breaking news
Sports
-
హాలండ్ జోరు.. ఉత్కంఠ పోరులో నార్వే విజయం
ఫిఫా ప్రపంచకప్లో నార్వే జట్టు రౌండ్ ఆఫ్ 32 దశకు అర్హత సాధించింది. గ్రూప్-ఐలో భాగంగా మంగళవారం సెనెగల్తో జరిగిన ఉత్కంఠ పోరులో నార్వే 3-2తో విజయాన్ని అందుకుంది. నార్వే తరఫున స్టార్ ఆటగాడు ఎర్లింగ్ హాలండ్ (ఆట 48, 58వ నిమిషం) డబుల్ గోల్స్ కొట్టగా, మార్కస్ పెడెర్సన్ (ఆట 43వ నిమిషం) మరో గోల్ చేశాడు. అటు సెనెగల్ తరఫున ఇస్మాయిల్ సర్ (ఆట 53, 90+3వ నిమిషం) రెండు గోల్స్ కొట్టాడు. ఈ విజయంతో నార్వే నాకౌట్ దశకు చేరుకోగా సెనెగల్ ఆడిన రెండింటిలో ఓడి ఇంటిబాట పట్టింది.ఇక రెండు గోల్స్ సాధించిన ఎర్లింగ్ హాలండ్కు 52 అంతర్జాతీయ మ్యాచ్ల్లో 59 గోల్స్ కావడం విశేషం. అంతేకాదు ఫిఫా ప్రపంచకప్లో వరుసగా రెండు మ్యాచ్లు గెలవడం నార్వేకు ఇదే తొలిసారి. కాగా లీగ్ దశలో నార్వే తన చివరి మ్యాచ్ను ఫ్రాన్స్తో ఆడనుంది.Read: వందో మ్యాచ్లో ఎంబాపె రికార్డు గోల్స్.. నాకౌట్కు ఫ్రాన్స్ -
‘చాలా బాధపడ్డాను.. సత్తా చాటేందుకు ఇదే మంచి సమయం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వర్ధమాన క్రికెటర్లు తమ ప్రతిభను ప్రదర్శించే అందరి దృష్టిలో పడేందుకు తెలంగాణ టి20 లీగ్ (టీజీ టీ20) తగిన అవకాశం కల్పిస్తోందని పేస్ బౌలర్ సీవీ మిలింద్ అన్నాడు. దేశవాళీ క్రికెట్ లో హైదరాబాద్ తరఫున కీలక ఆటగాడిగా ఉన్న మిలింద్... టీజీ టి20లో అన్విత ఖమ్మం ఏసెస్ టీమ్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. టోర్నీ తొలి మ్యాచ్లో విజయంతో ఏసెస్ శుభారంభం చేసింది. 'టోర్నీ తొలి మ్యాచ్లోనే మా జట్టు మంచి ప్రదర్శన కనబర్చింది. తర్వాత మ్యాచ్ల్లోనూ మంచి ఫలితాలు సాధించి ఏసెస్కు టైటిల్ అందించాలని పట్టుదలగా ఉన్నా' అని మిలింద్ చెప్పాడు. ‘ఇతర రాష్ట్రాల టీ20 లీగ్లను చూసినప్పుడల్లా మన వద్ద ఇలాంటి టోర్నమెంట్ ఎప్పుడు జరుగుతుందా అని అనుకునేవాళ్లం. ఎట్టకేలకు ఇప్పుడు హెచ్సీఏ అధికారికంగా లీగ్ జరపడం సంతోషంగా ఉంది' అని మిలింద్ వ్యాఖ్యానించారు. ప్రతి ఏటా హెచ్సీఏ లీగ్స్లో పెద్ద సంఖ్యలో ఆటగాళ్లు పాల్గొంటారని... అయితే వారి ప్రదర్శనకు తగిన గుర్తింపు లభించదని మిలింద్ అభిప్రాయపడ్డాడు. అలాంటి క్రికెటర్లకు తమ సత్తా చాటి మున్ముందు కెరీర్లో ఎదిగేందుకు టీజీ టి20 లీగ్ సరైన వేదిక అని అతను చెప్పాడు. ఈ టోర్నీలో చెప్పుకోదగ్గ అంశం వేలం, వారికి దక్కిన మొత్తం గురించి కాదు. కుర్రాళ్ల ప్రతిభకు సరైన అవకాశం. ఆటగాళ్ల కోణంలో చూస్తే అన్ని విధాలా లీగ్ సరైన ప్రయత్నం' అని మిలింద్ విశ్లేషించాడు.వ్యక్తిగతంగా చూస్తే తమ ఖమ్మం ఏసెస్ యాజమాన్యం అన్ని విధాలా టీమ్కు అండగా నిలిచిందని మిలింద్ వెల్లడించాడు. 'అన్విత గ్రూప్ సరైన ప్రణాళికతో టీమ్ ను సిద్ధం చేసింది. మేమంతా నగర శివార్లలో పది రోజులకు పైగా జరిగిన ప్రత్యేక శిక్షణా శిబిరంలో పాల్గొన్నాం. మా టీమ్ యజమాని అనూప్ అక్కడే ఉండి టీమ్ బాండింగ్కు ఎంతో సహకరించాడు.. ఓవరాల్గా కూడా టోర్నీలో ఐపీఎల్ తరహా వాతావరణం కనిపించడం సానుకూలాంశం' అని మిలింద్ విశ్లేషించాడు. -
వందో మ్యాచ్లో ఎంబాపె రికార్డు గోల్స్.. నాకౌట్కు ఫ్రాన్స్
ఫిఫా ప్రపంచకప్ 2026లో ఫ్రాన్స్ జట్టు నాకౌట్ దశకు చేరుకుంది. గ్రూప్-ఐలో ఇరాక్తో జరిగిన మ్యాచ్లో ఫ్రాన్స్ 3-0తో విజయాన్ని అందుకుంది. ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు కైలియన్ ఎంబాపె డబుల్ గోల్స్ (ఆట 14, 54వ నిమిషం)తో మెరవగా, ఓస్మన్ డెంబ్లె (ఆట 60వ నిమిషం) మరో గోల్ చేశాడు. ఈ విజయంతో ఫ్రాన్స్ నాకౌట్కు అర్హత సాధించింది. వర్షంతో మ్యాచ్ రెండు గంటలు ఆలస్యంగా మొదలైంది. మ్యాచ్ ఆలస్యంగా మొదలైనప్పటికీ ఎంబాపె తన గోల్స్ కిక్తో అభిమానులను సంతోషంలో ముంచెత్తాడు. ఆట 14వ నిమిషంలో కార్నర్ నుంచి బంతిని గోల్ పోస్టులోకి తరలించిన ఎంబాపె ఫిఫాలో 15 వ గోల్ సాధించాడు. ఆ తర్వాత రెండో హాఫ్లో 54వ నిమిషంలో మరోసారి మెరిసిన ఎంబాపె రెండో గోల్ సాధించడంతో పాటు ఫ్రాన్స్ను 2-0తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో బాలన్ డీ ఓర్ అవార్డు విజేత ఓస్మన్ డెంబ్లె 64వ నిమిషంలో గోల్ చేయడంతో ఫ్రాన్స్ ఖాతాలో మూడో గోల్ చేరింది. మరోవైపు 1986 తర్వాత రెండో ఫిఫా ప్రపంచకప్ ఆడుతున్న ఇరాక్ ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.కాగా ఎంబాపె ఇరాక్తో మ్యాచ్ ద్వారా పలు రికార్డులను బద్దలు కొట్టాడు. ఎంబాపెకు ఇది వందో అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. తన వందో అంతర్జాతీయ మ్యాచ్లో రెండు గోల్స్తో మెరిసిన ఎంబాపెకు ఫిఫాలో ఇది 16వ గోల్. తద్వారా ఫిఫా చరిత్రలో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో ఎంబాపె.. జర్మనీ దిగ్గజం మిరాస్లావ్ క్లోస్ (16 గోల్స్) సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. అంతకముందు 15వ గోల్ కొట్టి బ్రెజిల్ దిగ్గజం రొనాల్డో రికార్డును సమం చేశాడు. మెస్సీ వెనుకే ఎంబాపె..ఇక ఫిఫా ప్రపంచకప్లో ఈసారి మెస్సీ, ఎంబాపె మధ్య నంబర్ గేమ్ నడుస్తోంది. ‘వస్తా నీ వెనుక’ అన్నట్లుగా మెస్సీకి పోటీగా ఎంబాపె వరుస గోల్స్తో రెచ్చిపోతున్నాడు. ఆస్ట్రియాతో మ్యాచ్లో డబుల్ గోల్స్తో మెరిసిన మెస్సీ 18 గోల్స్తో ఫిఫా అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా తొలి స్థానంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇరాక్తో మ్యాచ్లో రెండు గోల్స్ కొట్టి తన గోల్స్ సంఖ్యను 16కు పెంచుకున్న ఎంబాపె.. మెస్సీ తర్వాతి స్థానంలో ఉన్నాడు. రాబోయే మ్యాచ్లో మిరాస్లావ్ క్లోస్ రికార్డును బద్దలు కొట్టనున్న ఎంబాపె ఆ తర్వాత మెస్సీని దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు.ఫిఫాలో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితా👉లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా)-18👉కైలియన్ ఎంబాపె (ఫ్రాన్స్)-16👉మిరోస్లావ్ క్లోజ్ (జర్మనీ)-16👉రొనాల్డో (బ్రెజిల్)- 15👉గెర్డ్ ముల్లర్ (జర్మనీ)-14👉జస్ట్ ఫాంటైన్ (ఫ్రాన్స్)- 13👉పీలే (బ్రెజిల్)-12Read: 90 నిమిషాలు అడ్డుగోడలా.. రోమాలు నిక్కబొడిచే ప్రదర్శన! -
వింబుల్డన్ సింగిల్స్లోనూ సెరెనా
లండన్: నాలుగేళ్ల తర్వాత మళ్లీ రాకెట్ పట్టిన అమెరికా దిగ్గజ టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ గ్రాండ్స్లామ్ సింగిల్స్లో రీఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఈనెల 29 నుంచి జరిగే ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో 44 ఏళ్ల సెరెనా సింగిల్స్ విభాగంలోనూ బరిలోకి దిగనుంది. ఈ మేరకు వింబుల్డన్ టోర్నీ నిర్వాహకులు చివరిదైన ఎనిమిదో వైల్డ్ కార్డును సెరెనాకు కేటాయిస్తూ సోమవారం నిర్ణయం తీసుకున్నారు. తన సోదరి వీనస్ విలియమ్స్తో కలిసి సెరెనా వింబుల్డన్ మహిళల డబుల్స్ విభాగంలోనూ ఆడేందుకు ఇంతకుముందే వైల్డ్ కార్డు ఇచ్చారు. తాజా ప్రకటనతో సెరెనా సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో పోటీపడనుంది. చివరిసారి 2022లో వింబుల్డన్ టోర్నీలో ఆడిన సెరెనా తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. అదే ఏడాది ఆటకు గుడ్బై చెప్పిన సెరెనా ఇటీవల పునరాగమనం చేసింది. సెరెనా తన కెరీర్లో 23 గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గింది. ఆమె అత్యధికంగా ఏడుసార్లు చొప్పన వింబుల్డన్, ఆ్రస్టేలియన్ ఓపెన్ టైటిల్స్ సొంతం చేసుకోగా... ఆరుసార్లు యూఎస్ ఓపెన్ టైటిల్స్ను, మూడుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ను సాధించింది. -
జోరు కొనసాగించాలని...
లండన్: ప్రపంచ చాంపియన్ జర్మనీ జట్టును... ఒలింపిక్ చాంపియన్ నెదర్లాండ్స్ జట్టును ఓడించిన ఉత్సాహంలో ఉన్న భారత పురుషుల హాకీ జట్టు తన కీలక పోరుకు సిద్ధమైంది. ప్రొ లీగ్ 2025–2026 సీజన్లో భాగంగా తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తోనూ భారత్ రెండు మ్యాచ్లు ఆడనుంది. ఇరు జట్ల మధ్య నేడు తొలి మ్యాచ్ జరగనుండగా... రెండో మ్యాచ్ను శుక్రవారం నిర్వహిస్తారు. 2024లో చైనా వేదికగా జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో చివరిసారి భారత్, పాక్ ముఖాముఖిగా తలపడ్డాయి. ఆ మ్యాచ్లో భారత్ 2–1తో గెలిచింది. ప్రస్తుత యూరోప్ అంచె ప్రొ లీగ్లో భారత్ తమకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న జట్లను ఓడించి జోరు మీదుంది. జుగ్రాజ్ సింగ్, మన్దీప్ సింగ్, శిలానంద్ లాక్రా, అభిషేక్ తమకు లభించిన అవకాశాలను గోల్స్గా మలుస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ జట్టు ఆడిన 12 మ్యాచ్ల్లో ఒక్క విజయాన్ని కూడా సాధించలేకపోయింది. కొన్నేళ్లుగా అంతర్జాతీయ హాకీలో పాకిస్తాన్పై భారత్దే పైచేయిగా ఉంది. గత పదేళ్లలో ఈ రెండు జట్ల మధ్య 17 మ్యాచ్లు జరగ్గా... 15 మ్యాచ్ల్లో భారత్ గెలిచింది. మరో రెండు మ్యాచ్లు ‘డ్రా’గా ముగిశాయి. ప్రొ లీగ్లోనూ పాక్పై తమ విజయపరంపరను కొనసాగించాలనే లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగనుంది. తొమ్మిది జట్ల మధ్య జరుగుతున్న ప్రస్తుత ప్రొ లీగ్ సీజన్లో భారత్ 10 పాయింట్లతో 8వ స్థానంలో... పాకిస్తాన్ జట్టు పాయింట్ల ఖాతా తెరవకుండానే చివరిదైన 9వ స్థానంలో ఉన్నాయి. ప్రొ లీగ్లో మొత్తం తొమ్మిది జట్లు 16 మ్యాచ్ల చొప్పున ఆడతాయి. ఇప్పటికి అన్ని జట్లు 12 మ్యాచ్ల చొప్పున పూర్తి చేసుకున్నాయి. ఈనెల 28తో సీజన్ ముగియనుండగా... 34 పాయింట్లతో బెల్జియం అగ్రస్థానంలో కొనసాగుతోంది. -
మెస్సి ఒక్కడే చాలు.. ఫుట్బాల్ ప్రపంచం షాక్
ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ (18) చేసిన ఆటగాడిగా లియోనెల్ మెస్సి నిలిచాడు. కెప్టెన్గా రెండు గోల్స్ చేసి, సోమవారం అర్ధరాత్రి ఆస్ట్రియాపై అర్జెంటీనాకు 2-0 తేడాతో విజయాన్ని అందించాడు. ఈ విజయంతో అర్జెంటీనా నాకౌట్ దశలోని చివరి 32 జట్లలో ఒకటిగా అర్హత సాధించింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక మ్యాచ్ ముగిసింది.తొలి మ్యాచ్లో హ్యాట్రిక్ సాధించిన మెస్సి.. ఈ మ్యాచ్లో మొదటి గోల్ చేయడంతో ప్రపంచకప్లో అతని మొత్తం గోల్స్ 17 అయ్యాయి. అంటే, తొలి మ్యాచ్లో అల్జీరియాపై మెస్సీ 3 గోల్స్ (హ్యాట్రిక్) చేశాడు. ఇప్పుడు ఆస్ట్రియాతో జరిగిన ఈ మ్యాచ్లో మొదటి గోల్ చేశాడు. దీంతో ప్రపంచకప్లో అతని మొత్తం గోల్స్ 16 నుంచి 17కు చేరాయి. ఆ తర్వాత మెస్సి మరో గోల్ చేయడంతో మొత్తం గోల్స్ 18కి చేరుకున్నాయి.మ్యాచ్కు ముగింపు ఇలా.. మెస్సీ ఇంజరీ టైమ్ చివరలో రెండో గోల్ చేసి మ్యాచ్కు ముగింపు పలికాడు. బాక్స్లో జరిగిన గందరగోళం మధ్య ఫుట్బాల్ను అడ్డుకునేందుకు నిలిచిన నలుగురు డిఫెండర్లను దాటుకుని గోల్ చేశాడు. ఈ మ్యాచ్లో మెస్సీ ప్రదర్శన ఇంకా మెరుగ్గా ఉండేదే. తొలి దశలో వచ్చిన పెనాల్టీ అవకాశాన్ని అతను చేజార్చాడు. డల్లాస్ కౌబాయ్స్ స్టేడియంలో అర్జెంటీనాకు మద్దతుగా వచ్చిన 70,649 మంది ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే నాకౌట్ దశకు చేరుకునే అవకాశం ఉండటంతో రెండు జట్లు గట్టిగా పోరాడాయి. ఆస్ట్రియా అభిమానుల కంటే అధిక సంఖ్యలో వచ్చిన అర్జెంటీనా అభిమానులు తమ హీరో మెస్సికి నిలబడి అభినందనలు తెలిపారు. అర్జెంటీనా తొలి మ్యాచ్లో అల్జీరియాపై 3-0తో విజయం సాధించిన సమయంలో హ్యాట్రిక్ చేసిన మెస్సీ.. గతంలో జర్మన్ ఆటగాడు మిరోస్లావ్ క్లోస్ ప్రపంచకప్లో చేసిన 16 గోల్స్ రికార్డును సమం చేశాడు. తొలి గోల్ తర్వాత మెస్సి భావోద్వేగానికి గురయ్యాడు. తర్వాత అతని తండ్రి ఆరోగ్య సమస్య నుంచి కోలుకుంటున్నట్టు తెలిసింది. ఆ ఆరోగ్య సమస్య ఏమిటన్న వివరాన్ని వెల్లడించలేదు.మెస్సి నయా రికార్డ్ లెక్క ఇది.. తొలి మ్యాచ్లో అల్జీరియాపై హ్యాట్రిక్తో మెస్సి ప్రపంచకప్ కెరీర్ గోల్స్ 16 అయ్యాయి. దీంతో మిరోస్లావ్ క్లోస్ రికార్డును సమం చేశాడు.ఇప్పుడు ఆస్ట్రియాపై మొదటి గోల్ చేయడంతో అతని ప్రపంచకప్ గోల్స్ 17 అయ్యాయి. దీంతో మిరోస్లావ్ క్లోస్ రికార్డును అధిగమించి కొత్త రికార్డు నెలకొల్పాడు.ఇదే మ్యాచ్లో ఇంజరీ టైమ్లో మరో గోల్ కూడా చేశాడు. దీంతో అతని మొత్తం ప్రపంచకప్ గోల్స్ 18కు చేరాయి. -
తిలక్ వర్మ విధ్వంసకర సెంచరీ.. 259 టార్గెట్ హాంఫట్
తెలంగాణ టీ20 లీగ్ను మెదక్ ఫాల్కన్స్ ఘనంగా ఆరంభించింది. ఉప్పల్ మైదానం వేదికగా వరంగల్ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో మెదక్ ఘన విజయం సాధించింది. వరంగల్ నిర్ధేశించిన 259 పరుగుల భారీ లక్ష్యాన్ని మెదక్.. 7 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో చేధించింది. ఈ విజయంలో మెదక్ కెప్టెన్ తిలక్ వర్మది కీలక పాత్ర. ఈ టీమిండియా సూపర్ స్టార్ విరోచిత శతకంతో చెలరేగాడు. 52 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్లతో 136 (నాటౌట్) పరుగులు చేసి తన జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అతడితో పాటు విక్రం నాయక్ గగులోత్(25), శృజిత్ రెడ్డి(25) రాణించారు. వరంగల్ బౌలర్లలో కులకర్ణి, మన్సూరి తలా రెండు వికెట్లు పడగొట్టారు.ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వరంగల్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. వరంగల్ బ్యాటర్లలో కెప్టెన్ అమన్రావ్(48 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్స్లతో 142) భారీ సెంచరీతో చెలరేగాడు. మెదక్ బౌలర్లలో తిలక్ వర్మ 2, మధుకర్ 2, సూర్యతేజ, రవి తేజ, రాహుల్ ఒక్కో వికెట్ సాధించారు. -
TG20 League 2026: తిలక్ వర్మ సూపర్ సెంచరీ
తెలంగాణ టీ20 లీగ్లో భాగంగా వరంగల్ వారియర్స్తో మ్యాచ్లో మెదక్ ఫాల్కన్స్ కెప్టెన్, టీమిండియా సూపర్ స్టార్ తిలక్ వర్మ శతక్కొట్టాడు. 259 పరుగుల భారీ లక్ష్య చేధనలో తిలక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఉప్పల్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో తిలక్ 42 బంతుల్లో తొలి టీజీ 20 సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 52 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్లతో 136 (నాటౌట్) పరుగులు చేసి తన జట్టును తిలక్ విజయ తీరాలకు చేర్చాడు. -
భారత్తో టీ20 సిరీస్.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన! యువ సంచలనానికి ఛాన్స్
స్వదేశంలో భారత్తో జరగనున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్గా హ్యారీ బ్రూక్ వ్యవహరించనున్నాడు. కాగా టీ20 ప్రపంచకప్తో పాటు ఐపీఎల్లోనూ పేలవ ప్రదర్శన కనబరిచిన స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్కు సెలక్టర్లు మరో అవకాశమిచ్చారు. అతడితో పాటు ఆదిల్ రషీద్, పేసర్ జోఫ్రా ఆర్చర్, ఫిల్ సాల్ట్, టామ్ బాంటన్, సామ్ కరన్ వంటి సీనియర్ ప్లేయర్లు ఈ జట్టులో ఉన్నారు. మరోవైపు వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన జోర్డాన్ కాక్స్, సన్నీ బేకర్, సాకిబ్ మహమూద్లు తిరిగి జట్టులోకి వచ్చారు. యువ ఆటగాళ్లు జాకబ్ బెథెల్, విల్ జాక్స్, జోష్ టంగ్ కూడా తమ స్ధానాలను నిలబెట్టుకున్నారు.అయితే ఈ సిరీస్కు స్టార్ ఆల్రౌండర్లు బ్రైడన్ కార్స్, జేమీ ఓవర్టన్లు ఇద్దరూ గాయాల కారణంగా దూరమయ్యారు. దీంతో ససెక్స్ ఆల్రౌండర్ 22 ఏళ్ల జేమ్స్ కోల్స్ తొలిసారి ఇంగ్లండ్ జాతీయ జట్టులో చోటు దక్కింది. టీ20 క్రికెట్లో కోల్స్కు అద్భుతమైన రికార్డు ఉంది. 71 టీ20 మ్యాచ్లు ఆడిన కోల్స్.. 1,373 పరుగులతో పాటు 53 వికెట్లు పడగొట్టాడు. వైటాలిటీ బ్లాస్ట్, ది హండ్రెడ్ టోర్నీలతో పాటు సౌతాఫ్రికా టీ20 వంటి ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్లో ఆడిన అనుభవం ఉంది.భారత్తో సిరీస్ కోసం ఇంగ్లండ్ టీ20 జట్టు:హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, సన్నీ బేకర్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, జేమ్స్ కోల్స్, జోర్డాన్ కాక్స్, సామ్ కరన్, లియామ్ డాసన్, విల్ జాక్స్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్. -
వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ.. గంభీర్కు కొత్త తలనొప్పి!
అఫ్గాన్తో వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు మరో కీలక పోరుకు సిద్దమైంది. రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడేందుకు భారత సీనియర్ జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో మెన్ ఇన్ బ్లూ బరిలోకి దిగనుంది. అదేవిధంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా ఐర్లాండ్ టూర్కు వెళ్లే భారత జట్టులో ఉండడంతో అందరి దృష్టి ఈ సిరీస్పైనే ఉంది. జూన్ 26న బెల్ఫెస్ట్ వేదికగా ఐరీష్ జట్టుతో జరగనున్న తొలి టీ20లో వైభవ్ భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది.గంభీర్కు కొత్త తలనొప్పిఅయితే వైభవ్ను తుది జట్టులోకి తీసుకువాలంటే భారత రెగ్యులర్ ఓపెనర్లైన సంజూ శాంసన్ లేదా అభిషేక్ శర్మలలో ఒకరిని పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఇది ఇప్పుడు కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుంకటే వీరిద్దరూ ఇప్పటికే ఓపెనర్లగా తమను తాము నిరూపించుకున్నారు. టీ20ల్లో నంబర్ వన్ బ్యాటర్ అభిషేక్ శర్మ పవర్ప్లేలో బౌలర్లకు చుక్కలు చూపించగలే విధ్వంసకర వీరుడు. అలాంటి ప్లేయర్ను డ్రాప్ చేయడం అంత సులువు కాదు.మరోవైపు ఇటు ఓపెనర్గా, అటు వికెట్ కీపర్గా జట్టుకు వెన్నముకగా ఉన్న సంజూను తప్పించడం కూడా అసాధ్యం. అయితే గంభర్ ముందు రెండే రెండు మార్గాలు ఉన్నాయి. ఐర్లాండ్ సిరీస్ చిన్నది సంజూ శాంసన్కు మొదటి మ్యాచ్లో విశ్రాంతినిచ్చి వైభవ్ను ఆడించడం. లేదా లేదా సంజూను మూడో స్థానానికి పంపి, అభిషేక్ - వైభవ్ లతో లెఫ్ట్-లెఫ్ట్ కాంబినేషన్ ఓపెనింగ్ చేయించడం. సంజూ ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు పంపితే ఇన్ఫామ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ను పక్కన పెట్టాల్సిందే. మరి గంభీర్ అండ్ కో ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఒకవేళ 15 ఏళ్ల వైభవ్ అరంగేట్రం చేస్తే మాత్రం భారత జట్టు తరపున ఆడిన అతి పిన్నవయష్కుడిగా సచిన్(16)ను అధిగమిస్తాడు. -
TG20 League: వైభవ్ టీమ్మేట్ విధ్వంసం.. 32 బంతుల్లోనే సెంచరీ
తెలంగాణ టీ20 లీగ్లో తొలి సెంచరీ నమోదైంది. ఈ టోర్నీలో భాగంగా ఉప్పల్ వేదికగా మెదక్ ఫాల్కన్స్తో జరుగుతున్న మ్యాచ్లో వరంగల్ వారియర్స్ కెప్టెన్ అమన్రావు పేరాల విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ప్రత్యర్ధి బౌలర్లను అమన్ ఉతికారేశాడు. మెదక్ కెప్టెన్ తిలక్ వర్మను కూడా అతడు విడిచిపెట్టలేదు. 7 ఓవర్ వేసిన తిలక్ బౌలింగ్లో అతడు 15 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో అమన్ రావు కేవలం 32 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా అమన్ 48 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్స్లతో 142 పరుగులు చేసి ఔటయ్యాడు.కాగా అమన్రావ్ ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ క్యాంప్లో భాగంగా ఉన్న సంగతి తెలిసిందే. అమన్ రాజస్తాన్ తరపున అరంగేట్రం చేయనప్పటికి జోఫ్రా ఆర్చర్ వంటి వరల్డ్క్లాస్ బౌలర్ను నెట్స్లో ఎదుర్కొన్న అనుభవం అతడికి బాగా కలిసొచ్చింది. వైభవ్ సూర్యవంశీ వంటి యువ సంచలనంతో కూడా డ్రెస్సింగ్ రూమ్ను అమన్ షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు వైభవ్ తరహాలోనే టీజీ 20 లీగ్లో అమన్ దుమ్ములేపుతున్నాడు. -
TG20 League 2026: శతక్కొట్టిన తిలక్ వర్మ.. మెదక్ ఘన విజయం
తెలంగాణ టీ20 లీగ్లో భాగంగా ఉప్పల్ వేదికగా మెదక్ ఫాల్కన్స్, వరంగల్ వారియర్స్ జట్లు తలపడుతున్నాయి.మెదక్ ఫాల్కన్స్ ఘన విజయంఉప్పల్ వేదికగా వరంగల్ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో మెదక్ ఫాల్కన్స్ ఘన విజయం సాధించింది. వరంగల్ నిర్ధేశించిన 259 పరుగుల భారీ లక్ష్యాన్ని మెదక్.. 7 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో చేధించింది. కెప్టెన్ తిలక్ వర్మ(55 బంతుల్లో 14 ఫోర్లు, 8 సిక్స్లతో 136) అజేయ సెంచరీతో తన జట్టును గెలిపించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన వరంగల్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. వరంగల్ బ్యాటర్లలో అమన్రావ్(48 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్స్లతో 142) భారీ సెంచరీతో మెరిశాడు.విజయం దిశగా మెదక్మెదక్ విజయానికి 12 బంతుల్లో 20 పరుగులు కావాలి. 18 ఓవర్లకు స్కోర్: 239/6తిలక్ వర్మ సెంచరీమెదక్ కెప్టెన్ తిలక్ వర్మ 42 బంతుల్లో తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 104 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. మొదక్ విజయానికి ఇంకా 24 బంతుల్లో 52 పరుగులు కావాలి.ఒకే ఓవర్లో రెండు వికెట్లు15 ఓవర్ వేసిన అసిఫ్ బౌలింగ్లో మెదక్ రెండు వికెట్లు కోల్పోయింది. అనిష్ రెడ్డి(2), సూర్యతేజ(0) వరుసగా ఔటయ్యారు. తిలక్ 99 పరుగులతో ఉన్నాడు.నాలుగో వికెట్ డౌన్19 పరుగులు చేసిన వరుణ్.. మురుగన్ అభిషేక్ బౌలింగ్లో ఔటయ్యాడు. మొదక్ మూడో వికెట్ డౌన్మెదక్ మూడో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన తెలుకుపల్లి తేజ.. కులకర్ణి బౌలింగ్లో ఔటయ్యాడు. 11 ఓవర్లకు మెదక్ స్కోర్: 159/4తిలక్ హాఫ్ సెంచరీమెదక్ కెప్టెన్ తిలక్ వర్మ హాఫ్ సెంచరీ సాధించాడు. 23 బంతుల్లోనే మొదటి టీజీ20 ఆర్ధ శతకాన్ని నమోదు చేశాడు. 8 ఓవర్లకు మెదక్ స్కోర్: 104/2దూకుడుగా ఆడుతున్న తిలక్ వర్మ259 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మెదక్ దూకుడుగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసే సరికి మెదక్ వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది. క్రీజులో తిలక్ వర్మ(24), శృంజిత్(16) ఉన్నారు.వరంగల్ భారీ స్కోర్ఉప్పల్ వేదికగా మెదక్ ఫాల్కన్స్తో జరుగుతున్న మ్యాచ్లో వరంగల్ వారియర్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన వరంగల్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. వరంగల్ బ్యాటర్లలో అమన్రావ్(48 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్స్లతో 142) భారీ సెంచరీతో చెలరేగాడు. మెదక్ బౌలర్లలో తిలక్ వర్మ 2, మధుకర్ 2, సూర్యతేజ, రవి తేజ, రాహుల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.మూడో వికెట్ డౌన్వరంగల్ మూడో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన సిసోడియా తిలక్ బౌలింగ్లో ఔటయ్యాడు.వరంగల్ రెండో వికెట్ డౌన్వరంగల్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 48 బంతుల్లో 142 పరుగులు చేసిన అమన్రావు పేరాల.. రాహుల్ బౌలింగ్లో ఔటయ్యాడు.లీగ్ తొలి సెంచరీఅమన్రావు 32 బంతుల్లో శతక్కొట్టాడు.వరంగల్ తొలి వికెట్ డౌన్వరంగల్ తొలి వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన హర్షిత్ చౌదరి.. సూర్యతేజ బౌలింగ్లో ఔటయ్యాడు. 8.2 ఓవర్లలో వరంగల్ స్కోర్: 134-1అమన్ ఫిప్టీవరంగల్ కెప్టెన్ అమన్ రావు పేరాల కేవలం 17 బంతుల్లోనే 6 ఫోర్లు, మూడు సిక్స్లతో తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. దీంతో వరంగల్ స్కోర్ పవర్ప్లేలోనే వంద పరుగులు దాటింది.దంచికొడుతున్న వరంగల్ ఓపెనర్లువరంగల్ ఓపెనర్లు అమన్ రావు(22), హర్షిత్(21) దూకుడు ఆడుతున్నారు. 4 ఓవర్లు ముగిసే సరికి వరంగల్ వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది.తెలంగాణ టీ20 లీగ్లో భాగంగా ఉప్పల్ వేదికగా మెదక్ ఫాల్కన్స్, వరంగల్ వారియర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన వరంగల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మెదక్ ఫాల్కన్స్ కెప్టెన్గా టీమిండియా సూపర్ స్టార్ తిలక్ వర్మ వ్యవహరిస్తున్నాడు.మరో భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్(వరంగల్) మాత్రం ఈ మ్యాచ్కు అందుబాటులో లేడు. టీజీ20 లీగ్ తొలి సీజన్ వేలంలో తిలక్ను రూ.33 లక్షల రికార్డు ధరకు మెదక్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తుదిజట్లు వరంగల్ వారియర్స్ అమన్రావు పేరాల (కెప్టెన్), హర్షిత్ చౌదరి, భావేశ్ సేథ్, రుషికేశ్ సిసోడియా, మురుగన్ అభిషేక్, ఆది మణికిరణ్, అనిరుధ్ శ్రీవాస్తవ టీపీ, మహ్మద్ ఆసిఫ్ మన్సూరి, షౌనక్ కులకర్ణి, మహ్మద్ ముదస్సర్ హుస్సేన్, క్రాంతి పల్లెపాటి.మెదక్ ఫాల్కన్స్ తిలక్ వర్మ (కెప్టెన్), రవితేజ టి, నమన్ అగర్వాల్, శృజిత్ రెడ్డి, విక్రం నాయక్ గగులోత్, నిమ్మగడ్డ సూర్యతేజ, సాయి వరుణ్ యెర్రమ్, నయని అనీశ్ రెడ్డి, కుంటా రాహుల్, ఘాజి అబ్బాస్ అబేది, మధుకర్ మన్నె. -
ఆ విషయం చాలా మందికి తెలియదు: వైభవ్
భారత నయా సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి సత్తా చాటాడు. ముక్కోణపు వన్డే సిరీస్లో వైఫల్యాలకు చెక్ పెడుతూ.. శ్రీలంక -‘ఎ’తో ఫైనల్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఉపమానాలే ఈర్ష్య పడేలా... అలంకారాలే అసూయపడేలా... బిరుదులే చిన్నబోయేలా... 15 ఏళ్ల ఈ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ ఆదివారం దంబుల్లాలో విధ్వంస రచన చేశాడు.లంక బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపాడు. మెరుపుల్లాంటి ఫోర్లు, పిడుగుల్లాంటి సిక్స్లతో లంక తీరంలో పరుగుల తుఫాన్ సృష్టించాడు. బౌలర్ చేతి నుంచి బంతి వచ్చిందే తడువు దాన్ని స్టాండ్స్లోకి పంపడమే తన కర్తవ్యం అన్నట్లు విరుచుకుపడ్డాడు.కేవలం 11 బంతుల్లోనేకేవలం 11 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకొని లిస్ట్ ‘ఎ’క్రికెట్లో సరికొత్త రికార్డు నెలకొల్పిన వైభవ్... ఒక్క షాట్ దూరంలో రికార్డు సెంచరీని కోల్పోయాడు. వైభవ్ (Vaibhav Suryavanshi) తో పోటు మిగిలినవాళ్లు కూడా రాణించడంతో ముక్కోణపు వన్డే టోర్నీ ఫైనల్లో శ్రీలంక ‘ఎ’ జట్టును ఓడించి భారత ‘ఎ’ జట్టు విజేతగా నిలిచింది.నిజానికి శ్రీలంకతో గత మ్యాచ్లో భారత్ సూపర్ ఓవర్లో పరాజయం పాలైన వేళ.. వైభవ్ను లంక ప్లేయర్ విశేన్ రెచ్చగొట్టాడు. అందుకు ఫలితంగా ఫైనల్లో ఆ జట్టు మొత్తాన్ని తన ఆట తీరుతో శిక్షించాడు వైభవ్. మొత్తంగా 29 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సర్లు బాది ఏకంగా 324కు పైగా స్ట్రైక్రేటుతో 94 పరుగులు సాధించాడు.ఈ నేపథ్యంలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న వైభవ్ సూర్యవంశీ.. తన ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. అదే విధంగా తాను బయటి విషయాలేమీ పట్టించుకోనని.. వన్డేల్లోనూ ఆడగల సత్తా తనకు ఉందని పేర్కొన్నాడు.పరుగులు చేయలేదని తెలుసు‘‘ఓపెనర్గా మొదటి పది ఓవర్లలో వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టాలనేది నా ఆలోచన. ఈరోజు ఆ ప్రణాళికను పక్కాగా అమలు చేశాను. సిరీస్ మొదట్లో ఆశించినంతగా పరుగులు చేయలేదని తెలుసు. అప్పుడు కోచ్లతో చర్చించాను.లోపాలు సరిదిద్దుకుని.. గట్టిగానే ప్రాక్టీస్ చేశాను. అందుకు తగ్గ ఫలితం ఫైనల్లో వచ్చింది. ఈ సిరీస్ నుంచి చాలానే నేర్చుకున్నాను. అయితే, చాలా మందికి నేను 50 ఓవర్ల మ్యాచ్లు ఆడినట్లు తెలియదు. ఏదేమైనా విభిన్నమైన పిచ్ల మీద ఆడటం కాస్త సరదాగా.. మరికాస్త సవాలుగా అనిపించింది. ఈ సిరీస్ నాకు మంచి అనుభవాన్ని ఇచ్చింది’’ అని వైభవ్ సూర్యవంశీ పేర్కొన్నాడు. కాగా ఈ సిరీస్లో భారత్, శ్రీలంక, అఫ్గనిస్తాన్ ‘ఎ’ జట్లు పాల్గొనగా భారత్ ఫైనల్లో శ్రీలంకను ఓడించి టైటిల్ గెలిచింది. ఇక ఈ సిరీస్లో వైభవ్ చేసిన పరుగులు వరుసగా.. 14, 44, 21, 38, 94.చదవండి: నల్గొండను చిత్తు చేసిన రంగారెడ్డి -
తనయ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. రంగారెడ్డి ఘన విజయం
తెలంగాణ టీ20 లీగ్లో రంగారెడ్డి రైజర్స్ శుభారంభం చేసింది. సోమవారం ఉప్పల్ మైదానం వేదికగా అనురాగ్ నల్గొండ నైట్స్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో రంగారెడ్డి విజయం సాధించింది. నల్గొండ నిర్ధేశించిన 190 పరుగుల లక్ష్యాన్ని రంగారెడ్డి కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 16.3 ఓవర్లలోనే ఊదిపడేసింది. రైజర్స్ కెప్టెన్ తన్మయ్ త్యాగరాజన్(30 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్లతో 71 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు ఫస్ట్ డౌన్ బ్యాటర్ ఆదిత్య జువ్వాజి 41 పరుగులు చేశాడు. నల్గొండ బౌలర్లలో వరుణ్ గౌడ్, అనికేత్ రెడ్డి తలా రెండు వికెట్లు సాధించారు. రంగారెడ్డి బౌలర్లలో పున్నయ్య మూడు, కరియప్ప, నితిన్ సాయి యాదవ్ చెరో రెండు, కెప్టెన్ తనయ్ త్యాగరాజన్ ఒక వికెట్ దక్కించుకున్నారు.That's one way to finish a game! 💥Nitin Sai Yadav wasted no time to make a telling impact on the chase, cruising away to 2️⃣6️⃣* off just 9️⃣ deliveries to close out the game for his side!#RRRvANK #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/EDp4AKNMNq— tg20official (@tg20official) June 22, 2026 -
సిక్సర్ల వర్షం.. 20 ఓవర్లలో 290 పరుగులు
ఆంధ్ర ప్రీమియర్ లీగ్-2026లో కడప వేదికగా కాకినాడ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో విజయవాడ సన్షైనర్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఓపెనర్లు మున్నంగి అభినవ్ , కెప్టెన్ అశ్విన్ హెబ్బార్ విధ్వంసకర శతకాలతో కాకినాడ కింగ్స్ బౌలర్లను ఊచకోత కోశారు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే కడప మైదానంలో బౌండరీల వర్షం కురిపించారు. వారిని ఆపడం కాకినాడ బౌలర్ల తరం కాలేదు.అభినవ్ కేవలం 69 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్సర్లతో 137 పరుగులు చేసి అజేయంగా నిలవగా.. అశ్విన్ హెబ్బార్ కేవలం 53 బంతుల్లోనే 13 ఫోర్లు, 9 భారీ సిక్సర్లతో 130 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వీరిద్దరూ మొదటి వికెట్కు ఏకంగా 260 కి పైగా పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అభినవ్, అశ్విన్ విధ్వంసం ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన విజయవాడ సన్షైనర్స్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి ఏకంగా 290 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఏపీఎల్ చరిత్రలో ఇదే అత్యధిక టోటల్ కావడం విశేషం.291 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కాకినాడ కింగ్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 180 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ మనీష్ గొలమారు (0) ఖాతా తెరవకుండానే అవుట్ కాగా, అర్జున్ టెండూల్కర్ (17), అభిషేక్ రెడ్డి (9)లు త్వరగానే పెవిలియన్ చేరారు. మిడిలార్డర్లో పిన్నింటి తపస్వి (27), ఒమ్మి భాస్వంత్ కృష్ణ (30), మిట్టా లేఖాజ్ రెడ్డి (31), హరిశంకర్ రెడ్డి (20)లు పోరాడినప్పటికీ రన్ రేట్ ఒత్తిడి కారణంగా వికెట్లు సమర్పించుకున్నారు. విజయవాడ బౌలర్లలో బి.ప్రణవ్ రెడ్డి 3 వికెట్లు (3/30) తీసి కాకినాడ వెన్ను విరవగా, తన్నీరు భరత్ 2 వికెట్లు, సాయి వెంకట సుమిత్, సిద్ధార్థ, లలిత్ మోహన్ తలా ఒక వికెట్ పడగొట్టి విజయవాడకు భారీ విజయాన్ని అందించారు.సూపర్ ఫామ్లో అశ్విన్ఇక ఈ ఏడాది సీజన్లో విజయవాడ సన్షైనర్స్ కెప్టెన్ అశ్విన్ హెబ్బార్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. కేవలం 6 ఇన్నింగ్స్ల్లోనే 79.67 సగటుతో ఏకంగా 478 పరుగులు సాధించాడు. ఈ పరుగులను అతడు 216.29 స్ట్రైక్ రేట్తో రాబట్టడం విశేషం. ఇందులో రెండు భారీ సెంచరీలు ఉన్నాయి. వైట్బాల్ క్రికెట్లో అశ్విన్కు మంచి రికార్డు ఉంది. ఆంధ్ర జట్టులో కీలక సభ్యునిగా అతడు కొనసాగుతున్నాడు. 58 లిస్ట్-ఎ మ్యాచ్ల్లో 2019 పరుగులు చేశాడు.ఇందులో 6 సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా 69 టీ20 మ్యాచ్ల్లో 131.60 స్ట్రైక్ రేట్తో 1803 పరుగులు చేశాడు. కాగా 30 ఏళ్ల అశ్విన్ ఇదే ఫామ్ను కొనసాగిస్తే ఐపీఎల్-2027 మెగా వేలంలో ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించే ఛాన్స్ ఉంది. నెల్లూర్కు చెందిన అశ్విన్ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఎంపికయ్యాడు. కానీ అతడికి ఒక్క మ్యాచ్లో కూడా ఆడే అవకాశం రాలేదు. ఈసారి మాత్రం అశ్విన్ హెబ్బార్కు జాక్పాట్ తగిలే అవకాశముంది. -
ప్రపంచ రికార్డుకు అడుగుదూరంలో మెస్సీ!
ఫిఫా ప్రపంచకప్ 2026లో అర్జెంటీనా రెండో విజయంపై కన్నేసింది. గ్రూప్-జెలో ఇవాళ రాత్రి ఆస్ట్రియాతో అర్జెంటీనా తలపడుతోంది. ఈసారి ఫిఫా ప్రపంచకప్లో తాను ఆడిన తొలి మ్యాచ్లోనే మెస్సీ హ్యాట్రిక్ గోల్స్తో మెరిసిన సంగతి తెలిసిందే. అల్జీరియాతో జరిగిన మ్యాచ్ మెస్సీకి 200వది కావడం గమనార్హం. తన 200వ మ్యాచ్ను అద్భుతంగా మలుచుకున్నాడు. అల్జీరియాతో మ్యాచ్లో పలు రికార్డు లను బద్దలు కొట్టిన మెస్సీ ఆస్ట్రియాతో మ్యాచ్లోనూ పలు రికార్డులు సవరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఒకసారి వాటిని పరిశీలించి చూద్దాం.👉38 ఏళ్ల మెస్సీ వరుసగా ఐదు ఫిఫా ప్రపంచకప్పుల్లో గోల్ చేశాడు. రికార్డు స్థాయిలో ఆరోసారి ఫిఫా ఆడుతున్న మెస్సీ మరొక గోల్ చేస్తే, వరుసగా ఆరు ప్రపంచకప్పుల్లో గోల్స్ చేసిన ఆటగాళ్ల సరసన చేరనున్నాడు. గతంలో ఫ్రాన్స్కు చెందిన జస్ట్ ఫోంటైన్, బ్రెజిల్కు చెందిన జైర్జిన్హో సంయుక్తంగా ఆరు ప్రపంచకప్పుల్లో ఆరు గోల్స్ చేశారు. ఆల్ టైమ్ రికార్డు అందుకోవడానికి మెస్సీ మరొక గోల్ చేస్తే సరిపోతుంది.👉ఆస్ట్రియాతో మ్యాచ్లో మెస్సీ గోల్ కొడితే ఫిఫా చరిత్రలో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంటాడు. ప్రస్తుతం మెస్సీ 16 గోల్స్తో జర్మనీ దిగ్గజం మిరాస్లావ్ క్లోస్తో కలిసి తొలి స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రియాతో మ్యాచ్లో ఒక్క గోల్ చేసినా మెస్సీ ప్రపంచ రికార్డు సాధించినట్లే.👉ఆస్ట్రియాపై అర్జెంటీనా విజయం సాధిస్తే మెస్సీకి మరో చారిత్రాత్మకం కానుంది. ఇప్పటివరకు 16 ఫిఫా మ్యాచ్లు గెలిచిన మెస్సీ, ఇవాళ ఆస్ట్రియాపై గెలుపుతో 17 విజయాలతో జర్మనీ దిగ్గజం మిరాస్లావ్ క్లోస్ రికార్డు సమం చేసే అవకాశముంది.👉అల్జీరియాతో మ్యాచ్లో మెస్సీ 38 సంవత్సరాల 357 రోజుల వయస్సులో, అతను 2018 టోర్నమెంట్లో క్రిస్టియానో రొనాల్డో నెలకొల్పిన మునుపటి రికార్డును అధిగమించి, ప్రపంచ కప్ హ్యాట్రిక్ సాధించిన అత్యంత వయస్సు గల ఆటగాడిగా నిలిచాడు. అతను ప్రపంచ కప్లో కలిపి చేసిన గోల్స్ మరియు అసిస్ట్ల రికార్డును కూడా 24కు (16 గోల్స్, ఎనిమిది అసిస్ట్లు) పెంచుకున్నాడు. ఇక అర్జెంటీనా కెప్టెన్ ఇప్పటికే అత్యధిక ప్రపంచ కప్ ప్రదర్శనలు (27), అత్యధిక నిమిషాలు ఆడిన (2,394), అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు (12) ,అత్యధిక విజయవంతమైన డ్రిబుల్స్ (125) రికార్డులను కలిగి ఉన్నాడు.👉అయితే ఆస్ట్రియా జట్టును తక్కువ అంచనా వేసేందుకు లేదు. ఈసారి ఫిఫాలో ఆస్ట్రియా తమ తొలి మ్యాచ్లో జోర్డాన్ను 3-1తో మట్టికరిపించింది. అంతేకాదు గత 12 మ్యాచ్ల్లో ఆస్ట్రియా 10 విజయాలు, ఒక డ్రా సాధించి ఒక్క మ్యాచ్లో మాత్రమే ఓడిపోయింది. దీంతో అర్జెంటీనా జాగ్రత్తగా ఆడాల్సిన అవసరముంది.Read: హర్మన్ సేనకు మిథాలీరాజ్ కీలక సూచన -
హర్మన్ సేనకు మిథాలీరాజ్ కీలక సూచన
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో సౌతాఫ్రికాతో మ్యాచ్లో భారత జట్టు ఓటమిపాలైన సంగతి తెలిసిందే. బ్యాటింగ్ పర్వాలేదని పించినప్పటికీ బౌలింగ్లో పూర్తిగా తేలిపోవడం హర్మన్ సేన కొంపముంచింది. ఇక మ్యాచ్లో సౌతాఫ్రికా ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులకు సంబంధించి హర్మన్ సేనకు పలు కీలక సూచనలు చేసింది.జియో హాట్స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిథాలీరాజ్ మాట్లాడింది. ‘భారత జట్టుకు ఇది చాలా నిరుత్సాహపరిచే గేమ్. ఈ మ్యాచ్లో గెలిచి ఉంటే హర్మన్ సేన పట్టికలో టాప్లో ఉండేది. కానీ ఇప్పుడు సెమీస్ రేసులో ఉండాలంటే బలమైన ఆస్ట్రేలియాను చిత్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే బ్యాటింగ్ ఆర్డర్లో పలు మార్పులు చేసుకుంటే ఆసీస్పై విజయం అంత కష్టమేమి కాకపోవచ్చు. కెప్టెన్ హర్మన్ప్రీత్ గత రెండు మ్యాచ్ల్లోనూ ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చింది. మంచి ఫామ్లో ఉన్న ఆమె తన పాత స్థానమైన నాలుగులో బ్యాటింగ్కు రావాలి.. ఆ స్థానంలో వస్తున్న జెమీమా రోడ్రిగ్స్ ఐదో స్థానంలో బ్యాటింగ్కు వస్తే బాగుంటుంది. ఎందుకంటే గతంలో జెమిమా ఐదో స్థానంలో ఆడిన అనుభవముంది. స్పిన్నర్లను బాగా ఆడగలదనే పేరు కలిగిన జెమిమా ఐదో స్థానంలో బ్యాటింగ్ రావడం వల్ల, ఆ సమయానికి ఎక్కువగా స్పిన్నర్లను ఎదుర్కొనే అవకాశం వస్తోంది. దీనివల్ల ఆమె వేగంగా పరుగులు చేయగలదు. స్పిన్ బౌలింగ్లోనే జెమీమా స్కూప్స్, స్వీప్ షాట్లు కచ్చితంగా ఆడగలదు. మరోవైపు హర్మన్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ రావడం వల్ల చివరి ఓవర్లలోనే ఆమె వేగంగా ఆడేందుకు ఆస్కారముంటుంది. ఇక బౌలింగ్లో శ్రీచరణి తన ప్రదర్శనతో అదరగొట్టింది. ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి ఆడుతున్నప్పటికీ అక్కడి పిచ్ పరిస్థితులకు తగ్గట్లుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొట్టడంలో విజయవంతమవుతోంది. తన బౌలింగ్లో పేస్ వైవిధ్యం కనిపిస్తోంది. లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ వేస్తున్నశ్రీచరణి రాబోయే రోజుల్లో జట్టుకు కీలక బౌలర్గా మారనుంది.’ అని మిథాలీ చెప్పుకొచ్చింది. ఇక భారత జట్టు తమ తర్వాతి మ్యాచ్ జూన్ 25న (గురువారం) బంగ్లాదేశ్తో ఆడనుంది. ఆ తర్వాత జూన్ 28న (ఆదివారం) ఆస్ట్రేలియాను ఎదుర్కోనుంది. ఈ రెండింట గెలిస్తే భారత్ నేరుగా సెమీస్లో అడుగుపెట్టనుంది. ఒక్క మ్యాచ్లో ఓడినా నెట్ రన్రేట్ కీలకం కానుంది.చదవండి: ఐర్లాండ్తో టీ20 సిరీస్.. వైభవ్తో పాటు వీళ్లకు కీలకమే! -
నల్గొండ నామమాత్రపు స్కోరు.. రంగారెడ్డి లక్ష్యం ఎంతంటే?
తెలంగాణ టీ20 లీగ్-2026లో రెండో మ్యాచ్లో భాగంగా రంగారెడ్డి రైజర్స్- నల్గొండ నైట్స్ సోమవారం ముఖాముఖి ఎదురుపడ్డాయి. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా టాస్ గెలిచిన రంగారెడ్డి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఫలితంగా నల్గొండ ముందుగా బ్యాటింగ్కు దిగింది.నల్గొండ స్కోరెంతంటే?ఈ క్రమంలో రంగారెడ్డి బౌలింగ్ ధాటికి నల్గొండ ఓపెనర్లు గౌరవ్ రెడ్డి (0), ప్రణవ్ సూర్యదేవర (7) విఫలమయ్యారు. వన్డౌన్లో వచ్చిన నితీశ్ రెడ్డి 20 పరుగులు చేయగా.. కెప్టెన్ రాహుల్ బుద్ధి మెరుపులు (19 బంతుల్లో 30) మెరిపించాడు.మిగిలిన వారిలో వరుణ్ గౌడ్ (26) రాణించగా.. అర్ఫాజ్ (7), అనికేత్ రెడ్డి (0) ఇలా వచ్చి.. అలా వెళ్లారు. ఇలాంటి దశలో దివేశ్ సింగ్, హర్షవర్దన్ సింగ్ నల్గొండ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. దివేశ్ 27 బంతుల్లో 48 పరుగులు చేయగా.. హర్షవర్ధన్ సింగ్ 20 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్స్ బాది 40 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నల్గొండ 189 పరుగులు చేయగలిగింది. రంగారెడ్డి బౌలర్లలో పున్నయ్య మూడు వికెట్లతో చెలరేగగా.. కరియప్ప, నితిన్ సాయి యాదవ్ చెరో రెండు, కెప్టెన్ తనయ్ త్యాగరాజన్ ఒక వికెట్ పడగొట్టాడు.తుదిజట్లురంగారెడ్డి రైజర్స్తనయ్ త్యాగరాజన్ (కెప్టెన్), ఆరోన్ జార్జ్ వర్గిస్, అవినాశ్ రావు (వికెట్ కీపర్), అలంకృద్ రాపోల్, జ్ఞాన ప్రకాశ్ రెడ్డి, ఆదిత్య జవ్వాజి, నితిన్ సాయి యాదవ్, నానావత్ రాకేశ్, అరుణ్ కుమార్, భువనగిరి పున్నయ్య, ఆర్యన్ కరియప్పనల్గొండ నైట్స్రాహుల్ బుద్ధి (కెప్టెన్), ప్రణవ్ సూర్యదేవర, గౌరవ్ రెడ్డి, పి. నితీశ్ రెడ్డి, వరుణ్ గౌడ్, ఎండీ అర్ఫాజ్ అహ్మద్, టి. హర్షవర్దన్ సింగ్ (వికెట్ కీపర్), దివేశ్ సింగ్, చిన్నట్ల రక్షణ్ రెడ్డి, నివాంత్ శరణు. Update: తనయ్ కెప్టెన్ ఇన్నిం గ్స్.. రంగారెడ్డి ఘన విజయంThat's one way to finish a game! 💥Nitin Sai Yadav wasted no time to make a telling impact on the chase, cruising away to 2️⃣6️⃣* off just 9️⃣ deliveries to close out the game for his side!#RRRvANK #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/EDp4AKNMNq— tg20official (@tg20official) June 22, 2026 -
ఐర్లాండ్తో టీ20 సిరీస్.. వైభవ్తో పాటు వీళ్లకు కీలకమే!
అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన టీమిండియా సీనియర్ బృందం నేరుగా ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టనుంది. ఈ గ్యాప్లో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో యువకులతో నిండిన జట్టు ఐర్లాండ్ టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోంది. అయ్యర్కు కెప్టెన్గా ఇదే తొలి టీ20 సిరీస్ కానుండగా, వైభవ్ సూర్యవంశీ తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. వీరిద్దరితో పాటు మరికొందరు కొత్త క్రికెటర్లకు కూడా రాణించేందుకు ఇదే మంచి అవకాశం కానుంది. మిగతావారి సంగతి పక్కనబెడితే ఒక నలుగురు క్రికెటర్లకు మాత్రం ఐర్లాండ్ సిరీస్ కీలకం కానుంది. వాళ్లే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వైభవ్ సూర్యవంశీ, తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి, స్పిన్నర్ రవి బిష్ణోయి.శ్రేయస్ అయ్యర్..ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా 2025 సీజన్లో పంజాబ్ను ఫైనల్ చేర్చిన శ్రేయస్ అయ్యర్ 2024 ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ను విజేతగా నిలిపాడు. అయితే 2026 సీజన్లో పంజాబ్ ప్లేఆఫ్ చేరడంలో విఫలమైనప్పటికీ కెప్టెన్గా, బ్యాటర్గా శ్రేయస్ అయ్యర్ సక్సెస్ అయ్యాడు. తన కెప్టెన్సీతో బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. దీంతో ఫామ్ కోల్పోయి జట్టుకు భారంగా మారిన సూర్యకుమార్ను కెప్టెన్సీ నుంచి తొలగించి ఆ బాధ్యతలు శ్రేయస్కు అప్పగించారు. ఐర్లాండ్తో సిరీస్ కెప్టెన్గా అయ్యర్కు మొదటి సిరీస్ కానుంది. అయితే బ్యాటర్గా తనను తాను ఎప్పుడో నిరూపించుకున్న అయ్యర్ ఇక కెప్టెన్గా ఐపీఎల్ ప్రదర్శనను చూపిస్తాడా లేదా అన్నది చూడాలి. 2028లో జరగనున్న టీ20 ప్రపంచకప్ లక్ష్యంగా శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్ చేసినట్లు బీసీసీఐ తెలిపింది. మరి వారి అంచనాలను ఎంతమేర అందుకుంటాడనేది ఐర్లాండ్ సిరీస్తో తేలిపోనుంది.వైభవ్ సూర్యవంశీ..ఐర్లాండ్తో జరగనున్న టీ20 సిరీస్లో అందరి కళ్లు వైభవ్ సూర్యవంశీ పైనే ఉన్నాయి. ఆదివారం ముగిసిన ట్రై సిరీస్ ఫైనల్లో టీ20 తరహా బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. కొద్దిలో ఫాస్టెస్ట్ సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ 11 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అంతకముందు ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున విధ్వంసం సృష్టించిన వైభవ్ 16 మ్యాచ్ల్లో 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ ఎగురేసుకుపోయాడు. వన్డే క్రికెట్లోనూ టీ20 తరహా ఆటతీరును ప్రదర్శించిన వైభవ్ పొట్టి ఫార్మాట్లో మరింత రెచ్చిపోయేందుకు ఆస్కారముంది. అయితే తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతుండడం వైభవ్పై అంచనాలను పెంచేసింది. ఇంగ్లండ్తో టూర్కు ముందు ఐర్లాండ్ టీ20 సిరీస్లో అంచనాలను అందుకొని భారీ స్కోర్లతో చెలరేగాలని వైభవ్ భావిస్తున్నాడు. ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు ఎంపికైన వైభవ్కు ఆ జట్టులో చోటు దక్కడం కాస్త కష్టమే అయినప్పటికీ, ఐర్లాండ్తో సిరీస్లో రాణిస్తే ఇంగ్లండ్తో టీ20 సిరీస్లోనూ ఆడే అవకాశాలు మెండుగా ఉంటాయి.నితీశ్కుమార్ రెడ్డి..హార్దిక్ పాండ్యా గాయపడడంతో ఆల్రౌండర్ స్థానాన్ని భర్తీ చేసుకునేందుకు నితీశ్కుమార్ రెడ్డికి ఇదే మంచి అవకాశం. ఐపీఎల్ 2026 సీజన్లో సన్రైజర్స్ తరఫున ఆడిన నితీశ్ మంచి ప్రదర్శనే కనబరిచాడు. బ్యాటింగ్, బౌలింగ్లో కీలక సమయాల్లో రాణించగలడన్న పేరున్న నితీశ్కుమార్ ఐర్లాండ్తో టీ20 సిరీస్లో రాణించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే టెస్టు ఫార్మాట్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో ఉన్న నితీశ్రెడ్డి టీ20 జట్టులోనూ తన స్థానాన్ని నిలుపుకునేందుకు ఐర్లాండ్ టూర్ మంచి అవకాశం అని చెప్పొచ్చు.రవి బిష్ణోయి..ఐర్లాండ్తో టీ20 సిరీస్కు గాయంతో వరుణ్ చక్రవర్తి దూరం కావడంతో అతడి స్థానంలో రవి బిష్ణోయి చోటు దక్కించుకున్నాడు. కుల్దీప్ యాదవ్ వన్డేలకు పరిమితం కావడంతో టీ20ల్లో రాణించేందుకు రవి బిష్ణోయికు ఐర్లాండ్సిరీస్ ఎంతగానో ఉపయోగపడనుంది. ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడిన రవి బిష్ణోయి 9 మ్యాచ్ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. ఐర్లాండ్తో సిరీస్లో రవి బిష్ణోయి ఫ్రంట్లైన్ స్పిన్నర్గా సేవలందించేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఐర్లాండ్తో రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ జూన్ 26 (శుక్రవారం) బెల్ఫాస్ట్ వేదికగా జరగనుంది.Read: 90 నిమిషాలు అడ్డుగోడలా.. రోమాలు నిక్కబొడిచే ప్రదర్శన! -
నల్గొండను చిత్తు చేసిన రంగారెడ్డి
తెలంగాణ టీ20 లీగ్-2026లో రెండో మ్యాచ్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. లీగ్ ఆరంభ మ్యాచ్లో ఖమ్మం ఏసెస్.. పాలమూరు స్ట్రైకర్స్పై గెలుపొందగా.. తాజాగా సోమవారం నాటి మధ్యాహ్నం మ్యాచ్లో రంగారెడ్డి రైజర్స్- నల్గొండ నైట్స్ అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి.ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా టాస్ గెలిచిన రంగారెడ్డి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఫలితంగా నల్గొండ ముందుగా బ్యాటింగ్కు దిగింది. నల్గొండ స్కోరెంతంటే?నల్గొండ ఓపెనర్లు గౌరవ్ రెడ్డి (0), ప్రణవ్ సూర్యదేవర (7) విఫలం కాగా.. వన్డౌన్ బ్యాటర్ నితీశ్ రెడ్డి 20 పరుగులు చేయగా.. కెప్టెన్ రాహుల్ బుద్ధి వేగంగా (19 బంతుల్లో 30) ఆడాడు. వరుణ్ గౌడ్ (26) రాణించగా.. అర్ఫాజ్ (7), అనికేత్ రెడ్డి (0) ఫెయిలయ్యారు. ఇలాంటి దశలో దివేశ్ సింగ్ 27 బంతుల్లో 48 పరుగులు చేయగా.. హర్షవర్ధన్ సింగ్ 20 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్స్ బాది 40 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నల్గొండ 189 పరుగులు చేయగలిగింది. రంగారెడ్డి బౌలర్లలో పున్నయ్య మూడు, కరియప్ప, నితిన్ సాయి యాదవ్ చెరో రెండు, కెప్టెన్ తనయ్ త్యాగరాజన్ ఒక వికెట్ దక్కించుకున్నారు. రంగారెడ్డి ఘన విజయంనల్గొండ విధించిన 190 పరుగుల లక్ష్యాన్ని రంగారెడ్డి 16.3 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి ఛేదించింది. ఆదిత్య జువ్వాజి 41 పరుగులు చేయగా.. తనయ్ త్యాగరాజన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 30 బంతుల్లో ఏడు ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 71 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడితో పాటు నితిన్ సాయి యాదవ్ (9 బంతుల్లో 26 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. తుదిజట్లురంగారెడ్డి రైజర్స్తనయ్ త్యాగరాజన్ (కెప్టెన్), ఆరోన్ జార్జ్ వర్గిస్, అవినాశ్ రావు (వికెట్ కీపర్), అలంకృత్ రాపోల్, జ్ఞాన ప్రకాశ్ రెడ్డి, ఆదిత్య జవ్వాజి, నితిన్ సాయి యాదవ్, నానావత్ రాకేశ్, అరుణ్ కుమార్, భువనగిరి పున్నయ్య, ఆర్యన్ కరియప్పనల్గొండ నైట్స్రాహుల్ బుద్ధి (కెప్టెన్), ప్రణవ్ సూర్యదేవర, అనికేత్ రెడ్డి, గౌరవ్ రెడ్డి, పి. నితీశ్ రెడ్డి, వరుణ్ గౌడ్, ఎండీ అర్ఫాజ్ అహ్మద్, టి. హర్షవర్దన్ సింగ్ (వికెట్ కీపర్), దివేశ్ సింగ్, చిన్నట్ల రక్షణ్ రెడ్డి, నిశాంత్ సరాను. -
స్లో ఓవర్రేట్ దెబ్బ.. ఇంగ్లండ్కు భారీ షాక్!
న్యూజిలాండ్తో రెండో టెస్టులో ఓటమి పాలైన ఇంగ్లండ్కు మరో గట్టి షాక్ తగిలింది. కివీస్తో రెండో టెస్టులో స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు ఐసీసీ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించడంతో పాటు ఇంగ్లండ్ డబ్ల్యూటీసీ పాయింట్లలో 12 పాయింట్లు కోత విధించింది. ఈ నిర్ణయంతో ఇంగ్లండ్కు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈసారి ఐసీసీ వరల్డ్టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ ఆడాలన్న ఇంగ్లండ్ కల నెరవేరేలా కనిపించడం లేదు. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పట్టికలో ఏడో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ పాయింట్స్ పర్సంటేజీ మాత్రం 34.72 నుంచి 26.38కి పడిపోయింది. ఇంగ్లండ్ 12 టెస్టులాడి 4 విజయాలు, ఏడు ఓటములు, ఒక డ్రాతో ఏడో స్థానంలో ఉంది. ఇక టీమిండియా 9 టెస్టులు ఆడి 4 విజయాలు, 4 ఓటములు, ఒక డ్రాతో ఆరో స్థానంలో కొనసాగుతుంది. 2027లో జరగనున్న ఐసీసీ వరల్డ్టెస్టు చాంపియన్షిప్ పైనల్లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా తలపడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా ఆడిన 8 మ్యాచ్ల్లో ఏడు విజయాలు, ఒక ఓటమితో పట్టికలో తొలి స్థానంలో కొనసాగుతుండగా, సౌతాఫ్రికా 4 టెస్టుల్లో 3 విజయాలు, ఒక ఓటమితో రెండో స్థానంలో ఉంది.ఇంగ్లండ్, న్యూజిలాండ్ రెండో టెస్టు విషయానికొస్తే.. ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్లో కివీస్ 253 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 463 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మాట్ హెన్రీ ధాటికి 209 పరుగులకే కుప్పకూలింది. మాట్ హెన్రీ ఆరు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. చెరో విజయంతో ఇరుజట్లు 1-1తో సమానంగా ఉన్నాయి. నిర్ణయాత్మక మూడో టెస్టు ట్రెంట్బ్రిడ్జి వేదికగా జూన్ 25 నుంచి మొదలుకానుంది. నైట్క్లబ్ వివాదంతో రెండో టెస్టుకు దూరంగా ఉన్న కెప్టెన్ స్టోక్స్, గస్ అట్కిన్సన్లు మూడో టెస్టుకు జట్టుతో చేరనున్నారు.England have been fined 50% of their match fees and docked 12 WTC points for maintaining slow overrate against New Zealand. pic.twitter.com/YgnKhbdPcH— Mufaddal Vohra (@mufaddal_vohra) June 22, 2026Read: 90 నిమిషాలు అడ్డుగోడలా.. రోమాలు నిక్కబొడిచే ప్రదర్శన! -
పాకిస్తాన్కు షాకిచ్చి.. బంగ్లాదేశ్కు బంపరాఫర్!
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) పాకిస్తాన్కు షాకిచ్చింది. సమ్మర్లో పాక్తో ఆడాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్ను ఈసీబీ రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్-2027కు ముందు ఈసీబీ.. ఇంగ్లండ్- పాకిస్తాన్ మధ్య ఏకైక టెస్టు నిర్వహించాలని నిర్ణయించింది.యూటర్న్ఈ విషయమై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB)తో కూడా చర్చించినట్లు సమాచారం. అయితే, ఈసీబీ తాజాగా యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ను కాదని బంగ్లాదేశ్తో ఈ ఏకైక టెస్టు నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.‘ది టెలిగ్రాఫ్’ కథనం ప్రకారం.. వచ్చే ఏడాది మే నెలలో ఇంగ్లండ్- బంగ్లాదేశ్ మధ్య టెస్టు నిర్వహణకు ఈసీబీ ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఇందుకు సంబంధించిన వేదికను మాత్రం ఇంకా నిర్ణయించలేదు.ఒప్పందం ప్రకారం..కాగా మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ (MCC)తో ఈసీబీకి ఓ ఒప్పందం ఉంది. దీని ప్రకారం.. ప్రతీ ఏడాది వేసవిలో లార్డ్స్ వేదికగా రెండు టెస్టు మ్యాచ్లు నిర్వహించాల్సి ఉంటుంది. ఇక ఈసారి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 ఫైనల్ వేదికను లార్డ్స్ నుంచి తరలిస్తున్న విషయం తెలిసిందే.బంగ్లాదేశ్కు బంపరాఫర్ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్తో నిర్వహించే టెస్టుకు లార్డ్స్ను వేదికగా ఎంపిక చేయాలనే యోచనలో ఈసీబీ ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే నిజమైతే బంగ్లాదేశ్కు బంపరాఫర్ వచ్చినట్లే!.. బంగ్లా జట్టు చివరగా 2010లో ఇంగ్లండ్లో పర్యటించింది. తాజాగా మరోసారి ఏకైక టెస్టు కోసం ఇంగ్లండ్కు వెళ్లనుంది.నిజానికి పాకిస్తాన్తో నిర్వహించాలనుకున్న ఏకైక టెస్టుకు ఈసీబీ మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానాన్ని వేదికగా ఎంపిక చేసింది. అయితే, తాజా నిర్ణయం నేపథ్యంలో బంగ్లాకు చారిత్రాత్మక లార్డ్స్లో టెస్టు ఆడే అవకాశం రానుంది. ఇక ఇప్పటి వరకు ఇంగ్లండ్- బంగ్లాదేశ్ మధ్య ఐదు టెస్టు సిరీస్లు జరిగాయి. అయితే, సొంతగడ్డపై ఒకే ఒక్క మ్యాచ్లో బంగ్లా.. ఇంగ్లండ్ను టెస్టు మ్యాచ్లో ఓడించగలిగింది.పాకిస్తాన్కు ఊరటఅయితే, ఈసీబీ పాకిస్తాన్కు ఓ ఊరట కూడా ఇచ్చింది. ఈ ఏడాది ఆగష్టులో పాకిస్తాన్ ఇంగ్లండ్ పర్యటన యథావిధిగా కొనసాగుతుందని తెలిపింది. ఇందులో భాగంగా హెడింగ్లీ, లార్డ్స్, ఎడ్జ్బాస్టన్ వేదికలుగా ఇరుజట్ల మధ్య ఆగష్టు 19 నుంచి ఈ సిరీస్ మొదలుకానుంది. కాగా 2020 తర్వాత పాకిస్తాన్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. నాడు అజర్ అలీ కెప్టెన్సీలో ఇంగ్లండ్తో మూడు టెస్టులు ఆడిన పాకిస్తాన్.. బాబర్ ఆజం సారథ్యంలో మూడు టీ20 మ్యాచ్లు ఆడింది.చదవండి: సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. భారత్ సెమీస్ చేరాలంటే! -
పావెల్ మహోగ్రరూపం
మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2026లో వెస్టిండీస్ విధ్వంసక బ్యాటర్ రోవ్మన్ పావెల్ తుఫాన్ ఇన్నింగ్స్తో చెలరేగిపోయాడు. ఈ లీగ్లో లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్కు ప్రాతినిథ్యం వహించే అతడు.. సియాటిల్ ఓర్కాస్తో జరిగిన మ్యాచ్లో మహోగ్రరూపం దాల్చాడు. కేవలం 11 బంతుల్లో 37 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా శ్రీలంక ఆల్రౌండర్ దసున్ షనక వేసిన ఒకే ఓవర్లో 30 పరుగులు పిండుకొని మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.We promise there was a fifth one too. 😭Rovman Powell | #SOvLAKR | #WeAreLAKR | #LAKnightRiders | #MLC26 pic.twitter.com/WQF9eORvd2— Los Angeles Knight Riders (@LA_KnightRiders) June 21, 2026డల్లాస్లో జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్కు కొలిన్ మున్రో (30), ఆండ్రే ఫ్లెచర్ (40) శుభారంభం అందించారు. అయితే పవర్ప్లే తర్వాత వరుస వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు 16 ఓవర్లు ముగిసే సమయానికి 138/5 స్కోర్తో కష్టాల్లో పడింది. ఈ దశలో భారీ స్కోరు సాధించాలంటే చివరి ఓవర్లలో వేగంగా పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఆ సమయంలో క్రీజులో ఉన్న పావెల్ తనలోని విధ్వంసకర రూపాన్ని బయటపెట్టాడు. 17వ ఓవర్ బౌలింగ్కు వచ్చిన దసున్ షనకపై ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. తొలి బంతినే డీప్ మిడ్వికెట్ మీదుగా సిక్సర్గా మలిచిన పావెల్ అక్కడితో ఆగలేదు. వరుసగా మరో నాలుగు బంతులను కూడా స్టాండ్స్లోకి పంపించాడు. మొత్తంగా తొలి ఐదు బంతుల్లోనే ఐదు సిక్సర్లు బాది, ఆరో బంతికి ఔటయ్యాడు.ఈ ఇన్నింగ్స్లో పావెల్కు హోల్డర్ (14 బంతుల్లో 23 పరుగులు) జత కలవడంతో నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 196 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.అనంతరం 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఓర్కాస్ ఎప్పుడూ పోటీలో కనిపించలేదు. వరుస వ్యవధుల్లో వికెట్లు కోల్పోయి 16 ఓవర్లు పూర్తికాకముందే 115 పరుగులకు కుప్పకూలింది. దీంతో నైట్ రైడర్స్ 81 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. -
90 నిమిషాలు అడ్డుగోడలా.. రోమాలు నిక్కబొడిచే ప్రదర్శన!
ఫిఫా ప్రపంచకప్లో చాలా మ్యాచ్లు వన్సైడ్గా ముగుస్తున్నాయని ఫుట్బాల్ అభిమానుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈసారి ఫిఫా అంత కిక్ ఇవ్వడం లేదని కూడా కొందరు వాపోతున్నారు. కానీ అది తప్పని మరోసారి నిరూపితమైంది. చాలా మ్యాచ్లు డ్రాగా ముగుస్తున్నప్పటికీ, పెద్ద జట్లను నిలువరిస్తూ చిన్న జట్లే ఈసారి ఫిఫాలో హైలైట్గా మారిపోయాయి. కేప్ వర్డె, కురాకావో వంటి చిన్న దేశాలు టోర్నీలో తమ పోరాటంతో ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ దేశాలు తమ మ్యాచ్లను డ్రా చేసుకోవడంలో గోల్ కీపర్లదే కీలకపాత్ర. 40 ఏళ్ల వోజిన్హా (కేప్ వర్డె), 37 ఏళ్ల ఎలోయ్ రూమ్ (కురాకావో) అద్భుత గోల్కీపింగ్ విన్యాసాలతో పెద్ద జట్లను నిలువరించి తమ జట్లకు డ్రా రూపంలోనే విజయాలు సాధించి పెట్టారు. తాజాగా వీరి సరసన ఇరాన్ గోల్ కీపర్ అలీరెజా బెయిరాన్వాండ్కు కూడా చోటు కల్పించాల్సిందే.ఫిఫా ప్రపంచకప్లో భాగంగా సోమవారం గ్రూప్-జీలో ఫిఫా 9వ ర్యాంకర్ బెల్జియంను ఇరాన్ నిలువరించిందంటే అదంతా అలీరెజా చలువే. మ్యాచ్లో బెల్జియం ఒక్క గోల్ కూడా కొట్టకపోవడంలో అలీరెజాదే కీలకపాత్ర. ఇరాన్ గోల్పోస్ట్ వద్ద అడ్డుగోడలా నిలబడిన అలీరెజా బెల్జియం పటిష్టమైన డిఫెన్స్ను సమర్థంగా ఎదుర్కొని గోడకు కొట్టిన బంతిలా నిలబడ్డాడు. మ్యాచ్లో ఏడుసార్లు గోల్ చేసే అవకాశం వచ్చినప్పటికీ ఆరు అడుగులు నాలుగు అంగుళాల పొడవున్న అలీరెజా బెయిరాన్వాండ్ తన రెండు చేతులను చాపి బంతిని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. మొత్తం ఏడు సేవ్స్ చేసిన అలీరెజానే ‘ఫిఫా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’ కూడా వరించింది.అంతేకాదు, క్రీడా నియమాల ప్రకారం ఒక క్లీన్షీట్ను కూడా అలీరెజా సొంతం చేసుకున్నాడు.గొర్రెలకాపరి కుటుంబం నుంచి..అలీరెజా గొర్రెల కాపరి కుటుంబం నుంచి వచ్చాడు. అలీరెజా 12 ఏళ్ల వయసులో యూరోప్ ఉన్నత వర్గాల ఆధిపత్య పోరుకు తట్టుకోలేక అతడి తల్లిదండ్రులు బీరన్వంద్ నుంచి లోరెస్తాన్ కొండల్లోకి పారిపోయారు. ఆ కొండల్లోనే తీవ్ర పేదరికంలో అలీరెజా బాల్యం గడిచింది.చిన్నప్పటి నుంచే ఫుట్బాల్ ఆటపై అమితాసక్తి పెంచుకున్న అలీరెజా ఈ విషయంలో ప్రతీరోజు తండ్రితో గొడవపడేవాడు. ఎలాగోలా ఇంట్లో వాళ్లను ఒప్పించి ఆ కొండ ప్రాంతం నుంచి ఇరాన్ రాజధాని టెహ్రాన్కు చేరుకున్నాడు. టెహ్రాన్ చేరుకున్న సమంలో అలీరెజా జేబులో రూపాయి లేదు. నెలల తరబడి, అతడు స్థానిక ఫుట్బాల్ క్లబ్ల బయటే ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ కాలం గడిపాడు. ఆ క్లబ్లో జరిగే మ్యాచ్లను చూస్తూ ఫుట్బాల్ ఆటను పూర్తిగా అవగతం చేసుకున్నాడు. కొన్నాళ్లకు ఒక ఫ్యాక్టరీలో అసెంబ్లింగ్ పనులు చేస్తూ స్థానిక ఫుట్బాల్ క్లబ్లో మెంబర్షిప్ సాధించాడు. ఆ క్లబ్కు డబ్బులు కట్టడం కోసం రాత్రిళ్లు పిజ్జా దుకాణాల్లో పిండిని కలపడం, పిజ్జాలు చేయడం వంటి పనులు కూడా చేశాడు. అయితే కొండ ప్రాంతం నుంచి రావడంతో అలీరెజా బలిష్టంగా ఉండడంతో అతడికి గోల్ కీపింగ్ కరెక్ట్ అని స్థానిక ఫుట్బాల్ క్లబ్ కోచ్ నిర్ణయించాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ ఇరాన్ ఫుట్బాల్ జట్టుకు గోల్కీపర్గా సేవలందిస్తున్నాడు అలీరెజా. రెండు గిన్నిస్ రికార్డులు..ఇక మోడ్రన్ ఫుట్బాల్లో అలీరెజా బెయిరాన్వాండ్ తన పేరిట రెండు గిన్నిస్ రికార్డులు కూడా లిఖించుకున్నాడు. 2016 అక్టోబర్లో దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్లో బంతిని దాదాపు 200.14 అడుగులు (61.002 మీటర్లు) విసిరి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఫుట్బాల్ చరిత్రలో అత్యంత సదూర త్రో రికార్డు ఇప్పటికీ అలీరెజా పేరిటే ఉంది. ఇక ఫుట్బాల్లో అత్యంత పొడవైన డ్రాప్ కిక్ (255.95 అడుగులు-78.014 మీటర్లు) కూడా అలీరెజాదే కావడం విశేషం. ఇక బెల్జియం, న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లను డ్రా చేసుకున్న ఇరాన్ రెండు పాయింట్లు సాధించి నాకౌట్ అర్హత అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఇరాన్ తన తర్వాతి మ్యాచ్ జూన్ 27న పటిష్టమైన ఈజిప్ట్తో ఆడనుంది. Alireza Beiranvand🧤💚 pic.twitter.com/HlVeDsHoXo— Iman🇵🇹🇫🇷 (@i4emi) June 21, 2026Read: సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. భారత్ సెమీస్ చేరాలంటే! -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్
మహిళల టీ20 ప్రపంచకప్-2026లో సౌతాఫ్రికా ప్లేయర్ మారిజాన్ కాప్ చరిత్ర సృష్టించింది. మాంచెస్టర్ వేదికగా భారత్తో నిన్న జరిగిన కీలక పోరులో 4 సిక్సర్లు బాదిన ఆమె.. సౌతాఫ్రికా తరఫున మహిళల టీ20 ప్రపంచకప్ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్గా రికార్డు నెలకొల్పింది. గతంలో ఈ రికార్డు మూడు సిక్సర్లతో క్లో ట్రయాన్, లిజెల్ లీ, లారా వోల్వార్డ్ట్ పేరిట ఉండేది.కాప్ రికార్డు ప్రదర్శన కారణంగా భారత్పై సౌతాఫ్రికా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 159 పరుగుల లక్ష్య ఛేదనలో ఆమె, 45 బంతుల్లో 4 సిక్సర్లతో పాటు 7 ఫోర్లు బాది అజేయమైన 81 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చింది. ఈ గెలుపు సౌతాఫ్రికా ప్రపంచకప్ చరిత్రలో అత్యుత్తమ విజయాల్లో ఒకటిగా నిలిచింది.కాప్ మహిళల టీ20 ప్రపంచకప్లో విజయవంతమైన లక్ష్య ఛేదనల్లో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు (81*) నమోదు చేసిన ప్లేయర్గానూ రికార్డుల్లోకెక్కింది. ఈ జాబితాలో విండీస్ స్టెఫానీ టేలర్ 90 పరుగులతో అగ్రస్థానంలో ఉంది.భారత్పై గెలుపు మహిళల టీ20 క్రికెట్లో అత్యధికసార్లు 150కిపైగా లక్ష్యాలను విజయవంతంగా ఛేదించిన జట్టుగా సౌతాఫ్రికాను నిలిపింది . ఇది వారి పదో విజయవంతమైన 150 ప్లస్ పరుగుల ఛేదన. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా (9) పేరిట ఉండేది.కాప్ చేసిన అజేయ 81 పరుగులు మహిళల టీ20 ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా తరఫున మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నిలిచింది. అలాగే ప్రపంచకప్లో భారత్పై నమోదైన రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరుగానూ రికార్డుల్లోకెక్కింది.ఈ మ్యాచ్లో తొలుత బౌలింగ్లో రెండు వికెట్లు తీసిన కాప్.. మహిళల టీ20 ప్రపంచకప్లలో 500కిపైగా పరుగులు, 30కిపైగా వికెట్లు సాధించిన నాలుగో క్రికెటర్గా అరుదైన ఘనత సాధించింది. ఈ జాబితాలో ఎల్లిస్ పెర్రీ, డియాండ్ర డాట్టిన్, స్టెఫానీ టేలర్ మాత్రమే కాప్ కంటే ముందున్నారు.ఇక జట్టు రికార్డుల విషయానికి వస్తే, 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం దక్షిణాఫ్రికా మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక విజయవంతమైన లక్ష్య ఛేదనగా నిలిచింది. అలాగే ప్రపంచకప్ చరిత్రలో మూడో అత్యధిక విజయవంతమైన ఛేజ్గానూ నమోదైంది.ఈ మ్యాచ్లో కాప్ తజ్మిన్ బ్రిట్స్తో కలిసి మూడో వికెట్కు అజేయమైన 70 పరుగులు జోడించడంతో దక్షిణాఫ్రికా ప్రపంచకప్ చరిత్రలో అత్యుత్తమ మూడో వికెట్ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. -
సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. భారత్ సెమీస్ చేరాలంటే!
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన లీగ్ మ్యాచ్లో భారత జట్టు ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా బ్యాటర్ మారిజెన్ కాప్ (45 బంతుల్లో 81 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్తో ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో సౌతాఫ్రికా రెండు విజయాలు సాధించి పట్టికలో మూడో స్థానంలో ఉంది. మరోవైపు బంగ్లాదేశ్ కూడా మూడు మ్యాచ్ల్లో రెండు విజయాలతో నాలుగో స్థానంలో ఉంది. అయితే భారత్ తొలి రెండు మ్యాచ్లు (పాకిస్తాన్, నెదర్లాండ్స్) భారీ తేడాతో గెలవడంతో మెరుగైన నెట్ రన్రేట్ (+2.511) కారణంగా పట్టికలో సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ కంటే ముందుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్లకు తలా రెండు మ్యాచ్లు మిగిలి ఉండడం, ఆసీస్ ఆడిన మూడింట గెలిచి సెమీస్ రేసులో ఒక మెట్టు పైనే ఉంది. అయితే హర్మన్ సేన సెమీస్ చేరడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం.సెమీస్ అవకాశాలు ఇలా..భారత మహిళల జట్టు తమ చివరి రెండు మ్యాచ్లను ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్తో ఆడాల్సి ఉంది. ఈ రెండింటిలోనూ హర్మన్ సేన గెలిస్తే 8 పాయింట్లతో నెట్ రన్రేట్తో సంబంధం లేకుండా నేరుగా సెమీస్లో అడుగుపెట్టనుంది. అలా కాకుండా ఒక మ్యాచ్లో గెలిచి మరో మ్యాచ్లో ఓడితే మాత్రం నెట్ రన్రేట్ కీలకం కానుంది. అదే సమయంలో సౌతాఫ్రికా కూడా తాను ఆడబోయే రెండింటిలో ఒక దానిలో ఓడిపోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం సౌతాఫ్రికా, బంగ్లాదేశ్లతో పోలిస్తే భారత్ రన్రేట్ చాలా మెరుగ్గా ఉంది. ఆస్ట్రేలియాపై ఓడినా బంగ్లాదేశ్తో మ్యాచ్లో భారీ తేడాతో గెలిస్తే భారత జట్టుకు సెమీస్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ బంగ్లాదేశ్ మనపై విజయం సాధిస్తే మాత్రం రన్రేట్ పడిపోయి హర్మన్ సేన ఎలిమినేట్ అయ్యే అవకాశాలుంటాయి. ఇక హర్మన్ సేన తాము ఆడబోయే రెండు మ్యాచ్ల్లోనూ ఓటమిపాలైతే మాత్రం ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా టోర్నీ నుంచి నేరుగా నిష్క్రమిస్తుంది. అప్పుడు సౌతాఫ్రికా, బంగ్లాదేశ్లో ఒక జట్టు సెమీస్ చేరుతుంది. మరోవైపు ఆస్ట్రేలియా మాత్రం మిగిలిన రెండు మ్యాచ్ల్లో ఒక్కటి గెలిచినా సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంటుంది. అప్పుడు గ్రూప్-బి నుంచి మరో సెమీస్ స్థానానికి భారత్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్పోటీపడాల్సి వస్తోంది. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.ఓపెనర్ షఫాలీ వర్మ (31) టాప్ స్కోరర్గా నిలవగా, దీప్తిశర్మ (29), హర్మన్ప్రీత్ (24) పర్వాలేదనిపించారు. సఫారీ బౌలర్లలో మారిజెన్ కాప్, షబ్నమ్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం దక్షిణాఫ్రికా కాప్ సంచలన ఇన్నింగ్స్తో 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. తంజిమ్ బ్రిట్స్ (40), లారా వోల్వర్ట్ (20) రాణించారు. భారత బౌలర్లలో శ్రీ చరణి మూడు వికెట్లు పడగొట్టింది.చదవండి: కొంపముంచిన రెడ్కార్డ్.. బెల్జియంకు ఇరాన్ షాక్ -
నరైన్ మరో చారిత్రక ఘనత
విండీస్ స్పిన్ మాంత్రికుడు సునీల్ నరైన్ పొట్టి క్రికెట్లో మరో చారిత్రక ఘనత సాధించాడు. మేజర్ లీగ్ క్రికెట్ 2026లో లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. నిన్న సియాటిల్ ఓర్కాస్తో జరిగిన మ్యాచ్లో రెండు కీలక వికెట్లు తీయడంతో టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానానికి (632 వికెట్లతో) ఎగబాకాడు. ఈ క్రమంలో తన మాజీ సహచరుడు డ్వేన్ బ్రావోను (631) అధిగమించాడు. ఈ జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (723) టాప్ ప్లేస్లో ఉన్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. నరైన్తో పాటు (4-0-18-2), రసెల్ (1.3-0-8-3), వాన్ ష్కాల్విక్ (3-0-17-3), లీ రాక్స్ (2-0-17-2) చెలరేగడంతో ఓర్కాస్పై నైట్రైడర్స్ 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది. ఆండ్రీ ఫ్లెచర్ (40), కొలిన్ మున్రో (30), రోవ్మన్ పావెల్ (37), హోల్డర్ (23) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. ఓర్కాస్ బౌలర్లలో జస్దీప్ సింగ్, బార్ట్మన్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. షనక 2, అలీ షేక్, హర్మీత్ సింగ్ చెరో వికెట్ పడగొట్టారు.197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఓర్కాస్ పూర్తిగా విఫలమైంది. నరైన్, రసెల్, ష్కాల్విక్, లీ రాక్స్ ధాటిఇ 15.3 ఓవర్లలో కేవలం 115 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టు తరఫున బ్యాటింగ్లో ఒక్కరు కూడా రాణించలేదు.బౌలింగ్లో నరైన్తో పాటు షాడ్లీ వాన్ షాల్క్విక్, ఆండ్రే రస్సెల్ తలో మూడు వికెట్లు తీసి జట్టు విజయాన్ని ఖాయం చేశారు. చివరికి లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్ 81 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 25 పరుగులు చేసిన ఎనిమిదో నంబర్ ఆటగాడు హర్మీత్ సింగ్ టాప్ స్కోరర్గా నిలిచాడు. విధ్వంసకర బ్యాటర్లు టిమ్ సీఫర్ట్ 5, హెట్మైర్ 11, స్టోయినిస్ 1, షనక 14 పరుగులకు ఔటయ్యారు. -
కొంపముంచిన రెడ్కార్డ్.. బెల్జియంకు ఇరాన్ షాక్
ఫిఫా ప్రపంచకప్లో ఇరాన్, బెల్జియం మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఫిఫాలో 9వ ర్యాంక్లో ఉన్న బెల్జియం టోర్నీలో ఇంకా బోణీ చేయలేదు. అయితే బెల్జియం ఆటగాడు నాథన్ ఎంగోయ్ గోల్ ఆట 67వ నిమిషంలో గోల్ కొట్టినప్పటికీ రెడ్కార్డ్ అతడి కొంపముంచింది. రిఫరీ చూస్తుండగానే ఎంగోయ్ బంతిని తన చేతులతో వెనుక వైపు నుంచి పాస్ అందించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో గోల్ కొట్టేందుకు వచ్చిన ఇరాన్ ఫార్వార్డ్ ప్లేయర్ మెహ్దీ తరేమీని ఉద్దేశపూర్వకంగా కింద పడేశాడు. దీంతో ఇరాన్కు గోల్ వచ్చే చాన్స్ మిస్సయింది. దీంతో రిఫరీ నాథన్ ఎంగోయ్కు రెడ్కార్డ్ చూపించడంతో మైదానం వీడాడు. నాథన్ ఎంగోయ్ కొట్టిన గోల్ కూడా చెల్లలేదు. ఆ తర్వాత బెల్జియం పలుమార్లు గోల్ పోస్టులపై దాడి చేసినప్పటికీ ఇరాన్ గోల్ కీపర్ అలీరెజా బెయిరాన్వాండ్ సమర్థంగా అడ్డుకొని ఇరాన్ మ్యాచ్ డ్రా చేసుకోవడంలో కీలకపాత్ర పోషించాడు.వరుసగా రెండు మ్యాచ్లు డ్రా చేసుకోవడంతో బెల్జియం నాకౌట్ దశకు అర్హత సాధించడం అనుమానమే. ఎందుకంటే బెల్జియం కంటే ముందు ఈజిప్ట్, ఇరాన్లు ఉన్నాయి. న్యూజిలాండ్పై గెలుపుతో ఈజిప్ట్ 4 పాయింట్లతో తొలి స్థానంలో కొనసాగుతుంది. ఒకవేళ ఈజిప్ట్ తన చివరి మ్యాచ్ గెలవడం లేదా డ్రా చేసుకుంటే మాత్రం బెల్జియం ఇంటిబాట పట్టాల్సిందే. ఇక బెల్జియం తన చివరి మ్యాచ్ను న్యూజిలాండ్తో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్లో బెల్జియం భారీ తేడాతో గెలిస్తేనే నాకౌట్ దశకు చేరుకునే అవకాశం ఉంటుంది.Read: 33 మ్యాచ్ల్లో వంద గోల్స్.. ఆల్టైమ్ రికార్డు ఎంతో తెలుసా? -
ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. స్టోక్స్ రీఎంట్రీ
న్యూజిలాండ్పై తొలి టెస్ట్ విజయం తర్వాత ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని జోరుగా ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారం ఉట్టిదేనని తేలిపోయింది. న్యూజిలాండ్తో మూడో టెస్ట్ కోసం ఎంపిక చేసిన ఇంగ్లండ్ జట్టులో స్టోక్స్కు చోటు దక్కింది. స్టోక్స్తో పాటుగస్ అట్కిన్సన్ కూడా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. జేమ్స్ రూ స్థానాన్ని స్టోక్స్, సోనీ బేకర్ స్థానాన్ని అట్కిన్సన్ భర్తీ చేశారు. మిగతా జట్టు యధాతథంగా కొనసాగింది. మూడో టెస్ట్ ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జూన్ 25 నుంచి మొదలుకానుంది.కాగా, నిన్ననే ముగిసిన రెండో టెస్ట్లో న్యూజిలాండ్ 253 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి, 3 మ్యాచ్ల సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది. అంతకుముందు తొలి టెస్ట్లో ఇంగ్లండ్ 115 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసిన విషయం తెలిసిందే.తిరిగి పగ్గాలు చేపట్టనున్న స్టోక్స్రెండో టెస్ట్లో భారీ ఓటమి తర్వాత ఇంగ్లండ్ జట్టులో మార్పులు అనివార్యమయ్యాయి. జో రూట్ నాయకత్వంలో ఆడిన ఆ మ్యాచ్లో ఇంగ్లండ్ భారీ తేడాతో ఓడిపోవడం జట్టుపై ఒత్తిడిని పెంచింది. దీంతో అనుభవజ్ఞుడైన స్టోక్స్ తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు.స్టోక్స్, అట్కిన్సన్కు క్లీన్ చిట్స్టోక్స్, అట్కిన్సన్లను రెండో టెస్ట్ నుంచి తప్పించడానికి కారణం ఒక వివాదాస్పద సంఘటన. న్యూజిలాండ్పై తొలి టెస్ట్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు స్టోక్స్, అట్కిన్సన్ లండన్లోని చెల్సీ ప్రాంతంలోని రెక్స్ రూమ్స్ నైట్క్లబ్కు వెళ్లారు. అక్కడ వీరిద్దరూ ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఓ రగ్బీ ఆటగాడితో వాగ్వాదం చోటుచేసుకుందని, ఇందులో ఒక ECB సెక్యూరిటీ గార్డ్ గాయపడ్డాడని నివేదికలు తెలిపాయి. అలాగే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిర్దేశించిన మిడ్నైట్ కర్ఫ్యూ నిబంధనను సైతం వీరు ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ECB వెంటనే విచారణ ప్రారంభించి, స్టోక్స్ మరియు అట్కిన్సన్లను రెండో టెస్ట్ నుంచి తప్పించింది.అయితే తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో స్టోక్స్, అట్కిన్సన్కు క్లీన్ చిట్ ఇచ్చినట్లు తెలిపింది. వీరిద్దరికి ఆ గొడవతో సంబంధం లేదని పేర్కొంది. -
సలాహ్ సూపర్ షో.. ఈజిప్ట్ చారిత్రక విజయం
ఫిఫా వరల్డ్కప్-2026లో ఈజిప్ట్ చరిత్ర సృష్టించింది. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ప్రపంచకప్లో తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్-జీ పోరులో న్యూజిలాండ్పై 3-1 గోల్స్ తేడాతో విజయం సాధించి, ఫుట్బాల్ ప్రపంచంలో తమ ప్రయాణాన్ని ప్రారంభించింది.జట్టు కెప్టెన్ మొహమ్మద్ సలాహ్ కీలక సమయంలో జట్టును ముందుండి నడిపించి విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు.కెనడాలోని వాంకూవర్లో జరిగిన ఈ మ్యాచ్లో ఈజిప్ట్ దూకుడుగా ఆడింది. ప్రారంభం నుంచే దాడులు చేస్తూ న్యూజిలాండ్పై ఒత్తిడి పెంచింది. ఆటలో సలాహ్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. మిడ్ఫీల్డ్ నుంచి దాడులను నిర్మించడమే కాకుండా ప్రత్యర్థి రక్షణను చీల్చుకుంటూ అవకాశాలు సృష్టించాడు. కీలక సమయంలో అతడు చేసిన గోల్ మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చేసింది.ప్రపంచ ఫుట్బాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఆటగాళ్లలో ఒకడైన సలాహ్ మరోసారి పెద్ద వేదికపై తన విలువను నిరూపించాడు. ఈజిప్ట్కు అత్యంత అవసరమైన సమయంలో గోల్ సాధించి జట్టును విజయపథంలో నిలిపాడు. ఆ గోల్తో ఈజిప్ట్ అభిమానుల కలలకు రెక్కలు వచ్చాయి.మ్యాచ్లో ఈజిప్ట్ మూడు గోల్స్తో ఆధిపత్యం చెలాయించినప్పటికీ న్యూజిలాండ్ చివరి వరకు పోరాటాన్ని ఆపలేదు. స్కోరును తగ్గిస్తూ మ్యాచ్లోకి తిరిగి రావాలని ప్రతి నిమిషం ప్రయత్నించింది. ముఖ్యంగా చివరి పది నిమిషాల్లో వరుస దాడులతో ఈజిప్ట్ రక్షణకు గట్టి పరీక్ష పెట్టింది.అయితే ఈజిప్ట్ డిఫెండర్లు అద్భుతంగా నిలబడ్డారు. బాక్స్లోకి వచ్చిన ప్రతి క్రాస్ను అడ్డుకోవడం, కీలక క్లియరెన్స్లు చేయడం, షాట్లను బ్లాక్ చేయడం ద్వారా ప్రత్యర్థికి అవకాశమే ఇవ్వలేదు.ఇంజరీ టైమ్లో న్యూజిలాండ్ దాడులు మరింత పెరిగాయి. అయినప్పటికీ ఈజిప్ట్ ఆటగాళ్లు తమ శక్తినంతా వినియోగించి ఆధిక్యాన్ని కాపాడుకున్నారు. చివరకు రిఫరీ తుది విజిల్ ఊదగానే ఈజిప్ట్ ఆటగాళ్లు, అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.ఈ విజయం కేవలం మూడు పాయింట్లకే పరిమితం కాదు. ప్రపంచకప్ చరిత్రలో ఈజిప్ట్ సాధించిన తొలి విజయం కావడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. కైరో వీధుల నుంచి వాంకోవర్ స్టేడియం వరకు అభిమానులు ఆనందోత్సాహాలతో మునిగిపోయారు. ఎన్నో ప్రపంచకప్ల్లో పాల్గొన్నప్పటికీ విజయం దక్కకపోవడంతో ఎదురైన నిరాశకు ఈ ఫలితం ముగింపు పలికింది.ఈ విజయంతో గ్రూప్-జీలో ఈజిప్ట్ నాకౌట్ దశ అవకాశాలను గణనీయంగా మెరుగుపరుచుకుంది. అదే సమయంలో సలాహ్ పేరు ఈజిప్ట్ ఫుట్బాల్ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోనుంది. దేశానికి తొలి ప్రపంచకప్ విజయాన్ని అందించిన కెప్టెన్గా అతడు చరిత్రపుటల్లోకెక్కాడు. -
శతక్కొట్టుడు.. చరిత్ర సృష్టించిన పోలార్డ్
వెస్టిండీస్ మాజీ ఆల్రౌండర్ కీరన్ పోలార్డ్ టీ20 క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. మాజీ సహచరుడు క్రిస్ గేల్ పేరిట 12 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉండిన రికార్డును అధిగమిస్తూ అత్యధిక పరుగుల వీరుడిగా అవతరించాడు.మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2026లో భాగంగా ముంబై ఇండియన్స్ న్యూయార్క్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. వాషింగ్టన్ ఫ్రీడంతో జరిగిన మ్యాచ్లో శతకం బాది తన టీ20 పరుగుల సంఖ్యను 14,583కు చేర్చుకున్నాడు. దీంతో అప్పటివరకు టీ20ల్లో అత్యధిక పరుగుల వీరుడిగా చలామణి అయిన గేల్ (14,562 పరుగులు) రికార్డును అధిగమించాడు.39 ఏళ్ల పొలార్డ్ అంతర్జాతీయ టీ20ల్లో కేవలం 1,569 పరుగులే చేయగా.. మిగతా పరుగులన్నీ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ఫ్రాంచైజీ, దేశీయ టీ20 టోర్నీల్లో సాధించాడు. మరోవైపు గేల్ 2022 తర్వాత పోటీ క్రికెట్కు దూరంగా ఉండటంతో అతని రికార్డు అలాగే నిలిచిపోయింది. 2014 మార్చి నుంచి అత్యధిక టీ20 పరుగుల జాబితాలో గేల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.ప్రస్తుతానికి పోలార్డ్ ఈ రికార్డును తన పేరిట బదలాయించుకున్నా, ఇది అతని వద్దే ఎక్కువ కాలం నిలబడేలా లేదు. ఎందుకంటే అతడి వెనువెంటే ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న అలెక్స్ హేల్స్ (14,449), జోస్ బట్లర్ (14,371), డేవిడ్ వార్నర్ (14,284), విరాట్ కోహ్లి (14,218) ఉన్నారు. వీరిలో ముఖ్యంగా విరాట్ కోహ్లికి పోలార్డ్ రికార్డు బద్దలు కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరో ఐపీఎల్ సీజన్ ఆడినా కోహ్లి ఖాతాలో ఈ రికార్డు చేరుతుంది.మరోవైపు పోలార్డ్ పేరిట టీ20ల్లో అత్యధిక మ్యాచ్లు (736) ఆడిన రికార్డు కూడా ఉంది. ప్రస్తుతం పోలార్డ్ ఆటగాడిగా కొనసాగుతూనే కోచ్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇటీవల ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్గా పనిచేసిన అతడు, ఈ ఏడాది పురుషుల హండ్రెడ్ టోర్నీలో MI London జట్టుకు ప్రధాన కోచ్గా వ్యవహరించనున్నాడు.కాగా, పోలార్డ్ ఈ చారిత్రక ఘనత సాధించిన మ్యాచ్లో అతని జట్టుకు విజయం దక్కలేదు. అతడు శతకం సాధించినా ముంబై ఇండియన్స్ న్యూయార్క్ 30 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఫ్రీడం జట్టు.. మిచెల్ ఓవెన్ (155) భారీ శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టానికి 245 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో న్యూయార్క్ సైతం పోరాడినా సానుకూల ఫలితం రాలేదు. పోలార్డ్ తన టీ20 కెరీర్లో రెండో శతకం బాది న్యూయార్క్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయి 215 పరుగులకే పరిమితమైంది. -
మాజీ ఛాంపియన్కు ముచ్చెమటలు పట్టించిన కేప్ వెర్డే
ఫిఫా వరల్డ్కప్-2026లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న జట్లలో కేప్ వెర్డే ఒకటి. టోర్నీ ప్రారంభం నుంచి అంచనాలకు మించి రాణిస్తున్న ఈ ఆఫ్రికన్ జట్టు మరోసారి సత్తా చాటింది. మాజీ ఛాంపియన్ ఉరుగ్వేతో జరిగిన కీలక పోరును 2-2తో డ్రా చేసుకొని సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో తమ తొలి వరల్డ్కప్ గోల్స్ను కూడా సాధించింది. ఈ ఫలితంతో నాకౌట్ ఆశలను మరింత బలోపేతం చేసుకుంది.ఈ మ్యాచ్ ఆరంభం నుంచి ఉరుగ్వే ఆధిపత్యం కనబర్చినా, బంతిపై ఎక్కువ నియంత్రణ కలిగింది మాత్రం కేప్వెర్డేనే. స్పెయిన్పై తొలి మ్యాచ్ తరహాలోనే కేప్వెర్డే ఈ మ్యాచ్లోనూ రక్షణాత్మక వ్యూహంతో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టింది. తొలి 20 నిమిషాల పాటు రక్షణకే ప్రాధాన్యం ఇచ్చిన ఈ జట్టు, 21వ నిమిషంలో వచ్చిన ఫ్రీ కిక్ను అద్భుతంగా సద్వినియోగం చేసుకుంది.కెవిన్ పినా దూరం నుంచి కొట్టిన శక్తివంతమైన షాట్ నేరుగా గోల్పోస్ట్లోకి దూసుకెళ్లింది. దీంతో 1-0 ఆధిక్యంలోకి వెళ్లడమే కాకుండా, తమ తొలి వరల్డ్కప్ గోల్ను కూడా నమోదు చేసింది.ఆ తర్వాత మళ్లీ కేప్ వెర్డే రక్షణపై దృష్టి పెట్టింది. కానీ తొలి అర్ధభాగం చివర్లో ఉరుగ్వే తన అనుభవాన్ని చూపించింది. ముందుగా మాక్సీ అరౌజో గోల్ సాధించాడు. గోల్ ముందు జరిగిన గందరగోళాన్ని సద్వినియోగం చేసుకున్న అతడు, స్కోరును 1-1గా మార్చాడు. ఆ ఉత్సాహంలోనే దాడులు కొనసాగించిన ఉరుగ్వేకు మరికొద్ది సేపటికే మరో గోల్ లభించింది. బాక్స్లోకి వచ్చిన బంతిని అగస్టిన్ కానోబ్బియో గోల్గా మలచడంతో ఉరుగ్వే 2-1 ఆధిక్యంతో విరామానికి వెళ్లింది.రెండో అర్ధభాగం ప్రారంభంలో కేప్వెర్డే ఆటలో కొంత నిదానం కనిపించింది. గోల్కీపర్ వోజిన్హా కొట్టిన బంతులు సరిగా సహచరులకు చేరకపోవడంతో ఉరుగ్వేకు మరిన్ని అవకాశాలు లభించాయి. ఈ పరిస్థితిని గమనించిన కోచ్ నునో డా కోస్టా, హెలియో వరెలాలను మైదానంలోకి దింపాడు. ఈ మార్పులు కేప్ వెర్డే ఆటలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి.ఈ దూకుడే 61వ నిమిషంలో ఫలితాన్నిచ్చింది. ఉరుగ్వే డిఫెండర్ మాథియస్ ఒలివేరా చేసిన పొరపాటు కారణంగా బంతి హెలియో వరెలా వద్దకు చేరింది. పరిస్థితిని అంచనా వేయకుండా ముందుకు వచ్చిన గోల్కీపర్ ముస్లేరాను చాకచక్యంగా తప్పించుకున్న వరెలా ఖాళీ గోల్లో బంతిని పంపించాడు. దీంతో స్కోరు 2-2గా మారింది.ఆ తర్వాత మ్యాచ్ మరింత ఉత్కంఠభరితంగా సాగింది. కేప్వెర్డేకు 3-2 ఆధిక్యం సాధించే అవకాశం వచ్చినా మోంటెయిరో కొట్టిన షాట్ తృటిలో గోల్ పోస్ట్ను మిస్ అయ్యింది. మరోవైపు ఉరుగ్వేకు కూడా గోల్ వచ్చినట్లే వచ్చి చేజారింది. వీడియో అసిస్టెంట్ రిఫరీ (వీఏఆర్) జోక్యంతో వారు చేసిన ఓ గోల్ రద్దైంది. చివరి పది నిమిషాల్లో ఇరు జట్లు గెలుపు కోసం తీవ్రంగా పోరాడాయి.మ్యాచ్ చివరి దశలో వోజిన్హా చేసిన చిన్న పొరపాటు ఉరుగ్వేకు అవకాశం ఇచ్చినా, కేప్వెర్డే రక్షణ అప్రమత్తంగా వ్యవహరించి ప్రమాదాన్ని తప్పించింది. అదనపు సమయంలో కూడా రెండు జట్లు అవకాశాలు సృష్టించినప్పటికీ గోల్గా మలచలేకపోయాయి. చివరకు మ్యాచ్ 2-2తోడ్రాగా ముగిసింది. -
హడలెత్తించిన హెన్రీ
లండన్: ఇంగ్లండ్తో తొలి టెస్టులో ఘోర పరాజయం ఎదుర్కొన్న న్యూజిలాండ్... రెండో టెస్టులో ఘనవిజయంతో సిరీస్ను 1–1తో సమం చేసింది. ఆదివారం ముగిసిన రెండో టెస్టులో న్యూజిలాండ్ 253 పరుగుల తేడాతో నెగ్గింది. 463 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్నైట్ స్కోరు 182/5తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 58.1 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ (145 బంతుల్లో 77; 8 ఫోర్లు) పోరాడాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మ్యాట్ హెన్రీ 29 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 391 పరుగులు చేయగా... ఇంగ్లండ్ 291 పరుగులకు పరిమితమైంది. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో 362 పరుగులు చేసి ప్రత్యర్థి ముందు కొండంత లక్ష్యాన్ని నిలిపింది. -
బుమ్రా పునరాగమనం
న్యూఢిల్లీ: పనిభారం నేపథ్యంలో గత కొంతకాలంగా వన్డే క్రికెట్కు దూరంగా ఉంటున్న భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు ఎంపికయ్యాడు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ తర్వాత ఈ ఫార్మాట్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని అతడిని... వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో తిరిగి జట్టుకు ఎంపిక చేశారు. ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా గాయపడి అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్కు అందుబాటులో లేకపోయిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని కూడా ఇంగ్లండ్ సిరీస్కు ఎంపిక చేశారు. అయితే దానికి ముందు అతడు ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిన అవసరముంది. వచ్చే నెలలో ఇంగ్లండ్తో టీమిండియా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది. దాని కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆదివారం శుబ్మన్ గిల్ సారథ్యంలో... 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. అఫ్గాన్తో చివరి వన్డేలో సెంచరీతో చెలరేగినప్పటికీ యశస్వి జైస్వాల్కు అవకాశం దక్కలేదు. గాయం నేపథ్యంలో హార్దిక్ పాండ్యా పేరును పరిశీలించలేదు. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు జూలై 14న తొలి వన్డే (ఎడ్జ్బాస్టన్), 16న రెండో వన్డే (సోఫీ గార్డెన్స్), 19న మూడో వన్డే (లార్డ్స్) ఆడనుంది. భారత వన్డే జట్టు: గిల్ (కెప్టెన్), రోహిత్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, ఇషాన్ కిషన్, సుందర్, అక్షర్, నితీశ్ కుమార్ రెడ్డి, కుల్దీప్, బుమ్రా, ప్రసిధ్, హర్షిత్ రాణా, అర్‡్షదీప్, గుర్నూర్ బ్రార్. -
నెదర్లాండ్స్కు భారత్ షాక్
రోటర్డామ్: ప్రొ లీగ్ హాకీ టోర్నిలో భారత పురుషుల జట్టు మరో సంచలనం నమోదు చేసింది. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్లో భారత్ 3–2తో ప్రపంచ రెండో ర్యాంక్ నెదర్లాండ్స్ జట్టును ఓడించింది. మూడేళ్ల తర్వాత నెదర్లాండ్స్పై భారత్ నెగ్గడం విశేషం. భారత్ తరఫున జుగ్రాజ్ సింగ్ (18వ నిమిషంలో), అభిషేక్ (27వ నిమిషంలో), రాజిందర్ సింగ్ (56వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. నెదర్లాండ్స్ జట్టుకు హెజ్డెన్ (19వ నిమిషంలో), బిజెన్ (59వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. ఈ లీగ్లో 12 మ్యాచ్లు పూర్తి చేసుకున్న భారత జట్టు 10 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. భారత్ తమ తదుపరి మ్యాచ్లో మంగళవారం లండన్ వేదికగా పాకిస్తాన్ జట్టుతో ఆడుతుంది. -
అజేయంగా నిలిచి... టైటిల్ గెలిచి...
