East Godavari
-
హత్యకేసులో నిందితుడి అరెస్టు
కోరుకొండ: సీతానగరం మండలం రఘుదేవపురానికి చెందిన కోట నూకరాజును ఈ నెల 13వ తేదీన తన భార్య సుబ్బలక్ష్మిని హత్య చేసిన ఘటనలో సోమవారం అరెస్టు చేసి, రిమాండ్ నిమిత్తం సెంట్రల్ జైలుకు పంపినట్టు కోరుకొండ సీఐ ఎస్వీవీవీ మూర్తి తెలిపారు. ఆయన కార్యాలయంలో విలేకరులకు ఈ విషయాన్ని వెల్ల డించారు. నిందితుడి కోడలు చంద్రకళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. నిందితుడు నూకరాజుకు కొడుకు, కూతురు ఉన్నారు. వీరంతా రఘుదేవపురంలోని చింతాలమ్మగుడి వీధిలోని పెందుర్తి రామన్న ఇంట్లో అద్దెకుంటున్నారు. కొడుకు శ్రీనివాస్ గుండె సంబంధిత అనారోగ సమస్యతో మార్చి నెల 28వ తేదీన మృతిచెందాడు. దీంతో అతని ఇద్దరు కుమార్తెలు, కోడలు, భార్యను మోపెడ్బండిపై ఊరూ రా తిరుగుతూ దుస్తుల వ్యాపారం చేసి పోషిస్తున్నాడు. కొడుకు మృతికి సంబంధించి కీడుబట్టలు తీసుకోవడానికి కోరుకొండ మండలం నర్సాపురం గ్రామంలోని భార్య బంధువులింటికెళ్లాడు. తిరిగి ఇంటికొచ్చిన తర్వాత భార్యతో కుటుంబాన్ని పోషించలేకపోతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశాడు. కోడలు చంద్రకళ మనమరాళ్లను పోషించుకుంటుందని భార్య (మృతురాలు) భరోసా ఇచ్చింది. అయితే ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో తీవ్రావేశంతో కూరగాయలు కట్చేసే చాకుతో తన భార్య మెడ కోసి చంపేశాడు. అత్తమ్మ అరుపులకు కోడలు చంద్రకళ కిటికీ తలుపులు తీసి, చూడగా ఆమె (మృతురాలి) గుండెలపై నిందితుడు కూర్చుని ఉండడం చూసింది. తలుపులు తీయండీ, అత్తమ్మను విడిచిపెట్టండని కేకలు పెట్టినా తీయకుండా, నూకరాజు మెడపై కోసుకున్నట్టు తెలిపింది. గాయంతో ఉన్న నూకరాజును స్థానికుల సహకారంతో అంబులెన్స్ ద్వారా రాజమహేంద్రవరం జీజీహెచ్కు తరలించినట్టు తెలిపారు. చికిత్స అనంతరం నిందితుడు నూకరాజును అరెస్టు చేశామన్నారు. ఎస్పీ నరసింహకిశోర్, నార్త్జోన్ డీఎస్పీ సీహెచ్ జీవన ఆదేశాల మేరకు సోమవారం అరెస్టు చేశామన్నారు. సీతానగరం పోలీసుస్టేషన్ ఎస్సై వినయ్ప్రతాప్ కేసు నమోదు చేసినట్టు సీఐ మూర్తి పేర్కొన్నారు. -
రత్నగిరిపై భక్తుల రద్దీ
అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయం సోమవారం వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కిటకిట లాడింది. సింహాచలం చందనోత్సవానికి వెళ్లిన భక్తులు కూడా తిరుగు ప్రయాణంలో సత్యదేవుని దర్శనానికి విచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. సుమారు 30 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల క్యూ లు, వ్రత మండపాలు జనంతో నిండిపోయాయి. సత్యదేవుని దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని వ్రతాలు 1,500 జరిగాయి. మహిళను స్వదేశానికి రప్పించిన కేసీఎంఅమలాపురం రూరల్: ఖతర్ దేశంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న యానాం ప్రాంత దరియాల తిప్పకు చెందిన దండుప్రోలు వీరవేణిని కలెక్టర్ చొరవతో కోనసీమ వలస దారుల కేంద్రం (కేసీఎం) సురక్షితంగా ఇంటికి రప్పించింది. వివరాల్లోకి వెళ్ళితే ఉప్పలగుప్తం గ్రామానికి చెందిన ఏజెంట్ పి.ఆదినారాయణ ద్వారా నాగలక్ష్మి (వీరవేణి) 2025 మార్చిలో ఉపాధి కోసం ఖతర్ వెళ్లారు. అక్కడ ఒక ఇంట్లో పనికి చేరిన ఆమెను ఆ తర్వాత ఆమెకు తెలియకుండానే సౌదీ అరేబియాకు తరలించారు. బాధితురాలు యజమానుల నుంచి తీవ్రమైన శారీరక, మానసిక వేధింపులు ఎదుర్కొన్నారు. కనీసం తినడానికి సరైన ఆహారం అందించకపోవడం, నిరాశ, పని ఒత్తిడి భరించలేక మిమ్మల్ని మళ్లీ చూడలేనేమో.. ఇక్కడే చనిపోతానేమో అని కుటుంబ సభ్యుల వద్ద విలపించింది. బాధితురాలి దీనస్థితిని తెలుసుకున్న కుటుంబ సభ్యులు లెక్టర్ను కలిసి వేడుకోగా ఆయన స్పందించారు. కేసీఎం బృందం ఏజెంట్తో సంప్రదింపులు జరిపి ఒత్తిడి తీసుకువచ్చి ఆమెను సురక్షితంగా స్వదేశానికి తీసుకుని వచ్చామని కేంద్ర సమన్వయ అధికారి జి రమేష్ తెలిపారు. -
జేబులు నింపుకోవడంలోనే..
● ప్రజా సమస్యలు ఏమాత్రం పట్టడం లేదు ● పీజీఆర్ఎస్లో 5 సమస్యలపై మాజీ ఎంపీ భరత్రామ్ ఫిర్యాదు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కేవలం తమ జేబులు నింపుకోవడంలోనే కూటమి ఎమ్మెల్యేలు చిత్తశుద్ధి చూపుతున్నారని, వారికి ప్రజా సమస్యలు ఏమాత్రం పట్టడం లేదని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ విమర్శించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో 5 సమస్యలపై ఆయన అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఇష్టానుసారం ఇసుక రవాణా చేస్తూండటంతో మల్లయ్యపేట ప్రాంతం దుమ్ము, ధూళితో నిండిపోయి, ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఇసుక లారీలు నగరంలోకి రాకుండా గోదావరి గట్టు వెంబడి మాత్రమే వెళ్లేలా చూడాలని కోరారు. గోరక్షణ పేట రోడ్డు తక్షణం వేయాలని విజ్ఞప్తి చేశారు. తన హయాంలో నిర్మించిన మోరంపూడి ఫ్లై ఓవర్ వంతెనకు రెండేళ్లు దాటినా కూటమి ప్రభుత్వం సర్వీస్ రోడ్లు వేయలేదని, దీనివలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాగే, పుష్కర్ ఘాట్లో తాజాగా వేసిన టైల్స్ వల్ల ప్రజలు జారిపోతున్నారని వాటిని మార్చాలని కోరారు. గోకవరం బస్టాండ్ సమీపాన గౌతమి సూపర్ బజార్ భవనాన్ని ప్లానుకు విరుద్ధంగా నిర్మించారని, దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం భరత్రామ్ మీడియాతో మాట్లాడుతూ, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు అభివృద్ధి, సంక్షేమం విషయంలో పోటీ పడే వారని, కానీ నేడు కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలందరూ జేబులు నింపుకోవడానికే పరుగులు పెడుతున్నారని దుయ్యబట్టారు. ఒకవైపు ఇసుక అక్రమ రవాణా, మరోవైపు మద్యం మాఫియా, ఇంకో పక్కన కొండలు తవ్వేస్తూ ఒక్కో ఎమ్మెల్యే తక్కువలో తక్కువ నెలకు రూ.2 కోట్ల పైనే సంపాదిస్తున్నారని ఆరోపించారు. దోచుకుని పంచుకుంటున్నారు కోటిలింగాల ఘాట్ సమీపాన ఉన్న గామన్ బ్రిడ్జికి ఒకవైపు సిటీ ఎమ్మెల్యే, మరోవైపు రూరల్ ఎమ్మెల్యే పంచుకొని దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజల సమస్యలు పరిష్కరించాల్సింది పోయి కొత్త సమస్యలు తెచ్చిపెట్టారని, మల్లయ్యపేట వాసుల బాధలు వర్ణనాతీతమని అన్నారు. ఇప్పటికే చాలామంది వ్యాపారాలు మూసుకున్నారని, ఆరోగ్యాలు కూడా పాడైపోయాయని చెప్పారు. రాజమండ్రి సిటీలో రాజకీయాలు జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు. పేకాట క్లబ్బులు నడిపే వ్యక్తిని ఒక ఆలయ చైర్మన్గా, రౌడీ షీటర్ను మరో సత్రానికి చైర్మన్గా, ఇసుక దోపిడీ చేసే వ్యక్తిని విద్యాబుద్ధులు నేర్పే హితకారిణి సమాజం చైర్మన్గా, మద్యం సిండికేట్ నడిపే వ్యక్తికి పార్టీ అధ్యక్షుడిగా నియమించి ప్రజలకు ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. ఇన్ని అరాచకాలు జరుగుతున్నా ఇటీవల జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి ఏమీ మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో 35 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని, కనీసం వారు ఇళ్లు కట్టుకోవడానికి ఇప్పటి వరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పీఎంఏవై కింద కేంద్ర ప్రభుత్వం రూ.1.80 లక్షలు మంజూరు చేస్తుందని, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చొరవ చూపడం లేదని నిలదీశారు. ఈ విషయాలను ప్రజలు గమనించి, ఇలాంటి పాలకులకు బుద్ధి చెప్పాలని భరత్రామ్ విజ్ఞప్తి చేశారు. -
పాలిసెట్కు డిమాండ్
● ఉమ్మడి జిల్లాలో 23,980 మంది దరఖాస్తు ● 25న 71 కేంద్రాల్లో పరీక్ష రాయవరం: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి పాలిసెట్–2026 ఈ నెల 25న నిర్వహించనున్నారు. గంట ముందుగానే పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. గతేడాదితో పోలిస్తే దరఖాస్తుదారుల సంఖ్య పెరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 23,980 మంది దరఖాస్తు చేయగా, వీరి కోసం 71 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పెరిగిన దరఖాస్తులు పాలిసెట్–2026కు గతేడాదితో పోలిస్తే దరఖాస్తుదారుల సంఖ్య పెరిగింది. జిల్లాల వారీగా పోలిస్తే 15 శాతం దరఖాస్తుల సంఖ్య పెరిగింది. ప్రభుత్వ యాజమాన్యంలో తూర్పుగోదావరి జిల్లాలో బొమ్మూరు, అనపర్తి, కాకినాడ జిల్లాలో కాకినాడలో రెండు, పిఠాపురం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ద్రాక్షారామ, పోలవరం జిల్లాలో రంపచోడవరం, ఎటపాకలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రైవేట్ యాజమాన్యంలో 10 వరకు పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో కంప్యూటర్, ఐటీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, ఇనుస్ట్రుమెంటేషన్ తదితర కోర్సులు అందుబాటులో ఉంటాయి. కొన్నేళ్లుగా 80 శాతం వరకు సీట్లు భర్తీ అవుతున్నాయి. అయితే ఈ ఏడాది విద్యార్థుల నుంచి దరఖాస్తుల రూపంలో మంచి స్పందన ఉండడంతో 100 శాతం సీట్లు భర్తీ అవుతాయని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాలు భావిస్తున్నాయి. గంట ముందుగానే ప్రవేశం ప్రవేశ పరీక్ష ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు. విద్యార్థులు హాల్ టికెట్, బాల్ పాయింట్ పెన్ను, హెచ్బీ పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ వెంట తీసుకుని వెళ్లాలి. సెల్ఫోన్, కాలిక్యులేటర్, స్మార్ట్ వాచ్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు.పదవ తరగతి విద్యార్థులుపట్టణం పరీక్షా వచ్చిన కేంద్రాలు దరఖాస్తులు ఎటపాక 02 236 చింతూరు 01 241 రంపచోడవరం 02 405 కాకినాడ 18 5.855 సామర్లకోట 04 743 పెద్దాపురం 05 1,411 పిఠాపురం 05 1,786 తుని 04 1,489 రాజమహేంద్రవరం 12 5,292 ముక్తేశ్వరం 01 366 మండపేట 04 975 రామచంద్రపురం 03 1,161 అమలాపురం 07 3,185 నిడదవోలు 03 835మౌలిక వసతులకు ప్రాధాన్యం పరీక్షా కేంద్రాల ఆవరణలో తాగునీరు, విద్యుత్తు, వైద్య సేవలు వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిచ్చాం. – అక్కుల మురళి, పాలిసెట్–2026 తూర్పుగోదావరి జిల్లా కో–ఆర్డినేటర్, రాజమహేంద్రవరం. -
హుందా మరచి.. దూషణల పంథా
సాక్షి, రాజమహేంద్రవరం: వ్యక్తిగత ప్రయోజనమో.. సొంత అజెండాయో.. అధినాయకుల మెప్పు కోసమో.. పదవీ లాలసో తెలీదు కానీ.. కొన్నాళ్లుగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. విపక్ష నాయకులపై దూషణల పంథా పట్టారు. సినిమాల్లో ప్రతినాయకుల మాదిరిగా ‘చంపుతా.. నరుకుతా..’ అంటూ శివాలెత్తిపోతున్నారు. సభ్యతను పూర్తిగా పక్కన పెట్టేసి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులపై దిగజారుడు వ్యాఖ్యలకు దిగుతున్నారు. అధికారంలో ఉన్న నాయకులు ప్రతిపక్ష నేతలను విమర్శిస్తూంటారు. కానీ, ఆ విమర్శలు, ఆరోపణలు విధానపరమైన అంశాలకు పరిమితమైతే ఫర్వాలేదు. కానీ, బుచ్చయ్య మాత్రం తరచుగా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. మాజీ సీఎం అనే కనీస గౌరవం లేకుండా ఇష్టమొచ్చినట్లు దూషణలకు దిగడం ఆయనకు పరిపాటిగా మారుతోంది. విలేకర్ల సమావేశాలు, టీవీ డిబేట్లలో పదేపదే అవే విమర్శలు చేస్తూ తన రాజకీయ అనుభవానికి సమాధి కట్టుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధినేతల మెప్పు కోసమేనా? టీడీపీ మహానాడు అనంతరం చంద్రబాబు ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆ సందర్భంగా కొందరు మంత్రులకు ఉద్వాసన పలకనున్నారని తెలుస్తోంది. వారి స్థానంలో సీనియర్లకు మంత్రి పదవులిచ్చి, మాజీ సీఎం, వైఎస్సార్ సీపీని విమర్శించేలా ప్రణాళిక సిద్ధం చేశారని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఓ రాయేస్తే పోలా.. అనే రీతిలోనే బుచ్చయ్య ఇలా రెచ్చిపోతున్నారని అంటున్నారు. మాజీ సీఎం జగన్ను, వైఎస్సార్ సీపీని గట్టిగా విమర్శిస్తే తనకు బెర్త్ ఖాయమవుతుందని భావించారో.. ఏమో కానీ కొన్ని నెలలుగా ఎన్నడూ లేని విధంగా దారుణమైన దూషణలకు దిగుతున్నారు. విజయవాడలో ప్రెస్మీట్లు పెట్టి మరీ విమర్శలు చేస్తున్నారు. తద్వారా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ల దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారని విశ్లేషకులు అంటున్నారు. స్వపక్షంలో అవమానాలు మర్చిపోయారా? సీనియర్ నేత అయినప్పటికీ టీడీపీలో బుచ్చయ్య చౌదరి ఆది నుంచీ అవమానాలే ఎదుర్కొంటున్నారు. దివంగత ఎన్టీఆర్కు ఆయన అత్యంత సన్నిహితుడు. ఎన్టీఆర్కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన సమయంలో బుచ్చయ్య ఎన్టీఆర్ వర్గంలోనే ఉన్నారు. తనకు అన్యాయం జరిగితే అధినాయకత్వాన్నే ప్రశ్నించే తత్వం ఆయన సొంతం. ఆయన వ్యవహార శైలిని చంద్రబాబు జీర్ణించుకునే వారు కాదు. ఇష్టం లేకపోయినా పార్టీలో సీనియర్ అనే కారణంగా పట్టించుకోకుండా వదిలేసేవారు. టీడీపీపై ఉన్న అభిమానంతో గోరంట్ల సైతం పార్టీలో అలాగే కొనసాగేవారు. మంత్రి పదవి రాని సమయంలో ‘పార్టీలో పదవులు అమ్ముకుంటున్నార’ని గతంలో తీవ్ర స్థాయిలో ఆరోపించారు కూడా. ఈ నేపథ్యంలో ఆయనను చంద్రబాబు పెద్దగా నమ్మరనే ప్రచారం ఉంది. అందువల్లనే చంద్రబాబు ప్రభుత్వంలో బుచ్చయ్యకు మంత్రి పదవి దక్కలేదని అంటారు. తనను అంతగా అవమానించినప్పటికీ.. ఇప్పటికీ వారినే పొగడటం, మాజీ సీఎంను దూషించడం వంటివన్నీ మంత్రి పదవి కోసమేననే అభిప్రాయాన్ని కలిగించక మానవు. గోరంట్ల బుచ్చయ్య చౌదరిమంగళవారం శ్రీ 21 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026నరికేస్తాం ‘ఏంట్రా యదవల్లారా మీరు నరికేది.. మేమే నరకగలం.. మాకు అధికారం ఉంది.. మేం తలుచుకుంటే మిమ్మల్ని నరికేయగలం.. కానీ, శాంతియుతంగా ముందుకు వెళ్తాం.. పిచ్చిపిచ్చి పేలాపనలు పేలితే అంబటి అయినా గిమ్మటి అయినా గుమ్మటం పట్టించేస్తాం.. మా కార్యకర్తలు తలుచుకుంటే గుమ్మం దాటి బయటకు రాలేరు’ అంటూ మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత అంబటి రాంబాబును టార్గెట్ చేస్తూ బుచ్చయ్య చౌదరి తాజాగా వ్యాఖ్యలు చేశారు. చంపితే తప్పేముంది? ‘నువ్వు ఓ సైకో.. నీకు ఉరి వేయక సన్మానాలు చేయాలా? నీ తల ఎందుకు తీయకూడదు? నిన్ను చంపితే తప్పేముంది? ఉరి తీసినా తప్పు లేదు?’ అంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని టార్గెట్ చేస్తూ గతంలో పత్రికా సమావేశాలు, టీవీ డిబేట్లలో బుచ్చయ్య ఊగిపోతూ మాట్లాడారు. ఆయన దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. టీడీపీలో చంద్రబాబు కంటే సీనియర్ నేత. అటువంటి నాయకుడు ఎంతో హుందాగా.. కొత్త తరానికి స్ఫూర్తిగా ఉండాలి. కానీ, ఆయనే సభ్యసమాజం తలదించుకునే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. ఇంతటి దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నా.. పార్టీ అధిష్టానం కనీసం పట్టించుకోకపోవడం చూస్తూంటే.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సభ్య సమాజం తలదించుకునేలా బుచ్చయ్య తీరు ‘నిన్ను చంపితే తప్పేముంది?’ అంటూ మాజీ సీఎంపై గతంలో శివాలు సభ్యత వదిలి తాజాగా ‘నరుకుడు’ వ్యాఖ్యలు రూరల్ ఎమ్మెల్యే తీరుపై సర్వత్రా నిరసనలు వైఎస్సార్ సీపీ నేతలు గరంగరం బుచ్చయ్య చౌదరి దూషణలపై వైఎస్సార్ సీపీ నేతలు మండిపడుతున్నారు. మహిళలను కించపరుస్తూ ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్సార్ సీపీ శ్రేణులు ఉద్యమించిన విషయం తెలిసిందే. అలాంటి వ్యక్తిని సమర్థిస్తూ మాజీ సీఎంపై దూషణలకు దిగడంపై వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మంత్రి పదవి కోసమే బుచ్చయ్య నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, వయసును, అనుభవాన్ని పక్కన పెట్టి మరీ మత్రి భ్రమించి దూషిస్తున్నారని ఆ పార్టీ నేతలు జక్కంపూడి రాజా, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మార్గాని భరత్రామ్ తదితరులు ఆరోపిస్తున్నారు. ‘నరుకుతామంటున్నారు. ఎక్కడి రావాలో టైమ్, డేట్ చెప్పాలంటూ సవాల్ విసురుతున్నారు. మంత్రి పదవి కోసం ‘నరుకుతా, చంపుతా, ఉరి తీయాలి’ మాట్లాడటమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాల్సింది పోయి.. ప్రతిపక్ష నేతలపై ఇలాంటి దూషణలు తగవని హెచ్చరిస్తున్నారు. బుచ్చయ్య తీరు ఇలాగే కొనసాగితే తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టం చేస్తున్నారు. -
గ్రీన్ ఫీల్డ్ హైవేపై టోల్ వసూళ్లు
దేవరపల్లి: దేవరపల్లి నుంచి ఖమ్మం గ్రీన్ఫీల్డ్ హైవేపై సోమవారం నుంచి టోల్ ఫీజు వసూలు ప్రారంభించారు. దాదాపు 20 రోజుల నుంచి హైవేపై వాహనాల రాకపోకలకు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. దీంతో విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు వెళ్లే వాహనాలు హైవేపై రాకపోకలు సాగిస్తున్నాయి. ట్రయల్ రన్ కావడంతో ఇంత వరకు వాహనదారుల నుంచి ఎటువంటి టోల్ ఫీజు వసూలు చేయలేదు. ఖమ్మం జిల్లా వైరా సమీపంలోని సోమవారం (33వ కిలో మీటరు) గ్రామం వద్ద నుంచి ఏలూరు జిల్లా కొయ్యలగూడెం(149వ కిలో మీటరు) వరకు మధ్యలో గల ఏడు టోల్ ఫ్లాజాల ద్వారా టోల్ ఫీజు వసూలు చేస్తున్నట్టు హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పీడీ బి.కృష్ణమూర్తి తెలిపారు. ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు 162 కిలోమీటర్ల హైవేపై 11 టోల్ ఫ్లాజాలు ఉండగా, ప్రస్తుతం ఏడు టోల్ ఫ్లాజాల ద్వారా ఫీజు వసూలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. నగదు రహిత వసూలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఆన్లైన్ ద్వారా చెల్లింపులు జరపాలన్నారు. తెలంగాణలో కొంత వరకు నిర్మాణ పనులు జరుగుతున్నాయని, జంగారెడ్డిగూడెం–దేవరపల్లి మధ్య అక్కడడక్కడా చిన్నచిన్న పనులు జరుగుతున్నాయన్నారు. మే నెలలో పూర్తి స్థాయిలో టోల్ ఫీజు వసూలు జరుగుతుందన్నారు. హైవేపై మోటార్ సైకిళ్లు, ఆటోలకు అనుమతి లేదన్నారు. -
వీరేశ్వరుని బ్రహ్మోత్సవానికి సర్వం సిద్ధం
● నేటి నుంచి 24వ తేదీ వరకు నిర్వహణ ● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఐ.పోలవరం: నిత్యకల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ల భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో సోమవారం నుంచి 24వ తేదీ శుక్రవారం వరకూ ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్వామివారికి బ్రహ్మాది దేవతల ద్వారా ఆది దంపతుల సమక్షంలో కై లాశంలో వైశాఖ శుద్ధ పంచమినాడు కల్యాణం జరిగిందని పురాణాల ద్వారా తెలస్తోంది. ఆ ప్రాతిపదికన నిత్యకల్యాణ మూర్తికి శాశ్వత ప్రాతిపదికగా పాంచాహ్నిక దీక్షతో శైవాగమ పండిత ప్రముఖుడు యనమండ్ర సత్య సీతారామశర్మ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఐదు రోజుల పాటు జరుగనున్నాయి. 20న గణపతి పూజ, పంచగవ్యారాధన, దీక్షా ధారణ, అభిషేకాలు, నూతన వధూవరులను చేయడం, ధ్వజారోహణ, సాయంత్రం ‘భద్ర’పీఠంపై గ్రామోత్సవం నిర్వహించనున్నారు. 21న లక్ష్మి గణపతి హోమం, ప్రధాన కలశారాధన, వాస్తు పూజ, సాయంత్రం ‘చంద్రప్రభ’ వాహనంపై ఊరేగింపు, ఆలయ ద్వాదశ ప్రదక్షిణ, స్వామి వారికి అమ్మవారికి బ్రహ్మోత్సవ కల్యాణం, 22న పంచవింశతి కలశస్థాపన పూర్వక అభిషేకం, సరస్వతీ హోమం, రుద్రహోమం, సాయంత్రం ‘సూర్యప్రభ’ వాహనంపై గ్రామోత్సవం, 23న గవ్యాంతం, చండీహోమం, సాయంత్రం ‘నంది వాహనం’పై గ్రామోత్సవం, 24న పూర్ణాహుతి, వసంతోత్సవం, వృద్ధ గౌతమిలో త్రిశూల స్నానం, స్వామి, అమ్మవారిని రథంపై ఊరేగింపు, పుష్పోత్సవం, పవళింపు సేవ, నిర్వహించ నున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, ఈఓ వి.సత్యనారాయణ తెలిపారు. -
లంచం ఇస్తేనే శ్లాబ్ పడేది..
● పేద మహిళకు జనసేన నాయకుడి బెదిరింపు ● సీపీఐ నాయకులను ఆశ్రయించిన బాధిత కుటుంబం ● నేడు పాడాలో ఫిర్యాదు చేయనున్న బాధితులు పిఠాపురం: ఇంటికి శ్లాబ్ వేయాలంటే తమకు లంచం ఇవ్వాలని పేద మహిళను స్థానిక జనసేన నాయకుడు బెదిరించిన ఘటన స్థానిక జగ్గయ్యచెరువులో చోటుచేసుకుంది. బాధితుల నుంచి స్థానిక సీపీఐ నాయకులు సాకా రామకృష్ణ, దళిత నాయకులు ఖండవిల్లి సుబ్బారావు తదితరులు సమాచారం సేకరించారు. ఈ మేరకు ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. పేద మహిళ అయిన కఠారి సత్యవతికి జగ్గయ్యచెరువు కాలనీలో రెండు సెంట్ల స్థలం ఉందని, ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకుంటుండగా స్థానిక జనసేన నాయకులు వచ్చి నిర్మాణాన్ని అడ్డుకున్నారని తెలిపారు. రూ.60 వేలు లంచం ఇస్తేనే ఇంటి నిర్మాణం ముందుకు సాగుతుందని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఇంటికి శ్లాబ్ వేసేందుకు ఆదివారం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని, స్థానిక జనసేన నాయకులు వచ్చి లంచం డిమాండ్ చేయడంతో ఆ మొత్తం ఇచ్చే స్తోమత లేక ఇంటి నిర్మాణం నిలిచిపోందన్నారు. పనులు నిలిచిపోవడంతో బాధితురాలికి రూ.20వేలు నష్టం వాటిల్లిందన్నారు. బాధితురాలికి అధికారులు న్యాయం చేయాలని, న్యాయం జరగకపోతే ఆమె తరఫున సీపీఐ పోరాటం కొనసాగిస్తుందని హెచ్చరించారు. -
పైకి నటన.. లోపల వంచన
● మహిళలపై చంద్రబాబు రెండు నాల్కెల ధోరణి ● కేంద్రానికి మద్దతు ఉపసంహరించుకోగలరా? ● ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు సూటి ప్రశ్న అమలాపురం టౌన్: పార్లమెంట్లో మహిళా బిల్లు పాస్ కాకపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పైకి నటన, లోపల వంచన అన్నట్టు రెండు నాల్కల ధోరణితో దేశ చరిత్రలో ఇదో బ్లాక్ డే, మహిళలు క్షమించరని పెద్దపెద్ద మాటలు అంటున్నారని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో అంటకాగుతున్న ఆయన మహిళా బిల్లు విషయంలో మద్దతు ఉపసంహరించుకుంటామని మోదీకి వార్నింగ్ ఇస్తే ఆ బిల్లు ఎందుకు పాస్ కాదని ప్రశ్నించారు. స్థానిక హైస్కూలు సెంటర్లోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన ఆదివారం స్థానిక మీడియాతో మాట్లాడారు. ఓ పక్క కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి అండ కావాలి, మరో పక్క మద్దతు ఉపసంహరించుకునే సత్తా లేనప్పుడు బిల్లు పాస్ కానందుకు మహిళలు క్షమించరు.. ఇది బ్లాక్ డే అనకూడదని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన ప్రభుత్వంలోని బీసీ వెల్ఫేర్ మంత్రి చెల్లుబోయిన వేణు కుల గణనకు శ్రీకారం చుట్టారు. ఆ గణన సర్వే నివేదికను అసెంబ్లీలో యథాతథంగా అమలు చేయండని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలకు ఎమ్మెల్సీ సూచించారు. ఓబీసీలకు 2011లో సోషియో ఎకానమిక్ కాస్ట్ సెన్సస్ జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఆ సెన్సస్ జరిగి ఏళ్లు గడుస్తున్నా పార్లమెంట్లో బిల్లు పెట్టలేదు. పాస్ చేయలేదని ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు గుర్తు చేశారు. -
తలుపులమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
తుని రూరల్: లోవ దేవస్థానంలో వెలసిన తలుపులమ్మ అమ్మవారి సన్నిధికి ఆదివారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో వచ్చిన సుమారు 25 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.2,02,680, పూజా టికెట్లకు రూ.2,65,540, కేశఖండన శాలకు రూ.15,520, వాహన పూజలకు రూ.7,890, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.71,730, విరాళాలు రూ.43,929 కలిపి మొత్తం రూ.6,07,289 ఆదాయం సమకూరిందని వివరించారు. సర్వేయర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానంసీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): తూర్పు గోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పోలవరం జిల్లాల్లో 235 మంది లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకానికి దరఖాస్తులు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 30వ తేదీ లోగా కాకినాడలోని జిల్లా సర్వే, భూమి రికార్డుల అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. లైసెన్స్డ్ సర్వేయర్ నియామకానికి పూర్వ చరిత్ర ధ్రువీకరణ తప్పనిసరన్నారు. లైసెన్స్ రెన్యువల్ కాలపరిమితి మూడేళ్లుండగా, ఆధునిక సర్వే పరికరాలపై శిక్షణ పొందిన తరువాతే లైసెన్స్ జారీ చేస్తారని తెలిపారు. ప్రతి దరఖాస్తుకు రూ.750 ఫీజు నిర్ణయించారన్నారు. అవసరమైన పత్రాలతో పాటు పూర్వ చరిత్ర వివరాల కోసం అభ్యర్థులు మూడు సెట్ల ఫామ్లు భర్తీ చేసి సమర్పించాల్సి ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు కాకినాడలోని జిల్లా సర్వే, భూమి రికార్డుల అధికారి బి.లక్ష్మీనారాయణను సంప్రదించాలని జేసీ సూచించారు. -
ఎడ్ల రాతిబండ పోటీల్లో సతీష్కు బహుమతి
అమలాపురం టౌన్: గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో నూతలపాటి పరమేశ్వరరావు మెమోరియల్ ఆధ్వర్యంలో ఈనెల 17న జరిగిన ఎడ్ల రాతి బండ పోటీల్లో స్థానిక మున్సిపల్ మాజీ చైర్మన్, పశు పోషక రైతు యాళ్ల నాగ సతీష్కు చెందిన ఎడ్ల జత రాతిబండను లాగి విజేతలుగా నిలిచాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా స్థాయిలో సతీష్ పోషణలో పెరుగుతున్న ఎడ్లు 6వ స్థానంలో నిలిచి బహుమతి గెలుచుకున్నాయి. ఈ మేరకు నాగ సతీష్ను నిర్వాహకులు సత్కరించి బహుమతిని అందజేశారు. నాగ సతీష్ తండ్రి అమలాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ దివంగత యాళ్ల మల్లేశ్వరరావు కూడా పశుపోషక రైతే. ప్రత్తిపాడులో గెలుపొందిన ఎడ్లను హరి, ఉగ్ర పేర్లతో పిలుస్తారు. విద్యుత్ చౌర్యంపై విజిలెన్స్ దాడులు ● ఐదు సర్వీసులపై కేసు నమోదు ● రూ.3 లక్షల జరిమానా కాట్రేనికోన: మండలంలోని గచ్చకాయలపోరలో రొయ్యల చెరువులకు కొంతకాలంగా అక్రమ విద్యుత్ వినియోగిస్తున్నట్టు అందిన సమాచారంతో విజిలెన్సు అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ తనిఖీలలో విద్యుత్ చౌర్యానికి పాల్పడిన ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. 5 సర్వీసులకు మొత్తం రూ.3 లక్షలు జరిమానా విధించినట్టు విజిలెన్సు ఈఈ డీపీఈ కేవీవీ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ అక్రమ వినియోగానికి పాల్పటిడే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ దాడులలో ఎ.మురళి డీఈ డీపీఈ, వి.భరత్ కుమార్ ఏఈఈ డీపీఈ, డి.జీవానందం ఏపీటీఎస్, సీఎస్ తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్కు జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసు
పెరవలి: జిల్లా కలెక్టర్కు జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసు జారీ చేసింది. వివరాలివీ.. మండలంలోని తీపర్రు గ్రామానికి చెందిన దళితులు తమకు శ్మశాన వాటిక కోసం స్థలం కేటాయించాలంటూ కొన్నేళ్లుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ సమస్యపై 2024లో అప్పటి కలెక్టర్ స్థానిక రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దళితుల శ్మశాన వాటికకు స్థలం చూపించాలని సూచించారు. అయినప్పటికీ వారి సమస్య పరిష్కారం కాలేదు. దీంతో, గత నెలలో జిల్లాలో పర్యటించిన జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా దృష్టికి తీపర్రు దళితులు తమ సమస్యను తీసుకువెళ్లారు. ఆయన సూచన మేరకు జాతీయ ఎస్సీ కమిషన్కు ఆ గ్రామానికి చెందిన గొల్ల ధనరాజ్ ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జాతీయ ఎస్సీ కమిషన్ జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరికి నోటీసు జారీ చేసింది. తీపర్రు దళితుల శ్మశాన వాటిక సమస్యపై 30 రోజుల్లోగా సమగ్ర నివేదిక పంపించాలని ఆదేశించింది. నివేదిక ఇవ్వకపోతే స్వయంగా లేదా కలెక్టర్ ప్రతినిధి తమ ముందు హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొంది. నర్సరీలో మొక్కల నరికివేత కడియం: మండలంలోని దామిరెడ్డిపల్లిలో సుమారు రూ.6 లక్షల విలువైన నర్సరీ మొక్కలను గుర్తు తెలియని దుండగులు నరికేశారు. గ్రామంలోని పోలేరమ్మ గుడి సమీపాన ఏడు కుంచాల చేనులో బాధితుడు, ఆ గ్రామ ఎంపీటీసీ సభ్యుడు విత్తనాల సాయికుమార్ కౌలు వ్యవసాయం చేస్తున్నారు. అందులో మిర్చి మేరీ గ్రీన్, పోక రకాలకు చెందిన 25 అంగుళాల బ్యాగు సైజు మొక్కలు పెంచుతున్నారు. ఈ నెల 13వ తేదీ రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆ నర్సరీలోకి చొరబడి మొక్కల మొవ్వులను నరికేశారు. మొత్తం మొక్కలన్నిటినీ ఇదే విధంగా చేయడంతో తనను నష్టపరచడానికి ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని సాయికుమార్ గ్రహించారు. దీనిపై కడియం పోలీసులకు ఈ నెల 14న ఫిర్యాదు చేశారు. ఈ వివరాలను ఆయన ఆదివారం స్థానిక విలేకర్లకు వెల్లడించారు. తనకు ఎవ్వరితోనూ వివాదాలు లేవని, తనను ఇంతగా నష్టపరచాల్సిన అవసరం ఎవరికి వచ్చిందో అర్థం కావడం లేదని సాయికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వనాథకు ఋషిపీఠం పురస్కారం రాజమహేంద్రవరం రూరల్: మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ ప్రతిష్ఠాత్మక ఋషిపీఠం పురస్కారం–2025కు ఎంపికయ్యారు. సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ వ్యవస్థాపక అధ్యక్షునిగా ఏర్పాటయిన ఈ సంస్థ ప్రాచీన భారతీయ విద్యలను ప్రోత్సహించడానికి ఏటా ఈ పురస్కారం అందజేస్తోంది. ప్రముఖ వేద విద్వాంసుడు, రాష్ట్రపతి పురస్కార గ్రహీత దివంగత విశ్వనాథ జగన్నాథ ఘనపాఠి తనయుడు గోపాలకృష్ణ సంప్రదాయ పద్ధతిలో వేదవేదాంగాలను అభ్యసించారు. రాజమహేంద్రవరం గౌతమీ విద్యాపీఠం, ఓరియెంటల్ కళాశాల ప్రిన్సిపాల్గా పని చేశారు. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం నుంచి మహామహోపాధ్యాయ గౌరవ పురస్కారం, బెంగళూరుకు చెందిన సురభారతి సంస్కృత ప్రతిష్ఠానం నుంచి శాస్త్రరత్నాకర, అవధూత దత్తపీఠం నుంచి శాస్త్రనిధి, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి శాస్త్రవిద్వన్మణి బిరుదులు అందుకున్నారు. 2019లో రాష్ట్రపతి పురస్కారం అందుకున్నారు. తండ్రీతనయులిద్దరూ రాష్ట్రపతి పురస్కారాలు అందుకోవడం విశేషం. హైదరాబాద్లోని భారతీయ విద్యా భవన్లో మే 9న జరిగే కార్యక్రమంలో సామవేదం చేతుల మీదుగా విశ్వనాథ ఋషిపీఠం పురస్కారం అందుకుంటారు. ఋషిపీఠం కార్యవర్గ సభ్యుడు డాక్టర్ టీవీ నారాయణరావు ఆదివారం ఒక ప్రకటనలో ఈ వివరాలు తెలిపారు. రేపు పీఆర్టీయూ ధర్నా బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద మంగళవారం ధర్నా నిర్వహిస్తున్నట్లు పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు చింతాడ ప్రదీప్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ ఏర్పాటు, డీవైఈఓ, ఎంఈఓ, జూనియర్ లెక్చరర్, పీజీటీల పదోన్నతులు కల్పించాలని, 2023 జూలై 1 నుంచి 12వ పీఆర్సీ అమలు చేయాలని, 30 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని, ఇంకా ఇతర సమస్యల పరిష్కారానికి ఈ ధర్నా నిర్వహిస్తున్నామని వివరించారు. -
ఈ చట్టం.. శ్రమజీవికి చుట్టం!
● భవితకు భద్రతనిస్తున్న ఏపీ భవన, ఇతర నిర్మాణ కార్మికుల చట్టం–2005 ● అవగాహన లేక ఎన్నో ప్రయోజనాలకు దూరం ● వివిధ మార్గాల్లో అవగాహన కల్పిస్తున్న అధికారులు కాకినాడ క్రైం: భవన నిర్మాణ కార్మికుల బతుకులు ఇక భద్రం. ఆంధ్రప్రదేశ్ భవన, ఇతర నిర్మాణ కార్మికుల చట్టం–2005 వారి జీవితాలకు భరోసా కల్పిస్తోంది. భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డు తోడ్పాటుతో అధికారులు ఈ మేరకు అవగాహన కల్పిస్తున్నారు. ఎవరి కోసం... ఈ చట్టం కార్మికుల ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతుంది. భవన నిర్మాణ కార్మికులు, ఇతర నిర్మాణ రంగాల్లో పనిచేస్తున్న వారు, ఉపాధి హామీ కార్మికులు ఈ ప్రయోజనాలు అందిపుచ్చుకునేందుకు అర్హులు. ఏ అధికారితో అవసరం లేకుండా తాము భవన నిర్మాణ రంగం, అనుబంధ రంగాలకు చెందిన కార్మికులమని స్వీయ నిర్థారణ (సెల్ఫ్ డిక్లరేషన్) ఇస్తే చాలు. పెళ్లికి కానుక.. కార్మికుడు లేదా కార్మికురాలికి వివాహానికి, కార్మికుల ఇళ్లలో ఆడపిల్లల వివాహాలకు రూ.20 వేలు సాయం అందుతుంది. ఒక ఇంట్లో గరిష్టంగా ఇద్దరు ఆడ పిల్లలు ఉంటే రూ.40 వేల ఆర్థిక సాయం అందజేస్తారు. ఏపీ సేవా పోర్టల్ ద్వారా వివాహ ధృవీకరణ పత్రం తీసుకుని, కార్మికుడి ఆధార్, రేషన్ కార్డుల నకళ్లు, బ్యాంక్ ఖాతా వివరాలతో స్థానిక కార్మిక శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. 2026 మార్చి తర్వాత జరిగిన వివాహాలకు ఈ ప్రయోజనం వర్తిస్తుంది. ప్రసవిస్తే.. కార్మికుడి కుమార్తె, లేదా భార్య లేదా మహిళా కార్మికురాలు ప్రసవిస్తే ప్రసూతి వైద్యం నిమిత్తం రూ.20 వేలు అందజేస్తారు. ఇందుకు ఆసుపత్రి ధృవపత్రాలను జతచేసి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సాయం మొదటి రెండు కాన్పులకు అందుతుంది. గర్భధారణ మొదటి దశ నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. సహజ మరణానికి... జనన మరణాల్లో కార్మికుడికి చట్టం తోడుంటుంది. మరణం వేళ రూ.60 వేల మొత్తాన్ని కార్మికుడు నిర్ణయించిన నామినీకి అందజేస్తుంది. ఈ సాయం కేవలం సహజ మరణానికే వర్తిస్తుంది. అంతియాత్రలోనూ.. అంతిమ యాత్రలోనూ మృతుడి అంత్యక్రియలకు రూ.20 వేలు కుటుంబానికి ఇస్తారు. కార్మికుడి మృతి నిర్థారణ అయిన వెంటనే కార్మిక శాఖ కార్యాలయాన్ని సంప్రదిస్తే ఈ సాయం తక్షణం అందజేస్తారు. 1.2 లక్షలకు పైగా నమోదు కాకినాడ జిల్లాలో నమోదైన 1,20,530 మంది కార్మికులకు అధికారులు లేబర్ కార్డులు మంజూరు చేశారు. మరో 70 వేల మందికి పైగా నమోదు కావలసిన వారున్నారు. కార్మికులకు ఎంతో భరోసా భవన నిర్మాణ, అనుబంధ విభాగాల్లోని కార్మికులకు చట్టం ఎంతో భరోసా ఇస్తోంది. 90 రోజులు పనిచేసి ఉంటే చాలు. కేవలం ఏడాదికి రూ.12 రూపాయలు చొప్పున ఒకే సారి ఐదేళ్లకు రిజిస్ట్రేషన్ రుసుముతో కలిపి రూ.110 చెల్లిస్తే సరిపోతుంది. 24 గంటల వ్యవధిలోనే లేబర్ కార్డు మంజూరు చేస్తాం. కార్మికులు, సంఘ ప్రతినిధులకు అవగాహన కల్పిస్తున్నాం. స్థానిక జీపీటీ రోడ్లో ఉన్న కార్మిక శాఖ కార్యాలయంలో అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి. – పి.శ్రీనివాస మహేష్, అసిస్టెంట్ కమిషనర్, కాకినాడ జిల్లా -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 26,000 గటగట (వెయ్యి) 23,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 22,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)13,000 – 14,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
మహిళలను వంచించి.. నిరసన ర్యాలీయా?
● రాజకీయ లాభం కోసమే నిడదవోలు సభ ● సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి వేణు ధ్వజంరాజమహేంద్రవరం రూరల్: ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా మహిళలను వంచించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తిరిగి వారితో కలసి నిరసన ర్యాలీ చేయడమేమిటని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆక్షేపించారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్సభలో మహిళా బిల్లు వీగిపోయిన సందర్భంలో ఈ ర్యాలీ ఎందుకు చేశారో చంద్రబాబే చెప్పాలన్నారు. నిడదవోలులో జరిగిన సభ, ర్యాలీ ప్రజల కోసం కాదని, రాజకీయ లాభం కోసమేనని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలను మోసం చేసిన నాయకుల్లో చంద్రబాబు ముందు వరుసలో ఉన్నారన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చి, ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదని గుర్తు చేశారు. 2024 ఎన్నికల్లో ప్రతి మహిళకూ నెలకు రూ.1,500 చొప్పున ఇస్తామని చెప్పి, రెండేళ్లు గడుస్తున్నా ఆ హామీ అమలు చేయలేదని అన్నారు. సూపర్ సిక్స్ పథకాలను ‘సూపర్ హిట్’గా ప్రచారం చేస్తున్న ప్రభుత్వం, వాస్తవానికి వాటి అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.3 వేల భృతి ఇస్తామని చెప్పి, ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా యువతను మోసగించారని అన్నారు. మూడు ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల హామీ కూడా పూర్తిగా అమలు కాలేదని చెప్పారు. ఈ రెండేళ్లలో చేసిన అభివృద్ధి ఏమీ లేకపోవడంతో, వైఎస్ జగన్ పైన, గత ప్రభుత్వం పైన నిందలు వేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. అమరావతి ఒక్కటే చంద్రబాబు అజెండా జిల్లాలో భూముల రేట్లు ఎక్కువగా ఉండటంతో పరిశ్రమలు రావడం లేదని చంద్రబాబు అంటున్నారని వేణు చెప్పారు. వాస్తవానికి పరిశ్రమలకు అనువైన భూములు జిల్లాలో అనేకం ఉన్నాయని చెప్పారు. మూడు పంటలు పండే భూములను రాజధాని కోసం తీసుకున్నప్పుడు, ఆ భూమి విలువైనదనే విషయం చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. ‘మీకు ఎక్కడ లాభం వస్తే అక్కడ పరిశ్రమలు పెడతారు. కిక్బ్యాక్స్ ఇచ్చే ప్రాంతాల్లోనే పరిశ్రమలు పెడతారా?’ అంటూ నిలదీశారు. అమరావతి ఒక్కటే అజెండాగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ధర్మదీక్షలు, ర్యాలీలతో ఏం సాధించారు? బీజేపీతో 2014–19లో విభేదించిన తరువాత చేసిన ధర్మదీక్షలతో చంద్రబాబు ఏం సాధించారని వేణు ప్రశ్నించారు. నేడు కూడా అదే పంథా కొనసాగిస్తున్నారన్నారు. ఎంతసేపూ రాజకీయాలు చేయడం తప్ప.. అభివృద్ధి, ప్రజల అవసరాలపై ఆలోచన చేయకుండా వ్యవస్థలన్నింటినీ కుప్ప కూల్చారని విమర్శించారు. పెరిగిన ధరలతో పేదలు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యులకు భద్రత కొరవడిందన్నారు. తాను చేసిన అవినీతి, ప్రజావ్యతిరేక కార్యక్రమాలను ప్రశ్నిస్తున్న ఏకై క ప్రతిపక్షం వైఎస్సార్ సీపీ అని, వైఎస్ జగన్పై నిందలు వేస్తే ప్రజలు నమ్ముతారనే భావనతో చంద్రబాబు ఉన్నారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ సీపీ పాలనలో అన్ని వర్గాలకూ న్యాయం జరిగిందనే విషయాన్ని ప్రజలు ఇప్పుడు చర్చించుకుంటున్నారని తెలిపారు. ‘మీరు విధ్వంసం చేస్తూ వైఎస్ జగన్ పాలనను విధ్వంసం అని ప్రచారం చేస్తారా?’ అని మండిపడ్డారు. ఇప్పటికే రెండేళ్లు గడిచిపోయాయని, చంద్రబాబు ఇప్పటికై నా మారాలని, మిగిలిన మూడేళ్లలోనైనా చేసిన పనులు చెప్పుకోవాలని వేణు హితవు పలికారు. -
సీజన్ మొదలైంది
ఏటా పచ్చళ్లు పెట్టుకునే వారు గతంలో ఇళ్ల వద్దే ముక్కలు కోసుకునే వారు. కోత సరిగ్గా లేకపోతే పచ్చడి నిల్వ ఉండదు. అందుకే మా దగ్గర ముక్కలు కొట్టిస్తున్నారు. మామిడి కాయల సీజన్ వచ్చిందంటే మాకు చేతి నిండా పని దొరుకుతుంది. ప్రతి రోజూ వెయ్యికి పైగా మామిడి కాయలను ముక్కలుగా కొడుతూంటాం. మామూలు రోజుల్లో వెదురు బుట్టలు అల్లుకునే మాకు ఈ సీజన్లో మామిడి కాయలు కొట్టే పనే పొట్ట నింపుతుంది. – పిల్లి లక్ష్మి, పిఠాపురం ఇక నుంచి ఖాళీ ఉండదు వారం రోజులుగా మామిడి కాయ ముక్కలు కోయడం ప్రారంభమైంది. మామిడి పండ్లు వచ్చేంత వరకూ రోజూ ఈ పని ఉంటుంది. మాతో పాటు చాలా మంది ముక్కలు కోసే పనిలో ఉన్నారు. ప్రత్యేకమైన కత్తులతో ఎక్కడా ముక్క దెబ్బ తినకుండా, పీచు విడిపోకుండా కోయాల్సి ఉంటుంది. ఈ పని మాకు అలవాటు కాబట్టి మా దగ్గర కోయించుకుంటారు. – పిల్లి అప్పయ్యమ్మ, పిఠాపురం -
ఇల్లు కదలని బేళ్లు
● మందకొడిగా వర్జీనియా కొనుగోళ్లు ● నామమాత్రంగా వేలం ● మార్కెట్కు రాని కొనుగోలుదారులు ● గిట్టుబాటు ధర కోసం రైతుల నిరీక్షణ దేవరపల్లి: కొనుగోలుదారులు పూర్తి స్థాయిలో రాకపోవడం.. గిట్టుబాటు ధర దక్కకపోవడంతో పొగాకు అమ్మకాలు మందకొడిగా జరుగుతున్నాయి. రైతుల వద్ద సిద్ధంగా ఉన్న బేళ్లు ఇల్లు కదలనంటున్నాయి. టుబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలో 2025–26 పంట కాలంలో 12,612 మంది రైతులు సుమారు 29 వేల హెక్టార్లలో పొగాకు సాగు చేశారు. పంట ఆశాజనకంగా ఉండడంతో ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. బోర్డు 49.32 మిలియన్ కిలోల ఉత్పత్తికి మాత్రమే అనుమతివ్వగా.. సుమారు 85 మిలియన్ కిలోల పొగాకు పండిందన్నది అంచనా. పంట క్యూరింగ్లు దాదాపు పూర్తి కావచ్చాయి. పొగాకు రంగు, నాణ్యత బాగుండటంతో మార్కెట్ కూడా అందుకు తగినట్టుగానే ఉంటుందని రైతులు ఆశించారు. కానీ, అందుకు భిన్నమైన పరిస్థితులు మార్కెట్లో ఎదురయ్యాయి. తగ్గిన ప్రారంభ ధర రీజియన్ పరిధిలోని దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం–1, 2 వేలం కేంద్రాల్లో గత నెల 25న పొగాకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. గత ఏడాది కొనుగోళ్ల ప్రారంభం రోజున కిలో పొగాకు గరిష్ట ధర రూ.290 దక్కగా.. ఈసారి తొలి రోజున అది రూ.265కే పరిమితమైంది. దీంతో, రైతులు కంగు తిన్నారు. గత ఏడాది ప్రారంభ ధరకంటే ఎంతో కొంత ఎక్కువగా ఇస్తారని, కనీసం గత ఏడాది ప్రారంభ ధర రూ.290 అయినా ఇస్తారని ఆశ పడగా.. అందుకు భిన్నంగా మార్కెట్ మొదలైంది. ఈ నేపథ్యంలో గిట్టుబాటు ధర ఇస్తేనే వేలం జరగనివ్వాలనే నిర్ణయానికి రైతులు వచ్చారు. కిలో ప్రారంభ గరిష్ట ధర రూ.290 ఇవ్వాలని అధికారులను, కొనుగోలుదారులను డిమాండ్ చేశారు. గరిష్ట ధర రూ.265కు మించకుండా వ్యాపారులు సీలింగ్ పెట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఆరంభం రోజునే వేలం నిలుపు చేయడం మంచిది కాదని భావించిన రైతులు తొలి రోజు అదే ధరకు పొగాకు విక్రయించారు. అప్పటి నుంచీ రైతులు తక్కువ సంఖ్యలో బేళ్లను అమ్మకానికి తెస్తున్నారు. నెల రోజులవుతున్నా.. సాధారణంగా వేలం ప్రారంభం రోజున శుభసూచకంగా ఒక్కో వేలం కేంద్రంలో 18 నుంచి 27 బేళ్లతో కొనుగోళ్లు ప్రారంభిస్తారు. అనంతరం, రోజుకు 300 నుంచి 400 బేళ్లు వేలం కేంద్రాలకు వస్తాయి. మార్కెట్ వేగం పుంజుకున్నాక ఆ సంఖ్య రోజుకు 700 నుంచి 1,200కు పెరుగుతుంది. ఈ ఏడాది కొనుగోళ్లు ప్రారంభమై దాదాపు నెల రోజులవుతున్నా మార్కెట్లో కొనుగోళ్లు మందకొడిగానే జరుగుతున్నాయి. ఒక్కో వేలం కేంద్రానికి 30 నుంచి 150 వరకూ మాత్రమే బేళ్లు అమ్మకానికి వస్తున్నాయి. వీటిలో దాదాపు సగం బేళ్లను వ్యాపారులు తిరస్కరిస్తున్నారు. రోజు విడిచి రోజు వేలం వేలం కేంద్రాలకు రైతులు తక్కువ సంఖ్యలో బేళ్లు తీసుకురావడం, కొనుగోలుదారులు మార్కెట్కు రాకపోవడం వంటి కారణాలతో అధికారులు ప్రస్తుతం రోజు విడిచి రోజు మాత్రమే వేలం నిర్వహిస్తున్నారు. జంగారెడ్డిగూడెంలోని రెండు కేంద్రాల్లో ఒక రోజు, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి వేలం కేంద్రాల్లో మరుసటి రోజు వేలం జరుగుతోంది. ఈ నెలాఖరు వరకూ వేలం ప్రక్రియ ఇలానే కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఐదు వేలం కేంద్రాల్లోనూ రోజుకు సుమారు 20 వేల కిలోల పొగాకు కొనుగోళ్లు మాత్రమే జరుగుతున్నాయి. కొనుగోళ్ల తీరుపై కౌలు, చిన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది మార్కెట్ ఎలా ఉంటుందోనని మధనపడుతున్నారు. జీఎస్టీ భారం.. యుద్ధం శాపం పొగాకు ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీని 28 శాతం నుంచి 42 శాతానికి పెంచింది. ఇది భారం కావడంతో వ్యాపారులు పొగాకు ధర పెంచడం లేదని అంటున్నారు. మరోవైపు పశ్చిమాసియా యుద్ధ ప్రభావం కూడా పొగాకు మార్కెట్పై పడింది. మన ప్రాంత పొగాకుకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇక్కడి నుంచి గల్ఫ్తో పాటు చైనా, జపాన్ తదితర దేశాలకు వివిధ దేశాలకు పొగాకు ఎగుమతులు జరుగుతూంటాయి. యుద్ధం నేపథ్యంలో ఎగుమతి సంస్థలకు విదేశీ ఎగుమతుల ఆర్డర్లు ఇప్పటి వరకూ ఖరారు కాలేదు. ఇది కూడా మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపుతోంది. దీనికి తోడు కర్ణాటకలో పొగాకు వేలం ఇంకా కొనసాగుతోంది. అక్కడ ఇంకా సుమారు 30 మిలియన్ కిలోల పొగాకు వేలం జరగాల్సి ఉంది. అక్కడ వేలం ముగిస్తేనే కానీ, కొనుగోలుదారులు ఇక్కడకు వచ్చే పరిస్థితి లేదని అంటున్నారు. ఆర్డర్లు ఖరారు కాలేదు కొనుగోలు సంస్థలకు ఎగుమతి ఆర్డర్లు ఇప్పటి వరకూ ఖరారు కాలేదు. కర్ణాటకలో కొనుగోళ్లు జరుగుతూండటం, జీఎస్టీ, యుద్ధ ప్రభావం వంటి అనేక కారణాలతో పొగాకు కొనుగోళ్లు మందకొడిగా జరుగుతున్నాయి. మార్కెట్లో చాలా ఇబ్బందులున్నాయి. ఇప్పటి వరకూ రూ.10.57 కోట్ల విలువైన 4.05 లక్షల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. – జె.సురేంద్ర కుమార్, టుబాకో బోర్డు రీజినల్ మేనేజర్, రాజమహేంద్రవరం దేవరపల్లి వేలం కేంద్రంలో పొగాకు కొనుగోళ్లుఇప్పటి వరకు జరిగిన పొగాకు విక్రయాలు (కిలోల్లో) వేలం కేంద్రం విక్రయాలు దేవరపల్లి 45,706 జంగారెడ్డిగూడెం–1 1,05,688 జంగారెడ్డిగూడెం–2 1,19,027 కొయ్యలగూడెం 55,175 గోపాలపురం 79,547 మొత్తం 4,05,143 కిలో గరిష్ట ధర : రూ.265 కనిష్ట ధర : రూ.250 సగటు ధర : రూ.261 -
సత్యదేవుని కల్యాణానికి మంచిముత్యాలు సమర్పణ
అన్నవరం: ఈ నెల 27వ తేదీన జరుగనున్న సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవానికి వంగా రామకృష్ణ, భవాని, తారకరామ శివసాయి, సూర్య ఐశ్వర్యాంబిక (కాకినాడ) 500 గ్రాముల మంచి ముత్యాలను ఆదివారం అందచేశారు. దాత కోరిక మేరకు వీటిని స్వామివారి కల్యాణంలో ఉపయోగిస్తామని అధికారులు తెలిపారు. పెదరాయవరంలో చోరీ ● నగదు, బంగారం, వెండి అపహరణ ● సొత్తు విలువ సుమారు రూ.3 లక్షలు రంగంపేట: మండల పరిధిలోని పెదరాయవరం గ్రామంలో భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఊరు వెళ్లి తిరిగి వచ్చేలోపు ఇంటిని గుల్ల చేశారని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. ఈ చోరీపై ఎస్ఐ శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మందపాక బుచ్చిబాబు తన భార్యతో కలసి ఈనెల 13వ తేదీ సోమవారం ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లి ఆదివారం సాయంత్రం తిరిగి వచ్చారు. ఇంటిలోకి వెళ్లి చూడగా ఇంటి వెనుకవైపు తలుపు తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి దొంగతనం చేసినట్టు గుర్తించారు. గదిలో ఉన్న ఇనుప అల్మరాను పగుల గొట్టి దానిలోని మూడు ఉంగరాలు, 290 గ్రాముల వెండి, నగదు చోరీ చేసినట్టు గుర్తించారన్నారు. సొత్తు విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని ఎస్సై తెలిపారు. బుచ్చిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. అగ్నిప్రమాదంలో తాటాకిళ్లు దగ్ధం పిఠాపురం (గొల్లప్రోలు): మండలం చిన జగ్గంపేట సగర కాలనీలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించి రెండు తాటాకిళ్లు దగ్ధమయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఎం.అప్పయ్యమ్మ ఇంటిలో వంట చేస్తుండగా మంటలు చెలరేగాయి. దీనిని గమనించి ఆమె బయటకు పరుగులు తీసింది. ఆమె ముగ్గురు కుమారులు ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ప్రమాదంలో గృహోపకణాలు, వంట సామగ్రి, బట్టలు, ఇతర వస్తువులు అగ్నికి ఆహుతి అయ్యాయి. ప్రమాదానికి కారణాలు విశ్లేషిస్తున్నట్టు విశ్లేసిస్తున్నట్లు పిఠాపురం అగ్నిమాపక అధికారి డి.రామకృష్ణ రాజు తెలిపారు. -
విలువల వేసవికి స్వాగతం..
