East Godavari
-
15 నుంచి జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలు
అమలాపురం టౌన్: స్థానిక సత్యనారాయణ గార్డెన్స్లో ఈనెల 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ 15వ జాతీయ సబ్ జూనియర్ అండ్ జూనియర్ క్లాసిక్ (మెన్ అండ్ వుమెన్) పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్–2026 పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా స్పోర్ట్స్ క్లబ్ అసోసియేషన్, జిల్లా హెల్త్ ఫిట్నెస్ జిమ్ల ప్రతినిధులు తెలిపారు. ఆరు రోజుల పాటు జరిగే ఈ పోటీల బ్రోచర్లను ఎంపీ గంటి హరీష్ మాధుర్ మంగళవారం విడుదల చేశారు. స్థానిక ఎంపీ క్యాంపు కార్యాలయంలో జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు యెనుముల కృష్ణ పద్మరాజు, కార్యదర్శి వంటెద్దు వెంకన్నాయుడు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పప్పుల శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ కంకిపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇండియన్ టీమ్ సెలక్షన్ ట్రయిల్స్ ఫర్ వరల్డ్ చాంపియన్ షిప్ను, ఏషియాడ్ టీమ్ సెలక్షన్స్ ట్రయల్స్ను ఆంధ్ర ప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ పోటీలకు 29 రాష్ట్రాల నుంచి దాదాపు 800 మంది క్రీడాకారుల ఎంట్రీలు ఇప్పటికే వచ్చాయని పేర్కొన్నారు. మెన్ అండ్ వుమెన్ విభాగాల్లో 36 కేటగిరీల్లో ఈ పోటీలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గారపాటి చంద్రశేఖర్, అసోసియేషన్ ప్రతినిధులు ముత్తాబత్తుల వెంకటరమణ, ఆశెట్టి ఆదిబాబు, నార్ని శ్రీను, పెద్దిరెడ్డి రాము, చిక్కం రాజబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరు బైక్ దొంగల అరెస్టు
4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): నగరంలో వరుస బైక్ దొంగతనాల కేసులను త్రీటౌన్ పోలీసులు ఛేదించారు. ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్కు తరలించారు. విశాఖపట్నానికి చెందిన ఇద్దరు యువకులు వ్యసనాలకు బానిసలై బైక్ దొంగతనాల బాట పట్టినట్టు పోలీసులు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల మేరకు నిందితులు ఖరీదైన రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేస్తున్నట్టు తెలిపారు. వీరు దొంగిలించిన వాహనాలను ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నారు. ఇటీవల త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాల చోరీలు పెరగడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో వచ్చిన పక్కా సమాచారంతో త్రీ టౌన్ ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు నిఘా పెట్టి ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా బైక్ దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించినట్లు సమాచారం. నిందితుల నుంచి మూడు రాయల్ ఎన్ఫీల్డ్, ఒక జూక్ బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. -
సృజనకు వేదికలు వేసవి శిబిరాలు
ఆట పాటలు, చిత్రలేఖన పోటీలు, వ్యాయామ శిక్షణతో సమయం సద్వినియోగం కొత్తపేట: విద్యార్థులు వేసవి సెలవులను సెల్ఫోన్లు, టీవీలతో వృథా చేయకుండా వేసవి శిక్షణ తరగతులు వారికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ఈ మేరకు స్థానిక గ్రంథాలయంలో లైబ్రేరియన్ సునీత ఆధ్వర్యంలో గత నెల 28 నుంచి వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులు, విశ్రాంత ఉపాధ్యాయులు, పీఈటీలు, కవులు, కళాకారులతో బాలలకు నీతి కథలు చెప్పించడం, చదివించడం, చిత్రలేఖనం, క్రాఫ్ట్, ఆటలు, పాటలు, స్పోకెన్ ఇంగ్లిషు, వ్యాయామం, యోగా తదితర అంశాలపై శిక్షణ, పోటీలు నిర్వహిస్తున్నారు. సోమవారం విశ్రాంత పీఈటీ, సత్యసాయి సేవా సమితి సభ్యుడు మారిశెట్టి సత్యనారాయణ బాలలకు వ్యాయామం, యోగా శిక్షణ ఇచ్చారు. ఆధ్యాత్మిక అంశాలపై అవగాహన కల్పించారు. విశ్రాంత ఎంఈఓ, పూర్వ తాలూకా పెన్షనర్ల సంఘం ప్రధాన కార్యదర్శి ఏడిద సత్తిరాజు చదరంగం (చెస్) పట్ల అవగాహన కల్పించారు. -
దుబాయ్, మస్కట్ల నుంచి క్షేమంగా స్వదేశాలకు
అమలాపురం రూరల్: దుబాయ్, మస్కట్ దేశాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ముగ్గురు కోనసీమ వాసులను కేసీఎం అధికారులు క్షేమంగా వారి ఇళ్లకు చేర్చారు. అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు గ్రామానికి చెందిన కే.ఆదిలక్ష్మి, అమలాపురం మండలం సవరప్పాలెం గ్రామానికి చెందిన ఎం.మావుళ్లు, కే.శివకృష్ణలను కలెక్టర్ చొరవతో సురక్షితంగా కోనసీమకు రప్పించారు. వివిధ కారణాలతో అక్కడకు వెళ్లిన ఆదిలక్ష్మి ఆరోగ్యం పాడై, మావుళ్లు, శివకృష్ణ ఏజెంట్ మోసాలకు గురై శ్రమతో కూడిన పనులు చేయలేక అవస్థలు పడ్డారు. వారి కుటుంబ సభ్యుల ఫిర్యాదుల మేరకు కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ అధికారులు వారిని స్వగ్రామాలకు తీసుకువచ్చారు. జగ్గంపేట హత్య కేసు రాజానగరానికి బదిలీ రాజానగరం: కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం వద్ద జరిగిన హత్య కేసును రాజానగరం పోలీసు స్టేషనుకు బదిలీ అయినట్టు సీఐ వీరయ్యగౌడ్ మంగళవారం ఇక్కడ మీడియాకు తెలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన ఈ హత్యపై మృతుడు రావుల సత్తిబాబు సోదరుడు రావుల వీరబాబు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. సత్తిబాబు దంపతుల మధ్య విభేదాలు రావడం, భార్య పుట్టింటిలో ఉండటం, హత్య జరిగిన ముందు రోజు ఆమెతో మాట్లాడి వస్తానని మృతుడు ఇంటిలో చెప్పడం, ఆ తరువాత హత్యకు గురికావడం వంటి వాటిపై ఫిర్యాదుదారు వెలిబుచ్చిన అనుమానాలను పరిగణలోకి తీసుకుని, వాస్తవాలను వెలికితీసేందుకు కేసును లోతుగా పరిశీలిస్తున్నామన్నారు. -
రేపటి నుంచి ’శుభకార్యాలకు’ బ్రేక్
● 36 రోజుల పాటు వివాహాలకు విరామం ● జూన్ 19 నుంచి మళ్లీ ముహూర్తాలు ద్వారకాతిరుమల: వివాహాది శుభ మూహూర్తాలకు 36 రోజులపాటు బ్రేక్ పడనుంది. ఈ నెల 18 నుంచి వచ్చేనెల జూన్ 18 వరకు అధిక జ్యేష్ఠ మాసం (మూఢమి) కావడంతో ఈ నెలలో ఆఖరి ముహూర్తం 13న పెద్ద ఎత్తున వివాహాలు జరగనున్నాయి. మళ్లీ జూన్ 19 నుంచి శుభ ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. ఈ మౌఢ్యమి వల్ల వివాహ సంబంధ వృత్తులపై ఆధారపడిన వారికి పనులు లేనట్టే. ఈ ఏడాది ముహూర్తాలు ఇవే.. శుభకార్యాలు పనికిరావు అధిక జ్యేష్ఠమాసం వల్ల వివాహాలు, గృహ ప్రవేశాలు, ఆస్తుల కొనుగోళ్లు, వ్యాపారాలు తదితర శుభకార్యాలు జరపకూడదు. ఇప్పటికే వివాహాలు కుదుర్చుకున్న వారు ఈ 36 రోజులు ఆగాల్సిందే. – గోవిందవఝుల వెంకటరమణ మూర్తి శర్మ, పురోహితుడు, ద్వారకాతిరుమల -
హోమ్ స్టేటస్!
● పేరు.. రూపు మార్చుకున్న విడిదిళ్లు ● వేడుక ఏదైనా అవసరాల మేరకు వసతులు ● విలాసవంతంగా తీర్చిదిద్దుతున్న నిర్వాహకులు ● అద్దె సైతం అదే స్థాయిలో వసూలు ● పల్లెలకూ విస్తరిస్తున్న కొత్త ఒరవడి రాయవరం: వివాహ వేడుకలో విడిదింటిది ఓ ప్రధాన భూమిక. ఏ మాత్రం తేడా వచ్చినా.. ఏ లోపం కనపడినా మొదటి పేచీ మొదలయ్యేది అక్కడే. సహజంగా ఆడపెళ్లివారింటే వివాహాలు జరుగుతాయి. ఆచార వ్యవహారాలను బట్టి కొన్ని రోజుల ముందు నుంచే మగ పెళ్లివారి కోసం వివాహ వేదికకు సమీపంలోనే విడిదింటిని ఏర్పాటు చేస్తారు. ఎన్నో ఆపసోపాలు.. వ్యయ ప్రయాసలకోర్చి మందీ మార్బలంతో వచ్చే వారు రావడంతోనే ప్రయాణ బడలిక తీర్చుకోవడానికి అలా ఓ కుర్చీలో వాలిపోవాలని చూస్తారు. ఆ సమయంలో పెద్దలు ఏదో సరిపెట్టుకున్నా కొందరు అది బాలేదు.. ఇది బాలేదు అంటూ రాగాలు తీస్తుంటారు. ఇటువంటి పరిస్థితులు నేడు అంతగా లేకపోయినా వేడుక ఏదైనా సకల సౌకర్యాలతో అద్దెకు ఇచ్చే విడిదిళ్లు చాలానే అందుబాటులో ఉన్నాయి. వీటినే ఇప్పుడు పేరు మార్చి ఇంగ్లిష్లో హోమ్ స్టేగా పిలుస్తున్నారు. గ్రామాల్లో సైతం లగ్జరీ రూమ్స్, వంద మందికి సరిపడా మిని బ్యాంకెట్ హాల్, పార్టీ హోమ్ థియేటర్ ఇలా ఎన్నో అందుబాటులో ఉన్నాయి. కార్పొరేట్ కంపెనీల సమావేశాలు, గెట్ టుగెదర్లు, పుట్టిన రోజు, వివాహ నిశ్చయ తాంబూలం, లగ్న పత్రిక రాసుకోవడం ఇలా దేనికై నా హోమ్ స్టేలు సిద్ధంగా ఉంటున్నాయి. ఇటీవలి కాలంలో అన్నీ ఏసీ కల్యాణ మండపాలుగా మారిపోవడంతో అద్దె, నిర్వహణ, విద్యుత్ బిల్లు వంటి ఖర్చులు మొత్తంగా రూ.లక్ష పైనే అవుతోంది. అంత పెద్ద మొత్తం వృథా అనుకునే వాళ్లు ఈ హోం స్టేలను బుక్ చేసుకుంటున్నారు. అందుబాటు ధరల్లో రూ.10 వేల నుంచి రూ.30 వేల మధ్యలో సకల సదుపాయాలతో ఇటువంటి హోమ్స్టేలు లభిస్తున్నాయి. వీటికి డిమాండ్ బాగా ఉండడంతో ఇటీవల కాలంలో పట్టణాలతో పాటుగా, పల్లెల్లోనూ ఈ హోమ్ స్టేలు సులువుగానే దొరుకుతున్నాయి. సహజంగా దూర ప్రాంతం నుంచి వచ్చిన వారు కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు మంచి సౌకర్యాలతో నాలుగు నుంచి ఆరు లగ్జరీ డబుల్ బెడ్ రూంలు అందుబాటులో ఉంచుతున్నారు. మినీ హాల్స్లో 50 నుంచి 100 మంది వరకు కూర్చునే ఏర్పాట్లు చేస్తున్నారు. విలాసవంతమైన సదుపాయాలతో ఆధునిక సాంకేతిక కిచెన్, లాండ్రి, డైనింగ్ హాల్ వంటి సదుపాయాలు వీటిలో అందుబాటులో ఉంచుతున్నారు. పచ్చని సోయగాలతో ఆహ్లాదం పంచడానికి ఓపెన్ టెర్రస్, స్కై లాంజ్ను కూడా సిద్ధం చేస్తున్నారు. వీటి వద్ద ఫొటో షూట్స్కు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటువంటి హోం స్టేలు పలు గ్రామాల్లో అందుబాటులోకి తెస్తున్నారు. అలానే డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా చేసుకోవచ్చు. కొన్ని విడిదిళ్లలో మినీ స్విమింగ్ పూల్స్ కూడా ఏర్పాటు చేస్తూ పార్టీలను ఆకట్టుకుంటున్నారు. -
చెరువు మట్టినీ మింగేస్తున్నారు!
● వడిశలేరు పాపాయి చెరువులో ఆగని దోపిడీ ● జేసీబీలతో యథేచ్ఛగా తవ్వకాలు ● రూ.లక్షలు చేతులు మారుతున్నా పట్టించుకోని యంత్రాంగం ● తవ్వకాలను అడ్డుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు ● తహసీల్దారుకు ఫిర్యాదు ● 13 లారీలు, జేసీబీల సీజ్ రంగంపేట: కూటమి సర్కారు కొలువుదీరాక అధికార పార్టీ నాయకుల నేతృత్వంలో సహజ వనరుల దోపిడీ అడ్డూ అదుపు లేకుండా పోతోందని వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మండలంలోని వడిశలేరు గ్రామంలో పాపాయి చెరువులో మట్టిని అనుమతులు లేకుండా తవ్వేస్తుండడంతో మంగళవారం రాత్రి వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొల్లాటి ఇజ్రాయేలు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అడ్డుకున్నారు. ఈ సమయంలో చెరువులో 13 లారీలు, జేసీబీ ఉన్నాయి. వారు తహసీల్దారు కోసు అనసూయకు ఫిర్యాదు చేయడంతో ఆమె ఆదేశాల మేరకు వడిశలేరు వీఆర్వో పోచయ్య అక్రమ మైనింగ్ జరుగుతున్న చెరువు వద్దకు వెళ్లి అక్కడి పరిస్థితిని సమీక్షించి రికార్డు చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న వాహనాల గుర్తించామని 13 లారీలు, జేసీబీని అధికారుల ఆదేశాలతో సీజ్ చేసి తహసీల్దార్ కార్యాలయానికి తరలిస్తున్నామని తెలిపారు. ఇప్పటికై నా మండలంలో మట్టి అక్రమ దోపిడీని అరికట్టాలని వైఎస్సార్ సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పోతుల బులి వీర్రాజు, కన్వీనర్ నలమాటి భీముడు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
అంబాజీపేట: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి రేకుల షెడ్డులో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఇసుకుపూడి మెరకపేటకు చెందిన బాల రమేష్ (50) రాజమహేంద్రవరంలో ఓ ప్రైవేటు సంస్థలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 6వ తేదీన అక్కడి నుంచి మెరకపేటకు వచ్చి ఆర్థిక ఇబ్బందులతో కలత చెందుతూ ఈ నెల 11న తన ఇంటి వెనుక ఉన్న రేకుల షెడ్డులో ఉరి వేసుకున్నాడన్నారు. సమీప బంధువు చూసి రాజమహేంద్రవరంలోని రమేష్ భార్యకు సమాచారం అందించారన్నారు. మృతుడికి భార్య, ఇరువురు కుమార్తెలు ఉన్నారన్నారు. మృతుడి భార్య వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కొనసాగిన వ్యవసాయ కార్మిక రాష్ట్ర మహాసభలు
అమలాపురం టౌన్: ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం 30వ రాష్ట్ర మహా సభలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక గంగరాజు ఫంక్షన్ హాలులో జరిగిన సభల్లో ఈ మేరకు 14 తీర్మానాలు ఆమోదించారు. కార్మిక నేత కేతా సూర్యారావు వ్యవసాయ కార్మిక జెండాను ఆవిష్కరించి అనంతరం అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు అధ్యక్షోపన్యాసం చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు అధ్యక్షతన జరిగిన సభల్లో కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, అఖిల భారత సహాయ కార్యదర్శి విక్రమ్ సింగ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు. రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.లోకనాథం, కారెం వెంకటేశ్వరరావు, సంఘం రాష్ట్రం మహిళా కన్వీనర్ వి.రాణి తదితరులు ప్రసంగించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను దుయ్యబట్టారు. -
గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
యానాం: స్థానిక గౌతమీ గోదావరిలో స్నేహితులతో స్నానానికి దిగి గల్లంతైన రాజమహేంద్రవరం మంగళవారపుపేటకు చెందిన అబ్దుల్ ఫైజాన్ (18) మృతదేహం లభ్యమైంది. సోమవారం అర్ధరాత్రి అగ్నిమాపకదళ సిబ్బంది, మత్స్యకారులు అతడి మృతదేహాన్ని గుర్తించి ఒడ్డుకు చేర్చారు. అనంతరం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం అతని కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఎస్సై కుమరన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. పుష్కరఘాట్ వద్ద నిర్మించిన బారికేడ్ల వద్ద మెష్ నిర్మించకపోవడం వల్ల ఆ గొట్టాల మధ్య నుంచి గోదావరిలో జారిపోయాడని స్థానికులు అంటున్నారు. -
ఇద్దరిపై విద్యుత్ చౌర్యం కేసు
గండేపల్లి: కాకినాడ, రాజమహేంద్రవరం విద్యుత్ విజిలెన్స్ అధికారులు ఆయిల్ పామ్ తోటలో మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేసి ఇద్దరిపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే అధికారులకు అందిన సమాచారం మేరకు గోకవరం రోడ్డులో ఉన్న జెడ్ రాగంపేట రెవెన్యూ పరిధి జగ్గంపేటకు చెందిన కోండ్రోతు నారిబాబుకు చెందిన ఆయిల్ పామ్ తోటకు ఆనుకుని వేరొకరి పొలం ఉంది. ఆ పొలంలో బోరుకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలంటే నారిబాబు పొలం మీదుగా లైన్ వెళ్లాల్సి ఉంది. అందుకు నారిబాబు అంగీకరించలేదు. దీంతో విద్యుత్ అధికారులు అతడి విద్యుత్ కనెక్షన్ను కట్ చేశారు. దీంతో అతడు కోర్టును ఆశ్రయించాడు. కోర్టు విద్యుత్ సరఫరా ఇచ్చేందుకు అనుమతించి సుమారు నెల రోజులు గడుస్తున్నప్పటికీ అధికారులు కనక్షన్ ఇవ్వలేదు. ఆయిల్ పామ్ తోట ఎండిపోవడం, పశువుల దాహార్తికి నీళ్లులేకపోవడంపై అధికారులకు ఆన్లైన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పరిశీలనకు వచ్చిన అధికారులు అతని పక్కనున్న పొలంలో రైతులు వారికి సమీపంలోని విద్యుత్ స్తంభం నుంచి విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నట్టు గుర్తించారు. ఈ మేరకు ఇద్దరి రైతులపై కేసు నమోదు చేసినట్టు విద్యుత్ విజిలెన్స్ సీఐ కె.నాగమోహన్రెడ్డి, ఏఈ కె.దుర్గాప్రసాద్ తదితరులు తెలిపారు. -
పరీక్షల నిర్వహణలో లోపాలు ఉండకూడదు
డీఆర్ఓ సీతారామమూర్తి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లావ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని డీఆర్ఓ సీతారామమూర్తి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పోలీసు శాఖ పరీక్ష కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్ సెక్షన్ అమలు చేయడం, ప్రశ్నపత్రాల తరలింపు సమయంలో భద్రత కల్పించడం, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. విద్యుత్ శాఖ పరీక్ష సమయాల్లో ఎటువంటి విద్యుత్ అంతరాయం కలగకుండా నిరంతర సరఫరా అందించాలని సూచించారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకోవడానికి వీలుగా ఆర్టీసీ అదనపు బస్సులను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఏఎన్ఎంలు, ప్రాథమిక చికిత్స కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆరోగ్య శాఖకు సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద పారిశుధ్యం, స్వచ్ఛమైన తాగునీరు, విద్యార్థులకు అవసరమైన కనీస వసతులు కల్పించాలని మున్సిపల్, రెవెన్యూ శాఖలను ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్ఐఓ శారద హెచ్చరించారు. -
డీఎల్ఎస్ఏ కార్యదర్శిగా శ్రీలక్ష్మి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా యార్లగడ్డ శ్రీలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు సేవలందించిన ఎన్.శ్రీలక్ష్మి స్థానంలో ఆమె వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మంగళవారం స్థానిక కోటగుమ్మంలో ఉన్న ప్రభుత్వ బాలుర పర్యవేక్షణ గృహాన్ని సందర్శించారు. అక్కడ వసతులను పరిశీలించారు. పర్యవేక్షణ గృహంలో బాలురతో మాట్లాడి వారి విద్యాభ్యాసం గురించి, యోగ క్షేమాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి మాట్లాడుతూ బాలురు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి విద్యపై దృష్టి సారించాలన్నారు. క్రమశిక్షణ, సహన శీలత ప్రతి వ్యక్తికి అవసరమైన ముఖ్యమైన లక్షణాలని, వాటిని అలవరచుకొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. ప్రతి ఒక్కరికీ ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు ఉందని, పర్యవేక్షణ గృహంలో ఏవైనా సమస్యలు ఉన్నా, న్యాయ సహాయం అవసరమైనా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలన్నారు. ఏసీబీ వలలో మున్సిపల్ డీఈ రూ.10 వేలు తీసుకుంటుండగా పట్టివేత సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట మున్సిపల్ డీఈ కె.శశిధర్ మంగళవారం ఏసీబీ వలకు చిక్కారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలిలా.. మున్సిపల్ కాంట్రాక్టర్ కనూరి పవన్కుమార్కు రూ.11 లక్షల విలువైన ఐదు బిల్లులు చేయడానికి డీఈ లంచం డిమాండ్ చేశారు. మొదటి విడతగా రూ.10 వేలు ఇచ్చేందుకు అంగీకరించిన పవన్కుమార్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు మంగళవారం రూ.10 వేలు ఇస్తుండగా మున్సిపల్ కార్యాలయంలో మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా డీఈని పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు ఇచ్చిన నోట్లు మున్సిపల్ డీఈ వద్ద ఉండడంతో ఏసీబీ డీఎస్పీ ఎం.కిశోర్కుమార్ ఆయనపై కేసు నమోదు చేశారు. మున్సిపల్ డీఈ తన అసిస్టెంట్ ఓదూరి శ్రీనివాసు ద్వారా రూ.10 వేలు తీసుకున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. మార్పులకు గ్రీన్ సిగ్నల్ అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో కేంద్ర ప్రభుత్వ ‘పిలిగ్రిమేజ్ రీజువినేషన్ అండ్ స్ప్రిట్యువల్ ఆగ్మంటేషన్ డ్రైవ్ ’ (ప్రసాద్’) స్కీం నిధులు రూ.11 .50 కోట్ల వ్యయంతో కడుతున్న అన్నదాన భవనంలో మరింత ఎక్కువ మంది భోజనం చేసేందుకు వీలుగా నిర్మాణంలో మార్పులు చేయనున్నారు. మంగళవారం అన్నవరం దేవస్థానానికి వచ్చిన టూరిజం, దేవదాయశాఖ శాఖ అధికారులు ఈ నిర్మాణాన్ని పరిశీలించిన అనంతరం ఈ మేరకు నిర్ణయించారు. మూడంతస్తులలో అన్నదాన భవనం నిర్మిస్తున్నారు. మూడు అంతస్తులలోని నాలుగు హాల్స్లో ఒక్కో హాలులో 350 మంది చొప్పున 1,400 మంది భోజనం చేసేందుకు వీలుగా నిర్మాణం చేయాలని నిర్ణయించారు. అయితే ఈ భవనంలోని హాల్స్లో మెట్లు లోపల వైపు ఉండేలా ప్లాన్లో పొందుపరిచి ఆ మేరకు నిర్మిస్తున్నారు. గత నెలలో ఇక్కడికి వచ్చిన దేవదాయశాఖ కమిషనర్ కే రామచంద్రమోహన్ ఈ భవనాన్ని పరిశీలించి మెట్లు లోపల కాకుండా భవనం బయట వైపు వస్తే ఒక్కో హాలులో 50 నుంచి వంద మంది అదనంగా భోజనం చేసే వీలుంటుందని సూచించారు. భోజనం చేసిన భక్తులు వినాయక అతిథిగృహం వెనుక నుంచి వెలుపలకు వచ్చేలా మార్పులు చేయాలని ఆదేశించారు. దేవదాయశాఖ సలహాదారు సుబ్బారావు, చీఫ్ ఇంజినీర్ జీవీ శేఖర్, టూరిజం శాఖ ఎస్ఈ ఈశ్వరయ్య, ఈఈ విజయభాస్కరరెడ్డి, ఆర్కిటెక్ట్ బీకే సాధి, అన్నవరం దేవస్థానం ఈఓ నల్లం సూర్య చక్రధర్రావు, ఈఈ వీ రామకృష్ణ పరిశీలించారు. మెట్లు భవనం వెలుపల కడితే నాలుగు హాల్స్లో 50 నుంచి వంద మంది భోజనం చేసే వీలుంటుందని తేల్చారు. భవనం ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని నిర్ణయించినట్లు ఈఈ రామకృష్ణ తెలిపారు. -
కలెక్టర్ లేని మీటింగ్ ఎందుకు?
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లేకుండా జిల్లా పరిషత్ సమావేశం ఎందుకని కోనసీమ జిల్లాకు చెందిన జెడ్పీటీసీ సభ్యులు మండిపడ్డారు. కాకినాడలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశం జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన నిర్వహించారు. జెడ్పీ సమావేశాలకు కలెక్టర్, జేసీ ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ప్రతీ సమావేశానికి కలెక్టర్ ఎందుకు దూరంగా ఉంటున్నారో చెప్పాలని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ఆధ్వర్యంలో సుమారు అరగంట పాటు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీటీసీ సభ్యులు నేలపై కూర్చుని నిరసన తెలిపారు. కలెక్టర్ లేకుంటే తాము సమావేశం బహిష్కరిస్తామని ప్రకటించారు. సమావేశానికి హాజరుకాని కలెక్టర్పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేయాలన్నారు. కలెక్టర్ రానప్పుడు దూర ప్రాంతాల నుంచి తాము వచ్చినా ఏమీ ఉపయోగమని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ మాట్లాడుతూ కోనసీమలో జాతీయ రహదాలకు పనులు జరుగుతున్నాయని, ఇరిగేషన్కు సంబంధించిన విషయాలు సమావేశంలో చర్చించాలని దీనిపై వివరణ ఇచ్చేందుకు కలెక్టర్ కనీసం జాయింట్ కలెక్టర్ అయినా లేకుంటే ఎలా అన్నారు. జెడ్పీ సమావేశానికి డీఆర్ఓ స్థాయి అధికారులను పంపిస్తున్నారని, ఇలా అయితే సమావేశం వద్దని ఆయన జెడ్పీ చైర్మన్కు సూచించారు. జిల్లా పరిషత్ సమావేశం వేరొక రోజు పెట్టాలని ఆ రోజు కలెక్టర్ వచ్చేలా చూడాలని ఎమ్మెల్సీతో పాటు జేడ్పీటీసీ సభ్యులు పట్టుబట్టారు. జెడ్పీ చైర్మన్ తో పాటు జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు సభ్యులకు ఎంత సర్దిచెప్పినా వారు తగ్గలేదు. కలెక్టర్తో సంప్రదించిన తర్వాతనే తాము సమావేశానికి తేదీలు ఖరారు చేశామని జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు తెలిపారు. కోనసీమ జిల్లాకు జడ్జి రావడంతో ప్రొటోకాల్ నిమిత్తం కలెక్టర్ ఉండాల్సి వచ్చిందని చెప్పడంతో వారు శాంతించారు. సంక్షేమ హాస్టళ్లలో స్వచ్ఛమైన మంచినీరివ్వాలి : ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు సంక్షేమ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు స్వచ్ఛమైన మంచినీరు అందించకపోవడంతో రోగాల బారిన పడుతున్నారని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టళ్లలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారని అన్నారు. ఆర్వో ప్లాంట్ల నిర్వహణను ఆయా కంపెనీలు సక్రమంగా చేయడం లేదని, అధికారులు పర్యవేక్షించడం లేదని మండిపడ్డారు. వైద్య సేవలు సక్రమంగా అందడం లేదు ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరత, సిబ్బంది కొరత ఎక్కువగా ఉందని, దీంతో వైద్య సేవలు అందకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని పలువురు జెడ్పీటీసీ సభ్యులు చెప్పారు. ఏజెన్సీ ప్రాంతంలో ఈ సమస్య ఎక్కువగా ఉందని అక్కడి జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు మండిపడ్డారు. దూర ప్రాంతాలకు వెళ్లి ప్రైవేట్ ఆసుపత్రిలో వేలాది రూపాయలు వెచ్చించి వైద్యం చేయించుకోవాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరుపేదల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారని చెప్పారు. రహదారులు సక్రమంగా లేకపోవడంతో అనేక అవస్థలు పడుతున్నామని పలువురు సభ్యులు తెలిపారు. ముఖ్యంగా రౌతులపూడి, తేటగుంట, ఎస్ పైడిపాల రోడ్డు పూర్తిగా గోతుల మయం అయిందన్నారు. ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, పంతం నానాజీ, వేగుళ్ల జోగేశ్వరరావు, సత్తి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. MýSÌñæ-MýStÆŠ‡ çÜÐ]l*-Ðól-Ô>-°MìS Æ>¯]l…-§ýl$MýS$ °Æý‡çÜ-¯]lV> ¯ólÌSOò³ MýS*Æý‡$a¯]l² ˘ ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు, కోనసీమ జిల్లా జెడ్పీటీసీ సభ్యులుసమావేశంలో మాట్లాడుతున్న జెడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు కోనసీమ జెడ్పీటీసీ సభ్యుల ఆందోళన రైతులకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలం వాడీవేడిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశం వరి రైతులు నష్టపోతున్నారు : ఎంపీ బోస్ ప్రస్తుత రబీలో వరి రైతులకు మద్దతు ధర రాాకపోవడం వల్ల ప్రతి బస్తాకు రూ.200 నుంచి రూ.300 నష్టపోవాల్సి వస్తోందని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. తేమ పేరుతో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కోనసీమ జిల్లాలో తక్కువ రైస్మిల్లులు ఉండడం వల్ల ధాన్యం కొనుగోలు చేయడం లేదన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని ఇతర రైస్ మిల్లులకు కోనసీమ ధాన్యం తరలించే ఏర్పాట్లు చేయాలని, అప్పుడు రైతులకు మద్దతు ధర లభిస్తుందన్నారు. దీనికి కాకినాడ జిల్లా కలెకర్ట్ సానుకూలంగా స్పందించి ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకొంటామని చెప్పారు. -
ఐదేళ్ల లోపు పిల్లలకు బ్లూ ఆధార్
రాజమహేంద్రవరం రూరల్: ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి బ్లూ ఆధార్ ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖాధికారులకు కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. మంగళవారం హుకుంపేటలోని మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న ప్రత్యేక వేసవి శిబిరాలను, అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఈ వేసవి శిబిరంలో కొంతమంది పిల్లలకు ఆధార్ నంబర్లు లేవని కలెక్టర్ కీర్తి చేకూరి తెలుసుకున్నారు. బాల ఆధార్ నమోదు కోసం జనన ఽధ్రువీకరణ పత్రం, తల్లిదండ్రులలో ఒకరి ఆధార్ కార్డుతో సమీప ఆధార్ నమోదు కేంద్రాన్ని సంప్రదించాలని తెలిపారు. ఐదేళ్లలోపు పిల్లలకు వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ అవసరం లేకుండా ఫొటోతోనే నమోదు ప్రక్రియ పూర్తి చేస్తారని వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి విద్యార్థులకు డిక్టేషన్ చెప్పి రాయించారు. 3, 4 తరగతుల విద్యార్థుల్లో పఠన సామర్థ్యం లోపిస్తున్నట్లు గుర్తించి, అలాంటి వారికి ప్రత్యేక వేసవి శిబిరాల ద్వారా అదనపు బోధన నిర్వహించాలని సూచించారు. రిజిస్టర్ అయిన పిల్లల్లో ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. అక్కడ సరిగా చదవకపోయినా పై తరగతికి ప్రమోట్ చేయడంతో వారి తల్లిదండ్రులు తిరిగి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన విషయాన్ని ఉపాధ్యాయులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన అందుతోందనే నమ్మకం ప్రజల్లో పెరుగుతోందనడానికి ఇదో ఉదాహరణ అని కలెక్టర్ అన్నారు. డీఈవో కె.వాసుదేవరావు, ఎంపీడీవో కె.సునీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎంఈవోలు ఏఆర్కేడీ తులసీదాస్, చందుకుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయిని ఉషారాణి పాల్గొన్నారు. ప్రభుత్వ భవనాలపై సోలార్ యూనిట్లు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలోని ప్రతి ప్రభుత్వ భవనం, కార్యాలయంపై సోలార్ పవర్ యూనిట్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గించే అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ కీర్తి అన్నారు. ఆమె వివిధ శాఖల అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సచివాలయ భవనాల రూఫ్టాప్ సమాచారం, పూర్తికాని అంగన్వాడీ భవనాలు, విద్యామిత్ర , వాట్సాప్ గవర్నెన్స్ సేవలు, జలధార – జలహారతి పనులు, రెవెన్యూ పన్నుల వసూళ్లపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ వాట్సాప్ గవర్నెన్స్పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టర్ కీర్తి చేకూరి -
ఆందోళనకరం
నీట్ వంటి ప్రతిష్టాత్మక పరీక్షల్లో పేపర్ లీక్ ఆరోపణలు ఆందోళనకరం. లక్షలాది మంది విద్యార్థులు సంవత్సరాల పాటు కష్టపడి, ఒత్తిడిని ఎదుర్కొంటూ ఈ పరీక్షకు సిద్ధమవుతున్నారు. కొంతమంది చేసిన తప్పులకు నిజాయితీగా చదివిన విద్యార్థులు శిక్ష అనుభవించకూడదు. సమగ్రమైన దర్యాప్తు జరగాలి. అవినీతికి లేదా అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. నిజాయితీగా చదివిన విద్యార్థుల మానసిక స్థితి, భవిష్యత్తును కాపాడటం ముఖ్యం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, డిజిటల్ మానిటరింగ్ అమలు చేయాలి. వైద్య విద్యపై ప్రజల నమ్మకం నిలబెట్టడం అందరి బాధ్యత. – డాక్టర్ ఎస్సీహెచ్ఎస్ రామకృష్ణ, కార్యదర్శి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రద్దు చేయడం దారుణం నీట్ పరీక్షలు రద్దు చేయడం దారుణం. విద్యార్థులు మానసికంగా ఇబ్బంది పడతారు. ఎంతో కష్టపడి నీట్ రాసిన విద్యార్థులు మంచిర్యాంకులు వస్తాయని ఎదురు చూస్తున్నారు. ఎక్కడో రాజస్థాన్లో పేపర్ లీకేజ్ అయిందని పరీక్షలు రద్దు చేయడం సమంజసం కాదు. మా అబ్బాయి కోన సాయి సాత్విక్ నీట్ పరీక్షకు కష్టపడి చదివాడు. అలాగే రానున్న ఎంసెట్కు కూడా ప్రిపేర్ అవుతున్నాడు. ఈ సమయంలో పరీక్ష రద్దు ప్రభావం ఎంసెట్పై పడుతుంది. తిరిగి పరీక్షలు నిర్వహించడం, మళ్లీ చదివి రాయడం అంటే విద్యార్థికి ఇబ్బందిగా ఉంటుంది. – కోన సత్యనారాయణ, కే.పెదపూడి, అంబాజీపేట మండలం, కోనసీమ జిల్లా కొత్త పరీక్షా తేదీలను ప్రకటించాలి దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు తమ భవిష్యత్తును ఈ పరీక్షలపై ఆధారపడి నిర్మించుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పరీక్షల పారదర్శకత, నిష్పాక్షికత, విశ్వసనీయతను కాపాడటం కేంద్ర పరీక్షా సంస్థల ప్రాథమిక బాధ్యత. ఆరోపణల నేపథ్యంలో పరీక్షలను రద్దు చేయడం విద్యార్థుల నమ్మకాన్ని నిలబెట్టే దిశగా తీసుకున్న అత్యవసర చర్యగా భావించాలి. అయితే, విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా, త్వరితగతిన కొత్త పరీక్షా తేదీలను ప్రకటించి, భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్టీఏకు విజ్ఞప్తి చేస్తున్నాం. – మతుకుమిల్లి శ్రీవిజయ్ ధైర్యంగా ఉండాలి నీట్ 2026 ఎన్నో నెలల కృషి, కష్టం. ఎంతోమంది విద్యార్థుల, తల్లిదండ్రుల కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది. ఇది చాలా దారుణం, తిరిగి నీట్ ఎగ్జామ్ ఎప్పుడూ ప్రారంభమవుతుందో తెలిసే వరకు ఎవరూ భయపడకుండా ధైర్యంగా ఉండాలి. – వై.గోవిందరాజు, కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు, రాజమహేంద్రవరం -
ఆక్వా రైతులను పీడిస్తున్న సిండికేట్లు
● నియంత్రించకుంటే ప్రత్యక్ష కార్యాచరణ ● ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కపిలేశ్వరపురం (మండపేట): చంద్రబాబు ప్రభుత్వ పాలనా తీరుతో ఆక్వా రైతులు కుదేలవుతున్నారని, వారిని కనీసం పట్టించుకుంటున్న పాపాన పోలేదని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి మంగళవారం వీడియో మాధ్య మం ద్వారా ప్రభుత్వ వైఖరిని ఖండించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ లెక్కల్లో 4.30 లక్షలు, వాస్తవంగా 10 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారని, ఆక్వా రైతులను ఫీడ్, ఎగుమతి పరిశ్రమల నిర్వాహకులు దోచుకుంటున్నారన్నారు. వారి దోపిడీకి తట్టుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల్లోని ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రభుత్వ అసమర్థత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఆక్వా ఉత్పత్తుల ఎగుమతి, ఫీడ్ పరిశ్రమల యాజమానులు వారి వారి పరిధుల్లో సిండికేట్ అయ్యి ఫీడ్ ధరలను పెంచేస్తున్నారన్నారు. ఫీడ్ తయారీ ముడిసరుకు ఈ దేశంలోనే లభ్యమవుతున్నప్పటికీ ధరలను ఎందుకు పెంచుతున్నారో ప్రభుత్వం చెప్పాలన్నారు. ధరల నిర్ధారణ విషయంలో రైతులతో కానీ, ఏపీఈడీఏ సంస్థతో కానీ ఏ మాత్రమూ సంప్రదించడంలేదన్నారు. కడుపు మండిన రైతులు యాజమానులను ప్రశ్నిస్తే.. కూటమి ప్రభుత్వం తమ కృషి వల్ల వచ్చిందని, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండని చెబుతున్నారని రైతులు అంటున్నారన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక పరిస్థితులు ప్రభుత్వ అసమర్థతను తెలియజేస్తున్నాయన్నారు. సిండికేట్లను నియంత్రించే బాధ్యత ప్రభుత్వానిదన్నారు. కరోనా కాలంలో ఆక్వా ఉత్పత్తులను చెరువుల్లోనే వదిలేసే సంక్షోభం తలెత్తినప్పుడు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చర్యలతో ఆక్వా రైతులను ఆదుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం రైతుల పక్షాన నిలవకుండా కేవలం ఆదుకుంటామన్న ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతోందన్నారు. వైఎస్సార్ సీపీ ఆక్వా రైతులకు అండగా నిలుస్తుందని, ప్రభుత్వం రైతులను ఆదుకోని పక్షంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని ఎమ్మెల్సీ తోట హెచ్చరించారు. -
‘దండి మార్చ్’ సందర్శనను అడ్డుకుంటారా?
● వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి భరత్రామ్ ఆగ్రహం ● పోలీసులతో వాగ్వాదం ● దూరం నుంచే నివాళులర్పించిన వైనం రాజమహేంద్రవరం సిటీ: చంద్రబాబు పాలనలో స్వాతంత్ర సమరయోధుల విగ్రహాల సందర్శనను పోలీసులు అడ్డకోవడం దారుణమని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నగరంలోని కంబాలచెరువు సెంటర్లోని చిరంజీవి బస్ స్టాప్ వద్ద ఉన్న దండి మార్చ్ విగ్రహాల సందర్శనకు వెళ్లిన భరత్రామ్ను సందర్శనకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. స్వతంత్ర సమరయోధుల విగ్రహాలపై దుమ్ము పేరుకుపోవడంతో స్వచ్ఛంద సంస్థ పెయింటింగ్ వేసి మరమ్మత్తులు చేసింది. దీనిని చూసేందుకు వచ్చిన భరత్రామ్ను అధికారులు, పోలీసులు అడ్డుకోవడంతో ఆయన దూరం నుంచే విగ్రహాలకు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను ఏర్పాటు చేసిన విగ్రహాలను అధికారం లేకపోవడంతో చూడకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం చలివేంద్రం ఏర్పాటు చేద్దామన్నా అడ్డుకుంటున్నారని అన్నారు. దేశభక్తిని చాటుతూ ఢిల్లీ తరహాలో రాజమహేంద్రవరంలో దండి మార్చ్ విగ్రహాలను తీసుకువచ్చానన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వాటిని పట్టించుకోకపోతే స్వచ్ఛంద సంస్థతో రంగులు వేయించానని, దానిని చూడడానికి వస్తే అడ్డుకోవడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తాను చేసిన అభివృద్ధి పనులను ధ్వంసం చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందన్నారు. దండి మార్చ్ వంటి చారిత్రక స్ఫూర్తి కేంద్రాలను సంరక్షించడం ప్రభుత్వ బాధ్యతని ఆయన అన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు గుర్రం గౌతమ్, వాసంశెట్టి గంగాధరరావు, దాసి వెంకటరావు, మజ్జి అప్పారావు, నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
హక్కుల సాధన కోసమే పోరాటం
● అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట్ ● అమలాపురంలో మొదలైన మహాసభలు ● ఎర్ర జెండాలతో హోరెత్తిన మహా ప్రదర్శన అమలాపురం టౌన్: వ్యవసాయ కార్మికుల్లో ఐక్యత కోసం, కార్మిక హక్కుల సాధన కోసం జాతీయ, రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్నామని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ధ్వజమెత్తారు. అమలాపురం గడియారం స్తంభం సెంటరులో 30వ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహా సభలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. బుధవారం వరకు నిర్వహించేందుకు రాష్ట్ర సంఘం ఏర్పాట్లు చేసింది. పుర వీధుల్లో సంఘం మహా ప్రదర్శన నిర్వహించింది. ప్రదర్శనలో వ్యవసాయ కార్మిక ప్రతినిధులు 30వ కవాతు నిర్వహించారు. సభలో వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత అధ్యక్షుడు ఎ.విజయరాఘవన్, అఖిల భారత సహాయ కార్యదర్శి విక్రమ్ సింగ్, మాజీ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కారెం వెంకటేశ్వరరావు, చైతన్య, రాష్ట్ర కార్యదర్శులు కె.లోకనాధం, వి.వెంకటేశ్వర్లు ప్రసంగించి వ్యవసాయ కార్మికుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై ప్రశ్నించారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ సభలకు పలు రాష్ట్రాల నుంచి వ్యవసాయ కార్మిక ప్రతినిధులు హాజరై ప్రసంగించారు. చివరిగా సభా వేదికపై వారంతా సంఘీభావం ప్రకటించారు. -
క్రైస్తవం తీసుకున్నా ఎస్సీ హోదా కోల్పోకూడదు
● 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్కు పార్లమెంట్లో సవరణ చేయాలి ● ప్రభుత్వానికి రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ సంఘం నాయకుల వినతి సీటీఆర్ఐ: మత స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కని, దళితులు క్రైస్తవ మతం తీసుకుంటే ఎస్సీ హోదా కోల్పోకూడదని రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ సంఘం నాయకులు అన్నారు. స్థానిక హొటల్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు మాట్లాడుతూ ఎస్సీలు క్రైస్తవం లోకి మారినా ఎస్సీలకు ఉండే ప్రయోజనాలు కోల్పోకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, దీనికోసం 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డరుకు పార్లమెంటులో సవరణ చేసి ఆమోదింపజేయాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు బి.జార్జి ఆంటోని మాట్లాడుతూ ఇతర మతాల్లోకి మారితే కోల్పోని ఎస్సీ హోదా క్రైస్తవంలోకి మారితే ఉండదనడం అన్యాయమని పేర్కొన్నారు. రాష్ట్ర చైర్మన్ గుమ్మడి సమర్పణరావు, వైస్ చైర్మన్ ఎల్వీ ప్రసాద్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా పని చేసే తమ సంఘం ఎస్సీ క్రిష్టియన్లపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు పోరాడుతుందని, క్రైస్తవం లోకి మారినా ఎస్సీ హోదా కోల్పోకుండా దేశ వ్యాప్త ఉద్యమం రావాలని వారు కోరారు. సంఘ సభ్యుడు నంబూరి రవీంద్ర మాట్లాడుతూ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డరు ప్రకారం ఎస్సీల్లో 59 ఉప కులాలు ఉన్నాయని, అందులో ఉన్న సిక్కులు, బౌద్ధులు మతం మారినా ఎస్సీ హోదా పోకుండా ఆ ఆర్డరుకు సవరణ చేయించుకున్నారని వివరించారు. దళితుల కోసం ఆ ఆర్డరుకు సవరణ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మట్టపర్తి సత్యనారాయణ, పోలవరపు రాము, నక్కా సోమేశ్వరరావు పాల్గొన్నారు. -
అవే వినతులు మళ్లీ మళ్లీ
● విన్నవించిన సమస్యలపైనే మళ్లీ మళ్లీ అర్జీలు ● సర్వే మాయాజాలంలో భూములు గల్లంతు ● క్షేత్రస్థాయిలో పరిష్కరించని అధికారులు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): వచ్చిన దరఖాస్తులే మళ్లీ మళ్లీ వస్తున్నాయంటే రెవెన్యూ క్లినిక్లో ఏ మేరకు సమస్యలు పరిష్కారమవుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. సోమవారం నిర్వహించిన రెవెన్యూ క్లినిక్ (పీజీఆర్ఎస్)లో 85 అర్జీలు మాత్రమే వచ్చాయి. వీటిలో భూ సమస్యలపై వచ్చేవే 80 శాతం ఉన్నాయి. గతంలో ఇచ్చిన సమస్యలపైనే మళ్లీ మళ్లీ ఫిర్యాదులు వస్తుండడం గమనార్హం. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో స్పందన, జగనన్నకు చెపుదాం కార్యక్రమాలలో ఇచ్చిన దరఖాస్తులకు ఎంత వేగంగా పరిష్కారాలు దొరికేవోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లలో కలెక్టర్ కీర్తి మొత్తం 201 అర్జీలు స్వీకరించారు. సర్వే నంబర్లు మార్చేశారు బిక్కవోలు మండలం బలభద్రపురంలో నా భార్య చింతా లక్ష్మికి సర్వే 425లో 54 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. 1995లో ఒకసారి, 2022లో సర్వే చేసి అన్నీ బాగుండడంతో అమెకు పట్టా మంజూరు చేశారు. కానీ తాజా సర్వేలో ఆన్లైన్లో ఆ భూమిని వేరే సర్వేలోకి మారిపోయింది. దీంతో ఆ సర్వేపై ఆమె రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంది. అలాగే తన అత్త మేడపాటి వరలక్ష్మికి సర్వే నంబర్ 88 1సీలో 150 సెంట్లు ఉండగా గతంలో దానికి పట్టా ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో చేపట్టిన సర్వేలో 140 సెంట్లకి మాత్రమే పట్టా ఇచ్చి 10 సెంట్ల భూమి లేకుండా చేశారు. తనకు సర్వే నంబర్ 425లో 54 సెంట్లు భూమి ఉంది. దానికి గతంలో సర్వే చేసి పట్టా ఇచ్చారు. ఇప్పుడు సర్వేలో 2015లో చనిపోయిన మామయ్య మేడపాటి సత్యనారాయణ రెడ్డి పేరు మీద అన్లైన్ పెట్టి నా పేర మీద భూమిని తొలగించారు. – చింతా డేవిడ్ రాజా రెడ్డి, ఫిర్యాదు దారుడు డ్రోన్ సర్వేలో మాయం చేశారు నాకు తాళ్లపూడి మండలం, పోచవరం వద్ద ఎకరం 8 సెంట్ల భూమి ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత డ్రోన్ సర్వే చేపట్టి ఆ భూమిని లేపేశారు. రెండేళ్లుగా కలెక్టరేట్కి తిరుగుతున్నా ఇప్పటి వరుకు న్యాయం చేయలేదు. – దుగ్గిరాల శ్రీనివాసరావు, ఫిర్యాదుదారు 15 ఎకరాలకు అడ్డుగా గట్టు కట్టారు తాళ్లపూడి మండలం పైడిమెట్ట గ్రామం వద్ద 20 మంది రైతులకు కలిపి 15 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమి చుట్టూ కొంత ఆర్ అండ్ ఆర్ భూమి ఉండేది. ఈ భూములను కబ్జా చేయడంతో మురుగునీరు తమ పొలాల్లో ఆగిపోతోంది. దీంతో తమ పంటలు పాడైపోతున్నాయి. మురుగు నీరు వెళ్లిపోవడానికి మార్గం చూపించాలని ఇప్పటికి చాలా సార్లు అర్జీ పెట్టినా పరిష్కారం కాలేదు. – పులప కృష్ణారావు, అర్జీదారు చంద్రబాబు చెప్పారని... వికలాంగులకు అదనంగా 35 కేజీల బియ్యం ఇస్తారని సచివాలయ ఉద్యోగులు వచ్చి సర్వే చేపట్టారు. ఇప్పటి వరుకు బియ్యం ఇవ్వలేదు. ఏడాదిన్నర నుంచి కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా. చంద్రబాబు చెప్పారని ఎందుకు వేలి ముద్రుల తీసుకున్నారు. అసలు ఇస్తారో, ఇవ్వరో తెలియాలి. – రొక్కం నీలకంఠేశ్వరరావు, అర్జీదారుడు -
దానకర్ణుడు బసివిరెడ్డి విగ్రహం ఏర్పాటు అభినందనీయం
పెదపూడి : ఉభయగోదావరి జిల్లాల్లో పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు అందజేసి, అన్నదాన సత్రాలు నిర్మించిన అపర దాన కర్ణుడు కీర్తి శేషులు కొవ్వూరి బసివిరెడ్డి అని వైఎస్సార్ సీపీ అనపర్తి నియోజకవర్గం కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. జి.మామిడాడ గ్రామంలో ఏర్పాటు చేసిన కొవ్వూరి బసివిరెడ్డి కాంస్య విగ్రహానికి సోమవారం మాజీ ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ ఖండాంతరాల ఖ్యాతిగడించిన బసివిరెడ్డి విగ్రహం ఏర్పాటుకు ఆవిశ్రాంతంగా కృషి చేసిన ప్రముఖ యువనేత చింతా దొరబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి మండా రాజారెడ్డి, మండల కన్వీనర్ గుత్తుల రమణ, పార్టీ గ్రామ కన్వీనర్,కోకన్వీనర్ మేడపాటి తాతారెడ్డి, ద్వారంపూడి శ్రీనివాసారెడ్డి, పార్టీ నాయకులు ద్వారంపూడి వెంకటరెడ్డి(చింతపండు), కర్రి వీర్రెడ్డి, కోసూరి వాసు, లంక రమేష్, గుడిమెట్ల మురళీ, సబ్బెళ్ల మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోలీస్ పీజీఆర్ఎస్కు 47 ఫిర్యాదులు కంబాలచెరువు(రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పోలీస్ పీజీఆర్ఎస్ నిర్వహించారు. దీనికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్జీదారులు వచ్చి ఎస్పీ డి.నరసింహాకిశోర్కు ఫిర్యాదులు అందజేశారు. మొత్తం పీజీఆర్ఎస్కు 47 ఫిర్యాదులు అందగా, వాటిలో సివిల్ కేసులు, కుటుంబ సమస్యలు, చీటింగ్ కేసులు, కొట్లాట కేసులు, ఇతర కేసులు ఉన్నాయి. వాటిని సంబంధిత స్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయాలని ఆదేశించారు. కడియం రైల్వే గేటు మూసివేత కడియం: సోమవారం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు కడియం ఫిష్ఫామ్ వద్దగల రైల్వే గేటును మూసివేయనున్నారు. ట్రాక్ మరమ్మతుల్లో భాగంగా గేటును మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రజలు సహకరించాలని వారు కోరారు. -
మొక్కజొన్న, అరటికి గిట్టుబాటు ధర కల్పించాలి
● వైఎస్సార్ సీపీ నేతలు గన్నవరపు, జిన్నూరి ● వర్షాలకు దెబ్బతిన్న పంటల పరిశీలన అయినవిల్లి: మొక్కజొన్న, అరటి పంటలకు ప్రభుత్వం గిట్టుబాబు ధర ప్రకటించాలని, తుపాను, అకాల వర్షాలకు దెబ్బతిన్న ఆయా పంటల రైతులను ఆదుకోవాలని నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు జిన్నూరి రామారావు (బాబి) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని తొత్తరమూడి కె.పెదలంకలో తుపాను, వర్షాలకు దెబ్బతిన్న పంటలను వారు పరిశీలించారు. రైతులు గుత్తాల బాబురావు, రేవు రాంబాబు, బొక్కా సత్యనారాయణ, మద్దా వెంకటలక్ష్మి తదితరులు పాడైన పంటలను వారికి చూపించారు. ఈ ఏడాది మొక్కజొన్న ఎకరాకు 40 బస్తాల వరకు దిగుబడి వచ్చిందని, అరటి సైతం బాగుందని, కానీ మార్కెట్లో గిట్టుబాటు ధర లేక అయినకాడికి విక్రయించాల్సి వస్తోందని వాపోయారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు, రామారావు మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మొక్కజొన్నకు ఎంఎస్పీ క్వింటాలుకు రూ.2400 చెల్లించే వారని ఈ ప్రభుత్వంలో రూ.1400 నుంచి రూ.1700 మాత్రమే చెల్లింస్తున్నారన్నారు. అరటి గెల మార్కెట్లో రూ.400 వరకూ పలికేదని ఇప్పుడు రూ.50కి కూడా కొనావారు లేరన్నారు. ఇంతలా నష్టపోతున్న రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరేత్తినట్లు చూస్తోందని మండి పడ్డారు. తక్షణం రైతులకు గిట్టుబాటు ధర ప్రకటించి ఆదుకోవాలని కోరారు. పంటల బీమాకు కేంద్ర ప్రభుత్వం, రైతులు ముందుకు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం తమవాటా చెల్లించలేని స్థితిలో ఉందన్నారు. దీంతో బీమా సంస్థలు పంటల బీమాకు ముందుకు రావడం లేదన్నారు. కార్యక్రమంలో అయినవిల్లి, పి.గన్నవరం మండలాల వైఎస్సార్ సీపీ అధ్యక్షులు మేడిశెట్టి శ్రీనివాసబాబు, యన్నబత్తుల ఆనంద్, రాష్ట్ర రైతు విభాగ జాయింట్ సెక్రటరీ కొర్లపాటి కోటబాబు, రైతు విభాగం మండల అధ్యక్షుడు రెడ్డి గనిరాజు, కోట విజయరాజు, గుత్తుల నాగబాబు, మిండగుడిది శిరీష్ నారాయణస్వామి, కుడుపూడి రామకృష్ణ, మిండగుదిటి రాంబాబు, కుసుమ సునీల్కుమార్, మతుకుమిల్లి సత్తులు తదితరులు ఉన్నారు. -
అవినీతి సైకథం!
