Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

US military surged advanced drones regional contingency on Iran1
ఇరాన్ సమీపంలో అమెరికా అత్యాధునిక డ్రోన్ల నిఘా

మిడిల్‌ఈస్ట్‌ ప్రాంతంలో భౌగోళిక రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. గత కొంతకాలంగా వెనిజులా పరిణామాలపై దృష్టి సారించిన అమెరికా ఇప్పుడు మళ్లీ తన వ్యూహాత్మక బలగాలను గల్ఫ్ ప్రాంతం వైపు మళ్లిస్తోంది. తాజా నివేదికల ప్రకారం, ఒమన్ గల్ఫ్, ఇరాన్ సరిహద్దు ప్రాంతాల్లో అమెరికా తన నిఘా వ్యవస్థను ముమ్మరం చేసింది. ఇది రాబోయే సైనిక చర్యకు సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు.ఎంక్యూ-4సీ ట్రైటాన్జనవరి 2026 ప్రారంభం నుంచి అబుదాబి వేదికగా అమెరికా నావికాదళానికి చెందిన ఎంక్యూ-4సీ ట్రైటాన్ డ్రోన్లు నిరంతర నిఘా కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఇది హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ (HALE) రకానికి చెందిన డ్రోన్. 50,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నిరంతరంగా 24 గంటల పాటు ఇది ఎగరగలదు. సముద్ర ప్రాంతాల్లోని కదలికలను అత్యంత స్పష్టంగా పర్యవేక్షించే సామర్థ్యం దీని సొంతం.సాధారణంగా సైనిక కార్యకలాపాల్లో ‘కాల్ సైన్’ (Call Sign) గోప్యంగా ఉంచుతారు(గాలిలో వందలాది విమానాలు ఎగురుతున్నప్పుడు ట్రాఫిక్ కంట్రోలర్లు లేదా ఇతర సైనిక విమానాలు ఏ విమానంతో కాంటాక్ట్‌ అవుతున్నాయో స్పష్టంగా తెలియడానికి ఈ కాల్ సైన్లను ఉపయోగిస్తారు). కానీ, ఈసారి ట్రైటాన్ డ్రోన్లు తమ గోప్యతను దాచకుండా బహిరంగంగానే సంచరించడం గమనార్హం. ఇది ఇరాన్‌కు అమెరికా పంపిస్తున్న పరోక్ష హెచ్చరిక అని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఇరాన్‌లో కల్లోలం - ట్రంప్ హెచ్చరికప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వం స్వదేశీ నిరసనకారులపై అనుసరిస్తున్న కఠిన వైఖరి అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. మానవ హక్కుల సంస్థల సమాచారం ప్రకారం, నిరసనల అణిచివేతలో ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ హింసను అమెరికా అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు. నిరసనకారులకు మద్దతుగా సహాయం అందిస్తామని ట్రంప్ ఇచ్చిన సందేశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. హింస కొనసాగితే ఇరాన్‌పై నేరుగా సైనిక చర్యకు దిగుతామని ఆయన హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో అమెరికా జోక్యం చేసుకోబోతోందనే సంకేతాలను ఇస్తున్నాయి.తిరిగి వస్తున్న యుద్ధనౌకలుగత ఏడాది హౌతీ తిరుగుబాటుదారులను ఎదుర్కోవడానికి ‘యూఎస్ఎస్ హ్యారీ ఎస్‌.ట్రూమాన్’, ఇతర విధ్వంసక నౌకలను గల్ఫ్‌లో మోహరించారు. అయితే, వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వీటిని కరేబియన్ ప్రాంతానికి తరలించారు. కానీ, ఇప్పుడు మళ్లీ గల్ఫ్ వైపు మళ్లిస్తున్నారు. యూఎస్ నేవీ అధికారిక సమాచారం ప్రకారం.. గైడెడ్-క్షిపణి యూఎస్ఎస్ రూజ్‌వెల్ట్ (DDG 80) ఇప్పటికే అరేబియా గల్ఫ్‌కు చేరుకుంది. యూఎస్ సెంట్రల్ కమాండ్ పరిధిలో ఈ నౌక తన పెట్రోలింగ్‌ను ప్రారంభించింది. ఇరాన్ వ్యూహాత్మక ప్రాంతాలకు సమీపంలో అమెరికా డ్రోన్లు, యుద్ధనౌకలు మోహరించడం చూస్తుంటే గల్ఫ్ ప్రాంతంలో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: వ్యాధి నిర్ధారణలో ఐసీఎంఆర్‌ కీలక ఆవిష్కరణ