ఫ చిన్న మార్పులతో చిన్నారుల్లో చైతన్యం ఫ మొబైల్ ఫోన్లు, ఆన్లైన్ గేమ్స్ వద్దు ఫ నీతి కథలు, మెదడుకు మేత పెట్టే ఆటలవైపు దృష్టి మరల్చాలి ఫ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో అవసరం ఫ 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు రాయవరం: పాఠశాలకు వేసవి సెలవులంటే విద్యార్థులకు అదో ఆట విడుపు. పుస్తకాలకు స్వస్తి చెప్పి ఆటపాటలకు అల్లర్లకు సిద్ధమైపోతుంటారు. గతంలో అయితే అమ్మమ్మ, లేదా నానమ్మల ఇళ్లకు వెళ్లి ఆత్మీయులతో సంతోషంగా గడపడం, వారు కథలు చెప్తుంటే శ్రద్ధగా వినడం, ఇంట్లో చిన్న చిన్న సాయాలు చేయడం ఇలా గడిచేవి రోజులు. కాలం మారింది. ఏ కుగ్రామానికి వెళ్లినా అక్కడ కావలసినంత ఇంటర్నెట్, దానిని వాడుకోడానికి ఓ స్మార్ట్ఫోన్. ఇవి చాలవా వేసవి ఇట్టే గడిచిపోవడానికి. విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా వారికి ఇష్టమైన అంశాల్లో వారి ప్రతిభను గుర్తించి మెరుగైన శిక్షణ ఇప్పిస్తే వారు దేశానికి విలువైన సంపదగా మారతారనడంలో సందేహం లేదు. వారిళ్లలో పెద్దలు వారికి కుటుంబ విలువలు, నైతిక విలువలు నేర్పే చిన్నయ సూరి నీతి చంద్రికలోని కథలు, లేదా దేశభక్తిని పెంపొందించే స్వాతంత్య్ర సమరయోధుల కథలను, శాస్త్రవేత్తల బయోగ్రఫీలను, పురాణేతిహాసాలను వారికి కథలు కథలుగా చెప్పవచ్చు. తద్వారా వారిని విలువలతో కూడిన రేపటి పౌరులవుతారనడంలో అతిశయోక్తి లేదు. బాల్యం..అమూల్యం: నాటి చిన్నారులకు పల్లెల్లోని చేలగట్ల పైన, పంటబోదెలలోను, చెట్ల కొమ్మలపై ఆడే పల్లె పట్టు ఆటలు ఆడేవారు. అలాగే గ్రామీణ ప్రాంతాలలో కోతికొమ్మచ్చి, గోటిబిళ్ల, గోళీకాయలు, అష్టాచమ్మా, బిళ్లపెంకుల ఆటలు, వంగుదూకుళ్లు, దొంగాట వంటి ఆటలు ఆడేవారు. తద్వారా వారిలో శారీరక శ్రమ అలవడి, తద్వారా మేథోమధనం జరిగి నిత్య నూతన చైతన్యంతో ఉండేవారు. అదే ఒరవడిని నేటి పిల్లలకు తల్లిదండ్రులు అలవరచాలి. ఆత్మస్థైర్యం నింపాలి చిన్నారులలో ఆత్మస్థైర్యం పెంపొందే దిశగా కరాటే, యోగా, ధ్యానం తదితర అంశాల్లో శిక్షణ ఇప్పించాలి. సమీపంలోని అనాథ ఆశ్రమాలకు తీసుకుని వెళ్లి అక్కడి చిన్నారులలో మాట్లాడించడం, అక్కడి పరిసరాలపై అవగాహన కల్పించడం ద్వారా మానవత్వ విలువలు అలవడతాయి. చిన్నతనం నుంచే వారిలో పొదుపు అలవాటు చేయడంద్వారా ఆర్థిక అంశాల నిర్వహణ అలవాటు చేయవచ్చు. ఆరోగ్యంపైనా అవగాహన సెలవుల్లో ఆటలకు వెళ్లి అపరిశుభ్రంగా తిరిగి వస్తుంటారు. ఆ సమయంలో వారు ఎటువంటి రోగాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరాన్ని ఏ విధంగా శుభ్రంగా చేసుకోవాలో వివరంగా చెప్పాలి. 6.2 లక్షల మంది విద్యార్థులు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలకు ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు ఇస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 6,190 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని సుమారు 6.2 లక్షల మంది విద్యార్థులు సుమారు 50 రోజుల పాటు వేసవి సెలవులను గడపనున్నారు. -
‘మాకు అధికారం ఉంది..మేం తలచుకుంటే నరికేయగలం’
సాక్షి, రాజమహేంద్రవరం: ‘ఏంట్రా యదవల్లారా మీరు నరికేది. మేమే నరకగలం. మాకు అధికారం ఉంది. మేం తలచుకుంటే మిమ్మల్ని నరికేయగలం’ అని కాపునేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించి రాజమహేంద్రవరం రూరల్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి రెచ్చిపోయారు. ఆదివారం రాజమహేంద్రవరంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ‘పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలితే అంబటి అయినా.. గిమ్మటి అయినా గుమ్మటం పట్టించేస్తాం. మా కార్యకర్తలు తలచుకుంటే గుమ్మం దాటి బయటకు రాలేరు. అసలు ప్రజాస్వామ్యం గురించి వైఎస్సార్సీపీకి తెలుసా?’ అంటూ మండిపడ్డారు. జగన్కి అమరావతిలో అభివృద్ధి జరగడం ఇష్టం లేదన్నారు. కాగా, రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం ఏ స్థాయిలో వెర్రితలలు వేస్తోందో చెప్పడానికి బుచ్చయ్యచౌదరి వ్యాఖ్యలే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై.. ప్రొటెం స్పీకర్గా.. రాష్ట్ర మంత్రిగా పనిచేసిన బుచ్చయ్యచౌదరి ఈ స్థాయిలో దిగజారి దారుణమైన వ్యాఖ్యలు చేయడం రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు నిదర్శనమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. -
‘బుచ్చయ్య చౌదరి మతి గతి తప్పి మాట్లాడుతున్నారు’
రాజమహేంద్రవరం: టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరిపై మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ ధ్వజమెత్తారు. బుచ్చయ్య చౌదరి మతి గతి తప్పి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుచ్చయ్యకు వయసు అయిపోయి ఏదో మాట్లాడుతున్నారన్నారు. బుచ్చయ్య ఇప్పుడు కేబినెట్లో ప్లేస్కోసం అర్రులు చాస్తున్నారని మండిపడ్డారు. హింసా రాజకీయాలు అంటూ వైఎస్సార్సీపీని ఉద్దేశించి బుచ్చయ్య చేసిన వ్యాఖ్యలకు వేణుగోపాల్ కృష్ణ కౌంటరిచ్చారు. ఎవరివి హింసా రాజకీయాలు అందరికీ తెలుసని చురకలంటించారు.చంద్రబాబు వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందడమే రాధాకృష్ణ లక్ష్యమని, రాధాకృష్ణ బ్రోకర్గా మారిపోయారని ప్రజలు అనుకుంటున్నారన్నారు. జర్నలిజం విలువ కోల్పోయేటట్లుగా రాధాకృష్ణ రాతలు ఉన్నాయన్నారు. ఏపీ ప్రజలకు రాధాకృష్ణతోనే హాని ఉందన్నారు మాజీ మంత్రి వేణు.మీ పాత కథలు ఒక్కసారి గుర్తుచేసుకోండిబుచ్చయ్య చౌదరికి వయసు పెరిగే కొద్దీ మతిస్థిమితం లేకుండా పోతుందన్నారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా., ఆయన భాషా చాలా దారుణంగా ఉందని, మానసిక వైద్యులకు చూపించుకుంటే మంచిదని సూచించారు. హత్యా రాజకీయాలకు టీడీపీ కేరాఫ్ అడ్రస్ అని, గడిచిన రెండేళ్లలో ప్రతిరోజూ రాష్ట్రంలో ఎక్కడో ఒక దగ్గర ఘోరం జరుగుతూనే ఉందన్నారు. ఇసుక సరఫరాకు ఎక్కడకక్కడ కౌంటర్లు ఓపెన్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారని, బుచ్చయ్య చౌదరి పాత కథలు ఒక్కసారి గుర్తు చేసుకుంటే మంచిదన్నారు జక్కంపూడి రాజా. -
రహదారిణం
సాక్షి టాస్క్ఫోర్స్: సెల్ఫ్ ఇంజినీరింగ్ రోడ్డు.. ఈ మాట కాస్త వింతగానే అనిపించక మానదు. నిపుణులైన ఆర్అండ్బీ అధికారులను పక్కను పెట్టి.. ప్రజాప్రతినిధులే దగ్గరుండి పర్యవేక్షిస్తూ నిర్మిస్తున్న రోడ్డు ఇది. మండల కేంద్రమైన కడియం నుంచి వీరవరం మీదుగా వెదురుమూడి వెళ్లే ఈ రోడ్డును రూ.6.12 కోట్ల అంచనాతో నిర్మిస్తున్నారు. ఆక్రమణల తొలగింపు మొదలుకుని అన్నింటిలోనూ అధికారులకంటే ప్రజాప్రతినిధుల ప్రమేయమే ఈ రోడ్డు నిర్మాణంలో ఎక్కువగా ఉంటోందని స్థానికులు చెబుతున్నారు. వాస్తవానికి ఈ రోడ్డును 60 అడుగుల వెడల్పున సెంట్రల్ లైటింగ్, ఇరువైపులా డ్రైన్లు, ఫుట్పాత్లతో నిర్మించాలంటూ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కానీ, ఏం జరిగిందో ఏమో కానీ.. కొన్నిచోట్ల 48, మరికొన్నిచోట్ల 50, ఇంకొన్నిచోట్ల 60 అడుగుల వెడల్పున ఈ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇలా ఒక్కోచోట ఒక్కో వెడల్పున ఈ రోడ్డును ఎందుకు నిర్మిస్తున్నారన్న ప్రశ్నకు అధికారుల నుంచి సరైన సమాధానం రావడం లేదు. నాణ్యత ఊసే లేదు ఎంతో హడావుడిగా చేపట్టిన ఈ రోడ్డు నిర్మాణంలో నాణ్యతను సైతం పక్కన పెట్టేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. తారు రోడ్డు పై పొరను 50 మిల్లీమీటర్ల మందాన తొలగించి, ఆ మేరకు కొత్త మెటీరియల్తో రోడ్డును పటిష్టంగా నిర్మించాలని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. కానీ, దీనికి విరుద్ధంగా పాత తారు రోడ్డును తవ్వేసి, తిరిగి దానినే రోలింగ్ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిత్యం ఈ పనులను మాత్రమే పర్యవేక్షిస్తున్న ప్రజాప్రతినిధులకు ఈ విషయం కనిపించలేదా? లేక చూసీ చూడటనట్లు వదిలేశారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మండల వ్యాప్తంగా నర్సరీలు విస్తారంగా ఉన్నాయి. మొక్కల ఎగుమతులు, దిగుమతుల నిమిత్తం 35 టన్నుల లారీలు సైతం ఈ రోడ్లపై రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటి ఒత్తిడిని సైతం తట్టుకునే విధంగా నిర్మించకపోవడంతో నెలల వ్యవధిలోనే రోడ్లు ధ్వంసమైపోతున్నాయి. కడియం – వెదురుమూడి రోడ్డును కూడా అధిక లోడును తట్టుకునేలా నిర్మించకపోతే త్వరలోనే ఇది కూడా శిథిలమవక తప్పదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘ప్రస్తుతం నిర్మిస్తున్నంత మేర మాత్రమే ఈ రోడ్డుపై ఆక్రమణలను తొలగించామని, ఆ తరువాత డ్రైనేజీలు, ఇతర ఏర్పాట్లు కావాలంటే ఆయా శాఖలు చూసుకుంటాయని ఓ ఆర్అండ్బీ అధికారి చెప్పారు. తన పేరు మాత్రం బయటకు చెప్పొద్దని చివరిగా హామీ కూడా తీసుకున్నారు. దీనిని బట్టి వీరిపై అధికారులపై స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. నిత్యం వేలాది వాహనాలు తిరిగే ఈ రోడ్డులో ఎటువంటి ఇంజినీరింగ్ లోపం తలెత్తినా అది ప్రజలకు ప్రమాదకరంగా మారుతుంది. ఈ విషయాన్ని విస్మరించి, తాత్కాలిక ప్రయోజనాల కోసం ఇష్టారీతిన రోడ్లను నిర్మించడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమేనని నిపుణులు చెబుతున్నారు. ఇష్టానుసారం కడియం – వెదురుమూడి రోడ్డు నిర్మాణం రూ.6.12 కోట్ల అంచనాతో పనులు అడుగడుగునా ప్రజాప్రతినిధుల పెత్తనం నిబంధనలకు తూట్లు మిన్నకుండిపోతున్న అధికారులు -
చిన్నారిపై అంగన్వాడీ ఆయా దాడి
తాళ్లరేవు: టాయిలెట్కు వెళతానన్నందుకు నాలుగేళ్ల బాలుడిని అంగన్వాడీ ఆయా తీవ్రంగా గాయపరచింది. వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని జి.వేమవరం గ్రామానికి చెందిన నాలుగేళ్ల దాసరి జస్విత్ గగన్ స్వరూప్ స్థానిక 30వ నెంబరు అంగన్వాడీ కేంద్రంలో ప్రీస్కూల్లో చదువుతున్నాడు. టాయిలెట్కు వెళతానని అంగన్వాడీ ఆయా రాయుడు వెంకటలక్ష్మిని అడిగాడు. ఆమె వద్దన్నా వినకుండా వెళ్తున్న చిన్నారిని చేతిలో ఉన్న పలకతో తలపై గట్టిగా కొట్టింది. దీంతో బాలునికి తీవ్రగాయమై రక్తస్రావమైంది. హుటాహటిన ఆస్పత్రికి తీసుకువెళ్లగా కుట్లువేశారు. ఆయాపై చర్యలు తీసుకోవాలని బాలుడి తండ్రి వెంకటరమణ ఈ మేరకు ఐసీడీఎస్ సీడీపీఓ శ్రీదేవికి ఫిర్యాదు చేశారు. అలాగే ఆయాపై చర్యలకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు సీడీపీఓ శ్రీదేవి విలేకర్లకు తెలిపారు. ఇలా ఉండగా రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యుడు మందాల గంగ సూర్యనారాయణ ప్రాంతంలోనే బాలునిపై దాడి జరగడం గమనార్హం. పలకతో కొట్టడంతో తలకు తీవ్ర గాయం సీడీపీఓకు ఫిర్యాదు చేసిన బాలుడి తండ్రి -
గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి
రాయవరం: మండలంలోని వెదురుపాక గ్రామానికి చెందిన ఉపాధి కూలీ సత్తి వనుమురెడ్డి(74) శనివారం గుండెపోటుతో మృతి చెందాడు. గ్రామంలో చెరువులో పూడికతీత పనుల్లో పాల్గొన్న వనుమురెడ్డి ఉదయం 6.30 గంటల ప్రాంతంలో పని ప్రదేశంలో కుప్పకూలిపోయాడు. సహచర కూలీలు సపర్యలు చేసినా ఫలితం లేకపోయింది. ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీను ఈ విషయాన్ని ఏపీఓ జె.సుధారాణికి తెలపడంతో ఆమె ఘటనా స్థలికి చేరుకుని ఆరా తీసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వనుమురెడ్డి మృతి చెందడం పట్ల సహచర కూలీలు సంతాపం వ్యక్తం చేసి, అతని కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. కాల్మనీ వేధింపులపై ఫిర్యాదు అంబాజీపేట: ఓ ప్రైవేటు బ్యాంకులో రుణం తీసుకున్న మహిళ సకాలంలో చెల్లించకపోవడంతో బ్యాంకు సిబ్బంది ఆమెతో పాటు చుట్టు పక్కల వారిని నానా దుర్భాషలాడుతూ వేధిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయ. అమలాపురం మండలం బండారులంక గ్రామానికి చెందిన కె.భాగ్యలక్ష్మి ఐడీఎఫ్సీ బ్యాంకు నుంచి రూ.50 వేల రుణం తీసుకుని అంబాజీపేటలో బ్యూటీపార్లర్ నడుపుతున్నారు. ఆ మొత్తాన్ని సకాలంలో చెల్లించారు. ఆ తరువాత రూ.30 వేలు రుణాన్ని తీసుకుని సకాలంలో చెల్లించలేకపోవడంతో కొంత గడువు కోరారు. ఆమె అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోకుండా బ్యాంకు సిబ్బంది కాల్మనీ పేరుతో వేధింపులకు దిగారు. తనతో పాటు చుట్టూ ఉన్నవారికి ఫోన్ చేసి దుర్భాషలాడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దాంతో బాధితురాలు భాగ్యలక్ష్మి, ఇతర దుకాణాల యజమానులు సీఐ ఆర్.భీమరాజుకు, ఎస్సై షేక్ సుభానికి ఫిర్యాదు చేశారు. బ్యాంకు సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని పోలీసులను కోరారు. -
ఎరియర్లు వెంటనే చెల్లించాలి
కడియం: రాష్ట్రంలో ఇంకా 20 శాతం మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎరియర్లు అందలేదని, వాటిని వారికి వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ గోపిమూర్తి డిమాండ్ చేశారు. మండలంలోని పలు పాఠశాలలను ఆయన శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు తమకు 2018 నాటి డీఏ ఎరియర్లు రాలేదని, మండలంలో దాదాపు 120 మందికి రూ.1.30 కోట్ల మేర నిలిచిపోయాయని చెప్పారు. ఈ సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉందని ఆయనన్నారు. ఆయా ఉపాధ్యాయుల ఖాతాల్లో బకాయిలు జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. నెలలు గడుస్తున్నా ఈ సమస్యను పరిష్కరించకపోవడం దారుణమని అన్నారు. ఈ విషయాన్ని మరోసారి అధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఉపాధ్యాయులపై యాప్ల భారం తగ్గించాలని, పదో తరగతి వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సెలవు దినాలు, ఆదివారాల్లో పని చేసిన ఉపాధ్యాయులకు సీసీఎల్స్ మంజూరు చేయాలని, 12వ పీఆర్సీ కమిషన్ వేసి, 29 శాతం ఐఆర్ ప్రకటించాలని గోపిమూర్తి డిమాండ్ చేశారు. ఆయన వెంట యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఈవీవీఎస్ఆర్ ప్రసాద్, కె.రమేష్బాబు తదితరులున్నారు. రత్నగిరిపై భక్తుల రద్దీ అన్నవరం: వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి శనివారం కిటకిటలాడింది. సత్యదేవుని సన్నిధికి రాష్ట్రం నలుమూలల నుంచీ భక్తులు తరలి రావడంతో ఉదయం నుంచి రాత్రి వరకూ కూడా రద్దీ కొనసాగింది. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సత్యదేవుని వ్రతాలు 1,500 జరిగాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. సర్కులర్ మండపం వద్ద సుమారు 5 వేల మంది భక్తులకు పులిహోర, దధ్యోదనం పంపిణీ చేశారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. రత్నగిరిపై ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగనుంది. సుమారు 40 వేల మంది భక్తులు వస్తారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి తిరుపతి కిటకిట సామర్లకోట: తొలి తిరుపతిగా ప్రసిద్ధికెక్కిన పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత శృంగార వల్లభ స్వామి ఆలయం ఽశనివారం వేలాది మంది భక్తులతో కిటకిటలాడింది. సుమారు 15 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.1,63,500, అన్నదాన విరాళాలు రూ.65,516, కేశఖండన ద్వారా రూ.5,520, లడ్డూ ప్రసాదం విక్రయాల ద్వారా రూ.20,235, ఇతరత్రా కలిపి రూ.2,54,871 ఆదాయం వచ్చిందని వివరించారు. సుమారు 2,500 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారన్నారు. ఆలయం వద్ద వాహనాల పార్కింగ్కు పంచాయతీ ఆశీలు వసూలు చేయడం సర్వత్రా విమర్శలకు దారి తీసింది. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 26,000 గటగట (వెయ్యి) 23,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 22,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)13,000 – 14,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
వేతన యాతన ఎన్నాళ్లు?
● రత్నగిరిపై పారిశుధ్య సిబ్బంది అవస్థలు ● మంత్రి ఆనం, కలెక్టర్, ఆశాఖ కమిషనర్ ఆదేశాలు సైతం బేఖాతరు అన్నవరం: రత్నగిరిపై పారిశుధ్య కార్మికుల వేతన వెతలు ఇంకా కొలిక్కి రాలేదు. పద్మావతి సంస్థ కాంట్రాక్టు నిర్వహణ పనిచేస్తున్న 413 మందికి ఫిబ్రవరి, మార్చి నెలల వేతనాలు నేటికీ పడకపోవడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఈ సమస్యపై ఈ నెల 11వ తేదీన ‘సత్యదేవా సాపాట్లు కనవా’ శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఆ తరువాతి రోజు దేవస్థానానికి వచ్చిన దేవదాయ, ధర్మదాయ శాఖమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆ కథనంపై స్పందిస్తూ సత్వరం వారి వేతనాలు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే కలెక్టర్ సైతం స్పందించి సిబ్బంది వేతనాల విషయమై ఆరా తీశారు. ఇది జరిగి ఐదు రోజులైనా ఆలయ అధికారులలో స్పందన లేదు. ఈ పరిస్థితుల్లో ఆ సిబ్బంది కుటుంబాల సాగుబడికి నానా అవస్థలు పడుతున్నారు. శానిటరీ సంస్థ ఖర్చులన్నీ పోను సిబ్బందికి చెల్లించాల్సినది నెలకు రూ.50 లక్షలు. రెండు నెలలకు కలిపి రూ.కోటి చెల్లించాల్సి ఉంటుంది. ఈ వేతన బకాయిలు సత్వరం చెల్లించాలని మంత్రి సమక్షంలోనే దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ స్వయంగా ఆదేశించినా అధికారులలో చలనం లేకపోవడం గమనార్హం. సిబ్బంది సంఖ్యపై సందిగ్ధం అసలు పద్మావతి సంస్థ కింద దేవస్థానంలో 413 మంది పనిచేస్తున్నారా? ఎక్కడ ఎంతమంది పనిచేస్తున్నారన్న వివరాలు సరిగా లేవన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ విషయమై ఆడిట్ అధికారులను ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. కాగా దేవస్థానంలో కేవలం 350 మంది మాత్రమే పని చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపైనా అధికారులు ఆరా తీయాల్సి ఉంది. సీఎంకు సన్నిహితుడని చర్యలకు వెనుకంజ దేవస్థానంలో శానిటరీ పనులు దక్కించుకున్న పద్మావతి సంస్థ అధిపత భాస్కరనాయుడు సీఎం చంద్రబాబుకు సన్నిహితుడన్న విషయం తెలిసిందే. ఈ కారణంగానే కొండపై పారిశుధ్య నిర్వహణ బాగోకపోయినా, సకాలంలో వేతనాలు చెల్లించకపోయినా ఎవరూ ఆయనను ప్రశ్నించలేకపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
నిరుద్యోగ రహిత రాజమహేంద్రవరమే లక్ష్యం
● వచ్చే మూడేళ్లలో 20 వేల ఉద్యోగాల కల్పన ● ప్రతి రెండు నెలలకోసారి జాబ్ మేళా ● ఏడాదికోసారి మెగా జాబ్ మేళా ● వెబ్సైట్ కూడా రూపొందిస్తున్నాం ● మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ రాజమహేంద్రవరం సిటీ: నిరుద్యోగ రహిత రాజమహేంద్రవరమే లక్ష్యంగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ తెలిపారు. స్థానిక మార్గాని ఎస్టేట్లో శనివారం నిర్వహించిన జాబ్ మేళాకు హాజరైన నిరుద్యోగులనుద్దేశించిన ఆయన ప్రసంగించారు. వచ్చే మూడేళ్లలో 15 వేల నుంచి 20 వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పని చేస్తానన్నారు. ప్రతి రెండు నెలలకోసారి జాబ్ మేళా, ఏడాదికోసారి మెగా జాబ్ మేళా నిర్వహిస్తామని ప్రకటించారు. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువత కోసం సుమారు 75 కంపెనీలతో స్థానిక మంజీరా కన్వెన్షన్లో జనవరిలో నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతమైందని చెప్పారు. ఈ మేళాలు నిరంతర ప్రక్రియగా సాగుతూ మార్గాని భరత్రామ్ జాబ్ సెంటర్గా నడుస్తుందని అన్నారు. ‘మార్గాని భరత్’ పేరిట వెబ్సైట్ కూడా ప్రారంభిస్తున్నామని, తమ విద్యార్హతలను బట్టి దీనిలో నిరుద్యోగ యువత, విద్యార్థులు నమోదు కావచ్చని తెలిపారు. రెండు నెలలకోసారి జరిగే జాబ్ మేళాకు ఇది ఉపయోగపడుతుందన్నారు. కృత్రిమ మేధ (ఏఐ), మాన్యుఫ్యాక్చరింగ్, బీపీఓ, బ్యాంకింగ్, ఫార్మా, ఈ–కామర్స్ వంటి కంపెనీల నుంచి శిక్షకులను రప్పించి నిరుద్యోగులకు ఓరియెంటేషన్ శిక్షణ కూడా అందిస్తామని చెప్పారు. జనవరి మెగా జాబ్ మేళాలో ఉద్యోగం పొందిన యువతి ఇప్పుడు ఆ కంపెనీ నుంచి ఇంటర్వ్యూల నిర్వహణకు ఇన్చార్జిగా రావడం ఆనందంగా ఉందని భరత్రామ్ అన్నారు. హెచ్ఆర్ కో డాట్ కంపెనీ హెచ్ఆర్ సుస్మిత మాట్లాడుతూ, గతంలో భరత్రామ్ నిర్వహించిన మెగా జాబ్ మేళాలో తాను ఉద్యోగం పొందానని అన్నారు. ఇప్పుడు ఆయన నిర్వహిస్తున్న జాబ్ మేళాకు తాను పని చేస్తున్న కంపెనీ నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించడానికి రావడం ఆనందంగా ఉందని అన్నారు. వైఎస్సార్ సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రజాసేవకు పదవులు అవసరం లేదని, మంచి మనసుంటే చాలని నిరూపించిన వ్యక్తి మార్గాని భరత్రామ్ అని అభినందించారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి విద్యను అందిస్తే.. ఆ విద్యకు సార్థకత చేకూర్చేలా భరత్రామ్ ఉద్యోగ కల్పనకు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ జాబ్ మేళాకు సుమారు 25 కంపెనీలు హాజరు కాగా, వివిధ ఉద్యోగాలకు ఎంపికై న 500 మందికి మార్గాని భరత్రామ్, మార్గాని నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, డాక్టర్ గూడూరి శ్రీనివాస్, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు ఆకుల వీర్రాజు చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందజేశారు. -
అంబరాన ఉన్నా బంగారమే!
● అక్షయ కొనుగోళ్లకు సెంటిమెంట్ తోడు ● ఊగిసలాడుతున్న పేద, మధ్య తరగతి వర్గాలు ● చంద్రబాబు పాలనలో సన్నగిల్లిన కొనుగోలు శక్తి ● నేడు, రేపు క్రయ విక్రయాలపై వ్యాపారుల ఆశలు కపిలేశ్వరపురం: అర గ్రాము బంగారం అపురూపమైన రోజులు ఇవి. ఇతర దేశాల్లో ట్రేడింగ్ కోసం బంగారాన్ని కొనుగోలు చేస్తుండగా మన దేశంలో ఆభరణాల కోసం కొనుగోలు చేస్తుంటారు. నేడు బంగారం కొనుగోళ్లను ఆధ్యాత్మికానికి జోడించి అక్షయ తృతీయ సెంటిమెంటును పెంచుతున్నారు. ఎంత చిన్న మొత్తమైనా బంగారం కొంటే ఆ సంపద అక్షయమవుతుందని ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 2,500కి పైగా బంగారు దుకాణాల్లో ఆ రోజున సుమారు రూ.125 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా. అక్షయ తృతీయ సందర్భంగా ప్రత్యేక కథనం. లోహంలో బంగారం శాతం ఇలా... బిస్కెట్ లేదా కాయిన్ రూపంలో ఉండే బంగారాన్ని 24 క్యారట్ల స్టాండర్డ్ బంగారంగా పరిగణిస్తారు. దీని క్రయ విక్రయాలు సులభతరంగా ఉంటాయి. విక్రయించాలనుకున్న రోజు బంగారం ధర ఎంత ఉందో అంత లభిస్తుంది. 91.6 బంగారం, 8.4 శాతం రాగి, వెండి తదితర లోహాలున్న కలిసి ఉన్నదాన్ని 22 క్యారెట్ల బంగారంగానూ 75 శాతం బంగారం, 25 శాతం ఇతర లోహాలుతో ఉన్నదాన్ని 18 క్యారెట్ల బంగారంగానూ పరిగణిస్తారు. గతంలో ఇలా... ● 2000 సంవత్సరంలో పది గ్రాముల బంగారం ధర రూ.4,400 ఉండేది. 2005లో రూ.7వేలు, 2010లో రూ.18,500, 2015లో రూ.26,300, 2020లో రూ.46 వేలు, 2025లో రూ.98,500, ప్రస్తుతం రూ.1,55,000 పెరుగుతూ వచ్చింది. ఇలా ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో బంగారం కొనుగోళ్లకు దూరమవుతున్న వినియోగదారుల కోసం కార్పొరేట్ బంగారు దుకాణ దారులు ఆఫర్లుతో పాటు గిఫ్ట్ ఓచర్లు ప్రకటిస్తూ ఆకర్షిస్తున్నారు. ● పెరుగుతున్న ధర.. తరుగుతున్న జీవన ప్రమాణాలు.. ● బంగారు ధరల పెరుగుదల స్వర్ణకారుల జీవితాలపై పెను ప్రభావం చూపుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలోని బంగారు దుకాణాలకు ఆర్డర్లు తగ్గిపోతూ వచ్చాయి. వివాహాది శుభకార్యాలు వంటి సందర్భాలలో తప్ప బంగారం జోలికి ఎవరూ వెళ్లడం లేదు. చంద్రబాబు ప్రభుత్వంలో తగ్గిన కొనుగోలు శక్తి చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం నుంచి పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఏ విధమైన ఆర్థిక సాయమూ అందడంలేదు. పనుల్లేక, జీతాలు పెరగక ప్రజల్లో కొనుగోలు శక్తి గణనీయంగా పడిపోయింది. దీంతో బంగారం క్రయ విక్రయాలు అదే స్థాయిలో తగ్గిపోయాయి. -
చోరీ కేసులలో ఐదుగురి అరెస్టు
భారీ మొత్తంలో బంగారం, వెండి ఆభరణాల స్వాధీనం కాకినాడ క్రైం: ఇళ్ల తాళాలు పగలగొట్టి సొత్తు దోచుకుంటున్న ముగ్గురిని, నకిలీ తాళాలతో బైక్ చోరీలు చేసే ఇద్దరిని జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ బిందు మాధవ్ శనివారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. కాకినాడ ఏటిమొగకు చెందిన 32 ఏళ్ల రేకాడి వెంకటేశ్వర్లు నగరంతో పాటు శ్రీకాకుళంలో 30కి పైగా దొంగతనాలు చేశాడు. ఇతడి నుంచి 117 గ్రాముల బంగారు, 629 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.1.95 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అతడిని కోరంగి ఎస్సై సత్యనారాయణ ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. అలాగే అతడికి సహకరించిన ఇద్దరు మైనర్లను వన్ టౌన్, టూ టౌన్ పోలీసులు అరెస్టు చేసినట్టు ఎస్పీ తెలిపారు. స్థానిక జె.రామారావు పేటకు చెందిన వనమాడి జానకిరామ్, మాడుగుల మండలం సత్యవరం గ్రామానికి చెందిన రేఖా సతీష్లను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. ఈ చోరీలో మరో నేరస్తుడు కాకినాడ గాటి సెంటర్కు చెందిన తోట శివశంకర్ పరారీలో ఉన్నాడన్నారు. సామర్లకోట–కాకినాడ రహదారిలో సామర్లకోట సీఐ కృష్ణభగవాన్ బృందం ముద్దాయిలను పట్టుకుందని తెలిపారు. వీరి నుంచి రూ.5 లక్షల విలువైన ఆరు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఐదుగురిని అరెస్టు చేయడం ద్వారా కాకినాడ జిల్లాలో కాకినాడ వన్ టౌన్, టూ టౌన్, రూరల్లో కోరింగ, సామర్లకోట పరిధిలో జరిగిన 10 కేసులను ఛేదించి, సుమారు రూ.26 లక్షల విలువైన ఆభరణాలు, వస్తువులు రికవరీ చేసినట్టు ఎస్పీ తెలిపారు. అన్నవరం ట్రస్ట్ బోర్డుకు నలుగురు ప్రత్యేక ఆహ్వానితులు అన్నవరం: రత్నగిరి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశాలకు నలుగురు ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ దేవదాయ, ధర్మదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ ఎం.హరి జవహర్లాల్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. వేముల పల్లి కాంతారావు (కత్తిపూడి), గంగి గోవిందరాజు (పిఠాపురం), ఇమ్మిడిశెట్టి వేంకట రమణ (కాకినాడ), బి.సురేంద్రనాథ్రెడ్డి ( ఉదయగిరి–నెల్లూరు) లను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. వీరితో బాటు ఆలయ ప్రధానార్చకుడిని కో–ఆప్షన్ సభ్యునిగా నియమిస్తారు. -
తాగునీరివ్వండి
● బాలవరంలో మహిళల ఆందోళన ● ఆరు నెలలుగా ఇక్కట్లు పడుతున్నామని ఆవేదన ● ట్యాంక్ వాచర్ను తొలగించాలని డిమాండ్ రంగంపేట: తాగడానికి గుక్కెడు నీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రంగంపేట మండలం జి.దొంతమూరు శివారు బాలవరంలో పలువురు మహిళలు, గ్రామస్తులు శనివారం రాత్రి ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి, తమ సమస్య తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ కాలనీకి ఆరు నెలలుగా తాగునీరు రావడం లేదని, పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. స్థానిక రక్షిత మంచినీటి పథకం నుంచి సరఫరా అవుతున్న నీరు కలుషితమవుతోందన్నారు. ఈ నీరు సరఫరా అవుతున్న పైపులైను పక్కనే మురుగు కాలువ ఉందని, అక్కడ పైప్లైన్ వాల్వ్ పాడైపోవడంతో తాగునీటిలో మురుగునీరు కలిసిపోతోందని చెప్పారు. పైపులైనుకు మరమ్మతులు చేపట్టి తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ పంచాయతీ సిబ్బందికి చెప్పినా ఫలితం లేదని ధ్వజమెత్తారు. ఈ విషయమై పంచాయతీ ట్యాంక్ వాచర్ను అడగగా.. ‘నీరు అలాగే వస్తుంది. మీ దిక్కున్నచోట చెప్పుకోండి’ అని అతడు నిర్లక్ష్యంగా జవాబు చెప్పడమే కాకుండా స్ధానికులను, మహిళలను బూతులు తిడుతున్నాడని మండిపడ్డారు. అతడిని తక్షణమే పంచాయతీ ట్యాంక్ వాచర్ను విధుల నుంచి తొలగించాలని గ్రామస్తులు, మహిళలు డిమాండ్ చేశారు. అప్పటి వరకూ ఆందోళన విరమించేది లేదని హెచ్చరించారు. బాలవరం గ్రామస్తుల ఆందోళనకు వైఎస్సార్ సీపీ అనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి సంఘీభావం తెలిపారు. గ్రామస్తుల ఆందోళన విషయం తెలిసిన వెంటనే ఆయన బాలవరం చేరుకుని, గ్రామస్తులను విషయం అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వివక్ష ఈ సందర్భంగా డాక్టర్ సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ, బాలవరం గ్రామంపై ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. పంచాయతీలో రూ.1.30 కోట్ల వరకూ నిధులున్నాయని, గ్రామ సర్పంచ్ వైఎస్సార్ సీపీకి చెందిన వారని, దీంతో, అభివృద్ధి పనులు చేయనీయకుండా ఆయనను ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని అన్నారు. రూ.25 వేల పంచాయతీ నిధులు ఖర్చు చేస్తే బాలవరంలో ఈ సమస్య వచ్చేది కాదని చెప్పారు. కలుషిత నీరు తాగడంతో గ్రామస్తులకు వాంతులవుతున్నాయని, శ్రీకాకుళంలో మాదిరిగా ఇక్కడ కూడా కలుషిత నీటితో ప్రజలు మరణిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత బాలవరంలో ఏ పనులూ చేయడం లేదని, గ్రామంలోని ఎస్సీలందరూ వైఎస్సార్ సీపీ మద్దతుదారులనే దుగ్ధతోనే ఎమ్మెల్యే వివక్ష చూపుతున్నారని డాక్టర్ సూర్యనారాయణరెడ్డి విమర్శించారు. -
వాడపల్లికి పోటెత్తిన భక్తులు
ఆత్రేయపురం: వాడపల్లి వెంకటేశ్వరుని దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు కాలినడకన సైతం స్వామివారి దర్శనానికి వచ్చారు. ఏడు శనివారాల వ్రతంలో భాగంగా వచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. భారీ సంఖ్యలో వాహనాల రాకతో ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పాడ్డాయి. సుప్రభాత సేవ, తొలి హారతి, నిరాజనం, ఐశ్వర్య లక్ష్మీ హోమం, బాల భోగం వంటి కార్యక్రమాలను భక్తులు తిలకించారు. విశేషాలంకరణలో ఉన్న స్వామివారితో పాటు, ఆవరణలో క్షేత్రపాలకులు, అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి వారిని భక్తులు దర్శించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి ఉచిత అన్న ప్రసాదం, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వేసవి తీవ్రత దృష్ట్యా చలివేంద్రాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆలయ ఈవో, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు, ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది సేవా కార్యక్రమాలలో సహకరించారు. ఐదు ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై కేసులు రావులపాలెం: నిబంధనలు పాటించని ఐదు ప్రైవేటు ట్రావెల్ బస్సులపై కేసు నమోదు చేసి రూ.13,400 అపరాధ రుసుము విధించినట్టు జిల్లా రవాణా అధికారి డి.శ్రీనివాసరావు శనివారం తెలిపారు. మండలంలోని ఈతకోట టోల్ ప్లాజా వద్ద రవాణాశాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలు పాటించని బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీటీఓ హెచ్చరించారు. ప్రతీ బస్సులోను అగ్ని ప్రమాద రక్షణ పరికరాలు, అలాగే అత్యవసర ద్వారం తదితర నిబంధనలు కచ్చితంగా ఉండాలన్నారు. అలా లేని బస్సుల ఫిట్నెస్ రద్దు చేస్తామన్నారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే డ్రైవర్లకు జైలు శిక్ష తప్పదన్నారు. -
అంబరాన ఉన్నా బంగారమే!
● ‘అక్షయ’ కొనుగోళ్లకు సెంటిమెంట్ తోడు ● ఊగిసలాడుతున్న పేద, మధ్య తరగతి వర్గాలు ● నేడు, రేపు క్రయ విక్రయాలపై వ్యాపారుల ఆశలు కపిలేశ్వరపురం: అర గ్రాము బంగారం అపురూపమైన రోజులివి. ఇతర దేశాల్లో ట్రేడింగ్ కోసం బంగారాన్ని కొనుగోలు చేస్తుండగా మన దేశంలో ఆభరణాల కోసం కొనుగోలు చేస్తుంటారు. నేడు బంగారం కొనుగోళ్లను ఆధ్యాత్మికకు జోడించి అక్షయ తృతీయ సెంటిమెంటును పెంచుతున్నారు. ఎంత చిన్న మొత్తమైనా బంగారం కొంటే ఆ సంపద అక్షయమవుతుందని ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 2,500కి పైగా బంగారు దుకాణాల్లో అక్షయ తృతీయ సందర్భంగా సోమవారం సుమారు రూ.125 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా. లోహంలో బంగారం శాతం ఇలా.. బిస్కెట్ లేదా కాయిన్ రూపంలో ఉండే బంగారాన్ని 24 క్యారెట్ల స్టాండర్డ్ బంగారంగా పరిగణిస్తారు. దీని క్రయవిక్రయాలు సులభతరంగా ఉంటాయి. విక్రయించాలనుకున్న రోజు బంగారం ధర ఎంత ఉందో అంత లభిస్తుంది. 91.6 బంగారం, 8.4 శాతం రాగి, వెండి తదితర లోహాలున్న కలిసి ఉన్నదాన్ని 22 క్యారెట్ల బంగారంగానూ 75 శాతం బంగారం, 25 శాతం ఇతర లోహాలుతో ఉన్నదాన్ని 18 క్యారెట్ల బంగారంగానూ పరిగణిస్తారు. గతంలో ఇలా.. ● 2000 సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర రూ.4,400 ఉండేది. 2005లో రూ.7 వేలు, 2010లో రూ.18,500, 2015లో రూ.26,300, 2020లో రూ.46 వేలు, 2025లో రూ.98,500కు పెరుగుతూ.. ప్రస్తుతం రూ.1,55,000 వరకూ పలుకుతోంది. ఇలా ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో బంగారం కొనుగోళ్లకు దూరమవుతున్న వినియోగదారుల కోసం కార్పొరేట్ బంగారు దుకాణదారులు ఆఫర్లతో పాటు గిఫ్ట్ ఓచర్లు ప్రకటిస్తూ ఆకర్షిస్తున్నారు. ● బంగారు ధరల పెరుగుదల స్వర్ణకారుల జీవితాలపై పెను ప్రభావం చూపుతున్నాయి. వివాహాది శుభకార్యాల వంటి సందర్భాల్లో తప్ప బంగారం జోలికి ఎవరూ వెళ్లడం లేదు. దీంతో, ఆర్డర్లు తగ్గిపోతూ వస్తున్నాయి. ● చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా పడిపోవడం కూడా బంగారం క్రయవిక్రయాలు తగ్గడానికి కారణమవుతోంది. -
ఆ మంటల్లో టీడీపీ దహించుకుపోవడం ఖాయం
● వైఎస్సార్ సీపీ నేత జక్కంపూడి రాజా ● గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు దీక్షకు సంఘీభావం రాజమహేంద్రవరం సిటీ: రామాయణంలో హనుమంతుడి తోకకు నిప్పు పెడితే లంకా దహనం జరిగినట్టుగానే.. నేడు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి నిప్పు పెట్టడం ద్వారా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ దహనం కావడం ఖాయమని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హెచ్చరించారు. గుంటూరు కలెక్టరేట్ ఎదుట మాజీ మంత్రి అంబటి రాంబాబు శనివారం చేపట్టిన నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ వివరాలను ఆయన ఇక్కడ ఒక ప్రకటనలో తెలిపారు. అంబటి దీక్షలో రాజా మాట్లాడుతూ, గతంలో పేదల ఇళ్ల పట్టాల కోసం నిరాహార దీక్ష చేస్తున్న వంగవీటి మోహన్ రంగాను అత్యంత ఘోరంగా నరికి చంపారని అన్నారు. కాపులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని గొంతెత్తి ప్రశ్నించిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని, ఆయన కుటుంబ సభ్యులను ఏవిధంగా ఈడ్చుకెళ్లి కేసులు పెట్టారో చూశామన్నారు. ఈ ఘోరాలకు ప్రతిఫలంగా టీడీపీ రెండుసార్లు అధికారం కోల్పోయిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై 8 – 9 గంటల పాటు దాడి చేసి, నిప్పు పెట్టి చంద్రబాబు మరో ఘోర తప్పిదం చేశారని, ఫలితంగా 2029 ఎన్నికల్లో ఆయన మరోసారి అధికారం కోల్పోవడం ఖాయమనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని రాజా హెచ్చరించారు. పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాలపై మాట్లాడిందుకు అంబటి రాంబాబుపై కేసులు పెట్టి, జైలుకు పంపారని అన్నారు. సీబీఐ కోర్టుకు నివేదించిన అంశంపై అంబటి మాట్లాడితే ప్రభుత్వ పెద్దలకు బాధనిపించిందన్నారు. అంబటి ఇంటిపై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా విడిచిపెట్టారని, తిరిగి బాధితుల పైనే కేసు నమోదు చేసి, రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఖాకీ చొక్కాల ముసుగులో చాలామంది పోలీసులు టీడీపీ అభిమానుల్లా పని చేస్తున్నారన్నారు. వీరు రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరించారు. చంద్రబాబు, లోకేష్ వద్ద మార్కులు కొట్టేద్దామనే ఉద్దేశంతో వారి డైరెక్షన్లో స్థానిక ఎమ్మెల్యే ఈ దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొనడం దుర్మార్గమని రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా కేవలం వైఎస్సార్ సీపీ శ్రేణులపై కేసులు బనాయించి, కక్ష సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న, నాయకులపై వేలెత్తి చూపిస్తున్న సామాన్య కార్యకర్తలపై ప్రతి రోజూ వందలు, వేలకొద్దీ కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి, ధర్మవరంలో పెద్దారెడ్డి, గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇళ్లపై దాడులు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం చేసిన తప్పులను ప్రశ్నిస్తూంటే ప్రజల్లో ఎక్కడ చులకన అవుతామోననే భయంతోనే కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. దీనికి భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని జక్కంపూడి రాజా హెచ్చరించారు. -
ఇచ్చిన హామీలే ‘రిపీట్’
● నిధుల కేటాయింపు ఊసే లేదు ● సీఎం తీరుపై విస్తుపోయిన ప్రజలు ● ఆయన ప్రసంగిస్తూండగానే తిరుగుముఖం ● మొక్కుబడిగా చంద్రబాబు నిడదవోలు పర్యటననిడదవోలు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిడదవోలులో శనివారం నిర్వహించిన సభకు ప్రజల నుంచి ఆశించిన స్పందన కరవైంది. సీఎం ప్రసంగిస్తూండగానే సభకు వచ్చిన వారు సభ నుంచి జారుకోవడం కనిపించింది. దీంతో, ఖాళీ కుర్చీలకే ఆయన ప్రసంగం పరిమితమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ఈ సభలో చంద్రబాబు ప్రకటిస్తారని పట్టణ వాసులు వేయి కళ్లతో ఎదురు చూశారు. నియోజకవర్గంపై వరాల జల్లు కురిపిస్తారని ఆశించారు. కానీ, వచ్చారు.. వెళ్లారు.. అన్న రీతిలోనే సీఎం పర్యటన ముగిసింది. అధికారం చేపట్టాక నిడదవోలు నియోజకవర్గానికి ఏం చేశారు.. రానున్న రోజుల్లో ఏం చేస్తామనే విషయాలను చెప్పకుండా.. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకోవడంపై విమర్శలకే చంద్రబాబు తన ప్రసంగాన్ని పరిమితం చేశారు. ఆయన ఊకదంపుడు ఉసన్యాసం భరించలేక సభకు వచ్చినవారు తమ కాళ్లకు పని చెప్పారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం మధ్యాహ్నం 12.35 గంటలకు నిడదవోలుకు వచ్చిన చంద్రబాబు.. సాయంత్రం వరకూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సభా వేదిక సమీపాన జనసేన నేతలు ఏర్పాటు చేసిన భోజనాల శిబిరం వద్దకు జనం చేరుకోగా.. సీఎం ప్రసంగం పూర్తి కాకుండా భోజనాలు ప్రారంభించేది లేదని అక్కడి నేతలు చెప్పారు. దీంతో, జనం మండుటెండలో ఇబ్బందులు పడుతూ నిరీక్షించాల్సి వచ్చింది. ఎన్నికల హామీలే మళ్లీ.. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో నిడదవోలు వచ్చిన చంద్రబాబు, పవన్ కల్యాణ్, కందుల దుర్గేష్లు అనేక హామీలు ఇచ్చారు. కూటమి అధికారం చేపట్టి రెండేళ్లయినప్పటికీ వాటిని అమలు చేయలేదు. సీఎం హోదాలో తొలిసారి నిడదవోలు పర్యటనకు వచ్చిన చంద్రబాబు.. వరాల జల్లు కురిపిస్తారని నియోజకవర్గ ప్రజలు ఆశగా ఎదురు చూశారు. నిధుల కేటాయింపు మాట దేవుడెరుగు.. గత హామీలనే చంద్రబాబు మళ్లీ ఈ సభలో కూడా ఇవ్వడం గమనార్హం. దీంతో, విస్తుపోవడం జనం వంతయింది. పట్టణంలోని తీరు గూడెంలో ఉన్న టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని, 100 పడకలకు ప్రభుత్వాస్పత్రి అభివృద్ధి, మండలంలో కంసాలిపాలెం – మాధవరం వంతెన, చినకాశిరేవు వంతెన, పట్టణంలో ఇండోర్ స్టేడియం నిర్మాణం, ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధి, ఎర్రకాలువ గండ్ల పూడ్చివేత, నిడదవోలు – యర్నగూడెం రహదారి మరమ్మతులు, ఉండ్రాజవరం మండలం వడ్లూరు కాలువపై వంతెన నిర్మాణం.. ఇలా గతంలో ఇచ్చిన హామీలనే మరోసారి సీఎం వల్లె వేశారు. కీలకమైన హామీల అమలుకు సంబంధించి నిధుల కేటాయింపుపై ఆయన పెదవి విప్పలేదు. చంద్రబాబు హామీలను నమ్మలేమని, వచ్చారు.. ఏదో చెప్పి వెళ్లారు.. అంటూ ప్రజలు బహిరంగంగానే పెదవి విరవడం గమనార్హం.చంద్రబాబు మాట్లాడుతూండగానే సభా ప్రాంగణం నుంచి వెళ్లిపోతున్న ప్రజలుచంద్రబాబు ప్రసంగ సమయంలో ఖాళీగా ఉన్న ప్రజావేదిక -
ఈ వంతెన ర్యాలిపోవలసిందేనా?