వాడపల్లి–1లో ఇసుక ర్యాంప్లో లారీలకు ఎగుమతి చేస్తున్న ప్రోక్లైయినర్లు● అనుచిత రీతిలో భారీ దోపిడీ ● అధికారులతో కాంట్రాక్టర్ల కుమ్మక్కు! ● అన్నీ తెలిసినా నిద్ర నటిస్తున్నవైనం పెరవలి (కొవ్వూరు): కాంట్రాక్టర్లకు కాసులు కురిపించడానికే ఉచిత ఇసుక పథకాన్ని ప్రభుత్వం రూపొందించినట్టుంది. అధికారులు, నాయకుల కళ్లెదుటే లారీ డ్రైవర్ల నుంచి అదనపు వసూళ్లు చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 20 టన్నుల ఇసుక గుట్టల వద్దే రూ.4300 విక్రయిస్తున్నా ప్రశ్నించేవారు లేకపోవడం శోచనీయం. కాంట్రాక్టర్లు, దళారులు, అధికారుల పటిష్టమైన సమన్వయంతో దోపిడీ పర్వం సాగుతున్న నేపథ్యంలో పేదలకు ఉచిత ఇసుక ఏ మేరకు అందుతోందో వేరే చెప్పాల్సిన పనిలేదని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. మామూళ్ల మత్తులో.. కొవ్వూరు నియోజకవర్గంలో వాడపల్లి, ఔరంగబాద్, కొవ్వూరు, అరికలరేవు, కుమారదేవం, వేగేశ్వరం, తాళ్లపూడి, ప్రక్కిలంక ఇసుక ర్యాంపుల్లో జరుగుతున్న అవినీతికి అంతులేకుండా పోయింది. అధికారుల కళ్లెదుటే కాంట్రాక్టర్లు అధిక మొత్తంలో సొమ్ములు వసూలు చేస్తున్నారంటే నెలవారీ చదివింపులు ఏ స్థాయిలో సాగుతున్నాయో అర్ధంచేసుకోవచ్చని బహిరంగంగానే చర్చ సాగుతోంది. ప్రభుత్వ రేటు ఎంత? నియోజకవర్గంలో ఇసుక లభ్యత ఉన్న 7 ఓపెన్ రీచ్లు, 8 పడవల ద్వారా లభ్యమయ్యే ఇసుక రీచ్లను జిల్లా అధికారులు గుర్తించి ఇసుక సరఫరా చేయాలని ఆదేశించారు. దీనికి ముందు టెండర్లు పిలిచి తక్కువ టెండరు వేసినవారికి రీచ్లను అప్పగించారు. టెండర్ దక్కించుకున్నవారికి ఒక్కో రీచ్కు అధికారులు ఒక్కో ధర నిర్ణయించారు. ఈ ర్యాంపుల్లో టన్ను ఇసుక రూ.68 నుండి రూ.110కు సరఫరా చేస్తామని కాంట్రాక్టర్లు టెండర్లు వేస్తారు. దీని ప్రకారం ర్యాంపులో లారీ ఇసుక (20 టన్నులకు) ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం రూ.1380 నుంచి రూ.1921 వసూలు చేయాల్సి ఉంది. కానీ రూ.4 వేల నుంచి రూ.4300 వరకు విక్రయిస్తున్నారు. అదే ట్రాక్టరుకై తే రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నారు. మొత్తం వసూళ్లు ఇలా.. నియోజకవర్గంలోని 15 ర్యాంపుల్లో నిత్యం 50 నుంచి వంద లారీల చొప్పున సుమారు 750 లారీల ఇసుక ఎగుమతి అవుతుంది. వీటికి తోడు ట్రాక్టర్ల ద్వారా ఎగుమతి అవుతున్న ఇసుకకు రూ.17.25 లక్షలు కాంట్రాక్టర్లకు చేరుతోంది. ఇలా నెలకు రూ.5.17 కోట్లు వసూలు చేస్తున్నారు. అధికారుల సమక్షంలోనే ఈ దందా సాగుతున్నా సొమ్ములు కాంట్రాక్టర్ నియమించిన వ్యక్తులే వసూలు చేయడం గమనార్హం. కాగా నదీగర్భం నుంచి ఇసుక తీసుకువస్తున్న పడవల యజమానులకు, ఎగుమతి చేస్తున్న కూలీలకు మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తే రోజుకు రూ.500 నుంచి రూ.700 ఇస్తున్నారు. చెప్పిన ధరలకు ఇవ్వడం లేదుఇసుక పాయింట్ల వద్ద ప్రభుత్వం చెప్పిన ధరలకు ఎగుమతి చేయటం లేదు. ఒక లారీకి అదనంగా రూ.2300 తీసుకుంటున్నారు. కాదంటే ఒప్పుకోవడం లేదు. – ఆర్.సత్యనారాయణ, లారీ డ్రైవర్, భీమవరం గంటల తరబడి నిరీక్షణ అడిగిన సొమ్ములు ఇవ్వకపోతే ఇసుక ఇవ్వటం లేదు. రోజంతా పడిగాపులు తప్పడంలేదు. ఎంత ఎక్కువ డబ్బులు ఇస్తే అంత ముందర లోడ్ చేస్తున్నారు. – వి సుబ్బారావు, లారీ డ్రై యివర్ తాడేపల్లి గూడెం -
తామర వ్యాధిని తరిమేద్దాం
● పశువుల్లో ప్రమాదకరం ● జాగ్రత్తలతో నయం రాయవరం: మనుషుల మాదిరిగానే పశువులకు కూడా చర్మ వ్యాధులు సోకుతాయి. ఈ చర్మ వ్యాధుల్లో తామర పశువులను అనారోగ్యానికి గురి చేస్తుంది. ఇది ‘డర్మటోఫైట్స్’ అనే రకానికి చెందిన శిలీంధ్రం/బూజు వల్ల ఆవులు, గేదెల్లో కలిగే అతి సాధారణ వ్యాధి. దీనివల్ల చర్మంపై గుండ్రని, గోళాకారపు మచ్చలు ఏర్పడతాయి. దీనినే రింగ్ వార్మ్ అని కూడా అంటారు. పశువులకు తామర వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది?, వ్యాధి లక్షణాలు, చికిత్స విధానాన్ని రాయవరం మండలం మాచవరం పశువైద్యాధికారి ఎం.బిందు వివరించారు. అవి ఇలా.. వ్యాధి వ్యాప్తి.. లక్షణాలు రింగ్ వార్మ్ ఏడాది లోపు దూడల్లో ముఖ్యంగా ఎండా కాలంలో అధికంగా వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన పశువుతో కలిసి జీవించే ఇతర పశువులకు నేరుగా, పశువుల కొట్టాంలోని వస్తువుల ద్వారా, పశువుల కాపరుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. వ్యాధికి గురైన పశువుల చర్మంపై ఉండే వెంట్రుకలు రాలిపోతాయి. కంటి చుట్టూ, చెవులు, మెడ, తలపై మరియు గంగడోలు చర్మంపైన ఎర్రటి పుండ్లు ఏర్పడతాయి. ఈ మచ్చలు గుండ్రంగా, గోళాకారంగా ఉండి, గాయం మధ్యలో మానిపోయి చుట్టూ పుచ్చిపోయి ఉంటుంది. నిర్ధారణ.. చికిత్స వెంట్రుకలు ఊడిపోయి గుండ్రంగా ఉన్న మచ్చల ఆధారంగా పశువులకు తామర వ్యాధి సోకిందని గుర్తించవచ్చు. చర్మాన్ని సేకరించి పరీక్షించడం ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చు. సాలిసిలిక్, బెంజాయిక్ ఆసిడ్, అయోడిన్, ఫినాల్ వంటి ఔషధాలను దగ్గరలో ఉన్న పశు వైద్యుడిని సంప్రదించిె వినియోగించాలి. తామర తగ్గే వరకూ వైద్యం చేయించాల్సి ఉంటుంది. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 22,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 22,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
జాతీయ పతకాలే లక్ష్యం
నా పేరు జి.నికిలేష్. పదో తరగతి పూర్తి చేసుకుని ఇంటర్లో చేరేందుకు సిద్ధమవుతున్నాను. ఐదేళ్లుగా టెన్నిస్ ఆడుతున్నాను. ఇప్పటి వరకూ నాలుగు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. జాతీయ స్థాయిలో పతకం సాధించడమే లక్ష్యంగా సాగుతున్నాను. ఫిట్నెస్ కోసం ఆడుతున్నా.. నా పేరు షేక్ సాజిద్ అలోక్. తొమ్మిదో తరగతి చదువుతున్నాను. రోజుకు రెండు గంటలు టెన్నిస్ సాధన చేస్తున్నాను. ఫిట్నెస్ కోసం ఈ క్రీడ ఆడుతున్నాను. భవిష్యత్తులో ఐఏఎస్ కావాలన్నది నా లక్ష్యం. మూడేళ్లుగా శిక్షణ నాపేరు కె.కుందన. ఇంటర్ చదువుతున్నాను. నాకు టెన్నిస్ క్రీడాకారుడు ఫెదరర్ అంటే ఇష్టం. గత మూడు సంవత్సరాలుగా కోచ్ కుమార్ వద్ద శిక్షణ పొందుతున్నాను. రోజుకు 2 గంటలు ఆడుతున్నాను. -
● వేసవి శిక్షణతో ఆగిపోవద్దు
వేసవి శిక్షణలో తమ పిల్లలను తల్లిదండ్రులు ఎంతో ఇష్టంగా చేర్పిస్తున్నారు. ఈ శిక్షణ పొందిన క్రీడాకారులు వేసవితో ఆగిపోకుండా నిరంతరం శిక్షణ పొందితే జాతీయ స్థాయి క్రీడాకారులుగా తయారవుతారు. ఈ ఏడాది శిక్షణకు సుమారు 120 మంది చేరారు. ఉదయం, సాయంత్రం అనుభవజ్ఞులైన కోచ్లతో శిక్షణ అందిస్తున్నాం. శిక్షణకు డీఎస్డీఓ సతీష్ కుమార్ ఎంతో సహకారం అందిస్తున్నారు. –పీవీ రామ్కుమార్, టెన్నిస్ సంఘ రాష్ట్ర కార్యదర్శి, కోచ్ ● -
అందమే అక్కడెక్కడ!
తాండవ నదిపై పచ్చని తివాచీ కనువిందు చేస్తుంది. ఈ అపురూప దృశ్యం అందరినీ ఆకర్షిస్తోంది. తుని వద్ద జాతీయ రహదారి బ్రిడ్జి నుంచి రైల్వే బ్రిడ్జి వరకూ అర కిలోమీటరు పైగా తాండవ నదిలో పేరుకుపోయిన గుర్రపుడెక్క ఇది. వేసవిలో తాండవ నదిలో నీటి ప్రవాహం నిలిచిపోయి గుర్రపుడెక్క ఇలా పేరుకుపోయింది. వేసవి ఉష్ణోగ్రతలు కొనసాగితే తాండవ నదిలో పూర్తిగా నీరు ఇంకిపోయి ఈ గుర్రపుడెక్క ఎండిపోనుంది. –తుని రూరల్ రక్షణ గోడు పట్టదా! కాజులూరు మండలం ఉప్పుమిల్లి– దుగ్గుదుర్రు రహదారిలో కాలువపై కల్వర్టు ప్రమాదాలకు నిలయంగా మారింది. పదిహేనేళ్ల కిందట నిర్మించిన వంతెన ఇరువైపులా రక్షణ గోడలు ఏర్పాటు చేయలేదు. ఈ కల్వర్టుకు ఇరువైపులా రోడ్డు మలుపు తిరిగి ఉంటుంది. వేగంగా వచ్చే వాహనాలు అదుపు తప్పితే కాలువలోకి పడిపోతున్నాయి. ఇటీవల ఓ ట్రాక్టర్ కల్వర్టుపై నుంచి కాలువలోకి పడిపోగా, డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. –కాజులూరు -
మరిచిపోయిన బంగారు ఆభరణాల అప్పగింత
రామచంద్రపురం రూరల్: బస్సులో బంగారు ఆభరణాల బ్యాగు మరిచిపోయిన వృద్ధురాలికి తిరిగి వాటిని అందజేసి ఆర్టీసీ సిబ్బంది నిబద్ధత చాటుకున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. రామచంద్రపురం పట్టణ ఆర్టీసీ పాత బస్టాండ్ వద్ద జంగారెడ్డిగూడేనికి చెందిన 60 ఏళ్ల వృద్ధురాలు కాలెపు ప్రభావతి రాజమహేంద్రవరం బస్సు అనుకుని రాజానగరం వెళ్లే బస్సు ఎక్కింది. ఆ బస్సు రాజమహేంద్రవరం వెళ్లదని చెప్పడంతో హడావుడిగా దిగిపోయింది. ఆ హడావుడిలో ఆమె తన బ్యాగును ఆ బస్సులో మర్చిపోయింది. తరువాత గుర్తించిన ఆమె ఆర్టీసీ డిపో మేనేజర్ పేపకాయల భాస్కరరావుకు విషయం తెలియజేయగా, వెంటనే సంబంధిత కండక్టర్, డ్రైవర్లను అధికారులు అప్రమత్తం చేశారు. రూ.6 లక్షల విలువైన ఆభరణాలతో ఉన్న బ్యాగును అధికారుల సమక్షంలో డ్రైవర్, కండక్టర్ల చేతుల మీదుగా ఆమెకు అందజేశారు. కండక్టర్ పలివెల సత్తిబాబు, డ్రైవర్ సీహెచ్ఎస్ రావు, డిపో మేనేజర్లకు ప్రభావతి కృతజ్ఞతలు తెలియజేసింది. -
జోరుగా.. హుషారుగా..
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో.. నా పేరు ఎస్.చార్విన్. ఐదో తరగతి చదువుతున్నాను. నాకు ఫెదరర్ అంటే ఇష్టం. టెన్నిస్లో రాణించి కార్డియాలజిస్టు కావాలన్నదే లక్ష్యం. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో టెన్నిస్లో చేరాను. ఈ క్రీడలో రాణించేందుకు కృషి చేస్తున్నాను. ఫ ఉత్సాహంగా లాన్ టెన్నిస్ శిక్షణ ఫ వేసవి వేళ సద్వినియోగం నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కలలను నిజం చేసుకునే అడుగది.. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునే సమయమిది.. చిన్నతనం నుంచే అనుకున్న లక్ష్యం దిశగా కొందరు బాటలు వేసుకుంటుండగా, మరికొందరు ఖాళీ సమయాన్ని ఇష్టమైన క్రీడకు కేటాయిస్తున్నారు. అలాంటి వారి కోసం కాకినాడలోని జిల్లా క్రీడా మైదానంలో జిల్లా లాన్ టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో శాప్ సహకారంతో లాన్టెన్నిస్ శిక్షణ ఇస్తున్నారు. ఇందులో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇక్కడ రోజూ ఉదయం 6 నుంచి 8 వరకూ, సాయంత్రం 4 నుంచి 7 వరకూ శిక్షణ అందిస్తున్నారు. ఐదేళ్ల వయసు నుంచి చిన్నారులు శిక్షణ పొందుతున్నారు. చీఫ్ కోచ్ పీవీ రామ్కుమార్తో పాటు రమణ, త్రినాథ్, అనంత్, నాని శిక్షణ అందిస్తున్నారు. ఫిట్నెస్తో పాటు, టెన్నిస్లో క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నారు. 120 మంది క్రీడాకారులు ఈ వేసవి శిక్షణకు హాజరై ఓనమాలు నేర్చుకుంటున్నారు. శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు టెన్నిస్ సంఘం తరఫున ప్రతి రోజూ గుడ్డు, నిమ్మ రసం అందిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన శ్రీవేద పదో తరగతి పరీక్షల్లో 600 మార్కులకు 587 మార్కులు సాధించి విద్యలోనూ సత్తా చాటింది. అలాగే విద్యార్థిని ప్రవల్లికి స్పోర్ట్స్ కోటాలో ఇంజినీరింగ్ సీటు వచ్చింది. స్థానిక డీఎస్ఏ మైదానంలోని టెన్నిస్ కోర్టుల్లో శిక్షణ పొందుతున్న చిన్నారులు తమ మనోభావాలు ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు. నాన్న ఆడడం చూసి.. నా పేరు జాహ్నవిక. మా నాన్న ఆర్ఎంసీ మైదానంలో టెన్నిస్ ఆడేవారు. అక్కడ టెన్నిస్ ఆడడం చూసి టెన్నిస్పై ఇష్టం పెంచుకున్నాను. నేను 4వ తరగతి చదువుతున్నాను. నాకు రాష్ట్ర స్థాయిలో బంగారు పతకం సాధించాలని ఉంది. -
వేగమే బలిగొంది
ఫ రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి ఫ మరొకరికి తీవ్ర గాయాలు కూనవరం: వేగం... ఇద్దరి ప్రాణాలను బలిగొంది. కూలి పనులు చేస్తూ కుటుంబాలకు ఆసరాగా ఉంటున్న వారి మృతితో విషాదం నెలకొంది. ఈ ఘటన అభిచర్ల గ్రామ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై బి.రామకృష్ణ కథనం ప్రకారం.. పంద్రాజుపల్లి గ్రామం నుంచి చింతూరు వైపు ద్విచక్ర వాహనంపై పంద్రాజుపల్లికి చెందిన వంజం లక్ష్మణ్ (24), ముల్లూరుకు చెందిన పద్దం కార్తీక్ (25), అభిచర్ల గ్రామానికి చెందిన శ్యామల భీమేశ్వరరావు వస్తున్నారు. అభిచర్ల గ్రామ సమీపంలో మలుపు వద్ద వేగంగా వస్తున్న కంకర లోడు ట్రాక్టర్ను వీరు ఢీకొన్నారు. వెంటనే ఆ ముగ్గురూ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. తీవ్ర రక్తస్రావం కావడంతో వంజం లక్ష్మణ్, కార్తీక్ అక్కడికక్కడే మృతి చెందారు. భీమేశ్వరరావుకు తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్లో కోతులగుట్ట సీహెచ్సీకి తరలించి ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం భద్రాచలానికి రిఫర్ చేసినట్లు వైద్యులు తెలిపారు. కాగా ఘటనా స్థలాన్ని ఎస్సై రామకృష్ణ సందర్శించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సీహెచ్సీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
వంద కిలోల గంజాయి స్వాధీనం
వై.రామవరం: మండలంలోని కొమరవరం గ్రామ జంక్షన్లో రూ.50 లక్షల విలువైన వంద కిలోల గంజాయిని పట్టుకున్నట్లు అడ్డతీగల సీఐ బి.నరసింహమూర్తి, ఎస్సై ఎస్.పృథ్వీయాదవ్ తెలిపారు. ఓ కారును, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఈ మేరకు మహారాష్ట్రాకు చెందిన మహేష్ మార్కెట్ (35), రఫిన్ జిలాల్ పింజారి (27)లను కోర్టులో హాజరుపరిచగా, న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు చెప్పారు. గంజాయిని ఒడిశా రాష్ట్రం నుంచి వై.రామవరం మండలం మీదుగా మహారాష్ట్రాకు తరలిస్తున్నారని అన్నారు. సోమవారం ఉదయం కొమరవరంలో వీరు పట్టుబడ్డారు. మొత్తం ఐదుగురు నిందితులు కాగా, ముగ్గురు పరారీలో ఉన్నారన్నారు. వీరంతా గంజాయి కేసుల్లో పాత నిందితులని సీఐ వివరించారు. సెల్ టవర్ ఎక్కి వ్యక్తి ఆత్మహత్యాయత్నం యానాం: పోలీసులు వేధిస్తున్నారంటూ యానాంలో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన సంచలనం రేపింది. ఎన్నికలకు సంబంధించి సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టు షేర్ చేశాడనే అభియోగంతో పట్టణ పరిధిలో మహ్మద్ అహ్మద్ అలీషాకి సంబంధించిన సెల్ ఫోన్ను పోలీసులు ఇటీవల స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అతన్ని రోజూ స్టేషన్కు పిలవడం, సాయంత్రం వెళ్లిపోమని చెప్పడం, వారం రోజులుగా జరుగుతుంది. తన సెల్ ఫోన్ తిరిగి ఇవ్వాలంటూ అలీషా సోమవారం మధ్యాహ్నం స్థానిక సిద్ధార్ధనగర్లోని సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అక్కడకు ఎస్పీ వరదరాజన్, ట్రైనీ ఎస్పీ చిట్టిరాజు, సీఐ షణ్ముకసుందరం, ఎస్సై కొమరన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్ధాని దినేష్, శివ తదితరులు చేరుకుని దిగిరావాలని కోరారు. ఇలా రెండు గంటల పాటు ఉత్కంఠ నెలకొంది. ఆఖరికి ఎస్సై కొమరన్ సెల్ఫోన్ తీసుకుని రావడంతో అలీషా కిందకు దిగాడు. సెల్ఫోన్ ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ పోలీసులు పట్టుకువెళ్లడంతో, గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంటానని అలీషా అనడంతో సెల్ఫోన్ తిరిగి ఇచ్చారు. -
గిన్నీస్ వరల్డ్ రికార్డ్లో ప్రతిభ
సీతానగరం: కీ బోర్డుపై సుస్వరాలు పలికించి గిన్నీస్ వరల్డ్ రికార్డులో రాపాక శ్రేష్ట జోయిస్ ప్రతిభ చాటింది. సీతానగరం మండలం కాటవరం గ్రామానికి చెందిన జోయిస్ అక్కడి ప్రైవేట్ స్కూల్లో యూకేజీ చదువుతుంది. ఆ పాప పుట్టినప్పుడు, ఆడపిల్ల పుట్టిందనే కారణంతో తండ్రి వదిలి వెళ్లిపోయాడు. అయినప్పటికీ తల్లి సోనీ ప్రశాంతి, మేనమామ గుర కిషోర్కుమార్, అమ్మమ్మ అందించిన సహకారంతో ప్రతిభ చాటింది. ఫిబ్రవరి 2న గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో సామూహిక కీ బోర్డు ప్లే జరిగింది. సుమారు 22 దేశాల నుంచి రెండు వేల మంది కీబోర్డు వాయిద్యకారులు పాల్గొనగా, 777 మంది ప్రతిభ కనబరిచారు. ఇందులో రాపాక శ్రేష్ట జోయిస్తో పాటు తల్లి సోనీ ప్రశాంతి, మేనమామ కిషోర్ కుమార్ కూడా ఉన్నారు. వీరికి ఈ నెల 9న విజయవాడలో హల్లెల్ మ్యూజిక్ స్కూల్ ఆధ్వర్యంలో ప్రత్యేక అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ స్కూల్ వ్యవస్థాపకులు అగస్టీన్ దండింగి సర్టిఫికెట్లు, పథకాలను అందజేశారు. విజయవాడలో సర్టిఫికెట్ అందుకున్న శ్రేష్ట జోయిస్తో పాటు తల్లి, మేనమామ -
పగలంతా ఉక్కపోత.. రాత్రి కుండపోత
రాజానగరం: చండప్రచండంగా కాసిన ఎండ తీవ్రత నుంచి ప్రజలు కాస్త సేద తీరారు. రాజానగరంలో ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. పగలంతా 39 డిగ్రీల ఉష్టోగ్రతలతో తల్లడిల్లిపోయిన జనాలు.. హఠాత్తుగా చల్లబడిన వాతావరణాన్ని హాయిగా ఆస్వాదించారు. ఈదురు గాలులు, చినుకులతో ప్రారంభమైన వర్షం క్రమంగా జోరందుకోవడంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. సుమారు గంటన్నర పాటు కుండపోతగా కురిసిన వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. బాటసారులు, బైకులపై ప్రయాణించేవారు షెల్టర్ కోసం పరుగులు తీశారు. కలవరపడుతున్న రైతులు అకస్మాత్తుగా కురిసిన వర్షం రైతులను కలవరపాటుకు గురి చేసింది. రబీ వరి కోతలు జరుగుతున్న వేళ కురిసిన ఈ వర్షంతో పంట నష్టం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. కోతలు జరిగిన చోట కళ్లాల్లో ఉన్న ధాన్యం తడిసి దెబ్బ తింటుందని అంటున్నారు. అలాగే, కోతకు సిద్ధంగా ఉన్న పొలాల్లోని వరి పైరు ఈదురు గాలులకు నేలకొరిగి, ధాన్యం గింజలు రంగు మారే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే, ఈ వర్షం వలన కోతలు పూర్తయిన పొలాల్లో వేసవి దుక్కులు చేపట్టే అవకాశం ఉంటుంది. రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది. -
నిరంతరం సేవా కార్యక్రమాలు
● మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ● ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహణ రాజమహేంద్రవరం సిటీ: మార్గాని భరత్ ఫౌండేషన్ ద్వారా నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ తెలిపారు. ఈ నెల 12న ఆయన పుట్టిన రోజు, ఆదివారం అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక కృష్ణా నగర్ వీవీ గార్డెన్స్ కల్యాణ మండపంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో ఆయన మాట్లాడారు. ఈ శిబిరంలో క్యాన్సర్, గుండె, కిడ్నీ, ఊపిరితిత్తులు, కీళ్ల నొప్పులు, న్యూరో, డెంటల్, కళ్లు, గైనకాలజీ తదితర అన్ని విభాగాలకు సంబంధించిన సేవలు అందిస్తున్నామన్నారు. హైదరాబాద్ కాంటినెంటల్, రాజమహేంద్రవరం జీఎస్ఎల్, వాసన్ ఐ కేర్, మాగ్నా వంటి సూపర్స్పెషాలిటీ ఆస్పత్రుల నుంచి నిపుణులైన వైద్యులు వచ్చిన ఈ శిబిరంలో ఉచిత వైద్య పరీక్షలు చేశారని, ఉచితంగా మందులు అందించామని చెప్పారు. ఈ శిబిరంలో సుమారు 2 వేల మంది ఉచిత వైద్య సేవలు పొందారన్నారు. ప్రతి రెండు నెలలకు వైద్య శిబిరం నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ, భరత్ను అభినందించారు. ప్రభుత్వ పరంగా ఆరోగ్యశ్రీ సేవలు 80 శాతం మేర అందని ప్రస్తుత తరుణంలో ఇటువంటి శిబిరాలు నిర్వహించడం మంచి పరిణామమని అన్నారు. మార్గాని నాగేశ్వరరావు మాట్లాడుతూ, మార్గాని ఫౌండేషన్ ద్వారా గతంలో జాబ్ మేళాలు నిర్వహించి, 2 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించామని తెలిపారు. ఇప్పుడు ఈ వైద్య శిబిరం నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. రత్నం మెడికల్స్, రామలక్ష్మీ మెడికల్ ఏజెన్సీల ద్వారా మందులు అందజేశారు. ఆదిత్య కాలేజీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి జీవీఎస్ నాగేశ్వరరావు ఆధ్వర్యాన వలంటీర్లు సేవలందించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, తలారి వెంకటరావు, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైఎస్సార్ సీపీ రామచంద్రపురం కో ఆర్డినేటర్ సూర్యప్రకాష్, సిటీ పరిశీలకుడు అద్దంకి ముక్తేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు, ఏపీఐడీసీ మాజీ డైరెక్టర్ కానుబోయిన సాగర్, రాష్ట్ర కార్యదర్శి వాసంశెట్టి గంగాధరరావు, పార్టీ కడియం మండల అధ్యక్షుడు స్టాలిన్, జిల్లా ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ దాసి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. -
కోలుకోలేక..
● సిండికేటుపెరవలి: కొనుగోలు సంస్థలు సిండికేట్ అవుతున్నాయి.. ధర దారుణంగా తగ్గించేస్తున్నాయి.. రైతుల కష్టాన్ని కొల్లగొడుతున్నాయి.. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు.. సాధారణంగా ఏ వస్తువు ధర అయినా ఒక ఏడాదికి, మరో ఏడాదికి పెరుగుతూ ఉంటుంది. కానీ, తమ కష్టానికి మాత్రం ధర నానాటికీ పడిపోతోందని, నష్టాల ఊబిలో కూరుకుపోతున్నామని కోకో రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ధర తగ్గించేశారిలా.. జిల్లావ్యాప్తంగా పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, చాగల్లు, దేవరపల్లి, కొవ్వూరు, కడియం, సీతానగరం, బిక్కవోలు తదితర మండలాల్లోని సుమారు 5 వేల మంది రైతులు దాదాపు 16 వేల హెక్టార్లలో కోకో సాగు చేస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో ఏటా సుమారు 2.64 లక్షల క్వింటాళ్ల కోకో గింజల ఉత్పత్తి జరుగుతోంది. ప్రతి పంటకు ఎకరానికి నాలుగైదు క్వింటాళ్ల వరకూ దిగుబడి రావాలి. గత ఏడాది 2 నుంచి 3 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. ఈ ఏడాది 3 నుంచి 4 క్వింటాళ్ల వరకూ వస్తోందని రైతులు చెబుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కిలో కోకో గింజలకు ఏకంగా రూ.1,050 ధర పలకడంలో రైతులకు మంచి లాభాలు వచ్చాయి. అటువంటిది చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత కొనుగోలు సంస్థలది ఇష్టారాజ్యంగా మారింది. ఆయా కంపెనీలు గత ఏడాది దారుణంగా ధర తగ్గించేయడంతో రైతులు సామూహికంగా ఉద్యమించారు. దీంతో, ప్రభుత్వం దిగివచ్చి, కిలో గింజల ధరను రూ.650గా నిర్ణయించింది. ఈ ఏడాది ధర అంతకంటే అధికంగా ఉండాలి. కానీ, ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా.. కొనుగోలు సంస్థలు సిండికేట్ అయ్యి, ధరను ఏకంగా రూ.300కు తగ్గించేశాయి. అది కూడా కొనుగోలు కేంద్రాల్లో మామూళ్లు ఇస్తేనే కొంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోకో గింజలను ఫ్యాక్టరీలకు తీసుకెళ్తే కనీసం గేట్లు కూడా తీయడం లేదని, మార్కెట్ ధరకే అమ్ముతామన్నా వద్దంటున్నారని వాపోతున్నారు. అన్నీ ప్రైవేటు సంస్థలు కావడంతో వారు ఆడింది ఆట.. పాడింది పాటగా మారిందని దుయ్యబడుతున్నారు. నాణ్యతను బట్టి అంతర్జాతీయ మార్కెట్లో కిలో కోకో గింజల ధర రూ.750 నుంచి రూ.800 పలుకుతుండగా.. కనీసం రూ.500కు కూడా కొనుగోలు చేయడం లేదని మండిపడుతున్నారు. తమ కష్టనష్టాలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఆదారపడిన జనం జిల్లాలో కోకో సాగుపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి 15 వేల మంది జీవిస్తున్నారు. ఈ ఏడాది గిట్టుబాటు ధర లభించకపోవడంతో కూలీలను పెట్టుకోవడానికి చాలా మంది రైతులు విముఖత చూపుతున్నారు. పలువురు రైతులు సొంతంగా కాయలు కోసి, గింజలు తీసుకుంటున్న పరిస్థితి నెలకొంది. కొంత మంది రైతులు మాత్రం తక్కువ సంఖ్యలో కూలీలను పెట్టుకుంటున్నారు. కోకో సాగుకు అధిక మొత్తంలో ఎరువులు అవసరమవుతాయి. తెగుళ్లు కూడా ఎక్కువగానే వస్తాయి. అందువలన పురుగు మందులు కూడా వినియోగించడం తప్పనిసరి. దీంతో, ఎకరానికి రూ.60 వేల వరకూ పెట్టుబడి అవుతోంది. ఈ పరిస్థితుల్లో గత ఏడాది కంటే దిగుబడి పెరిగినప్పటికీ, కంపెనీలు ధరను తగ్గించేయడంతో రైతులు తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. వచ్చిన సొమ్ము ఖర్చులకు సరిపోతుందని, మగతాకు ఎక్కడి నుంచి తేవాలని వాపోతున్నారు. సిండికేట్ అయితే రైతులు అయిన కాడికి అమ్ముకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని, అందుకే కంపెనీలు ధర తగ్గించేశాయని రైతులు ఆరోపిస్తున్నారు. ధర తగ్గించేశారు కోకోకు గత ఏడాది కంటే అధిక ధర లభిస్తుందని ఆశించాం. కానీ, తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాది కంటే దిగుబడి పెరిగినా నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. అయిన కాడికి అమ్ముకోవాల్సి వస్తోంది. – కంటిపూడి సూర్యనారాయణ, రైతు, తీపర్రు, పెరవలి మండలం మరీ ఇంత దారుణమా? కొనుగోలు కంపెనీలు సిండ్కేటుగా మారి కోకో గింజల ధరను తగ్గించాశాయి. కిలో రూ.300కే అమ్ముదామన్నా కొనే నాథుడే లేడు. ఇంత దారుణం ఎప్పుడూ చూడలేదు. ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. – వాకలపూడి సూర్యారావు, రైతు, కానూరు, పెరవలి మండలం నష్టాల ఊబిలో కోకో రైతులు వైఎస్సార్ సీపీ పాలనలో కిలో కోకో గింజల ధర రూ.1,050 గత ఏడాది కిలోకు రూ.650 నేడు కేవలం రూ.300 సిండికేట్ అయ్యి, ధర తగ్గించేస్తున్న సంస్థలు పట్టించుకోని ప్రభుత్వం -
నత్త నడకన పొగాకు కొనుగోళ్లు
● ఇప్పటి వరకూ రూ.358.31 కోట్ల మేర విక్రయాలు ● గరిష్ట ధర రూ.265 ● సగటు ధర రూ.261.88 దేవరపల్లి: పొగాకు కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. కొనుగోళ్లు ప్రారంభించి దాదాపు 45 రోజులు కావస్తున్నా వేలం కేంద్రాలకు రైతులు బేళ్లు తీసుకురాని పరిస్థితి. ధర గిట్టుబాటు కాకపోవడంతో రైతులు పొగాకు తీసుకురావడానికి అంగీకరించడం లేదు. గత ఏడాది కిలో ప్రారంభ ధర రూ.290 ఉండగా, ఈ ఏడాది రూ.265 మాత్రమే పలకడంతో వారు నిరాశతో ఉన్నారు. ఈ ధరకు పొగాకు అమ్మితే అప్పులు తప్ప మిగిలేదేమీ ఉండదని అంటున్నారు. జూన్ మొదటి వారం నుంచి మార్కెట్ ఆశాజనకంగా ఉంటుందని రైతులు భావిస్తున్నారు. శనివారం నాటికి టొబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో రూ.358.31 కోట్ల విలువైన 13.68 లక్షల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. కిలోకు గరిష్టంగా రూ.265, కనిష్టంగా రూ.235, సగటున రూ.261.88 చొప్పున ధర లభించింది. 888 బేళ్లు అమ్మకానికి తీసుకురాగా, 216 బేళ్లు తిరస్కరించారు. 672 బేళ్ల కొనుగోలు జరిగినట్టు బోర్డు రీజినల్ మేనేజర్ జె.సురేంద్ర కుమార్ తెలిపారు. వేలం కేంద్రాల వారీగా కొనుగోళ్ల వివరాలు వేలం కేంద్రం కొనుగోళ్లు గరిష్ట ధర సగటు ధర (కిలోలు) (రూ.) (రూ.) దేవరపల్లి 2,30,706 265.00 263.95 జంగారెడ్డిగూడెం–1 3,65,185 265.00 261.38 జంగారెడ్డిగూడెం–2 2,89,369 265.00 261.98 కొయ్యలగూడెం 2,36,960 265.00 260.62 గోపాలపురం 2,46,022 265.00 261.78 -
మృత్యు శకటాలు
● నిండు ప్రాణాలను బలిగొంటున్న ఇసుక లారీలు ● చంద్రబాబు పాలనలో దర్జాగా అక్రమ రవాణా ● కళ్లెం లేకుండా ఇసుక లారీల పరుగులు ● ప్రమాదాలు జరుగుతున్న పట్టించుకోని అధికారులు కపిలేశ్వరపురం: ఇసుక లారీలు మృత్యు శకటాలుగా మారుతున్నాయి. కళ్లెం లేని గుర్రాల్లా అడ్డూ అదుపూ లేకుండా రోడ్లపై పరుగులు పెడుతూ నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. మరోవైపు భారీ ఇసుక లారీల రాకపోకలతో రోడ్లు ఛిద్రమవడంతో జరుగుతున్న ప్రమాదాలు కూడా ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. చంద్రబాబు నేతృత్వంలోని 2014–19, ప్రస్తుత ప్రభుత్వాల కాలంలో ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నారు. అయితే, ఆ ముసుగులో అధికార పార్టీల నేతలు పలువురు ఇసుక మాఫియా అవతారమెత్తి అక్రమాలకు తెర తీస్తున్నారు. ఇసుక తవ్వకాల నుంచి రవాణా వరకూ నిబంధనలను గోదాట్లో తొక్కేస్తున్నారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్న పవన్ కల్యాణ్ ఇసుక అక్రమాలను కనీసంగా కూడా పట్టించుకోవడం లేదు. వైఎస్సార్ సీపీ, వామపక్షాలు, ప్రజా సంఘాల నేతలు ప్రశ్నిస్తే ప్రభుత్వం వేధింపులకు దిగుతోందన్న విమర్శలున్నాయి. మొత్తంం మీద ఇసుక మాఫియా అక్రమాలకు సామాన్యుల ప్రాణాలు బలవుతున్న పరిస్థితి దాపురించింది. తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి, కొవ్వూరు, పెరవలి, సీతానగరం మండలాలతో పాటు రాజమహేంద్రవరం, తాతపూడి, కపిలేశ్వరపురం, కోనసీమ జిల్లా జొన్నాడ, ఊబలంక, పి.గన్నవరంలోని పలు ర్యాంపుల్లో గోదారి తల్లికి నిలువునా తూట్లు పొడుస్తూ, అక్రమార్కులు పెద్ద మొత్తంలో ఇసుకను కొల్లగొడుతున్నారు. దీనిని నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా రవాణా చేస్తూ, అమ్ముకుని, రూ.కోట్లలో సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో జరుగుతున్న ప్రమాదాలు సామాన్యుల కుటుంబాలను ఛిద్రం చేస్తున్నాయి. 2014–19, ప్రస్తుత చంద్రబాబు పాలనలో ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి. దీంతో, మృతుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కొన్ని ప్రమాదాలు ఇలా.. ● 2015 మే 25: అచ్యుతాపురం వద్ద ఇసుక లారీ ఢీకొని, వల్లూరుకు చెందిన పాలచర్ల సత్యనారాయణ మృతి చెందారు. ● 2017 జూన్ 7: కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి గ్రామ శివారు చిన కోరుమిల్లికి చెందిన గంగుమళ్ళ సూర్యచంద్రరావు (51) గోదారి గట్టుపై ఇసుక లారీ ఢీకొని ప్రాణాలు వదిలారు. ● 2017 నవంబరు 18: తాతపూడి శివారు గోపాలరావుపేట వద్ద గోదావరి గట్టుపై ఎదురుగా వస్తున్న ఇసుక లారీ ఢీకొని, కేదారిలంక గ్రామానికి చెందిన గంధం ఈశ్వరరావు(32), వీరా జయబాబు(26) దుర్మరణం పాలయ్యారు. ● 2018 జనవరి 9: కోరుమిల్లి గ్రామానికి చెందిన సలాది సత్తిబాబు అక్కడి ఇసుక ర్యాంపులో జట్టు కార్మికుడిగా పని చేస్తూంటారు. గోదావరి గట్టుపై ఇసుక లారీ ఢీకొని మరణించారు. ● ఈ నెల 2: కొత్తపేట బోడిపాలెం వంతెన వద్ద ఊబలంక ర్యాంపునకు వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో అయినవిల్లి మండలం చింతనలంక గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ విళ్ల గీతారాణి (24) అక్కడికక్కడే మృతి చెందారు. ● ఈ నెల 9: మండపేట బైపాస్ నాలుగు రోడ్లు జంక్షన్ వద్ద ఇసుక టిప్పర్ ఢీకొనడంతో పట్టణానికి చెందిన అన్నదమ్ముల పిల్లలు దార్ల దుర్గాప్రసాద్, దార్ల శివకుమార్ దుర్మరణం పాలయ్యారు. మట్టి శ్రీకొట్టేస్తున్నారుశ్రీ మండపేట మండలం కేశవరంలో రేయిబవళ్లు గ్రావెల్ను అక్రమంగా తరలించేస్తున్నారు. జిల్లాలోని కోరుకొండ, సీతానగరం, కడియం తదితర మండలాల్లో పెద్ద మొత్తంలో గ్రావెల్, చెరువు మట్టి అక్రమంగా తవ్వేసి, తరలించుకుపోతూ, కూటమి నేతలు ప్రతి రోజూ రూ.లక్షల్లో కొల్లగొడుతున్నారు. పి.గన్నవరం మండలం యర్రంశెట్టివారిపాలెం ఏటిగట్టు దిగువన లంకల గన్నవరం, ఊడుమూడి శివారు ఊడుమూడి లంకల్లో అనుమతి లేకుండా ఈ నెల మొదటి వారంలో మట్టి తవ్వకాలకు పాల్పడ్డారు. ఇంకా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు, జగ్గంపేట, తుని నియోజకవర్గాల్లో అవకాశమున్న ప్రతి చోటా మట్టి, గ్రావెల్ కొల్లగొట్టి, జేబులు నింపుకొంటున్నారు. కళ్ల ముందే ఇన్ని అక్రమాలు, సహజ వనరుల దోపిడీ విశృంఖలంగా సాగుతున్నా అధికార కూటమి నేతలు కావడంతో అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. -
సీసీ ఫుటేజీ బయట పెడితే అవినీతి బట్టబయలు
అనపర్తి: ఈవీఎంల సహకారంతో గెలిచిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి యథావిధిగా మాటల గారడీ చేస్తున్నారని అనపర్తి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి విర్శించారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ, అక్రమాలకు సంబంధించిన సాక్ష్యాలను ఇప్పటికే ప్రజల ముందు ఉంచామన్నారు. ఆయనకు ఎవరెవరు ఎంతెంత లంచాలు ఇచ్చారో గతంలో బాధితులే నేరుగా వెల్లడించారని, అవసరమైతే ప్రమాణం చేయడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఒక మద్యం షాపు యజమాని విషయంలో జరిగిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ, డబ్బులివ్వకముందు టీ ఇచ్చి పంపిన ఎమ్మెల్యే, ముడుపులు అందిన తర్వాత తన ఇంట్లో చేపల పులుసు బాగుంటుందని భోజనం పెట్టారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే ఇంటి పక్కనే దాదాపు ఏడాదిన్నర పాటు భారీ పేకాట డెన్ నడిచిందని, రోజుకు రూ.2 లక్షల చొప్పున భారీగా వసూళ్లు జరిగాయని, పరిస్థితి శ్రుతి మించడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు ఆ డెన్పై రైడ్ చేసిన విషయం ప్రజలు ఇంకా మర్చిపోలేదని చెప్పారు. తన ఇంట్లో జరిగిన రెండు శుభకార్యాల సందర్భంగా వ్యాపారవేత్తలను బెదిరించి వందకు పైగా బంగారు బిస్కెట్లు వసూలు చేశారంటూ నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారని డాక్టర్ సూర్యనారాయణరెడ్డి అన్నారు. ఎమ్మెల్యే తన నిజాయతీ నిరూపించుకోవాలంటే ఆ కార్యక్రమాలకు సంబంధించిన సీసీ ఫుటేజీని ఎటువంటి కటింగ్స్ లేకుండా బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అతిథులు లోపలకు వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకూ ఉన్న దృశ్యాలను ప్రజల ముందుంచాలని డాక్టర్ సూర్యనారాయణరెడ్డి సవాల్ విసిరారు. ఆటోడ్రైవర్ నిజాయతీ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఓ ఆటో డ్రైవర్ తన నిజాయతీని చాటుకున్నాడు. కోటగుమ్మం సెంటర్ వద్ద ఉన్న ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తున్న మహిళ క్వారీ సెంటర్ వద్ద ఆటో ఎక్కి కోటగుమ్మం సెంటర్లో దిగింది. అనంతరం, ఆమె తన పర్సును ఆటోలో మరచిపోయినట్టు గుర్తించింది. ఆ ఆటో చుట్టుపక్కల ఉందేమోనని వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో ఆమె త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అదే సమయంలో ఆటో డ్రైవర్ తన ఆటోలో ఓ మహిళ పర్సు మరచిపోయిందంటూ త్రీటౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చి పోలీసులకు అప్పగించాడు. ఫిర్యాదు చేసిన మహిళ చెప్పిన వివరాలతో సరిపోల్చిన పోలీసులు.. ఆ పర్సు ఆమెదేనని నిర్ధారించి అందజేశారు. పోగొట్టుకున్న పర్సు తిరిగి దొరకడంతో మహిళ ఆనందం వ్యక్తం చేసింది. నిజాయతీగా వ్యవహరించిన ఆటో డ్రైవర్ను త్రీటౌన్ సీఐ వి.అప్పారావు, ఎస్సై వి.అప్పలరాజు, సిబ్బంది అభినందించారు. -
బస్సు ఢీకొని మహిళ మృతి
సామర్లకోట: స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్లో బస్సు ఢీకొని ఓ మహిళ దుర్మరణం పాలైంది. పోలీసులు, ఆమె బంధువుల కథనం ప్రకారం.. రాజానగరం మండలం శ్రీరామపురానికి చెందిన భావన ధనలక్ష్మి (51) వడ్లమూరులోని తన బంధువుల గృహ ప్రవేశానికి వెళ్లి, తిరిగి స్వగ్రామానికి బయలు దేరింది. వడ్లమూరు నుంచి ఆర్టీసీ బస్సులో సామర్లకోట ఆర్టీసీ కాంప్లెక్స్కు వచ్చింది. అక్కడ రాజానగరం బస్సు ఎక్కడానికి వెళ్తున్న తరుణంలో ఆమె దిగిన బస్సే ధనలక్ష్మి మీదుగా వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయాన్ని బంధువులకు చెప్పకుండానే మృతదేహాన్ని ఆర్డీసీ అధికారులు పెద్దాపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున సామర్లకోట ఆర్టీసీ కాంప్లెక్స్కు చేరుకున్నారు. అక్కడ బస్సులకు అడ్డుగా బైఠాయించారు. ప్రభుత్వ బస్సు ఢీకొంటే చనిపోతారని, మృతుల కుటుంబాలకు రూ. ఐదు వేల నష్ట పరిహారం ఇస్తారని అపహాస్యం చేసినట్లు ఇద్దరు సిబ్బంది మాట్లాడారంటూ మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ ఎ.కృష్ణభగవాన్ ఆందోళనకారులతో చర్చించారు. ఆర్టీసీ బస్సును నిర్లక్ష్యంగా నడిపిన వ్యక్తిపై కేసు పెడతామని చెప్పడంతో ఆందోళనకారులు శాంతించారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ. కోటి నష్ట పరిహారం ఇవ్వాలని వైఎస్సార్ సీపీ నాయకులు కంటే వీర్రాఘవరావు, మద్దాలి శ్రీను, ఎలిశెట్టి నరేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీరామపురంలో విషాదం రాజానగరం: శ్రీరామపురానికి చెందిన భావన ధనలక్ష్మి (51) మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆమె భర్త భావన రత్తయ్య వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి కుమార్తె, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. కుమార్తెకు వివాహం జరిగింది. ధనలక్ష్మి మృతితో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. ఆర్టీసీ కాంప్లెక్స్లో బంధువుల ఆందోళన -
● జలకాలాటల్లో ఆగేదెలేదు!
