East Godavari
-
సిలిండర్ కోసం 45 రోజుల వేచి.. బ్లాక్లో క్షణాల్లో డెలివరీ
సాక్షి, రాజమహేంద్రవరం: పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం కొందరికి వంటింటి కష్టాలు తెచ్చి పెడుతోంటే.. కొంతమంది గ్యాస్ సరఫరా డీలర్లకు కాసులు కురిపిస్తోంది. గ్యాస్ కొరతను బూచిగా చూపుతూ సిలిండర్లు బ్లాక్ మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. సామాన్యుల పేరుతో గ్యాస్ బుక్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. సామాన్యులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. అర్బన్ ప్రాంతాల్లో అయితే గ్యాస్ బుక్ చేసిన 20 రోజుల తర్వాత డెలివరీ ఇస్తున్నట్టు తెలిసింది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం 45 రోజులకు పైగా సమయం పడుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవసరాన్ని బట్టి ధర గృహ వినియోగానికి అవసరమయ్యే ఒక్కో సిలిండర్ సాధారణ ధర రూ.900 ఉంటే.. ప్రస్తుతం అవసరాన్ని బట్టి రూ.2,000ల నుంచి రూ.2,500లకు విక్రయిస్తున్నారు. కమర్షియల్ సిలిండర్ రూ.3,500కు పైగా పలుకుతోంది. అధిక ధరలైనా కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఇదే అదనుగా భావిస్తున్న కొన్ని గ్యాస్ ఏజెన్సీలు, సరఫరా డీలర్లు బ్లాక్ మార్కెట్లో భారీగా దోపిడీ చేస్తున్నారు. మరోవైపు అత్యవసర పరిస్థితుల్లో గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ సరఫరా వ్యవస్థలో కొన్ని ఏజెన్సీలు శాసించే స్థాయికి చేరాయి. ఫలితంగా అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందన్న ఆరోపణలున్నాయి. చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం చిన్నపాటి హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు వంటివి నిర్వహించే చిరు వ్యాపారులపై వంట గ్యాస్ ప్రభావం తీవ్రంగా పడుతోంది. జిల్లావ్యాప్తంగా పెద్ద కేటరింగ్ సంస్థలు 53, చిన్నాపెద్ద హోటళ్లు, కేఫ్లు 1.20 లక్షలు ఉంటాయి. వీటిపై సుమారుగా 3 లక్షలకు పైగా శ్రామికులు ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గ్యాస్ కొరత కారణంగా ఇప్పటికే పలు హోటళ్లు మూసివేశారు. మరికొన్ని హోటళ్లు కట్టెలపొయ్యిపై వంటలు చేస్తున్నాయి. వీధి వ్యాపారులు రోజువారీ ఆదాయంతోనే బతుకుబండి లాగుతుంటారు. ప్రస్తుతం గ్యాస్ లభించకపోవడం, దొరికినా.. అధిక ధర వెచ్చించాల్సి వస్తుండటంతో ఆహార పదార్థాల ధరలను ఆ మేరకు పెంచి విక్రయిస్తున్నారు. గ్యాస్ కొరత కారణంగా వ్యాపారాలు ఆపేస్తే పస్తులు ఉండాల్సి వస్తుందన్న ఉద్దేశంతో బ్లాక్లో కొనుగోలు చేస్తున్నారు. చిన్న హోటళ్లు, టీస్టాళ్లు గ్యాస్ కోసం రోజూ తిరుగుతుంటే పెద్ద హోటళ్లకు మాత్రం దొంగచాటుగా గ్యాస్ సరఫరా అవుతున్నట్లు ఆరోపణలున్నాయి. డబ్బు చెల్లించే వారికి గ్యాస్ క్షణాల్లో ప్రత్యక్షం అవుతోంది. సాధారణ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రం రోజుల సమయం పడుతోందని ఆవేదన చెందుతున్నారు. కొన్ని ఏజెన్సీలు హాస్టళ్లు, ఆస్పత్రులు, ఆలయాలు, ట్రస్టుల పేరుతో గ్యాస్ బుకింగ్లు పెట్టుకుని బ్లాక్లో హోటళ్లకు అమ్ముకుంటున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. మామూళ్ల మత్తులో కొందరు అధికారులు గ్యాస్ బ్లాక్ దందాపై పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. కొందరు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని, సిఫారసుల ఆధారంగా వ్యవహారం నడుస్తోందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. గ్యాస్ కొరత, అధిక ధరలు, అక్రమ బుకింగ్లు ఇలా అన్ని వైపులా ఇబ్బందులు ఎదురవుతుండటంతో సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సరఫరా వ్యవస్థపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విజిలెన్స్ దాడులు కూడా నామమాత్రంగా ఉన్నాయి. దొంగ బుకింగ్లు వినియోగదారుల పేరుతో అక్రమంగా బుకింగ్లు చేసి గ్యాస్ పక్కదారి పట్టిస్తున్నట్లు తెలుస్తోంది. ఓటీపీలు లేకుండానే బుకింగ్లు పూర్తి చేసి, సిలిండర్లను ఇతరులకు విక్రయిస్తున్నట్లు సమాచారం. దీనిపై ప్రశ్నించే నాథుడే లేకపోవడంతో గ్యాస్ సరఫరా దారులు అడిందే ఆట.. పాడిందే పాటగా మారింది.23 రోజులుగా అవస్థలు జిల్లా వ్యాప్తంగా 22 మండలాలు ఉండగా.. 18.32 లక్షల జనాభా ఉంది. 52 గ్యాస్ ఏజెన్సీల ద్వారా గ్యాస్ సరఫరా అవుతోంది. 8.67 లక్షల వివిధ రకాల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. 23 రోజులుగా గ్యాస్ కొరత ఏర్పడింది. ముందు జాగ్రత్తగా బుకింగ్లు ఇప్పటికే గ్యాస్ కొరత తీవ్రంగా వేధిస్తుండటం.. భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆందోళనతో వినియోగదారులు అవసరానికి మించి గ్యాస్ సిలిండర్లు బుక్ చేస్తున్నారు. అధికారుల గణాంకాల మేరకు సాధారణ పరిస్థితుల్లో జిల్లా వ్యాప్తంగా రోజుకు 11,500 గ్యాస్ సిలిండర్లు బుక్ అవుతాయి. యుద్ధం ఆందోళనల నేపథ్యంలో రోజుకు 19,896 నుంచి 22,250 వరకు బుకింగ్లు నమోదవుతున్నాయి. ఒక్కో సిలిండర్కు సగటున రూ.1,000 అధికంగా వసూలు చేస్తున్నారని భావించినా.. రోజుకు రూ.లక్షల్లో దోపిడీ జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. రెండు సిలిండర్లు ఉన్న వినియోగదారులు అడ్వాన్స్గా బుక్ చేసి పెట్టుకుంటున్నారు. సింగిల్ సిలిండర్ ఉన్న వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో గ్యాస్ బుకింగ్ ప్రక్రియ క్షణాల్లో ముగిసేది. ప్రస్తుం సర్వర్లు బిజీగా మారిపోవడంతో గంటల తరబడి కుస్తీ పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
వైభవంగా పండిత సదస్యం
ఆత్రేయపురం: కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా మంగళవారం నాలుగో రోజు వైభవంగా పండిత సదస్యం నిర్వహించారు. స్వామివారికి చతుర్వేద పండితులు మహదాశీర్వచనం చేశారు. ఉదయం స్వామివారి మేలుకొలుపు, తీర్థం బిందె తెచ్చుట, విశేషార్చన, నిత్య హోమాలు, బలి హరణం, ద్రవిడ వేద పారాయణ, సాగాయి. మధ్యాహ్నం విష్వక్సేన పూజ, అష్టదిక్పాలక ఆరాధన, సదస్యం నిర్వహించారు. రాత్రి ప్రధాన హోమాలు, బలి హరణము, నీరాజన మంత్రపుష్పాల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో నల్లం సూర్యచక్రధరరావు వేద పండితులను సత్కరించారు. ఆలయ అర్చక కమిటీ సభ్యుడు వాడపల్లి శేషావతారం, కమిటీ సభ్యుడు శిష్టా సూర్య కుటుంబరావు, గ్రామ సర్పంచ్ పోచిరాజు బాబురావు, సూర్యకుమారి దంపతులు, ఆలయ కమిటీ సభ్యులు, సేవా కార్యకర్తలు పాల్గొన్నారు. -
సాంకేతికత సాయంతో కేసుల దర్యాప్తు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రతి కేసులో టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించి, అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించి దర్యాప్తు చేయాలని, తద్వారా నేర నిర్ధారణ రేటు పెంచవచ్చని ఎస్పీ డి.నరసింహకిశోర్ సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులు, ప్రాపర్టీ కేసులు, ఎన్ఫోర్స్మెంట్ వర్క్, డీపీఓకు సంబంధించి పెండింగ్ రిప్లై ఫైల్స్, ఎన్బీడబ్ల్యూఎస్, ఎన్డీపీఎస్ కేసులలో దర్యాప్తు, రికవరీలపై సర్కిల్ వారీగా పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, జిల్లాలో మహిళల భద్రతకు గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఓపెన్ డ్రింకింగ్పై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలతో పాటు, డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. రౌడీషీటర్ల కదలికలు, కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. తీవ్రమైన కేసులలో నిర్ణీత గడువు లోపల విచారణ పూర్తి చేసి, చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. ప్రాపర్టీ క్రైమ్ కేసుల్లో రికవరీ పెంచాలని, జిల్లావ్యాప్తంగా గుర్తించిన బ్లాక్ స్పాట్లలో డ్రోన్ సర్వైలెనన్స్ విరివిగా ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమైన అన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనుమానిత ప్రాంతాలలో కార్డన్ ఆపరేషన్స్ నిర్వహించాలన్నారు. పోలీసు అధికారులు అందరూ విలేజ్ విజిట్స్, పల్లె నిద్ర తప్పక చేయాలన్నారు. తద్వారా రాబోయే పుష్కరాల్లో ఎదురయ్యే వివిధ సమస్యలను అరికట్టవచ్చన్నారు. రాత్రి పూట అన్ని స్టేషన్లలో గస్తీలు ముమ్మరం చెయ్యాలని, అనుమానితుల వేలిముద్రలు ఎంఎస్డీ డివైస్ ద్వారా చెక్ చేయాలన్నారు. గత నెలలో విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేశారు. అడిషనల్ ఎస్పీ ఎల్.చెంచిరెడ్డి, ఎస్బీ డీఎస్పీ బి.రామకృష్ణ, జోనల్ డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, ఇతర పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ నరసింహకిశోర్ సూచన -
చంద్రబాబు ప్రభుత్వంలో ప్రాణాలకు రక్షణ లేదు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రాణాలకు రక్షణ లేదని వైఎస్సార్ సీపీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. కోనసీమ జిల్లా ఆత్రేయపురం గ్రామానికి చెందిన యాతం శ్రీనివాస్ అబ్బీస్ జనవరి 28వ తేదీన రాజమహేంద్రవరం రవి హాస్పిటల్లో మత్తుమందు వికటించడం వల్ల చనిపోయారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కలెక్టర్, ఎస్పీలకు గ్రీవెన్స్లో విన్నవించినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ విషయంపై కలెక్టర్ కీర్తికి, రాజమహేంద్రవరం డీఎస్పీకి మంగళవారం మరోసారి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చనిపోయిన కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని, 40 రోజులు అవుతున్నా ఇప్పటికీ న్యాయం జరగలేదన్నారు. మృతుడు జనసేన కార్యకర్త అయినా ఆ పార్టీ ఈ విషయంపై స్పందించకపోవడం విచారకరం అన్నారు. వైఎస్సార్ సీపీ కోనసీమ జిల్లా పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో పేద ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా చంద్రబాబుకు చీమ కుట్టినట్టుగా కూడా లేదన్నారు. కల్తీ పాల ఘటనలో చనిపోయిన వారికి ఇప్పటి వరకు న్యాయం జరగలేదన్నారు. నష్ట పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం తప్ప నిజాయితీగా విచారణ చేపట్టలేదన్నారు. న్యాయం జరిగే వరకూ పోరాడుతామని, ఆ కుటుంబానికి అండగా నిలుస్తామన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి -
సమన్వయంతో ధాన్యం కొనుగోళ్లు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ధాన్యం కొనుగోళ్లు సమన్వయంతో చేపట్టాలని కలెక్టర్ కీర్తి స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్లో రబీ 2025–26 సీజన్కు సంబంధించి డిస్ట్రిక్ట్ ప్రొక్యూర్మెంట్ కమిటీ సమావేశం కలెక్టర్ కీర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గతంలో అవకతవకలకు పాల్పడిన, రైతులను ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తులు, మిల్లర్లను ప్రస్తుత సేకరణ ప్రక్రియకు దూరంగా ఉంచాలని ఆదేశించారు. గన్నీ బ్యాగుల నాణ్యతపై దృష్టి సారించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో కోతలు జరిపిన ధాన్యాన్ని తక్షణమే సేకరించి రవాణా చేయడానికి వాహనాలను సిద్ధంగా ఉంచాలని, అవసరమైతే ఒకే రోజు 30 వేల మెట్రిక్ టన్నుల వరి తరలించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని తెలిపారు. గత ఖరీఫ్ సీజన్లో 2,557 వాహనాలు రిజిస్టర్ కాగా, 2,190 వాహనాలు వినియోగంలోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రైతుల వద్ద సుమారు 1,100 ట్రాక్టర్లు అందుబాటులో ఉన్నాయని, మిగిలిన వాహనాలను ప్రైవేట్ ఆపరేటర్ల నుంచి సమీకరించనున్నట్లు పేర్కొన్నారు. ధాన్యం సేకరణ, రవాణా ప్రక్రియల పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 8309487151 నంబర్ను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్ మాట్లాడుతూ జిల్లాలో 256 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, డి.ఆర్.డి.ఏ ద్వారా కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభించే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి టి.సీతారామమూర్తి, జిల్లా మేనేజర్ (సి.ఎస్) బి.గణేష్ కుమార్, ఆర్డీవోలు కె.ఆనందరావు, ఆర్.శివరాముడు, జిల్లా పౌర సరఫరాల అధికారి వి.పార్వతి, జిల్లా వ్యవసాయ అధికారి రాబర్ట్ పాల్, జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్, మిల్లర్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.కలెక్టర్ కీర్తి ఆదేశం -
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో వెటరన్ క్రీడాకారుల ప్రతిభ
అమలాపురం టౌన్: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు నాగార్జున యూనివర్శిటీ క్రీడా మైదానంలో సోమ, మంగళవారాల్లో జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో అమలాపురానికి చెందిన వెటరన్ క్రీడాకారిణి మెహబూబ్ షకీలా ప్రతిభ చాటింది. 35, 45 వయస్సు విభాగాల్లో ఈ అథ్లెటిక్స్ ఈవెంట్స్ జరిగాయి. హై జంప్లో మెహబూబ్ షకీలా బంగారు పతకాన్ని కై వసం చేసుకుంది. పట్టణానికి చెందిన బూరగాయల శివరామకృష్ణ కూడా డిస్కస్ త్రో క్రీడలో తలపడ్డారు. జిల్లాకు చెందిన దాట్ల ఎన్ఎస్ రామరాజు 800 మీటర్లు, 1500 మీటర్లు పరుగు పందెంలో వెండి పతకాలను, జావెలిన్ త్రోలో ఎం.సాయిబాబు కాంస్య పతకాన్ని, 100 మీటర్ల పరుగు పందెంలో ఐ.సురేష్కుమార్ కాంస్య పతాకాన్ని సాధించారు. -
ఆదాయానికి పాతర
కాకినాడ లీగల్: ప్రభుత్వ సొమ్ముకు రక్షణగా ఉండాల్సిన ట్రెజరీ (ఖజానా) కార్యాలయంలోనే నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అధికారుల ఉదాసీనత వల్ల లక్షల రూపాయల విలువ చేసే ప్రభుత్వ ఆస్తి తుప్పు పట్టిపోతోంది. కొత్త భవనంలోకి మారడానికి ఉత్సాహం చూపిన అధికారులు.. పాత సామగ్రిని మాత్రం గాలికొదిలేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగేళ్లుగా పార్కింగ్లోనే.. స్థానిక కోర్టు ప్రాంగణంలో జిల్లా ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ కాంప్లెక్స్ ప్రారంభమై నాలుగేళ్లు గడుస్తోంది. ఈ భవనంలో జిల్లా ట్రెజరీ కార్యాలయంతో పాటు సబ్ ట్రెజరీ వంటి ఇతర విభాగాలు కొలువుదీరాయి. కొత్త కార్యాలయాలు ప్రారంభమైన సమయంలో కోట్లాది రూపాయలతో సరికొత్త టేబుళ్లు, కుర్చీలు, ఇతర ఫర్నిచర్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే పాత కార్యాలయం నుంచి తీసుకొచ్చిన టేబుళ్లు, కుర్చీలు, ఇనుప బీరువాలు, కంప్యూటర్ భాగాలు వీటన్నింటినీ భవనంలోని పార్కింగ్ ప్రాంతంలో ఒక మూలన పడేశారు. నిబంధనలు ఇవే.. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో వాడని పాత సామగ్రి జాబితాను ఎప్పటికప్పుడు తయారు చేసి, నిబంధనల ప్రకారం ప్రభుత్వం నుంచి అనుమతి పొంది వేలం వేయాల్సి ఉంటుంది. ఆ వేలం ద్వారా వచ్చే నగదును ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలి. కానీ ఇక్కడ అధికారులు నాలుగేళ్లనా ఆ దిశగా అడుగులు వేయడం లేదు. పలు ఆరోపణలు ఏటా పాత ఫర్నిచర్ లెక్కలు చూడకపోవడంతో విలువైన వస్తువులను కొందరు సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా మాయం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నిర్లక్ష్యం వెనుక ఉన్న అసలు కారణాలు బయటపడాలంటే ఉన్నతాధికారులు స్పందించాల్సి ఉంది. పాత కార్యాలయం నుంచి ఇక్కడకు ఎన్ని వస్తువులు తరలించారు. ఇప్పుడు అక్కడ ఎన్ని ఉన్నాయి అనే విషయాలపై సమగ్రంగా తనిఖీ జరగాలి. పనికిరాని వస్తువులను వెంటనే వేలం వేసి ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడాలి. ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగం చేసిన అధికారులపై విచారణ జరిపించాలి. ప్రభుత్వ కార్యాలయంలో రూపాయి లెక్క కూడా పక్కాగా ఉండాలి. కానీ ఇక్కడ కళ్ల ముందే విలువైన ఫర్నిచర్ పాడవుతున్నా పట్టించుకోకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా నిలుస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. పాత సామగ్రిపై అధికారుల నిర్లక్ష్యం నిబంధనల మేరకు వేలం వేయని వైనం కాకినాడ జిల్లా ట్రెజరీలో తుప్పుపడుతున్న బీరువాలు, కుర్చీలు ప్రభుత్వ ఆదాయానికి గండి -
ఎక్కడికో ఈ పయనం..
● అధికారులను పరుగులు పెట్టిస్తున్న పులి ● చిక్కకుండా సంచారం దేవీపట్నం: రెండు నెలలుగా అటవీ అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న పులి గమ్యం ఎటువైపో అంతుచిక్కడం లేదు. నాలుగు రోజుల నుంచి గోదావరి పరివాహక ప్రాంతంలో తిష్ట వేసి, కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో సంచరిస్తూ వెనుకకు, ముందుకు పయనిస్తుందే తప్ప స్పష్టమైన మార్గం వైపు వెళ్లడం లేదు. శనివారం సాయంత్రం జోడుమామిళ్ల వద్ద గోకవరం దండంగి ఆర్అండ్బీ రహదారిని దాటి, పరగసానిపాడు, పూడిపల్లి వద్ద కొండపైకి చేరింది. సోమవారం ఉదయం బోడిగూడెం, డి.రావిలంక గ్రామాల వరకూ సంచరించి, రాత్రికి పరగసానిపాడుకు చేరింది. మంగళవారం నాగళ్లపల్లి ప్రాంతంలో సంచరిస్తున్నట్లు సమాచారం. ఇదే విధంగా సంచరిస్తే నాగళ్లపల్లి, గొందూరు గ్రామాల వద్ద తూర్పు వైపుగా కొండ దాటితే దేవారం పంచాయతీలోని చిన్నారిగండి మరలే అవకాశం ఉంది. ఒకవేళ గోదావరిని దాటేందుకు ప్రయత్నిస్తే పోలవరం ప్రాజెక్టు స్పిల్వే దిగువన గల అంగుళూరు, పురుషొత్తపట్నం వైపునకు వెళ్లి, గోదావరిని దాటవచ్చు. ఒకవేళ అదే జరిగితే పులి పయనం ప్రారంభమైన మహారాష్ట్రలోని తడోబా అభయారణ్యంలోకి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రలను దాటుకుని వచ్చిన దారిలోనే వెళ్లే అవకాశం ఉంది. కాగా.. పులి సంచారంపై రంపచోడవరం సబ్ డీఎఫ్ఓ అనూష, వైల్డ్లైఫ్ రేంజి అధికారి కొండలరావు, సిబ్బంది రేయింబవళ్లు పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు సమీప గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతం పులి సంచరించే ప్రాంతాల్లోని తమ పశువులు దాని బారిన పడతాయోమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
అమ్మచెక్కిన బొమ్మకు ప్రథమ బహుమతి
ఏలేశ్వరం: మండలంలోని పెద్దనాపల్లి గ్రామంలో శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా గొల్లపల్లి చెల్లయ్య మోమోరియల్ నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు రాష్ట్రాల నాటికల పోటీలు సోమవారం రాత్రితో ముగిసాయి. కళాపరిషత్ అధ్యక్షుడు, ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి (బుజ్జి) ఆధ్వర్యంలో నాలుగు రోజులపాటు అసక్తికరంగా పోటీలు నిర్వహించారు. పోటీల్లో హైదరాబాద్కు చెందిన గోవాడ క్రియేషన్స్ అమ్మచెక్కిన బొమ్మ నాటిక ఉత్తమ ప్రదర్శనగా ఎంపికై ంది. గోవాడ వెంకట్ దర్శకత్వం వహించగా జ్యోతిరాజ్ భీశెట్టి రచన అందించారు. ఉత్తమ ద్వితీయ ప్రదర్శనగా గుంటూరు అభినయ ఆర్ట్స్ వారి ఇంద్రప్రస్థం, ఉత్తమ తృతీయ ప్రదర్శనగా గుంటూరు కరణం మహేష్ మోమోరియల్ తరమెల్లిపోతున్నదో ఎంపిక కాగా నగదు పురస్కారాలు అందుకున్నాయి. ఉత్తమనటుడుగా సురభినిఖిలేష్ (అమ్మచెక్కినబొమ్మ), ఉత్తమ నటిగా జీఎన్డి కుశమసాయి (ఇంద్రప్రస్థం), ఉత్తమ దర్శకుడుగా ఎన్.రవీంద్రరెడ్డి(ఇంద్రప్రస్థం) ఎంపికయ్యారు. కళాపరిషత్ అఽధ్యక్షుడు గొల్లపల్లి బుజ్జి చేతులమీదుగా బహుమతులు అందజేశారు. -
ఏసీబీ వలలో శానిటరీ ఇన్స్పెక్టర్
కాకినాడ క్రైం: ఏసీబీ వలకు ఓ శానిటరీ ఇన్స్పెక్టర్ చిక్కాడు. కాకినాడ మున్సిపాలిటీ కొత్తపేట మార్కెట్ సర్కిల్ 10లో శానిటరీ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న వంగల రాజేంద్ర ప్రసాద్ రూ.15 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. ఆ పరిధిలో ఓ దుస్తుల దుకాణానికి ట్రేడ్ లైసెన్సు మంజూరు చేసేందుకు సూరంపూడి అరవింద్ను రూ.15 వేల లంచం డిమాండ్ చేశాడు. మంగళవారం సాయంత్రం 5.43 గంటలకు తన కార్యాలయంలో లంచం తీసుకుంటూండగా రాజమహేంద్రవరం ఏసీబీ డీఎస్పీ ఎం.కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్లు భాస్కరరావు, వాసుకృష్ణ, సతీష్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. లంచం సొత్తు రూ.15 వేలే కాక, మరో రూ.18,640 లెక్కలో లేని మొత్తాన్ని అతడి నుంచి ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. లంచం కోసం రాజేంద్ర ప్రసాద్ చేస్తున్న వేధింపులను తాళలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు ఫిర్యాదుదారు సూరంపూడి అరవింద్ తెలిపారు. హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు సామర్లకోట: హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష, రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తూ పెద్దాపురం కోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది. సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దాపురం మండలం తాటిపర్తి గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ గోపు సతీష్ రాజాపై 2016 మే 15వ తేదీ రాత్రి పెద్దాపురం మండలం దివిలి గ్రామంలోని రాజుగారి కాంప్లెక్స్ వద్ద గల శ్రీరామా ఎంటర్ప్రైజెస్ షూమార్టు సమీపంలో ముగ్గురు వ్యక్తులు కత్తితో దాడి చేసి హత్య చేశారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై వై.సతీష్ కేసు నమోదు చేయగా సీఐ కె.శ్రీధర్ కుమార్ దర్యాప్తు చేసి 2016 మే 28న కొప్పిరెడ్డి అచ్చిరాజు (ఏ1), అతడి కుమారులు రాంబాబు (ఏ2), రాజేష్ (ఏ3)లను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. తదుపరి సీఐ వీరయ్య గౌడ్ చార్జిషీట్ ఫైల్ చేశారు. వాదోపవాదాలు పూర్తయిన తర్వాత ఏడో అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు జడ్జి జి.చంద్రమౌళీశ్వరి ఈ కేసులో తీర్పును వెలువరించారు. ముగ్గురు నిందితులకు పైవిధంగా శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ కేసులో నిందితులను పట్టుకోవడం, వారికి శిక్ష పడేలా చేసిన అప్పటి సీఐలు కె. శ్రీధర్ కుమార్, వీరయ్య గౌడ్, అప్పటి డీఎస్పీ శ్రీహరిరాజు, ప్రస్తుత ఇన్చార్జి డీఎస్పీ కేవీవీ సత్యనారాయణ, ఇటీవల బదిలీ అయిన సీఐ పి.విజయ్ శంకర్, ఎస్సై మౌనిక, కోర్టు లైన్ ఆఫీసర్, ఏఎస్సై బీవీ నారాయణలను ఎస్పీ బిందు మాధవ్ ప్రత్యేకంగా అభినందించారు. పీపీలుగా గన్నం వినయతేజ, ఎం.జయరావు వాదించారు. ప్రభుత్వ వైద్య కళాశాలకు రూ.2 లక్షల విరాళం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): మైక్రో బయాలాజీ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ ఎం.భారతి తన తల్లి లోలాక్షి జ్ఞాపకార్థం రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలకు రూ.రెండు లక్షల విరాళం అందించారు. ఈ మొత్తాన్ని మంగళవారం కళాశాల ప్రిన్సిపాల్ కేవీ శివప్రసాద్కు అందజేశారు. ఈ సొమ్మును ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, దానిపై వచ్చే ఆదాయంతో ఏటా మైక్రోబయాలాజీలో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణులైన వారిని బంగారు పతకంతో సత్కరించాలని కోరారు. ఆ పని కోసమే తన తల్లి పేరుతో ఈ మొత్తాన్ని వినియోగించాలని భారతి విజ్ఞప్తి చేశారు. తన తల్లి వైద్య విద్యను ఎంతో ప్రోత్సహించేవారని, అందుకే తాను ఈ స్థాయిలో ఉన్నానన్నారు. కార్యక్రమంలో జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కెనడీ, వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శారద తదితరులు పాల్గొన్నారు. లారీ డ్రైవర్ మృతి గండేపల్లి: ముందు వెళుతున్న లారీని ఢీకొన్న ప్రమాదంలో వెనుక వస్తున్న లారీ డ్రైవర్ మృతి చెందాడు. గండేపల్లి పోలీసులు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. రాజమహేంద్రవరం వైపు బొగ్గు లోడుతో వెళుతున్న ఓ లారీ తెల్లవారుజాము 3 గంటల సమయంలో మండలంలోని మురారి శివారుకు వచ్చే సరికి సడన్గా స్లో అయ్యింది. దీంతో లారీని వెనుక వస్తున్న గ్రావెల్ లోడు లారీ బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో గ్రావెల్ లోడు లారీ డ్రైవర్ మేడవలిమి యోగయ్య అలియాస్ దావీదు (50) క్యాబిన్లో ఇరుక్కుని మృతి చెందాడు. మృతుడు మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలేనికి చెందిన వాడని, కుటుంబ సభ్యులు పిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి దేవరపల్లి: గుండుగొలను – కొవ్వూరు జాతీయ రహదారిపై దేవరపల్లి మండలం కృష్ణంపాలెం వద్ద మంగళవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడని ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపారు. అతడి వయసు సుమారు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందన్నారు. ఆచూకీ తెలిసినవారు 94407 96624, 94407 96584 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
● బరువైన చదువు
చాగల్లు జెడ్పీ ఉన్నత పాఠశాలలో బీరువాలు మోస్తున్న విద్యార్థులు విద్యార్థులకు చదువు చెప్పి, ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు వారి చేత పనులు చేయిస్తున్న సంఘటన చాగల్లు జెడ్పీ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఆలస్యంగా మంగళవారం వెలుగుచూశాయి. వివరాల్లోకి వెళితే.. సుమారు వారం రోజుల క్రితం పాఠశాలకు నూతన ఫర్నిచర్ వచ్చింది. బరువైన బీరువాలు, ఇతర సామగ్రి ఉన్న ఆ బరువైన ఫర్నిచర్ను విద్యార్థులతో ఆపసోపాలు పడుతూ మోశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో చూసిన పలువురు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు ఎంఈఓలు ఉన్నా పాఠశాలల పర్యవేక్షణ కనిపించడం లేదని విమర్శలున్నాయి. ఇప్పటికై న ఉన్నతాధికారులు స్పందించి బాధ్యలుపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. – చాగల్లు -
వైభవంగా దివ్య కల్యాణ మహోత్సవాలు
ఆత్రేయపురం: ర్యాలిలోని జగన్మోహిని కేశవస్వామి ఆలయంలో దివ్య కల్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఐదో రోజు మంగళవారం వేద పండితులు ఆగమ శాస్త్రానుసారం సదస్యం నిర్వహించారు. ఉదయం స్వామివారికి అభిషేకం, తులసి పూజ, అమ్మవారికి కుంకుమార్చన, నిత్య ఉపాసన, వేద పారాయణ, సాయంత్రం సదస్యం జరిపారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. రాత్రి రాజమహేంద్రవరం సత్య శ్రావణి బృందం ప్రదర్శించిన భరతనాట్యం అలరించింది. ఆలయ చైర్మన్ మెర్ల నాగేశ్వరరావు, కమిటీ సభ్యులు, ఆలయ ఈవో భాగవతుల వెంకట రమణ మూర్తి తదితరులు వేద పండితులను ఘనంగా సత్కరించారు. ఆలయ అర్చకులు, బృందం సభ్యులు సదస్యంలో పాల్గొన్నారు. పేకాట శిబిరంపై దాడి అనపర్తి: మండలంలోని మహేంద్రవాడ గ్రామ శివారులో పేకాడుతున్న వారిని పట్టుకున్నామని ఎస్సై ఎల్.శ్రీను నాయక్ తెలిపారు. మార్చి 29న సాయంత్రం 6 గంటలకు తన సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి దాడి నిర్వహించామన్నారు. ఈ దాడిలో పొలమూరు గ్రామానికి చెందిన అల్లక ఉమామహేశ్వరరావు, గుత్తుల హరి దుర్గ, ద్వారంపూడి ప్రభాకర రెడ్డి, ద్వారంపూడి ఈశ్వరరెడ్డి, దాసరి వీరవెంకట సత్యనారాయణచౌదరి, కొవ్వూరి కాశీవిశ్వనాథరెడ్డి, బిక్కిన శ్రీనుబాబు, అమరపు దుర్గప్రసాద్ పేకాట ఆడుతూ పట్టుబడ్డారన్నారు. వారి నుంచి రూ.18,130, రెండు సెట్ల కార్డులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. -
బంగారు ఆభరణాల చోరీ
అనపర్తి: లక్ష్మీనరసాపురం గ్రామంలోని ఓ ఇంట్లో బంగారు ఆభరణాలను సోమవారం అర్ధరాత్రి దొంగలు దోచుకుపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సురకాసుల గోపి వ్యవసాయ కూలీగా పనిచేస్తుంటాడు. అతడికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానిక కనకదుర్గమ్మ గుడి పక్కనే రెండు అంతస్తుల భవనం నిర్మించుకున్నారు. పగలంతా కుటుంబ సభ్యులందరూ ఆ భవనంలోనే ఉంటారు. రాత్రి పడుకోవడానికి దాని వెనుక ఉన్న పాత బిల్డింగ్లోకి వెళతారు. గోపి తల్లిదండ్రులు కూడా కొత్త భవనం పైఅంతస్తులో ఉంటున్నారు. ప్రతి రోజూ మాదిరిగానే సోమవారం అర్ధరాత్రి పడుకోవడానికి పాత భవనానికి వెళ్లారు. మంగళవారం ఉదయం కొత్త ఇంటికి వచ్చేసరికీ తలుపు తాళాలు పగలగొట్టి ఉన్నాయి. లోపలకు వెళ్లి చూడగా బీరువాలోని 4 కాసుల బంగారు నల్లపూసలు, రెండు కాసుల జిగిని, 4 కాసుల చైను ఉంగరాలు, ఒక కాసు విలువైన చెవి రింగులు, మ్యాటీలు కలిపి.. మొత్తం 11 కాసుల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు అనపర్తి ఎస్సై ఎల్.శ్రీను నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం సభ్యులు ఆధారాలు సేకరించారు. -
ఉత్తమ నాటికగా ‘ఇంద్రప్రస్థం’
అమలాపురం టౌన్: అమలాపురం రస వాహిని సాంస్కృతిక వేదిక నిర్వహణలో కేఎన్ మూర్తి నాటక పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక ముస్లిం షాదీఖానా భవన ప్రాంగణంలో మూడు రోజులుగా జరుగుతున్న ప్రథమ ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు సోమవారం రాత్రితో ముగిశాయి. ఈ మూడు రోజుల్లో ప్రదర్శించిన నాటికల్లో సోమవారం రాత్రి ప్రదర్శితమైన ‘ఇంద్రప్రస్థం’ నాటిక ఉత్తమ ప్రదర్శనగా నిలిచి రూ.30 వేల నగదు బహుమతిని గెలుచుకుంది. ప్రేమించుకున్న జంట ఒక వైపు, వారి తల్లిదండ్రులు మరోవైపు, వారి వాదనలు, చివరకు ఉభయుల అంగీకారంతో పెళ్లి జరగడంతో నాటిక ముగుస్తుంది. పోటీల ముగింపు సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ షరీఫ్లు హాజరయ్యారు. రసవాహని సంస్థ అధ్యక్షుడు, కేఎన్ మూర్తి నాటక పరిషత్ వ్యవస్థాపక కార్యదర్శి మహ్మద్ షెహన్ షా పర్యవేక్షణలో జరిగిన ఈ పోటీల ముగింపు కార్యక్రమంలో పరిషత్ అధ్యక్షుడు కొండాబత్తుల వేణుగోపాలరావు, కేఎన్ మూర్తి, ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ గోకరకొండ నాగేంద్ర, విశ్వ హిందూ పరిషత్ జిల్లా ప్రతినిధి డాక్టర్ గోదశి గంగరాజు, అమలాపురం పంచాయితీ రాజ్ డీఈఈ అన్యం రాంబాబు, పరిషత్ కో ఆర్డినేటర్ ఎంవీఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. పరిషత్ ప్రతినిధులు కొండాబత్తుల నరసింహమూర్తి, కొండాబత్తుల శ్రీరాములును రస వాహిని రంగస్థల సేవా పురస్కారాలతో సత్కరించారు. అలాగే డాక్టర్ కె.సాంబశివరావు, మల్లాది శివన్నారాయణ, నాయుడు గోపి, దేవిశెట్టి రామకోటేశ్వరరావు, నటకుమారిలను దివంగత నల్లా సత్యనారాయణ రంగస్థల సేవా పురస్కారాలతో సత్కరించారు. కార్యక్రమంలో అమలాపురం చెన్నమల్లేశ్వర కళాపరిషత్ ప్రతినిధి నల్లా శ్రీధర్, రమణ పాల్గొన్నారు. -
చదరంగం పోటీల్లో ప్రతిభ
అమలాపురం రూరల్: అమలాపురంలో జరిగిన కోనసీమ జిల్లా అండర్–9 చెస్ చాంపియన్ షిప్ పోటీల్లో అమలాపురం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థినీ బి.శాన్వి ప్రథమ స్థానం, ఓపెన్ కేటగిరీ నుంచి మోక్స్ సైనీ తృతీయ స్థానాలు కై వసం చేసుకున్నారని కోచ్ వి.శ్రీనుబాబు సోమవారం తెలిపారు. వీరు వచ్చే నెల 18, 19 తేదీల్లో అన్నవరంలో జరిగే అండర్ –9 రాష్ట్ర స్థాయి చదరంగం పోటీల్లో పాల్గొనున్నారు. ఎనిమిదేళ్ల శాన్వి మొదటి స్థానం సాధించి జిల్లా చాంపియన్గా నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం హర్షించదగ్గ విషయమని పలువురు కొనియాడారు. చదువుతో పాటు చదరంగంలో రాణిస్తున్న విద్యార్థినులను స్కూల్ చైర్మన్ నాయుడు, డైరెక్టర్ పిన్సిపాల్ నంద్యాల మనువిహార్ అభినందించారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 22,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 24,000 గటగట (వెయ్యి) 21,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 14,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
11 మంది కార్మికులకు అస్వస్థత
రౌతులపూడి: మండలంలోని ఉప్పంపాలెం సమీపంలో ఓ స్టోన్ క్రషర్లో పనిచేస్తున్న 11 మంది బీహార్ కార్మికులు సోమవారం అస్వస్థతకు గురై స్థానిక సీహెచ్సీలో చేరారు. ఇందులో నలుగురు వాంతులు, విరోచనాలు, మరో ఏడుగురు ఒళ్లు, కడుపు నొప్పి వంటి సమస్యతో బాధపడుతున్నారు. వీరికి ఆసుపత్రి వైద్యులు పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని సీహెచ్సీ వైద్యాధికారి ఉమామహేశ్వరరెడ్డి తెలిపారు. ఆరుగురిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేయగా, మిగిలిన ఐదుగురిని పూర్తిగా కోలుకునే వరకూ వైద్యులు పర్యవేక్షిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అనంతరం స్టోన్ క్రషర్ సమీపంలో రోగులు తీసుకున్న ఆహార దినుసులను, చుట్టుపక్కల పరిశుభ్రత గురించి పరిశీలన చేసినట్లు ఆయన వివరించారు. డాక్టర్లు రాజాజీ, సరోజ, సౌమ్మశ్రీ రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఆదుకోండి.. ప్రాణం నిలపండి కుమారుడి కోసం తల్లిదండ్రుల మొర బోట్క్లబ్ (కాకినాడ సిటీ): అరుదైన వ్యాధితో బాధపడుతున్న తన నాలుగేళ్ల కుమారుడి వైద్యానికి సాయం చేసి ఆదుకోవాలని బాధిత తల్లిదండ్రులు కోరారు. కాకినాడ రూరల్ మండలం గంగనాపల్లికి చెందిన కోసూరి బాలాజీ కుమారుడు మోజెస్రాజు (4) ఎస్ఎంఎస్ టైప్ టూ వ్యాధి తో బాధపడుతున్నాడు. స్థానికంగా ఓ చెప్పులు దుకాణంలో బాలాజీ పనిచేస్తున్నాడు. అతని జీతం రూ.18 వేలు, ప్రస్తుతం మోజెస్రాజుకు ప్రతి నెలా వైద్యానికి రూ. 50 వేలకు పైగా ఖర్చవుతుంది. ఈ పరిస్థితుల్లో తమ కుమారుడిని ఆదుకోవాలని కోసూరి బాలాజీ సోమవారం పీజీఆర్ఎస్లో జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్కు వినతిపత్రం అందజేశారు. నడవలేని స్థితిలో ఉన్న తన కుమారుడిని ఇప్పటికే చాలా ఆసుపత్రులు తిప్పానని తెలిపారు. ఈ వ్యాధి నయం కావడానికి రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్లు చే యాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారని బాలా జీ అన్నారు. ప్రభుత్వం, దాతలు సహకరించి తన కుమారుడిని ఆదుకోవాలని ఆయన కోరారు. దాతలు సహాయం చేయాలనుకుంటే 92905 96660 నంబరులో సంప్రదించాలన్నారు. -
వైభవంగా బ్రహ్మోత్సవాలు
ఆత్రేయపురం: ప్రసిద్ధి గాంచిన ర్యాలీ జగన్మోహినీ కేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు సోమవారం ఆలయ అర్చక స్వాములు ప్రత్యేక పూజలు, సేవలు నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు, తులసి పూజ, అమ్మవారికి కుంకుమార్చనలు, నిత్య ఉపాసన, బలిహరణ, నీరాజన మంత్ర పుష్పాలు, వేద పారాయణ అనంతరం పెద్ద సంఖ్యలో భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. అనంతరం కరప కళాకారుల బృందంచే సుందరకాండ, తోలు బొమ్మలాట ప్రదర్శన నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయ చైర్మన్ మెర్ల నాగేశ్వరరావు, కమిటీ సభ్యులు, ఆలయ ఈఓ భాగవతుల వెంకటరమణమూర్తి పర్యవేక్షించారు. హైదరాబాద్కు చెందిన వెంకట మహాదేవ కుమార్ దంపతులు రూ.5,116, కాకినాడ వాస్తవ్యులు గంగరాజు దంపతులు రూ.5,116 విరాళం సమర్పించారు. దాతలకు స్వామివారి ఫొటోలను సిబ్బంది అందజేశారు. ర్యాలిలో జగన్మోహినీ కేశవస్వామి -
పాత్ర రోజులొచ్చాయ్..
కుమ్మరి చక్రంపై మట్టితో కూజా తయారు చేస్తున్న కార్మికుడు పిఠాపురం: ఆరోగ్యమే మహాభాగ్యం.. అలాంటి ఆరోగ్యంపై అందరికీ శ్రద్ధ పెరిగింది.. ఆధునికతతో వస్తున్న ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు కొత్తది వద్దు.. పాతదే ముద్దు అనే పరిస్థితి వచ్చింది. అందుకే ఎలాంటి హాని లేని మట్టి పాత్రలపై మోజు పెరుగుతోంది. దీంతో వీటికి పూర్వ వైభవం సంతరించుకుంటోంది. ప్రస్తుతం ప్రతి ఇంట్లో స్టీలు, అల్యూమినియం, ప్లాస్టిక్ వస్తువులదే అగ్రభాగం అయ్యింది. ఆధునిక పద్ధతులతో పాటు అంతే వేగంగా వ్యాధుల ముప్పు ఆందోళన కలిగిస్తోంది. ఉదయం వంట సాయంత్రానికే పాడవుతోంది. అదే మట్టి పాత్రలో వండితే వండినవి వండినట్లే ఉంటాయి. ఆరోగ్యానికి ఆరోగ్యం, అన్ని రకాల సౌలభ్యం. అందుకే మట్టి పాత్రలకు మళ్లీ మంచి రోజులొచ్చాయి. సాధారణంగా మట్టి పాత్రల ప్రాధాన్యం తగ్గిపోయాక కుమ్మర్లు కుల వృత్తిని వీడి ఇతర వృత్తులకు చేరువయ్యారు. అక్కడక్కడా కొందరు మట్టి పాత్రలు తయారు చేసినా, కేవలం కొందరు మాత్రమే అదీ వేసవిలో మంచినీటికి, శుభకార్యాల్లో సంప్రదాయాలకు మాత్రమే వీటిని ఉపయోగించేవారు. ఇలా వీటి తయారీ తగ్గిపోయింది. కానీ ప్రకృతి వైద్యం ఆయుర్వేదం వంటి ఆరోగ్య సూచనలు పెరగడంతో ఎక్కువ మంది ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి మట్టి పాత్రలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల పూర్వ వైభవం వచ్చింది. తద్వారా వీటి తయారీ ఊపందుకుంది. మళ్లీ కుమ్మర్లకు చేతినిండా పని వచ్చింది. జిల్లాలో 500 కుటుంబాలు ప్రస్తుతం మట్టి పాత్రల తయారీ చేస్తుండగా, క్రమంగా వీటి సంఖ్య పెరుగుతోంది. ఆ‘పాత్ర’మధురాలు పూర్వం పాలు తాగినా, నీళ్లు తాగినా, అన్నం తిన్నా, పెరుగు తోడెట్టినా అన్నీ మట్టి పాత్రలోనే జరిగేవి. శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుందన్నట్టుగా మట్టి పాత్రలో వేసిన ప్రతీది ఒక అద్భుతంగా మారేది. మట్టి పాత్రలు కేవలం వంట పాత్రలు లేదా నిల్వ పాత్రలు మాత్రమే కాదు. అవి మన సంస్కృతీ సంప్రదాయం, గ్రామీణ జీవన విధానానికి ప్రతిబింబం. భారతీయ సంస్కృతిలో మట్టి పాత్రలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. పూర్వం నుంచి మట్టి కుండల్లో నీరు నిల్వ చేయడం, ఆ పాత్రల్లో వంట చేయడం అనేది సాధారణం. పండగలు, ఉత్సవాలు, వివాహాలు, పూజలలో కూడా మట్టి పాత్రలు ముఖ్య పాత్ర పోషించేవి. దీపావళి సందర్భంగా వెలిగించే ప్రమిదలు, గ్రామీణ దేవాలయాలలో ఉపయోగించే మట్టి పాత్రలు ఇవన్నీ మన సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనాలు. వీటి తయారీ అనేది ఒక సాధారణ పనికాదు. ఇది అనుభవం, నైపుణ్యం, సహనం కలిసిన కళ. సరైన మట్టిని సేకరించాక శుభ్రపరిచి, నీటితో కలిపి మృదువుగా చేయడం, కుమ్మరి చక్రంపై చేతులతో ఆకారమివ్వడం, సూర్యరశ్మిలో ఆరబెట్టడం, అగ్నిలో కాల్చి దృఢంగా మార్చడం, కొన్నిసార్లు రంగులు వేసి అలంకరించడం ఇలా ఈ ప్రతి దశలో శ్రద్ధ అవసరం. ఒక చిన్న పొరపాటు మొత్తం పాత్ర రూపాన్ని మార్చేస్తుంది. కొన్ని గ్రామాల్లో వీటి తయారీకి ప్రత్యేకంగా ఒక వీధి ఉంటుంది. ఆ వీధిని స్థానికంగా కుమ్మర వీధి అని పిలుస్తారు. ఈ వృత్తినే నమ్ముకుని అక్కడ అనేక కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కుండ బిర్యానీకి మంచి గిరాకీ ప్రస్తుతం ‘సస్టైనబుల్ లివింగ్’ అనే భావన ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోంది. ఈ నేపథ్యంలో మట్టి పాత్రల ప్రాముఖ్యత మళ్లీ పెరుగుతోంది. నగరాల్లో కూడా ఇప్పుడు మట్టి పాత్రలను ఉపయోగించే అలవాటు తిరిగి వస్తోంది. రెస్టారెంట్లు, ఆర్గానిక్ స్టోర్లు, హోమ్ డెకర్ రంగంలో కూడా మట్టి వస్తువులకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా బిర్యానీ ప్రియులు కుండ బిర్యానీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. బిర్యానీ ప్రేమికుల అభిరుచికి తగినట్టుగా చిన్న చిన్న హోటళ్లు, రెస్టారెంట్లు సైతం తమ వద్ద కుండ బిర్యానీ లభిస్తుందంటూ ప్రచారం చేస్తున్నారు. కుండలు, కూజాలు, వాటర్ బాటిళ్లు వంట పాత్రలు ఇలా అనేక రకాల మట్టి పాత్రల తయారీ ఊపందుకుంది. ఆదరణ పెరుగుతోంది మా తాతల కాలం నుంచి ఇదే వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాం. రాను రాను వివాహాలు, ఇతర కార్యక్రమాల్లో తప్ప మట్టి పాత్రలను వినియోగించడం మానేశారు. ఈ పాత్రలను వినియోగించడం మన ఆ రోగ్యానికి, పర్యావరణానికి చాలా మంచిదని తెలుసుకున్న తరువాత వీటికి ఆదరణ పెరిగింది. ము ఖ్యంగా బిర్యానీ వంటి వంటకాలకు వీటిని వినియోగించడం వల్ల మాకు చేతి నిండా పని దొరుకుతోంది. –ఎస్.అప్పారావు, మట్టి పాత్రల తయారీ కార్మికుడు, పిఠాపురం ఆరోగ్యానికి, ప్రకృతికి మేలు మట్టి పాత్రలు వినియోగించడం వల్ల మన ఆరోగ్యానికి ఇటు ప్రకృతికి మేలు జరుగుతుంది. మట్టి బిందెల్లో నిల్వ చేసిన నీరు సహజంగా చల్లగా ఉంటుంది. ఆహారం మెల్లగా వండబడటం, రసాయనాలు లేని సహజ వంట విధానం వల్ల పోషక విలువలు నిలుస్తాయి. పూర్తిగా సహజ పదార్థం మట్టితో తయారు చేయడం కారణంగా పర్యావరణానికి మేలు చేస్తుంది. ప్లాస్టిక్ వాడకాన్ని వీడడంతో కాలుష్యం తగ్గుతుంది. ఫ మట్టి పాత్రలకు పెరుగుతున్న ఆదరణ ఫ కుమ్మర్లకు చేతినిండా పని ఫ గడిలో పడిన బతుకు చక్రం -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
శంఖవరం: కత్తిపూడి– రౌతులపూడి రోడ్డులో సోమవారం జరిగిన ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. స్థానిక జెడ్పీ హైస్కూల్ శివారులో కత్తిపూడి సీతారామా కళాశాల బస్సు విద్యార్థులతో శృంగవరం వెళ్తుండగా, రౌతులపూడి నుంచి వస్తున్న గ్రావెల్ లారీ బలంగా ఢీకొంది. బస్సులో ప్రయాణిస్తున్న శంఖవరం మండలం గౌరంపేట పంచాయతీ మాసంపల్లి గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థినులు టి.సంధ్య అనురాధ, డి.వరలక్ష్మి, శృంగవరం గ్రామానికి చెందిన స్థానిక జెడ్పీ హైస్కూల్ విద్యార్థి వై.అభిరామ్కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు చికిత్స నిమిత్తం స్థానిక పీహెచ్సీకి తరలించారు. ఈ రోడ్డులో అధిక బరువుతో గ్రావెల్ లారీలు తిరగడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఎమ్మెల్యే అశోక్పై దాడికి యత్నం
త్రుటిలో తప్పించుకున్న వైనం యానాం: స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్పై కొంతమంది దాడికి యత్నించడంతో త్రుటిలో ఆయన తప్పించుకున్నారు. తీర ప్రాంత మత్స్యకార గ్రామమైన సావిత్రినగర్కు ఓ పుట్టినరోజు కార్యక్రమానికి ఆయన వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి కారు వద్దకు వెళుతుండగా, ఒక్కసారిగా సుమారు 50 మంది రాళ్లు పట్టుకుని దాడికి యత్నించారని, దాని నుంచి త్రుటిలో తప్పించుకున్నానని ఎమ్మెల్యే అశోక్ విలేకరులకు తెలిపారు. తాను ముందస్తు అనుమతితో సావిత్రినగర్కు వెళ్లానని, అక్కడ ఉన్న ఎన్నికల అధికారి గొంతియ్యకు సైతం తెలిపానని, అయితే తనను గొంతియ్య ఏకపక్షంగా నువ్వు అంటూ సంబోధించడం ఎంతవరకు సబబు అని అన్నారు. ఇంటింటికీ ప్రచారానికి రాలేదని తెలిపానన్నారు. అయితే ఇదే అదనుగా కొంతమంది ఒక్కసారి తన వైపునకు రాళ్లతో వచ్చారని, మరోవైపు తన అనుయాయులు ఆపినప్పటికీ ముందుకు రావడంతో తాను కారులో తిరిగి యానాంకు వచ్చేశానన్నారు. తనపై ఎన్ని దౌర్జన్యాలకు దిగినా తనదే విజయమని ఆయన అన్నారు. ఘటనపై పుదుచ్చేరి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తానన్నారు. -
రికార్డులు లేని నగదు స్వాధీనం
యానాం: యానాం శాసనసభా నియోజకవర్గానికి వచ్చే నెల 9న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి, యానాం సరిహద్దుల్లో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తనిఖీలు ముమ్మరం చేశారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక హనుమాన్ దాబా సమీపంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద ఓ కారులో రూ.2.50 లక్షలను కనుగొన్నట్లు ఎన్నికల సిబ్బంది తెలిపారు. ఆ నగదుకు సంబంధించి అకౌంట్ల వివరాలు లేకపోవడంతో ఆ నగదును సీజ్ చేసి యానాం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి స్వాధీనం చేసినట్లు సిబ్బంది తెలిపారు. -
ఆలోచింపజేసిన నాటికలు
ఏలేశ్వరం: శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా పెద్దనాపల్లి గ్రామంలో గొల్లపల్లి చెల్లయ్య మెమోరియల్ నాటక కళా పరిషత్ అధ్యక్షుడు, ఎంపీపీ గొల్లపల్లిబుజ్జి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల నాటికల పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం వెలగలేరు థియేటర్స్ వారి ఉరి నాటిక ఆలోచింపజేసింది. నేటి సమాజంలో మనిషికి ఇగో ఉంటే చివరికి ఎంతో నష్టపోతాడో సవివరంగా ప్రదర్శించారు. దీనికి రచన, దర్శకత్వం పోలుదాసు శ్రీనివాసరావు అందించారు. రెండో ప్రదర్శనగా కాకినాడ జీవీకే క్రియేషన్స్ వారి కన్నీటికి విలువెంత నాటిక ఆకట్టుకుంది. ఒక మహిళ డాక్టర్ తన స్వార్థంతో చేసిన పనిని తోటి మహిళలు తిరగబడి బుద్ధి చెప్పిన కథాంశంతో నాటిక ఆసక్తికరంగా సాగింది. దీనికి మూలకథ డి.కామేశ్వరి, నాటకీకరణ డి.ఉమాశంకర్ అందించగా, దర్శకత్వం డి.వినయ్ నిర్వహించారు. నాటిక ప్రదర్శనలు తిలకించేందుకు అధిక సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. -
రాజధాని పేరుతో చంద్రబాబు డ్రామా
● రానున్న రోజుల్లో ప్రజలే చెక్ పెడతారు ● రాజధాని, పోలవరం చంద్రబాబుకు ఏటీఎంలు ● ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కపిలేశ్వరపురం (మండపేట): సీఎం చంద్రబాబు రాష్ట్ర రాజధాని అమరావతి పేరుతో డ్రామా ఆడుతున్నారని, ఆయన చర్యలన్నింటినీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. మండపేటలోని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరావతికి చట్ట బద్దత తెస్తూ తీర్మానం చేసినట్టు కూటమి నేతలు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారన్నారు. తర్వాత ఎవరొచ్చినా రాజధానిని మార్చలేని విధంగా చట్టం చేసినట్టు గొప్పలు చెబుతున్నారని, అలాంటప్పుడు ఇప్పటి వరకూ అమరావతి రాజధాని కాదని అంటారా అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు హంగామా చేస్తున్న చంద్రబాబు ఆ చట్టమేదో నవ్యాంధ్రకు తొలిసారి సీఎం అయ్యినప్పుడు ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు. అమరావతి పేరుతో చేస్తున్న జపమంతా చంద్రబాబు, కూటమి నేతలు రూ.లక్షల కోట్లు దోచుకోవడానికి చేస్తున్న జిమ్మిక్కులన్నారు. రాజధానిని అభివృద్ధి చేశామని చెబుతున్న చంద్రబాబు మాటలు మసిపూసి మారేడుకాయ చేసినట్టున్నాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేశానని చెబుతున్న తీర్మానాలు కేవలం విపక్షాన్ని విమర్శించడానికి తప్ప అందులో రాష్ట్ర ప్రయోజనాలేమీ లేవన్నారు. అమరావతి, పోలవరంలను చంద్రబాబు ఏటీఎంలుగా మార్చుకున్నారని గతంలో ప్రధాని మోదీ చెప్పారని గుర్తు చేశారు. అమరావతిలో రూ.లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామన్న పేరుతో తన అనుచరులకు టెండర్లు ఇచ్చుకుంట్నునారన్నారు. 50 ఏళ్లు నిండిన బీసీలకు పింఛను కల్పిస్తామని, ప్రతి మహిళకు నెలకు రూ.15 వందలు ఇస్తామని, చేనేత కార్మికులకు ఏడాదికి రూ.25వేలు ఇస్తామంటూ చేసిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. వీటన్నింటినీ ప్రశ్నిస్తారన్న భయంతో విపక్ష నేతలను విమర్శిస్తూ కూటమి నేతలు కాలం వెళ్లబుచ్చుతున్నారన్నారు. మహనీయుడు ఎన్టీఆర్ను సీఎం కుర్చీ నుంచి దించేసి ఘోరంగా క్షోభ పెట్టారని, అలాంటి చంద్రబాబు సామాన్య ప్రజలకు మేలు చేస్తారన్నది అభూత కల్పన అని ఎమ్మెల్సీ తోట అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు పిల్లా వీరబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరగ్రుంట అయ్యప్ప, మాజీ కౌన్సిలర్లు మందపల్లి రవికుమార్, మెండు బాపిరాజు, పోతంశెట్టి ప్రసాద్, ముమ్మిడివరపు బాపిరాజు, నియోజకవర్గ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు పలివెల మధు, మైనారిటీ విభాగం అధ్యక్షుడు షేక్ వల్లీ సాహెబ్, నాయకులు మేడిశెట్టి దుర్గారావు, వరదా చక్రవర్తి, సాధనాల శివ భగవాన్, వై రామకృష్ణ, యారమటి వెంకన్నబాబు పాల్గొన్నారు. -
అక్రమ నిర్మాణాలతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి పండగ
● ప్రోత్సహిస్తున్న కార్పొరేషన్ అధికారులు ● గౌతమి బిల్డింగ్ విషయంలో హైకోర్టు ఆదేశాలు పాటించాలి ● పీజీఆర్ఎస్లో మాజీ ఎంపీ భరత్రామ్ వినతిపత్రం రాజమహేంద్రవరం సిటీ: నగరంలో అక్రమ భవన నిర్మాణాలతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పండగ చేసుకుంటున్నారని, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ముడుపుల మత్తులో తేలుతున్నారని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆరోపించారు. రాజమహేంద్రవరం దేవీచౌక్ సమీపంలో పశువుల ఆసుపత్రి ఎదుట గౌతమి బిల్డింగ్ జి ప్లస్ ఫోర్లో నిబంధనలను అతిక్రమించి నిర్మించారని అన్నారు. ఈ బిల్డింగ్ అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని మహమ్మద్ ఉస్మాన్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు. కార్పొరేషన్ అధికారులు విచారణ జరిపి నిర్మాణం అక్రమమని నిర్ధారణ చేస్తే చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు ఆదేశించినట్టు భరత్రామ్ తెలిపారు. ఆ ఆదేశాలను అమలు పరచాలని ఆయన సోమవారం కార్పొరేషన్ సిటీ ప్లానర్ జీవీవీఎస్ మూర్తిని కోరారు. ఈ మేరకు కార్పొరేషన్ కార్యాలయంలో పీజీఆర్ఎస్లో వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ నిబంధనల ప్రకారం 22 శాతం పార్కింగ్ ఉండాలని సెట్ బ్యాక్లు ఉండాలని, ఓపెన్ స్థలం ఉండాలని అయితే ఇవన్నీ ఎక్కడ కనిపించవన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధి ఒత్తిడికి లొంగి బిల్డింగ్ యజమానిపై చర్యలు మానేసి బీపీఎస్ అమల్లో ఉందని వత్తాసు పలుకుతున్నారని ఆయన మండిపడ్డారు. అక్రమ బిల్డింగ్ వ్యవహారం తాము హైకోర్టులోనే తేల్చుకుంటామన్నారు. రూ.లక్షల్లో ముడుపులు నగరంలో ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు జరిగితే సిటీ ఎమ్మెల్యేకు పండగేనని, వెంటనే ఆయన అనుచరులు రాబందుల్లాగా వాలిపోయి రూ.లక్షల్లో ముడుపులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. నిర్మాణం సైజును బట్టి రూ.ఐదు లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ముడుపులు వసూలు చేస్తున్నారని అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ముడుపుల మత్తులో పడి ఆక్రమణదారులను ప్రోత్సహిస్తున్నారని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని భరత్రామ్ ధ్వజమెత్తారు. నగరంలో వందలాది అక్రమ భవన నిర్మాణాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని వీటి వైపు కనీసం కన్నెత్తి చూసిన ప్రజా ప్రతినిధులు గాని, అధికారులు గానీ లేరన్నారు. ఎమ్మెల్యేకు సవాల్ ఎన్నికల ముందు ఇదే బిల్డింగ్ వ్యవహారంలో తాను రూ.ఐదు కోట్లు లంచం తీసుకున్నానని నగరమంతా కరపత్రాలు ముద్రించి పంపిణీ చేసి, విష ప్రచారం చేసి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్యాయంగా ఎమ్మెల్యేగా గెలిచారని అన్నారు. ఎన్నికల ముందు తనపై చేసిన లంచం ఆరోపణలు ఈవీఎం ఎమ్మెల్యే నిరూపించాలని, లేదంటే రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, నిరూపించినట్లైతే అదే బిల్డింగ్ వద్ద తాను క్షమాపణ చెప్తానని భరత్రామ్ సవాల్ చేశారు. మున్సిపల్ కమిషనర్కు చిత్తశుద్ధి ఉంటే నిబంధనలు అతిక్రమించిన అక్రమ బిల్డింగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే తండ్రి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు దళితుల్ని కించపర్చిన వ్యవహారంలో పోలీస్ కేసు నమోదు చేసినా బాధితులకు ప్రాథమిక హక్కుగా ఇవ్వవలసిన రసీదును ఒక సీఐ నిరాకరించడాన్ని బట్టి రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం అవుతోందన్నారు. క్రెడిట్ చోరీ చేయడంలో దేశంలో చంద్రబాబును మించినవారు లేరని, రాష్ట్రంలో ప్రస్తుతం వచ్చిన పోర్టులు, పరిశ్రమలు గత జగనన్న ప్రభుత్వంలో వచ్చినవేనన్నారు. ఈయన వెంట వైఎస్సార్ సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, వైఎస్సార్ సీపీ జిల్లా ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ దాసి వెంకట్రావు, వైఎస్సార్ సీపీ మున్సిప్ల్ వింగ్ అధ్యక్షుడు మజ్జి అప్పారావు ఉన్నారు. -
పన్ను కట్టకపోతే.. పరువు తీత!