● ఎప్పుడు కూలుతుందో తెలియని స్థితిలో ర్యాలి వంతెన ● పాలకుల నిర్లక్ష్యంపై ప్రజల ఆందోళన ఆత్రేయపురం: ఏడు శతాబ్దాలకు ముందు నిర్మించిన ర్యాలి వంతెన శిథిలస్థితికి చేరి ఎప్పుడు కూలుతుందోనని ఈ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొంచి ఉన్న ప్రమాదాన్ని పట్టించుకోరా? అంటూ పాలకుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నారు. 1950 ప్రాంతంలో అప్పటి వాహనాల రద్దీ కనుగుణంగా నిర్మించిన వంతెన ఇప్పుడు ప్రయాణించే వాహనాల రద్దీని తట్టుకోలేకపోతోంది. ఇరుకుగా ఉండి, ఎదురుగా వాహనం వస్తే వంతెనపై ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. ఈ వంతెన రక్షణ గోడలు బీటలు వారి పూర్తిగా పాడయ్యాయి. రాత్రి వేళ విద్యుత్ దీపాలు సైతం లేకపోవడంతో వాహనదారులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణాలు సాగిస్తున్నారు. గ్రామంలోకి వెళ్లే రహదారి సైతం ఇరుకుగా, అసౌకర్యంగా ఉంది. రెండు లేన్లుగా అభివృద్ధి చేసేందుకు గత ప్రభుత్వంలో ప్రతిపాదనలు ఈ వంతెన రహదారి అటు రాజవరం– పొదలాడ రాష్ట్రీయ రహదారిని ఇటువైపు అమలాపురం– బొబ్బర్లంక రాష్ట్రీయ రహదారిని కలుపుతోంది. ఈ వంతెనపై పలు వాహనాల్లో నిరంతరం ఇసుక, ఇటుక రవాణా జరుగుతోంది. గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఈ వంతెనను రెండు లేన్లుగా అభివృద్ధి చేసి రెండు రాష్ట్రీయ రహదారులకు కలపాలని నిర్ణయించారు. వంతెన నిర్మాణానికి అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ప్రతిపాదనలు సిద్ధం చేసి, ప్రభుత్వ అనుమతిని సైతం పొందారు. ప్రభుత్వం మారడంతో ఆ ప్రతిపాదనలు మరుగున పడ్డాయి. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు ఈ వంతెన నిర్మాణంపై దష్టి సారించ లేదు. ప్రభుత్వం దృష్టి సారించాలి ఈ వంతెన గురించి పలుమార్లు జిల్లా పరిషత్ సమావేశాలలో ప్రస్తావించాను. చంద్రబాబు ప్రభుత్వం వంతెన నిర్మాణంపై దృష్టి సారించకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. – బోనం సాయిబాబు, ఆత్రేయపురం జెడ్పీటీసీ సభ్యుడు ప్రతిపాదనలు పంపాం 1954లో ఊబలంక నుంచి ర్యాలి వెళ్లే రోడ్డులో దీన్ని సింగల్ లైన్ వంతెనగా నిర్మించారు. రెండు వరుసల సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.9.00 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. – జి.రాజేంద్రప్రసాద్, డీఈ, రోడ్లు భవనాల శాఖ, కొత్తపేట వెంటనే నిర్మించాలి ర్యాలి సుమారు 20వేల జనాభా గల అతి పెద్ద గ్రామం. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడి ఆలయాలకు టూరిస్టులు వస్తున్నారు. వెంటనే వంతెనను నిర్మించాలి. పి.ఎస్.ఆర్.జైపాల్, ర్యాలి, ఎంపీటీసీ సభ్యులు భక్తులకు గోతుల దర్శనం ర్యాలి గ్రామంలో 11 శతాబ్దం నాటి చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ జగన్మోహిని కేశవస్వామి ఆలయానికి నిత్యం వాహనాల్లో వందల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడే ఆలయాల కూడలికి వచ్చే సింగిల్ రోడ్డు గోతులతో అధ్వానంగా ఉంది. ర్యాలి సమీపంలో అంకంపాలెం, నార్కెడిమిల్లి వంటి జనసాంద్రత గల గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి నిత్యం రైతులు అరటి గెలలను సైకిళ్లపై రావులపాలెం మార్కెట్ యార్డుకు తరలిస్తూ ఉంటారు. ఇటీవల జరిగిన పంచాయతీల పునర్వ్యవస్థీకరణలో ర్యాలి గ్రామం జిల్లాలోని అతిపెద్ద రూర్బన్ గ్రామంగా గుర్తించారు. -
మహిళా పక్షపాతి జగన్
రాజమహేంద్రవరం రూరల్: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన చట్టానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంగాడ సత్యప్రియ అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ నేతృత్వంలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయడం అభినందనీయమన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో 50 శాతం మహిళా రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేసిన ఘనత గత ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. తన క్యాబినెట్లో ఒక ఉపముఖ్యమంత్రి పదవితో పాటు నలుగురు మహిళలకు స్థానం కల్పించారన్నారు. హోం, వైద్యం, మహిళాశిశు సంక్షేమం వంటి కీలకశాఖలను మహిళలకు అప్పగించారన్నారు. గుండెపోటుతో ఖైదీ మృతి కంబాలచెరువు (రాజమహేంద్రవరం): సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న రాజస్థాన్కు చెందిన అవాసింగ్ (42) శుక్రవారం మృతి చెందాడు. అతను గంజాయి కేసులో మార్చి 5న సెంట్రల్ జైలుకు వచ్చాడు. 10 రోజులుగా గుండెల్లో నొప్పి వస్తుండడంతో జైలు అధికారులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి స్వతంత్ర ఆసుపత్రికి తరలించి చికిత్సలందించారు. అయితే వైద్యులు అతనిని వైజాగ్ తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. దీంతో జైలు అధికారులు అవాసింగ్ను వైజాగ్ తీసుకెళ్లేందుకు అనుమతి కోరారు. ఉన్నతాధికారుల నుంచి అనుమతి రాకపోవడంతో జైలు ఆసుపత్రిలోనే ఉంచి చికిత్సలందిస్తున్నారు. హఠాత్తుగా అవాసింగ్ పరిస్థితి విషమించడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. జైలు అధికారులు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. వేసవికి ప్రత్యేక రైళ్లు రాజమహేంద్రవరం సిటీ: జిల్లా మీదుగా వేసవి సెలవుల్లో రైళ్లనునడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ డివిజన్ అధికారులు ప్రకటించారు. ఎస్ఎంవీటీ బెంగళూరు–బలురఘట్(06551) సమ్మర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ నెల 17, 24 తేదీల్లో బలురఘట్– ఎస్ఎంవీటీ బెంగళూరు(06552) స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ నెల 20, 27వ తేదీల్లో రాకపోకలు సాగించనుంది. చర్లపల్లి – సంత్రగచ్చి (07675), సంత్రగచ్చి– చర్లపల్లి (07676)సమ్మర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ నెల 18,19 తేదీలలో నడవనుంది. చర్లపల్లి–ఖరగ్పూర్(07673), ఖరగ్పూర్ – చర్లపల్లి (07674) ఎక్స్ప్రెస్ ఈ నెల 23, 24 తేదీలలో నడుస్తాయి. సంత్రగచ్చి– చైన్నె బీచ్ (06074) వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలు ఈ నెల 19 తేదీన సంత్రగచ్చిలో బయల్దేరనుంది. సహర్స జంక్షన్ – యశ్వంత్పూర్ జంక్షన్ (05551) యశ్వంత్పూర్ జంక్షన్– సహర్స జంక్షన్ (05552) రైళ్లు ఈ నెల 19, 26, మే 3వ తేదీల్లో రాకపోకలు సాగించనున్నాయి. అలిపుర్ దౌర్ – హుబ్బళ్లి (07324) స్పెషల్ ఎక్స్ ప్రెస్ ఈ నెల 19వ తేదీన నడవనుంది. చర్లపల్లి –సంత్రగచ్చి (07677) ఈ నెల 21వ తేదీన జిల్లా మీదుగా నడవనుంది. సంత్రగచ్చి– హైదరాబాద్(07678) రైలు ఈ నెల 22వ తేదీన నడవనుంది. కాకినాడ టౌన్ –హిషార్ (07717) ఎక్స్ప్రెస్ ఈ నెల 21న నడవనున్నదని తెలిపారు. -
టిడ్కో ఇళ్ల కోసం నిరీక్షణ
ఎన్నికల ప్రచారంలో భాగంగా నిడదవోలు నియోజకవర్గ కేంద్రానికి వచ్చిన చంద్రబాబు, పవన్, దుర్గేష్లు నిడదవోలులోని తీరుగూడెంలో ఉన్న టిడ్కో ఇళ్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇళ్లు లేని పేదలకు టిడ్కో ఇళ్లను సబ్సిడీతో బ్యాంకు్ ద్వారా కట్టించి ఇస్తామని చెప్పి ప్రారంభించారు. 1,152 మందికి ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ లబ్ధిదారులకు వాటిని పంపిణీ చేయలుదు. నేటికీ ప్లాట్ల కేటాయింపులు జరగకపోవడంతో గృహ సముదాయాలు నిరుపయోగంగా మారాయి. ద్వారాలు, కిటికీలు, తలుపులు శిథిలావస్థకు చేరాయి. కాలనీల్లో కనీస వసతులు కరవయ్యాయి. కలగానే వంద పడకల ఆస్పత్రి నిర్మాణం నిడదవోలులో 30 పడకల సామర్థ్యంతో ఉన్న ఆస్పత్రిని 100 పడకలుగా అభివృద్ధి చేస్తామని గుప్పించిన హామీ సైతం అమలు కాలేదు. పైగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.19 కోట్లతో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. శంకుస్థాపన కూడా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాన్ని విస్మరించారు. ఇక్కడ మంజూరైనా 100 పడకల ఆసుపత్రిని పిఠాపురానికి తరలించారని సమాచారం. నిడదవోలు ప్రభుత్వాస్పత్రిలో ప్రతి రోజూ 350 మందికి పైగా ఓపీ సేవలు పొందుతున్నారు. నెలకు 50 వరకూ ప్రసవాలు జరుగుతున్నాయి. అంతటి ప్రాధాన్యం ఉన్న ఆస్పత్రిని పట్టించుకోవడం లేదు. దీంతో ప్రజలు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి తలెత్తింది. పట్టణంలో పునాదులు వేసి వదిలేసిన మినీ స్టేడియంకూలిపోయిన కంసాలిపాలెం–మాధవరం వంతెనసాక్షి, రాజమహేంద్రవరం/ నిడదవోలు: ‘ఏరు దాటేవరకు ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడిమల్లన్న’ అన్న సామెత చంద్రబాబునాయుడు, కూటమి నేతలకు అతికినట్టు సరిపోతుంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో తూర్పుగోదావవరి జిల్లా వ్యాప్తంగా పర్యటించిన చంద్రబాబు, పవన్కళ్యాణ్ అనేక బహిరంగ సభల్లో ప్రసంగించారు. అధికారం చేజిక్కించుకునేందుకు అలవిగాని హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చాక వాటి అమలును విస్మరించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో అభివృద్ధి పరుగులు పెట్టిస్తామని ఎన్నికల ప్రచార సభల్లో ప్రగల్భాలు పలికిన నేతలు.. గద్దెనెక్కి రెండేళ్లయినా పట్టించుకోవడం లేదు. 2024లో నిడదవోలు పట్టణంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన చంద్రబాబు, పవన్కల్యాణ్, కందుల దుర్గేష్లు అనేక హామీలు ఇచ్చారు. వాటిని నేటికీ నెరవేర్చలేదు. శనివారం తిరిగి నిడదవోలు పర్యటనకు సీఎం హోదాలో చంద్రబాబు రానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సమక్షంలో ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ.. ‘సాక్షి’ ప్రత్యేక కథనం. తీరని వంతెన చింతన పట్టణంలో చినకాశిరేవు వద్ద బ్రిటిష్ హయాంలో నిర్మించిన పురాతన గడ్డర్ బ్రిడ్జి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కుప్పకూలింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో గడ్డర్ బ్రిడ్జి నిర్మిస్తామన్న కూటమి నేతలు హామీ ఇచ్చారు. రెండేళ్లయినా దాని ఊసే ఎత్తడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కై లాసగిరి ప్రాంతానికి మృతదేహాలను తీసుకెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. చినకాశిరేవులో ఉన్న 30 ఆలయాలకు వెళ్లేందుకు కీలకమైన వంతెన నిర్మాణంపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. ముందుకు కదలని మినీ స్టేడియం విద్యానగర్లో ఉన్న మున్సిపల్ పార్కులో మినిస్టేడియం నిర్మాణానికి 2018లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు శంకుస్థాపన చేశారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ బహిరంగ సభలో క్రీడాకారులకు మినీ స్టేడియం నిర్మిస్తామని హమీ ఇచ్చారు. దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో నిడదవోలు ప్రాంతంలో సుమారు 2,000 మంది క్రీడాకారులు నైపుణ్యాలు మెరుగుపర్చుకునే అవకాశం లేకుండా పోయింది. నెరవేరని ప్రజల ఆకాంక్ష తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన ప్రజల ఆకాంక్ష అయిన కంసాలిపాలెం– తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామాల మధ్య ఎరక్రాలువపై వంతెన నిర్మాణ సమస్యకు పరిష్కారం లభించడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో నిర్మిస్తామని ఎన్నికల సభల్లో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. రెండేళ్లయినా అతీగతీ లేదు. ఎరక్రాలువ ఉధృతికి కొట్టుకుపోయింది. తర్వాత వచ్చిన వరదకు పూర్తిగా పడిపోయింది. దీంతో రెండు నియోజకవర్గాలకు చెందిన ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. రైతులు పంటలు ఇంటికి తరలించేందుకు పాట్లు పడుతున్నారు. గొంతు తడపని గోదావరి జలాలు అధికారంలోకి వచ్చిన వెంటనే గోదావరి జలాలను పట్టణ ప్రజల చెంతకు చేరుస్తామని హామీ ఇచ్చారు. నేటికీ గొంతు తడవని పరిస్థితి ఏర్పడింది. ● పట్టణంలో డంపింగ్ యార్డు సమస్య సైతం గాలికి వదిలేశారు. ● పెరవలి గ్రామంలో బస్టాండ్ నిర్మాణం, విజ్జేశ్వరం నుంచి సిద్ధాంతం వరకు ఏటిగట్టు నిర్మాణ పనులు చేస్తామని చెప్పి ఇప్పటికి వాటి ఊసే ఎత్తడం లేదు. నేటి సీఎం పర్యటన షెడ్యూల్స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం నిడదవోలులో పర్యటించనున్నారు. తాడేపల్లిలో ఉదయం 10.30 గంటలకు బయలుదేరి నిడదవోలు ఎంవీనగర్లో మారుతీ లేఅవుట్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు ఉదయం 11 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సుబ్బరాజుపేట ప్రజావేదిక వద్దకు ఉదయం 11.20 గంటలకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.15 గంటల నుంచి 1.45 వరకు పాల్గొంటారు. 1.50 నుంచి 2.20 గంటల వరకు లయన్స్ కంటి ఆసుపత్రి సమీపంలో ఉన్న మాలకోడు చెరువు ప్రాంతాన్ని సందర్శిస్తారు. అక్కడ నుంచి సెయింట్ ఆంబ్రోస్ హైస్కూల్ వద్ద ఏర్పాటు చేసిన నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశానికి మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకుంటారు. తిరిగి సాయంత్రం 4.05 గంటలకు ఎంవీనగర్ మారుతీ లేవుట్ వద్ద హెలిప్యాడ్కు చేరుకుని అక్కడ నుంచి బయలుదేరి సాయంత్రం 4.45 గంటలకు ఉండవల్లి నివాసానికి వెళతారు. సార్వత్రిక ఎన్నికల వేళ పలు హామీలు గుప్పించిన కూటమి నేతలు అధికారం చేపట్టి రెండేళ్లయినా నేటికీ నెరవేరని వైనం మంత్రి కందుల దుర్గేష్ ఇలాకాలో తిష్ట వేసిన సమస్యలు 100 పడకల ఆసుపత్రి ఊసేలేదు టిడ్కో ఇళ్ల కోసం నిరీక్షణ కంసాలిపాలెం–మాధవరం వంతెనకు తప్పని చింత చినకాశిరేవులో పురాతన వంతెన నిర్మాణం ఎండమావేనా? ఇంకెన్నాళ్లు నిరీక్షించాలి ? రెక్కాడితేగాని డొక్కాడని బతుకులు మావి. అప్పులు చేసి తిప్పలు పడుతున్నాం. ఓ పక్క నెలకు రూ.5 వేలు వడ్డీ చెల్లిస్తున్నాం. మరోపక్క రూ.మూడు వేలు అద్దె ఇస్తున్నాం. నెలలో సంపాదించిన డబ్బు వీటికే పోతోంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఫ్లాట్లు కేటాయిస్తే అద్దె భారం తగ్గుతుంది. – మల్లిపూడి, జ్యోతి, టిడ్కో లబ్ధిదారు, నిడదవోలు క్రీడలకు అవకాశం కల్పించాలి పట్టణంలో మినీ స్టేడియం నిర్మించి క్రీడలను మరింత ప్రొత్సహించాలి. షటిల్, బాడ్మింటన్, త్రోబాల్, బాస్కెట్బాల్ వంటి ఇండోర్ క్రీడలను ఆడుకోవడానికి ఎక్కడా అవకాశం లేదు. మినీ స్టేడియం నిర్మిస్తే మా లాంటి క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు ఉంటాయి. – పంతుల కార్తీక్, త్రో బాల్ క్రీడాకారుడు, నిడదవోలు -
మహిళా రిజర్వేషన్ల మార్గదర్శి జగన్
● గతంలోనే 50 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు ● వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్) షర్మిలారెడ్డి సీటీఆర్ఐ: మహిళా రిజర్వేషన్లకు నిజమైన టార్చ్ బేరర్ (మార్గదర్శి) మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి అని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్) మేడపాటి షర్మిలారెడ్డి అన్నారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భంగా శుక్రవారం ఆమె నివాసంలో మీడియాతో మాట్లాడుతూ మహిళా సాధికారత అంటే కేవలం నినాదం కాదు ఆచరణలో చూపించిన వ్యక్తి జగన్మోహన్రెడ్డి అన్నారు. జగన్మోహన్రెడ్డి పాలనలో మహిళలకు నిజమైన అధికారం ఇచ్చారన్నారు. స్థానిక సంస్థల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్ అమలు చేశారన్నారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం మహిళలకు అవకాశాలు కల్పించారన్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా మహిళను హోం మంత్రిగా నియమించారని అదే పంథాను నేడు చంద్రబాబు కూడా కొనసాగిస్తున్నారన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళలకు పెద్దఎత్తున ఉద్యోగాలు ఇచ్చారన్నారు. మహిళా పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. మహిళల ఆర్థిక సాధికారతకు సంక్షేమ పథకాలు జగన్అందజేశారన్నారు. తల్లులకు నేరుగా ఆర్థిక సాయం అందించేవిధంగా అమ్మ ఒడి, స్వయం సహాయక సంఘాల బలపరడం కోసం వైఎస్సార్ ఆసరా, చిరువ్యాపారరులకు మద్దతుగా వైఎస్సార్ చేదోడు, అందచేసి ప్రపంచానికి దిశానిర్దేశం చేశారన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో 33 శాతం మహిళా రిజర్వేషన్ బిలును స్వాగతిస్తున్నామన్నారు. అయితే జగన్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే 50 శాతం అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. -
మంత్రి సుభాష్ మాట నీటిమూట
కపిలేశ్వరపురం: స్వాతంత్య్రానికి ముందు వలసపాలనలో బ్రిటిష్ పాలకులు దోపిడీదారులే అయినప్పటికీ భారత చేనేత నైపుణ్యాన్ని ప్రశంసించారు. కానీ ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం చేనేత వృత్తిని, కార్మికులను విస్మరిస్తోంది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అటకెక్కించడమే కాక కనీస చేయూతను సైతం చేనేతకు ఇవ్వని పరిస్థితి. వైఎస్ జగన్మోహన్రెడ్డి కంటే రూ.వెయ్యి ఎక్కువ వేసి ఏడాదికి రూ.25 వేలు సాయమందిస్తానంటూ సార్వత్రిక ఎన్నికల సమయంలో చేనేత కార్మికులకు చంద్రబాబు హామీ ఇచ్చారు. 22 నెలల ఆయన పాలనాకాలంలో ఆ హామీ గాలికి కొట్టుకుపోయింది. అదే ఒరవడిని అందిపుచ్చుకున్నారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. చేనేతకు ప్రసిద్ధి చెందిన అంగర గ్రామంలోని శ్రీగణపతి చేనేత పారిశ్రామికుల సంఘానికి రావాల్సిన ఆప్కో, ప్రభుత్వ బకాయిలను 2025 అక్టోబర్ నెలాఖరులోగా జమ చేయిస్తానంటూ మంత్రి సుభాష్ హామీ ఇచ్చారు. ఆరు నెలలు గడిచినా ఆ హామీ అమలు కాలేదు. మంత్రి సుభాష్ హామీ నేపథ్యమిదీ... 2025 సెప్టెంబర్ 28న మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం అంగరలోని శ్రీగణపతి చేనేత పారిశ్రామికుల సహకార సంఘం కార్మికులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. తమ సంఘానికి రావాల్సిన ఆప్కో, ప్రభుత్వ బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీక్షలు ప్రారంభించిన నాటికి అంగర చేనేత సంఘానికి రావాల్సిన వివిధ రకాల బకాయిలు రూ.3.85 కోట్లు ఉన్నాయి. వాటిని చెల్లించాలంటూ 2025 సెప్టెంబర్ 27న అంగర గ్రామంలో భారీ నిరసన ర్యాలీ చేశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో 28 నుంచి సహకార సంఘం ఎదుట నిరసన దీక్షలు ప్రారంభించారు. 14 రోజులపాటు సాగిన దీక్షలకు ఉమ్మడి జిల్లాలోని చేనేత కార్మికుల నుంచి స్పందన లభించింది. వైఎస్సార్ సీపీ నాయకులు, సీఐటీయూ తదితర ప్రజా సంఘాల నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. దీక్ష చేస్తున్న విషయం తెలుసుకున్న ఇతర జిల్లాల చేనేత సహకార సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఎదురవుతుందన్న విషయాన్ని అధికార పార్టీ నేతలు గుర్తించారు. జిల్లాకు చెందిన కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ అక్టోబర్ 11న స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుతో కలిసి సహకార సంఘం వద్దకు వచ్చి చర్చలు జరిపారు. అక్టోబర్ నెలాఖరు నాటికి బకాయిలు చెల్లించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలా హామీ ఇచ్చి నేటికి ఆరు నెలలు పూర్తయినా అమలు కాలేదు. వైఎస్ జగన్ పాలనను గుర్తు చేసుకుంటున్న నేతన్నలు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నేతన్న నేస్తం పేరుతో ఆదుకున్న రోజులను చేనేత కార్మికులు గుర్తు చేసుకుంటున్నారు. జిల్లాలో 916 చేనేత కుటుంబాలకు నేతన్న నేస్తం పేరుతో ఏడాదికి రూ.24వేలు ఆర్థిక సాయాన్ని క్రమం తప్పకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం అందించింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చేనేత కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. బకాయిలు జమ చేయిస్తానంటూ నేతన్నలకు హామీ ఆరు నెలలుగా అమలు కాని వైనం కాకినాడలో రిలే దీక్షలు చేస్తున్న నేతన్నలు పట్టించుకోని కూటమి నాయకులు శిబిరం వైపు కన్నెత్తి చూడని కూటమి నాయకులుఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులు విసిగి పోయి కాకినాడ కేంద్రంగా ఈ నెల 13 నుంచి ఆత్మగౌరవ దీక్షల పేరుతో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. తొలిరోజు అంగర చేనేత సహకార సంఘం సభ్యులు దీక్షలో కూర్చున్నారు. ఐదు రోజులుగా సాగుతున్న దీక్షలు అధికార పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు. అలాగని మరోసారి హామీ ఇస్తే నమ్మే పరిస్థితిలో చేనేత కార్మికులు లేరు. అంగరలో స్వయంగా మంత్రి సుభాష్ ఇచ్చిన హామీ గాలికి కొట్టుకుపోయింది. చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో ఈ ఏడాది ఫిబ్రవరి 22న 16 భాగస్వామ్య సంఘాలతో కలిసి చేనేత గర్జన పేరుతో భారీ నిరసన ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు. ఆ సందర్భంగా సంఘాల నాయకులు చేసిన డిమాండ్లను ప్రభుత్వం ఖాతరు చేయలేదు. ఇలాంటి అనుభవాల నేపథ్యంలో తమ సంఘాలకు రావాల్సిన బకాయిలను జమ చేయడం తప్ప మరే మాటా వినేది లేదని నాయకులు స్పష్టం చేస్తున్నారు. దీంతో నిరసనను నిలిపివేయాలని కార్మికులపై అధికార పార్టీ నేతలు ఒత్తిడులు తెస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వానికి బకాయిలు చెల్లించే ఉద్దేశం ఉన్నట్టు కనిపించడం లేదు. కాకినాడలోని దీక్షా శిబిరం వైపు కీలక కూటమి నాయకులు కానీ, మంత్రులు కానీ కన్నెత్తి చూడకపోవడమే ఇందుకు నిదర్శనమని చేనేత కార్మికులు అంటున్నారు. -
నేతన్నలకు అండగా ఉంటా : ఎమ్మెల్సీ తోట
కపిలేశ్వరపురం: చేనేత కార్మికులను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని, చేనేత సహకార సంఘాల బకాయిలను చెల్లించే వరకూ తాను నేతన్నలకు అండగా నిలుస్తానని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చేనేత కార్మికులు ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్, ఏపీ చేనేత సహకార సంఘాల జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ ఎదుట చేస్తున్న ఆత్మగౌరవ దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్సీ తోట సందర్శించారు. చేనేత సంఘాల నాయకులతో మాట్లాడి సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం బాధ్యత తీసుకుని చేనేత వస్త్రాల విక్రయాలకు చర్యలు చేపట్టడం ద్వారా వృత్తిని పరిరక్షించవచ్చన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేనేత కార్మికులు పట్ల వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గమైనదన్నారు. ఓట్ల కోసం హామీలను ఇవ్వడం తప్ప మనస్ఫూర్తిగా చేనేత కార్మికులను ఆదుకోవాలన్న ఉద్దేశం చంద్రబాబు ప్రభుత్వానికి లేదన్నారు. చేనేత వృత్తి రక్షణకు మాజీ సీఎం ఎన్టీఆర్ పని చేశారన్నారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి చేనేత రుణమాఫీ చేశారని గుర్తు చేశారు. మాజీ సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి నేతన్న నేస్తం పేరుతో చేనేత కార్మిక కుటుంబాలకు ఏడాదికి రూ.24 వేలు సాయాన్ని అందజేశారని గుర్తు చేశారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం కనీసం మానవత్వం కూడా చూపడంలేదని తోట ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ తోటకు ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పప్పు దుర్గారమేష్, డాక్టర్ సమతం రమణ మహేష్, ఏపీ చేనేత సహకార సంఘాల ఉమ్మడి తూర్పుగోదావరి జేఏసీ అల్లక రాజు, ఆత్మ గౌరవ దీక్షా నిర్వహణ కమిటీ కార్యదర్శి దొంతంశెట్టి సత్యప్రకాష్ కృతజ్ఞతలు తెలిపారు. -
మహిళా రిజర్వేషన్ బిల్లు చరిత్రాత్మకం
రాజమహేంద్రవరం సిటీ: మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం దేశంలో చరిత్రాత్మకమని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరం వైఎస్సార్ సీపీ సిటీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ ముందుకు 2023లోనే వచ్చిందన్నారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు తీసుకురావడాన్ని వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి గతంలోనే స్వాగతించారన్నారు. ఆయన 33 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలు అందించడమే కాకుండా ఇళ్లు కట్టించే ప్రయత్నం చేశారన్నారు. వైఎస్సార్ చేయూత ద్వారా 45 ఏళ్లు దాటిన మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున ఖాతాల్లో వేశారని చెప్పారు. ఈ పథకం ద్వారా 50 లక్షల మంది లబ్ధి పొందారన్నారు. డ్వాక్రా రుణాల మాఫీ, సున్నా వడ్డీ రుణాలు, అమ్మఒడి ద్వారా రూ.వేల కోట్లు మహిళల ఖాతాలకు జమ చేశారన్నారు. వివిధ పదవుల్లో 50 శాతం అవకాశాలు కల్పించారని చెప్పారు. చంద్రబాబు మహిళలకు చేసిందేమీ లేదు చంద్రబాబు ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడుస్తున్నా మహిళలకు చేసిందేమీ లేదని చెప్పారు. తల్లికి వందనం పేరు చెప్పి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కోతపెట్టి వారి ఖాతాల్లో రూ.7 వేలు, రూ.9 వేలు మాత్రమే వేశారని విమర్శించారు. ఈ పథకాన్ని ఒక ఏడాది పూర్తిగా ఎత్తేశారన్నారు. టిడ్కో ఇళ్లను రెండేళ్లవుతున్నా పూర్తి చేయలేదన్నారు. జగనన్న కాలనీలలో ఇళ్లను పూర్తిచేయకుండా గాలికొదిలేశారని చెప్పారు. తమ ప్రభుత్వంలో వేలాది మంది మహిళలకు ఇళ్ల స్థలాల పట్టాలను అందజేశామన్నారు. తమ ప్రభుత్వం వస్తే 3 సెంట్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. రెండేళ్లు గడుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ అభివృద్ధికి భారత్ అమృత్ పథకంలో నిధులు మంజూరు చేయించామని, దీని అభివృద్ధిని బాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఫ్లై ఓవర్లను పట్టించుకోలేదు బొమ్మూరు, దివాన్ చెరువు సహా నాలుగు ఫ్లైఓవర్ బ్రిడ్జిలతో పాటు ఔటర్ రింగ్ రోడ్డును కూడా మంజూరు చేయించామని, వాటిని బాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. మోరంపూడి ఫ్లైఓవర్ వద్ద ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఫ్లెక్సీలు పెట్టుకోవడం తప్ప సర్వీసు రోడ్డు వేయించలేకపోయారన్నారు. ఇసుక, మద్యం, కబ్జాలతో దోచుకోవడం తప్ప అభివృద్ధిపై దృష్టి లేదన్నారు. రాష్ట్ర కార్యదర్శి వాశంశెట్టి గంగాధరరావు, జిల్లా ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ వెంకటరావు పాల్గొన్నారు. మాజీ ఎంపీ భరత్రామ్ -
రత్నగిరికి ట్రస్ట్బోర్డు ఏర్పాటు
● చైర్మన్గా ఐవీ రోహిత్ ● మరో 16 మంది సభ్యుల నియామకం ● టీడీపీ నుంచి 13, జనసేన నుంచి రెండు, బీజేపీ నుంచి ఒకరికి స్థానం అన్నవరం: అన్నవరం దేవస్థానానికి ఎట్టకేలకు 17 మంది సభ్యులతో ధర్మకర్తల మండలి (ట్రస్ట్బోర్డు) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీఓ విడుదల చేసింది. గత ధర్మకర్తల మండలి పదవీకాలం గత ఏడాది ఏప్రిల్తో ముగిసిన విషయం తెలిసిందే. దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పి. హరి జవహర్లాల్ జీఓ విడుదల చేశారు. దేవస్థానం అనువంశిక ధర్మకర్త ఐవీ రోహిత్ ఈ మండలికి చైర్మన్గా వ్యవహరిస్తారు. ఆయనతో కలిపి ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన నలుగురికి స్థానం లభించింది. ఇద్దరు ఎస్సీలు, ఒక ఎస్టీ, ఆరుగురు మహిళలకు స్థానం లభించింది. గోదావరి జిల్లాల నుంచే కాకుండా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, అనకాపల్లి జిల్లాల వారిని కూడా ట్రస్ట్బోర్డులో నియమించారు. చైర్మన్ను మినహాయిస్తే 16 మంది సభ్యులలో 13 మంది టీడీపీ వారు కాగా, ఇద్దరు జనసేన, ఒకరు బీజేపీ వారు ఉన్నారు. మండలి సభ్యులు వీరే ఐవీ రోహిత్, చైర్మన్ (ప్రత్తిపాడు) కాగా, సభ్యులుగా పర్వత సూర్యారావు (శంఖవరం–ప్రత్తిపాడు), సూర్యభాస్కరం ధనేకుల (ప్రత్తిపాడు), కామర్స్ చిరంజీవిరావు సభ్యుడు (అన్నవరం), రావిపాటి సత్యేనారాయణ (గుంటూరు), పాలచర్ల నాగేంద్రబాబు (జగ్గంపేట), తూము అప్పారావు (పిఠాపురం), హెచ్ రామాంజనేయులు (ఎస్సీ) (మడకశిర), తేలుకుంట్ల అనంతమ్మ (ఒంగోలు), గెడ్డం అప్పారావు (బుజ్జి) (పాయకరావుపేట), గొడేటి భగవత్ (ఎస్టీ) (రంపచోడవరం), రెడ్డి ఎరుకమ్మ (మాడుగుల), ఇండుగబిల్లి లోవకుమారి (తుని), యరగాటపు బాబ్జీ (మండపేట), బండి లక్ష్మి (కై కలూరు), తోలేటి శిరీష (పిఠాపురం), తుల్లిమల్లి ఝాన్సీలక్ష్మి (గన్నవరం–కృష్ణా) నియమితులయ్యారు. వీరిలో గెడ్డం అప్పారావు, తోలేటి శిరీష జనసేన కాగా, కామర్స్ చిరంజీవిరావు బీజేపీ. మిగిలిన 13 మంది టీడీపీకి చెందినవారు. దాతలకు దక్కని సభ్యత్వం టీడీపీ, వైఎస్సార్ సీపీ ప్రభుత్వాలు నియమించిన ధర్మకర్తల మండలిలో దాతలకు స్థానం కల్పించారు. కానీ ఈ సారి వారికి స్థానం దక్కలేదు. గతంలో పెద్దాపురానికి చెందిన పారిశ్రామికవేత్త, దాత, లలితా రైస్ మిల్లు ఎండీ మట్టే సత్యప్రసాద్ను నియమించారు. ఆయన స్వామి, అమ్మవారికి రూ.మూడు కోట్లతో వజ్ర కిరీటాలు చేయించారు. ఇలా పలు విధాల దేవస్థానానికి సేవలు చేశారు. అలాగే విశాఖకు చెందిన పారిశ్రామికవేత్త, దేవస్థానానికి 33 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చిన దాత ఎంఎస్ రెడ్డిని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో సభ్యునిగా నియమించారు. ఈ సారి మండలిలోకి తీసుకోలేదు. చినరాజప్పకు ఝలక్ అన్నవరం దేవస్థానం ట్రస్ట్బోర్డులో పెద్దాపురం నుంచి ఒకరికి స్థానం దక్కేది. కానీ ఈసారి దక్కలేదు. సీనియర్ టీడీపీ నాయకుడు నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నుంచి ఎవరికీ స్థానం దక్కకపోవడం గమనార్హం. కాగా, తుని నుంచి గతంలో కనీసం ఇద్దరు సభ్యులు ఉండేవారు. ఈసారి ఒకరికే పరిమితం చేశారు. కాకినాడ నుంచి సైతం లేరు. కాగా అన్నవరానికి సుమారు 400 కిలోమీటర్లు దూరంలో గల ఒంగోలు, 836 కిలోమీటర్ల దూరంలోని కర్నాటక సరిహద్దుల్లోని మడకశిరకు చెందిన నాయకులకు ట్రస్ట్బోర్డులో స్థానం కల్పించారు. వీరు మండలి సమావేశాలకు రాకపోకలు సాగించడానికే శ్రమపడాల్సి వస్తుంది. కాగా రెండు మూడు రోజుల్లో ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం చేయనుంది. -
విద్యుత్ స్తంభం పైనుంచి పడి ఎలక్ట్రీషియన్ మృతి
అయినవిల్లి: మండలంలోని వీరవల్లిపాలేనికి చెందిన ఓ వ్యక్తి విద్యుత్ బల్బులు మారుస్తుండగా 11 కేవీ విద్యుత్ తీగలు తగిలి పైనుంచి పడి మృతి చెందాడు. హెడ్ కానిస్టేబుల్ హరిబాబు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు మండలం వీరవల్లిపాలెం గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్ ఉండ్రాజవరపు శ్రీను (54) శుక్రవారం పంచాయతీ విద్యుత్ స్తంభం ఎక్కి వీధి దీపాలు మారుస్తున్నాడు. ఈ క్రమంలో 11 కేవీ విద్యుత్ తీగ తగిలి షాక్కు గురై కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు హెచ్సీ తెలిపారు. పంచాయతీ సిబ్బంది, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తన భర్త మృతి చెందాడని ఆమెతో పాటు, బంధువులు సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వద్ద ఆందోళన చేశారు. బాధిత కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటిని తడుపుతూ షాక్కు గురై..సామర్లకోట: స్థానిక కోట బజార్ ప్రాంతానికి చెందిన మోర్త శ్రీను (40) విద్యుదాఘాతంతో మృతి చెందాడు. శుక్రవారం ఉదయం జి.రాగంపేట రోడ్డులోని ఈటీసీ లే అవుట్లో పేద ప్రజలకు ఇచ్చిన స్థలంలో నిర్మిస్తున్న ఇంటిని తడుపుతుండగా విద్యుత్ షాక్కు గురై పడిపోయాడు. స్థానికులు సమీపంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతికి కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో సల్ఫర్ లారీ దగ్ధం రూ.52 లక్షల ఆస్తి నష్టం ఏలేశ్వరం: మండలంలోని యర్రవరం సమీపంలోని జాతీయరహదారిపై శుక్రవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సల్ఫర్లోడుతో వెళ్తున్న లారీ దగ్ధం కాగా సుమారు రూ.52 లక్షల విలువైన ఆస్తి నష్టం సంభవించింది. వివరాల్లోకి వెళితే విశాఖ నుంచి మహారాష్ట్రకు 30 టన్నుల సల్ఫర్ లోడుతో వెళ్తున్న లారీని రాజమహేంద్రవరం నుంచి కత్తిపూడి వైపు వెళుతున్న వేన్ అదుపు తప్పి డివైడర్ దాటి మరీ వచ్చి ఢీకొట్టింది. దీంతో సల్ఫర్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగి లారీ పూర్తిగా దగ్ధమైంది. ప్రత్తిపాడు, జగ్గంపేట అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. మధ్యప్రదేశ్కు చెందిన లారీ డ్రైవర్లు లాల్రామ్, రూప్సింగ్, శంఖవరం మండలం కత్తిపూడికి చెందిన వేన్ డ్రైవర్ కుర్రే సురేష్, సహయకుడు కొయ్య గోవిందు తృటిలో తప్పించుకోగా స్వల్ప గాయాలయ్యాయి. తెలవారుజాము కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీ కేసులో ముగ్గురికి జైలు, జరిమానా కాకినాడ లీగల్: ఎవరూ లేని సమయంలో ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి కత్తులతో మహిళను బెదిరించి, ఆమె నుంచి నాలుగు బంగారు గాజులతో పాటు రూ.15 లక్షల చోరీ చేసిన కేసులో ముగ్గురికి జైలు, జరిమానా విధిస్తూ కాకినాడ మూడో అదనపు జిల్లా జడ్జి జి.ఆనంది శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం కాకినాడ రమణయ్యపేటలో నివసిసున్న సత్తి కమల ఇంటిలో ఒంటరిగా ఉండడాన్ని గమనించి 2016 మార్చి 16న పెద్దాపురం మండలం, గోరింట గ్రామానికి చెందిన పిడుగు శ్రీనివాస్ తమ్మారావు, గంటా వీర్రాజు, కాకినాడ సూర్యనారాయణపురానికి చెందిన సయ్యద్ సుభాని ఇంట్లో ప్రవేశించి ఆమెను చంపేస్తామని భయపెట్టి గాజులతో పాటు రూ.15లక్షల నగదు చోరీ చేశారు. వారు ఈ పనిలో ఉండగా మరో ఇద్దరు బయట కాపలా ఉన్నారు. వారిలో ఒకరు సామర్లకోట పోలీసుస్టేషన్లో పనిచేస్తున్న హోమ్ గార్డ్ దాసరి సతీష్కుమార్, మరొకరు కాకినాడ చెందిన మోస తోమా ఉన్నారు. బాధితురాలు కమల ఫిర్యాదు మేరకు నిందితులపై నేరం రుజువు కావడంతో శ్రీనివాస్ తమ్మారావు, వీర్రాజుకు ఒక్కొక్కరికి ఐదేళ్లు జైలు శిక్ష, రూ.5 వేలు చొప్పున జరిమానా, సుభానికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.2వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. హోమ్గార్డ్ దాసరి సతీష్ కుమార్పై సరైన సాక్షాధారాలు లేకపోవడంతో అతనిపై కేసు కొట్టివేశారు. మోస తోమా మృతి చెందడంతో అతడి పేరును కేసు నుంచి తొలగించారు. -
రోడ్డు ప్రమాదంలో భర్త మృతి
● భార్యకు తీవ్ర గాయాలు ● బైక్ను కారు ఢీకొని ఘటన గోకవరం: రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ఆ భార్యాభర్తలు ఓ హోటల్లో పనిచేస్తూ పూట గడుపుకొనే వారిని విధి వెక్కిరించి విడదీసింది. పని ముగించుకుని బైక్పై ఇంటికి వెళ్తున్న క్రమంలో కారు రూపంలో మృత్యువు భర్తను తీసుకుపోగా భార్య తీవ్ర గాయాలపాలైంది. మండలంలోని పెంటపల్లికి చెందిన ములికి వెంకన్న (59), భార్య నాగమణి గోకవరంలో పోస్టాఫీసు సమీపంలోని ఓ హోట్లో పని చేస్తున్నారు. ఉదయమే వచ్చి రాత్రి పనులయ్యాక ఇంటికి వెళ్తుంటారు. ఈ క్రమంలో గురువారం అర్థరాత్రి బైక్పై తమ గ్రామానికి వెళ్తుండగా గోకవరం శివారు హాట్స్పాట్ హోటల్ వద్ద మలుపులో ఎదురుగా వస్తున్న కారు వీరి బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భర్త వెంకన్న, భార్య నాగమణి లను రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వెంకన్న మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్సై నాగమణి, ఇతర సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రమాదానికి కారణమైన కారుని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. విషాదంలో కుటుంబం వెంకన్న, నాగమణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె భువనేశ్వరికి వివాహమై ఒక పాప, రెండు నెలల మగ శిశువు ఉన్నారు. రెండో కుమార్తె పుణ్యవతి దివ్యాంగురాలు. ఆమె రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది. తండ్రి మృతి, తల్లి ఆస్పత్రి పాలవడంతో కుమార్తెలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వారి రోదనలు స్థానికులను కలచివేశాయి. -
కొత్త తరహాలో సేవా తీర్థ స్మారక నాణెం
అమలాపురం టౌన్: భారత ప్రభుత్వం కోల్కతా మింట్ ద్వారా సేవా తీర్థ రూ.100 స్మారక నాణేన్ని ముద్రించి విడుదల చేసింది. ఈ నాణేన్ని అమలాపురానికి చెందిన నాణేల సేకరణ కర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ సేకరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల ఢిల్లీలోని సేవా తీర్థ కాంప్లెక్స్ గౌరవార్థం ఈ నాణేన్ని విడుదల చేశారు. ఈ నాణెం ద్వారా కోల్కతా మింట్ 200 ఏళ్ల పైబడి ఉన్న తన చరిత్రలో తొలిసారిగా ’కె’ మార్కుతో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకూ కోల్కతా మింట్ ముద్రించిన నాణేలపై ఎలాంటి మార్కును ముద్రించలేదు. ఈ నాణెంపై మాత్రం కోల్కతాను సూచిస్తూ ‘కె’ మింట్ మార్కును ముద్రించింది. నాణేనికి ఓ వైపు అశోక స్తంభం, సత్యమేవ జయ తే అని ఉండగా, మరోవైపు కొత్తగా ని ర్మించిన సేవా తీర్థ కాంప్లెక్స్ చిత్రం ఉంది. అలాగే నాణెం దిగువ అంచున ‘నాగరిక్ దేవోభవ’ అనే నినాదాన్ని కూడా ముద్రించారు. సేవా తీర్థ అనేది కేవలం ఒక భవనం మాత్రమే కాదని, అది భార త ప్రభుత్వ సేవా దృక్పథానికి చిహ్న మని నాణెం తెలియచెబుతోంది. నికెల్ సిల్వర్లో ఈ నాణెం విడుదలైంది. -
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
పెదపూడి: కరకుదురు గ్రామంలో గురువారం ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న కూలీలపై తేనెటీగలు ఆకస్మికంగా దాడి చేశాయి. ఈ ఘటనలో గాయపడిన 24 మందిని పెదపూడి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వారికి వైద్యులు ప్రేమ్చంద్, హర్షవర్ధన్, సుభాష్, రాముడు, వరప్రసాద్ తదితరులు అత్యవసర చికిత్స అందించారు. వారిలో కనిపే అచ్యుతామణి, నురుకుర్తి సూరమ్మ, విప్పర్తి కొండబాబు, జాలిమి వెంకటరావు, దున్నా జయలక్ష్మిలను మెరుగైన చికిత్స కోసం కాకినాడ జీజీహెచ్కు తరలించారు. మిగిలిన 19 మంది ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఇళ్లకు పంపించారు. జీజీహెచ్లో చికిత్స పొందుతున్న ఐదుగురు బాధితులను వైఎస్సార్ సీపీ అనపర్తి నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి సాయంత్రం పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు, వారి బంధువులను అడిగి తెలుసుకున్నారు. సంఘటన జరిగిన వెంటనే ఫీల్డ్ అసిస్టెంటు శివ, ఏపీఓ సత్యనారాయణ సకాలంలో స్పందించడంతో కూలీలకు ప్రాణాపాయం తప్పిందని అన్నారు. తేనెటీగల దాడిలో కిడ్నీలు ఫెయిలై ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంటుందని చెప్పారు. తుప్పలు, గట్ల మీద చెత్త , కాలువల్లో పూడిక తొలగింపు వంటి పనుల్లో కూలీలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి వాసంశెట్టి మాధవ, గ్రామ కన్వీనర్ పెమ్మనబోయిన గోవిందరాజు తదితరులు ఉన్నారు. అంతకు ముందు తేనెటీగల బాధితులను కాకినాడ డ్వామా పీడీ ఎస్.మధుసూదన్, డ్వామా ఫైనాన్స్ అధికారి విజయభాస్కర్ తదితరులు జీజీహెచ్లో పరామర్శించారు. అవసరమైన అన్ని వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు సూచించారు. -
కేజీ బేసిన్ ఉత్పత్తిలో 50 శాతం ఇవ్వాలి
రాజమహేంద్రవరం సిటీ: కృష్ణా, గోదావరి (కేజీ) బేసిన్లో దేశంలోనే అతి పెద్ద లూటీ జరుగుతోందని, రాష్ట్ర ప్రజల అవసరాల కోసం గ్యాస్, చమురులో 50 శాతం వాటా లక్ష్యంగా సమరశంఖం పూరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని డిమాండ్ చేశారు. అప్పటికీ కేంద్రం దిగి రాకుంటే ఎన్డీఏకి మద్దతు ఉపసంహరించుకుని, ప్రధాని నరేంద్ర మోదీ మెడలు వంచాలని అన్నారు. తాడితోట సెంటర్లో సంహిత కన్వెన్షన్ సెంటర్లో కేజీ బేసిన్ గ్యాస్, చమురు సాధన సమితి ఆధ్వర్యాన గురువారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. కేజీ బేసిన్లో గ్యాస్, చమురుపై వాటా కోసం రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహించి, ప్రజలను కార్యోన్ముఖులను చేయాలని అన్నారు. కేజీ బేసిన్లో గ్యాస్, చమురు నిల్వలను యథేచ్ఛగా తరలించుకు పోయి కార్పొరేట్ సంస్థలు లాభాలు గడిస్తున్నాయని చెప్పారు. సహజ వనరులపై రాష్ట్రాలకు 50 శాతం వాటా కల్పించాలంటూ 12వ ఆర్థిక సంఘం చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బానిస పాలకులు నాటకాలు చేస్తున్నారు ప్రత్యేక హెూదా, రాష్ట్ర విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో సహజ వనరుల లూటీ యథేచ్ఛగా జరుగుతూంటే బానిస పాలకులు నాటకాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. యుద్ధం నేపథ్యంలో మరోసారి ఈ చర్చ ముందుకు వచ్చిందని, ఇప్పటికై నా దానిని సాధించుకోవాలని అన్నారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ తరపున కాకినాడలో త్వరలో సదస్సు నిర్వహిస్తామని, బుక్లెట్ కూడా విడుదల చేస్తామని చెప్పారు. కేజీ బేసిన్ గ్యాస్, చమురులో సగం వాటా రాష్ట్ర ప్రజల అవసరాలకు కేటాయించాలని, పీఎన్జీ గ్యాస్ ఇంటింటికీ సరఫరా చేయాలని, సహజ వనరుల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే చేపట్టాలని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు టి.మధు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పి.ప్రసాద్, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బుగత బంగార్రాజు, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు చీకట్ల వెంకటేశ్వరరావు, ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.సుందర రామరాజు, సీపీఐ ఎంఎల్ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎంఎస్ నాగరాజు, ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి కాటం నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. -
పెయింటర్లుగా మారిన సెక్యూరిటీ గార్డులు
నిడదవోలు: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న సెక్యూరిటీ గార్డులు తమ విధులను పక్కన పెట్టి పెయింటర్ల అవతారం ఎత్తారు. ఈ నెల 18న సీఎం చంద్రబాబు నిడదవోలు పర్యటన సందర్భంగా ఆసుపత్రి ముందు భాగంలో రంగులు వేస్తున్నారు. యుద్ధప్రాతిపదికన పారిశుధ్య పనులు కూడా చేపట్టారు. ఇంతవరకూ బా గానే ఉంది. అయితే, ఉన్నత చదువులు చదివిన కొందరు సరైన ఉద్యోగాలు లేకపోవడంతో చాలీచాలని జీతాలకు ఔట్సోర్సింగ్ సెక్యూరిటీ గార్డు లుగా పని చేస్తున్నారు. దీనిని ఆసరాగా తీసుకు న్న వైద్యాధికారులు ఇద్దరు సెక్యూరిటీ గార్డులతో గురువారం పెయింటింగ్ పనులు చేయించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ‘నన్నయ’లో 20 వసంతాల వేడుకలు ప్రారంభం రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో 20 వసంతాల వేడుకలు గురువారం ప్రారంభమయ్యాయి. ‘గోదావరి కలశాలు – సంప్రదాయ వరాలు, విభిన్నం – విలక్షణం – వంటకం’ అనే కార్యక్రమాలతో ఉప కులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ ఈ వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. ప్రాంగణంలోని కొలనులో వర్సిటీలోని 20 విభాగాలకు చెందిన అధ్యాపకులు, విద్యార్థులతో కలసి దీపాలు వెలిగించారు. పొంగల్ వండి సామూహికంగా ఆరగించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, కన్వీనర్లు పి.విజయనిర్మల, టి.హైమవతి పాల్గొన్నారు. మార్గాని ఎస్టేట్స్లో రేపు జాబ్మేళారాజమహేంద్రవరం సిటీ: స్థానిక వీఎల్ పురం మార్గాని ఎస్టేట్స్లో శనివారం ఉదయం 9 గంటల నుంచి జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగ రహిత రాజమహేంద్రవరమే లక్ష్యంగా జనవరిలో సుమారు 75 కంపెనీలతో మంజీరా కన్వెన్షన్లో మెగా జాబ్మేళా నిర్వహించి, 500 మందికి పైగా ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. ఈ క్రమంలో ఇప్పుడు రెండో జాబ్ మేళా సుమారు 25 కంపెనీలతో వందలాది ఉద్యోగావకాశాలతో నిర్వహిస్తున్నామని చెప్పారు. జాబ్మేళా పోస్టర్లోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకుని పాల్గొనవచ్చని, లేదంటే నేరుగా వచ్చి కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని తెలిపారు. పూడి శ్రీహరి అరెస్టు దారుణంసాక్షి, రాజమహేంద్రవరం: వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి (మీడియా విభాగం) పూడి శ్రీహరి అక్రమ అరెస్టు దారుణమని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు సివిల్ డ్రెస్లో వచ్చి ఆయనను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. దీనినిబట్టి చూస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికుందా అనే అనుమానం కలుగుతోందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎవరినైనా అరెస్టు చేసే ముందు నోటీసులు ఇవ్వాలని, న్యాయస్థానాలను సైతం ధిక్కరిస్తూ పోలీసులు అరెస్టు చేశారని పేర్కొన్నారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదని, ఈ వ్యవహారంలో చట్టం ప్రకారం ముందుకెళ్తామని చెప్పారు. ప్రజాస్వామ్య దేశంలో మాట్లాడే హక్కు లేదా అని ప్రశ్నించారు. అరెస్టు వారెంట్, ఏవిధమైన అనుమతీ లేకుండా నేరుగా ఇంటికి వెళ్లి ఎలా తనిఖీలు చేస్తారని ప్రశ్నించారు. ఇదంతా ప్రజా వ్యతిరేకతను డైవర్ట్ చేయడంలో భాగమేనని వేణు అన్నారు. -
జారితే.. గోదాహరీ!
భక్తులు జారి పడేలా పుష్కర ఘాట్లో అమర్చిన నునుపైన టైల్స్● ప్రమాదకర రీతిలో పుష్కర ఘాట్ ఆధునీకరణ పనులు ● జోథ్పూర్ నుంచి తెచ్చిన నునుపు టైల్స్ అమరిక ● వాటిపై జారి పడుతున్న భక్తులు ● పుష్కరాల్లో ఎక్కువ మంది ఇక్కడికే వచ్చే చాన్స్ ● అదే జరిగితే అధిక సంఖ్యలో ప్రమాదానికి గురయ్యే అవకాశం సాక్షి, రాజమహేంద్రవరం: పావన గోదావరి పుష్కరాల అభివృద్ధి పనుల తీరు.. పుణ్యానికి పోతే పాపం ఎదురైందన్నట్టుగా సాగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చే రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ ఆధునీకరణ పనులు ఈ విమర్శలు నిజమేననిపించేలా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై ఏడో తేదీ వరకూ గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఆలోగా అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపించినా ప్రభుత్వం ఇంకా నిధులు విడుదల చేసిన దాఖలాల్లేవు. దీంతో, అధికారులు ఉన్న అరకొర నిధులతోనే పనులు చేస్తున్నారు. అవి కూడా సరైన ముందుచూపు లేకుండా చేపడుతూండటంతో ప్రమాదకరంగా మారుతున్నాయి. అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా రూ.94 కోట్ల పర్యాటక శాఖ నిధులతో నగరంలోని పుష్కర ఘాట్, గౌతమీ ఘాట్ల అభివృద్ధి, గోదావరి మాత విగ్రహావిష్కరణ, హేవలాక్ బ్రిడ్జి ఆధునీకరణ పనులు చేపడుతున్నారు. పనులు ప్రారంభించి ఏడాదవుతున్నా నత్తకు మేనత్తను తలపిస్తున్నాయి. రెండు రోజులు చేయడం.. నెల రోజుల పాటు ఆపేయడంతో ఎప్పటికి పూర్తవుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ‘లుక్’ పేరుతో ముప్పు తెచ్చేలా.. ముఖ్యంగా పుష్కర ఘాట్ ఆధునీకరణ పనులు భక్తులు, యాత్రికులకు ప్రమాదకరంగా మారుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుష్కర ఘాట్లో ఇప్పటి వరకూ జారుడు స్వభావం లేని టైల్స్ ఉండేవి. బాగానే ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వ ప్రచారార్భాటం కోసం వాటిని పూర్తిగా తొలగించి, రాజస్థాన్లోని జోథ్పూర్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన టైల్స్ అమరుస్తున్నారు. వీటిని నాలుగు రోజులు అమర్చడం.. తిరిగి తొలగించడం.. మళ్లీ అమర్చడం.. ఫలితంగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. మరోవైపు అక్కడక్కడ టైల్స్ అమర్చకుండా వదిలేశారు. ఘాట్ మొత్తం ఇదే తంతు సాగుతోంది. తద్వారా ఘాట్కు ప్రత్యేకమైన లుక్ వస్తుందని అధికారులు చెబుతున్నారు. వారి మాటలు బాగానే ఉన్నా.. ఇక్కడే అసలు సమస్య తలెత్తుతోంది. కొత్తగా తెచ్చిన టైల్స్ చాలా నునుపుగా, అడుగు వేస్తే జారి పడేలా ఉన్నాయి. వీటిని కొన్నిచోట్ల అమర్చగా.. గోదావరిలో స్నానాలు ఆచరించి వస్తున్న భక్తులు వాటిపై నడుస్తూ జర్రున జారి పడుతున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో జారి పడుతూ గాయాలపాలవుతున్నారు. పుష్కర ఘాట్లో స్నానాలకు ప్రతి రోజూ వివిధ ప్రాంతాల నుంచి వందలాదిగా భక్తులు వస్తూంటారు. పండగ సమయాల్లో రద్దీ మరింతగా ఉంటుంది. వీరిలో వృద్ధులు, చిన్నారులు సైతం ఉంటారు. ఘాట్లో స్నానం ఆచరించే చోట నునుపుగా ఉన్న టైల్స్ వేయడంతో వారు జారి పడుతున్నారు. పుష్కర ఘాట్ వద్ద నిత్యం నీరుంటుంది. సాధారణ రాళ్లే నాచు పట్టే అవకాశం ఉంది. అటువంటిది నునుపైన టైల్స్పై నాచు పడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఇక చెప్పనవసరమే లేదు. గోదావరి పుష్కరాలకు సుమారు 7 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుందన్నది అధికారుల అంచనా. నగరంలో స్నానాలు చేసేందుకు మరిన్ని ఘాట్లు ఉన్నప్పటికీ.. ఎక్కువ శాతం మంది పుష్కర ఘాట్కే వస్తూంటారు. ఆ సమయంలో ఒక్కరు జారినా.. వారితో పాటే పదుల సంఖ్యలో భక్తులు జారి పడి పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుందని భక్తులు ఆందోళన చెందుతున్నారు. కొత్తవి అమరుస్తున్నామని చూపించుకునేందుకు భక్తులను ప్రమాదంలోకి నెడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు, కాంట్రాక్టర్లు పట్టించకోకపోగా.. టైల్స్పై గాడి కొడతామంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఒకవేళ గాడి కొట్టినా జారకుండా ఉంటాయా అనే ప్రశ్న తలెత్తుతోంది. కలెక్టర్ హెచ్చరించినా.. నునుపైన టైల్స్ కారణంగా భక్తులు జారి పడుతున్న విషయం ఇప్పటికే కలెక్టర్ దృష్టికి వెళ్లినట్లు సమాచారం. ఈ విషయాన్ని నిపుణులు సైతం పరిశీలించి, ఈ టైల్స్ను తొలగించాలని సూచించినట్లు సమాచారం. ఒకవేళ ఈ టైల్స్ను తొలగిస్తే ఇప్పటి వరకూ పెట్టిన ఖర్చు గోదాట్లో కలసినట్లే. దీంతో, ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ టైల్స్ను తొలగించేందుకు అంగీకరించడం లేదన్న ఆరోపణలున్నాయి. కంటితుడుపు చర్యగా టైల్స్ జారకుండా గాడి కొడతామని చెబుతున్నారు. మార్చి నెలాఖరులోగా ఈ పనులు పూర్తి చేయాల్సి ఉండగా.. నేటికీ అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. కూటమి నేతలకు లబ్ధి చేకూర్చేందుకు, వారు సిఫారసు చేసిన, అవగాహన లేని వారికి కాంట్రాక్ట్ అప్పగించినందువల్లనే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయనే ఆరోపణలున్నాయి. పాత టైల్స్ బాగానే ఉన్నా.. బిల్లుల కోసం కక్కుర్తిపడి వాటిని పూర్తిగా తొలగించారని పలువురు విమర్శిస్తున్నారు. గోదారిలో కలసిన ‘వ్యూ’ పుష్కర ఘాట్ వద్ద ఇప్పటి వరకూ హేవలాక్ బ్రిడ్జి (పాత రైల్వే వంతెన), ఆర్చిలతో ఉన్న మూడో రైల్వే వంతెన మధ్య నిల్చుని సందర్శకులు గోదావరి అందాలను తిలకించి, పులకించే వారు. అక్కడ ఉత్సాహంగా ఫొటోలు దిగేవారు. కూర్చుని కాసేపు సేద తీరేవారు. ఎన్నో ఫొటోషూట్లు, ప్రీ వెడ్డింగ్ షూట్లు, సీరియల్, సినిమా చిత్రీకరణలు ఇక్కడ జరిగేవి. ఇంతటి పర్యాటకాకర్షణ ఉనన ఈ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి పనులతో ఈ ‘వ్యూ’ కాస్తా గోదారిలో కలసిపోయింది. అసలే పుష్కర ఘాట్ విస్తీర్ణం తక్కువగా ఉంటుంది. ఇటువంటి చోట అనవసర కట్టడాలు చేపడుతూండటంతో ఘాట్ మరింత కుచించుకుపోతోంది. ఘాట్ ప్రవేశం వద్ద సైతం ఆర్చి నిర్మిస్తూండటంతో గోదావరి వ్యూ పూర్తిగా కనుమరుగైపోయింది. ఈ పనులతో రెండు వంతెనల మధ్య గోదావరి అందాలను చూసే వీలు లేకుండా పోయిందని భక్తులు, పర్యాటకులు ఆవేదన చెందుతున్నారు. కట్టడాలు లేని సమయంలో ప్రతి రోజూ వివిధ ప్రాంతాల నుంచి నాలుగైదు బస్సుల్లో వచ్చిన యాత్రికులు ఘాట్ను సందర్శించి, వ్యూ పాయింట్ వద్ద ఫొటోలు దిగేవారు. ప్రస్తుతం ఒక్క బస్సు కూడా వస్తున్న దాఖలాలు లేవు. -
వైఎస్సార్ సీపీ బలోపేతానికి కృషి చేయాలి
రాజమహేంద్రవరం సిటీ: వైఎస్సార్ సీపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ పిలుపునిచ్చారు. అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వివిధ విభాగాల్లో పలు హోదాల్లో నియమితులైన వారికి పార్టీ కార్యాలయంలో గురువారం నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా భరత్రామ్ మాట్లాడుతూ, పార్టీని కింది స్థాయి నుంచీ బలోపేతం చేసి, రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పదవులు పొందిన వారు క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా పని చేసి పార్టీ నిర్మాణానికి కృషి చేయాలన్నారు. కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్తకూ గుర్తింపు లభిస్తుందన్నారు. ఈ సందర్భంగా బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు సేపేని మునీశ్వరరావును, వైఎస్సార్ టీయూసీ సిటీ ప్రెసిడెంట్ దాది గౌరీశంకర్, ఆరో డివిజన్ అధ్యక్షుడు నల్ల రామాంజనేయులు, 24వ డివిజన్ అధ్యక్షుడు ఎజ్జవరపు శ్రీనివాసరావు, 25వ డివిజన్ అధ్యక్షుడు రొక్కం త్రినాథ్, 50వ డివిజన్ అధ్యక్షురాలు గుత్తుల కోటేశ్వరిలను శాలువాలతో భరత్రామ్ ఘనంగా సత్కరించారు. -
జనగణన స్వీయ నమోదు ప్రారంభం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జనగణన (సెన్సస్)లో భాగంగా స్వీయ నమోదు అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. స్వీయ వివరాలతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు కూడా నమోదు చేసుకోవాలని సూచించారు. హెచ్టీటీపీఎస్://ఎస్సీ.సీఈఎన్ఎస్యూఎస్.జీఓవీ.ఇన్ పోర్టల్ ద్వారా ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకూ ప్రజలు తమ వివరాలు స్వయంగా నమోదు చేసుకోవచ్చన్నారు. ఫోన్ నంబర్ వంటి మొత్తం 33 అంశాలపై సమాచారం సేకరిస్తారని తెలిపారు. దీనిపై ప్రతి రోజూ వేర్వేరు వర్గాల ప్రజలను కలిసేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇందులో భాగంగా ఈ నెల 16న ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారన్నారు. 17న సచివాలయ, జిల్లా, మండల కార్యాలయ సిబ్బంది, 18న ప్రముఖులు, క్రీడాకారులు, కళాకారులు, 19న మహిళా సంఘాలు, 20, 30 తేదీల్లో కార్మికులు, 21న గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, 22న పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, 23, 24 తేదీల్లో అంగన్వాడీ, ఆరోగ్య కార్యకర్తలు, గిరిజన ప్రాంతాలు, 25న రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, 26న వృద్ధాశ్రమాలు, 27న దుకాణాలు, పరిశ్రమలు, 28న బ్యాంకులు, 29న పోలీస్ సిబ్బంది వంటి వర్గాలను లక్ష్యంగా చేసు కుని ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రోజుకు కనీసం 10 నుంచి 20 మంది వరకూ స్వీయ నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలని కలెక్టర్ కీర్తి సూచించారు. మాలకోడు చెరువు ప్రక్షాళనకు శ్రీకారం నిడదవోలు: మాలకోడు చెరువు ప్రక్షాళనకు రూ.5.5 కోట్లతో శ్రీకారం చుట్టామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి నెలా మూడో శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ వారం నిడదవోలు రానున్న సీఎం చంద్రబాబు ఈ పనులను పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. చెరువులో గుర్రపు డెక్కను తొలగించి, దానిని వర్మి కంపోస్ట్గా మార్చే ప్రక్రియను పరిశీలిస్తారన్నారు. సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కు శంకుస్థాపన చేస్తారన్నారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. -
జయలక్ష్మి సొసైటీ పాలక వర్గాన్ని రద్దు చేయాలి
సభ్యుల డిమాండ్ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జయలక్ష్మీ సొసైటీ ప్రస్తుత పాలక వర్గం చైర్మన్ గంగిరెడ్డి త్రినాథరావు, ఇతర సభ్యులు అవినీతికి పాల్పడిన నేపథ్యంలో వారిని తొలగించాలని సొసైటీ సభ్యుల డిమాండ్ చేశారు. కాకినాడ గాంధీభవన్లో గురువారం జయలక్ష్మి సొసైటీ సర్వసభ్య సమావేశం జరిగింది. సొసైటీ బోర్డు తిప్పేసిన అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో చైర్మన్గా ఎన్నికై న గంగిరెడ్డి త్రినాథరావు, ఇతర పాలక వర్గ సభ్యులు సుమారు రూ.4.60 కోట్లు దోచుకొన్నారని సభ్యులు మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న కార్యవర్గాన్ని రద్దు చేసి, ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నాలుగు సంవత్సరాలుగా విచారణ అధికారులు సైతం రికవరీలో శ్రద్ధ చూపకపోవడంతో డిపాజిట్దారులకు అన్యాయం జరిగిందని జయలక్ష్మి విక్టిమ్స్ స్టీరింగ్ కమిటీ కార్యదర్శి ఈరంకి రఘభూషణ్ తెలిపారు. సొసైటీలో 2,284 మంది రుణాలు తీసుకొన్నారన్నారు. వీరిలో కేవలం 13 మంది వద్ద మాత్రమే రుణాలు వసూలు చేశారన్నారు. జయలక్ష్మి సొసైటీ 29 శాఖల్లో ఉన్న ఫర్నీచర్ అమ్మకాల్లో అవినీతి జరిగిందన్నారు. అక్కడ ఉన్న ఫర్నీచర్ను కార్గవర్గ సభ్యులు వారి బంధువులకు తక్కువ ధరకు విక్రయించారన్నారు. ఈ సొసైటీకి ఎన్నో విలువైన ఆస్తులు ఉన్నాయని వాటిని అమ్మితే డిపాజిట్దారులకు 50 శాతం చెల్లించవచ్చునన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కాకినాడ డివిజనల్ కో ఆపరేటివ్ అధికారి పీబీఎంఎం కుమార్ మాట్లాడుతూ సహకారశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జయలక్ష్మి సొసైటీలో జరిగిన అవినీతిపై తాను విచారణ చేపట్టగా పలు విషయాలు బయటపడ్డాయన్నారు. డబ్బు చెల్లించకుండానే రూ.3. 98 కోట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు రుణాలు తీసుకొన్న వారికి ఇచ్చివేశారన్నారు. ఎటువంటి ఓచర్లు, బిల్లులు లేకుండా సుమారు రూ.70 లక్షలు దుర్వినియోగం అయినట్లు గుర్తించామని వివరించారు. ఈ సందర్భంగా పలువురు డిపాజిట్దారులు వీలైనంత త్వరగా తమకు డబ్బులు ఇప్పించాలని సహకారశాఖ అధికారులను కోరారు. నాలుగు సంవత్సరాలుగా వడ్డీ రాకపోవడంతో కుటుంబాలను పోషించడం ఇబ్బందిగా మారిందని పలువురు డిపాజిట్దారులు ఆవేదన వ్యక్తం చేశారు. -
సీబీఎస్ఈ ఫలితాలలో షిర్డీసాయి హవా
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పదవ తరగతి సీబీఎస్ఈ ఫలితాలలో తమ విద్యార్థులు 100 శాతం ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించినట్టు శ్రీ షిర్డీసాయి విద్యా సంస్థల డైరెక్టర్ టి. శ్రీవిద్య గురువారం తెలిపారు. జి.అంజలి ప్రణయ 486 మార్కులు సాధించి ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకుందని తెలిపారు. ఎం.శ్రీయుక్త, ఎన్.శ్రీలాస్య 483 మార్కులతో ద్వితీయ స్థానం, ఎ.దివేష్ 481 మార్కులతో తృతీయస్థానాన్ని సాధించారన్నారు. నలుగురు విద్యార్థులు 480 పైగా మార్కులు, 7 మంది 470 పైగా మార్కులు, 26 మంది 460 పైగా, 47 మంది 450 పైగా మార్కులు సాధించగా 142 మంది 400 పైగా మార్కులు సాధించారని శ్రీవిద్య తెలిపారు. ఈ ఘనత సాధించిన విద్యార్థులను, ఉపాధ్యాయ బృందాన్ని విద్యాసంస్థల చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్ అభినందించారు. -
గుప్తనిధుల కోసం తవ్వకాలు : ఆరుగురి అరెస్టు
ఏలేశ్వరం: గుప్తనిధుల కోసం యర్రవరంలోని ధనాల కొండపై తవ్వకాలు చేస్తున్న ఆరుగురిని అరెస్టు చేసినట్టు ఎస్సై రామలింగేశ్వరరావు గురువారం తెలిపారు. యర్రవరంలో పురావస్తుశాఖ అధీనంలో ఉన్న ధనాలకొండపై గుప్తనిధులు ఉన్నాయని ఆరుగురు తవ్వకాలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు దాడి చేశారు. నిందితులతోపాటు వారి నుంచి కట్టర్లు, జనరేటర్, ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తవ్వకాలు చేసిన వారిలో గండేపల్లి మండలం ఉప్పలపాడుకు చెందిన టి శివశంకర్, రాజమహేంద్రవరం రూరల్ కాతేరుకు చెందిన ఓ వీరసాయికుమార్, వి.గణపతి, డి.గోవిందస్వామి, కె.సతీష్, బిక్కవోలుకు చెందిన ఎస్ శ్రీనులను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై బైండోవర్ కేసు నమోదు చేసి తహసీల్దార్ కోర్టులో హజరుపరిచారు. -
గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్టు
సామర్లకోట: పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్న గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు గురువారం రైల్వే పోలీసులు వివరాలు తెలిపారు. 2025 అక్టోబర్ 24న టాటానగర్–యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్లో గంజాయి రవాణా అవుతున్న సమాచారం తెలుసుకొని రైల్వే పోలీసులు దాడి చేసి 154 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆ తరుణంలో గంజాయి రవాణా చేస్తున్న అరవింద్ పరార్ అయ్యాడు. దాంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం డీఎస్పీ జయ రాంప్రసాద్ కాకినాడ లైన్ ఇన్స్పెక్టర్ టి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిందితుని పట్టుకొనేందుకు బృందాన్ని ఏర్పాటు చేశారు. నిందితుడు కర్ణాటకలో ఉన్నట్లు తెలుసుకొని కాకినాడ ఎస్సై సత్తిబాబు, హెచ్సీ శ్యామ్ త్రినాథరావు, పీసీ చంద్రశేఖర్, మధులను అక్కడకు పంపారు. నిందితుడిని మాండ్య జిల్లాలో అరెస్టు చేసి రైల్వే కోర్టులో ప్రవేశ పెట్టగా రైల్వే మెజిస్ట్రేట్ రిమాండ్కు పంపారని ఎస్సై సత్తిబాబు తెలిపారు. నిందితునిపై రాజమహేంద్రవరం, సామర్లకోట జీఆర్పీ పోలీసు స్టేషన్లో కేసులు ఉన్నాయన్నారు. -
సీబీఎస్ఈ ఫలితాలలో శశి విద్యార్థుల విజయ దుందుభి
నిడదవోలు : సీబీఎస్ఈ విడుదల చేసిన పదో తరగతి బోర్డు పరీక్షా ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారని శశి విద్యాసంస్థల చైర్మన్ బూరుగుపల్లి రవికుమార్ తెలిపారు. పదో తరగతి విద్యార్ధి ఎస్.జైరామ్ 490 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచాడని, కె నందన్ శ్యామ్, ఎన్ లాస్య ప్రియలు 486 మార్కులు, బి. వరసిద్ది వెంకటయశ్వంత్, డీఎస్ శ్రీ హర్షలు 485 మార్కులు, జి.ధన్విశ్రీరెడ్డి 484 మార్కులు, సీహెచ్ నమ్రత్ సాయికిశోర్, జి.జనిత, టి. మానస 482 మార్కులు, టి. బెర్నిస్ దియ 481 మార్కులు సాధించారు. 450 మార్కులకు పైన 130 మంది విద్యార్థులు, 400 మార్కులు పైన 380 మంది విద్యార్థులు సాధించారని రవికుమార్ తెలియజేశారు. విద్యార్థులను, తల్లిదండ్రులను, అధ్యాపక బృందాన్ని శశి విద్యాసంస్థల వైస్ చైర్మన్ లక్ష్మీ సుప్రియ, ప్రిన్సిపాల్ షేక్ షానూర్, అకడమిక్ ఇన్చార్జిలు ప్రసంశించారు. -
జనసేన నేత శ్రీరామ్పై అట్రాసిటీ కేసు పెట్టాలి
గొల్లపాలెం పోలీస్ స్టేషన్ ఎదుట బాధిత మహిళ, దళిత సంఘాల నేతల ఆందోళన కాజులూరు: దళిత మహిళను కులం పేరుతో దూషించి అవమానించిన కాజులూరు జనసేన నాయకుడు అన్యం శ్రీరామచంద్రమూర్తి (శ్రీరామ్) పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసి అరెస్టు చెయ్యాలంటూ గురువారం బాధిత మహిళతో కలసి పలువురు దళిత సంఘాల నేతలు గొల్లపాలెం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధిత మహిళ సన్నపు లక్ష్మీ మాట్లాడుతూ తన భర్త కిరణ్, ఆకుల నాగదేవి భర్త నాయుడు, నామా సుబ్బారావు కలసి చేస్తున్న టైల్స్ వ్యాపారం లావాదేవీలలో తలెత్తిన వివాదంపై తమకు తగువు చెప్పాలని తానూ, ఆకుల నాగదేవి ఈ నెల తొమ్మిదవ తేదీ గురువారం గ్రామానికి చెందిన అన్యం శ్రీరామ్ ఇంటికి వెళ్లామన్నారు. అయితే అతను మహిళలమని కూడా చూడకుండా అమానుషంగా ప్రవర్తిస్తూ కులంపేరుతో దూషించి ఇంటి నుంచి నెట్టివేశారన్నారు. దీనిపై ఈ నెల 11వ తేదీన కులసంఘాల నేతలతో వచ్చి గొల్లపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. పోలీసులు కేసు నమోదు చెయ్యకుండా తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. అన్యం శ్రీరామ్ కూటమి పార్టీలో ఉన్న దళిత నాయకులతో ప్రెస్మీట్లు పెట్టించి తమపై తప్పుడు ప్రసంగాలు చేయిస్తున్నారన్నారు. దళితుల మధ్య విభేదాలు సృష్టించి గొడవలు ప్రేరేపిస్తున్నారన్నారు. అనంతరం వైఎస్సార్ సీపీ మండల ఎస్సీ సెల్ కన్వీనర్ పోలినాటి సూర్యచంద్రం, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు మాత సుబ్రహ్మణ్యం, జేబీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు ఏనుగుపల్లి కృష్ణ, అఖిల భారత స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షుడు పత్తిపాటి బుల్లిరాజు, మాలమహానాడు అధ్యక్షుడు సిద్దాంతుల కొండబాబు మాట్లాడుతూ తామంతా బాధితులకు బాసటగా ఉన్నామని, పోలీసులు తగిన చర్యలు తీసుకొనకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. దళిత నాయకులు పోతురాజు బాబురావు, సీపీఐఎంఎల్ జిల్లా కార్యదర్శి గుబ్బల ఆదినారాయణ, బుల్లెట్ రాజు, పుల్లారావు పాల్గొన్నారు. -
సత్యదేవుని హుండీ ఆదాయం రూ.1.02 కోట్లు
అన్నవరం: వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి హుండీల ద్వారా గత 21 రోజులకు గాను 1,02,43,731 ఆదాయం వచ్చింది. దేవస్థానంలోని హుండీలలో భక్తులు సమర్పించిన కానుకలను గురువారం లెక్కించారు. నగదు రూ.96,43,314 రాగా, చిల్లర నాణేలు రూ.6,00,417 వచ్చాయని ఆలయ చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ నల్లం సూర్య చక్రధర్రావు తెలిపారు. వీటితో బాటు బంగారం 26.5 గ్రాములు, వెండి 280 గ్రాములు వచ్చినట్టు చెప్పారు. రోజుకి సగటున రూ.4,87,796 హుండీ ఆదాయం వచ్చినట్లు తెలిపారు. అమెరికా డాలర్లు రెండు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దీనార్లు 15, ఒమెన్ బైసా వంద, ఇంగ్లాండ్ పౌండ్లు ఐదు, మలేషియా రింగిట్స్ ఐదు, డెన్మార్స్ క్రోనార్స్ వంద లభించాయని తెలిపారు -
ఈ వంతెన ర్యాలిపోవలసిందేనా?