మూగజీవాలకు వేసవి తాపం నుంచి ఉపశమనం ఇది. ఎండలు మండుతున్న వేళ ఇలా జలకాలాడుతూ సేదతీరాయి. పలు గ్రామాలకు చెందిన వారు తమ పశువులను కోరంగి అటవీ ప్రాంతంలో ఏడాదంతా మేపుతుంటారు. వేసవిలో కాలువలకు నీరు నిలిపివేయడంతో పాటు అడవిలో పచ్చిక లేక గ్రామాల్లోకి తోలుకు వస్తుంటారు. ఇలా ఏటా వందలాది గేదెలు తాళ్లరేవు మండలంలో దర్శనమిస్తుంటాయి. పోలేకుర్రు ఇరిగేషన్ కాలువలో ఉన్న కొద్దిపాటి నీటిలో అనేక గేదెలు ఇలా వేసవి తాపాన్ని తీర్చుకున్నాయి. –తాళ్లరేవు -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 22,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 24,000 గటగట (వెయ్యి) 21,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
రొయ్యల మేత గోడౌన్ దగ్ధం
కాట్రేనికోన: చెయ్యేరు అగ్రహారంలో ఆదివారం మధ్యాహ్నం రొయ్యల మేత గోడౌన్ కాలిపోయింది. అక్కడి శివపార్వతి ఆక్వా ఏజెన్సీస్ రొయ్యల మేత గోడౌన్లో బ్లీచింగ్, రాతి ముగ్గు నిల్వలు ఉన్నాయి. ఎండ తీవ్రతకు ఆ గోడౌన్లో ఉన్న బ్లీచింగ్, రాతి ముగ్గు కెమికల్ రియాక్షన్తో మంటలు వ్యాపించాయి. గోడౌన్ పక్క షాపులో ఉన్న నాలుగు మోటారు సైకిళ్లు, బ్లీచింగ్, రాతి ముగ్గు, రొయ్యల చెరువులకు వాడే మందులు కాలిబూడిదయ్యాయి. రైలు నుంచి జారి వ్యక్తి మృతి తుని: రైలు నుంచి జారిపడి విశ్రాంత ఆర్మీ ఉద్యోగి ఆదివారం మృతి చెందారు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. అసోంకు చెందిన విశ్రాంత ఆర్మీ ఉద్యోగి ప్రమోద్ బోర్డోలోయ్ (61) అసోం నుంచి హైదరాబాద్కు రైలులో ప్రయాణిస్తున్నారు. స్థానిక రైల్వే స్టేషన్ పరిధి హంసవరం రైల్వే గేటు సమీపంలో ప్రమోద్ ప్రమాదవశాత్తూ కాలు జారి రైలు నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై స్థానిక రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్యామ్ త్రినాథరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని తుని ఏరియా ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు ఆయన తెలిపారు. పిల్లలను చూడడానికి రావొద్దనడంతో ఆత్మహత్య కొత్తపల్లి: తన పిల్లలను చూడడానికి రావొద్దని భార్య అనడంతో మనస్తాపం చెందిన ఓ భర్త పురుగు మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. ఉప్పాడ నాయకర్ కాలనీకి చెందిన ఓసిపల్లి ఏసేబు (26) భార్య రెండో కాన్పు నిమిత్తం తన పుట్టింటికి అమీనాబాద్ వెళ్లింది. తన పిల్లలను చూడడానికి రావొద్దని భార్య అనడంతో మనస్తాపానికి గురై, భార్యను బెదిరించాలనే ఉద్దేశంతో ఈ నెల 8న ఏసేబు పురుగు మందు తాగాడు. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి తల్లి ఓసిపల్లి పాప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు. ఫోన్ మాట్లాడుతూ బస్సులు నడిపితే జైలుకే అమలాపురం రూరల్: సెల్ఫోన్ మాట్లాడుతూ స్కూల్, కళాశాలల బస్సులు నడిపితే జైలు శిక్ష తప్పదని కోనసీమ జిల్లా రవాణా శాఖాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు హెచ్చరించారు. అమలాపురంలో కళాశాల బస్సుల చోదకులకు ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50 కిలోమీటర్ల వేగంతో మాత్రమే బస్సులు నడపాలని, డ్రైవర్ చరవాణిని క్లీనర్ వద్ద ఉంచాలన్నారు. మోటార్ వాహనాల చట్టం 185 (జీ) ప్రకారం ప్రతి బస్సులో విద్యార్థులతో పాటు పేరెంట్, టీచర్ విధిగా ఉండాలన్నారు. అదే విధంగా డ్రైవర్ శారీరక, మానసిక పరిస్థితిని స్కూల్ యాజమాన్యం గమనిస్తూ ఉండాలని డీటీఓ సూచించారు. నెలాఖరు నాటికి జిల్లాలోని అన్ని విద్యాసంస్థల బస్సులు ఫిట్నెస్ పొందాలని పేర్కొన్నారు. జూన్ మూడో వారం నుంచి ప్రత్యేక తనిఖీలు చేపడతామన్నారు. -
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిత
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కాకినాడ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వి.సతీష్ కుమార్ తెలిపారు. ఆదివారం కాకినాడ శ్రీనగర్ స్కూల్లో తైక్వాండో క్రీడాకారులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. డీఎస్డీఓ సతీష్ కుమార్ మాట్లాడుతూ విజయనగరం జిల్లాలో జరిగిన 5వ రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచారన్నారు. తైక్వాండో సంఘ కార్యదర్శి బి.అర్జునరావు మాట్లాడుతూ ఈ పోటీల్లో 10 బంగారు, 12 రజత, 18 కాంస్య పతకాలు సాధించి ఓవరాల్ చాంపియన్ షిప్లో మూడో స్థానం అందుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో తైక్వాండో సంఘ ప్రతినిధులు సత్యనారాయణ, అన్నవరం కేవీ సత్యనారాయణ, పి.త్రిమూర్తులు, అరుణ, దుర్గా తదితరులు పాల్గొన్నారు. -
ఇక్కడ అదృశ్యం.. అమరావతిలో ప్రత్యక్షం
నిడదవోలు: జనసేన నాయకులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, తాను చనిపోతానంటూ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అదృశ్యమైన నిడదవోలు మండలం సింగవరం గ్రామానికి చెందిన టీడీపీ బూత్ ఇన్చార్జి కట్ట మణికంఠ శనివారం అమరావతిలో నిర్వహించిన గ్రీవెన్స్లో ప్రత్యక్షమయ్యాడు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్పై ప్రసార మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు పెట్టాడని ఏప్రిల్ 24న జనసేన కార్యకర్తలు అచ్యుత పవన్కుమార్, అడ్డాల సాయి లక్ష్మణ్లు పట్టణ పోలీస్ స్టేషన్లో మణికంఠపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మణికంఠను పోలీస్ స్టేషన్కు పిలిపించి దర్యాప్తు చేస్తున్న క్రమంలో తట్టుకోలేక అతను చనిపోతున్నానంటూ ఈ నెల 3న సెల్ఫీ వీడియో పోస్టు చేశాడు. ‘నాన్న.. నన్ను క్షమించండి.. నేను చనిపోతున్నా.. నా వల్ల కావడం లేదు.. అక్రమ కేసులు నేను తట్టుకోలేకపోతున్నాను’ అంటూ అతను పోస్టు చేసి అదృశ్యమయ్యాడు. దీంతో సీఐ పీవీజీ తిలక్ మూడు బృందాలను ఏర్పాటు చేసి మణికంఠ ఆచూకీ కోసం గాలించారు. అనూహ్యంగా శనివారం అమరావతిలో నిర్వహించిన గ్రీవెన్స్లో రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణికి వినతిపత్రం ఇస్తున్న ఫొటో ప్రచార మాధ్యమాల్లో రావడం గమనార్హం. ప్రస్తుతం మణికంఠ విజయవాడలో ఉన్నట్టు పోలీసులు ధ్రువీకరించారు. -
ట్రాన్స్ఫార్మర్లో పడిన బంతి
సామర్లకోట: సెలవులు కావడంతో పిల్లలంతా క్రికెట్ ఆడుతుండగా బంతి ట్రాన్ఫార్మర్లోకి వెళ్లింది.. దానిని తీసే క్రమంలో ఓ బాలుడు విద్యుదాఘాతానికి గురికావడంతో, శరీమంతా కాలిపోయింది. స్థానికులు కథనం ప్రకారం.. సామర్లకోట గాంధీనగర్కు చెందిన కరణం పవన్ (13) సదాశివ నగర్లోని ఖాళీ స్థలంలో క్రికిట్ ఆడుతున్నాడు. ఈ సమయంలో బంతి సమీపంలోని ట్రాన్స్ఫార్మర్లోకి వెళ్లిపోయింది. వెంటనే ఆ బాలుడు బంతిని తీయడానికి ప్రయత్నించడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. శరీరం అంతా పూర్తిగా కాలిపోవడంతో అతనిని కాకినాడలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి ఉందని, సుమారు రూ.10 లక్షలు అవుతుందని డాక్టర్లు చెప్పారు. పేద కుటుంబం కావడంతో ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఆ యువకుడిని ఆదుకోవాలని స్నేహితులు కోరుతున్నారు. ● తీస్తుండగా బాలుడికి షాక్ ● శరీరమంతా తీవ్ర గాయాలు -
అవమానంతో ఆత్మహత్య
భార్య ఇంటి ముందు భర్త మృతదేహంతో నిరసన మామిడికుదురు: అత్తింటి వారు పెట్టిన తప్పుడు కేసు ను అవమానంగా భావించి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడంటూ అతని కుటుంబ సభ్యులు, స్థానికులు నిరసన తెలిపారు. ఈ ఘటన పెదపట్నంలంకలో ఆదివారం ఉద్రిక్తతకు దారి తీసింది. మృతుడి బంధువుల కథనం ప్రకారం.. పెదపట్నంలంక గ్రామానికి చెందిన సూదా రాజు (26) ఎలుకల మందు తిని ఈ నెల 4న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతన్ని కాకినాడ జీజీహెచ్కు తరలించగా, చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఆ మృతదేహాన్ని రాజు భార్య దివ్యజ్యోతి ఇంటి ఎదుట ఉంచి ఆందోళన చేపట్టారు. రాజు కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు భారీగా తరలివచ్చారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 21 రోజుల వయసు కలిగిన రాజు చిన్నారిని ఊయలలో వేసిన సందర్భంగా గొడవ జరిగిందని ఆందోళనకారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రాజు, అతని తల్లిదండ్రులపై దివ్యజ్యోతి కుటుంబ సభ్యులు దాడి చేశారని ఆరోపించారు. వారే దాడి చేసి తప్పుడు కేసు పెట్టారని వాపోయారు. పోలీసుల నుంచి పిలుపు రావడంతో దానిని అవమానంగా భావించి రాజు అత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. ఈ వివాదం నేపథ్యంలో నగరం ఎస్సై ఎ.చైతన్యకుమార్, పి.గన్నవరం, అయినవిల్లి ఎస్సైలు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుడు రాజు కుటుంబ సభ్యులు వస్తున్నారన్న సమాచారంతో దివ్యజ్యోతి కుటుంబ సభ్యులు అక్కడి నుంచి ముందుగానే వెళ్లిపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని రప్పించాలని, నిందితులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఫిర్యాదు ఇస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్సై చైతన్యకుమార్ స్పష్టం చేశారు. బాధ్యులను అక్కడకు రప్పించాలని రాజు మద్దతుదారులు డిమాండ్ చేయడంతో పరిస్థితి జఠిలంగా మారింది. ఆందోళన ఇంకా కొనసాగుతోంది. -
అవగాహన అవసరం
లూపస్ వ్యాధిపై అపోహలు తొలగించుకుని, అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయలేం, కానీ అదుపు చేయవచ్చు. ఇందుకోసం దీర్ఘకాలం మందులు వాడాల్సి ఉంటుంది. సాధారణ వ్యాయామం చేయడం, ఎండలో తిరగకుండా ఉండడం, సన్ ప్రొటెక్షన్ క్రీమ్ వాడటం, సరైన నిద్ర, ఒత్తిడి లేకుండా ఉండడం చేయాలి. లూపస్ వ్యాధి ఉన్న గర్భిణులు ఎక్కువ సార్లు వైద్యుల వద్ద చెకప్ చేయించుకుంటూ మందులు వాడితే వారి ప్రసవానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. – డాక్టర్ వసుంధర, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి, రాజమహేంద్రవరం -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
దేవరపల్లి: మోటారు సైకిల్పై వచ్చిన వ్యక్తి బలంగా ఢీకొనడంతో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తి మృతి చెందాడు. గోపాలపురం మండలం కరిచర్లగూడెంలోని మాతంగమ్మ గుడి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కరిచర్లగూడేనికి చెందిన కొమ్మిరెడ్డి నాగేశ్వరరావు (45) శుక్రవారం రాత్రి ఎన్హెచ్ 516 డి జాతీయ రహదారిపై నడిచి వెళుతున్నాడు. కొయ్యలగూడెం వైపు నుంచి గోపాలపురం వైపు మోటార్ సైకిల్పై వస్తున్న వ్యక్తి అతడిని బలంగా ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో నాగేశ్వరరావు తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వి. సుబ్రహ్మణ్యంతెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి.. రాజమహేంద్రవరం సిటీ: కడియం రైల్వే స్టేషన్ సమీపంలో సుమారు 60 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి శనివారం రైలు ఢీకొని మృతి చెందాడని రాజమహేంద్రవరం జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ గంగరాజు తెలిపారు. అతడు ఐదు అడుగులు ఎత్తు కలిగి ఉండి, సిమెంటు రంగు నిక్కరు, ఎరుపు రంగు హాఫ్ హాండ్స్ షర్ట్ ధరించి ఉన్నాడన్నారు. మృతుడి వివరాలు తెలిస్తే జీఆర్పీ స్టేషన్లో 944077 9249, 0883 2442821 నంబర్లకు తెలియజేయాలన్నారు. -
కాకినాడలో చైన్నె షాపింగ్ మాల్ ప్రారంభం
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కాకినాడ మెయిన్రోడ్డులో ఏర్పాటు చేసిన ది చైన్నె షాపింగ్ మాల్ను శనివారం సినీ నటి మృణాల్ ఠాకూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టు, ఫ్యాన్సీ, రెడీమేడ్ వస్త్రాలు అనేక రకాల డిజైన్లలో ఇక్కడ లభిస్తాయన్నారు. నాణ్యతకు నమ్మకానికి మారు పేరుగా చైన్నె షాపింగ్ మాల్ ఖ్యాతి పొందిందన్నారు. షాపింగ్మాల్ నిర్వాహకులు ఎం.వెంకటరెడ్డి, కృష్ణారావు మాట్లాడుతూ తమ షోరూమ్లో మహిళలు, పురుషులు, చిన్నారులకు అవసరమైన ఎన్నో రకాల డిజైన్ల వస్త్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు చెప్పారు. షాపింగ్ మాల్ను ప్రారంభించేందుకు వచ్చిన మృణాల్ ఠాకూర్ను చూసేందుకు అధిక సంఖ్యలో నగర ప్రజలు రావడంతో ఆ ప్రాంతమంతా జనసంద్రమైంది. కార్యక్రమంలోఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పాల్గొన్నారు. -
రక్షకుడే భక్షకుడైతే..
ఫ అదే లూపస్ వ్యాధి ఫ ముఖంపై సీతాకోక చిలుక ఆకారంలో దద్దుర్లు ఫ ఇతర అవయవాలపై ప్రభావం ఫ నేడు వరల్డ్ లూపస్ డే రాయవరం: సాధారణంగా మనపై అనేక రోగాలు నిత్యం దాడి చేస్తుంటాయి. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని, తిప్పికొట్టడం మన శరీరంలోని రోగనిరోధక శక్తి ప్రధాన విధి. ఒక రకంగా చెప్పాలంటే శరీరానికి రక్షణ కవచం వంటిది. కానీ ఆ రక్షణ కవచమే వ్యతిరేక దిశలో పనిచేస్తే కొన్ని రోగాలు వస్తాయి. వాటిలో సిస్టమిక్ లూపస్ ఎరిథమాటోనస్ (ఎల్ఎస్ఈ) అనే వ్యాధి ఒకటి. దీన్ని లూపస్ వ్యాధి అని పిలుస్తారు. ఏటా మే 10న వరల్డ్ లూపస్ డేగా పాటిస్తున్నారు. రోగ నిరోధక వ్యవస్థ దాడి శరీరంలోని కణాలు, కణజాలంపై వ్యక్తి సొంత రోగనిరోధక వ్యవస్థ దాడి చేసినప్పుడు లూపస్ వ్యాధి అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల గుండె, ఊపిరితిత్తులు, చర్మం, కీళ్లు, మూత్రపిండాలు, రక్త నాళాలు, మెదడు వంటి వివిధ అవయవాలు, శరీర వ్యవస్థకు హాని జరుగుతుంది. ఈ వ్యాధి సిస్టమిక్ లూపస్ ఎరిథమాటోసస్, డిస్కోయిడ్ లూపస్, సబ్ అక్యూట్ క్యూటేనియస్ ల్యూపస్, డ్రగ్ ఇండ్యూసెడ్ లూపస్, నియోనెటాల్ లూపస్ అనే రకాలుగా ఉంటుంది. ఈ వ్యాధిని చాలా మంది తమ అవగాహన లోపంతో ముందుగా గుర్తించలేకపోతున్నారు. ఈ వ్యాధితో జిల్లాలోని రుమటాలజిస్టులు, జనరల్ ఫిజీషియన్లు, నెఫ్రాలజిస్టుల వద్దకు ప్రతి నెలా 80 నుంచి 100 మంది వరకు వస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో దాదాపు 3 వేల నుంచి 4 వేల మంది దాకా లూపస్ వ్యాధితో బాధపడుతున్నట్లు అంచనా. లక్షణాలివే.. లూపస్ ఉన్న వారిలో ముఖంపై సీతాకోక చిలుక ఆకారంలో దద్దుర్లు వస్తాయి. కీళ్ల నొప్పులు, త్వరగా అలసిపోవడం, చాలా రోజులుగా జ్వరం, ఆకలి లేకపోవడం, జుట్టు రాలిపోవడం, గాఢంగా శ్వాస తీసుకున్నప్పుడు చాతీలో నొప్పి, చేతి, కాలివేళ్లు గోధుమరంగు, ఊదా రంగులోకి మారిపోవడం, నోటిలో పుండ్లు ఏర్పడటం జరుగుతుంది. కొందరిలో కిడ్నీ, గుండె, మెదడుపై కూడా ప్రభావం చూపుతుంది. ఎలా వస్తుందంటే.. సాధారణంగా జీన్స్, పర్యావరణం (ఇన్ఫెక్షన్, కొన్ని రకాల మందులు, ఒత్తిడి, అధిక యువీ కిరణాలు) ప్రభావం వల్ల ఈ ఆటో ఇమ్యూన్ వ్యాధి వస్తుంది. ముఖ్యంగా 15 నుంచి 45 ఏళ్లలోపు (9:1 నిష్పత్తి) ఉన్న వారిలో కనిపిస్తుంది. వీరిలో ఈస్ట్రోజెన్ హార్మోన్ ప్రభావం వల్ల సహజంగానే ఇది వస్తుంది. చిన్న, పెద్ద తేడా లేకుండా ఈ వ్యాధి ఎవరికై నా రావచ్చు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 22,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 24,000 గటగట (వెయ్యి) 21,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
టిప్పర్ దగ్ధం
గోకవరం: గుమ్మళ్లదొడ్డి సమీపంలో 516ఈ జాతీయ ప్రధాన రహదారిపై శనివారం రాత్రి కంకరలోడుతో వెళుతున్న టిప్పర్ దగ్ధమైంది. పోలవరం జిల్లా రంపచోడవరం మండలం నరసాపురంలోని ఓ క్రషర్ నుంచి కోనసీమ జిల్లా పి.గన్నవరానికి కంకరలోడుతో ఈ లారీ వెళుతోంది. గుమ్మళ్లదొడ్డికి వచ్చేసరికి వెనుక టైరు నుంచి మంటలు రావడాన్ని డ్రైవర్ గుర్తించి లారీ నిలిపివేశాడు. అనంతరం మంటలు విపరీతంగా వ్యాపించాయి. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న కోరుకొండ అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపు చేశారు. అనంతరం ఎస్సై పవన్కుమార్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. -
హాలిడేస్.. జాలీగా..
● ఉత్సాహంగా వేసవి శిబిరాలు ● పలు అంశాల్లో విద్యార్థులకు శిక్షణ ● ఏపీఎస్పీ బెటాలియన్ స్కూల్లో క్యాంప్ విద్యార్థులకు విద్య, విజ్ఞానం అందించడంతో పాటు మానసిక, శారీరక ఉల్లాసాన్ని పెంపొందించేలా వేసవి శిక్షణ శిబిరాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. రమణయ్యపేట ఏపీఎస్పీ బెటాలియన్ ఇంగ్లిషు మీడియం స్కూల్లో గత నెల 24న ప్రారంభమైన శిబిరంలో పలు పాఠశాలల విద్యార్థులు, బెటాలియన్ సిబ్బంది, పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. స్పోకెన్ ఇంగ్లిషు, స్టోరీ టెల్లింగ్, వేదిక్ మ్యాథ్స్, అబాకస్, రీజనింగ్, కోడింగ్ అండ్ డీ కోడింగ్, గ్లాస్ పెయింటింగ్, భగవద్గీత శ్లోకాల పఠనం, నో ఫైర్ కుకింగ్, యోగా, రైఫిల్ షూటింగ్, వాలీబాల్ వంటి వాటిలో శిక్షణ పొందుతున్నారు. – కాకినాడ రూరల్ -
సాగులో విత్తనం.. ఎంతో కీలకం
ఫ నేల స్వభావాన్ని బట్టి ఎంపిక చేసుకోవాలి ఫ వ్యవసాయాధికారుల సూచనలు కరప: రబీ వరి కోతలు దాదాపు పూర్తి కావడంతో ఖరీఫ్ సీజన్పై రైతులు దృష్టి సారించారు. ముందస్తు ఖరీఫ్ సాగు చేపడితే తొలకరి సీజన్ చివరిలో వచ్చే తుపాన్లు, అధిక వర్షాల నుంచి తప్పించుకుని పండిన పంటను దక్కించుకోవచ్చని వ్యవసాయాధికారులు రైతులను చైతన్యపరుస్తున్నారు. దీని వల్ల ఖరీఫ్, రబీపంట కాలం ముందుకు వచ్చి, రైతులకు అదనపు ఆదాయాన్ని సమకూర్చే మూడో పంటగా అపరాలు పండించుకోవచ్చన్నారు. సాగులో విత్తన ఎంపికే కీలకమని సూచిస్తున్నారు. అలాగే ఈ నెల 15వ తేదీనే పంట కాలువలకు సాగునీరు విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మరో ఐదు రోజుల్లో సాగునీరు విడుదల చేస్తుండటంతో రైతులు ఖరీఫ్ సాగుకు సమాయత్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో కరప మండల వ్యవసాయాధికారి ఇమ్మిడిశెట్టి సత్య సూచనలు చేశారు. ఫ వరి నారుమడి నుంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మలచుకోవచ్చు. మంచి రకాల ఎంపిక, నారుమడి తయారీ, విత్తనశుద్ధి, ఎరువులు, పురుగుమందుల వాడకం, కలుపు నివారణలో యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి. ఫ సాధారణ పరిస్థితుల్లో నాటడానికి ఎంటీయూ 7029 (స్వర్ణ), స్వర్ణకు ప్రత్యామ్నాయంగా కొత్తగా రూపొందించిన ఎంటీయూ 1318 రకాన్ని వినియోగించుకోవచ్చు. పర్ర భూములు, పల్లపు ప్రాంతాలకు ఈ రకం అనువుగా ఉంటుంది. సన్న రకాలైన ఎంటీయూ 1282కు తక్కువ ఎరువులు వాడాలి. సన్నరకం సాంబమసూరికి ప్రత్యామ్నాయంగా ఎంటీయూ 1282 రకాన్ని సాగు చేసుకోవచ్చు. ఎంటీయూ 1318, ఎంటీయూ 1282 సాగు చివరిలో బ్యాక్టీరియా మూలంగా ఆకు ఎండు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రకాలకు యూరియా ఎక్కువగా వాడరాదు. ఫ విత్తనం ద్వారా వ్యాప్తి చెందే కొన్ని రకాల తెగుళ్లను అరికట్టడానికి తప్పనిసరిగా విత్తనశుద్ధి చేయాలి. దీని కోసం సూడోమోనస్, కార్భండిజమ్ మందులను వినియోగించొచ్చు. ఫ నాటే పద్ధతిలో ఒక ఎకరానికి 25 నుంచి 30 కిలోల విత్తనాలు, వెదజల్లు పద్ధతిలో ఒక ఎకరానికి 12 కిలోల విత్తనాలు సరిపోతాయి. ఫ ధృఢమైన, ఆరోగ్యవంతమైన నారు పొందాలంటే నారుమడిని 12 రోజుల ముందు దమ్ముచేసి, చిన్న మడులుగా విభజించుకోవాలి. నీరు పెట్టడానికి, తొలగించడానికి వీలుగా పిల్ల కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి సెంటు భూమిలో ఐదు కిలోల వంతున విత్తనాలు చల్లుకోవాలి. విత్తనం ఎక్కువైతే నారు బలహీనంగా ఉండి, మాగుడు తెగులు సోకే అవకాశం ఉంది. ఎక్కువ విత్తనాలు పోస్తే నారు తీసేటప్పుడు వేర్లు తెగిపోయి సులువుగా రాదు. ఒక ఎకరానికి ఐదు సెంట్ల నారుమడి సరిపోతుంది. మొలక కట్టిన విత్తనాన్ని పలుచటి నీటి మీద చల్లుకోవాలి. నారు రెండు, మూడు ఆకులు తొడిగే వరకు ఆరుతడి పెడుతూ ఉండాలి. తర్వాత పలుచగా నీరుండేలా చూసుకోవాలి. ఫ దమ్ములో ప్రతి ఐదు సెంట్ల నారుమడికి 2 కిలోల యూరియా, 7 కిలోల సింగిల్ సూఫర్ పాస్ఫేటు, 2 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. విత్తిన రెండు వారాల తర్వాత మళ్లీ 2 కిలోల యూరియా పైపాటుగా వేయాలి. అవసరాన్నిబట్టి నారుమడిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. -
అన్న పంచాయితీలో తమ్ముళ్ల లూటీలు!
మిగిలిన నియోజకవర్గాలపై సీఎం గుర్రు! ఎమ్మెల్యేల భేటీలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రెండు నియోజకవర్గాలు మినహా మిగిలిన ఆరు నియోజకవర్గాల ఎమ్మెల్యేల పనితీరు దారుణంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయమై సీఎం చంద్రబాబు సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ● రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు మట్టి, మద్యం అక్రమ దందాలో భాగస్వామ్యం వహిస్తుండడంపై ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించుకుని మరీ ప్రశ్నించినట్లు సమాచారం. పేకాట క్లబ్బు ఎవరు నిర్వహిస్తున్నారు..? ఎంత ఆర్జిస్తున్నారు..? అన్న విషయాలపై ఆ ఎమ్మెల్యే, బాబుకు మధ్య నిమిషాల పాటు చర్చ జరిగినట్లు తెలిసింది. ● అనపర్తి నియోజకవర్గంలో తన గెలుపులో కీలక పాత్ర పోషించిన అతని సామాజికవర్గాన్ని విస్మరిస్తున్నట్టు తెలిసింది. ఎప్పుడూ ఏదో ఒక వివాదం సృష్టించడం, కక్షసాధింపుగా ఇతర పార్టీల కార్యకర్తలపై కేసులు పెట్టిస్తున్న వైనం చంద్రబాబు వద్ద చర్చ జరిగినట్టు తెలిసింది. ● రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో నేతలు భూ కబ్జాలకు వంత పాడుతున్నారన్న అంశంపై చర్చ జరిగినట్లు తెలిసింది. అంతేగాక ఇసుక అక్రమ రవాణాలో ఆయన అనుచరులు ఆరితేరిన ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. ● కొవ్వూరు నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాలో అక్కడి నేతలు భారీగా ఆర్జిస్తున్నట్లు తెలిసింది. లారీకి ఇంత అని ధర నిర్ణయించి మరీ దండుకుంటున్న విషయమై చర్చ వచ్చినట్లు సమాచారం. సాక్షి, రాజమహేంద్రవరం: సీఎం చంద్రబాబుతో నేతల భేటీ జనసేన, టీడీపీ నేతల మధ్య కుంపటి రాజేసిందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాజానగరం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన నేతల మధ్య మళ్లీ ముసలం పుట్టుకొచ్చింది. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్చార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి వర్గాల మధ్య విభేదాలు పొడసూపిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం చంద్రబాబుతో భేటీలో ఇవి మరింత బహిర్గతమయ్యాయి. ఒక్క రాజానగరం నియోజకవర్గంలోనే కాకుండా.. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. చంద్రబాబు వద్దకు పేచీలు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలు, టీడీపీ ఇన్చార్జిలతో విజయవాడలో సమావేశమయ్యారు. ఒక్కో ఎమ్మెల్యే పనితీరుపై ప్రత్యేకంగా ఆరా తీశారు. ఈ నేపథ్యంలో రాజానగరం నియోజకవర్గ నేతల భేటీ చర్చనీయాంశంగా మారింది. జిల్లా టీడీపీ అధ్యక్షుడు, రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే తమకు, తన వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని, అధికారిక కార్యక్రమాల్లో, సంక్షేమ పథకాల ప్రచారంలోనూ తమను ఆహ్వానించడం లేదని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ విషయం ఎమ్మెల్యే బత్తులకు లీకై ంది. దీంతో ఆయన సైతం సీఎం వద్ద పంచాయతీ పెట్టినట్లు తెలిసింది. తాము వెంకటరమణ చౌదరికి ప్రాధాన్యం ఇస్తున్నామని, అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నా గంటల తరబడి ఆలస్యం చేస్తున్నారని, దీంతో ప్రజలు విసుగు చెందుతున్నారన్న విషయాన్ని చంద్రబాబుకు వివరించినట్టు తెలిసింది. ఇందుకు ఉదాహరణగా ఇటీవల రాజానగరం నియోజకవర్గంలో అన్న క్యాంటిన్ ప్రారంభోత్సవానికి ఆయన ఆలస్యంగా వచ్చిన విషయాన్ని ప్రస్తావించినట్టు సమాచారం. మరికొన్ని అంశాల్లో సైతం వెంకటరమణ వ్యవహరిస్తున్న తీరును బాబు ముందుంచినట్లు తెలిసింది. ఇలా ఒకరిపై మరొకరు పరస్పర ఫిర్యాదులు చేసుకున్న విషయం రాజానగరం నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. గతంలోనూ.. గాడాలలో కోలమూరుకు చెందిన ఓ టీడీపీ నేత లే అవుట్కు మట్టి తరలిస్తుండగా ఎమ్మెల్యే బత్తుల వర్గీయులు ఆ లారీలను అడ్డుకున్నారు. ఆ సందర్భంలో టీడీపీ, జనసేన నేతల మధ్య పెద్ద స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. అలాగే భవన నిర్మాణాలకు వినియోగించే రాయిని రాజమహేంద్రవరానికి చెందిన టీడీపీ నేతలు లారీల్లో అక్రమంగా తరలిస్తున్నారు. వే బిల్లులు లేవన్న కారణంతో రాయి తరలించే లారీలను బత్తుల అనుచరులు అడ్డుకున్న సందర్భాలు సైతం ఉన్నాయి. కూటమిలో చిచ్చురేపుతున్న నాయకుల విభేదాలు ప్రాధాన్యమివ్వడం లేదని పరస్పర ఆరోపణలు ఇసుక, మట్టి, మద్యం దందాల్లో పంపకాల పేచీ రచ్చకెక్కిన బత్తుల, బొడ్డు విభేదాలు -
మధురఫలమెంత ప్రియమో!
● మామిడిలో రారాజు కొత్తపల్లి కొబ్బరి ● సామాన్యులకు అందని ధరతో ౖపైపెకి ● దిగుబడి తక్కువ.. గిరాకీ ఎక్కువ ● పిందె ప్రాయంలోనే బుక్కింగులు ● వంద కాయ రూ.5 వేల వరకు విక్రయం పిఠాపురం: వేసవిలో ఫలరాజు మామిడి రుచి చూడనివారుండరు. మరీ ప్రత్యేకంగా కొత్తపల్లి కొబ్బరి, పండూరు మామిడి రకాలైతే కనీసం వాసన చూసినా చాలనేంత రుచి. కొత్తపల్లి నుంచి కొత్త ఢిల్లీ వరకు కొత్తపల్లి కొబ్బరి పేరు తెలియనివారు ఉండరు. మామిడి ఉత్పత్తుల్లో హిడెన్ జెమ్స్గా భావిస్తారు. ఏ గ్రామాల్లో ఇవి ఉత్పత్తి అయితే ఆ గ్రామం పేరుతో ప్రసిద్ధి చెందుతాయంటారు. పూర్వం ఆంధ్ర ప్రాంత రాజులు తమ తోటల్లో వీటి పెంపకం చేపట్టి మిత్రరాజులకు కానుకలుగా పంపేవారు. ఇప్పటికీ దేశాధినేతలకు, పై అధికారులకు మామిడిపండ్లను కానుకగా పంపడం మనకు తెలిసిందే. ఆవకాయ పెట్టుకోవాలన్న ఆలోచన రాగానే గృహిణులకు ముందుగా గుర్తొచ్చేది కొత్తపల్లి కొబ్బరే. పీచు ఎక్కువగా ఉండి, ఎక్కువ కాలం నిల్వ ఉండడం వల్ల దీనికి ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ప్రస్తుతం మార్కెట్లో వంద కాయలు రూ.3500 నుంచి రూ.ఐదు వేల వరకు పలుకుతున్నాయి. ఈ రకం కాయలు, పళ్ల రంగు, రుచి, వాసన ఎంతో ప్రత్యేకం. వీటిలో ఫైబర్ అధికంగా ఉండడంతో పాటు కెరోటిన్, కాల్షియం, విటమిన్ ఎ, సి ఎక్కువగా ఉంటాయి. తొక్క పలుచగా ఉండి పీచు ఎక్కువగా ఉంటుంది. పులుపు ఎక్కువగా ఉండడం వల్ల పచ్చి మామిడి మామూలుగా తినలేరు. కాని పండు మాత్రం అతి మధురం. కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్లు కొత్తపల్లి కొబ్బరి మామిడి కాయలుమామిడి కాయలు కోస్తున్న నాగేశ్వరరావు35 ఏళ్లుగా వ్యాపారం ఈ ఏడాది దిగుబడి సరిగా లేకపోయినా 35 ఏళ్లుగా ఈ వ్యాపారం చేస్తున్నా. కొబ్బరి మామిడి మన దరిదాపుల్లోనే ఎక్కడా లేదు. ఉలవపాడు నుంచి తెస్తున్నాం. కొబ్బరి మామిడి ఒక పరక (14 కాయల) ధర రూ.400 ఉంది. ఈ జిల్లాలో పండే కొత్తపల్లి కొబ్బరి మామి డికి మంచి గిరాకీ ఉంది. – ఎ.శ్రీను మామిడి వ్యాపారి, పిఠాపురంగిరాకీ ఎక్కువ అత్యంత సువాసన భరితంగా ఉండే కొత్తపల్లి కొబ్బరి పళ్ల గిరాకీ మరే రకానికీ ఉండదంటే అతిశయోక్తి కాదు. ముందుగానే డబ్బులు ఇచ్చి ఆర్డర్లు బుక్చేసుకుంటారు. ప్యాకింగ్లు చేసి ఉంచేస్తే వారు తీసుకువెళ్తుంటారు. ఎక్కువ ధర పలికే ఈ కాయలు, పండ్లను రాజకీయ నాయకులు, అధికారులు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. – పెద్దిమూడి నాగేశ్వరరావు, మామిడి వ్యాపారీ, కొత్తపల్లి. -
బార్, బెంచ్ సమన్వయంతో న్యాయ వ్యవస్థ బలోపేతం
● ఉమ్మడి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి దేవానంద్ ● నూతన కోర్టు భవన సముదాయాల ప్రారంభం ● హాజరైన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లిసా గిల్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): న్యాయ వ్యవస్థ సమర్ధంగా పనిచేయాలంటే బార్, బెంచ్ మధ్య సమన్వయం అవసరమని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ బట్టు దేవానంద్ అన్నారు. రాజమహేంద్రవరంలో నూతనంగా నిర్మించిన కోర్టు భవన సముదాయాల ప్రారంభోత్సవం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లిసా గిల్తో పాటు పలువురు న్యాయమూర్తులు హాజరయ్యారు. కోర్టులకు మౌలిక వసతులు కల్పించడం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల బాధ్యత అన్నారు. నూతన కోర్టుల భవన సముదాయం జిల్లా న్యాయ చరిత్రలో ఒక కీలక మైలురాయని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రిన్సిపల్, జిల్లా న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. జిల్లా కోర్టు 1802లో స్థాపించబడిందని, మద్రాస్ ప్రెసిడెన్సీలో ఏర్పాటైన తొలి న్యాయ సంస్థల్లో ఒకటన్నారు. 1802–09 మధ్య కాలంలో ఎల్.స్కిన్నర్ తొలి జిల్లా, సెషన్స్ జడ్జిగా పనిచేశారన్నారు. భారత తొలి ప్రధాన న్యాయమూర్తుల్లో ఒకరైన కోకా సుబ్బారావు రాజమహేంద్రవరం వాసేనని, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు ఇక్కడ న్యాయవాదిగా పనిచేశారన్నారు. జిల్లాలో ప్రస్తుతం 65 కోర్టులు ఉండగా, మొత్తం 87,922 కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. రాజమహేంద్రవరంలో 18 కోర్టులు ఉండి 23,173 కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. 2008లో నాలుగు కోర్టుల నిర్మాణానికి పరిపాలన అనుమతులు లభించాయని, సవరణ అనుమతులు మంజూరు కాగా, 2012లో అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మదన్ బి.లోకూర్ శంకుస్థాపన చేశారన్నారు. జస్టిస్ రఘునందరావు మాట్లాడుతూ జిల్లాతో తనకు వ్యక్తిగత, చారిత్రక అనుబంధం ఉందని, తన పూర్వీకులు కడియం ప్రాంతానికి చెందినవారని, అక్కడ నర్సరీ ఉద్యమానికి ఆద్యులుగా నిలిచారన్నారు. జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి మాట్లాడుతూ తాను రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరం ప్రాంతంలో జన్మించానని, జీఎస్కే లా కళాశాలలో న్యాయ విద్య అభ్యసించానన్నారు. కాకినాడలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన సమయంలో అప్పీలు, బెయిల్ కేసుల కోసం తరచూ రాజమహేంద్రవరం కోర్టులకు వచ్చేవాడినన్నారు. జస్టిస్ న్యాపతి విజయ్ మాట్లాడుతూ ఈ భవన నిర్మాణంలో తలెత్తిన వివాదాలలో కాంట్రాక్టర్ తరఫున తాను హైకోర్టులో వాదించానని, అప్పట్లో పొందిన మధ్యంతర ఉత్తర్వులు చివరకు భవన నిర్మాణం పూర్తికి దోహదపడ్డాయన్నారు. రాజమండ్రి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్వీ.ప్రసాద్, జిల్లా జేసీ వై.మేఘా స్వరూప్, ఎస్పీ డి.నరసింహకిశోర్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, న్యాయ మూర్తులు, న్యాయ వాదులు, బార్ సభ్యులు పాల్గొన్నారు. -
కార్పెట్లు ఎక్కడ స్వామీ?
అన్నవరం: ఎండలు మండి భక్తుల కాళ్లు కాలిపోతున్నా అన్నవరం దేవస్థానం అధికారులకు కార్పెట్లు పరచాలన్న తలంపు రాకపోవడం శోచనీయం. శనివారం సుమారు 50 వేల మంది భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చి ఆలయ ప్రాంగణంలో నడిచేందుకు తీవ్ర ఇబ్బంది పడ్డారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో వందల సంఖ్యలో నవ దంపతులు వారి బంధు మిత్రులు వస్తున్నారు. చలువ పందిళ్లు ఉన్నప్పటికీ అవి లేని చోట నడవడానికి వారు అవస్థ పడుతున్నారు. అధికారులు గత మార్చి నెలలో పది ఫుట్ కార్పెట్ బండిళ్లు కొనుగోలు చేశారు. భక్తుల అవస్థలపై గత నెల 8న ‘కాళ్లు కాలుతున్నా కార్పెట్లు తీయరా’ పేరుతో కథనం ప్రచురించగా ఆ నెల 12న మంత్రి ఆనం పర్యటన సందర్భంగా వాటిని పరిచారు. దీంతో ఆ తరువాత రోజు 13వ తేదీన ‘ఆనందంగా పరిచేశారు’ కథనాలు ‘సాక్షి’లో ప్రచురితమయ్యాయి. ఆ తరువాత కొన్ని రోజులు వాటిని ఉంచినప్పటికీ నాలుగు రోజులుగా అవి కనిపించడం లేదు. భక్తులు పశ్చిమ రాజగోపురం వెలుపలకు వచ్చేటప్పటికి నేల వేడెక్కి ఉంటుంది. దీంతో వారు కాలు పెట్టలేని పరిస్థితి ఉంటుంది. రాజగోపురం నుంచి అన్నదాన పథకానికి వెళ్లాలంటే తారు రోడ్ మీద నడవాల్సి ఉంది. దీనిపై భక్తులు నడిచేందుకు వీలుగా తెల్ల పెయింట్ వేసినా నాలుగు రోజులకే ఆ అది వెలిసిపోయి మళ్లీ ఇబ్బందిగా మారుతోంది. పశ్చిమ రాజగోపురం నుంచి అన్నదాన భవనం వరకు, దేవస్థానం బస్సులు ఆగే విశ్రాంతి షెడ్డు వరకు కార్పెట్ వేస్తే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందని భక్తులు అంటున్నారు. నాన్నమ్మకు తలకొరివి పెట్టిన మనవరాలు రాజోలు: ఓ మనవరాలు తన నానమ్మకు తలకొరివి పెట్టి రుణం తీర్చుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజోలు సుందరమ్మ చెరువు గట్టు ప్రాంతానికి చెందిన గాలిదేవర సత్యవేణి (75) కిడ్నీ సమస్యతో బాధపడుతూ మృతి చెందింది. సత్యవేణికి ఒక్కగానొక్క కుమారుడు శ్రీనివాసరావు 2021లో కరోనాతో మృతి చెందాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహమై వేరొక ప్రాంతంలో నివాసం ఉంటోంది. నాన్నమ్మ సత్యవేణి ఆలనాపాలనా చిన్న మనుమరాలైన గాలిదేవర రేణుక చూసుకుంటోంది. దీంతో శనివారం రాజోలు కై లాసభూమిలో నానమ్మకు తలకొరివి పెట్టింది. ఈ సందర్భంగా రేణుక మాట్లాడుతూ తన తండ్రి శ్రీనివాసరావు కరోనాతో చనిపోయినప్పుడు అంత్యక్రియలు నిస్సహాయ స్థితిలో జరిగాయని, కనీసం మృతదేహాన్ని చివరిచూపు చూసేందుకు కూడా నోచుకోలేకపోయామని విలపించింది. నానమ్మ సత్యవేణికి తలకొరివి పెట్టి పితృరుణం తీర్చుకున్నానని కన్నీటి పర్యంతమైంది.● కాళ్లు కాలి అవస్థలు పడుతున్న భక్తులు ● మంత్రి ఆనం పర్యటనలో పరిచి మళ్లీ మూలకు చేర్చిన అధికారులు -
కిక్కిరిసిన రత్నగిరి
అన్నవరం: సత్యదేవుని ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. సుమారు 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించి పూజలు చేశారు. శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున రత్నగిరిపై సుమారు రెండువందల వివాహాలు జరిగాయి. నవదంపతులతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వివాహాలు చేసుకున్న నవదంపతులు, వారి బంధుమిత్రులు కుటుంబ సభ్యులతో సత్యదేవుని సన్నిధికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వరుసగా రెండ్రోజులు సెలవు రావడంతో సమాన్య భక్తులు పెద్ద సంఖ్యలో సత్యదేవుని సన్నిధికి విచ్చేసి స్వామివారి వ్రతాలాచరించారు. దీంతో ఆలయ ప్రాంగణం, వ్రతమండపాలు నిండిపోయాయి. 2,200 వ్రతాలు, అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ. 50 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు ఐదు వేల మంది భక్తులకు సత్యదేవుని నిత్యాన్నదానపథకంలో ఉచిత భోజన చేశారు. ఘాట్రోడ్లో ట్రాఫిక్ జామ్ సత్యదేవుని సన్నిధిన శుక్రవారం రాత్రి భారీ సంఖ్యలో వివాహాలు జరిగిన విషయం తెలిసిందే. వివాహాలకు వివిధ వాహనాలలో తరలివచ్చిన పెళ్లిబృందాలు శనివారం స్వామివారి వ్రతం దర్శనం అనంతరం దిగువకు ప్రయాణం అయ్యారు. స్వామివారి దర్శనానికి శనివారం వందల సంఖ్యలో వాహనాలలో వేలాదిగా విచ్చేసిన భక్తులు సైతం స్వామివారి దర్శనం అనంతరం దిగువకు ఒకేసారి ప్రయాణమవ్వడంతో శనివారం దేవస్థానం ఘాట్రోడ్లో భక్తుల వాహనాలతో సుమారు అరగంట సేపు వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. -
సర్పవరం పోలీసు స్టేషన్ ఎస్ఐ పోస్టుకు రూ.30 లక్షలు?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సర్పవరం పోలీసు స్టేషన్లో ఇన్స్పెక్టర్ పోస్టుకు మాం...చి డిమాండ్ ఉంది! పాడి ఆవు లాంటి ఈ పోస్టును వేలం పాడి మరీ దక్కించుకోవాలని పలువురు ఉవ్విళ్లూరుతున్నారు. ఇది ఇటీవలే ఖాళీ అయ్యింది. ఇక్కడి ఇన్స్పెక్టర్ బొక్కా పెద్దిరాజును కారణాంతరాలతో వేకెన్సీ రిజర్వు(వీఆర్)కు పంపించారు. పెద్దిరాజు సర్పవరం ఇన్స్పెక్టర్గా సుమారు 16 నెలలు పనిచేశారు. వాస్తవానికి రెండేళ్ల వరకు ఇదే స్టేషన్లో ఉంటాననే నమ్మకంతో పెద్దిరాజు ఇక్కడ జాయిన్ అయ్యారు. కానీ పరిస్థితులు మారి ఆయనను వీఆర్లో పెట్టారు. ఖాళీగా ఉన్న ఆ పోస్టుకు మహిళా పోలీసు స్టేషన్లో పనిచేస్తోన్న ఇనస్పెక్టర్ రవికుమార్ ఇన్చార్జిగా వచ్చారు. సర్పవరంలో బాధ్యతలు తీసుకున్నప్పటికీ మూడు రోజులు కూడా గడవకుండానే ఆయనను వీఆర్కు పంపించేశారు. ప్రస్తుతం కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణ శాంతిభద్రతల బాధ్యతను తాత్కాలికంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్పవరం సీఐ పోస్టు హాట్ సీట్గా మారిందనే చర్చ పోలీసు సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. అందరి కళ్లూ దానిపైనే.. కాకినాడ రూరల్ మండలం పరిధిలో కాకినాడ రూరల్, సర్పవరం రెండు పోలీసు సర్కిల్స్ ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో అత్యధిక డిమాండ్ ఉన్న ఈ రెండు సర్కిళ్లలో సర్పవరం సర్కిల్ ఖాళీగా ఉండటంతో అందరి కళ్లూ దానిపైనే పడ్డాయి. ఇక్కడి పోస్టింగ్ కోసం కాకినాడ రూరల్లోని అధికార భాగస్వామ్య పార్టీ ముఖ్యనేత కనుసన్నల్లో అనుచర వర్గం బేరసారాలకు తెరలేపారని చెప్పుకుంటున్నారు. ఏడాదిన్నర క్రితం ఈ సర్కిల్లో పోస్టింగ్ కోసం సొమ్ముతో త్రీ స్టార్స్ క్యూ కట్టారని జిల్లా అంతటా విస్తృతమైన చర్చ నడిచింది. నాడు నలుగురైదుగురు పోటీ పడగా అధికార పార్టీ నేతకు అత్యధికంగా రూ.30 లక్షలు ముట్టచెప్పాకనే ఖాయం చేశారని వినికిడి. ఇప్పుడూ డిమాండే అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఇక్కడి పోస్టింగ్ కోసం ముఖ్య నేత, వారి అనుచరులను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ జిల్లాల త్రీస్టార్స్.. తెలిసిన నాయకుల ద్వారా నానా తంటాలు పడుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నలుగురు ఇనస్పెక్టర్లు ఈ పోస్టింగ్ కోసం పోటీపడుతున్నారు. ఇందులో ఒక సీఐకు పిఠాపురానికి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే ముఖ్యనేతకు సిఫారసు చేశారని విశ్వసనీయ సమాచారం. మరొక త్రీ స్టార్ ముఖ్యనేత బంధువుల ఆశీస్సులతో గడచిన వారం రోజులుగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. గిట్టుబాటు ఖాయం! కాకినాడ రూరల్ మండలంలో ఉన్న రెండు ఇన్స్పెక్టర్ పోస్టులకు ఒకే తరహా డిమాండ్ ఉండటం విశేషం. ఈ రెండు కొలువు తెచ్చుకోవాలే కాని పెట్టిన పెట్టుబడికి తగ్గట్టు ఆదాయానికి లోటు ఉండదంటుంటారు. ఇందులో రూరల్ సర్కిల్ పరిధిలో అత్యధికంగా ఆరు (ఇంద్రపాలెం, తిమ్మాపురం, పెదపూడి, కోరంగి, గొల్లపాలెం, కరప) పోలీసు స్టేషన్లు ఉండటం కూడా ఇంతటి డిమాండ్కు కారణంగా పేర్కొంటున్నారు. సర్పవరం ఇన్స్పెక్టర్ పరిధిలో వాకలపూడి, రమణయ్యపేట, సర్పవరం, ఆటోనగర్ వంటి ఇండస్ట్రియల్ ఏరియాలలో పెద్ద పెద్ద కర్మాగారాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు కోకొల్లలు. అందుకే ఇక్కడి ఇనస్పెక్టర్æ పరిధిలో రాబడి దండిగా వస్తుందనే దూరదృష్టితో రూ.లక్షలు ముట్టచెప్పడానికి వెనుకాడటం లేదంటున్నారు. ఎవరు ఎంత ఎక్కువ ఇస్తారో, సిఫారసు లేఖ ఎవరికి దక్కుతుందో అనే చర్చ పోలీసుల్లో సాగుతోంది. -
రైతుల కష్టం బుగ్గిపాలు
అగ్ని కీలల్లో 100 బస్తాల ధాన్యం దగ్ధం రాయవరం: మండలంలోని వెంటూరులో సుమారుగా వంద బస్తాల ధాన్యం అగ్నికి ఆహుతైంది. గ్రామానికి చెందిన బుట్టా వీరబాబు, శ్రీను 10 ఎకరాల పొలంలో కౌలు వ్యవసాయం చేశారు. కోసిన ధాన్యాన్ని పొలంలోనే రాశులుగా వేశారు. వాటి సమీపంలోని ట్రాన్స్ఫార్మర్పై కాకి పడడంతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యింది. దీంతో కోయగా మిగిలిన వరి గడ్డిపై నిప్పురవ్వలు పడడంతో మంటలు చెలరేగి ధాన్యం రాశులకు అంటుకుంది. రైతులు అప్రమత్తమయ్యే సరికే సుమారుగా వంద బస్తాల ధాన్యం అగ్నికి ఆహుతైనట్లు రైతులు తెలిపారు. సమాచారం అందుకున్న రామచంద్రపురం అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనతో దాదాపుగా రూ.2 లక్షల వరకు నష్టం వస్తుందని అంచనా వేస్తున్నారు. బాధిత కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ సర్పంచ్ వాసంశెట్టి రాధాకృష్ణ, పలువురు రైతులు కోరారు. -
విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు సిద్ధం
● జిల్లా కేంద్రంలోని గొడౌన్కు చేరిన సరకు ● మండల కేంద్రాలకు ప్రారంభమైన సరఫరా రాయవరం: పాఠశాలల పునఃప్రారంభం రోజే పాఠ్య పుస్తకాలు అందించేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు పాఠ్య పుస్తకం, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను అందించనుంది. ఇప్పటికే జిల్లా పుస్తక గొడౌన్కు చేరుకున్న పాఠ్య పుస్తకాలను జిల్లాల మండల స్టాక్ పాయింట్లకు వాటిని సరఫరా చేస్తున్నారు. రాష్ట్ర విద్యా పరిశోధన మండలి ఈ ఏడాది పాఠ్య పుస్తకాలను మరింత కుదిం 53 టైటిల్స్ మాత్రమే ఉండేలా ఏర్పాటు చేసింది. తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని మండలాలతో పాటు ఏజెన్సీలోని ఏడు మండలాలకు 18,12,671 పాఠ్య పుస్తకాలు సరఫరా కావాల్సి ఉంది. ఇప్పటికే 80 శాతం అంటే 15,17,441 పాఠ్య పుస్తకాలు జిల్లా గొడౌన్కు చేరుకున్నాయి. ఈ నెల ఏడో తేదీ నుంచి ఆర్టీసీ కార్గో సర్వీసు ద్వారా మండల కేంద్రాలకు తరలిస్తున్నారు. జిల్లాల వారీగా పంపుతున్న పుస్తకాల వివరాలు ఇలా ఉన్నాయి. ఉచిత విద్యకు చురుగ్గా ఏర్పాట్లు ● మొదటి విడతగా 3585 మందికి ప్రవేశాలు ● రెండో విడతగా 1,781 సీట్ల కేటాయింపు రాయవరం: ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఉచితంగా సీట్లు కేటాయించాల్సి ఉంది. ఈ మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రానున్న విద్యా సంసత్సరానికి ఇప్పటికే మొదటి విడతగా ఒకటో తరగతిలో 3,585 మంది చిన్నారులకు ఉచిత ప్రవేశాలు కల్పించారు. అలాగే రెండో విడతలో 1,781 మందికి సీట్లు కేటాయిస్తూ అధికారులు ప్రవేశాల జాబితాను విడుదల చేశారు. వారి ప్రవేశాలను ఈ నెల 16వ తేదీలోగా పూర్తి చేయాల్సి ఉంది. విద్యాహక్కు చట్టం ప్రకారం పేద విద్యార్థులకు ఒకటో తరగతిలో ప్రవేశానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రభుత్వ ఆదేశాలను ఆయా జిల్లాల్లోని ప్రైవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ జి.నాగమణి అధికారులను ఆదేశించారు. అలాగే ఇప్పటికే ఆయా పాఠశాలల యాజమాన్యాలకు ప్రభుత్వ ఆదేశాలపై అవగాహన కల్పించినట్టు తూర్పుగోదావరి సమక్ష శిక్ష జిల్లా ఏపీసీ ఎస్.సుభాషిణి వివరించారు. జిల్లా పాఠ్య పుస్తకాలు వర్క్ బుక్స్ డిక్షనరీలు తూర్పుగోదావరి 3,19,106 53,665 3,495 కోనసీమ 3,70,091 65,223 4,660 కాకినాడ 6,03,802 1,02,549 7,062 పోలవరం 2,24,442 53,297 5,279 -
ఎక్కుపెడితే శరపరంపరే..!
