Sports
-
రెండో వన్డేలోనూ రెచ్చిపోయిన పాక్ బౌలర్లు
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో పాకిస్తాన్ బౌలర్లు చెలరేగుతున్నారు. ఈ సిరీస్ తొలి మ్యాచ్లో ఆసీస్ను 200 పరుగులకే ఆలౌట్ చేసి, ఆతర్వాత సునాయాస విజయం సాధించిన పాక్ జట్టు.. ఇవాళ (జూన్ 2) జరుగుతున్న రెండో వన్డేలోనూ ఆసీస్పై పట్టు బిగించింది.లాహోర్లోని గడాఫీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన పాక్.. ఆసీస్ను 231 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) పరిమితం చేసింది. తొలి వన్డేలో ఐదు వికెట్లతో చెలరేగిన లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ అరాఫత్ మిన్హాస్ (10-2-27-2) ఈ మ్యాచ్లోనూ సత్తా చాటాడు.అరాఫత్తో పాటు మరో స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ (10-1-34-2), పేసర్లు షాహీన్ అఫ్రిది (8-1-36-3), హరీస్ రౌఫ్ (10-1-49-2) కూడా రాణించడంతో ఆసీస్ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. ఆసీస్ ఇన్నింగ్స్లో ఇంగ్లిస్ (51), కెమరూన్ గ్రీన్ (53), మ్యాట్ రెన్షా (43), ఒలివర్ పీక్ (31) మినహా మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. ఓపెనర్గా బరిలోకి దిగిన అలెక్స్ క్యారీ డకౌట్ కాగా.. మరో ఓపెనర్ మాథ్యూ షార్ట్ 15, లబూషేన్ 5, కుహ్నేమన్ 5, నాథన్ ఇల్లిస్ 5 పరుగులకు ఔటయ్యారు. -
కెప్టెన్గా శ్రేయస్.. భువీ రీఎంట్రీ..!
భారత్-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య తొలిసారి ద్వైపాక్షిక టీ20 సిరీస్ జరుగనుందన్న ఓ వార్త ఇవాళ (జూన్ 2) సోషల్మీడియాలో వైరలైంది. ఈ సిరీస్ ఈ ఏడాది సెప్టెంబర్లో న్యూఢిల్లీలో జరుగనుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ చారిత్రక సిరీస్లో భారత జట్టు ఎలా ఉండబోతుందోనన్న అంచనాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి.ఈ సిరీస్ కోసం ఐపీఎల్ స్టార్లకు అధిక అవకాశాలు ఇవ్వవొచ్చని అభిమానులు భావిస్తున్నారు. ఈ అంచనాల ప్రకారం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. వికెట్కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించవచ్చు. వీరిద్దరూ ఇటీవలికాలంలో కెప్టెన్సీ బాధ్యతలను సమర్దవంతంగా నిర్వర్తించడంతో పాటు వ్యక్తిగతంగానూ విశేషంగా రాణించారు.ఐపీఎల్ 2026 పెను సంచలనం, రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి ఈ జట్టులో చోటు దక్కడం ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే తాజా ఐపీఎల్ సీజన్లో అద్భుతంగా రాణించిన పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్, సాయి సుదర్శన్లకు కూడా ఈ జట్టులో చోటు ఖాయమని అనుకుంటున్నారు.మిడిలార్డర్లో ఆర్సీబీకి రెండుసార్లు టైటిల్ అందించిన రజత్ పాటిదార్, ముంబై ఇండియన్స్ ఆటగాడు నమన్ ధిర్, ఢిల్లీ విధ్వంసకర బ్యాటర్ అశుతోష్ శర్మ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.ఆల్రౌండర్లుగా ఆర్సీబీ సంచలనాలు కృనాల్ పాండ్యా, రసిక్ సలాం దార్కు చోటు దక్కవచ్చని అంచనా.బౌలింగ్ విషయానికొస్తే.. ఆర్సీబీ వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ పేరు అందరి నోటా వినిపిస్తుంది. ఈ సిరీస్తో అతడు రీఎంట్రీ ఇవ్వడం ఖాయమని అంతా భావిస్తున్నారు. మిగతా పేసర్లుగా సీఎస్కే అన్షుల్ కంబోజ్, కేకేఆర్ కార్తీక్ త్యాగి, లక్నో ప్రిన్స్ యాదవ్లకు అవకాశం దక్కవచ్చనే అంచనాలు ఉన్నాయి. స్పిన్ బాధ్యతలు రవి బిష్ణోయ్కు అప్పగించవచ్చనే ప్రచారం జరుగుతుంది.అంచనా భారత జట్టు:వైభవ్ సూర్యవంశీ, ప్రభ్సిమ్రన్ సింగ్, సాయి సుదర్శన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రజత్ పాటిదార్, ఇషాన్ కిషన్ (వైస్ కెప్టెన్), నమన్ ధిర్, ఆశుతోష్ శర్మ, కృనాల్ పాండ్యా, రసిక్ సలామ్, అన్షుల్ కంబోజ్, కార్తిక్ త్యాగి, ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్.ఇదిలా ఉంటే, ఈ జట్టు అధికారిక జట్టు కాదు. ఐపీఎల్ ప్రదర్శనలు, ప్రస్తుత ఫామ్, జట్టు అవసరాలను ఆధారంగా చేసుకుని రూపొందించిన అంచనా జట్టు మాత్రమే. ఈ సిరీస్పై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన కూడా లేదు. ఇది కేవలం సోషల్మీడియాలో ప్రచారం మాత్రమే. ఈ సిరీస్ విషయాన్ని పక్కన పెడితే.. జూన్ 6 నుంచి భారత్-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్, 3 మ్యాచ్ల వన్డే సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్ల కోసం భారత జట్లను ఇదివరకే ప్రకటించారు. -
పంజాబ్ స్పిన్ కింగ్కు టీమిండియా కీలక పదవి
ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ స్పిన్ బౌలింగ్ కోచ్గా వ్యవహరించిన సాయిరాజ్ బహుతులేకు టీమిండియాలో కీలక పదవి దక్కింది. ఈ మాజీ లెగ్ స్పిన్నర్ను టీమిండియా ప్రత్యేక స్పిన్ బౌలింగ్ కోచ్గా నియమించారు. ఈ విషయాన్ని బీసీసీఐ ఇవాళ (జూన్ 2) అధికారికంగా ప్రకటించింది. మాజీ టీమిండియా ఆటగాడిగా, దేశీయ క్రికెట్లో దిగ్గజ ఆల్రౌండర్గా గుర్తింపు పొందిన బహుతులేకు ఆటగాడిగా, కోచ్గా విశేష అనుభవం ఉంది. ముఖ్యంగా యువ స్పిన్నర్లను తీర్చిదిద్దడంలో, వారి ప్రతిభను మెరుగుపరచడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో భారత జట్టు స్పిన్ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో బీసీసీఐ ఆయనకు ఈ బాధ్యతలను అప్పగించింది.బహుతులే భారత్ తరఫున రెండు టెస్టులు, ఎనిమిది వన్డేలు ఆడాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగిన ఫస్ట్క్లాస్ కెరీర్లో 6,176 పరుగులు చేసి, 630 వికెట్లు సాధించి దేశీయ క్రికెట్లో అత్యంత విజయవంతమైన ఆల్రౌండర్లలో ఒకరిగా నిలిచాడు.కోచ్గా కూడా బహుతులే విజయవంతమైన ప్రయాణం కొనసాగించాడు. విదర్భ, కేరళ, గుజరాత్, బెంగాల్ దేశవాలీ జట్లకు హెడ్ కోచ్గా సేవలందించాడు. అలాగే ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్తో పాటు రాజస్థాన్ రాయల్స్కు సుదీర్ఘంగా స్పిన్ బౌలింగ్ కోచ్గా పని చేశాడు.భారత క్రికెట్ అభివృద్ధి కార్యక్రమాల్లోనూ బహుతులే కీలక పాత్ర పోషించాడు. 2022 ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు బౌలింగ్ కోచ్గా వ్యవహరించాడు. 2024 అండర్-19 ప్రపంచకప్లో కూడా కోచింగ్ సిబ్బందిలో సభ్యుడిగా ఉన్నాడు. అదనంగా ఇండియా-ఏ, సీనియర్ జట్లతో పలు పర్యాయాలు ప్రత్యేక బౌలింగ్ కోచ్గా పని చేశాడు.2021 నుంచి 2024 వరకు బీసీసీఐ నిర్వహించే నేషనల్ క్రికెట్ అకాడమీ (ప్రస్తుతం సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్)లో కూడా కోచింగ్ బృందంలో కీలక సభ్యుడిగా కొనసాగాడు. యువ ఆటగాళ్ల అభివృద్ధిలో ఆయన చేసిన కృషి బీసీసీఐని ఆకట్టుకుంది.తన నియామకంపై స్పందించిన సాయిరాజ్ బహుతులే, భారత జట్టు స్పిన్ బౌలింగ్ కోచ్గా ఎంపిక కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నాడు. ఆటగాడిగా భారత్కు ప్రాతినిధ్యం వహించడం ఎంత గర్వకారణమో, కోచ్గా సేవలందించడం కూడా అంతే ప్రత్యేకమని అన్నాడు. -
వారెవ్వా కోహ్లీ.. రోజు వ్యవధిలో ఎంత మార్పు!
ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు వృందావనంలోని ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని మంగవారం సందర్శించారు. ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత ఆర్సీబీ బ్యాటర్ కోహ్లీ తన భార్య అనుష్కతో కలిసి ఆధ్యాత్మిక ఆశ్రమానికి వచ్చాడు. ప్రేమానంద్ మహారాజ్కు చెందిన రాధా కేళీ కుంజ్ ఆశ్రమానికి వెళ్లారు. కాగా కోహ్లీ, అనుష్క దంపతులు ఇప్పటికే అనేక సార్లు ఆశ్రమాన్ని విజిట్ చేశారు. ఆశ్రమానికి వెళ్లి బయటకు వస్తున్న కోహ్లీ, అనుష్కకు సంబంధించిన వీడియోలు, ఫొటోలే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చాలా సింపుల్ డ్రెస్సులో ఇద్దరూ ఆశ్రమానికి వెళ్లారు. మాస్క్లతో తమ ముఖాన్ని కవర్ చేసుకున్నారు. ప్రేమానంద్ ఆధ్యాత్మిక బోధనలు వినేందుకు తరుచూ అనుష్క, కోహ్లీ జంట ఆశ్రమానికి వెళ్తుంటారు. ఇది చూసిన ఆర్సీబీ అభిమానులు.. ‘వారెవ్వా కోహ్లీ.. ఒక్కరోజులో ఎంత మార్పు’..‘టైటిల్ టు ఆధ్యాత్మికం వైపు అడుగులు’ అంటూ కామెంట్లు చేశారు.గత ఆదివారం జరిగిన ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్పై ఆర్సీబీ విజయం సాధించింది. అయితే ట్రోఫీ పట్టుకున్న సమయంలో కోహ్లీ నుదురుపై అనుష్కా కిస్ ఇచ్చింది.ఆ తర్వాత ఆర్సీబీ గెలుపు సంబరాలకు సంబంధించిన ఒక ఈవెంట్లోనూ విరుష్క జంట అదిరిపోయే స్టెప్పులతో అలరించారు. 🎥 | Virat Kohli and Anushka Sharma’s visit to #PremanandMaharaj’s Radha Keli Kunj Ashram in #Vrindavan has gone viral on #socialmedia, with a video showing the couple seeking blessings from the spiritual leader. The visit came days after #RCB’s historic #IPL title triumph, and… pic.twitter.com/QPucsbjK6i— The Statesman (@TheStatesmanLtd) June 2, 2026చదవండి: 'మాట తప్పిన మూర్ఖుడు.. అత్యంత చెత్త యజమాని!' -
ఐపీఎల్ తర్వాత కూడా 'స్కై' వైఫల్యాలు కొనసాగింపు
భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వైఫల్యాల పరంపర ఐపీఎల్ 2026 తర్వాత కూడా కొనసాగుతోంది. క్యాష్ రిచ్ లీగ్ తర్వాత ఆడిన తొలి మ్యాచ్లోనే ఈ ముంబై ఇండియన్స్ విధ్వంసకర బ్యాటర్ చేతులెత్తేశాడు. ముంబై టీ20 లీగ్లో ట్రయంప్స్ నైట్స్ ఎంఎన్ఈకి ఆడుతున్న స్కై.. నార్త్ ముంబై పాంథర్స్తో జరిగిన మ్యాచ్లో 11 బంతుల్లో 19 పరుగులు (4 ఫోర్లు) మాత్రమే చేసి ఔటయ్యాడు.తాజా వైఫల్యం తర్వాత స్కై టీమిండియా భవిష్యత్తు మరోసారి చర్చనీయాంశంగా మారింది. స్కైను భారత టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి తొలగించడమే కాకుండా, జట్టు నుంచి కూడా తప్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ముంబై ఇండియన్స్ సైతం స్కైకు ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు.స్కై గతకొంతకాలంగా టీ20 ఫార్మాట్లో దారుణంగా విఫలమవుతున్నాడు. ఐపీఎల్ 2026 అతడు 13 మ్యాచ్ల్లో కేవలం రెండు సార్లు మాత్రమే హాఫ్ సెంచరీ మార్కు తాకాడు. అంతకుముందు టీమిండియా ఛాంపియన్గా నిలిచిన టీ20 వరల్డ్కప్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. 9 మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు. అది కూడా పసికూన యూఎస్ఏపై.ఈ వరుస వైఫల్యాల నేపథ్యంలో స్కైకు వ్యతిరేకులు ఎక్కువయ్యారు. తాజా వైఫల్యం తర్వాత సోషల్ మీడియాలో అభిమానుల స్పందనలు వైరల్గా మారాయి. కొందరు అతడికి మద్దతుగా నిలబడుతుంటే.. మరికొందరు వ్యతిరేకంగా భారీ క్యాంపెయినింగ్ చేస్తున్నారు.ముంబై టీ20 లీగ్లో స్కై వైఫల్యం అతడి జట్టు కొంప ముంచింది. కీలక దశలో ఔట్ కావడంతో అతడి జట్టు ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కై ప్రత్యర్ది జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన స్కై జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 188 పరుగులకే పరిమితమై, 21 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ముంబై టీ20 లీగ్లో స్కైతో పాటు చాలామంది టీమిండియా స్టార్లు పాల్గొంటున్న విషయం తెలిసిందే. -
'మాట తప్పిన మూర్ఖుడు.. అత్యంత చెత్త యజమాని!'
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాజీ చైర్మన్ లలిత్ మోదీ లక్నో సూపర్జెయింట్స్ ప్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకాపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే సంజీవ్ గోయెంకా అత్యంత చెత్త యజమాని అని, అతడో మాట తప్పిన మూర్ఖుడిగా అభివర్ణించాడు. నిలకడ లేని వక్తి ఎవరైనా ఉన్నారంటే అది సంజీవ్ గోయెంకానే అంటూ ఘాటుగా పేర్కొన్నాడు. ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ పాడ్కాస్ట్ ఇంటర్య్వూలో లలిత్ మోదీ ఈ వ్యాఖ్యలు చేశాడు. లలిత్ మోదీ మాట్లాడుతూ.. ‘అతడికి (గోయెంకా) ఒక ఫ్రాంచైజీని కొనడం కానీ, నడిపించే హక్కు కానీ లేదు. సంజీవ్ గోయెంకా ఒక బిజినెస్ మైండ్ కలిగిన వ్యక్తి. తన విద్యుత్ వ్యాపారానికి పరిమితమవ్వాల్సింది. అనవసరంగా ఐపీఎల్లో ఫ్రాంచైజీని కొని చేతులు కాల్చుకున్నాడు. లక్నో సూపర్జెయింట్స్ను కొనుగోలు చేయడం వల్ల ఐపీఎల్ రేటింగ్ తగ్గుదలకు సంజీవ్ కారణమయ్యాడు. లక్నో జట్టు కూడా ప్రతీ సీజన్లో పేలవమైన ప్రదర్శననే కనబరుస్తూ వస్తోంది. ఈసారి కూడా లక్నో ఒట్టి చేతులతోనే లీగ్ నుంచి నిష్క్రమించడంతో సంజీవ్ గోయెంకా మీమర్స్కు దొరికిపోయారు. ఇప్పుడాయన ఒక మీమ్ కింగ్ అయిపోయారు.’ అంటూ లలిత్ మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. గోయెంకాపై వచ్చిన మీమ్స్లో అత్యధిక మంది చూసిన మీమ్కు కృతజ్ఞతగా రోలెక్స్ వాచీని బహుమతిగా ఇస్తానని లలిత్ మోదీ ఆఫర్ చేయడం గమనార్హం. ఇక అవకాశం దొరికినప్పుడల్లా సంజీవ్ గోయెంకాపై లలిత్ మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించడం పరిపాటిగా మారిపోయింది. ఈ సీజన్లో ఒక మ్యాచ్లో ఓటమి చెందడంపై జట్టు మాజీ కెప్టెన్ రిషబ్ పంత్తో సంజీవ్ గోయెంకా వాడీ వేడీ చర్చ జరపడంపై లలిత్ మోదీ కౌంటర్ ఇచ్చాడు. అయితే సీజన్లో లక్నో ఆట ముగిసిన తర్వాత ఆ జట్టు పంత్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామంపై స్పందించిన లలిత్ మోదీ.. ‘పంత్కు దీర్ఘకాలం అండగా ఉంటానన్న ఒక పెద్ద మనిషి (సంజీవ్ గోయెంకా) తన వాగ్ధానాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాడు’ అంటూ విమర్శలు సంధించాడు. ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్జెయింట్స్ దారుణ ఆటతీరు కనబరిచింది. సీజన్లో 14 మ్యాచ్లాడిన లక్నో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది.చదవండి: సింధూ శుభారంభం.. అసలు గండం ముందుంది! -
కేన్-సాంట్నర్ ఫైట్.. 'బాక్స్' యుద్దం
క్రికెట్లో ఆటగాళ్ల భద్రతకు గత మూడు దశాబ్దాల్లో విపరీతమైన ప్రాధాన్యం పెరిగింది. హెల్మెట్లు, ప్యాడ్లు, గ్లోవ్స్, ఛెస్ట్ గార్డులు, ఆర్మ్ ప్రొటెక్టర్లు వంటి పరికరాలు ఆధునిక సాంకేతికతతో మరింత సురక్షితంగా మారాయి. అయితే పురుష క్రికెటర్లకు అత్యంత సున్నితమైన భాగాన్ని రక్షించే 'అబ్డొమినల్ గార్డ్' లేదా 'బాక్స్' విషయంలో మాత్రం పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. దాదాపు 1970ల నుంచి వాడుతున్న డిజైన్నే ఇప్పటికీ ఎక్కువ మంది ఆటగాళ్లు ఉపయోగిస్తున్నారు.ఇటీవల ఆటగాళ్ల భద్రతపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఈ అంశం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ముఖ్యంగా టీమిండియా బ్యాటర్ తిలక్ వర్మ టెస్టిక్యులర్ టార్షన్తో బాధపడిన ఘటన తర్వాత క్రికెటర్ల రక్షణ పరికరాలపై కొత్త చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్కు చెందిన ఇద్దరు మాజీ, ప్రస్తుత క్రికెటర్ల కుటుంబాలు అభివృద్ధి చేసిన రెండు కొత్త తరహా అబ్డొమినల్ గార్డులు ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో ఆసక్తికర పోటీకి కారణమయ్యాయి.కేన్ విలియమ్సన్ తన సంస్థ 'కవర్' (Cover) ద్వారా కొత్త తరహా బాక్స్ను మార్కెట్లోకి తీసుకొచ్చాడు. అల్యూమినియం మిశ్రమంతో తయారైన ఈ గార్డ్ పగలకుండా ఉండేలా ప్రత్యేకంగా రూపొందించబడింది. అంతేకాకుండా షాక్ను గ్రహించే ప్రత్యేక ఫోమ్ను కూడా ఇందులో ఉపయోగించారు. గతంలో తాను వాడిన గార్డులు దెబ్బతిన్న అనుభవాల నేపథ్యంలో మరింత బలమైన ఉత్పత్తిని రూపొందించినట్లు విలియమ్సన్ చెబుతున్నాడు.మరోవైపు మిచెల్ సాంట్నర్ సోదరుడు ఎలియట్ సాంట్నర్, ఓటాగో క్రికెటర్ రూబెన్ క్లింటన్ కలిసి 'ట్రూగార్డ్' (TruGuard) అనే ఉత్పత్తిని అభివృద్ధి చేశారు. ఇది ప్లాస్టిక్తో తయారైనప్పటికీ 'జైరాయిడ్ లాటిస్' అనే ప్రత్యేక నిర్మాణాన్ని ఉపయోగించి, విస్తృత ప్రాంతంలో ప్రభావాన్ని విభజించేలా రూపొందించారు. తేనెగూడు ఆకృతిని పోలిన ఈ నిర్మాణం దెబ్బ తీవ్రతను గణనీయంగా తగ్గిస్తుందని వారు చెబుతున్నారు.ఈ రెండు ఉత్పత్తులు ఇప్పటికే పలువురు ప్రొఫెషనల్ క్రికెటర్ల దృష్టిని ఆకర్షించాయి. అయితే అసలు పరీక్ష మాత్రం జూన్ 4 నుంచి ప్రారంభమయ్యే ఇంగ్లండ్-న్యూజిలాండ్ వన్డే సిరీస్ సందర్భంగా జరగనుంది. లార్డ్స్ వేదికగా జరిగే మ్యాచ్లలో న్యూజిలాండ్ ఆటగాళ్లు ఈ రెండు కంపెనీల ఉత్పత్తులను ఉపయోగించే అవకాశం ఉంది. మైదానంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు పోటీపడుతుండగా, మైదానం వెలుపల విలియమ్సన్ 'కవర్', సాంట్నర్ కుటుంబం 'ట్రూగార్డ్' మధ్య ఆసక్తికర పోటీ నెలకొననుంది.ఐపీఎల్ 2026లో కేన్ విలియమ్సన్ లక్నో మెంటార్గా వ్యవహరించిన సమయంలో తన ఉత్పత్తిని ఆటగాళ్లకు పరిచయం చేశాడు. ఓ మ్యాచ్లో మిచెల్ మార్ష్కు బంతి బలంగా బాక్స్పై తాకినా పెద్దగా ఇబ్బంది లేకుండా ఆడటం ఈ ఉత్పత్తికి మంచి ప్రచారం తీసుకొచ్చింది. ఆ ఘటన తర్వాత విలియమ్సన్కు మార్ష్ థంబ్స్అప్ చూపించడం కూడా సోషల్ మీడియాలో వైరలైంది. -
సింధూ శుభారంభం.. అసలు గండం ముందుంది!
ఇండోనేషియా ఓపెన్ సూపర్-1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం పీవీ సింధు శుభారంభం చేసింది. టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధూ 25-23, 21-16తో థాయ్లాండ్కు చెందిన బుసానన్ ఒంగ్బామ్రుంగ్ఫాన్ను మట్టికరిపించిది. 51 నిమిషాల పాటు సాగిన పోరులో సింధూ తన ప్రత్యర్థిపై ఆద్యంతం ఆధిపత్యం కనబరిచింది. అయితే తొలి గేమ్ హోరాహోరీగా సాగినప్పటికీ, రెండో గేమ్లో మాత్రం సింధూ తనలోని ఆటను బయటికి తీసి సునాయాస విజయాన్ని అందుకుంది. అయితే రెండో రౌండ్లో సింధూ.. ప్రపంచ నంబర్వన్ యాన్ సే యంగ్ను ఎదుర్కోనుంది. గతవారం సింగపూర్ ఓపెన్లో యాన్ సే చేతిలో రెండో రౌండ్లోనే వెనుదిరిగింది. మరి ఈసారైనా ఆమె గండం దాటి ప్రిక్వార్టర్స్కు చేరుకుంటుందేమో చూడాలి. మిగిలిన మ్యాచ్ల విషయానికొస్తే మాళవిక బన్సోద్ తొలి రౌండ్కే పరిమితమైంది. మాళవిక బన్సోద్ 12-21, 10-21తో ఏడో సీడ్ పోర్న్పావీ చోచువాంగ్ చేతిలో ఓటమి చవిచూసింది. ఇక పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టాడు. తొలి రౌండ్లో శ్రీకాంత్ 19-21, 15-21తో జపాన్కు చెందిన యుషి తనాకా చేతిలో చిత్తయ్యాడు. డబుల్స్ మ్యాచ్ల విషయానికొస్తే హరిహరన్-ఎంఆర్ అర్జున్ ద్వయం రెండో రౌండ్లో అడుగుపెట్టింది. -
హెడ్కోచ్గా ఆండ్రూ ఫ్లింటాఫ్
ఇంగ్లండ్ మాజీ ఆల్రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ తొలిసారి విదేశీ లీగ్లో కోచ్గా వ్యవహరించనున్నాడు. ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) ఫ్రాంఛైజీ సిడ్నీ థండర్ తమ హెడ్కోచ్గా ఫ్లింటాఫ్ను నియమించింది. ఇందుకు సంబంధించి మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఒకసారి ఫైనల్.. కానీ రెండుసార్లు..కాగా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ట్రెవర్ బేలిస్ గత ఐదేళ్లుగా సిడ్నీ థండర్కు హెడ్కోచ్గా వ్యవహరిస్తున్నాడు. అతడి మార్గదర్శనంలోనే 2024-2025లో జట్టు ఫైనల్కు చేరింది. అయితే, 2023-24, 2025-26 సీజన్లలో మాత్రం దారుణంగా పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.ఈ నేపథ్యంలో సిడ్నీ థండర్ బేలిస్పై వేటు వేసి అతడి స్థానంలో ఆండ్రూ ఫ్లింటాఫ్ను తీసుకువచ్చింది. కాగా ఫ్లింటాఫ్ గతంలో ది హండ్రెడ్ లీగ్లో నార్తర్న్ సూపర్చార్జర్స్కు కోచ్గా పనిచేశాడు.అత్యుత్తమ ఆల్రౌండర్అంతేకాదు.. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్లకు 2023-24 సీజన్కు గానూ కన్సల్టెంట్గా ఫ్లింటాఫ్ వ్యవహరించాడు. అదే విధంగా ఇంగ్లండ్ లయన్స్ జట్టుకు మార్గదర్శనం చేశాడు. కాగా ఇంగ్లండ్ అందించిన అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఆండ్రూ ఫ్లింటాఫ్ ఒకడు.అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లండ్ తరఫున 1998- 2010 వరకు ఫ్లింటాఫ్ 79 టెస్టులు, 141 వన్డేలు, 7 టీ20లు ఆడాడు. వన్డేల్లో 3845 పరుగులు చేసిన ఈ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్.. 226 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 3394 పరుగులు చేయడంతో పాటు 169 వికెట్లు కూల్చాడు.ఇక ఏడు టీ20లలో కలిపి 76 పరుగులు చేయడంతో పాటు.. ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు ఆండ్రూ ఫ్లింటాఫ్ . కాగా సిడ్నీ థండర్ తొలుత డాన్ క్రిస్టియన్, షేన్ వాట్సన్లను సంప్రదించినట్లు సమాచారం. అయితే, వారి కంటే 48 ఏళ్ల ఫ్లింటాఫే తమ జట్టుకు సరైన కోచ్ అని భావించి.. అతడితో రెండేళ్లకు ఒప్పందం కుదుర్చుకుంది.చదవండి: ODI WC: రోహిత్ శర్మ ఎందుకిలా చేస్తున్నాడు? -
భారత టెస్ట్ జట్టులో మార్పులు.. ఐపీఎల్ స్టార్లకు ప్రత్యేక అవకాశం
త్వరలో (జూన్ 6 నుంచి) ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే ఏకైక టెస్ట్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ జట్టుకు అదనంగా ఆరుగురు ప్లేయర్లను భారత సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. వీరిలో కొందరు ఐపీఎల్ 2026లో సత్తా చాటిన బౌలర్లు. వీరిని మెయిన్ జట్టులో కాకుండా నెట్ బౌలర్లుగా ఎంపిక చేశారు.బీసీసీఐ అధికారికంగా విడుదల చేసిన జాబితా ప్రకారం.. గుర్జప్నీత్ సింగ్, ఆకిబ్ నబీ, ప్రిన్స్ యాదవ్, సరాన్ష్ జైన్, జీషన్ అన్సారీ, శివాంగ్ కుమార్ ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే ఏకైక టెస్ట్ కోసం భారత జట్టు నెట్ బౌలర్లుగా ఎంపికయ్యారు. వీరు ప్రధాన జట్టులో సభ్యులు కాకపోయినా, భారత బ్యాటర్లకు నెట్ ప్రాక్టీస్లో సహాయపడతారు.పై బౌలర్లను టీమిండియా నెట్ బౌలర్లుగా తీసుకోవడానికి ప్రధాన కారణం ఐపీఎల్ 2026 వల్ల రెగ్యులర్ బౌలర్లపై పడిన శారీరక ఒత్తిడి అని తెలుస్తోంది. ఫైనల్ వరకు ఆడిన మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్ (రెగ్యులర్ జట్టు సభ్యులు) శారీరక అలసట కారణంగా ప్రాక్టీస్ సెషన్స్కు అందుబాటులో ఉండటం లేదు. దీంతో బ్యాటర్లకు సరైన ప్రాక్టీస్ కల్పించేందుకు అదనపు బౌలర్లను ఎంపిక చేశారు.అయితే ఈ ఎంపికలను కేవలం నెట్ బౌలర్ల అవసరంగా మాత్రమే చూడడం లేదు. భారత టెస్టు జట్టు ప్రస్తుతం మార్పుల దశలో ఉంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రతిభావంతులైన యువ బౌలర్లను దగ్గరగా పరిశీలించాలనే ఉద్దేశంతోనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. జట్టుతో కలిసి శిక్షణ పొందడం ద్వారా అంతర్జాతీయ స్థాయి వాతావరణాన్ని అర్థం చేసుకునే అవకాశం వీరికి లభించనుంది.ఈ ఆరుగురిలో కొందరు దేశీయ క్రికెట్లో అద్భుత ప్రదర్శనలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆకిబ్ నబీ దేశీయ సీజన్లో 10 మ్యాచ్ల్లో 60 వికెట్లు తీసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. అలాగే జీషన్ అన్సారీ తన లెగ్స్పిన్తో మంచి పేరు సంపాదించాడు. గుర్జప్నీత్ సింగ్, సరాన్ష్ జైన్ కూడా రెడ్బాల్ క్రికెట్లో నిలకడైన ప్రదర్శనలు చేశారు.ప్రిన్స్ యాదవ్, శివాంగ్ కుమార్లకు ఐపీఎల్ 2026 ప్రదర్శనలు ఈ అవకాశాన్ని తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా ప్రిన్స్ యాదవ్ తన వేగం, క్రమశిక్షణతో ఆకట్టుకుని ఇప్పటికే అఫ్ఘనిస్తాన్తో వన్డే సిరీస్కు భారత జట్టులో చోటు సంపాదించాడు.అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే ముందు భారత జట్టు డ్రెస్సింగ్రూమ్ వాతావరణాన్ని అనుభవించడం యువ ఆటగాళ్లకు ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే ఈ ఆరుగురి ఎంపికను భవిష్యత్ భారత టెస్టు జట్టు నిర్మాణంలో ఒక కీలక అడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు. అఫ్ఘనిస్తాన్ టెస్టులో ప్రత్యక్షంగా ఆడే అవకాశం లేకపోయినా, జట్టుతో కలిసి పనిచేసే ఈ అనుభవం వారి కెరీర్కు కీలక మలుపుగా మారే అవకాశముంది.ఆఫ్ఘనిస్తాన్తో ఏకైక టెస్ట్ కోసం భారత రెగ్యులర్ జట్టు..శుభ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషభ్ పంత్, దేవ్దత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, మానవ్ సుతార్, ప్రసిద్ధ్ కృష్ణ, గూర్నూర్ బ్రార్, ధ్రువ్ జురెల్, హర్ష్ దూబే -
కోహ్లీ, పాటీదార్ కాదు.. ఆర్సీబీ రాత మారింది ఆమె వల్లే!
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. పాటిదార్ నేతృత్వంలోని ఆర్సీబీ వరుసగా రెండో ఏడాది చాంపియన్గా నిలిచింది. అయితే ఐపీఎల్ ఆరంభం నుంచి 'ఈ సాలా కప్ నమ్దే' అంటూ 17 ఏళ్లుగా టైటిల్ కోసం చకోర పక్షిలా ఎదురుచూసింది. అప్పటికీ మూడుసార్లు ఫైనల్ చేరినా తుది మెట్టుపై బోల్తా పడడంతో ఇక ఆర్సీబీ టైటిల్ కల కష్టమే అని ఫ్యాన్స్ కూడా ఒక అభిప్రాయానికి వచ్చేశారు.కానీ 17 ఏళ్లలో దక్కని టైటిల్ గతేడాది తమ చెంత చేరడంతో ఆర్సీబీ ఉబ్బితబ్బిబ్బైపోయింది. ఈ సీజన్లో అద్భుత ప్రదర్శనతో ఆర్సీబీ రెండోసారి కప్ ఒడిసిపట్టడంతో రజత్ పాటీదార్ లక్కీ కెప్టెన్ల జాబితాలో చేరిపోయాడు. వరుసగా రెండుసార్లు టైటిల్ సాధించిన మూడో కెప్టెన్గా పాటీదార్ నిలిచాడు. ఈ క్రమంలో పాటీదార్ను ఆర్సీబీకి ట్రోఫీ అందించిన లక్కీ కెప్టెన్ అని పొగుడుతున్నారు.కానీ ఆర్సీబీ రాత అంతకుముందే మారిందని కొంతమంది అభిమానులు పేర్కొంటున్నారు. ఆర్సీబీ పురుషుల జట్టు టైటిల్ సాధించ డానికి ముందే మహిళల జట్టు ఆ ఘనత సాధించింది. స్మృతి మందాన నేతృత్వంలోని ఆర్సీబీ వుమెన్ టీం 2024లోనే తొలి టైటిల్ సాధించింది. అయితే 2023లో మొదలైన డబ్ల్యూపీఎల్లో ఆర్సీబీ మహిళల జట్టు కూడా మొదట్లో ఓటమిబాటలోనే నడిచింది. ఆ సీజన్లో వరుసగా ఐదు మ్యాచ్లలో ఓడిపోయి పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. దీంతో పురుషుల జట్టు మాదిరే మహిళల జట్టు కూడా ట్రోలింగ్కు గురైంది. అయితే మరుసటి సీజన్లోనే మంధాన నేతృత్వంలోని ఆర్సీబీ కమ్బ్యాక్ ఇచ్చింది. ఆ సీజన్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తు చేసిన ఆర్సీబీ వుమెన్ తొలిసారి ఫ్రాంచైజీకి టైటిల్ అందించింది. దీంతో కెప్టెన్గా మంధాన పేరు మార్మోగిపోయింది. 2025 సీజన్లో టైటిల్ సాధించడంలో విఫలమైనప్పటికీ, 2026 సీజన్లో మరోసారి ఆర్సీబీ మహిళల జట్టు చాంపియన్గా నిలిచింది. ముఖ్యంగా కెప్టెన్గా, బ్యాటర్గా మంధాన అద్భుత ప్రదర్శన చేసింది. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఫైనల్లో మంధాన 41 బంతుల్లోనే 87 పరుగులు సాధించి ఒంటిచేత్తో ఆర్సీబీకి రెండో కప్పును అందించింది. దీంతో ఆర్సీబీ కూడా చాంపియన్గా నిలవగలదని మంధాన బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చింది. మహిళల జట్టును ఆదర్శంగా తీసుకున్న పురుషుల జట్టు లెగసీని కంటిన్యూ చేస్తూ ఇవాళ వరుసగా రెండోసారి చాంపియన్గా నిలిచింది. రాబోయే రెండు మూడేళ్లు ఆర్సీబీకి చెందిన మహిళల జట్టు డబ్ల్యూపీఎల్లో.. పురుషుల జట్టు ఐపీఎల్లో వరుస టైటిల్స్ సాధించినా ఆశ్చర్యపోనవసరం లేదు.ఆర్సీబీని మార్చిన కోహ్లీ సందేశం..2023 డబ్ల్యూపీఎల్లో వైఫల్యం తర్వాత ఆర్సీబీ మహిళల జట్టుతో కోహ్లీ ప్రత్యేకంగా మాట్లాడాడు. ఈ నేపథ్యంలో మహిళల జట్టుకు 'ఫలితం కోసం ఆశించకుండా 110 శాతం కష్టపడండి' అంటూ కోహ్లీ తన మోటివేషన్ స్పీచ్తో ఆ ఏడాది ఆర్సీబీ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. అలా కోహ్లీ సందేశాన్ని ఒంటబట్టించుకున్న మంధాన సేన 2024 సీజన్లో టైటిల్ను సాధించింది. ఆర్సీబీ తలరాత మార్చింది కోహ్లీ, పాటీదార్ కాదు.. మంధాన అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ ఫన్నీ పోస్టులు పెడుతున్నారు.𝙀𝙚 𝙎𝙖𝙡𝙖 𝘾𝙪𝙥 𝙉𝙖𝙢𝙙𝙪 x 2⃣ 🏆🏆Smriti Mandhana 🤝 Rajat Patidar #TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/QxVAOX8oq2— IndianPremierLeague (@IPL) May 31, 2026చదవండి: షకీరా కూడా పనికిరాదు.. ఫ్యాన్స్ను షేక్చేస్తోన్న ఫిఫా పాట! -
ODI WC: రోహిత్ శర్మ ఎందుకిలా చేస్తున్నాడు?
దాదాపు రెండు నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉంది టీమిండియా. భారత జట్టులోని ప్రధాన ఆటగాళ్లంతా ఐపీఎల్-2026తో బిజీ బిజీగా గడిపారు. ఇక ఈ మెగా టోర్నీకి ఆదివారం నాటి ఫైనల్తో తెరపడింది.ఈ నేపథ్యంలో జూన్ 6 నుంచే టీమిండియా రంగంలోకి దిగనుంది. స్వదేశంలో అఫ్గనిస్తాన్తో తొలుత ఓ టెస్టు మ్యాచ్ ఆడి.. ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇక అఫ్గన్తో మ్యాచ్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే తమ జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే.ఫిట్నెస్లోబడే...శుబ్మన్ గిల్ సారథ్యంలో అఫ్గన్తో ఆడే ఈ జట్లలో వన్డేలకు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంపికయ్యారు. అయితే, వీరిద్దరు ఫిట్నెస్లోబడే ఆడతారని బీసీసీఐ స్పష్టం చేసింది. కాగా ఐపీఎల్-2026లో హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్కు ఆడిన రోహిత్ శర్మ.. సీజన్ మధ్యలో గాయపడ్డాడు.తొడ కండరాల గాయంతో ఐదు మ్యాచ్లకు రోహిత్ దూరమయ్యాడు. ఆ తర్వాత తిరిగి జట్టుతో చేరినా ఇంపాక్ట్ ప్లేయర్గానే బరిలోకి దిగాడు. మరోవైపు.. హార్దిక్ పాండ్యా సైతం వెన్నునొప్పితో నాలుగు మ్యాచ్లు ఆడలేకపోయాడు.క్లియరెన్స్ వస్తేనే..ఈ నేపథ్యంలో రోహిత్, హార్దిక్లను అఫ్గన్తో సిరీస్కు ఎంపిక చేసినప్పటికీ.. ఫిట్నెస్ ఆధారంగానే వారు ఆడతారో, లేదో తేలుతుందని బీసీసీఐ జట్టు ప్రకటన సమయంలో వెల్లడించింది. అదే విధంగా.. వీరిద్దరిని సిరీస్ ఆరంభానికి రెండు వారాల ముందే బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది.ఇంత వరకు రిపోర్టు చేయని రోహిత్!అక్కడి వైద్య బృందాన్ని సంప్రదించి.. వేగంగా కోలుకొనే అంశంపై దృష్టి పెట్టాలని.. వారి నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాలని బోర్డు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా మంగళవారం (జూన్ 2)న బెంగళూరుకు పయనం కానుండగా.. రోహిత్ శర్మ మాత్రం ఇంత వరకు రిపోర్టు చేయలేదని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ వెల్లడించింది.కాగా వన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి ముందు టీమిండియా కొద్ది వన్డేలు మాత్రమే ఆడనుంది. ఇలాంటి తరుణంలో రోహిత్ గాయపడటం.. బోర్డు ఆదేశాలు పాటించే అంశంలో స్పష్టత లేకపోవడం సందేహాలకు తావిస్తోంది.రేసులోకి జైసూ!ఇప్పటికే రోహిత్కు బదులు యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ పేర్లను శుబ్మన్ గిల్ ఓపెనింగ్ జోడీగా పరిగణించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ విషయంలో బోర్డు కూడా సానుకూలంగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 39 ఏళ్ల రోహిత్ శర్మనే స్వయంగా తప్పుకోనున్నాడనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ముల్లన్పూర్లో భారత్- అఫ్గన్ మధ్య ఏకైక టెస్టు జరుగనుండగా.. జూన్ 13, 17, 20 తేదీల్లో వన్డే సిరీస్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: IPL 2026: అత్యుత్తమ జట్టు ఇదే! -
సాల్ట్, సుయాశ్ చారిత్రక ఘనత
ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కరికి దక్కిన అరుదైన ఘనతను, తాజాగా ఆర్సీబీ ఆటగాళ్లు ఫిల్ సాల్ట్, సుయాశ్ శర్మ సాధించారు. ఆర్సీబీతో ఐపీఎల్ 2026 ఛాంపియన్గా నిలవడంతో ఈ ఇద్దరూ హ్యాట్రిక్ ఐపీఎల్ టైటిళ్ల (సీజన్లో కనీసం ఒక మ్యాచ్ అయినా ఆడిన ఆటగాళ్లలో) అరుదైన ఫీట్ను నమోదు చేశారు. గతంలో కర్ణ్ శర్మ ఒక్కడే ఈ ఫీట్ను సాధించగా.. తాజాగా సాల్ట్, సుయాశ్ అతని సరసన చేరారు.కర్ణ్ శర్మ 2016లో ఎస్ఆర్హెచ్తో, 2017లో ముంబై ఇండియన్స్తో, 2018లో సీఎస్కేతో ఐపీఎల్ టైటిళ్లు సాధించగా.. సాల్ట్, సుయాశ్ 2024లో కేకేఆర్తో, 2025, 2026లో ఆర్సీబీతో ఐపీఎల్ టైటిళ్లు సాధించి, చారిత్రక రికార్డును సొంతం చేసుకున్నారు.మే 31న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఆర్సీబీ గుజరాత్ టైటాన్స్పై 5 వికెట్ల తేడాతో గెలుపొంది వరుసగా రెండో ఎడిషన్లో టైటిల్ను ఎగరేసుకుపోయింది. తొలి 17 ఎడిషన్లలో ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేని ఆర్సీబీ వరుసగా రెండు ఎడిషన్లు టైటిల్ సాధించి, టైటిళ్ల కరువును తీర్చుకుంది.ఈ మ్యాచ్లో గుజరాత్ ఆర్సీబీకి ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. సీజన్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన ఆ జట్టు టాపార్డర్, బౌలింగ్ విభాగాలు తుది సమరంలో చేతులెత్తేశాయి. తొలుత బ్యాటింగ్లో సాధారణ స్కోర్కు (155-8) పరిమితమైన గుజరాత్.. ఆతర్వాత దాన్ని కాపాడుకోవడంలో దారుణంగా విఫలమైంది. విరాట్ కోహ్లి (75 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్తో ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. -
షకీరా కూడా పనికిరాదు.. ఫ్యాన్స్ను షేక్చేస్తోన్న ఫిఫా పాట!
ప్రపంచవ్యాప్తంగా మరో రెండు వారాల్లో ఫిఫా ప్రపంచకప్ సందడి మొదలుకానుంది. జూన్ 11 నుంచి జరగనున్న ఫిఫా వరల్డ్కప్కు అమెరికా, మెక్సికో, కెనడాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫిఫా ప్రపంచకప్ను ప్రమోట్ చేస్తూ ప్రముఖ అమెరికన్ యూట్యూబర్ ఐషోస్పీడ్ తన ప్రత్యేక గీతాన్ని విడుదల చేశాడు. అయితే ఐషోస్పీడ్ పాడిన పాట 24 గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒక్క ఇన్స్టాగ్రామ్లోనే 40 మిలియన్ల వ్యూస్ సాధించడం విశేషం. ఇక యూట్యూబ్లోనూ మూడు మిలియన్లు, ఇతర ప్లాట్ఫామ్స్ కలిపి మరో ఏడు మిలియన్ల వ్యూస్ సాధించింది. ఈ లెక్కన ఒక్కరోజులోనే 50 మిలియన్ల వ్యూస్ సాధించడం మరో రికార్డుగా నిలిచింది. అయితే మే నెలలో కొలంబియన్ పాప్స్టార్ షకీరా, నైజీరియన్ ఆఫ్రోబీట్స్ ఐకాన్ బర్నాబాయ్లతో ఫిఫా నిర్వాహకులు ప్రపంచకప్ అధికారిక గీతాన్ని విడుదల చేశారు. టోర్నమెంట్ బహుళ సాంస్కృతిక స్ఫూర్తిని చాటిచెప్పేలా, విలక్షణమైన పశ్చిమ ఆఫ్రికా లయలను ఉత్సాహభ రితమైన లాటిన్ బీట్స్తో మేళవించేలా "డై డై" అనే ఈ ట్రాక్ను రూపొందించారు. కానీ ఫిఫా నిర్వాహకులు విడుదల చేసిన గీతం జనాలకు అంతగా ఎక్కలేదు. చారిత్రాత్మక ఫుట్బాల్ గీతాల్లో సాధారణంగా ఉండే సహజమైన, ఉత్సాహభరితమైన ట్యూన్స్ మిస్సయ్యాయని చాలా మంది అభిమానులు విమర్శించారు. కానీ ఇదే సమయంలో ఐషో స్పీడ్ విడుదల చేసిన గీతం మాత్రం అభిమానులను పిచ్చెక్కిస్తోంది. ఐషో స్పీడ్ పాడిన పాట అన్ని దేశాల సంప్రదాయాలను మేళవిస్తూ పాడడంతో 24 గంటల్లోనే వైరలయ్యి కూర్చొంది. 'ఫిఫా విడుదల చేసిన దానికంటే ఐషో స్పీడ్ పాడిన పాట మంచి కిక్ ఇస్తుందని.. ఇది కదా అసలైన ఫిఫా పాట" అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక జూన్ 11 నుంచి మొదలుకానున్న ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్లు భారత్లో కూడా ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీకి సంబంధించిన ప్రసార హక్కులను జీ నెట్వర్క్ మంచి ధరకు కొనుగోలు చేసింది. 2010 ఫిఫా ప్రపంచకప్ సమయంలో షకీరా పాడిన వాకా వాకా పాట ఎంత ప్రసిద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఐషో స్పీడ్ పాడిన పాట షకీరా పాటను కూడా క్రాస్ చేసేలా కనిపిస్తోంది.🚨| BREAKING: Speed has OFFICIALLY RELEASED his World Cup song “Champions” 🤯🤯🔥 pic.twitter.com/Y7OuAweBNP— Speedy HQ (@IShowSpeedHQ) June 1, 2026చదవండి: వైభవ్ కోసం పడిగాపులు.. అస్సలు తగ్గేదేలే! -
టీమిండియాలోకి వికెట్ల వీరుడు!
ఐపీఎల్-2026 సీజన్ అనంతరం టీమిండియా తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమవుతోంది. జూన్ 6 నుంచి అఫ్గానిస్తాన్తో ప్రారంభం కానున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ ఇప్పటికే 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్గా శుబ్మన్ గిల్ వ్యవహరించనుండగా.. అతడి డిప్యూటీగా కేఎల్ రాహుల్ ఎంపికయ్యాడు.ఈ మ్యాచ్కు స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చిన సెలక్షన్ కమిటీ.. అతడి స్దానంలో గుర్నూర్ బ్రార్కు అవకాశమిచ్చింది. అయితే రంజీల్లో దుమ్ములేపుతున్న జమ్మూ కాశ్మీర్ స్పీడ్ స్టార్ అకిబ్ నబీని ఎంపిక చేయకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో సెలక్టర్లు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.అఫ్గానిస్తాన్తో టెస్ట్ కోసం ఆకిబ్ నబీని బ్యాకప్ ప్లేయర్గా ఎంపిక చేసినట్లు సమాచారం. అతడు గురువారం జట్టుతో కలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రాక్టీస్లో నెట్బౌలర్గా నబీ తన సేవలను అందించనున్నాడు. రాబోయో విదేశీ పర్యటనలను దృష్టిలో ఉంచుకుని, అతడి బౌలింగ్ నైపుణ్యాలను సెలెక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి పరిశీలించనున్నారు.కాగా నబీ రెడ్ బాల్తో ప్రస్తుతం అద్భుతాలు చేస్తున్నాడు. గత రెండు రంజీ సీజన్లలో కలిపి నబీ ఏకంగా 100కు పైగా వికెట్లు పడగొట్టాడు. రంజీ ట్రోఫీని జమ్మూ కాశ్మీర్ తొలిసారి సొంతం చేసుకోవడంలో నబీది కీలక పాత్ర. గత సీజన్లో నబీ 10 మ్యాచ్లు ఆడి 60 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 7 ఫైవ్ వికెట్ల హాల్స్ ఉన్నాయి.అఫ్గానిస్తాన్తో టెస్ట్కు భారత జట్టుశుభ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషభ్ పంత్, దేవ్దత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, మానవ్ సుతార్, ప్రసిద్ధ్ కృష్ణ, గూర్నూర్ బ్రార్, ధ్రువ్ జురెల్, హర్ష్ దూబె. -
ఒకే ఒక్క పరుగు.. వెస్టిండీస్కు షాకిచ్చిన ఐర్లాండ్
టీ20 ప్రపంచకప్-2016 ఛాంపియన్ వెస్టిండీస్కు ఐర్లాండ్ మహిళల జట్టు ఊహించని షాకిచ్చింది. ముక్కోణపు సిరీస్లో భాగంగా డబ్లిన్ వేదికగా జరిగిన విండీస్తో జరిగిన మ్యాచ్లో ఒక్క పరుగు (డక్ వర్త్ లూయిస్ పద్దతి) తేడాతో ఐర్లాండ్ విజయం సాధించింది. మహిళల టీ20ల్లో వెస్టిండీస్పై ఐర్లాండ్కు ఇదే తొలి విజయం కావడం విశేషం. ఈ విజయంతో ఐర్లాండ్ ఫైనల్కు చేరుకునే అవకాశాలను మెరుగుపరుచుకుంది. ఐర్లాండ్ కెప్టెన్ ఓర్లా ప్రెండర్గాస్ట్ బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ అద్భుత ప్రదర్శన తన జట్టును ఒంటి చేత్తో గెలిపించింది. ఈ ఉత్కంఠ భరిత పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. కెప్టెన్ హేలీ మాథ్యూస్(1), టేలర్(9),డాటిన్(16) వంటి సీనియర్ ప్లేయర్లు నిరాశపరినప్పటికి.. ఆఖరిలో గ్లాస్కో(36) కాస్త దూకుడుగా ఆడడంతో విండీస్ కాస్త గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. ఐర్లాండ్ బౌలర్లలో కానింగ్, ప్రెండర్గాస్ట్ తలా రెండు వికెట్లు సాధించారు. ఐర్లాండ్ స్కోర్ 14.1 ఓవర్లలో 95/5 వద్ద ఉండగా ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. అయితే ఆ సమయానికి డీఎల్ఎస్ పార్ స్కోరు ప్రకారం ఐర్లాండ్ 3 పరుగులు వెనుకబడి ఉంది. అంపైర్లు మ్యాచ్ను ఆపేసే ముందు కనీసం ఒక్క బంతి అయినా వేయాలని ఐర్లాండ్ బ్యాటర్లు పట్టుబట్టారు.జాజారా క్లాక్స్టన్ వేసిన బంతి లూయిస్ లిటిల్ బ్యాట్ ఎడ్జ్ తీసుకుని థర్డ్ మ్యాన్ దిశగా బౌండరీకి వెళ్లింది. వర్షం తీవ్రత పెరగడంతో మ్యాచ్ను నిలిపివేశారు. అప్పటికి డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం ఐర్లాండ్ 1 పరుగు ఆధిక్యంలో ఉండటంతో విజేతగా ప్రకటించారు. ఓర్లా ప్రెండర్గాస్ట్(46 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సర్తో 71) అజేయంగా నిలిచింది.చదవండి: 'వైభవ్ను ఇప్పుడే టీమిండియాకు సెలక్ట్ చేయొద్దు' -
వైభవ్ కోసం పడిగాపులు.. అస్సలు తగ్గేదేలే!
రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ భారత క్రికెట్లో వండర్కిడ్ అనడంలో సందేహం లేదు. 15 ఏళ్ల వయసులోనే బ్యాటింగ్లో విధ్వంసం సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీ ఇప్పటికిప్పుడు వేలంలోకి వస్తే 30 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు భారత మాజీ క్రికెటర్లు సెహ్వాగ్, ఆకాశ్ చోప్రా పేర్కొన్నారు. అందుకు తగ్గట్లే వైభవ్ ఈ సీజన్లో 16 మ్యాచ్ల్లో 237 స్ట్రైక్రేట్తో 776 పరుగులు సాధించాడు. ఆరెంజ్ క్యాప్ సహా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా ఎంపికైన వైభవ్ రూ.55 లక్షలు అందుకున్నాడు. దీంతో వైభవ్ ఆట మారడంతోనే అతడి బ్రాండ్వాల్యూ కూడా అంతే స్థాయిలో పెరిగిపోయినట్లుగా తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్కు ముందు తాను సంతకాలు చేసిన ఎండార్స్మెంట్లకు సంబంధించిన ఫీజులన్నింటిని డబుల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వైభవ్ ఇప్పటికే కాంప్లాన్, రెడ్బుల్ వంటి బ్రాండ్లకు అంబాసిడర్గా వ్యవహరిస్తున్న వైభవ్.. ఇటీవలే ఐపీఎల్లో విధ్వంసకర ప్రదర్శనతో అతడితో ఒప్పందం కుదుర్చుకోవడానికి అనేక కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వైభవ్ సూర్యవంశీ తన ఎండార్స్మెంట్ ఫీజులను రెట్టింపు చేసినట్లు ఒక కంపెనీకి చెందిన అడ్వర్టైజింగ్ అధికారి పేర్కొన్నారు. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు వైభవ్ ఒక్కో ఒప్పందానికి సుమారు రూ.కోటి చొప్పున సంతకాలు చేశాడు. సీజన్ ముగిసిన తర్వాత మాత్రం అతడు ఒక్కో ఒప్పందానికి రూ. 1.5 కోట్ల నుంచి 2 కోట్ల వరకు ఫీజు వసూలు చేస్తున్నట్లు సదరు అధికారి పేర్కొన్నాడు. ఆట మారడంతోనే బ్రాండ్ కూడా మారిపోయిన వైభవ్ సూర్యవంశీ కెరీర్ ఉన్నత దశలో ఉంది. ఐపీఎల్ ప్రదర్శనను పరిగణలోకి తీసుకొని కెరీర్ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటే మాత్రం వైభవ్ సమీప భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకోవడం ఖాయం. క్రికెట్లో ఇప్పటికే వైభవ్ను దిగ్గజాలు సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్తో పాటు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ వంటి క్రికెటర్లతో పోలుస్తున్నారు. ఇలాంటి బ్రాండ్ వాల్యూలకు ఆకర్షితుడవ్వకుండా కెరీర్ కోసం కష్టపడితే మాత్రం వైభవ్కు ఇంతమించి ఎండార్స్మెంట్లు వస్తాయనడంలో సందేహాం లేదు.చదవండి: కింగ్ పదానికి కోహ్లీ అర్హుడు కాదు.. పాక్ కపట బుద్ధి! -
IPL 2026: అత్యుత్తమ జట్టు.. ఓపెనర్లుగా ఎవరంటే?
భారత మెగా క్రికెట్ సంబరం ఐపీఎల్-2026 ఆదివారంతో ముగిసింది. అహ్మదాబాద్ వేదికగా ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ను ఓడించి.. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) రెండోసారి ట్రోఫీ సొంతం చేసుకుంది.ఇక రెండు నెలలకు పైగా వినోదం పంచిన క్యాష్ రిచ్ లీగ్లో రాజస్తాన్ రాయల్స్ వైభవ్ సూర్యవంశీ ఈసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. మరోవైపు ఆర్సీబీ దిగ్గజం విరాట్ కోహ్లి ఫైనల్లో 75 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టును గెలిపించి.. వింటేజ్ కింగ్ను గుర్తుచేశాడు.అయితే, సీజన్ ఆసాంతం అదరగొట్టిన గుజరాత్ ఓపెనింగ్ జోడీ సాయి సుదర్శన్- శుబ్మన్ గిల్ టైటిల్ పోరులో మాత్రం నిరాశపరిచారు. సాయి 12, గిల్ 10 పరుగులకే నిష్క్రమించడంతో గుజరాత్ ఓటమికి అక్కడే పునాది పడింది.అత్యుత్తమ జట్టుఈ పరిణామాల నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. ఈ సీజన్కు గానూ తన అత్యుత్తమ జట్టును ప్రకటించాడు. ఇందులో పన్నెండు మందికి చోటిచ్చాడు. ఈ మేరకు..ఓపెనర్లుగా ఎవరంటే?‘‘వైభవ్ సూర్యవంశీ.. మరో మాటకు తావు లేకుండా నా జట్టులో అతడు ఉంటాడు. పదిహేనేళ్ల వయసులోనే అతడు ఆరెంజ్ క్యాప్ గెలిచాడు. అతడితో పాటు దిగ్గజ విరాట్ కోహ్లి నా జట్టు ఓపెనర్గా ఉంటాడు.మూడో స్థానంలో సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఇషాన్ కిషన్ను ఆడిస్తాను. అతడే నా వికెట్ కీపర్.. అదే విధంగా వైస్ కెప్టెన్ కూడానూ!.. నాలుగో స్థానానికి ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ను ఎంచుకుంటాను. అతడే నా జట్టు సారథి.అతడు లేకుంటే ఎలా?ఐదో స్థానంలో హైదరాబాద్ పవర్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ ఉంటాడు. అతడు లేకుండా అసలు ఈ జట్టు కూర్పు సాధ్యమే కాదు. పందొమిదేళ్ల ఐపీఎల్ చరిత్రలో ఆరెంజ్ క్యాప్ కోసం పోటీపడ్డ ఏకైక మిడిలార్డర్ బ్యాటర్ అతడు.అతడికి తోడుగా హైదరాబాద్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి కూడా నా జట్టులో ఉంటాడు. హార్దిక్ పాండ్యా ఈసారి దారుణం గా విఫలం కాగా.. అదే సమయంలో నితీశ్ రెడ్డి అదరగొట్టాడు. ఏడో స్థానంలో కృనాల్ పాండ్యా సరైనోడు.ఎనిమిదో స్థానానికి సునిల్ నరైన్ లేదంటే రషీద్ ఖాన్ను ఎంచుకుంటాను. నాకు ఒక్క స్పిన్నర్ అవసరం మాత్రమే ఉంది. కాబట్టి సునిల్తో వెళ్తాను. ఇక తొమ్మిదో స్థానంలో భువనేశ్వర్ కుమార్ ఉంటాడనడంలో సందేహం లేదు.బౌలింగ్ దళం ఇదేఈ సీజన్లోనూ అత్యుత్తమంగా బౌలింగ్ చేశాడు. కగిసో రబడ, జోఫ్రా ఆర్చర్లకు కూడా నా జట్టులో చోటు ఉంటుంది. ఇక పన్నెండో స్థానం కోసం అన్షుల్ కాంబోజ్, సకీబ్ హుసేన్, రసిఖ్ సలామ్ దర్ పేర్లను పరిశీలించాను.సకీబ్ అత్యద్భుతంగా బౌలింగ్ చేశాడు. రసిఖ్ కూడా తక్కువేమీ కాదు. అన్క్యాప్డ్ కేటగిరీలో అతడే అత్యధిక వికెట్ల వీరుడు. కాబట్టి రసిఖ్కే నా ఓటు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. అయితే, అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఉన్న రెండు, మూడు స్థానాల్లో ఉన్న గిల్ (732 రన్స్), సాయి (722)లకు మాత్రం ఆకాశ్ చోప్రా తన జట్టులో చోటు ఇవ్వలేదు.ఐపీఎల్-2026 సీజన్కు గానూ ఆకాశ్ చోప్రా ప్రకటించిన అత్యుత్తమ జట్టు (12 member).వైభవ్ సూర్యవంశీ (776 రన్స్), విరాట్ కోహ్లి (675 రన్స్), ఇషాన్ కిషన్ (602 రన్స్), రజత్ పాటిదార్ (కెప్టెన్- 501 రన్స్), హెన్రిచ్ క్లాసెన్ (624 రన్స్), నితీశ్ కుమార్ రెడ్డి (302 రన్స్, 8 వికెట్లు ), కృనాల్ పాండ్యా (226 రన్స్, 14 వికెట్లు), సునిల్ నరైన్ (15 వికెట్లు), భువనేశ్వర్ కుమార్ (28 వికెట్లు), కగిసో రబడ (29 వికెట్లు), జోఫ్రా ఆర్చర్ (25 వికెట్లు), రసిఖ్ సలామ్ దర్ (19 వికెట్లు).చదవండి: నేనేమీ లక్కీ చార్మ్ కాదు.. కానీ నేనొచ్చాకే ఆర్సీబీకి ట్రోఫీలు! -
కింగ్ పదానికి కోహ్లీ అర్హుడు కాదు.. పాక్ కపట బుద్ధి!
ఈ తరం క్రికెటర్లలో ఆల్ టైమ్ గ్రేటెస్ట్ జాబితాలో ఆటగాళ్ల పేర్లను వెలికితీస్తే అందులో టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ కచ్చితంగా ఉంటాడు. భారత క్రికెట్లో సచిన్ టెండూల్కర్ తర్వాత మూడు ఫార్మాట్లు (టెస్టు, వన్డే, టీ20) కలిపి అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్గా కోహ్లీ చరిత్రకెక్కాడు. కోహ్లీ మూడు ఫార్మాట్లు కలిపి 559 మ్యాచ్ల్లో 28,215 పరుగులు సాధించాడు. ఇందులో 85 సెంచరీలు, 146 హాఫ్ సెంచరీలున్నాయి. అలాంటి కోహ్లీతో కొన్నాళ్ల క్రితం వరకు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం పరుగుల పరంగా పోటీ పడ్డ మాట నిజమే. ఒక దశలో కోహ్లీ రికార్డులను కూడా బాబర్ బద్దలుకొట్టాడు. అయితే క్రమేపి బాబర్ ఆజం ఆటలో పదును తగ్గుతూ రావడం.. అదే సమయంలో కోహ్లీ వయసు పెరుగుతున్న కొద్ది బ్యాటింగ్లో జోరు కనబరచడం జరిగిపోయింది. దీంతో బాబర్ ఆజం కోహ్లీకి ఆమడ దూరంలోనే నిలిచిపోయాడు. ఇప్పటివరకు బాబర్ ఆజం మూడు ఫార్మాట్లు కలిపి 15,647 పరుగులు సాధించాడు. ఇందులో 32 శతకాలు, 108 అర్థసెంచరీలున్నాయి. అయితే బాబర్ ఆజం టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. కానీ మూడు ఫార్మాట్లు కలిపి చూస్తే మాత్రం కోహ్లీ చేసిన పరుగుల్లో బాబర్ సగం కూడా చేయలేకపోయాడు. ఈ నేపథ్యంలో పాక్ మాజీ పేసర్ తన్వీర్ అహ్మద్ కోహ్లీ కంటే బాబర్ ఆజం గొప్పోడంటూ ప్రశంసలు కురిపించడం ఆసక్తి రేపింది. 'విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2026 సీజన్లో 675 పరుగులు సాదించాడు. కానీ అదే సమయంలో బాబర్ ఆజం పీఎస్ఎల్లో కోహ్లీ కంటే నాలుగు తక్కువ ఇన్నింగ్స్లు ఆడినప్పటికీ 588 పరుగులు సాధించాడు. మూడు ఫార్మాట్లు కలిపి చూస్తే కోహ్లీవి ఎక్కువ పరుగులు ఉండొచ్చు.. కానీ టీ20 క్రికెట్లో బాబర్ను మించిన బ్యాటర్ లేడు. పరుగులు సాధించడమే కాదు సెంచరీల విషయంలోనూ కోహ్లీపై బాబర్ ఆజందే పైచేయి. అదీగాక కోహ్లీ టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్నాడు. కానీ బాబర్ ఇప్పటికీ మూడు ఫార్మాట్లు నిలకడగా ఆడుతున్నాడు. రాబోయే కాలంలో బాబర్ ఆజం టీ20 క్రికెట్లో ఉన్న రికార్డులన్నింటిని తన పేరిట లిఖించుకోనున్నాడు.' అని చెప్పుకొచ్చాడు. అంతటితో ఊరుకోకుండా తన్వీర్ అహ్మద్ తన ఎక్స్ ఖాతాలో కింగ్ అనే పదానికి బాబర్ ఆజం సరైన నిర్వచనమని, కోహ్లీ దీనికి ఎంతమాత్రం సరిపోడంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేయడం కనిపించింది. 'గత పదేళ్లలో అన్ని ఫార్మాట్లలోనూ కోహ్లీతో పోటీ పడి పరుగులు సాధించిన బాబర్ ఆజం నా దృష్టిలో గొప్ప క్రికెటర్. నేను అతడిని కింగ్ అని పిలుచుకుంటా' అని పేర్కొన్నాడు. తన్వీర్ అహ్మద్ వ్యాఖ్యలపై టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'పరుగుల యంత్రంగా పేరున్న కోహ్లీని అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోము.'..'టీమిండియా బ్యాటర్లు బాగా ఆడుతుంటే ఓర్వలేనితనం ఎలా ఉంటుందో పాక్ నిరూపించింది' టీమిండియా అంటే పాక్కు ఎప్పుడు కుళ్లే ఉంటుంది’ అని కామెంట్లు చేస్తున్నారు.కోహ్లీతో సరితూగలేడు.. నిజానికి బాబర్ కంటే ఏడేళ్ల ముందే కోహ్లీ (2008లో) అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. బాబర్ అడుగుపెట్టే సమయానికే కోహ్లీ స్టార్ క్రికెటర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కోహ్లీ బ్యాటింగ్తో ఏమాత్రం సరితూగని బాబర్ ఆజంకు కలిసొచ్చే అంశం ఏదైనా ఉందంటే.. వయసు దృష్ట్యా అతడు మరో ఐదారేళ్లు క్రికెట్ ఆడే అవకాశముంది. అసలు కోహ్లీతో బాబర్ ఆజంను పోల్చలేము. ఐసీసీ మేజర్ టైటిల్స్ సాధించకపోయినప్పటికీ, కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ను, ఆ తర్వాత ఇంగ్లండ్, సౌతాఫ్రికా దేశాల్లో నిలకడ విజయాలు అందుకుంది. మరోవైపు బాబర్ ఆజం కేవలం టీ20 ప్రపంచకప్పుల్లో మాత్రమే టీమిండియాను ఓడించాడు. అందులో కోహ్లీ కెప్టెన్సీలోని టీమిండియా టీ20 ప్రపంచకప్లో 10 వికెట్ల తేడాతో పాక్ చేతిలో ఓడిపోవడమే బాబర్ ఆజంకు ఉన్న ఏకైక విజయం. అది మినహాయిస్తే కోహ్లీని ఏ విషయంలోనూ బాబర్ ఆజం మ్యాచ్ చేయలేడన్న సంగతి అందరికి తెలిసిందే.చదవండి: కోహ్లీకి ఏడుపొక్కటే తక్కువ.. ఆ కవర్లో ఏముంది? -
'వైభవ్ను ఇప్పుడే టీమిండియాకు సెలక్ట్ చేయొద్దు'
స్వదేశంలో అఫ్గానిస్తాన్తో టెస్ట్, వన్డే సిరీస్లు ముగిసిన అనంతరం టీమిండియా ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇందులో భాగంగా భారత్ ఆతిథ్య జట్టుతో రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. అయితే ఈ టూర్కు రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎంపికవుతాడా లేదా అనే చర్చ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో జోరందుకుంది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ వైభవ్ సెలక్షన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. వైభవ్ను ఇప్పుడే విదేశీ గడ్డపై జరిగే సిరీస్లకు ఎంపిక చేయడం సరికాదని మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు.తొలుత ఐపీఎల్ తరహా పిచ్ల(ఉప ఖండ పరిస్థితులు)పై జరిగే అంతర్జాతీయ క్రికెట్ సిరీస్లలో వైభవ్ను ఆడించాలని అతడు సూచించాడు."ప్రస్తుత భారత టీ20 జట్టులో సంజూ శాంసన్, అభిషేక్ శర్మలు ఓపెనర్లుగా తమ స్ధానాలను సుస్ధిరం చేసుకున్నారు.. కచ్చితంగా వీరి తర్వాత స్ధానం వైభవ్ సూర్యవంశీదే. అయితే అతడిని భారత జట్టు ఎంపిక చేయాలనుకుంటే.. మొదట ఐపీఎల్ తరహా బ్యాటింగ్ అనుకూల పరిస్థితులన్న పిచ్లపై మాత్రమే ఆడించాలి. ఐపీఎల్ లాంటి పిచ్లపై జరిగే మ్యాచ్లలోనే అతడు అరంగేట్రం చేయాలి. అతడిని నేరుగా సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఐర్లాండ్ వంటి విదేశీ కండీషన్స్లో ఆడించడం సరైన నిర్ణయం కాకపోవచ్చు.ఐర్లాండ్లో ఉండే పచ్చని పిచ్లు, ఇంగ్లండ్ తరహా వాతావరణంలో బంతి బాగా స్వింగ్ అవుతుంది. కెరీర్ ఆరంభంలోనే 15 ఏళ్ల కుర్రాడిని అలాంటి కఠినమైన పరిస్థితుల్లోకి నెట్టడం సరికాదు. ఇక ఓపెనింగ్ స్ధానం కోసం వైభవ్తో పాటు గిల్ కూడా పోటీలో ఉన్నాడు. కానీ ఈ రేసులో గిల్ ముందంజలో ఉన్నాడా లేక వైభవ్ సూర్యవంశీనా చెప్పడం చాలా కష్టం. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో వేచి చూడాలివైభవ్ భవిష్యత్తు గురుంచి..టీ20ల్లో దుమ్ములేపుతున్న వైభవ్.. 'రెడ్-బాల్' క్రికెట్లో (టెస్టులు) ఎలా రాణిస్తాడో అని చాలామంది చర్చించుకుంటున్నారు. అయితే అతడి భవిష్యత్తు నిర్ణయించేది మనం కాదు. అది బీసీసీఐ బాధ్యత కూడా కాదు. అతడు ఒక స్వతంత్ర వ్యక్తి. అతడు తన కోచ్ల మార్గదర్శకత్వంలో ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. అతడు కేవలం టీ20ల్లో మాత్రమే పరిమితమై, ఒక స్టార్గా మిగిలిపోవాలంటే తన ఇష్టమది. వైభవ్ 50 ఓవర్ల క్రికెట్ కూడా సరిపోతాడు. రోహిత్ శర్మ వన్డే ప్రపంచకప్-2023లో మొదటి 10 ఓవర్లలోనే ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగి, మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసేవాడు. వైభవ్ కూడా రోహిత్ మాదిరే దూకుడుగా ఆడి జట్టుకు శుభారంభం అందించగలడు. అవసరమైతే రోహిత్ కంటే వేగంగా ఆడగలడని అని స్పోర్ట్స్ స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజ్రేకర్ పేర్కొన్నాడు.చదవండి: మా ఇంట్లోనే ఉంటూ.. మా బిడ్డ ప్రాణం తీశాడు! -
మా ఇంట్లోనే ఉంటూ.. మా బిడ్డ ప్రాణం తీశాడు!