● ఎప్పుడు కూలుతుందో తెలియని స్థితిలో ర్యాలి వంతెన ● పాలకుల నిర్లక్ష్యంపై ప్రజల ఆందోళన ఆత్రేయపురం: ఏడు శతాబ్దాలకు ముందు నిర్మించిన ర్యాలి వంతెన శిథిలస్థితికి చేరి ఎప్పుడు కూలుతుందోనని ఈ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొంచి ఉన్న ప్రమాదాన్ని పట్టించుకోరా? అంటూ పాలకుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నారు. 1950 ప్రాంతంలో అప్పటి వాహనాల రద్దీ కనుగుణంగా నిర్మించిన వంతెన ఇప్పుడు ప్రయాణించే వాహనాల రద్దీని తట్టుకోలేకపోతోంది. ఇరుకుగా ఉండి, ఎదురుగా వాహనం వస్తే వంతెనపై ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. ఈ వంతెన రక్షణ గోడలు బీటలు వారి పూర్తిగా పాడయ్యాయి. రాత్రి వేళ విద్యుత్ దీపాలు సైతం లేకపోవడంతో వాహనదారులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణాలు సాగిస్తున్నారు. గ్రామంలోకి వెళ్లే రహదారి సైతం ఇరుకుగా, అసౌకర్యంగా ఉంది. రెండు లేన్లుగా అభివృద్ధి చేసేందుకు గత ప్రభుత్వంలో ప్రతిపాదనలు ఈ వంతెన రహదారి అటు రాజవరం– పొదలాడ రాష్ట్రీయ రహదారిని ఇటువైపు అమలాపురం– బొబ్బర్లంక రాష్ట్రీయ రహదారిని కలుపుతోంది. ఈ వంతెనపై పలు వాహనాల్లో నిరంతరం ఇసుక, ఇటుక రవాణా జరుగుతోంది. గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఈ వంతెనను రెండు లేన్లుగా అభివృద్ధి చేసి రెండు రాష్ట్రీయ రహదారులకు కలపాలని నిర్ణయించారు. వంతెన నిర్మాణానికి అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ప్రతిపాదనలు సిద్ధం చేసి, ప్రభుత్వ అనుమతిని సైతం పొందారు. ప్రభుత్వం మారడంతో ఆ ప్రతిపాదనలు మరుగున పడ్డాయి. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు ఈ వంతెన నిర్మాణంపై దష్టి సారించ లేదు. ప్రభుత్వం దృష్టి సారించాలి ఈ వంతెన గురించి పలుమార్లు జిల్లా పరిషత్ సమావేశాలలో ప్రస్తావించాను. చంద్రబాబు ప్రభుత్వం వంతెన నిర్మాణంపై దృష్టి సారించకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. – బోనం సాయిబాబు, ఆత్రేయపురం జెడ్పీటీసీ సభ్యుడు ప్రతిపాదనలు పంపాం 1954లో ఊబలంక నుంచి ర్యాలి వెళ్లే రోడ్డులో దీన్ని సింగల్ లైన్ వంతెనగా నిర్మించారు. రెండు వరుసల సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.9.00 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. – జి.రాజేంద్రప్రసాద్, డీఈ, రోడ్లు భవనాల శాఖ, కొత్తపేట వెంటనే నిర్మించాలి ర్యాలి సుమారు 20వేల జనాభా గల అతి పెద్ద గ్రామం. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడి ఆలయాలకు టూరిస్టులు వస్తున్నారు. వెంటనే వంతెనను నిర్మించాలి. పి.ఎస్.ఆర్.జైపాల్, ర్యాలి, ఎంపీటీసీ సభ్యులు భక్తులకు గోతుల దర్శనం ర్యాలి గ్రామంలో 11 శతాబ్దం నాటి చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ జగన్మోహిని కేశవస్వామి ఆలయానికి నిత్యం వాహనాల్లో వందల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడే ఆలయాల కూడలికి వచ్చే సింగిల్ రోడ్డు గోతులతో అధ్వానంగా ఉంది. ర్యాలి సమీపంలో అంకంపాలెం, నార్కెడిమిల్లి వంటి జనసాంద్రత గల గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి నిత్యం రైతులు అరటి గెలలను సైకిళ్లపై రావులపాలెం మార్కెట్ యార్డుకు తరలిస్తూ ఉంటారు. ఇటీవల జరిగిన పంచాయతీల పునర్వ్యవస్థీకరణలో ర్యాలి గ్రామం జిల్లాలోని అతిపెద్ద రూర్బన్ గ్రామంగా గుర్తించారు. -
‘షిర్డీసాయి’ హవా
రాజమహేంద్రవరం సిటీ: ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాలలో శ్రీ షిర్డీసాయి విద్యా సంస్థల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించి జయ కేతనం ఎగురవేసినట్లు షిర్డీసాయి విద్యా సంస్థల డైరెక్టర్ టి. శ్రీవిద్య తెలిపారు. ప్రధమ సంవత్సరం ఎంపీసీలో కె.అక్షయ, కె.పావని, జి.సౌమ్య, జి.పాల్, షణ్ముఖ శ్రీ, సాన్వి ప్రియ, ప్రతీష్, సాహితి, ఐశ్వర్య, దీపక్, ప్రజ్ఞ 11 మంది 470 మార్కులకు 465 సాధించి ప్రధమ స్థానం కై వసం చేసుకోగా, 17 మంది 464 మార్కులు, 22 మంది 463, 35 మంది 462, 43 మంది 461, 65 మంది 460, 116 మంది 450, 220 మంది 400 మార్కులు సాధించినట్లు శ్రీవిద్య వివరించారు. ద్వితీయ సంవత్సరం ఫలితాలలో కె.ప్రవల్లిక, ఎన్.లలిత 989 మార్కులతో ప్రధమ స్థానం కై వసం చేసుకోగా, ఎస్.నిత్యశ్రీ, జె.చాతుర్య, వి.నిత్యశ్రీ, బ్లెస్సీ గ్లాడిస్ 988 మార్కులు సాధించారు. 19 మంది 980 మార్కులు, 50 మంది 970, 104 మంది 950, 170 మంది 900 మార్కులు సాధించారన్నారు. తమ విద్యార్థులు అత్యుత్థమ ఫలితాలతో 100 శాతం ఉత్తీర్ణత సాధించడంపై విద్యాసంస్థల చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులను, వారి ఉత్తీర్ణతకు కృషి చెసిన అధ్యాపక బృందాన్నీ ఆయనతో పాటు డైరెక్టర్ శ్రీవిద్య, లక్ష్యా డీన్ చంద్రశేఖర్ అభినందించారు. -
అత్యధిక కేసులు పరిష్కరించాలి
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): వచ్చే నెల తొమ్మిదో తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో అత్యధిక కేసులు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎన్.శ్రీలక్ష్మి పోలీసులకు సూచించారు. బుధవారం సంస్థ కార్యాలయంలో ఆమె, తూర్పు గోదావరి జిల్లా ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి షేక్ జానీ బాషా సమన్వయశాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో విచారణలో ఉన్న ఖైదీల కేసుల దర్యాప్తు, చార్జ్ షీట్ దాఖలు విషయంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పోలీసు అధికారులకు పలు సూచనలిచ్చారు. బెయిల్ / జామీను విషయంలో ఖైదీలు ఎదుర్కొంటున్న సమస్యలపై తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు. ఈ సమావేశంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రెవెన్యూ, పోలీసు అధికారులు, కేంద్ర కారాగారం, ప్రత్యేక మహిళా కారాగారం అధికారులు పాల్గొన్నారు. -
తమిళనాడులో గోకివాడ యువకుడి మృతి
పిఠాపురం రూరల్: మండలం గోకివాడకు చెందిన మలిరెడ్డి సూర్యనారాయణ (27) తమిళనాడులో మృతి చెందాడు. విల్లుపురం రైల్వేస్టేషన్ సమీపంలో అతడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు అక్కడి రైల్వే పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. డిగ్రీ చదివిన సూర్యనారాయణ ఉద్యోగం నిమిత్తం పదిరోజుల క్రితం చైన్నె వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. వీర్రాజు, సత్యవేణి దంపతుల ముగ్గురు కుమారుల్లో రెండో సంతానం సత్యనారాయణ. శ్రీ చైతన్య విద్యార్థుల విజయభేరి రాజమహేంద్రవరం సిటీ: ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాల్లో స్థానిక శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ విద్యార్థులు విజయభేరి మోగించారని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఎం.హరి ప్రసాద్ తెలిపారు. జూనియర్ ఇంటర్ ఫలితాలలో ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు 467 మార్కులు సాధించిన ముత్తుర్తి అజయ్ లక్ష్మణ్ రాజమహేంద్రవరం టౌన్ ఫస్ట్ మార్కుగా, స్టేట్ థర్డ్ మార్క్గా నిలిచాడు. అలాగే 466 మార్కులతో ఇద్దరు విద్యార్థులు పంపన జ్ఞాన భాగ్య లక్ష్మీ సౌజన్య, కాలెపు సుష్మా సాయి విజేతలుగా నిలిచారు. ఏడుగురు విద్యాఽర్థులు 465 మార్కులు, 14 మంది 464, 12 మంది 463, 10 మంది 462, 13 మంది 461, 16 మంది 460, 75 మంది 460 మార్కులు సాధించారన్నారు. జూనియర్ బైపీసీ విభాగంలో ఎల్లెన్ జాయ్ 455 మార్కులకు 450 సాధించి స్టేట్ థర్డ్ ర్యాంకర్గా నిలిచాడన్నారు. ముగ్గురు 449, ఒకరు 448, ఇద్దరు 447 సాధించారన్నారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో లాస్య శ్రీ సాయి 991 మార్కులు సాధించగా 22 మందికి 980 మార్కులు దాటి వచ్చాయన్నారు. సీనియర్ బైపీసీలో ఇద్దరు 991, మార్కులు సాధించగా 16 మంది 980 మార్కులు దాటి విజయం సాధించారన్నారు. ఈ ఫలితాలు సాధించిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఆయన అభినందలు తెలిపారు. సీబీఎస్ఈ ఫలితాల్లో ‘లక్ష్య’ ఘనత బాలాజీచెరువు (కాకినాడ సిటీ): సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ చూపారని పాఠశాల డైరెక్టర్ నల్లమిల్లి సుగుణారెడ్డి బుధవారం తెలిపారు. ఫలితాల్లో వందకు వందశాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. రిహాన్ సన (97.6 శాతం) సాధించి స్కూల్ టాపర్గా నిలిచారన్నారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యాసంస్థల అధినేత నల్లమిల్లి శేషారెడ్డి మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో ముందుకు వెళ్లడానికి చదవుతో పాటు జీవన నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్ చాలా అవసరమన్నారు. విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ వందన బోహ్రా తదితరులు అభినందించారు. శ్రీ ప్రకాష్ విద్యార్థుల ప్రతిభ బాలాజీచెరువు: సీబీఎస్ఈ ఫలితాల్లో శ్రీ ప్రకాష్ విద్యార్థులు ప్రతిభ చూపారని పాఠశాల సీనియర్ ప్రిన్సిపాల్ ఎంవీవీఎస్ మూర్తి తెలిపారు. విద్యార్థులు ఎం.హాసిని 482, ఎంఎస్వీ సాత్విక్ 482, ఎ.రిషితారెడ్డి 481, సీహెచ్ విజయదుర్గ 478, ఎన్.శర్వన్ రాకేష్ 477, పి.భానుప్రతాప్ 477 మార్కులు సాధించారన్నారు. నూటికి నూరుశాతం ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి పాఠశాల ఘనత పెంచారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను విద్యాసంస్థల అధినేత సీహెచ్వీకే నరసింహారావు, సంయుక్త కార్యదర్శి సీహెచ్ విజయప్రకాష్ అభినందించారు. ఇంటర్ ఫలితాలలో శశి విజయభేరి నిడదవోలు: 2026 ఇంటర్ ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలతో సత్తా చాటారని వేలివెన్ను శశి విద్యాసంస్థల చైర్మన్ బూరుగుపల్లి రవికుమార్ తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు బి.ఘర్మా నాయక్, వీఎస్వీ సాత్విక్, జె.లాస్య, ఐ.నాగకీర్తి, ఏసీహెచ్ శ్రీసత్య వివేక్, ఎ.విజయలక్ష్మి, సీహెచ్ తేజశ్రీ 467 మార్కుల చొప్పున సాధించారు. జూనియర్ ఇంటర్ బైపీసీలో 455 మార్కులకు యస్. నందిని, ఎంఎల్ఎస్ లక్ష్మీ లిఖిత, హెచ్. తరణిదేవి 451 చొప్పున, పి.జానూష 450 మార్కులు, కేబీ శ్రీపావని, యన్. దేవి 450 మార్కుల చొప్పున, 465 పైన 58 మంది, 460 పైన 318, 430 పైన 1175 మంది, 400 పైన 1572 మంది సాధించారని ఆయన తెలిపారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో వెయ్యి మార్కులకు వై.రాహుల్ 992, వై. పురంధేశ్వర రెడ్డి, కెబీఎస్ వెంకట ఆచారి, సీహెచ్ఆర్ఎస్ సుమశ్రీ, యం.నవ్యశ్రీ 991 చొప్పున సాధించారు. సీనియర్ ఇంటర్ బైపీసీలో వెయ్యి మార్కులకు యస్. స్వర్ణాంజలి, పి.అమృత, ఎఎన్ వాసవి అలేఖ్య 990 చొప్పున, 990 పైన 25 మంది, 980 పైన 337 మంది, 950 పైన 972 మంది, 900 పైన 1496 మంది సాధించారని ఆయన తెలిపారు. ఉత్తమ ఫలితాల సాధించిన విద్యార్థులను విద్యాసంస్థల వైస్ చైర్మన్ బూరుగుపల్లి లక్ష్మి సుప్రియ అభినందించారు. -
ఇంటర్ ఫలితాల్లో ‘ప్రగతి’ జయభేరి
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంటర్మీడియెట్ ఫలితాల్లో ప్రగతి విద్యా సంస్థల విద్యార్థులు ప్రతిభ చూపారని విద్యాసంస్థల చైర్మన్ నూతలపాటి పూర్ణచంద్రరావు బుధవారం తెలిపారు. ఎంపీసీ మొదటి సంవత్సరంలో పీఎస్డీయూ మాధవి షర్మిల 470కి 466, మట్టి స్వప్నిక 465, పైల మహేశ్వరి 465, వాసంశెట్టి హర్షిత 465, బొజ్జ మాన్యశ్రీ 465 మార్కులు సాధించారన్నారు. జూనియర్ బైపీసీలో 455కి చిట్టూరి మేఘన 450, తూరంగి హాసిని 450, సీఈసీలో ఎస్.పూజిత శ్రీదుర్గ 493, కొల్లు సత్యతేజ 490 మార్కులు సాధించారన్నారు. సీనియర్ ఎంపీసీలో ఆర్ఎల్డీఎన్ గాయత్రి 989 మార్కులు, పిల్లా హర్షిణి 989, వంకా స్వరూప్బాబు 989, జీఎం శ్రీదుర్గ 989, బైపీసీలో ఫాజీలా ఖురేషిబేగం 989 సాధించారన్నారు. వీటితో పాటు జూనియర్ ఎంపీసీలో 460కు పైగా 60 మంది, జూనియర్ బైపీసీలో 440కు పైగా 15 మంది మార్కులు సాధించారన్నారు. కాకినాడ, పెద్దాపురం, జగపతినగరం, రాజమండ్రి బ్రాంచ్లలో నూరుశాతం ఉత్తీర్ణతతో మంచి మార్కులు సాధించారన్నారు. విద్యార్థులను ప్రగతి డైరెక్టర్లు హిమబిందు, శ్వేతబిందు, ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు అభినందించారు. -
జాతీయ రహదారిపై టిప్పర్ బీభత్సం
● అదుపు తప్పిన వాహనం నుంచి పడి డ్రైవర్ మృతి ● క్లీనర్కు తీవ్ర గాయాలు ● బాధితులు ఒడిశావారిగా గుర్తింపు తొండంగి: బెండపూడి శివారు తమ్మయ్యపేట జాతీయ రహదారిలోని రావికంపాడు విద్యుత్ సబ్స్టేషన్ జంక్షన్ వద్ద బుధవారం టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు అన్నవరం వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న టిప్పర్ లారీ అతివేగంగా వెళ్తూ అక్కడి జంక్షన్ వద్ద ఉన్న డివైడర్ను ఢీ కొట్టింది. దీంతో అందులోని డ్రైవర్ సంతోష్కుమార్ ఫాలో (56) రోడ్డుపై పడిపోయాడు. లారీ ఆగకుండా సెంట్రల్ డివైడర్ను దాటి రాజమండ్రి వైపు నుంచి అన్నవరం వైపు వస్తున్న రహదారిని దాటుకుని రేకుల షెడ్డును ఢీకొట్టి ఆగింది. దీంతో విద్యుత్ వైర్లు కూడా తెగిపడ్డాయి. ఈ ఘటనలో డ్రైవర్తో పాటు, క్లీనర్ మంగరాజ్ గొల్లారి తీవ్రగాయాలు కాగా, డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే హైవే సిబ్బంది తెగిన విద్యుత్ తీగల నుంచి స్థానికులను అప్రమత్తంచేసి దూరంగా పంపారు. క్లీనర్ను వైద్యం నిమిత్తం అంబులెన్స్లో ప్రత్తిపాడు ఏరియా ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ ఒడిశా రాష్ట్రం కోరాపుట్ వాసులుగా పోలీసులు తెలిపారు. జి.మాడుగుల నుంచి రాజమహేంద్రవరానికి లారీ మరమ్మతుల నిమిత్తం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వారు తెలిపారు. తొండంగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా దుకాణాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమేరాల్లో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. డ్రైవర్ నిద్రమత్తా, లేక సాంకేతిక లోపమా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈ ఘటన సమయంలో హైవే మరమ్మతులు చేస్తున్న సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనతో సుమారు గంటపాటు వాహనాల ట్రాఫిక్ నిలిచిపోయింది. హైవే సిబ్బంది, పెట్రోలింగ్ సిబ్బంది వాహనాలను క్రమబద్దీకరించడంతో వాహనాల రాకపోకలు యథావిధిగా సాగాయి. -
సిలిండర్ డెలివరీ చేయకపోవడంపై ఫిర్యాదు
ఆత్రేయపురం: ఇటీవల కాలంలో వినియోగదారులు గ్యాస్ సిలిండర్లు సక్రమంగా అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా ఆత్రేయపురం అరుంధతి పేటకు చెందిన ఉందుర్తి మనోహరం బుధవారం పోలీసులకు తాను సిలిండర్ బుక్ చేసుకున్నప్పటికీ డెలివరీ చేయలేదని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. రాజమహేంద్రవరం లక్ష్మీ తులసి భారత్ గ్యాస్ ఏజెన్సీ వినియోగదారుడు ఉందుర్తి మనోహరం 10 రోజుల క్రితం సిలిండర్ బుక్ చేసుకున్నాడు. మూడు రోజుల క్రితం ఓటీపీ లేకుండా, సిలిండర్ తీసుకోకుండా డెలివరీ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీనిపై తనకు సిలిండర్ అందించకుండా మోసం చేసిన గ్యాస్ ఏజెన్సీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఇటీవల ఆత్రేయపురంలో పలువురు వినియోగదారులకు బుక్ చేసుకున్నప్పటికీ సిలిండర్లు అందించకుండా బ్లాక్ లో ఏజెన్సీ వ్యక్తులు అమ్ముకుంటున్నట్లు ఆరోపిస్తున్నారు. -
నవయుగ నాటక వైతాళికుడు!
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఆయన సీ్త్ర విద్యోద్ధారకుడు.. బాలికా విద్యకు స్ఫూర్తి ప్రదాత.. వితంతు వివాహాలు జరిపించిన సంస్కరణవాది.. సమాజ సేవ కోసం ‘హితకారిణి’ని స్థాపించిన సేవామూర్తి. వ్యవహార ధర్మబోధిని పేరుతో తొలి ప్రదర్శిత నాటకం ప్రదర్శించిన నాటక కర్త.. ఇంతటి ఘనత గోదారి తీరాన రాజమహేంద్రిలో నడయాడిన నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం పంతులుకే సొంతం. 1848 ఏప్రిల్ 16న రాజమహేంద్రవరంలో పున్నమ్మ, సుబ్బారాయుడు దంపతులకు జన్మించిన ఆయన 179వ జయంత్యుత్సవాలకు నగరం ముస్తాబైంది. ‘కావ్యేషు నాటకం రమ్యం’ అని భారతీయ సాహితీకారులు పేర్కొన్నా.. ‘ఈ ప్రపంచమే ఒక రంగస్థలం, సీ్త్రపురుషులందరూ పాత్రధారులు’ అని ఆంగ్ల కవి షేక్స్పియర్ ప్రకటించినా, నాటకం ఒక విలక్షణ ప్రక్రియగా తన ప్రత్యేకతను, ప్రాభవాన్ని నేటికీ కోల్పోలేదు. ఒకనాడు సమాజ చైతన్యానికి ఊపిరులూదిన నాటకరంగం సినిమాల రాకతో కొంత ప్రాభవం కోల్పోయిన మాట నిజమే. అయినప్పటికీ నేటికీ రంగస్థలాన్ని ఆదరిస్తున్న కళాభిమానులకు కొదవు లేదన్నదీ అంతే నిజం. రాజమహేంద్రవరం పురిటిగడ్డగా సామాజిక చైతన్యంతో పాటు, పురాణ సాహిత్యంపైనా సామాన్యుల్లో ఆసక్తి కలిగించినది నాటకరంగమే. రాజమహేంద్రవరం కేంద్రంగా యుగపురుషుడు కందుకూరి వీరేశలింగం రచించిన తొలి ప్రదర్శిత నాటకం ‘వ్యవహార ధర్మబోధిని’ నాడు ఎంతో సంచలన సృష్టించింది. సామాజిక రుగ్మతలపై కందుకూరి సంధించిన మరో అస్త్రం ‘బ్రాహ్మీ వివాహం‘ చాందసవాదులను కలవరపరిచింది. అదే సమయంలో కళింగప్రాంతం నేపథ్యంలో గురజాడ వారి కన్యాశుల్కం నేటికీ నిత్య నూతమే. కళాప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మీనరసింహం, తిరుపతి వేంకట కవులు పౌరాణిక నాటకాలతో తెలుగువారిని ఆకట్టుకుంటే, హాస్యబ్రహ్మ భమిడిపాటి కామేశ్వరరావు, ఇతర ప్రముఖులు నాటకరంగాన్ని పరిపుష్టం చేశారు. నాటకరంగ దినోత్సవంగా ప్రకటన నాటకరంగం తన ప్రాభవాన్ని కోల్పోకూడదని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వ హయాంలో అప్పటి రాజమహేంద్రవరం ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు అభ్యర్థనపై కందుకూరి జన్మదినాన్ని నాటకరంగ దినోత్సవంగా ప్రకటించారు. మొట్టమొదటి వితంతు వివాహం 1881 డిసెంబర్ 11న వీరేశలింగం ఇంటిలో మొట్టమొదటి వితంతు వివాహం జరిపారు. బాల వితంతువు గౌరమ్మ, రేబూడికి చెందిన గోగులపాటి శ్రీరాములకు వివాహం జరింపించారు. వంట చేయడానికి ఎవరూ ముందుకు రాకపోతే భార్య రాజ్యలక్ష్మమ్మ తానే స్వయంగా వంట చేశారు. కందుకూరి దంపతులు నివసించిన పాత ఇల్లు, నేటి నాటక నిలయంవీరేశలింగం రచించిన పుస్తకాలు నాటక నిలయంగా కందుకూరి గృహం నాటకానికి తాహి సాహిత్యం అని ఆర్యోక్తి. నాటకం లేకపోతే అది సాహిత్యమే కాదు. తెలుగు అక్షరానికి శ్రీకారం చుట్టినట్లే, తెలుగు నాటక రంగం కూడా నడక నేర్చింది ఇక్కడే. ఆ ఉద్దేశంతోనే తెలుగు నాటకం నిలయాన్ని ప్రారంభించారు. ఆనంద్ గార్డెన్లోని కందుకూరి నివశించిన ఇంట్లో జక్కంపూడి విజయలక్ష్మి ప్రోత్సాహంతో లక్ష్మీపార్వతిచే ఈ నాటక నిలయాన్ని ప్రారంభించారు. తెలుగు నాటకంలో జరిగిన పరిశోధనలు, అలాగే సాహిత్యాన్ని ఒకచోట నిక్షిప్తం చేయాలన్న ఉద్దేశంతో ఈ నాటక నిలయాన్ని కందుకూరి ఇంట్లో ప్రవేశ పెట్టారు. ఇది కందుకూరి కుటుంబానికి చెందిన కార్యక్రమంలా కాకుండా యావత్ ఆంధ్ర ప్రజలంతా పండగలా నిర్వహించాల్సిన అవసరం ఉంది. కందుకూరి రచనలలో కొన్ని.. మార్కండేయ మకుటంతో శతకం, శ్రీరాజమహేంద్ర పురవర గోపాల వంటి పద్య కావ్యాలు, వ్యవహార దర్మభోధిని, చమత్కార రత్నావళి, అభిజ్ఞాన శాకుంతలం వంటి నాటకాలు, రాజశేఖర చరిత్రము, సత్యరాజా పూర్వదేశ యాత్రలు వంటి రచనలు, సాంఘిక దురాచారాలపై అనేక రచనలు చేశారు. నాటకాన్ని ఆదరించే రోజులు రావాలి దసరా, వినాయక చవితి లాంటి పండగలే నేడు నాటకాలను ప్రదర్శిస్తున్నారు. సత్య హరిశ్చంద్ర, వరవిక్రయం, చింతామణి, పాండవోద్యోగ విజయంలోని పద్యాలు నాటి తెలుగువారి నాలుకలపై నాట్యమడేవి. ఆ రోజులే వేరు. ఆ రోజులు మళ్లీ రావాలి. పరిషత్ల పోటీల వల్లే ఇంకా నాటకాలు మనగలుగుతున్నాయి. – డీఎస్పీ రావు, నాటక కళాకారులుప్రపంచమే నాటక రంగం ప్రపంచమే పెద్ద నాటక రంగం. సీ్త్ర, పురుషులు ఇద్దరూ పాత్రధారులే. విభిన్న సంస్కృతులు, జాతులను కలిపిన కళావేదికే రంగస్థలం. నన్నయ కాలంలోనే నాటక ప్రదర్శనలు ఉన్నాయి. తెలుగులో తొలి నాటక కర్త, ప్రయోక్త రెండూ కందుకూరే. నేడు అడపాదడపా నాటక ప్రదర్శనలు తప్ప, నిరంతరం థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ని స్మరించుకోవడం కనుమరుగవుతోంది. సమాజ ప్రతిబింబమైన నాటకాన్ని అందరూ కాపాడుకోవాలి. – డాక్టర్ పీవీబీ సంజీవరావు, నాటక సాహిత్య పరిశోధకులు సాంఘిక నాటకాలకు ఆద్యుడు కందుకూరి వ్యవహార ధర్మబోధినితో సంచలనం ఆయన జనన తేదీనే నాటకరంగ దినోత్సవంగా ప్రకటించిన వైఎస్సార్ నేడు 179వ జయంతి -
ఇంటర్ ఫలితాల్లో జిల్లాకు 6వ స్థానం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఇంటర్ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా 6వ స్థానంలో నిలిచింది. ప్రథమ సంవత్సరంలో ఉత్తీర్ణత ఐదు శాతం తగ్గినా, ద్వితీయ సంవత్సరంలో 9 శాతం ఉత్తీర్ణత పెరిగింది. జిల్లాలో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 25 వరకు జరిగాయి. ఈ పరీక్షలకు మొదటి సంవత్సరం విద్యార్థులు 19,977 మంది హాజరుకాగా, 16,439 మంది ఉత్తీర్ణులయ్యారు. 82 శాతం ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది కంటే ఉత్తీర్ణత 5 శాతం తగ్గింది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 18,337 మంది పరీక్షలు రాయగా 15,707 మంది ఉత్తీర్ణులయ్యారు. 86 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. గత సంవత్సరంతో పోలిస్తే 9 శాతం ఉత్తీర్ణత పెరిగింది. 2025లో జిల్లా ప్రథమ సంవత్సరంలో 77 శాతం ఉత్తీర్ణతతో 5వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 87 శాతం ఉత్తీర్ణతతో 4వ స్థానంలో నిలిచింది. 2024లో ప్రథమ సంవత్సరంలో 75 శాతం ఉత్తీర్ణతతో 5వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 85 శాతం ఉత్తీర్ణతతో 5వ స్థానం సాధించింది. విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తూ సప్లిమెంటరీ పరీక్షలను మే 21 నుంచి జూన్ 4 వరకు నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. కళాశాలల వారీ ఇలా.. మొదటి సంవత్సరంలో ఎయిడెడ్ కళాశాలల నుంచి 95 మంది హాజరుకాగా 17 మంది పాసై 17.8 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఏపీఎస్డబ్ల్యూఆర్ కళాశాలల్లో 481 మందికి 401 మంది పాసై 83.3 శాతం, ప్రభుత్వ కళాశాలల్లో 1,794 మందికి 780 మంది పాసై 43.4 శాతం, హైస్కూలు ప్లస్లో 447 మందికి 178 మంది పాసై 39.8 శాతం, ప్రైవేట్, అన్ ఎయిడెడ్ కళాశాలల్లో 17,676 మందికి 15,063 మంది పాసై 85.2 శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో ఎయిడెడ్ కళాశాలల నుంచి 114 మంది విద్యార్థులు హాజరుకాగా 41 మంది పాసై 39.5 శాతం సాధించారు. ఏపీఎస్డబ్ల్యూఆర్ కళాశాలల్లో 420 మందికి 389 మంది పాసై 92.6 శాతం, ప్రభుత్వ కళాశాలల్లో 1,508 మందికి 926 మంది పాసై 61.4 శాతం, హైస్కూలు ప్లస్లో 342 మందికి 180 మంది పాసై 52.6 శాతం, ప్రైవేట్, అన్ ఎయిడెడ్ కళాశాలల్లో 16,370 మందికి 14,171 మంది పాసై 86.5 శాతం ఉత్తీర్ణత సాధించారు. 20 నుంచి రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో అనుమానాలుంటే ఈ నెల 20 నుంచి 27వ తేదీ వరకు రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్కు దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు ఆర్ఐవో ఐ.శారద తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 82, ద్వితీయ సంవత్సరం 86 శాతం పాస్ గత ఏడాదితో పోలిస్తే ప్రథమ సంవత్సరంలో 5 శాతం తగ్గిన ఉత్తీర్ణత ద్వితీయ సంవత్సరంలో 9 శాతం పెరుగుదల నూరుశాతం ఫెయిల్ పెదపూడి: జి.మామిడాడలోని ప్రభుత్వ మహిళా ఇంటర్మీడియెట్ కాలేజీ (ప్లస్ 2) విద్యార్థులు నూరుశాతం ఫెయిల్ అయ్యారు. ఆ కాలేజీ ప్రిన్సిపాల్ అప్పలాచార్యులు మాట్లాడుతూ తమ కళాశాల నుంచి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలకు మొత్తం 25 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. వారిలో ఫస్ట్టియర్ సీఈసీ నలుగురు, సెకండియర్ 11, సెకండియర్ ఎంపీసీ 10 మంది ఉన్నారన్నారు. వీరందరూ పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని ఆయన తెలిపారు. -
ఈసారైనా.. కళ కట్టేనా!
అన్నవరం: ఈ నెల 26 నుంచి మే రెండో తేదీ వరకూ సత్యదేవుని వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాలు జరగనున్నాయి. ఏర్పాట్లలో చోటు చేసుకున్న లోపాలతో గత ఏడాది ఈ ఉత్సవాలు పెద్దగా కళ కట్టలేదు. ఈ ఏడాదైనా ఆ లోపాలను సరి చేసి, ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహించాలని భక్తులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ శుభ వేడుకల నిర్వహణపై గురువారం రత్నగిరిపై సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. పెద్దాపురం ఆర్డీఓ ఎన్.శ్రీధర్ అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు జరగనున్న ఈ సమావేశానికి పెద్దాపురం డీఎస్పీ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, నూతన ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తదితరులు హాజరు కానున్నారు. ఉత్సవాల నిర్వహణకు దేవస్థానం తరఫున చేపడుతున్న ఏర్పాట్లను ఈఓ ఈ సందర్భంగా వివరించనున్నారు. ఈ ఉత్సవాలకు వేలాదిగా భక్తులు తరలి రానున్న నేపథ్యంలో చేయాల్సిన ఇతర ఏర్పాట్లపై ఈ సమన్వయ సమావేశంలో చర్చించనున్నారు. వీటిపై దృష్టి పెడితే మేలు ఫ కల్యాణోత్సవాల మొదటి రోజున స్వామి, అమ్మవారిని వధూవరులను చేసే కార్యక్రమంలో తూతూమంత్రంగా నలుగురికి తాంబూలం ఇచ్చి మమ అనిపించేస్తున్నారు. ఈ కాార్యక్రమానికి వచ్చే మహిళలే 25 మందికి మించి ఉండరు. వారందరికీ తాంబూలం ఇస్తే సంతోషిస్తారు. ఫ ఈ నెల 27వ తేదీ రాత్రి 9.30 గంటలకు జరిగే సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవానికి వేలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. కానీ, స్వామివారి వార్షిక కల్యాణ వేదిక ముందున్న విశ్రాంతి షెడ్డులో సుమారు 2 వేల మంది మాత్రమే కల్యాణాన్ని తిలకించే అవకాశం ఉంది. మిగిలిన వారు కూడా ఈ ఉత్సవాన్ని తిలకించేందుకువ వీలుగా ఆ షెడ్డుకు ఇరువైపులా పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేయాలి. ఫ ఆ రోజున ట్రాఫిక్ క్రమబద్ధీకరించాలి. చిన్న, ద్విచక్ర వాహనాలు మినహా మిగిలిన వాటిని సాధ్యమైనంత వరకూ కొండ దిగువనే నిలిపివేయాలి. భక్తులను కొండ మీదకు తరలించేందుకు ఉచిత బస్సులు నడపాలి. ఫ కల్యాణానికి హాజరయ్యే భక్తులకు మంచినీరు, కల్యాణానంతరం అన్నదాన పథకంలో ఉచిత ఫలహారాన్ని రెండు మూడు చోట్ల పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఫలహారం కూడా ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేస్తే భక్తులు వాటిని తీసుకుని వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. ఫ కల్యాణానంతరం ఉచిత ప్రసాదం, తలంబ్రాలను ఒక్కచోట మాత్రమే పంపిణీ చేస్తూండటంతో భక్తుల మధ్య తోపులాట జరుగుతోంది. స్వామివారి సర్కులర్ మండపంతో పాటు మరో రెండుచోట్ల పంపిణీ చేస్తే ఈ ఇబ్బంది తప్పుతుంది. ఫ పంపా జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం 88 అడుగులు ఉంది. బ్యారేజీకి కొత్త గేట్ల ఏర్పాటు పనులకు తోడు, ఆయకట్టులో రబీ సాగుకు నీటిని విడుదల చేస్తున్నారు. ఏలేరు నుంచి రోజుకు 50 క్యూసెక్కులు పంపాకు మళ్లిస్తున్నా వచ్చిన నీరు వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. దీంతో, రోజు రోజుకూ నీటిమట్టం తగ్గుతోంది. కల్యాణోత్సవాల నాటికి ఇది మరింత తగ్గే అవకాశం ఉంటుంది. కల్యాణోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు రానున్నందున దేవస్థానంలో నీటి సమస్య ఉత్పన్నమయ్యే అవకాశముంది. దీంతోపాటు మే 1న స్వామివారి శ్రీచక్రస్నానం నిర్వహించాలి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఏలేరు నుంచి నీటి విడుదలను పెంచాలి. ఫ భక్తులు భారీగా రానున్నందున వారిని నియంత్రించేందుకు పెద్ద సంఖ్యలో పోలీసులను నియమించాలి. ఫ పశ్చిమ, తూర్పు రాజగోపురాల పరిసరాల్లో పార్కింగ్ స్థలాల వద్ద ఎక్కువ సంఖ్యలో టాయిలెట్లు ఏర్పాటు చేయాలి. ఫ ఈ నెల 30న సత్యదేవుడు, అమ్మవార్లను భారీ టేకు రథంపై కొండ దిగువన ఊరేగించనున్నారు. దీనికి అధిక సంఖ్యలో భక్తులు రానున్నందున విస్తృత బందోబస్తు ఏర్పాటు చేయాలి. ప్రమాదాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలి. ఫ గత ఏడాది మధ్యాహ్నం 3.30 గంటలకే రథోత్సవాన్ని ప్రారంభించడంతో ఆంధ్రా బ్యాంక్ సెంటర్ వరకూ ఈ ఉత్సవాన్ని తిలకించేవారే లేరు. ఆ తరువాత సాయంత్రం 6 గంటల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. అందువలన ఈసారి రథోత్సవాన్ని సాయంత్రం 5 గంటల తరువాత ప్రారంభిస్తే మేలు. ఫ సత్యదేవుని శ్రీపుష్పయాగం అనంతరం మహిళలకు జాకెట్టు ముక్కల పంపిణీలో ఏటా గందరగోళం ఏర్పడుతోంది. దీని నివారణకు చర్యలు తీసుకోవాలి. గత ఏడాది లోపాలివీ.. గత ఏడాది సత్యదేవుని కల్యాణోత్సవాల నిర్వహణపై అనేక విమర్శలు వచ్చాయి. ప్రధానంగా పుష్పాలంకరణ, విద్యుద్దీపాలంకరణ పేలవంగా ఉన్నాయనే అభిప్రాయం భక్తుల నుంచి వినిపించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా గత ఏడాది కల్యాణోత్సవాల సందర్భంగా రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం చండీ హోమం, పౌర్ణమి నాడు ప్రత్యంగిర హోమం నిర్వహించలేదు. దీనిపై ‘సాక్షి’ పలు కథనాలు ప్రచురించడంతో అధికారులు స్పందించి, వైదిక కమిటీని వివరణ కోరారు. ఈసారి కొత్తగా ప్రతి శుక్రవారం ఉదయం ఖడ్గమాల పూజ కూడా ప్రారంభించారు. వీటన్నింటినీ ఈ ఏడాదైనా ఏ వివాదం లేకుండా నిర్వహిస్తారో లేక ఉత్సవాల సాకుతో నిలిపివేస్తారో వేచి చూడాలి. కల్యాణోత్సవాల చివరి రోజున శ్రీపుష్పయాగం నాడు ఊయలలో స్వామి, అమ్మవార్ల అలంకరణపై కూడా గతంలో విమర్శలు వచ్చాయి. ఈ లోపాలను ప్రస్తావిస్తూ ‘ప్చ్.. కళ కట్టలే..’ శీర్షికన అప్పట్లో ‘సాక్షి’ కథనం ప్రచురించింది. ఆ లోపాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. ఈ మాట ఏమేరకు నిలబెట్టుకుంటారో చూడాలి. -
22న ‘నన్నయ’లో 20 వసంతాల వేడుక
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఏర్పడి ఈ నెల 22వ తేదీకి 20 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆరోజు యూనివర్సిటీలో ఆవిర్భావ దినోత్సవాన్ని 20 రకాల థీమ్స్తో నిర్వహించదలచామని వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ తెలిపారు. ఈ 20 థీమ్స్కి 20 మందిని కన్వీనర్లుగా నియమించామన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ బ్రోచర్ను బుధవారం విడుదల చేశారు. ముగిసిన పది మూల్యాంకనం ప్రకాశంనగర్ (రాజమహేంద్రవరం) : తొమ్మిది రోజులుగా స్థానిక బీవీఎమ్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి స్పాట్ వాల్యూయేషన్ క్యాంప్ బుధవారంతో ముగిసిందని జిల్లా విద్యాశాఖాధికారి కంది వాసుదేవరావు తెలిపారు. మొత్తం 780 మంది సిబ్బంది తమ విధులను సమర్థంగా నిర్వహించారన్నారు. 7 జిల్లాల నుంచి ఒక్కో సబ్జెక్టు చొప్పున సుమారు 1,76,032 జవాబు పత్రాలు కేంద్రానికి వచ్చాయన్నారు. చీఫ్ ఎగ్జామినర్లు 75, సహాయ ఎగ్జామినర్లు 455, సహాయకులు 221, ఇతరులు 29..మొత్తం 780మంది సిబ్బందిని నియమించామన్నారు. ముగిసిన ఓపెన్ స్కూల్ స్పాట్ ఓపెన్ స్కూల్ స్పాట్ కూడా బుధవారంతో ముగిసిందని, మొత్తం 12,768 జవాబు పత్రాలు వచ్చాయని, చీఫ్ ఎగ్జామినర్లు 18, అసిస్టెంట్ ఎగ్జామినర్లు 64 మంది, స్పెషల్ అసిస్టెంట్లు 18 మంది.. ఓపెన్ స్పాట్ లో విధులు నిర్వహించారని డీఈవో తెలిపారు. కేజీ బేసిన్ గ్యాస్, చమురు సాధన కోసం నేడు సదస్సు ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం) : కేజీ బేసిన్ గ్యాస్ చమురు సాధన సమితి ఆధ్వర్యంలో గురువారం ఉదయం 10 గంటలకు సంహిత కన్వెషన్ హాల్లో కేజీ బేసిన్ గ్యాస్, చమురు సాధన కోసం రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నామని సీపీఐ రాష్ట్ర కార్య వర్గ సభ్యులు తాటి పాక మధు, సీపీఎం జిల్లా కార్య దర్శి టి.అరుణ్ తెలిపారు. బుధవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో విలేకరులతో వారు మాట్లాడుతూ సహజ వనరులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించేప్పుడు ఆ రాష్ట్రానికి పన్నులు చెల్లించాలనే సుప్రీంకోర్టు తీర్పును గుర్తు చేశారు. ఆ వనరులు ఆ రాష్ట్రానికి 50 శాతం దక్కాలని 12వ ఫైనాన్స్ కమిషన్ చెప్పిందన్నారు. కేజీ బేసిన్ గ్యాస్, చమురు సాధన కోసం జరిగే రాష్ట్ర సదస్సుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, ప్రత్యేక హెూదా విభజన హామీల సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు తదితర 12 మంది వక్తలు రానున్నారని తెలిపారు. సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన నిడదవోలు: స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 18న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిడదవోలు పర్యటన ఖరారైన నేపథ్యంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ నరసింహ కిషోర్, జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్లు బుధవారం ఉన్నతాధికారులతో కలిసి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. గాంధీనగర్ సమీపంలో ఉన్న మాలకోడు చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే పనులకు, మురుగునీటి శుద్ధి ప్లాంట్కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. -
వైఎస్సార్ సీపీలో నియామకాలు
రాజమహేంద్రవరం సిటీ: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో పలువురు నాయకులను పార్టీ పదవుల్లో నియమిస్తూ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజమహేంద్రవరం నగరానికి చెందిన ఎస్ఎం సాధిక్ హుస్సేన్ను స్టేట్ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీగా, జిల్లా బీసీ సెల్ వైస్ ప్రెసిడెంట్గా సీనేపి మునేశ్వరరావు, రాజమహేంద్రవరం సిటీ వైఎస్సార్ టీయూసీ ప్రెసిడెంట్గా దాది గౌరీశంకర్, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికి చెందిన జిల్లా యాక్టివిటీ సెక్రటరీగా డాకే శ్రీను, జిల్లా బీసీ సెల్ సెక్రటరీగా అయినవిల్లి నాగ సత్య ప్రసాద్, జిల్లా మహిళా విభాగం సెక్రటరీగా వెలగన కళ్యాణి రెడ్డిలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాజమహేంద్రవరం నగరానికి చెందిన ఆరో డివిజన్ ప్రెసిడెంట్గా నల్ల రామాంజనేయులు, 24వ డివిజన్ ప్రెసిడెంట్గా వై. శ్రీనివాసరావు, 25వ డివిజన్ ప్రెసిడెంట్గా రొక్కం త్రినాథ్, 50 డివిజన్ ప్రెసిడెంట్గా గుత్తుల కోటీశ్వరిలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
కోమాలోకి వెళ్లిన యువకుడి ఆచూకీ గుర్తింపు
అమలాపురం రూరల్: జాతీయ రహదారిపై భట్నవెల్లి వద్ద ఈ నెల 12వ తేదీ రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కోమాలోకి వెళ్లిన యువకుడి ఆచూకీ తెలిసింది. సోషల్ మీడియాలో వచ్చిన ఫొటో ఆధారంగా యువకుడిని కుటుంబ సభ్యులు గుర్తించారు. అతడిని అల్లవరం మండలం కొమరగిరి పట్టణానికి చెందిన కోటూరు రాజేష్ (20 గా గుర్తించారు. ఎస్సై వై.శేఖర్ బాబు మంగళవారం రాత్రి తెలిపిన వివరాల ప్రకారం అమలాపురం నుంచి ముమ్మిడివరం వైపు మోటారు సైకిల్పై వెళుతున్న రాజేష్ స్థానిక చెక్పోస్ట్ సమీపంలో రోడ్డును దాటుతున్న వ్యక్తిని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయం కావడంతో రాజేష్ కోమాలోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు. రాజేష్కు వరుసకు సోదరుడు అయిన నేల వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి సీతానగరం: మోటారు సైకిల్ పైనుంచి పడిన ఘటనలో తలకు తీవ్ర గాయమై ఓ మహిళ మృతి చెందింది. వంగలపూడి శివారున ఏటిగట్టుపై ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. కోరుకొండ మండలం నరసాపురానికి చెందిన నొక్కి వెంకటలక్ష్మి (37) సోమవారం వంగలపూడిలో ఉంటున్న అక్క అరవాలమ్మ ఇంటికి వచ్చింది. అక్క కుమార్తె ఆరోగ్యం బాగా లేకపోవడంతో తాళ్లపూడి మండలం అన్నదేవరపేటలో ఆయుర్వేద మందు తీసుకోవడానికి పురుషోత్తపట్నం ఫెర్రీ రేవు నుంచి గోదావరి దాటి పోలవరం మీదుగా వెళ్లడానికి బంధువులతో కలిసి మంగళవారం వంగలపూడి ఏటిగట్టుపైకి వచ్చింది. అక్కడి నుంచి పురుషోత్తపట్నం వైపు బంధువులు ముందుగా వెళ్లిపోయారు. దీంతో అక్కడకు వెళ్లడానికి వెంకటలక్ష్మి వంగలపూడికి చెందిన దురికుర్తి ఏసును లిఫ్ట్ అడిగి మోటారు సైకిల్ ఎక్కింది. వంగలపూడి శివారు ఆంజనేయస్వామి ఆలయం వద్ద మలుపులో రోడ్డు పక్కగా వ్యాన్ ఆగి ఉంది. ఏసు ఆకస్మాతుగా ఆ వ్యాన్ను చేసి బ్రేక్ వేశాడు. దీనితో వెంకటలక్ష్మి అదుపుతప్పి రోడ్డుపై పడిపోయింది. ఆమె తలకు తీవ్రమైన గాయం తగిలింది. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ ఈఎంటీ శ్రీనివాస్ అక్కడి వచ్చి.. వెంకటలక్ష్మి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని హెడ్ కానిస్టేబుల్ గోవిందరాజులు పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి భర్త పెంటయ్య, పదిహేడేళ్ల కుమార్తె అనుష్క, పదిహేనేళ్ల కుమారుడు జోసెఫ్ ఉన్నారు. అక్క కుమారుడు యానంపూడి శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్కు ఇన్వెర్టర్ల వితరణ రాజమహేంద్రవరం సిటీ: భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సిద్ధాంతాలు మహోన్నతమైనవని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ హెడ్ ఏ.విశ్వేశ్వరరావు అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా మంగళవారం రాజమహేంద్రవరంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీ సమీపంలోని ఎస్సీ, ఎస్టీ మహిళల హాస్టల్ సముదాయానికి రెండు ఇన్వర్టర్లను వితరణ చేశారు. కార్యక్రమంలో డీఆర్హెచ్ నిర్మల జ్యోతి, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు, బ్యాంక్ యూనియన్ నాయకులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 22,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 24,000 గటగట (వెయ్యి) 21,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)13,000 – 14,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
పూలమాల వేయకుండా అవమానిస్తారా?