విద్యార్థులకు సహృదయ సేవ వేసవి సెలవులు వృధా కాకుండా విద్యార్థులకు వివిధ కళల్లో శిక్షణ ఇస్తోంది స్థానిక సహృదయ మిత్ర మండలి. గత 25 ఏళ్లుగా స్థానిక ఆర్ఆర్బీహెచ్ఆర్ స్కూల్, రాజీవ్గాంధీ మున్సిపల్ హైస్కూళ్లలో, ఏడేళ్లుగా శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్, దేశభక్తి గీతాలు, పప్పెట్రీ, దస్తూరి, చిత్ర లేఖనం తదితర అంశాలను బోధిస్తూ వారి వేసవి సెలవులను సద్వినియోగం చేస్తున్నారు. వివిధ పోటీలు నిర్వహించి వారిలో సృజనాత్మకతను వెలికితీస్తూ ఆ సంస్థ ఎంతో కృషి చేస్తోంది. పిఠాపురం -
వైకల్యం నుంచి వికాసం వైపు..
● ప్రత్యేక అవసరాలు గల చిన్నారుల సర్వే ● కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో భవిత కేంద్రాలు ● చురుగ్గా సాగుతున్న నమోదు ప్రక్రియ కపిలేశ్వరపురం: శారీరక వైకల్యం ఉన్న వారు మానసికంగా కుంగిపోకుండా జీవితంపై ఆశ, భవిత బంగారమనే నమ్మకాన్ని కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భవిత కేంద్రాలను నిర్వహిస్తోంది. ప్రత్యేక అవసరాలు గల చిన్నారులను వాటిలో చేర్పించేందుకు జూన్ 9వ తేదీ వరకూ సర్వే నిర్వహిస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఇలా.. తూర్పుగోదావరి జిల్లాలో 22, అంబేడ్కర్ కోనసీమ 19, కాకినాడ 22, పోలవరం జిల్లాలో 11 మొత్తంగా 74 భవిత కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో ఇద్దరు ఐఈఆర్పీలు, ఓక కేర్ వింగ్ వలంటీర్, వారానికోసారి సందర్శించే ఫిజియో థెరపిస్ట్ సేవలందిస్తారు. ఉమ్మడి జిల్లాలో 146 మంది ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ (ఐఈఆర్పీలు), 73 మంది ఆయాలు (కేర్వింగ్ వలంటీర్లు) ఆయా కేంద్రాల్లో సేవలు అందిస్తున్నారు. లక్ష్యమిదీ.. ప్రత్యేక అవసరాలు గల చిన్నారులు ఇంటికే పరిమితం కాకుండా వారిని మానసికంగా, శారీరకంగా బలోపేతం చేసి భవిష్యత్తు తమదే అని భావించే లక్ష్యంతో ఆయా కేంద్రాలు సాగుతున్నాయి. 0 నుంచి 18 ఏళ్లలోపు చిన్నారులకు ప్రత్యేక పరికరాల సాయంతో విద్యా బుద్ధులు చెబుతారు. వారికి ప్రత్యేక సౌకర్యాలు, రాయితీలు కల్పిస్తారు. సిబ్బంది కార్యాచరణ ఇదీ ఆరేళ్ల లోపు చిన్నారులకు ఈ కేంద్రాల్లో సేవలందిస్తారు. 6–18 చిన్నారులను పాఠశాలలో చేర్పించి విద్యా బుద్ధులు నేర్పుతారు. వారికి మధ్యాహ్న భోజనం ఇస్తారు. కేంద్రాలకు రాలేనివారికి గృహ ఆధారిత విద్యను అందిస్తారు. సమస్య తీవ్రతను బట్టి ప్రత్యేక వ్యాయామాలు, స్పీచ్, బిహేవియర్ థెరపీ చేస్తారు. ఇందుకు తగ్గ పరికరాలు ఆయా కేంద్రాల్లో ఉంటాయి. ఆర్థిక చేయూత ఇలా.. కండరాల బలహీనత, అంధత్వం, మానసిక వైకల్యం, వినికిడి లోపం, ఆటిజం ఉన్న విద్యార్థులకు నెలకు రూ.600 చొప్పున 10 నెలలకు రూ.ఆరు వేలు లబ్ధిదారు ఖాతాలో ఎస్కార్ట్ భత్యం కింద జమ చేస్తారు. తీవ్రమైన వైకల్యం ఉన్న ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు గృహ ఆధారిత విద్యను అందించి నెలకు రూ.300 చొప్పున 10 నెలలకు రూ.3 వేలు జమ చేస్తారు. సీడబ్ల్యూఎస్ఎన్ బాలికల కోసం అదనంగా నెలకు రూ.200 చొప్పున 10 నెలలకు రూ.2వేలు ఖాతాలో జమ చేస్తారు. ప్రస్తుత ప్రాజెక్ట్ లక్ష్యమిదీ 2026–27 విద్యా సంవత్సరానికి ఆయా విద్యార్థుల వివరాలు సేకరించి దృష్టి పోర్టల్లో నమోదుచేయడం లక్ష్యంగా ప్రత్యేక ప్రాజెక్టు సాగుతోంది. భవిత, నాన్ భవిత కేంద్రాల్లోని ఐఈఆర్పీలకు ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి శిక్షణ ఇస్తోంది. సమస్యలతో సిబ్బంది సతమతం సమగ్ర శిక్ష పరిధిలోని తమను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని రెండేళ్లుగా కోరుతున్నారు. సమాన పనికి సమాన వేతనం, ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరి గ్రాట్యుటీ, పీఎఫ్, ఈఎస్ఐ కల్పించాలన్న వారి డిమాండ్లను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. యువగళం పాదయాత్రలో ఈ మేరకు ఇచ్చిన హామీని ప్రభుత్వం విస్మరించింది. ఈ నెల 15న విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి మంత్రి లోకేష్ ఇంటి వరకూ పాదయాత్రకు ఉపక్రమించినట్టు రాష్ట్ర కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఫెడరేషన్ కార్యవర్గ సభ్యులు నూకపెయ్యి గంగాధర్ చెప్పారు. -
ప్రశాంతంగా ఈడీ సెట్
రాజానగరం: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఎంపిక చేసిన 16 కేంద్రాలలో శుక్రవారం నిర్వహించిన ఏపీ ఈడీసెట్ 2026 ప్రశాంత వాతావరణంలో జరిగిందని ప్రాంతీయ సమన్వయకర్త, ఆదికవి నన్నయ యూనివర్సిటీ బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సుబ్బారావు తెలిపారు. 4,622 మంది పరీక్ష రాసేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే పరీక్షకు హాజరైంది మాత్రం 3,629 మంది (78.5శాతం). వీరిలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఏడు కేంద్రాలలో 2,609 మందికిగాను 2,137 మంది (81.9శాతం), పశ్చిమ గోదావరి జిల్లాలోని తొమ్మిది కేంద్రాలలో 2,013 మందికిగాను 1,492 మంది (74.1శాతం) పరీక్షకు హాజరయ్యారన్నారు. ఆగస్టులో ప్రత్యేక లోక్ అదాలత్ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘‘సమాధాన్ సమరోహ్’’ కార్యక్రమంలో భాగంగా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న రాజీకి అనుకూలమైన కేసులను పరస్పర అవగాహనతో పరిష్కరించడానికి ఆగస్టు 21, 22, 23 తేదీలలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత శుక్రవారం ప్రకటనలో తెలిపారు. న్యాయవాదులు, కక్షిదారులు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని తమ కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని సూచించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కక్షిదారులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవలసిందిగా కోరారు. 011–23116464, 011–23116465 హెల్ప్లైన్ నంబర్లలో సంప్రదించవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. రత్నగిరిపై పెళ్లి సందడి అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధి శుక్రవారం రాత్రి పెళ్లి బృందాలతో నిండిపోయింది. ఎటు చూసినా వధూవరులు, వారి బంధుమిత్రులు, వివాహాలు చేయించే పురోహితులు, సన్నాయి మేళం వారు ఇలా అంతా పెళ్లిళ్లకు సంబంధించిన వారే దర్శనమిచ్చారు. శుక్రవారం రాత్రి ఏడు గంటల ముహూర్తంలో 150కి పైగా వివాహాలు జరిగాయి. ఈ వివాహాల నిర్వహణ కోసం సత్యగిరిపై నిర్మించిన 36 వివాహ హాల్స్, వివిధ సత్రాలలో వివాహాలు చేసుకునే స్థలాలు, రామాలయం వద్ద గల విశ్రాంతి షెడ్డు, దాని పక్కనే గల ఖాళీ ప్రదేశం అంతా పెళ్లి సందడి కనిపించింది. సత్యగిరిపై గల మట్టేవారి ఉచిత ఏసీ కల్యాణ మండపం, ఎంఎస్ రెడ్డి వివాహ వేదికలోని 24 చిన్న కల్యాణ మండపాల్లో కూడా ఇదే ముహూర్తంలో వివాహాలు జరిగాయి. వివాహ బృందాల వారి తాకిడితో సాధారణ భక్తులకు సత్రాలలో గదులు లభ్యం కాలేదు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 22,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 24,000 గటగట (వెయ్యి) 21,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 14,000 – 15,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)14,000 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
జోయాలుక్కాస్లో బ్రిలియన్స్ డైమండ్ జ్యుయల్లరీ షో
రాజమహేంద్రవరం సిటీ: ద వరల్డ్ ఫేవరెట్ జ్యువెలర్, జోయాలుక్కాస్, తమ రాజమహేంద్రవరం షోరూమ్ను తిరిగి ప్రారంభించినట్లు ఆ సంస్థ గ్రూప్ చైర్మన్, ఎండీ డాక్టర్ జోయా లుక్కాస్ ప్రకటించారు. శుక్రవారం ఈ షాపును రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పునః ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బ్రాండ్ ఎంతో ఆదరణ పొందిన, ఎదురుచూస్తున్న బ్రిలియన్స్ డైమండ్ జ్యూవెలరీ షోను నిర్వహించనున్నామన్నారు. ఇది కట్, అన్కట్ డైమండ్స్, విలువైన ఆభరణాల ప్రీమియం, ప్రత్యేకమైన కొత్త డిజైన్ల అద్భుతమైన ప్రదర్శన అని తెలిపారు. ఈ సందర్భంగా వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను అందిస్తోందన్నారు. బంగారం, వెండి, విలువైన రాళ్ల ఆభరణాలపై ఫ్లాట్ 40 శాతం తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపారు. రూ.1 లక్ష, అంతకంటే ఎక్కువ విలువైన డైమండ్ ఆభరణాల కొనుగోలుపై ఉచితంగా ఒక బంగారు నాణెం పొందవచ్చునన్నారు. ఈ ఆఫర్లు మే 24 వరకు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి సేకరించిన అద్భుతమైన క్లాసిక్ నగల సమాహారం, సరికొత్త డిజైన్న్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. -
చెప్పింది చేయడమే ప్రత్యేకం!
సాక్షి, రాజమహేంద్రవరం: పంచాయతీల్లో ప్రభుత్వం నియమించిన ప్రత్యేకాధికారులు ఉత్సవ విగ్రహాల్లా మారారు. కూటమి నేతలు వారిపై ఒత్తిడి తెచ్చి అన్ని పనులూ చక్కబెట్టేస్తున్నారు. ఈ ప్రభావం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై పడుతోంది. పంచాయతీల పదవీకాలం ఏప్రిల్ 2వ తేదీ నాటికి ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన సాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జిల్లాలో 343 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 322 మంది ప్రత్యేకాధికారులను నియమిస్తూ కలెక్టర్ కీర్తి చేకూరి ఉత్తర్వులు వెలువరించారు. తహసీల్దార్లు, ఎంపీడీఓ, ఎంఈఓ, ఏఓ, మత్స్యశాఖ అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. అధికారుల కొరత కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఏపీఎంలకు సైతం బాధ్యతలు ఇచ్చారు. పంచాయతీలు ఎక్కువగా ఉండటం అందుకు తగ్గట్టు అధికారులు లేకపోవడంతో సీనియర్ అధికారులకు రెండు నుంచి మూడు, మరికొందరికి ఐదు పంచాయతీల బాధ్యతలు అప్పగించారు. త్రీమెన్ కమిటీ పెత్తనం గ్రామ పంచాయతీ పరిధిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కలిసి త్రీమెన్ కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఆ కమిటీ కనుసన్నల్లోనే పంచాయతీ పాలన సాగుతోంది. కూటమి కమిటీ సూచించిన అభివృద్ధి పనులు, తాము చెప్పిన వాటికే సంతకాలు చేయాలంటూ అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. తమ అంగీకారం లేనిదే రూపాయి కూడా ఖర్చు చేయకూడదంటూ హుకుం జారీ చేస్తున్నారు. రూల్ ప్రకారం వెళతామంటున్న అధికారులపై బెదిరింపులకు దిగుతున్నారు. కాదూ కూడదంటే బదిలీ చేయిస్తామంటూ హెచ్చరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ కావడం.. ఆపై ఎందుకొచ్చిన గొడవలే అంటూ అధికారులు మిన్నకుంటున్నారు. అధికారులకు ప్రత్యేక అధికారాలు కేటాయించిన ప్రభుత్వం.. వారికి పవర్ లేకుండా చేసింది. ప్రత్యేక బాధ్యతలు స్వీకరించి రెండు మాసాలు గడిచినా నేటికీ నిధులు డ్రా చేసే అధికారం కల్పించలేదు. వెరసి గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు నానా పాట్లు పడుతున్నారు. వీధి దీపాలు, తాగునీటి సరఫరా, పారిశుధ్యం తదితర పనులు చేపట్టాల్సి ఉంది. అత్యవసర పరిస్థితుల్లో చేతిపంపుల మరమ్మతులు, తాగునీటి ట్యాంకులు, గ్రామీణ నీటి సరఫరా పనులు చేపట్టాల్సి ఉంది. ప్రభుత్వం నిధులు ఖర్చు చేసే అధికారం ఇవ్వకపోవడంతో అత్యవసర పనులకు ఆటంకం ఏర్పడుతోంది. చేసేది లేక అధికారులు తమ సొంత డబ్బు వెచ్చిస్తున్నారు. ఇలా ప్రతి అధికారి ఇప్పటి వరకు రెండు నెలలుగా ఒక్కో అధికారి రూ.లక్ష వరకు సొంత డబ్బు వెచ్చించినట్లు సమాచారం. డ్రాయింగ్ పవర్ లెస్ ప్రత్యేక అధికారులకు డ్రాయింగ్ పవర్ తప్పనిసరి. బిల్లులపై సంతకాలతో పాటు స్టాంప్ తదితర ధ్రువీకరణలు చేయాలి. అనంతరం ఆన్లైన్లో వేలిముద్ర వేస్తేనే బిల్లులు విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ప్రత్యేకాధికారుల నుంచి వేలిముద్ర అథారిటీ అనుమతుల కోసం మండల పరిషత్ అధికారులు ఇటీవల ఆధార్, ఆధార్తో లింకై న మొబైల్ నంబర్ వివరాలు సేకరించారు. నేటికీ ప్రత్యేక అధికారులకు నిధులు డ్రా చేసే అధికారం రాలేదు. ఎప్పటికి వస్తుందో తెలియని పరిస్థితి. ఆ అధికారం వస్తే తప్ప 15వ ఆర్థిక సంఘం నిధులు డ్రా చేయడం, బిల్లులు చెల్లించడం సాధ్యం కాదు. ప్రజాసేవల్లో జాప్యం ప్రత్యేకాధికారులు తమ సొంత శాఖకు సంబంధించిన విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అదనంగా పల్లె పాలనపై దృష్టి పెట్టాలి. ఈ పరిణామం అధికారుల పనితీరుపై పడనుంది. గ్రామ పంచాయతీల్లో విద్యుత్, తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు వంటి సమస్యలు పరిష్కరించడానికి అధికారులు అందుబాటులో ఉండరు. దీంతో ఆయా సమస్యల పరిష్కారంలో జాప్యం చోటు చేసుకుంటుందని ప్రజలు అంటున్నారు. ఉత్సవ విగ్రహాల్లా మారిన పంచాయతీల ప్రత్యేకాధికారులు చెక్ పవర్ ఇవ్వకపోవడంతో ఆర్థిక అవస్థలు కూటమి నేతలు చెప్పినట్టు వినాల్సిందేనంటూ హుకుం తమ సొంత డబ్బు వెచ్చించి చిన్నపాటి పనులు చేస్తున్న వైనం ఇప్పటి వరకు ఒక్కో అధికారి రూ.లక్షకు పైగా ఖర్చు -
మస్కట్లో మహిళ నరకయాతన
సురక్షితంగా ఇంటికి చేర్చిన కేఎస్ఎం అధికారులు అమలాపురం రూరల్: ఉపాధి కోసం వెళ్లి మస్కట్లో నరకయాతన అనుభవించిన జిల్లా ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్పకు చెందిన కె.లక్ష్మిని కేసీఎం అధికారులు సురక్షితంగా ఇంటికి చేర్చారు. గత ఏడాది సెప్టెంబర్ 8న ఏజెంట్ అక్కడకు వెళ్లిన మహిళ ఓ ఇంటిలో పనికి చేరింది. యజమాని వేధింపులు భరించలేక తన భర్త శ్రీనివాసరావుకు ఆ సమాచారాన్ని ఇచ్చింది. కలెక్టరేట్లోని కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ (కేఎస్ఎం)ను సంప్రదించగా కలెక్టర్ ఆదేశాలతో అక్కడి అధికారులు సహాయక చర్యలు చేపట్టి ఆమెను క్షేమంగా ఇంటికి చేర్చారు. -
నేడు పది కోర్టుల భవన సముదాయం ప్రారంభం
– ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ రాక రాజమహేంద్రవరం సిటీ, ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): రాజమహేంద్రవరంలో నూతనంగా నిర్మించిన ‘‘పది కోర్టుల సముదాయ భవనం‘ ను శనివారం ఉదయం 10.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ ప్రారంభిస్తారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్ , జస్టిస్ ఆర్.రఘునందన్రావు, జస్టిస్ బి.వి.ఎల్.ఎన్.చక్రవర్తి, జస్టిస్ సుమతి జగడం, జస్టిస్ న్యాపతి విజయ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారన్నారు. జస్టిస్ బట్టు దేవానంద్ తూర్పు గోదావరి జిల్లా పరిపాలనా న్యాయమూర్తిగా కార్యక్రమంలో పాల్గొంటారని ఆమె తెలిపారు. రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్.వి. ప్రసాద్, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, న్యాయశాఖ అధికారులు, సిబ్బంది, ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పదికోర్టుల సముదాయ భవనం ప్రారంభోత్సవ ఏర్పాట్లును పరిశీలించారు. -
పశువులకూ వేసవి తాపం
● రక్షణ చర్యలు తీసుకోకుంటే ప్రమాదం ● జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి విజయరెడ్డి అమలాపురం టౌన్: వేసవి ఎండల తాపం నుంచి మూగ జీవాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటిని వేసవి తాపం నుంచి వాటిని కాపాడేందుకు జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఎల్.విజయరెడ్డి ఐదు సూత్రాలు చెప్తున్నారు. జిల్లాలో 55, 221 ఆవులు, 1,10,123 గేదెలు, 25,291 గొర్రెలు, 19,713 మేకలు, 49,38,269 కోళ్లు (పౌల్ట్రీ) ఉన్నాయి. ఎండల తీవ్రత నుంచి వాటికి ఉపశమనం కలిగించేందుకు శుభ్రమైన చల్లని నీరు 24 గంటలూ అందుబాటులో ఉంచాలని చెప్తున్నారు. పశువు రోజుకు 100 లీటర్ల వరకూ నీరు తాగుతుంది. అలాగే వాటికి నీడ ఏర్పాటు చేయాలి. పశువుల పాకలపై గడ్డి, టార్పాలిన్, షేడ్ నెట్ వేయాలి. ఎండ సమయంలో పశువులకు జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది. ఉదయం 6 నుంచి 9 గంటల వరకూ, సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల లోపు మాత్రమే మేత, దాణా వేయాలి. దాణాలో 30 గ్రాముల ఉప్పు, 50 గ్రాముల మినరల్ మిక్స్చర్ కలిపాలి. ఈ విధానం వల్ల పశువులు వడ దెబ్బ తగలకుండా ఉంటాయి. వడ దెబ్బ లక్షణాలివీ.. పశువులు వడ దెబ్బ తగలకుండా రైతులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వాటిని గమనిస్తూ ఉండాలి. వాటికి ఆయాసం, జొల్లు, నాలుక బయట పెట్టడం, మేత మానేయడం వంటి లక్షణాలు గమినిస్తే తక్షణమే స్పందించాలి. వాటిని నీడకు చేర్చి వాటి శరీరంపై నీళ్లు పోయాలి. తక్షణమే పశువుల అంబులెన్స్ 1962 నెంబర్కు కాల్ చేయడం లేదా దగ్గరలో ఉన్న పశు వైద్యుడిని సంప్రదించడమో చేయాలి. ఈ జాగ్రత్తలను విధిగా పాటిస్తూ పాల దిగుబడి తగ్గకుండా, ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తతతో చూసుకోవాల్సిన రైతులపై ఉందని విజయరెడ్డి సూచిస్తున్నారు. -
తెల్లబోతున్న నల్లరేగడి పొగాకు!
● ఇంకా ప్రారంభంకాని కొనుగోళ్లు ● రైతుల ఆందోళన ● తొర్రేడులో బ్లాక్ సాయిల్ టొబాకో సాగు ● 3 మిలియన్ల కిలోల ఉత్పత్తి దేవరపల్లి: ఈ ఏడాది పొగాకు పండించిన రైతుల పరిస్థితి గందరగోళంగా మారింది. నల్లరేగడి భూముల్లో పండించిన పొగాకు విక్రయాలకు బోర్డు నుంచి ఇంతవరకు అనుమతులు రాలేదు. టొబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని దేవరపల్లి వేలం కేంద్రం పరిధిలో సుమారు 30 గ్రామాల్లో 964 బ్యారన్లకు లైసెన్సులు ఉండగా, 1,013 మంది రైతులు 1,120 హెక్టార్లలో బ్లాక్ సాయిల్ పొగాకు పండిస్తున్నారు. 2025–26 పంట కాలానికి 2.03 మిలియన్ల కిలోలు ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా, 3 మిలియన్ల కిలోలు ఉత్పత్తి జరిగింది. పొగాకు క్యూరింగ్లు, గ్రేడింగ్లు పూర్తి చేసిన రైతులు పంటను అమ్ముకోవడానికి ఎదురు చూస్తున్నారు. రాజమహేంద్రవరం డివిజన్లో తొర్రేడు, రంగంపేట, సీతానగరం, ముగ్గళ్ల, వడిశలేరు ప్రాంతాల్లో నల్లరేగడి భూముల్లో పొగాకు పండిస్తున్నారు. దేవరపల్లి వేలం కేంద్రం పరిధిలోని దేవరపల్లి మండలంలో దేవరపల్లి, పల్లంట్ల, లక్ష్మీపురం, బందపురం, దుద్దుకూరు గ్రామాల పరిధిలో కొంత మంది నల్లరేగడి భూముల్లో పొగాకు పండిస్తున్నారు. నల్లరేగడి భూముల్లో పండించిన పొగాకును దేవరపల్లి వేలం కేంద్రంలో రైతులు విక్రయించవలసి ఉంది. గతంలో తొర్రేడు వేలం కేంద్రంలో బ్లాక్ సాయిల్ రైతులు పొగాకును విక్రయించేవారు. వేలం కేంద్రాన్ని పొగాకు బోర్డు మూసివేయడంతో అక్కడ బ్యారన్లను దేవరపల్లి వేలం కేంద్రానికి బదిలీ చేశారు. దాదాపు 10 సంవత్సరాలుగా అక్కడ రైతులు పండించిన పొగాకును దేవరపల్లి వేలం కేంద్రంలో విక్రయిస్తున్నారు. బ్లాక్ సాయిల్(బీఎస్) పొగాకును వేలం కేంద్రంలో ప్రత్యేకంగా ఉంచి అధికారులు వేలం నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 25న రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు ప్రారంభించారు. వర్జీనియా పొగాకును మాత్రమే వేలం నిర్వహిస్తున్నారు. బ్లాక్ సాయిల్ పొగాకు కొనుగోలుకు బోర్డు నుంచి అనుమతులు రాలేదని అధికారులు చెబుతున్నారు. మొక్కుబడిగా వర్జీనియా కొనుగోళ్లు వర్జీనియా పొగాకు కొనుగోళ్లు కూడా మొక్కుబడిగా జరుగుతున్నాయి. 40 రోజులు వేలం నిర్వహించగా సుమారు 11 లక్షల కిలోల పొగాకు విక్రయం జరిగింది. వేలం కేంద్రాలకు వచ్చిన బేళ్లలో 50 నుంచి 60 శాతం అమ్ముడు పోక రైతులు ఇబ్బంది పడుతున్నారు. కిలో గరిష్ట ధర రూ.265 పలకడంతో పంటను అమ్ముకోవడానికి రైతులు ముందుకు రావడంలేదు. సుమారు 25 కంపెనీల ప్రతినిధులు వేలంలో పాల్గొనవలసి ఉండగా, ఆరు కంపెనీలు వేలంలో పాల్గొంటున్నాయి. ఈ ఏడాది పొగాకు కొనుగోళ్లను చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. బోర్డు అనుమతి మేరకు పండించిన పంటను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి ఆదుకోవాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు. 2015–16 సంవత్సరంలో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో గిట్టుబాటు ధర రాక అనేక మంది పొగాకు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, అటువంటి ఘటనలు ఈ ఏడాది పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైతులకు అండగా ఈ నెల 6వ తేదీన దేవరపల్లి వేలం కేంద్రం వద్ద వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన సంగతి తెలిసిందే. కస్టమర్స్ నుంచి ఆర్డర్లు రావాలి విదేశీ కస్టమర్స్ నుంచి ఎగుమతి ఆర్డర్లు రావలసి ఉంది. లక్ష కిలోల పొగాకు ఐటీసీ శాంపిల్స్ తీసి కస్టమర్లకు పంపించింది. శాంపిల్స్ పొగాకు కస్టమర్లకు నచ్చకపోవడంతో రెండవ సారి పంపిస్తున్నారు. త్వరలో ఆర్డర్లు వస్తాయని ఆశిస్తున్నాం. బ్లాక్ సాయిల్ పొగాకుకు ఇండెంట్ రావలసి ఉంది. ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో 50.87 మిలియన్ల కిలోల ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇవ్వగా, 85.25 మిలియన్ల కిలోలు ఉత్పత్తి జరిగింది. – జె.సురేంద్ర కుమార్, టొబాకో బోర్డు రీజనల్ మేనేజరు, రాజమహేంద్రవరం పల్లంట్లలో నల్లరేగడి భూముల్లో సాగు చేస్తున్న పొగాకు -
హాకీ వేసవి శిక్షణ ప్రారంభం
స్థానిక పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హాకీ వేసవి క్రీడాశిక్షణ శిబిరం గురువారం ఉత్సాహంగా ప్రారంభమైంది. ప్రారంభ కార్యక్రమానికి హాకీ సంఘ ప్రతినిధి వి.రవిరాజు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా డీఎస్డీఓ సతీష్ కుమార్ పాల్గొన్నారు. రవిరాజు మాట్లాడుతూ క్రీడాయాప్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు మాత్రమే ఈ శిక్షణకు అర్హులన్నారు. ఈనెల 30 వరకు జరిగే ఈ శిబిరంలో 40 మంది పాల్గొంటున్నారని, ఫిట్నెస్ మెళకువలతోతో పాటు హాకీలో ఓనమాలు నేర్పిస్తామని చెప్పారు. ఖో–ఖో సంఘ అధ్యక్షుడు పట్టాభి మాట్లాడుతూ క్రీడల్లో రాణించేవారికి ప్రభుత్వం మూడు శాతం రిజర్వేషన్ కల్పిస్తుందన్నారు. పీఆర్ కళాశాల పీడీ వర్మ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే జాతీయస్థాయి క్రీడాకారులుగా ఎదగాలని తెలిపారు. పీఆర్జీ పీడీ రమణ, గ్రౌండ్స్మెన్ శ్రీను పాల్గొన్నారు. -
జీజీయూలో దొంగలు పడ్డారు
రాజానగరం: జాతీయ రహదారిని ఆనుకుని వెలుగుబందలో ఉన్న గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జీజీయూ)లో బుధవారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ అధికారి (ఏఓ) జి. శ్రీహరిప్రసాద్ గురువారం రాజానగరం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు వివరాలు ఇలా వున్నాయి.. బుధవారం సాయంత్రం వరకు విద్యార్థులు చెల్లించిన ఫీజులకు సంబంధించిన రూ.3,74,790ను క్యాషియర్ శ్వేత నగదు విభాగంలోని క్యాబిన్లో భద్రపరిచారు. గురువారం డ్యూటీకి వచ్చిన సిబ్బంది క్యాబిన్ తలుపులు తెరచివుండటాన్ని గమనించడంతో చోరీ జరిగిన సంగతి తెలిసింది. నగదు విభాగంలో భద్రపరచిన రూ.3,74,790 కనిపించలేదు. అర్ధరాత్రి సమయంలో ఈ చోరీకి పాల్పడివుండవచ్చని అనుమానిస్తున్నారు. ఘటనా స్థలాన్ని నార్త్ జోన్ డీఎస్పీ జీవన, స్థానిక సీఐ వీరయ్యగౌడ్ సందర్శించి, సీసీ కెమెరాలను పరిశీలించారు. నలుగురు వ్యక్తులు ముఖాలకు ముసుగులు ధరించి, చోరీకి పాల్పడినట్టుగా గుర్తించారు. -
మడ చెట్ల తొలగింపుపై కేసు
తాళ్లరేవు: పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహదపడే మడ చెట్లను తొలగించిన పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎం.నాగార్జున తెలిపారు. మండల పరిధిలోని గాడిమొగ పంచాయతీలో గాయత్రీ సాల్ట్ వర్క్స్ సంస్థకు చెందిన పలువురు రహదారి విస్తరణ నేపథ్యంలో అడ్డుగా ఉన్న మడ చెట్లను విచక్షణా రహితంగా తొలగించారు. ఎటువంటి అనుమతులు లేకుండా మడ చెట్లను తొలగించడంపై పలువురు అటవీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. తుమ్మ చెట్ల ముసుగులో మడ చెట్లను తొలగించడాన్ని గుర్తించి సంస్థ ప్రతినిధులతోపాటు కృష్ణంరాజు అనే వ్యక్తిపై కేసులు నమోదు చేశారు. తీర ప్రాంతానికి రక్షణ కవచంగా ఉన్న మడ అటవీ ప్రాంతంలో చెట్లను తొలగించడం నేరమని, కఠిన చర్యలు చేపట్టనున్నట్లు నాగార్జున విలేకర్లకు తెలిపారు. మడ చెట్లు తొలగించిన ప్రాంతం కోరంగి వైల్డ్లైఫ్ సాంక్చురీకి అతి దగ్గరగా ఉండడం గమనార్హం. -
ఉరి వేసుకుని వ్యక్తి మృతి
కాకినాడ రూరల్: భార్యాభర్తల మధ్య మనస్పర్థల నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఎస్.అచ్యుతాపురం మధురానగర్కు చెందిన గోకాడ శ్రీనివాసులు(44) బుధవారం రాత్రి మృతి చెందాడు. ఇంద్రపాలెం పోలీసులు తెలిపిని వివరాలివీ.. శ్రీనివాసులకు భార్య పుష్పలత, 14 ఏళ్ల కుమారుడు, 13 ఏళ్ల కుమార్తె ఉన్నారు. కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషించేవాడు. ఇటీవల కాలంలో ఇంటి వద్దే ఖాళీగా ఉండడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ఇటీవల భార్య, పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న శ్రీనివాసులు ఫ్యాన్కు ఉరివేసుకుని మృతి చెందాడు. గురువారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వీఆర్వో బత్తుల రమణకుమారి ఫిర్యాదు మేరకు ఏఎస్సై ఎం.వాడపల్లి కేసు నమోదు చేశారు. లేఅవుట్ రోడ్డులో యువకుడి మృతి రాజానగరం: ఫరిజల్లిపేట నుంచి చక్రద్వార బంధానికి వెళ్లే డీవీబీ రాజు లేఅవుట్ రోడ్డులో మేడిశెట్టి గంగరాజు (24) ప్రమాదానికి గురై మృతి చెందాడు. రాజానగరం సీఐ వీరయ్యగౌడ్ గురువారం ఇక్కడ మీడియాకు తెలిపిన వివరాలిలా వున్నాయి.. ఫరిజల్లిపేటకు చెందిన దుర్గాప్రసాద్ బుధవారం తన పల్సర్ మోటారు బైకుపై దగ్గరి దారిలో చక్రద్వారబంధం వైపు వెళ్లేందుకు డీవీబీ రాజు లేఅవుట్ రోడ్డులో ప్రయాణిస్తూ అదుపు తప్పి పడిపోయాడు. ఈ క్రమంలో అతని తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రి సమయంలో అటుగా వెళ్తున్న వేరొకరు సమాచారం ఇవ్వడంతో 108 సిబ్బంది అక్కడకు చేరుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే అతను మరణించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. తొలుత దీనిని అనుమానాస్పద స్థితిలో మృతిగా భావించారు. ఘటనా స్థలాన్ని నార్త్ జోన్ డీఎస్పీ జీవన కూడా పరిశీలించారు. -
పీఈటీ అవ్వాలని...
నా పేరు కర్రి దుర్గాప్రసాద్. పీఆర్ బాలుర పాఠశాలలో నేను 10 వ తరగతి చదువుతున్నాను. పీఈటీ అవ్వాలనేది నా కోరిక. స్పోర్ట్స్ కోటాలో పీఈటీ ఉద్యోగం సాధించాలని హాకీలో చేరాను. క్రీడలంటే ఇష్టం నా పేరు లలిత ప్రియ. నేను శ్రీనగర్ మున్సిపల్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాను. నాకు క్రీడలంటే చిన్నతనం నుంచీ ఇష్టం. అందుకే హాకీ శిబిరంలో చేరాను. టీచర్ ఉద్యోగం నా లక్ష్యం నా పేరు జి.అఖిల. నేను నీఆర్ బాలికోన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాను. నేను మొదటిసారి వేసవి శిక్షణకు హాజరయ్యాను. టీచర్ అవ్వాలనేది నా లక్ష్యం. జాతీయ స్థాయిలో రాణించడమే ధ్యేయం నా పేరు సీహెచ్బీఎల్ఎస్ షణ్ముకేశ్వరి. నేను పీఆర్ బాలికోన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పీడీ షేక్ మస్తాన్ బేగంను స్ఫూరిగా తీసుకుని హాకీ వైపు వచ్చాను. జాతీయ స్థాయి క్రీడాకారిణిగా రాణించడం నా ధ్యేయం. -
బరి తెగించిన ముగ్గురికి అరదండాలు
● ఇద్దరు అంతర జిల్లా నేరస్తులు సహా ఒక బైక్ దొంగ అరెస్టు ● రూ.51 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువుల రికవరీ కాకినాడ క్రైం: ఒంటరి మహిళలను టార్గెట్ చేసి బంగారు గొలుసులు తెంపుకొని మాయమవడం. అర్ధరాత్రుళ్లు ఇళ్లలో చొరబడి చోరీలు చేయడం, బైక్లు దొంగిలించడంలో ఆరితేరిన ముగ్గురు నేరస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ బిందుమాధవ్ గురువారం తన కార్యాలయంలో ఈ వివరాలు విలేకరులకు వెల్లడించారు. ఇద్దరికి అరదండాలు : తూర్పుగోదావరి జిల్లా రాజవోలు గ్రామానికి చెందిన 30 ఏళ్ల పల్లా సురేంద్రకుమార్, కాకినాడ రాగంపేటకు చెందిన 45 ఏళ్ల రంగాల శ్రీనివాసరెడ్డి కలిసి వరుస నేరాలకు పాల్పడుతున్నారు. వీరిద్దరు 12 కేసుల్లో నిందితులు. చైన్స్నాచింగ్, ఏటీఎం కేంద్రాల వద్ద నేరాలు చేయడంలో సిద్ధహస్తులు. సురేంద్రకుమార్ ఏటీఎంలలో వ్యక్తుల నుంచి కార్డు, పిన్ చోరీ చేసి డబ్బు డ్రా చేసి పరారయ్యేవాడు. ఇలా ఇతడు 65 ఏటీఎంల వద్ద చోరీలకు పాల్పడ్డాడు. సురేంద్ర, శ్రీనివాస్ ఇద్దరూ చైన్స్నాచింగ్లకు పాల్పడుతున్నారు. రోడ్లపై వెళ్లే ఒంటరి మహిళలతో పాటు ఇళ్లలో ఉండే తోడు లేని ఆడవారు, వృద్ధుల్ని లక్ష్యంగా చేసుకొని వీరు పేట్రేగిపోయారు. దారి కాచి మెడలో గొలుసులు తెంపుకెళ్లడం, ఇళ్లల్లోకి అర్థరాత్రుళ్లు చొరబడి బంగారం ఎత్తుకెళ్లడంలో వీరు నేర్పరులు. వీరిద్దరినీ బుధవారం రాత్రి సామర్లకోట జెడ్ బ్రిడ్జ్ వద్ద అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. బైక్ల దొంగ అరెస్టు : కాకినాడ రూరల్ మండలం వలసపాకలకు చెందిన 20 ఏళ్ల రచ్చ నాగ సతీష్ కుమార్ వరుస ద్విచక్రవాహన చోరీలకు పాల్పడుతున్నాడని, అతడిపై సస్పెక్టు షీటు సహా గంజాయి వినియోగం, నాటుసారా సంబంధిత 30 కేసులు జిల్లాలో వివిధ పోలీస్స్టేషన్లో ఉన్నాయని అన్నారు. ముద్దాయిని వలసపాకలలో అతడి ఇంటికి సమీపంలో పట్టుకున్నామని తెలిపారు. రెండు కేసుల్లో 320 గ్రాముల బంగారం, 600 గ్రాముల వెండి సామగ్రి, రూ.40 వేల నగదు, 3 బైక్లు స్వాధీనం చేసుకున్నామని వీటి విలువ సుమారు రూ.51 లక్షలని ఎస్పీ తెలిపారు. కేసుల ఛేదనలో కీలకంగా వ్యవహరించిన ఏఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ వి.కృష్ణ, కాకినాడ టూ టౌన్ సీఐ మజ్జి అప్పలనాయుడిని ఎస్పీ అభినందించారు. -
గోల్ కొడతామిలా!
● హాకీ వేసవి శిక్షణ శిబిరంలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు ● ఈ తర్ఫీదును తమ లక్ష్య సాధనకు వినియోగించుకుంటామని స్పష్టీకరణ నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): చక్కని కార్యాచరణతో వేసవి సెలవులను సద్వినియోగం చేసుకొనేందుకు ఆ విద్యార్థులు సిద్ధమయ్యారు. ఆట విడుపు వేళ తమ లైఫ్ గోల్ సాధనకు శ్రమించాలని నిర్ణయించుకున్నారు. భవిష్యత్తులో తాము ఎలా ఎదగాలనుకుంటున్నామో, జీవితంలో ఏ విధంగా స్థిరపడాలనుకుంటున్నామో ముందుగానే నిర్ణయించుకొన్న.. వారు తమ లక్ష్యసాధనకు శిక్షణ పొందడానికి సమాయత్తమయ్యారు. కాకినాడ పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న హాకీ వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో పాల్గొన్న విద్యార్థులు తమ అభిప్రాయాలు ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు.. అంకితభావంతో రాణింపు ఆటల్లో రాణించాలంటే అంకిత భావం, కృషి, పట్టుదల అవసరం. 1987లో ఇదే కళాశాలలో చదివే రోజుల్లో వెయిట్ లిఫ్టింగ్లో ఆలిండియా గోల్డ్ మెడల్ సాధించా. అప్పటి ప్రిన్సిపాల్ ధర్మారావు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి అభినందించారన్నారు. ఆ ప్రోత్సాహంతోనే వెయిట్ లిఫ్టింగ్ కోచ్గా కెరీర్ ప్రారంభించి, ఇప్పుడు డీఎస్డీఓ విధులు నిర్వహిస్తున్నా. 2013లో డీఎస్ఏలో వెయిట్ లిఫ్టింగ్ శిక్షణకు వచ్చిన ధాత్రి ఇప్పుడు ఇండియన్ రైల్వేస్లో గ్రేడ్–2 ఉద్యోగినిగా పనిచేస్తోంది. ఆటల్లో రాణించాలంటే క్రమం తప్పకుండా శిక్షణకు హాజరు కావాలి. – వి.సతీష్కుమార్, డీఎస్డీఓ -
ఆపదలు గాసే అరుదైన క్రాస్!
