breaking news
Krishna
-
కమనీయ కార్తికానికి సంసిద్ధం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై రానున్న రెండు నెలల్లో జరిగే విశేష పూజలు, పర్వదినాలను పురస్కరించుకుని అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని దుర్గగుడి చైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ పేర్కొన్నారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆవరణలోని మహా మండపం ఆరో అంతస్తులో గురువారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రానున్న రోజులలో దేవస్థానంలో నిర్వహించనున్న ఉత్సవాలు, విశేష పర్వదినాలు, భవానీ దీక్ష స్వీకరణలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తొలుత దేవస్థానం అమ్మవారి అలంకరణలు, ఆలయ బంగారు శిఖరం, రాజగోపురం ఫొటోలతో రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. 20న దీపావళి వేడుకలు.. 19వ తేదీ ధనత్రయోదశి పర్వదినం సందర్భంగా ఉదయం 8గంటలకు దేవస్థాన యాగశాలలో శ్రీమహాలక్ష్మీ యాగం నిర్వహిస్తామని చైర్మన్, ఈవో తెలిపారు. ఈ యాగం దేవస్థానం తరఫున ఆలయ అర్చకులు నిర్వహిస్తారని, భక్తుల పరోక్ష సేవగా జరుగుతుందన్నారు. ఇక 20వ తేదీ దీపావళి పర్వదినాన ప్రదోషకాలంలో అమ్మవారి ప్రధాన ఆలయంలో ధనలక్ష్మీపూజ, దీపాలంకరణ, దీపావళి వేడుకల అనంతరం రాత్రి 7 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేస్తామన్నారు. కార్తికం.. ఆధ్యాత్మిక సంరంభం.. 21వ తేదీ సాయంత్రం అమ్మవారి ఆలయం, నటరాజ స్వామి వారి ఆలయం, మల్లేశ్వర స్వామి వారి ఆలయాల్లో ఆకాశదీపం వెలిగిస్తామని, 22వ తేదీ నుంచి కార్తిక మాసోత్సవాలు ప్రారంభమవుతాయని చైర్మన్, ఈవో పేర్కొన్నారు. అక్టోబర్ 22వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు నిర్వహించే మాసోత్సవాలలో ప్రతి నిత్యం స్వామి వారికి విశేష అభిషేకాలు, అర్చనలు జరుగుతాయన్నారు. వీటితో పాటు ప్రతి రోజు సాయంత్రం 3 గంటలకు మల్లేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో సహస్ర లింగార్చన, సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ ఉంటుందన్నారు. వీటితో పాటు కార్తిక మాసంలో వచ్చే విశేషమైన రోజుల్లో స్వామి వారికి బిల్వార్చన, కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని కోటి దీపో త్సవం, జ్వాలా తోరణం, మాస శివరాత్రి వంటి పర్వదినాలను విశేష పూజలు నిర్వహిస్తామన్నారు. దుర్గమ్మ గాజుల సంబరం.. దుర్గమ్మకు 23వ తేదీన గాజులతో విశేష అలంకరణ చేస్తారని చైర్మన్, ఈవో పేర్కొన్నారు. అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఆలయ ప్రాంగణం, మూలవిరాట్కు గాజులతో విశేషంగా అలంకరిస్తామన్నారు. అమ్మవారికి అలంకరించిన గాజులను భక్తులకు పంపిణీ చేస్తామని వివరించారు. ప్రత్యేక బిల్వార్చన జరిగే తేదీలు.. కార్తిక మాసంలో మల్లేశ్వర స్వామి వారికి ప్రత్యేక తిథులలో బిల్వార్చన నిర్వహిస్తారు. 27వ తేదీ సోమవారం శుద్ధ చవితి, నవంబర్ 1వ తేదీ శనివారం శుద్ధ ఏకాదశి, 3వ తేదీ సోమవారం శుద్ధ త్రయోదశి, 05వ తేదీ బుధవారం కార్తిక పౌర్ణమి, 10వ తేదీ సోమవారం బహుళ పంచమి, 15వ తేదీ శనివారం బహుళ ఏకాదశి, 17వ తేదీ సోమవారం బహుళ త్రయోదశి 18వ తేదీ మంగళవారం మాస శివరాత్రిన ప్రత్యేక బిల్వార్చన నిర్వహించేందుకు వైదిక కమిటీ నిర్ణయించింది. నవంబర్ 1 నుంచి భవానీ దీక్షలు నవంబర్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు భవానీ మండల దీక్షలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అర్ధమండల దీక్షలు నవంబర్ 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు, డిసెంబర్ 4వ తేదీ కలశ జ్యోతి ఉత్సవం సత్యనారాయణపురంలోని శ్రీ శృంగేరి శారదాపీఠం పరిపాలిత శ్రీ శివరామకృష్ణ క్షేత్రం నుంచి ప్రారంభమవుతాయన్నారు. డిసెంబర్ 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు భవానీదీక్ష విరమణలు జరుగుతాయని, 15వ తేదీ ఉదయం 10 గంటలకు పూర్ణాహుతితో దీక్ష విరమణలు పరిసమాప్తమవుతాయన్నారు. మీడియా సమావేశంలో ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రిపై 22 నుంచి కార్తిక మాసోత్సవాలు 23న దుర్గమ్మకు గాజుల అలంకరణ భక్తులకు ఇబ్బందుల్లేకుండా పక్కా ఏర్పాట్లు మీడియాతో దుర్గగుడి చైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ -
ఉద్యమం...ఉధృతం
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ ధర్నా చౌక్లో గత 12 రోజులుగా నిర్వహిస్తున్న పీహెచ్సీ వైద్యుల ఉద్యమం ఉధృతరూపం దాల్చుతోంది. ఇప్పటి వరకూ రాష్ట్రంలోని వైద్యులు మాత్రమే రిలే దీక్షలు, నిరసనల్లో పాల్గొనగా, ఇప్పుడు వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సైతం పాల్గొనడంతో దీక్షా శిబిరం నినాదాలతో హోరెత్తుతోంది. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పీహెచ్సీల్లో పనిచేసే 2700 మంది వైద్యులు విధులను బహిష్కరించినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. వైద్యులకు మద్దతుగా వైద్య సిబ్బంది వైద్యులకు మద్దతుగా పారామెడికల్, నర్సింగ్ సిబ్బంది సైతం నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతూ తమ నిరసనను తెలియచేస్తున్నారు. అవసరమైతే తాము కూడా విధులు బహిష్కరించేందుకు సిద్ధమేనని ఇప్పటికే ప్రకటించారు. మరో వైపు సెకండరీ హెల్త్లో పనిచేసే వైద్యులు, వైద్య సిబ్బంది, టీచింగ్ వైద్యుల సంఘాలు సైతం ఇప్పటికే మద్దతు ప్రకటించాయి. -
జీఎస్టీ సంస్కరణలతో సుస్థిర ఆర్థిక ప్రగతి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జీఎస్టీ 2.0 సంస్కరణలు సుస్థిర ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. సంస్కరణల ఫలితంగా దేశ వ్యాప్తంగా 99శాతం వస్తువులు, సేవలు పన్ను రహితం కావడం లేదా 5 శాతం, 18 శాతం జీఎస్టీ పరిధిలోకి వచ్చాయన్నారు. సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా గురువారం రవాణా శాఖ ఆధ్వ ర్యంలో జిల్లా అధికార యంత్రాంగం, ది కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ భాగస్వామ్యంతో ఏర్పా టు చేసిన ఆటోలు, సరుకుల రవాణా వంటి వివిధ పనులకు ఉపయోగించే చిన్న వాహనాల ర్యాలీని కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, జీఎస్టీ జాయింట్ కమిషనర్ ఎస్.ప్రశాంత్ కుమార్, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎ.మోహన్ తదితరులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఆతిథ్య రంగానికి ఊతం.. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జీఎస్టీ 2.0 సంస్కరణలతో రవాణా, ఆతిథ్య రంగాల్లో మరింత అభివృద్ధికి వీలవుతుందన్నారు. ప్రయాణికుల రవాణా వాహనాలు, వస్తువుల రవాణా వాహనాలకు 28 శాతం ఉన్న జీఎస్టీ 18 శాతానికి తగ్గిందని వివరించారు. సూపర్ జీఎస్టీతో రాష్ట్ర ప్రజలకు దాదాపు రూ. 8 వేల కోట్లు, జిల్లా ప్రజలకు రూ. 300 కోట్లు, ప్రతికుటుంబానికి నెలకు రూ. 6 వేలు నుంచి రూ.12 వేల వరకు ఆదా అవుతుందని వివరించారు. అనంతరం వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఆర్టీవోలు ఆర్. ప్రవీణ్, కె.వెంకటేశ్వరరావు, మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్లు వై. నాగేశ్వరరావు, వి.పద్మాకర్, అలీ, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జి. ప్రియదర్శిని, కృష్ణాజిల్లా లారీ ఓనర్ల అసోసియేషన్, విజయవాడ టాక్సీ ఓనర్ల అసోసియేషన్, ఎన్ఏఎంటీఏ అసోసియేషన్, టీఎన్ టీయూసీ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ బాబూ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
టికెట్ తనిఖీల ద్వారా రూ.1.22 కోట్ల ఆదాయం
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో మూడు రోజుల పాటు నిర్వహించిన టికెట్ తనిఖీల ప్రత్యేక డ్రైవ్ ద్వారా రూ.1.22 కోట్లు ఆదాయం ఆర్జించింది. ఈ నెల 13 నుంచి 15 వరకు జరిగిన ఈ తనిఖీలలో 716 మంది టికెట్ తనిఖీ సిబ్బంది డివిజన్లోని రైళ్లు, స్టేషన్లలో చేపట్టిన ప్రత్యేక తనిఖీలలో అనధికారిక ప్రయాణం చేస్తున్న వారిపై 17,017 కేసులు నమోదు చేయడం ద్వారా ఈ ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. అందులో టికెట్ లేని ప్రయాణికులపై 7,928 కేసులు, సరైన టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న వారిపై 9,034 కేసులు, అనధికారిక లగేజీలపై 55 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీలలో మొదటి రోజు రూ.37.03 లక్షలు, రెండవ రోజు రూ.40.26 లక్షలు, మూడవ రోజు రూ.45.03 లక్షల పెనాల్టీలు వసూలు చేశారు. ఈ సందర్భంగా సీనియర్ డీసీఎం బి.ప్రశాంత కుమార్ మాట్లాడుతూ రైళ్లలో సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం సరైన టికెట్తోనే ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు. సరైన ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా సజావుగా వారి ప్రయాణాన్ని కొనసాగించేందుకు డివిజన్లో ఇటువంటి డ్రైవ్లు తరచుగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. -
కేయూలో ఫ్రెషర్స్ డే వేడుకలు
కోనేరుసెంటర్: కృష్ణా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో కొత్తగా వచ్చిన విద్యార్థులకు ఆహ్వానం పలుకుతూ గురువారం ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన వీసీ ఆచార్య కె.రాంజీ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు వికాసం కూడా తప్పనిసరి అన్నారు. విద్యార్థులు కాలంతో పోటీపడి ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవ్వాలని సూచించారు. రెక్టార్ ఆచార్య ఎం.వి.బసవేశ్వరరావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎన్.ఉష, ఇంజినీరింగ్ కళాశాల డీన్ ఆచార్య వై.కె. సుందరకృష్ణ, ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.విజయకుమారి ప్రసంగించారు. ఆటపాటలు, డ్యాన్స్లతో విద్యార్థులు సందడి చేశారు. కంచికచర్ల: ఆర్డీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ తమపై దురుసుగా ప్రవర్తించిందని డ్రైవర్, కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో గురువారం జరిగింది. పోలీసుల కథనం మేరకు కంచికచర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన ఓ మహిళ జగ్గయ్యపేట డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సును విజయవాడలో ఎక్కింది. ఆమె పరిటాలలో దిగాల్సి ఉంది. ఆమె బస్సు ఎక్కి ఫుట్పాత్పై నిల్చుంది. గమనించిన డ్రైవర్ ఆమెను లోపలికి వెళ్లమని సూచించాడు. దీనిపై ఆమె డ్రైవర్పై గొడవకు దిగింది. ఎందుకమ్మా డ్రైవర్పై గొడవ పడతున్నావన్న కండక్టర్పైనా ఆమె మండిపడింది. ఇద్దరు కలసి తనను మందలిస్తారా.. ఇది ఫ్రీ బస్సు.. నా ఫొటో తీసుకో.. ఈ ఫొటోను విజయవాడ సిటీలో లేదా చిల్లకల్లు, కంచికచర్ల పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి చూపించుకో.. నా ఫొటో చూడగానే పోలీసులకే దడ పుడుతుందంటూ కండక్టర్పై దురుసుగా ప్రవర్తించింది. ‘అమ్మా కండక్టర్ అయ్యప్ప మాల ధరించాడు అతనిపై దుర్భాషలాడకూడదు’ అని హితవు పలికిన తోటి మహిళలను కూడా దుర్భాషలాడింది. బస్సు డ్రైవర్ పరిటాల గ్రామంలో బస్సును ఆపకుండా నేరుగా కంచికచర్ల పోలీస్స్టేషన్ వద్ద బస్సు ఆపి మహిళపై ఫిర్యాదు చేశారు. ఎస్ఐ విశ్వనాథ్ మహిళను మందలించి కండక్టర్, డ్రైవర్లకు సర్ది చెప్పి పంపించి వేశారు. ఉంగుటూరు(గన్నవరం): ఉంగుటూరు మండలం ఇందుపల్లిలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన ముసిముక్కు కనకచింతయ్య, అతని భార్య సీతామహాలక్ష్మి(42) వ్యవసాయ సనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే పక్కపక్కనే నివాసిస్తున్న కనకచింతయ్యకు, అతని సోదరుడైన వడ్డీకాసులకు గత కొంత కాలంగా దారి విషయంలో వివాదం కొనసాగుతోంది. ఈ విషయమై రెండు నెలలు క్రితం వీరి మధ్య జరిగిన గొడవలో సీతామహాలక్ష్మిపై దాడిచేసి కొట్టారు. ఈ ఘటనపై అప్పట్లో ఉంగుటూరు పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయినప్పటికీ వివాదం సమసిపోలేదు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ఇంట్లో సీతామహాలక్ష్మి సీలింగ్ ఫ్యానుకు ఉరివేసుకుని ఉండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. అప్పటికే ఆమె మృతి చెందడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఆమె మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వడ్డీకాసులు కుటుంబ సభ్యులే సీతామహాలక్ష్మిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి భర్త కనకచింతయ్య, కుమారుడు రాజేష్ ఆరోపిస్తున్నారు. గతంలో ఆమైపె దాడి జరిగినప్పుడు పోలీసులు కేసు నమోదు చేసినప్పటికి, వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. -
సతికి బదులు పతి హాజరు
ఆయన భార్య ట్రస్ట్ బోర్డు సభ్యురాలు.. అనివార్య కారణాలతో ఆమె ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. అయితే ఏంటీ.. తన భార్యను ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా నియమించడంతో ఆమె స్థానంలో భర్త దర్జాగా ఆలయ అధికారులతో పరిచయ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తర్వాత జరిగిన మీడియా సమావేశంలోనూ మిగిలిన బోర్డు సభ్యుల మధ్యలో కూర్చొని ఆద్యంతం సమావేశం ముగింపు వరకు అక్కడే ఉన్నారు. ఈ ఘటన గురువారం దుర్గగుడిలో చోటు చేసుకుంది. దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా పద్మావతి ఠాకూర్ నియమితులయ్యారు. అయితే గత శనివారం ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణస్వీకారానికి పద్మావతి ఠాకూర్ హాజరు కాలేదు. గురువారం నిర్వహించిన సమావేశానికి కూడా ఆమె హాజరుకాకపోగా, ఆమె స్థానంలో భర్త అజయ్వర్మ ఠాకూర్ బోర్డు సభ్యులతో కలిసి సమావేశంలో పాల్గొనడం దుర్గగుడిలో చర్చనీయాంశంగా మారింది. -
జాబ్ మార్కెట్కు అనుగుణంగా నైపుణ్యాలు
కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రస్తుతం జాబ్ మార్కెట్కు అనుగుణంగా యువత నైపుణ్యాలు సముపార్జించాలని, అప్పుడే కెరీర్ పరంగా ప్రపంచ వ్యాప్త అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన ఇగ్నైట్ సెల్ను కలెక్టర్ లక్ష్మీశ సందర్శించారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) ద్వారా అందిస్తున్న సేవలకు సంబంధించిన వివరాలను, సంస్థ కార్యకలాపాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీఎస్ఎస్డీసీ ద్వారా ఎప్పటికప్పుడు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలతో పాటు జాబ్ మేళాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రష్యా, జర్మనీ, ఖతార్ తదితర దేశాల్లో కూడా వివిధ ఉద్యోగావకాశాలు పొందేందుకు ఆయా భాషల్లో శిక్షణతో పాటు ఉద్యోగాలు పొందేందుకు చేయూతనందిస్తోందన్నారు. ఇలాంటి అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. అనంతరం సంస్థ రూపొందించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. కలెక్టర్ వెంట జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సీపాన శ్రీనివాసరావు, డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు తదితరులు ఉన్నారు. నవంబరు 22, 23 తేదీలలో సాహిత్య, సాంస్కృతిక ఉత్సవాలు విజయవాడ కల్చరల్: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సంకల్పంతో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మల్లెతీగ సాహిత్యవేదిక సహకారంతో నవంబరు 22, 23 తేదీలలో తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో రెండు రోజులపాటు సాహిత్య, సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు కలిమిశ్రీ తెలిపారు. గాంధీనగర్లోని హోటల్ ఐలాపురంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ కార్యక్రమంలో నాలుగు రాష్ట్రాల నుంచి సంగీత, సాహిత్య, నాటక రంగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గోళ్ళ నారాయణరావు మాట్లాడుతూ తెలుగు సాహితీ వైభవాన్ని ప్రతిబింబించేలా కార్యక్రమాలుంటాయని తెలిపారు. సాంస్కృతిక ఉత్సవాల విజయవంతానికి కామ్రేడ్ జీఆర్కే, పోలవరపు సాహితీ సమితి పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. పోస్టర్ను అతిథులు ఆవిష్కరించారు. వివిధ రంగాలకు చెందిన మీసాల రాజేశ్వరరావు, గొరిపర్తి హనుమంతరావు, ఉత్సవ కమిటీ బాధ్యులు చొప్పా రాఘవేంద్ర చంద్రశేఖర్, పి.చిదంబరం, వైడీ ఆనంద్ పాల్గొన్నారు. పున్నమిఘాట్లో గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే భవానీపురం(విజయవాడపశ్చిమ): స్థానిక పున్నమి ఘాట్లో గురువారం రాత్రి విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్, యునిసెఫ్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా స్థాయి గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే కార్యక్రమం జరిగింది. కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, ఆదాయపు పన్ను కమిషనర్ ప్రకాష్, ఐసీడీఎస్ పీడీ ఎస్కే రుక్సానా సుల్తానా బేగం పాల్గొన్నారు. గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే అంశంపై నిర్వహించిన డ్రాయింగ్ పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మనోజ్కుమార్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. జిల్లాలో నేటి నుంచి ఖరీఫ్ ధాన్యం సేకరణ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలోని 159 రైతు సేవా కేంద్రాల ద్వారా 17వ తేదీ శుక్రవారం నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభించనున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ టీవీ సతీష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లాలో మొత్తం 3,59,733 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా. ఇందులో సుమారు 3,03,154 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ తిరువూరు మండలంలోని మునకుళ్ల రైతు సేవా కేంద్రాన్ని అధికారికంగా ప్రారంభిస్తారన్నారు. రైతులు తమ ధాన్యాన్ని విక్రయించేందుకు రైతు సేవా కేంద్రాలను వినియోగించుకుని, మద్దతు ధర పొందాలని డీఎం టీవీ సతీష్ ఆ ప్రకటనలో కోరారు. -
దుర్గమ్మకు వజ్రాభరణాలు
శుక్రవారం తెల్లవారుజామున అలంకరణ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ప్రముఖ జ్యూయలర్స్ సంస్థ కీర్తిలాల్ జ్యూయలర్స్ వారు గురువారం బంగారు, వజ్రాభరణాలను కానుకగా సమర్పించారు. సుమారు రూ.2కోట్ల విలువైన 531 గ్రాముల బంగారం, వజ్రాలు, కెంపులు, ముత్యాలతో కూడిన సూర్యుడు, చంద్రుడు, ముక్కుపుడక, బులాకీ, బొట్టు, మంగళ సూత్రాలు, బంగారు గొలుసు వంటి ఆభరణాలను దాతలు గురువారం రాత్రి ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణకు అందజేశారు. తొలుత దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ అధికారులకు వాటిని అందజేశారు. శుక్రవారం ఈ వజ్రాభరణాలను అమ్మవారికి అలంకరించనున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో కీర్తిలాల్ జ్యూయలర్స్కు చెందిన సూరజ్ శాంతకుమార్, కీర్తిలాల్ కాళిదాస్, తమిళనాడు గవర్నర్ సతీమణి లక్ష్మీరవి, గోకరాజు గంగరాజు, కనుమూరి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. -
సులభమైన పద్ధతుల్లో బోధించాలి
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పామర్రు: చిన్న చిన్న పరికరాలతో ప్రయోగాత్మకంగా భౌతిక శాస్త్రాన్ని అర్థమయ్యే రీతిలో వివరించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉపాధ్యాయులకు సూచించారు. మండల కేంద్రమైన పామర్రులోని ప్రగతి విద్యా సంస్థలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులకు క్యాంటం కంప్యూటర్స్పై ఒక రోజు ఓరియంటేషన్ కార్యక్రమం గురువారం నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సరస్వతీ దేవి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ నిజ జీవితంలో భౌతిక శాస్త్రం మనకు ఏ విధంగా అన్వయించుకోవచ్చు తెలియజేస్తే విద్యార్థుల్లో చైతన్యవంతం అవుతారన్నారు. మనం తరగతులు నిర్వహిస్తే విద్యార్థులు బాగా అర్థం చేసుకోగలరు అనే నమ్మకం ఉపాధ్యాయులకు ఉండాలన్నారు. ఉపాధ్యాయులు అందరూ క్వాంటం కంప్యూటర్ అవగాహన పెంపొందించుకుని విద్యార్థులకు వివరించి, జ్ఞానవంతులను చేయాలని కోరారు. రాష్ట్ర సమాచార సాంకేతిక ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ శాఖ ప్రత్యేక కార్యదర్శి బి. సుందర్ విజయవాడ నుంచి వర్చువల్గా పాల్గొని క్వాంటం కంప్యూటింగ్ గురించి కూలంకషంగా వివరించారు. సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, జిల్లా విద్యాశాఖ అధికారి పి. విజయ రామారావు, ఉప విద్యాధికారి పద్మ రాణి, ప్రగతి విద్యా సంస్థల ప్రిన్సిపాల్ పూర్ణచంద్రరావు, నాగ మల్లేశ్వరి పాల్గొన్నారు. -
తాను తవ్విన గోతిలోనే పడిన కూటమి ప్రభుత్వం
మధురానగర్(విజయవాడసెంట్రల్): టీడీపీ తీసుకున్న సారా గోతిలోనే కూటమి ప్రభుత్వం పడిందని.. దాని నుంచి బయటపడేందుకు వైఎస్సార్ సీపీ నాయకులపై బురద చల్లుతోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి విమర్శించారు. సత్యనారాయణపురం వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సూపర్ సిక్స్ హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సూపర్ లేబుల్స్కు పరిమితం అయ్యారని అన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు జోగి రమేష్ను ఉద్దేశ పూర్వకంగానే ఇబ్బంది పెడుతున్నారని.. పోలీసులు సమగ్రంగా విచారణ చేయటం లేదన్నారు. జోగి రమేష్కు ఎలాంటి నిక్ నేమ్స్ లేవని.. కంప్లైంట్లో 1 రమేష్ అని పెట్టించారని ఫోన్లో చూపించారు. తద్వారా ఇదంతా ఉద్దేశపూర్వకంగా పెట్టిందే అని తేలిపోయిందన్నారు. నకిలీ మద్యంపై సీబీఐ ఎంక్వయిరీ వేయాలని డిమాండ్ చేశారు. 16 నెలలు గడిచిన తరువాత కూటమి ప్రభుత్వం ఇప్పుడు క్యూ ఆర్ కోడ్ పెట్టాం అని చెబుతున్నారని.. గతంలోనే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఈ క్యూ ఆర్ కోడ్ పద్ధతిని తెచ్చిందని గుర్తు చేశారు. జైలులో ఉన్న జనార్దన్ వీడియో బయటకి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సాయి పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి -
కృష్ణాజిల్లా
శుక్రవారం శ్రీ 17 శ్రీ అక్టోబర్ శ్రీ 2025ఇంద్రకీలాద్రిపై రానున్న కార్తిక మాసంలో జరిపే విశేష పూజలకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ తెలిపారు. –IIలో విమానాశ్రయం(గన్నవరం): తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్.రవి విజయవాడ పర్యటన నిమిత్తం గురువారం గన్నవరం విమానాశ్రయానికి విచ్చేశారు. సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: మచిలీపట్నంలోని ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన ఎండూరి శేష బాపనలాల్, పూర్ణచంద్రిక, రవీంద్రమూర్తి రక్త సంబంధీకులు. వారికి చిన్నగొల్లపాలెంలో తల్లి దండ్రుల నుంచి 167 ఎకరాలు సంక్రమించింది. 1941వ సంవత్సరం నుంచి ఎండూరి కుటుంబం స్వానుభవంలో ఉన్న 213, 217, 572/1 సర్వే నంబర్లలోని 52.76 ఎకరాల విషయంలో ప్రస్తుతం వివాదం నెలకొంది. తన బృందం ద్వారా కొల్లు రవీంద్ర 2014–19 మధ్య కాలంలోనూ, తాజాగా కూటమి ప్రభుత్వంలో ప్రయత్నాలు ఈ భూమిని కాజేసే యత్నాలు కొనసాగిస్తున్నారు. ఎండూరి శేషబాపనలాల్ 2011 జూలైలో మరణించగానే 2012లో మచిలీపట్నానికే చెందిన గంపల కస్తూరి అనే మహిళను రంగప్రవేశం చేయించారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాల ద్వారా ఆమెను లాల్ భార్య అంటూ ఇంటి పేరును సైతం మార్పించి రెవెన్యూ కార్యాలయం నుంచి 39.70 ఎకరాలకు పట్టాదారు పాసు పుస్తకాలు, టైటిల్ డీడ్ను ఇప్పించగలిగారు. ఈ విషయాన్ని తెలుసుకున్న లాల్ తల్లి ఎండూరి సీతామహాలక్షుమమ్మ 2014 ఆగస్టులో రెవెన్యూ కోర్టులో కేసు దాఖలు చేశారు. కుమారుడి ద్వారా పొందిన వీలునామా తదితరాలను సాక్ష్యాలుగా పొందుపరిచారు. కాలక్రమంలో చిన్న కుమారుడైన ఎండూరి రవీంద్రమూర్తికి తల్లి సీతామహా లక్షుమమ్మ వీలునామా రాశారు. ఆమె తదనంతరం రెవెన్యూ కోర్టులో మూర్తి ఇంప్లీడ్ అయ్యారు. ఈ కేసు కొనసాగుతున్న దశలోనే 2016 ఆగస్టులో గంపల కస్తూరి వివాదరహిత భూమిగా పేర్కొంటూ ఆరుగురికి సేల్ డీడ్ ద్వారా, మరొకరికి గిఫ్ట్ డీడ్ ద్వారా 38 ఎకరాలను విక్రయించారు. 1.70 ఎకరాలను పంచాయతీ దారి కోసం రాసిచ్చారు. అప్పుడు కొల్లు రవీంద్ర మంత్రిగా కొనసాగుతున్నందునే ఈ విక్రయ ప్రక్రియ సాధ్యమైందని బాధితవర్గం ఆరోపిస్తోంది. సరుగుడు తోటలు నరికేశారు... చిన్నగొల్లపాలెంకు చెందిన పెద్ది సత్యనారాయణ, చందు సత్యనారాయణ 2011 నుంచి వివాదాస్పద భూమితో పాటు రవీంద్రమూర్తికి చెందిన మరి కొంత భూమిని కౌలుకు తీసుకుని మొత్తం 53.76 ఎకరాలలో సరుగుడు తోటలు పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కొల్లు రవీంద్ర అండదండలతో భూ కొనుగోలుదారులమంటూ ఈ ఏడాది జనవరి 31, ఫిబ్రవరి 1వ తేదీన, తాజాగా సెప్టెంబరు 22 నుంచి ఈనెల ఆరో తేదీ వరకు 19 ఎకరాల్లోని తోటలు నరికేశారు. నరికేసిన 900 టన్నులకు పైగా కలప విలువ దాదాపు రూ.80 లక్షల వరకు ఉంటుందని కౌలురైతులు వాపోతున్నారు. రైతులపై రెడ్బుక్ రాజ్యాంగం అమలు తమ తోటలు నరకొద్దని అడ్డుపడిన రవీంద్రమూర్తి తో పాటు 12 మంది రైతులపై ఫిబ్రవరిలో కృత్తివెన్ను పోలీసులు కేసు నమోదుచేశారు. మచిలీ పట్నం నుంచి వెళ్లి దౌర్జన్యంగా కోర్టు పరిధిలో ఉన్న తోటలు నరికేసిన రౌడీల జోలికి పోలీసులు వెళ్లక పోవడం వెనుక ఎవరున్నారనేది విదితమే. ఆర్డీవో, డీఎస్పీలు గ్రామానికి వెళ్లి మీకు మేలు చేస్తామనడం వరకే పరిమితమయ్యారు. పది నెలలు అవుతున్నా పోలీసులు చార్జిషీటు దాఖలు చేయకపోవడం గమనార్హం. మంత్రి చెప్పినట్టు వినండి, ఆ భూముల వద్దకు వెళ్లకండి, లేదంటే మీ సంగతి తేలుస్తామనే పోలీసుల బెదిరింపులకు నెలల తరబడి గ్రామాన్ని వదిలి తలదాచుకోవాల్సిన దుస్థితి దాపురించిందని బాఽధిత రైతులు వాపోయారు. అక్రమంగా రెండు సారా కేసులు భూమి తనకు చెందుతుందని కోర్టుకు వెళ్లిన రవీంద్రమూర్తిపై గత టీడీపీ హయాంలో అక్రమంగా రెండు సారా కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత న్యాయస్థానాన్ని ఆశ్రయించి కేసుల నుంచి బయటపడినట్లు బాధితుడు తెలిపారు. పెడన ఎమ్మెల్యే కాగిత హెచ్చరికలు... పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మంత్రి తరఫున మాట్లాడుకుందాం రండని చినగొల్లపాలెం బాధిత రైతులను ఫిబ్రవరి నుంచి పలుసార్లు పిలిపించి చెప్పినట్లు వింటే మీపై కేసులు లేకుండా చూస్తానని, ఎదురుచెపితే కటకటాలు తప్పవని హెచ్చరించినట్టు బాధితులు చెబుతున్నారు. సెటిల్మెంట్కు భీమవరం ఎమ్మెల్యే వద్దకు... భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు స్వగ్రామం చినగొల్లపాలెం. రైతులకు సర్ది చెప్పి సెటిల్ చేయాలని మంత్రి రవీంద్ర ఆయనకు సూచించారు. ఎలాంటి షరతులు లేకుండా భూమిని తమకు వదిలేసి వెళ్లిపోవాలని కొల్లు బృందం కోరడాన్ని ఎమ్మెల్యే అంజిబాబు తప్పు పట్టి ఎటూ తేల్చకుండా పంపించేశారని సమాచారం. టీజీ వెంకటేష్, సోము వీర్రాజుల జోక్యం... తమ కుటుంబానికి జరుగుతున్న అన్యాయం గురించి రవీంద్రమూర్తి మాజీ మంత్రి టీజీ వెంకటేష్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. చినగొల్లపాలెం రైతులకు అన్యాయం జరుగుతోందని భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు సోము వీర్రాజుకు వివరించగా ఆయన పోలీసు అధికారులకు ఫోన్ చేసి చట్టప్రకారం వెళ్లాలని, లేదంటే పరిణామాలు వేరుగా ఉంటాయని అన్నారని సమాచారం.Iమంత్రి పదవిని అడ్డు పెట్టుకుని కొల్లు రవీంద్ర హద్దు లేని అరాచకాలకు పాల్పడుతున్నారనే తీవ్ర విమర్శలు వినవస్తున్నాయి. కుటుంబ తగాదాలు ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని వారి ఆస్తిపాస్తులను కాజేసే కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బంధువులు, బినామీల మాటున ఈ అడ్డగోలు వ్యవహారాలకు ఒడిగడుతున్నారని, ఇందుకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో పాటు టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకుల ద్వారా సామ దాన భేద దండోపాయాల వినియోగానికి ఏమాత్రం వెనుకాడటంలేదని స్థానికులు అంటున్నారు. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చిన్నగొల్లపాలెంలో రూ.11.50 కోట్లకు పైగా విలువ చేసే 38 ఎకరాల భూమిని కాజేయడానికి దశాబ్దకాలంగా కొనసాగిస్తున్న అరాచకపర్వం ఇందుకు తార్కాణమని ఉదహరిస్తున్నారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 53,355 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నుంచి దిగువకు 53,355 క్యూసెక్కులు వదులుతున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర అనుచరులు బెంగళూరు వెళ్లి నా కుమార్తె కుటుంబాన్ని బెదిరించారు. నా కుమారుడిని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. నా పైనా, రైతుల పైనా తప్పుడు కేసులు పెట్టారు. ఏంచేసినా సరే న్యాయం జరిగే వరకు పోరాడతా. – ఎండూరి రవీంద్రమూర్తి, మచిలీపట్నం మంత్రి కొల్లు అయినా.. మరెవరైనా సరే రైతుల భూములను లాగేసుకోవా లని చూస్తే ఊరుకోం. రవీంద్రమూర్తి విషయంలో ఉన్నతాధికారులతో మాట్లాడాం. – వల్లభనేని ఆశాకిరణ్, భారతీయ కిసాన్సంఘ్ రాష్ట్ర కోశాధికారి భూమిని కొనుగోలు చేశామంటున్న వారందరూ మచిలీపట్నం వాసులే. వారిలో మంత్రి కొల్లు రవీంద్ర చినమామ నడకుదిటి అర్జున సర్వే నంబరు 213లో 11.30 ఎకరాలు, మంత్రి బాబాయ్ కుమారుడు కొల్లు రంగనాఽథ్ 571/1లో అయిదు ఎకరాలు, మంత్రి కొల్లు బినామీలుగా స్థానికంగా బాగా గుర్తింపు ఉన్న ఊకంటి రాంబాబు 572/1లో 5 ఎకరాలు, పైడిపాటి త్రినాథ్ 217లో 5 ఎకరాలు, కొల్లూరి సూర్య చంద్ర భగవాన్ గుప్త 217లో 5 ఎకరాలు, శ్రవణం పవన్కుమార్ 3.70 ఎకరాలు కొను గోలుదారులు. కాగా గిఫ్ట్ డీడ్ కింద పొన్నుగంటి చంద్రమౌళి 3 ఎకరాలు పొందారు. -
రూ 2.96కోట్ల మెరిట్ స్కాలర్షిప్లు పంపిణీ
పెనమలూరు: కానూరు సిద్ధార్థ డీమ్డ్ టూబీ యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న విద్యార్థులకు గురువారం రూ.2,96,37,000 మెరిట్ స్కాలర్ షిప్పులు యాజమాన్యం పంపిణీ చేసింది. ఈ సందర్భంగా సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు మాట్లాడుతూ వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీని సిద్ధార్థ డీమ్డ్ టూబీ యూనివర్సిటీగా మార్చిన తర్వాత విద్యార్థులకు తాము పూర్తి అండగా ఉన్నామన్నారు. గతంలో విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్మెంట్ పథకం ఉండేదని, యూనివర్సిటీ చేసిన తరువాత తామే విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తున్నామన్నారు. చదువులో ప్రతిభ, హాజరు శాతం పరిగణనలోకి తీసుకుని విద్యార్థులను ఎంపిక చేస్తున్నామని వివరించారు. ఉపకులపతి ప్రొఫెసర్ పి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 2025–2026లో 624 మంది విద్యార్థులకు రూ.2.96కోట్లను స్కాలర్షిప్లుగా ఇచ్చామన్నారు. ఆన్లైన్ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలో సొమ్ము జమ అవుతుందని తెలిపారు. ప్రో ఉపకులపతి డాక్టర్ ఏవీ రత్నప్రసాద్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.రవిచంద్, డైరెక్టర్ బావినేని పాండురంగారావు, డీన్ డాక్టర్ జీఎన్.స్వామి, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
స్కిట్లు, డ్యాన్స్లతో వైద్యుల నిరసన
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పీహెచ్సీల్లోని వైద్యులు ఆందోళన బాట పట్టారు. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో వారి ఆందోళనలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేవలం దీక్షా శిబిరంలో మాత్రమే కాక, జనసమ్మర్థం అధికంగా ఉండే మాల్స్లో ఫ్లాష్ మాబ్లు నిర్వహిస్తూ తమ ఆవేదనను స్కిట్లు, పాటల రూపంతో ప్రజలకు వివరిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం విజయవాడ బెంజిసర్కిల్ వద్ద నున్న ట్రెండ్ సెట్మాల్లో యువ వైద్యులు వినూత్నంగా నిరసన ప్రదర్శన చేశారు. – సాక్షి ఫొటో గ్రాఫర్, విజయవాడ -
సిద్ధార్థ లూథ్రాపై ఏసీబీ కోర్టు జడ్జీ సీరియస్
సాక్షి, విజయవాడ: అక్రమ లిక్కర్ కేసు బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. ప్రాసిక్యూషన్ తరపున సిద్ధార్ధ లూథ్రా వాదనలు వినిపించారు. లూథ్రాపై సీరియస్ అయిన ఏసీబీ కోర్టు జడ్జి.. కేసు విచారణ పూర్తయిందా? లేదా? సూటిగా చెప్పాలన్నారు. విచారణ కొనసాగుతుందని.. కొత్త విషయాలు గుర్తించాల్సి ఉందని కోర్టుకు లూథ్రా తెలిపారు.ఇప్పటి వరకు మూడు సార్లు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చామని.. కొత్తగా ఆధారాలు కోర్టుకు తెలపలేదన్న ఏసీబీ జడ్జి.. ఇన్వెస్టిగేషన్ అధికారి కూడా ఇక్కడే ఉన్నారన్నారు. మెటీరియల్ ఎవిడెన్స్ కూడా సమర్పించలేదన్న న్యాయమూర్తి.. కోర్టుని మిస్ గైడ్ చేస్తున్నారంటూ లుథ్రాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్చువల్ విధానంలో సిద్ధార్ధ లూథ్రా తన వాదనలు వినిపించారు. -
పత్రికా స్వేచ్ఛపై కాలకూటమి
‘సాక్షి’పై కొనసాగుతున్న సర్కారు కక్ష సాధింపుసాక్షి ప్రతినిధి, విజయవాడ: ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని నిలదీస్తున్న ‘సాక్షి’పై చంద్రబాబు సర్కారు కక్ష సాధింపుగా వ్యవహరిస్తోంది. సాక్షి ఎడిటర్ ఆర్. ధనంజయరెడ్డితోపాటు పలువురు పాత్రికేయులపై వరుసగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తోంది. నోటీసుల పేరుతో అర్ధరాత్రి, తెల్లవారుజామున పోలీసులు వచ్చి హంగామా చేస్తున్నారు. సంబంధిత పాత్రికేయులు లేరని చెప్పినా వినకుండా కార్యాలయాల్లోకి ప్రవేశిస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను కూటమి సర్కారు కాల రాస్తోంది. రాష్ట్రంలో పరిస్థితులు ఎమర్జెన్సీ నాటి దురాగతాలను తలపిస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన ప్రతిసారీ ఎక్కడో చోట, సంబంధం లేని వ్యక్తులతో ఫిర్యాదు చేయించి సాక్షి పైకి పోలీసులను ఉసిగొల్పుతున్నారు. సోషల్ మీడియా, భావ ప్రకటన విషయంలో కేసులకు సంబంధించి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ పోలీసు శాఖ టీడీపీ పెద్దలకు జీహుజూర్ అనడానికి మాత్రమే పరిమితమైనట్లు కనిపిస్తోంది. జర్నలిస్టు సంఘాల ఖండన.. సాక్షి ఎడిటర్పై అక్రమ కేసులు హేయం అని, కూటమి ప్రభుత్వ తీరు ప్రజా స్వామ్యానికే చేటు అంటూ జర్నలిస్టు సంఘాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర వ్యాప్తంగా పత్రికపై ప్రభుత్వ వేధింపులు, అక్రమ కేసులు నమోదు చేయడాన్ని పాత్రికేయ సంఘాలు ఖండించాయి. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై సమష్టిగా పోరాడతామని ప్రకటించాయి. ‘సాక్షి’పై కక్ష ఇలా.. ●గతేడాది ఆగస్టు 31న విజయవాడలో వరదల సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసినందుకు ‘సాక్షి’పై అక్రమ కేసు నమోదు చేశారు. ●జై భారత్ గో సేవా ట్రస్టు ఆధ్వర్యంలో నడిచే గోశాలను కూల్చేయడాన్ని ప్రశ్నించిన నందిగామ టౌన్ విలేకరిపై టీడీపీ నేతల ప్రోద్బలంతో గతేడాది జూన్లో అక్రమంగా అట్రాసిటీ కేసు నమోదు చేయించారు. దీంతో పాటు వార్తలు రాసినందుకు ఇదే విలేకరిపైన మరో రెండు అక్రమ కేసులు బీఎన్ఎస్111 సెక్షన్ల కింద నమోదు చేశారు. ●రాష్ట్రంలో డీఎస్పీలు, ఏఎస్పీలుగా ఉద్యోగోన్నతులు కల్పించే అంశంలో కొంత మంది డీఎస్పీలు తీవ్రంగా నష్టపోయారని రాసిన వార్తపై పోలీసులు కక్ష పూరితంగా వ్యవహరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్స్టేషన్లో అక్రమ కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 1 అర్ధరాత్రి 12.30 నుంచి 2 గంటల వరకు విజయవాడ ఆటోనగర్లోని ప్రధాన కార్యాలయంలో చొరబడి సిబ్బందిపై ప్రశ్నల వర్షం కురిపించారు. సెప్టెంబర్ 2న రాత్రి వచ్చి హడావుడి చేశారు. సెప్టెంబర్ 11న ఎడిటర్, పాత్రికేయులను తాడేపల్లి పోలీసుస్టేషన్లో విచారణ పేరుతో మూడు గంటల పాటు వేచి ఉండేలా చేశారు. పాత్రికేయ ప్రమాణాలకు విరుద్ధంగా ప్రశ్నలు సంధించారు. ●నకిలీ మద్యంపై వార్తలు ప్రచురించినందుకు ఎడిటర్కు నోటీసుల పేరుతో విజయవాడలోని సాక్షి ప్రధాన కార్యాలయం వద్ద ఆదివారం తెల్లవారుజామున పోలీసులు దారుణంగా వ్యవహరించారు. మళ్లీ సోమవారం ఉదయం 8.30 గంటలకు సాక్షి కార్యాలయం వద్దకు పోలీసులు వచ్చారు. ●బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు హైదరాబాద్లోని సాక్షి ఆఫీసు వద్ద నెల్లూరు పోలీసులు హల్చల్ చేశారు. సాక్షి ఎడిటర్కు నోటీసులు ఇష్యూ చేసేందుకు అని చెప్పి గంటల తరబడి ప్రశ్నించారు. ఈ తీరును నిరసిస్తూ జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. -
జీజీహెచ్ సూపరింటెండెంట్కు బెదిరింపులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావును గుర్తు తెలియని అగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు. లయోలా కళాశాల సమీపంలో నివసించే ఆయన ఇంటికి మంగళవారం రాత్రి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వెళ్లారు. మంగళవారం జరిగిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో మా క్యాంటీన్ లీజు ఒక ఏడాదే పొడిగించారు, రెండేళ్లు పొడిగించాలని డిమాండ్ చేశారు. నేను మూడు నెలల్లో రిటైర్ అవుతున్నానని చెప్పగా, అవన్నీ మాకు తెలియదు రేపు రెండేళ్లకు పొడిగిస్తూ ఆదేశాలు ఇవ్వాలని బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. అలాంటిది ఏమైనా ఉంటే ఆఫీసులో మాట్లాడదామని చెప్పినా వినకుండా బెదిరించినట్లు తెలిసింది. దీంతో ఫోన్ తీసుకు వచ్చి ఫొటో తీద్దామని ఇంట్లోకి వెళ్లి రాగా, అప్పటికే వాళ్లు వెళ్లిపోయారు. ఈ విషయమై సూపరింటెండెంట్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశకు సమాచారం ఇవ్వడంతో పాటు మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్యాంటీన్ నిర్వాహకుల ఫిర్యాదు.. కాగా సూపరింటెండెంట్ ఇంటికి వెళ్లి బెదిరించిన వారితో తమకు సంబంధం లేదంటూ క్యాంటీన్ నిర్వాహకులు మాచవరం పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. అగంతకులను గుర్తించాలని ఆ ఫిర్యాదులో కోరారు. క్యాంటీన్ లీజు ఏడాది పొడిగించారని, బెదిరించాల్సిన అవసరం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారో తేల్చాలని కోరారు. అందుకు సంబంధించి అనుమానితుల పేర్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. బెదిరింపులు దుర్మార్గం.. ఆస్పత్రి సూపరింటెండెంట్ ఇంటికి వెళ్లి బెదిరింపులకు పాల్పడటం దుర్మార్గమని వైద్యుల సంఘం నేతలు డాక్టర్ సొంగా వినయ్కుమార్, డాక్టర్ కె.రవిలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటి వద్దకు వెళ్లిన అగంతకులు ఎవరో గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. గంజాయి నిందితుల అరెస్ట్ జి.కొండూరు: గంజాయి నిందితులను జి.కొండూరు పోలీసులు బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. వివరాలలోకి వెళ్తే... ఏలూరుకు చెందిన ఉత్తరవల్లి జగదీష్ అనే వ్యక్తి ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండల పరిధి చెవుటూరు గ్రామ శివారులో ఎనిమిది మంది వ్యక్తులకు విక్రయించేందుకు ఏలూరు నుంచి గంజాయిని తీసుకువచ్చాడు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న జి.కొండూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. జి.కొండూరు ఎస్ఐ సతీష్కుమార్ మాట్లాడుతూ.. గంజాయి విక్రయిస్తున్న జగదీష్తో పాటు కొనుగోలు చేసేందుకు ముందుగానే నిందితుడికి ఆన్లైన్ పేమెంట్ చేశారన్నారు. గంజాయిని తీసుకునేందుకు వచ్చిన మైలవరానికి చెందిన తమ్మిశెట్టి సాయి, విజయవాడకు చెందిన రామ్జలి కృష్ణ, బెజవాడ చందు, బొప్పూరి రవి, యలమర్తి కమలకేష్, జి.కొండూరు మండల పరిధి వెంకటాపురం గ్రామానికి చెందిన బొడ్డపాటి కార్తీక్, నూతక్కి ప్రసన్నకుమార్, చాట్ల విజ్ఞాన్ సాగర్లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితుల నుంచి 1.1 కేజీల గంజాయిని, రెండు స్కూటీలను, ఒక ఆటోని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు. నిందితులను గురువారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తామని చెప్పారు. ఎంయూడీఏ వైస్ చైర్మన్గా జేసీ నవీన్ చిలకలపూడి(మచిలీపట్నం): మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎంయూడీఏ) వైస్ చైర్మన్గా కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంయూడీఏ వైస్ చైర్మన్గా ఫుల్ అడిషనల్ చార్జ్ను నవీన్కు అప్పగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
నిమ్మకూరు(పామర్రు): గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. పామర్రు మండలం నిమ్మకూరు గ్రామంలో అభివృద్ధి పనుల పురోగతిపై అన్ని శాఖల అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించామన్నారు. ఇంకా గ్రామానికి అవసరమైన పనులను గ్రామస్తుల నుంచి తెలుసుకుని వాటి ఏర్పాటుకు తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామంలో రహదారుల నిర్మాణం, అంతర్గత డ్రెయినేజీ, చెరువుల కంచె ఏర్పాటు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సామాజిక ఆరోగ్య కేంద్రంగా మార్పు, పీహెచ్సీలో పరికరాల ఏర్పాటు, వసతుల కల్పనపై చర్చించారు. గ్రామంలో కమ్యూనిటీ గోకులం ఏర్పాటుకు రూ.10 లక్షల నిధులతో ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలన్నారు. అనంతరం గ్రామంలోని గురుకుల వృత్తి విద్యా పాఠశాల, బాలుర, బాలికల డార్మిటరీలను పరిశీలించారు. గ్రామంలోని శ్రీ సిద్ధేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణానికి దేవదాయశాఖ ఆధ్వర్యంలో రూ.1.10 కోట్లు నిధులు మంజూరయ్యాయని చెప్పారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, దేవదాయ ధర్మదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ నూతక్కి వెంకట సాంబశివరావు, డీఎంహెచ్వో వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ -
విద్యారంగ సమస్యల పరిష్కారానికి 22 నుంచి బస్సు జాతా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఈ నెల 22 నుంచి నవంబర్ 12వ తేదీ వరకు ఇచ్ఛాపురం నుంచి హిందూపురం వరకు బస్సు జాతా నిర్వహిస్తున్నట్లు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు గుజ్జుల వలరాజు, బందెల నాసర్జీ తెలిపారు. విజయవాడ హనుమాన్పేటలోని దాసరి భవన్లో బస్సు జాతా వాల్ పోస్టర్ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తోందన్నారు. ఇందుకు సంబంధించి జారీ చేసిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పేదలకు వైద్య విద్యను దూరం చేసే చర్యలు మానుకోవాలన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. యువగళం పాదయాత్రలో తాము అధికారంలోకి వస్తే బకాయిలు పూర్తిగా విడుదల చేస్తామని హామీ ఇచ్చిన లోకేష్ ఆ హామీని తుంగలో తొక్కారన్నారు. తానే విద్యాశాఖ మంత్రిగా ఉండి కూడా విద్యారంగ సమస్యలు గాలికి వదిలేశారన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రోత్సహిస్తూ పేద విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. కురుపాంలో 150 మంది విద్యార్థులు వ్యాధుల బారిన పడ్డారని, వీరిలో నలుగురు విద్యార్థులు చనిపోయినా ప్రభుత్వానికి, మంత్రులకు చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కార్తిక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యశ్వంత్, నాయకులు ప్రణీత్, అమర్నాథ్, అజయ్ పాల్గొన్నారు. -