జనసేన ఎమ్మెల్యేను నిలదీసిన దండోరా నాయకులు అంబాజీపేట: పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ (జనసేన)కు మంగళవారం చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. అంబాజీపేట హడ్కో కాలనీలో గత ఏడాది అంబేడ్కర్ విగ్రహం పక్కనే మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రామ్ విగ్రహం ఏర్పాటు చేయడంతో వివాదం తలెత్తింది. అప్పటి నుంచీ ఈ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇప్పటికీ పోలీస్ పికెట్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా కాలనీలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసేందుకు ఎమ్మెల్యే మంగళవారం వచ్చారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసిన ఆయనను.. పక్కనే ఉన్న జగ్జీవన్రామ్ విగ్రహానికి కూడా పూలమాల వేయాలని దండోరా నాయకులు కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పూలమాల వేసేందుకు వెళ్తూండగా.. స్థానిక ఎస్సీ నాయకులు జోక్యం చేసుకున్నారు. ఇక్కడ విగ్రహం సమస్య ఇంకా పరిష్కారం కాలేదని ఎమ్మెల్యేకు వివరించి, అక్కడి నుంచి పంపించేశారు. దీనికి దండోరా నాయకులు అభ్యంతరం చెప్పారు. ఏడాది కాలంగా ఇక్కడ విగ్రహం సమస్య పరిష్కారం కానప్పుడు ఎమ్మెల్యే ఎందుకు వచ్చారని నిలదీశారు. రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టడానికి వచ్చారా అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి, జగ్జీవన్రామ్ విగ్రహానికి పూలమాల వేయకుండా అవమానిస్తారా అని ఆందోళన వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కాన్వాయిని అడ్డగించారు. దీంతో, పోలీసులకు, దండోరా నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఆ సమయంలో ఒక గర్భిణి, మహిళ పడిపోయి, అస్వస్థతకు గురవడంతో స్థానిక పీహెచ్సీకి తీసుకువెళ్లారు. సమస్యను పరిష్కరించేందుకు త్వరలోనే చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో దండోరా నాయకులు ఆందోళన విరమించారు. -
పదిపదమంటూ..
ఫ నేటితో పూర్తి కానున్న టెన్త్ స్పాట్ ఫ ఇక ఫలితాల విడుదలే తరువాయి ఫ విద్యార్థులు, తల్లిదండ్రుల ఎదురుచూపులు రాయవరం: పదో తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకనం తుది అంకానికి చేరుకుంది. ఈ నెల 6న ప్రారంభమైన ఈ కార్యక్రమం బుధవారం సాయంత్రంతో షెడ్యూల్ ప్రకారం ముగియనుంది. జవాబు పత్రాల మూల్యాంకనం చివరి దశకు చేరుకోవడంతో ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలనే పడింది. తడబడుతూ ప్రారంభమై.. ఈ ఏడాది పదో తరగతి మూల్యాంకనాన్ని నూతన విధానంలో ప్రారంభించారు. జవాబు పత్రాల మూల్యాంకనం అనంతరం ఆన్లైన్లో మార్కులను నమోదు చేస్తున్నారు. ప్రతి సబ్జెక్టుకు ప్రశ్నల వారీగా విద్యార్థి పొందిన మార్కులను ట్యాబ్ సహాయంతో ఏరోజుకారోజు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. అయితే ఈ నెల 6న మూల్యాంకనం ప్రారంభించగా తొలి రోజు తడబాట్లతో ప్రారంభమైంది. నెట్వర్క్ సమస్యలతో పాటుగా, నూతన విధానం కావడంతో తొలి రోజు తక్కువగా పేపర్ల మూల్యాంకనం చేపట్టారు. రెండో రోజు నుంచి 40 వంతున పేపర్లను ఏఈలు మూల్యాంకనం చేయగా, స్పెషల్ అసిస్టెంట్ల ద్వారా మార్కుల ఆన్లైన్ చేపట్టారు. గత విద్యా సంవత్సరంలో ఫలితాలను ఏప్రిల్ 23న విడుదల చేశారు. మరి ఈ సంవత్సరం ఎప్పుడు చేస్తారో వేచి చూడాల్సిందే. 5,44,769 జవాబు పత్రాల రాక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు వివిధ జిల్లాల నుంచి 5,44,769 జవాబు పత్రాలను మూల్యాంకనం కోసం పంపించారు. తెలుగు, కాంపోజిట్ తెలుగు, హిందీ, ఇంగ్లిషు, గణితం, ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టులతో పాటుగా, ఒకేషనల్ పేపర్లను మూల్యాంకనం చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు 1,76,032, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు 1,79,180, కాకినాడ జిల్లాకు 1,89,557 జవాబు పత్రాలు వచ్చాయి. 348 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 1,438 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 693 మంది స్పెషల్ అసిస్టెంట్లు విధుల్లో పాల్గొన్నారు. షెడ్యూల్ ప్రకారమే.. పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనాన్ని షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాం. శత శాతం జవాబు పత్రాల మూల్యాంకనాన్ని సమర్థవంతంగా చేశాం. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు, సిబ్బంది సహకారంతో విజయవంతంగా జరిగింది. – జి.నాగమణి, ఆర్జేడీ, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ -
అదుపు తప్పిన టిప్పర్
శంఖవరం: మండలంలోని నెల్లిపూడి గ్రామంలో కలిదిండి సత్యనారాయణ ఇంటిని ఓ టిప్పర్ ఢీకొంది. ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రౌతులపూడి నుంచి శంఖవరం మీదుగా కాకినాడకు భారీ రాళ్లతో టిప్పర్ వెళుతోంది. మంగళవారం తెల్లవారుజామున అది అదుపు తప్పి నెల్లిపూడిలో సత్యనారాయణ ఇంటికి బలంగా ఢీకొని బోల్తా పడింది. నిద్రలో ఉన్న సత్యనారాయణ భారీ శబ్ధానికి ఉలిక్కిపడి లేచి చూసేసరికి ఇల్లు, జీవనోపాధిగా నడిపే వాటర్ ప్లాంట్ ధ్వంసమయ్యాయి. కాగా.. ఈ రోడ్డులో నిరంతరం భారీ లోడుతో లారీలు అతి వేగంగా రాకపోకలు చేస్తున్నాయని, దీనిపై పలుమార్లు ధర్నాలు చేసినా, వినతి పత్రాలు సమర్పించినా అధికారులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ వాటిని అదుపు చేయలేకపోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. -
తుది దశకు కసరత్తు
ఫ మొదటి దశలో గృహగణన ఫ రెండో దశలో జనగణన ఫ రేపటి నుంచి సెల్ఫ్ ఎన్యూమరేషన్ రాయవరం: పదేళ్లకోసారి నిర్వహించే జనగణన 2021లో కరోనా కారణంగా నిలిచిపోయింది. ఆ తర్వాత వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం జనగణనకు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ కార్యక్రమం రెండు విడతల్లో నిర్వహించనుంది. తొలి దశలో గృహ గణన, రెండో దశలో జనగణన చేపట్టనుంది. దీనికి సంబంధించిన కసరత్తు తుది దశకు చేరుకుంది. క్షేత్ర స్థాయిలో జనగణన నిర్వహించే ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ ఇచ్చేందుకు గాను ఫీల్డ్ ట్రైనర్లకు తొలి దశలో గత నెల 23 నుంచి 29వ తేదీ వరకూ శిక్షణ ఇచ్చారు. ప్రతి మండలం నుంచి ఇద్దరు టీచర్లను ఫీల్డ్ ట్రైనర్లుగా తీసుకున్నారు. ఈ నెల రెండో వారంలో మండలాల వారీగా ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు ఫీల్డ్ ట్రైనర్లు మూడు రోజుల చొప్పున రెండు బ్యాచ్ల్లో క్షేత్ర స్థాయిలో శిక్షణ ఇస్తారు. మండల స్థాయిలో సచివాలయ సిబ్బందిని ఎన్యూమరేటర్లుగా, వివిధ శాఖల అధికారులను సూపర్వైజర్లుగా నియమిస్తున్నారు. ఈ ప్రక్రియ కూడా తుది దశకు చేరుకుంది. 200 ఇళ్లు లేదా 800 జనాభాకు ఒక ఎన్యూమరేటర్ను నియమిస్తున్నారు. ఆ విధంగా ప్రతి మండలంలో 100 నుంచి 150 మందిని ఎన్యూమరేటర్లుగా నియమించే అవకాశం ఉంది. ఆరుగురు ఎన్యూమరేటర్లకు ఒక సూపర్వైజర్ చొప్పున ఉంటారు. ప్రత్యేకతలివీ.. ఫ జనగణన పూర్తిగా సెన్సస్–2027 మొబైల్ యాప్లో జరుగుతుంది. ఫ ఈసారి ఎన్యూమరేటర్లుగా టీచర్లను మినహాయిస్తున్నట్లు సమాచారం. ఫ సచివాలయ సిబ్బందితో జనగణన పూర్తి చేసే అవకాశముంది. ఫ ప్రస్తుత సెన్సస్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ ప్రక్రియ గురువారం ప్రారంభం కానుంది. ఫ గూగుల్ ప్లే స్టోర్ నుంచి సెన్సస్–2027 యాప్ను గృహ యజమానులు డౌన్లోడ్ చేసుకుని, సొంతంగా వివరాలు నమోదు చేసుకోవచ్చు. 33 రకాల ప్రశ్నలు ఫ మొదటి విడత గృహ గణన మే 1 నుంచి 31వ తేదీ వరకూ జరగనుంది. ఇందులో సేకరించిన వివరాలను కంప్యూటర్ మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా నమోదు చేస్తారు. జనగణన ద్వారా సేకరించే గణాంకాల ఆధారంగా గ్రామ, పట్టణ, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో అభివృద్ధి ప్రణాళికలకు రూపకల్పన చేస్తారు. ఫ మొదటి దశలో హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ (హెచ్ఎల్ఓ) చేపడతారు. ఫ ఇంటి నిర్మాణం మొదలు ప్రతి వివరం నమోదు చేస్తారు. ఫ గుర్తించిన ఇంటికి ప్రత్యేక సంఖ్య కేటాయిస్తారు. ఫ ఇంట్లో నివసించే సభ్యుల వివరాలు నమోదు చేస్తారు. ఫ గృహగణనలో భాగంగా మౌలిక సదుపాయాలు, ఫోన్, ఇంటర్నెట్, వాహనాలు తదితర గృహోపకరణాల వివరాలు సేకరిస్తారు. ఫ ఇంటి కట్టడం తీరు, ఫ్లోరింగ్, తాగునీటి వినియోగం, మరుగుదొడ్ల వాడకం, విద్యుత్ వినియోగం, నెలవారీ బిల్లు, విద్యుత్తో పని చేసే పరికరాలు (ఏసీ, రిఫ్రిజిరేటర్, ఫ్యాన్లు, గీజర్) తదితర వివరాలు నమోదు చేస్తారు. ఫ ఇంటి యజమానిని 33 రకాల ప్రశ్నలు అడిగి వివరాలు సేకరిస్తారు. ట్రయల్ రన్ షురూ యాప్ పని తీరుపై ముందుగా ట్రయల్ రన్ వేశారు. ఎంపిక చేసిన ప్రాంతంలో ఇంటింటికీ వెళ్లి ఫీల్డ్ ట్రైనర్లు గృహగణన నమోదు చేశారు. సేకరించిన వివరాలను యాప్లో నమోదు చేసి, యాప్ పనితీరును సరిచూసుకున్నారు. యాప్ ద్వారా సమాచారం సూపర్వైజర్ లాగిన్కు వెళ్తున్నట్లు నిర్ధారించుకున్నారు. సొంతంగా చేసుకోవాలంటే.. గృహ యజమాని సొంతంగా ఎన్యూమరేషన్ చేసుకునే అవకాశమే సెల్ఫ్ ఎన్యూమరేషన్. గూగుల్ ప్లేస్టోర్ నుంచి సెన్సస్–2027 యాప్ను డౌన్లోడ్ చేసుకుని వ్యక్తిగత, కుటుంబ వివరాలను ఎవరికి వారే నమోదు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీ గృహ యజమాని సెల్కు టెక్ట్స్ మెసేజ్గా వస్తుంది. ఆ ఐడీ నంబరును ఎన్యూమరేటర్కు ఇస్తే వివరాలను సరిచూసుకుని సేవ్ చేసుకుంటారు. -
టీడీపీ నాయకులకు నిరసన సెగ
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): దళితులపై తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుతో పాటు ఆయన కుమారుడు, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్కు దళితుల నిరసన సెగ తగిలింది. వివరాల్లోకి.. అంబేడ్కర్ జయంతి సందర్భంగా మంగళవారం నగరంలో టీడీపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ క్రమంలో 47వ డివిజన్లో అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించడానికి విచ్చేశారు. వీరి రాకను గమనించిన దళిత నాయకులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ నగర నాయకుడు తిరగటి దుర్గారావు ఆధ్వర్యంలో వారిని అడ్డుకున్నారు. ఆదిరెడ్డి అప్పారావు గోబ్యాక్, దళితులపై అవమానకరంగా మాట్లాడినందుకు క్షమించాలని అడగాలి అంటూ నినాదాలు చేశారు. జయంతి, వర్ధంతి సమయంలో వచ్చి అంబేడ్కర్ విగ్రహాలకు నివాళులర్పించడంతోనే సరిపోదని, ఆయన ఆశయాల సాధనకు కూడా కృషి చేయాలన్నారు. వెంటనే పోలీసులు, రాపిడ్ ఫోర్స్ అక్కడకు వచ్చి నినాదాలు చేస్తున్న వారిని పక్కకు తప్పించారు. రోప్ సహాయంతో వారిని కట్టడి చేయడానికి ప్రయత్నించారు. ఆదిరెడ్డి అప్పారావు కారులోనే ఉండిపోయారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కారు కిందికి దిగినా అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించకుండానే వెనుదిరిగారు. -
కొబ్బరి చెట్టు పడి రెండు ఆవుల మృతి
పెరవలి: కొబ్బరి చెట్టు విరిగి పడడంతో రెండు ఆవుల మృతి చెందిన ఘటన అన్నవరప్పాడులో జరిగింది. పశువైద్యాధికారి చరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. అన్నవరప్పాడుకు చెందిన కోటిపల్లి గంగన్న మంగళవారం ఉదయం పశువుల పాలు తీసి, వాటిని షెడ్డు బయట కట్టేశాడు. అనంతరం చేలో పనిచేసుకుంటుండగా ఉదయం 10.30 ప్రాంతంలో హఠాత్తుగా కొబ్బరి చెట్టు విరిగి రెండు ఆవులపై పడటంతో అవి అక్కడికక్కడే మృతి చెందాయి. వాటికి ఇన్సూరెన్స్ లేకపోవటంతో రైతుకు ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. వాటిలో ఒకటి సూడి ఆవు అని గంగన్న కన్నీటిపర్యంతమయ్యాడు. కాగా.. వీఆర్వో శ్రీనివాస్ ఆవులకు పంచనామా నిర్వహించి పశువైద్యాధికారులకు అప్పగించారు. అనంతరం ఆవులను శాస్త్రోతంగా చేలోనే ఖననం చేశారు. హుండీ దొంగను పట్టుకున్న గ్రామస్తులురాయవరం: ఆలయంలో హుండీ సొమ్మును పట్టపగలే చోరీ చేయబోయిన దొంగను గ్రామస్తులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. చెల్లూరులోని బాలా త్రిపుర సుందరీ సమేత అగస్తేశ్వరస్వామి ఆలయంలోకి మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన కానూరి మల్లేష్ ప్రవేశించాడు. అక్కడి హుండీని పగులగొట్టి నగదును చోరీ చేస్తుండగా గ్రామస్తులు గమనించి పట్టుకున్నారు. అతడిని ఆలయంలో స్తంభానికి కట్టేసి రాయవరం పోలీసులకు అప్పగించారు. మల్లేష్ గతంలో కూడా పలుమార్లు దొంగతనాలకు పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. -
సాంకేతికమక
బాలాజీచెరువు (కాకినాడ): పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనాన్ని (స్పాట్) ఆధునీకరించాలని ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ప్రవేశ పెట్టిన ట్యాబ్ ఆధారిత వ్యవస్థ ప్రారంభ దశలోనే సాంకేతిక సమస్యలను ఎదుర్కొంది. నెట్వర్క్ లోపాలు, సర్వర్ అంతరాయాలు, పరికరాల పనితీరులో సమస్యల కారణంగా మూల్యాంకన ప్రక్రియలో ఆలస్యం జరిగింది. కాకినాడ సాలిపేట మున్సిపల్ హైస్కూల్లో జరిగిన స్పాట్కు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సమాధాన పత్రాలు వచ్చాయి. ఒక్కో ఉపాధ్యాయుడు రోజుకు కనీసం 40 జవాబు పత్రాలు మూల్యాంకనం చేయాల్సి ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యలతో మొదటి రోజున 20 పత్రాలకే పరిమితమయ్యారు. మూల్యాంకనం అనంతరం ప్రతి జవాబు పత్రాన్ని స్కాన్ చేసి ట్యాబ్లో మార్కులు నమోదు చేయాల్సిన ప్రక్రియ క్లిష్టతరంగా మారింది. అసిస్టెంట్ ఎగ్జామినర్లు మూల్యాంకనం చేసిన మార్కులను నమోదు చేసే బాధ్యతను ప్రత్యేకంగా నియమించిన ప్రత్యేక అసిస్టెంట్లకే పరిమితం చేయడం వల్ల పనిలో వేగం తగ్గింది. రోజూ మూల్యాంకనం సాయంత్రానికి ముగియాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుతం పూర్తికాకపోవడంతో కొన్నిసార్లు జవాబు పత్రాలను మళ్లీ భద్రతా గదులకు తరలిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సాంకేతిక లోపాల వల్ల ఫలితాల విడుదల ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ● గడువులోపు పూర్తి చేస్తాం మూల్యాంకనాన్ని బుధవారంలోపు పూర్తి చేస్తాం. సాంకేతిక సమస్యలు ఉన్నా ఎప్పటికప్పుడు అందరినీ సమన్వయం చేసుకుంటూ పని పూర్తి చేస్తున్నాం. ట్యాబ్ విధానంతో తొలుత కాస్త ఇబ్బందులు పడిన మాట వాస్తవమే. – పిల్లి రమేష్. కాకినాడ జిల్లా విద్యాశాఖాఽఽఽధికారి -
పెళ్లయిన రెండున్నర నెలలకే మృత్యుఒడికి..
ఫ రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి ఫ అంబేడ్కర్ జయంతిలో పాల్గొని వెళుతుండగా ఘటన అంబాజీపేట: పెళ్లయిన రెండున్నర నెలలకే ఆ యువకుడిని మృత్యువు కబళించింది. అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో సరదాగా గడిపిన ఇంటికి వెళుతున్న అతడిని రోడ్డు ప్రమాదంలో కాటేసింది. వివరాల్లోకి వెళితే.. అంబాజీపేట మండలం వాకలగరువుకు చెందిన ముత్తాబత్తుల నాగేంద్రబాబు (26) తన మోటారు సైకిల్పై అమలాపురం రూరల్ బండారులంకలోని అత్తవారింటికి వెళుతున్నాడు. అమలాపురం శాంతినగర్కు చెందిన నాగవరపు గిరి, ఎలిపే వీరేంద్ర కుమార్, షేక్ నబీలు మోటారు సైకిల్పై వస్తూ అంబాజీపేటలో నాగేంద్రబాబును బలంగా ఢీకొన్నారు. ఘటనలో నాగేంద్రబాబు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది అక్కడకు వచ్చేసరికి నాగేంద్రబాబు మృతి చెందాడు. వెంటనే ప్రమాదానికి కారణమైన ఆ ముగ్గురూ అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న సీఐ ఆర్.భీమరాజు, అంబాజీపేట, పి.గన్నవరం, నగరం ఎస్సైలు షేక్ సుభానీ, బి.శివకృష్ణ, కె.చైతన్య కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సీసీ పుటేజ్లు, స్థానికుల తెలిపిన వివరాల ఆధారంగా నిందితులను అరగంటలోనే పట్టుకుని పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. సీఐ భీమరాజు పర్యవేక్షణలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుభానీ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రేమ పెళ్లి చేసుకుని.. : నాగేంద్రబాబు రెండున్నర నెలల క్రితమే బండారులంకకు చెందిన సత్యను ప్రేమ పెళ్లి చేసుకుని అత్తవారి ఇంటి వద్దే ఉంటున్నాడు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా వాకలగరువు తదితర ప్రాంతాల్లో ఉత్సవాల్లో పాల్గొని, స్నేహితులతో సరదాగా గడిపాడు. అనంతరం తన భార్యకు ఫోన్ చేసి, ఇంటికి వచ్చేస్తున్నానని చెప్పి బయలుదేరాడు. ఇంటికి వస్తాడని ఎదురుచూసిన భార్య.. నాగేంద్రబాబు మృతి చెందాడన్న విషయం తెలిసి కన్నీరుమున్నీరైంది. సంఘటనా స్థలంలో భార్య, బంధువులు రోదనలు కంటతడి పెట్టించాయి. -
మహోన్నతుడు అంబేడ్కర్
● ఘనంగా 135వ జయంతి వేడుకలు ● పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ, ప్రజాప్రతినిధులు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): దేశ గతిని మార్చిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని పలువురు కొనియాడారు. రాజమహేంద్రవరంలోని గోకవరం బస్టాండ్ వద్ద మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు నిర్వహించారు. భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కలెక్టర్ కీర్తి, ఎస్పీ నరసింహ కిశోర్, ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ రాజమహేంద్రవరం పర్యటన సమయంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఇచ్చిన అద్భుత ప్రసంగాన్ని గుర్తుచేసుకున్నారు. చదువు ద్వారానే వ్యక్తి ఉన్నత స్థాయికి ఎదగగలడని అంబేడ్కర్ జీవితాంతం విద్యను ఆయుధంగా ఉపయోగించారన్నారు. రోజుకు 18 గంటలు చదవుతూనే ఉండేవారంటే ఆయనకు చదవు పట్ల ఎంత అభిలాష ఉందో అర్థం చేసుకోవచ్చున్నారు. ఎస్పీ డి.నరసింహ కిశోర్ మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమాన్ని కాంక్షిస్తూ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించారన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, ప్రజాప్రతినిధులు, ఇన్చార్జి జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎం.సందీప్, ఆర్డీవో ఆర్.శివరాముడు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో.. రాజమహేంద్రవరం రూరల్: వైఎస్సార్ సీపీ జిల్లా క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు రెవరెండ్ ఎం.విజయ సారథి ఆధ్వర్యంలో నాయకులు జిల్లాలోని అన్ని మండలాల్లో పర్యటించి అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గంలో ప్రారంభమై ఏడు నియోజకవర్గాలలో ఉన్న 19 మండల కేంద్రాల్లో ఉన్న ఆయా మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. అంబేడ్కర్ ఆశయాలను పుణికి పుచ్చుకున్న జగనన్నను 2029లో ముఖ్యమంత్రిగా చేయడానికి కృషి చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దళితులు, క్రైస్తవులు జగనన్ననే ముఖ్యమంత్రిని చేయబోతున్నామని నినదించారు. మండల అధ్యక్షుడు రెవరెండ్ షిమ్మీ, రెవరెండ్ కల్వరి కుమార్, పిట్ట డానియల్, కరుణాకర్, వైఎస్సార్ సీపీ అభిమానులు పాల్గొన్నారు. -
జనర్విభజన కసరత్తు!
సాక్షి, రాజమహేంద్రవరం: పురపాలక సంఘాల్లో వార్డుల పునర్విభజనకు రంగం సిద్ధమైంది. ఈ నెల 26వ తేదీలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో వార్డుల పునర్విభజనపై మున్సిపల్ కమిషనర్లు దృష్టి సారించారు. ఇప్పటికే ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఆయా మున్సిపాలిటీల పరిధిలో పెరిగే వార్డుల వివరాలను క్రోడీకరించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నారు. అయితే సందట్లో సడేమియాలా చంద్రబాబు ప్రభుత్వం తమకు అనువైన వార్డుల్లో ఉన్న ప్రజలను మరో వార్డులో చేర్చించి అక్కడ కూడా పట్టు సాధించేందుకు ఈ పునర్విభజనను ఉపయోగించుకుంటున్నట్టు సమాచారం. 2011 జనాభా లెక్కల మేరకు పునర్విభజన చేపట్టనున్నారు. 1,100 మంది ఓటర్లకు తగ్గకుండా వార్డుల పునర్విభజన చేపట్టనున్నారు. వార్డు వివరాలు ప్రచురించిన అనంతరం ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకుని వార్డుల విభజనను ఆమోదిస్తారు. విభజన ప్రక్రియ పూర్తయిన వెంటనే వార్డుల మ్యాపింగ్ విషయం గెజిట్లో ప్రచురిస్తారు. జిల్లాలో ఇలా.. జిల్లాలో రాజమహేంద్రవరం కార్పొరేషన్, మండపేట, కొవ్వూరు, నిడదవోలు మున్సిపాలిటీలు ఉన్నాయి. మూడు మున్సిపాలిటీల్లో ప్రస్తుతం 81 వార్డులు ఉండగా.. 96 వార్డులుగా పునర్విభజించనున్నారు. అంటే అదనంగా మరో 15 వార్డులు పెరగనున్నాయి. రాజమహేంద్రవరం కార్పొరేషన్కు రాజమండ్రి రూరల్లోని పలు వార్డుల విలీనం ప్రక్రియ న్యాయస్థానంలో పెండింగ్లో ఉండటంతో వార్డుల పునర్విభజన ప్రక్రియకు బ్రేక్ పడింది. విభజన చేస్తారిలా? మున్సిపాలిటీల్లో వార్డుల విభజన ప్రక్రియకు ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది. మున్సిపాటిలీ కేంద్రంలో 30,000 జనాభా ఉంటే 23 వార్డులుగా విభజిస్తారు. 40 వేల జనాభాకు 28 వార్డులు, 50 వేల జనాభాకు 32 వార్డులు, 60 వేల జనాభా ఉంటే 36 వార్డులుగా విభజిస్తారు. 80 వేల జనాభా ఉంటే 40 వార్డులు, లక్షలోపు జనాభా ఉంటే 44 వార్డులు, లక్షకు పైగా జనాభా ఉంటే 52 వార్డులుగా విభజిస్తారు. నిడదవోలు నిడదవోలు పట్టణంలో 2011 జనాభా లెక్కల మేరకు 43,098 వేల మందికి పైగా ఉండగా ప్రస్తుతం 28 వార్డులు ఉన్నాయి. 33 వేల మంది ఓటర్లున్నారు. వీటిని 32 వార్డులుగా పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అంటే అదనంగా 4 వార్డులు పెరగనున్నాయి. మండపేట మండపేట మున్సిపాలిటీలో 2011 జనాభా లెక్కల ప్రకారం 54,000 మంది ఉన్నారు. 2021 ఎన్నికలకు ఆ జనాభా ఆధారంగానే వార్డు రిజర్వేషన్లు ఖరారు చేశారు. ప్రస్తుత లెక్కల ప్రకారం సుమారు 80 వేల జనాభా నివసిస్తున్నారు. పట్టణ విస్తీర్ణం 21 చదరపు కిలోమీటర్లు. ప్రస్తుతం 30 వార్డులు ఉన్న మున్సిపాలిటీలో మరో ఆరు వార్డులు పెరిగి 36కి విస్తరించనుంది. కొవ్వూరు కొవ్వూరు పట్టణంలో ప్రస్తుతం 40,000 జనాభా ఉంది. 23 వార్డులు ఉండగా.. మరో 5 పెరగనున్నాయి. కౌన్సిలర్లకు అవకాశం వార్డు పెంపుతో మరికొంత మంది కౌన్సిలర్లకు రాజకీయ రంగప్రవేశం చేసే అవకాశం దక్కనుంది. ప్రతి కొత్త వార్డుకు ఒక కొత్త నాయకత్వానికి అవకాశం దక్కుతుంది. ఏ ప్రాంతాలు ఏ వార్డులోకి వెళ్తాయన్న అంశం కీలకం కానుంది. సామాజిక వర్గాల ప్రాబల్యం, ఓటర్ల సంఖ్య ఆధారంగా పార్టీలు తమ వ్యూహాలను రచించాల్సి ఉంటుంది. స్థానిక ఎన్నికల్లో ప్రభావం వార్డుల పునర్విభజన మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. ఈ విషయమై ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం తమకు అనువైన వార్డుల్లో ప్రజలను మరో వార్డులో చేర్చి అక్కడ పట్టు సాధించేందుకు పావులు కదుపుతున్నట్లు తెలిసింది. రాజమహేంద్రవరం ఏరియల్ వ్యూకార్పొరేషన్కు బ్రేక్ రాజమహేంద్రవరంలో ప్రస్తుతం 42 వార్డులున్నాయి. సుమారు 5 లక్షలకు పైగా జనాభా ఉన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో మరో 8 వార్డులు ఉన్నాయి. ఇవి రెండు నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్నాయి. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని 8 వార్డులను సిటీ నియోజకవర్గంలో విలీనం చేయాలన్న ప్రతిపాదన ఉంది. ఈ వ్యవహారం న్యాయస్థానంలో ఉంది. ఈ విషయంలో టీడీపీకి చెందిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి మధ్య విభేదాలున్న విషయం తెలిసిందే. విలీనం చేసి కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలని రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య డిమాండ్ చేస్తుండగా.. విలీనం లేకుండానే ఎన్నికలకు వెళ్లాలని వాసు కోరుతున్నారు. ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో కార్పొరేషన్ ఎన్నికలకు బ్రేక్ పడుతూ వస్తోంది. ప్రస్తుతం వార్డుల పునర్విభనజనకు బ్రేక్ పడింది. న్యాయస్థానంలో విలీన అంశం కొలిక్కి వస్తే తప్ప విభజన ప్రక్రియ జరగదు. మున్సిపాలిటీల్లో పెరగనున్న వార్డులు జిల్లాలో ఒక కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలు కోర్టు వివాదాలతో రాజమహేంద్రవరం కార్పొరేషన్లో యథాతథ స్థితి మున్సిపాలిటీల్లో పెరగనున్న వార్డులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న కమిషనర్లు పునర్విభజనను అనుకూలంగా మార్చుకుంటున్న బాబు సర్కారు -
విజ్ఞాన భాండాఘోరం
అమలాపురం టౌన్: సమాజానికి వెలుగునిచ్చే విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయాల పరిస్థితి చంద్రబాబు ప్రభుత్వంలో ఘోరంగా తయారైంది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లుగా గ్రంథాలయాల అభివృద్ధిని, నిధుల కేటాయింపును పట్టించుకోవడం లేదు. జిల్లాల పునర్విభజన జరిగినప్పటికీ కొన్ని ప్రభుత్వ శాఖలు ఉమ్మడి జిల్లా పరిధిలోనే కొనసాగుతున్నాయి. అందులో గ్రంథాలయశాఖ ఒకటి. ప్రతి ఏటా రాష్ట్ర గ్రంథాలయాల బడ్జెట్ దాదాపు రూ.140 కోట్ల వరకూ ఉండేది. తాజాగా ప్రభుత్వం ఆ బడ్జెట్ను కేవలం రూ.36 కోట్లకు కుదించడంపై ఉమ్మడి జిల్లాలోని గ్రంథాలయ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జీతమో రామ‘చంద్రా..’ ఉమ్మడి జిల్లాలోని గ్రంథాలయాల విశ్రాంత ఉద్యోగులకు ప్రతి నెలా పింఛన్ల కింద రూ.54 లక్షలు ప్రభుత్వం ఇవ్వాలి. అలాగే సిబ్బంది జీతాలకు మరో రూ.52 లక్షల వరకూ అవసరం. ఇక గ్రంథాలయాల నిర్వహణ, అద్దెలు, విద్యుత్ బిల్లులు, దిన పత్రికలు, పోటీ పరీక్షల పుస్తకాలు తదితర ఖర్చులు కూడా సిబ్బంది జీతాల గ్రాంటులోనే ఉంటుంది. అయితే మూడు నెలల నుంచి గ్రంథాలయ ఉద్యోగులకు జీతాలను కూడా ప్రభుత్వం బట్వాడా చేయలేకపోతోంది. దీంతో ఉమ్మడి జిల్లాలోని ఉద్యోగులు జీతమో రామ‘చంద్ర’ అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. పెండింగ్లో.. గ్రంథాలయాల్లో దిన పత్రికల నిధులను ప్రభుత్వం పంపించకపోయినప్పటికీ ఆయా గ్రంథాలయాల ఉద్యోగులే అరువు పద్ధతిలో ఏదోలా పత్రికలను వేయించుకుని పాఠకులకు అసౌకర్యం కలగకుండా చూస్తున్నారు. ఇక పోటీ పరీక్షల పుస్తకాల సరఫరా అయితే మూడు నెలల నుంచే కాదు అంతకు ముందు నుంచే నిలిచిపోయింది. ఇక అద్దె భవనాల్లో కొనసాగుతున్న గ్రంథాలయాలకు అద్దెలు, విద్యుత్ బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయి. గుదిబండగా సెస్ బకాయిలు ఉమ్మడి జిల్లాలోని స్థానిక సంస్థల నుంచి రావాల్సిన సెస్ బకాయిలు విపరీతంగా పెరిగిపోయి గ్రంథాలయ నిర్వహణ భారం మరింత పెరిగింది. రాజమహేంద్రవరం, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ల సెస్ బకాయి రూ.18 కోట్లు, ఉమ్మడి జిల్లాలోని పంచాయతీల నుంచి రూ.16.50 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ఇక మున్సిపాలిటీల బకాయిలు రూ.లక్షల్లో ఉన్నాయి. ఉదాహరణకు అమలాపురం మున్సిపాలిటీ నుంచి రూ.20 లక్షల మేర గ్రంథాలయ సెస్ వసూలు కావాల్సి ఉంది. వీటిని వసూలు చేసుకుని జీతాలు తీసుకోవాలని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు ఇవ్వడంపై గ్రంథాలయ ఉద్యోగులు మండిపడుతున్నారు. తమ జీతాలను ఎప్పటిలాగే గ్రాంటు రూపంలో విడుదల చేయాలని కోరుతున్నారు. సిబ్బంది కొరత ఉమ్మడి జిల్లాలోని గ్రంథాలయాలను సిబ్బంది కొరత వేధిస్తోంది. 204 రెగ్యులర్ పోస్టులకు గాను కేవలం 55 మందే పనిచేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ పోస్టులు 37కి 27, లైబ్రేరియన్, రికార్డు అసిస్టెంట్లు, హెల్పర్లు పోస్టులు 37కి 27 మాత్రమే ఉన్నాయి. అలాగే ఉమ్మడి జిల్లాలో 102 శాఖా గ్రంథాలయాలకు 100 పనిచేస్తున్నాయి. ఇక 51 గ్రామీణ గ్రంథాలయాలకు నాలుగు, 161 పుస్తక పంపిణీ కేంద్రాలకు 138 మాత్రమే పనిచేస్తున్నాయి. ఫ గ్రంథాలయాలపై చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం ఫ మూడు నెలలుగా నిలిచిన సిబ్బంది జీతాలు ఫ పోటీ పరీక్షల పత్రికల సరఫరా నిలిపివేత ఫ దిన పత్రికలకు బిల్లులు నిల్ ఫ బడ్జెట్లోనూ భారీ కోత గ్రంథాలయాలను పరిరక్షించాలి నిర్వీర్యమవుతున్న గ్రంథాలయ వ్యవస్థను రక్షించాలి. దీని అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలి. గ్రంథాలయ సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు లేవు. దిన పత్రికల బిల్లులు ఇవ్వకపోగా, పోటీ పరీక్షల పుస్తకాలను నిలిపివేయడం తగదు. పరిస్థితి ఇలానే కొనసాగితే ఆందోళనకు దిగక తప్పదు. – జీవీఆర్ఎస్హెచ్కే వర్మ, ఉమ్మడి జిల్లా గ్రంథాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు -
అన్నీ పనులకూ ఒక్కరే!
తాళ్లపూడి: స్థానిక సాంఘిక సంక్షేమ వసతిగృహన్ని మంగళవారం కొవ్వూరు ఆర్డీవో ఆనందరావు తనిఖీ చేశారు. అక్కడ పరిస్థితులను గమనించిన ఆయన ఆశ్చర్యపోయారు. విద్యార్థులకు కనీసం రాష్ట్రపతి, ప్రధాని, ఆర్డీఓ, తహసీల్దార్ పేర్లు తెలియని పరిస్థితి నెలకొంది. హాస్టల్లో 23 మంది విద్యార్థులకు సగం మంది మాత్రమే ఉన్నారు. ఇక్కడ కొంతకాలంగా వార్డెన్తో పాటు పలువురు సిబ్బంది లేకుండానే హాస్టల్ నడుస్తోంది. నాలుగు నెలల క్రితం వచ్చిన కుక్ (వంటమనిషి) శివాజీ అన్ని తానై హాస్టల్ను నడుపుతున్నారు. వార్డెన్గా, వాచ్మెన్గా, కుక్గా శివాజీ పని చేయటంపై అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. తాళ్లపూడి తహసీల్దార్ లక్ష్మీలావణ్య, ఆర్ఐ రామకృష్ణ, వీఆర్వోలు ప్రకాష్, నాగేశ్వరరావు, సంజీవరావు, లీలావతి తనిఖీలో పాల్గొన్నారు. సీఐటీయూ నూతన కార్యవర్గం ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం) : సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) నూతన జిల్లా కమిటీ ఎన్నిక మంగవారం స్థానిక వైఏంఏ హాలులో జరిగింది. ఈ కమిటీలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఎం.సుందర్ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా బి.పవన్, జిల్లా కోశాధికారిగా కేఎస్వీ రామచంద్రరావు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎస్ఎస్. మూర్తి, టి.అరుణ్, సీహెచ్ మాణిక్యాంబ, కె.అన్నామణి, కె.రామకృష్ణ, కార్యదర్శులుగా కె.బేబీరాణి, బి.పూర్ణిమ రాజు, బి.భగత్, రణదీప్ సింగ్, గంటి కృష్ణ, ఎం.వెంకటలక్ష్మి ఎన్నికయ్యారు. వీరితోపాటు జిల్లా కమిటీ సభ్యులుగా 41 మంది ఎన్నికయ్యారు. గృహోపకరణాలు దగ్ధం తాళ్లరేవు: కోరంగి పంచాయతీ సీతారామపురం గ్రామంలో మంగళవారం రాత్రి రెడ్డి నాగరాజు ఇంటిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఇంట్లోని వారంతా టీవీ చూస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో టీవీతో పాటు ఏసీ తదితర గృహోపకరణాలు కాలిపోయాయి. గమనించిన స్థానికులు వెంటనే మంటలను అదుపుచేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. సుమారు రూ.లక్షకు పైగా ఆస్తినష్టం సంభవించిందని బాధితులు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు వచ్చి ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు ముమ్మిడివరం: నిబంధనలు పాటించని ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా రవాణాధికారి (డీటీవో) దేవిశెట్టి శ్రీనివాస్ హెచ్చరించారు. ఆయన మంగళవారం అన్నంపల్లి టోల్ ప్లాజా వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు. యానాం నుంచి హైదరాబాద్ వెళుతున్న 23 బస్సుల్లో తనిఖీలు నిర్వహించారు. అగ్ని ప్రమాద నిరోధక పరికరాలు, అత్యవసర ద్వారం, ప్రయాణికుల లగేజీలను పరిశీలించారు. అతివేగం, సెల్ఫోన్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్ చేస్తూ పట్టుపడితే డ్రైవర్కు జైలుశిక్ష తప్పదని హెచ్చరించారు. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు బయటపడే మెళకువలను ప్రయాణికులకు వివరించారు. ఎంవీఐ సురేష్ కుమార్ పాల్గొన్నారు. హాస్టల్ విద్యార్థులకు ’దివీస్’ విరాళం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు కాకినాడ ఒంటిమామిడికి చెందిన దివీస్ ల్యాబ్రేటరీస్ లిమిటెడ్ సంస్థ రూ.3.10 కోట్ల విలువైన వస్తువులను విరాళంగా అందించినట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. మొదటి విడతగా 500 పరుపులను నాలుగు బీసీ హాస్టళ్లకు పంపే వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. -
కొత్త ఈఓ ‘చక్ర’ం తిప్పగలరా?
● రత్నగిరిపై స్వాగతం పలుకుతున్న సమస్యలు ● ఐదేళ్లుగా అంతంత మాత్రంగా ఆర్థిక పరిస్థితి అన్నవరం: వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానానికి ఇన్చార్జి ఈఓగా నియమితులైన వాడపల్లి ఈఓ ఎన్ఎస్ చక్రధర్రావుకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. అనుభవజ్ఞులైన సిబ్బంది లేకపోవడం, శానిటేషన్ సమస్య, ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండడం, త్వరలో జరుగనున్న స్వామివారి కల్యాణ మహోత్సవాలకు ఏర్పాట్లు వంటివి కొత్త ఈఓకు చాలెంజ్గా మారనున్నాయి. క్లిష్టంగా పరిస్థితి ఒకప్పుడు అనుభవం గలిగిన సిబ్బంది, మిగులు ఆదాయంతో కళకళలాడిన దేవస్థానంలో నేడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. గతంలో అనేక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించిన చాలామంది సిబ్బంది పదవీ విరమణ చేశారు. మిగిలిన సిబ్బందిలో కార్యక్రమాలు సమర్థంగా నిర్వహించే చొరవ, అనుభవం లేకపోవడంతో తూతూ మంత్రంగా జరుగుతున్నాయన్న అభిప్రాయం భక్తుల నుంచి వినిపిస్తోంది. వార్షికాదాయం రూ.157 కోట్లు 2025–26 ఆర్థిక సంవత్సరంలో దేవస్థానం ఆదాయం రూ.157 కోట్లు వచ్చింది. 2026–27 దేవస్థానం బడ్జెట్ రూ.180 కోట్లుగా ఖరారు చేశారు. ఐదేళ్ల క్రితమే దేవస్థానం ఆదాయం సుమారు రూ.150 కోట్లు. పది శాతం చొప్పున పెరిగినా ఈ ఐదేళ్లలో రూ.200 కోట్లుకు చేరుకోవాలి. కాని ఆ మేరకు పెరగలేదు. ఆదాయం పెరగకపోవడంతో బడ్జెట్ కూడా పెరగలేదు. కీలక అధికార్లదీ ప్రేక్షక పాత్రే ఇక్కడ కీలకంగా బాధ్యతలు నిర్వహించాల్సిన డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ కేవలం అలంకార ప్రాయంగానే ఉంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అనుభవజ్ఞులైన సిబ్బంది లేకపోవడం, ఏ వ్యవహారమైనా చక్కదిద్దే భాధ్యత ఈఓ మీదనే ఉండడం తదితర కారణాల వల్ల గతంలో ఇక్కడ పనిచేసిన ఈఓలు బదిలీ చేయించుకుని వెళ్లిపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 220 మంది రెగ్యులర్ సిబ్బంది... వేయికి పైగా తాత్కాలిక సిబ్బంది దేవస్థానంలో రెగ్యులర్ సిబ్బంది 220 మంది ఉంటే ఎన్ఎంఆర్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది వేయి కి పైగా ఉన్నారు. రెగ్యులర్ సిబ్బందిలో కూడా దాదాపు సగం మంది కారుణ్య నియామకాల ద్వారా నియమితులైనవారే. కీలకమైన పోస్టులలో కూడా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందినే నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేవస్థానంలో ఒక ఏఈఓ, నాలుగు సూపరిండెంట్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరో పది రోజుల్లో కల్యాణోత్సవాలు ఈ నెల 26వ తేదీ నుంచి జరుగనున్న సత్యదేవుని కల్యాణోత్సవాలకు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. గురువారం కో ఆర్డినేషన్ సమావేశంలో ఏర్పాట్లపై సమీక్షించనున్నారు. పెరిగిన రాజకీయ జోక్యం దేవస్థానంలో ప్రతీ విషయంలో ప్రజాప్రతినిధుల అనుమతి తప్పనిసరి అనే ధోరణి ప్రబలింది. దీంతో చిన్న స్థాయి ఉద్యోగిని మరో సెక్షన్కు బదిలీ చేయాలన్నా ఈఓ సొంతంగా చేయలేని పరిస్థితి. ఈ పద్ధతి మారకపోతే ఇబ్బందే. ప్రోసీడింగ్స్ ఇచ్చాక బాధ్యతల స్వీకరణ మంగళవారం అంబేడ్కం జయంతి కావడంతో దేవదాయశాఖ కమిషనర్ ప్రోసీడింగ్స్ పంపించ లేదు. బుధవారం ఆదేశాలు వస్తాయని భావిస్తున్నారు. అవి రాగానే ఈఓ బాధ్యతలు స్వీకరిస్తారు. -
జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్లో నాగబాబు సత్తా
జపాన్ ప్రపంచ మీట్కు ఎంపిక కరప: ఢిల్లీలోని ఈస్ట్ వినోద్ నగర్ స్పోర్ట్స్ స్టేడియంలో అడ్వెంచర్ నేషనల్ మాస్టర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అథ్లెటిక్స్ ఓపెన్ చాంపియన్ షిప్లో కాకినాడ జిల్లాకు చెందిన అథ్లెట్, ప్రస్తుత భీమవరం జిల్లా ఉప మలేరియా అధికారి యాతం నాగబాబు అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఈ పోటీల్లో ఆయన మొత్తం మూడు పతకాలను కై వసం చేసుకుని తన సత్తా చాటారు. పతకాల పంట నాగబాబు 800 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతకం, 1500 మీటర్ల విభాగంలో మరో స్వర్ణ పతకం సాధించగా, 400 మీటర్ల పరుగు పందెంలో వెండి పతకాన్ని గెలుచుకున్నారు. ఈ విజయంతో 2027 మే నెలలో జపాన్ లో జరగనున్న ’ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్’కు ఆయన ఎంపికయ్యారు. రికార్డు స్థాయిలో పతకాలు నాగబాబు ఇప్పటివరకు తన క్రీడా జీవితంలో మొత్తం 105 పతకాలను సాధించి రికార్డు సృష్టించారు. వీటిలో ● జాతీయ స్థాయిలో 63 పతకాలు (21 బంగారం, 17 వెండి, 25 కాంస్యం) ● అంతర్జాతీయ స్థాయిలో 2 స్వర్ణ పతకాలు ● రాష్ట్ర స్థాయిలో 40 పతకాలు ఉన్నాయి -
బెట్టింగ్ భూతం
బెట్టింగ్లో నష్టపోయి.. చోరీల బాట● బంతి బంతికీ పందెమే.. ● ఉత్కంఠ రేపుతున్న ఐపీఎల్ మ్యాచ్లు ● యువతను బెట్టింగ్ ఉచ్చులోకి దించుతున్న బుకీలు ● ఆన్లైన్, యాప్లతో వల రాజమహేంద్రవరం రూరల్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ గత నెల 28వ తేదీన ఆరంభమైంది. రెండు నెలల పాటు సాగే ఈ క్రికెట్ మ్యాచ్లు యువతలో ఉత్కంఠ రేపుతున్నాయి. మ్యాచ్లను ఆసక్తిగా తిలకిస్తూ, తమ అభిమాన జట్టు గెలుస్తుందన్న ధీమాతో బెట్టింగ్లు కాసేందుకు కొందరు క్రికెట్ అభిమానులు ఉత్సుకత చూపుతున్నారు. వారి బలహీనతను ఆసరాగా తీసుకుని పలువురు బుకీలు రంగంలోకి దిగారు. ఉమ్మడి తూర్పు గోదా వరి జిల్లావ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, పల్లెలు, మైదాన ప్రాంతం, మన్యసీమ అనే తేడా లేకుండా యువతకు ఆన్లైన్, రకరకాల యాప్లతో వల విసురుతున్నారు. రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, అనపర్తి, నిడదవోలు, పిఠాపురం, ఏలేశ్వరం, తుని, మండపేట, రామచంద్రపురం, కొవ్వూరుతో పాటు అనేక గ్రామాల్లో పలువురిని ఈ ఉచ్చులోకి దించుతున్నారు. టాస్ నుంచి బంతిబంతికీ బెట్టింగ్ కట్టేలా ఉసిగొల్పుతూ, నిలువునా దోచుకుంటున్నారు. గెలిచినా డబ్బులు ఎగ్గొడుతూ.. ఐపీఎల్లో మొత్తం 75 మ్యాచ్లకు గాను హైదరాబాద్, చైన్నె, బెంగళూరు, ముంబై జట్ల పైనే ఎక్కువ మంది బెట్టింగ్లు వేస్తున్నారు. ఇదే అదనుగా బుకీలు బెట్టింగ్ కాసేవారిని ముంచేస్తున్నారు. బెట్టింగ్లో కొన్నిసార్లు గెలిచినా డబ్బులు ఎగ్గొడుతున్నారు. అయినప్పటికీ అంతా ఆన్లైన్ కావడం, విషయం బయటకు తెలిస్తే ఇబ్బందులు ఎదురవుతాయన్న భయంతో చాలా మంది మిన్నకుండిపోతున్నారు. కొందరు బెట్టింగ్లకు ఇళ్లు, వాహనాలను, ఆభరణాలను సైతం తాకట్టు పెడుతున్న దాఖలాలున్నాయి. అన్నింటికీ బెట్టింగే.. ఈ ఉచ్చులో చిక్కుకున్న వారు క్రికెట్ మ్యాచ్లు తిలకిస్తూనే బెట్టింగ్లో పాల్గొనేలా బుకీలు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతా ఫోన్లోనే ప్రత్యేక కోడ్ భాషతో పందేలు కాయిస్తున్నారు. ఎస్, నో, ఓకే, డన్, రిపీట్ వంటి పదాలు వాడుతున్నారు. ఏ క్రికెటర్ ఎన్ని పరుగులు చేస్తారు.. ఆ ఓవర్లో ఎన్ని సిక్స్లు కొడతారు.. వికెట్లు తీస్తారు.. ఎన్ని పరుగులకు జట్టు అవుటవుతుంది వంటి అనేక అంశాలపై బెట్టింగ్లు సాగుతున్నాయి. బంతి బంతికీ ఉత్కంఠ రేపుతూ పందెం కాయిస్తున్నారు. సెకన్ల తేడాతో.. వాస్తవానికి టీవీల్లో క్రికెట్ మ్యాచ్ చూసేవారికి కనీసం 10 నుంచి 80 సెకన్ల తేడాతో ప్రత్యక్ష ప్రసారం వస్తుంది. ఒక్కోసారి రెండు బంతుల సమయం కూడా తేడా ఉంటుంది. అయితే, బెట్టింగ్ బలహీనత ఉన్నవారు ఈ విషయాలు తెలుసుకోకుండా, తెలిసినా పెద్దగా పట్టించుకోకుండా పందేలు కాస్తున్నారు. ఇదే అదనుగా వారి జేబులకు బుకీలు కన్నం వేస్తున్నారు. రూ.100 కడితే రూ.1,000 ఇస్తామంటూ నమ్మించి పెద్ద మొత్తంలో సొమ్ము దోచుకుని నిలువునా ముంచేస్తున్నారు. పోలీసు శాఖ హెచ్చరికలు ● బెట్టింగ్ అనేది పెనుభూతం లాంటిది. ఆశ చూపి అధఃపాతాళానికి నెట్టేస్తుంది. కుటుంబాలను రోడ్డు పాలు చేస్తుంది. కొందరి ప్రాణాలను సైతం తీస్తుంది. ● క్రికెట్ను అభిమానులు ఆస్వాదించాలే తప్ప బెట్టింగ్లకు పోరాదు. ఆన్లైన్, ఆఫ్లైన్ బెట్టింగ్లతో జీవితాలను నాశనం చేసుకోవద్దు. ● బెట్టింగ్ కాస్తున్న వారిలో యువతే అధికంగా ఉంటున్నారు. కొందరు స్వార్థపరులు, చెడు నడత కలిగిన వ్యక్తులు క్రికెట్ బెట్టింగ్లకు తెర లేపే అవకాశం ఉంది. వారి మాటలు నమ్మరాదు. ● బెట్టింగ్లో ఒకసారి ఆదాయం వచ్చినా ఎక్కువసార్లు నష్టపోతారు. ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి, చేసిన అప్పులను తీర్చడానికి యువత దొంగతనాలకు, ఇతర నేరాలకు పాల్పడుతూ, భవిష్యత్తును అంధకారమయం చేసుకుంటున్నారు. ● పిల్లలను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. బెట్టింగులకు పాల్పడుతూంటే నచ్చజెప్పి వారిని ఆ ఊబిలో నుంచి బయటకు తీసుకురావాలి. ● బెట్టింగ్ నిర్వాహకులపై సస్పెక్ట్ షీట్లు తెరుస్తాం. ● ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్లు జరుగుతున్నట్లు తెలి స్తే 112, 100 లేదా సంబంధిత పోలీసు అధికారులకు ఫోను ద్వారా తెలియజేయాలి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. నిర్వాహకులపై నిఘా క్రికెట్ బెట్టింగ్పై పూర్తి స్థాయిలో నిఘా పెట్టాం. గతంలో బెట్టింగ్ కేసులలో పట్టుబడిన నిందితుల ఫోన్లపై ఇప్పటికే నిఘా పెట్టాం. బెట్టింగ్లకు పాల్పడినా, ఇతరులను ప్రోత్సహించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ఆన్లైన్, బెట్టింగ్ యాప్ల వలలో చిక్కుని జీవితాలను నాశనం చేసుకోవద్దు. – డి.నరసింహ కిషోర్, ఎస్పీ, తూర్పు గోదావరి జిల్లా పలుచోట్ల దొంగతనాలు యువకుడి అరెస్టు రూ.12 లక్షల సొత్తు స్వాధీనం రంపచోడవరం: క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడి.. డబ్బులు పొగొట్టుకుని.. ఆ నష్టాల నుంచి బయట పడటానికి దొంగగా మారిన ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. చింతూరు ఏఎస్పీ, రంపచోడవరం ఇన్చార్జి ఏఎస్పీ బి.హేమంత్ సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. అడ్డతీగల సీఐ బి.నరసింహమూర్తి, ఎస్సైలు అడ్డతీగల మండలం పాపంపేట వద్ద ఆదివారం వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో కాకినాడ జిల్లా ఏలేశ్వరం పట్టణానికి చెందిన మజ్జి శివప్రసాద్ మోటార్ బైక్పై వస్తూండగా ఆపారు. అనుమానంతో తనిఖీ చేసి, ప్రశ్నించగా పోలవరం జిల్లా పరిధిలోని పలుచోట్ల 13 దొంగతనాలు చేసినట్లు అతడు అంగీకరించాడు. క్రికెట్ బెట్టింగ్కు అలవాటు పడి దాదాపు రూ.4 లక్షల వరకూ పోగొట్టుకున్న అతడు.. ఈ క్రమంలో దొంగతనాలకు అలవాటు పడ్డాడు. మోటార్ బైక్పై ఉదయం వేళ గ్రామాల్లో తిరుగుతూ రెక్కీ నిర్వహిస్తాడు. తాళాలు వేయకుండా ఉన్న ఇళ్లు, తాళాలు గుమ్మానికి తగిలించిన ఇళ్లను గుర్తించి, దొంతనాలకు పాల్పడుతున్నాడు. నిందితుడు శివప్రసాద్ నుంచి రూ.12 లక్షల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో పది జతల చెవి దిద్దులు, 5 చైన్లు, 14 ఉంగరాలు, ఒక జత మాటీలు, నల్లపూసలు వంటి వాటితో కలిపి మొత్తం 122.846 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయి. వీటితో పాటు వెండి పట్టీలు, వెండి వినాయకుడు, లక్ష్మీదేవి, ఆవు–దూడ, తులసి చెట్టు బొమ్మలు, గుత్తి గ్లాసులు, కుంకుమ భరిణె తదితర వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అడ్డతీగల కోర్టులో హాజరుపరిచారు. అతడిని పట్టుకోవడంలోను, చోరీ సొత్తు రికవరీలోను ప్రతిభ చూపిన సీఐ నరసింహమూర్తి, ఎస్సై బి.వినోద్, కానిస్టేబుళ్లు కె.రాంబాబు, కె.దుర్గాప్రసాద్, బి.సురేంద్ర, కె.నీలపురెడ్డిలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారని ఏఎస్పీ హేమంత్ తెలిపారు. -
కార్యకర్తకు రూ.లక్ష ఆర్థిక సాయం
కపిలేశ్వరపురం: ఎలక్ట్రికల్ పని చేస్తూండగా షాక్కు గురై, చేతిని కోల్పోయిన కపిలేశ్వరపురానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త నాగాబత్తుల సుధీర్కు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మండలానికి చెందిన నాయకులు, కార్యకర్తలు రూ.1,00,500 ఆర్థిక సాయం సమకూర్చారు. ఆ మొత్తాన్ని సుధీర్కు ఆయన నివాసంలో ఎమ్మెల్సీ తోట చేతుల మీదుగా సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా సుధీర్కు, కుటుంబ సభ్యులకు ఆయన ధైర్యం చెప్పారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఏ కష్టమొచ్చినా తనను సంప్రదించవచ్చన్నారు. కష్టకాలంలో చేదోడువాదోడుగా నిలిచిన ఎమ్మెల్సీ తోటకు, పార్టీ నేతలు, కార్యకర్తలకు సుధీర్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గూటం సత్యనారాయణ, గ్రామ కమిటీ అధ్యక్షుడు అంగాని నూకరాజు, వైస్ ఎంపీపీ గుణ్ణం భానుప్రసాద్, ఎంపీటీసీ సభ్యులు గొల్లపల్లి సోనియా, నాయకులు మేడిశెట్టి దుర్గారావు, కట్టా మురళి, పిప్పర సంపతరావు, కుడుపూడి విజయ్, చింతా పెద్దకాపు, కందుల శ్రీనివాస్, పాలింగి కృష్ణకిశోర్, శ్రీనివాస్, పీతల శ్రావణ్ కుమార్, నీతిపూడి శేఖర్, కన్నా శ్రీను, పెంటపాటి వెంకన్నబాబు, పలివెల మధు పాల్గొన్నారు. ర్యాపిడో రైడర్ల సమస్యలు పరిష్కరించాలి కంబాలచెరువు (రాజమహేంద్రవరం): తమ సమస్యలు పరిష్కరించాలంటూ ర్యాపిడో రైడర్లు ఆ సంస్థ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా చేశారు. రైడర్లు రవీంద్ర, వంశీ మాట్లాడుతూ, ర్యాపిడో యాప్ ద్వారా రాత్రనక, పగలనక, ఎండనక, వాననక ఎంతో కష్టపడి తాము రైడ్స్ చేసి సంపాదిస్తున్న సొమ్మును యాజమాన్యం అడ్డంగా దోచుకుంటోందని మండిపడ్డారు. తమకు కంపెనీ నుంచి రావలసిన హెల్మెట్లు, టీషర్టులు ఇవ్వడం లేదని, రేట్ కార్డుల వంటి సదుపాయాలు కల్పించకపోగా.. తమ ఆదాయంలో జీఎస్టీ, కమీషన్ పేరిట అడ్డంగా వసూలు చేస్తున్నారని అన్నారు. చివరకు కస్టమర్లు ఇస్తున్న టిప్లో కూడా కమీషన్ కట్ చేస్తున్నారన్నారు. అదేమిటని ప్రశ్నిస్తే పైనుంచి వస్తున్న రూల్స్ అని, ఇష్టం ఉంటే చేయమని, లేదంటే మానేయాలని చెబుతున్నారన్నారు. ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పి.త్రిమూర్తులు మాట్లాడుతూ, ర్యాపిడో రైడర్ల శ్రమను యాజమాన్యం దారుణంగా దోచుకుంటోందని ఆరోపించారు. బైక్ బూస్ట్ ఇంటర్ సిటీ పేరిట రాజమహేంద్రవరం నుంచి కాకినాడకు రూ.177, రావులపాలేనికి రూ.68, భీమవరానికి రూ.198 చార్జీ పెడుతూ రైడర్లను ఇబ్బంది పెడుతోందన్నారు. ఇకపై బైక్ బూస్ట్ ఇంటర్ సిటీలను రద్దు చేసి, సరైన రైడ్స్ కార్డు ప్రకటించాలని, రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రైడర్లకు సరైన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ర్యాపిడో యాప్ను రాజమహేంద్రవరంలో నిలిపివేయడానికి మరింత ఉధృతంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో 200 మందికి పైగా రైడర్లు పాల్గొన్నారు. పోలీస్ పీజీఆర్ఎస్కు 43 ఫిర్యాదులు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి 43 ఫిర్యాదులు వచ్చాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఎస్పీ డి.నరసింహ కిశోర్ స్వయంగా ఫిర్యాదులు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుని, వెంటనే సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి, ఆ సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఆదేశించారు. -
అగి్గ.. రేగితే బుగే్గ..