ICMR developing multiplex molecular diagnostic test2
వ్యాధి నిర్ధారణలో ఐసీఎంఆర్‌ కీలక ఆవిష్కరణ

దేశంలో అంటువ్యాధుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసేందుకు, ప్రాణాంతక ‘యాంటీ-మైక్రోబయల్ రెసిస్టెన్స్’(ఏంఎఆర్‌) ముప్పును తగ్గించేందుకు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) సంచలనాత్మక అడుగు వేసింది. జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడే రోగుల్లో ఒకేసారి అనేక రకాల ఇన్ఫెక్షన్లను గుర్తించగలిగే ‘మల్టీప్లెక్స్ మాలిక్యులర్ డయాగ్నొస్టిక్’ పరీక్షను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.సాధారణంగా ఆసుపత్రికి వచ్చే రోగులకు డెంగ్యూ, టైఫాయిడ్, ఇన్‌ఫ్లుయెంజా లేదా కొవిడ్ వంటి లక్షణాలు ఉన్నప్పుడు వైద్యులు ఒక్కో వ్యాధికి విడివిడిగా పరీక్షలు నిర్వహిస్తారు. ఒక నివేదిక నెగటివ్ వస్తేనే మరో పరీక్షకు వెళ్లే ఈ దశల వారీ విధానం వల్ల కొన్ని సమస్యలున్నాయి. ఈ విధానం ద్వారా వ్యాధి నిర్ధారణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. రోగి పరిస్థితి విషమించే ప్రమాదం ఉంది. వైద్య ఖర్చులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి ఒకేసారి బహుళ వ్యాధికారక క్రిములను (Pathogens) గుర్తించే సింగిల్-టెస్ట్ మోడల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఐసీఎంఆర్ ప్రణాళిక రూపొందించింది.యాంటీబయాటిక్స్ దుర్వినియోగానికి అడ్డుకట్టవ్యాధి ఏంటో స్పష్టంగా తెలియనప్పుడు వైద్యులు తప్పనిసరి పరిస్థితుల్లో ‘బ్రాడ్-స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్’ వాడుతుంటారు. దీనిపై ఎయిమ్స్ మైక్రోబయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ హితేందర్ గౌతమ్ స్పందిస్తూ.. ‘కచ్చితమైన నివేదిక లేకుండా ఎక్కువ కాలం యాంటీబయాటిక్స్ వాడటం వల్ల శరీరంలో సూక్ష్మజీవుల నిరోధక శక్తి పెరుగుతుంది’ అని హెచ్చరించారు. ఐసీఎంఆర్ ఏఎంఆర్‌ఎస్‌ఎన్‌ 2024 నివేదిక ప్రకారం, ప్రస్తుతం వాడుకలో ఉన్న అనేక యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియాపై ప్రభావం కోల్పోతున్నాయని తేలింది. కొత్త మల్టీప్లెక్స్ పరీక్షల వల్ల కచ్చితమైన చికిత్స త్వరగా మొదలై ఈ ముప్పు తగ్గుతుంది.సింగిల్‌ టెస్ట్‌కు సంబంధించిన కీలక అంశాలురోగి లక్షణాల ఆధారంగా ఒకే టెస్ట్‌లో అన్ని అనుమానిత ఇన్ఫెక్షన్లను పరీక్షించడం.ఈ డయాగ్నొస్టిక్ కిట్లను అభివృద్ధి చేయడానికి భారతీయ తయారీదారులు, పరిశోధన సంస్థలకు ఐసీఎంఆర్ మద్దతు ఇస్తుంది.ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రతిపాదనలు సమర్పించడానికి జనవరి 25ను చివరి తేదీగా నిర్ణయించారు.కొవిడ్ సమయంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వ్యాధుల వ్యాప్తిని ప్రారంభ దశలోనే అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఈ వేగవంతమైన నిర్ధారణ పరీక్షలు దేశ ప్రజారోగ్య వ్యవస్థలో కీలక మార్పుగా నిలవనున్నాయి.ఇదీ చదవండి: యూఎస్‌-ఇరాన్‌ ఉద్రిక్తతలు.. భారత వాణిజ్యంపై ప్రభావం

