Sports
-
'వైభవ్ కాదు.. ముందు అతడిని టీమిండియాకు ఎంపిక చేయండి'
ఐపీఎల్-2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ యువ ఆటగాడు సాయి సుదర్శన్ దుమ్ములేపుతున్నాడు. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో సుదర్శన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఆరంభంలోనే శుభ్మన్ గిల్, జోస్ బట్లర్ వంటి కీలక వికెట్లను కోల్పోయిన గుజరాత్ను సుదర్శన్ తన హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. కష్టతరమైన పిచ్పై సుదర్శన్ సంయమనంతో ఆడి గుజరాత్ జట్టు 168 పరుగుల స్కోరు సాధించేలా చేశాడు. మొత్తంగా 44 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 61 పరుగులు సాధించాడు. మొత్తంగా ఈ ఏడాది సీజన్లో 11 మ్యాచ్లు ఆడిన సుదర్శన్.. 41.75 సగటుతో 501 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సుదర్శన్ 500 పరుగులు దాటడం ఇది వరుసగా మూడో సీజన్ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో సుదర్శన్పై టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ప్రశంసల వర్షం కురిపించాడు. సుదర్శన్ ఆటతీరును కొనియాడుతూ, అతడిని భారత టీ20 జట్టులోకి తీసుకోవాలని సుదర్శన్ సూచించాడు.ఐపీఎల్-2026 సీజన్ ఆరంభంలో సుదర్శన్ ఆరెంజ్ క్యాప్ రేసులో దారుదాపుల్లో కూడా కన్పించలేదు. కానీ ఇప్పుడు తన అద్భుతమైన ఆట తీరుతో ఒక్కసారిగా ఆరెంజ్ క్యాప్ రేసులోకి దూసుకొచ్చాడు. గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ అతడికి బాగా కలిసి వస్తోందని, అహ్మదాబాద్ పిచ్ కూడా అతడికి సహకరిస్తుందని నేను ఇప్పటికే చాలా సార్లు చెప్పాను.అతను సాంప్రదాయబద్ధమైన (Orthodox) క్రికెట్ షాట్లు ఆడతాడు. అలా అని ఎక్కడా స్లోగా ఆడడు. మైదానానికి రెండు వైపులా పరుగులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. గుజరాత్ ఫ్రాంచైజీ అతడిపై చాలా ఎక్కువగా ఆధారపడుతుంది. అయినప్పటికి ప్రతీ సీజన్లోనూ అతడు రాణిస్తున్నాడు. మనం సాధారణంగా భారత టీ20 జట్టు గురించి చర్చించేటప్పుడు సుదర్శన్ పేరును కనీసం పరిగణలోకి తీసుకోము. కానీ అతడు తన ప్రదర్శనలతో మన ఆలోచన తప్పు అని ప్రతీసారి నిరూపిస్తున్నాడు. ఇలాంటి నిలకడ ఉన్న ఆటగాడు జట్టులో ఉండాలి. కేవలం సిక్సర్లు కొట్టే ఆటగాళ్లు మాత్రమే కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే ఆటగాళ్లు కూడా జట్టులో ఉండాలి.కాబట్టి టీమిండియా సెలక్టర్లు అతడిని కచ్చితంగా టీ20 జట్టులోకి తీసుకోవాలని జాఫర్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. కాగా ఇదే సీజన్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న వైభవ్ సూర్యవంశీ పేరును జాఫర్ పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం. -
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం.. ఒకేసారి ముగ్గురికి
ఇంగ్లండ్ పురుషల క్రికెట్ జట్టు స్వదేశంలో న్యూజిలాండ్తో మూడు టెస్టుల సిరీస్లో తలపడేందుకు సిద్దమైంది. ఈ క్రమంలో జూన్ 4 నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభమయ్యే మొదటి టెస్టు కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటించింది.ఈ జట్టులో ముగ్గురు కొత్త ఆటగాళ్లకు చోటు దక్కింది. బ్యాటర్ ఎమిలియో గే, ఫాస్ట్ బౌలర్ సోనీ బేకర్, వికెట్ కీపర్ బ్యాటర్ జేమ్స్ రూ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. అయితే ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న వైస్ కెప్టెన్ ఓలీ పోప్, ఓపెనర్ జాక్ క్రాలీలపై సెలక్టర్లు వేటు వేశారు.ఇక గాయం కారణంగా దాదాపు మూడు నెలలగా పోటీ క్రికెట్కు దూరమైన కెప్టెన్ బెన్ స్టోక్స్ జాతీయ జట్టులోకి తిరిగొచ్చాడు. ఫిబ్రవరిలో దుర్హం అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బంతి బలంగా తగలడంతో స్టోక్స్ దవడ ఎముక విరిగిన సంగతి తెలిసిందే. స్టోక్సీ ఇటీవలే కౌంటీ ఛాంపియన్షిప్లో దుర్హం తరపున బరిలోకి దిగి తన సత్తాచాటాడు. న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో స్టోక్స్ డిప్యూటీగా స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ వ్యహరించే అవకాశముంది.న్యూజిలాండ్తో మొదటి టెస్టుకు ఇంగ్లండ్ జట్టు:బెన్ స్టోక్స్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, గస్ అట్కిన్సన్, సోనీ బేకర్, షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, మాథ్యూ ఫిషర్, ఎమిలియో గే, జేమ్స్ రూ, ఓలీ రాబిన్సన్, జో రూట్, జేమీ స్మిత్, జోష్ టంగ్.షెడ్యూల్:మొదటి టెస్టు: జూన్ 4 – 8 (లార్డ్స్) రెండవ టెస్టు: జూన్ 17 – 21 (ది ఓవల్) మూడవ టెస్టు: జూన్ 25 – 29 (ట్రెంట్ బ్రిడ్జ్)చదవండి: కమిన్స్పై చర్యలు -
చారిత్రక రికార్డును సమం చేసిన రబాడ
ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ స్పీడ్స్టర్ కగిసో రబాడ చెలరేగిపోతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్ల్లో 21 వికెట్లు తీసి ఆర్సీబీ భువనేశ్వర్ కుమార్తో పాటు లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు. తాజాగా ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో 4 ఓవర్లలో పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన రబాడ.. తన జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకోవడంతో పాటు ఓ చారిత్రక రికార్డును సమం చేశాడు.ఈ మ్యాచ్లో రబాడ తీసిన 3 వికెట్లు పవర్ప్లేలో (ఇన్నింగ్స్ తొలి 6 ఓవర్లు) వచ్చినవే. తద్వారా ఓ ఐపీఎల్ సీజన్ పవర్ప్లేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మిచెల్ జాన్సన్ (2013), ట్రెంట్ బౌల్ట్ (2020)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో 17 వికెట్లతో మహ్మద్ షమీ (2023) టాప్ ప్లేస్లో ఉన్నాడు. షమీ పేరిట ఉన్న ఈ రికార్డును రబాడ ఈ సీజన్లో తప్పక అధిగమించే అవకాశం ఉంది.అందనంత ఎత్తుకు..!తాజా ప్రదర్శనతో రబాడ ఈ సీజన్ పవర్ప్లేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. రబాడ తర్వాత ఈ సీజన్ పవర్ప్లేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఆర్సీబీ భువనేశ్వర్ కుమార్ (12) ఉన్నాడు. ఆతర్వాతి స్థానాల్లో జోఫ్రా ఆర్చర్ (9), సిరాజ్ (9) నిలిచారు.ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో కొత్త బంతితో రబాడ వేసిన స్పెల్ ఈ సీజన్లోనే అత్యంత ప్రమాదకరమైందిగా నిలిచింది. పవర్ప్లేలోనే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, స్మరణ్ రవిచంద్రన్ వంటి కీలక బ్యాటర్లను పెవిలియన్ పంపిన రబాడ.. ఎస్ఆర్హెచ్ను కోలుకోలేని దెబ్బ తీశాడు.కాగా, నిన్నటి మ్యాచ్లో సన్రైజర్స్పై గుజరాత్ అన్ని విభాగాల్లో ఆధిపత్యం చలాయించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. ఆదిలోనే శుభ్మన్ గిల్ (5), జోస్ బట్లర్ (7) వికెట్లు కోల్పోయినా.. సాయి సుదర్శన్ (61), వాషింగ్టన్ సుందర్ (50) జట్టును ఆదుకున్నారు. ఫలితంగా గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో సన్రైజర్స్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. రబాడ (4-0-28-3), హోల్డర్ (4-0-20-3), ప్రసిద్ద్ కృష్ణ (3-0-23-2), సిరాజ్ (3-1-11-1), రషీద్ ఖాన్ (0.5-0-3-1) ధాటికి ఆ జట్టు 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారీ తేడాతో పరాజయంపాలైంది. ఈ గెలుపుతో గుజరాత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకి, ప్లే ఆఫ్స్ బెర్త్ను దాదాపుగా ఖరారు చేసుకుంది. -
పాక్ను చిత్తుగా ఓడించిన బంగ్లా ప్లేయర్లకు భారీ లబ్ది
పాకిస్తాన్పై ఘన విజయం సాధించిన బంగ్లాదేశ్ ఆటగాళ్లకు ఐసీసీ గుడ్న్యూస్ చెప్పింది. మిర్పూర్ టెస్టులో 104 పరుగుల తేడాతో పాక్ను చిత్తు చేసిన తర్వాత విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్లో బంగ్లా ప్లేయర్లు భారీగా లాభపడ్డారు. ముఖ్యంగా కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో కెరీర్ బెస్ట్ రేటింగ్ సాధించాడు. ఈ మ్యాచ్లో షాంటో విశేషంగా రాణించాడు.తొలి ఇన్నింగ్స్లో సెంచరీ (101), రెండో ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ (87) (మొత్తం 188 పరుగులు) చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇందుకు ప్రతిఫలంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న అతడు.. ర్యాంకింగ్స్లో ఏకంగా 16 స్థానాలు ఎగబాకి 23వ స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం ఇదే స్థానంలో పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ కూడా కొనసాగుతున్నాడు.ఇదే మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లు, తొలి ఇన్నింగ్స్లో వికెట్ తీసి జట్టు విజయంలో మరో కీలక పాత్రధారుడిగా నిలిచిన నహిద్ రాణా కూడా ర్యాంకింగ్స్లో భారీ జంప్ కొట్టాడు. ఒకేసారి ఐదు స్థానాలు ఎగబాకి 64వ స్థానానికి చేరుకున్నాడు.ఇదే మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 91, రెండో ఇన్నింగ్స్లో 56 పరుగులు చేసిన మొమినుల్ హక్ 12 స్థానాలు ఎగబాకి 35వ ర్యాంక్కి చేరుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో 71, రెండో ఇన్నింగ్స్లో 22 పరుగులు చేసిన ముష్ఫికర్ రహీం రెండు స్థానాలు మెరుగుపరుచుకుని 26వ ర్యాంక్లో నిలిచాడు.నాలుగు వికెట్లతో సత్తా చాటిన తైజుల్ ఇస్లాం మూడు స్థానాలు ఎగబాకి 13వ ర్యాంక్ చేరుకోగా, తస్కిన్ అహ్మద్ 48వ స్థానంలో నిలిచాడు.ఇక పాకిస్తాన్ ఆటగాళ్లకు మాత్రం ఈ టెస్ట్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. సౌద్ షకీల్, షాన్ మసూద్ ఇద్దరూ ఆరు స్థానాలు దిగజారారు. ఐదు వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటిన మొహమ్మద్ అబ్బాస్ మాత్రం 28వ స్థానానికి ఎగబాకి కొంత ఊరటనిచ్చాడు. -
ప్రపంచకప్కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన
ఇంగ్లండ్ అండ్ వేల్స్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్ 2026 కోసం క్రికెట్ ఆస్ట్రేలియా 15 మంది సభ్యుల పటిష్టమైన జట్టును ఇవాళ ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్గా స్టార్ ఆల్రౌండర్ సోఫీ మోలినెక్స్ ఎంపిక కాగా.. ఆష్లే గార్డ్నర్ ఆమెకు డిప్యూటీగా (వైస్ కెప్టెన్) వ్యవహరించనుంది.ఈ జట్టులో ఎల్లిస్ పెర్రీ, బెత్ మూనీ, తహ్లియా మెక్గ్రాత్ వంటి స్టార్ ప్లేయర్లు కూడా చోటు దక్కించుకున్నారు. ఈసారి సెలెక్టర్లు స్పిన్ బౌలింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇంగ్లండ్ పరిస్థితులకు అనుగుణంగా జార్జియా వేర్హమ్, అలానా కింగ్ వంటి లెగ్ స్పిన్నర్లను ఎంపిక చేశారు. అయితే ఫాస్ట్ బౌలర్ డార్సీ బ్రౌన్కు ఈ జట్టులో చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఆమె స్థానంలో 20 ఏళ్ల యువ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ లూసీ హ్యామిల్టన్కు అవకాశం దక్కింది.ఇక భారత అభిమానులకు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. డబ్ల్యూపీఎల్ ఫ్రాంచైజీ ఆర్సీబీకి చెందిన ముగ్గురు కీలక ప్లేయర్లకు ఈ ఆసీస్ ప్రపంచకప్ జట్టులో చోటు దక్కింది. గ్రేస్ హ్యారిస్, ఎల్లిస్ పెర్రీ, సోఫీ మోలినెక్స్ డబ్ల్యూపీఎల్లో ఆర్సీబీ ఆడతారు. తమ ఫ్రాంచైజీకి చెందిన ముగ్గురు ప్లేయర్లకు ప్రపంచకప్ జట్టులో చోటు దక్కడం ఆర్సీబీ అభిమానుల్లో ఆనందం నింపింది.జూన్ 12 నుంచి జూలై 5 వరకు జరిగే ప్రపంచకప్లో ఆస్ట్రేలియా.. భారత్, సౌతాఫ్రికా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ వంటి పటిష్టమైన జట్లతో కలిసి గ్రూప్-1లో ఉంది. ఆసీస్.. జూన్ 13న మాంచెస్టర్లో దక్షిణాఫ్రికాతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. అనంతరం బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, పాకిస్తాన్, భారత్తో గ్రూప్ దశ పోరాటాలు ఉంటాయి. ముఖ్యంగా జూన్ 28న లార్డ్స్ మైదానంలో భారత్తో జరిగే మ్యాచ్పై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఆస్ట్రేలియా మహిళల T20 ప్రపంచ కప్ 2026 జట్టుసోఫీ మోలినెక్స్ (కెప్టెన్), ఆష్లే గార్డ్నర్ (వైస్ కెప్టెన్), తహ్లియా మెక్గ్రాత్ (వైస్ కెప్టెన్), నికోలా క్యారీ, కిమ్ గార్త్, లూసీ హామిల్టన్, గ్రేస్ హారిస్, అలనా కింగ్, ఫోబ్ లిచ్ఫీల్డ్, బెత్ మూనీ (వికెట్ కీపర్), ఎలిస్ పెర్రీ, మేగన్ షుట్, అన్నబెల్ సదర్లాండ్, జార్జియా వోల్, జార్జియా వేర్హామ్. రిజర్వ్: తాలియా విల్సన్ (వికెట్ కీపర్). -
Sufiya Sufi: 88 రోజులు.. 5 వేల కిలోమీటర్లు
రాజస్థాన్కు చెందిన అల్ట్రా-మారథాన్ రన్నర్ సూఫియా సుఫీ తన సాహసయాత్రను ప్రారంభించింది. భారత సాయుధ దళాలకు నివాళిగా కన్యకుమారి నుంచి కారకోరం వరకు 5వేల కిలోమీటర్లు రన్నింగ్ చేయనుంది. అయితే అత్యంత కఠినమైన ఈ యాత్రను పూర్తి చేయడానికి సుఫియా సుఫీకి 88 రోజులు పట్టనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం తన యాత్రను ప్రారంభించిన సూఫియా తొలి రోజు 52 కిలోమీటర్ల దూరం పరిగెత్తిన వీడియోనూ ఎక్స్లో పంచుకుంది. బుధవారం మరో 52 కిలోమీటర్లు పరిగెత్తనున్నట్లు తెలిపింది. తొలిరోజు 12 గంటల 23 నిమిషాల పాటు పరిగెత్తి 52 కిలోమీటర్లు పూర్తి చేసినట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దక్షిణ భారత్ ఏరియా ప్రధాన కార్యాలయం మద్దతుతో ఈ మహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించిన సోఫి తన ప్రయాణంలో అన్ని ప్రధాన యుద్ధ స్మారక చిహ్నాలను గౌరవించనున్నట్లు తెలిపింది. లడఖ్లోని కార్గిల్ దివస్ వద్ద తన సాహసయాత్ర ముగించనున్నట్లు ఆమె పేర్కొంది. ఈ ఘనత సూఫియా అకుంఠిత స్ఫూర్తికి నిదర్శనంగా నిలవనుంది. జాతీయ ఐక్యత, దేశభక్తి, పట్టుదలకు ప్రతీకగా నిలిచే ఈ ప్రయాణానికి నాంది పలుకుతూ, కల్నల్ సూర్య ముఖర్జీ ఈ మారథాన్ను అధికారికంగా జెండా ఊపి ప్రారంభించారు. తన ఆరో గిన్నిస్ ప్రపంచ రికార్డు కోసం కృషి చేస్తున్న సూఫియా అంకితభావానికి, మానసిక స్థైర్యానికి ఈ పరుగు ఒక నిదర్శనం అని చెప్పొచ్చు.Day 01 of The Fastest Run Across India (Kanyakumari - Karakoram)Run For Dreams - An Official World Record Run to Tribute to our Armed Forces Bravehearts who sacrifice themselves for us. Run Flaged-off from Sunrise Point, Kanyakumari Beach. Thank you so much everyone for… pic.twitter.com/8GUjbMGVse— Sufiya Sufi Runner (@sufirunner) May 12, 2026చదవండి: సాయి సుదర్శన్ అరుదైన ఫీట్! -
కమిన్స్పై చర్యలు
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (మే 12) గుజరాత్ టైటాన్స్ చేతిలో 82 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్రేట్ మెయిన్టెయిన్ చేసినందుకు ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్కు రూ.12 లక్షల జరిమానా పడింది. ఈ విషయాన్ని బీసీసీఐ ధృవీకరించింది. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ ఇది తొలి స్లో ఓవర్రేట్ తప్పిదం కావడంతో ఫైన్తో సరిపెట్టినట్లు బీసీసీఐ ప్రకటించింది.ఈ సీజన్లో కెప్టెన్లు అక్షర్ పటేల్ (ఢిల్లీ), హార్దిక్ పాండ్యా (ముంబై), శ్రేయస్ అయ్యర్ (పంజాబ్), శుభ్మన్ గిల్ (గుజరాత్) కూడా స్లో ఓవర్రేట్ కారణంగా జరిమానాలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆ జాబితాలో ప్యాట్ కమిన్స్ చేరాడు.ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 12 మ్యాచ్ల్లో 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఈ జట్టు ప్లే ఆఫ్స్కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్ల్లో కనీసం ఒక మ్యాచ్లో అయినా గెలవడం కీలకం. తదుపరి మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్.. సీఎస్కే (మే 18న చెన్నైలో), ఆర్సీబీతో (మే 22న హైదరాబాద్లో) తలపడాల్సి ఉంది.నిన్నటి మ్యాచ్ విషయానికొస్తే.. సన్రైజర్స్పై గుజరాత్ అన్ని విభాగాల్లో ఆధిపత్యం చలాయించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. ఆదిలోనే శుభ్మన్ గిల్ (5), జోస్ బట్లర్ (7) వికెట్లు కోల్పోయినా.. సాయి సుదర్శన్ (61), వాషింగ్టన్ సుందర్ (50) జట్టును ఆదుకున్నారు. ఫలితంగా గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో సన్రైజర్స్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. రబాడ (4-0-28-3), హోల్డర్ (4-0-20-3), ప్రసిద్ద్ కృష్ణ (3-0-23-2), సిరాజ్ (3-1-11-1), రషీద్ ఖాన్ (0.5-0-3-1) ధాటికి ఆ జట్టు 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారీ తేడాతో పరాజయంపాలైంది. ఈ గెలుపుతో గుజరాత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకి, ప్లే ఆఫ్స్ బెర్త్ను దాదాపుగా ఖరారు చేసుకుంది. -
సాయి సుదర్శన్ అరుదైన ఫీట్!
ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ క్రికెటర్ సాయి సుదర్శన్ది ప్రత్యేకమైన స్థానం. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసినప్పటి నుంచి ఒకే జట్టుకు ఆడుతూ స్థిరమైన ప్రదర్శన కొనసాగిస్తున్న అరుదైన క్రికెటర్లలో సాయి సుదర్శన్ కూడా ఒకడు. ఐపీఎల్ 2026 సీజన్లోనూ తన బ్యాటింగ్తో అలరిస్తున్న సాయి సుదర్శన్ మంగళవారం సన్రైజర్స్తో మ్యాచ్లోనూ 61 పరుగులతో మెరిశాడు. తద్వారా ఐపీఎల్లో ఒక అరుదైన ఫీట్ను సాధించాడు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో అర్థశతకం సాధించడం ద్వారా ఐపీఎల్లో తాను ఎదుర్కొన్న అన్ని జట్లపై కనీసం ఒక ఫిఫ్టీ సాధించిన నాలుగో భారత ఆటగాడిగా, ఓవరాల్గా ఐదో ప్లేయర్గా సాయి సుదర్శన్ నిలిచాడు. గతంలో గుజరాత్ కెప్టెన్ శుబ్మన్ గిల్, సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్తో పాటు ఎస్ఆర్హెచ్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ ఈ ఫీట్ను సాధించారు. తమిళనాడుకు చెందిన సాయి సుదర్శన్ సీఎస్కేపై నాలుగు అర్థశతకాలు, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్, రాజస్తాన్లపై మూడు ఫిఫ్టీలు, కేకేఆర్, ముంబై, ఆర్సీబీలపై రెండు హాఫ్ సెంచరీలు, లక్నో, ఎస్ఆర్హెచ్లపై ఒక్కో అర్థశతకం సాధించాడు. ఇక ఐపీఎల్ ఆరంభం నుంచి కొనసాగుతున్న భారత సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఈ ఫీట్ను అందుకోవడంలో విఫలమయ్యారు. ఈ సీజన్లో పరుగుల వరద పారిస్తున్న సాయి సుదర్శన్ 500 పరుగుల మార్క్ను దాటాడు. తద్వారా వరుసగా మూడో సీజన్లోనూ ఐదొందల పరుగుల మార్క్ను దాటిగా ఆటగాడిగా సాయి సుదర్శన్ నిలిచాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో ప్రస్తుతం సాయి సుదర్శన్ 12 మ్యాచ్ల్లో 501 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (61), వాషింగ్టన్ సుందర్ (50) అర్థసెంచరీలతో రాణించారు. అనంతరం ఎస్ఆర్హెచ్ 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ కమిన్స్ (19) టాప్ స్కోరర్గా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో రబాడ, జాసన్ హోల్డర్ చెరో 3 వికెట్లతో చెలరేగగా.. ప్రిసిధ్ క్రిష్ణ 2, సిరాస్ ఒక వికెట్ పడగొట్టాడు. వరుసగా ఐదో విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో తొలి స్థానానికి చేరుకోగా, ఎస్ఆర్హెచ్ మూడో స్థానానికి పడిపోయింది.చదవండి: ‘మాటలు జాగ్రత్త.. ఏది పడితే అది వాగొద్దు’ -
సునామీ శతకం.. చరిత్ర సృష్టించిన పాక్
పాక్ మహిళల టీ20 జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. పరుగుల పరంగా తమ అత్యంత భారీ విజయాన్ని నమోదు చేసింది. నిన్న (మే 12) జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించింది. 153 పరుగుల భారీ తేడాతో జింబాబ్వేను మట్టికరిపించింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్లో ఘనంగా బోణీ కొట్టింది. దీనికి ముందు ఇరు జట్ల మధ్య జరిగిన 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను పాక్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. జింబాబ్వే మహిళల జట్టు తొలిసారి పాక్లో పర్యటిస్తూ ఆడుతున్న చారిత్రక సిరీస్ ఇది.సునామీ శతకంకరాచీ వేదికగా జరిగిన తొలి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. అయేషా జాఫర్ (47 బంతుల్లో 102 నాటౌట్; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) సునామీ శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 237 పరుగుల భారీ స్కోర్ చేసింది. పాక్ మహిళల జట్టు అంతర్జాతీయ స్థాయిలో 200 పరుగుల మార్కు తాకడం ఇదే తొలిసారి.ఈ మ్యాచ్లో అయేషా జాఫర్ చేసిన సెంచరీ మహిళల అంతర్జాతీయ టీ20 క్రికెట్లో మూడో వేగవంతమైన సెంచరీగా రికార్డైంది. అలాగే మునీబా అలీ తర్వాత పాక్ తరఫున టీ20ల్లో సెంచరీ చేసిన రెండో ప్లేయర్గా అయేషా జాఫర్ నిలిచింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో జింబాబ్వే జట్టు పూర్తిగా చేతులెత్తేసింది. 18.2 ఓవర్లలో 84 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ ఫాతిమా సనా (3-0-7-3), సదియా ఇక్బాల్ (3.2-0-14-2), నతాలియా పర్వేజ్ (2-0-3-2), రమీన్ షమీమ్ (3-0-18-1) జింబాబ్వే ఇన్నింగ్స్ను నేలమట్టం చేశారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 కరాచీ వేదికగా మే 14న జరుగనుంది. -
రసవత్తరంగా మారిన ప్లే ఆఫ్స్ సమీకరణలు
ఐపీఎల్ 2026 కీలక దశకు చేరుకున్న వేళ, ప్లే ఆఫ్స్ సమీకరణలు ఆసక్తికరంగా మారాయి. సీజన్ ప్రారంభంలో చెలరేగి ఆడిన జట్లు ప్రస్తుతం మెత్తబడగా.. అడపాదడపా ప్రదర్శనలతో ప్రారంభించిన జట్లు వరుస విజయాలతో దూసుకుపోతున్నాయి.దశ తిరగబడి, అనూహ్యంగా పుంజుకున్న జట్ల జాబితాలో గుజరాత్ టైటాన్స్ ముందుంది. ఈ జట్టు రెండు వరుస పరాజయాలతో సీజన్ ప్రారంభించి, ఆతర్వాత హ్యాట్రిక్ విజయాలు, ఆతర్వాత మళ్లీ రెండు వరుస పరాజయాలు, వాటి తర్వాత వరుసగా ఐదు మ్యాచ్ల్లో విజయాలు సాధించి, ప్రస్తుతం పాయింట్ట పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. సీజన్ ప్రారంభంలో ఏమాత్రం అంచనాలు లేని గుజరాత్ ఒక్కసారిగా టైటిల్ ఫేవరెట్గా మారిపోయిన వైనం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ జట్టు తదుపరి ఆడాల్సిన 2 మ్యాచ్ల్లో (కేకేఆర్, సీఎస్కే) ఒక్కటి గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారరవుతుంది. గుజరాత్ ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్ల్లో 8 విజయాలు, 4 అపజయాలతో 16 పాయింట్లు కూడగట్టుకుంది. ఈ జట్టు రన్రేట్ (0.551) కూడా మెరుగ్గా ఉంది.అంచనాలు తల్లకిందులైన జట్లలో పంజాబ్, రాజస్థాన్ ముందువరుసలో ఉన్నాయి. ఈ రెండు జట్లు సీజన్ ప్రారంభంలో వరుస విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో టాప్-2 జట్లుగా చలామణి అయ్యాయి. అయితే అనూహ్యంగా ప్రస్తుతం ప్లే ఆఫ్స్ రేసులో వెనుకపడ్డాయి. వీటిలో పంజాబ్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ జట్టు తొలి ఏడు మ్యాచ్ల్లో ఒక్క అపజయం కూడా ఎదుర్కోలేదు. అయితే ఆతర్వాత అనూహ్యంగా వరుసగా నాలుగు మ్యాచ్ల్లో పరాజయంపాలై, నాలుగో స్థానానికి పడిపోయింది. తద్వారా ప్లే ఆఫ్స్ అవకాశాలను సంకటంలో పడేసుకుంది. ఇకపై ఆడబోయే 3 మ్యాచ్ల్లో (ముంబై, ఆర్సీబీ, లక్నో) కనీసం రెండైనా గెలవకపోతే పంజాబ్ ప్లే ఆఫ్స్ అశలను వదులుకోవాల్సిందే. పంజాబ్ ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్ల్లో 6 విజయాలు, 4 అపజయాలతో 13 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. కేకేఆర్తో జరగాల్సిన ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఓ పాయింట్ లభించింది. నాలుగు వరుస పరాజయాలు ఎదుర్కొన్నా, రన్రేట్ (0.428) ఇంకా మెరుగ్గానే ఉండటం పంజాబ్కు ఊరట కలిగించే విషయం.ఆరంభంలో అదరగొట్టి, ఆతర్వాత ఢిలా పడిపోయిన మరో జట్టు రాజస్థాన్. ఈ జట్టు సీజన్ ప్రారంభంలో నాలుగు వరుస విజయాలు సాధించి, ఆతర్వాత 7 మ్యాచ్ల్లో కేవలం రెండు విజయాలు మాత్రమే నమోదు చేసి, ప్లే ఆఫ్స్ రేసులో బాగా వెనుకపడిపోయింది. ఈ జట్టు ఇకపై ఆడాల్సిన 3 మ్యాచ్ల్లో (ఢిల్లీ, లక్నో, ముంబై) కనీసం రెండైనా గెలవకపోతే, ప్లే ఆఫ్స్ బెర్త్పై ఆశలు వదులుకోవాల్సిందే. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్ల్లో ఈ జట్టు 6 విజయాలు సాధించి, 5 అపజయాలు ఎదుర్కొని పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ జట్టు ఖాతాలో 12 పాయింట్లు ఉన్నాయి. రన్రేట్ (0.082) మెరుగ్గానే ఉంది.హ్యాట్రిక్ పరాజయాలు.. హ్యాట్రిక్ విజయాలుఈ సీజన్లో అనూహ్యంగా ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చిన జట్టు సీఎస్కే. ఈ జట్టు హ్యాట్రిక్ పరాజయాలతో సీజన్ ప్రారంభించినప్పటికీ.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుంది. చివరి 8 మ్యాచ్ల్లో హ్యాట్రిక్ విజయాలు సహా 6 విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతుంది. ఇకపై ఆడాల్సిన 3 మ్యాచ్ల్లో రెండు గెలిచినా ఈ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది. సీఎస్కేకు రన్రేట్ (0.185) కూడా మెరుగ్గా ఉండటం కలిసొచ్చే అంశం. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్ల్లో 6 విజయాలు, 5 అపజయాలు నమోదు చేసి, ప్లే ఆఫ్స్ రేసులో బలంగా నిలబడింది.ప్లే ఆఫ్స్ రేసులో స్థిరంగా కొనసాగుతున్న మరో రెండు జట్లు ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్. సీజన్ ప్రారంభం నుంచి స్థిరంగా రాణిస్తున్న ఆర్సీబీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్ల్లో 7 విజయాలు, 4 అపజయాలు ఎదుర్కొని 14 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ఈ జట్టు రన్రేట్ అన్ని జట్లకంటే మెరుగ్గా (1.103) మెరుగ్గా ఉంది. ఆర్సీబీ తదుపరి ఆడాల్సిన 3 మ్యాచ్ల్లో (కేకేఆర్, పంజాబ్, ఎస్ఆర్హెచ్) రెండు గెలిస్తే సునాయాసంగా ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటుంది.ఎస్ఆర్హెచ్ విషయానికొస్తే.. ఈ జట్టు 12 మ్యాచ్ల్లో 7 విజయాలు, 5 అపజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో (14 పాయింట్లు, 0.331 రన్రేట్) కొనసాగుతోంది. ఈ జట్టు ఇకపై ఆడాల్సిన 2 మ్యాచ్లు (సీఎస్కే, ఆర్సీబీ) గెలిస్తే, మిగతా జట్లతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్కు చేరుకుంటుంది. అధికారికంగా ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్న మరో రెండు ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్. ఈ రెండు జట్లు టెక్నికల్గా ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నా, అది జరిగే పని కాదు. ఢిల్లీతో పోలిస్తే కేకేఆర్కు కాస్త మెరుగైన అవకాశాలే ఉన్నా, అది కూడా అంత ఈజీ కాదు. ప్రస్తుతం కేకేఆర్ ఖాతాలో 9 పాయింట్లు ఉన్నాయి. ఆ జట్టు ఇకపై ఆడాల్సిన 4 మ్యాచ్ల్లో గెలిస్తే ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. ఢిల్లీ విషయానికొస్తే.. ఈ జట్టు ఇకపై ఆడాల్సిన 2 మ్యాచ్ల్లో ఒక్కదాంట్లో ఓడినా లీగ్ నుంచి ఎలిమినేట్ అవుతుంది. ఇప్పటివరకు లక్నో, ముంబై ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. -
‘మాటలు జాగ్రత్త.. ఏది పడితే అది వాగొద్దు’
ఐపీఎల్ 2026 సీజన్ను ఘనంగా ప్రారంభించిన పంజాబ్ కింగ్స్ తొలి అంచె పోటీలు ముగిసేసరికి ఏడు మ్యాచ్ల్లో ఆరు విజయాలతో టేబుల్ టాపర్గా నిలిచింది. అయితే రెండో అంచె పోటీల్లో మాత్రం పంజాబ్ తడబడుతూ వస్తోంది. వరుసగా నాలుగు పరాజయాలతో పంజాబ్ పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది. బౌలింగ్లో విఫలమవ్వడంతో పాటు పేలవమైన ఫీల్డింగ్ ఆ జట్టు ప్రమాణాలను దెబ్బ తీస్తున్నాయి. పంజాబ్ ఆటగాళ్లు క్యాచ్ డ్రాప్లు ఎక్కువగా చేయడం కూడా ఆ జట్టు కొంపముంచుతోంది. మైదానంలో పరిస్థితి ఇలా ఉంటే బయట కూడా పంజాబ్ జట్టు చిక్కుల్లో పడింది. ఇటీవలే విమానంలో పంజాబ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ వేప్ (ఈ-సిగరేట్) పీల్చడం వివాదంగా మారింది. వేప్ను అందించిన అర్ష్దీప్తో పాటు చాహల్, మరికొంత మంది పంజాబ్ ఆటగాళ్లపై వేటు పడనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అంతేకాదు పంజాబ్ ఓపెనర్ ప్రబ్సిమ్రన్ బరువు పెరిగాడన్న వార్తలతో పాటు జట్టు ఆటగాళ్ల ప్రవర్తనపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా స్పందించింది. ఎక్స్ వేదికగా ప్రీతి జింటా మాట్లాడుతూ..'మాటలు జాగ్రత్త. నిజానిజాలు తెలుసుకోకుండా ఏది పడితే అది వాగొద్దని హెచ్చరించారు. ఇలాంటి తప్పుడు కథనాల వల్ల ఆటగాళ్లు, ఫ్రాంచైజీ ప్రతిష్టకు నష్టం కలుగుతోంది. విమర్శలకు, తప్పుడు కథనాలకు మధ్య చాలా తేడా ఉంటుంది. ఆటలో తప్పులకు సంబంధించి ఎలాంటి చర్చనైనా స్వాగతిస్తాం. కానీ వ్యక్తులకు, జట్టుకు, ఫ్రాంచైజీ బ్రాండ్కు నష్టం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు వ్యాప్తి చేస్తే ఎంతమాత్రం సహించము. వీటిని తేలికగా తీసుకోలేము. సమాచారాన్ని ప్రచారం చేసే ముందు వ్యక్తులు, మీడియా నిపుణులు, సోషల్ మీడియా ప్రతినిధులు వాస్తవాలు తెలుసుకొని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నేను కోరుతున్నా' అని పేర్కొంది. There’s a difference between criticism & calculated misinformation. Healthy debate around the game is welcome, but the deliberate spread of fake narratives to damage individuals, the team, or the brand should not & will not be taken lightly. I urge everyone including verified… https://t.co/yeqbsTwLBd— Preity G Zinta (@realpreityzinta) May 12, 2026ఇదే విషయమై పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ కూడా ఎక్స్ వేదికగా స్పందించిది. 'విమర్శలు, సరదా సంభాషణలు, అభిప్రాయాలు క్రీడలో భాగమే. కానీ టీఆర్పీ, వ్యూస్ కోసం నకిలీ వార్తలు, కథనాలు రాయడం సరికాదు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ముందు వాస్తవాలు ఏంటన్నది గ్రహించాలని మేము కోరుతున్నాము' అని తెలిపింది.Criticism, banter, and opinions are part of sport. Fake stories and made-up narratives for cheap engagement are not. We urge everyone to verify facts before spreading misinformation for attention or traction.— Punjab Kings (@PunjabKingsIPL) May 12, 2026చదవండి: హార్దిక్ నిజంగా గాయపడ్డాడా? -
హార్దిక్ నిజంగా గాయపడ్డాడా? కావాలని తప్పించారా?