రాయవరం మండలం సోమేశ్వరంలో అగ్నికి ఆహుతి అవుతున్న ఇళ్లు (ఫైల్) ● వేసవిలో అగ్ని ప్రమాదాల ముప్పు ● అవగాహన, అప్రమత్తతే రక్ష ● ఏడాదిగా జిల్లాలో 468 అగ్నిప్రమాదాలు ● నేటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు రాయవరం: ఇంకా గ్రీష్మ రుతువు రానేలేదు.. అప్పుడే సూరీడు దాదాపు 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలతో భగ్గుమంటున్నాడు. మే నెలను తలదన్నేటట్లు ప్రతాపం చూపుతున్నాడు. ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటుతాయంటూ వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. వివిధ కారణాలతో వేసవిలో సాధారణంగా అగ్ని ప్రమాదాల ముప్పు పొంచి ఉంటుంది. ఫలితంగా ఆస్తితో పాటు ఒక్కోసారి ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. జిల్లాలో అగ్నిమాపక కేంద్రాలు 20 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నప్పటికీ పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు నిమిషాల్లోనే నష్టం జరిగిపోతూంటుంది. ఈ నేపథ్యంలో వేసవిలో జరిగే అగ్ని ప్రమాదాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఏటా ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకూ అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తూంటారు. 1994 ఏప్రిల్ 14న ముంబై ఓడరేవులో జరిగిన అగ్నిప్రమాదానికి గుర్తుగా ఏటా జాతీయ అగ్నిమాపక దినోత్సవం నిర్వహిస్తారు. జిల్లాలోని ఏడు అగ్నిమాపక కేంద్రాల పరిధిలో వారోత్సవాల నిర్వహణకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రమాదాలూ అధికమే.. వేసవిలో ఎక్కడ చూసినా అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూంటాయి. కొన్నిసార్లు ఒక్కో రోజు ఒక్కో ప్రాంతంలో రెండు మూడు ప్రమాదాలు కూడా జరుగుతాయి. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకూ జిల్లావ్యాప్తంగా 468 అగ్ని ప్రమాదాలు సంభవించాయి. వీటిలో అతి భారీ ప్రమాదం ఒకటి, తీవ్రమైనవి (రూ.10 లక్షల పైన) 7, ఒక మోస్తరు (రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల లోపు) 36, చిన్నపాటివి 360 చొప్పున సంభవించాయి. ఈ అగ్ని ప్రమాదాల్లో మొత్తం రూ.7.92 కోట్ల మేర ఆస్తినష్టం సంభవించింది. రూ.27.89 కోట్ల ఆస్తిని అగ్నిమాపక సిబ్బంది కాపాడగలిగారు. అగ్ని ప్రమాదాల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, 15 మందిని రక్షించగలిగారు. రెస్క్యూ కాల్స్లో 20 మంది చనిపోగా, 11 మందిని అగ్నిమాపక సిబ్బంది కాపాడాగారు. జిల్లాలోని గోపాలపురం మినహా మిగిలిన ఆరు నియోజకవర్గ కేంద్రాల్లోనూ అగ్నిమాపక కేంద్రాలున్నాయి. గోపాలపురంలో స్థలం కేటాయింపు జరిగినా, బడ్జెట్ కేటాయించకపోవడంతో ఫైర్ స్టేషన్ నిర్మాణం చేపట్టలేదు. రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరులో అగ్నిమాపక కేంద్రం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అవగాహన కల్పిస్తున్నాం అగ్ని ప్రమాదాలను అదుపు చేయడంతో పాటు ప్రమాదాలపై ముందస్తు అవగాహన కల్పిస్తున్నాం. అవసరమైన వారికి శిక్షణ ఇస్తున్నాం. వేసవిలో నిర్లక్ష్యంగా స్మోకింగ్ చేయడాన్ని నియంత్రించాలి. ఇంట్లో వంట చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నాం. వోల్వో బస్సులలో జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పిస్తాం. – చిన్నం మార్టిన్ లూథర్కింగ్, జిల్లా విపత్తుల స్పందన అధికారి, రాజమహేంద్రవరం అగ్నిమాపక శకటంఈ జాగ్రత్తలు పాటిస్తే మేలు గ్యాస్ స్టౌను సిలిండర్ కన్నా ఎత్తులో ఉంచాలి. వాడుతున్న వంట గ్యాస్ సిలిండర్కు అదనపు సిలిండర్ను, కిరోసిన్, డీజిల్, పెట్రోల్ను దూరంగా ఉంచాలి. చిన్నారులకు అగ్గిపెట్టెలు, లైటర్లు అందుబాటులో ఉంచరాదు. వంట పూర్తయిన వెంటనే రెగ్యులేటర్ను తప్పనిసరిగా ఆపివేయాలి. ఐఎస్ఐ మార్కు ఉన్న ఎల్పీజీ సురక్ష ట్యూబులనే వాడాలి. గ్యాస్ లీక్ అవుతున్న అనుమానం వస్తే కిటికీలు, తలుపులు వెంటనే తెరవాలి. ఎలక్ట్రికల్ స్విచ్ ఆన్, ఆఫ్ చేయరాదు. ఒకే ఎలక్ట్రిక్ పాయింట్ వద్ద ఎక్కువ ప్లగ్గులు పెట్టరాదు. ఇళ్లు వదిలి దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు విద్యుత్ మెయిన్ ఆపు చేయాలి. విద్యుత్ పరికరాలకు నిప్పు అంటుకుంటే మెయిన్ ఆఫ్ చేసి పొడి ఇసుక లేదా డ్రై కెమికల్ పౌడర్ జల్లాలి. కాల్చిన సిగరెట్లు, బీడీలు, అగ్గిపుల్లలు ఆర్పివేసి పారేయాలి. ఎలక్ట్రిక్ పాయింట్లను ఓవర్లోడు చేయరాదు. దుస్తులకు నిప్పు అంటుకుంటే పరుగెత్తరాదు. నేలపై దొర్లాలి లేదా దుప్పటి చుట్టుకోవాలి. కాలిన శరీర భాగాల మీద చల్లని నీరు పోయాలి. పొగతో నిండిన గదుల్లో మోచేతులు, మోకాళ్లపై పాకాలి. గడ్డివాములను ఇళ్లకు తప్పనిసరిగా 60 అడుగుల దూరంలో వేసుకోవాలి. గడ్డివాములను సరైన గాలివాటంలో ఏర్పాటు చేసుకోవాలి. గుడిసెకు గుడిసెకు మధ్య 30 అడుగుల దూరాన్ని పాటించాలి. కర్మాగారాల్లో కార్మికులు పని చేసే స్థలాల్లో కనీసం రెండు ఫైర్ ఎగ్జిట్స్ ఏర్పాటు చేయాలి. వారోత్సవాలు ఇలా.. ఈ నెల 14న అగ్నిమాపక దళ పతాకావిష్కరణ, విధి నిర్వహణలో అసువులు బాసిన సిబ్బందికి నివాళి, కరపత్రాల ఆవిష్కరణ. 15న బస్టాండ్, మాల్స్, మార్కెట్లు, సినిమా థియేటర్లు, మురికివాడల్లో అగ్నిమాపక పరికరాల ప్రదర్శన, అవగాహన కల్పించడం. 16న నివాస ప్రాంతాల్లో ముఖ్యంగా అపార్ట్మెంట్ల వద్ద ఎల్పీజీ సేఫ్టీ, నిర్లక్ష్యంగా పొగ తాగడం, అగ్నిమాపక నియంత్రణ పరికరాల వినియోగం, అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన. 17న విద్యా సంస్థల్లో మాక్ డ్రిల్. 18న ఎల్పీజీ నిల్వ ఉంచే విధానం, పరిశ్రమల్లో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన. 19న ఆస్పత్రుల్లో వైద్యులు, స్టాఫ్ నర్సులు, రోగులకు అగ్నిమాపక నియంత్రణపై అవగాహన. 20న అంగన్వాడీ కేంద్రాలు, స్వచ్ఛంద సంస్థల్లో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన, వారోత్సవాల ముగింపు. జిల్లాలో ఫైర్ స్టేషన్ల నంబర్లు ఫైర్ స్టేషన్ ల్యాండ్ నంబరు అనపర్తి 08856–227201 ఇన్నీస్పేట, రాజమహేంద్రవరం 08832–444101 కొవ్వూరు 08813–232101 మండపేట 08855–232101 కోరుకొండ 0883–2496101 నిడదవోలు 08813–221101 -
దొంగలొస్తారు జాగ్రత్త!
ఇటీవల జరిగిన చోరీలు ● సామర్లకోట పట్టణంలో 15 రోజుల కిందట ఓ కుటుంబీకులు తమ ఇంటికి తాళాలు వేసి ఊరెళ్లారు. వారు ఇంటికి తిరిగి వచ్చేలోపు దొంగలు తమ పని కానిచ్చేశారు. 143 గ్రాముల బంగారు నగలు, రూ.50 వేల నగదు తస్కరించారు. ● తాళ్లరేవులో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన వరస చోరీలు ప్రజలను ఆందోళనకు గురిచేశాయి. ఒక స్టూడియో, రెండు ఇళ్లలో దొంగలు చొరబడి ఈ చోరీలు చేశారు. రూ. 1.50 లక్షలకు పైగా సొత్తును దోచుకున్నారు. ● అప్రమత్తతతో ‘వేసవి’ చోరీలకు చెక్ ● అర్ధరాత్రి వేళ ఇళ్లు, షాపుల్లో జరిగే అవకాశం ● ఎల్హెచ్ఎంఎస్ను వినియోగించు కోవాలంటున్న పోలీసులు అమలాపురం టౌన్: వేసవి కాలం.. ఇంటి ఆరు బయట మంచాలు వేసుకుని చల్లని గాలిని ఆస్వాదిస్తూ నిద్రలోకి జారుకునే పరిస్థితులు ఇప్పుడు లేవు. ఆరుబయట నిద్రిస్తే ఇల్లును గుల్ల చేసే చోరీలు జరుగుతాయని జనం ఆందోళన చెందుతున్నారు. వేసవి కాలం వచ్చిందంటే ఏ ఇంట్లో కన్నం వేద్దామా అని దొంగలు పగలు రెక్కీ నిర్వహిస్తుంటారు. రాత్రి అయ్యాక రెక్కీలో గుర్తించిన ఇళ్లల్లో చోరీలు చేసేందుకు పక్కా ప్రణాళిక వేసుకుంటారు. జిల్లా కేంద్రాలైన రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురంతో పాటు ఉమ్మడి జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో వేసవి చోరీలు ఇప్పటికే మొదలయ్యాయి. ప్రజలే కాదు పోలీసులు కూడా ఈ చోరీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తాళాలు వేసి ఉన్న ఇళ్లే టార్గెట్ వేసవి సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి పిల్లలను వెంటబెట్టుకుని కుటుంబ సమేతంగా బంధువుల ఇంటికో, గుళ్లు గోపురాలకో, విహార యాత్రకో వెళ్లడం సాధారణం. అలా తాళాలు వేసిన ఇళ్లనే దొంగలు టార్గెట్ చేస్తారు. వేసవి ఎండలకు పగలంతా అలసి సొలసి ఇంటికి తాళాలు వేయకుండా తలుపులు జారవేసి వీధిలో నిద్రించే ఇళ్లపై దొంగలు ప్రత్యేక దృష్టి పెడతారు. సీసీ కెమెరాల వ్యవస్థ ఉన్న కొన్ని షాపుల్లో కూడా చోరీలు జరుగుతున్నాయి. కొందరు దొంగలు సీసీ కెమెరాలకు తమ పోలికలు దొరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటుంటే మరికొందరు సీసీ పుటేజీలకు చిక్కి కొద్దిరోజులకు పోలీసులకు పట్టుబడుతున్నారు. ఇవీ జాగ్రత్తలు.. ఇంటికి తాళాలు వేసి ఊరు వెళ్లేవారు రోజూ రాత్రి అయ్యే సరికి ఇంటి బయట, వెనుక వైపు లైట్లు వెలిగేలా ఏర్పాట్లు చేసుకోవాలి. అలా రోజూ రాత్రి లైట్లు వేసేందుకు ఇరుగుపొరుగు వారి సహకారం తీసుకోవాలి. ● ఇంటి ప్రధాన ద్వారానికి తాళం వేసినట్టు దొంగలకు తెలియకుండా గుమ్మానికి ఉన్న తాళం కనిపించకుండా విధిగా కర్టెన్ వేయాలి. ● ఇంటి ఇరుగు పొరుగున ఉండే వారిలో మీతో నమ్మకంగా ఉన్న వ్యక్తికి ఇంటిని చూస్తూ ఉండే బాధ్యతలు అప్పగించాలి. ● ఇంట్లో విలువైన నగలు, నగదు తదితర వస్తువులను బ్యాంక్ లాకర్లలో పెట్టుకోవడమో లేదా ఎవరికై నా తెలుసున్న బంధువులు లేదా స్నేహితులకు అప్పగించడమో చేసి ఊరు వెళ్లాలి. ‘ఎల్హెచ్ఎంఎస్’ ఉచిత అధికారిక సేవ లాక్డ్ హౌస్ మోనటరింగ్ సిస్టమ్’ (ఎల్హెచ్ఎంఎస్) పోలీసులు ఇళ్లకు కల్పించే ఉచిత అధికారిక సేవ. ఎవరైనా తమ ఇళ్లకు తాళాలు వేసి ఊరెళితే సమీపంలోని పోలీస్ స్టేషన్కు వెళ్లడం లేదా పోలీసులకు ఫోన్ చేసి ఎల్హెచ్ఎంఎస్ను అభ్యర్థించాలి. ఎల్హెచ్ఎంఎస్ యాప్ను డోన్ లౌడ్ చేసుకుంటే దాని గురించి పూర్తి అవగాహన కలుగుతుంది. ఈ సౌకర్యాన్ని తమ ఇళ్లకు ఏర్పాటు చేయించుకుంటే 24 గంటలూ ఆ ఇళ్లను పోలీసులు ఆన్లైన్లో పర్యవేక్షిస్తారు. ఈ విధానం తమ ఇళ్లకు ఓ రక్షణ కవచంగా నిలుస్తుంది. ఈ సిస్టమ్ను అభ్యర్థిస్తే పోలీసులే ఇళ్లకు వచ్చి ఆ సిస్టమ్ను అమర్చుతారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే వారంతా ఎల్హెచ్ఎంఎస్ ఉపయోగించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వేసవి కాలంలో అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగే చోరీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వేసవి సెలవుల్లో ఊరు వెళ్లే వారు ఇళ్లకు పటిష్టమైన తాళాలు వేసుకోవాలి. ఆరు బయట నిద్రించేవారు తమ ఆస్తులను భద్రపరచుకోవాలి. – టీఎస్ఆర్కే ప్రసాద్, డీఎస్పీ, అమలాపురం -
అలసత్వం చూపుతున్న అధికారులపై చర్యలు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో వచ్చిన అర్జీల పరిష్కారంలో అలసత్వం చూపుతున్న అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కీర్తి చేకూరి హెచ్చరించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లో జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్ తదితరులతో కలసి ప్రజల నుంచి ఆమె 183 అర్జీలు స్వీకరించారు. అనంతరం, అర్జీల పరిష్కార విధానం, పెండింగ్, ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ తదితర అంశాలపై జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో అలసత్వం చూపుతున్న ప్రభుత్వ శాఖల జాబితాను ముఖ్యమంత్రి కార్యాలయ పీజీఆర్ఎస్ విభాగం నుంచి పంపారన్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యానికి గల కారణాలను ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. జేసీ మేఘస్వరూప్ మాట్లాడుతూ, ఆయా అధికారుల విధి నిర్వహణలో ప్రవర్తనాపరమైన, విధానపరమైన లోటుపాట్లను గుర్తించామని, వెంటనే వాటిని సరిదిద్దుకోవాలని ఆదేశించారు. అర్జీల పరిష్కారంపై హడావుడిగా చర్యలు తీసుకునే విధానాన్ని మార్చుకోవాలని, ఏ రోజు వచ్చిన వాటిని ఆ రోజు చూస్తే పరిష్కారానికి తగిన సమయం ఉంటుందని అన్నారు. అర్జీ అందిన వెంటనే కింది స్థాయి అధికారులకు సూచనలు ఇస్తూ, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, నూరు శాతం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏదైనా అర్జీ తమ పరిధిలోకి రానప్పుడు సంబంధిత అధికారికి పంపించాలని జేసీ అన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ టి.సీతారామమూర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.భాస్కర్రెడ్డి, రాజమహేంద్రవరం ఆర్డీఓ ఆర్.శివరాముడు తదితరులు పాల్గొన్నారు. -
తల్లీబిడ్డ అదృశ్యంపై కేసు నమోదు
ప్రత్తిపాడు: తల్లీబిడ్డ అదృశ్యంపై ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో సోమవారం కేసు నమోదైంది. స్థానిక పోలీసుల కథనం మేరకు మండలంలోని ఏలూరు గ్రామానికి చెందిన ఉండ్రు ఆశ తన ఎనిమిది నెలల కుమారుడితో ఆదివారం మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదు. ఏలూరు గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ ఉండ్రు సురేష్తో కిర్లంపూడి మండలం వేలంక గ్రామానికి చెందిన ఆశకు నాలుగేళ్ల కిత్రం వివాహమైంది. దీనిపై భర్త ఉండ్రు సురేష్ ఇచ్చిన ఫిర్యాదుపై ప్రత్తిపాడు ఎస్సై ఎస్.అనంతలక్ష్మి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
విమర్శలు కాదు... మీ పార్టీ గతం గుర్తు చేసుకోండి
రాష్ట్ర హోంమంత్రికి వైఎస్సార్ సీపీ నేత నాగమణి హితవు కాకినాడ రూరల్: వైఎస్సార్ సీపీపై విమర్శలు చేయడం కాదు, ముందు మీ పార్టీ గతం ఒక్కసారి గుర్తు చేసుకోవాలని రాష్ట్ర హోంమంత్రి అనితకు వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి హితవు పలికారు. విమర్శల్లో హుందాతనం లేకుండా పోయిందని, మీరూ ఒక మహిళ అనే విషయం మరిచిపోయారా అని నాగమణి ప్రశ్నించారు. కాకినాడ గైగోలుపాడులోని తన నివాసంలో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిని విమర్శించడానికి మీరు అధికారంలోకి వచ్చారా అని ప్రశ్నించారు. రాజధాని విషయంలో మాజీ సీఎం సూచనలు నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలే గానీ డైవర్షన్ రాజకీయాలు సరికాదన్నారు. దివంగత ఎన్టీఆర్ మరణానికి కారణం ఎవరన్నది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసునని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాధవరెడ్డి, బాలయోగి, యర్రంనాయుడు వంటి నేతల మరణాలపై అనుమానాలు ఉన్నాయని, ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రజలే ప్రశ్నిస్తున్నారని టీడీపీ నేతలు గ్రహించాలన్నారు. ఉపాధ్యాయురాలిగా పనిచేసిన హోంమంత్రి అనిత తన బాస్ల మెప్పు కోసం ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేయడం విజ్ఞత కాదని, తప్పుడు విమర్శలు మానుకోవాలన్నారు. జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదనపై రాష్ట్ర ప్రజలు పునరాలోచనలో పడడం టీడీపీ నేతలకు మింగుడుపడడం లేదన్నారు. అమరావతి రాజధాని పేరిట రూ.లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ దందాకు ఆటంకం కలుగుతుందనే ఆందోళనలో చంద్రబాబు, లోకేష్ ఉన్నారన్నారు. -
లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఉద్యమం
ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం): కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశాన్ని కార్పొరేట్లకు తాకట్టు పెడుతోందని, లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ప్రతిఘటననోద్యమాలు చేపట్టాల్సిన అవసరముందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. సీఐటీయూ 12వ జిల్లా మహాసభలు స్థానిక వైఎంఏ హాలులో సోమవారం ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగేశ్వరరావు మాట్లాడు తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహజ వనరులను, కార్మికుల హక్కులను కార్పొరేట్లకు దోచిపెట్టడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నాయని మండిపడ్డారు. అనేక దశాబ్దాలుగా భారత్కు ఇరాన్ మిత్రదేశంగా ఉన్నప్పటికీ మోదీ ప్రభుత్వం పశ్చిమాసియా యుద్ధంపై నోరు మెదపకపోవటం శోచనీయమన్నారు. యుద్ధం ప్రభావంతో దేశంలో ఏర్పడిన గ్యాస్ కొరత వంటింట్లో చిచ్చు పెట్టడంతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, చిరు వ్యాపారాలు, భవన నిర్మాణం తదితర రంగాలపై తీవ్ర ప్రభావం చూపించిందని నాగేశ్వరరావు అన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ, పని గంటల పెంపు, వేతనాల కోత, పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ సౌకర్యాలను ప్రస్తావించకుండా రాత్రి వేళ పని వంటి చర్యలు కార్మికుల హక్కులపై తీవ్రమైన దాడిగా అభివర్ణించారు. మతం పేరుతో ప్రజల ఐక్యత మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఇటీవల ఆకివీడు, గతంలో అంతర్వేది తదితర ఘటనలను గుర్తు చేశారు. ప్రజల మధ్య భావోద్వేగాలను రెచ్చగొట్టి, రాజకీయ లబ్ధి పొందేందుకు కూటమి పార్టీలు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో ఎస్టీఎఫ్ఐ జాతీయ కార్యదర్శి అరుణ కుమారి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు టి.అరుణ్, ఎస్ఎస్ మూర్తి, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జె.రాంబాబు, సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.సుందరబాబు, బి.పవన్ తదితరులు పాల్గొన్నారు. -
సర్వేతో సామర్థ్యాల మదింపు
● 3వ తరగతి విద్యార్థుల ప్రతిభకు పరీక్ష ● ఉమ్మడి జిల్లాలో 21 పాఠశాలల ఎంపిక ● 16,17,18 తేదీల్లో పరీక్ష రాయవరం: ప్రాథమిక స్థాయి విద్యార్థులు కనీస అభ్యసన సామర్థ్యాలు ఎంత వరకు సాధించారు? భాషపై, గణితంలోని చతుర్విధ ప్రక్రియలపై ఎంతవరకు అవగాహన కలిగి ఉన్నారు? అనే విషయాలను తెలుసుకునేందుకు సర్వే నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన నూతన జాతీయ విద్యా విధానం–2020లో భాగంగా ఢిల్లీలోని ఫరఖ్ (ఫెర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్), ఎన్సీఈఆర్టీ ఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషన్ లెర్నింగ్ సర్వే) నిర్వహిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 21 పాఠశాలలను ఎంపిక చేశారు. ఒక్కో పాఠశాల నుంచీ 12 మంది ముఖ్యంగా 3వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు, అవగాహన నైపుణ్యాలు ఎలా ఉన్నాయి? అనే అంశంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడు రోజుల పాటు ఎఫ్ఎల్ఎన్ సర్వే నిర్వహించనున్నారు. ఎంపికై న ఒక్కో పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న 12 మందిని మాత్రమే సర్వే చేస్తారు. రోజుకు ఆరుగురు వంతున రెండు రోజులు ఈ పరీక్ష నిర్వహిస్తారు. రెండు రోజుల్లో పరీక్ష నిర్వహించడం సాధ్యం కాకుంటే మూడవ రోజు కూడా నిర్వహిస్తారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఈ సర్వే ఎంపిక చేసిన పాఠశాలల్లో నిర్వహిస్తారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో నాలుగు పాఠశాలలు, తూర్పుగోదావరి జిల్లాలో 11, కాకినాడ జిల్లాలో ఆరు పాఠశాలలను ఎంపిక చేశారు. జిల్లా విద్యా శిక్షణ సంస్థ(డైట్) ఈ పరీక్షను పర్యవేక్షిస్తుంది. ఛాత్రోపాధ్యాయులే ఇన్వెస్టిగేటర్లుగా.. ప్రాథమిక స్థాయిలో విద్యా ప్రమాణాలు పడిపోతున్న పరిస్థితుల్లో ఫౌండేషన్ లెర్నింగ్ అండ్ న్యుమరసీ(ఎఫ్ఎల్ఎన్)లో భాగంగా ఈ సర్వే చేపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరులో ఉన్న జిల్లా విద్యా శిక్షణ సంస్థకు చెందిన మొదటి సంవత్సరం విద్యార్థులను పరీక్ష నిర్వహణ నిమిత్తం ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు (ఎఫ్ఐ)గా నియమించారు. పరీక్ష నిర్వహణపై ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లకు శిక్షణ ఇచ్చారు. ఎఫ్ఐలు ట్యాబ్ ద్వారా ఆన్లైన్ విధానంలో సర్వే నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలోని భాష, గణితం ప్రశ్నలకు సంబంధించిన స్పందనలను ట్యాబ్లో నిర్ణీత విధానంలో నమోదు చేస్తారు. అంబాజీపేట కొబ్బరి మార్కెట్ కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 22,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 24,000 గటగట (వెయ్యి) 21,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)13,000 – 14,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 డిజిటల్ విధానంలో.. ఎంపికై న పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను డిజిటల్ విధానంలో పరీక్షిస్తాం. – పి.నాగేశ్వరరావు, డీఈవో, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అభ్యసన సామర్థ్యాలను అంచనా వేసేందుకే.. నిపుణ్ భారత్లో భాగంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేస్తున్నాం. పబ్లిక్ పరీక్ష మాదిరిగానే దీన్ని నిర్వహించాలి. – జి.నాగమణి, ఆర్జేడీ, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ -
ఆకట్టుకున్న తలాష్ 2కే26
కాకినాడ రూరల్: తిమ్మాపురం గ్రామం అచ్చంపేట జంక్షన్ వద్ద నన్నయ్య ఎంఎస్ఎన్ పీజీ సెంటర్లో వాణిజ్య, నిర్వహణ అధ్యయన విభాగం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన తలాష్ 2కే26 కార్యక్రమం ఆకట్టుకుంది. విద్యార్థుల ప్రతిభ, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకతను వెలికి తీయడమే లక్ష్యంగా రాష్ట్ర స్థాయి ఫెస్ట్గా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నన్న య యూనివర్సిటీ వీసీ ప్రసన్న శ్రీ, ఎలైట్ నేచురల్ ఆయి ల్స్ ఎండీ తోట సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. వీసీ ప్రస న్న శ్రీ మాట్లాడుతూ మేనేజ్మెంట్ అంటే కేవలం లెక్కలు, స్ప్రెడ్షీట్లు మాత్రమే కాదని అది ఒక సమగ్ర వ్యవస్థ అని పేర్కొన్నారు. ప్రతి అంశాన్ని కలిపి నడిపించే ప్రక్రియే మేనేజ్మెంట్ అన్నారు. మరో అతిథి తోట సుబ్రహ్మణ్యం యువతలో ఆత్మ విశ్వాసం, స్టార్టప్ ఆలోచనలు, ప్రాక్టికల్ నాలెడ్జ్ గురించి వివరించారు. ప్రిన్సిపాల్ ప్రశాంతి శ్రీ, మెడికవర్ ఆస్పత్రి సెంటర్ హెడ్ అంజిబాబు, ప్రోగ్రామ్ కన్వీనర్ మధుకుమార్ పాల్గొన్నారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యాఽర్థులు సందడి చేశారు. -
ఆనందంగా పరిచేశారు
అన్నవరం: రత్నగిరిపై కొలువైన సత్యదేవుని దర్శించుకునేందుకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. వారికి సౌకర్యాలు కల్పించడంలో వెనుకాడే దేవస్థానం అధికారులు.. ప్రజాప్రతినిధులు వస్తే మాత్రం రాచమర్యాదలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. సత్యదేవుని ఆలయానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఆలయ ప్రాంగణంలో నేల వేడెక్కడంతో నడవాలంటే కాళ్లకు బొబ్బలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆలయ ప్రాంగణంలో నేలపై పర్చడానికి కొత్త కార్పెట్లు ఆలయంలో ఉన్నాయి. కానీ వాటిని వినియోగించకపోవడంతో ఈనెల ఎనిమిదో తేదీన ‘సాక్షి’ దినపత్రికలో ‘కాళ్లు కాలుతున్నా కార్పెట్లు బయటకు తీయరా’ అనే శీర్షికన వార్త ప్రచురితమైంది. అయినా అధికారులు స్పందించలేదు. కానీ.. ఆదివారం దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నవరం దేవస్థానానికి రావడంతో కొత్త కార్పెట్లను బయటకు తీశారు. ఆలయ ప్రాంగణంతో పాటూ మంత్రి పర్యటించిన ప్రతి చోటా వీటిని పరిచేశారు. మంత్రి రాకతో దేవస్థానం అధికారుల హడావుడి ఆలయ ప్రాంగణంలో కొత్త కార్పెట్ల ఏర్పాటు ఇన్నాళ్లూ భక్తులు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోని వైనం -
టీడీపీ నేత ఇంట్లో బాణసంచా అక్రమ నిల్వలు
● సుమారు రూ.10 లక్షలు ఉంటుందని సమాచారం ● స్వాధీనం చేసుకున్న అధికారులుసాక్షి, టాస్క్ఫోర్స్: పెదపూడి మండలం కై కవోలు గ్రామంలోని ఓ టీడీపీ నేత ఇంట్లో సుమారు రూ.10 లక్షల విలువైన భారీ బాణసంచా నిల్వలు బయటపడ్డాయి. విశ్వసనీయ సమాచారం మేరకు పెదపూడి తహసీల్దార్ పీవీ సీతాపతిరావు, ఎస్సై ఎస్.తులసీరామ్, కాకినాడ ఆర్డీఓ ఎస్.మల్లిబాబు, పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆదివారం దాడి చేసి వీటిని గుర్తించారు. కై కవోలు రామాలయం వీధిలోని టీడీపీ నేత ఇనపకోళ్ల వీర వెంకట సత్యనారాయణకు చెందిన ఇంట్లో 47 బాక్సుల్లో ఉన్న ఈ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో వాటి విలువ రూ.5 లక్షలుగా చెబుతున్నప్పటికీ రూ.10 లక్షలు ఉంటుందని సమాచారం. స్వాధీనం చేసుకున్న వాటిలో 5000 వాలా 62 షాట్స్, తారాజువ్వలు ఉన్నాయి. వీర వెంకట సత్యనారాయణ ఇంట్లో అదే గ్రామానికి చెందిన గోపిశెట్టి మణికంఠస్వామి వీటిని ఉంచినట్లు అధికారులు తెలిపారు. మణికంఠస్వామి కూడా టీడీపీ నాయకుడు కావడం గమనార్హం. కాగా.. ఇటీవల వేట్లపాలెం బాణసంచా కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనతో బాణసంచా తయారీని చంద్రబాబు ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీకి చెందిన నాయకులే అక్రమంగా బాణసంచా నిల్వ ఉంచడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
దిగిరాకుంటే ఆమరణ దీక్షలు
సామర్లకోట: న్యాయమైన డిమాండ్ల సాధనకు నేతన్నలు సోమవారం నుంచి రోడ్డు ఎక్కనున్నారు. ఇందులో భాగంగా కాకినాడ కలెక్టరేట్ బయట చేనేతల ఆత్మ గౌరవ దీక్షకు సమాయత్తమవుతున్నారు. ఏళ్ల తరబడి చేస్తున్న విజ్ఞప్తులను, ఉద్యమాలను పట్టించుకోకపోవడంతో వారి హక్కుల సాధనకు నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు ఈ దీక్షలు చేయాలని నిర్ణయించినట్టు పెద్దాపురం పద్మశాలి సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గ సభ్యుడు కట్టా రాజబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని, ఆమరణ దీక్షలకు దిగుతామని ఆయన తెలిపారు. అలాగే పెద్దాపురం ఆప్కో మాజీ డైరెక్టర్ ముప్పన వీర్రాజు మాట్లాడుతూ చేనేత రంగానికి బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని, చేనేత వస్త్రాలపై 30 శాతం రిబేటు, సహకార సంఘాలకు పావలా వడ్డీ రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు ఇవే ● చేనేత సహకార సంఘాలకు ఆప్కో, ప్రభుత్వం చెల్లించవలసిన రూ.203 కోట్ల బకాయిలు తక్షణం చెల్లించాలి. ● ఆప్కో చేనేత సహకార సంఘాలకు ముడిసరకు ఇచ్చి పూర్తి స్థాయిలో పని కల్పించాలి. ● సహకార సంఘాల వద్ద ఉన్న వస్త్ర నిల్వలనను ఆప్కో కొనుగోలు చేయాలి. ● చేనేత సహకార సంఘాలకు, ఆప్కోకు తక్షణమే ఎన్నికలు నిర్వహింలి. ● ఎన్నికై న ప్రతినిధులు ప్రభుత్వానికి నేతన్నలకు వారధిలా ఉండి సమస్యలు పరిష్కరించాలి. ● ఆప్కో ఎండీ రేఖారాణిని వెంటనే బదిలీ చేయాలి.● నేటి నుంచి చేనేత ఆత్మ గౌరవ దీక్ష ● సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ -
సాయం చేయండి.. ఊపిరి నిలపండి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): వైద్యానికి ఆర్థిక సాయం చేసి, తన ఊపిరి నిలపాలంటూ రాజమహేంద్రవరంలోని తాడితోట ఇందిరానగర్కు చెందిన 38 ఏళ్ల చికిలే దుర్గాదేవి.. దాతలను కోరుతున్నారు. వివరాల్లోకి వెళితే.. దుర్గాదేవికి భర్త దైవ సహాయం, ఎనిమిదో తరగతి చదువుతున్న కుమార్తె సుమణి ఉన్నారు. ఆమెకు 2022 మార్చిలో విపతీరమైన దగ్గు వచ్చింది. స్థానికంగా వైద్యులకు చూపించగా ఆస్తమాగా నిర్ధారించి ఏడాదిన్నర పాటు చికిత్స అందించారు. నయం కాకపోవడంతో మరో ఆసుపత్రికి తీసుకువెళ్లగా, ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని, మార్పిడి ఒక్కటే మార్గమని వైద్యులు సూచించారు. ఆక్సిజన్ సిలిండర్ సాయంతోనే.. దుర్గాదేవి ఊపిరితిత్తులు 80 శాతం మేర గట్టిపడి 20 శాతమే పనిచేస్తున్నాయి. ఏడాదిగా ఆక్సిజన్ సిలిండర్ సాయంతో నెట్టుకొస్తున్నారు. కృత్రిమ శ్వాస లేకపోతే శరీరంతో ఆక్సిజన్ స్థాయి 60 శాతానికి పడిపోతోంది. చివరికి కాలకృత్యాలకు వెళ్లినా కృత్రిమ శ్వాస ఉండాల్సిందే. ఈ కారణంగా మంచానికే పరిమితమైన దుర్గాదేవికి ఆమెకు భర్త, కుమార్తె, తల్లి సపర్యలు చేస్తున్నారు. హైదరాబాద్లో ఓ ప్రముఖ ఆసుపత్రిని సంప్రదించగా ఊపిరితిత్తుల మార్పిడి చికిత్సకు దాదాపు రూ.46 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. ప్రస్తుతం జీవన్ధాన్లో ఆమె పేరు నమోదు చేసుకున్నారు. ఇప్పటికే కొందరు దాతలు రూ.8,71,816 సాయం చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిఽధి నుంచి రూ.10,80,210 చికిత్స నిమిత్తం అందించారు. మిగిలిన మొత్తం కోసం ఆమె దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. సాయం అందించే దాతలు మరిన్ని వివరాలకు 80080 01706 నంబర్ను సంప్రదించాలి. -
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
ప్రతి కేజీబీవీల్లో 6వ తరగతిలో ప్రవేశానికి ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. గడువు ముగియగానే రాష్ట్ర ఎస్పీడీ కార్యాలయం ఆ దరఖాస్తులను పరిశీలన చేసి ప్రవేశాన్ని నిర్ణయిస్తుంది. పేద విద్యార్థినులకు కేజీబీవీలో ప్రవేశం ఒక సువర్ణావకాశం. చదువు, ఆటపాటల్లో కేజీబీవీ విద్యార్థులు మెరుగైన ఫలితాలను సాధిస్తున్నారు. – జి.నాగమణి, ఆర్జేడీ, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ. సద్వినియోగం చేసుకోవాలి కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో ప్రవేశాలకు కల్పించే అవకాశాన్ని బాలికలు సద్వినియోగం చేసుకోవాలి. ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు కార్పొరేట్ తరహా విద్యను ఇక్కడ అందిస్తున్నారు. బాలికలకు భద్రతతో కూడిన విద్యాబోధన లభిస్తుంది. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధను తీసుకుంటారు. సీసీ కెమెరాలు, భద్రతా వలయం మధ్య విద్యార్థినులకు విద్యను అందిస్తున్నారు. – పి.ఉమామహేశ్వరి, జీసీడీవో, సమగ్ర శిక్షా, కాకినాడ● -
ముంపుతిప్పలు
ఆలమూరు: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు ముప్పుతిప్పులు పడుతున్నారు. పెట్టుబడిగా డబ్బులు లేక అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా గతేడాది అక్టోబర్లో సంభవించిన మోంథా తుపాను పంటలన్నింటినీ ముంచేసింది. వాటికి నష్టపరిహారం అందిస్తామంటూ ప్రభుత్వం ఇచ్చిన భరోసా.. ప్రకటనకే పరిమితమైంది. దాదాపు ఆరునెలలు దాటినా పంట నష్టపరిహారం అందకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. వ్యవసాయం చేసే అన్నదాతలకు విత్తు నుంచి విక్రయం వరకూ అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. వాటిన్నంటినీ తట్టుకుని ముందు ‘సాగు’తూనే ఉంటారు. అయితే వారందరికీ ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం చాలా అవసరం. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవసాయాన్ని పండగలా మార్చారు. ఎన్నికల అనంతరం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు కష్టకాలం మొదలైంది. పరిహారం ఊసే లేదు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీని ఈ ప్రభుత్వం రద్దు చేసింది. గతేడాది అక్టోబర్ చివరి వారంలో సంభవించిన మొంథా తుపాను బీభత్సంతో అనేక మంది వరి, ఉద్యాన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ సమయంలో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ చేసిన పోరాటం, రైతుల ఆందోళనలతో వరి, ఉద్యాన పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.పది వేల ఆర్థిక సాయం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ను పూర్తి చేసుకుని రబీ సీజన్ చివరి దశలో ఉన్నా ఇప్పటి వరకూ ప్రభుత్వం పరిహారం ఊసే ఎత్తడం లేదు. దీనిపై వ్యవసాయశాఖ అధికారులను ప్రశ్నిస్తే వారి నుంచి మౌనమే సమాధానంగా వస్తోంది. అపార నష్టం మోంథా తుపాను ప్రభావంతో జిల్లాలో ఖరీఫ్లో సాగు చేసిన 1.69 లక్షల ఎకరాల్లో సుమారు 73 వేల ఎకరాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిళ్లినట్టు వ్యవసాయశాఖ ప్రభుత్వానికి నివేదించింది. అందులో సుమారు 54 వేల ఎకరాల్లో వరిచేలు నేలకొరగగా, మరో 21 ఎకరాల్లోని పంట నీట మునగగా, అందులో సుమారు 80 వేల మంది రైతులకు నష్టం వచ్చింది. అలాగే జిల్లా వ్యాప్తంగా సాగు చేసిన 5.84 వేల ఎకరాల ఉద్యాన పంటలకు గాను 3,941.09 ఎకరాల పంట తీవ్రంగా దెబ్బతింది. వీటిలో అధిక శాతం అరటి, కూరగాయల పంటలు ఉన్నాయి. అలాగే జిల్లాలోని పలు మండలాల్లో 950 కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. దీనివల్ల 5,336 మంది ఉద్యాన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంటల బీమా తొలగింపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉచిత పంటల బీమాను రద్దు చేసింది. ఆ నిర్ణయం లక్షల మంది రైతులకు శాపంగా మారింది. జిల్లాలో సాగు చేసిన 1.69 లక్షల ఎకరాల్లో కేవలం 43,900 ఎకరాల్లో మాత్రమే మోంథా తుపాను బీమా పరిధిలోకి వచ్చింది. మిగిలిన భూమికి చెందిన రైతులు అటు ఉచిత పంటల బీమా వర్తించక, ఇటు ప్రభుత్వం ప్రకటించిన విధంగా పరిహారం అందించకపోవడం వల్ల అన్ని విధాలుగా నష్టపోవాల్సి వచ్చింది. ప్రైవేట్ వ్యాపారుల వద్ద రుణాలు చేసి వరి, ఉద్యాన రైతులు సాగు చేపట్టి ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న రైతులు అప్పుల ఊబిలో దిగిపోయారు. తుపానుకు నేలకొరిగిన అరటితోట (ఫైల్) మోంథా తుపానుకు ఆలమూరు మండలం పినపళ్లలో దెబ్బతిన్న వరి (ఫైల్) మోంథా తుపానుకు భారీగా పంట నష్టం ఆరు నెలలు దాటినా పరిహారం ఇవ్వని చంద్రబాబు ప్రభుత్వం అప్పుల ఊబిలో రైతులు పంటల బీమా రద్దు చేయడంతోనే ఈ దుస్థితి -
తగవు తీర్చమంటే కులం పేరుతో దూషించాడు
● జనసేన నేతపై పోలీసులకు మహిళల ఫిర్యాదు ● బాధితులకు అండగా కులసంఘాలురామచంద్రాపురం (కాజులూరు): న్యాయం కోసం వెళ్లిన తమతో కాజులూరుకు చెందిన జనసేన నాయకుడు అన్యం శ్రీరామచంద్రమూర్తి (అన్యం శ్రీరామ్) అవమానకరంగా ప్రవర్తించాడని, కులంపేరుతో దూషించి ఇంటి నుంచి నెట్టివేశాడని అదే గ్రామానికి చెందిన సన్నపు లక్ష్మి, ఆకుల నాగదేవి శనివారం రాత్రి గొల్లపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వివరాల ప్రకారం.. ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన సన్నపు లక్ష్మి భర్త, కాపు సామాజిక వర్గానికి చెందిన ఆకుల నాగదేవి భర్త ఆ గ్రామానికి చెందిన సుబ్బారావుతో కలిసి టైల్స్ వ్యాపారం చేస్తున్నారు. అయితే వ్యాపార లావాదేవీల్లో సుబ్బారావుతో వివాదాలు రావడంతో ఆ ఇద్దరు మహిళలు గురువారం జనసేన పార్టీకి చెందిన అన్యం శ్రీరామ్ వద్దకు తగవు తీర్చాలని వెళ్లారు. మందుగా ఆకుల నాగదేవి ఇంటి తలుపుకొట్టి పిలవగా.. బయటకు వచ్చిన అన్యం శ్రీరామ్ ఆమెతో మాలలతో మీకు వ్యాపారాలు ఏమిటి, అంతలా దిగజారిపోయారా అంటూ హేళనగా మాట్లాడాడు. దీంతో పక్కనే ఉన్న సన్నపు లక్ష్మి కలుగజేసుకుని కాపులకు మాలల ఓట్లు కావాలి కానీ, మాలలతో కాపులు వ్యాపారాలు చెయ్యకూడదా అని ప్రశ్నించింది. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాలలకు తాను తగవు చెప్పనంటూ, కులం పేరుతో దుర్భాషలాడుతూ వారిని బయటకు నెట్టేసి తలుపులు వేసుకున్నాడు. జరిగిన సంఘటన చెప్పి తమకు న్యాయం చేయాలని పలువురు స్థానికులను కోరినా ఎవ్వరూ పట్టించుకోలేదని, దీంతో తమ కుల సంఘాల నాయకులను ఆశ్రయించి వారి సహకారంతో పోలీసులకు ఫిర్యాదులు చేశామన్నారు. కాగా.. జైభీమ్ పార్టీ అధ్యక్షుడు ఏనుగుపల్లి కృష్ణ, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు మాత సుబ్రహ్మణ్యం, బుల్లిరాజు తదితరులు బాధితులకు బాసటగా పోలీస్టేషన్ ఎదుట ఆందోళనలు చేపట్టారు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
అంకంపాలెంలో పీచు ఫ్యాక్టరీ దగ్ధం
ఆత్రేయపురం: ర్యాలి గ్రామ శివారు అంకంపాలెం బంగారం తల్లి గుడి సమీపంలోని పీచు ఫ్యాక్టరీలో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు రూ.కోటి విలువైన ఫ్యాక్టరీ పూర్తిగా కాలిపోయింది. పవన్ కాయర్ ప్రొడక్ట్ పేరుతో ర్యాలి గ్రామానికి చెందిన రుద్రరాజు సూర్యనారాయణరాజు ఈ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు రేగాయి. పనిచేస్తున్న సిబ్బంది, స్థానికులు వాటిని గుర్తించి, అదుపు చేసే ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోయింది. సమాచారం అందుకున్న కొత్తపేట అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఫ్యాక్టరీలోని పీచుమెషీన్లు, తయారుచేసిన పీచు బండిళ్ల, ఇతర సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. -
లోవ దేవస్థానంలో..
