు అవసరం. గూగుల్ వంటి సంస్థలు వార్షికంగా బిలియన్ల గ్యాలన్ల నీటిని వినియోగిస్తున్నట్లు అంచనాలున్నాయి. ఇప్పటికే నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో డేటా సెంటర్ల ఏర్పాటు వల్ల స్థానిక ప్రజలకు, వ్యవసాయానికి నీటి లభ్యతపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. కంపెనీల నుంచి నీటి వినియోగంపై పారదర్శకత లేకపోవడం, నియంత్రణ సంస్థల నుంచి సరైన పర్యవేక్షణ లేకపోవడం ఈ సమస్యను మరింత పెంచుతుందని గుర్తుంచుకోవాలి.సింగపూర్, అమెరికాలో వ్యతిరేకతసింగపూర్, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా డేటా సెంటర్ల ఏర్పాటుపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నట్లు తెలుస్తుంది. ఈ దేశాల్లో డేటా సెంటర్ల విస్తరణను ప్రజలు, పర్యావరణవేత్తలు పరిమితం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణాలు భారతదేశంలోని సమస్యల తరహాలోనే ఉన్నాయి. అధిక విద్యుత్ వినియోగం కోసం శిలాజ ఇంధనాలపై ఆధారపడినప్పుడు కార్బన్ ఉద్గారాలను పెంచుతుండడం. స్థానిక నీటి వనరులపై ఒత్తిడి పెంచి, ఇతర అవసరాలకు కొరత ఏర్పరచడం.అంతా ఆటోమేషన్‌..డేటా సెంటర్ల నిర్వహణ ఆటోమేటెడ్‌గా ఉంటుంది. దాంతో ఉద్యోగాలు ఎక్కువగా రాకపోవడం, ఆర్థిక ప్రయోజనం స్థానికులకు తక్కువగా ఉండటంతో ఇప్పటికే ఇవి ఉన్న ప్రాంతాల్లో వ్యతిరేకత నెలకొంటుంది. ఈ పరిణామాలను భారత్‌ నిశితంగా పరిశీలించి అందుకు తగిన విధంగా పాలసీను రూపొందించాలి. సాంకేతిక పురోగతికి డేటా సెంటర్లు అవసరమే అయినా, వనరుల స్థిరత్వం, పర్యావరణ భద్రత విషయంలో దీర్ఘకాలిక ప్రణాళిక చాలా అవసరం.ఇదీ చదవండి: 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం

SEBI Approves IPOs for Five Companies4
5 కంపెనీలు లిస్టింగ్‌కు రెడీ

ఈ కేలండర్‌ ఏడాది(2025) సరికొత్త రికార్డు నెలకొల్పే బాటలో ప్రైమరీ మార్కెట్లు పలు లిస్టింగ్‌లతో కదం తొక్కుతున్నాయి. ఇప్పటికే సెంచరీ మార్క్‌కు చేరువైన ఐపీవోలు రూ. 1.6 లక్షల కోట్లకుపైగా సమీకరించాయి. ఈ బాటలో తాజాగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మరో 5 కంపెనీలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచి్చంది. వివరాలు చూద్దాం..న్యూఢిల్లీ: పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు తాజాగా సెబీ నుంచి 5 కంపెనీలకు అనుమతి లభించింది. జాబితాలో లీప్‌ ఇండియా, ఎల్‌డొరాడో అగ్రిటెక్, మోల్బియో డయాగ్నోస్టిక్స్, టెక్నోక్రాఫ్ట్‌ వెంచర్స్, ఫుడ్‌లింక్‌ ఎఫ్‌అండ్‌బీ హోల్డింగ్స్‌(ఇండియా) చేరాయి. నిధుల సమీకరణకు వీలుగా ఈ కంపెనీలన్నీ జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలంలో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ దాఖలు చేశాయి. అయితే మరోపక్క ఐనాక్స్‌ క్లీన్‌ ఎనర్జీ, స్కై అల్లాయ్స్‌ అండ్‌ పవర్‌ వెనకడుగు వేశాయి. ఈ నెల మొదట్లో సెబీ నుంచి ఐపీవో పత్రాలను వాపస్‌ తీసుకున్నాయి. వీటిలో ఐనాక్స్‌ క్లీన్‌ ఎనర్జీ తాత్కాలికంగానే ప్రాస్పెక్టస్‌ను వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రీఐపీవో రౌండ్‌లో భాగంగా కంపెనీ ఇటీవల రూ. 