● సామాజిక సేవల్లో ఆదర్శం ● రక్తదానంతో ప్రాణదానం ● నేడు ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవం రాయవరం: ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకోవడంలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ముందుంటుంది. బాధితుల ప్రాణాలను కాపాడేందుకు రక్తదానంతో పాటు ఇతర సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1928లో ఆ సంస్థ సేవలు ప్రారంభమయ్యాయి. దాతల నుంచి సేకరించిన రక్తం యూనిట్లను జిల్లాలోని రక్తనిధి కేంద్రాలు, రక్త నిల్వ కేంద్రాల ద్వారా వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాధితులకు అందజేస్తూ వారికి ప్రాణదానం చేస్తోంది. శుక్రవారం రెడ్క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కథనం.. వేలాది రక్తదాన శిబిరాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 120 మంది తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉచితంగా రక్తాన్ని సరఫరా చేస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 77 రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి 6,708 యూనిట్ల రక్తాన్ని సేకరించింది. 11,598 యూనిట్ల రక్తాన్ని అవసరమైన వారికి అందజేసింది. ఈ ఏడాది జెల్ టెక్నాలజీని ప్రవేశ పెట్టింది. దీని ద్వారా శుద్ధి చేసిన, నాణ్యమైన రక్తాన్ని రోగికి అందిస్తారు. ఇతర సేవా కార్యక్రమాలు రెడ్క్రాస్ సంస్థ దివ్యాంగుల ఆశ్రమ పాఠశాలను కాకినాడ ప్రతాప్నగర్లో నిర్వహిస్తోంది. ఇక్కడ ఉచిత వసతి విద్యాబోధనతో పాటు పుస్తకాలు, దుస్తులు అందజేస్తోంది. ప్రకృతి వైపరీత్యాల వేళ బాధితులకు వైద్యంతో పాటు నిత్యావసర వస్తువులు అందిస్తోంది. రాజా ట్యాంకు వద్ద యోగా సెంటర్ను నిర్వహిస్తోంది. నామమాత్రపు చార్జీలతో వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. వాకలపూడిలో ఉన్న ఆశ్రమంలో 25 మంది ఉన్నారు. గ్రీన్ఫీల్డ్ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ బ్లైండ్లో 40 మంది బోధిస్తున్నారు. అనాథ శవాలకు దహన సంస్కారాలను ఆత్మబంధువు పేరుతో నిర్వహిస్తున్నారు. ఉచిత అంబులెన్స్ అందిస్తోంది. సంస్థ కార్యాలయంలో రోజూ ఉదయం, సాయంత్రం 50 మందికి ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. ఏటా ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. సేవలకు పురస్కారం తూర్పుగోదావరి జిల్లా శాఖ అందించిన సేవలకు పలు అవార్డులు సొంతం చేసుకుంది. గవర్నర్ చేతుల మీదుగా పురస్కారాలను, ప్రశంసాపత్రాలను అందుకుంది. చాలా సంతోషంగా ఉంది రెడ్క్రాస్ సంస్థలో సేవచేయడం సంతోషంగా ఉంది. రక్తదానంపై అవగాహన పెంచడానికి కృషి చేస్తున్నాం. – కసిరెడ్డి శివకుమార్, సెక్రటరీ, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ, కాకినాడ వలంటీర్లను సిద్ధం చేస్తున్నాం బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. పుష్కరాల్లో సేవలందించేందుకు వలంటీర్లను సిద్ధం చేస్తున్నాం. – తరుణ్ గోగినేని, చైర్మన్, రెడ్క్రాస్ సంస్థ, తూర్పుగోదావరి జిల్లా -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 22,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 24,000 గటగట (వెయ్యి) 21,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 14,000 – 15,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)14,000 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
ఇద్దరు అంతర్ జిల్లాల దొంగల అరెస్ట్
● రూ.97.50 లక్షల సొత్తు స్వాధీనం ● ఎస్పీ రాహుల్ మీనా వెల్లడి అమలాపురం టౌన్: వారు ఇంటి తలుపుల టవర్ బోల్ట్లు తీయడంలో, ఐరన్ రాడ్తో తాళాలు పగులగొట్టడంలో సిద్ధహస్తులు. ఇంట్లోని వారు నిద్రిస్తుండగానే చడీ చప్పుడు లేకుండా చోరీలు చేయడం వారి నైజం. కొత్తపేట ఓల్డ్ బ్యాంక్ వీధిలోని ఒక డాబా ఇంట్లో గత సంవత్సరం ఆగస్టు 30న జరిగిన చోరీ కేసు దర్యాప్తు చేస్తుండగా తీగ లాగితే డొంక కదిలినట్లు ఆ దొంగల చోరీల చిట్టా బయట పడింది. మరింత లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు ఎట్టకేలకు ఆ ఇద్దరు దొంగలను వల పన్ని పట్టుకున్నారు. వారి నుంచి రూ.97.50 లక్షల సొత్తు రికవరీ చేశారు. కాకినాడ జిల్లా ఏటిమొగ గ్రామానికి చెందిన పొన్నాడ రవిశంకర్ (వీరబాబు), తూర్పు గోదావరి జిల్లా అనపర్తి గ్రామానికి చెందిన వైరా చిరంజీవి ఈ చోరీలకు పాల్పడ్డారు. రవిశంకర్ను కొత్తపేట నాయుడు రైస్ మిల్లు వద్ద, చిరంజీవిని అనపర్తిలో అరెస్టు చేశారు. అమలాపురంలోని తన కార్యాలయంలో ఎస్పీ రాహుల్ మీనా విలేకరులకు గురువారం ఈ వివరాలు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న 646.361 గ్రాము ల బంగారు నగలు, రూ.2,100 నగదు, మోటారు సైకిల్, స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్ను చూపించారు. 14 చోరీల కేసుల్లో సొత్తు స్వాధీనం ఈ అంతర జిల్లాల దొంగలు కోనసీమతో పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తం 14 చోరీలకు పాల్పడ్డారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, రావులపాలెం స్టేషన్ పరిధిలో 1, తూర్పు గోదావరి జిల్లా పెరవలి పోలీస్ స్టేషన్ పరిధిలో 3, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టౌన్, ఇరగవరం, తణుకు టౌన్, తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో తలో రెండు చోరీలు చేశారు. ఈ 14 చోరీ కేసుల నుంచి మొత్తం రూ.97.50 లక్షల సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏ–1పై 120 చోరీలు, ఏ–2పై హత్య కేసు ఈ చోరీల్లో ఏ–1 అయిన రవిశంకర్ ఇప్పటి వరకూ 120 ఇంటి దొంగతనాలకు పాల్పడినట్లు కొత్తపేట పోలీసుల దర్యాప్తులో తేలింది. ఏ–2 అయిన చిరంజీవిపై గతంలో హత్య కేసు కూడా నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. అధికారులు, సిబ్బందికి ఎస్పీ అభినందన అంతర జిల్లాల దొంగలను అరెస్ట్ చేసి సొత్తును రికవరీ చేయడంపై ఎస్పీ మీనా పోలీస్ అధికారులు, క్రైమ్ సిబ్బందిని ప్రశంసించి వారికి నగదు రివార్డులు అందజేశారు. కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్, రావులపాలెం రూరల్ సీఐ విద్యాసాగర్, అమలాపురం క్రైమ్ సీఐ ఎం.గజేంద్రకుమార్, కొత్తపేట ఎస్సై జి.సురేంద్రకుమార్, క్రైమ్ ఎస్సైలు ఎ.పరదేశి, అయితాబత్తుల బాలకృష్ణ, ఏఎస్ఐ ఎం.సుబ్బరాజు, కానిస్టేబుళ్లు లంకాడి శ్రీను, డి.అర్జునరావు, బీడీవీ ప్రసాద్, జి. కృష్ణసాయి, ఎ.శుభాకర్, ఆర్సీహెచ్వీ ప్రసాద్, ఎం.హరిబాబులకు ఎస్పీ మీనా రివార్డులు అందించి అభినందించారు. -
దయనీయ పరిస్థితిలో రైతులు
● ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు ● మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆవేదన రాజమహేంద్రవరం సిటీ: రాష్ట్రంలోని రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో వారిని కూటమి ప్రభుత్వం నిలువునా ముంచేసిందని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ విమర్శించారు. వరి, మొక్కజొన్న, మామిడి ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను నట్టేట ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఏటా రూ.20 వేల పెట్టుబడి సాయం ఇస్తామంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందన్నారు. ఈ రెండేళ్లలో చంద్రబాబు ప్రతి రైతుకూ రూ.40 వేలు బాకీ పడ్డారన్నారు.. కేంద్ర సాయంతో కలిపి ప్రతి రైతు ఖాతాలో రూ.52 వేలు జమ కావాల్సి ఉందని, కానీ, ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదని ధ్వజమెత్తారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఏవీ? గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో పేదలకు అందజేసిన ఇళ్ల పట్టాలు, జగనన్న కాలనీలను కూటమి ప్రభుత్వం అటకెక్కించిందని భరత్రామ్ అన్నారు. గతంలో తాము ఇచ్చిన ఇళ్లను అగ్గిపెట్టెలని విమర్శించిన చంద్రబాబు.. ప్రతి పేదవాడికి 2 నుంచి 3 సెంట్ల స్థలం ఇస్తామన్న హామీని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో టిడ్కో ఇళ్లు ఖాళీగా ఉన్నాయని, లబ్ధిదారులపై నెలవారీ వాయిదాల (ఈఎంఐ) భారం వేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారులు ధర్నాలు చేస్తున్నారని, మరోవైపు ఈఎంఐలు మొదలవడంతో ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితులు ఉండే అవకాశం లేదని అన్నారు. పుష్కరాల ఏర్పాట్లపై నిర్లక్ష్యం గోదావరి పుష్కరాలకు సరిగ్గా ఏడాది సమయం ఉందని, అయినప్పటికీ సంబంధిత ఏర్పాట్లలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని భరత్రామ్ విమర్శించారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయన పబ్లిసిటీ షూటింగ్ కోసం ప్రజలను పుష్కర ఘాట్ గేటు వద్ద ఉంచేయడంతో జరిగిన తొక్కిసలాటలో 29 మంది చనిపోయారని గుర్తు చేశారు. శివరాత్రి నాడు 2 లక్షల మందిని అదుపు చేయలేకపోయిన ప్రభుత్వం, 10 కోట్ల మంది వచ్చే పుష్కరాలను ఎలా నిర్వహిస్తుందని ప్రశ్నించారు. ఎక్కువ మంది యాత్రికులు పుష్కర ఘాట్కే వస్తారని, ఇప్పుడు కూడా ఏర్పాట్లలో అశ్రద్ధ చూపుతూ, కేవలం మాక్ డ్రిల్స్తో కాలక్షేపం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పుష్కరాల నిర్వహణ, నిధులపై తక్షణమే మాస్టర్ ప్లాన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పుష్కరాలకు ఎంత నిధులు కేటాయిస్తున్నారో బహిరంగ ప్రకటన చేయాలని, పుష్కర కార్యక్రమాలపై బ్లూ ప్రింట్ రూపొందించాలని అన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారంలో ఎమ్మెల్యే విఫలమయ్యారన్నారు. -
మంత్రముగ్ధుల్ని చేసిన వీణావాదన
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): గోదావరి తీరాన ఈమని కల్యాణి లక్ష్మీనారాయణ, పసుమర్తి పద్మినిల వీణావాదన శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి 75 వసంతాల సందర్భంగా అమృతోత్సవం పేరిట స్థానిక గోదావరి గట్టున ఉన్న సమితి ప్రాంగణంలోని ఏసీ ఆడిటోరియంలో 18 రోజుల పాటు సంగీత మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రెండో రోజైన గురువారం సాయంత్రం కల్యాణి, పద్మినిలు వందేమాతరం గీతంతో వీణావాదన ప్రారంభించి, త్యాగరాజ కీర్తనలు, కృతులు వాయించారు. హంసధ్వని రాగంలో ’బంధురీతి కొలువీయవయ్యా..’, మాయమాళవగౌడ రాగంలో ‘మనవి ఆలకించరాదటే..’, అభేరి రాగంలో ‘నగుమోము..’, శ్రీరాగంలో ‘ఎందరో మహానుభావులు..’, హిందోళ రాగంలో ‘సామజవరగమన’ వంటి కీర్తనలు, కృతులు వాయించి శ్రోతలను మైమరపించారు. కరుటూరి నందకుమార్ సితార, కాపా శ్రీనివాస్ మృదంగం, పండుగ మురళి తబలపై సహకరించి కచేరీని రక్తి కట్టించారు. సమితి గౌరవ చైర్మన్ వాడ్రేవు వెంకట రమణారావు, చైర్మన్ సీఎస్ వెంకట్రావు, ప్రిన్సిపల్ సెక్రటరీ జోస్యుల సరస్వతి, ఫంక్షనల్ సెక్రటరీ వక్కలంక శ్రీరామచంద్రం, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ విశ్వనాథం భాస్కరరామ్, కోశాధికారి వి.కృష్ణకుమారి, ప్రవచన రాజహంస ధూళిపాళ మహాదేవమణి, పలువురు సంగీత ప్రియులు పాల్గొన్నారు. ఈ నెల 23వ తేదీ వరకూ నిర్వహించే సంగీతోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు విజయవాడకు చెందిన పీవీఎన్ కృష్ణ బృందంచే శ్రీకృష్ణరాయబారం పౌరాణిక పద్య నాటకం ప్రదర్శిస్తారు. -
సరస్వతీ పుత్రుల బతుకు పోరాటం
● ప్రైవేటు టీచర్ల మెడపై యాజమాన్యాల కత్తి ● అడ్మిషన్లు తెస్తేనే జీతాలంటూ ఒత్తిళ్లు ● మండుటెండల్లో ఇంటింటా విద్యార్థుల కోసం వెంపర్లాట రాయవరం: ‘సార్/మేడమ్.. మీ ఇంట్లో ఎంత మంది పిల్లలున్నారు? మా పాఠశాల/కళాశాలలో చేర్పించండి. నాణ్యమైన బోధన ఉంటుంది. మీకు నమ్మకం లేకపోతే ఈ బ్రోచర్లో మా ఫలితాలు చూడండి. సీటు ఇప్పుడే కన్ఫర్మ్ చేసుకుంటే ఫీజులో రాయితీ ఇప్పిస్తాం’ అంటూ వివిధ ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల టీచర్లు, అధ్యాపకులు మండుటెండలో ఇంటింటికీ కాళ్లరిగేలా తిరుగుతూ, బతుకు పోరాటం చేస్తున్నారు. ‘ప్లీజ్ మేడమ్.. మా గురించైనా జాయిన్ చేయండి. ప్లీజ్ సార్.. టార్గెట్లున్నాయి. టార్గెట్ పూర్తి చేస్తేనే ఇంక్రిమెంట్ ఉంటుంది’ అని ఒకరు.. టార్గెట్ పూర్తి చేస్తేనే తమకు జీతాలుంటాయని మరొకరు తమ దురవస్థను విద్యార్థుల తల్లిదండ్రులకు దీనంగా చెప్పుకొంటూ ఆ సరస్వతీ పుత్రులు ప్రయాస పడుతున్నారు. ప్రస్తుతం విద్యా సంస్థలకు అడ్మిషన్ల సమయం కావడంతో పల్లెలు, పట్టణాల్లో ఇటువంటి దృశ్యాలు నిత్యం కనిపిస్తున్నాయి. గత్యంతరం లేక.. పని చేసేది పాఠశాలలో ఉపాధ్యాయుడిగానే అయినా సెలవనే మాటే ఉండదు. ఆదివారమైనా, వేసవి సెలవులైనా, పండగలైనా వారు ప్రైవేటు/కార్పొరేట్ టీచర్లు పని చేయాల్సిందే. ఏటా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతోందంటే చాలు.. వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతూంటాయి. అడ్మిషన్ల సంఖ్య ఆధారంగానే జీతాల చెల్లింపు, ఇంక్రిమెంట్లు, ఉద్యోగ భద్రత ఉంటాయని యాజమాన్యాలు నిష్కర్షగా చెబుతూండటంతో ప్రైవేట్ టీచర్లు ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలో ఆందోళనకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. టార్గెట్లు విధించి యాజమాన్యాలు మానసిక వేదనకు గురి చేస్తున్నాయని కొందరు ప్రైవేట్ టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో దాదాపు 1,250 ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలుండగా, వీటిల్లో 25 వేల మంది వరకూ బోధన, బోధనేతర సిబ్బంది పని చేస్తున్నట్లు అంచనా. యాజమాన్యం ఇచ్చిన టార్గెట్ సాధించకపోతే ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో తెలియదు. గత్యంతరం లేక అడ్మిషన్ల కోసం వారు ఎక్కే మెట్టు, దిగే మెట్టు అన్నట్టుగా అవస్థలు పడుతున్నారు. రాయవరం మండలం సోమేశ్వరంలో అడ్మిషన్ల కోసం మండుటెండలో తిరుగుతున్న కార్పొరేట్ పాఠశాల ఉపాధ్యాయులువేధింపులు మానుకోవాలి అడ్మిషన్ల పేరిట ప్రైవేటు ఉపాధ్యాయులతో వెట్టిచాకిరీ చేయించడం తగదు. అడ్మిషన్లు తెస్తేనే జీతాలిస్తామని లేదా ఉద్యోగంలో కొనసాగుతారని కొన్ని యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వేధింపులకు గురవుతున్న వారు పైకి చెప్పుకోలేక మానసిక వేదన చెందుతున్నారు. – బి.సిద్ధు, రాష్ట్ర సహాయ కార్యదర్శి, పీడీఎస్యూ, రాయవరం నిఘా పెట్టాలి ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో అడ్మిషన్ల పేరిట బోధన, బోధనేతర సిబ్బందిని ఇబ్బంది పెడుతున్నారు. సెలవు దినాల్లోనూ పనులు చేయించుకుంటున్నారు. అడ్మిషన్ల టార్గెట్లు చేరుకోలేని వారికి జీతాలు నిలుపుదల చేయడం తగదు. ఉన్నతాధికారులు నిఘా పెట్టి, వేధిస్తున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. – గండి రవికుమార్, రాష్ట్ర కోశాధికారి, ఏఐఎస్ఎఫ్, అమలాపురం దినదిన గండం ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో పని చేస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత లేదు. ఉద్యోగాలు దినదినగండంగా మారుతున్నాయి. అడ్మిషన్ల టార్గెట్లు పెట్టి ఇంటింటికీ తిప్పుతున్నారు. ఉద్యోగ భద్రతకు, అడ్మిషన్లకు ముడి పెడుతున్నారు. ప్రైవేటు టీచర్ల ఉద్యోగ భద్రతకు చట్టబద్ధత కల్పించాలి. – దిద్దే రమేష్, ప్రధాన కార్యదర్శి, ప్రైవేటు టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్, తూర్పు గోదావరి జిల్లా -
పనులు క్లోజ్!
● గోదావరి డెల్టాలో 499 క్లోజర్ పనుల గుర్తింపు ● రూ.27 కోట్లతో అంచనాలు ● నిధుల మంజూరులో సర్కారు జాప్యం ● కాలువలు మూసివేసి 18 రోజులు ● ఇప్పటికీ పడని ముందడుగు నిడదవోలు: గోదావరి డెల్టా కాలువలకు నీటి విడుదలను నిలిపివేసిన తరువాత యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన ఇరిగేషన్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) పనులపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ పనులు అసలు ప్రారంభిస్తారా, లేదా అనే సందిగ్ధత నెలకొంది. గోదావరి తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాల పరిధిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అధికారులు 499 క్లోజర్ పనులను గుర్తించి, రూ.27 కోట్ల అంచనాలతో గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అయితే, కాలువలకు నీటి విడుదలను నిలిపివేసిన చాలా రోజుల తరువాత ఈ పనులకు ప్రభుత్వం ఆలస్యంగా నిధులు మంజూరు చేస్తూ ఈ నెల 2న ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నిధులతో మూడు డెల్టాల ప్రధాన కాలువలతో పాటు ఆయా సబ్ డివిజన్ల పరిధిలోని ప్రధాన ఉప కాలువలు, పిల్ల కాలువల్లో పెరిగిపోయిన తూడు, గుర్రపు డెక్కను తొలగించడంతో పాటు స్లూయిజ్ల నిర్వహణ, షట్టర్ల మరమ్మతులు, గ్రీజు, ఆయిల్ పంపింగ్ వంటి పనులు చేపట్టాల్సి ఉంది. ఈ పనులు సక్రమంగా చేస్తే శివారు భూములకు సైతం రెండు పంటలకూ పూర్తి స్థాయిలో నీరందుతుంది. కూటమి నేతల కన్ను అయితే, క్లోజర్ పనుల్లో కాసులు పిండుకోవాలనే కూటమి నేతలు కొందరు పావులు కదుపుతున్నారు. రూ.10 లక్షల్లోపు పనులను సాగునీటి సంఘాల్లోని రైతులకు నామినేషన్ పద్ధతిపై చేసుకునే అవకాశం ఉంది. దీంతో, రైతుల ముసుగులో ఈ పనులు దక్కించుకునేందుకు కొంతమంది ప్రజాప్రతినిధులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు రూ.10 లక్షలకు పైబడిన పనులు టెండర్ల ద్వారానే చేపట్టాల్సి ఉంటుంది. గోదావరి డెల్టా కాలువలను గత నెల 20న మూసివేశారు. ఇది జరిగి 18 రోజులైనా క్లోజర్ పనులు ఇప్పటికీ చేపట్టలేదు. వచ్చే నెల మొదటి వారంలో ఖరీఫ్ సాగుకు తిరిగి నీరు విడుదల చేయనున్నారు. ఆ గడువు సమీపిస్తూండటం, ప్రభుత్వం ఆలస్యంగా నిధులు మంజూరు చేయడంతో ఈ పనులు పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు. దీంతో, ఈ ఏడాది క్లోజర్ పనులకు మంగళం పాడినట్లేనని రైతులు భావిస్తున్నారు. శిథిలావస్థలో శెట్టిపేట స్లూయిజ్ పశ్చిమ డెల్టా పరిధిలోని ఉండి సబ్ డివిజన్లో లక్షలాది ఎకరాలకు నీరందించే శెట్టిపేట వియర్ (స్లూయిజ్) శిథిలావస్థకు చేరింది. పశ్చిమ డెల్టాకు సాగునీటిని విడుదల చేసే విజ్జేశ్వరం హెడ్ స్లూయిజ్తో పాటు శెట్టిపేట స్లూయిజ్ కూడా ఎంతో ప్రధానమైది. నిడదవోలు మండలం శెట్టిపేట గ్రామంలో పశ్చిమ డెల్టా ప్రధాన కాలువకు కుడి వైపు 1874లో సర్ ఆర్థర్ కాటన్ హయాంలో దీనిని నిర్మించారు. దీని ద్వారానే 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు విడుదల చేస్తారు. ఉండి సబ్ డివిజన్లోని ఉండి, వెంకయ్య వియర్, పాత వియర్ కాలువల ద్వారా తాడేపల్లిగూడెం, ఉండి, భీమవరం, తణుకు, పాలకోడేరు, నిడమర్రు, కాళ్ల, ఆకివీడు మండలాలకు శెట్టిపేట స్లూయిజ్ ద్వారానే సాగునీరు విడుదలవుతుంది. వర్షాకాలంలో వరద నీటి నియంత్రకు శెట్టిపేట వియర్ నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తారు. వర్షాలు అధికంగా కురిసే సమయంలో పశ్చిమ డెల్టా ప్రధాన కాలువ గట్లపై నుంచి వరద నీరు పొంగి ప్రవహించి పొలాలను ముంచెత్తుతుంది. ఆ సమయంలో శెట్టిపేట వియర్ నుంచి వరద నీటిని ఎర్ర కాలువ, యనమదుర్రు డ్రెయిన్లకు వదులుతున్నారు. ఇంత ప్రాధాన్యం ఉన్న శెట్టిపేట స్లూయిజ్ ప్రస్తుతం దారుణంగా శిథిలమైంది. కాటన్ హయాంలో రాళ్లతో చేపట్టిన నిర్మాణం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. కానీ, యంత్ర సామగ్రి, షట్టర్లు పూర్తిగా శిథిలమయ్యాయి. ఐదు ఖానాల్లోని 10 షట్టర్లు తుప్పు పట్టాయి. వీటిలో నాలుగు పూర్తిగా ధ్వంసమవడంతో పూర్తిస్థాయిలో కిందకు దిగడం లేదు. ఆ ఖాళీల్లో నుంచి పెద్ద మొత్తంలో నీరు లీకై , వృథా పోతోంది. ఫలితంగా వరదల సమయంలో నీటిని వదిలేందుకు తలుపులు తెరచుకోకపోవడం, బలవంతంగా తెరచిన తలుపులు నీటి క్రమబద్ధీకరణ సమయంలో మూసుకోకపోవడంతో ఇరిగేషన్ సిబ్బంది అవస్థలు పడుతున్నారు. శెట్టిపేట స్లూయిజ్ను తక్షణం ఆధునీకరించాలని, తుప్పు పట్టిన షట్టర్లు తొలగించి, కొత్తవి ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నా పట్టించుకున్న వారే కరువయ్యారు. ఫలితంగా రెండు పంటలకూ పూర్తి స్థాయిలో నీరు అందని దుస్థితి నెలకొంది. క్లోజర్ పనులు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడంతో శెట్టిపేట స్లూయిజ్ పనులు ఈ ఏడాది కూడా జరిగే సూచనలు కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. -
రత్నగిరిపై పెళ్లి సందడి
● నేటి రాత్రి 7 గంటల ముహూర్తానికి 150కి పైగా వివాహాలు ● వివాహ మండపాలు, సత్రం గదులు ఇప్పటికే రిజర్వ్అన్నవరం: రత్నగిరి, సత్యగిరి ప్రతిధ్వనించేలా సత్యదేవుని సన్నిధిలో నేడు పెళ్లి బాజాలు మోగనున్నాయి. శుక్రవారం రాత్రి 7 గంటల ముహూర్తంలో 150కి పైగా జంటలు ఒక్కటి కానున్నాయి. దీంతో, కొండపై ఎక్కడ చూసినా పెళ్లి సందడే కనిపిస్తోంది. ఇప్పటికే పెళ్లి బృందాలు వివాహ మండపాలు, సత్రం గదులను రిజర్వ్ చేసుకున్నాయి. సత్యగిరిపై 36 వివాహ హాల్స్, వివిధ సత్రాల్లో వివాహాలు చేసుకునే స్థలాలను, రెండు ఉచిత వివాహ మండపాల్లోని 24 చిన్న కల్యాణ మండపాలను కూడా రిజర్వ్ చేసుకున్నారు. అలాగే, వివిధ సత్రాల్లో 400 గదులుండగా.. 300కు పైగా గదులను వివాహ బృందాల వారు బుక్ చేసుకున్నారు. దేవస్థానం అధికారికంగా 70 శాతం గదులకు ఆన్లైన్ ద్వారా రిజర్వేషన్కు అనుమతి ఇచ్చింది. వీటితో పాటు ప్రజాప్రతినిధులు, వీఐపీల సిఫారసు లేఖలతో మరో 100కు పైగా గదులు రిజర్వ్ చేశారు. దీంతో, సామాన్య భక్తులకు శుక్రవారం గదులు దొరకడం కష్టమేనని అధికారులు తెలిపారు. 13 తేదీతో శుభం కార్డు వైశాఖ మాసంలో వివాహాలకు ఈ నెల 13వ తేదీతో శుభం కార్డు పడనుంది. వైశాఖంలో ఈ నెల 9, 12, 13 తేదీల్లో వివాహ ముహూర్తాలున్నాయి. అయితే, అవి అంత పెద్ద ముహూర్తాలు కావని దేవస్థానం అధికారులు చెప్పారు. ఆ తేదీల్లో సత్యదేవుని సన్నిధిలో 50 వివాహాల వరకూ జరిగే అవకాశం ఉంది. ఈ నెల 17న అధిక జ్యేష్ట మాసం ప్రారంభమవుతోంది. దీంతో, ఆ మాసంలో వివాహాలు జరగవు. తిరిగి జూన్ 16 నుంచి నిజ జ్యేష్ట మాసం ప్రారంభమవుతుంది. ఆ మాసంలో వివాహాలు జరుగుతాయి. ఆగస్టు 13న ప్రారంభమవుతున్న శ్రావణ మాసంలో కూడా పెద్ద సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. -
25, 26 తేదీల్లో ఎస్బీఐ ఉద్యోగుల సమ్మె
ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం): తమ సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 25, 26 తేదీల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినట్లు ఆలిండియా ఎస్బీఐ ఉద్యోగుల ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఎల్.చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చామన్నారు. కంబాలచెరువు ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అఖిల భారత స్టేట్ బ్యాంక్ ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు, ఎస్బీఐ ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఈ సమ్మెకు పిలుపునిచ్చామని చెప్పారు.. మెసెంజర్లు, ఆర్మ్డ్ గార్డుల శాశ్వత నియామకాలు, వెంటనే క్లర్క్ల నియామకాలు చేపట్టాలని, పర్మినెంట్ ఉద్యోగాల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించరాదని, ఎన్పీఎస్ ఉద్యోగులకు పెన్షన్ ఫండ్ మేనేజర్ ఆప్షన్లు మార్చాలని, కెరీర్ ప్రోగ్రెషన్ స్కీమ్పై పునరాలోచించాలని, మెడికల్ బెనిఫిట్లను మెరుగుపరచాలని, హెచ్ఆర్ఎంఎస్ సంబంధిత సమస్యలు పరిష్కరింఆలని, పెన్షనర్ల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్లతో ఈ సమ్మె చేస్తున్నామని చంద్రశేఖర్ వివరించారు. ప్రభుత్వం రైతులను గాలికొదిలేసింది అమలాపురం టౌన్: చంద్రబాబు ప్రభుత్వం రైతులను, వ్యవసాయాన్ని గాలికొదిలేసిందని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబీ) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో ఏ పంటలకూ మద్దతు ధరలు దక్కడం లేదని ఆరోపించారు. అమలాపురంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత సంవత్సరం టమాటా, మొక్కజొన్న, పొగాకు, శనగ, కోకో, అరటి, మామిడి, సజ్జ ఇలా ఏ పంటకూ మద్దతు ధర ఇవ్వలేదన్నారు. మొక్కజొన్న మద్దతు ధర క్వింటాల్కు రూ.2,400 దక్కాలి. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.1,400, రూ.1,600కు రైతులు అయినకాడికి అమ్ముకుంటున్నారని చెప్పారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకల్లో మొక్కజొన్నకు రూ.2,400 మద్దతు ధరను ఆ ప్రభుత్వాలు ఇస్తున్నాయని బాబీ చెప్పారు. ఎంతసేపూ మాది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ పాలన అంటూ సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడమే తప్ప రైతులను ఆదుకోవడంలో మాత్రం వెనుకబాటులో ఉన్నారని విమర్శించారు. పొగాకు మద్దతు ధర కోసం ఇబ్బందులపై గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లిలో రైతులు ధర్నా చేశారన్నారు. కేజీ పొగాకుకు రూ.265 కూడా రావడం లేదని చెప్పారు. అదే గత సంవత్సరం రూ.450 ఉందన్నారు. మొక్కజొన్న, పొగాకు రైతులు కష్టనష్టాలు వర్ణనాతీతమని బాబీ ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు నాయకులు బ్లాక్ మార్కెట్ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. పొగాకు నుంచి మొన్నటి ఎరువులు, నిన్నటి డీజిల్ కొరత వరకూ కొందరు కూటమి నేతలు దళారులై కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని చెప్పారు. అమరావతి పనులకు డీజిల్ సమృద్ధిగా ఇవ్వాలని ఆయిల్ కంపెనీలకు లేఖలు రాసి కాంట్రాక్టర్ల కొమ్ము కాసిన చంద్రబాబు ప్రభుత్వం రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదని బాబీ విమర్శించారు. -
ఘాటెత్తిన పొగాకు పోరు
ప్రజలను మోసగించడమే ప్రభుత్వ లక్ష్యం ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యం. రైతులు పండించిన పొగాకు, ధాన్యం, మొక్కజొన్న, కోకో, ఇతర పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. పొగాకు రైతులను ఆదుకోవాలని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగు బయట పెట్టిన తర్వాతే గతేడాది చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. – చెల్లుబోయిన వేణు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గిట్టుబాటు ధర కల్పించాలి అప్పులు చేసి పండించిన పొగాకుకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారు. పొగాకు ఎక్కువ కాలం నిల్వ చేస్తే నాణ్యత దెబ్బతింటుంది. రైతులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకున్నాం. పెట్టుబడి సాయం అందించి ప్రోత్సహించాం. – తానేటి వనిత, మాజీ మంత్రి, గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జి రైతులకు మట్టే చంద్రబాబు సీఎం పీఠంపై ఎప్పుడూ కూర్చున్నా రైతుల నోట్లో మట్టికొట్టే పరిస్థితులు వస్తున్నాయి. పొగాకు రైతుల కష్టం వర్ణించలేనిది. వేలం కేంద్రాల్లో ఇప్పటికీ కొనుగోళ్లు ప్రారంభించని పరిస్థితి. పొగాకుపై కేంద్రానికి ఏటా రూ.లక్ష కోట్ల ఆదాయం వస్తున్నా రైతులను విస్మరిస్తున్నారు. ప్రభుత్వాలు స్పందించకపోతే ఉద్యమిస్తాం. –జక్కంపూడి రాజా, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నిరసన కార్యక్రమానికి హాజరైన రైతులు, నాయకులు, కార్యకర్తలురైతులను ఉద్దేశించి మాట్లాడుతున్న మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ. చిత్రంలో పార్టీ నేతలుపొగాకు రైతులకు జగన్ అండ 2022లో పొగాకు సంక్షోభం ఏర్పడితే మాజీ సీఎం వైఎస్ జగన్ రూ.500 కోట్లు విడుదల చేసి మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నారు. 2014లో ప్రతిపక్ష నేతగా దేవరపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించగా, మరుసటి రోజు కిలోకు రూ.20 ధర పెంచి కొన్నారు. ఇప్పుడు రైతుల వద్ద రూ.2,600 కోట్ల పొగాకు నిల్వలున్నాయి. –తలారి వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే, కొవ్వూరు నియోజకవర్గ ఇన్చార్జి రైతుల విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం రైతుల విశ్వాసాన్ని కోల్పోయింది. గతేడాది కిలో పొగాకు రూ.453కు కొనుగోలు చేయగా, ఈ ఏడాది రూ.250 పలుకుతోంది. మొక్కజొన్న మద్ధతు ధర రూ. 2,400 ఉండగా, రూ.1,800కు కొంటున్నారు. రైతును ఆదుకోవడానికి డబ్బు లేదు కాని, అమరావతిలో అద్దాలు బిగించడానికి రూ.2,500 కోట్లు ఖర్చు పెడుతున్నారు. – జిన్నూరి రామారావు (బాబి), వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు సాక్షి, రాజమహేంద్రవరం/దేవరపల్లి: వర్జీనియా పొగాకు కొనుగోళ్లు వేగవంతం చేసి, గిట్టుబాటు ధర కల్పించాలని నల్లరేగడి నేలల్లో పండిన పొగాకు కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలని వైఎస్సార్ సీపీ శ్రేణులు, రైతులు రోడ్డెక్కారు. చంద్రబాబు ప్రభుత్వ విధానాలపై సమరభేరి నిర్వహించారు. పొగాకు రైతులు చలో దేవరపల్లి కార్యక్రమంలో భాగంగా బుధవారం దేవరపల్లి టొబాకో బోర్డు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు బైఠాయించారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరచి రైతులను ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని పొగాకు బోర్డు మేనేజర్ సురేంద్రకుమార్కు అందజేశారు. మాజీ ఎమ్మెల్యేలు సత్తిసూర్యనారాయణరెడ్డి, జి.శ్రీనివాస్నాయుడు, పార్లమెంటరీ పరిశీలకులు టి.గురుమూర్తి రెడ్డి, గోపాలపురం నియోజకవర్గ పరిశీలకులు చందన నాగేశ్వర్, వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొవ్వూరి త్రినాథరెడ్డి, పొగాకు రైతు సంఘం ప్రతినిధులు సత్తి జగదీశ్వరరెడ్డి, గడా రాంబాబు, జగదీష్, నరహరిశెట్టి రాజేంద్రబాబు, సుధాకర్ పాల్గొన్నారు.ఉత్పత్తి పెరిగినా కొనుగోళ్లు పెరగడం లేదు జిల్లా వ్యాప్తంగా 12,612 మంది రైతులు 29,132 హెక్టార్లలో వర్జీనియా పొగాకు సాగు చేశారు. పొగాకు ఉత్పత్తి 85 మిలియన్ కిలోలకు పెరిగినా కేవలం 49.32 మిలియన్లు మాత్రమే కొనుగోలు చేస్తామనడం దారుణం. –డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ, రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్చార్జి రైతులకు ఆత్యహత్యలే శరణ్యం చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు ఆత్మహత్య తప్ప వేరే మార్గంలేదు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఉన్నాయి. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. – సత్తి సూర్యనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, అనపర్తి గిట్టుబాటు ధరకు కొనాలి బోర్డు ఇచ్చిన ఇండెంట్ ప్రకారం పండించిన పొగాకు గిట్టుబాటు ధర కిలోకు రూ.330 చెల్లించాలి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్నాం. అరటికి బీమా వర్తింప చేసి నిడదవోలు నియోజకవర్గంలో రూ.11.50 కోట్ల పరిహారం అందించాం. – జి. శ్రీనివాసనాయుడు, మాజీ ఎమ్మెల్యే, నిడదవోలు రైతుల సమస్యలపై వైఎస్సార్ సీపీ సమరభేరి నల్లరేగడి భూముల్లో పొగాకు వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ దేవరపల్లి టొబాకో వేలం కార్యాలయం వద్ద ధర్నా జిల్లావ్యాప్తంగా తరలివచ్చిన వైఎస్సార్ సీపీ శ్రేణులు, రైతులు కొనుగోళ్లు ప్రారంభించకపోతే ఉద్యమిస్తామని హెచ్చరిక టొబాకో బోర్డు మేనేజర్కు వినతి పత్రం -
కట్టెయ్యాల్సిందే!
రాయవరం: ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన అనంతరం పెట్రోలు, డీజిల్ ధరలను పెంచే యోచనేదీ లేదని చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచేసింది. ఇప్పటికే సిలిండర్ల కొరతతో సతమతమవుతున్న హోటల్ రంగంపై ధరల పెంపు తీవ్ర ప్రభావం చూపుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే వ్యాపారం మూసేసుకోవాల్సిందేనని హోటళ్ల యజమానులు వాపోతున్నారు. గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రం ఒకేసారి రూ.993 మేర పెంచేసింది. దీంతో, దీని ధర ఒక్కసారిగా రూ.3,315కు పెరిగింది. దాదాపు రూ.వెయ్యి మేర ధర పెరగడంతో హోటల్ వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. యుద్ధ ప్రభావంతో ధరలు పెరుగుతాయనే అంచనాలున్నా.. ఇంత భారీగా పెంచేస్తారని ఊహించలేదని అంటున్నారు. ఇప్పటికే సిలిండర్ల కొరతతో నెట్టుకొస్తున్న తమపై పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర మరింత భారంగా మారిందని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. కేంద్రం పెంచిన భారం ప్రత్యక్షంగా హొటల్స్పై పడినప్పటికీ పరోక్షంగా ఆ భారం ప్రజలు భరించాల్సిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర సాధారణంగా రూ.50 నుంచి రూ.150 పెంపు ఉంటుంది. కానీ ఒకేసారి ఇంత భారీగా పెరగడం గతంలో ఎన్నడూ లేదని వ్యాపారులు పేర్కొంటున్నారు. ధర పెరగడం వ్యాపారాల నిర్వహణకు సవాల్గా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి పెరిగిన ధర మళ్లీ తగ్గే అవకాశం ఉండకపోవచ్చని వ్యాపారులు అంటున్నారు. గతంలో వలే పరిస్థితులు ఇక రాకపోవచ్చనేది వ్యాపారుల భావన. కాకా నుంచి పెద్ద హోటల్స్ వరకు.. గ్రామాలు, పట్టణాల్లో కాకా హోటళ్ల నుంచి బడా హోటళ్లకు వరకు సిలిండర్ ధరల ప్రభావం చూపుతోంది. రోడ్డు పక్కగా ఉన్న టీ స్టాల్స్, టిఫిన్ సెంటర్లు, చాట్ సెంటర్లు, చిన్న చిన్న బిర్యానీ, భోజన హోటళ్ల యజమానులు ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్ సాధారణ ధర పెరిగితే రూపాయి నుంచి రెండు రూపాయల వరకు టీ, టిఫిన్ల ధరలు పెంచవచ్చని. కానీ ఏకంగా ఒకేసారి రూ.వెయ్యి వరకూ సిలిండర్ ధర పెరగడంతో నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేసుకోవాలా అని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. వ్యాపారంలో ఆదాయం రాకున్నా లోటును భర్తీ చేసుకోవడానికి తాము కూడా రూ.10 వరకూ పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని చిరు వ్యాపారులు వాపోతున్నారు. మరోవైపు ధరలు పెంచితే గిరాకీ దెబ్బ తింటుందనే భయం కూడా వారిని వెన్నాడుతోంది. పెద్ద పెద్ద హోటళ్ల యజమానులు సైతం గ్యాస్ ధర పెంపుతో సమస్యలు ఎదురు కానున్నాయనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ ఆర్డర్లపై కూడా ప్రభావం గ్యాస్ సిలిండర్ ధర పెరగడంతో ఆన్లైన్ ఆర్డర్ల డిమాండ్ కూడా తగ్గవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈ ప్రభావం వర్కర్లపై కూడా పడి జీవనోపాధి దెబ్బతినే అవకాశం ఉంటుందని వ్యాపారులు అంటున్నారు. ముఖ్యంగా యూత్ నుంచే ఎక్కువగా ఆన్లైన్ ఆర్డర్లు ఉంటాయని, ధరల పెంపుతో ఎంతో కొంత తగ్గుముఖం పడతాయని వ్యాపారులు నిరాశ చెందుతున్నారు. కట్టెల ధరల మంట చిరు, మధ్య తరహా హోటల్ వ్యాపారులు కట్టెలను ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు. వాటి ధర కూడా పెరిగిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 25 కేజీల వంట చెరకు రూ.170 ఉండగా, గ్యాస్ కొరత ప్రారంభమైన తర్వాత రూ.225కు పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో పరిస్థితి ఇదీ.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారుగా 200 వరకూ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో కమర్షియల్ సిలిండర్ల కనెక్షన్లు 5 వేల వరకు ఉండగా, కాకినాడ జిల్లాలో 20 వేలు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 1,400 వరకు ఉన్నాయి. రోజుకు దాదాపు 10 వేల సిలిండర్లను వినియోగిస్తున్నట్టు అధికారుల గణాంకాల ద్వారా తెలుస్తుంది. ఫ హోటళ్లపై కమర్షియల్ గ్యాస్ ధరాభారం ఫ ఒకేసారి రూ.993 మేర బాదేసిన కేంద్రం ఫ వ్యాపారం మూసుకోవాల్సిందేనని యజమానుల ఆవేదన గిట్టుబాటు కావడం లేదు ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం హోటల్ నిర్వహిస్తున్నాను. గ్యాస్ ధరలు పెరగడంతో ఉదయం టిఫిన్లు ఆపేశాను. ధరలు పెంచితే కస్టమర్లు దూరమవుతున్నారు. పెంచకపోతే నిర్వహణ కష్టమవుతుంది. భోజనం ధరలు పెంచాల్సి వచ్చింది. – అనపర్తి జయకృష్ణ, రెస్టారెంట్ యజమాని, రాయవరం కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నాం కట్టెల పొయ్యిలపై వంట చేయాల్సిన పరిస్థితి వచ్చింది. స్వల్పంగా ధరలు పెంచి అతి కష్టం మీద నిర్వహిస్తున్నాం. – వి.రాజేష్, హోటల్ నిర్వాహకుడు, రాయవరం -
మేకల పెంపకంతో జీవనోపాధి
● సమగ్ర యాజమాన్యంతో అదనపు ఆదాయం ● జేడీఏ శ్రీనివాసరావు రాయవరం: మేకల పెంపకంతో జీవనోపాధి పొందవచ్చని పశు వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఆ శాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో 37,700 మేకలు ఉన్నట్లు సమాచారం. సమగ్ర యాజమాన్య పద్ధతులలో వాటి పెంపకంపై పశు సంవర్ధక శాఖ జేడీ టి.శ్రీనివాసరావు సూచనలిస్తున్నారు. రోజుకు 10 గంటల పాటు మేపాలి మేకలు త్వరగా వృద్ధి చెందాలంటే వాటికి సరిపడ మేత అందించాలి. రోజుకు ఎనిమిది నుంచి 10 గంటల పాటు మేపాలి. ఇందు కోసం వాటిని ఉంచే ప్రాంతం చుట్టూ ఖాళీ స్థలంలో గ్రాసాన్ని పెంచాలి. మేకలు ఎక్కువుగా ఆకులు, పండ్ల తొక్కలు, కూరగాయల ఆకులను తినడానికి ఇష్టపడతాయి. అందుకే అవిశ, రావి, తుమ్మ, అల్లనేరేడు, సీమచింత, వేప, సుబాబుల్, దిరిశనం తదితర మొక్కలు నాటుకుని ఆ ఆకులను మేతగా వేస్తుండాలి. వీటితో పాటు కాయజాతిలో ఏకవార్షిక రకాలైన జొన్న, కాయజాతి పశుగ్రాసాలైన లూసర్న్ తదితరాలను పెంచాలి. పచ్చి మేత వేసేటప్పుడు సుమారు కిలో చెట్ల ఆకులు, కిలో కాయజాతి పచ్చిమేత, మూడు కిలోల ఇతర గ్రాసాలను ఇవ్వాలి. చూడి మేకలను ఇలా మేకలు చూడి కట్టిన మూడు నెలల తర్వాత గర్భంలోని పిల్ల పెరుగుదల వేగంగా ఉంటుంది. ఈ సమయంలో 200 నుంచి 250 గ్రాముల మిశ్రమ దాణా అదనంగా ఇవ్వాలి. దీని వల్ల పిల్లలు ఎక్కువ బరువుతో పుడతాయి. తల్లి మేక ఆరోగ్యంగా ఉంటే పిల్లకు పాలు ఎక్కువ ఇస్తుంది. ముర్రుపాలు బాగా తాగించాలి పిల్లలు మేక నుంచి బయటకు వచ్చిన వెంటనే ముక్కు రంధ్రాలు, నోటిపై ఉన్న పొరలను తీసి వేయాలి. బొడ్డుకు టింక్చర్ అయోడిన్ పూయాలి. పిల్లలను ఉంచే ప్రదేశంలో 10 శాతం ఫినాయిల్ చల్లాలి. ఈనిన వెంటనే పొదుగును శుభ్రంగా కడిగి ముర్రుపాలు తాగించాలి. తర్వాత రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు రెండు నెలల పాటు తాగిస్తే వాటికి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తర్వాత తల్లి నుంచి వేరు చేసి దాణా, పచ్చిమేత, లేత ఆకులు అందుబాటులో ఉంచాలి. మేక పిల్లల షెడ్డులో/పాకలో కాని ఉప్పు, లవణ మిశ్రమ ఇటుకలను ఏర్పాటు చేయాలి. పిల్లల దాణాలో మొక్కజొన్న, వేరుశనగ చెక్క, గోధుమ పొట్టు, బియ్యం, నూక, జొన్నలు ఉండేలా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు తప్పనిసరి ● పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మేత, నీరు, ముందు జాగ్రత్తగా టీకాలు వేయించాలి. ● బయటి ప్రాంతంలో మేస్తున్నప్పుడు తినే గడ్డి, ఇతర ఆకులు అలమలతో పాటు ఏలిక పాములు, బద్దెపురుగులు వాటి శరీరంలో చేరి పోషకాల్ని పీల్చి వేసి, అనారోగ్యానికి గురిచేస్తాయి. ● మూడు నెలల దాటిన మేక పిల్లలకు నట్టల నివారణ మందు తాగించాలి. -
● దొడ్డా వారింట కవల దూడల పంట
● చిన్నారులు.. చేపాట్లు.. పెదపట్నం అగ్రహారంలో రైతు దొడ్డా కృష్ణమూర్తికి చెందిన జెర్సీ ఆవు బుధవారం కవల దూడలకు జన్మనివ్వడం స్థానికంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా ఆవులు ఒక దూడకే జన్మనిస్తాయి. ఇది అరుదైన ఘటన అని పశు వైద్యాధికారి చేగొండి శ్రీరామ్ తెలిపారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వీటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నుట్టు రైతు కృష్ణమూర్తి తెలిపారు. – మామిడికుదురు జలపుష్పాల కోసం వలతో వేట సాగిస్తున్న చిన్నారులు -
‘త్యాగరాజ’ అమృతోత్సవాలకు శ్రీకారం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): కీర్తిశేషులు బుగ్గా పాపయ్య శాస్త్రి నెలకొల్పిన శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి 75 వసంతాల సందర్భంగా అమృతోత్సవం పేరిట 18 రోజుల పాటు నిర్వహించే సంగీత మహోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక గోదావరి గట్టున గల సమితి ప్రాంగణంలోని ఏసీ ఆడిటోరియంలో జూపూడి సరోజినీదేవి కళా ప్రాంగణంపై ఈనెల 23వ తేదీ వరకు ఈ ఉత్సవాలు సాగనున్నాయి. రోజూ సాయంత్రం నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు విశాఖపట్నానికి చెందిన గురువిల్లి అప్పన్న బృందం నాదస్వరంతో ఉత్సవాలకు శుభారంభం పలికారు. అనంతరం స్థానిక కళాకారులతో త్యాగరాజ పంచరత్న సేవ వీనుల విందుగా సాగింది. తొలుత సమితి ప్రాంగణంలోని త్యాగరాజ స్వామి మందిరంలో పూజలు చేసి, వై.సత్యనారాయణ, యశోద బృందం మంగళ వాయిద్యాల నడుమ ప్రాంగణానికి చేరుకున్నారు. వేద పఠనం అనంతరం ఈమని కల్యాణి లక్ష్మీ నారాయణ, పసుమర్తి పద్మిని జ్యోతి ప్రకాశనం చేశారు. సమితి గౌరవ అధ్యక్షుడు వాడ్రేవు వెంకట రమణారావు, చైర్మన్ సీఎస్ వెంకట్రావు, ప్రిన్సిపల్ సెక్రటరీ జోస్యుల సరస్వతి, ఫంక్షనల్ సెక్రటరీ వక్కలంక శ్రీరామచంద్రం, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ విశ్వనాథం భాస్కర రామ్, కోశాధికారి వి.కృష్ణకుమారి, సంగీత ప్రియులు పాల్గొన్నారు. సీఎస్ వెంకట్రావు పరిచయ వ్యాక్యాలు పలికారు. నాదస్వరంలో శ్రీ గణపతిని సేవింపరాదే, సంగీత జ్ఞానము, శోభిల్లు సప్తస్వర, ఎంత ముద్దో వంటి త్యాగరాజ కీర్తనలు వాయించారు. జగదానందకారక, దుడుకు గల, సాధించేనే, కనకన రుచిరా, ఎందరో మహానుభావులు పంచరత్న కృతుల బృందాగానంతో అలరించారు. అయ్యగారి సత్యప్రసాద్ దంపతులు, వేలూరి లక్ష్మీ తులసి, ముట్నూరి పార్వతి, మల్లాది నరసింహారావు, సంగీత పాఠశాల పూర్వ, ప్రస్తుత విద్యార్థులు పంచరత్న సేవలో పాల్గొన్నారు. నాదస్వరం, పంచరత్న సేవతో శుభారంభం -
రేపు ఏపీ ఈడీ సెట్
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు రాజానగరం: ప్రభుత్వ ఉపాధ్యాయ విద్య (బీఈడీ)లో ప్రవేశాలకు శుక్రవారం నిర్వహించే ఏపీ ఈడీసెట్–2026కు ఏర్పాట్లు పూర్తయ్యాయని ప్రాంతీయ సమన్వయకర్త, ఆదికవి నన్నయ యూనివర్సిటీ బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సుబ్బారావు బుధవారం తెలిపారు. ఈ పరీక్ష నిర్వహణకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో 16 కేంద్రాలను ఏర్పాటు చేశారు. తూర్పు గోదావరి జిల్లాలోని ఏడు కేంద్రాలలో 2609 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలోని తొమ్మిది కేంద్రాలలో 2013 మంది పరీక్షకు హాజరుకానున్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసేలా వసతులు కల్పించామని, ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సైన్స్ కోర్సుల వారికి, మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు ఆర్ట్స్ కోర్సుల వారికి రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయన్నారు. నిర్ణీత సమయానికి గంటన్నర సమయం ముందుగా పరీక్ష కేంద్రాలకు వచ్చిన వారినే లోనికి అనుమతిస్తారన్నారు. జేఈఈ (మెయిన్) ఫలితాల్లో తిరుమల సంచలనం రాజమహేంద్రవరం రూరల్: ప్రతిష్టాత్మక జేఈఈ (మెయిన్)బి–ఆర్క్ అండ్ బి–ప్లాన్ ఫలితాలలో తమ తిరుమల ఐఐటీ అండ్ మెడికల్ అకాడమీ విద్యార్థులు అత్యద్భుత ఫలితాలు సాధించినట్లు విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. బి.ప్లాన్ జనరల్ ఈడబ్ల్ల్యుఎస్ విభాగంలో గొల్లా ప్రభవ్తేజ ఆల్ ఇండియా రెండో ర్యాంకు, వివిధ కేటగిరీలలో పైలా హర్షాదిత్య 5, గెడ్డం రాజా నవీన్తేజ 10, గన్నమనీడి వాత్సల్య 16, కొండేటి మోహన్గణేష్ సంతోష్కుమార్ 55, గారపాటి కృష్ణమురారి 62, కురివెళ్ల లక్ష్మీ హంసిని 82, కూచిపూడి జశ్వంత్ సత్యసాయి 83, తాతపూడి అవినాష్ 93, లోవిశెట్టి వైష్ణవి 96 ర్యాంకులు సాధించారని తెలిపారు. 500 లోపు 48 మంది, వెయ్యి లోపు 102 మంది, 5 వేల లోపు 663 మంది, 10 వేల లోపు 921 మంది ర్యాంకులు సాధించారని ఆయన అన్నారు. బి ఆర్క్ విభాగంలో వివిధ కేటగిరీలలో జాతీయస్థాయిలో గొల్లా ప్రభవ్తేజ 33వ ర్యాంకు, పైలా హర్షాదిత్య 64, గెడ్డం రాజా నవీన్ తేజ 64, మోతూరి సాత్విక్ 94వ ర్యాంకు సాధించారని ఆయన తెలిపారు. 500 లోపు 18 మంది, 1000 లోపు 33 మంది, 5 వేల లోపు 300 మంది, 10 వేల లోపు 633 మంది ర్యాంకులు సాధించారని తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను తిరుమలరావు, అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి అభినందించారు. -
జిల్లా అధికారి నియామకంపైనా విమర్శలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కొంతమంది అక్రమార్కులకు దేవదాయ శాఖ రూ.లక్షలు కురిపించే కల్పవృక్షంగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. పైసలిస్తే చాలు హోదాలు, మార్గదర్శకాలను గాలికొదిలేసి మెచ్చిన వారికి నచ్చిన సీటు కట్టబెట్టేస్తున్నారు. ఆదాయం దండిగా వచ్చే ఆలయాలకు పోస్టింగ్లు ఇవ్వడంలో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ప్రధాన ఆలయాల్లో ఇటీవల జరిగిన ఈఓల బదిలీలపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఇంకా.. ఫ ఉమ్మడి తూర్పు గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పేరెన్నికగన్న తుని తలుపులమ్మ అమ్మవారి లోవ దేవస్థానం ఈఓగా డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారిని నియమించాలి. కానీ, ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్ హోదా కలిగిన పెన్మత్స విశ్వనాథరాజును ఈఓగా కొనసాగిస్తున్నారు. లోవ దేవస్థానం ప్రసాదం తయారీలో నాణ్యత లేకపోవడంతో ఆహార నియంత్రణ శాఖ అధికారులు కొన్నాళ్ల కిందట దాడులు చేసిన జరిమానా విధించారు. ఇక్కడ డీసీ స్థాయి అధికారి లేకపోవడమే దీనికి కారణమనే విశ్లేషణలు అప్పట్లో సిబ్బంది నుంచి వచ్చాయి. ఫ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి దేవస్థానానికి అసిస్టెంట్ కమిషనర్ హోదా కలిగిన ఈఓను నియమించాలి. కానీ, ఇక్కడ పెద్దాపురం మహారాణి సత్రం గ్రేడ్–2 ఈఓగా ఉన్న కాట్నం జగన్మోహన శ్రీనివాస్ను నియమించారు. గ్రేడ్–1 సీనియార్టీ కలిగిన ఎంతో మంది వారి అర్హత కంటే తక్కువ స్థాయి ఆలయాల్లో ఈఓలుగా పని చేస్తున్నారు. వీరిలో ఏ ఒక్కరికీ అవకాశం ఇవ్వకుండా నిబంధనలు పక్కన పెట్టి మరీ గ్రేడ్–2 ఈఓను కుక్కుటేశ్వరస్వామి ఆలయంలో నియమించారు. అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారి లేకపోవడంతో ఇక్కడ యంత్రాంగం మధ్య సమన్వయంలోపించి, భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విమర్శలున్నాయి. ఈ కారణంగానే అప్పటి కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ బిందుమాధవ్ మహాశివరాత్రి వేడుకల ఏర్పాట్లను స్వయంగా చక్కబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడి యంత్రాంగం భక్తుల కంటే నిత్యం అధికార పార్టీ నేతల సేవలోనే తరిస్తున్నారనే చర్చ నడుస్తోంది. ఫ వాస్తవానికి అసిస్టెంట్ కమిషనర్ హోదా కలిగిన అల్లు వెంకట దుర్గాభవాని పిఠాపురం ఆలయ ఈఓగా పని చేసేవారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాగానే ఆమెను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ పంచారామ క్షేత్రానికి బదిలీ చేయడం గమనార్హం. ఫ చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చీ రాగానే కాకినాడ బాలా త్రిపుర సుందరీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి గ్రేడ్–1 ఈఓగా ఉన్న చింతపల్లి విజయభాస్కర్రెడ్డిని తప్పించారు. ఆయన స్థానంలో కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చింతలూరు నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో గ్రేడ్–2 ఈఓగా ఉన్న వుండవల్లి వీర్రాజు చౌదరికి అదనపు బాధ్యతలు అప్పగించారు. సొంత సామాజిక వర్గానికి చెందిన నాయకులు పట్టుబట్టి మరీ ఆయనను నియమించుకున్నారనే విమర్శలున్నాయి. ఫ కాకినాడ సినిమా రోడ్డులోని మంత్రిప్రగడ వారి సత్రం ఈఓగా గ్రేడ్–1 కేడర్ అధికారిని నియమించాలి. కానీ, ఇక్కడ గ్రేడ్–2 ఈఓ శ్రీనివాస్ను నియమించారు. ఆయనకు కాకినాడ గాంధీనగర్ ఆలయంతో పాటు కాకినాడ రూరల్ కొవ్వూరు వారాహి అమ్మవారి దేవస్థానం ఇన్చార్జి బాధ్యతలు సైతం అప్పగించారు. ఇక్కడ గ్రేడ్–1 ఈఓగా ఉన్న సౌజన్యను తప్పించి గ్రేడ్–2 ఈఓ శ్రీనివాస్కు అదనపు బాధ్యతలు అప్పగించడం గమనార్హం. ఇలా హోదాలు, కేడర్లతో పని లేకుండా మెచ్చిన వారికి నచ్చిన సీటును ఇష్టారాజ్యంగా కట్టబెట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫ దేవదాయ శాఖ బదిలీల్లో నిబంధనలకు నీళ్లు! ఫ ఇష్టానుసారం ఈఓల స్థాన చలనం ఫ భారీగా డబ్బు చేతులు మారుతోందని ఆరోపణలు కాకినాడ జిల్లా దేవదాయ శాఖ అధికారి కనపర్తి నాగేశ్వరరావు మార్చి 31న ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో పుష్కర కాలం క్రితమే గ్రేడ్–1 ఈఓగా పదోన్నతి పొందిన, సీనియర్ అయిన నడకుదురు గ్రూపు టెంపుల్స్ ఈఓ తలాటం సూర్యనారాయణను ఏప్రిల్ 1న నియమించారు. అయితే, ఆ శాఖలో ఉన్నత స్థాయి అధికారుల కనుసన్నల్లో చక్రం తిప్పుతున్న ఓ కోటరీ నెల రోజులు దాటీ దాటగానే సూర్యనారాయణను సాగనంపేసింది. దీనికి సరైన కారణం కూడా చూపించకపోవడంతో ఆ శాఖ ఉద్యోగులే విస్మయానికి గురయ్యారు. సూర్యనారాయణ స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న వి.వెంకటేశ్వరరావును ఉద్యోగోన్నతిపై కాకినాడ జిల్లా దేవదాయ శాఖాధికారిగా నియమించారు. వాస్తవానికి ఈ పోస్టింగ్ ఇవ్వాలంటే సీనియర్ గ్రేడ్–1 ఈఓ లేదా ఆ శాఖలో సూపరింటెండెంట్ హోదా అయినా ఉండాలి. అమలాపురంలో దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న సమయంలో వెంకటేశ్వరరావుపై ఏసీబీ కేసు పెండింగ్లో ఉందని ఆ శాఖ ఉద్యోగులు బహిరంగంగా చెప్పుకొంటున్నారు. ఈ కేసు తేలకుండానే ఆయనకు ఉద్యోగోన్నతి కల్పించి, జిల్లా అధికారిగా నియమించడంలో ఆంతర్యమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో జిల్లా దేవదాయ శాఖ కార్యాలయంలో పని చేస్తున్న ఓ ఉన్నతాధికారి చక్రం తిప్పినట్టు ఉద్యోగ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జిల్లాలో సీనియర్ గ్రేడ్–1 ఈఓలు ఎంతో మంది ఉండగా రెండు జిల్లాల అవతల నుంచి అది కూడా గ్రేడ్–1కు అర్హత లేని వారిని ఎలా నియమిస్తారని ప్రశ్నిస్తున్నారు. -
కుటుంబ కలహాల నేపథ్యంలో వ్యక్తి హత్య
జగ్గంపేట: మండలం రామవరం గ్రామానికి చెందిన రావుల సత్తిబాబు(43) హత్యకు గురయ్యాడు. సీఐ బి.తిరుపతిరావు అందజేసిన వివరాల మేరకు సత్తిబాబు తన భార్యతో ఉన్న కుటుంబ కలహాల నేపథ్యంలో మంగళవారం ఆమెతో మాట్లాడి వస్తానని ఇంట్లో చెప్పి రాజానగరం వెళ్లాడు. బుధవారం ఉదయం రామవరంలోని సచివాలయం సమీపంలో కాలువ గట్టు వద్ద అతని మృతుదేహం లభ్యం కావడంతో కటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వెంటనే ఎస్సై రఘునాథరావుతో పాటు సీఐ ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృత దేహంపై గాయాలు కనపడడంతో హత్యకు గురైనట్టు పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పెద్దాపురం డీఎస్పీ ఏజీబీ తిలక్ పరిశీలించిన అనంతరం ఆయన సూచన మేరకు హత్య కేసుగా నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. అయితే సత్తిబాబు రాజానగరం వెళ్లాడా లేక వెళ్లకుండానే మధ్యలో హత్యకు గురయ్యాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహం స్థితిని గమనిస్తే ఎక్కడో హత్య చేసి ఇక్కడకు తీసుకువచ్చి పడేసినట్టు అనుమానిస్తున్నారు. బి ప్లానింగ్లో శ్రీ షిర్డీసాయి విద్యార్థికి మొదటి ర్యాంకు కంబాలచెరువు(రాజమహేంద్రవరం): జేఈఈ మెయిన్స్ బి.ప్లానింగ్ ఫలితాల్లో రాజమహేంద్రవరం శ్రీ షిర్డీ సాయి జునియర్ కాలేజ్ విద్యార్థులు వివిధ కేటగిరీలలో జాతీయ స్థాయి అత్యుత్తమ ర్యాంకులు సాధించినట్లు విద్యా సంస్థల డైరెక్టర్ టి.శ్రీవిద్య బుధవారం తెలిపారు. తమ లక్ష్య ఐఐటీ అకాడమీలో శిక్షణ పొందుతున్న బీఏవీ విజయ భార్గవ్ ప్రధమ ర్యాంకు సాధించాడన్నారు. బి.నిహాంత్ 52, ఎ.లోహిత్ కుమార్ 53వ ర్యాంకు సాధించగా, 100 లోపు ర్యాంకులు ముగ్గురు సాధించారన్నారు. బీఆర్క్లో బీఏవీ విజయ భార్గవ్ ఆల్ ఇండియా 4వ ర్యాంకు, లోహిత్ కుమార్ 60వ ర్యాంకు సాధించారన్నారు. శ్రీ షిర్డీసాయి విద్యాసంస్థల చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్ మాట్లాడుతూ యేటా తమ విద్యార్థులు బిఆర్క్ బి. ప్లానింగ్ వంటి విభాగాలలో కూడా అత్యుత్తమ ర్యాంకులు సాధించడం హర్షణీయమన్నారు. విజేతలను, అందుకు కృషి చేసిన అధ్యాపక బృందాన్ని చైర్మన్ శ్రీధర్, లక్ష్య డీన్ చంద్రశేఖర్ అభినందించారు. -
ఇంతింతై నభోవీధిపైనంతై..!