Supreme Court directed schools to strictly implement RTE Act3
రిక్షా పుల్లర్ బిడ్డ, జడ్జి బిడ్డ ఒకే స్కూళ్లో చదవాలి: సుప్రీంకోర్టు

దేశంలో విద్యా వ్యవస్థ ద్వారా రాజ్యాంగం ఆశించిన ‘సౌభ్రాతృత్వం’ (Fraternity) లక్ష్యాన్ని సాధించే దిశగా సుప్రీంకోర్టు కీలక అడుగు వేసింది. ఒక రిక్షా కార్మికుడి పిల్లలు మల్టీ మిలియనీర్ లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి పిల్లలతో కలిసి ఒకే తరగతి గదిలో చదువుకున్నప్పుడే అసలైన సామాజిక మార్పు సాధ్యమవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. విద్యా హక్కు చట్టం (ఆర్‌టీఈ) కింద ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో పేద, వెనుకబడిన వర్గాల పిల్లలకు కేటాయించిన 25% ఉచిత సీట్ల అమలుపై విచారణ చేపట్టింది. ఇందుకు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందుర్కర్‌లతో కూడిన ధర్మాసనం సారథ్యం వహించింది.‘ఒక ఆటో డ్రైవర్ లేదా వీధి వ్యాపారి బిడ్డ, ధనవంతుల బిడ్డతో కలిసి పాఠశాలలో ఒకే బెంచీపై కూర్చోవడం అనేది సహజమైన, నిర్మాణాత్మకమైన ప్రక్రియగా మారాలి. ఇది కేవలం ఒక సంక్షేమ పథకం కాదు. ఆర్టికల్ 21ఏ, 39(ఎఫ్‌) కింద దేశం చిన్నారులకు ఇచ్చిన హక్కు’ అని కోర్టు పేర్కొంది. కులం, తరగతి లేదా ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఉండే ‘అనుమానాస్పద గుర్తింపులను’ పక్కన పెట్టి, విద్యార్థులు ఒకరితో ఒకరు మమేకంగా ఉండటానికి సెక్షన్ 12 దోహదపడుతుందని ధర్మాసనం వివరించింది.కొఠారి కమిషన్ నివేదిక ప్రస్తావనసమాజంలోని అన్ని వర్గాల పిల్లలు వివక్ష లేకుండా విద్యను అభ్యసించే సాధారణ పాఠశాల వ్యవస్థపై గతంలో కొఠారి కమిషన్ ఇచ్చిన నివేదికను కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. పేద పిల్లలు ధనిక వాతావరణం(Rich Culture)లో ఇమడగలరా? అనే సందేహాలను పక్కన పెట్టాలని, ఉపాధ్యాయులు ఆ పిల్లల నేపథ్యాలను ఒక వనరుగా మార్చుకుని వారి గౌరవాన్ని పెంచాలని సూచించింది.రాష్ట్రాలకు, ఎన్‌సీపీసీఆర్‌కు ఆదేశాలువిద్యా హక్కు చట్టం (RTE)లోని సెక్షన్ 12(1)(సీ) కింద ఉన్న ఆదేశాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడానికి తగిన నియమ నిబంధనలను రూపొందించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. చట్టంలోని సెక్షన్ 38 కింద ఉన్న అధికారాలను ఉపయోగించి, వెనుకబడిన, బలహీన వర్గాల పిల్లల ప్రవేశాలకు సంబంధించి అవసరమైన సబార్డినేట్ చట్టాలను (Subordinate Legislation) సిద్ధం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.‘సమానత్వం, స్వేచ్ఛ అనేవి వ్యక్తిగత హక్కులు కావచ్చు. కానీ, సౌభ్రాతృత్వం అనేది సంబంధాలపై ఆధారపడి ఉంటుంది. ఇది సంస్థాగత ఏర్పాట్ల ద్వారానే సాధ్యమవుతుంది’ - సుప్రీంకోర్టుసంప్రదింపులుఈ నిబంధనల రూపకల్పన ప్రక్రియ కేవలం ఏకపక్షంగా సాగకూడదని, సంబంధిత విభాగాల భాగస్వామ్యం ఉండాలని కోర్టు సూచించింది. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR), రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్లు (SCPCR), జాతీయ, రాష్ట్ర స్థాయి సలహా మండలితో సమగ్రంగా సంప్రదించి విధివిధానాలను ఖరారు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేసింది.రిపోర్టింగ్, పర్యవేక్షణఈ ప్రక్రియ ఎంతవరకు వచ్చిందనే దానిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణ గడువును విధించింది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు జారీ చేసిన లేదా రూపొందించిన నియమ నిబంధనలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరించాలని ఎన్‌సీపీసీఆర్‌ను ఆదేశించింది. ఈ సమాచారాన్ని క్రోడీకరించి మార్చి 31 లోగా ఒక సమగ్ర అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది.ఇదీ చదవండి: యూఎస్‌-ఇరాన్‌ ఉద్రిక్తతలు.. భారత వాణిజ్యంపై ప్రభావం