శనివారం ఉదయం (మే 29).. త్యాగి కుటుంబమంతా చిరాగ్ కోసం ఎదురుచూస్తోంది. జపాన్ నుంచి తిరిగి వస్తున్న అతడికి ఘన స్వాగతం పలికేందుకు ఇంటిని అందంగా అలంకరించారు. పారా ఆసియా క్రీడలకు అర్హత సాధించిన అతడికి అభినందనలు తెలపాలని ఊరంతా ఎదురుచూస్తోంది.కానీ చిరాగ్ మాత్రం ఇంటికి రానేలేదు. బదులుగా ఘజియాబాద్ పోలీసుల నుంచి అతడి కుటుంబానికి ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే ఎంఎంజీ ఆస్పత్రికి రావాలని.. చిరాగ్ గాయపడ్డాడని వారికి చెప్పారు. కానీ అక్కడికి వెళ్లే సరికి అంతా అయిపోయింది.భారత పారా అథ్లెట్ 24 ఏళ్ల చిరాగ్ త్యాగి శాశ్వతంగా ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయాడు. పారా ఒలింపిక్స్లో పాల్గొనాలన్న కల నెరవేరకుండానే అతడు కన్నుమూశాడు. ఇందుకు అతడి స్నేహితుడు, తోటి పారా అథ్లెట్ యశ్ ఖటిక్ కారణమని త్యాగి కుటుంబం ఆరోపించింది.వాళ్లే కారణంఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన ఉత్తరప్రదేశ్ పోలీసులు సోమవారం నాటి ప్రెస్ మీట్లో కీలక విషయాలు వెల్లడించారు. ‘‘విచారణలో భాగంగా చిరాగ్ త్యాగి మరణానికి యశ్ ఖటిక్తో పాటు గగన్ త్యాగి కూడా కారణమని తేలింది. వీరితో పాటు అభయ్ అలియాస్ అభినవ్కు కూడా ఇందులో హస్తం ఉంది’’ అని పోలీసులు తెలిపారు.విచారణలో భాగంగా నిందితుడు యశ్ ఖటిక్ తమకు చెప్పిన విషయాలను కూడా పోలీసులు ఈ సందర్భంగా మీడియాకు తెలియజేశారు. ‘‘నేనూ.. చిరాగ్ ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 400 మీటర్ల రేసు కోసం ప్రాక్టీస్ చేసేవాళ్లము. చిరాగ్ మాత్రమే ఆసియా క్రీడలకు ఎంపికయ్యాడు.నాలో అభద్రతా భావం నిజానికి చిరాగ్ మాదిరే నాకూ కంటి సమస్య ఉంది. అయితే, నా మెడికల్ రిపోర్టును జర్మనీకి పంపించాల్సి ఉంది. కానీ చిరాగ్ దానిని నాశనం చేశాడు. దీంతో నేను ఆసియా క్రీడలకు సెలక్ట్ కాలేకపోయాను.అంతేకాదు.. పరుగు పందెంలో ఎప్పుడూ చిరాగే గెలిచేవాడు. అతడు వరుసగా రెండు పతకాలు కూడా సాధించాడు. అతడి ఎదుగుదల నాలో అభద్రతా భావాన్ని పెంచింది. అతడి వల్ల నా కెరీర్ ప్రమాదంలో పడుతుందనే భయం వెంటాడింది.అందుకే నా అసోసియేట్ గగన్ త్యాగితో కలిసి చిరాగ్ హత్యకు పథకం రచించాను. మాకు భికన్పూర్కు చెందిన అభయ్ పిస్టల్ తెచ్చి ఇచ్చాడు. మే 29న బెంగళూరు నుంచి చిరాగ్ తిరిగి వచ్చాడు. మే 30న ఘజియాబాద్కు టాక్సీలో పయనమయ్యాడు.అక్కడిక్కడే కుప్పకూలిపోయాడుఅప్పుడే మా ప్లాన్ ప్రకారం.. సాయి ఉప్వన్ దగ్గర చిరాగ్ త్యాగిని నేను తుపాకీతో చాలా దగ్గరి నుంచి కాల్చాను. అది అతడి తలకు తగిలింది. ఆ తర్వాత వెన్నులోనూ కాల్చాను. అతడు అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు.మేము చిరాగ్ ఫోన్ తీసుకుని అక్కడి నుంచి పారిపోయాము. అతడి సిమ్ కార్డు తీసి మురికికాలువలో పడేశాము. అతడి బ్యాంకు అకౌంట్ నుంచి 62 వేల రూపాయలు డ్రా చేసి.. మాకు పిస్టల్ అమ్మిన వ్యక్తికి ఇచ్చేశాము’’ అని నిందితుడు యశ్ ఖటిక్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు.కాగా చిరాగ్, యశ్ ‘బ్లైండ్’ కేటగిరీలో పోటీల్లో పాల్గొంటున్నారని.. అయితే, చిరాగ్ పట్ల అసూయతోనే యశ్ ఈ పని చేసినట్లు వెల్లడించాడని పోలీసుల విచారణలో తేలింది. కాగా చిరాగ్ అంకుల్ ప్రవీణ్ రాజ్ త్యాగి ఈ ఘటన గురించి మాట్లాడుతూ..‘‘చిన్నప్పటి నుంచి ఒలింపిక్స్ లక్ష్యంగా చిరాగ్ ముందుకు సాగాడు. జూడోలో కూడా అతడికి ప్రవేశం ఉంది. అయితే, స్ప్రింటర్గా రాణించడంపైనే దృష్టి పెట్టాడు.మా ఇంట్లోనే ఉంటూ.. మా బిడ్డ ప్రాణం తీశాడు!ఈ క్రమంలో ఎన్నో త్యాగాలు చేశాడు. అయితే, రోజురోజుకీ అతడి కంటిచూపు మందగించింది. ఎన్ని ఆస్పత్రులకు తిప్పినా ఫలితం లేకుండా పోయింది. అప్పుడే పారా క్రీడల రూపంలో మాకు మరో మార్గం దొరికింది. అక్కడైనా తనను తాను నిరూపించుకోవాలని చిరాగ్ పట్టుదలగా పనిచేశాడు.అసలు యశ్ ఈ పని చేశాడంటే మేము నమ్మలేకపోతున్నాము. చిరాగ్కు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి రూ. 20 వేలు వస్తే అందులో 10 వేలు యశ్కే ఇచ్చేవాడు. అతడికి శిక్షణ కూడా ఇచ్చేవాడు. యశ్ను మేమెంతగానో నమ్మాము. మా కొడుకులాగే చూసుకున్నాము. మాతో పాటు మా ఇంట్లోనే ఉండేవాడు. అలాంటిది ఇప్పుడు అసూయతో మా బిడ్డనే చంపేశాడు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. -
గెలిచి నిలిచిన యువ భారత్
కాకమిగహారా (జపాన్): సెమీఫైనల్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో భారత పురుషుల యువ హాకీ జట్టు సత్తా చాటింది. ఆసియా కప్ అండర్–18 టోర్నమెంట్లో భాగంగా భారత జట్టు రెండో విజయం నమోదు చేసింది.దక్షిణ కొరియా జట్టుతో సోమవారం జరిగిన పూల్ ‘ఎ’ మ్యాచ్లో కేతన్ కుశ్వహా సారథ్యంలోని భారత బృందం 4–1 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున వరీందర్ సింగ్ (5వ నిమిషంలో), షారుఖ్ అలీ (54వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా... కెపె్టన్ కేతన్ (3వ, 36వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించాడు. కొరియా జట్టుకు యున్ జేహైక్ (21వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. భారత జట్టుకు ఐదు పెనాల్టీ కార్నర్లు లభించింది.ఇందులో రెండింటిని భారత్ సది్వనియోగం చేసుకొని, మూడింటిని వృథా చేసుకుంది. కొరియా జట్టు తమకు లభించిన రెండు పెనాల్టీ కార్నర్లలో ఒక దానిని గోల్గా మలిచి, మరో దానిని వృథా చేసింది.ఐదు జట్లున్న పూల్ ‘ఎ’లో భారత్ మూడు మ్యాచ్లు పూర్తి చేసుకుంది. రెండు మ్యాచ్ల్లో గెలిచి, ఒక మ్యాచ్లో ఓడి ఆరు పాయింట్లతో కొరియా, జపాన్ జట్లతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉంది. రేపు జరిగే చివరి లీగ్ మ్యాచ్లో చైనీస్ తైపీతో భారత్ తలపడుతుంది. లీగ్ మ్యాచ్లు ముగిశాక పూల్ ‘ఎ’... పూల్ ‘బి’లలో టాప్–2లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. -
నేనేమీ లక్కీ చార్మ్ కాదు.. కానీ నేనొచ్చాకే ఆర్సీబీకి ట్రోఫీలు!
పద్దెమినిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. గతేడాది తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ). డిఫెండింగ్ చాంపియన్గా భారీ అంచనాలతో ఐపీఎల్-2026లో బరిలోకి దిగి.. మరోసారి టైటిల్ సాధించి సత్తా చాటింది.అహ్మదాబాద్లో ఆదివారం జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి ఆర్సీబీ జయకేతనం ఎగురవేసింది. తద్వారా రజత్ పాటిదార్ సారథ్యంలో వరుసగా రెండోసారి టైటిల్ గెలిచి.. అభిమానులను సగర్వంగా తలెత్తుకునేలా చేసింది.ఈ నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పూసర్ల వెంకట సింధు (PV Sindhu) ఆర్సీబీకి శుభాకాంక్షలు చెప్పిన తీరు వైరల్గా మారింది. తాను బెంగళూరుకు మకాం మార్చిన తర్వాత.. అకస్మాత్తుగా ఆర్సీబీ ట్రోఫీల మీద ట్రోఫీలు గెలుస్తోందని సరదాగా ఆమె కామెంట్ చేశారు.నేనొచ్చాకే ఆర్సీబీకి ట్రోఫీలు!‘‘ఆర్సీబీ అభిమానులారా!... నేనేమీ మీ లక్కీ చార్మ్ అని చెప్పడం లేదు. కానీ.. మీరొకటి గమనించారా.. నేను బెంగళూరుకు మకాం మార్చినప్పటి నుంచి అకస్మాత్తుగా మీరు వరుసగా ట్రోఫీలు సాధిస్తున్నారు. అవునో.. కాదో మీరే లెక్కలు కట్టేయండి.ఏదేమైనా ఆర్సీబీ ఒక అసామాన్యమైన జట్టు. ఆటగాళ్లు, సహాయ సిబ్బంది.. అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా జట్టును తమ సొంతంగా భావించే అభిమానులకు కంగ్రాట్స్. ఈ ఫ్రాంఛైజీ భావోద్వేగాలకు నిలయం.అత్యంత ప్రత్యేకంఆర్సీబీ అంటే ఫ్యాన్స్కు ఒక రకంగా పిచ్చి. ఎన్నో ఏళ్లుగా ట్రోఫీ గెలుస్తామనే నమ్మకంతో వారు జట్టుకు అండగా నిలిచారు. ఇప్పుడిలా వరుసగా రెండుసార్లు చాంపియన్గా నిలవడం నిజంగా అత్యంత ప్రత్యేకం’’ అని పీవీ సింధు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆర్సీబీకి శుభాకాంక్షలు తెలిపారు.అయితే, ఫైనల్లో చాలా మంది మాదిరే తానూ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ పోరును చూడాలనుకున్నానన్న సింధు.. బెంగళూరు ఈ విజయానికి వందశాతం అర్హమైందని పేర్కొన్నారు. కాగా ఐపీఎల్లో వరుసగా రెండుసార్లు టైటిల్ సాధించిన కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోని (చెన్నై సూపర్ కింగ్స్), రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్) సరసన రజత్ పాటిదార్ నిలిచాడు. ఈ నేపథ్యంలో అతడిపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.చదవండి: అతడేమీ రోబో కాదు.. బీసీసీఐ తప్పు చేస్తోందా? -
క్రికెట్లో సరికొత్త రూల్స్.. కీలక నిర్ణయాలు తీసుకున్న ఐసీసీ
అంతర్జాతీయ క్రికెట్లో పలు మార్పులకు ఐసీసీ శ్రీకారం చుట్టింది. ఇకపై వెలుతురు లేమి కారణంగా టెస్ట్ మ్యాచ్లు నిలిచిపోకుండా ఉండేందుకు రెడ్ బాల్ స్ధానంలో పింక్ బాల్ను వినియోగించుకునేందుకు ఐసీసీ ఆమోదం తెలిపింది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందే రెండు జట్ల కెప్టెన్లు ఇందుకు అంగీకరించాలి. అప్పుడే వెలుతురు తగ్గినప్పుడు పింక్ బాల్ను ఉపయోగించవచ్చు. ఫ్లడ్లైట్ల వెలుతురులో పింక్ బాల్ క్లియర్గా కన్పిస్తోంది. దీంతో టెస్ట్ మ్యాచ్లలో బ్యాడ్లైట్ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికనట్లే. ప్రస్తుతం పింక్బాల్ను కేవలం డే అండ్ నైట్ టెస్టుల్లో మాత్రమే వాడుతున్నారు. అహ్మదాబాద్లో రెండు రోజుల పాటు జైషా అధ్యక్షతన జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే వెలుతురును మరింత కచ్చితంగా అంచనా వేయడానికి ఐసీసీ, ఎంసీసీ (మెరిల్బోన్ క్రికెట్ క్లబ్) సంయుక్తంగా సరికొత్త లైటింగ్ టెక్నాలజీపై పరిశోధనలు చేయనున్నాయి. ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్టుల కోసం ఎంసీసీ (MCC)తో కలిసి ఐసీసీ నిధులు సమకూర్చనుంది.బౌలింగ్ యాక్షన్ను పసిగట్టేందుకు 'హాక్-ఐ' (Hawk-Eye)👉ఇకపై బౌలర్ల అనుమానాస్పద బౌలింగ్ శైలిని (చకింగ్) అంచనా వేసేందుకు మ్యాచ్ అధికారులు ఇకపై'హాక్-ఐ' ట్రాకింగ్ డేటాను ఉపయోగించుకోవచ్చు.👉కోచ్లతో కమ్యూనికేషన్: ఫ్రాంచైజీ లీగ్ల తరహాలోనే.. ఇకపై అంతర్జాతీయ మ్యాచ్ల్లో కూడా అఫీషియల్ డ్రింక్స్ బ్రేక్ సమయంలో కోచింగ్ సిబ్బంది మైదానంలోకి వెళ్లి ఆటగాళ్లతో మాట్లాడవచ్చు, వ్యూహాలను పంచుకోవచ్చు.👉అంతర్జాతీయ టీ20ల్లో తప్పనిసరిగా 15 నిమిషాల బ్రేక్ను ప్రవేశపెట్టనున్నారు. అలాగే డ్రింక్స్ బ్రేక్ లేదా ఇంటర్వెల్ బ్రేక్ ముగిసిన వెంటనే బ్యాటర్లు ఆలస్యం చేయకుండా క్రీజులోకి రావాల్సి ఉంటుంది.👉ఇప్పటి వరకు ట్రయల్ రూపంలో ఉన్న 'లెగ్సైడ్ వైడ్స్' నిబంధనను ఐసీసీ శాశ్వతంగా అమలు చేయాలని ఐసీసీ నిర్ణయించింది.👉క్రికెట్ వరల్డ్ కప్ ఛాలెంజ్ లీగ్లో పాల్గొనే జట్లు.. ఆ టోర్నమెంట్ సైకిల్ జరుగుతున్న సమయంలోనే ఇతర లిస్ట్-ఎ మ్యాచ్లు కూడా ఆడుకోవడానికి అనుమతించారు. అసోసియేట్ దేశాలకు మరిన్ని మ్యాచ్లు ఆడే అవకాశం కల్పించాలనే డిమాండ్తో ఈ నిర్ణయం తీసుకున్నారు.👉ఈ కొత్త రూల్స్ అక్టోబర్ 1, 2026 నుండి అధికారికంగా అమలుల్లోకి రానున్నాయి.చదవండి: క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి.. బీసీసీఐ సంచలన నిర్ణయం! -
ఆసియా క్రీడలకు రెజ్లర్లు సుజీత్, అమన్ అర్హత
లక్నో: ఆసియా చాంపియన్ సుజీత్ కల్కాల్... పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అమన్ సెహ్రావత్ ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత రెజ్లింగ్ జట్టులో చోటు దక్కించుకున్నారు. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) నిర్వహించిన సెలెక్షన్ ట్రయల్స్లో వీరిద్దరూ తమ వెయిట్ కేటగిరీల్లో విజేతలుగా నిలిచారు.సుజీత్ ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో... అమన్ ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తారు. హరియాణాకు చెందిన 23 ఏళ్ల సుజీత్ నాలుగేళ్లు అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్నాడు. ఈ ఏడాది సుజీత్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. జాగ్రెబ్ (క్రొయేషియా), టిరానా (అల్బేనియా)లలో జరిగిన వరల్డ్ ర్యాంకింగ్ సిరీస్ టోర్నీల్లో... బిష్కెక్ (కిర్గిస్తాన్)లో జరిగిన ఆసియా చాంపియన్షిప్లో సుజీత్ స్వర్ణ పతకాలు సాధించాడు. గత ఏడాది ప్రపంచ అండర్–23 చాంపియన్షిప్లోనూ సుజీత్ పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు.మరోవైపు అమన్కు ఈ సీజన్లో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఆసియా చాంపియన్షిప్లో 61 కేజీల విభాగంలో పోటీపడ్డ అమన్ రజత పతకాన్ని దక్కించుకున్నాడు. జాగ్రెబ్ వరల్డ్ ర్యాంకింగ్ సిరీస్ టోరీ్నలోనూ రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. ఆసియా క్రీడలు ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్లోని ఐచి–నగోయా నగరాల్లో జరగనున్నాయి.ఆసియా క్రీడలకు భారత రెజ్లింగ్ జట్లు..ఫ్రీస్టయిల్ జట్టు: అమన్ సెహ్రావత్ (57 కేజీలు), సుజీత్ కల్కాల్ (65 కేజీలు), సాగర్ జగ్లాన్ (74 కేజీలు), ముకుల్ దహియా (86 కేజీలు), దీపక్ పూనియా (97 కేజీలు), రజత్ రాహుల్ (125 కేజీలు).గ్రీకో రోమన్ జట్టు: సుమిత్ దలాల్ (60 కేజీలు), దీపక్ (67 కేజీలు), అమన్ (77 కేజీలు), సునీల్ కుమార్ (87 కేజీలు), నితేశ్ కుమార్ (97 కేజీలు), దీపాన్షు (130 కేజీలు).మహిళల ఫ్రీస్టయిల్ జట్టు: దీపాన్షి (50 కేజీలు), అంతిమ్ పంఘాల్ (53 కేజీలు), మనీషా భన్వాలా (57 కేజీలు), నిషా దహియా (68 కేజీలు), మాన్సి అహ్లావత్ (62 కేజీలు), ప్రియా మలిక్ (72 కేజీలు). -
సుస్మిత దగ్గరే ఎక్కువ వజ్రాలు.. నా ఖర్చులు ఆమెనే భరించేది
ఐపీఎల్ ముగిసింది. ఈ లీగ్ వ్యవస్థాపకుడు, వ్యాపారవేత్త అయిన లలిత్ మోడీ మాత్రం ఇప్పుడు పలు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. సూర్యవంశీ గురించి మాట్లాడాడు. గతంలో ఇతడు బాలీవుడ్ నటి సుస్మితా సేన్తో డేటింగ్ చేస్తున్నట్లు ప్రకటించుకున్నాడు. అయితే డబ్బు కోసమే లలిత్కి ఈమె దగ్గరైందనే ఆరోపణలు వచ్చాయి. తాజాగా వాటిని ఖండించాడు. ఈ క్రమంలోనే సుస్మితా గురించి ఇతడు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా అనిపించాయి.(ఇదీ చదవండి: బరువు తగ్గాలా? అలా అస్సలు చేయొద్దు: రాశీఖన్నా)'సుస్మితా సేన్ కష్టపడి ఎదిగిన మహిళ. నాకు తెలిసిన చాలామంది కంటే ఆమె దగ్గరే ఎక్కువ వజ్రాలున్నాయి. వాటన్నింటినీ ఆమెనే స్వయంగా సంపాదించుకుంది. మేం కలిసున్న సమయంలో బయటకు వెళ్లినప్పుడు ఆమెనే ఖర్చులన్నీ చెల్లించేది. నేనే ఆమె డబ్బులపై ఆధారపడ్డాను. ఎవరి దగ్గర నుంచి ఏం ఆశించడానికి ఇష్టపడదు. ఆమె గురించి తెలియని వాళ్లు మాత్రమే అలాంటి ఆరోపణలు చేస్తారు' అని లలిత్ మోడీ క్లారిటీ ఇచ్చాడు.సుస్మితాతో బంధం గురించి మాట్లాడిన లలిత్ మోడీ.. 'సుస్మితా నాకు చాలా ప్రత్యేకమైన వ్యక్తి. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి ఆమె ఎంతో సాయపడింది. మాది చాలా ప్రత్యేకమైన బంధం' అని చెప్పుకొచ్చాడు. 2022లో సుస్మితాతో డేటింగ్లో ఉన్నట్లు తనకు తానుగా ప్రకటించుకున్న లలిత్ మోడీ.. తర్వాత బ్రేకప్ అయినట్లు కూడా చెప్పాడు. గతేడాది మరో మహిళతో డేటింగ్ చేస్తున్నట్లు లలిత్ పోస్ట్ పెట్టాడు. పన్ను ఎగవేత, మనీలాండరింగ్లో కేసులో దేశం వదలి పారిపోయిన ఇతడు 2010 నుంచి లండన్లో ఉంటున్నాడు. (ఇదీ చదవండి: తెలుగు యంగ్ హీరోయిన్ శివానీ నాగారంకి బంపరాఫర్) -
ఫైనల్కు విజయం దూరంలో...
మడ్గావ్: సొంతగడ్డపై జరుగుతున్న దక్షిణాసియా మహిళల ఫుట్బాల్ చాంపియన్షిప్లో భారత జట్టు వరుసగా రెండో విజయంతో అదరగొట్టింది. బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘బి’ రెండో మ్యాచ్లో భారత్ 3–0 గోల్స్తో ఘనవిజయం సాధించింది. తద్వారా గ్రూప్ ‘బి’లో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ గెలిచి టాపర్గా నిలిచి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.రేపు జరిగే సెమీఫైనల్లో భూటాన్ జట్టుతో భారత్ తలపడుతుంది. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా తరఫున ప్యారీ జక్సా (36వ నిమిషంలో), లిండా కోమ్ సెర్టో (78వ నిమిషంలో), మాళవిక (90+1వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. తొలి లీగ్ మ్యాచ్లో టీమిండియా 11–0 గోల్స్ తేడాతో మాల్దీవులు జట్టును చిత్తు చేసింది.తెలంగాణ క్రీడాకారిణి సౌమ్య గుగులోత్ ఈ టోర్నీలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. గ్రూప్ ‘ఎ’ నుంచి నేపాల్, భూటాన్ జట్లు... గ్రూప్ ‘బి’ నుంచి బంగ్లాదేశ్ కూడా సెమీఫైనల్కు అర్హత సాధించాయి. ఎనిమిదోసారి దక్షిణాసియా చాంపియన్షిప్లో ఆడుతున్న భారత జట్టు ఐదుసార్లు (2010, 2012, 2014, 2016, 2019) విజేతగా నిలిచింది. -
దివ్యాంశి ధమాకా
ప్రిస్టినా (కొసోవో): వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) ప్రిస్టినా ఫీడర్ లెవెల్ టోర్నమెంట్లో భారత టీనేజర్ దివ్యాంశి భౌమిక్ సంచలనం సృష్టించింది. మహిళల సింగిల్స్తోపాటు డబుల్స్ విభాగంలో టైటిల్స్ సొంతం చేసుకుంది.ఈ క్రమంలో డబ్ల్యూటీటీ ఫీడర్ లెవెల్ టోరీ్నలో భారత్ తరఫున మహిళల సింగిల్స్ టైటిల్ గెలిచిన అతిపిన్న వయసు్కరాలిగా 15 ఏళ్ల దివ్యాంశి రికార్డు నెలకొలి్పంది. ఓవరాల్గా మివా హరిమోటో (జపాన్) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్గా ఆమె గుర్తింపు పొందింది. సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 211వ ర్యాంకర్ దివ్యాంశి 8–11, 11–8, 11–5, 7–11, 11–7తో ప్రపంచ 38వ ర్యాంకర్ యె యి టియాన్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించింది.డబుల్స్ ఫైనల్లో దివ్యాంశి–సిండ్రెల్లా దాస్ (భారత్) ద్వయం 7–11, 14–12, 12–14, 11–8, 11–7తో సాచి అవోకి–కొకోనా మురమత్సు (జపాన్) జోడీపై గెలుపొందింది. సింగిల్స్ టైటిల్ నెగ్గినందుకు దివ్యాంశి ఖాతాలో 1,450 డాలర్ల (రూ. 1 లక్ష 37 వేలు) ప్రైజ్మనీ, 125 ర్యాంకింగ్ పాయింట్లు చేరాయి. డబుల్స్ టైటిల్ సాధించినందుకు దివ్యాంశి–సిండ్రెల్లాలకు 500 డాలర్లు (రూ. 47 వేలు), 125 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ఫొన్సెకా మరో సంచలనం!
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో బ్రెజిల్ టీనేజర్ జోవో ఫొన్సెకా సంచలన ప్రదర్శన కొనసాగుతోంది. మూడో రౌండ్లో సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ను బోల్తా కొట్టించిన 19 ఏళ్ల ఫొన్సెకా... ప్రిక్వార్టర్ ఫైనల్లో 15వ సీడ్, ఫ్రెంచ్ ఓపెన్లో రెండుసార్లు రన్నరప్గా నిలిచిన కాస్పర్ రూడ్ను ఓడించాడు. తద్వారా తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.3 గంటల 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ఫొన్సెకా 7–5, 7–6 (10/8), 5–7, 6–2తో రూడ్పై గెలిచాడు. 11వ సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిముఖం పట్టాడు. రుబ్లెవ్ 3–6, 6–7 (6/8), 6–4, 6–2, 3–6తో మెన్సిక్ (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓడిపోయాడు. పదో సీడ్ కొ»ొల్లి (ఇటలీ), నాలుగో సీడ్ ఫెలిక్స్ అగర్ (కెనడా), అన్సీడెడ్ బెరెటెని (ఇటలీ) కూడా క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్లో కొ»ొల్లి 6–2, 6–3, 6–7 (3/7), 7–6 (7/5)తో జచెరీ వజ్దా (అమెరికా)పై, ఫెలిక్స్ 6–3, 7–5, 6–1తో అలెజాంద్రో టబిలో (చిలీ)పై, బెరెటిని 6–3, 7–6 (7/2), 7–6 (8/6)తో యువాన్ మాన్యుయెల్ సెరున్డొలో (అర్జెంటీనా)పై గెలిచారు.మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్లో మాజా చావ్లిన్స్కా (పోలాండ్) 6–3, 6–2తో డయానా ప్యారీ (ఫ్రాన్స్)పై, డయానా ష్నయిడర్ (రష్యా) 6–3, 3–6, 6–0తో మాడిసన్ కీస్ (అమెరికా)పై, కలిన్స్కాయా (రష్యా) 6–4, 2–6, 7–6 (10/7)తో అనస్తాసియా పొటపోవా (ఆ్రస్టియా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల డబుల్స్ మూడో రౌండ్లో శ్రీరామ్ బాలాజీ (భారత్)–డెమోలైనర్ (బ్రెజిల్) ద్వయం 7–5, 6–4తో కెవిన్ క్రావిట్జ్–టిమ్ ప్యుట్జ్ (జర్మనీ) జంటపై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. -
క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి.. బీసీసీఐ సంచలన నిర్ణయం!
ప్రపంచ క్రికెట్లో మరో చారిత్రాత్మక ద్వైపాక్షిక సిరీస్ నిర్వహణకు రంగం సిద్దమవుతోంది. భారత్తో మూడు టీ20 మ్యాచ్ల సిరీస్కు ఆతిథ్యమిచ్చేందుకు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు పావులు కదపుతోంది. ఇదే విషయంపై ఏసీబీ ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే అఫ్గానిస్తాన్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, భద్రతా కారణాల వల్ల అక్కడ అంతర్జాతీయ మ్యాచ్లు ఆడేందుకు ఐసీసీ నుంచి అనుమతి లేదు. దీంతో భారత్తో సిరీస్ను న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నిర్వహించడానికి అఫ్గాన్ క్రికెట్ బోర్డు ప్రణాళికలు రచిస్తోంది. అఫ్గాన్-భారత్ మధ్య టీ20 సిరీస్ ఈ ఏడాది ఆఖరిలో జరిగే అవకాశముంది."బీసీసీఐ, ఏసీబీ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఐర్లాండ్, శ్రీలంక, జింబాబ్వే వంటి ఇతర బోర్డులను ఆర్థికంగా ఆదుకోవడానికి బీసీసీఐ భారత జట్టును అక్కడికి పంపించి మ్యాచ్లు ఆడిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అఫ్గానిస్తాన్కు కూడా భారత క్రికెట్ బోర్డు అండగా నిలవనుంది. ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య దైపాక్షిక టీ20 సిరీస్ నిర్వహణ విషయంలో చర్చలు జరుగుతున్నాయి. ఫార్మాలిటీస్ పూర్తి అయిన తర్వాత దీనిపై అధికారిక ప్రకటన వెలువడుతుంది. ఈ సిరీస్ కోసం అఫ్ఘనిస్తాన్ జట్టుకు ఢిల్లీని 'హోమ్ గ్రౌండ్' గా కేటాయించనున్నారు. ఇప్పటికే ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) తో బీసీసీఐ చర్చలు జరిపింది. ఇందుకోసం డీడీసీఏ 'ఢిల్లీ ప్రీమియర్ లీగ్ టీ20' షెడ్యూల్ను కూడా మార్చుకోవడానికి సిద్ధమైందని" బీసీసీఐ అధికారి ఒకరు టైమ్స్ ఇండియాతో పేర్కొన్నారు. కాగా అఫ్గానిస్తాన్ జట్టు భారత్ను తమ హోమ్ గ్రౌండ్గా వాడుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ పలు సిరీస్లు ఇండియా వేదికగా జరిగాయి.భారత్లో హోంగ్రౌండ్ అఫ్గానిస్తాన్ ఆడిన సిరీస్లు2017: ఐర్లాండ్తో సిరీస్ (గ్రేటర్ నోయిడా)2018: బంగ్లాదేశ్తో సిరీస్ (డెహ్రాడూన్)2024: న్యూజిలాండ్తో ఏకైక టెస్ట్ మ్యాచ్ (గ్రేటర్ నోయిడా)ఇక హష్మతుల్లా షాహిదీ నేతృత్వంలోని అఫ్గాన్ జట్టు ప్రస్తుతం భారత పర్యటనలో ఉంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య జట్టుతో ఏకైక టెస్ట్తో మూడు వన్డేల సిరీస్లో అఫ్గాన్ తలపడనుంది. జూన్ 6 నుంచి ముల్లాన్పూర్ వేదికగా టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. -
నలుగురూ ఓడిపోయారు..
ఓస్లో: నార్వే ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆరో రౌండ్ భారత గ్రాండ్మాస్టర్లకు కలిసి రాలేదు. పురుషుల విభాగంలో పోటీపడుతున్న క్లాసికల్ ఫార్మాట్ ప్రస్తుత ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్, ప్రజ్ఞానంద... మహిళల విభాగంలో బరిలో ఉన్న ప్రపంచకప్ విజేత దివ్య దేశ్ముఖ్, ప్రపంచ ఆరో ర్యాంకర్ కోనేరు హంపి పరాజయం చవిచూశారు.క్లాసికల్ ఫార్మాట్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ జు వెన్జున్ (చైనా)తో జరిగిన రెగ్యులర్ గేమ్లో దివ్య 69 ఎత్తుల్లో ఓటమి పాలైంది. బిబిసారా అసబయేవా (కజకిస్తాన్)తో జరిగిన రెగ్యులర్ గేమ్ను హంపి 15 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. దాంతో విజేతను నిర్ణయించేందుకు వీరిద్దరి మధ్య అర్మగెడాన్ గేమ్ను నిర్వహించారు. అర్మగెడాన్ గేమ్లో బిబిసారా 24 ఎత్తుల్లో హంపిని ఓడించింది. ఆరో రౌండ్ తర్వాత దివ్య 8.5 పాయింట్లతో రెండో స్థానంలో... హంపి 5.5 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నారు.పురుషుల విభాగంలో విన్సెంట్ కీమెర్ (జర్మనీ)తో జరిగిన రెగ్యులర్ గేమ్లో నల్ల పావులతో ఆడిన గుకేశ్ 52 ఎత్తుల్లో ఓటమి పాలయ్యాడు. వెస్లీ సో (అమెరికా)తో జరిగిన రెగ్యులర్ గేమ్లో ప్రజ్ఞానంద 63 ఎత్తుల్లో ఓడిపోయాడు. అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్)తో జరిగిన రెగ్యులర్ గేమ్లో నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ 55 ఎత్తుల్లో గెలుపొందాడు.ఈ టోర్నీ నిబంధనల ప్రకారం రెగ్యులర్ గేమ్లో గెలిస్తే 3 పాయింట్లు లభిస్తాయి. రెగ్యులర్ గేమ్ను ‘డ్రా’ చేసుకొని, అర్మగెడాన్ గేమ్లో విజయం సాధిస్తే 1.5 పాయింట్లు దక్కుతాయి. ఆరుగురు మేటి గ్రాండ్మాస్టర్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ ఫార్మాట్లో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. ఆరో రౌండ్ తర్వాత గుకేశ్ 6.5 పాయింట్లతో ఐదో స్థానంలో, ప్రజ్ఞానంద 6 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నారు. -
మరో టైటిల్ లక్ష్యంగా...
ఇండోనేసియా ఓపెన్లో భారత షట్లర్లు ఐదుసార్లు విజేతలుగా నిలిచారు. మహిళల సింగిల్స్లో సైనా నెహా్వల్ అత్యధికంగా మూడుసార్లు (2009, 2010, 2012) చాంపియన్గా నిలిచింది. పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ (2017లో), పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (2023లో) ఒక్కోసారి టైటిల్ సాధించారు.జకార్తా: రెండేళ్ల నిరీక్షణకు తెరదించుతూ... ఆదివారం ముగిసిన సింగపూర్ ఓపెన్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం పురుషుల డబుల్స్ విభాగంలో టైటిల్ సాధించింది. అదే జోరును జకార్తాలోనూ కొనసాగించాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో భారత జోడీ బరిలోకి దిగుతోంది.బుధవారం జరిగే తొలి రౌండ్లో కాంగ్ ఖాయ్ జింగ్–ఆరోన్ తాయ్ (మలేసియా)లతో సాత్విక్–చిరాగ్ తలపడతారు. మంగళవారం మొదలయ్యే ఈ మెగా టోర్నీలో తొలి రోజు మహిళల సింగిల్స్లో ప్రపంచ మాజీ చాంపియన్, భారత స్టార్ పీవీ సింధు... పురుషుల సింగిల్స్లో ప్రపంచ మాజీ నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్... పురుషుల డబుల్స్లో హరిహరన్–అర్జున్ ద్వయం... మిక్స్డ్ డబుల్స్లో తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల జోడీ... మహిళల డబుల్స్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జంట పోటీపడనున్నారు.ఈ టోర్నీలో సింధుకు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. తొలి రౌండ్లో ప్రపంచ 18వ ర్యాంకర్ బుసానన్ (థాయ్లాండ్)తో సింధు తలపడుతుంది. బుసానన్తో 22వ సారి ఆడనున్న సింధు 20 సార్లు గెలిచి, ఒకసారి ఓడిపోయింది. బుసానన్పై గెలిస్తే సింధుకు ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్వన్ ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా) ఎదురయ్యే అవకాశముంది. ఆన్ సె యంగ్తో ఇప్పటి వరకు ఆడిన తొమ్మిదిసార్లూ సింధు ఓడిపోయింది.ఈ నేపథ్యంలో సింధు ప్రస్థానం ఈ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసే అవకాశముంది. ఇతర మ్యాచ్ల్లో యుషి తనాకా (జపాన్)తో శ్రీకాంత్; అల్వీ ఫర్హాన్ (ఇండోనేసియా)తో లక్ష్య సేన్ ఆడతారు. మిక్స్డ్ డబుల్స్లో గువో జిన్ వా–చెన్ ఫాంగ్ హుయ్ (చైనా)లతో తనీషా–ధ్రువ్... మహిళల డబుల్స్లో కుసుమ ఫెబ్రియానా–మెలీసా (ఇండోనేసియా)లతో గాయత్రి–ట్రెసా...అజ్రియాన్–టాన్ వీ కియోంగ్ (మలేసియా)లతో హరిహరన్–అర్జున్ తలపడతారు. -
ఫ్రెంచ్ ఓపెన్లో సబలెంక మూన్వాక్
ఫ్రెంచ్ ఓపెన్లో ప్రపంచ నంబర్ వన్, బెలారస్ టెన్నిస్ స్టార్ అరీనా సబలెంక జోరు కొనసాగుతోంది. సబలెంక సోమవారం రాత్రి జరిగిన 4వ రౌండ్లో నవోమి ఒసాకా (జపాన్)ను 7-5, 6-3 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లింది.సబలెంకకు వరుసగా ఇది 14వ గ్రాండ్స్లామ్ క్వార్టర్ ఫైనల్ కావడం విశేషం. ఈ మ్యాచ్లో సబలెంక అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. రెండు సెట్లల్లోనూ ఆమె ప్రత్యర్ధికి చుక్కలు చూపించింది. ఏకంగా 39 విన్నర్లు, 12 ఏస్లతో ముప్పు తిప్పలు పెట్టింది.కాగా ఈ గేమ్ ముగిసిన అనంతరం..మీకు డ్యాన్స్ చేయాలననుందా? అని ఓ వ్యాఖ్యత సబలెంకను అడిగాడు. అందుకు ఆమె అవును అంటూ.. మైఖేల్ జాక్సన్ తరహాలో మూన్వాక్ చేసి అలరించింది. అదేవిధంగా ఈ విజయంపై సబలెంక మాట్లడుతూ.. ఈ ఏడాది రోలాండ్ గారోస్ (ఫ్రెంచ్ ఓపెన్)లో ఫలితాలతో సంబంధం లేకుండా కేవలం నా ఆటపైనే నేను దృష్టి పెట్టాను. టెన్నిస్లో ఏదైనా జరగొచ్చు" అని పేర్కొంది. కాగా యాసెస్ ఓపెన్లో నవోమి ఒసాకా చేతిలో సబలెంక ఘోర ఓటమి చవిచూసింది. అయితే ఈ ఏడాది మాత్రం ఒసాకాపై వరుసగా మూడో విజయాన్ని సబలెంక నమోదు చేసింది.From dancing in front of the admin's phone to dancing on Philippe-Chatrier 💃#RolandGarros pic.twitter.com/XqxPmCjt35— Roland-Garros (@rolandgarros) June 1, 2026 -
అతడేమి రోబో కాదు.. బీసీసీఐ తప్పు చేస్తోంది?
మహ్మద్ సిరాజ్.. ప్రస్తుతం అత్యంత ఫిట్గా ఉన్న భారత క్రికెటర్లలో ఒకడు. ఎంత అలసిపోయినా అదే వేగంతో, పట్టుదలతో బౌలింగ్ చేయడం అతడి ప్రత్యేకత. అది కొత్త సీజన్లోని మొదటి బంతి అయినా.. 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లోని చివరి రోజైనా సరే సిరాజ్లో ఏ మాత్రం అలుపు కనిపించదు.2026లో సిరాజ్ ఇప్పటికే విశ్రాంతి లేకుండా దాదాపు 6 లిస్ట్ ఎ మ్యాచ్లు, 18 టీ20 మ్యాచ్లు, 2 ఫస్ట్-క్లాస్ మ్యాచ్లు ఆడాడు. అంతకముందు ఇంగ్లండ్ పర్యటనలో కూడా సిరాజ్ మొత్తం 5 మ్యాచ్లు ఆడి మరోసారి తన ఫిట్నెస్ను నిరూపించుకున్నాడు. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్-2026, ఐపీఎల్-2026లో కూడా ఈ హైదరాబాదీ భాగమయ్యాడు.సిరాజ్కు విశ్రాంతి?ఈ నేపథ్యంలో జూన్ 6 నుంచి అఫ్గానిస్తాన్తో ప్రారంభం కానున్న ఏకైక టెస్ట్కు సిరాజ్కు విశ్రాంతి ఇవ్వాలని క్రికెట్ నిపుణులు బీసీసీఐని సూచిస్తున్నారు. బుమ్రా తరహాలోనే సిరాజ్ వర్క్లోడ్ను కూడా మేనేజ్ చేయాల్సిన అవసరముందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో సిరాజ్ ఏకంగా 17 మ్యాచ్లు ఆడాడు. సిరాజ్ చివరగా మే 31న ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ తరఫున బరిలోకి దిగాడు.ఇప్పుడు కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే.. అఫ్గాన్తో టెస్ట్లో అతడు ఆడాల్సి ఉంది. 4 నెలల పాటు విరామం లేకుండా క్రికెట్ ఆడిన ఒక ఫాస్ట్ బౌలర్ను 5 రోజుల సుదీర్ఘ టెస్ట్ మ్యాచ్ ఆడమనడం ఎంతవరకు సమంజసం? ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అతడేమి రోబో కాదు కదా? అని సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు.ఇదే కొనసాగితే అతడు గాయాల బారిన పడే అవకాశముంది. కాబట్టి బీసీసీఐ అతడి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని మాజీ క్రికెటర్లు సైతం హెచ్చరిస్తున్నారు. అఫ్గానిస్తాన్తో జరిగే వన్డే సిరీస్ నుండి సిరాజ్కు విశ్రాంతి ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత ఇంగ్లండ్ టూర్, శ్రీలంకతో 2 టెస్టులు, న్యూజిలాండ్ పర్యటనలతో మళ్లీ బిజీ కానున్నాడు.ముఖ్యంగా శ్రీలంక, న్యూజిలాండ్తో జరిగే రెడ్ బాల్ సిరీస్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా జరగనున్నాయి. ఈ సిరీస్ల సమయానికి సిరాజ్ 100% ఫిట్నెస్తో ఉండటం ముఖ్యం. కాగా అఫ్గాన్తో జరిగే టెస్ట్ మ్యాచ్ డబ్ల్యూటీసీ పరిధిలోకి రాదు. కాబట్టి ఈ మ్యాచ్ కోసం ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, నితీష్ కుమార్ రెడ్డి లాంటి యువ పేసర్లను వాడుకుంటే సరిపోతుంది. అంతేకాకుండా ముల్లాన్పూర్ పిచ్ ఎక్కువగా స్పిన్నర్లకు అనుకూలిస్తోంది. జట్టులో కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే వంటి స్పిన్నర్లు ఉన్నారు.చదవండి: ఒకే ఓవర్లో 6 సిక్స్లు -
ఒకే ఓవర్లో 6 సిక్స్లు
సింగపూర్: అంతర్జాతీయ టి20 మ్యాచ్లో ‘ఓవర్లో 6 సిక్సర్ల’ ఫీట్ మరోసారి నమోదైంది. నేపాల్ బ్యాటర్ కుశాల్ భుర్తేల్ ఈ అరుదైన జాబితాలో చేరాడు. ఆసియా క్రీడల అర్హత టోర్నీలో భాగంగా ఆదివారం చైనాతో జరిగిన మ్యాచ్లో కుశాల్ ఈ ఘనతను సాధించాడు. చైనా లెఫ్టార్మ్ స్పిన్నర్ చెన్ జూ యూ ఓవర్లో అతను ఆరు సిక్సర్లు బాదాడు. ఈ ఓవర్లో తొలి ఐదు బంతులను కుశాల్ వరుసగా 6, 6, 6, 6, 6 కొట్టాడు. తర్వాతి బంతిని చెన్ ‘వైడ్’గా వేశాడు. అయితే ఈ అదనపు బంతిని కూడా కుశాల్ సిక్స్గా మలచడంతో ఓవర్లో 6 గీ6 పూర్తయింది. మ్యాచ్లో కుశాల్ 43 బంతుల్లోనే 5 ఫోర్లు, 16 సిక్సర్లతో 129 పరుగులు సాధించాడు. అతని జోరుకు తోడు కుశాల్ మల్లా (47 బంతుల్లో 85 నాటౌట్; 8 ఫోర్లు, 5 సిక్స్లు), రోహిత్ పౌడేల్ (21 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 7 సిక్స్లు) కూడా చెలరేగడంతో నేపాల్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 313 పరుగులు చేసింది. అనంతరం 19.2 ఓవర్లలో 92 పరుగులకే కుప్పకూలిన చైనా 221 పరుగుల తేడాతో ఓడింది. -
మా ఆధిపత్యం కొనసాగింది: పాటీదార్
గత ఏడాదితో పోలిస్తే ఈసారి తమపై ఎలాంటి ఒత్తిడి లేకుండా బరిలోకి దిగామని, అందుకే స్వేచ్ఛగా ఆడి ప్రత్యర్థులపై ఆధిపత్యం ప్రదర్శించామని ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ వ్యాఖ్యానించాడు. విజయానంతరం తన ఆనందాన్ని అతను మీడియాతో పంచుకున్నాడు. ‘టోర్నీలో ఏ దశలోనూ ఒత్తిడిని ఎదుర్కోలేదు. ప్రతీ మ్యాచ్లో ప్రశాంతంగా ఆడాం. ఈసారి ఇతర జట్లను ఓడించడం మాత్రమే కాదు, సంపూర్ణంగా ఆధిపత్యం ప్రదర్శించాం. ఇలాగే ఆడితే రెండో టైటిల్ సాధించగలమనే నమ్మకం ఆరంభంలోనే కలిగింది.ఇంతకంటే మంచి పుట్టిన రోజు కానుక ఏదీ ఉండదు. ఇకపై వరుసగా మూడో టైటిల్ ఎలా గెలవాలనే దానిపైనే మా దృష్టి’ అని అతను అన్నాడు. కెప్టెన్గానే కాకుండా బ్యాటర్గా కూడా పాటీదార్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. బ్యాటింగ్లో స్వల్ప మార్పులతో ఈ దూకుడు సాధ్యమైందని అతను వెల్లడించాడు. ‘నా కెప్టెన్సీ శైలి భిన్నంగా ఉంటుందని అందరికీ తెలుసు. నేను ఎక్కువగా మాట్లాడకపోయినా మ్యాచ్లో పరిస్థితులపై పూర్తి అవగాహనతో నిర్ణయాలు తీసుకుంటాను. టీమ్ మేనేజ్మెంట్, ఆటగాళ్ల మద్దతు కూడా నాకు ఉండటంతో అంతా సానుకూలంగా మారిపోయింది. ఐపీఎల్కు ముందు బ్యాటింగ్ విషయంలో తీవ్రంగా సాధన చేశాను. మెంటార్ దినేశ్ కార్తీక్తో చర్చించి కొన్ని సాంకేతిక అంశాలను మార్చుకున్నాను. మ్యాచ్లో నా పాత్రపై నాకు చాలా స్పష్టత ఉండటం వల్లే ఈ స్కోర్లు సాధించగలిగాను’ అని పాటీదార్ చెప్పాడు. 2025లో చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవాల సమయంలో మరణించిన 11 మంది ఆర్సీబీ అభిమానులకు ఈ విజయాన్ని అంకితమిస్తున్నట్లు అతను ప్రకటించాడు. నాటి ఘటన నేపథ్యంలోనే ఈ సారి బెంగళూరు నగరంలో ఎలాంటి విక్టరీ పరేడ్ నిర్వహించరాదని, బహిరంగంగా ఏ తరహా సంబరాలు చేయరాదని ఆర్సీబీ యాజమాన్యం నిర్ణయించింది. అయితే ఆదివారం రాత్రి ఫైనల్ ముగిసిన తర్వాత పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ బెంగళూరు రోడ్లపైకి వచ్చి తమ ఆనందాన్ని ప్రదర్శించారు. ఇవన్నీ కూడా పోలీసుల పర్యవేక్షణలో, బ్యారికేడ్ల నియంత్రణలోనే జరగడం గమనార్హం. -
రాయల్గా సంబరాలు
అహ్మదాబాద్: ‘వన్ ఫెల్ట్ నైస్... వి డిడ్ ఇట్ ట్వైస్’... ఒక్క విజయం ఎంతో బాగు... రెండో విజయం బహు బాగు’ అంటూ ప్రత్యేకంగా సిద్ధం చేసిన టీ షర్ట్పై వ్యాఖ్య రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గెలుపు సంబరాలకు చిరునామాగా నిలిచింది. కోహ్లి సిక్సర్తో వరుసగా రెండో ఐపీఎల్ ట్రోఫీ ఖాయం కాగానే స్టేడియంలో మొదలైన వేడుకలు రాత్రంతా నిర్విరామంగా సాగాయి. ముందుగా మైదానంలో విజయోత్సవ వేడుకల్లో ఆటగాళ్లంతా భాగమయ్యారు. ఆ తర్వాత ఈ ఆనందం హోటల్ వరకు చేరింది. అక్కడ ఢోల్ బాజాలతో జట్టుకు ఘనమైన స్వాగతం లభించింది. ముందుగా కెప్టెన్ పాటీదార్ తన డ్యాన్స్తో ఇన్నింగ్స్ మొదలు పెట్టగా... ఆ తర్వాత కోహ్లి, కృనాల్ పాండ్యా బల్లే బల్లే అంటూ జత కలిశారు. రసిఖ్ సలామ్ తదితర కుర్రాళ్ల బృందం చేసిన హంగామాతో ప్రాంగణమంతా మారుమోగిపోయింది. ఆ తర్వాత హోటల్లో అసలు పార్టీ మొదలైంది. జట్టు విజయోత్సవంలో అంతా పాల్గొని తెల్లవారే వరకు నిర్విరామంగా సంబరాలు చేసుకున్నారు. ముఖ్యంగా కోహ్లి, అనుష్క శర్మ కలిసి చేసిన డ్యాన్స్ ఈ మొత్తం ప్రోగ్రామ్కే హైలైట్గా నిలిచింది. జట్టు మెంటార్ దినేశ్ కార్తీక్ కూడా కోహ్లితో జత కట్టి ‘నాటు నాటు’ స్టెప్పులేశాడు. సోమవారం పుట్టిన రోజు జరుపుకున్న రజత్ పాటీదార్, దినేశ్ కార్తీక్లతో పాటు ఫిల్ సాల్ట్ ఏడాది బాబుకు కూడా కలిపి ముగ్గురి బర్త్డే వేడుకలు కూడా ఇదే వేదికపై నిర్వహించారు. మరోవైపు ఫైనల్లో ఓటమి తర్వాత గుజరాత్ టైటాన్స్ అనూహ్య ఘటనలో బాధితులయ్యారు. మ్యాచ్ ముగిశాక హోటల్కు వెళుతుండగా టీమ్ బస్సును దారి మధ్యలో నిలిపి వేయాల్సి వచ్చింది. షార్ట్ సర్క్యూట్తో బస్సు ఆగిపోవడంతో ఆటగాళ్లందరినీ కిందకు దించేశారు. ఆ తర్వాత మరో బస్సు లో గుజరాత్ ప్లేయర్లు హోటల్కు చేరుకున్నారు. విన్నింగ్ షాట్ కల తీరింది: కోహ్లి విరాట్ కోహ్లి తన అత్యద్భుత కెరీర్లో ఎన్నో గొప్ప విజయాలందించాడు. ఛేదనలో చివరి వరకు నిలిచి మరెన్నో మ్యాచ్లలో భారత జట్టును లక్ష్యానికి చేర్చాడు. కానీ ఐపీఎల్లో కూడా అలాగే గెలిపించాలని చాలాసార్లు కోరుకున్నాడు. చివరకు ఇప్పుడు అది జరిగిందని కోహ్లి సంతోషాన్ని ప్రదర్శించాడు. 2025లోనే ఆర్సీబీ టైటిల్ నెగ్గినా... నాడు జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. ఆదివారం కూడా విజయానికి 11 పరుగుల దూరంలో కోహ్లి అవుటైనట్లు కనిపించినా... చివరకు రీప్లేలో నాటౌట్గా తేలాడు. ‘ఐపీఎల్లో విన్నింగ్ షాట్ కొట్టాలనేది నా కల. దీని గురించి నిజంగా చాలాసార్లు ఆలోచించాను. ఎట్టకేలకు ఈ రోజు సాధ్యమైంది. ఛేదనలో ఏం చేయాలో నాకు సరిగ్గా తెలుసు. ఈతరం కుర్రాళ్ల జోరులో మరింత సాహసంతో ఆడాలనే విధంగా నా ఆలోచనా శైలి మారింది. అందుకే వేగవంతమైన అర్ధసెంచరీ సాధించగలిగా. పవర్ప్లేలోనే గెలుపు ఖాయం కావాలని వెంకటేశ్ అయ్యర్కు చెప్పాను. ఫ్యాన్స్కు మాకు అండగా నిలిచిన తీరు చూస్తే 7 కాదు 14 హోం మ్యాచ్లు ఆడినట్లుగా అనిపించింది. ఫైనల్లో కూడా వేదిక ప్రత్యర్థి జట్టుదే అయినా 90 శాతం ఫ్యాన్స్ మాకు మద్దతిచ్చారు’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. -
ఐపీఎల్ 2026 విజేత ఆర్సీబీకి బిగ్షాక్!
ఐపీఎల్ 2026 సీజన్ చాంపియన్గా నిలిచిన ఆర్సీబీకి ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ టిమ్ డేవిడ్ జరిమానా నుంచి తప్పించుకోలేకపోయాడు. వరుసగా రెండో సీజన్లోనూ టైటిల్ గెలిచి జోరు మీదున్న ఆర్సీబీకి టిమ్ డేవిడ్పై చర్య తీసుకోవడం కంటికి ఇంపుగా మారింది. టైటిల్ గెలిచిన ఉత్సాహం, సంబరాల నడుమ ఫైనల్ మ్యాచ్లో మైదానంలో దుష్ప్రవర్తనకు పాల్పడినందుకు టిమ్ డేవిడ్ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. అంతేకాదు ఐపీఎల్ 2027 సీజన్లో ఆర్సీబీ ఆడే తొలి మ్యాచ్ లేదా అతడు ప్రాతినిధ్యం వహించే ఫ్రాంచైజీ ఆడే తొలి మ్యాచ్లో టిమ్ డేవిడ్ ఆడకుండా అతడిపై సస్పెన్షన్ విధిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది.గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ 10వ ఓవర్లో టిమ్ డేవిడ్ ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ వైపు ఐస్బ్యాగ్ను విసరడం కనిపించింది. ఇది ఫన్నీగా చేశాడా లేక కావాలనే చేశాడా అన్నది పక్కనబెడితే.. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.9 ప్రకారం మ్యాచ్ సమయంలో ఒక ఆటగాడు.. జట్టుపై లేదా అంపైర్ లేదా మ్యాచ్ రిఫరీ లేదా మూడో వ్యక్తిపై అనుచితంగా ప్రవర్తించడం లేదా ఏదైనా వస్తువును విసరడం నిబంధనలకు విరుద్ధం. 30 ఏళ్ల టిమ్ డేవిడ్ తన తప్పును అంగీకరించినందున తన దుష్ప్రవర్తనతో నిబంధనలను ఉల్లఘించినందుకు గాను అతడి మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానాతో పాటు రెండు డీ మెరిట్ పాయింట్లు విధిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. అయితే ఈ సీజన్లో టిమ్ డేవిడ్ బీసీసీఐ ఆగ్రహానికి గురికావడం ఇది మొదటిసారి కాదు. ఈ టోర్నీలో అతడు మూడుసార్లు ఐపీఎల్ లెవెల్ 1 నిబంధనను ఉల్లఘించడం గమనార్హం. మొదటిసారి ఈ సీజన్లో 20వ మ్యాచ్లో (ఒక డీమెరిట్ పాయింట్), 54వ మ్యాచ్లో రెండో ఉల్లంఘన కింద రెండు డీమెరిట్ పాయింట్లు కోత పడింది. మూడోసారి కూడా టిమ్ డేవిడ్ నిబంధన ఉల్లంఘించడంతో నిబంధనల ప్రకారం వచ్చే సీజన్లో అతడు తొలి మ్యాచ్ ఆడకుండా సస్పెన్షన్ పడనుంది.చదవండి: ఆమె తిరిగి వచ్చేస్తోంది.. జాగ్రత్త! -
ఆమె తిరిగి వచ్చేస్తోంది.. జాగ్రత్త!
అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ టెన్నిస్ కోర్టులోకి రీఎంట్రీ ఇవ్వనుంది. 23 గ్రాండ్స్లామ్ టోర్నీలతో మహిళల సింగిల్స్లో మకుటం లేని మహారాణిగా వెలుగొందిన సెరెనా విలియమ్స్ టెన్నిస్కు దూరమై నాలుగేళ్లు కావొస్తోంది. ఈ నేపథ్యంలో 44 ఏళ్ల వయసులో సెరెనా ఈ నెలలో జరగనున్న క్వీన్స్ క్లబ్ టోర్నీ ద్వారా టెన్నిస్ రాకెట్ పట్టనుంది. అయితే సెరెనా ఈ టోర్నీలో సింగిల్స్లో కాకుండా డబుల్స్లో బరిలోకి దిగుతోంది. 2022 యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో మూడో రౌండ్లో ఓటమి తర్వాత సెరెనా మళ్లీ టెన్నిస్ ఆడలేదు. తాను టెన్నిస్లోకి రీఎంట్రీ ఇస్తున్న విషయాన్ని అమెరికా నల్లకలువ స్వయంగా పంచుకుంది. ‘ట్రావెల్ చేయడానికి సిద్ధంగా ఉన్నా’ అని క్యాప్షన్ జత చేసింది. దీనితో పాటు సెరెనా తెలుపు రంగు నైక్ టెన్నిస్ డ్రెస్తో పాటు మొబైల్ ఫోన్ను ఫొటోలో పంచుకుంది. అయితే ఫ్రొఫెషనల్ టెన్నిస్లోకి మాత్రం రావడం లేదని, కేవలం వైల్డ్కార్డ్గా క్వీన్స్క్లబ్ టోర్నీలో కెనడాకు చెందిన విక్టోరియా బోకోతో కలిసి డబుల్స్ మ్యాచ్ ఆడబోతున్నా అంటూ అసలు విషయాన్ని మెళ్లిగా చెప్పింది. దీంతో ప్రొఫెషనల్ టెన్నిస్లోకి సెరెనా రీఎంట్రీ ఇస్తుందంటూ తెగ సంబరపడిపోయిన అభిమానుల ఆశలు ఆవిరైపోయాయి. 2022లో యూఎస్ ఓపెన్ లో ఓటమి అనంతరం ఆటకు దూరంగా ఉన్న సెరెనా విలియమ్స్ ‘రిటైర్మెంట్’ అనే పదం వాడలేనని, దానికి బదులుగా టెన్నిస్ నుంచి ‘అదృశ్యం’ అవుతున్నానంటూ పరోక్షంగా వీడ్కోలు పలికింది. ఓపెన్ శకంలో మహిళల సింగిల్స్లో అత్యధిక గ్రాండ్స్లామ్ టైటిల్స్ నెగ్గిన రెండో క్రీడాకారిణిగా సెరెనా విలియమ్స్ (23 టైటిల్స్) నిలిచింది. ఇక తొలి స్థానంలో ఆస్ట్రేలియా దిగ్గజం మార్గరెట్ కోర్ట్ (24 గ్రాండ్స్లామ్) టైటిల్స్తో కొనసాగుతుంది. సెరెనా సాధించిన 23 గ్రాండ్స్లామ్ టైటిల్స్లో ఏడు ఆస్ట్రేలియన్ ఓపెన్, మూడు ఫ్రెంచ్ ఓపెన్, ఏడు వింబుల్డన్, ఆరు యూఎస్ ఓపెన్ టైటిల్స్ ఉన్నాయి. View this post on Instagram A post shared by ESPN (@espn)చదవండి: కోహ్లీకి ఏడుపొక్కటే తక్కువ.. ఆ కవర్లో ఏముంది? -
కోహ్లీకి ఏడుపొక్కటే తక్కువ.. ఆ కవర్లో ఏముంది?
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ చాంపియన్గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్పై ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్లో కోహ్లీ(75 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్తో ఆర్సీబీని గెలిపించడమే గాక రెండోసారి టైటిల్ అందించాడు.అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లి, అనుష్క శర్మల మధ్య జరిగిన ఒక సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. ఆ వీడియోలో అనుష్క, కోహ్లీ నడుచుకుంటూ వెళుతున్న సమయంలో, అనుష్క చేతిలో ఒక కవర్ కనిపించింది. ఇది చూసిన కోహ్లీ అందులో ఏముందో తెలుసుకోవడానికి అది ఒకసారి ఇవ్వాలని అడిగాడు. కానీ అనుష్క మాత్రం కోహ్లీకి లెటర్ ఇవ్వడానికి ఇష్టపడలేదు.అయినా కోహ్లీ అదే పనిగా ఆమె చేతి నుంచి లెటర్ తీసుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన అనుష్క శర్మ డగౌట్కు చేరుకున్న తర్వాత ఇస్తానులే అని చెప్పింది. దీంతో కోహ్లీ ఏంటి ఇలా చేస్తున్నావనడం వీడియోలో కనిపించింది. ఇది చూసిన అభిమానులు ఇంతకీ ఆ కవర్లో ఏముంది చెప్మా అంటూ కామెంట్లు పెట్టారు.మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (50) అర్థసెంచరీతో రాణించాడు. ఆర్సీబీ బౌలర్లలో రసిక్ సలామ్ 3 వికెట్లు తీయగా, భువనేశ్వర్, హాజిల్వుడ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 18 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. కోహ్లీ (75 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్తో ఆర్సీబీని గెలిపించగా, వెంకటేశ్ అయ్యర్ (32), టిమ్ డేవిడ్ (24) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీయగా, సిరాజ్, రబాడలు చెరొక వికెట్ తీశారు.FUNNY MOMENT AFTER THE FINAL 🤣🔥- Anushka had an envelope.- Virat Kohli was trying to take it.- But Anushka didn't want to give it.- Kohli tried multiple times but failed.- He was curious to know what was inside.Meanwhile, Anushka: "I'll give it to you there." 😅🔥 pic.twitter.com/v8k7jyaZ4z— Jara (@JARA_Memer) June 1, 2026చదవండి: కెనడా క్రికెట్పై సస్పెన్షన్.. కీలక మార్పులకు ఐసీసీ ఆమోదం! -
కెనడా క్రికెట్పై సస్పెన్షన్.. కీలక మార్పులకు ఐసీసీ ఆమోదం!