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ ఖేల్ ఖతం అయిన సంగతి తెలిసిందే. ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో దారుణ ఆటతీరుతో మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే ఇంటిబాట పట్టింది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ముంబై ఆడిన గత రెండు మ్యాచ్లకు వెన్నునొప్పి గాయంతో పాండ్యా దూరంగా ఉన్నాడు. అయితే తాజాగా మే 14న (గురువారం) పంజాబ్ కింగ్స్తో మ్యాచ్కు పాండ్యా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పాండ్యా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను పంచుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ పాండ్యా నిజంగా గాయపడ్డాడా లేక కావాలని అతడిని జట్టు నుంచి తప్పించారా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే పాండ్యా తన ప్రాక్టీస్లో బౌలర్లను అవలీలగా ఎదుర్కొంటూ కసితీరా బ్యాటింగ్ చేశాడు. బ్యాటింగ్ చేస్తున్నంతసేపు పాండ్యాకు ఏమాత్రం అసౌకర్యంగా కనిపించలేదు. మరోవైపు ముంబై ఇండియన్స్ హెడ్కోచ్ మహేల జయవర్దనే మాత్రం పాండ్యా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదంటూ ఒక ప్రకటన విడుదల చేశాడు. అంతేకాదు పాండ్యా త్వరగా కోలుకునేందుకు తమ మెడికల్ టీం ప్రయత్నాలు చేస్తుందని తెలిపాడు. పాండ్యా పూర్తిగా కోలుకునేంతవరకు రిస్క్ చేయకూడదని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. పాండ్యా తాను ఫిట్గా ఉన్నట్లు ఒకవైపు వీడియో రిలీజ్ చేయడం, అదే సమయంలో జయవర్దనే పాండ్యా కోలుకోవడానికి సమయం పడుతుందని చెప్పడం చూస్తుంటే పాండ్యా నిజంగా గాయపడ్డాడా లేక కావాలనే జట్టు నుంచి తప్పించారా అనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. పాండ్యా కూడా తన అగ్రెసివ్ ప్రవర్తనతో జట్టులో పూర్తిగా నెగెటివిటీని మూటగట్టుకోవడం కూడా అతడికి ప్రతికూలంగా మారిందని చెప్పొచ్చు.ఇటీవలే పాండ్యా.. ముంబై ఇండియన్స్ ప్రాంచైజీని అన్ఫాలో చేయడం అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. ఇదే విషయమై ముంబై ఫ్యాన్స్ ఒక అడుగు ముందుకేసి 'ఈ సీజన్లో పాండ్యా ముంబై తరఫున ఆఖరి మ్యాచ్ ఆడేశాడని, వచ్చే సీజన్లో వేరే జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడంటూ' కామెంట్లు చేస్తున్నారు. 'పాండ్యా జట్టులోకి రావడం వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆ జట్టు ఐపీఎల్ 2026 సీజన్ నుంచి ఎలిమినేట్ అయింది. అతడి రాక వల్ల ఉపయోగం లేదు' అని మరికొందరు పేర్కొన్నారు. ఈ సీజన్లో 11 మ్యాచ్లాడిన ముంబై ఇండియన్స్ కేవలం ఆరు పాయింట్లతో పట్టికలో 9వ స్థానంలో ఉంది. ముంబై తన తర్వాతి మ్యాచ్లు పంజాబ్ కింగ్స్, కేకేఆర్, రాజస్తాన్ రాయల్స్తో ఆడనుంది.Hardik pandya practicing in the nets. He just put a stop on alll the rumours 🌚 pic.twitter.com/AjG8Fg9gW9— Gagan Choudhary (@trigguuuu) May 12, 2026చదవండి: ఓటమిలోనూ ఎస్ఆర్హెచ్ రికార్డుల వెల్లువ! -
సీఎస్కే కీలక నిర్ణయం
ఐపీఎల్ 2026 కీలక దశకు చేరుకున్న వేళ, ఫైవ్ టైమ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. గాయంతో టోర్నీ మొత్తానికి దూరమైన పేసర్ రామకృష్ణ ఘోష్ స్థానంలో కర్ణాటక ఆల్రౌండర్ మెక్నీల్ హ్యాడ్లీ నొరొన్హాను జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథ్ ధృవీకరించారు. ప్రస్తుతం బీసీసీఐ ఆమోదం కోసం ఫ్రాంచైజీ ఎదురుచూస్తోంది.24 ఏళ్ల మాక్నీల్ గతేడాది మహారాజా ట్రోఫీలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మంగళూరు డ్రాగన్స్ టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 13 మ్యాచ్ల్లో 148.82 స్ట్రైక్రేట్తో 253 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 19 సిక్సర్లు ఉండటం విశేషం.బ్యాటింగ్తో పాటు ఆఫ్ స్పిన్ బౌలింగ్ కూడా వేయగల మాక్నీల్.. ఆ టోర్నీలో 7.44 ఎకానమీతో 10 వికెట్లు తీశాడు. ముఖ్యంగా ఫైనల్లో హుబ్లీ టైగార్స్పై 2/25 గణాంకాలతో మెరిశాడు. ఈ ప్రదర్శనలతో అతడికి సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ (కర్ణాటక తరఫున) ఆడే అవకాశం లభించింది. ఆ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ అతడు ఆకట్టుకున్నాడు.ఇక రామకృష్ణ ఘోష్ విషయానికి వస్తే, అతడు ఈ సీజన్లో సీఎస్కే తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అయితే మే 3న ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కాలికి తీవ్ర గాయం కావడంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతడికి ఫుట్ ఫ్రాక్చర్ అయినట్లు సీఎస్కే ప్రకటించింది.ఈ సీజన్లో సీఎస్కే గాయాల సమస్యతో తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది. ఇప్పటికే పేసర్ ఖలీల్ అహ్మద్, స్టార్ బ్యాటర్ ఆయుశ్ మాత్రే కూడా సీజన్ మొత్తానికి దూరమయ్యారు. అయుశ్ స్థానంలో ఆకాశ్ మధ్వాల్ జట్టులోకి రాగా.. ఖలీల్ అహ్మద్కు ఇంకా ప్రత్యామ్నాయాన్ని ప్రకటించలేదు.మరోవైపు విదేశీ పేసర్ నాథన్ ఇల్లిస్ కూడా గాయం కారణంగా సీజన్ ఆరంభం నుంచే జట్టుకు దూరంగా ఉంటున్నాడు. అతడి స్థానంలో వచ్చిన స్పెన్సర్ జాన్సన్ కూడా గాయంతో కొన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండలేదు.ఇక జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కూడా కాఫ్ స్ట్రెయిన్తో బాధపడుతూ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడం వల్ల సీజన్ ప్రారంభంలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న సీఎస్కే.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకొని ప్రస్తుతం ప్లే ఆఫ్స్ రేసులో బలంగా నిలబడింది. ఈ జట్టు ప్రస్తుతం ఐదో స్థానంలో ఉండి, ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం తీవ్రంగా పోరాడుతుంది. ఇలాంటి సమయంలో మాక్నీల్ వంటి యువ ఆల్రౌండర్ రాక జట్టుకు అదనపు బలం ఇవ్వొచ్చని సీఎస్కే అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
ఓటమిలోనూ ఎస్ఆర్హెచ్ రికార్డుల వెల్లువ!
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) 82 పరుగుల తేడాతో దారుణ ఓటమిని చవిచూసింది. గుజరాత్ విధించిన 169 పరుగులను ఛేదించే క్రమంలో ఎస్ఆర్హెచ్ 86 పరుగులకే కుప్పకూలింది. ఈ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ పలు చెత్త రికార్డులను తన పేరిట లిఖించుకుంది. అవి ఏంటనేది ఒకసారి పరిశీలిద్దాం.👉గుజరాత్తో మ్యాచ్లో 89 పరుగులకే కుప్పకూలిన ఎస్ఆర్హెచ్కు ఐపీఎల్లో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. 2019లో ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో 96 పరుగులు, 2015లో ముంబైతో మ్యాచ్లో 113 పరుగులు, 2024లో కేకేఆర్తో మ్యాచ్లో 113 పరుగులు, 2020 సీజన్లో పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో 114 పరుగులకు ఆలౌటైంది.👉ఐపీఎల్లో పరుగుల పరంగా (గుజరాత్ చేతిలో 82 పరుగుల తేడాతో) చూసుకుంటే ఎస్ఆర్హెచ్కు ఇదే అతిపెద్ద ఓటమి. 2025లో కేకేఆర్ చేతిలో 80 పరుగులు, 2024లో సీఎస్కే చేతిలో 78 పరుగులు, 2013లో సీఎస్కే చేతిలో 77 పరుగులు, 2014లో పంజాబ్ చేతిలో 72 పరుగులు, 2023లో రాజస్తాన్ చేతిలో 72 పరుగులతో భారీ ఓటములు చవిచూసింది.👉అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ చేసిన 86 పరుగులే అత్యల్ప స్కోరు. గతంలో గుజరాత్ టైటాన్స్ (2024లో ఢిల్లీతో మ్యాచ్లో 89 పరుగులు) ఇప్పటిదాకా అత్యల్పం. అంతకముందు ఇదే సీజన్లో ముంబైతో మ్యాచ్లో గుజరాత్ వంద పరుగులకు ఆలౌటైంది. 2014లో ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో రాజస్తాన్ 102 పరుగులకు ఆలౌటైంది.👉ఐపీఎల్లో పరుగుల పరంగా గుజరాత్ టైటాన్స్కు (82 పరుగులు) ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. ఈ సీజన్లో రాజస్తాన్పై 77 పరుగులతో, 2023లో ముంబైపై 62 పరుగులతో, 2022లో లక్నోపై 62 పరుగులతో, 2025లో రాజస్తాన్పై 58 పరుగులతో భారీ విజయాలు అందుకుంది.👉ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో టేబుల్ టాపర్గా నిలిచి ప్లేఆఫ్స్కు మరింత చేరువైంది. ప్రస్తుతం 14 పాయింట్లతో ఉన్న ఎస్ఆర్హెచ్ మిగిలిన రెండు మ్యాచ్లను సీఎస్కే, ఆర్సీబీతో ఆడనుంది. ఇందులో ఆర్సీబీతో మ్యాచ్ను సొంత గ్రౌండ్లో ఆడనుండడం ఎస్ఆర్హెచ్కు కలిసొచ్చే అంశం. ఈ రెండు మ్యాచ్ల్లోనూ ఎస్ఆర్హెచ్ నెగ్గితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లేఆఫ్స్కు చేరనుంది.చదవండి: ‘టైటిల్ మాదే.. రాసిపెట్టుకోండి’.. గిల్ హెచ్చరిక! -
‘టైటిల్ మాదే.. రాసిపెట్టుకోండి’.. గిల్ హెచ్చరిక!
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ వరుసగా ఐదో విజయాన్ని సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకొచ్చింది. మంగళవారం ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ 82 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 200 ప్లస్ స్కోర్లు కూడా ఈజీగా ఛేదిస్తున్న ఈ సీజన్లో 160 ప్లస్ స్కోరును కాపాడుకోవడం గుజరాత్కు మాత్రమే చెల్లింది. మ్యాచ్ విజయం అనంతరం గుజరాత్ కెప్టెన్ శుబ్మన్ గిల్ మాట్లాడాడు. ‘అహ్మదాబాద్ వికెట్ పై 170 పరుగులు చేయడం కూడా కష్టమే. మేం 160-170 పరుగులు చేస్తే.. మా బౌలింగ్ అటాక్ ముందు ఆ స్కోర్ను ఛేదించడం అంత సులువు కాదని ముందే అంచనా వేశాం. ఈ మ్యాచ్లో మా వ్యూహం కూడా అదే. సన్రైజర్స్ బ్యాటింగ్ లైనప్, ముఖ్యంగా టాపార్డర్ను పడగొట్టడానికి మేం వేసిన ప్రణాళికలు పక్కాగా పనిచేశాయి.సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ ఈ స్లో పిచ్పై అద్భుతంగా రాణించారు. ఈ గెలుపు క్రెడిట్ వారికి ఇవ్వాల్సిందే. ఓ వైపు వికెట్లు పడిపోతున్నా.. వారిద్దరూ నిలబడి జట్టుకు ఆ స్కోర్ను అందించారు. మేము ఒక బ్రాండ్ క్రికెట్కు మాత్రమే పరిమితం అవ్వాలని అనుకోవడం లేదు. మేము ఒక నిర్దిష్ట శైలి లేదా బ్రాండ్ క్రికెట్ ఆడే జట్టు కాదని మీకు తెలుసు. వరుస విజయాలు ఊరికే రాలేదు. రాసిపెట్టుకోండి.. ఈసారి టైటిల్ కొట్టబోతున్నాం. పిచ్ను చూసి, పరిస్థితులను అంచనా వేసి ఆడి గెలిచే జట్టుగా ఉండాలని కోరుకుంటున్నాం. 240 పరుగులు చేసే వికెట్ అయితే కచ్చితంగా ఆ స్కోర్ కోసం ప్రయత్నిస్తాం. ముఖ్యంగా జాసన్ హోల్డర్.. మా టీమ్ గెలుపు సీక్రెట్. అతడు వేస్తున్న లెంగ్త్లు మా జట్టుకు చాలా ప్లస్ అవుతున్నాయి. దాదాపు ప్రతి మ్యాచ్లో హోల్డర్ వరుసగా నాలుగు ఓవర్లు వేస్తూ రాణిస్తూ మాకు గెలుపు మంత్రంగా మారిపోయాడు.’ అని గిల్ వెల్లడించాడు.చదవండి: ‘నన్ను పావుగా వాడుకొని కోహ్లీపై కుట్ర పన్నాగం’ -
‘నన్ను పావుగా వాడుకొని కోహ్లీపై కుట్ర పన్నాగం’
జర్మన్ మోడల్, ఇన్ఫ్లుయెన్సర్ లిజ్లాజ్ పెట్టిన పోస్టుకు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ లైక్ కొట్టడం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ తర్వాత ఆ లైక్ కనిపించకపోవడం వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో లిజ్ లాజ్ మరోసారి బాంబు పేల్చింది. కోహ్లీపై తప్పుడు ఆరోపణలు చేయాలంటూ కొందరు జర్నలిస్టులు తనను సంప్రదించారని, అందుకు భారీగా డబ్బులు కూడా ఆఫర్ చేశారని లిజ్ లాజ్ వెల్లడించింది. తనను పావులా వాడుకొని కోహ్లీపై కుట్ర పన్నాలని భావించారని, కానీ డబ్బు కోసం లేదా పాపులర్ అవ్వడానికి కోహ్లీ పేరును వాడుకొని అతడి ప్రతిష్టను దెబ్బతీయాలన్న ఆసక్తి తనకు లేదని తెలిపింది. అందుకే వాళ్లు (జర్నలిస్టులు) ఇచ్చిన ఆఫర్ను సున్నితంగా తిరస్కరించినట్లు పేర్కొంది. ఇంటర్వ్యూలో లిజ్ లాజ్ మాట్లాడుతూ.. ‘మొదట విరాట్ కోహ్లీ నా ఫొటో లైక్ చేసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ప్రపంచస్థాయి క్రికెటర్ నా పోస్టును గమనించడం గర్వంగా అనిపించింది. కానీ తర్వాత ఆ విషయాన్ని సోషల్ మీడియాలో అతిగా చూపించడం బాధ కలిగించింది. ఒక సాధారణ సోషల్ మీడియా యాక్టివిటీని పెద్ద వివాదంగా మార్చడం సరికాదు. కోహ్లీపై వచ్చిన ట్రోలింగ్ చూసి ఆశ్చర్యపోయాను. అతను ఎప్పుడూ అనుచితంగా ప్రవర్తించలేదు. కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి మాట్లాడుతూ, అతడిని ఫుట్బాల్ దిగ్గజాలు మెస్సీ, రొనాల్డోలతో పోల్చింది. ‘కోహ్లీ ఆసియాలో అత్యంత ప్రభావవంతమైన క్రీడాకారుల్లో ఒకరు. ఆయనపై అనవసర ఆరోపణలు చేయడం సరైంది కాదు. ఒక చిన్న విషయాన్ని పెద్ద వివాదంగా మార్చి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూడటం బాధాకరం’ అని ఆమె పేర్కొంది. ఈ వివాదం తర్వాత భారత్లో లిజ్ లాజ్కు విపరీతమైన గుర్తింపు వచ్చినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్లు భారీగా పెరిగారు. పలు బ్రాండ్ ప్రమోషన్లు, రియాలిటీ షో అవకాశాలు కూడా వచ్చినట్లు సమాచారం. అయినప్పటికీ, తాను సంచలన ప్రచారం కోసం ఎవరి ప్రతిష్ఠతో ఆడుకోనని ఆమె స్పష్టం చేసింది. అంతేకాదు తాను ఐపీఎల్కు పెద్ద అభిమానినని, ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టును క్రమం తప్పకుండా ఫాలో అవుతానని స్పష్టం చేసింది.ఎవరీ లిజ్లాజ్?లిజ్ లాజ్ దక్షిణాఫ్రికాలో జన్మించింది. ఆమె తండ్రిది సౌతాఫ్రికా కాగా.. తల్లిది జర్మనీ. దీంతో లిజ్ లాజ్ జర్మన్, ఆఫ్రికా, డచ్, ఫ్రెంచ్, రష్యన్ వంటి భాషలను అనర్గళంగా మాట్లాడగలదు. సైకాలజీ విభాగంలో ఎంఎస్సీ పట్టా పొందింది. లైఫ్సేవింగ్ స్విమ్మర్ కూడా లిజ్ లాజ్ గుర్తింపు పొందింది. ఫుడ్ వ్లాగింగ్, ట్రావెలింగ్, పాటల రచన లిజ్ లాజ్ హాబీలు.చదవండి: చీర్గర్ల్స్ చిందులు.. కళ్లప్పగించిన పోలీసులు! -
వినేశ్ను అడ్డుకోవడం సబబు కాదు: సాక్షి మలిక్
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్కు మరో రెజ్లర్ సాక్షి మలిక్ మద్దతుగా నిలిచింది. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో పాల్గొనాలనుకుంటున్న వినేశ్... జాతీయ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్ ద్వారా తిరిగి మ్యాట్పై అడుగు పెట్టాలని భావించగా... భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) నిబంధనల సాకుతో అడ్డుపడింది. 2024 పారిస్ ఒలింపిక్స్లో ఫైనల్కు చేరిన అనంతరం 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హతకు గురై పతకం కోల్పోయిన వినేశ్... ఆ తర్వాతి పరిణామాల నేపథ్యంలో కెరీర్కు వీడ్కోలు పలికింది. అనంతరం రాజకీయాల్లో చేరి కాంగ్రెస్ పార్టీ తరఫున హరియాణా ఎమ్మెల్యేగా విజయం సాధించింది.ఇటీవల తల్లి అయిన వినేశ్ తిరిగి పోటీలో దిగేందుకు ప్రయత్నించగా... షోకాజ్ నోటీసుకు సమాధానం ఇచ్చిన తర్వాతే పోటీల్లో పాల్గొనే అవకాశమిస్తామని డబ్ల్యూఎఫ్ఐ పేర్కొంది. నిబంధనల ప్రకారం రిటైర్మెంట్ ప్రకటించిన అథ్లెట్లు తిరిగి పోటీల్లో పాల్గొనాలనుకుంటే... ఆరు నెలల నోటీసు నిబంధనను పాటించాలి. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు కొత్తగా తల్లి అయిన అథ్లెట్ తిరిగి పోటీల్లో పాల్గొనేందుకు ప్రయత్నిస్తే వారి కోసం నిబంధనలు మార్చిన సందర్భాలు చాలా ఉన్నాయని సాక్షి వెల్లడించింది. ‘మహిళా అథ్లెట్ తల్లి అయిన తర్వాత కూడా దేశం కోసం ఆడటం, పతకాలు గెలవడం కొనసాగించేలా నిబంధనలు ఉండాలి.గతంలో పలు దేశాల్లో ఇలా నిబంధనల్లో మార్పులు చేశారు. వినేశ్ రెజ్లింగ్కు విరామమిచ్చిన అనంతరం ఎమ్మెల్యే అయింది. ఇప్పుడు ఆమె తిరిగి రెజ్లింగ్లో అడుగు పెట్టకుండా డబ్ల్యూఎఫ్ఐ కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. వినేశ్కు ట్రయల్స్ నిర్వహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా, డబ్ల్యూఎఫ్ఐని అభ్యరి్థస్తున్నా. దీంతో తల్లి అయిన తర్వాత పతకాలు గెలిచి ఆమె మహిళా సమాజానికి ఆదర్శంగా నిలవగలదు’ అని సాక్షి మలిక్ వెల్లడించింది. 2016 రియో ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలిచిన సాక్షి... 2023లో వినేశ్ ఫొగాట్, బజరంగ్ పూనియాతో కలిసి డబ్ల్యూఎఫ్ఐ అప్పటి అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్పై జరిగిన నిరసనల్లో పాల్గొంది.75 కేజీల విభాగం ఫైనల్లో లక్షయ్తాష్కెంట్: ఆసియా అండర్–17 బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్ లక్షయ్ ఫొగాట్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 75 కేజీల విభాగం ఫైనల్లో లక్షయ్ 5:0తో సెయుంగ్మిన్ లీ (దక్షిణ కొరియా)పై గెలుపొందాడు. భారత్కే చెందిన నేళ్ల నరేంద్ర (46 కేజీలు), యశ్ యాదవ్ (50 కేజీలు), నివేశ్ పాల్ (54 కేజీలు), నమన్ (70 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలు సాధించారు. సెమీఫైనల్స్లో నరేంద్ర 0:5తో నురాలియెవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో, యశ్ 1:4తో ఉస్కుబాటర్ (మంగోలియా) చేతిలో, నివేశ్ 0:5తో అబ్దుల్బాసిత్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో, నమన్ 2:3తో అబ్దుమజిదోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓటమి చవిచూశారు. -
బంగ్లాదేశ్ చేతిలో పాక్ బోల్తా
మిర్పూర్: బంగ్లాదేశ్తో జరిగిన మొదటి 13 టెస్టుల్లో పాకిస్తాన్ 12 విజయాలు సాధించింది. ఒక మ్యాచ్ను ‘డ్రా’గా ముగించింది. ఆ తర్వాత పాకిస్తాన్ విజయపరంపరకు 2024లో రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్ తెరదించింది. ఆనాడు రెండు వారాల్లో వరుసగా రెండు టెస్టుల్లో పాకిస్తాన్ను వారి సొంతగడ్డపైనే ఓడించి బంగ్లాదేశ్ భళా అనిపించింది. రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ పాకిస్తాన్తో జరిగిన టెస్టులో వరుసగా మూడోసారి బంగ్లాదేశ్ జట్టే పైచేయి సాధించింది. ‘హ్యాట్రిక్’ విజయాన్ని అందుకుంది. రెండు టెస్టుల సిరీస్లో భాగంగా మిర్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 103 పరుగుల తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసింది. సిరీస్లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్టు ఈనెల 16 నుంచి సిల్హెట్లో జరుగుతుంది. ఆట చివరిరోజు ఓవర్నైట్ స్కోరు 152/3తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ 70.3 ఓవర్లలో 9 వికెట్లకు 240 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన బంగ్లాదేశ్ కెపె్టన్ నజు్మల్ హుస్సేన్ షంటో (87; 7 ఫోర్లు) రెండో ఇన్నింగ్స్లోనూ టాప్ స్కోరర్గా నిలిచాడు. మోమినుల్ హక్ (56; 4 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. పాక్ బౌలర్లలో హసన్ అలీ, నోమన్ అలీ 3 వికెట్ల చొప్పున తీశారు.అనంతరం బంగ్లాదేశ్ నిర్దేశించిన 268 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుక బరిలోకి దిగిన పాకిస్తాన్ 52.5 ఓవర్లలో కేవలం 163 పరుగులకే కుప్పకూలింది. అబ్దుల్లా ఫజల్ (66; 11 ఫోర్లు) ఒక్కడే క్రీజులో నిలబడి అర్ధసెంచరీతో రాణించాడు. మిగతా పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. బంగ్లాదేశ్ పేసర్ నహీద్ రాణా 40 పరుగులిచ్చి 5 వికెట్లు తీసి పాక్ను దెబ్బకొట్టాడు. తస్కిన్ అహ్మద్, తైజుల్ 2 వికెట్ల చొప్పున తీసుకున్నారు. ఆఖరి రోజు 16 వికెట్లు పడటం విశేషం. మ్యాచ్లో 188 పరుగులు చేసిన షంటోకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 413 పరుగులు... పాకిస్తాన్ 386 పరుగులు చేశాయి. -
జొకోవిచ్ సరసన సినెర్
రోమ్: ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. క్వాలిఫయర్ ఆండ్రియా పెలెగ్రినో (ఇటలీ)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సినెర్ 6–2, 6–3తో గెలిచాడు. తద్వారా మాస్టర్స్ సిరీస్ టోర్నీల్లో వరుసగా 31వ విజయంతో సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ పేరిట ఉన్న రికార్డును సినెర్ సమం చేశాడు. 2011లో జొకోవిచ్ కూడా మాస్టర్స్ సిరీస్ టోర్నీల్లో వరుసగా 31 మ్యాచ్ల్లో నెగ్గాడు. క్వార్టర్ ఫైనల్లో సినెర్ గెలిస్తే మాస్టర్స్ టోర్నీల్లో అత్యధిక వరుస విజయాలు సాధించిన ప్లేయర్గా రికార్డు సృష్టిస్తాడు. -
శ్రమించి గెలిచిన సాత్విక్ – చిరాగ్ జోడీ
బ్యాంకాక్: థాయ్లాండ్ ఓపెన్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో టాప్ సీడ్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–19, 21–23, 21–10తో ఎర్వియాన్సియా–మౌలానా (ఇండోనేసియా) జంటపై శ్రమించి గెలిచింది.64 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో తొలి రెండు గేముల్లో గట్టిపోటీ ఎదుర్కొన్న భారత జోడీ నిర్ణాయక మూడో గేమ్లో మాత్రం పూర్తి ఆధిపత్యం చలాయించి విజయాన్ని ఖరారు చేసుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో గూన్టింగ్– హైకల్ (మలేసియా)లతో సాత్విక్–చిరాగ్ తలపడతారు. -
ఎస్ఆర్హెచ్ ఘోర ఓటమి.. 86 పరుగులకే ఆలౌట్
ఐపీఎల్-2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ఐదో ఓటమి ఎదురైంది. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 82 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. 168 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక ఆరెంజ్ ఆర్మీ చతికిలబడింది. గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ల ధాటికి హైదరాబాద్ జట్టు 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో పాట్ కమ్మిన్స్(19) టాప్ స్కోరర్గా నిలవగా.. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో రబాడ, జాసన్ హోల్డర్ తలా మూడు వికెట్లతో సత్తాచాటగా.. ప్రసిద్ద్ రెండు, సిరాజ్, రషీద్ ఖాన్ ఓ వికెట్ సాధించారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసినగుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.గుజరాత్ బ్యాటర్లలో సాయిసుదర్శన్(61), వాషింగ్టన్ సుందర్(50) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ప్రపుల్ హింగే, షకీబ్ తలా రెండు వికెట్లు సాధించారు. కెప్టెన్ శుభ్మన్ గిల్(5)తో పాటు జోస్ బట్లర్(7) విఫలమయ్యాడు. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్ర స్ధానానికి చేరుకుంది. -
చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్.. 19 ఏళ్లలో ఒకే ఒక్కడు
ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ స్టార్ ప్లేయర్ సాయి సుదర్శన్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. అహ్మదాబాద్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో సుదర్శన్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఆరంభంలోనే శుభ్మన్ గిల్, జోస్ బట్లర్ వికెట్లను కోల్పోయిన గుజరాత్ను సుదర్శన్ ఆదుకున్నాడు.ఈ తమిళనాడు క్రికెటర్ 44 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 61 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్తో అతడు ఐపీఎల్-2026 సీజన్లో 500 పరుగులను పూర్తి చేసుకున్నాడు. తద్వారా సుదర్శన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.👉ఐపీఎల్ చరిత్రలో 24 ఏళ్ల వయసులోపు మూడు వేర్వేరు సీజన్లలో 500 కంటే ఎక్కువ పరుగులు సాధించిన మొదటి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ ఫీట్ ఎవరూ సాధించలేకపోయారు. ఇంతకుముందు ఆర్సీబీ సూపర్ స్టార్ విరాట్ కోహ్లి 24 ఏళ్ల వయసులోపు రెండు సీజన్లలో 500 పరుగుల మార్క్ను అందుకున్నాడు.👉అదేవిధంగా ఐపీఎల్ చరిత్రలో వరుసగా మూడు లేదా అంతకంటే ఎక్కువ సీజన్లలో 500కు పైగా పరుగులు సాధించిన నాల్గవ ఆటగాడిగా సుదర్శన్ నిలిచాడు. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ (2014-2017), కె.ఎల్. రాహుల్ (2018-2021), విరాట్ కోహ్లి (2023-2025), సాయి సుదర్శన్ (2024-2026) ఉన్నారు.👉గుజరాత్ టైటాన్స్ జట్టు తరఫున మూడుసార్లు 500+ పరుగులు చేసిన మొదటి ఆటగాడు కూడా సుదర్శనే కావడం గమనార్హం. -