టిడ్కో గృహాలకు నోటీసులు జారీ చేసిన బ్యాంక్ అధికారులు
మచిలీపట్నంటౌన్: స్థానిక రుద్రవరంలోని టిడ్కో గృహాల లబ్ధిదారులు బ్యాంక్కు రుణ వాయిదాలు(ఈఎంఐ)లు సక్రమంగా చెల్లించకపోవడంతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు బుధవారం పలువురు లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసి, ఇళ్లకు అతికించారు. కొంతమంది లబ్ధిదారులు రాజకీయ నాయకుల హామీలను నమ్మి, రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందనే అపోహలో ఉండి ఈఎంఐ చెల్లింపులు నిలిపివేస్తున్నారని అధికారులు తెలిపారు. ఇళ్లు కేటాయించి, నివాసం ఉండకపోవడం రుణ చెల్లింపులు నిలిపివేయడానికి సరైన కారణం కాదని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వం, టిడ్కో సంస్థ ఇప్పటికే స్పష్టంగా ప్రకటించినట్లుగా, ఒకసారి ఇల్లు కేటాయించబడిన తరువాత ఇకపై ఎటువంటి ఆర్థిక సహాయం, రుణమాఫీ ఉండదని అధికారులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. బ్యాంకు అధికారులు రుద్రవరంలోని లబ్ధిదారులకు, ఈఎంఐలు తక్షణమే చెల్లించాలని స్పష్టం చేశారు. ఆలస్యం జరిగితే ఖాతాలు ఎన్పీఏ స్థితిలోకి వెళ్లి సర్ఫేసీ(ఎస్ఎఆర్ఎఫ్ఎఈఎస్ఐ) చట్టం ప్రకారం నోటీసులు జారీ చేసి, అవసరమైతే ఇళ్లు వేలం వేస్తామని హెచ్చరించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మచిలీపట్నం డెప్యూటీ రీజినల్ హెడ్ కొవ్వూరి రామలింగారెడ్డి, రికవరీ చీఫ్ మేనేజర్ రాకేష్, జిల్లా పరిషత్ బ్రాంచ్ మేనేజర్ నవక్రాంత్, సిబ్బంది పాల్గొన్నారు. -
లారీల మధ్య ఇరుక్కుని లారీ డ్రైవర్ దుర్మరణం
జి.కొండూరు: రెండు లారీల మధ్య ప్రమాదవశాత్తూ ఇరుక్కుని లారీ డ్రైవర్ మృతి చెందిన ఘటన జి.కొండూరు బైపాస్రోడ్డులో బుధవారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులో ఒకే యజమానికి చెందిన రెండు లారీలు చత్తీస్ఘడ్లో అల్యూమినీయం రోల్స్ను లోడు చేసుకొని తమిళనాడు వెళ్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం 10 గంటల సమయంలో జి.కొండూరు బైపాస్రోడ్డులోని ఆత్కూరు క్రాస్రోడ్డు జంక్షన్ వద్దకు రాగానే మలుపు తీసుకునే సమయంలో ముందు వస్తున్న లారీ ఇంజిన్ ఆగిపోయింది. ఆగిపోయిన లారీకి సెల్ఫ్ స్టార్ట్ లేకపోవడంతో వెనుక ఉన్న లారీతో ముందు లారీని నెట్టేందుకు ముందు లారీలో ఉన్న డ్రైవర్ సుభాష్(42) రెండు లారీల మధ్య ఇనుప రాడ్ను సెట్ చేస్తున్నాడు. ఈ సమయంలో ఇనుప రాడ్డు పక్కకి తప్పడంతో వెనుక లారీ ఒక్కసారిగా ముందుకు రావడంతో రెండు లారీల మధ్యలో సుభాష్ ఇరుక్కుపోయాడు. సుభాష్ తల రెండు లారీల మధ్యలో ఒత్తుకుపోవడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ సతీష్కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి మృతుడు కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు. కంచికచర్ల: రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని గుర్తు తెలియని వాహనం ఢీకొనగా అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ పి.విశ్వనాథ్ కథనం మేరకు కంచికచర్లకు చెందిన కూరపాటి సరస్వతి(65) బుధవారం ఉదయం స్థానిక శ్రీశివసాయ క్షేత్రానికి వెళ్లి వచ్చే క్రమంలో నేషనల్ హైవే దాటుతుంది. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపునకు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొనగా ఆమె తలకు తీవ్రగాయాలై, అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమారుడు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. బందరు కాలువలో గుర్తుతెలియని మృతదేహం ఆటోనగర్(విజయవాడతూర్పు): పడవలరేవు సమీపంలోని బందరు కాలువ బ్రిడ్జి వద్దకు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం బుధవారం కొట్టుకు వచ్చింది. మృతుడు సుమారు 45 ఏళ్ల మగ వ్యక్తిగా భావిస్తున్నారు. ఒంటిపై నిక్కర్ మాత్రమే ఉంది. బ్రిడ్జి పక్కనే ఉన్న చెట్లకు ఆనుకొని మృతదేహం ఆగింది. కుటుంబ కలహాలతో అధ్యాపకుడు ఆత్మహత్య పెనమలూరు: కుటుంబ కలహాలతో పోరంకిలో అధ్యాపకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా సింగరేణికి చెందిన బాణావత్ హరిచంద్(37) ఓ ప్రైవేట్ కాలేజీలో అధ్యాపకుడిగా పని చేస్తున్నాడు. అతని భార్య అనిత పోరంకిలో ప్రైవేటు స్కూల్లో టీచర్గా పని చేస్తోంది. వీరు పోరంకిలో నివాసం ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం అనిత సోదరుడు ఆర్థిక ఇబ్బందులతో ఉండటంతో రుణం కోసం బంగారు ఆభరణాలు ఇచ్చింది. అయితే అతను బంగారు ఆభరణాలు తిరిగి ఇవ్వలేదు. దీంతో దంపతుల మధ్య గొడవ జరుగుతోంది. కాగా మంగళవారం అనిత సోదరుడు ఇంటికి రాగా హరిచంద్ బంగారు ఆభరణాల విషయం అడిగాడు. దీంతో వారి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్థాపం చెందిన హరిచంద్ తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. భర్త గది నుంచి బయటకు రాక పోవటంతో బలవంతంగా తలుపులు తెరిచి చూడగా హరిచంద్ ఫ్యాన్కు ఉరేసుకోని వేలాడుతూ కనిపించాడు. అతడిని వెంటనే విజయవాడ ప్రభుత్వాస్పత్రికి అత్యవసర చికిత్సకు తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న హరిచంద్ ఆస్పత్రిలో బుధవారం వేకువజామున మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
విజయవంతంగా ‘స్వచ్ఛ రైలు – స్వచ్ఛ భారత్ మిషన్’
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): స్వచ్ఛ రైలు – స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా విజయవాడ డివిజన్లో పక్షం రోజులుగా నిర్వహించిన స్వచ్ఛత పక్వాడ–2025 విజయవంతంగా ముగిసిందని విజయవాడ రైల్వే ఏడీఆర్ఎంలు పీఈ ఎడ్విన్, కొండా శ్రీనివాసరావు తెలిపారు. డీఆర్ఎం కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా డివిజన్లోని రైల్వే స్టేషన్లు, రైల్వే ప్రాంగణాలు, కార్యాలయాల్లో పరిశుభ్రత డ్రైవ్లు విజయవంతంగా ముగిశాయన్నారు. అందులో స్వచ్ఛత అభియాన్, స్వచ్ఛత హి సేవా, స్వచ్ఛత పక్వాడ కార్యక్రమాలతో విస్తృతమైన డ్రైవ్లు నిర్వహించి ఉత్తమ ఫలితాలు సాధించినట్లు చెప్పారు. ఉద్యోగులు, వలంటీర్లకు అభినందనలు 1,595 మంది అధికారులు, 2,243 మంది వలంటీర్లతో పరిశుభ్రత డ్రైవ్లు నిర్వహించడం ద్వారా 9,166 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న స్టేషన్లలో పరిశుభ్రత కార్యక్రమాలు, 64.7 కి.మీ. ట్రాక్లు, 341 మీటర్ల డ్రెయిన్లు, 30 కార్యాలయాలను శుభ్రపర్చామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేసిన వారిపై 114 కేసులు నమోదు చేయడం ద్వారా రూ.24,800 పెనాల్టీలు వసూలు, ఒక టన్ను వ్యర్థాలను తొలగించడం, 26 రైళ్లను శుభ్రపర్చడం, మొక్కలు నాటడంతో పాటు ప్రయాణికులు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. కార్యక్రమం విజయవంతం కావడంలో విశేష కృషి చేసిన, స్వచ్ఛందంగా పాల్గొన్న వలంటీర్లు, ఉద్యోగులను వారు ప్రత్యేకంగా అభినందించారు. డివిజన్ పరిధిలో పరిశుభ్రత, ప్రయాణికుల పరిశుభ్రత ప్రమాణాలను మెరుగుపర్చడంతో డివిజన్ అనుకున్న లక్షాలను సాధించినట్లు తెలిపారు. సమావేశంలో సీనియర్ డీఈ (పర్యావరణ, హౌస్ కీపింగ్ మేనేజ్మెంట్) వంశీకాంత్, పీఆర్వో నుస్రత్ మండ్రుప్కర్ పాల్గొన్నారు. -
సిబ్బంది కృషి వల్లే సాధ్యమైంది
బస్టాండ్(విజయవాడపశ్చిమ): స్వీపింగ్, టాయిలెట్ సిబ్బంది కృషి ఫలితంగానే పండిట్ నెహ్రూ బస్స్టేషన్కు రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛ సేవా అవార్డు వచ్చినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు పేర్కొన్నారు. బుధవారం ఆర్టీసీ హౌస్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఇటీవల సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అందుకున్న అవార్డును ద్వారకాతిరుమలరావు సిబ్బందికి అందజేసి అభినందనలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఇటువంటి అవార్డులు పండిట్ నెహ్రూ బస్స్టేషన్కు మరిన్ని రావాలని ఆకాంక్షించారు. బస్స్టేషన్ స్వీపింగ్, టాయిలెట్ సిబ్బందికి బహుమతులను అందజేశారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు రవివర్మ, అప్పల రాజు, చెంగల్రెడ్డి, విజయరత్నం, డెప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ సూర్యపవన్కుమార్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ బి.శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
నాట్యాచార్యుడు చినసత్యానికి నృత్య నీరాజనం
విజయవాడకల్చరల్: దుర్గాపురంలోని జీవీఆర్ సంగీత కళాశాలలో బుధవారం నాట్యాచార్యుడు వెంపటి చినసత్యం జయంతి సందర్భంగా గోకరాజు గంగరాజు కళావేదికపై నిర్వహించిన నృత్య కార్యక్రమాలు మనోహరంగా సాగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, ఘంటసాల వెంకటేశ్వరరావు నృత్య కళాశాల, అమరావతి నాట్యాచార్యుల సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. నగరానికి చెందిన 30 మంది నాట్యాచార్యులు తమ 500 మంది బృంద సభ్యులు నృత్యాంజలి ఘటించారు. చినసత్యం నృత్య దర్శకత్వం వహించిన బ్రహ్మాంజలి, జతిస్వరం, థిల్లానా అంశాలను ఒకే వేదికపై నృత్యాలను చేసి గురుభక్తిని చాటుకున్నారు. తెలుగు తేజం చినసత్యం.. తెలుగు తేజం వెంపటి చినసత్యమని వైస్ ప్రిన్సిపాల్ కూచిపూడి కళాక్షేత్రం డాక్టర్ చింతారవి బాల కృష్ణ అన్నారు. నృత్య కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కూచిపూడి నాట్యరంగానికి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు. ఆయన అనేక తెలుగు సినిమాల్లో పాటలకు నృత్య దర్శకత్వం వహించారని తెలిపారు. కూచిపూడి నాట్యానికి దిశానిర్దేశం చేశారన్నారు. నేడు ప్రముఖ నాట్యాచార్యులు ఆయన వద్ద నృత్యంలో శిక్షణ తీసుకున్నారన్నారు నాట్యాచార్యులు వేదాంతం రాధేశ్యాం ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సంగీత కళాశాల ప్రిన్సిపాల్ సి.జ్యోతిర్మయి పాల్గొన్నారు. పద్మశ్రీ హేమంత్, ఉమామహేశ్వర పాత్రుడు, సీహెచ్ అజయ్కుమార్, రాయన శ్రీనివాసరావు, సప్తా శివకుమార్, ఉషామాధవి, యల్లాజోస్యుల అనూరాధ, చదలవాడ ఆనంద్, హిమాన్సీ చౌదరి, లలిత, వేణుగోపాల్ తదితరులు తమ బృందాలతో నృత్య కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నారులు నాట్యాచార్యుడు వెంపటి చినసత్యానికి పుష్పాంజలి సమర్పించారు. -
టీడీపీలో చీడ పురుగులు!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: తిరువూరు టీడీపీలో ముసలం మొదలైంది. ఆది నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన టీడీపీ సీనియర్ నేత ఎన్టీ వెంకటేశ్వరరావు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి, కొన్ని చీడ పురుగుల వల్ల పార్టీ నుంచి తప్పుకోవాల్సి వస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి కారణం పార్లమెంటు ప్రజా ప్రతినిధి, ఆయన కార్యాలయంలో పనిచేసే మరో వ్యక్తేనన్న భావన టీడీపీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. నియోజకవర్గంలో ఆ ఇద్దరి మితిమీరిన జోక్యంతోపాటు అవినీతి అక్రమాలను ప్రోత్సహిస్తుండటంతో పార్టీ పరువు బజారున పడిందనే భావన వ్యక్తం అవుతోంది. పెత్తనం కోసం పట్టు.. తిరువూరులో ఎస్సీ వర్గం నుంచి నియోజకవర్గ ప్రజా ప్రతినిధి ఉండటంతో పార్లమెంటు ప్రజా ప్రతినిధి అంతా తన కనుసన్నల్లోనే జరగాలని పట్టు పడుతున్నారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధిని అవమానించే రీతిలో అన్ని విషయాల్లో జోక్యం చేసుకొంటూ, తన కార్యాలయం నుంచి సమాంతరంగా రాజకీయాలు నడుపుతూ, ఓ వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇసుక, మద్యం, గ్రావెల్, గంజాయి, రేషన్ బియ్యం ఇలా అవినీతి వ్యవహారాలన్నీ కొంత మంది దళారులను పెట్టుకొని నడిపిస్తున్నారు. దీంతో ఆది నుంచి పార్టీ కోసం కష్ట పడిన టీడీపీ వర్గాలు కారాలు, మిరియాలు నూరుతున్నాయి. ఇప్పటికే పార్లమెంటు ప్రజాప్రతినిధి వ్యవహార శైలిపై అధిష్టానం పెద్దలకు ఫిర్యాదు చేసినా, ఆయన తీరులో మాత్రం మార్పు రావటం లేదని తెలుస్తోంది. అవినీతిలో అందె వేసిన చెయ్యి.. అవినీతి దందాల విషయంలో పార్లమెంటు ముఖ్యనేతదే పైచేయిగా మారింది. రేషన్ మాఫియాకు చెందిన వ్యక్తిని తన కార్యాలయంలోనే ఉంచుకొని రేషన్ బియ్యం, నెలవారీ మామూళ్లు దండుకోవటాన్ని నియోజకవర్గ ప్రజా ప్రతినిధి సహించలేక పోతున్నారు. పార్టీ పదవులు, దేవాలయ చైర్మన్లు, నామినేటెడ్ పదవులను బేరం పెట్టి కోట్ల రూపాయలకు అమ్ముకున్నట్లు ఆరోపణలున్నాయి. పార్లమెంటు కార్యాలయంలో పనిచేసే వ్యక్తితో పాటు, మరో వ్యక్తి ద్వారా పార్టీ పదవులకు, నామినేటెడ్ పదవులకు రూ. లక్షలు వసూలు చేశారు. 34 సహకార సంఘాల చైర్మన్లలో దాదాపు 25 మంది దగ్గర ఒక్కొక్కరి నుంచి రూ.15 లక్షలు వసూలు చేసినట్లు పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. మండల టీడీపీ అధ్యక్ష పదవుల కోసం రూ.25లక్షలు వసూలు చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలోనే టీడీపీ సీనియర్ నాయకులు కలత చెంది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని చర్చ సాగుతోంది. ఎన్నికల సమయంలో రూ.3కోట్లు ఖర్చు పెట్టి పార్టీ గెలుపు కోసం కష్టపడిన ఓ ఎన్ఆర్ఐని అధికారంలోకి రాగానే పక్కన పెట్టారు. పార్టీకి సేవ చేసి రూ.2కోట్లు ఖర్చు పెట్టిన మరో వ్యక్తిని సైతం అవమానించడంతో పార్టీకి రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. ఇలా అక్కడ పార్ల మెంటు ప్రజా ప్రతినిధి అహంకార పూరిత ధోరణితో పార్టీలో విభేదాలు మరింత రచ్చకెక్కుతున్నాయి. -
ఈ–కేవైసీ వెంటనే పూర్తి కావాలి
‘ఉపాధి’పై సమీక్షలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఉపాధి హామీ పథకంలో శ్రామికులందరికీ ఈ వారం చివరిలోగా ఈ–కేవైసీ పూర్తి చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ఎంజీ ఎన్ఆర్ఈజీఎస్, ఐవీఆర్ఎస్ నివేదిక, వసతి గృహాలపై డీఎల్డీవోలు, ఎంపీడీవోలు, వసతి గృహాల ప్రత్యేక అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నవంబర్ నుంచి ఉపాధి హామీ పనులకు బయోమెట్రిక్ విధానం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉపాధి శ్రామికులందరికీ ఈ–కేవైసీ పూర్తిచేయాలని చెప్పారు. నూరు శాతం ఈ–కేవైసీ చేయకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. టెండర్లతో సంబంధం లేకుండా పశువుల షెడ్లను స్వయంగా నిర్మించుకోవచ్చని, అయితే బిల్లు విలువ రూ. 50వేలకు మించరాదని చెప్పారు. గ్రామపంచాయతీలో చెత్త సేకరణపై ప్రజల నుంచి పూర్తిస్థాయి సంతృప్తి వ్యక్తం కావడం లేదని, దీనికి గల కారణాలను అన్వేషించాలని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో ముక్తేశ్వరపురం, సుబ్బయ్యగూడెం, పాతపాడు, రాయనపాడు, పొందుగల గ్రామపంచాయతీలు చెత్త సేకరణలో టాప్ ఫైవ్లో ఉన్నాయని అభినందించారు. సంక్షేమ గృహాలపై ప్రత్యేక దృష్టి.. సంక్షేమ వసతి గృహాలను నిరంతరం పర్యవేక్షించాలని ప్రత్యేక అధికారులను ఆదేశించారు. ఆహార నాణ్యత, మంచినీటి సదుపాయం, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యార్థుల హాజరు తదితర అంశాలను పరిశీలించాలన్నారు. నీటి నాణ్యత నిర్ధారించడానికి ప్రతి సంక్షేమ వసతి గృహానికి క్లోరిన్ కిట్లను ఇస్తామని తెలిపారు. సమావేశంలో డ్వామా పీడీ ఏ.రాము, డీపీఓ లావణ్య కుమారి, డీఎల్డీఓలు పి.శ్రీనివాసరావు, పార్థసారథి, బి. ఎన్.లక్ష్మీకుమారి, డివిజనల్ పంచాయతీ అధికారి జి.రాఘవన్ పాల్గొన్నారు. -
పత్రికపై దాడి దుర్మార్గం..
ఎడిటర్కు నోటీసులు ఇచ్చేందుకని చెప్పి సాక్షి పత్రికా కార్యాలయంలో పోలీసులు హల్ చల్ చేయడం దుర్మార్గం. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. నోటీసులు ఇవ్వదలచుకుంటే నేరుగా వెళ్లి ఇవ్వొచ్చు. అలా కాకుండా జర్నలిస్ట్లను భయభ్రాంతులకు గురి చేసేలా పోలీసుల వ్యవహార శైలి ఉంది. ఇది పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తుంది. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలి. – ఎస్కే బాబు, కార్యవర్గ సభ్యుడు, ఐకేయూ పత్రికాస్వేచ్ఛను హరిస్తున్నారు.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో పత్రికా స్వేచ్ఛను హరించే యత్నం జరుగుతోంది. ముఖ్యంగా సాక్షి మీడియాపై ప్రభుత్వ దూకుడు వైఖరి రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్ర హక్కును నిరోధించేదిగా కనిపిస్తోంది. ప్రజల సమస్యలను, ఇబ్బందులను, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల పక్షాన వినిపిస్తున్న సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వ అణచివేత ధోరణిని ఖండిస్తున్నాం. – రేగళ్ల మోహన్రెడ్డి, సీనియర్ న్యాయవాది, తిరువూరు -
నకిలీ మద్యంపై సీబీఐ విచారణకు ఆదేశించాలి
వించిపేట(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలో నకిలీ మద్యం కుంభకోణంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, జిల్లా వక్ఫ్బోర్డు మాజీ చైర్మన్ షేక్ గౌస్మొహిద్దీన్ డిమాండ్ చేశారు. వించిపేటలోని తన కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ పెద్దల అండదండలతో ఆ పార్టీ నాయకుడు అద్దేపల్లి జనార్దనరావు ఒక పరిశ్రమలా పెద్దఎత్తున తయారు చేసిన నకిలీ మద్యం వ్యవహారంలో కుట్రపూరితంగా వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ పేరును ఇరికించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందన్నారు. ఏడాదిన్నర టీడీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు, బార్లు, బెల్టు షాపుల ద్వారా కల్తీ మద్యాన్ని అమ్మి టీడీపీ నేతలు కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. ఈ విషయం బయటకు పడి ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావటంతో దొంగే.. దొంగ అని అరిచిన చందంగా వైఎస్సార్ సీపీ నేతలపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రిమాండ్ రిపోర్టులో లేని జోగి రమేష్ పేరు ఇప్పడు ఎలా వచ్చిందని, ఇది కుట్ర పూర్వక చర్యలు కాదా అని గౌస్ మొహిద్దీన్ ప్రశ్నించారు. నిందితుడి చేతికి ఫోన్ ఇచ్చి జోగి రమేష్ పేరు చెప్పిస్తూ చవకబారు వీడియో చేశారని ఎద్దేవా చేశారు. జిల్లా వక్ఫ్బోర్డు మాజీ చైర్మన్ గౌస్మొహిద్దీన్ -
చంద్రబాబు, లోకేష్కు జోగి రమేష్ సవాల్
సాక్షి, విజయవాడ: తనపై వస్తున్న ఫేక్ వార్తలపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బుధవారం ఆయన వినతి పత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. జనార్థన్తో బలవంతంగా తన పేరు చెప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘లై డిటెక్టర్ టెస్టుకు రెడీ అని సవాల్ చేసి రెండ్రోజులవుతోంది. మళ్లీ చెబుతున్నా లై డిటెక్టర్ టెస్టుకు నేను రెడీ.. చంద్రబాబు, లోకేష్ రెడీనా?. చంద్రబాబు మరి ఇంత దారుణంగా దిగజారిపోయాడు. రిమాండ్లో ఉన్న జనార్థన్రావుతో వీడియో రికార్డ్ చేశారు. బలహీనవర్గానికి చెందిన నన్ను జైల్లో వేయాలని చూస్తున్నారు. నేను ఎక్కడికి పారిపోలేదు. ఇబ్రహీంపట్నం నడిబొడ్డున ఉండి మాట్లాడుతున్నా.. చంద్రబాబును రాష్ట్ర ప్రజలు అసహించుకుంటున్నారు’’ అని జోగి రమేష్ నిప్పులు చెరిగారు. -
జీఎస్టీ తగ్గింపుతో భవన నిర్మాణ కార్మికులకు మేలు
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్అవనిగడ్డ: జీఎస్టీ తగ్గింపుతో నిర్మాణ రంగానికి, భవన నిర్మాణ కార్మికులకు ఎంతో మేలు జరిగిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. అవనిగడ్డ రెవెన్యూ హాలులో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ అవగాహన సదస్సు మంగళవారం జరిగింది. ముఖ్య అతిథి, మంత్రి సుభాష్ మాట్లాడుతూ.. సిమెంటుపై పది శాతం, వెదురు ఫ్లోరింగ్పై ఏడు శాతం, మార్బుల్స్, గ్రానైట్, ఇసుక, ఇటుకపై ఏడు శాతం జీఎస్టీ తగ్గిందని తెలిపారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. జీఎస్టీ తగ్గింపు సంచలనాత్మక నిర్ణయమని, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, జాయింట్ కలెక్టర్ నవీన్ కుమార్, జీఎస్టీ ప్రచార కమిటీ డిస్ట్రిక్ట్ కో–ఆర్డినేటర్, జాయింట్ కమిషనర్ జి.కల్పన, నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, డెప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ స్వరూపరాణి, జనసేన, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నిర్మాణ రంగానికి జీఎస్టీ 2.0 చేయూత పమిడిముక్కల: నిర్మాణ రంగానికి జీఎస్టీ 2.0 చేయాతనిస్తుందని కృష్ణా జిల్లా ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. వీరంకిలాకులో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్పై ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తొలుత మంత్రి సుభాష్, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా వీరంకిలాకు సెంటర్లో దుకాణాల వద్దకు వెళ్లి వ్యాపారులకు కరపత్రాలు అందజేపి జీఎస్టీపై అవగాహన కల్పించారు. ఉయ్యూరు ఆర్డీఓ హేలా షారేన్, మొవ్వ ఏఎంసీ చైర్మన్ దోనెపూడి శివరామకృష్ణ, హౌసింగ్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ లింగమనేని రామలింగేశ్వరరావు, కృష్ణాపురం డీసీ చైర్మన్ నాదెళ్ల సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ నవీన్కుమార్, ఎంపీడీఓ సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు. -
తల్లిదండ్రుల చెంతకు చిన్నారులు
కంకిపాడు: ఇంటి నుంచి పరారైన చిన్నారులను పోలీసులు క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. విజయవాడ పటమటలోని ఓ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ఇంట్లో వాళ్ల మీద కోపంతో అలిగి స్కూల్ నుంచి నేరుగా బయటకు వచ్చేశారు. మచిలీపట్నం వైపు నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులను కంకిపాడు పోలీసుల ప్రొద్దుటూరు అడ్డరోడ్డు వద్ద సోమవారం రాత్రి గుర్తించారు. వారిని విచారించగా ఇంట్లో వాళ్లపై కోపంతో ఇల్లు విడిచి వెళ్లిపోతున్నట్లు చెప్పారు. వారి వద్ద నుంచి సమాచారం సేకరించి వారిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా పోలీసులు విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. -
కలెక్టర్కు జగనన్న కాలనీల్లో సమస్యలు ఏకరవు
పెడన: కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ మంగళవారం పెడన పట్టణంలోని పలు జగనన్న కాలనీలను ఆకస్మింకంగా పరిశీలించారు. పైడమ్మ లే అవుట్ కాలనీలో వాసుల వద్దకు వెళ్లి మాట్లాడారు. కాలనీలో అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, వర్షం వస్తే నడిచే పరిస్థితి లేదని, తాగునీరు సక్రమంగా రావడం లేదని ఫిర్యాదు చేశారు. మునిసిపల్ కమిషనర్ ఎల్.చంద్రశేఖరరెడ్డి, ఏఈ సీతారామాంజనేయులు ఆయా సమస్యలను రాసుకుని, తాగునీటికి అదనంగా ట్యాంకులు పంపించేలా చూస్తామన్నారు. మొత్తం ఎన్ని ఇళ్లు పూర్తి అయ్యాయో వివరాలను హౌసింగ్ ఏఈ మాధవి కలెక్టర్కు వివరించారు. అనంతరం సొంత స్థలాల్లో పీఎంజేఆర్ కింద నిర్మించుకున్న ఇళ్లను పరిశీలించారు. నాలుగో వార్డు పాతపేటలో ఎ.కోటనాగేశ్వరరావు ఇంటిని నిర్మించుకున్నా బిల్లులు రాలేదని ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ పల్లోటి కాలనీలో పర్యటించగా, స్థానికులు తమ సమస్యలను ఏకరవు పెట్టారు. పగలు పనులు నిమిత్తం ఇళ్లకు తాళాలు వేసుకుని పెడన పట్టణానికి వెళ్లి తిరిగి సాయంత్రం వచ్చేసరికి తాళాలు పగలగొట్టి దొంగలు ఇంట్లో నగదు, నగలు ఎత్తుకుపోతున్నారంటూ వాపోయారు. తాగునీరు రావడం లేదని, చెత్త కూడా తీసుకువెళ్లే వారు లేరని పేర్కొన్నారు. రోడ్లు కూడా లేవని, పల్లోటి ఎంట్రన్స్లో మట్టి రోడ్డు నుంచి రాలేని దుస్థితి ఏర్పడిందని, వాహ నాలు కూడా రావడం లేదని వాపోయారు. రాత్రి అయితే పాములకు భయపడుతున్నామని పేర్కొ న్నారు. తక్షణం మెయిన్ రోడ్డు నుంచి కాలనీకి వచ్చే మార్గంలో వీధిలైట్లు వేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పర్యటనలో హౌసింగ్ పీడీ పోతురాజు, ఇన్చార్జి డీఈ బుచ్చిబాబు, ఏఈ మాధవి, ఇన్చార్జి తహసీల్దారు అనిల్కుమార్, ఎంపీడీఓ అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీలపై దాడులను ఎదుర్కొనేందుకు ఐక్య ఉద్యమం
రౌండ్టేబుల్ సమావేశంలో వక్తలుకృష్ణలంక(విజయవాడతూర్పు): ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలను ఎదుర్కొనేందుకు ఐక్య ఉద్యమం నిర్మించాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. గవర్నర్పేటలోని బాలోత్సవ భవన్లో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్), ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి అధ్యక్షతన మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్పై మతోన్మాది బూటుతో దాడి, సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్యలను నిరసిస్తూ జరిగిన ఈ సమావేశంలో దళిత శోషన్ ముక్తి మంచ్(డీఎస్ఎంఎం) జాతీయ ఉపాధ్యక్షుడు వి.శ్రీనివాసరావు మాట్లా డుతూ.. ప్రజలకు రక్షణగా ఉన్న న్యాయ, పోలీసు వ్యవస్థల్లో దళితులకు రక్షణ కరువైందన్నారు. సీజేఐ గవాయ్పై దాడి దేశ ప్రజలపై జరిగిన దాడిగా పేర్కొన్నారు. గతంలో మహారాష్ట్ర పర్యటనలోనూ అవమానించారని గుర్తుచేశారు. ఐపీఎస్ పూరన్ కుమార్ సమర్థమైన పోలీసు అధికారి అని, కుల వివక్ష వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుత పరిస్థితికి అద్ధం పడుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి శామ్యూల్ ఆనంద్కుమార్ మాట్లాడుతూ.. దళితులు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న వివక్ష కొనసాగుతోందన్నారు. ఐపీఎస్ అధికారి పూరన్కుమార్ ఆత్మహత్యకు కారకులైన వారిపై అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబట్టారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ.. బీజేపీ పాలిత, తెలుగు రాష్ట్రాల్లోను దళిత, గిరిజనులపైన దాడులు, వ్యవసాయ కార్మికుల ఆత్మహత్యలు పెరిగాయని జాతీయ నేర గణాంక బ్యూరో నివేదిక వెల్లడిస్తోందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్, న్యాయవాదులు పిచ్చుక శ్రీనివాస్, అశోక్, జైభీమ్ జైభారత్ పార్టీ నాయకుడు కొండలరావు, ఆమ్ఆద్మీ నాయకుడు నేతి మహే శ్వరరావు, ఐఏఫ్టీయూ నాయకుడు రామకృష్ణ, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.శ్రీనివాస్, కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.క్రాంతికుమార్ మాట్లాడారు. ఈ నెల 27వ తేదీన ఎస్సీ, ఎస్టీ సంఘాలన్నీ గవర్నర్కు అర్జీ ఇవ్వాలని రౌండ్టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది. -
చిట్టీలు, గోల్డ్ స్కీం పేరుతో భారీ మోసం
పోలీస్స్టేషన్కు క్యూకట్టిన బాధితులు పెనుగంచిప్రోలు: పేద, మధ్య తరగతి ప్రజల ఆశను సొమ్ము చేసుకున్నాడు పెను గంచిప్రోలు గ్రామానికి చెందిన వ్యాపారి చిన్నం చిన్న దుర్గారావు. ఎన్నో సంవత్సరాలుగా గ్రామంలోనే కాకుండా చుట్టు పక్కల గ్రామాల్లో ద్విచక్ర వాహనంపై తిరుగుతూ వస్త్ర వ్యాపారం చేసేవాడు. ఆ తరువాత తిరుపతమ్మవారి ఆలయ సమీపంలో లక్ష్మీ దుర్గ ఎంటర్ ప్రైజెస్ పేరుతో ఎలక్ట్రికల్ వస్తువులు, ఫర్నిచర్ దుకాణం ప్రారంభించాడు. సమీపంలోనే అతని కుమారుడు వస్త్ర దుకాణం నిర్వహిస్తూ ఎంతో నమ్మకంగా ఉండేవారు. ఈ క్రమంలో దుర్గారావు చిట్టీలతో పాటు గోల్డ్ స్కీం వ్యాపారం చేపట్టాడు. గ్రామాల్లో తనకు ఉన్న పరిచయాలతో బంగారం ఒక్కసారిగా కొనలేని వారు వాయిదా పద్ధతిలో నగదు కట్టి బంగారం పొందొచ్చని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన 175 మంది సభ్యులుగా చేరారు. ఒక్కొక్కరు నెలకు రూ.3 వేల చొప్పున 22 నెలలు పాటు చెల్లించాలి. ప్రతి నెలా లాటరీ తీసి విజేతలకు పది గ్రాముల బంగారం చెల్లించాలి. ఈస్కీం మే నెలతోనే పూర్తయింది. 22 మందికి లాటరీలో బంగారం ఇవ్వగా మిగిలిన వారికి 22 నెలలకు వారు చెల్లించిన రూ.66 వేలకు 10 గ్రాముల చొప్పున బంగారం ఇవ్వాలి. మరికొందరు భవిష్యత్కు ఆసరాగా ఉంటుందని అతని వద్ద రూ.లక్ష చిట్టీలు కట్టారు. మరికొందరు వడ్డీకి అప్పులు ఇచ్చారు. గడువు తీరినా డబ్బులు, బంగారం చెల్లించకపోవటంతో కొద్ది రోజులుగా దుర్గారావును బాధితులు నిలదీయటం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఈ నెల పదో తేదీ రాత్రి కుటుంబంతో గ్రామం నుంచి పరారయ్యారు. దుకాణాలు మూసి వేయటంతో పాటు సెల్ఫోన్లు కూడా స్విచ్చాఫ్ కావటంతో బాధితులు రెండు రోజులుగా పోలీస్స్టేషన్కు క్యూ కడుతున్నారు. సుమారుగా రూ.5 కోట్ల వరకు అతను వసూళ్లకు పాల్పడినట్లు బాధితులు పేర్కొంటున్నారు. సోమవారం సాయంత్రం వరకు చిన్నం చిన్నదుర్గారావుపై 32 ఫిర్యాదులు అందాయని పోలీసులు తెలిపారు. అతని బాధితులు పెనుగంచిప్రోలుతో పాటు నవాబుపేట, ముండ్లపాడు, గౌరవరం, భీమ వరం గ్రామాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. 40 ఏళ్ల నుంచి గ్రామంలో వస్త్ర వ్యాపారం చేస్తూ ఎంతో నమ్మకంగా ఉన్నాడని, ఒక్కో కుటుంబంలో రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఇచ్చిన వారు ఉన్నారని, లాఖరికి పింఛన్ సొమ్ము మొత్తం ఇచ్చానని నవాబుపేట గ్రామానికి చెందిన తూమాటి విజయమ్మ వాపోయింది. తనకు రూ.4.50 లక్షలు రావాలని కన్నీటిపర్యంతమైంది. చిట్టీ పాటలు, గోల్డ్ స్కీం నుంచి తమ కుటుంబానికి రూ.8 లక్షలు రావాలని తుమాటి కృష్ణకుమారి తెలిపారు. -
పీఎం సభకు కమర్షియల్ టార్గెట్లు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ‘వారి ప్రచారం మా చావుకొచ్చింది. గతంలో ఎప్పుడూ లేదు. రాజకీయ ప్రచార సభకు మమ్మల్ని జనాలను పోగేయమంటున్నారు. ఇదెక్కడి తలనొప్పి మాకు?’ అంటూ ఉమ్మడి కృష్ణాజిల్లాలోని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వాపోతున్నారు. సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ ప్రచారంలో భాగంగా ఈ నెల 16వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కర్నూలులో సభ నిర్వహిం చనున్నారు. ఈ సభకు వ్యాపారులను తరలించాలని వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు టార్గెట్లు విధించారని సమాచారం. ఈ టార్గెట్లు ఆ శాఖ ఉద్యోగుల్లో తీవ్ర దుమారం లేపుతున్నాయి. ప్రధాని సభకు తాము జనాలను పోగే యటం ఏమిటంటూ తలలు పట్టుకుంటున్నారు. నాలుగైదు రోజులుగా అధికారులపై ఒత్తిడి ప్రధానమంత్రి సభకు ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి రెండు వేల మంది వ్యాపారులను తరలించాలని వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్ర అధికారులు జిల్లా అధికారులకు టార్గెట్లు విధించారని సమాచారం. ఉమ్మడి జిల్లాలోని విజయవాడ–1, విజయవాడ –2, విజయవాడ–3 డివిజన్లకు సంబంధించి 17 సర్కిళ్ల కార్యాలయ అధికారులకు ఈ మేరకు వాట్సాప్ గ్రూప్లతో పాటుగా ప్రత్యేకంగా టెలికాన్ఫరెన్స్లను నిర్వహించి మరీ టార్గెట్లు పెడుతున్నారని స్థానిక అధికారులు చెబుతున్నారు. ప్రధానమంత్రి సభకు వచ్చే వ్యాపారుల పేర్లు, వారి వివరాలను సేకరించి రాష్ట్ర కార్యాలయానికి పంపాలని నాలుగైదు రోజులుగా తమపై ఒత్తిడి పెట్టారని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏమి చేయాలో అర్థంకాక ప్రభుత్వంపై వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మండిపడుతున్నారు. ప్రచార బాధ్యతలు వారిపైనే సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ పేరుతో సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 19వ తేదీ వరకూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని ప్రభుత్వం చేప ట్టింది. ఆ ప్రచార కార్యక్రమాల్లో స్థానిక వ్యాపారవేత్తలు, పారిశ్రామికవర్గాలు, ప్రజాప్రతినిధులు పాల్గొనాల్సి ఉంది. ఆ వర్గాలకు అవసరమైన జీఎస్టీ తగ్గింపు, శ్లాబ్ల మార్పు తదితర సమాచారాన్ని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఇవ్వాలి. ఈ కార్యక్రమాల అనంతరం ఆ ఫొటోలను స్థానిక సచివాలయ సిబ్బంది ఆప్లోడ్ చేయాలి. అయితే ప్రభుత్వం నిర్దేశించినా ఆయా వర్గాలు ఈ కార్యక్రమాలు అనుకున్న స్థాయిలో నిర్వహించడం లేదు. దీంతో ఉన్నతాధికారుల ఒత్తిడితో వాణిజ్య పన్నుల శాఖ అధికారులే కార్యక్రమాలను చేపడుతున్నారు. వారే విద్యాసంస్థలకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఎవరో చేయాల్సిన కార్యక్రమాలను సైతం తమతో చేయించటం ఏమిటంటూ రాష్ట్ర స్థాయి అధికారుల తీరుపై వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుబాటులో లేని అధికార యంత్రాంగం వాణిజ్య పన్నుల శాఖలో 15 రోజులుగా అధికారులెవరూ అందుబాటులో ఉండటం లేదని వ్యాపార వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఏ సర్కిల్ కార్యాలయానికి వెళ్లినా అధికారులు ఏదో ప్రచారంలో ఉన్నారని, లేదా పాఠశాలలో పోటీలు నిర్వహించటానికి వెళ్లారని ఆ కార్యాలయాల్లో ఉంటున్న ఒకరిద్దరు సిబ్బంది వ్యాపారులకు చెప్పి మళ్లీ రావాలంటూ తిప్పి పంపుతున్నారని పలువురు చెబుతున్నారు. 15 రోజులుగా తమను ఉన్నతాధికారులు ప్రచార కార్యక్రమాలు, ర్యాలీలు, పోటీల పేరుతో కార్యాలయాలకు దూరంగా ఉండటంతో చాలా పనులు పెండింగ్లో పడిపోయాయంటూ వాణిజ్య పన్నుల శాఖకు చెందిన అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. జీఎస్టీ శ్లాబ్ల మార్పు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అయితే దానిని తమ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగా చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం చేసుకోవటం, ధరలన్నీ తగ్గిపోయాయని ఊదరగొట్టడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంత ప్రచారం నిర్వహించినా ప్రజల నుంచి అనుకున్న స్థాయిలో స్పందన రావటం లేదని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ఈ మేరకు ఆయా అధికారుల టెలికాన్ఫరెన్స్ సమావేశాల్లో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు సీనియర్ అధికారులు చెబు తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని సభకు వ్యాపారుల తరలింపు బాధ్యతలు అప్పగించడంతో ‘ఇదెక్కడి తలనొప్పి’ అంటూ ఉమ్మడిజిల్లాలోని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వాపోతున్నారు. -
రూ.12.48 లక్షల ఉపాధి నిధుల రికవరీకి ఆదేశాలు
మొవ్వ: స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పనుల 17వ విడత సామాజిక తనిఖీ సోషల్ ఆడిట్ జరిగింది. ఈ సందర్భంగా రూ.12.48 లక్షల రికవరీకి డ్వామా పీడీ ఎన్.వి.శివప్రసాద్ యాదవ్ ఆదేశించారని ఏపీఓ దేవానంద్ రాజు తెలిపారు. రూ.1.25 లక్షల జరిమానా విధించడంతోపాటు రూ.11 లక్షల పనులకు సంబంధించి మరో మారు విచారణ చేయాలని ఆదేశించారని పేర్కొన్నారు. పెదముత్తేవి గ్రామంలో పక్షవాతంతో ఆస్పత్రిలో మూడు నెలలపాటు చికిత్స చేయించుకుంటున్న చిందా వెంకటరాజు, చనిపోయిన కంచర్ల వెంకటేశ్వరరావు, దాసరి మురళి ఇద్దరిజాబు పనులకు వచ్చినట్లు మస్టురు వేయటం, అంగన్వాడీ హెల్పర్ గండ్రపు దేవకుమారి, వెలుగు బుక్ కీపర్ మండా దివ్యభారతిని పనులకు తీసుకెళ్లడం వంటి ఘటనలు మండల స్థాయి సమావేశంలో వెలుగు చూడటంతో పెదముత్తేవి ఫీల్డ్ అసిస్టెంట్ వి.సీతారామదాసును సస్పెండ్ చేస్తూ, నిధులు రికవరీ చేయాల్సిందిగా వెలుగు చూడటంతో డ్వామా పీడీ శివప్రసాద్ యాదవ్ ప్రజా వేదికలో ఆదేశాలు జారీ చేశారు. వేములమడలో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా పొలాల్లో నిమ్మ మొక్కలు నాటిన రైతులు కొనకళ్ల శ్రీనివాసరావు, నారగం హరికృష్ణ ప్రసాద్కు 14 నెలలుగా మొక్కల కొనుగోలు బిల్లు చేయకపోవడంతో టెక్నికల్ అసిస్టెంట్ నాగలక్ష్మికి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. రెండు రోజుల్లో బిల్లు చేయాలని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొండేటి ఇందిర, ఎస్ఎస్ఐఐటీ అడిష నల్ డైరెక్టర్ రామారావు, ఎంపీడీఓలు జె.విమాదేవి, డి.సుహాసిని, అంబుడ్స్మన్ కె.వి.శ్రీనివాసరావు, ఇన్చార్జి డీవీఓ సురేష్, ఎస్ఆర్పీ సుబ్బారావు, ఏపీఓ లక్ష్మీరెడ్డి, దేవానంద్ తదితరులు పాల్గొన్నారు. -
ఏఎన్యూలో ప్రపంచ హస్తకళల దినోత్సవం
పెదకాకాని: సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటంలో హస్తకళలు కీలకపాత్ర పోషిస్తాయని ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కోఆర్డినేటర్ పులిచెర్ల దేవకాంత్ అన్నారు. ప్రపంచ హస్తకళ ల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో హస్తకళల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేవకాంత్ మాట్లాడుతూ హస్తకళలు ఆర్థిక వ్యవస్థకు తోడ్పడటంలో, సృజనాత్మకత ను ప్రోత్సహించడంలో ప్రముఖపాత్ర పోషిస్తాయన్నారు. అనంతరం కొండపల్లి, ఏటి కొప్పాక, చెన్నపట్నం బొమ్మలు, మంగళగిరి, ధర్మవరం, కలంకా, చేనేత వస్త్రాలను విద్యార్థులు ప్రదర్శించారు. అధ్యాపకులు బి.శేఖర్బాబు, జాన్రత్నబాబు, వి.వీరయ్య, విద్యార్థులు సీహెచ్ హెలీనా, చక్రిత విద్య, రేణుక, బాంధవి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
దేవదాయశాఖ భూమిపై కూటమి నేతల కన్ను
సాక్షి నెట్వర్క్: ఖాళీ కనపడితే పాగా వేసేయ్ అన్న చందాన కూటమి నేతలు ఆక్రమణలకు పాల్పడుతున్నారు. మచిలీపట్నం–విజయవాడ జాతీయ రహదారిలో పామర్రులోని పెట్రోల్బంక్ ఎదురుగా ఉన్న వేణుగోపాలస్వామి దేవస్థానంకు సంబంధించి సుమారు ఆరు ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో కొంతకాలంగా ఏ విధమైన సాగు చేయటం లేదు. దీనిని ఆసరాగా తీసుకుని కాంట్రాక్టర్ కూడా అయిన స్థానిక టీడీపీ నేత కూటమి నేతల సహకారంతో ఆ ప్రాంతంలో సోమవారం రాత్రికి రాత్రే అక్రమంగా షెడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాడు. ఇదేమని ప్రశ్నించిన వారిపై అధికారం తమదేనని, ఎవరు ఆపుతారని బెదిరిస్తున్నారు. రూ.కోట్లు విలువ చేసే ఈ ఆరు ఎకరాల భూమిని ఆక్రమించేందుకు టీడీపీ నాయకులు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే తొలుత షెడ్డును ఏర్పాటు చేసి మిగిలిన భూమిని కూడా కబ్జా చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని పలువురు టీడీపీ నాయకులే విమర్శిస్తున్నారు. పట్టించుకోని అధికారులు ప్రధాన రహదారి పక్కనే ఈ అక్రమ నిర్మాణం జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. నిర్మాణాలను పరిశీలించి నిలిపివేయాలని సూచించి వెళ్లిపోయారు. అధికారులు వచ్చినప్పుడు పనులు నిలిపివేసిన్పపటికీ రాత్రి వేళల్లో ఆ నిర్మాణాన్ని పూర్తి చేయడం గమనార్హం. యథేచ్ఛగా షెడ్డు నిర్మాణం -
18 నుంచి చెకుముకి సైన్స్ సంబరాలు
కృష్ణలంక(విజయవాడతూర్పు): జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి జరగనున్న చెకుముకి సైన్స్ సంబరాలను జయప్రదం చేయాలని జన విజ్ఞాన వేదిక(జేవీవీ) రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు పిలుపునిచ్చారు. రాఘవయ్య పార్కు సమీపంలోని బాలోత్సవ భవన్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో చెకుముకి సైన్స్ సంబరాల వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసీ్త్రయ సమాజం ఏర్పాటు లక్ష్యంగా ఏర్పడిన జేవీవీ గత 35 ఏళ్లుగా తెలుగు విద్యార్థుల కోసం ప్రతి ఏటా చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహిస్తోందన్నారు. సైన్స్ పట్ల ఆసక్తిని, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించేందుకు, విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఈ సంబరాలు ఉపయోగపడతాయన్నారు. జేవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలల్లో 8, 9, 10వ తరగతి విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. ఈ సంబరాలు నాలుగు స్థాయిల్లో నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 18న పాఠశాల స్థాయిలో, నవంబర్ 1న మండల స్థాయి, నవంబర్ 23న జిల్లా స్థాయి, డిసెంబర్ 12,13,14 తేదీల్లో రాష్ట్ర స్థాయిలో జరుగుతాయన్నారు. ఈ సంబరాలలో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొనేలా ఉపాధ్యాయులు, పాఠశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జేవీవీ రాష్ట్ర కార్యదర్శి బోయి రవి, నాయకులు మురళీమోహన్, వెలగా శ్రీనివాస్, శోభన్ కుమార్, రాజశేఖర్, లెనిన్బాబు పాల్గొన్నారు. జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు -
ప్రతి భక్తుడికి సంతృప్తికర దర్శనం లక్ష్యం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కార్తిక మాసం, భవానీ దీక్ష విరమణలకు విచ్చేసే ప్రతి భక్తుడికి దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దర్శనం సంతృప్తికరంగా జరిగేలా చూడాలని దుర్గగుడి ఈవో శీనానాయక్ అన్నారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన వైదిక కమిటీ, ఇంజినీ రింగ్, ఏఈవోలు, సూపరింటెండెంట్లతో సోమవారం ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మహా మండపం నాల్గో అంతస్తులోని ఈవో చాంబర్లో జరిగిన ఈ సమావేశానికి ఆలయానికి చెందిన ముఖ్య అధికారులందరూ హాజరయ్యారు. దసరా ఉత్సవాలలో సిబ్బంది పని తీరు, సహనాన్ని ప్రతి ఒక్కరూ గమనించారని, ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించడంలో అందరి భాగస్వామ్యం ఉందన్నారు. అదే తీరులో రానున్న కార్తిక మాసం, భవానీ దీక్ష విరమణలలో భక్తులకు మరింత సేవలు అందించాలని సూచించారు. రానున్న ఉత్సవాలలో ఎక్కడ అలక్ష్యం జరిగినా సహించేది లేదన్నారు. ధర్మకర్తల మండలి సభ్యులు, దేవస్థాన యంత్రాంగం సమన్వయంతో వ్యవహరించాలన్నారు. 66 అంశాలపై చర్చ సమీక్ష సమావేశంలో ఆలయంలో చేపట్టాల్సిన మార్పులు, అభివృద్ధి పనులకు సంబంధించి 66 అంశాలను గుర్తించి, వాటి గురించి చర్చించారు. కనకదుర్గనగర్లో దేవస్థానానికి చెందిన భవనాలను కాటేజీలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అన్నదానం, లడ్డూ పోటు, క్యూ కాంప్లెక్స్ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఈవో ఆదేశాలు జారీ చేశారు. కొండపై దేవస్థానం నిర్వహిస్తున్న గోశాలను భక్తులందరికీ అందు బాటులో ఉండేలా కనకదుర్గనగర్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆలయంలోకి మొబైల్ ఫోన్లతో భక్తులు ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అంతరాలయంలోకి వచ్చే భక్తులు, ఆర్జిత సేవల్లో పాల్గొనే ఉభయదాతలందరూ తప్పనిసరిగా సంప్రదాయ వస్త్రాలు ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్ష సమావేశంలో ఏసీ రంగారావు, ఈఈ రాంబాబు, ఏఈవోలు చంద్రశేఖర్, రమేష్బాబు, సుధారాణి, గంగాధర్, తిరుమలేశ్వరరావు, శ్రీనివాస్, వైదిక కమిటీ సభ్యులు ఆంజనేయ ఘనాపాటి, శ్రీధర్శర్మ తదితరులు పాల్గొన్నారు. దుర్గ గుడి ఈవో శీనానాయక్ కార్తిక మాసం, భవానీ దీక్ష విరమణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష -
మీకోసంలో 32 ఫిర్యాదులు
కోనేరుసెంటర్: మీకోసం కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిష్కరిస్తామని జిల్లా అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన మీకోసంలో పాల్గొన్న ఆయన బాధితుల నుంచి అర్జీలు అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మీకోసంలో వచ్చిన ప్రతి ఫిర్యాదును చట్టపరిధిలో విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేస్తామన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల సమస్యలను ఆయన సావధానంగా ఆలకించారు. కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని ఫిర్యాదులను సంబంధిత అధికారులకు ఫోన్లో సిఫార్సు చేశారు. -
సారూ...మా కాలనీ రోడ్లు బాగు చేయండి!