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టెస్టు క్రికెట్లో మార్పులకు ఆమోదముద్ర వేయడంతో పాటు కెనడా క్రికెట్పై సస్పెన్షన్, బంగ్లా క్రికెట్ బోర్డు ఎన్నికలను పర్యవేక్షించేందుకు ఐసీసీ ఉన్నతాధికారులను నియ మించడం వంటి నిర్ణయాలు తీసుకుంది. ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా అహ్మదాబాద్ వేదికగా ఐసీసీ చైర్మన్ జైషా నేతృత్వంలో రెండు రోజులపాటు సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే ఐసీసీ పలు కీలక మార్పులకు ఆమోద ముద్ర వేసింది.అవినీతి ఆరోపణలు..అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కెనడా క్రికెట్ను సస్పెండ్ చేయాలని ఐసీసీ బోర్డు తీర్మానించింది. సభ్యత్వానికి సంబంధించిన బాధ్యతలను ఉల్లంఘించిన కారణమే తక్షణ సస్పెన్షన్కు కారణమని తెలుస్తోంది. అయితే కెనడా క్రికెట్ బోర్డుపై వేటు వేసినప్పటికీ జట్టు ఆటగాళ్ల ప్రయోజనాలను కాపాడడం ఐసీసీ మొదటి ప్రాధాన్యమని తెలిపింది. జాతీయ పాలకమండలిని ప్రభావితం చేసే పాలనపరమైన సమస్యల వల్ల ఆటగాళ్లు నష్టపోకుండా చూడడం తమ బాధ్యత అని ఐసీసీ తెలిపింది.సస్పెన్షన్లో ఉన్న కెనడా క్రికెట్ బోర్డులో సమస్యలను పరిష్కరించడానికి ఐసీసీ నార్మలైజేషన్ కమిటీ పనిచేయనుందని, కెనడా క్రికెట్ బోర్డును తిరిగి కొత్తగా పునరుద్ధరించేందుకు దోహదపడుతుందని పేర్కొంది.పింక్బాల్ ట్రయల్..ఆటలో వెలుతురు సమస్య కారణంగా ఆట నిలిచిపోకుండా ఉండేందుకు, సంప్రదాయ రెడ్ బాల్కు బదులుగా అవసరమైతే పింక్ బాల్ వినియోగాన్ని ట్రయల్గా అనుమతించేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే పింక్ బాల్ ట్రయల్కు షరతులతో అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది.ముందుగా ఇరు జట్ల అంగీకారంతో, చెడు వెలుతురు కారణంగా ఆట ఆగే పరిస్థితులు ఉంటే రెడ్ బాల్ స్థానంలో పింక్ బాల్ ఉపయోగించేందుకు ట్రయల్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రతిపాదనను ఐసీసీ క్రికెట్ కమిటీ (మాజీ భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ నేతృత్వంలో) అలాగే చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ పరిశీలించి ఓకే చెప్పింది. టెస్టు క్రికెట్లో వెలుతురు తగ్గడం వల్ల ఆట తరచూ నిలిచిపోతుండటాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యం. అధికారిక ప్రకటనలో పూర్తి విధివిధానాలు వెల్లడించకపోయినా, పరిస్థితులు క్షీణిస్తున్నప్పుడు మ్యాచ్ అధికారులు రెడ్ బాల్ నుంచి పింక్ బాల్కు మారే అవకాశం ఇవ్వబడుతుందని సమాచారం. పింక్ బాల్ సాధారణంగా డే-నైట్ టెస్టుల్లో ఉపయోగించబడుతుంది. తక్కువ వెలుతురులో మెరుగైన కనిపించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఓవర్కాస్ట్ పరిస్థితులు, త్వరగా సూర్యాస్తమయం జరిగే దేశాల్లో బాడ్ లైట్ కారణంగా ఆట ఎక్కువగా నిలిచిపోతుండటంతో ఈ నిర్ణయాన్ని ప్రాక్టికల్ సొల్యూషన్గా చూస్తున్నారు.హాక్-ఐ డేటాకు అనుమతిసందేహాస్పద బౌలింగ్ యాక్షన్పై రిపోర్ట్ చేసే సందర్భంలో మ్యాచ్ అధికారులు ఇకపై 'హాక్-ఐ డేటాను ఉపయోగించేందుకు' ఐసీసీ అనుమతి ఇచ్చింది. .వన్డేల్లో హెడ్కోచ్లకు కొత్త అవకాశంఇక వన్డే మ్యాచ్లలో డ్రింక్స్ బ్రేక్ సమయంలో కోచ్లు మైదానంలోకి వెళ్లి ఆటగాళ్లతో మాట్లాడేందుకు అనుమతి లభించింది. ఇప్పటివరకు ఇది కేవలం సబ్స్టిట్యూట్ ప్లేయర్లకే పరిమితమైంది. ప్రతి ఇన్నింగ్స్లో రెండు డ్రింక్స్ బ్రేక్లు ఉండటంతో కోచ్లు మ్యాచ్లో నాలుగు సార్లు ప్రత్యక్షంగా ఆటగాళ్లకు వ్యూహాలను చెప్పే అవకాశం పొందనున్నారు. అయితే కోచ్లు మైదానంలో ఎలాంటి డ్రెస్ కోడ్లో ఉండాలన్నది ఇంకా స్పష్టత రాలేదు.లెగ్-సైడ్ వైడ్ రూల్కు శాశ్వత ఆమోదంఐసీసీ లెగ్-సైడ్ వైడ్పై సవరించిన నిబంధనను శాశ్వతంగా అమలు చేయాలని నిర్ణయించింది. అలాగే ఎంసీసీ క్రికెట్ నిబంధనల్లో మిగిలిన మార్పులు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.మరికొన్ని నిర్ణయాలు..క్రికెట్ వరల్డ్ కప్ ఛాలెంజ్ లీగ్లో పాల్గొనే జట్లు, టోర్నమెంట్ సైకిల్ సమయంలో ఇతర లిస్ట్-ఏ పరిమిత ఓవర్ల మ్యాచ్లు ఆడేందుకు అర్హత కొనసాగుతుందని ఐసీసీ స్పష్టం చేసింది. మొత్తంగా, టెస్టు క్రికెట్లో ఆట సమయాన్ని పెంచడం, ఆధునిక టెక్నాలజీ వినియోగం, అలాగే పరిమిత ఓవర్ల ఫార్మాట్లో వ్యూహాత్మక మార్పుల దిశగా ఐసీసీ ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. చదవండి: బీసీసీఐ ప్రాపర్టీని నాశనం చేసిన ఆర్సీబీ బ్యాటర్! -
విరాట్ కోహ్లీ నేర్పే పెట్టుబడి పాఠాలు!
విరాట్ కోహ్లీ ఐపీఎల్ ఫైనల్లో మరోసారి తన స్థిరమైన ఆటతీరుతో అద్భుత ప్రదర్శన చేశారు. 42 బంతుల్లో 75 పరుగులు (నాటౌట్) చేసి ఆర్సీబీ విజయానికి కీలక పాత్ర పోషించారు. అతని ఆట శైలి కేవలం భారీ షాట్లపై కాకుండా, సరైన టెక్నిక్, సహనం, క్రమశిక్షణపై ఆధారపడుతుందని అతని కోచ్ వ్యాఖ్యానించారు. కోహ్లీ అంటే కేవలం క్రికెట్ మాత్రమే కాదు. ఆయన కెరీర్ క్రీడల్లో మాత్రమే కాకుండా.. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో కూడా విలువైన పాఠాలు నేర్పుతుంది. ఈ కథనంలో ఆ విషయాలను వివరంగా తెలుసుకుందాం.➤ఒకటి.. కోహ్లీ విజయానికి కారణం అతని స్థిరత్వం, క్రమశిక్షణ. ఒక్క అద్భుతమైన ఇన్నింగ్స్ కాదు, సంవత్సరాల తరబడి నిరంతర ప్రదర్శనే అతన్ని గొప్ప ఆటగాడిగా నిలబెట్టింది. అదే విధంగా.. పెట్టుబడుల్లో కూడా ఒకేసారి పెద్ద లాభాలు ఆశించడం కంటే, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ (SIP) వంటి విధానంతో నిరంతరంగా పెట్టుబడి పెట్టడం ఎక్కువ లాభాన్ని ఇస్తుంది.➤రెండవది, తక్కువ వయస్సులోనే ప్రారంభించడం. కోహ్లీ 19 ఏళ్ల వయస్సులోనే ఐపీఎల్లో ప్రవేశించారు. ఇది అతనికి అనుభవం, తప్పిదాల నుంచి నేర్చుకునే అవకాశం కల్పించింది. పెట్టుబడుల్లో కూడా ముందుగా ప్రారంభిస్తే చక్రవడ్డీ ద్వారా ఎక్కువ సంపద సృష్టించుకోవచ్చు.➤మూడవది, డైవర్సిఫికేషన్ (పెట్టుబడుల విభజన). కోహ్లీ కేవలం ఒక రంగంలోనే కాకుండా స్పోర్ట్స్, టెక్, రియల్ ఎస్టేట్ వంటి అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టాడు. అలాగే పెట్టుబడిదారులు కూడా షేర్లు, బాండ్లు, బంగారం వంటి విభిన్న ఆస్తుల్లో పెట్టుబడి పెట్టాలి.➤నాలుగవది, ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉండడం. క్రికెట్లో ఒత్తిడి పరిస్థితుల్లో కూడా కోహ్లీ స్థిరంగా ఆడతాడు. అలాగే మార్కెట్ పతనాలు వచ్చినప్పుడు భయపడకుండా దీర్ఘకాల లక్ష్యాలపై దృష్టి పెట్టాలి.➤చివరగా.. వయస్సు, అవసరాల ప్రకారం వ్యూహం మార్చుకోవడం. కోహ్లీ ఇప్పుడు కొన్ని ఫార్మాట్లకు మాత్రమే ఆడుతున్నాడు. అలాగే పెట్టుబడిదారులు కూడా రిటైర్మెంట్ దగ్గరపడే కొద్దీ రిస్క్ తగ్గించి సురక్షిత పెట్టుబడులపై దృష్టి పెట్టాలి.Note: పెట్టుబడుల విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తప్పకుండా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.ఇదీ చదవండి: జాబ్ అంత ఈజీ కాదు.. అమెజాన్ మాజీ ఉద్యోగి ఆవేదన! -
బీసీసీఐ ప్రాపర్టీని నాశనం చేసిన ఆర్సీబీ బ్యాటర్!
ఐపీఎల్ 2026 సీజన్ విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి వరుసగా రెండోసారి టైటిల్ను నిలబెట్టుకుంది. అయితే ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్ బీసీసీఐ ప్రాపర్టీని నాశనం చేసేందుకు ప్రయత్నించడం వైరల్గా మారింది. అయితే టిమ్ డేవిడ్ ఇదంతా ఫన్ మోడ్లో చేయడంతో పెద్దగా వివాదం కాలేదు.విషయంలోకి వెళితే.. ఈ సీజన్లో బీసీసీఐ ఏఐ రోబోట్ చంపాక్ను పరిచయం చేసింది. ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు బంతిని తీసుకురావడం, బ్యాటర్లకు వెల్కమ్ చెప్పడం లాంటి పనులతో రోబో బాగా పాపులర్ అయింది. అయితే ఈ ఏఐ రోబోను టిమ్ డేవిడ్ నాశనం చేసినంత పని చేశాడు. మ్యాచ్ విజయం అనంతరం ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్తో చాంపియన్ ఫొటోలకు ఫోజిచ్చేందుకు వచ్చింది. ఈ సమయంలో టిమ్ డేవిడ్ చాంపియన్ అని రాసి ఉన్న బోర్డు నుంచి బయటకు వచ్చి ఏఐ రోబో చంపాక్ను తన్నాలని చూశాడు. కానీ తన ఆలోచనను విరమించుకొని తిరిగి తన స్థానానికి వెళ్లిపోయాడు. టిమ్ డేవిడ్ చర్య సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (50) అర్థసెంచరీతో రాణించాడు. ఆర్సీబీ బౌలర్లలో రసిక్ సలామ్ 3 వికెట్లు తీయగా, భువనేశ్వర్, హాజిల్వుడ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 18 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. కోహ్లీ (75 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్తో ఆర్సీబీని గెలిపించగా, వెంకటేశ్ అయ్యర్ (32), టిమ్ డేవిడ్ (24) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీయగా, సిరాజ్, రబాడలు చెరొక వికెట్ తీశారు.The moment when the rest of the players were celebrating with the IPL trophy, Tim David started having fun with Champak. Never change Timmy 😂❤️ pic.twitter.com/CYteAnZ53z— ` (@Atomickolly17) May 31, 2026చదవండి: IPL 2026: టాప్-10 వివాదాలపై ఒక లుక్కేద్దామా! -
IPL 2026: టాప్-10 వివాదాలపై ఒక లుక్కేద్దామా!
ఐపీఎల్లో పరుగుల పండుగ అభిమానులకు ఎంత కిక్ ఇస్తుందో, వివాదాలు, గొడవలు కూడా అదే స్థాయిలో ఫ్యాన్స్ను అలరించాయి. ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి తాజా 19వ సీజన్ దాకా ఎన్నో గొడవలు, వివాదాలు చోటు చేసుకున్నాయి. మరి ఈ సీజన్లో అభిమానులకు కిక్ ఇచ్చిన టాప్-10 వివాదాలు ఏంటనేవి ఇప్పుడు తెలుసుకుందాం.1) కోహ్లి-గిల్ క్యాచ్ వివాదంఆదివారం జరిగిన ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లి క్యాచ్ ఔట్పై ఎంత రగడ జరిగిందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 63 పరుగులతో కోహ్లి ఆర్సీబీని విజయం వైపు నడిపిస్తున్న సమయంలో ఈ వివాదం చోటుచేసుకుంది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 16వ ఓవర్ చివరి బంతికి అర్షద్ ఖాన్ వేసిన బంతిని కోహ్లి మిడాఫ్ మీదుగా ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ గిల్ డైవ్ చేసి మరీ క్యాచ్ అందుకున్నాడు. అయితే, ఆ క్యాచ్ను గిల్ సరిగ్గా పట్టలేదని, చేతుల్లోకి వెళ్లడానికి ముందు బంతి నేలను తాకిందని కోహ్లీ భావించాడు. A chat between Virat Kohli and Shubman Gill on the catch. - The celebration by Kohli after winning the argument. 😄 pic.twitter.com/9yVbseOqGy— Mufaddal Vohra (@mufaddal_vohra) May 31, 2026అయితే అంపైర్ నితిన్ మీనన్ ఔట్ ఇవ్వడంతో షాక్ తిన్న కోహ్లీ అంపైర్తో వాగ్వాదానికి దిగాడు. తాను ఔట్ కాదని, క్రీజు వదలి వెళ్లనని, థర్డ్ అంపైర్ రివ్యూకు చాన్స్ ఇవ్వాలిని మొండిపట్టు పట్టాడు. చేసేదేం లేక అంపైర్ తన నిర్ణయాన్ని థర్డ్ అంపైర్కు నివేదించాడు. రీప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్కు కూడా అది స్పష్టంగా కనిపించకపోయినా.. బంతిలో కొంత భాగం నేలను తాకినట్లు గుర్తించి ఔట్ నిర్ణయాన్ని రద్దు చేసి నాటౌట్గా ప్రకటించాడు. కోహ్లీ సంబరాలు చేసుకోగా, గిల్ మాత్రం నిరాశతో చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత 75 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో కోహ్లీ ఆర్సీబీకి రెండో టైటిల్ అందించాడు.2) షేక్హ్యాండ్ వివాదం..ఈ సీజన్లో అభిమానులకు మరింత కిక్ ఇచ్చిన ఎపిసోడ్ అంటే కోహ్లీ, హెడ్ మధ్య జరిగిన షేక్ హ్యాండ్ వివాదమే అని చెప్పొచ్చు. ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో కోహ్లీతో హెడ్ వ్యంగ్యంగా మాట్లాడడం, దానికి కోహ్లీ ధీటుగా బదులివ్వడం జరిగిపోయాయి. అయితే ఈ గొడవ ఇక్కడితో సద్దుమణగలేదు. Look behind the whole SRH coaching staff, including Daniel Vettori and Muttiah Muralitharan, were watching Virat Kohli and Travis Head, expecting some drama and ready to stop a fight. But Kohli didn’t shake hands, and everyone started laughing. 😂Kohli you character 🔥 pic.twitter.com/W9CS6KM52t— Avénue.1 (@Avnueone8) May 23, 2026మ్యాచ్ పూర్తైన తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చే క్రమంలో హెడ్ తన వద్దకు వచ్చినా కోహ్లీ అతడిని పట్టించుకోకుండా పక్కకు వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. ఈ వివాదం హెడ్ భార్యను కూడా తాకింది. ఆమెపై సోషల్ మీడియాలో అసభ్య కామెంట్లు పెడుతూ కొందరు ఆకతాయిలు రెచ్చిపోయారు. మరి ఈ వివాదానికి ఈ సీజన్తో ముగింపు పడిందా అంటే చెప్పలేని పరిస్థితి.3) టిమ్ డేవిడ్ అనైతిక చర్యమే 11న ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ విజయం తర్వాత ఆర్సీబీ బ్యాటర్ టిమ్ డేవిడ్ చేతి వేళ్లతో అసభ్య సంజ్ఞలు చేయడం వివాదాస్పదమైంది. సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన మెగా వేలంలో ముంబై ఇండియన్స్ తనను విడుదల చేయడంపై వ్యంగ్యంగా ఈ సైగలు చేసినట్లు తేలింది. దీంతో బీసీసీఐ టిమ్ డేవిడ్ చర్యను తప్పుబడుతూ అతని మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించడంతో పాటు రెండు డీ మెరిట్ పాయింట్లు కేటాయించింది.4) టాస్ వివాదం..ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య క్వాలిఫయర్-2 పోరు సందర్భంగా టాస్ సమయంలో నెలకొన్న గందరగోళం వివాదంగా మారింది. మొదట టాస్ వేసినప్పుడు పరాగ్ హెడ్ అని చెప్పాడు. అయితే మ్యాచ్ రిఫరీ ప్రకాశ్ భట్ మాత్రం పరాగ్ చెప్పింది అర్థం కాలేదంటూ టాస్ మళ్లీ వేయించాడు. రెండో ప్రయత్నంలో రాజస్తాన్ రాయల్స్కు టాస్ అనుకూలించడంతో బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే తొలి ప్రయత్నంలో గుజరాత్కు టాస్ అనుకూలంగా వచ్చినట్లు తర్వాత తేలింది. ఈ సమయంలో గుజరాత్ కెప్టెన్ గిల్ కాస్త అయోమయానికి గురయ్యాడు. కానీ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించడంతో ఈ వివాదంపై పెద్దగా చర్చ జరగలేదు.5) అంపైరింగ్పై ఎస్ఆర్హెచ్ ఫిర్యాదు ఈ సీజన్లో వరుస వివాదాస్పద అంపైరింగ్ నిర్ణయాలు తమను తీవ్ర ప్రభావితం చేశాయంటూ ఎస్ఆర్హెచ్ బీసీసీఐని ఆశ్రయించడం హైలైట్గా నిలిచింది. ఆర్సీబీతో మ్యాచ్లో క్లాసెన్ వివాదాస్పద క్యాచ్, కేకేఆర్తో మ్యాచ్లో అభిషేక్ శర్మ క్యాచ్పై, లక్నో ఆటగాడు అవేశ్ ఖాన్ బంతి బౌండరీ లైన్ను దాటకముందే, ఆ తాడును వెనక్కి నెట్టేయడంపై ఎస్ఆర్హెచ్ అసహనం వ్యక్తం చేసింది. ఎంసీసీ నిబంధనల ప్రకారం ఈ చర్యపై ఆటగాడికి భారీ జరిమానా విధించాలని బీసీసీఐ ఎదుట వాదించడం చర్చనీయాంశమైంది.6) పరాగ్ డ్రెస్సింగ్ రూమ్ ఘటనపంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా రాజస్తాన్ రాయల్స్ డ్రెస్సింగ్ రూమ్లో ఆ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ వేపింగ్ (ఈ-సిగరేట్) చేస్తూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. నిబంధనల ప్రకారం ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్లో ఇలాంటి చర్యలకు పాల్పడడం నిషిద్ధం. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో రంగంలోకి దిగిన బీసీసీఐ ఆట పరువుకు భంగం కలిగించినందుకు పరాగ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించడంతో పాటు, ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించింది.Captain of Rajasthan Royals team Riyan Parag enjoying vape in the RR dressing room .Vaping is illegal in India . Hello @BCCI is this allowed? #PBKSvsRR pic.twitter.com/banIgJDO6u— Surbhi (@SurrbhiM) April 29, 20267) రాజస్తాన్ డగౌట్ మొబైల్ వివాదంఈ సీజన్లో వివాదాల్లో హైలైట్గా నిలిచిన వాటిలో రాజస్తాన్ రాయల్స్ డగౌట్లో మొబైల్ ఫోన్ కనిపించడమే. ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా డగౌట్లో రాజస్తాన్ రాయల్స్ మేనేజర్ రోమి భిందర్ మొబైల్ ఫోన్ ఉపయోగిస్తుండడం కెమెరాల కంటికి చిక్కింది. ఈ చర్య పట్ల సీరియస్ అయిన బీసీసీఐ భిందర్ మొబైల్ అనుకోకుండా వాడానని, మెడికల్రిపోర్ట్స్ చూసుకునేందుకే ఫోన్ వాడినట్లు తెలిపాడు. తన చర్య పట్ల క్షమాపణ చెప్పినప్పటికీ, అతడి వివరణతో సంతృప్తి చెందని బీసీసీఐ రోమి భిందర్కు రూ.లక్ష జరిమానా విధించింది. రోమి భిందర్ చర్యను వ్యతిరేకిస్తూ బీసీసీఐ ఆటగాళ్లకు కఠిన ఆంక్షలు, నిబంధనలు జారీ చేసింది.8) అబ్స్ట్రకింగ్ ది ఫీల్డ్ఐపీఎల్ 2026 సీజన్లో లక్నోతో మ్యాచ్ సందర్భంగా కేకేఆర్ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీ అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కింద ఔటయ్యాడు. షాట్ ఆడిన అంగ్క్రిష్ సింగిల్ తీయడానికి ప్రయత్నించాడు. నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న గ్రీన్ వద్దని వారించడంతో వెనక్కి వెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ దశలో బంతిని అందుకున్న షమీ స్ట్రైకింగ్ ఎండ్ వికెట్ల వైపు విసిరాడు. The infamous Angkrish Raghuvanshi Run out today ! 😔What's your opinion on this decision 🤔 , my opinion is that it was not out, a blunder by 3rd umpire ! What was the hurry 😯?#LSGvsKKR #IPL2026pic.twitter.com/eJmxLm5Gwk— Cricket IQ (@S17Anurag) April 26, 2026ఈ నేపథ్యంలో తన రన్నింగ్ దిశను మార్చుకున్న రఘువంశీ షమీ వేసిన బంతికి అడ్డు రావడంతో అది అతడి ప్యాడ్లకు తగిలింది. దీంతో లక్నో ఆటగాళ్లు అప్పీల్ చేయడంతో ఉద్దేశపూర్వకంగానే బంతిని అడ్డుకున్నందుకు అంపైర్ అంగ్క్రిష్ రఘువంశీని ఔట్గా ప్రకటించాడు.9) అర్ష్దీప్ ఇన్స్టా వివాదంపంజాబ్ కింగ్స్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో దాదాపు 200 పైగా పోస్టులను తొలగించడం ఆసక్తిగా నిలిచింది. ఐపీఎల్ 2026 సీజన్లో పలు వివాదాల నేపథ్యంలో అర్ష్దీప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తేలింది. టోర్నీ జరుగుతున్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్ సహా జట్టు సమావేశాలకు సంబంధించి కంటెంట్ను సోషల్మీడియాలో షేర్ చేసుకోవద్దంటూ బీసీసీఐ ఆటగాళ్లను హెచ్చరించింది. అందుకే అర్ష్దీప్ తన ఇన్స్టాలో పోస్టులు తొలగించి ఉంటాడని అభిమానులు భావించారు.10) జాసన్ హోల్డర్ క్యాచ్ వివాదంగుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ మధ్య మ్యాచ్లో రజత్ పాటీదార్ ఇచ్చిన క్యాచ్ హోల్డర్ డైవ్ చేసి పట్టినప్పటికీ ఆ క్యాచ్ పూర్తి వివాదాస్పదమయింది. పాటిదార్ ఇచ్చిన క్యాచ్ను అందుకునే క్రమంలో హోల్డర్ బంతిని తొలుత నేలకు ఆనించినట్లు కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, అంపైర్ ఔటివ్వడం ఆర్సీబీ డగౌట్లో ఆటగాళ్లకు ఆగ్రహం తెప్పించింది. They checked the runout for 1 min and there was indeed a check of that Patidar's catch by Jason Holder, just judged in 17 secsTruly disappointing to see umpiring at this level this season. New day, new lowpic.twitter.com/KGgbi2a7qb— Gautam (@indiantweetrian) April 30, 2026హోల్డర్ పట్టిన క్యాచ్పై కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఔట్ కాదని తెలుస్తున్నప్పటికీ మూడో అంపైర్ పాటిదార్ను ఔట్ అని ప్రకటించడం అత్యంత వివాదాస్పదమయ్యింది.చదవండి: భారత్లో ఫిఫా ప్రసార హక్కులు ఆ సంస్థకే! -
అతడిని వన్డౌన్లో ఆడిస్తారా?: ఇంగ్లండ్ దిగ్గజం ఫైర్
ఐపీఎల్-2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ అనుసరించిన వ్యూహాలపై ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ మండిపడ్డాడు. అసలు గుజరాత్ నాయకత్వ బృందం ఆలోచన ఏమిటో తనకు అర్థం కాలేదన్నాడు.జోస్ బట్లర్ను కాదని నిశాంత్ సింధును వన్డౌన్లో ఎలా ఆడిస్తారని బ్రాడ్ ప్రశ్నించాడు. అహ్మదాబాద్లో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చేతిలో గుజరాత్ ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.ఈ క్రమంలో బెంగళూరు వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడగా.. గుజరాత్ రన్నరప్తో సరిపెట్టుకుంది. కాగా ఆర్సీబీతో ఫైనల్ సందర్భంగా గుజరాత్ తమ టాపార్డర్ను మార్చిన సంగతి తెలిసిందే.ఆదిలోనే షాక్ఓపెనర్లుగా సాయి సుదర్శన్, కెప్టెన్ శుబ్మన్ గిల్ కొనసాగగా.. వన్డౌన్లో మాత్రం బట్లర్ను కాదని నిశాంత్ సింధును ఆడించారు. అయితే, సీజన్ ఆసాంతం ఆకట్టుకున్న సాయి ఫైనల్లో 12, గిల్ 10 పరుగులే చేయడంతో గుజరాత్కు ఆదిలోనే షాక్ తగిలింది.ఇలాంటి తరుణంలో అన్క్యాప్డ్ నిశాంత్ సింధు మూడో స్థానంలో వచ్చి 18 బంతుల్లో 20 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ నాలుగో నంబర్ బ్యాటర్గా బరిలోకి దిగి 23 బంతుల్లో 19 పరుగులే చేసి నిష్క్రమించాడు.ఈ నేపథ్యంలో స్టువర్ట్ బ్రాడ్ గుజరాత్ జట్టు యాజమాన్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓ యూట్యూబ్ చానెల్తో మాట్లాడుతూ.. ‘‘ఈ టోర్నీ ఆసాంత బట్లర్ మూడో స్థానంలోనే బ్యాటింగ్ చేశాడు. కానీ ఫైనల్లో అనూహ్య రీతిలో అతడిని నాలుగో స్థానానికి మార్చారు.నాకైతే అర్థం కావడం లేదుఅసలు ఫైనల్లో.. అది కూడా ముందుగా బ్యాటింగ్ చేస్తూ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఏబీ డివిలియర్స్ సైతం దీనిని ఆత్మరక్షణ ధోరణిగానే అభివర్ణించాడు.ఇక ఈ సీజన్లో ఓపెనర్లు గిల్, సాయి చెరో 700కు పైగా పరుగులు సాధించారు. ఓపెనర్లు ఇంత నిలకడగా రాణించడం మంచిదే. అదే సమయంలో ఇలాంటి ప్రదర్శనల వల్ల మిడిలార్డర్ను పరీక్షించేందుకు వీలుకాదు. ఇద్దరు ఓపెనర్లు విఫలం కాగానే..ఒత్తిడిలో వారు ఎలా రాణిస్తారో తెలియదు. టైటిల్ పోరులో ఇద్దరు ఓపెనర్లు విఫలం కాగానే.. మిగతా వాళ్లు కూడా పెవిలియన్కు క్యూ కట్టేశారు’’ అని స్టువర్ట్ బ్రాడ్ విమర్శించాడు.బహుశా అందుకేనేమో!ఇక ఇదే షోలో ఇంగ్లండ్ మరో మాజీ ఆటగాడు స్టీవెన్ ఫిన్స్పందిస్తూ.. ‘‘ఇంగ్లండ్ తరఫున చాలా ఏళ్ల పాటు ఓపెనర్గా ఆడిన అనుభవం బట్లర్కు ఉంది. అలాంటిది అతడిని డిమోట్ చేయడం ఆశ్చర్యకరంగా అనిపించింది.అయితే, పాత బడుతున్న కొద్దీ వికెట్ బ్యాటింగ్కు అనుకూలిస్తుందని గుజరాత్ నాయకత్వ బృందం భావించి ఉంటుంది. కాసేపు నిశాంత్ స్టాండింగ్ ఇస్తే బట్లర్ కుదురుకోగలడని అంచనా వేసి ఉంటుంది. కానీ అదేమీ జరుగలేదు’’ అని పేర్కొన్నాడు.కాగా గుజరాత్ టాపార్డర్ కుదేలు కాగా.. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ అజేయ అర్ధ శతకం (50)తో రాణించాడు. ఫలితంగా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 155 పరుగులు చేయగలిగింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఆర్సీబీ 18 ఓవర్లలో పూర్తి చేసి టైటిల్ విజేతగా నిలిచింది.చదవండి: ఈ ఐదుగురు తమ చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడేశారు?! -
ఈ ఐదుగురు తమ చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడేశారు?!
ఐపీఎల్ పందొమ్మిదో సీజన్ ముగిసింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టైటిల్ నిలబెట్టుకుంది. అహ్మదాబాద్లో ఆదివారం జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ను ఓడించి వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడింది.ఇదిలా ఉంటే.. ఈ సీజన్తో కొంతమంది ఆటగాళ్లు ఐపీఎల్ కెరీర్ చరమాంకానికి చేరినట్లు తెలుస్తోంది. అంచనాలు అందుకోలేక చతికిలపడిన కొందరు ప్లేయర్లను వదిలించుకునేందుకు ఫ్రాంఛైజీలు సిద్ధమైనట్లు సమాచారం. ఈ జాబితాలో టాప్-5లో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు ఇవే!కరుణ్ నాయర్కరుణ్ నాయర్ను ఢిల్లీ క్యాపిటల్స్ గతేడాది రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. మిడిలార్డర్లో రాణిస్తాడనే ఉద్దేశంతో 34 ఏళ్ల ఈ వెటరన్ బ్యాటర్కు అవకాశం ఇచ్చింది. ఇక, ఐపీఎల్-2025లో కరుణ్ నాయర్ కాస్త ఫర్వాలేదనిపించాడు.ఎనిమిది ఇన్నింగ్స్లో కలిపి 198 పరుగులు చేయగలిగాడు. దీంతో ఈ ఏడాది కూడా ఫ్రాంఛైజీ అతడిని కొనసాగించింది. అయితే, ఐపీఎల్-2026లో రెండు ఇన్నింగ్స్ ఆడిన కరుణ్ కేవలం 18 పరుగులే చేశాడు. ఫీల్డింగ్లోనూ విఫలమయ్యాడు.వచ్చే సీజన్ నాటికి కరుణ్ 35వ వసంతంలోకి అడుగుపెడతాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తమ జట్టు పునర్నిర్మాణంలో భాగంగా యువ ఆటగాళ్లను ఎంచుకునే క్రమంలో కరుణ్ నాయర్కు స్వస్తి పలికే అవకాశం ఉంది. ఇక అతడికి కొత్త జట్టు దొరకడం కూడా కష్టమే!టి.నటరాజన్సన్రైజర్స్ హైదరాబాద్ నెట్ బౌలర్గా వచ్చి.. ఐపీఎల్లో ఇటీవలి కాలంలో ప్రభావం చూపిన లెఫ్టార్మ్ పేసర్లలో ఒకడిగా ఎదిగాడు టి.నటరాజన్. ఢిల్లీ క్యాపిటల్స్ గతేడాది అతడిని ఏకంగా రూ. 10.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.అందుకు తగ్గట్లుగానే ఆరంభంలో రాణించినప్పటికీ.. ఆ తర్వాత అదే జోరు కొనసాగించకలేకపోయాడు ఈ తమిళనాడు బౌలర్. పది ఇన్నింగ్స్లో కలిపి కేవలం ఐదు వికెట్లే తీశాడు. ఎకానమీ 11.18.వరుసగా ఆరు మ్యాచ్లలో నటరాజన్ ఒక్క వికెట్ కూడా తీయలేక చతికిలపడ్డాడు. కాబట్టి ఢిల్లీ అతడిని వదిలివేయడం ఖాయంగానే కనిపిస్తోంది.అన్రిచ్ నోర్జేసౌతాఫ్రికా స్పీడ్స్టర్ అన్నిచ్ నోర్జేను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. పదునైన పేస్ ఆయుధంతో రాణించగల నోర్జే.. అదే స్థాయిలో గాయాల బారిన పడటం ప్రతికూలంగా మారింది.తాజా ఎడిషన్లో అతడు కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడగలిగాడు. గాయం వల్ల జట్టుకు దూరమయ్యాడు. గతంలో కేకేఆర్ తరఫున కూడా కేవలం రెండు మ్యాచ్లే ఆడి వెళ్లిపోయాడు. దీంతో గాయాల బెడదతో బాధపడుతున్న నోర్జేకు ఫ్రాంఛైజీలు మళ్లీ అవకాశం ఇవ్వడం దాదాపుగా అసాధ్యమే అనిపిస్తోంది.ట్రెంట్ బౌల్ట్న్యూజిలాండ్ సీనియర్ పేసర్ ఫాస్ట్బౌలర్ ట్రెంట్ బౌల్ట్కు ఐపీఎల్లోనూ ఘన చరిత్రే ఉంది. వివిధ ఫ్రాంఛైజీలకు ప్రాతినిథ్యం వహిస్తూ.. విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ కివీస్ బౌలర్.. ఇప్పటికి 124 మ్యాచ్లలో కలిపి 145 వికెట్లు పడగొట్టాడు.ఇక ఐపీఎల్-2026కు ముందు ముంబై ఇండియన్స్ రూ. 12.50 కోట్ల భారీ ధరకు బౌల్ట్ను కొనుగోలు చేసింది. అయితే, ఆశించిన రీతిలో అతడు రాణించలేకపోయాడు. ఐదు మ్యాచ్లు ఆడి కేవలం రెండే వికెట్లు తీశాడు. దీంతో అతడికి బౌలింగ్ కోటా పూర్తి చేసే అవకాశం కూడా రాలేదు. కాబట్టి 36 ఏళ్ల బౌల్ట్ను ముంబై వదిలేస్తే.. అతడికి మరో ఫ్రాంఛైజీ నుంచి అవకాశం రావడం కష్టమే అనిపిస్తోంది.హర్షల్ పటేల్ఐపీఎల్-2026కు ముందు సన్రైజర్స్ హైదరాబాద్ హర్షల్ పటేల్ను రూ. 8 కోట్లకు రిటైన్ చేసుకుంది. గతేడాది 13 ఇన్నింగ్స్లో కలిపి అతడు 16 వికెట్లు తీశాడు అయితే, గతంలో మాదిరి ఈసారి హర్షల్ రాణించలేదు.ఐదు మ్యాచ్లు ఆడి 10కి పైగా ఎకానమీతో పరుగులు ఇచ్చి.. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. వచ్చే సీజన్ నాటికి హర్షల్ 35వ వసంతంలోకి అడుగుపెడతాడు. ఈ పరిణామాల క్రమంలో సన్రైజర్స్ అతడిని వదిలివేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. హర్షల్ వేలంలోకి వచ్చినా ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఫ్రాంఛైజీ అతడి వైపు మొగ్గుచూపకపోవచ్చు.చదవండి: IPL 2026: వైభవ్ తగ్గేదేలే.. ఎవరికెంత ప్రైజ్మనీ? -
భారత్లో ఫిఫా ప్రసార హక్కులు ఆ సంస్థకే!
భారత్లో ఫిఫా ప్రపంచకప్ 2026 మ్యాచ్ల ప్రసారాలకు సంబంధించి లైన్ క్లియర్ అయింది. జూన్ 11 నుంచి జరగనున్న ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్లకు సంబంధించిన ప్రసార హక్కులను జీ నెట్వర్క్ దక్కించుకుంది. ఒప్పందం ప్రకారం 2026 నుంచి 2034 వరకు ఫిఫా ప్రపంచకప్ సహా మొత్తం 39 ఫిఫా ఈవెంట్లకు సంబంధించిన మ్యాచ్లను ఆ చానెల్ ప్రసారం చేయనుంది. ఈ విషయాన్ని జీ ఎంటర్టైన్మెంట్ సోమవారం అధికారికంగా వెల్లడించింది. 2026 ఫిఫా ప్రపంచకప్తో పాటు ఫిఫా మహిళల ప్రపంచకప్ 2027, ఫిఫా ప్రపంచకప్ 2030 సహా మిగతా ఈవెంట్లకు సంబంధించిన మ్యాచ్లను భారత్లో జీ నెట్వర్క్ ప్రసారం చేయనుంది. 8 ఏళ్ల కాలానికి ఒప్పందం చేసుకోవడంతో విలువ కూడా భారీ స్థాయిలోనే ఉండనుంది. రెండు రోజుల క్రితం ఫిఫా మ్యాచ్ల ప్రసారానికి సంబంధించి హక్కులను జీ నెట్వర్క్ సొంతం చేసుకుందని, సదరు బ్రాడ్కాస్టర్లకు 30 నుంచి 35 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 284 నుంచి 332 కోట్లు) చెల్లించనున్నట్లు సమాచారం అందింది. అయితే ఇప్పుడు ఆ సంఖ్య డబుల్ అయినట్లు తెలుస్తోంది. అంతకముందు భారత్లో మ్యాచ్ల ప్రసార హక్కుల ఒప్పందం కోసం ఫిఫా వంద మిలియన్ డాలర్లను ఆశించింది. కానీ జీ నెట్వర్క్ మంచి ధరకే ఒప్పందం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2022 ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్లకు భారత్లో ప్రసార హక్కులను అప్పట్లో వయాకామ్ 18 (న్యూస్ 18) 62 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. మొత్తంగా ఒప్పందం విలువ ఎంత అనేది పక్కనబెడితే ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్లను భారత్లో వీక్షించాలనుకున్న అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి. ఇక ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్లను జీ నెట్వర్క్ ఇటీవలే కొత్తగా లాంఛ్ చేసిన నాలుగు స్పోర్ట్స్ చానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. యునైట్8 స్పోర్ట్స్ 1 (హిందీ), యునైట్8 స్పోర్ట్స్ 1 హెచ్డి (హిందీ), యునైట్8 స్పోర్ట్స్ 2 (ఇంగ్లీష్), యునైట్8 స్పోర్ట్స్ 2 హెచ్డి (ఇంగ్లీష్) లో మ్యాచ్లు ప్రసారం కానున్నాయి. జూన్ 11 నుంచి ప్రారంభం కానున్న ఫిఫా వరల్డ్ కప్ లో మొత్తం 104 మ్యాచ్లు జరగనున్నాయి. మొన్నటిదాకా ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్లను వీక్షించే భాగ్యం లేకుండా పోయిందని తెగ బాధపడిపోయిన అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.భారతీయ బ్రాడ్కాస్టర్లు ఈ హక్కులను కొనుగోలు చేయడానికి అంతగా ఆసక్తి చూపకపోవడానికి 'టైమింగ్స్' ఓ పెద్ద సమస్యగా మారాయి. ఈసారి టోర్నమెంట్లో మొత్తం 104 మ్యాచ్లు జరుగుతుండగా.. అందులో కేవలం 14 మ్యాచ్లు మాత్రమే భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి లోపు ప్రారంభమవుతాయి. మిగిలినవన్నీ అర్ధరాత్రి దాటాక లేదా తెల్లవారుజామున ప్రారంభం కానున్నాయి. ఫైనల్ మ్యాచ్ కూడా అర్ధరాత్రి 12:30 గంటలకు షెడ్యూల్ చేయబడింది. పీడబ్ల్యూసీ ఇండియా మీడియా నిపుణుడు రాజేష్ సేథి తెలిపిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి దాటిన తర్వాత మ్యాచ్లు ప్రసారమైతే ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం భారీగా పడిపోతుంది. పైగా చివరి నిమిషంలో డీల్ కుదిరితే స్పాన్సర్లను వెతుక్కోవడానికి ఛానెళ్లకు తగిన సమయం ఉండదు. జనాభా ఎక్కువగా ఉన్నంత మాత్రాన ప్రకటనకర్తలు డబ్బులు కుమ్మరించరని, వీక్షకుల సంఖ్యను బట్టే రేట్లు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.చదవండి: ఆ విషయంలో గిల్ తోపు.. రబాడ తక్కువేం కాదు! -
‘కడుపున పుట్టిన పిల్లల్లాగే.. అప్పుడే సగం గెలిచేశాము’
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కడుపున పుట్టిన సంతానంలో ఎవరు ప్రత్యేకమో చెప్పడం కష్టమని.. ఐపీఎల్ ట్రోఫీల విషయంలోనూ తాను ఇదే మాట చెబుతానన్నాడు. ఈ ట్రోఫీలు కూడా తన సొంత పిల్లల్లాంటివే అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు.కాగా గతేడాది ఆర్సీబీ తరఫున 109 పరుగులు చేసిన కృనాల్ పాండ్యా.. 17 వికెట్లతో సత్తా చాటాడు. తద్వారా ఆర్సీబీ తొలి టైటిల్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక ఐపీఎల్-2026లోనూ కృనాల్ అదరగొట్టాడు.ఐదుసార్లుఈసారి 226 పరుగులు చేసిన కృనాల్.. 14 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఆర్సీబీ వరుసగా రెండోసారి ట్రోఫీ గెలవడంలో కీలకంగా మారాడు. ఈ క్రమంలో ఐదుసార్లు ఐపీఎల్ నెగ్గిన జట్టులో సభ్యుడిగా కృనాల్ నిలిచాడు. ముంబై ఇండియన్స్ తరఫున 2017, 2019, 2020లలో టైటిల్ గెలిచిన ఈ బరోడా ఆల్రౌండర్... ప్రస్తుతం ఆర్సీబీతో ప్రయాణం కొనసాగిస్తూ.. 2025, 2026లలో విజేతగా నిలిచిన జట్లలో సభ్యుడిగా ఉన్నాడు.కడుపున పుట్టిన పిల్లల్లాంటివే..ఈ నేపథ్యంలో ఫైనల్లో గుజరాత్ టైటాన్స్పై విజయానంతరం కృనాల్ పాండ్యా మాట్లాడుతూ.. ‘‘ప్రతీ ఐపీఎల్ ట్రోఫీ దేనికదే ప్రత్యేకం. ఇది కూడా పిల్లల్ని కలిగి ఉండటం లాంటిదే. కడుపున పుట్టిన పిల్లల్లో ఎవరు ప్రత్యేకమో చెప్పలేము.అలాగే ఈ ట్రోఫీల విషయంలోనూ నేనేమీ చెప్పలేను. ఎంతో కష్టపడితే గానీ ట్రోఫీని ముద్దాడలేము. పదకొండేళ్ల వ్యవధిలో ఐదు ట్రోఫీలు గెలవడం నిజంగా నాకెంతో ప్రత్యేకం’’ అని తెలిపాడు.వేలం సమయంలోనే సగం గెలిచేశాముఇక తొలి టైటిల్ కోసం పద్దెనిమిదేళ్లు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన ఆర్సీబీ.. వరుసగా రెండోసారి విజేతగా నిలవడం పట్ల కృనాల్ స్పందించాడు. ‘‘నిజానికి గతేడాది వేలానికి ముందే మేము ఎంతగానో చర్చించాము.సమతుల్యమైన జట్టును తయారు చేసుకున్నాము. వేలం సమయంలోనే మేము సగం టోర్నీ గెలిచేశామని చెప్పవచ్చు. పద్దెనిమిదేళ్ల ఎదురుచూపుల తర్వాత ఇలా వరుసగా ట్రోఫీలు సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఆర్సీబీ అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. మ్యాచ్ ఎక్కడైనా సరే.. అక్కడ మాకు అభిమానులు ఉంటారు. ఇదొక అద్వితీయమైన అనుభూతి’’ అని కృనాల్ పాండ్యా చెప్పుకొచ్చాడు.Celebration rukenge nahi ft. Krunal Pandya. 🕺🤭😂 pic.twitter.com/s6RgvHdxaR— Royal Challengers Bengaluru (@RCBTweets) May 31, 2026కృనాల్తో పాటు వీళ్లు కూడాఆర్సీబీ వరుస రెండు టైటిల్ విజయాల్లో 13 మంది భాగంగా ఉన్నారు. కెప్టెన్ రజత్ పాటీదార్, దిగ్గజ ఓపెనర్ విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, స్వప్నిల్, కృనాల్ పాండ్యా, రొమారియో షెఫర్డ్, జోష్ హాజల్వుడ్, రసిఖ్ సలామ్, భువనేశ్వర్ కుమార్, సుయాశ్ శర్మ, అభినందన్కి ఇది రెండో ట్రోఫీ. మరో 10 మంది దేవ్దత్ పడిక్కల్, కాక్స్, బెతెల్, వెంకటేశ్, సాత్విక్, మంగేశ్, విక్కీ ఒస్వాల్, విహాన్ మల్హోత్రా, కనిష్క్ చౌహాన్, డఫీలకు తొలిసారి గెలుపు ఆనందం దక్కింది. చదవండి: IPL 2026: వైభవ్ తగ్గేదేలే.. ఎవరికెంత ప్రైజ్మనీ? -
ఆ విషయంలో గిల్ తోపు.. రబాడ తక్కువేం కాదు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన జట్లలో గుజరాత్ టైటాన్స్ ఒకటిగా నిలిచిపోనుంది. 2022 సీజన్ నుంచి స్థిరమైన ప్రదర్శన కనబరుస్తూ వచ్చిన గుజరాత్ టైటాన్స్ ఆడిన నాలుగు సీజన్లలో మూడుసార్లు ఫైనల్ చేరడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. 2022లో చాంపియన్గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ 2023లో రన్నరప్గా, 2024 సీజన్లో లీగ్ దశ, 2025 సీజన్లో ప్లేఆఫ్స్, తాజా సీజన్లో మరోసారి రన్నరప్గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో గుజరాత్ను 5 వికెట్ల తేడాతో ఓడించిన ఆర్సీబీ వరుసగా రెండోసారి టైటిల్ అందుకుంది. అయితే రన్నరప్గా నిలిచిన గుజరాత్ టైటాన్స్లో ఉత్తమ ప్రదర్శన ఆధారంగా ఆటగాళ్లకు రేటింగ్ ఇవ్వడం జరిగింది. ఫైనల్ ఆడిన తుది జట్టు సహా మొత్తం 15 మందికి సంబంధించిన ఆటగాళ్ల రేటింగ్ను విడుదల చేశారు. 10 పాయింట్లతో కూడిన రేటింగ్లో జట్టును అంతా తానై నడిపించిన కెప్టెన్ శుబ్మన్ గిల్, బౌలర్ కగిసో రబాడ చెరో 9 పాయింట్లతో తొలి స్థానంలో నిలవగా, సాయి సుదర్శన్ (8 పాయింట్లు) రెండో స్థానంలో ఉన్నాడు. జాసన్ హోల్డర్, మహ్మద్ సిరాజ్, రషీద్ ఖాన్లు ఏడేసి పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు. ఇక వికెట్ కీపర్ జాస్ బట్లర్ 6.5 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా, వాషింగ్టన్ సుందర్, ప్రసిధ్ కృష్ణ చెరో 6 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచారు. అశోక్ శర్మ, అర్షద్ ఖాన్లు చెరో 4 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా, 3 పాయింట్లతో రాహుల్ తెవాటియా ఏడో స్థానంలో నిలిచాడు.ఈ సీజన్లో ద్దగా ప్రభావం చూపని గ్లెన్ ఫిలిప్స్ (2 పాయింట్లు), షారుక్ ఖాన్, నిషాంత్ సింధూ ఒక్కో పాయింట్తో ఆఖరి స్థానాల్లో ఉన్నారు. లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్ల్లో 9 విజయాలతో పట్టికలో రెండో స్థానంలో నిలిచిన గుజరాత్ టైటాన్స్ క్వాలిఫయర్-1 పోరులో ఆర్సీబీ చేతిలో ఓడిపోయింది. అయితే క్వాలిఫయర్-2లో రాజస్తాన్ను చిత్తు చేసిన గుజరాత్ ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే ఫైనల్లో ఆర్సీబీ చేతిలో చతికిలపడిన గుజరాత్ రన్నరప్కు పరిమితమైంది.చదవండి: 'కోహ్లీ కాస్త తగ్గి ఉండు.. మీ బ్యాటింగ్ అయిపోలేదు!' -
నాపై ఒత్తిడి పెరిగింది.. ఇకపై: వైభవ్ సూర్యవంశీ
భారత యువ సంచలనం, రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నానన్నాడు. అయితే, చిన్న వయసులోనే వచ్చిన ఈ ‘అమితాదరణ’ ఒక్కోసారి తనను ఒత్తిడిలోకి నెట్టేస్తుందని తెలిపాడు.గతేడాది.. పద్నాలుగేళ్ల వయసులో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ.. 35 బంతుల్లోనే శతక్కొట్టి తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. ఆ తర్వాత భారత్ అండర్-19 జట్టు తరఫునా సత్తా చాటి వరల్డ్కప్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.ఆరెంజ్ క్యాప్ విజేతఇక ఐపీఎల్-2026లో పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రాజస్తాన్ ఓపెనర్గా ఈసారి పూర్తి స్థాయిలో బరిలోకి దిగి.. ఏకంగా 776 పరుగులు సాధించాడు. తద్వారా ఈ సీజన్లో అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ అందుకోవడంతో పాటు ఎమర్జింగ్ ప్లేయర్, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ తదితర అవార్డులు గెలుచుకున్నాడు.ఈ క్రమంలో ప్రజెంటర్, టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రితో మాట్లాడుతూ వైభవ్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ‘‘అందరూ నా గురించి మాట్లాడుతూ ఉంటే సంతోషంగా ఉంటుంది. అయితే, వరుస ఇంటర్వ్యూలు నాపై ఒత్తిడిని పెంచుతున్నాయి. నేను గర్వించదగ్గ క్షణం ఇది.నాపై ఒత్తిడి.. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నానువచ్చే సీజన్లోనూ ఇలాగే ఆడటానికి ప్రయత్నిస్తాను. కీలక మ్యాచ్లలో ఒత్తిడిని జయించడం ఎలాగో ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. మ్యాచ్.. మ్యాచ్కూ నా ఆట తీరు మారుతుంది. పరిస్థితులకు తగ్గట్లుగా.. జట్టు అవసరాలకు తగినట్లుగా ఆడతాను. ఈ సీజన్లో నేను నేర్చుకున్న ప్రధాన అంశాలు ఇవే.ప్రస్తుతానికి నా దృష్టి మొత్తం ఫిట్నెస్ మీదే ఉంది. నేను సుదీర్ఘకాలం కెరీర్ కొనసాగించాలంటే.. గాయాల బారిన పడకుండా ఉండాలి. అందుకోసం ఫిట్గా ఉండాలి. మా జట్టు మొత్తం నాకు అండగా నిలబడింది. సీనియర్ల నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను’’ అని వైభవ్ సూర్యవంశీ చెప్పుకొచ్చాడు. చదవండి: IPL 2026: వైభవ్ తగ్గేదేలే.. ఎవరికెంత ప్రైజ్ మనీ?! -
విండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర వీరుడి రీఎంట్రీ
జూన్ 3 నుంచి స్వదేశంలో శ్రీలంకతో జరుగబోయే 3 మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యుల వెస్టిండీస్ జట్టును ఇవాళ (జూన్ 1) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్గా షాయ్ హోప్ కొనసాగనుండగా.. పలువురు కీలక ఆటగాళ్లు చాలాకాలం తర్వాత జట్టులోకి వచ్చారు.రీఎంట్రీల్లో ఎక్కువ ఆకర్శిస్తున్న పేరు షిమ్రోన్ హెట్మైర్ది. ఇతను గతేడాది జూన్ తర్వాత ఒక్క వన్డే కూడా ఆడలేదు. అయినా లంక సిరీస్కు ఎంపిక చేశారు. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్లో అద్భుతంగా రాణించినందుకు అతడికి ఈ ఆఫర్ వచ్చింది. వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ దృష్ట్యా ఈ ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది.అలాగే గాయాల కారణంగా జట్టుకు దూరంగా ఉన్న అల్జరీ జోసఫ్, గుడకేశ్ మోటీ కూడా ఈ సిరీస్తో రీఎంట్రీ ఇవ్వనున్నారు. వర్క్లోడ్ విషయం పరిగణలోకి వచ్చినా జేడన్ సీల్స్, షమార్ జోసఫ్ను ఎంపిక చేశారు. 2027 వన్డే ప్రపంచకప్కు నేరుగా అర్హత సాధించాలంటే విండీస్కు ఈ సిరీస్ చాలా ముఖ్యం. అందుకే బలమైన జట్టుతో బరిలోకి దిగుతుంది. ఇటీవల విండీస్ జట్టుకు స్వదేశంలో తిరుగులేని రికార్డు ఉంది. వరుసగా ఐదు వన్డే సిరీస్లు గెలిచి అజేయ జట్టుగా చలామణి అవుతుంది.స్వదేశంలో శ్రీలంకతో సిరీస్కు వెస్టిండీస్ వన్డే జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్), అకీమ్ ఆగస్టే, జాన్ క్యాంప్బెల్, కీసీ కార్టీ, రోస్టన్ ఛేజ్, మాథ్యూ ఫోర్డ్, జస్టిన్ గ్రీవ్స్, షిమ్రోన్ హెట్మైర్, అమీర్ జాంగూ, అల్జరీ జోసెఫ్, షమార్ జోసఫ్, గుడకేశ్ మోటీ, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్, జేడన్ సీల్స్, షమార్ స్ప్రింగర్విండీస్-శ్రీలంక వన్డే సిరీస్ షెడ్యూల్జూన్ 3- తొలి వన్డే (కింగస్టన్)జూన్ 6- రెండో వన్డే (కింగస్టన్)జూన్ 8- మూడో వన్డే (కింగ్స్టన్)ఇదిలా ఉంటే, ఈ విండీస్ పర్యటనలో శ్రీలంక జట్టు వన్డే సిరీస్ తర్వాత 3 మ్యాచ్ల టీ20 సిరీస్, రెండు మ్యాచ్ల టెస్ట్ ఆడనుంది. జూన్ 11, 13, 14 తేదీల్లో ఇదే కింగస్టన్ వేదికగా మూడు టీ20లు జరుగనున్నాయి. అనంతరం శ్రీలంక జట్టు విండీస్ సెలెక్ట్ టీమ్తో ఓ నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ (జూన్ 18-21) ఆడుతుంది. దీని తర్వాత జూన్ 25 నుంచి ఆంటిగ్వాలో తొలి టెస్ట్, జులై 3 నుంచి అదే అంటిగ్వాలో రెండో టెస్ట్ జరుగనున్నాయి. -
రికార్డు ఛేదన.. పాక్కు ఊహించిన షాక్
మహిళల క్రికెట్లో సంచలనం నమోదైంది. పసికూన ఐర్లాండ్ తమ టీ20 చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించి, పటిష్టమైన పాకిస్తాన్కు ఊహించని షాకిచ్చింది. ఐర్లాండ్ ట్రై సిరీస్లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో పాక్ నిర్దేశించిన 176 పరుగుల భారీ లక్ష్యాన్ని ఐర్లాండ్ జట్టు మరో 5 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఐర్లాండ్ మహిళల టీ20 క్రికెట్ చరిత్రలో ఇదే అత్యంత భారీ ఛేదనగా (7 వికెట్ల తేడాతో) రికార్డైంది. ఆమీ హంటర్ (56), రెబెకా స్టాకెల్ (60 నాటౌట్) అద్భుతమైన అర్ద సెంచరీలతో ఐర్లాండ్కు ఈ చారిత్రక విజయాన్ని అందించారు. అంతకుముందు మ్యాచ్లో వెస్టిండీస్ చేతిలో పరాభవం ఎదుర్కొన్న ఐరిష్ మహిళలు, ఈ మ్యాచ్లో అనూహ్యంగా పుంజుకొని సంచలన విజయం సాధించారు. మరోవైపు పాక్ దీనికి ముందు మ్యాచ్లో విండీస్ చేతిలో, ఇప్పుడు ఐర్లాండ్ చేతిలో ఓడి నిష్క్రమణకు దగ్గర్లో ఉంది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. మునీబా అలీ (65) అర్ద సెంచరీతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. మిగతా పాక్ బ్యాటర్లలో గుల్ ఫెరోజా (32), సైరా జబీన్ (36), కెప్టెన్ ఫాతిమా సనా (21) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్ 19.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. అమీ హంటర్, స్టోకెల్ అర్ద సెంచరీలతో రాణించగా.. కెప్టెన్ ఓర్లా ప్రెండర్గాస్ట్ (33) ఓ మోస్తరు స్కోర్తో పర్వాలేదనిపించింది. ఇవాళే జరిగే (జూన్ 1) తదుపరి మ్యాచ్లో ఐర్లాండ్ మరోసారి విండీస్తో తలపడనుంది. -
రెండో టైటిల్.. ఆర్సీబీ సాధించిన రికార్డులు ఇవే
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీ నెగ్గింది. ఐపీఎల్-2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. అహ్మదాబాద్లో ఆదివారం టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.టాపార్డర్ను కుదేలు చేసి ఆదిలోనే ప్రత్యర్థిని దెబ్బకొట్టిన ఆర్సీబీ.. గుజరాత్ను 155 పరుగులకే పరిమితం చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగి రెండు ఓవర్లు మిగిలి ఉండగానే పనిపూర్తి చేసింది. తద్వారా ఏకపక్ష విజయం సాధించి.. తమ స్థాయి ఏమిటో మరోసారి నిరూపించుకుంది. ఈ క్రమంలో ఆర్సీబీ తమ పేరిట పలు రికార్డులు లిఖించుకుంది. అవేమిటంటే..ఆర్సీబీ సాధించిన రికార్డులు ఇవే👉ఐపీఎల్ టోర్నీ టైటిల్ను వరుసగా రెండేళ్లు గెల్చుకున్న మూడో జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ (2010, 2011లో), ముంబై ఇండియన్స్ (2019, 2020లో) మాత్రమే ఈ ఘనత సాధించాయి.👉ఐపీఎల్లో 2011లో ‘ప్లే ఆఫ్స్’ ఫార్మాట్ మొదలయ్యాక ఇప్పటి వరకు ‘ప్లే ఆఫ్స్’లోని క్వాలిఫయర్–1 మ్యాచ్లో గెలిచిన జట్టే విజేతగా నిలువడం ఇది 13వసారి కావడం విశేషం. చెన్నై (2011, 2018, 2021, 2023లో), కోల్కతా (2012, 2014, 2024లో), ముంబై (2015, 2019, 2020లో), బెంగళూరు (2025, 2026), గుజరాత్ టైటాన్స్ (2022లో) జట్లు ఈ ఘనత సాధించాయి. 👉చెన్నై (5 సార్లు), ముంబై (5 సార్లు), కోల్కతా (3 సార్లు) జట్ల తర్వాత ఐపీఎల్ టోర్నీ టైటిల్ను రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు గెలిచిన నాలుగో జట్టుగా బెంగళూరు నిలిచింది.దిగ్గజాల సరసన రజత్ పాటీదార్👉ఐపీఎల్ టైటిల్ను రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు గెలిచిన నాలుగో కెప్టెన్ రజత్ పాటీదార్. గతేడాది (2025) పాటీదార్ సారథ్యంలోనే బెంగళూరు తొలిసారి ఐపీఎల్ టైటిల్ నెగ్గింది. ఈ జాబితాలో ధోని, రోహిత్ శర్మ (5 సార్లు చొప్పున), గౌతమ్ గంభీర్ (2 సార్లు) ఉన్నారు.👉ఒకే వేదికపై రెండుసార్లు ఐపీఎల్ టైటిల్ సాధించిన మూడో జట్టు బెంగళూరు. 2025లోనూ అహ్మదాబాద్లోనే బెంగళూరు టైటిల్ నెగ్గింది. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ (కోల్కతా, ఈడెన్గార్డెన్స్; 2013, 2015లో; హైదరాబాద్, ఉప్పల్ స్టేడియం; 2017, 2019లో), కోల్కతా నైట్రైడర్స్ (చెన్నై, ఎంఎ చిదంబరం స్టేడియం; 2012, 2024లో) ఉన్నాయి.చదవండి: వైభవ్ గురించి కోహ్లి ఏమన్నాడంటే!Moments that became memories. Memories that became history. 🏆🎥 Reliving the defining moments of @RCBTweets going back-2️⃣-back in Ahmedabad ❤️#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/mHL9U36rB1— IndianPremierLeague (@IPL) June 1, 2026 -
ఐపీఎల్ 2026 చెత్త జట్టు.. కెప్టెన్గా హార్దిక్.. స్కై కూడా చోటు
ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాత ఈ సీజన్లో నిరాశపరిచిన ఆటగాళ్లతో ఒక "ఫ్లాప్ జట్టు" రూపొందించబడింది. క్రెక్స్ అనే ప్రముఖ ఇంగ్లీష్ వెబ్సైట్ రూపొందించిన ఈ జట్టులో అనూహ్యంగా పెద్ద పెద్ద స్టార్లు చోటు దక్కించుకున్నారు. కెప్టెన్గా ముంబై ఇండియన్స్ను లీడ్ చేసిన హార్దిక్ పాండ్యా ఎంపిక కాగా.. ఆశ్చర్యకరంగా పంజాబ్ కింగ్స్ విధ్వంసకర ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య పేరు ఈ జట్టులో ప్రత్యక్షమైంది.ప్రియాంశ్ మినహా మిగతా ప్లేయర్ల పేర్లు ఊహించినవే అయినా, ఒకరిద్దరి పేర్లు తొలగించి ఉండాల్సిందన్న భావన కలిగింది. అలాంటి వారిలో సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పేరు ఒకటి. రుతు ఈ సీజన్లో అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయినా, 337 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.ప్రియాంశ్ ఆర్య సైతం ఈ సీజన్లో 364 పరుగులు సాధించినా, నిలకడలేమి అతన్ని ఈ జట్టులో చేర్చింది. టాపార్డర్లో సూర్యకుమార్ యాదవ్ పేరు ఊహించిందే.మిడిలార్డర్లో ఈ సీజన్ వైఫల్యాధికుల పేర్లు ఉన్నాయి. లక్నో తరఫున ఘోర ప్రదర్శన చేసిన పూరన్, వైఫల్యాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన అదే జట్టు కెప్టెన్ రిషబ్ పంత్, డ్రాప్ క్యాచ్లతో ఈ సీజన్లో హైలైట్ అయిన పంజాబ్ ఆల్రౌండర్ శశాంక్ సింగ్, అదే జట్టు మరో ఆల్రౌండర్ మార్కో జన్సెన్ ఫ్లాప్ జట్టు మిడిలార్డర్లో చోటు దక్కించుకున్నారు.కెప్టెన్గా, వ్యక్తిగతంగా దారుణంగా విఫలమైన హార్దిక్ పాండ్యా ఈ ఫ్లాప్ జట్టుకు ఫస్ట్ ఛాయిస్ కెప్టెన్ అయ్యాడు.బౌలింగ్ విభాగానికొస్తే.. ఈ విభాగం కూడా స్టార్లతో నిండింది. మరిముఖ్యంగా టీమిండియా స్టార్లంతా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఆల్రౌండ్గా మిక్స్డ్ సీజన్ కలిగిన అక్షర్ పటేల్.. వికెట్లు లేకా, ధారాళంగా పరుగులు సమర్పించుకున్న కుల్దీప్ యాదవ్.. వికెట్ల కోసం కళ్లకు కాయలు కాసేలా ఎదురుచూసిన బుమ్రా, వికెట్లు తీయగలిగినా ధారాళంగా పరుగులు సమర్పించుకున్న అర్షదీప్ సింగ్ ఈ ఫ్లాప్ టీమ్లో చోటు దక్కించుకున్నారు.మొత్తంగా హార్దిక్, సూర్యకుమార్, బుమ్రా, పంత్ వంటి పెద్ద పేర్లు ఈ జట్టులో ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే, నిన్న (మే 31) జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్లో ఆర్సీబీ గుజరాత్ టైటాన్స్పై 5 వికెట్ల తేడాతో గెలుపొంది, వరుసగా రెండో ఎడిషన్లో ఛాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే. క్రెక్స్ ప్రకటించిన ఫ్లాప్ జట్టులో ఛాంపియన్, రన్నరప్ ఆర్సీబీ, గుజరాత్ జట్లలో నుంచి ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. -
‘బాస్ బేబీ’ వైభవ్ గురించి కోహ్లి ఏమన్నాడంటే!
ఐపీఎల్-2026లో వైభవ్ సూర్యవంశీ దుమ్ములేపాడు. రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా పూర్తిస్థాయిలో బరిలోకి దిగిన ఈ బిహారీ పిల్లాడు.. జట్టు ప్లే ఆఫ్స్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్లో మొత్తంగా 16 మ్యాచ్లు ఆడిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 776 పరుగులు సాధించాడు.తద్వారా తాజా ఎడిషన్లో టాప్ రన్ స్కోరర్గా నిలిచి ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకున్నాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi). అంతేకాదు ఒక సీజన్లో అత్యధిక సిక్సర్లు (72) బాదిన ప్లేయర్గానూ నిలిచి.. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు.యూనివర్స్ బాస్ బేబీఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీని అభిమానులు ముద్దుగా ‘యూనివర్స్ బాస్ బేబీ’ అని పిలుచుకుంటున్నారు. ఇక అతడి ఆట తీరుకు టీమిండియా దిగ్గజాలు సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్.. సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్, విండీస్ స్టార్ గేల్ తదితరులు ఇప్పటికే ఫిదా అయిన సంగతి తెలిసిందే.తాజాగా... భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. గుజరాత్ టైటాన్స్తో ఆదివారం నాటి ఫైనల్లో ఆర్సీబీ ‘కింగ్’ కోహ్లి 75 పరుగులతో అజేయంగా నిలిచి.. జట్టు విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.Virat Kohli' talking with "Vaibhav Suryavanshi ❤️ pic.twitter.com/0OVwtASeVp— Priyanka Yadav (@Priyankaji1998) June 1, 2026వైభవ్ సూర్యవంశీతో కోహ్లి ముచ్చటఇక అదే సమయంలో వైభవ్ సూర్యవంశీ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచి.. కింగ్ హవాలోనూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ విజయానంతరం కోహ్లి వైభవ్ సూర్యవంశీతో కాసేపు ముచ్చటించాడు.తనకు వినయంగా నమస్కరించిన ‘బేబీ బాస్’ భుజం తట్టి.. ఆత్మీయంగా హత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ‘‘కింగ్’.. ‘బేబీ బాస్’తో ఏం మాట్లాడాడబ్బా!.. మాకూ తెలిస్తే బాగుండు’ అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు.వైభవ్ గురించి కోహ్లి ఏమన్నాడంటే!ఈ నేపథ్యంలో ఆర్సీబీ దిగ్గజం, కామెంటేటర్ ఏబీ డివిలియర్స్ కోహ్లి.. వైభవ్ గురించి తనతో మాట్లాడిన విషయాన్ని బయటపెట్టాడు. ‘‘విరాట్ ఏం చెప్పాడోనని మీరంతా తెలుసుకోవాలని అనుకుంటున్నారు కదా!.. వైభవ్ ఆరెంజ్ క్యాప్ అందుకోవడానికి స్టేజీ పైకి వెళ్తుంటే విరాట్ నాతో అతడి గురించి మాట్లాడాడు.‘ఏబీ.. ఈ పిల్లాడు చాలా ప్రత్యేకమైన వాడు. ఈ అబ్బాయి చాలా కాలం క్రికెట్ను ఏలగలడు’ అని విరాట్ నాతో అన్నాడు’’ అని డివిలియర్స్ తెలియజేశాడు. కాగా సచిన్ సైతం వైభవ్ రిస్ట్ వర్క్, టెక్నిక్ అద్భుతం అంటూ కొనియాడిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే.. ఫైనల్ వీక్షించేందుకు ఆదివారం అహ్మదాబాద్కు వచ్చాడు వైభవ్ సూర్యవంశీ. ఐసీసీ చైర్మన్ జై షా, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాతో కలిసి మ్యాచ్ను ఆస్వాదించాడు.చదవండి: IPL 2026: వైభవ్ తగ్గేదేలే!.. ఎవరికెంత ప్రైజ్ మనీ? -
ఐపీఎల్ ముగిసింది.. వారంలోపే రంగంలోకి దిగనున్న టీమిండియా
ఐపీఎల్ 2026 ముగిసిన వారం వ్యవధిలోనే టీమిండియా రంగంలోకి దిగనుంది. జూన్ 6 నుంచి ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే ఏకైక టెస్ట్, 3 మ్యాచ్ల వన్డే సిరీస్తో భారత క్రికెట్ జట్టు అంతర్జాతీయ షెడ్యూల్ మొదలుకానుంది. ఈ ఏడాది ఆసాంతం టీమిండియా అన్ని ఫార్మాట్ల సిరీస్లతో బిజీగా ఉండనుంది. ఐపీఎల్ తర్వాత టీమిండియా ఆడబోయే సిరీస్ల వివరాలు ఇలా ఉన్నాయి.భారత్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు పర్యటనజూన్ 6-10: ఆఫ్ఘనిస్తాన్తో ఏకైక టెస్ట్ (ముల్లాన్పూర్)జూన్ 13- ఆఫ్ఘనిస్తాన్తో తొలి వన్డే (ధర్మశాల)జూన్ 17- ఆఫ్ఘనిస్తాన్తో రెండో వన్డే (లక్నో)జూన్ 20- ఆఫ్ఘనిస్తాన్తో మూడో వన్డే (చెన్నై)ఐర్లాండ్లో టీమిండియా పర్యటనజూన్ 26- తొలి టీ20 (బెల్ఫాస్ట్)జూన్ 28- రెండో టీ20 (బెల్ఫాస్ట్)టీమిండియా టూర్ ఆఫ్ ఇంగ్లండ్జులై 1- తొలి టీ20 (చెస్టర్ లీ స్ట్రీట్)జులై 4- రెండో టీ20 (మాంచెస్టర్)జులై 7- మూడో టీ20 (నాటింగ్హమ్)జులై 9- నాలుగో టీ20 (బ్రిస్టల్)జులై 11- ఐదో టీ20 (సౌతాంప్టన్)జులై 14- తొలి వన్డే (ఎడ్జ్బాస్టన్)జులై 16- రెండో వన్డే (కార్డిఫ్)జులై 19- మూడో వన్డే (లండన్)టీమిండియా టూర్ ఆఫ్ జింబాబ్వేజులై 23- తొలి టీ20 (హరారే)జులై 25- రెండో టీ20 (హరారే)జులై 26- మూడో టీ20 (హరారే)టీమిండియా టూర్ ఆఫ్ శ్రీలంక (అధికారికంగా ఖరారు కాలేదు)2 టెస్టులు, 3 టీ20లుఏషియన్ గేమ్స్ 2026 (టీ20 ఫార్మాట్, సెప్టెంబర్ 17 – అక్టోబర్ 3)ఈ ఖండాంతర ఈవెంట్లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతుంది.భారత్లో వెస్టిండీస్ జట్టు పర్యటనసెప్టెంబర్ 27- తొలి వన్డే (తిరువనంతపురం)సెప్టెంబర్ 30- రెండో వన్డే (గౌహతి)అక్టోబర్ 3- మూడో వన్డే (ముల్లాన్పూర్)అక్టోబర్ 6- తొలి టీ20 (లక్నో)అక్టోబర్ 9- రెండో టీ20 (రాంచీ)అక్టోబర్ 11- మూడో టీ20 (ఇండోర్)అక్టోబర్ 14- నాలుగో టీ20 (హైదరాబాద్)అక్టోబర్ 17- ఐదో టీ20 (బెంగళూరు)భారత్లో శ్రీలంక జట్టు పర్యటనడిసెంబర్ 13- తొలి వన్డే (ఢిల్లీ)డిసెంబర్ 16- రెండో వన్డే (బెంగళూరు)డిసెంబర్ 19- మూడో వన్డే (అహ్మదాబాద్)డిసెంబర్ 22- తొలి టీ20 (రాజ్కోట్)డిసెంబర్ 24- రెండో టీ20 (కటక్)డిసెంబర్ 27- మూడో టీ20 (పూణే)భారత్లో జింబాబ్వే జట్టు పర్యటన2027, జనవరి 3- తొలి వన్డే (కోల్కతా)జనవరి 6- రెండో వన్డే (హైదరాబాద్)జనవరి 9- మూడో వన్డే (ముంబై)భారత్లో ఆస్ట్రేలియా పర్యటనజనవరి 21- తొలి టెస్ట్ (నాగ్పూర్)జనవరి 29- రెండో టెస్ట్ (చెన్నై)ఫిబ్రవరి 11- మూడో టెస్ట్ (గౌహతి)ఫిబ్రవరి 19- నాలుగో టెస్ట్ (రాంచీ)ఫిబ్రవరి 27- ఐదో టెస్ట్ (అహ్మదాబాద్) -
అప్పుడు బీసీసీఐ నిషేధం!.. ఇప్పుడీ కుర్రాడికి ‘సలామ్’ కొట్టాల్సిందే!