తుని రూరల్: తలుపులమ్మ లోవ దేవస్థానానికి ఆదివారం వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో 20 వేల మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నట్టు ఈఓ పి.విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,62,195, పూజా టికెట్లకు రూ.1,57,020, కేశఖండన శాలకు రూ.12,160, వాహన పూజలకు రూ.9,500, కాటేజీలు, వసతి గదులు, పొంగలి షెడ్ల అద్దెలు రూ.68,535, విరాళాలు రూ.40,262, వెరసి మొత్తం రూ.4,84,163 ఆదాయం లభించినట్టు ఆయన వివరించారు. రత్నగిరికి భక్తుల తాకిడి సత్యదేవుని దర్శించిన 40 వేల మంది అన్నవరం: రత్నగిరికి ఆదివారం భక్తులు పోటెత్తారు. రత్నగిరితో పాటు పలు ప్రాంతాలలో శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున వివాహాలు చేసుకున్న నవ దంపతులు, వారి బందుమిత్రులతో ఆలయ ప్రాంగణం కిటకిట లాడింది. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, రెండు వేల సత్యవ్రతాలు జరిగాయి. సత్యదేవుని దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. నిత్యాన్నదాన పథకంలో ఐదు వేల మంది అన్నప్రసాదం స్వీకరించారు. భక్తులతో కిటకిటలాడిన అయినవిల్లిఅయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి ఆలయానికి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి (సురేష్) ఆధ్వర్యంలో విశేష పూజలు జరిపారు. స్వామిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. లఘున్యాస ఏకదశ రుద్రాభిషేకాల్లో 46 మంది పాల్గొన్నారు. 26 మంది భక్తులు శ్రీలక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. ఎనిమిది మంది చిన్నారులకు అక్షరభ్యాసం, తొమ్మిది మంది పిల్లలకు తులాభారం వేశారు. 2,664 మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు స్వామివారికి వివిధ పూజ టిక్కెట్లు, అన్నదాన విరాళాల ద్వారా రూ.4,87,185 ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలి ఉప్పలగుప్తం: పిల్లలను తల్లిదండ్రులు చిన్నతనం నుంచే క్రీడల్లో ప్రోత్సహించాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వంటెద్దు వెంకన్నాయుడు అన్నారు. ఉప్పలగుప్తం గ్రామానికి చెందిన పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి యనమదల ఇందిర ఇటీవల విజయనగరం జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 76 కేజీల విభాగంలో రెండో స్థానం సాధించి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రన్నర్గా నిలిచి, జాతీయ స్థాయికి ఎంపికై ంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఇందిరను ఆమె నివాసంలో వెంకన్నాయుడు సత్కరించి, నగదు బహుమతి అందజేశారు. అలాగే ఎస్టీయూ జిల్లా ఉపాధ్యాయవాణి కన్వీనర్ చిక్కం మైనర్ బాబు, మోటూరి సత్యంకాపు సైతం ఇందిరను అభినందించారు. వెంకన్నాయుడు మాట్లాడుతూ ఎనిమిదో తరగతి చదువుతున్న ఇందిర తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆమె తండ్రి, వైఎస్సార్ సీపీ బీసీ సెల్ మండల అధ్యక్షుడు యనమదల పల్లంరాజు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఆర్టీఐ విభాగం మండల అధ్యక్షుడు పోలిశెట్టి వీర్రాజు, పార్టీ నాయకులు బొర్రాయిపాలెపు సూర్యనారాయణ, దూలం సూరిబాబు, గొల్లపల్లి బాబీ, యర్రంశెట్టి ప్రసాద్, ఆప్పారి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
బాలికల విద్యకు భరోసా
రాయవరం: పేద, అనాథ బాలికల కోసం ఏర్పాటు చేసిన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) బాలికల విద్యకు భరోసాగా నిలుస్తున్నాయి. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా బోధన జరుగుతున్న వీటిలో ప్రవేశాలకు ఏటేటా డిమాండ్ పెరుగుతోంది. వీటిలో సాధారణ విద్యతో పాటు ఒకేషనల్, కంప్యూటర్ విద్యను సైతం అందిస్తున్నారు. ఆంగ్ల బోధనతో పాటు ఉచిత భోజనం, వసతి, పుస్తకాలు, యూనిఫాం తదితర సౌకర్యాలు అందిస్తున్నారు. కాకినాడ జిల్లాలో ఉన్న నాలుగు కేజీబీవీల్లో 6వ తరగతిలో ప్రవేశానికి మార్చి 12 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రతి పాఠశాలలో 6వ తరగతికి 40 సీట్లు ఉన్నాయి. ఈ నెల 10 వరకు ఉన్న గడువును మరోసారి ఈ నెల 20 వరకు గడువు పెంచారు. జిల్లాలో కేజీబీవీలు సమగ్ర శిక్షా ప్రాజెక్టు కింద మైదాన ప్రాంతంలో తుని, కోటనందూరు, శంఖవరం, తొండంగిల్లో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలున్నాయి. గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మైదాన ప్రాంతంలోని నాలుగు కేజీబీవీలతో పాటుగా రంపచోడవరం, మారేడుమిల్లి, గంగవరం, వై.రామవరం, ఎటపాక, కూనవరం, వీఆర్పురం, చింతూరులో కేజీబీవీలు ఉండేవి. జిల్లాల విభజన అనంతరం ఏజెన్సీ కేజీబీవీలు పోలవరం జిల్లా పరిధిలోకి వెళ్లాయి. ఇప్పుడు కేవలం కాకినాడ జిల్లా పరిధిలో ఉన్న నాలుగు కేజీబీవీల్లో కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలోని విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశముంది. వీటిలో ఏడాదికి 40 వంతున 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జిల్లాలోని నాలుగు కేజీబీవీల్లో ఇంటర్ విద్యను ప్రవేశ పెట్టారు. శంఖవరం కేజీబీవీలో ఎంపీసీ, తుని, తొండంగి కేజీబీవీల్లో బైపీసీ, కోటనందూరు కేజీబీవీలో ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సులున్నాయి. వీరికి తొలి ప్రాధాన్యం అనాథ వీధి బాలికలు, పేద పిల్లలతో పాటు బడి బయట ఉన్న పిల్లలు, బడి మానేసిన వారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న బాలికలకు తొలి ప్రాధాన్యత కింద కేజీబీవీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. వలస కూలీల చిన్నారులు, కార్మిక శాఖ అధికారులు సిఫారసు చేసిన వారికీ ప్రవేశాల్లో ప్రాధాన్యత ఉంటుంది. 2018 నుంచి కేజీబీవీల్లో ఇంటర్ విద్యనూ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఫిమేల్ లిటరసీ రేటు తక్కువుగా ఉన్న మండలాలకు చెందిన విద్యార్థినులకు తొలి ప్రాధాన్యతనిస్తారు. మొదటి ప్రాధాన్యం కాకినాడ జిల్లాలోని ఫిమేల్ లిటరసీ తక్కువుగా ఉన్న మండలాల విద్యార్థినులకు ఇస్తారు. సీట్లు భర్తీ కాకపోతే ఆ సీట్లను కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలోని ఫిమేల్ లిటరసీ తక్కువుగా ఉన్న మండలాల విద్యార్థినులతో భర్తీ చేస్తారు. గుణాత్మక విద్యా బోధన కేజీబీవీల్లో బాలికలకు క్వాలిఫైడ్ ఉపాధ్యాయులతో గుణాత్మక విద్యను అందిస్తున్నారు. వీటితో పాటు ఆంగ్ల మాధ్యమం కూడా బోధిస్తున్నారు. రెగ్యులర్ పాఠ్యాంశాల బోధనతో పాటు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు, కంప్యూటర్ విద్య, క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు. అలాగే కేజీబీవీల్లో విద్యార్థినులకు విద్యతో పాటు కుట్లు, అల్లికలను నేర్పిస్తున్నారు. బొమ్మల తయారీ, పేపర్లతో వివిధ రకాల నమూనాలు తయారు చేయడాన్ని నేర్పిస్తున్నారు. కబడ్డీ, టెన్నిస్, వాలీబాల్, సాఫ్ట్బాల్, హాకీ, టెన్నికాయిట్ తదితర క్రీడల్లో శిక్షణనిస్తున్నారు. కేజీబీవీలతో బంగారు భవిష్యత్తు 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచిత బోధన దరఖాస్తులకు ఈనెల 20 వరకు గడువు -
ఒడిదొడుకుల్లో వర్జీనియా
● గిట్టుబాటు ధర లేక సాగని కొనుగోళ్లు ● జిల్లాలో 85 మిలియన్ కిలోల ఉత్పత్తి ● విక్రయాలకు ఆసక్తి చూపని రైతులు ● రూ.290కి నిర్ణయించాలని డిమాండ్ దేవరపల్లి: వర్జీనియా పొగాకు మార్కెట్ ఒడిదొడుకులకు గురవుతోంది. టుబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం–1, 2 వేలం కేంద్రాల్లో మార్చి 25న కొనుగోళ్లు ప్రారంభించింది. ప్రారంభ ధర కిలో రూ.265 పలకడంతో దానిని రూ.290కి పెంచాలని డిమాండ్ చేస్తూ రైతులు కొనుగోళ్లు నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు. దీనికి ట్రేడర్లు నిరాకరించడంతో రైతులు, బోర్డు చైర్మన్, అధికారుల మధ్య ఓ దశలో వాగ్వివాదం జరిగింది. గోపాలపురం వేలం కేంద్రానికి వచ్చిన బోర్డు చైర్మన్ సీహెచ్ యశ్వంత్ కుమార్ ముందు రైతులు ఈ మేరకు నిరసన వ్యక్తంచేయడంతో చేసేది లేక అధికారులు మొదటి రోజు వేలం నిలిపివేశారు. మిగిలిన కేంద్రాల్లో అధికారులు రైతులకు నచ్చచెప్పి కొనుగోళ్లు నిర్వహించారు. గోపాలపురంలో రెండో రోజు వేలం జరిగింది. గుంటూరులో ట్రేడర్లు, రైతు సంఘాల ప్రతినిధులతో అక్కడి ప్రధాన కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి ధర విషయంలో నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ చెప్పడంతో రైతులు సరకు విక్రయాలకు అంగీకరించారు. ఈ నెల 1న గుంటూరులో నిర్వహించిన సమావేశంలో కిలో గరిష్ట ధర రూ.290 ఇచ్చేందుకు అధికారులు అంగీకరించినప్పటికీ ట్రేడర్లు యాజమాన్య సంస్థలకు చెప్పి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇది జరిగి రెండు వారాలు కావస్తున్నా నేటికీ ఏ నిర్ణయమూ తీసుకోలేదు. దీంతో కొనుగోళ్లు మొక్కుబడిగా సాగుతున్నాయి. ముందుకు సాగని కొనుగోళ్లు వేలం ప్రక్రియ ప్రారంభమై 20 రోజులు కావస్తున్నప్పటికీ కొనుగోళ్లు ముందుకు సాగడం లేదు. రోజుకు ఒకొక్క కేంద్రానికి 300 నుంచి 400 బేళ్లు అమ్మకానికి రావలసి ఉండగా, 30 నుంచి 150 బేళ్లు వస్తున్నాయి. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం వేలం కేంద్రాలకు 150 బేళ్లు, కొయ్యలగూడేనికి 110 బేళ్లు, గోపాలపురం, దేవరపల్లి కేంద్రాలకు 30 నుంచి 40 బేళ్లు వస్తున్నాయి. వీటిలో సగానికిపైగా అమ్ముడుపోని పరిస్థితి ఉంది. కిలో గరిష్ఠ ధర రూ.265, కనిష్ఠ ధర రూ. 250 పలుకుతుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆయా కేంద్రాల్లో రోజు విడిచి రోజు వేలం నిర్వహిస్తున్నారు. ఎగుమతుల ఆర్డర్లపై ఆశలు ఈ ఏడాది రైతుల పరిస్థితి గందరగోళంగా ఉంది. మొక్క మొదటి నాలుగు రెలుపుల పొగాకు కొనుగోలుకు ట్రేడర్లు నిరాకరిస్తున్నారు. ఐదో రెలుపు నుంచి వచ్చిన పొగాకు కొనుగోలుకు వారు మొగ్గు చూపుతుండడదీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఓ పక్క యుద్ధ ప్రభావం, మరో పక్క అనుమతికి మంచి పంట ఉత్పత్తి కావడంతో మార్కెట్లో సంక్షోభం ఏర్పడింది. 49.32 మిలియన్ల కిలోల ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా, దాదాపు 85 మిలియన్ల కిలోలు ఉత్పత్తి జరిగినట్టు అధికారుల ప్రాధమిక అంచనా. ఎగుమతి ఆర్డర్లు వస్తే పొగాకుకు మంచి రోజులు వస్తాయని అధికారులు, రైతులు అంటున్నారు. 29,132 హెక్టార్లలో సాగు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలో 2025–26 పంట కాలంలో ఐదు వేలం కేంద్రాల్లో 12,612 మంది రైతులు, 14,412 బ్యారన్లు కలిగి 29,132 హెక్టార్లలో పంట సాగు చేశారు. దీనిలో ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో 28,011 హెక్టార్లు, తొర్రేడు ప్రాంతంలోని నల్లరేగడి భూముల్లో 1120 హెక్టార్లలో పొగాకు సాగు జరిగింది. 85 మిలియన్ల కిలోల ఉత్పత్తి అంచనా ప్రస్తుత పంట కాలంలో 49.32 మిలియన్ల కిలోల ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇచ్చింది. అయితే సాగు విస్తీర్ణం పెరగడం, దిగుబడులు ఆశాజనకంగా ఉండడంతో దాదాపు 85 మిలియన్ల కిలోలు ఉత్పత్తి అవుతుందని అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. -
పుష్కర పనులకు రూ.863 కోట్లు
● దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ● రత్నగిరిపై శ్రీసీతారామ సత్రానికి శంకుస్థాపన ● రూ.11.4 కోట్ల వ్యయంతో 105 గదుల నిర్మాణం అన్నవరం: వచ్చే ఏడాది జూన్లో ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాలకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో విస్తృత ఏర్పాట్లు చేయనున్నట్టు రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆదివారం రత్నగిరిపై రూ.11.40 కోట్ల వ్యయంతో నాలుగు అంతస్తుల్లో 105 గదులతో నిర్మించనున్న శ్రీసీతారామ సత్రం మొదటి బ్లాక్కు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభతో కలసి శంకుస్థాపన చేశారు. అలాగే రూ.1.3 కోట్ల వ్యయంతో మొదటి ఘాట్ రోడ్డు నుంచి సత్యదేవుని ఆలయానికి వెళ్లేందుకు నిర్మించిన రెండో మెట్ల దారిని ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. దేవదాయ శాఖ తరఫున గోదావరి పుష్కరాలకు రూ.863 కోట్ల వ్యయంతో 715 నిర్మాణ పనులకు ఇప్పటికే టెండర్లు పిలిచినట్టు చెప్పారు. వాటిలో కాకినాడ జిల్లాలోనే రూ.51.70 కోట్ల వ్యయంతో 43 పనులకు టెండర్లు పిలిచామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా పుష్కరాలకు ఏర్పాట్లు చేస్తామని మంత్రి చెప్పారు. గోదావరి పుష్కరాలపై సోమవారం రాజమహేంద్రవరంలో జరగాల్సిన సమావేశాన్ని రద్దు చేసినట్టు మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిన అధికారులు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ప్రత్యేక అధికారులుగా నియమితులైనందున వారు వచ్చాక ఈ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ధూప దీప నైవేద్యాలకు రూ.70 కోట్లు ధూప దీప నైవేద్యాల కింద రాష్ట్రంలో 5,821 గుళ్లకు రూ.70 కోట్లు మంజూరు చేసినట్టు మంత్రి ఆనం తెలిపారు. రూ.200 కోట్ల కామన్ గుడ్ ఫండ్ నిధులతో 194 చిన్న ఆలయాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు చెప్పారు. ఐదువేల భజన మండళ్లకు రూ.700 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. సమావేశంలో దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్, అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావు, దేవదాయశాఖ సీఈ జీవీ శేఖర్, అన్నవరం దేవస్థానం ఈఈలు నూకరత్నం, వి. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.భోజనంలో సత్యదేవుని ప్రసాదం పెట్టండి దేవదాయశాఖా మంత్రి ఆనం ఆదేశం పారిశుధ్యం, వేతన బకాయిలపై ‘పద్మావతి’ సంస్థపై ఆగ్రహం సాక్షి వరుస కథనాలపై కమిషనర్కు సూచనలు అన్నవరం: సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో భాగంగా భక్తులకు స్వామి వారి గోధుమ నూక ప్రసాదం కూడా పెట్టాలని దేవదాయ, ధర్మదాయశాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దేవస్థానం అధికారులను ఆదేశించారు. ఆదివారం ‘సాక్షి’లో ‘అమాత్యా....మొరాలకించవా..’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించి విలేకరులతో మాట్లాడారు. సత్యదేవుని అన్నప్రసాద పథకంలో స్వామివారి ప్రసాదం పెట్టాలని భక్తులు కోరడంపై గతంలో పెట్టిన ప్రసాదాన్ని ఎందుకు తీసేశారని అధికారులను ప్రశ్నించారు. దీంతో అధికారులు బదులిస్తూ కొందరు వడ్డించిన ప్రసాదాన్ని వదిలేస్తున్నారని వివరించారు. దీనికి మంత్రి మాట్లాడుతూ భక్తులను అడిగే ప్రసాదం పెట్టాలని సూచించారు. వారం రోజుల పాటు భోజనంతో పెట్టి భక్తుల అభిప్రాయాలు కోరాలని, తరువాత స్థానిక ఎమ్మెల్యేతో పథకాన్ని ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. పారిశుధ్యంపైనా.. అలాగే అన్నవరం దేవస్థానంలో పారిశుధ్య నిర్వహణకు నెలకు రూ.80 లక్షలు వెచ్చిస్తున్నా అక్కడి అధ్వాన పరిస్థితులపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేయడంపైనా మంత్రి స్పందించారు. పద్మావతి సంస్థ పనితీరుపైన, నాసిరకం శానిటరీ మెటీరియల్ పైన, వాషింగ్ మెషీన్ మరమ్మతులపైనా తనిఖీలు చేపట్టి కమిషనర్ రామచంద్రమోహన్కు నివేదించాలని ఆ శాఖ చీఫ్ ఇంజినీర్ శేఖర్ను ఆదేశించారు. అలాగే వేతన బకాయిలపై శనివారం ‘సాక్షి’ ‘సత్యదేవా సాపాట్లు కనవా..!’ శీర్షికన ప్రచురితమైన కథనంపై కూడా స్పందిస్తూ సత్వరం వేతనాలు చెల్లించాలని ఆదేశించారు. కమిషనర్ జోక్యం చేసుకుని ప్రతి నెలా ఐదో తేదీ లోపు కాంట్రాక్టర్ నుంచి బిల్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
బాణసంచా తయారీకి అనుమతించాలి
● ఉపాధి లేక రోడ్డున పడ్డాం ● లైసెన్సులు పునరుద్ధరించాలి ● తయారీదారుల సంఘ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్కరప: బాణసంచా తయారీ కేంద్రాల లైసెన్సులను పునరుద్ధరించి, తయారు చేయడానికి అనుమతించి, తమకు జీవనోపాధి కల్పించాలని ఆ సంఘ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కొప్పిశెట్టి శ్రీనివాస్ కోరారు. కరప మండలం వేళంగిలో ఆదివారం ఆ సంఘ ఉపాధ్యక్షుడు వినకోటి శ్రీనివాస్ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాణసంచా తయారీ దారుల సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ వేట్లపాలెంలో జరిగిన బాణసంచా పేలుడు దుర్ఘటన కారణంగా తయారీ దారుల లైసెన్సులను రద్దు చేసి, తయారీని నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారన్నారు. దీనివల్ల ఈ పరిశ్రమపై ఆధార పడిన వందల మంది కార్మికులు, యజమానులు ఉపాధి లేక రోడ్డున పడ్డారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 115 లైసెన్సు కలిగిన బాణసంచా తయారీ షాపులుండగా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 60 ఉన్నాయన్నారు. వీటిలో పనిచేసే కార్మికులతో పాటూ యజమానులు కూడా ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వేట్లపాలెం విస్పోటానికి కారకుడైన లైసెన్సుదారుడిని తూర్పు, పశ్చిమ, విశాఖ జిల్లా బాణసంచా ఓనర్స్ సంక్షేమ సంఘం నుంచి బహిష్కరించామని, ఆ ఘటన మానవ తప్పిదం వల్లనే జరిగిందన్నారు. అనుమతికి మించి స్టాకును తయారు చేయడమే ప్రమాదానికి కారణమని, దానిని తమ సంఘం వ్యతిరేకిస్తోందన్నారు. వేట్లపాలెం షాపును సీజ్ చేసి, మిగిలిన షాపులకు అనుమతించాలని కోరారు. తయారీ సమయంలో ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తామని హామీ ఇచ్చారు. సంఘ ఉపాధ్యక్షుడు వినకోటి శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాపారాలు కొనసాగేలా అధికారులు, ప్రభుత్వం స్పందించి, లైసెన్సులను పునరుద్ధరించాలని కోరారు. సమావేశానికి వివిధ జిల్లాల నుంచి బాషా, బాబ్జీ, గోపి, కంభంపాటి రమణ, రమణ, చంద్ర, వేల్పుకొండ సత్తిబాబు తదితరులు హాజరయ్యారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 22,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 24,000 గటగట (వెయ్యి) 21,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)13,000 – 14,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
వీరేశ్వరుని ఆలయ పునర్మిర్మాణానికి శంకుస్థాపన
ఐ.పోలవరం: మురమళ్ల భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన (శిలాస్థాపన) కార్యక్రమం ఆదివారం శాస్త్రోక్తంగా జరిగింది. శైవాగమ పండితుడు యనమండ్ర సత్యసీతారామశర్మ ఆధ్వర్యంలో ఆలయ పాలక మండలి చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, ఏసీ వి.సత్యనారాయణ పర్యవేక్షణలో ఈ కార్య క్రమం నిర్వహించారు. తొలుత గణపతి పూజ, మండపారాధన, పుర్ణాహుతి, శిలలకు పూజలు జరిపారు. ప్రత్యేక పూజలు చేసిన కలశ జలాలను శంకుస్థాపన ప్రదేశంలో కలిపారు. ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు దంపతులు శిలాస్థాపన నిర్వహించారు. కాగా.. కాకినాడకు చెందిన రావు బుచ్చి వెంకట్రావు తండ్రి సత్యనారాయణ జ్ఞాపకార్థం రూ.లక్ష, ఐ.పోలవరం గ్రామానికి చెందిన సాగిరాజు సత్యనారాయణరాజు రూ.10,116 విరాళంగా అందజేశారు. గండి పోశమ్మ ఆలయానికి దారి మళ్లింపుసీతానగరం: సీతానగరం మీదుగా పురుషోత్తపట్నం నుంచి దేవీపట్నం మండలంలోని గండి పోశమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్లే దారిని పోలవరం ప్రాజెక్టు పనుల కారణంగా మూసివేశారు. దీంతో భక్తులు సీతానగరం మండలం నుంచి అమ్మవారి ఆలయానికి వెళ్లాలంటూ రాపాక మీదుగా కోరుకొండ మండలం కోటికేశవరం నుంచి కోరుకొండ చేరుకుని గోకవరం మీదుగా వెళ్లాలి. అలాగే కోటి కేశవరం నుంచి బొల్లెద్దులపాలెం, గోకవరం, దండంగి, పోతవరం మీదుగా దారి మళ్లించారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతిముమ్మిడివరం: మోటారు సైకిల్పై వస్తూ కారును ఢీకొన్న యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేట మండలం వాడపాలెం గ్రామానికి చెందిన పెట్టా బాబీ ఆదివారం మోటారు సైకిల్పై వస్తూ ముమ్మిడివరం మండలంలోని పదో మైలు సెంటర్ వద్ద కారును ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు 108లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాబీ మృతి చెందాడు. ముమ్మిడివరం ఎస్సై డి.జ్వాలా సాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంధకారంలో విద్యుత్ కార్మికుల జీవితాలుసామర్లకోట: రాష్ట్ర విద్యుత్ శాఖలో ఏళ్ల తరబడి వెట్టి చాకిరీ చేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికుల జీవితాలు నేడు అంధకారంలో కూరుకుపోయాయని విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల ఉమ్మడి జిల్లా చైర్మన్ వీసం వీరనాగు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ రావులపాలెం 33/11 కేవీ సబ్ స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్గా పని చేస్తున్న బండారు ప్రశాంత్ కుమార్ శనివారం ఉదయం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని పోషించుకొలేక, ప్రభుత్వం నుంచి ఎటువంటి భరోసా లేకపోవడంతో మనస్తాపం చెందిన ప్రశాంత్.. ఒక సెల్ఫీ వీడియో ద్వారా తన ఆవేదనను పంచుకున్నారన్నారు. పాదయాత్రలో లోకేష్, ప్రజావాణిలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విద్యుత్ కార్మికులకు ఇచ్చిన హామీలు నేడు నీటి మూటలుగా మిగిలాయని ఆరోపించారు. తమ సమస్యలను పరిష్కరిస్తారని నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే, అధికారంలోనికి వచ్చాక కూటమి ప్రభుత్వం కార్మికుల నోట్లో మట్టి కొట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్శాఖలోని దళారీ వ్యవస్థను రద్దు చేస్తామని, నేరుగా వేతనాలు చెల్లిస్తామని చెప్పి రెండేళ్లు గడుస్తున్నా అతీగతీ లేదన్నారు. సుమారు ఏడాది క్రితం రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సామర్లకోట వచ్చిన సమయంలో కార్మికుల సమస్యలపై వినతిపత్రం అందజేశామని ఆయన గుర్తు చేశారు. -
స్క్వాష్ క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్ల పంపిణీ
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఢిల్లీలో ఈ నెల 16 నుంచి 22 వరకు జరిగే జాతీయ స్ధాయి స్వ్కాష్ పోటీలలో పాల్గొనే రాష్ట్ర అండర్ – 14, 17 జట్లకు పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేశారు. కాకినాడలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో డీఈవో రమేష్ మాట్లాడుతూ జాతీయస్థాయి పోటీల్లో రాణించి రాష్ట్రానికి, జిల్లాలకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కాకినాడ ఉప విద్యాశాఖ అఽధికారి కేవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ క్రీడల్లో రాణించి, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య అడ్మిన్ కార్యదర్శి పి.సుధారాణి, కోచ్, మేనేజర్లు కె.మంగయమ్మ, జి.సునీల్ కుమార్, జి.సత్యానందం, స్కూల్ గేమ్స్ అసిస్టెంట్ కార్యదర్శి పరశురాం తదితరులు పాల్గొన్నారు. జట్ల వివరాలు ● అండర్ 14 (బాలురు): ఏ.ప్రభు కిరణ్, ఎం.వీర వెంకట రమణ, జి.కార్తికేయ, వి.సిద్ధిశ్రీ, జి.శశాంక్ రెడ్డి, కోచ్ జి.సునీల్ కుమార్, మేనేజర్ జి.సత్యానందం. ● అండర్–14 (బాలికలు): పి.బెస్సీ షారోన్, జి.మహాలక్ష్మి, కె.సాహితీ మేఘన, జి.స్తుతి కీర్తన, టి.రమ్యశ్రీ, కోచ్ కె.మంగయమ్మ, మేనేజర్ పి.సుధారాణి. ● అండర్–17 (బాలురు): ఐ.తనీష్ రాజ్, బి.సూరజ్, బి.అశ్విక్, టి.వెంకట చంద్రసాయి సాకేత్, బి.సురేష్, కోచ్ బి.సురేష్ రాజు, మేనేజర్ జి.సునీల్ కుమార్. ● అండర్–17 (బాలికలు): పి.సూర్యలక్ష్మీ అభిజ్ఞ, నల్లమిల్లి ఐశ్వర్య రెడ్డి, నడింపల్లి రూపశ్రీ, ఎం.తేజశ్విని, రాగం మేణు, కోచ్ పి.సుధారాణి, మేనేజర్ కె.మంగయమ్మ, హెచ్ఓడీ ఎస్కే మహబూబ్ బాషా. -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరం ప్రధాన రైల్వే స్టేషన్లోని రెండో నంబర్ ప్లాట్ఫాంపై సుమారు 60 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడని జీఆర్పీ పోలీసులు శనివారం తెలిపారు. అతడు సుమారు 5.2 అడుగుల ఎత్తు కలిగి ఉన్నాడని, అతని వద్ద మావూరి అప్పారావు, తండ్రి వీరన్న అనే పేరుతో ఆసుపత్రి కార్డు ఉందన్నారు. దీనిపై కేసు నమోదు చేసి, మృత దేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు 94407 79249 ,0883 2442821 నంబర్లకు సమాచారం ఇవ్వాలని హెడ్ కానిస్టేబుల్ గంగరాజు కోరారు. -
కొనసాగిన వైద్య ఉద్యోగుల నిరసన
అనపర్తి: ఆంధ్రప్రదేశ్ వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నాలుగు రోజుల నిరసన శనివారం కూడా కొనసాగింది. స్థానిక ఏరియా ఆస్పత్రి వైద్య ఆరోగ్య సిబ్బంది ప్లకార్డులు, డిమాండ్లతో కూడిన బ్యానర్లు పట్టుకుని నినాదాలు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. పీఆర్సీని వేయాలని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్, 35 రోజుల సాధారణ సెలవులు అమలు చేయాలని తదితర డిమాండ్లు చేశారు. కార్యక్రమంలో స్టాఫ్ నర్సులు, కౌన్సిలర్ చైతన్యరాజు, రేడియో గ్రాఫర్ విజయకుమార్, ల్యాబ్ టెక్నీషియన్ క్రాంతి, ఫార్మసిస్ట్ మీనా తదితర సిబ్బంది పాల్గొన్నారు. అప్పనపల్లిలో భక్తుల రద్దీ మామిడికుదురు: అప్పనపల్లి బాల బాలాజీ స్వా మివారి ఆలయానికి శనివారం భక్తులు భారీగా తరలి వచ్చారు. వైనతేయ నదిలో పుణ్య స్నానా లు ఆచరించి, స్వామివారిని దర్శించుకుని, ము డుపులు, మొక్కుబడులు చెల్లించారు. ఆలయం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేశారు. స్వామి వారికి వివిధ సేవల ద్వారా రూ.2,69,006 ఆదాయం వచ్చింది. స్వామి వారి నిత్య అన్నదానం ట్రస్టుకు భక్తులు రూ.94,812 విరాళంగా అందించారు. స్వామి వారిని 6,400 మంది భక్తులు దర్శించుకున్నారు. 2,600 మంది భక్తులు స్వామి వారి అన్న ప్రసాదం స్వీకరించారు. ఏలేరులో తగ్గుతున్న నీటి నిల్వలు ఏలేశ్వరం: వేసవి ఎండలు తీవ్రమవుతుండడంతో ఏలేరు జలశయంలో నీటినిల్వలు స్వల్పంగా తగ్గుతున్నాయి. ఎగువ ప్రాంతం నుంచి నీటి సరాఫరా అంతంతమాత్రంగా ఉండడంతో దిగువ ఆయకట్టుకు నీటి సరఫరా తగ్గించారు. శనివారం నాటికి ప్రాజెక్టులో రూ.86.56 మీటర్లకు 77.38 మీటర్లు, 24.11 టీఎంసీలకు 10.58 టీఎంసీల నిల్వలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి దిగువ ఆయకట్టుకు 600, విశాఖకు 225, పంపాకు 50 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు. తిమ్మరాజుచెరువుకు నీటి సరఫరా నిలిపివేశారు. సీతారామ సత్రానికి రూ.5 లక్షల విరాళం తొలి విడతగ రూ.2.6 లక్షల అందజేత అన్నవరం: రత్నగిరిపై నూతనంగా నిర్మించనున్న సీతారామ సత్రంలో ఒక గది నిర్మాణానికి కర్నూలుకు చెందిన ఎల్.రవీంద్రారెడ్డి దంపతులు రూ. ఐదు లక్షల విరాళాన్ని శనివారం ప్రకటించారు. రూ. 11.40 కోట్లు వ్యయంతో 105 గదులతో నిర్మించనున్న సత్రానికి ఆదివారం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. కాగా శనివారం దాత రవీంద్రారెడ్డి సత్యదేవుని దర్శించి పూజల అనంతరం ఆయన ప్రకటించిన విరాళంలో తొలి విడత రూ.2.6 లక్షల చెక్కును దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వి.రామకృష్ణకు అందజేశారు. డోనార్ స్కీం కింద సత్రంలో 15వ నంబరు గదిని దాతకు కేటాయించనున్నట్టు ఈఈ తెలిపారు. -
ఆదారం కోల్పోయి..
ఫ చంద్రబాబు తీరుతో నేతన్నల కష్టాలు ఫ గుదిబండలా ఆప్కో, ఇతర బకాయిలు ఫ అమలుకాని రూ.25 వేల ఆర్థిక సాయం ఫ మగ్గం నుంచి ఉద్యమంలోకి.. ఫ కాకినాడలో ఈ నెల 13 నుంచి దీక్షలు కపిలేశ్వరపురం: నూలు నుంచి దారం తీసి దుస్తులు నేసే చేనేత కార్మికులను చంద్రబాబు పాలనలో కష్టాలు చుట్టుముట్టాయి. ఆప్కో, ఇతర సంస్థల నుంచి బకాయిల పేరుకుపోవడంతో వారికి ఉపాధి కరువవుతోంది. తద్వారా బతకడానికి ఆధారం లేకుండా పోతోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేనేత రంగానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చి, నేత కార్మికుల సంక్షేమానికి కృషి చేశారు. కానీ చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రంగాన్ని పూర్తిగా విస్మరించింది. చేనేత రంగానికి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చకపోవడంతో నేత కార్మికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తమ సమస్యలను ఎన్నిసార్లు విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సోమవారం నుంచి కాకినాడలో రిలే దీక్షలు చేయనున్నారు. సంఘాలపై నిర్లక్ష్యం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 22 నెలలు అవుతోంది. చేనేత స్టాళ్ల పేరుతో ప్రజాప్రతినిధులు, అధికారులు హడావుడి చేయడం తప్ప చేనేత సంఘాల పటిష్టతకు ఇప్పటి వరకూ చేసిందేమీ లేదు. నేతన్నకు పనే లేకుండా చేసిన చంద్రబాబు ప్రభుత్వం రూ.200 ఉచిత విద్యుత్ కల్పిస్తున్నామంటూ ప్రచారం చేసుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా రూ.203 కోట్ల ఆప్కో, ప్రభుత్వ బకాయిలు సంగతేమిటన్నప్పుడు మాత్రం మాట్లాడడం లేదు. ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ నిర్లక్ష్య ధోరణికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని చేనేత సంఘాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. కూటమి హామీలు గాలికి.. 2024 ఎన్నికల ప్రచార సమయంలో కూటమి నేతలు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో చేసిన సాయానికి మించి చేనేత కార్మికులకు అందిస్తామని, చేనేత రంగాన్ని పరిరక్షిస్తామంటూ హామీలు ఇచ్చారు. తీరా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో ప్రధాన హామీలను అమలు చేసిన పాపానపోలేదు. చేనేత సంఘాల బకాయిలు చెల్లించలేదు, కార్మి క కుటుంబాలకు ఆర్థిక సాయం చేయలేదు. నేతన్న నేస్తం కింద జగన్ ప్రభుత్వం రూ.24 వేలు ఇచ్చిందని, తాము అధికారంలోకి వస్తే రూ.25 వేల సాయమందిస్తామన్న హామీని సైతం గాలికి వదిలేశారు. అలాగే చేనేత ఉత్పత్తుల విక్రయాలకు మార్గాలను అన్వేషించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఉద్యమబాట ప్రభుత్వ తీరుతో విసిగిపోయిన చేనేత కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమబాట పడుతున్నారు. ఏపీ చేనేత సహకార సంఘాల జేఏసీ, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం నుంచి ఉమ్మడి జిల్లాలోని నేత కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. కాగా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేనేత రంగాన్ని విస్మరించడంతో ఏపీ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో 16 భాగస్వామ్య సంఘాలతో కలిసి చేనేత గర్జన పేరుతో ఈ ఏడాది ఫిబ్రవరి 22న చలో మంగళగిరి పేరుతో నిరసన ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు. ఆ సందర్భంగా నేతన్నలు చేసిన డిమాండ్లను సైతం ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదు. మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం అంగరలోని గణపతి చేనేత పారిశ్రామికుల సహకార సంఘానికి ఆప్కో, ప్రభుత్వం నుంచి వివిధ పథకాల ద్వారా రూ.3.85 కోట్ల బకాయిలు జమ కావాల్సి ఉంది. వాటిని చెల్లించాలంటూ 2025 సెప్టెంబర్, అక్టోబర్లలో 14 రోజుల పాటు ఆ సంఘ కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఆ సందర్భంగా అంగర, పడమర ఖండ్రిక గ్రామాల్లో భారీ ర్యాలీలు చేస్తూ తమ గోడును ప్రజలకు చెప్పుకున్నారు. అక్టోబర్ 11న జిల్లాకు చెందిన కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ స్వయంగా వచ్చి అక్టోబర్ ననెలాఖరు నాటికి బకాయిలు చెల్లిస్తామంటూ హామీ ఇచ్చి దీక్షలను విరమింపజేశారు. ఇప్పటికి ఐదున్నర నెలలు గడుస్తున్నా పాక్షిక చెల్లింపులు తప్ప హామీని నెరవేర్చలేదు. ● సంఘాల నిర్వహణ కష్టం ఆప్కో, ప్రభుత్వం నుంచి చేనేత సంఘాలకు జమ చేయాల్సిన వివిధ రకాల బకాయిలను దీర్ఘకాలంగా చెల్లించడం లేదు. ఆ బకాయిలు గుదిబండలా మారడంతో సంఘాల నిర్వహణ కష్టంగా మారింది. నేత కార్మికులకు ఉపాధి చూపలేని స్థితి నెలకొంది. – పప్పు దుర్గా రమేష్, చైర్మన్, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్, కాకినాడ చేనేత పరిశ్రమ వివరాలు జిల్లా చేనేత మగ్గాలు కార్మికులు సంఘాలు తూర్పు 16 1,510 3,890 గోదావరి కాకినాడ 18 2,809 4,430 కోనసీమ 16 4,570 8,010 మొత్తం 50 8,889 16,330 హామీ ఇచ్చి.. ఆచరణలో మరచి.. జగన్ పాలనలో స్వర్ణయుగం వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 2019–24 మధ్య మాజీ ముఖ్యమంత్రి జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలతో చేనేత రంగానికి కొత్త ఊపిరి వచ్చింది. చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24 వేల చొప్పున నేతన్న నేస్తం పేరుతో ఆర్థిక సాయాన్ని నేరుగా నేతన్న బ్యాంకు ఖాతాకు జమ చేశారు. కరోనా మహమ్మారి సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు కూడా ఈ సాయాన్ని కొనసాగించారు. ఒక విడత ఆర్థిక సాయాన్ని షెడ్యూల్కు ముందే ఖాతాలకు జమ చేశారు. జగన్ హయాంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 4,408, తూర్పుగోదావరిలో 916, కాకినాడ జిల్లాలో 2,776 కుటుంబాలు నేతన్న నేస్తం సాయాన్ని పొందేవి. -
18న సీఎం చంద్రబాబు పర్యటన
నిడదవోలు: రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మూడో శనివారం నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర’లో భాగంగా ఈ నెల 18న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిడదవోలు పర్యటనకు రానున్నారని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన స్థానిక ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రజావేదిక కోసం పటిక ఫ్యాక్టరీ వద్ద స్థలాన్ని ప్రతిపాదించారు. హెలీప్యాడ్ కోసం పంగిడి రోడ్డులోని బ్రాహ్మణగూడెం ప్రాంతాలను పరిశీలించామన్నారు. ‘జయలక్ష్మి’ బాధితుల దీక్షల విరమణ కాకినాడ రూరల్: సర్పవరం జంక్షన్లోని జయలక్ష్మి సొసైటీ మెయిన్ బ్రాంచ్ ఎదుట ఆ సభ్యుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిప్పల సూర్య శంకరం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం విరమించారు. బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల ఒకటో తేదీన ప్రారంభించిన దీక్షలకు అధికారులు స్పందించారు. జిల్లా సహకార అఽధికారి బి.శ్రీనివాసరెడ్డి తీసుకుంటున్న చర్యలను సొసైటీ అధ్యక్షుడు గంగిరెడ్డి త్రినాథరావుకు ఈ నెల 9న లేఖ ద్వారా వివరించి దీక్షలు విరమించాలని కోరారు. అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సిట్ దర్యాప్తుతో పాటు సీఐడీతో విచారణ చేయించిన విషయం తెలిసిందే. వయసు మీద పడి చాలా మంది డిపాజిటర్లు చనిపోతుండడంతో తక్షణ న్యాయం కోరుతూ సభ్యులు రిలే దీక్షలు చేపట్టారు. శనివారం దీక్షలో కూర్చున్న పైడికొండల హనుమంతరావు, దేవికుమారిలతో సొసైటీ అధ్యక్షుడు త్రినాథరావు చర్చలు జరిపి ఒప్పించడంతో మధ్యాహ్నం దీక్షను విరమించారు. చైర్మన్ త్రినాథరావు మాట్లాడుతూ సొసైటీ బాధితులకు సాయం చేయాలని, ముందుగా రూ.200 కోట్లు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఎంపీలకు, కలెక్టర్, తదితరులకు వినతి పత్రాలు ఇచ్చామని వివరించారు. చట్ట పరమైన చర్యలు తీసుకుంటున్నామని డీసీఓ తెలియజేయడంతో పాటు ఎండలో దీక్షలు వద్దని అభ్యర్థించిన మేరకు దీక్ష విరమింపజేశామన్నారు. -
రత్నగిరికి పోటెత్తిన భక్తులు
ఫ సత్యదేవుని దర్శించిన 40 వేల మంది ఫ స్వామివారి ఆదాయం రూ.40 లక్షలు అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణస్వామివారి ఆలయానికి శనివారం వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. రత్నగిరిపై, రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున పెద్దసంఖ్యలో వివాహాలు జరిగాయి. ఈ నేపథ్యంలో నవదంపతులు, వారి బంధువులు సత్యదేవుని దర్శనానికి తరలి వచ్చారు. అలాగే శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున కూడా వివాహాలు ఉండడంతో, వాటికి హాజరయ్యేందుకు శనివారం మధ్యా హ్నం నుంచి పెళ్లి బృందాలు విచ్చేశాయి. వీరికి సాధారణ భక్తులు తోడవడంతో ఉదయం నుంచి రాత్రి వరకు కూడా రత్నగిరిపై రద్దీ కొనసాగింది. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారి సన్నిధికి విచ్చేయడంతో క్యూలైన్లు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం నిండిపోయాయి. సత్యదేవుని దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట సమయం పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో శ్రీకృష్ణుడు, గోవులకు ప్రదక్షిణచేశారు. సర్క్యులర్ మండపం వద్ద సుమారు ఐదు వేల మంది భక్తులకు పులిహోర, దద్దోజనం పంచిపెట్టారు. భక్తులు సత్యదేవుని వ్రతాలు రెండు వేలు ఆచరించారు. శనివారం దేవస్థానానికి రూ. 40 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. -
మాస్టర్స్ అథ్లెటిక్స్లో నాగబాబు ప్రతిభ
సామర్లకోట: ఢిల్లీలో ఈ నెల 9వ తేదీ నుంచి 11 వరకూ జరిగిన నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఓపెన్ చాంపియన్ షిష్లో సామర్లకోట్లకు చెందిన యాతం నాగబాబు ప్రతిభ చూపి, మూడు పతకాలు సాధించాడు. 800, 1500 మీటర్ల పరుగు పందేల్లో బంగారు పతకాలు, 400 మీటర్ల పందెంలో వెండి పతకం గెలుచుకున్నాడు. ఈ పోటీలకు 18 రాష్ట్రాల నుంచి 1,200 క్రీడాకారులు హాజరయ్యారు. ఇప్పటికే 63 పతకాలు సాధించిన ఆయన ఢిల్లీలో గెలుచుకున్న వాటితో 65 పతకాలను తన ఖాతాలో వేసుకున్నాడు. సామర్లకోటకు చెందిన 55 ఏళ్ల నాగబాబు ప్రస్తుతం భీమవరంలో జిల్లా మలేరియా విభాగంలో పనిచేస్తున్నాడు. -
వాడపల్లి వాసా.. శ్రీవేంకటేశా
ఫ భక్తులతో కిక్కిరిసిన కోనసీమ తిరుపతి ఫ స్వామివారికి ప్రత్యేక పూజలు ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి శనివారం అశేష భక్తజనం తరలివచ్చారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితో తెల్లవారుజాము నుంచి ఆలయ ప్రాంగణం రద్దీగా మారింది. ముందుగా గౌతమీ గోదావరిలో స్నానాలు ఆచరించి, క్యూలో నిలబడి స్వామిని దర్శించుకుఏన్నారు. నూతన వధూవరులు పెళ్లి దుస్తుల్లో మాఢ వీధులలో ఏడు ప్రదక్షిణలు చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. కాగా.. ఆలయంలో వేకువ జామునే సుప్రభాత సేవ, తొలి హారతి, నిరాజనం, ఐశ్వర్య లక్ష్మీ హోమం, బాలభోగం వంటి కార్యక్రమాలను ఆలయ అర్చకులు, వేద పండితులు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం తరఫున భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు. వేసవి నేపథ్యంలో చల్లని మజ్జిగ అందజేశారు. ఆలయ ఈవో, దేవదాయశాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు, ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. శనివారం ఒక్కరోజే దేవస్థానానికి రూ.71,26,678 ఆదాయం సమకూరింది. -
పంచాయతీ కార్యదర్శులకు ముగిసిన శిక్షణ
సామర్లకోట: స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో గ్రేడ్ 4, 5 పంచాయతీ కార్యదర్శులకు ఆరు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ శనివారంతో ముగిసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులకు ఈ శిక్షణ ఇచ్చారు. ముగింపు సందర్భంగా నేర్చుకున్న అంశాలపై, అవగాహన పెంచుకున్న విధానంపై పరీక్ష నిర్వహించారు. అనంతరం వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. శిక్షణ కేంద్రం వైస్ ప్రిన్సిపాల్ జి.రమణ మాట్లాడుతూ పంచాయతీరాజ్ వ్యవస్థలోని అకౌంటింగ్, ఆర్థిక వనరులు, వేలం నిర్వహించే విధానం, పంచాయతీ వ్యయాలకు సంబంధించిన నియమాలు, ఆదాయ, వ్యయాల వర్గీకరణ, నిర్వహించాల్సిన రిజిస్టర్లు, పనులు నిర్వహించే విధానం, టెండర్ల అమలు విధానంపై శిక్షణ ఇచ్చామని తెలిపారు. ప్యాకల్టీలు కె.సుశీల, కేఆర్ నిహరిక, శేషుబాబు, డి.చిన్నబ్బులు, రాజ్కుమార్, కె.రామకృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పంచాయతీ కార్యదర్శులకు సర్టిఫికెట్లు అందజేస్తున్న వైస్ ప్రిన్సిపాల్ రమణ తాటిచెట్టు పైనుంచి పడి గిరిజనుడి మృతి చింతూరు: తాటికల్లు సేకరించేందుకు చెట్టు ఎక్కిన గిరిజనుడు పట్టు తప్పి కిందపడి మృతి చెందాడు. చింతూరు మండలం మదుగూరులో ఈ ఘటన జరిగింది. మదుగూరుకు చెందిన మోటు జోగయ్య (61) తాటి చెట్టు ఎక్కి కల్లు సేకరిస్తుండగా ప్రమాదవశాత్తూ కింద పడిపోయాడు. కుటుంబ సభ్యులు అతడిని గమనించే లోపు సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. శుక్రవారం జరిగిన ఈ సంఘటనపై కుటుంబ సభ్యులు శనివారం ఫిర్యాదు చేశారని ఎస్సై సంతోష్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
అమాత్యా.. మొరాలకించవా
● సత్యదేవుని చెంత సమస్యల చింత ● భక్తులలో అసంతృప్తి వెల్లువ ● నేడు దేవదాయ శాఖ మంత్రి ‘ఆనం’ రాక ● సీతారామ సత్రం శంకుస్థాపన, మెట్ల దారి ప్రారంభానికి సన్నాహం అన్నవరం: రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ది చేస్తాం.. సూపర్ సిక్స్ హామీలు, లక్షలాది ఉద్యోగాల కల్పన, విద్య, వైద్య రంగాలలో అభివృద్ధి.. గత ఎన్నికల్లో టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి నేతలు ఇచ్చిన బూటకపు హామీలివి. అధికారం అందగానే అవన్నీ బుట్టదాఖలైన రెండేళ్లయినా ఒక్కటీ అమలు చేయకుండానే అన్నీ చేసేశాం అని ఆ నేతలు డబ్బాలు కొట్టుకుంటున్నారు. సనాతన ధర్మానికి సారథులం అని గొప్పలు చెప్పుకొంటున్న కూటమి పెద్దలు ఆచరణలో మాత్రం దేవాలయాలకు, దైవ దర్శనాలకు వచ్చే భక్తులకు వసతులు, సౌకర్యాల కల్పనలో మొండి చేయి చూపుతున్నారు. రత్నగిరిపై రూ.11.4 కోట్లతో నిర్మించిన సీతారామ సత్రానికి శంకుస్థాపన, మెట్ల దారిని ఆదివారం దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రారంభించనున్నారు. ఈ రెండు నిర్మాణాలు గత వైఎస్సార్ సీపీ హయాంలోనే మొదలై నేడు ప్రారంభం కానుండడం గమనార్హం. కాగా ఆలయంలో పలు సమస్యలు, వసతుల లేమితో భక్తులు అవస్థ పడుతున్నారు. వాటి పరిష్కారానికి ఆయన సత్వర చర్యలు తీసుకోవాల్సి ఉంది. పారిశుధ్యం అధ్వానం అన్నవరంలో పారిశుధ్య బాధ్యతలు చూస్తున్న పద్మావతి సంస్థకు నెలకు రూ.80 లక్షల చొప్పున చెల్లిస్తున్నారు. అయినా ఎక్కడా సంతృప్తి వ్యక్తం కావడం లేదు. మూలన పడిన వాషింగ్ మెషీన్లు దేవస్థానంలో సత్రాలలో వస్త్రాలను మెషీన్ల ద్వారా ఉతికిస్తామని చెప్పిన ఆ సంస్థ దోబీలతో ఉతికించింది. వీటికే సుమారు రూ.ఐదు లక్షల బిల్లు దేవస్థానం నుంచి వసూలు చేస్తున్నారు. దీనిపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సిఫార్సులతో ఉద్యోగ నియామకాలు దేవస్థానంలో రెగ్యులర్ సిబ్బంది కొరత ఉంది. ప్రస్తుతం 220 మంది మాత్రమే ఉండగా, వారిలో 16 మంది ఈ ఏడాది, మరో పది మంది వచ్చే ఏడాది పదవీ విరమణ చేయనున్నారు. వీరి నియామకాలు ఏపీపీ ఎస్సీ ద్వారా కాకుండా ప్రజా ప్రతినిధుల సిఫార్సులతోనే పూర్తి చేస్తున్నారు. రెగ్యులర్ సిబ్బంది తక్కువగా ఉండడంతో కీలక పోస్టుల్లో వీరే ఉన్నారు. అర్చకుల కొరత దేవస్థానంలో 40 ఏళ్ల క్రితం 24 మంది అర్చకులు ఉంటే ఇప్పుడు కేవలం 14 మంది మాత్రమే ఉన్నారు. సేవలు మాత్రం గతం కంటే దాదాపు రెట్టింపు అయ్యాయి. ప్రస్తుతం ఉన్న వారిలో ఇద్దరు పదవీ విరమణ చేయనున్నారు. కనీసం మరో 15 మంది అర్చకులు అవసరమని ఆ వర్గం కొన్నాళ్లుగా కోరుతోంది. వనదుర్గ గుడి రహదారి పూర్తి చేయండి మొదటి ఘాట్రోడ్లోని మూడో మలుపు నుంచి వనదుర్గ ఆలయానికి వెళ్లేందుకు రహదారి నిర్మాణం ఎంతో అవసరం. ఇది జరిగితే ట్రాపిక్ అంతరాయాలు నివారించవచ్చు. అన్నదానంలోనూ సత్యదేవుని ప్రసాదం పెట్టాలి తిరుమలలో అన్నదానంలో చిన్న లడ్డూ వడ్డిస్తారు. అలాగే సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలోనూ సత్యదేవుని ప్రసాదాన్ని పెట్టాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో వినియోగంలో ఉన్న విధానాన్నే ఇటీవల నిలిపివేయడంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
గోదావరి దాటిన పెద్ద పులి
దేవీపట్నం: గడిచిన రెండు వారాలుగా దేవీపట్నం మండలంలోనే తిష్ట వేసిన పెద్ద పులి ఎట్టకేలకు గోదావరి దాటింది. దేవీపట్నం, లింగవరం గ్రామాల వద్ద ఐదు రోజుల పాటు మకాం ఉండడంతో ఆ ప్రాంతంలోనే ఉంటుందని భావించినప్పటికీ పులి తన గమనాన్ని మార్చుకుంటోంది. ఈ క్రమంలో శనివారం తెల్లవారు జామున దేవీపట్నం, లింగవరం గ్రామాల సమీపంలో గోదావరి నదిని దాటి ఏలూరు జిల్లా పోలవరం మండలం సంగనపల్లి ప్రాంతంలో సంచరిస్తున్నట్లు పులికి అమర్చిన జీపీఎస్ ట్రాకర్ ద్వారా అటవీ అధికారులు గుర్తించారు. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతం కావడంతో దేవీపట్నం తరహాలోనే అక్కడ కూడా సమృద్ధిగా నీరు, పులికి ఆహారం లభించే అవకాశం ఉంది. అయినప్పటికీ పెద్ద పులి వచ్చిన ప్రాంతమైన మహారాష్ట్రలోని తడోబా అంధేరి అభయారణ్యానికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏలూరి జిల్లా దాటుకుని తెలంగాణ రాష్ట్రం మీదుగా మహారాష్ట్రలోని తడోబా చేరుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రస్తుతం పులి ఉన్న ప్రాంతం నుంచి సుమారు 600 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సి ఉంటుంది. -
నోరు విప్పకుండా ఉండలేం..
● విప్ప పూలలో ఎన్నో పోషకాలు ● వివిధ రకాల తినుబండారాల తయారీ ● రోగనివారిణి ● సేకరణతో గిరిజనులకు రాబడిఅడవి తల్లి తన బిడ్డల్లాంటి గిరిజనులకు ప్రసాదించిన తియ్యని కానుకల్లో విప్ప పూలు ప్రధానమైనవి. వేసవిలో వేకువజామునే ఈ చెట్ల వైపు వెళ్లేవారికి సువాసన వెదజల్లుతోంది. ఈ పూలు గిరిజనులకు ఆదాయ వనరుగా మారింది. గిరిజన సంస్కృతిలో భాగంగా సారా తయారీకి, ఆలయాల్లో ప్రసాదంగా, తినుబండారాల తయారీకి కూడా వినియోగిస్తున్నారు. ఇక కాయల విషయానికొస్తే విప్పబద్దను నూనెగా చేసి ఇంటి వంటకాలు, దీపారాధనలు, నొప్పులు తగ్గేందుకు మసాజ్గా వాడుతుంటారు. ఏటా ముందుగా విప్ప చెట్టుకు పూజలు చేసిన అనంతరం విప్ప పూల సేకరణను గిరిజనులు ప్రారంభిస్తారు. చింతూరు: లాటిన్ పరిభాషలో సపోటేసీ జాతికి చెందిన అడవి చెట్టు విప్ప. ప్రధానంగా ఈ చెట్లు పోలవరం ముంపు మండలాలైన చింతూరు, వీఆర్ పురం, ఎటపాక ప్రాంతాల్లో ఉంటాయి. ఇళ్ల వద్ద, అడవిలో ఉండే ఈ చెట్ల నుంచి ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పూలు రాలుతుంటాయి. ఈ చెట్లున్న ఇంటి వద్ద గిరిజనులు పూలు రాలడానికి ముందే వాటి చుట్టూ నేలను శుభ్రం చేస్తారు. తెల్లవారుతున్న వేళ మంచి సువాసనతో కూడిన విప్పపూలు రాలడం ప్రారంభమవుతుంది. అనంతరం ఇంటిల్లపాదీ కలసి బుట్టలు, చేటల్లో వాటిని సేకరిస్తారు. అలా సేకరించిన పూలను నాలుగైదు రోజులు బాగా ఎండబెడతారు. ఎండిన విప్ప పూలను గిరిజనులు సంతల్లో వ్యాపారులకు విక్రయించడంతో పాటు తమ ఇళ్లలో సారా తయారీకి వాడతారు. కొన్ని దేవస్థానాలు విప్ప పూలను ప్యాకింగ్ చేసి ప్రసాదాలుగా విక్రయిస్తుంటాయి. తియ్యని కానుకలా.. విప్ప పూలను ఇప్పటి వరకూ సారా తయారీ లేదా ప్రసాదాల కోసమే ఉపయోగించేవారు. ప్రస్తుతం కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో స్వీట్లు కూడా తయారు చేస్తున్నారు. విప్ప పూలతో లడ్డూ, హల్వా, జామ్, కేక్ వంటి వాటిని చేయడం విశేషం. వీటికి మంచి డిమాండ్ ఉండడంతో ఈ పూలకు డిమాండ్ పెరుగుతోంది. పోషక గుణాలెన్నో.. విప్ప పూలలో ఎన్నో పోషక గుణాలు ఉంటాయని శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడయ్యాయి. ఎన్నో రోగాలను హరించే గుణాలు విప్ప పూలలో ఉన్నాయని వైద్యులు చెబుతుంటారు. అధిక రక్తపోటు, మధుమేహం వంటి రోగాలను నయం చేసే గుణం విప్పపూలలో ఉంది. విప్పకాయలతో చేసిన నూనె వినియోగించి మసాజ్ చేస్తే కీళ్లనొప్పులు దూరమవుతాయి. ఈ పూలలో ప్రొటీన్లు, కార్బో హైడ్రేడ్లు, ఎనర్జీ, కాల్షియం, ఫాస్పరస్, విటమిన్–సి వంటి పోషక విలువలు ఉంటాయి. ఇతర అవ‘సారాలకు’.. ఆదివాసీలు తమ సంస్కృతీ సంప్రదాయాల్లో భాగంగా పండగలు, శుభకార్యాల్లో విప్పసారాను వినియోగిస్తారు. ఎటువంటి రసాయనాలు ఇతర పదార్థాలు వినియోగించకుండా బెల్లం ఊటతో కలిపి విప్పసారాను తయారు చేస్తారు. శుభకార్యాల సమయంలో తమ ఇళ్లకు వచ్చే బంధువులకు విప్పసారాను పోస్తారు. శుభకార్యాలు, దినకార్యాలకు ఇతర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు తమవెంట వారు తీసుకువెళ్లడం ఆనవాయితీ. విప్ప కాయలతో తయారు చేసిన మొహ్వా ఆయిల్ -
ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య
ఫ ప్రేమ పెళ్లికి కులం అడ్డురావడంతో మనస్తాపం ఫ కాపవరంలో ఘటన కోరుకొండ: ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకునేందుకు కులం కారణంగా అతడి పెద్దలు అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కోరుకొండ మండలం కాపవరంలో శనివారం ఈ విషాద ఘటన జరిగింది. ఎస్సై ఆర్.అంకారావు తెలిపిన వివరాల ప్రకారం.. గోకవరం మండలం కామరాజుపేట గ్రామానికి చెందిన ఆకాశపు నందిని (19)కి గోకవరానికి చెందిన ఇంటి హేమంత్ రామకృష్ణతో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. అనంతరం ప్రేమగా మారి, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నందినితో పెళ్లికి రామకృష్ణ తరఫు పెద్దలు అంగీకరించలేదు. దీంతో మనస్తాపానికి గురైన నందిని కామరాజుపేట నుంచి కాపవరంలోని తన అమ్మమ్మ ఇంటికి వచ్చింది. అయితే శనివారం ఉదయం ఆమె ఇంట్లోంచి బయటకు రాకపోవడంతో అమ్మమ్మ కంగారు పడింది. స్థానికుల సాయంతో తలుపులు తీసి చూసి చూడగా.. నందిని ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని మృతి చెందింది. సమాచారం అందుకున్న ఎస్సై ఆర్.అంకారావు, సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం జీజీహెచ్కు తరలించారు. నార్త్ జోన్ ఇన్చార్జి డీఎస్పీ రామకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నేలకు నవ్యౌషధం
పెరవలి: జిల్లాలో నవధాన్యాల సాగు పెంచేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా గత ఏడాది 40 వేల ఎకరాల్లో ఈ పంటలు వేస్తే ఈ ఏడాది 54 వేల ఎకరాల్లో, 45 వేల మంది రైతులతో సాగుకు సమాయత్తమవుతున్నారు. ఇందుకు 30 రకాల నవరత్న ధాన్యాలను కిట్లను రైతులకు అందించేందుకు రంగం సిద్ధం చేశారు. కిట్టు రూ.850 నుంచి రూ.వెయ్యికి అందిస్తూ 309 గ్రామాలను ఈ సాగుకు ఎంపిక చేశారు. ఈ కిట్ల తయారీకి అవసరమైన పెట్టుబడిని సొసైటీల ద్వారా రూ.1.5 కోట్లు, మహిళా సంఘాల ద్వారా రూ.2 లక్షల చొప్పున, ఉన్నతి పథకం ద్వారా ఒకొక్కరికి రూ.50 వేల చొప్పున తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 10 వేల కిట్లు తయారు చేసి రైతులకు ఐదు వేల కిట్లు అందజేశారు. దీని వలన భూసారం పెరగటంతో పాటు రైతులకు పంటల ద్వారా లబ్ధి చేకూరనుంది. లక్ష్యం ఇదీ.. జిల్లాలో 54 వేల ఎకరాల్లో 45 వేల మంది రైతులతో నవధాన్యాల సాగు చేపట్టాలన్నది లక్ష్యం. ఇందు కోసం వ్యవసాయ అనుభంద శాఖలతో పాటు వెలుగు, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులను సన్నద్ధం చేస్తున్నారు. ప్రకృతి సాగు ద్వారా నేలను సారవంతం చేసి, పెట్టుబడి ఖర్చు తగ్గించి, పంట దిగుబడి పెంచేలా దృష్టిసారించారు. నవధాన్యాల్లో పెసలు, పిల్లిపెసర, మినుము, జీలుగ, జనుము, కొర్రలు, సామలు, బొబ్బర్లు, కందులు, సజ్జలు, నువ్వులు ఇలా 30 రకాల ధాన్యాలతో సాగు చేసి భూమికి సారం పెంచనున్నారు. దీనివల్ల పశువులకు మేత కూడా సమకూరే అవకాశం ఉంటుంది. రైతులకు అదనపు ఆదాయం నవధాన్యాల పంటల సాగుతో రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుంది. ఉదాహరణకు ఒక రైతు ఎకరం పొలంలో నవ్వులు సాగు చేస్తే దిగుబడి 250 నుంచి 300 కిలోలు వస్తాయి. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం కిలో రూ.250 చొప్పున 250 కిలోలకు రూ.62,500 ఉంది. ఖర్చులు, పెట్టుబడి పోను ఎకరానికి రూ.25 వేలు మిగులుతుంది. అదే మినుము సాగు చేస్తే ఎకరానికి దిగుబడి 400 నుండి 700 కిలోలు వస్తుంది. మార్కెట్ ధర ప్రకారం క్వింటా రూ.6 వేల చొప్పున 5 క్వింటాళ్లకు రూ.30 వేల ఆదాయం వస్తుంది. పెసలు ఎకరానికి దిగుబడి 500 నుండి 600 కిలోలు వస్తుంది. మార్కెట్టు రేటు ప్రకారం క్వింటాకి రూ.8 వేలు చొప్పున రూ.40 వేలు వస్తుంది. ఇందులో ఖర్చులు సగానికి సగం పోగా సగం సొమ్ము రైతులకు మిగులు తుంది. అంతే కాకుండా ఈ పంటల వలన ఎకరానికి పచ్చిరొట్ట రూపేణా 10 టన్నులు ఎరువు లభ్యం అవుతుంది. సాగుతో లాభాలిలా.. జీవ వైవిధ్యం పెంపు. బహుళ పంటలతో 365 రోజుల పాటు సాగు. నేలలో సేంద్రియ కర్బనాల శాతం వృద్ధి. భూమిలో సూక్ష్మజీవులు వృద్ధి చెంది ప్రధాన పంటకు ఉపయుక్తం కావడం. కలుపు ఉండదు. నేల కోతకు గురి కాదు. నేల గుల్లబారి, వానపాముల వృద్ధి. నేలలో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుదల. రైతులకు అదనపు ఆదాయం. రసాయన ఎరువులు, మందుల అవసరం ఉండదు. దిగుబడులు పెరగడం జిల్లాలో విస్తీర్ణం ఇలా గత సార్వాలో 40 వేల ఎకరాలలో సాగు రైతులు 36 వేలు ప్రస్తుత లక్ష్యం 54 వేల ఎకరాలు రైతులు 45 వేలు నవధాన్యాల సాగుకు పక్కా ప్రణాళిక మూడో పంటగా వేసేందుకు సమాయత్తం జిల్లాలో 54 వేల ఎకరాల్లో పంపిణీకి పది వేల కిట్లు సిద్ధం 309 గ్రామాల్లో రైతులకు అవగాహన రైతులకు అదనపు ఆదాయంజిల్లాలో నవధాన్యాల సాగు విస్తీర్ణం 54 వేల ఎకరాలకు పెంచాలనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించాం. ఇందుకు జిల్లాలో 309 గ్రామాలు ఎంపిక చేశాం. ఈ సాగు వల్ల రైతులకు అదనపు ఆదాయంతో పాటు పంట భూములకు ఎరువు లభ్యమై భూసారం పెరుగుతుంది. – తాతారావు, ప్రాజెక్టు మేనేజర్, జిల్లా సేంద్రియ వ్యవసాయ శాఖ -
26 నుంచి శాప్ క్రీడా ప్రవేశ ఎంపికలు
ప్రకాశం నగర్: ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి వివిధ క్రీడా విభాగాల్లో ప్రవేశాల ఎంపికను నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి డీఎంఎం శేషగిరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 15 ఏళ్లు పైబడి, 19 ఏళ్లలోపు క్రీడాకారులు జనవరి ఒకటో తేదీ 2008 నుంచి జనవరి ఒకటి, 2011 మధ్య జన్మించిన వారు ఈ ఎంపికలకు అర్హులని తెలిపారు. ఎంపికై న క్రీడాకారులకు శిక్షణ, వసతి, భోజన సౌకర్యాలు కల్పించనున్నట్టు తెలిపారు. అసక్తి గల అభ్యర్థులు శాప్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. వివరాలకు నాగేంద్రన్ 90329 34038 ఫోన్ నెంబర్ను సంప్రదించాలన్నారు. -
సత్యగిరికి మరో సత్రం
● రూ.11.4 కోట్లతో నిర్మాణం కానున్న సీతారామ సత్రం ● ఈ నెల 12న మంత్రి ఆనంచే శంకుస్థాపన అన్నవరం: రత్నగిరి భక్తులకు సత్యగిరిపై మరో సత్రం నిర్మాణం కానుంది. రూ.11.40 కోట్ల వ్యయంతో 105 గదులతో దీనిని నిర్మించనున్నారు. ఇప్పటికే దేవదాయశాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్ అన్ని అనుమతులు మంజూరు చేశారు. శిథిలావస్థకు చేరిన పాత సీతారామ సత్రంలో సగభాగాన్ని కూల్చి ఈ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ నెల 12న దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దీనికి శంకుస్థాపన చేయనున్నట్టు ఈఓ వి.త్రినాథరావు తెలిపారు. అలాగే టోల్గేట్ నుంచి రత్నగిరికి చేరేందుకు రూ.1.40 కోట్లతో నిర్మించిన రెండో మెట్లదారిని సైతం ఆయన ప్రారంభించనున్నట్టు ఈఓ తెలిపారు. సుమారు 30 ఏళ్ల క్రితం నిర్మించిన శ్రీ సీతారామ సత్రం శిథిలావస్థకు చేరడంతో 2024లో అప్పటి ఈఓ, ప్రస్తుత దేవదాయ కమిషషనర్ కె.రామచంద్రమోహన్ ఆదేశాలతో ఆర్ అండ్ బి అధికారుల నివేదిక మేరకు దానిని కూల్చి నూతన సత్రాన్ని నిర్మించనున్నారు. ఎ–బ్లాక్ పేరుతో రూ.7.07 కోట్లకు డీడీ గిరి కన్స్ట్రక్షన్స్ టెండర్ దక్కించుకుంది. ఫర్నిచర్, విద్యుత్, ఫ్లోరింగ్ తదితర పనులకు రూ.4.5 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. 2025 జూన్ 26న సాక్షిలో ‘సత్యదేవ చూడవయ్యా..’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన కమిషనర్ రామచంద్రమోహన్ కూల్చివేత విషయంలో జేఎన్టీయూకే ప్రొఫెసర్ల అభిప్రాయాల మేరకు కూడా పాత సత్రాన్ని కూల్చాలని నిర్ణయించి నూతన సత్రం నిర్మాణానికి నిర్ణయించారు. 16 నెలల్లో దీనిని పూర్తిచేయాలని నిర్ణయించి గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఈఓ త్రినాథరావు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మరొకరికి తీవ్ర గాయాలు ముమ్మిడివరం: స్థానిక జాతీయ రహదారి కాశివాని తూము బైపాస్ రోడ్లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రాంతం గగ్గిపర్రుకు చెందిన రందికట్ల యేసురాజు (18) మృతి చెందగా లంకల కోడేరుకు చెందిన కొయ్య రాజకుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. వీరు యానాం నుంచి మోటారు సైకిల్పై వస్తూ ఆర్టీసీ బస్సును అధిగమించబోయి ఈ ప్రమాదానికి గురయ్యారు. వాహనంపై వెనుక కూర్చున్న యేసురాజు జారిపడడంతో బస్సు వెనుక చక్రం కింద పడి మృతి చెందాడు. రాజ్కుమార్ కొంచెం దూరం వెళ్లి రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని 108లో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యేసురాజు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్సై డి.జ్వాలాసాగర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
స్నాతకోత్సాహం
● ‘నన్నయ’లో ఘనంగా ‘పట్టాల’ పండగ ● మొత్తం 722 మందికి అందజేత ● 14 మందికి బంగారు పతకాలు రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో శుక్రవారం స్నాతకోత్సవం సందడిగా సాగింది. యూనివర్సిటీతోపాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని అనుబంధ కళాశాలలకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా ఈ పట్టాల పండగలో పాల్గొన్నారు. చాన్సలర్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా 14 మంది బంగారు పతకాలు అందుకున్నారు. పట్టభద్రులు దేశాభివృద్ధిలో కీలకం : చాన్సలర్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉన్నత చదువులతో పట్టభద్రులైన వారందరూ సమాజ హితంగా పయనాన్ని కొనసాగిస్తూ, దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని ఆదికవి నన్నయ యూనివర్సిటీ చాన్సలర్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. భారతాన్ని తెలుగులోకి అనువదించిన ‘నన్నయ’ పేరిట ఏర్పడిన ఈ యూనివర్సిటీ దేశంలో ప్రముఖ యూనివర్సిటీగా అభివృద్ధిని సాధించాలనే ఆకాంక్షను వెలిబుచ్చారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులంతా ‘వసుదైక కుటుంబం’ అనే భావనతో ముందుకు సాగాలన్నారు. యూనివర్సిటీలోని కన్వెన్షన్ హాలులో 2022–23, 2023–24 విద్యా సంవత్సరాలకు సంబంధించి 16, 17 స్నాతకోత్సవాలను శుక్రవారం నిర్వహించారు. 45 మందికి బంగారు పతకాలు, పీహెచ్డీ పట్టాలను అందజేశారు. పట్టాలు అందుకునేందుకు 722 మంది దరఖాస్తు చేసుకోగా, మిగిలిన వారికి వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ, రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, అతిథులు జేఎన్టీయూ సీనియర్ ప్రొఫెసర్ మహేంద్ర పి.లామా, యాప్షీ చైర్మన్ ఆచార్య కె.మధుమూర్తిల చేతుల మీదుగా అందజేశారు. ‘నన్నయ’ కీర్తిని ఇనుమడింపజేసేలా.. వీసీ ప్రసన్న శ్రీ ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ మాట్లాడుతూ గోదావరి జిల్లావాసుల చిరకాల కోరిక మేరకు ఆవిర్భవించిన ఆదికవి నన్నయ యూనివర్సిటీ అంచెలంచెలుగా ఎదుగుతూ విలువలతో కూడిన ఉన్నత విద్యను అందస్తోందన్నారు. తెలుగు సాహిత్యానికి ఆదికవి అయిన నన్నయ భట్టారకుని కీర్తిని ఇనుమడింపజేసే విధంగా ముందుకు సాగుతుందని చెప్పారు. ఆరు జిల్లాల్లో 390 అనుబంధ కళాశాలలతో రెండు తెలుగు రాష్ట్రాలలో అతిపెద్ద యూనివర్సిటీగా నిలిచిందన్నారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించి, విద్యార్థులను సమాజానికి కావలసిన బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగేందుకు తోడ్పడుతుందని చెప్పారు. డిగ్రీ ప్లస్ విధానం అవసరమే : ప్రొఫెసర్ మహేంద్ర పి.లామా జేఎన్టీయూ సీనియర్ ప్రొఫెసర్ మహేంద్ర పి.లామా మాట్లాడుతూ విద్యార్థులు ఒకే విభాగానికి పరిమితం కాకుండా అంతర్ శాఖల అధ్యయనం వైపు అడుగులు వేయాలని సూచించారు. డిగ్రీ ప్లస్ విధానం అవసరాన్ని ప్రస్తావిస్తూ, పాఠ్యాంశాలతోపాటు నైపుణ్యాలు, సృజనాత్మకత, అనుభవాత్మక అభ్యాసం కూడా అవసరమనే విషయాన్ని గ్రహించాలన్నారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో చదువును మరచిపోకుండా నిరంతరం పుస్తక పఠన చేయాలన్నారు. అందుకు అనుగునంగా తల్లిదండ్రులు కూడా నచుకోవాలని, ఇంటిలోని ర్యాక్లలో భాగవత, రామాయణాలతోపాటు చరిత్రను తెలియజేసే పుస్తకాలను కూడా పిల్లలు చదువుకునేందుకు వీలుగా ఉంచాలని సూచించారు. ఘన స్వాగతం స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు కులపతి హోదాలో వచ్చిన గవర్నర్ అబ్దుల్ నజీర్కు గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలోని హెలీపాడ్ వద్ద ఉదయం 11 గంటలకు కలెక్టర్ కీర్తి చేకూరి, ప్రజాప్రతినిధలు, జిల్లా అధికారులు పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు.722 మందికి పట్టాల ప్రదానం 2022–23, 2023–24 విద్యా సంవత్సరాలకు చెందిన పీహెచ్డీ, పీజీ, పీజీ డిప్లమా, యూజీ అండ్ పీజీ ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసి, దరఖాస్తు చేసుకున్న 722 మంది విద్యార్థులకు పట్టాలను ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో అందజేశారు. వీరిలో 21 మంది పీహెచ్డీ, 14 మంది గోల్డ్ మెడల్స్, 10 ప్రైజ్లు పొందిన వారున్నారు. యూనివర్సిటీతోపాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని అనుబంధ కళాశాలలకు చెందిన 6,113 మంది పోస్టు గ్రాడ్యుయేషన్, 45,337 మంది అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలు అందించేందుకు చాన్సలర్ ఆమోదం తెలిపారు. కార్యక్రమంలో తెలుగు యూనివర్సిటీ వీసీ ఆచార్య మునిరత్నంనాయుడు, జీజీయూ చాన్సలర్ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు), ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణచౌదరి, యూనివర్సిటీ పాలకమండలి సభ్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
ఎక్కడి ధాన్యం అక్కడే!
పెరవలి: రబీలో ధాన్యాన్ని సేకరించటానికి అధికారులు సిద్ధమవుతుండగా రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. వరి సాగు 2,19,831 ఎకరాల్లో చేపట్టగా 8.91 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అధికారులు వేసిన అంచనాలు అటుఇటుగా నిజం అయినా కొనుగోలు ఎంత చేస్తారనేది చెప్పకపోవటంతో రైతులు గందరగోళంలో పడ్డారు. జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని అధికారులు చెబుతున్నా ఆన్లైన్లో సైట్ ఓపెన్ కాకపోవడంతో రైతులు మిల్లర్లకు ధాన్యం అమ్ముకుంటున్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్కు ఏ గ్రేడ్ రూ.2,389, కామన్ రకం రూ.2,369గా ప్రకటించింది. మిల్లర్లు తేమ శాతం ముసుగులో క్వింటాల్కు 15 కిలోల ధాన్యానికి సొమ్ము తగ్గించి ఇస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఎకరాకు సగటున 50 బస్తాల దిగుబడి వస్తే సుమారు రూ.6 వేల వరకు నష్టపోవలసి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 249 కొనుగోలు కేంద్రాలు జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు 249 ఏర్పాటు చేశామని, 242 మిల్లులను ఎంపిక చేశామని అధికారులు చెబుతున్నారు. అయితే ధాన్యం కొనుగోలు కొందరు మిల్లర్లకు అధిక మొత్తంలో, మరికొన్ని మిల్లులకు తక్కువ మొత్తంలో కేటాయిస్తున్నారని మిల్లర్లే బహిరంగంగా అంటున్నారు. గంటల తరబడి నిరీక్షణ మెట్ట ప్రాంతంలో వరి కోతలు ముమ్మరంగా జరుగుతుండగా ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టి, బస్తాల్లో పట్టి నిల్వ ఉంచారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సైట్ ఓపెన్ కాకపోవటంతో రైతులు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. దీంతో విసుగెత్తిన రైతులు నేరుగా రైసు మిల్లులకు వెళ్లి ధాన్యాన్ని అయినకాడికి అమ్ముకుంటున్నారు. కళ్లాల్లో ధాన్యం వాతావరణం బాగుండకపోవటంతో రైతులు పండిన ధాన్యాన్ని కళ్లాల్లోను, రాశులుగాను, బస్తాల్లో నిల్వ చేసుకుంటున్నారు. సీతానగరం, రాజానగరం, కోరుకొండ మండలాల్లో ఈ పరిస్థితి నెలకొంది. సక్రమంగా కొనుగోలు చేస్తారా? పండిన ధాన్యాన్ని సక్రమంగా కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటారా లేదా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత రబీలో 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని అధికారులు నిర్ణయించారు. అయితే వారి అంచనాలు తప్పి ధాన్యం దిగుబడులు అనూహ్యంగా రావడంతో సేకరణ లక్ష్యాన్ని 3.50 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచారు. అయినా రైతుల వద్ద ధాన్యం మిగిలిపోయి అయినకాడికి అమ్ముకోవలసి వచ్చింది. ఈసారైనా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుని పండిన ధాన్యం అంతా కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం విఫలం ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో విఫలం అయ్యింది. కొనుగోలు కేంద్రాలకు ఏర్పాట్లు చేశామంటున్నారు కానీ ఎక్కడా కొనడం లేదు. – నంబూరి త్రిమూర్తిరాజు, రైతు, చిన కొండేపూడి రోడ్డు పక్కనే ధాన్యం ఐదెకరాలు సాగు చేశాను. సైట్ ఓపెన్ కాక రోడ్డు పక్కనే ధాన్యం బస్తాల్లో పట్టి ఉంచాను. ప్రభుత్వం చెప్పిన దానికి, వాస్తవానికి పొంతన లేదు. – గెడ్డం వెంకట రామారావు, కౌలు రైతు, ముగ్గళ్ల ఆన్లైన్లో సైట్ ఓపెన్ కాక.. సాగని సేకరణ అయినకాడికి అమ్ముకుంటున్న రైతులు తేమ శాతం ముసుగులో క్వింటాల్కు 15 కిలోల చొప్పున తరుగు మిల్లర్ల దోపిడీతో ఎకరాకు సుమారు రూ.6 వేలు నష్టపోతున్న వైనం -
స్థలాల ఎంపికపై నిర్వాసితుల అభిప్రాయ సేకరణ
చింతూరు: గిరిజనేతర నిర్వాసితులకు స్థలాల ఎంపిక నిమిత్తం తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం అభిప్రాయ సేకరణ చేపట్టారు. రెండో ఆప్షన్లో భాగంగా స్వయంగా ఇళ్లు నిర్మించుకోవాలనుకొనే నిర్వాసితులకు తాడువాయిలోని 12వ నంబరు బ్లాకు, లేదా మూడో నంబర్ బ్లాకులలో ఏది కావాలో అనే అంశంపై అభిప్రాయాలు స్వీకరిస్తున్నారు. గతంలో తమ అభిప్రాయాలు తెలిపిన వారు సైతం ప్రస్తుతం తమ అభిప్రాయాలు మార్చుకొనే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 15 వరకు అభిప్రాయ సేకరణ జరుగుతుందన్నారు. చింతూరుకు చెందిన గిరిజన నిర్వాసితులు తమకు ఏ బ్లాకులో ప్లాట్ కావాలో స్పష్టమైన అభిప్రాయాన్ని తెలిపాలని అధికారులు కోరుతున్నారు. -
ఆగని ఇసుక దుమారం
తహసీల్దార్కు ఫిర్యాదు చేసిన జనసేన, కూటమి నేతలు తాళ్లపూడి: కూటమి ప్రభుత్వంలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఇసుక ర్యాంపుల నిర్వహణపై కూటమిలోని జనసేన, టీడీపీకి చెందిన నాయకులు ఫిర్యాదు చేశారు. మండలంలో ఇసుక ర్యాంపుల నిర్వహణ, అక్రమ రవాణాపై కూటమిలోని కొత్తవర్గం శుక్రవారం తాళ్లపూడి తహసీల్దార్ను కలిసి వినతిపత్రం అందజేసింది. జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షుడు చెవ్వురి రాము, ఎంపీటీసీ మాజీ సభ్యుడు పెదపాటి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో తహసీల్దార్ లక్ష్మి లావణ్యను కలిసి ఇసుక ర్యాంపుల్లో అక్రమాలను అరికట్టాలని కోరారు. మండలంలో నిర్వహిస్తున్న అన్ని ఇసుక రాంపుల్లో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు సాగుతున్నాయని, దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడటమే కాకుండా పర్యావరణానికి నష్టం వాటిల్లుతోందని ఆరోపించారు. అధికార యంత్రాంగం స్పందించి తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మూడవ రోజూ వైద్య ఉద్యోగుల నిరసన అనపర్తి : ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మూడవ రోజు శుక్రవారం కూడా అనపర్తి ఏరియా ఆసుపత్రిలో వైద్య ఉద్యోగులు తమ నిరసన కొనసాగించారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ, పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు పీఆర్సీని తక్షణమే ఏర్పాటు చేయాలని కోరారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస టైమ్ స్కేల్ అమలు చేయడంతో పాటు, 35 రోజుల సాధారణ సెలవులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో నూరు శాతం గ్రాస్ శాలరీ అమలు చేయడంతో పాటు, వారికి రెగ్యులరైజేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం స్పందించి, న్యాయం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించే వరకు ఈ నిరసనలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. స్టాఫ్ నర్సులు, కౌన్సిలర్ చైతన్యరాజు, రేడియోగ్రాఫర్ విజయకుమార్, ల్యాబ్ టెక్నీషియన్ క్రాంతి, ఫార్మసిస్ట్ మీనా పాల్గొన్నారు. -
● చదువుల బంగారాలు!
మళ్లీ శాప్ అకాడమీలు నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలో రాష్ట్ర స్థాయి అకాడమీలను తిరిగి ప్రారంభిస్తుందని డిఎస్డీఓ వి.సతీష్కుమార్ శుక్రవారం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి శాప్ నుంచి ఆదేశాలు అందాయన్నారు. 2026–27 విద్యా సంవత్సరానికి వెయిట్ లిఫ్టింగ్లో 15, జిమ్నాస్టిక్స్లో 15, హాకీలో 20, ఖోఖోలో 20 మంది బాలికలకు ప్రవేశం కల్పించనున్నారు. 19 సంవత్సరాలలోపు వారు 1–1–2008 నుంచి 1–1–2011 మధ్య జన్మించిన వారు ప్రవేశానికి అర్హులు. ఎంపికై న వారికి కోచింగ్, వసతి, భోజన, ఆధునిక శిక్షణ సదుయాలు కల్పిస్తారన్నారు. విశాఖ, తిరుపతి, కాకినాడలో ఈ శాప్ అకాడమీలు ప్రారంభమవుతాయన్నారు. విశాఖలో అథ్లెటిక్స్, వాటర్ స్పోర్ట్స్, సైక్లింగ్లో బాలుర, అకాడమీలు, తిరుపతిలో బాలురు, బాలికలకు జుడో, బ్యాడ్మింటన్, బాక్సింగ్, వెయిట్ లిిఫ్టింగ్, రైఫిల్ షూటింగ్, లాన్ టెన్నిస్లో అకాడమీలు ఏర్పాటు కానున్నాయని పేర్కొన్నారు. కాకినాడలో ఈ నెల 29న వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్లో, 30న హాకీ, ఖోఖోలో ఎంపికలు జరుగుతాయని తెలిపారు. వివరాలకు 9440031601 నంబరులో సంప్రదించాలని కోరారు. పచ్చటి బతుకుల్లో కారుచిచ్చు -
రవ్వ వద్ద రాజుకున్న జ్వాల
● ఆందోళనలకు స్పందించని యాజమాన్యంపై ఆగ్రహం ● వేదాంత జిఎం మను ఖన్నా దిష్టిబొమ్మ దగ్ధం ● స్థానికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ ఉప్పలగుప్తం: ఎస్.యానంలోని వేదాంత ఆయిల్ కంపెనీ (రవ్వ ప్లాంట్) ఇచ్చిన హామీ మేరకు స్థానికులకు వంద ఉద్యోగాలు, గ్రామాభివృద్ధి కోసం చేస్తున్న నిరసనలకు యాజమాన్యం స్పందించకపోవడంతో శుక్రవారం ప్లాంటు వద్ద ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదాంత కంపెనీ జీఎం మనుఖన్నా దిష్టిబొమ్మను దగ్ధం చేసి కంపెనీ గో బ్యాక్ అంటూ డిమాండ్ చేశారు. ధర్నాకి నాయకత్వం వహించిన నాయకులు మాట్లాడుతూ ఈ సంస్థ 15 ఏళ్లుగా గ్రామస్తులకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, గ్రామాన్ని శ్మశానంలా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్లాంటు వల్ల కాలుష్యం పెరిగి పంట లు నాశనమయ్యాయని, ప్రజలు వ్యాధులకు గురవుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు పెట్టా అప్పారావు, నీటి సంఘం చైర్మన్ దంగేటి చిట్టిబా బు, జోగి రాజా, లంకే భీమరాజు పాల్గొన్నారు. -
సత్యదేవా సాపాట్లు కనవా!
● వేతనాలు అందక పారిశుధ్య సిబ్బంది వెతలు ● రెండు నెలలుగా రూ.కోటి బకాయిలు ● పట్టించుకోని పద్మావతి కాంట్రాక్టు సంస్థ అన్నవరం: రత్నగిరిపై పారిశుధ్య సిబ్బంది జీతాల సమస్య వీడడం లేదు. ఆ సిబ్బంది కాంట్రాక్టు నిర్వహించే పద్మావతి శానిటరీ, హౌస్ కీపింగ్, ఫెసిలిటీ మేనేజ్మెంట్లో పని చేస్తున్న 350 మంది సిబ్బందికి ఫిబ్రవరి, మార్చి నెలల జీతాలు ఇంకా అందలేదు. ఈ నెల పదో తేదీ వచ్చినప్పటికీ జీతాలు రాకపోవడంతో వారు అవస్థలు పడుతున్నారు. వర్కర్ నుంచి సూపర్వైజర్ వరకు నెలకు రూ.9 వేల నుంచి రూ.13 వేల వరకు ఉంటుంది. ఈపీఎఫ్ కటింగ్ పోగా రూ.8 వేల నుంచి రూ.12 వేల వరకు మాత్రమే చెల్లించాల్సి ఉంది. నెలకు రూ.80 లక్షలు శానిటరీ టెండర్ కాగా, రూ. 30 లక్షలు మెటీరియల్ తదితర ఖర్చులకు మినహాయించి, రూ.50 లక్షలు జీతాలు చెల్లిస్తున్నారు. ఇలా రెండు నెలలకు రూ.కోటి చెల్లించాల్సి ఉంది. గత ప్రభుత్వంలో ఎక్కడి టెండర్ అక్కడే గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పారిశుధ్య పనులకు ఏ దేవస్థానానికి ఆ దేవస్థానంలోనే టెండర్లు పిలిచి ఖరారు చేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏడు ప్రముఖ దేవస్థానాలను ఒకే యూనిట్ గా శానిటరీ టెండర్లు నిర్వహించాలని 2024 ఆగష్టు 27న నిర్ణయించారు. గత ఏడాది అక్టోబర్ నుంచి పద్మావతి సంస్థ పారిశుధ్య పనుల టెండర్ దక్కించుకుంది. పారిశుధ్య పనులలో అత్యాధునిక మెషినరీలు ఉపయోగించాలనే షరతుతో పాటు ఏసీల నిర్వహణ, విద్యుత్ ఉపకరణాల నిర్వహణ కూడా కలిపారు. దీంతో కాంట్రాక్ట్ రూ.80 లక్షలకు ఖరారైంది. అలాగే 50 ఏళ్లు దాటిన సుమారు 50 మందిని గత నవంబర్లో తొలగించారు. కాగా కూటమి నేతలు సిఫార్సు చేసిన 350 మందిని వయో పరిమితితో సంబంధం లేకుండా ఈ పనుల్లోకి తీసుకోవడం గమనార్హం.సీఎంకు సన్నిహితుడికే టెండర్ రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాలైన అన్నవరం, సింహాచలం, శ్రీశైలం, ద్వారకా తిరుమల, విజయవాడ దుర్గగుడి, కాణిపాకం, శ్రీకాళహస్తి దేవస్థానాలలో పారిశుధ్య పనులను తిరుపతికి చెందిన పద్మావతి శానిటరీ, హౌస్ కీపింగ్, ఫెసిలిటీ మేనేజ్మెంట్ సంస్థ నిర్వహిస్తోంది. ఈ సంస్థ అధిపతి భాస్కరనాయుడు సీఎం చంద్రబాబుకు సన్నిహితుడిగా గుర్తింపు ఉంది. బిల్లు పెట్టిన వెంటనే చెల్లిస్తాం దేవస్థానంలో శానిటరీ పనులు నిర్వహిస్తున్న ‘పద్మావతి’ సంస్థ ప్రతి నెలా సిబ్బందికి ఈపీఎఫ్, తదితర చెల్లింపులు చేస్తూ ఆ రశీదులతో కాంట్రాక్ట్ బిల్లు అందచేస్తే వెంటనే నిధులు విడుదల చేస్తాం. సకాలంలో బిల్లు పెట్టాలని ఇప్పటికే వారిని ఆదేశించాం. – వి.త్రినాథరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం -
డీసెట్ నోటిఫికేషన్ విడుదల
దరఖాస్తులకు ఈ నెల 15వ తేదీ తుది గడువు రాయవరం: రెండేళ్ల ఉపాధ్యాయ శిక్షణ కోర్సులో ప్రవేశానికి ఏపీ డీఈఈ సెట్–2026 నోటిఫికేషన్ విడుదలైంది. 2026–27 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరులోని డైట్ కళాశాలతో పాటుగా, కొన్ని ప్రైవేట్ కళాశాలల్లో అడ్మిషన్లు పొందడానికి అవకాశముంది. గత నెల 31 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండగా, ఈ నెల 15 తుది గడువు విధించారు. ఈ పరీక్షకు రూ.వెయ్యి ఫీజు చెల్లించి హెచ్టీటీపీఎస్://సీఎస్ఈ.ఏపీ.జీవోవీ.ఇన్ లేదా హెచ్టీటీపీఎస్://ఏపీడీఈఈసెట్.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో పరీక్షా కేంద్రాలను కేటాయిస్తారు. అర్హతలివీ విద్యార్థుల వయసు ఈ ఏడాది సెప్టెంబరు 1వ తేదీ నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. భారత జాతీయుడై ఉండాలి. పది, ఇంటర్మీడియెట్ తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. ఇంటర్లో 50 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 45 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. ● చక్కటి అవకాశం ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలనుకునే వారికి ఇది ఒక చక్కని అవకాశం. ప్రభుత్వ డైట్తో పాటుగా ప్రైవేట్ ఉపాధ్యాయ శిక్షణ సంస్థల్లో సీటు పొందడానికి డీసెట్ రాయాల్సి ఉంది. –జి.నాగమణి, ఆర్జేడీ, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ. -
రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల సీజ్
● నాగాలాండ్ రాష్ట్ర రిజిస్ట్రేషన్తో అక్రమంగా నిర్వహణ ● పోలీసు స్టేషన్కు తరలింపు బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): ఇటీవల ప్రైవేట్ స్లీపర్ బస్సులు తరచుగా ప్రమాదాలకు గురౌతున్న నేపథ్యంలో కాకినాడ జిల్లా రవాణాశాఖాధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. డ్రైవ్లో భాగంగా ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్తో నాగాలాండ్ రాష్ట్ర రిజిస్ట్రేషన్తో ఉన్న రెండు స్లీపర్ బస్సులను సీజ్ చేసి ఆర్టీసీ కాంప్లెక్స్కు తరలించారు. బస్సుకు ఉండాల్సిన ఇంధన ట్యాంకర్ కంటే అదనంగా మరో ట్యాంకర్ ఏర్పాటు చేసి యానాంలో డీజిల్ రూ.10 తక్కువగా ఉండడంతో అక్కడ ఇంధనం నింపుకొంటున్నారని రవాణా అధికారులు గుర్తించారు. ఇలా అధిక ట్యాంకులు ఉండటం వల్లే త్వరగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించి ప్రతి ట్రావెల్ బస్సు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని డీటీసీ శ్రీధర్ అదేశించారు. ఈ డ్రైవ్లో ఏఏంవీఐలు మత్సా కళాజ్యోతి, గౌరశంకర్, సిబ్బంది పాల్గొన్నారు. -
సీహెచ్సీలో ఆకస్మిక తనిఖీలు
చింతూరు: చింతూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను రాష్ట్ర బాలల కమిషన్ సభ్యులు గాంధీబాబు శుక్రవారం సందర్శించారు. బాలల ఆరోగ్య పరిరక్షణకు సీహెచ్సీలో అందిస్తున్న సేవలను సమీక్షించారు. పర్యటనలో భాగంగా ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగం, పోషకాహార పునరావాస కేంద్రం సేవలపై ఆరా తీశారు. సూపరింటిండెంట్ డాక్టర్ కోటిరెడ్డితో పలు అంశాలపై సమీక్షించారు. పోషకాహారలోపంతో ఉన్న పిల్లలను గుర్తించి వారిని పోషకాహార పునరావాస కేంద్రానికి తరలించేందుకు చర్యలు చేపట్టాలని ఐసీడీఎస్ జిల్లా ప్రోజెక్టు డైరెక్టర్ ఉమాకు సూచించారు. అనంతరం తక్కువ బరువుతో జన్మించిన ఓ శిశువును పరిశీలించారు. ఎస్ఎన్సీయూ మెడికల్ ఆఫీసర్ మహేష్ ఆసుపత్రి ద్వారా అందజేస్తున్న సేవలను వివరించారు. ఆయన వెంట సీడీపీఓ జయలక్ష్మి, వైద్యులు మహేష్, స్పందన, శివ, రమణారావు, శశికళ, దివ్య, జలవతి, భరద్వాజ్ తదితరులు ఉన్నారు. -
పోగొట్టుకున్న బంగారం అప్పగింత
● 34గ్రాములు బంగారం స్వాధీనం ● బాధితులకు అప్పగించిన పోలీసులు జగ్గంపేట: గ్రామానికి చెందిన ఒక మహిళ ఆటోలో వదిలేసిన 34 గ్రాముల బంగారాన్ని ఫిర్యాదు చేసిన మూడు గంటల వ్యవధిలో పోలీసులు వెతికి పట్టుకుని బాధితురాలికి అప్పగించారు. మండలం గుర్రంపాలెం గ్రామానికి చెందిన పడాల లలిత హైదరాబాద్ నుంచి గురువారం రాత్రి రైలులో శుక్రవారం సామర్లకోట వచ్చారు. అక్కడి నుంచి జగ్గంపేటకు ఆటోలో వెళ్లి దిగేటపుడు తన బ్యాగ్ను మరచిపోయారు. అందులో రూ.4.5 లక్షల విలువైన 34 గ్రాముల బంగారు వస్తువులు మరచిపోయారు. కొద్దిసేపటికే ఆ విషయం గుర్తొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై రఘునాథరావు తన సిబ్బందితో జగ్గంపేట సెంటర్ నుంచి సామర్లకోట వెళ్లే దారిలో సీసీ కెమేరాల ఫుటేజీలన పరిశీలించి కాట్రావులపల్లి శివార్లలో ఆటోను గుర్తించి పట్టుకున్నారు. ఆటోలో బ్యాగ్ తీసుకుని పరిశీలించి బంగారం వుండడంతో వాటిని సురక్షితంగా భాదితురాలు లలితకు అందజేశారు. పోలీసులకు లలిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
అప్పులిచ్చి మోసపోయిన వ్యక్తి ఆత్మహత్య
● పెట్రోల్ పోసుకుని బలవన్మరణం ● ఎమ్మెల్యే అనుచరుడి అండతో నయవంచనే కారణం ● తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో ఘటన ధవళేశ్వరం: తన వద్ద అప్పులు తీసుకున్న వారు తనను మోసం చేశారని, ఎమ్మెల్యే అనుచరుడి అండతోనే తనకు అన్యాయం జరిగిందంటూ ఓ వ్యక్తి తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలో ఈ ఘటన వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. ధవళేశ్వరంలోని వెలుగుబంటి గార్డెన్స్ రైల్వేట్రాక్ పక్కన గురువారం మధ్యాహ్నం ఒక వ్యక్తి నిప్పంటించుకుని చనిపోయినట్లు వీఆర్ఓ సూర్యకుమారి పోలీసులకు సమాచారమిచ్చారు. వారు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా అప్పటికే అతడు పూర్తిగా కాలిపోయి మృతిచెందాడు. ఘటనా స్థలం వద్ద పెట్రోల్ తెచ్చేందుకు ఉపయోగించిన కవర్లు, ఒక బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులోని వస్తువులు పరిశీలించగా మృతుడు అల్లూరి జిల్లా అడ్డతీగలకు చెందిన గోగినేని జయకిషన్ (55)గా వారు గుర్తించారు. ఎమ్మెల్యే అనుచరుడి అండతోనే.. అయితే, అప్పుల బాధ తాళలేక బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు ఆత్మహత్యకు ముందు జయకిషన్ సోషల్ మీడియాలో వీడియో పోస్టుచేశాడు. తనను నమ్మించి అప్పులు తీసుకున్న వారు మోసం చేశారని, తనకు న్యాయం చేయాలని మంత్రి లోకేశ్ను కోరుతూ వీడియోను విడుదల చేశాడు. స్థానిక ఎమ్మెల్యే అనుచరుడి అండతోనే తనకు అన్యాయం జరిగిందని ఆ వీడియోలో పేర్కొన్నాడు. అడ్డతీగలలో ఆత్మహత్య చేసుకుంటే కేసు నీరుగారుస్తారన్న భయంతో ఇక్కడికొచ్చి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో వివరించాడు. జయకిషన్ మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు 15 ఏళ్లుగా జయకిషన్కు దూరంగా ఉంటున్నారు. సమాచారం ఇచ్చినప్పటికీ వారెవరూ రాకపోవడంతో పోస్టుమార్టం పూర్తికాలేదు. ధవళేశ్వరం సీఐ టి.గణేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
29 చెరువులకు త్వరలో మరమ్మతులు
రాజవొమ్మంగి: జలధార–జలహారతి కార్యక్రమంలో భాగంగా మండలంలో వివిధ మరమ్మతులు చేపట్టాల్సిన 29 సాగునీటి చెరువులను గుర్తించామని ఎంపీడీఓ యాదగిరీశ్వరరావు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం రాజవొమ్మంగి సచివాలయంలో జరిగిన గ్రామ సభలో ఆయన మాట్లాడారు. గ్రామసభకు హాజరైన ఎంపీడీఓ మాట్లాడుతు రిజర్వాయర్లు, చెరువులు, పంట కాలువల్లో పూడిక తీత పనులు, షటర్లు, పంట పొలాలకు సాగు నీరందించే తూములకు చేపట్టాల్సిన మరమ్మతులను గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. నీటి భద్రత– భూగర్భ జలాల పెంపుదలకు ప్రభుత్వం చేపట్టిన వంద రోజుల ప్రత్యేక కార్యాచరణతో ఉపాధిహామీ పథాకాన్ని ఆనుసంధానం చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఎంపీడీఓ అన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు గొల్లపూడి పెద్దిరాజు, వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షుడు ముప్పన కేశవరావు, పంచాయతీ సెక్రటరీ మల్లేశ్వర్రావు, నాయకులు చీడిపల్లి అప్పారావు, త్రిమూర్తులు, రైతులు పాల్గొన్నారు. -
పరిశ్రమలు పప్పు'పప్పు'
తుని: దేశ విదేశాల్లో జీడిపప్పుకు ఉన్న డిమాండ్ ఇతర ఉత్పత్తులకు ఉండదు. రోజువారీ వంటకాల నుంచి స్టార్ హోటళ్లు, విందు భోజనాల్లో జీడిపప్పు ఉండాల్సిందే. అందరికీ పసందు ఇచ్చే జీడిపప్పు తయారీలో రాష్ట్రం కీలకంగా ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విదేశీ దిగుమతులపై 9.55 శాతం సుంకం విధించింది. దీనివల్ల ఏటా రూ.115 కోట్ల మేర పన్ను భారం పడుతోంది. ఇంత మొత్తం పన్ను చెల్లిస్తే జీడిపప్పు తయారీ పరిశ్రమల నిర్వహణ కష్టమని యాజమాన్యాలు అంటున్నాయి. ఇదే పరిస్థితి ఉంటే పరిశ్రమలు మూత పడే ప్రమాదం ఉంది. తద్వారా లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ఇదీ పరిస్థితి నెల్లూరు నుంచి పలాస వరకూ 650 జీడిపప్పు తయారీ పరిశ్రమలున్నాయి. వీటిలో ఏడాదికి ప్రాసెస్ చేయడానికి 2 లక్షల మెట్రిక్ టన్నుల జీడి గింజలు అవసరం. రాష్ట్రంలోని జీడి తోటల నుంచి లక్ష మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తోంది. అంటే 50 శాతం మేర ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం దిగుమతులపై ఎటువంటి సుంకం విధించలేదు. దీంతో, ఇతర దేశాల నుంచి జీడి గింజలను దిగుమతి చేసుకుని పప్పు తయారు చేసేవారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం విదేశీ దిగుమతులపై 9.55 శాతం కస్టమ్స్ సుంకం విధించింది. దీంతో, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే జీడి గింజలకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో క్వింటా జీడి గింజల ధర రూ.10 వేల వరకు ఉంది. అంటే క్వింటాకు దిగుమతి సుంకం రూపంలో రూ.955 చెల్లించాలి. లక్ష మెట్రిక్ టన్నులు దిగుమతి చేసుకోవాలంటే రూ.115 కోట్ల మేర పన్ను రూపంలో చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల చిన్న, మధ్యతరహా పరిశ్రమల నిర్వహణ సాధ్యం కాదని యజమానులు ఆవేదన చెందుతున్నారు. ఈ దేశాల నుంచే దిగుమతులు రాష్ట్రంలో జీడిపప్పు తయారీ పరిశ్రమలకు అవసరమైన జీడి గింజలను ఆఫ్రికా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. వీటిలో ఐరిస్కోస్ట్, ఘనా, బెనిన్, టాంజానియాతో పాటు ఇండోనేషియా నుంచి లక్ష మెట్రిక్ టన్నులు వస్తున్నాయి. ఇదిలా ఉండగా వియత్నాం వంటి ఇతర దేశాలు జీడిపప్పు తయారీ పరిశ్రమలకు రాయితీలు కల్పించడంతో పాటు పన్నుల మినహాయింపు ఇస్తున్నాయి. దీంతో, అంతర్జాతీయ మార్కెట్లో తక్కువ ధరకు వారు జీడిపప్పు అందిస్తున్నారని ఏపీ జీడి పప్పు తయారీ పరిశ్రమల అసోసియేషన్ అధ్యక్షుడు కుసుమంచి సుబ్బరాయులు తెలిపారు. దీంతో, అంతర్జాతీయ మార్కెట్ పోటీలో తట్టుకునే పరిస్థితి తమకు ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తగ్గుతున్న జీడితోటలు ఒకప్పుడు రెండెకరాల జీడి తోట ఉంటే చాలు.. కుటుంబ పోషణకు ఢోకా ఉండేది కాదు. అధికారుల లెక్కల ప్రకారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రస్తుతం 30 వేల హెక్టార్లలో జీడి తోటలున్నట్టు అంచనా. పదేళ్ల క్రితం సముద్ర తీర ప్రాంతం, మైదానాలు, కొండ ప్రాంతాల్లో విరివిగా జీడి తోటలుండేవి. పెట్టుబడులు పెరగడం, దిగుబడి తగ్గడంతో రైతులు ఆర్థిక నష్టాలు చవి చూశారు. ప్రభుత్వాల నుంచి ఆశించిన స్థాయిలో ప్రోత్సాహం లేకపోవడం సాగు విస్తీర్ణం తగ్గడానికి కారణం. మరోవైపు రియల్ ఎస్టేట్, వాణిజ్య పంటలు లాభదాయకం కావడంతో పలు ప్రాంతాల్లో జీడి తోటలను తొలగించారు. ప్రస్తుతం మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లోనే జీడితోటలున్నాయి. ఎకరాకు 4 క్వింటాళ్లకు మించి దిగుబడి రావడం లేదు. క్రమేపీ జీడి తోటల సాగుకు స్వస్తి పలికే పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్థానికంగా జీడి పప్పు తయారీ పరిశ్రమలు వందకు పైగా ఉన్నాయి. వీటిలో కేరళకు చెందిన పెద్ద కంపెనీలున్నాయి. స్థానికంగా జీడిగింజల దిగుబడి తగ్గడంతో ఈ పరిశ్రమలు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సరకు పైనే ఆధారపడ్డాయి. దిగుమతి సుంకం ఎత్తివేయాలి జీడిగింజల దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం విధించిన 9.55 శాతం కస్టమ్స్ సుంకాన్ని ఎత్తివేయాలి. ఏపీలో 650 జీడిపప్పు తయారీ పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో లక్షలాది మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. దిగుమతి సుంకం చెల్లించి పరిశ్రమలను నడపడం కష్టం. పన్ను మినహాయింపు ఇవ్వాలని అసోసియేషన్ తరపున ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించాం. – కుసుమంచి సుబ్బరాయలు, ఏపీ జీడిపప్పు తయారీ పరిశ్రమల అసోసియేషన్ అధ్యక్షుడు, తుని విదేశీ మార్కెట్లో నిలబడటం కష్టం విదేశీ మార్కెట్లో పోటీని తట్టుకునే పరిస్ధితి లేదు. జీడి గింజలను దిగుమతి చేసుకుని పన్ను చెల్లించి ప్రాసెసింగ్ చేయడానికి క్వింటాకు రూ.14 వేల వరకూ అవుతుంది. 22 కిలోల పప్పు దిగుబడి వస్తుంది. ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం రూ.12,500 వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో పరిశ్రమలను నడపడం సాధ్యం కాదు. – డి.మల్లికార్జునరావు, ఏపీ జీడిపప్పు తయారీ పరిశ్రమల అసోసియేషన్ కార్యదర్శి, తుని -
హాయివేపై రయ్.. రయ్..
● పూర్తయిన దేవరపల్లి – ఖమ్మం గ్రీన్ఫీల్డ్ హైవే ● ట్రయల్ రన్కు అధికారుల అనుమతి ● వచ్చే నెలలో అధికారికంగా ప్రారంభందేవరపల్లి: ఉభయ తెలుగు రాష్టాలను అనుసంధానం చేస్తూ చేపట్టిన గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు పూర్తి కావడంతో రాకపోకలు ప్రారంభమయ్యాయి. రెండు వారాలుగా కొత్త హైవేపై ట్రయల్ రన్కు అధికారులు అనుమతి ఇవ్వడంతో విశాఖపట్నం నుంచి హైదరాబాద్, ఖమ్మం వెళ్లే వాహనాలు రయ్..రయ్మంటూ దూసుకు వెళ్తున్నాయి. కరోనా, అధిక వర్షాలు, భూ సేకరణలో ఎదురైన న్యాయపరమైన అడ్డంకుల కారణంగా దీని నిర్మాణంలో జాప్యం జరిగింది. ప్రస్తుతం అన్ని పనులూ దాదాపు పూర్తి కావడంతో ఈ హైవేను మే నెలలో అధికారికంగా ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అధికారులు చెబుతున్నారు. ఎన్నో ప్రత్యేకతలు ● దేవరపల్లి – ఖమ్మం గ్రీన్ఫీల్డ్ హైవేకు భారత్మాల పరియోజన–1 కింద కేంద్ర ప్రభుత్వం 2018 మే 23న అనుమతి ఇచ్చింది. 2022లో పనులు చేపట్టారు. దేవరపల్లి నుంచి తెలంగాణలోని ఖమ్మం వరకూ మొత్తం 162 కిలోమీటర్ల పొడవున ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్(హ్యామ్)లో ఈ హైవే నిర్మించారు. ● ఈ హైవే మొత్తం పచ్చని పొలాల మధ్య నుంచి సాగుతుంది ● ఏపీ – తెలంగాణ మధ్య 4 వరుసల మొట్టమొదటి యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ హైవే ఇదే కావడం విశేషం. ● అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఏటీఎంఎస్) కింద ఈ హైవేపై ప్రతి 2 కిలోమీటర్లకు ఒకటి చొప్పున 95 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇవి సోలార్ విద్యుత్తో పని చేస్తాయి. వీటి ద్వారా రోడ్డుకు ఇరువైపులా సుమారు కిలోమీటరు దూరం వరకూ నిఘా ఉంచుతారు. మార్గం మధ్యలో ఎక్కడైనా ప్రమాదం, మరేదైనా సంఘటన జరిగితే వెంటనే కంట్రోల్ రూముకు సమాచారం అందుతుంది. ఈ సీసీ కెమెరాల పర్యవేక్షణకు తెలంగాణలోని కల్లూరు సమీపాన కమాండ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ● హైవేపై రాత్రి వేళ వెలుతురు కోసం సౌర విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. ● అత్యవసర సమయాల్లో ఉపయోగపడేలా ప్రతి 5 కిలోమీటర్లకు ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏర్పాటు చేశారు. ● ఈ రోడ్డుపై ప్రయాణించిన దూరానికే టోల్ చార్జీలు చెల్లించే ఏర్పాటు చేశారు. ● చైన్నె – కోల్కతా 16వ నంబర్ జాతీయ రహదారి, దేవరపల్లి – ఖమ్మం గ్రీన్ఫీల్డ్ హైవే దేవరపల్లి వద్ద అనుసంధానమవుతాయి. ఇక్కడ డ్రమ్ఫుట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రదేశంలో పచ్చని గ్రీన్పార్క్ ఏర్పాటు చేశారు. ఈ హైవేకి ఇరువైపులా ఎక్కడా సర్వీస్ రోడ్లు ఉండవు. ● ప్రస్తుతం విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లడానికి విజయవాడ, సూర్యాపేట మీదుగా 12 గంటలు ప్రయాణించాల్సి వస్తోంది. దేవరపల్లి – ఖమ్మం గ్రీన్పీల్డ్ హైవే వల్ల 56 కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు 4 గంటల సమయం ఆదా అవుతుంది. గ్రీన్ఫీల్డ్ హైవే స్వరూపమిదీ.. నేషనల్ హైవే నంబర్ 365 బీజీ పొడవు 162 కిలోమీటర్లు వరుసలు 4 వ్యయం రూ.4,451కోట్లు కేంద్రం అనుమతి ఇచ్చిన తేదీ 2018 మే 23 పనులు ప్రారంభం 2022 టోల్ ప్లాజాలు 8 మైనర్ బ్రిడ్జిలు 51 మేజర్ బ్రిడ్జిలు 9 మేజర్ పనులు పూర్తి అక్కడక్కడ చిన్నచిన్న పనులు మినహా గ్రీన్ఫీల్డ్ హైవేలో మేజర్ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. ప్రస్తుతం వాహనాల ట్రయల్ రన్కు అనుమతించాం. వచ్చే నెలలో ఈ హైవే ప్రారంభోత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అధునాతన సాంకేతికతతో దీని నిర్మాణం జరిగింది. – బి.కృష్ణమూర్తి, ప్రాజెక్ట్ డైరెక్టర్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ఎహెచ్ఏఐ), రాజమహేంద్రవరం -
పట్టాల పండగకు రెడీ
● నేడు నన్నయ స్నాతకోత్సవం ● చాన్సలర్ హోదాలో పాల్గొంటున్న గవర్నర్ ● వర్సిటీలో పూర్తయిన ఏర్పాట్లు నన్నయ వర్సిటీ ఏర్పాటుకు భూమి పూజ చేస్తున్న నాటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి (ఫైల్)వర్సిటీ ముఖద్వారంరాజానగరం: తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్ద యూనివర్సిటీగా విరాజిల్లుతున్న ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో శుక్రవారం పట్టాల పండగ జరగనుంది. గతంలో 2024 జనవరిలో వర్సిటీ 13, 14, 15వ స్నాతకోత్సవాలు నిర్వహించారు. ఆ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ చాన్సలర్ హోదాలో పాల్గొన్నారు. మళ్లీ రెండేళ్ల తరువాత నేడు జరుగుతున్న 16, 17వ స్నాతకోత్సవాల్లో కూడా ఆయనే చాన్సలర్ హోదాలో పాల్గొంటున్నారు. ఈ వేడుకలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 722 మందికి పట్టాల ప్రదానం 2022–23, 2023–24 విద్యా సంవత్సరాల్లో నన్నయ యూనివర్సిటీతో పాటు అనుబంధ కళాశాలల్లో గ్రాడ్యుయేషన్ 6,113 మంది, అండర్ గ్రాడ్యుయేషన్ 45,337 మంది పూర్తి చేశారు. అయితే, మొత్తం ఈ 51,450 మందికి గాను ఇప్పటి వరకూ 722 మంది మాత్రమే ఈ స్నాతకోత్సవంలో పట్టాలు అందుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. భద్రత కట్టుదిట్టం గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన నేపథ్యంలో వర్సిటీ, పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. గవర్నర్ విజయవాడ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జీజీయూ) ప్రాంగణంలోని హెలిప్యాడ్కు చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు నన్నయ యూనివర్సిటీకి చేరుకుని, స్నాతకోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.05 గంటలకు జీజీయూకు చేరుకుని హెలికాప్టర్లో తిరిగి విజయవాడ పయనమవుతారు. హెలీపాడ్, వర్సిటీలో స్నాతకోత్సవం జరిగే ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్లను ఎస్పీ నరసింహ కిషోర్, రాజమహేంద్రవరం ఆర్డీఓ ఆర్.శివరాముడు, గవర్నర్ భద్రతా సిబ్బంది గురువారం పరిశీలించారు. భద్రపరమైన అంశాలపై జాయింట్ కలెక్టర్ వై.మేఘస్వరూప్, గవర్నర్ సెక్యూరిటీ అధికారులతో చర్చించారు. వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ, రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, ఎస్పీ నరసింహ కిషోర్, ఆర్డీఓ శివరాముడు, గవర్నర్ భద్రతా సిబ్బంది తదితర ఉన్నతాధికారులు వర్సిటీ ప్రాంగణాన్ని నిశితంగా పరిశీలించారు. ట్రయల్ రన్ నిర్వహించారు. గవర్నర్ కోసం ఏర్పాటు చేసిన అతిథి గృహాన్ని, సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. పండగలా నిర్వహించుకుందాం నన్నయ యూనివర్సిటీ 16, 17 స్నాతకోత్సవాన్ని పండగలా నిర్వహించుకుందాం. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ఈ వేడుకల్లో వర్సిటీ చాన్సలర్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, జాతీయ భద్రతా మండలి మాజీ సలహాదారు ప్రొఫెసర్ మహేంద్ర పి.లామా, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య కె.మధుమూర్తి తదితరులు పాల్గొంటున్నారు. – ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ, ఉపకులపతి, ఆదికవి నన్నయ యూనివర్సిటీ వైఎస్సార్ చేతుల మీదుగా.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా వాసుల చిరకాల స్వప్నం ఆదికవి నన్నయ యూనివర్సిటీ. సంస్కృతీ సాహిత్యాలకు పుట్టినిల్లుగా విరాజిల్లుతున్న రాజమహేంద్రవరం సమీపాన రాజానగరం మండలం వెలుగుబంద వద్ద అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2006లో ఈ వర్సిటీకి భూమి పూజ చేశారు. తద్వారా ఈ ప్రాంత ప్రజల కలను ఆయన సాకారం చేశారు. మొత్తం 98 ఎకరాల విస్తీర్ణంలో పదహారో నంబరు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ యూనివర్సిటీ అచిరకాలంలోనే స్వశక్తితో అభివృద్ధి సాధిస్తూ, అందరి ప్రశంసలూ అందుకుంటూ, 19 వసంతాలు పూర్తి చేసుకుంది. విద్యాసుమాలు విరబూస్తోంది. ఈ వర్సిటీకి అనుబంధంగా 440 కళాశాలలున్నాయి. ఇప్పటికే 12బితో పాటు ఐఎస్ఓ, ఏఐసీటీఈ, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (నాక్) బి+ వంటి గుర్తింపులను ఈ విశ్వవిద్యాలయం దక్కించుకుంది. అలాగే గ్రీన్ ఆడిట్, ఎనర్జీ ఆడిట్, జెండర్ సెన్సిటైజేషన్ వంటి గుర్తింపులతో పాటు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డులను కూడా సొంతం చేసుకుంది. -
12న రోల్బాల్ జిల్లా స్థాయి పోటీలు
ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం): ఈ నెల 12న దానవాయిపేట గాంధీపురం పార్కులోని స్కేటింగ్ రింక్లో జిల్లా స్థాయి రోల్బాల్ పోటీ లు, ఎంపికలు నిర్వహిస్తున్నారు. జిల్లా రోల్బాల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వై.రుద్రశ్రీ మహశ్వి, జి.అప్పారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయి విజేతలుగా నిలిచిన క్రీడాకారులు ఈ నెల 25, 26 తేదీల్లో పిడుగురాళ్లలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు. ఆసక్తి ఉన్న వారు 90145 18799 నంబరులో సంప్రదించాలని సూచించారు. హుండీ ఆదాయం రూ.4.31 లక్షలు పెరవలి: అన్నవరప్పాడు శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి హుండీల ద్వారా రూ.4.31 లక్షల ఆదాయం వచ్చింది. అధికారులు, బోర్డు సభ్యులు, గ్రామ పెద్దల సమక్షంలో ఆలయంలో హుండీలను గురువారం తెరిచి, 43 రోజులకు గాను ఆదాయాన్ని లెక్కించారు. ప్రధాన హుండీతో పాటు ఉప ఆలయాల హుండీల ద్వారా రూ.4,25,969, అన్నదాన హుండీ ద్వారా రూ.5,089 కలిపి మొత్తం రూ.4,31,058 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ మీసాల రాధాకృష్ణ తెలిపారు. త్వరలో ఆలయ పునర్నిర్మాణ పనులు చేపడతామని, దీనికి దాతల నుంచి విరాళాలు స్వీకరిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో దేవదాయ, ధర్మాదాయ శాఖ అధికారి ఎంవీ రామయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గొర్ర గేదె సంచారంగోకవరం: మండలంలోని తిరుమలాయపాలెం అటవీ ప్రాంతంలో గురువారం సాయంత్రం గొర్ర గేదె సంచరించింది. రంపయర్రంపాలెం, తిరుమలాయపాలెం ప్రధాన రహదారిలో రోడ్డు దాటుతూండగా కొందరు ప్రయాణికులు గుర్తించి, వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. గొర్ర గేదె సంచారం వార్త గుప్పుమనడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. గతంలో ఎప్పుడూ ఈ ప్రాంతంలో గొర్ర గేదెలు సంచరించిన దాఖలాలు లేవని, అది దారి తప్పి ఇక్కడకు ఎలా వచ్చిందనే దానిపై ప్రజలు చర్చించుకుంటున్నారు.12న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష తుని రూరల్: హంసవరంలోని ఏపీ మోడల్ స్కూల్లో ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఈ నెల 12న జరుగుతుందని ఎంఈఓ పరవాడ గీతాదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మోడల్ స్కూల్లోనే ఈ పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తు చేసిన 157 మంది విద్యార్థులు వెబ్సైట్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని, గంట ముందుగా పరీక్షకు హాజరు కావాలని సూచించారు. -
రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలి
తాళ్లపూడి/సాక్షి నెట్వర్క్: మహిళలను కించపరిచేలా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలకు తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆధ్వర్యాన పలువురు నాయకులు కొవ్వూరులో ఎస్సై వంశీ అలెగ్జాండర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మహిళలపై నీచ వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణపై తక్షణం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసభ్యకర వ్యాఖ్యలను రాధాకృష్ణ వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. గతంలో సైకిల్పై తిరగిన రాధాకృష్ణ మీడియా ముసుగులో నేడు వేల కోట్ల రూపాయలు ఏవిధంగా సంపాదించారని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ నాయకులు, వారి భార్యలపై చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని మండిపడ్డారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కంఠమని రమేష్, రాష్ట్ర కార్యదర్శులు పిట్టా శ్రీనివాస్, వల్లభశెట్టి శ్రీనివాస్, తాళ్లపూడి మండల కన్వీనర్ కొలిశెట్టి నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జుట్టా ఏడుకొండలు, పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మండపేట, అనపర్తి, రాజమహేంద్రవరం, ధవళేశ్వరం, గోపాలపురం, నిడదవోలు తదితర ప్రాంతాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పోలీసులకు ఫిర్యాదులు చేశారు. పేపర్, చానల్ ఉన్నాయి కదా అని పాత్రికేయ విలువలను తుంగలో తొక్కి, ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేసినా, రాసినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. -
పదవులన్నీ భజనసేనకేనా!
● రాజానగరం జనసేనలో అసమ్మతి రాగం ● అగ్గి రాజేస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీ ● తమకు ప్రాధాన్యం దక్కలేదంటూ అసంతృప్తిసాక్షి, రాజమహేంద్రవరం: రాజానగరం నియోజకవర్గం జనసేనలో అసమ్మతి జ్వాలలు చల్లారడం లేదు. నామినేటెడ్ పదవుల్లో తమకు ప్రాధాన్యం దక్కకపోవడంతో వారు అసంతృప్తితో రగిలిపోతున్నారు. స్థానిక జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వ్యవహార శైలే దీనికి కారణంగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీలో కష్టపడిన వారి ని కాకుండా తనకు భజన చేసే వారినే ఆయన చేర దీస్తున్నారని అసంతృప్తి నేతలు ఆరోపిస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో తన భజన బృందానికే ఆయన ప్రాధాన్యం ఇచ్చారని విమర్శిస్తున్నారు. అండగా నిలిచినా అన్యాయమే! గత సార్వత్రిక ఎన్నికల్లో రాజానగరం స్థానాన్ని టీడీపీ ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు, అప్పటి నియోజకవర్గ ఇన్చార్జి బొడ్డు వెంకట రమణ చౌదరి ఆశించారు. అయితే, కూటమి పొత్తులో భాగంగా ఆ సీటు ను జనసేనకు కేటాయించారు. దీనిపై భగ్గుమన్న బొడ్డు వర్గీయులు అప్పట్లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడినే ఏకంగా నిలదీశారు. ఆ పరిస్థితుల్లో జనసేన అభ్యర్థి బత్తుల బలరామృష్ణకు అండగా నిలిచామని, ఎన్నికల్లో ఆయన విజయానికి శ్రమించామని. కానీ, అధికారంలోకి రాగానే తమను కాదని, తనకు చిడతలు కొట్టే వారిని ఎమ్మెల్యే చేరదీస్తున్నారని ఆ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. చివరకు కూటమి ప్రభుత్వం మూడు విడతలుగా చేపట్టిన సొసైటీ ప్రెసిడెంట్, ఆలయ కమిటీ చైర్మన్ తదితర నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ భజనపరులకు, తన అనుచరులకే అందలం వేస్తున్నారంటూ జనసేనలోని ఓ వర్గం మండిపడుతోంది. పట్టం కట్టారిలా.. నాతిపాము దొరబాబుకు రాజానగరం సొసైటీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. గళ్ల రంగా భార్యకు సైతం పదవి ఇచ్చారు. ముక్క రాంబాబు భార్యకు కోరుకొండ ఏఎంసీ డైరెక్టర్, బత్తుల గోపాలకృష్ణకు కోరుకొండ సొసైటీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. యర్రంశెట్టి శ్రీనుకు పార్టీలో కీలక పదవి ఇచ్చినట్లు సమాచారం. దేవన దుర్గాప్రసాద్(డీడీ)కు కోరుకొండ పీఏసీఎస్ డైరెక్టర్ పదవి ఇచ్చారు. వాకపల్లి రాజు, సైతిని చల్లారావుకు సైతం నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇచ్చారు. ఎమ్మెల్యే అల్లుడు తోట అనిల్ వాసుకు సైతం పదవి కట్టబెట్టారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేని, పార్టీ కోసం ఏనాడూ కృషి చేయని ఇటువంటి వారికి పదవులు ఎలా ఇస్తారని అసమ్మతి వర్గ్గీయులు ప్రశ్నిస్తున్నారు. అధికారిక, పార్టీ కార్యక్రమాల్లో సైతం వారి కే ప్రాధాన్యం కల్పించడంపై అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. పార్టీకి సంబంధం లేని, రాజకీయం తెలియని నేతలకు పదవులు కట్టబెట్టడంపై అసమ్మతి వర్గం లోలోపల మండిపడుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే స్థానిక ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చూపిస్తామంటూ వారు సవాల్ విసురుతున్నారు.బీజేపీకి జెల్ల మూడో దశ నామినేటెడ్ పదవుల భర్తీలో బీజేపీ నేతలకు మొండిచెయ్యి చూపారు. టీడీపీలోనే నామినేటెడ్పై ఆశావహుల సంఖ్య పెరిగిపోతున్న పరిస్థితుల్లో బీజేపీకి ఇస్తే కొత్త తలనొప్పి ఎదురవుతుందనే ఉద్దేశంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే, తమ తోడ్పాటు తో అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు తమనే విస్మరిస్తున్నారని జనసేన, బీజేపీ నేతలు ఆవేదన చెందుతున్నారు. మద్యం, ఇసుక వ్యాపారాలన్నీ టీడీ పీ నేతలకే కట్టబెట్టారని, కనీసం నామినేటెడ్ పద వుల్లోనైనా తమకు న్యాయం చేయకపోతే ఎలాగ ని వారు ప్రశ్నిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా నీటి సంఘాలు, సొసైటీ అధ్యక్షులు, ఆలయ కమిటీ చైర్మన్, డైరెక్టర్ పదవులను భర్తీ చేయగా, వాటిలో బీజేపీకి ఒక్క సొసైటీ చైర్మన్ పదవి మాత్రమే దక్కిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. -
ఐదు అంతర్రాష్ట్ర ప్రైవేటు బస్సుల సీజ్
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు రాజమహేంద్రవరం నుంచి నడుస్తున్న ఆలిండియా టూరిస్ట్ పర్మిట్ కలిగిన ప్రైవేటు బస్సులపై రవాణా శాఖ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లా రవాణా అధికారి (డీటీఓ) ఆర్.సురేష్ ఆదేశాల మేరకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కలసి బుధ, గురువారాల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. మొత్తం 5 స్లీపర్ కోచ్ బస్సులను సీజ్ చేశారు. ప్రయాణికుల భద్రతను పక్కన పెట్టి ఈ బస్సులలో పలు నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు. బస్సుల దిగువ భాగాన అదనపు డీజిల్ ట్యాంకులను అక్రమంగా అమర్చడం, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సిన ఎమర్జెన్సీ ఎగ్జిట్లను (ఎస్కేప్ హ్యాచ్, డోర్) లగేజీతో మూసివేయడం, నిబంధనల ప్రకారం వెనుక భాగంలో ఎమర్జెన్సీ డోర్ లేకపోవడం వంటి తీవ్రమైన లోపాలు బయటపడ్డాయి. జిల్లా రవాణా అధికారి సురేష్ గురువారం స్వయంగా ఒక బస్సును తనిఖీ చేయగా, అందులో కూడా అదనపు డీజిల్ ట్యాంకు ఉన్నట్లు గుర్తించారు. పర్మిట్ నిబంధనలను అతిక్రమించడమే కాకుండా, ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగించే ఈ తరహా చర్యలు అత్యంత ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు. సీజ్ చేసిన 5 బస్సులను రాజమహేంద్రవరం రవాణా శాఖ కార్యాలయంలో భద్రపరిచారు. నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి వీటి యజమానులు సుమారు రూ.2.15 లక్షల పన్ను, అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని సురేష్ హెచ్చరించారు. ఈ తనిఖీల్లో రవాణా అధికారులు సంపత్ కుమార్, ప్రణీత్, ఉమామహేశ్వరరావు, రాధిక, సుమ పాల్గొన్నారు. -
త్రిరత్న బుద్ధ విహార్ అపురూపం
అమలాపురం రూరల్: అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో బౌద్ధ పరిమళాలు విరజిమ్ముతున్న త్రిరత్న బుద్ధ విహార్ ఒక అపురూప ఆధ్యాత్మిక కేంద్రమని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనవడు భీమారావు యశ్వంత్ అంబేడ్కర్ అన్నారు. కోనసీమ పర్యటనకు వచ్చిన ఆయన అమలాపురంలో శ్రీరత్న బుద్ధవిహార్ను గురువారం సందర్శించారు. తొలుత తాత అంబేడ్కర్ నిలువెత్తు విగ్రహానికి వ్యవస్థాపకులు, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు గొల్లపల్లి సూర్యారావుతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. యశ్వంత్ అంబేడ్కర్కు పంచశీల కండువా మెడలో వేసి గొల్లపల్లి స్వాగతం పలికారు. బుద్ధ విహార్ లైబ్రరీని యశ్వంత్ అంబేడ్కర్ పరిశీలించారు. బుద్ధ విహార్ నిర్మాణం గురించి వ్యవస్థాపకులు గొల్లపల్లిని అడిగి తెలుసుకున్నారు. కోనసీమలో బౌద్ధమత ప్రచారం చేస్తున్న గొల్లపల్లిని అభినందించారు. తాను ఇప్పటివరకు ఇంత అద్భుతమైన బుద్ధ విహార్ను, బుద్ధుని విగ్రహాన్ని చూడలేదన్నారు. అనంతరం బుద్ధుని విగ్రహం వద్ద బౌద్ధ వందనం చేసి ప్రత్యేక పూజలు చేశారు. సెక్రటరీ జనరల్ డీబీ లోక్, చైర్మన్ నాగ బత్తుల ప్రసాదరావు, ప్రతినిధులు జంగా బాబురావు, ఎంఏకే భీమారావు, పినిపే సత్యనారాయణ, గెడ్డం సురేష్బాబు కోడూరు రామ్మూర్తి, కాశి వెంకట్రావు, సాపే సత్యనారాయణ, దోనిపాటి నాగేశ్వరరావు పాల్గొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడు భీమారావు యశ్వంత్ అంబేద్కర్