జి.కొండూరు: ‘‘సారూ...మా కాలనీలో రోడ్లు అధ్వానంగా మారి కాలు బయట పెట్టలేకపోతున్నాం. మురుగునీరు పోయే దారిలేక ఇళ్ల మధ్యలోనే నిలుస్తున్నాయి. ఈగలు, దోమలతో నరకయాతన పడుతున్నాం’’ అంటూ జి.కొండూరు జగనన్న కాలనీ వాసులు కలెక్టర్ లక్ష్మీశ వద్ద సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణం పూర్తయిన లబ్ధిదారులకు కీస్ హ్యాండోవర్ ప్రోగ్రాం నిర్వహణ కోసం జి.కొండూరు జగనన్న కాలనీని కలెక్టర్ లక్ష్మీశ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీలో మహిళలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని తమ సమస్యలను కలెక్టర్ వద్ద ఏకరువు పెట్టారు. వర్షం పడితే బయటకు రావాలంటే నరకం కనపడుతోందని, రోడ్లు బురదతో అధ్వానంగా ఉండడంతో పాఠశాల బస్సులు కాలనీలోకి రావడం లేదని వాపోయారు. జాతీయ రహదారి వరకు బురదలో నడిచి వెళ్లి పిల్లలను బస్సులు ఎక్కించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల మధ్యలో మురుగునీరు నిలిచి ఈగలు, దోమలతో రోగాల బారిన పడుతున్నామని వాపోయారు. గ్రామ పంచాయతీ అధికారులు కరెంటు మీటర్ల ఏర్పాటుకు డబ్బులు చెల్లించలేదని, వీధి లైట్లు, పంచాయతీ బోర్లకు విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాని నిలిపివేస్తున్నారని కలెక్టర్కు తెలిపారు. అసలే ఊరికి దూరంగా ఉన్న కాలనీకి వీధిలైట్లు లేకపోతే రాత్రి సమయంలో మహిళలు బయటకు ఎలా రావాలని ప్రశ్నించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యుత్ సరఫరా నిలిపివేతపై విచారణ జరిపి సమస్య పరిష్కరిస్తామన్నారు. కాలనీలో సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతాయని, ఓపిక పట్టాలని చెప్పారు. కార్యక్రమంలో హౌసింగ్, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు. జగనన్న కాలనీలో రహదారులు బాగు చేయాలని కలెక్టర్కు వినతి -
విద్యార్థులను కొట్టిన ఘటనపై ఎంపీడీఓ విచారణ
కిలేశపురం(ఇబ్రహీంపట్నం): కిలేశపురం ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులపై టీచర్ దాడి చేసిన ఘటనపై ఎంపీడీవో శకుంతల విచారణ చేపట్టారు. ఈనెల 11న ‘విద్యార్థులను చితకబాదిన టీచర్’ కథనం ‘సాక్షి’లో వెలువడింది. ఇందుకు స్పందించిన ఎంపీడీఓ సోమవారం పాఠశాలలో విచారించారు. విద్యార్థులను పిలిపించి టీచర్ కొట్టిన అంశంపై ఆరా తీశారు. టీచర్ చెప్పిన మాట వినలేదని లావు కర్రతో అందరినీ కొట్టిందని ఎంపీడీవోకు విద్యార్థులు తెలిపారు. ఆరోజు తరగతి గదిలో జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్లు విద్యార్థులు వెల్లడించారు. విద్యార్థులను కొట్టిన ఉపాధ్యాయురాలు రజని మాత్రం తాను కొట్టలేదని, పిల్లలు చెప్పేది అంతా అబద్ధమని చెప్పారు. దెబ్బలు తిన్న విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి, టీసీలు తీసుకోవద్దని పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని ఎంపీడీవో సూచించారు. పీజీఆర్ఎస్లో పెట్టిన ఫిర్యాదుపై మరో విచారణ జరగాల్సి ఉంది. ఎంఈఓ సీహెచ్ పుష్పలత, హెచ్ఎం బేబీరాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ఎంతో మేలు
చిలకలపూడి(మచిలీపట్నం): కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ఎంతో మేలు జరిగిందని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం జెడ్పీ కన్వెన్షన్ హాలులో వాణిజ్య పన్నులశాఖ ఆధ్వర్యంలో షాపింగ్ ఫెస్టివల్ను కలెక్టర్ డీకే బాలాజీ, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం కన్వెన్షన్ హాలులో ఏర్పాటుచేసిన వ్యాపారస్తుల ప్రదర్శనను సంద ర్శించి ధరల వివరాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపుతో పన్నుల భారం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగిందన్నారు. 2014లో ఒకే దేశం ఒకే పన్ను విధానంతో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ అమలు చేసిందని, ఈ విధానంలో కేంద్ర ప్రభుత్వమే పన్నులు వసూలు చేసి రాష్ట్రాలకు వాటాను పంపిణీ చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీఎస్టీ తగ్గింపుతో రూ.8 వేల కోట్ల ఆదాయం తగ్గిపోతున్నప్పటికీ ప్రజల కోసం తగ్గింపు ధరలను అమలు చేస్తున్నామన్నారు. వ్యవసాయ పరికరాలపై కూడా భారీగా ధరలు తగ్గాయన్నారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ ప్రతి సామాన్యుడు ఆనందకరమైన జీవనాన్ని గడపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జీఎస్టీ తగ్గించిందన్నారు. కార్య క్రమంలో జీఎస్టీ ప్రచార కమిటీ జిల్లా కో–ఆర్డినేటర్ కల్పన, అడిషనల్ కమిషనర్ బాబ్జిబాబు, సీఈవో కన్నమనాయుడు, డెప్యూటీ సీఈవో ఆనందకుమార్, మెప్మా పీడీ సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర -
● జంక్షన్ జలమయం
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో హనుమాన్జంక్షన్లో రహదారులు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమై సుమారు మూడు గంటల పాటు కుండపోత వర్షం కురిసింది. హనుమాన్జంక్షన్ ప్రధాన కూడలిలో వర్షపు నీరు నిలవటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నూజివీడు రోడ్డు, గుడివాడ రోడ్డులో డ్రెయినేజీ పొంగిపొర్లటంతో దుకాణాల్లోకి నీళ్లు వచ్చాయి. విజయవాడ రోడ్డులో వేలేరు క్రాస్రోడ్డు నుంచి పాల శీతల కేంద్రం వరకు రహదారి కాలువను తలపించింది. బాపులపాడు, మహాత్మగాంధీ నగర్, తారకరామ కాలనీ, బండారుగూడెం, పెరికీడు గ్రామాల్లోనూ అంతర్గత రహదారులన్నీ జలమయమయ్యాయి. –హనుమాన్జంక్షన్ రూరల్ -
అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజల నుంచి వచ్చే అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో, నాణ్యంగా పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ – కోసం) కార్యక్రమం జరిగింది. కలెక్టర్ బాలాజీతో పాటు జేసీ ఎం.నవీన్, డీఆర్వో చంద్రశేఖరరావు, కేఆర్ఆర్సీ ఎస్డీసీ శ్రీదేవి, ఆర్డీఓ స్వాతి, హౌసింగ్ పీడీ పోతురాజు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. తొలుత కలెక్టర్ మాట్లాడుతూ.. కొంత మంది జిల్లా అధికారులు అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. సకాలంలో పరిష్క రించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించేందుకు కలెక్టరేట్లో నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని అధికారులు, సిబ్బందికి గాజు సీసాలతో తాగునీటిని సరఫరా చేస్తామన్నారు. జేసీ నవీన్ మాట్లాడుతూ.. గత నెల మూడో శుక్రవారం ఉద్యోగుల సమస్యలపై నిర్వహించిన కార్యక్రమంలో వచ్చిన 22 అర్జీలకు సంబంధించి తీసుకున్న చర్యల నివేదికలను వెంటనే అందజేయాలని కోరారు. మీ–కోసంలో అధికారులు 109 అర్జీలు స్వీకరించారు. ముఖ్యమైన అర్జీలు ఇవీ.. -
నకిలీ మద్యాన్ని అరికట్టాలి
రాష్ట్రంలో నకిలీ మద్యం యథేచ్ఛగా తయారవు తోంది. మద్యాన్ని ప్రభుత్వం ఆదాయ వనరుగా చూస్తోంది. రాష్ట్ర రాజధాని అమరావతికి దగ్గరలోనే నకిలీ మద్యం తయారీ మూలాలను గుర్తించడం గమనార్హం. కల్తీ మద్యం తయారీదారులపై కూటమి ప్రభుత్వం స్పందించి కఠిన చర్యలు తీసుకో వాలి. మద్యం కల్తీని రూపుమాపేలా ఆ చర్యలు ఉండాలి. – రాజులపాటి పార్వతి, జెడ్పిటీసీ, మొవ్వ, కృష్ణాజిల్లా -
ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ
చిలకలపూడి(మచిలీపట్నం): మహిళల కోసం ఉచితంగా ఏర్పాటు చేసిన రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డి.కె.బాలాజీ సూచించారు. ప్రభుత్వ వైద్యకళాశాల, సర్వజన ఆస్పత్రి సంయుక్త ఆధ్వ ర్యంలో రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల శిబిరాన్ని ఆయన సోమవారం వీడియోకాన్ఫరెన్స్ హాలులో ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలు ఆల్ట్రాసౌండ్, మామో గ్రామ్ వంటి పరీక్షల కోసం రూ.వేలు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. కలెక్టరేట్లో ఉచితంగా ఈ పరీక్షలు చేస్తామని తెలిపారు. ఈ వైద్య పరీక్షలు ప్రతి సోమవారం, గురువారం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చేస్తా రని పేర్కొన్నారు. ప్రతి మంగళ, శుక్రవారం క్షేత్రస్థాయిలో సంచార వాహనం ద్వారా వైద్య పరీక్షలు చేస్తారని వివరించారు. పరీక్షలు చేయించుకున్న వారి వివరాలను రహస్యంగా ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, కలెక్టరేట్ ఏఓ రాధిక, వైద్యులు బి.పద్మావతి, ఇంద్రజ, రేడియాలజిస్ట్ అంజన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఎకై ్సజ్ కార్యాలయాల వద్ద నిరసన తెలిపిన వైఎస్సార్ సీపీ నాయకులు
చిలకలపూడి(మచిలీపట్నం): కూటమి ప్రభుత్వ హయాంలో జోరుగా సాగుతున్న నకిలీ మద్యం తయారీపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన నిరసన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన కనిపించింది. గ్రామాల్లో వీధివీధినా బెల్టు షాపుల ఏర్పాటు, నకిలీ మద్యం తయారీ, విక్రయాలపై మహిళలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎకై ్సజ్ కార్యాలయాల వద్ద వైఎస్సార్ సీపీ శ్రేణులు సోమవారం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నిరసనలతో పాటు నినాదాలతో హోరెత్తించారు. నకిలీ, కల్తీ మద్యం ద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొ ద్దని కూటమి ప్రభుత్వంపై మహిళలు తీవ్రస్థాయిలో ధ్యజమెత్తారు. టీడీపీ నేతల కనుసన్నల్లోనే నకిలీ మద్యం తయారు చేసి నేరుగా హోటళ్లు, దాబాలు, బెల్టుషాపులు, రోడ్ల పక్కన బడ్డీకొట్లలో సైతం విక్ర యాలు చేపట్టడం దారుణమన్నారు. నకిలీ మద్యం తయారీని ఒక కుటీర పరిశ్రమగా తయారుచేసి ప్రోత్సహిస్తున్నారని, కల్తీ మద్యంతో పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. నకిలీ మద్యం ద్వారా కూటమి నాయకులు రూ.కోట్లు గడిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. కల్తీ మద్యం వల్ల ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని, చాలా మంది అనారోగ్యం పాలయ్యారని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికై నా నకిలీ మద్యం తయారీపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని, మహిళల తాళిబొట్లు తెంచొద్దని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు కృష్ణా జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) సూచనలతో ఎకై ్సజ్ శాఖ కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు జరిగాయి. -
ప్రజల రక్తాన్ని పీల్చేస్తున్నారు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వీధి వీధినా బెల్టుషాపులు ఎక్కువయ్యాయి. ప్రభుత్వం మద్యాన్ని ఆదాయంగా ఎంచుకుంది. పాలకులు ప్రజల రక్తాన్ని పీల్చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల సహకారం లేకుండా కల్తీ మద్యం సరఫరా జరగదు. ప్రభుత్వ సహకారంతో కొందరు పెద్దలు ప్రజల సొమ్మును అడ్డదారిలో దోచేస్తున్నారు. – గుర్రం కుమారి, ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు, కంకిపాడు, కృష్ణాజిల్లా -
ఏపీ పోలీసులపై మరోసారి హైకోర్టు సీరియస్
సాక్షి,విజయవాడ: పోలీసులపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పరకామణిలో చోరీ కేసుకు సంబంధించి రికార్డులు సీజ్ చేయాలని ఇచ్చిన ఆదేశాలను సీఐడీ అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా పోలీసులపై హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. పోలీసు శాఖను మూసేయాలి. డీజీపీ నిద్రపోతున్నారా?. కోర్టు ఆదేశాన్ని అమలు చేయడం తెలీదా అంటూ ధ్వజమెత్తింది. పరకామణి వ్యవహారంలో నిందితులకు సహకరిస్తున్నారని మండిపడింది.ఇప్పటికే నిందితులు సాక్షాలను తారుమారు చేసే ఉంటారు. అయినా మీరు చోద్యం చేస్తున్నారంటూ హైకోర్టు విమర్శలు గుప్పించింది. ఈ కేసులో మీ నిర్లక్ష్యం చాలా విషయాలు చెబుతోంది. మీకు నిజాయితీ ఉండి ఉంటే వెంటనే కోర్టుకు వచ్చేవాళ్లు.సీఐడీలో ఐజీ ర్యాంకు అధికారి లేకుంటే.. మరో అధికారితో పనిచేయించుకోవచ్చుగా? మేము కేవలం రికార్డులను సీజ్ మాత్రమే కదా ఆదేశించింది. ఆ ఆదేశాలను అమలు చేసే వారెవరు సీఐడీలో లేరా?.ఈ నిర్లక్ష్యానికి డీజీపీనే మేం నిందించాలి. పోలీసుల తీరుపై అసంతృప్తిగా ఉన్నామంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
‘కొల్లు కాదు.. సొల్లు రవీంద్ర.. టీడీపీ కార్యకర్తలే నిన్ను తంతారు’
సాక్షి, కృష్ణా: మంత్రి కొల్లు రవీంద్రపై మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) సెటైరికల్ కామెంట్స్ చేశారు. మంత్రి రవీంద్ర(Kollu Ravindra) ఇంటి పేరు కొల్లు కాకుండా సొల్లు అని పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. టీడీపీ(TDP) కార్యకర్తలు తాళ్లతో కట్టేశాడని ఆయన అనుకుంటున్నాడు.. గన్మెన్లు లేకపోతే కార్యకర్తలే తిరగబడి దాడి చేస్తారని అన్నారు. కల్తీ మద్యం కారణంగా కుటుంబాలు రగిలిపోతున్నాయని చెప్పుకొచ్చారు.కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో కల్తీ మద్యం కారణంగా అమాయక ప్రజలు తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు అని ఎక్సైజ్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనల్లో మాజీ మంత్రి పేర్ని నాని, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ..‘సారా మంత్రి అంటాడు.. మేము నాణ్యమైన మందు అమ్ముతున్నాం. దాని కోసం ఒక యాప్ కూడా తీసుకొచ్చామని చెబుతాడు. కొన్న వెంటనే స్కాన్ చేసి పరిశీలించుకోండి అని అంటున్నాడు. ఆ సమయంలో పేదవారు, టచ్ ఫోన్ లేని వారి పరిస్థితి ఏంటి?. కల్తీ మద్యం తాగే వారికి కూడా కుటుంబం ఉంటుంది. మద్యం తాగకూడదు అని చెప్పాలి. ఒక వేళ మద్యం తాగకుండా ఉండలేకపోతే నాణ్యమైన మద్యం అయినా ఇవ్వాలి.రాష్ట్రంలో మంచి నీటికైనా కరువు వచ్చిందోమో కానీ మద్యానికి మాత్రం కరువు రాలేదు. ప్రతి గల్లీలో ఎటుచూసినా, ఎక్కడ చూసినా మద్యం అమ్మకాలే కనిపిస్తున్నాయి. దయచేసి కల్తీ మందు జోలికి వెళ్లొద్దు. మద్యాన్ని నిమంత్రించకుండా విచ్చలవిడిగా మద్యాన్ని అందిస్తున్న ఈ సారా మంత్రిని బర్తరఫ్ చేయాలి. మంత్రి రవీంద్ర ఇంటి పేరు కొల్లు కాకుండా సొల్లు అని మార్చుకోవాలి. టీడీపీ కార్యకర్తలను తాళ్లతో కట్టేశావు కాబట్టి ఆగారు అని నువ్వు అనుకుంటున్నావు. టీడీపీ కార్యకర్తలను తాళ్లతో కట్టేసి ఒక కత్తి ఇచ్చి చూడు.. నువ్వు కట్టిన తాళ్లను పరాపరా తెంపేసి వాళ్ళు నిన్ను తిరగబడి తన్నకపోతే చూడు. నీ గన్మెన్లు ఉన్నా నిన్ను టీడీపీ కార్యకర్తలు నిన్ను కొట్టకపోతే నన్ను అడుగు. కడుపు రగిలిపోయి సచ్చిపోతున్నారు.. అల్లాడి ఏడుస్తున్నారు’ అని వ్యాఖ్యలు చేశారు. -
ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఘరానా మోసం!
ఎన్టీఆర్ జిల్లా: సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్కళ్యాణ్తో పరిచయాలు ఉన్నాయని, ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి పలువురి వద్ద భారీగా నగదు వసూలు చేసిన ఘరానా మోసగాడి ఉదంతం ఆదివారం వెలుగుచూసింది. ఉద్యోగాలు అయినా ఇప్పించండి, నగదు అయినా ఇవ్వండి అని బాధితులు మోసగాడిని నిలదీయడంతో వారిపైనే ఎస్సీ ఎస్టీ కేసు పెడతానని బెదిరించడంతో బాధితులు పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.... యూ ట్యూబర్ కావడి కృష్ణ గతంలో ఇబ్రహీంపట్నంలో ఉన్నాడు. ప్రస్తుతం అమరావతి సచివాలయం ప్రాంతంలో నివశిస్తున్నాడు. సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, పలువురు మంత్రులు, పోలీస్ అధికారులతో దిగిన ఫొటోలు, బొకేలు అందించే ఫొటోలు చూపించి ఉద్యోగాలు ఇప్పిస్తానని 9 మందిని మాయలో పడేశాడు. వారి వద్ద సుమారు రూ.40 లక్షలు వరకు వసూలు చేశాడు. స్టేషన్కు వచ్చిన ఐదుగురి బాధితులు రూ.10.50 లక్షలు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. నగదు అడుగుతుంటే నా వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారని, ఎస్సీ ఎస్టీ కేసులు పెడతానని బెదిరిస్తున్నట్లు వారు వాపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
బ్రాహ్మణ వివాహ సమాచార కేంద్రం సేవలు శ్లాఘనీయం
తెనాలి: ఆంధ్రాప్యారిస్ తెనాలిలో నిర్వహిస్తున్న బ్రాహ్మణ ఉచిత వివాహ సమాచార కేంద్రం సేవలు శ్లాఘనీయమని రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు కామేశ్వర ప్రసాద్ అన్నారు. స్థానిక నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ కళాసదనంలో ఆదివారం 15వ రాష్ట్రస్థాయి బ్రాహ్మణ వధూవరుల పరిచయవేదిక జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన సమావేశానికి సంఘ అధ్యక్షుడు దక్షిణామూర్తి అధ్యక్షత వహించారు. ఐదు రాష్ట్రాల్నుంచి 750 కుటుంబాలవారు పాల్గొన్నారు. ముఖ్యఅతిథి కామేశ్వరప్రసాద్ వివాహవేదిక సమాచార పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. శాఖ భేదాన్ని చూడకుండా వివాహాలు జరుపుకోవాలని హితవు పలికారు. రాష్ట్రస్థాయిలో 15 పర్యాయాలు పరిచయ వేదికను తెనాలిలో నిర్వహించటం గొప్పగా ఉందన్నారు. సంఘ అధ్యక్షుడు దక్షిణామూర్తి మాట్లాడుతూ వైష్ణవి కేటరర్స్ హైదరాబాద్, బ్రాహ్మణ పరిషత్, వివిధ బ్రాహ్మణ సంఘాలు, అర్చక సంఘాల సహకారంతో నిర్వహించినట్టు తెలిపారు. వివిధ విభాగాల ద్వారా బ్రాహ్మణులకు, బ్రాహ్మణ సంఘాలకు సేవలు అందిస్తున్న ప్రముఖులను సత్కరించారు. హరిప్రసాద్, ఉమాదేవి, జయలక్ష్మి, విశ్వనాథం తదితరులున్నారు.ఐదు రాష్టాల్నుంచి 750 కుటుంబాలు హాజరుకావటం విశేషం! 15వ రాష్ట్రస్థాయి బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదికలో రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు కామేశ్వర ప్రసాద్ -
దుర్గగుడిలో బాలుడి కిడ్నాప్ కలకలం!
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): తప్పిపోయిన బాలుడిని ఎవరో గుర్తుతెలియని యువకులు కిడ్నాప్ చేశారంటూ దుర్గగుడిలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే చివరకు బాలుడిని ఎవరు కిడ్నాప్ చేయలేదని, తప్పిపోయిన బాలుడిని తల్లికి అప్పగించినట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఈ ఘటన ఇంద్రకీలాద్రిపై ఆదివారం చోటు చేసుకుంది. జగ్గయ్యపేటకు చెందిన లావణ్య తన కుమారుడైన శశి వజ్ర ఆరూష్, మరి కొంత మంది బంధువులతో కలిసి అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. మహా నివేదనకు ముందు బాలుడు తప్పిపోగా, తల్లి కుటుంబ సభ్యులు మైక్ ద్వారా ప్రచారం చేయించారు. అయితే మహా మండపం లిప్టు వద్ద ఆ బాలుడిని ఇద్దరు యువకులు బలవంతంగా తీసుకెళుతుండగా ఫైర్ డిపార్ట్మెంట్ ఏఎస్ఐ ఆర్వీ.సత్యనారాయణ గుర్తించి ప్రశ్నించారు. దీంతో ఆ ఇద్దరు బాలుడిని వదిలి పారిపోయారు. దీంతో ఆ బాలుడిని తీసుకుని సత్యనారాయణ నేరుగా ఈవో చాంబర్కు వెళ్లి శీనానాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణకు విషయం తెలియజేశారు. అయితే దర్శనానికి వచ్చిన బాలుడిని కిడ్నాప్ చేశారంటూ ఆలయంలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో అందరూ ఒక సారిగా ఉలిక్కిపడ్డారు. క్యూలైన్లో ఉన్న భక్తులు తమ బిడ్డలు పక్కనే ఉన్నారో లేదో పరిశీలించుకున్నారు. కొంత సమయం తర్వాత బాలుడిని ఎవరు కిడ్నాప్ చేయలేదని, తప్పిపోయిన బాలుడిని తల్లికి అప్పగించామంటూ ఆలయ అధికారులు ప్రకటించారు. దీంతో భక్తుందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కార్మికుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటాలు నిర్వహిస్తున్న సీఐటీయూ 12వ జిల్లా మహాసభలు కొండపల్లి ఎన్టీటీపీఎస్ బి కాలనీ ఆడిటోరియంలో ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజులు పాటు జరగనున్న మహాసభల్లో తొలిరోజు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిల్లి నరసింహారావు పతాక ఆవిష్కరణ చేశారు. డేవిడ్ చిత్రపటానికి సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు అజయ్ కుమార్ నివాళులర్పించారు. అనంతరం సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలపై చర్చించారు. భవిష్యత్తులో కార్మిక వ్యతిరేక విధానాలపై పెద్దఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎ.వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎన్సీహెచ్ శ్రీనివాస్, ఆహ్వాన సంఘం అధ్యక్షుడు మామిడి శీతారామారావు, కార్యదర్శి యం.మహేష్, కోశాధికారి వాసుదేవన్, జేవీవీ జిల్లా అధ్యక్షుడు వెనిగళ్ళ మురళీమోహన్, ఉపాధ్యక్షుడు కాశీనాథ్, ఎన్సీహెచ్ సుప్రజ, మైలవరం కార్యదర్శి సుధాకర్, ఇర్ల కొండలరావు పాల్గొన్నారు. సీఐటీయూ 12వ జిల్లా మహాసభలు ప్రారంభం -
డిసెంబర్లో యోగా చాంపియన్షిప్ పోటీలు
మొగల్రాజపురం/పటమట:(విజయవాడ తూర్పు): డిసెంబర్ 12, 13, 14 తేదీల్లో అనంతపురం జిల్లాలో 6వ యోగాసన చాంపియన్ షిప్ 2025–26 (సబ్ జూనియర్స్) రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్ చెప్పారు. స్థానిక టీచర్స్ కాలనీలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆదివారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఈ పోటీలకు వివిధ జిల్లాల నుంచి ఎంపికై న 10 నుంచి 14 సంవత్సరాల లోపు బాల బాలికలు హాజరవుతారని చెప్పారు. ప్రతిభ చూపిన క్రీడాకారులు జనవరి 5, 6, 7, 8 తేదీల్లో మహారాష్ట్రలో జరిగే జాతీయస్థాయి పోటీలకు వెళతారని తెలిపారు. గత నెల 28, 29, 30 అక్టోబర్ 1 తేదీల్లో విజయవాడ సిద్దార్థ ఆడిటోరియంలో జరిగిన 6వ జాతీయ యోగాసనా చాంపియన్షిప్ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను సత్కరించారు. హ్యాండ్ బ్యాలెన్స్ ఆసనాల్లో మహిళా విభాగంలో నెల్లూరుకు చెందిన పి.ప్రసూనకు స్వర్ణం, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఎ.సుజాతకు రజిత పతకం దక్కిందని చెప్పారు. 2032లో జరిగే కామన్వెల్త్ గేమ్స్, 2036లో జరిగే ఒలింపింక్ గేమ్స్లో ఏపీ నుంచి క్రీడాకారులను పంపి స్వర్ణ పతకాలు సాధించడమే లక్ష్యంగా తమ అసోసియేషన్ పనిచేస్తుందని వెల్లడించారు. ఏపీ యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎ.రాధిక, ప్రధాన కార్యదర్శి పి.ప్రేమ్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కొంగర సాయి, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.దుర్గారావు, మేనేజర్ బెనర్జీ పాల్గొన్నారు. నేటి నుంచి యోగా పోటీలు... ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు పోలీస్ నేషనల్ యోగాసన పోటీలు– 2025–26 అమరావతిలో విట్ యూనివర్శిటీలో జరుగుతాని వెంకట రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. ఈ గేమ్స్ను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చేతుల మీదుగా సోమవారం ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఇందులో యోగాసనా భారత్ , యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున న్యాయనిర్ణేతలు, టెక్నికల్ ఆఫీషియల్స్ను పంపించి మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు వెంకట రామకృష్ణ ప్రసాద్ -
అద్వితీయ ఉపాధ్యాయుల కార్ఖానా అవనిగడ్డ
అవనిగడ్డ:అద్వితీయ ఉపాధ్యాయులను తయారుచేసే కార్ఖానాగా అవనిగడ్డ ప్రత్యేక గుర్తింపు సాధించిందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో డీఎస్సీ శిక్షణ ద్వారా విద్యారంగ చరిత్రలో అవనిగడ్డ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుందని తెలిపారు. ఆదివారం అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో నియోజకవర్గ మెగా డీఎస్సీ–2025 ఉపాధ్యాయులు 275 మందికి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్ది దేశానికి ఉత్తమ పౌరులను అందించాలని పిలుపునిచ్చారు. సమాజాన్ని తీర్చిదిద్దే మహోన్నత వృత్తిలో అడుగుపెడుతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో 1208 మంది ఉద్యోగాలు సాధిస్తే అవనిగడ్డ నియోజకవర్గంలోనే 275 మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించటం గర్వకారణం అన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి పీవీజే రామారావు మాట్లాడతూ డీఎస్సీ ఉపాధ్యాయులకు దీపావళి ముందే వచ్చిందన్నారు. ఎన్నొ నిద్రలేని రాత్రులు గడిపి ఏళ్ళ తరబడి శ్రమించి టీచర్ పోస్టులు సాధించిన వారు అదృష్టవంతులు అన్నారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షుడు మండలి వెంకట్రామ్, ప్రగతి డీఎస్సీ కోచింగ్ సెంటర్ చైర్మన్ పూర్ణచంద్రరావు, విద్యానికేతన్ డీఎస్సీ కోచింగ్ సెంటర్ చైర్మన్ పండ్రాజు లంకమ్మ ప్రసాద్, ఎంఈఓలు, జీఎన్బీ గోపాల్, టీవీఎం రామదాసు, శివశంకర్, నాంచారయ్య, శ్రీకాంత్, అన్నపరెడ్డి పిచ్చయ్య, పి.వెంకటేశ్వరరావు, ఏవీ రమణ, మోమిన్, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.కనకారావు, డీపీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు జీవీఎస్ పెరుమాళ్ళు, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివరావు, పీఆర్టీయూ జిల్లా నాయకులు వి.వి.ఎస్.ఆర్.వర్మ తదితరులు పాల్గొన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం
ఇబ్రహీంపట్నం: వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన మండలంలోని కాచవరం గ్రామంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పరిసర గ్రామాల్లో యాచక వృత్తి చేసుకునే వ్యక్తి కాచవరం కరుణా హెల్త్ సెంటర్ సమీపంలో 65 నెంబర్ హైవే దాటుతున్న సమయంలో హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ వైపు వెళుతున్న గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి వయస్సు సుమారు 40 ఏళ్లు ఉంటాయి. ఎత్తు 5.5 అడుగులు, నలుపు రంగు ఫుల్హ్యాండ్ టీషర్ట్, నలుపురంగు ప్యాంటు ధరించి ఉన్నాడు.. వీఆర్వో జయదుర్గ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు స్టేషన్ సీఐ చంద్రశేఖర్, 9440627084, ఎస్ఐ రాజు 98661 14556 ఫోన్ నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. లారీ ఢీకొని ముఠా కార్మికుడు.... గన్నవరం: లారీ ఢీకొని ముఠా కార్మికుడు దుర్మరణం చెందిన ఘటన కొత్తపేట వద్ద చైన్నె–కోల్కత్తా జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. మండలంలోని కొండపావులూరు శివారు ముదిరాజుపాలెం గ్రామానికి చెందిన గోనేపల్లి రాధాకృష్ణ (47) గన్నవరంలో ముఠా కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ముఠా పని నిమిత్తం వెళ్లేందుకు సైకిల్పై కొత్తపేట వద్ద జాతీయ రహదారి దాటుతుండగా విజయవాడ నుంచి ఏలూరు వైపు వేగంగా వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ వెనుక టైర్లు కిందపడి రాధాకృష్ణ తల భాగం నుజ్జునుజ్జు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమారై ఉన్నారు. తూములో ఇరుక్కొని దివ్యాంగుడు... తిరువూరు: పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి చెరువు తూము లాకులు ఎత్తుతుండగా నీటి ఉద్ధృతికి దివ్యాంగ రైతు ఆదివారం మృతి చెందిన సంఘటన ఏకొండూరు మండలం కొండూరు తండాలో జరిగింది. తండాకు చెందిన గిరిజన దివ్యాంగ రైతు భూక్యా గోపయ్య (43) పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి తూము గేటు లాకులు సరిగా లేకపోవడంతో తూములో ఇరుక్కుపోయాడు. ఊపిరాడక తూములోనే గోపయ్య మృతిచెందాడని స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఏకొండూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కుక్క అడ్డురావడంతో... షేర్మహ్మద్పేట(జగ్గయ్యపేట): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. పట్టణానికి చెందిన షేక్ ఇర్ఫాన్ (35) పట్టణం నుంచి ద్విచక్ర వాహనంపై షేర్మహ్మద్పేటకు వెళ్తుండగా మార్గమధ్యంలో కుక్క అడ్డురావటంతో అదుపు తప్పి కిందపడ్డాడు. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలవటంతో గమనించిన స్థానికులు జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చిల్లకల్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షుడిగా మనోహర్నాయుడు
వన్టౌన్(విజయవాడ పశ్చిమ): విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షుడిగా టి.మనోహర్నాయుడు(విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్) ఎన్నికయ్యారు. సొసైటీ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సొసైటీ ఉపాధ్యక్షుడిగా జక్కంపూడి ప్రసాద్(జేపీ పబ్లికేషన్స్), కార్యదర్శిగా కె.లక్ష్మయ్య (ప్రజాశక్తి బుక్హౌస్), సహాయ కార్యదర్శిగా ఎ.బి.ఎస్.సాయిరామ్(సహస్ర బుక్స్), కోశాధికారిగా కొండపల్లి రవి (నవసాహితి బుక్ హౌస్).. సభ్యులుగా జి.లక్ష్మి, గోళ్ల నారాయణరావు, విశ్వేశ్వరరావు, శిరం రామారావు (వీజీఎస్), బి.రవికుమార్, బి.వి.బసవరాజు, కె.శ్రీనివాస్, వి.శ్రీనివాసరావు, ఎన్.ఎస్.నాగిరెడ్డి, పి.సుబ్రహ్మణ్యం, వల్లూరి శివప్రసాద్, కె.సత్యరంజన్, చలపాక ప్రకాష్ ఎన్నికయ్యారు. పల్లవి పబ్లికేషన్స్ అధినేత ఎస్.వెంకటనారాయణ, ఏపీ అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణను ప్రత్యేక ఆహ్వానితులుగా ఎన్నుకున్నారు. -
వైద్యుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి
మధురానగర్(విజయవాడసెంట్రల్): ప్రభుత్వం వెంటనే వైద్యుల సమస్యలు పరిష్కరించి ప్రజలకు సకాలంలో వైద్యం అందించాలని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ అంబటి నాగ రాధాకృష్ణ యాదవ్ డిమాండ్ చేశారు. ముత్యాలంపాడులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు చేపట్టిన సమ్మెను పరిష్కరించటంలో కూటమి ప్రభుత్వం విఫలమయ్యిందన్నారు. దీనివల్ల ప్రతి రోజు లక్షలాది మంది రోగులకు సకాలంలో వైద్యసేవలు అందటం లేదని చెప్పారు. ముఖ్యంగా చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు వైద్యసేవల కోసం ఎక్కువగా తీవ్ర అవస్థలు పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. కల్తీ మద్యంవల్ల అనేక మంది అనారోగ్యంతో మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ వైద్య విభాగం రాష్ట్ర కారయదర్శి డాక్టర్ ఎం.ప్రభుదాస్ మాట్లాడుతూ ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం స్పందించి వైద్యుల సమ్మె పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. డాక్టర్ అంబటి నాగ రాధాకృష్ణ యాదవ్ -
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
మంగళగిరి టౌన్: మంగళగిరిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నేపాల్ దేశానికి చెందిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు గుంటూరు జిల్లా పెదకాకాని సమీపంలో వున్న ఓ బార్లో సుమారు సంవత్సరం నుంచి నేపాల్కు చెందిన మనోజ్ బిస్తా (26), రాకేష్ (34) పనిచేస్తున్నారు. భ్రమరాంబపురం కాలనీలో ఓ రూమ్ తీసుకుని ఇద్దరూ అద్దెకు ఉంటూ ప్రతిరోజూ విధులకు వెళ్లివస్తుంటారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి 12 గంటలకు విధులను ముగించుకుని యజమాని దగ్గర నుంచి స్కూటీ తీసుకుని వెళ్లారు. తిరిగి వెళ్లే క్రమంలో ఆదివారం తెల్లవారుజామున 4.30 సమయంలో జాతీయ రహదారిపై విజయవాడ వైపు వెళుతుండగా మంగళగిరి వద్ద వెనుక నుంచి ఓ వాహనం ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు రోడ్డుమధ్యలో పడిపోయారు. అదేసమయంలో వెనుక నుంచి ఓ బస్సు వారిపై నుంచి వెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సమీపంలో వున్న ఓ వ్యక్తి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న మంగళగిరి పట్టణ ఎస్ఐ రవీంద్రనాయక్ మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం మంగళగిరి ఎయిమ్స్కు తరలించి మృతుల వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో మనోజ్ బిస్తా (26) యువకుడికి తల్లిదండ్రులు లేరని, 10 సంవత్సరాల నుంచి గుంటూరు నగరంలో వివిధ బార్లలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. నేపాల్లోని సౌరన ప్రస్తకీర్ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకుల్లో రాకేష్ (34)కు తండ్రి లేడని, అమ్మ, చెల్లి మాత్రమే ఉన్నారని, ఇతను గత సంవత్సర కాలం నుంచి బార్లో పనిచేస్తున్నాడని ఇద్దరూ రూమ్లో అద్దెకు ఉంటూ పెదకాకాని గోల్డెన్ బార్లో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాకేష్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని పేర్కొన్నారు.గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు నేపాల్ యువకులు మృతి -
కారు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు
మూలపాడు(ఇబ్రహీంపట్నం):అతివేగంగా దూసుకొచ్చిన కారు బైక్ను ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్రమైన గాయాలయ్యాయి. మండలంలోని మూలపాడు గ్రామం వద్ద 65వ నెంబర్ జాతీయ రహదారిపై ఈప్రమాదం ఆదివారం చోటుచేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు... కంచికచర్లకు చెందిన ఐలపోగు కాటయ్య, తిరుపతిరావు కలసి నున్న గ్రామంలో పాలాలకు సరిహద్దు రాళ్లు పాతే పనులకు వెళ్లారు. పనులు పూర్తిచేసుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో మూలపాడు వద్దకు చేరుకునే సమయానికి విజయవాడ వైపు నుంచి దూసుకొచ్చిన కారు వెనుక వైపు నుంచి బైక్ను ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఐలపోగు కాటయ్యకు తలకు గాయమవడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. 108 వాహన సిబ్బంది బాధితులను విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషయంగా మారడంతో సమీపంలోని ఓప్రైవేట్ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఢీకొట్టిన కారు ఆపకుండా వెళ్లిపోయింది. సంఘటనా స్థలానికి చేరిన ఎస్ఐ రాజు బాధితులు, కారు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
బలవన్మరణానికి అనుమతించండి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ‘నేను ఏ తప్పూ చేయకపోయినా సస్పెండ్ చేశారు. చేయని తప్పునకు 12 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నా. నాపై మోపిన అభియోగం రుజువు కాలేదు. అయినా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ప్రస్తుత ప్రభుత్వం వేధిస్తోంది. నేను బతికి ఉండగా పెన్షన్ వస్తుందో, రాదో? ఇక ఈ బాధలు పడలేను. బలవన్మరణానికి అనుమతివ్వండి’ అంటూ ఓ విశ్రాంత ఉద్యోగి.. రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి దరఖాస్తు చేసుకున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఆదివారం విజయవాడలో మీడియాకు వివరించారు.2023లో ఉద్యోగ విరమణ..కాకినాడ జిల్లా కందరాడకు చెందిన పి.వి.వి.ఎస్.ఎస్.మూర్తి 2007 నుంచి 2011 వరకు ఆ గ్రామ వీఆర్వోగా పనిచేశారు. ఆ తర్వాత సీనియర్ అసిస్టెంట్గా ఉద్యోగోన్నతి పొందారు. 2023 ఆగస్టులో ఉద్యోగ విరమణ చేశారు. కాగా, 2011లో రైతులకు ప్రభుత్వం ఇచ్చిన ఇన్పుట్ సబ్సిడీలో మూర్తి అవకతవకలకు పాల్పడ్డారంటూ కలెక్టర్కు తహసీల్దార్ నివేదిక పంపారు. ఎలాంటి విచారణ చేపట్ట కుండా 2013లో మూర్తిని సస్పెండ్ చేశారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ మూర్తి అనేకసార్లు అప్పటి, ఆ తర్వాతి ప్రభుత్వానికి విజ్ఞాపనలు చేసుకున్నారు.నిరాధారమని తేల్చినా..గత ప్రభుత్వంలో విచారణ జరిపి.. అతనిపై మోపిన అభియోగాలు నిరాధారమని విచారణాధికారి తేల్చారు. ఈ నివేదిక పంపి దాదాపు రెండేళ్లు అవుతోంది. అయినా పూర్తి పెన్షన్ మంజూరవ్వలేదు. కోర్టును ఆశ్రయించగా.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలంటూ 9 నెలల క్రితం ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలను ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయలేదు. దీంతో తాను మానసికంగా కుంగిపోయానని.. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నానని మూర్తి కన్నీరుపెట్టుకున్నారు. ప్రభుత్వ తీరుతో విసిగిపోయానని.. అందుకే బలవన్మరణం కోసం రాష్ట్రపత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. -
తూర్పు కాపులందరికీ ఓబీసీ వర్తింపజేయాలి
కృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర మినహా అన్ని జిల్లాల్లో నివసిస్తున్న తూర్పు కాపులందరికీ ఓబీసీ రిజర్వేషన్లు వర్తింపజేయాలని ఆలిండియా తూర్పుకాపు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ గవర్నర్పేట, రాఘవయ్య పార్కు సమీపంలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఆలిండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా చంద్రమోహన్ మాట్లాడుతూ ప్రాంతం మారినంత మాత్రాన కులం మారదని, తూర్పు కాపులందరికీ ఓబీసీ రిజర్వేషన్ అమలయ్యేలా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో తూర్పు కాపులకు ప్రాధాన్యం కల్పించాలని కోరారు. అనంతరం ఆలిండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం, ఏపీ తూర్పు కాపు సంక్షేమ సంఘం, ఏపీ తూర్పు కాపు జాయింట్ యాక్షన్ కమిటీలకు నూతన కార్యవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జాతీయ అధ్యక్షుడిగా చంద్రమోహన్, రాష్ట్ర అధ్యక్షుడిగా ఆకుల అప్పల సూరినాయుడు, జేఏసీ రాష్ట్ర చైర్మన్గా గిరడా అప్పలస్వామి ఎన్నికయ్యారు. 17 జిల్లాలకు జిల్లా అధ్యక్షులను, రాష్ట్ర మహిళా విభాగాన్ని, యువజన విభాగాలను ఎన్నుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా విజయవాడకు చెందిన మహంతి వాసుదేవరావును ఎన్నుకున్నారు. జాతీయ గౌరవాధ్యక్షుడు పి.గిరీశ్వరావు, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఆనెపు రామకృష్ణ, చంద్రరావు, ఉమామహేశ్వరరావు, బలగ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడ చరిత్రను ప్రపంచానికి తెలియజేద్దాం