ఆత్రేయపురం: ఏ స్వామిని దర్శిస్తే ఆపదలు దూరమవుతాయో.. ఏడు శనివారాలు.. ఏడు ప్రదక్షిణల వ్రతం ఆచరిస్తే ఏ స్వామి కరుణించి కష్టాలు కడదేరుస్తాడో ఆయనే వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి. కొన్నేళ్ల క్రితం వరకు అంతగా అలికిడి లేని ఈ గ్రామంలో నేడు అంతటా గోవింద నామమే మార్మోగుతోందంటే అతిశయోక్తి కాదు. శనివారం వస్తే ఇసుకేస్తే రాలనంతగా భక్తజన సందోహం. ఆయన ‘లక్ష్మీ’పతి ఈ ఏడాది వివిధ మార్గాల ద్వారా సుమారు 70 కోట్ల ఆదాయం ఆలయానికి సమకూరింది. అలాగే సుమారు 90 లక్షల నుంచి కోటి మంది ఈ ఏడాది స్వామివారిని దర్శించుకున్నారు. సుమారు 25 లక్షల మందికి పైగా ఉచిత అన్నదానాన్ని స్వీకరించారు. కేవలం అన్నదానానికే సుమారు రూ.14.52 కోట్ల విరాళాలు అందాయి. హుండీల ద్వారా రూ.15.71 కోట్లు, వివిధ బ్యాంకులలో రూ.30 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. అలాగే 1700 సంవత్సర కాలంలో నాటి పెద్దాపురం మహారాజు తిమ్మ జగపతిరాజు స్వామి వారికి 412 ఎకరాల సుక్షేత్రాన్ని అందజేశారు. 26 ఎకరాల భూమిని ఆలయ అర్చకులు, ఇతరసేవ నిమిత్తం కేటాయించారు. 70 ఎకరాల లీజు ద్వారాఐ ఏటా సుమారు రూ.55 లక్షల ఆదాయం లభిస్తోంది. సుమారు 13 ఎకరాల్లో ఆలయం దుకాణాలు, పార్కింగ్కు వినియోగిస్తున్నారు. అలాగే 5.85 ఎకరాలు సీసీఎల్ఆర్ కోర్టు వాజ్యం ద్వారా వచ్చింది. ఈ భూములలో సుమారు 296 ఎకరాలు ఈనాం భూములుగా బయట వ్యక్తులు అధీనంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. బ్రిటిష్ కాలంలోనే ఆలయం నోటిఫైడ్ టెంపుల్ గా నమోదై ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దినదిన ప్రవర్ధమానంగా.. 2011 వరకు దేవదాయ శాఖలో మేనేజర్ స్థాయి నుంచి గ్రేడ్–1 ఆలయంగా, 2023 నుంచి డిప్యూటీ కమిషనర్ స్థాయికి ఆలయం వృద్ధి చెందింది. ప్రస్తుతం ఈ ఆలయ చైర్మన్ పదవికి రాష్ట్ర స్థాయిలో పోటీ నెలకొంది. భక్తజన తాకిడి పెరగడంతో ఆలయంలో రూ.6.25 కోట్లతో వకుళ మాత అన్నదాన భవనం, రూ.2.8 కోట్లతో తెప్పోత్సవ కోనేరు, రూ.38 లక్షలతో రథశాల నిర్మాణాలు సాగుతున్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆలయంలో అభివృద్ధిని పరుగులు పెట్టించడం గమనార్హం. మాడ వీధుల్లో ప్రదక్షిణలు చేస్తున్న భక్తులుఏడు శనివారాల వ్రతం చేస్తున్న వారితో పాటు నిత్య భక్తులతో రద్దీగా ఉన్న ఆలయం ఖండాంతరాలు దాటుతున్న వాడపల్లి వెంకటేశ్వరుని కీర్తి ఏడు శనివారాలు, ఏడు ప్రదక్షిణలతో అంతకంతకూ పెరుగుతున్న భక్తకోటి అందుకు తగ్గట్టుగా చురుగ్గా అభివృద్ధి పనులు -
పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్షా ఫలితాలో
రాజమహేంద్రవరం రూరల్: పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్షా ఫలితాల్లో తమ విద్యార్థులు అద్భుత ఫలితాలతో సత్తా చాటారని తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దిరసాల నాగ సత్య హిమసూర్య 120కి 120 మార్కులు సాధించాడన్నారు. ఉండవల్లి సంతోష్, జక్కంపూడి సత్య, జయధీర్ నాయుడు, తిర్రి కుషాల్, కెల్లా శ్రీదత్తా, ఈరంకి యశ్వంత్, వట్టూరి హరి సంపత్, కొలుపోటి రోహిత్ శ్రీసాయి, గంజికుంట సాయిచరణ్ గోవిందు 119 మార్కులతో మెరిశారని వివరించారు. 119 మార్కులకు పైన 12 మంది, 118 మార్కుల పైన 25 మంది, 117 మార్కుల పైన 34 మంది, 116 మార్కుల పైన 47 మంది, 115 మార్కుల పైన 60 మంది విద్యార్థులు సాధించారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ చాటిన విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు. -
పోలేరమ్మ జాతరలో దేవీశ్రీ డ్యాన్స్
రాయవరం: మండలంలోని వెదురుపాకలో జరిగిన పోలేరమ్మ జాతరలో సినీ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ డ్యాన్స్ చేసి అందరికీ ఉత్సాహ పరిచారు. అ మ్మవారి జాతరను పురస్కరించుకుని ఆయన వెదురుపాక గ్రామానికి చేరుకున్నారు. మంగళవారం తన ఇంటి వద్దే ఉన్న అమ్మవారి ఆలయంలో మొక్కు లు తీర్చుకున్నారు. అనంతరం ఉత్సవ కమిటీ ఏర్పా టు చేసిన గరగ నృత్యాలు, గారడీల వంటి సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. గరగ నృత్య కళాకారులు వేస్తున్న స్టెప్పులకు, డప్పుల దరువుకు ఆయన పాదం కలిపారు. కొన్ని నిమిషాల పాటు స్టెప్పులు వేసి అభిమానులను మరింత ఉత్సాహ పరిచారు. అనంతరం అభిమానుల తాకిడి అధికమవ్వడంతో అక్కడ నుంచి వెళ్లిప్యోఆరు. కాగా.. అమ్మవారికి వెదురుపాక పరిసర గ్రామాల ప్రజలు మొక్కులు చెల్లించారు. ఉత్సవ కమిటీ భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసింది. పోలేరమ్మ జాతరలో డ్యాన్స్ చేస్తున్న సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ -
కష్టపడితే సాధించలేనిదేదీ లేదు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): పట్టుదలతో కష్టపడితే జీవితంలో సాధించలేనిదేదీ లేదని కలెక్టర్ కలెక్టర్ కీర్తి అన్నారు. పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపిన 27 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను మంగళవారం కలెక్టరేట్లో ఆమె అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటిస్తూ, తన చిన్ననాటి అనుభవాలను పంచుకున్నారు. పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించడం ద్వారా ఉన్నత లక్ష్యాలను చేరుకునే ధైర్యం పెరుగుతుందని అన్నారు. ప్రయత్నించడం మాత్రమే మన చేతుల్లో ఉంటుందని, ఫలితాలపై ఆందోళన చెందకుండా నిరంతరం కృషి చేస్తే విజయాలు వాటంతట అవే వస్తాయని అన్నారు. పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ముఖ్యంగా బాలికల విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని, చిన్న వయసులో వివాహాలు చేయరాదని తల్లిదండ్రులకు కలెక్టర్ సూచించారు. జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్ కూడా ప్రసంగించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ క్షితిజ్ ఆదిత్య శర్మ, నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, జిల్లా విద్యా శాఖాధికారి కె.వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. -
ఈదురుగాలులతో భారీ వర్షం
ఫ తెగిపడిన విద్యుత్ తీగలు ఫ తడిసిన మొక్కజొన్న కళ్లాలు దేవీపట్నం: వేసవి ఎండలు మండిపోతున్న వేళలో మంగళవారం సాయంత్రం ఇందుకూరుపేట పరిసర గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన భారీవర్షం కురిసింది. గోకవరం దండంగి ఆర్అండ్బీ రహదారిలో ఇందుకూరు, ఇందుకూరుపేట గ్రామాల మధ్య తాటిచెట్టు విరిగిపడడంతో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఈ కారణంగా ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆ శాఖ సిబ్బంది సాయంత్రం నుంచి రాత్రి వరకూ మరమ్మతులు నిర్వహించారు. భారీ వర్షం కారణంగా మొక్కజొన్న కళ్లాలు మరోసారి తడిసి ముద్దయ్యాయి. రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి ముందుగా తడిసిన మొక్కజొన్న కళ్లాల్లో కండెలను మంగళవారం రైతులు కూలీలతో తిరగేసి ఆరబెట్టారు. కానీ సాయంత్రం కురిసిన వర్షానికి మరోసారి తడిచిపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అసలే ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో దళారులు చెప్పిన ధరకే అమ్ముకుంటున్న రైతులకు.. అకాల వర్షం కారణంగా అదనపు ఖర్చులు పెరిగిపోయాయి. కూనవరం: మండల కేంద్రమైన కూనవరంలో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. విద్యుత్ అంతరాయంతో గ్రామస్తులు కంటిమీద కునుకు వేయలేదు. గాలుల ధాటికి పలు చోట్ల విద్యుత్ వైర్లపై చెట్లు విరిగి పడ్డాయి. ఎయిర్ టెల్ టవర్ సమీపంలోని ట్రాన్స్ఫారమ్తో పాటు రెండు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. గాలి, వర్షం తగ్గగానే విద్యుత్ ఏఈ తన సిబ్బందితో కలిసి విద్యుత్ సౌకర్యం పునరుద్ధరించేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. ఫారెస్ట్ కార్యాలయం రోడ్డుపైనా, హరిజనపేట పాఠశాల సమీపంలో, సాయిబాబా గుడి వద్ద, గిన్నెల బజారులో చెట్లు విరిగి పడ్డాయి. ఆయా చెట్లను తొలగించి మంగళవారం రాత్రి 7.30 గంటల విద్యుత్ పునరుద్దరించారు. బ్రిడ్జిరోడ్డులో ఎయిర్టెల్ టవర్ వద్ద పడిపోయిన ట్రాన్స్ఫారం పునరుద్దరించేకు ప్రత్యేక మెషీన్ రావాలని సిబ్బంది తెలిపారు. గడిచిన 24 గంటల నుంచి విద్యుత్ లేకపోవడంతో గ్రామస్తులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామ పంచాయతీ కుళాయిల ద్వారా సరఫరా కావాల్సిన తాగునీరు నిలిచిపోయింది. సిగ్నల్స్ లేక సెల్ఫోన్లు మూగబోయాయి. -
పాలిసెట్లో జిల్లాకు 1, 8 ర్యాంకులు
రాజమహేంద్రవరం రూరల్: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి గత నెల 25న నిర్వహించిన పాలిసెట్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ ప్రవేశ పరీక్షలో రాజమహేంద్రవరం నగరానికి చెందిన దామోడ రామ్గౌతమ్ 120కి 120 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించాడు. గౌతమ్ తండ్రి సత్యనారాయణ ప్రైవేటు ఉద్యోగి. తల్లి రత్నకుమారి గృహిణి. ఇంటర్ చదివి జేఈఈ అడ్వాన్స్లో అత్యుత్తమ ర్యాంకు సాధించి ప్రముఖ ఐఐటీలో చదివి, ఇంజినీర్ కావాలన్నదే తన లక్ష్యమని గౌతమ్ చెప్పాడు. కాగా, ఈ పరీక్షలో జిల్లాకు చెందిన దిరిసాల నాగ సత్య హిమసూర్య కూడా 120కి 120 మార్కులు సాధించి, రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంకు సాధించాడు. బొమ్మూరులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, పాలిసెట్ జిల్లా కో ఆర్డినేటర్ అక్కుల మురళి ఈ విషయం తెలిపారు. పాలిసెట్లో జిల్లాలోని విద్యార్థులు 92.80 శాతం మంది అర్హత సాధించారని ఆయన పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా 5,668 మంది ఈ పరీక్షకు హాజరవగా, వీరిలో 5,269 మంది అర్హత సాధించారని వివరించారు. ఈ ‘బాబు’ వద్దు బాబూ.. రాజమహేంద్రవరం సిటీ: రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అహ్మద్ బాబును తక్షణమే ఆ పదవి నుంచి బదిలీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పి.గిరి ప్రసాద్ వర్మ డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పును గౌరవించి, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. దానవాయిపేటలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం వద్ద ఉద్యోగులు భోజన విరామ సమయంలో మంగళవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా గిరి ప్రసాద్ వర్మ మాట్లాడుతూ, అహ్మద్ బాబు అనుసరిస్తున్న అక్రమ విధానాలపై సంఘం దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఇచ్చిన తీర్పు.. దుర్మార్గంగా వ్యవహరించే అధికారులకు చెంపపెట్టు అని అన్నారు. ఆందోళనకు అధ్యక్షత వహించిన వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు త్వరగా శ్రీరామ్ మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యలు తీరే వరకు, అహ్మద్ బాబు బదిలీ అయ్యే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అహ్మద్ షరీఫ్, కార్యదర్శి రత్న కుమార్, కోశాధికారి స్వామి వెంకటేష్, పెన్షనర్స్ విభాగం నాయకుడు ఉదయ భాస్కర్ రాజు తదితరులు పాల్గొన్నారు. 10 రోజులైనా ధాన్యం డబ్బులివ్వరేం? వేగేశ్వరపురంలో రైతుల ఆందోళన తాళ్లపూడి: కూటమి ప్రభుత్వం గొప్పగా చెబుతున్నట్టు మిల్లుకు తోలిన 24 గంటల్లో తమకు ధాన్యం సొమ్ము చెల్లించడం లేదని, 10 రోజులైనా డబ్బులెందుకివ్వడం లేదని పలువురు రైతులు ప్రశ్నించారు. వివరాలివీ.. తాళ్లపూడి మండలం వేగేశ్వరపురానికి చెందిన రైతులు గత నెల 24న మిల్లుకు రబీ ధాన్యం తోలారు. వాటికి సంబంధించిన డబ్బు ఇప్పటి వరకూ తమ ఖాతాల్లో జమ కాలేదని రైతులు తైలం ప్రసాద్, తైలం సంపతిరావు, నున్న కృష్ణ, సులా పోసియ్య, పెట్టా సుబ్బారావు, ఇండుగుల బుజ్జి తదితరులు పేర్కొన్నారు. ప్రభుత్వం ఒక్క రోజులోనే డబ్బు చెల్లిస్తామని ప్రకటిస్తూంటే, 10 రోజులైనా చెల్లించడం లేదని అన్నారు. రైతు సేవా కేంద్రం (ఆర్ఎస్కే) వద్దకు వెళ్లి, కంప్యూటర్లో చేయించుకుంటే డబ్బులొచ్చేస్తాయని రైస్ మిల్లర్ చెబుతున్నారని చెప్పారు. ఆర్ఎస్కేకి వెళ్తే రైస్ మిల్లుకు బ్యాంకు గ్యారెంటీ(బీజీ)లు లేవని, ఈ రోజు టార్గెట్ పూర్తయిపోయిందని, సర్వర్ పని చేయటం లేదని అక్కడి సిబ్బంది అంటున్నారని, రైతు గోడు ఎవ్వరూ వినటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మండల వ్యవసాయాధికారి రుచిత మాట్లాడుతూ, వేగేశ్వరపురం ఆర్ఎస్కేలోని పరిస్థితిపై ఆరా తీస్తానని చెప్పారు. -
ఎఫ్సీ చేయించుకోవాలి
ప్రతి బడి బస్సుకు స్పీడ్ గవర్నర్లు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. వచ్చే నెల 15వ తేదీలోగా ఎఫ్సీ చేయించుకోవాలి. ఎఫ్సీ, పర్మిట్, కండిషన్ లేని బస్సులను సీజ్ చేస్తాం. – ఎన్.లక్ష్మీ శ్రీదేవి, మోటార్ వెహికల్ ఇనస్పెక్టర్, మండపేట ఆకస్మిక తనిఖీలు చేస్తాం పాఠశాలలు ప్రారంభం కాగానే స్కూల్ బస్సుల తనిఖీలు చేపడతాం. ఎఫ్సీ లేకుండా పాఠశాల బస్సులు రోడ్డెక్కితే కఠిన చర్యలు తప్పవు. జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని బడి బస్సులకు వెంటనే ఎఫ్సీ చేయించుకోవాలి. – ఆర్.సురేష్, జిల్లా రవాణా అధికారి, రాజమహేంద్రవరం -
కొత్త వేలుగులు
ఫ దేవరపల్లికి మహర్దశ ఫ హైవేల కూడలిగా మారిన వైనం ఫ ఆ గ్రామం మీదుగా మూడు జాతీయ రహదారుల నిర్మాణం దేవరపల్లి: గుండుగొలను – కొవ్వూరు మధ్య మండల కేంద్రమైన దేవరపల్లి గతంలో ఓ సాధారణ జంక్షన్. ఎవరూ ఊహించని విధంగా ఇప్పుడది మూడు ప్రధాన జాతీయ రహదారుల కూడలిగా గుర్తింపు పొందింది. దీంతో దేశ వ్యాప్తంగా దేవరపల్లికి గుర్తింపు లభించింది. రవాణా పరంగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు అత్యంత ప్రాధాన్యంగా మారింది. మూడు జాతీయ రహదారులు ఆ గ్రామంలో ‘వే’లుగులు విరజిమ్మతున్నాయి. హాయిగా ప్రయాణం తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరానికి 25 కిలోమీటర్ల దూరంలో దేవరపల్లి ఉంది. ఎక్కడా లేని విధంగా మూడు జాతీయ రహదారులను దేవరపల్లి మీదుగా నిర్మించారు. ఒకే గ్రామం మీదుగా మూడు హైవేల నిర్మాణం జరగడం చాలా అరుదు. గతంలో కనీస రహదారుల సదుపాయం లేని దేవరపల్లి నేడు జాతీయ ప్రధాన రహదారులతో అభివృద్ధి చెందింది. పదేళ్ల క్రితం ఈ ప్రాంతాన్ని చూసిన ప్రజలు.. నేడు దేవరపల్లిని చూసి ఆశ్చర్యపోతున్నారు. రహదారులపై ప్రయాణికులు హాయిగా రయ్ రయ్ మంటూ ప్రయాణం చేస్తున్నారు. జాతీయ రహదారులు గుండుగొలను – కొవ్వూరు మధ్య 170 కిలో మీటర్ల నాలుగు వరుసల జాతీయ రహదారి (ఎన్హెచ్–16)ని రూ.1,825 కోట్లతో నిర్మించారు. సుమారు 53 కిలో మీటర్లు బైపాస్ హైవే నిర్మాణం చేశారు. అలాగే దేవరపల్లి – తల్లాడ జాతీయ రహదారి (316 డి)ని సుమారు రూ. 98 కోట్లతో రెండు వరుసలుగా ఏర్పాటు చేశారు. ఇక మూడో జాతీయ రహదారి దేవరపల్లి – ఖమ్మం (365 బీజీ) గ్రీన్ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే. దేవరపల్లి నుంచి ఖమ్మం వరకు పచ్చని పంట పొలాల మీదుగా రూ. 4,451 కోట్లతో 162 కిలోమీటర్లు మేర నాలుగు వరుసల రహదారి నిర్మాణం చేసి ఇటీవల రాకపోకలకు అనుమతి ఇచ్చారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు ఈ రహదారి దగ్గర మార్గం అవుతుంది. ఈ మూడు ప్రధాన జాతీయ రహదారులను దేవరపల్లి శివారున అనుసంధానం చేశారు. ఈ కూడలి ప్రాంతానికి డైమండ్ జంక్షన్గా అధికారులు నామకరణం చేశారు. దీనికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో జీలుగుమిల్లి – కొవ్వూరు రెండు వరుసల జాతీయ రహదారి నిర్మాణం జరుగుతుంది. రూ.365 కోట్ల వ్యయంతో దాదాపు 86.2 కిలో మీటర్లు దీన్ని నిర్మిస్తున్నారు. సుమారు వంద గిరిజన ప్రాంతాలు, 30 మైదాన ప్రాంతాలకు రహదారి ఉపయోగకరంగా ఉంటుంది. మెరుగుపడిన రవాణా రంగం మూడు ప్రధాన జాతీయ రహదారుల నిర్మాణంతో మెట్ట ప్రాంతంలో రవాణా రంగం మెరుగుపడింది. ఈ ప్రాంతంలో పండించిన వ్యవసాయ ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసి రైతులు గిట్టుబాటు ధర పొందుతున్నారు. హైదరాబాద్, చైన్నె, కోల్కతా, విశాఖ, ఒడిశా వంటి ప్రాంతాలకు రవాణా సౌకర్యం ఏర్పడింది. పెరిగిన భూముల ధరలు భూముల ధరలు కూడా పెరిగాయి. 2004–05లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టి, కుడి, ఎడమ ప్రధాన కాలువలకు భూముల సేకరణ చేసి రైతులకు ఎకరాకు రూ. 3 లక్షలు చొప్పున పరిహారం అందజేసి న్యాయం చేశారు. అప్పటి వరకు ఎకరం ధర రూ. 40 నుంచి 50 వేలు ఉండగా, రూ. 3 లక్షలు ఇవ్వడంతో రైతులు ఆర్థికంగా కోలుకున్నారు. అనంతరం జాతీయ రహదారుల నిర్మాణం చేయడంతో భూముల ధరలు అనూహ్యంగా పెరిగాయి. రహదారి పక్కన భూమి ఎకరం రూ. 2 నుంచి 3 కోట్లు పలుకుతోంది. లోపల భూములు కూడా రూ. 60 నుంచి 80 లక్షలు పలకడంతో రైతులు ఆర్థికంగా పుంజుకున్నారు. రహదారుల పక్కన పరిశ్రమలు నెలకొల్పడంతో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి. -
ఖతార్లో కష్టాల నుంచి మహిళకు విముక్తి
అమలాపురం రూరల్: ఉపాధి కోసం ఖతార్ దేశం వెళ్లి అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్న కోనసీమ జిల్లాకు చెందిన మహిళను కలెక్టర్ మహేష్ కుమార్ ప్రత్యేక చొరవతో కేసీఎం అధికారులు సురక్షితంగా మంగళవారం ఇంటికి చేర్చారు. వివరాల్లోకి వెళితే.. మామిడికుదురు మండలం కొమరాడ గ్రామానికి చెందిన డి.కనకదుర్గ అమలాపురానికి చెందిన ఏజెంట్ ఎ.శ్రీనివాసరావు ద్వారా 2024 నవంబర్లో ఖతార్ వెళ్లింది. అక్కడ ఓ ఇంట్లో పనికి చేరిన ఆమెకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఖతార్ యజమాని భార్యాభర్తల గొడవల కారణంగా దుర్గను తీవ్రంగా వేధించడమే కాకుండా కనీసం సరైన ఆహారం పెట్టకుండా ఇబ్బందులకు గురి చేశారు. ఐదు నెలల పాటు నరక యాతన అనుభవించిన దుర్గ ఆ బాధలను భరించలేక అక్కడి నుంచి తప్పించుకుని తనను పంపిన ఆఫీసుకు చేరుకున్నారు. అక్కడ కూడా ఆమె పరిస్థితి మెరుగుపడలేదు. వేర్వేరు ఇళ్లలో పది రోజులు, వారం రోజులు చొప్పున పనిచేయిస్తూ ఎటువంటి జీతం ఇవ్వకుండా ఆమెను మానసిక, శారీరక వేధింపులకు గురిచేశారు. దీనితో ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించగా, బాధితురాలు తన భర్త నాగరాజుకు ఫోన్ చేసి తన గోడు వెళ్లబోసుకోగా కేసీఎంను ఆశ్రయించారు. బాధితురాలిని రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వలసదారుల కేంద్రాన్ని ఆదేశించారు. కేసీఎం అధికారి గోళ్ల రమేష్ ఆధ్వర్యంలో బృందం ఏజెంట్తో మాట్లాడి చట్టపరమైన ఒత్తిడి తీసుకువచ్చారు. చివరకు కనకదుర్గను సురక్షితంగా రప్పించగలిగారు. -
రండి.. దిండి.. దయ చేయండి
ఫ పర్యాటకులను ఆకర్షిస్తున్న దిండి అందాలు ఫ ఆకట్టుకుంటున్న గోదావరి సోయగాలు ఫ మదిని దోచుకుంటున్న పచ్చటి తివాచీ ఫ అలలపై దూసుకుపోయే బోట్లు మలికిపురం: దిండి కేంద్రంగా గోదావరి అందాలు పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. రండి.. రండి.. దయ చేయండంటూ స్వాగతం పలుకుతున్నాయి. జిల్లాలోని వశిష్ట నదీ తీరంలో 2004లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏర్పాటు చేసిన ఈ ప్రముఖ పర్యాటక కేంద్రం దిండి కేంద్రంగా నేడు ఎంతో ప్రసిద్ధికెక్కింది. సాధారణంగా వేసవి సెలవులు వచ్చాయంటే చక్కని పర్యాటక ప్రాంతాలకు విహరించాలని ప్రకృతి ప్రేమికులు కోరుకుంటారు. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనంతో పాటు ప్రకృతి అందాలను చూడాటానికి ఈ సమయంలోనే అవకాశం దొరుకుతుంది. అలాంటి వారికి దిండి పర్యాటక కేంద్రం ఘనంగా స్వాగతం పలుకుతోంది. ఇక్కడ టూరిజం శాఖ ఆధ్వర్యంలో పర్యాటకులకు అన్ని సౌకర్యాలూ కల్పించారు. టూరిస్టుల రాక : రాష్ట్రంతో పాటు దేశ నలుమూలల నుంచీ అనేక మంది టూరిస్టులు దిండికి వస్తున్నారు. ఆన్లైన్ విధానం అందుబాటులోకి రావడంతో పాలకొల్లు, నర్సాపురం, రాజమహేంద్రవరం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు రైల్వే స్టేషన్ల ద్వారా, రాజమహేంద్రవరం, గన్నవరం విమానాశ్రయాల నుంచి ఇక్కడకు చేరుకుంటున్నారు. దిండి, చుట్టు పక్కల విహార కేంద్రాల్లో హోటళ్లు బుక్ చేసుకుని విహరిస్తున్నారు. ఇక్కడ కేరళకు దీటుగా ఉన్న గోదావరి పాయలు, పంట కాలువలు, రోడ్ల వెంబడి గల తోటలతో పాటు టెంపుల్ టూరిజంపై ఆసక్తి చూపుతున్నారు. అంతర్వేది సాగర సంగమం, లొల్ల లాకులు, కోరంగి అడవులలో పచ్చటి అందాల నుంచి ఆహ్లాదం పొందుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటున్నారు. దిండికి దారి : కోనసీమ – పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య మ లికిపురం మండలంలో వశిష్ట గోదావరి తీరంలో దిండి పర్యాటక కేంద్రం ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చే పర్యాటకులు పాలకొల్లు రైల్వేస్టేషన్లో దిగి ఆటోలు, ప్రైవేటు వాహనాల్లో అక్కడకు చేరుకోవచ్చు. పాలకొల్లు ఆర్టీసీ డిపో నుంచి రాజోలు వచ్చే బస్సు ఎక్కి దిండిలో దిగవచ్చు. రాజమహేంద్రవరం మీదుగా రాజోలు చేరుకుని అక్కడ నుంచి పాలకొల్లు వెళ్లే బస్సు ఎక్కి దిండిలో దిగవచ్చు. ఈ కేంద్రం పాలకొల్లు నుంచి 15 కిలోమీటర్లు, రాజోలు నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. విశాఖపట్నం నుంచి పర్యాటకులు కాకినాడ, అమలాపురం చేరుకుని అక్కడి నుంచి రాజోలు మీదుగా దిండికి రావచ్చు. రిసార్ట్స్లో గదుల ధరలు ఫ ఏసీ స్టాండర్డ్ రూమ్ రూ.2,624(24 గంటలు) ఫ ఏసీ డీలక్స్ రూమ్ రూ.3,360(24 గంటలు) ఫ ఏసీ ప్రీమియం డీలక్స్ రూమ్ రూ.4,200 ఫ ఏసీ సూట్ రూ.5,250 ఫ ఏసీ ప్రీమియం సూట్ రూ.6,825 ఫ రాయల్ ప్రిన్స్ సూట్ రూ.10,620 హౌస్బోట్ల రేట్లు ఫ 24 గంటల ప్యాకేజీ రూ.15 వేలు (ఉదయం 10 నుంచి మరుసటి రోజు ఉదయం 9 గంటల వరకు) ఫ 12 గంటల ప్యాకేజీ రూ.12 వేలు (ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకూ) ఫ బోటులో రెండు గదులు, అటాచ్డ్ బాత్రూమ్లు, డైనింగ్ హాలు ఉంటాయి. రెండు జంటలు నలుగురు పిల్లలతో ఒకేసారి విహరించవచ్చు. ఫాంటూన్, ఆత్రేయ బోట్లలో ట్రిప్పుల వారీగా రూ.150 నుంచి రూ.80 వరకూ టిక్కెట్ ధరలు ఉంటాయి. అవసరమైనవారు రిసెప్షన్ నంబర్ 98487 80524ను సంప్రదించొచ్చు. ఇక్కడ ఏపీ టూరిజానికి దీటుగా ప్రైవేటు టూరిజం రిసార్ట్స్ కూడా భారీగా ఆదాయం సంపాదిస్తున్నాయి. వైఎస్ వేసిన మొక్క.. నేడు మహావృక్షం 2004లో అప్పటి రాజోలు ఎమ్మెల్యే అల్లూరు కృష్ణంరాజు ప్రోత్సాహంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇక్కడ టూరిజం అభివృద్ధికి బీజం వేశారు. అప్పట్లో ఆయన రూ.4 కోట్ల కేటాయించి, రిసార్ట్ కట్టి, నాలుగు హౌస్ బోట్లు పెట్టారు. అదే ఇప్పుడు మహా వృక్షం అయింది. నేడు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు సైతం రూ.వంద కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాయి. రూ.కోట్లలో టర్నోవర్ జరుగుతోంది. తాజాగా ఇక్కడ ప్రైవేటు బోట్ షికారు జోరుగా జరుగుతోంది. కేరళకు దీటుగా .. దిండి కేంద్రం ద్వారా కోనసీమతో పాటు గోదావరి జిల్లాల టూరిజం కేరళకు దీటుగా మారింది. ఇక్కడకు వచ్చే పర్యాటకుల సంఖ్య ప్రతి ఏడాదీ పెరుగుతోంది. ప్రకృతి ప్రేమికులతో పాటు టెంపుల్ టూరిజం కూడా అభివృద్ది చెందింది. వేసవిలో పర్యాటకుల సంఖ్య బాగా ఎక్కువగా ఉంటుంది. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేశాం. – కె.మురళీధర్, దిండి ఏపీ టూరిజం మేనేజర్ 05ఆర్జెడ్ఎల్31 కె. మురళీధర్ -
నేడు వైఎస్సార్ సీపీ చలో దేవరపల్లి
రాజానగరం: పొగాకు రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ చలో దేవరపల్లికి పిలుపునిచ్చింది. ఈ మేరకు దేవరపల్లి పొగాకు వేలం కేంద్రం వద్ద బుధవారం ఉదయం 10 గంటలకు చేపడుతున్న ధర్నాకు నియోజకవర్గం నుంచి రైతులతో పాటు పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలని ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మంగళవారం పిలుపునిచ్చారు. ఉదయం 9 గంటలకు రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్లోని పార్టీ కార్యాలయం నుంచి దేవరపల్లికి ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మాజీ హోం మంత్రి తానేటి వనితతో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. పొగాకు రైతుల పట్ల ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం తగదని రాజా అన్నారు. పొగాకు కొనుగోళ్లు మార్చి 25న ప్రారంభించినప్పటికీ రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలోని నల్లరేగడి నేలల్లో పండించిన పొగాకు కొనుగోలు ఇంతవరకూ ప్రారంభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు రైతుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనమని విమర్శించారు. వర్జీనియా పొగాకుకు కనీస మద్దతు ధర ఇవ్వాలని, పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేయాలనే ప్రధాన డిమాండ్లతో ఈ ధర్నా చేపడుతున్నామని రాజా తెలిపారు. ఫ పొగాకు వేలం కేంద్రం వద్ద ధర్నా ఫ రైతులు, పార్టీ శ్రేణులు తరలి రావాలి ఫ జక్కంపూడి రాజా పిలుపు -
స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
రాజమహేంద్రవరం సిటీ: బీసీలకు స్థానిక సంస్థల్లో గతంలో మాదిరి 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాకు రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. సోమవారం రాజమహేంద్రవరం ఆర్అండ్బీ అతిథి గృహంలో ప్రజాప్రతినిధులు, వెనుకబడిన వర్గాల సంఘాలు, సివిల్ సొసైటీలు, ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాను నియమించగా, జిల్లాలో వినతులు స్వీకరించే కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు, ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ మహానాడు కన్వీనర్, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, రాష్ట్ర శెట్టిబలిజ సంక్షేమ సంఘ అధ్యక్షుడు పిల్లి సుబ్రహ్మణ్యం, చైర్మన్ గుమ్మడి సమర్పణరావు, వైస్ చైర్మన్ ఎల్వీ ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు బి.జార్జి ఆంటోని, మట్టపర్తి సత్యనారాయణ, డాక్టర్ రాచర్ల నాగేశ్వరరావు, నక్కా సోమేశ్వరరావు తదితరులు రాజీవ్ రంజన్ మిశ్రాను కలసి వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేక కులాల ప్రజలు విద్యా, ఉద్యోగ అవకాశాలకు దూరంగా ఉన్నారన్నారు. ఈ పరిస్థితుల్లో అన్ని స్థానిక సంస్థల్లో గతంలో మాదిరి 34 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని కోరారు. -
రేపు పొగాకు రైతు సమస్యలపై ధర్నా
రాజమహేంద్రవరం రూరల్: వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో దేవరపల్లి పొగాకు వేలం కేంద్రం ఎదుట బుధవారం ఉదయం 10.0.గంటలకు వర్జీనియా పొగాకు రైతుల సమస్యలపై ధర్నా నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ మంత్రి తానేటి వనిత వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. వర్జీనియా పొగాకుకి కనీస మద్దతు ధర చెల్లించాలని, కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఈ ఆందోళన కార్యక్రమానికి పొగాకు రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమస్యలుంటే నేరుగా రండి కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రజలు తమ సమస్యల పరిష్కారం కాకపోతే నేరుగా తన వద్దకు వచ్చి తెలపవచ్చని ఎస్పీ డి.నరసింహకిశోర్ పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పోలీస్ పీజీఆర్ఎస్ నిర్వహించారు. దీనికి 39 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఆర్జీదారులు హాజరయ్యారు. వారి నుంచి పోలీసు అధికారులు ఆర్జీలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే నేరుగా సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాది దారుల సమస్యలను పరిష్కరించవలసినదిగా ఉత్తర్వులు ఇచ్చారు. పీజీఆర్ఎస్కు సివిల్ కేసులు, కుటుంబ సమస్యలు, చీటింగ్, కొట్లాట కేసులు, ఇతర కేసులకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించామన్నారు. హైవేపై కారు నుంచి మంటలుకడియం: జాతీయ రహదారిపై మండలంలోని బుర్రిలంక వద్ద ఒక కారు ఇంజిన్ నుంచి మంటలు చెలరేగాయి. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. నక్కా రామేశ్వరం గ్రామానికి చెందిన కే.మురళి తన స్నేహతుడితో కలిసి తన స్వగ్రామం నుంచి రాజమహేంద్రవరం కారులో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు బుర్రిలంక వద్దకు వచ్చేసరికి ఇంజిన్ నుంచి మంటలు చెలరేగాయి. దీంతో అందులో ఉన్న ఇద్దరూ అప్రమత్తమై వెంటనే కారుని రోడ్డు పక్కనే నిలిపివేసి కిందికి దిగేసారు. స్థానికుల సాయంతో మంటలు ఆర్పివేశారు. కడియం పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. 183 అర్జీల స్వీకరణ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం) : కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల్లో మొత్తం 183 అర్జీలు స్వీకరించినట్లు జిల్లా రెవెన్యూ అధికారి టి.సీతారామమూర్తి సోమవారం తెలిపారు. నిర్దిష్ట గడువులో అర్జీలకు పరిష్కారం కల్పించే విధంగా చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఎస్డిసి ఎం.ఆర్.ఆర్. ప్రేమ్కుమార్, పుష్కరాల ప్రత్యేక అధికారి ఎస్డిసి డాక్టర్ ఏ. మహేష్, డీఎస్పీతో పాటు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. అక్రమ లాకౌట్ ఎత్తివేయాలి ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం): కడియం పేపర్మిల్లు అక్రమ లాకౌట్ ఎత్తి వేసి, తక్షణమే సమస్య పరిష్కరించకపోతే కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాజమండ్రి పేపర్ మిల్లు ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటిపాక మధు హెచ్చరించారు. సోమవారం స్థానిక శ్యామల సెంటర్ వద్ద గల సీఐటీయూ కార్యాలయంలో కేంద్ర కార్మిక సంఘాల సమావేశం జరిగింది. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.పవన్ మాట్లాడుతూ కార్మికులు ఏప్రిల్ 27 నుంచి న్యాయమైన డిమాండ్లపై సమ్మె చేస్తున్నారన్నారు. అనంతరం యాజమాన్యం వైఖరిపై కేంద్ర కార్మిక సంఘాలు నిరసన తెలిపాయి. సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు టి అరుణ్, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు, జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాంబాబు పాల్గొన్నారు. -
చోద్యశాలలు
● అధ్వానంగా జిల్లాలోని ప్రభుత్వాస్పత్రులు ● రోగులకు కనీస వసతులు కరవు ● అవసరమైనన్ని బెడ్లు లేక ఇబ్బందులు ● తాగునీరు, మరుగుదొడ్లకూ కటకటేసాక్షి, నెట్వర్క్: తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్యశాలలు అధ్వానంగా మారాయి. రోగులకు కనీస వసతులు మృగ్యమయ్యాయి. అవసరమైన బెడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటికి, మరుగుదొడ్లకు అవస్థలు తప్పడం లేదు. డాక్టర్ల కొరతతో మెరుగైన వైద్యం అందని ద్రాక్షగా మారింది. ఆస్పత్రుల అధ్వాన పరిస్థితులపై ‘సాక్షి’ ఫీల్డ్ విజిట్. రాజమహేంద్రవరం రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిత్యం ఓపీ 1,500 నుంచి 1,800 మధ్య ఉంటుంది. ఇనన్ పేషెంట్ల సంఖ్య 650 ఉంటుంది. ఆసుపత్రిలో బెడ్ల సామర్థ్యం 500 వరకు మాత్రమే ఉంది. బెడ్స్ కొరత ఉంది. మెడికల్ కళాశాలకు అనుసంధానంగా ఉండటంతో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ నిర్మించాల్సి ఉంది. క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణం పూర్తయింది. అందులో మెడికల్ ఎక్విప్మెంట్ లేకపోవడంతో ఆ భవనం నిరుపయోగంగా ఉంది. న్యూరో సమస్యలతో రోగులు వస్తే డాక్టర్ ఉన్నా సర్జరీలు చేసేందుకు పరికరాలు లేవు. గుండెపోటుతో ఎవరైనా వస్తే ఇక అంతే సంగతి. ఆసుపత్రిలో కార్డియాలజీ విభాగమే లేదు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరగడం లేదు. ఆసుపత్రిలో ఆ విభాగంలో ఉన్న వైద్యుడిని వేరే ప్రాంతానికి పంపడంతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఆగిపోయాయి. మండపేట మండపేట పట్టణంలోని సీహెచ్సీలో రోజుకు సుమారు 200 మంది వైద్యం కోసం ఓపీ రాయించుకుంటున్నారు. ఈ 30 పడకల ఆసుపత్రికి పట్టణంలోని ప్రజలు వస్తారు. ఓపీ చీటీ రాయించడం ఇక్కడ ఓ ప్రసహనంగా మారుతోంది. ఉదయం 10 గంటలకు సుమారు 25 మంది లైన్లో నిలుచుండగా ఆసుపత్రి సిబ్బంది ఒక్కరు మాత్రమే ఓపీ రసీదులు ఇస్తున్నారు. మహిళలకు ప్రత్యేక లైనను నిర్వహంచకపోవడంతో సీ్త్రలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాలికి గాయమైన వ్యక్తి బాధను ఓర్చుకుంటూ లైనులో నిలుచోవాల్సిన పరిస్థితి. వృద్ధులు, గాయాలపాలైనవారికి త్వరితగితన ఓపీ చీటీ రాసిచ్చే పరిస్థితి కానరాలేదు. ఓపీ రాయించుకునేందుకు ఆధార్, సెల్ఫోన్ నంబర్లు తప్పనిసరి చేయడంపై రోగులు అసహనం వ్యక్తం చేశారు. రావులపేటకు చెందిన బేవర చిన్న వెంకటేశ్వర్లు అనే వృద్ధుడు లైన్లో నిలుచుండగా సెల్ఫోనన్ తప్పనిసరని సిబ్బంది చెప్పడంతో కుటుంబ సభ్యుల నంబరు చీటీపై రాయించారు. నేరుగా మొబైల్ ఫోన్ తేవాలని, ఓటీపీ నమోదు చేయాల్సి వస్తుందని చెప్పడంతో తనకు అలాంటి సదుపాయాలు లేవంటూ ఉసూరుమంటూ వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద వాటర్ టిన్లో నీళ్లు లేకపోవడంతో బయట వాటర్ బాటిళ్లను రోగులు ఆశ్రయించాల్సి వచ్చింది. ప్రసూతి వైద్య విభాగం వద్ద రోగులు సిబ్బంది కోసం వేచి చూడాల్సి వచ్చింది. కొవ్వూరు కొవ్వూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో పలు సమస్యలు వెంటాడుతున్నాయి. 44 పోస్టులకు గాను 8 ఖాళీలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ముగ్గురు వైద్యాధికారులు, ముగ్గురు డాక్టర్ల పోస్టులు ఉన్నాయి. ఆస్పత్రిలో జనరేటర్ పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. దీంతో విద్యుత్ సమస్య వస్తోంది. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆసుపత్రిలో అంబులెన్సు ఉన్నప్పటికీ మెయింటినెనన్స్ లేక నిరుపయోగంగా ఉంది. ట్రామా కేర్ సెంటర్ లేకపోవడం వల్ల కేసులను రాజమహేంద్రవరం రిఫర్ చేయాల్సి వస్తోంది. 122 మంది ఓపీ సేవలు ఉపయోగించుకుంటున్నారు. 20 మంది ఇన్ పేషెంట్లు ఉన్నారు.గోపాలపురం గోపాలపురంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు సరిపడినన్ని బెడ్స్ లేక ఇబ్బందులు పడుతున్నారు. 30 పడకల ఆస్పత్రి అయినా 45 మంది రోగులు ఇన్పేషెంట్లుగా ఉంటున్నారు. జనరల్ మెడిసిన్ డాక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. రోగులకు అవసరమైన మరుగుదొడ్లు లేవు. జనరల్ డ్యూటీ సిబ్బంది కొరత ఉంది. మార్చురీ షెడ్డు శిథిలమై కూలేందుకు సిద్ధంగా ఉంది. ఆర్వో ప్లాంట్ లేదు. ఆస్పత్రికి వచ్చిన వారికి చెట్టు నీడే ఆదరువుగా మారింది. నిడదవోలు నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరత వెంటాడుతోంది. ప్రధానమైన ముగ్గురు డాక్టర్ల పోస్టులు భర్తీ కాకపోవడంతో సరైన వైద్యం అందడం లేదు. వెరసి రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇన్ పేషెంట్ వార్డు సరిపోకపోవడంతో వార్డు బయట వరండాలో వైద్యం చేస్తున్నారు. ఇంకా ఇక్కడ 3 వార్డులు అవసరమవుతాయి. -
యానాంలో ‘మల్లాడి’కే పట్టం
● అట్టహాసంగా విజయోత్సవ ర్యాలీ ● మంచి పాలన అందిస్తానని కృష్ణారావు వెల్లడి యానాం: యానాం ఎమ్మెల్యేగా మల్లాడి కృష్ణారావు ఆరోసారి ఎన్నికయ్యారు. ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఆయనకు 19,863 ఓట్లు రాగా, తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్అశోక్కు 15,295 ఓట్లు వచ్చాయి. స్థానిక ఎస్ఆర్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎస్పీ వరదరాజన్, ట్రైనీ ఎస్పీ కె.చిట్టిరాజు ఆధ్వర్యంలో పోలీసు బలగాలు బందోబస్తు నిర్వహించారు. మూడో రౌండ్లో మల్లాడికి స్పష్టమైన మెజార్టీ రావడంతో కౌంటింగ్ కేంద్రం నుంచి శ్రీనివాస్ అశోక్ తన సతీమణి లక్ష్మీ స్నేహతో కలసి బయటకు వెళ్లిపోయారు. డిపాజిట్లు కోల్పోయిన అభ్యర్థులు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన 11 మంది అభ్యర్థులు డిపాజిట్లను కోల్పోయారు. టీవీకే పార్టీ అభ్యర్థి తోటరాజుకు 167 ఓట్లు, స్వతంత్రులు జనిపల్లి వెంకన్నబాబుకు 9 ఓట్లు, కాళ్ల వెంకటరమణకు 18 ఓట్లు, గిడ్డి బలరాంకు 78 ఓట్లు, తిరుకోటి ఆదిమూర్తికి 4 ఓట్లు, నాటి బూరయ్యకు 19 ఓట్లు, మల్లాడి ఉదయలక్ష్మికి 9 ఓట్లు, మెల్లం శ్రీనివాసరావుకు 14 ఓట్లు, లక్ష్మీస్నేహా మేడపాటికి 34 ఓట్లు, షేక్ అహ్మద్షా ఖాదర్కు 27 ఓట్లు, సూరిమిల్లి సుబ్బారావుకు 195 ఓట్లు లభించాయి. ఆరోసారి ఎన్నికై .. నియోజకవర్గం నుంచి ఆరోసారి మల్లాడి కృష్ణారావు విజయకేతనం ఎగురవేశారు. 1996, 2001, 2006, 2011, 2016 ఎన్నికల్లో కృష్ణారావు గెలుపొందారు. ఇప్పుడు తిరిగి మల్లాడి విజయం సాధించారు. యానాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కృష్ణారావు ఎన్నికై నట్లు రిటర్నింగ్ అధికారి మీనా నుంచి మల్లాడి కుమారుడు రఘువంశీ సర్టిఫికెట్ అందుకున్నారు. భారీగా విజయోత్సవం మల్లాడి కృష్ణారావు విజయోత్సవ ర్యాలీ నియోజకవర్గ పరిధిలో ఉత్సాహంగా సాగింది. ప్రత్యేక వాహనంపై మల్లాడి నిలబడి ప్రజలకు అభివాదం చేశారు. ఓ వైపు బాణసంచా కాల్పులు, మరోవైపు పూలమాలలతో వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు, మహిళలతో విజయోత్సవ ర్యాలీ సాగింది. ఇకపై మంచి పరిపాలన ఉంటుందని మల్లాడి కృష్ణారావు అన్నారు. గతంలో పేకాట పరిపాలన చూశారని, ప్రజలు అశోక్కు గుణపాఠం చెప్పారని విమర్శించారు. -
సత్యదేవుని సన్నిధిలో భక్తుల సందడి
అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం భారీగా తరలివచ్చిన భక్తులతో సోమవారం కిటకిటలాడింది. రత్నగిరితో బాటు పలు ప్రాంతాలలో ఆదివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున వివాహాలు చేసుకున్న నవ దంపతులు వారి బంధుమిత్రులతో కలిసి వేలాదిగా తరలి వచ్చారు. సుమారు 30 వేల మంది భక్తులు స్వామిని దర్శించారు. స్వామివారి వ్రతాలు రెండు వేలు జరిగాయి. సత్యదేవుని దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. దేవస్థానానికి రూ. 40 లక్షలు ఆదాయం సమకూరింది. సోమవారం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లు, శంకరుడు ముత్యాలు పొదిగిన కవచాలు (ముత్తంగి) ధరించి భక్తులకు దర్శనమిచ్చారు. వాడపల్లి ఆలయానికి రూ.కోటితో రోడ్డు ఆత్రేయపురం: కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయానికి బీటీ రోడ్డు నిర్మాణం నిమిత్తం రూ.కోటి నిధులు మంజూరైనట్లు సోమవారం ఈఓ నల్లం సూర్యచక్రధర్రావు తెలిపారు. -
మా డబ్బు ఇప్పించండి
సత్యసాయి ఎంటర్ ప్రైజెస్ నిర్వాహకుని ఇంటి వద్ద బాఽధితుల నిరసన కంబాలచెరువు (రాజమహేంద్రవరం): అగరబత్తీల ప్యాకింగ్ పేరుతో తమ వద్ద లక్షల రూపాయలు దండుకున్న సత్యసాయి ఎంటర్ ప్రైజెస్ నిర్వాహకుడు వరదా మోహన్కృష్ణ నుంచి తమకు డబ్బు తిరిగి ఇప్పించాలంటూ బాధితులు నిరసన వ్యక్తం చేశారు. స్థానిక నారాయణపురంలోని వరదా మోహన్కృష్ణ ఇంటి వద్దకు సోమవారం బాధితులంతా చేరుకుని నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్బంగా బాధితులు మీడియాతో మాట్లాడుతూ తాము మోసపోయిన వైనాన్ని వివరించారు. ఇంటి వద్దే ఉంటూ డబ్బు సంపాదించవచ్చని యూట్యూబ్లో, సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో తాము సంస్థను సంప్రదించామన్నారు. తమకు డిపాజిట్ చెల్లిస్తే వస్తువులు ఇస్తామని, వాటిని ప్యాకింగ్ చేసి ఇవ్వాలని నిర్వాహకులు తెలిపారన్నారు. దీంతో తామంతా డ్వాక్రా రుణాల ద్వారా, వేరే వ్యక్తుల వద్ద వడ్డీకి డబ్బు తెచ్చి సత్యసాయి ఎంటర్ ప్రైజెస్కు చెల్లించామన్నారు. తొలుత రెండు నెలల డబ్బు బాగానే వేశారని, తర్వాత నుంచి వేయడం మానేశారన్నారు. దీనిపై అడిగేందుకు వెళితే రాజమహేంద్రవరంలోని కార్యాలయం మూసివేశారన్నారు. దీంతో కేసు నమోదు చేసేందుకు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లకు వెళితే ఎక్కడా కేసులు నమోదు చేసుకోలేదన్నారు. అయితే రాజమహేంద్రవరం త్రీటౌన్లో నలుగురు ఫిర్యాదులపై మాత్రమే కేసు నమోదు చేశారని చెప్పారు. తాము డబ్బు చెల్లించామని, దీనికి ఆధారాలు ఉన్నాయని, తమ కేసులు కూడా నమోదు చేసి సత్యసాయి ఎంటర్ ప్రైజెస్ నిర్వాహకుల వద్ద నుంచి తాము కట్టిన డబ్బు తిరిగి ఇప్పించాలన్నారు. విషయం తెలిసిన ప్రకాశ్నగర్ సీఐ బాజిలాల్ ఘటనా ప్రాంతానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. ఏ ప్రాంతంలో సొమ్ము చెల్లించారో అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. -
ఈ ‘బాబు’ మా కొద్దు!