how much Impact on India regarding US Sanctions on Iran4
యూఎస్‌-ఇరాన్‌ ఉద్రిక్తతలు.. భారత వాణిజ్యంపై ప్రభావం

అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, తాజాగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన వాణిజ్య సుంకాలు (Tariffs) ప్రపంచ మార్కెట్లను కలవరపెడుతున్నాయి. ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు కొనసాగించే ఏ దేశమైనా అమెరికాతో చేసే వ్యాపారంపై 25% అదనపు సుంకం చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో భారత్-ఇరాన్ వాణిజ్యంపై దీని ప్రభావం ఎలా ఉంటుందనే అంశాలు చూద్దాం.భారత్-ఇరాన్ వాణిజ్యం: ప్రస్తుత స్థితిగతులుఅధికారిక గణాంకాల ప్రకారం, ఇరాన్‌తో భారత్‌కు ఉన్న వాణిజ్య సంబంధాలు ఇటీవలి కాలంలో క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్-ఇరాన్ మధ్య మొత్తం వాణిజ్యం సుమారు 1.68 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇది భారత్ మొత్తం ప్రపంచ వాణిజ్యంలో కేవలం 0.15% మాత్రమే. ఇది గతంలో కాస్త ఎక్కువగానే ఉండేది.ఎగుమతులు-దిగుమతులుభారత్ నుంచి ఇరాన్‌కు సుమారు 1.24 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు ఎగుమతి అవుతున్నాయి. ఇందులో ప్రధానంగా బాస్మతి బియ్యం, టీ, చక్కెర, ఫార్మాస్యూటికల్స్ (మందులు), రసాయనాలు ఉన్నాయి. ఇరాన్ నుంచి భారత్ సుమారు 0.44 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. డ్రై ఫ్రూట్స్, సేంద్రీయ రసాయనాలు, గ్లాస్‌వేర్ ప్రధాన దిగుమతులుగా ఉన్నాయి.ట్రంప్ హెచ్చరిక - భారత్‌పై ప్రభావంట్రంప్ ప్రకటించిన 25% అదనపు సుంకం వల్ల భారత ఎగుమతిదారుల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతున్నప్పటికీ, ప్రభుత్వ వర్గాల విశ్లేషణ ప్రకారం దీని ప్రభావం పరిమితంగానే ఉండే అవకాశం ఉంది.భారత్ ఇరాన్‌కు ఎగుమతి చేసే వస్తువుల్లో అత్యధిక భాగం ఆహార పదార్థాలు (బియ్యం, టీ పొడి), మందులు. ఇవి అంతర్జాతీయ ఆంక్షల పరిధిలోకి రావు.ఇరాన్ భారత్ టాప్-50 వాణిజ్య భాగస్వాముల జాబితాలో కూడా లేదు. అందువల్ల 25% సుంకం భారత్ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపకపోవచ్చు.సముద్ర రవాణా, చాబహార్ ఓడరేవుభారత్‌కు వ్యూహాత్మకంగా కీలకమైన చాబహార్ ఓడరేవు విషయంలో అమెరికా సానుకూల వైఖరిని ప్రదర్శించింది. చాబహార్ ఓడరేవు అభివృద్ధి, నిర్వహణకు సంబంధించి భారత్‌కు ఉన్న ఆంక్షల మినహాయింపును ఏప్రిల్ 2026 వరకు పొడిగించినట్లు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా దేశాలకు రవాణా సౌకర్యం కల్పించే ఈ ఓడరేవు ద్వారా వాణిజ్యం కొనసాగింపుపై భారత్ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.చైనా, యూఈఏ, టర్కీకి దెబ్బఅమెరికా నిర్ణయం వల్ల చైనా, యూఏఈ, టర్కీ వంటి దేశాలపై ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్ దిగుమతుల్లో వీటి వాటా చాలా ఎక్కువ. భారత్ తన వాణిజ్యాన్ని ఇప్పటికే వైవిధ్యీకరించుకోవడం వల్ల ఈ టారిఫ్ వార్ నుంచి తక్కువ నష్టంతో బయటపడే అవకాశం ఉంది.ఇదీ చదవండి: భారత రెవెన్యూ వ్యవస్థలో ఆర్థిక సైనికులు