● పంచాయతీల్లో పన్నుల వసూళ్లకు చంద్రబాబు ప్రభుత్వం కొత్త పంథా ● పన్ను చెల్లించని ప్రజల ఇంటి ముందు జప్తు నోటీసుల ఏర్పాటు ● జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వెలసిన బోర్డులు ● తమ పరువేం కావాలంటూ ప్రజల ఆందోళన ● వసూలు చేయని అధికారులపై చర్యలకూ వెనకాడని వైనం ● జిల్లాలో పన్నుల వసూళ్ల లక్ష్యం రూ.120 కోట్లు ● ఇప్పటికి రూ.79.99 కోట్లు వసూలు సాక్షి, రాజమహేంద్రవరం: పంచాయతీల్లో పన్నుల వసూలుకు చంద్రబాబు సర్కారు కొత్త పంథా అనుసరిస్తోంది. పన్నుల చెల్లింపుల్లో ఆలస్యమైన, చెల్లించని వారి పరువు తీసేందుకు నిర్ణయం తీసుకుంది. పన్ను కట్టని ఇంటి వద్ద ఇంటి యజమాని పేరుతో పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తోంది. జప్తు నోటీసు ఇంటికి అంటిస్తోంది. అందులో ఇంటి యజమాని పేరు, ఎంత చెల్లించాలో స్పష్టం చేస్తోంది. ఈ పరిణామం గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఆగ్రహావేశాలు నింపుతోంది. పన్ను చెల్లించకపోతే నోటీసు ఇచ్చి వసూలు చేయాలే తప్ప.. ఇంటి వద్దకు వచ్చి పరువు తీయడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇలాంటి చర్యలు ఇప్పటి వరకు ఎన్నడూ చూడలేదని ఆవేదన చెందుతున్నారు. అడ్డదారుల్లో సంపద సృష్టించేందుకు ఇలాంటి పద్ధతిని అవలంబిస్తున్నారా? అన్న అనుమానం కలుగుతోంది. ఇప్పటికే మద్యం, విద్యుత్ సర్చార్జీలు పెంచడం ద్వారా రూ.కోట్లల్లో ఆదాయం గడించిన చంద్రబాబు ప్రభుత్వం.. గ్రామాల్లో పన్నుల వసూళ్లతో మరింత ఆదాయం గడించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఎవరినీ వదలడం లేదు. పన్నులు ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేయాలంటూ కార్యదర్శులకు హుకుం జారీ చేసింది. చేయని పక్షంలో సస్పెండ్ చేస్తామంటూ బెదిరింపులకు గురిచేస్తోంది. జిల్లాలో రూ.120.17 కోట్ల వసూళ్ల లక్ష్యం జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది పన్నుల వసూళ్లలో భాగంగా మొత్తం రూ.120.17 కోట్లు వసూలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఇందులో ట్యాక్స్లో భాగంగా ఇంటి, నీటి పన్నులు, నాన్ట్యాక్స్గా ఇండస్ట్రీస్, చెరువులు తదితరాల కింద రూ.120.17 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులకు లక్ష్యాలను నిర్దేశించింది. మార్చి నెలాఖరుకు 100 శాతం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందుకుగాను కార్యదర్శుల మెడపై కత్తి పెట్టారు. లక్ష్యాలు అధిగమించకపోతే.. మండలానికి ఒక కార్యదర్శిని సస్పెండ్ చేస్తామంటూ బెదిరింపులకు గురి చేశారు. దీంతో గ్రామాల్లో కార్యదర్శులు పన్నుల వసూళ్లపై దృష్టి సారించారు. నిత్యం అదేపనిలో తలమునకలయ్యారు. అయినా లక్ష్యం నెరవేరలేదు. ఇప్పటి వరకు రూ.79.99 కోట్లు వసూలు చేయగా.. రూ.40.17 కోట్లు పెండింగ్లో ఉంది. 66 శాతం మాత్రమే లక్ష్యాన్ని సాధించారు. మిగిలినది ఒక రోజులో ఎలా చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. నోటీసులు అందకపోవడంతో.. గతేడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో పన్నుల డిమాండ్లకు సంబంధించి కంప్యూటరైజేషన్ చేశారు. ట్యాక్స్ చెల్లించే వారికి ఫిజికల్ కాపీ ఇవ్వకుండా వారి ఫోన్ నంబర్లకు కట్టాల్సిన మొత్తానికి సంబంధించి డిమాండ్ నోటీస్ పంపారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకోని వారు ఎక్కువగా ఉంటారు. దీనికితోడు ఆండ్రాయిడ్ కాకుండా కీప్యాడ్ ఫోన్లు ఎక్కువగా వినియోగిస్తారు. వారికి ఈ విషయం తెలియకపోవడం.. ఫిజికల్గా నోటీసు అందకపోవడంతో పన్నుల వసూళ్లలో ఆలస్యం చోటు చేసుకుంది. నవంబర్ 1వ తేదీ నుంచి ఇంటి పన్నులు, జనవరి 1 నుంచి కుళాయిలు, చేపల చెరువుల పన్నుల వసూళ్లు ప్రారంభించారు. దీంతో పాటు స్వర్ణ పంచాయతీలుగా ప్రభుత్వం రూపకల్పన చేయడంతో డిసెంబర్ 1 నుంచి స్వర్ణ పంచాయతీల్లో చెల్లింపులు జరుగుతున్నాయి. ఫోన్ల ద్వారా మెసేజ్ వెళ్లిన వారికి బకాయి ఎంత ఉందో తెలియకపోవడం, ప్రజలు నగదు ఇవ్వటంతో కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు వాటిని తీసుకెళ్లి డిపాజిట్ చేసి ఆన్లైన్లో కట్టడం తలకుమించిన భారంగా పరిణమించింది. పన్ను కట్టని వారికి ఘోరంగా అవమానం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పరువుకు ప్రాణం ఇస్తారు. ఏ ఒక్కరు చిన్న మాట అన్నా.. పడరు. అలాంటి పల్లెల్లో పన్నులు చెల్లించలేదన్న సాకుతో వారి పరువు తీసేలా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పన్నులు కట్టని వారిని వివిధ రూపాల్లో అవమానాలకు గురి చేస్తోంది. పన్ను కట్టని ఇంటికి కూళాయి కనెక్షన్ నిలిపివేస్తున్నారు. వారికి నీరు అందకుండా చేస్తున్నారు. మరో అడుగు ముందుకేసి విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తున్నారు. ఇంట్లో వస్తువులు జప్తు చేసేందుకు నోటీసులు జారీ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా ‘ఈ కుటుంబ యజమాని పన్నులు చెల్లించలేదు.’ అంటూ ఆ ఇంటి ముందు యజమాని పేరు, ఆయన చెల్లించని పన్ను వివరాలు తెలిసేలా పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల పేరుతో కార్యదర్శులను ప్రతి ఇంటికీ పంపించి వసూళ్ల పర్వం వేగవంతం చేయాలని ఒత్తిడి చేయడంతో పగలు, రాత్రి తేడా లేకుండా పంచాయతీ కార్యదర్శులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. దీంతో ప్రజలు మరింత అవమానాలకు గురవుతున్నారు. తాము పన్ను కట్టలేదని ఊరంతా తెలిసేలా చేస్తున్నారని.. ప్రభుత్వం చేసే తప్పిదాలకు తాము అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఏటా జరుగుతోందిలా..! ఏటా ఇంటి పన్నుల వసూళ్లకు మార్చి మాసంలో నోటీసులు జారీ చేస్తారు. ఏప్రిల్ నెలాఖరుకు పంచాయతీ కార్యదర్శులు వసూలు చేస్తారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాత ప్రక్రియకు మంగళం పాడారు. ప్రజల వద్ద వసూళ్లకు నాంది పలికారు. రాష్ట్ర ప్రభుత్వానికి మరెక్కడా అప్పు పుట్టక ప్రజలపై పడుతున్నారు. ఫిబ్రవరి నెలాఖరుకే పన్నులు వసూలు చేసేయాలంటూ కార్యదర్శుల మెడపై కత్తిపెట్టారు. ఈ పరిణామం కార్యదర్శుల్లో ఆవేదన నింపుతోంది. ప్రతి సంవత్సరం ఇంటిపన్ను వసూళ్లకు మార్చి నెలలో నోటీసులు జారీ చేసి ఆ నెలాఖరుకు గానీ, ఏప్రిల్ చివరకు పంచాయతీ కార్యదర్శులు వసూలు చేస్తుంటారు. ప్రస్తుతం పద్ధతులన్నీ మారడంతో కార్యదర్శి ఉద్యోగం చేయడం కంటే మానుకోవడం మేలంటూ కొందరు కార్యదర్శులు వాపోతున్నారు. కార్యదర్శులు సతమతం పన్నుల వసూళ్లపై ప్రభుత్వం ఉన్నతాధికారులపై ఒత్తిడి పెంచుతోంది. ఉన్నతాధికారులు కార్యదర్శులపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో చేసేది లేక కార్యదర్శులు అవస్థలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒత్తిడిని తాళలేక వయసుపైబడిన సీనియర్ కార్యదర్శులు బీపీలు, సుగర్ బారిన పడుతున్నామని వాపోతున్నారు. తమ పంచాయతీల్లో పన్నులు వసూలు చేసినా.. పక్క మండలాల్లో పంచాయతీలకు బాకీల వసూళ్ల నిమిత్తం పంపించడంతో పగలు, రాత్రి అష్టకష్టాలు పడి వసూలు చేస్తున్నారు. జిల్లాలో ఇలా... మండలం పన్ను వసూళ్ల వసూలైన శాతం లక్ష్యం పన్నులు (రూ.లక్షల్లో) (రూ.లక్షల్లో) రాజానగరం 1,335.25 690.46 51.7 రాజమహేంద్రవరం రూరల్ 3,462.73 1,866.12 53.9 కడియం 1,053.88 650.06 61.7 రంగంపేట 332.87 213.41 64.1 దేవరపల్లి 590.22 384.22 65.1 గోకవరం 319.08 230.39 72.2 కొవ్వూరు 446.01 330.18 74.0 సీతానగరం 417.90 296 71.0 కోరుకొండ 354.29 249.42 70.4 గోపాలపురం 403.54 291.72 72.3 నల్లజర్ల 562.55 458.07 81.4 తాళ్లపూడి 273.90 216.09 78.9 ఉండ్రాజవరం 410.97 359.02 87.44 బిక్కవోలు 489.43 417.64 85.3 పెరవలి 277.52 230.15 82.9 చాగల్లు 387.90 316.45 81.6 అనపర్తి 606.50 545.23 89.9 నిడదవోలు 293.04 254.21 86.7 -
149 అర్జీల స్వీకరణ
ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం) : కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 149 అర్జీలు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. వీటిలో 144 ఆన్లైన్ ద్వారా, 5 ఆఫ్లైన్ ద్వారా అందాయి. రెవెన్యూ విభాగానికి 56 అర్జీలు అందాయి. పోలీస్ పీజీఆర్ఎస్కు.. కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 27 ఫిర్యాదులు వచ్చాయి. పీజీఆర్ఎస్ను ఎస్పీ డి.నరసింహకిశోర్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు హాజరయ్యారు. వారి నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే నేరుగా సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదిదారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయవలసిందిగా ఉత్తర్వులు ఇచ్చారు. చెరువులో స్నానానికి దిగి మృత్యువాత రాజానగరం: స్నానం చేసేందుకని చెరువులో దిగిన వ్యక్తి ప్రమాదవశాత్తూ మునిగిపోయి మృతి చెందాడు. మండలంలోని కానవరంలో సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి రాజానగరం ఎస్సై నారాయణమ్మ తెలిపిన వివరాలిలావున్నాయి. కానవరానికి చెందిన వాసంశెట్టి నాగరాజు (45) రోజువారీ మాదిరిగానే ఉదయాన్నే స్నానం చేసేందుకు గ్రామంలోని చెరువులోకి దిగాడు. అయితే కొంతసేపటికి ప్రమాదవశాత్తూ మునిగిపోయి, మృత్యువాత పడ్డాడు. ఆ సమయంలో చెరువును బాగు చేస్తున్న కూలీలు ఉన్నప్పటికీ స్నానం చేస్తున్నాడనుకొని పట్టించుకోలేదు. అయితే చెరువులోకి స్నానానికి వెళ్లిన వ్యక్తి ఎంతసేపటికీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. రాజమహేంద్రవరం నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి యంత్రం సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తు జరుగుతోందని ఎస్సై తెలిపారు. అప్పన్నపల్లి బాలాజీ హుండీ ఆదాయం రూ.56.08 లక్షలుమామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి వారి హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. 68 రోజులకు స్వామి వారికి హుండీల ద్వారా రూ.56.08 లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ ఎం.రాంబాబురెడ్డి తెలిపారు. 17 గ్రాముల బంగారం, 250 గ్రాముల వెండిని భక్తులు హుండీల్లో కానుకలుగా సమర్పించారన్నారు. అమలాపురం గ్రూపు టెంపుల్స్ కార్యనిర్వహణాధికారి ఆర్.శ్రీనివాస్ పర్యవేక్షణలో జరిగిన హుండీ లెక్కింపులో ఆలయ వంశపారం పర్య ధర్మకర్త మొల్లేటి లక్ష్మీనారాయణ, స్థానికులు, ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు. నరసన్న హుండీల రాబడి రూ.37,08,338 సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ హుండీలను సోమవారం లెక్కించారు. మొత్తం రూ.37,08,338 ఆదాయం సమకూరింది. 53 రోజులకుగాను పై ఆదాయం వచ్చింది. -
ఇది మంచి పరిణామం
పీఎండీఎస్ సాగు మంచి ఫలితాలను ఇవ్వడంతో చాలా మంది రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం. పీఎండీఎస్ సాగు ఈ ఏడాది అనూహ్య ఫలితాలను ఇచ్చింది. అయితే రైతులు పీఎండీఎస్ పంటను భూమిలో కలియదున్నకుండా ముందుగా పశుగ్రాసం తీసుకుని మిగిలిన వ్యర్థాలను కలియ దున్నుకోవడం ద్వారా ఆదాయం వస్తుంది. ఈ సాగుతో జిల్లాలో పశుగ్రాసం ఒక్కసారిగా పెరిగింది. ఇది పాడి పరిశ్రమకు మంచిది. – ఎలియాజరు, ప్రకృతి వ్యవసాయ శాఖ డీపీఎం, కాకినాడ● -
పొట్టకూటి కోసం వచ్చి..
● తిరిగి వెళ్తుండగా ప్రమాదం ● కూలీలతో వ్యాన్ అర్ధరాత్రి బోల్తా ● ఉదయం వెలుగులోకి.. ● మహిళ మృతి, 11 మందికి గాయాలు చింతూరు: వారంతా నిరుపేదలే.. పొట్టకూటి కోసం బతుకు జీవుడా అంటూ వచ్చారు.. కొద్దిపాటి సొమ్ము సంపాదించుకుని సొంతూరుకు ఆనందంగా బయలుదేరారు.. చివరికి అనుకోని ప్రమాదంలో చిక్కుకున్నారు.. భద్రాచలం, చట్టి జాతీయ రహదారి–326పై చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి, బొడ్డుగూడెం నడుమ శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఛత్తీస్గఢ్కు చెందిన ఓ మహిళ మృతి చెందింది. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కట్టేకళ్యాణ్కు చెందిన కొంతమంది కూలీలు మిరప కాయలు కోసేందుకు రెండు నెలల క్రితం ఎటపాక మండలం మురుమూరు వచ్చారు. కూలి పనులు ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వెళ్లేందుకు ఛత్తీస్గఢ్ నుంచి వారు బొలెరో వ్యాన్ను కిరాయికి రప్పించుకున్నారు. శనివారం రాత్రి 13 మంది కూలీలతో కట్టేకళ్యాణ్కు బయలుదేరిన వ్యాన్ అర్ధరాత్రి దాటాక చింతూరు మండలం బొడ్డుగూడెం, ఏడుగురాళ్లపల్లి నడుమ ఉన్న ఓ కల్వర్టు వద్ద అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలోకి బోల్తాపడింది. వాహనం అర్ధరాత్రి బోల్తా పడినా చీకటి కావడంతో వాహనాన్ని ఉదయం వరకూ ఎవరూ గమనించలేదు. ఆదివారం ఉదయం లోయలో ఉన్న వాహనాన్ని, క్షతగాత్రులను గుర్తించిన ప్రజలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ రమేష్ ఘటనా స్థలానికి చేరుకుని వాహనంలో ఇరుక్కుని ఉన్న క్షతగాత్రులను బయటకు తీసి ఏడుగురాళ్లపల్లి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మడకం పైకే (35) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా, మరో 11 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు ఏడుగురాళ్లపల్లి ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ వివరించారు. కూలి పనులకు వచ్చి.. సొంత రాష్ట్రమైన ఛత్తీస్గఢ్లో వ్యవసాయ పనులు ముగిశాక పొట్టకూటి కోసం పొరుగునే ఉన్న ఆంధ్రా, తెలంగాణకు ప్రతి ఏటా కూలికి రావడం వారికి పరిపాటి. ఇక్కడకు వచ్చిన వారు మిర్చి తోటలు, జామాయిల్ కటింగ్ పనులు చేస్తుంటారు. నెల, రెండు నెలల పాటు కూలి పనులు చేసిన అనంతరం సొమ్ములు తీసుకుని వారి రాష్ట్రానికి తిరిగి వెళుతుంటారు. ఈ క్రమంలోనే పనులు ముగించుకుని తిరిగి వెళుతున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగి ఓ మహిళ మృతి చెందింది. అర్ధరాత్రి ప్రమాదం జరగడంతో ఉదయం వరకూ ఆ గాయాలతో వారు నరకయాతన అనుభవించారు. పరిమితికి మించి ప్రయాణమే కారణమా? బొలెరో వ్యాన్లో సాధారణంగా ఏడుగురు లేదంటే తొమ్మిది మంది ప్రయాణం చేయవచ్చు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన ఈ వ్యాన్లో పరిమితికి మించి డ్రైవర్తో సహా 13 మంది ప్రయాణిస్తున్న క్రమంలోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రోజువారీ కూలీలను పరిమితికి మించి వాహనాల్లో ఎక్కిస్తూ వారి ప్రాణాలతో చెలగాట మాడుతున్నారని ‘సాక్షి’ ముందుగానే హెచ్చరించింది. దీనిపై ‘సాక్షి’ దినపత్రికలో ఆదివారం ‘ఈ మ్యాజిక్కులు ఎన్నాళ్లో’ శీర్షికన కథనం కూడా ప్రచురితమైంది. అత్యాశతో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తూ ప్రయాణికుల జీవితాలతో చెలగాటమాడుతున్న వాహనాలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. రెండు బైక్లు ఢీకొని.. చింతూరు మండలం పోతనపల్లి వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్లు ఢీకొన్న ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. రంపచోడవరానికి చెందిన కానెం సాయితేజ, అతని భార్య గంగోత్రితో పాటు కూనవరానికి చెందిన పండు, దుర్గాప్రసాద్కు గాయాలయ్యాయి. వీరికి చింతూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేశారు. -
చక్రాల బండికి రీటైర్మెంట్
అండాదండ లేక..ౖసైసె జోడెడ్ల బండి .. సోకై న దొరలా బండి.. అంటూ సాగే ఆ చక్రాల బండి దాదాపు మూలకు చేరింది. పూర్వం జోడెడ్ల బండి ఒక ప్రధాన రవాణా సాధనంలా, భూమి దున్నడం నుంచి పంటను ఇంటికి చేర్చడంలో కీలకంగా ఉండేది. సాంకేతికత పెరగడంలో ట్రాక్టర్లు వచ్చి జోడెడ్ల బండి జోరు తగ్గింది. అక్కడక్కడా ఎడ్ల బళ్లు ఉన్నా, దాని రూపురేఖలు మారిపోయాయి. ఆ గంటల చప్పుడు మూగబోయింది. కేవలం ఎడ్ల పందేలకు మాత్రమే చక్రాల బళ్లు ఉపయోగిస్తున్నారు. మిగిలినవి చక్రాలకు బదులుగా టైర్ల బండ్లు వాడుతున్నారు. ప్రస్తుతం ధాన్యం తరలించడానికి అక్కడక్కడా ఎడ్ల బళ్లు కనిపిస్తున్నా, అన్నీ టైరు బళ్లే. జోడెడ్ల బండి అంటే ఇలా ఉండేదని ఇప్పటి వారికి బొమ్మలు చూపించే పరిస్థితి వచ్చింది. – పిఠాపురం టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్. ఆదివారం ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కడియం మండల కేంద్రానికి కూతవేటు దూరంలోని బుర్రిలంకలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పట్టించుకునే వారే కరవయ్యారు. కనీసం ఎన్టీఆర్ విగ్రహాన్ని శుభ్రం చేసి, దండ వేసేవారు లేకపోవడంపై ఆయన అభిమానులు నొచ్చుకున్నారు. ఆయన పెట్టిన పార్టీలో పదవులు అనుభవిస్తున్న వారైనా కనీసం ఈ విగ్రహానికి దండేద్దామన్న ఆలోచన లేకపోవడం పట్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. – కడియం టీడీపీ ఆవిర్భావం రోజున కూడా బుర్రిలంకలో పూలదండకు నోచుకోని ఎన్టీఆర్ విగ్రహం -
అవనికి అవసారం
● పీఎండీఎస్ సాగుతో ప్రయోజనాలు ● ఎకరాకు 20 టన్నుల పశుగ్రాసం ● టన్నుకు రూ.3 వేల వరకూ ఆదాయం●పిఠాపురం: రబీ సాగు చివరి దశకు చేరుకుంది.. వేసవిలో రైతులు అపరాల సాగు చేయడం లేకుంటే, భూములను ఖాళీగా వదిలేయడం చేస్తుంటారు. భూములు ఖాళీగా ఉంటే భూసారం తగ్గడంతో పాటు క్రిమికీటకాలు భూమిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని, తరువాత పంటలకు హాని కలిగిస్తాయి. వీటికి చెక్ పెట్టడానికి ప్రకృతి వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంటోంది. భూమికి ఆరోగ్యం.. పోషక విలువల ఆహార పంటలు, ప్రజలకు ఆరోగ్యం తదితర బహుళ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోంది. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్) సాగుకు చేపట్టింది. అంటే జనుము, జీలుగ, పిల్లి పెసర వంటి పచ్చిరొట్టతో పాటు పెసలు, మినుములు, పప్పు దినుసులు, చిరుధాన్యాలు, ఆకుకూరలు, సుగంధ ద్రవ్యాలు, దుంప జాతి విత్తనాలను కలిపిన నవధాన్యాల సాగుకు ప్రాధాన్యం ఇస్తోంది. వేసవిలో రైతులకు అదనపు ఆదాయంతో పాటు పశువులకు మేత అందించే నవ ధాన్యాల సాగుకు చేపట్టాలని అవగాహన కల్పిస్తోంది. ఇందులో భాగంగా ప్రకృతి వ్యవసాయ శాఖ గత ఏడాది ఎకరానికి 10 కిలోల చొప్పున విత్తనాలను రైతులకు అందించింది. ఇలా రైతులు సాగు చేసిన 400 ఎకరాల్లో పీఎండీఎస్ విత్తనాలతో సారవంతంగా మొక్కలు రావడంతో రైతుకు అదనపు ఆదాయం సమకూరింది. ఈ ఏడాది కూడా నవ ధాన్యాల సాగుకు ప్రకృతి వ్యవసాయ శాఖ శ్రీకారం చుట్టింది. గత ఏడాది కాకినాడ జిల్లాలో 40 వేల ఎకరాల్లో పీఎండీఎస్ సాగు చేశారు. మొత్తం 56 వేల మంది రైతులు ఈ విత్తనాలను వేశారు. ఇందుకు గాను ప్రకృతి వ్యవసాయ శాఖ 400 టన్నుల విత్తనాలను రైతులకు పంపిణీ చేసింది. దీనిద్వారా సుమారు 60 వేల టన్నుల పశుగ్రాసం వచ్చింది. రైతులు సుమారు రూ. 6 కోట్ల ఆదాయం పొందినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది 86,959 ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. 60,349 మంది రైతులకు 450 టన్నుల పీఎండీస్ విత్తనాలను పంపిణీ చేయాలని నిర్ధేశించారు. భూమికి ఎంతో మేలు పీఎండీఎస్ సాగు చేసిన పంట పొలాల్లో మంచి మార్పులు కనిపిస్తున్నాయి. ఈ పొలాల్లో భూసారం పెరగడంతో పాటు రైతుకు మంచి అదనపు లాభాలను తెచ్చిపెట్టింది. భూమి గుల్లబారి నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. కలుపు నివారణ జరుగుతుంది. పురుగులు, తెగుళ్ల నివారణ, రైతు మిత్రులు వానపాముల వృద్ధి జరిగి మిత్ర పురుగుల శాతం అధికమవుతుంది. ఎరువులు, పురుగు మందుల వాడకం తగ్గి ఖర్చు అదుపులో ఉంటుంది. భూమి కోతకు గురి కాకుండా కాపాడుతుంది. పంట దిగుబడి పెరుగుతుంది. భూతాపం తగ్గి విపత్తులను తట్టుకునే శక్తి వస్తుంది. నేలలో సేంద్రియ కర్బనం రెండు శాతం వరకూ పెరిగి సూక్ష్మజీవుల వైవిధ్యం పెరిగి అనేక పోషకాలు పైరుకు అందుతాయి. బలవర్ధక పశుగ్రాసం పీఎండీఎస్ పంట ఏపుగా పెరగడంతో ఎకరానికి సుమారు 20 టన్నుల వరకూ నాణ్యమైన పోషక విలువలున్న పశుగ్రాసం లభ్యమవుతోంది. దీంతో ఎకరానికి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకూ రైతుకు అదనపు ఆదాయం సమకూరుతోంది. వివిధ మిల్క్ డెయిరీలకు చెందిన యజమానులు పీఎండీఎస్ పశుగ్రాసం కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో రోజూ 200 టన్నులకు పైగా పశుగ్రాసం అమ్మకాలు జరుగుతున్నాయి. ఒకపక్క భూమి సారవంతం అవ్వడంతో పాటు మరోపక్క రైతుకు ఆదాయం వస్తుండడంతో పీఎండీఎస్ సాగుకు ఉత్సాహం చూపిస్తున్నారు.ఇలా చేస్తే కళకళలాడుతూ.. వేసవిలో ఈ విత్తనాలను ఖాళీగా ఉండే భూముల్లో వేయడం ద్వారా పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. బీడు భూములు సారవంతం అవుతున్నాయి. పశువుకు గ్రాసం అందుతుంది. నేల రంగు మారి సారవంతం కావడం, వేరు వ్యవస్థ పటిష్టంగా పెరిగి, వాతావరణ ఆటుపోట్లను తట్టుకొని నిలబడడం జరుగుతుంది. జీవవైవిధ్యం పెరుగుతుంది. పంట ఉత్పత్తుల నాణ్యత, పోషక విలువలు పెరుగుతాయి. 365 రోజులు భూమి కప్పబడి ఉండి సకాల వర్షాలకు దోహదపడుతుంది. ఈ గ్రాసం తిన్న పశువుల్లో పాల దిగుబడి పెరుగుతుంది. పాలలో వెన్న శాతం అధికమవుతోంది. ఇలా నవధాన్యాల సాగుతో రైతులు అనేక ప్రయోజనాలు పొందుతున్నారు. -
బీమా కోసం చోరీ జరిగినట్టు కథ చెప్పి..
● పోలీసులను తప్పుదోవ పట్టించిన మహిళ ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ సుభాష్ కోరుకొండ: బంగారు ఆభరణాలపై రూ.లక్షల బీమాను పొందవచ్చనే దురుద్దేశంతో చోరీ జరిగినట్టు నమ్మించిన ఓ మహిళ పన్నాగాన్ని ఛేదించినట్లు క్రైం డీఎస్పీ సుభాష్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం కోరుకోండ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన కథనం ప్రకారం.. కోరుకొండ మండలం కాపవరం శివారులోని నార్త్ జోన్ డీఎస్పీ కార్యాలయానికి సమీపంలో ముండ్రు పద్మ నివాసం ఉంటోంది. ఈ నెల 27న 200 గ్రాముల బంగారు ఆభరణాలను ఓ సంస్థలో కొనుగోలు చేసింది. విదేశాల్లో ఉంటున్న తన పిల్లల నుంచి వచ్చిన నగదు బ్యాంకుల్లో నాలుగు ఖాతాల్లో జమవుతున్నాయి. ఆ నగదును తీసుకుని బంగారు ఆభరణాలను కొనుగోలు చేసింది. అయితే అవి చోరీ జరిగినట్లు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైతే, దాని ఆధారంగా బీమా పొందవచ్చనే పథకం రచించింది. ఈ మేరకు తన ఇంట్లో చోరీ జరిగినట్టు 28న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇందులో భాగంగా ఇంటి వద్ద సీసీ కెమెరాలు కనిపించకుండా చేసింది. మెయిన్ గేటుకు, లోపల తాళాలు వేసి అర్ధరాత్రి తీసేసింది. ఇంట్లోని వస్తువులను చిందర వందరగా పడేసింది. తనను తాళ్లతో కట్టేసుకుంది. మొబైల్ ఫోన్ను స్విచాఫ్ చేసి దాచేసింది. నలుగురు చోరులు ఇదంతా చేసినట్టు ఆమె పోలీసులకు చెప్పింది. ఈ ఘటనపై క్లూజ్ టీమ్, డాగ్ స్క్వాడ్లు దర్యాప్తు చేయగా, చాకచక్యంగా నిజాన్ని నిగ్గు తేల్చినట్టు డీఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో ప్రత్యేక ప్రతిభ కనబర్చిన కోరుకొండ ఎస్సై ఆర్.అంకారావు, గోకవరం ఎస్సై పవన్కుమార్, పోలీసులు రామన్నదొర, నాయుడు, సత్తిరెడ్డి, గోవిందు, యేసు, వీరబాబులకు రివార్డులను అందజేశారు. -
క్రికెట్ బెట్టింగ్లపై ఉక్కుపాదం
జిల్లా ఎస్పీ రాహుల్ మీనా హెచ్చరిక అమలాపురం టౌన్: క్రికెట్ బెట్టింగ్లు వేసి జీవితాలను నాశనం చేసుకోవద్దని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా హితవు పలికారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు ప్రారంభమైన క్రమంలో జిల్లాలో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపామని, పట్టుబడితే చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం క్రికెట్ బెట్టింగ్లపై అమలాపురంలో ఎస్పీ మీనా ఓ ప్రకటన విడుదల చేశారు. బెట్టింగ్ నిర్వాహకులపై, ఆన్లైన్ బుకీలపై ప్రత్యేక పోలీస్ బృందాలతో నిరంతర నిఘాను ఏర్పాటు చేశామన్నారు. క్రికెట్ బెట్టింగ్లు నిర్వహించినా, ప్రోత్సహించినా, ఆ బెట్టింగ్ల్లో పాల్గొన్నా ఏపీ జూద చట్టం ప్రకారం కఠిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చనే ఆశతో బెట్టింగ్ల యాప్ల ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తమ పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. స్మార్ట్ ఫోన్లలో మీ పిల్లలు ఏఏ యాప్స్ వాడుతున్నారనే వాటిపై దృష్టి పెట్టాలన్నారు. క్రికెట్ను వినోదంగానే స్వీకరించాలని, దానిని జూదంగా మార్చి మీ బంగారు భవష్యత్ను, తల్లిదండ్రుల కలలను చిన్నాభిన్నం చేసుకోవద్దని యువకులకు హితవు పలికారు. మీ పరిసరాల్లో ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్లు జరుగుతున్నట్లు తెలిసే ఆ సమాచారాన్ని 100 లేదా 112కు కాల్ చేసి తెలపాలన్నారు. అలా సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. -
పూడిపల్లిలోనే పెద్దపులి సంచారం
దేవీపట్నం: నాలుగు రోజుల కిందట ఈనుకొండకు చేరిన పెద్దపులి గురువారం రాత్రి కొత్త వీధిలో నాలుగు పశువులపై దాడిచేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పులిని బంధించేందుకు అటవీ అఽధికారులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. శనివారం పోతవరం సమీపంలోని జోడుమామిళ్లు సమీపంలో పులి సంచరించింది. సాయంత్రం సమయంలో గోకవరం, దండంగి ఆర్అండ్బీ రహదారిని దాటుకుని డి.రావిలంక, పరగసానిపాడు, పూడిపల్లి గ్రామాల్లో తిరిగింది. కొత్తవీధిలో నాలుగు పశువులను చంపిన తర్వాత ఇప్పటివరకూ ఏ జంతువుకు హాని కలిగించలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రికి ఆహారం కోసం పులి వేటాడేందుకు తప్పనిసరిగా ప్రయత్నం చేస్తుందనే ఆలోచనతో అటవీ అధికారులు పూడిపల్లి పరిసర ప్రాంతాలలో ట్రాప్ను సిద్ధం చేశారు. పులి సంచరిస్తున్న ప్రాంతంలో అధిక సంఖ్యలో గేదెలు ఉన్నాయి. ఆదివారం రాత్రికి పూడిపల్లి వద్ద సీతపల్లి వాగును దాటి దేవీపట్నం వైపునకు మరలుతుందా, లేక గోదావరి దాటి పశ్చిమగోదావరి వైపు వెళుతుందా అని అటవీ అఽధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఒకవేళ దేవీపట్నం వైపు మరలితే పులిని విడిచిపెట్టిన కొండమొదలు ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంది. ఒకవేళ గోదావరిని దాటి పశ్చిమగోదావరి వైపు మరలితే ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలను దాటుకుని పులి పయనాన్ని ప్రారంభించిన ప్రాంతమైన మహారాష్ట్రలోని తడోబా అభయ అరణ్యానికి చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. నూకాలమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులుసామర్లకోట: పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో వేంచేసి ఉన్న నూకాలమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. అమ్మవారి జాతర ఉత్సవాలు కొత్త అమావాస్య సందర్భంగా ప్రారంభించారు. మే 3 వరకు ఉత్సవాలు జరుగుతాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి ఆది, గురువారాల్లో అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఇందులో భాగంగా రెండో ఆదివారం కావడంతో తెల్లవారు జామునే ఆలయానికి అనేక మంది వచ్చారు. ఆలయ సమీపంలో ఉన్న తోటలో వాహనాలను పార్కింగ్ చేసి అమ్మవారిని దర్శించుకుని ఆ తోటలోనే వంటలు చేసుకుని కుటుంబ సభ్యులతో కలిసి భోజనాలు చేశారు. జాతరను పురస్కరించుకుని ఆలయం వద్ద తిరునాళ్లు ఏర్పాటు చేశారు. ఆలయ ఈఓ రాంబాబురెడ్డి, చైర్మన్ లొల్ల సత్యనారాయణ, కమిటీ సభ్యులు భక్తులకు సేవలందించారు. ఎస్సై మౌనిక ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ‘ఈనాడు’ అనుచిత కార్టూన్పై చర్యలకు ఫిర్యాదుకపిలేశ్వరపురం (మండపేట): ఈనాడు దినపత్రికలో ఈ నెల 28న ఇదీ సంగతి శీర్షికన ప్రచురితమైన కార్టూన్ అనుచితంగా ఉందని, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరువు, ప్రతిష్టలను దెబ్బతీసేదిగా ఉందంటూ మండపేట పట్టణ పోలీస్ స్టేషన్లో శనివారం రాత్రి వైఎస్సార్ సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. కార్టూన్ గీసిన వారిపై, ప్రచురణకర్తపై, ఎడిటర్పై చర్యలు తీసుకోవాలంటూ వైఎస్సార్ సీపీ పట్టణ కమిటీ అధ్యక్షుడు పిల్లి శ్రీనివాస్ తన ఫిర్యాదులో కోరారు. పోలీసులను కలిసిన వారిలో వైఎస్సార్ సీపీ నాయకులు మందపల్లి రవికుమార్, పొలమాల సత్తిబాబు, జొన్నపల్లి సత్తిబాబు, జెల్లా కాదర్నాథ్ పాల్గొన్నారు. ఆకట్టుకున్న నాటిక ప్రదర్శనలుఏలేశ్వరం: మంచివాళ్లు చేసే తప్పులే మహా విపత్తులకు కారణమవుతాయని, అందరూ మంచివారే కానీ నాటిక కళ్లకు కట్టినట్టు చూపించింది. ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా గొల్లపల్లి చెల్లయ్య మెమోరియల్ నాటక కళా పరిషత్ అధ్యక్షుడు, ఎంపీపీ గొల్లపల్లిబుజ్జి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం యడ్లపాడు మానవతా వారి అందరూ మంచివారే కానీ నాటికకు రచన, దర్శకత్వం జరుగుల రామారావు అందించారు. రెండో నాటికగా మాతృత్వం ఆకట్టుకుంది. గుంటూరు శ్రీరమణ కళానిలయం వారి మాతృత్వం నాటికకు మూలకథ సుఖమంచి కోటేశ్వరరావు అందించగా, పాగర్తి నాగేశ్వరరావు దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. -
నేత్రపర్వం.. శృంగార వల్లభుని కల్యాణం
సామర్లకోట: తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో వేంచేసి యున్న శృంగార వల్లభ స్వామి వారి కల్యాణోత్సవం ఆదివారం నేత్రపర్వంగా జరిగింది. ఏటా చైత్ర శుద్ధ ఏకాదశి పర్వదినాన ఇక్కడ స్వామి వారి కల్యాణం నిర్వహిస్తారు. ఆలయంలో సర్వాంగసుందరంగా అలంకరించిన వేదికపై రాత్రి 10 గంటలకు అర్చకులు కల్యాణ క్రతువుకు శ్రీకారం చుట్టారు. విష్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, యజ్ఞోపవీత ధారణ, మహాసంకల్పం, సుముహూర్తం, మాంగల్యసూత్ర ధారణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి వేలాదిగా వచ్చిన భక్తులు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో జరిగిన స్వామివారి కల్యాణోత్సవాన్ని కన్నులారా తిలకించి పులకించిపోయారు. అర్ధరాత్రి 12 గంటల వరకూ కల్యాణం కన్నుల పండువగా సాగింది. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయ చైర్పర్సన్ మొయిళ్ల సంధ్యా కృష్ణమూర్తి, ఈఓ వడ్డీ శ్రీనివాసరావుల ఆధ్వర్యాన కల్యాణానికి ఏర్పాట్లు చేశారు. -
రత్నగిరి కిటకిట
● సత్యదేవుని దర్శించిన 40 వేల మంది ● 2,800 వ్రతాల నిర్వహణ ● రూ.40 లక్షల ఆదాయం అన్నవరం: వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి కిటకిటలాడింది. చైత్ర శుద్ధ ఏకాదశి, ఆదివారం సెలవు కలసి రావడంతో సత్యదేవుని దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వందలాది వాహనాల్లో తరలి వచ్చారు. సత్యదేవుని సన్నిధిలోను, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోనూ శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజాము ముహూర్తాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు, వారి బంధుమిత్రులకు ఇతర భక్తులు కూడా తోడవడంతో ఆలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ రద్దీ కొనసాగింది. క్యూలు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయాయి. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చారు. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో శ్రీకృష్ణుడు, గోవులకు ప్రదక్షిణ చేశారు. రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి, ప్రదక్షిణ చేశారు. సత్యదేవుని వ్రతాలు 2,800 మంది ఆచరించారు. వివిధ విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. ఏకాదశి సందర్భంగా సత్యదేవునికి ఉదయం ఏడు గంటలకు స్వర్ణ పుష్పార్చన, ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ లక్ష తులసి పూజ ఘనంగా నిర్వహించారు. -
వాడవాడలో వేంకటేశు నామమే..
● వాడపల్లి క్షేత్రంలో వైభవంగా శ్రీవారి కల్యాణం ● గోవింద ఘోషతో మార్మోగిన పుర వీధులు ● కోలాహలంగా రథోత్సవం భక్తుల కోలాహలం నడుమ సాగుతున్న రథోత్సవంకొత్తపేట/ఆత్రేయపురం: కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రంలో కొలువైన శ్రీ, భూ సమేత వేంకటేశ్వరుని కల్యాణం, రథోత్సవం ఆదివారం వైభవంగా సాగాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వచ్చిన భక్తులతో వాడపల్లి క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తుల గోవింద ఘోషతో క్షేత్రం మార్మోగింది. దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఈవో నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఆలయ పాలకమండలి పర్యవేక్షణలో ఈ మహోత్సవాలు వైభవంగా సాగాయి. ఉదయం నుంచీ ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, వేదపండితులు, అర్చక బృందం వివిధ పూజా, హోమం, కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్వామివారి రథోత్సవాన్ని ప్రారంభించగా వేలాది భక్త జన సందోహం నడుమ మాడ వీధుల్లో స్వామివారు ముందుకు సాగిపోయారు. కల్యాణం.. కనుల వైకుంఠం వాడపల్లిలోని విశాలమైన ప్రదేశంలో పంచ ద్రవ్యాలు, సుగంధ పరిమళాలు, సువాసన భరిత పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించిన కల్యాణ మంటపంలో స్వామివారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. పట్టు వస్త్రాలు, బంగారు, వెండి ఆభరణాలతో అలంకరించిన శ్రీ, భూ సమేత వేంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహలను పుష్పాలంకృతమైన పల్లకిలో ఉంచి వేద మంత్రాలు, మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కల్యాణ వేదిక వద్దకు తీసుకు వచ్చారు. అక్కడ కల్యాణ మూర్తులను ఆశీనులను చేశారు. కల్యాణ తిలకంతో స్వామివారు, బుగ్గన చుక్కతో సిగ్గులొలుకుతూ ఉభయ దేవేరులు భక్తజనానికి దర్శనమిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నడిపూడికి చెందిన వేద పండితుడు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాద్ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, వేదపండితులు, అర్చక బృందం వేద మంత్రాల నడుమ సాయంత్రం 6.15 గంటలకు కల్యాణాన్ని వైభవంగా ప్రారంభించారు. దేవస్థానం తరఫున శ్రీవారికి డీసీ అండ్ ఈఓ సూర్యచక్రధరరావు మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తదితర ప్రముఖులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. డీఎస్పీ సుంకర మురళీమోహన్ ఆధ్వర్యంలో రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ బందోబస్తు నిర్వహించారు. పలువురు ఉన్నతాధికారులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. కల్యాణోత్సవాలను పురస్కరించుకుని వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు, వాయిద్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి, నియోజకవర్గ జనసేన ఇన్చార్జి బండారు శ్రీనివాసరావు, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్యశ్రీ.. గుండె గుభిల్లు!
బి● జిల్లా వ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా బకాయి ● ఆగనున్న ఎన్టీఆర్ ‘వైద్యసేవ’ ● 1 నుంచి నిలిపివేతకు ‘ఆషా’ నిర్ణయం ● చంద్రబాబు ప్రభుత్వానికి అల్టిమేటం ● నూతన యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలుపై ప్రభుత్వం సమాలోచనలు సాక్షి, రాజమహేంద్రవరం: పేదలకు ఆధునిక, కార్పొరేట్ వైద్యం అందించే ఎన్టీఆర్ వైద్య సేవలు (ఆరోగ్యశ్రీ) నిలిచిపోనున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి వైద్యం పూర్తి స్థాయిలో నిలిపివేస్తామని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆషా) చంద్రబాబు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న రూ.3 వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది. ఏప్రిల్ 1వ తేదీ లోగా బకాయిలు చెల్లించని పక్షంలో సేవలు కొనసాగించే పరిస్థితి లేదని తేల్చిచెప్పింది. ఈ పరిణామం జిల్లా ప్రజల్లో ఆందోళన నింపుతోంది. ఎన్టీఆర్ వైద్యసేవ స్తంభిస్తే ఖరీదైన వైద్యం, శస్త్ర చికిత్సలు ఎక్కడ చేయించుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.లక్షలు వెచ్చించి వైద్యం చేయించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించకపోవడం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. దీని వెనుక చంద్రబాబు ప్రభుత్వ కుట్ర దాగుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీఆర్ వైద్యసేవ పథకం ఎత్తేసి.. యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకువచ్చే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోందని.. అందులో భాగంగానే బిల్లులు చెల్లించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. రూ.లక్షలు విలువ చేసే వైద్యం ఉచితంగా పొందే పరిస్థితి ఇకపై ఉండదని ప్రజలు ఆందోళ చెందుతున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లా వ్యాప్తంగా 90 ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు అందుతున్నాయి. అందులో ప్రైవేటు ఆస్పత్రులు 40 ఉండగా.. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 5, ప్రైమరీ హెల్త్ సెంటర్లు 28, జీజీహెచ్ 1, ఏరియా హాస్పిట్ 1, మరో 3 ఎంపిక ప్రక్రియలో ఉన్నాయి. 16 దంత వైద్య శాలలు(ఈహెచ్ఎస్) సైతం వైద్య సేవలు అందిస్తున్నాయి. వీటిల్లో సుమారు 60 మంది వైద్య మిత్రలు విధులు నిర్వర్తిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎప్పుడు ఎత్తివేయాలా అనే ఆలోచిస్తున్నారు. ఏప్రిల్ నుంచి ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) స్థానంలో యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకువచ్చేందుకు కొన్ని నెలల నుంచి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పథకం ప్రకారం ఆరోగ్య నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు ఆపేసి.. వేధించడం ప్రారంభించారన్న ఆరోపణలు ఉన్నాయి. వన్టైం సెటిల్మెంట్ పేరుతో వంచన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బిల్లుల చెల్లింపుల్లో అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. నిరసనగా ఇప్పటికే ఆస్పత్రుల యాజమాన్యాలు తమకు బిల్లులు చెల్లించాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాయిు. రెండు, మూడు సార్లు వైద్య సేవలను సైతం నిలిపివేశారు. సమ్మె సైతం నిర్వహించాయి. ప్రైవేట్ ఆస్పత్రుల యజమానులు రోడ్డెక్కి ఉద్యమాలు చేసిన సందర్భాలు సైతం ఉన్నాయి. అప్పట్లో నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలను బుజ్జగించేందుకు ప్రభుత్వం వన్టైం సెటిల్మెంట్తో మొత్తం బిల్లు చెల్లించేస్తామని గతేడాది డిసెంబర్లో సెటిల్ చేస్తామని హామీ ఇచ్చింది. ఇది జరిగి మూడు నెలలవుతున్నా నేటికీ అతీగతి లేదు. ఎప్పుడు చెల్లిస్తారని ప్రశ్నిస్తే సమాధానం చెప్పేవారు లేరు. చేసేది లేక ఎన్టీఆర్ వైద్యసేవ పథకాన్ని నిలిపివేసేందుకు ఆషా నిర్ణయం తీసుకుంది. జిల్లా వ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా బకాయి తెల్ల రేషన్కార్డు దారులకు ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్యసేవ వర్తింప చేస్తోంది. ఆస్పత్రులకు చెల్లించాల్సిన బిల్లులపై ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా కాలయాపన చేస్తూ వస్తోంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా నెట్వర్క్ ఆస్పత్రులకు సుమారు రూ.250 కోట్ల మేర బకాయి పెట్టింది. గుండె సంబంధిత, చర్మం, ఈఎన్టీ, గ్యాస్ట్రో, జనరల్ మెడిసిన్, సర్జరీ, మూత్రపిండ శస్త్ర చికిత్సలు తదితర ఆపరేషన్లు చేసిన ఆస్పత్రులకు బిల్లులు ఆగిపోయాయి. ఈ పరిణామం పేద ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఖరీదైన శస్త్ర చికిత్స తాము ఎలా చేయించుకోవాలంటూ నిట్టూరుస్తున్నారు. దీనిపై చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. అనేక ఆందోళనల నేపథ్యంలో తలొగ్గిన ప్రభుత్వం ఇటీవల 5 శాతం నిధులు మాత్రమే విడుదల చేసి వారిని జోకొట్టింది. మిగిలినవి ఎప్పుడు విడుదల చేస్తుందో స్పష్టత ఇవ్వలేదు. సేవల ఎత్తివేతకు కుట్ర ఎన్టీఆర్ వైద్యసేవ పథకాన్ని శాశ్వతంగా తొలగించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. ఆ పథకం స్థానంలో యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకువచ్చేందుకు ఇప్పటికే సర్వం సిద్ధం చేసినట్లు తెలిసింది. పాలసీకి సంబంధించిన మార్గదర్శకాలు, స్పష్టమైన ఆదేశాలు మాత్రం గుట్టుగా ఉంచిందన్న ఆరోపణలున్నాయి. రూ.2 లక్షల వరకు ఆయుష్మాన్ భారత్, ఆపై మొత్తానికి బీమా కంపెనీల ద్వారా వైద్యం అందించాలనే ప్రతిపాదనలపై ఇప్పటికే అధికారులకు అవగాహన కల్పించినట్లు తెలిసింది. ఆస్పత్రుల సిబ్బంది వివరాలు రిజిస్టర్ చేసినట్లు సమాచారం. తక్కువ ప్యాకేజీల కారణంగా బీమా కంపెనీలు ముందుకు రావడం లేదని సమాచారం. బీమా పథకంలో వ్యాధుల సంఖ్య 1900 లోపే ఉంటాయి. ప్యాకేజీ సైతం తక్కువగా ఉండడంతో ప్రైవేటు ఆస్పత్రులు ఆయుష్మాన్ భారత్పై ఆసక్తి చూపడం లేదు. ఇదే జరిగితే నయాపైసా చెల్లించకుండా వైద్యం చేయించుకునే పేద, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర భారం పడుతుంది. కొత్త పథకంపై స్పష్టత కరువు పేదలకు ఆరోగ్య ఆసరా కల్పిస్తున్న ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) పథకాన్ని తొలగిస్తే మెరుగైన వైద్యం అందుతుందా..? లేదా..? అన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. కొత్త పాలసీతో పేదలకు మేలు జరుగుతుందా..? లేదంటే పేరు మార్చి బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందా..? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రస్తుతం అమలవుతున్న ఎన్టీఆర్ వైద్య సేవలో ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల మేర హెల్త్ కవరేజ్ లభిస్తోంది. ఈ విధానాన్ని బీమాలోకి తీసుకువస్తే.. బీమా క్లెయిమ్ల విషయంలో ఏ మేరకు లబ్ధి చేకూరుతుందన్న ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమవుతోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఊపిరి వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక 938 వ్యాధులతో ప్రారంభమైన ప్రస్థానం 3,275 వ్యాధుల వరకు విస్తరించారు. ఆస్పత్రుల్లో మౌలిక వసతులు, డ్యూటీ డాక్టర్, స్పెషలిస్టు వైద్యులతో పాటు నర్సు, పారా మెడికల్ సిబ్బంది తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. నాలుగున్నరేళ్లలో పథకం అమలుకు భారీగా ఖర్చు చేసింది. రూ.508,49,95,571 కోట్లు వైద్యం, శస్త్ర చికిత్సలకు వెచ్చించింది. 2,48,805 మందికి వైద్యం అందించి సంపూర్ణ ఆరోగ్యవంతులు చేశారు. దిక్కుతెలియని పరిస్థితుల్లో ఆపేస్తున్నాం ఎన్టీఆర్ వైద్యసేవలో నెట్వర్క్ ఆస్పత్రులకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.3 వేల కోట్ల బకాయిలు ఉన్నాయి. డిసెంబర్ నాటికి వన్టైం సెటిల్మెంట్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నేటికీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. తమకు చెల్లించాల్సిన బిల్లుల్లో సైతం కోత విధిస్తున్నారు. మళ్లీ కొత్తగా యూనివర్సల్ హెల్త్ స్కీమ్ మొదలు పెడతామంటున్నారు. ఇదే ప్యాకేజీతో వైద్యం అందించడం సాధ్యం కాదని చెబుతున్నా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం చేయాలనుకున్న పని చేసుకుంటూ పోతోంది. ప్రజలకు వైద్యం అందించాలని ఉన్నా.. బిల్లులు అందకపోవడంతో దిక్కుతెలియని పరిస్థితుల్లో వైద్యం ఆపేయాలని నిర్ణయం తీసుకున్నాం. – డాక్టర్ విజయ్కుమార్, ఆషా ఏపీ చైర్మన్ గత ప్రభుత్వంలో జిల్లాలో వైద్యం ఇలా..సంవత్సరం వైద్యం/ ఖర్చులు శస్త్రచికిత్సలు (రూ.కోట్లల్లో) 2019–2020 25,750 62.71 2020–2021 29,602 62.15 2021–2022 47,039 89.48 2022–2023 1,46,414 294.15 -
సమస్యలు పరిష్కరించాలి
● 1న కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష ● యూటీఎఫ్ నాయకుల పిలుపు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): 12వ పీఆర్సీని అమలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలు చెల్లించాలని కోరుతూ ఏప్రిల్ ఒకటో తేదీన కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నట్టు యూటీఎఫ్ నాయకులు ఈవీఎస్ఆర్ ప్రసాద్, ఎ.షరీఫ్ తెలిపారు. స్థానిక జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఎన్ని ఉద్యమాలు చేపడుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, పీఆర్సీ గడువు ముగిసి ఇప్పటికే మూడేళ్లు కావస్తున్నదని, ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఎయిడెడ్ ఉపాధ్యాయులకు కారుణ్య నియామకాలు, హెల్త్ కార్డుల మంజూరు తదితర సమస్యలపై వారు డిమాండ్ చేశారు. వీటి సాధనకు చేపడుతున్న నిరాహార దీక్షలను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. కార్టూనిస్ట్ శేఖర్కు ఉత్తమ పురస్కారం రాజమహేంద్రవరం సిటీ: నగరానికి చెందిన ప్రముఖ కార్టూనిస్ట్ వి.శేఖర్ను హైదరాబాద్కు చెందిన తపస్వీ మనోహరం సాహిత్య సేవా సంస్థ ఐదో వార్షికోత్సవం సందర్భంగా ఉత్తమ పురస్కారంతో సత్కరించింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన పలువురికి ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య కళాభవన్లో ఉత్తమ సేవా పురస్కారాలను అందజేశారు. ఇందులో భాగంగా శేఖర్కు పురస్కారంతో పాటు, నగదు, ప్రశంసాపత్రం జ్ఞాపికతో సత్కరించారు. సంస్థ వ్యవస్థాపకులు నిమ్మగడ్డ కార్తిక్, ప్రముఖ రచయిత కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత పి.చంద్రశేఖర్ అజాద్, సాధనాల వెంకటస్వామి నాయుడు విపుల, చతుర పత్రికల పూర్వ సంపాదకులు చంద్ర ప్రతాప్ కంతటి తదితరులు పాల్గొన్నారు. ‘చిరు సంచుల’తో అధిక దిగుబడి● హెక్టారుకు 7 టన్నుల ధాన్యం దిగుబడి ● నూతన వరి వంగడం ఎంటీయూ 1426 దేవరపల్లి: మార్టేరు వ్యవసాయ పరిశోధన స్థానం అభివృద్ధి చేసిన నూతన వరి వంగడం చిరుసంచులు రకం ఎంటీయూ 1426 అధిక దిగుబడులు ఇస్తోందని మండల వ్యవసాయాధికారి కె.కమల్ రాజ్ తెలిపారు. ఈ వంగడాన్ని ద్వాళ్వాలో రైతుల కమతాలలో ప్రయోగం నిమిత్తం ఈ ఏడాది పంపిణీ చేసినట్టు ఆయన తెలిపారు. ఈ రకం దళ్వాలో 120 నుంచి 125 రోజుల్లో పక్వానికి వస్తుందని, హెక్టారుకు 6.5 నుంచి 7 టన్నులు దిగుబడి వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అగ్గితెగులు, ఎండాకు తెగులు, దోమపోటు, ఉల్లికోడును తట్టుకుంటుందని ఆయన తెలిపారు. గత రబీలో మిగిలిన రబీ రకాలతో పోలిస్తే 8 నుంచి 10 శాతం దిగుబడిలో వృద్ధిని గమనించామని, తినడానికి బాగుందని ఆయన తెలిపారు. రైతులు పండించిన విత్తనాలను తోటి రైతులకు పంపిణీ చేయవచ్చునని ఆయన తెలిపారు. ఘనంగా వేద సదస్యం అన్నవరం: రత్నగిరి క్షేత్ర పాలకులు సీతారాముల కల్యాణోత్సవాల్లో భాగంగా మూడో రోజయిన ఆదివారం వేద సదస్యం ఘనంగా నిర్వహించారు. రత్నగిరి రామాలయంలో సాయంత్రం 4 గంటలకు నవ దంపతులు సీతారాములను వెండి సింహాసనం మీద, పెళ్లి పెద్దలు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని మరో ఆసనం మీద వేంచేయించి, పండితులు పూజలు చేసి, వేదాశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం వేద పండితులు సీతారాముల ముందు నాలుగు వేదాలను పఠించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు, వడపప్పు పంపిణీ చేశారు. వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, చిట్టి శివ, గంగాధరభట్ల గంగబాబు, ముష్టి పురుషోత్తం, సత్యదేవుని ఆలయ ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ, అర్చకుడు సుధీర్, రామాలయ అర్చకుడు కోట వంశీ, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు పాల్గొన్నారు. -
‘అప్పుల్లో చంద్రబాబు రికార్డు సాధించారు’
సాక్షి, కాకినాడ జిల్లా: ‘‘2014-19 కాలంలో చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం అని చెప్పేవారు.. 2024 తరువాత ప్రతి మంగళవారం అప్పుల వారం అంటున్నారు’’ అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేస్తూ.. అప్పు చేసి పప్పుకూడు అనే కార్యక్రమం చేస్తున్నారంటూ ఆయన దుయ్యబట్టారు.‘‘అప్పుల్లో చంద్రబాబు రికార్డ్ సాధించారు. ఈ 22 నెలల కాలంలో రూ.3 లక్షల 40,621 కోట్లు అప్పులు తెచ్చి ప్రజల నెత్తిన భారం పెట్టారు. కోవిడ్ వంటి కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలను వైఎస్ జగన్ అమలు చేశారు. అవసరమైన చోట అప్పులు చేసి సంక్షేమం.. అభివృద్ధిని సమానం తీసుకువెళ్ళి పాలన చేశారు. వైఎస్ జగన్ అప్పులు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందని ప్రచారం చేశారు. ఐదేళ్లలో జగన్ చేసిన అప్పులతో సమానంగా ఈ 22 నెలల్లోనే చంద్రబాబు చేశారు. చంద్రబాబు చేస్తున్న అప్పులతో రాష్ట్రం ఇవాళ శ్రీలంక అవ్వడం లేదా?’’ అంటూ కన్నబాబు దుయ్యబట్టారు.‘‘చంద్రబాబు అప్పులు చేస్తే సంపద సృష్టి.. నిధులు సమీకరణ అని కొన్ని పత్రికలు రాస్తున్నాయి. జగన్ అప్పులు చేస్తే రుణ భారం.. అప్పుల మోత అని ఆవే పత్రికలు రాశాయి. ఇప్పుడా పత్రికలకు సమ్మగా ఉంది. ఆ పత్రికలకు సామాజిక బాధ్యత లేదు?. తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నావ్ అని చంద్రబాబు ను అడిగేవాడు లేడు. చంద్రబాబు చేసిన అప్పులు చూసి కాగ్ ముక్కున వేలు వేసుకుంటుంది. కేంద్రం మా సపోర్ట్తో ప్రభుత్వాన్ని నడుపుతుంది కనుక మేము ఏం చేసిన చెల్లుబాటు అవుతుందన్న ధోరణీ కనిపిస్తుంది. అదే ప్రభుత్వంతో భాగస్వామ్యంగా ఉన్న మీరు కేంద్రం నుండి సాధించిన గ్రాంట్లు ఏమైనా ఉన్నాయా?. మీ సంపద సృష్టి ఎంత వరకు వచ్చింది?. ఏ రూపంలో రాష్ట్రాన్ని అప్పుల భారం పడకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు?..ఏపీ బేవరేజస్ నుండి వైఎస్ జగన్ అప్పులు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తే మీరు అడ్డుకున్నారు. ఇప్పుడు అదే సంస్థ నుండి మీరు రూ.17,600 కోట్లు అప్పులు చేశారు. అమరావతి నిర్మాణం కోసం మీరు కేంద్రం నుండి ఎంత గ్రాంట్ తీసుకువచ్చారు?. అమరావతిని మీరు అమితంగా ప్రేమిస్తున్నారు కదా?. ఆ ప్రేమకు కేంద్రం ఇచ్చిన కానుక ఎంత?. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేని మీరు.. సూపర్ సిక్స్ను అమలు చేయలేని మీరు రాష్ట్రాన్ని అప్పులతో అధోగతిపాలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్్గా మారుస్తున్నారని ప్రజలు అనుకునే పరిస్థితికి తీసుకువచ్చారు’’ అని కురసాల కన్నబాబు మండిపడ్డారు. -
నిరంతరాయంగా ఎల్పీజీ సరఫరా
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో గృహ అవసరాలు, అత్యవసర సేవలకు అవసరమైన ఎల్పీజీ సరఫరా నిరంతరంగా కొనసాగుతోందని జేసీ మేఘ స్వరూప్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో రోజుకు సుమారు 12 వేల నుంచి 12,500 వరకూ గ్యాస్ సిలిండర్లు 52 పంపిణీదారుల ద్వారా సరఫరా జరుగుతోందన్నా రు. గ్యాస్ పంపిణీ దారుల వద్ద సుమారు 14,362 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. సాధారణంగా రోజుకు 11 వేల నుంచి 11,500 వరకూ బుకింగ్లు ఉండేవని, అవి ప్రస్తుతం 8 వేల నుంచి 9 వేలకు తగ్గాయని పేర్కొన్నారు. ఇటీవల బుకింగ్లు సుమారు 90 శాతం పెరగడంతో ముందు బుకింగ్ చేసుకున్న వారికి ముందస్తు విధానంలో కొనసాగుతుండటంతో సరఫరాలో కొంత జాప్యం కనిపించిందన్నారు. సిలిండర్లను వినియోగదారుల ఇళ్లకే సరఫరా చేస్తున్నందున గోడౌన్లకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. జిల్లాలో గ్యాస్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ హెల్ప్లైన్ నంబర్ 80746 61259కు వచ్చిన 220 ఫిర్యాదులను పరిష్కరించామని, గత కొన్ని రోజులుగా 47 కేసులు నమోదు చేసి 119 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గ్యాస్ హోర్డింగ్, నల్ల బజారు, అధిక ధరలకు అమ్మకాలు జరిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని 208 పెట్రోల్ బంకుల ద్వారా పెట్రోలు, డీజిల్ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందన్నారు. -
పూల్లో.. కూల్కూల్గా..