చీఫ్ కమిషనర్కు వ్యతిరేకంగా వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల నిరసన నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులుకాకినాడ రూరల్: అయ్యా బాబు గారు.. మా కొద్దు ఈ బాబు అంటూ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు ఆ శాఖకు చెందిన చీఫ్ కమిషనర్ అహ్మద్బాబుకు వ్యతిరేకంగా కాకినాడలో సోమవారం నిరసన వ్యక్తం చేశారు. రమణయ్యపేటలోని వాణిజ్య పన్నుల శాఖ డివిజన్ కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఫ్లెక్సీని పట్టుకుని అహ్మద్బాబు ప్రవర్తనా శైలికి వ్యతిరేకంగా కాకినాడ నోడల్ డివిజన్లోని ఉద్యోగులు ఆందోళనకు దిగారు. పెండింగ్లో ఉన్న పదోన్నతులను వెంటనే భర్తీ చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు పి.విజయ్కుమార్ మాట్లాడుతూ పునర్వ్యవస్థీకరణ పేరుతో చేపట్టిన చర్యల వలన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆర్వో కార్యాలయ వ్యవస్థ కారణంగా క్షేత్ర స్థాయి ఉద్యోగుల కొరత ఏర్పడిందని, ప్రభుత్వం పునఃసమీక్ష చేపట్టి ఈ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సంఘ కార్యదర్శి ఏవీవీఎస్ స్వామి, ఎస్.శ్రీను,. ఆర్.నారాయణమూర్తి, గంగాభవాని, నాగ కల్పన, విజయలక్ష్మి పాల్గొన్నారు. -
ఒక్క రాత్రిలో 20 మోటార్ల వైర్లు చోరీ
● దేవినేనివారిగూడెంలో ఘటన ● లబోదిబోమంటున్న రైతులు ద్వారకాతిరుమల: మండలంలోని దేవినేనివారిగూడెంలో పలు వ్యవసాయ భూముల్లో కొందరు మోటారు కేబుల్ వైర్ల దొంగలు ఆదివారం అర్ధరాత్రి రెచ్చిపోయారు. దాదాపు 20 మంది రైతులకు చెందిన పొలాల్లోని బోర్ల మోటార్లకు ఉన్న విద్యుత్ కేబుల్ వైర్లను చోరీ చేశారు. వివరాల్లోకి వెళితే. దేవినేనివారిగూడెంకు చెందిన రైతులు కమ్మ వెంకట సుబ్రహ్మణ్యం, ముళ్ళపూడి శ్రీరామమూర్తి, నల్లూరి యుగంధర్, కమ్మ నాగన్న, ముళ్ళపూడి రామ్మోహనరావు తదితరులకు చెందిన వ్యవసాయ భూముల్లోకి దొంగలు ప్రవేశించారు. కాపర్ వైర్ల కోసం బోర్లుకు ఉన్న మోటారు వైర్లను కట్ చేసి, చోరీ చేశారు. సోమవారం తెల్లవారుజామున పొలాలకు వెళ్లిన బాధిత రైతులు ఈ చోరీలను గుర్తించి లబోదిబోమన్నారు. ఒక్క రాత్రిలో ఇంతమంది రైతుల పొలాల్లో విద్యుత్ కేబుల్ వైర్లు చోరీలు జరగడం స్థానిక రైతులను ఉలిక్కిపాటుకు గురిచేసింది. బాధిత రైతులు ఫిర్యాదులు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. -
హెచ్చరిస్తున్నా ఏమాగకుండా!
కొత్తపల్లి: ఉష్ణం ఉష్ణేన శీతలే అన్నది ఆయుర్వేద వైద్యుల సూత్రం. మండు వేసవిలో తాపాన్ని చల్లార్చే ఔషధ విలువల ఫలం మామిడి. సహజ సిద్ధంగా చెట్టుకు పండితే దాని రంగు కానీ, రుచి కానీ, వాసన కానీ మనసును దోచుకుంటాయి. అలాంటి పండ్ల ముందు అమృతం కూడా దిగదుడుపే. అందుకే దానిని మధుర ఫలం అంటారు. కాలం మారింది. డిమాండ్ పెరిగింది. దిగుబడి తగ్గింది. వాతావరణ పరిస్థితులు, యాజమాన్య పద్ధతులలో లోపాలతో పూర్తిగా పండకుండానే రాలిపోతున్నాయి. దీంతో వ్యాపారులు స్వార్థంతో కృత్రిమంగా పండించి విషతుల్యం చేస్తున్నారు. కాల్షియం కార్బైడ్ రసాయనాలతో వాటిని సహజ సిద్ధంగా పండిన పండ్లలా మాగించి మార్కెట్ను ముంచెత్తుతున్నారు. ఇటువంటి పండ్లను తినడం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బ తిని, క్యాన్సర్ తదితర రోగాల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాకినాడ జిల్లాలో ప్రధానంగా తుని, జగ్గంపేట, శంఖవరం, తొండంగి, ప్రత్తిపాడు, రౌతులపూడి, కోటనందూరు, పెద్దాపురం, గండేపల్లి, కరప, యు.కొత్తపల్లి, కాజులూరు, పిఠాపురం, తాళ్లరేవు, కిర్లంపూడి, కాకినాడ రూరల్, పెదపూడి, సామర్లకోట తదితర ప్రాంతాల్లో సుమారు 22,270 ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. కార్బైడ్ వల్ల ఎసిటిలీన్ వాయువు విడుదలై దానిలోని ఆర్సెనిక్, ఫాస్పరస్ వంటి హానికారక పదార్థాల వల్ల దేహంలో మైకం, దాహం, వాంతులు, నోటి పూతలు వస్తాయని వైద్యులు అంటున్నారు. అధికారులు ఎంత హెచ్చరిస్తున్నా ఏ మాత్రం ఆగకుండా లాభాపేక్షతో కృత్రిమంగా పండించడానికే మొగ్గు చూపుతున్నారు. వినియోగదారులు ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సహజ సిద్ధంగా పండిన మామిడి పండ్లు నీటిలో వేస్తే మునిగిపోతాయి. సువాసన కలిగి ఉంటాయి. కానీ కార్బైడ్తో ముగ్గించినవి నీటిలో తేలుతాయి. సువాసన కూడా ఉండదు. వినియోగదారులు ఈ విషయాన్ని గుర్తించాలి.దీర్ఘకాలిక వ్యాధులకు అవకాశం రసాయనాలతో మగ్గబెట్టిన మామిడి పండ్లు తినడం వల్ల దీర్ఘకాలిక రోగాలు వ్యాప్తి చెందుతాయి. రసాయనాల ద్వారా పండించిన మామిడి పండ్లను తీసుకున్న వారికి గ్యాస్ట్రిక్ సమస్యలు, విరేచనాలు, వాంతులే కాకుండా మనిషి పూర్తిగా నీరసించి పోయే ప్రమాదం ఉంది. రంగులు చూసి ప్రజలు మోసపోకుండా ఎవరి ఆరోగ్యాన్ని వారే కాపాడుకోవాలి. – సౌజన్య, వైద్యాధికారి, నాగులాపల్లి ఆరోగ్య కేంద్రం సురక్షిత పద్ధతులు పాటించాలి మామిడి కాయలపై కాల్షియం కార్బైడ్ పూయడాన్ని ప్రభుత్వం నిషేధించింది. అలా చేస్తే ఆహార భద్రత అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారు. రసాయనాలు పూసిన మామిడి పండ్లు తింటే నాలుక, పెదవులు మొద్దు బారినట్లు అనిపిస్తుంది. రైతులు, వ్యాపారులు సురక్షిత పద్ధతులు పాటించాలి. ప్రజల ఆరోగ్యాన్ని ధృష్టిలో పెట్టుకుని రైతులు, వ్యాపారులు సహజంగా ముగ్గబెట్టిన మామిడి పండ్లనే విక్రయించాలి. – వై.సోమ రాజశేఖర్, ఉద్యానశాఖ అధికారి, పిఠాపురం కాల్షియం కార్బైడ్తో మామిడిని ముగ్గిస్తున్న రైతులు ప్రభుత్వం నిషేధించినా కృత్రిమ విధానంపై మొగ్గు ప్రజారోగ్యానికి చేటు తప్పదంటున్న వైద్యులు కొరవడిన అధికారుల పర్యవేక్షణ, నిఘా -
బ్రహ్మాండనాయకునికి వసంతోత్సవం
● నేత్ర పర్వంగా చూర్ణ, శ్రీపుష్ప యాగోత్సవం ● క్షేత్రంలో ముగిసిన వైశాఖ బ్రహ్మోత్సవాలు ద్వారకా తిరుమల: శ్రీవారి వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలు ఆదివారం జరిగిన విశేష కార్యక్రమాలతో ముగిశాయి. ఉదయం స్వామివారి కల్యాణ మండపంలో అర్చకులు శ్రీవారు, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు అర్చన చేసి హారతులిచ్చారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు వసంతాలను సమర్పించి, చూర్ణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అందులో భాగంగా స్వామివారిని కీర్తిస్తూ అర్చకులు, మహిళా భక్తులు వడ్లు దంచారు. ఆ తరువాత రాజాధిరాజ వాహనంపై శ్రీవారికి తిరువీధి సేవ చేసి, భక్తులకు వసంతాలు అందజేశారు. రాత్రి ఆలయంలో స్వామి వారికి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్ప యాగోత్సవం నిర్వహించారు. ద్వాదశ కోవెల ప్రదక్షిణలు ఇలా.. ఉభయ దేవేరులతో శ్రీవారికి రాత్రి ఆలయంలో 12 ప్రదక్షిణలు, 12 సేవా కాలాలు, 12 రకాల పిండి వంటలతో నివేదనలు జరిపారు. అందులో అర్చకులు, పండితులు, భక్తులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒక్కొక్క ప్రదక్షిణకు ఒక్కో సేవాకాలాన్ని నిర్వహించారు. అలాగే ఒక్కో ప్రదక్షిణకు ఒక్కో రకం పిండివంటను ఆరగింపు చేసి స్వామి, అమ్మవార్లకు హారతులిచ్చారు. వీణా, వేణువు, మృదంగం, గానం, నృత్యం, శృతి, స్మృతి, ద్రవిడ వేదం, భేరి, కాహలము, గంటారవం, నిశ్శబ్దం వెరసి 12 సేవలు, 12 ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం శ్రీపుష్ప యాగోత్సవాన్ని వైభవంగా జరిపారు. ఆలయ ముఖ మండపంలో శయన మహావిష్ణువు అలంకారంలో ఉన్న స్వామి వారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. అలాగే శ్రీహరి కళాతోరణ వేదికపై నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి. ఈ వేడుకలతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. నేటి నుంచి ఆర్జిత సేవలు శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో రద్దు చేసిన నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను సోమవారం నుంచి పునరుద్ధరిస్తున్నట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. -
నీలి మబ్బులు.. ఆగమేఘాలు..
ఉదయిస్తూనే భగ్గుమంటున్న భానుడిని కారు మబ్బులు కమ్మేశాయి. శర పరంపరలా దూసుకొచ్చే రవి కిరణాల స్థానే తనువుకు తాపం తీర్చేలా చిటపట చినుకులు వర్షించాయి. ఆ పూటంతా సుమారుగా అదే వాతావరణం జిల్లాలో చాలా చోట్ల కొనసాగింది. కొత్తపేటలో ఆదివారం ఉదయం 8.30 సమయంలో కారు మబ్బులు కమ్ముకుని భారీగా వర్షించాయి. వచ్చిన పని అయిపోయినట్టు మధ్యాహ్నం 2 గంటల సమయంలో రావులపాలెం–జొన్నాడ మధ్య గౌతమి గోదావరి బ్రిడ్జి మీదుగా నీలాకాశంలో పాల నురగలాంటి మేఘాల తేరులో ఎలా వచ్చినవి అలాగే వెళ్లిపోయాయి. వినువీధిలో ప్రకృతి చిత్రాలను స్థానికులు, ప్రయాణికులు తమ సెల్ఫోన్లలో క్లిక్మనిపించి మురిసిపోయారు. – కొత్తపేట -
జాతీయ టెన్నిస్ సంఘ ఈసీ సభ్యుడిగా రామ్కుమార్
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఆలిండియా టెన్నిస్ సంఘ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా కాకినాడ జిల్లాకు చెందిన సీనియర్ టెన్నిస్ క్రీడాకారుడు, ఏపీ టెన్నిస్ సంఘ కార్యదర్శి పుప్పాల వెంకట రామ్ కుమార్ ఎన్నికయ్యారు. ఈ మేరకు జాతీయ టెన్నిస్ సంఘం నుంచి ఆదివారం ఆయన నియామక ఉత్తర్వులు అందుకున్నారు. 2017 నుంచి ఏపీ టెన్నిస్ సంఘ కార్యదర్శిగా కొనసాగుతున్న రామ్ కుమార్ ఇప్పటి వరకు నాలుగు వేల మందిని టెన్నిస్ క్రీడాకారులుగా తీర్చిదిద్దారు. 22 ఏళ్లుగా కాకినాడ, ఏపీ టెన్నిస్ సంఘానికి తన సేవలు అందిస్తున్నారు. ఏపీలో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆలిండియా టెన్నిస్ సంఘ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యునిగా రామ్ కుమార్ ఎన్నిక కావడంపై టెన్నిస్ క్రీడాకారులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో, రాష్ట్రంలో టెన్నిస్ క్రీడాభివృద్ధికి తన సహకారం అందిస్తానని తెలిపారు. కల్యాణ మండపాన్ని దేవుడు ఆశీర్వదించాడు– ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు రామచంద్రపురం రూరల్: నియోజకవర్గంలో కాపు కల్యాణ మండపం నిర్మాణానికి భూమి పూజ పూర్తయిన తరువాత భగవంతుడు వర్షం రూపంలో ఆశీర్వదించాడని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. ముందుగా మండలం హసన్బాదలో శిరిడీ సాయి ఆలయం పక్కన గల రెండు ఎకరాల పది సెంట్ల స్థలంలో తన తల్లిదండ్రులు తోట పుండరీకాక్షయ్య, లక్ష్మీకాంతం దంపతుల పేరుతో శ్రీ కృష్ణదేవరాయ కాపు కల్యాణ మండపానికి త్రిమూర్తులు, సూర్యకుమారి దంపతులు, కుమారుడు పృథ్వీరాజ్ చేతుల మీదుగా కాపు సంఘ పెద్దలు మేడిశెట్టి కృష్ణదాసు, తెనగాని ఏడుకొండలు, చవ్వాకుల సూరిబాబు, రావూరి సుబ్బారావు, రేవు శ్రీను తదితరులతో కలసి భూమి పూజ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలో కాపు సంఘీయుల చిరకాల కోరిక ఈ రోజు సాకారమైందన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సాకా బాబీ, మున్సిపల్ మాజీ చైర్మన్ గాధంశెట్టి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ స్తంభం పైనుంచి పడి ఎలక్రీ ్టషియన్ మృతి
దేవరపల్లి: విద్యుత్ స్తంభంపై నుంచి ప్రమాదవశాత్తు పడి ఓ ప్రైవేటు ఎలక్ట్రీషియన్ మృతి చెందిన ఘటన గోపాలపురం మండలం గుడ్డిగూడెంలో శనివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కధనం ప్రకారం గుడ్డిగూడేనికి చెందిన ప్రతిపాటి రాజశేఖర్ (31) శనివారం అర్ధరాత్రి సమయంలో విద్యుత్ శాఖ సిబ్బందితో కలిసి స్తంబం ఎక్కి తీగలు కలుపుతుండగా ప్రమాదవశాస్తు జారిపడి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. రాజశేఖర్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వి.సుబ్రహమణ్యం తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 22,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 24,000 గటగట (వెయ్యి) 21,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 14,000 – 15,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)14,000 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
విద్యుదాఘాతంతో రైతు మృతి
కపిలేశ్వరపురం (మండపేట): మండపేట మండలం ద్వారపూడి శివారు వేములపల్లిలో రైతు బడుగు సాల్మన్ రాజు (63) విద్యుతాఘాతంతో మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు శనివారం ఉదయం సాల్మన్రాజు యథావిధిగా పొలానికి వెళ్లాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో ఆయన బంధువు పొలానికి వెళ్లి చూడగా అక్కడ విగతజీవిగా పడి ఉన్నాడు. కొబ్బరి చెట్టు నుంచి ఇనుప ఊచతో కాయలు కోస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడుకి కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. అదుపు తప్పి వాహనాలను ఢీకొన్న ఐషర్పి.గన్నవరం: రాజవరం–పొదలాద రహదారిలో పి.గన్నవరం శివారు తాటికాయలవారిపాలెం వద్ద ఆదివారం ఒక ఐషర్ వ్యాన్ అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న మూడు మోటారు సైకిళ్లను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఆదివారం వర్షం కురవడంతో తాటికాయలవారిపాలెం సమీపంలో తేనె పరిశ్రమ వద్ద పలువురు ప్రయాణీకులు తమ మోటారు సైకిళ్లను రోడ్డు పక్కన నిలిపి షెడ్డులోకి వెళ్లారు. ఆ సమయంలో పి.గన్నవరం నుంచి రావులపాలెం వైపు వెళ్తున్న ఐషర్ వ్యాన్ అదుపుతప్పి ఆ వాహనాలను ఢీకొట్టింది. దీంతో మూడు మోటారు సైకిళ్లు ధ్వంసమయ్యాయి. అక్కడ ఉన్న ఒక వ్యక్తికి గాయాలు కావడంతో అతడిని చికిత్స నిమిత్తం అమలాపురంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తాళం పగలగొట్టి ఇంట్లో చోరీ నల్లజర్ల: దూబచర్ల శివారు గాంధీ కాలనీలో ఓ ఇంటి తాళం పగులగొట్టి దొంగలు చోరీకి పాల్పడ్డారు. శనివారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై ఎస్ఐ ఆంజనేయబాబు తెలిపిన వివరాల మేరకు ఇంటి యజమాని భీమడోలు పుష్పకు శనివారం జ్వరం రావడంతో ఇంటికి తాళం వేసి అదే గ్రామంలో ఉన్న తన తల్లి ఇంటికి వెళ్లి పడుకుంది. ఉదయం వచ్చి చూసేసరికి ఇంటితాళం పగులగొట్టి ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలోని 8 గ్రాముల బంగారు భరణాలు, 30 తులాల వెండి వస్తువులను దొంగలు దోచుకుపోయినట్టు ఆదివారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యం ధవళేశ్వరం: కాటన్ బ్యారేజ్ 9వ గేట్ వద్దకు ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకువచ్చింది. స్థానికుల సమాచారం మేరకు ధవళేశ్వరం పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహం మగ వ్యక్తిగా గుర్తించారు. ఐదడుగుల పొడవు, సుమారు 35 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతుడి శరీరంపై నీలం, బిస్కెట్ రంగు గడులు కలిగిన ఫుల్ హాండ్స్ షర్టు, సిమెంట్ కలర్ ఫ్యాంటు ఉంది. షర్టు కాలర్ వెనుక ‘శ్రీసాయి‘ పేరుతో ఒక లేబుల్ ఉన్నది. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 9440796586 , 9491999336 నెంబర్లకు తెలియజేయాలని ధవళేశ్వరం సీఐ టి.గణేష్, ఎస్సై హరిబాబు కోరారు. -
గణపయ్యకు ఘనంగా పూజలు
అయినవిల్లి: విఘ్నాలను తొలగించే అయినవిల్లి విఘ్నేశ్వరస్వామిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో స్వామికి తెల్లవారు జామున మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, లక్ష్మీగణపతి హోమం, గరిక పూజ నిర్వహించారు. అర్చకులు స్వామిని వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. స్వామికి మహా నివేదన చేశారు. సాయంత్రం ఎనిమిది గంటలకు విశేష సేవలు చేసి ఆలయ తలుపులు వేశారు. స్వామికి ఒక జంట పంచామృతాభిషకం నిర్వహించారు. అలాగే లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 46 మంది భక్త దంపతులు పాల్గొన్నారు. 16 మంది భక్తులు లక్ష్మీగణపతి హోమం నిర్వహించారు. 13 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. ఆరుగురికి తులాభారం, ఎనిమిది మందికి అన్నప్రాశన, ఒక చిన్నారికి నామకరణం చేశారు. 24 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 1694 మంది స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు స్వామికి వివిధ పూజా టిక్కెట్లు, అన్నదాన విరాళాలు ద్వారా రూ.2,04,450 ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమీషనర్, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. -
అధికారుల తప్పిదానికి వందనం
దేవరపల్లి: కూటమి ప్రభుత్వ సాంకేతిక తప్పిదాలకు ప్రభుత్వ పథకాలు అందక లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. మీ తప్పిదాన్ని మీరే సరిచేయండని మొత్తుకుంటుంటే ఆ అధికారం తమకు లేదని సదరు అధికారులు నీళ్లు నములుతున్నారు. వివరాల్లోకి వెళితే మండలం త్యాజంపూడికి చెందిన కూలీ కోడ్రు మధు ప్రసాద్కు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె వినూత్న 7, రెండో కుమార్తె స్వర్ణ 8వ తరగతి ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఏటా అమ్మఒడి పథకం వర్తించేది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పథకం సొమ్ము వారి తల్లి ఖాతాకు పడలేదు. దీంతో మధుప్రసాద్ నాలుగు నెలలుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగగా చివరికి అతని పేరుపై 29 ఎకరాల భూమి ఉందని అందువల్ల పథకం నిలిచిపోయినట్టు తెలిసింది. తనకు కేవలం 47 సెంట్ల భూమి మాత్రమే ఉందని చెప్పినా ఫలితం లేకపోయింది. దీంతో అతడు మండలం మొదలుకుని కలెక్టర్ కార్యాలయం వరకు తనకు న్యాయం చేయాలని అర్జీ పెట్టుకున్నాడు. దీనిపై అధికారులు ఆరా తీయగా గ్రామంలోని కంసాలి చెరువు, ఊర చెరువు, పలకుంట చెరువు, రామచెరువు (ఎల్పీ నంబర్ 105, 353, 462, 461) మొత్తం 29 ఎకరాలు అతని ఆధార్ కార్డుకు లింకై నట్టు వెబ్ల్యాండ్ రికార్డుల్లో చూపారు. దీంతో అతడి కుటుంబం అవాకై ్కంది. దీంతో అతడు తన రికార్డుల నుంచి ఆ చెరువులను తొలగించి వచ్చే నెలలో వచ్చే తల్లికి వందనం పథకాన్ని అందించాలని కోరాడు. పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చదివించలేక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించనునట్టు తెలిపాడు. గత నెల 28న కలెక్టర్ను కలిసి సమస్య పరిష్కరించాలని కోరామని, లేకుంటే వారం రోజుల్లో తహసీల్దార్ కార్యాలయం వద్ద కుటుంబంతో దీక్ష చేపడతామని పేర్కొన్నాడు. సమస్య పరిష్కారం కాకుంటే ఆ 29 ఎకరాల చెరువులను తనకు అప్పగించాలని కోరాడు. దీనిపై తహసీల్దార్ ఎం. శ్రీనివాస్ను వివరణ కోరగా, వెబ్లాండ్ రికార్డుల నుంచి తొలగించే ఆప్షన్ తన లాగిన్లో లేదని, వచ్చిన వెంటనే తొలగిస్తామని తెలిపారు. నిరుపేద ఆధార్కు 29 ఎకరాల్లోని చెరువులు లింకింగ్ వెబ్ల్యాండ్లో నమోదుతో పిల్లలకు అందని విద్యా పథకం లింక్ తొలగించే లాగిన్ తనకు లేదన్న తహసీల్దార్ రెండేళ్లుగా తల్లి ఖాతాకు జమకాని నిధులు -
మా మీదే కేసులు పెడతారా?
నిడదవోలు పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ ఆందోళన నిడదవోలు: కూటమి పేరుతో తామంతా పనిచేయడం వల్లే ఇక్కడ జనసేన ఎమ్మెల్యే నెగ్గారని, ఇప్పుడు ఆ పార్టీ నేతలు తమ పైనే కేసులు పెట్టే పరిస్థితి వచ్చిందని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలివీ.. రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్పై, జనసేన నాయకులపై దు ష్ప్రచారం చేస్తూ సింగవరం గ్రామానికి చెందిన టీడీపీ బూత్ ఇన్చార్జి కట్ట మణికంఠ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నాడంటూ గత నెల 26న జనసేన కార్యకర్తలు అడ్డాల సాయి లక్ష్మణ్, అచ్యుత పవన్ కుమార్లు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సై జగన్మోహన్రావు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తనపై అక్రమంగా కేసులు పెట్టారని, విచారణకు స్టేషన్కు రమ్మంటూ ఇబ్బంది పెడుతున్నారని, ఈ వేధింపులు తాళలేక తాను చనిపోతున్నానంటూ మణికంఠ సెల్ఫీ వీడియో చేసి, సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ మేరకు వేలివెన్ను నీటి సంఘం అధ్యక్షుడు, టీడీపీ సీనియర్ నేత బూరుగుపల్లి శ్రీనివాస్, ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యాన నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. మణికంఠ ఆచూకీ తెలిపే వరకూ ఎన్ని రోజులైనా అక్కడే ఉంటామని నిరసన తెలిపారు. వారితో సీఐ తిలక్ చర్చించినా ఫలితం లేకుండా పోయింది. మణికంఠ తండ్రి కృష్ణ మా ట్లాడుతూ, 1989 నుంచి టీడీపీ కోసం పని చేసిన తమకు జనసేన నాయకుల వల్ల రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగవరంలో భూ ఆక్రమణలపై పోరాడుతుంటే తన కుమారుడు మణికంఠపై జనసేన నాయకులు అక్రమ కేసులు పెట్టడమే కాకుండా ఉద్యోగం నుంచి తొలగించేందుకు కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకుంటానంటూ మణికంఠ సెల్ఫీ వీడియో పెట్టాడని బోరున విలపించారు. టీడీపీ నాయకులమైన తమకే ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. -
● నీట్గా నిర్వహణ
వైద్య విద్యా కోర్సులలో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదివారం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్షకు జిల్లావ్యాప్తంగా 3,341 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 3,242 మంది హాజరయ్యారని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 99 మంది హాజరు కాలేదన్నారు. అభ్యర్థుల కోసం రాజమహేంద్రవరం అర్బన్లో ఎస్కేవీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆర్ట్స్ కళాశాల, ఎస్కేవీటీ ఇంగ్లిష్ మీడియం ప్రభుత్వ హైస్కూల్, ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్లోని కేంద్రీయ విద్యాలయం, ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్తో పాటు నెహ్రూ నగర్, దానవాయిపేటల్లోని మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూళ్లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. అలాగే, రాజానగరం వద్ద ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల, కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో కూడా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద సౌకర్యాలను, పరీక్షల నిర్వహణను రాజమహేంద్రవరం ఇన్చార్జి ఆర్డీఓ కె.ఆనందరావు పరిశీలించారు. – సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం) -
రైతులపై పగాకు
సోమవారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2026ఉండేశ్వరపురంలో పొగాకు గ్రేడింగ్ చేస్తున్న మహిళలుసాక్షి, రాజమహేంద్రవరం: నల్లరేగడి భూముల్లో (బ్లాక్ సాయిల్స్ – బీఎస్) రైతులు పండిస్తున్న పొగాకు కొనుగోలు చేయకుండా ప్రభుత్వం అంతు లేని అలక్ష్యం వహిస్తోంది. దేవరపల్లిలోని పొగాకు వేలం కేంద్రంలో ఏటా మార్చి 15వ తేదీనే బీఎస్ పొగాకు కొనుగోళ్లు ప్రారంభమవుతూంటాయి. కానీ, ఈ ఏడాది మే మొదటి వారం వచ్చేసినా ఒక్క బేలు కూడా కొనుగోలు చేసిన దాఖలాల్లేవు. కొనుగోళ్లలో జాప్యం ఫలితంగా సుమారు 50 రోజులుగా రైతుల వద్దనే పెద్ద మొత్తంలో పొగాకు నిల్వ ఉండిపోయింది. ఇలాగే ఆలస్యం చేస్తే పొగాకు నాణ్యత తగ్గిపోతుందని, ఎండల తీవ్రతకు తరుగు వచ్చి, నష్టాల్లో కూరుకుపోతామని బీఎస్ పొగాకు సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. కర్ణాటకలోని మైసూరులో కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయిన తరువాత జూన్ నెలలో దేవరపల్లిలో బీఎస్ పొగాకు కొనుగోళ్లు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇదెంతవరకూ సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు. రూ.446 కోట్ల బీఎస్ పొగాకు నిల్వ అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలోని సీతానగరం, కోరుకొండ, రాజమహేంద్రవరం రూరల్ తొర్రేడు, రాజానగరం పరిసర ప్రాంతాల్లోని నల్లరేగడి నేలల్లో 1,120.94 హెక్టార్లలో రైతులు బీఎస్ పొగాకు సాగు చేస్తున్నారు. బ్లాక్ సాయిల్స్ పరిధిలో సుమారు 965 పొగాకు బ్యారన్లున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 5 వేల మంది రైతులు ఈ రకం పొగాకు సాగుపై ఆధారపడి ఉన్నారు. సీజన్ మొదలైనప్పటికీ ఇప్పటి వరకూ కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో జిల్లావ్యాప్తంగా రైతుల వద్ద రూ.446 కోట్ల విలువైన 2.03 మిలియన్ కిలోల బీఎస్ పొగాకు నిల్వ ఉండిపోయింది. ఒక్కో రైతు వద్ద రూ.50 లక్షల నుంచి రూ.కోటి విలువైన పొగాకు నిల్వలు ఉండిపోయాయి. ఎకరం పొగాకు సాగుకు అన్ని ఖర్చులూ కలిపి ఒక్కో రైతు రూ.2.70 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం కొనుగోళ్లు లేకపోవడంతో దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పొలం కౌలు, సాగు ఖర్చులు, క్యూరింగ్, గ్రేడింగ్, కలప కొనుగోలు, వెదురు కర్రల కొనుగోళ్లకు పలువురు రైతులు ముందుగానే అప్పులు తెచ్చి, చెల్లించాల్సిన పరిస్థితి. బ్యాంకు నుంచి తీసుకున్న లింకేజీ రుణాలకు నెలల తరబడి వడ్డీ చెల్లింపులు వారికి మరింత భారంగా మారుతున్నాయి. వర్జీనియా రైతులకూ నిరాశే టుబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలో దేవరపల్లి, జంగారెడ్డిగూడెం–1, 2, కొయ్యలగూడెం, గోపాలపురాల్లో వేలం కేంద్రాలున్నాయి. ఈ ప్రాంతాల్లో 12,612 మంది రైతులు 29,132.48 హెక్టార్లలో వర్జీనియా పొగాకు సాగు చేశారు. పంట ఆశాజనకంగా ఉండటంతో ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. బోర్డు 49.32 మిలియన్ కిలోల ఉత్పత్తికి మాత్రమే అనుమతివ్వగా.. సుమారు 85 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నారు. కొనుగోలుదారులు పూర్తి స్థాయిలో రాకపోవడం, గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆయా వేలం కేంద్రాల్లో అమ్మకాలు మందకొడిగా జరుగుతున్నాయి. కిలో ప్రారంభ గరిష్ట ధర రూ.290 ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తూండగా.. రూ.265 కంటే ఎక్కువ ఇచ్చేందుకు వ్యాపారులు సుముఖంగా లేరు. దీంతో, తాము నష్టపోతున్నామని వర్జీనియా పొగాకు రైతులు వాపోతున్నారు. మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో రైతుల వద్ద ఇటు బీఎస్, అటు వర్జీనియా పొగాకు నిల్వలు భారీగా పేరుకుపోతున్నాయి. ఒక్క వర్జీనియా పొగాకు నిల్వలే రూ.2,200 కోట్లకు పైగా ఉండగా.. మరో రూ.446 కోట్ల మేర బీఎస్ పొగాకు నిల్వలు రైతుల వద్ద ఉండిపోయాయి. కొనుగోళ్లు ప్రారంభం కాక నల్లరేగడి నేలల్లో పొగాకు పండించిన రైతులు నష్టపోతున్నా.. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర రాకపోయినా చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 8నాడు అండగా నిలిచిన జగన్ ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పొగాకు రైతులకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అండగా నిలిచింది. అప్పట్లో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థానిక నాయకులు తీసుకెళ్లగా.. ఆయన వెంటనే స్పందించారు. తక్షణం రూ.100 కోట్లు విడుదల చేసి, మార్క్ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేసి, రైతులకు అండగా నిలిచారు. అలాగే, అప్పట్లో తుపాను ప్రభావంతో దెబ్బ తిన్న పొగాకు రైతులకు సైతం నష్టపరిహారం ఇచ్చిన ఘనత జగన్కే దక్కింది.ఆలస్యమైతే లో గ్రేడ్లోకి... నేను 25 ఎకరాల నల్లరేగడి నేలల్లో పొగాకు సాగు చేశాను. నా దగ్గర పొగాకు నిల్వ ఉంది. కొనుగోళ్లు ఆలస్యమైతే రంగు మారి, లో గ్రేడ్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. అదే జరిగితే ఆశించిన ధర దక్కకపోగా.. పంట సాగుకు చేసిన అప్పులు కూడా తీర్చలేని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వం స్పందించి వెంటనే పొగాకు కొనుగోలుకు చర్యలు తీసుకోవాలి. – మాకల ఈశ్వరరావు, పొగాకు రైతు, ఉండేశ్వరపురం, సీతానగరం మండలం కొనుగోళ్లు ప్రారంభించకుంటే ఆందోళన నల్లరేగడి నేలల్లో పొగాకు కొనుగోళ్లను చంద్రబాబు ప్రభుత్వం తక్షణం ప్రారంభిచకపోతే రైతుల పక్షాన ఆందోళనకు దిగుతాం. ఇప్పటికే 50 రోజులకు పైగా పొగాకు కొనుగోళ్లు లేక, నిల్వలు పేరుకుపోయి రైతులు అగమ్యగోచరంలో ఉన్నా ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గం. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరచి పొగాకు రైతులను ఆదుకోవాలి. – జక్కంపూడి రాజా, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే బీఎస్ పొగాకు కొనుగోళ్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం ఏటా మార్చి 15 నుంచి 30లోగా కొనుగోళ్లు ఈ ఏడాది ఇప్పటికీ ప్రారంభం కాని ప్రక్రియ ఆందోళనలో రైతులు -
అకాల కష్టం
● అన్నదాతపై వరుణుడి కన్నెర్ర ● పలు ప్రాంతాల్లో వర్షాలు ● నీట తడిసిన ధాన్యం రాయవరం/అనపర్తి/పెరవలి: కొన్నాళ్లుగా చండప్రచండంగా కాస్తున్న ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేలా ఆదివారం ఉదయం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. రాజమహేంద్రవరం, రాజానగరం తదితర ప్రాంతాల్లో జల్లులు కురవగా.. అనపర్తి, బిక్కవోలు, రాయవరం, పెరవలి తదితర మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ప్రజలు సేద తీరగా.. ఈ అకాల వర్షాలు అన్నదాతలకు అనుకోని కష్టం తెచ్చిపెట్టాయి. పలు గ్రామాల్లో ఉదయం బలమైన ఈదురు గాలులు వీచాయి. ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమైంది. దీంతో, రోడ్ల పక్కన, కళ్లాల్లోను ఆరబెట్టిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పరుగులు తీశారు. చూస్తూండగానే ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో పలువురు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని బరకాలతో కాపాడుకునేందుకు ప్రయత్నం చేశారు. ఆ అవకాశం లేని వారు అలాగే వదిలేయడంతో ధాన్యపు రాశులు తడిసిపోయాయి. కళ్లాల్లోని ధాన్యం కళ్ల ముందే వర్షంలో తడిసి ముద్దవుతూంటే నిస్సహాయంగా చూస్తూ కన్నీరు పెట్టుకున్నారు. వాన తగ్గిన తరువాత నీట మునిగిన ధాన్యాన్ని చేతులతో దేవుకుంటూ రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. పెరవలి మండలంలోని పలు గ్రామాల్లో బస్తాల్లో పట్టి ఉన్న ధాన్యం తడిసిపోయింది. కొందరు రైతులకై తే మిల్లులకు తరలించిన ధాన్యాన్ని ట్రాక్టర్ల నుంచి దించకపోవటంతో అలాగే తడిసిపోయింది. అసలే తేమ పేరుతో ధాన్యానికి అంతంత మాత్రమే ధర ఇస్తున్నారని, ఇప్పుడు అకాల వర్షానికి తడిసిపోవడంతో ధర మరింత తగ్గిపోతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. పుట్టెడు కష్టాల్లో ఉన్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. మరోవైపు పలు ప్రాంతాల్లో భారీ వర్షానికి ఇటుక బట్టీలు పూర్తిగా తడిసిపోవడంతో వాటి యజమానులు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు పెరవలి మండలంలో ఈదురు గాలులకు అరటి తోటలు నేలనంటాయి. ప్రతి తోటలో 10 నుంచి 50 వరకూ బొందలు విరిగిపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ లైన్లు తెగి పడటంతో పెరవలి మండలంలో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకూ కరెంటు సరఫరా నిలిచిపోయి, ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెరవలి మండలం ముక్కామలలో ధాన్యాన్ని హడావుడిగా బస్తాలకు పడుతున్న రైతులు అనపర్తిలో వాన నీట తడిసిన ధాన్యపు రాశులు రాయవరం మండలం లొల్లలో ధాన్యాన్ని కాపాడుకునేందుకు అన్నదాతల పాట్లు -
నేడు పీజీఆర్ఎస్
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం కలెక్టరేట్లో సోమవారం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ కీర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా ప్రజాప్రతినిధులతో అమరావతిలో సోమవారం నిర్వహించే సమావేశానికి తాను హాజరు కానున్నందున.. ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్, జిల్లా అధికారులు అర్జీలు స్వీకరిస్తారని వివరించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల ఆధ్వర్యాన జిల్లా స్థాయి రెవెన్యూ క్లినిక్ జరుగుతుందన్నారు. డివిజన్, మండల స్థాయిల్లో కూడా పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లు నిర్వహిస్తామన్నారు. ప్రజలు 1100 టోల్ ఫ్రీ నంబర్కు కూడా ఫిర్యాదు చేయవచ్చని, అర్జీల పరిష్కార స్థితిని తెలుసుకోవచ్చని, 95523 00009 వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా పౌర సేవలు పొందవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. ‘మట్టి’ దొంగలు దొరికేనా!సాక్షి టాస్క్ఫోర్స్: కడియపులంకలో నిర్మిస్తున్న ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో రూ.లక్షల విలువైన నల్లమట్టిని దోచుకుపోయిన దుండగులను అధికారులు పట్టుకుంటారా అనే సందేహాలను మండల ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సహజ వనరుల దోపిడీయే ప్రధాన అజెండా పని చేస్తున్న కొందరు నాయకులు ఈ మట్టి దోపిడీకి కూడా అండదండలు అందించారనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. నిత్యం వందలాది మంది తిరిగే రోడ్డు పక్కనే ఉన్న మట్టిని రాత్రికి రాత్రే మాయం చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. గతంలోనే మట్టి దోపిడీకి సిద్ధమైనప్పటికీ మీడియాలో కథనాలు రావడంతో ఆ మట్టిని పరిరక్షించాల్సిందిగా సంబంధిత నిర్మాణ కాంట్రాక్టర్కు రెవెన్యూ యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసినట్లు చెబుతున్నారు. మరోవైపు ముఖ్య నాయకుల మధ్య వాటాలు కుదరనందువల్లనే అప్పట్లో మట్టి జోలికి వెళ్లలేదని కూడా అంటున్నారు. అయితే, ఇప్పుడు హఠాత్తుగా మట్టి దోచుకుపోవడం వెనుక భారీ మంత్రాంగమే నడిచిందని, వాటాలపై అక్రమార్కులు స్పష్టతకు వచ్చారని స్థానికులు చెబుతున్నారు. కూటమి పార్టీల్లోని కీలక నాయకులకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది. వారి ప్రమేయమే కనుక లేకపోతే.. ప్రతి విషయానికి మీడియా ముందుకు వచ్చి మైకులు పట్టుకునే నాయకులు మట్టి దోపిడీని కూడా అదే రీతిలో ఎందుకు ఖండించడం లేదనే ప్రశ్న వస్తోంది. మట్టి దోపిడీ నిగ్గు తేల్చాలని, బాధ్యులను శిక్షించాలని పలు రాజకీయ పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా మట్టి మాయంపై మండలంలోని కీలక నాయకులకు ముందస్తుగానే సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. ‘నాకు చెప్పకు నీకెలా నచ్చితే అలా చేసుకో’ అంటూ ఒక నేత.. ‘మండలంలో ఏం జరిగానా నా మెడకే చుడుతున్నారంటూ మరో ముఖ్య నాయకుడు’ అన్నట్లు చెబుతున్నారు. అయితే చివరికి ఏం ‘ఒప్పందం’ కుదిరిందో ఏమో కానీ మట్టి మాత్రం మాయమైపోయింది. ఉత్కంఠకు నేటితో తెర.. నేడు యానాం నియోజకవర్గ ఓట్ల లెక్కింపు యానాం: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి పరిధిలోని యానాం అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు సోమవారం జరగనుంది. గత నెల 9న పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా యానాం నియోజకవర్గ ఓట్ల లెక్కింపు స్థానిక సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటిగ్ హాలులో ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. దీనికోసం విస్తృత బందోబస్తు చేసినట్టు రిటర్నింగ్ అధికారి శివరాజ్ మీనా తెలిపారు. ఈ ఎన్నికల్లో మొత్తం 35,445 మంది ఓటర్లతో పాటు 360 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కళాశాలలో ఉదయం 5 గంటలకు జనరల్ అబ్జర్వర్ సమక్షంలో ఈవీఎంలను ర్యాండమైజ్ చేసి, 7.30 గంటలకు కౌటింగ్ కేంద్రానికి చేరుస్తారు. తొలుత 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లను ఒక టేబుల్ వద్ద, 8.30 గంటలకు మరో 10 టేబుళ్లపై ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. మొత్తం 5 రౌండ్లలో 42 పోలింగ్ బూత్లకు సంబంధించి ఓట్లు లెక్కిస్తారన్నారు. ఫలితం మధ్యాహ్నం 12 గంటలకు ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో స్వతంత్రులతో కలిపి మొత్తం 14 మంది పోటీ చేయగా ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు మధ్యే పోటీ నెలకొంది. ఫిట్నెస్ లేని బస్సులపై చర్యలుఅమలాపురం రూరల్: నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా విద్యా సంస్థల బస్సులు మే 15 కల్లా ఫిట్నెస్ పొందాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని కోనసీమ జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు హెచ్చరించారు. జిల్లాలో ఉన్న 71 విద్యాసంస్థలకు 784 బస్సులు ఉన్నాయని, వాటికి విధిగా ఫిట్నెస్ పొందాలని డీటీఓ పేర్కొన్నారు. బీవీసీ ఇంజినీరింగ్ విద్యా సంస్థకు చెందిన 27 బస్సులను ఆదివారం తనిఖీ చేసినట్టు ఆయన తెలిపారు. -
● బాబూ.. ఆకలి బాపు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): అతడి జీవితంతో విధి ఆటలాడుకుంది. సాపీగా సాగిపోతున్న అతని జీవితం ఓ ప్రమాదం కారణంగా రోడ్డున పడింది. కడపకు చెందిన రామయ్య దీనగాథ ఇది. అతడు గతంలో డ్రైవర్గా పని చేసేవాడు. 2015లో జరిగిన ఒక ప్రమాదంలో అతడి తుంటి ఎముక విరిగిపోయింది. నడవలేని పరిస్థితి వచ్చింది. కుటుంబాన్ని పోషించుకోవడం భారంగా మారింది. ప్రభుత్వం కరుణించి పెన్షన్ కూడా ఇవ్వడం లేదు. ఏ పనీ చేయలేని దుస్థితిలో కూరుకుపోయిన అతడు.. ఉన్న ఊరులో ఉండలేక.. ఏం చేయాలో పాలుపోక.. ఒక్కడే రాజమహేంద్రవరం చేరుకున్నాడు. విధి లేని పరిస్థితుల్లో 65 సంవత్సరాల వయస్సులో.. తాను బతకడానికి ‘బాపు’నే నమ్ముకున్నాడు. ఆ మహనీయుడు గాంధీజీ వేషధారణలో రోడ్డుపై కూర్చుని.. ఎవరైనా జాలితో వేసిన చిల్లరతో పరమ దీనావస్థలో అతడు జీవనం సాగిస్తున్నాడు. ఉదయమే కాస్త టిఫిన్ తిని, కాలకృత్యాలు తీర్చుకుంటాడు. ఒంటికి వెండి రంగు పూసుకుని, మహాత్మా గాంధీ వేషధారణ వేసుకుంటాడు. నిలబడలేని పరిస్థితి కావడంతో చిన్న ప్లాస్టిక్ బల్లపై ఏదైనా సెంటర్లో రోడ్డు పక్కన కూర్చుంటాడు. మధ్యాహ్న భోజన సమయం వరకూ.. 40 డిగ్రీల సెల్సియస్ ఎండ కాస్తున్నా సరే కదలకుండా అక్కడే ఉంటాడు. ఏమైనా తింటే కడుపు నిండుగా ఉండి, ఇబ్బంది కలుగుతుందని, మంచినీరు కూడా తాగకుండా అలాగే కూర్చుంటున్నానని తన దయనీయ పరిస్థితిని ‘సాక్షి’తో పంచుకున్నాడు. మధ్యాహ్న భోజనం తరువాత సాయంత్రం 6 గంటల వరకూ పుష్కర ఘాట్ వద్ద అదే బల్లపై కూర్చుని ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తూంటాడు. రాత్రి వేళ పుష్కర ఘాట్ వద్ద ఫుట్పాత్ పైనే నిద్రిస్తూంటాడు. రామయ్య దీనావస్థను ‘సాక్షి’.. స్వర్ణాంరధ్ర వృద్ధాశ్రమ నిర్వాహకుడు గుబ్బల రాంబాబు దృష్టికి తీసుకు వెళ్లగా.. అతడికి కావలసిన సహాయం చేస్తానని భరోసా ఇచ్చారు. -
నా చావుకు కారణం మీ అనుచరులే..