Customs Officers GST Inspectors Economic Soldiers Behind Revenue System5
భారత రెవెన్యూ వ్యవస్థలో ఆర్థిక సైనికులు

సాధారణంగా దేశ రక్షణ అనగానే మనకు సరిహద్దుల్లో పహారా కాసే సైనికులు గుర్తుకు వస్తారు. కానీ, ఆయుధాలు పట్టుకోకుండా, దేశ ఆర్థిక సరిహద్దులను కాపాడుతూ దేశాభివృద్ధికి అవసరమైన నిధులను సమీకరించే కొందరు సైనికులు మన మధ్యే ఉన్నారు. వారే కస్టమ్స్ అధికారులు, జీఎస్టీ ఇన్‌స్పెక్టర్లు. ప్రభుత్వ ఆదాయాన్ని రక్షించడంలో, వాణిజ్య, పన్నుల వ్యవస్థలో పారదర్శకతను నిర్ధారించడంలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. అందుకే వీరిని ‘ఆర్థిక సైనికులు’(Economic Soldiers) అని పిలుస్తున్నారు.కస్టమ్స్ అధికారుల పాత్రకస్టమ్స్ అధికారులు ప్రధానంగా ఓడరేవులు (Ports), విమానాశ్రయాలు, భూ సరిహద్దుల వద్ద విధులు నిర్వహిస్తారు. దేశంలోకి వచ్చే, దేశం నుంచి వెలుపలికి వెళ్లే వస్తువుల కదలికలను వీరు పర్యవేక్షిస్తారు.అక్రమ రవాణా నిరోధం: బంగారం, మాదకద్రవ్యాలు, ఇతర నిషేధిత వస్తువుల స్మగ్లింగ్‌ను అడ్డుకోవడం వీరి ప్రధాన బాధ్యత.సుంకాల వసూలు: వస్తువుల సరైన విలువను నిర్ణయించి వాటిపై పడే పన్నులను వసూలు చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు గండి పడకుండా చూస్తారు.వాణిజ్య నియంత్రణ: అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలు అమలు చేస్తూ, దేశ ఆర్థిక ప్రయోజనాలను కాపాడటంలో వీరు కీలకంగా వ్యవహరిస్తారు.జీఎస్టీ ఇన్‌స్పెక్టర్ల పాత్రదేశీయ పన్నుల వ్యవస్థకు జీఎస్టీ(GST) ఇన్‌స్పెక్టర్లు వెన్నెముక వంటి వారు. వస్తు సేవల పన్ను చట్టం సక్రమంగా అమలు అయ్యేలా చూడటం వీరి బాధ్యత.పన్ను చెల్లింపుల తనిఖీ: పన్ను రిటర్నులను ధ్రువీకరించడం, ఆడిట్‌లు నిర్వహించడం ద్వారా పన్ను ఎగవేతను అరికడతారు.దర్యాప్తు: పన్ను ఎగవేతకు పాల్పడే సంస్థలపై నిఘా ఉంచి, విచారణలు చేపడతారు.పన్ను చెల్లింపుదారులకు చట్టపరమైన నిబంధనల పట్ల అవగాహన కల్పిస్తూ, సరళమైన పన్ను సంస్కృతిని ప్రోత్సహిస్తారు.