ఆక్లాండ్: లీగ్ దశలో కనబరిచిన జోరును నాకౌట్ మ్యాచ్ల్లోనూ కొనసాగించిన భారత మహిళల హాకీ జట్టు నేషన్స్ కప్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో సలీమా టెటె సారథ్యంలోని భారత జట్టు 2–0 గోల్స్ తేడాతో న్యూజిలాండ్ను ఓడించింది. తద్వారా వచ్చే ప్రొ లీగ్ సీజన్లో ఆడే అవకాశాన్ని దక్కించుకుంది. తుది పోరులో భారత్ తరఫున నవ్నీత్ కౌర్ (4వ నిమిషంలో), సునెలితా టొప్పో (15వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. లీగ్ దశలో భారత జట్టు వరుసగా అమెరికా (3–2తో), జపాన్ (2–1తో), ఉరుగ్వే (3–2తో) జట్లపై గెలిచి... సెమీఫైనల్లో 6–0తో చిలీని ఓడించింది. నేషన్స్ కప్ టైటిల్ నెగ్గడం భారత్కిది రెండోసారి. 2022లోనూ టీమిండియా విజేతగా నిలిచింది. చాంపియన్ భారత జట్టు ప్రదర్శనకు హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. జట్టులోని ప్రతి ప్లేయర్కు రూ. 3 లక్షల చొప్పున... శిక్షణ సిబ్బందికి రూ. 1 లక్ష 50 వేల చొప్పున నగదు పురస్కారం అందజేయనుంది. -
TG20 League: అన్విత ఖమ్మం ఏసెస్ శుభారంభం
తెలంగాణ టీ20 లీగ్ 2026లో అన్విత ఖమ్మం ఏసెస్ శుభారంభం చేసింది. ఉప్పల్ మైదానం వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో పాలమూరు స్ట్రైకర్స్పై 20పరుగుల తేడాతో ఖమ్మం ఘన విజయం సాధించింది. 238 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాలమూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. పాలమూరు బ్యాటర్లలో ఓపెనర్ విగ్నేష్ రెడ్డి(31 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్లతో 86) టాప్ స్కోరర్గా నిలవగా.. చైతన్య రెడ్డి(35) పర్వాలేదనిపించాడు. మిగితా బ్యాటర్లంతా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ఖమ్మం బౌలర్లలో వేద్రెడ్డి రెండు, మిలింద్, వెంకట్, విద్యానంద రెడ్డి తలా వికెట్ సాధించారు.కాగా తొలుత బ్యాటింగ్ చేసిన ఖమ్మం జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 237 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఏసెస్ బ్యాటర్లలో ఓపెనర్ వాఫీ ఖచ్చి(60), కృష్ణ రెడ్డి(52), హిమతేజ(59) హాఫ్ సెంచరీలతో సత్తాచాటగా.. కెప్టెన్ మిలంద్(18, ప్రతీక్ రెడ్డి(25) రాణించారు. పాలమూర్ బౌలర్లలో కిరణ్ రెండు, రోహిత్ రాయుడు, అఫ్రిది అహ్మద్ తలా వికెట్ పడగొట్టారు.Juggling act but safe hands! 😮💨Inches away from the boundary rope, Vidyananda Reddy Ellala recovers well to dismiss the opposition skipper.#PSvANK #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/G64zKnQpUw— tg20official (@tg20official) June 21, 2026 -
కొంపముంచిన చెత్త ఫీల్డింగ్.. సౌతాఫ్రికా చేతిలో భారత్ ఓటమి
మహిళల టీ20 ప్రపంచకప్-2026లో భారత జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. మాంచెస్టర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. భారత్ నిర్ధేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని ప్రోటీస్ కేవలం 4 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో చేధించింది. దక్షిణాఫ్రికా విజయంలో ఆల్రౌండర్ మరిజాన్ కాప్ది కీలక పాత్ర. కాప్ (45 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 81) అజేయంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేసింది. ఆమెతో పాటు ఓపెనర్ బ్రిట్స్(40) రాణించింది. అయితే భారత్ ఓటమికి ప్రధాన కారణం ఫీల్డింగ్ వైఫలమ్యనే చెప్పాలి. మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడిన కాప్.. రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుంది. రెండు సార్లు కూడా ఆమె ఇచ్చిన క్యాచ్లను భారత సబ్స్ట్యూట్ ఫీల్డర్ రాధా యాదవ్ జారవిడిచింది. ఆ క్యాచ్లు అందుకుని ఉండింటే ఫలితం మరో విధంగా ఉండేది. భారత బౌలర్లలో శ్రీచరణి మూడు వికెట్లు పడగొట్టింది.ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ(15 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్తో 31) టాప్ స్కోరర్గా నిలవగా.. దీప్తి శర్మ(29), హర్మన్ ప్రీత్ కౌర్(24), మంధాన(17) పర్వాలేదనిపించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కాప్, ఇస్మాయల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. మల్బా, అయబోంగ ఖకా, నడైన్ డిక్లార్క్ తలా వికెట్ సాధించారు. భారత్ తమ తదుపరి మ్యాచ్లో జూన్ 25న బంగ్లాదేశ్తో తలపడనుంది. -
చరిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. పురుషుల, మహిళల క్రికెట్ చరిత్రలోనే 200 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడిన మొట్టమొదటి ప్లేయర్గా హర్మన్ప్రీత్ రికార్డులకెక్కింది.ఉమెన్స్ టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా సౌతాఫ్రికాతో మ్యాచ్లో బరిలోకి దిగడంతో హర్మన్ ఈ ఘనతను సొంతం చేసుకుంది. 2009లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన తొలి మహిళల టీ20 ప్రపంచకప్తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హర్మన్.. తన 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఇప్పటివరకు రెండు వందల టీ20 మ్యాచ్లలో భారత్కు ప్రాతినిథ్యం వహించింది. హర్మన్కు ఇది 10వ టీ20 వరల్డ్కప్ కావడం గమనార్హం.కాగా మహిళల విభాగంలో అత్యధిక టీ20 మ్యాచ్లు ఆడిన జాబితాలో హర్మన్(200) అగ్రస్ధానంలో ఉండగా.. రెండో స్ధానంలో న్యూజిలాండ్ లెజెండరీ ప్లేయర్ సూజీ బేట్స్ (184 మ్యాచ్లు) రెండో స్ధానంలో కొనసాగుతోంది. పురుషుల క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ఐర్లాండ్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్ (163) ఉన్నాడు.అత్యధిక టీ20లు ఆడిన టాప్ ప్లేయర్స్పురుషుల విభాగంలో: పాల్ స్టిర్లింగ్ (ఐర్లాండ్): 163 మ్యాచ్లు (అగ్రస్థానం) రోహిత్ శర్మ (భారత్): 159 మ్యాచ్లు (రెండో స్థానం) మహిళల విభాగంలో: హర్మన్ప్రీత్ కౌర్ (భారత్): 200 మ్యాచ్లు సూజీ బేట్స్ (న్యూజిలాండ్): 184 మ్యాచ్లు ఎలిస్ పెర్రీ (ఆస్ట్రేలియా): 177 మ్యాచ్లుకాగా తన కెరీర్లో హర్మన్ ఇప్పటివరకు ఆడిన 200 మ్యాచ్లలో 29.83 సగటుతో 4147 పరుగులు చేసింది. ఇందులో ఒక సెంచరీతో పాటు 17 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టీ20ల్లో ఆమె అత్యధిక వ్యక్తిగత స్కోరు 103 పరుగులుగా ఉన్నాయి. బౌలింగ్లో ఆమె 32 వికెట్లు పడగొట్టింది. -
ఒలింపిక్సే లక్ష్యంగా తెలంగాణలో 'స్పోర్ట్స్ యూనివర్సిటీ'
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో సరైన అవకాశాలు లేక మరుగున పడిపోతున్న ప్రతిభాపాటవాలను వెలికితీసి, వారికి సరైన శిక్షణనిచ్చి ప్రపంచానికి పరిచయం చేయడమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. భవిష్యత్తులో ఒలింపిక్స్ బరిలో తెలంగాణ క్రీడాకారులు పతకాలు సాధించేలా, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సరికొత్త 'స్పోర్ట్స్ యూనివర్సిటీ'ని త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నాం" అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.ఉప్పల్ స్టేడియం వేదికగా అత్యంత వైభవంగా ప్రారంభమైన 'టీజీ 20 క్రికెట్ లీగ్' మెగా టోర్నమెంట్కు డిప్యూటీ సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి, క్రీడాకారుల ఉజ్వల భవిష్యత్తుకు ఈ లీగ్ ఒక బలమైన పునాది కాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు."గతంలో క్రికెట్ అంటే కేవలం నగరాలకే పరిమితమనే భావన ఉండేది. కానీ, ఆ పరిస్థితులను మారుస్తూ మొదటిసారిగా మా ప్రభుత్వం ప్రతి జిల్లా నుంచి క్రీడాకారుల నైపుణ్యాన్ని గుర్తించింది. జిల్లాల వారీగా జట్లను (టీమ్లను) ఎంపిక చేసి గ్రామీణ యువతకు ఈ మెగా వేదికను కల్పించాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం క్రీడలను పెద్దపీట వేస్తూ, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కట్టుబడి ఉంది" అని భట్టి విక్రమార్క తెలిపారు.గతంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఫుట్బాల్ స్టార్ 'మెస్సి' ఆడిన ఈ ఉప్పల్ స్టేడియం సాక్షిగా.. హైదరాబాద్ నగరంలో ప్రపంచ స్థాయి వసతులు, అన్ని హంగులతో కూడిన స్పోర్ట్స్ యూనివర్సిటీ రాబోతోందని డిప్యూటీ సీఎం వెల్లడించారు. ఒలింపిక్స్ స్థాయి శిక్షణ ఇచ్చేలా తెలంగాణలో ఒక బలమైన క్రీడా వ్యవస్థను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.మొత్తం 21 రోజుల పాటు సాగనున్న ఈ 'టీజీ 20 క్రికెట్' హంగామా.. రాష్ట్రంలోని క్రీడాభిమానులకు ఒక పెద్ద పండుగ వాతావరణాన్ని తీసుకురానుంది. ఈ టోర్నీ విజయవంతం కావడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. -
రాణించిన భారత బ్యాటర్లు.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
మహిళల టీ20 ప్రపంచకప్-2026లో మాంచెస్టర్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న గ్రూపు-ఎ మ్యాచ్లో భారత బ్యాటర్లు రాణించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ(15 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్తో 31) టాప్ స్కోరర్గా నిలవగా.. దీప్తి శర్మ(29), హర్మన్ ప్రీత్ కౌర్(24), మంధాన(17) పర్వాలేదనిపించారు. భారత్కు మంచి ఆరంభం లభించినప్పటికి మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచలేకపోయింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో కాప్, ఇస్మాయల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. మల్బా, అయబోంగ ఖకా, నడైన్ డిక్లార్క్ తలా వికెట్ సాధించారు. -
అట్టహాసంగా టీజీ20 లీగ్ ఆరంభ వేడుకలు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ టీ20 లీగ్ (TG20) తొలి సీజన్ అట్టహాసంగా మొదలైంది. ఈ టోర్నీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు టీజీ టీ20 లీగ్ మంచి అవకాశమని ఈ సందర్భంగా విక్రమార్క పేర్కొన్నారు.ఆయనతో పాటు టీజీ20 బ్రాండ్ అంబాసిడర్ విజయ్ దేవరకొండ, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు. అదేవిధంగా సంగీత దర్శకుడు తమన్ తన మ్యూజికల్ పెర్ఫార్మెన్స్తో స్టేడియంలో జోష్ నింపారు. ఉర్రూతలూగించే పాటలతో సాగిన డిజిటల్ లేజర్ షో,. సాంస్కృతిక ప్రదర్శనలు స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులను కట్టిపడేశాయి.No warm-up needed.Thaman set the TG20 stage on fire from the very first beat. 🔥⚡#OpeningCeremony #SreenidhiUniversity #ManaCricketShuru pic.twitter.com/hh8HXB3rl8— tg20official (@tg20official) June 21, 2026 -
పాలమూరు స్ట్రైకర్స్పై ఖమ్మం ఘన విజయం
Palamuru Strikers vs Anvita Khammam Aces Live Updates:. తెలంగాణ టీ20 లీగ్ 2026లో అన్విత ఖమ్మం ఏసెస్ శుభారంభం చేసింది. ఉప్పల్ మైదానం వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో పాలమూరు స్ట్రైకర్స్పై 20పరుగుల తేడాతో ఖమ్మం ఘన విజయం సాధించింది. 238 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాలమూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. పాలమూరు బ్యాటర్లలో ఓపెనర్ విగ్నేష్ రెడ్డి(31 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్లతో 86) టాప్ స్కోరర్గా నిలవగా.. చైతన్య రెడ్డి(35) పర్వాలేదనిపించాడు. మిగితా బ్యాటర్లంతా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ఖమ్మం బౌలర్లలో వేద్రెడ్డి రెండు, మిలింద్, వెంకట్, విద్యానంద రెడ్డి తలా వికెట్ సాధించారు.పాలమూరు ఐదో వికెట్ డౌన్పాలమూరు ఐదో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన ప్రతీక్ పవార్.. మిలింద్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. 17 ఓవర్లకు పాలమూరు స్కోర్: 190/5. పాలమూరు విజయానికి 18 బంతుల్లో 48 పరుగులు కావాలి.పాలమూరు మూడో వికెట్ డౌన్35 పరుగులు చేసిన చైతన్య రెడ్డి.. రనౌట్ రూపంలో పెవిలియన్కు చేరాడు. 14 ఓవర్లకు పాలమూర్ స్కోర్: 167/3పాలమూరు రెండో వికెట్ డౌన్పాలమూరు రెండో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన ప్రజ్ఞయ్ రెడ్డి.. వేద్రెడ్డి బౌలింగ్లో ఔటయ్యాడు.పాలమూరు తొలి వికెట్ డౌన్పాలమూరు తొలి వికెట్ కోల్పోయింది. 86 పరుగులు చేసిన విగ్నేష్ రెడ్డి.. వేద్రెడ్డి బౌలింగ్లో ఔటయ్యాడు. 10 ఓవర్లకు పాలమూరు స్కోర్: 133/1దూకుడుగా ఆడుతున్న పాలమూరు ఓపెనర్లు238 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాలమూరు స్ట్రైకర్స్ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. 4 ఓవర్లు ముగిసే సరికి పాలమూరు వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. క్రీజులో అనుముల విగ్నేష్ రెడ్డి(45), చైతన్య రెడ్డి(7) ఉన్నారు.పాలమూరు టార్గెట్ ఎంతంటే?పాలమూరు స్ట్రైకర్స్తో జరుగుతున్న తొలి మ్యాచ్లో అన్విత ఖమ్మం ఏసెస్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఖమ్మం జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 237 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఏసెస్ బ్యాటర్లలో ఓపెనర్ వాఫీ ఖచ్చి(60), కృష్ణ రెడ్డి(52), హిమతేజ(59) హాఫ్ సెంచరీలతో సత్తాచాటగా.. కెప్టెన్ మిలంద్(18, ప్రతీక్ రెడ్డి(25) రాణించారు. పాలమూర్ బౌలర్లలో కిరణ్ రెండు, రోహిత్ రాయుడు, అఫ్రిది అహ్మద్ తలా వికెట్ పడగొట్టారు.GSK aale aale, nahi khelte hai haule haule! 🥵Three 6️⃣s in an over that gave the #AnvitaKhammamAces the very start they needed. 🔥#PSvANK #SreenidhiUniversityTG20 #ManaCricketShuru pic.twitter.com/67iEuethQs— tg20official (@tg20official) June 21, 2026మూడో వికెట్ డౌన్ఖమ్మం జట్టు మూడో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన జైశ్వాల్.. అఫ్రిది అహ్మద్ బౌలింగ్లో ఔటయ్యాడు. 14 ఓవర్లకు స్కోర్: 150/3ఖమ్మం రెండో వికెట్ డౌన్ఖమ్మం ఏసెస్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. 52 పరుగులు చేసిన కృష్ణ రెడ్డి.. రోహిత్ రాయుడు బౌలింగ్లో ఔటయ్యాడు. 12 ఓవర్లకు ఏసెస్ స్కోర్: 141/2ఖమ్మం ఏసెస్ తొలి వికెట్ డౌన్అన్విత ఖమ్మం ఏసెస్ తొలి వికెట్ కోల్పోయింది. 60 పరుగులు చేసిన వాఫీ కచ్చీ.. నిపుణ్ రెడ్డి శవ్వా బౌలింగ్ ఔటయ్యాడు. 10 ఓవర్లకు ఏసెస్ స్కోర్: 113/1దుమ్ములేపుతున్న ఖమ్మం ఓపెనర్లుఅన్విత ఖమ్మం ఏసెస్ ఓపెనర్లు కృష్ణ రెడ్డి(18 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్లతో 30), వాఫీ కచ్చీ(24 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్తో 52) దుమ్ములేపుతున్నారు. 7 ఓవర్లకు ఖమ్మం ఏసెస్ స్కోర్: 86/0తెలంగాణ టీ20 లీగ్ తొలి సీజన్కు తెరలేచింది. ఈ టోర్నీ మొదటి మ్యాచ్లో ఉప్పల్ మైదానం వేదికగా పాలమూరు స్ట్రైకర్స్, అన్విత ఖమ్మం ఏసెస్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాలమూరు తొలుత బౌలింగ్ ఎంచుకుంది.తుది జట్లుఖమ్మం ఏసెస్కృష్ణ రెడ్డి, వాఫీ కచ్చీ, మిలింద్(కెప్టెన్), జైశ్వాల్, హిమతేజ, వెంకట్ ధాత్రక్, సిద్దు నాయక్,విశాల్ యాదవ్, వేద్ రెడ్డి అమిష్టాపురం, విద్యా నంద రెడ్డి, అనంత్ ప్రతీక్ రెడ్డిపాలమూరు స్ట్రైకర్స్అన్ముల విఘ్నేష్ రెడ్డి, ప్రజ్ఞయ్ రెడ్డి(కెప్టెన్), పృథ్వీ రెడ్డి, రోహిత్ రాయుడు, ప్రతీక్ పవార్, మహమ్మద్ అఫ్రీది అహ్మద్, నిపుణ్ రెడ్డి శవ్వా, బుడిది రతన్ తేజ, పి.ఎస్. చైతన్య రెడ్డి, జంబోజు పార్థిపన్, రవి కిరణ్ మజేటి -
సౌతాఫ్రికాతో మ్యాచ్.. బ్యాటింగ్ భారత్దే! యువ ప్లేయర్ డెబ్యూ
మహిళల టీ20 ప్రపంచకప్-2026లో మరో హైవోల్టేజ్ మ్యాచ్కు తెరలేచింది. ఈ టోర్నీ గ్రూపు-ఎలో భాగంగా మాంచెస్టర్ వేదికగా భారత్, సౌతాఫ్రికా జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా 24 ఏళ్ల యువ స్పిన్నర్ ప్రేమ రావత్ భారత్ తరపున అరంగేట్రం చేసింది.గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగిన శ్రేయాంక పాటిల్ స్ధానంలో ప్రేమ రావత్ జట్టులోకి వచ్చింది. అదేవిధంగా క్రాంతి గౌడ్ స్ధానంలో హైదరాబాదీ పేసర్ అరుంధతి రెడ్డికి తుది జట్టులో చోటు దక్కింది.కాగా భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్కు ఇది 200వ టీ20 మ్యాచ్ కావడం విశేషం. మహిళల క్రికెట్లో ఈ ఫీట్ సాధించిన తొలి ప్లేయర్గా హర్మన్ నిలిచింది. మరోవైపు సౌతాఫ్రికా కూడా రెండు మార్పులతో బరిలోకి దిగింది.తుది జట్లుదక్షిణాఫ్రికా: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్, అన్నరీ డెర్క్సెన్, డేన్ వాన్ నీకెర్క్, మారిజాన్ కాప్, నాడిన్ డి క్లెర్క్, క్లో ట్రయాన్(వికెట్ కీపర్), సినాలో జాఫ్తా, షబ్నిమ్ ఇస్మాయిల్, అయాబొంగా ఖాకా, నాన్కులులేకో మలాబాభారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యాస్తిక భాటియా, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, ప్రేమ రావత్, అరుంధతి రెడ్డి, శ్రీ చరణి, నందిని శర్మ -
వైభవ్ వీరవిహారం.. ట్రై సిరీస్ విజేతగా భారత్
శ్రీలంక ఆతిథ్యమిచ్చిన అనాధికారిక ముక్కోణపు వన్డే సిరీస్ విజేతగా భారత్-ఎ జట్టు నిలిచింది. ఆదివారం దంబుల్లా వేదికగా జరిగిన ఫైనల్లో శ్రీలంక-ఎ జట్టును 66 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. ఈ తుది పోరులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన చేసిన ఇండియా 'ఎ' జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోరు సాధించింది.భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి విధ్వంసం సృష్టించాడు. ఈ బాస్ బేబీ కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. దీంతో లిస్ట్-ఎ క్రికెట్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన ప్లేయర్గా వైభవ్ నిలిచాడు. ఓవరాల్గా 29 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సూర్యవంశీ.. 10 ఫోర్లు, 8 సిక్స్లతో 94 పరుగులు చేశాడు. అతడితో పాటు తిలక్ వర్మ(67), రుతురాజ్ గైక్వాడ్(40), అనుకుల్ రాయ్(15 బంతుల్లో 39), ప్రియాన్ష్ ఆర్య(39) రాణించారు. లంక బౌలర్లలో వనజా సహాన్, కుగదాస్ మతులన్, రవిందు ఫెర్నాండో తలా రెండు వికెట్లు పడగొట్టారు.అనంతరం 378 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ‘ఎ’ జట్టును భారత పేసర్ యశ్ ఠాకూర్ ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. అయితే మిడిల్ ఆర్డర్లో సదీర సమరవిక్రమ (52), సహన్ అరచ్చిగే(38) నిలకడగా ఆడడంతో లంక తిరిగి గేమ్లోకి వచ్చింది. రన్ రేట్ ఒత్తిడి పెరగడంతో శ్రీలంక వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. ఆఖరిలో వనుజ సహన్ (62) దూకుడుగా ఆడినప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు. దీంతో 47.1 ఓవర్లలో 311 పరుగులకు శ్రీలంక ఆలౌట్ అయింది. రత బౌలర్లలో యశ్ ఠాకూర్, విప్రాజ్ నిగమ్ తలో మూడు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు అనుకుల్ రాయ్ రెండు, తిలక్ వర్మ, ఆశోక్ శర్మ చెరో వికెట్ సాధించారు.చదవండి: IND vs IRE: టీమిండియాకు భారీ షాక్ -
కుప్పకూలిన ఇంగ్లండ్.. 253 పరుగుల తేడాతో కివీస్ గెలుపు
లండన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్లో ఇంగ్లండ్ను 253 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చిత్తు చేసింది. దీంతో 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను కివీస్ 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 391 పరుగుల మెరుగైన స్కోర్ సాధించింది. గ్లెన్ ఫిలిప్స్ (100) అద్భుత సెంచరీతో బ్లాక్క్యాప్స్ను ఆదుకున్నాడు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లీష్ జట్టు.. కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీ (5/80) ధాటికి 291 పరుగులకే ఆలౌటైంది. దీంతో న్యూజిలాండ్కు 100 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. ఆతిథ్య జట్టు బ్యాటర్లలో ఎమిలియో గే (53), మాథ్యూ ఫిషర్ (50) మాత్రమే రాణించారు. నికోల్స్ సెంచరీకాగా పర్యాటక కివీస్ రెండో ఇన్నింగ్స్లోనూ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచింది. సీనియర్ బ్యాటర్ హెన్రీ నికోల్స్(121) సెంచరీతో సత్తాచాటగా.. రచిన్ రవీంద్ర (76), మిచెల్ (68) ఆర్ధ శతకాలతో చెలరేగారు. ఫలితంగా న్యూజిలాండ్ 362 పరుగుల భారీ స్కోర్ సాధించి ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్లో లభించిన ఆధిక్యాన్ని జోడించి ఇంగ్లండ్ ముందు 463 పరుగుల భారీ లక్ష్యాన్ని కివీస్ ఉంచింది.ఈ భారీ టార్గెట్ను చేధించే క్రమంలో 209 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌటైంది. మాట్ హెన్రీ 6 వికెట్ల పడగొట్టి ఇంగ్లీష్ జట్టు పతనాన్ని శాసించాడు. అతడితో జేమిసన్ మూడు వికెట్లు సాధించాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్ (77), హ్యారీ బ్రూక్ (58) మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. మొత్తంగా 11 వికెట్లు పడగొట్టి కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన మాట్ హెన్రీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక సిరీస్ డిసైడర్ మూడో టెస్ట్ మ్యాచ్ జూన్ 25 నుంచి ట్రెంట్ బ్రిడ్జ్ మైదానం వేదికగా ప్రారంభం కానుంది.చదవండి: IND vs ENG: భారత జట్టు ప్రకటన.. సెంచరీ హీరోకు నో ఛాన్స్ -
టీమిండియాకు భారీ షాక్
అఫ్గానిస్తాన్తో సిరీస్ క్లీన్ స్వీప్ చేసి మంచి జోష్లో ఉన్న టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా ఐర్లాండ్తో జరగనున్న టీ20 సిరీస్కు దూరమయ్యాడు. ఐపీఎల్-2026లో ఎడమ కాలి గాయం బారిన పడిన వరుణ్ ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు.అతడు ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (BCCI COE)లో కోలుకుంటున్నాడు. అతడు పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం పట్టనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ధ్రువీకరించారు. అయితే వరుణ్ చక్రవర్తి రీప్లేస్మెంట్ను ఇంకా భారత క్రికెట్ బోర్డు ప్రకటించలేదు. ప్రస్తుత పరిస్థితుల బట్టి చక్రవర్తి ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు కూడా దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వరుణ్ స్ధానంలో హర్ష్ దూబే లేదా కుల్దీప్ యాదవ్ను ఎంపిక చేసే అవకాశముంది. దూబే అఫ్గాన్తో వన్డే సిరీస్లో ఆకట్టుకున్నాడు. కాగా భారత్, ఐర్లాండ్ మధ్య టీ20 సిరీస్ జూన్ 26 నుంచి జరగనుంది. మరోవైపు ఇంగ్లండ్తో వన్డేలకు కూడా భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అఫ్గాన్తో వన్డే సిరీస్కు దూరంగా ఉన్న స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రాలు తిరిగొచ్చారు. కానీ యశస్వి జైశ్వాల్, సిరాజ్కు మాత్రం జట్టులో చోటు దక్కలేదు.ఐర్లాండ్తో టీ20 సిరీస్కు భారత జట్టు (అప్డేటడ్):శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్-కెప్టెన్), నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ధ్ కృష్ణ.ఇంగ్లండ్తో వన్డేలకు భారత జట్టు:శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్-కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, గూరనూర్ బ్రార్. -
33 మ్యాచ్ల్లో వంద గోల్స్.. ఆల్టైమ్ రికార్డు ఎంతో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఫిఫా క్రేజ్ నడుస్తోంది. ఏ దేశం చూసినా ఫుట్బాల్ మత్తులోనే తేలియాడుతోంది. గోల్స్ వర్షంలో అభిమానులు తడిసి ముద్దవుతున్న వేళ ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీ కొత్త చరిత్ర సృష్టించింది. ఫిఫా చరిత్రలో 68 ఏళ్ల తర్వాత అత్యంత వేగంగా 100 గోల్స్ నమోదైన ఎడిషన్గా 2026 ఫిఫా టోర్నీ నిలిచింది. 1958 ఫిఫా ప్రపంచకప్లో 32 లేదా 33 మ్యాచ్ల్లో వంద గోల్స్ నమోదైనట్లు రికార్డుల్లో ఉంది.ఈసారి ఫిఫా ప్రపంచకప్లో 33 మ్యాచ్ల్లోనే 100 గోల్స్ మైలురాయిని చేరుకోవడం విశేషం. కాగా ప్రపంచకప్లో ఈసారి తొలి గోల్ను సౌతాఫ్రికాతో మ్యాచ్లో మెక్సికో ఆటగాడు జూలియన్ క్వినోనెస్ నమోదు చేయగా.. వందో గోల్ను నెదర్లాండ్స్ స్టార్ ఆటగాడు కోడీ గాకో కొట్టాడు. స్వీడన్తో మ్యాచ్లో కోడీ గోల్ కొట్టడం ద్వారా టోర్నీలో వందో గోల్ వచ్చింది. ఈ మ్యాచ్లో నెదర్లాండ్స్ 5-1 తేడాతో స్వీడన్ను చిత్తు చేసింది. కాగా ఫిఫా చరిత్రలో 33 మ్యాచ్ల్లో వంద గోల్స్ చేరుకోవడమనేది సరికొత్త రికార్డుగా పేర్కొనవచ్చు. గతంలో 1982, 2014 ప్రపంచకప్పుల్లో వంద గోల్స్ చేరడానికి 36 మ్యాచ్లు, 1978, 1994 టోర్నీల్లో 38 మ్యాచ్లు అవసరమయ్యాయి.అయితే 1954లో స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్లో మాత్రం కేవలం 20 మ్యాచ్ల్లోనే 100 గోల్స్ నమోదవ్వడం ఇప్పటికీ ఆల్టైమ్ రికార్డుగా ఉంది. ఈ రికార్డును అందుకోవడం ఇప్పట్లో కష్టతరమే. అంతేకాదు నెదర్లాండ్స్ జట్టు కూడా మరో అరుదైన ఘనత సాధించింది. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో 100 గోల్స్ క్లబ్లో చేరిన ఎనిమిదో దేశంగా నెదర్లాండ్స్ నిలిచింది. స్వీడన్తో మ్యాచ్లో బ్రియాన్ బ్రోబ్బే రెండు గోల్స్ సాధించగా.. అతని రెండో గోల్ నెదర్లాండ్కు ఫిఫా ప్రపంచకప్లలో 100వ గోల్గా నిలిచిపోయింది. మొత్తం మీద అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యమిస్తోన్న ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో 48 దేశాలు పాల్గొంటున్నాయి. Read: ఫిఫాలో 1000వ మ్యాచ్.. జపాన్ గర్జనకు ట్యునీషియా చిత్తు -
భారత జట్టు ప్రకటన.. సెంచరీ హీరోకు నో ఛాన్స్
ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అఫ్గాన్తో వన్డేలకు గాయం కారణంగా దూరమైన స్టార్ విరాట్ కోహ్లి తిరిగి జట్టులోకి వచ్చాడు. అతడితో పాటు స్టార్ సేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా పునరాగమనం చేశాడు. విరాట్ను ఎంపిక చేసినప్పటికి సిరీస్ ఆరంభానికి ముందు తన ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంది.ఇక అఫ్గాన్తో ఆఖరి వన్డేలో సెంచరీతో సత్తాచాటిన యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్కు మాత్రం చోటు దక్కలేదు. తన చివరి మూడు వన్డేలలో రెండు శతకాలు సాధించినప్పటికీ జైస్వాల్ను సెలక్టర్లు పక్కన పెట్టారు. జూలై 14 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.ఇంగ్లండ్తో వన్డేల కోసం భారత జట్టుశుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్భారత్ వర్సెస్ ఇంగ్లండ్ వన్డే షెడ్యూల్1వ వన్డే జూలై 14, 2026 (మంగళవారం) ఎడ్జ్బాస్టన్, బర్మింగ్హామ్ మధ్యాహ్నం 3:302వ వన్డే జూలై 16, 2026 (గురువారం) సోఫియా గార్డెన్స్, కార్డిఫ్ సాయంత్రం 5:303వ వన్డే జూలై 19, 2026 (ఆదివారం) లార్డ్స్, లండన్ మధ్యాహ్నం 3:30చదవండి: వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు -
వైభవ్, తిలక్ మెరుపులు.. శ్రీలంక-ఏ టార్గెట్ 378 రన్స్
ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా దంబుల్లా వేదికగా శ్రీలంక-ఏతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో ఇండియా-ఏ జట్టు భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇండియా-ఏ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ (29 బంతుల్లో 94 పరుగులు, 10 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ తిలక్ వర్మ (90 బంతుల్లో 67, 4 ఫోర్లు, 1 సిక్సర్) క్లాస్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. మిగిలిన బ్యాటర్లలో రుతురాజ్ గైక్వాడ్ (40), ప్రియాన్ష్ ఆర్య (39) రాణించారు. ఆఖర్లో విప్రజ్ నిగమ్ (27), అనుకుల్ రాయ్ (15 బంతుల్లో 39, 1 ఫోర్, 4 సిక్సర్లు) ధాటిగా ఆడడంతో ఇండియా-ఏ స్కోరు 370 పరుగుల మార్క్ను దాటింది. లంక బౌలర్లలో రవిందు ఫెర్నాండో, వనుజా సాహన్చె, కుగతా మథులన్ 2 వికెట్లు తీయగా, మొహమ్మద్ షిరాజ్, సహన్ అరాచిగే, దులజ్ సముదితా తలా ఒక వికెట్ పడగొట్టారు.వైభవ్ జోరు.. లంక బేజారుటాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇండియా-ఏ జట్టుకు వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. ఆరంభం నుంచే లంక బౌలర్లను ఉతికారేసిన సూర్యవంశీ 11 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించి ప్రపంచ రికార్డు సాధించాడు. ఆ తరవ్ఆత కూడా తన విధ్వంసాన్ని కొనసాగించిన వైభవ్ 29 బంతుల్లో 94 పరుగుల వద్ద ఔటవ్వడంతో అతడి జోరుకు బ్రేకులు పడ్డాయి. వైభవ్ దెబ్బకు 8.5 ఓవర్లలో 132 పరుగులు రాగా.. అందులో వైభవ్ సూర్యవంశీవే 94 పరుగులు ఉండడం గమనార్హం. సూర్యవంశీ ఔటైన తర్వాత ప్రియాన్ష్ ఆర్య కూడా వెనుదిరిగాడు. ఈ దశలో రుతురాజ్కు జత కలిసిన తిలక్ వర్మ కాస్త నిధానంగా ఆడడంతో పరుగులు రావడం మందగించింది. ఈ ఇద్దరు మూడో వికెట్కు 84 పరుగులు జోడించారు. అనంతరం 220 పరుగుల వద్ద రుతురాజ్ వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన కుమార్ కుషాగ్ర కూడా పర్వాలేదనిపించడంతో స్కోరు నత్తనడకనే సాగింది. ఈ దశలో హాఫ్ సెంచరీ చేసిన తిలక్ వర్మ 67 పరుగుల వద్ద ఔటవ్వడంతో ఇండియా-ఏ ఐదో వికెట్ కోల్పోయింది. తిలక్ ఔటైన తర్వాత ఇండియా-ఏకు పరుగులు రాలేదు. వైభవ్ విధ్వంసంతో 400 పరుగులు ఈజీగా వస్తాయనిపించింది. అయితే చివర్లో విప్రజ్, అనుకుల్ రాయ్ మెరుపులతో ఇండియా-ఏ 370 పరుగుల మార్క్ను దాటింది. The journey to the Final has been built on knocks like these.💥Now Tilak Varma and India 'A' are one win away from glory.🔥Watch #SLvIND in the #TalentTVCup Final, on 21st June, 10 AM onwards, LIVE on Sony Sports Network TV channels & Sony LIV. 📺🏏 pic.twitter.com/yJlAC3IjrB— Sony Sports Network (@SonySportsNetwk) June 19, 2026చదవండి: కవ్వించి తప్పు చేశారు.. వైభవ్ ప్రతీకారం! -
ఫిఫాలో 1000వ మ్యాచ్.. జపాన్ గర్జనకు ట్యునీషియా చిత్తు
ఫిఫా ప్రపంచకప్ 2026లో ఆసియా జట్టు జపాన్ బోణీ కొట్టింది. ఆదివారం గ్రూప్-ఎఫ్లో ట్యునీషియాతో జరిగిన మ్యాచ్లో జపాన్ 4-0తో విజయం సాధించింది. నెదర్లాండ్స్తో జరిగిన తొలి మ్యాచ్ను డ్రా చేసుకున్న జపాన్.. ట్యునీషియాతో మ్యాచ్లో మాత్రం చెలరేగింది. జపాన్ తరఫున అయాసే ఉడా (ఆట 31,83వ నిమిషం) డబుల్ గోల్స్తో మెరవగా, దయిచీ కమదా (4వ నిమిషం), జున్యా ఇటో (69వ నిమిషం) గోల్స్ సాధించారు. కాగా ఫిఫా వరల్డ్కప్ చరిత్రలో జపాన్, ట్యునీషియాది 1000వ మ్యాచ్ కావడం విశేషం. కాగా మ్యాచ్లో ఓటమితో ట్యునీషియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఫిఫా ప్రపంచకప్ నుంచి వైదొలిగింది. ఇక జపాన్ తమ తదుపరి మ్యాచ్ స్వీడన్తో ఆడనుంది. ప్రస్తుతం నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న జపాన్ స్వీడన్పై గెలిచి గ్రూప్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఇదే గ్రూప్లో నెదర్లాండ్స్ 5-1 తేడాతో స్వీడన్ను చిత్తు చేసి టాప్లో కొనసాగుతోంది.Joy for Japan! 🇯🇵#FIFAWorldCup— FIFA World Cup (@FIFAWorldCup) June 21, 2026Read: కవ్వించి తప్పు చేశారు.. వైభవ్ ప్రతీకారం! -
కవ్వించి తప్పు చేశారు.. వైభవ్ ప్రతీకారం!
ముక్కోణపు వన్డే టోర్నీలో భాగంగా భారత సంచలనం వైభవ్ సూర్యవంశీ తనకు కోపమొస్తే ఆ విధ్వంసం ఎంతలా ఉంటుందో లంక ఆటగాళ్లకు రుచి చూపించాడు. మొన్నటికి మొన్న లంక-ఏ ఆటగాళ్లతో గొడవకు దిగి వైభవ్ సూర్యవంశీ విమర్శలకు గురయ్యాడు. బ్యాటింగ్లో విఫలం కావడానికి తోడు తన చర్యతో చెడ్డ పేరు మూటగట్టుకున్నాడు. అయితే తనపై వచ్చిన విమర్శలకు, అనవసరంగా గెలికిన లంక ఆటగాళ్లకు ఒక్క ఇన్నింగ్స్తో దిమ్మతిరిగిపోయే సమాధానమిచ్చాడు. ఎందుకురా అనసవరంగా పెట్టుకున్నాం వీడితో అనేంతలా వైభవ్ రెచ్చిపోయాడు. క్రీజులోకి దిగిందే మొదలు బాదడమే పరమావధిగా పెట్టుకున్న వైభవ్ తాను ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీగా మలచిన వైభవ్ 28 బంతుల వరకు విధ్వంసాన్ని కొనసాగించాడు. ఇక తొలి 11 బంతుల్లో వైభవ్ వరుసగా 4,4,4,6,6,0,6,4,4,6,6 బాదడం విశేషం. తాను ఎదుర్కొన్న 11 బంతుల్లో ఒక డాట్ బాల్ మినహా మిగతా అన్ని బంతులను గమనిస్తే ఫోర్లు, సిక్సర్లే కనిపిస్తాయి. దీన్నిబట్టే వైభవ్ విధ్వంసం ఎలా సాగిందనేది అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే లిస్ట్-ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును తన పేరిట లిఖించుకున్న వైభవ్ ఆ తర్వాత సెంచరీ వైపు పరిగెత్తాడు. చూస్తుండగానే 90ల్లోకి వచ్చిన వైభవ్ 29 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేసి ఔటయ్యాడు. వైభవ్ కాస్త కొంచెం ఓపిక వహించి ఉండుంటే లిస్ట్-ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు కూడా తన పేరిట లిఖించుకునేవాడు. అయితే తృటిలో శతకం చేజార్చుకున్నప్పటికీ వైభవ్ ఆడిన 94 పరుగుల ఇన్నింగ్స్ తన కెరీర్లోనే కాదు ప్రపంచ క్రికెట్లో సైతం ఎప్పటికీ గుర్తుండిపోతుందనడంలో సందేహం లేదు. అయితే అండర్-19 క్రికెట్లో వైభవ్ సూర్యవంశీ 52 బంతుల్లో సెంచరీ బాదిన సంగతి తెలిసిందే. ఇక లిస్ట్-ఏ క్రికెట్లో మాత్రం ఆస్ట్రేలియా క్రికెటర్ జేమ్స్ మెక్గుర్క్ 29 బంతుల్లో సెంచరీ సాధించడం ఇప్పటికీ ప్రపంచ రికార్డుగా ఉంది. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ఏబీ డివిలియర్స్ 31 బంతుల్లో అందుకున్న రికార్డు శతకం ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఇక దేశవాలీ క్రికెట్లో 2025-26 విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ప్రదేశ్పై 36 బంతుల్లోనే సెంచరీ బాదిన వైభవ్ లిస్ట్-ఏ క్రికెట్లో శతక్కొట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ రికార్డులకెక్కాడు. మొత్తం మీద తృటిలో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు మిస్చేసుకున్న వైభవ్ తనను అనవసరంగా గెలికి తప్పు చేసిన లంక ఆటగాళ్లకు బ్యాటింగ్ పవర్ రుచి చూపించడంతో పాటు ప్రతీకారం తీర్చుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే 25 ఓవర్లు ముగిసేసరికి ఇండియా-ఏ 2 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. కెప్టెన్ తిలక్ వర్మ (40), రుతురాజ్ గైక్వాడ్ (31 పరుగులు) క్రీజులో ఉన్నారు. Never mess with a Ego kid😭🔥🔥🔥Scored 11 balls 50 in IND A Finals😭😭With 5 sixes and 5 fours🥵🥵🥵🥵🥵#INDAvsSLA #vaibhav pic.twitter.com/rGQdowLjhh— Prabhas Devotee 🔥 (@SainathPb45) June 21, 20264,4,4,6,6,0,6,4,4,6,6 BY VAIBHAV SOORYAVANSHI IN HIS FIRST 11 BALLS 🥹- 15 YEAR OLD KID IS HAMMERING SRI LANKA. #indvssla pic.twitter.com/VzO2tm9uUb— Arman Cricket Updates (@arman7590) June 21, 2026Read: వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు -
వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు
ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా శ్రీలంక-ఏతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ 11 బంతుల్లోనే అర్ధసెంచరీ మార్క్ సాధించి ప్రపంచ రికార్డు సాధించాడు. లీగ్ దశలో లంక- ఏ ఆటగాళ్లతో గొడవను పర్సనల్గా తీసుకున్న వైభవ్ మ్యాచ్ ఆరంభం నుంచే లంక బౌలర్లను చీల్చి చెండాడుతూ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు. గతంలో లిస్ట్-ఏ క్రికెట్లో 2005లో శ్రీలంక క్రికెటర్ కౌషల్య వీరరత్నే 12 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ సాధించాడు. తాజాగా ఆ రికార్డును బద్దలు కొట్టిన వైభవ్ లిస్ట్-ఏ క్రికెట్లో అతి తక్కువ బంతుల్లో ఫిఫ్టీ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు.అంతేకాదు వన్డే ఫార్మాట్లోనూ సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ రికార్డును వైభవ్ సూర్యవంశీ బద్దలు కొట్టాడు. ఏబీ డివిలియర్స్ 2015లో వెస్టిండీస్తో జరిగిన వన్డే మ్యాచ్లో 16 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు. వెస్టిండీస్ బ్యాటర్ మాథ్యూ ఫోర్డ్ కూడా 2025లో ఐర్లాండ్తో వన్డేలో 16 బంతుల్లోనే ఫిఫ్టీ మార్క్ సాధించాడు. అయితే వైభవ్ సూర్యవంశీ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ మార్క్ అందుకున్నది అనధికారిక వన్డే మ్యాచ్ కావడంతో అంతర్జాతీయంగా ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు మాత్రం ఏబీ డివిలియర్స్, మాథ్యూ ఫోర్డ్ పేరిటే ఉంది. ఇక టీ20 క్రికెట్లో యువరాజ్ సింగ్ 12 బంతుల్లో సాధించిన ఫిఫ్టీ రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. అయితే క్రికెట్ చరిత్రలో ఏ ఫార్మాట్లోనైనా వైభవ్ సూర్యవంశీ (11 బంతుల్లో 50 పరుగులు)దే అత్యుత్తమం కావడం విశేషం. 10 FOURS & 8 SIXES IN JUST 29 BALLS FOR VAIBHAV SOORYAVANSHI IN TRI SERIES FINAL 🥶🔥pic.twitter.com/3x16I9ONwb— Johns. (@CricCrazyJohns) June 21, 2026India A's Vaibhav Sooryavanshi smashed the fastest-ever List A fifty, reaching the milestone in just 11 balls against Sri Lanka A in the Tri-Series final. pic.twitter.com/vnzipNcZ6U— Sri Lanka Tweet 🇱🇰 (@SriLankaTweet) June 21, 2026 HEARTBREAK FOR VAIBHAV SOORYAVANSHI. 💔- 94 (29) with 10 fours and 8 sixes in the Tri-Series Final against Sri Lanka. Vaibhav absolutely ruled the Final and answered everyone who were doubting him. 🫡15 YEAR OLD IS SHOWING THE WORLD HIS SLAYING POWERS. 🇮🇳 pic.twitter.com/vk4RX8hFb6— Mufaddal Vohra (@mufaddal_vohra) June 21, 2026Read: టీ20 ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ నిష్క్రమణ -
లంకతో ఫైనల్ మ్యాచ్.. 11 బంతుల్లోనే ఫిఫ్టీ బాదిన వైభవ్
శ్రీలంక పర్యటనలో ట్రై సిరీస్ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ముక్కోణపు వన్డే టోర్నీ ఫైనల్లో శ్రీలంక-ఏ, ఇండియా-ఏ జట్టు తలప డుతున్నాయి. టాస్ గెలిచిన శ్రీలంక-ఏ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇండియా-ఏ దూకుడుగా ఆడుతోంది. వైభవ్ ధాటికి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ 11 బంతుల్లోనే అర్ధసెంచరీ మార్క్ సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో ఆరు ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అతడికి ప్రియాన్ష్ ఆర్య (22 బ్యాటింగ్) సహకరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు సాధించాడు. ఇప్పటివరకు సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న రికార్డును వైభవ్ బద్దలుకొట్టాడు.తుది జట్లు:ఇండియా-ఏ: ప్రియాంష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ(సి), కుమార్ కుషాగ్రా(w), సూర్యాంశ్ షెడ్గే, నిశాంత్ సింధు, అనుకుల్ రాయ్, విప్రజ్ నిగమ్, అశోక్ శర్మ, యశ్ ఠాకూర్శ్రీలంక-ఏ: నిరోషన్ డిక్వెల్లా(w), అవిష్క ఫెర్నాండో, నువానీదు ఫెర్నాండో, సదీర సమరవిక్రమ, సహన్ అరాచ్చిగే(సి), రవిందు ఫెర్నాండో, వనుజా సహన్, మహ్మద్ షిరాజ్, విజయకాంత్ వియాస్కాంత్, దులజ్ సముదిత, కుగతస్ మతులన్ -
టీ20 ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ నిష్క్రమణ
మహిళల టీ20 ప్రపంచకప్ 2026 నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా పాకిస్తాన్ నిలిచింది. బంగ్లాదేశ్ చేతిలో ఓటమి చవిచూసిన పాకిస్తాన్కు టోర్నీలో ఇది హ్యాట్రిక్ పరాజయం. ఇంతకముందు భారత్, సౌతాఫ్రికా చేతిలో ఓడిన పాకిస్తాన్ మహిళల జట్టు తాజాగా శనివారం బంగ్లాదేశ్ చేతిలో ఓటమితో నాకౌట్ దశకు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అంతకముందు ఆస్ట్రేలియా జట్టు నెదర్లాండ్స్పై భారీ విజయంతో పాయింట్ల పట్టికలో టాప్కు చేరుకోవడంతో పాకిస్తాన్తో పాటు నెదర్లాండ్స్ కూడా మూడు ఓటములతో టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. సౌతాంప్టన్ వేదికగా జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ 23 పరుగుల తేడాతో పాకిస్తాన్పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. కెప్టెన్ నిగార్ సుల్తానా (36), శోభన మోస్తరీ (22) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. ఆఖర్లో షోర్నా అక్తెర్ (39 నాటౌట్) బ్యాట్ ఝులిపించింది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో పాక్ ఆదిలో బాగా ఆడినా, మధ్యలో లయ కోల్పోయింది. ఆ జట్టు ఓపెనర్లు మునీబా అలీ (25), గుల్ ఫెరోజా (23) తొలి వికెట్కు 49 పరుగులు జోడించగా.. ఆతర్వాత పాక్ 26 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లు కోల్పోయి ఓటమి బాట పట్టింది.పాకిస్తాన్ క్రికెట్కు ప్రస్తుతం సంధికాలం నడుస్తోంది. అటు పురుషులు.. ఇటు మహిళల జట్టు టీ20 ప్రపంచకప్లో నాకౌట్ చేరడంలో విఫలమయ్యాయి. ఫిబ్రవరిలో జరిగిన పురుషుల టీ20 ప్రపంచకప్లో పాకిస్తాన్ సూపర్-8 దశలోనే ఇంటిబాట పట్టింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ చేతిలో టెస్టు సిరీస్లో క్లీన్స్వీప్ అయింది. తాజాగా మహిళల జట్టు కూడా పురుషుల జట్టునే అనుసరించింది. టీ20 ప్రపంచకప్లో భారత్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ చేతుల్లో హ్యాట్రిక్ ఓటములు చవిచూసి టోర్నీ నుంచి భారంగా నిష్క్రమించింది. 2009 ఆరంభ టీ20 ప్రపంచకప్ నుంచి ప్రతీసారి బరిలోకి దిగిన పాకిస్తాన్ మహిళల జట్టు ఏనాడు ఫస్ట్ రౌండ్ దాటింది లేదు. ఈసారి కూడా ఆ చెత్త రికార్డును బద్దలు కొట్టడంలో విఫలమైంది.మరోవైపు ఇదే గ్రూప్లో ఉన్న భారత మహిళల జట్టు మాత్రం రెండు విజయాలతో ఆసీస్ తర్వాతి స్థానంలో ఉంది. ఇవాళ సౌతాఫ్రికాతో జరగనున్న మ్యాచ్లో గెలిచి నాకౌట్కు చేరుకోవాలని హర్మన్ సేన ఉవ్విళ్లూరుతోంది. Pakistan Women's became the first Asian Team to get Eliminated from the Women's T20 World Cup 2026- Lost against India- Lost against South Africa- Lost against Bangladesh pic.twitter.com/UBcGqBOC9S— Ajay Jadeja (@AjayJadeja171) June 20, 2026చదవండి: 11 ఫోర్లు, 13 సిక్సర్లతో విధ్వంసం.. టీ20 క్రికెట్లో సరికొత్త రికార్డు! -
11 ఫోర్లు, 13 సిక్సర్లతో విధ్వంసం.. టీ20 క్రికెట్లో సరికొత్త రికార్డు!
అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ 2026) టోర్నీలో రికార్డులు బద్దలవుతున్నాయి. ఆదివారం ముంబై న్యూయార్క్తో జరుగుతున్న మ్యాచ్లో వాషింగ్టన్ ఫ్రీడమ్ ఓపెనర్ మిచెల్ ఓవెన్ 68 బంతుల్లోనే 155 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన అతడి ఇన్నింగ్స్లో 11 ఫోర్లు, 13 సిక్సర్లు ఉండడం విశేషం. మిచెల్ ఓవెన్ దెబ్బకు ముంబై న్యూయార్క్ బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 245 పరుగుల భారీ స్కోరు చేసింది. మిచెల్ ఓవెన్ విధ్వంసకర సెంచరీ మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (27), మార్క్ చాప్మన్ (23) పర్వాలేదనిపించారు. ముంబై న్యూయార్క్ బౌలర్లలో బౌల్ట్, కార్బిన్ బోష్, షెపర్డ్, ఉగర్కర్, కోరె అండర్సన్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం 246 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన ముంబై న్యూయార్క్ 5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసి ఓటమి దిశగా పయనిస్తోంది. ముంబై న్యూయార్క్ విజయానికి 89 బంతుల్లో 201 పరుగులు అవసరం. క్రీజులో పొలార్డ్ (10), అండర్సన్ ఉన్నారు.కాగా ఆస్ట్రేలియా తరఫున టీ20 క్రికెట్లో అత్యధిక స్కోరు బాదిన రెండో క్రికెటర్గా మిచెల్ ఓవెన్ నిలిచాడు. ఓవెన్ కంటే ముందు ఆరోన్ ఫించ్ (2013లో 156 పరుగులు, 2018లో 175 పరుగులు) రెండు అత్యధిక స్కోర్లతో ముందున్నాడు. 24 ఏళ్ల ఓవెన్ ఆస్ట్రేలియా తరఫున 18 టీ20 మ్యాచ్లు ఆడాడు.Mitchell Owen casually giving everyone some neck exercises ✨#MLC2026 #FreedomExpress #WFvMINY pic.twitter.com/ai99q1CKPL— Washington Freedom (@WSHFreedom) June 21, 2026చదవండి: చిన్న జట్టు సంచలనం.. ఈక్వెడార్కు భారీ షాక్ -
చిన్న జట్టు సంచలనం.. ఈక్వెడార్కు భారీ షాక్
ఫిఫా ప్రపంచకప్లో ఈక్వెడార్ ప్రయాణం ముగిసింది. నాకౌట్ దశకు చేరకుండానే ఇంటిబాట పట్టనుంది. టోర్నీలో భాగంగా ఆదివారం గ్రూప్-ఈలో కురాకావోతో జరిగిన మ్యాచ్ను ఈక్వెడార్ (0-0)తో డ్రా చేసుకుంది. నిర్ణీత సమయంలో ఇరుజట్లు గోల్ కొట్టడంలో విఫలమయ్యాయి. దీంతో మ్యాచ్ డ్రా కావడంతో ఇరుజట్లకు చెరో పాయింట్ లభించాయి. అయితే తొలిసారి ఫిఫా ప్రపంచకప్ ఆడుతున్న కురాకావో జట్టు ఒక పాయింట్ సాధించి టోర్నీలో ఖాతా తెరిచింది. మ్యాచ్ డ్రా చేసుకున్నప్పటికీ తనకంటే ఎన్నో రెట్లు మెరుగైన ఈక్వెడార్ను నిలువరించడం వారికి విజయంతో సమానం. మ్యాచ్లో ఈక్వెడార్ 15 సార్లు కురాకావో గోల్ పోస్టుపై దాడులు చేసింది. కురాకావో ఫుట్బాల్ జట్టుకానీ కురాకావో గోల్ కీపర్ 37 ఏళ్ల ఎలోయ్ రూమ్ వాటిని సమర్థంగా అడ్డుకొని మ్యాచ్ డ్రా కావడంలో కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు ఎలోయ్ తన విన్యాసాలతో ఫిఫా ప్రపంచకప్లో కురాకావోకు ఒక పాయింట్ లభించేలా చేశాడు. ఫిఫా ప్రస్తుత ర్యాంకింగ్స్ ప్రకారం చూసుకుంటే ఈక్వెడార్ 29వ ర్యాంక్లో ఉంటే, కురాకావో మాత్రం 83వ ర్యాంకులో కొనసాగుతోంది. కేవలం లక్షా 56వేల జనాభా కలిగిన కురాకావో ఆడుతున్న తొలి ఫిఫా ప్రపంచకప్లోనే తమ ప్రదర్శనతో అందరి చేత శెభాష్ అనిపించుకుంది. ఒక ఓటమి, ఒక డ్రాతో ఆఖరిస్థానంలో ఉన్న కురాకావో అనధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే. టోర్నీలో తమ చివరి మ్యాచ్ను జూన్ 26న ఐవరీకోస్ట్తో ఆడనుంది. మరోవైపు ఈక్వెడార్ కూడా టోర్నీ నుంచి వైదొలిగినట్లే. తమ చివరి మ్యాచ్ను గ్రూప్-ఈలో టాపర్గా ఉన్న జర్మనీతో జూన్ 26న ఆడనుంది.Que defesa do goleiro de Curaçao, sobrou até pra jornalista na beira do campo. pic.twitter.com/K2PHSSrHPM— Luiz Carlos Largo (@LARGOESPN) June 21, 2026 Cómo todos van con el portero después del partido Lo que significa para ellos ❤️ pic.twitter.com/8Fp1NNdo8F— Jeff (@JeffFcb14) June 21, 202637-year-old Eloy Room delivers a goalkeeping masterclass to secure Curaçao’s first-ever World Cup point 👏🔥 pic.twitter.com/9SVDhX8Xp2— OneFootball (@OneFootball) June 21, 2026చదవండి: దెబ్బతిన్న పులిలా రొనాల్డో.. ఆ మెరుపులెక్కడ? -
జో రూట్ ఒంటరి పోరాటం.. ఇంగ్లండ్ గెలిస్తే చరిత్రే!
న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ పోరాడుతోంది. 463 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టపోయి 182 పరుగులు చేసింది. కెప్టెన్ జో రూట్ (75 నాటౌట్) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఇంగ్లండ్ విజయానికి మరో 281 పరుగులు అవసరం కాగా.. న్యూజిలాండ్ విజయానికి మరో 5 వికెట్లు అవసరం. ఇప్పటికైతే గెలుపు అవకాశాలు న్యూజిలాండ్ వైపే ఉన్నప్పటికీ ఇంగ్లండ్ విజయం సాధిస్తే మాత్రం చరిత్ర సృష్టించినట్లే.ప్రస్తుతం జోర్డాన్ కాక్స్ (0) క్రీజులో ఉన్నాడు. కివీస్ బౌలర్లలో కైల్ జేమీసన్ 3 వికెట్లు పడగొట్టాడు. అంతకముందు హ్యారీ బ్రూక్ (58) అర్ధసెంచరీతో రాణించాడు. రూట్, బ్రూక్ కలిసి నాలుగో వికెట్కు 97 పరుగులు జోడించారు. వీరిద్దరు ఉన్నంతసేపు మ్యాచ్ ఇంగ్లండ్ వైపే మొగ్గు చూపినప్పటికీ బ్రూక్ వెనుదిరగడం, ఆ వెంటనే వికెట్ కీపర్ జేమ్స్ రూ కూడా ఔట్ కావడంతో ఇంగ్లండ్ ఐదు వికెట్లు కోల్పోయింది. ఇక గెలుపు సంగతి పక్కనబెడితే కాక్స్ మినహా మిగతా అంతా టెయిలెండర్లే కావడంతో రూట్ చివరి వరకు నిలిస్తేనే ఇంగ్లండ్ కనీసం మ్యాచ్ను డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో 362 పరుగులకు ఆలౌటైంది. హెన్రీ నికోల్స్ 121 పరుగులు చేసి ఔటవ్వగా, డారిల్ మిచెల్ (68), నాథన్ స్మిత్ (38) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్, మాథ్యూ ఫిషర్ చెరో 3 వికెట్లు తీయగా, జోష్ టంగ్ 2 వికెట్లు పడగొట్టాడు. తొలి టెస్టులో కివీస్ 115 పరుగుల తేడాతో విజయం సాధించిన ఇంగ్లండ్ మూడు టెస్టుల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.Read: నోరు మూసుకున్నందుకు రెడ్కార్డ్.. ఫిఫా చరిత్రలోనే తొలిసారి! -
తెలంగాణ టి20కి వేళాయె..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మక టి20 లీగ్కు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఆధ్వర్యంలో అధికారికంగా టీజీ టి20 లీగ్ను తొలిసారి నిర్వహించనున్నారు. గతంలో పలు వేర్వేరు లీగ్ టోర్నీలు జరిగినా... బీసీసీఐ అనుమతితో అధికారికంగా టోర్నీని జరపడం ఇదే తొలిసారి. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర తదితర అసోసియేషన్లు రాష్ట్ర స్థాయిలో వర్ధమాన క్రికెటర్ల కోసం ఇలాంటి టి20 లీగ్ను నిర్వహిస్తుండగా, ఇప్పుడు హెచ్సీఏ కూడా ఆ జాబితాలో చేరింది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో నేడు టోర్నీ మొదలు కానుంది. 22 రోజుల పాటు జరిగే టోర్నీలో ఫైనల్ సహా మొత్తం 32 మ్యాచ్లు నిర్వహిస్తారు. జూలై 12న ఫైనల్ జరుగుతుంది. తొలి రోజు రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మొదలయ్యే తొలి మ్యాచ్లో పాలమూరు స్ట్రైకర్స్తో ఖమ్మం ఏసెస్ జట్టు తలపడుతుంది. దీనికి ముందు సంగీత దర్శకుడు తమన్ నేతృత్వంలో ప్రత్యేక కార్యక్రమం జరుగుతుంది. మ్యాచ్లను స్టార్ స్పోర్ట్స్, జియో హట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. 160 మంది ప్లేయర్లు... టీజీ టి20 లీగ్ బరిలో ఎనిమిది జట్లు నిలిచాయి. హైదరాబాద్ ఇ–చాంపియన్స్, కరీంనగర్ డైమండ్స్, ఖమ్మం ఏసెస్, పాలమూరు స్ట్రైకర్స్, మెదక్ ఫాల్కన్స్, వరంగల్ వారియర్స్, రంగారెడ్డి రైజర్స్, నల్గొండ నైట్స్ టీమ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ టీమ్లకు అభిరథ్ రెడ్డి, తన్మయ్ అగర్వాల్, సీవీ మిలింద్, ప్రజ్ఞయ్ రెడ్డి, రవితేజ, అమన్ రావు, తనయ్ త్యాగరాజన్, రాహుల్ బుద్ధి కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. ముందుగా బిడ్ ద్వారా ఎనిమిది మంది ఫ్రాంచైజీలను ఎంపిక చేయగా, ఆ తర్వాత వేలం ద్వారా టీమ్లు ఆటగాళ్లను ఎంచుకున్నాయి.ఒక్కో టీమ్లో 20 మంది ఆటగాళ్ల చొప్పున మొత్తం 160 మంది ప్లేయర్లకు అవకాశం కల్పించారు. వేలంలో అత్యధికంగా టీమిండియా ఆటగాడు తిలక్ వర్మకు రూ.33 లక్షలు దక్కగా, పేసర్ మొహమ్మద్ సిరాజ్కు రూ.14 లక్షలు లభించాయి. అన్క్యాప్డ్ ప్లేయర్ మిలింద్కు అత్యధికంగా రూ. 17 లక్షలు దక్కాయి. ఆటగాళ్ల కోసం అన్ని జట్లు కలిపి మొత్తం రూ. 4.74 కోట్లు వెచ్చించాయి. అంతర్జాతీయ మ్యాచ్ల షెడ్యూల్ కారణంగా తిలక్, సిరాజ్ ఎన్ని మ్యాచ్లు ఆడతారనే విషయంపై స్పష్టత లేదు. రూ.49 టికెట్... తొలిసారి నిర్వహిస్తున్న లీగ్ కోసం హెచ్సీఏ ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్గా పని చేస్తుండగా, ప్రత్యేక గీతాన్ని కూడా రూపొందించారు. టోర్నీకి శ్రీనిధి యూనివర్సిటీ ప్రధాన స్పాన్సర్గా వ్యవహరిస్తోంది. టోర్నీ నిర్వహణకు సంబంధించి కొందరు న్యాయపరమైన అభ్యంతరాలు తలెత్తడంతో దీనిపై హెచ్సీఏ వివరణ ఇచ్చింది. లీగ్ నిర్వహణకు బీసీసీఐ అధికారికంగా అనుమతి ఇచ్చిందని, బోర్డు అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) పర్యవేక్షణలోనే మ్యాచ్లు జరుగుతాయని స్పష్టం చేసింది. ఎక్కువ మంది అభిమానులు స్టేడియంలో లీగ్ మ్యాచ్లు చూడటం కోసం కేవలం రూ.49 టికెట్ను అందుబాటులో ఉంచారు. ‘డిస్ట్రిక్ట్ ’ యాప్ ద్వారా ఫ్యాన్స్ టికెట్లు కొనుగోలు చేయవచ్చు. ఫ్రాంచైజీల వివరాలు » కరీంనగర్ డైమండ్స్ – ఈఐపీఎల్ గ్రూప్ అండ్ టిబరుమల్ జ్వెలర్స్ » ఖమ్మం ఏసెస్ – అన్విత గ్రూప్ » పాలమూరు స్ట్రైకర్స్ – వీరభద్ర స్టీల్స్ » మెదక్ ఫాల్కన్స్ – బృంద ఇన్ఫ్రా » వరంగల్ వారియర్స్ – బైన్ గ్లోబల్ రిసోర్సెస్ » రంగారెడ్డి రైజర్స్ – బూరుగు ఇన్ఫ్రా అండ్ ప్రణవ » నల్లగొండ నైట్స్ – కిశోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్æ » హైదరాబాద్ ఇ–చాంపియన్స్– ఉషోదయ ఎంటర్ప్రైజెస్ -
డెనిజ్ డబుల్ ధమాకా.. 12 ఏళ్ల తర్వాత నాకౌట్కు జర్మనీ
జర్మనీ జట్టు 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఫిఫా ప్రపంచకప్లో నాకౌట్కు చేరింది. 2026 ఎడిషన్ గ్రూప్-ఈలో భాగంగా ఐవరీ కోస్ట్పై 2-1 గెలుపుతో సూపర్-32కు అర్హత ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్ తొలి అర్ధభాగంలో వెనుకబడిన జర్మనీ, సూపర్ సబ్ డెనిజ్ ఉందవ్ ద్విగోల్ ప్రదర్శనతో నాటకీయ విజయాన్ని అందుకుంది.30వ నిమిషంలో ఫ్రాంక్ కెస్సీ రీబౌండ్ను గోల్గా మలిచి ఐవరీ కోస్ట్కు ఆధిక్యం అందించాడు. 60వ నిమిషంలో బెంచ్ నుంచి వచ్చిన డెనిజ్ అద్భుతమైన గోల్ చేసి స్కోర్ సమం చేశాడు. అదనపు సమయంలో మరోసారి గోల్ కొట్టిన డెనిజ్ జర్మనీకి విజయాన్ని ఖాయం చేశాడు.ఈ గెలుపుతో జర్మనీ గ్రూప్-ఈలో అగ్రస్థానంలో నిలిచి రౌండ్ ఆఫ్ 32కు అర్హత సాధించింది. 2014లో టైటిల్ గెలిచిన తర్వాత జర్మనీ గ్రూప్ దశను దాటడం ఇదే మొదటిసారి. ఈ ఎడిషన్ తొలి మ్యాచ్లో జర్మనీ అనామక కురసావోపై 7-1 భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. -
సెమీస్ బెర్త్ లక్ష్యంగా...