హెరిటేజ్ వాక్ ప్రారంభోత్సవంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): విజయవాడ చరిత్రను ఇక్కడి యువత తెలుసుకోవడంతో పాటుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ప్రపంచానికి తెలిసేలా చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఇన్టాచ్) ఆధ్వర్యంలో హెరిటేజ్ వాక్ నగరంలో ఆదివారం జరిగింది. మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియం వద్ద కలెక్టర్ లక్ష్మీశ జెండా ఊపి ఈ వాక్ను ప్రారంభించారు. అనంతరం మొగల్రాజపురం సిద్ధార్థ జంక్షన్లో ఉన్న గుహలను ఆయన సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వారం ఇలాంటి వాక్లను నిర్వహించి యువతను ఎక్కువగా ఇలాంటి కార్యక్రమాల్లో భాగం చేయాలన్నారు. ‘సిటీ ఆఫ్ కేవ్స్ అండ్ కెనాల్స్’ నినాదంతో.. చరిత్ర పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి మాట్లాడుతూ మొగల్ చక్రవర్తులు మచిలీపట్నం వెళ్తూ ఇక్కడ గుహలను నిర్మించారన్నారు. ఇన్టాచ్ సంస్థ చైర్మన్ అశోక్ సింగ్ ఠాగూర్ మాట్లాడుతూ తమ సంస్థ ప్రపంచంలోని అతి పెద్ద వారసత్వ పరిరక్షక సంస్థల్లో ఒకటిగా ఉందన్నారు. ఇన్టాచ్ విజయవాడ కన్వీనర్ సాయి పాపినేని మాట్లాడుతూ ‘ది సిటీ ఆఫ్ కేవ్స్ అండ్ కెనాల్స్’ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. సిద్ధార్థ ఆడిటోరియం వద్ద మొదలైన వాక్ మధుచౌక్ దగ్గర ఉన్న నటరాజ స్వామి గుహల వరకు సాగింది. అక్కడ నుంచి వాహనాల్లో నగరంలోని గాంధీ హిల్, అక్కన్న మాదన్న గుహలు, ఉండవల్లిలోని గుహలతో పాటుగా ప్రకాశం బ్యారేజ్, బందరు, ఏలూరు కాలువలను సంస్థ సభ్యులు కుటుంబ సభ్యులతో కలిసి పరిశీలించారు. -
దేవాంగ కార్పొరేషన్ ఏర్పాటుకు వినతి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దేవాంగ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఏపీ దేవాంగ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. విజయవాడ ప్రెస్క్లబ్లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్టి నాగశయనం మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి దేవాంగ సామాజిక వర్గం ఎంతగానో కృషి చేసిందన్నారు. అటువంటి సామాజిక వర్గానికి వీలైనంత త్వరగా కార్పొరేషన్ ప్రకటించాలని కోరారు. చేనేతలకు పెన్షన్లు మంజూరు చేయాలన్నారు. చేనేతలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్లు ఉచితం ప్రకటించిన ప్రభుత్వం తక్షణమే అమల్లోకి తేవాలన్నారు. దేవాంగ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుచ్చల రామకృష్ణ మాట్లాడుతూ.. దేవాంగ సామాజిక వర్గానికి న్యాయం చేయాలన్నారు. సంఘం మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు నక్కిన విజయ లక్ష్మి, జాతీయ దేవాంగ ఫెడరేషన్ ఏపీ మీడియా ఇన్చార్జి గుత్తి త్యాగరాజు, రాష్ట్ర కోశాధికారి ఉప్పు కనకరాజు, ఉపాధ్యక్షుడు మన్నెముద్దు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
సుబ్బారాయుడికి రూ. 8.26లక్షల ఆదాయం
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానానికి ఒకరోజు ఆదాయం రూ.8,26,626 వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు వెల్లడించారు. శాశ్వత అన్నదాన కార్యక్రమం నిమిత్తం రూ.50,239, నిత్యాన్నదాన కార్యక్రమానికి రూ.50,712, కల్యాణ కట్ట టికెట్ల ద్వారా రూ. 24,680, లడ్డూ, పులిహోర ద్వారా రూ. 1,12,225, దర్శన రుసుం ద్వారా రూ.63,100, సేవా టికెట్ల ద్వారా రూ. 5,18,380తో పాటు ఇతర సేవా టికెట్లతో కలిపి మొత్తం రూ.8,20,626 దేవస్థానానికి ఆదాయం వచ్చినట్లు వివరించారు. కిక్కిరిసిన ఆలయం.. తెలుగు ఉభయ రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం ఆదివారం కళకళలాడింది. తెల్లవారుజాము నుంచే భక్తులతో క్యూలైన్లన్నీ కిక్కిరిశాయి. నాగపుట్ట, నాగమల్లి వృక్షం, పొంగళశాల వద్ద భక్తుల రద్దీ ఏర్పడింది. పారామెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో పలు పారామెడికల్ పోస్టుల కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కొలసాని శ్రీనివాసరావు తెలిపారు. డెంటల్ మెకానిక్, డెంటల్ టెక్నీషియన్, డెంటల్ హైజీనిస్ట్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 20 సాయంత్రం 5 గంటల్లోపు కళాశాలలో అందజేయాలని సూచించారు. ఎంపికలు జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా చేస్తామని చెప్పారు. మరిన్ని వివరాలు, దరఖాస్తుకోసం http://gdchvja.inను సంప్రదించవచ్చునని సూచించారు. పర్యాటకులతో సాగరతీరం కళకళ కోడూరు: హంసలదీవి సాగరతీరంలో పర్యాటకులతో కళకళలాడింది. ఆదివారం సెలవుదినం కావడంతో వివిధ సుదూర ప్రాంతాలకు చెందిన యాత్రికులు ప్రత్యేక వాహనాల్లో తీరానికి తరలివచ్చారు. సముద్ర అలల మధ్య కేరింతలు కొడుతూ సరదాగా గడిపారు. హైదరాబాద్, వరంగల్, నల్లగొండ, విజయవాడ, గుడివాడకు చెందిన పర్యాటకులు తీరంలో కనిపించారు. పాలకాయతిప్ప మైరెన్ పోలీసులు ఏవిధమైన అవాంఛనీయ ఘటనలు జరగకుండా గస్తీ చేపట్టారు. తిరుపతమ్మకు బంగారు కాసులపేరు పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మవారికి ఆదివారం బాపట్ల జిల్లా, రేపల్లె మండలం, నల్లూరిపాలెం గ్రామానికి చెందిన నలకుర్తి రాజేష్బాబు, లక్ష్మీతిరుపతమ్మ దంపతులు రూ.2లక్షలు విలువైన బంగారు కాసులపేరు ను ఆలయ ఇన్స్పెక్టర్ బద్దుల కృష్ణమోహన్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దాతలను అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలతో సత్కరించారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం ‘కె–ర్యాంప్’ లబ్బీపేట(విజయవాడతూర్పు): కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం కె–ర్యాంప్ అని ఆ చిత్ర హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. దీపావళి కానుకగా ఈ నెల 18న విడుదల కానుండగా, చిత్ర పమోషన్లో భాగంగా కె–ర్యాంప్ యూనిట్ సభ్యులు ఆదివారం విజయవాడ విచ్చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ఇప్పటికే విడుదలైన ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడం సంతోషంగా ఉందన్నారు. సినిమా మొత్తం ఆసక్తికరంగా ఉంటుందని, ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయన్నారు. ఆదరించాలని కోరారు. -
కృష్ణాజిల్లా
సోమవారం శ్రీ 13 శ్రీ అక్టోబర్ శ్రీ 2025ఆదివారం ఒక్క రోజే 1.20లక్షల మంది రాక చేతులెత్తేసిన అధికారులు..నేడు ‘మీ కోసం’ చిలకలపూడి(మచిలీపట్నం): కలెక్టరేట్లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. మీ కోసం కాల్ సెంటర్(1100)కి కాల్ చేసి కూడా అర్జీ నమోదుతో పాటు దాని స్థితిని తెలుసుకోవచ్చని చెప్పారు. పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 82,540 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగువకు 82,548 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 42.1600 టీఎంసీలు ఉంది. భక్తిశ్రద్ధలతో సూర్యోపాసన సేవ ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం అర్చకులు సూర్యభగవానుడి చిత్రపటానికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సూర్యోపాసన సేవ జరిపించారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాలు ముగిసి పది రోజులైనా కాకుండానే దసరా ఉత్సవాలను తలపించేలా ఆదివారం ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కనిపించింది. రికార్డు స్థాయిలో 1.20 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తెల్లవారుజామున 3 గంటలకు అమ్మవారి సుప్రభాత సేవ, అనంతరం ఖడ్గమాలార్చన నిర్వహించారు. సాధారణంగా ఖడ్గమాలార్చన జరుగుతున్న సమయంలో సర్వ దర్శనంలో ఒక క్యూలైన్ మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అయితే ఆదివారం ఖడ్గమాలార్చన జరిగే సమయానికి క్యూలైన్లో పెద్ద ఎత్తున భక్తులు వేచి ఉండటంతో రెండు క్యూలైన్ల ద్వారా భక్తులను అనుమతించారు. తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన భక్తుల రద్దీ ఉదయం 8 గంటలు గడిచే సరికి ఘాట్రోడ్డులో ఓం టర్నింగ్, మహా మండపంలో ఆరో అంతస్తుకు చేరింది. పలువురు చిన్నారులకు అస్వస్థత.. అంతకంతకు ఆలయంలో భక్తుల రద్దీ పెరుగుతూ ఉండటంతో దర్శన టికెట్ల విక్రయాలను నిలిపివేశారు. వీఐపీతో పాటు రూ. 500, రూ. 300, రూ. 100 క్యూలైన్లతో పాటు సర్వ దర్శనం క్యూలైన్లు మొత్తం ఆరు క్యూలైన్ల ద్వారా భక్తులను ఉచితంగా దర్శనానికి అనుమతించారు. మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారికి మహా నివేదన సమర్పించేందుకు అరగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేశారు. దీంతో ఉదయం ఎప్పుడో క్యూలైన్లోకి ప్రవేశించిన వారికి దర్శనం కాకపోవడంతో ఉక్కబోతతో కొంత మంది చిన్నారులు కళ్లు తిరిగి స్పృహ కోల్పోగా, మరికొంత మంది అస్వస్థతకు గురయ్యారు. భారీగా ట్రాఫిక్ జామ్.. దుర్గమ్మ దర్శనానికి భారీగా భక్తులు తరలిరావడంతో కొండ దిగువన ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. వీఎంసీ కార్యాలయం మొదలు, కెనాల్రోడ్డు, సీతమ్మ వారి పాదాలు, ప్రకాశం బ్యారేజీ, మోడల్ గెస్ట్ హౌస్, దుర్గాఘాట్, హెడ్ వాటర్ వర్క్స్, కుమ్మరి పాలెం వరకు ఎక్కడ చూసినా నిలిచిపోయిన వాహనాలే కనిపించాయి. టోల్గేట్ వద్ద అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి కనిపించలేదు. ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సిఫార్సులపై దర్శనానికి విచ్చేసిన వారందరూ తమ కార్లు కొండపైకి తీసుకువెళ్లాలని భావించడంతో ఘాట్రోడ్డులో సైతం ట్రాఫిక్ నిలిచిపోయింది. 7కనిపించని బోర్డు సభ్యులు.. రద్దీ నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి అంతరాలయ దర్శనాన్ని సైతం రద్దు చేశారు. మధ్యాహ్నం రెండు గంటల సమయానికి సుమారు 90వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారంటే రద్దీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వీఐపీ దర్శనాలను సైతం నిలిపివేసిన ఆలయ అధికారులు, భక్తులందరికీ త్వరతిగతిన అమ్మవారి దర్శనం అయ్యేలా చర్యలు తీసుకున్నారు. స్కానింగ్ పాయింట్ వద్ద ఇంజినీరింగ్, పరిపాలనా విభాగం సిబ్బందికి అదనపు విధులను కేటాయించారు. క్యూలైన్ల ద్వారా స్కానింగ్ పాయింట్కు చేరుకున్న భక్తులకు ఏ క్యూలైన్లో అయితే ఖాళీ కనిస్తాయో ఆ క్యూలైన్లోకి అనుమతించారు. రద్దీ నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. సాయంత్రం నాలుగు గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ అధికంగా ఉండగా, కనీసం ట్రస్ట్ బోర్డు సభ్యులు మచ్చుకైనా కనిపించలేదు. మధ్యాహ్నం మహా నివేదన అనంతరం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఆలయానికి చేరుకుని రద్దీని పర్యవేక్షించారు. -
‘సాక్షి’ ఆఫీసు వద్ద పోలీసుల ఓవరాక్షన్
సాక్షి, విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వంలో ‘సాక్షి’పై(Sakshi) కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ పత్రికపై రెడ్బుక్ వికృత చర్యలు పీక్ స్టేజ్కు చేరుకున్నాయి. తాజాగా కూటమి ప్రభుత్వం.. సాక్షి ఆఫీసుకు పోలీసులను పంపించింది. ఈ క్రమంలో ఆఫీసుకు వచ్చిన పోలీసులు ఓవరాక్షన్ చేశారు.వివరాల ప్రకారం.. ఏపీలో నకిలీ(AP Liquor Scam) మద్యం వ్యవహారంపై ఎల్లో మీడియా(Yellow Media) సైతం కథనాలు రాస్తున్నా దాన్ని ఏమీ చేయలేని కూటమి సర్కారు ‘సాక్షి’పై మాత్రం కక్ష సాధిస్తోంది. నకిలీ మద్యం అంశంపై ఎలా వ్యవహరించాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్న ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని ‘సాక్షి’ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో సాక్షిని టార్గెట్ చేసిన చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను(AP Police) రంగంలోకి దింపింది. తాజాగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనూ ఎక్సైజ్ అధికారుల ఫిర్యాదుల మేరకు ‘సాక్షి’ యాజమాన్యంతోపాటు ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, రిపోర్టర్లపై నెల్లూరు రూరల్, కలిగిరి పోలీసుస్టేషన్లలో రెండు అక్రమ కేసులు నమోదు చేయించింది.ఇది కూడా చదవండి: నకిలీ మద్యం కేసులో మరో బిగ్ ట్విస్ట్..దీంతో, ఆదివారం తెల్లవారుజామునే పోలీసులు.. ఆటోనగర్లోని సాక్షి ప్రధాన కార్యాలయానికి వచ్చారు. తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు ఆఫీసు వద్ద పోలీసులు హల్చల్ చేశారు. కేసుకు సంబంధించి నోటీసులు తీసుకోవాలంటూ సాక్షి సిబ్బందిపై పోలీసులు ఒత్తిడి తెచ్చారు. జర్నలిస్టులను, సాక్షి సిబ్బందిని భయబ్రాంతులకు గురిచేశారు. పత్రికా స్వేచ్ఛను కాలరాస్తూ నిరంకుశ చర్యలకు దిగారు. కాగా, చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే అనేక సార్లు సాక్షి కార్యాలయంపైకి పోలీసులను పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పత్రికా స్వేచ్ఛపై కూటమి ప్రభుత్వం చేస్తున్న దాడిని జర్నలిస్టులు ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
రైతుల కష్టం నీటిపాలు
కంకిపాడు: ఖరీఫ్ సాగుచేపట్టిన రైతులను కష్టాలు వీడటం లేదు. వరుసగా వస్తున్న వరదలకు రైతులు కుదేలవుతున్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాల్సిన కూటమి ప్రభుత్వం అడుగడుగునా నిర్లక్ష్యం చేస్తోంది. సకాలంలో స్పందించాల్సింది పోయి మీనమేషాలు లెక్కిస్తోందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇటీవల కృష్ణానదికి సంభవించిన వరుస వరదలతో ఏటిపాయ వెంబడి సాగులో ఉన్న పంట పొలాలు ముంపు బారిన పడ్డాయి. పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంటలకు వాటిల్లిన నష్టాన్ని గుర్తించేందుకు ప్రభుత్వం సర్వే కూడా చేపట్టలేదు. దీంతో పరిహారం అందుతుందా? లేదా? అన్న సందేహాలు రైతుల కంటి మీద కునుకు కరువయ్యేలా చేస్తున్నాయి. కృష్ణానది ఏటిపాయ వెంబడి ప్రధానంగా ఉద్యాన పంటలు సాగులో ఉన్నాయి. ముఖ్యంగా పసుపు, అరటి, కంద, పూలతోటలు, కూరగాయల తోటలు, తమలపాలకు ఇతర పంటలు సాగవుతున్నాయి. లక్షలాదిరూపాయలు పెట్టుబడులు పెట్టి పంటను సంరక్షించుకుంటున్నారు. గత ఏడాది సెప్టెంబర్లో ఎన్నడూ లేని విధంగా కృష్ణానదికి వరద ముంచుకొచ్చింది. కృష్ణాజిల్లా వ్యాప్తంగా వందలాది ఎకరాల పంట ముంపునకు గురైంది. రైతులు దెబ్బతిన్న పంటలను తొలగించి తిరిగి సాగుకు ఉపక్రమించారు. ఈ ఏడాది మేలో అకాల వర్షాలకు ఉద్యాన పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. కృష్ణాజిల్లాలో 64.3 హెక్టార్లలో అరటి, తమలపాకు, బొప్పాయి, కూరగాయల తోటలు దెబ్బతిన్నట్లు అధికారులు నివేదించారు. తాజాగా కృష్ణానదికి మరోమారు వరద వచ్చి పడింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఏటిపాయ వెంబడి సాగులో ఉన్న వివిధ రకాల ఉద్యాన పంటలు ముంపునకు గురయ్యాయి. ఈ దఫా రోజుల తరబడి పంట పొలాల్లో వరదనీరు నిలిచిపోవటంతో మొక్క దశలో ఉన్న పసుపు, కంద, కూరగాయలు, పూల తోటలకు భారీగా నష్టం వాటిల్లింది. లక్షల రూపాయలు పంటపై పెట్టిన పెట్టుబడులు కోల్పోవాల్సి వచ్చిందంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రాథమిక అంచనాలు సిద్ధం! వరదలతో ఏర్పడిన పంట నష్టంపై ఉద్యానశాఖ ప్రాథమిక అంచనాలను రూపొందించింది. జిల్లాలోని పెనమలూరు, కంకిపాడు, మోపిదేవి, అవనిగడ్డ, చల్లపల్లి, ఘంటసాల, తోట్లవల్లూరు, పమిడిముక్కల, కోడూరు మండలాల్లో పంటలకు అపారనష్టం వాటిల్లినట్లు నివేదిక సిద్ధం చేశారు. ఇందులో భాగంగా పసుపు, అరటి, బొప్పాయి, కూరగాయలు, కంద, పూలతోటలు ప్రధానంగా దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. 2,863 మంది రైతులకు చెందిన 2244.63 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లినట్లు నివేదికలో పొందుపరిచారు. దీన్ని బట్టి వరదలకు జిల్లాలో ఏర్పడిన నష్టాన్ని అంచనా వేయవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. కృష్ణానదికి వరదలు, అధిక వర్షాలు వచ్చి పంటలు దెబ్బతిన్నా, ఈదురుగాలులకు పంటలు నేలవాలినా కనీసం కన్నెత్తి చూడటం లేదు. ఒక్క రూపాయి పరిహారం కూడా రైతులకు అందించలేదు. తాజాగా కృష్ణానదికి వచ్చిన వరదతో రైతులకు మునుపెన్నడూ లేని విధంగా భారీగా నష్టం జరిగింది. ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తే సర్వే ప్రక్రియ వేగంగా పూర్తి చేసి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రాథమిక నష్టం అంచనాలను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు నివేదించాం. ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు రాగానే పంట నష్టం సర్వే పూర్తి చేసి నివేదికను పంపుతాం. క్షేత్రస్థాయిలో సిబ్బందికి కూడా సూచనలు అందించాం. మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తున్నాం. – జె.జ్యోతి, జిల్లా ఉద్యానశాఖ అధికారి, కృష్ణాజిల్లా ఏటిపాయకు వచ్చిన వరదతో పంటలు దెబ్బతిన్నాయి. కుళ్లిపోయిన పంటలతో పెట్టుబడులు కోల్పోతున్నాం. అధికారులు క్షేత్రస్థాయికి వచ్చి ప్రతి ఎకరం నమోదు చేయాలి. రైతులకు నష్టం జరగకుండా అన్ని చర్యలూ తీసుకోవాలి. రైతులకు నష్టం వాటిల్లకుండా వ్యవహరించాలి. – వడుగు శ్రీనివాసరావు, రైతు, మద్దూరు ప్రస్తుతం ప్రాథమిక అంచనాలను సిద్ధం చేసిన వ్యవసాయ శాఖ అధికారులు ఇంకా పంట నష్టం సర్వే ప్రక్రియను చేపట్టలేదు. కూటమి ప్రభుత్వం అధికారులకు ఇంకా శాఖాపరమైన మార్గదర్శకాలు జారీ చేయలేదు. దీంతో పంట నష్టం సర్వే ప్రక్రియ ప్రారంభానికి నోచలేదు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవటంలో కూటమి ప్రభుత్వంలో ఎప్పుడూ అలసత్వం, నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ సంక్షేమాన్ని విస్మరిస్తోందన్న వాదనలకు తాజా చర్యలు బలం చేకూరుస్తున్నాయి. ముంపునకు గురైన ప్రతి ఎకరాన్ని నమోదు చేయాలన్న డిమాండ్ రైతుల నుంచి వ్యక్తమవుతోంది. అయితే ఇప్పటి వరకూ సర్వే ప్రారంభం కాకపోవటంతో ఎప్పటికి సర్వే జరుగుతుందో అన్న ప్రశ్న తలెత్తుతోంది. -
ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాల్సిందే
పామర్రు: పేదలకు మెరుగైన వైద్యసేవలను అందించే విషయంలో సీఎం చంద్రబాబుకు అడుగుముందుకు పడటం లేదనే విషయాన్ని ప్రజలంతా గ్రహిస్తున్నారని మాజీఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్కుమార్ పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటికరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజాఉద్యమం వాల్ పోస్టర్ను శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీఎమ్మెల్యే అనిల్కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో తనపార్టీ శ్రేణులకు లాభం చేకూర్చాలన్నదే చంద్రబాబు ఆలోచన అని విమర్శించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ ప్రజాఉద్యమం చేపట్టి సమస్యను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టి అందులో ఐదు కళాశాలలు పూర్తి చేశారని గుర్తుచేశారు. మరో మూడు కళాశాలల పనులు తుదిదశకు చేరుకున్నాయని వివరించారు. ఈ మెడికల్ కాలేజీల పనులను పూర్తి చేస్తే వైఎస్సార్ సీపీకి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని భయపడిన సీఎం చంద్రబాబుకు ఆపనులను పూర్తి చేయడానికి మనస్సు రావడం లేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలోనే ఆ మూడు మెడికల్ కాలేజీల్లో అన్ని సదుపాయాలు సమకూర్చినా తుదిదశ పనులు చేసి ప్రారంభించేందుకు చంద్రబాబు భయ పడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రస్తుత ప్రభుత్వానికి మెడికల్ కాలేజీలను పూర్తి చేయడం ఇష్టం లేకనే వాటిని పార్టీశ్రేణులకు కట్టబెట్టాలని చూస్తున్నారన్నారు. ప్రజలకు ఉచిత వైద్యం అందాలంటే కచ్చితంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలల అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం పునారాలోచించి ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ ఉద్యమంలో భాగంగా ఈనెల 25న నియోజకవర్గ కేంద్రాల్లో, నవంబరు 12న జిల్లా కేంద్రాలలో ర్యాలీలు నిర్వహిస్తామని అనిల్కుమార్ తెలిపారు. ఆయా ర్యాలీల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మేధావులు, ప్రజాసంఘాలతోపాటు ప్రజలంతా పాల్గొని కూటమి ప్రభుత్వ అనుమాష చర్యలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు ఆరేపల్లి శ్రీనివాసరావు, తాడిశెట్టి శ్రీనివాసరావు, రాజులపాటి రాఘవరావు, కళ్లం వెంకటేశ్వరరెడ్డి, నడకుదురు రాజేంద్ర, కూసం పెద వెంకటరెడ్డి, గవాస్కరరాజు, నవుడు సింహాచలం, సజ్జా సుబ్రమణ్యం, నత్తా రవి, అజీజ్, తిరుమలశెట్టి వాసు, దిట్టకవి తదితరులు పాల్గొన్నారు. కై లే అనిల్కుమార్ డిమాండ్ -
మద్యం షాపుల నుంచి శాంపిల్స్ సేకరణ
కోనేరుసెంటర్: మచిలీపట్నంలోని మద్యం షాపుల్లో ఎకై ్సజ్ పోలీసులు శనివారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి, పరీక్షల నిమిత్తం శాంపిల్స్ను సేకరించారు. ములకలచెరువు నకిలీ మద్యం ఘటన నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గడిచిన నాలుగురోజులుగా ఎకై ్సజ్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మచిలీపట్నంలో 21షాపులు, ఏడు బార్లు ఉండగా ఎకై ్సజ్ ఇన్చార్జ్ సీఐ, ఎస్సైలు రెండు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. మద్యం అమ్మకాలను పరిశీలించారు. యాప్ ద్వారా మద్యం బాటిళ్లను స్కాన్ చేసి ఏ డిస్టలరీ నుంచి సరఫరా అయినదీ తనిఖీ చేశారు. కిట్ ద్వారా మద్యం నాణ్యతను పరిశీలించారు. షాపుల నిర్వహణ సమయపాలనపై ఆరా తీశారు. ఈసందర్భంగా ఎకై ్సజ్ సీఐ లక్ష్మణ్ మాట్లాడుతూ 21 మద్యం షాపులకు సంబంధించి 15మద్యం శాంపిల్స్, బార్ల నుంచి ఏడు శాంపిల్స్ తీసి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించినట్లు తెలిపారు. ఎకై ్సజ్ నిబంధనల మేరకే వ్యాపారులు మద్యం అమ్మకాలు సాగించాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
చిన్న వయస్సులోనే కీళ్లలో అరుగుదల
లబ్బీపేట(విజయవాడతూర్పు): కీళ్లు వాయడంతో పాటు పట్టేస్తున్నాయి. నిద్రలేవగానే అడుగు వేయడం కష్టంగా మారురింది.. అంటూ ఇటీవల ఆర్థోపెడిక్ వైద్యుల వద్దకు వచ్చే వారి సంఖ్య పెరిగింది. అందుకు కారణం వారు రుమటాయిడ్ ఆర్థరైటిస్ బారినపడటమేనని డాక్టర్లు చెబుతున్నారు. మోకీళ్ల వాపుతో పాటు, నీరు పట్టి జలదరింపు వస్తుందని, నడవలేక పోతున్నామని వైద్యుల వద్దకు వచ్చే మహిళలు కూడా పెరిగారు. ఇలాంటి వారికి ఆర్థరైటిస్ కారణంగా మోకీలు అరుగుదల ప్రారంభమైనట్లు ఎక్స్రే ద్వారా గుర్తిస్తున్నారు. నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్ప త్రుల్లోని ఆర్థోపెడిక్ వైద్యుల వద్దకు వస్తున్న వారిలో 35 శాతం (మూడో వంతు) మంది ఆర్థరైటీస్ రోగులే ఉంటున్నారు. ఆర్థరైటిస్ను సకాలంలో గుర్తించి సరైన చికిత్స పొందడం ద్వారా దుష్ఫలితాలు లేకుండా చూడొచ్చని వైద్యులు అంటున్నారు. అక్టోబర్ 12న ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆర్థరైటిస్ అంటే... ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కీళ్ల వాపు, నొప్పి ఉంటే ఆర్థరైటిస్గా నిర్ధారిస్తారు. ఆర్థరైటీస్ ప్రభావం వయస్సు పెరిగే కొద్దీ ఎక్కువ అవుతుంది. 12 రకాల ఆర్థరైటిస్లు ఉండగా రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్, స్క్లెరోడెర్మా అనేవి రోగ నిరోధక వ్యవస్థ శరీర కణజాలలపై దాడి చేయడం వల్ల సంభవిస్తాయి. వీటిని ఆలస్యం చేస్తే ప్రాణాంతకంగా మారవచ్చు. కీళ్లలో స్పటికాలు పేరుకుపోవడం వల్ల గౌట్ వస్తుంది. కొన్ని రకాల ఆర్థరైటిస్ జన్యువలతో ముడిపడి ఉండొచ్చు. వయసు రీత్యా ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంది. జీవనశైలి కారణంగా వచ్చే థైరాయిడ్ వల్ల కూడా ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంది. గర్భస్రావం అయిన మహిళలకు రావచ్చు. ఆటో ఇమ్యూన్ వ్యాధి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. ఇది ఎందుకు ఆశిస్తుందో కచ్చితంగా నిర్ధారించ లేదు. ప్రస్తుతం ఎక్కువ మంది ఈ వ్యాధి బారిన పడుతు న్నారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ సోకిన వారిలో కీళ్ల వాపులు, తీవ్ర కీళ్ల నొప్పులు ఉంటాయి. సకాలంలో చికిత్స పొందకుండా అశ్రద్ధచేస్తే కీళ్లు అరు గుదలతో పాటు చర్మం, కళ్లు, ఊపిరితిత్తులు, గుండె, నరాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. గుండె, ఊపిరితిత్తుల చుట్టూ వాపు ఏర్పడే అవకాశం ఉంది. ఇది ఏ వయస్సు వారికై నా సోకొచ్చు. ప్రస్తుతం రుమటాయిడ్ ఆర్థరైటిస్కు మంచి వైద్యం అందు బాటులో ఉంది. క్రమం తప్పకుండా మందులు వాడటం ద్వారా అదుపులో ఉంచుకోవచ్చు. చిన్న వయస్సులోనే కీళ్ల మార్పిడికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ కారణం అవుతోంది. గుల్ల ఎముక వ్యాధి గుల్ల ఎముక వ్యాధినే ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఇది సోకిన వారికి ఎముకలు గుల్లబారి, చిన్న దెబ్బకే విరిగిపోతుంటాయి. ప్రస్తుతం మహిళలు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. మోకీళ్లు, తుంటె కీళ్లు అరుగుదల ఏర్పడి కీళ్ల మార్పిడికి దారి తీయవచ్చు. వెన్నెముక వంకర ఏర్పడటంతో నిటారుగా నడవలేని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం మధ్య వయస్సు వారు కూడా ఆస్టియో ఆర్థరైటిస్ బారిన పడుతున్నారు. కీళ్లనొప్పులు, వాపు ఉండటం, ఉదయాన్నే వేళ్లు కీళ్లు పట్టేసినట్లు ఉండటం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఆర్థరైటిస్ 12 రకాలు. వాటిలో రోగికి ఏ రకమైన ఆర్థరైటిస్ సోకిందో తెలుసుకుని మందులు వాడాల్సి ఉంటుంది. కొందరికి ఆరునెలలు, ఏడాది పాటు మందులు వాడితే తగ్గిపో తుంది. మరికొందరు దీర్ఘకాలికంగా మందులు వాడాల్సి ఉంటుంది. లక్షణాలను తొలిదశలో గుర్తించి మందులు వాడితే దుష్ఫలితాలు ఉండవు. – డాక్టర్ ఎన్.కావ్యాదేవి, రుమటాలజిస్ట్, విజయవాడ రుమటాయిడ్, సోరియాసిస్ ఆర్థరైటిస్ వంటి ఇన్ప్లమేటరీ డిసీజ్ వల్ల తుంటి, మోకీళ్ల అరుగుదల ఎక్కు వగా ఉంటుంది. మధ్య వయస్సులోనే కీళ్లు అరిగి మా వద్దకు వస్తున్నారు. వారికి కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్స చేస్తున్నాం. మోకీలు, తుంటి కీలు మార్పిడికి ఆధునిక రోబోటిక్ సర్జరీలు చేస్తున్నాం. వందశాతం సక్సెస్ రేటు ఉంటుంది. 20 ఏళ్ల వారు కూడా ఆర్థరైటిస్తో కీళ్లు అరిగి మావద్దకు వస్తున్నారు. – డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ -
సౌత్జోన్ ఖోఖో పోటీలకు జట్లు ఎంపిక
గన్నవరం: స్థానిక జెడ్పీ బాలుర హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో శనివారం ఖోఖో సౌత్ జోన్ పోటీల్లో పాల్గొనే పురుషులు, మహిళల రాష్ట్ర జట్ల ఎంపికలు నిర్వహించారు. ఆంధ్ర ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సెలక్షన్స్కు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 120మంది క్రీడాకారులు హాజరయ్యారు. వీరిలో ప్రతిభ కనబరిచిన పురుషులు, మహిళల జట్లకు 15మంది చొప్పున క్రీడాకారులను, స్టాండ్ బైగా మరో తొమ్మిది మందిని ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు శిక్షణ అనంతరం కర్ణాటక రాష్ట్రం దావణగిరిలో ఈ 24 నుండి 26వతేదీ వరకు జరిగే సౌత్ జోన్ పోటీల్లో పాల్గొంటారని ఆంధ్ర ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు టిఎస్ఆర్కె. ప్రసాద్ తెలిపారు. ఈ పోటీల్లో అత్యుత్తమ క్రీడా నైపుణ్యం ప్రదర్శించి పతకాలతో తిరిగిరావాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఉత్తమ క్రీడాకారులను జాతికి అందించే దిశగా తమ అసోసియేషన్ కృషి చేస్తుందని చైర్మన్ గరటయ్య తెలిపారు. అసోసియేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎం.సీతారామిరెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మడక ప్రసాద్, సత్యప్రసాద్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కేవీఆర్. కిషోర్, సెలక్షన్ కమిటీ సభ్యులు ఖాసీ, రవిబాబు, గిరిప్రసాద్, పట్టాభి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర జట్ల వివరాలు.. పురుషుల జట్టు: ఆర్.సునీల్నాయుడు, కుంభా నరేష్, ఎన్ఎస్.రాజు, వై.సుధీర్కుమార్, ఎస్కె.మహమ్మద్, ఐ.ఎలియా(ప్రకాశం), ఎస్కె.మహబుబ్(కర్నూల్), కోడూరి కొండలరావు(కృష్ణా), బి. కిరణ్(వైజాగ్), జి.సంతోష్(అనంతపురం), వి.భానుప్రకాష్(విజయనగరం), కె.శివశంకర్(తూర్పుగోదావరి), కె.ప్రవీణ్(శ్రీకాకుళం), పి.వరుణ్(చిత్తూరు), వై.అశిష్(నెల్లూరు). మహిళల జట్టు: పి. చంద్రఅనూష, జి.పావని (పశ్చిమ గోదావరి), పి.హేమ, బి.శిరీష(విశాఖపట్నం), ఎస్.పావని, వి. శశికళ, ఆర్.యశోద, ఎం.సఖీయా, వి.నాగమల్లేశ్వరి(ప్రకాశం), కె. కుమారి, కె.ఉర్ధవ(కృష్ణా), బీ. గుణవతి, పి.అమృత(శ్రీకాకుళం), జె.శ్రావణి(విజయనగరం), కె.కీర్తన(చిత్తూరు). -
బైక్ దగ్ధం– నలుగురికి గాయాలు
తిరువూరు: తిరువూరు సమీపంలోని లక్ష్మీపురం వద్ద జాతీయరహదారిపై శనివారం రాత్రి రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న సంఘటనలో ఓ బైక్ దగ్ధం కాగా, నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని ఆంజనేయపురంనకు చెందిన కల్యాణ్ ద్విచక్రవాహనంపై మరో ఇద్దరితో కలిసి తిరువూరు నుంచి ఇంటికి వెళ్తుండగా, కాకర్లకు చెందిన నరసింహ అనే వ్యక్తికి చెందిన బైక్ అదుపు తప్పి ఢీకొంది. ఈక్రమంలో నరసింహాకు చెందిన బైక్ నుంచి పెట్రోలు లీకై వాహనం పూర్తిగా దగ్ధమెంది. ఈ ఘటనలో నరసింహా, కల్యాణ్లతోపాటు బైక్పై ప్రయాణిస్తున్న ఆంజనేయపురంనకు చెందిన మరో ఇద్దరికి కూడా తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన యువకులు తిరువూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
20న రాష్ట్రవ్యాప్త నిరసనలు
కృష్ణలంక(విజయవాడతూర్పు): అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలకు వ్యతిరేకంగా ఈనెల 20వ తేదీన రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపడుతున్నట్లు రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు తెలిపారు. గవర్నర్పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో శనివారం వారు మాట్లాడుతూ ట్రంప్ విఽధించిన సుంకాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రంప్ సుంకాల టెర్రరిజాన్ని ప్రపంచదేశాలపై రుద్దుతున్నాడన్నారు. ప్రత్యేకించి భారత దేశంపై కక్షతో సుంకాలను ఇతర దేశాలతో పోలిస్తే మరింత ఎక్కువగా వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్వారంగంపై పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలకు 19.2శాతం, ఈక్విడార్పై 13శాతం సుంకాలు విధించిన అమెరికా మనదేశంపై సుమారు 60శాతం సుంకాన్ని విధించిందని మండిపడ్డారు. ట్రంప్ హుంకరింపులతో ప్రధాని మోడీ 11శాతం దిగుమతి సుంకాన్ని ఎత్తివేసి పత్తి రైతులను దివాలా తీయిస్తున్నారని ఆరోపించారు. పౌల్ట్రీ రంగాన్ని నాశనం చేసేలా అమెరికాకు సహకరిస్తున్నారని విమర్శించారు. ట్రంప్ సుంకాల మోత కారణంగా ఎగుమతులపై సుమారు రూ.2.6లక్షల కోట్లు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ట్రంప్ సుంకాలు, అమెరికా సామ్రాజ్యవాద చర్యలను మోడీ ప్రభుత్వం, అన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు, సంఘాలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. అమెరికా సామ్రాజ్యవాద ట్రంప్ సుంకాల యుద్ధానికి వ్యతిరేకంగా చేపడుతున్న ఉద్యమంలో రైతులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు, రైతు సంఘం నాయకుడు వై.కేశవరావు, ఎం.సూర్యనారాయణ పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ డీఆర్వో లక్ష్మీనరసింహం
బాలికా సాధికారతకు సమష్టిగా కృషి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వివక్షకు తావులేకుండా బాలికలకు సమాన అవకాశాలు కల్పించినప్పుడే సమాజం పురోగతి సాధిస్తుందని ఎన్టీఆర్ జిల్లా రెవెన్యూ అధికారి ఎం. లక్ష్మీనరసింహం అన్నారు. బాలికల విద్య, హక్కుల పరిరక్షణకు సమష్టిగా కృషిచేయా ల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా శనివారం శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ, చైల్డ్ రైట్స్ అడ్వొకసీ ఫౌండేషన్ (సీఆర్ఏఎఫ్) ఆధ్వర్యంలో భాగ స్వామ్య పక్షాలకు ప్రత్యేక వర్క్షాప్ జరిగింది. ముఖ్య అతిథి, డీఆర్వో లక్ష్మీనరసింహం మాట్లాడుతూ.. బాలికల విద్య, ఆరోగ్యం, హక్కుల పరిరక్షణ, సామాజిక వివక్షను రూపు మాపడం, బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయడం వంటి అంశాలపై సమన్వయ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని కోరారు. గ్రామ స్థాయిలో బాలల సంక్షేమం, భద్రతా కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. బాలికల హక్కులతో పాటు ఆధునిక సాంకేతిక ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లపై విద్యా సంస్థల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ నెల 18వ తేదీ వరకు వివిధ రకాల పోటీలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో అంతర్జాతీయ బాలికా దినోత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ పి.భానుమతి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు రాధాకుమారి, డీసీపీఓ ఎం.రాజేశ్వరరావు, సీఆర్ఏఎఫ్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ తంబి, సమగ్రశిక్ష అధికారి శిరీష రాణి, ఎంఈఓ పుష్పలత, చిన్నారులు, వివిధ శాఖల అధికారులు తదితరులు హాజరయ్యారు. -
దుర్గగుడి ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం శనివారం జరిగింది. రాజగోపురం ఎదుట కళావేదికపై జరిగిన ఈ కర్యక్రమంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్గా బొర్రా రాధాకృష్ణ(గాంధీ), 15 మంది సభ్యులు, ఇద్దరు ప్రత్యేక ఆహ్వానితులు, ఎక్స్అఫీ షియో సభ్యుడితో ఆలయ ఈఓ శీనానాయక్ ప్రమాణ స్వీకారం చేయించారు. సభ్యురాలు పద్మా వతి ఠాకూర్ వ్యక్తిగత కారణాలతో హాజరుకావడంలేదని దేవస్థానానికి సమాచారమిచ్చారు. ప్రమాణ స్వీకారం అనంతరం మహా మండపంలోని చైర్మన్ చాంబర్లో ట్రస్ట్బోర్డు సభ్యులు సమావేశమయ్యారు. చైర్మన్ దంపతులతో పాటు పలువురు ట్రస్ట్ బోర్డు సభ్యులకు ఆలయ మర్యాదలతో అమ్మ వారి దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ట్రస్ట్ బోర్డు సభ్యులు వీరే.. ట్రస్ట్ బోర్డు సభ్యులుగా అవ్వారు శ్రీనివాసరావు (బుల్లబ్బాయ్), బడేటి ధర్మారావు, గూడపాటి వెంకట సరోజినీదేవి, జి.వి.నాగేశ్వరరావు, జి.హరి కృష్ణ, జింకా లక్ష్మీదేవి, మన్నె కళావతి, పనబాక భూలక్ష్మి, మోరు శ్రావణి, పెనుమత్స రాఘవరాజు, ఏలేశ్వరపు సుబ్రహ్మణ్యకుమార్, సుకాశి సరిత, తంబ ళ్లపల్లి రమాదేవి, తోటకూర వెంకట రమణారావు, తరిగొప్పల పార్వతి, ప్రత్యేక ఆహ్వానితులుగా వెలగపూడి శంకరబాబు, మార్తి రామబ్రహ్మం ప్రమాణ స్వీకారం చేశారు. ఎక్స్అఫీషియో సభ్యుడిగా ఆలయ ప్రధానార్చకుడు ఎల్.దుర్గాప్రసాద్ ఉన్నారు. కోడలి హత్య కేసులో నిందితురాలు తరిగొప్పల పార్వతితో బోర్డు సభ్యురాలిగా ప్రమాణం చేయడం, వేద ఆశీర్వచనం అందించడంపై విమర్శలు వచ్చాయి. తొలి రోజే వివాదాలు ప్రమాణ స్వీకారం అనంతరం మహామండపం ఆరో అంతస్తులో చైర్మన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అదే సమయంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఈఓ శీనానాయక్ అక్కడికి వచ్చారు. మీడిమా సమావేశం ఉందని ఎందుకు చెప్పలేదని సిబ్బందిపై ఈఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఎమ్మెల్యే సుజనా చౌదరి అక్కడి నుంచి వెనుతిరగడంతో ఆయనను పంపేందుకు ఈఓ వెళ్లారు. ఈఓ అసంతృప్తిని ఆలయ సిబ్బంది చైర్మన్ గాంధీకి చెప్పడంతో ఆయన రాక కోసం పది నిమిషాలు ఎదురు చూశారు. ఈఓ వచ్చాక సమావేశాన్ని మొక్కుబడిగా ముగించారు. ఈఓ, చైర్మన్ వెనుక చైర్మన్ కుమారుడు కుర్చీ వేసుకుని కూర్చో వడం వివాదాస్పదమైంది. ప్రమాణస్వీకారానికి వచ్చిన చైర్మన్, ట్రస్ట్ బోర్డు సభ్యుల బంధువులు, స్నేహితులు, కుటుంబీకులు అమ్మవారి దర్శనానికి వెళ్లడంతో వీఐీపీ, రూ.500, రూ.300 టికెట్ల క్యూ లైన్లు గంట పాటు నిలిచాయి. ప్రమాణ స్వీకారం నేప థ్యంలో అంతరాలయ దర్శనాన్ని దేవస్థానం రద్దు చేసింది. రూ.500 టికెట్ల విక్రయాలు నిలిపి, వీఐపీలు, ట్రస్ట్బోర్డు కుటుంబ సభ్యులకు బంగారు వాకిలి దర్శనం కల్పించారు. అంతరాలయ దర్శనం కల్పించకపోవడంపై హైదరాబాద్, బెంగళూరు వంటి దూర ప్రాంతాల నుంచి విచ్చేసిన సామాన్య భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
15 నుంచి విద్యుత్ ఉద్యోగుల సమ్మె
ఇబ్రహీంపట్నం: విద్యుత్ ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి సమ్మె నిర్వహిస్తామని యూనియన్ నాయకులు ప్రకటించారు. ఏపీ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ హెచ్ 129 కార్యాలయం వద్ద శనివారం సమావేశం నిర్వహించారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మోదుగు మోహనరావు మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగులను సంస్థలో విలీనం చేయాలని, రెగ్యులర్ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డీఏలను విడుదల చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి, పీస్ రేటు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. డిమాండ్స్ పరిష్కరించని పక్షంలోణీ నెల 14వ తేదీన వర్కు రూల్ పాటించి 15 నుంచి సమ్మె బాట పడతామని చెప్పారు. సమావేశంలో యూనియన్ ఉపాధ్యక్షులు పచ్చిగోళ్ల సుబ్బారావు, వి. రమేష్, కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షంషేర్వలి, తన్వికుమార్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు
సాక్షి, కృష్ణా: మాజీ మంత్రి పేర్ని నానిపై చిలకలపూడి పీఎస్లో కేసు నమోదు అయ్యింది. మచిలీపట్నం ఆర్ఆర్ పేట పీఎస్లో వివాదం సృష్టించారని నానిసహా 29 మందిపై కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఆయనపై అభియోగం నమోదు చేశారు.ఏపీ వ్యాప్తంగా టీడీపీ డైరెక్షన్లో పోలీసు యంత్రాంగం పని చేస్తున్న పరిస్థితులు చూస్తున్నవే. వైఎస్సార్సీపీ చలో మెడికల్ కాలేజీ నేపథ్యంలో పార్టీ నగర అధ్యక్షుడు మేక సుబ్బన్నపై కేసు నమోదు చేశారు. పీఎస్కు పిలిపించుకుని ఆయనను ఉద్దేశించి సీఐ ఏసుబాబు అనుచితంగా మాట్లాడారు. ఈ విషయం తెలుసుకున్న పేర్ని నాని మరికొందరు కార్యకర్తలతో కలిసి పీఎస్కు చేరుకుని సీఐని నిలదీశారు. అయితే పేర్ని నాని జులుం ప్రదర్శించారంటూ పచ్చ మీడియా గగ్గొలు పెట్టింది. దీంతో కేసు నమోదు చేస్తామని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. అయితే ఈ పరిణామాలపై పేర్ని నాని స్పందించారు. తానేం పోలీసులకు వ్యతిరేకంగా కాదని.. మేయర్ భర్తపై సీఐ చేసిన అనుచిత వ్యాఖ్యలను మాత్రమే తాను ఖండించానని, ఆ సీఐ టీడీపీకి అనుకూలంగా పని చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇదిలా ఉంటే.. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగానే పేర్ని నానిపై కేసు నమోదు చేయించిందని వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.ఇదీ చదవండి: సీఐ గదిలో జరిగింది ఇదే.. -