దేశానికి భౌగోళిక భద్రత ఎంత ముఖ్యమో, ఆర్థిక భద్రత కూడా అంతే కీలకం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన (రోడ్లు, రైల్వేలు..), రక్షణ రంగానికి అవసరమైన నిధులు ఈ పన్నుల ద్వారానే లభిస్తాయి. ఆదాయ నష్టాన్ని నిరోధించడం ద్వారా ఈ అధికారులు దేశ అభివృద్ధిలో నేరుగా భాగస్వాములవుతున్నారు. అందుకే వీరిని దేశపు ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడే సైనికులుగా అభివర్ణిస్తున్నారు.నియామక ప్రక్రియభారతదేశంలో ఈ విభాగాల్లో చేరడానికి ప్రధానంగా రెండు మార్గాలు ఉన్నాయి.1. ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్ష ద్వారా ఇన్‌స్పెక్టర్ల నియామకం జరుగుతుంది. వీరు పే లెవల్-7 (సుమారు నెలకు రూ.44,900 ప్రాథమిక వేతనం) హోదాలో ఉండి క్షేత్రస్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తారు.2. యూపీఎస్సీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా నేరుగా అసిస్టెంట్ కమిషనర్ హోదాలో నియమితులవుతారు. వీరు పే లెవల్-10 (సుమారు నెలకు రూ.56,100 ప్రాథమిక వేతనం) హోదాలో ఉండి పరిపాలన, పర్యవేక్షక బాధ్యతలు చేపడతారు.వృత్తిపరమైన ఎదుగుదలఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ ద్వారా ఎంపికైన ఇన్‌స్పెక్టర్లు తమ రెండు సంవత్సరాల ప్రొబేషన్ కాలం, ఆ తదుపరి రెండు సంవత్సరాల కనీస సర్వీసు పూర్తి చేసిన తర్వాత సూపరింటెండెంట్‌గా ప్రమోషన్ పొందడానికి అర్హులు. ఖాళీలు, అనుభవం ఆధారంగా వారు అసిస్టెంట్ కమిషనర్లుగా, ఉన్నత స్థాయి అధికారులుగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఈ క్రమబద్ధమైన కెరీర్ వృద్ధి అధికారులకు కాలక్రమేణా పెద్ద బాధ్యతలను స్వీకరించేలా ప్రోత్సహిస్తుంది.కస్టమ్స్ అధికారులు, జీఎస్టీ ఇన్‌స్పెక్టర్లు భారతదేశ పాలనా వ్యవస్థలో కీలకం. వీరి పనితనం వెలుగులోకి రాకపోయినా, దేశ ఆర్థిక భద్రతలో వీరి ప్రభావం అపారం. సక్రమమైన వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తూ, అక్రమ మార్గాలను అడ్డుకుంటూ, వీరు దేశ గౌరవాన్ని, ఆర్థిక వ్యవస్థను నిరంతరం కాపాడుతున్నారు.-దవనం శ్రీకాంత్‌ఇదీ చదవండి: పండగవేళ పసిడి దూకుడు.. తులం ఎంతంటే..