మాంచెస్టర్: వరుస విజయాలతో దూకుడు మీదున్న భారత మహిళల క్రికెట్ జట్టు టి20 ప్రపంచకప్లో కీలక పోరుకు సిద్ధమైంది. తొలి రెండు మ్యాచ్ల్లో పాకిస్తాన్, నెదర్లాండ్స్పై అలవోక విజయాలు సాధించిన హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా ఆదివారం దక్షిణాఫ్రికాతో తలపడనుంది. గ్రూప్–1లో ఆ్రస్టేలియా మూడు విజయాలతో 6 పాయింట్లు ఖాతాలో వేసుకోగా... భారత్ 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఒక గ్రూప్ నుంచి రెండు జట్లు మాత్రమే సెమీఫైనల్కు చేరనుండటంతో ఈ మ్యాచ్ ఫలితం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.సఫారీలపై విజయం సాధిస్తే టీమిండియా సెమీఫైనల్లో దాదాపుగా అడుగు పెట్టినట్లే. దీంతో హర్మన్ బృందం సమష్టిగా సత్తా చాటాలని భావిస్తోంది. గత రెండు మ్యాచ్ల్లో బలహీన ప్రత్యర్థులపై సంపూర్ణ ఆధిపత్యం కనబరిచిన హర్మన్ బృందం... సఫారీలపై ఎలాంటి ప్రదర్శన చేస్తుందనేది ఆసక్తికరం. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఫుల్ఫామ్లో ఉండటం భారత్కు కలిసొచ్చే అంశం. మరోవైపు టోర్నీ ఆరంభానికి ముందు టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా కనిపించిన దక్షిణాఫ్రికా జట్టు మైదానంలో మాత్రం ఆ స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోతోంది. మాంచెస్టర్ మైదానంలో గత రెండు మ్యాచ్ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు విజయాలు సాధించగా... మ్యాచ్కు వర్ష సూచన లేదు. ఆదివారమే జరగనున్న మరో మ్యాచ్లో శ్రీలంకతో వెస్టిండీస్ తలపడనుంది. సఫారీలతో అంత సులువు కాదు... గతేడాది వన్డే వరల్డ్కప్ ట్రోఫీ చేజిక్కించుకున్న టీమిండియా... ఇప్పుడు టి20ల్లో వరల్డ్ చాంపియన్గా అవతరించాలని పట్టుదలగా ఉంది. అందుకు తగ్గట్లే తొలి రెండు మ్యాచ్ల్లో మనవాళ్లు ఆల్రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. రెండు అర్ధశతకాలతో స్మృతి ఇన్నింగ్స్ను ముందుండి నడిపిస్తుండగా... ఆమెకు సహచరుల నుంచి చక్కటి సహకారం లభిస్తోంది. అయితే షఫాలీ వర్మ, జెమీమా, హర్మన్ప్రీత్, రిచా ఘోష్ నిలకడ కనబర్చాల్సిన అవసరముంది. దక్షిణాఫ్రికా జట్టులో నాణ్యమైన బౌలర్లు ఉన్న నేపథ్యంలో... మరింత అప్రమత్తత అవసరం. బౌలింగ్లో భారత జట్టుకు పెద్దగా ఇబ్బందులు కనిపించడం లేదు. ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్ల వ్యూహాన్నే అమలు చేయొచ్చు. పాకిస్తాన్తో పోరులో ఐదు వికెట్లతో సత్తాచాటిన సీనియర్ స్పిన్నర్ దీప్తి శర్మతో పాటు ఆంధ్ర అమ్మాయి శ్రీచరణిపై భారీ అంచనాలు ఉన్నాయి.200భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్కు ఇది 200వ అంతర్జాతీయ టి20 మ్యాచ్ కానుంది. తద్వారా ఈ మైలురాయి అందుకోనున్న తొలి క్రికెటర్గా (పురుషులు/మహిళలు) హర్మన్ చరిత్ర సృష్టించనుంది. -
ఘనంగా ముగించారు
భారత జట్టు ముందు అఫ్గానిస్తాన్ ఇంకా పసికూన మాత్రమే అని మరోసారి నిరూపితమైంది. సొంతగడ్డపై ఏకైక టెస్టును మూడు రోజుల్లో ముగించిన టీమిండియా మూడు వన్డేల్లో కూడా అఫ్గాన్పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. అలవోక విజయాలతో సిరీస్ను 3–0తో క్లీన్స్వీప్ చేసింది. చివరి పోరులో ముందుగా ప్రసిధ్ కృష్ణ ధాటికి అఫ్గాన్ తక్కువ స్కోరుకే పరిమితం కాగా... ఆ తర్వాత యశస్వి జైస్వాల్, రోహిత్ దూకుడుతో భారత్ సునాయాసంగా లక్ష్యాన్ని అధిగమించింది. చెన్నై: సొంతగడ్డపై అఫ్గానిస్తాన్తో జరిగిన మూడు వన్డేల సిరీస్ను భారత్ 3–0తో గెలుచుకుంది. శనివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన అఫ్గానిస్తాన్ 44.2 ఓవర్లలో 218 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (131 బంతుల్లో 102; 13 ఫోర్లు, 1 సిక్స్) తన వన్డే కెరీర్లో తొలి సెంచరీ సాధించగా... అజ్మతుల్లా ఒమర్జాయ్ (56 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీ చేశాడు. వీరిద్దరు ఐదో వికెట్కు 19.3 ఓవర్లలో 105 పరుగులు జోడించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ప్రసిధ్ కృష్ణ (5/23) కెరీర్లో తొలిసారి 5 వికెట్ల ప్రదర్శనతో అఫ్గాన్ను కుప్పకూల్చాడు. అనంతరం భారత్ 28.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 224 పరుగులు చేసి విజయాన్నందుకుంది. యశస్వి జైస్వాల్ (86 బంతుల్లో 110 నాటౌట్; 14 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీతో సత్తా చాటగా, రోహిత్ శర్మ (69 బంతుల్లో 79; 9 ఫోర్లు, 3 సిక్స్లు) తనదైన శైలిలో దూకుడుగా ఆడాడు.వీరిద్దరు తొలి వికెట్కు 23.1 ఓవర్లలో 170 పరుగులు జత చేయడంతోనే భారత్ విజయం ఖాయమైంది. గతంలో ఏ భారత బ్యాటర్కు సాధ్యం కాని రీతిలో జైస్వాల్ తన తొలి 6 వన్డేల్లోనే రెండు సెంచరీలు సాధించడం విశేషం. శుబ్మన్ గిల్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. (సి) రోహిత్ (బి) ప్రసిధ్ స్వింగ్, అదనపు బౌన్స్కు సహకరించిన పిచ్పై ప్రసిధ్ చెలరేగిపోయాడు. తన తొలి బంతికే గుర్బాజ్ (5)ను అవుట్ చేసిన అతను ఆ తర్వాత రహ్మత్ షా (5), ఇబ్రహీమ్ (11)లను కూడా వెనక్కి పంపించాడు. ఈ మూడు క్యాచ్లను మొదటి స్లిప్లోనే ఒకే తరహాలో రోహిత్ శర్మనే అందుకోవడం విశేషం. అనంతరం దార్విష్ (1)ను కూడా అవుట్ చేసిన ప్రసిధ్ తన తొలి స్పెల్ను 5–2–6–4తో ముగించాడు. 36/4 వద్ద హష్మత్, అజ్మత్ కలిసి జాగ్రత్తగా ఆడుతూ అఫ్గాన్ను ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ముందుగా హష్మత్ 64 బంతుల్లో, అజ్మత్ 55 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయితే అజ్మత్ను ప్రిన్స్ అవుట్ చేసి ఈ భాగస్వామ్యాన్ని విడదీయగా, ఆ తర్వాత జట్టు తక్కువ వ్యవధిలో వరుస వికెట్లు చేజార్చుకుంది. మరో వైపు పట్టుదలగా నిలిచిన హష్మత్ సెంచరీ అందుకోవడంలో (128 బంతుల్లో) సఫలమయ్యాడు. హష్మత్ను అవుట్ చేసి ప్రసిధ్ తన ఖాతాలో ఐదో వికెట్ వేసుకోవడంతో అఫ్గాన్ ఇన్నింగ్స్ ముగిసింది. రోహిత్ హాఫ్ సెంచరీ... అఫ్గాన్ ఇన్నింగ్స్లో హష్మత్ మూడుసార్లు పిచ్పై పరుగెత్తడంతో లభించిన 5 పెనాల్టీ పరుగులతో భారత్ ఇన్నింగ్స్ మొదలైంది. అజ్మల్ వేసిన తొలి ఓవర్లో జైస్వాల్ 3 ఫోర్లు బాదడంతో పాటు 2 నోబాల్, 2 వైడ్లతో తొలి ఓవర్ ముగిసే సరికి స్కోరు 23/0కు చేరింది. ఆ తర్వాత జైస్వాల్, రోహిత్ అలవోకగా దూసుకుపోయారు. తనకు లభించిన మరో అవకాశాన్ని జైస్వాల్ సద్వినియోగం చేసుకోగా, చక్కటి షాట్లతో రోహిత్ తన స్థాయిని మళ్లీ ప్రదర్శించాడు. 10 పరుగుల వద్ద రోహిత్ ఇచ్చిన క్యాచ్ను ఫరీద్ వదిలేయడం కూడా కలిసొచ్చింది. 38 బంతుల్లోనే జైస్వాల్, 47 బంతుల్లో రోహిత్ హాఫ్ సెంచరీలు పూర్తయ్యాయి. ఎట్టకేలకు పుల్ షాట్తో డీప్ మిడ్వికెట్లో క్యాచ్ ఇవ్వడంతో రోహిత్ వెనుదిరిగాడు. అయితే జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ (20 నాటౌట్) కలిసి జట్టును విజయం దిశగా నడిపించారు. నబీ ఓవర్లో సిక్స్తో సెంచరీ (83 బంతుల్లో) పూర్తి చేసుకున్న జైస్వాల్...అదే ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్తో మ్యాచ్ను ముగించాడు.160మూడు ఫార్మాట్లలో కలిపి అఫ్గానిస్తాన్తో 18 సార్లు తలపడిన భారత్ 16 గెలిచింది. ఒక మ్యాచ్ ‘టై’ కాగా, మరో మ్యాచ్ రద్దయింది. ఇప్పటి వరకు అఫ్గాన్ చేతిలో ఓడని ఐసీసీ శాశ్వత సభ్యత్వ జట్టు భారత్ మాత్రమే.స్కోరు వివరాలు అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) రోహిత్ (బి) ప్రసిధ్ 5; ఇబ్రహీమ్ (సి) రోహిత్ (బి) ప్రసిధ్ 11; రహ్మత్ (సి) రోహిత్ (బి) ప్రసిధ్ 5; హష్మతుల్లా (సి) అయ్యర్ (బి) ప్రసిధ్ 102; దార్విష్ (సి) అయ్యర్ (బి) ప్రసిధ్ 1; అజ్మతుల్లా (సి) ప్రసిధ్ (బి) ప్రిన్స్ 50; నబీ (బి) గుర్నూర్ 21; రషీద్ (సి) ప్రిన్స్ (బి) దూబే 5; ఘజన్ఫర్ (రనౌట్) 1; ఫరీద్ (రనౌట్) 0; రహమాన్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 16; మొత్తం (44.2 ఓవర్లలో ఆలౌట్) 218. వికెట్ల పతనం: 1–5, 2–26, 3–28, 4–36, 5–141, 6–198, 7–205, 8–206, 9–206, 10–218. బౌలింగ్: గుర్నూర్ 8–0–49–1, ప్రసిధ్ 8.2–2–23–5, ప్రిన్స్ 7–0–38–1, నితీశ్ రెడ్డి 6–0–42–0, హర్ష్ దూబే 7–0–38–1, సుందర్ 8–2–23–0. భారత్ ఇన్నింగ్స్: జైస్వాల్ (నాటౌట్) 110; రోహిత్ (సి) (సబ్) సాదిఖుల్లా (బి) నబీ 79; అయ్యర్ (నాటౌట్) 20; ఎక్స్ట్రాలు 15; మొత్తం (28.4 ఓవర్లలో వికెట్ నష్టానికి) 224. వికెట్ల పతనం: 1–170. బౌలింగ్: అజ్మతుల్లా 2–0–26–0, రహమాన్ 4–0–21–0, ఫరీద్ 5–0–55–0, ఘజన్ఫర్ 3–0–15–0, రషీద్ 7–0–53–0, నబీ 7.4–1–47–1. -
ఫైనల్లో భారత్
ఆక్లాండ్: తదుపరి ప్రొ లీగ్ సీజన్కు అర్హత సాధించేందుకు భారత మహిళల హాకీ జట్టు విజయం దూరంలో నిలిచింది. ప్రొ లీగ్కు క్వాలిఫయింగ్ టోర్నీ అయిన నేషన్స్ కప్లో సలీమా టెటె బృందం ఫైనల్లోకి దూసుకెళ్లింది. చిలీ జట్టుతో శనివారం జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 6–0 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున నవ్నీత్ కౌర్ (6వ, 13వ నిమిషాల్లో), దీపిక (14వ, 18వ నిమిషాల్లో) రెండు గోల్స్ చొప్పున చేయగా... నేహా (32వ నిమిషంలో), రుతుజా (39వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. నేడు జరిగే ఫైనల్లో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టుతో భారత్ ఆడుతుంది. రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్ ‘షూటౌట్’లో 4–1తో జపాన్ జట్టును ఓడించింది. నేషన్స్ కప్ విజేత జట్టు తదుపరి ఏడాది ప్రొ లీగ్లో ఆడే అర్హత సంపాదిస్తుంది. ప్రొ లీగ్లో చివరి స్థానంలో నిలిచిన జట్టు నేషన్స్ కప్లో ఆడుతుంది. -
పాక్ను చిత్తుగా ఓడించిన బంగ్లాదేశ్
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా పాకిస్తాన్తో ఇవాళ (జూన్ 20) జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ 23 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. గ్రూప్ దశలో పాక్కు ఇది వరుసగా మూడో ఓటమి. ఈ ఓటమితో ఆ జట్టు తదుపరి రౌండ్కు చేరుకునే అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు బంగ్లాదేశ్ ఆడిన 3 మ్యాచ్ల్లో రెండింట గెలిచి సూపర్-8 అవకాశాలను మెరుగుపర్చుకుంది. గ్రూప్-ఏలో బంగ్లా, పాక్తో పాటు భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా, భారత్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా మొదటి నాలుగు స్థానాల్లో ఉండగా.. పాక్, నెదర్లాండ్స్ చివరి రెండు స్థానాల్లో నిలిచాయి.మ్యాచ్ విషయానికొస్తే.. సౌథాంప్టన్ వేదికగా జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. కెప్టెన్ నిగార్ సుల్తానా (36), శోభన మోస్తరీ (22) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. ఆఖర్లో షోర్నా అక్తెర్ (39 నాటౌట్) బ్యాట్ ఝులిపించింది. వీరు మినహా మరే ఇతర బంగ్లా బ్యాటర్ కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేదు. పాక్ బౌలర్లు తొలి 16 ఓవర్లలో చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా, చివరి 4 ఓవర్లలో 43 పరుగులు సమర్పించుకొని మూల్యం చెల్లించుకున్నారు. షోర్నా అక్తెర్ చివర్లో పాక్ బౌలర్ల భరతం పట్టింది. ముఖ్యంగా తస్మియా రుబాబ్ బౌలింగ్ను చీల్చిచెండాడింది. రుబాబ్ మినహా పాక్ బౌలర్లంతా పొదుపుగా బౌలింగ్ చేశారు. కెప్టెన్ ఫాతిమా సనా (4-1-18-2), నష్రా సంధు (4-0-14-1), సదియా ఇక్బాల్ (4-0-21-1) అద్బుతమైన గణాంకాలు నమోదు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో పాక్ ఆదిలో బాగా ఆడినా, మధ్యలో లయ కోల్పోయింది. ఆ జట్టు ఓపెనర్లు మునీబా అలీ (25), గుల్ ఫెరోజా (23) తొలి వికెట్కు 49 పరుగులు జోడించగా.. ఆతర్వాత పాక్ 26 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోయి ఓటమి బాట పట్టింది. షంజిద అక్తెర్ (4-0-21-3), నహిద అక్తెర్ (4-0-18-3), రబేయా ఖాన్ (4-1-17-1), మరుఫా అక్తెర్ (4-1-18-0), రితూ మోనీ (4-0-24-1) ధాటికి పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 100 పరుగులకే పరిమితమైంది. పాక్ ఇన్నింగ్స్లో ఓపెనర్లు మినహా ఎవరూ కనీసం 20 పరుగుల మార్కును కూడా తాకలేకపోయారు. -
చరిత్ర సృష్టించిన జో రూట్.. సచిన్ ఆల్టైమ్ రికార్డు బ్రేక్
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 14,000 పరుగుల మైలు రాయిని అందుకున్న ప్లేయర్గా లెజెండరీ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ బ్రేక్ చేశాడు. లండన్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో అతడు ఈ భారీ రికార్డును నమోదు చేశాడు. ఈ మైలురాయిని అందుకోవడానికి సచిన్కు 171 మ్యాచ్లు పట్టగా.. రూట్ కేవలం 164 మ్యాచ్ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఇన్నింగ్స్ల పరంగా అయితే రూట్(302) కంటే సచిన్(279) ముందున్నారు. ఇక టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ (15,921 పరుగులు) ఆల్టైమ్ రికార్డును బద్దలు కొట్టే దిశగా జో రూట్ శరవేగంగా దూసుకుపోతున్నాడు. ఈ ఇంగ్లండ్ దిగ్గజం ఇప్పటివరకు టెస్ట్ల్లో 14052 పరుగులు చేశాడు. ప్రస్తుత అతని ఫామ్ చూస్తుంటే, రెండు మూడేళ్లలో సచిన్ రికార్డును అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రూట్నే కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు రూట్ 76 మ్యాచ్లలో 51.78 సగటుతో 6577 పరుగులు చేశాడు. ఆ తర్వాత స్ధానంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్(4,564) ఉన్నాడు.ఇక రెండో టెస్ట్ విషయానికి వస్తే.. న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్లో 391 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ తొలి టెస్ట్ సెంచరీతో కివీస్ను ఆదుకున్నాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 291 పరుగులకు ఆలౌటైంది. 100 పరుగుల ఆధిక్యంలో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన బ్లాక్ క్యాప్స్ జట్టు అద్భుతంగా ఆడి 362 పరుగులు చేసింది. మొత్తంగా ఆతిథ్య జట్టు ముందు కివీస్ 463 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఇంగ్లండ్ కాస్త తడబడుతోంది. సెకెండ్ ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. ఇంగ్లీష్ జట్టు విజయానికి ఇంకా 326 పరుగులు కావాలి. హ్యారీ బ్రూక్(58), రూట్(57) పోరాడుతున్నారు.చదవండి: IND vs AFG: భారత వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి -
రోహిత్ సరికొత్త రికార్డు.. భారత వన్డే క్రికెట్ హిస్టరీలోనే
చెపాక్ వేదికగా అఫ్గానిస్తాన్తో జరిగిన మూడో వన్డేలో 9 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 3-0 తేడాతో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. 219 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 28.4 ఓవర్లలో చేధించింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్(110) అజేయ శతకంతో మ్యాచ్ ఫినిష్ చేశాడు. అతడితో పాటు మరో సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 219 పరుగుల లక్ష్య ఛేదనలో హిట్మ్యాన్ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. 69 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 79 పరుగులు చేశాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.వన్డేల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన మూడో భారత ఆటగాడిగా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ను రోహిత్ అధిగమించాడు. రోహిత్కు ఇది 95వ హాఫ్ సెంచరీ. ద్రవిడ్ తన వన్డే కెరీర్లో 94 ఆర్ధ శతకాలు నమోదు చేశాడు. ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (145) టాప్ ప్లేస్లో కొనసాగుతుండగా.. విరాట్ కోహ్లి(131) రెండో స్ధానంలో ఉన్నాడు.అదేవిధంగా వన్డే క్రికెట్ చరిత్రలో టీమిండియా తరపున హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రోహిత్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. 39 ఏళ్ల 51 రోజుల వయస్సులో వయస్సులో అతడు ఈ ఫీట్ సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు భారత మాజీ క్రికెటర్ మొహిందర్ అమర్నాథ్ పేరిట ఉండేది. అమర్నాథ్ 1989లో పాకిస్తాన్పై 39 ఏళ్ల 21 రోజుల వయసులో ఆర్ధ శతకం నమోదు చేశాడు. తాజా మ్యాచ్తో అమర్నాథ్ ఆల్టైమ్ రికార్డు హిట్మ్యాన్ బ్రేక్ చేశాడు.చదవండి: IND vs AFG: భారత వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి -
జైశ్వాల్ మెరుపు సెంచరీ.. మూడో వన్డేలో భారత్ గ్రాండ్ విక్టరీ
చెన్నై వేదికగా అఫ్గానిస్తాన్తో జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో 9 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 3-0 తేడాతో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. 219 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన మెన్ ఇన్ బ్లూ.. 28.4 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది. యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అజేయ సెంచరీతో సత్తాచాటాడు.86 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్లతో 110 పరుగులు చేశాడు. అతడితో పాటు మరో సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ(69 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 79) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. జైశ్వాల్తో కలిసి తొలి వికెట్ రోహిత్ 170 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఫస్ట్ డౌన్లో వచ్చిన శ్రేయస్ అయ్యర్(20 నాటౌట్) దూకుడగా ఆడాడు. అఫ్గాన్ బౌలర్లలో నబీ ఒక్కడే వికెట్ సాధించాడు.నిప్పులు చెరిగిన ప్రసిద్ద్ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 44.2 ఓవర్లలో 218 పరుగులకే కుప్పకూలింది. అఫ్గాన్ బ్యాటర్లకు టీమిండియా పేసర్ ప్రసిద్ద్ కృష్ణ చుక్కలు చూపించాడు. ఈ కర్ణాటక స్పీడ్ స్టార్ ఐదు వికెట్లు పడగొట్టి పర్యాటక జట్టు పతనాన్ని శాసించాడు.అతడితో పాటు ప్రిన్స్ యాదవ్, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్ తలా వికెట్ సాధించారు. అఫ్గాన్ బ్యాటర్లలో కెప్టెన్ హాష్మతుల్లా షాహిది(102), ఓమర్జాయ్(50) మినహా మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు.చదవండి: IND vs AFG: భారత వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి -
భారత వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి
చెపాక్ వేదికగా భారత్తో జరుగుతున్న ఆఖరి వన్డేలోనూ అఫ్గానిస్తాన్ తమ మార్క్ చూపించలేకపోయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 44.2 ఓవర్లలో 218 పరుగులకే కుప్పకూలింది. భారత పేసర్ ప్రసిద్ద్ కృష్ణ 5 వికెట్లతో పర్యాటక జట్టు పతనాన్ని శాసించాడు.అయితే 36 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన అఫ్గాన్ను కెప్టెన్ హాష్మతుల్లా షాహిది(102) సెంచరీతో ఆదుకున్నాడు. అతడితో పాటు ఓమర్జాయ్(50) హాఫ్ సెంచరీతో రాణించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.అఫ్గాన్కు షాక్!అయితే సెకెండ్ ఇన్నింగ్స్లో బంతి పడక ముందే భారత్ స్కోర్ బోర్డులో 5 పరుగులు చూసి అందరూ షాక్ అయ్యారు. తొలి ఇన్నింగ్స్లో అఫ్గాన్ కెప్టెన్ చేసిన చిన్న పొరపాట్ల వల్ల భారత జట్టుకు 5 పెనాల్టీ పరుగులు లభించాయి. షాహిది పిచ్ మధ్య (డేంజర్ లైన్)లో పదే పదే నడిచినందుకు జరిమానా విధించారు.మ్యాచ్ 31వ ఓవర్ సమయంలో షాహిదీ పిచ్ మధ్యలో నడుస్తుండటాన్ని గమనించిన అంపైర్లు, అతనికి మొదటి అధికారిక హెచ్చరిక ఇచ్చారు. అయినప్పటికీ, 40వ ఓవర్ చివరి బంతికి షాహిదీ మళ్లీ అదే తప్పు చేస్తూ డేంజర్ జోన్లోకి దూసుకెళ్లాడు.దీంతో ఫీల్డ్ అంపైర్లు క్రిస్ గాఫానీ, రోహన్ పండిట్లు ఐదు పరుగులు పెనాల్టీ విధిస్తూ అఫ్గాన్కు షాకిచ్చారు. నిబంధనలో పిచ్ మధ్యలో నవడవడం గానీ పరిగెత్తడం గానీ చేయకూడదు. బూట్ల స్పైక్స్ వల్ల పిచ్ దెబ్బతిని, అక్కడ గుంతలు పడే ప్రమాదం ఉంది.తొలి ఓవర్లో 23 రన్స్కాగా కాగా భారత ఇన్నింగ్స్లో మొదట ఓవర్ వేసిన అఫ్గాన్ పేసర్ అజ్మతుల్లా ఓమర్జాయ్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. తొలి బంతిని డాట్గా సంధించిన ఓమర్జాయ్.. ఆ తర్వాత వైడ్లు, నోబాల్స్తో విసుగు తెప్పించాడు. అంతకుతోడు భారత ఓపెనర్ యశస్వి జైశ్వాల్ మూడు ఫోర్లు బాదాడు.దీంతో టీమిండియా పెనాల్టీ రూపంలో లభించిన ఐదు పరుగులతో కలిపి తొలి ఓవర్లో మొత్తం 23 పరుగులు చేసింది. అయితే తొలి ఓవర్లో ఇన్ని పరుగులు రావడం 52 ఏళ్ల భారత వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. అంతకుముందు 2004లో కొలంబో వేదికగా బంగ్లాదేశ్పై మొదటి ఓవర్లో 22 పరుగులు భారత్ సాధించింది. తాజా మ్యాచ్తో గత రికార్డును టీమిండియా అధిగమించింది.చదవండి: IPL 2026: 'అలాగైతే ఢిల్లీని వీడు.. వేలంలోకి వెళ్ళిపో' -
వైభవ్కు ఉన్న సంస్కారం మా వాళ్లకెక్కడిది?: శ్రీలంక దిగ్గజం
భారత నయా సంచలనం వైభవ్ సూర్యవంశీకి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పద్నాలుగేళ్లకే ఐపీఎల్లో సంచలనాలు సృష్టించిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. భారత అండర్-19 జట్టు తరఫునా దుమ్ములేపాడు.ఇక ఈ ఏడాది ఐపీఎల్ రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ.. 16 మ్యాచ్లలో కలిపి 776 పరుగులు సాధించాడు. తద్వారా 2026 సీజన్లో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచి.. పదిహేనేళ్లకే ఆరెంజ్క్యాప్ అందుకుని చరిత్ర సృష్టించాడు.శ్రీలంక పర్యటనలోఈ క్రమంలో తొలిసారి భారత్- ‘ఎ’ జట్టు, టీమిండియాకు ఎంపికైన వైభవ్ సూర్యవంశీ.. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో బిజీగా ఉన్నాడు. శ్రీలంక, భారత్, అఫ్గానిస్తాన్ ‘ఎ’ జట్ల మధ్య ముక్కోణపు వన్డే సిరీస్లో వైభవ్ పెద్దగా ఆకట్టుకోలేదు. నాలుగు లీగ్ మ్యాచ్లలో వరుసగా 14, 44, 21, 38 పరుగులే చేశాడు.ఇదిలా ఉంటే.. వైభవ్ను చూసేందుకు శ్రీలంక ప్రేక్షకులు ఎగబడ్డారు. ఎయిర్పోర్టులో అతడి కోసం వేచి ఉండి మరీ ఫొటోలు దిగారు. హోటల్లోనూ ఫొటోల కోసం అభిమానులు రాగా.. వైభవ్ కొన్నిసార్లు సున్నితంగా తిరస్కరించాడు.గంటసేపు ఎదురుచూసి మరీఅయితే, అందరింకంటే ప్రత్యేకమైన అభిమాని ఒకరు వైభవ్ కోసం దాదాపు గంటసేపు ఎదురుచూసి మరీ అతడిని కలిశారు. ఆయన మరెవరో కాదు.. శ్రీలంక జాతీయ జట్టుకు మొట్టమొదటి వన్డే కెప్టెన్గా పనిచేసిన అనురా తెనాకూన్.Former great of Sri Lanka and one of the finest batters of the country and the captain of the 1st ever World cup in 1975, Anura Tennekoon met a potential future great Vaibhav Sooryavanshi during the Triangular A team series in Dambulla. pic.twitter.com/xYOWMcO6AM— Roshan Abeysinghe (@RoshanCricket) June 16, 2026ఇరుజట్ల ఆటగాళ్లదీ తప్పేశ్రీలంక- భారత్ ‘ఎ’ జట్ల మధ్య సోమవారం నాటి అనధికారిక వన్డే సందర్భంగా అనురా వైభవ్ను కలిశారు. ఈ సందర్భంగా తమ మధ్య జరిగిన సంభాషణను తాజాగా వెల్లడించారు. ‘‘ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన చూసి నేను ముగ్ధుడినయ్యాను.అతడి బ్యాటింగ్ చూసేందుకే దంబుల్లా స్టేడియానికి వెళ్లాను. కానీ దురదృష్టవశాత్తూ అతడి బ్యాట్ నుంచి మెరుపులు చూడలేకపోయాను. మా ఆటగాళ్లు అతడిని చుట్టుముట్టి రెచ్చగొట్టారు. అతడింకా పిల్లాడే.అప్పటికే మ్యాచ్ ఓడిన కోపంలో ఉన్నాడు. మా వాళ్లు కవ్వించడంతో తానూ రెచ్చిపోయాడు. భావోద్వేగాలు నియంత్రించుకోలేకపోయాడు. దురదృష్టవశాత్తూ ఆ ఘటన జరిగిపోయింది. ఇరుజట్ల ఆటగాళ్లదీ తప్పే.మా శ్రీలంక ఆటగాళ్లు ఎప్పుడూ కూడాఆరోజు నన్ను కలిసినపుడు వైభవ్ నా దగ్గరికొచ్చి.. ‘సర్. మీ ఆశీసులు కావాలి. మిమ్మల్ని కలవడం నా అదృష్టం’ అంటూ నా పాదాలకు నమస్కరించాడు. మా శ్రీలంక ఆటగాళ్లు ఎప్పుడూ కూడా ఇలా నా పాదాలు తాకి ఆశీసులు తీసుకున్న దాఖలాలే లేవు. వైభవ్ను ఆరోజు రెచ్చగొట్టినందు వల్లే అలా ప్రవర్తించాడు’’ అని అనురా తెనాకూన్ పేర్కొన్నారు.కాగా శ్రీలంకతో సోమవారం నాటి మ్యాచ్ ‘టై’ కాగా.. సూపర్ ఓవర్లో భారత్ ఓడిపోయింది. ఈ క్రమంలో లంక ప్లేయర్ విశేన్.. వైభవ్ను ఉద్దేశించి ‘ఇంటికి వెళ్లిపో’ అంటూ రెచ్చగొట్టగా.. అతడూ తిరిగి బదులిచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరూ పరస్పరం నెట్టేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరికీ శిక్ష పడింది. ఇక ఈ ఘటన గురించి తాజాగా అనురా తెనాకూన్ వద్ద ప్రస్తావించగా.. పైవిధంగా స్పందించారు.చదవండి: వైభవ్ను టార్గెట్ చేస్తారా?🚨 BIG TROUBLE FOR VAIBHAV & TILAK 😭Vaibhav Sooryavanshi and Tilak Varma could face a 1-2 match ban after their heated argument with the umpires 😳- Suryavanshi's physical altercation with Sri Lanka A players after the match might cost him dearly 😥 pic.twitter.com/Fc5zLXYL91— Jara (@JARA_Memer) June 15, 2026 -
'అలాగైతే ఢిల్లీని వీడు.. వేలంలోకి వెళ్ళిపో'
ఐపీఎల్-2026 ముగిసి నెల రోజుల కూడా కాకముందే అప్పుడే వచ్చే ఏడాది సీజన్ గురుంచి ఊహాగానాలు మొదలయ్యాయి. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ లక్నో సూపర్ జెయింట్స్ను వదిలి తిరిగి తన పాత ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.అందుకు బదులుగా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను లక్నోకు ఇచ్చేందుకు ఢిల్లీ సిద్దమైనట్లు వార్తలు వస్తున్నాయి. పంత్ను ఐపీఎల్ 2025 మెగా వేలంలో పంత్ను లక్నో రూ. 27 కోట్లకు రికార్డు ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజా డీల్ ప్రకారం పంత్ తన జీతాన్ని తగ్గించుకుని రూ.15 కోట్లకు ఢిల్లీకి వచ్చేందుకు అంగీకరించినట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.అంతేకాకుండా అక్షర్ పటేల్ స్ధానంలో కేఎల్ రాహుల్ను ఢిల్లీ కెప్టెన్గా నియమించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ పేసర్ దొడ్డ గణేష్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ పంత్ గనుక ఢిల్లీ జట్టులోకి వస్తే, రాహుల్ ఢిల్లీ ఫ్రాంచైజీని వీడాలని అతడు సూచించాడు. ప్రస్తుతం అతడు చేసిన కామెంట్స్ క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చానీయాంశమయ్యాయి.కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో రాహుల్ను రూ.14 కోట్లకు ఢిల్లీ కొనుగోలు చేసింది. గతేడాది సీజన్లో 539 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచిన రాహుల్.. ఐపీఎల్-2026లో కూడా అదరగొట్టాడు. కేవలం 14 ఇన్నింగ్స్ల్లోనే 45.61 సగటుతో, 174.41 భారీ స్ట్రైక్ రేట్తో 593 పరుగులు చేశాడు.ఇందులో 5 అర్ధసెంచరీలు, ఒక అద్భుత శతకం ఉన్నాయి. మరోవైపు రిషబ్ పంత్ తన ఐపీఎల్ కెరీర్ను ఢిల్లీ క్యాపిటల్స్తోనే ప్రారంభించాడు. ఇప్పుడు మళ్లీ తన సొంత గూటికి వచ్చేందుకు సిద్దమయ్యాడు.చదవండి: IND vs AFG: రోహిత్ శర్మ హ్యాట్రిక్.. వీడియో వైరల్ -
ఐదు వికెట్లతో చెలరేగిన ప్రసిద్ద్.. కుప్పకూలిన అఫ్గానిస్తాన్
భారత ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ద్ కృష్ణ నిప్పులు చెరిగాడు. తన అద్భుత బౌలింగ్తో అఫ్గాన్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే కీలక వికెట్లు పడగొట్టి పర్యాటక జట్టును ప్రసిద్ద్ కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఈ కర్ణాటక పేసర్ 8.2 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు సాధించాడు. అతడితో పాటు హర్ష్దూబే, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్ తలా వికెట్ సాధించారు. ఫలితంగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు చేసిన అఫ్గాన్ 44.2 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది.కెప్టెన్ విరోచిత శతకంఓవైపు క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నప్పటికి అఫ్గాన్ కెప్టెన్ హస్మతుల్లా షాహిది మాత్రం విరోచిత సెంచరీ సాధించాడు. 131 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్తో 102 పరుగులు చేశాడు. అతడితో పాటు అజ్మతుల్లా ఓమర్జాయ్(50) హాఫ్ సెంచరీతో సహకారం అందించాడు. మిగితా ప్లేయర్లంతా ఘోరంగా విఫలమయ్యారు.తుదిజట్లుభారత్యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్.అఫ్గానిస్తాన్రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), డార్విష్ రసూలీ, మొహమ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ఏఎమ్ ఘజన్ఫర్, జియా ఉర్ రహ్మాన్ షరీఫీ, ఫరీద్ అహ్మద్ మాలిక్. -
రోహిత్ శర్మ హ్యాట్రిక్.. వీడియో వైరల్
చెన్నై వేదికగా భారత్, అఫ్గానిస్తాన్ మధ్య జరుగుతున్న మూడో వన్డే ఓ అద్భుతమైన రికార్డుకు వేదికైంది. టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, పేసర్ ప్రసిద్ద్ కృష్ణ కలిసి అరుదైన ఫీట్ను సాధించారు. వీరిద్దరి కాంబినేషన్లో ఓ యూనిక్ హ్యాట్రిక్ నమోదైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన అఫ్గానిస్తాన్కు ప్రసిద్ద్ కృష్ణ ఆరంభంలోనే చుక్కలు చూపించాడు. తన సంచలన బౌలింగ్తో అఫ్గాన్ టాపార్డర్ను కుప్పకూల్చాడు.ప్రసిద్ద్ వేసిన తన స్పెల్ మొదటి బంతికే గుర్బాజ్ అవుట్ అయ్యాడు. ఆఫ్ స్టంప్ వెలుపల పడిన బంతిని గుర్బాజ్ ఆఫ్సైడ్ ఆడగా, అది ఎడ్జ్ తీసుకుని ఫస్ట్ స్లిప్లో ఉన్న రోహిత్ శర్మ చేతుల్లోకి వెళ్ళింది. ఆ తర్వాత 6 ఓవర్లో ప్రసిద్ధ్ వేసిన షార్ట్ లెంగ్త్ బంతిని రహ్మత్ షా లెగ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ లీడింగ్ ఎడ్జ్ తీసుకున్న బంతిని మళ్లీ స్లిప్స్లో ఉన్న హిట్మ్యాన్ అందుకున్నాడు. అంతేకాకుండా 8వ ఓవర్లో ఇబ్రహీం జద్రాన్ డ్రైవ్ చేయడానికి ప్రయత్నించి ఫస్ట్ స్లిప్లో ఉన్న రోహిత్కే క్యాచ్ ఇచ్చాడు. దీంతో రోహిత్ క్యాచ్ల హ్యాట్రిక్ పూర్తి అయింది. ఒక వన్డే మ్యాచ్లో ఒకే బౌలర్ బౌలింగ్లో మూడు క్యాచ్లు పట్టిన మూడవ భారత ఫీల్డర్గా రోహిత్ నిలిచాడు. అతడి కంటే ముందు వి.వి.ఎస్. లక్ష్మణ్ (2004లో జింబాబ్వేపై ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్లో), శిఖర్ ధావన్ (2018లో బంగ్లాదేశ్పై జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో) ఈ ఫీట్ సాధించారు.చదవండి: MLC 2026: ఐపీఎల్లో డ్రింక్స్ బాయ్.. కట్ చేస్తే! అక్కడ కేవలం 25 బంతుల్లోనేIdentical setups, identical results 🔄Prasidh Krishna 🤝 Rohit Sharma 😎 Updates ▶️ https://t.co/kHgF4bqTg3#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/Bf2YPIA59l— BCCI (@BCCI) June 20, 2026 -
ఐపీఎల్లో డ్రింక్స్ బాయ్.. కట్ చేస్తే! అక్కడ కేవలం 25 బంతుల్లోనే
మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2026 సీజన్ను వాషింగ్టన్ ప్రీడమ్ ఓటమితో ప్రారంభించింది. శనివారం డల్లాస్ వేదికగా సీటెల్ ఓర్కాస్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో వాషింగ్టన్ ఓటమి పాలైంది. వాషింగ్టన్ నిర్ధేశించిన 216 పరుగుల భారీ లక్ష్యాన్ని సీటెల్ ఓర్కాస్ జట్టు కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 17.4 ఓవర్లలోనే ఊదిపడేసింది. ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ (33 బంతుల్లో 78), ఫస్ట్ డౌన్ బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కే (36 బంతుల్లో 66), దసున్ శనక(12 బంతుల్లో 36) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. సౌరభ్ నేత్రవల్కర్, ఇయాన్ హాలండ్ తలా రెండు వికెట్లు సాధించారు.మిచెల్ మెరుపులుటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ప్రీడమ్ నిర్ణీత 20 ఓవర్లలో 216 పరుగుల భారీ స్కోర్ సాధించి ఆలౌటైంది. వాషింగ్టన్ బ్యాటర్లలో ఆసీస్ యువ ఆల్రౌండర్ మిచెల్ ఓవెన్ విధ్వంసం సృష్టించాడు.కేవలం 25 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. కాగా 24 ఏళ్ల ఓవెన్ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కానీ అతడికి ఐపీఎల్-2026లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం లభించలేదు. రూ. 3 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకుని మరి అతడిని పంజాబ్ బెంచ్కే పరిమితం చేసింది.ఆ కసిని అతడు ఈ అమెరికా టీ20 లీగ్లో చూపించాడు. అతడితో పాటు కివీస్ ప్లేయర్ మార్క్ చాప్మన్(57) రాణించాడు. సీటెల్ ఓర్కాస్ బౌలర్లలో బార్ట్మన్ నాలుగు, శనక మూడు వికెట్లు పడగొట్టారు.చదవండి: IND vs SL: వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. లంక కెప్టెన్ ఏమన్నాడంటే.. -
IND vs AFG: కేఎల్ రాహుల్ను పక్కనపెట్టారా?
అఫ్గానిస్తాన్తో మూడో వన్డేలో భారత్ తమ తుదిజట్టులో మూడు మార్పులు చేసింది. తొలి మ్యాచ్ సందర్భంగా ధర్మశాలలో అరంగేట్రం చేసిన స్పిన్నర్ హర్ష్ దూబే.. రెండో వన్డేకు దూరమైన సంగతి తెలిసిందే. దీంతో అతడి స్థానంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆడాడు.రాహుల్ లేడుఅయితే, తాజాగా శనివారం నాటి మూడో మ్యాచ్లో కుల్దీప్ స్థానాన్ని హర్ష్ తిరిగి భర్తీ చేశాడు. ఇక మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్కు బదులు.. ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి తుదిజట్టులోకి వచ్చాడు. తొడ కండరాల నొప్పి నుంచి కోలుకున్న అతడి కోసం రాహుల్ తప్పుకోవాల్సి వచ్చింది.అదే విధంగా.. పేస్ దళంలో కీలకమైన అర్ష్దీప్ సింగ్ స్థానంలో ప్రసిద్ కృష్ణకు చోటు దక్కింది. అయితే, ఈ మూడు మార్పులు చేయడానికి గల కారణం ఏమిటనే ప్రశ్నలకు.. మ్యాచ్కు ముందే టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే పరోక్షంగా సమాధానమిచ్చాడు.బ్యాటర్లలో కూడా ఒకరికి రెస్ట్డష్కాటే శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మేము మ్యాచ్ మ్యాచ్కూ తుదిజట్టులో మార్పులు చేస్తున్నాం. ఈసారి అర్ష్దీప్ సింగ్కు విశ్రాంతినిస్తున్నాం. బ్యాటర్లలో కూడా ఒకరికి రెస్ట్ ఇస్తాం’’ అని పేర్కొన్నాడు. కాగా గత మ్యాచ్లో డకౌట్ అయిన కేఎల్ రాహుల్ను మూడో వన్డేలో పక్కనపెట్టడం గమనార్హం.మరోవైపు.. గత మ్యాచ్లో పది ఓవర్ల కోటాలో 42 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన కుల్దీప్ యాదవ్ కూడా మూడో వన్డే తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, రాహుల్, కుల్దీప్లపై వేటు వేయడం గాకుండా.. అర్ష్దీప్తో కలిసి వీరిద్దరికీ విశ్రాంతినిచ్చినట్లు డష్కాటే వ్యాఖ్యల ద్వారా స్పష్టమైంది.2-0తో సిరీస్ కైవసంఇక ఇప్పటికే ఈ మూడు వన్డేల సిరీస్ను 2-0తో టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫలితంగా నామమాత్రపు మూడో వన్డే నుంచి ఈ ముగ్గురు ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చినట్లు తెలుస్తోంది. పనిభారాన్ని తగ్గించే క్రమంలో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గా చెన్నై వేదికగా మూడో వన్డేలో టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.చదవండి: వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఏమన్నాడంటే.. -
FIFA World Cup 2026: ఫిఫా హీరోలు.. గద్ద – దుప్పి – జాగ్వార్
2026 ఫిఫా వరల్డ్ కప్కు మూడు దేశాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. అందుకే ఈసారి ఒకటి కాదు, మూడు మస్కట్లు మన ముందుకు వచ్చాయి. అమెరికా గద్ద, కెనడా దుప్పి, మెక్సికో జాగ్వార్ కలిసి ఫుట్బాల్ మైదానంలో సందడి చేయనున్నాయి.‘మస్కట్’ అంటే ఒక ‘లక్కీ చార్మ్‘ (అదృష్ట చిహ్నం). అంతర్జాతీయ క్రీడల్లో ఆ ఆటలు బాగా జరగాలని, అందరికీ అదృష్టం కలిసి రావాలని ఒక బొమ్మను ఎంచుకుంటారు. దీన్నే ‘మస్కట్’ అంటారు. ఇది సాధారణంగా కార్టూన్ బొమ్మలా ఉంటుంది. క్రీడలకు ఆ మస్కట్ బ్రాండ్ అంబాసిడర్లా పని చేస్తుంది.ఇప్పుడు జరుగుతున్న ‘ఫిఫా వరల్డ్ కప్ 2026’ను చరిత్రలో మొదటిసారిగా మూడు దేశాలు కలిసి నిర్వహిస్తున్నాయి. ఆ దేశాలు అమెరికా, కెనడా, మెక్సికో. అందుకే ఫిఫా కూడా కొత్తగా ఆలోచించింది. టోర్నమెంట్కు గుర్తుగా ఒక మస్కట్ కాకుండా మూడు మస్కట్లను ప్రవేశపెట్టింది. ప్రతి మస్కట్ ఒక్కో దేశానికి ప్రతీక. అంతేకాదు, ఫుట్బాల్ టీమ్లోని మూడు కీలక పొజిషన్లను ఈ మూడు మస్కట్లు ్రపాతినిధ్యం వహిస్తాయి. అవి ఏమిటో, వాటినే ఎందుకు ఎంచుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.Clutch – అమెరికా బట్టతల గద్ద..నం.10 జెర్సీ వేసుకున్న Clutch మిడ్ఫీల్డర్. అమెరికా జాతీయ పక్షి బట్టతల గద్ద రూపంలో దీన్ని తీర్చిదిద్దారు. ఫుట్బాల్లో మిడ్ఫీల్డర్ పాత్ర టీమ్ను నడిపించడం, ఆటగాళ్లను కలపడం, సరైన సమయంలో పాస్ ఇవ్వడం. Clutch కూడా అంతే. ఎత్తులో ఎగురుతూ అందరినీ ఒకచోట చేర్చుతుంది. టీమ్ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటుంది. గద్ద నిర్భయంగా, లక్ష్యంతో ఎగురుతుంది. అమెరికా క్రీడాస్ఫూర్తికి అది సరైన గుర్తు.Maple – కెనడా దుప్పినం.1 జెర్సీతో గోల్కీపర్గా Maple ఉంది. కెనడా జెండాలో ఉండే మాపుల్ ఆకు పేరును దీనికి పెట్టారు. దుప్పి కెనడా అడవుల్లో ఎక్కువగా కనిపించే జంతువు. ఇది శాంతానికి, ఓర్పుకు చిహ్నం. అదే సమయంలో తన ప్రాంతాన్ని కాపాడుకోవడంలో చాలా బలంగా ఉంటుంది. ఫుట్బాల్లో గోల్కీపర్ పని కూడా అదే. గోల్ పోస్ట్ను కాపాడటం.Zayu – మెక్సికో జాగ్వార్నం.9 జెర్సీతో స్ట్రైకర్ పాత్రలో Zayu ఉంది. ఇది దక్షిణ మెక్సికో అడవుల్లో సంచరించే జాగ్వార్. మెక్సికో నాగరికతలో జాగ్వార్ బలానికి, వేగానికి, ధైర్యానికి చిహ్నం. ఫుట్బాల్లో స్ట్రైకర్ పని గోల్ కొట్టడం. Zayu అందులో దిట్ట. చిరుత కన్నా వేగంగా పరిగెత్తి డిఫెండర్లను బోల్తా కొట్టిస్తుంది.Clutch గద్ద, Maple దుప్పి, Zayu జాగ్వార్. మూడు వేర్వేరు దేశాలు, మూడు వేర్వేరు జంతువులు, మూడు వేర్వేరు పొజిషన్లు. అయినా వీరి లక్ష్యం ఒక్కటే. కలిసి ఆడటం, కలిసి గెలవడం. ఒక్కరు ఎక్కువ, ఒక్కరు తక్కువ కాదు. 2026 వరల్డ్ కప్ మనకు చెప్పే పాఠం కూడా అదే. మనం వేరైనా, మన ఆట, మన భాష, మన అలవాట్లు వేరైనా కలిసి పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు. -
ఇంగ్లండ్ సిరీస్కు పాండ్యా దూరం.. కోహ్లీ ఆడడంపై ఆరోజే క్లారిటీ!
టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు దూరమైనట్లు తెలుస్తోంది. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న హార్దిక్ పాండ్యా కోలుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) శిబిరంలో ఉన్న పాండ్యా అఫ్గానిస్తాన్తో సిరీస్కు కూడా దూరమయ్యాడు. అయితే ఇంగ్లండ్ సిరీస్కు ఇంకా సమయం ఉండడంతో అప్పటివరకు పాండ్యా కోలుకుంటాడని వార్తలు వచ్చినప్పటికీ, బీసీసీఐ మెడికల్ బృందం మాత్రం పాండ్యా ఇంగ్లండ్ వెళ్లేందుకు సిద్ధంగా లేడని తెలిపింది. ఎందుకంటే రీహాబిలిటేషన్ సెంటర్లో ఉన్న పాండ్యా ఫిట్నెస్ టెస్టులో విఫలమయ్యాడని, అతడు కోలుకునేందుకు మరో నెల రోజులు పట్టే అవకాశముందని సమాచారం. అయితే ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా జూలై 14 నుంచి 19 మధ్య మూడు వన్డేలు ఆడనుంది. ఈ లెక్కన హార్దిక్ టీమిండియాతో జాయిన్ కావడం కష్టమే. ఇక గాయంతో బాధపడుతున్న కోహ్లీ కూడా ఇంగ్లండ్ సిరీస్లో ఆడుతాడా లేదా అనేది జూన్ 22న (సోమవారం) తేలనుంది. ఆరోజు కోహ్లికి ఫిట్నెస్ టెస్టు జరగనుంది.అయితే అఫ్గానిస్తాన్, ఇంగ్లండ్ టూర్లకు హార్దిక్ పాండ్యాను ఎంపిక చేస్తూ బీసీసీఐ సెలెక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. వన్డే వరల్డ్కప్ రోడ్మ్యాప్ ప్రక్రియలో భాగంగా పాండ్యా కీలకం కానున్నాడని అజిత్ అగార్కర్ వెల్లడించాడు. కానీ ఐపీఎల్ 2026 సీజన్ చివర్లో వెన్ను గాయంతో బాధపడ్డ పాండ్యా సీవోఈకి చేరుకున్నాడు. వెన్ను నొప్పి నుంచి తేరుకునే లోపే తొడ కండరాల గాయం కావడంతో ఆఫ్గన్తో వన్డే సిరీస్ ప్రారంభానికి ఒక్కరోజు ముందే పాండ్యా ఆడడం లేదని బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది.2027 వన్డే వరల్డ్కప్ ఆడేనా?వరుస గాయాలతో సతమతమవుతున్న పాండ్యా వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్లో ఆడుతాడా లేదా అన్నది మిస్టరీగా మారింది. టీమిండియా కూడా ఇంగ్లండ్తో వన్డే సిరీస్ అనంతరం మళ్లీ సెప్టెంబర్లో వెస్టిండీస్ టూర్లో వన్డే మ్యాచ్లు ఆడనుంది. అప్పటికి కోలుకొని పాండ్యా జట్టులోకి వస్తే మంచిదే, కానీ మళ్లీ ఏదైనా గాయం బారిన పడితే మాత్రం వన్డే ప్రపంచకప్కు పాండ్యా అందుబాటులో ఉండేది అనుమానమే.Read: నోరు మూసుకున్నందుకు రెడ్కార్డ్.. ఫిఫా చరిత్రలోనే తొలిసారి! -
IND vs AFG: శతక్కొట్టిన జైసూ.. సిరీస్ క్లీన్స్వీప్
చెన్నై వేదికగా అఫ్గానిస్తాన్తో మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి విధించిన 219 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 28.4 ఓవర్లలోనే ఛేదించింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది.భారత ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ శతకం (86 బంతుల్లో 110 నాటౌట్)తో చెలరేగగా.. రోహిత్ శర్మ 79 పరుగులు సాధించాడు. వన్డౌన్లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ 19 బంతుల్లో 20 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా టీమిండియా తొమ్మిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. అంతకుముందు ధర్మశాలలో ఏడు వికెట్ల తేడాతో అఫ్గాన్ను ఓడించిన గిల్ సేన.. లక్నో మ్యాచ్లో 170 పరుగుల తేడాతో పర్యాటక జట్టును చిత్తు చేసింది.Updates: చెన్నై వేదికగా టాస్ గెలిచిన అఫ్గాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ల ధాటికి 44.2 ఓవర్లలో కేవలం 218 చేసి ఆలౌట్ అయింది. ఇక టీమిండియా 219 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగింది. హష్మతుల్లా పిచ్ ఏరియాలో పరిగెత్తిన కారణంగా అఫ్గాన్కు ఐదు పరుగుల పెనాల్టీ పడగా.. టీమిండియా.. 5/0తో తమ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.25 ఓవర్లలో టీమిండియా స్కోరు: 1771-1జైసూ 81, అయ్యర్ 4 పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన భారత్22.5: నబీ బౌలింగ్లో సెదీకుల్లాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన రోహిత్ శర్మ (69 బంతుల్లో 79). శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 171-1. జైసూ 78 పరుగులతో ఉన్నాడు.21 ఓవర్లలో టీమిండియా స్కోరు: 153-0రోహిత్ శర్మ 65, యశస్వి జైస్వాల్ 75 పరుగులతో ఉన్నారు.రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ15.2: రషీద్ ఖాన్ బౌలింగ్లో ఫోర్ బాది.. అర్ధ శతకం పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ. 47 బంతుల్లో హాఫ్ సెంచరీ. స్కోరు: 123-0(15.3). జైసూ 58 పరుగులతో ఉన్నాడు.జైస్వాల్ అర్ద శతకం11.3: రషీద్ ఖాన్ బౌలింగ్లో సింగిల్ తీసి ఫిఫ్టీ పూర్తి చేసుకున్న జైస్వాల్పది ఓవర్లలో టీమిండియా స్కోరు: 86-0యశస్వి జైస్వాల్ 46, రోహిత్ 27 పరుగులతో ఉన్నారు.తొలి ఓవర్లోనే 23 పరుగులు5/0తో లక్ష్య ఛేదన మొదలుపెట్టిన టీమిండియా.. తొలి ఓవర్లో మొత్తంగా 23 పరుగులు ఖాతాలో వేసుకుంది. జైస్వాల్ 14 పరుగులు చేయగా.. మిగతావి ఎక్స్ట్రా రూపంలో వచ్చాయి. చెలరేగిన ప్రసిద్.. అఫ్గాన్ ఆలౌట్భారత పేసర్ ప్రసిద్ కృష్ణ అఫ్గాన్ టాపార్డర్ను కుదేలు చేశాడు. అతడి దెబ్బకు రహ్మానుల్లా గుర్బాజ్ (5), రహ్మత్ షా (5), ఇబ్రహీం జద్రాన్ (11) పెవిలియన్కు వరుస కట్టారు. ఇలాంటి దశలో హష్మతుల్లా షాహిది కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 131 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 102 పరుగులు చేశాడు. అయితే, ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో ఆఖరి వికెట్గా వెనుదిరగడంతో హష్మతుల్లా శతక ఇన్నింగ్స్కు తెరపడింది. మిగతా వారిలో అజ్మతుల్లా అర్ధ శతకం (50) చేయగా.. మహ్మద్ నబీ 21 పరుగులు చేశాడు. ఫలితంగా 44.2 ఓవర్లలో 218 పరుగులు చేసి అఫ్గాన్ ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో ప్రసిద్ కృష్ణ ఐదు వికెట్లతో చెలరేగగా.. గుర్నూర్, ప్రిన్స్, హర్ష్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.అఫ్గాన్ కెప్టెన్ సెంచరీఅఫ్గానిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది సెంచరీ సాధించాడు. 126 బంతుల్లో తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. స్కోరు: 217-9(44).తొమ్మిదో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్41.1: వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో హష్మతుల్లా సింగిల్కు వెళ్లగా ఫరీద్ రనౌట్ (0). స్కోరు: 206-9(41.2).ఎనిమిదో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్40.6: హర్ష్ దూబే బౌలింగ్లో.. హష్మతుల్లా షాహిది సింగిల్కు వెళ్లగా.. ఘజన్ఫర్ (1) రనౌట్ అయ్యాడు. స్కోరు: 206-8(41). ఫరీద్ మాలిక్ క్రీజులోకి వచ్చాడు.ఏడో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్40.3: హర్ష్ దూబే బౌలింగ్లో ప్రిన్స్ యాదవ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన రషీద్ ఖాన్ (5). స్కోరు: 206-7(40.3). హష్మతుల్లా 91 పరుగులతో ఆడుతున్నాడు.ఆరో వికెట్ డౌన్37.1: గుర్నూర్ బ్రార్ బౌలింగ్లో మహ్మద్ నబీ (21) బౌల్డ్. స్కోరు: 200-6(37.2). రషీద్ ఖాన్ క్రీజులోకి రాగా.. హష్మతుల్లా 89 పరుగులతో ఉన్నాడు.ఐదో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్28.2: ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో ప్రసిద్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన అజ్మతుల్లా (50). అజ్మతుల్లా అర్ధ శతకం27.3: వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో సింగిల్ తీసి అజ్ముతుల్లా ఒమర్జాయ్ హాఫ్ సెంచరీ (55 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. స్కోరు: 140-4(28). హష్ముతుల్లా 54 పరుగులతో ఆడుతున్నాడు. హష్మతుల్లా హాఫ్ సెంచరీ15.5: వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో సింగిల్ తీసి అర్ధ శతకం పూర్తి చేసుకున్న హష్మతుల్లా షాహిది. 64 బంతుల్లో యాభై పరుగుల మార్కు అందుకున్న కెప్టెన్. స్కోరు: 133-4(26). అజ్మతుల్లా 47 పరుగులతో ఆడుతున్నాడు.22 ఓవర్లకు అఫ్గాన్ స్కోర్: 108/422 ఓవర్లు ముగిసే సరికి అఫ్గానిస్తాన్ నాలుగు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ హస్మతుల్లా షాహిది(36), అజ్మతుల్లా ఓమర్జాయ్(36) ఉన్నారు.పదిహేను ఓవర్లలో అఫ్గానిస్తాన్ స్కోరు: 69-4(15)హష్మతుల్లా 17, అజ్మతుల్లా 18 పరుగులతో ఆడుతున్నారు.పవర్ ప్లేలో అఫ్గానిస్తాన్ స్కోరు: 37-4 (10)హష్మతుల్లా నాలుగు పరుగులతో ఉండగా.. అజ్మతుల్లా సున్నా పరుగుల వద్ద ఉన్నాడు.నాలుగో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్9.2: ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి అవుటైన డార్విష్ రసూలీ (1). అజ్మతుల్లా ఒమర్జాయ్ క్రీజులోకి రాగా.. హష్మతుల్లా షాహిది నాలుగు పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 36-4(9.3)మూడో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్7.2: ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన ఇబ్రహీం జద్రాన్ (11). స్కోరు: 28-3(7.2). డార్విష్ రసూలీ క్రీజులోకి రాగా.. హష్మతుల్లా ఇంకా పరుగుల ఖాతా తెరవనే లేదు.రెండో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్5.6: ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి రహ్మత్ షా (15 బంతుల్లో 5) రెండో వికెట్గా వెనుదిరిగాడు. స్కోరు: 26-2. జద్రాన్ 10 పరుగులతో ఉండగా.. కెప్టెన్ హష్మతుల్లా షాహిది క్రీజులోకి వచ్చాడు. ఐదు ఓవర్లలో అఫ్గాన్ స్కోరు: 22-1(5)రహ్మత్ ఒకటి, జద్రాన్ పది పరుగులతో క్రీజులో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన అఫ్గానిస్తాన్1.1: ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో తొలి వికెట్గా వెనుదిరిగిన రహ్మానుల్లా గుర్బాజ్ (5). క్రీజులోకి రహ్మత్ షా. స్కోరు: 5-1(1.2). ఇబ్రహీం జద్రాన్ ఇంకా పరుగుల ఖాతా తెరవలేదు.తుదిజట్లలో మార్పులుఈ సందర్భంగా కెప్టెన్ హష్మతుల్లా షాహిది మాట్లాడుతూ.. మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, జియా ఉర్ రహ్మాన్లు తిరిగి రాగా.. ఫరీద్ మాలిక్కు కూడా తుదిజట్టులో చోటు ఇచ్చినట్లు తెలిపాడు. రాహుల్పై వేటు!ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో భారత్ తమ తుదిజట్టులో మూడు మార్పులు చేసింది. కుల్దీప్ యాదవ్కు బదులు హర్ష్ దూబే రాగా.. అర్ష్దీప్ సింగ్, కేఎల్ రాహుల్ స్థానాల్లో ప్రసిద్ కృష్ణ, నితీశ్ కుమార్ రెడ్డి చోటు దక్కించుకున్నారు.సిరీస్ భారత్ కైవసంకాగా మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలుత ధర్మశాలలో అఫ్గాన్ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన భారత్.. లక్నో మ్యాచ్లో 170 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది. భారత వన్డే జట్టు కెప్టెన్గా శుబ్మన్ గిల్కు ఇదే తొలి సిరీస్ విజయం కావడం విశేషం.తుదిజట్లుభారత్యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్.అఫ్గానిస్తాన్రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), డార్విష్ రసూలీ, మొహమ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ఏఎమ్ ఘజన్ఫర్, జియా ఉర్ రహ్మాన్ షరీఫీ, ఫరీద్ అహ్మద్ మాలిక్. -
వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఏమన్నాడంటే..