నిడదవోలు రూరల్: రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అనుచరుల టార్చర్ వల్లే నేను చనిపోతున్నాను.. అకారణంగా ఓ కేసులో ఇరికించి ఇబ్బంది పెడుతున్నారని తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం సింగవరం గ్రామానికి చెందిన టీడీపీ బూత్ ఇన్చార్జి కట్టా మణికంఠ సోషల్ మీడియాలో ఆదివారం మధ్యాహ్నం సెల్ఫీ వీడియో పోస్ట్ చేశాడు. దీంతో మణికంఠ ఆచూకీ తెలపాలని టీడీపీ నాయకులు నిడదవోలు పట్టణ పోలీస్స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. మరో వైపు మణికంఠ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. సెల్ఫీ వీడియో సారాంశం ఇదీ.. ‘నా పేరు కట్టా మణికంఠ. మాది నిడదవోలు మండలం సింగవరం. నాన్న.. నన్ను క్షమించండి.. నేను చనిపోతున్నా. అక్రమ కేసులు తట్టుకోలేకపోతున్నాను. మంత్రి కందుల దుర్గేష్ గారూ.. నేను తెలుగుదేశం కార్యకర్తను. మా నాన్న గారు తెలుగుదేశం పార్టీ నాయకులు. 1989 నుంచి అదే టీడీపీలో ఉన్నారు. సింగవరంలో చందు అనే వ్యక్తి గతంలో దేవదాయశాఖకు సంబంధించిన స్థలాలు కబ్జా చేశాడు. పంచాయతీరాజ్, స్కూల్ స్థలాలు కబ్జా చేశాడు. దానిపై మా నాన్న 14 నెలలుగా పోరాటం చేస్తున్నారు. టీడీపీ బూత్ ఇన్చార్జినైన నా మీద కేసులు పెడితే ఇంకా ఎందుకు సార్ పార్టీ. మీ నియోజకవర్గంలో బీసీలంటే అంత చులకనా? ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించి నా ఫోన్ సీజ్ చేశారు. ఎస్సై, సీఐ పట్టించుకోవడం లేదు. నేను పనిచేసిన చోటుకు వచ్చి పోలీస్స్టేషన్కు తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. ఊర్లో భూములు కబ్జా చేసిన చందు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. నాకు గుండె దడగా ఉంది. తట్టుకోలేకపోతున్నాను. నేను చనిపోతున్నాను. నా చావుకు కారణం డాక్టర్ తోపరాల కల్యాణ చక్రవర్తి, పెన్మత్స చందు వర్మ, అచ్యుత్ పవన్, సాయిలక్ష్మణ్ అడ్డాల, ఎస్సై జగన్మోహన్రావు, సీఐ తిలక్లే. నేను చనిపోతున్నాను.. నా వల్ల కావడం లేదు.’ అని పోస్టు చేశాడు. -
మట్టి.. కొల్లగొట్టి
సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో మైనింగ్ మాఫియా బరి తెగిస్తోంది. కూటమిలోని ప్రధాన నేతలే మట్టి మాఫియా అవతారమెత్తి, చెరువులను చెరబడుతున్నారు. కొండలను కరిగించేస్తున్నారు. రేయింబవళ్లు అడ్డూ అదుపూ లేకుండా అక్రమంగా గ్రావెల్ తవ్వి విక్రయించేస్తూ రూ.కోట్లు దండుకుంటున్నారు. రాజానగరం నియోజకవర్గంలో తాగు, సాగునీటి చెరువులు, ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలనే తేడా లేకుండా.. శ్రీమూడు టిప్పర్లు.. ఆరు లారీలుశ్రీ అన్న చందంగా ఈ అక్రమ దందా సాగుతోంది. ముఖ్యంగా కోరుకొండ మండలం గాడాల, జంబూపట్నం, కొత్త మునగాల, నిడిగట్ల గ్రామాల్లో చెరువులు, కోటికేశవరం, సీతానగరం మండలం నల్లగొండలో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. నిబంధనలు చెరువులో తొక్కి.. ప్రభుత్వ స్థలాల్లో మట్టి తవ్వితే ప్రభుత్వ అభివృద్ధి పనులకు, ప్రజా అవసరాలకు మాత్రమే వినియోగించాలి. కానీ, మట్టి మాఫియా ఈ నిబంధనలన్నింటినీ చెరువుల్లో తొక్కేస్తూ, దర్జాగా ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు విక్రయిస్తోంది. సాధారణంగా చెరువుల్లో మీటరు లోతు వరకూ మాత్రమే మట్టి తవ్వకాలు చేపట్టాలి. అది కూడా ఒక నిర్దిష్ట ప్రదేశంలో మాత్రమే తవ్వాలి. కానీ, నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారం అడ్డగోలుగా తవ్వకాలు సాగిస్తున్నారు. కొన్నిచోట్ల 10 నుంచి 15 అడుగుల లోతు వరకూ కూడా తవ్వేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ అగాధాల్లా తవ్వేసి, మట్టి తరలించుకుపోతున్నారు. ఫలితంగా వర్షాలు కురిసి, ఈ చెరువుల్లో నీరు చేరితే పశువులు, మనుషుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితులు నెలకొన్నాయి. నిడిగట్లలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇక్కడ రాత్రి, పగలు అనే తేడా లేకుండా మట్టి తవ్వేస్తున్నారు. నిత్యం వందలాదిగా మట్టి లారీలు దూసుకుపోతూండటంతో రహదారులు దెబ్బ తింటున్నాయి. ఈ వాహనాలు రేపే దుమ్ము, ధూళి ఇళ్లలోకి చేరి, స్థానికులు అనారోగ్యాల బారిన పడుతున్న దుస్థితి నెలకొంది. దుమ్ము మరీ ఎక్కువగా ఉంటే తూతూమంత్రంగా రోడ్డుపై నీళ్లు జల్లి చేతులు దులుపుకొంటున్నారు. తిరిగి గంటల వ్యవధిలోనే దుమ్ము రేగిపోతోంది. నెలకు రూ.60 కోట్లకు పైగా దోపిడీ? నియోజకవర్గంలోని చెరువుల్లో తవ్వుతున్న నల్లరేగడి మట్టిని కడియం, ఆలమూరు, రావులపాలెం ప్రాంతాల్లోని ఇటుక బట్టీలు, భవన నిర్మాణాలు, రియల్ ఎస్టేట్ వెంచర్లను ఎత్తు చేసేందుకు తరలిస్తున్నారు. ఎర్రమట్టి అయితే కడియం నర్సరీలకు తరలిస్తున్నారు. నల్లరేగడి, ఇసుక నేలల్లోని మట్టిని టిప్పర్కు రూ.10 వేలు, ఎర్ర మట్టి (గ్రావెల్) రూ.20 వేల నుంచి రూ.25 వేల చొప్పున అమ్ముకుంటున్నారు. సాధారణంగా రోడ్డు అభివృద్ధి పనుల్లో బెర్ములు (రోడ్డు అంచులు) ఎత్తు చేయడానికి ఎర్ర గ్రావెల్ వాడతారు. దీనిని కూడా మట్టి మాఫియా అవకాశంగా తీసుకుంటోంది. లారీ చెరువు మట్టిని రూ.3,500కు విక్రయిస్తున్నారు. ఈవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి రోజూ 500 లారీల మట్టి తరలిపోతోంది. ఈవిధంగా రోజుకు రూ.2 కోట్లకు పైగా, నెలకు సుమారు రూ.60 కోట్ల వరకూ అక్రమార్కుల జేబుల్లోకి వెళుతున్నట్లు సమాచారం. ఇందులో ఎవరి వాటా తీసుకుంటున్నట్టు తెలిసింది. కన్నెత్తి చూడని అధికారులు కూటమి నేతలే గ్రావెల్ దందా సాగిస్తూండటంతో ఇరి గేషన్, మైనింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్ని లారీలకు అనుమతులు తీసుకున్నారు, ఎన్ని లారీలు తరలించారు, కాలువ గట్టుపై ఏ మేరకు తవ్వకాలు చేపట్టారు తదితర విషయాలు ఆరా తీయడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు కాలువ గట్టునే కొల్లగొడుతున్నా అధికారుల్లో చలనం లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. బరి తెగిస్తున్న మట్టి మాఫియా అక్రమార్కుల చెరలో చెరువులు ప్రతి రోజూ వందల లారీల్లో అక్రమ రవాణా రూ.కోట్లు దండుకుంటున్న కూటమి నేతలు -
పేపరు మిల్లు కార్మికుల ఆందోళన
● అక్రమ లాకౌట్పై ఆవేదన ● కార్మిక శాఖ కార్యాలయంలో చర్చలుకడియం: మాధవరాయుడుపాలెం పంచాయతీ పరిధిలోని ఏపీ పేపర్ మిల్లుకు యాజమాన్యం లాకౌట్ ప్రకటించడంతో మిల్లు వద్ద పర్మినెంట్, కాంట్రాక్టు కార్మికులు శనివారం కూడా ఆందోళన కొనసాగించారు. యాజమాన్యం, అధికారులతో మిల్లులోని ఐదు యూనియన్లకు సంబంధించిన 8 మంది జేఏసీ సభ్యులు చర్చలు జరుపుతున్నారు. తమకు ఎటువంటి ముందస్తు నోటీసులూ ఇవ్వకుండా యాజమాన్యం అర్ధరాత్రి అక్రమంగా లాకౌట్ ప్రకటించడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు తక్షణం కొత్త వేతన ఒప్పందం అమలు చేయాలనే డిమాండుతో కాంట్రాక్టు కార్మికులు ఏడు రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం విదితమే. వారితో శనివారం చర్చలు జరుగుతాయని ప్రకటించిన యాజమాన్యం, మరోవైపు లాకౌట్ ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి. కాంట్రాక్టు కార్మికులు సమ్మెలో ఉండటంతో మిల్లు కార్యకలాపాలు నిలిచిపోకూడదనే ఉద్దేశంతో తామంతా ఓవర్ టైమ్ కూడా పని చేశామని, అయినప్పటికీ లాకౌట్ ప్రకటించడం దారుణమని పలువురు పర్మినెంటు కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. చట్ట విరుద్ధంగా లాకౌట్ ప్రకటించి, తమను అన్యాయంగా గేటు బయటే నిలిపివేయడంతో భవిష్యత్తు కార్యాచరణపై మిల్లు వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో శనివారం ఉదయం నుంచీ కార్మికులు చర్చల్లో పాల్గొన్నారు. కాగా, కలెక్టరేట్లోని కార్మిక శాఖ అధికారుల ముందు లేబర్ కాంట్రాక్టర్లు, యాజమాన్యం మధ్య శనివారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. తిరిగి సోమవారం ఈ చర్చలు జరగనున్నాయి. కాంట్రాక్టు కార్మికులు లేకుండానే చర్చలు జరగడం గమనార్హం. మరోవైపు జేఏసీలో చురుకుగా ఉంటున్న 10 మంది కార్మికులకు యాజమాన్యం సస్పెన్షన్ నోటీసులు కూడా ఇచ్చింది. తద్వారా కార్మికుల ఐక్యతను దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం ఇష్టారీతిన వ్యవహరిస్తూ తమను బానిసల మాదిరిగా భావిస్తోందని ఆవేదన చెందుతున్నారు. మిల్లు గేటు వద్ద కడియం సీఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యాన ఎస్సైలు నాగదుర్గాప్రసాద్, ప్రసన్నలు తమ సిబ్బందితో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. -
కడియపులంకలో మట్టి దోచేశారు
కడియం: కడియపులంకలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మిస్తున్న స్థలంలోని నల్లమట్టిని రాత్రికి రాత్రే కొంతమంది దోచుకుపోయారు. ‘అడ్డగోలు దోపిడీ’ శీర్షికన మార్చి 14న ప్రచురించిన కథనం ద్వారా ఇక్కడ జరుగుతున్న మట్టి దోపిడీని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. అప్పటి నుంచీ ఇటువైపు తొంగి చూడని అక్రమార్కులు శుక్రవారం ఒక్కసారిగా చెలరేగిపోయారు. రాత్రికి రాత్రే దాదాపు రూ.3 లక్షల విలువైన మట్టిని 60కి పైగా ట్రాక్టర్లతో తరలించుకుపోయారని స్థానిక రైతులు చెబుతున్నారు. కడియపులంకకు చెందిన అన్నందేవుల రామసూర్య సీతామహాలక్ష్మి రూ.కోట్ల విలువైన 80 సెంట్ల భూమిని గ్రామ పంచాయతీకి దానంగా ఇచ్చి, అందులో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించాలని కోరారు. ఈ మేరకు ఇక్కడ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో నల్లమట్టిని దోచుకుని, ఇసుకతో నింపే ప్రయత్నాలను కొందరు స్థానిక నాయకులు ప్రారంభించారు. దీనిపై మీడియా దృష్టి పెట్టడంతో కొన్నాళ్లు మిన్నకుండిపోయారు. ఇప్పుడు హఠాత్తుగా ఈ మట్టిని మాయం చేయడం వెనుక మండలంలోని ప్రముఖ నాయకుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మట్టి మాయమైందంటూ ఆసుపత్రి నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న సైట్ సూపర్వైజర్ కడియం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దాత ఇచ్చిన స్థలంలో మట్టిని మాయం చేయడంపై మండల వ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. సంబంధిత అధికారులు దీనిపై దృష్టి పెట్టి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
వెండి వీణ సమర్పణ
అనపర్తి: స్థానిక పాత ఊరిలో కొలువైన పార్వతీ సమేత ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారికి దాతలు సుమారు మూడు కిలోల వెండి వీణను సమర్పించారు. గ్రామానికి చెందిన పడాల నాగమోహనరెడ్డి, అలేఖ్యాదేవి దంపతులు తమ కుమార్తె నధిర కైవల్యతో కలసి ఈ వీణను అర్చకులు కామేష్శర్మ సోదరులకు శనివారం అందజేశారు. ప్రత్యేక పూజల అనంతరం ఈ వీణను అమ్మవారికి అలంకరించారు. ‘నిమ్మ’దించిన ధర దేవరపల్లి: మొన్నటి వరకూ మార్కెట్లో ఎగసిన నిమ్మకాయల ధర వారం రోజులుగా తగ్గుముఖం పట్టింది. గత నెలలో కిలో నిమ్మకాయల ధర రూ.130 నుంచి రూ.150 వరకూ పలికింది. ఇది మరింత పెరిగి రూ.180కి చేరుతుందని రైతులు ఆశ పడ్డారు. కానీ, వారి ఆశలపై నీల్లు జల్లేలా వారం రోజులుగా యాదవోలు మార్కెట్లో ధర దిగజారింది. ప్రస్తుతం కిలో నిమ్మకాయల ధర రూ.50 నుంచి రూ.60 వరకూ మాత్రమే పలుకుతోంది. ధర సగానికి పైగా తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీస ధర కిలోకు రూ.100 ఉంటే గిట్టుబాటు అవుతుందని అంటున్నారు. కాయల నాణ్యత, సైజు తగ్గడంతో రసం రావడం లేదని, దీంతో మార్కెట్లో ధర తగ్గినట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఈ నెలతో నిమ్మకాయల సీజన్ ముగుస్తుంది. ప్రస్తుతం యాదవోలు మార్కెట్కు రోజుకు 10 టన్నుల కాయలు అమ్మకానికి వస్తున్నాయి. ఈ ఏడాది దిగుబడులు తగ్గగా, మార్కెట్లో ధర కూడా లేకపోవడం వల్ల కౌలు సొమ్ము కూడా రాని పరిస్థితి ఏర్పడిందని కౌలు రైతులు ఆవేదన చెందుతున్నారు. రీ వెరిఫికేషన్ దరఖాస్తుకు 7 వరకు అవకాశం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పదో తరగతి పరీక్ష ఫలితాల్లో అనుమానాలున్న విద్యార్థులు రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్కు ఈ నెల ఏడో తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తమతమ పాఠశాలల లాగిన్ల ద్వారా దరఖాస్తులు సమర్పించాలన్నారు. ప్రతి సబ్జెక్టుకు రీకౌంటింగ్కు రూ.500, రీవెరిఫికేషన్కు రూ.1,000 చొప్పున చెల్లించాలన్నారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్ఈ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్ ద్వారా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా మాత్రమే చెల్లించాలన్నారు. సీఎఫ్ఎంఎస్ సిటిజన్ చలాన్ ద్వారా చేసే చెల్లింపులు అంగీకరించరని స్పష్టం చేశారు. పునఃపరిశీలనకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల జవాబు పత్రాలు పాఠశాల లాగిన్లలో మాత్రమే డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయన్నారు. అదనంగా జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీలు వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్ర సేవ 95523 00009 ద్వారా డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మరిన్ని వివరాలకు సంబంధిత అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని వాసుదేవరావు సూచించారు. దూసుకొచ్చిన మృత్యువు క్వారీ లారీ ఢీకొని యువకుడి దుర్మరణం కపిలేశ్వరపురం (మండపేట): క్వారీ లారీ ఢీకొని ఓ యువకుడు దుర్మరణం పాలైన ఘటన ద్వారపూడిలో చోటు చేసుకుంది. మండపేట రూరల్ పోలీసులు శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. ద్వారపూడికి చెందిన సయ్యపురెడ్డి సతీష్ (29) అనపర్తిలోని పెట్రోలు బంకులో పని చేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం విధులు ముగించుకుని పీరా రామచంద్రపురంలోని స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. అక్కడి నుంచి ద్విచక్ర వాహనంపై అర్ధరాత్రి ద్వారపూడిలోని ఇంటికి వెళ్తూండగా పీరా రామచంద్రపురం వైపు వెళ్తున్న క్వారీ లారీ ఎదురుగా దూసుకుని వచ్చి అతడిని ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్ర రక్తస్రావమైన సతీష్ అక్కడిక్కడే మృతి చెందారు. సతీష్కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సతీష్ తండ్రి నారాయణ ఫిర్యాదు మేరకు ఎస్సై వి.కిశోర్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
గంటాడకు సర్ సీవీ రామన్ పురస్కారం
రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరుకు చెందిన భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు గంటాడ వంశీకృష్ణను ప్రతిష్టాత్మక సర్ సీవీ రామన్ రాష్ట్ర స్థాయి పురస్కారం వరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ అండ్ ప్రొఫెసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఈ అవార్డును విజయవాడలో ప్రదానం చేసినట్లు ఆయన తెలిపారు. వంశీకృష్ణతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మరో 78 మంది ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. విద్యార్థుల్లో సైన్స్పై ఆసక్తిని పెంపొందించడంలో వంశీకృష్ణ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా కమిటీ ప్రశంసించింది. 4 కేజీల గంజాయి స్వాధీనం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): నలుగురు యు వకుల నుంచి పోలీసులు శనివారం 4 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. టూటౌన్ సీఐ శివగణేష్ కథనం ప్రకారం.. స్థానిక పాడుబడిన రైల్వే క్వార్టర్స్ వద్ద పోలీసులు దాడి చేశారు. కృష్ణా జిల్లా వైఎస్సార్ కాలనీకి చెందిన కట్టా హేమంత్ కుమార్, గుడివాడ టౌన్ పెదవీధికి చెందిన ఎర్రగుంట్ల సాయికిరణ్, కోటిబొమ్మ సెంటర్కు చెందిన పల్లపు సాయి సుభాష్, సత్యనారాయణపురానికి చెందిన పెద్ది అభినయ్లను పట్టుకుని, గంజాయి బ్యాగ్ స్వాధీనం చేసుకున్నారు. -
సెలవులెప్పుడు బాబూ!
● అంగన్వాడీ కేంద్రాలకు పొరుగు రాష్ట్రాల్లో ఇప్పటికే సెలవులు ● మన రాష్ట్రంలో సెలవులివ్వని సర్కారు ● మండుటెండల్లో చిన్నారుల ఇబ్బందులురాజమహేంద్రవరం రూరల్: భానుడి భగభగలతో చిన్నాపెద్దా అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. ఉదయం 10 గంటలకే ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో గత నెల 24 నుంచి జూన్ 11వ తేదీ వరకూ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు విద్యా శాఖ సెలవులు ప్రకటించింది. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. కానీ, ముక్కుపచ్చలారని 3 నుంచి ఆరేళ్ల చిన్నారులుండే అంగన్వాడీ కేంద్రాలకు మాత్రం చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకూ సెలవులు ప్రకటించకలేదు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలు అంగన్వాడీ కేంద్రాలకు ఇప్పటికే సెలవులు ప్రకటించాయి. మన రాష్ట్రంలో మాత్రం సర్కారు నిర్లక్ష్యం పుణ్యమా అని పసి పిల్లలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ పరిస్థితిపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఒంటిపూట అయినా ఇబ్బందే.. ఐసీడీఎస్ పరిధిలో జిల్లాలోని 8 సెక్టార్లలో 1,798 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిల్లో మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 27,760 మంది విద్యనభ్యసిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించని ప్రభుత్వం.. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఒంటిపూట నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో, అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్న తమ పిల్లలను తిరిగి 12 గంటల తరువాత దూరంగా ఉన్న ఇళ్లకు మండుటెండలో తల్లులు నడుచుకుంటూ తీసుకువెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. దీనికి తోడు పలు కేంద్రాలు అద్దె భవనాలు ఇరుకై న భవనాల్లో ఉన్నాయి. ఆ ఇరుకు గదుల్లో చిన్నారులతో పాటు సిబ్బంది సైతం అల్లాడిపోతున్నారు. దీంతో, చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు అనారోగ్యానికి గురవుతారేమోననే భయంతో అంగన్వాడీ కేంద్రాలకు పంపించడానికి ఇష్టపడటం లేదు. ఫలితంగా 50 శాతానికి పైగా చిన్నారులు హాజరు కావడం లేదు. అంగన్వాడీ కార్యకర్తలకు, హెల్పర్లకు 15 రోజుల చొప్పున ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ప్రస్తుతం మొదట హెల్పర్లు సెలవు తీసుకుంటున్నారు. సెలవులుండవు అంగన్వాడీ కేంద్రాలకు ఎప్పుడూ సెలవులుండవు. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పటికీ తల్లిదండ్రులు తగు జాగ్రత్తలతో తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు తీసుకువస్తారు. హాజరు శాతం తగ్గినప్పటికీ న్యూట్రిషన్ పంపిణీకి అంగన్వాడీ కేంద్రాలు ఉండాలి. కార్యకర్తలకు, హెల్పర్లకు 15 రోజుల చొప్పున సెలవులు ఇస్తారు. ఈ మేరకు జీఓ వచ్చింది. – కె.నాగలక్ష్మి, జిల్లా ఇన్చార్జి సీ్త్ర, శిశు సంక్షేమ సాధికారత అధికారి -
రైతులపై ఇంత నిర్లక్ష్యమా?
● పొగాకు కొనుగోళ్లు ఇంకెప్పుడు? ● రైతుల వద్ద వందల టన్నుల నిల్వ ● వెంటనే ప్రారంభించకుంటే పోరాటమే ● వైఎస్సార్ సీపీ నేత జక్కంపూడి రాజా సాక్షి, రాజమహేంద్రవరం: నల్లరేగడి నేలల్లో (బ్లాక్ సాయిల్ – బీఎస్) రైతులు సాగు చేస్తున్న పొగాకు కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్లోని తన కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఎస్ పొగాకు రైతులపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఏటా మార్చి 15 నుంచి 30వ తేదీలోగా వేలం కేంద్రాల్లో బీఎస్ పొగాకు కొనుగోలు చేసేవారని, ఈ ఏడాది మే మొదటి వారం వచ్చినా ఇప్పటి వరకూ కొనుగోలు ప్రక్రియ ప్రారంభించకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. దీంతో, రైతులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోందన్నారు. బీఎస్ పొగాకు బ్యారన్లు సుమారు 900 ఉన్నాయని, వీటి పరిధిలో సుమారు 3 వేల ఎకరాల్లో రైతులు పొగాకు సాగు చేస్తున్నారని, 5 వేల మంది ఉపాధి పొందుతున్నారని చెప్పారు. రైతుల వద్ద రూ.కోట్ల విలువైన సుమారు 2 మిలియన్ టన్నుల పొగాకు నిల్వలు ఉన్నాయన్నారు. సుమారు 50 రోజులుగా పొగాకు నిల్వ ఉండిపోవడంతో నాణ్యత దెబ్బ తింటుందని, ఎండల తీవ్రతకు తరుగు వస్తుందని రైతులు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని రాజా దుయ్యబట్టారు. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టిన రైతులు నెలల తరబడి వడ్డీలు కట్టలేక సతమతమవుతున్నారన్నారు. ఎకరా పొగాకు సాగుకు అన్ని ఖర్చులూ కలిపి రూ.2.50 లక్షల నుంచి రూ.2.70 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారని చెప్పారు. ఇప్పటి వరకూ కొనుగోలు ప్రక్రియ ప్రారంభించకపోవడంతో రైతులు దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. కర్ణాటకలోని మైసూరులో కొనుగోళ్లు పూర్తి చేసిన అనంతరం జూన్లో దేవరపల్లిలో నల్లరేగడి పొగాకు కొనుగోలు ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. గతంలో పొగాకు రైతుల ఇబ్బందులను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి మార్క్ఫెడ్ ద్వారా 2 మిలియన్ టన్నుల పొగాకును కొనుగోలు చేయించిన ఘనత వైఎస్సార్ సీపీదేనని గుర్తు చేశారు. బీఎస్ పొగాకు కొనుగోళ్లను తక్షణం ప్రారంభించకపోతే రైతుల పక్షాన పోరాడతామని రాజా హెచ్చరించారు. -
పొట్టకూటి కొచ్చి అనంతలోకాలకు..
ఫ విద్యుదాఘాతానికి ఇద్దరు కూలీల మృతి ఫ మృతులు రాష్ట్రానికి చెందిన వారు కరప: ఊరికాని ఊరొచ్చారు.. పొట్టకూటి కోసం చెమట చిందిస్తున్నారు.. ఇంతలో అనుకోని ప్రమాదం మృత్యు కుహరంలోకి లాగేసింది. ఇటుకల బట్టీలో విద్యుదాఘాతానికి ఇద్దరు కూలీలు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. కరప పోలీసుల కథనం ప్రకారం.. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో లట్టులీ గ్రామానికి చెందిన 8 మంది కూలీలు కరప మండలం వలసపాకల గ్రామంలోని ఇటుక బట్టీలో పని చేస్తున్నారు. శుక్రవారం ఉదయం 5 గంటలకు పార్వతీ విశ్వకర్మ, భూపేంద్రకుమార్, మారుద్వాజ్ పాయికర్, భీమ్సింగ్, విశ్వకర్మలు బట్టీలో ఇటుకలు తయారు చేసే మెషీన్ వద్ద పనిచేస్తున్నారు. సదరు మెషీన్ లాగుతుండగా అది ప్రమాదవశాత్తూ అక్కడ లైటింగ్ కోసం ఏర్పాటు చేసిన ఐరన్ పోల్కు తగిలింది. దీనివల్ల కరెంట్ స్తంభానికి ఉన్న విద్యుత్ తీగల కారణంగా ఆ ముగ్గురు కూలీలు విద్యుదాఘాతానికి గురయ్యారు. వెంటనే సదరు ఆ ముగ్గురినీ చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలిచారు. వైద్యులు పరీక్షించి పార్వతీ విశ్వకర్మ, భూపేంద్రకుమార్ మృతి చెందినట్టు ధ్రువీకరించారు. పాయికర్కు స్వల్ప గాయాలవ్వగా చికిత్స పొందుతున్నాడు. కరప ఎస్ఐ టి.సునీత, విద్యుత్ శాఖ ఏఈ సానా ఈశ్వరిప్రసాద్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కరప ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇన్చార్జి డీఎంహెచ్వోగా డాక్టర్ వసుంధర
రాజమహేంద్రవరం రూరల్: జిల్లా ఇన్చార్జి డీఎంఅండ్హెచ్వోగా జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ మరియు టీబీ నివారణ అధికారి, అడిషనల్ డీఎంఅండ్హెచ్వో డాక్టర్ ఎన్.వసుంధరను నియమిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత డీఎంఅండ్హెచ్వో డాక్టర్ కె.వెంకటేశ్వరరావు గురువారం పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వసుంధర శుక్రవారం బొమ్మూరులోని డీఎంఅండ్హెచ్వో కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఆమెను పలువురు ఉద్యోగులు పూలబొకేలతో అభినందించారు. డీఏఓగా బొడ్డపాటి రాజమహేంద్రవరం రూరల్: జిల్లా వ్యవసాయ అధికారిగా బొడ్డపాటి వెంకటేశ్వరరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలో సహాయ వ్యవసాయ సంచాలకునిగా పనిచేస్తూ పదోన్నతిపై జిల్లా వ్యవసాయ అధికారిగా ఈ జిల్లాకు బదిలీ అయ్యారు. ఇప్పటివరకు ఇన్చార్జిగా పనిచేసిన రాబర్ట్ పాల్ రెగ్యులర్ పోస్టింగ్ అయిన ఉమ్మడి జిల్లా ఆత్మ పీడీగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో వ్యవసాయ అభివృద్ధికి కృషిచేస్తానని వెంకటేశ్వరరావు అన్నారు. జిల్లా వ్యవసాయ అధికారుల సంఘం అధ్యక్షుడు డీవీ కృష్ణ, కార్యదర్శి కమల్ రాజ్, రాష్ట్ర ఏఈఓ సంఘ అధ్యక్షుడు డి.వేణుమాధవ్ తదితరులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. 4, 5 తేదీలలో ప్రత్యేక రైళ్లు రాజమహేంద్రవరం సిటీ: వేసవి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 4, 5 తేదీలలో జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ప్రకటించారు. ఈ నెల 4వ తేదీన కాకినాడ టౌన్– లింగంపల్లి (07703)మధ్య, 5వ తేదీన లింగంపల్లి– కాకినాడ టౌన్ (07704) మధ్య రైళ్లు రాకపోకలు సాగించనున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు జిల్లాలోని సామర్లకోట, రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయని పేర్కొన్నారు. పేదల సొంతింటి కలను చిదిమేసిన చంద్రబాబు వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నాగమణి కాకినాడ రూరల్: పేదవాడి సొంతింటి కలను చంద్రబాబు ప్రభుత్వం కర్కశంగా చిదిమేసిందని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 33 లక్షలకు మందికి పైగా లబ్ధిదారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంటి స్థలాలను కేటాయించారని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలోని ఆర్ 5 జోన్లో పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలను సీఆర్డీఏ పరిధిలోకి విలీనం చేయడంతో లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాలను బలవంతంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకునే పరిస్థితి దాపురించిందని చెప్పారు. పేదలంటే చంద్రబాబుకు ఎప్పుడూ అలుసేనని పేర్కొన్నారు. సుమారు 50 వేల మంది పేదలు వారికి కేటాయించిన ఇంటి స్థలాలు కోల్పోతున్నారని తెలిపారు. మెడికల్ కాలేజీల నిర్వహణకు, ఆరోగ్య నెట్వర్క్ ఆస్పత్రులకు నిధులు ఇవ్వని ప్రభుత్వం అమరావతి రాజధానిపై కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. అమరావతిలో పలు కట్టడాలకు గ్లాస్ ఫినిషింగ్ చేసేందుకు రూ.2,540 కోట్లు మంజూరు చేయడాన్ని ఆక్షేపించారు. -
రైతుల వినతిని ప్రభుత్వానికి నివేదించాం
కొత్తపేట: మండలంలో ప్రస్తుత రబీ సీజన్లో మొక్కజొన్న పంటను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలనే రైతుల విజ్ఞప్తిని ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి నివేదించామని మండల వ్యవసాయ అధికారి కె.ద్వారకాదేవి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ 2.400కు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో తక్కువ ధర రూ.1600కు దళారులకు అమ్ముకోవాల్సి వస్తుందని ఆ రైతుల ఆందోళనపై గత నెల 29న ‘సాక్షి’ దినపత్రికలో ‘కొనుఘెల్లు’ శీర్షికన కథనం వచ్చింది. దీనికి ఏఓ స్పందించి ఓ ప్రకటన విడుద చేశారు. కొత్తపేట మండలంలో మొత్తం 955 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా, ఇందులో విత్తనం కోసం 445 ఎకరాలు, మిగతా 510 ఎకరాల్లో సాధారణ రకాలు సాగు చేశారని పేర్కొన్నారు. 510 ఎకరాల సాధారణ రకాల సాగుకు గాను ఇప్పటి వరకూ 370 ఎకరాల పంట కోతలు పూర్తయ్యాయని, ఎకరాకు సుమారు 40 క్వింటాళ్ల చొప్పున 14,800 క్వింటాల దిగుబడి వచ్చిందన్నారు. ఈ మొక్కజొన్న కొనుగోలుకు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు చేసిన విజ్ఞప్తిని ఉన్నతాధికారులకు తెలిపామన్నారు. -
కష్టాలు సాగుతూ..!
మామిడికుదురు: వైనతేయ గోదావరి నదీ తీరంలోని లంక గ్రామాల రైతులు సుదీర్ఘ కాలం నుంచి సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. సారవంతమైన భూములకు సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారు. భూగర్భం నుంచి వచ్చే జలాలు ఉప్పు నీటిమయంగా మారడం కలవరపెడుతోంది. ఉప్పు నీటి ప్రభావంతో కొబ్బరి కాయల దిగుబడులు గణనీయంగా పడిపోతోంది. రూ.వేలు ఖర్చు చేసి ఏటా వేసవిలో రైతులు కొబ్బరి తోటలకు నీటి తడులు పెడుతున్నారు. దీని కోసం ఎన్నో వ్యయ ప్రయాసలు పడాల్సిన పరిస్థితి వస్తోంది. పాలకులు మారుతున్నా లంక గ్రామాలకు సాగునీరందించే అప్పనపల్లి ఎత్తిపోతల పథకానికి మోక్షం లభించడం లేదని రైతులు మండిపడుతున్నారు. అప్పనపల్లి, పెదపట్నంలంక, పెదపట్నం, బి.దొడ్డవరం, మానేపల్లి గ్రామాలకు అప్పనపల్లి ఎత్తిపోతల పథకం ఎంతో అవసరం. చుట్టూ పుష్కలంగా గోదావరి జలాలు అందుబాటులో ఉన్నా, ఆ జలాలు ఉప్పు నీటిమయం కావడంతో ఇక్కట్లు తప్పడం లేదు. ఐదు గ్రామాల్లో 15 కిలోమీటర్ల పంట కాలువ ఏర్పాటుతో 4,035 ఎకరాల్లోని కొబ్బరి తోటలకు ప్రయోజనం కలుగుతుంది. దీంతో పాటు కొబ్బరి తోటల్లో అంతర పంటలు సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. బ్రిటీష్ వారి హయాంలో పైగ్రామాలకు ఇరిగేషన్ సదుపాయం ఉండేది. ప్రస్తుతం ఈ గ్రామాలకు ఇరిగేషన్ సదుపాయం లేక ఆ గ్రామాల రైతులు బోరు బావులపై ఆధారపడి కొబ్బరి సాగు చేస్తున్నారు. అప్పనపల్లి ఎత్తిపోతల పథకం కార్యరూపం దాల్చితే ఎంతో మేలు జరుగుతుంది.ఫ అప్పనపల్లి ఎత్తిపోతల పథకానికి కానరాని మోక్షం ఫ తీరంలో లంక భూములకు అందని నీరు -
కాంట్రాక్టు కార్మికులకు అండగా వైఎస్సార్ సీపీ
కడియం: మండలంలోని మాధవరాయుడుపాలెం పరిధిలోని ఏపీ పేపర్మిల్లు కాంట్రాక్టు కార్మికులకు అండగా తమ పార్టీ ఉంటుందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. శుక్రవారం ఆయన పార్టీ నాయకులతో కలసి కార్మికుల దీక్షా శిబిరాన్ని సందర్శించి, మద్దతు తెలిపారు. వేణు మాట్లాడుతూ అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయవలసిన రోజున రిలే నిరాహార దీక్షకు మద్దతుగా రావడం బాధాకరమన్నారు. రెండు రోజుల్లో యాజమాన్యం పరిష్కారం చూపకపోతే, కార్మికులకు మద్దతుగా తానే శిబిరంలో కూర్చుంటానన్నారు. పలువురు కార్మికులు మాట్లాడుతూ తమ ఇబ్బందులను వేణు దృష్టికి తీసుకువచ్చారు. చాలీచాలని జీతాలతో పనిచేయలేక ఇప్పటి వరకు 18 మంది కార్మికులు ఉద్యోగాలను విడిచిపెట్టి వెళ్లిపోయారన్నారు. వారికి రావాల్సిన గ్రాట్యుటీ ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకొక్కరికి రూ.70 వేల వరకు అందాల్సి ఉందన్నారు. అయితే యాజమాన్యంగానీ, లేబర్ కాంట్రాక్టర్లు గానీ ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదన్నారు. లేబర్ కాంట్రాక్టర్ల ఆగడాలు కూడా అధికమయ్యాయని, మహిళలని కూడా చూడకుండా ఇబ్బందులు పెడుతున్నారని పలువురు మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు, కడియం మండలం పార్టీ అధ్యక్షులు యాదల సతీష్చంద్రస్టాలిన్, కడియపు సావరం మాజీ సర్పంచ్ సాపిరెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. పేపర్ మిల్లు లాకౌట్ కడియం: మాధవరాయుడుపాలెం పంచాయతీ పరిధిలోని ఏపీ పేపర్ మిల్లు లాకౌట్ ప్రకటించింది. శుక్రవారం రాత్రి 10 గంటలకు సీ షిఫ్టుకు హాజరయ్యే కార్మికులను విధులకు హాజరు కాకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని గేటు వద్ద లాకౌట్ నోటీసును అంటించారు. కార్మికుల అక్రమ సమ్మె నేపథ్యంలో మిల్లుకు ఆర్థిక నష్టాల సంభవిస్తున్నందున లాకౌట్ విధిస్తున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. అత్యవసర సేవలు మినహా మిల్లు లాకౌట్లోకి వెళుతుందని తెలిపారు. కాగా నిబంధనల ప్రకారం పర్మెనెంట్ కార్మికులకు ముందుగానే లాకౌట్ నోటీసు ఇవ్వాలని, కానీ నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి లాకౌట్ ప్రకటించడం దారుణమని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మిక సంఘం నాయకులు టి.అరుణ్ అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న కార్మికులకు మద్దతుగా నిలిచారు. -
తెచ్చుకొనే కొరివి!
ఘటనలు ఎన్నో.. ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో జనవరి 27న క్రూడ్ ఆయిల్, జంతువుల కొవ్వును మరగబెట్టి తయారు చేసిన 56 డబ్బాల్లోని నూనెను, 4 క్రూడ్ ఆయిల్ డబ్బాలను పట్టుకుని తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2025 ఫిబ్రవరి 20న అమలాపురంలోని రెస్టారెంట్లు, హోటళ్లు, బేకరీలను ఆహార భద్రత తనిఖీ అధికారులు పరిశీలించి రూ. 1.30 లక్షల అపరాధ రుసుం విధించారు. 2025 ఫిబ్రవరి 17న ఆత్రేయపురంలో దుకాణాలపై ఆహార నియంత్రణాధికారులు దాడులు చేసి, కంపెనీ పేరు లేని 150 కిలోల నెయ్యి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 2025లో 145 దుకాణాలను తనిఖీ చేయగా 13 కేసులు, కాకినాడ జిల్లాలో 2025లో 240 చోట్ల సేకరించిన 198 నమూనాలను పరీక్షించగా, 38 నమూనాల్లో కల్తీ నిర్ధారణ అయ్యి 9 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఫ అన్నింటా కల్తీ చేస్తున్న మాయగాళ్లు ఫ ప్రజలకు ఆరోగ్య సమస్యలు ఫ ఉమ్మడి జిల్లాలో కలవరపెడుతున్న ఘటనలు కపిలేశ్వరపురం: ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు అంటారు. అలాంటి ఆరోగ్యానికి నాణ్యమైన ఆహారం అవసరం. అయితే బయట కొని తెచ్చే ప్రతి సరకులోనూ కల్తీ జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జాతీయ ఆహార భద్రత సూచీలో రాష్ట్రం 28వ స్థానానికి పడిపోవడం దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో 7,29,658, కాకినాడలో 7,23,855, కోనసీమ జిల్లాలో 4,90,075 కుటుంబాలు ఉండగా, పోలవరం జిల్లాలో 3,49,799 మంది జనాభా ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 1.60 లక్షల పాల కేంద్రాలు నిర్వహిస్తున్నారు. కాకినాడ జిల్లాలో 352 రెస్టారెంట్లు, 635 బేకరీలు, 340 పానీపూరి బండ్లు, 2,150 ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, 170 పాల విక్రయ కేంద్రాలు, 300 చికెన్ సెంటర్లు ఉన్నాయి. కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం, సమీప గ్రామాల్లో 120 ఫాస్ట్ఫుడ్ బండ్లు ఉన్నాయి. చాలా చోట్ల కల్తీ సరకుల విక్రయాలు చాపకింద నీరులా సాగుతోంది. ఇలా చేసి.. ముంచేసి ఫ వంట నూనెల్లో జంతు కొవ్వును కలిపి కల్తీ చేస్తున్నారు. వేడి చేయకుండా ఎలాంటి రసాయనాలు కలపకుండా తయారు చేసే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మంచిది. ఫ పాలను యూరియా, సబ్బు, కాస్టిక్ సోడా వంటి రసాయనాలతో కల్తీ చేస్తున్నారు. ఇలా ప్రజారోగ్యంతో ఆటలాడుతున్నారు. ఫ వేసవిలో ఐస్ క్రీమ్, పండ్ల రసాలు, లస్సీలతో పాటు మత్స్య ఉత్పత్తుల ప్యాకింగ్ కోసం ఐస్ వాడతారు. ఐస్ తయారీలో తుప్పు పట్టిన బాక్స్లు, సురక్షితం కాని నీటిని వాడితే అనారోగ్యం. నీటిలోని మలినాలను తొలగించేందుకు రివర్స్ ఆస్మాసిస్ వ్యవస్థ ఐస్ ఫ్యాక్టరీలో లేకపోతే జాగ్రత్త పడాలి. ఫ టీ పౌడర్ పరిమాణం పెంచేందుకు కొబ్బరి పీచు, తదితర వాటిని కలుపుతారు. 2018 మార్చి 23న రాజమహేంద్రవరంలోని ఓ హోల్సేల్ దుకాణంలో అప్పటి విజిలెన్స్ ఎస్పీ రెడ్డి గంగాధరరావు నకిలీ టీ పౌడర్ను పట్టుకున్నారు. ఫ పైపులైన్లు డ్రైన్లలో ఉండడంతో తాగునీరు కల్తీ అవుతోంది. నీటిని శుద్ధి చేసి వినియోగించాలి. కల్తీ తెలుసుకుందాం.. ఫ చిన్న గాజు గిన్నెలో ఒక టేబుల్ స్ఫూన్ నెయ్యిని వేసి రెండు చుక్కలు అయోడిన్ ఉప్పు కలిపినప్పుడు నెయ్యి నీలం రంగులోకి మారితే పిండి పదార్థాలను కలిపి కల్తీ చేసినట్టు లెక్క. ఒక స్ఫూన్ నెయ్యిలో కొంచెం చక్కెర కలిపి వేడి చేస్తే ఎరుపు లేదా పింక్ రంగులోకి మారిందంటే నెయ్యిలో వనస్పతి, పామాయిల్ వంటి నూనెలు కలిపి కల్తీ చేసినట్టు. ఫ పాలను విరగగొట్టేందుకు నిమ్మ రసమో, వెనిగర్ వేయడం సహజమైన పద్ధతి. దానికి భిన్నంగా పామాయిల్ లాంటి వెజిటబుల్ ఆయిల్స్, స్టార్చ్లు కలుపుతారు. బాగా మరిగించిన నీళ్లలో పన్నీర్ ముక్కలు వేసి బెటాడిన్, లేదా అయోడిన్ చుక్కలు వేసినప్పుడు రంగు మారితే కల్తీదని అర్థం. ప్రభుత్వమే బాధ్యత వహించాలి రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగిన కారణంగా మా మావయ్య కడలి కృష్ణారావు చనిపోయారు. వ్యక్తిగా, కుటుంబ పరంగా ఎలాంటి తప్పులూ చేయకపోయినా, మంచి వ్యక్తి దూరం అయ్యారు. కల్తీ పాల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. –సూరంపూడి సత్యప్రసాద్, మండపేట సమాచారం ఇవ్వండి కల్తీ జరిగినట్లు తెలిస్తే ప్రభుత్వం ప్రకటించిన 1800 425 3857, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ హెడ్ ఆఫీస్ నంబరు 08645 297245 నంబర్లకు సమాచారాన్ని తెలపవచ్చు. -
కాసుల కోసం కేసులు!
సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి నేతృత్వంలోని ఇసుక మాఫియా కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే ర్యాంపులు దక్కించుకుని అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్న మాఫియా లారీల నుంచి అదనపు వసూళ్లకు అర్రులు చాస్తోంది. మామూళ్లు ఇవ్వని లారీలపైకి అధికారులను ఉసిగొలుపుతున్నారు. ఇదీ సంగతి.. కొవ్వూరు, తాళ్లపూడి మండలాల్లో సుమారు 20 వరకు ఇసుక ర్యాంపులున్నాయి. ఇందులో 7 ఓపెన్ రాంపులు, 13 బోట్స్ మెన్ సొసైటీకి చెందినవి. ప్రస్తుతం వాడపల్లి, ఔరంగాబాదు, కొవ్వూరు, దొంగగుంట రేవు, కుమారదేవం, తాళ్లపూడిలో ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. నియోజకవర్గంలోని రాంపులన్నీ టీడీపీలోని ఓ కీలక నేత కనుసన్నల్లో నడుస్తున్నాయి. వీరికి ఓ ప్రజాప్రతినిధి సహకారం ఉండటంతో అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. దొంగగుంట రేవు వద్ద అనధికార డ్రెడ్జింగ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కొవ్వూరు, తాళ్లపూడి ర్యాంపుల నుంచి నిత్యం 400లకు పైగా లారీల ఇసుక ఇతర ప్రాంతాలకు తరలుతున్నట్లు సమాచారం. కొన్ని ర్యాంపుల్లో బోట్స్మెన్ సొసైటీల ముసుగులో ఈ దందా సాగుతున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం నిర్దేశించిన ధరలు కాదని తమకు తోచినట్టు ఇసుక అమ్మి రూ.లక్షలు దండుకుంటున్నారు. 20 టన్నుల లారీ ఇసుక రూ.2,900కు విక్రయించాల్సి ఉండగా.. డిమాండ్ను బట్టి రూ.6 వేల నుంచి రూ.7 వేలకు ఇస్తున్నారు. కొవ్వూరు నియోజకవర్గం కుమారదేవం ఓపెన్ రీచ్లో నిత్యం వందలాది లారీల్లో ఇసుక అక్రమంగా తరలుతోంది. నియోజకవర్గ కేంద్రం, ఆర్డీఓ స్థాయి అధికారులు ఉన్నా.. అక్రమాలపై పర్యవేక్షణ పెట్టకపోవడం ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. భారీగా జరిమానాలు అక్రమ దందా చాలదన్నట్లు లారీల నుంచి అక్రమ వసూళ్లకు అర్రులు చాస్తున్నట్లు ఆరోపణలున్నాయి. టన్ను ఇసుకకు రూ.50 చొప్పున 20 టన్నుల లారీ నుంచి అదనంగా మరో రూ.వెయ్యి వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తం చెల్లించని లారీలపై ఇసుక మాఫియా, కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు కక్ష గడుతున్నారు. చెల్లించని పక్షంలో అధికారులకు ఆ లారీల సమాచారం చేరవేస్తున్నారు. రంగంలోకి దిగుతున్న అధికారులు వారిని వెంబడించి మరీ తనిఖీలు చేస్తున్నారు. నిబంధనల మేరకు ఒక్కో లారీకి 20 టన్నుల ఇసుకను టాప్ దాటకుండా నింపాల్సి ఉంది. అధిక లోడ్తో వెళుతున్న లారీలపై జరిమానా వేయాల్సి ఉంది. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా కూటమి నేతలు, ప్రజా ప్రతినిధులకు టన్నుకు రూ.50 ఇవ్వని వసూలు చేస్తున్నారు. కొన్ని లారీలు నిబంధనల మేరకే ఇసుక తరలిస్తున్నా.. తమకేమీ పట్టనట్లు ఇష్టానుసారంగా జరిమానా వేసేస్తున్నారు. ఒక్కో లారీకి ఒకసారి పట్టుబడితే రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు ఫైన్ రూపంలో వసూలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో తాము నెలంతా సంపాదించుకున్న మొత్తం ఒక్క ఫైన్తోనే కోల్పోతున్నామని లారీల యజమానులు ఆవేదన చెందుతున్నారు. నెల రోజుల వ్యవధిలో ఇలా రూ.లక్షల్లో జరిమానాల రూపంలో వసూలు చేసినట్లు సమాచారం. సీఎం చంద్రబాబు మాత్రం ఇసుక పాలసీ పారదర్శకంగా సాగుతోందని, ఎలాంటి మామూళ్లు ఇవ్వాల్సిన అవసరం లేదని చేస్తున్న ప్రకటనలకు.. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న తంతుకు భారీ వ్యత్యాసం కనిపిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొవ్వూరు మండలం రోడ్ కం రైలు వంతెన వద్ద ఇసుక తవ్వకాలు (ఫైల్)ఇసుకను లారీల్లో లోడు చేస్తున్న నిర్వాహకులు కూటమి నేతల కనుసన్నల్లో ఇసుక అక్రమ దందా అది చాలదన్నట్లు అదనపు వసూళ్లు టన్నుకు రూ.50 ఇవ్వాలని డిమాండ్ లారీకి రూ.వెయ్యి వసూలు కొవ్వూరు, తాళ్లపూడి ఇసుక ర్యాంపులలో రెచ్చిపోతున్న మాఫియా గగ్గోలు పెడుతున్న లారీల యజమానులు నిఘాపై నిర్లక్ష్యం? ఇసుక రీచ్ల వద్ద నిఘా ఉండటం లేదు. సీసీ కెమెరాలతో పాటు, అధికారుల పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడం ఇసుక మాఫియాకు వరంగా మారుతోంది. ఒకవేళ ఉన్నా.. మామూళ్ల మత్తులోపడి మిన్నకుండిపోతున్నారన్న ఆరోపణలున్నాయి. గత కలెక్టర్ హయాంలో ఇసుక అక్రమాలపై ఉక్కుపాదం మోపారు. ఎప్పుడు వచ్చి అధికారులు పట్టుకుంటారో అన్న భయం ఉండేది. ప్రస్తుత కలెక్టర్ కొత్తగా రావడం.. ఈ దందాపై వ్యవస్థపై అవగాహన లేకపోవడంతో పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదన్న వాదన ప్రజల నుంచి వినిపిస్తోంది. -
ఉప్పునీరు కావడంతో..
అప్పనపల్లి ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలి. ఇది ఎంతో కాలంగా పెండింగ్లో ఉంది. సాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఏటా వేసవిలో కొబ్బరి తోటలకు నీరు పెట్టేందుకు రూ.వేలు ఖర్చవుతుంది. ఈ సమయంలో మూడు నీటి తడులు కట్టాల్సి ఉంది. బోరు బావుల నుంచి వచ్చే నీరు ఉప్పు నీరు కావడంతో చవుడు బారి కొబ్బరి తోటలు దెబ్బతింటున్నాయి. – తటవర్తి సూరిబాబు, రైతు, అప్పనపల్లి ప్రభుత్వం స్పందించాలి సారవంతమైన భూములకు సరైన సాగునీరు అందక ఎందుకూ పనికి రాకుండా పోతున్నాయి. సాగునీరు అందిస్తే లంక భూముల్లో బంగారం పండుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉప్పు నీటితో వ్యవసాయం సర్వనాశనమైంది. గతంలో లంక గ్రామాల్లోని కొబ్బరి తోటల్లో ఎన్నో పంటలు పండించేవారు. నీటి సమస్యతో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సాగునీరు అందించే దిశగా ప్రభుత్వం, పాలకులు చర్యలు తీసుకోవాలి. – కొమ్ముల సూరిబాబు, రైతు, పెదపట్నంలంక -
పసిపాప ఆరోగ్యంపై ఆరా
కాకినాడ క్రైం: స్థానిక జీజీహెచ్లో చికిత్స పొందుతున్న ఓ పసిపాపను రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు శుక్రవారం పరిశీలించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మూడు నెలల అనాథ బాలిక చైత్రను తల్లిదండ్రులు నడిరోడ్డుపై వదిలేశారు. ఈ విషయం పోలీసులకు చేరడంతో వారు పాపను చేరదీసి మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన శిశు గృహలో అప్పగించారు. గత నెల 1 నుంచి అమలాపురం శిశుగృహలో సంరక్షణ పొందుతున్న శిశువు తీవ్ర అనారోగ్యానికి గురైంది. సిబ్బంది స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చిన్నారి గుండెకు రంధ్రం ఉందని, ఇన్ఫెక్షన్ చేరి ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని, ఆయాసంతో బాధపడుతోందని వైద్యులు గుర్తించారు. ఈ నేపథ్యంలో మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్కు సిఫార్సు చేశారు. గురువారం సాయంత్రం చిన్నారిని జీజీహెచ్కు తరలించి పీఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కమిషన్ సభ్యులు డాక్టర్ కొప్పుల నాగమానస, మందాల గంగా సూర్యనారాయణలు పాపకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. కమిషన్ సభ్యుల వెంట కాకినాడ అర్బన్ సీడీపీఓ అనసూరి జ్యోతి, అంబేడ్కర్ కోనసీమ జిల్లా బాలల పరిరక్షణ విభాగం డీసీపీఓ బూల ఉమాలక్ష్మి, కాకినాడ జిల్లా బాలల పరిరక్షణ విభాగం సంరక్షణ అధికారులు జాగరపు విజయ, మాకే సుధాకర్ ఉన్నారు. -
20 సెల్ఫోన్ల రికవరీ
గోకవరం: స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న 20 సెల్ఫోన్లను రికవరీ చేసినట్టు కోరుకొండ సీఐ సత్యనారాయణమూర్తి తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై పవన్కుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ పోగొట్టుకున్న వారి ఫోన్లను నూతన టెక్నాలజీతో రికవరీ చేస్తున్నామన్నారు. మొత్తం రూ.20 లక్షల విలువైన సెల్ఫోన్లను రికవరీ చేశామన్నారు. ఎవరైనా ఫోన్లు పోగొట్టుకుంటే స్థానిక పోలీస్ స్టేషన్, సంబంధిత వెబ్ పోర్టల్లో నమోదు చేసుకోవాలన్నారు. అలాగే వేసవి సెలవులకు ఊరెళ్లే వారు పోలీసులకు సమాచారం ఇస్తే రక్షణ కల్పిస్తామన్నారు. సమావేశంలో ఎస్సై పవన్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.