● డీఎస్ఏ స్టేడియంలో స్విమ్మింగ్ శిక్షణ ● ఆరేళ్ల చిన్నారుల నుంచి పెద్దవారి వరకు అవకాశం ● ఈతతో వ్యాయామంతో పాటు ఆరోగ్యం ● స్వీయ రక్షణకే కాకుండా ఇతరుల రక్షణకూ దోహదం నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఒంటిపూట సెలవులు వచ్చేశాయి. అభిరుచులకు అనుగుణంగా చిన్నారులకు వారికి ఆసక్తికరమైన ఆటపాటల్లో తర్ఫీదు ఇప్పించేందుకు అనువైన సమయం. పుస్తకాలకు కాస్త విరామం ఇచ్చి ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణ ఇప్పించి నైపుణ్యాలకు పదును పెట్టేందుకు దోహదపడే సమయం. లలిత కళలు, డ్యాన్స్, మూజిక్, క్రీడలు వంటివి నేర్చుకుంటూ సంతోషంగా గడపాలనుకునే వారి జాబితాలో ఇప్పుడు స్విమ్మింగ్ కూడా చేరుతోంది. భానుడి వేడి రోజురోజుకు పెరుగుతుండడంతో ఈ క్రీడపై ఆసక్తి చూపుతున్న చిన్నారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పాఠశాలలకు ఒంటి పూట సెలవులు కావడంతో చెరువుల్లో, సముద్రంలో, బావుల్లో, కాలువల్లో, నదుల్లో సరదాగా స్నానానికి దిగి ప్రమాదవ శాత్తు పడి ప్రాణాలు కోల్పోయేవారు ఎక్కువవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో స్వీయ రక్షణకు ఈత తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈత శరీరాన్ని చల్లబరచడమే కాకుండా.. కావలసిన వ్యాయామాన్ని అందిస్తుంది. ఈత నేర్చుకోవాలనుకునే వారికి కాకినాడలోని డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ (డీఎస్ఏ)లోని స్విమ్మింగ్ పూల్ ఆహ్వానం పలుకుతోంది. డీఎస్ఏలో కాకినాడ జిల్లా క్రీడామైదానంలోని స్విమ్మింగ్ పూల్లో శిక్షణకు చిన్నారులు ఉత్సాహంగా చేరుతున్నారు. జలకాలలో ఓనమాలు నేర్చుకుని తమ ప్రతిభను రాష్ట్ర, జాతీయ స్థాయిలో కపనరచాలనే లక్ష్యంతో శిక్షణ పొందుతున్నారు. స్వీమ్మింగ్ కోచ్ అప్పలనాయుడు ఆధ్వర్యంలో, డీఎస్డీఓ వి.సతీష్కుమార్ పర్యవేక్షణలో ఈశిక్షణ నిర్వహిస్తున్నారు. ఉదయం 5.30 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7.30 వరకు శిక్షణ అందిస్తున్నారు. మహిళలకు ప్రత్యేకంగా సాయంత్రం 4 నుంచి 5 వరకు పూల్ను కేటాయించారు. శిక్షణలో చేరిన వారికి ఫిట్నెస్తో పాటు ఫ్రీ స్టైల్, బటర్ఫ్లై, బ్యాక్స్ట్రోక్, బ్రెస్ట్స్ట్రోక్లో శిక్షణ ఇస్తూ మెళకువలు నేర్పుతున్నారు. డీఎస్ఏలో స్విమ్మింగ్ పూల్లో శిక్షణకు చేరగోరే పిల్లలకు నెలకు రూ.వెయ్యి, పెద్ద వారికి నెలకు రూ.1500 వసూలు చేస్తున్నారు. జాతీయస్థాయి, రాష్ట్రస్థాయి పతకాలు సాధించిన బీపీఎల్ కార్డు ఉన్న క్రీడాకారులకు ఉచితం. మంచి వ్యాయామం ఈత నేర్చుకునే సమయంలో శరీరంలోని అన్ని కండరాలు, కీళ్లకు అవసరమైన వ్యాయామం అందుతుంది. ఊపిరి ఎక్కువ సేవు బిగబట్టి వదలడం వల్ల శాస ప్రక్తియ క్రమబద్దీకరించబడి ఊపితిత్తులు బలంగా తయారవుతాయి. పగలు ఏసమయంలో ఈత నేర్చుకున్నా మంచిదే. ఈత వల్ల అత్యధిక క్యాలరీలు ఖర్చవుతాయి. తద్వారా ఆకలి పెరుగుతుంది. నిత్యం ఈత కొట్టేవారు ఉత్సాహంగా ఉంటారు. మెదడు చురుకుగా పనిచేస్తుంది. శరీరం దృఢంగా ఉంటుంది. చదివిన విషయాలను త్వరగా నేర్చుకోగలుగుతారు. చిన్న వయసు వారి నుంచి పెద్ద వయసు వారి వరకు ఈత నేర్చుకోవచ్చు. కొలనులో ఈత నేర్చుకునే వారు రు.500 వెచ్చిస్తే మంచి స్విమ్మింగ్ దుస్తులు లభిస్తాయి. మూడు వారాలు క్రమం తప్పకుండా నేర్చుకుంటే ప్రావీణ్యం వస్తుంది. స్విమ్మింగ్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి చిన్నతనం నుంచి స్విమ్మింగ్ నేర్చుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. శరీరానికి ఆక్సిజన్ సంపూర్ణంగా అందుతుంది. రక్తం సరఫరా మెరుగుపడి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మన స్నేహితులు, బంధువులు, మరెవరైనా ప్రమాదవ శాత్తు ఏదైనా నీటి ప్రమాదంలో పడిపోతే రక్షించే అవకాశం ఉంటుంది. అప్పల నాయుడు, కోచ్, డీఎస్ఏ శిక్షణను సద్వినియోగం చేసుకోండి కాకినాడ జిల్లా క్రీడామైదానంలోని స్విమ్మింగ్ పూల్లో నైపుణ్యం కలిగిన కోచ్, అసిస్టెంట్ కోచ్ సహాయంతో శిక్షణ అందిస్తున్నాం. మహిళలకు ప్రత్యేక సమయంలో శిక్షణ నిర్వహిస్తున్నాము. ఆత్మరక్షణకు స్విమ్మింగ్ దోహదపడుతుంది. ఆసక్తి గల వారు ఇక్కడి స్విమ్మింగ్ పూల్ను సద్వినియోగం చేసుకుని మంచి క్రీడాకారులుగా ఎదగాలి. ఈత నేర్చుకోవాలనుకునే వారు 94400 31601 నెంబరులో సంప్రదించాలి. – వి.సతీష్కుమార్, డీఎస్డీఓ, డీఎస్ఏ, కాకినాడ -
ఇద్దరి గంజాయి నిందితుల అరెస్టు
ఫియట్ లైనియా కారు స్వాధీనం పిఠాపురం రూరల్: స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల వెలుగు చూసిన భారీ గంజాయి అక్రమ రవాణా కేసులో ఇద్దరు నిందితులను శనివారం అరెస్టు చేసినట్లు సీఐ జి. శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల ఐదో తేదీన పి.దొంతమూరు గ్రామ శివారు పామాయిల్ తోటలో తనిఖీలు చేసిన పోలీసులు 92 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్థానిక ఎస్సై ఎస్కే జానీబాషా తహసీల్దార్ సమక్షంలో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా నిందితుల కోసం గాలింపు చేపట్టామని, సాంకేతిక ఆధారాలతో శనివారం శుద్దగెడ్డ వాగు కల్వర్టు వద్ద కారులో వెళ్తున్న ఇద్దరు అంతర్ జిల్లాల నిందితులను అరెస్టు చేసినట్టు తెలిపారు. నిందితులు అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలానికి చెందిన నడిగట్ల మనోహర్ (33), అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలానికి చెందిన లోచల రాజుబాబు (30)గా గుర్తించామని, వీరు గతంలో కూడా పలు గంజాయి అక్రమ రవాణా కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు తెలిపారు. నిందితులు తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయించే ఉద్దేశంతో దాచిపెట్టినట్లు వెల్లడైందన్నారు. నిందితుల వద్ద నుంచి ఫియట్ లైనియా కారు సీజ్ చేసినట్లు తెలిపారు. ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారన్నారు. పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. -
విద్యా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి
సీతానగరం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించినట్టు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఆమె శనివారం పురుషోత్తపట్నంలో ని ఎంపీయూపీ స్కూల్, తాబే లు మెట్ట – ఏనుగు కొండ ప్రాంతం, సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించా రు. ఎంపీయూపీ పాఠశాలలో ఉపాధ్యాయులతో సమావేశమై బోధనా విధానాలు, పేరెంట్స్ కమిటీ సమావేశాల నిర్వహణ, విద్యార్థుల ప్రతిభ తదితర వాటిపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు. పురుషోత్తపట్నం సమీపంలో పురాతన రామాలయం ఉన్న రామదుర్గం, తాబేలు మెట్ట – ఏనుగు కొండ ప్రాంతంలో పర్యాటక రంగ అభివృద్ధి పనులను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పీపీపీపీ విధానంలో చేపడుతున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ ప్రాంతంలో రిసార్టులు, రెస్టారెంట్ల స్థాపనకు అనువైన 7.5 ఎకరాల భూమిని గుర్తించామన్నారు. అవసరమైన మార్గదర్శకాలను టూరిజం వెబ్సైట్లో విడుదల చేశామని, ఆసక్తి కలవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అలాగే సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి, అక్కడి అపరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్నవరప్పాడుకు పోటెత్తిన భక్తులు పెరవలి: అన్నవరప్పాడులోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అన్నవరప్పాడు గ్రామానికి చెందిన వాసంశెట్టి గోపాలం, కుమారి దంపతుల కుమారుల ఆర్థిక సాయంతో 13 వేల మందికి అన్నసమారాధన నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మీసాల రాధాకృష్ణ మాట్లాడుతూ స్వామి వారికి పూలంకరణ, భక్తులకు ప్రసాదం, నిత్యగోత్రార్చన, అన్నదానం, నూతన ఆలయ నిర్మాణానికి భక్తుల నుంచి విరాళాలు సేకరిస్తున్నామన్నారు. -
మరో శిలా ఫలకం ధ్వంసం
● ఓవర్హెడ్ ట్యాంకు ప్రారంభోత్సవ ఫలకం ● నిర్మాణాన్ని పడగొట్టిన దుండగులు ● ఇమ్మిడివరప్పాడులో ఘటన అమలాపురం రూరల్: మండలం ఇమ్మిడివరప్పాడులో తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన మరువక ముందే మరో శిలా ఫలకాన్ని ధ్వంసం చేశారు. అదే ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన శిలా ఫలకాన్ని ఈసారి ధ్వంసం చేశారు. ఇక్కడ వరసగా శిలా ఫలకాల ధ్వంసం జరుగుతున్న తీరు చూస్తుంటే గ్రామంలో రాజకీయ క్షక్షలతో కావాలనే ఇలా చేస్తునట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే, మంత్రులు, ప్రజా ప్రతినిధుల పేర్లతో ఉన్న శిలాఫలకం ధ్వంసం చేయడంతో సదరు ప్రజా ప్రతినిధులంటే ఇష్టం లేకనే ఇలా చేస్తున్నారని గ్రామస్తులు అరోపిస్తున్నారు. ఈ శిలాఫలకం ధ్వంసంపై పంచాయతీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల్లో రెండు శిలా ఫలాకాలు ధ్వంసం చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. -
రాజు నిజాయతీ అభినందనీయం
● ల్యాప్టాప్ మరచి దిగిపోయిన ప్రయాణికురాలికి అందజేత ● ఆర్టీసీపై నమ్మకాన్ని పెంచుతుందన్న డీఎం జేమ్స్ కుమార్ రాజోలు: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ల్యాప్ట్యాప్ మరచి దిగిపోయిన ప్రయాణికురాలికి తిరిగి అందజేసిన కండక్టర్ రాజుకు స్థానిక డీఎం జేమ్స్ కుమార్ శనివారం అభినందనలు తెలిపారు. వివరాల్లోకి వెళి తే, అమలాపురం నుంచి కరవాకకు బస్సులో ప్రయా ణిస్తున్న జె.శ్రావణి బస్సు దిగుతూ ల్యాప్ట్యాప్ మరచిపోయారు. దీనిని గమనించిన కండక్టర్ ఎన్.జి.రాజు దానిని భద్రపరిచి, డిపో మేనేజరు జి.జేమ్స్ కుమార్, సూపర్వైజర్ సమక్షంలో ఆమెకు అప్పగించారు. కండక్టర్ నిజాయతీ, బాధ్యతాయుత సేవలను డీఎం కు మార్ అభినందించారు. ఈ ఘటన ప్రజల్లో సంస్థ పట్ల నమ్మకాన్ని పెంచడమే గాకుండా, ఏపీఎస్ ఆర్టీసీ సి బ్బంది సేవాతత్వాన్ని ప్రతిబింబింప చేస్తోందన్నారు. -
చిన్నారి శస్త్రచికిత్సకు ‘హెల్పింగ్ హ్యాండ్స్’
కాజులూరు: ఆర్యావటం గ్రామానికి చెందిన చిన్నారి పాదాలకు హెల్పింగ్ హ్యాండ్స్ సహకారంతో శస్త్ర చికిత్స చేసేందుకు వైద్యులు సిద్ధమవుతున్నారు. చిన్నారి పాదాలు వెనుకకు మెలి తిరిగి నడవలేని స్థితిలో ఓ అరుదైన శస్త్రచికిత్స చేసేందుకు కాకినాడ శ్రీకై రా ఎమర్జెన్సీ, ట్రామా సెంటర్ వైద్యులు సిద్ధమవుతున్నారు. కరప మండలం ఉప్పలంకకు చెందిన తొమ్మిదేళ్ల చిన్నారి కర్రి దుర్గాభవానికి పుట్టుకతోనే పాదాలు వెనుకకు మెలి తిరిగి ఉండటంతో నడచేందుకు వీలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతోంది. ఈ విషయం తెలుసుకున్న హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ప్రధాన కార్యదర్శి అనసూరి శ్రావణి హైదరాబాద్కు చెందిన పారిశ్రామికవేత్త, సంస్థ చైర్మన్ జి.విఠల్రెడ్డిని సంప్రదించగా రూ.లక్ష అందజేశారు. అలాగే సంస్థ సభ్యులు మరో రూ.40 వేలు సమకూర్చారు. చిన్నారి కుటుంబ పరిస్థితి, హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ అందిస్తున్న ప్రోత్సాహాన్ని గమనించిన కాకినాడ శ్రీకై రా ఎమర్జెన్సీ, ట్రామా సెంటర్ వైద్యుడు వెంకట భార్గవ్ రూ.2.5 లక్షలకే ఆపరేషన్ చేసేందుకు ముందుకు వచ్చారు. సంస్థ సభ్యులు సమకూర్చిన రూ.1.4 లక్షలకు తోడు మరో రూ.1.1 లక్షలు, ఖర్చుల నిమిత్తం మరో రూ.15 వేలను కాకినాడ ప్రియా హోటల్ మేనేజ్మెంట్ కళాశాల అధినేత తాడి నరేంద్రకుమార్ శనివారం అందజేశారు. దీంతో బాలికకు ఆదివారం ఆపరేషన్ చేయనున్నట్టు వైద్యుడు వెంకట భార్గవ్ తెలిపారు. -
తీవ్ర నష్టాలు
ఏడాది కాలంగా కోళ్ల ఫారాలతో తీవ్ర నష్టాల బాట పట్టాం. ప్రస్తుతం గుడ్డు ధర తగ్గటంతో మళ్లీ అదే పరిస్థితి ఏర్పడింది. గుడ్డు ధర రూ.4.05 ఉండటంతో ఏమి చెయ్యాలో తెలియడం లేదు. మేత ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. – భూపతిరాజు నర్సింహరాజు, ఖండవల్లి ఆర్థిక ఇబ్బందులు దాదాపు 15 ఏళ్లగా కోళ్లఫాం నిర్వహిస్తున్నాం. గత ఏడాది కాలంగా ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంటూ ఆర్థికంగా నలిగిపోయాం. రెండు నెలలు బాగానే ఉన్నా, మళ్లీ గుడ్డు ధర పతనమైంది. ఇలాగే ఉంటే కోళ్ల పరిశ్రమ మూతపడుతుంది. – మండా తాతారెడ్డి, కోళ్ల రైతు, పిట్టల వేమవరంఖండవల్లిలో ఖాళీగా ఉన్న కోళ్లషెడ్లు -
● ఈ మేజిక్కులు ఎన్నాళ్లో!
రోజు కూలీల ప్రాణాలతో వాహన డ్రైవర్ల చెలగాటానికి అంతులేకుండా ఉంది. రోజు కూలీల జీవన పోరాటం.. వాహన డ్రైవర్ల అత్యాశ వెరసి ఈ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఎవరి అవసరాల మేరకు వారు మ్యాజిక్ వ్యాన్లు, ఆటోలను ఆశ్రయిస్తూ లోపల స్థలం లేకుంటే వెనుక భాగంలో నిలబడి మరీ పని ప్రదేశాలకు ప్రయాణిస్తున్నారు. డివిజన్లోని చింతూరు, కూనవరం, వీఆర్ పురం, ఎటపాక మండలాల్లో ఈ తరహా ఫుట్ పాత్ ప్రయాణాలు సహజమైపోయాయి. ఏదైనా ప్రమాదం జరిగినపుడు హడావిడి చేయడం తప్ప కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో అధికారులు తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారు. చింతూరు -
ఆటో, కారు ఢీ ఐదుగురికి తీవ్ర గాయాలు
కొత్తపేట: మండల పరిధిలోని వాడపాలెం సమీపంలోని బండారుపేట వద్ద ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక ఎస్సై జి.సురేంద్ర తెలిపిన వివరాల మేరకు మండల పరిధిలోని వానపల్లి గ్రామానికి చెందిన అక్కిశెట్టి వీరేశ్వరరావు తన ఆటోలో నలుగురు మహిళా ప్రయాణికులు, ఒక బాలికను ఎక్కించుకుని కొత్తపేట వస్తున్నాడు. బండారుపేట వద్దకు వచ్చేసరికి ఎదురుగా వానపల్లి వైపు అతి వేగంగా వచ్చిన ఏపీ39 బీవై 6896 నెంబరు గల కారు అతని ఆటోను ఢీకొంది. దానితో ఆ ఆటో అక్కడే నిలిపి ఉన్న మరో ట్రక్కు ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ వీరేశ్వరరావుతో పాటు దానిలో ప్రయాణిస్తున్న వానపల్లికి చెందిన ఇమ్మడి నాగమణి, బద్రి పళ్లాలమ్మ, గండ్రోతు గణేశ్వరి, సలాది పద్మ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు కొత్తపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వారికి ప్రాధమిక చికిత్స చేసి ఉన్నత వైద్యం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ వీరేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సురేంద్ర తెలిపారు. అవయవ దానంతో ముగ్గురికి పునర్జన్మ కాకినాడ క్రైం: కాకినాడకు చెందిన ఓ వ్యక్తికి బ్రెయిన్ డెడ్ కావడంతో కుటుంబ సభ్యులు అవయవదానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఆర్ఆర్ నగర్కు చెందిన భూపతిరాజు వెంకటనారాయణ రాజు (60)కు కొద్ది రోజుల క్రితం తీవ్రమైన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. కుటుంబ సభ్యులు కాకినాడ అపోలో ఆసుపత్రిలో ఆయనను చేర్చినప్పటికీ కోలుకోలేకపోయారు. దీంతో వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్థారించారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆదర్శాన్ని చాటుకున్నారు. రాజు భార్య మమత, కుమార్తె విజయశ్రీతో పాటు రాజు సోదరుడు సుబ్బరాజు అవయవ దానానికి ముందుకు వచ్చారు. వారి నిర్ణయంతో ముగ్గురికి పునర్జన్మ లభించింది. ఓ వ్యక్తి ప్రాణాలు నిలువగా, మరో ఇద్దరికి కంటి చూపు దక్కింది. ఆయన కాలేయాన్ని విశాఖపట్టణంలో ప్రాణాపాయంతో ఉన్న ఓ వ్యక్తికి అమర్చనున్నారు. అలాగే కళ్లను బాదం ఐ బ్యాంక్కు దానం చేశారు. రాజు నేత్రదానంతో ఇద్దరు తమ కంటి చూపును తిరిగి పొందనున్నారు. కాలేయాన్ని తరలించేందుకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గ్రీన్ చానల్ ఏర్పాటు చేసి కాలేయాన్ని శనివారం మధ్యాహ్నం సకాలంలో అవసరమైన వారికి అమర్చేందుకు తరలించారు. వెంకట నారాయణ రాజు కుటుంబం చూపిన ఉదాత్త సేవాభావం సమాజానికి ఓ ప్రేరణగా నిలిచిందని పలువురు కొనియాడారు. ఆలోచింపచేసిన అమ్మ చెక్కిన బొమ్మ ఏలేశ్వరం: మానవజన్మలో సీ్త్ర, పురుషులే కాకుండా 20 రకాల శరీర తత్వాలు ఉన్నాయనే ఇతివృత్తంతో సాగిన అమ్మచెక్కిన బొమ్మ నాటిక ఆహూతులను ఆలోచింపజేసింది. మండలంలోని పెద్దనాపల్లి గ్రామంలో శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా గొల్లపల్లి చెల్లయ్య మోమోరియల్ నాటక కళాపరిషత్ అధ్యక్షుడు, ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు రాష్ట్రాల నాటికల పోటీలు అసక్తికరంగా సాగుతున్నాయి. హైదరాబాద్కు చెందిన గోవాడ క్రియేషన్స్ ప్రదర్శించిన ఈ నాటికకు గోవాడ వెంకట్ దర్శకత్వం వహించగా శ్రీమతి జ్యోతిరాజ్ భీశెట్టి రచన చేశారు. రెండో నాటికగా తరమెల్లిపోతున్నదో నాటిక ప్రదర్శించారు. మరణం తరువాత మనిషి బతుకుతాడు, మరణం తరువాత బతికేవారే నిజమైన మనిషి అనే కధాంశంతో నాటిక కొనసాగింది. గుంటూరుకు చెందిన కరణం మహేష్ మోమోరియల్ థియేటర్స్ వారి ఈ నాటికకు రచన, దర్శకత్వం శ్రీరామకృష్ణ బొమ్మిడి అందించారు. -
జోడుమామిళ్ల సమీపంలో పెద్దపులి!
దేవీపట్నం: ఇందుకూరు పంచాయతీ కొత్తవీధి గ్రామంలో గురువారం రాత్రి నాలుగు పశువులను చంపిన పెద్దపులి శుక్రవారం రాత్రి కొత్తవీధి ఎగువన గల మీటరాయి చెరువు వద్ద ఉన్న కొండకు చేరింది. గోకవరం దండంగి ఆర్అండ్బి రహదారిలో పోతవరం, జోడుమామిళ్లు మధ్య పులి సంచరిస్తోంది. శనివారం రాత్రికి పులి పయనం ఎటువైపు వెళుతుందోనన్న ఆసక్తి నెలకొంది. జోడు మామిళ్లు వద్ద ఆర్అండ్బి రహదారి దాటితే పురుషొత్తపట్నం వైపు మరలే అవకాశం ఉంది. ప్రస్తుతం పులి ఉన్న ప్రదేశం నుంచి గుంపెనపల్లి, లక్ష్మీపురం గ్రామాల మీదుగా సీతపల్లి వాగు దాటితే పులిని విడిచిపెట్టిన పాపికొండల అభయారణ్యంలోని కొండమొదలు ప్రాంతానికి చేరే అవకాశం ఉన్నట్లు అటవీ అధికారులు భావిస్తున్నారు. గడిచిన 20 రోజులుగా పులి పయనిస్తున్న మార్గాన్ని పర్యవేక్షిస్తున్న అటవీశాఖ అధికారులు రక్షిత అటవీ ప్రాంతానికి చేరుకునే అవకాశాలున్నాయి. తిరుపతి, పుణే నుంచి వచ్చిన బృందాలతో పాటు, హనుమ సభ్యులు స్థానిక అటవీ సిబ్బంది సహకారంతో పులి గమనాన్ని జీపీఎస్ ట్రాకర్ ద్వారా ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. ఇదిలా ఉండగా స్థానికంగా ఉన్న గ్రామాలైన లక్ష్మీపురం, గుంపెనపల్లి, నూనెపల్లి గ్రామాలకు చెందిన పశువులను జనవరి నెలలోనే విడిచిపెట్టడంతో ఆయా పశువులు అడవులలో సంచరిస్తున్నాయి. వీటికి తోడు దండంగి పరిసర ప్రాంతాల్లో సుమారు వెయ్యి వరకూ గేదెలు ఉండడంతో ఆయా పశువుల యజమానులు ఆందోళనకు గురవుతున్నారు. -
‘ ఆ ఆడియోలను నేషనల్ ఫోరెన్సిక్కు పంపాలి’
రాజమహేంద్రవరం: దళితుల గురించి దళిత సంఘాల గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుపై ఫిర్యాదు చేయడానికి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్కు వైఎస్సార్సీపీ నేతలు వెళ్లారు. అయితే దీనికి సంబంధించి కౌంటర్ఫైల్ ఇవ్వడానికి సీఐ బాజీలాల్ నిరాకరించారు. దాంతో వైఎస్సార్సీపీ నేతలు, సీఐ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే సీఐ తీరును మాజీ ఎంపీ భరత్ నిలదీశారు. దీనిలో భాగంగా మీడియాతో భరత్ మాట్లాడుతూ.. ‘ దళితుల గురించి దళిత సంఘాల గురించి ఆడియోలో ఆదిరెడ్డి అభ్యంతరకరంగా మాట్లాడారు. నిష్పక్షపాతంగా ఎంక్వయిరీ జరగాలని డిమాండ్ చేశాం. ఆడియోలో అప్పారావు ఎస్సీ వర్గాల పట్ల మాట్లాడిన తీరు చూస్తే అత్యంత దారుణంగా ఉంది. ఆదిరెడ్డి అప్పారావు ఆడియోలను నేషనల్ ఫోరెన్సిక్కు పంపాలి. ప్రత్యేకంగా ఈ వ్యవహారంపై ఎంక్వయిరీ వేసి నిజానిజాలు నిర్ధారించాలి. లేదంటే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. గంటసేపు వాగ్వాదం చేస్తే అకనాలెడ్జిమెంట్ కాఫీఇచ్చారు’ అని స్పష్టం చేశారు. -
పెద్దాపురానికి ఇద్దరు ఎమ్మెల్యేలా!
పెద్దాపురం (సామర్లకోట): పెద్దాపురం నియోజకవర్గంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారా అనే విషయం శుక్రవారం చర్చనీయాంశమైంది. పెద్దాపురం మహారాణి సత్రంలో శ్రీరామ నవమి వేడుకల సందర్బంగా సత్రం నిర్వాహకులు ఎమ్మెల్యేకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఒక ఫ్లెక్సీపై నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యే, పెద్దాపురం నియోజకవర్గం అని, మరో ఫ్లెక్సీపై నిమ్మకాయల రంగనాగ్, ఎమ్మెల్యే, తెలుగుదేశంపార్టీ కాకినాడ ఉపాధ్యక్షుడు అని స్వాగతం పలుకుతూ మహారాణి సత్రం ఈఓ పేరున ఏర్పాటైంది. ఒక నియోజకవర్గానికి ఇద్దరు ఎమ్మెల్యేలా అనే చర్చ జరిగింది. ఈ విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. 1న అండర్–19 క్రికెట్ జట్టు ఎంపికలు నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1న అండర్–19 విభాగంలో క్రికెట్ క్రీడాకారుల ఎంపిక నిర్వహిస్తున్నట్లు సంఘ అధ్యక్ష, కార్యదర్శులు తలాటం హరీష్, వెంకటేష్ శుక్రవారం తెలిపారు. రంగరాయ వైద్య కళాశాల క్రీడా ప్రాంగణంలో ఉదయం 8 గంటలకు ఎంపికలు ప్రారంభమవుతాయన్నారు. 2007 తరువాత జన్మించిన వారు ఈ ఎంపికలకు అర్హులన్నారు. జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, క్రికెట్ కిట్, వైట్ దుస్తులు, బూట్లుతో హాజరుకావాలని కోరారు. వివరాలకు 90631 68999 నెంబరులో సంప్రదించాలని తెలిపారు. వ్యాన్ ఢీకొని వ్యక్తి మృతి అల్లవరం: మండలం దేవగుప్తం ప్రధాన రహదారిపై చింతలమెరక వద్ద రైస్ వ్యాన్ ఢీకొని అదే ప్రాంతానికి చెందిన గాడ మరిడియ్య (54) అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు రెల్లుగడ్డ పంచాయతీ ఎలువుల్లంక గ్రామానికి చెందిన బొంతు నాగార్జున తన రైస్ వ్యాన్తో అమలాపురం వైపు వెళ్తున్నాడు. అదే సమయానికి వాటర్ టిన్నుతో మరిడియ్య తన సైకిల్పై ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అతడి తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అల్లవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సంపత్కుమార్ తెలిపారు. వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు పి.గన్నవరం: మండలంలోని జొన్నల్లంక గ్రామానికి చెందిన వ్యక్తి అదృశ్యమైన ఘటనపై శుక్రవారం కేసు నమోదు చేసినట్టు ఎస్సై బి.శివకృష్ణ తెలిపారు. ఈనెల 18న చందాడి శ్రీను (33) జొన్నల్లంక నుంచి పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాళీపట్నంలోని అత్తవారి ఇంటికి వెళ్తున్నట్టు చెప్పాడు. అయితే అతడు అక్కడికి వెళ్లలేదని తెలుసుకుని కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాలలో గాలించినప్పటికీ ఆచూకీ తెలియలేదు. దీంతో అతడి తల్లి మారమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వివరించారు. రిజర్వాయర్లో మృతదేహం లభ్యం గంగవరం: ఈ నెల 25న సూరంపాలెం రిజర్వాయర్లో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై వెంకయ్య తెలిపారు. గురువారం ఉదయం మృతదేహం రిజర్వాయర్ నీటిలో తేలింది. మృతదేహం మండలం నెల్లిపూడి గ్రామానికి చెందిన కుంజర్ల ఈశ్వర వరప్రసాద్ (21)దిగా గుర్తించినట్టు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని అడ్డతీగల ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి శుక్రవారం వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. -
జగన్మోహనం.. కేశవుని కల్యాణం..
● భక్తజన సంద్రమైన ర్యాలి క్షేత్రం ● ఘనంగా స్వామివారి కల్యాణ మహోత్సవాలు ప్రారంభం కొత్తపేట/ఆత్రేయపురం: చరిత్ర ప్రసిద్ధి గాంచిన స్వయంభూ క్షేత్రం ర్యాలిలోని జగన్మోహిని కేశవస్వామి కల్యాణం శుక్రవారం అంగరంగ వైభవంగా సాగింది. వేద పండితులు శ్రీనివాసుల వెంకటాచార్యులు, అర్చకులు వేద పండితులు భక్తజనం నడుమ ఈ కల్యాణాన్ని నిర్వహించారు. స్వామివారి దంపతులకు ఆలయ చైర్మన్ మెర్ల నాగేశ్వరరావు, కమిటీ సభ్యులు, ఆలయ ఈవో భాగవతుల వెంకటరమణమూర్తి దంపతులు నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉదయం స్వామి వారికి మేలుకొలుపు, పంచామృత అభిషేకాలు, నిత్యౌపాసన, బలిహరణ, నీరాజనం మంత్రపుష్పం, వేద పారాయణ నిర్వహించారు. తొలుత స్వామి వారిని పెండ్లి కుమారునిగా, అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా పట్టు వస్త్రాలతో అలంకరించారు. అత్యంత వేడుకగా తలంబ్రాలు పోయించారు. సాయంత్రం గరుడ వాహనంపై స్వామికి సన్నాయి, మేళతాళాలతో గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా వేదిక వద్దకు తీసుకు వచ్చి వైభవంగా కల్యాణం నిర్వహించారు. కంకణధారణ కన్యాదానం, సూత్రధారణ, యజ్ఞోపవీత ధారణ, వరపూజ, తలంబ్రాలు తదితర తంతులు కన్నుల పండుగగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు పాల్గొని తిలకించి పులకించారు. ఆలయ ఈవో భాగవతుల వెంకటరమణ మూర్తి, జూనియర్ అసిస్టెంట్లు మేడిద శ్రీను, దత్తు, సునీత, కళ్యాణోత్సవానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఏకశిలగా స్వామి, అమ్మవార్ల రూపంఏక శిలలో ముందు పురుష రూపం, వెనక సీ్త్ర రూపంతో జగన్మోహినీ, విష్ణుమూర్తి సాక్షాత్కరించే అద్భుత నిలయం ఆత్రేయపురం మండలం ర్యాలి. ఈ క్షేత్రంలో వెలసిన జగన్మోహినీ కేశవస్వామి వారి ఆలయంలో అణువణువునా ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంటుంది. శుక్రవారం ప్రారంభమైన కల్యాణోత్సవాలు వచ్చే నెల 3 వరకూ వైభవంగా నిర్వహించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఆరో దేవాలయంగా ఇది ఖ్యాతికెక్కిన ఇక్కడి శిలారూప స్వామి అమ్మవార్లు స్వయంభువుగా వెలిశారని చరిత్ర చెప్తోంది. భక్తులందరికీ ఇక్కడ గర్భాలయ ప్రవేశం ఉండడం విశేషం. అంతే కాక ఈ ఆలయానికి ఎదురుగా పడమర వైపు ఉమా కమండలేశ్వర స్వామి ఆలయం ఉండటం మరో విశేషం. కాగా శివాలయంలో నీరు ఇంకి పోవడం, జగన్మోహునుడి ఆలయంలో స్వామి వారి పాదాల నుంచి నిరంతరం నీరు (గంగ) ఉప్పొంగడం సృష్టి రహస్యాలుగా చరిత్రకారులు చెప్తుంటారు. ఆలయ చరిత్ర ఎంతో విశిష్టం ఈ ఆలయంలో ప్రత్యేకతలకు తగినట్లే ఆ దైవం అవతరించిన విధానానికి కూడా ఓ అద్భుత చరిత్ర ఉంది. రాక్షస సంహారంలో భాగంగా ఇక్కడి స్వామివారు అవతరించారని స్థల పురాణం బట్టి తెలుస్తోంది. ఇటు గౌతమి, అటు వశిష్ట నదీ పాయల మధ్య రూపుదిద్దుకున్న ఈ ఆలయ స్థాపనకు, ఈ గ్రామానికి ర్యాలి అన్న పేరు రావడానికి కూడా ఒక కథ ఉన్నట్టు పండితులు చెప్తుంటారు. విక్రమదేవుడు అనే భక్తుడు అడవిగా ఉన్న ఈ ప్రాంతంలో వేటాడుతూ ఒక చెట్టు వద్ద నిద్రించాడు. అతనికి మహావిష్ణువు కలలో కనపడి శిలా రూపంలో నేను ఈ ప్రాంతంలో ఉన్నానని, నీవు కర్రతో రథం చేయించి లాగుతూ వెళ్తే ఆ రథం శీల ఎక్కడ రాలి పడుతుందో అక్కడ తవ్వితే నా విగ్రహం బయటపడుతుందని చెప్పి అదృశ్యమైనట్టు ఓ కథనం ప్రచారంలో ఉంది. ఆ ప్రకారం విక్రమ దేవుడి ద్వారా ఈ విగ్రహం బయట పడిందని చారిత్రక కథనం. రథం శీల రాలడం వల్ల ఈ దైవం వెలసిన ప్రాంతానికి ‘ర్యాలి’ అని పేరు వచ్చినట్టు పెద్దలు చెప్తారు. గరుడ వాహనంపై స్వామివారిని ఊరేగిస్తున్న భక్తులు, ఆలయ సిబ్బందిర్యాలి కళ్యాణానికి హాజరైన భక్తులు కల్యాణ మహోత్సవాలు ఇలా దేవస్థానం పాలకమండలి చైర్మన్ మెర్ల నాగేశ్వరరావు పర్యవేక్షణలో, ఈఓ భాగవతుల వెంకటరమణమూర్తి ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం నుంచి 30వ తేదీ వరకు స్వామివారికి అభిషేకం, తులసి పూజ, అమ్మవారికి కుంకుమార్చన తదితర కార్యక్రమాలు, 31 న సదస్యం, ఏప్రియల్ 2న చక్రస్నానం, 3న శ్రీపుష్పోత్సవంతో కల్యాణ మహోత్సవాలు ముగుస్తాయని ఈఓ భాగవతుల వెంకటరమణమూర్తి తెలిపారు. -
రత్నగిరిపై కన్నుల పండువగా..