శ్రీలంక, భారత్, అఫ్గానిస్తాన్ ‘ఎ’ జట్ల మధ్య ముక్కోణపు సిరీస్ తుది అంకానికి చేరుకుంది. భారత్- శ్రీలంక టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. దంబుల్లా వేదికగా ఆదివారం ఇరుజట్ల మధ్య సిరీస్లో ఆఖరి అనధికారిక వన్డే సిరిస్ జరుగనుంది.ఈ నేపథ్యంలో శ్రీలంక- ‘ఎ’ జట్టు కెప్టెన్ సహాన్ అరాచిగే భారత స్టార్ వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. తాము ఫైనల్లో అతడిని టార్గెట్ చేయబోమని స్పష్టం చేశాడు. కాగా శ్రీలంక- భారత్ జట్ల మధ్య సోమవారం జరిగిన మ్యాచ్ ‘టై’ కాగా.. సూపర్ ఓవర్ నిర్వహించారు.ఇందులో శ్రీలంక విజయం సాధించగా.. ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. ఈ క్రమంలోనే లంక ప్లేయర్ కవ్వింపు చర్యలకు దిగగా.. వైభవ్ సూర్యవంశీ అతడి మీదకు దూసుకువెళ్లాడు. ఆ తర్వాత ఇద్దరూ పరస్పరం నెట్టేసుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. అంపైర్ వచ్చి ఆటగాళ్లను విడదీశాడు.ఈ ఘటన నేపథ్యంలో లంక ప్లేయర్తో పాటు వైభవ్కూ మొట్టికాయలు పడ్డాయి. ఇక ఫైనల్లో ఇరుజట్లు మరోసారి తలపడనున్న తరుణంలో వైభవ్ సూర్యవంశీ ఆట తీరు, అతడి ప్రవర్తనపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది.ఈ విషయం గురించి శ్రీలంక కెప్టెన్ సహాన్ అరాచిగే వద్ద స్పోర్ట్స్స్టార్ ప్రస్తావించగా.. ‘‘మా వాళ్లు ఎవరినీ, ఏ విషయాన్ని ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకోరు. మా ఆటను మేము ఆస్వాదిస్తున్నాము. సూపర్ ఓవర్ లాంటి సందర్భాల్లో ఆటగాళ్లు భావోద్వేగాలకు లోనుకావడం సహజం. ఆటలో ఇలాంటివి సాధారణం’’ అని స్పష్టం చేశాడు.ఇక భారత్తో ఫైనల్కు తాము పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నామన్న అరాచిగే.. ‘‘బ్యాటింగ్ విషయంలో మాకు ఎలాంటి సమస్యా లేదు. మా బౌలింగ్ విభాగంలో ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు మెరుగ్గా రాణిస్తున్నారు. మా జట్టు బాగుంది’’ అని పేర్కొన్నాడు. భారత్తో పోటీ కోసం తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.కాగా లీగ్ దశలో తొలుత శ్రీలంకపై భారత్ ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కగా.. రెండో మ్యాచ్లో లంక సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఇక ఇరుజట్లు అఫ్గానిస్తాన్పై గెలుపుతో ఫైనల్లో అడుగుపెట్టాయి. చదవండి: శ్రీలంక ఫైనల్ చేరిందిలా! -
నోరు మూసుకున్నందుకు రెడ్కార్డ్.. ఫిఫా చరిత్రలోనే తొలిసారి!
ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరిస్తున్న ఫిఫా ప్రపంచకప్ టోర్నీ వివాదాలకు కూడా కేంద్రబిందువుగా మారుతోంది. తాజాగా శనివారం పరాగ్వే, తుర్కియో మ్యాచ్ సందర్భంగా పర్వాగ్వే మిడ్ఫీల్డర్ మిగ్యుల్ అల్మిరాన్ చేతితో నోరును మూసుకున్నాడన్న కారణంతో రిఫరీ రెడ్కార్డ్ చూపించడం చర్చనీయాంశంగా మారింది.ఫిఫాలో ఈసారే ప్రవేశపెట్టిన ఈ కొత్త రూల్ ఇప్పుడు హైలైట్గా నిలిచింది. విషయంలోకి వెళితే.. మ్యాచ్లో ఫౌల్ అనంతరం తుర్కియో డిఫెండర్ మెర్ట్ ముల్దర్తో పరాగ్వే ఫార్వర్డ్ ఆటగాడు ఇసిడ్కో పిట్టా వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుండగానే ఇరుజట్ల ఆటగాళ్లు గుంపుగా వచ్చేశారు. ఈ సమయంలో జట్టుకు కాస్త దూరంలో ఉన్న అల్మిరాన్ ముల్దర్తో మాట్లాడుతూ నోటికి చేతిని అడ్డుపెట్టాడు. అల్మిరాన్ చర్య పట్ల తుర్కియే డిఫెండర్ రిఫరీకి ఫిర్యాదు చేశాడు. వీఏఆర్ (Video Assistant Referee) ద్వారా మ్యాచ్ అధికారులు వీడియోను మరోసారి పరిశీలించారు. రిప్లేలో అల్మిరాన్ తన నోరును మూసుకున్నట్లు తేలడంతో రిఫరీ బార్డన్ వెంటనే అతడికి రెడ్ కార్డ్ చూపించాడు. దీంతో పరాగ్వే జట్టు 10 మందితోనే మిగతా మ్యాచ్ ఆడాల్సి వచ్చింది.ఫిఫా తెచ్చిన కొత్త రూల్ ఏంటంటే?2026 ఫిఫా ప్రపంచకప్లో ఫిఫా కొత్త రూల్ను తీసుకొచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా మైదానంలోనే దుర్భాషకు దిగడం లేదా వివక్షపూరిత వ్యాఖ్యలు చేయడం నిషేధం. ఇదే నిబంధన ప్రకారం ప్రత్యర్థి జట్టుతో ఘర్షణ జరిగిన సమయంలో సదరు ఆటగాడు చేతితో లేదా భుజంతో లేదా చొక్కాతో నోరు మూసుకుంటే అతడికి రెడ్ కార్డ్ చూపించవచ్చు. మ్యాచ్ అధికారులకు తెలియకుండా ఆటగాళ్లు చేసే వ్యాఖ్యలు దాచిపెట్టకుండా నిరోధించడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. అయితే ఈ నిబంధన కేవలం ఫిఫాకు మాత్రమే పరిమితమని, క్లబ్ మ్యాచ్లు, స్నేహపూర్వక సంభాషణ సమయంలో ఒక ఆటగాడు ఇలాంటి చర్యలకు పాల్పడితే రెడ్కార్డ్ చూపడం జరగదని ఫిఫా నిర్వాహకులు తెలిపారు.బోణీ కొట్టిన పరాగ్వే అల్మిరాన్ రెడ్కార్డ్కు గురవ్వడంతో పదిమందితోనే ఆడిన పరాగ్వే 1-0తో తుర్కియేపై విజయం సాధించి ఫిఫాలో బోణీ కొట్టింది. అల్మిరాన్ రెడ్కార్డ్కు గురవ్వడంతో అతడు కొట్టిన గోల్ చెల్లదు. మరో గోల్ను మటియస్ గాల్జా (ఆట 2వ నిమిషంలో) జట్టుకు అందించాడు. ఈ క్రమంలో గాల్జా ఫిఫా ప్రపంచకప్లో ఫాస్టెస్ట్ గోల్ నమోదు చేశాడు. 65 సెకన్ల వ్యవధిలోనే గాల్జా బంతిని గోల్పోస్ట్లోకి పంపించాడు. ఇవాళ ఉదయం మొరాకో ఆటగాడు ఇస్మాయిల్ సైబారి 72 సెకన్ల వ్యవధిలో కొట్టిన గోల్ రికార్డు గంటల వ్యవధిలోనే బద్దలు కావడం గమనార్హం. 🚨| SHOCKING MOMENT AT THE FIFA WORLD CUP! 🤯🌎Miguel Almirón became the first player ever to be sent off for 𝐂𝐎𝐕𝐄𝐑𝐈𝐍𝐆 his mouth while speaking to an opposition player during a confrontation. 😳🟥 pic.twitter.com/Y8TYL7sISL— FÚTBOL HUB (@futbol_hubX) June 20, 2026 -
‘నాపై దేశద్రోహి ముద్ర’.. గంభీర్పై శ్రీశాంత్ ఆరోపణలు
టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ లల్లన్టాప్కు ఇచ్చిన ఇంటర్య్వూలో తన మాటలతో సంచలనాల పరంపరకు తెరతీశాడు. శుక్రవారం మాజీ స్పిన్నర్ హర్భజన్కు సవాల్ విసిరిన శ్రీశాంత్, ఆ తర్వాత గంభీర్ కోచ్గా పనికిరాడని, అతడి స్థానంలో మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనిని మెంటార్ లేదా కోచ్గా ఎంపిక చేయాలని పేర్కొన్నాడు. తాజాగా గంభీర్పై మరోసారి సంచలన ఆరోపణలు చేశాడు. 2023లో లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ సందర్భంగా గంభీర్ తనను దేశద్రోహి అని తిట్టినట్లు శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. లల్లన్టాప్కు ఇచ్చిన ఇంటర్య్వూలోనే శ్రీశాంత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. శ్రీశాంత్ మాట్లాడుతూ.. ‘2023 లెజెండ్ లీగ్ టోర్నీలో మేమిద్దరం ప్రత్యర్థులుగా ఆడాము. నేను వేసిన తొలి బంతినే గంభీర్ ఫ్లిక్ షాట్ ఆడేందుకు ముందుకు వచ్చాడు. అయితే అతడి గేమ్ ఏంటో నాకు తెలుసు. ఆ వెంటనే నేను బౌన్సర్ను సంధించాను. ఆ సమయంలోనే గంభీర్ నన్ను ఒక ఫిక్సర్గా పిలిచాడు. దీంతో గంభీర్ దగ్గరకు వచ్చి భయ్యా నువ్వు బాగానే ఉన్నావా? అని అడిగాను. ఎందుకంటే నేను వేసిన బౌన్సర్ అతడికి తాకింది. కానీ గంభీర్ మాత్రం ఒక అసభ్య పదజాలం వాడడంతో పాటు మళ్లీ ఒకసారి ఫిక్సర్, దేశద్రోహి అని పిలిచాడు’ అని శ్రీశాంత్ పేర్కొన్నాడు.2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్కప్ గెలిచిన టీమిండియా జట్టులో గంభీర్,శ్రీశాంత్ సభ్యులుగా ఉండడం విశేషం. అయితే క్రికెట్ నుంచి దూరమైన తర్వాత ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో శ్రీశాంత్పై నిషేధం పడిన సమయంలో గంభీర్ అతడిని ఉద్దేశించి పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఏడేళ్ల నిషేధం తర్వాత 2020లో శ్రీశాంత్ మళ్లీ రీఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆకట్టుకోలేక ఆటకు వీడ్కోలు పలికాడు. ఆటకు గుడ్బై చెప్పిన గంభీర్ టీమిండియా హెడ్ కోచ్గా వచ్చాడు. అతడి పర్యవేక్షణలో టీమిండియా 2025 చాంపియన్స్ ట్రోఫీతో పాటు 2026 టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకుంది.Read: రోహిత్, కోహ్లీ భవితవ్యంపై బీసీసీఐ స్పందన! -
మెస్సీపై ఫిఫాకు ఫిర్యాదు.. అర్జెంటీనా చీట్ చేసిందా?
ఫిఫా ప్రపంచకప్లో అల్జీరియాపై విజయంతో జోష్ మీదున్న అర్జెంటీనాకు ఊహించని షాక్ ఎదురైంది. రిఫరీ పూర్ అంపైరింగ్ కారణంగా తాము మ్యాచ్ ఓడిపోయామంటూ అల్జీరియా ఫిఫాకు ఫిర్యాదు చేసింది. ఈ మ్యాచ్లోనే లియోనల్ మెస్సీ హ్యాట్రిక్ గోల్స్తో మెరిసిన సంగతి తెలిసిందే. అయితే మెస్సీ మ్యాచ్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాడని కూడా అల్జీరియా తన ఫిర్యాదులో పేర్కొంది. తమ జట్టు ఆటగాడిని ఉద్దేశపూర్వకంగానే కిందపడేసినప్పటికీ మెస్సీకి రిఫరీ రెడ్కార్డ్ జారీ చేయకపోవడం తమకు ఆశ్చర్యం కలిగించిందని అల్జీరియా పేర్కొంది.రాయిటర్స్ కథనం ప్రకారం మ్యాచ్ సరైన రీతిలో జరగలేదంటూ మ్యాచ్లో జరిగిన తప్పిదాలను హైలైట్ చేస్తూ ఫిఫా రిఫరీయింగ్ కమిషన్కు ఫిర్యాదు లేఖను అందించింది. లేఖలో పేర్కొన్న ప్రకారం.. ‘ఆట మొదటి అర్ధభాగంలో అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ ఉద్దేశపూర్వకంగానే అల్జీరియా కెప్టెన్ ఐస్సా మాండీ పిక్కపై కాలు వేసి అతడి పడిపోయేటట్లుగా చేయడం కనిపించింది. ఆ తర్వాత వెనక నుంచి మెస్సీ తన కాలి బూటుతో మాండీని తన్నినట్లు కూడా తెలుస్తోంది. మెస్సీకి రెడ్కార్డ్ ఇచ్చి మైదానం నుంచి బయటికి పంపాలని తాము డిమాండ్ చేసినప్పటికీ, మ్యాచ్కు రిఫరీగా వ్యవహరించిన పోలండ్కు చెందిన సైమన్ మార్సినియాక్ మెస్సీపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు. ఇక రెండో అర్ధభాగంలో అర్జెంటీనా మిడ్ఫీల్డర్ అలెక్సిస్మాక్ అల్లిస్టర్ తమ జట్టు ఆటగాడు ఇబ్రహీం మజాపై మోచేతితో దాడి చేసినట్లు అల్జీరియా లేఖలో ఆరోపించింది. ఈ దాడి పట్ల కూడా రిఫరీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తమకు ఆశ్చర్యం కలిగించింది. మ్యాచ్ మొత్తంలో రిఫరీ అర్జెంటీనాకు సానుకూలంగా ఉన్నారని, ఆయన తప్పిదాల వల్లే ఇవాళ అర్జెంటీనా మ్యాచ్లో విజయం సాధించింది. వెంటనే మెస్సీతో పాటు రిఫరీపై యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం.’ అని ఫిర్యాదులో పేర్కొంది. అయితే అర్జెంటీనా, అల్జీరియా మ్యాచ్కు రిఫరీగా వ్యవహరించిన సైమన్ మార్సినియాక్ 2022 ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్కు కూడా రిఫరీగా వ్యవహరించడం గమనార్హం. ఆనాటి ఫైనల్లో అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్లో ఫ్రాన్స్ను ఓడించి జగజ్జేతగా నిలిచింది. చదవండి: రోహిత్, కోహ్లీ భవితవ్యంపై బీసీసీఐ స్పందన! -
రోహిత్, కోహ్లీ భవితవ్యంపై బీసీసీఐ స్పందన!
వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో టీమిండియా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆ మెగాటోర్నీలో ఆడతారా లేదా అన్న దానిపై బీసీసీఐ కీలక అప్డేట్ ఇచ్చింది. 2027 వన్డే ప్రపంచకప్ చర్చకు వస్తే ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్ల పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే టెస్టు, టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికిన రోహిత్, కోహ్లీలు ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నారు. 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత ఈ ఇద్దరు ఆటకు పూర్తిగా వీడ్కోలు పలుకుతారనే వార్తలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే తాజాగా బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా పీటీఐకి ఇంటర్వ్యూ ఇస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. 2027 వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియా రోడ్మ్యాప్ను రూపొందిస్తున్నామని, ఈ ప్రయాణంలో కొంతమంది ఆటగాళ్లకు అవకాశాలు లభించకపోవచ్చని పేర్కొన్నారు. సైకియా మాటలను బట్టి చూస్తే జట్టులో సీనియర్లుగా చెలామణి అవుతున్న రోహిత్, కోహ్లీలను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు ఉన్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే రోహిత్, కోహ్లీ వన్డే ప్రపంచకప్ వరకు జట్టులో కొనసాగుతారా లేదా అన్నదానిపై సెలెక్షన్ కమిటీ హెడ్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. నిజానికి కోహ్లి, రోహిత్లు మంచి ఫామ్లో ఉన్నప్పటికీ సైకియా వ్యాఖ్యలు సమాధానం కంటే ప్రశ్నలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.గంభీర్, అగార్కర్ల మాదిరిగానే, రోహిత్, కోహ్లీల 2027 ప్రపంచ కప్ అవకాశాలపై సైకియా కూడా స్పష్టమైన వైఖరిని వెల్లడించలేదు. ఈ విషయంపై బీసీసీఐ ఏమైనా అంతర్గత చర్చలు జరిపిందా అని అడగ్గా, ఇది ప్రాథమికంగా కొనసాగుతున్న ప్రక్రియ అని, ఇందులో భాగస్వాములందరూ తమ అభిప్రాయాలలో ఏకీభవిస్తున్నారని సైకియా అన్నారు. 'మాది చాలా సమన్వయంతో కూడిన బృందం, ఇందులో చాలా మంది నిపుణులు ఉన్నారు. సంబంధిత వర్గాలన్నింటినీ కలుపుకొని వెళ్తాము. ఏ నిర్ణయాలలోనైనా క్రికెట్ కమిటీ, సెలెక్టర్లు, సహాయక సిబ్బంది, ప్రధాన కోచ్, సంబంధిత ఆటగాళ్లతో సహా ఇతర భాగస్వాములందరూ పాలుపంచుకుంటారు.క్రమం తప్పకుండా సంభాషణలు జరుగుతున్నాయి. అందువల్ల, మనకు ప్రత్యేక సంప్రదింపుల సమావేశం అవసరం లేదు. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ' అని సైకియా పేర్కొన్నారు. ప్రస్తుతం రోహిత్ శర్మ అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్లో ఆడుతుండగా, కోహ్లీ గాయంతో సిరీస్కు దూరమయ్యాడు. -
ఫిఫా క్రేజ్: చూస్తే కిక్ రాదు.. అసలు మజా అందులోనే!
భారత్లో ఫుట్బాల్ క్రేజ్ మామూలుగా లేదిప్పుడు. ఫిఫా వరల్డ్కప్ నేపథ్యంలో.. ఐపీఎల్ తరహా సందడి వాతావరణం కనిపిస్తోంది. హోటళ్లు, పబ్లు, స్పోర్ట్స్ బార్లు అభిమానులతో కిక్కిరిసిపోతున్నాయి. మెస్సీ, రొనాల్డో, ఎంబాప్పే, యమాల్ వంటి స్టార్ ఆటగాళ్ల అభిమానులు తెరపైకి వచ్చేశారు. అయితే మ్యాచ్ జరిగేటప్పుడు కామెంటేటర్లు తరచూ వాడే పదాలకు చాలామందికి అర్థం మాత్రం తెలియదు. క్రికెట్ను కామెంటరీతో ఏలాగైతే ఆస్వాదిస్తామో.. ఫుట్బాల్ను మరింత ఆస్వాదించాలంటే ముందుగా ఆ ఆటలో వాడే కొన్ని పదాలను అర్థం చేసుకోవాల్సిందే.గోల్ (Goal).. ఫుట్బాల్లో అత్యంత ముఖ్యమైన పదం ఇదే. బంతి పూర్తిగా గోల్పోస్టుల మధ్య, క్రాస్బార్ కిందుగా గోల్లైన్ను దాటితే గోల్గా పరిగణిస్తారు. ఎక్కువ గోల్స్ చేసిన జట్టు విజేతగా నిలుస్తుంది.ఆఫ్సైడ్ (Offside).. ఫుట్బాల్లో అత్యంత క్లిష్టమైన నిబంధనగా దీన్ని భావిస్తారు. ఆటగాడు బంతి అందుకునే సమయంలో ప్రత్యర్థి జట్టు చివరి డిఫెండర్ కంటే ముందుంటే, అలాగే ఆటలో ప్రభావం చూపితే ఆఫ్సైడ్గా ప్రకటిస్తారు. గోల్ చేసినా అది చెల్లదు. చాలా వివాదాలు, వీఏఆర్ సమీక్షలు ఎక్కువగా ఈ నిబంధన చుట్టూనే తిరుగుతుంటాయి.పెనాల్టీ (Penalty).. పెనాల్టీ బాక్స్లో డిఫెండర్ ఫౌల్ చేస్తే రిఫరీ పెనాల్టీ ఇస్తాడు. అప్పుడు బంతిని పెనాల్టీ స్పాట్పై ఉంచి ఒక ఆటగాడు నేరుగా గోల్పై షాట్ కొట్టే అవకాశం పొందుతాడు. ఫుట్బాల్లో గోల్ చేసే అత్యుత్తమ అవకాశాల్లో ఇది ఒకటి.ఫ్రీ కిక్ (Free Kick).. ఫౌల్ జరిగినప్పుడు ప్రత్యర్థి జట్టుకు లభించే అవకాశం. డైరెక్ట్ ఫ్రీ కిక్.. నేరుగా గోల్ కొట్టవచ్చు. ఇన్డైరెక్ట్ ఫ్రీ కిక్.. మరో ఆటగాడు బంతిని తాకిన తర్వాత మాత్రమే గోల్ చెల్లుతుంది.హ్యాట్రిక్ (Hat-trick).. ఒకే మ్యాచ్లో ఒక ఆటగాడు మూడు గోల్స్ చేస్తే దానిని హ్యాట్రిక్ అంటారు. మెస్సీ, రొనాల్డో, హ్యారీ కేన్, ఎర్లింగ్ హాలాండ్ వంటి స్టార్లు అనేక హ్యాట్రిక్లు సాధించారు అని తరచూ వింటుటాం కదా!.క్లీన్ షీట్ (Clean Sheet).. గోల్కీపర్ లేదా జట్టు ప్రత్యర్థికి ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా మ్యాచ్ను ముగిస్తే దాన్ని క్లీన్ షీట్ అంటారు. డిఫెండర్లు, గోల్కీపర్లకు ఇది ప్రతిష్టాత్మక గణాంకం.వీఏఆర్ (Video Assistant Referee).. ఫుట్బాల్ మ్యాచ్కి రివ్యూలాంటిది. మైదానంలో రిఫరీ తీసుకున్న నిర్ణయాన్ని వీడియోల ద్వారా పరిశీలించే వ్యవస్థ. ఇందులో.. గోల్ చెల్లుతుందా?, పెనాల్టీ సరైందా?.. రెడ్ కార్డ్ ఇవ్వాలా? ఈ తరహా కీలక నిర్ణయాల్లో వీఏఆర్ ఉపయోగిస్తారు.యెల్లో కార్డ్ – రెడ్ కార్డ్.. యెల్లో కార్డ్.. ఆటగాడికి హెచ్చరికగా ఇస్తారు. రెడ్ కార్డ్.. ఆటగాడిని వెంటనే మైదానం నుంచి పంపిస్తారు. ఆ జట్టు మిగతా మ్యాచ్ను ఒక ఆటగాడు తక్కువతో ఆడాల్సి ఉంటుంది.ఎక్స్ట్రా టైమ్ (Extra Time).. నాకౌట్ మ్యాచ్ల్లో నిర్ణీత 90 నిమిషాల తర్వాత స్కోరు సమంగా ఉంటే అదనంగా 30 నిమిషాలు ఆడిస్తారు.పెనాల్టీ షూటౌట్ (Penalty Shootout).. ఎక్స్ట్రా టైమ్ తర్వాత కూడా ఫలితం తేలకపోతే రెండు జట్లు పెనాల్టీల ద్వారా విజేతను నిర్ణయిస్తాయి. వరల్డ్కప్లలో ఎన్నో చారిత్రక మ్యాచ్లు ఇలాగే ముగిశాయి.కార్నర్ కిక్ (Corner Kick).. ప్రత్యర్థి ఆటగాడు బంతిని తన గోల్లైన్ దాటి బయటకు పంపితే దాడి చేస్తున్న జట్టుకు కార్నర్ లభిస్తుంది. ఇవి తరచూ గోల్స్కు దారితీస్తుంటాయి.థ్రో-ఇన్ (Throw-in).. బంతి సైడ్లైన్ దాటి బయటకు వెళ్తే చేతులతో మైదానంలోకి విసిరే విధానాన్ని థ్రో-ఇన్ అంటారు.ఎక్స్జీ(xG) అంటే.. Expected Goals (xG) అనే ఆధునిక గణాంకం ఇప్పుడు బాగా ప్రాచుర్యంలో ఉంది.ఒక షాట్ గోల్గా మారే అవకాశాన్ని శాతం రూపంలో కొలుస్తుంది. జట్టు ఎలా ఆడిందో అంచనా వేయడానికి దీనిని ఉపయోగిస్తారు.డర్బీ (Derby).. ఒకే నగరం లేదా ప్రాంతానికి చెందిన రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ను డర్బీ అంటారు. ఉదాహరణకు.. రియల్ మాడ్రిడ్-అట్లెటికో మాడ్రిడ్, అలాగే.. ఏసీ మిలాన్ వర్సెస్ ఇంటర్ మిలాన్ ఇలాగన్నమాట.ట్రెబుల్ (Treble).. ఒకే సీజన్లో లీగ్, దేశీయ కప్, ఖండాంతర టోర్నీ గెలిస్తే ట్రెబుల్ అంటారు. ఇది ఫుట్బాల్లో అత్యంత అరుదైన ఘనతల్లో ఒకటి.ఫుట్బాల్ కేవలం 22 మంది ఆటగాళ్లు బంతి వెంట పరుగెత్తే ఆట కాదు. దానికి సొంత భాష, సొంత వ్యూహాలు, సొంత పదజాలం ఉన్నాయి. "ఆఫ్సైడ్" ఎందుకు ఇచ్చారు? "వీఏఆర్" ఎందుకు జోక్యం చేసుకుంది? "క్లీన్ షీట్" అంటే ఏమిటి? వంటి విషయాలు అర్థమైతే మ్యాచ్ చూడటంలోనే కాదు.. చర్చల్లో పాల్గొనడంలోనూ మజా పెరుగుతుంది. ప్రపంచ ఫుట్బాల్ను ప్రేమించే భారతీయులు పెరుగుతున్న ఈ సమయంలో.. ఆ ఆటకు సంబంధించిన భాషను నేర్చుకోవడం కూడా అంతే ముఖ్యమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. -
బోణీ కొట్టిన బ్రెజిల్.. నాకౌట్కు అడుగు దూరంలో!
ఫిఫా ప్రపంచకప్ 2026లో మాజీ చాంపియన్ బ్రెజిల్ బోణీ కొట్టింది. మొరాకోతో జరిగిన తొలి మ్యాచ్ను డ్రాగా ముగించిన బ్రెజిల్ శనివారం హైతీతో మ్యాచ్లో 3-0తో ఘన విజయాన్ని అందుకుంది. బ్రెజిల్ తరఫున మాథ్యూస్ కుహా (ఆట 23, 36వ నిమిషాలు) గోల్స్ చేయగా, స్టార్ ప్లేయర్ వినిసియస్ జూనియర్ హాఫ్ టైమ్ ముందు (45+3వ నిమిషం) గోల్ చేశాడు. రెండో హాఫ్లో ఇరుజట్లు గోల్ చేయడంలో విఫలమయ్యాయి. అయితే రెండో సగంలో బ్రెజిల్ పలుమార్లు హైతీ గోల్ పోస్టుపై దాడులు చేసినప్పటికీ ఆ జట్టు గోల్ కీపర్ వాటిని సమర్థంగా అడ్డుకున్నాడు. ఈ విజయంతో నాలుగు పాయింట్లు ఖాతాలో వేసుకున్న బ్రెజిల్ పట్టికలో తొలి స్థానంలో కొనసాగుతుంది. తదుపరి రౌండ్ (రౌండ్ ఆఫ్ 32)కు అర్హత సాధించేందుకు బ్రెజిల్ అడుగుదూరంలో నిలిచింది.ఇక ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో ఒక మ్యాచ్లో మూడు గోల్స్ అంతకంటే ఎక్కువ కొట్టడం బ్రెజిల్కు ఇది 41వ సారి కావడం విశేషం. బ్రెజిల్ తర్వాత జర్మనీ (36 సార్లు) మాత్రమే అత్యధికంగా మూడు గోల్స్ కొట్టిన సందర్భాలున్నాయి. ఇక బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నెయ్మర్ జూనియర్ ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. గాయంతో బాధపడుతున్న నెయ్మర్ లీగ్ దశలో ఈ నెల 24న స్కాట్లాండ్తో చివరి మ్యాచ్కు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. నెయ్మర్ లేకున్నా తాము విజయం సాధించగలమని బ్రెజిల్ జట్టు నిరూపించింది.FIM DE JOGO NA FILADÉLFIA!🇧🇷3-0🇭🇹⚽️ Cunha⚽️ Cunha⚽️ Vini JrMAIS TRÊS PONTOS PARA O BRASIL! 🇧🇷🏆A Seleção Brasileira vence o Haiti e segue firme na busca pela classificação às oitavas de final da Copa do Mundo FIFA 2026.Próximo desafio: Escócia, na quarta-feira (24),… pic.twitter.com/1O9j8tG5LU— brasil (@CBF_Futebol) June 20, 2026చదవండి: దెబ్బతిన్న పులిలా రొనాల్డో.. ఆ మెరుపులెక్కడ? -
దెబ్బతిన్న పులిలా రొనాల్డో.. ఆ మెరుపులెక్కడ?
రెండు దశాబ్దాలకు పైగా క్రిస్టియానో రొనాల్డో ఫుట్బాల్ను ఏలుతున్నాడు. తనపై విమర్శలు వచ్చిన ప్రతీసారి అవి తప్పని నిరూపిస్తూ తన కెరీర్ను నిర్మించుకుంటూ వచ్చాడు ఈ పోర్చుగల్ స్టార్. విమర్శలు వచ్చిన ప్రతీసారి తన గోల్స్తో సమాధానమిచ్చాడు. అతని కెరీర్ సుదీర్ఘకాలం కొనసాగుతుందా అనే సందేహాలు తలెత్తిన ప్రతిసారీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూనే వస్తున్నాడు. మాంచెస్టర్ నుంచి మాడ్రిడ్ వరకు, టురిన్ నుంచి రియాద్ వరకు, తన జాతీయ జట్టు పోర్చుగల్ తరఫున అసాధారణ కెరీర్తో రొనాల్డో పదేపదే అంచనాలను తిరగరాశాడు. ఒక్క ఫిఫా ప్రపంచకప్ సాధించలేదన్న వెలితి తప్ప మిగతా రికార్డులన్నీ రొనాల్డో ఎప్పుడో సాధించేశాడు.ఇక అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఫిఫా ప్రపంచకప్లో మాత్రం రొనాల్డో అంచనాలు అందుకోలేకపోతున్నాడు. తన సమకాలీన ఆటగాళ్లైన మెస్సీ, ఎంబాపె, ఎర్లింగ్ హాలండ్, లామినే యమాలా, హ్యారీ కేన్ వంటి స్టార్లు తమ దేశాల తరఫున తొలి మ్యాచ్లోనే అదరగొట్టి గోల్స్ కొట్టడంతో జట్టుకు విజయం అందించడంలో సహాయపడ్డారు. కానీ పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో మాత్రం ఇప్పటివరకు ఖాతా తెరవలేదు. ఫిఫా ప్రపంచకప్లో పోర్చుగల్ తమ తొలి మ్యాచ్ కాంగోతో ఆడింది. ఈ మ్యాచ్లో 90 నిమిషాల పాటు మైదానంలో ఉన్న రొనాల్డో ఒక్క గోల్ కొట్టలేకపోయాడు. అంతేకాదు ఇతర ఆటగాళ్లకు కనీసం పాస్ కూడా అందించడంలో విఫలమయ్యాడు. దీంతో రొనాల్డో ఫామ్పై ప్రశ్నలు, విమర్శలు మొదలయ్యాయి.ఆ ప్రశ్నలన్నింటికీ రొనాల్డో కూడా సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చేసింది. రికార్డు స్థాయిలో ఆరో ఫిఫా ప్రపంచకప్ ఆడుతున్న రొనాల్డో కాంగోతో మ్యాచ్లో కేవలం బంతిని 25సార్లు మాత్రమే టచ్ చేశాడు. ప్రతీ ఫిఫాతో పోల్చుకుంటే ఈసారి రొనాల్డో ప్రదర్శన అత్యల్పం. కేవలం మూడు సందర్భాల్లో మాత్రమే షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. మ్యాచ్లో మొత్తంగా 25 టచ్లు, రెండు ప్రోగ్రెసివ్ క్యారీ, రెండు ప్రోగ్రెసివ్ పాస్లు, రెండు ఏరియల్ డ్యూయల్స్ పాస్లు ఆడాడు. వయసు కూడా రొనాల్డోకు అడ్డంకిగా మారినట్లు అనిపిస్తోంది. తన కంటే వయసులో రెండేళ్లు చిన్నవాడైన మెస్సీ మాత్రం మైదానంలో పాదరసంలా కదులుతుంటే రొనాల్డో మాత్రం పరిగెత్తడానికి కూడా ఇబ్బంది పడినట్లు కాంగోతో మ్యాచ్లో కనిపించింది. 2006లో తొలి ఫిఫా ఆడిన సమయంలో రొనాల్డో వయసు 21 ఏళ్లు. 2026 నాటికి అతడి వయసు 41 ఏళ్లు. ఈ 20 ఏళ్లలో ఆరు ఫిఫా ప్రపంచకప్లు ఆడిన రొనాల్డో మొత్తంగా 8 గోల్స్ కొట్టాడు. రష్యా వేదికగా జరిగిన 2018 ఫిఫాలో రొనాల్డో అత్యధికంగా నాలుగు గోల్స్ కొట్టడం విశేషం. పోర్చుగల్ ఆడిన గత నాలుగు మ్యాచ్ల్లో రొనాల్డో 396 నిమిషాలు మైదానంలో గడిపాడు. కానీ ఆ జట్టు మాత్రం కేవలం ఒక్క గోల్ మాత్రమే చేయడం గమనార్హం. ఈ గణాంకాలు రొనాల్డో ఫామ్నే కాదు జట్టును కూడా ఇబ్బందుల్లోకి నెట్టేసినట్లుగా అనిపిస్తోంది. గతంలో తనపై విమర్శలు వచ్చిన ప్రతీసారి ఆటతోనే సమాధానం చెప్పిన రొనాల్డో మరోసారి అదే ఆటతో ప్రపంచం మొత్తం తనను ప్రశంసించేలా చేసుకోవాలని ఆశిద్దాం.Read: ఫిఫా చరిత్రలోనే ఫాస్టెస్ట్ గోల్.. మొరాకోదే విజయం -
హెన్రీల చేతిలో ఇంగ్లండ్కు చావుదెబ్బ.. కివీస్కు భారీ ఆధిక్యం
ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టు నుంచి ఓటమి పాఠాలు నేర్చుకున్న న్యూజిలాండ్ రెండో టెస్టులో మాత్రం దూకుడు ప్రదర్శిస్తోంది. ఓవల్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ తమ రెండో ఇన్నింగ్స్లో భారీ స్కోరు దిశగా సాగుతుంది. మూడోరోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 56 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. హెన్రీ నికోల్స్ (164 బంతుల్లో 119 బ్యాటింగ్; 16 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించగా, డారిల్ మిచెల్ (32 బ్యాటింగ్) అతడికి సహకరిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని న్యూజిలాండ్ ఇప్పటివరకు 352 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండడంతో కివీస్ విజయం ఖాయంగా కనిపిస్తోంది. అంతకముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 291 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఎమిలియో గే (53), డెబ్యూ ఆటగాడు మాథ్యూ ఫిషర్ (50 నాటౌట్) అర్థసెంచరీలు చేయగా, కెప్టెన్ రూట్ (46) పర్వాలేదనిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మాట్ హెన్రీ 5 వికెట్లతో చెలరేగగా, విలియమ్ రూర్కీ 2, కైల్ జేమీసన్, నాథన్ స్మిత్ చెరొక వికెట్ తీశారు. దీంతో తొలుత మాట్ హెన్రీ తన బౌలింగ్తో ఇంగ్లండ్ బ్యాటర్లను చెడుగుడు ఆడుకుంటే.. ఆ తర్వాత మరో హెన్రీ (హెన్రీ నికోల్స్) ఇంగ్లండ్ బౌలర్ల భరతం పట్టి సెంచరీతో మెరిశాడు. ఈ లెక్కన ఇద్దరు హెన్రీల (మాట్ హెన్రీ, హెన్రీ నికోల్స్) చేతుల్లో ఇంగ్లండ్ చావుదెబ్బ తిన్నట్లయింది. ఇక న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 391 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. గ్లెన్ ఫిలిప్స్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో కివీస్కు వంద పరుగుల ఆధిక్యం లభించింది. తొలి టెస్టులో న్యూజిలాండ్ 115 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. Read: ఫిఫా చరిత్రలోనే ఫాస్టెస్ట్ గోల్.. మొరాకోదే విజయం -
ఫిఫా చరిత్రలోనే ఫాస్టెస్ట్ గోల్.. మొరాకోదే విజయం
ఫిఫా ప్రపంచకప్ 2026లో మొరాకో జట్టు తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. గ్రూప్-సిలో భాగంగా శనివారం స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో మొరాకో 1-0 తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో నాలుగు పాయింట్లు ఖాతాలో వేసుకున్న మొరాకో నాకౌట్ దశకు ఒక అడుగు దూరంలో నిలిచింది. మొరాకో తరఫున ఇస్మాయిల్ సైబారి మ్యాచ్ మొదలైన రెండో నిమిషంలోనే గోల్ కొట్టాడు. అయితే 71 సెకన్ల వ్యవధిలో సైబారి గోల్ కొట్టడం విశేషం. తద్వారా ఫిఫా చరిత్రలో ఇస్మాయిల్ సైబారి కొట్టిన గోల్ అత్యంత వేగవంతమైనదిగా రికార్డులకెక్కింది. బోస్టన్లోని గిల్లెట్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్కు 64,146 మంది అభిమానుల సమక్షంలో సైబారి కళ్లు మూసి తెరిచేలోపు ఎడ్జ్ నుంచి బంతిని నేరుగా గోల్పోస్ట్లోకి తరలించడం విశేషం. గత వారం మాజీ చాంపియన్స్ బ్రెజిల్తో మ్యాచ్ను 1-1తో డ్రా చేసుకున్న మొరాకో ఇవాళ్టి మ్యాచ్లో మాత్రం స్కాట్లాండ్పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.ఫిఫా చరిత్రలో అత్యంత ఫాస్టెస్ట్ గోల్స్1) హకాన్ సుకుర్ – 2002లో 11 సెకన్లు2) వాక్లావ్ మాసెక్ – 1962లో 15 సెకన్లు3) ఎర్నెస్ట్ లెహ్నర్ – 1934లో 25 సెకన్లు4) బ్రయాన్ రాబ్సన్ – 1982లో 28 సెకన్లు5) క్లింట్ డెంప్సీ – 2014లో 30 సెకన్లు6) బెర్నార్డ్ లాకోంబే – 1978లో 31 సెకన్లు7) ఆర్నే నైబర్గ్ – 1938లో 35 సెకన్లు7) ఎమిలే వీనాంటే – 1938లో 35 సెకన్లు8) ఫ్లోరియన్ ఆల్బర్ట్ – 1962లో 50 సెకన్లు8) అడాల్బర్ట్ డెసు – 1930లో 50 సెకన్లు8) సెయుంగ్ జిన్ పాక్ – 1966లో 50 సెకన్లు9) సెల్సో అయాలా – 1998లో 52 సెకన్లు10) మథియాస్ జోర్గెన్సెన్ – 2018లో 55 సెకన్లు11) ఇస్మాయిల్ సైబారి- 2026లో 71 సెకన్లు71 SECONDS 🔥 🔥 Ismael Saibari has just scored the fastest goal of the 2026 World Cup.He will cook in Bayern alongside Harry Kane and Olise 🔥 Moroco 1 - 0 Scotland #SCOMAR#FIFAWorldCup pic.twitter.com/071FJBPS5c— JACINTA❤️ (@JacentaAfc) June 19, 2026 -
ఆస్ట్రేలియాపై గెలుపు.. నాకౌట్కు యూఎస్ఏ
ఫిఫా వరల్డ్కప్ 2026కు సహ ఆతిథ్య దేశమైన యూఎస్ఏ గ్రూప్ దశలో (గ్రూప్-డి) వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి నాకౌట్కు అర్హత సాధించింది. ఆస్ట్రేలియాపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి రౌండ్ ఆఫ్ 32కు చేరింది. గ్రూప్ దశలో మరో మ్యాచ్ (తుర్కియేతో) మిగిలి ఉండగానే ఆరు పాయింట్లు సాధించి తదుపరి దశలోకి ప్రవేశించింది.ఆసీస్తో మ్యాచ్కు స్టార్ ఆటగాడు క్రిస్టియన్ పులిసిక్ గాయంతో దూరమైనప్పటికీ అమెరికా జట్టు ఏమాత్రం తడబడలేదు. మ్యాచ్ ప్రారంభమైన 11వ నిమిషంలో ఆస్ట్రేలియా డిఫెండర్ కెమరూన్ బుర్గెస్ చేసిన సెల్ఫ్ గోల్ అమెరికాకు తొలి ఆధిక్యాన్ని అందించింది.ఆ తర్వాత తొలి అర్ధభాగం ముగియడానికి కొద్దిసేపటి ముందు అలెక్స్ ఫ్రీమన్ హెడ్డర్ ద్వారా రెండో గోల్ సాధించాడు. మొదట ఆఫ్సైడ్గా ప్రకటించిన ఈ గోల్ను వీడియో అసిస్టెంట్ రిఫరీ (VAR) సమీక్ష అనంతరం చెల్లుబాటు అయ్యే గోల్గా నిర్ధారించారు. -
క్లీన్స్వీప్పై భారత్ దృష్టి
చెన్నై: సొంతగడ్డపై అఫ్గానిస్తాన్ను ఏకైక టెస్టులో చిత్తుగా ఓడించిన భారత జట్టు ఆపై వరుసగా రెండు వన్డేల్లో కూడా ప్రత్యర్థిపై చెలరేగింది. ఇప్పటికే వన్డే సిరీస్ సొంతం చేసుకున్న టీమ్ మరో మ్యాచ్నూ గెలిచి క్లీన్స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో సిరీస్తో చివరిదైన మూడో వన్డేకు నేడు చెపాక్ మైదానం సిద్ధమైంది. సగం ఓవర్లే సాగిన తొలి మ్యాచ్లో, పూర్తి మ్యాచ్ జరిగిన గత మ్యాచ్లో కూడా టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం కొనసాగింది. గత మ్యాచ్లో గిల్, ఇషాన్ల శతకాలతో జట్టు 400కు పైగా స్కోరు నమోదు చేసింది. రాహుల్, శ్రేయస్ చెప్పుకోదగ్గ స్కోర్లు సాధించాల్సి ఉంది. రెండో వన్డేలో విఫలమైనా... జైస్వాల్కు మరో అవకాశం దక్కనుంది. లక్నో వన్డేలో ధాటిగా ఇన్నింగ్స్ను ఆరంభించిన రోహిత్ దానిని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. ఇక్కడ కూడా అతను తన జోరు కొనసాగించాలని జట్టు ఆశిస్తోంది. బౌలింగ్లో కూడా భారత్కు ఎలాంటి సమస్యా లేదు. ఈ సిరీస్తో అరంగేట్రం చేసిన కొత్త ఆటగాళ్లు గుర్నూర్, ప్రిన్స్, హర్ష్ దూబే తమకు లభించిన అవకాశాన్ని సమర్థంగా వాడుకున్నారు. అర్ష్ దీప్ ఫర్వాలేదనిపించగా, కుల్దీప్ మాత్రం గత వన్డేలో ప్రభావం చూపలేదు. గాయంతో రెండో వన్డేకు దూరమైన నితీశ్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్లో బరిలోకి దిగడం ఖాయమైంది. మరో వైపు అఫ్గానిస్తాన్ పరిస్థితి మాత్రం పేలవంగా కనిపిస్తోంది. గుర్బాజ్ రెండు మ్యాచ్లలో చెలరేగినా జట్టుకు కావాల్సిన ఫలితం దక్కకపోగా, టాప్ స్పిన్నర్ రషీద్ కూడా భారత్ను నిలువరించలేకపోయాడు. చెన్నై పిచ్పై అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్కు సమాన అవకాశాలు ఉన్నాయి. -
ఢిల్లీకి పంత్... లక్నోకు కుల్దీప్!
న్యూఢిల్లీ: ఐపీఎల్ వేలంలో రూ.27 కోట్ల విలువతో ఆల్టైమ్ రికార్డు సృష్టించిన రిషభ్ పంత్... లక్నో సూపర్ జెయింట్స్ జట్టును వీడటం ఖాయమైంది. తాజా సీజన్ ముగిసిన వెంటనే కెప్టెన్సీని వదిలేసిన పంత్ ఇప్పుడు పూర్తిగా జట్టునుంచే తప్పుకుంటున్నాడు. ఐపీఎల్–2027 కోసం ఆటగాళ్ల మార్పిడిలో భాగంగా పంత్ను తీసుకునేందుకు అతని పాత జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ సిద్ధమైంది. అయితే దీని వల్ల పంత్ ఏకంగా రూ.12 కోట్లు నష్టపోనున్నాడు. నిబంధనల ప్రకారం అతనికి ఢిల్లీ రూ.15 కోట్లు మాత్రమే చెల్లిస్తుంది. తన విలువను తగ్గించుకొని ఢిల్లీకి వచ్చేందుకు పంత్ అంగీకరించినట్లు సమాచారం. పంత్కు బదులుగా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లక్నో తీసుకుంటుంది. అయితే కుల్దీప్ ఫీజులో మాత్రం ఎలాంటి కోత ఉండటం లేదు. అతనికి ఢిల్లీ ఇచ్చిన మొత్తాన్నే (రూ.13.25 కోట్లు) లక్నో కూడా ఇవ్వనుంది. లక్నో తరఫున 2 సీజన్లు ఆడిన పంత్ పేలవ ప్రదర్శన కనబర్చాడు. 28 మ్యాచ్లలో కలిపి 26.4 సగటుతో 581 పరుగులు మాత్రమే చేసిన అతను ఒక సెంచరీ, 2 అర్ధసెంచరీలు నమోదు చేశాడు. అతని కెప్టెన్సీలో 10 మ్యాచ్లో గెలిచి 18 ఓడిన జట్టు రెండు సార్లు ‘ప్లే ఆఫ్స్’కు చేరలేకపోయింది. 2016–2024 మధ్య ఎనిమిది సీజన్ల పాటు పంత్ ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించాడు. మరో వైపు 2026 సీజన్లో పూర్తిగా విఫలమైన కుల్దీప్... 12 మ్యాచ్లలో 10 వికెట్లు మాత్రమే తీశాడు. ఢిల్లీ తరఫున ఐదు సీజన్లు ఆడిన కుల్దీప్ ఇప్పుడు తన సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్కే చెందిన జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. -
నీరజ్కు నాలుగో స్థానం
దోహా: సుదీర్ఘ విరామం అనంతరం మైదానంలో అడుగుపెట్టిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా... స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాడు. ప్రతిష్టాత్మక దోహా డైమండ్ లీగ్లో జావెలిన్ను అత్యుత్తమంగా 85.69 మీటర్ల దూరం విసిరి నాలుగో స్థానంలో నిలిచాడు. శ్రీలంక ఆటగాడు రుమేశ్ పతిరగే 88.68 మీటర్లు అగ్రస్థానం దక్కించుకోగా... పీటర్స్ అండర్సన్ (86.38 మీటర్లు; గ్రనేడా) రెండో ‘ప్లేస్’ దక్కించుకున్నాడు. గతేడాది వరల్డ్ చాంపియన్షిప్ అనంతరం మైదానానికి దూరమైన భారత స్టార్... దాదాపు తొమ్మిది నెలల తర్వాత శుక్రవారమే కొత్త సీజన్ను ప్రారంభించాడు. తొలి ప్రయత్నంలో ఫౌల్ చేసిన నీరజ్... రెండో ప్రయత్నంలో జావెలిన్ను 82.77 మీటర్ల దూరం విసిరాడు. మూడో ప్రయత్నంలో 85.69 మీటర్లు, నాలుగో ప్రయత్నంలో 83.45 మీటర్లు విసిరగా... ఐదో ప్రయత్నంలో మరోసారి ఫౌల్ చేశాడు. అయితే ఈ క్రమంలో నీరజ్ కామన్వెల్త్ క్రీడల అర్హత మార్క్ (82.61 మీటర్లు)ను అధిగమించాడు. -
డిఫెండింగ్ ఛాంపియన్స్కు తృటిలో తప్పిన మరో పరాభవం
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్స్ న్యూజిలాండ్కు వరుస పరాభవాలు ఎదురయ్యాయి. తొలి మ్యాచ్లో వెస్టిండీస్, రెండో మ్యాచ్లో శ్రీలంక చేతిలో ఓటమిపాలైన ఆ జట్టు, తాజాగా మరో పరాభావాన్ని తృటిలో తప్పించుకొని ఊపీరి పీల్చుకుంది.సౌథాంప్టన్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంప్ 4 పరుగుల స్వల్ప తేడాతో బయటపడింది. తద్వారా సూపర్-8 అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. కెప్టెన్ అమేలియా కెర్ (30), బ్రూక్ హ్యాలీడే (34), ఇజ్జీ షార్ప్ (36) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఆ జట్టు ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. మిగతా ప్లేయర్లలో ఇసబెల్లా గేజ్ 1, ప్లిమ్మర్ 4, మ్యాడీ గ్రీన్ 2 పరుగులకు ఔట్ కాగా.. సూజీ బేట్స్ 19, జెస్ కెర్ 5 పరుగులతో అజేయంగా నిలిచారు. ఐరిష్ బౌలర్లలో ప్రెండర్గాస్ట్, కారా ముర్రే తలో 2 వికెట్లు తీయగా.. మగూర్, కెల్లీ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ వికెట్లు కాపాడుకునే ప్రయత్నంలో నిదానంగా ఆడి ఓటమిని కొని తెచ్చుకుంది. గ్యాబీ లెవిస్ (58), ప్రెండర్గాస్ట్ (59) అర్ద సెంచరీలతో రాణించినా లక్ష్యానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది. చివరి ఓవర్లో గెలుపుకు 15 పరుగులు అవసరం కాగా.. సూజీ బేట్స్ వారిని నిలువరించింది. లియా పాల్ (8 నాటౌట్), లూయిస్ లిటిల్ (5 నాటౌట్) ఐర్లాండ్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో కెర్ 2, ఇల్లింగ్, రోస్మేరీ తలో వికెట్ తీశారు. మిగతా బౌలర్లు వికెట్లు తీయలేకపోయినా పొదుపుగా బౌలింగ్ చేశారు.ఈ ఓటమితో ఐర్లాండ్ సూపర్-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆడిన 3 మ్యాచ్ల్లో ఓడి చిట్టచివరి స్థానంలో ఉంది. -
హెచ్సీఏకి భారీ షాక్!
తెలంగాణ టీ20(TG20) ప్రీమియర్ లీగ్ ఆరంభానికి ముందే చిక్కుల్లో పడింది. లీగ్ చట్టబద్ధతను సవాల్ చేస్తూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ చెందిన క్రికెటర్లు గౌరవ్ శర్మ, మహేందర్ రెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోయేషన్ ప్రతిపాదించిన ‘టీజీ20 లీగ్’కు ఎలాంటి చట్టబద్ధత లేదని, ప్రస్తుత పాలకవర్గానికి ఈ లీగ్ను నిర్వహించే అధికారం లేదని వారు తమ పిటిషన్లో పేర్కొన్నారు.పిటిషనర్లు తమ రిట్లో హెచ్సీఏ వివాదాస్పద పదవీకాలంలో జరిగిన నియామకాలు, అనుమతులు, పరిపాలనా నిర్ణయాలు, పాలనా ప్రక్రియలన్నింటిపై న్యాయపరమైన విచారణ జరపాలని కోరారు.మరోవైపు హెచ్సీఏలోని ఆర్థిక అక్రమాలపై సమగ్ర సీఐడీ దర్యాప్తునకు జస్టిస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ లోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది. హెచ్సీఏపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ చేసిన ఫిర్యాదులపై నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేయాలని తెలంగాణ సీఐడీని లోకాయుక్త ఆదేశించింది.ఈ కేసును 2026 జూలై 24కు వాయిదా వేస్తూ, ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైతే సంబంధిత అధికారులపై తీవ్రమైన క్రమశిక్షణా చర్యలు తప్పవని లోకాయుక్త హెచ్చరించింది. -
ఢిల్లీ కెప్టెన్గా కేఎల్ రాహుల్..! రీ ఎంట్రీ ఇవ్వనున్న పంత్?
