Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Volvo Car India Announces Price Hike Of Up To Rs 1 Lakh From May 11
వోల్వో కీలక ప్రకటన: రూ.లక్ష వరకు పెరగనున్న ధరలు!

వోల్వో కార్ ఇండియా.. 2026 మే 1 నుంచి తమ కార్ల ధరలను లక్ష రూపాయల వరకు పెంచుతున్నట్లు ధృవీకరించింది. ఇటీవల పెరుగుతున్న ఖర్చుల కారణంగా ఆడి, మెర్సిడెస్-బెంజ్, బీఎండబ్ల్యూ వంటి ఇతర లగ్జరీ బ్రాండ్‌లు కూడా ధరలను సర్దుబాటు చేయవలసి వస్తున్న నేపథ్యంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.వోల్వో భారత పోర్ట్‌ఫోలియోలో నాలుగు ప్రధాన మోడళ్లు ఉన్నాయి. అవి EX30, EC40, XC60, XC90. ప్రతి మోడల్‌కు సంబంధించిన నిర్దిష్ట ధరల పెంపులను కంపెనీ వెల్లడించనప్పటికీ, అన్ని వేరియంట్‌ల ధరలను గరిష్టంగా రూ.1 లక్షకు పరిమితం చేయనున్నట్లు సమాచారం.కొత్త ధరలు మే 1వ తేదీ నుంచి బుకింగ్‌లు, డెలివరీలకు వర్తిస్తాయి. అంటే అంతకు ముందు బుక్ చేసుకున్న లేదా కొనుగోలు చేసే కార్లకు పాత ధరలే వర్తిస్తాయి. కాగా వోల్వో కార్ ఇండియా దేశవ్యాప్తంగా 23 షోరూమ్‌లు మరియు 25 సర్వీస్ సెంటర్ల నెట్‌వర్క్‌ను నిర్వహిస్తోంది.

India to Rank Among Renaults Top 3 Global Markets CEO François Provost2
టాప్‌ 3 మార్కెట్లలో భారత్‌: ప్రముఖ సీఈఓ

రాబోయే రోజుల్లో భారత్‌ తమ టాప్‌ 3 మార్కెట్లలో ఒకటిగా ఉంటుందని ఫ్రెంచ్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం రెనో గ్లోబల్‌ గ్రూప్‌ సీఈవో ఫ్రాంకోయిస్‌ ప్రొవోస్ట్‌ తెలిపారు. దేశీయంగా 5 శాతం మార్కెట్‌ వాటాను దక్కించుకోవాలని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా కొత్త మోడల్స్‌ని ప్రవేశపెట్టడం ద్వారా 2030 నాటికి తమ పోర్ట్‌ఫోలియోని ఏడు మోడల్స్‌కి విస్తరిస్తామని వివరించారు. అలాగే, అప్పటికల్లా విడిభాగాలు, టెక్నాలజీ సహా భారత్‌ నుంచి ఏటా 2 బిలియన్‌ యూరోల విలువ చేసే ఎగుమతులను టార్గెట్‌గా పెట్టుకున్నట్లు ప్రొవోస్ట్‌ వివరించారు.కాంపాక్ట్‌ ఎస్‌యూవీ ’బ్రిడ్జర్‌ కాన్సెప్ట్‌’ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. భారత్‌లో రెనో గ్రూప్‌కి సంబంధించి తొలి పూర్తి ఎలక్ట్రిక్‌ వాహనంగా, తమ విద్యుత్‌ కార్ల ప్రస్థానంలో ఇది కీలకంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ప్రవేశపెట్టిన కొత్త డస్టర్‌కి భారీ స్పందన లభిస్తోందని చెప్పారు. తమ గ్రూప్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మార్కెట్లలో మొత్తం వాహనాల పరిమాణంపరంగా భారత్‌ వాటా మూడో వంతు పైగా ఉంటుందని, అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటిగా ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా తమ ఫ్యూచర్‌రెడీ ప్రణాళికల్లో భాగంగా భారత్‌తో పాటు యూరప్, దక్షిణ అమెరికాలో 36 మోడల్స్‌ని ప్రవేశపెట్టనున్నట్లు ప్రొవోస్ట్‌ చెప్పారు.

TCS Nashik Case Shocking Allegations of Harassment and Abuse Surface3
TCS నాసిక్ కేసు: వెలుగులోకి సంచలన విషయాలు!

ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నాసిక్ శాఖకు సంబంధించిన తీవ్రమైన ఆరోపణలు వెలుగులోకి రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక మాజీ మహిళా ఉద్యోగి చేసిన ఆరోపణల ప్రకారం.. అక్కడ కొంతమంది టీమ్ లీడర్లు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ మహిళా ఉద్యోగులపై మానసికంగా, లైంగికంగా వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది.మహిళలను టీమ్ లీడర్ల డెస్క్ దగ్గరకు పిలిచే సమయంలో అసభ్యకరమైన, అవమానకరమైన భాషను ఉపయోగించేవారని చెప్పారు. ఒక ప్రొఫెషనల్ కార్యాలయంలో ఊహించలేని విధంగా అసభ్య ప్రవర్తన కొనసాగిందని ఆమె వెల్లడించారు. ముఖ్యంగా తౌసిఫ్ అత్తర్ అనే వ్యక్తి హిందూ సంప్రదాయాలను లక్ష్యంగా చేసుకుని, పండుగల సమయంలో చీరలు లేదా బొట్టులు ధరించిన మహిళలను అవమానించేవాడని ఆరోపించారు.ఒక సహోద్యోగి కృష్ణ రుద్రాక్ష మాలను ధరించేవాడని, తరువాత మత మార్పిడి చేసుకున్నాడని కూడా ఆమె పేర్కొన్నారు. నిదా ఖాన్ అనే ఉద్యోగి పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమె హెచ్‌ఆర్ కాకపోయినా, ఇతర విభాగాలకు మారేందుకు ప్రయత్నించడం అనుమానాస్పదంగా ఉందని ఆరోపించారు.ఆఫీసులో భద్రత పేరుతో ఉద్యోగులు తమ మొబైల్ ఫోన్లు, బ్యాగులు, లంచ్ బాక్సులు బయట ఉంచాల్సి వచ్చేదని, దీని వల్ల లోపల జరిగే కార్యకలాపాలు రికార్డు కాకుండా ఉండేవని తెలిపారు. డానిష్, రాజా వంటి ఉద్యోగులు వీకెండ్లలో హోటళ్లు బుక్ చేసి మహిళలను ఒత్తిడి చేసి తీసుకెళ్లేవారని కూడా ఆరోపణలు ఉన్నాయి.ఈ ఘటనల వల్ల కార్యాలయ వాతావరణం పూర్తిగా విషపూరితంగా మారిందని, ఉద్యోగం వదిలిన తర్వాత మాత్రమే తాను సురక్షితంగా ఉన్నానని ఆ మహిళ తెలిపారు. ఇంత పెద్ద సంస్థలో ఉన్న ఉన్నతాధికారులకు ఈ వ్యవహారాలు తెలియకపోవడం ఆశ్చర్యకరమని ఆమె ప్రశ్నించారు.ఈ కేసు ఒక్క వ్యక్తి ఆరోపణలతో మాత్రమే కాకుండా.. మొత్తం ఎనిమిది మంది మహిళా ఉద్యోగులు చేసిన ఫిర్యాదుల ఆధారంగా వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 2022 నుంచి మార్చి 2026 వరకు జరిగిన మానసిక, లైంగిక వేధింపులపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయబడింది.ఇప్పటివరకు ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేశారు. వారిలో తౌసిఫ్ అత్తర్, డానిష్ షేఖ్, రాజా మెమన్, షారుఖ్ ఖురేషి, షఫీ షేఖ్, ఆసిఫ్ అఫ్తాబ్ అన్సారీ, నిదా ఖాన్ ఉన్నారు. ఇంకా ఒక మహిళా ఉద్యోగి అదృశ్యంగా ఉండటం పరిస్థితిని మరింత ఆందోళనకరంగా మారుస్తోంది. కాగా అరెస్టు అయిన వారిని సంస్థ సస్పెండ్ చేసింది.

Gold on Akshaya Tritiya Unstoppable Rise 9 years of strong returns4
పండుగ పసిడి.. తిరుగులేని రాబడి!

భారతీయ సంస్కృతిలో అక్షయ తృతీయకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ పవిత్ర దినాన పసిడిని కొనుగోలు చేయడం అదృష్టాన్ని, శాశ్వత సంపదను తెస్తుందని కోట్లాది మంది నమ్ముతారు. అయితే, ఈ సంప్రదాయం వెనుక బలమైన ఆర్థిక ప్రయోజనం కూడా దాగి ఉందని గత తొమ్మిదేళ్ల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం సెంటిమెంట్‌తోనే కాకుండా, లాభదాయకమైన పెట్టుబడి వ్యూహంగా కూడా బంగారం తన సత్తాను చాటుతోంది. ముఖ్యంగా గత తొమ్మిదేళ్ల కాలంలో పసిడి సుమారు రూ. 29,000 నుండి రూ. 1,54,000 స్థాయికి చేరుకుని, పెట్టుబడిదారులకు ఏకంగా 435 శాతం భారీ రాబడిని అందించింది.12 ఏళ్లలో అక్షయ తృతీయ రాబడులు ఇలా..గత 12 ఏళ్ల అక్షయ తృతీయ బంగారం రాబడులను పరిశీలిస్తే, 2015లో 11 శాతం, 2017లో 3 శాతం తగ్గుదలతో కొంత నిరాశపరిచినప్పటికీ, ఆ తర్వాత నుండి పసిడి ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది. ముఖ్యంగా 2020లో 47 శాతం భారీ రాబడిని అందించిన బంగారం, ఈ ఏడాది (2026) ఏకంగా 60 శాతం వృద్ధిని నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. 2023లో 18 శాతం, 2024లో 22 శాతం, 2025లో 31 శాతంగా ఉన్న రాబడులు, ప్రతి ఏడాది రెట్టింపు ఉత్సాహంతో పెరుగుతూ పసిడిపై పెట్టుబడి అత్యంత లాభదాయకమని మరోసారి నిరూపించాయి.ఏడాదిలో 60 శాతం పెరుగుదలగత ఏడాది కాలంలో బంగారం చూపిన జోరు ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురిచేసింది. 2025 అక్షయ తృతీయ (ఏప్రిల్ 30) నాటి ధరలతో పోలిస్తే, ప్రస్తుతం పసిడి ధరలు 60 శాతం పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు గోల్డ్ మార్కెట్‌కు గతేడాది అండగా నిలిచాయి. పెట్టుబడిదారులకు వరుసగా తొమ్మిదో ఏడాది కూడా ఘనమైన లాభాలను అందిస్తూ, సురక్షితమైన పెట్టుబడి సాధనంగా బంగారం తన పట్టును నిలుపుకుంది. ధంతేరాస్‌తో పాటు అక్షయ తృతీయ భారతీయులకు అతిపెద్ద కొనుగోలు పండుగగా కొనసాగుతోంది.2026 సంవత్సరం బంగారం కొనుగోలుదారులకు కొంత గందరగోళంగా ప్రారంభమైనప్పటికీ, బులియన్ మార్కెట్ భవిష్యత్తు మాత్రం ఆశాజనకంగానే కనిపిస్తోంది. ఇటీవల యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో మార్చి గరిష్టాల నుండి ధరలు 10 శాతం మేర తగ్గుముఖం పట్టాయి. ద్రవ్యోల్బణ భయాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై జాప్యం వంటి కారణాలు మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. అయినప్పటికీ, ఈ ఏడాది ఇప్పటివరకు బంగారం 15 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. ధరల్లో వచ్చిన ఈ తాత్కాలిక తగ్గుదల (పుల్ బ్యాక్) కొనుగోలుదారులకు ఒక మంచి అవకాశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మళ్లీ వచ్చే పండుగకి రూ.1.80 లక్షలు!మున్ముందు బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా ఎదురయ్యే ఆటంకాలు పసిడి ధరలో పదునైన పెరుగుదలకు దారితీస్తాయని, ఏడాది కాలంలోనే తులం (10 గ్రాములు) బంగారం ధర రూ.1,80,000 మార్కును తాకవచ్చని నిర్మల్ బాంగ్ కమోడిటీస్ రీసెర్చ్ హెడ్ కునాల్ షా విశ్లేషించారు. అదేవిధంగా, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు ధర 5,500 డాలర్ల స్థాయికి చేరవచ్చని, తద్వారా దేశీయంగా ధరలు రూ.1,70,000 నుండి రూ. 1,85,000 మధ్య ఉండొచ్చని యాక్సిస్ సెక్యూరిటీస్ నిపుణులు భావిస్తున్నారు.

Wipro unveils Rs 15000 crore buyback via tender route5
విప్రో భారీ ఆఫర్: రూ.15,000 కోట్లతో షేర్ల బైబ్యాక్

ప్రముఖ ఐటీ దిగ్గజం విప్రో తన వాటాదారులకు తీపి కబురు అందించింది. 2026 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక (Q4FY26) ఫలితాల సందర్భంగా ఏకంగా రూ. 15,000 కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు (బైబ్యాక్) చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది.బైబ్యాక్ ముఖ్యాంశాలువిప్రో బైబ్యాక్ చేసే షేర్ల మొత్తం విలువ రూ. 15,000 కోట్లు. బైబ్యాక్ ధర ఒక్కో షేరుకు రూ. 250. ప్రస్తుత మార్కెట్ ధర రూ. 210.15 తో పోలిస్తే ఇది 19 శాతం అధికం. మొత్తం 60 కోట్ల షేర్లను (మొత్తం ఈక్విటీలో 5.7 శాతం) కంపెనీ వెనక్కి తీసుకోనుంది. 'టెండర్ ఆఫర్' మార్గంలో దామాషా పద్ధతిలో ఈ బైబ్యాక్ ప్రక్రియ జరగనుంది. రికార్డు తేదీ నాటికి షేర్లు కలిగిన వారు, ఏడీఆర్ (ADR) హోల్డర్లు ఇందులో పాల్గొనవచ్చు.క్యూ4 ఫలితాలుమార్చి 2026తో ముగిసిన త్రైమాసికంలో విప్రో ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. నికర లాభం గత ఏడాది ఇదే కాలంలో రూ. 3,569.6 కోట్లుగా ఉండగా, ఇప్పుడు 1.89 శాతం తగ్గి రూ. 3,501.8 కోట్లుగా నమోదైంది. మరోవైపు కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 7.6 శాతం వృద్ధితో రూ. 24,236.3 కోట్లకు చేరింది. 2025-26 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ. 13,197.4 కోట్ల నికర లాభాన్ని, రూ. 92,624 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.ఏఐ దిశగా అడుగులుఫలితాల సందర్భంగా విప్రో సీఈఓ, ఎండీ శ్రీని పల్లియా మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో వస్తున్న మార్పులు క్లయింట్ల ప్రాధాన్యతలను మారుస్తున్నాయని తెలిపారు. ‘మేము 'ఏఐ-ఫస్ట్' వ్యూహంతో ముందుకు వెళ్తున్నాం. మా ఏఐ నేటివ్ బిజినెస్ యూనిట్ ద్వారా 'సర్వీసెస్-యాజ్-ఎ-సాఫ్ట్వేర్' మోడల్‌కు పెద్దపీట వేస్తున్నాం. ఓలం గ్రూప్‌తో కుదుర్చుకున్న వ్యూహాత్మక ఒప్పందం మా భవిష్యత్తు పెట్టుబడులకు నిదర్శనం’ అని ఆయన పేర్కొన్నారు.గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి విప్రో షేరు ధర స్వల్పంగా పెరిగి రూ. 210.20 వద్ద స్థిరపడింది.

Surge in Russian Oil Indias Imports Triple to 5 3 Billion in March6
రష్యన్‌ ఆయిల్‌.. రయ్‌ రయ్‌..

పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల క్రూడ్‌ రేట్లు పెరగకుండా రష్యన్‌ ఆయిల్‌పై ఆంక్షలను అమెరికా నెలరోజుల పాటు సడలించడంతో, ఆ దేశం నుంచి ముడి చమురు దిగుమతులు మళ్లీ జోరందుకున్నాయి. మార్చిలో భారత్‌ కొనుగోళ్లు మూడు రెట్లు పెరిగి 5.3 బిలియన్‌ డాలర్లకు చేరాయి.యూరప్‌కి చెందిన సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఎనర్జీ, క్లీన్‌ ఎయిర్‌ (క్రియా) నివేదిక ప్రకారం ఫిబ్రవరిలో రష్యా నుంచి దిగుమతులను తగ్గించుకున్న భారత్, ఆ తర్వాతి నెలలో మళ్లీ గణనీయంగా కొనుగోళ్లు చేసింది. మొత్తం 5.8 బిలియన్‌ యూరోల విలువ చేసే రష్యన్‌ హైడ్రోకార్బన్స్‌ని దిగుమతి చేసుకోగా ఇందులో క్రూడాయిల్‌ వాటా 91 శాతం (సుమారు 5.3 బిలయన్‌ యూరోలు)గా నమోదైంది.ఇది 2025 మార్చిలో నమోదైన దానితో పోలిస్తే 72 శాతం అధికం. ఇక రష్యా నుంచి దిగుమతి చేసుకున్న మిగతా వాటిలో బొగ్గు (337 మిలియన్‌ యూరోలు), ఇతరత్రా ఆయిల్‌ ఉత్పత్తులు (178.5 మిలియన్‌ యూరోలు) ఉన్నాయి. మార్చిలో భారత్‌ క్రూడాయిల్‌ దిగుమతులు మొత్తం మీద 4 శాతం తగ్గినప్పటికీ రష్యా నుంచి కొనుగోళ్లు మాత్రం రెట్టింపయ్యాయి.ఫిబ్రవరిలో 1.4 బిలియన్‌ డాలర్ల మేర ముడిచమురు దిగుమతి అయింది. ఆంక్షల కారణంగా 2025 నవంబర్‌లో రష్యన్‌ దిగుమతులు నిలిపివేసిన ప్రభుత్వ రంగ మంగళూరు, వైజాగ్‌ రిఫైనరీలు 2026 మార్చి నుంచి తిరిగి కొనుగోళ్లు మొదలుపెట్టాయి.

Advertisement
Advertisement
Advertisement