‘ఈ సాలా కప్ నమ్దూ’ అంటూ పద్దెనిమిదేళ్లుగా ఎదురుచూసిన అభిమానుల కలను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గతేడాది నిజం చేసింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. అయితే, అంతటితో ఆర్సీబీ ఆకలి తీరలేదు.ఆత్మ విశ్వాసంతో ఐపీఎల్-2026లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగి అద్భుత ప్రదర్శనతో మరోసారి టైటిల్ విజేతగా అవతరించింది. అహ్మదాబాద్లో ఆదివారం నాటి ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ను ఓడించి వరుసగా రెండోసారి ట్రోఫీ గెలిచి.. ‘ఈ సాలనూ కప్ నమ్దూ’ (ఈసారీ కప్పు మనదే) అంటూ విజిల్స్ వేయించింది.చివరి నిమిషంలో సువర్ణావకాశంనిజానికి ఆర్సీబీ అ‘ద్వితీయ’విజయంలో పేస్ బౌలింగ్ దళానిదే కీలక పాత్ర. టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ (28 వికెట్లు), ఆస్ట్రేలియా స్టార్ జోష్ హాజిల్వుడ్ (15 వికెట్లు) ముందుండి నడిపించగా... మరో భారత కుర్రాడి పాత్ర కూడా మరువలేనిది. గతేడాది సత్తా చాటినా.. వివాదం కారణంగా చివరి నిమిషంలో యశ్ దయాళ్ దూరం కావడంతో మూడో పేసర్గా సత్తా చాటాల్సిన స్థితిలో తనకు లభించిన అవకాశాన్ని అతడు సమర్థంగా వినియోగించుకున్నాడు.అతడు మరెవరో కాదు జమ్ము కశ్మీర్కు చెందిన 26 ఏళ్ల రసిఖ్ సలామ్. ఈ సీజన్లో 19 వికెట్లతో రాణించి.. తన కెరీర్లోనే చిరస్మరణీయ విజయంలో భాగమయ్యాడు. అనూహ్య మలుపులతో సాగిన కెరీర్లో అతడు ఇక్కడి వరకు రాగలిగాడు.రెండేళ్ల నిషేధం విధించిన బీసీసీఐ!ఐపీఎల్లో 2019లో తొలిసారి ముంబై ఇండియన్స్ తరఫున ఒకే ఒక మ్యాచ్ ఆడి సలామ్ అరంగేట్రం చేశాడు. కొద్ది రోజుల్లోనే ‘తప్పుడు వయసు’ను చూపించిన కారణంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అతడిపై రెండేళ్ల నిషేధం విధించింది. దీంతో 2020 అండర్–19 వరల్డ్ కప్ ఆడే అవకాశం కోల్పోయాడు సలామ.ముంబై అండతో..అయితే ముంబై ఇండియన్స్ అండగా నిలిచి అన్ని సౌకర్యాలతో తమ ప్రైవేట్ క్లబ్లో అతడికి రెండేళ్ల పాటు ప్రాక్టీస్ చేసే అవకాశాన్ని కల్పించింది. ఈ క్రమంలో 2022లో మళ్లీ ఐపీఎల్ అవకాశం దక్కగా కేకేఆర్ 2 మ్యాచ్లే ఆడించింది. ఇక 2023లో సలామ్ గాయంతో ఆటకు దూరమయ్యాడు. కారు ప్రమాదం నుంచి కోలుకొని జాతీయ క్రికెట్ అకాడమీలో సాధన చేస్తున్న రిషభ్ పంత్... సలామ్ బౌలింగ్ పదును చూసి ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్లో అవకాశం కల్పించాడు.రసిఖ్ అంటే ‘నిలకడ’ అలా 2024లో 8 మ్యాచ్లు ఆడే చాన్స్ లభించడంతో సలామ్ ఆకట్టుకున్నాడు. ఇక గతేడాది ఆర్సీబీ రూ.6 కోట్లకు అతడిని తీసుకున్నప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలో రెండు మ్యాచ్లలోనే అవకాశం దక్కింది కానీ జట్టు అతడిలో మంచి భవిష్యత్తును చూసింది. దాని ఫలితం ఈ సారి కనిపించింది. కశ్మీరీ భాషలో రసిఖ్ అంటే ‘నిలకడ’ అని అర్థం.ఈసారి 12 మ్యాచ్లలో నిలకడగా రాణించిన సలామ్ కీలక సమయాల్లో వికెట్లు తీసి జట్టు నమ్మకాన్ని నిలబెట్టి.. జట్టులో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. గుజరాత్ టైటాన్స్తో ఫైనల్లో సీనియర్లు భువీ, హాజిల్వుడ్ కంటే.. సలామ్ మంచి ఎకానమీతో బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 27 పరుగులే ఇచ్చి.. నిశాంత్ సింధు (20), రాహుల్ తెవాటియా (7), రషీద్ ఖాన్ (7) రూపంలో మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. Moments that became memories. Memories that became history. 🏆🎥 Reliving the defining moments of @RCBTweets going back-2️⃣-back in Ahmedabad ❤️#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/mHL9U36rB1— IndianPremierLeague (@IPL) June 1, 2026చదవండి: వైభవ్ తగ్గేదేలే!.. ఎవరికెంత ప్రైజ్ మనీ అంటే?! -
IPL 2026: వైభవ్ తగ్గేదేలే!.. ఎవరికెంత ప్రైజ్ మనీ?
ఐపీఎల్-2026 టోర్నీ ఆదివారంతో ముగిసింది. అహ్మదాబాద్ వేదికగా టైటిల్ పోరులో గుజరాత్ టైటాన్స్ను ఓడించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజేతగా అవతరించింది. తద్వారా వరుసగా రెండోసారి ట్రోఫీ సాధించి సంబరాల్లో మునిగిపోయింది. తొలి టైటిల్ కోసం పద్దెనిమిదేళ్లు ఎదురుచూసిన ఆర్సీబీ గతేడాది ఫైనల్లో.. పంజాబ్ కింగ్స్ను ఓడించి చాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే. అదే జోరు కొనసాగిస్తూ తాజా ఎడిషన్లోనూ జయభేరి మోగించింది.Moments that became memories. Memories that became history. 🏆🎥 Reliving the defining moments of @RCBTweets going back-2️⃣-back in Ahmedabad ❤️#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/mHL9U36rB1— IndianPremierLeague (@IPL) June 1, 2026ఇక ఐపీఎల్ తాజా సీజన్లో చాంపియన్ ఆర్సీబీ, రన్నరప్ గుజరాత్ ప్రైజ్ మనీలతో పాటు.. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ తదితర అవార్డులు గెలిచిన ప్లేయర్లు, వారికి దక్కిన మొత్తం ఎంతో తెలుసుకుందామా?!ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు) వైభవ్ సూర్యవంశీ (రాజస్తాన్) 👉మ్యాచ్లు: 16; పరుగులు: 776 👉ప్రైజ్మనీ: రూ. 10 లక్షలుపర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు) కగిసో రబాడ (గుజరాత్) 👉మ్యాచ్లు: 17; వికెట్లు: 29 👉ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు ఎమర్జింగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ👉ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ👉ప్రైజ్మనీ: రూ. 15 లక్షలు సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ద సీజన్’ వైభవ్ సూర్యవంశీ👉స్ట్రయిక్ రేట్: 237.30 👉ప్రైజ్మనీ: టాటా కార్ ‘బెస్ట్ క్యాచ్’ ఆఫ్ ద టోర్నీ మనీశ్ పాండే (కోల్కతా)👉ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు‘ఫెయిర్ ప్లే’ అవార్డుపంజాబ్ కింగ్స్ అత్యధిక సిక్స్లువైభవ్ (72 సిక్స్లు) 👉ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు అత్యధిక ఫోర్లుసాయి సుదర్శన్ (75 ఫోర్లు)👉ప్రైజ్మనీ: రూ. 10 లక్షలు ‘గ్రీన్ డాట్బాల్స్ ఆఫ్ ద సీజన్’ సిరాజ్ (గుజరాత్) 👉మొత్తం 172 డాట్ బాల్స్ 👉ప్రైజ్మనీ: రూ. 10 లక్షలుటైటిల్ విజేతకు ఎంతంటే?ఐపీఎల్ 19వ సీజన్ విజేతగా నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు రూ. 20 కోట్లు లభించాయి. రన్నరప్ గుజరాత్ టైటాన్స్కు రూ. 12.50 కోట్లు దక్కాయి.వైభవ్దే హవారాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు ఈ సీజన్లో మొత్తం దాదాపుగా రూ. 55 లక్షల ప్రైజ్మనీ గెలిచాడు. ఓ టాటా కారు కూడా అతడి సొంతమైంది.చదవండి: రజతాభిషేకం -
కలలో కూడా ఊహించలేదు.. రాసి పెట్టి ఉంది: రజత్ పాటిదార్
19 ఎడిషన్ల ఐపీఎల్ చరిత్రలో తొలి 17 ఎడిషన్లు టైటిల్ కోసం ముఖం వాచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ.. ఇప్పుడు వరుసగా రెండో ఎడిషన్లో టైటిల్ సాధించి కరువు తీర్చుకుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నిన్న (మే 31) జరిగిన 2026 ఎడిషన్ ఫైనల్లో ఆ జట్టు గుజరాత్ టైటాన్స్పై 5 వికెట్ల తేడాతో గెలుపొంది, టైటిల్ను నిలబెట్టుకుంది.ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఆర్సీబీకి ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. సీజన్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన ఆ జట్టు టాపార్డర్, బౌలింగ్ విభాగాలు తుది సమరంలో చేతులెత్తేశాయి. తొలుత బ్యాటింగ్లో సాధారణ స్కోర్కు (155-8) పరిమితమైన గుజరాత్.. ఆతర్వాత దాన్ని కాపాడుకోవడంలో దారుణంగా విఫలమైంది. విరాట్ కోహ్లి (75 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్తో ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు.ఈ సీజన్ ప్రారంభం నుంచి గుజరాత్ విజయాల్లో ప్రధానపాత్ర పోషించిన బౌలర్లు, ఆఖరి మెట్టుపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. 9వ ఓవర్లో రషీద్ ఖాన్ రెండు వికెట్లు (రజత్, కృనాల్) తీయడం మినహాయించి, ఏ దశలోనూ బౌలర్లు ప్రభావం చూపించలేకపోయారు. కాస్త పొదుపుగా బౌలింగ్ చేయగలిగినా, స్కోర్ మరీ చిన్నది కావడంతో కాపాడుకోలేకపోయారు.ఈ మ్యాచ్ అనంతరం విన్నింగ్ కెప్టెన్ రజత్ పాటిదార్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. వరుసగా రెండో ఏడాది టైటిల్ సాధించడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ట్రోఫీని అందుకున్న తర్వాత మాట్లాడుతూ..ఆర్సీబీకి కెప్టెన్గా వ్యవహరించి వరుసగా రెండు టైటిళ్లు గెలిపిస్తానని కలలో కూడా ఊహించలేదన్నాడు. టాస్ గెలిస్తే ఛేజ్ చేయడమే తమ ప్రణాళిక అని, పవర్ప్లేలోనే గుజరాత్ టాప్-3 బ్యాటర్లను ఔట్ చేయాలని ముందుగానే వ్యూహం సిద్ధం చేసుకున్నామని తెలిపాడు. ఆ ప్లాన్ను బౌలర్లు అద్భుతంగా అమలు చేశారని ప్రశంసించాడు.భువీ, హాజిల్వుడ్, రసిక్, కృనాల్, సుయాశ్ సీజన్ మొత్తం అద్భుతంగా రాణించారని కొనియాడాడు. గతేడాది తొలి టైటిల్ గెలవాలనే ఒత్తిడి ఎక్కువగా ఉండేదని, ఈసారి మాత్రం జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిందని చెప్పుకొచ్చాడు. సీజన్ ప్రారంభం నుంచి మంచి క్రికెట్ ఆడటమే తమకు ధైర్యాన్ని ఇచ్చిందన్నాడు.తన బ్యాటింగ్లో మెరుగుదల కోసం టోర్నీకి ముందు ప్రత్యేకంగా శ్రమించానని, వేగవంతమైన బౌలర్లపై కొన్ని షాట్లను మెరుగుపర్చుకునేందుకు కృషి చేశానని తెలిపాడు. ఈ క్రమంలో దినేశ్ కార్తీక్, విరాట్ కోహ్లి సహా పలువురు సీనియర్ల నుంచి విలువైన సూచనలు అందాయని చెప్పాడు.కోహ్లీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ.. మైదానంలోనూ, బయటా జట్టు కోసమే ఆలోచిస్తాడు. ముఖ్యంగా కొత్త ఆటగాళ్ల వద్దకు తానే వెళ్లి మాట్లాడతాడు. వారికి ధైర్యం ఇస్తాడు. జట్టుకు అతను గొప్ప బలమని కొనియాడాడు.చివరగా అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ "ఈసారి కూడా కప్ మనదే (Ee Sala Nu Cup Namdu) అంటూ అభిమానులకు ట్రోఫీని అంకితం చేశాడు. -
ఫైనల్లో ఓటమి అనంతరం గిల్ విశ్లేషణ
నిన్న (మే 31) జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్లో ఆర్సీబీ చేతిలో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్లో గుజరాత్ ఆర్సీబీకి ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. తొలుత బ్యాటింగ్లో సాధారణ స్కోర్కు (155-8) పరిమితమై, ఆతర్వాత దాన్ని కాపాడుకోవడంలో దారుణంగా విఫలమైంది. విరాట్ కోహ్లి (75 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్తో ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు.సీజన్ ఆధ్యాంతం గుజరాత్ విజయాల్లో ప్రధానపాత్ర పోషించిన బౌలర్లు తుది సమరంలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. 9వ ఓవర్లో రషీద్ ఖాన్ రెండు వికెట్లు (రజత్, కృనాల్) తీయడం మినహా, మిగతా బౌలర్లు చేసిందేమీ లేదు. కాస్త పొదుపుగా బౌలింగ్ చేయగలిగినా, స్కోర్ మరీ చిన్నది కావడంతో కాపాడుకోలేకపోయారు. మ్యాచ్ అనంతరం గుజరాత్ సారధి శుభ్మన్ గిల్ విశ్లేషణ ఇలా ఉంది. "180-190 పరుగులు చేసుంటే, మ్యాచ్ మరింత పోటీగా ఉండేది. పిచ్ పూర్తిగా స్లోగా లేదు. ఆరంభ ఓవర్లలో మాత్రం పేసర్లకు కొంత సహకారం లభించింది.ఆదిలోనే వికెట్లు కోల్పోవడం జట్టు మోమెంటంను దెబ్బతీసింది. మధ్య ఓవర్లలో వేగంగా పరుగులు చేయలేకపోవడం కష్టాలను అధికం చేసింది. ఫైనల్ మ్యాచ్ కావడంతో 150-160 పరుగులు చేసినా, పవర్ప్లేలో రెండు-మూడు వికెట్లు తీసుంటే పోటీలో ఉండేవాళ్లం.టార్గెట్ను కాపాడుకునే క్రమంలో పవర్ప్లేలో 15-20 పరుగులు ఎక్కువగా ఇచ్చేశాము. ఆ దశలో ప్రత్యర్థిని 50-55 పరుగులకు కట్టడి చేసి ఉంటే మ్యాచ్ మరోలా ఉండేది.సీజన్ మొత్తాన్ని పరిశీలిస్తే, మా బౌలింగ్ యూనిట్ అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా నిలిచింది. తొలి రెండు మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత కూడా జట్టు వెనక్కి తగ్గకుండా, చిన్నచిన్న అంశాల్లో మెరుగుపడుతూ బలంగా తిరిగి వచ్చింది.తుది మెట్టుపై ట్రోఫీ చేజారినా ఈ సీజన్ చాలా సంతృప్తినిచ్చింది. గెలిచినా, ఓడినా మెరుగుపర్చుకోవాల్సిన అంశాలు ఎప్పుడూ ఉంటాయి. జట్టుగా ఇంకా అభివృద్ధి చెందాల్సిన అంశాలపై దృష్టి పెడతాము" -
గుజరాత్ టైటాన్స్కు తప్పిన పెను ప్రమాదం
ఐపీఎల్ 2026 ఫైనల్లో ఓటమి బాధ నుంచి కోలుకోకముందే, గుజరాత్ టైటాన్స్కు మరో ఊహించని షాక్ తగిలింది. మ్యాచ్ ముగిసిన తర్వాత వారు ప్రయాణిస్తున్న టీమ్ బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.బస్సులో పొగ వ్యాపించడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆటగాళ్లను బయటకు దించారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం లేదా క్యాజువాలిటీలు లేవు. ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ సురక్షితంగా బయటపడినట్లు సమాచారం.ఊహించని ఈ ఘటన కారణంగా గుజరాత్ బృందం మొత్తం దాదాపు గంటపాటు రోడ్డుపైనే వేచి ఉండాల్సి వచ్చింది. అనంతరం నిర్వాహకులు మరో బస్సును ఏర్పాటు చేసి వారిని హోటల్కు తరలించారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం నుంచి హోటల్కు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.కాగా, నిన్న (మే 31) రాత్రి జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్పై ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, వరుసగా రెండో ఏడాది ఛాంపియన్గా నిలిచింది.ఈ మ్యాచ్లో గుజరాత్ ఏ దశలోనూ ఆర్సీబీకి పోటీనివ్వలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసి సాధారణ స్కోర్కు (155-8) పరిమితమైన ఆ జట్టు.. అనంతరం దాన్ని కాపాడుకోవడంలో దారుణంగా విఫలమైంది. విరాట్ కోహ్లి (75 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. -
స్వియాటెక్కు కొస్టుక్ షాక్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో ఈసారి సంచలనాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పురుషుల సింగిల్స్ విభాగంలో ఈ ఏడాది కొత్త చాంపియన్ అవతరించడం ఖరారు కాగా... మహిళల సింగిల్స్ విభాగంలోనూ వరుసగా రెండో ఏడాది కొత్త విజేత రావడం ఖాయమైంది. మహిళల సింగిల్స్ బరిలో మిగిలిన నాలుగుసార్లు చాంపియన్, ప్రపంచ మూడో ర్యాంకర్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)కు ఆదివారం అనూహ్య పరాజయం ఎదురైంది. దాంతో ఈసారీ మహిళల సింగిల్స్లో కొత్త క్వీన్ అవతరించనుంది. 15వ సీడ్ మార్టా కొస్టుక్ (ఉక్రెయిన్) అద్భుత ఆటతీరుతో మెరిపించి 7–5, 6–1తో ‘బర్త్డే గర్ల్’ స్వియాటెక్ను బోల్తా కొట్టించి తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్ బెర్త్ దక్కించుకుంది. 2019 తర్వాత స్వియాటెక్ రెండోసారి ఈ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. 2020లో తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్గా నిలిచిన స్వియాటెక్ 2021లో క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. 2022, 2023, 2024లలో టైటిల్ నెగ్గి ‘హ్యాట్రిక్’ నమోదు చేసిన ఈ పోలాండ్ స్టార్...గత ఏడాది సెమీఫైనల్లో ఓడిపోయింది. 99 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో కొస్టుక్ ఐదు ఏస్లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్లు చేసింది. తొలి సర్వీస్లో 33 పాయింట్లు, రెండో సరీ్వస్లో 12 పాయింట్లు స్కోరు చేసింది. తన సర్వీస్ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సరీ్వస్ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. 25 విన్నర్స్ కొట్టిన ఈ ఉక్రెయిన్ భామ, 27 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు స్వియాటెక్ ఒక్క ఏస్ కూడా కొట్టకుండానే, ఐదు డబుల్ ఫాల్ట్లు చేసింది. 13 విన్నర్స్ కొట్టిన ఆమె, 39 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. ‘నేనింకా షాక్లోనే ఉన్నా. నాలుగుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన ప్లేయర్ను ఓడించానంటే నమ్మశక్యంగా లేదు’ అని ఈ ఏడాది క్లే కోర్టు సీజన్లో ఓటమి రుచి చూడని కొస్టుక్ వ్యాఖ్యానించింది. మరోవైపు ఏడో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్), ఎనిమిదో సీడ్ మిరా ఆండ్రీవా (రష్యా), 18వ సీడ్ సొరానా కిర్స్టీ (రొమేనియా) కూడా క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్లో స్వితోలినా 4–6, 6–4, 6–0తో 11వ సీడ్ బెలిండా బెన్చిచ్ (స్విట్జర్లాండ్)పై, ఆండ్రీవా 6–3, 6–2తో జిల్ టెక్మన్ (స్విట్జర్లాండ్)పై, కిర్స్టీ 6–3, 7–6 (7/4)తో జియు వాంగ్ (చైనా)పై గెలిచారు. శనివారం జరిగిన మూడో రౌండ్లో డిఫెండింగ్ చాంపియన్, నాలుగో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 6–4, 6–7 (1/7), 4–6తో అనస్తాసియా పొటపోవా (ఆ్రస్టియా) చేతిలో ఓటమి చవిచూసింది. క్వార్టర్ ఫైనల్లో జ్వెరెవ్ పురుషుల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్, ప్రపంచ మూడో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) వరుసగా ఆరో ఏడాది క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. జెస్పర్ డి జాంగ్ (నెదర్లాండ్స్)తో ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో జ్వెరెవ్ 7–6 (7/3), 6–4, 6–1తో గెలుపొందాడు. డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్) గాయంతో ఈ టోర్నీకి దూరంగా ఉండటం... ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ (ఇటలీ) రెండో రౌండ్లో... మాజీ విజేత, సెర్బియా దిగ్గజం జొకోవిచ్ మూడో రౌండ్లో వెనుదిరగడంతో... జ్వెరెవ్ టైటిల్ ఫేవరెట్గా అవతరించాడు. జ్వెరెవ్ తన స్థాయికి తగ్గట్టు ఆడితే పారిస్లో ‘గ్రాండ్స్లామ్ టైటిల్’ కలను నిజం చేసుకుంటాడు. 2025 ఆ్రస్టేలియన్ ఓపెన్లో.. 2024 ఫ్రెంచ్ ఓపెన్లో... 2020 యూఎస్ ఓపెన్లో ఫైనల్ చేరిన జ్వెరెవ్ మూడుసార్లూ ఓడిపోయి రన్నరప్గా నిలిచాడు. మరోవైపు స్పెయిన్ రైజింగ్ స్టార్ రాఫెల్ జొడార్ ఆడుతున్న రెండో గ్రాండ్స్లామ్ టోర్నీలోనే క్వార్టర్ ఫైనల్కు చేరాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో 19 ఏళ్ల జొడార్ 4–6, 4–6, 6–1, 6–2, 6–2తో పాబ్లో కరెనో బుస్టా (స్పెయిన్)పై గెలిచాడు. మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో యూకీ బాంబ్రీ (భారత్)–అలెగ్జాండ్రా పనోవా (రష్యా) ద్వయం 1–6, 3–6తో డెసిరె క్రాసిక్ (అమెరికా)–నీల్ స్కప్స్కీ (బ్రిటన్) జోడీ చేతిలో ఓడిపోయింది. -
IPL 2026: సత్తా చాటిన యంగ్ గన్స్
గత రెండు నెలలుగా మండు వేసవిలో నిండు వినోదం పంచిన ఐపీఎల్ 19వ సీజన్ ముగిసింది! ‘బేబీ బాస్’ వైభవ్ రికార్డులు తిరగరాస్తూ వీరబాదుడు బాదితే... అనామక అన్షుల్ ‘పర్పుల్ క్యాప్’ రేసులో చివరి వరకు నిలిచాడు!జోఫ్రా ఆర్చర్ తన పేస్ పవర్ తగ్గలేదని నిరూపించుకుంటే... రబాడ తానెంత ప్రమాదకర బౌలరో మరోసారి చాటాడు!ఐదేసిసార్లు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ సీజన్ ఆసాంతం పరాజయాలతో సహవాసం చేయగా... లక్నో సూపర్ జెయింట్స్ను నడిపించలేక రిషభ్ పంత్ నాయకత్వ బాధ్యతలకు రాం రాం చెప్పాడు! చెన్నై భారీ ధర పెట్టిన కార్తీక్, ప్రశాంత్ పెద్దగా ఆకట్టుకోలేకపోగా... హైదరాబాద్ కొత్త పేసర్లు ప్రఫుల్, సాకిబ్ లీగ్పై తమదైన ముద్ర వేశారు!ఢిల్లీ హార్డ్ హిట్టర్ సమీర్ రిజ్వీ మెరుపులు ఆరంభ మ్యాచ్లకే పరిమితమైతే... లక్నో పించ్హిట్టర్ ముకుల్ ఒక్క ఇన్నింగ్స్తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు!అంతర్జాతీయ టి20లకు వీడ్కోలు పలికినా తన పరుగుల దాహం తీరలేదని కోహ్లి నిరూపించుకుంటే... లయ దొరకబుచ్చుకోలేక సూర్యకుమార్, హార్దిక్ విమర్శల పాలయ్యారు!వెస్టిండీస్ ప్లేయర్ల విధ్వంసకర విన్యాసాలు కొన్ని మ్యాచ్లకే పరిమితం కాగా... అన్క్యాప్డ్ ప్లేయర్ల మెరుపులు భారత బెంచ్ బలాన్ని చాటాయి! టెస్టు ప్లేయర్లుగా ముద్రపడ్డ ఆటగాళ్లు ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో ముందుంటే.. దేశవాళీల్లో రాణించిన అఖీబ్ నబీ ఐపీఎల్లో అదే జోరు కనబర్చలేకపోయాడు!ఇలా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్లో జరిగిన కొన్ని కీలక అంశాలపై ఓ కన్నేస్తే... 10 జట్లు, 65 రోజులు, 74 మ్యాచ్లు, వందలకొద్దీ రికార్డులు, వేలాది బౌండరీలు... ఇలా వేసవిలో మస్తు మజా పంచిన ఐపీఎల్–19వ సీజన్ ఎప్పటిలాగే కోట్లాది మంది అభిమానాన్ని చూరగొంది. దినదిన ప్రవర్ధమానంగా దూసుకెళ్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్... ఈసారి కూడా ఎందరో యువ ఆటగాళ్లను అందలం ఎక్కించింది. బ్యాటింగ్కు అనుకూలమైన నిబంధనల కారణంగా భారీ స్కోర్లు నమోదయ్యాయనే అపవాదు ఉన్నా... ఈ సీజన్లో పరుగుల వరద పారిందనేది వాస్తవం. 200 స్కోరు సాధారణం అయిపోయిన తరుణంలో... రాజస్తాన్ రాయల్స్ తమ పదునైన బౌలింగ్తో 159 పరుగుల మ్యాచ్లో 40 పరుగుల తేడాతో విజయం సాధించడం విశేషం. మొహమ్మద్ షమీ తొలి బంతికి వికెట్ తీసే అలవాటును కొనసాగించగా... ప్రిన్స్ యాదవ్ తన వేగంతో టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. 264 పరుగులు చేసి కూడా ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ గెలవలేకపోగా... అంత పెద్ద లక్ష్యాన్ని పంజాబ్ మరో 7 బంతులుండగానే ఛేదించి ‘వావ్’ అనిపించింది. గత సీజన్లోనే మెరుపు సెంచరీతో వెలుగులోకి వచ్చిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది నిలకడైన బాదుడుతో ప్రపంచవ్యాప్తంగా తనపేరు మారుమోగేలా చేసి భారత సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ‘టెస్టు’ ప్లేయర్ల సత్తా... అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ ఎందులో తీసుకున్న టెస్టు ప్లేయర్లే ఐపీఎల్లో తమదైన ముద్ర వేశారు. బౌలింగ్లో రబాడ, ఆర్చర్, భువనేశ్వర్ విజృంభిస్తే... బ్యాటింగ్లో శుబ్మన్ గిల్, సాయి సుదర్శన్ సత్తా చాటారు. టీమిండియా టెస్టు కెపె్టన్ గిల్ 16 మ్యాచ్ల్లో 45.75 సగటుతో 732 పరుగులు సాధించి సెలెక్టర్లకు సవాల్ విసిరాడు. ఈ ఏడాది టి20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయన గిల్... తాజా సీజన్లో తన బ్యాట్తోనే బదులిచ్చాడు. నిదానంగా ఆడతాడనే ముద్రను చెరిపేసుకుంటూ 163.02 స్ట్రయిక్రేట్తో చెలరేగిపోయాడు. క్వాలిఫయర్–2 మ్యాచ్ను పరిశీలిస్తే అతడి ధాటి ఎలాంటిదో అర్థమవుతుంది. వైభవ్ సూర్యవంశీ మినహా మిగిలినవాళ్లంతా బ్యాటింగ్ చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడిన పిచ్పై గిల్ మంచినీళ్ల ప్రాయంలా పరుగులు రాబట్టాడు. ఆర్చర్, బర్గర్, బ్రిజేశ్, జడేజాతో కూడిన బౌలింగ్ లైనప్ను ఎదుర్కొంటూ 53 బంతుల్లోనే 104 పరుగులు చేశాడు. అందులో ఎక్కడా మచ్చుకు కూడా అడ్డదిడ్డమైన బాదుడు లేదు. అచ్చమైన క్రికెటింగ్ షాట్లతో చాపకింద నీరులా పరుగులు సాధిస్తూ చూస్తుండగానే రాయల్స్ చేతుల్లో నుంచి మ్యాచ్ను లాగేసుకున్నాడు. పట్టు సాధించేంత వరకు సిక్స్ల జోలికి పోని గిల్... సరైన టైమింగ్ వాడితే ఎంతటి లక్ష్యాన్ని అయినా చేధించవచ్చని నిరూపించాడు. మరోవైపు అతడి ఓపెనింగ్ సహచరుడు సాయి సుదర్శన్ కూడా ఈ సీజన్లో తనదైన ముద్ర వేశాడు. భారత టెస్టు జట్టు సభ్యుడైన సుదర్శన్ తాజా సీజన్లో 17 మ్యాచ్ల్లో 45.13 సగటుతో 722 పరుగులు సాధించాడు. గిల్, సుదర్శన్ల ఆటతీరు కారణంగానే టైటాన్స్ నిలకడైన ప్రదర్శన కొనసాగించగలిగిందనేది నిజం! టెస్టు ప్లేయర్లుగా ముద్ర పడ్డ ఈ ఇద్దరూ ఎక్కడా తొందరపాటుకు పోకుండా ఆచితూచి ఆడటంతోనే పరుగుల వీరుల జాబితాలో చోటు దక్కించుకోగలిగారు. ఫార్మాట్ ఏదైనా టెక్నిక్ ముఖ్యం అని ఈ జంట మరోసారి చాటింది. అన్షుల్ అదుర్స్ రంజీ ట్రోఫీ ఒకే ఇన్నింగ్స్లో 10కి 10 వికెట్లు పడగొట్టి వెలుగులోకి వచ్చిన అన్షుల్ కంబోజ్... ఈ సీజన్లో తనదైన ముద్ర వేశాడు. చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహించిన ఈ కుడిచేతి వాటం పేసర్... 14 మ్యాచ్ల్లో 26.32 సగటుతో 21 వికెట్లు పడగొట్టాడు. మిగతా జట్లతో పోల్చుకుంటే... పాతికేళ్ల అన్షుల్కు మరో ఎండ్ నుంచి సరైన సహకారం లేనçప్పటికీ అతడు నిలకడైన ప్రదర్శన కనబర్చాడు. కోల్కతా నైట్రైడర్స్ పేసర్ కార్తీక్ త్యాగీ మంచి వేగంతో అభిమానులను ఆకర్షించాడు. ఈ సీజన్లో అతడు 13 ఇన్నింగ్స్ల్లో 27.66 సగటుతో 18 వికెట్లు పడగొట్టాడు. ప్రిన్స్ యాదవ్ 14 మ్యాచ్ల్లో 28.68 సగటుతో 16 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. 36 ఏళ్ల వయసులో భువనేశ్వర్ తన స్వింగ్ సత్తా ఏంటో ప్రపంచానికి చాటాడు. కళ్లు చెదిరే అవుట్ స్వింగర్లతో బెంగళూరుకు ఇతోధిక సాయం చేశాడు. భారీగా పరుగులు ఇచ్చుకుంటాడనే ముద్రపడ్డ సిరాజ్ ఈసారి పొదుపైన బౌలింగ్తో ఆకట్టుకుంటే... టి20 ప్రంపచకప్ హీరోలు జస్ప్రీత్ బుమ్రా, అర్ష్ దీప్ సింగ్ అనామక బౌలర్లుగా కనిపించారు. వారెవ్వా వైభవ్ సూర్యవంశీ... నూనుగు మీసాలు కూడా రాని ఓ 15 ఏళ్ల కుర్రాడు... అంతర్జాతీయ స్థాయిలో కొమ్ములు తిరిగిన బౌలర్లను ఊచకోత కోయడం ఈ సీజన్కే హైలైట్గా నిలిచింది. గత సీజన్లో 35 బంతుల్లో సెంచరీతో తన రాకను ఘనంగా చాటిన రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ... ఈ ఏడాది ప్రతి క్రికెట్ అభిమాని తన పేరు జపించేలా చేశాడు. 16 మ్యాచ్ల్లో 48.50 సగటుతో 776 పరుగులు చేసి ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్గా నిలిచాడు. మామూలుగా ఒక వంద పరుగులు రెండొందల స్ట్రయిక్ రేట్తో కొట్టడమే కష్టం అనుకుంటే... వైభవ్ 776 పరుగులను ఏకంగా 237.30 స్ట్రయిక్రేట్తో బాదాడు. గణాంకాలు చూస్తే అతడి దూకుడును అర్ధం చేసుకోవడం కష్టమే. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర బౌలర్లను అతడు ఎదుర్కొన్న తీరు మాత్రం నభూతో! మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, జస్ప్రీత్ బుమ్రా వంటి వాళ్ల బౌలింగ్లో ఏమాత్రం బెరుకు లేకుండా తొలి బంతికే సిక్స్లు కొట్టిన అతడి తెగువకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. ఈ సీజన్లో ఒక సెంచరీ తన పేరిట రాసుకున్న వైభవ్... మరో రెండుసార్లు శతకం గుమ్మం వద్ద అవుటయ్యాడు. ఫోర్ (63)ల కంటే సిక్స్ (72)లే ఎక్కువ కొట్టిన సూర్యవంశీ... అవసరమైతే నిదానంగానూ ఆడగలనని క్వాలిఫయర్–2లో నిరూపించుకున్నాడు. సహచరుల విఫలమైన చోట వికెట్ విలువ గుర్తెరిగి ఆచితూచి ఆడటంతోనే అతడిపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. 90వ దశకంలో సచిన్ టెండూల్కర్ తరహాలో... రాజస్తాన్ రాయల్స్ జట్టును ఈ సీజన్లో వైభవ్ తన భుజస్కందాలపై మోశాడు. అతడు ఇదే నిలకడ, క్రమశిక్షణ, కఠోర శ్రమ కొనసాగిస్తే... క్రికెట్కు మరో ఆణిముత్యం దొరికినట్లే! –సాక్షి, క్రీడావిభాగం -
‘రజతాభిషేకం’
ఐపీఎల్లో వరుసగా రెండు టైటిల్స్ నెగ్గిన కెప్టెన్లు గతంలో ఇద్దరు ఉన్నారు. అయితే మిగతా ఇద్దరిలో పోలిస్తే నాయకుడిగా రజత్ పాటీదార్ ప్రస్థానం ఎంతో భిన్నం. రెండు ట్రోఫీలు గెలిపించే సమయానికి ధోని దిగ్గజ కెప్టెన్గా గుర్తింపు పొంది రెండు ప్రపంచ కప్లు కూడా అందించాడు. రోహిత్ వరుసగా రెండు గెలవడానికి ముందే కెప్టెన్గా అతని ఖాతాలో మరో మూడు కప్లు ఉన్నాయి. కానీ పాటీదార్ భారత్ తరఫున తన చివరి టెస్టును 2024లో, ఏకైక వన్డేను 2023లో ఆడాడు. ఆ తర్వాత మళ్లీ అతనికి టీమిండియా అవకాశం దక్కలేదు.గత ఏడాది పాటీదార్ను కెప్టెన్గా ఎంపిక చేసినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. మితభాషి, తన భావనలను ప్రదర్శించలేని అతను సారథిగా ఏం చేస్తాడు అని భావించారు. ద్రవిడ్, పీటర్సన్, కుంబ్లే, వెటోరి, కోహ్లిలాంటి దిగ్గజాల వల్ల సాధ్యం కాని భారం అతనిపై మోపినట్లు అనిపించింది. దాదాపు రెండేళ్ల క్రితం మొదటిసారి పాటీదార్ను కెప్టెన్గా చేయాలనే ఆలోచన వచ్చిప్పుడు ఆర్సీబీ డైరెక్టర్ బొబాట్, కోచ్ ఫ్లవర్ చిన్నపాటి ఇంటర్వ్యూ చేశారు. జట్టు పరిస్థితి బాగుపర్చేందుకు కెప్టెన్గా ఏం సూచిస్తావు అని అడిగారు. టీమ్ వాతావరణం, నమ్మకం, ముందుండి నడిపించడంలాంటి రొటీన్ మాటలు అతను చెప్పలేదు.‘పదునైన పేస్ బౌలింగ్ బృందం కావాలి’ అని ఒకే ఒక్క మాటతో ముగించాడు. ముస్తాక్ అలీ ట్రోఫీలో కెప్టెన్గా మధ్యప్రదేశ్ను నడిపించిన తీరు చూసి కోహ్లి అనుమతితో వెంటనే పాటీదార్ను కెప్టెన్గా నియమించారు. స్టార్ ఆటగాడిగా గుర్తింపు లేదు. ప్రత్యేక ఆకర్షణగా ఎక్కడా కనిపించడు. టీమ్ సమావేశాల్లో కూడా గలగలా మాట్లాడే అలవాటు లేదు. కానీ ఒక్కసారి మైదానంలోకి దిగిన తర్వాతే అతనిలోని కెప్టెన్ బయటకు వస్తాడు. ఆ తర్వాత తాను స్వేచ్ఛగా పని చేస్తాడు. సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాడు. ఈ లక్షణాలే అతని సారథ్యంపై నమ్మకం ఉంచేందుకు కారణం అయ్యాయని ఆర్సీబీ మేనేజ్మెంట్ వెల్లడించింది. ఆటగాడిగా కూడా అతను ఒక్కసారిగా ఐపీఎల్ వేదికపై దూసుకురాలేదు. 2021లో ఆర్సీబీ తరఫున 4 మ్యాచ్లలో 71 పరుగులే చేయడంతో తర్వాతి ఏడాది జట్టు అతడిని వదిలేసుకుంది. అయితే గాయంతో లవ్నీత్ తప్పుకోవడంతో అతని స్థానంలో 2022లో మళ్లీ చాన్స్ దక్కగా, లక్నోపై అద్భుత సెంచరీతో సత్తా చాటాడు. తర్వాతి సీజన్ గాయంతో దూరమైనా...గత ఏడాది కెప్టెన్గా అసాధారణ విజయాన్ని అందించాడు. తాజా సీజన్లో బ్యాటర్గా కూడా అతను విధ్వంసం సృష్టించాడు. 14 ఇన్నింగ్స్లలో 30 ఫోర్లు, 42 సిక్సర్లు సహా ఏకంగా 192.69 స్ట్రయిక్రేట్తో 501 పరుగులు నమోదు చేసి కోహ్లి తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. ఆదివారమే ఫైనల్ ముగియగా... తన 33వ పుట్టిన రోజున అందుకున్న రెండో ట్రోఫీతో రజత్ పాటీదార్ తన పేరును ప్రత్యేకంగా లిఖించుకున్నాడు. -
మళ్లీ వేటాడేసింది...
‘సుదీర్ఘ కాలం మనం వేటాడబడ్డాం... ఇకపై వేటగాళ్లలా మారిపోవాలి. ఇది ఆరంభం మాత్రమే. విజయాన్ని వ్యసనంగా మార్చుకోవాలి. వరుసగా రెండుసార్లు టైటిల్ సాధించిన జట్టుగా మనం కూడా నిలవగలం’... గత ఏడాది ట్రోఫీని గెలుచుకున్న తర్వాత ఆర్సీబీ డైరెక్టర్ బొబాట్ డ్రెస్సింగ్రూమ్లో చేసిన వ్యాఖ్య ఇది. ఆ సమయంలో విజయోత్సాహంతో చెప్పిన మాటలుగానే ఇవి మిగిలిపోలేదు. నాడు జట్టులో కనిపించిన ఆత్మవిశ్వాసం, అద్భుత ప్రదర్శన స్ఫూర్తిగా ఈసారి కూడా బెంగళూరు దూసుకుపోయింది. దాదాపు అదే తరహా ప్రణాళికతో సరిగ్గా సంవత్సరం తర్వాత టీమ్ మళ్లీ చాంపియన్గా నిలిచి సత్తా చాటింది. ఒక్క టైటిల్తో ఆగిపోకుండా తమ ఆకలిని తీర్చుకుంటూ వరుసగా రెండో ట్రోఫీని గెలుచుకొని సగర్వంగా నిలిచింది.తేదీలు మారడం మినహా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రస్థానం సరిగ్గా 2025 తరహాలోనే సాగి టైటిల్ వరకు చేరింది. లీగ్ దశలో 9 విజయాలతో అగ్రస్థానం, తొలి క్వాలిఫయర్లో ఏకపక్ష గెలుపుతో ఫైనల్కు... తుది పోరులో కూడా సంపూర్ణ ఆధిపత్యం... డిఫెండింగ్ చాంపియన్గా సొంతగడ్డ బెంగళూరులో మళ్లీ ట్రోఫీనిముద్దాడతామని గత ఏడాది గర్వంగా చెప్పినా... వేర్వేరు కారణాలతో అది జరగలేదు. కానీ మళ్లీ అదే అహ్మదాబాద్ వేదికపై విజయానందాన్ని సొంతం చేసుకుంది. 18వ సీజన్లో తొలిసారి ‘ఈ సాలా కప్ నమ్దు’ అంటూ గర్జించిన జట్టు మరోసారి అదే ధ్వనిని బిగ్గరగా వినిపించింది. నాడు విజేతగా నిలిచిన జట్టులోని 13 మంది ఈసారి కూడా గెలుపులో భాగమై తమ ఆనందాన్ని రెట్టింపు చేసుకున్నారు. ఇరు జట్ల మధ్య తొలి క్వాలిఫయర్ పూర్తి ఏకపక్షంగా సాగగా... ఈసారి గుజరాత్ టైటాన్స్ కాస్త మెరుగ్గా ఆడింది. అయితే భయపడినట్లే గిల్, సుదర్శన్, బట్లర్ వైఫల్యం తర్వాత జట్టు కోలుకోలేకపోయింది. ఆర్సీబీ బౌలర్లు పదునైన బంతులతో ప్రత్యర్థిని కట్టి పడేశారు. సరిగ్గా నెలరోజుల క్రితం ఇదే మైదానంలో టైటాన్స్తో పోరులో సరిగ్గా 155 పరుగులే చేసి ఆర్సీబీ ఓడగా... ఇప్పుడు అసలు పోరులో సీన్ రివర్స్ అయింది. ఛేదనలో కోహ్లి, వెంకటేశ్ అయ్యర్ మెరుపు ఆరంభంతో ఆర్సీబీ విజయానికి బాట పడింది. ఆ తర్వాత కాస్త తడబాటు ఎదురైనా... దిగ్గజ ఆటగాడిగా ఛేదనలో తన స్థాయిని చూపిస్తూ దూసుకుపోయిన కోహ్లి భారీ సిక్స్తో విన్నింగ్ షాట్ కొట్టడంతో ఆర్సీబీ బృందంలో సంబరాలు షురూ అయ్యాయి. అహ్మదాబాద్: ఐపీఎల్లో వరుసగా రెండుసార్లు విజేతగా నిలిచిన మూడో జట్టుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన ఆర్సీబీ ఐపీఎల్–2026 టైటిల్ను గెలుచుకుంది. నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (37 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో రసిఖ్ సలామ్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బెంగళూరు 18 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులు చేసి గెలిచింది. విరాట్ కోహ్లి (42 బంతుల్లో 75 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్లు) చెలరేగిపోగా, వెంకటేశ్ అయ్యర్ (16 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడాడు. టపటపా... ప్రతీ సీజన్లో జట్టు బ్యాటింగ్ భారం మోస్తున్న ముగ్గురు ప్రధాన బ్యాటర్లు తొందరగా వెనుదిరగడంతోనే గుజరాత్ భారీ స్కోరు ఆశలు కోల్పోయింది. శుబ్మన్ గిల్ (8 బంతుల్లో 10; 2 ఫోర్లు), సాయి సుదర్శన్ (12 బంతుల్లో 12; 2 ఫోర్లు) నాలుగు పరుగుల వ్యవధిలో అవుట్ కాగా, నిశాంత్ సింధు (18 బంతుల్లో 20; 3 ఫోర్లు) ప్రభావం చూపలేదు. పవర్ప్లేలో జట్టు 45 పరుగులే చేసింది. క్రీజ్లో ఉన్నంత సేపు తడబడిన జోస్ బట్లర్ (23 బంతుల్లో 19; 1 ఫోర్) సహనం కోల్పోయి వికెట్ సమర్పించుకున్నాడు. ఈ దశలో సుందర్ కొంత పట్టుదలగా నిలబడినా... అతనూ పెద్ద షాట్లు కొట్టలేకపోయాడు. 4 పరుగుల వద్ద కాక్స్ క్యాచ్ అందుకున్నా... రీప్లేలో బంతి గ్రౌండ్కు తాకిందని తేలడంతో అతను బతికిపోయాడు. మరోవైపు అర్షద్ ఖాన్ (6 బంతుల్లో 15; 2 సిక్స్లు) కొన్ని పరుగులు జోడించగా, తర్వాతి బ్యాటర్లంతా పూర్తిగా చేతులెత్తేశారు. ఒక దశలో వరుసగా 40 బంతుల పాటు ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయిన గుజరాత్ ఇన్నింగ్స్లో 13వ ఓవర్ నాలుగో బంతికి గానీ తొలి సిక్స్ రాలేదు! తొలి 10 ఓవర్లలో 62 పరుగులు చేసిన జట్టు తర్వాతి 10 ఓవర్లలో 92 పరుగులు రాబట్టింది. శుభారంభం... ఛేదనలో వెంకటేశ్, కోహ్లి జట్టుకు మెరుపు ఆరంభాన్ని అందించారు. తొలి ఓవర్లో సిరాజ్ 5 పరుగులే ఇచ్చినా... రబాడ వేసిన తర్వాత ఓవర్లో వెంకటేశ్ 3 ఫోర్లు, సిక్స్ బాదాడు. సిరాజ్ రెండో ఓవర్లోనూ 3 బౌండరీలు రాగా... రబాడ తర్వాతి ఓవర్లో కోహ్లి వరుసగా 4, 4, 6, 4తో చెలరేగిపోయాడు. వెంకటేశ్, పడిక్కల్ (1) పరుగు తేడాతో వెనుదిరగ్గా... పవర్ప్లేలో జట్టులో 70 పరుగులు చేసింది. ఆ తర్వాత కెపె్టన్ రజత్ పాటీదార్ (13 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్స్), కృనాల్ పాండ్యా (1)లను రషీద్ ఒకే ఓవర్లో అవుట్ చేసి కొంత ఒత్తిడి పెంచాడు. అయితే కోహ్లి మాత్రం తగ్గకుండా దూసుకుపోయాడు. 25 బంతుల్లో అతని అర్ధసెంచరీ పూర్తయింది. టిమ్ డేవిడ్ (17 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక పరుగులు జోడించగా... విరాట్ చివరి వరకు నిలిచి జట్టును విజయతీరం చేర్చాడు.స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి) జితేశ్ (బి) భువనేశ్వర్ 12; గిల్ (సి) పాటీదార్ (బి) హాజల్వుడ్ 10; నిశాంత్ (సి) పడిక్కల్ (బి) సలామ్ 20; బట్లర్ (స్టంప్డ్) జితేశ్ (బి) కృనాల్ 19; సుందర్ (నాటౌట్) 50; అర్షద్ (సి) సలామ్ (బి) హాజల్వుడ్ 15; తెవాటియా (సి) పాటీదార్ (బి) సలామ్ 7; హోల్డర్ (సి) హాజల్వుడ్ (బి) భువనేశ్వర్ 7; రషీద్ (సి) షెఫర్డ్ (బి) సలామ్ 7; రబాడ (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–22, 2–26, 3–55, 4–73, 5–99, 6–115, 7–142, 8–151. బౌలింగ్: డఫీ 4–0–38–0, భువనేశ్వర్ 4–0–29–2, హాజల్వుడ్ 4–0–37–2, సలామ్ 4–0–27–3, కృనాల్ 4–0–23–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: వెంకటేశ్ (సి) రబాడ (బి) సిరాజ్ 32; కోహ్లి (నాటౌట్) 75; పడిక్కల్ (సి) అర్షద్ (బి) రబాడ 1; పాటీదార్ (సి) రబాడ (బి) రషీద్ 15; కృనాల్ (ఎల్బీ) (బి) రషీద్ 1; డేవిడ్ (సి) బట్లర్ (బి) అర్షద్ 24; జితేశ్ (నాటౌట్) 11; ఎక్స్ట్రాలు 2; మొత్తం (18 ఓవర్లలో 5 వికెట్లకు) 161. వికెట్లపతనం: 1–62, 2–63, 3–89, 4–91, 5–132. బౌలింగ్: సిరాజ్ 4–0–36–1, రబాడ 3–0–44–1, హోల్డర్ 2–0–16–0, రషీద్ 4–0–25–2, అర్షద్ 4–0–32–1, ప్రసిధ్ 1–0–7–0. -
కోహ్లీ వీరవిహారం.. చాంపియన్స్గా ఆర్సీబీ
ఐపీఎల్ 2026 చాంపియన్గా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఫైనల్లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చేజింగ్ మాస్టర్గా పేరు పొందిన విరాట్ కోహ్లీ ఆఖరి దాకా నిలిచి ఆర్సీబీని గెలిపించాడు. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. విరాట్ కోహ్లీ (42 బంతుల్లో 75 నాటౌట్), వెంకటేశ్ అయ్యర్ (16 బంతుల్లో 32), టిమ్ డేవిడ్ (17 బంతుల్లో 24 పరుగులు) ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2 వికెట్లు తీయగా, మహ్మద్ సిరాజ్, రబాడ, అర్షద్ ఖాన్ తలా వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (50 నాటౌట్), నిషాంత్ సిందూ (20 పరుగులు) ఆడుతున్నారు. రసిక్ సలామ్ 3 వికెట్లు తీయగా, హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్ చెరో 2 వికెట్లు తీశాడు.కోహ్లీ కమాల్..156 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. వెంకటేశ్ అయ్యర్, కోహ్లీలు కలిసి తొలి వికెట్కు 4.3 ఓవర్లలో 62 పరుగులు జోడించి మంచి పునాది వేశారు. ఈ దశలో పడిక్కల్, పాటీదార్లు రషీద్ఖాన్ బౌలింగ్లో వెనువెంటనే ఔట్ కావడంతో ఆర్సీబీ శిబిరంలో ఆందోళన నెలకొన్నప్పటికీ కోహ్లీ నిలకడగా ఆడి జట్టును విజయం దిశగా నడిపించాడు. ఆఖర్లో టిమ్ డేవిడ్ ఔటైనప్పటికీ జితేశ్ శర్మ (11 నాటౌట్)తో కలిసి కోహ్లీ ఆర్సీబీని గెలిపించి వరుసగా రెండో కప్పును అందించాడు.ఆర్సీబీ అరుదైన ఫీట్ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఒక అరుదైన ఫీట్ సాధించింది. వరుసగా రెండు సీజన్లలో టైటిల్ గెలిచిన మూడో జట్టుగా ఆర్సీబీ రికార్డులకెక్కింది. గతంలో చెన్నై సూపర్కింగ్స్ (2010, 2011), ముంబై ఇండియన్స్ (2019, 2020) ఈ ఫీట్ను సాధించాయి.Finishing off in style 🥳And it's none other than King Kohli 😎👑Scorecard ▶️ https://t.co/Yz6K3q6w0X#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/FZNGQ26gBs— IndianPremierLeague (@IPL) May 31, 2026 -
ఆరెంజ్ క్యాప్ వైభవ్దే.. ప్రైజ్మనీ ఎంతంటే?
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ప్రతిష్టాత్మక ఐపీఎల్ ‘ఆరెంజ్ క్యాప్’ సొంతం చేసుకున్న వైభవ్.. యావత్తు క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్-2026 సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. సూర్యవంశీ 16 మ్యాచ్లలో 776 పరుగులు చేసి ఈ ఆరెంజ్ క్యాప్ను కైవసం చేసుకున్నాడు.దీంతో ఐపీఎల్ చరిత్రలోనే ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న అతి పిన్న వయస్కుడిగా వైభవ్ రికార్డులెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ (23 ఏళ్ల 263 రోజులు) పేరిట ఉండేది. ఐపీఎల్-2026 సీజన్లో గిల్ ఈ ఫీట్ సాధించాడు. తాజా సీజన్తో గిల్ ఆల్టైమ్ రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు. ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచినందుకు వైభవ్కు రూ.10 లక్షలు నగదు బహుమతి దక్కింది.ఛాంపియన్స్గా ఆర్సీబీఇక ఐపీఎల్-2026 సీజన్ ఛాంపియన్స్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆర్సీబీ.. వరుసగా రెండో ఐపీఎల్ టైటిల్ను సొంతం చేసుకుంది. 156 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం 18 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. లక్ష్య చేధనలో విరాట్ కోహ్లి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 75 పరుగులు చేసి తన జట్టును ఛాంపియన్గా నిలిపాడు. అతడితో పాటు వెంకటేశ్ అయ్యర్(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 32) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా గుజరాత్ నిర్ధేశించిన స్వల్ప లక్ష్యాన్ని బెంగళూరు 18 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది -
చరిత్ర సృష్టించిన ఆర్సీబీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే
ఐపీఎల్-2026లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్లు విరాట్ కోహ్లి, వెంకటేశ్ అయ్యర్ విధ్వంసం సృష్టించారు. 156 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో గుజరాత్ పేసర్లకు వీరిద్దరూ చుక్కలు చూపించారు. ఫలితంగా ఆర్సీబీ స్కోర్ కేవలం 3.3 ఓవర్లలోనే (21 బంతుల్లో) 50 పరుగుల మార్క్ దాటింది. దీంతో ఆర్సీబీ ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఐపీఎల్ ఫైనల్ చరిత్రలో అత్యంత వేగంగా 50 పరుగులు చేసిన జట్టుగా బెంగళూరు నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఉంది. ఐపీఎల్-2023 సీజన్ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్పై సీఎస్కే 4 ఓవర్లలో 50 పరుగులు చేసింది. తాజా మ్యాచ్తో సీఎస్కే రికార్డును ఆర్సీబీ బ్రేక్ చేసింది. విజేతగా ఆర్సీబీఇక ఈ ఏడాది సీజన్ ఛాంపియన్స్గా ఆర్సీబీ నిలిచింది. గుజరాత్ నిర్ధేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 18 ఓవర్లలో చేధించి రెండో ఐపీఎల్ టైటిల్ను తమ ఖాతాలో వేసుకుంది. విరాట్ కోహ్లి కేవలం 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లితో పాటు వెంకటేశ్ అయ్యర్ 32 పరుగులతో రాణించాడు.చదవండి: వైభవ్కు నో ఛాన్స్.. టీ20 ప్రపంచకప్లో భారత ఓపెనర్లు వీరే? -
అరుదైన ఫీట్తో భువనేశ్వర్ కొత్త చరిత్ర
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన ఫీట్ సాధించాడు. 16 మ్యాచ్లాడిన భువనేశ్వర్ 28 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఒక సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్గా భువనేశ్వర్ షమీతో కలిసి రికార్డులకెక్కాడు. కాగా ఈ జాబితాలో ఆర్సీబీ తరఫున హర్షల్పటేల్ (32 వికెట్లు, 2021 సీజన్), గుజరాత్ టైటాన్స్ తరఫున మహ్మద్ షమీ (28 వికెట్లు, 2023 సీజన్) ఈ ఫీట్ సాధించారు. ఇక ముంబై ఇండియన్స్ తరఫున జస్ప్రీత్ బుమ్రా (27 వికెట్లు, 2020 సీజన్), రాజస్తాన్ తరఫున చాహల్ (27 వికెట్లు, 2022), గుజరాత్ తరఫున మోహిత్ శర్మ (27 వికెట్లు, 2022) భువనేశ్వర్ తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇక ఈ సీజన్లో ఇప్పటికే పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్న భువనేశ్వర్ మరో ఫీట్ కూడా అందుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజన్లో తొలి పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో భువనేశ్వర్ (17 వికెట్లు) షమీతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఇదే సీజన్లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ కగిసో రబాడ (19 వికెట్లు) తీసి తొలి స్థానంలో ఉన్నాడు.Bhuvneshwar Kumar in IPL2026 - 𝟮𝟴 wickets (7.95 Eco)*2025 - 17 wickets (9.28 Eco)2024 - 11 wickets (9.35 Eco)2023 - 16 wickets (8.33 Eco)2022 - 12 wickets (7.34 Eco)2021 - 6 wickets (7.97 Eco)2020 - 3 wickets (6.98 Eco)2019 - 13 wickets (7.81 Eco)2018 - 9 wickets… pic.twitter.com/DLOczlJ22e— 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) May 31, 2026చదవండి: 'కోహ్లీ కాస్త తగ్గి ఉండు.. మీ బ్యాటింగ్ అయిపోలేదు!' -
'కోహ్లీ కాస్త తగ్గి ఉండు.. మీ బ్యాటింగ్ అయిపోలేదు!'
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న ఫైనల్లో ఇప్పటికైతే ఆర్సీబీదే పైచేయిగా ఉంది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతున్న గుజరాత్ టైటాన్స్ సాధారణ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. అయితే గుజరాత్ వికెట్లు పడిన ప్రతీసారి కోహ్లీ హైపర్ యాక్టివ్గా కనిపించాడు. ముఖ్యంగా గుజరాత్ ఓపెనర్లు సాయి సుదర్శన్, శుబ్మన్ గిల్ వికెట్లు పడ్డప్పుడు కోహ్లీ ఇచ్చిన రియాక్షన్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హాజిల్వుడ్ బౌలింగ్లో గిల్ ఔటైన వెంటనే పిచ్పైకి పరిగెత్తుకొచ్చిన కోహ్లి గిల్వైపు చూస్తూ గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకోవడం కనిపించింది. అంతటితో ఆగకుండా సాయి సుదర్శన్ ఔట్ కావడానికి ముందు కోహ్లీ శ్రుతి మించిపోయాడు. హాజిల్వుడ్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లు ప్రతీ బంతికి ముందు కోహ్లీ సాయి సుదర్శన్ను టార్గెట్ చేస్తూ ఏదో ఒక మాట అనడం స్టంప్ మైక్లో రికార్డయింది. అదే ఓవర్ నాలుగో బంతికి సాయి సుదర్శన్ భారీ షాట్కు యత్నించి జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే కోహ్లీ చర్యలపై గుజరాత్ టైటాన్స్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోహ్లీ కాస్త తగ్గి ఉండు.. మీ బ్యాటింగ్ ఇంకా అయిపోలేదు. అని కామెంట్లు పెడుతున్నారు.మరో విషయమేంటంటే.. గత రెండు మ్యాచ్ల్లో హిట్ వికెట్గా వెనుదిరిగిన సాయి సుదర్శన్ ఈ మ్యాచ్లోనూ అలా ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. హాజిల్వుడ్ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్ రెండో బంతిని ఆడే క్రమంలో బ్యాట్ అతని చేతి నుంచి జారిపోయేలా కనిపించినప్పటికీ ఈసారి మాత్రం అలా జరగలేదు. ఇక మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాష్టింగ్టన్ సుందర్ (50) అర్థసెంచరీతో గుజరాత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. రసిక్ సలామ్ మూడు వికెట్లు తీయగా, హాజిల్వుడ్, భువనేశ్వర్లు చెరో 2 వికెట్లు పడగొట్టారు.pic.twitter.com/E5HLX9ALPr— crictalk (@crictalk7) May 31, 2026చదవండి: అయ్యో గుజరాత్.. సీన్ రివర్స్ అయ్యేలా ఉందే! -
వైభవ్కు నో ఛాన్స్.. టీ20 ప్రపంచకప్లో భారత ఓపెనర్లు వీరే?
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ప్రదర్శనలతో భారత సీనియర్ జట్ట వైపు దూసుకొస్తున్నాడు. ఇప్పటికే ఆసియా క్రీడలకు బీసీసీఐ ఎంపిక చేసిన 30 మంది ఆటగాళ్లతో కూడిన ప్రాబుబుల్స్ జాబితాలో వైభవ్ చోటు దక్కించుకున్నాడు.అంతకంటే ముందు ఐర్లాండ్ లేదా జింబాబ్వేలతో టీ20 సిరీస్ల కోసం భారత జట్టుకు వైభవ్ ఎంపికయ్యే అవకాశముంది. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే సంచనాలు సృష్టిస్తున్న వైభవ్ను భారత క్రికెట్ భవిష్యత్తు స్టార్గా అభివర్ణిస్తున్నారు.ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2028లో భారత జట్టుకు వైభవ్ కీలకం కానున్నాడని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ టోర్నీలో వైభవ్.. అభిషేక్ శర్మ లేదా సంజూ శాంసన్లతో కలిసి భారత ఇన్నింగ్స్ను ప్రారంభించనున్నాడని మాజీలు ఇప్పటి నుంచే జోస్యం చెబుతున్నారు.కానీ భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మాత్రం పొట్టి ప్రపంచకప్ కోసం కొత్త భారత ఓపెనింగ్ జోడీని ఎంచుకున్నాడు. శుబ్మన్ గిల్, సాయిసుదర్శన్లు భారత ఇన్నింగ్స్ను ఆరంభించాలని అతడు సూచించాడు. "ఆస్ట్రేలియా వంటి కఠిన పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోగల ఓపెనింగ్ జోడీ(సాయిసుదర్శన్-శుభ్మన్ గిల్)ని ఇప్పుడు మనం ఐపీఎల్లో చూస్తున్నాము. ప్రస్తుతం ఐపీఎల్లో కూడా పిచ్లు ఆస్ట్రేలియా మాదిరిగానే అంతే వేగం, బౌన్స్ను కలిగి ఉన్నాయి. అలాంటి పిచ్లపై కూడా గిల్-సుదర్శన్ జోడీ అద్భుతంగా రాణిస్తోంది. వీరిద్దరూ 2028 ప్రపంచ కప్ టోర్నీకి ఎంపిక కాకపోతే కచ్చితంగా నేను ఆశ్చర్యపోతాను. ఈ మెగా టోర్నీలో గిల్-సుదర్శన్లు టీమిండియా ఓపెనర్లగా బరిలోకి దిగాలి. ఎందుకంటే ఒకరి ఆట తీరుపై మరొకరికి చాలా మంచి అవగాహన ఉంది. విభిన్నమైన విదేశీ పరిస్థితుల్లో జట్టు రాణించాలనుకుంటే, వీరిద్దరూ కలిసి ఉండటం అనేది జట్టుకు చాలా పెద్ద సానుకూలాంశం" అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాయుడు పేర్కొన్నాడు. కాగా శుబ్మన్ గిల్ ప్రస్తుతం భారత టీ20 సెటాప్లోనే లేడు. అతడు చివరగా సౌతాఫ్రికాపై టీ20 మ్యాచ్ ఆడాడు. వరుస మ్యాచ్లలో విఫలం కావడంతో టీ20 ప్రపంచకప్-2026 జట్టును అతడిని బీసీసీఐ సెలక్షన్ కమిటీ తప్పించింది. ఇప్పుడు మళ్లీ గిల్ను టీ20లకు ఎంపిక చేయమని రాయుడు సూచించడం గమనార్హం.చదవండి: IPL 2026: తుది పోరులో తుస్సుమనిపించిన శుబ్మన్ గిల్ -
ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి సినిమా ఛాన్స్
ఈసారి ఐపీఎల్ ప్రస్తావన వస్తే అందులో కచ్చితంగా వైభవ్ సూర్యవంశీ పేరు ఉంటుంది. ఎందుకంటే తనదైన హిట్టింగ్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. తనకోసమే చాలామంది మ్యాచులు చూసేలా చేశాడు. ఈ ఏడాది 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ విజేతగానూ నిలిచాడు. అందరూ సూర్యవంశీలో క్రికెట్ స్కిల్స్ చూస్తుంటే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మాత్రం ఇతడిలో నటుడిని చూశాడు. సినిమా ఆఫర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: 'జన నాయగణ్' రిలీజ్ నా చేతుల్లో లేదు)బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్.. ప్రస్తుతం 'మసూమ్: ద న్యూ జనరేషన్' సినిమాని తీస్తున్నారు. 1983లో వచ్చిన 'మసూమ్'ని ఇప్పటి పరిస్థితులకు తగ్గట్లు కుటుంబ బంధాలు, ప్రేమ, గుర్తింపు తదితర అంశాలతో తీస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో షూటింగ్ మొదలుపెట్టనున్నారు.అయితే వైభవ్ సూర్యవంశీ గురించి ట్వీట్ చేసిన శేఖర్ కపూర్.. 'సూర్యవంశీ ఇంత సంచలన క్రికెటర్ కాకపోయింటే 'మసూమ్'లో అతడికి నటింపజేసేవాడిని' అని చెప్పుకొచ్చారు. వైభవ్ అమాయక రూపం, సహజ వ్యక్తిత్వం తనని ఆకట్టుకున్నాయని.. మసూమ్ లాంటి భావోద్వేగ సినిమాకు వైభవ్ సరిపోతాడని అభిప్రాయపడ్డారు.బిహార్కి చెందిన సూర్యవంశీ వయసు 15 ఏళ్లే. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు. ఈ ఏడాది అద్భుతమైన బ్యాటింగ్ చేసి అదరగొట్టేసిన ఇతడు.. చిన్న వయసులోనే ఐపీఎల్ సెంచరీ చేసిన ఆటగాడిగా ఇప్పటికే రికార్డ్ సృష్టించాడు. భారత బ్యాటర్ల వరకు వేగవంతమైన ఐపీఎల్ శతకం చేసింది కూడా ఇతడే కావడం విశేషం. అలాంటి వైభవ్లో శేఖర్ కపూర్ లాంటి దర్శకుడు.. నటుడిని చూడటం ఆసక్తికరం.(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత శోభిత సినిమా.. పవర్ఫుల్ ఫస్ట్ లుక్)If sooryavanshi wasn’t such a sensational cricketer.. I could have cast him in Masoom the film z.. pic.twitter.com/p8vaLzq1e2— Shekhar Kapur (@shekharkapur) May 31, 2026 -
తుది పోరులో తుస్సుమనిపించిన శుబ్మన్ గిల్
ఐపీఎల్-2026లో అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్లు శబ్మన్ గిల్, సాయిసుదర్శన్ తీవ్ర నిరాశపరిచారు. క్వాలిఫయర్-2లో మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీ.. తుది పోరులో మాత్రం పూర్తిగా తేలిపోయింది.గుజరాత్ ఇన్నింగ్స్ 3వ ఓవర్ వేసిన జోష్ హాజిల్వుడ్ బౌలింగ్లో రెండో బంతిని గిల్ షార్ట్-ఆర్మ్ జాబ్ ఫుల్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ టాప్ ఎడ్జ్ తీసుకుని మిడ్-ఆఫ్ దిశగా గాల్లోకి లేచింది. ఈ క్రమంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ తన కుడివైపునకు పరిగెత్తుకు వచ్చి బంతిని అందుకున్నాడు.దీంతో గిల్ 8 బంతుల్లో 10 పరుగులు చేసి తీవ్ర నిరాశతో పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత భువనేశ్వర్ కుమార్ ఓవర్లో సాయిసుదర్శన్(12 బంతుల్లో 12) కూడా ఓ చెత్త షాట్ ఆడి తన వికెట్ను కోల్పోయాడు. దీంతో గుజరాత్ 26 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి గుజరాత్ కష్టాల్లో పడింది. ఇక ఓవరాల్గా ఈ ఏడాది సీజన్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో (732), సుదర్శన్(722) రెండు, మూడు స్ధానాల్లో నిలిచారు.చదవండి: IND vs SL: రుతురాజ్ గైక్వాడ్కు బంపర్ ఆఫర్ -
అయ్యో గుజరాత్.. సీన్ రివర్స్ అయ్యేలా ఉందే!