ఐపీఎల్-2027 సీజన్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో సమూల మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. గత రెండు సీజన్లుగా అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్కు తమ జట్టు పగ్గాలను అప్పగించాలని ఢిల్లీ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా అక్షర్ పటేల్ ఉన్నాడు. ఐపీఎల్-2025 సీజన్లో ఢిల్లీ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను అక్షర్ చేపట్టాడు. అతడి సారథ్యంలోని ఢిల్లీ గత రెండు సీజన్లలోనూ కనీసం ప్లే ఆఫ్స్నకు చేరలేకపోయింది. దీంతో ఢిల్లీ యాజమాన్యం అక్షర్ కెప్టెన్సీపై ఆసంతృప్తిగా ఉందంట. దీంతో అక్షర్ స్ధానంలో రాహుల్ను సారథిగా నియమించేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ సిద్దమైనట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తమ కథనంలో పేర్కొంది. ఒకవేళ కేఎల్ రాహుల్ బాధ్యతలు చేపడితే.. ఐపీఎల్లో ఆయన సారథ్యం వహించబోయే మూడో జట్టు ఢిల్లీ కానుంది.గతంలో అతడు పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లకు ఫుల్ టైమ్ కెప్టెన్గా వ్యవహరించాడు. రాహుల్ ప్రస్తుతం ఢిల్లీ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఐపీఎల్-2025 సీజన్లో ఆ జట్టు తరపున 539 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచిన రాహుల్.. ఐపీఎల్-2026లో కూడా అదరగొట్టాడు. కేవలం 14 ఇన్నింగ్స్ల్లోనే 45.61 సగటుతో, 174.41 భారీ స్ట్రైక్ రేట్తో 593 పరుగులు చేశాడు. ఇందులో 5 అర్ధసెంచరీలు, ఒక అద్భుత శతకం ఉన్నాయి.రిషబ్ పంత్ రీఎంట్రీ!ఇక ఢిల్లీ క్యాపిటల్స్కు సంబంధించి మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లక్నో సూపర్ జెయింట్స్ మాజీ కెప్టెన్ రిషభ్ పంత్ను డ్రేడ్ స్వాప్ చేసుకోవాలని ఢిల్లీ భావిస్తుందంట. అందుకు బదులుగా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను లక్నోకు ఇచ్చేందుకు ఢిల్లీ సిద్దమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్-2026లో దారుణ ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ పంత్ ఇటీవల లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. అంతకుముందు రిషబ్ తన ఐపీఎల్ కెరీర్ను ఢిల్లీ క్యాపిటల్స్తోనే ప్రారంభించాడు. ఆ తర్వాత కెప్టెన్గా పనిచేశాడు. మళ్లీ ఇప్పుడు తన సొంత గూటికి వెళ్తే తన పూర్వ వైభవాన్ని పొందే అవకాశముంది.చదవండి: IPL 2027: యువరాజ్ సింగ్ ఐపీఎల్ రీఎంట్రీ? -
రెండో టీ20లో బంగ్లా ఓటమి.. ప్రతీకారం తీర్చుకున్న ఆస్ట్రేలియా
ఛాటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన రెండో టీ20లో 7 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో ఆసీస్ కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్పై ఆసీస్కు ఇదే తొలి టీ20 సిరీస్ గెలుపు కావడం గమానార్హం. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే గట్టి షాక్లు తగిలాయి. ఓపెనర్లు జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్లతో పాటు వన్ డౌన్ బ్యాటర్ కూపర్ కానోలి పవర్ప్లేలోనే అవుట్ కావడంతో ఆసీస్ 44 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో మాట్ రెన్షా(52 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 89), టిమ్ డేవిడ్(26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 45) అద్బుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్కు 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఫలితంగా ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 197 పరుగుల భారీ లక్ష్య చేధనలో బంగ్లాదేశ్ ఆఖరి వరకు పోరాడింది. బంగ్లాదేశ్ పవర్ప్లే ముగిసేసరికి 72/1 స్కోరుతో పటిష్టంగా కనిపించింది. ఆ తర్వాత పర్వేజ్ హుస్సేన్(36), సైఫ్ హసన్(42) అవుట్ కావడంతో మ్యాచ్ ఆసీస్ వైపు మలుపు తిరిగింది. చివరిలో తౌహిద్ హృదయ్ పోరాడినప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు. ఆసీస్ బౌలర్లలో ఆరోన్ హార్దీ రెండు, నాథన్ ఎల్లీస్, రెన్షా, జంపా, డేవిస్ తలా వికెట్ పడగొట్టారు. కాగా అంతకుముందు బంగ్లాదేశ్తో వన్డే సిరీస్ను 2-1 తేడాతో కంగారుల తేలిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టీ20 సిరీస్ గెలుపుతో అందుకు మార్ష్ సేన ప్రతీకారం తీర్చుకుంది.చదవండి: IPL 2027: యువరాజ్ సింగ్ ఐపీఎల్ రీఎంట్రీ? -
IND vs AFG: టీమిండియా స్టార్ వచ్చేస్తున్నాడు!
అఫ్గానిస్తాన్తో మూడో వన్డేకు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుభవార్త చెప్పింది. ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి పూర్తిగా కోలుకున్నట్లు తెలిపింది. అఫ్గాన్తో నామమాత్రపు మ్యాచ్కు అతడు అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడించింది.సిరీస్ కైవసంకాగా టీమిండియా ప్రస్తుతం సొంతగడ్డ మీద అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించిన గిల్ సేన.. లక్నో వేదికగా రెండో వన్డేలో ప్రత్యర్థిని ఏకంగా 170 పరుగుల తేడాతో చిత్తు చేసింది.రెండో వన్డేకు దూరంతద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది టీమిండియా. ఇక తొలి వన్డే ఆడిన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీశ్ రెడ్డి (Nitish Kumar Reddy).. ఆ మ్యాచ్ సందర్భంగా తొడ కండరాల నొప్పితో బాధపడ్డాడు. ఫలితంగా రెండో వన్డేకు దూరమయ్యాడు. అయితే, తాజాగా నితీశ్ రెడ్డి గాయం గురించి బీసీసీఐ అప్డేట్ ఇచ్చింది.సెలక్షన్కు అందుబాటులో ఉన్నాడుఈ విషయం గురించి టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘నితీశ్ రెడ్డి బాగానే ఉన్నాడు. కోలుకున్నాడు. రేపటి మ్యాచ్ ఆడేందుకు అతడు సిద్ధంగానే ఉన్నాడు’’ అని తెలిపాడు. కాగా టీమిండియా ఇప్పటికే సిరీస్ గెలిచింది. కాబట్టి నితీశ్ రెడ్డి విషయంలో మేనేజ్మెంట్ రిస్క్ తీసుకుంటుందా?.. లేదంటే విశ్రాంతినిస్తుందానేది శనివారం తేలనుంది. కాగా భారత్- అఫ్గానిస్తాన్ మధ్య మూడో వన్డేకు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదిక.చదవండి: IND vs AFG: మూడో వన్డే.. భారత తుదిజట్టు ఇదే! -
SL vs AFG: ఫైనల్లో భారత్ ప్రత్యర్థి ఎవరంటే?
ముక్కోణపు సిరీస్లో అఫ్గానిస్తాన్- ‘ఎ’ ప్రయాణం ముగిసింది. శ్రీలంక- ‘ఎ’తో శుక్రవారం జరిగిన అనధికారిక వన్డేలో అఫ్గాన్ చిత్తుగా ఓడిపోయింది. శ్రీలంక వేదికగా భారత్, లంక, అఫ్గాన్ జట్ల మధ్య ట్రై సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా తొలి మ్యాచ్లో శ్రీలంకపై గెలిచిన భారత్.. తర్వాత అఫ్గాన్, శ్రీలంక చేతిలో ఓడిపోయింది. అయితే, లీగ్ దశలో చివరగా అఫ్గనిస్తాన్పై తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఏకంగా 101 పరుగులతో గెలిచి.. ఫైనల్కు దూసుకువెళ్లింది.ఈ క్రమంలో దంబుల్లా వేదికగా మరో ఫైనల్ బెర్తు కోసం శ్రీలంక- అఫ్గాన్ తలపడ్డాయి. టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా శ్రీలంక బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లలో నిరోషన్ డిక్విల్లా అర్ధ శతకం (66)తో ఆకట్టుకోగా.. అవిష్క ఫెర్నాండో సెంచరీ (110)తో దుమ్ములేపాడు. వన్డౌన్ బ్యాటర్ నువానిదు ఫెర్నాండో 45 పరుగులతో రాణించగా.. లోయర్ ఆర్డర్లో రవిందు ఫెర్నాండో 25 రన్స్ రాబట్టాడు.ఫలితంగా శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 322 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. అఫ్గాన్ బౌలర్లలో ఫరీదూన్ దావూద్జాయ్ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. ఫర్మానుల్లా సఫీ మూడు, మహ్మద్ ఇబ్రహీం ఒక వికెట్ దక్కించుకున్నారు.భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్ జట్టుకు ఆదిలోనే షాకులు తగిలాయి. ఓపెనర్, కెప్టెన్ ఇమ్రాన్ మిర్, వన్డౌన్ బ్యాటర్ నూర్ ఉల్ రహ్మాన్ను దులాజ్ సముదిత డకౌట్ చేశాడు. ఇలాంటి తరుణంలో మరో ఓపెనర్ హసన్ ఎసాఖిల్ ఒంటరి పోరాటం (74) చేయగా.. బహీర్ షా 35, ఫర్మానుల్లా సఫీ 43 పరుగులతో రాణించారు. అయితే, మిగతా వారి నుంచి వీరికి పెద్దగా సహకారం లభించలేదు. దీంతో 42.5 ఓవర్లలో కేవలం 219 పరుగుల చేసి అఫ్గాన్ ఆలౌట్ అయింది. శ్రీలంక బౌలర్లలో దులాజ్ సముదిత్ ఐదు వికెట్లతో చెలరేగి అఫ్గాన్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. కుగాతస్ మతూలన్ మూడు, రవిందు ఫెర్నాండో, విజయకాంత్ వియస్కాంత్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఈ క్రమంలో 103 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన శ్రీలంక- ‘ఎ’ జట్టు ఫైనల్కు దూసుకుపోయింది. భారత్- ‘ఎ’తో ఆదివారం నాటి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఇరుజట్ల మధ్య ఫైనల్కు దంబుల్లా వేదిక. -
IPL 2027: యువరాజ్ సింగ్ ఐపీఎల్ రీఎంట్రీ?
టీమిండియా లెజెండరీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ కోచ్గా తన సరికొత్త ఇన్నింగ్స్ను ప్రారంభించేందుకు సిద్దమయ్యాడు. ఐపీఎల్-2027 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోచింగ్ స్టాప్లో యువీ భాగం కానున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ ఫ్రాంచైజీ నిర్వహణ బాధ్యతలను జే.ఎస్.డబ్ల్యూ సంస్థ తిరిగి రెండేళ్లపాటు నిర్వర్తించనుంది. ఈ క్రమంలో ఢిల్లీ కోచింగ్ స్టాప్లో పలు మార్పులు చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. టైమ్స్ ఇండియా కథనం ప్రకారం.. జే.ఎస్.డబ్ల్యూ క్రికెట్ జట్ల డైరెక్టర్గా ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్ పురుషుల జట్టు మెంటార్గా వ్యవహరించనున్నట్లు సమాచారం. గంగూలీ నేతృత్వంలో యువరాజ్ బ్యాటింగ్ కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ సీనియర్ అధికారి ఒకరు ధృవీకరించారు."యువరాజ్ సింగ్ వంటి లెజెండరీ ప్లేయర్ కోచింగ్ స్టాప్లో ఉండాలని ప్రతీ టీమ్ కోరుకుంటుంది. ఇప్పటికే ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్ , వీరేంద్ర సెహ్వాగ్ వంటి అతని మాజీ సహచరులు చాలామంది ఇప్పటికే కోచింగ్ బాధ్యతలు చేపట్టారు. ఈ విషయంలో యువరాజ్ కాస్త ఆలస్యంగా అడుగుపెడుతున్నప్పటికీ, యువ ఆటగాళ్లతో పని చేయడం, ఆధునిక క్రికెట్ అవసరాలను అర్థం చేసుకోవడంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. అతడు కేవలం ఆటగాళ్లకు శిక్షణ ఇవ్వడమే కాకుండా, వారికి ఒక మెంటార్గా దిశానిర్దేశం చేస్తాడు. ఫోన్ కాల్స్ లేదా వర్చువల్ సెషన్లకే పరిమితం కాకుండా ఆటగాళ్లతో పాటు అతడు కూడా మైదానంలో గంటల తరబడి గడుపుతాడు. అతడు ఇప్పటికే చాలా మంది యువ క్రికెటర్లను తీర్చిదిద్దాడు" అని ఢిల్లీ క్యాపిటిల్స్ అధికారి ఒకరు పేర్కొన్నారు. శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య వంటి యువ ఆటగాళ్లు యువీ గైడెన్స్లో రాటుదేలిన వారే. కాగా గంగూలీ కెప్టెన్సీలోనే యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ప్రారంభమైంది. ఇప్పుడు అదే గురుశిష్యుల జోడీ ఢిల్లీ క్యాపిటల్స్ను తొలి ఐపీఎల్ టైటిల్ వైపు నడిపించడానికి వ్యూహాలు రచించనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ప్రస్తుత హెడ్కోచ్గా హేమంగ్ బదోని ఉన్నాడు. -
ఆల్టైమ్ టెస్ట్ జట్టు ప్రకటన.. సచిన్ టెండూల్కర్కు నో ఛాన్స్
ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ తన ఆల్ టైమ్ టెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ను ప్రకటించాడు. అయితే బ్రాడ్ ఎంచుకున్న అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్లో గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్కు చోటు దక్కకపోవడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.భారత్ నుంచి విరాట్ కోహ్లికి ఒక్కడికే ఛాన్స్ దక్కింది. ఇక ఓపెనర్లగా దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్తో పాటు శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కరను బ్రాడ్ ఎంపిక చేశాడు. సంగక్కరను వికెట్ కీపర్గా కూడా బ్రాడ్ అవకాశమిచ్చాడు.మూడో స్దానంలో ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్, నాలుగో స్ధానంలో విరాట్ కోహ్లిలు చోటు సంపాదించుకోవడం గమనార్హం. మిడిల్ ఆర్డర్లో స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) ఐదో స్థానం, ప్రపంచ అత్యుత్తమ ఆల్రౌండర్ జాక్ కలిస్ (సౌతాఫ్రికా) ఆరో స్థానంలో ఎంపికయ్యారు.ఇక ఏడో స్థానంలో సౌతాఫ్రికా విధ్వంసకర వీరుడు ఏబీ డివిలియర్స్కు బ్రాడ్ ఛాన్స్ ఇచ్చాడు. బౌలింగ్ విభాగంలో ముగ్గురు ప్రపంచ స్థాయి పేసర్లు, ఒక లెజెండరీ స్పిన్నర్కు బ్రాడ్ చోటు కల్పించాడు. ఈ జట్టులో ఫాస్ట్ బౌలర్లగా మిచెల్ జాన్సన్(ఆస్ట్రేలియా), డేల్ స్టెయిన్(సౌతాఫ్రికా), మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) ఉన్నారు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన స్పిన్ మాంత్రికుడు మురళీధరన్ ఈ జట్టులోని ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్. కాగా స్టువర్ట్ బ్రాడ్ 2023 జూలైలో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన 17 ఏళ్ల కెరీర్లో 167 టెస్టులు, 121 వన్డేలు, 56 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 845 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టాడు.స్టువర్ట్ బ్రాడ్ ఆల్-టైమ్ టెస్ట్ ఎలెవెన్ జట్టు:గ్రీమ్ స్మిత్ (కెప్టెన్), కుమార్ సంగక్కర (వికెట్ కీపర్), రికీ పాంటింగ్, విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, జాక్ కలిస్, ఏబీ డివిలియర్స్, మిచెల్ జాన్సన్, డేల్ స్టెయిన్, ముత్తయ్య మురళీధరన్, మిచెల్ స్టార్క్.చదవండి: భారత క్రికెట్కు గుడ్ బై.. వేరే దేశానికి ఆడనున్న తెలుగు ప్లేయర్ -
IND vs AFG: మూడో వన్డే.. భారత తుదిజట్టు ఇదే!
అఫ్గానిస్తాన్తో నామమాత్రపు మూడో వన్డేకు టీమిండియా సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య శనివారం జరిగే ఈ మ్యాచ్కు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదిక. ఇందుకోసం టీమిండియా ఇప్పటికే లక్నో నుంచి చెన్నైకి చేరుకుంది.ఇదిలా ఉంటే.. అఫ్గాన్తో మూడో వన్డే కోసం భారత యువ పేసర్ హర్షిత్ రాణా జట్టుతో చేరాడు. గాయం నుంచి కోలుకున్న అతడు మ్యాచ్కు అందుబాటులో ఉంటాడని యాజమాన్యం ప్రకటించింది.రెండో వన్డేకు మూడు మార్పులుకాగా ధర్మశాల వేదికగా తొలి వన్డేలో అఫ్గాన్ను టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ సందర్భంగా పేసర్ గుర్నూర్ బ్రార్, స్పిన్నర్ హర్ష్ దూబే అరంగేట్రం చేశారు. తొలి మ్యాచ్లోనే ఇద్దరూ మూడేసి వికెట్లు కూల్చారు.అయితే, రెండో మ్యాచ్కు హర్ష్ దూబే దూరం కాగా.. కుల్దీప్ యాదవ్ ఆడాడు. అదే విధంగా నితీశ్ కుమార్ రెడ్డి, ప్రసిద్ కృష్ణల స్థానంలో యశస్వి జైస్వాల్, ప్రిన్స్ యాదవ్ తుదిజట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్లో టీమిండియా 170 పరుగుల తేడాతో అఫ్గాన్పై విజయం సాధించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది.అర్ష్దీప్ సింగ్ను పక్కన పెట్టి..ఈ నేపథ్యంలో చెన్నై వేదికగా తుదిజట్టులో ఎలాంటి మార్పులు చేస్తారోనన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన ప్లేయింగ్ ఎలెవన్ను ఎంచుకున్నాడు. అఫ్గాన్తో మూడో వన్డేలో అర్ష్దీప్ సింగ్ను పక్కన పెట్టి.. నితీశ్ రెడ్డిని ఆడించాలని సూచించాడు.ఈ మేరకు.. ‘‘యశస్వి ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. అతడికి మరో అవకాశం ఇస్తే బాగుంటుంది. నితీశ్ కుమార్ రెడ్డి ఫిట్గా ఉంటే.. అతడిని కచ్చితంగా ఆడించాలి. నితీశ్ కోసం అర్ష్దీప్ సింగ్కు విశ్రాంతినివ్వాలి.ఏదేమైనా విరాట్ కోహ్లి తిరిగి వస్తే.. ఇషాన్ కిషన్కు తుదిజట్టులో చోటు ఉండదు. అయితే, రెండో వన్డేలో అతడు శతక్కొట్టాడు. కాబట్టి ఇషాన్ను పక్కనపెట్టే వీలులేదు. పేస్ దళంలో గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్లను ఆడించాలి’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.అఫ్గానిస్తాన్తో మూడో వన్డేకు ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత తుదిజట్టురోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్.చదవండి: భారత క్రికెట్కు గుడ్బై... వేరే దేశంలో ఆడనున్న తెలుగు క్రికెటర్ -
భారత క్రికెట్కు గుడ్ బై.. వేరే దేశానికి ఆడనున్న తెలుగు ప్లేయర్
ఇటీవల భారత క్రికెట్కు వీడ్కోలు పలికిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్, ఆంధ్ర ప్లేయర్ కె.ఎస్. భరత్ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. రిటైర్మెంట్ ప్రకటించిన కేవలం 15 రోజుల్లోనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో తన క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు భరత్ సిద్దమయ్యాడు. యూఏఈ క్రికెట్ బోర్డు నిర్వహించనున్న స్థానిక టోర్నమెంట్లో 'టీమ్ స్టాలియన్స్' (Team Stallions) జట్టు తరపున భరత్ ఆడనున్నాడు.అయితే 32 ఏళ్ల శ్రీకర్ భరత్ వెంటనే యూఏఈ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం లేదు. ఐసీసీ నిబంధనల ప్రకారం.. ఫుల్ మెంబర్ నేషన్ నుంచి అసోసియేట్ దేశానికి వెళ్లే ఆటగాళ్లు మూడేళ్ల కూలింగ్-ఆఫ్ పీరియడ్ను పూర్తి చేయాలి. అయితే ఫిబ్రవరి 2024లో ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్లో భారత్ తరపున తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.అంటే అతడు యూఏఈ తరపున ఆడాలంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు వేచి ఉండాల్సిందే. ఈ విశాఖ క్రికెటర్ భారత్ తరపున 7 టెస్ట్ మ్యాచ్లు ఆడి 221 పరుగులు చేశాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో మాత్రం భరత్కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. 113 ఇన్నింగ్స్లలో 36.53 సగటుతో 6102 పరుగులు చేశాడు. అతడి పేరిట ఓ ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది. లిస్ట్-ఎ క్రికెట్లో కూడా అతడు అద్భుతంగా రాణించాడు. 83 మ్యాచ్లలో 2692 పరుగులు చేశాడు.ఇక తమ జట్టు అగ్రశ్రేణి ఆటగాళ్లలో లాంగ్-ఫార్మాట్ స్కిల్స్ను పెంపొందించే లక్ష్యంతో ఈసీబీ ఈ టూ-డే వైట్-బాల్ ఛాంపియన్షిప్ టోర్నీని నిర్వహించనుంది. ఈ టోర్నీలో టీమ్ స్టాలియన్స్, టీమ్ ఫాల్కన్స్, టీమ్ ఈగల్స్, టీమ్ లెపర్డ్స్ మొత్తం నాలుగు జట్లు పాల్గోనున్నాయి.చదవండి: 41 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. 7 ఫోర్లు, 9 సిక్సర్లతో విధ్వంసం -
41 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. 7 ఫోర్లు, 9 సిక్సర్లతో విధ్వంసం
సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తనలో ఏ మాత్రం జోరు తగ్గలేదని మరోసారి నిరూపించాడు. అమెరికా మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీ 2026 సీజన్ తొలి మ్యాచ్లో డుప్లెసిస్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ టోర్నీలో టెక్సాస్ సూపర్ కింగ్స్కు సారథ్యం వహిస్తున్న ఫాఫ్.. శుక్రవారం సీటెల్ ఓర్కాస్తో జరిగిన మ్యాచ్లో విధ్వంసం సృష్టించాడు.221 పరుగుల భారీ లక్ష్య చేధనలో ఈ ప్రోటీస్ ఆటగాడు ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. 41 ఏళ్ల డుప్లెసిస్ కేవలం 52 బంతుల్లోనే 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 113 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అతడితో పాటు రుసో(21 బంతుల్లో 7 ఫోర్లు,2 సిక్స్లతో 49), వియాన్ ముల్డర్(15 బంతుల్లో 31) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. ఫలితంగా సూపర్ కింగ్స్ టార్గెట్ను కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.3 ఓవర్లలో చేధించింది.సీఫర్ట్ సెంచరీ వృథామొదట బ్యాటింగ్ చేసిన సీటెల్ ఓర్కాస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్ భారీ(66 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లతో 104 పరుగులు)సెంచరీతో కదం తొక్కాడు. అతడితో పాటు మరో ఓపెనర్ షాయన్ జహంగీర్ (78 పరుగులు) హాఫ్ సెంచరీతో సాధించాడు. వీరిద్దరూ మొదటి వికెట్కు 191 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. టెక్సాస్ బౌలర్లలో మిల్నే, హస్మి డిసిల్వా తలా వికెట్ సాధించారు.ఐపీఎల్కు దూరంకాగా ఫాఫ్ డుప్లెసిస్ ఐపీఎల్-2026 సీజన్లో పాల్గోనలేదు. వేలానికి ముందే అతడు తప్పుకొన్నాడు. ప్లేయర్గా తప్పకొన్నప్పటికి వ్యాఖ్యతగా మాత్రం తన సేవలను డుప్లెసిస్ అందించాడు. అంతకంటే ముందు గాయం కారణంగా సౌతాఫ్రికా లీగ్ టీ20 టోర్నీలో కేవలం ఐదు ఇన్నింగ్స్లు మాత్రమే ఆడాడు.చదవండి: గంభీర్పై నిప్పులు చెరిగిన మాజీ క్రికెటర్ శ్రీశాంత్! -
‘బ్యాటింగ్ మా ప్రధాన బలం.. సీక్రెట్ వెపన్ అతడే!’
ఆదివారం నుంచి ఉప్పల్ వేదికగా టీజీ 20 లీగ్ టోర్నీ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్వితా ఖమ్మం ఏసెస్ జట్టుతో సాక్షి మీడియా ముచ్చటించింది. ఈ నేపథ్యంలో జట్టు బలాలు, బలహీనతలపై ఖమ్మం ఏసెస్ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. అన్ని జట్లతో పోలిస్తే బ్యాటింగ్ తమ ప్రధాన బలమని ఖమ్మం కోచ్ అభిజీత్ పేర్కొన్నారు. అయితే జట్టులో ఉన్న ఒక సీక్రెట్ ఆయుధాన్ని గ్రౌండ్లోనే వాడనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఆ సీక్రెట్ ప్లేయర్ ఎవరనేది మాత్రం తాము రివీల్ చేయబోవవడం లేదని పేర్కొన్నారు. ఖమ్మం జట్టు కెప్టెన్ సీవీ మిలింద్ మాట్లాడుతూ.. టీ20 20లీగ్ అనేది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ఆటగాళ్లకు రంజీల్లోకి వెళ్లడానికి ఇదొక మంచి అవకాశంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు. ఐపీఎల్ సహా ఇతర లీగ్స్కు కూడా ఆడేందుకు ఇలాంటి లీగ్లు తమ లాంటి ఆటగాళ్లకు కీలకంగా మారుతుందని తెలిపాడు. తమ జట్టులో లెగ్ స్పిన్నర్గా వేద్రెడ్డి అత్యంత పిన్న వయస్కుడిగా ఉన్నాడని, అతడు తన స్పిన్తో ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. కార్యక్రమంలో కెప్టెన్ సీవీ మిలింద్తో పాటు వైస్ కెప్టెన్ హిమతేజ, లెగ్ స్పిన్నర్ వేద్ రెడ్డి, ఓపెనర్ ప్రతీక్రెడ్డి పాటు ఇతర క్రికెటర్లు పాల్గొన్నారు. ఇక ఖమ్మం ఏసెస్ జట్టును అన్వితా గ్రూప్ సొంతం చేసుకుంది. ఇక ఖమ్మం ఏసెస్ జట్టు తన తొలి మ్యాచ్ను జూన్ 21న పాలమూరు స్ట్రైకర్స్తో ఆడనుంది. -
మీ వల్ల గందరగోళంలో శుబ్మన్ గిల్: మాజీ క్రికెటర్ ఫైర్
టీమిండియా యాజమాన్యం తీరును భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారి విమర్శించాడు. అఫ్గానిస్తాన్తో రెండో వన్డేలో టాపార్డర్లో మార్పులు చేయడాన్ని తప్పుబట్టాడు. కాగా స్వదేశంలో అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.తొలుత ధర్మశాలలో అఫ్గాన్ను చిత్తు చేసిన భారత జట్టు.. లక్నో వేదికగా బుధవారం రెండో వన్డేలో అఫ్గాన్ను 170 పరుగుల తేడాతో చిత్తు చేసి ఈ ఘనత సాధించింది. తద్వారా వన్డే కెప్టెన్గా శుబ్మన్ గిల్ ఖాతాలో తొలి సిరీస్ విజయం చేరింది.ఇదిలా ఉంటే.. అఫ్గాన్తో రెండో వన్డేలో టీమిండియా తమ ఓపెనింగ్ జోడీని మార్చింది. కెప్టెన్ శుబ్మన్ గిల్కు బదులు.. యశస్వి జైస్వాల్ రోహిత్ శర్మతో పాటు ఇన్నింగ్స్ ఆరంభించాడు. అయితే, చాన్నాళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన జైసూ పూర్తిగా విఫలమయ్యాడు. కేవలం నాలుగు పరుగులు చేసి నిష్క్రమించాడు.మరోవైపు.. రోహిత్ 48 పరుగులు చేయగా.. వన్డౌన్లో వచ్చిన గిల్ భారీ శతకం (154)తో దుమ్ములేపాడు. ఇక గత మ్యాచ్లో మూడో స్థానంలో ఆడిన ఇషాన్ కిషన్.. ఈసారి నాలుగో నంబర్ బ్యాటర్గా బరిలోకి దిగి మెరుపు సెంచరీ (79 బంతుల్లో 125)తో అదరగొట్టాడు. అయితే, ఈ మార్పులతో జట్టు భారీ విజయం సాధించినప్పటికీ మనోజ్ తివారీ మాత్రం నాయకత్వ బృందాన్ని విమర్శించాడు.క్రిక్బజ్తో మాట్లాడుతూ.. ‘‘భవిష్యత్తులో తలనొప్పిగా మారడం తప్ప ఈ ప్రయోగంతో ఎలాంటి ప్రయోజనం లేదు. రోహిత్ శర్మతో యశస్వి జైస్వాల్ను ఓపెనింగ్ చేయించి శుబ్మన్ గిల్ను వన్డౌన్కి డిమోట్ చేశారు. ఆ స్థానంలో గిల్ భారీగా పరుగులు రాబట్టాడు.ఇప్పుడా విషయం గందరగోళానికి కారణం కావొచ్చు. నేను మళ్లీ ఓపెనర్గా వెళ్లాలా? లేదంటే వన్డౌన్లోనే ఆడాలా అని గిల్ కన్ఫ్యూజ్ అవుతాడు. అసలు యాజమాన్యం ఇలా ఎందుకు చేసిందో అర్థం కావడం లేదు. ఇక్కడ స్పష్టత లోపించింది.ఏదేమైనా జైస్వాల్ను ఆడించడం మంచి విషయం. ఎందుకంటే అతడు అన్ని ఫార్మాట్లలో ఆడగల సమర్థుడు. అతడికి మళ్లీ అవకాశం రావడం హర్షణీయం. ఇక రోహిత్ శర్మ అఫ్గన్తో రెండో వన్డేలో పెద్దగా దూకుడు ప్రదర్శించలేదు. అతడిపై బయటి నుంచి ఒత్తిడి ఎక్కువవుతోంది’’ అని మనోజ్ తివారి చెప్పుకొచ్చాడు. -
దక్షిణ కొరియాపై విజయం.. నాకౌట్ దశకు మెక్సికో
ఫిఫా ప్రపంచకప్లో మెక్సికో రౌండ్ ఆఫ్ 32కు అర్హత సాధించింది. శుక్రవారం గ్రూప్-ఏలో సౌత్కొరియాతో జరిగిన మ్యాచ్లో మెక్సికో 1-0తో విజయాన్ని అందుకుంది. మెక్సికో తరఫున లూయిస్ రొమో ఆట 50వ నిమిషంలో గోల్ సాధించాడు. ఈ విజయంతో గ్రూప్ దశలో రెండు విజయాలు సాధించిన మెక్సికో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే తర్వాతి రౌండ్ (రౌండ్ ఆఫ్ 32)కు క్వాలిఫై అయింది. కాగా దక్షిణ కొరియా మ్యాచ్ మొత్తంలో రెండుసార్లు మాత్రమే మెక్సికో గోల్పోస్టుపై దాడులు చేయడం గమనార్హం. అయితే ఈ రెండుసార్లు కూడా గోల్ కొట్టడంలో విఫలమైన దక్షిణ కొరియా ఓటమి దిశగా సాగింది. ఇక ఆరు పాయింట్లతో మెక్సికో తర్వాతి రౌండ్కు అర్హత సాధించగా, ఇదే గ్రూప్లో ఉన్న సౌత్ కొరియా మూడు పాయింట్లు, చెక్ రిపబ్లిక్, సౌతాఫ్రికా ఖాతాలో ఒక్కో పాయింట్ ఉన్నాయి. మెక్సికో తన చివరి మ్యాచ్ను చెక్ రిపబ్లిక్తో ఆడనుంది. కాగా ప్రతీ గ్రూప్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు రౌండ్ ఆఫ్ 32కు అర్హత సాధించనున్న సంగతి తెలిసిందే.చదవండి: గంభీర్పై నిప్పులు చెరిగిన మాజీ క్రికెటర్ శ్రీశాంత్! -
గంభీర్పై నిప్పులు చెరిగిన మాజీ క్రికెటర్ శ్రీశాంత్!
టీమిండియా హెడ్కోచ్ గౌతమ్ గంభీర్పై మాజీ క్రికెటర్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గంభీర్ లాంటి వ్యక్తి కోచ్గా పనికిరాడని, అతడి స్థానంలో ధోని లాంటి ఫ్రెండ్లీ వ్యక్తిని కోచ్గా ఎంపిక చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. శ్రీశాంత్ వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. 'లల్లన్టాప్' వెబ్సైట్కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో శ్రీశాంత్ ఈ వ్యాఖ్యలు చేశాడు.'ముందు కోచ్ను మార్చండి. భారత్కు ఇప్పుడు కావాల్సింది కోచ్ కాదు, ఒక మంచి మెంటార్. ఒక షో సజావుగా సాగడానికి డైరెక్టర్ ఎంత ముఖ్యమో, జట్టుకు కోచ్ కూడా అంతే ముఖ్యం. నాకు సాధారణంగా కోచ్లపై ఎలాంటి వ్యతిరేకత లేదని, కానీ అంతర్జాతీయ జట్లకు సాంప్రదాయ కోచ్ల కంటే మెంటార్ల అవసరమే ఎక్కువగా ఉంటుంది.ముఖ్యంగా గంభీర్ అనుసరిస్తున్న కోచింగ్ విధానం ఆటగాళ్లపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతోంది. ఫెయిల్ అయితే జట్టు నుంచి తీసేస్తామనే భయాన్ని కల్పించి, ఆటగాళ్లను ఒక కఠినమైన వ్యవస్థలోకి నెట్టే కోచ్ జట్టుకు అవసరం లేదు.' అని పేర్కొన్నాడు. ఆ తర్వాత ఎంఎస్ ధోని గురించి శ్రీశాంత్ ప్రస్తావించాడు.'జనాలు ఏమైనా చెప్పుకోవచ్చు.. కానీ ధోని ఆలోచనా విధానం, అతను ఆటగాళ్లలో నింపిన ఆత్మవిశ్వాసమే జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాయి. గంభీర్ స్థానంలో ధోనికి కోచ్ బాధ్యతలు అప్పగించాలి.' అని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్ గెలవడంలో గంభీర్కు అధిక క్రెడిట్ ఇవ్వడం సరికాదని శ్రీశాంత్ వ్యాఖ్యనించాడు. మైదానంలో చెమటోడ్చి ఆడేది ఆటగాళ్లు, కాబట్టి ఆ గుర్తింపు, క్రెడిట్ వారికే దక్కాలని అభిప్రాయపడ్డాడు. టీ20 ప్రపంచకప్ విజయాన్ని ప్రస్తావిస్తూ.. ఆటగాళ్ల ప్రదర్శనే అక్కడ అత్యంత కీలకమని పేర్కొన్నాడు. ఒకవేళ సంజూ శాంసన్ రాణించకపోయినా, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ సరిగ్గా చేయకపోయినా, లేదా సమయానికి బౌలింగ్ మార్పులు జరగకపోయినా మనం గెలిచేవాళ్లమా? మైదానంలోకి వచ్చి కోచ్ ఏమైనా నిర్ణయాలు తీసుకున్నాడా? చెప్పండి అంటూ గంభీర్ను ఉద్దేశించి పరోక్షంగా ప్రశ్నలు వేశాడు.అంతకముందు మాజీ హాఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్కు శ్రీశాంత్ సవాల్ విసిరాడు. ఐపీఎల్ చెంపదెబ్బ ఘటన గుర్తుచేసుకున్న శ్రీశాంత్ తన వెనుక స్క్రీన్పై ఉన్న హర్భజన్ను చూపిస్తూ.. 'నీకు నిజంగా దమ్ముంటే నాతో రింగ్లోకి రా.. అక్కడ తేల్చుకుందాం' అని భజ్జీకి సరదాగా సవాల్ విసిరాడురు. తాను ప్రస్తుతం 'బేర్ నకిల్ ఫైటింగ్ లీగ్'తో సంబంధం కలిగి ఉన్నానని.. కోనర్ మెక్ గ్రోర్ వంటి అంతర్జాతీయ ఫైటర్లతో కలిసి పనిచేస్తున్నానని శ్రీశాంత్ పేర్కొన్నాడు. SREESANTH BACKS DHONI-TYPE LEADERSHIP OVER STRICT COACHING 👀🎙️: "India doesn't need a coach who forces players to follow instructions and drops them if they don't. Even MS Dhoni never operated that way. What the team needs is a mentor, and Mahi bhai would be the perfect fit… pic.twitter.com/kbGt6EjHot— Faruk (@uf2151593) June 19, 2026Read: ఆఫ్గన్తో మూడో వన్డే.. టీమిండియాలో కీలకమార్పు -
ఆఫ్గన్తో మూడో వన్డే.. టీమిండియాలో కీలకమార్పు
స్వదేశంలో అప్గానిస్తాన్తో జరుగున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను టీమిండియా 2-0తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. అయితే చెన్నై వేదికగా మూడో వన్డే జరగనున్న నేపథ్యంలో టీమిండియా జట్టులో కీలక మార్పు జరగనుంది. మోకాలి గాయంతో తొలి రెండు వన్డేలకు దూరమైన హర్షిత్ రానా చివరి వన్డే ఆడనున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ‘హర్షిత్ రానా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో రీహాబిలిటేషన్ను విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు. చెన్నై వేదికగా జరగనున్న మూడో వన్డే ఆడేందుకు టీమిండియాలో జాయిన్ అయ్యాడు’ అని బీసీసీఐ సెక్రటరీ దేవ్జిత్ సైకియా తెలిపారు. ఇక 2026 టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా సౌతాఫ్రికాతో వార్మప్ మ్యాచ్లో బౌలింగ్ చేస్తూ హర్షిత్ రానా గాయపడ్డాడు. దీంతో టీ20 ప్రపంచకప్తో పాటు ఐపీఎల్కు కూడా దూరమయ్యాడు. అయితే ఫిట్నెస్ నిరూపించుకోకుండానే హర్షిత్ రానాకు ఇంగ్లండ్, ఐర్లాండ్ టూర్లతో పాటు ఆసియా గేమ్స్కు ఎంపిక చేసిన టీమిండియాలో చోటు లభించడం విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో అతడి ఎంపికపై కూడా క్రీడా వర్గాల్లో కూడా పెద్ద చర్చే నడిచింది. ఈ విషయాలన్నీ పక్కనబెడితే హర్షిత్ రానా అప్గానిస్తాన్తో మూడో వన్డేలో ఆడడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. 24 ఏళ్ల హర్షిత్ రానా టీమిండియా తరఫున 14 వన్డేలాడి 16 వికెట్లు తీశాడు. చివరగా ఈ ఏడాది న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో హర్షిత్ రానా టీమిండియా తరఫున మ్యాచ్ ఆడాడు. ఇక గిల్ సారథ్యంలోని టీమిండియా ఆఫ్గన్తో వన్డే సిరీస్లో మంచి ప్రదర్శన కనబరుస్తోంది. వర్షంతో తొలి వన్డేలో బ్యాటింగ్కు పెద్దగా అవకాశం రాలేదు. అయితే రెండో వన్డేలో మాత్రం కెప్టెన్ గిల్తో పాటు ఇషాన్ కిషన్ సెంచరీల మోత మోగించారు. దీంతో రెండో వన్డేలో టీమిండియా 170 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది.అఫ్గానిస్థాన్తో మూడో వన్డేకి భారత జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కులదీప్ సింగ్ యాదవ్, ప్రిన్స్ దీప్, కృష్ణ యాదవ్, యువరాజు బ్రార్, హర్ష్ దూబే, యశస్వి జైస్వాల్, హర్షిత్ రానా.చదవండి: గాయంతో శ్రేయాంక ఔట్.. ఆమె స్థానంలో ఎవరంటే? -
కెనడా, ఖతార్ మ్యాచ్.. ఆ ఒక్కడి కోసం తన్నుకున్న ఆటగాళ్లు!
ఫిఫా ప్రపంచకప్లో కెనడా, ఖతార్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరుజట్ల ఆటగాళ్లు తన్నుకోవడం చర్చనీయాంశమైంది. కెనడా 6-0తో ఖతార్పై ఘన విజయాన్ని అందుకుంది. అయితే మ్యాచ్లో కెనడా విజయం సాధించినప్పటికీ ఖతార్ ఆటగాళ్ల వైఖరిని తప్పుబట్టారు. అందుకే ఒక్కసారి మ్యాచ్లో ఫైనల్ విజిల్ రాగానే కెనడా ఆటగాళ్లు ఖతార్ జట్టువైపు దూసుకొచ్చారు. ఇరుజట్ల ఆటగాళ్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో మైదానంలోకి వచ్చిన సెక్యూరిటీ ఇరుజట్లను వేరు చేసి అక్కడినుంచి పంపించేశారు. ఈ సమయంలో మైదానంలో గందరగోళం నెలకొంది. ఈ చర్యను ఇరుజట్ల కోచ్లు తప్పుబట్టారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. మరి కెనడా ఆటగాళ్ల కోపానికి కారణం ఏంటా అని ఆరా తీస్తే.. ఖతార్ ఆటగాళ్ల తప్పిదాల వల్ల కెనడా మిడ్ఫీల్డర్ ఇస్మాయిల్ కోనె కాలు విరిగింది. నడవడానికి కూడా ఇబ్బంది పడడంతో అతడిని స్ట్రెచర్పై తీసుకెళ్లాల్సి వచ్చింది. అయితే ఇస్మాయిల్ కోనె కాలు విరగడానికి ప్రధాన కారణం ఖతార్ ఆటగాడు అస్సిమ్ మదిబో. బంతిని పాస్ అందించడానికి ఇస్మాయిల్ ప్రయత్నిస్తున్న సమయంలో అతడికి అడ్డువచ్చిన అస్సిమ్ కావాలనే తను కాలును వెనుక నుంచి అడ్డుపెట్టాడు. దీంతో కోనె కాలు బోన్ విరిగిపోయింది. ఈ దుశ్చర్యతో రిఫరీ ఖతార్ ఆటగాడికి రెడ్కార్డ్ జారీ చేశాడు. మ్యాచ్ విషయానికొస్తే ఆతిథ్య కెనడా.. ఖతార్పై పూర్తి ఆధిపత్యం కనబరిచింది. జొనాథన్ డేవిడ్ హ్యాట్రిక్ గోల్స్తో కెనడా విజయంలో కీలకపాత్ర పోషించాడు.Tempers flare between Canada and Qatar after the final whistle, leading to a player scuffle to conclude a dramatic match LIVE UPDATES: https://t.co/Hb9FJ14WLh pic.twitter.com/0z5Vqmf50Z— CTV News (@CTVNews) June 19, 2026 -
గాయంతో శ్రేయాంక ఔట్.. ఆమె స్థానంలో ఎవరంటే?
భారత క్రికెటర్ శ్రేయాంక పాటిల్ గాయంతో మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీకి దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది. కాగా శ్రేయాంక పాటిల్ స్థానంలో అన్క్యాప్డ్ ప్లేయర్ ప్రేమా రావత్ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ మేరకు శుక్రవారం బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్లో రెండు వరుస విజయాలతో జోష్ మీదున్న హర్మన్ సేనకు శ్రేయాంక పాటిల్ గాయపడడం ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు.ఇక ప్రేమా రావత్కు అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశం రానప్పటికీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున డబ్ల్యూపీఎల్లో తన లెగ్-స్పిన్తో ఆకట్టుకుంది. అంతేకాకుండా, దేశీయ సర్క్యూట్లో ఉత్తరాఖండ్ తరఫున కూడా ప్రేమా రావత్ రాణించింది. అంతేకాదు ఆమె ఇండియా-ఎ తరఫున కూడా కొన్ని అద్భుతమైన ప్రదర్శనలు నమోదు చేసి బీసీసీఐ దృష్టిలో పడింది.కాగా టోర్నీలో భాగంగా బుధవారం నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా కీలక స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ గాయపడింది. ఫీల్డింగ్ చేసే క్రమంలో ఆమె కుడి కాలి మడమ తిరగబడింది. దీంతో తీవ్రమైన నొప్పితో ఆమె విలవిలాడింది. ఫిజియో వెంటనే మైదానంలోకి వచ్చి ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ శ్రేయాంక పాటిల్ కనీసం కాలు కింద పెట్టలేకపోయింది. దీంతో ఆమెను స్ట్రెచర్పై గ్రౌండ్ వెలుపలి తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత స్కానింగ్ కోసం పాటిల్ను ఆసుపత్రికి తరలించారు. కాగా రిపోర్టులో శ్రేయాంక చీలమండకు గాయమైనట్లు తేలింది. ఆమె కోలుకునేందుకు కనీసం ఆరు వారాలు పట్టే అవకాశమున్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో శ్రేయాంకను బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (సీవోఈ)కు రావాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. శిబిరంలోనే శ్రేయాంక పాటిల్ చికిత్స తీసుకోనున్నట్లు బీసీసీఐ తెలిపింది. అయితే శ్రేయాంకకు గాయాలు కొత్తేమి కాదు. గతంలో వేలి ఫ్రాక్చర్, ఆ తర్వాత గ్రేడ్-3 షిన్ స్ప్లింట్స్ గాయాల కారణంగా శ్రేయాంక దాదాపు 16 నెలల పాటు ఆటకు దూరమైంది. డబ్ల్యూపీఎల్-2026 సీజన్తో ఆమె పునరాగమనం చేసింది. ఆర్సీబీ వరుసగా రెండోసారి ఛాంపియన్గా నిలవడంలో శ్రేయాంకది కీలక పాత్ర. ఇప్పుడు వరల్డ్కప్ వంటి మెగా టోర్నీలో కూడా సత్తాచాటాలని భావించిన శ్రేయాంకకు తీవ్ర నిరాశే ఎదురైంది. ఇక పాకిస్తాన్, నెదర్లాండ్స్లపై వరుసగా భారీ విజయాలు సాధించిన హర్మన్ సేన గ్రూప్-ఎ టేబుల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్ తమ తదుపరి మ్యాచ్లలో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి పటిష్టమైన జట్లను ఎదుర్కోనుంది. -
ఫిఫా తెచ్చిన తంటా.. ఆ బీర్లకు నోస్టాక్ బోర్డు!
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఫిఫా ప్రపంచకప్ ఫీవర్ నడుస్తోంది. 48 దేశాలు పాల్గొంటున్న ఫిఫాను ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా తిలకిస్తోంది. ఫుట్బాల్ ఆటలో గోల్స్ వర్షంలో తడిసి ముద్దవుతున్న అభిమానులు ఆ సంతోషంలో లెక్కకు మించి కేసులకు కేసుల బీర్లు తాగేస్తున్నారు. స్కాట్లాండ్ 28 ఏళ్ల తర్వాత ఫిఫా ప్రపంచకప్కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. దీనికి తోడు టోర్నీలో హైతీతో జరిగిన మ్యాచ్లో స్కాట్లాండ్ జట్టు 1-0తో గెలిచింది. అసలే ప్రపంచకప్కు అర్హత సాధించామన్న సంతోషాన్ని ఈ విజయం ఆ దేశ అభిమానుల్లో జోష్ను రెట్టింపు చేసింది. దీంతో స్కాట్లాండ్ అభిమానుల ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. ముఖ్యంగా పదివేల మంది స్కాట్లాండ్ మద్దతుదారులతో ఏర్పడిన ‘టార్జాన్ ఆర్మీ’ మసాచుసెట్స్ నగరానికి తరలివచ్చింది. విజయం ఇచ్చిన కిక్తో బోస్టన్ వీధుల్లో ఉన్న అనేక బార్లలో ఉన్న ‘బోస్టన్ లాగర్’ బీర్లను తాగేశారు. బోస్టన్ లాగర్ బీర్ కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం కేవలం నాలుగు రోజుల్లోనే 4వేల పింట్లు ఖాళీ అయినట్లు తెలిపింది. ఒక దశలో బీర్లకు డిమాండ్ పెరిగిపోవడంతో కంపెనీ అనేక అత్యవసర డెలివరీలను ఏర్పాటు చేయాల్సి వచ్చిందని తెలిపింది. గత 30 ఏళ్లలో ఎన్నడూ చూడని వ్యాపారం కేవలం నాలుగు రోజుల్లోనే తాము చూశామని, డిమాండ్కు తగినట్లు సరఫరా చేయడానికి మాకు కష్టమైనప్పటికీ ఆ టార్గెట్ను రీచ్ అయ్యామని బార్ నిర్వాహకుల్లో ఒకరు తెలిపారు. అయితే టార్జాన్ ఆర్మీ దెబ్బకు కొన్ని బార్లలో బోస్టన్ లాగర్ బీర్లకు సంబంధించి నోస్టాక్ బోర్డులు కనిపించడం విశేషం. ఇక టార్జాన్ ఆర్మీ పేరిట బోస్టన్లో అడుగుపెట్టిన స్కాట్లాండ్ అభిమానుల బృందం బ్యాగ్పైప్ గ్రూప్ సహకారంతో నగరంలో ఫ్యాన్ మార్చ్ నిర్వహించి, ఆ తర్వాత బోస్టన్ రెడ్సాక్స్లోని పెన్వై పార్క్కు చేరుకొని అక్కడ స్కాట్లాండ్ థీమ్తో కూడిన ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం అందరినీ ఆకట్టుకుంది. గ్రూప్-సిలో ఉన్న స్కాట్లాండ్ తమ తర్వాతి మ్యాచ్ను శనివారం మొరాకొతో ఆడనుంది.The Scotland fans are not letting the rain in Boston stop the party ! pic.twitter.com/ZqSXls8gmb— LIMBZ (@LimbzHQ) June 19, 2026The Tartan Army is at Fenway Park tonight! 🏴(via @MLB)pic.twitter.com/qDWiqelBYh— FOX Sports: MLB (@MLBONFOX) June 15, 2026 -
క్రికెటర్లు తిలక్ వర్మ, సిరాజ్లకు లీగల్ నోటీసులు!
భారత స్టార్ క్రికెటర్లు తిలక్ వర్మ, మహ్మద్ సిరాజ్లకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) లీగల్ నోటీసులు జారీ చేసింది. బీసీసీఐ నుంచి అనుమతి లేకుండానే హెచ్సీఏ నిర్వహిస్తున్న టీజీ 20 లీగ్కు ప్రచారం చేయడాన్ని తప్పుబడుతూ నోటీసులు జారీ చేసినట్లు టీసీఏ జనరల్ సెక్రటరీ గురవారెడ్డి తెలిపారు. కాగా వీరిద్దరితో పాటు టీజీ 20 లీగ్ ఆపరేషన్స్ హెడ్, మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సహా ప్రచార కర్తలుగా ఉన్న సినీ హీరోలు విజయ్ దేవరకొండ, వెంకటేశ్ దగ్గుబాటిలకు కూడా నోటీసులు జారీ చేసినట్లు టీసీఏ తెలిపింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి అనుమతి లేని టీజీ20కి ప్రచారం చేయడం అక్రమమని పేర్కొన్న టీసీఏ చర్యలకు ఉపక్రమించింది.టీసీఏ ఆరోపణల ప్రకారం బీసీసీఐ అనుమతి లేకుండానే హెచ్సీఏ టీజీ 20 లీగ్ను నిర్వహిస్తున్నట్లు తమకు సమాచారం అందింది. అందుకే టీజీ20 లీగ్కు ఆడనున్న క్రికెటర్లతో పాటు ప్రచారకర్తలుగా హీరోలకు, లీగ్ ఆపరేషన్స్ హెడ్ అంబటి రాయుడుకు కూడా లీగల్ నోటీసులు అందించినట్లు టీసీఏ పేర్కొంది.హెచ్సీఏ ఆధ్వర్యంలో టీ20 తరహాలో టీజీ20 క్రికెట్ లీగకు శ్రీకారం చుట్టారు. ఈ టోర్నీలో 8 క్రికెట్ జట్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, మెదక్, నల్గొండ, కరీంనగర్, మహబూబ్నగర్, ఖమ్మం జట్లున్నాయి. జూన్ 20 నుంచి ప్రారంభం కానున్న టోర్నీ జులై 11న ఫైనల్తో ముగియనుంది.Read: కెనడా ప్లేయర్కు విరిగిన కాలు; కట్చేస్తే ఖతార్కు చుక్కలు! -
కెనడా ప్లేయర్కు విరిగిన కాలు; కట్చేస్తే ఖతార్కు చుక్కలు!
ఫిఫా ప్రపంచకప్లో ఆతిథ్య కెనడా బోణీ కొట్టింది. గ్రూప్-బిలో ఉన్న కెనడా 6-0తో ఖతార్పై భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలి మ్యాచ్ డ్రా చేసుకున్న కెనడాకు ఇదే తొలి విజయం. కెనడా తరఫున జొనాథన్ డేవిడ్ హ్యాట్రిక్ గోల్స్తో (ఆట 29వ, 45+3వ, 90+2వ నిమిషంలో) మెరవగా, సైల్ లారిన్ (ఆట 16వ నిమిషం), నాథన్ సలిబా (ఆట 64వ నిమిషం), ఖతార్ ఆటగాడు మొహమ్మద్ మనాయి (ఆట 75వ నిమిషంలో) సెల్ఫ్ గోల్ చేయడంతో అది కెనడా ఖాతాలోకి వెళ్లిపోయింది. అయితే ఖతార్ తరఫున హొమమ్ అహ్మద్ (ఆట 33వ నిమిషం), అస్సిమ్ మదిబొ (ఆట 53వ నిమిషం) గోల్స్ కొట్టినప్పటికీ తప్పిదాలతో రిఫరీ రెడ్ కార్డ్ చూపడంతో ఖతార్ గోల్స్ చెల్లలేదు. దీంతో కెనడా భారీ విజయంతో 4 పాయింట్లతో పట్టికలో తొలి స్థానంలో ఉంది. ఇదే మ్యాచ్లో కెనడా స్టార్ మిడ్ఫీల్డర్ ఇస్మాయిల్ కొనే ప్రత్యర్థి ఆటగాడి ఫౌల్ కారణంగా తన ఎడమ కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. నొప్పి భరించలేక మైదానంలోనే స్ట్రెచర్పై ఆక్సిజన్ మాస్క్తో బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.ఇక మ్యాచ్లో హ్యాట్రిక్ గోల్స్ కొట్టిన జొనాథన్ డేవిడ్ అరుదైన ఫీట్ సాధించాడు. 2026 ఫిఫా ప్రపంచకప్లో మెస్సీ తర్వాత హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. మూడు కీలక గోల్స్తో కెనడా విజయంలో కీలకపాత్ర పోషించిన జొనాథన్నే ఫిఫా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.చదవండి: వివాదంలో మెస్సీ.. భగ్గుమన్న అభిమానులు! -
రెడ్ కార్డు టర్నింగ్ పాయింట్.. బోస్నియాపై స్విస్ దూకుడు
ఫిఫా ప్రపంచకప్ 2026లో స్విట్జర్లాండ్ తొలి విజయాన్ని నమోదు చేసింది. బోస్నియా అండ్ హెర్జేగోవినాపై 4-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది.73వ నిమిషం వరకు ఇరు జట్ల తరఫున ఒక్క గోల్ కూడా నమోదు కాకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసేలా కనిపించింది. అయితే యువ మిడ్ఫీల్డర్ జోహాన్ మంజాంబి అద్భుత వాలీతో తొలి గోల్ చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.ఆ వెంటనే బోస్నియా డిఫెండర్ తారిక్ ముహరెమోవిక్ ప్రత్యర్ది గోల్ అవకాశాన్ని అడ్డుకోవడంతో రెడ్ కార్డుకు గురై మైదానం వీడాడు. దీంతో 10 మంది ఆటగాళ్లతో బోస్నియా తీవ్ర ఒత్తిడికి లోనైంది.ఈ దశలో (84వ నిమిషం) స్విట్జర్లాండ్ తరఫున రూబెన్ వర్గాస్ రెండో గోల్ చేయగా, మంజాంబీ మరోసారి (90వ నిమిషం) బంతిని నెట్లోకి పంపి డబుల్ పూర్తి చేశాడు.ఇంజరీ టైమ్లో (90+3) ఎర్మిన్ మహ్మిక్ బోస్నియాకు కంటితుడుపు గోల్ అందించినా, చివర్లో (90+7) గ్రానిట్ హాకా పెనాల్టీని గోల్గా మలిచి 4-1 గోల్స్తో స్విస్ విజయాన్ని ఖాయం చేశాడు. -
వెస్టిండీస్ థ్రిల్లింగ్ విక్టరీ.. స్కాట్లాండ్ పోరాటం వృథా
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో వెస్టిండీస్ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. స్కాట్లాండ్తో జరిగిన గ్రూప్-బీ మ్యాచ్లో 7 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. షెమైన్ క్యాంప్బెల్ 26 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 36 పరుగులు చేయగా.. ఏడో స్థానంలో బరిలోకి దిగిన స్టెఫానీ టేలర్ 19 బంతుల్లో అజేయమైన 47 పరుగులు (3 సిక్సర్లు, 4 ఫోర్లు) చేసి జట్టుకు పోరాడే స్కోర్ను అందించింది. మిగతా ప్లేయర్లలో కియానా జోసఫ్ (13), కెప్టెన్ హేలీ మాథ్యూస్ (14), డియాండ్రా డాట్టిన్ (14), క్లాక్స్టన్ (16), చినెల్ హెన్రీ (4) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. స్కాట్లాండ్ బౌలర్లలో కేథరీన్ ఫ్రేజర్ 2 వికెట్లతో రాణించగా.. కేథరీన్ బ్రైస్, రేచల్ స్లేటర్, గార్డన్ తలో వికెట్ తీశారు.లక్ష్య ఛేదనలో స్కాట్లాండ్ శుభారంభం చేసింది. డార్సీ కార్టర్, కేథరీన్ ఫ్రేజర్ జోడీ తొలి వికెట్కు 51 పరుగులు జోడించి వెస్టిండీస్ను ఒత్తిడిలోకి నెట్టింది. గాయంతో ఇబ్బంది పడుతూనే కార్టర్ 53 బంతుల్లో అర్ధశతకం సాధించింది.ఈ దశలో వెస్టిండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ మ్యాచ్ను మలుపుతిప్పింది. వరుస బంతుల్లో కీలక వికెట్లు తీసి స్కాట్లాండ్ను ఒత్తిడిలోకి నెట్టింది. ఆమె మూడు, అఫీ ఫ్లెచర్ రెండు వికెట్లు తీయడంతో స్కాట్లాండ్ 23 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు కోల్పోయింది. చివర్లో గట్టిగా పోరాడినా 20 ఓవర్లలో 146 పరుగులకే పరిమితమైంది.ఈ విజయంతో వెస్టిండీస్ గ్రూప్-బీలో వరుసగా రెండు విజయాలు నమోదు చేసి సెమీస్ ఆశలను మరింత బలోపేతం చేసుకుంది. -
నీరజ్ సిద్ధం...