5,000 కోట్లు సమకూర్చుకున్న నేపథ్యంలో ఫైనాన్షియల్స్‌పై సవరించిన ముసాయిదా పత్రాలను తిరిగి దాఖలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రూ. 2,400 కోట్లపై కన్ను పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా సప్లైచైన్‌ అసెట్‌ పూలింగ్‌ కంపెనీ లీప్‌ ఇండియా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 2,000 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారులు ఆఫర్‌ చేయనున్నారు. దీంతో లిస్టింగ్‌ ద్వారా రూ. 2,400 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 300 కోట్లు రుణ చెల్లింపులకు, మిగిలిన నిధులను వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు వెచి్చంచనుంది. రూ. 1,000 కోట్లకు రెడీ శ్రీకార్‌ సీడ్స్‌ బ్రాండ్‌ కంపెనీ ఎల్‌డొరాడో అగ్రిటెక్‌ ఐపీవోలో భాగంగా రూ. 340 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 660 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 1,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. విత్తనాలుసహా.. సస్యరక్షణ సొల్యూషన్స్‌ సమకూర్చే తెలంగాణ కంపెనీ ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 245 కోట్లు రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. పీఈ సంస్థల వాటాలు పీఈ సంస్థలు టెమాసెక్, మోతీలాల్‌ ఓస్వాల్‌కు పెట్టుబడులున్న మోల్బియో డయాగ్నోస్టిక్స్‌ ఐపీవోలో భాగంగా రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా వీటికి జతగా మరో 1.25 కోట్ల షేర్లను కంపెనీ ప్రస్తుత వాటాదారులు ఆఫర్‌ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 99 కోట్లు కొత్త ఆర్‌అండ్‌డీ యూనిట్‌(ఎక్సలెన్స్‌ సెంటర్, ఆఫీస్‌ స్పేస్‌) ఏర్పాటుకు వెచి్చంచనుంది. కేంద్రీకృత కిచెన్ల ఏర్పాటు కేటరింగ్, ఫుడ్‌ రిటైల్‌ చైన్‌ కంపెనీ ఫుడ్‌లింక్‌ ఎఫ్‌అండ్‌బీ హోల్డింగ్స్‌(ఇండియా) ఐపీవోలో భాగంగా రూ. 160 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.19 కోట్ల షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను కొత్త కేంద్రీకృత కిచెన్ల ఏర్పాటుతోపాటు, మెటీరియల్‌ అనుబంధ సంస్థ ఫుడ్‌లింక్‌ గ్లోబల్‌ రెస్టారెంట్స్‌ అండ్‌ కేటరింగ్‌ సర్వీసెస్‌ కొత్తగా నెలకొల్పనున్న క్యాజువల్‌ డైనింగ్‌ రెస్టారెంట్లకు వినియోగించనుంది. ఇండియా బిస్ట్రో, ఆర్ట్‌ ఆఫ్‌ దమ్, చైనా బిస్ట్రో తదితర బ్రాండ్లతో 30 క్యాజువల్‌ రెస్టారెంట్లు, క్లౌడ్‌ కిచెన్లను నిర్వహిస్తోంది. తాజా ఈక్విటీ, ఓఎఫ్‌ఎస్‌ ఐపీవోలో భాగంగా వేస్ట్‌వాటర్‌ ట్రీట్‌మెంట్‌ సొల్యూషన్లు అందించే టెక్నోక్రాఫ్ట్‌ వెంచర్స్‌ 95.05 లక్షల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 23.76 లక్షల షేర్లను కంపెనీ ప్రమోటర్‌ సంస్థ కార్తికేయ కన్‌స్ట్రక్షన్స్‌ ఆఫర్‌ చేయనుంది. ఈక్విటీ జారీ నిధులలో రూ. 138 కోట్లు వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు కేటాయించనుంది. రెండు కంపెనీల దరఖాస్తు జాబితాలో స్టీమ్‌హౌస్‌ ఇండియా సిటియస్‌ ట్రాన్స్‌నెట్‌ ఇన్వెస్ట్‌ ట్రస్ట్‌ రవాణా సంబంధ మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు చేపట్టే సిటియస్‌ ట్రాన్స్‌నెట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌(ఇన్విట్‌) పబ్లిక్‌ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుమతించమంటూ సెబీకి ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసింది. దీనిలో భాగంగా యూనిట్ల జారీ ద్వారా రూ. 1,340 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇష్యూ నిధుల్లో రూ. 1,235 కోట్లు ఎస్‌ఆర్‌పీఎల్‌లో సెక్యూరిటీల కొనుగోలు, టీఈఎల్, జేఎస్‌ఈఎల్, ధోలా, డిబంగ్‌ తదితర ఎస్‌పీవీ ప్రాజెక్టులలో పెట్టుబడులు చేపట్టనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచ్చించనుంది. దాదాపు 3,407 కిలోమీటర్ల పోర్ట్‌ఫోలియో(ఆస్తులు)ను కలిగి ఉంది. గతేడాది(2024–25) రూ. 1,987 కోట్ల ఆదాయం, రూ. 418 కోట్ల నికర నష్టం ప్రకటించింది. రూ. 425 కోట్లకు సై ఇండ్రస్టియల్‌ స్టీమ్, గ్యాస్‌ సరఫరా చేసే స్టీమ్‌హౌస్‌ ఇండియా ఐపీవోకు వీలుగా సెబీకి అప్‌డేటెడ్‌ ప్రాస్పెక్టస్‌ను జత చేసింది. జూలైలో గోప్యతా విధానంలో దరఖాస్తు చేయడంతో తాజాగా పత్రాలు దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 345 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 80 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్‌ ఆఫర్‌ చేయనున్నారు. తద్వారా 425 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, అంకలేశ్వర్, పనోలీ యూనిట్ల విస్తరణకు, దహేజ్‌లో కొత్త స్టీమ్‌ జనరేషన్‌ యూనిట్‌ ఏర్పాటుకు వినియోగించనుంది. 2024–25లో రూ. 395 కోట్ల ఆదాయం, రూ. 31 కోట్ల నికర లాభం ఆర్జించింది.

New Kia Seltos Unveiled in India5
కియా నుంచి కొత్త సెల్టోస్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆటోమొబైల్‌ దిగ్గజం కియా ఇండియా తాజాగా సరికొత్త సెల్టోస్‌ వెర్షన్‌ని ప్రవేశపెట్టింది. భద్రత, టెక్నాలజీ, డిజైన్‌కి ప్రాధాన్యమిస్తూ మిడ్‌సైజ్‌ ఎస్‌యూవీ విభాగంలో మరింత విశాలమైనదిగా దీన్ని తీర్చిదిద్దినట్లు బుధవారమిక్కడ నిర్వహించిన గ్లోబల్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కంపెనీ ఎండీ గ్వాంగు లీ తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలు, భారతీయ పరిస్థితులకు అనుగుణంగా కొత్త సెల్టోస్‌ను రూపొందించినట్లు చెప్పారు. వినూత్న స్టైలింగ్, ప్రీమియం ఇంటీరియర్స్, ఏడీఏఎస్‌ లెవెల్‌ 2, బోస్‌ 8–స్పీకర్‌ ఆడియో, 30 అంగుళాల పనోరమిక్‌ డిస్‌ప్లే ప్యానెల్‌ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నట్లు చీఫ్‌ సేల్స్‌ ఆఫీసర్‌ సున్‌హాక్‌ పార్క్, సీనియర్‌ వీపీ అతుల్‌ సూద్‌ వివరించారు. దీనికి దేశవ్యాప్తంగా బుకింగ్స్‌ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ప్రాథమికంగా రూ. 25,000 కట్టి బుక్‌ చేసుకోవచ్చు. తుది ధరను జనవరి 2న ప్రకటిస్తామని, డెలివరీలు ఆ నెల మధ్య నుంచి ప్రారంభమవుతాయని పార్క్‌ తెలిపారు. దేశీయంగా 5,80,000 పైచిలుకు సెల్టోస్‌ వాహనాలను కియా విక్రయించింది.

Microsoft to Intel, the bold bet on India technology ecosystem6
టెక్‌ దిగ్గజాల పెట్టుబడులజోరు.. 

సాంకేతిక ఆవిష్కరణలకు భారత్‌ మెగా హబ్‌గా మారే దిశగా చురుగ్గా అడుగులు పడుతున్నాయి. అంతర్జాతీయ టెక్‌ దిగ్గజాలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. మైక్రోసాఫ్ట్‌ నుంచి ఇంటెల్‌ వరకు పలు అగ్రగామి సంస్థలు వరుస కడుతున్నాయి. దేశీయంగా డేటా సెంటర్లు, ఏఐ ఆవిష్కరణలకు ప్రోత్సాహం లభించడంతో పాటు లక్షల సంఖ్యలో ఉద్యోగాల కల్పనకు కూడా అవకాశాలు పెరుగుతున్నాయి. న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన సందర్భంగా మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల 17.5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. నాలుగేళ్ల వ్యవధిలో క్లౌడ్, కృత్రిమ మేధ (ఏఐ) మౌలిక సదుపాయాల కల్పనపై ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారు. ఆసియాలో మైక్రోసాఫ్ట్‌ ఇంత భారీగా ఇన్వెస్ట్‌ చేయడం ఇదే ప్రథమం. భారత్‌ సాంకేతిక సామర్థ్యాలపై కంపెనీకి గల నమ్మకానికి ఇది నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక చిప్‌ దిగ్గజం ఇంటెల్‌ కూడా భారత్‌ సెమీకండక్టర్ల లక్ష్యాల సాధనకు మద్దతుగా నిల్చేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం టాటా ఎలక్ట్రానిక్స్‌తో జట్టు కట్టింది. కంపెనీ సీఈవో లిప్‌–బు టాన్‌ ప్రధాని మోదీతో కూడా సమావేశమయ్యారు. అటు మరో అగ్రగామి సంస్థ అమెజాన్‌ సైతం భారత్‌పై మరింతగా దృష్టి పెడుతోంది. ఏఐ, ఎగుమతులు, ఉద్యోగాల కల్పనపై 35 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేయనుంది. ఇక్కడ అదనంగా పది లక్షలకుపైగా ఉద్యోగావకాశాలను కల్పించాలనే ప్రణాళికల్లో ఉంది. భారత్‌ నుంచి 80 బిలియన్‌ డాలర్ల ఈ–కామర్స్‌ ఎగుమతులను లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇక సెర్చ్‌ దిగ్గజం గూగుల్‌ .. వైజాగ్‌లో డేటా సెంటర్‌పై 15 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేస్తోంది. ఓపెన్‌ఏఐ కూడా భారత్‌లో డేటా హబ్‌ ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. రియల్టీకి కూడా ఊతం.. దేశవ్యాప్తంగా డేటా సెంటర్లను నిర్మించడంపై పెద్ద సంస్థలు ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో రియల్‌ ఎస్టేట్‌ రంగానికి కూడా ఊతం లభించనుంది. డేటా సెంటర్ల రాకతో నిర్మాణ, రిటైల్, నిర్వహణ విభాగాల్లో పెద్ద సంఖ్యలో పరోక్ష ఉద్యోగాలకు ఊతం లభించనుంది. వైజాగ్‌లో గూగుల్‌ ఏఐ, డేటా సెంటర్‌ హబ్‌తో 1,00,000 పైగా ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని అంచనా. కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ అధ్యయనం ప్రకారం డేటా సెంటర్లతో వచ్చే ఒక్క ప్రత్యక్ష ఉద్యోగంతో ఆరు రెట్లు పరోక్ష ఉద్యోగాల కల్పన జరిగే అవకాశం ఉంది. ఏఐ డేటా సెంటర్‌ బూమ్‌తో ఇంజినీర్లు, ఐటీ నిపుణులు, నిర్మాణ రంగ వర్కర్లు, రిటైల్‌ తదితర పరి శ్రమలలో మరింత ఉద్యోగ కల్పన జరగనుంది. – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Advertisement
Advertisement
Advertisement