అన్నవరం: భక్తవరదుడైన సత్యదేవుడు వెలసిన రత్నగిరి క్షేత్రపాలకులైన శ్రీ సీతారాముల దివ్యకల్యాణ మహోత్సవం శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా శుక్రవారం కన్నుల పండువగా జరిగింది. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవతో వైదిక కార్యక్రమాలకు పండితులు శ్రీకారం చుట్టారు. శ్రీరాముని జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకుని తెల్లవారుజామున 4 గంటలకు సీతారాములకు పంచామృతాభిషేకం, అనంతరం శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించారు. వధూవరులుగా అలంకృతులైన సీతారాములను వెండి ఆంజనేయ వాహనం పైన, పెళ్లి పెద్దలైన సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని వెండి పల్లకీ మీద ఉదయం 7 గంటలకు అన్నవరం గ్రామంలో ఊరేగించారు. అనంతరం ఊరేగింపుగా రత్నగిరి రామాలయం వద్ద ఉన్న వార్షిక కల్యాణ వేదిక వద్దకు తీసుకుని వచ్చారు. సర్వాంగసుందరంగా అలంకరించిన వేదిక మీద ప్రత్యేక సింహాసనంపై మంత్రోచ్చారణల నడుమ సీతారాములను, ఆ పక్కనే మరో ప్రత్యేక ఆసనంపై పెళ్లి పెద్దలు సత్యదేవుడు, అమ్మవార్లను వేంచేయించారు. కల్యాణ క్రతువు జరిగిందిలా.. ఉదయం 10.30 గంటలకు విఘ్నేశ్వర పూజతో కల్యాణ క్రతువు ప్రారంభించారు. దేవస్థానం చై0ర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావు దంపతులు సీతారాములకు పట్టు వస్త్రాలు, మంచి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సీతారాముల వంశీకుల విశిష్టతను వివరిస్తూ.. ప్రవరను కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు చెప్పారు. అనంతరం, పుణ్యాహవాచనం, యజ్ఞోపవీత ధారణ, మహా సంకల్పం, యుగఛిద్రాభిషేకం, తదితర కార్యక్రమాలను పండితులు నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిల్లగ్నంలో సీతారాముల శిరస్సులపై అర్చకులు జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని ఉంచారు. అనంతరం మాంగల్యసూత్ర ధారణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. రామాలయంలోని సీతారాముల మూలవిరాట్లకు కూడా అర్చకులు తలంబ్రాలు పోశారు. నూతన దంపతులు సీతారాములకు పండితులు వేదాశీస్సులందజేశారు. సీతారాములకు నివేదించిన పానకం, వడపప్పును భక్తులకు పంపిణీ చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరిగిన ఈ కల్యాణోత్సవాన్ని పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు, గ్రామస్తులు కన్నులారా తిలకించి, పులకించిపోయారు. కల్యాణోత్సవాన్ని దేవస్థానం వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, గంగాధరభట్ల గంగబాబు, చిట్టి శివ, యనమండ్ర శర్మ, ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ, రామాలయం అర్చకుడు కోట వంశీ, అర్చకులు ఇంద్రగంటి వేంకటేశ్వర్లు, దత్తుశర్మ, సుధీర్, పవన్, వ్రత పురోహితులు పాలంకి పట్టాభి తదితరులు నిర్వహించారు. ఏర్పాట్లను ఆలయ ఏఈఓ కృష్ణారావు, సూపరింటెండెంట్ రమణ తదితరులు పర్యవేక్షించారు. మధ్యాహ్నం సత్యదేవుని నిత్య కల్యాణం సీతారాముల కల్యాణానంతరం అదే వేదికపై మధ్యాహ్నం 1.30 నుంచి 3 గంటల వరకూ సత్యదేవుని నిత్య కల్యాణం నిర్వహించారు. దీనిని ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకూ స్వామివారి నిత్యకల్యాణ మండపంలో నిర్వహిస్తారు. ఆ కల్యాణానికి సీతారాములు పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తారు. అయితే, శ్రీరామ నవమి సందర్భంగా సీతారామ కల్యాణానికి సత్యదేవుడు, అమ్మవారు పెళ్లి పెద్దలుగా వ్యవహరించడంతో సత్యదేవుని నిత్యకల్యాణం ఆలస్యంగా నిర్వహించారు. నవదంపతులైన సీతారాములు ఈ కల్యాణానికి పెళ్లి పెద్దలుగా వ్యవహరించడం విశేషం. రమణీయంగా రాములోరి దివ్య కల్యాణం -
మస్కట్ నుంచి క్షేమంగా స్వగ్రామాలకు
కేసీఎం చొరవతో వచ్చిన బాధితులు అమలాపురం రూరల్: మస్కట్ వెళ్లి వివిధ కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఇద్దరి మహిళలను కలెక్టర్ మహేష్ కుమార్ చొరవతో కేసీఎం అధికారులు కోనసీమకు సురక్షితంగా తీసుకు వచ్చారు. గన్నవరం మండలం నరేంద్రపురానికి చెందిన బీరా శేషారత్నం గత ఏడాది ఆగస్టులో, పోతవరం గ్రామానికి చెందిన గుమ్మల్ల శ్రీలక్ష్మి అదే ఏడాది సెప్టెంబర్లో మస్కట్ వెళ్లారు. శేషారత్నం పని ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాలతో మధుమేహానికి గురై అనారోగ్యం పాలైంది. దీంతో కాలికి గాయమై పరిస్థితి విషమించింది. పని చేయలేని స్థితిలో ఆమెను యజమానులు సంబంధిత కార్యాలయానికి అప్పగించారు. ఆమెను పంపిన ఏజెంట్ను సంప్రదించగా, భారతదేశానికి పంపేందుకు నిరాకరించారు. కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ (కేసీఎం)ను సంప్రదించగా అధికారులు ఏజెంట్తో మాట్లాడి ఆమెను సురక్షితంగా స్వదేశానికి చేర్చారు. అలాగే లక్ష్మి మొదట ఒక ఇంటిలో పనికి చేరినప్పటికీ, పని నచ్చకపోవడంతో తిరిగి ఏజెంట్కు అప్పగించారు. అనంతరం మరో ఇంటిలో కుదిరి బుద్ధి మాంధ్యం ఉన్న బాలుడి బాగోగులు చూడాల్సి వచ్చింది. అక్కడ ఆమెకు పలు ఇబ్బందులు రావడంతో ఆమెను ఏజెంట్కు అప్పగించారు. అతడు రూ.2 లక్షలు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో విషయం తెలుసుకున్న కేసీఎం సభ్యులు ఆమెను సురక్షితంగా ఇంటికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో కడియాల సత్తిబాబు, షేక్ బీబీ సఫియా పాల్గొన్నారు. -
మట్టి మాఫియా
ఫ రాజానగరంలో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు ఫ నియోజకవర్గ వ్యాప్తంగా 13 చెరువులు గుల్ల ఫ మరోవైపు కరుగుతున్న ఎర్ర మట్టి కొండలు ఫ రోజూ వందల లారీలతో అక్రమ రవాణా ఫ రూ.కోట్లు దండుకుంటున్న కూటమి నేతలు సాక్షి, రాజమహేంద్రవరం: రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. చెరువులను చెరబట్టేస్తోంది. ఇష్టానుసారం తవ్వేస్తూ గుల్ల చేసేస్తోంది. విచ్చలవిడిగా గ్రావెల్ తవ్వకాలతో కొండలను కరిగించేస్తోంది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా కూటమిలోని ప్రధాన నేతల కనుసన్నల్లో అడ్డూ అదుపు లేకుండా అక్రమ తవ్వకాలు సాగిస్తూ.. రూ.కోట్లు కొల్లగొడుతోంది. ప్రధానంగా టీడీపీ, జనసేన నేతల నేతృత్వంలో అవినీతి దందా ‘మూడు టిప్పర్లు.. ఆరు లారీలు’ అన్న చందంగా సాగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చెరువులను చెరబట్టి.. ఇటీవల రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కోరుకొండలో మీడియాతో మాట్లాడుతూ, మెరక వేసిన చెరువుల్లో మట్టిని అవసరమైన వారందరూ తవ్వుకోవచ్చని, దీనికి ఎలాంటి అనుమతులూ అవసరం లేదని ప్రకటించారు. ఇదే అదనుగా పూడికల తొలగింపు పేరుతో మట్టి మాఫియా చెరువులను చెరబట్టింది. నియోజకవర్గ వ్యాప్తంగా 13 చెరువుల్లో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. చెరువుల్లో నీటిని తోడేసి మరీ మట్టిని తవ్వేస్తున్నారు. ప్రధానంగా నర్సాపురం, మునగాల, మధురపూడి, కోటి, తుంగపాడు, జి.యర్రంపాలెం, సంపత్నగరం, నామవరం, భూపాలపట్నం, కలవచర్ల, మల్లంపూడి, తూర్పుగానుగూడెం, తోకాడ తదితర గ్రామాల్లోని చెరువుల్లో ప్రతి రోజూ వందలకొద్దీ టిప్పర్లలో మట్టిని తరలించేస్తున్నారు. ఓ ప్రజాప్రతినిధి అనుచరుల కనుసన్నల్లో ఈ దందా జరుగుతూండటంతో వారిని అడ్డుకునేవారే కరువయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరుగుతున్న కొండలు నియోజకవర్గంలోని రాజానగరం, కోరుకొండ, సీతానగరం మండలాల్లో ఎర్రమట్టి కొండలు పుష్కలంగా ఉన్నాయి. మట్టి మాఫియా ధనదాహానికి ఇప్పటికే సింహభాగం కొండలు కరిగిపోయాయి. కొండగుంటూరు, జి.యర్రంపాలెం, తుంగపాడు, కోటికేశవరం, రాఘవపురం, మునగాల, నల్గొండలోని కొండలను విచ్చలవిడిగా తవ్వేసి గ్రావెల్ను అక్రమంగా తరలించేశారు. గోరంత అనుమతి తీసుకుని.. కొండంతా తవ్వేస్తున్నా అడ్డుకునే వారే లేకుండా పోతున్నారు. పోలవరం గట్టును సైతం.. రాజానగరం మండలం కలవచర్లతో పాటు పొరుగునే ఉన్న కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మురారి వద్ద పోలవరం కాలువ గట్లను సైతం మట్టి మాఫియా వదిలిపెట్టడం లేదు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా కాలువకు ఇరువైపులా 30, 40 అడుగుల ఎత్తున ఉన్న గట్లను ఇష్టారాజ్యంగా తవ్వేసి, మట్టి తరలించుకుపోతున్నారు. ప్రభుత్వ పనుల పేరుతో భారీ యంత్రాలు సైతం వినియోగించి, ఆ మట్టిని ప్రైవేటు లే అవుట్లకు తరలించి, సొమ్ము చేసుకుంటున్నారు. మురారి, కలవచర్ల ప్రాంతాల నుంచి నిత్యం వందల లారీల్లో మట్టి అక్రమంగా తరలిస్తున్నారంటే.. దోపిడీ ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. నిత్యం వందలాదిగా మట్టి లారీలు తిరుగుతూండటంతో రోడ్లు దెబ్బ తిని, దుమ్ము, ధూళితో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ దందాపై ఆగ్రహించిన కలవచర్ల గ్రామస్తులు గతంలో అర్ధరాత్రి వేళ లారీలను అడ్డుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ మట్టి అక్రమ తవ్వకాలకు మాత్రం బ్రేక్ పడటం లేదు. అధికారులు దాడులు చేసి ఫైన్లు వేస్తే రెండు రోజులు మిన్నకుంటున్నారు. అనంతరం తిరిగి అక్రమ తవ్వకాలు, రవాణా ప్రారంభింస్తున్నారు. ప్రజాప్రతినిధి అనుచరులు కావడంతో అడ్డుకునేందుకు ఎవరూ సాహసించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాటాల కోసం ముష్టియుద్ధం ఫ మట్టి డబ్బుల్లో వాటాల కోసం కలవచర్లలో టీడీపీ, జనసేన నేతల మధ్య ముష్టియుద్ధం నడిచింది. తమకు కావాలంటే తమకు కావాలంటూ ఇరు పార్టీల నేతలూ వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఫ కోరుకొండ మండలం గాడాలలో అయితే, ‘భూ బకాసురుల నుంచి ఊర చెరువును రక్షించండి’ అంటూ ఏకంగా ఓ ఫ్లెక్సీయే ఏర్పాటు చేశారు. పైగా, ఈ అక్రమ తవ్వకాలతో టీడీపీ, బీజేపీలకు సంబంధం లేదని మరీ ప్రకటించారు. దీనిని బట్టి మట్టి మాఫియా ఏవిధంగా రెచ్చిపోతోందో అర్థం చేసుకోవచ్చు. నెలకు రూ.60 కోట్లకు పైగా దోపిడీ! నల్లరేగడి మట్టి అయితే కడియం, ఆలమూరు, రావులపాలెం ప్రాంతాల్లోని ఇటుక బట్టీలు, భవన నిర్మాణాలు, రియల్ ఎస్టేట్ లే అవుట్లను ఎత్తు చేసేందుకు తరలిస్తున్నారు. ఎర్రమట్టి అయితే కడియం నర్సరీలకు తరలిస్తున్నారు. దూరం, డిమాండ్ను బట్టి మట్టికి ధర నిర్ణయిస్తున్నారు. నల్లరేగడి, ఇసుక నేలల్లోని మట్టిని టిప్పర్కు రూ.10 వేలు, ఎర్ర మట్టి (గ్రావెల్) రూ.20 వేల నుంచి రూ.25 వేల చొప్పున విక్రయిస్తున్నారు. అధికారికంగా రోడ్డు అభివృద్ధి పనులకు సైతం ఎర్ర గ్రావెల్ వాడుతూంటారు. మట్టి మాఫియా దీనిని కూడా అవకాశంగా తీసుకుంటోంది. నియోజకవర్గ వ్యాప్తంగా 13 ప్రాంతాల్లో మట్టి తవ్వకాలు జరుగుతూండగా.. ప్రతి రోజూ 3 వేల లారీలు, టిప్పర్లతో మట్టి, గ్రావెల్ తరలుతోంది. ఇలా రోజుకు రూ.2 కోట్లకు పైగా అక్రమార్కుల జేబుల్లోకి వెళుతున్నట్లు సమాచారం. ఈవిధంగా నెలకు రూ.60 కోట్లకు పైగా కొల్లగొడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇందులో ఎవరి వాటా వారి జేబుల్లోకి చేరుతోందని చెబుతున్నారు. -
కాపవరం శివారులో చోరీ
చోరీ జరిగిన ఇంటిలో వివరాలు సేకరిస్తున్న క్లూస్ టీం ● ఇంట్లోకి చొరబడి 150 గ్రాముల బంగారు ఆభరణాల అపహరణ ● యజమానిని తాళ్లతో మంచానికి బంధించి దురాగతం కోరుకొండ: మండలం కాపవరం శివారు నార్త్జోన్ డీఎస్పీ కార్యాలయం సమీపంలోని ముండ్రు పద్మ ఇంటిలోని 150 గ్రాముల బంగారు ఆభరణాలు గురువారం రాత్రి చోరీకి గురయ్యాయి. సీఐ ఎస్వీవీఎస్ మూర్తి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బాధితురాలు పద్మ గురువారం స్థానిక బ్యాంకులోని తన నగదు ఖాతా నుంచి డబ్బులు తీసుకుని రాజమహేంద్రవరంలో బంగారం కొనుగోలు చేసి ఇంటిలోని బీరువాలో భద్రపరిచారు. రాత్రి వేళ విదేశాల్లో ఉన్న తన పిల్లలతో ఫోన్లో మాట్లాడి నిద్రకు ఉపక్రమించారు. ఆ సమయంలో నలుగురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. ముగ్గురు ఇంటిలోకి రాగా, మరో వ్యక్తి బయట ఉండడాన్ని ఆమె గుర్తించింది. ఇంతలో లోపలికి వచ్చినవారు ఆమెను మంచానికి కట్టేసి నగదు, సొత్తు కోసం బెదిరించడంతో ఆమె బీరువా వైపు చూపింది. దీంతో వారు బీరువాలోని 150 గ్రాముల బంగారు ఆభరణాలను దోచుకున్నారు. అంతటితో ఆగక ఇంట్లో కోడిగుడ్లతో వంట చేసుకుని తిని బంగారు ఆబరణాలతో ఉడాయించారు. క్లూస్ టీమ్, డాగ్స్క్వాడ్తో పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ మూర్తి తెలిపారు. -
నాలుగు పశువులపై పులి పంజా
దేవీపట్నం: నెల రోజులకు పైగా జిల్లా వాసులను వణికిస్తున్న పులి గురువారం రాత్రి దేవీపట్నం మండలంలోకి ప్రవేశించింది. ఇందుకూరు పంచాయతీ కొత్తవీధి గ్రామం వద్ద కట్టి ఉంచిన వీరపాటి కొండబాబుకు చెందిన మూడు లేగ దూడలపై దాడి చేసి చంపేసింది. మరో చూడి ఆవును చంపి, కొంత మేర ఈడ్చుకుపోయి తినేసింది. జీపీఎస్ ట్రాకర్ ద్వారా ఈ పులి కొత్తవీధి సమీపాన ఉన్నట్లు అటవీ సిబ్బంది శుక్రవారం ఉదయం గుర్తించారు. వెంటనే తిరుపతి నుంచి వచ్చిన టీమ్, హనుమ టీమ్, స్థానిక అటవీ సిబ్బంది బృందాలు అక్కడకు చేరుకున్నాయి. ఆ పులికి మత్తు మందు ఇచ్చేందుకు మాటు వేశారు. అయితే, అక్కడి పొదల్లో సేద తీరుతున్న పులి మధ్యాహ్నం 3 గంటలకు సమీపంలోని ఈనుకొండ వైపు మళ్లిపోయింది. దీంతో, పులిని బంధించేందుకు అటవీ సిబ్బంది చేసిన ప్రయత్నం ఫలించలేదు. పులి దాడిలో చనిపోయిన పశువుల యజమానులకు నష్టపరిహారం అందిస్తామని ఇందుకూరు అటవీ రేంజ్ అధికారి కొండలరావు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ పులి శుక్రవారం రాత్రికి తిరిగి రంపచోడవరం మండలంలోకి ప్రవేశించే అవకాశం ఉందని భావిస్తున్నారు. 2న వాటర్ స్పోర్ట్స్ జిల్లా స్థాయి ఎంపికలు నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యాన వచ్చే నెల 2న రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) లీగ్ వాటర్స్పోర్ట్స్లో జిల్లా స్థాయి ఎంపికలు జరగనున్నాయి. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్డీఓ) వి.సతీష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. సబ్ జూనియర్స్ అండర్–15, జూనియర్స్ అండర్–18 విభాగాల్లో కెనాయింగ్, క్యాకింగ్, రోయింగ్, డ్రాగన్ బోట్లలో ఎంపికలుంటాయని వివరించారు. స్థానిక వివేకానంద పార్కు ఆవరణలో ఆ రోజు ఉదయం 8 గంటలకు ఎంపికలు ప్రారంభమవుతాయన్నారు. ఆసక్తి ఉన్న వారు సొంత క్రీడా పరికరాలతో హాజరు కావాలన్నారు. క్రీడా యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకుని, జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుతో హాజరు కావాలని సూచించారు. శిల్పారామంలో స్టాల్స్కు దరఖాస్తుల ఆహ్వానం కాకినాడ రూరల్: బీచ్ రోడ్డులోని శిల్పారామంలో ఖాళీగా ఉన్న స్టాల్స్ను సంప్రదాయ హస్తకళలు, చేనేత వస్త్ర వ్యాపారానికి కేటాయించేందుకు ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పరిపాలనాధికారి మోహన్తేజ శుక్రవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. స్థానిక హస్తకళలను ప్రోత్సహించడంలో భాగంగానే వీటిని కేటాయిస్తున్నామన్నారు. ఆట వస్తువులతో పాటు ఎగ్జిబిషన్ ఏర్పాటుకు ఆసక్తి ఉన్న వారు ఏప్రిల్ 6వ తేదీలోగా శిల్పారామం కార్యాలయంలో నేరుగా సంప్రదించాలని కోరారు, బ్లాక్స్పాట్లలో భద్రతా చర్యలు ఆలమూరు: జాతీయ రహదారి–216ఏపై రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్టు కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్రావు, హైవే ప్రాజెక్టు డైరెక్టర్ బి.కృష్ణమూర్తి తెలిపారు. కోనసీమ జిల్లా పరిధిలోని 216ఏ జాతీయ రహదారిపై రావులపాలెం – ఆలమూరు మండలం పొట్టిలంక వరకూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్, ఆలమూరు ఎస్సై జి.నరేష్తో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ రహదారిలోని జొన్నాడ వద్ద కోటిపల్లికి వెళ్లే ఏటిగట్టు రోడ్డు, ఆంజనేయస్వామి గుడి, మూలస్థాన అగ్రహారం సెంటర్, చొప్పెల్ల లాకులు, చెముడులంక, మడికి గ్రామాల్లో ఆరు ప్రమాదకర ప్రదేశాలు (బ్లాక్ స్పాట్లు) ఉన్నట్లు గుర్తించారు. ఆయా ప్రదేశాల్లో ప్రమాదాలకు కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. వాటి నివారణకు తీసుకోవలసిన చర్యలపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించారు.జొన్నాడ – కోటిపల్లి ఏటిగట్టు జంక్షన్ వద్ద బ్లాక్స్పాట్ను పరిశీలిస్తున్న అధికారులు -
605 కిలోల జంతు కొవ్వు పట్టివేత
రౌతులపూడి: మండలంలోని కత్తిపూడి–కొట్టాం ఆర్ అండ్ బీ రహదారిలో అక్రమంగా తరలిస్తున్న జంతు కొవ్వును శుక్రవారం రౌతులపూడి శివారున పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గొల్లప్రోలు మండలం చెందుర్తి నుంచి పాసింజర్ ఆటోలో కోటనందూరు మండలం కేఏ మల్లవరానికి తరలిస్తుండగా ముందుగా అందిన సమాచారం మేరకు పోలీసులు నిఘా పెట్టి పట్టుకున్నారు. పట్టుబడ్డ ఆటోను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆటోల 27 డబ్బాలలో పదిహేను కిలోల చొప్పున 405 కిలోలు, 200 కిలోల డ్రమ్ములో 200 కిలోలు మొత్తం 605 కిలోలు జంతు కొవ్వును గుర్తించామన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి కేసు నమోదు చేస్తామని ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు. జీడిమామిడి తోట దగ్ధం రూ.లక్షల్లో ఆస్తి నష్టం రాజవొమ్మంగి: మండలంలోని నెల్లిమెట్ల గ్రామ శివారున జీడి మామిడి తోటలో శుక్రవారం మంటలు ఎగసి తోట మొత్తం కాలిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. పూత పిందె దశలో వున్న తోట కాలిపోవడంతో తీవ్రమైన ఆస్తి నష్టం వాటిల్లిందని గ్రామస్తులు అన్నారు. ఆస్తి నష్టం రూ.లక్షల్లో ఉంటుందన్నారు. కాగా తన భార్యకు అనారోగ్యం వల్ల రెండేళ్లుగా చికిత్స కోసం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నానని, తనకున్న ఏకై క ఆధారం కాలిపోవడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని తోట యజమాని ఈక చిననాగరాజు వాపోయాడు. కాగా అగ్ని ప్రమాదానికి కారణం తెలియలేదు. 15 ప్రైవేటు బస్సులపై కేసులు రూ.74,800 అపరాధ రుసుము వసూలు రావులపాలెం: నిబంధనలు పాటించని బస్సులను సీజ్ చేసి ఫిట్నెస్ రద్దు చేస్తామని జిల్లా రవాణాధికారి డి.శ్రీనివాసరావు అన్నారు. ఈతకోట టోల్ ప్లాజా వద్ద శుక్రవారం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి 15 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. వారి నుంచి రూ.74,800 అపరాధ రుసుము విధించినట్టు డీటీఓ తెలిపారు. -
భక్తులకు మెరుగైన వసతులే లక్ష్యం
● దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ● అన్నవరంలో అభివృద్ధి పనుల పరిశీలన ● మెట్లమార్గంలో షెల్టర్లు, వ్యాపార స్థలాల అతిక్రమణపై సిబ్బందికి సూచనలు, ఆదేశాలు అన్నవరం: రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాలు సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ, కాణిపాకం, శ్రీశైలం, శ్రీకాళహస్తికి వచ్చే భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై చర్యలు తీసుకుంటున్నట్టు దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ తెలిపారు. మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రసాదాల నాణ్యత పెంచడం, సులభంగా దర్శనం, ఏ స్థాయిలోనూ భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వివరించారు. శుక్రవారం ఆలయంలో సాగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఇటీవల నిర్వహించిన సర్వేల ప్రకారం తక్కువ ర్యాంకులు వచ్చిన ఆలయాలలో సైతం భక్తుల సంతృప్తి శాతం సరాసరిన 70 శాతం ఉందని, దీనిని 80 శాతానికి పెంచాలని కృషి చేస్తున్నామని తెలిపారు. అన్నవరం దేవస్థానం సాధించిన మొదటి ర్యాంకును నిలబెట్టుకునేలా మౌలిక వసతులు కల్పించాలని ఈఓ త్రినాథరావును ఆదేశించారు. శుభ్రత అవసరం దేవస్థానంలోని సత్రాలు, పరిసరాల వద్ద శుభ్రత పాటించాలని, సత్రాల చుట్టూ సీసీ టీవీ కెమేరాలు ఏర్పాటు చేసి నిరంతరం పరిశీలించాలని ఆదేశించారు. సత్యగిరిపై హరిహరసదన్ చుట్టూ తిరిగి పలు సూచనలిచ్చారు. మన మిత్ర, కియోస్క్ల ద్వారా సేవలు దేవస్థానాలకు వచ్చే భక్తులు క్యూలైన్లలో నిలబడి అవస్థలు పడకుండా ఆన్లైన్ ద్వారా సేవలు అందిస్తున్నామని, ఇందు కోసం మన మిత్ర వాట్సాప్ యాప్ తీసుకువచ్చామని దీని ద్వారా దర్శనం, వ్రతం, ప్రసాదం, ఇతర సేవలు పొందవచ్చునని తెలిపారు. అలాగే కియోస్క్ల ద్వారా కూడా భక్తులు టిక్కెట్లు పొందవచ్చని తెలిపారు. ప్రముఖ దేవస్థానాల్లో సైతం వంద కియోస్కులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రెండో మెట్లదారిపై సంతృప్తి దేవస్థానం టోల్గేట్ నుంచి ఆలయం వరకు నిర్మించిన రెండో మెట్లదారిని కమిషనర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మెట్లదారికి ఇరువైపులా రెయిలింగ్ వేయాలని, వర్షాలకు, ఎండల నుంచి రక్షణకు షెల్టర్లు నిర్మించాలని ఆదేశించారు. త్వరలో మెట్ల దారి ప్రారంభోత్సవంతో పాటు, సీతారామ సత్రానికి శంకుస్థాపన చేసేందుకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని ఆహ్వానించనున్నట్టు తెలిపారు. దేవాలయాలలో ప్రసాదం, అన్నదానం తయారీకి తగినన్ని గ్యాస్ సిలిండర్లు ఉన్నాయని కమిషనర్ తెలిపారు. ముందు జాగ్రత్తగా గ్యాస్ ఏజెన్సీల నుంచి దేవస్థానాలకు పైప్ లైన్ల ద్వారా గ్యాస్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అలాగే ప్రైవేటు వ్యాపారులు వారి స్థలాన్ని అతిక్రమించి వ్యాపారాలు చేసుకోవడంపై సంబంధిత సెక్షన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి వాటిని నోటీసులు ఇచ్చి తొలగించాలని, లేని పక్షంలో రూ.50 వేల జరిమానా విధించాలని ఈవోను ఆదేశించారు. ఆలయ చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావు, అసిస్టెంట్ కమిషనర్ మంజులా దేవి, ఈఈలు నూకరత్నం, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కమనీయం.. రామయ్య కల్యాణం
పెదపూడి: వేద పండితుల సుస్వర మంత్రోచ్చారణలు.. మార్మోగుతున్న మంగళవాయిద్యాల ఘోష.. భక్తుల శ్రీజై శ్రీరామ్శ్రీ నినాదాల నడుమ.. పంచభూతాలు సాక్షిగా.. ఆకాశమంత పందిరిలో.. భూదేవంత పీటపై.. కోదండ రాముని కల్యాణం కమనీయంగా, కన్నుల పండువగా జరిగింది. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో శుక్రవారం జరిగిన కోదండ రాముని కల్యాణోత్సవాన్ని.. వేలాదిగా వచ్చిన భక్తులు కన్నులారా తిలకించి పులకించిపోయారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయ సమీపంలోని కోనేటికి చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించారు. స్వామివారి దర్శనానికి బారులు తీరారు. ఉదయం ఆరు గంటల నుంచే భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. వెల్లువలా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. వేడుక నిర్వహణ ఇలా.. ఉదయం 11.30 గంటలకు స్వామి, అమ్మవార్లను కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. మధ్యాహ్నం 12.30 గంటలకు పండితులు కల్యాణ సంకల్పం ప్రారంభించారు. మధ్యాహ్నం 12.45 గంటలకు విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం చేశారు. సంప్రోక్షణ అనంతరం మధ్యాహ్నం 1.25 గంటలకు స్వామి, అమ్మవార్ల కరకమలాలకు రక్షబంధనం గావించారు. యజ్ఞోపవీత ధారణ అనంతరం, వధూవరులను సుగంధభరిత పుష్పమాలికలతో అలంకరించారు. మిథిలాధిపతి జనక మహారాజు తరఫున అర్చక స్వామివారు మధ్యాహ్నం 2.05 గంటలకు సీతమ్మ తల్లిని శ్రీరామచంద్రునికి ఇచ్చి కన్యాదానం చేశారు. మధ్యాహ్నం 2.20 గంటల సుముహూర్తంలో కల్యాణమూర్తుల శిరస్సులపై అర్చకులు జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని ఉంచారు. స్వామి, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, హారతి ఇచ్చారు. వరుడు కోదండ రాముని తరఫున అర్చకుడు మధ్యాహ్నం 2.45 గంటలకు సీతమ్మవారికి మాంగల్యసూత్రధారణ గావించారు. అనంతరం ముత్యాల తలంబ్రాలు పోసి, కల్యాణ క్రతువును మంగళప్రదంగా పూర్తి చేశారు. తలంబ్రాలు, పట్టువస్త్రాలు అంతకు ముందు వధూవరులైన సీతారాములకు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మి దంపతులు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. వైఎస్సార్ సీపీ అనపర్తి నియోజకవర్గం కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు కూడా నూతన వస్త్రాలు సమర్పించి, స్వామి వారిని దర్శించుకున్నారు. అమ్మిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ద్వారంపూడి వెంకటరెడ్డి, పలువురు భక్తులు సైతం స్వామివారికి తలంబ్రాలుగా మంచి ముత్యాలు సమర్పించారు. ఉదయం 11.45 గంటలకు ఆలయ ధర్మకర్త ఇంటి నుంచి మంచి ముత్యాలు, తలంబ్రాలు, తొమ్మిది రకాల పండ్లు, పుష్పాలు, పట్టు వస్త్రాలను పల్లకీలో ఊరేగింపుగా వేదిక వద్దకు తీసుకొచ్చారు. జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు, భువన దంపతులు కూడా స్వామివారిని దర్శించుకుని, కల్యాణోత్సవాన్ని తిలకించారు. కోదండ రాముని కల్యాణోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగానే పిల్లల వేలంపాట తంతు ఆనవాయితీగా జరిగింది. కల్యాణోత్సవానికి వచ్చిన భక్తులకు ఆలయ అధికారులు ముత్యాల తలంబ్రాలు, అక్షతలు పంపిణీ చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్థానిక ఎస్సై ఎస్.తులసీరామ్తో పాటు ముగ్గురు సీఐలు, ఎనిమిది మంది ఎస్సైల పర్యవేక్షణలో 106 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఫ వైభవంగా కోదండ రాముని పరిణయ వేడుక ఫ గొల్లల మామిడాడకు వెల్లువెత్తిన భక్తజనం -
కోటసత్తెమ్మ తల్లి హుండీ ఆదాయం రూ.15.52 లక్షలు
నిడదవోలు రూరల్: తిమ్మరాజుపాలెంలో కోటసత్తెమ్మ అమ్మవారి హుండీల ఆదాయాన్ని మొత్తం 56 రోజులకు సంబంధించి గురువారం లెక్కించారు. ఆలయ హుండీలో రూ.15,17,638, అన్నదాన ట్రస్ట్ హుండీలో రూ.34,452 కలిపి మొత్తం రూ.15,52,090 నగదు, 18.2 గ్రాముల బంగారం, 26 గ్రాముల వెండి, మూడు విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయి. దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈఓ వి.హరిసూర్యప్రకాష్ ఈ వివరాలు తెలిపారు. తాడేపల్లిగూడెం తనిఖీదారు బీఎల్ నరసింహరావు పర్యవేక్షణలో లెక్కింపు జరిగింది. కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్, చైర్మన్ దేవులపల్లి రవిశంకర్, ప్రధానార్చకుడు అప్పారావుశర్మ తదితరులు పాల్గొన్నారు. రూట్ మార్చిన టైగర్ గంగవరం: వారం రోజులుగా గంగవరం మండలంలో సంచరించిన పులి బుధవారం రాత్రి రంప చోడవరం మండలం ఫోక్స్పేట ఫారెస్టు రేంజ్ లోని ఊట్ల, ఎర్రంపాలెం అటవీ ప్రాంతానికి చేరు కుంది. డివిజనల్ అటవీ అధికారి శివకుమార్ గంగల్ ఆధ్వర్యాన ఫోక్స్పేట అటవీ ప్రాంతంలో గురువారం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. -
రాములోరి పెళ్లి.. రాతిరేళే మళ్లీ!
పిఠాపురం: ప్రపంచమంతా శ్రీరామనవమికి శ్రీసీతారాముల కల్యాణం పగటి పూట నిర్వహిస్తుంటారు. కాని గొల్లప్రోలు మండలం చేబ్రోలులో మాత్రం చీకటి పడ్డాకే శ్రీరాముని కల్యాణం జరుగుతుంది. ఇది అనాదిగా వస్తున్న ఆచారంగా స్థానికులు చెబుతున్నారు. చేబ్రోలు శ్రీ సీతారామస్వామి వారి దేవాలయం ప్రాచీనమైనది. 1800వ సంవత్సరంలో ఈ దేవాలయం నిర్మించారు. అప్పట్లో పిఠాపురం రాజావారి అధీనంలో ఉన్న దేవాలయాల్లో ఇదొకటి. ఈ దేవాలయాన్ని దామర సీతాదేవి జ్ఞాపకార్థం పిఠాపురం మహారాజా రావు కుమార మహిపతి గంగాధర రామారావు బహదూర్ నిర్మించారు. ఇక్కడ మూలవిరాట్ భద్రాచలం రామచంద్రస్వామిని పోలి ఉండడం విశేషం. పూర్వం పిఠాపురం మహారాజా వారు తమ ఆస్థానంలో ఉన్న అన్ని రామాలయాల్లో శ్రీరాముడి కల్యాణాలు తన చేతుల మీదుగా జరిపించేవారు. దానిలో భాగంగా రాజావారు పిఠాపురంలో ఉన్న దేవాలయాలను సందర్శించి చివరిగా గొల్లప్రోలు ఆలయాలను సందర్శిస్తూ చేబ్రోలు చేరుకొనే సమయానికి చీకటి పడేది. రాజా వారు వచ్చిన తర్వాతనే కల్యాణం జరిపించడం వల్ల చివరకు రాత్రి సమయంలో స్వామి వారి కల్యాణం జరుగుతుండేది. దీంతో ఇది ఆచారంగా మారిపోయింది. రాజుల కాలం పోయినప్పటికి అప్పటి ఆచారాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. రాత్రి 10 గంటల తరువాతే పెళ్లి తంతు ప్రారంభమవుతుంది. కల్యాణం పూర్తయ్యే సరికి అర్ధరాత్రి దాటుతుంది. అలా శ్రీరామనవమి నాడు కల్యాణం ప్రారంభమై (అర్ధరాత్రి 12 గంటలు దాటాక) మరునాడు పూర్తవుతుంది. గ్రామస్తుల సహాయ సహకారాలతో పాంచరాత్ర ఆగమం ప్రకారం ఈ కల్యాణ ఉత్సవాలు చేస్తుంటారు. ఇదే చేబ్రోలు గ్రామంలో వీధుల్లో ఉన్న పలు రామాలయాల్లో సైతం సీతారాముల కల్యాణం పగటి పూటే నిర్వహించినప్పటికి ప్రధానాలయంగా ఉన్న సీతారామస్వామి ఆలయంలోనే రాత్రి నిర్వహించడం విశేషం. ఈ ఏడాది శుక్రవారం అర్ధరాత్రి సీతారాముల కల్యాణం వేద ఘోష నడుమ వేలాదిగా తరలి వచ్చే భక్త జన సందోహం తిలకిస్తుండగా వేద పండితులు కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది. రాముడి గుడిలో ఆచారం గంట కొట్టడం చేబ్రోలు శ్రీసీతారామాలయంలో అనాదిగా ఒక ఆచారం అమలవుతోంది. ఆలయంలో ఉత్సవాల వేళ ప్రతీ రోజు స్వామి వారికి వాహన సేవ నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా వాహనాన్ని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించే సమయంలో ముందు జేగంట మోగిస్తుంటారు. దీనిని గ్రామంలో ఒక కుటుంబం అనాదిగా నిర్వహిస్తోంది. పూర్వం యుద్ధాలు చేసే సమయంలో సైన్యానికి ముందు జేగంట మోగించడం ఆచారం కాగా ఉత్సవాలలో స్వామివారి వాహనాలకు ముందు జేగంట మోగిస్తూ వెళ్లడం ఆచారంగా వస్తోంది. ఇప్పటికీ ఆలయాల్లో స్వామివారికి నైవేద్యం వేళ అర్చకులు జేగంట మోగిస్తుంటారు. చేబ్రోలులో అర్ధరాత్రి రాముల వారి కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు (ఫైల్) చేబ్రోలులో శ్రీసీతారాములవారి ఆలయం ఆచారాలకు ప్రాధాన్యం చేబ్రోలు రామాలయంలో ఎక్కడా లేని విధంగా ఆచారాలు ఉంటాయి. వాటికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. గ్రామస్తులంతా కలిసికట్టుగా ఉత్సవాల్లో పాల్గొని ఆచారాలను పాటించి ఉత్సవాలను విజయవంతం చేస్తుంటారు. – కె సాత్వికాచార్యులు, ఆలయ అర్చకులు, శ్రీ సీతారామ స్వామి ఆలయం, చేబ్రోలువీధికో వాహన సేవ సాధారణంగా ఏ దేవుడి వాహన సేవలైనా గ్రామమంతా తిరుగుతారు. రోజుకో వాహన సేవ జరిగినా గ్రామమంతా తిప్పుతారు. చేబ్రోలులో మాత్రం ఆచారం విభిన్నంగా ఉంటుంది. వాహనాల ఊరేగింపు ఒక్కో వాహనం ఒక్కో వీధికి మాత్రమే వెళ్లడం ఆచారంగా వస్తోంది. ఈ ఆలయంలో వసంతోత్సవం, తెప్పోత్సవం, ఉట్టికొట్టడం వంటి తంతులు నిర్వహిస్తారు. గ్రామంలో ఒక్కో కుటుంబం ఒక్కో తంతు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఆయాఽ వీధుల్లో ఉన్న వివిధ వర్గాల వారు ఆయా సేవల్లో పాల్గొని స్వామి వారి వాహనానికి స్వాగతం పలికి పూజలు నిర్వహిస్తారు. అందరికీ దర్శన భాగ్యం కలిగించే విధంగా ఈ ఆచారం ఏర్పాటు చేసినట్లు పెద్దలు చెబుతున్నారు. మొదటిరోజు శేష వాహనం, రెండో రోజు హనుమంత వాహనం, మూడవరోజు గజవాహనము, నాలుగవ రోజు పొన్నవాహనము, ఐదవ రోజు రథోత్సవం వైభవంగా జరుగుతాయి. అనంతరం శ్రీ పుష్పయాగంతో ఈ కల్యాణోత్సవాలు ముగుస్తాయి. అక్కడ ప్రతి ఏడాదీ చీకటి పడ్డాకే శ్రీరాముని కల్యాణం చేబ్రోలు సీతారామస్వామి గుడిలో విభిన్న సంప్రదాయం శ్రీరామనవమి సందర్భంగా నేటి రాత్రి కమనీయ దృశ్యం -
గోపాలపురంలో పొగాకు కొనుగోళ్లు ప్రారంభం
దేవరపల్లి: గోపాలపురం వేలం కేంద్రంలో పొగాకు కొనుగోళ్లు ఎట్టకేలకు గురువారం ప్రారంభమయ్యాయి. రైతులతో బోర్డు అధికారులు చర్చించిన అనంతరం వేలం నిర్వహణాధికారి శ్రీహరి కొనుగోళ్లు ప్రారంభించారు. వేలానికి 27 బేళ్లు రాగా ట్రేడర్లు కిలో రూ.265 చొప్పున కొనుగోలు చేశారు. పొగాకు బోర్డు రాజమహేంద్రవరం రీజియన్లోని ఐదు వేలం కేంద్రాలకు గాను జంగారెడ్డిగూడెం–1, 2, కొయ్యలగూడెం, దేవరపల్లిల్లో కొనుగోళ్లు బుధవారం ప్రారంభం కాగా, గోపాలపురంలో రైతులు నిలుపు చేశారు. గత ఏడాది కిలో ప్రారంభ ధర రూ.290 ఉండగా, ఈ ఏడాది రూ.265 ఇవ్వడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏటా ప్రారంభ ధర కిలోకు రూ.50 పెంచి కొంటున్నారని, ఈ ఏడాది రూ.25 తగ్గించడమేమిటని అధికారులను, ట్రేడర్లను నిలదీసి, నిరసన తెలిపారు. రైతులతో బోర్డు ఛైర్మన్ యశ్వంత్ కుమార్, అధికారులు చర్చించినప్పటికి ప్రయోజనం లేకపోయింది. దీంతో, అధికారులు వేలం నిలిపివేసి వెళ్లిపోయారు. గిట్టుబాటు ధర ఇచ్చే వరకూ కొనుగోళ్లు జరగనివ్వబోమని రైతులు స్పష్టం చేశారు. దీంతో, బోర్డు అధికారులు గురువారం మరో దఫా రైతులతో సమావేశం నిర్వహించారు. నాలుగు వేలం కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభం కాగా, గోపాలపురంలో నిలుపు చేయడం మంచిది కాదని చెప్పారు. గుంటూరులోని బోర్డు ప్రధాన కార్యాలయంలో ట్రేడర్లు, రైతు సంఘాల ప్రతినిధులు, అధికారులతో రెండు రోజుల్లో సమావేశం జరుగుతుందని, ఆ సందర్భంగా ధరపై నిర్ణయం తీసుకుంటారని అధికారులు వివరించారు. చివరకు రైతుల అంగీకారం మేరకు కొనుగోళ్లు ప్రారంభించారు. కిలో ప్రారంభ ధర రూ.300, సగటు ధర రూ.350 ఉంటేనే ఈ ఏడాది పంట గిట్టుబాటు అవుతుందని రైతులు స్పష్టం చేశారు. వేలంలో పొగాకు బోర్డు రీజినల్ మేనేజర్ జె.సురేంద్ర కుమార్, రైతు సంఘం అధ్యక్షుడు యిల్లూరి రాంబాబు, బోర్డు మాజీ వైస్ చైర్మన్ గద్దే శేషగిరారావు, రైతు పిన్నమనేని మధుమోహన్, నాలుగు కంపెనీల ప్రతినిధులు, ఇతర రైతులు పాల్గొన్నారు. దేవరపల్లి వేలం కేంద్రంలో రెండో రోజైన బుధవారం 10 బేళ్లు కొనుగోలు చేశారు. చెరుకుమిల్లి గ్రామం నుంచి బేళ్లు వేలానికి రాగా, వేలం నిర్వహణాధికారి పి.హేమస్మిత వేలం నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నుంచి అనిల్ కుమార్ సస్పెన్షన్పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాలు దేవరపల్లి: గోపాలపురం నియోజకవర్గం ద్వారకా తిరుమల మండలం సీహెచ్ పోతేపల్లికి చెందిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోలంపల్లి అనిల్ కుమార్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ సిఫారసు మేరకు అధినేత జగన్మోహన్రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. -
త్రుటిలో తప్పిన ప్రమాదం
ఆరుగురికి గాయాలు ఏలేశ్వరం: మండల పరిఽధిలోని యర్రవరం వద్ద జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం త్రుటిలో తప్పగా ఆరుగురికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం యర్రవరం వద్ద జాతీయ రహదారిపై పేరవరం జంక్షన్లో రహదారిపై ప్రయాణికులను దింపేందుకు ఆటో సడన్గా ఆపగా.. వెనుక రాజమహేంద్రవరం నుంచి తుని వైపు వస్తున్న ట్రాలీ డ్రైవర్ స్లో చేశాడు. దాని వెనుక వస్తున్న ఆర్టీసీ బస్సు ట్రాలీని ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఆరుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇర్రిపాకకు చెందిన పళ్లరాణి, కిర్లంపూడికి చెందిన సరకనం పార్వతి, కోటనందూరుకు చెందిన గార్ల మానస, బి.సోమరాజు డి పోలవరానికి చెందిన ఎం.తాతారావు, ఎం చంద్రమ్మ ఉన్నారు. ఘటనా స్థలాన్ని ీసీఐ సూర్యఅప్పారావు, ఎస్సై రామలింగేశ్వరరావు పరిశీలించి క్షతగాత్రులను 108లో ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఆర్టీసీ బస్సు ముందు భాగం దెబ్బతింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు గంగవరం: సూరంపాలెం రిజర్వాయర్లో బోటు మునిగి గల్లంతైయినట్టు భావిస్తున్న గుర్తు తెలియని వ్యక్తి కోసం రెవెన్యూ, పోలీసు సిబ్బంది విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం అడ్డతీగల సీఐ నరసింహమూర్తి, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎస్సై వెంకయ్య, ఆర్ఐ లక్ష్మణ రావు, సర్పంచ్ బల్లెం శివదొర సూరంపాలెం రిజర్వాయర్ ప్రాంతాన్ని పరిశీలించారు. స్థానిక ఈతగాళ్లతో గాలింపు చర్యలను చేపట్టినా ఫలితం ఆచూకీ దొరకలేదు. ప్రాజెక్ట్ లోతు ఎక్కువగా ఉండడంతో గాలింపు కష్టమైందని తహసీల్దార్ శ్రీనివాసరావు తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపాలని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామన్నారు. దీంతో కాకినాడ నుంచి బృందం బయలుదేరిందని, రాగానే శుక్రవారం ఉదయం రిజర్వాయర్లో గాలింపు చేపడతామన్నారు. గ ల్లంతు అయిన వ్యక్తిది నెల్లిపూడిగా భావిస్తున్నా రు. అడ్డతీగల సీఐ నరసింహమూర్తి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. ఆర్పీ రోడ్డులో బోల్తా కొట్టిన కారు ముగ్గురికి తీవ్ర గాయాలు పి.గన్నవరం: రాజవరం–పొదలాడ రోడ్డులో పి.గన్నవరం శివారు తాటికాయలవారిపాలెం వద్ద గురువారం రాజమహేంద్రవరం వెళ్తున్న ఒక కారు అదుపుతప్పి కొబ్బరి తోటలోకి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకరగుప్తం గ్రామానికి చెందిన భార్యాభర్తలు సుష్మ, అజుల్తో పాటు సుష్మ అక్క అలేష్ రాజమహేంద్రవరం ఎయిర్పోర్టుకి కారులో వెళుతున్నారు. తాటికాయలవారిపాలెం కనకదుర్గమ్మ గుడి సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి పక్కనే ఉన్న కొబ్బరి తోటలోకి పల్టీ కొట్టింది. అనంతరం ఒక బిల్డింగ్ గోడను ఢీకొని కారు ఆగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని కారు నుంచి బయటకు తీసి 108 అంబులెన్స్లో పి.గన్నవరంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రాథమిక వైద్యం అనంతరం వారిని రాజమహేంద్రరంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో కారు ధ్వంసం అయింది. సుష్మ, అజుల్కు ఇటీవల వివాహం జరిగింది. వారిద్దరూ రాజమహేంద్రవరం ఎయిర్పోర్టులో ఉద్యోగులు. ఇంటి నుంచి డ్యూటీకి వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. -
పచ్చనాకుల సాక్షిగా చీట్లపేక!
సాక్షి టాస్క్ఫోర్స్: యథారాజా తథాప్రజా అన్నట్లుగా ఉంది కడియం మండలంలో పరిస్థితి. మండలంలో పేరెన్నిక గల కొందరు నాయకులు చతుర్ముఖ పారాయణలో దిట్టలు. తమకున్న ఈ నైపుణ్యాన్నే ప్రజలందరూ కూడా అలవర్చుకోవాలన్న తలంపుతో పనిచేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీలతో ప్రమేయం లేకుండా పేకాటరాయుళ్లను మండల ముఖ్య నాయకుల కార్యాలయంలోనే ఏకం చేసినట్లుగా చెబుతున్నారు. పేకాటల నిర్వహణలో వచ్చే లాభాల్లో నుంచి 50, 20, 20, 10 పర్సంటేజీల వంతున పంచుకునేందుకు ‘పెద్ద’ మనుషుల ఒప్పందాలు కూడా జరిగాయంటున్నారు. ఇందులో భాగంగా రెండు రోజులుగా మాధవరాయుడుపాలెం సమీపంలోని నర్సరీల్లో పేకాట శిబిరాలను యథేచ్ఛగా నిర్వహిస్తున్నట్లుగా చెబుతున్నారు. రోజుకు రూ.మూడు లక్షల వరకు లాభాలు కూడా వచ్చాయంటూ కడియం మండలంలో విస్తృత ప్రచారం జరుగుతోంది. నిర్వాహకులతో పాటు కొందరు ముఖ్య నాయకులకు కూడా ఈ లాభాల నుంచి పర్సంటేజీలు అందుతున్నాయంటున్నారు. కోడిపందేలు కూడా.. పేకాట రాయుళ్లను తీసుకు వచ్చే బాధ్యత, శిబిరం నిర్వహణ, అక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేయడం, వచ్చిన వాళ్ల భద్రతా ఏర్పాట్లు వంటి విధులను కూడా పంచుకుని నిర్భీతిగా పేకాట శిబిరాలను జరిపిస్తున్నారంటున్నారు. వీటికి తోటు అదనంగా కోడిపందేలను కూడా నిర్వహిస్తున్నట్లుగా చెబుతున్నారు. నిమిషాల్లో బతుకులు తలకిందులు ప్రస్తుతం శిబిరాల్లో నిర్వహిస్తున్న పేకాటల కారణంగా కొన్ని నిముషాల వ్యవధిలోనే లక్షల రూపాయలను పోగొట్టుకుని బతుకులను తలకిందులు చేసుకుంటున్నారని మండలంలోని ప్రజలు చెబుతున్నారు. రుమాళ్ల ఆట, లోన/బైట.. అంటూ సరికొత్త పేర్లతో సాగుతున్న ఈ ఆటల్లో క్షణాల వ్యవధిలోనే లక్షల రూపాయలు చేతులు మారుతాయంటున్నారు. ఆడేవారికి ముందుగా డబ్బు వచ్చేలా మాయ చేస్తుండడంలో కొందరు ఈ మాయలో పడి ఈ శిబిరాల వద్దకు వెళ్లి చేతులు కాల్చుకుంటున్నారంటున్నారు. పేకాటలు, కోడిపందేల నిర్వహణలో రాటుదేలిన మండల కేంద్రానికి చెందిన ఒక వ్యక్తి ఈ శిబిరం నిర్వహణలో కీలకమని చెబుతున్నారు. శిబిరం నిర్వహణకు సిండికేట్ అయిన పెట్టుబడిదారులు రాజకీయాలకు అతీతంగా జట్టు కట్టడంపై ప్రజలు విస్తుబోతున్నారు. నర్సరీల్లో యథేచ్ఛగా పేకాట శిబిరాలు నీకింత.. నా కింత అంటూ వాటాల పంపకాలు పార్టీలకతీతంగా ఏకమైన నాయకులు విస్తుబోతున్న ప్రజలు -
శ్రీరామ వైభవం
శుక్రవారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2026● నేడు కోదండ రాముని కల్యాణ వేడుక ● ముస్తాబైన జి.మామిడాడ ● పూర్తయిన ఏర్పాట్లు పెదపూడి: మరో భద్రాద్రిగా పేరొందిన సుప్రసిద్ధ దివ్య క్షేత్రం జి.మామిడాడ కల్యాణోత్సవ శోభను సంతరించుకుంది. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా.. ఇక్కడ కొలువుదీరిన కోదండ రాముని కల్యాణోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. సీతారాముల కల్యాణ క్రతువును కన్నులారా తిలకించి, తరించేందుకు వేలాదిగా భక్తులు తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో దీనికి అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో కొలువుదీరిన కోదండ రాముని కల్యాణోత్సవాలు ఏటా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయానికి దీటుగా జి.మామిడాడలోని ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయానికి తూర్పు, పశ్చి మ దిశల్లో ఆకాశాన్ని అంటుతున్నాయా అన్నట్టుగా అత్యంత ఎత్తున నిర్మించిన గోపురాలు భక్తులను ఎంతో ఆకట్టుకుంటాయి. వీటిపై భాగవత, రామాయణాల్లోని అపురూప ఘట్టాలను ప్రతిబింబించేలా రకరకాల శిల్పాలను ఎంతో మనోహరంగా తీర్చిదిద్దారు. తూర్పు గోపురం దాదాపు 160 నుంచి 170 అడుగులు, పశ్చిమ గోపురం సుమారు 200 అడుగుల ఎత్తున అనేక అంతస్తుల్లో నిర్మించారు. గోపురం చివరి అంతస్తు నుంచి చూస్తే దాదాపు 25 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలు, పచ్చని పొలాలు కనువిందు చేస్తాయి. ఉత్సవం నిర్వహిస్తారిలా.. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా స్వామి వారిని తెల్లవారుజామున 3.30 గంటలకు మేల్కొల్పుతారు. ప్రాతఃకాల అర్చనానంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. ఉదయం సుమారు 11.30 గంటలకు స్వామి వారి కల్యాణోత్సవం ప్రారంభమవుతుంది. జానకి రాముల పరిణయానంతరం స్వామి వారి ఊరేగింపు ఘనంగా నిర్వహిస్తారు. రామ నామ తలంబ్రాలు సీతారాముల కల్యాణోత్సవంలో ప్రధాన వేడుక తలంబ్రాలు. దీనికి మంచి ముత్యాలను సిద్ధం చేశారు. అలాగే, జి.మామిడాడ గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు, ఫిజికల్ డైరెక్టర్ ద్వారంపూడి యువరాజారెడ్డి 16వ పర్యాయం శ్రీరామ నామ లిఖిత తలంబ్రాలను, కల్యాణ కొబ్బరి బొండాలను సిద్ధం చేశారు. 1,01,001 బియ్యపు గింజలపై ఎటువంటి సూక్ష్మ పరికరాలూ లేకుండా మార్కర్ సాయంతో తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో రామ నామాన్ని లిఖించి ఈ తలంబ్రాలను సిద్ధం చేశారు. అలాగే, రాములోరి కల్యాణంలో వినియోగించే కొబ్బరి బొండాలను కుటుంబ సభ్యుల సహకారంతో శంఖ, చక్ర, నామాలతో తీర్చిదిద్దారు. వీటిపై పెళ్లి కొడుకు రామయ్య, పెళ్లి కుమార్తె సీతమ్మ నామాలను లిఖించి కల్యాణోత్సవంలో అందజేయనున్నారు. విస్తృతంగా ఏర్పాట్లు సీతారాముల కల్యాణానికి జి.మామిడాడలో భారీ ఏ ర్పాట్లు చేశారు. వేలాదిగా భక్తులు తరలి రానున్నందు న, స్వామివారి దర్శనానికి ప్రత్యేక క్యూలు, ఇతర ఏ ర్పాట్లు చేశారు. సుమారు 106 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు స్థానిక ఎస్సై ఎస్.తులసీ రామ్ తెలిపారు. వీరిలో ముగ్గురు సీఐలు, ఎనిమిది మంది ఎస్సైలు, 20 మంది మహిళా పోలీసులు, మిగిలిన వారు ఇతర కానిస్టేబుళ్లు ఉన్నారని వివరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ప్రాంతాల్లోనూ గట్టి నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. -
● హై.. శ్రీరామ్!
లక్ష్మణ, హనుమత్ సమేతంగా సీతారాములు ఈస్ట్ ఇండియా కంపెనీ రాజ ముద్రిక రాజమహేంద్రవరం రూరల్: బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మనల్ని పాలించే కాలంలో మెజారిటీగా ఉన్న హిందువుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని 1818వ సంవత్సరంలో అంటే ఇప్పటికి 208 సంవత్సరాల క్రితం శ్రీరామ నవమిని పురస్కరించుకొని సీతారాములు లక్ష్మణ హనుమత్ సమేతంగా ఉన్న చిత్రాన్ని ఒకవైపు, ఈస్ట్ ఇండియా కంపెనీ రాజ ముద్రికను రెండవ వైపు ముద్రించారు. అణా విలువతో నాలుగు సెంటీమీటర్ల వ్యాసార్థంతో మందంగా ఈ రాగి నాణేన్ని తీర్చిదిద్దారు. నాణేల సేకరణలో భాగంగా తమిళనాడులో 20 సంవత్సరాల క్రితం దీన్ని సేకరించినట్టు బొమ్మూరుకు చెందిన సామాజిక వేత్త అద్దంకి రాజా యోనా తెలిపారు. -
డ్వాక్రా సభ్యురాలిపై యానిమేటర్ భర్త హత్యాయత్నం
ఆటోతో ఢీకొట్టి గొడ్డలితో దాడి గోకవరం: డ్వాక్రా సభ్యురాలిపై యానిమేటర్ భర్త హత్యాయత్నం చేసిన ఘటన గోకవరం మండలం కొత్తపల్లి శివారు పెట్రోల్ బంకు వద్ద గురువారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం కామరాజుపేటలోని స్థానిక దుర్గాకాలనీకి చెందిన చిత్తా లావణ్య మహిళా సంఘం సభ్యురాలు. ఆమె గురువారం ఉదయం తన కుమార్తెను కొత్తపల్లిలోని ఆదర్శ ఫార్మశీ కళాశాలకు స్కూటీపై తీసుకువెళుతున్న క్రమంలో ఆయిల్ కోసం పెట్రోల్ బంకులోకి వెళ్లింది. ఈ క్రమంలో దుర్గాకాలనీకి చెందిన కనకాల దుర్గాప్రసాద్ ఆమె స్కూటీని వెనుక నుంచి ఆటోతో ఢీకొట్టాడు. వెంట తెచ్చుకున్న గొడ్డలితో ఆమె మెడపై, తలపై, వెన్నుపై దాడి చేశాడు. ఆమె కుమార్తె, బంకు సిబ్బంది, స్థానికులు ఆడ్డుకోవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు గోకవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై గోకవరం ఎస్సై పవన్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడి వెనుక పాత కక్షలే కారణం ఈ దాడి వెనుక పాత కక్షలే కారణమని స్థానికులు చెబుతున్నారు. దాడికి పాల్పడిన ఆటోడ్రైవర్ కనకాల దుర్గాప్రసాద్ భార్య దుర్గ యానిమేటర్గా పని చేస్తున్నారు. క్షతగాత్రురాలు, వీరు స్థానికంగా ఎదురెదురు ఇళ్లల్లో ఉంటున్నారు. డ్వాక్రా లోను విషయంలో యానిమేటర్ దుర్గ, క్షతగాత్రురాలు లావణ్యల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో దుర్గపై లావణ్య ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. తన భార్యపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిందనే కారణంతో కక్ష కట్టి ఉద్దేశపూర్వకంగా దుర్గాప్రసాద్ ఈ దాడికి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. క్షతగాత్రురాలి భర్త స్థానికంగా ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఈ దాడి వెనుక మరో ఉపాధ్యాయుడి హస్తం ఉందని, దానిపై విచారణ నిర్వహించాలని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీఆర్డీఏ పీడీ నగేష్ గోకవరంలో విచారణ నిర్వహించారు. -
రాములోరి కల్యాణానికి వెళ్తూ...
బైక్ అదుపు తప్పి కోనసీమ వాసి మృతి చింతూరు: భద్రాచలం సీతారాముల కల్యాణానికి వెళ్తున్న క్రమంలో గురువారం ఘాట్రోడ్లో జరిగిన ప్రమాదంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఆకుల శివ(26) మృతిచెందాడు. జిల్లాలోని చొప్పెల్లకు చెందిన శివ, సంతోష్ శుక్రవారం భద్రాచలంలో జరిగే రాములోరి కల్యాణం తిలకించేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న వాహనం చింతూరు, మారేడుమిల్లి ఘాట్రోడ్లోని చింతూరు మండలం తులసిపాక సమీపంలోని వ్యూ పాయింట్ వద్దకు రాగానే అదుపుతప్పి బండరాయిని ఢీకొట్టింది. ఈ ఘటనలో శివ అక్కడికక్కడే మృతిచెందగా సంతోష్కు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన సంతోష్ను చికిత్స నిమిత్తం 108 వాహనంలో చింతూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మోతుగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చంద్రబాబుపై ధర్మ పోరాటం
● నన్ను అన్యాయంగా వేధిస్తున్నారు ● మాజీ మంత్రి అంబటి రాంబాబు కపిలేశ్వరపురం: చంద్రబాబు ప్రభుత్వం తనను అన్యాయంగా వేధిస్తోందని, రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులను ఇదే తరహాలో ఇబ్బందులకు గురి చేస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. మండపేటలోని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. అన్ని పార్టీల్లో ఉన్న కాపులంతా తాను చేస్తున్న ధర్మ పోరాటానికి మద్దతు పలకాలని కోరుకుంటున్నానన్నారు. ప్రజల చేతిలో చంద్రబాబు, ఇతర కూటమి నాయకులు తగిన మూల్యం చెల్లించుకొనే సమయం దగ్గరలో ఉందన్నారు. కాపుల్ని బీసీల్లో చేరుస్తామంటూ చంద్రబాబు మోసగించారన్నారు. ఆ అంశం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి నిజాయితీగా చెప్పిన విషయాన్ని అంబటి గుర్తు చేశారు. ప్రస్తుతం టీడీపీ, జనసేన నాయకులు ఆ అంశాన్ని కేంద్రంతో ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రులు మర్రి చెన్నారెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనాకాలం నుంచి తాను రాజకీయాల్లో ఉంటున్నానని, విలువలతో కూడిన రాజకీయాల కోసం ప్రస్తుతం తాను వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి నడుస్తున్నానన్నారు. తనను బెదిరించేందుకు కుట్ర పూరితంగా జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో తనను పలకరించిన వారిని స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమంలో భాగంగా మండపేటలో ఎమ్మెల్సీ తోటను కలిసానన్నారు. టీడీపీ, జనసేన పార్టీల్లోని కొందరు కాపు నేతలు తనను పలకరించారన్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ నాయకుడిగానే కాకుండా సామాజికవర్గ పరంగా అంబటికి సంఘీభావం తెలిపానన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అణచివేత పాలనకు అంబటి అరెస్ట్ ఒక ఉదాహరణ అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు తోట రామకష్ణ, కర్రి పాపారాయుడు, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబి), డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వంగా గిరిజకుమారి, సీనియర్ నాయకులు వేగుళ్ళ పట్టాభిరామయ్య చౌదరి, రెడ్డి రాధాకృష్ణ, తోట పృథ్వీరాజ్, పిల్లా వీరబాబు, కుడిపూడి రాంబాబు, సిరిపురపు శ్రీనివాస్, పలివెల సుధాకర్, మండపేట పట్టణ, రూరల్, కపిలేశ్వరపురం మండల కమిటీల అధ్యక్షులు పిల్లి శ్రీనివాస్, గూటం సత్యనారాయణ, అడబాల బాబ్జి, ఎంపీపీలు జుత్తుక వెంకటలక్ష్మి, నౌడు వెంకటరమణ, భీమవరం నాయకులు చినిమిల్లి వెంకటరాయుడు, స్థానిక నేతలు కురుపూడి రాంబాబు, నక్కా సింహాచలం, ఓగిరాల దేవి, మేడిశెట్టి సత్యవేణి పాల్గొన్నారు. -
ముద్రగడను కలిసిన మాజీ మంత్రి అంబటి
సాక్షి, కాకినాడ జిల్లా: కిర్లంపూడిలో వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు ముద్రగడ పద్మనాభంను మాజీ మంత్రి అంబటి రాంబాబు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు, లోకేష్కు గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. నాకు జరిగిన అన్యాయంపై న్యాయ స్థానం ద్వారా పోరాడతాను. ఇప్పటికే హై కోర్టులో రెండు రిట్ పిటిషన్లు వేశాను. త్వరలోనే మరో రెండు రిట్ పిటిషన్లు వేస్తాను’’ అని అంబటి పేర్కొన్నారు.పవన్ కళ్యాణ్ మా వెంట ఉన్నాడు.. ఇక కాపుల్ని ఏం చేసినా పర్వాలేదు అనుకుంటున్నారు. అంబటి రాంబాబును కొట్టినా పర్వాలేదు. ముద్రగడ కుటుంబాన్ని తిట్టిన పర్వాలేదు అనుకుంటున్నారు. ఇది తప్పు.. అక్రమం.. అన్యాయం.. ఈ అన్యాయాలను ఎదుర్కోవడానికి నా కులం, నా పార్టీ సిద్ధంగా ఉంది’’ అని అంబటి రాంబాబు చెప్పారు. -
రాజమండ్రి కల్తీ పాల ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి కల్తీ పాల ఘటనపై ఎన్హెచ్ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కల్తీ పాల ఘటనను మానవ హక్కుల సంఘం సుమోటోగా స్వీకరించింది. ఏపీ సీఎస్, డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని సీఎస్, డీజీపీని ఆదేశించింది. నివేదికలో బాధితుల ఆరోగ్య పరిస్థితి, దర్యాప్తు వివరాలు, చనిపోయిన వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లింపు తదితర అంశాలను వెల్లడించాలని ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది.గత ఫిబ్రవరిలో తూర్పుగోదావరి జిల్లా లాలా చెరువు చౌడేశ్వరి నగర్ స్వరూపనగర్లో కల్తీపాల తాగి 16 మంది మృత్యువాత పడ్డారు మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. పాలలో విషపూరిత రసాయనాలు ఇథైల్ గ్లైకోల్ కలిసింది. విషపూరిత పాలను నరసాపురం గ్రామంలోని డెయిరీ నుంచి సరఫరా అయినట్లు గుర్తించారు. దాదాపు 100 ఇళ్లకు సరఫరా చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. మీడియా ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న జాతీయ మానవ హక్కుల సంఘం.. ఘటనపై విచారణకు స్వీకరించింది. ఇది మానవ హక్కుల ఉల్లంఘనేనని ఎన్హెచ్ఆర్సీ స్పష్టం చేసింది. -
సీతమ్మ వారికి కోవా సారె
పి.గన్నవరం: స్థానిక వైనతేయ నదీ తీరాన కొలువైన పట్టాభి రామస్వామి ఆలయంలో ఈ నెల 27న జరుగనున్న సీతారాముల కల్యాణోత్సవాలకు ఆలయ ధర్మకర్తలు పేరిచర్ల భీమరాజు, సత్యవాణి దంపతులు కోవా స్వీట్లతో తయారు చేయిస్తున్న కంత (సారె) భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ మహోత్సవంలో రాముల వారి తరఫున సీతమ్మవారికి ఈ కంతను సమర్పిస్తారు. వివిధ రకాల ఫలాలు, పుష్పాలు, కూరగాయలు, చీరలు, పూల సజ్జ వంటి ఆకృతుల్లో కోవాతో తయారు చేస్తున్న స్వీట్లు కనువిందు చేస్తున్నాయి. గత 17 ఏళ్లుగా ఈ ఆనవాతీని వారు కొనసాగిస్తున్నారు. ఈ కల్యాణానికి 20 రోజుల ముందుగా 100 రకాలకు పైగా కోవా స్వీట్లు, మరో 100 రకాల పిండి వంటలు తయారు చేయిస్తారు. స్వీట్లు, పిండి వంటల తయారీలో స్థానిక శ్రీరామ్ గార్డెన్స్కు చెందిన మహిళలు సహకరిస్తున్నారు. ఈ సారెకు 30 రకాల పండ్లను చేర్చి సీతమ్మకు కంతను సమర్పిస్తారు. సీతా రాముల కల్యాణాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నారు. -
ముగిసిన నక్షత్ర నవగ్రహ శివ పంచాయతన యాగం
స్వామివారిని దర్శించుకున్న నగరి మాజీ ఎమ్మెల్యే రోజా అల్లవరం: మండలం దేవగుప్తంలోని ఉమాపార్వతి సమేత మల్లేశ్వరస్వామి ఆలయంలో ఐదు రోజులుగా జరిగిన నక్షత్ర నవగ్రహ శివ పంచాయతన, సుబ్రహ్మణేశ్వర యాగం బుధవారంతో ముగిసింది. వేద పండితులు పోచినపెద్ది శ్యామ్శర్మ ఆధ్వర్యంలో బుధవారం మహా పూర్ణాహూతి అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఆర్కే రోజా, మాజీ ఎంపీ చింతా అనురాధతో కలిసి పట్టువస్త్రాన్ని సమర్పించారు. అనంతరం యాగశాలలో కొలువైన దేవతామూర్తులను దర్శించుకుని స్వామి వారిని దర్శించుకున్నారు. రామచంద్రాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ యాగశాలను సందర్శించి మల్లేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, దొమ్మేటి రాము, సర్పంచ్ సాధనాల వెంకటరావు, తిక్కా ప్రసాద్, చిట్టూరి వెంకటనారాయణ, తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వద్ద భారీ అన్నసమారాధన నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో..సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో బుధవారం మాజీ మంత్రి రోజా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆమెకు ఆలయ మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికారు. పూజల అనంతరం అర్చకులు ఆమెకు ఆశీర్వచనం చేసి లడ్డూ ప్రసాదం అందజేశారు. అయినవిల్లిలో.. అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వరస్వామివారిని మాజీ ఎమ్మెల్యే, నగరి వైఎస్సార్ సీపీ ఇన్చార్జి రోజా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకులు మాచరి వినాయకరావు, ఆలయ సిబ్బంది ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం ఆమెకు వేదాశీర్వచనం చేసి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. -
వాడపల్లి వెంకన్నకు రూ.1.82 కోట్ల ఆదాయం
ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వరునికి హుండీల ద్వారా 27 రోజులకు రూ.82,94,288 ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. ఆలయ ఆవరణలో బుధవారం జిల్లా దేవదాయ శాఖ అధికారి వి.సత్యనారాయణ, రాజమహేంద్రవరం తనిఖీదారు ఎస్టీపీటీ శ్రీనివాస్, గ్రూపు దేవాలయాల ఈవోలు పీవీఎస్ కామేశ్వరరావు, బి.కిరణ్ల సమక్షంలో హుండీలు లెక్కించారు. హుండీల ద్వారా విశ్వేశ్వరస్వామి హుండీలతో కలిపి రూ.1,47,36,474, అన్న ప్రసాదం హుండీల ద్వారా రూ.35,57,814 లభించాయన్నారు. బంగారం 19 గ్రాములు, వెండి 860 గ్రాములు, 12 దేశాలకు చెందిన 51 విదేశీ కరెన్సీ నోట్లు లభించాయని తెలిపారు. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కమిటీ సభ్యులు, గ్రామస్తులు, ఆలయ అర్చకులు, వేద పండితులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు, రావులపాలెం కెనరా బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్ల సిబ్బంది పాల్గొన్నారు. భీమేశ్వరుని హుండీ ఆదాయం రూ.15.74 లక్షలు రామచంద్రపురం రూరల్: ద్రాక్షారామలో కొలువై ఉన్న మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయ హుండీల ఆదాయం రూ.15,74,920 వచ్చినట్లు దేవస్థానం సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గా భవాని వెల్లడించారు. ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ఈనెల 25 వరకు 42 రోజులకు ఈ హుండీలను లెక్కించారు. అన్నదానం హుండీ ద్వారా రూ.26,333 వచ్చిందని కమిషనర్ తెలిపారు. కార్యక్రమాన్ని రామచంద్రపురం డివిజన్ ఆలయ తనిఖీదారు ఆర్.బాలాజీ రాంప్రసాద్ పర్యవేక్షించారు. ఓదురు గ్రూప్ టెంపుల్స్ ఈఓ విత్తనాల శ్రీనివాస్, కె.గంగవరం గ్రూప్ టెంపుల్స్ ఈఓ టి.బాలకృష్ణ, అర్చకులు, ద్రాక్షారామ పోలీస్ సిబ్బంది సేవా సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. దాడి కేసులో ముగ్గురి అరెస్టు అమలాపురం టౌన్: అమలాపురం రోహిణి ఆస్పత్రి వీధిలో గత సంక్రాంతి పండుగ రోజుల్లో ఇద్దరిపై దాడి చేసి డబ్బులు కాజేసిన కేసులో ముగ్గురిని బుధవారం అరెస్ట్ చేసినట్లు సీఐ పి.వీరబాబు తెలిపారు. అప్పట్లో స్థానిక మున్సిపల్ కాలనీకి చెందిన పాలెపు గంగరాజు, దుర్గా ప్రసాద్లపై పట్టణంలోని వడ్డెర (ఉప్పర) కాలనీకి చెందిన వేముల సీత, గుంజు దేవి, వేమల దత్తాత్రేయలు దాడి చేశారన్నది అభియోగం. ఈ ఫిర్యాదుపై పట్టణ ఎస్సై ఎన్ఆర్ కిషోర్బాబు కేసు నమోదు దర్యాప్తు చేశారు. ఈ ముగ్గురి నిందుతులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. వారిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించినట్లు సీఐ వీరబాబు తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో ఉందని, మరి కొంత మందిని ఇంకా అరెస్టు చేయాల్సి ఉందని ఎస్సై కిషోర్బాబు తెలిపారు. రైలు నుంచి పడి వ్యక్తి మృతిరాజమహేంద్రవరం సిటీ: కొవ్వూరు రైల్వే స్టేషన్, గోదావరి రైల్వే స్టేషన్ల మధ్య గోదావరి ఆర్చ్ బ్రిడ్జి పై సుమారు 27 ఏళ్ల వయసున్న వ్యక్తి గుర్తు తెలియని రైలు నుంచి జారి పడి మృతి చెందాడని జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ వై.నాగేశ్వరావు బుధవారం తెలిపారు. మృతుడు 5.4 అడుగులు ఎత్తు, లైట్ బ్లూ కలర్ జీన్స్ ఫ్యాంట్, లైట్ గ్రీన్ కలర్ చొక్కా ధరించి ఉన్నాడన్నారు. మృతుని వివరాలు తెలిస్తే జీఆర్పీ స్టేషన్ నంబరు 0883 2442821, అధికారి సెల్ నెంబర్ 9154578496ను సంప్రదించాలన్నారు. -
పులి బాటలో.. వేట!