దోహా: భారత స్టార్ జావెలియన్ త్రోయర్, టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా గత ఏడాది సెప్టెంబర్లో చివరిసారిగా ఫీల్డ్లో నిలిచాడు. టోక్యోలో జరిగిన వరల్డ్ చాంపియన్షిప్లో నిరాశాజనక ప్రదర్శన కనబర్చిన అతను ఎనిమిదో స్థానంతో ముగించాడు. టోక్యో ఈవెంట్ తర్వాత విరామం తీసుకున్న అతను ఇప్పుడు పూర్తి ఫిట్గా మళ్లీ సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్తో అతని కొత్త సీజన్ మొదలవుతోంది. లీగ్లోని ఆరు అంచెల్లో భాగంగా రబత్ (మొరాకో), రోమ్ (ఇటలీ)లలో జరిగిన తొలి రెండు ఈవెంట్లలో నీరజ్ పాల్గొనలేదు. ఇప్పుడు దోహా (ఖతర్)లో జరిగే మూడో అంచె పోటీల్లో అతను పోటీ పడుతున్నాడు. నేడు జరిగే పోరులో తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని నీరజ్ పట్టుదలగా ఉన్నాడు. తనకు అచ్చొచ్చిన ఈ వేదికపై గత ఏడాది భారత అథ్లెట్ తొలిసారి 90 మీటర్లకు పైగా (90.23 మీటర్లు) జావెలిన్ విసిరాడు. ‘నిజానికి నేను గత ఏడాది వరల్డ్ చాంపియన్షిప్ సమయంలో గాయంతో బాధపడుతున్నా. అయినా సరే బరిలోకి దిగడం సరైన నిర్ణయం కాదు. అయితే ఏడాదిలో అది చివరి ఈవెంట్ కావడంతో నాకు తప్పలేదు. అథ్లెట్ల కెరీర్లో గాయాలు భాగం. భుజం, మడమ గాయాలతో నేను ఇబ్బంది పడ్డా. అయితే ఇప్పుడు ఆ సమస్యలన్నీ దూరమయ్యాయి. ఇప్పుడు పూర్తి ఫిట్గా మారి ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. ఇక్కడ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలనని భావిస్తున్నా’ అని నీరజ్ చెప్పాడు. అందుకే కోచ్గా విడిపోయా! తన కెరీర్లో మంచి ఫలితాలు సాధించడంలో భాగంగా ఉన్న వ్యక్తిగత కోచ్ యాన్ జెలెన్జీతో గత జనవరిలో విడిపోయిన చోప్రా... ప్రస్తుతం భారత్కే చెందిన జైవీర్ చౌదరితో కలిసి పని చేస్తున్నాడు. ‘జెలెన్జీ చాలా మంది అథ్లెట్, గొప్ప కోచ్ కూడా. మేమిద్దరం పలు అంశాలపై కలిసి పని చేశాం. అతను కోచ్గా ఉన్న సమయంలోనే 90 మీటర్లకు పైగా జావెలిన్ విసరడం సంతోషకర క్షణం. అయితే ఆయనతో కలిసి పని చేయాలంటే సీజన్ మొత్తం ఒకే చోట ఉండాల్సి రావడం నాకు సాధ్యం కావడం లేదు. పైగా నా శైలిలో కొన్ని కొత్త ఆలోచనలతో పని చేయాలని భావించడం వల్లే వరల్డ్ చాంపియన్షిప్ తర్వాత ఆయనతో విడిపోయా. జైవీర్తోనే కలిసి నేను జావెలిన్ మొదలు పెట్టా. గత 15–16 ఏళ్లుగా నా గురించి, నా శిక్షణ గురించి అతనికి బాగా తెలుసు. అందుకే కొన్ని సాంకేతిక అంశాలపై జైవీర్తో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నా’ అని నీరజ్ స్పష్టం చేశాడు. కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో కూడా... ఈ ఏడాది ఒలింపిక్స్, వరల్డ్ చాంపియన్షిప్ లేకపోవడంతో తనపై మానసికంగా కాస్త ఒత్తిడి తగ్గిందని చోప్రా వ్యాఖ్యానించాడు. అయితే కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలతో బిజీగా ఉండనున్నట్లు అతను చెప్పాడు. కామన్వెల్త్ క్రీడల కోసం ఎంపిక చేసిన 32 మంది సభ్యుల భారత అథ్లెటిక్స్ బృందంలో చోప్రా కూడా ఉన్నాడు.‘శ్రీలంక ఆటగాడు రుమేశ్ పతిరగే, పారిస్ ఒలింపిక్స్ విజేత అర్షద్ నదీమ్లతో పాటు వరల్డ్ చాంపియన్ వాల్కాట్, మాజీ చాంపియన్ అండర్సన్ పీటర్స్ కూడా కామన్వెల్త్ గేమ్స్ బరిలోకి దిగుతున్నారు. వీరంతా 90 మీటర్లకు పైగా జావెలియన్ విసిరినవారే. కాబట్టి పోటీపరంగా ఇదేమీ వరల్డ్ చాంపియన్షిప్కంటే తక్కువేమీ కాదు. కాబట్టి తీవ్రంగా పోరాడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆసియా క్రీడల్లో కూడా పాల్గొనాలని భావిస్తున్నా’ అని నీరజ్ వెల్లడించాడు. త్వరలోనే ఎన్సీ క్లాసిక్... నీరజ్ చోప్రా గత ఏడాది జులైలో బెంగళూరులో తన పేరిట ఎన్సీ క్లాసిక్ ఈవెంట్ నిర్వహించాడు. అయితే ఈ ఏడాది దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. దీనిపై మాట్లాడుతూ నీరజ్... ‘గత ఏడాది ఒక్క జావెలిన్ త్రో ఈవెంట్కు 15 వేల మంది ప్రేక్షకులు హాజరు కావడం నిజంగా గర్వించే అంశం. దీంతో పాటు మరికొన్ని ఈవెంట్లు చేర్చాలనే ప్రతిపాదన ఉంది. దీనిపై నా బృందం కలిసి పని చేస్తోంది. త్వరలోనే వివరాలు వెల్లడిస్తాం’ అని నీరజ్ చెప్పాడు. -
భారత్ ‘హ్యాట్రిక్’ విజయం
ఆక్లాండ్: మహిళల నేషన్స్ కప్ హాకీ టోర్నమెంట్ లీగ్ దశను భారత జట్టు అజేయంగా ముగించింది. గురువారం జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్లో సలీమా టెటె బృందం 3–2 గోల్స్ తేడాతో ఉరుగ్వే జట్టును ఓడించింది. భారత్ తరఫున దీపిక రెండు గోల్స్ (24వ, 56వ నిమిషాల్లో) చేయగా... దీపిక సోరెంగ్ (43వ నిమిషంలో) ఒక గోల్ సాధించింది. ఉరుగ్వే తరఫున చియారా అపెనినో (13వ నిమిషంలో), మాన్యుయెలా విలార్ (55వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఈ మ్యాచ్ ద్వారా భారత ప్లేయర్ నేహా కెరీర్లో 200 అంతర్జాతీయ మ్యాచ్లు పూర్తి చేసుకుంది. ‘హ్యాట్రిక్’ విజయం సాధించిన భారత జట్టు తొమ్మిది పాయింట్లతో గ్రూప్ ‘ఎ’లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. శనివారం జరిగే సెమీఫైనల్లో చిలీ జట్టుతో భారత్ తలపడుతుంది. -
బాబోయ్... పాములు!
న్యూయార్క్: ప్రతిష్టాత్మక ‘ఫిఫా’ ప్రపంచకప్లో పాల్గొంటున్న జర్మనీ జట్టుకు వింత సమస్య వెంటాడుతోంది. ఆ జట్టు బస చేసిన నార్త్ కరోలినా క్యాంప్లో పాముల బెడద ఎక్కువగా ఉందని జట్టు సభ్యులు వాపోతున్నారు. తదుపరి మ్యాచ్లో ఎవరితో తలపడాలి, ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి అనే ఆలోచనలతో పాటు పాముల నుంచి ఎలా రక్షించుకోవాలనే అంశాన్ని కూడా ఆలోచించాల్సి వస్తోందని జర్మనీ కెప్టెన్ జోషువా కిమ్మిచ్ వెల్లడించాడు. ‘జర్మనీలో అయితే వ్యూహాలు, గాయాలు, ప్రత్యర్థుల గురించి ఆలోచించాల్సి వచ్చేది. కానీ ఇక్కడ గడ్డిలో ఏం ఉన్నాయో అని భయపడాల్సి వస్తోంది. మా జట్టు సభ్యులకు పలు చోట్ల పాములు దర్శనమిస్తున్నాయి. వాటితో ప్రాణహాని లేకపోయినా... పాముకాటుకు గురవ్వాలని ఎవరూ కోరుకోరు కదా’ అని కిమ్మిచ్ పేర్కొన్నాడు. మరోవైపు స్విట్జర్లాండ్, నార్వే జట్లు కూడా ఇలాంటి సమస్యతోనే ఇబ్బంది పడుతున్నాయి. -
ఒలింపిక్ స్వర్ణమే తదుపరి లక్ష్యం!
న్యూఢిల్లీ: భారత సీనియర్ హాకీ ప్లేయర్ మన్ప్రీత్ సింగ్ తన కెరీర్లో అతి పెద్ద మైలురాయిని అందుకున్నాడు. బుధవారం జర్మనీతో జరిగిన ప్రొ హాకీ లీగ్ మ్యాచ్ అతను తన కెరీర్లో 413 మ్యాచ్లు పూర్తి చేసుకున్నాడు. భారత్ తరఫున అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా దిలీప్ టిర్కీ (412) రికార్డును మన్ప్రీత్ అధిగమించాడు. అంతర్జాతీయ హాకీలో అత్యధిక మ్యాచ్లు ఆడిన జాబితాలో జాన్ డోమన్ (481), డి నూయెర్ (453), ఎడీ ఒకెండెన్ (451), బారీ మిడిల్డన్ (432) తర్వాత ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్నాడు. మరో ఇద్దరు ఆటగాళ్లు వసీమ్ అహ్మద్ (410), జెరోన్ డెల్మీ (401) మాత్రమే 400కు పైగా మ్యాచ్లు ఆడారు. 2011 చాంపియన్స్ ట్రోఫీతో తన కెరీర్ ఆరంభించిన మిడ్ఫీల్డర్ మన్ప్రీత్ ఈ 15 ఏళ్లలో ఎన్నో ఘనతలు తన పేరిట లిఖించుకున్నాడు. 2020 టోక్యో, 2024 పారిస్ ఒలింపిక్స్లలో కాంస్య పతకాలు గెలిచిన భారత జట్లలో అతను సభ్యుడిగా ఉన్నాడు. వచ్చే శుక్రవారం తన 34వ పుట్టిన రోజు జరుపుకోనున్న మన్ప్రీత్ తాజా రికార్డు పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. ‘భారత జట్టు సభ్యుడిగా అంతర్జాతీయ మ్యాచ్లో బరిలోకి దిగడమే ఒక గొప్ప ఘనతగా భావించా. ఇప్పుడు దేశం తరఫున ఇన్ని మ్యాచ్లు ఆడటం నిజంగా చాలా గర్వకారణంగా అనిపిస్తోంది. నా ఈ ప్రయాణంలో భాగమైన సహచర ఆటగాళ్లు, కుటుంబ సభ్యులకు దీనిని అంకితమిస్తున్నా’ అని అతను స్పందించాడు. మన్ప్రీత్ ఘనతలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని ఈ సందర్భంగా హాకీ ఇండియా (హెచ్ఐ) ప్రశంసించింది. మన్ప్రీత్కు రూ.10 లక్షల నగదు పురస్కారాన్ని హెచ్ఐ ప్రకటించింది. రెండు ఒలింపిక్స్ కాంస్యాల తర్వాత ఇప్పుడు తన తదుపరి లక్ష్యం ఒలింపిక్ స్వర్ణమని, అదే తరహాలో ప్రపంచకప్లో కూడా విజయాన్ని ఆశిస్తున్నట్లు మన్ప్రీత్ చెప్పాడు. 2014, 2022 ఆసియా క్రీడలతో పాటు 2017, 2025లలో ఆసియా కప్ గెలిచిన జట్లలో కూడా అతను సభ్యుడిగా ఉన్నాడు. ‘భారత్కు విజయాలు అందించాలనే తపనే నన్ను ఇన్నేళ్లుగా నడిపిస్తోంది. ఇప్పుడు కూడా రెండు కలలు మిగిలి ఉన్నాయి. ఒలింపిక్స్లో స్వర్ణం సాధించడంతో పాటు ప్రపంచ కప్ కూడా గెలవాలనేది నా కోరిక. ఈ క్రమంలో నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ఎప్పుడైనా సిద్ధమే’ అని అతను అన్నాడు.ఆదర్శం... విరాట్ కోహ్లి 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ను దృష్టిలో ఉంచుకొని తన ఫిట్నెస్పై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు... ఈ విషయంలో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి తనకు ఆదర్శమని మన్ప్రీత్ వెల్లడించాడు. ‘అత్యుత్తమ ఫిట్నెస్తో తర్వాతి పోటీలకు సిద్ధం కావాలని ఆశిస్తున్నా. ఇందులో లోటు ఉంటే జట్టునుంచి నేనే స్వయంగా తప్పుకుంటా. ఫిట్నెస్ విషయంలో నేను కోహ్లిని చూసి చాలా నేర్చుకున్నా. 36 ఏళ్ల వయసులో కూడా ఎంత చురుగ్గా ఉండవచ్చో అతడిని చూస్తే తెలుస్తుంది. మైదానంలో దూకుడుగా ఉండటం, ఎక్కడా తగ్గకుండా 100 శాతం శ్రమించడం వంటివి కోహ్లి చేసి చూపించాడు. నేనే అదే చాలా వరకు పాటించా. ఇంత సుదీర్ఘ కాలం నేను జట్టులో కొనసాగడానికి మంచి ఫిట్నెస్ కూడా కారణం’ అని మన్ప్రీత్ వ్యాఖ్యానించాడు. -
వైభవ్కు తోడుగా తల్లిదండ్రులు
న్యూఢిల్లీ: భారత సీనియర్ జట్టులోకి తొలిసారి ఎంపికైన సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రత్యేక ఏర్పాటు చేయనుంది. ఐర్లాండ్–ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే 15 ఏళ్ల వైభవ్కు తోడుగా అతని తల్లిదండ్రులను పంపాలని బోర్డు నిర్ణయించింది. ఈ వయసులో అమ్మానాన్న తన పక్కన ఉండటం వైభవ్కు మేలు చేస్తుందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అభిప్రాయ పడ్డారు. తనకంటే వయసులో పెద్దవారైన క్రికెటర్లతో కలిసి ఉండటంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాము ఈ నిర్ణయం తీసుకున్నామని సైకియా వెల్లడించారు. ‘సాధారణంగా ఏదైనా సీనియర్ టీమ్లలో ఇంత చిన్న వయసు ఆటగాళ్లు ఉండరు. ఎప్పుడో సచిన్ టెండూల్కర్ చిన్న వయసులో జాతీయ జట్టులోకి వచ్చాక ఇన్నేళ్లకు ఇప్పుడు మళ్లీ వైభవ్లాంటి కుర్రాడు వచ్చాడు. సహజంగానే 15 ఏళ్ల అబ్బాయికి సీనియర్లతో కలిసి ఉండటంలో సమస్యలు వస్తాయి. మిగతా ఆటగాళ్లంతా 18 ఏళ్లకు పైగా వయసు ఉన్నవారే. అలాంటి వాతావరణంలో అలవాటు పడేందుకు తల్లిదండ్రులు తోడుగా ఉండటం మేలు చేస్తుంది. స్కూల్ విద్యార్థులు విహారయాత్రకు వెళ్లినప్పుడు కూడా పెద్దవాళ్లు తోడుగా ఉంటారు. ఇదీ అలాంటిదే. వైభవ్ ఇంకా స్కూల్ కుర్రాడే. అతను రాబోయే కొన్నేళ్ల పాటు భారత క్రికెట్కు పెద్ద ఆస్తిలాంటివాడు’ అని సైకియా వ్యాఖ్యానించారు. మరోవైపు ఇటీవల శ్రీలంకలో ‘ఎ’ మ్యాచ్ సందర్భంగా వైభవ్ ప్రత్యర్థి ఆటగాళ్లతో దూకుడుగా వ్యవహరించిన అంశంపై తాము ఎలాంటి చర్యలు తీసుకోమని బోర్డు కార్యదర్శి స్పష్టం చేశారు. ‘ఇదంతా ఆటలో భాగంగానే జరిగింది. ఇలాంటి అంశాల్లో మ్యాచ్ అధికారుల పాత్ర కీలకంగా ఉంటుంది. ఏం చేయాలనేది వారిష్టం. బీసీసీఐకు దీంతో ఎలాంటి సంబంధం లేదు. మేం మ్యాచ్ రిఫరీ పాత్ర పోషించలేం కదా’ అని సైకియా స్పందించారు. -
జర్మనీకి భారత్ షాక్
రోటర్డామ్ (నెదర్లాండ్స్): పురుషుల ప్రొ హాకీ లీగ్లో భారత జట్టు రెగ్యులర్ సమయంలో తొలి విజయం అందుకుంది. ప్రపంచ చాంపియన్ జర్మనీ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత జట్టు 3–1తో సంచలన విజయం సాధించింది. భారత్ తరఫున మన్దీప్ సింగ్ (7వ నిమిషంలో), శిలానంద్ లాక్రా (13వ నిమిషంలో), నీలకంఠ శర్మ (35వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. ఈ మ్యాచ్లో బరిలోకి దిగడం ద్వారా మాజీ కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ భారత్ తరఫున అత్యధిక మ్యాచ్లు (413) ఆడిన హాకీ ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. 412 మ్యాచ్లతో దిలీప్ టిర్కీ పేరిట ఉన్న రికార్డును మన్ప్రీత్ బద్దలు కొట్టాడు. తొమ్మిది జట్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో భారత్ పది మ్యాచ్లు పూర్తి చేసుకుంది. రెగ్యులర్ సమయంలో ఒక విజయం (3 పాయింట్లు), ‘షూటౌట్’లో ఒక విజయం (2 పాయింట్లు) సాధించింది. ‘షూటౌట్’ లో రెండు పరాజయాలు (ఒక్కో పాయింట్), రెగ్యులర్ మ్యాచ్లో ఆరు ఓటములు చవిచూసి ఏడు పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. -
బిహార్ నుంచి మరో క్రికెట్ సంచలనం.. 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ
వైభవ్ సూర్యవంశీ.. బిహార్ నుంచి వచ్చి తన సంచలన బ్యాటింగ్తో యావత్తు క్రికెట్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాడు. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే భారత సీనియర్ జట్టుకు ఎంపికై క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇప్పుడు అదే బిహార్ నుంచి మరో యువ సంచలనం వెలుగులోకి వచ్చింది. కేవలం 14 ఏళ్ల వయస్సులోనే తన అద్భుత బ్యాటింగ్తో పరుగుల సునామీ సృష్టించింది.ఈ చిచ్చర పిడుగు పేరు అక్షర గుప్తా. బిహార్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న మహిళల అండర్-19 వన్డే టోర్నమెంట్లో అక్షర ఏకంగా అజేయ త్రిశతకం బాది అందరి దృష్టిని ఆకర్షించింది. భాగల్పూర్లోని శాండిస్ కాంపౌండ్ గ్రౌండ్లో జరిగిన మ్యాచ్లో ప్రత్యర్ధి బౌలర్లను అక్షర్ ఉతికారేసింది. కేవలం 126 బంతుల్లో 42 ఫోర్లు, 16 సిక్సర్ల సాయంతో 306 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది.తొలుత 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అక్షర.. 34 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకుంది. మహిళల దేశీవాళీ క్రికెట్లో అత్యధిక స్కోరు చేసిన రెండో బ్యాటర్గా అక్షర నిలిచింది. ఈ జాబితాలో అగ్రస్ధానంలో ముంబైకి చెందిన ఇరా గుప్తా (346) ఉంది. మరో 40 పరుగులు చేసి ఉంటే ఇరా గుప్తా రికార్డును అక్షర బ్రేక్ చేసి ఉండేది.ఎవరీ అక్షర గుప్తా?వైభవ్ సూర్యవంశీ మాదిరే ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన అక్షర.. పేస్ బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడడం ఆమె స్పెషాలిటి. కేవలం 14 ఏళ్ల వయసులోనే బీహార్ అండర్-19 జట్టుకు ఆమె నాయకత్వం వహించింది. అంతేకాకుండా బిహార్ సీనియర్ జట్టుకు కూడా అక్షర్ ప్రాతినిథ్యం వహించింది. అయితే ఫిట్నెస్ పరంగా కూడా ఆమె కొంచెం మెరుగు పడాల్సి ఉంది.చదవండి: Gurnoor Brar: టీమిండియాకు దొరికిన 'ఆరడుగుల' బుల్లెట్ -
'నెక్స్ట్ సచిన్, కోహ్లి' అంటూ భజన.. వారు ఏమయ్యారో తెలుసు కదా?
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాడు. అయితే ఈసారి అతడి ప్రదర్శన గురుంచి కాకుండా ప్రవర్తన గురుంచి చర్చ నడుస్తోంది. శ్రీలంక పర్యటనలో ప్రత్యర్థి ఆటగాళ్ల స్లెడ్జింగ్కు ఈ యువ బ్యాటర్ తీవ్రంగా రియాక్ట్ అవ్వడమే ఇందుకు కారణం.అతడి ప్రవర్తనను కొందరు తప్పుబడుతుంటే, మరొకరు సమర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ మెంటల్ కండిషనింగ్ కోచ్ ప్యాడీ అప్టన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తుపై బీసీసీఐకి కొన్ని విలువైన సూచనలు చేశారు. ఇప్పటివరకు విజయాలనే చూసిన వైభవ్.. కొన్ని సందర్భాల్లో వైఫల్యాలను ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉండాలని అప్టన్ అభిప్రాయపడ్డారు.కాగా ప్యాడీ అప్టన్ సుదీర్ఘ కాలం పాటు భారత జట్టుకు మెంటల్ కండిషనింగ్ కోచ్గా తన సేవలను అందించాడు. 2011లో భారత్ వన్డే ప్రపంచ కప్ గెలవడంలోనూ, 2009లో టెస్ట్ క్రికెట్లో నంబర్ వన్ స్థానానికి చేరడంలోనూ ఆయనదే కీలక పాత్ర."వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే మైదానంలో చాలా సార్లు తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. క్లిష్ట సమయాల్లో కూడా రాణించేందుకు అవసరమైన మైండ్ సెట్ అతడికి ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఏ ప్లేయర్ కూడా తన కెరీర్ అంతటా ఒకే విధమైన ఫామ్ను కొనసాగించలేడనే విషయాన్ని వైభవ్ గ్రహించాలి. అతడు ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కానీ ఆ ఫామ్ ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుందని ఆశించకూడదు. ఒకవేళ నేను కనుక ఇప్పుడు అతడితో ఉంటే.. తక్కువ స్కోర్లు రావడం, కొన్నిసార్లు విఫలం కావడం లేదా ఫలితాలు ఆశించినట్లుగా రాకపోవడం వంటివి సహజమని అర్థమయ్యేలా చెప్పేవాడిని. ఇంతకంటే భిన్నంగా ఏమి జరగదు. ప్రతీ ఆటగాడు ఏదో ఒక దశలో తన ఫామ్ను కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆ బ్యాడ్ ఫామ్ నుంచి ఎంత వేగంగా బయటపడతాడనేదే అతడి కెరీర్ను నిర్ణయిస్తుంది. బయట నుంచే వచ్చే ఒత్తిడి, అనవసరపు చర్చలను సమర్ధవంతంగా ఎదుర్కొవడం వైభవ్ ముందున్న అతిపెద్ద సవాల్.ప్రపంచంలోనే అత్యంత మానసిక దృఢత్వం కలిగిన, ఎంతో అనుభవం ఉన్న మేటి అథ్లెట్లు సైతం కొన్నిసార్లు బయటి , విమర్శలు , ఇతరుల అభిప్రాయల వల్ల తమ ఏకాగ్రతను కోల్పోయి కెరీర్ నాశనం చేసుకున్నారు.అలా వచ్చి.. ఇలా వెళ్లిపోయారుగత 5-6 ఏళ్లలో భారతదేశంలో రాత్రికి రాత్రే స్టార్స్గా ఎదిగిన ఎంతోమంది యువ సూపర్ స్టార్లను మనం చూశాం. ఐపీఎల్లో ఒక సీజన్ అద్భుతంగా ఆడగానే.. వారిని తర్వాతి సచిన్ టెండూల్కర్ అనో, తర్వాతి విరాట్ కోహ్లీ అనో లేదా తర్వాతి ఎంఎస్ ధోని అనో పిలవడం మొదలుపెట్టేస్తారు. కానీ వారిలో చాలా మంది అడ్రస్ లేకుండా అయిపోయారు. వారు కేవలం సాధారణ ఐపీఎల్ ఆటగాళ్ల స్థాయికే పరిమితమైపోయారు. దీనికి ప్రధాన కారణం.. వారు కూడా ఈ బయటి హడావుడిలో, విపరీతమైన అంచనాల వలయంలో చిక్కుకుపోవడమే. ఎవరైనా తప్పులు చేయడం సహజం. వైభవ్ కూడా తప్పు చేశాడనేది నిజమే. కానీ ఎలాంటి ఒత్తిడి, ఆందోళన కారణంగా అలా చేశాడో నేను ఊహించగలను. ఈ ఊహించని ఘటన నుంచి కోలుకోవడానికి, పాఠాలు నేర్చుకోవడానికి అతడికి ఎవరు గైడెన్స్ ఇస్తారన్నది చాలా ముఖ్యం. రాబోయో రోజుల్లో అతడు ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు వెళ్లనున్నాడు. ప్రత్యర్థి జట్లు మరింత దూకుడుగా వ్యవహరిస్తారు. వీటిన్నంటిని అతడు తట్టుకోవడానికి సిద్దంగా ఉండాలి. ముఖ్యంగా ఫెయిలూర్స్ను కూడా అతడు స్వీకరించాలి. అంతే తప్ప సహనం కోల్పోకూడదు. ఈ 15 ఏళ్ల వండర్ కిడ్ను కేవలం టెక్నికల్గానే కాకుండా, మానసికంగా కూడా ఒక గొప్ప ఆటగాడిగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత బీసీసీఐపై ఉందని" స్పోర్ట్స్ స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్యాడీ అప్టన్ పేర్కొన్నాడు. -
న్యూజిలాండ్ను కాపాడిన గ్లెన్ ఫిలిప్స్
లండన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ను ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ అద్భుత సెంచరీతో ఆదుకున్నాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ తొలుత కివీస్ను బ్యాటింగ్ అహ్హానించాడు. అయితే బ్యాటింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై న్యూజిలాండ్ 188 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఈ సమయంలో గ్లెన్ ఫిలిప్స్, వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ బ్లండెల్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. అయితే తొలి రోజు ఆట ముగుస్తుందన్న సమయంలో కివీస్ వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాక బ్లండెల్ జాకబ్ బెథెల్ బౌలింగ్లో అవుట్ కాగా.. ఆ తర్వాత నాథన్ స్మిత్ కూడా తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. 280 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశలో న్యూజిలాండ్ కనీసం 350 పరుగులైనా చేస్తుందా అనే అనుమానం కలిగింది. అయితే రెండో రోజు ఆటలో మాత్రం ఫిలిప్స్ దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో 133 బంతుల్లో ఫిలిప్స్ తొలి టెస్ట్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు.అతడు సరిగ్గా 100 పరుగులు చేసి పదో వికెట్గా వెనుదిరిగాడు. అయితే రెండో రోజు ఆటలో ఫిలిప్స్కు కైల్ జేమీసన్ (41) కూడా మంచి సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఫలితంగా న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 391 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో పార్ట్ టైమ్ స్పిన్నర్ జాకబ్ బెతల్ మూడు వికెట్లు పడగొట్టగా.. జోఫ్రా ఆర్చర్, మాథ్యూ ఫిషర్, బాకర్ తలా రెండేసి వికెట్లు చొప్పున సాధించారు.చదవండి: Gurnoor Brar: టీమిండియాకు దొరికిన 'ఆరడుగుల' బుల్లెట్ -
భారత్తో చారిత్రాత్మక టెస్ట్కు ఇంగ్లండ్ జట్టు ప్రకటన
భారత మహిళల క్రికెట్ జట్టుతో జరగనున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్గా నాట్ స్లివర్-బ్రంట్ కెప్టెన్గా వ్యహరించనుంది.అదేవిధంగా అలిస్ క్యాప్సే, టిల్లీ కోర్టీన్-కోల్మన్, మాడీ విలియర్స్, గ్రేస్ పాట్స్, ఎల్లీ త్రెల్కెల్డ్లకు తొలిసారి ఇంగ్లండ్ టెస్ట్ జట్టులో చోటు దక్కింది. వీరిలో గ్రేస్ పాట్స్, ఎల్లీ త్రెల్కెల్డ్ ఇప్పటివరకు ఇంగ్లండ్ తరపున ఏ ఫార్మాట్లోనూ అరంగేట్రం చేయలేదు.142 ఏళ్లలో ఇదే తొలిసారికాగా ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్ జూలై 10 నుండి 13 వరకు లార్డ్స్ మైదానం వేదికగా జరగనుంది. అయితే లార్డ్స్ తన 142 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో ఒక మహిళల టెస్ట్ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. అంతకంటే ముందు ఇదే మైదానంలో జూలై 5న మహిళల టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్ కూడా జరగనుంది. ఈ చారిత్రత్మక టెస్ట్ మ్యాచ్ కోసం బీసీసీఐ తమ జట్టును మరో వారం రోజుల్లో ప్రకటించే అవకాశముంది. భారత్, ఇంగ్లండ్ ఉమెన్స్ టీమ్స్ చివరగా 2023లో రెడ్బాల్ క్రికెట్ మ్యాచ్లో తలపడ్డాయి.భారత్తో ఏకైక టెస్టు కోసం ఇంగ్లాండ్ మహిళల జట్టునాట్ సివర్-బ్రంట్ (కెప్టెన్), టామీ బ్యూమాంట్, లారెన్ బెల్, మాయా బౌచర్, ఆలిస్ క్యాప్సీ, టిల్లీ కోర్టీన్-కోల్మన్, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్, అమీ జోన్స్, హీథర్ నైట్, ఎమ్మా లాంబ్, గ్రేస్ పాట్స్, ఎల్లీ థ్రెల్కెల్డ్, మాడీ విల్లయర్స్, ఇస్సీ వాంగ్.చదవండి: Gurnoor Brar: టీమిండియాకు దొరికిన 'ఆరడుగుల' బుల్లెట్ -
TG20: ఎనిమిది జట్లు, ఆటగాళ్ల ధర.. పూర్తి వివరాలు
తెలంగాణలో ప్రతిష్టాత్మక టీ20 లీగ్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఆధ్వర్యంలో టీజీ20 పేరిట జూన్ 21 నుంచి జూలై 10 మధ్య షెడ్యూల్ ఖరారైంది. కరీంనగర్ డైమండ్స్, ఖమ్మం ఏసెస్, పాలమూరు స్ట్రైకర్స్, మెదక్ ఫాల్కన్స్, నల్గొండ నైట్స్, రంగారెడ్డి రైజర్స్, వరంగల్ వారియర్స్, హైదరాబాద్ ఈ చాంపియన్స్ తొలి ట్రోఫీ కోసం బరిలో నిలిచాయి.ఈ నేపథ్యంలో టీజీ టీ20 ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ తీరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎనిమిది జట్ల కెప్టెన్లతో పాటు స్పాన్సర్ శ్రీనిధి యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.ఏ జట్టులో ఎవరు? ధర ఎంత?కరీంనగర్ డైమండ్స్చందన్ సహానీ- రూ. 9.5 లక్షలుఆశిష్ శ్రీవాస్తవ్- రూ. 9 లక్షలుతన్మయ్ అగర్వాల్- రూ. 8 లక్షలురాహుల్ రాదేశ్- రూ. 4.5 లక్షలురత్లావత్ దినేశ్- రూ. 4.5 లక్షలుహృషికేశ్ సింహ- రూ. 3.7 లక్షలుశుభం శర్మ- రూ. 3.5 లక్షలుమహ్మద్ అబ్దుల్ అద్నాన్- రూ. 3 లక్షలుఎన్ సాత్విక్ రెడ్డి- రూ. 2 లక్షలుటీవీఎస్ నారాయణ తేజ- రూ. 2 లక్షలుఅఖిల్ కుమార్ సంకోజు- రూ. 1.5 లక్షలుబి సతీశ్ కుమార్- రూ. లక్షసాయి కార్తికేయ మల్లం- రూ. 95 వేలునిహాల్ రెడ్డి- రూ. 75 వేలుర్యాన్ బిన్ అబ్దుల్లా- రూ. 75 వేలుఆశిష్ అభయ్- రూ. 75 వేలురావూరి సాయి శరణ్- రూ. 75 వేలుపగడాల లోకేశ్- రూ. 75 వేలుయశ్ సత్వాలేకర్- రూ. 75 వేలుచిల్లకూరు లిఖిత్ రెడ్డి- రూ. 75 వేలుఖమ్మం ఏసెస్చామా వ్రజేంద్ర మిలింద్- రూ. 17 లక్షలుహిమతేజ కొడిమెల- రూ. 8 లక్షలుమికిల్ జైస్వాల్- రూ. 6 లక్షలుఅనంత్ ప్రతీక్ రెడ్డి- రూ. 3.75 లక్షలుసాకేత్ ధాత్రక్- రూ. 3.5 లక్షలువఫీ కచ్చి- రూ. 3.25 లక్షలుఖుష్ అగర్వాల్- రూ. 3 లక్షలుమయాంక్ గుప్త- రూ. 3 లక్షలుజీఎస్కే రెడ్డి- రూ. 1.8 లక్షలువిద్యానంద రెడ్డి ఎల్లాల- రూ. 1.7 లక్షలుమహేశ్ విప్రాలా- రూ. 1.3 లక్షలుషేక్ అజర్- రూ. లక్షబద్ది విశాల్ యాదవ్- రూ. 85 వేలుసబవేత్ లోక్నాథ్ నాయక్- రూ. 75 వేలుమగవత్ సిద్ధు నాయక్- రూ. 75 వేలుపారస్ రాజ్- రూ. 75 వేలువేద్ రెడ్డి అమిస్తాపురం- రూ. 75 వేలువివేక్ సింగ్- రూ. 75 వేలుసహేంద్ర మల్లు- రూ. 75 వేలుఆవేజ్ అహ్మద్- రూ. 75 వేలుపాలమూరు స్ట్రైకర్స్రవి కిరణ్ మేజేటి- రూ. 13 లక్షలుప్రజ్ఞయ్ రెడ్డి- రూ. 11 లక్షలురోహిత్ రాయుడు కొలగాని- రూ. 6.5 లక్షలుప్రతీక్ పవార్- రూ. 4.25 లక్షలుపీఎస్ చైతన్య రెడ్డి- రూ. 3.25 లక్షలుఅనుముల విజ్ఞేశ్ రెడ్డి- రూ. 3 లక్షలుఎ. పృథ్వీ రెడ్డి- రూ. 3 లక్షలునిశాంత్ సేన్ రెడ్డి సీఎహెచ్- రూ. 2.3 లక్షలుమహ్మద్ ఆఫ్రిది అహ్మద్- రూ. 2.3 లక్షలురిషభ్ బస్లాస్- రూ. 2 లక్షలుఎం సంహిత్ రెడ్డి- రూ. 2 లక్షలుషేక్ అబ్దుల్ జీషాన్- రూ. లక్షఅశ్వద్ రాజీవ్- రూ. 95 వేలుబూడిది రతన్ తేజ- రూ. 80 వేలుకరణ్ యాదవ్- రూ. 75 వేలుమణికంఠేశ్వర్ రెడ్డి- రూ. 75 వేలుమహ్మద్ షాదాబ్ అహ్మద్- రూ. 75 వేలునిపుణ్ రెడ్డి షవ్వా- రూ. 75 వేలుజంబోజు పార్ధీపన్- రూ. 75 వేలుఎండీ అజారుద్దీన్- రూ. 75 వేలు.మెదక్ ఫాల్కన్స్తిలక్ వర్మ- రూ. 33 లక్షలురవితేజ టి- రూ. 12 లక్షలువిక్రం నాయక్ గుగులోత్- రూ. 1.1 లక్షలుశశాంత్ బుడ్తి- రూ. లక్షనిమ్న నిమగడ్డ సూర్య తేజ- రూ. 85 వేలుహరి ఓం సింగ్- రూ. 75 వేలుఇషాన్ శర్మ- రూ. 75 వేలుబన్నీ జగమ్- రూ. 75 వేలుజయదేవ్ రెండ్ల- రూ. 75 వేలుసాయి పూర్ణానంద్ రావు కాకులమర్రి- రూ. 75 వేలుకుంటా రాహుల్- రూ. 75 వేలుమధుకర్ మన్నె- రూ. 75 వేలునమన్ అగర్వాల్- రూ. 75 వేలునయని అనీశ్ రెడ్డి- రూ. 75 వేలునొమన్ అహ్మద్- రూ. 75 వేలుసయ్యద్ ఘాజి అబ్బాస్- రూ. 75 వేలుసాయి వరుణ్ యెర్రమ్- రూ. 75 వేలుఅశ్వినన్ రామ్ బూర్గుబావి- రూ. 75 వేలుశ్రుజిత్ రెడ్డి- రూ. 75 వేలురంగనాథ్ బీకే- రూ. 75 వేలుహైదరాబాద్ ఈ చాంపియన్స్అభిరథ్ రెడ్డి మందాడి- రూ. 11 లక్షలుఅజయ్ దేవ్ గౌడ్- రూ. 11 లక్షలుఅఖిల్ రాథోడ్- రూ. 1.6 లక్షలుఅన్విత్ రెడ్డి- రూ. 3.5 లక్షలుబాకి హిశాంత్ ప్రేమ్ చరణ్- రూ. 95 వేలుసి. అభినవ్ తేజ్- రూ. లక్షదేవ్ మెహతా- రూ. 75 వేలుగణేష్ గడుగు- రూ. 3.25 లక్షలుగూడెల్లి జశ్వంత్- రూ. 75 వేలుమిర్యాల ప్రత్యుష్ కుమార్- రూ. 75 వేలుఎం.ఎం. చరణ్- రూ. 75 వేలునితిన్ నాయక్- రూ. 75 వేలుపి. అరవింద్- రూ. 1 లక్షప్రణవ్ వర్మ- రూ. 8. 5 లక్షలుసాయి వికాస్ రెడ్డి- రూ. 4.25 లక్షలుఫణ్ముఖ అశ్విన్- రూ. 1.5 లక్షలుశ్రీనికేత్- రూ. 2.3 లక్షలుతరుణ్ రాజన్- 1.6 లక్షలువైష్ణవ్ రెడ్డి ఎ- - రూ. 75 వేలుయశ్వీర్ గౌడ్- రూ. 3 లక్షలునల్గొండ నైట్స్మహమ్మద్ అర్ఫాజ్ అహ్మద్- రూ. 11 లక్షలుఏల్గాని వరుణ్ గౌడ్- రూ. 3.5 లక్షలుఅనికేత్ రెడ్డి- రూ. 4.7 లక్షలుబీరవోలు నాగ సుధాంశ్ రెడ్డి- రూ. 75 వేలుచిన్నట్ల రక్షణ్ రెడ్డి- రూ. 6 లక్షలుచిన్నుగారి రుత్విక్- రూ. 75 వేలుదివేష్ సింగ్ - రూ. 75 వేలుగౌరవ్ రెడ్డి- రూ. 4.5 లక్షలుఇల్యాన్ సథాని- రూ. లక్షజశ్వంత్ మోటే- రూ. 75 వేలుజవ్వాజీ శ్రీకాంత్- రూ. 75 వేలునిశాంత్ శరణు- రూ. 5.5 లక్షలుపట్కూరి నితీశ్ రెడ్డి- రూ. 5.5 లక్షలుప్రణవ్ సూర్యదేవర- రూ. 2.5 లక్షలురాహుల్ బుద్ధి- రూ. 8 లక్షలుషేక్ సమీర్- రూ. 75 వేలుషేక్ సోహైల్- రూ. 75 వేలుటి. హర్షవర్ధన్ సింగ్- రూ. లక్షఉర్వేష్ కక్కడ్- రూ. 75 వేలువిక్రాంత్ రెడ్డి ఎం- రూ. 75 వేలురంగారెడ్డి రైజర్స్తనయ్ త్యాగరాజన్- రూ. 11 లక్షలుఆరోన్ జార్జ్ వర్గీస్- రూ. 7.5 లక్షలుఅడే సంతోష్- రూ. 90 వేలుఆదిత్య జవ్వాజీ- రూ. 1.6 లక్షలుఆదిత్య మల్హోత్రా- రూ. 85 వేలుఅలంకృత్ రపోలే- రూ. 1.9 లక్షలుఅరవెల్లి అవనీష్ రావు- రూ. 7 లక్షలుఆర్యన్ కారియప్ప- రూ. లక్షబబర్ ఖాన్ బర్కత్ ఖాన్- రూ. 75 వేలుభువనగిరి పున్నయ్య- రూ. 3 లక్షలుసి. హితేష్ యాదవ్- రూ. 2.3 లక్షలుచిమాట శ్రీనాథ్ యాదవ్- రూ. లక్షజ్ఞాన ప్రకాశ్ రెడ్డి- రూ. 4 లక్షలుటి. అరుణ్ కుమార్- రూ. లక్షనానావత్ రాకేష్- రూ. 90 వేలునితిన్ సాయి యాదవ్- రూ. 9 లక్షలురావుల ప్రణవ్ ఆదిత్యం- రూ. 75 వేలుఎస్. వెంకట్ కార్తిక్- రూ. 75 వేలుసచేత్ బింజ్రాజ్కా- రూ. 4 లక్షలుతనయ్ జద్దు- రూ. 75 వేలువరంగల్ వారియర్స్మహ్మద్ సిరాజ్- రూ. 14 లక్షలుఆది మణి కిరణ్- రూ. 85 వేలుఅమన్ రావు పేరాల- రూ. 12 లక్షలుఅమ్గోత్ దివిన్- రూ. 85 వేలుఅనిరుధ్ శ్రీవాత్స టి.పి.- రూ. 2 లక్షలుభావేష్ సేథ్- రూ. 5 లక్షలుహర్షిత్ చౌధరి- రూ. 3 లక్షలుకర్రి సాయి ధనుష్- రూ. 75 వేలుమహమ్మద్ అబ్దుల్ మాలిక్- రూ. 3 లక్షలుమహమ్మద్ ఆసిఫ్ మంసూరి- రూ. 75 వేలుమొహమ్మద్ ముదస్సర్ హుస్సేన్- రూ. 3 లక్షలుమురుగన్ అభిషేక్- రూ. 3 లక్షలుపల్లెపాటి క్రాంతి- రూ. 75 వేలుఋషికేత్ సిసోడియా- రూ. 4.75 లక్షలుఋషిత్ రావు- - రూ. 75 వేలురిత్విక్ గౌడ్- రూ. 75 వేలుసల్మాన్ ఖాన్- రూ. 75 వేలుషౌనక్ కులకర్ణి- రూ. 1.6 లక్షలుశివ రామకృష్ణ తెర్లి- రూ. 75 వేలువైష్ణవ్ విశ్వనాథ- రూ. లక్ష -
టీమిండియాకు దొరికిన 'ఆరడుగుల' బుల్లెట్
ప్రస్తుత తరం క్రికెట్లో భారత జట్టులోకి రావాలంటే ఐపీఎల్లో ఖచ్చితంగా అద్భుతాలు చేయాల్సిందే అనేది జగమెరిగిన సత్యం. జస్ప్రీత్ బుమ్రా నుంచి వైభవ్ సూర్యవంశీ వరకు ఐపీఎల్లో రాణించి టీమిండియాలోకి వచ్చినవారే. అయితే ఇప్పుడు ఒక 26 ఏళ్ల యువకుడు ఐపీఎల్తో సంబంధం లేకుండా నిశ్శబ్దంగా దేశవాళీ క్రికెట్ నుంచి వచ్చి అంతర్జాతీయ వేదికపై సంచలనం సృష్టిస్తున్నాడు. బుల్లెట్ లాంటి బంతులు విసిరి ప్రత్యర్ధి బ్యాటర్లకు దడ పుట్టిస్తున్నాడు. అతడే టీమిండియా నయా పేస్ గుర్రం గుర్నూర్ బ్రార్.అరంగేట్రంలో అదుర్స్పంజాబ్కు చెందిన గుర్నూర్ బ్రార్.. ఇటీవల అఫ్గానిస్తాన్తో ధర్మశాల వేదికగా జరిగిన భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్లోనే 3 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా బుధవారం జరిగిన రెండో వన్డేలనూ అతడు సత్తాచాటాడు. మరోసారి 3 వికెట్లు పడగొట్టి అఫ్గాన్ పతనాన్ని శాసించాడు.దీంతో తన కెరీర్లోని మొదటి రెండు వన్డేల తర్వాత భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల క్లబ్లో గుర్నూర్ బ్రార్ చేరిపోయాడు. కాగా ప్రస్తుతం భారత్ అన్ని ఫార్మాట్లలో ఎక్కువగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపైనే ఆధారపడుతోంది. అతడికి సపోర్ట్గా మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్ వంటి పేసర్లు ఉన్నారు. వీరు ముగ్గురు తప్ప ప్రస్తుత భారత జట్టులో నిలకడగా రాణించే మరొక ఫాస్ట్ బౌలర్ లేడు.ఇప్పుడు గుర్నూర్ ఎంట్రీతో భారత్ పేస్ బౌలింగ్ కష్టాలు తీరినట్లే అనే చెప్పాలి. ఈ పంబాబ్ స్పీడ్ స్టార్కు అద్భుతమైన ఫాస్ట్ బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. నిలకడగా గంటకు 148 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల సత్తా అతడికి ఉంది. 6 అడుగుల 5 అంగుళాల ఎత్తున్న బ్రార్.. ఫ్లాట్ పిచ్పైనైనా ఊహించని ‘స్టీప్ బౌన్స్’ రాబట్టగలడు. దీంతో భారత క్రికెట్కు మరో బుమ్రా దొరికాడని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బుమ్రా కూడా తన కెరీర్లో తొలి రెండో వన్డేల్లో 6 వికెట్లే పడగొట్టాడు. ఇప్పుడు గుర్నూర్ కూడా యాదృచ్ఛికంగా 6 వికెట్లు తీశాడు.ఐపీఎల్లో నో ఛాన్స్!గుర్నార్ బ్రార్.. 2023లో పంజాబ్ కింగ్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసినప్పటికి ఇప్పటివరకు కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఐపీఎల్-2024 నుంచి గుజరాత్ టైటాన్స్ జట్టులో సభ్యుడిగా గుర్నూర్ ఉన్నాడు. కానీ గత మూడు సీజన్లలోనూ కూడా అతడికి గుజరాత్ టైటాన్స్ తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు.కానీ మైదానంలో దిగకపోయినా గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా వంటి దిగ్గజ పేసర్ పర్యవేక్షణలో అతడు రాటు దేలాడు. మహ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ వంటి అంతర్జాతీయ అనుజ్ఞులైన బౌలర్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం, నెట్స్లో శ్రమించడం ద్వారా గుర్నూర్ ఎన్నో మెళకువలు నేర్చుకున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.అదే టర్నింగ్ పాయింట్?కాగా గుర్నార్ బ్రార్ దేశవాళీ క్రికెట్లో కూడా నిలకడగా రాణిస్తున్నాడు. పంజాబ్ తరపున కేవలం 18 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్లు ఆడి 52 వికెట్లు పడగొట్టాడు. అయితే గతేడాది స్వదేశంలో ఆస్ట్రేలియా-ఎతో జరిగిన వన్డే సిరీస్ అతడి కెరీర్కు టర్నింగ్ పాయింట్ చెప్పాలి. ఈ సిరీస్లో బ్రార్ దుమ్ములేపాడు. మూడు ఇన్నింగ్స్ల్లో 8 వికెట్లు తీసి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఆ సిరీస్లో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి సీనియర్ల కంటే అతడే అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత అతడికి భారత జట్టులో నెట్ బౌలర్గా అవకాశం దక్కింది. ఇప్పుడు అఫ్గాన్తో వన్డే సిరీస్కు బుమ్రా, సిరాజ్ వంటి ప్రధాన పేసర్లకు విశ్రాంతి ఇవ్వడంతో గుర్నూర్కు ప్రధాన జట్టులో చోటు కల్పించారు. తనకు లభించిన అవకాశాన్ని రెండు చేతులా ఈ పంజాబ్ పేసర్ అందిపుచ్చుకున్నాడు. కాగా 2027లో సౌతాఫ్రికా వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకునే బీసీసీఐ సెలక్షన్ కమిటీ గుర్నార్ను భారత జట్టుకు ఎంపిక చేశారు.ఎందుకంటే అక్కడి పిచ్లపై పేస్, బౌన్స్ ఉన్న బౌలర్లు చాలా కీలకం కానున్నారు.చదవండి: టీమిండియాకు భారీ షాక్.. స్ట్రెచర్పై బయటకు వెళ్లిన స్టార్ ప్లేయర్ -
టీమిండియాకు భారీ షాక్.. స్ట్రెచర్పై బయటకు వెళ్లిన స్టార్ ప్లేయర్
మహిళల టీ20 ప్రపంచకప్-2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. బుధవారం నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా కీలక స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ గాయపడింది. ఫీల్డింగ్ చేసే క్రమంలో ఆమె కుడి కాలి మడమ తిరగబడింది.దీంతో తీవ్రమైన నొప్పితో ఆమె విలవిలాడింది. ఫిజియో వెంటనే మైదానంలోకి వచ్చి ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ శ్రేయాంక పాటిల్ కనీసం కాలు కింద పెట్టలేకపోయింది. దీంతో ఆమెను స్ట్రెచర్పై గ్రౌండ్ వెలుపలి తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత స్కానింగ్ కోసం పాటిల్ను అస్పత్రికి తరలించారు. ఇంకా రిపోర్ట్స్ రావాల్సి ఉంది. అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో శ్రీయాంక ఈ మెగా టోర్నీ నుంచి వైదొలిగే అవకాశముంది. కాగా శ్రీయాంకు గాయాలేమి కొత్త కాదు. గతంలో వేలి ఫ్రాక్చర్, ఆ తర్వాత గ్రేడ్-3 షిన్ స్ప్లింట్స్ గాయాల కారణంగా శ్రేయాంక దాదాపు 16 నెలల పాటు ఆటకు దూరమైంది. డబ్ల్యూపీఎల్-2026 సీజన్తో ఆమె పునరాగమనం చేసింది. ఆర్సీబీ వరుసగా రెండోసారి ఛాంపియన్గా నిలవడంలో శ్రేయాంకది కీలక పాత్ర. ఇప్పుడు వరల్డ్కప్ వంటి మెగా టోర్నీలో కూడా సత్తాచాటాలని భావించిన శ్రేయాంకకు తీవ్ర నిరాశే ఎదురైంది.ఇక పాకిస్తాన్, నెదర్లాండ్స్లపై వరుసగా భారీ విజయాలు సాధించిన హర్మన్ సేన గ్రూప్-ఎ టేబుల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్ తమ తదుపరి మ్యాచ్లలో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి పటిష్టమైన జట్లను ఎదుర్కోనుంది. ఇలాంటి సమయంలో శ్రేయాంక గాయం మేనేజ్మెంట్కు పెద్ద తలనొప్పిగా మారింది.చదవండి: ముంబైకి సూర్య గుడ్బై!.. గంభీర్తో కలిసి ఆ జట్టులోకి?! -
IPL 2027: బీసీసీఐ కీలక నిర్ణయం!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2027 సీజన్కు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక ప్రకటన చేసింది. క్యాష్ రిచ్ లీగ్ ఇరవయ్యవ ఎడిషన్.. గత సీజన్తో పోలిస్తే దాదాపు రెండు వారాల ముందే ఆరంభం అవుతుందని వెల్లడించింది.మరోసారి బెంగళూరుదే టైటిల్కాగా ఐపీఎల్-2026 మార్చి 28న మొదలై.. మై 31న ఫైనల్తో ముగిసిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా జరిగిన టైటిల్ పోరులో.. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. గుజరాత్ను చిత్తు చేసి ట్రోఫీని ముద్దాడింది.ముందుగానే ఐపీఎల్ఇక వచ్చే సీజన్ విండో గురించి బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు. PTIతో మాట్లాడుతూ.. మార్చి 10 నుంచి మే 15 మధ్య టోర్నీ నిర్వహణ కోసం ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపాడు. ‘‘ఈ ఏడాది ఐపీఎల్ 28 మార్చిలో మొదలై.. మే 31న ముగిసింది.కారణం ఇదేనిజానికి మే 15 తర్వాత చాలా చోట్ల వాతావరణం కారణంగా ఇబ్బందులు తలెత్తాయి. కొన్నిచోట్ల ముందుగానే రుతుపవనాల రాకతో వర్షం పడింది. అందుకే వచ్చే ఏడాది నుంచి షెడ్యూల్ మార్చాలని అనుకుంటున్నాం.ఇందుకు సంబంధించి మా జనరల్ మేనేజర్కు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాను. మార్చి 10- మే 15 మధ్య టోర్నీ జరిగేలా షెడ్యూల్ వీలు అవుతుందో చూడమన్నాను. ప్లే ఆఫ్స్, ఫైనల్కు వర్షం అడ్డంకిగా మారకుండా ముందుగానే చర్యలు తీసుకోవాల్సి ఉంది. వాతావరణ పరిస్థితుల వల్ల ఇబ్బందులు పడడం కంటే షెడ్యూల్లో మార్పు చేస్తే బాగుంటుందనే యోచనలో ఉన్నాము’’ అని దేవజిత్ సైకియా తెలిపాడు. చదవండి: ముంబై ఇండియన్స్కి సూర్య గుడ్బై! -
ముంబైకి సూర్య గుడ్బై!.. గంభీర్తో కలిసి ఆ జట్టులోకి?!
టీమిండియాకు టీ20 ప్రపంచకప్ అందించిన మూడో కెప్టెన్గా ఘనత సాధించాడు సూర్యకుమార్ యాదవ్. కానీ ఆ ఆనందం మూణ్ణెళ్ల ముచ్చటే అయింది. అనూహ్య రీతితో సూర్యను టీ20 కెప్టెన్సీ నుంచి తప్పించడంతో పాటు.. జట్టులో చోటే లేకుండా చేసింది యాజమాన్యం.ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు తొలుత సూర్యనే సారథ్యం వహిస్తాడనే ప్రచారం జరగ్గా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మాత్రం నిర్దాక్షిణ్యంగా అతడిపై వేటు వేసింది. బ్యాటర్గా విఫలమవుతున్న సూర్యను జట్టు నుంచి కూడా తప్పించింది.బ్యాటర్గా విఫలం ఇక టీ20 ప్రపంచకప్-2026తో పాటు ఐపీఎల్-2026 సీజన్లోనూ 35 ఏళ్ల సూర్యకుమార్ యాదవ్ వ్యక్తిగతంగా దారుణ ప్రదర్శన కనబరిచాడు. ముంబై ఇండియన్స్ తరఫున 13 మ్యాచ్లలో కలిపి కేవలం 270 పరుగులే చేశాడు. ఈ పరిణామాల క్రమంలో భారత టీ20 జట్టులో చోటు కూడా కోల్పోయాడు.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప సూర్యకుమార్ భవితవ్యం గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ ముంబైకర్ 40 ఏళ్ల వయసు వచ్చేంత వరకు ఐపీఎల్ ఆడతాడని.. అయితే, టీమిండియాలో మాత్రం అతడు తిరిగి చోటు దక్కించుకోలేడని అభిప్రాయపడ్డాడు. అంతేకాదు అతడి ముంబై ఇండియన్స్ను వీడితే బాగుంటుందని సూచించాడు.ముంబైని వీడి...ఈ మేరకు కామ్బాక్స్ టీవీతో మాట్లాడుతూ.. ‘‘నాకు తెలిసి సూర్య తిరిగి కోల్కతా నైట్ రైడర్స్ (KKR)తో జట్టుకడితే బాగుంటుంది. నేను చెప్పేది కాస్త విచిత్రంగా అనిపించవచ్చు. కానీ ఇది జరిగే అవకాశం లేకపోలేదు.వన్డే వరల్డ్కప్-2027 తర్వాత టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్ పదవీకాలం ముగుస్తుంది. ఆ తర్వాత అతడు కేకేఆర్ హెడ్కోచ్, మెంటార్గా తిరిగి వస్తాడు. అప్పుడు కేకేఆర్కు సూర్య కెప్టెన్ అవుతాడు. గంభీర్ తప్పక సూర్యకు మద్దతుగా ఉంటాడు’’ అని రాబిన్ ఊతప్ప జోస్యం చెప్పాడు.గతంలో ఆ జట్టుకే ఆడాడుకాగా 2014- 2017 మధ్య కాలంలో గంభీర్ కెప్టెన్సీలో సూర్యకుమార్ యాదవ్ కేకేఆర్కు ప్రాతినిథ్యం వహించాడు. తాను పదవి నుంచి వైదొలిగే కంటే ముందు నాయకత్వ బృందంలో సూర్యను చేర్చేలా గంభీర్ మద్దతు ఇచ్చాడు. అతడిని వైస్ కెప్టెన్గా నియమించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే ఊతప్ప ఈ మేరకు తన అభిప్రాయాల్ని వ్యక్తం చేసి ఉంటాడు. కాగా గంభీర్ మార్గదర్శనంలో సూర్య సారథ్యంలో టీమిండియా ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన సంగతి తెలిసిందే.చదవండి: డబుల్ సెంచరీ చేసేవాడినే.. కానీ: గిల్ -
బోణీ కొట్టిన కొలంబియా.. ఘన విజయం
ఫిఫా ప్రపంచకప్-2026 టోర్నీలో కొలంబియా బోణీ కొట్టింది. గ్రూప్- ‘K’లో భాగంగా ఉజ్బెకిస్తాన్పై ఆద్యంతం ఆధిపత్యం కనబరిచి ఘన విజయం సాధించింది. తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న ఉజ్బెకిస్తాన్ను 3-1 తేడాతో చిత్తు చేసింది. మెక్సికో వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో లూయిస్ డియాజ్ ఇచ్చిన పాస్ను 40వ నిమిషంలో డానియల్ మునోజ్ గోల్గా మలిచాడు. అయితే, ఆ తర్వాత రెండో అర్ధ భాగంలో ఉజ్బెకిస్తాన్ గోల్ (60వ నిమిషం) కొట్టి సంచలనం నమోదు చేసింది. అబోస్బెక్ ఫేజులేవ్ ఉజ్బెకిస్తాన్ తరఫున ప్రపంచకప్లో తొలి గోల్ నమోదు చేశాడు.ఆ ఆనందం మాత్రం ఉజ్బెకిస్తాన్కు ఎంతో సేపు నిలవలేదు. డియాజ్ 65వ నిమిషంలో గోల్ కొట్టి కొలంబియాను ఆధిక్యంలోకి తీసుకెళ్లగా.. జామిన్టన్ క్యాపేజ్ (90+9వ నిమిషం) మరో గోల్ కొట్టి విజయాన్ని ఖరారు చేశాడు.ఘనా విజయంకెనడాలోని టొరంటో వేదికగా గ్రూప్-‘L’లో భాగంగా పనామాతో జరిగిన మ్యాచ్లో ఘనా గెలుపొందింది. అదనపు సమయంలో (90+5వ నిమిషం) కలేబ్ యిరెంక్యి గోల్ కొట్టి ఘనాను గెలిపించాడు.నిజానికి ఈ మ్యాచ్కు ముందు ఘనా కీలక ఆటగాడు, మిడ్ఫీల్డర్ థామస్ పార్టీ జట్టుకు దూరమయ్యాడు. ఇంగ్లండ్లో అతడిపై అత్యాచార ఆరోపణల నేపథ్యంలో కేసు విచారణ కొనసాగుతుండగా.. అతడిని కెనడా తమ దేశంలోకి అనుమతించలేదు. అయినప్పటికీ ఘనా కలేబ్ కారణంగా ఈ మ్యాచ్లో జయభేరి మోగించింది. -
రొనాల్డోకు ఏమైంది?.. అతడు ఆడలేడని మాకు ముందే తెలుసు!