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ పూర్తిగా తడబడుతోంది. ఆదిలోనే ఓపెనర్లిద్దరి వికెట్లను కోల్పోయిన గుజరాత్ కష్టాల్లో పడింది. అయితే హోంగ్రౌండ్లో గుజరాత్ టైటాన్స్కు మంచి రికార్డే ఉంది. టాస్ ఓడినా, గెలిచినా 2025 నుంచి చూసుకుంటే అప్పటినుంచి గుజరాత్ టైటాన్స్ ఐదు మ్యాచ్ల్లో తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ ఐదు మ్యాచ్ల్లోనూ గుజరాత్ విజయాలను సాధించింది. ఇందులో ముంబై ఇండియన్స్పై 36 పరుగులతో, రాజస్తాన్పై 58 పరుగులతో, ఎస్ఆర్హెచ్పై 38 పరుగులతో, ఎస్ఆర్హెచ్పై 82 పరుగులతో, సీఎస్కేపై 89 పరుగులతో విజయాలను అందుకుంది. అయితే ఈసారి జరుగుతున్న ఫైనల్లో మాత్రం గుజరాత్ టైటాన్స్కు సీన్ రివర్స్ అయ్యేలా కనిపిస్తుంది. పైగా టాస్ సమయంలో గిల్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా అనిపించాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ పటీదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అహ్మదాబాద్ పిచ్పై చేజింగ్ చేసిన జట్టే ఎక్కువ విజయాలు అందుకుంది. అయితే గిల్ మాత్రం తాను టాస్ గెలిచి ఉంటే బ్యాటింగ్ ఎంచుకునేవాడినని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు తొలుత బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ గుజరాత్ ఆర్సీబీ బౌలర్లను ఎదుర్కోలేకపోతుంది. 8 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ 2 వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది. నిషాంత్ సిందూ (20), జాస్ బట్లర్ (10) పరుగులతో ఆడుతున్నారు.🚨 Toss Update from the FINAL 🚨@RCBTweets have won the toss & will bowl first against @gujarat_titans in Ahmedabad.Updates ▶️ https://t.co/Yz6K3q6w0X#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/kgrF0LJ0gQ— IndianPremierLeague (@IPL) May 31, 2026చదవండి: చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్ జోడీ -
చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్ జోడీ
భారత బ్యాడ్మింటన్ స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి చరిత్ర సృష్టించారు. సింగపూర్ ఓపెన్లో ఈ జోడీ చాంపియన్గా నిలిచింది. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో సాత్విక్ జోడీ 18-21, 21-17, 21-16తో ఇండోనేషియాకు చెందిన ఫజర్ అల్ఫియన్-ముహమ్మద్ ఫిక్రీ జంటపై అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో సింగపూర్ ఓపెన్ సాధించిన తొలి భారత డబుల్స్ జోడీగా సాత్విక్-చిరాగ్ రికార్డులెక్కారు. మ్యాచ్ తొలి గేమను 18-21 తేడాతో కోల్పోయినప్పటికీ, రెండో గేమ్లో ఫుంజుకొని సాత్విక్ - చిరాగ్ జోడీ అద్భుతంగా పుంజుకుంది. అనంతరం జరిగిన రెండో, మూడో గేమ్లలో వరుసగా 21-17, 21-16 స్కోర్లతో విజయం సాధించి టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో సాత్విక్-చిరాగ్ జోడీ రెండేళ్ల తర్వాత తమ తొలి అంతర్జాతీయ టైటిల్ను గెలుచుకుంది. కీలక సమయాల్లో ఒత్తిడిని తట్టుకుని అద్భుతమైన ప్రదర్శన చేయగల తమ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించింది. మ్యాచ్ మొత్తం భారత జోడీ పోరాట పటిమ, సమన్వయం, దూకుడు ఆటతీరు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలి గేమ్లో వెనుకబడినప్పటికీ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా తిరిగి పోటీలోకి రావడం వారి విజయానికి ప్రధాన కారణమైంది. విజయం అనంతరం సాత్విక్-చిరాగ్ జోడీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. స్టేడియంలోని అభిమానుల మద్దతు తమకు ఎంతో ప్రేరణనిచ్చిందని పేర్కొంది.‘గతంలో మేము కొన్ని కీలక మ్యాచ్లో ఓడిపోయాం. కానీ ఈ టోర్నమెంట్ మా కోసం ప్రత్యేకమైనదిగా నిలిచింది. ప్రేక్షకుల మద్దతు అద్భుతంగా ఉంది. ఎవరు ఆడుతున్నారన్నది పక్కనపెట్టి ప్రతి మ్యాచ్ను మీరు ఎంతో ఉత్సాహంగా ఆస్వాదించారు. మేము ఆడిన అత్యుత్తమ స్టేడియంలలో ఇది ఒకటి. ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు’ అని వారు తెలిపారు.SATCHI ARE THE CHAMPIONS OF BWF SINGAPORE OPEN 2026 ❤️🏆#SingaporeOpen2026 https://t.co/bYmk2NWHoD pic.twitter.com/DQCoRSQVmS— Badminton Media (@BadmintonMedia1) May 31, 2026చదవండి: స్వియాటెక్కు షాక్.. వరుసగా 16వ విజయం -
స్వియాటెక్కు షాక్.. వరుసగా 16వ విజయం
ఫ్రెంచ్ ఓపెన్లో మరో సంచలనం నమోదైంది. నాలుగుసార్లు చాంపియన్, మాజీ నంబర్వన్ ఇగా స్వియాటెక్ ప్రిక్వార్టర్స్లో ఇంటిబాట పట్టింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ నాలుగో రౌండ్లో ఉక్రెయిన్కు చెందిన 15వ ర్యాంకర్ మార్తా కొస్త్యుక్ చేతిలో 7-5, 6-1తో స్వియాటెక్ ఓటమి పాలైంది. గంటా 39 నిమిషాల పాటు సాగిన పోరులో కొస్త్యుక్ 5 ఏస్లు సంధించగా.. స్వియాటెక్ సున్నా ఏస్లకు పరిమితమైంది. కొస్త్యుక్ 25 విన్నర్లు సంధించగా, స్వియాటెక్ కేవలం 13 విన్నర్లకే పరిమితమైంది. గతంలో తలపడిన మూడుసార్లు ఓటమి పాలైన కొస్త్యుక్ ఈసారి మాత్రం స్వియాటెక్పై పైచేయి సాధించింది. స్వియాటెక్ను ఎదుర్కొనే క్రమంలో కొస్త్యుక్ గ్రౌండ్ నలుమూలలా షాట్లు ఆడింది. ముఖ్యంగా మ్యాచ్లో కొస్త్యుక్ గ్రౌండ్ స్ట్రోక్ విన్నర్స్తో అలరించింది. అయితే క్లే కోర్టుపై కొస్త్యుక్ తన రికార్డును మరింత మెరుగుపరుచుకుంది. ఇప్పటివరకు క్లే కోర్టులో కొస్త్యుక్ వరుసగా 16వ విజయాన్ని నమోదు చేసుకుంది. కాగా ప్రెంచ్ ఓపెన్కు ముందు ఫ్రాన్స్లో క్లే కోర్టులో టైటిల్ నెగ్గిన కొస్త్యుక్ ఆ తర్వాత మాడ్రిడ్ టోర్నీ కూడా గెలుచుకుంది. మరోవైపు 2024 ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత స్వియాటెక్ క్లే కోర్టులో మరో టైటిల్ గెలవలేదు. జూన్ 2న జరగనున్న క్వార్టర్ ఫైనల్లో కొస్త్యుక్ ఏడో ర్యాంకర్ ఎలీనా స్వితోలినాను ఎదుర్కోనుంది.Still undeafeted on clay this season 👏#RolandGarros pic.twitter.com/ax2kZzUJe0— Roland-Garros (@rolandgarros) May 31, 2026చదవండి: పాక్ మాజీ కెప్టెన్కు అవమానం.. -
ఐపీఎల్-2026 సీజన్ విజేతగా ఆర్సీబీ
IPL 2026 RCB vs GT Live Updates: ఐపీఎల్-2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఆర్సీబీ.. వరుసగా రెండో ఐపీఎల్ టైటిల్ను ముద్దాడింది. ఈ విజయంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిది కీలక పాత్ర. 156 పరుగుల లక్ష్య చేధనలో కోహ్లి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 75 పరుగులు చేసి తన జట్టును ఛాంపియన్గా నిలిపాడు. అతడితో పాటు వెంకటేశ్ అయ్యర్(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 32) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా గుజరాత్ నిర్ధేశించిన స్వల్ప లక్ష్యాన్ని బెంగళూరు 18 ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీవిరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 25 బంతుల్లోనే కోహ్లి ఆర్ధ సెంచరీ సాధించారు. 12 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 116/4ఊహించని ట్విస్ట్.. నాలుగో వికెట్ డౌన్గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్ పోరులో ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. రషీద్ ఖాన్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. ముందు పాటీదార్ (15)ను వెనక్కి పంపిన రషీద్.. ఆ తర్వాత కృనాల్ పాండ్యా (1)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆర్సీబీ 4 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది.8 ఓవర్లలో ఆర్సీబీ 88-28 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (38), రజత్ పాటీదార్ (15) పరుగులతో ఆడుతున్నారు.ఆర్సీబీ రెండో వికెట్ డౌన్ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన దేవ్దత్త్ పడిక్కల్.. రబాడ బౌలింగ్లో ఔటయ్యాడు.ఆర్సీబీ తొలి వికెట్ డౌన్ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 16 బంతుల్లో 32 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్.. సిరాజ్ బౌలింగ్లో ఔటయ్యాడు.దుమ్ములేపుతున్న విరాట్ కోహ్లి158 పరుగుల లక్ష్య చేధనలో విరాట్ కోహ్లి దుమ్ములేపుతున్నాడు. కోహ్లి కేవలం పది బంతుల్లోనే 28 పరుగులు చేశాడు. వెంకటేశ్ అయ్యర్(26) కూడా దూకుడుగా ఆడుతున్నాడు. ఫలితంగా ఆర్సీబీ స్కోర్ కేవలం 4 ఓవర్లలోనే 50 పరుగుల మార్క్ దాటింది.దూకుడుగా ఆడుతున్న వెంకటేశ్ అయ్యర్2 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్(22) దూకుడుగా ఆడుతున్నాడు.ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే?అహ్మదాబాద్ వేదికగా ఆర్సీబీతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్(50) హాఫ్ సెంచరీతో గుజరాత్ను ఆదుకున్నాడు. కెప్టెన్ శుబ్మన్ గిల్(12), సాయిసుదర్శన్(12), జోస్ బట్లర్(19) వంటి స్టార్ ప్లేయర్లు తీవ్ర నిరాశపరిచారు. ఆర్సీబీ బౌలర్లలో రాసిఖ్ సలామ్ దార్ మూడు వికెట్లు పడగొట్టగా.. భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్వుడ్ తలా రెండు వికెట్లు సాధించారు.ఏడో వికెట్ డౌన్గుజరాత్ ఏడో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన హోల్డర్.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో ఔటయ్యాడు. 18.4 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 143/7ఆరో వికెట్ కోల్పోయిన గుజరాత్ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 115 పరుగులవ వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన రాహుల్ తెవాటియా రసిక్ సలామ్ బౌలింగ్లో పాటీదార్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఐదో వికెట్ డౌన్అర్షద్ ఖాన్(15) రూపంలో గుజరాత్ ఐదో వికెట్ కోల్పోయింది. జోష్ హాజిల్వుడ్ బౌలింగ్లో అర్షద్ ఔటయ్యాడు.దూకుడుగా ఆడుతున్న అర్షద్ ఖాన్జోష్ బట్లర్ స్ధానంలో క్రీజులోకి వచ్చిన అర్షద్ ఖాన్ దూకుడుగా ఆడుతున్నాడు. కేవలం 5 బంతుల్లోనే రెండు సిక్సర్ల సాయంతో 15 పరుగులు చేశాడు. 14 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 100/4గుజరాత్ నాలుగో వికెట్ డౌన్గుజరాత్ టైటాన్స్ వికెట్ల పతనం కొనసాగుతోంది. జోస్ బట్లర్(19) రూపంలో గుజరాత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 12.1 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 73/4గుజరాత్ మూడో వికెట్ డౌన్నిషాంత్ సింధు రూపంలో గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన సింధు.. రాసిఖ్ సలామ్ దార్ బౌలింగ్లో ఔటయ్యాడు. 9 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. క్రీజులో వాషింగ్టన్ సుందర్(2), జోస్ బట్లర్(2) ఉన్నారు.గుజరాత్కు భారీ షాక్గుజరాత్కు భారీ షాక్ తగిలింది. ఇన్ఫామ్ బ్యాటర్ సాయిసుదర్శన్(12) రూపంలో గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ బౌలింగ్లో సుదర్శన్ ఔటయ్యాడు. 4 ఓవర్లు గుజరాత్ టైటాన్స్ స్కోర్: 30/2గుజరాత్ తొలి వికెట్ డౌన్గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన శుబ్మన్ గిల్.. రజత్ పాటిదార్ బౌలింగ్లో ఔటయ్యాడు.2 ఓవర్లకు గుజరాత్ టైటాన్స్ స్కోర్: 18/02 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది. క్రీజులో శుబ్మన్ గిల్(6), సాయిసుదర్శన్(9) ఉన్నారు.ఐపీఎల్-2026లో తుది పోరుకు తెరలేచింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతున్నాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఓ మార్పుతో బరిలోకి దిగింది. స్పిన్నర్ సాయికిషోర్ స్ధానంలో పేసర్ అర్షద్ ఖాన్ తుది జట్టులోకి వచ్చాడు. ఆర్సీబీ మాత్రం తమ ప్లేయింగ్ ఎలెవన్లో ఎలాంటి మార్పులు చేయలేదు.తుది జట్లుగుజరాత్ టైటాన్స్: శుభ్మన్ గిల్ (కెప్టెన్), బి సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, నిశాంత్ సింధు, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, అర్షద్ ఖాన్, మహ్మద్ సిరాజ్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, జోష్ హాజిల్వుడ్, రసిఖ్ సలాం దార్ -
రుతురాజ్ గైక్వాడ్కు బంపర్ ఆఫర్
శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత ‘ఎ’ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్, అస్సాం స్టార్ ప్లేయర్ రియాన్ పరాగ్ గాయం కారణంగా లంక టూర్కు దూరమయ్యాడు. అతడి స్దానాన్ని మహారాష్ట్ర ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్తో బీసీసీఐ భర్తీ చేసింది. తిలక్ వర్మకు డిప్యూటీగా గైక్వాడ్ వ్యవహరించనున్నాడు. గైక్వాడ్ దాదాపు ఏడాది తర్వాత ఇండియా-ఎ జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఈ సీఎస్కే కెప్టెన్ ప్రస్తుతం పేలవ ఫామ్తో సతమతవుతున్నాడు. ఐపీఎల్-2026లో రుతురాజ్ 14 మ్యాచ్లు ఆడి కేవలం 337 పరుగులు చేశాడు. అయితే రుతు తన ఫామ్ను తిరిగి అందుకోవడానికి ఈ టూర్ మంచి అవకాశం.ఇక పరాగ్ విషయానికి వస్తే.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఆరంభంలోనే హ్యామ్స్ట్రింగ్ (Hamstring) గాయానికి గురయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్ మధ్యలోనే గాయం కారణంగా మైదానాన్ని వీడాడు.ఆ తర్వాత కొన్ని మ్యాచ్లకు దూరమైనప్పటికీ, జట్టు ప్లేఆఫ్స్ రేసులో ఉండటంతో నొప్పితోనే తిరిగి జట్టులోకి వచ్చాడు. కానీ రాజస్తాన్ ఎలిమినేటర్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. అయితే ఇప్పుడు అతడు గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో లంక పర్యటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే రుతురాజ్ను జట్టులోకి తీసుకున్నారు. అతడు చివరగా 2025లో ఇండియా-ఎ తరపున సౌతాఫ్రికా-ఎపై ఆడాడు. ఆ సిరీస్లో గైక్వాడ్ 210 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. కాగా లంక టూర్లో భాగంగా భారత్-ఎ జట్టు.. శ్రీలంక-ఎ, అఫ్గానిస్తాన్-ఎ టీమ్స్తో ముక్కోణపు వన్డే సిరీస్లో తలపడనుంది.శ్రీలంక సిరీస్ కోసం ఇండియా-ఎ జట్టు:తిలక్ వర్మ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, సూర్యాంశ్ శెడ్గే, ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), కుమార్ కుశాగ్ర (వికెట్ కీపర్), విప్రజ్ నిగమ్, యష్ ఠాకూర్, యుధ్వీర్ సింగ్, అన్షుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్, అనుకుల్ రాయ్. -
పాక్ మాజీ కెప్టెన్కు అవమానం..
ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్లో పాకిస్తాన్ శుభారంభం చేసింది. శనివారం రావల్పిండి వేదికగా తొలి వన్డేలో పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి 1000వ వన్డేను మధురానుభూతిగా మల్చుకుంది. మ్యాచ్లో హాఫ్ సెంచరీతో మెరిసిన బాబర్ ఆజంకు అవమానం జరిగింది. పాక్ వెయ్యి వన్డేలు పూర్తి చేసుకున్న క్రమంలో ఆ జట్టు మాజీ క్రికెటర్ మహ్మద్ యూసఫ్ జట్టులో ఉండే నాలుగు స్లాట్లకు (బ్యాటర్, బౌలర్, ఆల్రౌండర్, వికెట్ కీపర్) సంబంధించి అత్యుత్తమ ఆటగాళ్లను ఎంపిక చేశాడు. ఈ జాబితాలో బాబర్ ఆజంకు చోటు దక్కలేదు. 1992 వన్డే వరల్డ్కప్ సాధించిన పాక్ జట్టుకు నాయకత్వం వహించిన ఇమ్రాన్ఖాన్ను కెప్టెన్, ఆల్రౌండర్ స్లాట్కు ఎంపిక చేశాడు. ఇక బ్యాటర్గా బాబర్ ఆజం కాకుండా సయీద్ అన్వర్ను ఎంపిక చేశాడు. వికెట్ కీపర్గా రషీద్ లతీఫ్ను, ఫాస్ట్ బౌలర్ కోటాలో వసీమ్ అక్రమ్ను, స్పిన్నర్ కోటాలో సక్లెయిన్ ముస్తాక్ను ఎంపిక చేశాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 44.1 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. మాట్ రెన్షా (61), మాథ్యూ షార్ట్ (55) అర్థసెంచరీలు సాధించారు. అరాఫత్ మిన్హాస్ 5 వికెట్లు పడగొట్టగా, అబ్రార్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు. అనంతరం పాకిస్తాన్ 42.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. బాబర్ ఆజం (69), గాజీ గోరి (65) హాఫ్ సెంచరీలతో జట్టును గెలిపించారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ 2 వికెట్లు తీయగా, మాథ్యూ కునెమన్, తన్వీర్ సంగా, మార్నస్ లబుషేన్ తలా ఒక వికెట్ తీశారు.చదవండి: ఐపీఎల్ ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ! -
గౌతమ్ గంభీర్ సంచలన నిర్ణయం! రోహిత్ శర్మకు భారీ షాక్?
వన్డే వరల్డ్కప్-2027లో టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆడుతాడా? లేదా? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. 39 ఏళ్ల రోహిత్ శర్మ ప్రస్తుతం ఫిట్నెస్ సమస్యలతో సతమవుతున్నాడు. తొడ కండరాల గాయం కారణంగా ఐపీఎల్-2026లో రోహిత్ కేవలం 9 మ్యాచ్లు మాత్రమే ఆడాడు.ఆ తర్వాత పునరాగమనం చేసినప్పటికి పూర్తి ఫిట్నెస్తో మాత్రం హిట్మ్యాన్ కనిపించలేదు. కేవలం ఇంపాక్ట్ ప్లేయర్గా మాత్రమే బరిలోకి దిగాడు. అయితే ఈ జూన్లో అఫ్గానిస్తాన్తో జరగనున్న వన్డే సిరీస్కు రోహిత్ను ఎంపిక చేసినప్పటికి, అతడు ఆడేది అనుమానమే. సిరీస్ ప్రారంభ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధిస్తేనే రోహిత్ శర్మను జట్టులో కొనసాగించే అవకాశముంది.కాగా వన్డే ప్రపంచకప్-2027 టోర్నీ భవిష్యత్తు ప్రణాళికలలో భాగంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ స్థానంలో మరొక ముంబై ఆటగాడు, యువ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ను ఓపెనర్గా గంభీర్ భావిస్తున్నట్లు 'క్రిక్బ్లాగర్' వెబ్సైట్ పేర్కొంది.వాస్తవానికి అఫ్గానిస్తాన్తో సిరీస్కే రోహిత్ స్థానంలో జైశ్వాల్ను ఎంపిక చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావించందంట. కానీ రోహిత్ శర్మ బోర్డు అధికారులతో ఫోన్ చేసి మాట్లడడంతో సెలక్టర్లు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారని 'క్రిక్బ్లాగర్' వెల్లడించింది.జైస్వాల్ ఎంపికపై సస్పెన్స్కాగా జైశ్వాల్ గతేడాది డిసెంబర్లో సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో భారత్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. రెగ్యూలర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయం కారణంగా దూరం కావడంతో జైశ్వాల్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. రోహిత్తో కలిసి ఇన్నింగ్స్ను జైశూ ప్రారంభించాడు.తొలి రెండు మ్యాచ్లలో నిరాశపరిచిన యశస్వి.. వైజాగ్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో మాత్రం శతక్కొట్టాడు. దీంతో జైశ్వాల్ను అఫ్గాన్తో వన్డేలకు కూడా ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ సెలక్టర్లు ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో అతడు పేరు లేదు. ఆఫ్ఘనిస్తాన్తో వన్డే సిరీస్కు మాత్రమే కాకుండా, శ్రీలంకలో జరగబోయే ముక్కోణపు సిరీస్ కోసం ప్రకటించిన 'ఇండియా-ఎ' జట్టులోనూ జైస్వాల్కు చోటు దక్కలేదు. రోహిత్ ఫిట్నెస్ను దృష్టిలో పెట్టుకుని జైశ్వాల్ను 'ఇండియా-ఎ' జట్టుకు ఎంపిక చేయకపోయినట్లు తెలుస్తోంది. ఒకవేళ అఫ్గాన్తో వన్డేలకు రోహిత్ దూరమైతే ఆ స్ధానాన్ని జైశ్వాల్ భర్తీ చేయనున్నాడు.ఆఫ్గాన్ వన్డే సిరీస్కు భారత జట్టుశుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ (ఫిట్నెస్కు లోబడి), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్), హార్దిక్ పాండ్యా (ఫిట్నెస్కు లోబడి), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే. -
Asian Games: వైభవ్కు చోటు.. భారత జట్టు ఇదే!
ఆసియా క్రీడల అరంగేట్రంలోనే చాంపియన్గా నిలిచిన టీమిండియా.. ఈసారీ అదే ఫలితం పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. ఇప్పటికే ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ రూపంలో ఐసీసీ టైటిల్ గెలిచిన భారత్.. ఆసియా క్రీడలు-2026 ఎడిషన్లో ఫేవరెట్గా బరిలో దిగనుంది.ఈ నేపథ్యంలో ఇప్పటికే ముప్పై మందితో కూడిన ప్రాబబుల్స్ జాబితాను బీసీసీఐ భారత ఒలింపిక్ సంఘానికి అందజేసింది. ఇందులో రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి కూడా చోటు దక్కింది.ఓపెనర్ల విభాగంలో పోటీఓపెనర్ల విభాగంలో సీనియర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ల నుంచి వైభవ్ సూర్యవంశీకి గట్టి పోటీ ఉంది. అయితే, రాయల్స్లో తన సహచర ఆటగాడు జైసూ కంటే వైభవ్ ఈసారి గొప్పగా ఆడిన సంగతి తెలిసిందే.ఐపీఎల్-2026లో వైభవ్ 776 పరుగులతో సత్తా చాటగా.. జైస్వాల్ 427 పరుగులకే పరిమితమయ్యాడు. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్, టీ20 ప్రపంచకప్ విజేత అభిషేక్ శర్మ 563 పరుగులతో రాణించగా.. భారత్ వరల్డ్కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 477 పరుగులు సాధించాడు.ఇషాన్కు చోటు లేదు!ఇక ఇషాన్ కూడా సన్రైజర్స్ తరఫున 602 పరుగులతో దుమ్ములేపాడు. ఓవరాల్గా ఓపెనర్ల విభాగంలో అభిషేక్, ఇషాన్ సత్తా చాటగా.. అందరికంటే వైభవ్ అత్యధిక పరుగులతో ముందు వరుసలో ఉన్నాడు. అభిషేక్కు జోడీగా వైభవ్ను ఆడిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఆల్రౌండర్లు, బౌలర్లు వీరేఇక సంజూను వన్డౌన్లో పంపినా.. మరో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్, తిలక్ వర్మ, రింకూ సింగ్ బ్యాటర్ల విభాగంలో సెట్ అయిపోతారు. ఇక ఆల్రౌండర్ల జాబితాలో నితీశ్ కుమార్ రెడ్డి, శివం దూబే, హర్ష్ దూబేలను ఎంపిక చేసే అవకాశం ఉంది.బౌలర్ల విషయానికొస్తే.. పేస్ దళంలో అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, యశ్ ఠాకూర్.. స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయిలకు అవకాశం ఉండొచ్చు. కాగా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈసారి కూడా విశ్రాంతినివ్వడం ఖాయంగానే కనిపిస్తోంది.పసిడి పతకాలతో సత్తా చాటిన భారత జట్లుకాగా 2022లో తొలిసారిగా బీసీసీఐ సీనియర్ పురుషుల, మహిళల క్రికెట్ జట్టును ఆసియా క్రీడలకు పంపింది. టీ20 ఫార్మాట్లో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ద్వితీయ శ్రేణి జట్టు పసిడి పతకం సాధించగా.. హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో మహిళా జట్టు స్వర్ణం గెలుచుకుంది.అయితే, ఈసారి ప్రధాన టీ20 జట్టులోని సభ్యులను కూడా ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోంది. కాగా జపాన్లోని ఐచీ- నగోయాలో సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 3 వరకు ఆసియా క్రీడలు-2026 ఎడిషన్ నిర్వహించనున్నారు. ఇక గత పర్యాయం చైనా ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే.ఆసియా క్రీడలు-2026: భారత అత్యుత్తమ టీ20 జట్టు ఇదేఅభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్, ధ్రువ్ జురెల్, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివం దూబే, రింకూ సింగ్, హర్ష్ దూబే, అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయి, ప్రసిద్ కృష్ణ, యశ్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి.ప్రాబబుల్స్ జాబితాయశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, ప్రసిధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి, అనుకూల్ రాయ్, ఆయుశ్ బదోని, హర్ష్ దూబే, ధ్రువ్ జురేల్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్, షహబాజ్, శివమ్ దూబే, విప్రాజ్ నిగమ్, హర్షిత్ రాణా, యశ్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్. చదవండి: ‘అతడు 3 ఓవర్లు వేస్తే ఆర్సీబీ ఖేల్ ఖతం’ -
ఐపీఎల్ ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ!
ఐపీఎల్ 2026 సీజన్లో ఎక్కువగా వార్తల్లో నిలిచిన పేరు రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ. బ్యాటింగ్ చేసినా, ఫీల్డింగ్ చేసినా, తిన్నా, పడుకున్నా.. ఇలా అతడు ఏం చేసినా అది వార్తగానే నిలిచేది. ఎలిమినేటర్లో ఎస్ఆర్హెచ్ను చిత్తు చేసినప్పటికీ క్వాలిఫయర్-2 పోరులో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి పాలయిన రాజస్తాన్ రాయల్స్ సీజన్ను మూడో స్థానంతో ముగించింది. జట్టు ఓటమి పాలైనప్పటికీ వైభవ్ మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడు. వైభవ్ సూర్యవంశీ ఆటను మరొక్కసారి చూస్తే బాగుంటుందని అభిమానులు ఆశపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ అభిమానులకు ఒక శుభవార్త. అతడి ఆటను చూడలేకపోవచ్చు కానీ అతడిని స్టేడియంలో మరోసారి చూసే అవకాశం మాత్రం దక్కనుంది. అహ్మదాబాద్ వేదికగా నేడు ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్కు వైభవ్ సూర్యవంశీ హాజరుకానున్నాడు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లబ్భాయ్ పటేల్ అంతర్జాతీయ ఎయిర్పోర్టులో వైభవ్ తళుక్కుమన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఫైనల్ మ్యాచ్ చూసేందుకు వైభవ్ తన కుటుంబంతో కలిసి అహ్మదాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం వైభవ్ సూర్యవంశీని ప్రత్యేకంగా సన్మానించే అవకాశం కూడా ఉంది. ఈ సీజన్లో 16 మ్యాచ్ల్లో 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఒకవేళ ఇవాల్టి ఫైనల్లో గిల్, సాయి సుదర్శన్ తక్కువ స్కోర్లకు వెనుదిరిగితే మాత్రం వైభవ్ సూర్యవంశీ ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకునే చాన్స్ ఉంది. ఈ సీజన్ ఆరంభం నుంచి స్థిరమైన ప్రదర్శన కొనసాగిస్తూ వచ్చిన వైభవ్ ఒక సెంచరీ సహా ఐదు అర్థసెంచరీలు సాధించాడు. సీజన్లో 72 సిక్సర్లతో ఒక సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్గా నిలిచాడు. ఇక గుజరాత్తో మ్యాచ్లో 47 బంతుల్లో 96 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్లో ఏడు సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. ఇక ఎలిమినేటర్ పోరులోనూ ఎస్ఆర్హెచ్పై సునామీ ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి ఔటయ్యాడు. వరుసగా రెండు మ్యాచ్ల్లో సెంచరీ చేజార్చుకున్నప్పటికీ అతడి ఆటతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు.VAIBHAV SOORYAVANSHI AT AHMEDABAD TO WATCH IPL FINAL 🔥⭐ [IANS] pic.twitter.com/o7uRx10z3j— Johns. (@CricCrazyJohns) May 31, 2026చదవండి: IPL 2026: ఫైనల్ మ్యాచ్కు ముందు ఆర్సీబీకి షాక్! -
ఆస్ట్రేలియాను చిత్తు చేసిన పాకిస్తాన్
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్లో పాకిస్తాన్ శుభారంభం చేసింది. శనివారం రావాల్పిండి వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆసీస్ను 5 వికెట్ల తేడాతో పాక్ చిత్తు చేసింది. తమ 1,000 వన్డే మ్యాచ్లో ఆతిథ్య జట్టు ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. పాక్ బౌలర్ల ధాటికి 44.1 ఓవర్లలో 200 పరుగులకే కుప్పకూలింది. అరంగేట్ర ఆటగాడు అరాఫత్ మిన్హాస్ 5 వికెట్లు పడగొట్టి కంగారుల పతనాన్ని శాసించాడు. జోష్ ఇంగ్లిష్, గ్రీన్, లబుషేన్ వంటి కీలక వికెట్లను అరాఫత్ తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా వన్డే అరంగేట్రంలో 5 వికెట్లు పడగొట్టిన తొలి పాక్ బౌలర్గా మిన్హాస్ నిలిచాడు. ఇక ఆసీస్ బ్యాటర్లలో మాట్ రెన్షా(61), మాథ్యూ షార్ట్(55) మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. పాక్ బౌలర్లలో మిన్హాస్తో పాటు అబ్రార్ రెండు, రౌఫ్, అఫ్రిది, అఘా తలా వికెట్ సాధించారు.బాబర్, ఘోరి హాఫ్ సెంచరీలుఅనంతరం పాకిస్తాన్ 32 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అయితే స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం (69), వికెట్ కీపర్ బ్యాటర్ ఘాజీ ఘోరి (65) మూడో వికెట్కు 127 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ ఔటైనప్పటికి మిన్హాస్(18), సమద్(1) అజేయంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశారు.ఆసీస్ బౌలర్లలో నాథన్ ఈల్లీస్ రెండు, మాథ్యూ కునెమన్, తన్వీర్ సంగా, లబుషేన్ తలా వికెట్ సాధించారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే జూన్ 2న లహోర్ వేదికగా జరగనుంది.చదవండి: గర్వంగానే ఉంది.. నన్ను ఇరకాటంలో పెట్టొద్దు: అగార్కర్ -
నన్ను ఇరకాటంలో పెట్టొద్దు: అగార్కర్
టీమిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్గా అజిత్ అగార్కర్ వచ్చిన తర్వాత చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ విషయంలో అతడి నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. హెడ్కోచ్ గౌతం గంభీర్తో కలిసి కఠిన నిర్ణయాలు తీసుకుందనేది బహిరంగ రహస్యమే.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ను గెలిపించిన తర్వాత.. మరుసటి సిరీస్ నుంచే రోహిత్ శర్మ (Rohit Sharma)ను కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఇక సంజూ శాంసన్ను కాదని.. టెస్టు, వన్డే జట్ల సారథి శుబ్మన్ గిల్ను టీ20 ఓపెనర్గా దించి నాయకత్వ బృందం భారీ మూల్యమే చెల్లించింది.గిల్పై వేటు వేసి.. అయితే, పొరపాటును గ్రహించిన అగార్కర్ బృందం.. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి ముందు సంచలన నిర్ణయం తీసుకుంది. గిల్పై వేటు వేసి.. ఇషాన్ కిషన్ను ప్రపంచకప్ జట్టులో కొనసాగించింది. ఇక స్వదేశంలో జరిగిన ఈ మెగా ఈవెంట్లో భారత్ ట్రోఫీ గెలుచుకున్న సంగతి తెలిసిందే.ఈ టోర్నీలో నాకౌట్ మ్యాచ్లలో గొప్పగా రాణించిన ఓపెనర్ సంజూ శాంసన్ (97*, 89, 89) ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు అందుకున్నాడు. ఏదేమైనా.. ఏ సిరీస్కు భారత జట్టును ప్రకటించినా అగార్కర్పై విమర్శలు రావడం సహజమే. ఈ విషయం గురించి అతడు తాజాగా స్పందించాడు.ముంబైలో శనివారం జరిగిన క్రిక్ఇన్ఫో అవార్డు ప్రదానోత్సవానికి అగార్కర్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా ప్రజెంటర్ డానిష్ సైట్ (ఆర్సీబీ మిస్టర్ నాగ్స్గా పాపులర్) అతడిని తన ప్రశ్నలతో ఇరుకున పెట్టాడు.ప్రజెంటర్: ‘అబ్బ.. ఎంత గొప్ప జట్టును ఎంపిక చేశానో’ అని మీరు మురిపిసోయిన సందర్భాలు ఉన్నాయా?అగార్కర్ (నవ్వుతూ): నేను చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. లేదంటే నా మాటల్ని ఇష్టమొచ్చినట్లుగా వక్రీకరిస్తారు!.. ఏదేమైనా జట్టు గెలిచిన సందర్భంలో.. ఆ క్షణంలో నాకు గర్వంగానే ఉంటుంది. సెలక్షన్ కమిటీ చైర్మన్గా మంచి జట్టును ఎన్నుకున్నందుకు సంతోషంగా ఉంటుంది.ప్రజెంటర్: మన దేశంలో 140 కోట్లకు పైగా జనాభా ఉన్నారు. క్రికెట్ అభిమానుల దృష్టి మీపైనే ఉంటుంది. మరి ఓ ఆటగాడికి అవకాశం ఇవ్వలేనప్పుడు.. ‘సారీ మ్యాన్.. ఈసారి కాదు గానీ.. మళ్లీ వచ్చే సిరీస్కు చూద్దాంలే’ అని మీరు అతడికి చెప్పగలరా? ఇందుకు మీరు ఎలాంటి మార్గం ఎంచుకుంటారు?అగార్కర్ (గట్టిగా నవ్వేస్తూ): ఇప్పటికీ నో చెప్పేందుకు నాకు సరైన దారి దొరకలేదు. ఇది రోజూవారీ ప్రక్రియ. ఎప్పటికప్పుడు మెరుగుపడాల్సి ఉంటుంది.ప్రజెంటర్: మరి అందులో మీరు వినూత్నంగా కనుక్కున్న దారి ఏమైనా ఉందా?అగార్కర్: దయచేసి నన్ను ఇరకాటంలో పెట్టొద్దు. త్వరలోనే మేము మరో జట్టును ఎంపిక చేయాల్సి ఉంది అంటూ నవ్వులు పూయించాడు.చదవండి: ‘భారత టీ20 జట్టుకు ఎంపికయ్యే ఆలోచనే లేదు’ -
‘భారత టీ20 జట్టుకు ఎంపికయ్యే ఆలోచనే లేదు’
ఐపీఎల్ ట్రోఫీ కోసం కళ్లు కాచేలా పద్దెనిమిదేళ్లు ఎదురుచూసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు గతేడాది తమ చిరకాల కోరికను నెరవేర్చుకుంది. టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి సారథ్యంలో సాధ్యం కాని ఈ ఫీట్ను.. రజత్ పాటిదార్ కెప్టెన్గా అరంగేట్రంలోనే సాధించాడు.ఏమాత్రం అంచనాలు లేకుండాతద్వారా ఆర్సీబీ అభిమానులకు మరింత ఇష్టమైన ఆటగాడిగా మారిపోయాడు. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి ఈ మేరకు అరుదైన విజయం అందుకున్న పాటిదార్.. ఐపీఎల్-2026లోనూ ఆర్సీబీని అద్భుత రీతిలో ముందుకు నడిపించాడు. ఇటు బ్యాటర్గా.. అటు కెప్టెన్గా సత్తా చాటి జట్టును ఫైనల్కు చేర్చాడు.మెరుపులు మెరిపించిముఖ్యంగా గుజరాత్ టైటాన్స్తో ఫైనల్లో ఈ నాలుగో నంబర్ బ్యాటర్ దుమ్ములేపాడు. కేవలం 33 బంతుల్లోనే 5 ఫోర్లు, 9 సిక్సర్లు బాది 93 పరుగులతో అజేయంగా నిలిచాడు. తద్వారా ఈ సీజన్లో తన అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేయడంతో పాటు.. జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.ఇప్పటి వరకు ఈ సీజన్లో పద్నాలుగు మ్యాచ్లలో కలిపి పాటిదార్ 486 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో త్వరలోనే అతడు టీమిండియా తరఫున టీ20లలో అరంగేట్రం చేయడం ఖాయమని.. కెప్టెన్ రేసులోనూ ముందుంటాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ విషయంపై రజత్ పాటిదార్ తాజాగా స్పందించాడు. గుజరాత్ టైటాన్స్తో ఆదివారం నాటి ఫైనల్కు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నన్ను నేనెప్పుడూ టీమిండియా టీ20 కెప్టెన్ కావాలని ఊహించుకోలేదు. అసలు ఇపుడు భారత టీ20 జట్టుకు ఎంపిక కావాలనే ఆలోచనే నా మదిలో లేదు.భారత టీ20 జట్టుకు ఎంపికయ్యే ఆలోచనే లేదునా దృష్టి మొత్తం ఐపీఎల్-2026 సీజన్ మీదే ఉంది. ప్రతి కెప్టెన్ ట్రోఫీ గెలవాలని కోరుకుంటాడు. నేను కూడా అంతే. గతేడాది మేము టైటిల్ సాధించాము. అక్కడితో ఆ ప్రయాణం ముగిసింది.తాజా ఎడిషన్లో సరికొత్తగా ముందుకు వచ్చాము. 2025లో ఏం జరిగిందన్న విషయం గురించే మాట్లాడుతూ కూర్చుంటే పనులు ముందుకు సాగవు. ప్రస్తుత సీజన్లో ఒక్కో మ్యాచ్ గెలవడమే లక్ష్యంగా ఇక్కడిదాకా చేరుకున్నాము.అదంతా నాకు అనవసరంగతంలో ఆర్సీబీ కెప్టెన్లు ఏం చేశారో నాకు అనవసరం. భవిష్యత్తులో కెప్టెన్ అయ్యేవారు ఏం చేస్తారన్న అంశంతోనూ నాకు పనిలేదు. సారథిగా నేనేం చేయగలను అన్నదే ముఖ్యం. వ్యక్తిగతంగా నా కెరీర్లో ఎన్నో ఎత్తుపళ్లాలు ఉన్నాయి. అయితే, ఎవరినీ నాకు పోటీగా భావించను. నా పనిని పూర్తి చేయడంపైనే నా దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది. మేము డిఫెండింగ్ చాంపియన్లమనే గర్వం మాకు లేదు. మా జట్టు ఈసారి కూడా ట్రోఫీ కోసం అదే స్థాయిలో కృషి చేస్తోంది. మా ఆకలి తీరలేదు’’ అని రజత్ పాటిదార్ పేర్కొన్నాడు.చదవండి: కెప్టెన్ రేసు.. ముగ్గురిని ఎంపిక చేసిన బీసీసీఐ? -
‘అతడు మూడు ఓవర్లు వేశాడంటే ఆర్సీబీ ఓటమి ఖాయం’
డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఈసారీ కప్పు కొట్టాలని పట్టుదలగా ఉంది. ఐపీఎల్-2026 సీజన్ ఆది నుంచి ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న పాటిదార్ సేన.. టేబుల్ టాపర్గా, తొలి ఫైనలిస్టుగా నిలిచింది.ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్తో ఆదివారం నాటి టైటిల్ పోరుకూ పూర్తిస్థాయిలో సన్నద్ధమైన ఆర్సీబీ.. ఆఖరి గండాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని ఉవ్విళ్లూరుతోంది. కాగా తాజా ఎడిషన్లోనూ ఆర్సీబీ బౌలింగ్ దళం అదరగొడుతున్న సంగతి తెలిసిందే.పటిష్టంగా పేస్ దళంటీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఇప్పటికి 26 వికెట్లతో సత్తా చాటగా.. యువ ఆటగాడు రసిఖ్ దర్ సైతం 16 వికెట్లు కూల్చాడు. మిగిలిన వారిలో కృనాల్ పాండ్యా, జట్టుతో ఆలస్యంగా చేరిన జోష్ హాజిల్వుడ్ చెరో 13 వికెట్లతో ఉన్నారు. వీరికి తోడుగా సూయశ్ శర్మ (9), జేకబ్ డఫీ (9) కూడా రాణిస్తున్నారు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ బెంగళూరు జట్టు నాయకత్వ బృందానికి కీలక సూచన చేశాడు. గుజరాత్తో ఫైనల్లో రొమారియో షెఫర్డ్ చేతికి మాత్రం బంతిని ఇవ్వొద్దని సూచించాడు. అదే విధంగా ఫిల్ సాల్ట్ తిరిగి వచ్చినా వెంకటేశ్ అయ్యర్నే ఓపెనర్గా కొనసాగించాలని చిక్కా పేర్కొన్నాడు.అతడినే ఓపెనర్గా కొనసాగించాలిఈ మేరకు.. ‘‘ఫిల్ సాల్ట్ పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించాడా? లేదా? అన్న అంశంపై స్పష్టత లేదు. ఒకవేళ అతడు ఫిట్గా ఉన్నా వెంకటేశ్ అయ్యర్ బాగా ఆడుతున్నాడు కాబట్టి అతడినే ఓపెనర్గా కొనసాగిస్తే మంచిది.అతడు 3 ఓవర్లు వేశాంటే ఆర్సీబీ ఖేల్ ఖతమేఇక బౌలింగ్ విషయానికొస్తే... ఒకవేళ రొమారియో షెఫర్డ్తో కనీసం మూడు ఓవర్లు బౌలింగ్ చేయించినా సరే ఆర్సీబీ ఓడిపోవడం లాంఛనమే. అతడు కచ్చితంగా మూడు ఓవర్లు వేశాంటే ఆర్సీబీ ఖేల్ ఖతమే.PC: BCCIషెఫర్డ్ చేతికి అస్సలు బంతిని ఇవ్వకండి. నన్నడిగితే అతడికి తుదిజట్టులో కూడా చోటు ఇవ్వకండి’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. కాగా వెస్టిండీస్ ఆల్రౌండర్ రొమారియో షెఫర్డ్ గతేడాది కప్పు గెలిచిన ఆర్సీబీ జట్టులో సభ్యుడు.పేలవ ప్రదర్శనఈ క్రమంలో తాజా ఎడిషన్కు కూడా ఆర్సీబీ షెఫర్డ్ను అట్టిపెట్టుకుంది. ఇక ఈ సీజన్లో అతడు.. ఇప్పటికి 14 మ్యాచ్లలో కలిపి సగటు 42, ఎకానమీ 12తో చెత్తగా బౌలింగ్ చేసి.. ఏడు వికెట్లు తీయగలిగాడు. ఇక బ్యాటర్గా 14 మ్యాచ్లలో కలిపి కేవలం 83 పరుగులే రాబట్టాడు. చివరగా గుజరాత్తో క్వాలిఫయర్-1లో షెఫర్డ్ ఒక ఓవర్ వేసి 15 పరుగులు ఇచ్చుకున్నాడు.ఐపీఎల్-2026 ఫైనల్.. ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ తుది జట్లు (అంచనా) ఆర్సీబీ: రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్/ వెంకటేశ్ అయ్యర్, దేవ్దత్ పడిక్కల్, కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, జితేశ్ శర్మ, రొమారియో షెఫర్డ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్వుడ్, రసిఖ్ దర్, జేకబ్ డఫీ/ సుయశ్ శర్మ గుజరాత్: శుబ్మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, నిశాంత్ సంధు, జేసన్ హోల్డర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, సాయికిషోర్. చదవండి: కెప్టెన్ రేసు.. ఆ ముగ్గురిని ఎంపిక చేసిన బీసీసీఐ! -
వైభవ్కు మరో భారీ జాక్పాట్..?
ఐపీఎల్ 2026 సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఫైనల్లో ఆర్సీబీ-గుజరాత్ టైటాన్స్ తలపడుతుండగా, ట్రోఫీతో పాటు భారీ నగదు బహుమతులు కూడా ఆకర్షణగా నిలిచాయి. విజేత జట్టుకు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుండగా, రన్నరప్కు రూ.13 కోట్లు అందనున్నాయి.ఈ సీజన్లో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే మూడుసార్లు తలపడగా, ఆర్సీబీ 2-1 ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు ఫైనల్లో గెలిచే జట్టు ట్రోఫీతో పాటు భారీ చెక్కును కూడా సొంతం చేసుకోనుంది.ప్లే ఆఫ్స్కు చేరిన జట్లకు దక్కే ప్రైజ్ మనీఫైనల్ విజేతకు రూ.20 కోట్లు, రన్నరప్కు రూ.13 కోట్లు అందనున్నాయి. ఇక క్వాలిఫయర్-2లో ఓడిన రాజస్థాన్ రాయల్స్కు రూ.7 కోట్లు, ఎలిమినేటర్లో నిష్క్రమించిన ఎస్ఆర్హెచ్కు రూ.6.5 కోట్లు లభించనున్నాయి.వైభవ్కు మరో భారీ జాక్పాట్..?ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ పోరు ఆసక్తికరంగా మారింది. 15 ఏళ్ల చిచ్చరపిడుగు, రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 16 ఇన్నింగ్స్ల్లో 776 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే గుజరాత్ ఓపెనర్లు శుభ్మన్ గిల్ (722), సాయి సుదర్శన్ (710) కూడా ఇంకా రేసులోనే ఉన్నారు. ఆరెంజ్ క్యాప్ విజేతకు రూ.10 లక్షలు అందుతాయి.పర్పుల్ క్యాప్ కోసం రబడా–భువీ పోటీపర్పుల్ క్యాప్ రేసులో గుజరాత్ పేసర్ రబాడ 28 వికెట్లతో ముందంజలో ఉన్నాడు. ఆర్సీబీ పేసర్ భువనేశ్వ్ర్ కుమార్ 26 వికెట్లతో రబాడ వెన్నంటే ఉన్నాడు. పర్పుల్ క్యాప్ గెలిచే బౌలర్కు కూడా రూ.10 లక్షల బహుమతి ఉంటుంది.ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డుకు వైభవ్ ఫేవరెట్ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు కోసం వైభవ్ సూర్యవంశీ, ప్రియాంశ్ ఆర్య (పంజాబ్ కింగ్స్)మధ్య పోటీ నెలకొంది. ఈ అవార్డు గెలిచే ఆటగాడికి రూ.20 లక్షలు అందుతాయి.ఎంవీపీగా ఎవరు..?మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ (MVP) అవార్డు కోసం వైభవ్ సూర్యవంశీ (436.5 పాయింట్లు), కగిసో రబడా (408), జోఫ్రా ఆర్చర్ (396.5) మధ్య పోటీ కనిపిస్తోంది. ఎంవీపీ విజేతకు రూ.10 లక్షలు దక్కనున్నాయి.ఫెయిర్ప్లే అవార్డుఈ సీజన్లో ఫెయిర్ప్లే పట్టికలో పంజాబ్ కింగ్స్ ముందంజలో ఉంది. ఫెయిర్ప్లే అవార్డు గెలిచే జట్టుకు రూ.10 లక్షల నగదు బహుమతి అందుతుంది.ఐపీఎల్ ప్రైజ్ మనీ చరిత్ర2008, 2009 సీజన్లలో విజేతలకు కేవలం రూ.4.8 కోట్లు మాత్రమే ఇచ్చేవారు. 2010 నుంచి రూ.10 కోట్లకు పెంచిన బీసీసీఐ, 2014లో రూ.15 కోట్లు చేసింది. 2016 నుంచి విజేతలకు రూ.20 కోట్లు అందిస్తున్నప్పటికీ, కోవిడ్ ప్రభావంతో 2020లో మాత్రమే రూ.15 కోట్లకు తగ్గించింది. 2021 నుంచి మళ్లీ రూ.20 కోట్లే కొనసాగుతున్నాయి.ఈసారి మొత్తం అవార్డుల రూపంలో బీసీసీఐ సుమారు రూ.47.1 కోట్లను పంపిణీ చేయనుంది. ఫైనల్ ఫలితం ఎలా ఉన్నా, ఐపీఎల్ 2026లో ఆటగాళ్లు, జట్లపై కనక వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది. -
ఇషాన్ కిషన్కు భారీ షాకిచ్చిన ముంబై ఇండియన్స్ అనామకుడు
ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న స్టార్ వికెట్కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్కు జార్ఖండ్ టీ20 లీగ్ వేలంలో ఊహించని షాక్ తగిలింది. సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఈ సీజన్లో పరుగుల వరద పారించిన ఇషాన్ను వెనక్కినెట్టి, ముంబై ఇండియన్స్ వికెట్కీపర్ బ్యాటర్ రాబిన్ మింజ్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు.జార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ సంఘం నిర్వహించిన తొలి జార్ఖండ్ టీ20 లీగ్ మెగా వేలం మే 30న ఘనంగా జరిగింది. రాంచీ వేదికగా జరిగిన ఈ వేలంలో ఆరు జట్లు పాల్గొన్నాయి. రాంచీ టైటాన్స్, జంషెడ్పూర్ స్టీలర్స్, చోటా నాగ్పూర్ రాయల్స్, కోయలాంఛల్ సూపర్కింగ్స్, థన్బాద్ డైమాండ్స్, సంథల్ స్ట్రయికర్స్ ఫ్రాంచైజీలు తలో రూ.50 లక్షల బడ్జెట్తో ఆటగాళ్లను కొనుగోలు చేశాయి.ఈ వేలంలో రాబిన్ మింజ్ను దక్కించుకునేందుకు తీవ్రమైన పోటీ నెలకొంది. చివరకు కోయలాంఛల్ సూపర్ కింగ్స్ అతడిని రూ.15.25 లక్షలకు సొంతం చేసుకుంది. దీంతో టోర్నీ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రాబిన్ మింజ్ రికార్డు సృష్టించాడు.మరోవైపు ఇషాన్ కిషన్ను సంథల్ స్ట్రయికర్స్ రూ.14.70 లక్షలకు కొనుగోలు చేసింది. రాబిన్ మింజ్తో పోలిస్తే ఇషాన్ ధర రూ.55 వేల తక్కువగా ఉండటం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.వాస్తవానికి ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026లో ఇషాన్ కిషన్ అద్భుత ఫామ్లో కనిపించాడు. 15 ఇన్నింగ్స్ల్లో 40.13 సగటు, 182.42 స్ట్రయిక్రేట్తో 602 పరుగులు చేసి సన్రైజర్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు రాబిన్ మింజ్ మాత్రం ముంబై ఇండియన్స్ తరఫున కేవలం రెండే మ్యాచ్లు ఆడి ఆరు పరుగులు మాత్రమే చేశాడు.అయినా, దేశీయ క్రికెట్లో రాబిన్ మింజ్కు ఉన్న పవర్ హిట్టర్ ఇమేజ్ అతడిని ఇషాన్ కంటే ఎక్కువ మొత్తానికి అమ్ముడుపోయేలా చేసింది. ఇషాన్ జాతీయ జట్టు బాధ్యతల కారణంగా టోర్నీలో కొన్ని మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉండటం కూడా వేలంపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.కాగా, తొలి జార్ఖండ్ టీ20 లీగ్ జూన్ 10 నుంచి ప్రారంభం కానుంది. ఈ లీగ్లో మొత్తం 27 మ్యాచ్లు జరగనున్నాయి. లీగ్ దశ అనంతరం అగ్ర జట్లు నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి. అయితే టోర్నీ ప్రారంభానికి ముందే ఇషాన్ కిషన్ను అధిగమించి రాబిన్ మింజ్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. -
కెప్టెన్ రేసు.. ఆ ముగ్గురిని సెలక్ట్ చేసిన బీసీసీఐ?!