● ట్రాకర్ సాయంతో ముందుకు వెళ్తున్న అటవీ అధికారులు, సిబ్బంది ● ఎర్రంపాలెం వైపు వెళ్లినట్టు గుర్తింపు గంగవరం: జిల్లాలో గంగవరం మండలంలో పెద్దపులి సంచారం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. అటవీశాఖ అధికారులు, సిబ్బంది, ప్రజలకు పులి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. దొరమామిడికి వెళ్లే రహదారిలో కొండ సమీపంలో పులిని బంధించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఐనా పులి చిక్కలేదు. బుధవారం తెల్లవారే సరికి దొరమామిడి మార్గంలోనే దుంప తోటలో ఒక ఆవును హతమర్చి పాత కొత్తాడ, టేకులవీధి, ఎర్రంపాలెం వైపు పులి పయనించినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం నుంచి అటవీశాఖ అధికారులు, సిబ్బంది పులి జాడ కోసం ప్రయత్నిస్తున్నారు. రేడియో ట్రాకింగ్ ద్వారా అడ్డతీగల, ఫోక్స్పేట ఫారెస్టు రేంజ్ అఽధికారులు డివిజనల్ అటవీ శాఖాధికారి శివకుమార్ గంగల్, అడ్డతీగల సబ్–డీఎఫ్ఓ జేవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అటవీశాఖ సిబ్బంది, బేస్ క్యాంప్ సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. కాగా మంగళవారం రాత్రి కొంత మంది అటవీశాఖ బీట్ అధికారులు, బేస్ క్యాంప్ హెల్పర్లు కొండ పైభాగానికి వెళ్లి మరీ పులిని బంధించే ప్రయత్నం చేశారు. -
గాలికుంటు.. టీకాతో సరి..
● ఎన్ఏడీపీలో భాగంగా ఏప్రిల్ 13 వరకు పంపిణీ ● జిల్లాలో 2.31 లక్షల టీకాల లక్ష్యంనివారణ చేపట్టండిలా ● పశువులు బాగా బలహీనంగా ఉంటే గ్లూకోజ్ రక్తంలోకి ఇవ్వాల్సి ఉంటుంది. ’నోటిలో పుండ్ల వలన మేత మేయవు. కనుక వాటికి సులభంగా జీర్ణమయ్యే పోషక పదార్థాలతో కూడిన ఆహారం అందించాలి. ● జావ, జొన్న, అన్నం, ఉప్పు, బెల్లంతో కలిపి నిత్యం తాగించడం ద్వారా అవి బలహీన పడకుండా జాగ్రత్త వహించాలి. ఈ వ్యాధి సోకిన పశువులను వేరు చేయాలి. ● వీటి మల మూత్రాలను గడ్డిలో కాల్చివేయాలి. చనిపోయిన పశువులను సున్నపు గోతిలో పూడ్చాలి. చికిత్స ● కాలిగిట్టల మధ్య పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ ద్రావకాలతో కడిగి నీమ్లెంట్, వేపనూనె పూయాలి. ● నోటిలోని పుండ్లకు బోరిక్ పౌడర్ చల్లి గ్లిజరిన్ కలిపి పూయాలి. వైద్యుడిని సంప్రదించి అవసరమైన మందులు వాడాలి. రాయవరం: వ్యాధులు దాడి చేయడం ద్వారా పశువుల్లో పాల ఉత్పాదక శక్తి తగ్గుతుంది. ఒక్కో సమయంలో అవి ప్రాణాలు కూడా కోల్పోతాయి. అటువంటి ప్రమాదకర వ్యాధుల్లో గాలికుంటు ఒకటి. వైరస్ ద్వారా వ్యాపించే ఈ వ్యాధిని ఫుట్ అండ్ మౌత్ డిసీజ్గా పేర్కొంటారు. పశు పోషకులు సరైన చికిత్సా విధానాలు పాటిస్తే పశువులను కాపాడుకోవచ్చునంటున్నారు జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి టి.శ్రీనివాసరావు. నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ (ఎన్ఏడీపీ) 8వ విడతలో భాగంగా గాలికుంటు వ్యాధి నివారణకు ఈ నెల 16న సామూహిక టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. వచ్చే నెల 13 వరకూ ఈ పంపిణీ సాగనుంది. వ్యాధి లక్షణాలు ● గాలిలో తేమ శాతం అధికంగా ఉన్నపుడు ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఎక్కువ. ● వ్యాధి సోకిన సమయంలో పశువుల్లో గర్భం విఫలమవుతుంది. వేడిని తట్టుకోలేవు. ● వ్యాధికి గురైన పశువుకు తీవ్రమైన జ్వరం కన్పిస్తుంది. ● పాల దిగుబడి తగ్గడం, నోరు, మూతి, కాళ్లు, పొదుగు మీద పుండ్లు, బొబ్బలు కనపడటం, కాళ్లు కుంటడం, నోటి నుంచి విపరీతంగా నురగ కారడం వంటి లక్షణాలు ఉంటాయి. ● వ్యాధి సోకిన గేదె, ఆవు పాలు తాగే దూడల్లో మరణాలు ఉంటాయి. వ్యాధి సోకిన గేదె, ఆవు పాలను దూడలు తాగకుండా చూసుకోవాలి. ఉత్పాదక సామర్ధ్యం తగ్గుతుంది ● మార్చి, ఏప్రిల్ మాసాల్లో ఈ వ్యాధి ఎక్కువ వస్తుంది. ● వ్యాధి వల్ల మరణాల శాతం తక్కువైనప్పటికీ పశువుల్లో ఉత్పాదక శక్తి సామర్ధ్యం తగ్గుతుంది. ● జ్వర తీవ్రత 104–106 డిగ్రీల ఫారన్హీట్ వరకు పెరిగి పశువులు నీరసిస్తాయి. ● పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది. నోటి ఎపిథీలియం (పైపొర), పళ్లు, చిగుళ్లు, నాలుక, ముట్టి లోపలి ప్రాంతాల్లో బొబ్బలు ఏర్పడి అవి 24 గంటల్లో చితికి పోవడం వల్ల పశువులు నొప్పితో మేత తినవు. ● నోటి నుంచి చొంగ కారుతుంది. ● చూడి పశువుల్లో గర్భస్రావాలు సంభవిస్తాయి. ● పశువులు శ్వాసను కష్టంగా పీల్చుతూ, రొప్పుతూ ఎండవేడి తట్టుకోలేక నీరసిస్తాయి. వ్యాప్తి చెందుతుందిలా ● నోరు, కాలు వ్యాధికి గురైన పశువుల అంతఃస్రావాల (లాలాజలం, పుండ్ల నుంచి కారే రసి) వల్ల వ్యాధి మిగతా పశువులకు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ● వ్యాధికారక క్రిమి ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ● గాలిలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు ఒక చోట నుంచి మరో చోటుకు త్వరగా వ్యాప్తి చెందుతుంది. ● సంకరజాతి పశువులు త్వరగా ఈ వ్యాధి బారిన పడతాయి. జిల్లాకు 2.31లక్షల డోసులు జిల్లాలోని పశువులకు అవసరమైన డోసుల్లో మొదటి దశలో 2.31 లక్షల డోసులు జిల్లాకు చేరుకున్నాయి. నాలుగు నెలల పైబడి ఉన్న పశువులకు మాత్రమే వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలి. నాలుగు నెలలు దాటి తొలిసారి టీకాలు వేయిస్తున్న దూడలకు నెల రోజుల తర్వాత బూస్టర్ డోస్ వేస్తారు. జిల్లాలో 74 వేలు వైట్ క్యాటిల్స్, 1.86 బ్లాక్ క్యాటిల్స్ ఉన్నాయి. పశువైద్యశాఖ ద్వారా ఉచితంగా వ్యాధి నిరోధక టీకాలు వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 31 వరకు వ్యాధి నిరోధక టీకాలు వేస్తారు. జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకు కూడా వ్యాధి నిరోధక టీకాలను పంపిణీ చేశారు. -
‘ఆదిరెడి’్డ వ్యాఖ్యలపై ఆగ్రహ జ్వాల
● అట్రాసిటీ కేసు నమోదు చేసి టీడీపీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ ● అప్పారావు వైఖరిపై అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ శ్రేణుల నిరసన సాక్షి, రాజమహేంద్రవరం: దళితులను కించపరుస్తూ మాజీ ఎమ్మెల్సీ, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తండ్రి ఆదిరెడ్డి అప్పారావు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ సీపీ, దళితుల్లో ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి. ఆదిరెడ్డి అహంకార తీరుకు నిరసనగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్లకార్డులు, నినాదాలతో హోరెత్తించారు. దళితులను అవమానించిన ఆదిరెడ్డి అప్పారావుపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని, టీడీపీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. దళితులను కించపరిచారన్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భంగా దళితుల మనోభావాలను దెబ్బతీసిన ఆదిరెడ్డి అహంకార పూరిత వైఖరిని ఖండిస్తూ.. వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న ఆంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ నేతలు, దళితులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్, ఆదిరెడ్డి అరాచకాలు నశించాలని, దళితులకు క్షమాపణ చెప్పాలి, ఆదిరెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి, టీడీపీ నుంచి బహిష్కరించాలని ఆందోళనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. నివాళులు అర్పించి కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు. చంద్రబాబు ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగాయి : సుధాకర్బాబు వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజీఆర్ సుధాకర్బాబు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఆందోళన చెందారు. నిత్యం రాష్ట్రంలో ఏదో ఒకచోట దళితులపై దాడులు జరుగుతున్నాయన్నారు. ఎమ్మెల్యే తండ్రిగా, ప్రజా ప్రతినిధిగా పనిచేసిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు దళితులను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు అహంకార పూరితమని, వివక్షతో కూడుకున్నవన్నారు. ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దళితులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీలోని దళిత నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి : జడ శ్రావణ్కుమార్ ప్రముఖ న్యాయవాది, జై భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్కుమార్ మాట్లాడుతూ టీడీపీలో చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు దళిత వర్గాలను వేధిస్తున్నారన్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. పార్టీలు.. ప్రభుత్వాలు మారినా దళితులపై దాడులు మాత్రం ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పారావుపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకపోతే న్యాయపరంగా ఏ స్థాయి వరకు అయినా వెళ్లి కేసు పెట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. అప్పారావు విషయంలో టీడీపీలోని దళిత నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. అప్పారావు మాట్లాడిన విధంగా వైఎస్సార్ సీపీ నేతలు మాట్లాడి ఉంటే.. కేసులు పెట్టి జైలుకు పంపించేవారన్నారు. దళితుని మృతదేహాన్ని ఒక వీధిలోకి రాకుండా అడ్డుకున్న ఘటన సిగ్గుచేటన్నారు. టీడీపీకీ దళితుల రక్షణ ఆలోచన లేదా : మాజీ ఎంపీ భరత్రామ్ మాజీ ఎంపీ భరత్రామ్ మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన దళితులపై దూషణ, దాడుల సంఘటనలో అప్పారావును టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో ఆదిరెడ్డికి టీడీపీ అధిష్టానం కనీసం షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకపోవడంపై మాట్లాడుతూ దళితుల రక్షణపై ఆ పార్టీ అధిష్టానానికి ఆలోచన లేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వంలో దళితుల ఆత్మగౌరవం, రక్షణ కోసం పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఎస్సీ సెల్ జోన్–2 వర్కింగ్ ప్రెసిడెంట్ విప్పర్తి వేణుగోపాలరావు మాట్లాడుతూ స్వాతంత్య్రం సిద్ధించి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా దళితులకు వివక్ష తప్పడం లేదన్నారు. ఆదిరెడ్డిపై ఇప్పటి వరకు ఎందుకు కేసు నమోదు చేయలేదో స్పష్టం చేయాలన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగానికి పోలీసులు విలువ ఇవ్వడం లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే తలారి వెంకటరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాల నుంచి దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఒక వివాదంలో పెద్దమనిషిగా ఉన్న మాజీ ప్రజా ప్రతినిధి దళితులను కులం పేరుతో దూషించడం, చంపేస్తానని బెదిరించడం, దాడులు చేయడం గర్హనీయమన్నారు. కేసు కట్టేంతవరకు ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పార్టీ పార్లమెంట్ ఇన్చార్జి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ దళితులు ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగపడతారా? రాష్ట్రంలో ఏ రాజ్యాంగం నడుస్తోందని ప్రశ్నించారు. దళిత వర్గాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో చంద్రబాబు కూడా దళితులపై దారుణమైన వ్యాఖ్యలు చేశారని రుడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి అన్నారు. ఎస్సీ ఎస్టీలను టీడీపీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. నాయకులు ప్రదర్శనగా రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీస్ స్టేషన్కు వెళ్లి అక్కడ నినాదాలు చేశారు. ఆదిరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ సీఐ అప్పారావుకు ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పలివెల సుధాకర్, జిల్లా అధ్యక్షుడు సాలి వేణు, క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు విజయసారధి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఎం.లక్ష్మి, నాయకులు కాటం రజనీకాంత్, బిల్డర్ చిన్న పాల్గొన్నారు. -
నిరాశజనకంగా పొగాకు మార్కెట్
దేవరపల్లి: పొగాకు మార్కెట్ పట్ల రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం టుబాకో బోర్డు రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో బుధవారం కొనుగోళ్లకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 9.30 గంటలకు జంగారెడ్డిగూడెంలో బోర్డు చైర్మన్ సీహెచ్ యశ్వంత్కుమార్, కార్యదర్శి వేణుగోపాల్ కొనుగోళ్లు ప్రారంభించారు. అనంతరం కొయ్యలగూడెం వేలం కేంద్రాలో వేలం ప్రారంభించారు. గోపాలపురం వేలం కేంద్రంలో కొనుగోళ్లను రైతులు నిలుపుదల చేశారు. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం వేలం కేంద్రాల్లో కిలో గరిష్ఠ ధర రూ.265 పలకడంతో రైతులు నిరసన వ్యక్త చేశారు. దీంతో గోపాలపురం వేలం కేంద్రం, దేవరపల్లి వేలం కేంద్రాల్లో కొనుగోళ్లను రైతులు నిలుపుదల చేశారు. ఓ దశలో రైతులు, బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వావాదం జరిగింది. బోర్డు మాజీ వైస్ చైర్మన్ గద్దే శేషగిరిరావు, చైర్మన్ యశ్వంత్ మధ్య వాదోపవాదాలు జరగ్గా, కొంతమంది రైతులు గో బ్యాక్ చైర్మన్ అంటూ నినాధాలు చేశారు. మార్కెట్ ఆశాజనకంగా లేదని, గత ఏడాది కిలో గరిష్ఠ ప్రారంభ ధర రూ.290 ఉండగా, ఈ ఏడాది రూ. 265తో ప్రారంభించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో బోర్డు చైర్మన్, కార్యదర్శి చర్చలు జరిపి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికి అంగీకరించకపోవడంతో వేలం నిలుపుదల చేశారు. కిలో గరిష్ఠ ధర రూ. 300 ఉండాలని రైతులు డిమాండ్ చేశారు. అనంతరం దేవరపల్లి వేలం కేంద్రంలో వేలం ప్రారంభానికి సిద్ధం కాగా రైతులు అడ్డుకున్నారు. గరిష్ఠ ధర రూ. 300 ఇవ్వాలని, రూ.265 ధరకు కొనుగోలు చేయవద్దని రైతులు అధికారులకు వివరించారు. దీంతో అధికారులు, బోర్డు చైర్మన్ రైతులతో సమావేశం నిర్వహించి పరిస్థితిని వివరించి మూడు రోజుల్లో గుంటూరు బోర్డు కార్యాలయంలో కొనుగోలు సంస్థల ప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మార్కెట్పై నిర్ణయం తీసుకుంటామని, అప్పటి వరకు కొనుగోళ్లు ఆపవద్దని రైతులకు సూచించారు. మార్కెట్లో ధర గిట్టుబాటుగా లేనందున గుంటూరులో సమావేశం జరిగే వరకు కొనుగోలు చేయవద్దని రైతులు చెప్పడంతో వేలం ప్రారంభించకుండా నిలుపుదల చేసి అధికారులు వెళ్లిపోయారు. మధ్యాహ్నం 3 గంటలకు బోర్డు చైర్మన్ వేలం కేంద్రం రైతు సంఘం అధ్యక్షులు కరుటూరి శ్రీనివాస్, రైతు సంఘాల ప్రతినిధులతో సంప్రదించి, కొనుగోలుకు అంగీకరింపజేయడంతో ఎట్టకేలకు వేలం నిర్వహణాధికారి హేమస్మిత వేలం నిర్వహించారు. తొలిరోజు చెరుకుమిల్లి గ్రామం నుంచి 27 బేళ్లు వేలానికి రాగా, 24 బేళ్లు అమ్ముడు పోయాయి. 2,056 కిలోల పొగాకు కొనుగోలు చేసినట్టు హేమస్మిత తెలిపారు. కిలో గరిష్ఠ ధర రూ.265 పలికినట్టు ఆమె తెలిపారు. రీజనల్ మేనేజరు సురేంద్ర కుమార్, రైతు సంఘాల ప్రతినిధులు కాట్రు సత్యనారాయణ, యాగంటి వెంకటేశ్వరరావు, ఆచంట గోపాలకృష్ణ, సత్తి జగదీశ్వరరెడ్డి, సుంకవల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. గోపాలపురంలో నిలిచిన వేలం మార్కెట్ పట్ల రైతుల నిరసన బోర్డు చైర్మన్, రైతుల మధ్య వాగ్వాదం నాలుగు వేలం కేంద్రాల్లో ప్రారంభమైన కొనుగోళ్లు -
హత్యాయత్నం చేసినవారిని స్వేచ్ఛగా వదిలేస్తారా?
అనపర్తి: తన భర్తపై హత్యాయత్నం చేసిన నిందితుల పట్ల పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడంతో తమ కుటుంబం ప్రాణభయంతో బిక్కుబిక్కుమని కాలం వెళ్లదీస్తోందని బిక్కవోలు మండలం పందలపాకకు చెందిన వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కన్వీనర్ తమలంపూడి దుర్గారెడ్డి భార్య లలిత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక వినాయక నగర్లో నివసిస్తున్న దుర్గారెడ్డి ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటారు. ఈ నెల ఐదో తేదీ రాత్రి సుమారు 8:30 గంటలకు నూజివీడు నుంచి ఇంటికి వచ్చిన దుర్గారెడ్డి బయటకు వెళ్లి వస్తానని భార్యతో చెప్పి రాత్రి 10:30 అవుతున్నా తిరిగి రాలేదు. ఫోన్ చేసినా స్పందన లేదు. మరికొద్ది సేపటికి ఫోన్ చేస్తే తరవాత వస్తాను ఆగు అని మెసేజ్ పెట్టారని లలిత చెప్పారు. మళ్లీ 11:42 గంటలకు ఫోన్ చేస్తే స్పందన లేకపోవడంతో తెలిసినవాళ్లందరికీ ఫోన్లు చేసి తలో దిక్కూ వెతికినట్టు తెలిపారు. ఈ పరిస్థితుల్లో నిందితులలో ఒకరైన స్థానికుడు కొవ్వూరి రాజేష్రెడ్డి ఆ అర్ధరాత్రి 01:22 గంటలకు లలిత తమ్ముడు కృష్ణారెడ్డికి ఫోన్ చేసి తమ ఇంటికి రావాలని చెప్పడంతో అక్కడికి వెళ్లి చూడగా దుర్గారెడ్డి తీవ్ర రక్తగాయాలతో ఇంటి వద్ద మెట్లపై పడి ఉన్నాడని లలిత తెలిపారు. దీంతో ఆమె స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసి, హుటాహుటిన అతడిని రాజానగరం జీఎస్ఎల్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు మెడికో లీగల్ కేసు నమోదు చేసి దుర్గారెడ్డిని పరీక్షించి పరిస్థితి విషమంగా ఉందని కడుపులో రక్తస్తావం ఎక్కువైందని, ప్రాణాలకు ప్రమాదమని చెప్పారన్నారు. అప్పటికే దుర్గారెడ్డి అపస్మారకస్థితిలో ఉన్నాడని తెలిపారు. రాజేష్రెడ్డి, అతని సోదరుడు, మరి కొందరు కలసి కర్రలతో తీవ్రంగా కొట్టి, కడుపులో బలంగా పొడవడంతో ఇలా జరిగిందని, వెంటనే శస్త్ర చికిత్స చేయడంతో ప్రాణాలు దక్కాయని లలిత పేర్కొన్నారు. వీపు పైన, మర్మాంగాల పైన తీవ్రంగా కొట్టడంతో సుమారు 15 రోజులు అపస్మారక స్థితిలోనే ఉన్నారని ఆమె తెలిపారు. అధికారపక్షం చేస్తున్న అవినీతి, ఆక్రమాలను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తుండడం వల్లే ఆయనపై కక్షతో అధికార పార్టీ నాయకులు రాజేష్రెడ్డి ద్వారా ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆమె ఆరోపిస్తున్నారు. నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చి స్వేఛ్ఛగా వదలి వేయడం ఏమిటో అర్ధం కాలేదని ఆమె వాపోయారు. జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని లలిత ఆ ప్రకటనలో కోరారు. వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కన్వీనర్ దుర్గారెడ్డిపై దాడి నిందితులకు స్టేషన్ బెయిల్ ఇవ్వడంపై ఆవేదన తన కుటుంబానికి ప్రాణభిక్ష పెట్టాలని బాధితుడి భార్య లలిత వేడుకోలు -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 22,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 24,000 గటగట (వెయ్యి) 21,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)13,000 – 14,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
నా ఇంటిపై దాడి చేసిన వారికి శిక్ష పడేదాకా పోరాడతా
మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమహేంద్రవరం సిటీ: నా ఇంటిపై దాడి చేసి, వాహనాలను తగులు పెట్టిన వారిపై ప్రభుత్వం ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని, వారికి శిక్ష పడేదాకా పోరాడుతానని రాష్ట్ర మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. బుధవారం రాజమహేంద్రవరంలోని శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి నక్కా నగేష్ను పరామర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం తనపై అత్యంత కక్షపూరితంగా వ్యవహరించిందన్నారు. రాష్ట్రంలో40 శాతం ఓట్లు ఉన్న పార్టీలో, 20 శాతం జనాభా ఉన్న సామాజిక వర్గంలో నేను ఒక నాయకుడినన్నారు. ప్రభుత్వం అక్రమంగా నన్ను జైల్లో పెట్టిన సమయంలో తూర్పు గోదావరి జిల్లాలో ఎంతోమంది నాకు అండగా నిలిచారన్నారు. వారందరినీ కలిసి కృతజ్ఞత చెప్పేందుకు గోదావరి జిల్లాకు వచ్చానన్నారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఉన్నారు. ఆర్ఆర్ఆర్, ఫ్లడ్ మేనేజ్మెంట్కు సహకారం సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఆర్ఆర్ఆర్, ఫ్లడ్ మేనేజ్మెంట్ పనులకు సహకరిస్తామని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు అన్నారు. బుధవారం పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన ఆయనను రాజమహేంద్రవరంలోని ఒక హాటల్లో రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు కలిశారు. ప్రాజెక్టు పెండింగ్ డిజైన్లకు అనుమతులు వచ్చేలా సహకరించాలని కోరారు. గోదావరి, కృష్ణ, పెన్నా, వంశధార, నాగావళి ఏటి గట్ల పటిష్టతకు సహకరించాలన్నారు. కాంతారావును కలెక్టర్ కలెక్టర్ కీర్తి మర్యాద పూర్వకంగా కలిశారు. 28న జాబ్మేళా కంబాలచెరువు(రాజమహేంద్రవరం): పభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఈ నెల 28న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్ర ఆర్కే బుధవారం తెలిపారు. డిగ్రీ, పీజీ పాసైన, ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు 30 కంపెనీలతో జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. అర్హత గల విద్యార్థులు ఉదయం 9 గంటలకు తమ బయోడేటా, సరిఫికెట్లతో హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు కళాశాల జేకేసీ విభాగంలో సంప్రదించవచ్చన్నారు. నిందితులను వదిలే ప్రసక్తి లేదు మానవ హక్కుల చైర్పర్సన్ శైలజ తుని: మానవ సమాజం తలదించుకునే విధంగా గిరిజన దివ్యాంగురాలిపై లైంగిక దాడి చేసి, ఆపై హత్య చేసేందుకు ప్రయత్నించిన నిందితులకు చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మానవహక్కుల కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. బుధవారం తునిలోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గిరిజన దివ్యాంగురాలిని శైలజ పరామర్శించారు. లైంగికదాడిలో గాయపడిన దివ్యాంగురాలి ఆరోగ్య పరిస్థితిని న్యూరో వైద్యుడు గురుప్రసాద్ను అడిగి తెలుసుకున్నారు. వైద్యానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం తరఫున అందిస్తామని కుటుంబ సభ్యులకు చెప్పారు. అనంతరం మీడియా సమావేశంలో శైలజ మాట్లాడుతూ ఈ నెల 18న కోటనందూరు మండలం పాత కొట్టాం పంచాయతీ పరిధిలోని సంగవాకలో గిరిజన దివ్యాంగురాలు బహిర్భూమికి వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు లైంగిక దాడిచేసి, ఆపై హత్యాయత్నం చేశారన్నారు. తలకు గాయం కావడంతో ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని చెప్పారు. ప్రాథమిక సమాచారం మేరకు బాలుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారని, పోలీస్శాఖ లోతుగా విచారణ జరిపి అసలు నిందితులను పట్టుకోవాలని సూచించారు. అఘాత్యానికి పాల్పడినది ఎవరైనా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
నేతల చుట్టూ ప్రదక్షిణలు
సాక్షి, రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) శాఖ ఉద్యోగుల్లో బదిలీల భయం పట్టుకుంది. రాజమహేంద్రవరం, కోనసీమ, కాకినాడ, ఏలూరు, భీమవరం సర్కిళ్ల పరిధిలో సాధారణ బదిలీలకు రంగం సిద్ధమైంది. వచ్చే నెలలో ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈసారి పెద్ద ఎత్తున మార్పులు ఉంటాయని ఆ శాఖ అధికారుల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే తమకు అనువైన ప్రాంతాల్లో పోస్టింగ్ పొందడంపై దృష్టి పెడుతున్నారు. అందుకు తమకు అనుకూలమైన మార్గాలను ఎంచుకుంటున్నారు. ఎవరిని సంప్రదిస్తే పని సులువుగా అవుతుంది. ఏ నేతను ఆశ్రయించాలన్న లెక్కలు వేసుకుంటున్నారు. ఆ దిశగా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ఆదాయ వనరులు పుష్కలంగా ఉన్న రాజమహేంద్రవరం సర్కిల్పై కొందరు ఉద్యోగులు కన్నేశారు. ఎలాగైనా ఇక్కడ స్థానం దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకు తమకు పరిచయం ఉన్న టీడీపీ నేతలను ఆశ్రయిస్తున్నారు. వారి ద్వారా పైరవీలు చేస్తున్నారు. ఎలాగైనా తాము ఆశించే సీటును కై వసం చేసుకునేందుకు నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్టు సమాచారం. ఫెవికాల్ వీరులకు చెక్ పడేనా? రాజమహేంద్రవరం సర్కిల్ పరిధిలోని విద్యుత్ శాఖలో కొందరు ఉద్యోగులు కొన్నేళ్లుగా ఇక్కడే తిష్ట వేశారు. అక్రమాదాయం ఉండటంతో బదిలీల సమయంలో ఉన్నతాధికారులకు ఆమ్యామ్యాలు సమర్పించి తమ స్థానాలు పదిలం చేసుకుంటున్నారు. అలాంటి అధికారులకు ప్రస్తుతం చెక్ పడే అవకాశం ఉన్నట్లు ఆ శాఖ ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. పోలవరం సర్కిల్ పరిస్థితేంటో? నూతనంగా ఏర్పాటైన పోలవరం జిల్లాకు ప్రత్యేకంగా విద్యుత్ శాఖ సర్కిల్ కార్యాలయాన్ని కేటాయించారు. కానీ అధికారుల నియామకం మాత్రం జరగలేదు. కలెక్టర్ను నియమించిన ఉన్నతాధికారులు వచ్చే నెలలో జరిగే బదిల్లో ఎస్ఈ పోస్టు భర్తీ చేయనున్నట్లు తెలిసింది. అందులో భాగంగా పోస్టు కోసం ఇప్పటికే పైరవీలు మొదలయ్యాయి. పోలవరం ఎస్ఈగా వెళ్లేందుకు ఏలూరు సర్కిల్లోని ఓ ఈఈ, వైజాగ్ కార్పొరేట్ కార్యాలయంలోని ఓ ఈఈ పోటీ పడుతున్నారు. ఎవరి స్థాయిలో వారు పావులు కదుపుతున్నారు. చివరికి ఎవరు విజయం సాధిస్తారో అంతుచిక్కని ప్రశ్నగా మారింది. వచ్చే నెలలో బదిలీలు ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)లో ఏప్రిల్ నెలలో సాధారణ బదిలీలకు ఆ శాఖ ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ పరిణామం ఉద్యోగుల్లో ఉత్కంఠను రేపుతోంది. ముందస్తుగా మేల్కొంటున్న అధికారులు తమకు అనువైన పోస్టింగ్ దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రధానంగా ఎస్ఈ (సూపరింటెండెంట్ ఇంజినీర్) పోస్టులకు భారీగా పోటీ నెలకొంది. కోనసీమ సర్కిల్ ఎస్ఈ స్థానానికి ఓ ఈఈ పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఆయన అదే శాఖలో ఈఈ టెక్నికల్గా విధులు నిర్వర్తిస్తున్నారు. బదిలీలు జరిగితే ఎలాగైనా ఎస్ఈ స్థానం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఓ మంత్రి, ఎమ్మెల్యేలతో సైతం సిఫారసు చేయించినట్లు తెలిసింది. కాకినాడ ఎస్ఈ త్వరలో పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో నూతన ఎస్ఈ నియామకం తప్పనిసరి. అతని స్థానం కోసం కోనసీమ సర్కిల్లో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉన్నతాధికారిణి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలిసింది. సదరు అధికారిణికి కూటమి నేతల అండదండలు పుష్కలంగా ఉండటంతో కాకినాడ ఎస్ఈకి లైన్ క్లియరైనట్లు సమాచారం. జగ్గంపేట ఈఈ పోస్టు కోసం రాజమహేంద్రవరం సర్కిల్లో కన్స్ట్రక్షన్ (నిర్మాణం) విభాగంలో ఓ ఈఈ(ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) పావులు కదుపుతున్నట్లు తెలిసింది. అమలాపురం ఎస్ఏఓ (సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్) పోస్టు కోసం గతంలో పనిచేసిన ఓ అధికారి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. భీమవరం సర్కిల్ ఎస్ఈ స్థానానికి మెట్ట ప్రాంతానికి చెందిన ఓ ఈఈ, ఏలూరు సర్కిల్ ఎస్ఈ పోటీ పడుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. భీమవరం సర్కిల్ ఏఓ రెవెన్యూ పోస్టుకు విశాఖలోని కార్పొరేట్ కార్యాలయంలో ఇద్దరు, రాజమహేంద్రవరం సర్కిల్ కార్యాలయంలో ఒకరు తీవ్రంగా పోటీ పడుతున్నారు. విద్యుత్ శాఖలో బదిలీల ఫీవర్ వచ్చే నెలలో భారీగా మార్పులు చేపట్టాలన్న యోచన అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్న ఉద్యోగులు తమకు అనువైన ప్రాంతాల్లో పోస్టింగ్ కోసం ప్రయత్నాలు రాజకీయ నేతల వద్దకు క్యూ కడుతున్న వైనం జీతం కంటే.. గీతం వచ్చే స్థానాలపై కన్ను పోలవరం సర్కిల్కు ఎస్ఈ నియామకంపై మీమాంస -
నేటి నుంచి రాములోరి పెళ్లి వేడుకలు
రత్నగిరిపై తొమ్మిది రోజుల పాటు జరగనున్న శ్రీరామనవమి వేడుకలు అన్నవరం: రత్నగిరి క్షేత్ర పాలకుడు శ్రీసీతారామచంద్రస్వామివారి శ్రీరామనవమి వేడుకలు చైత్ర శుద్ధ అష్టమి, గురువారం ప్రారంభం కానున్న సందర్భంగా దేవస్థానంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా రత్నగిరి రామాలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈ వేడుకలకు ఈ నెల 21వ తేదీన రామాలయం వద్ద ఘనంగా పందిరి రాట ముహూర్తం చేసిన విషయం తెలిసిందే. నేడు వధూవరులను చేయడంతో వేడుకలు ప్రారంభం గురువారం నుంచి ఏప్రిల్ మూడో తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు శ్రీరామనవమి వేడుకలు రత్నగిరి పై నిర్వహించనున్నారు. రత్నగిరి క్షేత్రపాలకులుగా పూజలందుకుంటున్న సీతారాముల కల్యాణ మహోత్సవాలను సాక్షాత్తూ సత్యదేవుడు, అమ్మవారు పెళ్లిపెద్దలుగా నిర్వహించడం ఆనవాయితీ. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు సీతాదేవి, శ్రీరామచంద్రమూర్తిని వధూవరులను చేస్తారు. శుక్రవారం ఉదయం పది గంటల నుంచి సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. 28 తేదీన ప్రత్యేక పూజలు, 29 తేదీన పండిత సదస్యం, 30, 31 తేదీలలో సీతారాములకు ప్రత్యేక పూజలు, ఏప్రిల్ ఒకటో తేదీన సీతారాముల వారి వన విహారోత్సవం, రెండో తేదీన శ్రీ చక్రస్నానం, దండియాడింపు, మూడో తేదీ రాత్రి రామాలయంలో నిర్వహించే శ్రీపుష్పయాగంతో కార్యక్రమాలు ముగుస్తాయి. -
కాసులకే కూటమి నాయకుల ప్రాధాన్యం
కడియం: కాసులు కూడబెట్టుకునేందుకే కూటమి నాయకులు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని, గోదావరి లంకల్లో జరుగుతున్న మట్టి అక్రమ తవ్వకాలే దీనికి నిదర్శమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. కడియం మండలం వీరవరం రెవెన్యూ పరిధిలోని గోదావరి లంకల్లో సర్వే నెం.147లో మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని మంగళవారం ఆయన పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వంలో నాయకులు.. సొమ్ములను కూడబెట్టుకోవడానికే ప్రాధాన్యమిస్తున్నారన్నారు. అధికారులను ప్రలోభపెట్టో, భయపెట్టో, వారితో నిరంకుశంగా వ్యవహరించో ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారన్నారు. పదే పదే మీడియాలో వైఎస్సార్ సీపీ ఈ విషయాన్ని తెలియజేస్తూనే ఉందన్నారు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్న రూరల్ నియోజకవర్గంలో ఒక భారీ అవినీతి కార్యక్రమం ఇక్కడ జరుగుతోందన్నారు. పూలతోటలు సాగు చేసే భూములకు పక్కనే గోదావరి లంకల్లో మట్టిని అక్రమంగా తవ్వేస్తున్నారన్నారు. ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్, ఇప్పుడు మంత్రిగా ఉన్న కందుల దుర్గేష్ 2022లో ఇక్కడ తవ్వకాలు జరుగుతుంటే చాలా హడావుడి చేశారని గుర్తు చేశారు.లంకల్లో మట్టి తవ్వితే ఆ గోతుల్లో జింకలు పడి చచ్చిపోతాయని, పర్యావరణానికి తీరని నష్టం ఆందోళనకు దిగారన్నారు. కానీ ఇప్పుడు ఈ స్థాయిలో మట్టి దోపిడీ జరుగుతుంటే వారిద్దరూ ఏమైపోయారో అర్థం కావడం లేదన్నారు. గోరంట్ల బుచ్చయ్యచౌదరికి కూడా గతంలో ఈ నియోజకవర్గంలో జరిగే అక్రమాలను ఆయన దృష్టికి తానే స్వయంగా తీసుకువచ్చానన్నారు. కానీ ఆయన స్పందించడం లేదన్నారు. నిబంధనలకు విరుద్ధం వేణు మాట్లాడుతూ అధికారులు అనుమతులిచ్చిన భూములకు మూడు బ్యాంకుల్లో లోన్లు తెచ్చారన్నారు. ఆ రుణాలు తీర్చకపోవడంతో బ్యాంకర్లు ట్రిబ్యునల్కు వెళ్లారన్నారు. అక్కడ తీర్పు పెండింగ్లో ఉండగా సదరు భూముల్లో అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. రూ.2 వేలకు బిల్లు ఇచ్చి రూ.9 వేల నుంచి రూ.12 వేలకు మట్టి అమ్ముతున్నారన్నారు. నదీ గర్భంలో మట్టి తీయడం వాల్టా చట్టానికి వ్యతిరేకమని, అసలు ఈ రాష్ట్రంలో చట్టం అమలులో ఉందా? లేదా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. దీనిపై ఏ ఒక్క అధికారి పర్యవేక్షణ లేదన్నారు. మట్టి తవ్వకాల కారణంగా వరదల సమయంలో పక్కనే ఉన్న తమ పొలాలు కూడా కోతకు గురవుతాయని సమీప రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ అక్రమ తవ్వకాలకు కలెక్టర్, మైన్స్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అందరూ బాధ్యత వహించాలని వేణు అన్నారు. ప్రతి దానికీ స్పందించే బుచ్చయ్య.. ఇక్కడ జరిగే తప్పులపై ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ఇప్పటికే కూటమి ప్రభు త్వం పనితీరు కారణంగా పోలవరం ప్రాజెక్టులో రూ.వెయ్యి కోట్ల ప్రజల సొమ్ము గంగపాలు చేశారని, ప్రస్తుతం తవ్వకాలు జరుగుతున్న భూముల్లో అనుమతులు ఏ ప్రాతిపదికన ఇచ్చారన్న దానిపై కలెక్టర్ సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలన్నారు. కాగా.. వైఎస్సార్ సీపీ నాయకుల పరిశీలన నేపథ్యంలో అక్రమ తవ్వకాలను నిలిపివేసి, యంత్రాలు, లారీలను అక్కడి నుంచి తరలించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల వీర్రాజు, మండల అధ్యక్షుడు యాదల సతీష్చంద్ర స్టాలిన్, నాయకులు ఈలి గోపాలం, తాడాల విష్ణుచక్రవర్తి, కొత్తపల్లి శివాజీ, బోడపాటి సత్య నారాయణ, తిరుమలశెట్టి శ్రీనువాసు, కొత్తపల్లి మూర్తి, గాద రామకృష్ణ, సింగంశెట్టి శ్రీను, మార్గాని బలరాం, రత్నం కృష్ణ, తిరుకోటి నాగేశ్వరరావు, సాకా కిరణ్కుమార్, నరమామిడి బాలరాజు, ఈలి కొండబాబు, ఎంపీటీసీ ఆకుల సుధాకర్ పాల్గొన్నారు. ·˘ ÌS…MýSÌZÏ Ð]l$sìæt A{MýSÐ]l$ ™èlÐ]lÓ-M>Ìôæ దానికి నిదర్శనం ·˘ OÐðlG-ÝëÞÆŠ‡ ïÜï³ hÌêÏ A«§ýlÅ-„ýS$yýl$, మాజీ మంత్రి వేణు -
క్షయ వ్యాధిపై అవగాహన అవసరం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): క్షయ వ్యాధిపై నిర్లక్ష్యం వీడి, ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘ స్వరూప్ అన్నారు. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా మంగళవారం రాజమహేంద్రవరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్ట్స్ కళాశాలలో సమావేశం నిర్వహించారు. ముందుగా రాబర్ట్ కోచ్ చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు. క్షయ వ్యాఽధిపై నిర్వహించిన అవగాహన పోటీలలో విజేతలకు సర్టిఫికెట్లు అందజేసి, ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ 1882లో రాబర్ట్ కోచ్ క్షయవ్యాధికి కారణమైన జీవాణువును కనుగొనడం వైద్య రంగంలో ఒక గొప్ప మైలురాయన్నారు. ప్రజల భాగస్వామ్యంతో క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చన్నారు. జిల్లా కుష్ఠు నివారణ అధికారి డాక్టర్ ఎన్.వసుంధర మాట్లాడుతూ కుష్ఠు వ్యాధిని నిర్మూలిద్దాం, ప్రజల భాగస్వామ్యం కీలకం అనే నినాదంతో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ సభ్యులు, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. నేటి నుంచి పొగాకు కొనుగోళ్లు దేవరపల్లి: రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో బుధవారం పొగాకు కొనుగోళ్లను ప్రారంభిస్తున్నట్టు టుబాకో బోర్డు రీజినల్ మేనేజర్ జె.సురేంద్ర కుమార్ తెలిపారు. ఆయన మంగళవారం దేవరపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పొగాకు బయట అమ్మకాలను నియంత్రించడానికి గ్రామస్థాయిలో విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. బోర్డు చైర్మన్ సీహెచ్ యశ్వంత్ కుమార్ జంగారెడ్డిగూడెంలో వేలం ప్రారంభిస్తారని, అనంతరం ఐదు వేలం కేంద్రాలను సందర్శిస్తారన్నారు. గ్రామస్థాయి విజిలెన్స్ కమిటీలకు రైతులు సహకరించాలని, పొగాకు అక్రమ అమ్మకాల సమాచారాన్ని విజిలెన్స్ కమిటీకి తెలియజేయాలన్నారు. గత ఏడాది ఐదు వేలం కేంద్రాల్లో సుమారు 4 మిలియన్ల కిలోల పొగాకు బయట అమ్మకాలు జరిగినట్టు సమాచారం ఉందన్నారు. ఈ ఏడాది కిలో సగటు ధర రూ.320 లభించవచ్చునని తెలిపారు. సమావేశంలో వేలం కేంద్రం నిర్వహణాధికారి పి.హేమస్మిత, పొగాకు రైతు సంఘం ప్రతినిధులు కాట్రు భీమరాజు, సత్తి జగదీశ్వరరెడ్డి, యాగంటి వెంకటేశ్వరరావు, దుద్దునూడి హరిబాబు, రైతులు పాల్గొన్నారు. -
జగన్ హయాంలో జిల్లాల పునర్విభజన
వైఎస్సార్సీపీ సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక 2023లో జిల్లాల పునర్విభజన చేపట్టారు. పార్లమెంటు స్థానం ఒక జిల్లాగా తూర్పుగోదావరి, కాకినాడ, అమలాపురం జిల్లాలు ఏర్పాటు చేశారు. రంపచోడవరం నియోజకవర్గాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాలో విలీనం చేయగా ఈ నియోజకవర్గాన్ని చంద్రబాబు ప్రభుత్వం పోలవరం పేరుతో ప్రత్యేక జిల్లాగా చేసింది. ఇదిలా ఉండగా జగన్ హయాంలో రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటైన తూర్పుగోదావరి జిల్లాలోకి కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాలు కలిశాయి. ఇలా ఏడేసి నియోజకవర్గాలతో ఒక జిల్లాను జగన్ ఏర్పాటు చేశారు. పోలవరం జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గంతో కలిపి ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 22 అసెంబ్లీ స్థానాలు, కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. -
31 నాటికి నూరు శాతం పన్నులు వసూలు చేయాలి
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): గ్రామ పంచాయతీల ఆర్థిక పరిపుష్టి, గ్రామీణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు పన్నులే ప్రధాన ఆధారమని, ఈ నెల 31వ తేదీ నాటికి నూరు శాతం పన్నులు వసూలు అయ్యేలా అధికారులు కట్టుదిట్టంగా పనిచేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ కమిషనర్ వీఆర్ కృష్ణతేజ మైలవరపు స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్న అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పనితీరు మెరుగుపర్చుకోని క్షేత్రస్థాయి పంచాయతీ సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. స్థానిక ఆనం కళాకేంద్రంలో గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై పంచాయతీ సెక్రటరీలు, గ్రామ అభివృద్ధి అధికారులు, ఎంపీడీవోలు, ఇతర అధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కృష్ణతేజ మాట్లాడుతూ జిల్లాలోని కొన్ని గ్రామ పంచాయతీలలో భారీ మొత్తంలో పన్నులు పెండింగ్లో ఉన్నాయని పేర్కొంటూ, ఎంపీడీవోలు ప్రత్యేక దృష్టి సారించి వసూలు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. జిల్లా పంచాయతీ అధికారి వి.శాంతకుమారి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికి రూ.82 కోట్ల పన్ను వసూలు జరిగినట్లు తెలిపారు. గ్రామాల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మిగిలిన పన్నుల వసూలు త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సమావేశంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జెడ్పీ సీఈవో వీవీ లక్ష్మణ్, డీడీవోలు పి.వీణాదేవి, ఎ.స్లీవారెడ్డి, డీఎల్పీవో ఎం.నాగలత తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు పాలనలో క్రైస్తవులకు రక్షణ కరవు
రాజమహేంద్రవరం రూరల్: చంద్రబాబు ప్రభుత్వంలో క్రైస్తవులకు రక్షణ కరవైందని వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బొల్లవరపు జాన్ వెస్లీ అన్నారు. కొంతమూరులోని ఎంవీఎస్ ఫంక్షన్ హాల్లో వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్య క్షుడు విజయసారథి ఆధ్వర్యంలో మంగళవారం పాస్టర్ ప్రవీణ్ పగడాల ప్రథమ వర్ధంతి సందర్భంగా క్రైస్తవ సభ నిర్వహించారు. జాన్వెస్లీతో పాటు వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, రా ష్ట్ర ఉపాధ్యక్షుడు కె.జాన్ వెస్లీ, రాష్ట్ర కార్యదర్శి ఎం.శ్రవణ్ కుమార్, ఉప కార్యదర్శి వై.రాజా, తూ ర్పుగోదావరి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు తరలివచ్చి.. పాస్టర్ ప్రవీణ్ పగడాల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎంపీ భరత్రామ్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం మొదటి నుంచీ క్రైస్తవులను అణగతొక్కాలనే చూస్తోందన్నారు. రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తండ్రి అప్పారావు ఇటీవల దళితుడైన జాన్ను చంపేస్తానని, లేపేస్తానని దుర్భాషలాడిన విషయం అందరికీ తెలుసునన్నారు. జిల్లా అధ్యక్షుడు మారేళ్లపూడి విజయసారథి మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల ప్రథమ వర్ధంతి సందర్భంగా రాష్ట్రంలో ఈ రోజును క్రైస్తవ ఐక్యత దినంగా పాటించబోతున్నామన్నారు. ఫ వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్వెస్లీ ఫ పాస్టర్ ప్రవీణ్ పగడాల వర్ధంతి సభ ఫ పాల్గొన్న మాజీ ఎంపీ భరత్రామ్ -
భక్తి పతాక స్థాయిలో..
ఇనుగంటివారిపేటలో నాలుగు రోడ్ల కూడలి మధ్య ధ్వజస్తంభం ఫ ఇనుగంటివారిపేట గ్రామం మధ్యలో ధ్వజస్తంభం ప్రతిష్ఠ ఫ ఆలయాలు లేకుండానే ఏర్పాటు ఫ అక్కడ కోరిన కోర్కెలు తీరతాయని ప్రజల నమ్మకం ఫ ప్రత్యేకతను చాటుతున్న వైనం సీతానగరం: ఆలయాల్లో ధ్వజస్తంభం ఎంతో పవిత్రమైంది.. ఇది గర్భగుడికి ఎదురుగా ఉంటోంది.. భక్తుని చూపుని నేరుగా దేవునిపై పడేలా చేస్తోంది. మూలవిరాట్కు, భక్తులకు మధ్య వారధిగా ఉంటోంది. ఆలయానికి పూర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది. అయితే ఆ గ్రామంలో ధ్వజస్తంభానికి ఎంతో విశిష్టత ఉంది. ఇది ఆలయానికి ఎదురుగా కాకుండా, ఊరి మధ్యలో ఉండడం ప్రత్యేకతను చాటుతోంది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ఇనుగంటివారిపేటలో ఊరి మధ్యలో ఉన్న ధ్వజస్తంభం ఆధ్యాత్మికతను చాటుతుంది. ఆ విశేషమేమిటో తెలుసుకుందాం రండి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏ గ్రామంలో లేని విధంగా సీతానగరం మండలం ఇనుగంటివారిపేట గ్రామం నడిబొడ్డున కూడలి మధ్యలో పెరుమాళ్ల ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు. దీనిని తొంభై మూడేళ్ల్ల కిందట ప్రతిష్ఠించారు. కాలానుగుణంగా అది శిథిలావస్థకు చేరుకోవడంతో 2019 జూన్లో పునర్నిర్మించారు. ఇక్కడి ధ్వజస్తంభానికి విశిష్టత ఉంది. ఏ గ్రామంలోనైనా ఆలయాల వద్ద ధ్వజస్తంభం ప్రతిష్ఠించడం చూస్తుంటాం. కానీ ఇక్కడ ఏ ఆలయమూ ఉండదు. నాలుగు రోడ్ల కూడలి మధ్యలో ధ్వజస్తంభం ఉంటోంది. ప్రధానంగా విష్ణాలయం, శివాలయం, రామాలయం వంటి పలు దేవాలయాల వద్ద ధ్వజస్తంభం ప్రతిష్ఠిస్తారు. అయితే ఇనుగంటివారిపేటలో పలు ఆలయాలున్నా, వాటి వద్ద ధ్వజస్తంభం మాత్రం లేదు. గ్రామం నడిబొడ్డున మాత్రం ఉంటోంది. ఆలయాలు ఉన్నా.. ఇనుగంటివారిపేట గ్రామం మధ్యలో ఉన్న పెరుమాళ్ల ధ్వజస్తంభానికి ఉత్తర, దక్షిణ దిక్కుల్లో రామాలయాలు, తూర్పున శ్రీశాంతి దుర్గమ్మ వారి ఆలయం, పడమర దిక్కున శ్రీలంకాలమ్మ వారు కొలువై ఉన్నారు. ఇవే కాకుండా గ్రామంలో శ్రీలక్ష్మీ గణపతి ఆలయం, షిర్డీసాయిబాబా ఆలయం, భక్తాంజనేయ స్వామివారి ఆలయం ఉన్నా, ఏ ఆలయం వద్ద ధ్వజస్తంభం ప్రతిష్ఠించలేదు. పదహారేళ్ల క్రితం ముగ్గళ్ల పంచాయతీ నుంచి విడిపోయి ఇనుగంటివారిపేట పంచాయతీగా మారింది. 1933లో ప్రతిష్ఠించిన పెరుమాళ్ల ధ్వజస్తంభం శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామస్తుల సహకారంతో 2019 జూన్ 20న తిరిగి పునః ప్రతిష్ఠించారు. ఇక్కడ భక్తితో కొలిస్తే అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడ పూజలు చేస్తుండడం ఆచారంగా వస్తోంది. ఎందుకు నెలకొల్పారంటే.. పూర్వ కాలంలో ముగ్గళ్ల, ఇనుగంటివారిపేట గ్రామాలు ఇనుగంటి మహారాజు పాలనలో ఉండేవి. అయితే ముగ్గళ్లలో శివాలయం ఉన్నందున, అక్కడ ధ్వజస్తంభం ప్రతిష్ఠించారు. శైవ, వైష్ణవ ఆగమాలను అనుసరించి ఏ గ్రామంలోనైనా శివాలయం, లేకుంటే ధ్వజస్తంభం ఉండాలి. ఇనుగంటివారిపేటలో శివాలయం లేనందున 1933లో గ్రామ పెద్దలు గ్రంథి పుల్లయ్య, సత్యం మావయ్యకాపు, బిక్కిన వెంకట్రావులు ఆగమాలను అనుసరించి, ఆ గ్రామ నడిబొడ్డులో ఉన్న కూడలి మధ్యలో పెరుమాళ్ల ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. ధ్వజస్తంభం ఉన్న గ్రామాలు సుభిక్షంగా ఉంటాయని, సకల దేవతలు కొలువై ఉంటారని, విజయానికి సంకేతమని ఆ రోజుల్లో ప్రజలు విశ్వసించి గ్రామం మధ్వలో ఈ ధ్వజస్తంభం నెలకొల్పారు. ఎంతో విశిష్టమైంది తొంభై మూడేళ్ల్ల కిందట గ్రామం మధ్య కూడలి వద్ద పెరుమాళ్ల ధ్వజస్తంభం ప్రతిష్ఠించారు. దానిని 2019 జూన్లో పునః ప్రతిష్ఠించారు. పెరుమాళ్ల ధ్వజస్తంభం వద్దకు వచ్చి అనుకుంటే ఏ పనైనా జరుగుతుందని, విజయం చేకూరుతుందని ప్రజల ప్రగాఢ నమ్మకం. గ్రామం మధ్యలో ఉన్న ధ్వజస్తంభం ఎంతో విశిష్టమైంది. –ఆరాధ్యుల వెంకట నారాయణ, ఇనుగంటివారిపేట కోరిన కోర్కెలు నెరవేరతాయి పెరుమాళ్ల ధ్వజస్తంభం వద్ద కోరిన కోర్కెలు నెరవేరతాయి. గ్రామంలో శివాలయం లేకుంటే ధ్వజస్తంభం లేని గ్రామాలు ఏమీ ఉండవు. ఆనాటి పెద్దలు ఆలోచించి శివాలయం లేని కారణంగా ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకూ పూజలు అందుకుంటుంది. ప్రతి ఏడాది కార్తిక మాసంలో ఆకాశ దీపం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. –సత్యం రాంపండు, సర్పంచ్, ఇనుగంటివారిపేట -
చంద్రబాబు ప్రభుత్వంలో కుల వివక్ష
పి.గన్నవరం: చంద్రబాబు ప్రభుత్వంలో దళితులపై దాడులు, కుల వివక్ష వంటి సంఘటనలు పెరిగాయని భారత రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ కార్యదర్శి డీబీ లోక్ అన్నారు. కుందాలపల్లిలో కాట్రు శ్రీనివాస్ అనే దళితుడి మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలిస్తుండగా, అడ్డుకోవడం క్షమించరాని నేరమన్నారు. బాధిత కుటుంబాన్ని మంగళవారం ఆయన పరామర్శించారు. లోక్ మాట్లాడుతూ దీనిని ప్రత్యేకమైన సంఘటనగా గుర్తించి, కారకులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. దళితులపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. బాధితులకు ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని కోరారు. వారికి న్యాయం జరుగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామన్నారు. గ్రామంలో ఇరువర్గాలూ సంయమనం పాటించాలని, శాంతి భద్రతలను కాపాడాలని డీబీ లోక్ విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట దళిత ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ ములపర్తి సత్యనారాయణ, బొక్కే ప్రసాద్ తదితరులు ఉన్నారు. -
మెరిసిపోయి.. మురిసిపోయి
ఫ ఆధ్యాత్మిక కాంతుల్లో నిర్మలగిరి ఫ కనువిందు చేస్తున్న పుణ్యక్షేత్రం దేవరపల్లి: ఆధ్యాత్మిక కాంతులతో నిర్మలగిరి పుణ్యక్షేత్రం మెరిసిపోతోంది.. చూసిన భక్తుల మది మురిసిపోతోంది.. గౌరీపట్నం నిర్మలగిరి పుణ్యక్షేత్రంలో మేరీమాత ఉత్సవాల సందర్భంగా ఏర్పాటైన విద్యుత్ దీపకాంతులు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. క్రైస్తవులే కాకుండా ఇతర మతస్తులు కూడా పుణ్యక్షేత్రానికి తరలివచ్చి వీక్షిస్తున్నారు. పుణ్యక్షేత్రంలోని కలవర కొండపై ఉన్న క్రీస్తు ఆలయం, దిగువన ప్రార్థనా మందిరం, అఖండ దేవాలయం, ప్రధాన ద్వారం వద్ద మరియ తల్లి స్వరూపం, ప్రధాన ద్వారం ఎదురుగా ఫాతిమా టవర్ విద్యుత్ దీపకాంతులతో కొత్త శోభను అద్దుకున్నాయి. ఈ నెల 22న ప్రారంభమైన నిర్మలగిరి మేరీమాత ఉత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి ప్రార్థనలు చేస్తున్నారు. మరియ తల్లికి పూజలు చేసి కొబ్బరి కాయలు కొట్టి, తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఏసుక్రీస్తు ఆలయానికి మెట్లపై మెకాళ్లతో నడిచి వెళ్లి మొక్కులు చెల్లించురకుంటున్నారు. రెండు రోజుల నుంచి భక్తుల రద్దీ పెరిగింది. రాత్రి 8 గంటల నుంచి పుణ్యక్షేత్రం భక్తజన సంద్రం అవుతుంది. ఉత్సవాల చివరి రోజు బుధవారం భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. చివరి రోజు రాత్రి పుణ్యక్షేత్రంలో పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమెర, శ్రీకాకుళం పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ విజయ్ కుమార్, పుణ్యక్షేత్రం డైరెక్టర్ ఎస్.జాన్పీటర్, వివిధ ప్రాంతాలకు చెందిన గురువులు, ఫాదర్లు సమిష్ఠి దివ్యబలిపూజ సమర్పిస్తారని నిర్వాహకులు తెలిపారు. ఏలూరు కథోలిక్ తొలి పీఠాధిపతులు, నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రం వ్యవస్థాపకుడు మోస్ట్ రెవరెండ్ జాన్ ములగాడ స్వరూపాన్ని పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమెర, విజయ్కుమార్ ఆవిష్కరిస్తారని పుణ్యక్షేత్రం డైరెక్టర్ జాన్పీటర్ తెలిపారు. -
సృజనమేవ జయతే
ఆలోచనకు సృజన తోడైతే.. పనికిరాని పుల్లలతోనూ అద్భుత కళాఖండాలు తయారు చేయవచ్చు.. అందరితో ఔరా అనిపించుకోవచ్చు. రాజానగరం మండలం వెలుగుబంద జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు బి.పవన్కుమార్ సారథ్యంలో విద్యార్థులు పనికిరాని వస్తువులతో వివిధ బొమ్మలను తీర్చిదిద్దారు. పారేసిన ఐస్క్రీం పుల్లలు, స్ట్రాలతోపాటు అగ్గి పుల్లలు, ధారం, అట్టముక్కలను ఉపయోగించి అందమైన బొమ్మలను చేసి అబ్బురపరిచారు. ‘నో కాస్ట్, నో లాస్’ విధానంలో బోధనోపకరణాలను కూడా రూపొందించవచ్చని పవన్కుమార్ అన్నారు. పాఠశాలలో ప్రతి శనివారాన్ని ‘నో బ్యాగ్ డే’గా అమలు చేస్తున్న తరుణంలో విద్యార్థులచే ఇటువంటివి తయారు చేయించడం ద్వారా సృజనాత్మకతను వెలికితీయవచ్చని అంటున్నారు. –రాజానగరం -
ప్రాణం తీసిన ఈత సరదా
ఫ చెరువులో ఈతకెళ్లిన ఆరుగురు స్నేహితులు ఫ ఇందులో ఇంటర్ విద్యార్థి మృతి కాకినాడ రూరల్: ఈత సరదా ఓ విద్యార్థి ప్రాణం తీసుకుంది.. తిమ్మాపురం పెద్ద చెరువులో ఈ ఘటన జరిగింది. ఈత కోసం ఆరుగురు స్నేహితులు వెళ్లగా ఇందులో ఇంటర్ విద్యార్థి ప్రాణాలను కోల్పోయాడు. తిమ్మాపురం పోలీసుల కథనం ప్రకారం.. రమణయ్యపేట పంచాయతీ పరిధి కొత్తూరు బర్మాకాలనీ చెందిన రెడ్డి మురళీకృష్ణ (16) మరో ఐదుగురు కలసి మంగళవారం మధ్యాహ్నం సరదాగా ఈత కొట్టేందుకు తిమ్మాపురం శివాలయం వద్ద ఉన్న పెద్ద చెరువు దగ్గరకు వెళ్లాడు. ఆ ఆరుగురు సరదాగా ఈత కొడుతుండగా, అంతతో ఊబిలో మురళీకృష్ణ మునిగిపోయాడు. స్నేహితులు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. మిగతా స్నేహితులు ఒడ్డుకు చేరుకుని స్థానికులకు సమాచారం అందించారు. స్థానికులు, గ్రామస్తులు, సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ తదితరులు చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. తిమ్మాపురం పోలీసులు చెరువు వద్దకు చేరుకుని విద్యార్థి కోసం గాలించారు. అనంతరం కాకినాడ అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి తాళ్లు పట్టుకుని నీటి లోపల గాలించడంతో మురళీకృష్ణ మృతదేహం లభ్యమైంది. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తిమ్మాపురం ఎస్సై గణేష్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బర్మాకాలనీలో విషాదం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ఇటీవలే రాసి రెండో సంవత్సరంలోకి చేరుకున్న రెడ్డి మురళీకృష్ణ మృతితో కొత్తూరు బర్మాకాలనీలో విషాదం అలముకుంది. మురళీకృష్ణ తల్లిదండ్రులు మృతి చెందడంతో అమ్మమ్మ సంరక్షణలో ఉన్నాడు. ఈత కోసం తోటి స్నేహితులతో తిమ్మాపురం చెరువు వద్దకు వెళ్లి మనమడు మృతి చెందినట్టు తెలుసుకున్న అమ్మమ్మ, ఇతర కుటుంబ సభ్యులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. -
ప్రేమ పేరుతో మోసం
యువకుడిపై పోక్సో కేసు నమోదు ఐ.పోలవరం: ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ బాలికను మోసగించిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఐ.పోలవరం ఎస్సై రవీంద్రబాబు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఐ.పోలవరం మండలం పరిధి ఎదుర్లంక గ్రామానికి చెందిన బాలిక (17)ను అదే గ్రామానికి చెందిన యువకుడు కమిడి హరినారాయణ ప్రసాద్ పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. పలుసార్లు శారీరకంగా దాడి చేసినట్టు బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. దీనిపై అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ ఐ.పోలవరం పోలీస్ స్టేషన్కు వచ్చి విచారించారు. నిందితుడిని అరెస్ట్ చేస్తామని డీఎస్పీ ప్రసాద్ విలేకరులకు తెలిపారు. పనిముట్లు ధ్వంసం చేస్తున్న ముఠా అరెస్ట్ నల్లజర్ల: సింగరాజుపాలెంలో ఈ నెల 23న అర్ధరాత్రి కొఠారు నారాయణరావుకు చెందిన పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు పొలంలో చొరబడి పంటను, వ్యవసాయ పనిముట్లను ధ్వంసం చేస్తున్న సమయంలో కాపలాదారులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇదే గ్రామానికి చెందిన కొఠారు ప్రదీప్ చక్రవర్తి, ఉంగుటూరుకు చెందిన జీవరత్నం, రాంబాబుతో పాటు మరో ఆరుగురు ఆటోపై వచ్చి నారాయణరావు పొలంలో దోసపాదులు, ఆయిల్పామ్ మొక్కలు, బొప్పాయి తదితర పంటలను ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పొలం కాపలాదారులు ఇందులో ఆరుగురిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవికుమార్ తెలిపారు. -
అక్రమ మట్టి తవ్వకాలపై వైఎస్సార్సీపీ ఆందోళన
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం పొట్టిలంకలో అక్రమ మట్టి తవ్వకాలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు కలిసి మట్టిని తరలిస్తున్న లారీలను అడ్డుకున్నారు. ఎన్జీటి నిబంధనలను ఉల్లంఘిస్తూ సర్వే నెంబర్ 147లో అడ్డగోలుగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. నదీ గర్భానికి తూర్పు పొడుస్తూ తవ్వకాలు జరగడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది.దొంగ పట్టాలు సృష్టించి మట్టి తవ్వకాలు జరుపుతున్న కూటమి నేతలపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. లారీ మట్టి ఒక్కొక్కటి రూ.14,000కి అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం. దీంతో మట్టి మాఫియా ఇంతగా చెలరేగిపోతున్నా.. స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాత్రం మౌనంగా ఉన్నారని వైఎస్సార్సీపీ నేతలు విమర్శించారు. ఈ అక్రమ తవ్వకాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. పర్యావరణాన్ని కాపాడే దిశగా తక్షణ చర్యలు అవసరమని వైఎస్సార్సీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. -
దగ్గురలో ముప్పు
ఫ క్షయను నిర్లక్ష్యం చేయొద్దు ఫ సకాలంలో చికిత్సతో వ్యాధి నయం ఫ డాట్స్ థెరపీతో నివారణ సాధ్యం ఫ నేడు ప్రపంచ టీబీ నివారణ దినోత్సవం ఆలమూరు/ రాయవరం: దగ్గరలోనే ముప్పు ఉంది.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా లొంగదీసుకుంటోంది. క్షయ వ్యాధిని ముందుగా గుర్తించి సకాలంలో చికిత్స చేస్తే నివారణ సాధ్యమవుతోంది. ఈ ప్రాణాంతక ట్యూబర్ క్యులోసిస్ (క్షయ) వ్యాధిని నిర్మూలించేందుకు ప్రత్యేక వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. క్షయ (టీబీ) వ్యాధి రహిత సమాజమే లక్ష్యంగా జాతీయ వైద్యారోగ్య శాఖ చర్యలు తీసుకుంటోంది. 2028 నాటికి ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు డబ్ల్యూహెచ్ఓ తగిన ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. మంగళవారం ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇది. ట్యూబర్ క్యులోసిస్ అనే సూక్ష్మక్రిమి ద్వారా టీబీ వస్తుందని 1882 మార్చి 24న జర్మనీ శాస్త్రవేత్త రాబర్ట్కాక్ కనుగొన్నాడు. అప్పటి నుంచి ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వ్యాధి ఉన్నవారు దగ్గినప్పుడు ఈ బ్యాక్టీరియా గాలిలో కలసి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ప్రతి లక్ష మంది జనాభాలో 203 మందికి క్షయ వ్యాధి సోకుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 123 గ్రామీణ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 52.86 లక్షల మంది జనాభా ఉన్నారు. ఇప్పటి వరకూ నమోదైన సుమారు ఐదు వేల కేసులకు సంబంధించి క్షేత్ర స్థాయిలోని ఆరోగ్య, ఆశ సిబ్బంది రోగుల వద్దకు వెళ్లి మందులు సక్రమంగా వాడే విధంగా చైతన్యం నింపుతున్నారు. దీంతో వ్యాధి త్వరితగతిన తగ్గుముఖం పట్టి ఏటా రోగుల సంఖ్య తగ్గుతుందని జిల్లా వైద్యారోగ్య శాఖ గణాంకాలు తెలుపుతున్నాయి. ఇదిలా ఉంటే తూర్పు గోదావరి జిల్లాలో గతేడాది జనవరి నుంచి డిసెంబర్ వరకూ 2,601 మంది క్షయ బాధితులను గుర్తించారు. ఇందులో 1,780 మంది పూర్తి వైద్యం పొందగా, 821 మంది ఇప్పటికీ చికిత్స అందిస్తున్నారు. 549 మందికి దాతల ద్వారా ఫుడ్ బాస్కెట్ పేరుతో పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో సీబీ నాట్ మిషన్ ఉంది. నమోదవుతున్న కేసుల్లో చాలామందికి డాట్స్ కీమో థెరపీ ద్వారా నయం చేయడం జరుగుతుంది. మూడు రకాలు క్షయ శరీరంలోని ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి మూడు రకాలుగా ఉంటుంది. అందులో ద్రవాల తడితో కూడిన (వెబ్ టైప్) మొదటి రకం కాగా, ఉదరకోశ కండరాలను ముద్దలా చేసే పొడిరకపు (డ్రై టైప్) రెండో రకం, శరీరంలో కంతుల మాదిరిగా సంభవించే (ఒమెంటమ్) మూడో రకంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్షయ వ్యాధికి గురైన వ్యక్తి తుమ్మినప్పుడు కాని దగ్గినప్పుడు కాని నోటి, ముక్కు నుంచి వెలువడే గాలిలోని తుంపర్ల ద్వారా బ్యాక్టీరియా కారకాలతో ఇతరులకు వస్తుందని వైద్యులు చెబుతున్నారు. డాట్ చికిత్స ద్వారా కాని నూతనంగా ప్రవేశపెట్టిన ఎఫ్డీసీ విధానంలో క్రమం తప్పకుండా మందులు వాడాల్సి ఉంటుంది. ● వ్యాధి గుర్తింపు ముఖ్యం క్షయ వ్యాధిగ్రస్తులను తొందరగా గుర్తించి, వైద్యుల సూచనలు పా టించి పూర్తి కాలం వైద్యం తీసు కుంటే నయం అవుతుంది. ఈ వ్యాధిని గుర్తించకుంటే ఆ రోగి ఏడాదికి 10–15 మందికి వ్యాధిని కలగజేస్తాడు. క్షయ వ్యాధికి అవసరమైన మందులు ప్రతి పీహెచ్సీలో ఉచితంగా అందజేస్తారు. డయాబెటిక్ రోగులతోపాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గడంతో తొందరగా వ్యాపించే అవకాశం ఉంది. –ఎన్.వసుంధర, జిల్లా క్షయ నివారణ అధికారి, రాజమహేంద్రవరం ● నివారణకు ప్రత్యేక చర్యలు క్షయ వ్యాధితో బాధపడుతున్న రోగులను గుర్తించి సత్వరమే మెరుగైన చికిత్స అందిస్తున్నాం. ప్రభుత్వం సమకూర్చిన విలువైన మందులను అందిస్తున్నాం. క్రమం తప్పకుండా ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణ చేసేలా చూస్తుంన్నాం. అలాగే పోషకాహార కిట్లను పంపిణీ చేస్తున్నాం. –ఎం.సుమలత, అడిషనల్ డీఎంహెచ్ఓ, కొత్తపేట వ్యాధి లక్షణాలివే.. క్షయ సోకిన రోగికి రెండు వారాలకు మించి ఎడతెరిపి లేకుండా దగ్గు వస్తుంది. అప్పుడే క్షయగా అనుమానించాలి. సాయంత్రం పూట జ్వరం రావడం, నిద్ర పట్టకపోవడం, ఛాతిలో నొప్పి, బరువు తగ్గడం, ఉమ్మిలో రక్తం పడడం, ఆయాసం, త్వరగా అలసిపోవడం తదితర కారణాలతో రోగి నీరసించిపోతాడు. క్షయ క్రిమి శరీరంలోకి ప్రవేశించిన వెంటనే వ్యాధి రూపం దాల్చదు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో వ్యాధి తొందరగా వస్తుంది. హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు క్షయ తొందరగా వచ్చే అవకాశం ఉంది. ఎయిడ్స్ వ్యాధికి గురైన వారిలో మూడో వంతు క్షయ వ్యాధితోనే మరణిస్తున్నారు. క్షయ వ్యాధి దగ్గినా, తుమ్మినా, ఉమ్మినా, మాట్లాడిన సమయంలో వ్యాధికారక క్రిములు గాలిలోకి సన్నని తుంపర్లగా బయటకు వస్తాయి. ఈ తుంపర్లను ఆరోగ్యవంతులు శ్వాస ద్వారా పీల్చినప్పుడు క్షయ వ్యాధికి గురవుతారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫ పుట్టిన బిడ్డకు వెంటనే బీసీజీ టీకాను అందించాలి. ఫ దగ్గు వచ్చినప్పుడు నోటికి వస్త్రాన్ని అడ్డుగా పెట్టుకోవాలి. ఫ వ్యాధి సంక్రమించిన వ్యక్తి నిర్ధేశించిన సమయం వరకూ మందులు వాడాలి. ఫ వ్యాధి సోకిన వ్యక్తి ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరికీ పరీక్షలు చేయాలి. -
పక్కకు దిగపడి
రోడ్డు దిగబడుతోంది.. ఏ క్షణాన ఏ ప్రమాదం సంభవిస్తుందోనని ఆందోళన కలిగిస్తోంది. పెదపూడి మండలం చింతపల్లి పరిధిలో ఆర్అండ్బీ రోడ్డు బెర్ములు పెద్ద కాలువలోకి జారిపోతున్నాయి. నిత్యం చింతపల్లి గ్రామం మీదుగా అటు కాండ్రేగుల, కరప, కాకినాడ.. ఇటు రామచంద్రపురం, జి.మామిడాడ గ్రామాలకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇక్కడ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. –పెదపూడి ఏముందీ బురదే.. నిత్యం రద్దీగా ఉండే గోపాలపట్నం – తొండంగి ప్రధాన రహదారిలో గుంతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోపాలప ట్నం శివారులో భారీ గుంతలు పడ్డాయి. ఇక్కడ వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. కొద్ది నెలల క్రితం అధికారులు తాత్కాలికంగా మరమ్మతులు చేసినా మళ్లీ మామూలే అయ్యింది. గ్రావెల్, బండ రాళ్లతో టిప్పర్లు వెళ్తుండడంతో కొద్ది రోజులకే ఇలా పాడవుతోంది. రెండు రోజుల క్రితం కొద్దిపాటి చినుకులకే ఇలా బురదగా మారింది. –తొండంగి -
తాళం వేసిన ఇంట్లో చోరీ
ఫ రూ.20 లక్షల విలువైన ఆభరణాలు మాయం ఫ సామర్లకోటలో సంఘటన సామర్లకోట: స్థానికంగా ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. సామర్లకోట అంబటివారి తోటలోని తన ఇంట్లో విశ్రాంత ఉపాధ్యాయురాలు మట్టిపల్లి లక్ష్మీదేవి (82) ఉంటున్నారు. ఈ నెల 13న ఇంటికి తాళం వేసి బంధువులతో కలసి హైదరాబాద్లో పెళ్లికి వెళ్లారు. బంధువులు తిరిగి సామర్లకోట వచ్చినప్పటికీ లక్ష్మీదేవికి జ్వరంగా ఉండడంతో హైదరాబాద్లో ఉండిపోయారు. రోజూ పని మనిషి సాయంత్రం వచ్చి ఇంటి ఆవరణ శుభ్రం చేస్తుంది. సోమవారం సాయంత్రం ఇంటి ఆవరణ శుభ్రం చేస్తుండగా, ప్రధాన ద్వారం తెరిచి ఉండటం గమనించింది. వెంటనే సమీపంలోని లక్ష్మీదేవి బంధువు వజ్జులు మాస్టారుకు సమాచారం ఇచ్చింది. ఇంటి వద్దకు చేరుకున్న ఆయన దొంగతనం జరిగినట్లు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ ఎ.కృష్ణభగవాన్, ఎస్సై రాజా, క్రైం ఎస్సై కృష్ణారావు, సిబ్బంది సంఘటనా ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. సీఐ కృష్ణభగవాన్ హైదరాబాద్లో ఉన్న లక్ష్మీదేవికి ఫోన్ చేసి ఇంట్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సుమారు 140 గ్రాముల బంగారు, మూడు కిలోల వెండి, రూ.50 వేల నగదు బీరువాలో ఉంచినట్లు ఆమె వివరించారు. దొంగలు సీసీ కెమెరాలు పని చేయకుండా చేసి, ఇంటి తాళాలు బద్దలు కొట్టి బీరువాలోని వెండి, బంగారం, నగదును తస్కరించారు. సుమారు ఏడాది క్రితం తన భర్త వెంకట్రావు చనిపోవడంతో ఆయన పేరున బ్యాంకు లాకరులో ఉన్న బంగారు, వెండి ఆభరణాలను ఇటీవల ఇంటికి తీసుకువచ్చి బీరువాలో భద్రపరిచినట్లు బాధితురాలు తెలియజేసింది. పెళ్లి నిమిత్తం కొన్ని బంగారు ఆభరణాలను వెంట తీసుకువెళ్లానన్నారు. వేలిముద్ర నిపుణులు వచ్చి వివరాలు సేకరించారు. బాధితురాలి ఇంటి ఎదురుగా ఉన్న సీసీ కెమెరా పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ ప్రాంతానికి వచ్చిన కొత్తవారి సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా దొంగలను గుర్తించే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెట్రోల్ బంకు వద్ద మోటార్ సైకిల్ దగ్ధం
సురక్షితంగా వాహనచోదకులు పి.గన్నవరం: పోతవరం గ్రామ శివారులో ఉన్న బంకు వద్ద ఒక మోటారు సైకిల్ కాలిపోయింది. దానిపై ఉన్న ముగ్గురు ప్రయాణికులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం సుంకరపాలెం గ్రామానికి చెందిన బాలు అనే విద్యార్థి పదో తరగతి పరీక్షలను అమలాపురం రూరల్ మండలం బండారులంక హైస్కూల్లో ప్రైవేట్గా రాస్తున్నాడు. ఈక్రమంలో సోమవారం జరిగిన సైన్స్ పరీక్షకు ఆ విద్యార్థిని తండ్రి గంగులూరి రాజు, తల్లి జ్యోతి మోటారు సైకిల్పై బండారులంకకు తీసుకువచ్చారు. పరీక్ష రాసిన అనంతరం మోటారు సైకిల్పై స్వగ్రామానికి తిరిగి బయల్దేరారు. పోతవరంలోని బంకు వద్ద పెట్రోల్ కొట్టించుకుని తిరిగి మోటారు సైకిల్ స్టార్ట్ చేస్తుండగా, సీటు కింద నుంచి మంటలు వ్యాపించాయి. దీంతో రాజు మోటారు సైకిల్ను బంకు నుంచి కాస్త ముందుకు తీసుకువెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బంకు సిబ్బంది ఏబీసీ ఫైర్ ఎక్విప్మెంట్తో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. దీంతో అమలాపురం నుంచి వచ్చిన ఫైరింజన్ మంటలను అదుపు చేసింది. మోటారు సైకిల్ పూర్తిగా కాలిపోవడంతో బాధితుడు రాజు కన్నీటి పర్యంతమయ్యాడు. బంకు వద్ద సరైన ఫైర్ సేఫ్టీ లేదని, నాలుగు ఏబీసీ ఎక్విప్మెంట్స్లో రెండు మాత్రమే పనిచేశాయని, మంటలు ఆర్పేందుకు వాటర్ పైపు కూడా లేదని, దీంతో మోటారు సైకిల్ పూర్తిగా కాలిపోయిందని బాధితుడు రాజు ఆరోపించాడు. -
ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ఫ బాలుడి మృతి ఫ ఎనిమిది మందికి గాయాలు కాకినాడ రూరల్: పుట్టిన రోజు వేడుకలో వారంతా సరదాగా గడిపారు.. తిరిగి తమ ఇళ్లకు బయలు దేరారు.. ఈ నేపథ్యంలో అనుకోని ప్రమాదం ఓ బాలుడిని బలి తీసుకుంది. అలాగే మరో ఎనిమిది మందికి గాయాలు అయ్యాయి. కాకినాడ – సామర్లకోట రోడ్డులో ప్రతాప్నగర్ వంతెన వద్ద సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ఇందులో బాలుడు పలివెల అక్షంత్ (10) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. సామర్లకోట నుంచి ఆటోలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకొనేందుకు 9 మంది ఆటోలో కాకినాడకు వచ్చారు. కాకినాడలో రెండు గదులు అద్దెకు తీసుకుని, అక్కడ వేడుకల అనంతరం వారు తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. ప్రతాప్నగర్ వంతెన వద్దకు వచ్చేసరికి వారి ఆటోను ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో సామర్లకోట బళ్ల మార్కెట్ ప్రాంతానికి చెందిన అక్షంత్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా, ఐదుగురు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వీరబాబు తెలిపారు. -
ఆగని గాండ్రింపులు
ఫ వేములోవలోనే పెద్ద పులి సంచారం ఫ అప్రమత్తంగా ఉండాలని అధికారుల ప్రచారం గంగవరం: పెద్ద పులి ఎక్కడా ఆగడం లేదు.. రోజుకోచోట ప్రత్యక్షమవుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. ప్రస్తుతం గంగవరం మండలంలో దాని జాడలను అధికారులు గుర్తిస్తున్నారు. మూడు రోజులుగా గంగవరం మండలం వేములోవ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. శనివారం రాత్రి ఓ ఆవు దూడను హతమార్చింది. సోమవారం పెద్దపులి గంగవరం మండలం వేములోవ రిజర్వు ఫారెస్ట్లోని ఉయ్యాలమడుగు, గొరగుమ్మి, వేములోవ అటవీ ప్రాంతంలోనే సంచరించినట్లు అడ్డతీగల సబ్ డీఎఫ్ఓ వెంకటసుబ్బారెడ్డి తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు ట్రాకింగ్ ద్వారా పులి సంచారాన్ని కనుగొన్నామని, అటవీ ప్రాంతంలోనే ఉందని ప్రజలు భయాందోళన చెందనవసరం లేదన్నారు. వేములోవ – ఉయ్యాలమడుగు, గొరగుమ్మి అటవీ ప్రాంతంలోనే సంచరిస్తుందన్నారు. బంధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రత్యేక డ్రోన్ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. దీనికోసం శ్రీశైలం నుంచి ప్రత్యేక బృందం వచ్చిందని ఆయన వెల్లడించారు. ప్రజలు రాత్రిళ్లు ఒంటరిగా బయటకు రావొద్దని ప్రచారం నిర్వహించారు. ఫోక్స్పేట ఫారెస్ట్ రేంజర్ పి.శ్రీనివాసరావు, అటవీ శాఖ సిబ్బంది ఉన్నారు. జీడిమామిడి రైతుల్లో గుబులు గంగవరం మండలంలో జీడిమామిడి సాగు చేసే రైతులు ఆ తోటల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. పెద్ద పులి సంచారంతో ఆర్డీ పురం, పిడతమామిడి, వడ్డిచెరువు, పెదగార్లపాడు, చినగార్లపాడు, చిన్నంపాలెం, గొరగుమ్మి, లక్కొండ, గంగవరం తదితర గ్రామాలకు చెందిన గిరిజన రైతులు, మహిళలు జీడి పిక్కలు సేకరించేందుకు వెళ్లడం లేదు. దీంతో సర్వత్రా భయాందోళన నెలకొంది. -
అల్లరి వేళల అప్రమత్తం
రంగంపేట/రాయవరం: పిల్లలు అల్లరి చేస్తేనే అందం. ఆటలాడితేనే ఆరోగ్యం. ఆలోచిస్తేనే మేధోబలం. ఇవన్నీ నియంత్రణలో ఉన్నపుడే వారికీ.. వారి తల్లిదండ్రులకు.. చదువులు చెప్పే గురువులకు గౌరవం.. మన్నన. ఎండల తీవ్రత పెరగడంతో విద్యాశాఖ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 24 వరకు ఒంటిపూట తరగతుల నిర్వహణపై మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు సాగనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు పాఠశాలల నుంచి రాగానే పుస్తకాల సంచీ అవతల పడేసి ఆదరాబాదరగా అన్నం తినేసి స్నేహితులతో ఆటలకు పరుగులెడుతున్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నాయని ఒంటి పూట బడులు పెడితే విద్యార్థులు మళ్లీ ఆ ఎండనే పడి ఆటలాడడం ఆలోచించాల్సి విషయం. జిల్లాలో ఒంటిపూట బడుల నేపథ్యంలో పిల్లల భద్రతను తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఫేట్ మారుస్తున్న ఫీట్స్.. దేశంలో ఏటా రెండు లక్షల మంది చిన్నారులు కాలువలు, చెరువులు, వాగులు, వంకలు, బావుల్లో ఈత సరదా కోసం వెళ్లి మత్యువాత పడుతున్నట్లు యూనిసెఫ్ సర్వే సారాంశం. జిల్లాలో నీటి వనరులకు కొదవు లేకపోవడంతో ఇటువంటి ఘటనలకు ఆస్కారం ఎక్కువ. నీటిని చూడగానే సహజంగానే పిల్లలు ఈతకు ఉపక్రమిస్తుంటారు. స్థానికులైతే కొంత పరవాలేదు కానీ.. చుట్టపుచూపుగా వచ్చిన బంధువుల పిల్లలు, స్నేహితులు అయితే ఆ కాలువో, చెరువో లేదా మరేదైనా దాని లోతెంతో తెలియక.. ఊబి ఉందా.. బంక మట్టి ఉందా తెలియక వాటిలో మునిగిపోయి మృత్యువాత పడుతున్నారు. మరి కొందరు సరిగా ఈత రాక ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు చిన్నారులు తోటి స్నేహితులు ఈదుతున్నారు కదా అని ఈత రాకపోయినా వారు కూడా దిగి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. అలాగే ప్రమాదకర ఫీట్స్ చేసి తగలరాని చోట ఏదో తగిలి.. లేదా నిలువుగా డైవ్ చేసే వేళ నిగ్రహించుకోలేని లోతులకు దూసుకుపోయి ఊపిరాడక ప్రాణాలు కోల్పోతున్నారు. చెట్ల కొమ్మల నుంచి.. కాలువ గట్ల పైనుంచి దూకుతూ దుందుడుకు చర్యలకు పాల్పడుతూ మృత్యువాత పడుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలి ఒంటి పూట బడులు, రానున్న వేసవి సెలవుల నేపథ్యంలో తల్లిదండ్రులతో పాటు అధికారులు మరింత అప్రమత్తమై అత్యవసర చర్యలు తీసుకోవాల్సి ఉంది. కాలువల రేవుల వద్ద, చిన్నారులు ఎక్కువుగా స్నానాలు చేసే ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులు పెట్టాలి. కాలువైనా.. వ్యవసాయ బావులైనా.. నదులైనా ఎక్కడ ఎంత లోతు ఉంది.. పిల్లలు దిగరాదని.. నీటి లోపలి మట్టి జారుడుగా ఉందా.. ఊబులు ఉండే అవకాశం ఉందా.. అట్టడుగున తూటికాడ, గుర్రపుడెక్క ఉండే అవకాశం ఉందా.. దానిలో కాళ్లు చిక్కుకుని మునిగిపోయే ప్రమాదం ఉందా తదితర వివరాలతో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంది.పంచాయతీలు, నీటిపారుదల శాఖలు సంయక్తంగా కాలువ రేవుల వద్ద మెష్లతో కంచెలు నిర్మిస్తే చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. తేలికపాటి ఆహారం మంచిది... వేసవిలో పిల్లలకు త్వరగా జీర్ణమయ్యే తేలికపాటి ఆహారం ఇవ్వాలి. పండ్ల రసాలు తాగించి బడికి పంపాలి. నీరు ఎక్కువగా తాగిస్తూ ఉండాలి. మరీ చల్లని పదార్థాలు ఇవ్వొద్దు. వేపుళ్లు, మాంసాహారం వంటివి వేసవిలో మంచిది కాదు. రాత్రిపూట త్వరగా నిద్రకు ఉపక్రమించేలా, నిద్ర లేచిన తరువాత కొంత సమయం చదువుకునేలా అలవాటు చేస్తే మేధాశక్తి పెరుగుతుంది. – డాక్టర్ వేణుశ్రీలక్ష్మి, పీహెచ్సీ, రంగంపేట మండుటెండల్లోనే ఆటలు విద్యార్థులు ఎండ బారిన పడకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాఠశాల వదిలాక ఇళ్లకు వచ్చే క్రమంలో తలకు టోపీ ధరించడం, ముఖంపై ఎండ పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రవి కిరణాలతో ప్రమాదం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సూర్యుడి కిరణాలు భూమిపై నిటారుగా పడుతుంటాయి. ఈ సమయంలో విడుదలయ్యే అతినీలలోహిత కిరణాలు చర్మంపై పడి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవసరమైతే తప్ప బయట తిరగకపోవడం, ప్రయాణ సమయాల్లో పిల్లలను వాహనాల ముందు భాగంలో కూర్చోపెట్టకుండా వడదెబ్బ నుంచి కాపాడడం అవసరమని వారు సూచిస్తున్నారు. ఆటలలో అజాగ్రత్త వద్దు విద్యార్థులు స్మార్ట్ మొబైళ్లకు బానిసలు కాకుండా నీడ పట్టున ఆడే ఆటలు, విజ్ఞానాన్ని పెంపొందించే పుస్తకాల పఠనం, అన్నింటి కంటే ముఖ్యంగా తల్లిదండ్రులు, బంధువర్గంతో ఎక్కువ సమయం గడపడం అత్యంత ఆవశ్యకం. తద్వారా పెద్దలతో మసలే తీరు తెలుసుకునే అవకాశం, మంచీ చెడూ తెలుస్తాయి. మధ్యాహ్న వేళ కొంత విశ్రాంతి తీసుకునేలా చూడాలి. ఏప్రిల్ 24 వరకూ ఒంటిపూట బడులు మధ్యాహ్నం 12.30 వరకే తరగతులు ఆనక ఆటలకే సమయం వెచ్చిస్తున్న చిన్నారులు వేసవి తాపం వేళ ఈతలకు దిగుతున్న వైనం సరదాల మాటున పొంచి ఉన్న ప్రమాదం కనిపెట్టుకుని లేకుంటే మూల్యం చెల్లించాల్సిందే -
బీసీల అభ్యున్నతికి దొమ్మేటి విశేష కృషి
వెంకటరెడ్డి జయంతి వేడుకలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయినరాజమహేంద్రవరం రూరల్: బీసీ ఉపకులాల అభ్యున్నతికి ఎంతగానో పాటుపడిన మహోన్నత వ్యక్తి దొమ్మేటి వెంకటరెడ్డి అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ కొనియాడారు. సోమవారం బొమ్మూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి 173వ జయంతిని ఆయన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దొమ్మేటి చిత్రపటానికి వేణు నివాళులర్పించి మాట్లాడారు. అందరూ ఐక్యతతో ముందుకు సాగాలని చాటి చెప్పిన వ్యక్తి వెంకటరెడ్డి అన్నారు. ఆయన ఆశయ సాధనకు అందరం పాటుపడాలన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల విద్యకు దూరమైన బడుగు బలహీన వర్గాల పిల్లలకు పాఠశాల వద్దే భోజనం ఏర్పాటు చేసి విద్యను అందించిన విద్యాదాత దొమ్మేటిని స్మరించుకుంటూ, ఆయన చేసిన అనేక సేవలను గుర్తు చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యద ర్శి గిరజాల బాబు, మాజీ ఎంపీపీ రేలంగి వీర వెంకటసత్యనారాయణ, చెల్లుబోయిన నరేన్, వేముల ఏసుబాబు, కట్టా జమిందర్, డాక్టర్ చొల్లంగి సత్యగిరి, పి తాని హరికృష్ణ, చాప రాజా తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ పీజీఆర్ఎస్కు 47 ఫిర్యాదులు
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్కు 47 ఫిర్యాదులు వచ్చాయి. ఎస్పీ డి.నరసింహకిశోర్ ఆర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలపై సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. పీజీఆర్ఎస్కు సివిల్ కేసులు, కుటుంబ సమస్యలు, చీటింగ్ కేసులు, కొట్లాట కేసులు, ఇతర కేసులకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఎంబీఎన్ మురళీకష్ణ పాల్గొన్నారు. కల్తీపాల ఘటనలో మరొకరు డిశ్చార్జి కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కల్తీపాల ఘటనలో రాజమహేంద్రవరం కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జి.వెంకటేశ్వరరావు కోలుకుని సోమవారం డిశ్చార్జి అయ్యారు. గత నెల 16న కల్తీపాలు తాగి 21 మంది రాజమహేంద్రవరంలోని వివిధ ఆసుపత్రుల్లో చేరారు. అయితే వారికి అత్యవసర వైద్య చికిత్సలు అందించినా వీరిలో ఇప్పటి వరకు 17 మంది మృత్యువాత పడ్డారు. నలుగురు వైద్య చికిత్సలు పొందుతుండగా ఈ నెల 16న ఒకరు ఆరోగ్యం మెరుగుపడి డిశ్చార్జి అయిన విషయం తెలిసిందే. దీంతో కల్తీ పాల ఘటనలో కోలుకుని ఇంటికి వెళ్లిన వారి సంఖ్య రెండుకు చేరింది. అయితే ఇంకా ఇద్దరు చిన్నారులు రెయిన్బో చిల్డ్రన్ ఆసుపత్రిలో అత్యవసర వైద్య చికిత్స పొందుతున్నారు. జాతీయ స్థాయి సెపక్ తక్రా పోటీలకు కోనసీమ విద్యార్థులుఅమలాపురం రూరల్: ఈ నెల 24 నుంచి 28 వరకు జార్ఖండ్ రాష్ట్రం రాంచీ వేదికగా 28వ సబ్–జూనియర్ బాల బాలికల జాతీయ స్థాయి సెపక్ తక్రా పోటీలు జరుగుతున్నట్లు జిల్లా అధ్యక్షుడు జవ్వాది తాత బాబు తెలిపారు. కోనసీమ జిల్లా నుంచి గోసంగి సందీప్, జి.శశిధర్ నాగ్, సాయి సూర్య, అప్పారి యశ్వంత్, మట్టపర్తి అవంతి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జిల్లాలో ఈ క్రీడా దినదినాభివృద్ధి చెందుతోందని, దానికి నిదర్శనమే ఈ ఐదుగురు జాతీయ స్థాయికి ఎంపిక అవడమని తెలిపారు. జిల్లాకు చెందిన కేత సాయి దుర్గా ప్రసాద్, రాష్ట్ర బాలుర, బాలికల జట్టు కోచ్గా యాండ్ర గౌతమ్, కోచ్లు గా రాష్ట్ర కార్యదర్శి ఎ.శ్రీనివాసులను నియమించినట్లు తెలిపారు. జిల్లా క్రీడాకారులు రాంచీలో శిక్షణలో ఉన్నారని, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని స్వర్ణ పతకం తీసుకురావాలని తెలిపారు. ఉమ్మడి గోదావరి జిల్లా స్ట్రాంగ్ మెన్ వీరేంద్ర అమలాపురం రూరల్: ఉమ్మడి గోదావరి జిల్లాల స్ట్రాంగ్ మెన్ విన్నర్గా అమలాపురానికి చెందిన ఎం.వీరేంద్ర, రన్నర్గా యశ్వంత్ గెలుపొందారు. హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ ఆధ్వర్యంలో ఈదరపల్లిలో జనహిత కార్యాలయంలో జరిగిన పోటీలు సోమవారంతో ముగిసాయి. పోటీలలో 206 మంది సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, మాస్టర్స్ విభాగాల్లో పోటీ పడగా అమలాపురం హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్కు చెందిన వీరేంద్ర 690 కేజీల బరువును ఎత్తి స్ట్రాంగ్ మెన్గా నిలిచారు. యశ్వంత్ 570 కేజీల బరుఎత్తి రన్నర్గా గెలుపొందారు. ఏప్రిల్ 3, 4, 5 తేదీల్లో విజయనగరం జిల్లా రాజాంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా నుంచి 24 మందిని జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్టు కోచ్ వెంకటేశ్వరరావు తెలిపారు. -
నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టారు
● చంద్రబాబు పాలనలో లక్షల ఉద్యోగాలు పీకేశారు ● 1.72 లక్షల ఖాళీలకు 10,060 పోస్టులకు జాబ్ క్యాలెండరా? ● ప్రజలను మోసగించడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు ● వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా సాక్షి, రాజమహేంద్రవరం: ఉగాది రోజు జాబ్ క్యాలెండర్ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగులకు పచ్చడికి బదులు మట్టి కొట్టిందని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 22 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో 1.72 లక్షల ఉద్యోగులను తీసేశారని అన్నారు. స్థానిక నివాసంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించి నిరుద్యోగులను మోసం చేశారన్నారు. అదే సమయంలో లక్షల మంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నారని.. పైకి మాత్రం జాబ్ క్యాలెండర్ పేరుతో హంగామా చేస్తున్నారని విమర్శించారు. 2024 మార్చి నాటికి రాష్ట్రంలో 11.79 లక్షల మంది ఉద్యోగులు ఉంటే 2025 డిసెంబర్ నాటికి 10.07 లక్షలకు తగ్గారని అసెంబ్లీలో ద్రవ్య విధాన పత్రంలో పేర్కొన్నారన్నారు. హామీ అమలేదీ? 2024లో కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అప్పటి వరకు ఒక్కో నిరుద్యోగికి రూ.3 వేలు భృతి చెల్లిస్తామన్నారు. 22 నెలల కాలంలో మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా పైసా కూడా కేటాయించిన దాఖలాలు లేవని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో వలంటీర్ల జీతాన్ని రూ.10 వేలకు పెంచుతామని గద్దె నెక్కి.. అధికారంలోకి వచ్చాక 2.66 లక్షల మందిని రోడ్డున పడేశారన్నారు. రాష్ట్రంలో ఏటా 75 వేల మంది వయసు, ఇతర కారణాలతో ఉద్యోగాలకు అర్హత కోల్పోతుంటే 10,060 మందికి మాత్రమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం శోచనీయమన్నారు. ఉద్యోగాలు కూడా వచ్చే అక్టోబర్ లోపు విడతల వారీగా భర్తీ చేస్తామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. పోలీస్ శాఖలో 11 వేల పోస్టులు ఖాళీ ఉన్నాయని స్వయంగా డీజీపీ ప్రకటిస్తే కేవలం 2,778 పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. ఆరోగ్య శాఖలో 15 వేలు, పాలిటెక్నిక్ కళాశాలల్లో 975, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో 4,130, జెన్కో 2,307, ఏపీ ట్రాన్స్కో 5,137 ఇలా అన్ని శాఖల్లోనూ వేల సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయన్నారు. రాష్ట్రంలో సుమారు కోటి మంది నిరుద్యోగులు ఉన్నారని పచ్చ పత్రికలో కథనాలు ఇచ్చారన్నారు. ఈ లెక్కన ఒక్కో నిరుద్యోగికి రూ.3 వేలు లెక్కన రూ.66 వేల కోట్లు బకాయి పడ్డారన్నారు. చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా రెండేళ్ల కాలంలో 6.28 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రకటిస్తే, శాసనమండలిలో మంత్రి 5.72 లక్షల మందికి ఇచ్చారంటూ అంకెల గారడీ చేస్తున్నారన్నారు. నిరుద్యోగుల సమస్యలను గాలికి వదిలి ఇప్పుడు 54,903 కన్సల్టెంట్లను ఏర్పాటు చేసుకొని రూ.3 వేల కోట్లు జీతాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని ఆరోపించారు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో 243 మంది నియామకానికి ఆర్థిక శాఖ అనుమతి ఇస్తే భర్తీకి చర్యలు లేవన్నారు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం నిరుద్యోగులను మోసం చేసిన చంద్రబాబు, పవన్, లోకేష్లను కోడిగుడ్లు, రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుందని రాజా అన్నారు. ఇప్పటికై నా చేసిన తప్పును గ్రహించి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరుద్యోగుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. ప్రశ్నించిన వారిపై కక్ష సాధింపులు, బెదిరింపులు, భౌతిక దాడులు, కత్తులు పెట్టి నడిరోడ్లపై నరకడం వంటి పరిస్థితులు చూస్తున్నామన్నారు. ఇలాంటి సంస్కృతి వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు సాహసించడం లేదన్నారు. సమావేశంలో పార్టీ నగర మాజీ అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు అడబాల చినబాబు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో ఉద్యోగ విప్లవం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 1.34 లక్షల మందికి ఒకే నోటిఫికేషన్లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ఉద్యోగాలు ఇచ్చిన ఘనత గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. 58 వేల ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత మాజీ సీఎం జగన్కే దక్కుతుందన్నారు. 78 నోటిఫికేషన్లతో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు. -
జీజీహెచ్లో అభద్రత నిజమే
రాష్ట్ర డీఎంఈ ఆదేశాలతో ఆసుపత్రి అధికారుల వివరణ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి భద్రతలో లోపాలు నిజమే. సెక్యూరిటీ సూపర్వైజర్ అసమర్థత వల్లే చోరీలు, భద్రతా వైఫల్యం నెలకొంది. తగినంత మంది సిబ్బంది లేరు, ఉన్న వారిలోనూ సమర్థుల కొరత. వైద్యుల కూడా దాడులు జరుగుతున్నాయి. వాహనాలు, రోగుల విలువైన వస్తువుల చోరీలు నిత్యకృత్యమైపోయాయి. ఇదీ.. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రి అధికారులు రాష్ట్ర డీఎంఈ డాక్టర్ రఘునందన్ గంభీర, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిలకు సమర్పించిన లిఖితపూర్వక వివరణ. ఈ నెల 21న సాక్షి దినపత్రికలో ‘భద్రతకు సుస్తీ’ పేరుతో ప్రచురించిన కథనం అక్షర సత్యమైంది. డీఎంఈ రఘునందన్ ఈ కథనంపై స్పందించి వివరణ కోరారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టిన జీజీహెచ్ ఉన్నతాధికారులు కథనంలోని లోపాలను ధృవీకరించారు. 83 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉండాల్సిన చోట కేవలం 60 మందితో నడిపిస్తున్నారని, ఆస్పత్రి సామగ్రి కూడా చోరీకి గురవుతోందని, సెక్యూరిటీ సూపర్వైజర్ అసమర్థత భద్రతను బలహీనం చేసిందని వివరణలో నిర్థారించారు. ఎంవోయూ ప్రకారం శ్రీకార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ నిబంధనలు అనుసరించడం లేదని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఆస్పత్రిలో కొంత భాగం నిర్మాణంలో ఉండగా, భద్రతను పటిష్టం చేసేందుకు ఆసుపత్రి వెనుక భాగంలో కనీసం గోడ కూడా కట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని కాంట్రాక్టు సంస్థపై డీఎంఈ, కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. 10 రోజుల లోపు మిగిలిన 23 మంది సెక్యూరిటీ గార్డులను నియమించి, అలాగే ఇప్పటికే కొనసాగుతున్న వారిలో అసమర్థులను తక్షణమే తొలగించి వారి స్థానంలో నిబంధనల మేరకు నియామకాలు చేపట్టి తదుపరి చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని పేర్కొంటూ కాంట్రాక్టు సంస్థకు నోటీసులు జారీ చేసినట్టు వివరణలో పేర్కొన్నారు. సమర్థులు, అర్హులకే నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులకు తెలిపారు. ఆసుపత్రి అధికారులు సోమవారం ఈ వివరణను డీఎంఈ, కలెక్టర్లకు సమర్పించారు. ఆర్డీవో బాధ్యతల స్వీకరణ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం నూతన రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో)గా ఆర్. శివరాముడు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కలెక్టరేట్లో జేసీ మేఘాస్వరూప్ను మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓను జేసీ అభినందించారు. ప్రజలతో మమేకమై, వారి సమస్యల పరిష్కా రంలో తనదైన ముద్ర వేయాలని సూచించారు. శివ రాముడు 2007లో అనంతపురం జిల్లాలోని పెద్దవడుగూరు మండలంలో డిప్యూటీ తహసీల్దార్గా ఏపీ పబ్లి క్ సర్వీస్ కమిషన్ ద్వారా తొలి నియామకం పొందా రు. అనంతరం పదోన్నతిపై తహసీల్దార్గా బాధ్యత లు నిర్వర్తించారు. తహసీల్దార్గా బేతంచర్ల, డోన్, ఆ దోని ప్రాంతాలతో పాటు కర్నూలు కలెక్టరేట్లో కూడా వివిధ హోదాల్లో సేవలందించారు. అలాగే కలెక్టర్ ఏవోగా, భూ సేకరణ విభాగాల్లో కూడా పని చేసి విశేష అనుభవం సంపాదించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన కలెక్టరేట్లో రెవెన్యూ క్లినిక్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లు, పలువురు జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు ఆయనకు అభినందనలు తెలిపారు. -
వ్యవసాయ కూలీ నిజాయితీ
నిడదవోలు: కనిపించిన వస్తువును ఎవ్వరూ చూడకుండా సొంతం చేసుకుందామనుకునే ఆలోచనలు చాలా మందిలో ఉంటాయి. కానీ, ఆ వ్యవసాయ కూలీ తాను ఈ చోరధోరణికి అతీతమని నిరూపించుకున్నాడు. తన నిజాయితీని చాటుకున్నాడు. వివరాలివీ.. ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలోని బంధువుల ఇంట ఆదివారం జరిగిన వివాహ వేడుకకు నిడదవోలు మండలం తాడిమళ్ల గ్రామానికి చెందిన చెందిన ఎన్.నాగేశ్వరరావు వెళ్లారు. ఆ సందర్భంగా ఆయన మెడలోని సుమారు రూ.2.70 లక్షల విలువైన రెండున్నర కాసుల బంగారు గొలుసు పడిపోయింది. ఆ దారి వెంట నడిచి వెళ్తున్న అదే గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ అరిగెల శేషారావు కంట ఆ గొలుసు పడింది. దానిని ఎవరు పోగొట్టుకున్నారో, వారికి ఎలా అందజేయాలో తెలియక ఆలోచనలో శేషరావు పడ్డారు. అంతలో తన చైన్ పడిపోయిందంటూ నాగేశ్వరరావు లబోదిబోమంటూ వీధుల్లో వెతుకుతున్నారు. విషయం తెలిసిన శేషారావు నిజాయితీతో ఆ బంగారు గొలుసును నాగేశ్వరరావుకు అప్పగించారు. శేషారావు నిజాయితీని అందరూ అభినందించి, కృతజ్ఞతలు తెలిపారు. -
నిర్మలగిరికి భక్తుల తాకిడి
● ప్రారంభమైన మేరీమాత ఉత్సవాలు ● సందర్శించిన ఎస్పీదేవరపల్లి: గౌరీపట్నం నిర్మలగిరి మేరీమాత మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం సెలవు కావడంతో తొలి రోజే భక్తుల తాకిడి ఏర్పడింది. ఉభయ గోదావరి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా తరలి వచ్చి, మరియ తల్లిని దర్శించుకుని, దీవెనలు పొందారు. ఈ ఉత్సవాలు ఈ నెల 25వ తేదీ వరకూ జరుగనున్నాయి. ఏలూరు పీఠాధిపతి మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమెర పర్యవేక్షణలో పుణ్యక్షేత్రం డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ ఎస్.జాన్పీటర్ ఆధ్వర్యాన ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో సాయంత్రం 6 గంటల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. అర్ధరాత్రి వరకూ పుణ్యక్షేత్రంలో గడిపి ప్రార్థనలు, పూజలు చేస్తారు. తొలి రోజు సహాయ గురువులు ఫాదర్ ప్రేమ్కుమార్ దివ్య బలి పూజ సమర్పించారు. పలువురు గురువులు, ఫాదర్లు పాల్గొన్నారు. పుణ్యక్షేత్రంలో ఏర్పాట్లను జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ మళ్లింపు గుండుగొలను – కొవ్వూరు రాష్ట్ర ప్రధాన రహదారికి ఇరువైపులా నిర్మలగిరి పుణ్యక్షేత్రం విస్తరించినందున భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ను మళ్లించినట్టు సీఐ నాయక్ తెలిపారు. దేవరపల్లి, దుద్దుకూరు, గౌరీపట్నం, పంగిడి గ్రామాల్లో ట్రాఫిక్ను 16వ నంబర్ జాతీయ రహదారి మీదుగా మళ్లిస్తున్నామని చెప్పారు. 215 మందితో బందోబస్తు మేరీ మాత ఉత్సవాలకు 215 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు దేవరపల్లి సీఐ బీఎన్ నాయక్ తెలిపారు. ఉత్సవాలు నాలుగు రోజులూ పుణ్యక్షేత్రానికి సుమారు 10 లక్షల మంది భక్తులు వస్తారని నిర్వాహకులు చెప్పారన్నారు. అదనపు ఎస్పీ ఇన్చార్జిగా ముగ్గురు డీఎస్పీలు, 12 మంది సీఐలు, 21 మంది ఎస్సైలు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారని వివరించారు. పుణ్యక్షేత్రంలోని 30 ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఐదు డ్రోన్ కెమెరాలు, క్రైం పార్టీని కూడా ఏర్పాటు చేశామన్నారు. పాత నేరస్తులను గుర్తించడానికి ఈ ఏడాది అత్యాధునికమైన 50 ఫింగర్ ప్రింట్ డివైజ్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. వీటి ద్వారా అనుమానితులను గుర్తిస్తామన్నారు. ఫేస్ రికవరీ పరికరాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. -
మార్కెట్ పైనే ఆశలు
ఆరుగాలం కష్టపడి పండించిన పొగాకు రంగు, నాణ్యత బాగున్నాయి. ఎకరాకు సగటున 10 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. క్యూరింగ్లు ముగింపు దశలో ఉన్నాయి. గ్రేడింగ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. గ్రేడింగ్ చేసిన పొగాకును రైతులు బేళ్లు తయారు చేసి అమ్మకానికి సిద్ధం చేశారు. మార్కెట్ పైనే ఆశలు పెట్టుకున్నారు. ఉత్పత్తి పెరుగుతుంది. మార్కెట్ లాభసాటిగా ఉంటుందని ఆశిస్తున్నాం. – కరుటూరి శ్రీనివాస్, దేవరపల్లి వేలం కేంద్రం రైతు సంఘం అధ్యక్షుడు, సంగాయగూడెం సగటు ధర రూ.330 ఇవ్వాలి పొగాకు నాట్లు ఆలస్యంగా జరిగినందున దిగుబడులు తగ్గాయి. తుపాను తర్వాత వేసిన తోటల దిగుబడి తగ్గింది. ఎకరాకు సగటున 9 నుంచి 10 క్వింటాళ్లు వస్తున్నాయి. గత ఏడాది కంటే ఉత్పత్తి ఖర్చులు పెరిగాయి. భూముల కౌలు, బ్యారన్ల అద్దె పెరడంతో 15 నుంచి 20 శాతం పెట్టుబడి పెరిగింది. దీనికి తగ్గట్టుగా మార్కెట్ ఉండాలి. గత ఏడాది కిలో సగటు ధర రూ.311 లభించింది. ఈ ఏడాది రూ.330 వస్తే గిట్టుబాటు అవుతుంది. – సత్తి జగదీశ్వరరెడ్డి, రైతు సంఘం ప్రతినిధి, కృష్ణంపాలెం, దేవరపల్లి వేలం కేంద్రం కొనుగోళ్లకు ఏర్పాట్లు ఐదు వేలం కేంద్రాల్లో ఈ నెల 25 నుంచి పొగాకు కొనుగోళ్లు ప్రారంభిస్తున్నాం. గ్రేడింగ్ స మయంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. బేళ్లకు న్యూస్ పేపరుకు బదులు బోర్డు సరఫరా చేసిన గోనె పట్టాలనే వాడాలి. రోజూ ఉదయం 8 గంటలకు కాటాలకు బేళ్లు తీసుకురావాలి. మార్కెట్లో అమ్ముడు పోతున్న పొగాకును తీసుకురావాలి. ఈ ఏడాది పొగాకు నాణ్యత బాగుంది. మార్కెట్ కూడా బా గుంటుందని ఆశిస్తున్నాం. లో గ్రేడ్ పొగాకు శాతం తక్కువగా ఉంది. బేలు 150 కిలోలకు మించి ఉండరాదు. ట్రేడర్లకు, అధికారులకు రైతులు సహకరించాలి. – జె.సుధీర్ కుమార్, టుబాకో బోర్డు రీజినల్ మేనేజర్, రాజమహేంద్రవరం -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
వాలీబాల్ పోటీల్లో ఐసీఎఫ్ జట్టు విజేతమలికిపురం: ఆలిండియా మహిళా వాలీబాల్ పోటీల్లో తమిళనాడు ఐసీఎఫ్ (ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ) జట్టు విజేతగా నిలిచింది. మలికిపురం మండలం తూర్పుపాలెం గ్రామంలో అడబాల స్పోర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐదు రోజులుగా జరుగుతున్న డే అండ్ నైట్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఫైనల్స్లో కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుతో తలపడిన ఐసీఎఫ్ జట్టు విజేతగా నిలిచి రూ.2 లక్షల నగదు ట్రోఫీ అందుకుంది. కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు రన్నర్గా నిలిచి రూ.1.50 లక్షల నగదు ట్రోఫీ స్వీకరించింది. విజేతలకు నగదు, ట్రోఫీలను నిర్వాహకులు అందించారు. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, నిర్వాహకులు అడబాల వీరబ్రహ్మాజీరావు, అడబాల వేణుగోపాల్, అల్లూరి రవిరాజు, కె.రామచంద్రమూర్తి, గెడ్డం మహలక్ష్మీప్రసాద్, దొడ్డా బాబ్జీ, కృష్ణ, మంచాల సుధాకర్నాయుడు పాల్గొన్నారు. కనకదుర్గమ్మ ఆలయంలో చోరీకె.గంగవరం: మండలంలోని కుందూరులో కొలువైన కనకదుర్గమ్మ వారి ఆలయంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఆలయంలోకి చొరబడి అమ్మవారి వెండి కిరీటం, వెండి హస్తం, బంగారు మంగళసూత్రం అపహరించారు. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు కె.గంగవరం ఎస్సై సోమేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నూకాలమ్మకు జేజేలుసామర్లకోట: పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలోని నూకాలమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. అమ్మవారి జాతర ఉత్సవాలు ఈ నెల 17న ప్రారంభం కాగా, మే 3 వరకూ జరగనున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ సమీపంలోని తోటలో వాహనాలను పార్కింగ్ చేసి, అమ్మవారిని దర్శించుకుని తోటలోనే వంటలు చేసుకుని కుటుంబ సభ్యులతో కలసి భోజనాలు చేశారు. ఆలయం వద్ద తిరునాళ్లు ఏర్పాటు చేశారు. ఆలయ ఈఓ రాంబాబురెడ్డి, చైర్మన్ లొల్ల సత్యనారాయణ, కమిటీ సభ్యులు భక్తులకు సేవలందించారు. అమ్మవారి దర్శనానికి రూ.10, రూ.30, రూ.100 టిక్కెట్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బంది రాకుండా ఎస్సై మౌనిక ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. తల్లిదండ్రుల చెంతకు బాలుడుఅనపర్తి: రంగంపేట మండలం బాలవరం గ్రామానికి చెందిన ఇజ్జిన సిద్ధూ (11) శనివారం తప్పిపోయి పక్కనే ఉన్న బలభద్రపురం గ్రామానికి వచ్చాడు. ఆ బాలుడిని బలభద్రపురానికి చెందిన సింగిడి వెంకటలక్ష్మి గమనించి బిక్కవోలు పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చి అప్పగించారు. ఎస్సై వి.రవిచంద్ర ఆ బాబుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అతని నాన్నమ్మ ఇజ్జిన సీత, తండ్రి చంద్రశేఖర్లను పిలిపించి సిద్ధూను అప్పగించారు. -
బైక్, స్కూటీలను ఢీకొన్న కారు
● ఏడుగురికి గాయాలు ● బాలుడి పరిస్థితి విషమంకాకినాడ రూరల్: కాకినాడ – పిఠాపురం రోడ్డులో తిమ్మాపురం సాయిబాబా గుడి సమీపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు. ఇందులో ఓ బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. తిమ్మాపురం పోలీసుల కథనం ప్రకారం.. పిఠాపురం నుంచి కాకినాడ వైపు వస్తున్న కారు తిమ్మాపురం వద్ద ఎదురుగా వెళుతున్న ఎన్ఫీల్డ్ బైక్, స్కూటీలను వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్పై వెళుతున్న పిఠాపురం మండలం మాధవపురం గ్రామానికి చెందిన అక్కా తమ్ముళ్లు చిన్నారి హారిక రత్నం, చిన్నారి మణికంట, స్కూటీపై వెళుతున్న తిమ్మాపురం గ్రామానికి చెందిన భార్యాభర్తలు సవరం అరుణకుమార్, విజేత, వారి కుమారుడు బెన్ను సుశాంత్ (14) పాటు కారులోని భార్యాభర్తలు రమణయ్యపేటకు చెందిన మాగంటి బాబూరావు, ప్రవీణ గాయపడ్డారు. రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొన్న కారు తర్వాత రోడ్డు పక్కన ఉన్న సిమెంట్ పోల్ను ఢీకొట్టి ఆగింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా రెండు ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. కారు నడుపుతున్న బాబూరావు బ్రేక్పై కాలు వేయడానికి బదులుగా ఎక్స్లేటర్పై వేయడంతో అదుపుతప్పి ముందు వెళుతున్న వాహనాలను ఢీకొట్టి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. క్షతగాత్రులు కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో కోలుకుంటున్నారని, బాలుడు తీవ్రంగా గాయపడినట్లు ఎస్సై గణేష్బాబు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. క్షతగాత్రులకు ఏపీడీ సేవలు ప్రమాదం జరిగిన సమయంలో అటుగా ప్రయాణం చేస్తున్న ఏపీడీ శ్రీనివాస్ విశ్వనాథ్ వెంటనే స్పందించి 108 అంబులెన్స్కు కాల్ చేశారు. అప్పటి వరకూ గాయపడిన క్షతగాత్రులకు ధైర్యం చెప్పారు. అంబులెన్స్లోకి క్షతగాత్రులను స్థానికులతో కలసి ఆయన ఎక్కించారు. -
కొనుగోళ్లకు రెడీ
● 25 నుంచి వర్జీనియా పొగాకు కొనుగోళ్లు ● 5 వేలం కేంద్రాల్లో ఏర్పాట్లు ● 12,612 మంది రైతులు ● 14,412 బ్యారన్లు ● 80 మిలియన్ల ఉత్పత్తి అంచనా దేవరపల్లి: టుబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం–1, 2 వేలం కేంద్రాల్లో వర్జీనియా పొగాకు కొనుగోళ్లు ఈ నెల 25న ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికారులు వేలం కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. ఉదయం 8.30 గంటలకు కొనుగోళ్లు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 1962 నుంచి.. రాజమహేంద్రవరం రీజియన్ ఐదు వేలం కేంద్రాల పరిధిలోని రైతులు ఉత్తర తేలిక నేలల్లో (ఎన్ఎల్ఎస్) దాదాపు 60 సంవత్సరాలుగా వర్జీనియా పొగాకును ప్రధాన వాణిజ్య పంటగా సాగు చేస్తున్నారు. 1962లో దేవరపల్లి మండలం చిన్నాయగూడెంలో పొగాకు సాగుకు శ్రీకారం చుట్టారు. అనేక ఒడుదొడుకులను ఎదుర్కొంటూ ఆర్థికంగా నిలదొక్కుకుని, జింబాబ్వే, బ్రెజిల్ దేశాల్లో పండిస్తున్న పొగాకుకు దీటుగా నాణ్యమైన పొగాకు పండించడంలో మన రైతులు అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. దీంతో, ఇక్కడ పండించిన పొగాకు ఎక్కువగా చైనా, రష్యా, యూరోపియన్ దేశాలకు ఎగుమతి అవుతుంది. మన పొగాకులో 90 శాతం.. సిగరెట్ల తయారీకి వినియోగిస్తున్నారు. 29,132 హెక్టార్లలో.. ఈ ప్రాంతంలోని 12,612 మంది రైతులు, 2025–26 పంట కాలంలో 14,412 బ్యారన్లు కలిగి ఉన్నారు. వీరు మొత్తం 29,132 హెక్టార్లలో వర్జీనియా పొగాకు సాగు చేశారు. ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో 28,011 హెక్టార్లు, తొర్రేడు ప్రాంతంలోని నల్లరేగడి భూముల్లో 1,120 హెక్టార్లలో పొగాకు సాగు జరిగింది. తొర్రేడు ప్రాంతంలో 893 మంది రైతులు 964 బ్యారన్లు కలిగి ఉన్నారు. తాము పండించిన పొగాకును వీరు దేవరపల్లి వేలం కేంద్రానికి తెచ్చి, అమ్ముకోవలసి ఉంది. ఈ ఏడాది పొగాకు ఎగుమతులపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పడుతుందని బోర్డు అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు భావిస్తున్నారు. 49.32 మిలియన్ కిలోలకు అనుమతి ప్రస్తుత పంట కాలంలో ఐదు వేలం కేంద్రాల పరిధిలో 49.32 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇచ్చింది. కానీ, సాగు విస్తీర్ణం పెరగడం, దిగుబడులు ఆశాజనకంగా ఉండటంతో దాదాపు 80 మిలియన్ కిలోలు ఉత్పత్తి అవుతుందన్నది అధికారుల ప్రాథమిక అంచనా. గత ఏడాది 60 మిలియన్ కిలోల ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా, 83.88 మిలియన్ కిలోల ఉత్పత్తి జరిగింది. గత ఏడాది మార్కెట్లో కిలోకు ధర గరిష్టంగా రూ.453, కనిష్టంగా రూ.250, సగటున రూ.297.50 చొప్పున లభించింది. గత ఏడాది ధరలు ఇలా.. గత ఏడాది ఈ ప్రాంతంలో బ్రైట్ గ్రేడ్ 45.13, మీడియం గ్రేడ్ 31.19, లో గ్రేడ్ 7.56 మిలియన్ కిలోల చొప్పున ఉత్పత్తి జరిగింది. బ్రైట్ గ్రేడుకు కిలోకు సగటున రూ.347.93, మీడియం గ్రేడుకు రూ.270.60, లో గ్రేడుకు రూ.132 చొప్పున ధర లభించింది. అత్యధిక ఉత్పత్తి జంగారెడ్డిగూడెం–2 వేలం కేంద్రంలో జరిగింది. దేవరపల్లి వేలం కేంద్రంలో కిలో అత్యధిక సగటు ధర రూ.311 పలికింది. జంగారెడ్డిగూడెం–1లో రూ.299, జంగారెడ్డిగూడెం–2లో రూ.300.66, కొయ్యలగూడెంలో రూ.296.60, గోపాలపురంలో రూ.296.57 చొప్పున కిలో సగటు ధర లభించింది. రూ.2,664 కోట్ల పొగాకు అమ్మకాలు 2024–25 పంట కాలంలో ఐదు వేలం కేంద్రాల్లో 200 రోజుల పాటు వేలం నిర్వహించగా రూ.2,664 కోట్ల విలువైన 83.88 మిలియన్ల కిలోల పొగాకు అమ్మకాలు జరిగాయి. గత పంట కాలంలో 14,754 మంది రైతులు 29,480 హెక్టార్లలో పంట సాగు చేశారు. 6,79,450 బేళ్లు కొనుగోలు చేశారు. అయితే లో గ్రేడ్ పొగాకు కొనుగోళ్లకు ట్రేడర్లు నిరాకరించారు. కిలో రూ.50 పలికినప్పటికీ కొనుగోలుదారులు ఆసక్తి చూపకపోవడంతో సుమారు 10 లక్షల కిలోల లో గ్రైడ్ పొగాకు రైతుల వద్దనే ఉండిపోయింది. -
అతివేగం.. అదే కారణం
కాకినాడ నుంచి కనిగిరి వెళుతున్న కారును అతివేగంగా నడపడం వల్ల ప్రమాదం జరిగిందని సురక్షితంగా బయటపడిన పరసా కోటేశ్వరరావు తెలిపారు. ప్రమాదానికి నిమిషం ముందు తన కారును ఆ కారు ఢీకొట్టగా చాకచక్యంగా అదుపు చేయడం వల్ల ప్రాణాలను కాపాడుకోగలిగామని, లేదంటే తన కుటుంబం ప్రమాద బారిన పడేదని కోటేశ్వరరావు తెలిపారు. ప్రమాద సమయంలో కారులో తనతో పాటు భార్య తేజస్విని, కుమారుడు, కుమార్తె, డ్రైవర్ ఉన్నట్టు ఆయన వివరించారు. దైవదర్శనానికి ద్రాక్షారామ వెళుతున్నట్టు చెప్పారు. ద్రాక్షారామ భీమేశ్వరస్వామి తన కుటుంబాన్ని కాపాడారంటూ చెప్పారు. చాలా సేపు షాక్ నుంచి కోటేశ్వరరావు కుటుంబ సభ్యులు తేరుకోలేదు. -
తెలియక.. తికమక
● కియోస్క్ల ద్వారా సేవలకు ఇబ్బంది ● టిక్కెట్లు ఎలా పొందాలో అర్థంకాక అవస్థలు ● నెట్ స్లోగా ఉండడంతో అలస్యంగా ప్రక్రియ అన్నవరం: కొత్త విధానం తెస్తే సులువుగా ఉండాలి.. ప్రతి ఒక్కరికీ అర్థం కావాలి.. లేకుంటే అవగాహన కల్పించాలి.. అప్పుడే సత్ఫలితాలను ఇస్తోంది. అది జరగకుంటే మొదటికే మోసం వస్తుంది.. అచ్చం అలానే అన్నవరం దేవస్థానంలో కొత్తగా తెచ్చిన కియోస్క్ల పరిస్థితి ఉంది. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం, వారు టిక్కెట్లు సులువుగా పొందాలనే ఉద్దేశంతో ‘కియోస్క్ సెల్ఫ్ సర్వీస్’ మెషీన్లను అందుబాటులోకి తెచ్చారు. ఇవి భక్తులకు కొత్త తలనొప్పి తెచ్చి పెడుతున్నాయి. ఇక్కడి రోశయ్య మండపంలో కరూర్ వైశ్యా బ్యాంక్ ఏర్పాటు చేసిన ఈ మెషీన్లను ఉగాది పర్వదినం రోజున దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ త్రినాథరావు అట్టహాసంగా ప్రారంభించారు. ఏ సేవలు పొందవచ్చంటే.. ప్రతి పనిలో ఆధునీకత అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యలంలో భక్తులకు సులువుగా సేవలు అందించాలనే సదుద్దేశంతో ఈ కియోస్క్లను అందుబాటులోకి తెచ్చారు. భక్తులు స్వామివారి అంతరాలయ దర్శనం, వ్రతాలు, కల్యాణం, ప్రసాదం, కేశఖండన తదితర టిక్కెట్లను ఎటువంటి ప్రయాస లేకుండా త్వరితగతిన పొందేందుకు వీటిని ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నారు. అయితే ఆచరణలో మాత్రం భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. అవగాహన లేక.. అర్థం కాక దేవస్థానంలోని రోశయ్య మండపంలో ఒకేచోట ఎనిమిది కియోస్క్లు ఏర్పాటు చేశారు. అయితే ఈ మెషీన్లు ఎలా ఉపయోగించాలో తెలిపే బోర్డులు ఏర్పాటు చేయలేదు. అక్కడ ఓ సహాయకుడు మాత్రమే ఉండి మెషీన్లు ఎలా ఉపయోగించాలో చెబుతున్నారు. ఎనిమిది మెషీన్ల వద్ద ఉన్న భక్తుల్లో కొంతమందికి మాత్రమే అది తెలుస్తోంది. మిగిలిన వారికి అర్థం కాక తిరిగి మళ్లీ చెప్పమంటే అక్కడున్న వ్యక్తి విసుక్కుంటున్నట్టు భక్తులు ఆవేదన చెందుతున్నారు. ఎలా వినియోగించాలో తెలిపే బోర్డు ఉన్నా, దానిని చూసైనా కొందరు అర్థం చేసుకుంటారు. అదీ ఏర్పాటు చేయలేదు. ఒక్కోసారి గందరగోళం కియోస్క్ల ద్వారా టిక్కెట్ల కోసం ఫోన్పే, పేటీఎం తదితర వాటి ద్వారా నగదు చెల్లించినా, ఒక్కోసారి టిక్కెట్లు రావడం లేదు. దీంతో భక్తులు గందరగోళానికి గురవుతున్నారు. ఆందోళన చెంది అక్కడున్న వ్యక్తిని అడగాల్సి వస్తోంది. ఒక్కోసారి వెంటనే టిక్కెట్ వచ్చేలా చేస్తున్నారు. కొన్నిసార్లు చాలా సమయం పడుతోందని భక్తులు వాపోతున్నారు. కనీసం రెండు మెషీన్లకు ఒకరు చొప్పున సహాయకుడు ఉంటే భక్తులు సులభంగా టిక్కెట్లు పొందే అవకాశం ఉంటుంది. మెషీన్లు ఏర్పాటు చేసిన కరూర్ వైశ్యా బ్యాంక్ లేకుంటే దేవస్థానం ఈ ఏర్పాట్లు చేయాలి. అన్నింటి కన్నా ముఖ్యంగా అక్కడ వేగమైన వైఫే ఉండాలి. ఇంటర్ నెట్ స్లోగా ఉండడంతో భక్తులు చాలాసేపు వేచి ఉండాల్సి వస్తోంది. అదే విధంగా ఈ కియోస్క్ మెషీన్లు ఎలా ఉపయోగించాలో తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాలి. ఇప్పటికై నా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
జీవితాల్లో కారుచీకటి!
దేవరపల్లి: గుండుగొలను – కొవ్వూరు జాతీయ రహదారి (ఎన్హెచ్–16)పై దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం ఆపై నిద్రమత్తు కారణంగా ముగ్గురి ప్రాణాలను బలిగొంది. పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడ గాంధీనగర ప్రాంతానికి చెందిన సియాదుల సత్యనారాయణ (52), రామారావుపేటకు చెందిన మామిడాల నారాయణమూర్తి (57), బళ్ల చిట్టిబాబు, యండకుదిటి విజయ్, కోట్ని వెంకట్రావు, గొడుగుపాటి రాఘవులు కలసి రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు ఎర్రచందనం మొక్కల వ్యాపారం చేస్తుంటారు. ఆదివారం తెల్లవారు జామున తమ వ్యాపారంలో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరికి కారులో బయలు దేరారు. ఉదయం 7 గంటల సమయంలో కారు అతి వేగంగా, నిర్లక్ష్యంగా వస్తూ దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద హైవే ఫ్లైఓవర్పై డివైడర్ను ఢీకొని అటువైపు ఏలూరు నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న కారును ఢీకొంది. ఈ ప్రమాదంతో రెండు కార్లు ముందు భాగాలు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యాయి. ఆ ప్రాంతం భయానకంగా మారింది. కనిగిరి వెళుతున్న కారు అద్దాలు, డోర్లు బద్దలు కొట్టి దానిలో ఇరుక్కున్న వ్యక్తులను స్థానికుల సహాయంతో పోలీసులు బయటకు తీశారు. అప్పటికే ఆ కారులోని సియాదుల సత్యనారాయణ, మామిడాల నారాయణమూర్తి మృతి చెందగా, వీరితో పాటు ఉన్న బళ్ల చిట్టిబాబు, యండకుదిటి విజయ్, కోట్ని వెంకట్రావు, గొడుగుపాటి రాఘవులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం హైవే అంబులెన్స్లో గోపాలపురం ఏరియా అసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే ఏలూరు నుంచి రాజమహేంద్రవరం వెళుతున్న కారులోని ఏలూరు తంగెళ్లమూడికి చెందిన చిత్తి సలీం (44) అక్కడికక్కడే మృతి చెందాడు. సలీం రాజమహేంద్రవరంలోని పేపర్ మిల్లులో కాంట్రాక్టర్గా పని చేస్తున్నాడు. రంజాన్కు ఏలూరు వెళ్లి తిరిగి రాజమహేంద్రవరం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముందు ఈ కారునే ఢీకొంది కనిగిరి వెళ్తున్న కారు ముందుగా ఏలూరుకు చెందిన పరసా కోటేశ్వరరావు కారును ఢీకొంది. కోటేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో ద్రాక్షారామలో శివాలయానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం నుంచి కోటేశ్వరరావు చాకచక్యంగా తప్పించుకున్నారు. కారు దెబ్బతినగా, కోటేశ్వరరావు, అతని భార్య తేజస్విని స్వల్పంగా గాయపడ్డారు. వీరితో పాటు ఇద్దరు పిల్లలు, డ్రైవర్ క్షేమంగా ఉన్నారు. వీరంతా ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద స్థలాన్ని దేవరపల్లి సీఐ బీఎన్ నాయక్, ఎస్సై వి.సుబ్రహ్మణ్యం పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపారు. మృతుడు సలీంకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతి వేగం.. ఆపై నిర్లక్ష్యం ఆ జీవితాల్లో ‘కారు’చీకటిని నింపేసింది.. గమ్యానికి వేగంగా చేరుకోవాలనే తపనతో పాటు నిద్ర మత్తులో కారును నడపడంతో ముగ్గురి ప్రాణాలను బలిగొంది.. ఈ ఘోర రోడ్డు ప్రమాదం దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద జరిగింది.. ఈ ఘటనతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. ఓ కారు వేగంగా వెళ్లి డివైడర్ను ఢీకొని అవతలి రోడ్డులోకి వెళ్లి మరీ రెండు కార్లను ఢీకొంది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురి ప్రాణాలు బలయ్యాయి. ముగ్గురి ప్రాణాలను బలిగొన్న అతివేగం డివైడర్ను ఢీకొన్న కారు అవతలి వైపు దూసుకెళ్లి రెండు కార్లతో ఢీ ప్రమాదం నుంచి బయటపడిన ఓ కుటుంబం -
తొలిసారి ఫస్ట్ ర్యాంక్
అన్నవరం: రాష్ట్రంలోని ఏడు ప్రముఖ ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో అందిస్తున్న సేవలపై ఫిబ్రవరి 22 నుంచి మార్చి 21 వరకూ వాట్సాప్, ఐవీఆర్ఎస్ ద్వారా నిర్వహించిన సర్వేలో అన్నవరం దేవస్థానం 73.7 శాతం భక్తుల సంతృప్తితో ప్రథమ స్థానంలో నిలిచింది. దేవస్థానం ఈఓ వి.త్రినాథరావు ఆదివారం ఈ విషయం తెలిపారు. దేవస్థానాలకు ప్రభుత్వం ర్యాంకులు ప్రకటించడం ప్రారంభించాక అన్నవరం ప్రథమ స్థానంలో రావడం ఇదే తొలిసారి. తాజా సర్వేలో 65.9 శాతంతో శ్రీశైలం ఏడో స్థానంలో నిలిచింది. 73.6 శాతంతో రెండో స్థానంలో నిలచిన ద్వారకా తిరుమల కన్నా అన్నవరం దేవస్థానం 0.1 శాతం మాత్రమే ఎక్కువ పొందింది. స్వామివారి దర్శనంపై 76.6 శాతం, మౌలిక వసతుల కల్పనపై 71.5 శాతం, ప్రసాదం నాణ్యతపై 79.9 శాతం, పారిశుధ్య ఏర్పాట్లపై 66.3 శాతం మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. రత్నగిరికి పోటెత్తిన భక్తులు అన్నవరం: రత్నగిరికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వివాహ బృందాలు, ఇతర భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయంలో సాయంత్రం వరకూ విపరీతమైన రద్దీ ఏర్పడింది. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని వ్రతాలు 2,500 జరిగాయి. వివిధ విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. యుద్ధంతో ప్రపంచ దేశాలన్నింటికీ నష్టమే ఏలేశ్వరం: ప్రస్తుతం జరుగుతున్న పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచ దేశాలన్నింటికీ నష్టమేనని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు వి.రాంభూపాల్ అన్నారు. యుటీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు అప్పారి వెంకటస్వామి 26వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర స్థాయి స్మారకోపన్యాసం పట్టణంలో ఆదివారం నిర్వహించారు. యూటీఎఫ్ మండల కమిటీ ఆధ్వర్యాన, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు అధ్యక్షతన ‘అమెరికా యుద్ధోన్మాదం – అంతర్జాతీయ పరిణామాలు’ అనే అంశంపై రాంభూపాల్ ప్రసంగించారు. 23 రోజుల క్రితం మొదలైన ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇజ్రాయెల్, ఆమెరికాలు ఇరాన్పై ఏకపక్షంగా యుద్ధం చేస్తూ సామాన్య ప్రజానీకంపై పెనుభారం మోపుతున్నాయని అన్నారు. ఇరాన్ ఉన్మాద స్థితికి చేరుకుంటే ప్రపంచానికే నష్టమన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ, కరోనా ముందు ప్రభుత్వ పాఠశాలల్లో 46 లక్షల మంది విద్యార్థులుండగా ప్రస్తుతం 31.50 లక్షల మంది ఉన్నారని అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు. తొలుత యుటీఎఫ్ మండల శాఖ భవనాన్ని వెంకటేశ్వర్లు, ప్రసాద్ ప్రారంభించారు. -
ఆధ్యాత్మిక తరంగం
● భక్తుల కొంగుబంగారం విజయదుర్గా పీఠం ● భక్తులను బంధువులుగా పిలిచే ‘గాడ్’ రాయవరం: అక్కడ అడుగుపెట్టగానే ప్రశాంత వాతా వరణం కనిపిస్తుంది. నిత్యం దేవీ నామస్మరణతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుంది. మనస్సును నిర్మలంగా ఉంచే ఆ ప్రదేశానికి వెళ్లగానే బంధువుల మాదిరి పలకరింపులే కాదు.. మానసిక చింతతో వెళ్లే వారి బా ధలను తొలగించే సలహాలు సైతం అందుతాయి. అదే భక్తులకు కొంగుబంగారంగా రాయవరం మండలం వెదురుపాకలో భాసిల్లుతున్న విజయదుర్గా పీఠం. పుట్టినప్పటి నుంచే ‘గాడ్’ పీఠం వ్యవస్థాపక అధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం పుట్టినప్పటి నుంచే ‘గాడ్’గా పిలుపు అందుకున్నట్లు భక్తులు చెబుతారు. 1972 ఆగస్టు 18వ తేదీన స్వయంగా జగన్మాత వ్యాఘ్రవాహినిగా దర్శనమిచ్చి మంత్రోపదేశం చేసినట్లు విశ్వసిస్తారు. అప్పటి నుంచీ ఈ పీఠం ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. 1989 లో శృంగేరి జగద్గురువులు శ్రీమదభినవ విద్యాతీర్థ స్వామి ఆదేశంతో భారతీతీర్థ స్వామి చేతుల మీదుగా అష్టభుజాలతో కూడిన విజయదుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ ఈ పీఠంలో జరిగింది. ఇక్కడ నిత్యం పలు పూజలు నిర్వహిస్తారు. విజయదుర్గాదేవికి శ్రీచక్రార్చన, గణపతి, నక్షత్ర, నవగ్రహ, మృత్యుంజయ, రుద్ర, దుర్గా హోమాలు నిర్వహిస్తారు. వివిధ సమస్యలు, మానసిక అశాంతితో పీఠానికి వచ్చే వారికి ఇక్కడ మానసిక ప్రశాంతత లభిస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా భక్తులు పీఠానికి వస్తారు. భక్తులను గాడ్.. అబ్బాయి, అల్లుడు, కూతురు, కోడలు వంటి వరుసలతో పిలుస్తారు. ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ.. భక్తుల సమస్యలకు చక్కటి పరిష్కారాలను అందజేస్తారు. ఏటా శరన్నవరాత్ర వేడుకలు పీఠంలో ఏటా శరన్నవరాత్ర ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. దీనికి దూర ప్రాంతాల వారు ముందుగానే చేరుకుంటారు. ఆ పది రోజులూ భక్తులు స్వయంగా కలశాలు ఏర్పాటు చేసుకుని పూజలు చేసుకుంటారు. పీఠాధిపతి ‘గాడ్’ జన్మదిన వేడుకలను ఏటా ఆగస్టు 16, 17, 18 తేదీల్లో భక్తులే ఘనంగా నిర్వహించుకుంటారు. 19వ తేదీన జరిగే గాడ్ జన్మదిన వేడుకలకు వేలాదిగా తరలివస్తారు. వీటితో పాటు పర్వదినాల్లో పీఠంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు చేపడతారు. శృంగేరి జగద్గురువులు భారతీ తీర్థస్వామి, కంచి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి, పుష్పగిరి పీఠాధిపతులు అభినవ ఉద్దండ విద్యానృసింహ భారతీ స్వామి, సద్గురు శివానందమూర్తి, శ్రీ విశ్వయోగి విశ్వంజీ తదితర ప్రముఖులెందరో ఈ పీఠాన్ని సందర్శించారు. లోక కల్యాణం కోసం.. పీఠంలో లోక కల్యాణం కోసం నిత్యం పలు రకాల పూ జలు, అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తూంటారు. ప్ర త్యేక సందర్భాల్లో రాహుకేతువుల కల్యాణం, నవావరణార్చన, శ్రీనివాస కల్యాణం, సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం వంటివి నిర్వహిస్తారు. టీటీడీ శ్రీదేవి, భూ దేవీ సమేత శ్రీ విజయ వేంకటేశ్వరస్వామి, తిరుత్తణి దేవస్థానం శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను పీఠానికి అందజేశాయి. -
కల్యాణంలో కళర్ఫుల్
● కాగిత పూలతో అలంకరణకు సిద్ధం ● నవమికి సిద్ధమవుతున్న సత్యవాడ కె.గంగవరం: సీతారాముల కల్యాణంలో ఇక్కడ ప్రత్యేకత చాటుతోంది.. కళాత్మకతను చాటుతోంది.. తరతరాలుగా ఇక్కడ అలంకరణకు పెట్టింది పేరు. జిల్లా సరిహద్దులు దాటేలా తన కీర్తిని సత్యవాడ చాటుతోంది. స్వామివారి కల్యాణ మహోత్సవం అంటే ప్రతి కుటుంబం తన సొంత ఇంట్లో వివాహంలా భావిస్తుంది. మహా శివరాత్రి తదుపరి దినం నుంచి శ్రీరాముని కల్యాణం కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తూ స్వామివారి అలంకరణకు రేయింబవళ్లు శ్రమించి తమ కళా నైపుణ్యంతో శ్రీరామచంద్రుడిని అంగరంగ వైభవంగా అలంకరిస్తారు. సత్యవాడ గ్రామంలో నాలుగు వీధుల్లో సీతారాముల ఆలయాలు ఉంటాయి. ఆయా ఆలయాల వద్ద ప్రతి వీధి వారు కల్యాణోత్సవాలు జరపడం ఇక్కడ ఆనవాయితీ. 150 ఏళ్లుగా ఏటా ఉగాది పర్వదినం రోజున శ్రీరాముని కల్యాణానికి రాట ముహూర్తం చేస్తారు. చలువ పందిళ్లు వేసి, వంశపారపర్యంగా వస్తున్న కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. కాగితపు పూలతో అలంకరించి ఆ శ్రీరామునికి తమ కళాత్మకతను నైవేద్యంగా సమర్పించుకుంటారు. ఏటా శ్రీరామ నవమికి స్వయంశక్తితో తమ పూర్వీకుల నుంచి నేర్చుకున్న కాగితపు పూల అలంకరణ, చలువ పందిళ్లను రూపొందించడంలో సత్యవాడ గ్రామస్తులు ప్రత్యేకత చాటుతున్నారు. వీరు తరతరాలుగా తమలోని కళా నైపుణ్యాన్ని శ్రీరామునికి నివేదిస్తూ తమలోని భక్తి భావాన్ని తెలియజేస్తున్నారు. తెల్లవారితే ఎవరి వ్యాపారాల్లో వారు తలమునకలయ్యే వీరిలో కూడా అంతర్గతంగా ఎంతో సృజనాత్మకత ఉంది. పిల్లలు, పెద్దలు, వృద్ధులు సైతం కాగితపు పూల తయారీలో అందెవేసిన చేయి. తమ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని భద్రాచలంలో మాదిరిగానే ఏటా ఇక్కడ శ్రీరామ నవమి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుక ద్వారా తమ గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలనే ఉద్దేశంతో రంగురంగుల కాగితాలతో పువ్వులను తయారు చేసి వాటిని నవమికి వేసిన చలువపందిళ్లలో ఎంతో అందంగా అలంకరిస్తారు. ఆ విధంగా మొదలైన ఈ వంశపారంపర్య మహోత్సవాన్ని ఎన్ని వ్యయప్రయాసలు ఎదురైనా నేటికీ నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం గ్రామస్తులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దూరప్రాంతాల్లో ఉన్న బంధువులు ఇళ్లకు చేరుకున్నా. ఈ నెల 27 నుంచి 30 వరకూ నవమి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. -
దళితుడిని ఇంట్లోకి రానిస్తావా..
రాజమహేంద్రవరం సిటీ: ‘ఏయ్.. ఏంటి దళితుడిని ఇంట్లోకి రానిస్తూ మాదర్చోద్ వేషాలు వేస్తున్నావు. నీ కొడుకు ఎక్సైజ్ శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు కదా! మంత్రి కొల్లు రవీంద్రతో చెప్పి ఉద్యోగం తీయించేస్తా’ అంటూ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తండ్రి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఓ మహిళను బెదిరించిన ఫోన్ రికార్డింగ్ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వారం రోజుల కిందట వ్యాపార లావాదేవీల్లో ఓ వ్యక్తిని అప్పారావు బెదిరించిన ఫోన్ కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం మరచిపోకముందే ఓ మహిళను ఫోన్లో బెదిరించిన ఆడియో జిల్లాలో మరోసారి వైరల్గా మారింది. జాన్ను నరికేస్తా.. నగరంలో ఒంటిరిగా నివసిస్తున్న మహిళ ఇంటికి ఓ దళితుడు వస్తున్నాడనే విషయంపై మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆమెపై బెదిరింపులకు పాల్పడ్డారు. ‘దళితుడు జాన్ను ఇంటికి రాకుండా బయటకు తరిమి వేయ్.. లేనిపక్షంలో ఎక్సైజ్ శాఖలో పని చేస్తున్న నీ కొడుకు ఉద్యోగం తీయించేస్తా.. నీ అంతు చూస్తా’ అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించాడు. జాన్ అనే వ్యక్తి మాల మహానాడు పేరిట వ్యవహరిస్తున్నాడని, ఇది సరైనది కాదని అప్పారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వద్ద కూడా మాల మహానాడు, మాదిగ దండోరా ఉన్నాయని, జాన్ విషయం త్వరలో తేల్చేస్తానంటూ ఆయన ఫోన్లో బెదిరింపులకు పాల్పడ్డారు. ‘ఫైనల్గా నీ బతుకు నువ్వు బతుకు. నేను అడుగు పెట్టానంటే అన్నీ తేల్చి పారేస్తాను..నీ బతుకేంటో రోడ్డున పెడతా.. జాన్ను అడ్డగోలుగా నరికి పారేస్తా’ అంటూ ఆమెకు స్ట్రాంగ్ వారి్నంగ్ ఇస్తూ దుర్భాషలాడారు. మహిళలను దుర్భాషలాడడం సరైన విధానం కాదని ఆమె చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ‘నువ్వు మహిళవే కాదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిరెడ్డి అప్పారావు ఈవిధంగా దిగజారి మాట్లాడడం సరైనది కాదని కూటమి నాయకులే చర్చించుకుంటున్నారు. అయితే మహిళను తిట్టిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
సముద్రంలో యువకుడి మృతదేహం లభ్యం
అల్లవరం: ఓడలరేవు తీరంలోని గ్రోయిన్ల నిర్మాణాల వద్ద భారీ కెరటాలకు అమలాపురానికి చెందిన దొమ్మేటి లోకేష్ (17) శుక్రవారం గల్లంతైన విషయం తెలిసిందే. మైరెన్ పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆధ్వర్యంలో గజ ఈతగాళ్ల సాయంతో అతని ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. శనివారం మధ్యాహ్నం ఓడలరేవు సముద్ర తీరంలో లోకేష్ మృతదేహాన్ని గుర్తించారు. దీంతో అక్కడ లోకేష్ తండ్రి విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఈ ఘటనపై అల్లవరం ఎస్సై సంపత్కుమార్ కేసు నమోదు చేశారు. మైరెన్ సీఐ ఎంవీవీఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ ఓడలరేవు బీచ్ ప్రమాదకంగా ఉందని, యువతీ యువకులు సేఫ్టీ విధానాలు పాటించకుండా సముద్రంలో స్నానాలు చేయకూడదని సూచించారు. గ్రోయిన్ల నిర్మాణాల్లో ఉపయోగిస్తున్న టెట్రాపాడ్పై నాచు ఉందని, వీటిపై నడిస్తే సముద్రంలోకి జారిపడే అవకాశం ఉందన్నారు. బీచ్కు వెళ్లే వారంతా జాగ్రత్తలు పాటించాలన్నారు. రాత్రి వేళల్లో తీరంలో సంచరించ వద్దని సూచించారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 22,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 23,500 గటగట (వెయ్యి) 21,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 17,000 – 18,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)16,000 – 17,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
ఇంతలా చెప్పి..
హెల్మెట్ తలకెక్కక అనేక ప్రమాదాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. చెప్పి చెప్పి పోలీసులు విగిసిపోతున్నారు. చివరికి తాళ్లపూడిలో వినూత్న ప్రయోగం చేశారు. ఆ గ్రామ బస్టాండ్ సెంటర్లో శనివారం ఎస్సై టి.రామకృష్ణ వాహన తనిఖీ చేశారు. హెల్మెట్ లేనివారికి కౌన్సెలింగ్ ఇచ్చి, అక్కడికక్కడే కొత్త హెల్మెట్ కొనిపించి, దానిని ధరింపజేసి పంపించారు. ఇకపై హెల్మెట్ పెట్టుకోకుంటే కేసులు తప్పవని హెచ్చరించారు. –తాళ్లపూడి పక్కన కాలువే అడిగేవారు లేకుంటే ఇలానే ఉంటోంది. పక్కనే కాలువ ఉన్నా, నీటిపారుదల శాఖ అభ్యంతరాలు ఉన్నా ఎవరికీ పట్టవు. బొబ్బర్లంక నుంచి మధ్య డెల్టా కాలువ వెంబడి రావులపాలెం ప్రధాన రహదారి ఉంటోంది. ఇటుగా వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి క్షేత్రానికి లక్షలాది మంది భక్తులు వెళ్తుంటారు. ఇటుగా కాలువ వెంబడి ఆక్రమణలు జోరందుకున్నాయి. ఇటీవల పులిదిండి వద్ద ఆర్అండ్బీ రోడ్డుకు చేర్చి, కాలువ పక్కనే వాణిజ్య షెడ్డు వేసినా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. – ఆత్రేయపురం -
కోతుల దాడిలో వృద్ధురాలి మృతి
ప్రత్తిపాడు రూరల్: కోతుల దాడిలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం.. పెద్దిపాలెం గ్రామానికి చెందిన దానబోయిన చినబుల్లి (70) స్థానిక సంత మార్కెట్ వద్ద ఉన్న మామిడి తోటలో ఇల్లు నిర్మించుకుని అందులో కుమార్తెతో కలసి జీవిస్తుంది. ఇంటి వద్ద అల్లుడు, కుమార్తె లేని సమయంలో తోటలోని తనకు చెందిన పశువుల వద్దకు వెళ్లింది. ఆమె ఒంటరిగా ఉండటంలో ఒక్కసారిగా కోతులు దాడిచేసి గాయపర్చాయి. ఈ దాడితో చినబుల్లి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ముగ్గురికీ వివాహాలు జరిపించి పెద్ద కుమార్తె లక్ష్మి వద్ద జీవనం సాగిస్తుంది. -
అర్చక సంఘం నాయకులు, మహిళలపై దాడి
కాట్రేనికోన: కుండలేశ్వర స్వామి దేవస్థానంలో అర్చకుల కుటుంబాల మధ్య చెలరేగిన వివాదాన్ని సర్థి చెప్పేందుకు వచ్చిన అర్చక సంఘం నాయకులు, బ్రాహ్మణ మహిళలపై ఓ వర్గం దాడి చేసింది. కుండలేశ్వరం దేవస్థానంలో కాళ్లకూరి బాపన్న, మల్లన్న, సాంబయ్య కుటుంబాలకు చెందిన అర్చకులు దశాబ్దాలుగా వంతుల వారీగా స్వామికి సేవలు అందిస్తున్నారు. ఆలయం ప్రాచుర్యంలోకి రావడంతో భక్తుల రద్దీతో పాటు ఆదాయం పెరిగింది. ఉగాదితో గత అర్చకుల వంతు పూర్తి కావడంతో కొత్తవారికి అవకాశం ఇవాల్సి ఉండటంతో, ఒప్పందం కుదరక అర్చక కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది. దీనిపై ఆంఽధ్ర రాష్ట్రీయ అర్చక సంఘ రాష్ట్ర అధ్యక్షుడు యనమండ్ర సత్య సీతారామశర్మ (మురమళ్ల రాంబాబు) ఆధ్వర్యంలో అర్చక సంఘం నాయకులు పలు దఫాలు చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. అధికార పార్టీకి చెందిన వర్గం ప్రస్తుత అర్చకుడిని కొనసాగించాలని, పూర్వం నుంచి అనుసరిస్తున్న ఒప్పందంతో కాళ్లకూరి మల్లేశ్వరరావుకు ఇవ్వాలని అర్చక సంఘం నాయకులతో పాటు ఓ వర్గం పట్టుబట్టింది. దీనికి అధికార పార్టీ నాయకులు ఏకీభవించకుండా అర్చక సంఘం నాయకులు, అర్చకులతో పాటు మహిళలపై దాడికి తెగబడ్డారు. దీంతో ఆగ్రహించిన బాధితులు ఆలయం ముందు బైఠాయించారు. అనంతరం రాష్ట్రీయ అర్చక సంఘం అధ్యక్షుడు యనమండ్ర సత్య సీతారామశర్మ ఇరువర్గాలతో చర్చలు జరిపి వివాదానికి తెరదించారు. కుండలేశ్వరం ఆలయ ప్రధాన అర్చకులుగా కాళ్లకూరి మల్లేశ్వరశర్మ ఏడాది పాటు ఉండేందుకు అంగీకరించడంతో ఈఓ వెంకట సత్యదుర్గ సమక్షంలో బాధ్యతలను అప్పగించారు. -
గడ్డి మందు తాగిన వ్యక్తి మృతి
రాజానగరం: అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి గడ్డి మందు తాగగా, చికిత్స పొందుతూ మృతి చెందాడని ఎస్సై నారాయణమ్మ శనివారం తెలిపారు. మండలంలోని శ్రీకృష్ణపట్నంకు చెందిన మండారపు వీరబాబు (38) ఫైనాన్స్లో ఆటోను కొనుగోలు చేశాడు. అయితే వాయిదాలను సకాలంలో చెల్లించలేక ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నాడు. ఈ క్రమంలో ఫైనాన్సర్ల నుంచి ఒత్తిడి అధికం కావడంతో ఈ నెల 16న గడ్డి మందు తాగాడు. వెంటనే అతన్ని రాజమహేంద్రవరంలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడని ఎస్సై తెలిపారు. రైలు పట్టాలపై వ్యక్తి మృతదేహం కడియం: స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై ఓ వ్యక్తి (50) మృతదేహం లభ్యమైందని రైల్వే పోలీసులు తెలిపారు. నీలం రంగు లుంగీ, నీలం–గ్రీన్ గళ్ల షర్ట్ ఒంటిపై ఉన్నాయన్నారు. అతని వివరాలు తెలిస్తే 94407 79249 ఫోన్ నంబరుకు తెలపాలని కోరారు. రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు రాజానగరం: జాతీయ రహదారిపై రాజానగరంలోని ఏడీబీ రోడ్డు జంక్షన్ వద్ద శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు గాయపడ్డారు. దీనిపై సీఐ వీరయ్యగౌడ్ కథనం ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన డి.కృష్ణమూర్తి, డి.ఈశ్వరమ్మ, డి.మనోహర్, కొట్నాన కృష్ణమూర్తి, కె.లక్ష్మి, వేగిరెడ్డి అఖిల ఒకే కారులో వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికని బయలు దేరారు. పై జంక్షన్కు వచ్చేసరికి ఈ కారును కాకినాడ వైపు రోడ్డు మలుపు తిరుగుతున్న లారీ ఢీకొంది. కారు ముందు భాగం నుజ్జునుజ్జవడంతో పాటు అందులో ప్రయాణిస్తున్న పై ఆరుగురు గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను రాజానగరంలోని జీఎస్ఎల్ ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. అక్కడ చికిత్స అనంతరం విశాఖపట్నానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం కాట్రేనికోన: పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేసి పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అతని కథనం ప్రకారం.. కాట్రేనికోనలోని రామస్వామితోటకు చెందిన మోకా శ్రీకాంత్ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. శుక్రవారం వేట్లపాలెంలో ఓ ఇంటి బేస్మెంట్ కోసం అవసరమైన మట్టిని శ్రీకాంత్ తరలిస్తుండగా, పోలీసులు పట్టుకున్నారు. పది రోజులుగా లేఅవుట్లకు మట్టిని టిప్పర్లతో తరలిస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని, ఇంటి బేస్మెంట్కు మట్టిని తరలిస్తుండగా తన ట్రాక్టర్ను పట్టుకున్నారంటూ 100కు అతను ఫోన్ చేశాడు. అనంతరం జిల్లేళ్లవారిపేట సమీపంలో వేట్లపాలెం నుంచి మట్టితో వస్తున్న మూడు లారీలను పోలీసులు పట్టుకున్నారన్నారు. కొంత సేపటికి లారీలను వదిలేశారన్నారు. తన ట్రాక్టర్ కోసం వెళ్తే కేసు కట్టేశామని పోలీసులు అంటున్నారని, దీనిపై సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టి శ్రీకాంత్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అతనికి స్థానిక వైద్యుడిచే వైద్యం చేయించగా, ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉంది. దీనిపై కాట్రేనికోన ఎస్సై అవినాష్ను వివరణ కోరగా స్థానికుల ఫిర్యాదుపై మట్టి ట్రాక్టరును పట్టుకున్నామని, పోలీసులు వేధింపులేవీ లేవన్నారు. -
శ్రీనివాసా.. చిద్విలాసా
ఆత్రేయపురం: ఆ వాడపల్లి వాసుడిని చూసిన ప్రతి మది మురిసింది.. వెంకన్న క్షేత్రంలో గోవింద నామస్మరణ ప్రతిధ్వనించింది.. కోనసీమ తిరుమలగా ఖ్యాతికెక్కిన వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసింది. ఏడు ప్రదక్షిణలు చేసిన భక్తులతో సంద్రంగా మారింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది రావడంతో కోలాహలంగా మారింది. ఆలయ అర్చకులు, వేద పండితులు వేకువజామునే స్వామివారికి సుప్రభాత సేవ, తొలి హారతి, నీరాజన మంత్రపుష్పం, ఐశ్వర్యలక్ష్మీ హోమం తదితర పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని వివిధ రకాల ఫల పుష్పాలతో ప్రత్యేకంగా అలకరించారు. ఏడు వారాల నోము ఆచరిస్తున్న భక్తులు తిరు వీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ ఒక్కరోజే సుమారు లక్ష మంది వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. వేలాది మంది అన్నప్రసాదం స్వీకరించారు. గ్యాస్ కొరత ఉన్నప్పటికీ ఆలయ ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో సిబ్బంది భక్తులకు ఏవిధమైన అసౌకర్యం కలగకుండా కట్టెల పొయ్యిలపై అన్న ప్రసాదాన్ని తయారు చేయించారు. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ పర్యవేక్షణలో రావులపాలెం సీఐలు శేఖర్బాబు, ఉదయభాస్కర్, ఆత్రేయపురం ఎస్సై ఎస్.రాము ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది భక్తులకు ఇబ్బంది లేకుండా చూశారు. ఇదిలాఉంటే స్వామివారిని ప్రముఖ సినీ నటులు తనికెళ్ల భరణి, గౌతమ్రాజు తదితరులు దర్శించుకున్నారు. తనికెళ్ల భరణి మాట్లాడుతూ కోనసీమ తిరుమల దినదినాభివృద్ధి చెందుతుందన్నారు. రావులపాలెం సీఆర్సీ వ్యవస్థాపకుడు విక్టరీ వెంకట్రెడ్డి సారథ్యంలో స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు. ఫ వాడపల్లి ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి విజయవాడ, కానూరు వాస్తవ్యులు కాశి చొప్పరపు రమేష్బాబు, సునీత దంపతులు, వారి కుటుంబ సభ్యులు రూ.50,116 విరాళం సమర్పించారు. వీరికి స్వామివారి ఫొటోను ఆలయ సిబ్బంది వై.శ్రీనివాస్ అందించారు. ఫ వాడపల్లికి పోటెత్తిన భక్తులు ఫ మార్మోగిన గోవింద నామస్మరణ -
నేటి నుంచి నిర్మలగిరి మేరీమాత ఉత్సవాలు
దేవరపల్లి: గౌరీపట్నంలోని ప్రముఖ క్రైస్తవ పుణ్యక్షేత్రం నిర్మలగిరి మేరీమాత ఉత్సవాలు ఆదివారం ప్రారంభమవుతున్నాయి. ఈ మేరకు పుణ్యక్షేత్రంలో డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ ఎస్.జాన్పీటర్ ఆధ్వర్యాన ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 25వ తేదీ వరకూ ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పుణ్యక్షేత్రానికి చేరుకుని మరియతల్లిని ఆరాధిస్తూ దీవెనలు పొందుతున్నారు. ఈ నెల 16న పుణ్యక్షేత్రంలో ఏలూరు పీఠాధిపతి మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమెర, ఖమ్మం పీఠాధిపతి మోస్ట్ రెవరెండ్ ప్రకాష్లు మేరీమాత పతాకాన్ని ఆవిష్కరించి నవదిన జపాలు, దివ్యబలి పూజ, జపమాల ధ్యాన కార్యక్రమాలు నిర్వహించి, ఉత్సవాలను ప్రారంభించారు. పుణ్యక్షేత్రాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా కట్టుదిట్టం చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు రానున్నందున అవసరమైన పోలీస్ బందోబస్తు, మంచినీరు, భోజన వసతి, ఉచిత వైద్య శిబిరాలు, విశ్రాంతి షెడ్లు ఏర్పాటు చేశారు. నిత్యాన్నదాన కాంట్రాక్టర్ కళ్లే నాగేశ్వరరావు పర్యవేక్షణలో భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నారు. ఏపీఎస్ ఆర్టీసీ వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఉత్సవాల్లో పలువురు పీఠాధిపతులు, గురువులు పాల్గొంటున్నారు. -
రత్నగిరి.. కిక్కిరిసి..
అన్నవరం: వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో రత్నగిరి శనివారం కిక్కిరిసిపోయింది. సత్యదేవుని సన్నిధిలోను, వివిధ ప్రాంతాల్లోను శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధువులకు ఇతర భక్తులు కూడా తోడవడంతో ఆలయంలో విపరీతమైన రద్దీ ఏర్పడింది. సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారని అధికారులు అంచనా వేశారు. సత్యదేవుని వ్రతాలు మూడు వేలు నిర్వహించారు. వివిధ విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. ఇందులో ఒక్క వ్రతాల విభాగం ద్వారానే రూ.20 లక్షలు రాగా, ప్రసాద విక్రయాలు, ఇతర విభాగాల ద్వారా మరో రూ.20 లక్షలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. భక్తుల ఏర్పాట్లను దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావు పర్యవేక్షించారు. రత్నగిరిపై ఆదివారం కూడా భక్తుల రద్దీ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నేడు కూడా సుమారు 40 వేల మంది భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. సత్యదేవుని దర్శించిన చీనాబ్ రైల్వే బ్రిడ్జి ఇంజినీర్ ˘ అన్నవరం: జమ్మూ కశ్మీర్లో చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ–బెంగళూరు) ప్రొఫెసర్ గాలి మాధవీలత తన కుటుంబ సభ్యులతో కలసి సత్యదేవుని శనివారం దర్శించుకున్నారు. దర్శనానంతరం పండితులు వేదాశీస్సులు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. ప్రొఫెసర్ మాధవీలతను దేవస్థానం ఈఈ వి.రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. జేఎన్టీయూలో విద్యాభ్యాసం మాధవీలత కాకినాడ జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో 1992లో బీటెక్, తరువాత వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో ఎంటెక్ చదివారు. ఐఐటీ మద్రాస్లో సివిల్ ఇంజినీరింగ్లో పీహెచ్డీ చేశారు. తరువాత ఐఐటీ గౌహతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తూనే బెంగళూరు ఐఐఎస్సీలో డాక్టోరియల్ రీసెర్చ్ చేశారు. అనంతరం మెకానిక్స్ ఆఫ్ సోయిల్ అండ్ గ్రౌండ్ ఎన్ఫోర్స్మెంట్లో పలు పరిశోధన పత్రాలు సమర్పించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చీనాబ్ నదిపై వంతెన నిర్మించేందుకు అక్కడి నేల, కొండల పరిస్థితిపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించారు. ఆ తరువాత ఆ బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యే వరకూ మాధవీలత అక్కడే ఉండి పర్యవేక్షించారు. -
ఉగాది కానుక కాదు.. కంటితుడుపు చర్య
కపిలేశ్వరపురం (మండపేట): ఉగాది రోజున రాష్ట్ర ప్రజలకు కానుక ఇచ్చామంటూ చంద్రబాబు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ప్రకటన కంటితుడుపు చర్య మాత్రమేనని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. 20 నెలల చంద్రబాబు పాలనలో 6,28,347 ఉద్యోగాలిచ్చామంటూ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు. అధికారంలోకి వచ్చాక 20 లక్షల ఉద్యోగాలిస్తామంటూ సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి నేతలు ప్రకటించారని గుర్తు చేశారు. ఆరు లక్షలకు పైగా ఉద్యోగాలిచ్చామంటూ ప్రభుత్వం చెబుతున్న గణాంకాలన్నీ అబద్ధాలని ప్రజా సంఘాల నాయకులు చెబుతున్నారన్నారు. రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులతో 25 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా ఒప్పందాలు చేసుకున్నామంటూ ప్రభుత్వం చెబుతున్న మాటలు బూటకమన్నారు. రాష్ట్రంలో ఏయే కంపెనీఎల్లో ఎంత మందికి ఉద్యోగాలొచ్చాయో నియామక ఆర్డర్లతో కూడిన వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. అవినీతి, అక్రమాలు, అరాచక పాలనతో సామాన్య ప్రజలకు ప్రభుత్వం పట్ల అసహనం కలుగుతోందన్నారు. విసిగి వేసారిన నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఉద్యోగాల్లో చేరిన వారు ప్రభుత్వ పరంగా సేవలందిస్తున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు పాలన తీరుపై వైఎస్సార్ సీపీ ఉద్యమిస్తుందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలనే డిమాండ్తో ప్రజలతో కలిసి పోరాడతామని ఎమ్మెల్సీ తోట స్పష్టం చేశారు. -
గెలగిల
ఆదివారం శ్రీ 22 శ్రీ మార్చి శ్రీ 2026ఖండవల్లిలో అరటి తోట పెరవలి: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టు.. ఇతర రాష్ట్రాల్లో ఉత్పత్తి ఇబ్బడిముబ్బడిగా పెరగడం.. మన అరటి రైతులకు నష్టాల్ని తెచ్చి పెడుతోంది. నెల రోజుల క్రితం వరకూ 10 టన్నుల లారీ అరటి గెలల ధర రూ.2.20 లక్షలు పలకగా.. ప్రస్తుతం అది సగానికి పైగా తగ్గి, రూ.లక్షకు పడిపోయింది. తోటల వైపు కన్నెత్తి కూడా చూసేవారు లేకపోవడంతో రైతులు.. ఒకవేళ గెలలు కొన్నా అమ్ముకునే దారి లేక వ్యాపారులు దిక్కు తోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. పక్వానికి వచ్చిన గెలలు తోటల్లోనే ముగ్గిపోతూండటం చూసి రైతులు తల్లడిల్లుతున్నారు. వాటిని అలాగే వదిలేయలేక కొంత మంది పక్వానికి వచ్చిన గెలలను మార్కెట్కు తరలించి, అయినకాడికి అమ్ముకుంటున్నారు. 7,500 హెక్టార్లలో.. జిల్లాలో అన్ని రకాలు కలిపి 7,500 హెక్టార్లలో అరటి సాగు జరుగుతోంది. పెరవలి, నిడదవోలు, ఉండ్రాజవరం, నల్లజర్ల, చాగల్లు, కొవ్వూరు, దేవరపల్లి, గోపాలపురం, తాళ్లపూడి, సీతానగరం, రాజానగరం, అనపర్తి తదితర మండలాల్లో దాదాపు 8 వేల మంది రైతులు అరటి సాగు చేస్తున్నారు. అరటి తోటలను నమ్ముకుని కూలీలు, వెదురు వేసే కూలీలు, గెలలకు అరటి ఆకులు చుట్టే కూలీలు, గెలలు కోసే కూలీలు, అరటి వ్యాపారులు సుమారు 30 వేల మంది ఉన్నారు. మార్కెట్లో ధరలు పడిపోవడంతో వీరందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎగుమతులకు బ్రేక్ గత ఏడాది డిసెంబర్లో 10 టన్నుల అరటి ధర రూ.1.80 లక్షలు పలకగా.. అప్పటి నుంచీ అది క్రమంగా పెరుగుతూ గత నెలలో ఏకంగా రూ.2.20 లక్షలకు చేరింది. మన జిల్లా నుంచి ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, బిహార్ తదితర రాష్ట్రాలకు అరటి ఎగుమతులు జరిగేవి. గతంలో బెంగాల్లో అరటి సాగు పెద్దగా ఉండేది కాదు. ఇప్పుడు అక్కడ ఇతర రాష్ట్రాలకు సైతం ఎగుమతి చేసే స్థాయిలో సాగు జరుగుతోంది. దీనికితోడు తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో కొన్నాళ్లుగా అరటి ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఫలితంగా మన అరటికి నెల రోజులుగా డిమాండ్ తగ్గింది. ఎగుమతులు క్రమంగా తగ్గిపోయాయి. గతంలో జిల్లా నుంచి ప్రతి రోజూ 80 నుంచి 100 లారీల గెలల ఎగుమతి జరిగితే నేడు అది 40 నుంచి 50 లారీలకే పరిమితమవుతోంది. ఈ పరిస్థితుల్లో మన జిల్లాలో అరటి ధరల పతనమవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 6 వేల హెక్టార్లలో తోటల నుంచి దిగుబడి వచ్చే పరిస్థితి ఉంది. కానీ, ఇతర రాష్టాలకు ఎగుమతులు పడిపోయాయి. ఆ సరకంతా స్థానిక మార్కెట్లకు ఒక్కసారిగా వస్తూండటంతో ఇక్కడ కూడా రైతులు ఆశించిన ధర రావడం లేదు. మరోవైపు ఎగుమతులు కూడా తగినంతగా లేక నష్టాల ఊబిలో కూరుకుపోతున్నామని స్థానిక వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. ధరలు పతనమయ్యాయిలా.. ప్రస్తుతం మార్కెట్లో 10 టన్నుల లారీ కర్పూర అరటి ధర గతంలో రూ.2 లక్షల వరకూ పలకగా.. ప్రస్తుతం రూ.లక్షకు పతనమైంది. గతంలో వ్యాపారులు తోటలు కొనుగోలు చేసినప్పుడు చక్కెరకేళీ గెలకు రూ.250 నుంచి రూ.300 వరకూ పెట్టారు. ప్రస్తుతం దానికి రూ.250 మాత్రమే దక్కుతోంది. అలాగే, ఎర్ర చక్కెరకేళీ గెలకు తోటల వద్ద రూ.400 నుంచి రూ.500 వరకూ పెట్టగా, మార్కెట్లో ఇప్పుడు రూ.300 మాత్రమే వస్తోంది. ఫలితంగా తాము తీవ్రంగా నష్టపోతున్నామని వ్యాపారులు వాపోతున్నారు. మార్కెట్లో ధర లేకపోవడంతో వారు తోటలను వదిలేస్తున్నారు. అయితే, పక్వానికి వచ్చిన గెలలు కోయకపోతే అది పండిపోయి మొత్తం తోట పాడైపోతుందని, దీంతో మొదటికే మోసం వస్తుందని రైతులు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో కొంత మంది రైతులు గెలలను సైకిళ్లపై మార్కెట్కు తరలించి అమ్ముకుంటున్నారు. మార్కెట్లో సైకిల్ లోడ్ (6 గెలలు) కర్పూరం అయితే నాణ్యతను బట్టి రూ.వెయ్యి నుంచి రూ.1,200, చక్కెరకేళీకి రూ.1,500 నుంచి రూ.2 వేలు, ఎర్ర చక్కెరకేళీకి రూ.2 వేల నుంచి రూ.2,500 వరకూ ధర పలుకుతోంది. కుదేలైన అరటి ధరలు నెల క్రితం 10 టన్నుల లారీ ధర రూ.2.20 లక్షలు నేడు రూ.లక్ష గతంలో రోజూ 100 లారీల్లో ఇతర రాష్ట్రాలకు.. ప్రస్తుతం అందులో సగమే ఎగుమతులు రైతులు, వ్యాపారుల గగ్గోలు నష్టపోతున్నాం తోటలు అమ్మినప్పుడు ధరలు బాగానే ఉన్నాయి. ఒక్కో గెలను రూ.250కి అమ్మాను. సగం తోట కోసిన తరువాత ధరలు పతనమవడంతో వ్యాపారులు గెలలు కోయడమే మానేశారు. దీంతో నష్టాల పాలవుతున్నాం. – కాపకా పాపారావు, అరటి రైతు, కాకరపర్రు, పెరవలి మండలం గెలలు పాడైపోతున్నాయి ఈ ఏడాది ప్రారంభంలో ధరలు బాగానే ఉన్నాయి. నెల రోజులుగా ధరలు తగ్గడంతో వ్యాపారులు తోటల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. పక్వానికి వచ్చిన గెలలు ముగ్గిపోయి, పాడైపోతున్నాయి. – సంఖు ప్రభాకరరావు, అరటి రైతు, మల్లేశ్వరం -
తొలి తిరుపతికి పోటెత్తిన భక్తులు
పెద్దాపురం (సామర్లకోట): తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో కొలువైయున్న శృంగార వల్లభ స్వామి ఆలయానికి ఽశనివారం భక్తులు వేలాదిగా పోటెత్తారు. సెలవు రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు వివిధ గ్రామాల నుంచి స్వామి వారి దర్శనానికి రావడంతో ఆలయం రద్దీగా మారింది. స్వామివారి తొలి హారతిని తిలకించడానికి భక్తులు పోటీ పడ్డారు. సుమారు 35 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ఆలయాన్ని పూలమాలలతో అలంకరించి, స్వామివారికి అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా రూ.2,39,875, అన్నదాన విరాళాలు రూ.84,972, కేశఖండన ద్వారా రూ.6,760, తులాభారం ద్వారా రూ.550, లడ్డూ ప్రసాద విక్రయం ద్వారా రూ.22,095 కలిపి మొత్తం రూ.3,54,147 ఆదాయం సమకూరిందని ఈఓ వివరించారు. ఏడు వేల మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారని తెలిపారు. భక్తులకు గ్రామ సర్పంచ్ మొయిలి కృష్ణమూర్తి, ట్రస్టు బోర్డు చైర్పర్సన్ మొయిలి సంధ్య, దేవస్థానం సిబ్బంది, గ్రామ పెద్దలు సేవలందించారు. ఘనంగా పందిరి రాట ముహూర్తం అన్నవరం: ఈ నెల 26న ప్రారంభం కానున్న రత్నగిరి క్షేత్ర పాలకుడు శ్రీ సీతారామచంద్రస్వామివారి శ్రీరామ నవమి వేడుకలకు, వచ్చే నెల 26 నుంచి జరగనున్న సత్యదేవుని కల్యాణ మహోత్సవాలకు శనివారం రాట ముహూర్తం ఘనంగా నిర్వహించారు. రత్నగిరి రామాలయం వద్ద పండితులు విఘ్నేశ్వర పూజ తదితర కార్యక్రమాలు నిర్వహించి, మంత్రోచ్చారణల నడుమ ఉదయం 10.25 గంటలకు పందిరి రాట వేశారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావు దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో ఈ కార్యక్రమంలో తోపులాట జరిగింది. పెద్ద ఎత్తున వచ్చిన మహిళలు చైర్మన్, ఈఓల కన్నా ముందుగానే పందిరి రాటను ముట్టుకునేందుకు పోటీ పడ్డారు. వారిని నియంత్రించేందుకు సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడంతో కొంతసేపు గందరగోళం ఏర్పడింది. ఈఓ దంపతుల మధ్య నుంచే ఒక మహిళ చేయిపెట్టి పందిరి రాటను పట్టుకోవడం వివాదాస్పదమైంది. ఈ కార్యక్రమం గురించి ముందుగానే ప్రకటించినప్పటికీ తగిన ఏర్పాట్లు చేయలేదంటూ సిబ్బందిపై ఈఓ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పాత రాతియుగం
● ఈద్ ముబారక్ పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్షల అనంతరం జిల్లావ్యాప్తంగా ముస్లింలు శనివారం ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్) పండగను ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుతూ మసీదుల వద్ద సామూహికంగా ప్రత్యేక ప్రార్థనలు (దువా) నిర్వహించారు. పరస్పరం ఆత్మీయ ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. మత పెద్దలు ఖురాన్ చదివి వినిపించారు. సంపాదించిన దానిలో కొంత మొత్తాన్ని పేదలకు దానధర్మాలు చేయాలని, అలా చేసే వారి పట్ల అల్లాహ్ దయ ఎన్నటికీ ఉంటుందని మత పెద్దలు చెప్పారు. రాజమహేంద్రవరం రాజేంద్ర నగర్ దర్గాలో వేలాది మంది ముస్లింలు దువా చేసి స్వీట్లు పంచుకున్నారు. – సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం) ప్రాభవం తగ్గుతూ..ఇళ్ల వద్ద మూలకు చేరిన రాతి రోళ్లు ● రాతి పనిముట్లకు తగ్గిన ఆదరణ ● శుభకార్యాలకే పరిమితమవుతున్న రోళ్లు, సన్నికల్లు, తిరగళ్లు ● ఆధునికత మేళవింపుతో అక్కడక్కడ అమ్మకాలుపిఠాపురం: ఒకప్పుడు ఏ ఇంట చూసినా రోలు, రోకలి, కల్వం, రుబ్బురోలు, సన్నికల్లు వంటి రాతి పనిముట్లు అతివలకు వంటింటి నేస్తాలుగా ఉండేవి. వీటిని సాక్షాత్తూ దైవ స్వరూపాలుగా భావించేవారు. రోలు సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మి.. రోకలి శ్రీమన్నారాయణుడు.. తిరగలి శివుడు.. దాని పిడి పార్వతీదేవి.. ఈ పవిత్ర భావనతోనే వాటికి పొరపాటున కూడా కాలు తగలకుండా జాగ్రత్త పడేవారు. ఒకవేళ అలా కాలు తగిలితే మహాపాపంగా భావించేవారు. ప్రతి ఇంట్లో ఆయా రాతి పనిముట్లకు ఎంతో ప్రాధాన్యం ఉండేది. కానీ, కాలక్రమంలో మిక్సీలు, గ్రైండర్ల వంటి ఆధునిక గృహోపకరణాలు వచ్చిన తరువాత నాటి శ్రీపాత రాతి యుగంశ్రీ ప్రాభవం క్రమంగా తగ్గుతోంది. అక్కడక్కడ కనిపిస్తున్నప్పటికీ.. ఎక్కువగా వివాహాది శుభకార్యాల్లో.. అది కూడా పసుపు కొట్టడం వంటి కార్యక్రమాలకే పరిమితమవుతోంది. ఆ రుచే వేరు పండగలు సమీపిస్తున్నా, ఊరగాయల సీజన్ మొదలైనా.. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగబోతున్నా.. గతంలో రోళ్లు, రోకళ్లు, తిరగళ్లు, సన్నికల్లు వంటి రాతి పనిముట్లకు బోలెడంత పని. పప్పులను రోటిలో దంచేవారు. మసాలాలు కల్వంలో నూరేవారు. రుబ్బురోటిలో చేసే రోటి పచ్చడి అంటే ఇప్పటికీ చాలా మంది శ్రీఆ రుచే వేరుశ్రీ అంటూ లొట్టలేస్తారు. అంతే కాదు.. వీటిల్లో ఎప్పటికప్పుడు తయారు చేసే పచ్చళ్లు, రకరకాల పొడులు తాజాగా ఉంటాయి. అంతా రెడీమేడ్ పాత కాలం నాటి రాతి పనిముట్లు వాడాలనే ఆసక్తి ఉన్నప్పటికీ.. ఆధునిక జీవితంలో వేగం పెరిగింది. బతుకుతెరువు కోసం కాలంతో పోటీ పడాల్సిన పరిస్థితి. అటువంటి వారి కోసం మిక్సీలు, గ్రైండర్ల వంటి రకరకాల యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి పాత రాతి పనిముట్ల స్థానాన్ని ఆక్రమించాయి. గతంలో పెళ్లి కుదిరిందంటే రెండు నెలల ముందు నుంచి వడ్లు దంచుకోవడం, కారం, పసుపు కొట్టడం, అరిసెల పిండి దంచడం వంటి పనులను పది మంది కలసి చేసేవారు. ఇప్పుడన్నింటికీ యంత్రాలే. పైగా, అన్నీ షాపులో రెడీమేడ్గా దొరుకుతున్నాయి. కారం, పసుపు, పిండి, చివరకు ఊరగాయలు, కూరలు కూడా రెడీమేడ్. అయితే, వీటిలో ఏ కల్తీలు జరుగుతున్నాయో.. మన ఆరోగ్యానికి ఎంత చేటు చేస్తున్నాయో గమనించే పరిస్థితి కూడా ఉండటం లేదు. ఆధునిక రూపంలో.. రోళ్లు, రోకళ్లు, తిరగలి ఎంత పెద్దగా ఉన్నా గతంలో చాలా సులభంగా ఉపయోగించేవారు. తిరగలి పై భాగాన్ని సులువుగా లేపేవారు. మరీ పెద్దదైతే ఇద్దరు కలిసి లేపేవారు. రుబ్బురోలు పొత్రాన్ని సులభంగా ఎత్తేవారు. ఇప్పుడు ఎవ్వరికీ రోటిలో దంచే తీరికా లేదు.. పొత్రం ఎత్తే ఓపికా లేదు. అయితే, ఈ పనిముట్లపై ఇప్పటికీ కొంత మందికి మోజు ఉంది. వారిని దృష్టిలో పెట్టుకుని వీటి తయారీదారులు ఇప్పటి అవసరాలకు తగినట్లుగా రాతి రోళ్ల తయారీలో స్మార్ట్ టెక్నిక్స్ వాడుతున్నారు. మార్బుల్, గ్రానైట్తో పాటు సోప్ స్టోన్స్, శాండ్ స్టోన్లతో తక్కువ బరువుతో ఈ పనిముట్లు తయారు చేస్తున్నారు. రుబ్బుతున్నప్పుడు, విసురుతున్నప్పుడు పిండి సులువుగా తీసుకునేందుకు అనుకూలంగా ట్రేలు ఏర్పాటు చేస్తున్నారు. తిరగలిలో పైన పప్పులు పోసేందుకు చెక్కతో మూతలు సైతం ఏర్పాటు చేస్తున్నారు. సన్నికల్లును సన్నగా కత్తిరిస్తున్నారు. రుబ్బురోలుకు స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్స్ పెడుతున్నారు. ఆధునిక కిచెన్లకు సంప్రదాయ పనిముట్లను జోడించేలా వీటిని తయారు చేస్తున్నారు. నాపరాతితో తయారు చేసిన స్మార్ట్ రుబ్బురోలు స్మార్ట్ రాతి పరికరాలుపెళ్లిళ్లలోనే ప్రాధాన్యం వివిధ ప్రాంతాలు, సంప్రదాయాలకు అనుగుణంగా వివాహ వేడుకల్లో రాతి రోళ్లకు ఇప్పటికీ ప్రాధాన్యం ఉంది. ప్రతి శుభకార్యానికీ పసుపు కొట్టడం ఆనవాయితీ. వీటితో ధాన్యం దంచడం, కొట్నాలు వంటి సంప్రదాయ పద్ధతులు ఇప్పటికీ నిర్వహిస్తున్నారు. ఎక్కువ మంది తమ ఇళ్లల్లో చాన్నాళ్లుగా పక్కన పెట్టేసిన వీటిని శుభకార్యాల్లో మాత్రం తప్పనిసరిగా బయటకు తీస్తారు. కొందరైతే రెడీమేడ్ పనిముట్లతో శుభకార్యాలు పూర్తి చేస్తున్నారు. పెళ్లితంతులను బట్టి వీటికి ప్రాధాన్యం పెరుగుతుంది. బ్రాహ్మణ కుటుంబాల్లో అయితే తాళిబొట్టును రోకలికి, కాడికి కట్టి, పాలు పోస్తూం చేసే పద్ధతి ఇప్పటికీ కొనసాగుతోంది. – వెలిది రమేష్శర్మ, పురోహితుడు, కొత్తపల్లి -
అనపర్తిలో ఆగని అధికార పార్టీ ఆగడాలు
అనపర్తి: తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గంలో అధికార పార్టీ ఆగడాలు ఆగడం లేదు. నియోజకవర్గంలోని బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తపై అధికార పార్టీ శ్రేణులు విచక్షణారహితంగా దాడులు చేశాయి. ఈ ఘటనలో స్పృహ కోల్పోయిన బాధితుడిని ఆస్పత్రికి తరలించాయి వైఎస్సార్సీపీ శ్రేణులు. ఈ దాడిపై బాధిత కుటుంబ సభ్యలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ దాడికి కారణమైన నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు పోలీసులు. దాడులకు పాల్పడిన వారికి ఇలా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించడం విమర్శలకు దారి తీసింది. నిందితులపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు.. అధికార పార్టీకి కొమ్ముకాస్తూ నిందితుల్ని ఇలా స్టేషన్ బెయిల్పై పంపించడం ఏంటని వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తోంది. పల్నాడులో టీడీపీ గూండాలు దాడులుల్నాడు జిల్లాలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ గూండాలు దాడులకు దిగారు. ఈ దాడిలో ఇద్దరు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ఆక్వాంక్షలు ఫలించక..
ఉప్పలగుప్తం: ఆక్వా రైతు ఆకాంక్షలు ఫలించడం లేదు.. ఈ సాగు లాభసాటిగా ఉండడం లేదు.. వైరస్ల ముప్పేట దాడితో ఎటూ పాలుపోవడం లేదు.. సాగు వదలలేక, ముందుకు సాగలేక అగమ్యగోచరంలా వారి పరిస్థితి మారింది. దేశానికి రైతే రాజు అని పెద్దలు అంటుంటారు. ఒకప్పుడు రొయ్యలు సాగుచేసే రైతు రాజులాగే జీవించేవాడు. కొంత కాలంగా ఈ సాగులో నష్టాలను చూస్తూ ఢీలా పడుతున్నాడు. ప్రస్తుతం ఈ సాగు కత్తి మీద సాములా మారిందని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో పలువురు రైతులు కొంతకాలం సాగుకు విరామం ప్రకటించి సంవత్సరానికి రెండు సాగులు చేపట్టే దిశగా ఆలోచిస్తున్నారు. ఈ పరిస్థితులకు అనుకూలంగా జనవరి నుంచి జూన్ వరకూ చేసే సాగు కలసి వస్తుందని రైతులు గంపెడు ఆశతో పంట చేపడుతున్నారు. అయినప్పటికీ వాతావరణంలో మార్పు కారణంగా వైరస్ విజృంభించి నష్టాలు చవిచూడడం తప్పడం లేదని ఆక్వా రైతులు బెంబేలెత్తుతున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం, ఉప్పలగుప్తం, ముమ్మిడివరం కాట్రేనికోన, ఐ.పోలవరం, తాళ్లరేవు, అమలాపురం రూరల్ మండలాల్లో అధికారంగా, అనధికారకంగా సుమారు 30 వేల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. మిశ్రమ పద్ధతిలో రొయ్యలు, చేపల సాగు చేస్తున్నారు. రొయ్య సాగు కలిసి వస్తే దానిపై వచ్చే ఆదాయం పెట్టుబడిగా వచ్చి, చేపల సాగుపై వచ్చే ఆదాయం రైతుకు లాభదాయకంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో హేచరీల నిర్వాహకులు నాసిరకమైన తల్లి రొయ్యలను వాడటంతో రొయ్య సీడ్ నుంచి ఈహెచ్పీ అనే వ్యాధి రైతుల పాలిట శాపంగా మారింది. దీంతో రొయ్య మేత ఎక్కువగా తీసుకుని ఎదుగుదల లోపించడంతో రైతులు నష్టపోతున్నారు. వాతావరణ మార్పుల కారణంగా ఏరియేటర్లు ఎక్కువ సమయం తిప్పుతూ ఆక్సిజన్ అందించాల్సి వస్తుందని, ఇలా అధికంగా ఖర్చు అవుతుందని, రొయ్యలు సమయానికి మేతలు తీసుకోవడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. సమయానుకూలంగా సాగును పరిశీలించుకుని శానిటైజర్లు, మందులు వాడుతూ అధికంగా ఏరియేటర్లను తిప్పుతూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. చిన్న సైజులో ఉండగానే.. ప్రస్తుత వాతావరణంలో వస్తున్న మార్పులకు ఆక్వా రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం తెల్లటి దుప్పటిలా మంచు తెర కప్పి విపరీతమైన చల్లదనాన్ని ఇస్తుంటే, ఉదయం పది గంటల నుంచి భానుడు భగభగలాడుతూ ఎండలు కాస్తూ వాతావరణంలో వేడిని పుట్టిస్తున్నాడు. దీంతో చెరువుల్లోని రొయ్యలు డీవోలతో ఉక్కిరిబిక్కిరై వైరస్లతో చిన్న సైజులోనే మృత్యువాత పడుతున్నాయి. కొంత మంది రైతులు లాభాల దిశగా చేప, రొయ్య మిశ్రమ సాగు (పాలీకల్చర్) చేస్తున్నా.. రొయ్య సాగు రోజులు గడవక ముందే కొత్త కొత్త తెగుళ్లతో చిన్న కౌంట్లోనే చనిపోవడంతో రొయ్యను పట్టకుండానే వదిలివేసి నష్టాలను చూస్తున్నారు. వాతావరణంలో విభిన్న మార్పులతో ఒకపక్క ఎండ, మరోపక్క మంచు కురుస్తూ చెరువులో నీటి, మట్టి నాణ్యత లోపించడం, ఆక్సిజన్ స్థాయి తగ్గడం డెడ్ ఆల్గే, విష వాయువులు విజృంభిస్తున్నాయి. వెనామీ రొయ్యల సాగులో వైట్ గట్, సెల్ లూజ్, రెడ్ గిల్, బ్లాక్ గిల్, హిబ్రియో వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. గోపవరంలో రొయ్యల పట్టుబడిఫ రైతులకు లాభసాటి లేదు‘రొయ్య’ ఫ వైరస్ల బారిన పంట ఫ వాతావరణ మార్పులే కారణం ఫ రోజురోజుకూ విజృంభిస్తున్న వైనం తీవ్రంగా నష్టపోతున్నాం హేచరీల నిర్వాహకులు పూర్వం మంచి నాణ్యత కలిగిన తల్లి రొయ్యలను తెచ్చి దానితో నాణ్యమైన పిల్లలను అందించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నాసిరకమైన తల్లి రొయ్యలను వాడి నాసి రకమైన రొయ్య పిల్లలు ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో ఎంతో ఆశలతో అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రతి బ్యాచ్లో దిగే రొయ్యకు కచ్చితంగా వైట్ గట్ సోకి సమయానికి మేత తీసుకోక ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం పెట్టుబడులు భారీగా పెరిగిపోయాయి. అధికారులు దృష్టి సారించి హేచరీలపై చర్యలు తీసుకోకుంటే రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. –నల్లా వెంకటేశ్వరరావు, ఆక్వా రైతు, వానపల్లిపాలెం లాభాలు లేక.. వాతావరణంలో మార్పులకు చెరువులో రొయ్య పిల్ల లు డీవోకు గురవుతున్నాయి. దీంతో ఏరియేటర్లు ఎక్కువ సమయం తిపాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో రొయ్యలు సకాలంలో మేత తినకపోగా ఏరియేటర్లు తిప్పడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇంత కష్టపడినా సాగు లాభదాయకంగా చేతికొస్తుందనే భరోసా లేదు. నేను మూడు ఎకరాల్లో రొయ్య సాగు చేస్తున్నాను. సీడ్ విషయంలో నెల రోజుల క్రితం సుదూర ప్రాంతం నుంచి తెచ్చుకుని సాగు చేస్తున్నాను. అందులో ఒక చెరువు ఇటీవల హిబ్రియో వైరస్ వ్యాపించి పట్టుబడికి అనుకూలంగా లేకుండా పోయింది. –సురేష్రాజు, ఆక్వా రైతు, కొమ్మరిగిరిపట్నం -
అర్చకుల గృహాల కూల్చివేత
ఫ అడ్డుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు ఫ ఆత్రేయపురంలో ఘటన ఆత్రేయపురం: స్థానిక బాలాత్రిపుర సుందరీ సమేత రాజరాజేశ్వరస్వామి (శివాలయం), రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి ఆలయాల ఆవరణలో తరతరాల నుంచి ఉంటున్న తమ ఇళ్లను టీడీపీ నాయకులు అక్రమంగా కూల్చివేస్తున్నారని శివాలయ అర్చకుడు పుల్లేటికుర్తి భాస్కరశర్మ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే రెండు కుటుంబాలకు చెందిన ఇళ్లను దౌర్జన్యంగా నేలమట్టం చేసి, నిలువ నీడ లేకుండా చేశారని అన్నారు. పురాతన ఆలయాలను పునర్నిర్మించడం మంచిదే అయినా? ఎటువంటి అడ్డులేకుండా ఉన్న నివాసాలను కూల్చడం సరికాదన్నారు. ఇంతకు ముందు రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి ఆలయ ప్రధాన అర్చకుడు వాడపల్లి జనార్దనస్వామి ఎంతో కష్టపడి నిర్మించుకున్న భవనాన్ని కూల్చివేశారన్నారు. దీనిపై ఆయన తీవ్ర మనోవేదనకు గురై అనారోగ్యం బారిన పడినట్లు తెలిపారు. అలాగే ఆ పక్కనే ఉంటున్న పూర్వపు ఆలయ అర్చకుడు ఆచార్యులు కుటుంబ సభ్యుల ఇంటిని సైతం అనవసరంగా కూల్చివేశారన్నారు. గ్రామంలో తమకు బలం లేనందున దౌర్జన్యంగా నివాసాలను కూల్చివేస్తున్నారని అర్చకులు ఆరోపిస్తున్నారు. కాగా శుక్రవారం తాము ఇంట్లో ఉండగా, తమ తల్లి పుల్లేటికుర్తి పల్లాలమ్మ ఎంతగా అడ్డుకున్నా వినకుండా, ఆలయానికి ఏమాత్రం అడ్డంగా లేని తమ ఇంటి గోడను కూల్చివేశారని ఆలయ అర్చకుడు భాస్కరశర్మ తెలిపారు. మొత్తం భవనం కూల్చివేస్తామని వెంటనే బయటకు వెళ్లిపోవాలని అంటున్నారని ఆయనఅన్నారు. కాగా గ్రామ వైఎస్సార్ సీపీ నాయకులు చిలువూరి రామకృష్ణరాజు, ముదునూరి బండ కృష్ణంరాజు, గొట్టుముక్కల గోపిరాజు, ముదునూరి శ్రీహరిరాజు తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని కూల్చివేతను అడ్డుకున్నారు. దీంతో వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు ఆగ్రహంతో దౌర్జన్యానికి దిగినట్లు ఆలయ అర్చకుడు పుల్లేటికుర్తి భాస్కరశర్మ తెలిపారు. తమకు ఆస్తిపాస్తులు లేవని, కేవలం ఆలయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నామని అన్నారు. చివరికి వైఎస్సార్ సీపీ నాయకుల ఒత్తిడితో టీడీపీ నాయకులు ఆదివారం పెద్దలతో చర్చిస్తామని అన్నారు. అంతవరకూ కూల్చివేతను నిలుపుదల చేయాలని వైఎస్సార్ సీపీ నాయకులు చెప్పారు. అర్చకుల కుటుంబాలకు అన్యాయం చేస్తే సహించేది లేదని, వారికి నచ్చజెప్పి నష్టపరిహారం అందించి భవిష్యత్ కార్యక్రమాలు చేపట్టాలని వైఎస్సార్ సీపీ నాయకుడు గొట్టుముక్కల గోపిరాజు తదితరులు కోరారు. దీనిపై రాష్ట్ర అర్చక సమాఖ్య నాయకుడు రాంబాబు త్వరలో ఆత్రేయపురం వచ్చి నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. -
ఏటీఎం నుంచి మంటలు
గోకవరం: ఓ ఏటీఎం నుంచి మంటలు చెలరేగగా, లోపల ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆ వివరాల ప్రకారం.. గోకవరం ఎంపీపీ మెయిన్ పాఠశాల ఎదురుగా ఉన్న ఎస్బీఐ ఏటీఎం నుంచి శుక్రవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. ఏటీఎం నుంచి దట్టమైన పొగలు రావడంతో లోపల ఎవరైనా ఉన్నారా అని తీవ్రమైన అందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న కోరుకొండ అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయగా, లోపల ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఏటీఎం టెక్నికల్ సిబ్బంది అక్కడకు చేరుకుని కారణాలను గుర్తించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా నిర్ధారించారు. స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. -
నిందితులను అరెస్ట్ చేయకపోతే ఆందోళనే..
పి.గన్నవరం: కుందాలపల్లిలో ఈ నెల 16న దళితుడు కాట్రు శ్రీనివాస్ మృతదేహాన్ని గ్రామంలోని ప్రధాన రహదారి మీదుగా తీసుకు వెళ్లకుండా అడ్డుకున్న పది మందిని సోమవారం లోగా అరెస్టు చేయకపోతే, వేలాది మంది దళితులతో అమలాపురంలో కలెక్టరేట్ను ముట్టడిస్తామని దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ సంఘటనలో నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ దళిత నాయకులు శుక్రవారం పి.గన్నవరం పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. పెళ్లి పందిరి ఉందనే కారణంతో ప్రధాన రహదారిపై నుంచి మృతదేహాన్ని తీసుకువెళ్లకుండా అడ్డుకున్నారన్నారు. దళితులపై దౌర్జన్యం చేశారని ఆరోపించారు. ఎస్సై బి.శివకృష్ణతో దళిత సంఘాల నాయకులు మాట్లాడారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ బాధితుల ఫిర్యాదు మేరకు 10 మందిపై అట్రాసిటీ కేసు నమోదు చేశామన్నారు. డీఎస్పీ దర్యాప్తు చేసిన అనంతరం తగు చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
సముద్రంలో యువకుడి గల్లంతు
అల్లవరం: ఓడలరేవు సముద్ర తీరం వద్ద నిర్మాణంలో ఉన్న గ్రోయిన్లపై నడుస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి ఓ యువకుడు గల్లంతయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. కొమరగిరిపట్నంలో ఓ ఫంక్షన్కు స్నేహితులతో పాటు అమలాపురం నారాయణపేట ప్రాంతానికి చెందిన దొమ్మేటి లోకేష్ (17) వచ్చాడు. అక్కడి నుంచి లోకేష్తో పాటు బొక్కా సతీష్, గుత్తుల మనోజ్, బొక్కా గణేష్లు శుక్రవారం మధ్యాహ్నం ఓడలరేవు బీచ్కు చేరుకున్నారు. ఓఎన్జీసీ పశ్చిమ గేటు వద్ద నిర్మాణంలో ఉన్న గ్రోయిన్లపై లోకేష్ నడుస్తుండగా, నాచు కారణంగా జారి పడిపోయాడు. ఇంతలో సముద్రంలో స్నానం చేస్తున్న మరో యువకుడు గుర్తించి కేకలు వేసి కాపాడే ప్రయత్నం చేశారని మైరెన్ సీఐ ఎంవీవీఎస్ఎన్ మూర్తి తెలిపారు. భారీ కెరటాలకు లోకేష్ సముద్రం లోపలకు కొట్టుకుపోయాడని అన్నారు. అతను దివ్యాంగుడు కావడంతో తనను తాను కాపాడుకోలేకపోయాడని పోలీసులు భావిస్తున్నారు. ఇటీవలే లోకేష్ కాలికి శస్త్రచికిత్స చేయించామని, ఇంతలో ఇలా జరిగిందని కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మైరెన్ పోలీసులు, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్సైలు పుల్లయ్య, రమేష్, సిబ్బంది రాజేష్, డిప్యూటీ తహసీల్దార్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
ఆగనిది ఈ పయనం..
ఫ పరుగులు పెట్టిస్తున్న పులి ఫ కానెంవారి మెట్టపై తిష్ట ఫ బయటకు వెళ్లవద్దని అధికారుల ప్రచారం అడ్డతీగల: పులి పయనం ఆగకుండా సాగుతోంది.. అటవీ ప్రాంతం నుంచి జనారణ్యంలోకి వచ్చి చిక్కకుండా తిరుగుతోంది.. మూగజీవాలపై దాడులకు దిగుతోంది.. అధికారులను ముప్పుతిప్పలు పెడుతోంది. ఈ పెద్ద పులి శుక్రవారం ఉదయానికి వీరభద్రపురం రక్షిత అటవీ ప్రాంతానికి సమీపాన వీరభద్రపురం గ్రామానికి వెనుక ఉన్న కానెంవారి మెట్టపై తిష్ట వేసింది. అటవీ అధికారులు రేడియో కాలర్ సిగ్నల్స్ ద్వారా దీనిని గుర్తించారు. సాయంత్రానికి సరంపేట సమీపాన స్వామి కొండపై నూతుల్లోద్ది, పాకుల్లొద్దు ప్రాంతానికి చేరుకుని మకాం మార్చింది. ఆ కొండ ప్రాంతాల్లో రాతిపై చిన్న చిన్న బావుల రూపంలో గుంతలు ఉండి అక్కడ నీటి నిల్వలు ఉంటాయని, అందుకే ఆ ప్రాంతాన్ని అనువైన చోటుగా పులి ఎంచుకుందని అటవీ అధికారులు చెబుతున్నారు. ఇళ్లను విడిచి ఎవరూ బయటకు వెళ్లవద్దని, కొండ ప్రాంతాల్లో సంచరించవద్దని, చేను మకాంలో ఉండరాదని అటవీ అధికారులు తమ సిబ్బందితో మైక్లలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరభద్రపురం రక్షిత అటవీ ప్రాంతానికి చేరువలో ఉన్న కొట్టంపాలెం, గౌరయ్యపేట, కోనలోవ, వీరభద్రపురం, గొండోలు, రాజంపాలెం, సరంపేట గ్రామాల సమీపాన చేను మకాంలలో ఉన్న గిరిజనులు గ్రామాల్లోకి పరుగులు తీశారు. పులి తన సహజ గుణంలో భాగంగా అటవీ ప్రాంతాల్లో సంచరిస్తుందని, మనుషుల ప్రాణాలకు ఎటువంటి హాని కలగకూడదనే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నాలుగు బృందాలతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు అడ్డతీగల సబ్ డీఎఫ్ఓ సుబ్బారెడ్డి చెప్పారు. పులి కదలికలను సాంకేతికతను ఉపయోగించి ఎప్పటికప్పుడు తెలుసుకుని ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. పశువులను గ్రామంలోకి తీసుకువెళ్లి పులి సంచారం తగ్గే వరకూ జాగ్రత్తగా ఉంచుకోవాలన్నారు. -
స్వర్ణ శఠగోపం సమర్పణ
ఆత్రేయపురం: కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి భీమవరం వాస్తవ్యులు 108 గ్రాముల సుమారు రూ.17 లక్షల విలువైన స్వర్ణ శఠగోపాన్ని సమర్పించారు. వుద్ధరాజు సత్యవతమ్మ పేరున వారి కుమారులు రాఘవరాజు, సూర్యనారాయణ రాజులు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సమక్షంలో ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావుకు అందజేశారు. అలాగే ఆలయంలో కొత్తగా నిర్మించిన ఉచిత క్యూలైన్లను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఆలయ ధర్మకర్తలి సభ్యుడు తమ్మన సాయిప్రసాద్ పాల్గొన్నారు. కల్యాణోత్సవాలకు శ్రీకారం వాడపల్లి వేంటేశ్వర స్వామివారి కల్యాణోత్సవాలు ఈ నెల 28 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకూ అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈఓ, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. ఈ మేరకు ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో పందిరి రాట ముహూర్తం చేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. -
భద్రతకు సుస్తీ
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాకే తలమానికంగా విరాజిల్లుతూ పేద రోగులకు ఎన్నో వైద్య సేవలు అందిస్తున్న రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రత దయనీయంగా మారింది. దీని వల్ల ఆస్పత్రి సిబ్బందితో పాటూ రోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల జరుగుతున్న ఘటనలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఓ వ్యక్తి మద్యం మత్తులో సెక్యూరిటీ గార్డు చెయ్యి నరికేశాడు. రూ.4 లక్షల విలువైన ఏసీ కాపర్ గొట్టాలను పట్ట పగలే దొంగలు దోచుకెళ్లారు. అక్కడ పని చేస్తున్న స్టాఫ్ నర్సు మెడలో బంగారు గొలుసును ఓ వ్యక్తి లాక్కుని పరారయ్యాడు. బాత్రూంలో కుళాయిలు, ఇనుప పైపులను విప్పుకుని మరీ ఎత్తుకెళ్లారు. పట్ట పగలే భవన నిర్మాణ సామగ్రిని దర్జాగా ఆటోలో తరలించేశారు. రోగుల సెల్ఫోన్లు మాయమైపోతున్నాయి. అంబులెన్సు బ్యాటరీలు కూడా దొంగిలించారు. ఆస్పత్రిలో సెక్యూరిటీ కార్యకలాపాలపై పర్యవేక్షణ కొరవడడమే దీనికి కారణమని తెలుస్తోంది. అనేక ఆరోపణలు ఆస్పత్రిలో సెక్యూరిటీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న ఓ వ్యక్తిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అతడు నిబంధనలకు విరుద్ధంగా అనర్హులను సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాలకు నియమిస్తున్నాడని సమాచారం. అర్హత, అనుభవాల ఆధారంగా జరగాల్సిన ఎంపిక ప్రక్రియ కేవలం ఆర్థిక ప్రయోజనాలే పరమావధిగా సాగుతోందని, డబ్బులు ఇస్తే చాలు ఉద్యోగం ఇస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి. దీంతో అర్హత, అనుభవం, ఫిట్నెస్ లేనివారు సెక్యూరిటీ గార్డులుగా ఉండడంతో ఆస్పత్రిలో దొంగతనాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇటీవల ఆటోలో వచ్చి సామగ్రిని ఎత్తుకెళుతున్న దొంగలను నూతన భవనాలు కడుతున్న సంస్థ సెక్యూరిటీ గుర్తించింది. కానీ జీజీహెచ్ సెక్యూరిటీ అస్సలు కనిపెట్టలేకపోయింది. వార్డుల్లో రోగుల సహాయకుల సెల్ఫోన్లు పట్టపగలే మాయమైపోతున్నాయి. విధుల్లో ఉన్న ఓ నర్సు మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లిపోయారు. సీఎంవోపై వాటర్ బాటిల్తో దాడి చేయగా సెక్యూరిటీ ఈ ఘటనను నిలువరించలేకపోయింది. ఇష్టారాజ్యం సెక్యూరిటీ గార్డులుగా నియమితులైన కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జీతాలు తీసుకుని విధులకు డుమ్మా కొడుతూ సొంత పనుల్లో మునిగి తేలుతున్నారని తెలుస్తోంది. ఈ గార్డుల్లో ఒకరు మ్యాట్రీమోనీ ప్రతినిధిగా పని చేస్తున్నాడు. ఇంకో వ్యక్తి ఆసుపత్రి ఆవరణలో ఫేస్ అటెండెన్స్ వేసుకుని ఆటో డ్రైవర్గా కిరాయిలకు వెళుతున్నాడు. ఓ మహిళ హాజరు వేయించుకుని భర్త బట్టల దుకాణానికి వెళ్లి వ్యాపారం చేస్తోంది. ఓ వ్యక్తి హాజరు వేసుకుని వెళ్లిపోయి తన సొంత పాల కేంద్రం నడుపుకొంటున్నాడు. వీరి వ్యవహారంపై ఆసుపత్రి అధికారుల పర్యవేక్షణ కొరవడింది. సెక్యూరిటీని పర్యవేక్షిస్తున్న సదరు వ్యక్తి కనుసన్నల్లోనే ఈ అవకతవకలు జరుగుతున్నాయని, అతడు అడిగిన సొమ్ము ఇస్తే సరిపోతోందని సమాచారం. అలాగే 60 మంది సెక్యూరిటీ గార్డుల్లో 11 మందిపై పలు నేరాల్లో కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. ఫిర్యాదుల వెల్లువ సెక్యూరిటీని పర్యవేక్షిస్తున్న సదరు వ్యక్తి తనను వేధిస్తున్నాడంటూ ఓ మహిళ రాజానగరం పోలీ స్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ కేసు నుంచి బయటకు పడేందుకు భారీగా డబ్బులు ముట్టజెప్పినట్టు సమాచారం. అలాగే గత ఏడాది సెప్టెంబర్ 25న ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై కేసులు ఉన్నాయని విశాఖపట్టణం నుంచి జీజీహెచ్ సూపరింటెండెంట్కు ఫిర్యాదులు అందా యి. అదే నెల 9న ఓ మహిళ సెక్యూరిటీ పర్యవేక్షకుడు తన వద్ద లంచం తీసుకుని ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేశాడని ఫిర్యాదు చేసింది. ఇవన్నీ పెండింగ్ దశలోనే ఉన్నాయి. నెలలు గడిచినా ఎటువంటి విచారణ లేదు. మార్చురీలో శవానికి పోస్టుమార్టం జరుగుతుండగా ఓ సెక్యూరిటీ గార్డు.. కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి డబ్బులు డిమాండ్ చేసి వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదుతో విషయం బయటకు వచ్చింది. కలెక్టర్ కీర్తి చేకూరి ఈ విషయంపై విచారణకు ఆదేశించి నిజాలు నిగ్గు తేలడంతో డబ్బులు వసూలు చేసిన సెక్యూరిటీ గార్డును తొలగించాలని ఆదేశాలిచ్చారు. అయినా ఆ సెక్యూరిటీ గార్డును కొనసాగుతుండడం విశేషం. -
స్కూల్ బస్సు కింద పడి ఉపాధ్యాయురాలి మృతి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక కాతేరు సెంటర్లోని కోయంబత్తూర్ కాఫీ దుకాణం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరుమల స్కూల్లో ఇంగ్లిషు టీచర్గా పనిచేస్తున్న బొంగు గాయత్రి (40) మృతి చెందారు. వివరాల్లోకెళితే.. రఘుదేవపురానికి చెందిన గాయత్రి పదేళ్లుగా తిరుమల స్కూల్లో ఇంగ్లిషు టీచర్గా పనిచేస్తూ, స్థానికంగా మల్లయ్యపేటలో నివాసముంటున్నారు. శుక్రవారం, గాయత్రిని స్కూల్లో దింపేందుకు ఆమె భర్త బొంగు రాజా రావు మోటారు సైకిల్పై తీసుకువెళుతున్నాడు. ఆ క్రమంలో తిరుమల కళాశాల బస్సు కాతేరు సెంటర్ వద్ద ఆగి విద్యార్థులను ఎక్కించుకుని బయలుదేరింది. అదే సమయంలో వెనుక నుంచి మరో లారీ వస్తోంది. ఈ క్రమంలో ఆగివున్న తిరుమల బస్సును ఓవర్టేక్ చేయబోయారు. ఈ క్రమంలో ఆ టీచర్ ఆ స్కూలు బస్సు కిందే పడి మృతి చెందింది. తీవ్రంగా గాయపడ్డ రాజారావు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. అతడికి నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తొలి తిరుపతిలో 29 నుంచి కల్యాణోత్సవాలు పెద్దాపురం (సామర్లకోట): తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో వేంచేసిన శృంగార వల్లభ స్వామి వారి కల్యాణోత్సవాలు ఈ నెల 29 నుంచి ఏప్రిల్ మూడో తేదీ వరకూ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం పందిరి రాట ముహూర్తం చేశారు. ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు, చైర్మన్ మెయిలి సంధ్యా కృష్ణమూర్తి ఆధ్వర్యాన అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు పూజాదికాలు నిర్వహించారు. ఈ నెల 29వ తేదీ ఉదయం స్వామి వారి విశేషార్చన, తీర్థ ప్రసాద వితరణ, సాయంత్రం విష్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, అగ్ని ప్రతిష్ఠా పన, ధ్వజారోహణ, సాయంత్రం శ్రీదేవి, భూ దేవి సమేత శృంగార వల్లభస్వామి కల్యాణం జరుగుతాయని ఈఓ వివరించారు. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ రెండో తేదీ వరకూ ప్రతి రోజూ ఉదయం నిత్య హోమం, బలిహరణ, తీర్థ ప్రసా ద వితరణ ఉంటాయన్నారు. 30వ తేదీ సాయంత్రం గ్రామోత్సవం, 31వ తేదీ సాయంత్రం సదస్యం, ఏప్రిల్ ఒకటో తేదీ సాయంత్రం చోర సంవాదం, రెండో తేదీన పూర్ణాహుతి, ధ్వజావరోహ ణ చక్రస్నానం, బుక్క పండగ, గ్రామోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. ఏప్రిల్ 3న పవళింపు సేవతో ఉత్సవాలు ముగుస్తాయని ఈఓ చెప్పారు. 3, 4 తేదీల్లో నృసింహ నక్షత్ర మాల ధారణ సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 3, 4 తేదీల్లో నృసింహ నక్షత్ర మాల దీక్షాధారణ చేపడుతున్నట్లు ఆలయ ఈవో ఎంకేటీఎన్వీ ప్రసాద్ శుక్రవారంఒక ప్రకటనలో తెలిపారు. భక్తులు తరలివచ్చి నక్షత్ర మాల ధారణ చేయాలని కోరారు. అలాగే, దీక్ష విరమణ ఏప్రిల్ 30వ తేదీన నృసింహ జయంతి రోజున నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
మీ విశ్వసనీయత స్ఫూర్తిదాయకం
● మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి ● వైఎస్సార్ సీపీప్రజాప్రతినిధులకు సన్మానం అనపర్తి: ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా పార్టీకి విధేయులుగా ఉంటూ, ప్రజల పక్షాల పోరాడుతూ మీరు చూపిన విశ్వసనీయత అందరికీ స్ఫూర్తిదాయకమని ప్రజాప్రతినిధులను వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అభినందించారు. పొలమూరు శ్రీదేవి ఫంక్షన్ హాల్లో ఆ గ్రామ ఉప సర్పంచ్ సత్తి సూరారెడ్డి, వెంకటరెడ్డి బ్రదర్స్ ఆధ్వర్యంలో జిల్లా ప్రజాపరిషత్ మాజీ ప్రతిపక్షనేత సత్తి రామారెడ్డి అధ్యక్షతన శుక్రవారం ప్రజాప్రతినిధుల సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా మండలంలోని సర్పంచ్లు, వార్డు మెంబర్లు తదితర ప్రజాప్రతినిధులను దుశ్శాలువాలు, పూలమాలలతో సత్కరించి, వారికి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ సానుభూతిపరులుగా విజయం సాధించిన సర్పంచ్లు, పంచాయతీ పాలకమండలి సభ్యుల పదవీ కాలం ఏప్రిల్ 2తో పూర్తి కావస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఐదేళ్లుగా వారు పార్టీ, ప్రజలకు చూపిన విధేయత, విశ్వసనీయతకు, అంకిత భావానికి గుర్తుగా ఈ కార్యక్రమం నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపిన సత్తి సూరారెడ్డి బ్రదర్స్ను అభినందించారు. అలాగే విశ్వసనీయతే విలువైన ఆస్తిగా భావించి, ఎన్ని ఒత్తిడిలు ఎదురైనా పార్డీకి విధేయులుగా ఉన్న ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల్లో ఎన్నో ఒత్తిడులు, ప్రలోభాలు, బెదిరింపులు ఎదురైనా, పార్టీని విడవకుండా నిలిచిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ సబ్బెళ్ల కృష్ణారెడ్డి, పార్టీ అనపర్తి మండల కన్వీనర్ సత్తి రామకృష్ణారెడ్డి (రాంబాబు), అనపర్తి టౌన్ కన్వీనర్ నల్లమిల్లి మురళీ మోహన బాలకృష్ణారెడ్డి (మురళీ) తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్ ఫిర్యాదు చేశాం
ప్రభుత్వాసుపత్రిలో సెక్యూరిటీ వ్యవస్థ అసలు బాగాలేదు. దీనిపై మూడు రోజుల క్రితం కలెక్టర్కు ఫిర్యాదు చేశాం. నిత్యం ఆస్పత్రిలో దొంగతనాలు జరుగుతున్నాయి. సెక్యూరిటీ సూపర్వైజర్ సైతం సరిగ్గా విధుల్లో ఉండడం లేదు. సెక్యూరిటీ సిబ్బంది వారిని వారే రక్షించుకోలేకపోతే ఇంత పెద్ద ఆసుపత్రిని ఎలా కాపాడతారు. సెక్యూరిటీ గార్డుపై, ఆసుపత్రిలో రోగి తాలూకా బంధువులు, ఇతరుల ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. – డాక్టర్ జి.రాజశేఖర కెనడీ, సూపరింటెండెంట్, ప్రభుత్వాసుపత్రి, రాజమహేంద్రవరం -
కాస్త మారిస్తే బెటర్
వనదుర్గ అమ్మవారి ఆలయం అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో.. రత్నగిరి వనదేవతగా పూజలందుకుంటున్న వనదుర్గ అమ్మవారి ఆలయంలో నెల రోజుల కిందట ఖడ్గమాల పూజకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు సమక్షంలో ఈ పూజలను గత నెల 20న ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి శుక్రవారం ఉదయం 7.30 నుంచి 8.30 గంటల వరకూ ఈ పూజలు నిర్వహిస్తున్నారు. దుర్గా మాతకు చేసే ఖడ్గమాల పూజ చాలా విశిష్టమైనది. విజయవాడ దుర్గ గుడిలో ఈ పూజను చాలా విశేషమైనదిగా భావిస్తారు. అదే స్ఫూర్తితో అన్నవరం దేవస్థానంలో వనదుర్గ అమ్మవారి ఆలయంలో దీనిని ప్రవేశపెట్టారు. అయితే ఈ పూజ గురించి చేస్తున్న ప్రచారానికి తగిన రీతిలో దేవస్థానంలో ఏర్పాట్లు లేవన్న విమర్శలు భక్తుల నుంచి వస్తున్నాయి. ఇవీ విమర్శలు సాధారణంగా ప్రతి పూజలోనూ భక్తులను స్వామి, అమ్మవార్లకు ఎదురుగా కాకుండా పక్కగా కూర్చోబెడతారు. కానీ, ఇక్కడ భక్తులను ఒకరి వెనుక ఒకరిని అమ్మవారికి ఎదురుగా కూర్చోబెట్టి పూజ చేయిస్తున్నారు. దీనివలన ముందున్న వారి పృష్ట భాగం వెనుక కూర్చున్న వారికి కనిపిస్తోంది. వారి వెనుక అమ్మవారి యంత్రానికి పూజ చేస్తూండటం భక్తులను అసంతృప్తికి గురి చేస్తోంది. ఇది సరైన విధానం కాదని భక్తులు అంటున్నారు. సత్యదేవుని వ్రతాలాచరించేటపుడు కూడా స్వామివారి చిత్రపటానికి ఎదురుగా కాకుండా పక్కగా భక్తులను వరుసలో కూర్చోబెడతారు. స్వామివారి నిత్య కల్యాణంలో కేవలం విఘ్నేశ్వర పూజ తప్ప మరే పూజా ఉండదు. అర్చకులు చేసే కల్యాణం తిలకించడమే. అందువలన అక్కడ భక్తులను ఎదురుగా కూర్చోబెడతారు. ఖడ్గమాల పూజలో మాత్రం యంత్రానికి సుమారు 45 నిమిషాల పాటు కుంకుమ పూజ చేయిస్తారు. ఖడ్గమాల పూజ టికెట్టు రూ.1,116. ఇంత మొత్తం తీసుకుంటున్న దేవస్థానం భక్తులు కూర్చునేందుకు కనీసం సరైన చాపలు కూడా వేయడం లేదు. చిరిగిన చాపలు వేస్తున్నారు. దీనికి బదులు దంపతులు కూర్చునేందుకు చిన్న తివాచీలు వే యొచ్చు. ఒక తివాచీ ఖరీదు సుమారు రూ.వెయ్యి ఉంటుంది. ఒకసారి కొంటే కనీసం నాలుగేళ్లు ఉపయోగపడుతుంది. కానీ, ఎందుకనో ఆ చాపలతోనే సరిపెడుతున్నారు. కానీ అమ్మవారి ఆలయంలో ఒక మూల పరుపులు గు ట్టగా ఉంటున్నాయి. ఎవరైనా దేవస్థానం సిబ్బంది కానీ, వీఐపీలు కానీ పూజకు వస్తే ఆ పరుపులను వారికి వేస్తున్నారు. సామాన్య భక్తులు రూ.1,116 టికెట్టు తీసుకున్నా సరే వారికి చాపలే గతి. పూజ చేయించుకునే భక్తులకు రెండు పళ్లాలు ఇస్తున్నారు. ఒక పళ్లెంలో యంత్రంపై కుంకుమ పూజ, ఇంకో పళ్లెంలో పూజాద్రవ్యాలు ఉంచుతున్నారు. చివరిలో పులిహోర ప్రసాదం తెస్తే దానిని నేల మీద ఉంచుతున్నారు. దీనికి బదులు భక్తులకు ఇంకో పళ్లెం ఇచ్చి, అందులో ఉంచే ఏర్పాటు చేయాలని భక్తులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ పూజలో పది మందికి మించి పాల్గొనే అవకాశం లేదు. అందువలన మరో పది పళ్లాలుసమకూరిస్తే సరిపోతుంది. ఖడ్గమాల పూజతో పాటు శుక్రవారం వనదుర్గ అమ్మవారికి చండీహోమం కూడా నిర్వహిస్తారు. అయినప్పటికీ అమ్మవారికి పెద్దగా అలంకరణ ఏమీ చేయడం లేదు. రోజూ ఇచ్చే పూలదండల కన్నా మరో రెండు దండలు మాత్రమే ఇస్తారు. మండపంలో అయితే మామిడి తోరణాలు తప్ప పెద్దగా అలంకరణ చేయడం లేదు. పూజ ఉదయం 7.30 గంటలకే ప్రారంభిస్తున్నారు. స్థానికంగా ఉన్నవారు తప్ప దూర ప్రాంతాల వారు ఆ సమయానికి హాజరయ్యే అవకాశం ఉండటం లేదు. అలాగని రెండో బ్యాచ్కు అవకాశం కూడా లేదు. పూజ సమయాన్ని మార్చడమో లేదా ఉదయం 9 గంటలకు రెండో బ్యాచ్ పూజ ప్రారంభించడమో చేస్తే బాగుంటుంది. ఖడ్గమాల పూజను ఇద్దరు వ్రత పురోహితులు మాత్రమే చేస్తున్నారు. వేద పండితుడు కూడా ఒక్కరు మాత్రమే ఉంటున్నారు. కనీసం ఇద్దరు వేద పండితులు, సత్యదేవుని ఆలయ ప్రధానార్చకుడు లేదా అర్చకులు పూజ పూర్తయ్యేంత వరకూ ఉండేలా చూడాలి. అలాగే, పూజ సమయంలో ఆలయ సిబ్బంది ఎవరూ ఉండడం లేదు. కనీసం సూపరింటెండెంట్ లేదా గుమస్తా అయినా ఆ సమయంలో ఉండాలి. గతంలో వనదుర్గ అమ్మవారి చండీ, ప్రత్యంగిర హోమాలకు పెద్దగా భక్తులుండేవారు కాదు. కానీ, 2014 నుంచి ఆ హోమాల పూర్ణాహుతి సమయంలో అప్పటి ఈఓలు కాకర్ల నాగేశ్వరరావు, జితేంద్ర తదితరులు వస్తూండటంతో వారితో పాటు సిబ్బంది కూడా వచ్చేవారు. క్రమంగా ఇది సంప్రదాయంగా మారింది. ఇప్పుడు ఆ హోమాల్లో భక్తులు కూడా విశేష సంఖ్యలో పాల్గొంటున్నారు. ఖడ్గమాల పూజకు కూడా అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఖడ్గమాల పూజ విషయంలో ఈ జాగ్రత్తలన్నీ తీసుకుని, మరింత ప్రచారం చేస్తే ఎక్కువ మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉంటుంది. దీనిపై దేవస్థానం వైదిక కమిటీతో ఈఓ సమావేశమై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఖడ్గమాల పూజ నిర్వహణ తీరుపై విమర్శలు టికెట్టు వెయ్యి నూట పదహార్లు చింకిచాపలు, చాలీచాలని పూజా సామగ్రితో సరి ఒకరి వెనుక ఇంకొకరిని కూర్చోబెట్టి పూజలు ఇది సంప్రదాయ విరుద్ధమంటున్న భక్తులు ఉదయం 7.30 గంటలకే ప్రారంభం ఆ సమయానికి హాజరు కాలేకపోతున్న స్థానికేతరులు -
పోశియ్య ఇంటి పనులు పూర్తి
తాళ్లపూడి: మలకపల్లి గ్రామంలో చర్మకారుడు సనమండ్ర పోశియ్య ఇంటి పనులు పూర్తయ్యాయి. ఆ ఇంటిని శుక్రవారం జిల్లా హౌసింగ్ పీడీ నాతి బుజ్జి, ఇతర శాఖల అధికారులు పరిశీలించారు. హౌసింగ్ పీడీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హమీలు అమలు చేయడానికి కలెక్టర్ ఆదేశాల మేరకు హౌసింగ్, డీఆర్డీఏ డ్వామా, రెవెన్యూ అధికారులందరూ కలిసి పనిచేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వారందరికీ పోశియ్య కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో మలకపల్లికి వచ్చిన సమయంలో పీపీపీపీ విధానంలో పోశియ్య ఇంటిని బాగు చేయించడంతో పాటు, చెప్పుల దుకాణం పెట్టుకోవడానికి స్థలం చూపిస్తానని హామీ ఇచ్చారు. కానీ అది నెరవేర్చక పోవడంతో పీపీ.. పీపీ.. ఢాంఢాం అనే శీర్షికతో గత నెల 26న ‘సాక్షి’ పత్రికలో కథనం ప్రచురితమైంది. దానికి జిల్లా అధికారులు తక్షణం స్పందించారు. మలకపల్లిలో పోశియ్య ఇంటిని పరిశీలించి, ఉగాది నాటికి పనులు పూర్తి చేసి అప్పగిస్తామని హమీ ఇచ్చారు. ఆ ప్రకారమే ఇంటి పనులు పూర్తి చేసి అప్పగించారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఏఈ దాదాసాహెబ్, వర్క్ ఇన్స్పెక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఈద్ ఉల్ ఫితర్
● చంద్రదర్శనంతో శుక్రవారం ముగిసిన రంజాన్ మాసం ● శనివారం ఈద్ నమాజ్ చేయనున్న ముస్లింలు ● ప్రార్థనలకు ముస్తాబైన మసీదులు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): పవిత్ర రంజాన్ మాసం శుక్రవారంతో ముగిసింది. చంద్ర దర్శనంతో ముస్లింలు ఈద్ నమాజ్కు సిద్ధమయ్యారు. శనివారం ఈద్ ఉల్ ఫితర్ పండగ చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. నెల రోజుల పాటు కఠోర రోజాలు, నమాజ్, సహెర్, ఇఫ్తార్లు, ఖురాన్ పఠనం, ధాన ధర్మాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో గడిపారు. ఎండ తీవ్రత పెరిగినా దీక్షలు సడలించకుండా పాటించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు (14 గంటలకు పైగా) చుక్క మంచినీరు కూడా తాగకుండా నిష్టతో దీక్షలు పాటించారు. చివరకు చంద్రదర్శనంతో పండగ చేసుకోనున్నారు. ఈద్ నమాజ్కు సిద్ధం ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ కోసం ఈద్గాలతో పాటు మసీదుల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పండగ రోజు ముస్లింలు ఈద్గాలకు వెళ్లి నమాజ్ చేస్తారు. నెల రోజుల తాము చేసిన ప్రార్థనలు ఫలించాలని, సర్వమానవాళి సంతోషంగా ఉండాలని కోరుతూ దువా చేస్తారు. రాజమహేంద్రవరంలో పాటు జిల్లాలోని అన్ని ఈద్గాలు, మసీదుల్లోనూ ఈద్ నమాజ్ జరుగుతుంది. దాన ధర్మాలకు ప్రాధాన్యం రంజాన్లో దాన ధర్మాలకు అధిక ప్రాధాన్యత ఉంది. ధనికులతో పాటూ పేదలు సైతం పండగ చేసుకోవాలన్నదే ముఖ్య నిర్వచనం. మనిషి ఆరోగ్యం, సంపాదించిన ధనంపై అల్లా సూచించిన బీమాయే జకాత్, ఫిత్రా దానాలు అని చెప్పవచ్చు. 52.5 గ్రాముల వెండి, 75 గ్రాముల బంగారం, అంతకు మించి విలువైన ధనం, ఆస్తులు కలిగిన వారు జకాత్కు అర్హులు. వాటిని వెల లెక్కకట్టి 2.5 శాతం పేదలకు పంచాలి. ఇది రంజాన్లో ఇస్తే 70 శాతం అధికంగా పుణ్యం లభిస్తుందని విశ్వాసం. పేదలకు దానం రంజాన్ సందర్భంగా 1,750 గ్రాముల గోధుమలు, దానికి సమానమైన డబ్బును పేదలకు దానం చేయడమే ఫిత్రా. దీనిని ఆరోగ్య బీమాగా మతపెద్దలు చెబుతారు. పేదరికంతో పండగకు నోచుకోని అభాగ్యులకు ఫిత్రా దానం ఇవ్వాలి. ఈ ఏడాది మత పెద్దలు రూ.150 ఫిత్రా ఇవ్వాలని ఖరారు చేశారు. దీని కంటే ఎక్కువ ఇవ్వవచ్చు కానీ తగ్గించరాదు. అప్పడే పుట్టిన బిడ్డ నుంచి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి పేరు మీదా ఫిత్రా దానం చేయాలి. ఈద్ శుభాకాంక్షలు రంజాన్ పండగ రోజు ముస్లింలు సామూహిక ఈద్ నమాజ్ జరుపుకొని అనంతరం ఒకరికి ఒకరు ఈద్ ముబారక్ చెప్పకుంటారు. ప్రార్థనా స్థలానికి అల్లా నామం స్మరిస్తూ ఒక మార్గం నుంచి వెళ్లి, వేరే మార్గంలో ఇంటికి వచ్చి సేమ్యా సేవిస్తారు. బంధుమిత్రులకు, ఇరుగుపొరుగు వారికి సేమ్యాను పంచి, తమ ఆత్మీయతను తెలియజేస్తారు. చిన్న పిల్లలకు ఈద్ కానుకలు బహూకరిస్తారు.