ఆర్సీబీతో మ్యాచ్.. కేకేఆర్కు భారీ షాక్
ఐపీఎల్-2026 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా కేకేఆర్ బుధవారం రాయ్పూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే కేకేఆర్ ఈ మ్యాచ్లో కూడా కచ్చితంగా గెలవాల్సిందే. అయితే ఈ మ్యాచ్కు నైట్రైడర్స్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి.. ఆర్సీబీతో జరగనున్న మ్యాచ్లో ఆడేది అనుమానమే. చక్రవర్తి ప్రస్తుతం ఎడమ చేతి వేలి గాయంతో బాధపడుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లోనూ అతడు గాయంతోనే బరిలోకి దిగాడు. అయితే ఢిల్లీ-ఆర్సీబీ మ్యాచ్కు మధ్యలో 6 రోజుల గ్యాప్ రావడంతో అతడు కోలుకుంటాని కేకేఆర్ మేనెజ్మెంట్ భావించింది. కానీ అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దీంతో ఆర్సీబీతో మ్యాచ్కు చక్రవర్తి దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. తాజాగా అతడి గాయంపై కేకేఆర్ సహాయ కోచ్ షేన్ వాట్సన్ అప్డేట్ ఇచ్చాడు."వైభవ్ గత రెండు మ్యాచ్లలోనూ చాలా నొప్పితో బాధపడ్డాడు. అయినప్పటికి అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అయితే ఆర్సీబీతో మ్యాచ్కు అతడు అందుబాటులో ఉంటాడా? లేదా అన్నది కచ్చితంగా తెలియదు. కానీ అతడు టీమ్ సెలక్షన్ అందుబాటులో ఉండాలని మేము ఆశిస్తున్నాం" అని వాట్సన్ ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్లో పేర్కొన్నాడు.కాగా క్రిక్బజ్ నివేదిక ప్రకారం.. వరుణ్ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నప్పటికీ, పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయలేదు. అతను కొన్ని స్ట్రెచింగ్ వ్యాయామాలు చేస్తూ కన్పించాడు. ఇక ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడిన చక్రవర్తి.. 8 వికెట్లు పడగొట్టాడు.చదవండి: క్రికెట్ చరిత్రలో పెను సంచలనం.. 50 ఓవర్లలో 822 పరుగులు! -
'వైభవ్ సూర్యవంశీ కెరీర్కు ఆ రూల్ శాపం'
వైభవ్ సూర్యవంశీ... ఈ యువ క్రికెటర్ గురుంచి ప్రత్యేక పరిచయం అక్కర్లలేదు. కేవలం 14 ఏళ్ల వయస్సులోనే అద్భుత బ్యాటింగ్తో యావత్తు క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు. ఈ రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం ప్రస్తుతం ఐపీఎల్-2026లో కూడా దుమ్ములేపుతున్నాడు.వైభవ్ 440 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. అయితే బ్యాటింగ్లో అదరగొడుతున్న వైభవ్ను కేవలం ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించడాన్ని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తప్పుబట్టాడు. 'ఇంపాక్ట్ సబ్' నిబంధన కారణంగా వైభవ్ ఒక ఆల్రౌండ్ క్రికెటర్గా ఎదగలేకపోతున్నాడని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. కాగా ఈ ఏడాది సీజన్లో వైభవ్ను రాజస్తాన్ రాయల్స్ ఎక్కువగా ఇంపాక్ట్ ప్లేయర్గానే వాడుకుంటోంది. రాజస్తాన్ రాయల్స్ ఫీల్డింగ్ చేసేటప్పుడు ఈ యంగ్ కిడ్ గ్రౌండ్లో కాకుండా బెంచ్పైనే కనిపిస్తున్నాడు."వైభవ్ సూర్యవంశీని కేవలం ఒక బ్యాటర్గా మాత్రమే చూడాలనుకుంటున్నారా? ఒక క్రికెటర్ అంటే బ్యాటింగ్ మాత్రమే కాదు, ఫీల్డింగ్ కూడా బాగా చేయాలి. ఒక 'కంప్లీట్ క్రికెటర్'గా ఎదగాలంటే కచ్చితంగా ఫీల్డింగ్ కూడా చేయాలి. ఇంజమామ్ హల్ హక్ గొప్ప బ్యాటర్ మనందరికి తెలుసు. కానీ అతడు ఫీల్డ్లో కాస్త నెమ్మదిగా ఉంటాడు. అయినప్పటికి అతడు మైదానంలో ఉండి ఫీల్డింగ్ చేసేవాడు.ఫీల్డ్లో ఉంటేనే వారి లోపాలు, బలాలు అన్నీ స్పష్టంగా తెలిసేవి. కానీ ఇప్పుడు 'ఇంపాక్ట్ సబ్' వల్ల ఫీల్డ్లో వారి సామర్థ్యాన్ని పరీక్షించుకునేందుకు అవకాశం లభించడం లేదు. కేవలం 6 బంతులు ఆడే హిట్టింగ్ సామర్థ్యం కోసం మాత్రమే ప్లేయర్లను వాడుకోవడం సరికాదు.ఆటగాడి నుంచి అన్ని కోణాలూ (బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్) ఆశించకపోయినా, కనీసం అతను మైదానంలో ఉండి గేమ్ను ఆస్వాదించాలి. ఒక క్యాచ్ డ్రాప్ చేసినప్పుడు కలిగే ఒత్తిడి, ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్లో రాణించాలనే కసి ఒక ఆటగాడి మానసిక దృఢత్వాన్ని పెంచుతాయి. ఇప్పుడు అవన్నీ లేవు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఆటగాళ్లను కష్టపడే స్వభావాన్ని కోల్పోయేలా చేస్తుంది.అందుకే ఇంపాక్ట్ రూల్ను బీసీసీఐ రద్దు చేయాలని కోరుకుటున్నాను" అని మంజ్రేకర్ స్పోర్ట్స్ స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజ్రేకర్ పేర్కొన్నాడు. -
సన్రైజర్స్ను చిత్తు చేసిన గుజరాత్
IPL 2026 SRH vs GT Live Updates: అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 82 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. 168 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక ఆరెంజ్ ఆర్మీ చతికిలబడింది. గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ల ధాటికి హైదరాబాద్ జట్టు 14.5 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలింది. గుజరాత్ బౌలర్లలో రబాడ, జాసన్ హోల్డర్ తలా మూడు వికెట్లతో సత్తాచాటగా.. ప్రసిద్ద్ రెండు, సిరాజ్, రషీద్ ఖాన్ ఓ వికెట్ సాధించారు.ఓటమి దిశగా ఎస్ఆర్హెచ్ఎస్ఆర్హెచ్ 72 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.పీకల్లోతు కష్టాల్లో సన్రైజర్స్ఎస్ఆర్హెచ్ ఆరో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన క్లాసెన్.. జాసన్ హోల్డర్ బౌలింగ్లో ఔటయ్యాడు. 10.1 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 56/6ఎస్ఆర్హెచ్ ఐదో వికెట్ డౌన్ఎస్ఆర్హెచ్ ఐదో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన సైల్ ఆరోరా.. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో ఔటయ్యాడు.ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ డౌన్ఎస్ఆర్హెచ్ 34 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 9 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 54/4. క్రీజులో సైల్ ఆరోరా(16), హెన్రిచ్ క్లాసెన్(13) ఉన్నారు.ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ డౌన్ఇషాన్ కిషన్ రూపంలో ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన ఇషాన్ కిషన్.. రబాడ బౌలింగ్లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్: 29/3ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ డౌన్అభిషేక్ శర్మ రూపంలో ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన అభిషేక్.. రబాడ బౌలింగ్లో ఔటయ్యాడు.ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ డౌన్169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్కు గట్టి ఎదురు దెబ్బ తగలింది. డేంజరస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్.. మొహ్మద్ సిరాజ్ బౌలింగ్లో ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు.సాయి,వాషీ హాఫ్ సెంచరీలు.. ఎస్ఆర్హెచ్ టార్గెట్ ఎంతంటే?టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో సాయిసుదర్శన్(61), వాషింగ్టన్ సుందర్(50) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ప్రపుల్ హింగే, షకీబ్ తలా రెండు వికెట్లు సాధించారు. కెప్టెన్ శుభ్మన్ గిల్(5)తో పాటు జోస్ బట్లర్(7) విఫలమయ్యాడు.14 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 107/314 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. క్రీజులో సాయిసుదర్శన్(55), వాషింగ్టన్ సుందర్(14) ఉన్నారు.గుజరాత్ రెండో వికెట్ డౌన్26 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 7 పరుగులు చేసిన జోస్ బట్లర్.. ప్రపుల్ హింగే బౌలింగ్లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు గుజరాత్ టైటాన్స్ స్కోర్: 34/2గుజరాత్ తొలి వికెట్ డౌన్15 పరుగుల వద్ద గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన శుభ్మన్ గిల్.. ప్రపుల్ హింగే బౌలింగ్లో ఔటయ్యాడు.ఐపీఎల్-2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు కూడా ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి.తుది జట్లుసన్రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, నితీష్ కుమార్ రెడ్డి, స్మరణ్ రవిచంద్రన్, పాట్ కమిన్స్(కెప్టెన్), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగేగుజరాత్ టైటాన్స్ : శుభ్మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, నిశాంత్ సింధు, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్ -
చీర్గర్ల్స్ చిందులు.. కళ్లప్పగించిన పోలీసులు!
ఐపీఎల్ 2026 సీజన్ దగ్గరపడుతున్న కొద్దీ రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికీ ప్లేఆఫ్స్కు చేరే జట్లపై ఇంకా స్పష్టత రాలేదు. ముంబై, లక్నో ఎలిమినేట్ కాగా ప్లేఆఫ్స్ స్థానం కోసం ఎనిమిది జట్లు పోటీ పడుతున్నాయి. అయితే అందులో ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, పంజాబ్, గుజరాత్కు ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ టీ20 మ్యాచ్లు కావడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందనేది ఊహించడం కష్టం. అందుకే సీజన్లో అన్ని లీగ్ మ్యాచ్లు పూర్త య్యాకే ప్లేఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ రానుంది. ఈ విషయం పక్కనబెడితే ఐపీఎల్ మ్యాచ్లను వీక్షించడానికి వచ్చే అభిమానులకు, ఆటగాళ్లకు చీర్గర్ల్స్ తమ నృత్యాలతో అలరించడం చూస్తూనే ఉంటాం. అయితే ఆదివారం రాయ్పూర్ వేదికగా ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య మ్యాచ్ సమయంలో జరిగిన ఆసక్తికర ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయంలోకి వెళితే ఆర్సీబీ బ్యాటింగ్ సమయంలో స్ట్రాటజిక్ టైమ్ అవుట్ ఇచ్చారు. ఈ సమయంలో ముంబై ఇండియన్స్కు చెందిన చీర్ గర్ల్స్ ఫోడియంపై చిందులు వేస్తున్నారు. అందులో ఒక చీర్గర్ల్ అక్కడే ఉన్న పోలీసులను చూస్తూ నృత్యం చేసింది. దీంతో అక్కడే డ్యూటీ చేస్తున్న పోలీసులు చీర్ గర్ల్స్ నృత్యాలను కళ్లప్పగించి అలా చూస్తూ ఉండిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరలవుతోంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ఆర్సీబీ 2 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 7 వికెట్ నష్టానికి 166 పరుగులు చేసింది. అనంతరం ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓటమితో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 19వ సీజన్ నుంచి ఎలిమినేట్ కాగా.. ఆర్సీబీ 14 పాయింట్లతో టేబుల్ టాపర్గా నిలిచింది. ఆర్సీబీ తన తర్వాతి మ్యాచ్లో కేకేఆర్ను ఎదుర్కోనుండగా, ముంబై ఇండియన్స్ పంజాబ్తో తలపడనుంది.Raipur police enjoying watching the Mumbai Indians cheerleaders during the MI vs RCB match.😅 pic.twitter.com/xichgo4HEw— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) May 11, 2026చదవండి: అక్షర్ పటేల్కు భారీ జరిమానా! -
అక్షర్ పటేల్కు భారీ జరిమానా!
ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసినప్పటికీ, ఆ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్కు చేదు అనుభవం ఎదురైంది. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా అక్షర్ పటేల్పై బీసీసీఐ భారీ జరిమానా విధించింది. నిర్ణీత సమయంలోగా ఓవర్ల కోటాను పూర్తి చేయడంలో విఫలమైనందుకు అక్షర్ పటేల్కు రూ.12 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది.పంజాబ్తో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22ను ఉల్లంఘించినట్లు అధికారులు నిర్ధారించారు. అయితే ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ఇది తొలి తప్పిదం కావడంతో కేవలం కెప్టెన్కు మాత్రమే జరిమానా విధించారు. ఇదే తప్పు మళ్లీ పునరావృతమైతే కెప్టెన్తో పాటు జట్టు సభ్యులపై కూడా జరిమానాలు విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య 56 పరుగులతో రాణించగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 59 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్కార్ట్, మాధవ్ తివారీ రెండేసి వికెట్లు తీశారు. 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ ఆరంభంలోనే తడబడింది. 74 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. అయితే కెప్టెన్ అక్షర్ పటేల్ 56 పరుగులతో అర్ధసెంచరీ చేసి జట్టును ఆదుకోగా, డేవిడ్ మిల్లర్ 51 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ ఔటైన తర్వాత అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ మెరుపు బ్యాటింగ్తో మ్యాచ్ను ఢిల్లీ వైపు తిప్పేశారు. కేవలం 19 ఓవర్లలోనే 216 పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ తమ ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.చదవండి: ‘బౌలర్లకు అన్యాయం.. ఆ నిబంధన సవరించాలి’ -
పాక్కు షాకిచ్చిన బంగ్లాదేశ్.. 24 ఏళ్లలో ఇదే తొలిసారి
ఢాకా వేదికగా పాకిస్తాన్తో జరిగిన తొలి టెస్టులో 104 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. 268 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పర్యాటక పాక్ జట్టు 52.5 ఓవర్లలో 163 రన్స్కే కుప్పకూలింది. బంగ్లా పేసర్ల ఉచ్చులో చిక్కుకుని పాక్ బ్యాటర్లు విలవిల్లాడారు.ముఖ్యంగా యువ ఫాస్ట్ బౌలర్ నహిద్ రాణా అద్భుత ప్రదర్శన చేశాడు. కేవలం 9.5 ఓవర్లలోనే 40 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి పాక్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు టాస్కిన్ అహ్మద్, తైజుల్ ఇస్లాం తలా రెండు వికెట్లు సాధించారు. పాక్ బ్యాటర్లలో అబ్దుల్లా ఫజల్(66) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తమ మొదటి ఇన్నింగ్స్లో 413 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ నజ్ముల్ హోస్సేన్ షాంటో(101) సెంచరీతో కదం తొక్కగా..మోమినల్ హక్(91), ముష్ఫికర్ రహీమ్(71) హాఫ్ సెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో మహ్మద్ అబ్బాస్ ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్ కూడా ధీటుగా బదులిచ్చింది. అరంగేట్ర ఆటగాడు అజాన్ అవైస్(103) శతక్కొట్టగా.. అబ్దుల్లా ఫజల్(60), సల్మాన్ అలీ అఘా(58), మహ్మద్ రిజ్వాన్(59) రాణించారు. బంగ్లా స్పిన్నర్ మెహదీ హసన్ మిరాజ్ 5 వికెట్ల సత్తాచాటాడు. 17 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన బంగ్లాదేశ్ 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో లభించిన ఆధిక్యాన్ని జోడించి ప్రత్యర్ధి ముందు 268 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక పాకిస్తాన్ చతికిలబడింది. కాగా బంగ్లాదేశ్ తన టెస్ట్ క్రికెట్ చరిత్రలో స్వదేశంలో పాకిస్తాన్ ఓడించడం ఇదే తొలిసారి.బంగ్లా జట్టు స్వదేశంలో పాకిస్తాన్తో మొట్టమొదటి టెస్టు 2002లో ఆడింది. ఇప్పుడు 24 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై పాక్పై తొలి టెస్టు విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో టెస్ట్ మ్యాచ్ మే 16 నుంచి సిల్హెట్ వేదికగా ప్రారంభం కానుంది.చదవండి: క్రికెట్ చరిత్రలో పెను సంచలనం.. 50 ఓవర్లలో 822 పరుగులు! -
క్రికెట్ చరిత్రలో పెను సంచలనం.. 50 ఓవర్లలో 822 పరుగులు!
సాధారణంగా 50 ఓవర్ల క్రికెట్లో ఓ జట్టు 400 పరుగులు సాధిస్తే అతి భారీ స్కోర్గా చెప్పుకుంటాం. అటువంటిది జింబాబ్వే వేదికగా జరుగుతున్న దేశవాళీ వన్డే టోర్నమెంట్లో ఓ జట్టు ఏకంగా 822 పరుగులు సాధించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.మాస్వింగో 50 ఓవర్ల ఫస్ట్ లీగ్లో భాగంగా సోమవారం స్కోర్పియన్ క్రికెట్ క్లబ్, మీథేన్ లయన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన స్కోర్పియన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 822 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఓపెనర్లు విల్ఫ్రెడ్ మాటెండే, తకుండా మడెంబో ఆరంభం నుంచే బౌండరీల వర్షం కురిపించారు. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశారు. వారిని ఆపడం ఎవరి తరం కాలేదు. వారి విధ్వంసం ధాటికి ఫీల్డర్లు కేవలం ప్రేక్షక పాత్ర పోషించారు. తకుండా మడెంబో (143 బంతుల్లో 50 ఫోర్లు, 7 సిక్స్లతో 302) ట్రిపుల్ సెంచరీతో చెలరేగగా.. విల్ఫ్రెడ్ మాటెండే(75 బంతుల్లో 23 ఫోర్లు, 13 సిక్స్లతో 203) ద్విశతకం బాదాడు. వీరిద్దరితో పాటు గార్భియల్ జయ(49 బంతుల్లో 110) మెరుపు సెంచరీ సాధించాడు.కుప్పకూలిన మీథేన్అనంతరం 822 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మీథేన్ లయన్స్ జట్టు, కేవలం 28 పరుగులకే కుప్పకూలింది. దీంతో స్కోర్పియన్ క్రికెట్ క్లబ్ ఏకంగా 794 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్కు సంబంధించిన స్కోర్ కార్డ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఒకవేళ ఇది అధికారిక 'లిస్ట్ ఏ' మ్యాచ్ అయ్యుంటే, ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఇది ఒక తిరుగులేని రికార్డుగా నిలిచిపోయేది.చదవండి: Shreyas Iyer: ‘అతి తెలివి కొంపముంచింది.. అందుకే ఓడిపోయాం’ -
‘బౌలర్లకు అన్యాయం.. ఆ నిబంధన సవరించాలి’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్యాటర్లతో పాటు బౌలర్లకు సమాన అవకాశాలు రావాలంటే బౌలర్లు నాలుగు ఓవర్లకు పరిమితం కాకుండా ఐదు ఓవర్లు వేసేలా నిబంధనలను సవరించాలని బీసీసీఐకి కీలక సూచన చేశారు. దీనివల్ల జట్టులోని బెస్ట్ బౌలర్ సేవలను మరింతగా ఉపయోగించుకునేందుకు అవకాశమంటుందని తెలిపారు.మిడ్-డే కాలమ్లో గావస్కర్ స్పందిస్తూ..'ఈ సీజన్ సగానికి పైగా పూర్తయింది. ఇప్పటికే 46 సార్లు 200-పైగా స్కోర్లు నమోదయ్యాయి, ఇందులో సన్రైజర్స్ హైదరాబాద్ 8 సార్లు ఈ ఘనతను సాధించింది. ఆశ్చర్యకరంగా 26 సార్లు కనీసం ఒక జట్టు 200 పరుగుల మార్కును దాటగా, 20 సందర్భాలలో ఇరు జట్లు 200 పరుగుల మార్కును దాటాయి. జట్టు అవసరమని భావిస్తే, ఒక మ్యాచ్లో బౌలర్ను ఐదు ఓవర్లు బౌలింగ్ చేయడానికి అనుమతించే నిబంధనను అమలు చేస్తే బాగుంటుంది. టీ20ల్లో బౌలర్లకు కేవలం 4 ఓవర్లు మాత్రమే వేసేందుకు అవకాశమున్నప్పటికీ, ఒక అదనపు ఓవర్ను వేయించడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు. అయితే ఒక బ్యాటర్ మొత్తం 20 ఓవర్లు బ్యాటింగ్ చేసేందుకు అవకాశమున్నప్పుడు, బౌలర్కు మాత్రం ఒక ఓవర్ ఎక్కువగా వేసేందుకు ఎందుకు అనుమతించకూడదన్నది నా ప్రశ్న.ఈ మేరకు నిబంధనలు సవరించి బౌలర్లకు న్యాయం చేయాలి. దీనివల్ల ఆయా జట్లు కేవలం పరుగులు కాపాడుకోవడానికే కాకుండా, వికెట్లు తీసేందుకు కూడా ఆస్కారం ఉంటుంది. అంతేకాదు ఒక జట్టులో ముగ్గురు బెస్ట్ బౌలర్లు ఉన్నప్పుడు వారితో తలా ఐదు ఓవర్లు బౌలింగ్ చేయించేందుకు మార్గం సుగమం అవుతోంది' అంటూ తన కాలమ్లో రాసుకొచ్చారు. ఈ నిబంధనను ఐపీఎల్లో ప్రయత్నించడానికి ముందు దేశీయ స్థాయిలో అమలు చేస్తే బాగుంటుందని గావస్కర్ అభిప్రాయపడ్డారు. టీ20 ఫార్మాట్ అయిన ముస్తాక్ అలీ ట్రోఫీలో ప్రయత్నిచడం ద్వారా ఫలితాలు చూడవచ్చన్నారు. వచ్చే సీజన్ లేదా ఐపీఎల్ 2028 సీజన్ నుంచి ఈ నిబంధనను ఉపయోగిస్తే చూడాలని ఉందని గావస్కర్ తెలిపారు.చదవండి: పాక్ బౌలర్ ప్రపంచ రికార్డు! -
'చపాతీల కంటే బౌలర్లను ఉతకడం మేలు'
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సూపర్ ఫామ్లో ఉన్న సంగతి తెలిసిందే. జట్టు వరుస ఓటములు చవిచూస్తున్నప్పటికీ వైభవ్ మాత్రం ప్రతీ మ్యాచ్లో దనాధన్ ఆటను ప్రదర్శిస్తూ ఇన్నింగ్స్ ఆరంభంలోనే గట్టి పునాది వేస్తున్నాడు. ప్రస్తుతం సూర్యవంశీ 11 మ్యాచ్ల్లో 440 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో టేబుల్ టాపర్గా నిలిచిన రాజస్తాన్ క్రమంగా ఓటములు ఎదుర్కొంది. 11 మ్యాచ్ల్లో 6 విజయాలు, 5 ఓటములతో రాజస్తాన్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. రాజస్తాన్ తన తర్వాతి మ్యాచ్ మే 17న ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడనుంది. మ్యాచ్కు వారం రోజులు గ్యాప్ రావడంతో రాజస్తాన్ ఆటగాళ్లు బ్రేక్ మోడ్లోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే రాజస్తాన్ యాజమాన్యం తాజాగా ఆటగాళ్లకు సంబంధించి ఫన్నీ వీడియోలను తమ ఎక్స్ ఖాతాలో పంచుకుంది. దీనిలో భాగంగా వైభవ్ సూర్యవంశీ చపాతీలు కాలుస్తున్న వీడియోనూ పంచుకుంది. ఆ వీడియోలో వైభవ్ మాస్టర్ చెఫ్ అవతారంలో చపాతీలు కాలుస్తూ కనిపించాడు.'నేను చేసే చపాతీలతో పోలిస్తే మా అమ్మ చేసే చపాతీలు భిన్నంగా ఉంటాయి. చపాతీలు కాల్చడం కంటే బౌలర్లను ఉతకడం మేలు' అని నవ్వుతూ పేర్కొన్నాడు. వైభవ్ చపాతీలు కాలుస్తున్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది.𝘔𝘶𝘮𝘮𝘺 𝘬𝘦 𝘳𝘰𝘵𝘪 𝘴𝘦 𝘻𝘺𝘢𝘥𝘢 𝘨𝘰𝘭 𝘳𝘰𝘵𝘪 𝘩𝘢𝘪 😂💗 pic.twitter.com/qOqthFPWXU— Rajasthan Royals (@rajasthanroyals) May 12, 2026చదవండి: ఆస్ట్రేలియన్ టెన్నిస్ దిగ్గజం కన్నుమూత! -
పాక్ బౌలర్ ప్రపంచ రికార్డు!
బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ ఆటగాళ్లు రికార్డుల మీద రికార్డులు సాధిస్తున్నారు. ఇప్పటికే టెస్టుల్లో 400 వికెట్ల మార్క్తో షాహిన్ అఫ్రిది కొత్త రికార్డు నెలకొల్పగా.. తాజాగా పాకిస్తాన్ స్పిన్నర్ నోమన్ అలీ టెస్టులో వంద వికెట్ల మార్క్ను సాధించాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 69.1 ఓవర్లో మెహదీ హసన్ మిరాజ్ను పెవిలియన్ చేర్చడం ద్వారా నోమన్ అలీ ఈ ఫీట్ సాధించాడు. తద్వారా టెస్టు క్రికెట్లో వంద వికెట్ల మార్క్ సాధించిన పెద్ద వయస్కుడిగా నోమన్ అలీ నిలిచాడు. 22 టెస్టుల్లో వంద వికెట్ల మార్క్ అందుకున్న నోమన్ అలీ ప్రస్తుత వయస్సు 39 ఏళ్ల 213 రోజులు. నోమన్ అలీ కంటే ముందు ఈ రికార్డు బాబీ పీల్ (39 ఏళ్ల 180 రోజులు) పేరిట ఉండేది. రే విల్లింగ్టన్ (39 ఏళ్ల 30 రోజులు), క్లారీ గ్రిమ్మెట్ (39 ఏళ్ల 22 రోజులు), సిడ్నీ బార్న్స్ (38 ఏళ్ల 310 రోజులు) కూడా పెద్ద వయసులోనే వంద వికెట్ల మార్క్ సాధించారు. అంతేకాదు పాక్ తరఫున తక్కువ టెస్టుల్లో వంద వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చోటు దక్కించుకున్న నోమన్ అలీ ఆ జట్టు మాజీ ఆల్రౌండర్ అబ్దుల్ రజాక్ రికార్డును సవరించాడు. 2021లో పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన నోమన్ అలీ 100 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన తర్వాత కానీ అతడికి తొలి మ్యాచ్ ఆడే అవకాశం లభించలేదు. 2024లో సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్ను 1-0తో పాకిస్తాన్ గెలవడంలో నోమన్ అలీ పాత్ర కీలకం. 22 మ్యాచ్ల్లో 101 వికెట్లు సాధించిన నోమన్ అలీ 9 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఇందులో మూడు మ్యాచ్ల్లో రెండు ఇన్నింగ్స్లు కలిపి పది వికెట్ల ఫీట్ను అందుకున్నాడు. మ్యాచ్ విషయానికొస్తే చివరి రోజు ఆటలో పాకిస్తాన్ విజయం కోసం కష్టపడుతోంది. బంగ్లా విధించిన 268 పరుగుల టార్గెట్ను ఛేదించే క్రమంలో తడబడుతున్న పాకిస్తాన్ ప్రస్తుతం 38 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 139 పరుగులతో ఆడుతోంది. సాద్ షకీల్ (10), రిజ్వాన్ (7) క్రీజులో ఉన్నారు. పాక్ విజయానికి మరో 128 పరుగులు అవసరం.చదవండి: ‘అతి తెలివి కొంపముంచింది.. అందుకే ఓడిపోయాం’ -
ఆస్ట్రేలియన్ టెన్నిస్ దిగ్గజం కన్నుమూత!
ఆస్ట్రేలియా టెన్నిస్ దిగ్గజం మాల్ అండర్సన్ (91) కన్నుమూశాడు. అనారోగ్య సమస్యలతో సోమవారం తన ఇంట్లోనే తుదిశ్వాస విడిచాడు. ఆస్ట్రేలియా తరఫున యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ నెగ్గిన తొలి అన్సీడెడ్ ప్లేయర్గా మాల్ అండర్సన్ చరిత్ర సృష్టించాడు. వ్యవసాయక్షేత్రంలోని మట్టికోర్టుపై ప్రాక్టీస్ను ఆరంభించిన అండర్సన్ ఆ తర్వాత టెన్నిస్లో దిగ్గజ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. 1957లో యూఎస్ క్రౌన్ టైటిల్ నెగ్గిన అండర్సన్, మూడు డబుల్స్ టైటిల్స్ కూడా సాదించాడు. యునైటెడ్ స్టేట్స్ చాంపియన్షిప్ సాధించిన అన్సీడెడ్ క్రీడాకారుడిగా అండర్సన్ నిలిచాడు. ఇక ప్రతిష్ఠాత్మక డేవిస్ కప్ను కూడా అండర్సన్ రెండుసార్లు సాధించి చరిత్ర సృష్టించాడు.ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత అండర్సన్, ప్రపంచ నంబర్ వన్గా ఎదిగిన పాట్ రాఫ్టర్ సహా ఎంతోమంది యువ ఆస్ట్రేలియన్ ఆటగాళ్లకు మార్గనిర్దేశనం చేశాడు. మాల్ అండర్సన్ మరణంపై పాట్ రాఫ్టర్ స్పందించాడు. మాల్ మరణవార్త విని నేను చాలా బాధపడ్డాను. నా కెరీర్ ప్రారంభంలో టెన్నిస్లో మెళుకువలు తీర్చిదిద్దడంలో మాల్ అండర్సన్ ఎంతగానో సహాయపడ్డారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా" అని పాట్ రాఫ్టర్ పేర్కొన్నాడు. -
‘అతి తెలివి కొంపముంచింది.. అందుకే ఓడిపోయాం’
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలయ్యింది. 200 పరుగులకు పైగా టార్గెట్ నిర్దేశించి కూడా పంజాబ్ ఓడిపోవడంపై విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా స్పిన్నర్లకు అనుకూలించే ధర్మశాల పిచ్పై పంజాబ్ కెప్టెన్ అయ్యర్ ఒక్క ఓవర్ కూడా స్పిన్నర్లతో వేయించకపోవడం ఆ జట్టును దెబ్బతీసిందని చెప్పొచ్చు. మరోవైపు ఢిల్లీ కూడా ఒక్క స్పిన్నర్తోనై బౌలింగ్ చేయించకపోవడం గమనార్హం. ఇక మ్యాచ్ ఓటమి అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడాడు. ‘ధర్మశాల వంటి ఫ్లాట్ పిచ్పై 210 పరుగుల లక్ష్యం చాలా ఎక్కువ. కానీ సీమర్లకు అనుకూలిస్తున్న పిచ్పై మరో 20 నుంచి 30 పరుగులు చేసి ఉంటే బాగుండేదేమో. చాహల్తో ఒక్క ఓవర్ కూడా వేయించకపోవడం వెనుక ఒకటే కారణం. బంతి సీమర్లకు బాగా అనుకూలిస్తుందని భావించాను. కొత్త బ్యాటర్ క్రీజులోకి వచ్చినప్పుడు హార్డ్ లెంగ్త్లో బౌలింగ్ చేయడం ఉత్తమం. అక్కడ నిలకడగా బౌలింగ్ చేస్తే కనీసం ఒక్క బంతయినా మిస్-హిట్ అయ్యి వికెట్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మా సీమర్లు లైన్ అండ్ లెంగ్త్తో బంతులు విసరడంలో విఫలమయ్యారు. మా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవడంతో పాటు ఫీల్డింగ్లో లోపాలు మా కొంపముంచాయి. మా ప్రణాళికలన్నీ ఆచరణలో దారుణంగా విఫలమయ్యాయి.’ అని అయ్యర్ చెప్పుకొచ్చాడు. ఈ ఓటమితో పంజాబ్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోగా, ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.చదవండి: ‘ఐసీసీ మాట వినలేదు.. మాకు ఇది జరగాల్సిందే’ -
ఢిల్లీ-పంజాబ్ మ్యాచ్ వివాదాస్పదం.. బీసీసీఐపై విమర్శలు
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (మే 11) జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్-పంజాబ్ కింగ్స్ మ్యాచ్ వివాదాస్సదమైంది. ఈ మ్యాచ్ అనంతరం జరిగిన అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం వివాదానికి దారి తీసింది.ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ యువ ఆల్రౌండర్ మాధవ్ తివారి అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. మాధవ్కు ఈ అవార్డు అందజేసిన వ్యక్తి ఓ వివాదాస్పద కేసులో నిందితుడిగా ఉన్నాడు. అతని పేరు గౌతమ్ మల్హోత్రా. పంజాబ్కు చెందిన ఈ వ్యాపారవేత్త పేరు ఢిల్లీ లిక్కర్ కేసులో వినిపించింది. ఈ కేసులో అతను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణను కూడా ఎదుర్కొన్నారు.ఆయనపై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద కేసులు నమోదయ్యాయి. మాజీ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన సీబీఐ ఎఫ్ఐఆర్లో కూడా ఆయన పేరు ప్రస్తావనకు వచ్చింది.లైవ్లా బిజ్ నివేదికల ప్రకారం, గౌతమ్ మల్హోత్రా రూ.2.5 కోట్ల లంచాల వ్యవహారంలో భాగమైనట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే లిక్కర్ వ్యాపారంలో అక్రమ లాభాలు పొందినట్లు కూడా దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. అయితే అనంతరం సరిపడా ఆధారాలు లేవన్న కారణంతో 2026 ఫిబ్రవరిలో ఢిల్లీ కోర్టు ఆయనకు ఉపశమనం కల్పించింది.అయినా సరే, ఇలాంటి వివాదాస్పద వ్యక్తిని ఐపీఎల్ అవార్డు కార్యక్రమానికి ఎంపిక చేయడం బీసీసీఐ నిర్లక్ష్యానికి నిదర్శనమని క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. బీసీసీఐ చేసిన అతిపెద్ద తప్పిదం ఇది అంటూ సోషల్మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరికొందరు మాత్రం క్లియరెన్స్ లభించిన వ్యక్తిని ఆహ్వానించడం తప్పేమీ కాదని సమర్థిస్తున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. మాధవ్ తివారి అద్భుతమైన ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షించాడు. కేవలం రెండో ఐపీఎల్ మ్యాచ్లోనే కీలక ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీ విజయానికి ప్రధాన కారణంగా నిలిచాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ భారీ స్కోరు సాధించింది. 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఒక దశలో ఓటమి ఖాయమనే స్థితికి చేరింది.కానీ కెప్టెన్ అక్షర్ పటేల్, అనుభవజ్ఞుడు డేవిడ్ మిల్లర్ జట్టును పోటీలో నిలబెట్టారు. చివర్లో అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ, ఆకిబ్ నబీ వేగంగా పరుగులు చేసి ఢిల్లీకి సంచలన విజయాన్ని అందించారు.ఈ మ్యాచ్లో మాధవ్ తివారీ రెండు కీలక వికెట్లు తీసుకోవడంతో పాటు కేవలం 8 బంతుల్లో 18 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ప్రకటించారు. ఈ గెలుపుతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. -
‘ఐసీసీ మాట వినలేదు.. మాకు ఇది జరగాల్సిందే’
2026 టీ20 ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ వైదొలుగుతూ తీసుకున్న నిర్ణయం అప్పట్లో ప్రకంపనలు సృష్టించింది. తమ దేశంలో మతపరమైన ఉద్రిక్తతల కారణంగా ముస్తాఫిజుర్ను కేకేఆర్ తొలగించడంపై బీసీబీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆటగాళ్ల భద్రతకు సంబం ధించి కారణాలు ఎత్తిచూపుతూ ప్రపంచకప్లో తమ మ్యాచ్ వేదికలను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) చేసిన అభ్యర్థనను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తోసిపుచ్చింది. అయితే ఆటగాళ్ల భద్రతపై ఆందోళన అవసరం లేదని పేర్కొన్న ఐసీసీ మ్యాచ్ వేదికలను మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. దీంతో బంగ్లాదేశ్ జట్టు ప్రపంచకప్ నుంచి వైదొలుగున్నట్లు బీసీబీ ప్రకటన విడుదల చేసింది. దీంతో బంగ్లాదేశ్ స్థానంలోకి స్కాట్లాండ్ రావడం, ఆ తర్వాత ప్రపంచకప్ సజావుగా సాగిపోయింది. తాజాగా ఈ అంశంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తాత్కాలిక అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ స్పందించాడు. ఆనాడు ఐసీసీ మాటను వినకుండా బీసీబీ తప్పు చేసిందని, ఆ టోర్నీ ఆడకపోవడం వల్ల ఆర్థికంగా తాము చాలా నష్టపోవాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ జట్టు వైదొలగడం వెనుక అప్పటి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తప్పుబట్టాడు. ‘టీ20 ప్రపంచకప్ వివాదం జరిగినప్పుడు మొదట నేనే గళం విప్పాను. నిజానికి గత బీసీబీ పరిపాలన విభాగం వ్యవహరించిన తీరు సరైనది కాదు. ఈ విషయంలో ఐసీసీ కూడా ఉదాసీనంగా వ్యవహరించింది. అప్పుడే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఒక పరిష్కారం కనుగొనడానికి ఆస్కారం ఉండేది. కానీ బీసీబీ ఐసీసీ మాట వినకుండా తప్పు చేసింది. దీనివల్ల బంగ్లాదేశ్ జట్టు తీవ్రంగా నష్టపోయింది. ఇక 1996-97 వన్డే ప్రపంచకప్కు అర్హత సాధించడం కోసం కెన్యాపై ఐసీసీ ట్రోఫీని గెలిచినప్పుడు బంగ్లాదేశ్ అంతటా ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఆనాటి సంబరాలు మమ్మల్ని క్రికెట్వైపు ఆకర్షించాయి. ప్రతీ ఒక్కరు మిన్హాజుల్ అబెదిన్ నన్ను, ఖలీద్ మషూద్, అక్రమ్ ఖాన్ లాగా తయారవ్వాలనుకున్నారు. అప్పటి నుంచే బంగ్లా క్రికెట్ క్రమంగా ఎదుగుతూ వచ్చింది. సరైన చర్చ జరగకుండానే 2026 టీ20 ప్రపంచకప్ నుంచి వైదొలగడం బాధాకరం. ఆ జట్టులో ఉన్న కొందరు ఆటగాళ్ల వచ్చే ప్రపంచకప్లో ఆడకపోవచ్చు. అయితే ఇప్పుడు సమస్యలు అన్నీ సమసిపోయాయి. బీసీసీఐతో మంచి సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్తో నాకు మంచి అనుబంధముంది. ఇద్దరం కలిసి ఐపీఎల్లో ఒకే జట్టుకు ఆడాం. ఢాకా ప్రీమియర్ లీగ్ ఆడేందుకు ఆయన చాలాసార్లు బంగ్లాదేశ్కు వచ్చారు. నేను అధ్యక్ష హోదాలో ఇంకా ఆయన్ను కలవలేదు. బహుశా అది త్వరలో జరగవచ్చు. ఇక ప్రస్తుతం బంగ్లాదేశ్లో భద్రత చాలా బాగుంది. త్వరలోనే బీసీసీఐతో సమావేశం జరిపి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ నిర్వహించేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. త్వరలోనే భారత్, బంగ్లాదేశ్ మధ్య సిరీస్తో ఇరు దేశాల మధ్య క్రీడా బంధం బలపడుతుందని ఆశిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు.చదవండి: ఆర్సీబీ, ముంబై మ్యాచ్ ఫిక్స్.. ఇదిగో సాక్ష్యం! -
వైభవ్ సరసన ప్రియాంశ్
పంజాబ్ కింగ్స్ విధ్వంసకర ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య ఐపీఎల్ కెరీర్లో మరో ప్రత్యేక రికార్డు సాధించాడు. 2026 ఎడిషన్లో భాగంగా నిన్న (మే 11) ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో పవర్ప్లేలోనే హాఫ్ సెంచరీ బాది రికార్డుపుటల్లో చోటు దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్లో ప్రియాంశ్ తొలి బంతి నుంచే దూకుడు ప్రదర్శించాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో భారీ సిక్సర్ బాది ఖాతా ప్రారంభించాడు. ఆ తర్వాత ఏ బౌలర్నీ వదలకుండా కేవలం 24 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు.ఈ ఇన్నింగ్స్తో ప్రియాంశ్ పవర్ప్లేలో అత్యధిక 50+ స్కోర్లు నమోదు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ సరసన చేరాడు. ఐపీఎల్ పవర్ప్లేల్లో అత్యధిక 50+ స్కోర్లు (భారత ఆటగాళ్లు):* వైభవ్ సూర్యవంశీ – 4* ప్రియాంశ్ ఆర్య – 3అలాగే ఐపీఎల్లో తొలి బంతికే (ఇన్నింగ్స్) అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.ఐపీఎల్ ఇన్నింగ్స్ తొలి బంతికి అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు:* యశస్వి జైస్వాల్ – 4* ప్రియాంశ్ ఆర్య – 3విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, సంజూ శాంసన్ తదితరులు తలో సారి ఇన్నింగ్స్ తొలి బంతికే సిక్సర్లు కొట్టారు.ఇదిలా ఉంటే, ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో ప్రియాంశ్ ఆర్య రికార్డు ఇన్నింగ్స్తో చెలరేగినా పంజాబ్ కింగ్స్కు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. ప్రియాంశ్తో పాటు శ్రేయస్ అయ్యర్ (59 నాటౌట్) కూడా సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది.భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఆదిలో తడబడినా, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుంది. అక్షర్ పటేల్ (56), డేవిడ్ మిల్లర్ (51) అద్భుత అర్ద సెంచరీలతో ఢిల్లీని గెలిపించారు. ఈ గెలుపుతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోగా.. పంజాబ్ ప్లే ఆఫ్స్ అవకాశాలను ఇరకాటంలో పడేసుకుంది. -
నంబర్ వన్గా టీమిండియా
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో భారత క్రికెట్ జట్టు అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 118 రేటింగ్ పాయింట్లతో నంబర్వన్ జట్టుగా కొనసాగుతుంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.గతేడాది ఛాంపియన్స్ ట్రోఫీ విజయంతో పాటు ద్వైపాక్షిక సిరీస్ల విజయాలు భారత జట్టు టాప్ ప్లేస్ నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాయి. అయితే గత ర్యాంకింగ్తో పోలిస్తే భారత్ ఒక రేటింగ్ పాయింట్ కోల్పోయింది. అయినా మిగతా జట్లపై మాత్రం స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది.తాజా ర్యాంకింగ్స్ ప్రకారం న్యూజిలాండ్ 113 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. కివీస్ జట్టు గత కొంతకాలంగా ఐసీసీ టోర్నీల్లో స్థిరమైన ప్రదర్శన కనబరుస్తూ వస్తుంది. ఇక ఆస్ట్రేలియా జట్టు 109 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా ఇటీవల జరిగిన సిరీస్లలో మంచి ఫలితాలు సాధించినప్పటికీ భారత్ను అధిగమించలేకపోయింది.ఈసారి ర్యాంకింగ్స్లో పెద్ద మార్పుగా సౌతాఫ్రికా జట్టు టాప్-4లోకి ఎంట్రీ ఇచ్చింది. 102 పాయింట్లతో దక్షిణాఫ్రికా నాలుగో స్థానానికి చేరగా, పాకిస్తాన్ 98 పాయింట్లతో ఐదో స్థానానికి పడిపోయింది. ప్రోటీస్ జట్టు ఇటీవల వన్డే ఫార్మాట్లో మెరుగైన ఫలితాలు నమోదు చేయడంతో నాలుగో స్థానానికి ఎగబాకింది.ఆ తర్వాతి స్థానాల్లో శ్రీలంక (96), ఆఫ్ఘనిస్తాన్ (93), ఇంగ్లండ్ (89), బంగ్లాదేశ్ (84), వెస్టిండీస్ (74) ఉన్నాయి.ఈ ర్యాంకింగ్స్కు మరో ప్రత్యేక ప్రాధాన్యత కూడా ఉంది. వరల్డ్కప్ 2027కు నేరుగా అర్హత సాధించే జట్లను నిర్ణయించడంలో ఇవి కీలకంగా మారనున్నాయి. 2027 మార్చి 31 నాటికి టాప్-8లో ఉన్న జట్లు నేరుగా ప్రపంచకప్కు అర్హత సాధిస్తాయి. ఆతిథ్య దేశాలైన సౌతాఫ్రికా, జింబాబ్వే ఇప్పటికే ఆటోమేటిక్ అర్హత పొందాయి.దీంతో ప్రస్తుతం టాప్-8లో కొనసాగుతున్న జట్ల మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్ వంటి జట్లు తమ స్థానాన్ని కాపాడుకునేందుకు కీలక సిరీస్లపై దృష్టి పెట్టనున్నాయి. భారత్ మాత్రం ప్రపంచ నంబర్వన్ జట్టుగా మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది. -
రిటైర్మెంట్ వెనక్కు తీసుకున్న సౌతాఫ్రికా దిగ్గజం
సౌతాఫ్రికా దిగ్గజ మహిళా క్రికెటర్ షబ్నిమ్ ఇస్మాయిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేయనుంది. వచ్చే నెల ప్రారంభమయ్యే ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ కోసం ఆమెను జట్టులోకి తీసుకునే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.37 ఏళ్ల ఈ వెటరన్ ఫాస్ట్ బౌలర్ 2023లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించింది. అదే ఏడాది స్వదేశంలో జరిగిన టీ20 ప్రపంచకప్లో సౌతాఫ్రికా ఫైనల్కు చేరడంలో కీలక పాత్ర పోషించింది. అయితే ఆమె రిటైర్మెంట్ తర్వాత సౌతాఫ్రికా బౌలింగ్ విభాగంలో లోటు స్పష్టంగా కనిపించింది.క్రికెట్ సౌతాఫ్రికా డైరెక్టర్ ఈనాక్, హెడ్ కోచ్ మండ్ల మషింబితో జరిగిన చర్చల అనంతరం షబ్నిమ్ తిరిగి ఆడేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. 2007లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన షబ్నిమ్.. ఓ టెస్ట్, 127 వన్డేలు, 113 టీ20ల్లో 317 వికెట్లు తీసింది.షబ్నిమ్ అంతర్జాతీయ రిటైర్మెంట్ తర్వాత కూడా ఫ్రాంచైజీ క్రికెట్లో అదరగొడుతోంది. ఆమె భారత్లో జరిగే వుమెన్స్ ప్రీమియర్ లీగ్, హండ్రెడ్ లీగ్, బిగ్బాష్ లీగ్ తదితర టోర్నీల్లో అద్భుత ప్రదర్శనలు చేసింది. మహిళల క్రికెట్లో అత్యంత వేగవంతమైన బంతి వేసిన రికార్డు కూడా షబ్నిమ్ పేరిటే ఉంది. కాగా, సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ డేన్ వాన్ నికెర్క్ కూడా గతేడాది రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని తిరిగి జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్కప్లో సౌతాఫ్రికా తమ తొలి మ్యాచ్ను జూన్ 13న ఆస్ట్రేలియాతో ఆడనుంది. ప్రపంచకప్ టైటిల్పై కన్నేసిన ప్రోటీస్ జట్టుకు షబ్నిమ్ ఇస్మాయిల్ రీఎంట్రీ భారీ ఊతమివ్వనుంది. -
చరిత్ర సృష్టించిన షాహీన్ అఫ్రిది
పాకిస్తాన్ స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిది చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో 100 వికెట్లు తీసిన తొలి పాకిస్తాన్ బౌలర్గా రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో షాహీన్ ఇప్పటికే 4 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ ఇంకా జరుగుతుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీలో షాహీన్ వికెట్ల సంఖ్య 103కు చేరింది.పాకిస్తాన్ తరఫున WTCలో అత్యధిక వికెట్లు:* షాహీన్ అఫ్రిది – 103* నౌమన్ అలీ – 89* సాజిద్ ఖాన్ – 63* నసీం షా – 60ఇదే మ్యాచ్లో షాహీన్ మరో ఘనత కూడా సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 400 వికెట్ల చారిత్రక మైలురాయిని తాకాడు. మొమినుల్ హక్ వికెట్ షాహీన్కు 400వ వికెట్. కేవలం 26 ఏళ్ల వయసులోనే 211 అంతర్జాతీయ మ్యాచ్ల్లో షాహీన్ ఈ ఘనత సాధించడం విశేషం. ప్రస్తుతం షాహీన్ ఖాతాలో వన్డేల్లో 139, టీ20ల్లో 136, టెస్ట్ల్లో 125 వికెట్లు ఉన్నాయి.తొమ్మిదో బౌలర్షాహీన్ 400 వికెట్ల క్లబ్లో చేరిన తొమ్మిదో పాకిస్తాన్ బౌలర్గా నిలిచాడు. ఈ జాబితాలో వసీం అక్రమ్ 916 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, వకార్ యూనిస్ 789 వికెట్లు, ఇమ్రాన్ ఖాన్ 544 వికెట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.పాకిస్తాన్ తరఫున అత్యధిక అంతర్జాతీయ వికెట్లు:* వసీం అక్రమ్ – 916* వకార్ యూనిస్ – 789* ఇమ్రాన్ ఖాన్ – 544* షాహిద్ అఫ్రిది – 538* సక్లెయిన్ ముస్తాక్ – 496* సయీద్ అజ్మల్ – 447* షోయబ్ అక్తర్ – 438* ఉమర్ గుల్ – 427* షాహీన్ అఫ్రిది – 400*కాగా, బంగ్లాదేశ్తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో పాక్ వెనుకపడింది. తొలి ఇన్నింగ్స్లో మెహిది హసన్ మిరాజ్ ఐదు వికెట్లు తీసి పాక్ను కట్టడి చేయగా, రెండో ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ 152/3 స్కోరుతో 179 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన బంగ్లా కెప్టెన్ షాంటో, రెండో ఇన్నింగ్స్లో 58 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. ప్రస్తుతం చివరి రోజు ఆట కొనసాగుతుంది. -
చరిత్రపుటల్లోకెక్కిన ఢిల్లీ-పంజాబ్ మ్యాచ్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (మే 11) జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్-పంజాబ్ కింగ్స్ మ్యాచ్ చరిత్రపుటల్లోకెక్కింది. ఈ మ్యాచ్లో అన్నీ ఓవర్లను పేసర్లే వేశారు. ఐపీఎల్ చరిత్రలో ఇలా జరగడం ఇది 13వ సారి మాత్రమే. చివరిగా ఇలాంటి సందర్భం 2016 ఎడిషన్లో వచ్చింది. ఆ ఎడిషన్లో ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ మధ్య జరిగిన ఓ మ్యాచ్లో అన్నీ ఓవర్లు పేసర్లే వేశారు. ఒక్క ఓవర్ను కూడా స్పిన్నర్ వేయలేదు.నిన్నటి ఢిల్లీ-పంజాబ్ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లోనూ కలిపి 39 ఓవర్లను పేస్ బౌలర్లే వేశారు. ఈ రికార్డుకు సంబంధించి 2008 ఎడిషన్లో ఆర్సీబీ-సీఎస్కే మ్యాచ్ (39.4 ఓవర్లు) తొలి స్థానంలో ఉంది. తాజా మ్యాచ్లో పంజాబ్ నిర్దేశించిన 211 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 19 ఓవర్లలోనే ఛేదించింది. లేదంటే ఆర్సీబీ-సీఎస్కే మ్యాచ్ రికార్డు కూడా బద్దలయ్యేది.కాగా, నిన్నటి మ్యాచ్లో ఢిల్లీ పంజాబ్పై గెలిచి ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మరో వైపు ఈ ఓటమితో పంజాబ్ ప్లే ఆఫ్స్ అవకాశాలను ఇరకాటంలో పడేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేయగా.. ఢిల్లీ 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.అక్షర్, చహల్కు పని లేదు..!నిన్నటి మ్యాచ్లో పిచ్ పేసర్లకు అనుకూలంగా మారడంతో ఇరు జట్ల కెప్టెన్లు స్పిన్నర్లను పక్కన పెట్టారు. స్వయంగా స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ బంతి తీసుకోలేదు. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చహల్ను జట్టులోకి తీసుకున్నా, అతనికి బంతినివ్వలేదు. అక్షర్ బౌలింగ్ వేయకపోయినా బ్యాటింగ్లో మెరిసి తన జట్టును గెలిపించుకున్నాడు. -
గెలిచి నిలిచింది.. అయినా అంత ఈజీ ఏమీ కాదు..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రెండు జట్ల పోరాటం అధికారికంగా ముగిసింది. లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా వైదొలిగాయి. నిన్నటితో ఢిల్లీ క్యాపిటల్స్ భవిష్యత్తు కూడా తేలిపోయేదే. అయితే ఆ జట్టు పంజాబ్తో జరిగిన మ్యాచ్లో అద్భుతమైన పోరాటాన్ని ప్రదర్శించి, ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.గెలిచి నిలిచినా ఢిల్లీ ప్లే ఆఫ్స్కు చేరడం అంత ఈజీ ఏమీ కాదు. మున్ముందు ఆ జట్టు మరిన్ని కఠినమైన సవాళ్లను ఎదుర్కోవాలి. ప్రస్తుతం ఢిల్లీ 12 మ్యాచ్ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్ బెర్త్పై ఆశలు కలిగి ఉండాలంటే, ఆ జట్టు తదుపరి ఆడాల్సిన రెండు మ్యాచ్ల్లో భారీ విజయాలు సాధించాలి. అప్పుడు కూడా ఫైనల్-4కు చేరుతుందన్న గ్యారెంటీ లేదు.ఎందుకుంటే ఢిల్లీ కంటే ముందు ఆరు జట్లు ప్లే ఆఫ్స్ బెర్త్ల కోసం హోరాహోరీగా పోరాడుతున్నాయి. నిన్నటి ఓటమితో అప్పటిదాకా ప్లే ఆఫ్స్ బెర్త్పై ధీమాగా ఉండిన పంజాబ్ కూడా పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తొలి 7 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించిన పంజాబ్.. చివరిగా ఆడిన నాలుగు మ్యాచ్ల్లో పరాజయాలు ఎదుర్కొని ప్లే ఆఫ్స్ అవకాశాలను ఇరకాటంలో పడేసుకుంది. ప్రస్తుతం ఆ జట్టు 11 మ్యాచ్ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఆర్సీబీ (14 పాయింట్లు), ఎస్ఆర్హెచ్ (14), గుజరాత్ (14).. పంజాబ్ కంటే (13) మెరుగైన స్థానాల్లో ఉన్నాయి.పంజాబ్ లాగే సీజన్ ప్రారంభంలో వరుస విజయాలు సాధించిన రాజస్థాన్ రాయల్స్ కూడా ప్లే ఆఫ్స్ రేసులో బలంగా ఉంది. ఆ జట్టు ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడి 6 విజయాలతో ఆరో స్థానంలో ఉంది. సీజన్ను పరాజయాలతో ప్రారంభించి అనూహ్యంగా విజయాల బాట పట్టిన సీఎస్కే కూడా ప్లే ఆఫ్స్ రేసులో బలంగా నిలబడింది. ఇప్పటివరకు ఆ జట్టు కూడా 11 మ్యాచ్లు ఆడి 6 విజయాలతో (12 పాయింట్లు) ఐదో స్థానంలో ఉంది.ఆర్సీబీ (14 పాయింట్లు), ఎస్ఆర్హెచ్ (14), గుజరాత్ (14) పంజాబ్ (13), సీఎస్కే (12), రాజస్థాన్ (12)ను కాదని కేవలం 10 పాయింట్లు ఉన్న ఢిల్లీ ప్లే ఆఫ్స్కు చేరడం దాదాపుగా అసాధ్యమే. పైగా ఆ జట్టుకు మరో రెండు మ్యాచ్లు మాత్రమే ఆడే అవకాశం ఉంది. టాప్-6 జట్లకు తలో మూడు మ్యాచ్ల అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఢిల్లీకి ప్లే ఆఫ్స్ అవకాశాలు లేనప్పటికీ.. పూర్తిగా లేకపోలేదని మాత్రం చెప్పలేము. ఎందుకంటే మన్ముందు ఏమైనా జరగవచ్చు. ఏ జట్లు ప్లే ఆఫ్స్కు చేరతాయని ఇప్పుడు అంచనా వేయడం కష్టం. -
ఫ్రాంచైజీని కొనేసిన రాహుల్ ద్రవిడ్
భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఇప్పటికే ఆటగాడిగా, కోచ్గా సక్సెస్ సాధించిన అతడు.. తాజాగా ఓ క్రికెట్ ఫ్రాంచైజీ యజమానిగా మారాడు. యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL)లో డబ్లిన్ ఫ్రాంచైజీ యాజమాన్య హక్కులను చేజిక్కించుకున్నాడు. ఈ విషయంపై నిన్న అధికారిక ప్రకటన వెలువడింది. ఈ జట్టుకు "Dublin Guardians" అని పేరు పెట్టారు.యూరప్లో తొలిసారి క్రాస్-బోర్డర్ ఫ్రాంచైజీ మోడల్తో ప్రారంభమవుతున్న ఈ లీగ్కు బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ప్రమోటర్గా వ్యవహరిస్తున్నారు. తాజాగా డబ్లిన్లో జరిగిన కార్యక్రమంలో ద్రవిడ్, అభిషేక్ బచ్చన్ ఇద్దరూ పాల్గొన్నారు.ఈ టోర్నీని క్రికెట్ ఐర్లాండ్, క్రికెట్ స్కాట్లాండ్ మరియు రాయల్ డచ్ క్రికెట్ అసోసియేషన్ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నారు. డబ్లిన్, బెల్ఫాస్ట్, ఎడిన్బర్గ్, గ్లాస్గో, ఆమ్స్టర్డామ్, రోటర్డామ్ నగరాలకు చెందిన ఆరు ఫ్రాంచైజీ ఈ లీగ్లో పోటీ పడనున్నాయి.డబ్లిన్ యజమాన్య హక్కులను చేజిక్కించుకున్న సందర్భంగా ద్రవిడ్ మాట్లాడుతూ.. యూరప్లో క్రికెట్ అభివృద్ధి, యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించడం అనే పెద్ద విజన్ తనను ఆకర్షించిందని తెలిపాడు.డబ్లిన్లో ఇప్పటికే మంచి క్రికెట్ కమ్యూనిటీ ఉంది. యువ ప్రతిభను ప్రోత్సహించడం నాకు ఎప్పుడూ ముఖ్యమే. ETPL ఆ దిశగా కీలక పాత్ర పోషించగలదని ఆశాభావం వ్యక్తం చేశాడు.కాగా, ETPLలో పలువురు అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు పాల్గొనే అవకాశముంది. అందులో మిచెల్ మార్ష్, టిమ్ డేవిడ్, మిచెల్ సాంట్నర్, గ్లెన్ మ్యాక్స్వెల్, ఫాఫ్ డుప్లెసిస్, హెన్రిచ్ క్లాసెన్ వంటి ప్రముఖులు ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబర్ మధ్య ఈ టోర్నీ నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో రాహుల్ ద్రవిడ్తో పాటు మరికొంతమంది మాజీ క్రికెటర్లు కూడా యాజమాన్య హక్కులను పొందారు. మ్యాక్స్వెల్ బెల్ఫాస్ట్, కైల్ మిల్స్, నాథన్ మెక్కల్లమ్ ఎడిన్బర్గ్, క్రిస్ గేల్ గ్లాస్గో, స్టీవ్ వా అమ్స్టర్డామ్, జాంటీ రోడ్స్, డుప్లెసిస్ రోటర్డామ్ ఫ్రాంచైజీలకు యాజమానులుగా ఉన్నారు.ETPL ఫ్రాంచైజీల యజమానులు:* డబ్లిన్ – రాహుల్ ద్రావిడ్* బెల్ఫాస్ట్ – గ్లెన్ మ్యాక్స్వెల్, రోహన్ లండ్* ఎడిన్బర్గ్ – కైల్ మిల్స్, నాథన్ మెక్కల్లమ్, రాచెల్ వైజ్మన్* గ్లాస్గో – విపుల్ అగర్వాల్, క్రిస్ గేల్* ఆమ్స్టర్డామ్ – స్టీవ్ వా తదితరులు* రోటర్డామ్ – జాంటీ రోడ్స్, ఫాఫ్ డుప్లెసిస్ తదితరులు. -
నేను పోరాటం కొనసాగిస్తా: వినేశ్
గోండా (ఉత్తరప్రదేశ్): ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫొగాట్, భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మధ్య వివాదం మరింత తీవ్రమైంది. షోకాజ్ నోటీసుకు సమాధానమిచ్చే వరకు టోర్నిలో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వరాదని డబ్ల్యూఎఫ్ఐ నిర్ణయం తీసుకోగా... తాను పారిపోనని, పోరాటం కొనసాగిస్తానని వినేశ్ స్పష్టం చేసింది. నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నిలో భాగంగా మంగళవారం మహిళల విభాగంలో బౌట్లు జరగనున్న నేపథ్యంలో వినేశ్ టోర్నీ జరిగే వేదిక వద్దకు వచ్చింది. టోర్నిలో పాల్గొనడంపై ఆమె ఇచ్చిన సంబంధిత డాక్యుమెంట్లను తీసుకోవడానికి అధికారులు నిరాకరించారు. సమీపంలో ఆమె ప్రాక్టీస్ చేసుకునేందుకు ప్రయత్నించగా, వామప్ ఏరియా గదికి తాళం కూడా వేశారు. తాను ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ రెజ్లింగ్లోకి అడుగుపెట్టకుండా డబ్ల్యూఎఫ్ఐ ప్రయత్నిస్తోందని, రిటైర్ కావాలనే విధంగా కావాలనే అడ్డంకులు సృష్టిస్తున్నారని వినేశ్ ఆరోపించింది. అయితే తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గనని ఆమె స్పష్టం చేసింది. -
ఆటగాళ్ల ఎంపికపై ‘సెలక్షన్ షీట్’
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ క్రికెట్లో పాల్గొనే హైదరాబాద్ జట్ల ఎంపికలో మరింత పారదర్శకత పాటిస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఆపరేషన్స్ హెడ్, మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వెల్లడించాడు. ప్రతిభ గల ఆటగాళ్లను జట్టులోకి తీసుకునే ప్రక్రియలో భాగంగా దేశంలోనే తొలిసారిగా ‘సెలక్షన్ షీట్’ను తీసుకొస్తున్నామని అతను చెప్పాడు. దీని ప్రకారం ఇకపై ఎవరిని జట్టులోకి ఎంపిక చేసినా అందుకు తగిన కారణం, వారి ప్రదర్శన వివరాలతో పాటు ఎవరినైనా తప్పిస్తే అందుకు గల కారణాలను కూడా రాతపూర్వకంగా నమోదు చేస్తారు. కాబట్టి క్రికెటర్ల ఎంపిక ఎవరికీ అనుమానాలు లేని రీతిలో సాగుతుందని రాయుడు స్పష్టం చేశాడు. సోమవారం జరిగిన మీడియా సమావేశంలో హెచ్సీఏ కార్యదర్శి ఎం.జీవన్ రెడ్డితో కలిసి రాయుడు ఈ వివరాలు వెల్లడించాడు. త్వరలోనే ఓపెన్ సెలక్షన్స్ కూడా నిర్వహిస్తామని... హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే విషయంలో కూడా మూడు అంచెల్లో ఎంపిక జరుగుతుందని అతను వివరించాడు. ఈ సందర్భంగా హైదరాబాద్ సీనియర్, జూనియర్ సెలక్షన్ కమిటీలను రాయుడు ప్రకటించాడు. సీనియర్ సెలక్షన్ కమిటీకి అక్షత్ రెడ్డి చైర్మన్గా వ్యవహరించనుండగా... తిరుమలశెట్టి సుమన్, మెహదీ హసన్, టి.పవన్ కుమార్, ఇంద్రశేఖర్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. పి.రమేశ్ కుమార్, షోయబ్, సర్వేశ్ కుమార్, టిమోతీ కుమార్ సభ్యులుగా ఉన్న జూనియర్ సెలక్షన్ కమిటీకి ఆకాశ్ భండారీని చైర్మన్గా ఎంపిక చేశారు. -
మిల్లర్, అక్షర్ మెరుపులు.. ఢిల్లీ క్యాపిటల్స్ విజయం
ఐపీఎల్ 2026లో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జూలు విదిల్చింది. సోమవారం ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 211 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది.కెప్టెన్ అక్షర్ పటేల్ (56), డేవిడ్ మిల్లర్ (51) అర్థసెంచరీలతో ఢిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఆఖర్లో అశుతోశ్ శర్మ (24) , మాధవ్ తివారి (18 నాటౌట్), అకిబ్ నబీ (10 నాటౌట్) హిట్టింగ్తో ఢిల్లీకి విజయాన్ని అందించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్, యష్ ఠాకూర్ చెరో 2 వికెట్లు తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 59 నాటౌట్) అజేయ అర్థసెంచరీ సాధించగా.. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (33 బంతుల్లో 56) మెరుపు ఇన్నింగ్స్తో అలరించాడు. కూపర్ కనోలి (38) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో సూర్యాంశ్ షెగ్డె (8 బంతుల్లో 22 నాటౌట్) ఆకట్టుకున్నాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్, మాధవ్ తివారి చెరో 2 వికెట్లు తీయగా, ముకేశ్ కుమార్ ఒక వికెట్ పడగొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో ఇది ఐదో విజయం కాగా, పంజాబ్కు ఇది వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం.Ice in their veins and pure fire in their bats! 🧊🔥Madhav Tiwari & Ashutosh Sharma with match-winning clutch cameos to seal the deal for #DC 🫡Updates ▶️ https://t.co/wHhflKIvCR#TATAIPL | #KhelBindaas | #PBKSvDC | @DelhiCapitals pic.twitter.com/ZqwSxTCrhj— IndianPremierLeague (@IPL) May 11, 2026 -
కనోలి చర్యకు చాహల్ పిచ్చి చూపులు!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 210 పరుగుల భారీ స్కోరు చేసింది. మొదట ప్రియాన్ష్ ఆర్య మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టగా, చివర్లో శ్రేయస్, కన్నోలి, సూర్యాంశ్లు ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. పంజాబ్ ఇన్నింగ్స్ సమయంలో కూపర్ కన్నోలి కొట్టిన ఒక భారీ సిక్స్ స్టేడియం అవతల పడింది. ఈ నేపథ్యంలో పంజాబ్ బౌలర్ యజ్వేంద్ర చాహల్ చర్య సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 14.3 ఓవర్లో మిచెల్ స్టార్క్ వేసిన ఆఫ్ స్టంప్ బంతిని కనోలి ఫ్రంట్ ఫుట్ వచ్చి భారీ సిక్సర్ సంధించాడు. పవర్ స్ట్రోక్ ఉపయోగించడంతో బంతి స్టేడియం అవతల పడింది. ఇదే సమయంలో పంజాబ్ కింగ్స్ డగౌట్లో ఉన్న చాహల్.. కనోలి కొట్టిన భారీ సిక్స్ను కన్నార్పకుండా చూస్తూ.. ‘పోయింది.. బంతి పోయింది’ అన్న తరహాలో చేతితో సైగలు చేయడం కెమెరా కంటికి చిక్కింది. చాహల్ చర్య అభిమానులను ఎంతగానో ఆకర్షించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది. చాహల్ వీడియోపై మీరు ఒక లుక్కేయండి. మ్యాచ్ విషయానికొస్తే పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 59 నాటౌట్) అజేయ అర్థసెంచరీ సాధించగా.. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (33 బంతుల్లో 56) మెరుపు ఇన్నింగ్స్తో అలరించాడు. కూపర్ కనోలి (38) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో సూర్యాంశ్ షెగ్డె (8 బంతుల్లో 22 నాటౌట్) ఆకట్టుకున్నాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్, మాధవ్ తివారి చెరో 2 వికెట్లు తీయగా, ముకేశ్ కుమార్ ఒక వికెట్ పడగొట్టాడు.చదవండి: ఆర్సీబీ, ముంబై మ్యాచ్ ఫిక్స్.. ఇదిగో సాక్ష్యం! -
తెలంగాణ క్రికెట్లో కొత్త శకం.. ఏఐతో ఆటగాళ్ల ఎంపిక!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ యువ క్రికెటర్లకు అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) నిర్వహిస్తున్నట్లు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) సెక్రటరీ మన్నె జీవన్ రెడ్డి, ఆపరేషన్స్ హెడ్ అంబటి రాయుడు, సీఈఓ ఇంతియాజ్ అలీ తదితరులు పాల్గొన్నారు. సోమవారం ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో నిర్వహించిన ప్రెస్మీట్లో టీపీఎల్ వివరాలను వెల్లడించారు. హెచ్సీఏ సెక్రటరీ మన్నె జీవన్రెడ్డి మాట్లాడుతూ.. యువ ఆటగాళ్లకు సరైన వేదిక కల్పించడం ద్వారా భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎదిగే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఎలాంటి రాజకీయ ప్రభావం లేకుండా పూర్తిగా పారదర్శక విధానంలో పది మంది మాజీ క్రికెటర్లతో సెలెక్షన్ కమిటీని ఏర్పాటు చేసినట్లు హెచ్సీఏ సెక్రటరీ మన్నె జీవన్ రెడ్డి వెల్లడించారు. వచ్చే నెలలో నిర్వహించనున్న తెలంగాణ ప్రీమియర్ లీగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు మూడు వేల మంది ప్రతిభావంతులైన క్రికెటర్లను గుర్తించి ఎంపిక చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఎంపిక ప్రక్రియలో ఎటువంటి అవకతవకలకు తావులేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆపరేషన్స్ హెడ్ అంబటి రాయుడు మాట్లాడుతూ.. ఆటగాళ్ల ఎంపికలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విధానాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. దీని ద్వారా నిజమైన ప్రతిభ కలిగిన ఆటగాళ్లను గుర్తించే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రతి ఎంపిక ప్రక్రియను వీడియో రికార్డింగ్ ద్వారా పర్యవేక్షిస్తామని, సెలెక్షన్కు సంబంధించిన ఫిజికల్ రికార్డులను కూడా సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించడంలో ఐపీఎల్ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్న అంబటి రాయుడు, అదే తరహాలో హెచ్.సీఏ ఆధ్వర్యంలో కూడా పారదర్శకంగా లీగ్ లు నిర్వహిస్తామని తెలిపారు. ఓపెన్ ట్రయల్స్, లీగ్ మ్యాచ్ ల నిర్వహణను మరింత విస్తృతంగా చేపడుతున్నామని, ప్రతి నిర్ణయం నిష్పక్షపాతంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. రాబోయే లీగ్ లకు సంబంధించిన తుది నిర్ణయాలను సెలెక్షన్ కమిటీ తీసుకుంటుందని, ఆటగాళ్లు, అంపైర్ల నియామక ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభించామని నిర్వాహకులు వెల్లడించారు. -
ఆర్సీబీ, ముంబై మ్యాచ్ ఫిక్స్.. ఇదిగో సాక్ష్యం!
ఐపీఎల్ 2026 సీజన్ చప్పగా సాగుతున్న వేళ ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు ఫుల్కిక్ ఇచ్చింది. ఆఖరి బంతి వరకు నువ్వానేనా అన్నట్లుగా సాగిన పోరు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఛేదించాల్సిన లక్ష్యం తక్కువే అయినప్పటికీ ఆద్యంతం ఆర్సీబీ, ముంబై మధ్య విజయం చేతులు మారుతూ వచ్చింది. చివరకు ముంబై తప్పిదాలు, పేలవ ఫీల్డింగ్తో ఓటమిని కొనితెచ్చుకుంది. అయితే తాజాగా సోషల్ మీడియా ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య మ్యాచ్ ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే.. ఆర్సీబీ విజయానికి ఆఖరి ఓవర్లో 15 పరుగుల కావాలి. ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసేందుకు రాజ్ బవా వచ్చాడు. ఓవర్లో మూడు వైడ్లు, ఒక నోబ్ వేశాడు. ఇది చాలదన్నట్లు భువనేశ్వర్ చేత సిక్సర్ కొట్టించాడు. ఇక ఆఖరి బంతికి రెండు పరుగుల అవసరమైన దశలో ఆర్సీబీ బ్యాటర్ రసిక్ సలామ్ స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు. అయితే రాజ్ బవా తన వైపు వచ్చిన బంతిని కనీసం ఆపే ప్రయత్నం చేయకుండా అలాగే నిలబడి చూస్తూ ఉండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ఒక అభిమాని ఎక్స్లో పంచుకోవడంతో వైరల్గా మారింది. బంతి అతని కాలు తాకి మరో దిశలో వెళ్లింది. ఈ గ్యాప్లో ఆర్సీబీ రెండు పరుగులు తీసి విజయం సాధించింది. అయితే రాజ్ బవా బంతిని ఆపే ప్రయత్నం చేసి ఉంటే ముంబై గెలవడం లేదా సూపర్ ఓవర్కు దారి తీసి ఉండేదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ‘రాజ్ బవా బంతిని కావాలనే ఆపలేదని, కచ్చితంగా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటూ’ కొంతమంది ఫ్యాన్స్ తెలిపారు. ‘అప్పటికే ఆ ఓవర్లో తొమ్మిది బంతులు వేసి రాజ్ బవా అలసిపోయాడని, అందుకే బంతిని ఆపే ప్రయత్నం చేయలేకపోయి ఉండొచ్చని, మ్యాచ్ ఫిక్సింగ్ లాంటి వాటికి ఆస్కారం ఉండదని’ కొంతమంది కామెంట్లు చేశారు. ఇంకొందరు మాత్రం.. ‘ముంబై ఐదుసార్లు టైటిల్ గెలవడంతోనే ఆ జట్టు పూర్తిగా నీరుగారిపోయిందని.. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని, ఆర్సీబీతో ముంబై జట్టును కూడా ఐపీఎల్ నుంచి బ్యాన్ చేయాలని’ కొందరు ఆగ్రహంతో రెచ్చిపోయారు. ఏది ఏమైనా మ్యాచ్ ఫిక్సింగ్ సంగతి అటుంచితే చాన్నాళ్లుకు ఐపీఎల్లో ఒక థ్రిల్లర్ మ్యాచ్ మంచి అనుభూతి కలిగించిందని చెప్పొచ్చు. ఈ విజయంతో ఆర్సీబీ పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లగా.. ఓటమితో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2026 సీజన్ నుంచి ఎలిమినేట్ అయింది.RCB vs MI match is completely fixed. This mdc franchise needs to be banned from IPL forever pic.twitter.com/xCrf6JcHOc— Vishnu (@WorshipRohit) May 11, 2026🎥 𝙍𝙖𝙬 𝙍𝙚𝙖𝙘𝙩𝙞𝙤𝙣𝙨 from a thrilling night 🥳Down to the absolute wire in a contest of incredibly fine margins ⏳Watch the pure passion pour out from #RCB's unforgettable last-ball win ❤️ #TATAIPL | #KhelBindaas | #RCBvMI | @RCBTweets pic.twitter.com/H0PNbJSVY6— IndianPremierLeague (@IPL) May 11, 2026చదవండి: టిమ్ డేవిడ్ అనైతిక చర్య.. తగిన శాస్తి జరిగింది! -
టిమ్ డేవిడ్ అనైతిక చర్య.. తగిన శాస్తి జరిగింది!
ఐపీఎల్ 2026 సీజన్ వన్సైడ్ మ్యాచ్లో చప్పగా సాగుతున్న వేళ ఆదివారం ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ థ్రిల్లర్ను తలపించింది. అసలు సిసలు టీ20 మజాను చాలా రోజుల తర్వాత రుచి చూపించింది. ఆఖరివరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరులో ఆర్సీబీ 2 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఆటగాళ్లు డగౌట్లో సంబరాల్లో మునిగితేలారు. కానీ ఆర్సీబీ స్టార్ టిమ్ డేవిడ్ మాత్రం అనైతిక చర్యకు పాల్పడ్డాడు. ముంబై ఇండియన్స్ ఓటమిని వెక్కిరిస్తూ టిమ్ డేవిడ్ ఆ జట్టుకు మిడిల్ ఫింగర్ చూపించడం కెమెరాలకు చిక్కింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాజాగా టిమ్ డేవిడ్ చర్యను తీవ్రంగా పరిగణించిన బీసీసీఐ అతని మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించడంతో పాటు రెండు డీమెరిట్ పాయింట్లు కేటాయించింది. ‘ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.6 ప్రకారం అనుమతి లేకుండా ఒక జట్టు లేదా వ్యక్తిని ఉద్దేశించి అసభ్యకరమైన సంజ్ఞ చేయడం నిబంధనలకు విరుద్ధం. ఉల్లంఘన చర్య కింద అతడిపై చర్యలు తీసుకుంటున్నాం. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనల కింద ఆ సంజ్ఞ అసభ్యకరంగా ఉండడంతో పాటు వ్యక్తి లేదా జట్టును ఉద్దేశపూర్వకంగా అవమా నించడం కిందకు వస్తుంది. అందుకే అతడి మ్యాచ్ ఫీజులో జరిమానా విధించడంతో పాటు డీమెరిట్ పాయింట్లు కేటాయించాం’ అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.ఇక టిమ్ డేవిడ్ ఆర్సీబీలోకి రాకముందు ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహించాడు. 2022 నుంచి 2024 వరకు ముంబై తరఫున ఆడాడు. లోయర్ ఆర్డర్లో ధాటిగా బ్యాటింగ్ చేయగల సత్తా టిమ్ డేవిడ్ సొంతం. ముంబై ఇండియన్స్ తరఫున 37 మ్యాచ్లాడిన టిమ్ డేవిడ్ 171 స్ట్రైక్రేట్ 658 పరుగులు సాధించాడు. 2025 సీజన్కు ముందు ఆర్సీబీలోకి వచ్చిన టిమ్ డేవిడ్ ఆ సీజన్లో లోయర్ ఆర్డర్లో ఎక్కువగా బ్యాటింగ్కు వచ్చి 187 పరుగులు చేశాడు. తద్వారా ఆర్సీబీ తొలి ఐపీఎల్ టైటిల్ నెగ్గడంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ విషయానికొస్తే ఆఖరి ఓవర్లో 15 పరుగులు అవసరమైన దశలో రొమారియో షెపర్డ్ ఔట్ అయ్యాడు. దీంతో సమీకరణం మూడు బంతుల్లో 10 పరుగులకు మారింది. ఈ దశలో భువనేశ్వర్ సిక్సర్ కొట్టడంతో ఒక్క బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. ఈ నేపథ్యంలో రసిక్ సలామ్ ఆఖరి బంతికి రెండు పరుగులు సాధించి ఆర్సీబీకి థ్రిల్లింగ్ విజయాన్ని సాధించి పెట్టాడు. ఈ విజయంతో ఆర్సీబీ 14 పాయింట్లతో టేబుల్ టాపర్గా నిలిచింది.🚨👀🔥Former Mumbai Indians player Tim David was caught showing a middle finger during the match while playing for Royal Challengers Bengaluru 😳The clip instantly went viral, with fans debating💥#TimDavid #RCBvsMI #MumbaiIndians #RCB #IPL2026 #12BETIndia #KnowTheGame 🔥 pic.twitter.com/i7MNqTt3CT— 12BET India (@12B_India) May 11, 2026#breaking RCB's batter Tim David has been booked under Article 2.6 (showing an offensive gesture) during @RCBTweets match vs @mipaltan yesterday at Raipur. He will be penalized 30% of his match fees and given 2 demerit points..@IPL official media release will be out soon!— Gaurav Gupta (@toi_gauravG) May 11, 2026 -
IPL 2026: పంజాబ్ కింగ్స్పై ఢిల్లీ విజయం
ఐపీఎల్ 19వ సీజన్లో సోమవారం ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 211 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ అక్షర్ పటేల్ (56), డేవిడ్ మిల్లర్ (51) అర్థసెంచరీలతో ఢిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఆఖర్లో అశుతోశ్ శర్మ (24) , మాధవ్ తివారి (18 నాటౌట్), అకిబ్ నబీ (10 నాటౌట్) హిట్టింగ్తో విజయాన్ని అందించారు. అంతకముందు పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఐదో వికెట్ కోల్పోయిన ఢిల్లీఅర్థసెంచరీ సాధించిన అక్షర్ పటేల్ (56) మార్కస్ స్టోయినిస్ బౌలింగ్లో బెన్ ద్వార్సుస్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో 138 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. 16 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ (39), అశుతోశ్ శర్మ (7) పరుగులతో ఆడుతున్నారు.ఆశలు రేపుతున్న అక్షర్, మిల్లర్211 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 13 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ 44, డేవిడ్ మిల్లర్ 26 పరుగులతో ఆడుతున్నారు. ఈ ఇద్దరు 28 బంతుల్లోనే 50 పరుగులు జోడించి ఢిల్లీ శిబిరంలో ఆశలు పెంచుతున్నారు.నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీపంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కష్టాల్లో పడింది. 12 పరుగులు చేసిన స్టబ్స్ రనౌట్ కావడంతో ఢిల్లీ 74 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ 25 పరుగులతో ఆడుతున్నాడు.తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ211 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ అభిషేక్ పొరేల్ (5) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. యశ్ ఠాకూర్ బౌలింగ్లో పొరేల్ క్లీన్బౌల్డ్గా వెనుదిరిగాడు. 2 ఓవర్లలో ఢిల్లీ వికెట్ నష్టానికి 10 పరుగులు చేసింది.ఢిల్లీ లక్ష్యం 211 పరుగులుఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 59 నాటౌట్) అజేయ అర్థసెంచరీ సాధించగా.. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (33 బంతుల్లో 56) మెరుపు ఇన్నింగ్స్తో అలరించాడు. కూపర్ కన్నోలి (38) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో సూర్యాంశ్ షెగ్డె (8 బంతుల్లో 22 నాటౌట్) ఆకట్టుకున్నాడు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్, మాధవ్ తివారి చెరో 2 వికెట్లు తీయగా, ముకేశ్ కుమార్ ఒక వికెట్ పడగొట్టాడు.శ్రేయస్ అర్థశతకం17 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ 2 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (32 బంతుల్లో 50), కన్నోలి (34) పరుగులతో ఆడుతున్నారు. హాఫ్ సెంచరీ బాది ప్రియాన్ష్ ఔట్పంజాబ్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్యా ఔటయ్యాడు. 33 బంతుల్లో 6 సిక్సులు, 2 ఫోర్ల సాయంతో 56 పరుగులు బాదిన ప్రియాన్ష్ ఆ తర్వాత మాధవ్ తివారీ బౌలింగ్లో సాహిల్ పరాఖ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్రీజులో శ్రేయాస్ అయ్యర్ (13), కూపర్ (5) ఉన్నారు. స్కోరు107-2 (10 ఓవర్లకు)గా ఉంది.ప్రభ్సిమ్రాన్ సింగ్ ఔట్పంజాబ్ ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ 18 పరుగులు చేసి ఔటయ్యాడు. ముకేశ్ కుమార్ బౌలింగ్లో ఔక్విబ్ నబీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో ప్రియాన్ష్ ఆర్యా (51), శ్రేయాస్ అయ్యర్ (0) ఉన్నారు. స్కోరు 7 ఓవర్లకు 78-1గా ఉంది.ప్రియాన్ష్ ఫిఫ్టీ.. పంజాబ్ 72/0ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య ఫిఫ్టీ మార్క్ సాధించాడు. 24 బంతుల్లో అర్థశతకం సాధించిన ప్రియాన్ష్ ఇన్నింగ్స్లో ఒక బౌండరీ సహా ఆరు సిక్సర్లు ఉండడం విశేషం. 6 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. మరో ఓపెనర్ ప్రబ్సిమ్రన్ 15 పరుగులతో ఆడుతున్నాడు.దంచుతున్న ప్రియాన్ష్.. 3 ఓవర్లలో 51/0ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ను పంజాబ్ కింగ్స్ దూకుడుగా ఆరంభించింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య సిక్సర్లతో విధ్వంసం సృష్టిస్తున్నాడు. 3 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టోకుండా 51 పరుగులు చేసింది. ప్రబ్సిమ్రన్ (5) పరుగులతో ఆడుతున్నాడు.టాస్ ఓడిన పంజాబ్టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. పంజాబ్ తరఫున బెన్ ద్వార్షుయిస్ ఐపీఎల్లో అరంగేట్రం చేయనున్నాడు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు మార్పులతో బరిలోకి దిగింది. అభిషేక్ పొరేల్, సాహిల్ పరాక్, డేవిడ్ మిల్లర్, అకిబ్ నబీ, మాధవ్ తివారి తుది జట్టులోకి వచ్చారు.ఈ మ్యాచ్లో గెలిచి పంజాబ్ కింగ్స్ టాప్ ప్లేస్ అందుకోవాలని చూస్తోంది. మరోవైపు పంజాబ్తో మ్యాచ్ ఢిల్లీకి చావో రేవో లాంటిది. ప్రస్తుతం ఢిల్లీ 11 మ్యాచ్ల్లో 8 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే ఢిల్లీకి ప్లేఆఫ్ అవకాశాలు మిగిలి ఉంటాయి. ఓడితే మాత్రం ముంబై, లక్నో తర్వాత ఎలిమినేట్ అవనున్న మూడో జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిలవనుంది. ఈ సీజన్లో తొలి అంచె పోటీలో ఢిల్లీ క్యాపిటల్స్పై పంజాబ్ కింగ్స్ 6 వికెట్లతో విజయాన్ని అందుకుంది. మొదట ఢిల్లీ 264 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత పంజాబ్ 18.5 ఓవర్లలోనే 265 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ముఖాముఖి పోరులో ఇరుజట్లు 35 సార్లు తలడిపతే 18 సార్లు పంజాబ్, 17 సార్లు ఢిల్లీ నెగ్గింది. 2023 నుంచి చూసుకుంటే ఈ రికార్డు 3-2గా ఉంది. ఇక ధర్మశాలలో ఇరుజట్లు చెరో 2 విజయాలతో సమానంగా ఉన్నాయి.తుది జట్లు:ఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), అభిషేక్ పోరెల్, సాహిల్ పరాఖ్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్(కెప్టెన్), మాధవ్ తివారీ, ముఖేష్ కుమార్, ఔకిబ్ నబీ దార్, మిచెల్ స్టార్క్, లుంగి ఎన్గిడి.పంజాబ్ కింగ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాంష్ ఆర్య, కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), సూర్యాంశ్ షెడ్జ్, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్, బెన్ ద్వార్షుయిస్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ సబ్లు: పాతుమ్ నిస్సాంక, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, త్రిపురాన విజయ్పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్స్: హర్ప్రీత్ బ్రార్, యష్ ఠాకూర్, జేవియర్ బార్ట్లెట్, విష్ణు వినోద్, ప్రవీణ్ దూబే🚨Toss update from Dharamshala 🚨@DelhiCapitals won the toss and elected to bowl first against @punjabkingsiplUpdates ▶️ https://t.co/wHhflKIvCR#TATAIPL | #KhelBindaas | #PBKSvDC pic.twitter.com/uia9sh01xL— IndianPremierLeague (@IPL) May 11, 2026 -
తిరోగమనంలో ముంబై ఇండియన్స్.. ఆ ముగ్గురిపై వేటు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ది ఘన చరిత్ర. ఐదుసార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ ప్రస్తుతం తిరోగమనం దిశగా పయనిస్తోంది. రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన తర్వాత ఆ జట్టు పూర్తిగా గాడి తప్పింది. ఐపీఎల్ 2026 సీజన్లోనూ ప్లేఆఫ్స్ చేరడంలో విఫలమైన మాజీ చాంపియన్స్ అవమానకర రీతిలో నిష్క్రమించింది. ఆదివారం ఆర్సీబీతో ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ను ముంబై చేజేతులా ఓడిపోయింది. ఆఖరి ఓవర్లో 15 పరుగులు అవసరమైన దశలో అనుభవం లేని రాజ్బవా చేతికి బంతిని అందించి కెప్టెన్ సూర్యకుమార్ మూల్యం చెల్లించుకున్నాడు. అనుభవలేమితో ఒత్తిడికి లోనైన రాజ్బవా వైడ్లు, నోబ్ వేసి ముంబై ఓటమికి కారణమయ్యాడు. ఈ ఓటమితో ముంబై 11 మ్యాచ్ల్లో కేవలం మూడు విజయాలు మాత్రమే సాధించడంతో లీగ్ దశలో మరో మూడు మ్యాచ్లు ఉన్నప్పటికీ రెండు వారాల ముందే ముంబై ఐపీఎల్ 19వ సీజన్లో ఎలిమినేట్ అయింది. అయితే ఐపీఎల్కు ముందు జరిగిన టీ20 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన టీమిండియా జట్టులో సభ్యులుగా ఉన్న కెప్టెన్ సూర్యకుమార్ సహా తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, బుమ్రా ముంబై జట్టులో ఉండడం గమనార్హం. అయితే ఈ సీజన్లో ముంబై దారుణ వైఫల్యంతో వచ్చే సీజన్కు జట్టులో ప్రక్షాళన తప్పేలా లేదు. ఈ నేపథ్యంలో ముంబై జట్టులో ముగ్గురు ఆటగాళ్లను మాత్రం విడుదల చేయనుంది. వారే ప్రస్తుత ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్, ట్రెంట్ బౌల్ట్.సూర్యకుమార్35 ఏళ్ల వయసున్న సూర్యకుమార్ టీ20 క్రికెట్లో మిస్టర్ 360 ప్లేయర్గా గుర్తింపు ఉంది. కేవలం టీ20 స్పెషలిస్ట్గానే టీమిండియాకు ఆడిన సూర్యకుమార్ గత నాలుగేళ్లలో ముంబై ఇండియన్స్ తరఫున ఎన్నో కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. కానీ ఈ సీజన్లో మాత్రం సూర్యకుమార్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. 11 మ్యాచ్లాడి కేవలం 195 పరుగులు మాత్రమే చేశాడు. ఇదే సీజన్లో రోహిత్ శర్మ గాయంతో చాలా మ్యాచ్లకు దూరం కావడంతో జట్టులో సీనియర్గా బ్యాటర్గా బాధ్యతగా ఆడాల్సిన సూర్యకుమార్ తన పాత్రకు న్యాయం చేయడంలో విఫలమయ్యాడు. పైగా పాండ్యా దూరమవ్వడంతో కెప్టెన్సీ బాధ్యతలు అతడిని మరింత ఒత్తిడిలోకి నెట్టేశాయి. దీంతో వచ్చే సీజన్లో సూర్యకు ముంబై టాటా చెప్పే అవకాశాలు మెండుగా ఉన్నాయి.హార్దిక్ పాండ్యాఒకప్పుడు ముంబై ఇండియన్స్లో ఆడిన హార్దిక్ పాండ్యా ఆ తర్వాత 2022 సీజన్లో కొత్తగా వచ్చిన గుజరాత్ టైటాన్స్కు కెప్టెన్గా వ్యవహరించాడు. గుజరాత్ ఆడిన తొలి సీజన్లోనే పాండ్యా ఆ జట్టును చాంపియన్గా నిలబెట్టాడు. మరుసటి సీజన్లోనూ గుజరాత్ను రన్నరప్గా నిలపడంతో పాండ్యా పేరు మార్మోగిపోయింది. దీంతో ఉన్నపళంగా 2024సీజన్లో రోహిత్ను కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ బాధ్యతలను పాండ్యాకు అప్పగించింది. కానీ ముంబైలోకి వచ్చినప్పటి నుంచి పాండ్యా అటు కెప్టెన్గా.. ఇటు ఆల్రౌండర్గా పూర్తిగా విఫలమవుతూ వచ్చాడు. 2025 సీజన్లో పాండ్యా సారథ్యంలో ముంబై ప్లేఆఫ్స్ చేరినప్పటికీ ఇతర జట్ల సమీకరణాల ఆధారంగా చేరడంతో ముంబై స్థాయికి ఇది తగదు. ఇక 2024 సీజన్తో పాటు ఈ సీజన్లో ప్లేఆఫ్స్ చేరడంలో విఫలమైంది. ఈ సీజన్లో పాండ్యా 8 మ్యాచ్లాడి 146 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్లోనూ విఫలమైన పాండ్యా కేవలం 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీనికి తోడు తన అగ్రెసివ్ ప్రవర్తనతో విమర్శలు ఎదుర్కొన్నాడు. గాయంతో ఈ సీజన్కు దూరమైన పాండ్యా వచ్చే సీజన్లో వేరే జట్టుకు ఆడే అవకాశముంది.ట్రెంట్ బౌల్ట్అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయిన ట్రెంట్ బౌల్ట్ను ముంబై ఎంచుకోవడం కాస్త ఆశ్చర్యపరిచింది. ఈ సీజన్లో బౌల్ట్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. ఐదు మ్యాచ్లాడిన బౌల్ట్ కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు.బుమ్రాతో కలిసి ప్రత్యర్థులను బెంబెలెత్తిస్తాడనుకుంటే బౌల్ట్ మాత్రం తన దారుణ ప్రదర్శనతో ముంబై ఫ్రాంచైజీకి తలనొప్పిగా మారాడు. వచ్చే సీజన్లో బౌల్ట్ స్థానంలో యంగ్ పేసర్ను తీసుకోవాలని ఇప్పటికే ముంబై భావిస్తోంది.చదవండి: పోటీ రసవత్తరం.. ప్లేఆఫ్స్ రేసులో 8 జట్లు! -
పోటీ రసవత్తరం.. ప్లేఆఫ్స్ రేసులో 8 జట్లు!
ఐపీఎల్ 2026 సీజన్కు సంబంధించి ప్లేఆఫ్స్ రేసు రసతవత్తరంగా మారింది. ఆదివారం ముంబై ఇండియన్స్పై ఉత్కంఠ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్లో ముంబై చేజేతులా ఓటమి కొనితెచ్చుకుంది. ముంబై బౌలర్ రాజ్బవా ఒత్తిడికి తోడు వైడ్లు, నోబ్ వేయడంతో చివరి ఓవర్లో 15 పరుగులు చేసి ఆర్సీబీ హ్యాట్రిక్ ఓటమిని తప్పించుకోవడంతో పాటు టేబుల్ టాపర్గా నిలిచింది. ఇప్పటికే వరుస ఓటములతో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నాయి. అయితే టాప్-4లో నిలిచేందుకు 8 జట్లు పోటీలో ఉండడం గమనార్హం.అగ్రస్థానంలో ఆర్సీబీ:ప్రస్తుతం టేబుల్ టాపర్గా ఉన్న ఆర్సీబీ 11 మ్యాచ్ల్లో 7 విజయాలతో 14 పాయింట్లు సాధించింది. (+1.103) నెట్ రన్రేట్తో ఇతర జట్ల కంటే మెరుగైన స్థితిలో నిలిచింది. అయితే అధికారికంగా ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు కావాలంటే ఇంకా రెండు విజయాలు అవసరం. సాధారణంగా 16 పాయింట్లు ప్లేఆఫ్స్కు సరిపోతాయి. కాబట్టి ఆర్సీబీ ఒక్క విజయం సాధించినా సరిపోతుంది. కానీ ఎస్ఆర్హెచ్, పంజాబ్ల నుంచి పోటీ వద్దనుకుంటే మిగిలిన అన్ని మ్యాచ్లు గెలిచి నేరుగా క్వాలిఫయర్-1కు అర్హత సాధించే అవకాశం ఉంది.హైదరాబాద్ రెండు గెలిస్తే:సన్రైజర్స్ హైదరాబాద్ కూడా 14 పాయింట్లతోనే ఉన్నప్పటికీ నెట్ రన్రేట్ (+0.737) విషయంలో ఆర్సీబీ కంటే వెనుకబడి ఉంది. చివరి మూడు మ్యాచ్ల్లో రెండు గెలిస్తే.. ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయమవుతుంది. మే 22న ఆర్సీబీతో జరిగే మ్యాచ్ టాప్-2 స్థానాలపై కీలక ప్రభావం చూపే అవకాశముంది. గుజరాత్ టైటాన్స్ కూడా 14 పాయింట్లతో పోటీలో ఉంది. అయితే వారి నెట్ రన్ రేట్ (+0.228) తక్కువగా ఉండటంతో మరో రెండు విజయాలు అవసరం. మే 12న ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ గుజరాత్కు కీలకంగా మారనుంది.అనుకూల స్థితిలో పంజాబ్:పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం అత్యంత అనుకూల స్థితిలో ఉన్న జట్టుగా కనిపిస్తోంది. 10 మ్యాచ్ల్లోనే 13 పాయింట్లు సాధించిన పంజాబ్కు మరో నాలుగు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. నాలుగులో కనీసం రెండు గెలిస్తే చాలు 17 పాయింట్లతో ప్లేఆఫ్స్ బెర్తును పంజాబ్ దాదాపు ఖాయం చేసుకుంటుంది.చెన్నైకి కనీసం రెండు విజయాలు:ఐదుసార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం కఠిన పరిస్థితుల్లో ఉంది. సీఎస్కే ప్రస్తుతం 12 పాయింట్లతో ఉంది. మిగిలిన మూడు మ్యాచ్లో కనీసం రెండు గెలవాల్సిన అవసరముంది. అయితే వారి నెట్ రన్రేట్ (+0.185) పెద్దగా మెరుగ్గా లేకపోవడంతో అన్ని మ్యాచ్లు గెలిస్తేనే అవకాశం ఉంది.ఒత్తిడిలో రాజస్థాన్:రాజస్థాన్ రాయల్స్ కూడా 12 పాయింట్లతో సీఎస్కేతో సమానంగా ఉన్నప్పటికీ.. నెట్ రన్దేట్ (+0.082) తక్కువగా ఉంది. గత నాలుగు మ్యాచ్ ల్లో మూడు ఓటములు చవిచూడడంతో ఆ జట్టుపై ఒత్తిడి పెరిగింది. సీఎస్కేతో కలిసి నాలుగో ప్లేఆఫ్స్ స్థానం కోసం రాజస్థాన్ పోరాడే అవకాశం ఉంది. ఇక కోల్కతా నైట్ రైడర్స్ పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. మిగిలిన నాలుగు మ్యాచ్లు కేకేఆర్ కచ్చితంగా గెలవాల్సిన అవసరముంది. అప్పుడు కేకేఆర్ 17 పాయింట్లతో ప్లేఆఫ్స్ చేరే అవకాశముంటుంది. అయితే మ్యాచ్లో ఒక్క ఓటమి ఎదురైనా కేకేఆర్ ఇంటిబాట పట్టాల్సిందే.ఢిల్లీ క్యాపిటల్స్కు కష్టమే..ఢిల్లీ క్యాపిటల్స్కు అవకాశాలు అంతంతమాత్రమే. ప్రస్తుతం వారి నెట్ రన్ రేట్ (-1.154) దారుణంగా ఉంది. మిగిలిన అన్ని మ్యాచ్ల్లో భారీ తేడాతో గెలవడంతో పాటు ఇతర జట్ల ఫలితాలు కూడా తమకు అనుకూలంగా రావాల్సిన అవసరముంటుంది.ముంబై, లక్నో అవుట్:ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. దీంతో ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ పోరు ఇప్పుడు మరింత రసవత్తరంగా మారింది.చదవండి: ఆర్సీబీ థ్రిల్లింగ్ విక్టరీ.. ముంబై ఇండియన్స్ ఖేల్ ఖతం! -
లీకైన భారత టెస్ట్ జట్టు.. గుజరాత్ స్టార్ ప్లేయర్పై వేటు
ఐపీఎల్ 2026 తర్వాత స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే ఏకైక టెస్ట్ కోసం భారత జట్టును మరికొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడకముందే సోషల్మీడియా జట్టు వివరాలు లీకయ్యాయి.ఈ జట్టుకు కెప్టెన్గా శుభ్మన్ గిల్ కొనసాగనున్నాడు. సీనియర్లు కేఎల్ రాహుల్, పంత్, జడేజా, సిరాజ్, జైస్వాల్ కొనసాగనున్నారు. షమీ పునరాగమనం చేశాడు. ఐపీఎల్ ప్రదర్శనల ఆధారంగా అన్షుల్ కంబోజ్కు అవకాశం దొరికింది. రంజీ ప్రదర్శనల ఆధారంగా ఆకిబ్ నబీ, హర్ష్ దూబేకు చోటు కల్పించారు.ఆసక్తికరంగా గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్పై వేటు పడింది. సాయి ఐపీఎల్ 2026లో మంచి ప్రదర్శనలు చేస్తున్నా, గత టెస్ట్ ప్రదర్శనల దృష్ట్యా అతనిని తప్పించినట్లు తెలుస్తోంది. సాయి స్థానంలో ఇటీవలికాలంలో ఫార్మాట్లకతీతంగా చెలరేగుతున్న దేవ్దత్ పడిక్కల్కు ఛాన్స్ ఇచ్చారు. స్టార్ పేసర్ బుమ్రాకు విశ్రాంతినిచ్చారు.వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్తో ఏకైక టెస్ట్కు సీనియర్లకంతా విశ్రాంతినిస్తారని ప్రచారం జరిగింది. లీకైన జట్టును బట్టి చూస్తే అలాంటిదేమీ లేదని తెలుస్తోంది. మరో పక్క ఇదే జట్టు కొనసాగుతుందన్న గ్యారెంటీ అయితే లేదు. కేవలం సోషల్మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే ఇది. జట్టుపై త్వరలో అధికారిక ప్రకటన రావొచ్చు. ఒక్కటైతే గ్యారెంటీ జట్టు దాదాపుగా ఇలాగే ఉండవచ్చు. ఎందుకంటే సెలెక్టర్లు ఇప్పటికే జట్టును డిసైడ్ చేసినట్లు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్ ఐపీఎల్ ముగిసిన తర్వాత జూన్ 6 నుంచి ముల్లాన్పూర్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో ఆఫ్ఘనిస్తాన్ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కూడా ఆడనుంది. ఆ మ్యాచ్లు జూన్ 14, 17, 20 తేదీల్లో ధర్మశాల, లక్నో, చెన్నై వేదికలుగా జరుగనున్నాయి. సోషల్మీడియాలో ప్రచారం జరుగుతున్న భారత జట్టు:శుభ్మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, రిషభ్ పంత్, ధృవ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా,కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ఆకిబ్ నబీ, హర్ష్ దూబే, మహ్మద్ షమీ, అన్షుల్ కంబోజ్ -
ఇవాళ తేలిపోనున్న మరో జట్టు భవిష్యత్తు
ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతుంది. నిన్నటితో (మే 10) రెండు జట్లు (లక్నో, ముంబై ఇండియన్స్) పోటీ నుంచియ అధికారికంగా నిష్క్రమించాయి. ఇక మిగిలింది ఎనిమిది జట్లు. వీటిలో నాలుగు జట్లకు మాత్రమే ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుంది.ఆ జట్లు ఏవో తేలాలంటే మరికొద్ది రోజుల ఆగాల్సిందే. అయితే ఒక్క జట్టు భవితవ్యం మాత్రమే ఇవాల్టితో తేలిపోయే అవకాశం ఉంది. ఆ జట్టే ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో ఉండి, నిష్క్రమణ అంచుల్లో నిలిచింది. ఇప్పటివరకు ఆ జట్టు 11 మ్యాచ్ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి 8 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది.ఇవాళ పంజాబ్ కింగ్స్తో జరుగబోయే మ్యాచ్ డీసీకి డూ ఆర్ డైగా పరిగణించబడుతుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే, ఆ జట్టు ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. ఒకవేళ ఓడిందా.. ఈ మ్యాచ్తోనే ఇంటిముఖం పడుతుంది. ఒకవేళ గెలిచినా ఢిల్లీకి ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కడం అంత ఈజీ కాదు. ఏదైనా మహాద్భుతం జరిగితే తప్ప ఆ జట్టు ప్లే ఆఫ్స్కు చేరలేదు.ఫైనల్-4కు చేరాలంటే ఆ జట్టు ఏడు జట్లను దాటుకొని వెళ్లాలి. ఇది అంత ఈజీగా జరిగే పని కాదు. కాబట్టి అనధికారికంగా డీసీ ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరైనట్టే. ఈ మ్యాచ్ ఢిల్లీకి అంత ప్రాధాన్యం కానప్పటికీ.. పంజాబ్కు మాత్రం కీలకం కానుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే ఆ జట్టు ప్లే ఆఫ్స్ రేసులో మళ్లీ ముందుకెళ్తుంది. ప్రస్తుతం ఆ జట్టు 13 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఢిల్లీపై గెలిచి రెండు పాయింట్లు సాధిస్తే.. 15 పాయింట్లతో మళ్లీ టేబుల్ టాపర్గా నిలుస్తుంది.ఓవరాల్గా చూస్తే.. ప్రస్తుతం ప్లే ఆఫ్స్ పోటీ ప్రధానంగా టాప్-4లో ఉన్న నాలుగు జట్ల మధ్యే ఉంది. ఏదైనా అనూహ్యం జరిగితే సీఎస్కే, రాజస్థాన్ కూడా లైన్లోకి వస్తాయి. అద్భుతం జరిగితే కేకేఆర్, డీసీ కూడా రేసులో ఉంటాయి.ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న జట్లు ఆడాల్సిన మిగిలిన మ్యాచ్లు..ఆర్సీబీ- కేకేఆర్ (మే 13), పంజాబ్ (17), ఎస్ఆర్హెచ్ (22)ఎస్ఆర్హెచ్- గుజరాత్ (12), సీఎస్కే (18), ఆర్సీబీ (22)గుజరాత్- ఎస్ఆర్హెచ్ (12), కేకేఆర్ (16), సీఎస్కే (21)పంజాబ్- డీసీ (11), ముంబై (14), ఆర్సీబీ (17), లక్నో (23)సీఎస్కే- లక్నో (15), ఎస్ఆర్హెచ్ (18), గుజరాత్ (21)రాజస్థాన్- డీసీ (17), లక్నో (19), ముంబై (24)కేకేఆర్- ఆర్సీబీ (13), గుజరాత్ (16), ముంబై (20), డీసీ (24)డీసీ- పంజాబ్ (11), రాజస్థాన్ (17), కేకేఆర్ (24) -
ఆర్సీబీ కింగ్ మేకర్పై చర్యలు
ఆర్సీబీ కింగ్ మేకర్, ఆ జట్టు హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్పై బీసీసీఐ చర్యలు తీసుకుంది. ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (మే 11) రాత్రి ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో అతడు ఫోర్త్ అంపైర్తో వాగ్వాదానికి దిగాడు. ఈ చర్య ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో లెవెల్-1 ఉల్లంఘన కిందికి వస్తుంది. దీనికి శిక్షగా ఫ్లవర్కు మ్యాచ్ ఫీజ్లో 15 శాతం జరిమానా విధించారు. లెవెల్ 1 ఉల్లంఘనల కింద కోచ్లపై కూడా చర్యలు తీసుకునే అధికారం మ్యాచ్ రిఫరీకి ఉంటుంది.ఐపీఎల్లో ఇలాంటి ఉదంతాలు చాలా అరుదుగా జరిగాయి. గత సీజన్లో గుజరాత్ కోచ్ ఆశిష్ నెహ్రా కూడా ఇలాగే ప్రవర్తించి శిక్షించబడ్డాడు. అప్పట్లో అతని మ్యాచ్ ఫీజ్లో 25 శాతం కోత విధించారు. అదే సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్ కూడా లెవెల్-1 ఉల్లంఘనకు పాల్పడి బీసీసీఐ ఆగ్రహానికి (25 శాతం జరిమానా) గురయ్యాడు.దీనికి ముందు 2024 ఎడిషన్లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ కీరన్ పోలార్డ్.. 2022 ఎడిషన్లో ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రే కూడా అంపైర్లతో వాదించి శిక్షించబడ్డారు. వీరిలో ఆమ్రే ఏకంగా ఓ మ్యాచ్ నిషేధానికి కూడా గురయ్యాడు.మ్యాచ్ విషయానికొస్తే.. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై ఆర్సీబీ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇన్నింగ్స్ చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన తరుణంలో రసిక్ సలామ్ ఆర్సీబీని గెలిపించాడు. అంతకుముందు నాలుగో బంతికి భువనేశ్వర్ కుమార్ సిక్సర్ బాది గెలుపు ఖరారు చేశాడు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేయగా.. ఆర్సీబీ చివరి బంతికి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఓటమితో ప్రస్తుత సీజన్లో ముంబై ఇండియన్స్ పోరాటం ముగిసింది. మరో 3 మ్యాచ్లు ఆడాల్సి ఉన్నా, ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఎంఐతో పాటు లక్నో సూపర్ జెయింట్స్ కూడా ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఎలిమినేట్ అయ్యింది. -
జాతీయ విధులకు ఆసీస్ స్టార్లు డుమ్మా
ఐపీఎల్ 2026 కారణంగా పలువురు ఆసీస్ స్టార్ ఆటగాళ్లు జాతీయ విధులకు డుమ్మా కొట్టారు. త్వరలో జరుగబోయే పాక్, బంగ్లాదేశ్ పరిమిత ఓవర్ల సిరీస్లకు జట్లను ప్రకటించగా.. అందులో పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్వుడ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్ తదితరుల పేర్లు కనిపించలేదు.అండర్-19 జట్టు సారధి ఓల్లీ పీక్ తొలిసారి జాతీయ జట్టు నుంచి పిలుపునందుకున్నాడు. ఇతను పాకిస్తాన్తో జరిగే వన్డే సిరీస్కు మాత్రమే ఎంపికయ్యాడు. ఐపీఎల్ స్టార్లు రిటర్న్ రావడంతో బంగ్లాదేశ్ సిరీస్కు పీక్ను ఎంపిక చేయలేదు.కమిన్స్ గైర్హాజరీలో మిచెల్ మార్ష్ రెండు సిరీస్లకు (పాక్, బంగ్లాదేశ్) కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. అలాగే ఇంగ్లిస్, గ్రీన్లకు మూడు జట్లలో చోటు దక్కింది. స్టోయినిస్, మ్యాక్స్వెల్ బంగ్లాదేశ్ సిరీస్కు అందుబాటులో ఉన్నా సెలెక్టర్లు పట్టించుకోలేదు. వెటరన్ స్టార్ స్టీవ్ స్మిత్కు కూడా మూడు జట్లలో చోటు దక్కలేదు. ట్రవిస్ హెడ్ బంగ్లాదేశ్ వన్డే, టీ20 సిరీస్లకు మాత్రమే ఎంపికయ్యాడు.ఐపీఎల్ ప్లే ఆఫ్స్కు చేరే జట్లతో ఉన్న కూపర్ కన్నోల్లీ, డ్వార్షుయిస్, బార్ట్లెట్ను కూడా పాక్ వన్డే సిరీస్కు ఎంపిక చేయలేదు. కాగా, ఐపీఎల్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు పాక్ పర్యటనకు వెళ్తుంది. ఆ పర్యటనలో మే 30, జూన్ 2, 4 తేదీల్లో మ్యాచ్లు జరుగనున్నాయి.పాకిస్తాన్ వన్డేల కోసం ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), అలెక్స్ క్యారీ, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కునెమాన్, మార్నస్ లాబుషేన్, రైలీ మెరెడిత్, ఆలివర్ పీక్, మాథ్యూ రెన్షా, తన్వీర్ సంఘా, లియామ్ స్కాట్, మాట్ షార్ట్, బిల్లీ స్టాన్లేక్, ఆడమ్ జంపాఅనంతరం ఆస్ట్రేలియా జట్టు మూడు మ్యాచ్ల వన్డే, టీ20 సిరీస్ల కోసం బంగ్లాదేశ్కు వెళ్తుంది. ఈ పర్యటనలో వన్డేలు జూన్ 9, 11, 14 తేదీల్లో.. టీ20లు 17, 19, 21 తేదీల్లో జరుగన్నాయి.బంగ్లాదేశ్ వన్డేల కోసం ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, అలెక్స్ క్యారీ, కూపర్ కానలీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కునెమాన్, మార్నస్ లాబుషేన్, మాథ్యూ రెన్షా, తన్వీర్ సంఘా, లియామ్ స్కాట్, ఆడమ్ జంపాబంగ్లాదేశ్ టీ20ల కోసం ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కానలీ, టిమ్ డేవిడ్, జోయెల్ డేవిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మాథ్యూ కుహ్నెమాన్, రిలే మెరెడిత్, జోష్ ఫిలిప్, మాథ్యూ రెన్షా, ఆడమ్ జంపా -
ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ గెలుపు
మహిళల క్రికెట్లో భాగంగా నిన్న (మే 10) జరిగిన వన్డే మ్యాచ్లో న్యూజిలాండ్పై ఇంగ్లండ్ వికెట్ తేడాతో గెలుపొందింది. ఉత్కంఠగా సాగిన ఈ సమరంలో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 48.4 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ 48.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ 3 మ్యాచ్ల సిరీస్లో 1-0తో బోణీ కొట్టింది. న్యూజిలాండ్ జట్టు మూడు వన్డేలు, మూడు టీ20ల కోసం ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. వన్డే సిరీస్లోని రెండో మ్యాచ్ మే 13న నార్తంప్టన్ వేదికగా జరుగనుంది.రాణించిన గ్రీన్, కెర్చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ బ్యాటర్లు మ్యాడీ గ్రీన్ (88), కెప్టెన్ అమేలియా కెర్ (55) అర్ద సెంచరీలతో రాణించారు. వీరు మినహా జట్టులో ఎవ్వరూ ఓ మోస్తరు స్కోర్లైనా చేయలేదు. దీంతో న్యూజిలాండ్ స్వల్ప స్కోర్కే పరిమితమైంది. మిగతా ప్లేయర్లలో జార్జియా ప్లిమ్మర్ (20), ఇసబెల్లా గేజ్ (11) రెండంకెల స్కోర్లు చేయగా.. సూజీ బేట్స్ (6), బ్రూక్ హాల్లీడే (6), ఇజ్జీ షార్ప్ (6), జెస్ కెర్ (2) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. నెన్సి పటేల్, బ్రీ ల్లింగ్ డకౌట్ కాగా.. రోస్మేరీ 4 పరుగులతో అజేయంగా నిలిచింది. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్, కోల్మన్, ఛార్లోట్ డీన్ తలో 2 వికెట్లు తయగా.. లారన్ ఫైలర్, గిబ్సన్, గ్రివ్కాక్ తలో వికెట్ దక్కించుకున్నారు.ఇంగ్లండ్ను గెలిపించిన డీన్స్వల్ప లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ కూడా తడబడినప్పటికీ.. చివరికి విజయం సాధించింది. కెప్టెన్ డీన్ 31 పరుగులతో అజేయంగా నిలిచి తన జట్టును విజయతీరాలకు చేర్చింది. ఆమెకు మియా బౌచర్ (59), కెంప్ (30), గిబ్సన్ (19), లారెన్ బెల్ (12), కోల్మన్ (3 నాటౌట్) సహకరించారు. న్యూజిలాండ్ బౌలర్లలో రోస్మేరీ 3, అమేలియా కెర్ 2, జెస్ కెర్, ఇల్లింగ్, నెన్సి పటేల్ తలో వికెట్ తీసి ఇంగ్లండ్ను ఇబ్బంది పెట్టారు. -
ముంబై ఇండియన్స్ కొంపముంచిన సూర్యకుమార్
ఐపీఎల్ 2026 నుంచి ఫైవ్ టైమ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ అధికారికంగా నిష్క్రమించింది. నిన్న (మే 10) ఆర్సీబీతో జరిగిన క్లోజ్ ఫైట్ పరాభవం తర్వాత నాకౌట్ రేసు నుంచి వైదొలిగింది. ఆర్సీబీ కొట్టిన ఈ దెబ్బకు ముంబై ఇండియన్స్తో పాటు లక్నో సూపర్ జెయింట్స్ కూడా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ముంబై చివరి బంతి వరకు పోరాడినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. తొలుత బ్యాటింగ్ చేసి 167 పరుగుల ఫైటింగ్ టార్గెట్ను సెట్ చేసిన ముంబై.. అందుకు తగ్గట్టుగానే అద్భుతంగా పోరాడింది. చివరి ఓవర్లో 15 పరుగులను కాపాడుకునే క్రమంలో ఆ జట్టు తాత్కాలిక సారధి సూర్యకుమార్ యాదవ్ ఓ ఘోర తప్పిదం చేశాడు.ఘజన్ఫర్ రూపంలో నాణ్యమైన స్పిన్ బౌలర్ ఉన్నా, పెద్దగా అనుభవం లేని రాజ్ బవా చేతికి బంతినిచ్చి మూల్యం చెల్లించుకున్నాడు. చివరి ఓవర్లో బవా చివరి బంతి వరకు గెలుపు అవకాశాలు ఉన్నప్పటికీ.. ఘోర తప్పిదాలు చేసి ఓటమికి ప్రధాన కారకుడయ్యాడుఆ ఓవర్లో బవా ఒత్తిడికిలోనై 3 వైడ్లు, ఓ నో బాల్ సహా 11 బంతులు వేశాడు. అధికారిక నాలుగో బంతికి భువనేశ్వర్ కుమార్ ఊహించని రీతిలో సిక్సర్ కొట్టి ఆర్సీబీ గెలుపుకు మార్గం సుగమం చేశాడు. చివరి 2 రెండు బంతుల్లో 3 పరుగులు చేయాల్సి ఉండగా.. ఐదో బంతికి భువీ సింగిల్ తీశాడు.దీంతో చివరి బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. ఇక్కడ బవా చాలా పెద్ద తప్పు చేశాడు. ఆ బంతిని ఎదుర్కొన్న రసిక్ సలామ్ దార్ స్ట్రయిట్గా ఆడగా.. బవా బంతిని ఆపలేకపోయాడు. దీంతో రసిక్ రెండు పరుగులు పూర్తి చేసి ఆర్సీబీని గెలిపించాడు.మ్యాచ్ అనంతరం స్కై తీసుకున్న తప్పుడు నిర్ణయానికి విమర్శలపాలయ్యాడు. ఘజన్ఫర్ కాకపోయినా విల్ జాక్స్ రూపంలో మరో ఆప్షన్ ఉన్నా అతడు వినియోగించుకోలేదు. అప్పటికే 2 ఓవర్లలో 24 పరుగులిచ్చిన బవా చేతికి బంతినిచ్చి ఓటమిని కొని తెచ్చుకున్నాడు. స్కై తీసుకున్న ఈ నిర్ణయం ఈ ఒక్క మ్యాచ్ ఓటమినే కాకుండా ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను కూడా క్లోజ్ చేసింది. వరుసగా మరో సీజన్ ప్లే ఆఫ్స్కు చేరలేకపోవడంతో ఆ జట్టు అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత తమకేదీ కలిసిరావట్లేదని వాపోతున్నారు. కాగా, రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గాయపడటంతో గత రెండు మ్యాచ్లుగా స్కై కెప్టెన్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. -
ఒకే దెబ్బకు రెండు పిట్టలు
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (మే 10) రాత్రి జరిగిన రసవత్తర మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై ఆర్సీబీ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలను సుగమనం చేసుకోగా.. ముంబై ఇండియన్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. అలాగే మరో జట్టు కూడా పోటీ నుంచి వైదొలిగింది. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో సీఎస్కే చేతిలో చిత్తైన లక్నో సూపర్ జెయింట్స్ ముంబై ఇండియన్స్తో పాటు ఇంటికెళ్లింది. ఈ లెక్కన ఆర్సీబీ ఒకే దెబ్బతో రెండు జట్లను ఔట్ చేసింది.ఎంఐ, లక్నో నిష్క్రమణతో ఇక ప్లే ఆఫ్స్ రేసులో 8 జట్లు మిగిలి ఉన్నాయి. వీటిలో నాలుగు మాత్రమే ప్లే ఆఫ్స్కు చేరతాయి. ప్రస్తుతం టాప్-3లో ఉన్న ఆర్సీబీ (14 పాయింట్లు), ఎస్ఆర్హెచ్ (14), గుజరాత్ (14) ఆడాల్సిన 3 మ్యాచ్ల్లో తలో మ్యాచ్ గెలిచినా నాకౌట్ బెర్త్లు ఖరారయ్యే అవకాశం ఉంది.నాలుగో స్థానంలో ఉన్న పంజాబ్ ఇంకా 4 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. టాప్-3 జట్లతో పాటు ఈ జట్టుకు కూడా ప్లే ఆఫ్స్ అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. ఐదు, ఆరు స్థానాల్లో ఉన్న సీఎస్కే (12), రాజస్థాన్ (12) తలో 3 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ జట్లు నాకౌట్ బెర్త్లు దక్కించుకోవాలంటే కనీసం రెండు మ్యాచ్లైనా గెలవాలి. అప్పుడు కూడా ప్రస్తుతం టాప్-4లో ఉన్న జట్ల జయాపజయాలపై వీటి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ప్లే ఆఫ్స్ రేసులో మినుకుమినుమనే అవకాశాలు కలిగిన చివరి రెండు జట్లు కేకేఆర్ (9), ఢిల్లీ (8).ఈ రెండు జట్లు ప్లే ఆఫ్స్కు చేరడం దాదాపుగా అసాధ్యం. అయితే టెక్నికల్గా అవకాశాలు లేకపోలేదు. కేకేఆర్ తమ చివరి 4 మ్యాచ్ల్లో అన్నీ గెలిస్తే ప్లే ఆఫ్స్ అవకాశం ఉంటుంది. అలాగే డీసీ కూడా వారి చివరి 3 మ్యాచ్ల్లో తప్పక గెలవాలి. ఇలా జరిగితే ఈ రెండు జట్లకు కూడా ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి.ఓవరాల్గా చూస్తే.. పోటీ ప్రధానంగా ప్రస్తుతం టాప్-4లో ఉన్న నాలుగు జట్ల మధ్యే ఉంది. ఏదైనా అనూహ్యం జరిగితే సీఎస్కే, రాజస్థాన్ కూడా లైన్లోకి వస్తాయి. అద్భుతం జరిగితే కేకేఆర్, డీసీ కూడా రేసులో ఉంటాయి. ఇవాళ మరో జట్టు భవిష్యత్తు కూడా తేలిపోతుంది. పంజాబ్ చేతిలో ఓడితే డీసీ కూడా ఇంటిముఖం పడుతుంది. అప్పుడు రేసులో ఏడు జట్లు మాత్రమే మిగిలి ఉంటాయి. ఏది జరిగినా ఆశ్చర్యపోవాల్సి అవసరం లేదు. ఎందుకంటే పోటీ చాలా రసవత్తరంగా ఉంది.ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న జట్లు ఆడాల్సిన మిగిలిన మ్యాచ్లు..ఆర్సీబీ- కేకేఆర్ (మే 13), పంజాబ్ (17), ఎస్ఆర్హెచ్ (22)ఎస్ఆర్హెచ్- గుజరాత్ (12), సీఎస్కే (18), ఆర్సీబీ (22)గుజరాత్- ఎస్ఆర్హెచ్ (12), కేకేఆర్ (16), సీఎస్కే (21)పంజాబ్- డీసీ (11), ముంబై (14), ఆర్సీబీ (17), లక్నో (23)సీఎస్కే- లక్నో (15), ఎస్ఆర్హెచ్ (18), గుజరాత్ (21)రాజస్థాన్- డీసీ (17), లక్నో (19), ముంబై (24)కేకేఆర్- ఆర్సీబీ (13), గుజరాత్ (16), ముంబై (20), డీసీ (24)డీసీ- పంజాబ్ (11), రాజస్థాన్ (17), కేకేఆర్ (24) -
శ్రీనిధి డెక్కన్ ఎఫ్సీ మ్యాచ్ ‘డ్రా’
ఇండియన్ ఫుట్బాల్ లీగ్లో హైదరాబాద్కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టు ఖాతాలో నాలుగో ‘డ్రా’ చేరింది. హైదరాబాద్ వేదికగా షిల్లాంగ్ లాజోంగ్ ఎఫ్సీ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్ను శ్రీనిధి జట్టు 1–1తో ‘డ్రా’గా ముగించింది. శ్రీనిధి జట్టు తరఫున కాస్టనెడా (9వ నిమిషంలో), షిల్లాంగ్ జట్టు తరఫున బువామ్ (59వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ప్రస్తుతం శ్రీనిధి జట్టు 22 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది. -
వివాన్–నీరూ జోడీకి కాంస్యం
అల్మాటీ (కజకిస్తాన్): ప్రపంచకప్ షాట్గన్ షూటింగ్ టోర్నమెంట్ను భారత జట్టు ఏకైక కాంస్య పతకంతో ముగించింది. చివరిరోజు ఆదివారం ట్రాప్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో వివాన్ కపూర్–నీరూ ద్వయం కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. నాలుగు జోడీల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో వివాన్–నీరూ జంట 24 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. యాంగ్ కున్ పి–లియు వాన్ యు (చైనీస్ తైపీ) జోడీ 36 పాయింట్లతో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడంతోపాటు పసిడి పతకాన్ని గెలిచింది. 33 పాయింట్లతో మౌరో డె ఫిలిపిస్–మరియా స్టాంకో సిల్వానా (ఇటలీ) జంట రజత పతకాన్ని కైవసం చేసుకుంది. -
మన బాణం బంగారం
షాంఘై (చైనా): ఐదేళ్ల నిరీక్షణకు భారత మహిళల ఆర్చరీ జట్టు తెరదించింది. ఆదివారం ముగిసిన ప్రపంచకప్ స్టేజ్–2 టోర్నీలో మహిళల టీమ్ రికర్వ్ విభాగంలో టీమిండియా భారత జట్టు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. వరుసగా నాలుగు ఒలింపిక్స్లో పోటీపడ్డ ప్రపంచ మాజీ నంబర్వన్ దీపిక కుమారి, అంకిత, కుంకుమ్లతో కూడిన భారత జట్టు ఫైనల్లో 5–4 (54–53, 52–55, 56–57, 54–53, 28–26) సెట్ పాయింట్లతో జు జింగీ, యు కి, హువాంగ్ యువెలతో కూడిన ఆతిథ్య చైనా జట్టును ఓడించింది. తొలి సెట్ను నెగ్గిన భారత్ 2–0తో ముందంజ వేయగా... రెండో సెట్ను గెలిచి చైనా స్కోరును 2–2తో సమం చేసింది. మూడో సెట్ను కోల్పోయి 2–4తో వెనుకబడ్డ భారత్ నాలుగో సెట్ను సొంతం చేసుకొని స్కోరును 4–4తో సమం చేసింది. విజేతను నిర్ణయించేందుకు ‘షూట్ ఆఫ్’ నిర్వహించారు. భారత బృందం 28 పాయింట్లు స్కోరు చేయగా... చైనా 26 పాయింట్లకే పరిమితమైంది. దాంతో 2021 తర్వాత భారత మహిళల రికర్వ్ జట్టు ప్రపంచకప్లో బంగారు పతకాన్ని దక్కించుకుంది. చివరిసారి 2021లో దీపిక కుమారి, కోమలిక, అంకితలతో కూడిన భారత జట్టు గ్వాటెమాలా సిటీలో జరిగిన ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీలో, పారిస్లో జరిగిన ప్రపంచకప్ స్టేజ్–3 టోర్నీలో పసిడి పతకాలు గెలిచింది. మరోవైపు మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్ సిమ్రన్జీత్ కౌర్ కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. సెమీఫైనల్లో సిమ్రన్జీత్ 0–6 ( 25–26, 24–29, 26–28)సెట్ పాయింట్లతో కాంగ్ చెయంగ్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. అనంతరం కాంస్య పతక మ్యాచ్లో సిమ్రన్జీత్ 4–6 (29–27, 27–29, 28–28, 28–29, 28–28) సెట్ పాయింట్లతో జాంగ్ మిన్హీ (దక్షిణ కొరియా) చేతిలో పరాజయం పాలైంది. సెట్ గెలిస్తే రెండు పాయింట్లు, స్కోరు సమమైతే ఒక్కో పాయింట్ కేటాయిస్తారు. తదుపరి ప్రపంచకప్ స్టేజ్–3 టోర్నీ టర్కిలోని అంటాల్యా నగరంలో జూన్ 9 నుంచి 14 వరకు జరుగుతుంది. -
ఆర్సీబీ థ్రిల్లింగ్ విక్టరీ.. ముంబై ఇండియన్స్ ఖేల్ ఖతం!
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ ఆట ముగిసింది. ఆర్సీబీ చేతిలో ఓటమితో ఈ సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ నిష్క్రమించింది. ఆదివారం రాయ్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై ఆర్సీబీ 2 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది. టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైన చోట కృనాల్ పాండ్యా వీరోచిత పోరాటం ఆర్సీబీని విజయం వైపు తీసుకెళ్లింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. కృనాల్ పాండ్యా (46 బంతుల్లో 73) తన కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడి విజయంలో కీలకపాత్ర పోషించగా.. చివర్లో భువనేశ్వర్ సిక్సర్ కొట్టి ఆర్సీబీకి థ్రిల్లింగ్ విజయాన్ని అందించాడు. జాకబ్ బెతెల్ (27) పర్వాలేదనిపించాడు. ముంబై బౌలర్లలో కార్బిన్ బోస్క్ 4 వికెట్లు తీయగా, దీపక్ చాహర్ 2, గజన్ఫర్, రాజ్ బవాలు తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. తిలక్ వర్మ (57) హాఫ్ సెంచరీతో రాణించగా.. నమన్ ధిర్ (47) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు మినహా మిగతా ముంబై బ్యాటర్లు విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లతో అదరగొట్టగా, హాజిల్వుడ్, రసిక్ సలామ్, షెపర్డ్ తలా ఒక వికెట్ తీశారు. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ను ముంబై చేజేతులా ఓటమిని కొనితెచ్చుకుంది. ఫీల్డింగ్లో తప్పిదాలు, ఆఖరి ఓవర్లో రాజ్ బవా ఒత్తిడి లోనయ్యి వరుస వైడ్లు, నోబాల్ వేయడం కూడా ముంబై కొంపముంచింది. ఈ ఓటమితో ముంబై ప్లేఆఫ్స్ చేరకుండానే ఐపీఎల్ 19వ సీజన్ నుంచి ఎలిమినేట్ అయింది. మరోవైపు ఆర్సీబీ మాత్రం 11 మ్యాచ్ల్లో ఏడో విజయంతో 14 పాయింట్లు సాధించి మెరుగైన రన్రేట్తో టేబుల్ టాపర్గా నిలిచింది.WHAT ON EARTH HAVE WE JUST WITNESSED! 🤯Bhuvneshwar Kumar & Rasikh Dar, take a bow ❤️Updates ▶️ https://t.co/wYlCB10dhm#TATAIPL | #KhelBindaas | #RCBvMI | @RCBTweets pic.twitter.com/tqkuPMEsHR— IndianPremierLeague (@IPL) May 10, 2026 -
సిల్వర్ టు గోల్డెన్ డక్.. కోహ్లీ చెత్త రికార్డు
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో ఆర్సీబీ ఓపెనర్ విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ నాలుగో బంతిని మిడాఫ్ దిశగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడ కాచుకు కూర్చున్న రాజ్బవాకు స్టన్నింగ్ క్యాచ్ అందుకోవడంతో కోహ్లీ వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ డకౌట్ల విషయంలో చెత్త రికార్డు నమోదు చేశాడు. ఈ సీజన్లో తొలిసారి గోల్డెన్ డక్ అయిన కోహ్లీకి ఓవరాల్గా ఐపీఎల్లో ఎనిమిదో గోల్డెన్ డకౌట్ కావడం గమనార్హం. అంతేకాదు ఈ సీజన్లో వరుసగా రెండో మ్యాచ్లోనూ డకౌట్గా వెనుదిరిగాడు. తద్వారా నాలుగేళ్ల తర్వాత రెండు వరుస మ్యాచ్ల్లో డకౌట్ అయిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. లక్నోతో జరిగిన గత మ్యాచ్లోనూ కోహ్లీ 2 బంతులెదుర్కొని సున్నా పరుగుల వద్ద ఔటయ్యాడు. 2022 సీజన్లో కోహ్లీ లక్నో, ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ల్లో ఇదే మాదిరిగా డకౌట్ అయ్యాడు. దీంతో సోషల్ మీడియాలో అభిమానులు కోహ్లీని ట్రోల్ చేశారు. 'సిల్వర్ డక్ను గోల్డెన్ డక్గా మార్చుకున్న ఘనత కోహ్లీ సొంతం' అంటూ కామెంట్లు చేశారు. ఇక తాజా డకౌట్తో కోహ్లీ మరిన్ని చెత్త రికార్డులు మూట గట్టుకున్నాడు. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం.👉ముంబై ఇండియన్స్పై కోహ్లీ డకౌట్ కావడం ఇది మూడోసారి. గతంలో ఎస్ఆర్హెచ్పై కూడా మూడుసార్లు డకౌట్ అయ్యాడు. ఇక లక్నోపై రెండుసార్లు, పంజాబ్, గుజరాత్, కేకేఆర్, రాజస్తాన్లపై ఒక్కోసారి డకౌట్గా వెనుదిరిగాడు.👉 ఐపీఎల్లో కోహ్లీ గోల్డెన్ డకౌటవ్వడం నాలుగేళ్లలో ఇదే తొలిసారి. 2022 సీజన్లో లక్నో సూపర్జెయింట్స్తో మ్యాచ్లో ఎదుర్కొన్న తొలి బంతికే వెనుదిరిగాడు. ఆ సీజన్లో ఎస్ఆర్హెచ్తో ఆడిన తర్వాతి మ్యాచ్లోనూ కోహ్లీ డకౌట్ అయ్యాడు. తాజా సీజన్లోనూ వరుసగా లక్నో, ముంబైతో మ్యాచ్ల్లోనూ మరోసారి రిపీట్ చేశాడు.👉 ఐపీఎల్ల్లో అత్యధిక సార్లు గోల్డెన్డక్ అయిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ (8 సార్లు).. ఇషాన్ కిషన్, సునీల్ నరైన్లతో కలిసి సంయుక్తంగా ఉన్నాడు. వీరి కంటే ముందు రషీద్ ఖాన్ (12 సార్లు), మ్యాక్స్వెల్ (10 సార్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.👉ఈ సీజన్లో కోహ్లీ బ్యాటింగ్లో మెరుపులు తగ్గినప్పటికీ పర్వాలేదనిపిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్ల్లో 379 పరుగులు సాధించాడు. అయితే గత నాలుగు ఇన్నింగ్స్లు కలిపి కోహ్లీ చేసిన పరుగులు 51 మాత్రమే కావడం గమనార్హం.Virat Kohli goes for a Golden Duck 😯Courtesy Deepak Chahar 🤌💙Updates ▶️ https://t.co/wYlCB10dhm#TATAIPL | #KhelBindaas | #RCBvMI | @mipaltan pic.twitter.com/LxCP62qvVJ— IndianPremierLeague (@IPL) May 10, 2026Silver duck now has been upgraded to golden duck 😂 pic.twitter.com/wxhEbgDBHC— Hitman (@Vijay456V60026) May 10, 2026చదవండి: లేటు వయసులో భువనేశ్వర్ కొత్త చరిత్ర! -
లేటు వయసులో భువనేశ్వర్ కొత్త చరిత్ర!
ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్ భువనేశ్వర్ కుమార్ లేటు వయసులోనూ తన బౌలింగ్తో ఇరగదీస్తున్నాడు. ఆదివారం ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో ఈ వెటరన్ బౌలర్ నాలుగు వికెట్లు పడగొట్టి బౌలింగ్లో ఇంకా పదును తగ్గలేదని మరోసారి నిరూపించాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 19వ సీజన్లో 20 వికెట్లు పూర్తి చేసుకున్న భువనేశ్వర్ ఒక అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజన్లో 20 వికెట్లు తీయడం భువనేశ్వర్కు ఇది నాలుగోసారి. తొలిసారి 2014లో 20 వికెట్ల మార్క్ దాటిన భువనేశ్వర్, ఆ తర్వాత 2016, 2017లోనూ ఈ ఫీట్ నమోదు చేశాడు. తాజాగా నాలుగోసారి 20 ప్లస్ వికెట్ల మార్క్ను అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన నాలుగో బౌలర్గా భువనేశ్వర్ నిలిచాడు. భువనేశ్వర్ కంటే ముందు యజ్వేంద్ర చాహల్ ఐదుసార్లు, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రాలు నాలుగేసిసార్లు ఈ ఫీట్ను సాధించారు. ముంబైతో మ్యాచ్లో భువనేశ్వర్ తాను వేసిన తొలి రెండు ఓవర్లలోనే 17 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. ఆ తర్వాత అర్థసెంచరీతో ముంబై ఇన్నింగ్స్ను నిలబెట్టిన తిలక్ వర్మను క్లీన్బౌల్డ్ చేసి నాలుగో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు.మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. తిలక్ వర్మ (57) హాఫ్ సెంచరీతో రాణించగా.. నమన్ ధిర్ (47) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు మినహా మిగతా ముంబై బ్యాటర్లు విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లతో అదరగొట్టగా, హాజిల్వుడ్, రసిక్ సలామ్, షెపర్డ్ తలా ఒక వికెట్ తీశారు.𝘽𝙝𝙪𝙫𝙞-𝙛𝙪𝙡 exhibition of new-ball magic! 🤌🎥 Just sit back and admire the swing of things! ❤️Updates ▶️ https://t.co/wYlCB10dhm#TATAIPL | #KhelBindaas | #RCBvMI | @RCBTweets | @BhuviOfficial pic.twitter.com/STbZ16mzbj— IndianPremierLeague (@IPL) May 10, 2026The 𝘀𝘁𝘂𝗺𝗽𝘀 𝗹𝗶𝗴𝗵𝘁 𝘂𝗽 courtesy of the Purple Cap holder 👏🔥🎥 Bhuvneshwar Kumar with his 4️⃣th wicket tonight 🙇Updates ▶️ https://t.co/wYlCB10dhm#TATAIPL | #KhelBindaas | #RCBvMI | @RCBTweets | @BhuviOfficial pic.twitter.com/7q5TqfkHNs— IndianPremierLeague (@IPL) May 10, 2026చదవండి: ఉర్విల్ సిక్సర్ల సునామీ.. ‘ఇది నీకోసం పప్పా’ -
ఉర్విల్ సిక్సర్ల సునామీ.. ‘ఇది నీకోసం పప్పా’
ఐపీఎల్ 2026 సీజన్లో ప్లేఆఫ్ బరిలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో చెన్నై సూపర్కింగ్స్ జూలు విదిల్చింది. లక్నో సూపర్జెయింట్స్పై 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో చెన్నై పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. అయితే సీఎస్కే విజయంలో ఉర్విల్ పాత్ర కీలకం. వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన ఉర్విల్ పటేల్ లక్నో బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 8 బంతుల్లోనే 41 పరుగులు చేసిన ఉర్విల్ టీ20 క్రికెట్ చరిత్రలో వేగవంతమైన అర్థసెంచరీ సాధిస్తాడనిపించింది. కానీ ఆ తర్వాత రెండు బంతుల్లో సింగిల్స్ తీయడంతో 13 బంతుల్లో అర్థసెంచరీ మార్క్ సాధించాడు. అయితే ఉర్విల్ ఫిఫ్టీ మార్క్ చేరిన ఆనందంలో అతడి చర్య సోషల్ మీడియాలో వైరల్గా మారింది. A record knock 🤯A memorable celebration with a 𝗵𝗲𝗮𝗿𝘁𝗳𝗲𝗹𝘁 𝗺𝗲𝘀𝘀𝗮𝗴𝗲 🥹🫶Urvil Patel, thank you for the entertainment today 💛 Updates ▶️ https://t.co/MoXhlWHk4O#TATAIPL | #KhelBindaas | #CSKvLSG | @ChennaiIPL pic.twitter.com/GjR5D2sYid— IndianPremierLeague (@IPL) May 10, 2026హాఫ్ సెంచరీ మార్క్ అందుకోగానే ఉర్విల్ తన ప్యాంటు జేబులో నుంచి ఒక కాగితాన్ని బయటకు తీశాడు. ఆ కాగితంలో ఉన్న సందేశాన్ని అభిమానులకు చూపించాడు. అందులో 'ఇది నీకోసం పప్పా' అని రాసి ఉన్న మెసేజ్ కెమెరా కంటికి చిక్కింది.👉 ఇదే మ్యాచ్లో ఉర్విల్ పటేల్ మరో రికార్డు కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఉర్విల్ తాను ఎదుర్కొన్న తొలి 8 బంతుల్లో ఆరు సిక్సర్లు, ఒక బౌండరీ బాదాడు. తద్వారా ఒక ఇన్నింగ్స్లో తొలి 8 బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన తొలి బ్యాటర్గా ఉర్విల్ నిలిచాడు. అంతకముందు ఐపీఎల్లో తొలి 8 బంతుల్లో 33 పరుగులు రావడమే ఉత్తమంగా ఉంది. తాజాగా ఉర్విల్పటేల్ దానిని బద్దలు కొట్టాడు.6️⃣6️⃣6️⃣6️⃣6️⃣4️⃣6️⃣❗🔥Urvil Patel is unleashing absolute carnage at Chepauk! 💥🏏Will he script the fastest fifty in #TATAIPL? 👀🔥#TATAIPL Revenge Week 2026 ➡️ #CSKvLSG | LIVE NOW 👉 https://t.co/niGR0vFDDY pic.twitter.com/86xCo1SXsh— Star Sports (@StarSportsIndia) May 10, 2026👉 సీఎస్కే తరఫున ఒక ఇన్నింగ్స్లో అత్యధిక స్ట్రైక్రేట్తో బ్యాటింగ్ చేసిన జాబితాలో ఉర్విల్ రెండో స్థానంలో నిలిచాడు. లక్నోతో మ్యాచ్లో ఉర్విల్ 282.6 స్ట్రైక్రేట్ 23 బంతుల్లో 65 పరుగులు సాధించాడు. తొలి స్థానంలో సురేశ్ రైనా (348 స్ట్రైక్రేట్, 25 బంతుల్లో 87 పరుగులు) ఉన్నాడు. అంబటి రాయుడు (266.6 స్ట్రైక్రేట్, 27 బంతుల్లో 72 నాటౌట్), ఎంఎస్ ధోని (255 స్ట్రైక్రేట్, 20 బంతుల్లో 51 నాటౌట్), డెవాల్డ్ బ్రెవిస్ (247.82 స్ట్రైక్రేట్, 23 బంతుల్లో 57 పరుగులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.👉 మ్యాచ్ విజయం అనంతరం ఉర్విల్ మాట్లాడుతూ.. ‘నా మనసులో ఏమీ లేదు, కానీ నేను పరిస్థితికి తగినట్లుగా బ్యాటింగ్ చేయాలని భావించాను. స్థిరమైన బేస్ ఉంచుకుని బ్యాటింగ్ ఆడమని కోచ్ సలహా ఇచ్చారు. నేను అదే పాటించాను. వికెట్ పల్లంగా ఉందని, దానికి సిద్ధంగా ఉండమని రుతురాజ్ చెప్పాడు. ఇది మినహా నాకు ఏమీ చెప్పలేదు. నన్ను స్వేచ్ఛగా ఆడనిచ్చాడు. అందుకే ఇది సాధ్యమైంది’ అని చెప్పుకొచ్చాడు.చదవండి: వైభవ్పై రబాడ సంచలన వ్యాఖ్యలు -
ఉర్విల్ పటేల్ ఊచకోత.. లక్నోను చిత్తు చేసిన సీఎస్కే
ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో ఇవాళ (మే 10) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. జోష్ ఇంగ్లిస్ (85) ఊచకోత కోశాడు. ఆఖర్లో షాబాజ్ అహ్మద్ (43 నాటౌట్) రాణించాడు. వీరు మినహా ఎవరూ పెద్ద స్కోర్ చేయలేదు. మిచెల్ మార్ష్ 10, నికోలస్ పూరన్ 1, రిషబ్ పంత్ 15, మార్క్రమ్ 6, రఘువంశీ 18, హిమ్మత్ సింగ్ 17, షమీ డకౌటయ్యారు. సీఎస్కే బౌలర్లలో జేమీ ఓవర్టన్ 3 వికెట్లు పడగొట్టగా.. అన్షుల్ కంబోజ్ 2, నూర్ అహ్మద్ ఓ వికెట్ తీశాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్కే ఆది నుంచే దూకుడుగా ఆడింది. వన్డౌన్లో వచ్చిన ఉర్విల్ పటేల్ (65) పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, విజయానికి గట్టి పునాది వేశాడు. అయితే మధ్యలో సీఎస్కే కాస్త తడబాటుకు లోనైంది. సునాయాసంగా గెలుస్తుందనుకుంటే, మ్యాచ్ను చివరి వరకు తీసుకొచ్చింది. చివరి ఓవర్ తొలి రెండు బంతులకు శివమ్ దూబే (15 నాటౌట్) సిక్సర్లు బాది సీఎస్కేను విజయతీరాలు దాటించాడు. సీఎస్కే బ్యాటర్లలో సంజూ శాంసన్ 28, రుతురాజ్ గైక్వాడ్ 42, కార్తీక్ శర్మ 20, బ్రెవిస్ 10, ప్రశాంత్ వీర్ (18 నాటౌట్) పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో దిగ్వేశ్ రాఠీ, షాబాజ్ అహ్మద్ తలో 2 వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్లో లక్నో చాలా క్యాచ్లు జారవిడిచి మూల్యం చెల్లించుకుంది. ఈ ఓటమితో ఆ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్పై పూర్తిగా ఆశలు వదులుకుంది. సీఎస్కే విషయానికొస్తే.. ఆదిలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న ఈ జట్టు అనూహ్యంగా పుంజుకొని ప్లే ఆఫ్స్ రేసులో ప్రధాన పోటీదారుగా మారిపోయింది. ఈ గెలుపుతో ఆ జట్టు ఖాతాలో 12 పాయింట్లు (11 మ్యాచ్ల్లో 6 విజయాలు) చేరాయి. ప్రస్తుతం ఆ జట్టు పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. -
వైభవ్పై రబాడ సంచలన వ్యాఖ్యలు
ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అదరగొడుతున్నాడు. 15 ఏళ్ల వయసులోనే బౌలర్లను ఉతికారేస్తుండడంతో అతడికి బౌలింగ్ చేయాలంటేనే భయపడుతున్నారు. హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, కమిన్స్, షమీ లాంటి టాప్ పేసర్లు కూడా అతడి పరుగుల వరదని ఆపలేకపోయారు. అయితే గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ కగిసో రబాడ మాత్రం వైభవ్ సూర్యవంశీని పెద్దగా పట్టించుకోనంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.అతడికి బంతులు వేసే క్రమంలో 11 ఏళ్లుగా తనకు తెలిసిన విధానాన్నే ఇప్పటికీ కొనసాగిస్తున్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన బౌలింగ్లో వైభవ్ సూర్యవంశీ సిక్సర్లు కొట్టడంపై మ్యాచ్ అనంతరం రబాడ స్పందించాడు. ‘11 ఏళ్లుగా బౌలింగ్ చేస్తున్నా. అదే విధానమే ఇప్పటికీ కొనసాగుతుంది. బౌలర్లు తమ ప్రణాళికలపై నమ్మకం ఉంచాలి. బ్యాటర్ల బలహీనతలపై విశ్లేషణ చేస్తాం. చాలా కష్టపడి సిద్ధమవుతాం. కానీ చివరికి అదే ప్రాసెస్ను కొనసాగించాలి’ అని పేర్కొన్నాడు. శరీరం బాగానే ఉంది. కానీ మానసిక అలసట కూడా ఉంటుంది. అందుకే ప్రొఫెషనల్గా మరింత జాగ్రత్తగా ఉండాలి’ అని తెలిపాడు.ఐపీఎల్ 2026 సీజన్లో తొలి అంచె పోటీల్లో వరుస విజయాలు నమోదు చేసిన రాజస్తాన్ రెండో అంచెలో మాత్రం ఓటములు చవిచూస్తూ వస్తోంది. అయితే వైభవ్ మాత్రం ప్రతీ మ్యాచ్లో మినిమం గ్యారంటీ ఇన్నింగ్స్ ఆడుతూ అభిమానులను అలరిస్తున్నాడు. అంతేకాదు ఈ సీజన్లో నాలుగోసారి సిక్సర్తో ఇన్నింగ్స్ను మొదలుపెట్టిన వైభవ్ పలు రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.శనివారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 77 పరుగుల భారీ తేడాతో గెలిచింది. మ్యాచ్లో రబాడ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మూడు ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో ఐపీఎల్ 2026 పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడి.. 18 వికెట్లు తీసి అద్భుత ఫామ్లో కొనసాగుతున్నాడు. రాజస్తాన్పై విజయంతో గుజరాత్ వరుసగా నాలుగు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.చదవండి: సీఎస్కే అడ్డాలో జోస్ ఇంగ్లిస్ అరుదైన ఫీట్! -
IPL 2026: ముంబైపై ఆర్సీబీ ఉత్కంఠ విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ ఆట ముగిసింది. ఆర్సీబీ చేతిలో ఓటమితో ఈ సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ నిష్క్రమించింది. ఆదివారం రాయ్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై ఆర్సీబీ 2 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. కృనాల్ పాండ్యా (46 బంతుల్లో 73) తన కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడి విజయంలో కీలకపాత్ర పోషించగా.. చివర్లో భువనేశ్వర్ సిక్సర్ కొట్టి ఆర్సీబీకి థ్రిల్లింగ్ విజయాన్ని అందించాడు. జాకబ్ బెతెల్ (27) పర్వాలేదనిపించాడు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది.కార్బిన్ బాష్కు నాలుగు వికెట్లుముంబై ఇండియన్స్తో మ్యాచ్లో ఆర్సీబీ కష్టాల్లో పడింది. కార్బిన్ బాష్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. 18 పరుగులు చేసిన జితేశ్ శర్మ కార్బిన్ బోష్ బౌలింగ్లో నమన్ ధిర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాతి బంతికే టిమ్ డేవిడ్ కూడా గోల్డెన్ డక్గా వెనుదిరగడంతో ఆర్సీబీ ఆరో వికెట్ కోల్పోయింది. అంతకముందు కృనాల్ పాండ్యా అర్థశతకంతో మెరిశాడు. 33 బంతుల్లో అర్థశతకం సాధించిన కృనాల్ ఇన్నింగ్స్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. 16 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది.నాలుగో వికెట్ కోల్పోయిన ఆర్సీబీజాకబ్ బెతెల్ (27) రూపంలో ఆర్సీబీ 94 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. కార్బిన్ బోష్ బౌలింగ్లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి బెతెల్ పెవిలియన్ చేరాడు. 13 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ 4 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. కృనాల్ పాండ్యా (41) పరుగులతో ఆడుతున్నాడు.మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీకెప్టెన్ పటీదార్ (8) రూపంలో ఆర్సీబీ 39 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. కార్బిన్ బోస్క్ బౌలింగ్లో షాట్కు యత్నించి రికెల్టన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 7 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ 3 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది.రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీముంబైతో మ్యాచ్లో ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. ముంబై స్కోరు 24 పరుగుల వద్ద ఉన్నప్పుడు దీపక్ చాహర్ బౌలింగ్లో 12 పరుగులు చేసిన దేవదత్ పడిక్కల్ కీపర్ రికెల్టన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కోహ్లీ గోల్డెన్ డక్.. తొలి వికెట్ డౌన్167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. దీపక్ చాహర్ బౌలింగ్లో రాజ్ బవాకు క్యాచ్ ఇచ్చిన కోహ్లీ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు.ఆర్సీబీ టార్గెట్ 167 పరుగులుఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఆర్సీబీకి ముంబై ఇండియన్స్ 167 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. తిలక్ వర్మ (57) హాఫ్ సెంచరీతో రాణించగా.. నమన్ ధిర్ (47) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు మినహా మిగతా ముంబై బ్యాటర్లు విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లతో అదరగొట్టగా, హాజిల్వుడ్, రసిక్ సలామ్, షెపర్డ్ తలా ఒక వికెట్ తీశారు.ఐదో వికెట్ కోల్పోయిన ముంబైవిల్ జాక్స్ (10) రూపంలో ముంబై ఇండియన్స్ 132 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. షెపర్డ్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించిన విల్ జాక్స్ జాకబ్ బెతెల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 15.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది.నమన్ ధిర్ హాఫ్ సెంచరీ మిస్ ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. నమన్ ధిర్ 47 పరుగులు చేసి రసిఖ్ సలాం దార్ బౌలింగ్లో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో తిలక్ వర్మ 41, విల్ జాక్ 5 పరుగులతో ఉన్నారు. స్కోరు 114-4 (13 ఓవర్లకు)గా ఉంది. 10 ఓవర్లకు 82 పరుగులు ముంబై ఇండియన్స్ 10 ఓవర్లు ముగిసేనాటికి మూడు వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. క్రీజులో నమన్ ధిర్ 34, తిలక్ వర్మ 25 పరుగులతో ఉన్నారు. క్రీజులో నమన్, తిలక్ వర్మ 7 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ మూడు వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. నమన్ ధిర్ (16), తిలక్ వర్మ (13) పరుగులతో ఆడుతున్నారు.సూర్య గోల్డెన్ డక్.. మూడో వికెట్ డౌన్ఆర్సీబీతో మ్యాచ్లో స్టాండ్ ఇన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గోల్డెన్ డక్గా వెనుదిరగడంతో ముంబై మూడో వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ బౌలింగ్లో తాను ఆడిన తొలి బంతికే సూర్య కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకముందు రోహిత్ శర్మ (28)ను కాట్ అండ్ బౌల్డ్ చేశాడు. 4 ఓవర్లు ముగిసేసరికి ముంబై మూడు వికెట్ల నష్టానికి 34 పరుగులు చేసింది. నమన్ ధిర్ (5), తిలక్ వర్మ (1) పరుగుతో ఆడుతున్నారు.తొలి వికెట్ కోల్పోయిన ముంబైఆర్సీబీతో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 4 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఫామ్లో ఉన్న రికెల్టన్ 2 పరుగులు మాత్రమే చేసి భువనేశ్వర్ బౌలింగ్లో పటీదార్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.టాస్ గెలిచిన ఆర్సీబీటాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూరం కావడంతో సూర్యకుమార్ యాదవ్ స్టాండ్ ఇన్ కెప్టెన్గా ఉన్నాడు. ముఖాముఖి పోరులో ఇప్పటివరకు ఇరుజట్లు 35 సార్లు తలపడ్డాయి. ముంబై ఇండియన్స్ 19 సార్లు, ఆర్సీబీ 16 సార్లు గెలిచాయి. 2023 నుంచి ఐదు మ్యాచ్లు ఆడితే ఆర్సీబీ మూడు గెలిస్తే, ముంబై రెండు విజయాలు సాధించింది. తొలి అంచె పోటీలో ముంబై ఇండియన్స్పై ఆర్సీబీ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాయింట్ల పరంగా చూసుకుంటే ఆర్సీబీ 10 మ్యాచ్ల్లో ఆరు విజయాలు సాధించి 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ముంబైపై గెలిస్తే 14 పాయింట్లతో ఎస్ఆర్హెచ్ను వెనక్కి నెట్టి టేబుల్ టాపర్గా నిలవనుంది. మరోవైపు ఇప్పటికే ప్లేఆఫ్ ఆశలు క్లిష్టం చేసుకున్న ముంబై 10 మ్యాచ్ల్లో మూడు విజయాలతో పట్టికలో 9వ స్థానంలో ఉంది.తుది జట్లు:ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, రికెల్టన్(వికెట్ కీపర్), నమన్ ధిర్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, విల్ జాక్స్, రాజ్ బావా, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, గజన్ఫర్.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, జాకబ్ బెథెల్, రజత్ పటీదార్ (కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్వుడ్, సుయాష్ శర్మ, రసిఖ్ సలాం దార్.ముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ సబ్స్: ట్రెంట్ బౌల్ట్, రఘు శర్మ, మయాంక్ రావత్, రాబిన్ మింజ్, శార్దూల్ ఠాకూర్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంపాక్ట్ సబ్స్: దేవదత్ పడిక్కల్, జోర్డాన్ కాక్స్, మంగేష్ యాదవ్, స్వప్నిల్ సింగ్, వెంకటేష్ అయ్యర్🚨 Toss 🚨@RCBTweets have won the toss and elected to bowl first against @mipaltan in Raipur.Surya Kumar Yadav continues to lead #MI in Hardik Pandya's absence.Updates ▶️ https://t.co/wYlCB10dhm#TATAIPL | #KhelBindaas | #RCBvMI pic.twitter.com/TilnplTivN— IndianPremierLeague (@IPL) May 10, 2026 -
ఉర్విల్ పటేల్ సరికొత్త చరిత్ర.. ఐపీఎల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ
ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో ఇవాళ (మే 10) జరుగుతున్న మ్యాచ్లో సీఎస్కే బ్యాటర్ ఉర్విల్ మహోగ్రరూపం దాల్చాడు. కేవలం 13 బంతుల్లోనే ఓ ఫోర్, 7 సిక్సర్ల సాయంతో అర్ద సెంచరీ పూర్తి చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఇది అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ. గతంలో ఈ రికార్డు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ పేరిట ఉండేది. జైస్వాల్ కూడా 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. తాజాగా ఈ రికార్డును ఉర్విల్ జైస్వాల్తో సంయుక్తంగా పంచుకున్నాడు.ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీలు13 - యశస్వి జైస్వాల్ (RR) vs KKR, కోల్కతా, 202313 - ఉర్విల్ పటేల్ (CSK) vs LSG, లక్నో, 202614 - KL రాహుల్ (PBKS) vs DC, మొహాలి, 201814 - ప్యాట్ కమిన్స్ (KKR) vs MI, పుణే, 202214 - రొమారియో షెపర్డ్ (RCB) vs CSK, బెంగళూరు, 2025సరికొత్త చరిత్రఈ ఇన్నింగ్స్తో ఉర్విల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో తొలి 10 బంతుల తర్వాత అత్యధిక స్కోర్ (42) చేసిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు ఏబీ డివిలియర్స్ పేరిట ఉండేది. 2015 ఎడిషన్లో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో డివిలియర్స్ తొలి 10 బంతుల తర్వాత 41 పరుగులతో అజేయంగా నిలిచాడు. తాజాగా ఈ రికార్డును ఉర్విల్ బద్దలు కొట్టాడు.ఐపీఎల్లో మొదటి 10 బంతుల తర్వాత అత్యధిక స్కోర్లు42* - ఉర్విల్ పటేల్ vs LSG, చెన్నై, 202641* - AB డివిలియర్స్ vs MI, బెంగళూరు, 201541* - యశస్వి జైస్వాల్ vs KKR, కోల్కతా, 202340* - అభిషేక్ శర్మ vs DC, ఢిల్లీ, 202439* - రొమారియో షెపర్డ్ vs DC, ముంబై WS, 202439* - ప్రియాంష్ ఆర్య vs CSK, చెన్నై, 2026మ్యాచ్ విషయానికొస్తే.. 204 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సీఎస్కే దూసుకుపోతుంది. తొలి 10 ఓవర్లలో ఏకంగా 132 పరుగులు చేసి లక్ష్యం దిశగా సాగుతోంది. ఉర్విల్ 23 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 65 పరుగులు చేసి ఔటయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్ (33), కార్తీక్ శర్మ (4) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో సీఎస్కే గెలవాలంటే 60 బంతుల్లో మరో 73 పరుగులు చేయాల్సి ఉంది.అంతకుముందు లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. జోష్ ఇంగ్లిస్ (85) ఊచకోత కోశాడు. ఆఖర్లో షాబాజ్ అహ్మద్ (43 నాటౌట్) రాణించాడు. వీరు మినహా ఎవరూ పెద్ద స్కోర్ చేయలేదు. మిచెల్ మార్ష్ 10, నికోలస్ పూరన్ 1, రిషబ్ పంత్ 15, మార్క్రమ్ 6, రఘువంశీ 18, హిమ్మత్ సింగ్ 17, షమీ డకౌటయ్యారు. సీఎస్కే బౌలర్లలో జేమీ ఓవర్టన్ 3 వికెట్లు పడగొట్టగా.. అన్షుల్ కంబోజ్ 2, నూర్ అహ్మద్ ఓ వికెట్ తీశాడు. -
సీఎస్కే అడ్డాలో జోస్ ఇంగ్లిస్ అరుదైన ఫీట్!
లక్నో సూపర్జెయింట్స్ బ్యాటర్ జోస్ ఇంగ్లిస్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ 19వ సీజన్లో ఆదివారం సీఎస్కేతో మ్యాచ్లో దనాధన్ ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లిస్ 33 బంతుల్లోనే 85 పరుగులు చేశాడు. 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ సాధించిన ఇంగ్లిస్ ఒక అరుదైన ఫీట్ సాధించాడు. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో తక్కువ బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్న తొలి క్రికెటర్గా ఇంగ్లిస్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు సామ్ బిల్లింగ్స్ (21 బంతులు) పేరిట ఉండేది. సీఎస్కే సొంత గ్రౌండ్ అయినప్పటికీ ఇప్పటివరకు ఆ జట్టులో కూడా ఎవరు తక్కువ బంతుల్లో అర్థసెంచరీ సాధించలేకపోయారు. ఇక సామ్ బిల్లింగ్స్ 21 బంతుల్లో అర్థసెంచరీ సాధించాడు. 2018 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్పై బిల్లింగ్స్ దీనిని సాధించాడు. తాజాగా జోస్ ఇంగ్లిస్ కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి సీఎస్కే బ్యాటర్లకు కూడా సాధ్యం కానిది తన పేరిట లిఖించుకున్నాడు. అయితే ఇంగ్లిస్ ఉన్నంతసేపు లక్నో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. ఆరు ఓవర్లలోనే వంద పరుగుల మార్క్ను దాటిన లక్నో.. ఇంగ్లిస్ ఔటయ్యాక జట్టు ఇన్నింగ్స్ పేక మేడను తలపించింది. చివర్లో సషాబాజ్ అహ్మద్ (25 బంతుల్లో 43 నాటౌట్) రాణించడంతో లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.North, South, East, or West 📍Josh Inglis was at his best 👏Updates ▶️ https://t.co/MoXhlWHk4O#TATAIPL | #KhelBindaas | #CSKvLSG | @LucknowIPL pic.twitter.com/rAgC15cqmw— IndianPremierLeague (@IPL) May 10, 2026చదవండి: లక్నో డగౌట్లో ఫోన్.. మ్యాచ్ ఫిక్సింగ్ అనుమానాలు! -
పాకిస్తాన్ ఆలౌట్.. బంగ్లాదేశ్కు ఆధిక్యం
ఢాకా వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న తొలి టెస్ట్లో బంగ్లాదేశ్కు 27 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. పాక్ తొలి ఇన్నింగ్స్లో 386 పరుగులకు ఆలౌటైంది. అరంగేట్రం ఆటగాడు అజాన్ అవైస్ (103) సెంచరీతో కదంతొక్కగా.. అబ్దుల్లా ఫజల్ (60), సల్మాన్ అఘా (58), మొహమ్మద్ రిజ్వాన్ (59) అర్ద సెంచరీలతో రాణించారు. మిగతా ఆటగాళ్లలో ఇమామ్ ఉల్ హక్ 45, కెప్టెన్ షాన్ మసూద్ 9, సౌద్ షకీల్ డకౌట్, నౌమన్ అలీ 2, షాహీన్ అఫ్రిది 13, హసన్ అలీ 6, మొహమ్మద్ అబ్బాస్ 6 (నాటౌట్) పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహిది హసన్ మిరాజ్ ఐదు వికెట్లతో సత్తా చాటగా.. తస్కిన్ అహ్మద్, తైజుల్ ఇస్లాం తలో 2, నహిద్ రాణా ఓ వికెట్ తీశారు.అంతకుముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 413 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో (101) సెంచరీతో సత్తా చాటాడు. మొమినుల్ హక్ (91) సెంచరీ మిస్ అయ్యాడు. ముష్ఫికర్ రహీం (71) అర్ద సెంచరీతో రాణించాడు. మిగతా ప్లేయర్లలో మహ్మదుల్ హసన్ జాయ్ 8, షద్మాన్ ఇస్లాం 13, లిటన్ దాస్ 33, మెహిద్ హసన్ మిరాజ్ 10, తైజుల్ ఇస్లాం 17, ఎబాదత్ హొసేన్ డకౌట్, తస్కిన్ అహ్మద్ 28, నహిద్ రాణా 4 (నాటౌట్) పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో మొహమ్మద్ అబ్బాస్ 5 వికెట్లు పడగొట్టగా.. షాహీన్ అఫ్రిది 3, హసన్ అలీ, నౌమన్ అలీ తలో వికెట్ తీశారు. కాగా, పాకిస్తాన్ జట్టు రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం బంగ్లాదేశ్లో పర్యటిస్తుంది. 34 పరుగుల ఆధిక్యంలో..!27 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. దీంతో ఆ జట్టు ఆధిక్యం 34కు చేరింది. ఓపెనర్లు మహ్మదుల్ జాయ్ 2చ, షద్మాన్ 0 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. -
లక్నో డగౌట్లో ఫోన్.. మ్యాచ్ ఫిక్సింగ్ అనుమానాలు!
ఐపీఎల్ 2026 సీజన్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇప్పటికే రాజస్తాన్ రాయల్స్ మేనేజర్ రోమి భిందర్ డగౌట్లో ఫోన్ వాడడం, ఆ ఫోన్ను వైభవ్ సూర్యవంశీ చూడడం పెద్ద వివాదంగా మారింది. ఈ ఘటన మరువకముందే తాజాగా ఆదివారం చెన్నై సూపర్కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా లక్నో సూపర్జెయింట్స్ డగౌట్లో ఒక వ్యక్తి అదే పనిగా మొబైల్ ఫోన్ వాడడం కనిపించింది. సీఎస్కేతో మ్యాచ్లో ఇన్నింగ్స్ తొలి ఓవర్లో స్క్వేర్ లెగ్వైపు మిచెల్ మార్ష్ బౌండరీ కొట్టాడు. ఈ సమయంలో రిప్లేలో లక్నో డగౌట్లో ఒక వ్యక్తి మొబైల్ ఫోన్ ఉపయోగిస్తున్నట్లు కనిపించింది. అతడు పదే పదే ఫోన్లో మాట్లాడుతుండడం కనిపించడంతో, అభిమానులు మ్యాచ్ ఫిక్సింగ్ ఏమైనా జరుగుతుందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం, మ్యాచ్ సమయంలో డగౌట్లో మొబైల్ ఫోన్లు ఉపయోగించడం పూర్తిగా నిషేధం. ఈ ఘటనపై బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) విచారణ చేపట్టే అవకాశం ఉంది.పీఎంవోఏ నిబంధనలు ఏం చెబుతున్నాయి?ఐపీఎల్లో ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా (పీఎంవోఏ) ప్రొటోకాల్ ప్రకారం, టీమ్ మేనేజర్లు తమ ఫోన్లను కేవలం డ్రెస్సింగ్ రూమ్లో మాత్రమే వాడేందుకు అనుమతి ఉంది. డగౌట్ ఏరియా సహా మైదానంలో ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ కమ్యునికేషన్ పరికరాలు ఉపయోగించేందుకు వీలు లేదు. అయితే రాజస్తాన్ రాయల్స్ మేనేజర్ రోమీ భిందర్ చర్య తర్వాత బీసీసీఐ కఠిన ఆంక్షలు విధించింది. ముఖ్యంగా పీఎంవోఏ నిబంధనలు ఉల్లంఘించిన భిందర్కు రూ. లక్ష జరిమానా విధించడంతో పాటు వివరణ ఇవ్వాలని కోరింది. అయితే రోమీ భిందర్ ఇచ్చిన వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన బీసీసీఐ మరోసారి ఇది రిపీట్ చేయొద్దని హెచ్చరించింది. తాజాగా మరోసారి నిబంధనలకు విరుద్ధంగా డగౌట్లో ఫోన్ వాడడంపై బీసీసీఐ ఎలాంటి చర్యలకు దిగుతుందో చూడాలి.భద్రత, నియమ నిబంధనల ఉల్లంఘన, హనీ ట్రాప్ వంటి ఉదంతాలతో బీసీసీఐ ఆటగాళ్లు, ఫ్రాంచైజీల యాజమాన్యాలకు కఠిన మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.చదవండి: పంజాబ్ కింగ్స్ అత్యవసర సమావేశం.. అర్ష్దీప్పై వేటు! -
శ్రీలంక క్రికెట్లో అనూహ్య పరిణామం.. కొత్త కెప్టెన్ ఎంపిక
శ్రీలంక క్రికెట్లో అనూహ్య పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. వైట్బాల్ (టీ20, వన్డే) కెప్టెన్గా కుసాల్ మెండిస్ ఎంపికైనట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటనే తరువాయి అని తెలుస్తోంది. దసున్ షనక టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నాడని సమాచారం. ఈ మేరకు అతను బోర్డును రిసిగ్నేషన్ కూడా సమర్పించినట్లు తెలుస్తోంది. మరోవైపు చరిత్ అసలంకను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించారని సమాచారం. రెండు ఫార్మాట్లలో ఒకే కెప్టెన్ ఉండాలనే ఉద్దేశంతో ఈ కుసాల్ మెండిస్ ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు టెస్ట్ కెప్టెన్గా ధనంజయ డిసిల్వ కొనసాగనున్నాడు.31 ఏళ్ల కుసాల్ మెండిస్ ఇటీవలికాలంలో అద్భుత ఫామ్లో ఉన్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్-2026లో పెషావర్ జల్మీ టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ టోర్నీలో 11 మ్యాచ్లు ఆడిన అతను.. 550 పరుగులతో సత్తా చాటాడు. ఇందులో సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సగటు 55, స్ట్రైక్రేట్ 160తో నమోదు చేశాడు.కుసాల్ గత ఐపీఎల్ సీజన్లోనూ ఆకట్టుకున్నాడు. ఆడింది ఒకటే మ్యాచ్ అయినా ప్రభావంతంగా కనిపించాడు. జోస్ బట్లర్ గాయపడటంతో అతనికి రీప్లేస్మెంట్గా వచ్చిన మెండిస్.. ఓ మ్యాచ్లో 200 స్ట్రయిక్రేట్తో పరుగులు చేశాడు.కాగా, శ్రీలంక జట్టుకు మున్ముందు బిజీ షెడ్యూల్ ఉంది. త్వరలోనే వెస్టిండీస్ పర్యటనలో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఆ తర్వాత ఇంగ్లండ్, భారత్ పర్యటనలు కూడా ఉన్నాయి. ఈ సిరీస్లతో కుసాల్ మెండిస్ కెప్టెన్సీకి అసలైన పరీక్ష మొదలుకానుంది. -
లక్నోపై సీఎస్కే గెలుపు
ఉర్విల్ పటేల్ ఊచకోత.. లక్నోను చిత్తు చేసిన సీఎస్కేఐపీఎల్ 2026లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో ఇవాళ (మే 10) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. జోష్ ఇంగ్లిస్ (85) ఊచకోత కోశాడు. ఆఖర్లో షాబాజ్ అహ్మద్ (43 నాటౌట్) రాణించాడు. వీరు మినహా ఎవరూ పెద్ద స్కోర్ చేయలేదు. మిచెల్ మార్ష్ 10, నికోలస్ పూరన్ 1, రిషబ్ పంత్ 15, మార్క్రమ్ 6, రఘువంశీ 18, హిమ్మత్ సింగ్ 17, షమీ డకౌటయ్యారు. సీఎస్కే బౌలర్లలో జేమీ ఓవర్టన్ 3 వికెట్లు పడగొట్టగా.. అన్షుల్ కంబోజ్ 2, నూర్ అహ్మద్ ఓ వికెట్ తీశాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్కే ఆది నుంచే దూకుడుగా ఆడింది. వన్డౌన్లో వచ్చిన ఉర్విల్ పటేల్ (65) పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, విజయానికి గట్టి పునాది వేశాడు. అయితే మధ్యలో సీఎస్కే కాస్త తడబాటుకు లోనైంది. సునాయాసంగా గెలుస్తుందనుకుంటే, మ్యాచ్ను చివరి వరకు తీసుకొచ్చింది. చివరి ఓవర్ తొలి రెండు బంతులకు శివమ్ దూబే (15 నాటౌట్) సిక్సర్లు బాది సీఎస్కేను విజయతీరాలు దాటించాడు. మిగతా బ్యాటర్లలో సంజూ శాంసన్ 28, రుతురాజ్ గైక్వాడ్ 42, కార్తీక్ శర్మ 20, బ్రెవిస్ 10, ప్రశాంత్ వీర్ (18 నాటౌట్) పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో దిగ్వేశ్ రాఠీ, షాబాజ్ అహ్మద్ తలో 2 వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్లో లక్నో చాలా క్యాచ్లు జారవిడిచి మూల్యం చెల్లించుకుంది. ఈ ఓటమితో ఆ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్పై పూర్తిగా ఆశలు వదులుకుంది. సీఎస్కే విషయానికొస్తే.. ఆదిలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న ఈ జట్టు అనూహ్యంగా పుంజుకొని ప్లే ఆఫ్స్ రేసులో ప్రధాన పోటీదారుగా మారిపోయింది. ఈ గెలుపుతో ఆ జట్టు ఖాతాలో 12 పాయింట్లు (11 మ్యాచ్ల్లో 6 విజయాలు) చేరాయి. ప్రస్తుతం ఆ జట్టు పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.సంజూ శాంసన్ ఔట్3.4వ ఓవర్- 45 పరుగుల వద్ద సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. దిగ్వేష్ రాఠీ బౌలింగ్లో సంజూ శాంసన్ (28) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. లక్నో భారీ స్కోర్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. జోష్ ఇంగ్లిస్ (85) ఊచకోత కోశాడు. ఆఖర్లో షాబాజ్ అహ్మద్ (43 నాటౌట్) రాణించాడు. వీరు మినహా ఎవరూ పెద్ద స్కోర్ చేయలేదు. మిచెల్ మార్ష్ 10, నికోలస్ పూరన్ 1, రిషబ్ పంత్ 15, మార్క్రమ్ 6, రఘువంశీ 18, హిమ్మత్ సింగ్ 17, షమీ డకౌటయ్యారు. సీఎస్కే బౌలర్లలో జేమీ ఓవర్టన్ 3 వికెట్లు పడగొట్టగా.. అన్షుల్ కంబోజ్ 2, నూర్ అహ్మద్ ఓ వికెట్ తీశాడు. కష్టాల్లో లక్నోభారీ స్కోర్ దిశగా సాగుతుందనుకున్న దశలో లక్నో జట్టు కష్టాల్లో పడింది. ఓవర్టన్ వేసిన 10వ ఓవర్లో ఆ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. ఓవర్టన్ తొలి బంతికి ఇంగ్లిస్ను (85), నాలుగో బంతికి పంత్ను (15) ఔట్ చేశాడు. 9.4 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 116-4గా ఉంది. మార్క్రమ్కు జతగా రఘువంశీ క్రీజ్లోకి వచ్చాడు. ఇంగ్లిస్ ఊచకోతటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న లక్నో భారీ స్కోర్ దిశగా సాగుతోంది. పవర్ ప్లేలో ఆ జట్టు ఏకంగా 91 పరుగులు చేసింది. ఓపెనర్ జోష్ ఇంగ్లిస్ వీరవిహారం చేస్తున్నాడు. 25 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 77 పరుగులు చేశాడు. మిచెల్ మార్ష్ 10 బంతుల్లో 10 పరుగులు చేసి అన్షుల్ కంబోజ్ బౌలింగ్లో ఔటయ్యాడు. ప్రస్తుతం ఇంగ్లిస్కు జతగా పూరన్ (1) ఉన్నాడు.ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మే 10) డబుల్ హడర్ మ్యాచ్లు జరుగనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్లో సీఎస్కే, లక్నో తలపడుతున్నాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో సీఎస్కే టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లిస్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(w/c), ఐడెన్ మార్క్రామ్, అక్షత్ రఘువంశీ, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, మహ్మద్ షమీ, దిగ్వేష్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): సంజూ శాంసన్ (w), రుతురాజ్ గైక్వాడ్ (సి), ఉర్విల్ పటేల్, కార్తీక్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, జామీ ఓవర్టన్, అకేల్ హోసేన్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి -
విజయ్ సీఎం అయ్యాడు.. సీఎస్కే టైటిల్ గెలుస్తుంది..!
తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసఫ్ విజయ్ ఎట్టకేలకు ప్రమాణ స్వీకారం చేశాడు. ఇవాళ (మే 10) ఉదయం ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆథ్వర్యంలో ప్రమాణస్వీకారోత్సం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.విజయ్ సీఎం అవగానే సోషల్మీడియాలో ఓ అంశం వైరలైంది. విజయ్ సీఎం అయ్యాడు.. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టైటిల్ సాధిస్తుందని తమిళులు సంబరాలు చేసుకుంటున్నారు. వారు ఫ్యాన్స్ ఇలా ప్రవర్తించడాని ఓ బలమైన కారణముంది.తమిళనాట ప్రభుత్వాలు మారి, కొత్త సీఎంలు వచ్చినప్పుడు సీఎస్కే టైటిల్ సాధించింది. 2011లో జయలలిత ముఖ్యమంత్రి అయినప్పుడు సీఎస్కే టైటిల్ ఎగరేసుకుపోయింది. ఆతర్వాత 2021లో స్టాలిన్ సీఎం అయినప్పుడు కూడా సీఎస్కేనే టైటిల్ సాధించింది. ఇప్పుడు విజయ్ సీఎం అవ్వడంతో సెంటిమెంట్ రిపీటై సీఎస్కే మరోసారి టైటిల్ సాధిస్తుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.వాస్తవానికి ఈ సెంటిమెంట్కు దగ్గరగానే సీఎస్కే ప్రస్తుత పరిస్థితి ఉంది. సీజన్ ప్రారంభంలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న ఆ జట్టు అనూహ్యంగా పుంజుకొని ప్లే ఆఫ్స్ రేసులో బలంగా నిలబడింది. సంజూ శాంసన్ ఆ జట్టు తలరాతను మార్చాడు. రెండు శతకాలు, ఓ అర్ద శతకం సాధించి సీఎస్కే విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. తదుపరి ఆడబోయే 4 మ్యాచ్ల్లో మూడు గెలిచినా, ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారైనట్లే. -
సీఎస్కే కెప్టెన్సీపై సంజూ అధికారిక ప్రకటన
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీపై వస్తున్న ఊహాగానాలకు స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ ఎట్టకేలకు తెరదించాడు. ఐపీఎల్ 2026 సీజన్కు ముందు రాజస్థాన్ రాయల్స్ నుంచి సీఎస్కేలో చేరిన తర్వాత, అతడే జట్టు కొత్త కెప్టెన్ అవుతాడనే వార్తలు బలంగా వినిపించాయి. అయితే తాజాగా ఈ అంశంపై సంజూ స్పష్టమైన ప్రకటన చేశాడు. తాను ఎప్పుడూ కెప్టెన్సీ గురించి ఆలోచించలేదని తెలిపాడు. కొత్త జట్టులోకి వెళ్లేటప్పుడు డిమాండ్లతో వెళ్లకూడదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.“నేను ఇప్పటికే ఒక జట్టులో కెప్టెన్గా ఉన్నాను. అక్కడి నుంచి కొత్త జట్టుకు వచ్చాను. అలాంటి సమయంలో కెప్టెన్సీ గురించి ఆలోచించడం సరైంది కాదు. కొత్త ఇంట్లోకి వెళ్తే ముందుగా ఆ ఇంటి మనిషిలా కలిసిపోవాలి” అని అన్నాడు.అదే సమయంలో ప్రస్తుత సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్పై ప్రశంసలు కురిపించాడు. రుతురాజ్ చాలా నిశ్శబ్దంగా కనిపించినా, అతడిలో అపారమైన ఆత్మవిశ్వాసం ఉందని పేర్కొన్నాడు. సీఎస్కేలో చేరేందుకు తనను స్వయంగా రుతురాజ్ సంప్రదించాడని, అది తనకు ఎంతో నచ్చిందని తెలిపాడు.“రుతు భారత క్రికెట్లో చాలా భిన్నమైన స్టార్. అతను పెద్ద ఫ్రాంచైజీకి నాయకత్వం వహిస్తున్నా, ఎలాంటి అహంకారం ఉండదు. మాటలకంటే చర్యలతో చూపించే వ్యక్తి” అంటూ సంజూ కొనియాడాడు.కాగా, 2024లో సీఎస్కే కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన రుతురాజ్కు ఇప్పటివరకు కఠిన ప్రయాణమే ఎదురైంది. 2024లో జట్టు ప్లేఆఫ్స్కు తృటిలో దూరమవగా, 2025లో గాయం కారణంగా సీజన్ మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ సీఎస్కే యాజమాన్యం అతడిపైనే నమ్మకం ఉంచింది.ప్రస్తుత సీజన్ విషయానికొస్తే.. సీజన్ ప్రారంభంలో సీఎస్కే ఘోరంగా విఫలమైనా, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుంది. ప్లే ఆఫ్స్ బెర్త్కు ప్రధాన పోటీదారుగా మారింది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. తదుపరి ఆడబోయే 4 మ్యాచ్ల్లో మూడు గెలిచినా, సీఎస్కే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారైనట్లే. ఈ జట్టు పరివర్తనలో సంజూ శాంసన్ కీలకపాత్ర పోషించాడు. రెండు శతకాలు, ఓ అర్ద శతకం సాధించి సీఎస్కే విజయాలకు ప్రధాన కారకుడయ్యాడు. -
రషీద్ ఖాన్ మరో ఘనత
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఐపీఎల్లో మరో అరుదైన ఘనత సాధించాడు. నిన్న (మే 9) రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్లు తీయడంతో ఐపీఎల్ ఆల్టైమ్ హైయ్యెస్ట్ వికెట్ టేకర్ల టాప్-10 జాబితాలో ప్రవేశించాడు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ దిగ్గజం లసిత్ మలింగ (170 వికెట్లు) రికార్డును అధిగమించాడు.తాజా ప్రదర్శనతో ఐపీఎల్లో రషీద్ వికెట్ల సంఖ్య 173కు చేరింది. ప్రస్తుతం అతను 10వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో చహల్ 229 వికెట్లతో టాప్ ప్లేస్లో ఉన్నాడు. భువనేశ్వర్ కుమార్ (215), సునీల్ నరైన్ (202), పియుశ్ చావ్లా (192), రవిచంద్రన్ అశ్విన్ (187), బుమ్రా (186), డ్వేన్ బ్రావో (183), రవీంద్ర జడేజా (178), అమిత్ మిశ్రా (174) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు.మ్యచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్ (84), సాయి సుదర్శన్ (55) మెరుపు అర్ద శతకాలతో సత్తా చాటారు. వాషింగ్టన్ సుందర్ (37 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్తో అలరించాడు. మిగతా బ్యాటర్లలో జోస్ బట్లర్ 13, జేసన్ హెల్డర్ 7, రాహుల్ తెవాతియా 14 (నాటౌట్) పరుగులు చేశారు. రాయల్స్ బౌలర్లలో బ్రిజేష్ శర్మ 2, యశ్ రాజ్ పూనియా, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో రాయల్స్ తడబడింది. రషీద్ ఖాన్ (4-033-4), జేసన్ హెల్డర్ (2.3-0-12-3), రబాడ (3-0-33-2), సిరాజ్ (4-0-55-1) ధాటికి 16.3 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌటైంది. 38 పరుగులు చేసిన జడేజా టాప్ స్కోరర్ కాగా.. వైభవ్ సూర్యవంశీ (36), ధృవ్ జురెల్ (24), షనక (16), శుభమ్ దూబే (15) రెండంకెల స్కోర్లు చేశారు. జైస్వాల్ (3), హెట్మైర్ (6), ఫెరియెరా (4), ఆర్చర్ (5), తుషార్ దేశ్పాండే (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఈ గెలుపుతో గుజరాత్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. రాయల్స్ ఐదో ప్లేస్కు పడిపోయింది. -
మరోసారి చెలరేగిన పాక్ ఓపెనర్లు.. చారిత్రక సిరీస్ కైవసం
స్వదేశంలో జింబాబ్వేతో జరుగుతున్న చారిత్రక సిరీస్ను పాక్ మహిళల జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. కరాచీ వేదికగా నిన్న (మే 9) జరిగిన మూడో వన్డేలో పాక్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు గుల్ ఫెరోజా, సదాఫ్ షమాస్ మరోసారి చెలరేగి పాక్కు తిరుగులేని విజయాన్నందించారు.తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. కెలిస్ (51), బిలవ్డ్ బిజా (73) అర్ద సెంచరీలతో రాణించారు. వీరు మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. ఆఖర్లో జిమును (23), కెప్టెన్ సిబండ (35 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. మిగతా ప్లేయర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. పాక్ బౌలర్లలో తస్మియా రుబాబ్ 3, అరూబ్ షా, అయేషా జాఫర్ తలో 2, మొమినా రియాసత్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం 223 పరుగుల లక్ష్యాన్ని పాక్ 31.5 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు గల్ ఫిరోజా, సదాఫ్ షమాస్ విధ్వంసకర ఇన్నింగ్స్లతో చెలరేగి పాక్ను గెలిపించారు. ఫెరోజా ఈ సిరీస్లో రెండో సెంచరీతో (106 నాటౌట్) కదంతొక్కగా.. షమాస్ (90) ఈ సిరీస్లో రెండో సెంచరీని తృటిలో చేజార్చుకుంది.కాగా, ఈ సిరీస్లో పాక్ తొలి మ్యాచ్ నుంచే పసికూన జింబాబ్వేపై చెలరేగిపోతుంది. మూడు మ్యాచ్ల్లో భారీ విజయాలు సాధించి తిరుగులేని ఆధిపత్యం చలాయించింది. ముఖ్యంగా ఓపెనర్లు సదాఫ్, ఫెరోజా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. సదాఫ్ తొలి మ్యాచ్లో 98, రెండో మ్యాచ్లో 101, మూడో మ్యాచ్లో 90 పరుగులతో చెలరేగగా.. ఫెరోజా తొలి మ్యాచ్లో 50, రెండో వన్డేలో 100, మూడో వన్డేలో అజేయ శతకంతో విరుచుకుపడింది. -
‘ఇది 18 ఏళ్ల బాధ’
న్యూఢిల్లీ: ఐపీఎల్ తాజా సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రదర్శనపై టీమ్ డైరెక్టర్ వేణుగోపాల రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అన్ని విభాగాల్లో తాము విఫలమయ్యామని అతను అంగీకరించాడు. ఇది 18 ఏళ్ల బాధ అని వేణు వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ మొదలైన 2008 నుంచి ఇప్పటి వరకు లీగ్ ఉంటూ ఒక్క సారి కూడా టైటిల్ గెలవని రెండు జట్లలో ఒకటి పంజాబ్ కాగా మరొకటి ఢిల్లీ. 2020లో చివరిసారిగా ఫైనల్ చేరిన ఢిల్లీ ఆ తర్వాత అలాంటి స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోయింది. ‘నిజంగానే ఇది చాలా బాధిస్తుంది. 18 ఏళ్లుగా ఆడుతున్నా టైటిల్ లేకపోవడం నిరాశాజనకం. నేను ఈ టీమ్ను ఆడినప్పుడు కూడా గెలవాలని ఎంతో కోరుకున్నా. ఇప్పుడు కోచింగ్, పరిపాలనా వ్యవహారాల్లోకి వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి. ఇంకా చక్కదిద్దుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి’ అని వేణుగోపాలరావు అన్నాడు. ఆడిన 11 మ్యాచ్లలో 4 మాత్రమే గెలిచిన క్యాపిటల్స్ 7 ఓడింది. ‘ఒక్కో మ్యాచ్లో మా ఓటమికి ఒక్కో కారణం ఉంది. అయితే గత రెండు మ్యాచ్లను చూస్తే బ్యాటర్లు మరింత బాధ్యత తీసుకోవాల్సిందని అనిపించింది. ఎందుకంటే సీజన్ మొదట్లో కొన్ని మ్యాచ్లలో తక్కువ వ్యవధిలో వికెట్లు పడ్డా ఇతర బ్యాటర్లు రాణించి జట్టును గెలిపించారు’ అని వేణుగోపాలరావు విశ్లేషించాడు. -
ఫైనల్లో 8 మంది బాక్సర్లు
తాష్కెంట్: ