Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Bus Segment Set for Strong Summer Growth on Airfare Spike: Rohit Sharma1
వేసవి ఛాయిస్‌.. బస్సే బిగ్‌బాస్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: విమాన చార్జీలు పెరగడం, రైళ్ల రద్దీ తదితర అంశాల నేపథ్యంలో వేసవి సీజన్లో బస్సు ప్రయాణాలకు గణనీయంగా డిమాండ్‌ పెరగనున్నట్లు అభిబస్‌ సీవోవో రోహిత్‌ శర్మ చెప్పారు. ఇక పండుగలు, పెళ్లిళ్లు, తమిళనాడు .. పుదుచ్చేరి మొదలైన చోట్ల ఎన్నికలు జరగనుండటం కూడా ప్రయాణాలకి దోహదపడనున్నట్లు ఆయన చెప్పారు. క్రూడాయిల్‌ రేట్ల పెరుగుదలతో విమాన ప్రయాణాలు భారంగా మారడమనేది, పరోక్షంగా బస్సు ఆపరేటర్లకు ప్రయోజనం చేకూర్చనుందని పేర్కొన్నారు.సాధారణంగా విమానాలు, రైళ్లు, వ్యక్తిగత వాహనాలతో బస్సుల సెగ్మెంట్‌ పోటీ పడాల్సి ఉంటుందని తెలిపారు. అయితే, ఫ్లయిట్‌ చార్జీలు పెరిగినా, రైల్వే వెయిటింగ్‌ లిస్టులు పెరిగినా.. బస్సులకు మరింత డిమాండ్‌ ఏర్పడుతుందన్నారు. పీక్‌ సీజన్‌లో ప్రయాణికులను ఆకర్షించేందుకు 25 శాతం వరకు డిస్కౌంట్‌ అందిస్తున్నట్లు శర్మ వివరించారు. హైదరాబాద్‌–విజయవాడలాంటి కీలక రూట్లలో డిమాండ్‌ ఉంటోందని శర్మ చెప్పారు.పింక్‌ సీట్‌ ఆప్షన్‌లాంటి భద్రతా ఫీచర్ల కారణంగా సోలోగా ప్రయాణించే మహిళల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. హోలీ పండుగ వారానికి సంబంధించి అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఏకంగా 70 శాతం పెరగ్గా, మహిళల ప్యాసింజర్ల సంఖ్య 80 శాతం పెరిగినట్లు శర్మ వివరించారు. 6.5 లక్షల రూట్లలో 6,200 ఆపరేటర్లకు అగ్రిగేటరుగా వ్యవహరిస్తున్న అభిబస్‌.. ఈ విభాగంలో రెండో స్థానంలో ఉంది. ఉబర్‌తో జట్టు..ఇంటర్‌సిటీ బస్‌ టికెట్‌ బుకింగ్స్‌ సదుపాయాన్ని మరింతగా అందుబాటులోకి తెచ్చేలా ఉబర్‌తో కూడా చేతులు కలిపినట్లు శర్మ చెప్పారు. దీనితో ఉబర్‌ యాప్‌ నుంచే నేరుగా పలు ప్రాంతాలకు బస్‌ టికెట్లను బుక్‌ చేసుకునే వీలుందని ఆయన వివరించారు. ప్రస్తుతం 17 రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలతో కలిసి పని చేస్తున్నామన్నారు. టీఎస్‌ఆర్‌టీసీ, కేఎస్‌ఆర్‌టీసీ మొదలైనవి వీటిలో ఉన్నాయి.ఇక అష్యూర్డ్‌ ప్రోగ్రాం కింద బస్సుల జాప్యం, రద్దు లాంటి సేవల నాణ్యత లోపాలకు 150% వరకు రీఫండ్‌ ఆఫర్‌ చేస్తున్నామని, ప్రస్తుతం ఈ ప్రోగ్రాంలో సుమారు 360 మంది ఆపరేటర్లు చేరారని శర్మ చెప్పారు. ఆన్‌లైన్‌ ట్రావెల్‌ సంస్థ ఇక్సిగోలో భాగమైన అభిబస్‌ ప్లాట్‌ఫాంపై 2026 ఆర్థిక సంవత్సరం క్యూ3లో స్థూల లావాదేవీల విలువ (జీటీవీ) 36% వృద్ధితో రూ. 670.9 కోట్లకు చేరగా, ఆదాయం 47% పెరిగి రూ. 75.5 కోట్లకు చేరింది. ప్రయాణికుల సంఖ్య 33% పెరిగి 67.3 లక్షలకు చేరింది.

Silver Plunges Rs 11250 Per Kg and Gold Falls Rs 1900 In Delhi2
వెండి మళ్లీ వెనక్కి

న్యూఢిల్లీ: వెండి, బంగారం మరోసారి అమ్మకాల ఒత్తిడికి కుదేలయ్యాయి. శుక్రవారం ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి రూ.11,250 నష్టపోయి రూ.2.3 లక్షలకు దిగొచ్చింది. బంగారం సైతం 10 గ్రాములకు రూ.1,900 తగ్గి రూ.1,47,800 స్థాయికి చేరింది. శ్రీరామనవమిని పురస్కరించుకుని గురువారం బులియన్‌ మార్కెట్లు పనిచేయలేదు. చమురు ధరలు గరిష్ట స్థాయిల్లో ఉండడం, అంతర్జాతీయ పరిణామాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్‌ గోల్డ్‌ ఔన్స్‌కు 37 డాలర్లు లాభపడి 4,416 డాలర్ల స్థాయి వద్ద, వెండి ఔన్స్‌కు స్వల్ప లాభంతో 68.12 డాలర్ల స్థాయిలో ట్రేడయ్యాయి. ‘‘చమురు ధరలు బలహీనపడడంతో బంగారం ధర 4,420 డాలర్ల వరకు వెళ్లింది. కానీ, తర్వాత చమురు ధరల పెరుగుదలతో దిగొచ్చింది’’అని మిరే అసెట్‌ షేర్‌ఖాన్‌ కమోడిటీస్‌ హెడ్‌ ప్రవీణ్‌సింగ్‌ తెలిపారు. యూఎస్‌ ద్రవ్యోల్బణం డేటా సమీప కాలంలో బులియన్‌ ధరలను ప్రభావితం చేయొచ్చన్నారు.

Stock Market: Sensex crashes 1690 points and Nifty below 230003
మళ్లీ బేర్‌ ఎటాక్‌!

ముంబై: పశ్చిమాసియా యుద్ధం మరింత భీకరంగా మారడంతో దలాల్‌ స్ట్రీట్‌ మళ్లీ బేర్‌ గుప్పిట్లోకి వచ్చింది. అమెరికా–ఇరాన్‌ మధ్య జరగాల్సిన శాంతి చర్చలు ఇంకా ప్రతిష్టంభనలోనే కొనసాగుతున్నాయి. చమురు సరఫరా ఆందోళనలతో బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌ 107 డాలర్లకు ఎగసింది. రూపాయి విలువ రికార్డు కనిష్టానికి దిగివచ్చింది. విదేశీ ఇన్వెస్టర్లు గత 19 రోజులుగా దేశీయ ఈక్విటీలను విక్రయిస్తూనే ఉన్నారు. అమెరికాలో ట్రెజరీ బాండ్లపై రాబడులు అనూహ్యంగా పెరిగాయి. ఈ పరిణామాలతో శుక్రవారం సెన్సెక్స్‌ 1,690 పాయింట్లు కోల్పోయి 73,583 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 487 పాయింట్లు పతనమై 22,820 వద్ద నిలిచింది. సూచీల 2% పతనంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.8.86 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.422.15 లక్షల కోట్లకు దిగిచ్చింది. ఆసియాలో జపాన్, ఇండోనేషియా, తైవాన్, థాయిలాండ్‌ మార్కెట్లు 1–50% నష్టపోయాయి. చైనా, హాంగ్‌కాంగ్, సింగపూర్‌ సూచీలు 0.50% మేర లాభడ్డాయి. యూరప్‌లో జర్మనీ డాక్స్‌ ఇండెక్సు 1.37%, ఫ్రాన్స్‌ సీఏసీ సూచీ 0.72%, బ్రిటన్‌ ఎఫ్‌టీఎస్‌ఈ ఇండెక్సు 0.30 శాతం నష్టపోయాయి. అమెరికా స్టాక్‌ సూచీలు 1.50 శాతం పతనంతో ట్రేడవుతున్నాయి. రోజంతా అమ్మకాలు...బలహీన అంతర్జాతీయ సంకేతాలతో ఉదయమే సూచీలు నష్టాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్‌ ఆద్యంతం అమ్మకాలు ఒత్తిడితో సూచీలు రోజంతా నష్టాల్లో కదలాడాయి. ఒకానొక దశలో సెన్సెక్స్‌ 1,739 పాయింట్లు క్షీణించి 73,534 వద్ద, నిఫ్టీ 501 పాయింట్లు పతనమై 22,805 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. బీఎస్‌ఈలో రంగాల వారీగా ప్రభుత్వరంగ బ్యాంక్‌ సూచీ 4%, రియల్టీ 3.10% పతనమయ్యాయి. మిడ్, స్మాల్‌ క్యాప్‌ సూచీలు వరుసగా 2.12%, 1.77 శాతం నష్టపోయాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు పెరగడం, ప్రభుత్వం డీజిల్, ఏటీఎఫ్‌ ఎగుమతులపై మళ్ళీ ‘విండ్‌ఫాల్‌ టాక్స్‌’ విధించడంతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 4.55% క్షీణించి రూ.1,348 వద్ద స్థిరపడింది.

Reliance Industries Shares Slump 4 Percent4
అంబానీ సంస్థకు రూ.80 వేల కోట్ల లాస్!

భారతదేశపు అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) షేర్లు శుక్రవారం ట్రేడింగ్ ముగిసిన సమయానికి కుప్పకూలాయి. ఎగుమతి పన్ను విధించాలన్న ప్రభుత్వ ఆదేశం.. అధిక చమురు ధరలు, భారత మార్కెట్‌పై ప్రభావం చూపుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో.. సంస్థ షేర్లు మార్చి 27, శుక్రవారం నాటి ఇంట్రాడే ట్రేడింగ్ సెషన్‌లో 4% పైగా పడిపోయాయి. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం-క్యాప్)లో సుమారు రూ.80,000 కోట్ల నష్టం వాటిల్లింది.ఎన్‌ఎస్‌ఈ వెబ్‌సైట్ డేటా ప్రకారం.. బుధవారం మార్కెట్ ముగింపులో సుమారు రూ.19.12 లక్షల కోట్లుగా ఉన్న రిలయన్స్ మార్కెట్ క్యాప్, శుక్రవారం మార్కెట్ సెషన్‌లో సుమారు రూ.80,000 కోట్లు తగ్గి రూ.18.32 లక్షల కోట్లకు పడిపోయింది.శుక్రవారం మార్కెట్ సెషన్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 4.23% పడిపోయి ఇంట్రాడే కనిష్ట స్థాయి అయిన రూ.1,353.20కి చేరాయి. అంతకుముందు మార్కెట్ ముగింపులో ఈ షేర్ల ధర రూ.1,413.10గా ఉంది. మధ్యాహ్నం 12:45 గంటల సమయానికి, స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఆర్‌ఐఎల్ షేర్లు 4.13% నష్టంతో రూ.1,354.80 వద్ద ట్రేడ్ అయ్యాయి.ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఎగుమతి పన్ను విధించినట్లు.. మార్చి 27న కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. విదేశాలకు ఎగుమతి చేసే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) తమ వ్యాపారాన్ని కొనసాగించడానికి ఈ ఎగుమతి పన్నును ఇప్పుడు తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది.నేటి స్టాక్ మార్కెట్శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,690.23 పాయింట్లు లేదా 2.25 శాతం నష్టంతో 73,583.22 వద్ద, నిఫ్టీ 486.85 పాయింట్లు లేదా 2.09 శాతం నష్టంతో 22,819.60 వద్ద నిలిచాయి.ఇదీ చదవండి: ఒక్క యాప్.. 2400 సేవలు: దీని గురించి తెలుసా?

Rich Dad Poor Dad Author Robert Kiyosaki Tweet About 2026 Crash5
కియోసాకి హెచ్చరిక: అదే నిజమైతే.. లక్షలాది మంది పేదలవుతారు!

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించిన సూచనలు ఇచ్చే కియోసాకి.. తాజాగా ఒక ట్వీట్ చేశారు. ఇందులో 2026 క్రాష్?, అని పేర్కొంటూనే.. 1500వ సంవత్సరంలో నోస్ట్రాడమస్, 2026లో ప్రపంచాన్ని ఒక విపత్తు తాకుతుందని చెప్పారని వెల్లడించారు. ఈ ట్వీట్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే క్షమాపణలు అంటూ మరో ట్వీట్ చేశారు. కియోసాకి ఎందుకిలా చేశారు?, దీనికి గల కారణం ఏమిటనేది ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.మొదటి ట్వీట్''1500వ సంవత్సరంలో నోస్ట్రాడమస్, 2026లో ప్రపంచాన్ని ఒక విపత్తు తాకుతుందని చెప్పారు. 1950లో ఎడ్గార్ కేస్ కూడా 2026లో ఒక భారీ పతనం సంభవిస్తుందని అంచనా వేశారు. మీరేమనుకుంటున్నారు?.. 2026లో ఒక భారీ పతనం సంభవిస్తే, మీరు ధనవంతులు అవుతారా లేక పేదవారు అవుతారా?, నేను ధనవంతుడిని కావాలని అనుకుంటున్నాను'' అని కియోసాకి ట్వీట్ చేశారు.2026 CRASH?FUTURISTS:Nostradamus in 1500 said disaster would hit the world in 2026.Edgar Cayce in 1950 also predicted a massive crash occurring in 2026.What do you think?You may want to tune into YouTube videos for more details on these two famous futurist predictions.…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 27, 2026రెండో ట్వీట్క్షమించండి అని పేర్కొంటూ.. మొదటి పోస్ట్‌లో, 2026లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం ప్రారంభమవుతుందని భవిష్యత్ శాస్త్రవేత్తలైన నోస్ట్రాడమస్ (1500) మరియు ఎడ్గార్ కేసీ (1940) చేసిన అంచనాను నేను వెల్లడించాను. ఆ తరువాత ఒక స్నేహితుడు నన్ను సంప్రదించాడు.. 2026 సంక్షోభ సమయంలో నేను ధనవంతుడిని అవుతానని చెప్పినందుకు అతను నాపై కోపంగా ఉన్నాడని పేర్కొన్నారు.అతని సమస్య ఏమిటంటే.. మీలో చాలామంది అనుసరించినట్లుగా అతను నా పోస్ట్‌ను ఎప్పుడూ అనుసరించలేదు. అంతే కాకుండా.. ఒక సంక్షోభంలో ధనవంతులు కావాలని మీరు, నేను ప్రణాళిక వేసుకున్న విషయం అతనికి తెలియదు.నన్ను అనుసరించే అందరికీ.. నేను S&P 500, యూఎస్ బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు వంటి స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టనని, లేదా నగదును పొదుపు చేయనని ఇప్పటికే తెలుసు. ప్రభుత్వం, బ్యాంకులు లేదా వాల్ స్ట్రీట్ ముద్రించే దేనిలోనూ నేను పెట్టుబడి పెట్టను. అంతే కాకుండా.. నన్ను అనుసరించే వారికి నేను KISS (కీప్ ఇట్ సూపర్ సింపుల్) సూత్రాన్ని పాటిస్తానని కూడా తెలుసు.MY APOLOGIES:In my previous X I quoted futurists Nostradamus’ 1500 and Edgar Caycees 1940 prediction that a global economic crisi would begin in 2026. A friend contacted me. He was upset with me because I stated I was going to richer during the 2026 crisis.His problem was…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 27, 2026నేను పశువులను పెంచి అమ్ముతాను, టెక్సాస్, నార్త్‌లోని నా చమురు బావుల నుంచి చమురును అమ్ముతాను, అప్పుతో కొనుగోలు చేసిన 1500 అద్దె యూనిట్లను నెలవారీగా అద్దెకు ఇస్తాను, నేను అసలైన బంగారం, వెండి, బిట్‌కాయిన్, మరియు ఎథేరియంలను పొదుపు చేస్తాను. మీలో చాలా మందిలాగే, నా దగ్గర కూడా మొదట్లో డబ్బు లేదు. కానీ చిన్న చిన్న ఆస్తులను కొని సంవత్సరాల తరబడి ఉంచుకున్నాను, వాటిని ఎప్పుడూ అమ్మలేదు. మీలో చాలా మందికి నేను నా మొదటి 6 బిట్‌కాయిన్‌లను $600కి కొన్నానని తెలుసు, నా దగ్గర ఉన్న డబ్బంతా అదే, మరియు నేను కొన్ని రోజుల పాటు ఏమీ తినలేదు.ఇక చివరగా.. నోస్ట్రాడమస్, ఎడ్గార్ కేస్ చెప్పినట్లు 2026లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం వస్తుందా?, రాదా అని నాకు తెలియదు. కానీ ఒకవేళ అది నిజమైతే.. నా మాట విన్న మీరు, నేను ధనవంతులమవుతామని నాకు గట్టి నమ్మకం ఉంది. అదే సమయంలో లక్షలాది మంది పేదలుగా మిగిలిపోతారు.ఇదీ చదవండి: గరిష్టాల నుంచి డౌన్.. రూ.1.60 లక్షలు తగ్గిన వెండి!భవిష్యత్తును చూడగలిగే పెట్టుబడిదారులే ధనవంతులవుతారు. నాకు నిజమైనవి (విలువైన లోహాలు) ఇష్టం. నకిలీవి (కరెన్సీ) అంటే ద్వేషం. నువ్వేం చేయబోతున్నావు?. ఆలోచించి.. ఏమీ చేయని లక్షలాది మందిలా ఉండకు. అలోచించి నిర్ణయం తీసుకో అని కియోసాకి ట్వీట్ చేశారు.

Stock Market Closing Update 27th March 20266
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!

శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,690.23 పాయింట్లు లేదా 2.25 శాతం నష్టంతో 73,583.22 వద్ద, నిఫ్టీ 486.85 పాయింట్లు లేదా 2.09 శాతం నష్టంతో 22,819.60 వద్ద నిలిచాయి.హిల్టన్ మెటల్ ఫోర్జింగ్ లిమిటెడ్, హెచ్ఈజీ లిమిటెడ్, కృతి ఇండస్ట్రీస్ (ఇండియా) లిమిటెడ్, సుప్రీం పెట్రోకెమ్ లిమిటెడ్, RPSG వెంచర్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. నాగ ధున్సేరి గ్రూప్ లిమిటెడ్, మిట్టల్ లైఫ్ స్టైల్ లిమిటెడ్, MBL ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, షెమరూ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్, ఆర్చీస్ లిమిటెడ్ వంటి సంస్థలు నష్టాల్లో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.

Advertisement
Advertisement
Advertisement