జెడ్పీటీసీ టిక్కెట్ ఇప్పిస్తా...రూ.లక్ష పంపు
విజయవాడ: సైబర్ నేరగాళ్లు కొత్త అవతారం ఎత్తారు. రాజకీయ నాయకుల వాయిస్తో మాట్లాడుతూ ఓ సొసైటీ అధ్యక్షుడిని రూ. లక్ష అడిగి విఫలయత్నం చేశారు. మూరకొండ ఏడుకొండలరావు కంచికచర్ల మండలం ఘనిఆత్కూరు ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనకు ఈ నెల 8న రాత్రి వాట్సాప్ కాల్చేసి మాజీ మంత్రి దేవినేని ఉమా వాయిస్లో మాట్లాడి ఎక్కడున్నావ్ అని అడిగారు. నేను పక్క ఊరిలో ఉన్నానని చెప్పగా, ఒకసారి కారులో ఎక్కి మాట్లాడమని సైబర్ నేరగాళ్లు చెప్పారు. అదే విధంగా కారులో కూర్చుని ఏమిటండీ అని అడగ్గా, రానున్న జెడ్పీటీసీ ఎన్నికల్లో నీకు కంచికచర్ల, మైలవరం, ఇబ్రహీంపట్నంలలో ఏదో ఒకటి టికెట్ ఇప్పిస్తా, డబ్బులు ఎంత పెట్టుకుంటావని అడిగారు. మరలా ఐదు నిమిషాల తర్వాత ఫోన్కాల్ చేసి అన్నగారు (చంద్రబాబు) మాట్లాడతారంటా అని చెప్పి, ఫోన్ ఇవ్వగా, ఆయన వాయిస్తోనే మాట్లాడారు. దీంతో ఏడుకొండలరావుకు అనుమానం వచ్చింది. కొద్దిసేపటి ఒక రూ.లక్ష వేరేవారికి ట్రాన్స్ఫర్ చేయమని సైబర్ నేరగాళ్లు అడగ్గా, మరుసటి రోజు నేను క్యాష్ ఇస్తానని చెప్పి ఫోన్ పెట్టేశారు. మరుసటి రోజు ఫోన్ చేసి డబ్బులు విజయవాడలో ఎక్కడ ఇవ్వాలో చెప్పారు. 10వ తేదీ డబ్బులు ఇచ్చేందుకు రమ్మని చెప్పడంతో ఆయన బయలుదేరి నేరుగా గొల్లపూడిలోని దేవినేని ఉమా కార్యాలయానికి వెళ్లి, ఫోన్ చేసిన విషయం చెప్పారు. తాను ఫోన్ చేయలేదని చెప్పడంతో సైబర్ నేరగాళ్ల వల అని తెలుసుకుని సైబర్ క్రైమ్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. -
సామాజిక భద్రతే ఈఎస్ఐ లక్ష్యం
గన్నవరం రూరల్: ప్రజలకు సామాజిక భద్రత కల్పించటం ఈఎస్ఐ లక్ష్యమని విజయవాడ ప్రాంతీయ కార్యాలయం జాయింట్ డైరెక్టర్ ప్రణవ్కుమార్ తెలిపారు. చిన అవుటపల్లి డాక్టర్ పిన్నమనేని సిద్ధార్ధ మెడికల్ కళాశాలలో ఈఎస్ఐ ఆధ్వర్యంలో స్ప్రీ–2025 అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత ఉన్న ఉద్యోగులందరినీ నమోదు చేయటం లక్ష్యంగా పని చేస్తున్నామని పేర్కొన్నారు. గతానికి భిన్నంగా స్వీయ నమోదు ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 31 వరకూ కొనసాగుతుందని పేర్కొన్నారు. పది మంది లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులతో నడిచే కర్మాగారాలు, సంస్థలు, హోటళ్లు, ఆస్పత్రులన్నీ ఈఎస్ఐ పరిధిలోకి వస్తాయని వెల్లడించారు. కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చేసిన మొదటి రోజు నుంచే ఈఎస్ఐ చట్టం ద్వారా లభించే ప్రయోజనాలు పొందుతారని ఆటోనగర్ ఈఎస్ఐ బ్యాంక్ మేనేజర్ కె.హేమశ్రీ వివరించారు. వైద్య సంరక్షణ ఆయా కుటుంబాలకు రక్షణగా నిలుస్తుందన్నారు. పిన్నమనేని సిద్ధార్ధ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవి భీమేశ్వర్ ఈఎస్ఐ పథకంపై చూపిన చొరవ అభినందనీయమని అధికారులు కొనియాడారు. జాయింట్ డైరెక్టర్ ప్రణవ్కుమార్ -
విద్యార్థులను చితకబాదిన టీచర్
కిలేశపురం(ఇబ్రహీంపట్నం):విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు నేర్పాల్సిన ఉపాధ్యాయురాలు విద్యార్థులను విచక్షణా రహితంగా చితకబాదింది. ఈ ఘటన ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని కిలేశపురం (కొత్తజూపూడి)లో గురువారం చోటుచేసుకుంది. సాయంత్రం ఇంటికెళ్లిన విద్యార్థులు విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు శుక్రవారం పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులను నిలదీసి ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు చెప్పిన విషయాల మేరకు.. కిలేశపురంలోని ఎంపీపీ పాఠశాలలో 17 మంది విద్యార్థులు నాలుగో తరగతి చదువుతున్నారు. ఒకరిద్దరు పిల్లలు అల్లరి చేస్తున్నారని ఆగ్రహించిన టీచర్ రజని అందరికీ భయం ఉండాలని భావించి తరగతిలోని మిగిలిన విద్యార్థులందరినీ చితకబాదినట్లు చెప్పారు. ఓ బాలికకు చేతి శరీరంపై ఎర్రగా కందిపోయింది. మరో బాలిక అరచేతిని టేబుల్పై పెట్టి వేళ్లపై కర్రతో కొట్టడంతో నొప్పిని భరించలేక పోయి ఏడ్చానని స్వయంగా చెప్పింది. హెచ్ఎం బేబీరాణి గాయపడిన బాలికను ఓదార్చారు. ఓబాలిక తండ్రి బాణావత్ జగన్నాథ్నాయక్ ఈఘటనపై ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో ఇక చదివించమని, డబ్బులు ఖర్చు అయినా ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తామని టీసీ ఇవ్వాలని కోరారు. పిల్లలను చితకబాదిన టీచర్పై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన
లబ్బీపేట(విజయవాడతూర్పు): తమ దీర్ఘకాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్లో పీహెచ్సీ వైద్యులు చేపట్టిన రిలే దీక్షలు ఆరో రోజు శుక్రవారం కొనసాగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ రిలే దీక్షల్లో రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి డాక్టర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించే వరకూ ఆందోళన విరమించేది లేదన్నారు. ముఖ్యంగా ఇన్సర్వీసు పీజీ కోటాను 20 శాతం అన్ని విభాగాల్లో 2030 వరకూ కొనసాగించాలని డిమాండ్ చేశారు. వాటితో పాటు టైమ్ బాండ్ పదోన్నతులు, టైంబాండ్ స్కేల్స్, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వారికి అదనపు భత్యం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని కోరుతూ పీహెచ్సీ వైద్యులు శుక్రవారం సాయంత్రం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ధర్నా చౌక్ నుంచి నిర్వహించిన ఈ ర్యాలీలో భారీగా వైద్యులు పాల్గొన్నారు. -
నాగుల చవితి వేడుక జయప్రదం చేయండి
మోపిదేవి: నాగుల చవితి పర్వదినాన్ని విజయవంతం చేయాలని ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు కోరారు. మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో ఈ నెల 25వ తేదీ నాగుల చవితి సందర్భంగా పలుశాఖల అధికారుల సమన్వయ కమిటీ సమావేశం శుక్రవారం సాయంత్రం తహసీల్దార్ ఎం.హరనాథ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీ వరప్రసాదరావు మాట్లాడుతూ దేవస్థానం తరపున భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు, నాగపుట్ట, గుడి మండపం వద్ద చాందినీ డెకరేషన్, లడ్డూ ప్రసాదం భక్తులందరికీ అందుబాటులో ఉంచడం, ఆలయాన్ని విద్యుత్ అలంకరణ, క్యూలైన్లులో భక్తుల కోసం షామియానాలు ఏర్పాటు చేయడం, వివిధ డివిజన్ల నుంచి పోలీస్ బందోబస్తు, సేవాసమితి, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులచే క్యూలైనులో సేవలు, ఉచిత పులిహోర ప్రసాదం, వృద్ధులు, వికలాంగులు, చిన్నపిల్లల తల్లుల కోసం ప్రత్యేక దర్శన ఏర్పాటు చేస్తున్నామన్నారు. తహసీల్దార్ హరనాథ్ మాట్లాడుతూ ప్రసిద్ద పుణ్యక్షేత్రంగా ప్రసిద్ద పొందిన సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయంలోని నాగపుట్టలో పాలుపోసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారని తెలిపారు. చల్లపల్లి సీఐ ఈశ్వరావు, సర్పంచ్ నందిగం మేరీరాణి, ఎంఆర్ఐ కె. విశ్వనాఽథ్, ఎకై ్సజ్ శాఖ నుంచి ఆసిఫ్బాబు, అవనిగడ్డ ఆర్టీసీ డీఎం హనుమంతరావు, అగ్నిమాపకశాఖ అధికారి సుధాకర్, ఎస్ఐ సత్యనారాయణ, ఆలయ సూపరిటెండెంట్ అచ్చుత మధుసూదనరావు, ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఆలయ డెప్యూటీ కమిషనర్ శ్రీరామ వరప్రసాదరావు -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
తిరువూరు: పట్టణ శివారు పీటీకొత్తూరులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు. చౌటపల్లి పాలసేకరణ కేంద్ర వేతన కార్యదర్శిగా పనిచేస్తున్న తేలె వెంకటేశ్వరరావు (60) తన స్వగ్రామమైన చిట్టేల నుంచి తిరువూరు ద్విచక్రవాహనంపై వస్తుండగా ఎదురుగా వచ్చిన మరో ద్విచక్రవాహనం ఢీకొట్టింది. దీంతో అపస్మారక స్థితికి చేరిన వెంకటేశ్వరరావుకు తిరువూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం విజయవాడ తరలించారు. మార్గమధ్యంలోనే ఆయన మృతి చెందడంతో తిరువూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆయన మృతికి తిరువూరు క్లస్టర్ పాలశీతల కేంద్ర సిబ్బంది సంతాపం తెలిపారు. దీర్ఘకాలం పాలసేకరణ కేంద్రంలో పనిచేస్తూ రైతులతో సత్సంబంధాలు కలిగిన వెంకటేశ్వరరావు మృతితో చిట్టేల, చౌటపల్లి గ్రామాల్లో విషాదం నెలకొంది. -
కేడీీసీసీ బ్యాంక్తో ఆర్థిక వ్యవస్థ బలోపేతం
జగ్గయ్యపేట అర్బన్: కేడీసీసీ బ్యాంక్తో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ అన్నారు. కేడీసీసీ బ్యాంక్ జగ్గయ్యపేట బ్రాంచ్ పరిధిలోని సొసైటీలు, బ్యాంకు సిబ్బంది, ఇన్చార్జ్లతో మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ సమీక్ష సమావేశం నిర్వహించి, అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సంవత్సరం బ్యాంక్ బ్రాంచ్ టార్గెట్ రూ 361 కోట్లు కాగా, ఇప్పటి వరకు రూ.310 కోట్లు సాధించామని చెప్పారు. రైతు, సహకార సంఘం, ఎంఎస్ఎంఈ రంగాల సమగ్ర అభివృద్ధే బ్యాంక్ ప్రధాన లక్ష్యం అన్నారు. రైతు సౌభాగ్యమే బ్యాంకు విజయానికి ఆధారం అని స్పష్టం చేశారు. మల్కాపురం సొసైటీ కార్యాలయం నిర్మించేందుకు ఇంజినీరింగ్ విభాగానికి ఆదేశాలు జారీ చేశామన్నారు. అలాగే ఎంఎస్ఎంఈ చిన్న వ్యాపారాలకు పెద్ద తోడుగా ఉందని, పీఎం సూర్యఘర్ పథకం ద్వారా విద్యుత్ ఆదాతో పాటు ఆర్థికంగా ఆదా అవుతుందని పేర్కొన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, డ్రోన్ టెక్నాలజీతో వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతుందని తెలిపారు. అనంతరం ఆయన గోపాలకృష్ణ లార్జ్ సైజ్ కోపరేటివ్ సొసైటీ, కృష్ణాఫార్మర్స్ సొసైటీలను సందర్శించి అక్కడి కార్యకలాపాలను పరిశీలించారు. కృష్ణా ఫార్మర్స్ సొసైటీ పరిధిలో నడుస్తున్న జన ఔషది మెడికల్ స్టాల్స్ను సందర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), గౌరవరం సొసైటీ అధ్యక్షుడు కట్టా నరసింహారావు, గోపాలకృష్ణ, కృష్ణా ఫార్మర్స్ సొసైటీల అధ్యక్షులు దూళిపాళ్ల లక్ష్మణరావు, యానాల గోపి, బండిపాలెం, మల్కాపురం సొసైటీల అధ్యక్షులు అప్పారావు, పిచ్చయ్యచౌదరి, నందిగామ బ్రాంచ్ ఏజీఎం శ్రీదేవి, పేట బ్రాంచ్ ఛీప్ మేనేజర్ రమేష్, బ్యాంక్ సిబ్బంది, సొసౌటీల ప్రతినిధులు పాల్గొన్నారు. కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ రఘురామ్ -
డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన
పామర్రు: నూతన ఉపాధ్యాయులు డ్రగ్స్ వలన కలిగే ప్రమాదాలు, విద్యార్థుల భవిష్యత్పై వాటి ప్రభావం గురించి తెలుసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు తెలిపారు. స్థానిక ప్రగతి కళాశాల ఆవరణలో డీఎస్సీ ద్వారా నూతనంగా ఎంపికై న ఉపాధ్యాయులకు శిక్షణలో భాగంగా డ్రగ్స్పై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈగల్ చీఫ్ ఐజీపీ ఆర్కె రవికృష్ణ, కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుల ఆదేశాల మేరకు ఈగల్ టీం ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. కొత్త ఉపాధ్యాయుల కోసం అవగాహన కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు. డ్రగ్స్ శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను మాత్రమే కాకుండా కుటుంబాలను కూడా దెబ్బతీస్తాయని చెప్పారు. యువతలో ఆసక్తి, స్నేహితుల ఒత్తిడి వంటి కారణాల వల్ల ఈ వ్యసనం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. తరగతి గదిలో విద్యార్థుల ప్రవర్తనలో వచ్చే మార్పులను గమనించి అవసరమైతే తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచించారు. విద్యార్థులకు స్నేహ పూర్వక వాతావరణం కల్పించి భయ పడకుండా తమ సమస్యలను చెప్పుకునేలా చూడాలన్నారు. సమాజం తల్లిదండ్రులు, అధికారులు కలిసి పని చేస్తేనే డ్రగ్స్ వ్యసనాన్ని ఆరికట్టవచ్చని వెల్లడించారు. శిక్షణలో పాల్గొన్న 900 మంది ఉపాధ్యాయులు తాము భవిష్యత్తులో విద్యార్థులకు సరైన దారి చూపించేందుకు కృషి చేస్తామని తెలిపారు. డ్రగ్స్ వద్దు బ్రో అన్న నినాదాన్ని, టోల్ ఫ్రీ నెంబరు 1972 అందరూతో పలికించారు. ఈ కార్యక్రమంలో పామర్రు సీఐ సుభాకర్, ఈగల్ టీమ్ సబ్ఇన్స్పెక్టర్ ఎం. వీరాంజనేయులు, రాంబాబు టీమ్ సభ్యులు పాల్గొన్నారు. -
అక్రమంగా నిల్వ ఉంచిన టపాసులు స్వాధీనం
కంకిపాడు: అక్రమంగా నిల్వ ఉంచిన దీపావళి టపాసులను కంకిపాడు పోలీసులు గురువారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ జె.మురళీకృష్ణ తెలిపిన కథనం మేరకు...మండలంలోని ఉప్పలూరు గ్రామంలో గురువారం రాత్రి అదనపు ఎస్ఐ తాతాచార్యులు, పీఎస్ఐ సత్యం సురేష్ నేతృత్వంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో గ్రామంలోని మెయిన్రోడ్డు పరిసరాల్లో ఉంటున్న నీలం దుర్గారావు ఇంటిని సోదా చేయగా రూ.74,700 విలువైన దీపావళి టపాసులను స్వాధీనం చేసుకున్నారు. మరో వ్యక్తి వంగర రాధాకృష్ణమూర్తిని తనిఖీ చేయగా రూ.2,68,318 విలువైన దీపావళి టపాసులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా టపాసులు నిల్వ చేయటంపై నీలం దుర్గారావు, వంగర రాధాకృష్ణమూర్తిపై కేసులు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న టపాసులను పోలీసుస్టేషన్కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మురళీకృష్ణ, అదనపు ఎస్ఐ తాతాచార్యులు తెలిపారు. -
మహనీయుడు దీవి గోపాలాచార్యులు
భావదేవరపల్లి(నాగాయలంక):ఆయుర్వేద వైద్యరత్న పండిత దీవి గోపాలాచార్యులు దివిసీమకు చెందినవాడు కావడం తెలుగుజాతి ప్రజలకే కాకుండా యావత్ దేశానికే గర్వకారణమని అవనిగడ్డ శాసన సభ్యడు మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. గోపాలాచార్యులు జయంతి పురస్కరించుకుని ఆయన స్వగ్రామమైన భావదేవరపల్లిలో శక్రవారం దీవి వంశీయులతో కలసి గోపాలాచార్యులు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మండలి ఉదయభాస్కర్ అధ్యక్షతన నిర్వహించిన సభలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడారు. నాడు ఆయుర్వేద వైద్యాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తే బ్రిటీష్ రాణికి ఆయుర్వేద వైద్య చికిత్స చేసి బ్రిటీష్ ప్రభుత్వంచే భారతీయ ఆయుర్వేద వైద్యరత్న బిరుదు అందుకున్న గొప్ప ఆయుర్వేద వైద్య శాస్త్రవేత్త గోపాలాచార్యులు అని కొనియాడారు. గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ దేశవ్యాప్త ఆయుర్వేద వైద్యానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన మహానుభావుడి అడుగు జాడలు ఆయన స్వగ్రామంలో ప్రతిబింబించాలనే సంకల్పంతోనే గ్రామస్తులు సమష్టిగా గోపాచార్యులు విగ్రహం ఏర్పాటునకు ముందుకు వచ్చామని చెప్పారు. 265 మంది రోగులకు వైద్య పరీక్షలు చేశారు. గ్రామంలోని మండలి వెంకట కృష్ణారావు విగ్రహానికి దీవి వంశీయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. శతాధిక గ్రంథకర్త డాక్టర్ జీవీ పూర్ణచంద్ రచించిన ఆయుర్వేద మార్తాండుడు పండిత దీవి గోపాలచార్యులు పుస్తకాన్ని సభావేదికపై ఆవిష్కరించారు. నియోజకవర్గం ప్రత్యేకాధికారి పి.సాయిబాబు, ఎమ్మెల్యే తనయుడు మండలి వెంకట్రామ్, భావన్నారాయణస్వామి దేవస్థానం ధర్మకర్త భోగాది విశ్వేశ్వరరావు, ఈఓ సీహెచ్ సుధాకరరావు, దీవి వంశీయులు, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో రైతుల నుంచి ఖరీఫ్ ధాన్యం సేకరణకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సహకరించాలని కలెక్టర్ డీకే బాలాజీ రైస్ మిల్లర్లను కోరారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జేసీ ఎం.నవీన్ తో కలిసి ధాన్యం సేకరణపై రైస్మిల్లుల యజమానులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జిల్లా యంత్రాంగం, మిల్లర్లు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. గత సంవత్సరం 6.20 లక్షల మెట్రిక్ టన్నుల సేకరించగా ఈ సంవత్సరం 7.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. వరి కోతలు యంత్రాలతో జరగడం వల్ల ధాన్యం ఒకేసారి వచ్చే అవకాశం ఉందని దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. నాణ్యతలేని ధాన్యం పై రైతులకు అవగాహన కలిగిస్తున్నామన్నారు. జిల్లాలో 37 లక్షల గోనెసంచులు ఉన్నాయని, మరో 17 లక్షల గోనెసంచులు సిద్ధం చేయాలన్నారు. రైతు సేవా కేంద్రాలు, మిల్లర్ల మధ్య తేమ శాతంలో తేడాలు వస్తున్నట్లు గమనించామని, ఈసారి అటువంటివి పరిస్థితిలు రాకుండా రెండు చోట్ల ఒకే రకమైన తేమ శాతం పరీక్షించే యంత్ర పరికరాలను ఉంచుతున్నామని వివరించారు. పెండింగ్ బిల్లులు చెల్లిస్తాం... జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న అన్ని బిల్లులను వెంటనే చెల్లింపులు చేస్తామన్నారు. బ్యాంకు గ్యారంటీలకు సంబంధించి బ్యాంకర్లకు లేఖలు కూడా పంపిస్తున్నామన్నారు. వాహనాల నమోదు కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన జరగాలన్నారు. గోనెసంచులు ఎవరు ఎన్ని ఇచ్చారో వారికి అన్ని తిరిగి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శివరాంప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి ఎన్.పద్మావతి, మచిలీపట్నం ఆర్డీవో స్వాతి, జిల్లా ఇన్చార్జ్ రవాణాధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పకడ్బందీగా నిర్వహించండి... రైతుకు పూర్తి మద్దతు ధర అందించడంలో అధికారులు, సిబ్బంది క్రియాశీలకంగా పని చేయాలని కలెక్టర్ డీకె బాలాజీ అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో జిల్లా పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో బందరు డివిజన్లోని తహశీల్దార్లు, వీఆర్వోలు, గ్రామ వ్యవసాయ సహాయకులు (విఏఏ), సాంకేతిక సహాయకులకు (టిఏ) ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణపై అవగాహన శిక్షణ సదస్సు నిర్వహించారు. కలెక్టర్ డీకే బాలాజీ -
యువకుడి మోసంపై యువతి ఆందోళన
మక్కపేట(వత్సవాయి): ఓ యువకుడు మాయమాటలు చెప్పి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేసి మోసం చేశాడని యువతితో పాటు కుటుంబసభ్యులు ఆందోళన చేసిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బాధితురాలు యండ్రాతి అరుణ్య, నూతక్కి సందీప్ రెండేళ్లగా ప్రేమించుకున్నారు. అయితే గతేడాది అరుణ్య గర్భవతి కావడంతో కుటుంబసభ్యులు గమనించి వివరాలు తెలుసుకుని గ్రామంలోని పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. ఈ సందర్భంగా యువకుడు సందీప్ తనకు వివాహం చేసుకోవడానికి ఏడాదిన్నర సమయం కావాలని అంతేకాకుండా గర్భం కూడా తీసేసుకుంటేనే వివాహం చేసుకుంటానని పెద్దల సమక్షంలో ఒప్పుకుని కాగితాలు రాసుకున్నారు. తరువాత యువతి గర్భం తొలగించుకుంది. ఇప్పుడు ఏడాదిన్నర సమయం రావడంతో యువతి కుటుంబసభ్యులు పెద్దల దగ్గరకు వెళ్లారు. దీంతో వాళ్లు యువకుడిని పిలిచి అడగ్గా పెళ్లి తనకు ఇష్టం లేదని తనని వివాహం చేసుకోలేనని చెప్పాడు. దీంతో ఆగ్రహించిన యువతి కుటుంభసభ్యులు స్టేషన్లో ఫిర్యాదు చేయగా పెద్దల సమక్షంలో తేల్చుకోవాలని పోలీసులు చెప్పడంతో యువతితో పాటు కుటుంబసభ్యులు మక్కపేట గాంధీ సెంటర్లో ఆందోళన చేశారు. -
వాళ్లు పదవులోళ్లు.. మనం పనోళ్లం
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: పదవుల పంపిణీలో ఒక సామాజికవర్గానికి ప్రాధాన్యం దక్కుతోంది తప్ప తక్కిన వారికి అన్యాయం కొనసాగుతోందనిఎన్టీఆర్ జిల్లాలోని టీడీపీ నేతలు, కూటమి పార్టీల నాయకులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ‘పదవులకు వాళ్లు, పనులకు మనమా’ అంటూ అంతర్గత చర్చల్లో పరస్పరం వాపోతున్నారు. ఆయా కుల కార్పొరేషన్లకు మాత్రమే మనం పరిమితమా అని మథనపడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటివరకు దక్కిన పదవులను బేరీజు వేసుకుంటున్నారు. తాజాగా దుర్గగుడి దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్గా బొర్రా రాధాకృష్ణ (గాందీ)ని ప్రకటించిన తరువాత టీడీపీలోని పాలకపక్ష సామాజికవర్గీయులు సైతం మండిపడుతున్నారు. పాలకమండలి సభ్యుల్లో ఏ వర్గం వారిది మెజారిటీనో కూడా పరిశీలించాలంటున్నారు. ఇదీ వరుస.. తెలుగుదేశం పార్టీ నుంచి విజయవాడ లోక్సభ సభ్యుడిగా కేశినేని శివనాథ్ (చిన్ని), విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్, మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్, పశ్చిమ ఎమ్మెల్యేగా యలమంచిలి సుజనాచౌదరి (బీజేపీ) ప్రాతినిధ్యం వహిసున్న సంగతి తెలిసిందే. నందిగామ, తిరువూరు రిజర్వుడు స్థానాలు అయినందున ఆ వర్గీయులైన కొలికపూడి శ్రీనివాస్, తంగిరాల సౌమ్యలు కాగా విజయవాడ సెంట్రల్ నుంచి బొండా ఉమామహేశ్వరరావు, జగ్గయ్యపేట నుంచి శ్రీరాం తాతయ్య ఉన్నారు. కుల కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల పదవులు కాకుండా తక్కిన ప్రాధాన్యతా పోస్టులు మాత్రం దాదాపు చంద్రబాబు సామాజికవర్గీయులకే దక్కడం పరిశీలనాంశం. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా కొమ్మారెడ్డి పట్టాభిరాం, కేడీసీసీబీ చైర్మన్గా నెట్టెం రఘురాం పదవుల్లో కొనసాగుతున్నారు. చివరకు జిల్లా పరిధిలోని వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీల చైర్మన్లు సైతం ఆ వర్గీయులకే మెజారిటీ దక్కాయి. దుర్గగుడి చైర్మన్ పదవి కూడా.. దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయ చైర్మన్గా బొర్రా రాధాకృష్ణ (గాందీ) నియామకం జిల్లాలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు వియ్యంకుడు, లోకేష్ మామ, హిందూపురం ఎమ్మెల్యే అయిన బాలకృష్ణకు సన్నిహితుడు కావడం మినహా రాజకీయంగా గాం«దీకి ఉన్న అర్హతలు ఏంటని టీడీపీ వర్గాలే నిలదీస్తున్నాయి. బాలకృష్ణను అనుసరించడం తప్ప పార్టీలో బాధ్యత, కార్యక్రమాలలో భాగస్వామ్యం ఏపాటిదని ప్రశి్నస్తున్నారు. ఫైనాన్స్ వ్యాపారిగా, ఎల్ఐసీలో పనిచేసిన గాంధీ మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ)కు అనుచరునిగా కొనసాగారని గుర్తుచేస్తున్నారు. ఇదే విషయాన్ని జిల్లాలోని టీడీపీ ముఖ్య నేతలను ద్వితీయశ్రేణి నాయకులు ప్రశ్నించగా, ‘మాదేముంది అంతా అధిష్టానం నిర్ణయమేగా’ అని బదులిచ్చి మౌనం దాల్చారని సమాచారం. విజయవాడ పశి్చమ పరిధిలోని ముఖ్య పదవుల్లో సుజనాచౌదరి, గాంధీ, గొల్లపూడి మార్కెట్ యార్డు చైర్మన్ నర్రా వాసు, దుర్గ గుడి సభ్యురాలు గూడపాటి వెంకట సరోజనిదేవి ఒకే సామాజికవర్గానికి చెందినవారు. పశి్చమ పరిధిలోని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్గా కూటమి ప్రభుత్వం రాకముందు నుంచే టీడీపీకి చెందిన చలసాని ఆంజనేయులు కొనసాగుతున్నారు.నందిగామను పరిశీలిస్తే చాలు.. టీడీపీలో పదవుల పంపకం ఎలా ఉన్నాయనేది నందిగామ నియోజకవర్గాన్ని ఉదాహరణగా పరిశీలిస్తే తేటతెల్లం అవుతుంది. పదవులన్నీ ఒక సామాజికవర్గానికేనా అనే చర్చ కూటమి పార్టీల వైపు నుంచి సోషల్మీడియాలో జోరుగానే కొనసాగుతోంది. కంచికచర్ల ఏఎంసీ చైర్మన్గా కోగంటి వెంకట సత్యనారాయణ (బాబు), నాగార్జున సాగర్ ప్రాజెక్టు లెఫ్ట్ కెనాల్ చైర్మన్, చందర్లపాడు, నందిగామ, కంచికచర్ల, వీరులపాడు డి్రస్టిబ్యూటరీ కమిటీ చైర్మన్లుగా పాలకపక్షం వర్గీయులే. తాజాగా దుర్గ గుడి సభ్యురాలిగా మన్నే కళావతికి అవకాశం దక్కింది. మునిసిపల్ చైర్మన్, ఏరియా హాస్పిటల్ చైర్మన్ ఆ సామాజికవర్గం వారే. ఇక ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ (పీఏసీఎస్)ల చైర్మన్ల సంగతి సరేసరి. చందర్లపాడు, చింతలపాడు, గుత్తావారిపాలెం, కాసరబాద, కొడవటికల్లు, కోనాయపాలెం, ముప్పాళ్ల, చెవిటికల్లు, గండేపల్లి, కంచికచర్ల, గనిఆత్కూరు, గొట్టుముక్కల, మోగులూరు, పరిటాల, సక్కలంపేట, పెరకలపాడు, అడవిరావులపాడు, కంచెల, ఐతవరం, చౌటపల్లి, పొన్నవరం, వీరులపాడు, వెల్లంకి, జమ్మవరం సొసైటీల చైర్మన్లుగా ఆ సామాజికవర్గీయులే కొనసాగుతుండటం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా ఉంది. మరో ఎనిమిది పీఏసీఎస్ల చైర్మన్లుగా మాత్రమే ఇతరులున్నారు. రూరల్ నియోజకవర్గాల్లో నీటి సంఘాల కమిటీలు, వ్యవసాయ కమిటీలకు అధిక ప్రాధాన్యతనేది తెలిసిందే.విజయవాడ పశ్చిమానికి చెందిన నాగుల్మీరాను రాష్ట్ర నూర్బాషా సంఘం కార్పొరేషన్ చైర్మన్గా నియమించగా ఆయన అప్పట్లోనే అధిష్టానం వద్దే అయిష్టతను వ్యక్తం చేసినట్లు సమాచారం. శాసనసభా స్థానం నుంచి పోటీచేసిన, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన తనను కుల సంఘానికి పరిమితం చేయడం ఇబ్బందికరమని అన్నట్లు తెలిసింది. నగరంలోని మరికొందరు నాయకులను కూడా కుల సంఘాల పోస్టులకు పరిమితం చేయడం గమనార్హం. జగ్గయ్యపేట ఏఎంసీ చైర్మన్ పదవిని ఎస్సీ మహిళకు కేటాయించాలనే నిర్ణయం జరిగింది. జిల్లా కలెక్టర్ అయిదారు నెలల కిందట నోటిఫికేషన్ కూడా జారీచేశారు. ఎంపీ కేశినేని చిన్ని వర్గీయుడైన గండ్రాయి గ్రామానికి చెందిన కొటారి సత్యనారాయణ ప్రసాద్ అడ్డంకులు సృష్టించారు. తమ వర్గానికే ఇవ్వాలనడంపై ఎస్సీ సంఘాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. కోర్టు స్టే ఇచ్చింది. జిల్లా పరిధిలోని పలు దేవాలయాల చైర్మన్ పదవుల నియామకాలు జరగలేదు. మరికొన్ని ఆలయాలకు పాత కమిటీలే కొనసాగుతున్నాయి. ఇతర సామాజికవర్గాల వారికి పాలకమండలి పదవులు దక్కడం ఇష్టంలేక భర్తీచేయలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
మచిలీపట్నం పోలీసులకు బిగ్ షాక్
సాక్షి, కృష్ణా: మచిలీపట్నం పోలీసులకు బిగ్ షాక్ తగిలింది. నగర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మేకల సుబ్బన్న అక్రమ అరెస్టును కోర్టు తోసిపుచ్చింది. ఈ క్రమంలో రిమాండ్ను తిరస్కరించిన పీడీఎం కోర్టు న్యాయమూర్తి.. ఆయనకు బెయిల్ కూడా మంజూరు చేసింది. మరోవైపు.. సుబ్బన్న అక్రమ అరెస్ట్ నేపథ్యంలో పీఎస్కు వెళ్లిన మాజీ మంత్రి పేర్ని నాని సీఐ ఏసుబాసుపై బెదిరింపులకు దిగారనే ప్రచారం నడిచింది. దీంతో కేసు పెడతామంటూ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ప్రకటించారు. అయితే జరిగింది ఏంటో తెలుసుకోవాలని ఎస్పీని పేర్ని నాని కోరుతున్నారు. ‘‘కృష్ణాజిల్లా ఎస్పీ పూర్తి వాస్తవాలు తెలుసుకోవాలి. కింద అధికారులు చెప్పిందే నమ్మి ఎస్పీ మాట్లాడుతున్నారు. పోలీస్ స్టేషన్లో సీసీఫుటేజీ చూసి మాట్లాడాలి. పీఎస్కు వెళ్లిన తన భర్త ఇంటికి రాకపోవడంతో మేకల సుబ్బన్న భార్య నాకు ఫోన్ చేసి ఆందోళన చెందింది. మా పార్టీ నాయకుడి కోసమే నేను స్టేషన్ కు వెళ్లా. మేమేమీ స్టేషన్ పైకి దొమ్మీకి వెళ్లలేదు.... మేకల సుబ్బన్నను ఎందుకు తీసుకొచ్చారని సీఐని అడిగా. మీకు చెప్పాల్సిన అవసరం లేదు మేం ఎవరినైనా తీసుకురావొచ్చని సిఐ చెప్పారు. నేను మేకల సుబ్బన్నను విడిపించుకుని వెళతానని చెప్పలేదు. నా పై మీ సిబ్బంది చెప్పినవన్నీ అవాస్తవాలు. మేం పోలీసులకు వ్యతిరేకం కాదు. మీకింద పనిచేస్తున్న అధికారులు మా పై చెడుగా చెప్తున్నారు.. పోలీసు ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకుని కక్షసాధింపు చేస్తే ప్రశ్నిస్తే తప్పేంటి?. రెండున్నరేళ్ల క్రితం ఓ దళిత యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆ దళిత యువకుడిని పది రోజుల పాటు జైల్లో పెట్టారు. మా నాయకులను తమాషాలు చేస్తారా? అని సీఐ మాట్లాడారు. అలా ఎందుకు మాట్లాడారని మాత్రమే సీఐని నిలదీశాం.. .. ఏడాదిన్నర నుంచి సీఐ ఏకపక్షంగా టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. స్టేషన్ కు వెళ్లిన మమ్మల్ని అవమానకరంగా మాట్లాడారు. ఇష్టానుసారంగా మాట్లాడితే ఆత్మగౌరవాన్ని చంపుకుని బ్రతకలేం. పోలీస్ స్టేషన్ లో పోలీసులు నోటికొచ్చినట్లు తూలనాడితే నోరుమూసుకుని కూర్చోమని ఏ చట్టం చెబుతోంది?.. చెప్పుడు మాటలు వినొద్దు... వాస్తవాలు తెలుసుకోవాలని ఎస్పీని కోరుతున్నా. నా పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటున్నారు. మీరు కేసు పెడతామంటే పెట్టండి నేను కాదనను. నేనేమీ నేరాలు.. ఖూనీలు చేయలేదు. నన్ను అవమానిస్తే కచ్చితంగా తిరగబడతా. మీ సీఐ మమ్మల్ని అవమానించినా మేం ప్రశ్నించడం నేరమైతే మీరు తీసుకునే చర్యలను ఎదుర్కోవడానికి మేం సిద్ధం. 2014-19లో కూడా నా పై అనేక కేసులు పెట్టి జైల్లో పెట్టారు. 365 రోజులు సెక్షన్ 30 అమల్లో ఉంటే ప్రజలు తమ నిరసన ఎలా తెలియజేస్తారు?.. అని పేర్ని నాని ఎస్పీని ఉద్దేశించి ప్రశ్నించారు. -
‘చంద్రబాబు కుయ్ కుయ్ అనడం లేదు ఎందుకో?’
కృష్ణాజిల్లా: కల్తీ మద్యంపై టీడీపీ నేతల విమర్శలకు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఏపీలో తయారవుతున్న కల్తీ మద్యాన్ని చూసి ఎక్సైజ్శాఖే నివ్వెరపోతుందన్నారు. లైసెన్స్ ఉన్న డిస్టరీలకు పోటీగా ములకలచెరువులో కల్తీ మద్యం తయారవుతోందని పేర్ని నాని పేర్కొన్నారు. ఈ రోజు(శుక్రవారం, అక్టోబర్ 10వ తేదీ) ప్రెస్మీట్లో మాట్లాడిన పేర్ని నాని.. ‘ ధనదాహంతో తండ్రీ కొడుకులు ఎన్నో పాపాలు చేస్తున్నారు. మీ రాజకీయాల కోసం ఎంతటి విషమైనా చల్లడమేనా?, ఆంధ్రజ్యోతి,ఈనాడులో చాలా దారుణంగా రాస్తున్నారు. ఆఫ్రికాలో లిక్కర్ ఫ్యాక్టరీ నడిపేవాళ్లంతా రెడ్లే అని రాస్తున్నారు. రెడ్లయితే దొంగలు...కమ్మవారైతే మంచోళ్లా? అని ప్రశ్నించారు పేర్ని నాని. లోకేష్ ఎందుకు ట్వీట్లు పెట్టడం లేదు?‘ములకలచెరువుకు ముందు అమలాపురంలో కల్తీ మద్యం పట్టుబడింది. అనకాపల్లి జిల్లా పరవాడ , నెల్లూరు జిల్లాలోనూ కల్తీ మద్యం పట్టుబడింది. ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న బ్రాండ్ల సీసాల్లో కల్తీ మద్యం నింపుతున్నారు.ఏలూరు,రేపల్లె,అమలాపురంలో పట్టుబడినవన్నీ ఫ్రాంచైజీలే. ఈ ప్రాంఛైజీల తీగలాగితే ములకలచెరువులో డొంక కదిలింది. ములకలచెరువు నుంచి ఇబ్రహీంపట్నానికి కల్తీ మద్యం పాకింది. వాటాల కోసం వచ్చిన తేడాలతో టిడిపి నేతల కుమ్ములాటలో నకిలీమద్యం పట్టుబడింది. నకిలీ మద్యం పట్టుబడిన చోట ఆ జిల్లాల మంత్రులు ఎందుకు నోరు మెదపడం లేదు?, కల్తీ మద్యం పట్టుబడితే సారా మంత్రి కిక్కురుమనడం లేదు. మాట్లాడితే ట్విట్టర్లో పోస్టులు పెట్టే లోకేష్ ఎందుకు ట్వీట్లు పెట్టడం లేదు? అని నిలదీశారు. చంద్రబాబు కూడా కుయ్ కుయ్ అనడం లేదు ఎందుకో?పదే పదే మైకుల ముందువు వచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కుయ్ కుయ్ అనడం లేదు. అందరూ తేలుకుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు. పట్టుబడిన కల్తీ మద్యం కేసులను నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారుసోషల్ మీడియా కేసులో అరెస్టైన వైసిపి వాళ్ల ఫోన్లను లాక్కుంటారు. విచారణ చేయాలని ఫోన్లు స్వాధీనం చేసుకుంటారు. కల్తీమద్యం కేసులో ఎవరి వద్దైనా ఫోన్లు తీసుకున్నారా?, రేపల్లె,అమలాపురంలో కల్తీ మద్యంతో పట్టుబడిన వాళ్ల ఫోన్లు తీసుకున్నారా?, ఈ కల్తీ మద్యం వెనుక ఉన్న బాస్ ఎవరో తెలుసుకున్నారా?, లోతైన విచారణ చేయరా?, ఆఫ్రికాలో పెద్దిరెడ్డికి ఫ్యాక్టరీలున్నాయని మన సారా మంత్రి మట్లాడుతున్నాడు. మీ రాజకీయాల కోసం ఎంతటి విషమైనా చల్లడమేనా?, ఆఫ్రికాలో లిక్కర్ ఫ్యాక్టరీ నడిపేవాళ్లంతా రెడ్లే అని రాస్తున్నారు. రెడ్లయితే దొంగలు...కమ్మవారైతే మంచోళ్లా?, తప్పుచేసే వారైతే మీ పార్టీలో రెడ్లను ఎందుకు ఉంచుకున్నారు. రెడ్లందరినీ జగన్ వద్దకు ఎందుకు పంపించేయలేదు. టిడిపి నేతలు చాలా నీచంగా మాట్లాడుతున్నారు. అసలు టిడిపి ఒక పార్టీయేనా?, ఆఫ్రికాలో సారా వ్యావారం చేయిస్తున్న జగన్ రెడ్డి అని రాస్తున్నారు...అసలు సిగ్గుందా మీకు?, జయహో బిసి సభలో జయచంద్రారెడ్డిని పార్టీలో చేర్చుకున్నారుదొంగ లిక్కర్ కంపెనీలు నడిపే వారంతా చంద్రబాబు చుట్టూనే..పేరుకి బిసి సభ...చేర్చుకున్నది మాత్రం రెడ్డిని. ఆఫ్రికాలో తనకు లిక్కర్ ఫ్యాక్టరీలున్నాయని ఎన్నికల అఫిడవిట్ లో జయచంద్రారెడ్డి పేర్కొన్నాడు. ఆఫ్రికాలో నాలుగు లిక్కర్ ఫ్యాక్టరీలున్నాయని చెప్పాడు. ఎన్నికల్లో బిఫారం ఇచ్చినపుడు చంద్రబాబుకి తెలియదా?, చంద్రబాబుతో కాపురం చేసి జగన్కు డబ్బులు పంపించారని మాట్లాడుతున్నారు.. సిగ్గనిపించడం లేదా?, దొంగ లిక్కర్ కంపెనీలు నడిపే దొంగలంతా చంద్రబాబు చుట్టూనే ఉన్నారు. కట్టా సురేంద్ర నాయుడుకి 2002లో ఓ మర్డర్ కేసులో యావజ్జీవ శిక్ష పడింది. కట్టా సురేంద్ర వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో హైకోర్టుకు వెళ్లాడు. హైకోర్టు కూడా కట్టా సురేంద్రనాయుడిని నేరం చేశావని చెప్పిందికట్టా సురేంద్ర నాయుడికి క్షమాభిక్ష పెట్టి బయటికి తెచ్చింది చంద్రబాబు కాదా?, కట్టా సురేంద్రనాయుడికి క్లీన్ చిట్ ఇచ్చింది చంద్రబాబు కాదా?, మీకు పార్టనర్ కాకపోతే ఓ మర్డర్ కేసులో నిందితుడు క్షమాభిక్షతో ఎలా బయటికి వచ్చాడు. ఇది కూడా చంద్రబాబుతో జగనే చేయించారా?, చంద్రబాబు మీకు శంకర్ యాదవ్ గుర్తున్నాడా?, మీకు గుర్తులేకపోయినా చిత్తూరు జిల్లా టిడిపి నాయకులకు గుర్తుంటాడు. శంకర్ యాదవ్ ను కాదని మా కోవర్ట్ అని చెప్పే జయచంద్రారెడ్డికి టిక్కెట్ ఎలా ఇచ్చారు?, ఎంత తీసుకుని జయచంద్రారెడ్డికి టిక్కెట్ ఇచ్చారుఈరోజు మీరు దొరికిపోయారు కాబట్టి మా పై నిందలు వేస్తారా?మా కోవర్టులను చేర్చుకుని ఎందుకు మీరు టిక్కెట్లిచ్చారు. మా కోవర్ట్ ను చేర్చుకుని నూజివీడు టిక్కెట్ ఎందుకిచ్చారు?, మా కోవర్ట్ ను ఎందుకు మంత్రిని చేశారు. మా కోవర్ట్ను చేర్చుకుని ఎందుకు మచిలీపట్నం ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. మా కోవర్టులను బయటికి పంపించరా...మీ దగ్గరే ఉంచుకుంటారా?, బయటపడేవరకూ మా కోవర్టులను మీ వద్దే ఉంచుకుంటారా?, చంద్రబాబు పాపాలను ప్రజలు లెక్కబెడుతున్నారు. కచ్చితంగా ప్రజలే చంద్రబాబుకు బుద్ధి చెబుతారు’ అని హెచ్చరించారు.ఇదీ కూడా చదవండి:మీరు మోసగాళ్ల తరఫు లాయర్లు కదా? -
‘365 రోజులూ సెక్షన్ 30 పెడతానే ఉంటారా?’
కృష్ణాజిల్లా: కూటమి నేతలకు నచ్చితే సెక్షన్లు ఉండవు. నచ్చకపోతే సెక్షన్లు అమాంతం అమల్లోకి వస్తాయి. ఇప్పుడే ఇది జరిగింది. నిన్న(గురువారం, అక్టోబర్ 9వ తేదీ) వైఎస్ జగన్ నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించిన క్రమంలో ‘ఛలో మెడికల్ కాలేజ్’ కార్యక్రమం చేపట్టినందుకు మచిలీపట్నం వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు మేకల సుబన్నను అరెస్టు చేశారు. మొత్తం 400 మందిపై అక్రమ కేసులు బనాయించారు. సెక్షన్ 30 అమల్లో ఉన్నందున కేసులు పెట్టామని పోలీసులు అంటున్నారు.. అధికార పార్టీ ఆదేశాలతో వైఎస్సార్సీపీ నేతలపై వేధింపులకు దిగారు. దీనిపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. సుబ్బన్న అక్రమ అరెస్ట్ పై మచిలీపట్నం పోలీసులను నిలదీశారు పేర్ని నాని. 365 రోజులూ సెక్షన్ 30 పెడితే ప్రజల గొంతు వినిపించకూడదా? అంటూ ప్రశ్నించారు. ‘ఛలో మెడికల్ కాలేజ్ నిరసన చేపట్టినందుకు అక్రమ కేసులు పెట్టారు. సెక్షన్ 30 అమల్లో ఉన్నందుకు కేసులు పెట్టామంటున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రాష్ట్రమంతా సెక్షన్ 30 అమలు చేయడం వింతగా ఉంది. ఒక రాజకీయ పార్టీగా ప్రభుత్వ వ్యతిరేక విధానల పై నిరసన చేపట్టడం మా బాధ్యత. 365 రోజులూ సెక్షన్ 30 పెడితే ప్రజల గొంతు వినిపించకూడదా?, ఛలో మెడికల్ కాలేజీ నిరసన చేపట్టినందుకు 400 మంది పై కేసు పెట్టారు. నోటీసులు ఇచ్చిన వారమంతా స్టేషన్ కు వెళ్లి మా వివరాలిచ్చాం. మేకల సుబ్బన్నను మాట్లాడాలని స్టేషన్కు పిలిపించి అరెస్ట్ చేశామని చెప్పారు. ఇంట్లో పెళ్లి ఉందని చెప్పినా పోలీసులు వినిపించుకోవడం లేదు. కొల్లు రవీంద్రకు అనుకూలంగా పనిచేస్తే తమను ఏమీ చేయలేరనే భావనలో పోలీసులు ఉన్నారు. మా పట్టణ అధ్యక్షుడిని అరెస్ట్ చేస్తే మేం ప్రశ్నించకూడదా?, అరెస్ట్ నోటీసులు ఇవ్వమంటే పోలీసులు ఇవ్వడం లేదు. కోర్టులు ఎన్ని సార్లు చెప్పినా పోలీసులకు చాలా చులకన భావం కనిపిస్తోంది.మేం వేసిన రిమాండ్ ను రిజెక్ట్ చేసే ధైర్యం కోర్టులకు ఉందా అని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా కేసులో అరెస్ట్ చేసి 10 రోజులు లోపలేశాం మర్చిపోయారా అంటున్నారు. మేకల సుబ్బన్న స్టేషన్కు వచ్చాడో లేదో సిసి కెమెరా రికార్డులు తీయండి. మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర మెప్పు కోసం అధికారులు పనిచేస్తున్నారు. తప్పుడు కేసులు,తప్పుడు అరెస్టుల పై పోరాడతాం. ఎంత మంది పై కేసులు పెట్టారో లిస్ట్ ఇవ్వమంటే ఇవ్వడం లేదు. ఈ ప్రభుత్వం మీదేనని రౌడీలను పోలీసులు బ్రతిమిలాడుతున్నారు . మా పార్టీ వాట్సాప్ గ్రూపులను పోలీసులు హ్యాక్ చేశారు. మీ జగన్ మళ్లీ సీఎం అయితే ఏం చేస్తాడని పోలీసులు మాట్లాడుతున్నారు’ అంటూ పేర్ని నాని మండిపడ్డారు. -
నేటి నుంచి ఈఎన్టీ వైద్యుల సదస్సు
లబ్బీపేట(విజయవాడతూర్పు): అసోసియేషన్ ఆఫ్ ఓటోలారింగో లాజిస్ట్స్ ఇండియా (ఏఓఐ) దక్షిణ భారత, రాష్ట్ర సదస్సు శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు నగరంలో నిర్వహించనున్నట్లు నిర్వాహక కమిటీ కార్యదర్శి డాక్టర్ ఎంఏ రెహమాన్ తెలిపారు. అసోసియేషన్ దక్షిణ భారత, రాష్ట్రశాఖల సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలోని హోటల్ నోవోటెల్లో ఈ సదస్సు జరుగుతుందని ఆయన తెలిపారు. గురువారం సదస్సు నిర్వహించనున్న హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సదస్సు దక్షిణ భారత దేశంలోని 750 మందికి పైగా ఈఎన్టీ వైద్యులు పాల్గొననున్నట్లు తెలిపారు. దేశ విదేశాల నుంచి ప్రఖ్యాతిగాంచిన ఈఎన్టీ విభాగ ప్రొఫెసర్లు ఫ్యాకల్టీగా రానున్నారన్నారు. ఈ నెల 11న జరిగే ప్రారంభోత్సవ సభలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొంటారని, నిర్వహణ అధ్యక్షుడిగా డాక్టర్ కేవీఎస్ చౌదరి, డైరెక్టర్గా డాక్టర్ పీఎస్ఎన్ మూర్తి వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. కాగా డాక్టర్ అక్కినేని శివరామ్తో పాటు, నగరంలోని పలువురు వైద్యులు పర్యవేక్షిస్తారని రెహమాన్ వివరించారు. -
పాపం.. పసుపు రైతు!