‘నువ్వు గోల్ కొట్టకపోయినా పర్లేదు.. టీమ్ మాత్రం కచ్చితంగా స్కోరు చేయాలి.. అందుకు నువ్వు సహకరించాలి’- పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డోను ఉద్దేశించి ఫ్రాన్స్ మాజీ ఫుట్బాలర్ థియెరి హెన్రీ చేసిన విమర్శలు.. ఈ మాటలు అతడి ప్రస్తుత పరిస్థితికి సరిగ్గానే సరిపోతాయి. ఫిఫా ప్రపంచకప్-2022లో అర్జెంటీనాను విజేతగా నిలిపి లియోనల్ మెస్సీ తన చిరకాల కలను నెరవేర్చుకున్నాడు. అయితే, మెస్సీ సమకాలీన దిగ్గజం రొనాల్డోకు మాత్రం చేదు అనుభవమే మిగింది. తొలి మ్యాచ్లోనే షాక్నాటి సంగతి పక్కనపెడితే.. తాజాగా ఫిఫా ప్రపంచకప్-2026లోనూ తొలి మ్యాచ్లో పోర్చుగల్కు భంగపాటే ఎదురైంది. 52 ఏళ్ల తర్వాత తొలిసారి ఫిఫాలో అడుగుపెట్టిన డిఆర్ కాంగో జట్టుపై పోర్చుగల్ గెలవలేకపోయింది.మ్యాచ్ 1-1తో సమం కాగా డ్రాతో సరిపెట్టుకుంది. ఇందుకు రొనాల్డో చెత్త ప్రదర్శనే కారణం. టెక్సాస్ వేదికగా ఈ దిగ్గజ ఫుట్బాలర్ ఆట చూద్దామని వచ్చిన వాళ్లకు అతడు నిరాశే మిగిలిచ్చాడు.టార్గెట్ దిశగా రొనాల్డో ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయాడు. రెండు నామమాత్రపు షాట్లతో సరిపెట్టుకుని ప్రత్యర్థికి డ్రా చేసుకునే అవకాశం ఇచ్చాడు. నిజానికి పోర్చుగల్ ఆ ఒక్క గోల్ సాధించడానికి కారణమైన జోవో నెవ్స్కు అభిమానులు కృతజ్ఞతలు చెప్పుకొంటున్నారు.41 ఏళ్ల ‘యువకుడు’Age is Just a number అంటారు. కానీ అథ్లెట్ల విషయంలో వయసు పైబడుతున్న కొద్దీ ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. రొనాల్డో విషయంలో ఇప్పుడదే జరుగుతోంది. 41 ఏళ్ల ఈ పోర్చుగల్ స్టార్ ప్రపంచ కప్ ఆడుతున్న అత్యధిక వయస్కుడైన ఆటగాడిగా బరిలోకి దిగాడు.ఒకప్పుడు మైదానంలో పాదరసంలా కదులుతూ.. డ్రిబ్లింగ్లో తనకు తానే సాటి అనిపించుకున్న రొనాల్డోలో ఇప్పుడా వేగం లోపించినట్లే కనిపిస్తోంది. మ్యాచ్ అనంతరం కాంగో మిడ్ఫీల్డర్ ఎంగల్యేల్ ముకావ్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.అతడు ఆడలేడని మాకు తెలుసు‘‘రొనాల్డో మునుపటిలా లేడని మాకు ముందే తెలుసు. అతడు గతంలో కంటే అత్యంత నెమ్మదిగా పరిగెడుతున్నాడు. గోల్ కొట్టేందుకు పెద్దగా ప్రయత్నాలు కూడా చేయలేదు. కాబట్టి అతడిని ఆపడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. మా డిఫెన్స్ ఆ పనిని విజయవంతంగా పూర్తి చేసింది’’ అని ముకావ్ పేర్కొన్నాడు.ప్రదర్శన అంతంత మాత్రమేనిజానికి గత పది వరల్డ్కప్, యూరో మ్యాచ్లలో రొనాల్డో ఒక్క గోల్ కూడా చేయలేదు. దీనిని బట్టి అతడి ప్రదర్శన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే, ఆల్ నసర్ తరఫున సౌదీ ప్రో లీగ్లో 30 మ్యాచ్లలో కలిపి రొనాల్డో 28 గోల్స్ కొట్టాడు. దీనిని బట్టి అతడు ప్రపంచకప్నకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాడనే అంతా భావించారు.కానీ తొలి మ్యాచ్లోనే అంతా తలకిందులైంది. ఇక అంతకు ముందు మేజర్ టోర్నీల్లోని గత నాలుగు మ్యాచ్లలో పోర్చుగల్ తరఫున కూడా ఈ సూపర్స్టార్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. సమకాలీకుడు 39 ఏళ్ల మెస్సీతో పోలిస్తే రొనాల్డో ప్రస్తుతం బాగా వెనుబడ్డాడు.మెస్సీ అలా.. రొనాల్డో ఇలాప్రపంచకప్లో మెస్సీ, అతడి జట్టు డిఫెండింగ్ చాంపియన్ హోదాకు తగినట్లుగా ఆడుతోంది. మెస్సీ సైతం పాస్ చేసేందుకు మాత్రమే ఎక్కువగా ప్రయత్నిస్తూ కొత్త పాత్రలో ఒదిగిపోయే ప్రయత్నం చేస్తున్నాడు. అదే సమయంలో పోర్చుగల్ తమకు ఉన్న అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోలేకపోతోంది.కాంగోతో మ్యాచ్లో బంతిని చాలా సేపు తమ నియంత్రణలోనే ఉంచుకున్నప్పటికీ పోర్చుగల్ గోల్ కొట్టలేకపోవడం ఇందుకు నిదర్శనం. ఇక ఈ మ్యాచ్లో రొనాల్డోను పూర్తి స్థాయిలో అంటే 90 నిమిషాల పాటు ఆడించడం సరైన నిర్ణయమని పోర్చుగల్ హెడ్కోచ్ రొబెర్టో మార్టినెజ్ సమర్థించుకున్నాడు.ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత గొప్ప గోల్స్కోరర్ సేవలను తాము పరిమితం చేయాలని అనుకోవడం లేదన్నాడు. ఒక్క మ్యాచ్తోనే అతడిని జడ్జ్ చేయొద్దని మార్టినెజ్ విజ్ఞప్తి చేశాడు. అతిపెద్ద బలహీనతగాఏదేమైనా.. థియెర్రీ చెప్పినట్లు కాంగోతో మ్యాచ్లో రొనాల్డో తానూ స్కోర్ చేయలేదు. జట్టు స్కోర్ చేసేందుకు అవకాశాలు సృష్టించలేదు. ఇదే పునరావృతమైతే పోర్చుగల్కు బలంగా భావించే రొనాల్డో అతిపెద్ద బలహీనతగా మారాడనే విమర్శలు తీవ్రమవడం ఖాయం.చదవండి: డబుల్ సెంచరీ చేయాలనుకున్నా... కానీ: శుబ్మన్ గిల్ -
చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్.. ప్రపంచ రికార్డు
భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన సరికొత్త చరిత్ర సృష్టించింది. పురుషుల, మహిళల క్రికెట్లో ఇంత వరకు ఏ ప్లేయర్కూ సాధ్యం కాని అత్యంత అరుదైన ఘనత సాధించింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భాగంగా భారత జట్టు బుధవారం నెదర్లాండ్స్తో తలపడిన సంగతి తెలిసిందే.మంధాన, షఫాలీ మెరుపులులీడ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ మెరుపులతో హర్మన్ సేనకు శుభారంభం దక్కింది. స్మృతి 47 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 74 పరుగులు సాధించగా.. షఫాలీ 38 బంతుల్లో 10 ఫోర్లు బాది 55 పరుగులు చేసింది.మిగిలిన వారిలో వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ (20) మాత్రమే ఓ మోస్తరుగా రాణించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో భారత జట్టు ఐదు వికెట్ల నష్టానికి 209 పరుగులు సాధించింది. లక్ష్య ఛేదనకు దిగిన నెదర్లాండ్స్ మహిళా జట్టు 17.3 ఓవర్లలో కేవలం 114 పరుగులే చేసి ఆలౌట్ అయింది.చెలరేగిన బౌలర్లుభారత ప్లేయర్లలో శ్రీచరణి నాలుగు వికెట్లతో చెలరేగగా.. షఫాలీ వర్మ మూడు, నందినీ శర్మ రెండు, దీప్తి శర్మ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక ఈ మ్యాచ్లో భారత్ 95 పరుగుల తేడాతో గెలుపొందడంలో కీలక పాత్ర పోషించిన స్మృతి మంధానకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.మంధాన ప్రపంచ రికార్డుఇక ఈ మ్యాచ్ సందర్భంగానే స్మృతి తన అంతర్జాతీయ టీ20 కెరీర్లో 600 ఫోర్లు పూర్తి చేసుకుంది. తద్వారా పురుష, మహిళల క్రికెట్లో ఈ అరుదైన మార్కు అందుకున్న తొలి ప్లేయర్గా ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ప్రపంచ రికార్డు సాధించింది.Consistent. Majestic. Mandhana. 🤌✨👸 pic.twitter.com/vPPYtyMnP0— Royal Challengers Bengaluru (@RCBTweets) June 17, 2026అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక ఫోర్లు బాదిన క్రికెటర్లు👉స్మృతి మంధాన (ఇండియా)- 604 ఫోర్లు👉సూజీ బేట్స్ (న్యూజిలాండ్)- 521 ఫోర్లు👉చమరి ఆటపట్టు (శ్రీలంక)- 493 ఫోర్లు👉బాబర్ ఆజం (పాకిస్తాన్)- 477 ఫోర్లు👉బెత్ మూనీ (ఆస్ట్రేలియా)- 459 ఫోర్లు👉పాల్ స్టిర్లింగ్ (ఐర్లాండ్)- 449 ఫోర్లు.చదవండి: డబుల్ సెంచరీ చేసేవాడినే.. కానీ: గిల్ -
డబుల్ సెంచరీ చేసేవాడినే... కానీ
అఫ్గానిస్తాన్తో రెండో వన్డేలో టీమిండియా అదరగొట్టింది. లక్నో వేదికగా బుధవారం నాటి మ్యాచ్లో ప్రత్యర్థిని ఏకంగా 170 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను సొంతం చేసుకుంది.ఆత్మవిశ్వాసంతోఈ క్రమంలో టీమిండియా వన్డే కెప్టెన్గా శుబ్మన్ గిల్ (Shubman Gill) తొలి సిరీస్ విజయాన్ని అందుకున్నాడు. ఈ మ్యాచ్లో అతడు 154 పరుగులతో బ్యాటర్గానూ సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో విజయానంతరం మాట్లాడుతూ.. ‘‘మొదటి బంతి నుంచే నేను ఆత్మవిశ్వాసంతో బాదడం మొదలుపెట్టాను. నా ప్రణాళికలకు తగ్గట్లుగానే ఫలితం రావడం చూశాను.40- 45 ఓవర్ల పాటు ఈ సిరీస్లో నాకు నేనే ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాను. నేనే మ్యాచ్లు ఫినిష్ చేయాలని భావించాను. 40- 45 ఓవర్ల పాటు క్రీజులో ఉండాలని టార్గెట్ పెట్టుకున్నాను. శుభారంభం అందుకుంటే దానిని భారీ స్కోరుగా మలచాలని నిర్ణయించుకున్నా.డబుల్ సెంచరీ చేసేవాడినే... కానీఈరోజు డబుల్ సెంచరీ పూర్తి చేయాలనే అనుకున్నా. కానీ జట్టు స్కోరు 430, 440, 450 రేంజ్లో ఉండాలంటే నేను హిట్టింగ్ ఆపకూడదు. నా మనసులో అదొక్కటే ఉండిపోయింది. టాస్ ఓడినంత మాత్రాన పెద్దగా తేడా ఏమీ కనబడలేదు. ఈ పిచ్ మీద 310- 320 మాత్రమే స్కోరు చేసి ఉంటే.. అది ఛేదించదగ్గ టార్గెటే.అయితే, మేము ముందు నుంచే ప్రణాళికతో ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాము. మా బౌలర్లు కూడా తమ పనిని విజయవంతంగా పూర్తి చేశారు’’ అని శుబ్మన్ గిల్ తన వ్యక్తిగత ప్రదర్శన పట్ల.. అదే విధంగా జట్టు ప్రదర్శన పట్ల హర్షం వ్యక్తం చేశాడు.ఆల్రౌండ్ ప్రదర్శనతో..ఏకనా స్టేడియంలో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్కు దిగింది. 49.5 ఓవర్లలో 402 పరుగులు చేసి ఆలౌట్ అయింది. గిల్ (154)తో పాటు ఇషాన్ కిషన్ (125) మెరుపు సెంచరీ సాధించడం వల్ల ఈ స్కోరు సాధ్యమైంది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ 44.3 ఓవర్లలో కేవలం 232 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత పేసర్లు అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ చెరో మూడు వికెట్లతో సత్తా చాటగా.. ప్రిన్స్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. చదవండి: వైభవ్ సూర్యవంశీకి బీసీసీఐ షాక్ The in-form #RahmanullahGurbaz is sent packing as #GurnoorBrar delivers the breakthrough.#INDvAFG | 2nd ODI | LIVE NOW 👉https://t.co/YiwP9pOAPC pic.twitter.com/6JvreD78S0— Star Sports (@StarSportsIndia) June 17, 2026 -
ఉత్కంఠ పోరులో పాక్పై సౌతాఫ్రికా గెలుపు
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో సౌతాఫ్రికా తొలి విజయం నమోదు చేసింది. తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో పరాభవం తర్వాత, పాకిస్తాన్తో జరిగిన ఉత్కంఠ సమరంలో 2 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేయగా.. ఛేదనలో సౌతాఫ్రికా కూడా తడబడినా, 16.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. డెర్క్సెన్ (52) మెరుపు అర్ద సెంచరీతో, నదినే డి క్లెర్క్ (37) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లతో సౌతాఫ్రికాను గెలిపించారు.తొలుత బ్యాట్తో (55 నాటౌట్) సత్తా చాటిన పాక్ కెప్టెన్ ఫాతిమా సనా, ఆతర్వాత బంతితోనూ (2.5-0-16-3) చెలరేగి సౌతాఫ్రికా శిబిరంలో గుబులు రేపింది. సనాకు సదియా ఇక్బాల్ (4-0-26-2), తుబా హస్సన్ (4-0-28-2), నష్రా సంధు (4-0-28-1) కూడా తోడవ్వడంతో సౌతాఫ్రికా ఓ దశలో ఓటమి దిశగా సాగింది. అయితే అప్పటికే డెర్క్సెన్, క్లెర్క్ గెలుపుకు పునాది వేయడంతో సౌతాఫ్రికా విజయతీరాలకు చేరగలిగింది.అంతకుముందు 33 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్ను ఫాతిమా సనా (38 బంతుల్లో 55; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), తుబా హస్సన్ (23) ఆదుకున్నారు. వీరిద్దరూ తొమ్మిదో వికెట్కు 71 పరుగులు జోడించడంతో పాక్ ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది. పాక్ ఇన్నింగ్స్లో సనా, తుబాతో పాటు ఇరామ్ జావెద్ (11), ఆలియా రియాజ్ (10) మాత్రమే రెండంకెల స్కోర్ సాధించారు. మిగతా ప్లేయర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో కాప్ 3, షబ్నిమ్ ఇస్మాయిల్, ఖాకా తలో వికెట్ తీశారు. -
ఏపీఎల్లో విజయవాడ సన్ షైనర్స్ శుభారంభం
సాక్షి ప్రతినిధి, కడప: కడప వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)–2026 సీజన్–5 తొలి మ్యాచ్లో తుంగభద్ర వారియర్స్పై విజయవాడ సన్షైనర్స్ విజయం సాధించింది. టాస్ వేయడానికి బీసీసీఐ అపెక్స్ మెంబర్ చాముండేశ్వరినాథ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. టాస్ గెలిచిన విజయవాడ సన్ షైనర్స్ జట్టు పవర్ ప్లే ముగిసే సమయానికి 6 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. జట్టు ఓపెనర్ అశ్విన్ హెబ్బార్ 9 ఫోర్లు, 4 సిక్సర్లతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కడపకు చెందిన జహీర్ అబ్బాస్ విజయవాడ తరఫున రంగంలోకి దిగి కేవలం 25 బంతుల్లోనే 52 పరుగులతో బౌండరీల వర్షం కురిపించాడు. దీంతో జట్టు స్కోరు 198 పరుగులకు చేరింది. తుంగభద్ర బౌలర్లలో దీపక్, హిమ శ్రీనివాస్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన తుంగభద్ర వారియర్స్ ఆదిలోనే వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ సమన్యు 24 బంతుల్లో 51 పరుగులు (7 ఫోర్లు, 3 సిక్సర్లు), సత్య సూర్యనారాయణ 21 బంతుల్లో 29 పరుగులు (4 ఫోర్లు), చివర్లో సౌరవ్కుమార్ 15 బంతుల్లో 23 పరుగులు (2 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసినా టీంకు విజయాన్ని చేకూర్చలేకపోయారు. విజయవాడ బౌలర్లలో భరత్ 4 వికెట్లు పడగొట్టి తుంగభద్ర జట్టును కోలుకోలేని దెబ్బతీశాడు. -
కేన్ డబుల్ ధమాకా.. క్రొయేషియాపై ఇంగ్లండ్ థ్రిల్లింగ్ విక్టరీ
2026 ఫిఫా ప్రపంచకప్లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. గ్రూప్-ఎల్లో జరిగిన ఉత్కంఠభరిత పోరులో క్రొయేషియాపై 4-2తో విజయం సాధించింది. స్టార్ స్ట్రైకర్ హ్యారీ కేన్ రెండు గోల్స్తో మెరిసి జట్టు విజయానికి ప్రధాన కారణమయ్యాడు.మ్యాచ్ 12వ నిమిషంలో పెనాల్టీ ద్వారా కేన్ ఇంగ్లండ్కు ఆధిక్యం అందించాడు. తొలి ప్రయత్నాన్ని క్రొయేషియా గోల్కీపర్ అడ్డుకున్నప్పటికీ, వీడియో రివ్యూ అనంతరం రిఫరీ పెనాల్టీని మళ్లీ తీసుకోవాలని ఆదేశించడంతో రెండోసారి కేన్ గోల్ చేశాడు.అయితే 36వ నిమిషంలో మార్టిన్ బటురినా గోల్తో క్రొయేషియా స్కోరును సమం చేసింది. ఆరు నిమిషాలకే కేన్ మరోసారి హెడర్తో గోల్ చేసి ఇంగ్లండ్ను మళ్లీ ముందంజలో నిలిపాడు. దీంతో ప్రపంచకప్ల్లో అతని గోల్స్ సంఖ్య 10కు చేరి ఇంగ్లండ్ దిగ్గజం గ్యారీ లింకర్ రికార్డును సమం చేశాడు.మొదటి అర్థం అదనపు సమయంలో పీటర్ ముసా గోల్ చేయడంతో క్రొయేషియా మరోసారి స్కోర్ను సమం చేసింది (2-2).రెండో అర్థ భాగం ప్రారంభమైన రెండో నిమిషానికే జూడ్ బెల్లింగ్హమ్ అద్భుత గోల్తో ఇంగ్లండ్ను 3-2తో ముందుకు తీసుకెళ్లాడు. అనంతరం ఇంగ్లండ్ పలు అవకాశాలను వృథా చేసుకున్నప్పటికీ, మ్యాచ్ ముగియడానికి ఐదు నిమిషాల ముందు ప్రత్యామ్నాయ ఆటగాడిగా వచ్చిన మార్కస్ రూథర్ఫోర్డ్ నాలుగో గోల్ చేసి ఇంగ్లండ్ విజయం ఖాయం చేశాడు.2018 ప్రపంచకప్ సెమీఫైనల్లో తమను ఓడించిన క్రొయేషియాపై ఇంగ్లండ్ ఈ విజయంతో ప్రతీకారం తీర్చుకుంది. 1966 తర్వాత తొలి ప్రపంచకప్ టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగిన ఇంగ్లండ్కు ఈ విజయం ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. -
రొనాల్డోకు షాక్.. పోర్చుగల్ను నిలువరించిన కాంగో
ఫిఫా ప్రపంచకప్ 2026 గ్రూప్-కేలో సంచలన ఫలితం నమోదైంది. స్టార్ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో నేతృత్వంలోని పోర్చుగల్ జట్టును పసికూన డీఆర్ కాంగో 1-1 గోల్స్తో నిలువరించింది. హ్యూస్టన్లో జరిగిన ఈ మ్యాచ్లో పోర్చుగల్ పూర్తి ఆధిపత్యం చలాయించినప్పటికీ విజయాన్ని అందుకోలేకపోయింది. కెప్టెన్ రొనాల్డో పూర్తి 90 నిమిషాలు ఆడినా, ప్రత్యర్థి రక్షణను ఛేదించలేక నిరాశ చెందాడు.మ్యాచ్ ప్రారంభమైన ఐదో నిమిషంలోనే పోర్చుగల్కు ఆధిక్యం లభించింది. మిడ్ఫీల్డర్ జోవా నెవిస్ హెడర్తో గోల్ సాధించి జట్టును ముందంజలో నిలిపాడు. అయితే తొలి అర్ద భాగం ముగియడానికి క్షణాల ముందు కాంగో తరఫున యోనే విస్సా అద్భుత హెడర్తో గోల్ చేసి స్కోరును సమం చేశాడు.రెండో అర్థంలో పోర్చుగల్ బంతిపై అధిక నియంత్రణ సాధించి పలుమార్లు దాడులు చేసినా గోల్గా మలచలేకపోయింది. దీంతో కాంగో చారిత్రాత్మక ఫలితం సాధించింది. 1974 ప్రపంచకప్ తర్వాత తొలిసారి ఓ పాయింట్ ఖాతాలో వేసుకుంది.మరోవైపు నాకౌట్ దశకు చేరాలంటే పోర్చుగల్ మిగిలిన గ్రూప్ మ్యాచ్ల్లో మెరుగైన ఫలితాలు సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రొనాల్డోకు ఇది చివరి ప్రపంచకప్గా భావిస్తున్న నేపథ్యంలో తొలి మ్యాచ్లోనే విజయాన్ని కోల్పోవడం అభిమానులను నిరాశ కలిగించింది.జోవా నెవిస్ రికార్డుకాంగోపై గోల్తో పోర్చుగల్ యువ మిడ్ఫీల్డర్ జోవా నెవిస్ అరుదైన ఘనత సాధించాడు. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో గోల్ చేసిన మూడో అతి పిన్న వయస్కుడైన పోర్చుగీస్ ఆటగాడిగా నిలిచాడు.21 సంవత్సరాలు 263 రోజుల వయసులో నెవిస్ ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఉన్నాడు. 2006 ప్రపంచకప్లో 21 సంవత్సరాలు 132 రోజుల వయసులో రొనాల్డో గోల్ సాధించాడు. రెండో స్థానంలో రామోస్ ఉన్నాడు. అతడు 2022 ప్రపంచకప్లో 21 సంవత్సరాలు 169 రోజుల వయసులో గోల్ నమోదు చేశాడు. -
గిల్, ఇషాన్ శతకాల మోత
లక్నో: భారత జట్టు తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో సత్తా చాటింది. బలహీన జట్టు అఫ్గానిస్తాన్తో రెండో వన్డేలోనూ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి సిరీస్ను 2–0తో సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్లో భారత్ 170 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శుబ్మన్ గిల్ (110 బంతుల్లో 154; 22 ఫోర్లు, 2 సిక్స్లు) తొమ్మిదో సెంచరీ సాధించగా... ఇషాన్ కిషన్ (79 బంతుల్లో 125; 14 ఫోర్లు, 7 సిక్స్లు) కెరీర్లో రెండో శతకంతో చెలరేగాడు. వీరిద్దరు మూడో వికెట్కు 23.3 ఓవర్లలో 224 పరుగులు జోడించారు. వన్డేల్లో భారత్ 400కు పైగా స్కోరు చేయడం ఇది 8వసారి కావడం విశేషం. అనంతరం అఫ్గానిస్తాన్ 44.3 ఓవర్లలో 232 పరుగులకే ఆలౌటైంది. రహ్మత్ షా (89 బంతుల్లో 79; 8 ఫోర్లు) అర్ధ సెంచరీతో టాప్ స్కోరర్గా నిలిచాడు. నామమాత్రమైన చివరి వన్డే శనివారం చెన్నైలో జరుగుతుంది. డబుల్ సెంచరీ భాగస్వామ్యం... ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) రెండో ఓవర్లోనే వెనుదిరిగినా... రోహిత్ శర్మ (39 బంతుల్లో 48; 6 ఫోర్లు, 2 సిక్స్లు) తనదైన శైలిలో కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. ఘజన్ఫర్ ఓవర్లో 3 ఫోర్లతో గిల్ కూడా ధాటిని పెంచాడు. అయితే రోహిత్ను రషీద్ బౌల్డ్ చేయడంతో 87 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. ఈ దశలో జత కలిసిన గిల్, ఇషాన్ వేగంగా దూసుకుపోయారు. 38 బంతుల్లో గిల్ హాఫ్ సెంచరీ పూర్తి కాగా, 52 బంతుల్లో ఇషాన్ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ప్రతీ బౌలర్పై చెలరేగిన వీరిద్దరిని నిలువరించడం అఫ్గాన్ వల్ల కాలేదు. సమీ వేసిన ఇన్నింగ్స్ 33వ ఓవర్లో 5 బౌండరీలతో 21 పరుగులు రాబట్టిన భారత్ 250 పరుగుల స్కోరును దాటింది. ఇదే ఓవర్ తొలి బంతికి గిల్ సెంచరీ (77 బంతుల్లో) పూర్తి కాగా, చివరి బంతికి ఇషాన్ (71 బంతుల్లో) శతకాన్ని అందుకోవడం విశేషం. ఈ దశలో గిల్ 16 బంతుల వ్యవధిలో 7 ఫోర్లు బాదడం అతని జోరును చూపించింది. ఖరోటే ఓవర్లో వరుసగా రెండు సిక్స్లు బాదిన ఇషాన్ తర్వాతి బంతికి వెనుదిరిగాడు. గిల్, ఇషాన్ ఏకంగా 9.6 రన్రేట్తో పరుగులు జోడించడం విశేషం. గిల్ పెవిలియన్ చేరాక భారత్ ఇన్నింగ్స్ ఆశించిన వేగంతో సాగలేదు. గిల్, రాహుల్ (0) వరుస బంతుల్లో అవుట్ కాగా, శ్రేయస్ (26) పెద్దగా ప్రభావం చూపలేదు. 40 ఓవర్లు ముగిసే సరికి స్కోరు 340/3 కాగా... చివరి 10 ఓవర్లలో భారత్ 62 పరుగులు మాత్రమే చేసి 7 వికెట్లు కోల్పోయింది. టపటపా... భారీ ఛేదనలో ఊహించినట్లే అఫ్గాన్ చేతులెత్తేసింది. గుర్బాజ్ (33 బంతుల్లో 41; 7 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించినా... ఆపై ఇతర బ్యాటర్లు నిలవలేకపోయారు. రహ్మత్, సాదిఖుల్లా (50 బంతుల్లో 42; 5 ఫోర్లు, 1 సిక్స్) మూడో వికెట్కు 57 పరుగులు జత చేసిన తర్వాత జట్టు పూర్తిగా కుప్పకూలింది. బుధవారం లక్నోలో తీవ్రమైన ఎండ కారణంగా ఇరు జట్ల ఆటగాళ్లంతా బాగా ఇబ్బంది పడ్డారు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడంతో ప్లేయర్లు పదే పదే విరామాలు తీసుకున్నారు. గిల్, ఇషాన్ ఎంతో అలసిపోగా, రషీద్ ఖాన్ మధ్యలోనే మైదానం వీడాడు. కెరీర్లో తొలి వన్డే ఆడిన దార్విష్ రెండు సార్లు బయటకు వెళ్లాడు. బ్యాటింగ్ సమయంలో కండరాలు పట్టేయడంతో పెవిలియన్కు వెళ్లిన అతను మళ్లీ రాలేదు.ప్రిన్స్ యాదవ్ @263 ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో మూడు మార్పులు జరిగాయి. తొడ కండరాల గాయంతో నితీశ్ కుమార్ రెడ్డి మ్యాచ్కు దూరం కాగా... అతని స్థానంలో జైస్వాల్కు చోటు లభించింది. ప్రసిధ్, హర్ష్ దూబే స్థానాల్లో ప్రిన్స్ యాదవ్, కుల్దీప్లకు అవకాశం దక్కింది. ఈ మ్యాచ్తో ప్రిన్స్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. భారత్ తరఫున వన్డేలు ఆడిన 263వ ఆటగాడిగా అతను గుర్తింపు పొందాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) ఖరోటే (బి) సలీమ్ 4; రోహిత్ (బి) రషీద్ 48; గిల్ (సి) దార్విష్ (బి) ఖరోటే 154; ఇషాన్ కిషన్ (సి) (సబ్) ఇక్రామ్ (బి) ఖరోటే 125; శ్రేయస్ (సి) ఇబ్రహీం (బి)ఖరోటే 26; రాహుల్ (సి) ఇబ్రహీం (బి) ఖరోటే 0; సుందర్ (సి) గుర్బాజ్ (బి) రషీద్ 19; గుర్నూర్ (సి) ఇబ్రహీం (బి) రషీద్ 3; అర్ష్ దీప్ (సి) రషీద్ (బి) ఘజన్ఫర్ 3; కుల్దీప్ (నాటౌట్) 3; ప్రిన్స్ (రనౌట్) 5; ఎక్స్ట్రాలు 12; మొత్తం (49.5 ఓవర్లలో ఆలౌట్) 402. వికెట్ల పతనం: 1–9, 2–96, 3–320, 4–360, 5–360, 6–371, 7–387, 8–392, 9–396, 10–402. బౌలింగ్: ఘజన్ఫర్ 10–1–69–1, సలీమ్ 8–0–75–1, సమీ 8.5–0–90–0, ఖరోటే 10–0–76–4, రషీద్ 8–0–48–3, హష్మతుల్లా 5–0–36–0. అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) రాహుల్ (బి) గుర్నూర్ 41; ఇబ్రహీమ్ (సి) ప్రిన్స్ (బి) అర్ష్ దీప్ 21; సాదిఖుల్లా (ఎల్బీ) (బి) సుందర్ 42; రహ్మత్ (సి) గుర్నూర్ (బి) ప్రిన్స్ 79; దార్విష్ (రిటైర్డ్హర్ట్) 6; హష్మతుల్లా (బి) గుర్నూర్ 4; ఖరోటే (బి) ప్రిన్స్ 6; రషీద్ (సి) రోహిత్ (బి) అర్ష్ దీప్ 12; ఘజన్ఫర్ (సి) శ్రేయస్ (బి) అర్ష్ దీప్ 1; సలీమ్ (బి) గుర్నూర్ 9; సమీ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 9; మొత్తం (44.3 ఓవర్లలో ఆలౌట్) 232. వికెట్ల పతనం: 1–52, 2–71, 3–128, 4–140, 5–170, 6–188, 7–190, 8–220, 9–232. బౌలింగ్: అర్ష్ దీప్ 9–0–45–3, ప్రిన్స్ 7.3–0–56–2, గుర్నూర్ 10–0–60–3, కుల్దీప్ 10–0–42–0, సుందర్ 7–0–24–1, జైస్వాల్ 1–0–3–0. -
ఎంబాపె ‘డబుల్’ ధమాకా
గత వరల్డ్కప్ రన్నరప్ ఫ్రాన్స్ కూడా విజయంతో గెలుపు బోణీ కొట్టింది. గ్రూప్ ‘ఐ’లో భాగంగా భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మ్యాచ్లో ఫ్రాన్స్ 3–1 గోల్స్ తేడాతో సెనెగల్ జట్టును ఓడించింది. కెప్టెన్ కిలియన్ ఎంబాపె (66వ, 90+6వ నిమిషంలో) రెండు గోల్స్తో విజృంభించగా... బ్రాడ్లీ బార్కోలా (82వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. సెనెగల్ తరఫున ఇబ్రహీం ఎంబాయె (90+5వ నిమిషంలో) ఏకైక గోల్ నమోదు చేశాడు. 2002 ప్రపంచకప్లో సెనెగల్తో ఆడిన ఆరంభ మ్యాచ్లో ఓడిపోయిన ఫ్రాన్స్కు ఈసారి కూడా గట్టిపోటీనే ఎదురైంది. ముఖ్యంగా స్టార్ ప్లేయర్ ఎంబాపెను సెనెగల్ డిఫెండర్లు కట్టడి చేశారు. దాంతో తొలి అర్ధభాగంలో ఎంబాపె కేవలం 14 సార్లు మాత్రమే బంతిని టచ్ చేశాడు. అయితే రెండో అర్ధభాగంలో ఎంబాపెను నిలువరించడంలో సెనెగల్ ప్లేయర్లు విఫలమయ్యారు. 66వ నిమిషంలో మైకేల్ ఒలిసె అందించిన పాస్ను ఎంబాపె గోల్పోస్ట్లోనికి పంపించాడు. ఖాతా తెరిచిన తర్వాత ఫ్రాన్స్ మరింత జోరును పెంచింది. బార్కోలా గోల్తో 2–0తో ఆధిక్యంలోకి వెళ్లిన ఫ్రాన్స్ ఇంజ్యూరీ టైమ్లో గోల్ సమర్పించుకుంది. అయితే ఆ వెంటనే ఎంబాపె 30 అడుగుల దూరం నుంచి కళ్లు చెదిరే కిక్తో ఫ్రాన్స్ ఖాతాలో మూడో గోల్ చేరింది.పోర్చుగల్ను నిలువరించిన కాంగోహ్యూస్టన్: ఫుట్బాల్ ప్రపంచకప్లో మరో సంచలనం నమోదైంది. భారీ విజయంతో బోణీ కొడుతుందనుకున్న క్రిస్టియానో రొనాల్డో సారథ్యంలోని పోర్చుగల్ జట్టు తొలి మ్యాచ్ను ‘డ్రా’తో సరిపెట్టుకుంది. 52 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించిన డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో జట్టు అసాధారణ ఆటతీరును కనబరిచింది. రొనాల్డో కెప్టెన్సీలోని పోర్చుగల్తో మ్యాచ్ను 1–1తో ‘డ్రా’ చేసుకుంది. ఆరో నిమిషంలో నెవాస్ గోల్తో పోర్చుగల్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 45+5వ నిమిషంలో యోన్ విస్సా గోల్తో కాంగో జట్టు స్కోరును 1–1తో సమం చేసింది. ప్రపంచకప్ చరిత్రలో కాంగో జట్టుకు తొలి గోల్ అందించిన ప్లేయర్గా విస్సా నిలిచాడు. 1974 ప్రపంచకప్లో కాంగో జట్టు ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ఒక్క గోల్ కూడా చేయకుండానే ఓడిపోయింది. మరోవైపు ఈ మ్యాచ్ ద్వారా వరుసగా ఆరో ప్రపంచకప్ ఆడిన రెండో ప్లేయర్గా పోర్చుగల్ దిగ్గజం, 41 ఏళ్ల రొనాల్డో గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో మెస్సీ సరసన రొనాల్డో నిలిచాడు. 58 అంతర్జాతీయ ఫుట్బాల్లో అత్యధిక గోల్స్ చేసిన ఫ్రాన్స్ ప్లేయర్గా ఎంబాపె గుర్తింపు పొందాడు. 57 గోల్స్తో ఒలివర్ గిరూడ్ పేరిట ఉన్న రికార్డును ఎంబాపె బద్దలు కొట్టాడు.14 ప్రపంచకప్ చరిత్రలో ఎంబాపె చేసిన గోల్స్. ఈ మెగా ఈవెంట్లో అత్యధిక గోల్స్ చేసిన ఫ్రాన్స్ ప్లేయర్గా ఎంబాపె అవతరించాడు. 13 గోల్స్తో జస్ట్ ఫోంటెన్ పేరిట ఉన్న రికార్డును ఎంబాపె సవరించాడు. ప్రపంచకప్లో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్ల జాబితాలో ఎంబాపె మూడో స్థానానికి ఎగబాకాడు.ఆ్రస్టియా... 1990 తర్వాతశాన్ఫ్రాన్సిస్కో: తొలిసారి ప్రపంచకప్లో ఆడుతున్న ఆసియా జట్టు జోర్డాన్కు నిరాశ ఎదురైంది. గ్రూప్ ‘జె’లో భాగంగా జరిగిన మ్యాచ్లో ఆ్రస్టియా 3–1తో జోర్డాన్ను ఓడించింది. ఆ్రస్టియా తరఫున రొమానో (20వ నిమిషంలో), మార్కో అర్నాటోవిక్ (90+12వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. జోర్డాన్ ప్లేయర్ యాజాన్ అలారబ్ (76వ నిమిషంలో) సెల్ఫ్ గోల్ సాధించాడు. జోర్డాన్ తరఫున అలీ ఒల్వాన్ (50వ నిమిషంలో) రెగ్యులర్ గోల్ చేశాడు. చివరిసారి 1998లో ప్రపంచకప్లో ఆడిన ఆ్రస్టియా 1990 తర్వాత ప్రపంచకప్లో గెలుపు రుచి చూసింది. 1998లో ఆడిన మూడు మ్యాచ్ల్లో ఓడిన ఆ్రస్టియా 1990లో 2–1తో అమెరికాపై నెగ్గింది. 1994 ప్రపంచకప్ టోర్నీకి ఆ్రస్టియా అర్హత సాధించలేదు. -
న్యూజిలాండ్ 291/7
లండన్: ఇంగ్లండ్తో తొలి టెస్టులో ఘోర పరాజయం ఎదుర్కొన్న న్యూజిలాండ్ జట్టు రెండో టెస్టులో మెరుగైన ప్రదర్శన చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన కివీస్ బుధవారం ఆట ముగిసే సమయానికి 77 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. బ్లండెల్ (51; 6 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా... గ్లెన్ ఫిలిప్స్ (49 బ్యాటింగ్; 9 ఫోర్లు), మిచెల్ (44; 6 ఫోర్లు), రచిన్ రవీంద్ర (33; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెథెల్, సోనీ బకెర్ చెరో 2 వికెట్లు తీశారు. ఫిలిప్స్తో పాటు కైల్ జేమీసన్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. -
టీమిండియా ఖాతాలో మరో విజయం
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా వరుసగా రెండో మ్యాచ్లో ఘన సాధించింది. తొలి మ్యాచ్లో పాక్ను చిత్తుగా ఓడించిన భారత్.. ఇవాళ (జూన్ 17) జరిగిన రెండో మ్యాచ్లో నెదర్లాండ్స్పై అదే తరహా విజయం నమోదు చేసింది. నెదర్లాండ్స్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. అనంతరం నెదర్లాండ్స్ను 17.3 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్ చేసి, 95 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.చెలరేగిన మంధన, షఫాలీనెదర్లాండ్స్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఓపెనర్లు స్మృతి మంధన (47 బంతుల్లో 74; 11 ఫోర్లు, సిక్స్), షఫాలీ వర్మ (38 బంతుల్లో 55; 10 ఫోర్లు) చెలరేగడంతో భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో రిచా ఘోష్ (8 బంతుల్లో 20 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు), దీప్తి శర్మ (2 బంతుల్లో 10 నాటౌట్; ఫోర్, సిక్స్), కెప్టెన్ హర్మన్ప్రీత్ (9 బంతుల్లో 12; 2 ఫోర్లు) బ్యాట్ ఝులిపించారు. జెమీమా రోడ్రిగ్స్ 19, యస్తికా భాటియా 3 పరుగులు చేశారు. నెదర్లాండ్స్ బౌలర్లలో కరోలిన్ డి లాంజ్ 2 వికెట్లు పడగొట్టగా.. ఐరిస్ జ్విల్లింగ్, హీథర్ సీగర్స్, వాన్ డెన్ రాడ్ తలో వికెట్ తీశారు.శ్రీ చరణి మాయాజాలం.. బంతితోనూ సత్తా చాటిన షఫాలీ210 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ ఆదిలోనే చేతులెత్తేసింది. ఆ జట్టు టాప్-4 బ్యాటర్స్ మినహా ఎవ్వరూ కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. భారత స్పిన్నర్ల ధాటికి నెదర్లాండ్స్ ప్లేయర్లంతా బెంబేలెత్తిపోయారు. శ్రీ చరణి (4-0-19-4) దెబ్బకు నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ఆమెకు షఫాలీ వర్మ (3.2-0-20-3) కూడా తోడవ్వడంతో నెదర్లాండ్స్ చివరి 5 వికెట్లు కేవలం 9 బంతుల వ్యవధిలో కోల్పోయింది. మిగతా భారత బౌలర్లలో నందిని శర్మ 2, దీప్తి శర్మ ఓ వికెట్ పడగొట్టారు. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్లో వారి కెప్టెన్ బాబెట్ డి లీడ్ చేసిన 28 పరుగులే అత్యధికం. జూన్ 21న జరిగే తమ తదుపరి మ్యాచ్లో భారత్ సౌతాఫ్రికాతో తలపడనుంది. -
రెండో వన్డేలో అఫ్గాన్ చిత్తు.. సిరీస్ భారత్ సొంతం
లక్నో వేదికగా అఫ్గానిస్తాన్తో జరిగిన రెండో వన్డేలో 170 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు వన్డేల సిరీస్ను 2-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది.భారత్ నిర్ధేశించిన 403 పరుగుల టార్గెట్ను చేధించలేక అఫ్గాన్ చతికల పడింది. పర్యాటక జట్టు లక్ష్య చేధనలో భారత బౌలర్ల ధాటికి 44.3 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. అఫ్గానిస్తాన్ బ్యాటర్లలో రెహమత్ షా(79) టాప్ స్కోరర్గా నిలవగా.. గుర్బాజ్(41), అటల్(42) పర్వాలేదన్పించారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ తలా మూడు వికెట్లు సాధించారు.వీరిద్దరితో పాటు అరంగేట్ర ప్రిన్స్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోరు సాధించి టీమిండియా ఆలౌట్ అయింది. శుబ్మన్ గిల్ (154), ఇషాన్ కిషన్ (125) సెంచరీలతో కదం తొక్కారు. ఇక ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో వన్డే జూన్ 20న చెన్నై వేదికగా జరగనుంది. -
మంధాన మెరుపులు.. నెదర్లాండ్స్ ముందు భారీ స్కోర్
మహిళల టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా లీడ్స్ వేదికగా నెదర్లాండ్స్తో జరుగుతున్న మ్యాచ్లో భారత బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్ సాధించింది. స్మృతి కేవలం 47 బంతుల్లోనే 11 ఫోర్లు, ఒక సిక్సర్తో 74 పరుగులు చేసి భారత తరపున టాప్ స్కోరర్గా నిలిచింది.ఆఖరిలో రిచా ఘోష్(8 బంతుల్లో 20) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. భారత్కు ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మలు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. షెఫాలీ(55) హాఫ్ సెంచరీ చేశాక ఔటైనప్పటికి, మంధాన మాత్రం తన దూకుడును కొనసాగించింది. డచ్ బౌలర్లలో కరోలిన్ డి లాంగే రెండు వికెట్లు పడగొట్టగా.. హీథర్, మిర్తే వాన్ డెన్ రాడ్ తలా వికెట్ సాధించారు.చదవండి: 77 పరుగులకే ఖేల్ ఖతం.. 9.3 ఓవర్లలో ఛేదన -
శుబ్మన్ సరికొత్త చరిత్ర.. తొలి భారత క్రికెటర్గా
టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఐపీఎల్-2026లో దుమ్ములేపిన గిల్.. ఇప్పుడు అదే జోరును అఫ్గానిస్తాన్ సిరీస్లో కనబరుస్తున్నాడు. లక్నో వేదికగా అఫ్గాన్తో రెండో వన్డేలో గిల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 77 బంతుల్లోనే తన 9వ వన్డే సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 110 బంతులు ఎదుర్కొన్న గిల్.. 22 ఫోర్లు, 2 సిక్స్లతో 154 పరుగులు చేశాడు. ఈ అద్భుత శతకంతో వన్డే క్రికెట్లో 3000 పరుగుల మైలురాయిని దాటాడు.తద్వారా వన్డేల్లో అత్యంత వేగంగా 3000 పరుగులు చేసిన భారత ఆటగాడిగా గిల్ చరిత్ర సృష్టించాడు. ఈ ఫీట్ను గిల్ కేవలం 62 ఇన్నింగ్స్లలో అందుకున్నాడు. గతంలో ఈ రికార్డు శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్(72 ఇన్నింగ్స్లు) పేరిట సంయుక్తంగా ఉండేది.తాజా నాక్తో వారిద్దరిని శుబ్మన్ అధిగమించాడు. బంతులు పరంగా ఈ ఫీట్ సాధించిన జాబితాలో మాజీ కెప్టెన్ కపిల్దేవ్(2995) అగ్రస్ధానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్ధానంలో గిల్(3016) ఉన్నాడు. అదేవిధంగా వన్డేల్లో ఫాస్టెస్ట్ 150 చేసిన మూడో ప్లేయర్గా వీరేంద్ర సెహ్వాగ్ను గిల్ అధిగమించాడు.సెహ్వాగ్ 2011లో వెస్టిండీస్పై 112 బంతుల్లో ఈ ఫీట్ సాధించగా.. అఫ్గాన్తో మ్యాచ్లో గిల్ కేవలం 108 బంతుల్లో ఈ ఘనతను అందుకున్నాడు. ఈ జాబితాలో ఇషాన్ కిషన్(103) అగ్రస్ధానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది.చదవండి: వైభవ్ సూర్యవంశీకి బీసీసీఐ భారీ షాక్ -
77 పరుగులకే ఖేల్ ఖతం.. 9.3 ఓవర్లలో ఛేదన
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఆస్ట్రేలియా వరుసగా రెండో విజయం నమోదు చేసింది. తొలి మ్యాచ్లో సౌతాఫ్రికా వుమెన్ను 65 పరుగుల తేడాతో చిత్తు చేసిన మొలినెక్స్ బృందం.. తాజాగా బంగ్లాదేశ్ మహిళా జట్టుపై కూడా ఘన విజయం సాధించింది.టాపార్డర్ కుదేలు లీడ్స్ వేదికగా హెడింగ్లీ మైదానంలో బుధవారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన బంగ్లా టాపార్డర్ కుదేలైంది. ఆసీస్ పేసర్ కిమ్ గార్త్.. ఓపెనర్లలో దిలారా అక్తర్ను డకౌట్ చేయడంతో పాటు.. జువేరియా ఫిర్దోస్ను 8 పరుగులకే పెవిలియన్కు పంపింది.వన్డౌన్ బ్యాటర్ షర్మిన్ అక్తర్ (5)ను ఆసీస్ కెప్టెన్ సోఫీ మొలినెక్స్ వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది. అనంతరం బంగ్లా సారథి నిగర్ సుల్తానా (27)ను కూడా మొలినెక్స్ LBWగా వెనక్కి పంపింది. ఇక మిగిలిన వారిలో శోభనా మొస్తరీ (4), షోర్నా అక్తర్ (0) వికెట్లను ఎలిస్ పెర్రీ తన ఖాతాలో వేసుకోగా.. రీతూ మోనీ (16)ని జార్జియా వారేహామ్.. రెబెయా ఖాన్ (8)ను అన్నాబెల్ సదర్లాండ్ పెవిలియన్కు పంపారు.77 పరుగులకే ఖేల్ ఖతం.. 9.3 ఓవర్లలో ఛేదనఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో బంగ్లాదేశ్ మహిళా జట్టు ఎనిమిది వికెట్ల నష్టానికి కేవలం 77 పరుగులే చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా జట్టు కేవలం 9.3 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి పని పూర్తి చేసింది. ఓపెనర్ జార్జియా వోల్ (32 బంతుల్లో 45)తో పాటు.. వన్డౌన్ బ్యాటర్ ఎలిస్ పెర్రీ (15 బంతుల్లో 19) అజేయంగా నిలవగా.. మరో ఓపెనర్ బెత్ మూనీ (10) మాత్రం మరూఫా అక్తర్ బౌలింగ్లో వెనుదిరిగింది. కాగా బంగ్లాపై విజయంతో గ్రూప్-‘ఎ’లో ఆస్ట్రేలియా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఇప్పటికి ఆడిన రెండు మ్యాచ్లలో గెలిచి నాలుగు పాయింట్లతో టాపర్గా నిలిచింది. చదవండి: వైభవ్ సూర్యవంశీకి బీసీసీఐ షాక్ -
నెదర్లాండ్స్తో మ్యాచ్.. భారత్దే బ్యాటింగ్
మహిళల టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా లీడ్స్ వేదికగా భారత్-నెదర్లాండ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన డచ్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తమ రెండో మ్యాచ్లో హర్మన్ సేన ఓ మార్పుతో బరిలోకి దిగింది. అరుంధతి రెడ్డి స్ధానంలో యువ పేసర్ నందని శర్మకు తుది జట్టులో చోటు కల్పించారు.తుది జట్లుభార: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, యాస్తిక భాటియా, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, శ్రేయంక పాటిల్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, నందనీ శర్మనెదర్లాండ్స్: హీథర్ సీగర్స్, ఫేబ్ మోల్కెన్బోర్, బాబెట్ డి లీడే(కెప్టెన్), స్టెర్రే కాలిస్, రోబిన్ రిజ్కే, ఫ్రెడెరిక్ ఓవర్డిజ్క్, ఐరిస్ జ్విల్లింగ్, మైర్తే వాన్ డెన్ రాడ్, కరోలిన్ డి లాంగే, సిల్వర్ సీగర్స్, ఇసాబెల్ వెగింగ్ -
అఫ్గానిస్తాన్ను చిత్తు చేసి.. ఫైనల్కు దూసుకెళ్లిన భారత్
ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్- ‘ఎ’ జట్టు తమ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడేసింది. దంబుల్లా వేదికగా అఫ్గానిస్తాన్- ‘ఎ’తో బుధవారం నాటి మ్యాచ్లో తిలక్ వర్మ సేన 101 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా నెట్రన్రేటు భారీగా మెరుగుపరుచుకుని ఫైనల్ చేరుకుంది.వరుసగా రెండు ఓటములుశ్రీలంక వేదికగా ఆతిథ్య జట్టుతో భారత్- ‘ఎ’, అఫ్గాన్ - ‘ఎ’ జట్లు ముక్కోణపు వన్డే సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలుత శ్రీలంకపై గెలిచిన భారత్.. తదుపరి మ్యాచ్లో అఫ్గాన్ చేతిలో ఓడిపోయింది. అనంతరం శ్రీలంకతో మరో మ్యాచ్ ఆడగా.. సూపర్ ఓవర్లో తిలక్ వర్మ సేనకు భంగపాటే ఎదురైంది.319 పరుగులుఈ క్రమంలో ఫైనల్ రేసులో నిలవాలంటే అఫ్గాన్పై బుధవారం నాటి మ్యాచ్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఈ మ్యాచ్లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్కు దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 319 పరుగులు సాధించింది.ఓపెనర్లలో ప్రియాన్ష్ ఆర్య అర్ధ శతకం (58)తో రాణించగా.. వైభవ్ సూర్యవంశీ (38) ఫర్వాలేదనిపించాడు. వన్డౌన్లో వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ 30 పరుగులు చేయగా.. కెప్టెన్ తిలక్ వర్మ (59), వికెట్ కీపర్ బ్యాటర్ కుమార్ కుశాగ్ర (58) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు.సూర్యాంశ్ షెడ్గే (7) విఫలం కాగా.. నిశాంత్ సింధు (21 నాటౌట్), విప్రాజ్ నిగమ్ (30) మెరుగ్గా రాణించారు. ఫలితంగా భారత్ మంచి స్కోరు సాధించింది. అఫ్గాన్ బౌలర్లలో ఫరీదూన్ దావూద్జాయ్, అబ్దుల్లా అహ్మద్జాయ్, ఫర్మానుల్లా సఫీ రెండేసి వికెట్లు కూల్చగా.. జహీర్ ఖాన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.చెలరేగిన నిశాంత్ సింధుఅనంతరం లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గానిస్తాన్కు ఆరంభంలోనే షాకులు తగిలాయి. టాపార్డర్లో ఓపెనర్ హసన్ ఐసాఖిల్ (14), వన్డౌన్ బ్యాటర్ ఖలీద్ తనీవాల్ (13) ఇలా వచ్చి అలా వెళ్లారు. మరో ఓపెనర్, కెప్టెన్ ఇమ్రాన్ మిర్ 32 పరుగులతో ఫర్వాలేదనిపించారు.మిగిలిన వారిలో ఫైజల్ షినోజాదా (46), బహీర్ షా (57) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. మిగతా వారంతా చేతులెత్తేశారు. మహ్మద్ ఇషాక్ (16), ఫర్మానుల్లా సఫీ (17లతో పాటు షామ్స్ ఉర్ రహ్మాన్ (8), అబ్దుల్లా అహ్మద్జాయ్ (6), జహీర్ ఖాన్ (4) భారత బౌలర్ల ధాటికి తాళలేక పెవిలియన్కు క్యూ కట్టారు.ఫైనల్కు దూసుకువెళ్లిన భారత్ఈ క్రమంలో 36.5 ఓవర్లలో 218 పరుగులకే అఫ్గానిస్తాన్ ఆలౌట్ అయింది. ఫలితంగా భారత్ 101 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. భారత బౌలర్లలో నిశాంత్ సింధు నాలుగు వికెట్లతో చెలరేగగా.. యశ్ ఠాకూర్ రెండు, అన్షుల్ కాంబోజ్, విప్రాజ్ నిగమ్, సూర్యాంశ్ షెడ్గే, అనుకుల్ రాయ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.ఇక ఈ విజయంతో భారత్ ఖాతాలో నాలుగు పాయింట్లు చేరాయి. నెట్రన్రేటు +0.797. మిగిలిన ఒక్క లీగ్ మ్యాచ్లో శ్రీలంక- అఫ్గానిస్తాన్ అమీతుమీ తేల్చుకుంటాయి. గెలిచిన జట్టు భారత్తో ఫైనల్లో తలపడుతుంది.చదవండి: వైభవ్ సూర్యవంశీకి షాకిచ్చిన బీసీసీఐ -
వైభవ్ సూర్యవంశీకి బీసీసీఐ భారీ షాక్
శ్రీలంక-ఎ జట్టు ప్లేయర్తో గొడవపడిన భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి భారీ షాక్ తగిలింది. అతడి మ్యాచ్ ఫీజులో బీసీసీఐ 50 శాతం కోత విధించింది. వైభవ్తో పాటు ఇండియా-ఎ జట్టు కెప్టెన్ తిలక్ వర్మపై కూడా 30 శాతం జరిమానా పడింది. మ్యాచ్ రిఫరీ ప్రదీప్ జయప్రగాష్ సిఫార్సుల మేరకు భారత క్రికెట్ బోర్డు ఈ కఠిన చర్యలు తీసుకుంది. లంక ఆటగాడు విషేన్ హలంబెజ్పై శ్రీలంక క్రికెట్ బోర్డు ఇప్పటికే సీరియస్ యాక్షన్ తీసుకుంది. అతడి మ్యాచ్లో కూడా 50 శాతం కోత విధించారు.ఏమి జరిగిదింటే?ముక్కోణపు సిరీస్లో భాగంగా జూన్ 15న దంబుల్లా వేదికగా భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్లు తలపడ్డాయి. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ 'సూపర్ ఓవర్'కు దారితీసింది. సూపర్ ఓవర్లో శ్రీలంక 'ఎ' జట్టు విజయం సాధించింది. 17 పరుగుల టార్గెట్ను భారత్ చేధించలేకపోయింది. అయితే సూపర్ ఓవర్ ముగిసిన అనంతరం శ్రీలంక యువ ఆటగాడు విషేన్ హలంబెజ్ శృతిమించి ప్రవర్తించాడు. ఓటమి బాధలో ఉన్న వైభవ్ సూర్యవంశీ దగ్గరకు వెళ్లి.. “ఇక లగేజ్ సర్దుకుని ఇంటికి వెళ్ళు.. ఇది ఐపీఎల్ కాదు” అని వ్యంగ్యంగా అన్నాడు. దీంతో సహనం కోల్పోయిన వైభవ్.. హలంబెజ్ వైపు దూసుకెళ్లి అతని ఛాతీపై బలంగా నెట్టాడు. లంక ఆటగాడు కూడా ప్రతిఘటించడంతో ఇద్దరి తీవ్ర వాగ్వదం మొదలైంది. తోటి ఆటగాళ్లు జోక్యం చేసుకోవడంతో గొడవ సర్దుమణిగింది. అంతకుముందు వెలుతురు సరిగ్గా లేకపోయినప్పటికి అంపైర్లు సూపర్ ఓవర్ నిర్ణయించడం పట్ల భారత కెప్టెన్ తిలక్ వర్మ ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. సూపర్ ఓవర్ నిర్వహణ, నో-బాల్ కాల్స్ వంటి విషయాల్లో అంపైర్లతో తిలక్ వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే తిలక్పై కూడా బోర్డు క్రమశిక్షణా చర్యలు చర్యలు తీసుకుంది.చదవండి: అఫ్గానిస్తాన్ను చిత్తు చేసి.. ఫైనల్కు దూసుకెళ్లిన భారత్ -
గిల్, కిషన్ సెంచరీలు.. భారత్ స్కోర్ 402 పరుగులు
లక్నో వేదికగా అఫ్గానిస్తాన్తో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాటర్లు విజృంభించారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన అఫ్గాన్ కెప్టెన్ తొలుత టీమిండియాను బ్యాటింగ్కు అహ్హానించాడు. అయితే మొదట బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో కెప్టెన్ శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ నిలకడగా ఆడి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు.గిల్, ఇషాన్ మెరుపు సెంచరీలు..మంచి టచ్లో కన్పించిన రోహిత్ శర్మ(48) హాఫ్ సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్తో కలిసి కెప్టెన్ గిల్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. టీ20 మ్యాచ్ను తలపించేలా వీరిద్దరూ బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో గిల్ 77 బంతుల్లో తన సెంచరీ మార్క్ను అందుకోగా.. కిషన్ 71 బంతుల్లోనే శతక్కొట్టాడు.వీరిద్దరూ మూడో వికెట్కు ఏకంగా 224 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గిల్ ఓవరాల్గా 110 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 154 పరుగులు చేయగా.. కిషన్ 79 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్లతో 125 రన్స్ చేసి ఔటయ్యాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగుల వద్ద ఆలౌటైంది. అఫ్గానిస్తాన్ బౌలర్లలో స్పిన్నర్లు నంగ్యాలియా ఖరోటి నాలుగు, రషీద్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు ఘజన్ఫర్, మహ్మద్ సలీమ్ తలా వికెట్ సాధించారు. -
బీసీసీఐ అనుమతి లేదు.. విజయ్ దేవరకొండకు నోటీసులు
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) లీగల్ నోటీసులు పంపింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అనుమతి లేకుండా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) టీజీ20 లీగ్ నిర్వహిస్తోందని.. దీనినిప్రమోట్ చేయటం నేరమని ఆరోపించింది.బీసీసీఐ అనుమతి లేకుండా కార్పొరేట్ కంపెనీలతో HCA వ్యాపారం చేస్తోందని.. ఇది ఎంతమాత్రం సరికాదని టీసీఏ పేర్కొంది. లీగ్తో మమేకమైన సినీ హీరోలు విజయ్ దేవరకొండ, వెంకటేశ్లతో పాటు.. క్రికెటర్లు తిలక్ వర్మ, అంబటి రాయుడు, మహ్మద్ సిరాజ్లకు టీసీఏ లీగల్ నోటీసులు పంపింది.స్థానిక టీ20 లీగ్ నిర్వహణకు 45 రోజుల ముందు అనుమతి తీసుకోవాలి.. కానీ బీసీసీఐ అనుమతి లేకుండా డబ్బులు వాసులు చేసి HCA లీగ్ నిర్వహిస్తోందని టీసీఏ ఆరోపణలు చేసింది.టీసీఏ ప్రధాన కార్యదర్శి గురువా రెడ్డి మాట్లాడుతూ.. ‘‘TG20 ఒక మోసపూరిత లీగ్. TG20 లీగ్ను నిర్వహించడానికి HCA వద్ద BCCI అనుమతులు లేవు. లీగ్ అనుమతులు చూపించమని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు నేను సవాలు విసురుతున్నాను. 'తెలంగాణ' అనే పదాన్ని ఉపయోగించే హక్కు HCAకు లేదు. తెలంగాణ క్రికెట్ వ్యవహారాలను చూసుకోవడానికి 'తెలంగాణ క్రికెట్ అసోసియేషన్' ఉంది’’ అని పేర్కొన్నారు.