Key Assumptions by Shailesh Chandra on the Car Market6
హై స్పీడ్‌లో కార్ల మార్కెట్‌

వాహన తయారీ కంపెనీల నుంచి డీలర్లకు ప్రయాణికుల వాహన (కార్లు, వ్యాన్లు, ఎస్‌యూవీ) సరఫరాలు గతేడాది(2025)లో 5% పెరిగి 44,89,717కు చేరాయని ఆటో పరిశ్రమ సమాఖ్య సియామ్‌ మంగళవారం వెల్లడించింది. జీఎస్‌టీ సంస్కరణల వల్ల ధరలు తగ్గడంతో, పండుగల సీజన్‌లో అమ్మకాలు జోరుగా జరిగాయి. తద్వారా వాహన సరఫరాలు గతంలో ఎన్నడూ లేని రికార్డు స్థాయికి చేరాయి. అంతకు ముందు 2024లో ఈ సరఫరా 42,74,793 యూనిట్లుగా ఉన్నాయి.విభాగాల వారీగా ఇలా...యుటిలిటీ వాహనాలు డిస్పాచ్‌లు 27,49,932 నుంచి 7% వృద్ధి చెంది 29,54,279కు చేరాయి.ప్రయాణికుల టోకు విక్రయాలు స్వల్పంగా 1% పెరిగి 13,79,884 యూనిట్లకు చేరాయి.త్రీ వీలర్స్‌ డిస్పాచ్‌లు 8% ఎగసి 7,28,670 నుంచి 7,88,429 యూనిట్లకు చేరాయివాణిజ్య వాహన విక్రయాలు 8% వృద్ధి సాధించి 10,27,877 యూనిట్లుగా నమోదయ్యాయి. కాగా, 2024లో విక్రయాలు 1,95,43,093గా ఉన్నాయి.ద్వి చక్రవాహన అమ్మకాలు 5% వృద్ధితో 2,05,00,639 యూనిట్లకు చేరాయి.‘‘భారత ఆటోమొబైల్‌ పరిశ్రమకు 2025 ఏడాది కీలక మైలురాయిగా నిలిచింది. ప్రథమార్ధమంతా సప్లై, మందగమనం సవాళ్లు ఎదుర్కొంది. తదుపరి ఆదాయపు పన్ను రాయితీ, ఆర్‌బీఐ వరుస రెపో రేట్ల కోత, జీఎస్‌టీ 2.0 అమలు సెంటిమెంట్‌ మెరుగుపడింది’’ సియామ్‌ అధ్యక్షుడు శైలేష్‌ చంద్ర తెలిపారు. ముఖ్యంగా జీఎస్‌టీ రేట్ల తగ్గింపుతో వాహన ధరలు మరింత చౌకగా మారి, పరిశ్రమను పరుగులు పెట్టించాయి. ప్యాసింజర్, కమర్షియల్, సీవీ, త్రీ వీలర్స్‌ ఇలా అన్ని విభాగాల్లోనూ గతంలో ఎన్నడూలేని విధంగా రికార్డు స్థాయి విక్రయాలు 2025లో జరిగాయన్నారు. 2024తో 2025లో ఎగుమతులు సైతం రెండంకెల వృద్ధి సాధించాయన్నారు. ఈ ఏడాది(2026) అవుట్‌లుక్‌పై శైలేష్‌ చంద్ర వివరణ ఇస్తూ .., స్థిరమైన స్థూల ఆర్థిక పరిస్థితులు, అందుబాటు ధరల్లో వాహన లభ్యత, ప్రభుత్వ విధానాల కొనసాగింపు అంశాలతో ఈ ఏడాదిలో డిమాండ్‌ తగ్గట్లు సరఫరా ఉండొచ్చని అంచనా వేశారు. సప్లై చైన్‌ స్థిరత్వం, ఎగుమతుల వ్యాల్యూమ్స్‌(పరిమాణం) ప్రభావితంకాకుండా భౌగోళిక రాజకీయ పరిణామాలను పరిశ్రమ నిరంతరం పర్యవేక్షిస్తుందన్నారు. డిసెంబర్‌లో వాహన టోకు విక్రయాలు: గతేడాది డిసెంబర్‌ వాహన తయారీ కంపెనీల నుంచి డీలర్లకు 26,33,506 యూనిట్ల ప్రయాణికుల వాహన (కార్లు, వ్యాన్లు, ఎస్‌యూవీ) సరఫరా అయ్యాయి.ఇదీ చదవండి: పండగవేళ పసిడి దూకుడు.. తులం ఎంతంటే..

Advertisement
Advertisement
Advertisement