సారథిగా టీమిండియాకు ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ అందించిన సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ కెరీర్ దాదాపుగా ముగిసినట్లే కనిపిస్తోంది. బ్యాటర్గా పేలవ ఫామ్, వయసురీత్యా అతడిని మున్ముందు టీ20 ఫార్మాట్లో పరిశీలించే అవకాశం లేదని సెలక్టర్లు పరోక్షంగా చెప్పేశారు. ఈ ఏడాది జరిగే ఆసియా క్రీడల కోసం 30 మందితో కూడిన ప్రాబబుల్స్ జాబితాను భారత ఒలింపిక్ సంఘానికి (IOA)కు.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అందజేసింది. ఇందులో 35 ఏళ్ల సూర్యకుమార్ పేరు లేకపోవడమే ఇందుకు నిదర్శనం.ఆ సమావేశంలోనే నిర్ణయం!ఈ నేపథ్యంలో టీమిండియా టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) వారసుడు ఎవరన్న అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. అఫ్గనిస్తాన్తో సిరీస్ ఆరంభానికి ముందు బీసీసీఐ సెలక్టర్లు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.ఆ మీటింగ్లోనే ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు పంపే జట్ల గురించి చర్చించనున్నట్లు.. అదే విధంగా టీ20 కొత్త కెప్టెన్ గురించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ..ఆ ముగ్గురిలో ఒకరికి అవకాశం!‘‘సూర్యను సారథిగా తొలగించే ముందే కొత్త కెప్టెన్ ఎవరన్న అంశంపై సెలక్టర్లు సుదీర్ఘంగా చర్చించనున్నారు. శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్ ఈ రేసులో ముందున్నారు. వరల్డ్కప్ టోర్నీలో వైస్ కెప్టెన్గా వ్యవహరించిన అక్షర్ పటేల్ పేరును కూడా సెలక్టర్లు పరిశీలిస్తున్నారు.అయితే, ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల రూపంలో సూర్యకు మరో అవకాశం ఇచ్చేందుకు సెలక్టర్లు సిద్ధంగానే ఉన్నారు. అతడు బ్యాటర్గా ఫామ్లోకి వస్తే అంతా బాగానే ఉంటుంది. లేదంటే మున్ముందు జట్టులో చోటు కష్టమే.నిజానికి మేనేజ్మెంట్ ప్రస్తుతం వన్డే వరల్డ్కప్-2027 సన్నాహకాల్లో ఉంది. అందుకే టీ20 ఫార్మాట్లో జరిగే ఆసియా క్రీడలకు ఎంపిక చేసే జట్టులో కొత్త ఆటగాళ్లకు చోటు ఇవ్వాలని భావించింది.సెప్టెంబరు 19 నుంచిఅయితే, ఒకవేళ భారత ప్రభుత్వం పూర్తిస్థాయి జట్టును ఆసియా క్రీడలకు పంపాలని ఆదేశిస్తే బీసీసీఐ అందుకు తగినట్లుగానే నిర్ణయం తీసుకుంటుంది’’ అని పేర్కొన్నాయి. కాగా ఈ ఏడాది సెప్టెంబరు 19 నుంచి అక్టోబర్ 4 వరకు ఆసియా క్రీడల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.అదే సమయంలో స్వదేశంలో వెస్టిండీస్తో టీమిండియా వన్డే సిరీస్ ఆడుతుంది. ఈ నేపథ్యంలో వీటి కోసం రెండు వేర్వేరు జట్లను ఎంచుకునేందుకు వీలుగా 30 మందితో పెద్ద జాబితాను బోర్డు ప్రకటించింది. వన్డే కెప్టెన్గా శుబ్మన్ గిల్ జట్టును నడిపిస్తాడు కాబట్టి ఆసియా క్రీడల కోసం అతడి పేరును పరిశీలించలేదు.ఇక ప్రాబబుల్స్లోనే అయినా తొలిసారి భారత సీనియర్ టీమ్ బృందంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం విశేషం. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2026 ముగిసిన తర్వాత జూన్ 6 నుంచి టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్తాన్తో ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడనుంది. ఆసియా క్రీడల ప్రాబబుల్స్ జాబితా: యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, ప్రసిధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి, అనుకూల్ రాయ్, ఆయుశ్ బదోని, హర్ష్ దూబే, ధ్రువ్ జురేల్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్, షహబాజ్, శివమ్ దూబే, విప్రాజ్ నిగమ్, హర్షిత్ రాణా, యశ్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్. చదవండి: అది సెలక్టర్ల పని: సచిన్ -
చరిత్ర సృష్టించిన నేపాల్ బ్యాటర్
అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత అరుదైన ఘనతల్లో ఒకటైన "ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు" బాదిన ఆటగాళ్ల జాబితాలో మరో పేరు చేరింది. నేపాల్ స్టార్ ఓపెనర్ కుషాల్ భుర్టెల్ ఈ ఘనతను సాధించి, క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.భుర్టెల్కు ముందు అంతర్జాతీయ క్రికెట్లో హెర్షల్ గిబ్స్, యువరాజ్ సింగ్, కీరన్ పోలార్డ్, జస్కరన్ మల్హోత్రా, దీపేంద్ర సింగ్ ఎయిరీ మాత్రమే ఈ ఘనత సాధించారు. తాజాగా భుర్టెల్ వీరి సరసన చేరాడు.పురుషుల ఏషియన్ గేమ్స్ టీ20 క్వాలిఫయర్-2026లో టోర్నీలో భాగంగా చైనాతో ఇవాళ (మే 31) జరిగిన మ్యాచ్లో భుర్టెల్ ఈ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన భుర్టెల్ చైనా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో Zhuoyue Chen వేసిన ఆరు బంతులను వరుసగా సిక్సర్లుగా మలిచి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.భుర్టెల్ కేవలం ఆరు సిక్సర్లతోనే ఆగిపోలేదు. మొత్తం 43 బంతుల్లోనే 129 పరుగులు చేసి చైనా బౌలింగ్ను చీల్చి చెండాడాడు. అతని ఇన్నింగ్స్లో ఏకంగా 16 సిక్సర్లు నమోదయ్యాయి. అనంతరం Deng Jinqi అతన్ని ఔట్ చేసినా అప్పటికే మ్యాచ్ పూర్తిగా నేపాల్ చేతుల్లోకి వెళ్లిపోయింది.భుర్టెల్కు తోడుగా కుషాల్ మల్లా 47 బంతుల్లో 85 పరుగులు, రోహిత్ పౌడెల్ కేవలం 21 బంతుల్లో అజేయంగా 69 పరుగులు చేసి చెలరేగారు. ఫలితంగా నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి ఏకంగా 313 పరుగుల అతి భారీ స్కోరు సాధించింది.314 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చైనా ఆరంభం నుంచే ఒత్తిడికి గురైంది. నేపాల్ బౌలర్ల కట్టుదిట్టమైన ప్రదర్శన ముందు చైనా బ్యాటింగ్ కుప్పకూలింది. చైనా జట్టు కేవలం 92 పరుగులకే ఆలౌట్ అయింది. Zheng Shenjian 31 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ముగ్గురు బ్యాటర్లు ఖాతా కూడా తెరవలేకపోయారు.కాగా, సింగపూర్ వేదికగా జరుగుతున్న పురుషుల ఏషియన్ గేమ్స్ టీ20 క్వాలిఫయర్-2026 టోర్నీలో మొత్తం 8 జట్లు రెండు గ్రూప్లుగా విభజించబడి పోటీపడుతున్నాయి. నేపాల్, చైనా, ఖతార్, మలేసియా ఓ గ్రూప్-ఏలో ఉండగా.. బెహ్రెయిన్, హాంగ్కాంగ్, ఒమన్, సింగపూర్ గ్రూప్-బిలో పోటీపడుతున్నాయి. -
‘నా చావు కోరుకుంటున్నారు.. నేను మొండిదాన్ని’
భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) తన చావును కోరుకుంటోందని ఆరోపించింది. కాగా 2024 పారిస్ ఒలింపిక్స్లో ఫైనల్కు అర్హత సాధించిన అనంతరం వినేశ్కు చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేగా విజయంకేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హత వేటు పడటంతో ఆమె పతకానికి దూరమైంది. ఆ తర్వాత రెజ్లింగ్కు రిటైర్మెంట్ ప్రకటించిన వినేశ్... రాజకీయాల్లో చేరి ఎమ్మెల్యేగా విజయం సాధించింది. తల్లిగా మారిన అనంతరంఇటీవల తల్లిగా మారిన అనంతరం తిరిగి మ్యాట్పై అడుగు పెట్టాలనుకున్న ఈ హర్యానా అథ్లెట్కు భారత రెజ్లింగ్ సమాఖ్య షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో న్యాయపోరాటం చేసిన వినేశ్ ఆసియా క్రీడల సెలక్షన్ ట్రయల్స్లో పాల్గొంది. అయితే, ఇక్కడా ఆమెకు చుక్కెదురైంది.మీనాక్షి గోయత్ చేతిలో ఓటమిఎన్నో ఆరోపణలు, మరెన్నో పోరాటాల తర్వాత సుప్రీంకోర్టు అనుమతితో సెలక్షన్ ట్రయల్స్లో పాల్గొన్న వినేశ్ అనూహ్య రీతిలో సెమీఫైనల్లో పరాజయం పాలైంది. న్యూఢిల్లీలో శనివారం జరిగిన మహిళల 53 కేజీల సెమీఫైనల్ బౌట్లో వినేశ్ 4–6 పాయింట్ల తేడాతో మీనాక్షి గోయత్ చేతిలో ఓడిపోయింది. ప్రతి పాయింట్ కోసం ప్రాణం పెట్టానుఈ నేపథ్యంలో..‘నేను విఫలమయ్యానని భావించడం లేదు. నేను మ్యాట్పై కేవలం ప్రత్యర్థితో మాత్రమే పోరాడటం లేదు... మొత్తం వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్నా. ప్రతి పాయింట్ కోసం ప్రాణం పెట్టాను. నాకు సరైన అవకాశం లభించలేదు. నాతో పోటీపడి గెలిచిన రెజ్లర్లపై నాకు ఎలాంటి ద్వేషం లేదు. వాళ్లు నాతో బౌట్లో పాల్గొనాలని కలలు కన్నారు. నేను తప్పక తిరిగి వస్తా’ అని వినేశ్ భావోద్వేగానికి గురైంది. అదే సమయంలో.. ‘నేను ఓడిపోయానని తెలిసి డబ్ల్యూఎఫ్ఐ అధికారులు సంతోషంతో సంబరాలు చేసుకున్నారు.నా చావును కోరుకుంటున్నారు.. నేను మొండిదాన్నిపర్లేదు.. ఇప్పుడు వాళ్లను సెలబ్రేట్ చేసుకోనివ్వండి. నేను చాలా మొండిదాన్ని. నాకు పట్టుదల ఎక్కువ. ఇలాంటి చేదు అనుభవాలే నన్ను మరింత వేగంగా ముందుకు నడిపిస్తాయి. ఇవే నా ప్రయాణానికి ఇంధనాలు. నేను కచ్చితంగా తిరిగి వస్తా.నా ప్రతిభపై సందేహాలు వ్యక్తం చేస్తున్న ప్రతి ఒక్కరికీ నా ప్రదర్శనతోనే సమాధానం చెప్తా. నేను వీలైనంత త్వరగా చావాలని ఈ రెజ్లింగ్ సమాఖ్య కోరుకుంటోంది. ప్రస్తుతానికైతే వారి ఆలోచన ఇదే’ అని వినేశ్ సంచలన ఆరోపణలు చేసింది. IANSతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.తీవ్ర గందరగోళంకాగా ఆసియా క్రీడల సెలక్షన్ ట్రయల్స్ తొలి రౌండ్లో వినేశ్ 7–1తో జ్యోతిపై అలవోక విజయం సాధించింది. దీంతో వినేశ్ అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకొన్నారు. ఇక క్వార్టర్ ఫైనల్లో వినేశ్ 7–6 పాయింట్ల తేడాతో నిషు కుమారిని ఓడించింది. ఈ బౌట్ జరుగుతున్న సమయంలో తీవ్ర గందరగోళం నెలకొంది.భారత బృందంలో వీరికి చోటువినేశ్ పదే పదే రిఫరీ నిర్ణయాన్ని సవాలు చేయడం... ఆమె అభిమానులు నినాదాలతో హోరెత్తించడం... టెక్నికల్ ఇబ్బందులు ఇలా విజేతను నిర్ణయించేందుకు చాలా సమయం పట్టింది. మరోవైపు.. సెమీస్లో వినేశ్పై గెలిచిన మీనాక్షి... తుది పోరులో అంతిమ్ చేతిలో ఓడిపోయింది. అంతిమ్తో పాటు నిషా దహియా (68 కేజీలు), మనీషా (57 కేజీలు), దీపాన్షి (50 కేజీలు) ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత బృందంలో చోటు దక్కించుకున్నారు. చదవండి: అది సెలక్టర్ల పని: సచిన్ టెండుల్కర్ -
శృతి మించిన పీఎస్జీ టైటిల్ సంబరాలు
ఫ్రాన్స్ లీగ్ ఫుట్బాల్ దిగ్గజం పారిస్ సెయింట్ జెర్మైన్ (పీఎస్జీ) జట్టు వరుసగా రెండో సారి యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ టైటిల్ను కైవసం చేసుకుంది. హంగేరీ రాజధాని బూడాపెస్ట్లో నిన్న జరిగిన ఫైనల్లో ఆర్సెనల్ ఎఫ్సీను పెనాల్టీ షూటౌట్లో 4-3తో ఓడించి టైటిల్ను నిలబెట్టుకుంది. నిర్ణీత సమయం, అదనపు సమయంలో ఇరు జట్లు 1-1తో సమంగా నిలవడంతో మ్యాచ్ పెనాల్టీలకు వెళ్లింది. అక్కడ పీఎస్జీ ఆటగాళ్లు ఒత్తిడిని తట్టుకుని విజయం సాధించారు.అయితే మ్యాచ్ ముగిసిన వెంటనే పారిస్ నగరంలో వేలాది మంది అభిమానులు వీధుల్లోకి వచ్చి సంబరాలు ప్రారంభించారు. ముఖ్యంగా ప్రసిద్ధ ఛాంప్స్-ఎలిసిస్ ప్రాంతంలో భారీగా అభిమానులు గుమికూడారు. బాణాసంచా పేల్చడం, ఫ్లేర్లు వెలిగించడం, రోడ్లపై భారీ ర్యాలీలు నిర్వహించడం కనిపించింది. ప్రారంభంలో శాంతియుతంగా సాగిన వేడుకలు క్రమంగా ఉద్రిక్తంగా మారాయి.కొన్ని ప్రాంతాల్లో అభిమానులు మంటలు పెట్టడం, వాహనాలు ధ్వంసం చేయడం, దుకాణాలపై దాడులకు పాల్పడినట్లు ఫ్రెంచ్ అధికారులు వెల్లడించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ముఖ్యంగా పీఎస్జీ స్వస్థల మైదానం పార్క్ డెస్ ప్రిన్సెస్ పరిసరాల్లో, అలాగే నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో అభిమానులు–పోలీసుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి.గత రాత్రి 11 గంటలకల్లా 130 మందికి పైగా వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. గత ఏడాది పీఎస్జీ తొలి ఛాంపియన్స్ లీగ్ విజయానంతరం కూడా ఇలాంటి అల్లర్లు చోటుచేసుకోవడంతో ఈసారి ముందస్తుగా దేశవ్యాప్తంగా సుమారు 22 వేల మంది పోలీసులను మోహరించారు. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో హింసను పూర్తిగా అరికట్టలేకపోయారు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే, ఆరంభంలో ఆర్సెనల్ ఆధిపత్యం ప్రదర్శించింది. ఆరో నిమిషంలో జర్మన్ స్టార్ కాయ్ హావెర్ట్జ్ గోల్ చేసి ఆర్సెనల్కు ఆధిక్యం అందించాడు. అయితే రెండో అర్ధభాగంలో పీఎస్జీ తరఫున ఔస్మేన్ డెంబెలె పెనాల్టీని గోల్గా మలిచి స్కోరును సమం చేశాడు. అదనపు సమయంలోనూ ఫలితం తేలకపోవడంతో మ్యాచ్ పెనాల్టీలకు వెళ్లింది.పెనాల్టీ షూటౌట్లో ఆర్సెనల్ డిఫెండర్ గాబ్రియల్ మగల్హేస్ కీలక షాట్ను మిస్ చేయగా, పీఎస్జీ మిగిలిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని చరిత్ర సృష్టించింది. కోచ్ లూయిస్ ఎన్రిక్ నాయకత్వంలో పీఎస్జీ యూరప్ ఫుట్బాల్లో కొత్త శక్తిగా ఎదుగుతుండగా, పారిస్ వీధుల్లో జరిగిన హింసాత్మక ఘటనలు ఆ విజయోత్సాహాన్ని నీరు గార్చాయి. -
కోహ్లిని మరోసారి గెలికిన హెడ్
ఐపీఎల్ 2026 ఫైనల్కు ముందు విరాట్ కోహ్లీ–ట్రావిస్ హెడ్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్గా మారింది. కొద్ది రోజుల కిందట ఓ ఐపీఎల్ మ్యాచ్లో (ఆర్సీబీ-ఎస్ఆర్హెచ్) వీరిద్దరూ మాటా-మాటా అనుకున్న విషయం తెలిసిందే. మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ, ఎస్ఆర్హెచ్లోని పలువురు ఆటగాళ్లతో కరచాలనం చేసినప్పటికీ, ట్రావిస్ హెడ్తో మాత్రం చేతులు కలపలేదు.ఆతర్వాత కోహ్లి అభిమానులు హెడ్ను, అతని భార్య జెస్సికా హెడ్ సోషల్మీడియా వేదికగా టార్గెట్ చేయడం ప్రారంభించారు. కోహ్లి అభిమానులు హెడ్ భార్యపై వ్యక్తిగత దూషణలు కూడా చేశారు.ఈ వివాదం హెడ్ తాజా సోషల్మీడియా పోస్ట్తో కొత్త మలుపు తీసుకుంది. ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్లో ఆశించిన ఫలితాలు సాధించలేక టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీ, జోఫ్రా ఆర్చర్ ధాటికి ఓటమి పాలైంది. తాజాగా ఎస్ఆర్హెచ్ ఆటగాడైన ట్రావిస్ హెడ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టాడు. అందులో "Appreciate those who showed love and respect" అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఈ క్యాప్షన్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.ఆ క్యాప్షన్లో హెడ్ నేరుగా ఎవరి పేరు ప్రస్తావించకపోయినా, కోహ్లినే పరోక్షంగా టార్గెట్ చేసినట్లు అర్దమవుతుంది. కోహ్లీ అభిమానుల నుంచి తనకు, తన కుటుంబానికి ఎదురైన ట్రోలింగ్ను ఉద్దేశించే ఈ వ్యాఖ్య చేశాడని సోషల్ మీడియాలో విశ్లేషణలు మొదలయ్యాయి.కాగా, హెడ్-కోహ్లి మధ్య గొడవ తర్వాత జెస్సికా హెడ్, ఆమె కుటుంబం, స్నేహితులపై సోషల్మీడియా వేదికగా తీవ్రస్థాయి దూషణలు వచ్చాయి. భారత్లో జరిగిన 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ తర్వాత కూడా ఇలాంటి చేదు అనుభవాలే ఎదురైనట్లు ఆమె స్వయంగా వెల్లడించింది. ఆ ప్రపంచకప్ ఫైనల్లో భారత్పై అద్భుత సెంచరీ సాధించి ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించిన ట్రావిస్ హెడ్ అప్పుడూ భారత అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. అలాగే 2024 బాక్సింగ్ డే టెస్టులో భారత్పై కీలక ఇన్నింగ్స్ ఆడిన తర్వాత కూడా ఇలాంటి ట్రోలింగ్ ఎదుర్కొన్నట్లు నివేదికలు వెల్లడించాయి. కుటుంబాలను టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు..! క్రీడల్లో పోటీ ఎంత తీవ్రంగా ఉన్నా, ఆటగాళ్ల కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని దూషించడం సమర్థనీయం కాదనే అభిప్రాయం మాత్రం అన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.ఇదిలా ఉంటే, అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇవాళ (మే 31) రాత్రి ఐపీఎల్ 2026 ఫైనల్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ టైటిల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ- గుజరాత్ టైటాన్స్ పోటీపడనున్నాయి. -
అది సెలక్టర్ల పని: వైభవ్ సూర్యవంశీపై సచిన్ వ్యాఖ్యలు
ఐపీఎల్-2026లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ. రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా 16 మ్యాచ్లలో కలిపి ఏకంగా 776 పరుగులు సాధించాడు. ఈ లెఫ్టాండర్ ఇన్నింగ్స్లో ఓ విధ్వంసకర శతకం (36 బంతుల్లోనే) కూడా ఉండటం విశేషం. క్వాలిఫయర్-2 ముగిసేసరికి అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ కూడా తన వద్దే పెట్టుకున్నాడు ఈ చిచ్చరపిడుగు.టీమిండియాకు ఆడించాలనే డిమాండ్లుఇక అంతకు ముందు భారత అండర్-19 జట్టు తరఫున కూడా అదరగొట్టాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi). ఈ పరిణామాల క్రమంలో ఇప్పటికే భారత్-‘ఎ’ జట్టుకు కూడా ఎంపికయ్యాడు. అయితే, వీలైనంత త్వరగా ఈ పదిహేనేళ్ల పిల్లాడిని టీమిండియాకు ఆడించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.అత్యద్భుతంఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ వైభవ్ సూర్యవంశీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ప్రతి ఒక్కరూ సూర్యవంశీ గురించే మాట్లాడుతున్నారు. నేను కూడా అతడి బ్యాటింగ్ చూశాను. నిజంగా అత్యద్భుతం. అతడు చాలా చాలా ప్రత్యేకమైన ఆటగాడు.కేవలం బంతిని బాదడమే కాదు.. బ్యాటింగ్ చేసేటప్పుడు అతడు మణికట్టును ఉపయోగించే విధానం నన్ను ఆశ్చర్యపరిచింది. మైదానం నలుమూలలా షాట్లు బాదాలంటే రిస్ట్ వర్క్ అత్యంత ముఖ్యం. వైభవ్ ఏదో దూకుడుగా, గుడ్డిగా బంతిని బాదడం లేదు.బాల్ను ఎదుర్కొనే ముందు లైన్ అండ్ లెంగ్త్ను సరిగ్గా అంచనా వేసి షాట్ ఆడుతున్నాడు. అందుకే మిగతా వారితో పోలిస్తే అతడు ఎక్కువగా బౌండరీలు బాదగలుగుతున్నాడు. అతడు టీమిండియాకు ఆడాలని అందరూ కోరుకుంటున్నారు.టెస్టు క్రికెట్ ఆడితే చూడాలని ఉంది..అయితే, ఇలాంటి విషయాలు వైభవ్పై ఒత్తిడి పెంచుతాయి. ఏదేమైనా అతడు తన సహజ శైలిని వదులుకోవద్దు. వైభవ్ టెస్టు క్రికెట్ ఆడితే చూడాలని ఉంది. మిగతా ఫార్మాట్లతో పోలిస్తే టెస్టుల్లో సవాళ్లు ఎక్కువగా ఉంటాయి.ప్రతీ బంతి ఒక ప్రశ్న లాంటిదే. దానికి బదులిచ్చే క్రమంలో పరిష్కారం కనుగొనే ఆలోచనా విధానం పెరుగుతుంది. కెరీర్లో చివరి రోజు వరకూ కూడా ఈ సవాళ్లు కొనసాగుతూనే ఉంటాయి. ఏదేమైనా వైభవ్ ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. తాను చేస్తున్న పనిపట్ల అతడికి చక్కటి అవగాహన ఉంది.అది సెలక్టర్ల పనిఅందరూ కోరుకున్నట్లుగానే వైభవ్ టెస్టు క్రికెట్ ఆడితే ఎంతో బాగుంటుంది. అయితే, అతడిపై ఒత్తిడి పెంచకూడదు. ప్రతిభావంతుడైన ఆటగాడికి అవకాశాలు ఇవ్వడం ఎంత ముఖ్యమో.. అతడిపై ఒత్తిడి పెరగకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం.ఇలా ఆడాలి.. అలా ఆడాలి అంటూ మరీ ఎక్కువగా సూచనలు ఇచ్చి అతడిని గందరగోళంలోకి నెట్టేయకూడదు. వైభవ్ ఎంపిక గురించిన అంశాన్ని సెలక్టర్లకు వదిలివేయాలి. అతడిని ఏ జట్టుకు ఎంపిక చేయాలో వారికే తెలుసు. అది వారి బాధ్యత కూడా!.. కాబట్టి వైభవ్ విషయంలో తొందరపడటం మంచిది కాదు’’ అని సచిన్ టెండుల్కర్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో పేర్కొన్నాడు.చదవండి: ఐపీఎల్ ఎగ్గొట్టి.. అక్కడెలా ఆడావు?.. సంగక్కర ఆగ్రహం! -
చెలరేగిన ఇంగ్లండ్ బౌలర్లు.. టీమిండియాకు భంగపాటు
ఇంగ్లండ్ పర్యటనలో భారత మహిళల క్రికెట్ జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా బ్రిస్టల్ వేదికగా నిన్న (మే 30) జరిగిన రెండో టీ20లో ఆతిథ్య జట్టు 26 పరుగుల తేడాతో భారత్పై ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఫ్రేయా కెంప్ (39 నాటౌట్), డ్యానీ వాట్ హాడ్జ్ (29), అమీ జోన్స్ (28), అలైస్ క్యాప్సీ (28), డానియెలా గిబ్సన్ (11 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించగా.. సోఫీ డంక్లీ (10), హీథర్ నైట్ (18) తక్కువ స్కోర్లతో ఔటయ్యారు. భారత బౌలర్లలో శ్రీ చరణి (4-025-3) అద్భుతంగా బౌలింగ్ చేసింది. శ్రేయాంక పాటిల్ (4-0-29-1), నందిని శర్మ (4-0-26-1) కూడా పర్వాలేదనిపించారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో టీమిండియా తడబడింది. ఇంగ్లండ్ బౌలర్లు తలో చేయి వేయడంతో 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులకే పరిమితమైంది. లారెన్ బెల్, ఛార్లోట్ డీన్, ఫ్రేయా కెంప్ తలో 2 వికెట్లు, సోఫీ ఎక్లెస్టోన్ ఓ వికెట్ తీసి టీమిండియాను దెబ్బకొట్టారు. భారత ఇన్నింగ్స్లో 33 పరుగులు చేసిన యస్తికా భాటియా టాప్ స్కోరర్ కాగా.. స్మృతి మంధన 32, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 28, షఫాలీ వర్మ 22 పరుగులు చేశారు. మిగతా ప్లేయర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. జెమీమా రోడ్రిగ్స్ 1, రిచా ఘోష్ 8, దీప్తి శర్మ 2, శ్రేయాంక 6, శ్రీచరణి 1, అరుంధతి రెడ్డి 4 (నాటౌట్), నందిని శర్మ 0 (నాటౌట్) పరుగులు చేశారు. ఈ గెలుపుతో ఇంగ్లండ్ సిరీస్లో బోణీ కొట్టింది. టాంటన్ వేదికగా జూన్ 2న జరిగే మూడో టీ20తో సిరీస్ డిసైడ్ అవుతుంది. తొలి టీ20లో భారత్ 38 పరుగుల తేడాతో ఇంగ్లండ్పై విజయం సాధించింది. మూడో టీ20 తర్వాత ఇరు జట్ల మధ్య జూన్ 10 నుంచి ఏకైక టెస్ట్ మ్యాచ్ కూడా జరుగుతుంది. -
బంగ్లాదేశ్కు షాకిచ్చిన స్కాట్లాండ్
స్వదేశంలో జరుగుతున్న మహిళల టీ20 ట్రై-సిరీస్లో స్కాట్లాండ్ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. టోర్నీ ఓపెనర్లో నెదర్లాండ్స్ను చిత్తు చేసిన ఈ జట్టు.. తాజాగా బంగ్లాదేశ్కు భారీ షాకిచ్చింది.ఎడిన్బర్గ్ వేదికగా జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేయగా.. స్కాట్లాండ్ 15.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.బౌలర్లు, బ్రైస్ సిస్టర్స్ స్కాట్లాండ్ విజయంలో కీలకపాత్ర పోషించారు. తొలుత బౌలింగ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గాబ్రియెల్లా ఫోంటెనియా (4-1-11-1), క్రిస్టీ గోర్డాన్ (4-0-21-1), క్యాథరీన్ బ్రైస్ (3-0-24-1), అబ్తహా మక్సూద్ (2-0-14-1) రాణించగా.. ఛేదనలో క్యాథరీన్ బ్రైస్ (54 నాటౌట్), సారా బ్రైస్ (23 నాటౌట్) సత్తా చాటారు. డార్సీ కార్టర్ (23), క్యాథరీన్ ఫ్రేసర్ (28) కూడా తలో చేయి వేశారు. బంగ్లా బౌలర్లలో రీతూ మోనీ, షోర్నా అక్తెర్ తలో వికెట్ తీశారు. అంతకుముందు బ్యాటింగ్లో కెప్టెన్ నిగార్ సుల్తానా (46 నాటౌట్) రాణించగా.. శోభన మోస్తరి (22), షోర్నా అక్తెర్ (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మిగతా ప్లేయర్లలో దిల్హర అక్తెర్ 11, ఫిర్దోస్ 12, షర్మిన్ అక్తెర్ 10, రబేయా ఖాన్ 2 (నాటౌట్) పరుగులు చేశారు. ఇవాళ (మే 31) జరుగబోయే తదుపరి మ్యాచ్లో బంగ్లాదేశ్ నెదర్లాండ్స్తో తలపడనుంది. -
ప్రిక్వార్టర్స్లో సబలెంక
పారిస్: సీజన్ రెండో గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ సబలెంక (బెలారస్) ప్రిక్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన మూడో రౌండ్లో సబలెంక 6–0, 7–5తో డారియా కసాట్కినా (ఆ్రస్టేలియా)పై విజయం సాధించింది. 76 నిమిషాల్లో ముగిసిన పోరులో టాప్ సీడ్ సబలెంక పూర్తి ఆధిపత్యం కనబర్చింది. ఈ పోరులో ఒక ఏస్ సంధించిన బెలారస్ ప్లేయర్... రెండు డబుల్ ఫాల్ట్లు చేసింది. 27 అనవసర తప్పిదాలు చేసిన సబలెంక... 37 విన్నర్స్తో ముందంజ వేసింది. మరో మ్యాచ్లో నవోమీ ఒసాకా (జపాన్) 7–6 (7/5), 6–7 (3/7), 6–4తో ఇవా జోవిక్ (అమెరికా)పై గెలిచింది. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ హోరాహోరీ పోరులో... ఇరువురు ప్లేయర్లు ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా పోరాడారు. ఇది ఒసాకాకు వందో గ్రాండ్స్లామ్ మ్యాచ్ కావడం విశేషం. ఉత్కంఠ పోరులో ఒసాకా 12 ఏస్లు సంధించగా... జోవిక్ 4 ఏస్లకే పరిమితమైంది. ఒసాకా 46 విన్నర్స్ బాదితే... అమెరికా ప్లేయర్ 34 కొట్టింది. ప్రిక్వార్టర్స్లో సబలెంకతో ఒసాకా అమీతుమీ తేల్చుకోనుంది. ఇతర మ్యాచ్ల్లో ఏడో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–2, 6–3తో టమార కొరపాష్ (జర్మనీ)పై, 11వ సీడ్ బెన్కిక్ (స్విట్జర్లాండ్) 6–3, 6–3తో పైటన్ మెకంజీ స్టీర్న్స్ (అమెరికా)పై గెలిచి ప్రిక్వార్టర్స్లో అడుగుపెట్టారు. జ్వెరెవ్ జోరు... పురుషుల సింగిల్స్లో జ్వెరెవ్ (జర్మనీ) జోరు కొనసాగుతోంది. మూడో రౌండ్లో రెండో సీడ్ జ్వెరెవ్ 6–4, 6–3, 5–7, 6–2తో క్వెంటిన్ హాలిస్ (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు. 3 గంటల 7 నిమిషాల పాటు సాగిన పోరులో 6 ఏస్లు కొట్టిన జ్వెరెవ్... 53 విన్నర్స్తో విజేతగా నిలిచాడు. డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్) గాయంతో ఫ్రెంచ్ ఓపెన్కు దూరం కాగా... ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ (ఇటలీ) రెండో రౌండ్లోనే పరాజయం పాలయ్యాడు. మూడో సీడ్ జొకోవిచ్ (సెర్బియా) మూడో రౌండ్లో వెనుదిరగడంతో రెండో సీడ్ జ్వెరెవ్కు చక్కటి అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు మూడు గ్రాండ్స్లామ్ టోరీ్నల్లో ఫైనల్ వరకు చేరినా... ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయాడు. ప్రిక్వార్టర్స్లో జెస్పెర్ డి జాంగ్ (నెదర్లాండ్స్)తో జ్వెరెవ్ పోటీపడనున్నాడు. -
అద్వితీయ ప్రదర్శనకు సై!
తొలి ట్రోఫీ కోసం 18 సీజన్ల పాటు వేచి చూసి ఇప్పుడు అదే జోరులో ఆనందాన్ని రెట్టింపు చేసుకునేందుకు వరుసగా రెండో ట్రోఫీపై గురి పెట్టిన జట్టు ఒక వైపు... ఆడిన తొలి సీజన్లోనే కప్ను గెల్చుకోవడంతో పాటు ఐదో సీజన్లోనే మరో సారి విజేతగా నిలిచే లక్ష్యంతో నిలిచిన జట్టు మరో వైపు... దూకుడైన బ్యాటింగ్ లైనప్, పదునైన బౌలింగ్తో పాటు అమిత ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న టీమ్ సవాల్ విసురుతుండగా... ముగ్గురు బ్యాటర్లే దాదాపు మొత్తం బ్యాటింగ్ భారం మోస్తుండగా క్రమశిక్షణతో కూడిన బౌలింగ్తో సమరానికి మరో జట్టు రెడీ అయింది. వరుసగా రెండో టైటిల్ నెగ్గిన కెపె్టన్గా అరుదైన జాబితాలో చేరేందుకు ఒక సారథి ఉవి్వళ్లూరుతుండగా, తన నాయకత్వంలో మొదటి టోర్నీ గెలిపించాలని మరొకరు పట్టుదలగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్–19 తుది పోరుకు రంగం సిద్ధమైంది. నేడు జరిగే పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది.అహ్మదాబాద్: ఎన్నో అద్భుత ప్రదర్శనలు, మరెన్నో అనూహ్య ఫలితాలు, అసాధారణ బ్యాటింగ్ విన్యాసాలు, కొత్త రికార్డులు, సరికొత్త ఘనతలు...64 రోజులు, 73 మ్యాచ్లు, 2299 ఫోర్లు, 1416 సిక్సర్ల తర్వాత ఐపీఎల్ పోరాటం ఆఖరి ఘట్టానికి చేరింది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు, మాజీ చాంపియన్ గుజరాత్ను ఢీకొడుతుంది. ఏ జట్టు నెగ్గినా ఇది వారి రెండో టైటిల్ కానుంది. పాయింట్ల పట్టికలో టాప్–2 స్థానాల్లో నిలిచిన జట్లే చివరి సమరానికి సమాయత్తం కావడం విశేషం. తొలి క్వాలిఫయర్లో గుజరాత్ను చిత్తు చేసిన ఆర్సీబీ మానసికంగా పైచేయి సాధించగా... సొంతగడ్డపై ఫైనల్ ఆడనుండటం టైటాన్స్కు సానుకూలాంశం. ఆటగాళ్లంతా ఫామ్లో... డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన బెంగళూరు ఈ సారి గత ఏడాదికంటే మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చి దూసుకొచి్చంది. అన్ని అంచనాలను అందుకుంటూ జట్టు పాయింట్ల పట్టికలో టాపర్గా నిలిచింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో సమష్టి ప్రదర్శన టీమ్ను ముందంజ వేసేలా చేసింది. ఈ సీజన్లో ఆర్సీబీ 10 మ్యాచ్లు గెలవగా... 8 మంది వేర్వేరు ఆటగాళ్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’లుగా నిలవడం జట్టు సమష్టితత్వానికి నిదర్శనం. ప్రతీ ఒక్కరు జట్టు విజయాల్లో తమ వంతు పాత్ర పోషించారు. విరాట్ కోహ్లి అద్భుత ఫామ్ ఓపెనింగ్లో జట్టు శుభారంభానికి ప్రధాన కారణం. పదేళ్ల క్రితం 2016లో ఇదే స్థాయి ఆటతో ఒంటిచేత్తో బెంగళూరును ఫైనల్కు చేర్చిన విరాట్ కోహ్లి... మరోసారి నాటి ఆటను గుర్తుకు తెచ్చాడు. ఇప్పుడు అదే ఉత్సాహంతో జట్టుకు రెండో టైటిల్ అందించాలని అతను పట్టుదలగా ఉన్నాడు. కోహ్లి 600 పరుగులు చేయగా, కెపె్టన్ రజత్ పాటీదార్ (486) ఏకంగా 196.76 స్ట్రైక్రేట్తో 5 అర్ధ సెంచరీలతో తన స్థాయిని ప్రదర్శించాడు. పడిక్కల్ (463) కూడా చెలరేగగా... కృనాల్ పాండ్యా ఆల్రౌండర్ ప్రదర్శన (225 పరుగులు, 13 వికెట్లు) జట్టును నడిపించాయి. 2011 నుంచి ఐపీఎల్ ఆడుతున్న భువనేశ్వర్ కుమార్ అనుభవం జట్టుకు ఎంతో పనికొచి్చంది. భువీ ఇప్పటికే 26 వికెట్లు తీయగా...హాజల్వుడ్ (13) అండగా నిలిచాడు. వీరికి తోడు యువ బౌలర్ రసిఖ్ సలామ్ (16) సత్తా చాటడం బౌలింగ్ బలాన్ని పెంచింది. ఫిట్గా ఉంటే ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ చేస్తాడు. లేదంటే వెంకటేశ్ అయ్యర్ కొనసాగుతాడు. బౌలింగ్లో పరిస్థితిని బట్టి సుయాశ్, డఫీలలో ఒకరికి ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా అవకాశం దక్కుతుంది. టాప్–3 దూకుడు... టోర్నీ ఆరంభంనుంచి గుజరాత్ ఒకే విమర్శను మళ్లీ మళ్లీ ఎదుర్కొంది. టాప్–3 బ్యాటర్లు మినహా జట్టులో ఏమి లేదని, వీరిని అవుట్ చేస్తే కుప్పకూలడం ఖాయమని విమర్శలు వచ్చాయి. అయితే చివరిసారి ఈ విమర్శకు గుజరాత్ సిద్ధమైంది. మ్యాచ్ ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా టాప్–3 బ్యాటింగ్పైనే ఆధారపడుతోంది. శుబ్మన్ గిల్ (722 పరుగులు), సాయి సుదర్శన్ (710), జోస్ బట్లర్ (507) తమ పాత్రకు పూర్తి న్యాయం చేశారు కాబట్టి ఈ విషయంలో మేనేజ్మెంట్కు ఆందోళన లేదు. వీరు చెలరేగితే మిడిలార్డర్ అవసరం ఉండదనే భావన రాజస్తాన్తో జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో కూడా రుజువైంది. సుందర్ (327) కూడా జట్టు విజయాల్లో కొంత పాత్ర పోషించాడు. అయితే పదునైన బౌలింగ్ దళం సహకారంతో గుజరాత్ ముందంజ వేయగలిగింది. కొత్త బంతితో రబాడ (28 వికెట్లు), సిరాజ్ (18) ప్రత్యర్థులను పూర్తిగా కట్టపడేస్తున్నారు. హోల్డర్ (17) కూడా కేవలం 7.54 ఎకానమీతో బౌలింగ్ చేయడం టైటాన్స్కు అదనపు బలంగా మారింది. గత పోరులో రషీద్ లైన్ తప్పినా... అతనిలాంటి స్టార్ బౌలర్ ఏ సమయంలోనైనా చెలరేగిపోగలడు. ఇక్కడి పిచ్ను బట్టి చూస్తే స్పిన్నర్ సాయికిషోర్కు ఈ సారి బౌలింగ్ అవకాశం లభించవచ్చు. తుది జట్లు (అంచనా) బెంగళూరు: పాటీదార్ (కెపె్టన్), కోహ్లి, సాల్ట్/ వెంకటేశ్, పడిక్కల్, కృనాల్, డేవిడ్, జితేశ్, షెఫర్డ్, భువనేశ్వర్, హాజల్వుడ్, సలామ్, డఫీ/ సుయాశ్ గుజరాత్: గిల్ (కెపె్టన్), సుదర్శన్, బట్లర్, సుందర్, నిశాంత్, హోల్డర్, తెవాటియా, రషీద్, రబాడ, సిరాజ్, ప్రసిధ్, సాయికిషోర్. పిచ్, వాతావరణం బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్. భారీ స్కోరుకు అవకాశం ఉన్నా...బౌలర్లూ ప్రభావం చూపగలరు. లీగ్ దశలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన పిచ్పైనే ఫైనల్ నిర్వహిస్తున్నారు. ఆ పోరులో గుజరాత్ గెలిచింది. అన్నింటికి మించి ఈ స్టేడియంలో రెండో సారి బ్యాటింగ్ సులువుగా మారుతుంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపవచ్చు. మ్యాచ్ రోజు వర్షసూచన లేదు. -
ఆసీస్ కొంపముంచిన పాక్ సంచలనం.. 4 దశాబ్దాల రికార్డు బద్దలు
పాకిస్తాన్ క్రికెట్కు మరో అద్భుతమైన ఆల్రౌండర్ దొరికాడు. అరంగేట్రంలో తన స్పిన్ బౌలింగ్తో ఆస్ట్రేలియా వంటి పటిష్టమైన జట్టుకే చుక్కలు చూపించాడు. ఆ యువ స్పిన్నర్ను జోష్ ఇంగ్లిష్, మార్నస్ లబుషేన్ వంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్లు సైతం ఎదుర్కోలేకపోయారు. అతడే 21 ఏళ్ల అరాఫత్ మిన్హాస్. శనివారం రావల్పిండి వేదికగా ఆసీస్తో జరుగుతున్న తొలి వన్డేతో మిన్హాస్ అరంగేట్రం చేశాడు.మిన్హాస్ మూడేళ్ల కిందటే టీ20ల్లో డెబ్యూ చేసినప్పటికి పేలవ ప్రదర్శనల కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు. కానీ ఇటీవల డొమాస్టిక్ క్రికెట్లో మెరుగైన ప్రదర్శన చేయడంతో పాక్ సెలెక్టర్ల నుంచి మళ్లీ అతడికి పిలుపు వచ్చింది. ఈసారి మాత్రం సెలెక్టర్ల నమ్మకాన్ని అరాఫత్ నిలబెట్టుకున్నాడు.తన మొదటి వన్డేలోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన 10 ఓవర్ల కోటాలో కేవలం 32 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో అతడు ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే అరంగేట్రంలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన పాకిస్తాన్ బౌలర్గా చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు 1984లో జకీర్ ఖాన్ తన వన్డే డెబ్యూలో 19 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్తో 42 ఏళ్ల రికార్డును అరాఫత్ బ్రేక్ చేశాడు.అతడి బౌలింగ్ ధాటికి టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 44 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో మాథ్యూ షార్ట్(55), మాట్ రెన్షా(61) మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. పాక్ బౌలర్లలో అరాఫత్తో పాటు షాహీన్ షా అఫ్రిది, రౌఫ్, అఘా ఒక్కో వికెట్ పడగొట్టారు. -
ఇంగ్లండ్కు చుక్కలు చూపించిన తెలుగు అమ్మాయి
బ్రిస్టల్ వేదికగా ఇంగ్లండ్ మహిళల జట్టుతో జరుగుతున్న రెండో టీ20లో భారత బౌలర్లు రాణించారు. ముఖ్యంగా తెలుగు అమ్మాయి, యువ స్పిన్నర్ శ్రీచరణి అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచింది. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టింది. డాని వ్యాట్, అమీ జోన్స్, నైట్ వంటి కీలక బ్యాటర్లను అవుట్ చేసి ఇంగ్లండ్ను కట్టడి చేసింది. ఈ కడప అమ్మాయి తన 4 ఓవర్లలో కేవలం 25 పరుగులు మాత్రమే 3 వికెట్లు పడగొట్టింది. ఆమెతో పాటు నందిని శర్మ, శ్రేయాంక పాటిల్ చెరో వికెట్ తీశారు. ఫలితంగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లీష్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఓ దశలో ఇంగ్లండ్ 150 పరుగుల మార్క్ కూడా దాటేలా కనిపించలేదు. కానీ చివరి రెండు ఓవర్లలో భారత బౌలర్లు 39 పరుగులు సమర్పించుకోవడంతో ఇంగ్లండ్ ఫైటింగ్ టోటల్ను సాధించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఫ్రేయా కెంప్(13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 39) టాప్ స్కోరర్గా నిలవగా.. డానీ వ్యాట్(29), క్యాప్సీ(28) పర్వాలేదన్పించారు. ఇప్పటికే తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించిందిన. ఈ మ్యాచ్లో కూడా గెలిస్తే మూడు టీ20ల సిరీస్ను 2-0 తేడాతో సొంతం చేసుకుంటుంది.చదవండి: IPL 2026: ఫైనల్కు వాన గండం..! మ్యాచ్ రద్దైతే విజేత ఎవరంటే? -
ఫైనల్కు వాన గండం..! మ్యాచ్ రద్దైతే విజేత ఎవరంటే?
ఐపీఎల్-2026 సీజన్లో తుది సమరానికి రంగం సిద్దమైంది. ఈ మెగా టోర్నీ ఫైనల్ పోరులో భాగంగా ఆదివారం అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి తమ రెండో ఐపీఎల్ టైటిల్ను ముద్దాడాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. క్వాలిఫయర్-1లో ఆర్సీబీ చేతిలో ఓటమి చవిచూసిన గుజరాత్.. అందుకు ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో ఉంది. బెంగళూరు మాత్రం ఫైనల్ మ్యాచ్లోనూ తమ జోరును కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే ఈ హైవోల్టేజ్ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది.మ్యాచ్ జరిగే సమయంలో 30 శాతం వరకు వర్షం పడేందుకు అస్కారం ఉందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఒక వేళ వర్షం పడి మ్యాచ్ రద్దేతే పరిస్థితి ఏంటి? ట్రోఫీ ఎవరికి ఇస్తారు? అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.ఒకవేళ వర్షం పడితే?మిగిలిన నాకౌట్ మ్యాచ్ల మాదిరిగానే ఈ మ్యాచ్కు కూడా 120 నిమిషాల అదనపు సమయం ఇవ్వబడుతుంది. కానీ ఈ తుది పోరుకు మాత్రం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రత్యేకంగా రిజర్వ్ డే ను కేటాయించింది. షెడ్యూల్ ప్రకారం ఆదివారం(మే 31) పూర్తి మ్యాచ్ నిర్వహించడానికి అంపైర్లు నిర్వహిస్తారు.సమయం మించిపోతుంటే ఓవర్లను కుదిస్తూ వస్తారు. ఫలితం తేలాలంటే ఇరు జట్లు కనీసం 5 ఓవర్ల చొప్పున ఆడాల్సి ఉంటుంది. 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించడానికి చివరి కట్-ఆఫ్ సమయం రాత్రి 11:55 గంటల వరకు ఉంటుంది. ఐదు ఓవర్ల మ్యాచ్ కూడా సాధ్యం కాకపోతే.. అర్ధరాత్రి 12:50 గంటల లోపు కేవలం 'సూపర్ ఓవర్' ద్వారా విజేతను తేల్చేందుకు ప్రయత్నిస్తారు. అప్పటికి వాతవారణం అనుకూలించకపోతే మ్యాచ్ రిజర్వ్ డేకి మారుతుంది.ఒకవేళ ఆదివారం నాడు వర్షం కారణంగా పూర్తిగా మ్యాచ్ మొదలు కాకపోతే రిజర్వ్ డే అయిన సోమవారం(జూన్ 1)మ్యాచ్ను నిర్వహిస్తారు. మ్యాచ్ ప్రారంభమై ఆగిపోతే.. ఆదివారం ఎక్కడైతే మ్యాచ్ ఆగిందో అక్కడి నుంచే ఆటను సోమవారం కొనసాగిస్తారు.రిజర్వ్ డే రోజు కూడా ఆట సాధ్యం కాకపోతే లీగ్ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. గ్రూపు స్టేజ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అగ్రస్ధానంలో ఉంది కాబట్టి ఛాంపియన్గా అవతరిస్తోంది. కాగా ఐపీఎల్-2023 సీజన్ ఫైనల్ మ్యాచ్ ఫలితం రిజర్వ్ డే రోజునే తేలింది.చదవండి: సూర్యకుమార్ కీలక నిర్ణయం.. ఆఖరి నిమిషంలో? -
52 నిమిషాల్లోనే ఖతం.. ఫైనల్లో సాత్విక్ జోడీ
సింగపూర్ ఓపెన్లో భారత డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ఫైనల్స్కు దూసుకెళ్లింది. శనివారం పురుషుల డబుల్స్ సెమీస్లో సాత్విక్ జోడీ 21-19, 21-18తో ప్రపంచ నంబర్వన్ జోడీ, కొరియాకు చెందిన కిమ్ వోన్-సియో సుంగ్ జె జంటను ఓడించింది. సాత్విక్-చిరాగ్ జోడీ 52 నిమిషాల్లోనే ప్రత్యర్థులను మట్టికరిపించడం విశేషం. సాత్విక్ జంట ఫైనల్ చేరడంతో కనీసం రజతం ఖరారు చేసుకున్నట్లయింది. ఆద్యంతం హోరాహోరీగా జరిగిన సెమీఫైనల్లో భారత జోడీ టాప్ గేర్లో ఆడింది. ఆరంభం నుంచి కొరియా జంటకు ముచ్చెమటలు పట్టించిన భారత ద్వయం రెండు గేమ్స్ల్లోనే జయభేరి మోగించింది. రేపు జరగనున్న ఫైనల్లో సాత్విక్-చిరాగ్ జోడీ.. ఫజర్ అల్ఫియాన్ – ముహమ్మద్ షోహిబుల్ ఫిక్రీ(ఇండోనేషియా) లేదా లియాంగ్ వీ కెంగ్ – వాంగ్ ఛాంగ్ జంటలో ఒకరిని ఢీ కొట్టనుంది.SatChi Into The Finals ✅️Massive Victory For Satwik/Chirag . They Defeated Korean WR 1 Pair Kim Won Ho / Seo Seung Jae In Straight Games 21-19 , 21-18 . The Last Time The Korean Pair Lost A Match Was At The 2025 Denmark Open .Final vs Alfian/Fikri 🇮🇩 (OR) Liang/Wang 🇨🇳 https://t.co/VcZBKAHLy0 pic.twitter.com/zp2ryhVL2T— Badminton Media (@BadmintonMedia1) May 30, 2026చదవండి: అరుదైన ఫీట్.. టీమిండియా సరసన పాకిస్తాన్ -
సూర్యకుమార్ కీలక నిర్ణయం.. ఆఖరి నిమిషంలో?
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. సారథిగా భారత్కు పొట్టి ప్రపంచకప్ను అందించిన సూర్యకుమార్.. వ్యక్తిగత ప్రదర్శన పరంగా మాత్రం విఫలమవుతున్నాడు. ఐపీఎల్-2026లోనూ సూర్య అదే తీరును కనబరిచాడు. ఈ ముంబై ఆటగాడు 13 మ్యాచ్లలో 20.77 సగటుతో కేవలం 270 పరుగులు మాత్రమే చేశాడు.దీంతో భారత జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు వార్తలు వస్తున్నాయి. కెప్టెన్గానే కాకుండా పూర్తిగా టీ20 జట్టు నుంచే అతడిని పక్కన పెట్టాలనే యోచనలో సెలెక్టర్లు ఉన్నట్లు సమాచారం.అయితే సూర్యకు తన ఫామ్ను తిరిగి అందుకోవడానికి ముంబై టీ20 లీగ్ రూపంలో మరో అవకాశం లభించింది. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న ఈ టీ20 టోర్నీలో ట్రయంఫ్ నైట్ ముంబై నార్త్ ఈస్ట్కు సారథ్యం వహించనున్నాడు.అయితే అంతకంటే ముందు శనివారం(మే 30)న ఉగాండాతో జరగనున్న మ్యాచ్లో ట్రయంఫ్ నైట్ జట్టు తరపున సూర్యకుమార్ బరిలోకి దిగనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ సూర్య మాత్రం ఈ మ్యాచ్కు దూరంగా ఉన్నాడు. స్కై గైర్హాజరీలో అఖిల్ హెర్వాడ్కర్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.కాగా ఉగాండా జట్టు ప్రస్తుతం ముంబై పర్యటనలో ఉంది. ఇందులో భాగంగా వారు 4 వన్డేలు, 4 టీ20 మ్యాచ్లు ఆడుతున్నారు. ఇప్పటికే వన్డే సిరీస్ను ఉగాండా సొంతం చేసుకుంది. అనంతరం ముంబై టీ20 లీగ్లోని నాలుగు వేర్వేరు జట్లతో ఉగాండా టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఈ క్రమంలోనే డివై పాటిల్ స్టేడియం వేదికగా ఉగాండా, ట్రయంఫ్ నైట్ జట్లు తలపడతున్నాయి.చదవండి: IPL 2027: రోహిత్ శర్మ వద్దు.. ముంబై కెప్టెన్గా అతడే సరైనోడు -
అరుదైన ఫీట్.. టీమిండియా సరసన పాకిస్తాన్
రావల్పిండి వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో పాకిస్తాన్ ఒక అరుదైన ఫీట్ సాధించింది. ఆసీస్తో జరుగుతున్న తొలి వన్డే పాకిస్తాన్కు 1000వ మ్యాచ్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో వన్డే క్రికెట్లో వెయ్యి మ్యాచ్లు పూర్తి చేసుకున్న మూడో జట్టుగా పాకిస్తాన్ నిలిచింది. 1075 వన్డే మ్యాచ్లతో భారత్ జాబితాలో మొదటి స్థానంలో ఉండగా, 1020 మ్యాచ్లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో కొనసాగుతోంది. తాజాగా ఈ రెండు దేశాల సరసన పాకిస్తాన్ చోటు సంపాదించింది. ఇక 1000వ మ్యాచ్ ఆడుతున్న సందర్భంగా పాక్ కెప్టెన్ షాహిన్ అఫ్రిది ఆస్ట్రేలియా స్టాండ్ ఇన్ కెప్టెన్ జోస్ ఇంగ్లిస్ చేతుల మీదుగ2ఆ ప్రత్యేక మెమొంటో అందుకున్నాడు. ఇక పాక్ ఆడుతున్న 1000వ మ్యాచ్ ద్వారా అరాఫత్ మిన్హాస్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయడం మరో విశేషం. వెయ్యి వన్డేలు ఆడిన మూడు జట్లు విజయాల శాతాన్ని పరిశీలిస్తే.. ఆస్ట్రేలియా (1019 మ్యాచ్ల్లో 617 విజయాలు, 52.7 శాతం) తొలి స్థానంలో ఉండగా, టీమిండియా (1075 మ్యాచ్ల్లో 571 విజయాలు), పాకిస్తాన్ (999 మ్యాచ్ల్లో 527 విజయాలు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా 23 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్ (49), మాట్ రెన్షా (21) పరుగులతో ఆడుతున్నారు. Josh Inglis presented a souvenir to Shaheen Afridi on Pakistan’s 1000th ODI match. ❤️ - A lovely gesture by Inglis. 🇵🇰🇦🇺pic.twitter.com/T1SzeQH8PV— Sheri. (@CallMeSheri1_) May 30, 2026చదవండి: వినేశ్కు షాక్.. ఆసియా క్రీడల రేసు నుంచి ఔట్! -
వినేశ్కు షాక్.. ఆసియా క్రీడల రేసు నుంచి ఔట్!
ఆసియా గేమ్స్లో పాల్గొనాలన్న భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కల చెదిరింది. ఆసియా క్రీడల ఎంపిక ట్రయల్స్కు సంబంధించి నిర్వహిస్తున్న పోటీల్లో వినేశ్ సెమీస్లో ఓటమిపాలయ్యింది. శనివారం న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన మహిళల 53 కేజీల విభాగం సెమీఫైనల్స్లో వినేశ్ ఫొగాట్ 4-6 తేడాతో మీనాక్షి గోయత్ చేతిలో పరాజయం చవిచూసింది. ఈ ఓటమితో వినేశ్ ఫొగాట్ ఆసియా క్రీడల 2026 ఎంపిక ట్రయల్స్ నుంచి నిష్క్రమించడంతో పాటు క్రీడలకు దూరమైంది. ట్రయల్స్లో బాగా రాణించి.. అంతర్జా తీయ స్థాయిలో పునరాగమనం చేయాలన్న వినేశ్ ఆశలకు, అలాగే ఈ ఏడాది చివర్లో జపాన్లోని ఐచి నగోయాలో జరగనున్న ఆసియా క్రీడలలో స్థానం సంపాదించుకోవాలన్న ఆమె అవకాశాలకు బ్రేక్ పడినట్లయింది. గత మ్యాచ్లో నిషుతో హోరాహోరీగా జరిగిన బౌట్లో వినేశ్ తనకున్న ఎన్నో ఏళ్ల అనుభవాన్ని ఉపయోగించి విజయం సాధించి సెమీఫైనల్స్కు చేరుకున్నారు. ఫైనల్ ముంగిట ఆమెకు మీనాక్షి చేతిలో పరాజయం ఎదురైంది. ఆసియా క్రీడల ట్రయల్స్లో పాల్గొనేందుకు సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కిన వినేశ్ అక్కడి పోరాటంలో విజయం సాధించినప్పటికీ, తాజాగా సెమీస్లో ఓటమి పాలవ్వడంతో రెజ్లింగ్లో మాత్రం పరాజయం తప్పలేదు. ట్రయల్స్లో ఓటమి అనంతరం వినేశ్ ఫొగాట్ స్పందించింది. నేను ఓడిపోలేదు. ఈ వ్యవస్థతో ఒంటరిపోరాటం చేస్తున్నా. ప్రతిదాని కోసం పోరాడాల్సి వస్తోంది. నాకు న్యాయం జరగలేదు. మళ్లీ తిరిగి వస్తాను. రెజ్లర్ వినేశ్కు తొలుత రెజ్లింగ్ సమాఖ్య సెలక్షన్ ట్రయల్స్లో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆమె సుప్రీంను ఆశ్రయించింది. అయితే 53 కేజీల కేటగిరీలో వినేశ్ ఆడేందుకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. చదవండి: అతడు లక్కీ హ్యాండ్.. ఆ జట్టుదే ఐపీఎల్ టైటిల్! -
అతడు లక్కీ హ్యాండ్.. ఆ జట్టుదే ఐపీఎల్ టైటిల్!
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ మరోసారి చాంపియన్గా నిలవడానికి మరో అడుగు దూరంలో ఉంది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న మెగాటోర్నీ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్పై ఆర్సీబీ ఆధిక్యంలో ఉంది. లీగ్ దశలో చెరో మ్యాచ్ గెలిచినప్పటికీ, క్వాలిఫయర్-1 పోరులో గుజరాత్ను 92 పరుగుల భారీ తేడాతో ఓడించి 2-1తో ఆధిక్యంలో నిలిచింది. అయితే ఈ సీజన్లో ఆర్సీబీ విజేతగా నిలవనున్నట్లు, అందుకు జోష్ హాజిల్వుడ్ కారణం కానున్నట్లు ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ఇప్పటివరకు హాజిల్వుడ్ ఐదు టీ20 టోర్నీ ఫైనల్స్ ఆడితే.. ప్రతీసారి తాను ప్రాతినిధ్యం వహించిన జట్టే చాంపియన్గా నిలిచింది. ఐపీఎల్ 2021లో చెన్నై సూపర్కింగ్స్ విజేతగా నిలిచింది. ఆ జట్టులో హాజిల్వుడ్ ఉన్నాడు. 2012లో చాంపియన్స్ లీగ్ టీ20 టోర్నీలో విజేతగా నిలిచిన సిడ్నీ సిక్సర్, 2019 బీబీఎల్ విజేత సిడ్నీ సిక్సర్స్, 2021 టీ20 ప్రపంచకప్ సాధించిన ఆస్ట్రేలియా జట్టు, 2021 ఐపీఎల్ సీజన్ విజేతగా నిలిచిన సీఎస్కే, 2025 ఐపీఎల్ సీజన్ విజేతగా నిలిచిన ఆర్సీబీ జట్టు.. ఇలా ఐదుసార్లు హాజిల్వుడ్ సభ్యుడిగా ఉన్నాడు. అంతేకాదు 2015, 2023 వన్డే వరల్డ్కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులోనూ హాజిల్వుడ్ సభ్యుడిగా ఉండడం విశేషం.దీంతో హాజిల్వుడ్ లక్కీ హ్యాండ్ అని.. అతను ఏ జట్టులో ఉంటే ఆ జట్టు చాంపియన్గా నిలుస్తుందని అభిమానులు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. అతడు లక్కీహ్యాండ్ మాత్రమే కాదు, తాను ఆడిన ఐదు ఫైనల్స్లోనూ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆడిన ఐదు ఫైనల్స్ కలిపి 10 వికెట్లు పడగొట్టాడు. 2021 టీ20 ప్రపంచకప్ ఫైనల్తో పాటు 2012 చాంపియన్స్ లీగ్ టీ20 ఫైనల్లో మూడు వికెట్లు తీసి బెస్ట్ ప్రదర్శన నమోదు చేశాడు. అయితే ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ చాంపియన్గా నిలవడంలో హాజిల్వుడ్ కీలకపాత్ర పోషించాడు. ఆ సీజన్లో 12 ఇన్నింగ్స్ల్లో 22 వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ సీజన్లో 12 ఇన్నింగ్స్ల్లో కేవలం 13 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అయితే భువనేశ్వర్, రసిక్ సలామ్లు రాణిస్తుండడంతో హాజిల్వుడ్కు పెద్దగా ఇబ్బంది ఎదుర్కోవడం లేదు.చదవండి: ‘ఈసారి హిట్ వికెటవ్వను.. విరుగుడు మంత్రమదే!’ -
రోహిత్ శర్మ వద్దు.. ముంబై కెప్టెన్గా అతడే సరైనోడు
ఐపీఎల్-2026 సీజన్లో ఘోర ప్రదర్శన తర్వాత ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తీవ్రమైన మానసిక ఒత్తిడి, అంతర్గత విభేదాలు, శారీరక అలసటతో సతమతమవుతున్న ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ముంబై ఫ్రాంచైజీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఈ ఏడాది సీజన్ మధ్యలోనే పాండ్యా తన నిర్ణయాన్ని టీమ్ మేనెజ్మెంట్కు తెలియజేసినట్లు ఐపీఎల్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఐపీఎల్-2024 సీజన్లో ముంబై ఇండియన్స్ యాజమాన్యం రోహిత్ శర్మను తప్పించి మరి తమ జట్టు పగ్గాలను హార్దిక్కు అప్పగించింది.కానీ వారి నమ్మకాన్ని పాండ్యా నిలబెట్టుకోలేకపోయాడు. ఆ సీజన్లో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో నిలిచింది. ఆ తర్వాత సీజన్లో క్వాలిఫయర్-2 వరకు ముంబైని పాండ్యా తీసుకొచ్చాడు. కానీ తాజా ఎడిషన్లో మాత్రం పాండ్యా కెప్టెన్గా, వ్యక్తిగత ప్రదర్శన పరంగా దారుణంగా విఫలమయ్యాడు. 14 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ కేవలం నాలుగింట గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్ధానానికి పరిమితమైంది. దీంతో ముంబై ఇండియన్స్ యాజమాన్యం కూడా హార్దిక్ కెప్టెన్సీపై అసంతృప్తిలోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.అయితే ఐపీఎల్-2027కు ముందు పాండ్యా నేరుగా మెగా వేలంలోకి వస్తాడా? లేదా ట్రేడింగ్ పద్ధతి ద్వారా మరేదైనా జట్టుతో ఒప్పందం కుదుర్చుకుంటాడా అనేది ఇంకా స్పష్టత లేదు. దీంతో వచ్చే ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఐదు టైటిల్స్ను అందించిన రోహిత్ శర్మ మరోసారి ముంబై జట్టు పగ్గాలను చేపట్టేందుకు సిద్దంగా లేడని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో ముంబై తదుపరి కెప్టెన్ ఎవరన్న విషయంపై భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు."ముంబై ఇండియన్స్కు కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ బెస్ట్ ఛాయిస్. మళ్లీ రోహిత్ శర్మను కెప్టెన్గా నియమించడం అనేది వెనక్కి అడుగు వేయడమే అవుతుంది. ఎందుకంటే రోహిత్ వయస్సును కూడా పరిగణలోకి తీసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో సూర్యనే బెటర్" అని జాఫర్ తన యూట్యూబ్ ఛానల్లలో పేర్కొన్నాడు.చదవండి: IPL 2026: రాజస్తాన్ సరికొత్త చరిత్ర.. సన్రైజర్స్ ఆల్టైమ్ రికార్డు బ్రేక్ -
ఐపీఎల్ ఎగ్గొట్టి.. అక్కడెలా ఆడావు?.. సంగక్కర ఆగ్రహం
గతేడాది ఐపీఎల్లో విఫలమైన రాజస్తాన్ రాయల్స్.. తాజా ఎడిషన్లో మాత్రం అదరగొట్టింది. ఐపీఎల్-2026లో ప్లే ఆఫ్స్ చేరడమే కాకుండా.. ఎలిమినేటర్ గండం కూడా దాటి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది.అయితే, ఫైనల్కు చేరే క్రమంలో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడి ఇంటిబాటపట్టింది. ముల్లన్పూర్ వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్లో రాజస్తాన్ ఏడు వికెట్ల తేడాతో పరాజయం పాలుకావడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.సంజూ స్థానంలో..గతేడాది పద్నాలుగింట కేవలం నాలుగు విజయాలతో తొమ్మిదోస్థానంలో నిలిచిన రాజస్తాన్.. ఈసారి మాత్రం ఈ మేరకు అద్భుతంగానే రాణించింది. నిజానికి ఐపీఎల్-2026కు ముందు రాజస్తాన్ తమ కెప్టెన్ సంజూ శాంసన్ను చెన్నై సూపర్ కింగ్స్కు ట్రేడ్ చేసింది.సంజూ స్థానంలో కెప్టెన్గా రియాన్ పరాగ్ను నియమించిన రాయల్స్.. ఓపెనర్గా వైభవ్ సూర్యవంశీని పూర్తిస్థాయిలో బరిలోకి దించింది. ఈ రెండు నిర్ణయాలు రాయల్స్కు బాగా కలిసి వచ్చాయి. ఈ సీజన్లో వైభవ్ పదహారు మ్యాచ్లలో కలిపి ఏకంగా 776 పరుగులు సాధించి అత్యధిక పరుగుల వీరుడిగా (క్వాలిఫయర్-2 ముగిసేసరికి) నిలిచాడు.సీజన్ మొత్తానికి దూరంఇదిలా ఉంటే.. సంజూకు బదులు రాజస్తాన్ చెన్నై నుంచి ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, సామ్ కర్రాన్ (రూ. 2.4 కోట్లు)లను తీసుకుంది. అయితే, సామ్ కర్రాన్ గజ్జల్లో గాయం అని చెప్పి సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో రాజస్తాన్ శ్రీలంక స్టార్ దసున్ షనకను తీసుకుంది.అయితే, గాయం పేరు చెప్పి తప్పుకొన్న సామ్ కర్రాన్ ఇంగ్లండ్ దేశీ టోర్నీ టీ20 బ్లాస్ట్లో సర్రే జట్టుకు సుమారుగా మూడు మ్యాచ్లు ఆడాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ను కావాలనే నిర్లక్ష్యం చేశాడనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయం గురించి రాజస్తాన్ రాయల్స్ హెడ్కోచ్ కుమార్ సంగక్కర తాజాగా స్పందించాడు.సర్రే తరఫున ఆడటం నేను చూశాను‘‘సామ్ కర్రాన్కు గాయమైందని మాకు సమాచారం అందింది. కానీ అతడు సర్రే తరఫున 2- 3 మ్యాచ్లు ఆడటం నేను చూశాను. నిజంగా ఈ విషయం మమ్మల్ని చాలా నిరాశపరిచింది.అతడు మా జట్టుతో ఆడాలని మేము కోరుకున్నాము. అందుకే జట్టులో చేర్చుకున్నాము. కానీ అతడు ఇలా చేశాడు. కాకపోతే ముందుగానే విషయం చెప్పినందు వల్ల షనకను తీసుకువచ్చాము. ఆటగాళ్ల కెరీర్లో గాయాలు సహజమే.మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలిఅయితే, కొన్ని తీవ్రమైన గాయాలు ఉంటాయి. మరికొన్ని నామమాత్రంగా ఉంటాయి. ఏదేమైనా బీసీసీఐ ఈ విషయంలో మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలి. నిబంధనలు కఠినతరం చేయడం అత్యంత ముఖ్యం’’ అని సంగక్కర సామ కర్రాన్ తీరుపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా వ్యక్తిగత కారణాల దృష్ట్యా అకస్మాత్తుగా ఐపీఎల్కు దూరమైతే తదుపరి వేలంలో పాల్గొనకుండా రెండేళ్లపాటు నిషేధం విధిస్తోంది బీసీసీఐ. అయితే, గాయాలు, అనారోగ్య కారణాల వల్ల దూరమైన వారికి మాత్రం ఇందుకు మినహాయింపు ఉంటుంది.చదవండి: ఫైనల్కు ముందు ఆర్సీబీకి షాక్! -
రాజస్తాన్ సరికొత్త చరిత్ర.. సన్రైజర్స్ ఆల్టైమ్ రికార్డు బ్రేక్
ఐపీఎల్-2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ పోరాటం ముగిసిన సంగతి తెలిసిందే. శుక్రవారం ముల్లాన్పూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన క్వాలిఫయర్-2లో ఓటమి పాలైన రాజస్తాన్ రాయల్స్.. మరోసారి ఫైనల్కు చేరకుండానే ఇంటిముఖం పట్టింది.రియాన్ పరాగ్ సారథ్యంలోని రాయల్స్ జట్టు బ్యాటింగ్ పరంగా రాణించినప్పటికి, బౌలింగ్లో మాత్రం దారుణంగా విఫలమైంది. 215 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఊదిపడేసింది. అయితే ఈమ్యాచ్లో రాజస్తాన్ ఓటమిపాలైనప్పటికి ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది.ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా రాజస్తాన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది సీజన్లో రాజస్తాన్ ఏకంగా 181 కొట్టింది. దీంతో 2024 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నెలకొల్పిన 178 సిక్సర్ల రికార్డును రాజస్తాన్ బ్రేక్ చేసింది.రాజస్తాన్ రాయల్స్ కొట్టిన మొత్తం 181 సిక్సర్లలో, కేవలం యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఒక్కడే 72 సిక్సర్లు బాదడం విశేషం. ఈ క్రమంలోనే ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా 'యూనివర్స్ బాస్' క్రిస్ గేల్ (59 సిక్సర్లు - 2012) రికార్డును బద్దలు కొట్టాడు.వైభవ్ తర్వాత రాజస్తాన్ జట్టులో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్లు వీరేధ్రువ్ జురెల్: 24 సిక్సర్లుడొనవొన్ ఫెరీరా: 23 సిక్సర్లురియాన్ పరాగ్ (కెప్టెన్): 21 సిక్సర్లు -
‘ఈసారి హిట్ వికెటవ్వను.. విరుగుడు మంత్రమదే!’
ఐపీఎల్ 2026 సీజన్లో శుక్రవారం క్వాలిఫయర్-2లో రాజస్తాన్ రాయల్స్ను ఓడించి గుజరాత్ టైటాన్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ సెంచరీతో చెలరేగగా, మరో ఓపెనర్ సాయి సుదర్శన్ అర్థసెంచరీతో రాణించాడు. సాయి సుదర్శన్ ఇన్నింగ్స్లో 8 ఫోర్లు, ఒక సిక్స్ ఉంది. అయితే ఆర్సీబీతో జరిగిన క్వాలిఫయర్-1 పోరులో హిట్ వికెట్గా వెనుదిరిగిన సాయి సుదర్శన్ రాజస్తాన్తో జరిగిన క్వాలిఫయర్-2 పోరులోనూ మరోసారి హిట్వికెట్గా వెనుదిరగడం గమనార్హం. 150 ఏళ్ల క్రికెట్ చరిత్రలో వరుసగా రెండుసార్లు హిట్వికెట్గా వెనుదిరిగిన ఆటగాడిగా సాయి సుదర్శన్ నిలిచిపోయాడు. హిట్వికెట్గా రెండోసారి ఔటవ్వడంపై సాయి సుదర్శన్ ఎట్టకేలకు మౌనం వీడాడు. ఈసారి బ్యాట్ జారిపోకుండా ఏదైనా కొత్త పద్ధతిని అనుసరిస్తానని నవ్వుతూ పేర్కొన్నాడు. ‘ఈ సమస్యను అధిగమించడానికి కొత్తగా ఏదైనా చేయాలి. అందుకు కొన్ని గ్రిప్ టెక్నిక్స్ ఉపయోగించి బంతులు ఆడే ప్రయత్నం చేస్తాను. ఆర్సీబీతో మ్యాచ్లో బంతిని ఆడే క్రమంలో నా బ్యాట్ చేతిలో నుంచి జారి బౌన్స్ అయి వికెట్ల మీద పడింది. కానీ రాజస్తాన్తో మ్యాచ్లో స్ట్రెయిట్ షాట్ ఆడాలనుకున్నా. కానీ ఈసారి కూడా బంతి బౌండరీ వెళ్లినప్పటికీ బ్యాట్ నేరుగా వెళ్లి వికెట్లను గిరాటేసింది. ఫైనల్లో ఈ సమస్య రాకుండా ఒక కొత్త పద్ధతిని అనుసరించాలనుకుంటున్నా. అది ఎంతమేర సఫలమవుతుందో చూ డాలి’ అని చెప్పుకొచ్చాడు.ఇక ఈ సీజన్లో సాయి సుదర్శన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. గుజరాత్ తరఫున ఓపెనింగ్లో వస్తున్న సాయి సుదర్శన్ 16 ఇన్నింగ్స్లో 710 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇందులో ఒక సెంచరీ, 8 అర్థసెంచరీలున్నాయి. అయితే ఈ సీజన్లో గుజరాత్ ఆడిన తొలి ఆరు మ్యాచ్ల్లో సాయి సుదర్శన్ ఒక ఫిఫ్టీ కూడా నమోదు చేయలేదు. ఆ తర్వాత నుంచి వరుసగా ప్రతి మ్యాచ్లోనూ స్థిరమైన ప్రదర్శనతో కనీసం అర్థసెంచరీ సాధించడం విశేషం. మరో విషయమేంటంటే సాయి సుదర్శన్ వరుసగా రెండో సీజన్లోనూ 700 పరుగుల మార్క్ను అధిగమించాడు. గతంలో క్రిస్ గేల్ మాత్రమే వరుసగా రెండు సీజన్లలో 700 ప్లస్ మార్కును దాటాడు. తాజాగా ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్గా సాయి సుదర్శన్ నిలిచాడు. Glad he can still see the funny side of it 😅🎥 Sai Sudharsan on his back-to-back bizarre dismissals \|/#TATAIPL | #Qualifier2 | #TheFinalLeap | #GTvRR | @gujarat_titans pic.twitter.com/nGVrC10SUc— IndianPremierLeague (@IPL) May 29, 2026THE RAREST OF RARE DISMISSALS! TWICE IN TWO INNINGS 😯😯Sai Sudharsan's bat fell onto his own stumps 🫣Updates ▶️ https://t.co/eupS8cBPc2#TATAIPL | #Qualifier2 | #TheFinalLeap | #GTvRR pic.twitter.com/htGSYpu3YH— IndianPremierLeague (@IPL) May 29, 2026The Sai Sudharsan dismissal. 😄 pic.twitter.com/m0DaXI29aE— Mufaddal Vohra (@mufaddal_vohra) May 26, 2026చదవండి: అభిమానులకు గుడ్న్యూస్.. కానీ 332 కోట్ల మెలిక! -
టీమిండియా నుంచి సూర్యకుమార్ అవుట్..? వైభవ్కు ఛాన్స్?
ఐపీఎల్-2026 సీజన్ తుది దశకు చేరుకోవడంతో ఇప్పుడు అందరి దృష్టి టీమిండియా బిజీ షెడ్యూల్పై పడింది.ఈ ఏడాది ఐపీఎల్ ముగిసిన తర్వాత 'మెన్ ఇన్ బ్లూ' వరుస ద్వైపాక్షిక సిరీస్లతో బిజీబిజీగా గడపనుంది. తొలుత స్వదేశంలో అఫ్గానిస్తాన్తో ఏకైక టెస్ట్, మూడు వన్డేల సిరీస్లతో భారత్ తలపడనుంది.ఆ తర్వాత ఐర్లాండ్, ఇంగ్లండ్, జింబాబ్వేలలో టీమిండియా పర్యటించనుంది. అయితే ఈ ఏడాది భారత్కు అత్యంత కీలకమైన టోర్నమెంట్లలో ఆసియా క్రీడలు (Asian Games) ఒకటి. ఈ ఏషియన్ గేమ్స్ సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్ వేదికగా జరగనున్నాయి. అయితే ప్రతిష్టాత్మక ఈవెంట్ కోసం 30 మంది ఆటగాళ్లతో కూడిన ప్రాబబుల్స్ జాబితాను బీసీసీఐ సెలక్షన్ కమిటీ సిద్దం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.'అమర్ ఉజాలా' కథనం ప్రకారం.. ఈ జాబితాలో భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు చోటు దక్కపోయినట్లు తెలుస్తోంది. కానీ ఐపీఎల్లో దుమ్ములేపిన వైభవ్ సూర్యవంశీని బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసినట్లు సదరు వార్త పత్రిక తమ కథనంలో పేర్కొంది.వైభవ్తో పాటు యశస్వి జైశ్వాల్, సంజూ శాంసన్ వంటి స్టార్ క్రికెటర్లు కూడా ఈ ఏడాది ఆసియా గేమ్స్లో ఆడనున్నట్లు సమాచారం. కాగా ఈ 30 మంది జాబితా నుంచే తుది 15 మంది సభ్యుల జట్టును ఎంపిక చేయనున్నారు. ఈ ఆసియా క్రీడల కోసం జట్టును ప్రకటించడానికి జూన్ 10 చివరి తేదీగా నిర్ణయించినట్లు సమాచారం.ఇక ఇది ఇలా ఉండగా.. ఈ టోర్నీ సమయంలోనే భారత సీనియర్ జట్టు వెస్టిండీస్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య విండీతో 5 టీ20లు, 3 వన్డేలు టీమిండియా ఆడనుంది. సెప్టెంబర్ 27న టీమిండియా విండీస్ పర్యటన ప్రారంభం కానుంది.అయితే తొలుత వన్డే సిరీస్ జరగనుంది. అనంతరం అక్టోబర్ 6 నుంచి టీ20లు మొదలు కానున్నాయి. ఈ సిరీస్ సమయానికి అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ వంటి స్టార్ ప్లేయర్లు జపాన్ టూర్ను ముగించుకుని భారత జట్టుతో చేరే అవకాశముంది.ఆసియా క్రీడలు 2026 కోసం ప్రాబుబుల్స్ లిస్ట్(అమర్ ఉజాలా ప్రకారం)తిలక్ వర్మ, ఆయుష్ బదోని, హర్షిత్ రానా, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, సంజు శాంసన్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, శ్రేయస్ అయ్యర్, నితీష్ కుమార్ రెడ్డి, ఖలీల్ అహ్మద్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబే, ప్రసిద్ద్ కృష్ణ, రుతురాజ్ గైక్వాడ్, అనుకుల్ రాయల్, వరుణ్ చక్రవర్తి, రింకూ సింగ్, హర్ష్ దూబే, యష్ ఠాకూర్, వైభవ్ సూర్యవంశీ, విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, అభిషేక్ శర్మ, రిషబ్ పంత్ -
అభిమానులకు గుడ్న్యూస్.. కానీ 332 కోట్ల మెలిక!
భారత్లో ఫుటబాల్కు ఆదరణ తక్కువే అయినప్పటికీ.. బెంగాల్, కేరళ, ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లో ఫుట్బాల్ ఆటకు యమ క్రేజ్ ఉంటుంది. భారత్లో కూడా ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) పేరిట ఫుట్బాల్ టోర్నీలు నిర్వహిస్తుండడంతో ఆదరణ పెరుగుతున్నది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఫిఫా వరల్డ్కప్కు ఉన్న క్రేజ్ వేరు. ఈ మ్యాచ్లు లైవ్లో వీక్షించాలని ప్రతీ దేశం భావిస్తోంది. అయితే భారత్లో మాత్రం మొన్నటిదాకా ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్లను లైవ్లో వీక్షించే అవకాశం లేకుండేది. అయితే తాజాగా భారత ఫుట్బాల్ అభిమానులకు ఒక గుడ్న్యూస్. జూన్ 11 నుంచి ప్రారంభం కానున్న ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్లను లైవ్ టెలికాస్ట్ చేసేందుకు జీ నెట్వర్క్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఒప్పందం కూడా దాదాపు పూర్తయింది. మరో 24-48 గంటల్లో ఒక ప్రకటన కూడా విడుదల కానుంది. అయితే ఫిఫా మ్యాచ్ల ప్రసార హక్కుల్ని జీ నెట్వర్క్ పొందాలనుకుంటే సదరు ఫిఫా బ్రాడ్కాస్టర్లకు 30 నుంచి 35 మిలియన్ డాలర్లు (సుమారుగా రూ. 284 నుంచి 332 కోట్లు) చెల్లించాల్సి ఉంటుంది. ఇది భారీ మొత్తం కావడంతో జీ నెట్వర్క్ వెనుకడుగు వేసినప్పటికీ చర్చలు నడుస్తున్నాయి. అయితే జీతో పాటు సోని పిక్చర్స్ నెట్వర్క్ కూడా ప్రసార హక్కులను దక్కించుకునేందుకు పోటీలో ఉంది. అయితే సోనీ నెట్వర్క్ మాత్రం బిడ్ దాఖలు చేయలేదు. దీంతో ఫిఫా వరల్డ్కప్ మ్యాచ్ల ప్రసార హక్కులను జీ నెట్వర్క్ సొంతం చేసుకోవడం లాంఛనమే అని చెప్పొచ్చు. ఇక జీ నెట్వర్క్ కొత్తగా నాలుగు స్పోర్ట్స్ చానెల్లను లాంచ్ చేసింది. యునైటెడ్ స్పోర్ట్స్ 1, యునైట్ 8 స్పోర్ట్స్ హెచ్డీ (హిందీ), యునైట్ 8 స్పోర్ట్స్ 2 (ఇంగ్లీష్), యునైట్ 8 స్పోర్ట్స్ హెచ్డీ (ఇంగ్లీష్) లాంచ్ చేసింది. జూన్ 11 నుంచి ప్రారంభం కానున్న ఫిఫా వరల్డ్ కప్ లో మొత్తం 104 మ్యాచ్లు జరగనున్నాయి. ఒప్పందం ఖరారైతే మాత్రం ఈ మ్యాచ్లన్నింటి నాలుగు చానెల్స్లోనూ ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. మొత్తంగా మొన్నటిదాకా ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్లను వీక్షించే భాగ్యం లేకుండా పోయిందని తెగ బాధపడిపోయిన అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.చదవండి: ‘నువ్వొక అద్భుతం’.. థాంక్యూ వైభవ్ సూర్యవంశీ! -
‘నువ్వొక అద్భుతం’.. థాంక్యూ వైభవ్ సూర్యవంశీ!