చల్లపల్లి: ఇటీవల కృష్ణానదికి వచ్చిన వరదల కారణంగా కరకట్ట దిగువున ఉన్న మెట్ట పొలాలు ముంపునకు గురయ్యాయి. ముఖ్యంగా పుసుపు పంటపై వరద తీవ్ర ప్రభావం చూపింది. వరద తాకిడికి గురైన పసుపు పొలాలు క్రమంగా ఎండిపోతున్నాయి. చల్లపల్లి మండల పరిధిలోని నడకుదురు పంచాయతీ పరిధిలోని 194 ఎకరాలు, నిమ్మగడ్డలో, వెలివోలు ప్రాంతాల్లో మరో 80 ఎకరాలు మొత్తం 274 ఎకరాల వరకూ పసుపు సాగు చేపట్టినట్లు రైతులు చెబుతున్నారు. భారీగా ఖర్చులు.. ఇప్పటివరకూ ఎకరా పసుపు సాగుచేసేందుకు విత్తనానికి రూ.37,500, ఎరువులకు రూ.30వేలు(మూడు కోటాలు), కూలీ ఖర్చులకు రూ.20వేలు మొత్తం ఎకరాకు రూ.90వేల నుంచి రూ.1లక్ష వరకూ పెట్టుబడి పెట్టినట్లు రైతులు చెబుతున్నారు. ఇక కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఎకరాకు రూ.30వేల నుంచి రూ.40వేల వరకు కౌలు చెల్లించాల్సి ఉన్నట్లు పేర్కొంటున్నారు. వరదల వల్ల 150 ఎకరాలకు పైగా పసుపు నీట మునిగిందని అంచనా. అయితే వరదలో మునిగిన పంటలకు బీమా వర్తించదని అధికారులు చెబుతుండటంతో వారు దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకొంటున్నారు. చల్లపల్లి మండలంలో ఇప్పటి వరకూ ఈ–క్రాప్ చేయించుకున్న దాని ప్రకారం 207 ఎకరాల్లో పసుపు పంట రైతులు సాగు చేశారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు ఒకటి, రెండు రోజుల్లో పంట నష్టం అంచనాలు నమోదు చేస్తాం. వరదల వల్ల మునిగి, పాడైపోయిన పంటలకు బీమా వర్తించదు. – జె.కీర్తి, ఏఓ, హార్టికల్చర్ -
13నుంచి విజయవాడలో షాపింగ్ ఫెస్టివల్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 13నుంచి 19వ తేదీ వరకు విజయవాడలో షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించనున్నామని.. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సమన్వయ శాఖల అధికారులు కృషిచేయాలని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జేసీ ఇలక్కియ.. జాయింట్ కమిషనర్(జీఎస్టీ) ఎస్.ప్రశాంత్ కుమార్తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు చేకూరే ప్రయోజనాలపై పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా జీఎస్టీ తగ్గుదల ప్రభావమున్న వస్తువుల స్టాళ్లతో షాపింగ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశామన్నారు. డీఆర్డీఏ, యూసీడీ ద్వారా కూడా కొన్ని స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డీఈవో యూవీ సుబ్బారావు, జిల్లా పరిశ్రమల అధికారి పి.వెంకటరావు, డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, యూసీడీ పీవో పి.వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ -
బోధనేతర పనిభారం తగ్గించాలి
ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ నాయకుల వినతి మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఉపాధ్యాయులపై బోధనేతర పనిభారం తగ్గించాలని కోరుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు సచివాలయంలో కలిసి గురువారం వినతిపత్రం అందజేశామని ఆంధ్ర ప్రదేశ్ ఎస్సీ,ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎండీ సత్యనారాయణరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయులకు బోధనేతర పని భారం తగ్గించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ విడుదల చేయాలని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క డీఏ కూడా ఇవ్వలేదని, డీఏతో పాటుగా పీఆర్సీ, ఐఆర్ కూడా ఇవ్వాలని, ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం కూడా ఉండాలని, ఉద్యోగోన్నతులు కల్పించాలని, పీఎఫ్ లోన్స్ను వెంటనే జమ చేయాలనే అంశాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి అన్ను వెంకటరావుతో పాటుగా సభ్యులు లోకేష్ను కలిసిన వారిలో ఉన్నారు. గంజాయితో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ నాలుగు కేజీల గంజాయి స్వాధీనం రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైలులో గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జీఆర్పీ ఇన్స్పెక్టర్ జె.వి రమణ తెలిపిన వివరాల ప్రకారం తమిళనాడు రాష్ట్రానికి చెందిన పాండియా రాజ్, విష్ణు ముత్తు కుమార్ సులభంగా డబ్బు సంపాదించేందుకు ఇతర ప్రాంతాల నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి దానిని చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి తిరుపూర్ కళాశాల ప్రాంతంలో అధిక ధరలకు విక్రయిస్తుంటారు. ఈ క్రమంలోనే వారు ఈ నెల 8న బరంపూర్లోని న్యూ బస్స్టేషన్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఒక్కొక్కరు రూ.10వేలకు రెండు కేజీల గంజాయి కొనుగోలు చేసుకున్నారు. అక్కడ నుంచి బిలాస్పూర్–తిరుపతి ఎక్స్ప్రెస్ రైలు ఎక్కి ఈ నెల 9న మధ్యాహ్నం విజయవాడ రైల్వేస్టేషన్లో దిగారు. వీరిపై వచ్చిన ముందస్తు సమాచారం మేరకు జీఆర్పీ సిబ్బంది నాలుగో నంబర్ ప్లాట్ఫాంపై ఉన్న వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న బ్యాగులను సోదా చేయగా ఒక్కో బ్యాగులో రెండు కేజీల చొప్పున మొత్తం నాలుగు కేజీల గంజాయి లభ్యమైంది. దీంతో వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తూర్పు, గాజుల కాపు సంక్షేమానికి కృషి చిలకలపూడి(మచిలీపట్నం): తూర్పు కాపు, గాజుల కాపు కార్పొరేషన్కు ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 కోట్లు బడ్జెట్ కేటాయించిందని ఆ కార్పొరేషన్ చైర్ పర్సన్ పాలవలస యశస్వీ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో గురువారం ఉమ్మడి కృష్ణాజిల్లా తూర్పు, గాజుల కాపు కులస్తులకు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ వీరికి ఓబీసీ కుల ధ్రువీకరణ పత్రం పొందటంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులతో చర్చించి పరిష్కార దిశగా చర్యలు చేపడతామన్నారు. ఐఏఎస్, గ్రూప్–1, గ్రూప్–2 పరీక్షలకు ఉచిత శిక్షణ కేంద్రాలను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసేలా ప్రతిపాదించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు బీసీ కులస్తులందరూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించామన్నారు. బీసీ కార్పొరేషన్ ఈడీ కె. రాజేంద్రబాబు, సంఘ నాయకులు పాల్గొన్నారు. రాజ్యలక్ష్మి అమ్మవారికి బంగారు హారం బహూకరణ మంగళగిరి టౌన్: మంగళగిరిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దిగువ సన్నిధిలో ఉన్న శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారికి బంగారు హారాన్ని బహూకరించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె. సునీల్కుమార్ తెలిపారు. అమ్మవారి అలంకరణ నిమిత్తం సుమారు రూ. 3.50 లక్షల విలువైన బంగారు పచ్చల హారాన్ని మంగళగిరి పట్టణానికి చెందిన నీలి నాగమల్లేశ్వరరావు, రత్నకుమారి దంపతులు గురువారం ఆలయ అధికారులు, అర్చకులకు అందజేశారు. -
అట్రాసిటీ కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో గురువారం సాయంత్రం జిల్లా విజిలెన్స్, మోనిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పెండింగ్ కేసుల విషయంల ఎలాంటి జాప్యం లేకుండా పరిష్కరించాలన్నారు. బందరు డివిజన్లో 14, గుడివాడలో 6, గన్నవరం 10, అవనిగడ్డ 5 మొత్తం 35 కేసులు విచారణలో ఉన్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో 31 మంది బాధితులకు రూ. 66.23లక్షల పరిహారం ప్రభుత్వం ద్వారా అందించామన్నారు. సమావేశంలో పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్రాజా, డీఆర్వో కె. చంద్రశేఖరరావు, ఏఎస్పీ బీవీ నాయుడు, కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, డీఎస్పీలు సీహెచ్ రాజా, పి. విజయశ్రీ, ధీరజ్ వినీల్, సీహెచ్ శ్రీనివాసరావు, ఆర్డీవో కె. స్వాతి, గిరిజన సంక్షేమాధికారి ఫణిధూర్జటి తదితరులు పాల్గొన్నారు. వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ.. జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టిసారించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో వసతి గృహాల్లోని విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్యం తదితర సదుపాయాలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 90 ప్రభుత్వ వసతి గృహాల్లో ఓవర్ హెడ్ ట్యాంక్లను నెలకోసారి పరిశుభ్రం చేయాలన్నారు. ఇందుకోసం ఒక రిజిష్టర్ను నిర్వహించి స్థానికుల సంతకాలు సేకరించాలన్నారు. వసతిగృహాల్లోని విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రతి వసతి గృహంలో క్లోరినేషన్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యాధికారులు, ఏఎన్ఎంలు ప్రతి నెల మూడో గురువారం వసతి గృహాన్ని సందర్శించి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ షేక్ షాహెద్బాబు, జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, బీసీ సంక్షేమాధికారి జి. రమేష్, గిరిజన సంక్షేమాధికారి ఎం. ఫణిదూర్జటి, డీఎండ్హెచ్వో వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. -
12న మట్టి పాత్రల తయారీపై వర్క్ షాప్
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): మట్టి పాత్రల తయారీపై వర్క్షాప్ను ఈ నెల 12వ తేదీ ఆదివారం తమ సెంటర్లో నిర్వహిస్తున్నామని ఆర్టీజో సెంటర్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ చెప్పారు. స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో ఉన్న సెంటర్ ఆవరణలో వర్క్షాప్నకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ గురువారం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ మట్టితో బొమ్మలను తయారు చేసే ప్రాచీన కళకు పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (బీఎఫ్ఏ) డిగ్రీ పూర్తి చేసిన ప్రముఖ పోటరీ ఆర్టిస్ట్ సురేష్ ఈ వర్క్షాప్నకు ముఖ్య అతిథిగా హాజరై మట్టితో వివిధ రకాల పాత్రలు తయారుచేయడం, వాటికి అందంగా రంగులు అద్దడంపై శిక్షణ ఇస్తారన్నారు. 8 నుంచి 60 సంవత్సరాల వయస్సు లోపు వారు ఎవరైనా హాజరు కావచ్చని చెప్పారు. ఈ వర్క్షాప్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ సర్టిఫికెట్ అందజేస్తామన్నారు. వివరాలకు 99499 99222లో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు. -
వ్యవస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యం
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్కుమార్ పామర్రు: రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ.. కూటమి ప్రభుత్వం తయారు చేసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి.. ప్రజలను ఇబ్బందులు పాలు జేస్తోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్ కుమార్ విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాలలో సర్పంచ్లను, ప్రజా ప్రతినిధులను బెదిరించి పంచాయతీల పాలన సజావుగా సాగనీయడం లేదన్నారు. సర్పంచ్ల విధులకు అడ్డు పడుతూ నిధులను దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. ఎవరైనా ఎదురు తిరిగి ప్రశ్నిస్తే చెక్ పవర్ రద్దు చేస్తామంటూ సర్పంచ్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. రైతులకు నష్టపరిహారం ఎక్కడ? ఇటీవల వచ్చిన వరదలకు తోట్లవల్లూరు మండలంలో ముంపునకు గురైన వాణిజ్య పంటలకు వెంటనే ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని కై లే డిమాండ్ చేశారు. వరదలు తగ్గి నెల రోజులు కావొస్తున్నా ఇంత వరకు జరిగిన నష్టాన్ని అంచనా కూడా సక్రమంగా వేయకపోవడం అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శమన్నారు. వాణిజ్య పంటలు ఒక్కొక్క ఎకరానికి రూ.లక్ష చొప్పన పెట్టుబడులు పెట్టిన రైతులు నష్ట పరిహారం అందక విలవిల్లాడుతున్నారన్నారు. మండలంలో 5,200 ఎకరాలలో పసుపు, కంద, అరటి, బొప్పాయి, కూరగాయలు, చెరకు తదితరాలను హార్టికల్చర్ వ్యవసాయం చేస్తున్నారని దీనిలో సుమారు 2వేల ఎకరాల వరకు పంట నష్టం వాటిల్లిందని అన్నారు. మినుము పంట పూర్తిగా నీట మునిగి నష్టం ఏర్పడితే ఇంత వరకు జిల్లా స్థాయి అధికారులు పరిశీలన చేసిన దాఖలాలు లేవని అన్నారు. పసుపు పంట సాగుకు ఫసల్బీమా పథకంలో ఎకరానికి రూ.1100 చెల్లించి బీమా చేసినట్లు వివరించారు. కనీసం ఆ బీమా క్లయిమ్లను కూడా ప్రభుత్వం ఇప్పించలేక పోవడం దారుణమని అన్నారు. దోచుకోవడం.. దాచుకోవడమే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన నాటి నుంచి ఎంతసేపు దోచుకోవడం దాచుకోవడమే పనిగా ఉంది తప్ప ప్రజల కష్టాలను పట్టించుకునే పరిస్థితి లేదని కై లే అనిల్ విమర్శించారు. రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోందన్నారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగానికి దీటుగా తమ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిజిటల్ యాప్ను ప్రారంభించారని దీని ద్వారా కూటమి నేతలు, అధికారులు తమ నాయకులను కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తే వారి పేర్లను యాప్లో నమోదు చేస్తామన్నారు. ఎంపీపీ దాసరి అశోక్కుమార్, ఐదు మండల అధ్యక్షులు కళ్లవ వెంటేశ్వరరెడ్డి, కాకర్ల వెంకటేశ్వరరావు, రాజుల పాటి రాఘవరావు, యలమంచిలి గణేష్, గోగం సురేష్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
మద్యం మత్తులో యువకుడి వీరంగం
మధురానగర్(విజయవాడసెంట్రల్): మద్యం మత్తులో పశ్చిమ బెంగాల్కు చెందిన యువకుడు మధురానగర్లో వీరంగం సృష్టించాడు. పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్కు చెందిన రాజేష్ శ్యామ్(22) బెంగళూరు నుంచి తన సొంత నివాస ప్రాంతానికి వెళుతున్నాడు. ఈ క్రమంలో విజయవాడలో ట్రైన్ దిగిన రాజేష్ పూటుగా మద్యం తాగాడు. మద్యం మత్తులో స్పృహ తెలియక దారితప్పి బీఆర్టీఎస్ రోడ్డు మధురానగర్ చిన్న వంతెన వద్దకు చేరుకున్నాడు. మద్యం మత్తులో తూలుతూ వంతెన వద్ద ప్రమాదకరంగా నడుస్తుండటంతో స్థానికులు పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ వీలు పడలేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేసరికి మద్యం మత్తులో ఉన్న రాజేష్ చెప్పిన మాట వినకుండా తూలుతూ రైవస్ కాలువలో పడిపోయాడు. దీంతో పోలీసులు హుటాహుటిన తాడు వేసి రైవస్ కాలువలోకి దూకి రాజేష్ను బయటకు తీసుకువచ్చారు. అనంతరం ప్రథమ చికిత్స చేసి 108లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు -
టపాసుల గోడౌన్లో ఆకస్మిక తనిఖీలు
పెదపూడి(మొవ్వ): దీపావళి సమీపిస్తున్న నేపథ్యంలో మొవ్వ మండలం పెదపూడిలోని బాణ సంచా షాపులు, గోడౌన్లపై బందరు స్పెషల్ బ్రాంచ్ బృందం స్థానిక పోలీస్, రెవెన్యూ సిబ్బందితో కలిసి గురువారం ఆకస్మిక తనిఖీలు చేశారు. గ్రామంలోని పెడసనగల్లు రోడ్డులోని ఓ షాపులో అనుమతులు లేకుండా, భద్రతా ప్రమాణాలు లేకుండా నిల్వ ఉంచిన టపాసుల ఉంచినట్లు గుర్తించారు. ఆ టపాసులను స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు కూచిపూడి ఎస్ఐ కెఎస్ విశ్వనాథ్ తెలిపారు. కాగా నిల్వ ఉన్న టపాసుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, దీనిపై గ్రామ వీఆర్వో రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో పంచనామా నిర్వహించి కేసు నమోదు చేస్తామని ఎస్ఐ వెల్లడించారు. ఇసుక తరలిస్తున్న లారీలు సీజ్ చిల్లకల్లు(జగ్గయ్యపేట): ఏపీ నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు లారీలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తోట సూర్య శ్రీనివాస్ గురువారం పేర్కొన్నారు. ఆయన కథనం ప్రకారం తెల్లవారుజామున మండలంలోని అన్నవరం చెక్పోస్టు వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ఓ లారీని తనిఖీ చేసి ఇసుక ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. అదే విధంగా రాజమండ్రిలో బియ్యం దిగుమతి చేసి, అక్కడి నుంచి ఇసుక తీసుకువస్తున్న రెండు లారీలను మండలంలోని గండ్రాయి చెక్పోస్టు వద్ద తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మూడు లారీల డ్రైవర్లు హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు చెందిన వల్కి వెంకన్నం, వర్థం సురేష్, వంగర శ్రీశైలంను అదుపులోకి తీసుకుని వోల్టా కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అదే విధంగా మండలంలోని మల్కాపురం మునేటి నుంచి రెండు ఇసుక ట్రాక్టర్లు తెలంగాణకు ఇసుక తరలిస్తుండగా చెక్పోస్టు సిబ్బంది పట్టుకున్నట్లు చెప్పారు. కేసు నమో దు చేసి, లారీలు సీజ్ చేశామని తెలిపారు. -
తపాలాలో దుర్గమ్మ ప్రసాదాలు పంపిణీ
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): దసరా ఉత్సవాలలో ప్రత్యేక్ష, పరోక్ష పూజలు జరిపించుకున్న ఉభయదాతలకు దేవస్థానం ప్రసాదాలను పోస్టల్ విధానం ద్వారా పంపిణీని ప్రారంభించింది. దసరా ఉత్సవాలలో 11 రోజుల పాటు అమ్మవారికి విశేష కుంకుమార్చన, విశేష శ్రీచక్రనవార్చన, ప్రత్యేక కుంకుమార్చన, ప్రత్యేక ఛండీహోమాలను నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో పలు రాష్ట్రాలకు చెందిన భక్తులు పరోక్షంగా తమ పేరిట పూజలను జరిపించుకునేందుకు ఆన్లైన్ ద్వారా దేవస్థానానికి డబ్బులు చెల్లించారు. పరోక్ష సేవలతో పాటు ప్రత్యేక్ష పూజలకు హాజరు కాని భక్తుల వివరాల ప్రకారం అమ్మవారి ప్రసాదాలను దేవస్థానం పంపుతుంది. చీర, పంచె, అమ్మవారి చిత్రపటంతో పాటు అమ్మవారి డాలర్, కంకణాలను పోస్టర్ ద్వారా పంపిణీ చేస్తుంది. పరోక్ష పూజలు జరిపించుకున్న ఉభయదాతలకు శేషవస్త్రం, రవిక, అమ్మవారి ప్రసాదాలను పంపుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక, ముంబైలలో నివాసం ఉంటున్న భక్తులకు ప్రసాదాలను పోస్టల్ ద్వారా అందజేస్తున్నారు. తిరుమల దర్శనం పేరుతో రూ.12లక్షలు టోకరా ఉయ్యూరు: తిరుమల ప్రత్యేక దర్శనం టికెట్లు ఇప్పిస్తామని మాయ చేసి రూ. 12లక్షలు టోకరా వేసిన సంఘటన ఉయ్యూరులో వెలుగుచూసింది. ఈ ఘటనపై ఉయ్యూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఉయ్యూరు సీఐ టీవీవీ రామారావు తెలిపిన వివరాల ప్రకారం.. ఉయ్యూరుకు చెందిన గుడివాడ దామోదర్రావు అలియాస్ దాము అతని కుమారుడు కల్యాణ్ తిరుమల దర్శనం పేరుతో ఓ వ్యక్తికి టోకరా వేశారు. పట్టణంలో ట్యాక్స్ కన్సల్టెంట్గా పనిచేస్తున్న ఆ వ్యక్తి కొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్నాడు. ఈ క్రమంలో గుడివాడ దాముకు సంబంధించిన విజయదుర్గ యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ షాపు వద్దకు వెళ్లి నిర్మాణ సామగ్రి కొనుగోలు చేశారు. ఈ క్రమంలో పరిచయం పెంచుకున్న దాము అతని కుమారుడు కల్యాణ్ తిరుమలలో ప్రత్యేక దర్శనం, వసతి ఏర్పాటు చేస్తామని నమ్మబలికారు. అతని వద్ద నుంచి పలు దఫాలుగా రూ.12లక్షలు వసూలు చేశారు. దర్శనం చేయించకుండా, కనిపించకుండా పోవటంతో బాధితుడు పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు దామును అరెస్టు చేసి ఉయ్యూరు కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారని సీఐ తెలిపారు. మరో నిందితుడిని త్వరలో అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. బ్యాంకు ఉద్యోగి ఇంట్లో చోరీ రూ. 22లక్షల విలువైన బంగారం మాయం కోనేరుసెంటర్: మచిలీపట్నంలో భారీ చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఓ ఇంట్లోకి చొరబడి దాదాపు 216 గ్రాముల బంగారాన్ని అపహరించారు. జరిగిన సంఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలపూడి పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మచిలీపట్నంలోని నరసింహనగర్కు చెందిన విష్ణు కృష్ణా కో–ఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగం చేస్తుంటాడు. బుధవారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా గుర్తు తెలియని దుండగులు లోపలికి ప్రవేశించారు. చాకచక్యంగా బీరువా తలుపులు తెరిచి అందులోని 216గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించారు. గురువారం ఉదయం నిద్రలేచిన విష్ణు బీరువా తలుపులు తెరిచి ఉండటాన్ని చూశాడు. అనుమానంతో బీరువా తనిఖీ చేయగా అందులోని బంగారు వస్తువులు కనిపించలేదు. చోరీ జరిగినట్లు గ్రహించి చిలకలపూడి పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి క్లూస్ టీం.. విషయం తెలుసుకున్న చిలకలపూడి సీఐ నభీ ఇతర సిబ్బంది హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. చోరీకి గురైన బంగారం విలువ సుమారు రూ. 22లక్షల వరకు ఉంటుందని బాధితుడు విష్ణు పోలీసులకు చెప్పాడు. దీంతో క్లూస్ టీం రంగంలోకి దిగి నిందితుల వేలిముద్రలను సేకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
సీజేఐపై దాడి రాజ్యాంగానికి మాయని మచ్చ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్పై దాడి రాజ్యాంగానికి మాయని మచ్చ అని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. విజయవాడ ప్రెస్క్లబ్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీజేఐ తన ధర్మాసనంలో కూర్చుని ఉండగా, ఒక అడ్వకేట్ చెప్పు తీసి విసిరేశాడని ఇది అత్యంత అమానుషమని అన్నారు. ఎన్డీఏ పాలనలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపై చెప్పు విసరడం నేటి పరిస్థితులకు తార్కాణమన్నారు. ప్రధాన న్యాయమూర్తి పరిస్థితే ఇలా ఉంటే, గ్రామాల్లో దళితుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ పాలన అతి భయంకరంగా ఉందన్నారు. దళితులు కన్నీరు పెడుతున్నారని పేర్కొన్నారు. ఎప్పుడూ రోడ్లపైకి రాని దళితులు నేడు వీధుల్లోకి రావాల్సిన పరిస్థితులను కూటమి ప్రభుత్వం కల్పించిందని విమర్శించారు. ఏపీకి చెందిన ఒక డీజీపీ స్థాయి పోలీస్ ఆఫీసర్ హరియాణాలో తన రివాల్వర్తో కాల్చుకుని చనిపోయారని, ఆయన తొమ్మిది పేజీల నోట్లో ఆ రాష్ట్ర ప్రభుత్వం గురించి రాశా రని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వ పాలనలో దళిత ఆఫీసర్లు, దళిత ఉద్యోగస్తులు పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. ఏపీలో రైతులు చాలా ఆందోళనతో ఉన్నారని, చివరికి పండించిన ధాన్యాన్ని విక్రయించలేని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తంచేశారు. మిల్లర్లు లాభ పడ్డారని, రైతులు అప్పుల్లో, కష్టాల్లో కూరుకుపోయారని వివరించారు. బీజేపీ తన ఎన్నికల వాగ్దానాలను నిలబెట్టుకోలేదని ఆరోపించారు. రెండు కోట్ల ఉద్యోగాలు, పేదల ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున జమ హామీలు అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ -
కృష్ణాజిల్లా
శుక్రవారం శ్రీ 10 శ్రీ అక్టోబర్ శ్రీ 2025పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 66,450 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగువకు 64,450 క్యూసెక్కులు వదులుతున్నారు. నీటి నిల్వ 42.1600 టీఎంసీలు. లబ్బీపేట(విజయవాడతూర్పు): నగరంలోని సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలపై కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతోంది. గత ప్రభుత్వంలోనే నిధులు మంజూరు చేసి, ప్రారంభమైన నిర్మాణ పనులు ప్రస్తుతం నత్త నడకన నడుస్తున్నాయి. ఆ పనులను పూర్తిగా నిలిపివేయకుండా.. ‘చేస్తున్నాముగా..’ అనే రీతిలో కొనసాగుతున్నాయి. దీంతో రోగులు, వైద్య విద్యార్థులకు నాణ్యమైన సౌకర్యాలు కల్పన మరింత జాప్యమవుతోంది. పీజీ సీట్లు మంజూరు చేసి, వాటి నిమిత్తం విడుదలైన నిధులతో చేపట్టిన భవన నిర్మాణ పనులు అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అనే రీతిలో సాగుతున్నాయి. దీంతో వైద్య రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వైద్య కళాశాలలోనూ అంతే.. సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలకు 2023–24 విద్యా సంవత్సరంలో పోస్టు గ్రాడ్యుయేట్ సీట్లు పెరిగాయి. పెరిగిన సీట్లకు అనుగణంగా కేంద్రం నుంచి నిధులు మంజూర య్యాయి. రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించి అదనపు తరగతి గదులు, లెక్చర్ హాల్స్, లేబొరేటరీల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. రూ.60 కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభించగా, కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నత్త నడకన నడుస్తున్నాయి. నిధులు అందుబాటులో ఉన్నా, పనులు జరగకుండా నిలిపివేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. గత ఐదేళ్లూ స్వర్ణయుగం.. వైద్య రంగానికి 2019–24 మధ్యకాలం స్వర్ణయుగం లాంటిదని వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు. ఆ ఐదేళ్లలోనే 75 పోస్టు గ్రాడ్యుయేషన్ సీట్లు మంజూరయ్యాయి. ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల 1986లో ఏర్పా టవగా 2019 వరకూ స్పెషాలిటీ విభాగాల్లో పోస్టు గ్రాడ్యుయేట్ సీట్లు కేవలం 89 మాత్రమే ఉండేవి. కానీ 2019 తర్వాత వైద్య కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో 2022లో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) స్పెషాలిటీ విభాగాల్లో 14 సీట్లు, సూపర్స్పెషాలిటీ (ప్లాస్టిక్ సర్జరీ) రెండు మొత్తం 16 ీపీజీ సీట్లు మంజూరు చేసింది. అంతేకాక 2023లో స్పెషాలిటీ విభాగాల్లో 49, సూపర్స్పెషాలిటీ న్యూరాలజీ, న్యూరో సర్జరీల్లో 10 సీట్లు మంజూరయ్యాయి. ఇలా రెండేళ్లలోనే 75 పీజీ సీట్లు తేగలిగారంటే వైద్య రంగానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. Iదసరా ఉత్సవాలలో ప్రత్యేక్ష, పరోక్ష పూజలు జరిపించిన భక్తులకు దేవస్థానం పోస్టల్ ద్వారా ప్రసాదాల పంపిణీ చేపట్టింది. శేషవస్త్రం, రవిక, అమ్మవారి ప్రసాదాలు పంపుతోంది. గన్నవరం: కృష్ణాజిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు గన్నవరం పోలీస్స్టేషన్ను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులను పరిశీలించారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా అత్యాధునిక క్యాజువాలిటీ బ్లాక్ నిర్మాణానికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఒక్కో బ్లాక్ రెండు వేల చదరపు మీటర్ల విస్తీర్ణంతో నాలుగు అంతస్తుల్లో నిర్మించేందుకు రెండున్నరేళ్ల కిందట పనులు ప్రారంభించింది. ఆ భవనంలో క్యాజువాలిటీ, ట్రామాకేర్, ఏఎంసీ, అత్యవసర నిర్ధారణ పరీక్షలకు అవసరమైన పరికరాల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇది అందుబాటులోకి వస్తే అత్యవసర వైద్యం అవసరమైన వారికి సత్వరమే సేవలు అందుతాయని అధికారులు భావించారు. ఎన్నికల నాటికే రెండంతస్తుల శ్లాబు పూర్తి కాగా, ప్రస్త్తుతం పనులు అస్సలు ముందుకు సాగడం లేదు. ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్మాణ దశలో ఉన్న భవ నాలను పూర్తి చేయాలి. వైద్య విద్యార్థులు మెరుగైన సౌకర్యాల కోసం చేపట్టిన భవన నిర్మాణ పనులు వేగంగా కొనసాగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అంతేకాకుండా క్యాజువాలిటీ భవన నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలి. కూటమి ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఆ విధానం సరికాదు. – డాక్టర్ మెహబూబ్ షేక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు,వైఎస్సార్సీపీ వైద్య విభాగం -
బాణసంచా నిల్వలు, విక్రయాలపై నిఘా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బాణసంచా అక్రమ నిల్వలు, అమ్మకాలపై అధికారులు నిరంతరం నిఘా ఉంచాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిల్వలు, అమ్మకాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. దీపావళి పండుగ నేపథ్యంలో బాణసంచా నిల్వలు, అమ్మకాల పర్యవేక్షణపై గురువారం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ నుంచి రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, విపత్తు నిర్వహణ, మునిసిపల్, వైద్య ఆరోగ్యం, పౌర సరఫరాలు, విద్యుత్ తదితర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సమగ్ర తనిఖీల అనంతరం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాత్కాలిక బాణసంచా విక్రయ దుకాణాలకు అనుమతులు మంజూరు చేయాలన్నారు. ఇందుకు రెవెన్యూ, పోలీస్, మునిసిపల్, అగ్నిమాపక, పౌర సరఫరాలు, విద్యుత్ తదితర శాఖల అధికారులతో జాయింట్ ఇన్స్పెక్షన్ బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ పరిధిలో.. విజయవాడలో బాణసంచా దుకాణాల ఏర్పాటుకు అవసరమైన మైదానాలను సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. పట్టణ ప్రాంతాల్లో టౌన్ ప్లానింగ్ అధికారుల నివేదికలకు అనుగుణంగా ప్రాంతాలను గుర్తించాలన్నారు. బాణసంచా విక్రయించేందుకు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ నుంచి ముందుగానే దుకాణదారులు తప్పనిసరిగా లైసెన్సు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. గతంలో బాణసంచా విక్రయాలు జరిగిన జింఖానా మైదానంలో భద్రతాపరమైన లోపాల వల్ల అగ్నిప్రమాదం సంభవించి, ఇద్దరు మృతి చెందిన విషయాన్ని గుర్తు చేశారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆ సిఫార్సులను కచ్చితంగా పాటించాలి ఏకసభ్య విచారణ కమిటీ చేసిన 23 సిఫార్సులను కచ్చితంగా పాటించేలా చూడాలని ఆదేశించారు. ఒక్కో దుకాణానికి మధ్య మూడు మీటర్ల దూరం ఉండాలన్నారు. దుకాణాలు ఎదురెదురుగా ఉండకుండా చూడాలన్నారు. రెసిడెన్షియల్ ఏరియాకు కనీసం 50 మీటర్ల దూరంలో దుకాణాలకు అనుమతివ్వాలని స్పష్టం చేశారు. ఒక క్లస్టర్లో 50కి మించి దుకాణాలకు అనుమతివ్వకూడదన్నారు. సమావేశంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, ఆర్ఓ ఎం. లక్ష్మి నరసింహం, డీసీపీ కేజీవీ సరిత, అగ్నిమాపక అధికారి శంకర్రావు, వీఎంసీ అగ్నిమాపక అధికారి నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
నిత్యాన్నదానానికి రూ.7.91 లక్షల విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధిలో జరిగే నిత్యాన్నదానానికి గురువారం పలువురు భక్తులు రూ.7.91 లక్షల విరాళాలు సమర్పించారు. విజయవాడ అయ్యప్పనగర్కు చెందిన టి.ఈశ్వరదుర్గానాగేంద్ర కుటుంబం అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి వచ్చి రూ.5,89,055 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేసింది. లంబాడీ పేటకు చెందిన డి.రంగారావు కుటుంబ సభ్యులు ఈఓ శీనానాయక్ను కలిసి రూ.2,02,116 విరాళం అందజేశారు. దాతలకు ఆలయ మర్యా దలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. పెడన: సహజ సిద్ధ కలంకారీకి పేరు గాంచిన పెడనకు గురువారం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన యాత్రికులు శ్రీనివాస కోరమండల్ కలంకారీ పరిశ్రమను సందర్శించారు. వస్త్రాల తయారీని పరిశీలించారు. మహారాష్ట్ర, రాజ స్థాన్, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల ఐటీ, హెచ్ఆర్ ఉద్యోగులు రాగా వారికి టూరిస్ట్ గైడ్లు నవల్దీప్, ఆశ్విత కలంకారీపై వివరాలు తెలిపారు. ప్రింటింగ్ వేయడం, రంగులు ఎలా వస్తున్నాయి తదితర విషయాలను పరిశ్రమ యజమాని పిచ్చుక వరుణ్ వివరించారు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): పాఠశాల్లో ఈ నెల పదో తేదీ నుంచి బోధనేతర విధులను బహిష్కరిస్తున్నట్లు ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) జిల్లా చైర్మన్ ఎ.సుంద రయ్య తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మీనరసింహం, డీఈఓ యు.వి.సుబ్బా రావును ఫ్యాప్టో నేతలు గురువారం వేరువే రుగా కలిసి బోధనేతర పనులను చేయబోమని మెమొరాండం సమర్పించారు. అనంతరం సుందరయ్య మాట్లాడుతూ.. ఫ్యాప్టో పోరుబాట కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ ఇచ్చిన కార్యాచరణలో భాగంగా బోధనేతర విధులను బహిష్క రిస్తున్నామని తెలిపారు. బోధనకే పరిమితమై మరింత నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాలని నిర్ణయించామన్నారు. ఫ్యాప్టో జిల్లా సెక్రటరీ జనరల్ డాక్టర్ ఇంటి రాజు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు బోధనేతర పనులను తగ్గించాలని డిమాండ్ చేశారు. కో చైర్మన్ జి.రామారావు, డెప్యూటీ సెక్రటరీ జనరల్ వేముల భిక్షమయ్య, నాయకులు సయ్యద్ ఖాసీం, కుక్కడపు శ్రీనివాసరావు, జి.అనుగ్రహప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కోనేరుసెంటర్(మచిలీపట్నం): దీపావళి పండు గను పురస్కరించుకుని బాణసంచా తయారీదారులు, వ్యాపారులు పోలీసు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు ఆదేశించారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినా, హెచ్చరికలను పెడచెవినపెట్టినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిసూత గురువారం ప్రకటన విడుదల చేశారు. లైసెన్స్ లేకుండా బాణ సంచా తయారీ, విక్రయాలు నేరమని స్పష్టంచేశారు. బాణసంచాను భద్రపరిచే గోదాములకు కూడా లైసెన్స్ ఉండాలని పేర్కొన్నారు. లైసెన్స్ తీసుకునే ప్రతి వ్యాపారి తమ షాపులో పనిచేసే ప్రతి ఒక్కరికీ ఇన్సూరెన్స్ చేయించా లని, నిబంధనలనను కచ్చితంగా పాటించా లని ఆదేశించారు. ఇళ్లు, విద్యాసంస్థలు, ఆస్పత్రులకు దూరంగా బాణసంచా తయారీ కేంద్రాలు, స్టాళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఏవైనా ప్రమాదాలు జరిగితే వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమా చారం ఇవ్వాలని పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా బాణసంచా విక్రయిస్తున్నట్లు, తయారు చేస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. -
హాస్టల్ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టండి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నామని, వారు విద్యార్థుల సంక్షేమ, విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. జిల్లాలోని సాంఘిక సంక్షేమ, వెనుకబడిన తరగతులు, గిరిజన సంక్షేమ, గురుకుల వసతి గృహాల నిర్వహణపై జిల్లా సంక్షేమ అధికారులు, సహాయ సంక్షేమ అధికారులు, వసతి గృహ సంక్షేమ అధికారులతో కలెక్టర్ గురువారం రైతు శిక్షణ కేంద్రం సమావేశ మందిరంలో సమీక్ష జరిపారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 34 సాంఘిక సంక్షేమ, 26 వెనుకబడిన తరగతులు, మూడు గిరిజన సంక్షేమ, రెండు మైనార్టీ సంక్షేమ వసతి గృహాల పర్యవేక్షణకు జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. వసతి గృహ విద్యార్థుల భవిష్యత్ సంక్షేమ అధికారులపై ఉందన్నారు. చిన్నతనంలో తాను కూడా హాస్టల్లో ఉండి చదువుకుని ఈ స్థాయికి వచ్చానన్నారు. ప్రత్యేక అధికారులు వారానికి ఒక రోజు హాస్టళ్లను సందర్శించా లని, నిర్వహణలో ఏవైనా లోపాలను గుర్తిస్తే సరిచేసేందుకు కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, కాచి చల్లార్చిన నీటిని తాగేలా చూడా లని పేర్కొన్నారు. విద్యార్థులకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించాలని, ప్రతి ఒక్కరికీ కేర్ షీట్ నిర్వహించాలని స్పష్టంచేశారు. హాస్టళ్లకు సరఫరా చేసే మినరల్ వాటర్ ప్లాంట్లను, నీటిని ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలన్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్లు హాస్టళ్లలో ఆహారాన్ని తనిఖీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రత్యేక అధికారులు విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. ప్రతి వసతి గృహంలో ఏటీఎం కిచెన్ గార్డెన్ నిర్వహించాలన్నారు. ఈ సమా వేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.లక్ష్మీనర సింహం, జిల్లా సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ అధికారి ఎం.రమాదేవి, మైనార్టీ సంక్షేమ అధికారి అబ్దుల్ రబ్బాని, గురుకుల విద్యాలయ సంక్షేమ అధికారి ఎ.మురళీకృష్ణ, వెనకబడిన సంక్షేమ అధికారి కె.లక్ష్మీదేవి, సహాయ సంక్షేమ అధికా రులు వి.గణేష్, టి.గాయత్రి, ఎం.ఇజ్రాయిల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ -
రోడ్డు ప్రమాదాలను నివారించండి
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో సాంకేతిక పరిజ్ఞానంతో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో గురువారం రహదారి భద్రతా ఏర్పాట్లపై అధికారు లతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కువగా జాతీయ రహదారుల్లో జరిగే ప్రమాదాల్లోనే ప్రజలు మృత్యువాత పడుతున్నారన్నారు. గూగుల్ మ్యాప్ ద్వారా ప్రయాణించే వారికి ఎక్కువ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ వివరాలు తెలిసేలా చూస్తే వారు అప్రమత్తంగా ఉంటారని పేర్కొన్నారు. చెన్నయ్ ఐఐటీ సీనియర్ ఇంజినీర్ రాగుల్ రోడ్డు ప్రమాదాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఐ రాడ్ అందించిన వివరాలను అనుసరించి ప్రమాదాలు అధికంగా జరిగే వంద జిల్లాలో కృష్ణా జిల్లా 75వ స్థానంలో ఉందన్నారు. జిల్లాలో 23 బ్లాక్ స్పాట్లు ఉన్నాయని, 2023 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు 2,068 ప్రమాదాలు జరిగాయని, 734 మంది చనిపోగా 1887 మంది గాయపడ్డారని వివరించారు. సాంకేతిక పరిజ్ఞానంతో తక్కువ ఖర్చుతోనే ప్రమాదా లను నివారించొచ్చని సూచించారు. ప్రమాదాల నివారణకు సంజయ్ యాప్, ఫీల్డ్ పర్సెప్షన్ సర్వే యాప్, ట్రామా కేర్ ప్రిపేర్డ్నెస్ లెవల్ యాప్ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. పోలీసులు గుర్తించిన బ్లాక్ స్పాట్లలో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను కూడా సాంకేతికత సాయంతో తెలుసుకోవచ్చన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీన జరగనున్న జిల్లా రహదారి భద్రత సమావేశంతో పాటు భవిష్యత్లో నిర్వహించే సమావేశాలకు చెన్నయ్ విద్యార్థులు తప్పనిసరిగా వచ్చి సాంకేతిక సహకారాన్ని అందించాలని కోరారు. ఈ సమావేశంలో చెన్నయ్కు చెందిన సీనియర్ ఇంజినీర్ నవీన్కుమార్, రవాణాశాఖ అధికారి శ్రీనివాస్, రహదారులు, భవనాలశాఖ ఈఈ లోకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో సాంకేతిక పరిజ్ఞానంతో ఆక్వా సాగు వైపు దృష్టిసారించేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ బాలాజీ సూచించారు. గురువారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఆక్వా సాగుపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సాంకేతికతను అవలంబించి వినూత్న పద్ధతుల్లో ఆక్వా సాగు చేస్తే అధిక లాభాలు వస్తాయన్నారు. ఇలా సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందిస్తామని పేర్కొన్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద నందివాడ మండలాన్ని ఓ క్లస్టర్గా తీసుకుని, ఆరు గ్రామాల పరిధిలోని 300 మంది రైతులకు సాంకేతిక పరిజ్ఞానంతో చేసే సాగుపై అవగాహన కలిగించాలన్నారు. ఆక్వా ఎక్సేంజ్ లిమిటెడ్ సహాయ వ్యవస్థాపకుడు కిరణ్కుమార్.. ఆక్వా సాగును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు. ఈ సమావేశంలో మత్స్యశాఖ జేడీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ -
23న దుర్గమ్మకు గాజుల ఉత్సవం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు ఈ నెల 23వ తేదీన గాజుల ఉత్సవం నిర్వహించనున్నారు. కార్తిక శుద్ధ విదియ, భగిని హస్త భోజనం, యమ ద్వితీయను పురస్కరించుకుని అమ్మవారి ప్రధాన ఆలయంలో మూలవిరాట్, మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తిని, ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల గాజులతో అందంగా ముస్తాబు చేయనున్నారు. ఈ మేరకు ఆలయ వైదిక కమిటీ ఉత్సవానికి సంబంధించిన అంశాలపై గురువారం సమావేశమైంది. తెల్లవారుజామున అమ్మవారికి గాజు లతో విశేష అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అమ్మవారి ఆలయ అలంకరణకు అవసరమైన గాజులను భక్తులు, దాతల నుంచి సేకరించాలని దేవస్థానం నిర్ణయించింది. అమ్మవారికి వివిధ వర్ణాల గాజులను అలంకరణ నిమిత్తం వినియోగిస్తున్నారు. గాజులను దాతలు ఆలయ ప్రాంగణంలోని డోనేషన్ కౌంటర్లో సమర్పించొచ్చని ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఉత్సవం అనంతరం అమ్మవారికి, ఆలయాన్ని అలంక రించిన గాజులను క్యూ లైన్లలో భక్తులకు పంపిణీ చేస్తారు. 20న దీపాలంకరణ ఈ నెల 20వ తేదీన దీపావళి పర్వదినం సందర్భంగా అమ్మవారి ప్రధాన ఆలయంలో పంచహారతుల సేవ అనంతరం ధనలక్ష్మీ పూజ, దీపాలంకరణ జరుగుతాయి. అంతరాలయంలోని అమ్మవారి ప్రధాన మూర్తి వద్ద ఆలయ అర్చకులు ధనలక్ష్మి పూజ నిర్వహిస్తారు. అనంతరం ఆలయ ప్రాంగ ణంలో బాణసంచా వెలిగిస్తారు. అనంతరం ఏడు గంటలకు శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆలయాలతో పాటు ఇతర ఉపాలయాలకు కవాట బంధనం జరుగుతుంది. -
రెడ్ క్రాస్ సేవలు ప్రశంసనీయం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దుర్గగుడిలో జరిగిన దసరా మహోత్సవాల్లో రెడ్ క్రాస్ సంస్థ అందించిన సేవలు ప్రశంసనీయమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. స్థానిక కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో రెడ్ క్రాస్ వలంటీర్ల అభినందన సభ గురువారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దసరా ఉత్సవాల్లో వృద్ధులు, దివ్యాంగులకు రెడ్ క్రాస్ వలంటీర్లు మంచి సేవలు అందించారని అభినందించారు. ఉత్సవాల విజయవంతంలో రెడ్ క్రాస్ పాత్ర కూడా ఉందన్నారు. ఉత్తమ సేవలు అందించిన వలంటీర్లకు కలెక్టర్ అభినందన పత్రాలు అందజేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ జి.సమరం మాట్లాడుతూ.. కేబీఎన్, పొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్ కళాశాల, సిద్ధార్థ ఫార్మసీ కళాశాలల యూత్ రెడ్ క్రాస్ విభాగాల విద్యార్థులు ఒక షిఫ్ట్కు 20 మంది చొప్పున మూడు షిఫ్టుల్లో రోజుకు 60 మంది అమ్మవారి భక్తులకు సేవలందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా వైస్ చైర్మన్ డాక్టర్ వెలగా జోషి, జిల్లా కార్యదర్శి ఇ.చిట్టిబాబు, సిద్ధార్థ ఫార్మసీ కళాశాల, కేబీఎన్ కళాశాల, పొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్ కళాశాలల రెడ్ క్రాస్ యూత్ వింగ్ వలంటీర్లు, సమన్వయకర్తలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ -
ఆంటీ నువ్వంటే నాకు ఇష్టం..!