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఆట ముగిసింది. లీగ్ దశలో చాలా కష్టపడి ప్లేఆఫ్స్ చేరిన రాజస్తాన్ ఎలిమినేటర్లో ఎస్ఆర్హెచ్ను చిత్తు చేసింది. అయితే క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడి సీజన్ను మూడో స్థానంలో ముగించింది. అలా రాజస్తాన్ రాయల్స్ ఈ సీజన్లో ప్లేఆఫ్స్కు పరిమితమైనప్పటికీ.. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మాత్రం అభిమానుల గుండెల్లో నిలిచిపోయాడు. గత సీజన్లోనే తన మెరుపులను చూపెట్టిన వైభవ్ ఈ సీజన్లో దానిని పరిపూర్ణం చేశాడని చెప్పొచ్చు. ఈ సీజన్లో అతడు కొనసాగించిన బ్యాటింగ్ విధ్వంసం మాములుగా లేదు. ఏదో రెండు మ్యాచ్ల్లో మెరిసి ఆ తర్వాత విఫలమయ్యుంటే వైభవ్ గురించి చర్చ ఉండేది కాదు. కానీ 15 ఏళ్ల వయసులోనే క్రికెట్లో ఉన్న అన్ని షాట్లను అలవోకగా ఆడుతూ పరుగుల వరద పారించాడు. 16 మ్యాచ్ల్లో 237కు పైగా స్ట్రైక్రేట్తో 776 పరుగులు సాధించిన వైభవ్ ఖాతాలో ఒక సెంచరీ సహా ఐదు అర్థసెంచరీలున్నాయి. క్రీజులోకి అడుగుపెట్టిందే మొదలు ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదడమే కాకుండా పరిస్థితులకు తగ్గట్లుగా ఆడడం అలవాటు చేసుకోవడం వైభవ్ సూర్యవంశీలో కనిపించిన గొప్ప పరిణితి. ఉదాహరణకు ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో కమిన్స్ మొదలుకొని ఏ బౌలర్ను వదలని సూర్యవంశీ 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్లో సెంచరీ చేసి ఉంటే ప్రపంచ రికార్డు తన ముంగిట ఉండేదేమో. ఇక గుజరాత్ టైటాన్స్తో క్వాలిఫయర్-2లో వైభవ్ ఆడిన ఇన్నింగ్స్ కూడా అద్భుతమనే చెప్పొచ్చు. జట్టు కష్టాల్లో పడిందన్న విషయాన్ని గుర్తించిన వైభవ్ తన శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేసినప్పటికీ మెరుపులకు లోటు లేకుండా చూసుకున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా ఫోర్లు, సిక్సర్లు బాదాడు. వరుసగా రెండో మ్యాచ్లోనూ శతకం చేజార్చుకున్న వైభవ్ ఈ సీజన్లో మొత్తం 72 సిక్సర్లు బాది ఒకే సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. ఇలా సీజన్ ఆద్యంతం తన ఆటతీరుతో అలరించిన వైభవ్ సూర్యవంశీకి ఐపీఎల్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‘ఐపీఎల్ ద్వారా నీ అద్భుత బ్యాటింగ్ విన్యాసాలను మాకు చూపించినందుకు థ్యాంక్స్’ అని చెబుతూ పోస్టులతో నింపేశారు. ‘15 ఏళ్ల కుర్రాడు ఐపీఎల్ 2026 సీజన్లో ఒక జట్టును తన భుజస్కందాలపై మోసుకెళ్లిన తీరు అద్భుతం. ఐపీఎల్ ట్రోఫీలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ నీ ప్రదర్శన మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది వైభవ్’ అని ఒక అభిమాని వైభవ్కు సంబంధించిన ఒక వీడియోనూ పంచుకోవడం హైలైట్గా నిలిచింది.THE COLDEST EDIT ON VAIBHAV SOORYAVANSHI. 🥶 pic.twitter.com/LgDqruGc4A— Mufaddal Vohra (@mufaddal_vohra) May 30, 2026this IPL will be remembered for a 15 year old carrying an entire team on his shouldersTrophies come and go, but the impact you left will always stay🙏 pic.twitter.com/oPOW5ABYx2— OldMonkOfCricket (@OldMonkOfCric) May 30, 2026చదవండి: IPL 2026: ఫైనల్ మ్యాచ్కు ముందు ఆర్సీబీకి షాక్! -
వైభవ్పై ఇర్ఫాన్ పఠాన్ కామెంట్లు!.. ఇదేం పద్ధతి?
వైభవ్ సూర్యవంశీ.. ఈ పేరే ఒక సంచలనం. గతేడాది కాలంగా ఫార్మాట్లకు అతీతంగా పరుగుల వరద పారిస్తున్నాడు ఈ ఎడమచేతి వాటం బ్యాటర్. భారత్ అండర్-19 జట్టు తరఫున ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా గడ్డపై చితక్కొట్టిన ఈ బిహారీ పిల్లాడు.. వరల్డ్కప్-2025 ఫైనల్లోనూ భారీ శతకం (80 బంతుల్లో 175)తో జట్టును గెలిపించాడు.అదే జోరు కొనసాగిస్తూ ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా వైభవ్ దుమ్ములేపాడు. సన్రైజర్స్ హైదరాబాద్పై లీగ్ దశలో 36 బంతుల్లోనే శతక్కొట్టిన ఈ లెఫ్టాండర్.. కీలక ఎలిమినేటర్లో మరోసారి సన్రైజర్స్ తన బ్యాటింగ్ పదునేమిటో చూపించాడు.ఒంటిచేత్తో.. కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు సాధించిన వైభవ్.. ఒంటిచేత్తో సన్రైజర్స్ను ఎలిమినేట్ చేసి.. రాజస్తాన్ను క్వాలిఫయర్-2కు చేర్చాడు. ఇక ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై కూడా ఈ పదిహేనేళ్ల పిల్లాడు చితక్కొట్టాడు. ముల్లన్పూర్లో 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 96 పరుగులు రాబట్టాడు.బాడీలైన్ బౌలింగ్తోఅయితే.. సన్రైజర్స్కు ఎదురైన చేదు అనుభవం చూసిన గుజరాత్ బౌలర్లు వైభవ్ను గట్టిగానే టార్గెట్ చేశారు. ముఖ్యంగా కగిసో రబడ బాడీలైన్ బౌలింగ్తో వైభవ్ను భయపెట్టాడు. మరోవైపు.. మహ్మద్ సిరాజ్ సైతం బౌన్సర్లు సంధిస్తూ ఇబ్బందిపెట్టాడు.అయినా సరే బుడ్డోడు ఏమాత్రం బెదరకుండా నిలకడగా ఆడాడు. అయితే, ఆఖరికి రబడ వైభవ్పై పైచేయి సాధించి అతడిని అవుట్ చేశాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఇర్ఫాన్ పఠాన్ గుజరాత్ బౌలర్ల తీరును తీవ్రస్థాయిలో విమర్శించాడు.నాలోని తండ్రి మనసు‘‘పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీని ఆపడం కోసం బాడీలైన్ బౌలింగ్ చేయడం నాకు ఏమాత్రం నచ్చలేదు. అతడు ప్రపంచ స్థాయి బౌలర్లపై అదరగొడుతున్నాడని నాకు తెలుసు. కానీ.. నాలోని తండ్రి మనసు ఈ రకమైన బౌలింగ్ను ఏమాత్రం అంగీకరించడం లేదు’’ అని ఇర్ఫాన్ పఠాన్ ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు.ఇదేం పద్ధతి?అయితే.. చాలా మంది నెటిజన్లు ఇర్ఫాన్ పఠాన్ కామెంట్లపై ప్రతికూలంగా స్పందిస్తున్నారు. ‘‘ఇలా ఎలా మాట్లాడుతున్నారు?.. వైభవ్ సూర్యవంశీ ఏమో ఎదురుగా వరల్డ్క్లాస్ బౌలర్ ఉన్నా కనికరం లేకుండా బ్యాటింగ్తో విరుచుకుపడుతున్నాడు.మీరు మాత్రం అతడికి వ్యతిరేకంగా బౌలర్లు ఏపనీ చేయొద్దని చెబుతున్నారు. ఇదేం పద్ధతి?.. పదిహేనేళ్లకే అతడు విధ్వంసం సృష్టిస్తుంటే తప్పు లేదు గానీ.. బౌలర్లు తమ వ్యూహాలు అమలు చేస్తే తప్పా? బౌలర్లు బ్యాటర్ను అవుట్ చేయాలని మాత్రమే చూస్తారు. అందుకోసం ఏమైనా చేస్తారు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.బాడీలైన్ బౌలింగ్ అంటే ఏమిటి?ఆస్ట్రేలియాలో 1932-33లో జరిగిన ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్ సందర్భంగా తొలిసారి ఇది వెలుగులోకి వచ్చింది. ఇంగ్లండ్ జట్టు ఆసీస్ దిగ్గజం డాన్ బ్రాడ్మన్ను నిలువరించేందుకు బౌలింగ్ చేసిన తీరు వివాదాస్పదంగా మారింది.ఈ తరహా బౌలింగ్లో ఫాస్ట్ బౌలర్లు షార్ట్ పిచ్ డెలివరీలు లేదంటే లెగ్స్టంప్కు కాస్త ఆవల బంతులు వేస్తూ నేరుగా బ్యాటర్ శరీరాన్ని టార్గెట్ చేశారు. తలపైకి డెలివరీలు సంధిస్తారు. ఈ ప్రమాదకర బౌలింగ్తో బ్యాటర్ తీవ్రంగా గాయపడొచ్చు లేదంటే చాకచక్యంగా ఆ బంతి నుంచి తప్పించుకోవాలి.గుజరాత్తో మ్యాచ్లో రబాడ ఈ తరహా బౌలింగ్తో చెలరేగడంతో వైభవ్ కాస్త ఇబ్బంది పడ్డాడు. అతడి గ్లోవ్స్కు చాలాసార్లు బంతి తగిలింది. అయినా సరే అతడు పట్టుదలగా ఆడాడు. అయితే, దురదృష్టవశాత్తూ సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఇక ఈ మ్యాచ్లో గుజరాత్ రాజస్తాన్పై ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. ఫలితంగా ఆర్సీబీతో ఆదివారం నాటి టైటిల్ పోరుకు అర్హత సాధించింది.చదవండి: జైస్వాల్కు క్షమాపణ చెప్పండి.. రోహిత్ ఎందుకు? -
IPL 2026: ఫైనల్ మ్యాచ్కు ముందు ఆర్సీబీకి షాక్!
ఐపీఎల్ 2026 సీజన్ విజేత ఎవరనేది మరొక రోజులో తేలిపోనుంది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. వరుసగా రెండోసారి కప్పు కొట్టాలనే ఉత్సాహంతో ఉన్న ఆర్సీబీ ఫ్యాన్స్కు ఒక వార్త నిరాశ కలిగిస్తోంది. బెంగళూరు సిటీలో కఠిన ఆంక్షలు విధించడంతో పాటు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని నగర పోలీస్ శాఖ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఒకవేళ ఆర్సీబీ గనుక రెండో టైటిల్ గెలిస్తే నగరమంతటా భారీ సంఖ్యలో ప్రజలు గూమిగూడతారనే అంచనాల నేపథ్యంలో ముందస్తు హెచ్చరికలు జారీ చేసినట్లు బెంగళూరు పోలీస్ కమిషనరేట్ కార్యాలయం పేర్కొంది.2025 సీజన్ విజేతగా నిలిచిన ఆర్సీబీ విజయోత్సవాలను బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విజయోత్సవం తొక్కిసలాటకు దారి తీసి 11 మంది ప్రాణాలు కోల్పోయేలా చేసింది. దీంతో ఈసారి అలా జరగకూడదనే ఉద్దేశంతోనే ముందస్తు చర్యల కింద బెంగళూరు సిటీ మొత్తం కఠిన ఆంక్షలు విధిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.కఠిన ఆంక్షలు ఇవే..👉ముందస్తు అనుమతి లేకుండా ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేయరాదని తెలిపారు. సంబంధిత శాఖల నుంచి ఆమోదం పొందితే తప్ప బహిరంగ ప్రదేశాల్లో బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేయకూడదు.👉ఇక ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం రోడ్లు, పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో సాముహిక విజయోత్సవ సంబరాలు చేసుకోకూడదు.👉ముఖ్యంగా జనం పెద్ద ఎత్తున గూమికూడి విజయోత్సవాల పేరుతో బైక్ ర్యాలీలు, రోడ్లు బ్లాక్ చేస్తూ సంబరాలు చేసుకోవడం పూర్తిగా నిషేధం.👉ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్లపై టపాసులు కాల్చడం లేదా ఇతర కార్యక్రమాలు చేపట్టడం చేయవద్దని సూచించారు.విషాదంలా విజయోత్సవాలు..2025 ఐపీఎల్లో చాంపియన్గా నిలిచిన ఆర్సీబీ విజయోత్సవం నిర్వహించింది. ఈ విజయోత్సవం కాస్తా విషాదంగా మారిపోయింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఏర్పాటు చేసిన విజయోత్సవాలకు జనాలు భారీగా తరలివచ్చారు. స్టేడియం నిండిపోవడంతో బయట కూడా సుమారు 2 నుంచి 3 లక్షల మంది అభిమానులు గూమిగూడారు. భారీ జనసమూహం కారణంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే ముందస్తు చర్యల కింద కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు బెంగళూరు పోలీస్ కమిషనరేట్ తెలిపింది.గుజరాత్ వర్సెస్ ఆర్సీబీ..రెండు నెలల పాటు సాగిన ఐపీఎల్ 2026 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. రేపు జరగబోయే ఫైనల్లో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. సీజన్ ఆరంభం నుంచి ఆర్సీబీ నిలకడగా ఆడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే 18 పాయింట్లతో టేబుల్ టాపర్గా నిలిచి ప్లేఆఫ్స్లో అడుగుపెట్టింది. మరోవైపు గుజరాత్ కూడా స్థిరమైన ప్రదర్శన కొనసాగించినప్పటికీ మధ్యలో కొన్ని అపజయాలు పలకరించాయి. కానీ అన్నీ దాటుకొని ప్లేఆఫ్స్లో అడుగుపెట్టిన గుజరాత్కు క్వాలిఫయర్-1 పోరులో ఆర్సీబీ షాక్ ఇచ్చింది. అయితే క్వాలిఫయర్-2 పోరులో మాత్రం రాజస్తాన్ను చిత్తు చేసిన గుజరాత్ టైటాన్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. చదవండి: వైభవ్కు కళ్లు చెదిరే ఆఫర్.. కోహ్లీకి పోటీగా! -
వైభవ్కు షాకిచ్చి.. రికార్డుల మోత మోగించిన గిల్
గుజరాత్ టైటాన్స్ ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ ఫైనల్కు చేరింది. తమ అరంగేట్ర సీజన్ 2022లో ఏకంగా చాంపియన్గా నిలిచిన టైటాన్స్.. 2023లో రన్నరప్తో సరిపెట్టుకుంది. తాజాగా ఐపీఎల్-2026లో ప్లే ఆఫ్స్నకు అర్హత సాధించిన గుజరాత్ జట్టు.. క్వాలిఫయర్-2లో జయభేరి మోగించింది.రాజస్తాన్ రాయల్స్తో శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్కు దూసుకువెళ్లింది. ముల్లన్పూర్లో రాయల్స్ విధించిన 215 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే గుజరాత్ ఊదేసింది. తద్వారా ఆర్సీబీతో ఆదివారం నాటి టైటిల్ పోరుకు అర్హత సాదించింది. 47 బంతుల్లోనేఇక ఈ విజయంలో ఓపెనర్, కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill)ది కీలక పాత్ర. రాజస్తాన్తో మ్యాచ్లో కేవలం 47 బంతుల్లోనే అతడు శతక్కొట్టాడు. మొత్తంగా 53 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 104 పరుగులు సాధించాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోవడంతో గిల్ మెరుపు ఇన్నింగ్స్కు తెరపడింది.ఏదేమైనా క్వాలిఫయర్-2లో అద్భుత శతకంతో రాణించి జట్టును గెలిపించిన గిల్.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. కాగా అతడికి ఐపీఎల్లో ఇది ఐదో సెంచరీ. ఈ మ్యాచ్ సందర్భంగా గిల్ సాధించిన రికార్డులు ఇవీ..A 1️⃣0️⃣0️⃣ of the highest quality! 🤩🔥👏GT skipper #ShubmanGill brings up a sensational century and what an occasion to deliver this masterclass! ❤️🙌#TATAIPL Qualifier 2 👉 #GTvRR | LIVE NOW 👉https://t.co/pv6LOaRl1f pic.twitter.com/wEbwNXzply— Star Sports (@StarSportsIndia) May 29, 2026ఐపీఎల్లో అత్యధిక శతకాల వీరుల జాబితాలో..👉విరాట్ కోహ్లి- 9 శతకాలు👉జోస్ బట్లర్- 7 శతకాలు👉క్రిస్ గేల్, కేఎల్ రాహుల్- 6 శతకాలు👉సంజూ శాంసన్, శుబ్మన్ గిల్- 5 శతకాలు👉డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్- 4 శతకాలుగుజరాత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీలు👉శుబ్మన్ గిల్- 47 బంతుల్లో 2026లో రాజస్తాన్పై👉శుబ్మన్ గిల్- 49 బంతుల్లో 2023లో ముంబైపై👉శుబ్మన్ గిల్- 50 బంతుల్లో 2024లో చెన్నైపై👉సాయి సుదర్శన్- 50 బంతుల్లో 2024లో చెన్నైపైఐపీఎల్లో కెప్టెన్గా అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్లు👉విరాట్ కోహ్లి- 5👉కేఎల్ రాహుల్- 3👉శుబ్మన్ గిల్- 2.కాగా గుజరాత్తో మ్యాచ్లోనూ రాజస్తాన్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా ఆడాడు. 47 బంతులలో 96 పరుగులు చేశాడు. అయితే, గిల్ సెంచరీతో చెలరేగి అతడి ఇన్నింగ్స్కు విలువ లేకుండా చేసి పడేశాడు.చదవండి: మేము ఇక్కడిదాకా రావటమే గొప్ప: రియాన్ పరాగ్ -
జైస్వాల్కు క్షమాపణ చెప్పండి.. రోహిత్ ఎందుకు?
టీమిండియా తరఫున అరంగేట్రంలోనే సెంచరీతో చెలరేగాడు యశస్వి జైస్వాల్. వెస్టిండీస్తో టెస్టులో శతక్కొట్టి జట్టును గెలిపించాడు. ఆ పర్యటనలోనే అంతర్జాతీయ టీ20లలోనూ అడుగుపెట్టాడు.టెస్టుల్లో స్టార్ ఓపెనర్గా ఎదిగిన జైస్వాల్ (Yashasvi Jaiswal).. వన్డే అరంగేట్రానికి మాత్రం రెండేళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు గతేడాది సెలక్టర్లు అతడి నిరీక్షణకు తెరదించారు. స్వదేశంలో ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు అతడిని ఎంపిక చేశారు.అజేయ శతకంఈ క్రమంలో ఇంగ్లండ్తో తొలి వన్డేలో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగిన జైసూ.. 15 పరుగులకే అవుటయ్యాడు. ఆ తర్వాత మళ్లీ తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అనంతరం సొంతగడ్డపై గతేడాది సౌతాఫ్రికాతో తన చివరి వన్డే ఆడిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. అజేయ శతకం (116)తో ఆకట్టుకున్నాడు.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ టీమిండియా సెలక్టర్లు, దిగ్గజ ఓపెనర్ రోహిత్ శర్మను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. జైస్వాల్ను సెలక్టర్లు క్షమాపణ కోరాలని సూచించాడు. స్పోర్ట్స్స్టార్ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ..సెలక్టర్ల ఆలోచన ఏమిటి?‘‘యశస్వి జైస్వాల్ తన చివరి వన్డే ఇన్నింగ్స్లో 116 పరుగులతో అజేయంగా నిలిచాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అతడు మళ్లీ వన్డే ఆడనే లేదు. సెలక్టర్లు 24 ఏళ్ల జైస్వాల్కు బదులు.. ఫిట్నెస్పై స్పష్టత లేని వెటరన్ బ్యాటర్ (రోహిత్ శర్మ) వైపు మొగ్గుచూపుతున్నారు.అతడు ఇప్పుడు ఫామ్లో కూడా లేడు. దీని వెనుక ఉన్న లాజిక్ ఏమిటో నాలాంటి వాళ్లకు కాస్త అర్థమయ్యేలా వివరించండి. అసలు వన్డే వరల్డ్కప్-2027 సన్నద్ధత విషయంలో సెలక్టర్ల ఆలోచన ఏమిటి?ఫోన్ చేసి మరీ క్షమాపణలు చెప్పాలిరోహిత్ శర్మ విషయంలో వాళ్లు రాజీ పడాల్సి వచ్చిందో.. లేదంటే ఇంకెందుకు అతడిని కొనసాగిస్తున్నారో నాకైతే తెలియదు. ఏదేమైనా వాళ్లు జైస్వాల్కు ఫోన్ చేసి మరీ క్షమాపణలు చెప్పాలి. కఠినమైన టెస్టు ఫార్మాట్లో ఈ యువ ఆటగాడు ఎన్నో అద్భుత విజయాలు అందించాడు.24 ఏళ్ల వయసులోపే ఎన్నెన్నో శతకాలు బాదాడు. అతడి బంగారు భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయకండి. విరాట్ కోహ్లి విషయం పక్కనపెడితే.. రోహిత్ శర్మను ఇంకెందుకు కొనసాగిస్తున్నారు?రోహిత్ ఇంకెందుకు?అజిత్ అగార్కర్ టీమిండియా విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటున్నాడని నాకైతే అనిపించడం లేదు. ఇప్పటికీ రోహిత్ మాత్రమే వన్డేల్లో కీలక ఓపెనర్ అని భావిస్తున్నారా? అతడికి బదులు జైస్వాల్ లేదంటే సాయి సుదర్శన్కు అవకాశం ఇవ్వొచ్చు కదా!’’ అని సంజయ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.కాగా వన్డే వరల్డ్కప్-2023లో కెప్టెన్గా టీమిండియాను ఫైనల్కు చేర్చిన రోహిత్ శర్మ.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో విజేతగా నిలిపాడు. అయితే, ఆ తర్వాత అనూహ్య రీతిలో మేనేజ్మెంట్ అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించి.. పగ్గాలు శుబ్మన్ గిల్కు అప్పగించింది. అతడి సారథ్యంలో భారత్ ఇప్పటికి ఒక్క సిరీస్ గెలవలేదు.ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2026 ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్తాన్తో ఓ టెస్టు, మూడు వన్డేలు ఆడుతుంది. వన్డే సిరీస్లో ఫిట్నెస్కు లోబడి రోహిత్ శర్మ ఆడతాడని సెలక్టర్లు స్పష్టం చేశారు. ఈ జట్టులో జైస్వాల్కు చోటు దక్కలేదు. చదవండి: మేము ఇక్కడిదాకా రావటమే గొప్ప: రియాన్ పరాగ్ -
‘మేము ఇక్కడిదాకా రావటమే గొప్ప.. అంతా అతడి వల్లే’
ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ ప్రయాణం ముగిసింది. గుజరాత్ టైటాన్స్తో శుక్రవారం నాటి క్వాలిఫయర్-2లో రియాన్ పరాగ్ సేన ఓటమిపాలైంది. ఫలితంగా ఫైనల్ చేరాలన్న రాయల్స్ కలలు చెదిరిపోయాయి.అంచనాలకు మించిఈ నేపథ్యంలో గుజరాత్ చేతిలో ఓటమి అనంతరం రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. తమ జట్టు అంచనాలకు మించి రాణించిందని.. తమ ప్రయాణం ఇక్కడి వరకు సాగడమే గొప్ప విషయమని అతడు అన్నాడు.ఈ మేరకు.. ‘‘ఈ పిచ్పై 215 అనేది కాపాడుకోదగ్గ స్కోరే. అయితే, రెండో ఇన్నింగ్స్లో వికెట్ బ్యాటింగ్కు మరింతగా అనుకూలించడం మాపై ప్రతికూల ప్రభావం చూపింది. తొలి ఇన్నింగ్స్లో స్పిన్నర్లకు కాస్త అనుకూలంగా సాగింది.మేము మరో 15- 20 అదనపు పరుగులు సాధించి ఉండే బాగుండేది. ఏదేమైనా ఈ సీజన్ మాకు సానుకూలంగా సాగింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. మేము అసలు ప్లే ఆఫ్స్నకు కూడా అర్హత సాధించే స్థితిలో లేము.చాలా మంది యువ ఆటగాళ్లే మా జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లే ఉన్నారు. వారిలో చాలా మంది ఇప్పుడిప్పుడే ఐపీఎల్ ఆడుతున్నారు. సీజన్కు ముందు ఎన్నెన్నో మార్పులు.. ఎన్నో విభిన్న కాంబినేషన్లు ప్రయత్నించి చూశాము.అయినప్పటికీ మా ఆటగాళ్లు పట్టుదలగా పోరాడి ఇక్కడి దాకా చేరుకున్నారు. మాకు ఇదొక గొప్ప ఆరంభం. ఈ ప్రయాణంలో మున్ముందు మెరుగ్గా రాణించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాము’’ అని రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు.వైభవ్ సూర్యవంశీనే కారణంఇక గుజరాత్తో క్వాలిఫయర్-2లో తాము గట్టిగా పోరాడగలిగామంటే అందుకు వైభవ్ సూర్యవంశీనే కారణమని రియాన్ పరాగ్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. అతడు టీమిండియాకు ఆడితే చూడాలని ఉందని సెలక్టర్లకు విజ్ఞప్తి చేశాడు. వైభవ్ ఆట గాలివాటం కాదని.. పక్కా ప్రణాళికతోనే అతడు మైదానంలో దిగుతాడని ప్రశంసించాడు.ఆర్సీబీతో ఫైనల్లో గుజరాత్కాగా ముల్లన్పూర్ వేదికగా గుజరాత్తో మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (47 బంతుల్లో 96) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. రవీంద్ర జడేజా (45 నాటౌట్) రాణించాడు.ఆఖర్లో డొనోవాన్ ఫెరీరా (11 బంతుల్లో 38 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి రాజస్తాన్ 214 పరుగులు చేయగలిగింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ 18.4 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది. ఏడు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. ఆర్సీబీతో ఆదివారం నాటి టైటిల్ పోరుకు అర్హత సాధించింది.చదవండి: హార్దిక్ పాండ్యా కూడా! -
జొకోవిచ్కు షాక్!
పారిస్: కెరీర్లో రికార్డు 25వ గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్ కోసం సెర్బియా దిగ్గజం మరికొంత కాలం వేచి చూడాల్సిందే. సీజన్ రెండో గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్లో మూడో సీడ్ జొకోవిచ్కు మూడో రౌండ్లోనే అనూహ్య ఓటమి ఎదురైంది.శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో జొకోవిచ్ 6–4, 6–4, 3–6, 5–7, 5–7తో ప్రపంచ 30వ ర్యాంకర్ జోవో ఫొన్సెకా (బ్రెజిల్) చేతిలో ఓడిపోయాడు. 4 గంటల 53 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో జొకోవిచ్ తొలి రెండు సెట్లు గెలిచి విజయం దిశగా సాగుతున్నట్లు అనిపించింది. కానీ పట్టువదలని ఫొన్సెకా అద్భుత ఆటతీరుతో వరుసగా మూడు సెట్లు గెలిచి తన కెరీర్లోనే చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు.కెరీర్లో 21వసారి ఫ్రెంచ్ ఓపెన్లో బరిలోకి దిగిన జొకోవిచ్ 3వ రౌండ్లోపు ని్రష్కమించడం ఇది మూడోసారి మాత్రమే. 2009లో మూడో రౌండ్లో ఓడిన ఈ సెర్బియా దిగ్గజం... 2005లో 2వ రౌండ్లో నిష్క్రమించాడు. ఫొన్సెకాతో జరిగిన మ్యాచ్లో జొకోవిచ్ 8 ఏస్లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేశాడు. తొలి సర్వీస్లో 78 పాయింట్లు, రెండో సరీ్వస్లో 25 పాయింట్లు స్కోరు చేశాడు. తన సరీ్వస్ను ఆరుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సరీ్వస్ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు.70 విన్నర్స్ కొట్టిన జొకోవిచ్ 39 అనవసర తప్పిదాలు చేశాడు. తాజా ఫ్రెంచ్ ఓపెన్లో డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ గాయంతో దూరం కావడం... ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ (ఇటలీ) రెండో రౌండ్లోనే నిష్క్రమించడంతో... మూడుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన జొకోవిచ్కు నాలుగోసారి టైటిల్ గెలిచే సువర్ణావకాశం లభించింది. అయితే ఈ అవకాశాన్ని జొకోవిచ్ సది్వనియోగం చేసుకోలేకపోయాడు. మరో మూడో రౌండ్ మ్యాచ్లో ఎనిమిదో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆస్ట్రేలియా) 6–0, 2–6, 2–6, 3–6తో జేకబ్ మెన్సిక్ (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓడిపోయాడు.స్వియాటెక్ ముందంజమహిళల సింగిల్స్ విభాగంలో నాలుగుసార్లు చాంపియన్, మూడో ర్యాంకర్ ఇగా స్వియాటెక్ (పోలాండ్), ఏడో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్), ఎనిమిదో సీడ్ మిరా ఆండ్రీవా (రష్యా) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు.మూడో రౌండ్లో స్వియాటెక్ 6–4, 6–4తో మగ్దా లినెట్టి (పోలాండ్)పై, స్వితోలినా 6–2, 6–3తో తమరా కొర్పాత్చ్ (జర్మనీ)పై, ఆండ్రీవా 6–4, 6–2తో మేరీ బుజ్కోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచారు. పురుషుల డబుల్స్ రెండో రౌండ్లో యూకీ బాంబ్రీ (భారత్)–మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జోడీ 3–6, 4–6తో సిమోన్ బొలెలీ–వవాసోరి (ఇటలీ) జంట చేతిలో ఓడిపోయింది. శ్రీరామ్ బాలాజీ (భారత్)–డెమోలైనర్ (బ్రెజిల్) జంట 7–5, 6–2తో జేకబ్ ష్నయిటర్–మార్క్ వాల్నెర్ (జర్మనీ) జోడీపై గెలిచి మూడో రౌండ్లోకి ప్రవేశించింది. -
హైజంప్లో పూజా సింగ్ జాతీయ రికార్డు
హాంకాంగ్: ఆసియా అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో మహిళల హైజంప్లో భారత టీనేజర్ పూజా సింగ్ స్వర్ణ పతకాన్ని సాధించింది. ఈ క్రమంలో 14 ఏళ్లుగా సహన కుమారి పేరిట ఉన్న జాతీయ సీనియర్ రికార్డును పూజా సింగ్ బద్దలు కొట్టింది. శుక్రవారం జరిగిన హైజంప్ ఫైనల్లో పూజా సింగ్ 1.93 మీటర్ల ఎత్తుకు ఎగిరి పసిడి పతకాన్ని సంపాదించింది.2012లో సహన కుమారి 1.92 మీటర్లతో నెలకొల్పిన జాతీయ సీనియర్ రికార్డును పూజ తిరగరాసింది. అంతేకాకుండా కామన్వెల్త్ గేమ్స్ అర్హత ప్రమాణాన్ని (1.92 మీటర్లు) కూడా ఈ హరియాణా అమ్మాయి అధిగమించింది. గత ఏడాది దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా సీనియర్ చాంపియన్షిప్లోనూ పూజ బంగారు పతకాన్ని సాధించడం విశేషం. మరోవైపు పురుషుల 5000 మీటర్ల రేస్ వాక్ ఈవెంట్లో నితిన్ గుప్తా (19ని:47.49 సెకన్లు) భారత్కు పసిడి పతకాన్ని అందించాడు.మహిళల డిస్కస్ త్రోలో అమానత్ కంబోజ్ బంగారు పతకాన్ని నెగ్గింది. అమానత్ డిస్్కను 52.24 మీటర్ల దూరం విసిరింది. పురుషుల డెకాథ్లాన్లో రాహుల్ జాఖడ్ 7185 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని సాధించాడు. మహిళల ట్రిపుల్ జంప్లో సాధన దేవి... పురుషుల డెకాథ్లాన్లో ఉప్కార్ రజత పతకాలు గెలిచారు. మహిళల 400 మీటర్ల విభాగంలో నీరూ పాఠక్ కాంస్య పతకాన్ని సాధించింది. -
ప్రజ్ఞానంద ఖాతాలో మరో విజయం
ఓస్లో: నార్వే ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నీ పురుషుల విభాగంలో భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద మూడో విజయం నమోదు చేశాడు. విన్సెంట్ కీమెర్తో జరిగిన నాలుగో రౌండ్లో ప్రజ్ఞానంద ‘అర్మగెడాన్’ గేమ్లో గెలుపొందాడు. ఇద్దరి మధ్య జరిగిన క్లాసికల్ రెగ్యులర్ గేమ్ 46 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది.టోర్నీ నిబంధనల ప్రకారం విజేతను నిర్ణయించేందుకు ‘అర్మగెడాన్’ గేమ్ నిర్వహించారు. ప్రజ్ఞానంద 17 ఎత్తుల్లో కీమెర్ను ఓడించాడు. మరోవైపు క్లాసికల్ ఫార్మాట్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ మరో ఓటమిని చవిచూశాడు. నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ నల్ల పావులతో ఆడుతూ 42 ఎత్తుల్లో గుకేశ్ను ఓడించాడు. ఆరుగురు గ్రాండ్మాస్టర్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది.ఇదే టోర్నీ మహిళల విభాగంలో భారత గ్రాండ్మాస్టర్లు దివ్య దేశ్ముఖ్, కోనేరు హంపి నాలుగో రౌండ్లో పరాజయం పాలయ్యారు. దివ్య–అనా ముజీచుక్ (ఉక్రెయిన్) మధ్య రెగ్యులర్ గేమ్ 63 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. ‘అర్మగెడాన్’ గేమ్లో అనా ముజీచుక్ 39 ఎత్తుల్లో దివ్యను ఓడించింది. హంపి–జు జినెర్ (చైనా) రెగ్యులర్ గేమ్ 64 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. ‘అర్మగెడాన్’ గేమ్లో జు జినెర్ 28 ఎత్తుల్లో హంపిపై గెలిచింది. -
వినేశ్కు క్లియరెన్స్..
న్యూఢిల్లీ: భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్కు సుప్రీం కోర్టులో కూడా ఊరట లభించింది. ఆసియా క్రీడల సెలక్షన్ ట్రయల్స్లో పాల్గొనేందుకు ఆమెకు సుప్రీం అనుమతి ఇచ్చింది. నేడు, రేపు జరిగే ట్రయల్స్లో ఆమెను అనుమతించాలంటూ జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధే నేతృత్వంలోని బెంచ్ భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)ను ఆదేశించింది. వినేశ్ను సెలక్షన్స్కు అనుమతిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఇటీవలి తీర్పును డబ్ల్యూఎఫ్ఐ సుప్రీం కోర్టులో సవాలు చేసింది. సెలక్షన్స్లో పాల్గొనే అర్హత వినేశ్కు లేదంటూ వాదించింది.అయితే వాదనను సుప్రీం కోర్టు బెంచ్ సమర్థించలేదు. ‘వినేశ్ సెలక్షన్స్లో పాల్గొనవచ్చంటూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో అందరికీ ఆశలు, అంచనాలు పెరిగాయి. ఇలాంటి స్థితిలో ఆమెను ఇంటికి వెళ్లిపోమని మేం చెప్పడం సరైంది కాదు. అందుకే ఇలాంటి స్పష్టత ఇస్తున్నాం. ఆమె సెలక్షన్ ట్రయల్స్లో కచ్చితంగా పాల్గొనవచ్చు’ అని పేర్కొంది. మరోవైపు హైకోర్టు తీర్పు ప్రకారం వినేశ్ సెలక్షన్ ట్రయల్స్ ఇద్దరు ప్రభుత్వ పరిశీలకుల సమక్షంలో జరగడంతో పాటు మొత్తం ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయాల్సి ఉంటుంది.ప్రభుత్వం తరఫున భారత మాజీ ఫుట్బాలర్ అదితి చౌహాన్, భారత హాకీ మాజీ కెప్టెన్ ఎంఎం సోమయ దీనికి హాజరవుతారు. గోల్కీపర్గా అదితి 57 మ్యాచ్ల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించగా, 1980 మాస్కో ఒలింపిక్స్లో స్వర్ణ పతకం నెగ్గిన భారత జట్టులో సోమయ సభ్యుడిగా ఉన్నారు. వినేశ్ 50 కేజీల విభాగం సెలక్షన్ ట్రయల్స్లో మాత్రమే పాల్గొనేందుకు డబ్ల్యూఎఫ్ఐ అనుమతి ఇచ్చింది. చివరిసారి ఆమె 2024 పారిస్ ఒలింపిక్స్లో 50 కేజీల విభాగంలోనే పోటీపడిందని, అందుకే ఈసారి కూడా ఆమెకు అదే వెయిట్ కేటగిరీలో అనుమతి ఇస్తామని డబ్ల్యూఎఫ్ఐ వర్గాలు తెలిపాయి. -
హార్దిక్ పాండ్యా కూడా..!
ఐపీఎల్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న పంత్ బాటలో ముంబై సారథి హార్దిక్ పాండ్యా కూడా నాయకత్వానికి గుడ్బై చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. ‘మానసికంగా తీవ్రంగా అలసిపోయిన’ హార్దిక్ ఈ బాధ్యతల బరువునుంచి తప్పించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.లక్నో తరహాలోనే ముంబై కూడా 4 మ్యాచ్ల్లో గెలిచి, 10 మ్యాచ్ల్లో ఓడింది. అయితే స్వల్పంగా మెరుగైన రన్రేట్ ఉండటంతో 9వ స్థానంతో ముగించింది. ముంబై ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు కోల్పోయిన రోజే తాను కెప్టెన్సీ వదిలేయాలని భావిస్తున్న విషయాన్ని హార్దిక్ టీమ్ యాజమాన్యంతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సీజన్లో 10 మ్యాచ్లు ఆడిన పాండ్యా గాయం కారణంగా 4 మ్యాచ్లకు దూరమయ్యాడు. అతని సారథ్యంలో 2024లో చివరి స్థానంలో నిలిచిన ముంబై... గత ఏడాది ‘ప్లే ఆఫ్స్’కు అర్హత సాధించి మూడో స్థానంతో ముగించింది. -
సాత్విక్–చిరాగ్ జోడీ క్వార్టర్ ఫైనల్లో విజయం
సింగపూర్: ఈ ఏడాది తొలి టైటిల్ కోసం ఎదురుచూస్తున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ఆ దిశగా మరో అడుగు వేసింది. సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోరీ్నలో సాత్విక్–చిరాగ్ జంట సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఖాయ్ జింగ్ కాంగ్–ఆరోన్ తాయ్ (మలేసియా) ద్వయంతో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జంట 19–21, 21–17, 21–13తో గెలుపొందింది.ఈ విజయంతో ఖాయ్ జింగ్ కాంగ్–ఆరోన్ తాయ్లపై సాత్విక్–చిరాగ్ ప్రతీకారం తీర్చుకున్నారు. ఈ ఏడాది ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్íÙప్ తొలి రౌండ్లో ఖాయ్ జింగ్ కాంగ్–ఆరోన్ తాయ్ల చేతిలో ఎదురైన ఓటమికి లెక్క సరిచేశారు. 65 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో భారత జంట తొలి గేమ్ను కోల్పోయింది. రెండో గేమ్లో 3–8తో వెనుకబడి ఓటమి దిశగా పయనించింది. అయితే తమ తప్పిదాలను సరిచేసుకొని వరుసగా ఆరు పాయింట్లు గెలిచిన భారత ద్వయం 9–8తో ఆధిక్యంలోకి వచ్చింది.ఆ తర్వాత స్కోరు 16–16 వద్ద సాత్విక్–చిరాగ్ చెలరేగి వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 20–16తో ముందంజ వేశారు. అనంతరం ఒక పాయింట్ కోల్పోయినా, వెంటనే మరో పాయింట్ నెగ్గి గేమ్ను సొంతం చేసుకున్నారు. నిర్ణాయక మూడో గేమ్ ఆరంభంలో భారత జంట 8–4తో ఆధిక్యం సంపాదించింది. ఆ తర్వాత వరుసగా నాలుగు పాయింట్లు కోల్పోవడంతో స్కోరు 8–8తో సమమైంది.స్కోరు 10–9 వద్ద ఉన్నపుడు భారత జోడీ వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 16–9తో మ్యాచ్పై పట్టు బిగించింది. ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న సాత్విక్–చిరాగ్ ద్వయం చివరకు గేమ్ను, మ్యాచ్ను 21–13తో దక్కించుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ నంబర్వన్, ప్రపంచ చాంపియన్ జోడీ కిమ్ వన్ హో–సియో సెంగ్ జే (దక్షిణ కొరియా)తో సాత్విక్–చిరాగ్ జంట ఆడుతుంది.సింధు తొమ్మిదో‘సారీ’ సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ల కథ ముగిసింది. మహిళల సింగిల్స్లో పీవీ సింధు... పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగారు. ప్రపంచ నంబర్వన్ ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా)తో జరిగిన మ్యాచ్లో ప్రపంచ 11వ ర్యాంకర్ సింధు 17–21, 14–21తో ఓడిపోయింది. ఆన్ సె యంగ్ చేతిలో సింధుకిది వరుసగా తొమ్మిదో ఓటమి కావడం గమనార్హం. ఈ తొమ్మిది మ్యాచ్ల్లో ఆన్ సె యంగ్పై సింధు ఒక్క గేమ్ మాత్రమే గెలిచింది.2023 ఆసియా చాంపియన్íÙప్లో ఆన్ సె యంగ్ చేతిలో మూడు గేముల్లో ఓడిన సింధు... మిగతా ఎనిమిది మ్యాచ్ల్లో వరుసగా రెండు గేముల్లో పరాజయం రుచి చూసింది. కొకి వతనాబె (జపాన్)తో జరిగిన మ్యాచ్లో భారత నంబర్వన్ లక్ష్య సేన్ 19–21, 21–15, 15–21తో ఓడిపోయాడు. 2016 తర్వాత లక్ష్య సేన్పై వతనాబె రెండోసారి గెలిచాడు. ఈ పదేళ్ల కాలంలో వీరిద్దరి మధ్య నాలుగు మ్యాచ్లు జరగ్గా... నాలుగింటిలోనూ లక్ష్య సేన్ విజయం సాధించాడు.సెమీస్లో తనీషా–ధ్రువ్ ద్వయం మిక్స్డ్ డబుల్స్లో తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) జోడీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. ప్రపంచ నాలుగో ర్యాంక్ జంట చెన్ టాంగ్ జియె–టో ఈ వె (మలేసియా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో తనీషా–ధ్రువ్ తొలి గేమ్లో 16–18తో వెనుకబడ్డారు. ఈ దశలో మలేసియా ద్వయం గాయం కారణంగా వైదొలగడంతో భారత జోడీకి విజయం ఖరారైంది. నేడు జరిగే సెమీఫైనల్లో యుచి షిమోగామి–సయాక హొబారా (జపాన్)లతో తనీషా–ధ్రువ్ తలపడతారు. -
సురుచికి స్వర్ణం... ఇషా సింగ్కు రజతం
మ్యూనిక్: ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో శుక్రవారం భారత మహిళా పిస్టల్ షూటర్లు మెరిశారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో హరియాణా షూటర్ సురుచి సింగ్ స్వర్ణ పతకాన్ని సాధించగా... తెలంగాణ షూటర్ ఇషా సింగ్ రజత పతకాన్ని సంపాదించింది. గత ఏడాది ఇదే టోరీ్నలో సురుచి బంగారు పతకం గెలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. రెండో ఏడాది కూడా నిలకడైన ప్రదర్శనతో తన పసిడి పతకాన్ని నిలబెట్టుకుంది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో సురుచి సింగ్ 242.1 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ఇషా సింగ్ 241.2 పాయింట్లతో రెండో స్థానం సంపాదించి రజత పతకాన్ని గెలిచింది. గెయున్ చూ (దక్షిణ కొరియా) 220.2 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. అంతకుముందు 121 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్లో సురుచి సింగ్, ఇషా సింగ్ 578 పాయింట్లు స్కోరు చేసి వరుసగా ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచి ఫైనల్కు అర్హత సాధించారు. మరోవైపు పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో భారత షూటర్ ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ 592 పాయింట్లు స్కోరు చేసి ఆరో స్థానంతో ఫైనల్లోకి ప్రవేశించాడు. అయితే అతను వాడిన రైఫిల్ నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో అతనిపై అనర్హత వేటు వేశారు. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్లు అనీశ్ 27వ స్థానంలో, ఉదయ్వీర్ సిద్ధూ 37వ స్థానంలో, సూరజ్ శర్మ 39వ స్థానంలో నిలిచారు. -
మెరిసిన జెమీమా, యస్తిక
చెమ్స్ఫోర్డ్: బ్యాటింగ్లో జెమీమా రోడ్రిగ్స్ (40 బంతుల్లో 69; 10 ఫోర్లు, 1 సిక్స్), యస్తిక భాటియా (40 బంతుల్లో 54; 9 ఫోర్లు, 1 సిక్స్)... బౌలింగ్లో నందని శర్మ (3/34) రాణించడంతో... ఇంగ్లండ్ మహిళల జట్టుతో జరిగిన తొలి టి20 మ్యాచ్లో భారత మహిళల జట్టు 38 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. మూడు మ్యాచ్ల సిరీస్లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 188 పరుగులు సాధించింది. రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఈ మ్యాచ్కు దూరం కావడంతో... వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ఈ మ్యాచ్లో టీమిండియాకు సారథ్యం వహించింది. ఇంగ్లండ్ బౌలర్ లారెన్ బెల్ (3/34) తొలి ఓవర్లోనే భారత ఓపెనర్లు స్మృతి (0), షఫాలీ వర్మ (2)లను అవుట్ చేసింది. 7 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత్ను జెమీమా, యస్తిక ఆదుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్కు 76 బంతుల్లో 126 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. అయితే మూడు బంతుల తేడాలో జెమీమా, యస్తిక నిష్క్రమించారు. చివర్లో దీప్తి శర్మ (13 బంతుల్లో 22; 4 ఫోర్లు) ధాటిగా ఆడటంతో భారత్కు గౌరవప్రద స్కోరు నమోదు చేసింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నిరీ్ణత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 150 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. అమీ జోన్స్ (48 బంతుల్లో 67; 9 ఫోర్లు) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఈ మ్యాచ్తో అంతర్జాతీయ టి20ల్లో అరంగేట్రం చేసిన చండీగఢ్ పేస్ బౌలర్ నందని శర్మ మూడు వికెట్లతో ఆకట్టుకుంది. క్రాంతి గౌడ్ రెండు వికెట్లు తీయగా... శ్రీచరణి, దీప్తి శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు. జెమీమాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. సిరీస్లోని రెండో టి20 మ్యాచ్ ఈరోజు బ్రిస్టల్లో జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్ను సోనీ స్పోర్ట్స్ చానెల్లో, సోనీ లివ్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
గుజరాత్ ఘనంగా ఫైనల్కు
ఐపీఎల్లో ఫైనల్ చేరేందుకు రెండో క్వాలిఫయర్లో గుజరాత్ విజయలక్ష్యం 215 పరుగులు... కానీ నాకౌట్ మ్యాచ్లోనూ ఒత్తిడి లేకుండా శుబ్మన్ గిల్, సాయి సుదర్శన్ జోడీ తమ ఆటతో దీనిని చాలా చిన్నదిగా మార్చేశారు. విధ్వంసక ప్రదర్శన లేకుండానే తమదైన శైలిలో ఓపెనర్లు 77 బంతుల్లోనే 167 పరుగులు జోడించడంతో టైటాన్స్ ఫైనల్ చేరడం లాంఛనంగా మారిపోయింది. కీలక పోరులో రాజస్తాన్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. అంతకుముందు మరోసారి సెంచరీ చేజారినా... వైభవ్ సూర్యవంశీ తుఫాన్ బ్యాటింగ్తోనే రాయల్స్ చెప్పుకోదగ్గ స్కోరు సాధించగలిగింది. తమ సొంతగడ్డపై ఫైనల్ ఆడనున్న గుజరాత్... తుది పోరులో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించి రెండోసారి టైటిల్ సాధిస్తుందా చూడాలి. న్యూ చండీగఢ్: మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ మూడోసారి ఐపీఎల్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్–2లో గుజరాత్ 7 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ సూర్యవంశీ (47 బంతుల్లో 96; 8 ఫోర్లు, 7 సిక్స్లు) వరుసగా రెండో మ్యాచ్లోనూ సెంచరీ అవకాశం కోల్పోయాడు. రవీంద్ర జడేజా (35 బంతుల్లో 45 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, డొనొవాన్ ఫెరీరా (11 బంతుల్లో 38 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్లు) చివర్లో చెలరేగాడు. అనంతరం గుజరాత్ 18.4 ఓవర్లలో 3 వికెట్లకు 219 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’కెప్టెన్ శుబ్మన్ గిల్ (53 బంతుల్లో 104; 15 ఫోర్లు, 3 సిక్స్లు) ఐపీఎల్లో ఐదో సెంచరీతో చెలరేగగా... సాయి సుదర్శన్ (32 బంతుల్లో 58; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేశాడు. రేపు అహ్మదాబాద్లో జరిగే ఫైనల్లో బెంగళూరుతో గుజరాత్ తలపడుతుంది. వైభవ్ దూకుడు... గత మ్యాచ్లతో పోలిస్తే వైభవ్ ఈసారి కాస్త ఓపికను ప్రదర్శించాడు. తొలి ఓవర్లోనే జైస్వాల్ (1), తర్వాతి ఓవర్లో ధ్రువ్ జురేల్ (7) వెనుదిరగడం కూడా అందుకు కారణం. సిరాజ్ ఓవర్లో 3 ఫోర్లు బాదిన వైభవ్ 14వ బంతికిగానీ తన తొలి సిక్స్ కొట్టలేదు. అయితే నాలుగో స్థానంలో వచి్చన జడేజా చకచకా పరుగులు రాబట్టాడు. ప్రసిధ్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన అతను 19 బంతుల్లోనే 34 పరుగులకు చేరుకున్నాడు. అయితే మోచేతి గాయంతో రిటైర్డ్హర్ట్గా తప్పుకోగా, ఆ తర్వాత రాజస్తాన్ ఇన్నింగ్స్ తడబడింది. జడేజా మళ్లీ క్రీజ్లోకి వచి్చనా తర్వాతి 14 బంతుల్లో 11 పరుగులే చేయగలిగాడు. మరోవైపు 46 పరుగుల వద్ద సుదర్శన్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన వైభవ్ 31 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని కెరీర్లో ఇదే అది నెమ్మదైన అర్ధ సెంచరీ! హాఫ్ సెంచరీ తర్వాత దూకుడు చూపించిన వైభవ్ తర్వాత ఆడిన 15 బంతుల్లో చెలరేగి 2 ఫోర్లు, 5 సిక్స్లతో 96కు చేరుకున్నాడు. ఈసారైనా సెంచరీ ఖాయం అనుకోగా... మళ్లీ సరిగ్గా గత మ్యాచ్ తరహాలోనే ర్యాంప్ షాట్ ఆడబోయి మరోసారి షార్ట్ థర్డ్మాన్లోకి క్యాచ్ ఇచ్చాడు. అయితే రషీద్ వేసిన చివరి ఓవర్లో రెచి్చపోయిన ఫెరీరా 4 సిక్స్లు బాదడంతో మొత్తం 27 పరుగులు లభించాయి. పరుగుల జుగల్బందీ... ఛేదనలో గుజరాత్ అలవోకగా దూసుకుపోయింది. రాయల్స్ పేలవ బౌలింగ్తో సుదర్శన్, గిల్ ఎలాంటి శ్రమ లేకుండా ఒకరితో మరొకరు పోటీ పడుతూ సునాయాసంగా పరుగులు రాబట్టారు. ఆర్చర్ వేసిన తొలి ఓవర్లో ఇద్దరూ చెరో 2 ఫోర్లతో మొదలు పెట్టగా, పవర్ప్లేలో జట్టు 10 ఫోర్లు సహా 69 పరుగులు రాబట్టింది. సుదర్శన్ 14 వద్ద ఉన్నప్పుడు ఫెరీరా, షనక సమన్వయ లోపంతో క్యాచ్ వదిలేయడం కూడా గుజరాత్కు కలిసొచి్చంది. ఆపై తుషార్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టి 30 బంతుల్లో హాఫ్ సెంచరీని చేరిన గిల్... జడేజా ఓవర్లో 2 సిక్స్లు, ఫోర్ కొట్టాడు. అనంతరం 26 బంతుల్లోనే సుదర్శన్ అర్ధ సెంచరీ కూడా పూర్తయింది. ఎట్టకేలకు 13వ ఓవర్లో సుదర్శన్ ‘హిట్ వికెట్’తో ఈ భారీ భాగస్వామ్యానికి తెర పడింది. సుదర్శన్ వరుసగా రెండో మ్యాచ్లోనూ అనూహ్యంగా ఒకే తరహాలో అవుట్ కావడం విశేషం. 47 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న గిల్, సుందర్ (16) తక్కువ వ్యవధిలో అవుటైనా... తెవాటియా (17 నాటౌట్), బట్లర్ (9 నాటౌట్) కలిసి ఆటను ముగించారు. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) ప్రసిధ్ (బి) సిరాజ్ 1; వైభవ్ (సి) ప్రసిధ్ (బి) రబాడ 96; జురేల్ (సి) గిల్ (బి) రబాడ 7; జడేజా (నాటౌట్) 45; పరాగ్ (సి) రబాడ (బి) హోల్డర్ 11; షనక (సి) బట్లర్ (బి) హోల్డర్ 3; ఆర్చర్ (సి) బట్లర్ (బి) ప్రసిధ్ 7; ఫెరీరా (నాటౌట్) 38; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 214. వికెట్ల పతనం: 1–2, 2–9, 3–101, 4–109, 5–118, 6–172. బౌలింగ్: సిరాజ్ 4–0–42–1, రబాడ 4–0–35–2, ప్రసిధ్ 4–0–42–1, సుందర్ 2–0–23–0, హోల్డర్ 4–0–27–2, రషీద్ 2–0–45–0. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సుదర్శన్ (హిట్ వికెట్) (బి) బ్రిజేశ్ 58; గిల్ (ఎల్బీ) (బి) ఆర్చర్ 104; బట్లర్ (నాటౌట్) 9; సుందర్ (సి) ఫెరీరా (బి) బర్గర్ 16; తెవాటియా (నాటౌట్) 17; ఎక్స్ట్రాలు 15; మొత్తం (18.4 ఓవర్లలో 3 వికెట్లకు) 219. వికెట్ల పతనం: 1–167, 2–182, 3–201. బౌలింగ్: ఆర్చర్ 4–0–45–1, బర్గర్ 4–0–35–1, బ్రిజేశ్ 3.4–0–44–1, తుషార్ 3–0–34–0, యశ్రాజ్ 2–0–29–0, జడేజా 2–0–28–0. టాస్ గందరగోళం... మ్యాచ్కు ముందు టాస్ సమయంలో జరిగిన ఘటన తీవ్ర చర్చకు కారణమైంది. గిల్ నాణెం విసరగా, పరాగ్ ‘హెడ్స్’ చెప్పాడు. అయితే నాణెం కింద పడిన తర్వాత దానిని స్పష్టంగా చూపించకుండా రిఫరీ ప్రకాశ్ భట్ తాను ‘సరిగా వినలేదని’... టాస్ మళ్లీ వేయమని కోరాడు. దాంతో మళ్లీ నాణెం విసరగా, ఈసారి పరాగ్ టాస్ నెగ్గాడు. దాంతో గిల్ తన అసంతృప్తిని ప్రదర్శించాడు. గత మ్యాచ్లో వాడిన పిచ్ కాబట్టి తాను కూడా బ్యాటింగ్ ఎంచుకునేవాడినని, అయితే దురదృష్టవశాత్తూ రిఫరీ సరిగా వినలేదని అతను వ్యాఖ్యానించాడు. మ్యాచ్లో టైటాన్స్ ఓడి ఉంటే ఇది కూడా పెద్ద వివాదానికి కారణమయ్యేదేమో. -
పాపం సాయి సుదర్శన్.. క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి
ఐపీఎల్-2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ సాయిసుదర్శన్ను మరోసారి దురదృష్టం వెంటాడింది. ముల్లాన్పూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో క్వాలిఫయర్-2లో సుదర్శన్ హిట్ వికెట్గా వెనుదిరిగాడు. సుదర్శన్ ఇలా విచిత్రంగా ఔటవ్వడం ఇది వరుసగా రెండో సారి కావడం విశేషం. అంతకుముందు రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో కూడా సుదర్శన్ హిట్ వికెట్గా ఔటయ్యాడు.ఏమి జరిగిందంటే?ఈ క్వాలిఫయర్-2 మ్యాచ్లో సుదర్శన్ అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించి మంచి రిథమ్లో కన్పించాడు. అయితే గుజరాత్ ఇన్నింగ్స్ 13 ఓవర్ వేసిన బ్రిజేష్ శర్మ.. ఐదో బంతిని సుదర్శన్కు ఫుట్టాస్గా సంధించాడు. ఆ బంతిని ఆఫ్సైడ్ డీప్స్క్వేర్ దిశగా బౌండరీకి తరలించాడు. అయితే షాట్ ఆడే వేగంలో ఈసారి కూడా బ్యాట్ అతని చేతిలో నుంచి జారిపోయింది.గత మ్యాచ్లో బ్యాట్ కిందపడి దొర్లుకుంటూ వికెట్లను తాకితే, ఈసారి మాత్రం నేరుగా వెళ్లి స్టంప్స్ మీద పడింది. దీంతో గ్రౌండ్ మొత్తం ఒక్కసారిగా సెలైంట్ అయిపోయింది. శుభ్మన్ గిల్ తల పట్టుకుని మోకాళ్లపై కూలబడిపోయాడు. లైవ్ కామెంటరీలో ఉన్న రవిశాస్త్రి తన మార్క్ స్టైల్లో... "ఎక్కడ ఉంది ఫెవికాల్? ఎక్కడ ఉంది? వ్యాఖ్యనించాడు. బహుశా క్రికెట్ చరిత్రలో ఓ ప్లేయర్ వరుసగా రెండు మ్యాచ్ల్లో హిట్వికెట్ అవ్వడం ఇదే తొలిసారి కావచ్చు. సుదర్శన్ మొత్తంగా 32 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 58 పరుగులు చేశాడు.ಹೀಗೂ ಆಗುತ್ತಾ? Hit wicket! Twice in two innings! 👀🤯 Sai Sudarshan ಪಾಲಿಗೆ ಇದಕ್ಕಿಂತ ದೊಡ್ಡ ದುರದೃಷ್ಟ ಬೇರೆ ಇಲ್ಲ! ಕ್ರೀಸ್ನಲ್ಲಿದ್ದ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಈ ಔಟ್ ನೋಡಿ ಕಂಪ್ಲೀಟ್ ಶಾಕ್ ಆಗಿದೆ! 😱ವೀಕ್ಷಿಸಿ | #TATAIPL 2026, Qualifier 2 👉 #GTvsRR | LIVE NOW | ನಿಮ್ಮ Star Sports ಕನ್ನಡ & JioHotstar. pic.twitter.com/al2pOTFFk5— Star Sports Kannada (@StarSportsKan) May 29, 2026 -
హార్ట్ బ్రేకింగ్.. వైభవ్ మరో 'సారీ'
ఐపీఎల్-2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ వరుసగా రెండో మ్యాచ్లో సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఎలిమినేటర్లో 97 పరుగులు చేసి సెంచరీకి అడుగు దూరంలో నిలిచిపోయిన వైభవ్.. ఇప్పుడు రాజస్తాన్ రాయల్స్పై అదే సీన్ రిపీట్ చేశాడు. ముల్లాన్పూర్ వేదికగా రాజస్తాన్తో క్వాలిఫయర్-2లో వైభవ్ విరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. 9 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన రాజస్తాన్ను వైభవ్ తన అద్భుత బ్యాటింగ్తో ఆదుకున్నాడు. గత మ్యాచ్తో పోలిస్తే కాస్త ఆచితూచి ఆడిన సూర్యవంశీ సులువుగా తన మూడో ఐపీఎల్ సెంచరీ మార్క్ను అందుకుంటాడని అంతా భావించారు. కానీ మరోసారి సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో వైభవ్ నిలిచిపోయాడు.రబాడ బౌలింగ్లో భారీషాట్కు ప్రయత్నించి థర్డ్మ్యాన్లో వైభవ్ దొరికపోయాడు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లోనూ ఈ విధంగానే అతడు తన వికెట్ను కోల్పోయాడు. ఇక ఓవరాల్గా ఈ మ్యాచ్లో 47 బంతులు ఎదుర్కొన్న సూర్యవంశీ.. 8 ఫోర్లు, 7 సిక్స్లతో 96 పరుగులు చేశాడు.ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 90ల్లో అవుట్ అయిన బ్యాటర్ల సరసన వైభవ్ చేరాడు. డేవిడ్ వార్నర్, కె.ఎల్ రాహుల్ లాంటి దిగ్గజాల రికార్డును అతను సమం చేశాడు.ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 90ల్లో అవుట్ అయిన బ్యాటర్లు వీరేవైభవ్ సూర్యవంశీ-3డేవిడ్ వార్నర్-3కేఎల్ రాహుల్-3గ్లెన్ మాక్స్వెల్-3రుతురాజ్ గైక్వాడ్-3 -
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్-2026లో ముల్లాన్పూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న క్వాలిఫయర్-2లో వైభవ్ వీరవీహారం చేశాడు. కేవలం 9 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయిన రాజస్తాన్ను తన విరోచిత ఇన్నింగ్స్తో వైభవ్ ఆదుకున్నాడు. తొలుత కాస్త ఆచితూచి ఆడిన వైభవ్.. క్రీజులో కుదురుకున్నాక ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ చిచ్చరపిడుగు తనదైన శైలిలో గుజరాత్ బౌలర్లను ఉతికారేశాడు. ముల్లాన్పూర్ మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. మరోసారి తృటిలో తన మూడో ఐపీఎల్ సెంచరీ మార్క్ను అందుకునే అవకాశాన్ని సూర్యవంశీ కోల్పోయాడు. కేవలం 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్లతో 96 పరుగులు చేసి వైభవ్ ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్తో సూర్యవంశీ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.వైభవ్ సాధించిన రికార్డులు ఇవేఐపీఎల్ చరిత్రలో బంతుల పరంగా అత్యంత వేగంగా 1,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా సూర్యవంశీ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. వైభవ్ ఈ మైలురాయిని కేవలం 440 బంతుల్లోనే అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ లెజెండ్ ఆండ్రీ రస్సెల్ పేరిట ఉండేది. రస్సెల్ 545 బంతుల్లో 1,000 పరుగులు చేయగా.. వైభవ్ అంతకంటే 105 బంతులు తక్కువగానే ఆడి ఆ రికార్డును బ్రేక్ చేశాడు.అదేవిధంగా ఒక ఐపీఎల్ సీజన్లో పవర్ ప్లేలో 500 పరుగులు చేసిన తొలి బ్యాటర్గా వైభవ్ రికార్డు సృష్టించాడు. అతడు ఈ ఏడాది సీజన్లో పవర్ప్లేలో 233.63 స్ట్రైక్ రేట్తో 521 పరుగులు చేశాడు. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో వైభవ్ కంటే ముందు ఈ ఫీట్ను అందుకోలేకపోయారు. వైభవ్ తర్వాత డేవిడ్ వార్నర్(467) ఉన్నాడు.చదవండి: రిషబ్ పంత్ సంచలన నిర్ణయంTHE VAIBHAV SOORYAVANSHI SHOW 🤩🩷🎥 The Boy Wonder playing fire with fire 🔥Updates ▶️ https://t.co/eupS8cBPc2#TATAIPL | #Qualifier2 | #TheFinalLeap | #GTvRR | @rajasthanroyals pic.twitter.com/UFvfez3ORP— IndianPremierLeague (@IPL) May 29, 2026 -
క్వాలిఫయర్ 2లో 'టాస్' డ్రామా.. పాపం శుబ్మన్ గిల్
ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ క్వాలిఫయర్-2 మ్యాచ్ టాస్ సమయంలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. టాస్ కోసం గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్, రాజస్తాన్ సారథి రియాన్ పరాగ్ మైదానంలోకి వచ్చారు. టాస్ ప్రెజెంటేర్ రవిశాస్త్రి వ్యవహరించగా.. మ్యాచ్ రిఫరీగా ప్రకాష్ భట్ ఉన్నారు. అయితే టాస్ టైమ్లో శుభ్మన్ గిల్ కాయిన్ గాల్లోకి విసిరాడు.రియాన్ పరాగ్ 'హెడ్స్' అని కాల్ చేశాడు. కానీ కాయిన్ కింద పడ్డాక 'టెయిల్స్' వచ్చింది. దీంతో టాస్ గెలిచానని గిల్ సంబరపడ్డాడు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ చోటు చేసుకుంది. రియాన్ పరాగ్ చేసిన కాల్ తనకు సరిగ్గా వినపడలేదని మ్యాచ్ రిఫరీ ప్రకాష్ భట్ ప్రకటించారు. దీంతో మొదటి వేసిన టాస్ను రద్దు చేసి, రెండో సారి టాస్ వేయాల్సి వచ్చింది. రెండోసారి గిల్ కాయిన్ను విసరగా.. రియాన్ పరాగ్ గట్టిగా 'హెడ్స్' అని పిలిచాడు.ఈసారి కాయిన్ హెడ్స్ పడటంతో రాజస్తాన్ టాస్ గెలిచింది. పరాగ్ వెంటనే ఏమి ఆలోచించకుండా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. ఇక్కడ గిల్ కూడా టాస్ గెలిచి ఉంటే బ్యాటింగ్ ఎంచుకునేవాడని చెప్పడం కొసమెరుపు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు కావాలనే గుజరాత్కు అన్యాయం చేశారని కామెంట్లు పెడుతున్నారు.చదవండి: రిషబ్ పంత్ సంచలన నిర్ణయంToss clip 🔥SCAM?? MISTAKE??FIXED??? OR WOTTT??? 🙊 #GTvsRR pic.twitter.com/atQe43C6Mm— CHICO (@CHICOx58) May 29, 2026 -
వైభవ్కు కళ్లు చెదిరే ఆఫర్.. కోహ్లీకి పోటీగా!
రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 19వ సీజన్లో తన బ్యాట్తో విధ్వంసం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో 15 మ్యాచ్లాడిన వైభవ్ సూర్యవంశీ 242 స్ట్రైక్రేట్తో 680 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో వైభవ్ ఉపయోగిస్తున్న బ్యాట్ స్పాన్సర్షిప్కు సంబంధించి కళ్లు చెదిరే ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ వాడుతున్న బ్యాట్కు ఎస్ఎస్ (సరీన్ స్పోర్ట్స్) కంపెనీ స్పాన్సర్గా వ్యవహరిస్తోంది. అయితే ఇకపై వైభవ్ తన బ్యాట్పై ఏడాదికి రూ. 12కోట్లు అందుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎస్ఎస్ కంపెనీతో ఉన్న ఒప్పందంతో పోలిస్తే ఇది 24 రేట్లకు ఎక్కువ అని చెప్పొచ్చు. అయితే ఈ కొత్త ఒప్పందం ప్రస్తుత స్పాన్సర్ ఎస్ఎస్తోనే జరిగిందా లేక వేరే కంపెనీ స్పాన్సర్గా వ్యవహరించనుందా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీకి వైభవ్ పోటీగా మారనున్నాడు.ప్రస్తుతం కోహ్లీ బ్యాట్కు స్పాన్సర్గా వ్యవహరిస్తున్న ఎంఆర్ఎఫ్ ఏడాదికి రూ. 12.5 కోట్లు అందుకుంటున్నాడు. అయితే ఎంఆర్ఎఫ్ కూడా వైభవ్ బ్యాట్కు స్పాన్సర్గా వ్యవహరించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ఇలా వైభవ్ తన బ్యాట్తో పరుగుల సునామీ సృష్టించడమే కాదు, ఇప్పుడు బ్యాట్ ద్వారా కూడా ఎక్కువ మొత్తంలో సంపాదించబోతున్నాడు.Vaibhav Sooryavanshi has received a bat sponsorship offer of 12cr annually. - It’s more than 24 times than his previous bat sponsorship deal. (CricBlogger). pic.twitter.com/ZwQkLN61uf— Mufaddal Vohra (@mufaddal_vohra) May 29, 2026చదవండి: ముంబై వీడినా పాండ్యాకు బంపరాఫర్! -
క్వాలిఫయర్-2లో గుజరాత్ ఘన విజయం
Gujarat titans vs Rajasthan royals Qualifier 2 Live updates: ముల్లాన్పూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన క్వాలిఫయర్-2లో 7 వికెట్ల తేడాతో గుజరాత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో తమ ఫైనల్ బెర్త్ను గుజరాత్ ఖరారు చేసుకుంది. రాజస్తాన్ నిర్ధేశించిన 215 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 18.4 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.ఈ విజయంలో కెప్టెన్ శుబ్మన్ గిల్ది కీలక పాత్ర. ఈ మ్యాచ్లో గిల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. గిల్ కేవలం 53 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్లతో 104 పరుగులు చేశాడు. గిల్తో పాటు సుదర్శన్(58) హాఫ్ సెంచరీతో రాణించాడు. రాజస్తాన్ బౌలర్లలో ఆర్చర్, బర్గర్, బ్రిజేష్ శర్మ తలా వికెట్ సాధించారు. మే 31న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీతో గుజరాత్ తలపడనుంది.సుందర్ అవుట్వాషింగ్టన్ సుందర్(6).. బర్గర్ బౌలింగ్లో ఔటయ్యాడు.గుజరాత్ రెండో వికెట్ డౌన్గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. 104 పరుగులు చేసిన గిల్.. ఆర్చర్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు.శుబ్మన్ సెంచరీగుజరాత్ కెప్టెన్ శుబ్మన్ గిల్ కేవలం 47 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. గుజరాత్ విజయానికి 38 బంతుల్లో 39 పరుగులు కావాలి.గుజరాత్ తొలి వికెట్ డౌన్సాయిసుదర్శన్(58) రూపంలో గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. సుదర్శన్ మరోసారి హిట్వికెట్ రూపంలో వెనుదిరిగాడు.విజయం దిశగా గుజరాత్గుజరాత్ టైటాన్స్ విజయం దిశగా దూసుకుపోతుంది. ఓపెనర్లు శుబ్మన్ గిల్(39 బంతుల్లో 81), సాయిసుదర్శన్(27 బంతుల్లో 51) దుమ్ములేపుతున్నారు. గుజరాత్ విజయానికి 54 బంతుల్లో 71 పరుగులు కావాలి.దుమ్ములేపుతున్న గుజరాత్ ఓపెనర్లు6 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. క్రీజులో సాయిసుదర్శన్(30), శుబ్మన్ గిల్(29) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న గుజరాత్215 పరుగుల భారీ లక్ష్య చేధనను గుజరాత్ టైటాన్స్ ఘనంగా ఆరంభించింది. 3 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 41 పరుగులు చేసింది. క్రీజులో శుబ్మన్ గిల్(21), సాయిసుదర్శన్(14) ఉన్నారు.వైభవ్ విధ్వంసం.. గుజరాత్ ముందు భారీ టార్గెట్ముల్లాన్పూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న క్వాలిఫయర్-2లో రాజస్తాన్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. వైభవ్ కేవలం 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్లతో 96 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అతడితో పాటు డొనొవాన్ ఫెరీరా(11 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 38) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. రవీంద్ర జడేజా(45) కూడా రాణించాడు. ఫలితంగా రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో జాసన్ హోల్డర్, రబాడ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలా వికెట్ సాధించారు.వైభవ్ సెంచరీ మిస్రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. సెంచరీని 4 పరుగులు దూరంలో మిస్ చేసుకున్నాడు. 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్లతో 96 పరుగులు చేసి వైభవ్ ఔటయ్యాడు.వైభవ్ హాఫ్ సెంచరీవైభవ్ సూర్యవంశీ 27 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 14 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 129/5రాజస్తాన్ ఐదో వికెట్ డౌన్రాజస్తాన్ ఐదో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన ఆర్చర్.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో ఔటయ్యాడు. జడేజా తిరిగి క్రీజులోకి వచ్చాడు.రాజస్తాన్ నాలుగో వికెట్ డౌన్దసన్ షనక రూపంలో రాజస్తాన్ రాయల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన షనక.. హోల్డర్ బౌలింగ్లో ఔటయ్యాడు.రియాన్ పరాగ్ రెండో వికెట్ డౌన్రియాన్ పరాగ్ రూపంలో రాజస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన రియాన్ పరాగ్.. జాసన్ హోల్డర్ బౌలింగ్లో ఔటయ్యాడు.జడేజా రిటైర్డ్ హార్ట్మంచి టచ్లో కన్పించిన రవీంద్ర జడేజా(19 బంతుల్లో 34) గాయం కారణంగా రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన రియాన్ పరాగ్ సైతం దూకుడుగా ఆడుతున్నాడు. 9 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 100/2మొదలెట్టిన వైభవ్వైభవ్ సూర్యవంశీ(14 బంతుల్లో 27) దూకుడుగా ఆడుతున్నాడు. 4 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ స్కోర్: 45/2రాజస్తాన్కు భారీ షాక్.. 13 రన్స్కే 2 వికెట్లుధ్రువ్ జురెల్ రూపంలో రాజస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన జురెల్.. రబాడ బౌలింగ్లో ఔటయ్యాడు. 2 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 13/2రాజస్తాన్ తొలి వికెట్ డౌన్టాస్ గెలిచి బ్యాటింగ్కు రాజస్తాన్ రాయల్స్కు భారీ షాక్ తగిలింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి సిరాజ్ బౌలింగ్లో ఔటయ్యాడు. ఐపీఎల్-2026 క్వాలిఫయర్-2లో భాగంగా ముల్లాన్పూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.గుజరాత్ తమ జట్టులో ఓ మార్పు చేసింది. స్పిన్నర్ సాయికిషోర్ తుది జట్టులోకి వచ్చాడు. రాజస్తాన్ మాత్రం ఎలాంటి ఎలాంటి మార్పులు చేయలేదు.తుది జట్లుగుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), నిషాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కగిసో రబడ, ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధృవ్ జురెల్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), డోనోవన్ ఫెరీరా, దసున్ షనక, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజా -
సింగపూర్ ఓపెన్ నుంచి పీవీ సింధు అవుట్
సింగపూర్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్ 1, అన్ సే యాంగ్(దక్షిణ కొరియా) చేతిలో సింధు ఓటమి పాలైంది. దాదాపు 48 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో యాంగ్ దూకుడు ముందు సింధు నిలవలేకపోయింది. దీంతో ఈ సౌత్ కొరియా సూపర్ స్టార్ 21-17, 21-14 తేడాతో వరుస సెట్లలో సింధుపై విజయం సాధించింది. అన్ సే యంగ్ చేతిలో సింధు ఓడిపోవడం ఇది వరుసగా 9వ సారి కావడం గమనార్హం.ఇక సింధు ఇంటిముఖం పట్టిన స్టార్ జోడీ సాత్విక్సాయిరాజ్ రంకిరెడ్డి - చిరాగ్ శెట్టి మాత్రం సెమీస్లో అడగుపెట్టారు. క్వార్టర్ ఫైనల్లో ఈ భారత ద్వయం మలేషియా జోడీ కాంగ్ ఖాయ్ గ్జింగ్ – అరోన్ తాయ్పై 19-21, 21-17, 21-13తో అద్భుత విజయం సాధించారు. -
ముంబై వీడినా పాండ్యాకు బంపరాఫర్!
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కనబరిచింది. జట్టును నడిపించడంలో హార్దిక్ పాండ్యా పూర్తిగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో సీజన్ మధ్యలోనే పాండ్యాను కెప్టెన్సీ పదవి నుంచి తప్పించాలని ముంబై యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా పాండ్యా ముంబై ఇండియన్స్కు గుడ్బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అతడు తన సోషల్ మీడియాలో అకౌంట్లో పెట్టిన పోస్టులే ఉదాహరణ. దీనికి తోడు పాండ్యా కెప్టెన్సీ, అతడి ప్రవర్తనపై విమర్శలు వ్యక్తమవ్వడంతో ముంబై యాజమాన్యం కూడా పాండ్యాను జట్టు నుంచి రిలీజ్ చేయాలని భావిస్తోంది. ముంబై ఇండియన్స్ నుంచి బయటికి రానున్న హార్దిక్ పాండ్యా వచ్చే సీజన్లో ఏ జట్టులోకి వెళ్తే బాగుంటుందనే చర్చ జోరుగా సాగుతుంది. సీఎస్కే లేదా లక్నోకు పాండ్యా కెప్టెన్గా వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వస్తున్నప్పటికీ కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ జట్టులోకి కూడా హార్దిక్ పాండ్యా వెళ్లే అవకాశం లేకపోలేదు. 2022 ఐపీఎల్ సీజన్లో తొలిసారి ఆడిన గుజరాత్ టైటాన్స్ను చాంపియన్గా నిలిపాడు హార్దిక్ పాండ్యా. తర్వాతి సీజన్లోనూ ఆ జట్టును ఫైనల్ చేర్చాడు. అయితే గుజరాత్ను చాంపియన్గా నిలపడంతో ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాను భారీ ధరకు జట్టులోకి తీసుకొచ్చింది. రోహిత్ నుంచి జట్టు పగ్గాలు తీసుకున్న పాండ్యా ముంబైని విజయవంతంగా నడిపించడంలో విఫలమయ్యాడు. గతేడాది సీజన్లో ముంబైని ప్లేఆఫ్స్ చేర్చిన పాండ్యా ఈ సీజన్లో అటు కెప్టెన్గా, ఇటు ఆటగాడిగా పూర్తిగా విఫలమయ్యాడు. మైదానంలో ఆటగాళ్లతో అగ్రెసివ్గా ఉండడం, జట్టులో సీనియర్లతో సక్రమంగా వ్యవహరించకపోవడం పాండ్యాకు పూర్తి నెగెటివ్గా మారిపోయింది. ఈ క్రమంలోనే తాను ముంబైని వీడుతున్నట్లు పరోక్షంగా సంకేతాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇందులో భాగంగానే సీజన్లో ముంబై ఆఖరి మ్యాచ్ ఆడిన తర్వాత పాండ్యా డ్రెసింగ్ రూమ్కు వెళ్తూ ధరించిన జెర్సీని విప్పి అభిమానుల వైపు విసిరేశాడు. అంతేకాదు రాజస్తాన్తో మ్యాచ్ అనంతరం చాలా అలసిపోయానని, మారేందుకు సిద్ధమవుతున్నట్లు పరోక్షంగా హింట్ ఇచ్చాడు. మరి ముంబై ఇండియన్స్ను వీడనున్న పాండ్యా ఏ జట్టులోకి వచ్చే అవకాశముందో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం.లక్నో సూపర్జెయింట్స్:ముంబై నుంచి బయటకు వస్తే హార్దిక్ పాండ్యా లక్నో సూపర్జెయింట్స్కు కెప్టెన్గా వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ జట్టు కెప్టెన్గా ఉన్న పంత్ ఇప్పటికే తాను కెప్టెన్సీ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 27 కోట్లు వెచ్చించిన లక్నో యాజమాన్యం కూడా పంత్ ప్రదర్శనపై అసంతృప్తితోనే ఉంది. పంత్ను వదిలేసుకుంటే లక్నో దగ్గరు ఎక్కువ మొత్తంలో డబ్బు ఉంటుంది. ఈ మేరకు హార్దిక్ పాండ్యాను మంచి ధరకు తమ జట్టులోకి తీసుకోవడమే గాక కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశముంది.ఢిల్లీ క్యాపిటల్స్..ఐపీఎల్ ఆరంభం నుంచి కొనసాగుతున్న జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఒకటి. ఢిల్లీ డేర్డెవిల్స్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్గా పేరు మార్చుకున్నప్పటికీ ఆ జట్టు తలరాత మాత్రం మారడం లేదు. ప్రస్తుత ఢిల్లీ కెప్టెన్గా ఉన్న అక్షర్ పటేల్ అంతంతమాత్రంగా రాణించాడు. జట్టులో ప్రధాన ఆటగాడిగా ఉన్న కేఎల్ రాహుల్కు కెప్టెన్సీపై పెద్దగా ఆసక్తి లేదు. దీంతో అక్షర్ పటేల్ స్థానంలో హార్దిక్పాండ్యాను కెప్టెన్గా నియమిస్తే ఆల్రౌండర్గానూ సేవలందించే అవకాశం ఉంటుంది. అయితే అక్షర్ పటేల్ను ఢిల్లీ రిలీజ్ చేయకపోవచ్చు.కోల్కతా నైట్రైడర్స్:2024లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో మూడోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన కేకేఆర్ ఆ తర్వాత ఉన్నపళంగా అయ్యర్ను వదిలేసుకుంది. దీంతో అజింక్య రహానేను కెప్టెన్గా నియమించింది. అతడి కెప్టెన్సీలో కేకేఆర్ పెద్దగా రాణించింది లేదు. ఈ సీజన్లో తొలి అంచె పోటీల్లో ఆరు వరుస పరాజయాలు రహానేపై తీవ్ర విమర్శలు వచ్చేలా చేశాయి. కామెరున్ గ్రీన్ ట్రేడింగ్లోకి వెళ్తే మాత్రం ముంబై ఇండియన్స్ పాండ్యాను కేకేఆర్కు బదలాయించే అవకాశముంటుంది. అప్పుడు పాండ్యాకు కేకేఆర్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉంది.చెన్నై సూపర్కింగ్స్:ఇక లక్నో తర్వాత హార్దిక్ పాండ్యా కెప్టెన్గా వెళ్లేది సీఎస్కే జట్టులోకేనని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ సీజన్లో కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే సీజన్లో మధ్యలో వరుస విజయాలతో ఊపందుకున్న సీఎస్కే ఒక దశలో ప్లేఆఫ్ రేసులోనూ నిలిచింది. అయితే ఇప్పటికే రాజస్తాన్ నుంచి ట్రేడ్ చేసుకున్న సంజూ శాంసన్ను కూడా రుతురాజ్ స్థానంలో కెప్టెన్ను చేసే అవకాశం లేకపోలేదు. అయితే ప్రశాంత్ వీర్ లేదా శివమ్ దూబేలలో ఒకరిని సీఎస్కే విడుదల చేస్తే మాత్రం ట్రేడింగ్లో సీఎస్కే పాండ్యాను దక్కించుకునే అవకాశముంది.రాజస్తాన్ రాయల్స్:రాజస్తాన్ రాయల్స్ జట్టు బలంగా కనిపిస్తున్నప్పటికీ రియాన్ పరాగ్ కెప్టెన్సీ అనుభవలేమి కొట్టొచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే యాజమాన్య హక్కులు చేతులు మారడంతో వచ్చే సీజన్లో రాజస్తాన్ కొత్త కెప్టెన్ను ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ పాండ్యా రాజస్తాన్లోకి వస్తే మాత్రం రియాన్ పరాగ్ స్థానంలో అతడికి నాయకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశముంది.**Hardik Pandya throws away MI jersey**His way of saying goodbye to Mumbai Indians forever? pic.twitter.com/1fy2YzygzX— Viraj (@virajs1845) May 27, 2026🔴 STRESSED, EXHAUSTED HARDIK PANDYA TELLS MUMBAI INDIANS HE IS DONE🤯- Hardik has informed MI that he wants to leave the franchise after a disappointing IPL 2026 season.[PTI] Hardik was mentally stressed and completely exhausted & set to quit MI pic.twitter.com/1N8i4Sgfzd— Sam (@cricsam02) May 29, 2026చదవండి: ఆ జట్టుదే ఐపీఎల్ 2026 టైటిల్.. ఏఐ జోస్యం! -
రిషబ్ పంత్ సంచలన నిర్ణయం
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్సీ నుంచి పంత్ వైదొలిగాడు. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ శుక్రవారం అధికారికంగా ప్రకటిచింది. ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్ ఘోర ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ పంత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. "రిషభ్ పంత్ లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకోవాలని నిశ్చయించుకున్నాడు. అతడి అభ్యర్థనను ఫ్రాంచైజీ తక్షణమే ఆమోదించింది. క్రికెట్లో ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం ఎప్పుడూ సులువు కాదు. ఒక కెప్టెన్గా అతడు సూపర్ జెయింట్స్కు అందించిన సేవలకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇప్పుడు మా దృష్టి అంతా జట్టు ప్రయోజనాల పైనే ఉంది. రాబోయే రోజుల్లో జట్టును మళ్లీ పటిష్టంగా నిర్మించడమే మా లక్ష్యమని లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ డైరెక్టర్ టామ్ మూడీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.కెప్టెన్గా అట్టర్ ప్లాప్కాగా ఐపీఎల్-2025 వేలంలో రిషబ్ పంత్ను లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ రూ. 27 కోట్ల భారీ ధర వెచ్చించి మరి సొంతం చేసుకుంది. కేఎల్ రాహుల్ స్ధానంలో తమ జట్టు పగ్గాలను పంత్కు లక్నోకు అప్పగించింది. కానీ లక్నో యాజమాన్యం నమ్మకాన్ని రిషబ్ నిలబెట్టుకోలేకపోయాడు.ఐపీఎల్-2025, 26 సీజనల్లో అతడి కెప్టెన్సీలోని లక్నో సూపర్ జెయింట్స్ దారుణ ప్రదర్శన కనబరిచింది. ఈ రెండు సీజన్లలో కనీసం ఒక్కసారి కూడా ప్లే ఆఫ్స్కు చేరలేకపోయింది. ఈ ఏడాది సీజన్లో లక్నో మరింత ఘోరంగా విఫలమైంది. ఆడిన 14 మ్యాచ్ల్లో కేవలం 4 విజయాలు మాత్రమే నమోదు చేసి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. పంత్ కెప్టెన్గా మాత్రమే కాకుండా ఆటగాడిగా కూడా నిరాశపరిచాడు. దీంతో అతడిపై తీవ్ర స్ధాయిలో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే లక్నో కెప్టెన్సీ నుంచి పంత్ తప్పుకొన్నాడు.చదవండి: ‘ముంబై తప్పు తెలుసుకుంది.. కెప్టెన్గా అతడే!’ -
టీ20 వరల్డ్కప్ టోర్నీకి వెస్టిండీస్ జట్టు ప్రకటన
ఇంగ్లండ్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2026 కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్గా హేలీ మాథ్యూస్ వ్యవహరించనుంది. అదేవిధంగా ఈ జట్టులో డీండ్రా డాటిన్, స్టెఫానీ టేలర్ వంటి సీనియర్ ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు.పదేళ్ల క్రితం పొట్టి ప్రపంచకప్ విజేతగా నిలిచిన కరేబియన్ జట్టు.. ఆ తర్వాత ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా సొంతం చేసుకోలేకపోయింది. అటు విండీస్ పురుషల జట్టు కూడా 2016 తర్వాత ఐసీసీ టైటిల్ను ముద్దాడలేకపోయింది. దీంతో తమ 10 ఏళ్ల సుదీర్ఘ నిర్ణీక్షణకు తెరదించాలని విండీస్ అమ్మాయిలు పట్టుదలతో ఉన్నారు. అయితే సాధరణంగా ఇంగ్లండ్ పిచ్లు పేసర్లకు అనుకూలంగా ఉంటాయి. కానీ వెస్టిండీస్ సెలెక్టర్లు అనూహ్యంగా స్పిన్ బౌలింగ్కు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. . అష్మిని మునిసర్, అఫీ ఫ్లెచర్, మాండీ మంగ్రూ, కరిష్మా రామ్హారక్, హేలీ మాథ్యూస్, జైదా జేమ్స్ వంటి స్పిన్నర్లు విండీస్ ప్రపంచకప్ జట్టులో ఉన్నారు. ఇక ఈ టోర్నీలో విండీస్ జట్టు గ్రూప్-బిలో చోటు దక్కించుకుంది. ఈ గ్రూప్లో వెస్టిండీస్తో పాటు ఐర్లాండ్, న్యూజిలాండ్, స్కాట్లాండ్, శ్రీలంక, ఆతిథ్య ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి. వెస్టిండీస్ జట్టు జూన్ 13న సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్తో తన ప్రపంచ కప్ సమరాన్ని ప్రారంభించనుంది.మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 కు వెస్టిండీస్ జట్టు: హేలీ మాథ్యూస్ (కెప్టెన్), చినెల్ హెన్రీ, డీండ్రా డాటిన్, స్టెఫానీ టేలర్, అఫీ ఫ్లెచర్, ఆలియా అల్లీన్, షెమైన్ కాంప్బెల్, అష్మిని మునిసర్, కరిష్మా రామ్హారక్, జాన్నిలియా గ్లాస్గో, జహజారా క్లాక్స్టన్, కియానా జోసెఫ్, జైదా జేమ్స్, మాండీ మంగ్రూ, షానిషా హెక్టర్.చదవండి: ‘ముంబై తప్పు తెలుసుకుంది.. కెప్టెన్గా అతడే!’ -
ఆ జట్టుదే ఐపీఎల్ 2026 టైటిల్.. ఏఐ జోస్యం!
ఐపీఎల్ 2026 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. ఇవాళ జరగనున్న క్వాలిఫయర్-2 పోరుతో కలిపి ఫైనల్ మ్యాచ్ మాత్రమే మిగిలిఉంది. ఇప్పటికే క్వాలిఫయర్-1 పోరులో గుజరాత్ టైటాన్స్ను ఓడించిన ఆర్సీబీ నేరుగా ఫైనల్లో అడుగుపెట్టింది. ఎలిమినేటర్లో ఎస్ఆర్హెచ్ను ఓడించిన రాజస్తాన్ రాయల్స్ ఫైనల్లో బెర్తు దక్కించుకోవడం కోసం క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. ఇందులో గెలిచిన జట్టు మే 31న (ఆదివారం) జరగనున్న ఫైనల్లో ఆర్సీబీతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2026 సీజన్ విజేత ఎవరనేది ఏఐ ప్లాట్ఫామ్ క్లాడ్ అంచనా వేసింది. క్వాలిఫయర్-2లో విజేతతో పాటు టైటిల్ గెలుచుకోనున్న జట్టును కూడా అంచనా వేసింది. ఏఐ మాయతో ఏది నిజమో, ఏది అబద్దమో తెలుసుకోలేకపోతున్న ఈ రోజుల్లో అది చెప్పిన జోస్యం నిజమవుతుందా అనేది చూడాలి. క్వాలిఫయర్-2లో రాజస్తాన్ను ఓడించి గుజరాత్ టైటాన్స్ ఫైనల్కు దూసుకెళ్తుందని అంచనా వేసింది. కానీ ఫైనల్లో మాత్రం ఆర్సీబీ చేతిలో చతికిలపడి గుజరాత్ రన్నరప్తో సరిపెట్టుకుంటుందని పేర్కొంది. ఇక ఆర్సీబీ వరుసగా రెండోసారి చాంపియన్గా నిలవనుందని, ఆ జట్టుకే గెలుపు అవకాశాలు 65 శాతం ఉన్నట్లు తెలిపింది. దీని వెనుక ఉన్న కారణాల్ని కూడా పక్కాగా వివరించింది.ఈ సీజన్లో ఆర్సీబీ నిలకడైన ఆటతీరును ప్రదర్శిస్తూ ఆరంభం నుంచే విజయాలు సాధించి మెరుగైన రన్రేట్తో 18 పాయింట్లు సాధించి టేబుల్ టాపర్గా నిలిచింది. కోహ్లి, పాటిదార్, పడిక్కల్, టిమ్ డేవిడ్లతో కూడిన బలమైన లైనప్కు తోడు భువనేశ్వర్, హాజిల్వుడ్, రసిక్ సలామ్ వంటి బౌలర్లతో పటిష్టంగా ఉందని తెలిపింది. అదీగాక క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్ను భారీ తేడాతో చిత్తు చేసిన ఆర్సీబీ మంచి ఆత్మవిశ్వాసంతో ఫైనల్లో బరిలోకి దిగనుందని, అదే ఆత్మవిశ్వాసంతో గుజరాత్ను మరోసారి ఓడించి వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ దక్కించుకోనుందని తెలిపింది. మరి ఏఐ చెప్పిన జోస్యం నిజమవుతుందా లేదా అనేది తెలియాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే.చదవండి: తగ్గేదేలే.. లక్ష్యం మరో 4 వేల కిలోమీటర్లే! -
తగ్గేదేలే.. లక్ష్యం మరో 4 వేల కిలోమీటర్లే!
రాజస్థాన్కు చెందిన అల్ట్రా-మారథాన్ రన్నర్, భారత అథ్లెట్ సుఫియా సూఫీ సాహసయాత్ర వెయ్యి కిలోమీటర్లకు చేరుకుంది. భారత సాయుధ దళాలకు నివాళిగా కన్యకుమారి నుంచి కారకోరం వరకు 88 రోజుల పాటు 5వేల కిలోమీటర్ల దూరం రన్నింగ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం సుఫియా సూఫీ వెయ్యి కిలోమీటర్ల మార్క్ను చేరుకున్న క్రమంలో ఆ విశేషాలను తన ‘ఎక్స్’ వేదికగా ఫొటో రూపంలో పంచుకుంది. షూస్తో వెయ్యి సంఖ్య ఆకారాన్ని తయారు చేసిన సుఫియా .. ‘వెయ్యి కిలోమీటర్లు పూర్తైంది’ అని కామెంట్ చేసింది. 5 వేల కిలోమీటర్ల టార్గెట్లో మొదటి మెట్టును విజయవంతంగా పూర్తి చేయడం తనకు సంతోషంగా ఉందని సుఫియా తెలిపింది. కాగా సుఫియా సాహసయాత్రపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఇది నిజంగా అద్భుతం. దేశ భద్రతకు గస్తీ కాస్తున్న సాయుధ దళాలకు మీరు ఇస్తున్న గౌరవం చాలా బాగుంది’.. ‘రన్నింగ్కు షూకు సరైన నిర్వచనం చెప్పారు.. సలాం సూఫీ’..‘కంగ్రాట్స్ సుఫియా.. మీరు ఇలాగే ముందుకు సాగండి’ అంటూ అభిమానులు కామెంట్లు పెట్టారు.ఎందుకీ మారథాన్ రన్?దక్షిణ భారత్ ఏరియా ప్రధాన కార్యాలయం మద్దతుతో ఈ మహత్తర కార్యక్రమాన్ని సుఫియా సూఫీ ప్రారంభించింది. దేశ భద్రత కోసం ప్రాణాలొదిలిన భారత సాయుధ దళాలకు నివాళిగా మారథాన్ రన్ ప్రారంభించింది. కాగా సూఫీ తన ప్రయాణంలో అన్ని ప్రధాన యుద్ధ స్మారక చిహ్నాలను గౌరవించనున్నట్లు తెలిపింది. తన సాహసయాత్రను లడఖ్లోని కార్గిల్ దివస్ వద్ద ముగించనున్నట్లు ఆమె పేర్కొంది. సుఫియా సూఫీ చేస్తున్న ఈ మారథాన్ ఫీట్ వరల్డ్ రికార్డు సాధించడంతో పాటు ఆమె అకుంఠిత స్ఫూర్తికి, దీక్షకు, పట్టుదలకు నిదర్శనంగా నిలవనుంది. తన ఆరో గిన్నిస్ ప్రపంచ రికార్డు కోసం కృషి చేస్తున్న సుఫియా అంకితభావానికి, మానసిక స్థైర్యానికి ఈ పరుగు ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. కాగా జాతీయ ఐక్యత, దేశభక్తి, పట్టుదలకు ప్రతీకగా నిలిచే ఈ ప్రయాణానికి నాంది పలుకుతూ, కల్నల్ సూర్య ముఖర్జీ.. సుఫియా సూఫీ మారథాన్ను మే 12న అధికారికంగా జెండా ఊపి ప్రారంభించారు.1000 Km done.… #RunAcrossIndia #RunforDreams #TributetoBravehearts #worldrecordattempt pic.twitter.com/Ryr1NNuea0— Sufiya Sufi Runner (@sufirunner) May 29, 2026చదవండి: మెస్సీ ఆడడంపై క్లారిటీ.. అర్జెంటీనా జట్టు ప్రకటన View this post on Instagram A post shared by Sufiya Sufi Runner (@sufiyasufirunner) -
‘ముంబై తప్పు తెలుసుకుంది.. కెప్టెన్గా అతడే!’
మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్కు మరోసారి ఘోర పరాభవం ఎదురైంది. ఐపీఎల్-2026లో గ్రూప్ దశలో పద్నాలుగు మ్యాచ్లకు గానూ ముంబై.. కేవలం నాలుగు మ్యాచ్లే గెలిచింది. ఫలితంగా ఎనిమిది పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది.ఐదుసార్లు చాంపియన్కాగా రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీలో ముంబై గతంలో ఏకంగా ఐదుసార్లు చాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ 2024లో అతడిని సారథ్య బాధ్యతల నుంచి తప్పించింది యాజమాన్యం. అతడి స్థానంలో... గుజరాత్ టైటాన్స్ను విజేతగా (2022) నిలిపిన తమ మాజీ ఆటగాడు హార్దిక్ పాండ్యాను తిరిగి జట్టులోకి తీసుకుంది. అంతేకాదు కెప్టెన్గానూ బాధ్యతలు అప్పగించింది.ఘోర పరాభవంముంబై ఇండియన్స్ సారథిగా తొలి ప్రయత్నంలోనే హార్దిక్ ఘోర పరాభవం చవిచూశాడు. సొంత జట్టు అభిమానుల నుంచే తీవ్ర వివక్ష ఎదుర్కోవడంతో పాటు.. జట్టును మరీ దారుణంగా చిట్టచివరన పదో స్థానంలో నిలిపాడు. అయితే, ఆ తర్వాత టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించడంతో హార్దిక్పై నెగిటివిటీ కాస్త తగ్గింది.గతేడాది ప్లే ఆఫ్స్ చేరినా.. అదే జోరులో 2025లో ముంబైని ప్లే ఆఫ్స్ చేర్చాడు హార్దిక్ పాండ్యా. అయితే, తాజా ఎడిషన్లో మళ్లీ పాత కథే పునరావృతమైంది. ఈసారి కెప్టెన్గా.. ఆల్రౌండర్గా అతడు పూర్తిగా విఫలమయ్యాడు. వెన్నునొప్పి కారణంగా నాలుగు మ్యాచ్లకు దూరమైన హార్దిక్.. 10 మ్యాచ్లు ఆడి 206 పరుగులు చేయడంతో పాటు.. కేవలం నాలుగు వికెట్లు తీశాడు.ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాపై అంబానీల సారథ్యంలోని యాజమాన్యం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరువర్గాల మధ్య అభిప్రాయ భేదాలు తారస్థాయికి చేరుకున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి ముంబై ఇండియన్స్ సన్నిహిత వర్గాలు ఎన్డీటీవీకి కీలక విషయాలు వెల్లడించాయి.ముంబై తప్పు తెలుసుకుంది‘‘ముంబై ఇండియన్స్ యాజమాన్యం తమ తప్పును తెలుసుకుంది. అయితే, రోహిత్ శర్మ తిరిగి పగ్గాలు చేపట్టేందుకు ఏమాత్రం సిద్ధంగా లేడు. కానీ.. అతడి ఆశీర్వాదం ఉన్న వ్యక్తే ముంబై ఇండియన్స్ తదుపరి కెప్టెన్ అవుతాడనడంలో సందేహం లేదు. రోహిత్ సూచించిన ఆటగాడికే కెప్టెన్సీ దక్కే అవకాశం ఉంది’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.ఇదిలా ఉంటే.. హార్దిక్ పాండ్యా సైతం ముంబైని వీడే ప్రయత్నాల్లో ఉన్నట్లు సంకేతాలు ఇస్తున్నాడు. ఇటీవల తన ఫోన్ స్క్రీన్పై ‘07:07’ టైమ్ను షేర్ చేయడంతో.. అతడు చెన్నై సూపర్ కింగ్స్లో చేరబోతున్నాడని నెటిజన్లు భావించారు.మేనేజ్మెంట్తో సంబంధాలు దెబ్బతింటేఈ విషయం గురించి కూడా సదరు వర్గాలు స్పందించాయి. ‘‘హార్దిక్ కచ్చితంగా ట్రాన్స్ఫర్ కోరుకుంటాడు. కేవలం కెప్టెన్సీ విషయంలోనే కాదు.. వ్యక్తిగతంగానూ అతడు జట్టుకు దూరమవ్వాలని కోరుకుంటున్నాడు.ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నపుడు మేనేజ్మెంట్తో సంబంధాలు దెబ్బతింటే ఎవరైనా ఇలాగే చేస్తారు కదా!.. ఆటగాళ్లు కూడా ఇందుకు మినహాయింపు కాదు’’ అని ముంబై ఇండియన్స్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.చదవండి: GT vs RR: వర్షం వల్ల మ్యాచ్ రద్దైతే? -
మెస్సీ ఆడడంపై క్లారిటీ.. అర్జెంటీనా జట్టు ప్రకటన
జూన్ 11 నుంచి మొదలుకానున్న ఫిఫా వరల్డ్కప్ ఫుట్బాల్ టోర్నీ కోసం అర్జెంటీనా శుక్రవారం తమ జట్టును ప్రకటించింది. 2022లో ఫిఫా చాంపియన్గా నిలిచిన అర్జెంటీనాను మళ్లీ మెస్సీనే నడిపించనున్నాడు. 26 మంది సభ్యులతో కూడిన బృందాన్ని అర్జెంటీనా జట్టు కోచ్ లియోనిల్ స్కలోని ప్రకటించారు. ఇటీవలే ఇంటర్ మియామి క్లబ్ తరఫున మ్యాచ్ ఆడుతూ మెస్సీ గాయపడిన సంగతి తెలిసిందే. గాయం కారణంగా అతడు ఫిఫా వరల్డ్కప్కు దూరమవనున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు తెరదించుతూ మెస్సీ ఫిఫా వరల్డ్కప్లో ఆడనున్నట్లు, జట్టుకు సారథిగా అతనే వ్యవహరించనున్నట్లు స్కలోని వెల్లడించాడు. ఈ నేపథ్యంలో మెస్సీ రికార్డు స్థాయిలో ఆరోసారి ఫిఫా ప్రపంచకప్ ఆడనున్నాడు. ఎనిమిది సార్లు బాలన్ డీ ఓర్ అవార్డు గెలిచిన మెస్సీకే సారధ్య బాధ్యతలను అప్పగించారు. ఖతార్లో నాలుగేళ్ల క్రితం జరిగిన వరల్డ్కప్లో అర్జెంటీనా టైటిల్ను గెలిచిన విషయం తెలిసిందే. అయితే అర్జెంటీనా జట్టులో రియల్ మాడ్రిడ్ ప్లేయర్ ఫ్రాంకో మస్తానటునో పేరు మాత్రం జట్టులో కనిపించలేదు. జూన్ 11న మొదలుకానున్న ఫిఫా ప్రపంచకప్కు అమెరికా, మెక్సికో, కెనడాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. గ్రూప్ జెలో ఉన్న అర్జెంటీనా తమ తొలి మ్యాచ్ను కన్సాస్ సిటీ వేదికగా జూన్ 17న అల్జీరియాతో ఆడనుంది. అర్జెంటీనాతో పాటు అల్జీరియా, ఆస్ట్రియా, జోర్డాన్లు గ్రూప్-జెలో ఉన్నాయి. అర్జెంటీనా జట్టు:గోల్కీపర్స్: ఎమిలియానో మార్టినేజ్, జిరోనిమా రుల్లి, జువాన్ ముసోడిఫెండర్స్: గొంజాలో మాంటిల్, నాహుల్ మోలినా, లిసాండ్రో మార్టినేట్, నికోలస్ ఒటమెండి, లియోనార్డో బార్లేడి, క్రిస్టియానా రొమారియో, ఫకుండా మెదీనా, నికోలస్ తగ్లియాఫికోమిడ్ఫీల్డర్లు: లియాండ్రో పరేడ్స్, రోడ్రిగో డీ పాల్, ఎక్స్కుయల్ పాలేసియస్, ఎంజో ఫెర్నాండేజ్, అలెక్సిస్ మాక్ అలిస్టర్, జియోవాని లో సెల్సో, వాలెంటినా బార్కోస్ట్రైకర్లు: లియోనిల్ మెస్సి (కెప్టెన్) , నికోలస్ పాజ్, థియాగో అల్మడా, నికోలస్ గొంజాలెజ్, జులియన్ అల్వరేజ్, గులియానో సిమోని, లౌతారో మార్టినేజ్, జోస్ మాన్యువెల్ లోపేజ్చదవండి: ‘అఫ్రిదితో పోలిక.. ఇది అవమానించడమే!’ -
‘అఫ్రిదితో పోలిక.. ఇది అవమానించడమే!’
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఆటను, అతడి ప్రదర్శనను క్రీడా నిపుణులు, అభిమానులు క్రికెట్ దిగ్గజాలు డాన్ బ్రాడ్మన్, సచిన్ టెండూల్కర్తో పోలుస్తున్నారు. అయితే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ యూసఫ్ మాత్రం వైభవ్ను మరో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదితో పోల్చడం వివాదాస్పదంగా మారింది.‘15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆటను చూస్తుంటే నాకు మా షాహిద్ అఫ్రిది గుర్తుకు వస్తున్నాడు. అతడు కూడా యంగ్ వయసులో ఉన్నప్పుడు ఎలాంటి బెరుకు, భయం లేకుండా ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడుతూ పరుగులు రాబట్టేవాడు. 1996 వన్డే ప్రపంచకప్లో 37 బంతుల్లోనే అఫ్రిది సెంచరీ బాదాడు. అప్పుడు అఫ్రిది వయసు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే. ఇప్పుడు వైభవ్ కూడా బౌలర్లు ఎంతవారైనా భయం, బెరుకు లేకుండా బ్యాటింగ్ కొనసాగించడంలో విజయవంతమయ్యాడు. ఇక వైభవ్కు మంచి భవిష్యత్తు ఉంది. 15 ఏళ్ల వయసులో విధ్వంసకర బ్యాటింగ్ ఆడడం అతడి అదృష్టమని చెప్పొచ్చు. బ్యాటింగ్లో అదరగొడుతున్నప్పుడు వయసుతో పని లేకుండా సీనియర్ జట్టుకు ఎంపిక చేయాల్సిన అవసరముంది. అతన్ని వెంటనే టీమిండియా జట్టులోకి తీసుకోవాల్సిందే.’ అని డిమాండ్ చేశాడు. అయితే వైభవ్ బ్యాటింగ్ను మెచ్చుకోవడం నుంచి టీమిండియాలోకి అతడిని తీసుకోవాలని మహ్మద్ యూసఫ్ చేసిన వ్యాఖ్యల పట్ల సంతృప్తి చెందిన అభిమానులు షాహిద్ అఫ్రిదితో వైభవ్ను పోల్చడంపై మాత్రం మండిపడ్డారు. వైభవ్తో అఫ్రిదిని పోల్చవద్దని హితవు పలికారు. ‘భారత్ పట్ల ఎప్పుడు విద్వేష భావంతో ఉండే అఫ్రిదితో పోల్చడం ఏంటి? ఇది వైభవ్ను అవమానించడం కిందే లెక్క’.. ‘ఉగ్రవాదులతో కలిసి విందులో పాల్గొనే వ్యక్తితో పోలుస్తారా’ అంటూ కామెంట్లు చేశారు. కాగా పాక్ క్రికెటర్గా కొనసాగుతున్న సమయంలో షాహిద్ అఫ్రిది ఉగ్రవాద సంస్థ బలోచ్ నేత ఉజైర్ బలోచ్తో కలిసి డిన్నర్లో పాల్గొన్న ఫొటోలు ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదిగా ముద్ర పడిన వ్యక్తితో కలిసి అఫ్రిది భోజనం చేయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. భారత్ను ద్వేషించే క్రికెటర్లలో అఫ్రిది ముందు వరుసలో ఉంటాడు. పదే పదే భారత్ను కించపరిచేలా మాట్లాడుతూ కయ్యానికి కాలు దువ్వడం అఫ్రిదికి అలవాటుగా మారిపోయిందని గతంలోనూ భారత క్రికెట్ ఫ్యాన్స్ అతడిపై విమర్శలు గుప్పించారు.ఐపీఎల్ 19వ సీజన్లో వైభవ్ సూర్యవంశీ రాజస్తాన్ రాయల్స్ తరఫున విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఆడిన 15 మ్యాచ్ల్లో 242 స్ట్రైక్రేట్తో 680 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు అర్థసెంచరీలున్నాయి. ఎస్ఆర్హెచ్తో జరిగిన ఎలిమినేటర్ పోరులో 29 బంతుల్లోనే 97 పరుగులు చేసిన వైభవ్ తృటిలో క్రిస్ గేల్ (30 బంతుల్లో సెంచరీ) ప్రపంచ రికార్డు సాధించే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. 15-year-old cricket sensation #Vaibhav Sooryavanshi reminds me of @SAfridiofficial young, fearless, explosive, full of energy. The future is here! 🔥🏏 #Cricket #IPL2026— Mohammad Yousaf (@yousaf1788) May 28, 2026No comparison at all with Afridi. Vaibhav is way different!— manak (@manakseervi) May 29, 2026Hmmm.. getting compared to a bottom tier slogger.. this is perhaps the biggest insult to Vaibhav Sooryavanshi, the lowest point of his life. And I’m happy it has come so early in his career. I’m sure he’ll get over it soon, and after this, nothing negative will ever affect him…— THE SKIN DOCTOR (@theskindoctor13) May 28, 2026Shahid Afridi and Uzair Baloch of PAC aka Lyari Gang pic.twitter.com/IxSg0rUPEM— Zeeshan Akram Mirza (@ZshanMirza) March 27, 2013చదవండి: 'అతడు వేలంలోకి వస్తే 30 కోట్లు చెల్లిస్తా!' -
GT vs RR: పొంచి ఉన్న ప్రమాదం.. మ్యాచ్ రద్దైతే?
క్వాలిఫయర్-1లో ఓటమిపాలైన గుజరాత్ టైటాన్స్.. తనకున్న చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఐపీఎల్లో మూడోసారి ఫైనల్ చేరడమే లక్ష్యంగా రాజస్తాన్ రాయల్స్తో పోటీకి సిద్ధమైంది.ముల్లన్పూర్ వేదికగా..ఇరుజట్ల మధ్య శుక్రవారం జరిగే క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు ఫైనల్కు చేరనుండగా.. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గుజరాత్- రాజస్తాన్ మధ్య ఈ నాకౌట్ మ్యాచ్కు న్యూ చండీగఢ్లోని ముల్లన్పూర్లో గల మహరాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదిక.పొంచి ఉన్న ప్రమాదంకాగా వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం ముల్లన్పూర్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా సాయంత్రం మేఘావృతమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఈ మ్యాచ్కు కొద్దిమేర వర్ష ప్రమాదం పొంచి ఉందనే చెప్పవచ్చు.సాయంత్రానికి పరిస్థితి చక్కబడితే మాత్రం మ్యాచ్కు ఆటంకం ఉండకపోవచ్చు. ఒకవేళ వాన వల్ల మ్యాచ్కు ఆటంకం కలిగితే, రద్దైతే పరిస్థితి ఏమిటి?.. ఐపీఎల్ నిబంధల ప్రకారం ఎలిమినేటర్, క్వాలిఫయర్ మ్యాచ్లకు రిజర్వ్ డే ఉండదు.మ్యాచ్ రద్దైతే?కాబట్టి వర్షం వల్ల ఇప్పుడు క్వాలిఫయర్-2కు అంతరాయం కలిగితే.. 16.10.3 క్లాజ్ ప్రకారం.. ఇరుజట్ల మధ్య సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. ఒకవేళ అప్పుడు టై అయితే.. ఫలితం తేలేంత వరకు సూపర్ ఓవర్లు నిర్వహిస్తూనే ఉంటారు.అయితే, సూపర్ ఓవర్ నిర్వహించే పరిస్థితి కూడా లేకపోతే.. గ్రూప్ దశలో అత్యధిక పాయింట్లు కలిగి ఉన్న జట్టును విజేతగా నిర్ణయిస్తారు. ఒకవేళ పాయింట్లు కూడా సమంగా ఉంటే అప్పుడు నెట్రన్రేటు కీలకంగా మారుతుంది.కాగా గ్రూప్ దశలో గుజరాత్ టైటాన్స్ పద్నాలుగింట తొమ్మిది మ్యాచ్లు గెలిచి 18 పాయింట్లు సాధించింది. మరోవైపు.. రాజస్తాన్ పద్నాలుగింట ఎనిమిది గెలిచి.. 16 పాయింట్లతో ఉంది. కాబట్టి.. వర్షం వల్ల ఈ మ్యాచ్ రద్దైతే గుజరాత్ టైటాన్స్ నేరుగా ఫైనల్లో అడుగుపెడుతుంది. ఇదిలా ఉంటే.. క్వాలిఫయర్-1లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చేతిలో ఓడిన గుజరాత్ క్వాలిఫయర్-2 ఆడే పరిస్థితి తెచ్చుకుంది.ఆర్సీబీతో తలపడేది ఎవరో!మరోవైపు.. రాజస్తాన్ రాయల్స్ ఎలిమినేటర్ మ్యాచ్లో పటిష్ట సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించి.. క్వాలిఫయర్-2 రూపంలో సువర్ణావకాశం దక్కించుకుంది. కాగా ఐపీఎల్-2026లో ఫైనల్ చేరిన తొలి జట్టుగా ఆర్సీబీ నిలిచింది. క్వాలిఫయర్-2 విజేతతో మే 31న ఆర్సీబీ అహ్మదాబాద్ వేదికగా టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకుంటుంది. ఈ మ్యాచ్కు రిజర్వ్ డే ఉంటుంది. కాగా గతేడాది ఆర్సీబీ తొలిసారి టైటిల్ గెలవగా.. గుజరాత్ తమ అరంగేట్ర సీజన్ 2022లోనే ట్రోఫీ సాధించింది. ఇక 2023లో కూడా ఫైనల్ చేరిన గుజరాత్.. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది.చదవండి: IPL 2026: బీసీసీఐ కీలక ప్రకటన -
'అతడు వేలంలోకి వస్తే 30 కోట్లు చెల్లిస్తా!'
ఐపీఎల్ 19వ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం కొనసాగుతూనే ఉంది. బుధవారం ఎస్ఆర్హెచ్తో జరిగిన ఎలిమినేటర్ పోరులో వైభవ్ 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. తాజాగా నేడు గుజరాత్ టైటాన్స్తో క్వాలిఫయర్-2 పోరులో వైభవ్ ప్రళయం సృస్టిస్తాడా లేక విఫలమవుతాడా అన్నది చూడాలి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ వైభవ్ సూర్యవంశీని పొగడ్తలతో ముంచెత్తాడు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ సందర్భంగా హర్భజన్, సెహ్వాగ్లు కామెంటేటర్లుగా వ్యవహరించారు. మాటల సందర్భంలో వైభవ్ వేలంలోకి వస్తే ఎంత ఖర్చు చేసి అతడిని కొనుగోలు చేస్తావంటూ సెహ్వాగ్కు హర్భజన్ ప్రశ్న సంధించాడు. భజ్జీ ప్రశ్నకు ఏమాత్రం సంకోచించని సెహ్వాగ్.. ఒకవేళ వైభవ్ వేలంలోకి వస్తే గనుక రూ. 30 కోట్లు ఇచ్చి కొనుక్కుంటానంటూ ఆసక్తికర సమాధానమిచ్చాడు. అదే సమయంలో పక్కనే ఉన్న మరో మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా సెహ్వాగ్ ఇచ్చే ఆఫర్కు సమాన మొత్తాన్ని తాను చెల్లిస్తానంటూ బదులిచ్చాడు. ఇక వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్ దృష్ట్యా అతడిని భారత సీనియర్ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరిగిపోతున్నాయి. అయితే అతను ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చి రెండేళ్లు కూడా కాకపోవడం, పైగా 15 ఏళ్లే ఉండడంతో జాతీయ జట్టులోకి అతడి ఎంపికకు ఇంకా సమయం ఉందంటూ బీసీసీఐ పేర్కొంది. అయితే అతడి ప్రతిభను ప్రపంచవ్యాప్తంగా తెలిపేందుకు ఇండియా-ఎ జట్టుకు వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. తిలక్ వర్మ నేతృత్వంలో వచ్చే నెలలో శ్రీలంకలో జరగనున్న ట్రై సిరీస్లో ఇండియా-ఎ తరఫున సూర్యవంశీ ఆడనున్నాడు. ఈ సిరీస్లో వైభవ్ సత్తా చాటితే గనుక త్వరలో భారత సీనియర్ జట్టులోకి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఐపీఎల్ 18వ సీజన్లోనే కొన్ని మంచి ఇన్నింగ్స్లు ఆడిన వైభవ్ సూర్యవంశీ తన ఇన్నింగ్స్లు గాలివాటం కాదని తాజా సీజన్ ద్వారా నిరూపించాడు. ఈ సీజన్లో 15 మ్యాచ్లాడిన వైభవ్ సూర్యవంశీ 242 స్ట్రైక్రేట్తో 680 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు అర్థసెంచరీలున్నాయి. ఎస్ఆర్హెచ్తో జరిగిన ఎలిమినేటర్ పోరులో 29 బంతుల్లోనే 97 పరుగులు చేసిన వైభవ్ తృటిలో క్రిస్ గేల్ (30 బంతుల్లో సెంచరీ) ప్రపంచ రికార్డు సాధించే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. చదవండి: IPL 2026: బీసీసీఐ కీలక ప్రకటన -
IPL 2026: బీసీసీఐ కీలక ప్రకటన
ఐపీఎల్-2026 తుది అంకానికి చేరుకుంది. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఈసారి అదే జోరు కొనసాగిస్తూ.. ఫైనల్లో అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలిచింది.కీలక ప్రకటనఇక రెండో బెర్తు కోసం పోటీలో ఉన్న గుజరాత్ టైటాన్స్- రాజస్తాన్ రాయల్స్ (GT vs RR) క్వాలిఫయర్-2లో శుక్రవారం అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో ఇంకా రెండు మ్యాచ్లే మిగిలి ఉన్న వేళ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అవినీతి నిరోధక, భద్రతా విభాగం (ACSU) కీలక ప్రకటన చేసింది.ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా ఆటగాళ్లు, మ్యాచ్ అధికారులు స్మార్ట్ సన్గ్లాసెస్ ధరించకూడదని ACSU ఆదేశాలు జారీ చేసింది. ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా (PMOA)లోకి వీటిని తీసుకురావొద్దని పేర్కొంది. ఈ మేరకు..అస్సలు తీసుకురాకూడదు‘‘అత్యాధునిక కమ్యూనికేషన్ ఫీచర్లు గల పరికరాలను మైదానంలోకి తీసుకురాకూడదు. మొబైల్ డేటా లేదంటే వై-ఫై నెట్వర్క్ల ద్వారా.. ప్రత్యక్ష ప్రసారం, సందేశాలు ఇచ్చిపుచ్చుకోవడం, ఆడియో, వీడియోలు చేరవేయగల సామర్థ్యం వీటికి ఉంటుంది.కాబట్టి PMOA ప్రమాణాల ప్రకారం.. ఇలాంటి గాగుల్స్, సన్గ్లాసెస్ను ఆడియో, వీడియో రికార్డింగ్, కమ్యూనికేషన్ పరికరాల కింద పరిగణిస్తారు. కాబట్టి ఆటగాళ్లు, అధికారులు.. ఎవరూ కూడా స్మార్ట్ గాగుల్స్ను అస్సలు PMOAలోకి తీసుకురాకూడదు’’ అని బీసీసీఐ ACSU తెలిపింది.మొబైల్ ఫోన్ చూడకూడదుకాగా రాజస్తాన్ రాయల్స్ మేనేజర్ రోమీ బిందర్ PMOAలో మొబైల్ ఫోన్ చూడటం వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రాయల్స్ విధ్వంసకర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సైతం రోమీతో పాటు ఫోన్ స్క్రీన్ను చూశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారగా.. బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. రోమీకి జరిమానా విధించడంతో పాటు.. వైభవ్ను మందలించింది. కాగా తాను ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్ కోసం మొబైల్ చూసినట్లు రోమీ చెప్పాడని వార్తలు వచ్చాయి.చదవండి: ‘ఇంగ్లండ్ టూర్కు వైభవ్ను ఎంపిక చేయాల్సిందే’ -
‘ఇంగ్లండ్ టూర్కు వైభవ్ను ఎంపిక చేయాల్సిందే’
క్రికెట్ వర్గాల్లో వైభవ్ సూర్యవంశీ పేరు మారుమోగిపోతోంది. పదిహేనేళ్ల వయసులోనే విధ్వంసకర బ్యాటింగ్తో ఆకట్టుకుంటున్న ఈ చిచ్చరపిడుగును చూసి దిగ్గజాలు సైతం ఆశ్చర్యపోతున్నారు. గతేడాది కాలంగా ఫార్మాట్లకు అతీతంగా రాణిస్తున్న వైభవ్.. ఐపీఎల్-2026లోనూ దుమ్ములేపుతున్న సంగతి తెలిసిందే.ఆకాశమే హద్దుగారాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా ఈసారి పూర్తిస్థాయిలో బరిలోకి దిగిన వైభవ్ (Vaibhav Suryavanshi).. ఎలిమినేటర్ మ్యాచ్ ముగిసే సరికి 680 పరుగులతో అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్లో గ్రూప్ దశలో సన్రైజర్స్ హైదరాబాద్పై శతక్కొట్టిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్ (103).. ఎలిమినేటర్ మ్యాచ్లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.దిగ్గజాలు ఫిదాకేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు సాధించిన వైభవ్.. సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఏదేమైనా ఈ సీజన్లో ఈ బిహారీ పిల్లాడి ఆట చూసి టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్, వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్, సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ ఫిదా అయ్యారు.ఈ క్రమంలోనే భారత దిగ్గజ కెప్టెన్ సునిల్ గావస్కర్ సైతం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపించాడు. వయసుతో పనిలేదని.. అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రానికి అతడు ప్రస్తుతం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాడని పేర్కొన్నాడు. వీలైనంత త్వరగా టీమిండియాకు అతడికి ఎంపిక చేయాలని సెలక్టర్లకు సూచించాడు.ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?స్పోర్ట్స్ టాక్తో మాట్లాడుతూ.. ‘‘టీ20 క్రికెట్ ఆడేందుకు అతడు సిద్ధంగా ఉన్నాడు. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే టీమిండియాలో అతడికి చోటు దక్కుతుందని భావిస్తున్నా. ఇంతటి అత్యద్భుతమైన ప్రదర్శన తర్వాత సెలక్టర్లు అతడికి తప్పక చోటివ్వాలి కూడా!..అతడి వయసుతో పనిలేదు. 15 ఏళ్ల కంటే పెద్ద వారి కంటే కూడా అతడు శక్తిమంతంగా సిక్సర్లు బాదుతున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన బౌలర్ల బౌలింగ్లోనూ బంతిని బౌండరీ అవతలకు పంపిస్తున్నాడు.దేవుడిని ప్రార్థిస్తున్నాప్రత్యర్థి ఎవరైనా అతడికి అసలు భయమే లేదు. గల్లీల్లో పిల్లలు ఎలా ఆడతారో ఐపీఎల్లో ఈ పిల్లాడు అలాగే ఆడుతున్నాడు. మనం కూడా చిన్నపుడు డిఫెన్సివ్గా కాకుండా దూకుడుగా ఆడేవాళ్లము. ఇప్పుడు వైభవ్ అదే పని చేస్తున్నాడు.అయితే, అతడు మెగా వేదికపై ఇలా ఆడటం ఆశ్చర్యకరం. అతడి బ్యాటింగ్ శైలి, ఆట తీరు ఇలాగే కొనసాగాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నా’’ అని సునిల్ గావస్కర్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2026 ముగిసిన తర్వాత స్వదేశంలో అఫ్గనిస్తాన్తో సిరీస్లు ఆడిన తర్వాత.. టీమిండియా ఐర్లాండ్, ఇంగ్లండ్, పర్యటనలకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ ఎంపిక గురించి చర్చ నడుస్తోంది. చదవండి: ‘జైస్వాల్ రాయల్స్ను వదిలేయాలి’Universe Boss 🤝 Universe Boss Baby#VaibhavSooryavanshi smashes another fifty in #TATAIPL 2026 and breaks Chris Gayle’s record for most sixes in a season (59)🔥👊🏻#TATAIPL Playoffs Eliminator 👉 #SRHvRR | LIVE NOW 👉https://t.co/AsF9BnOMCE pic.twitter.com/dF7JsFwXro— Star Sports (@StarSportsIndia) May 27, 2026 -
ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్
ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో భారత మహిళా క్రికెట్ జట్టు శుభారంభం చేసింది. చెమ్స్ఫోర్డ్ వేదికగా తొలి టీ20లో 38 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ సన్నాహకాల్లో భాగంగా భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది.ఇందులో భాగంగా తొలుత ఈసీబీ డెవలప్మెంట్ వుమెన్స్ ఎలెవన్తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన భారత్.. ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. ఇక అసలు పోటీలో భాగంగా గురువారం రాత్రి మ్యాచ్లో.. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఆహ్వానం మేరకు భారత జట్టు తొలుత బ్యాటింగ్కు దిగింది.రాణించిన యస్తికా, జెమీమాఓపెనర్లు స్మృతి మంధాన (0), షఫాలీ వర్మ (2) తీవ్రంగా నిరాశపరచగా.. వన్డౌన్ బ్యాటర్ యస్తికా భాటియా అర్ధ శతకం (40 బంతుల్లో 54)తో రాణించింది. ఇక నాలుగో స్థానంలో బరిలోకి దిగిన జెమీమా రోడ్రిగ్స్ మెరుపు ఇన్నింగ్స్ (40 బంతుల్లో 69)తో ఆకట్టుకుంది.మిగిలిన వారిలో ఆల్రౌండర్ దీప్తి శర్మ (13 బంతుల్లో 22) చెప్పుకోదగ్గ స్కోరు చేసింది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో భారత మహిళా జట్టు ఏడు వికెట్ల నష్టానికి 188 పరుగులు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు.చెలరేగిన బౌలర్లుఓపెనర్లు అలిస్ క్యాప్సీ (6), సోఫియా డంక్లీ (16)లను క్రాంతి గౌడ్ వెనక్కి పంపగా.. అర్ధ శతకం (67)తో జోరు మీదున్న అమీ జోన్స్ (67)ను నందిని శర్మ అవుట్ చేసింది. మిగిలిన ఇంగ్లండ్ బ్యాటర్లలో హీదర్ నైట్ (21) మాత్రమే ఇరవై పరుగుల మార్కు దాటింది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి ఇంగ్లండ్ 150 పరుగుల వద్ద నిలిచిపోయింది.భారత బౌలర్లలో క్రాంతి గౌడ్ రెండు వికెట్లు దక్కించుకోగా.. నందిని శర్మ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. శ్రీచరణి, దీప్తి శర్మ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇక తొలి టీ20లో ఇంగ్లండ్పై 38 పరుగుల తేడాతో గెలిచిన మంధాన సేన.. మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.చదవండి: ‘అతడు ప్లే ఆఫ్స్లో విఫలమవుతూనే ఉన్నాడు’ -
న్యూజిలాండ్ క్రికెటర్ వరల్డ్ రికార్డు
ఏకైక టెస్టు ఆడేందుకు న్యూజిలాండ్ ఐర్లాండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా బెల్ఫాస్ట్ వేదికగా ఇరుజట్ల మధ్య మ్యాచ్ బుధవారం ఆరంభమైంది. టాస్ గెలిచిన ఆతిథ్య ఐర్లాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. న్యూజిలాండ్ బ్యాటింగ్కు దిగింది.టామ్ బ్లండెల్ భారీ సెంచరీఓపెనింగ్ జోడీ.. కెప్టెన్ టామ్ లాథమ్ (0), డెవాన్ కాన్వే (4) విఫలం కాగా.. వన్డౌన్లో వచ్చిన కేన్ విలియమ్సన్ (36) ఫర్వాలేదనిపించాడు. ఇక రచిన్ రవీంద్ర శతక్కొట్టగా (121).. వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ బ్లండెల్ భారీ సెంచరీ (186)తో ఆకట్టుకున్నాడు. వీరిద్దరితో పాటు డీన్ ఫాక్స్క్రాఫ్ట్ (98) కూడా రాణించాడు.ఫాలో ఆన్ ఆడుతూ..ఫలితంగా తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ 8 వికెట్లు నష్టపోయి 490 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఐర్లాండ్.. 179 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా ఫాలో ఆన్ గండం నుంచి తప్పించుకోలేకపోయింది.రెండో రోజు ఆట ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసి.. కివీస్ కంటే ఇంకా 246 పరుగులు వెనుకబడి ఉంది. ఇదిలా ఉంటే.. ఐర్లాండ్తో టెస్టు సందర్భంగా న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ బ్లండెల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.186 runs, 292 balls, nearly 7 hours at the crease. A new career-best for Tom Blundell in Test cricket 😮💨#IREvNZ pic.twitter.com/LJHkjFjQhF— BLACKCAPS (@BLACKCAPS) May 28, 2026 యూరోపియన్ గడ్డపై సరికొత్త చరిత్రయూరోపియన్ గడ్డపై టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన వికెట్ కీపర్ బ్యాటర్గా టామ్ బ్లండెల్ ప్రపంచ రికార్డు సాధించాడు. మొత్తంగా ఈ మ్యాచ్లో 292 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. 22 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 186 పరుగులు చేసి.. రూబెన్ విల్సన్ బౌలింగ్లో అవుటయ్యాడు.ఇక ఈ రికార్డు అంతకుముందు ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ పేరిట ఉండేది. గతేడాది ఎడ్జ్బాస్టన్ వేదికగా టీమిండియా మీద అతడు 184 పరుగులు సాధించాడు. బ్లండెల్ తాజాగా అతడిని అధిగమించి సరికొత్త చరిత్ర సృష్టించాడు.కివీస్ తొలి వికెట్ కీపర్ బ్యాటర్గానూ..అదే విధంగా.. విదేశీ గడ్డ మీద టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్యాటర్నూ బ్లండెల్ నిలిచాడు. గతంలో వారెన్ లీస్ 152 పరుగులు సాధించగా.. బ్లండెల్ అతడి రికార్డు బ్రేక్ చేశాడు. ఇక విదేశాల్లో టెస్టుల్లో అత్యధిక శతకాలు బాదిన కివీస్ వికెట్ కీపర్ల జాబితాలో బ్రెండన్ మెకల్లమ్ (2 సెంచరీలు)తో కలిసి బ్లండెల్ రెండో స్థానం ఆక్రమించాడు. బీజే వాల్టింగ్ (3 సెంచరీలు) ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నాడు.చదవండి: ‘అతడు ప్లే ఆఫ్స్లో విఫలమవుతూనే ఉన్నాడు’ -
‘అతడు ప్లే ఆఫ్స్లో ఫెయిల్ అవుతూనే ఉన్నాడు’
ఐపీఎల్-2026లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ అసలు సమరంలో మాత్రం చేతులెత్తేసింది. రాజస్తాన్ రాయల్స్తో ఎలిమినేటర్ మ్యాచ్లో సమిష్టి వైఫల్యంతో ఇంతటితో ప్రయాణం ముగించింది. ముఖ్యంగా విధ్వంసకర బ్యాటింగ్కు పెట్టింది పేరైన సన్రైజర్స్ టాపార్డర్ రాజస్తాన్ బౌలింగ్ ధాటికి కుదేలు కావడం తీవ్ర ప్రభావం చూపింది.టాపార్డర్ కుదేలుఓపెనర్లలో అభిషేక్ శర్మ డకౌట్ కాగా.. ట్రవిస్ హెడ్ (8 బంతుల్లో 17) కాసేపు వేగంగా ఆడినా క్రీజులో నిలదొక్కుకోలేకపోయాడు. ఇక వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (11 బంతుల్లో 33) మెరుపులు కూడా ఎక్కువసేపు కొనసాగలేదు. ఈ ముగ్గురిని రాజస్తాన్ పేసర్ జోఫ్రా ఆర్చర్ పెవిలియన్కు చేర్చాడు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ అభిషేక్ శర్మను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్లే ఆఫ్స్లో ఎల్లప్పుడూ అతడు విఫలం అవుతున్నాడని.. ఇంతకంటే చెత్త విషయం మరొకటి ఉండదన్నాడు. స్పోర్ట్స్కీడాతో మాట్లాడుతూ..అతడు ప్లే ఆఫ్స్లో ఫెయిల్ అవుతూనే ఉన్నాడు‘‘2024 నుంచి సన్రైజర్స్కు ఇదే సమస్య. అభిషేక్ శర్మ ప్లే ఆఫ్స్లో ప్రతిసారీ విఫలమవుతూనే ఉన్నాడు. ఆర్చర్ ఈసారి పవర్ప్లేలో అతడితో పాటు ఇషాన్ కిషన్నూ వెనక్కి పంపి దెబ్బకొట్టాడు. ట్రవిస్ హెడ్ అయితే గుడ్డిగా ఆడుతూ పోయాడే తప్ప ప్లాన్ ఉన్నట్లు కనిపించలేదు.ఇక హెన్రిచ్ క్లాసెన్ కంటే ముందు స్మరణ్ రవిచంద్రన్ ఎందుకు బ్యాటింగ్కు వచ్చాడో తెలియదు. అభిషేక్ శర్మ అవుటైనా ఇషాన్ వేగంగా ఆడాడు. మూడు ఓవర్లలోనే దాదాపుగా 50 పరుగులు తెచ్చారు. అయితే, ఇషాన్ అవుటైన తర్వాత సన్రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది.Bowled ’em! 🔥Jofra Archer strikes as Travis Head departs early, and #SRH are in deep trouble in this must-win clash 😮💨#TATAIPL 2026 Eliminator 👉 #SRHvRR | LIVE NOW 👉https://t.co/AsF9BnOMCE pic.twitter.com/RAEXQ0WmL7— Star Sports (@StarSportsIndia) May 27, 2026రాయల్స్ను గెలిపించిన వైభవ్ఏదేమైనా ప్లే ఆఫ్స్లో అభిషేక్ శర్మ విఫలం కావడం సన్రైజర్స్కు అతిపెద్ద సమస్యగా మారింది’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ పేర్కొన్నాడు. కాగా ముల్లన్పూర్ వేదికగా బుధవారం నాటి ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్తాన్ తొలుత బ్యాటింగ్కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 243 పరుగులు సాధించింది.ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (29 బంతుల్లో 97) విధ్వంసకర ఇన్నింగ్స్తో సన్రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇక లక్ష్య ఛేదనలో ఆది నుంచే తడబడ్డ సన్రైజర్స్ 19.2 ఓవర్లలో కేవలం 196 పరుగులు చేసి ఆలౌట్ అయింది.చదవండి: ‘జైస్వాల్ రాయల్స్ను విడిచి వెళ్లాలి’ -
పోరాడి ఓడిన అనిరుధ్ జోడీ
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నిలో చివరి నిమిషంలో ఆడే అవకాశం లభించిన హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. గురువారం పారిస్లో జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో అనిరుధ్ (భారత్)–టకెరు యుజుకి (జపాన్) ద్వయం 3–6, 7–6 (7/4), 6–7 (3/10)తో జేకబ్ పాల్ (స్విట్జర్లాండ్)–మార్కస్ విలిస్ (బ్రిటన్) జోడీ చేతిలో ఓడిపోయింది. అనిరుధ్–టకెరు జోడీకి 19,000 యూరోలు (రూ. 21 లక్షల 19 వేలు) ప్రైజ్మనీగా లభించాయి.2 గంటల 45 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ఇండో–జపాన్ జంట తమ సర్వీస్ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేసింది. 27 ఏళ్ల అనిరుధ్ ప్రస్తుతం ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్లో 93వ స్థానంలో ఉన్నాడు. కెరీర్లో అతను నాలుగోసారి గ్రాండ్స్లామ్ టోర్నిలో బరిలోకి దిగాడు. 2024, 2025లలో ఆస్ట్రేలియన్ ఓపెన్లో తొలి రౌండ్లోనే ని్రష్కమించిన అనిరుద్... 2025 యూఎస్ ఓపెన్లో రెండో రౌండ్కు చేరాడు. ఫ్రెంచ్ ఓపెన్లో తొలిసారి పాల్గొన్నాడు.