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): వివాహిత మహిళ స్నానం చేస్తుండగా చూడడమే కాకుండా.. ఆమె దగ్గరకు వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించిన బాలుడు (16)పై అజిత్సింగ్నగర్ పోలీసులు బుధవారం కేసు నమోదుచేశారు. న్యూరాజరాజేశ్వరీపేట కేర్ అండ్ షేర్ స్కూల్ సమీపంలో నివసిస్తున్న 35 ఏళ్ల మహిళకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బుధవారం ఉదయం ఇంట్లో స్నానం చేసి దుస్తులు మార్చుకొంటుండగా అదే ప్రాంతానికి చెందిన బాలుడు ఆమెను గమనిస్తూ నువ్వంటే ఇష్టం అంటూ పట్టుకునేందుకు ప్రయత్నించాడు. మహిళ గట్టిగా కేకలు పెట్టడంతో బాలుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చంద్రబాబు చేసింది శూన్యం..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో ప్రజలకు చేసింది శూన్యం. అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఏమి చేశారో చెప్పుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అమ్మేయటానికి చంద్రబాబు దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలో నారా వారి సారా తయారీ కేంద్రాలు పెట్టి ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. చిరంజీవిని బాలకృష్ణ తిడితే పవన్ కల్యాణ్ ఎక్కడున్నారు? వైఎస్ జగన్ గొప్పతనాన్ని చిరంజీవి కొనియాడిన విషయాన్ని మరచిపోకూడదు. – జోగి రమేష్, మాజీ మంత్రి, -
మహిళల నిరసనాగ్రహం
నకిలీ మద్యంపై ఎకై ్సజ్ కార్యాలయం వద్ద మద్యం బాటిళ్లు పగలకొట్టి ఆందోళన మధురానగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వంలో విచ్చలవిడిగా విక్రయిస్తున్న నకిలీ మద్యాన్ని అరికట్టి, ప్రజల ప్రాణాలు కాపాడాలని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నాయకులు డిమాండ్ చేశారు. మహిళలతో కలిసి బుధవారం మారుతీనగర్ ఎకై ్సజ్ కార్యాలయం వద్ద మద్యం బాటిళ్లను పగలకొట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళా నేతలు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు నాణ్యమైన మద్యం అందిస్తామని.. ప్రజల ప్రాణాలను రక్షిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు ఇప్పుడు ఇష్టారాజ్యంగా కల్తీమద్యాన్ని విక్రయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతోందని మీడియా ఏకరువు పెడుతున్నా అధికారులు, పాలకులు పట్టించుకోకపోవటం ప్రభుత్వ చిత్తశుద్ధి ఏ పాటిదో తెలియజేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ మద్యం సూత్రధారి అని చెబుతున్న టీడీపీ నాయకుడు విదేశాలకు పారిపోయి తనకు అనారోగ్యంగా ఉందని చెప్పటంలో ఎవరి పాత్ర ఉందో తేల్చాలని డిమాండ్ చేశారు. ఎకై ్సజ్ శాఖ మంత్రి ఎక్కడ? రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతున్నా ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంధ్ర ఏమై పోయారని మహిళా నేతలు ప్రశ్నించారు. సీ్త్రశక్తి అంటూ సీ్త్రలకు ప్రాధాన్యం అంటూ చెప్పే చంద్రబాబు సీ్త్రల తాళిబొట్లు ఉంటాయో లేదో తెలియని పరిస్థితి తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. -
ముఖ ఆధారిత హాజరుతో పారదర్శకత
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఉపాధి హామీ పథకంలో పారదర్శకతను మరింత పెంచేందుకు, ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చేసేందుకు వేతనదారులకు ముఖ ఆధారిత హాజరు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. ఇందుకు గాను ఆధార్ డేటా, ఈ–కేవైసీతో ఫేస్ అథంటికేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ లక్ష్మీశ ఎంపీడీవోలు, డ్వామా అధికారులు, సిబ్బందితో కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం అమలు తీరుతెన్నులను సమీక్షించడంతో పాటు పథకం అమల్లో పురోగతిపై దిశానిర్దేశం చేశారు. ప్రణాళికపై దృష్టి.. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఉపాధి శ్రామికుల ముఖ గుర్తింపు హాజరు నమోదుకు సంబంధించిన ఫేస్ – ఆర్డీ అండ్ ఎన్ఎంఎంఎస్ యాప్ను ఫీల్డ్ అసిస్టెంట్లు డౌన్లోడ్ చేసుకునేలా ఎంపీడీవోలు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టాల్సిన పనులను గ్రామసభల ద్వారా గుర్తించేందుకు అవసరమైన ప్రణాళికపై దృష్టిసారించాలన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు చూస్తే సగటు వేతనం విషయంలో గంపలగూడెం, కంచికచర్ల జగ్గయ్యపేట మండలాలు మొదటి మూడుస్థానాల్లో నిలిచాయని.. ప్రతి మండలం ఈ విషయంలో ప్రగతి చూపేందుకు కృషి చేయాలన్నారు. జిల్లాలో 2025–26లో 4వేల ఎకరాల ఉద్యానపంటల సాగును లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటివరకు 3,745 ఎకరాలను గుర్తించినట్లు తెలిపారు. అదేవిధంగా మునగ సాగుకు 880 ఎకరాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఉద్యాన పంటల సాగుతో కలిగే ప్రయోజనాలను రైతులకు క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది వివరించాలన్నారు. డ్వామా పీడీ ఎ.రాము తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేయండి
గుడివాడ టౌన్: ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వాటి అవసరాలపై అధికారులు దృష్టిపెట్టాలని జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ అన్నారు. బుధవారం స్థానిక ఐఎంఏ హాలులో డివిజన్లోని 7 మండలాల తహసీల్దార్లు, వ్యవసాయ అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లాలో 287 రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ధాన్యం సేకరణకు కావలసిన అన్ని పరికరాలు అందుబాటులోకి తెచ్చామన్నారు. దానిలో పనిచేసే సిబ్బంది నియామకం కూడా పూర్తయిందని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సంబంధిత అధికారులు కష్టపడి పనిచేసి ధాన్యం సేకరణలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వం కల్పించిన కనీస మద్దతు ధర సాధారణ రకానికి క్వింటాకు రూ.2,369, ఏ–గ్రేడ్కు రూ.2,389తో పాటు గన్నీ బ్యాగ్లు, లేబర్, ట్రాన్స్పోర్ట్ వంటి అదనపు ప్రయోజనాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఆర్డీఓ జి. బాల సుబ్రహ్మణ్యం, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ టి. శివరామ్ ప్రసాద్, అధికారి మోహన్బాబు, వ్యవసాయాధికారి పద్మావతి, ఏడు మండలాల తహసీల్దార్లు, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ నవీన్ -
ఒక్క పింఛనూ మంజూరు చేయలేదు!
పటమట(విజయవాడతూర్పు): కూటమి ప్రభుత్వం ఏర్పడి 16 నెలలవుతున్నా ఇప్పటి వరకు నూతనంగా ఒక్క పింఛను కూడా మంజూరు చేయలేదని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు మండిపడ్డారు. విజయవాడ నగర పాలక సంస్థ సర్వసభ్య సాధారణ సమావేశం వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో బుధవారం నిర్వహించారు. సాధారణ సర్వసభ్య సమావేశం ఎజెండాలో మొత్తం 159 అంశాలు పొందుపరచగా అందులో 124 అంశాలను సభ్యులు ఆమోదిస్తూ తీర్మానం చేశారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన కౌన్సిల్లో ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ రెహానానాహిద్ అడిగిన ప్రశ్నకు అధికారులు, కూటమి కార్పొరేటర్లు సమాధానం చెప్పలేక చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. దీనిపై వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు డెప్యూటీ మేయర్ బెల్లందుర్గ, అవుతుశైలజ, ఫ్లోర్ లీడర్ వెంకటసత్యం, పుణ్యశీల కల్పించుకుని ఇప్పటి వరకు ఒక్క సామాజిక భ్రదత పింఛను మంజూరు చేయకపోవటం కూటమి ప్రభుత్వ తీరుకు అద్దం పడుతుందని తెలిపారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి నియోజకవర్గంలో 20 వేల పింఛన్లు మంజూరు చేశారని తెలిపారు. ఇప్పటి వరకు విజయవాడ నగరంలో 8047 పింఛన్లు వెరిఫికేషన్ చేశారని, 5608 మందికి పింఛన్లు అందటంలేదని వెల్లడించారు. 402 మంది దివ్యాంగులకు 40 శాతం కంటే తక్కువగా వైకల్యం ఉందని నిర్థారించారని చెప్పారు. మాజీ కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు మాట్లాడుతూ కొత్త పింఛన్ల నమోదుకు కనీసం వెబ్సైట్ కూడా ఓపెన్ చేయలేదని పేర్కొన్నారు. ఒక్క దరఖాస్తు కూడా స్వీకరించకపోవడం కూటమి పని తీరుకు నిదర్శనమన్నారు. ప్రైవేటు వాటర్ప్లాంట్ల నుంచే డయేరియా వ్యాప్తి నగరంలో ప్రబలిన డయేరియాపై కౌన్సిల్ దద్దరిల్లింది. డయేరియా వ్యాప్తి చెందడానికి స్పష్టమైన సమాధానం అధికారులు ఇవ్వలేకపోయారు. నేటికీ అజిత్సింగ్నగర్లోని న్యూ, ఓల్డ్ ఆర్ఆర్పేటలో నీళ్లు మురికిగా, నలకలతో రంగుమారి వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీఎంసీ, జిల్లా యంత్రాంగం రోజుల తరబడి నీళ్ల పరీక్షలు నిర్వహించినా సమస్యను గుర్తించకపోవటం విడ్డూరంగా ఉందని కార్పొరేటర్ ఇసరపు రమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనర్ ధ్యానచంద్ర స్పందింస్తూ స్థానికంగా ఉన్న ఐదు ప్రైవేటు ఆర్వో ప్లాంట్ల నుంచి జరిగిన నీటి సరఫరాలో ఎకోలియా బ్యాక్టీరియా గుర్తించామని చెప్పారు. దసరా ఉత్సవాల్లో వీఎంసీ భాగస్వామ్యంపై చర్చ దుర్గామల్లేశ్వర్ల దేవస్థానంలో ఏటా నిర్వహించే దసరా ఉత్సవాల్లో వీఎంసీకి తీవ్ర అన్యాయం జరుగుతుందని, కార్పొరేటర్ల పాస్ల వ్యవహారం, పోలీసుల అత్యుత్సాహంలో తాము అవమానాలకు గురవుతున్నామని కార్పొరేటర్లు ఏకరువు పెట్టారు. ఉత్సవాల సమయంలో పారిశుద్ధ్యం మెరుగుదల, తాగునీటి సరఫరా, క్లోక్రూం, తాత్కాలిక మరుగుదొడ్లు, కార్మికుల సరఫరా అంతా వీఎంసీ నిర్వహణలో ఉంటుందన్నారు. వాటికి అయ్యే ఖర్చంతా దుర్గామల్లేశ్వర్ల దేవస్థానం అందిస్తుందని, వీఎంసీ నుంచి నిధులు సమకూర్చటంలేదని, ప్రోటోకాల్ వ్యవహారంలో ప్రభుత్వం, జిల్లా అధికారులతో చర్చించి సభ్యుల గౌరవానికి భంగం కలగకుండా చర్యలు తీసుకుంటామని కమిషనర్ సభకు వివరించారు. బుడమేరు ముంపుపై ... గత ఏడాది వచ్చిన బుడమేరు వరదల సమయంలో ఆస్తులు, వ్యాపారాలు, ఇతరత్రా నష్టపోయిన వారికి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం పూర్తిస్థాయిలో అందలేదని కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి సభలో ప్రస్తావించారు. దీనిపై టీడీపీ కార్పొరేటర్లు అభ్యంతరం చెప్పటంతో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు జానారెడ్డి, శర్వాణామూర్తి, డెప్యూటీ మేయర్ అవుతు శైలజరెడ్డి కల్పించకుని నేటికీ నష్టపరిహారం అందలేదని, బుడమేరు వరద ముంపు నివారణకు ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రకటించారు. వీఎంసీ నుంచి బుడమేరు ముంపు నివారణకు రూ. 56 కోట్ల నిధులు అవసరమని అంచనాలు ప్రభుత్వానికి పంపితే కేవలం రూ. 9 కోట్లు మాత్రమే మంజూరు చేశారని ఇది ప్రభుత్వ వైఫల్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా వరద ముంపు నివారణకు వైఎస్సార్ సీపీ హయాంలో రూ.400 కోట్లతో రిటైనింగ్వాల్ నిర్మించామని చెప్పారు. ఆ ప్రాంత ముంపు బెదడను కేవలం ఏడాదిలో తీర్చామని తెలిపారు. కానీ బుడమేరు వరద ముంపు నివారణపై ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చిందే కానీ నెరవేర్చలేదన్నారు. -
అనుమానాలున్నాయ్..
నాణ్యమైన మద్యం అందిస్తామంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు కల్తీ మద్యంతో వ్యాపారం సాగిస్తున్నారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా కనీసం ఎకై ్సజ్ మంత్రి కొల్లు రవీంధ్ర నోరు మెదకపోవటం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించాలి. తక్షణమే కల్తీ మద్యం సూత్రధారులను శిక్షించాలి. – ఇందుపల్లి సుభాషిణి, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షురాలు -
12న సౌత్ ఇండియా ఓబీసీ సెమినార్
మధురానగర్(విజయవాడసెంట్రల్): ఈ నెల 12వ తేదీ సౌత్ ఇండియా ఓబీసీ సెమినార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ, కురుమ, కురవ సంఘం పదో వార్షికోత్సవం నిర్వహించనున్నట్లు సంఘం గౌరవాధ్యక్షుడు తట్టి అర్జునరావు, అధ్యక్షుడు జబ్బల శ్రీనివాసులు తెలిపారు. విజయవాడ దుర్గాపురం విజయ్ నర్సింగ్ కళాశాలలో బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ, కురుమ, కురవ సంఘం ఆధ్వర్యాన సంఘం పదో వార్షికోత్సవం, సౌత్ఇండియా ఓబీసీ సెమినార్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెమినార్కు రాజకీయాలకు అతీతంగా దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన పలువురు ప్రముఖ నేతలు హాజరుకానున్నట్లు చెప్పారు. షెఫర్డ్ ఇండియా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నార్త్ నుంచి 6 రాష్ట్రాలు, సౌత్ నుంచి 6 రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. అనంతరం తట్టి అర్జునరావు ఎన్నికల అధికారిగా ఆయన పర్యవేక్షణలో నూతన కార్యవర్గం ఎంపిక నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బందరు మల్లయ్య స్వీట్స్ అధినేత గౌరా వెంకటేశ్వరరావు, దుర్గారావు, అంజయ్య, బి.నాగభూషణం , ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన కురుబ, కురుమ, కురువ సంఘం నాయకులు పాల్గొన్నారు. వివాహితను వేధిస్తున్న బాలుడిపై కేసు నమోదు అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): వివాహిత మహిళ స్నానం చేస్తుండగా చూడడమే కాకుండా.. ఆమె దగ్గరకు వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించిన బాలుడు (16)పై అజిత్సింగ్నగర్ పోలీసులు బుధవారం కేసు నమోదుచేశారు. న్యూరాజరాజేశ్వరీపేట కేర్ అండ్ షేర్ స్కూల్ సమీపంలో నివసిస్తున్న 35 ఏళ్ల మహిళకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బుధవారం ఉదయం ఇంట్లో స్నానం చేసి దుస్తులు మార్చుకొంటుండగా అదే ప్రాంతానికి చెందిన బాలుడు ఆమెను గమనిస్తూ నువ్వంటే ఇష్టం అంటూ పట్టుకునేందుకు ప్రయత్నించాడు. మహిళ గట్టిగా కేకలు పెట్టడంతో బాలుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కొరమీను సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం
కలెక్టర్ డీకే బాలాజీ చినముత్తేవి(మొవ్వ): వ్యవసాయంతో పాటు అనుబంధంగా కొరమీను చేపల సాగుతో రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. చినముత్తేవి గ్రామానికి చెందిన చిత్తూరి కస్తూరిబాయి తన 10 సెంట్ల స్థలంలో చేపట్టిన కొరమేను సాగును అధికారులతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. ట్యాంకులోని చేప పిల్లలను పరిశీలించి సాగుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. కొరమీను చేపల సాగు చేపట్టేందుకు ప్రభుత్వం రుణాలు అందించి అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొరమేనుని తక్కువ స్థలంలోనే పెంచవచ్చని పేర్కొన్నారు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందన్నారు. తక్కువ పెట్టుబడితో లాభాలు ఆర్జించవచ్చని వెల్లడించారు. ఉదయ్ ఆక్వా కంపెనీతో ఒప్పందం చేసుకున్నామని, అవసరమైన సీడ్ సరఫరాతో పాటు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని వివరించారు. ఎకరం లేదా రెండు ఎకరాలు కలిగిన రైతులు 10 సెంట్ల స్థలంలో చెరువును తవ్వుకొని సాగు చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కింద రూ.4.40 లక్షల రుణాన్ని అందించడంతో పాటు 35 శాతం సబ్సిడీ అందుతుందని చెప్పారు. కొరమేను వేసిన చెరువులోని నీటిని పొలాలకు వినియోగించు కోవడం ద్వారా ఎరువుల వినియోగం కూడా తగ్గుతుందన్నారు. చెరువును మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద తవ్వించుకోవచ్చని స్పష్టం చేశారు. ఆసక్తిగల రైతులు వెలుగు సంస్థ ఏపీఎం లేదా సీసీలను సంప్రదించాలని కోరారు. గ్రామంలో చిత్తూరి కస్తూరిబాయి చేపట్టిన సాగును సందర్శించి స్ఫూర్తి పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, మొవ్వ ఎంపీపీ కొండేటి ఇందిర, గ్రామ సర్పంచ్ కొమ్ము సౌదామణి, తహసీల్దారు మస్తాన్, ఎంపీడీవో సుహాసిని తదితరులు పాల్గొన్నారు. -
కాలం చెల్లిన, నిషేధిత మందులు విక్రయిస్తే కఠిన చర్యలు
● ఔషధ దుకాణాల కార్యకలాపాలపై నిరంతర పర్యవేక్షణ తప్పనిసరి ● జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలోని ఔషధ దుకాణాల్లో కాలం చెల్లిన, నిషేధిత మందులు విక్రయిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయంలోని ఔషధ విభాగం అధికారులతో బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఔషధ దుకాణాల కార్యకలాపాలపై ఆరా తీశారు. అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిబంధనల మేరకు దుకాణాలు నిర్వహించేలా నిరంతర పర్యవేక్షణ అవసరమని స్పష్టం చేశారు. అనుభవం లేని వ్యక్తులు మందులు విక్రయిస్తే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏ దుకాణంలోనైనా ఫార్మసిస్టులు లేకుండా ఔషధాలు విక్రయిస్తే సహించేది లేదన్నారు. తప్పనిసరిగా ప్రిస్క్రిప్షన్ ప్రకారం మాత్రమే ఫార్మసిస్టులు ఔషధాలు విక్రయించాలని సూచించారు. డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని.. ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని ఆదేశించారు. సమావేశంలో ఔషధ నియంత్రణ పరిపాలన అసిస్టెంట్ డైరెక్టర్ కె. అనిల్ కుమార్, డ్రగ్ ఇన్స్పెక్టర్లు హాజరయ్యారు. కంట్రోల్రూంలు తనిఖీ చేసిన సీపీ లబ్బీపేట(విజయవాడతూర్పు): నగరంలోని పోలీస్ కంట్రోల్రూమ్, ఎంజీ రోడ్డులోని కమాండ్ కంట్రోల్ రూమ్లను బుధవారం పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆకస్మిక తనిఖీ చేశారు. డీసీపీ తిరుమలేశ్వరరెడ్డితో కలిసి నిర్వహించిన ఈ తనిఖీల్లో కంట్రోల్ రూమ్ సిబ్బంది పనితీరును గమనించారు. వచ్చిన కాల్స్ను రిసీవ్ చేసుకుని అధికారులకు తెలియచేయాలని, అనంతరం కాల్కు వెళ్లిన వారి వద్ద నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలన్నారు. ఎప్పుడూ అప్రమత్తంగా విధులు నిర్వహించాలని తగు సూచనలు తెలిపారు. అనంతరం కమాండ్ కంట్రోల్ రూమ్ను పరిశీలించి అస్త్రం యాప్ ద్వారా నగరంలోని ట్రాఫిక్ రద్దీపై రివ్యూ నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. నిరంతరం సి.సి.కెమెరాలను పర్యవేక్షించాలని, ఏదైనా ఘటనలు జరిగితే వెంటనే అధికారులకు ఆ విషయం తెలియజేయాలన్నారు. కేసుల పరిష్కారంలో భాగంగా అవసరమైన సి.సి.ఫుటేజ్ లను అందించి కేసులు త్వరగా కొలిక్కి వచ్చేవిధంగా సహకరించాలని చెప్పారు. ఏసీపీ భానుప్రకాష్రెడ్డి, ఎస్.బి. సీఐ డి.వి.రమణ , కంట్రోల్ రూం సీఐ కనకరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఫెన్సింగ్ ఓవరాల్ చాంపియన్ వైవీఎస్ఆర్
మైలవరం: లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న కృష్ణా యూనివర్శిటీ మెన్ అండ్ ఉమెన్ ఫెన్సింగ్ పోటీల్లో బాలికల చాంపియన్షిప్ను కై కలూరు వైవీఎస్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కై వసం చేసుకోగా బాలుర ఫెన్సింగ్ చాంపియన్షిప్ను డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ కళాశాల పొందింది. అదే విధంగా నాలుగు గోల్డ్, మూడు సిల్వర్, మూడు బ్రాంజ్ మెడల్స్ను సాధించి కృష్ణా యూనివర్శిటీ ఓవరాల్ చాంపియన్షిప్ సాధించిందని టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మేజర్ మన్నే స్వామి బుధవారం తెలిపారు. మెరుగైన క్రీడాకారులను ఎంపిక చేసి కృష్ణా యూనివర్శిటీ జట్టు తయారు చేస్తామని చెప్పారు. కృష్ణా యూనివర్శిటీ జట్టు పంజాబ్లోని గురునానక్ దేవ్ యూనివర్శిటీలో నిర్వహించే అంతర్ విశ్వ విద్యాలయాల పోటీలకు పంపిస్తామని యూనివర్శిటీ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ డాక్టర్ నవీన లావణ్య లతా తెలిపారు. కళాశాలలో చదువుతో పాటు క్రీడల్లో కూడా మంచి ప్రాధాన్యత ఉందని ప్రిన్సిపాల్ డాక్టర్ ఇళ్ళా రవి తెలిపారు. మూడు గోల్డ్ మెడల్స్తో ఉమన్ చాంపియన్షిప్ వైవీఎన్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కాకినాడ సాదించింది. 2గోల్స్, 2సిల్వర్, ఒక బ్రాంజ్తో మెన్ చాంపియన్షిప్ ఎల్హెచ్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అదే విధంగా ఉమన్ 2సిల్వర్, 2 బ్రాంజ్ మెడల్స్తో కలిపి మైలవరం లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఒవరాల్ చాంపియన్షిప్ సాధించింది. విద్యార్థికి అభినందనలు కోనేరుసెంటర్: ఫెన్సింగ్ క్రీడలో బంగారు పతకం సాధించిన అలోషియాస్ను కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె. రాంజీ అభినందించారు. మైలవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన కృష్ణా విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల ఫెన్సింగ్ టోర్నమెంట్లో బీఫార్మసీ విద్యార్థి అలోషియాస్ బంగారు పతకం సాధించాడు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య రాంజీ బుధవారం తన చాంబర్లో విద్యా ర్థిని అభినందించారు. నవంబర్ 6 నుంచి అమృతసర్లోని గురునానక్ విశ్వవిద్యాలయంలో జరిగే టోర్నమెంట్లో పాల్గొనబోతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాంబాబు, ఫిజికల్ డైరెక్టర్ గోపి పాల్గొన్నారు. -
పాత కక్షలతోనే వృద్ధురాలి హత్య
వన్టౌన్(విజయవాడపశ్చిమ): వృద్ధురాలిని హత్య చేసి ముక్కలుగా కోసి సంచలనం సృష్టించిన కేసును పోలీసులు ఛేదించారు. పాత కక్షలతోనే ఈ హత్య చేసినట్లుగా పోలీసులు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ భవానీపురం పోలీసుస్టేషన్లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఏడీసీపీ గుణ్ణం రామకృష్ణ ఈ హత్య కేసు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. ఈ నెల ఒకటో తేదీన గొల్లపూడిలోని బొమ్మసాని నగర్ వద్ద మురుగునీటిలో ఒక మహిళ మృతదేహం ఉన్నట్లుగా పోలీసులకు సమాచారమందింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని అది మహిళ మృతదేహంగా గుర్తించారు. మృతదేహానికి కాళ్లు, చేతులు, తల లేకుండా మొండెం మాత్రమే ఉంది. దానిపై విచారణ చేపట్టగా ఆ మృతురాలు పొత్తూరి విజయలక్ష్మి (70)గా గుర్తించారు. ఆమె గత నెల 30వ తేదీన సాయిరాం థియేటర్ వద్ద ఉన్న వాసవీ కల్యాణమండపం వద్దకు వెళ్లినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. దాంతో అక్కడ సీసీ కెమెరా పుటేజీని పరిశీలించగా వంకదార హనుమాన్జీ సుబ్రహ్మణ్యంకు చెందిన మైనర్ కుమారుడు మృతురాలిని తన పల్సర్ వాహనంపై ఎక్కించుకొని హెచ్బీ కాలనీలోని తన నివాసానికి తీసుకెళ్లినట్లుగా గుర్తించారు. 30వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు లోపలకు వెళ్లిన ఆ మహిళ తిరిగి బయటకు రాలేదు. అయితే ఆమెను తీసుకొచ్చిన బాలుడితో పాటుగా అతని తండ్రి వంకదార హనుమాన్జీ సుబ్రహ్మణ్యం పలుమార్లు బ్యాగులతో బయటకు వచ్చి బండిపై వెళ్లినట్లుగా గుర్తించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితులను బుధవారం దర్గా ప్లాట్స్ వద్ద అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి వృద్దురాలి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో 30వ తేదీన వృద్ధురాలిని ఇంటికి తీసుకొచ్చిన తరువాత హత్య చేసి ముక్కలుగా కోసి వేర్వేరు ప్రాంతాల్లో పడవేసి నగరం నుంచి పరారయ్యామని నిందితులు తెలిపారు. పాతకక్షల కారణంగానే ఆమెను చంపినట్లుగా పోలీసుల విచారణలో అంగీకరించారు. విజయలక్ష్మి హనుమాన్జీ సుబ్రహ్మణ్యంకు వరసకు పిన్ని. నగరంలోని సీసీ కెమెరాలు ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిందితులను పట్టుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. కేసులో చురుకుగా పని చేసిన సిబందిని అధికారులు అభినందించారు. ఈ సమావేశంలో ఏసీపీ దుర్గారావు, సీఐ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
మాజీ మంత్రి జోగి రమేష్పై మరో అక్రమ కేసు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: మాజీ మంత్రి జోగి రమేష్పై చంద్రబాబు సర్కార్ మరో అక్రమ కేసు నమోదైంది. టీడీపీ నేతల కల్తీ మద్యాన్ని ప్రశ్నించినందుకు చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం కేసులో ఏ1 టీడీపీ నేత అద్దేపల్లి జనార్ధనరావుకు చెందిన గోడౌన్లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు నిర్వహించగా.. భారీ కల్తీ మద్యం తయారీ డెన్ బయటపడింది.పచ్చ నేత కల్తీ మద్యం డెన్ను పరిశీలించిన మాజీ మంత్రి జోగి రమేష్.. టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల కల్తీ మద్యాన్ని ప్రశ్నించడంతో ఆయనపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారు. తమ విధులకు అడ్డంకి కలిగించడంతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారంటూ కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం స్టేషన్లో ఎక్సైజ్ ఎస్ఐ పెద్దిరాజు ఫిర్యాదు చేశారు. జోగి రమేష్తో పాటు మరో 25 మందిపై కేసు నమోదైంది. -
ఏపీ కల్తీ మద్యం కేసు.. రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు
సాక్షి, విజయవాడ: నకిలీ మద్యం తయారీ కేసు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నకిలీ మద్యం తయారు చేసి అమ్మకాలు జరుపుతున్నట్టు పోలీసుల ఎదుట నిందితులు ఒప్పుకున్నారు. నకిలీ మద్యం తయారు చేయుటలో టీడీపీ నేత జనార్థన్ రావు, అతని సోదరుడు జగన్మోహన్రావు ప్రధాన పాత్ర పోషించినట్లు ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు.మద్యం అమ్మకాలలో అధిక లాభాలు ఆర్జించడం కోసమే నకిలీ మద్యం తయారీ విధానం మొదలు పెట్టినట్లు నిందితుడు జగన్మోహన్రావు ఒప్పుకున్నట్లు అధికారులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. నాలుగు నెలల నుంచి మొలకల చెరువు ప్రాంతంలో నకిలీ మద్యం డెన్ మొదలు పెట్టినట్టు రిమాండ్ రిపోర్ట్లో అధికారులు పేర్కొన్నారు. మూడు నెలల క్రితం ఇబ్రహీంపట్నంలో డెన్ ఏర్పాటు చేసి వివిధ వైన్ షాపులు, బెల్ట్ షాపులు, బార్ల లో అమ్మకాలు జరిపినట్టు గుర్తించారు.హైదరాబాద్కి చెందిన రవి అనే వ్యక్తి నకిలీ లేబుళ్లు తయారు చేసినట్టు పోలీసులు గుర్తించారు. మొలకల చెరువులో తయారు చేసిన నకిలీ మద్యాన్ని ఇబ్రహీంపట్నం తీసికొనివచ్చినట్టు పోలీసులు గుర్తించారు. నకిలీ మద్యం తయారీలో బెంగుళూరుకు చెందిన బాలాజీది కీలక పాత్ర వహించినట్లు పోలీసులు నిర్థారించారు. మద్యం బాటిళ్లకు ఫేక్ సీల్స్ బెంగుళూరు నుంచి బాలాజీ పంపినట్లు పోలీసులు గుర్తించారు.నకిలీ మద్యం కేసులో నిందితుల పై U/sec.13 (e), 1 3 (1), 34(a) =/w 34 (a)(1)(ii), 34 (e), 3 4 (f), 34 (h) r/w 34 (2) & 36 (1)(b)& (c), 37, 42, 50, 50(B) of A.P. Excise (Amendment) Act, 2020 OF PROH.& EXCISE సెక్షన్లు కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అచ్చం ఒరిజినల్లా ఉండేలా బాటిళ్లపై సీల్స్ తయారు చేయడంతో అనుమానం రాకుండా మద్యం అమ్మకాలు సాగిస్తున్నట్లు పోలీసుల విచారణ తేలింది. -
ప్రజలందరికీ బాబు వెన్నుపోటు
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజలందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారని రాష్ట్ర మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు ఇస్తామని, దేశంలో ఎక్కడా లేని వింత వాగ్దానంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 16 నెలలుగా నకిలీ మద్యం ఏరులై పారిస్తున్నారని ధ్వజమెత్తారు. సంక్షేమ పథకాల్లో కోత విధిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 85 లక్షల మందికి తల్లికి వందనం ఇవ్వాల్సి ఉండగా కేవలం 40 నుంచి 50 లక్షల మందికే అందజేశారని విమర్శించారు. లైసెన్సు ఉన్న డ్రైవర్లందరికీ ఆర్థిక సాయం అందజేస్తానన్న చంద్రబాబు కేవలం ఆటోలు తోలే డ్రైవర్లకు అది కూడా కోత విధించడం దారుణమన్నారు. పేదలకు ఇళ్లు కట్టి ఇస్తామని ఆశ పెట్టి అధికారంలోకి వచ్చి మాట తప్పారన్నారు. నకిలీ మద్యం సరఫరాతో చంద్రబాబు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ హయాంలో బూం బూం అంటూ విమర్శలు గుప్పించిన కూటమి నాయకులు ఇప్పుడు ఆ బ్రాండ్తో పాటు సూపర్ సిక్స్ అనే బ్రాండ్ మద్యాన్ని కూడా అమ్ముతున్నారని ఎద్దేవా చేశారు. రాయలసీమలో నకిలీ మద్యం ప్లాంట్లు రెండు బయటపడడం, వీటి వెనుక టీడీపీ కీలక నేతలే ఉండడం, ఉత్తరాంధ్రలోనూ నకిలీ మద్యం ప్లాంట్లు ఉన్నాయని సమాచారం రావడంతో రాష్ట్రంలో మద్యం ప్రియుల వెన్నులో వణుకు పుడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే నకిలీ మద్యాన్ని ప్రోత్సహిస్తోందని ప్రజలకు అర్ధమైందన్నారు. నకిలీ మద్యం ఎలా తయారు చేయాలో కూటమి నాయకులకు ఆఫ్రికాలో శిక్షణ ఇచ్చి ఆ ఫార్ములా ద్వారా నకిలీ మద్యాన్ని ప్రభుత్వ పెద్దలే ఏరులై పారిస్తున్నారని విమర్శించారు. మందు తాగొద్దు.. తస్మాత్ జాగ్రత్త ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ ఒక కలుగు నాయుడుగా మిగిలిపోయారని పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో అరవటం, రెచ్చిపోవటం, ఊగిపోవటం, తూగిపోవటం, జుట్టు పీక్కోవటం లాంటి చేష్టలు చేసిన ఆయన ఇప్పుడు మహిళలపై ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా మాట్లాడ కుండా కలుగులోనే ఉంటున్నారని విమర్శించారు. సొంత అన్నయ్యను బాలకృష్ణ అగౌరవపరిచినా బయటకు రాకపోవడం దారుణమన్నారు. పవన్ కళ్యాణ్ నిజస్వరూపాన్ని ఇప్పుడు ప్రజలు చూస్తున్నారని అన్నారు. జగన్ ప్రభుత్వంలో జే బ్రాండ్ మద్యం అని వ్యాఖ్యానించిన కూటమి నాయకులు ప్రస్తుతం సీబీఎన్, పీకే, ఎల్కే బ్రాండ్లు తయారుచేసి వైన్ షాపులు, బెల్టుషాపుల్లో విక్రయిస్తున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ హయాంలో ప్రతి మద్యం బాటిల్ను డిస్టిలరీల్లోనే తయారు చేశారని, ఇప్పుడు టీడీపీ నాయకుల ఇళ్లలోనే నకిలీ మద్యం తయారవుతోందని ధ్వజమెత్తారు. మందు బాబులు ఈ మద్యం తాగి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, తస్మాత్ జాగ్రత్త అని పేర్ని నాని హెచ్చరించారు. కూటమి సర్కారు పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉందని పేర్కొన్నారు. పవన్ ఓ కలుగు నాయుడు ఎన్ని అరాచకాలు జరుగుతున్నా బయటకు రావడం లేదు రాష్ట్రంలో 16 నెలలుగా ఏరులై పారుతున్న నకిలీ మద్యం అవన్నీ సీబీఎన్, పీకే, ఎల్కే బ్రాండ్లే వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజం -
నల్ల జెండాలతో నిరసన తెలుపుదాం
రౌండ్టేబుల్ సమావేశంలో వక్తల పిలుపుకృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చేస్తున్న దోపిడీ చర్యలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమర్ధించడం దారుణమని, భూమి, అడవులు, జీవనాధారాన్ని కాపాడుకునేందుకు పోరాటం ఉద్ధృతం చేయాలని రౌండ్టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు పేర్కొన్నారు. విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలోని బాలోత్సవ భవన్లో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి అశోక్ అధ్యక్షతన మంగళవారం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆదివాసీ, అటవీ హక్కులు, చట్టాలను ధిక్కరించి ఆదివాసీలను జలసమాధి చేసే హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం అదాని, నవయుగ, మెగా, షిర్డీ సాయి కార్పొరేట్ కంపెనీలకు కేంద్ర అటవీ, పర్యావరణ అనుమతులు మంజూరు చేయడాన్ని నిరసిస్తూ ఈ నెల 16వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా ఆదివాసీలు నల్ల జెండాలతో ఆదివాసీ గ్రామాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని తీర్మానించారు. దుర్మార్గమైన చర్య.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస్రావు మాట్లాడుతూ.. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ జీవోలు 2,13,51 రద్దు చేసేంత వరకు పోరాటం కొనసాగించాలన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు వనజ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆమోదం లేకుండా చట్టాలు ధిక్కరించి ప్రాజెక్టు నిర్మాణం చేయడం దుర్మార్గమన్నారు. ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు అప్పల నర్స, మైదానం గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దిసర ప్రభాకర్, గిరిజన ఉద్యోగుల సమన్వయ కమిటీ కన్వీనర్ బాలాజీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్ఆర్ఆర్లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
మధురానగర్(విజయవాడసెంట్రల్): ఎంతో ఘన చరిత్ర కలిగిన మాచవరం ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం డిగ్రీ ఫైనల్ విద్యార్థి కళాశాల భవనం రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేయటం కలకలం రేపింది. కళాశాలలో అందరూ చూస్తుండగానే భవనంపై నుంచి విద్యార్థి దూకటంతో విద్యార్థులు, కళాశాల సిబ్బంది ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఇప్పటి వరకు ప్రైవేటు కళాశాలల్లో మాత్రమే ఇటువంటి సంఘటనలు జరిగేవి. విద్యార్థులలో వత్తిడి పెరిగిపోవటమే ఈ దుర్ఘటనకు కారణమని, వత్తిడి తగ్గించేందుకు కళాశాలలో తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. వివరాలలోకి వెళితే... కృష్ణలంకకు చెందిన ఎస్.వెంకట రవి డిగ్రీ బీకాం ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. డిగ్రీ పూర్తికానుండటంతో తాను చదివిన చదువుకు ఉద్యోగం వస్తుందో రాదోనని, తనకు మంచి మార్కులు వస్తాయో రావోనని మథన పడుతున్నాడు. ఇదే విషయంపై తనకు ఉద్యోగం వస్తుందోలేదోనంటూ ఇంట్లో సోమవారం ఆందోళన వ్యక్తం చేయగా తల్లిదండ్రులు ఉద్యోగం వస్తే వస్తుంది.. లేకపోతే వేరే పనిచేసుకోవచ్చంటూ సర్ది చెప్పారు. ఈ నేపథ్యంలో రవి మంగళవారం కళాశాలకు వచ్చిన తరువాత అధ్యాపకులు పరీక్షల జవాబు పత్రాలు ఇస్తున్న క్రమంలో ఒక్కసారిగా అందరినీ తోసుకుంటూ వెళ్లి రెండో అంతస్తు నుంచి దూకేశాడు. కిందపడిన రవి రెండు కాళ్లు విరిగిపోవటంతో కదల్లేని స్థితిలో ఉన్నాడు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు 108కు ఫోన్ చేయగా అరగంట వరకు రాలేదు. 108 వచ్చిన తరువాత చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా రెండు కాళ్లు విరిగిపోయాయని వైద్యులు తెలియజేసి, మెరుగైన చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రవి ప్రాణానికి ఎటువంటి ఇబ్బంది లేదని, కాళ్లకు మాత్రం సర్జరీ చేయాలని తెలియజేశారు. అధ్యాపకుల వేధింపుల వల్లే..? కళాశాలలో అధ్యాపకుల వేధింపుల వల్లే రవి ఆత్మహత్యాయత్నం చేశారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. విషయం బయటకు పొక్కకుండా కళాశాల సిబ్బంది వ్యవహరిస్తున్నారని విద్యార్థులు అంటు న్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.భాగ్యలక్ష్మిని వివరణ అడిగితే పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారంటూ విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. కళాశాల రెండో అంతస్తు నుంచి కిందకు దూకిన విద్యార్థి అధ్యాపకుల వేధింపుల వల్లే అంటూ ఆరోపణలు..? ఉన్నతాధికారులు విచారణ చేయాలంటూ డిమాండ్ -
దుర్గమ్మ దసరా హుండీ ఆదాయం రూ.10.30కోట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాల్లో భక్తులు హుండీల ద్వారా రూ.10.30కోట్లను సమర్పించారు. ఉత్సవాల్లో అమ్మవారికి సమర్పించిన కానుకల లెక్కింపు మంగళవారంతో పూర్తయింది. తొలిరోజున రూ.3,57,92,708నగదు, 122 గ్రాముల బంగారం, 9.7కిలోల వెండి లభ్యమవగా.. రెండో రోజు రూ.6,73,02,813నగదు, 265 గ్రాముల బంగారం, 9.750కిలోల వెండి లభ్యమైంది. దసరా ఉత్సవాల్లో హుండీల ద్వారా 480 సంచులతో దుర్గమ్మకు కానుకలు వచ్చాయి. వీటిని లెక్కించగా రూ.10,30,95,521నగదు, 387గ్రాముల బంగారం, 19.450 కిలోల వెండి లభ్యమైంది. గతేడాది కంటే దాదాపు కోటి రూపాయలు హుండీల ద్వారా అదనంగా లభించింది. -
సొమ్మొకరిది.. షోకొకరిది!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ ఉత్సవ్ పేరుతో టూరిజం నిధులకు ఎసరు పెట్టారు. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడకు ‘ఏపీ ప్రభుత్వ సహకారంతో’ అనే ట్యాగ్ తగిలించి.. రూ. 5 కోట్ల నిధులు మంజూరు చేయాలని విజయవాడ ఉత్సవ్ కమిటీ టూరిజం శాఖకు ప్రతిపాదనలు పంపింది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి టెండరు పిలువకుండా, నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి టూరిజం అధికారులు సైతం ఫైల్ను ఆగమేఘాల మీద సిద్ధం చేశారు. దీని వెనుక టీడీపీ పెద్దల హస్తం ఉందని తెలుస్తోంది. అధికారులపై ఒత్తిడి తెచ్చి, ఎలాగైనా నిధులు మంజూరు చేయించుకోవాలని టీడీపీ పెద్దలు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ నిధులు రేపోమాపో విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నిధులన్నీ స్వాహా చేసేందుకేనని, టీడీపీ వర్గాల్లోనూ ప్రస్తుతం చర్చ సాగుతోంది. కనకదుర్గమ్మ ఉత్సవాలకు పైసా విదల్చని ప్రభుత్వం, ప్రైవేటు కార్యక్రమానికి నిధులు మంజూరు చేయడం పైన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతా ఫ్లాప్ షో.. పున్నమీ ఘాట్లో ఉత్సవాల ప్రారంభం రోజున జనాలు లేక వెలవెలబోయింది. ప్రారంభం చేసేందుకు వచ్చిన నేతలు సైతం అప్పట్లో పెదవి విరిచినట్లు అంతా చెప్పుకున్నారు. ఉపరాష్ట్రపతి హాజరైన సమయంలో కూడా జనాలు రాకపోవడంతో పరువు పోతుందని, హడావుడిగా డ్వాక్రా మహిళలను తరలించినట్లు టీడీపీ వర్గాలే పేర్కొంటున్నాయి. దుర్గమ దర్శనం ఉచితంగా కల్పిస్తే.. అక్కడ జరిగే కార్యక్రమాలకు ‘మీషో’ ద్వారా టికెట్ల అమ్మకాలు చేసి సొమ్ము చేసుకున్నారు. రెండు గంటల షోలకు భారీగా టికెట్టు ధర పెట్టి దండుకున్నారు. ఇంతలా ప్రజల నుంచి దోచుకున్న ఆ ప్రైవేటు కార్యక్రమానికి ఇప్పుడు ప్రభుత్వ నిధులు మంజూరు చేయడం ఏంటనే ప్రశ్న పలువురి నుంచి వ్యక్తం అవుతోంది. విజయవాడ ఉత్సవ్ పేరుతో జరిగిన ప్రతి కార్యక్రమం వ్యాపార కోణంలోనే జరిగిందనే భావన విజయవాడ వాసుల్లో సైతం ఉంది. అమ్మవారి ఉత్సవాల ప్రాశస్త్యం తగ్గించేలా, విజయవాడ ఉత్సవ్కు చేసిన భారీ ప్రచారంపైనా పలువురు పెదవి విరుస్తున్నారు. -
కొరమేను చేపల సాగుతో రైతుకు అదనపు ఆదాయం
చిలకలపూడి(మచిలీపట్నం): వ్యవసాయంతో పాటు అనుబంధంగా కొరమేను చేపల సాగు చేయటం వల్ల రైతులు అదనపు ఆదాయం పొందవచ్చునని, ఆ దిశగా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. జీవనోపాధుల మెరుగుదలపై అసిస్టెంట్ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్తో కలిసి కలెక్టరేట్లోని సమావేశపు హాలులో మంగళవారం ఆయన వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొరమేను చేపలను తక్కువ స్థలంలోనే పెంచవచ్చునని మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో తక్కువ పెట్టుబడితో లాభదాయకంగా ఉంటుందన్నారు. ఉదయ్ ఆక్వా కంపెనీతో ఒప్పందం చేసుకున్నామని, అవసరమైన సీడ్ సర ఫరాతో పాటు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఎకరం, రెండు ఎకరాలు కలిగిన చిన్న రైతులు 10 సెంట్ల స్థలంలో చెరువును తవ్వుకుని ఈ సాగు చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తుందన్నారు. ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం ద్వారా అవసరమైన వారికి సబ్సిడీతో రుణాలు అందిస్తామన్నారు. ప్రస్తుతం గుర్తించిన ఆసక్తి కలిగిన వంద మంది రైతులకు డీపీఆర్లను పరిశీలించి రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లాలో అధిక పాల ఉత్పత్తికి కృషి చేయాలని, లింగనిర్ధారిత, పిండం అభివృద్ధిపై ఆరా తీశారు. లబ్దిదారుడు కొనుగోలు చేసిన పశువులను తప్పనిసరిగా బీమా చేయించాలన్నారు. పశువులను కొనుగోలు చేయకుండా ఇతరులు కొనుగోలు చేసిన పశువులను చూపిస్తూ పథకం రాయితీలు పొందే వారిని నిరోధించాలన్నారు. సమావేశంలో డీఆర్డీఏ, మెప్మా పీడీలు హరిహరనాఽథ్, పి.సాయిబాబు, జెడ్పీ డెప్యూటీ సీఈవో ఆనంద్కుమార్, పశుసంవర్ధకశాఖ అధికారి చిననరసింహులు, మత్స్యశాఖ అధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ బాలాజీ -
నేడు వైఎస్సార్ సీపీ విస్తృతస్థాయి సమావేశం
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో బుధవారం ఎన్టీఆర్ జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు. రామవరప్పాడు రింగ్ సమీపంలోని కరెన్సీనగర్ ఎం కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించే ఈ సమావేశంలో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, పార్లమెంటు పరిశీలకుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి పాల్గొని పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. జిల్లా అధ్యక్షులు, సమన్వయకర్తలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, స్టేట్ కౌన్సిల్ సభ్యులు హాజరు కావాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ కోరారు.గృహ నిర్మాణాలపై నిర్లక్ష్యాన్ని సహించంచిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో గృహనిర్మాణాలపై నిర్లక్ష్యాన్ని సహించేది లేదని నిర్మాణాలను వేగవంతం చేసి పూర్తి చేయాలని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో అసిస్టెంట్ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్తో కలిసి గృహనిర్మాణాల పురోగతిపై ఎంపీడీవోలు, గృహనిర్మాణ ఇంజినీరింగ్ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గృహనిర్మాణాల పురోగతి ఆశించిన స్థాయిలో లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్చి 31వ తేదీలోపు నిర్మాణాలు పూర్తి చేస్తేనే లబ్ధిదారులకు బిల్లులు చెల్లింపులు జరుగుతాయన్నారు. ఈలోగా పూర్తి చేయకపోతే లబ్ధిదారులు నష్టపోతారని ఇందుకోసం ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు, లబ్ధిదారులతో సమావేశం నిర్వహించి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. గృహనిర్మాణ సంస్థ కార్యనిర్వహణాధికారి బుజ్జిబాబు, డీఆర్డీఏ, మెప్మా పీడీలు హరిహరనాథ్, సాయిబాబు, జెడ్పీ డెప్యూటీ సీఈవో ఆనంద్కుమార్, జిల్లా పశుసంవర్ధకశాఖాధికారి చిన నరసింహులు పాల్గొన్నారు.నేడు వీఎంసీ సర్వసభ్య సమావేశం పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం బుధవారం జరుగనుంది. మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగే ఈ సమావేశం ఉదయం 10.30గంటలకు ప్రారంభమవుతుంది. అజెండాలో మొత్తం 158 అంశాలు ఉండగా, 12 ప్రశ్నలపై సభ్యులు చర్చించనున్నారు. దసరా ఉత్సవాలు సందర్భంగా గత నెల 16న జరగాల్సిన ఈ కౌన్సిల్ సమావేశం వాయిదా పడిన విషయం తెలిసిందే.ఇసుక అక్రమ రవాణాకు బ్రేక్మల్కాపురం(జగ్గయ్యపేట): మల్కాపురంలో ఇసుక అక్రమ రవాణాకు బ్రేక్ పడింది. మంగళవారం సాక్షి దినపత్రిక ప్రచురించిన ‘అక్రమార్కులకు గేట్వే’ అనే కథనానికి రెవెన్యూ, పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. వారి ఆదేశాల మేరకు చిల్లకల్లు పోలీసులు, వీఆర్వో రాజేష్ ఆధ్వర్యంలో ఉదయం నుంచి గ్రామంలోని మున్నేటిలోని మూడు ఇసుక ర్యాంప్ల వద్ద తనిఖీలు చేశారు. అనంతరం చెక్పోస్టుల వద్ద చిల్లకల్లు ఎస్ఐ తోట సూర్య శ్రీనివాస్ పికెట్లు వేయటంతో ఇసుక అక్రమ రవాణా ప్రస్తుతానికి ఆగింది. ఇసుక ట్రాక్టర్ల యజమానులు వాహనాలను ఇళ్లకే పరిమితం చేశారు.10, 11న ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగ్జిబిషన్చిలకలపూడి(మచిలీపట్నం): సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ నెల 10, 11వ తేదీల్లో ఎలక్ట్రానిక్ వస్తువులతో ఎగ్జిబిషన్ నిర్వహించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆయన సమావేశ హాలులో అసిస్టెంట్ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్తో కలిసి వాణిజ్య పన్నులశాఖ అధికారులు, ఎలక్ట్రానిక్ వస్తువుల షాపుల యజమానులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణల ఫలాలను ప్రజలందరూ పొందే విధంగా చూడాలన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించిన దుకాణదారులు జిల్లా, నియోజకవర్గ, మండలస్థాయిలో ఎగ్జిబిషన్లు నిర్వహించాలన్నారు. జీఎస్టీ ప్రచార కమిటీ డిస్ట్రిక్ కో–ఆర్డినేటర్కల్పన, తదితరులు పాల్గొన్నారు. -
వీధికుక్కల దాడిలో చిన్నారికి తీవ్రగాయాలు
గుడివాడరూరల్: కృష్ణాజిల్లా గుడివాడ మండలంలోని రామనపూడి గ్రామంలో ఓ చిన్నారిని వీధి కుక్కలు సోమవారం రాత్రి తీవ్రంగా గాయపరిచాయి. గ్రామానికి చెందిన గూడపాటి నాగేంద్రబాబుకు ఇద్దరు కుమార్తెలు. ఆరేళ్ల చిన్న కుమార్తె మోక్షిత ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా ఒక్కసారిగా వీధి కుక్కలు మీద పడి దాడి చేశాయి. చిన్నారి ఎడమ కాలి తొడ పట్టుకుని కుక్కలు వదలకపోవడంతో అక్కడే ఉన్న స్థానికులు చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నించారు. వారిపై కూడా దాడి చేసేందుకు కుక్కలు ప్రయత్నించాయి. కొంత సమయానికి మరికొంతమంది అక్కడకు వచ్చి కుక్కలను తరిమి కొట్టారు. తీవ్రంగా గాయపడిన చిన్నారిని వెంటనే కుటుంబ సభ్యులు గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో వీధి కుక్కలు పెరిగిపోయాయని, పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని పలువురు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రోడ్డు ప్రమాదంలో పెయింటర్ దుర్మరణంపమిడిముక్కల: విజయవాడ– మచిలీపట్నం జాతీయ రహదారిపై తాడంకి బైపాస్లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. మండలంలోని వేల్పూరు గ్రామానికి చెందిన చీకుర్తి నరసింహారావు(50) విజయవాడలో నివాసం ఉంటున్నాడు. విజయవాడ నుంచి స్వగ్రామమైన వేల్పూరు కు స్కూటీపై బయలుదేరారు. తాడంకి బైపాస్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పమిడిముక్కల సీఐ చిట్టిబాబు సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు నరసింహారావు పెయింటర్గా జీవనం సాగిస్తున్నాడు. మృతునికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చిట్టిబాబు తెలిపారు.చెట్టు పైనుంచి పడి కూలి మృతిగుణదల(విజయవాడ తూర్పు): చెట్టు పై కొమ్మలు కొడుతున్న వ్యక్తి ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందిన సంఘటన మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని గాయత్రీ నగర్లో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉయ్యూరుకు చెందిన ఆళ్ల రమణ(36) కూలి పనులు చేస్తుంటాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విజయవాడ గాయత్రీనగర్లోని ఓ ప్రైవేటు పాఠశాల వద్ద విద్యుత్ తీగలకు తగులుతున్న చెట్ల కొమ్మలు నరికేందుకు చెట్టు పైకి ఎక్కి కొమ్మలు నరుకుతుండగా అకస్మాత్తుగా అదుపుతప్పి కొమ్మలతో పాటే కిందికి పడిపోయాడు. దీంతో తలకు బలమైన గాయమైంది. ఇది గమనించిన స్థానికులు అతనిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందాడని నిర్ధారించారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని భోరున విలపించారు. సమాచారం అందుకున్న మాచవరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృత దేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించారు.భక్తిశ్రద్ధలతో గిరిప్రదక్షిణతిరుమలగిరి(జగ్గయ్యపేట): పౌర్ణమి సందర్భంగా గ్రామంలోని వాల్మీకోద్భవ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద మంగళవారం భక్తిశ్రద్ధలతో భక్తులు గిరిప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే పలు గ్రామాల నుంచి వచ్చిన భక్తులు ఆలయం కొండ వెనుక భాగాన ఉన్న గిరిప్రదక్షిణ రోడ్డు మార్గం గుండా గోవింద నామ స్మరణతో పాదయాత్రగా వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో సాంబశివరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
గురువుల గర్జన
కృష్ణాజిల్లాబెజవాడలో కదంతొక్కిన ఉపాధ్యాయులు బోధనేతర పనులు బహిష్కరణ 7మచిలీపట్నంఅర్బన్: కృష్ణా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారిగా డాక్టర్ పి. యుగంధర్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఆయన అనంతపురం జిల్లాలో ఇమ్యునైజేషన్ అధికారిగా విధులు నిర్వర్తించారు.మోపిదేవి: సుబ్బారాయుడి సన్నిధిలో నిత్యాన్నదానానికి బాపట్ల జిల్లా పేరావళికి చెందిన దాది వివేకానందస్వామి, సీతామహాలక్ష్మి దంపతులు రూ. 1,00,108ను విరాళంగా సమర్పించారు.కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు విద్యారంగాన్ని భ్రష్టు పటిస్తున్నాయి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 మాసాలైన ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు. అనేక డీఏలు పెండింగ్లో ఉన్నాయి. వాటి గురించి మాట్లాడటం లేదు. తరగతి గదుల్లో ఉపాధ్యాయులు పాఠాలు చెప్పకుండా వివిధ బోధనేతర పనులతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వీటిని తక్షణం నిలుపుదల చేయాలి. – ఎంవీ మహాంకాళిరావు, అధ్యక్షుడు, వైఎస్సార్ టీఏ, కృష్ణాజిల్లావన్టౌన్(విజయవాడపశ్చిమ): విద్యా, ఉపా ధ్యాయ సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది గురువులు బెజవాడలో కదంతొక్కారు. రాష్ట్రంలోని పాఠశాల విద్యారంగంలో చోటు చేసుకున్న సమస్యలు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తదితర అంశాలపై ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైంది. రాష్ట్రంలోని 26జిల్లాల నుంచి వేలాది మంది ఉపాధ్యాయులు విజయవాడకు తరలివచ్చారు. ధర్నాచౌక్లో చేపట్టిన ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయ సంఘాల నేతలు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు సైతం తరలివచ్చి మద్దతు ప్రకటించారు. గాంధీనగర్లోని అలంకార్ సెంటర్, సాంబమూర్తిరోడ్డుతో పాటుగా ఆపరిసర ప్రాంతాలన్నీ ఉపాధ్యాయులతో కిక్కిరిసి కనిపించాయి. పాఠాలు చెప్పనివ్వండి మహాప్రభో.. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన ఉపాధ్యాయులు, ఆయా సంఘాల నేతలు ‘మమ్మల్ని విద్యార్థులకు పాఠాలు చెప్పనివ్వండి మహాప్రభో’ అంటూ ప్రభుత్వానికి విన్నవించారు. బోధనేతర పనులతో ఉపాధ్యాయులు సతమతమవుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాప్ల పేరుతో ఉపాధ్యాయులకు ఎక్కడా తీరిక లేకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. అంతేకాకుండా యోగాంధ్ర, మెగా పీటీఎం వంటి పనులతో ఉపాధ్యాయులను రోడ్లపైకి తీసుకురావటం వల్ల విద్యార్థులకు అన్యాయం జరుగుతోందంటూ ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి బోధనేతర పనులకు ఉపాధ్యాయులను వినియోగించవద్దంటూ వారంతా పెద్దపెట్టున విజయవాడ ధర్నాచౌక్లో నినదించారు. గడిచిన 16 మాసాలుగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తుందేమోనని ఎదురు చూశాం. కానీ వాటి గురించి ఆలోచించటానికి సైతం ఈ ప్రభుత్వానికి తీరిక లేదు. ప్రధానంగా ఉపాధ్యాయుల ఆర్థిక విషయాలతో పాటుగా విద్యారంగంలో తీసుకుంటున్న నిర్ణయాలు తిరోగమన దిశలో ఉన్నాయి. తక్షణం వాటిని ఉపసంహరించుకోవాలి. లేకుంటే ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధంగా ఉన్నాం. – వీవీ చంద్రశేఖరరెడ్డి, ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ టీఏ, కృష్ణాజిలా్లప్రస్తుతం ఎంటీఎస్ జాబ్ చేస్తున్న డీఎస్సీ 2008 ఎంటీఎస్ టీచర్లను రెగ్యులర్ చేయాలి. 2021 జూలై నుంచి విధులు నిర్వర్తిస్తున్న మాకు ఏడాదికి 11నెలలకు మాత్రమే జీతం ఇస్తున్నారు. 2025లో జరిగిన బదిలీల్లో 150, 200 కిలోమీటర్లు దూరంలో పోస్టింగ్ ఇచ్చారు. దానిని మార్చి.. సొంత మండలం లేదా పక్క మండలాలకు బదిలీ చేయాలి. – కె. లక్ష్మణ్, కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడు విజయనగరంశోభాయమానంగా గిరి ప్రదక్షిణ కారుణ్య నియామకాలను చేపట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు నగరంలోని చలో విజయవాడ కార్యక్రమానికి హాజరై తమ సంఘీభావం తెలిపారు. సుమారు 900 మంది కారుణ్య నియమకాల కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. అలాగే తాము ఆర్థిక ఇబ్బందులతో ఇక్కట్లు పడుతున్నామంటూ వాపోయారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను కలిసి తమ సమస్యను వివరించామని, కానీ ఆయన ఆదేశించినా ఇప్పటి వరకూ పరిష్కారం కాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 75,430 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగువకు 0,430 క్యూసెక్కులు వదులుతున్నారు. 42.0787 టీఎంసీలు నిల్వ ఉంది. ఈ నెల 10వ తేదీ నుంచి పాఠశాలల్లో ఉపాధ్యాయులు నిర్వహించే అన్ని బోధనేతర పనులను బహిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఆయా సంఘాల నేతలు తీర్మానించి పిలుపునిచ్చారు. ప్రధానంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం మినహా మిగిలిన పనులేమి ఉపాధ్యాయులు చేయరని, ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు, జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారులకు మెమోరాండాలు ఇవ్వనున్నారు. -
కూచిపూడిని వారసత్వ గ్రామంగా తీర్చిదిద్దాలి
చిలకలపూడి(మచిలీపట్నం): నాట్య కళకు ప్రసిద్ధి చెందిన కూచిపూడి గ్రామాన్ని సుందరమైన వారసత్వ గ్రామంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో మంగళవా రం సాయంత్రం ఆయన కూచిపూడి గ్రామ అభివృద్ధిపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్య అభియాన్ పథకం ద్వారా మంజూరైన రూ.3 కోట్ల నిధులతో కూచిపూడిని సుందర గ్రామంగా తీర్చిదిద్దాలన్నారు. ప్రతిపాదించిన మొదటి, రెండు ప్రాజెక్టు పనులను ఒకేసారి చేపట్టాలన్నారు. గ్రామంలో సరైన మురుగునీటి వ్యవస్థను ఏర్పాటు చేసి మురుగునీరు ముందుకు రాకుండా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వర్షపునీరు ఎక్కడా నిలబడకుండా పైపుల ద్వారా వెళ్లే మార్గం ఏర్పాటు చేయాలన్నారు. గ్రామంలో ప్రవేశమార్గం తోరణం నుంచి కోనేరు వరకు రహదారి నిర్మాణానికి అంచనాలు రూపొందించాలన్నారు. గ్రామంలో ఆసక్తి ఉన్న స్వయం సహాయక సంఘాల మహిళలకు కూచిపూడి నాట్య కళకు సంబంధించిన వస్తు సా మగ్రి తయారీ కోసం కుట్టుమిషన్లు పీ4 కార్యక్రమం ద్వారా సమకూర్చాలన్నారు. గ్రామంలో ముళ్లపొదలను తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వేదిక వద్ద దుస్తులు మార్చుకునే గదులు, విద్యుత్ దీపాలు, సౌండ్ సిస్టమ్, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ఇంటికి కళాత్మకంగా ఎర్రటి రంగులు వేయించాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, పర్యాటక శాఖ ఏడీ లజ్వంతనాయుడు, జిల్లా పర్యాటక అధికారి రామ్లక్ష్మణరావు, డీఆర్డీఏ పీడీ హరిహరనాఽథ్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సోమేశ్వర్, పంచాయతీరాజ్ ఎస్ఈ రమణరావు, ఆర్అండ్బీ ఈఈ లోకేశ్వరరావు, కూచిపూడి ఎంపీడీవో సుహాసిని, తహసీల్దార్ మస్తాన్ పాల్గొన్నారు. కలెక్టర్ బాలాజీ -
నాగవరానికి కలెక్టర్ వరాల జల్లు
గుడ్లవల్లేరు: ఆ గ్రామం భౌగోళికంగా రెండు నియోజకవర్గాల్లో రెండు మండలాల్లో రెండు వేర్వేరు గ్రామ పంచాయతీలలో ఉంది. దీంతో దశాబ్దాలుగా ఆ గ్రామం అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఆ గ్రామం పేరు నాగవరం. గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు మండలం వేమవరం శివారు గ్రామం. అయితే ఈ గ్రామంలో కొంత భాగం పెడన నియోజకవర్గం గూడూరు మండలం ముక్కొల్లులో ఉంది. వేమవరం పంచాయతీ పరిధిలో 250 మంది జనాభా, గూడూరు మండలం ముక్కొల్లు పంచాయతీ పరిధిలో 169 మంది జనాభా ఉన్నారు. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు మంగళవారం కలెక్టర్ డీకే బాలాజీ గ్రామాన్ని సందర్శించారు. ఇరు ప్రాంత ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ గ్రామంలో రహదారులు, వీధి దీపాలు, మంచినీటి సమస్య తదితర సమస్యలన్నింటిని ఆయనకు ఏకరువు పెట్టారు. నాగవరంలో సమస్యల్ని వెంటనే పరిష్కరించాలంటూ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పంచాయతీ తీర్మానం చేసి పంపండి కలెక్టర్ బాలాజీ నాగవరం గ్రామస్తులతో మాట్లాడుతూ నాగవరం గ్రామంలోని ప్రజలు అందరూ ముందుగా గ్రామసభ నిర్వహించుకోవాలని సూచించారు. అందరూ ఏకాభిప్రాయానికి వస్తే గ్రామస్తుల కోరిక మేరకు గుడ్లవల్లేరు మండలం వేమవరం పంచాయతీలోనే ఉంటామంటూ సానుకూలంగా తీర్మానాలు చేసి పంపించమని చెప్పారు. ఆ తీర్మానాలను మండల పరిషత్, జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో ఆమోదించుకుని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు ఆమోదించేటట్లుగా అన్ని విధాలా కృషి చేస్తామని, సరిహద్దు సమస్య లేకుండా ఆ విధంగా పరిష్కరిస్తామని చెప్పారు. ఈ విషయమై తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామంలో మంచినీటి కోసం ప్రస్తుతం ఉన్న చిన్న పైపులైనుకు అదనంగా మరో పైపులైను ఏర్పాటు చేసి గ్రామస్తులకు సరిపడే విధంగా నీటిని సరఫరా చేయిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ విషయమై తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. గ్రామంలో 2.5 కిలోమీటర్ల మేరకు సిమెంటు రోడ్లు, తారు రోడ్లు నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ అధికారులకు సూచించారు. వీధి దీపాలు ఏర్పాటు చేయిస్తామని చెప్పారు. గ్రామాభివృద్ధికి రూ. 6కోట్లను కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులందరూ హర్షధ్వానాల మధ్య కలెక్టర్కు ధన్యవాదాలు తెలిపారు. పర్యటనలో కలెక్టర్ వెంట డ్వామా పీడీ శివప్రసాద్, పంచాయతీరాజ్ ఎస్ఈ రమణరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సోమేశ్వరరావు, ఈఈ నటరాజు, గుడ్లవల్లేరు, గూడూరు ఎంపీడీవోలు ఇమ్రాన్, శైలజ, కొండలమ్మ ఆలయ తొలి చైర్మన్ తాళ్లూరి మాధవ, వేమవరం సర్పంచి మన్నెం పద్మావతి, మన్నెం నరసింహారావు, పంచాయతీరాజ్ ఏఈ నాగేశ్వరరావు, వేమవరం, ముక్కొల్లు పంచాయతీల కార్యదర్శులు దుర్గా నాగమల్లేశ్వరరావు, బాపూజీ, ఏఎన్ఎం ప్రభావతి, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆ గ్రామంలో కొంత భాగంగా గుడివాడ నియోజకవర్గంలో ఉండగా, మరికొంత భాగం పెడన నియోజకవర్గంలో ఉంది. దీంతో ఎవరికీ పట్టని అనాథలా ఆ గ్రామం అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఈ నేపథ్యంలో మంగళవారం గ్రామానికి వచ్చిన కలెక్టర్కు గ్రామస్తులు తమ సమస్యలు ఏకరువు పెట్టారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రెండు నియోజకవర్గాలకు ఎటూ కాకుండా ఉన్న గ్రామం కలెక్టర్కు సమస్యలు ఏకరువు పెట్టిన నాగవరం గ్రామస్తులు వెంటనే పరిష్కరించాలంటూ అధికారులకు కలెక్టర్ ఆదేశం -
గ్రీన్ క్లైమేట్ ఫండ్తో మత్స్యకారులకు ఉపాధి
కృష్ణా కలెక్టర్ బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో గ్రీన్ క్లైమేట్ ఫండ్ నిధులతో మత్స్యకారులకు జీవనోపాధి కల్పించేందుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో గ్రీన్ క్లైమేట్ ఫండ్ నిధులతో చేపట్టే కార్యకలాపాలపై సంబంధిత అధికారులతో మంగళవారం రాత్రి సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రూ. 85 లక్షలు గ్రీన్ క్లైమేట్ ఫండ్ నిధులు జిల్లాకు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. జిల్లాలో 1420 ఎకరాలను మడ అడవులుగా రూపొందించేందుకు గుర్తించామన్నారు. ఏం చేయాలాంటే.. ఈ సంవత్సరం వినూత్నంగా గ్రీన్ క్లైమేట్ ఫండ్ నిధులతో పీతలు, అలంకార చేపలు, సముద్రనాచు పెంపకం ద్వారా మత్స్యకారులకు జీవనోపాధి కల్పించాలన్నారు. ఇందులో భాగంగా 40 పీతల పెంపకం యూనిట్లు, 23 అలంకార చేపల పెంపకం యూనిట్లు, 25 సముద్ర నాచు పెంపకం యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు. అసిస్టెంట్ కలెక్టర్ జాహిద్ ఫర్హీన్, పర్యావరణ పరిరక్షణ ప్రాజెక్టు మేనేజర్ ఉష, డీఎఫ్వో సునీత, డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, ఆర్డీవో స్వాతి, మత్స్యశాఖ జేడీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం సేకరణపై ప్రణాళిక రూపొందించాలి
పెనమలూరు: ఖరీఫ్ ధాన్యం దిగుబడులపై ప్రణాళిక సిద్ధం చేసి సకాలంలో రైతుల వద్ద ధాన్యం సేకరించి మిల్లులకు పంపాలని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ అన్నారు. కానూరు పీవీపీ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో మంగళవారం ఏపీ పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఉయ్యూరు డివిజన్ స్థాయిలో రెవెన్యూ, ఏవోలు, రైతుసేవా కేంద్రాల సిబ్బందికి అవగాహన, శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ నవీన్ మాట్లాడుతూ ఖరీఫ్ వరి సాగు దిగుబడులు త్వరలో ప్రారంభం అవుతాయని, వరి దిగుబడుల పై అధికారులు పూర్తి అవగాహనతో ఉండి అంచనా వేయాలని సూచించారు. ఈ–క్రాప్ చేయటం వలన ఎంత దిగుబడి వస్తుందో ముందుగా అంచనా రూపొందించాలని సూచించారు. రైతులకు ఈకేవైసీ చేయటం వలన రైతుల, పంట సాగు వివరాలు ఉంటాయని, ఏఏ ప్రాంతంలో పంట దిగుబడి ముందుగా వస్తుందో గుర్తించి, రైతులకు రవాణా, గన్నీ బ్యాగ్లు అందజేయాలని సూచించారు. వరి పంట తేమ 17 శాతం ఉండే విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. తేమ శాతం సక్రమంగా ఉంటే గిట్టుబాటు ధర రైతులకు అందుతుందని తెలిపారు. మిల్లులకు సకాలంలో ధాన్యం తరలించాలన్నారు. గిట్టుబాటు ధర ఇవ్వాలి ప్రభుత్వం ప్రకటించిన విధంగా రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని జాయింగ్ కలెక్టర్ నవీన్ అన్నారు. సాధారణ రకం 75 కేజీల బస్తా(కామన్) రూ.1777, ఎ గ్రేడ్ రకం 75 కేజీల బస్తా రూ.1792 ధర ఇవ్వాలన్నారు. రైతుల అవసరాలకు టోల్ ఫ్రీ నంబర్ 8247693551 అందుబాటులో ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ఉయ్యూరు ఆర్డీవో హేలాషారోన్, సివిల్ సప్లయిస్ డీఎం టి.శివరామ్ప్రసాద్, డీఎస్వో మోహన్బాబు, జిల్లా వ్యవసాయాధికారి ఎన్.పద్మా వతి, డివిజన్ పరిధిలోని అధికారులు పాల్గొన్నారు. రైతులకు మద్దతు ధర ఇవ్వాలి కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్ -
కార్తికేయునికి ఒక్కరోజు ఆదాయం రూ.9,54,619
మోపిదేవి: కృష్ణాజిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని మంగళవారం ఉభయ తెలుగు రాష్ట్రాలు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న భక్తుల ద్వారా పలు సేవా టికెట్ల రూపంలో రూ.9,54,619 ఆదాయం వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు తెలిపారు. శాశ్వత అన్నదాన కార్యక్రమం నిమిత్తం రూ.1,45,408, నిత్యాన్నదాన కార్యక్రమం నిమిత్తం రూ.87,594, లడ్డు ప్రసాదం విక్రయం ద్వారా రూ.1,04,895, సేవా టికెట్ల ద్వారా రూ.5,88,432, ఇతర సేవా టికెట్ల ద్వారా మొత్తం రూ.9,54,619 ఆదాయం వచ్చినట్లు డీసీ వరప్రసాదరావు వివరించారు. 20 వరకూ ఇగ్నో పరీక్ష గడువు పెంపు వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) డిసెంబర్ –2025లో నిర్వహించే టర్మ్ ఎండ్ పరీక్షలకు ఆన్లైన్ ద్వారా చెల్లించే పరీక్ష ఫీజు గడువు తేదీని ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించినట్లు ఇగ్నో ప్రాంతీయ కేంద్రం రీజనల్ డైరెక్టర్ డాక్టర్ కె.సుమలత తెలిపారు. ఈనెల 21 నుంచి 26వ తేదీ వరకు రూ.1100 ఆలస్య రుసుముతో ఆన్లైన్ ద్వారానే చెల్లించాలని పేర్కొన్నారు. డిసెంబర్ సెషన్కు సమర్పించే అసైన్మెంట్ తేదీని ఈ నెల 31 వరకు పొడిగించినట్లు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని వారికి కేటాయించిన అధ్యయన కేంద్రాలలో సమర్పించాలని ఆమె తెలిపారు. ఇతర వివరాలకు విజయవాడ కొత్తపేటలోని హిందూ హైస్కూల్ ప్రాంగణంలో గల ఇగ్నో ప్రాంతీయ కేంద్రాన్ని స్వయంగా గాని లేదా 0866–2565253 ఫోన్ నంబర్ ద్వారా గాని సంప్రదించవచ్చని తెలియజేశారు. -
నకిలీ మద్యం కేసు: నాగరాజు అరెస్ట్.. సీఐ హిమబిందుపై వేటు
ములకలచెరువు/మదనపల్లె/గన్నవరం/గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన ములకలచెరువు నకిలీ మద్యం కేసులో రెండో ప్రధాన నిందితుడు కట్టా నాగరాజును మంగళవారం అరెస్ట్ చేసినట్టు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. విజయవాడ సమీపంలో ఇబ్రహీంపట్నంకు చెందిన నాగరాజు ములకలచెరువు నకిలీ మద్యం తయారీ ప్లాంట్లో కూలీలను సమకూర్చడంతోపాటు నకిలీ మద్యం రవాణా తదితర కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించామన్నారు. మిగిలిన నిందితులను అరెస్ట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ నీలకంఠేశ్వరరెడ్డి ఫిర్యాదు మేరకు ఎక్సైజ్ సీఐ హిమబిందు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా మరో ఇద్దరిని వేరుగా అరెస్ట్ చేశారు.ఇప్పటివరకు ఈ కేసులో నిందితులుగా తేలిన వారి సంఖ్య 14 మంది. తొలిరోజు 10 మందిని అరెస్ట్ చేయగా.. మిగిలిన నలుగురిలో కట్టా నాగరాజును మంగళవారం అరెస్ట్ చేశారు. కొడాలి శ్రీనివాసరావు, జయచంద్రారెడ్డి పీఏ రాజేష్, విదేశాల్లో ఉన్న జనార్దనరావు అరెస్ట్ కావాల్సి ఉంది. ఇదే కేసులో మరో ఏడుగురిని నిందితులుగా చేర్చబోతున్నట్టు ఎక్సైజ్ వర్గాలు వెల్లడించాయి. ఆ ఏడుగురు ఎవరన్నది చర్చనీయాంశమైంది. కాగా.. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వెలుగుచూసిన కల్తీ మద్యం తయారీ కేసులో మద్యం నింపేందుకు ఖాళీ బాటిళ్లను సరఫరా చేసిన సూరంపల్లి ఇండ్రస్టియల్ ఎస్టేట్కు చెందిన శ్రీనివాసరెడ్డిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మద్యం నింపేందుకు వినియోగించిన 90 ఎంఎల్ (క్వార్టర్) ఖాళీ బాటిళ్లను కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని సూరంపల్లి ఇండ్రస్టియల్ ఎస్టేట్లోని శ్రీనివాస పెట్ బాటిల్స్ కంపెనీ నుంచి కొనుగోలు చేసినట్టు గుర్తించారు. మంగళవారం ఆ కంపెనీలో సోదాలు నిర్వహించిన అధికారులు కంపెనీ నిర్వాహకుడైన గుంటూరుకు చెందిన శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకుని కంప్యూటర్ను స్వాధీనం చేసుకున్నారు.నిందితులకు 17 వరకు రిమాండ్ఇబ్రహీంపట్నంలో అరెస్టు చేసిన ముగ్గురికి కోర్టు ఈ నెల 17 వరకు రిమాండ్ విధించింది. ఈ కేసులో నిందితులు అద్దేపల్లి జగన్మోహన్రావు, బాధల్ దాస్, ప్రతాప్దాస్ను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని మంగళవారం 6వ ఎంఎం ఫస్ట్ క్లాస్ కోర్టులో హాజరు పరచగా, ముగ్గురికీ రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.అధికార పార్టీ నేతల్ని వదిలేసి.. ములకలచెరువు ఎక్సైజ్ సీఐపై బదిలీ వేటు మదనపల్లె: అధికార పార్టీ పెద్దల అండదండలతో సాగిన నకిలీ మద్యం దందాలో అసలైన సూత్రధారులు, పాత్రధారులను వదిలేసి ఎక్సైజ్ అధికారిపై వేటు వేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ములకలచెరువు నకిలీ మద్యం తయారీ రాకెట్ దందా నేపథ్యంలో ఎక్సైజ్ సీఐ హిమబిందును విజయవాడ కమిషనరేట్కు బదిలీ చేశారు. ఇప్పుడు వెలుగు చూసిన నకిలీ మద్యం తయారీ ప్లాంట్ ములకలచెరువు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది.ఎక్కడో అటవీ ప్రాంతంలో నాటు సారా తయారు చేస్తుంటేనే దాడులు చేసే ఎక్సైజ్ అధికారులకు ఈ నకిలీ మద్యం తయారీ ప్లాంట్ గురించి తెలియక పోవడం విడ్డూరం అని ప్రజల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీఐపై బదిలీ వేటు పడింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఈ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న అందరిపై అన్ని విధాలా విచారణ జరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ ప్రాంతంలో విచ్చలవిడిగా నకిలీ మద్యం, బెల్డ్ షాపులు, కర్ణాటక మద్యం అమ్మకాలు.. ఇలా ఇన్ని జరుగుతున్నా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విస్తుగొలుపుతోంది. -
‘మందుబాబులకూ బాబు వెన్నుపోటు.. పవన్ ఇక కలుగు నాయుడే’
సాక్షి, కృష్ణా: చంద్రబాబు, పవన్, లోకేష్.. గత 16 నెలలుగా ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. ఎన్నికల ముందు సరసమైన ధరలకే నాణ్యమైన మద్యమని చెప్పి అధికారంలోకి వచ్చిన ఏకైక ప్రభుత్వం కూటిమిదే అని ఎద్దేవా చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఇక నుంచి కలుగు నాయుడు అని పిలవాలని అన్నారు. ఎన్నికల సమయంలో తప్ప ఆయన.. ఆ కలుగు నుంచి బయటకు రారంటూ సెటైర్లు వేశారు.మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు తనకు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచాడు. అప్పట్నుంచి ప్రతీ ఒక్కరికీ వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు. 85 లక్షల మంది పిల్లలకు తల్లికి వందనం వేస్తాను అన్నాడు. కేవలం 40 లక్షల మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. జగన్ను విమర్శించి.. ఇప్పుడు తల్లికి వందనంలో కోత పెట్టాడు. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఏడాదికి 15 వేలు వేస్తానని చెప్పారు. ఒక సంవత్సరం అయిపోయింది. రెండో సంవత్సరం కోతలు కోసి జగన్ వేసిన వారికే వేశారు. జగన్ వాహనమిత్ర వేసినప్పుడు హేళనగా నవ్వారు. ఈ రోజు సిగ్గు ఎగ్గు లేకుండా డ్రైవర్లందరికీ వెన్నుపోటు పొడిచాడు.పేదలకు ఇళ్లు ఇస్తానని చెప్పాడు కొత్త ఇల్లు ఒక్కటి కూడా ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు. ప్రజలకు పథకాలు అరకొరగా ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మందుబాబులకు కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు. పవన్ కల్యాణ్ను ఇకపై కలుగు నాయుడు అని పిలవాలి. ఆ కలుగు నాయుడు కలుగులో నుంచి బయటకు రాడు. ఎన్నికలకు ముందు బయటకు వస్తాడు.. అరుస్తాడు, రెచ్చిపోతాడు. తలకాయ బాదుకుంటాడు.. ఊగిపోతాడు, తూగిపోతాడు, జుట్టు పీక్కుంటాడు. ఆడ పిల్లకు అన్యాయం జరుగుతుంటే.. అఘాయిత్యాలు జరుగుతుంటే కలుగులో నుండి బయటకు రాడు.వైఎస్ జగన్ ఉన్నప్పుడు మెక్డొనాల్డ్ లేదు, బ్యాక్ పైపర్, మాన్షన్ హౌస్ లేదన్నారు. మరి ఇప్పుడు దొరికే మందు పేరేంటి.. చంద్రబాబు బ్రాండేనా?. టీడీపీ ప్రభుత్వం ఆఫ్రికా నుండి కొత్త ఫార్ములా తెచ్చి కొత్త మందు అమ్ముతున్నారు. సూపర్ సిక్స్ బ్రాండ్, స్పెషల్ స్టేటస్ బ్రాండ్ మందు అంటున్నారు. రాయలసీమలో 2, ఎన్టీఆర్ జిల్లాలో 1, ఉత్తరాంధ్రలో కూడా ఉన్నాయని ఉందని ఎక్సైజ్ అధికారులే చెబుతున్నారు. టీడీపీ నాయకులను ఆఫ్రికా పంపి కల్తీ మద్యం తయారీ శిక్షణ ఇస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ప్రజలారా మద్యం సేవించడం మానేయండి. లేదా త్రాగకుండా ఉండలేకుంటే మాత్రం కొన్న బార్ వద్దే వాసన చూసి గుర్తుపట్టి తీసుకెళ్లండి. మీ కుటుంబం ముఖ్యం.. కల్తీ మందు తాగి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు’ అని సూచించారు. -
అక్రమార్కులకు గేట్ వే
ఇసుక అక్రమ రవాణాకు అడ్డాగా మల్కాపురం ఉచిత ఇసుక పథకం పేరుతో అక్రమార్కులు తెలంగాణకు అక్రమంగా ఇసుక తరలిస్తూ జేబులు నింపు కొంటున్నారు. రాత్రింబవళ్లూ తేడా లేకుండా ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారు. వాహనాల రణగొణ ధ్వనులతో గ్రామంలో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు ట్రాక్టర్ల శబ్దాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. జగ్గయ్యపేట మండలం మల్కాపురం తెలంగాణ రాష్ట్రానికి సరి హద్దులో ఉండటంతో అక్రమార్కులకు గేట్ వే గా మారింది. మల్కాపురం(జగ్గయ్యపేట): జగ్గయ్యపేట మండలం మల్కాపురం గ్రామంలోని మునేరులో మూడు చోట్ల ఇసుక ర్యాంపులు ఉన్నాయి. అందులో మొలకవాగు, గొల్లగుండు, శ్మశానవాటికకు వెళ్లే రహదారిలోని ఇసుక రేవులు ఉన్నాయి. అక్రమార్కులు తెలంగాణకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే మొలకవాగు, గొల్లగుండు ర్యాంపులను ఎంచుకుని ఇసుక అక్రమ రవాణాకు బాటలు వేశారు. ర్యాంపునకు వెళ్లే రహదారి అధ్వానంగా ఉండటంతో ఇటీవల రోడ్డును గ్రావెల్తో అభివృద్ధి చేయడంతో పాటు మూడు చోట్ల కాలువలు ఉండే ప్రాంతాలలో తూములు ఏర్పాటు చేసి మరీ రోడ్డు నిర్మించారు. దీంతో మునేరు నుంచి గ్రామంలోని ప్రధాన రోడ్డు వరకు ఎక్కడా ఏ గొయ్యి లేకుండా ట్రాక్టర్ క్షణాల్లో బయటకు వచ్చేస్తోంది. ఈ ర్యాంపుల్లో ఇసుక 25 మీటర్ల మేర వెయ్యి ఎకరాల్లో ఉంటుంది. మార్కెట్లో ఈ ఇసుక విలువ రూ.300 కోట్లుగా ఉంటుంది. వ్యవసాయ పనులు మానేసి ఇసుక లోడింగ్కు... మునేరు నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుక రేయింబవళ్లూ తెలంగాణకు తరలిస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో 100కు పైగా ట్రాక్టర్లు ఉన్నాయంటే ఏ మేరకు ఇసుక అక్రమ రవాణా అవుతుందో అర్థం చేసుకోవచ్చు. గ్రామంలో వ్యవసాయ పనులు కూడా మానేసి కూలీలు ముఠాలుగా ఏర్పడి ఇసుక లోడింగ్కు వెళుతున్నారు. ఒక్కో ముఠాలో నాలుగు నుంచి ఎనిమిది మంది ఉంటారు. ముఠా ట్రాక్టర్ ఇసుక లోడింగ్ చేసినందుకు రూ.800 నుంచి రూ.1100 వరకు అక్రమార్కులు చెల్లిస్తున్నారు. రోజుకు ఒక్కో ముఠా 30 నుంచి 50 ట్రాక్టర్ల వరకు లోడింగ్ చేస్తుండటంతో ఒక్కో కూలీకి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఆదాయం వస్తోంది. దీంతో కూలీలు కూడా పూర్తిగా వ్యవసాయ పనులు మానేసి ఇసుక లోడింగ్కు వెళుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలతో డిమాండ్ తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఊపందుకోవడంతో ఇసుకకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. గ్రామానికి కూతవేటు దూరంలో ఉండే తెలంగాణ రాష్ట్రంలోని పెద్ద మండవ ఇసుక రేవు ఉన్నప్పటికీ అక్కడి ఇసుకకు నాణ్యత లేకపోవడంతో మల్కాపురం మునేరు ఇసుకకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ఒక్కో ట్రక్కు ట్రాక్టర్ ఇసుక ధర రూ. 8 వేల నుంచి రూ.11 వేల వరకు పలుకుతోంది. ట్రాక్టర్ల యజమానులకు వ్వవసాయం కూడా ఆశాజనకంగా లేకపోవడంతో అక్రమార్కులకు ట్రాక్టర్లను అద్దెకు ఇస్తున్నారు. రోజుకు రూ.2 వేల వరకు అద్దె లభిస్తుండటంతో అదే బాటలో మిగతా వారు అద్దెకు ఇస్తున్నారు. రుణాలు తీసుకొని ట్రాక్టర్లు కొనుగోలు గ్రామంలో ఇసుక వ్యాపారం ఆశాజనకంగా ఉండటంతో గతంలో 20 నుంచి 30 ట్రాక్టర్లు ఉండగా ఈ ఏడాదిన్నర కాలంలోనే ఆ సంఖ్య 100కు చేరింది. బ్యాంకు రుణాలు తీసుకుని మరీ ట్రాక్టర్లు కొనుగోలు చేస్తున్నారు. ట్రాక్టర్ డ్రైవింగ్ చేసే యువత ఉంటే వారికి రోజుకు రూ.800 వరకు ఇస్తున్నారు. కొంతమందికి పూర్తి స్థాయిలో డ్రైవింగ్ రాకపోగా ఇష్టానుసారంగా నడుపుతుండటంతో ఇటీవల గ్రామంలో మూగ జీవాలపై దూసుకెళ్లి మృత్యువాత పడ్డాయి. 18 గ్రామాలకు తరలిపోతున్న ఇసుక తెలంగాణ రాష్ట్రంలోని వల్లభి, నేలకొండపల్లి, చెరువు మాధవరం, ముజ్జుగూడెం, గోండ్రాల, తమ్మర, బుద్దారం, రాయిగూడెం, రాజేష్పురం, చిమ్మిరాల, కోదాడ, బాణాపురం, పెదమండవ తండా, చిన్నమండవ, మంగాపురం తండా, కృష్ణాపురం, కమలాపురం గ్రామాల్లో చేపట్టిన ఇందిరమ్మ గృహాలకు ఇసుక తరలిస్తున్నారు. తరలింపు కూడా ఒక పథకం ప్రకారం చేస్తున్నారు. ముఖ్యంగా మునేరు నుంచి ఇసుక ట్రాక్టర్లు బయలుదేరి రెండు కిలోమీటర్ల దూరంలో గల పెద్ద మండవ సరిహద్దు ప్రాంతానికి వెళ్తాయి. అక్కడ ఆ ప్రాంతానికి చెందిన అక్రమార్కులు ఏపీ నుంచి తీసుకువచ్చిన ఇసుక లోడ్ ట్రక్కును అక్కడ పార్క్ చేసి, అక్కడి నుంచి వేరే ట్రక్కును తీసుకొచ్చి, మళ్లీ ఇసుక లోడు చేసిన తరువాత అక్కడికి తీసుకెళ్తారు. తెలంగాణ రిజి స్ట్రేషన్ ట్రక్కులతో ఇసుక రవాణా చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. -
దుర్గమ్మ దసరా తొలి విడత ఆదాయం రూ. 3.57 కోట్లు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నిర్వహించిన దసరా ఉత్సవాల్లో అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలు, ముడుపులు, మొక్కుబడుల లెక్కింపు సోమవారం ప్రారంభమైంది. మహామండపం ఆరో అంతస్తులో లెక్కింపును ప్రారంభించగా, తొలిరోజు రూ.3,57,92,708 ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో శీనానాయక్ తెలిపారు. 122 గ్రాముల బంగారం, 9.700 కిలోల వెండి, విదేశీ కరెన్సీ కూడా లభించిందని పేర్కొన్నారు. కానుకల లెక్కింపు మంగళవారం కూడా కొనసాగుతుందన్నారు.వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలి: కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీమచిలీపట్నంఅర్బన్: మహిళల్లో అత్యంత సాధారణంగా కనిపించే రొమ్ము క్యాన్సర్పై అవగాహన కలిగి ఉండాలని, ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. పింక్ అక్టోబర్ సందర్భంగా సోమవారం కలెక్ట రేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో రొమ్ము క్యాన్సర్ అవగాహన నెల గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అనుభవజ్ఞులైన శస్త్రచికిత్స, క్యాన్సర్ నిపుణులతో ప్రతి సోమ, గురువారాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రొమ్ము క్యాన్సర్ పరీక్షలు, రోగనిర్ధారణ సేవలు ఉచితంగా అందుబాటులో ఉంటాయన్నారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, డీఆర్ఓ కె. చంద్రశేఖరరావు, అదనపు ఎస్పీ సత్యనారాయణ, కేఆర్ ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, బందరు ఆర్డీఓ కె.స్వాతి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆశాలత తదితరులు పాల్గొన్నారు.స్కూల్ గేమ్స్ సెలక్షన్స్ వాయిదాగూడూరు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 2025–26 విద్యా సంవత్సరానికి ఉమ్మడి కృష్ణాజిల్లాకు సంబంధించి నిర్వహిస్తున్న జిల్లా సెలక్షన్స్ షెడ్యూలులో స్వల్ప మార్పులు చేసినట్లు కృష్ణాజిల్లా స్కూల్ గేమ్స్ స్పోర్ట్స్ కార్యదర్శి మత్తి అరుణ తెలిపారు. దీనిలో భాగంగా ఈనెల 8వ తేదీన జరగాల్సిన ఫెన్సింగ్, బాల్ బ్యాడ్మింటన్, 9న జరగాల్సిన స్విమ్మింగ్, 10న జరగాల్సిన జిమ్నాస్టిక్స్, త్రోబాల్, టెన్నికాయిట్ క్రీడాంశాలు అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు తెలిపారు. ఈనెల 23న జరగాల్సిన నెట్ బాల్ సెలక్షన్స్ను ఈనెల 9వ తేదీకి మార్చినట్లు వెల్లడించారు. షెడ్యూలు మార్పు విషయాన్ని ఉమ్మడి కృష్ణాజిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు గమనించాల్సిందిగా కోరారు. వాయిదా పడిన క్రీడాంశాలు ఎప్పుడు నిర్వహించేదీ త్వరలో వెల్లడిస్తామని ఆమె తెలిపారు. -
స్వచ్ఛతకు పురస్కారాల పట్టం
భవానీపురం(విజయవాడపశ్చిమ): పారిశుద్ధ్యం నిర్వహణ, పరిశుభ్రతలో ఉత్తమ ప్రతిభకు పట్టం కడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛాంధ్ర పురస్కారాలు–2025లో ఎన్టీఆర్ జిల్లాకు 8 రాష్ట్ర స్థాయి అవార్డులు లభించాయి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విజేతలకు పురస్కారాలను అందజేశారు. మొత్తం 69 రాష్ట్ర స్థాయి పురస్కారాలలో ఎనిమిది జిల్లాకు వచ్చాయి. ప్రత్యేక కేటగిరీ అవార్డ్ (స్వచ్ఛ సర్వేక్షణ్)లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కు దక్కగా, స్వచ్ఛ కాలనీల విభాగంలో విజయవాడ లోని కేపీ నగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్కు లభించింది. స్వచ్ఛ ఆస్పత్రుల విభాగంలో విజయవాడ భవానీపురంలోని హెచ్బీకాలనీలోగల యూపీహెచ్సీ, పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలకు అవార్డులు లభించాయి. స్వచ్ఛ అంగన్వాడీల విభాగంలో కేదారేశ్వరపేట–3 అంగన్వాడీ కేంద్రం, స్వచ్ఛ బస్ స్టేషన్ల విభాగంలో విజయవాడ బస్ స్టేషన్, స్వచ్ఛ పాఠశాలల కేటగిరీలో విజయవాడ కృష్ణ లంకలోని వీఎంఆర్ఆర్ (జీ) మునిసిపల్ కార్పొ రేషన్ హైస్కూల్, స్వచ్చతా ఎన్జీఓల కేటగిరీలో రైజ్ సంస్థ అవార్డులు సాధించగా ఆయా సంస్థలు, పాలనా యూనిట్ల ప్రతినిధులు సీఎం చంద్రబాబు చేతులమీదుగా అందుకున్నారు. కలెక్టర్ లక్ష్మీశ అభినందనలు స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనకు ముంద డుగు వేస్తూ స్వచ్ఛాంధ్ర పురస్కారాల్లో జిల్లాను ముందు వరుసలో నిలిపినందుకు అధికారులు, సిబ్బందికి కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అభినందనలు తెలిపారు. ఈ పురస్కారాల స్ఫూర్తితో జిల్లాను మరింత స్వచ్ఛత దిశగా నడిపించాలని ఆయన ఆకాంక్షించారు. మంత్రులు పి.నారాయణ, కె.పార్థసారథి, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
సైన్స్ అండ్ టెక్నాలజీతో విప్లవాత్మక మార్పులు
భవానీపురం(విజయవాడపశ్చిమ): పర్యాట క, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ భవానీపురంలోని హరిత బెరంపార్క్లో సోమవారం ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్గా నియమితులైన మందలపు రవికుమార్తో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్ రవికుమార్ మాట్లాడుతూ సైన్స్ అండ్ టెక్నాలజీని వినియోగించుకుని అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎస్. రోషన్కుమార్, బడేటి రాధాకృష్ణ, ఎం.వెంకటరాజు, కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొని రవికుమార్ను అభినందించారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రత్యేక రైలులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల యాత్రను నవంబర్లో ప్రారంభించనున్నామని భారతీయ రైల్వేస్ భారత్ గౌరవ ట్రైన్, సౌత్ స్టార్ రైల్ డైరెక్టర్ విఘ్నేష్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ బెంజి సర్కిల్ సమీపంలోని ఓ హోటల్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక పర్యాటక రైలులో తమిళనాడు, కేరళలో ఉన్న దేవాలయాలు, పంచ ద్వారక, మహదేవ్, జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చని తెలిపారు. నవంబర్ 16వ తేదీన మొదటి విడత యాత్ర, 26న రెండో విడత యాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఇండియన్ రైల్వే, మొదటి భారత్ గౌరవ్ రైలు, సౌత్ స్టార్ రైల్, అతిపెద్ద టూరిస్ట్ రైలు ఆపరేటర్ టూర్ టైమ్స్ ఈ యాత్ర చేపట్టిందన్నారు. ఈ ప్రత్యేక పర్యాటక రైలు ఐఆర్సీటీసీ వెబ్సైట్లో అందుబాటులో లేదన్నారు. రిజర్వేషన్ల కోసం టూర్ టైమ్స్ను నేరుగా 93550 21516 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చన్నారు. అందుకోసం www.tourtimes.in సందర్శించాలన్నారు. -
రేపు సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమం
పోస్టర్ ఆవిష్కరించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వరి రైతులు తరచూ ఎదుర్కొంటున్న ఎలుకల సమస్యను నివారించి, పంటను కాపాడటానికి సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వరి సాగు చేసే ప్రాంతాలలో ఈనెల 8వ తేదీ బుధవారం ఈ కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ను కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఎలుకల వల్ల తీవ్ర పంట నష్టం సంభవిస్తోందని, దీనిని నివారించడానికి సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుల నుంచి బ్రోమోడయోలోన్ ఎలుకల మందును కలిపిన ఎరను ఉచితంగా పొందవచ్చని తెలిపారు. ఎలుకలు ఉన్న బొరియలను గుర్తించి వాటిని మట్టితో కప్పి ఉంచాలని, మరుసటి రోజు తెరుచుకుని ఉన్న బొరియలలో బ్రోమోడయోలోన్ ఎలుకల మందు కలిపిన ఎరను ఉంచి మూసివేయాలని తెలిపారు. రైతులంతా సామూహికంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని, తద్వారా వరి పంటను ఎలుకల బారి నుంచి కాపాడుకోవచ్చని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయ అధికారి విజయ కుమారి, డీఆర్ఓ లక్ష్మీ నరసింహం, డెప్యూటీ కలెక్టర్ కె.పోశి బాబు, వ్యవసాయ శాఖ ఏడీ అనిత భాను పాల్గొన్నారు.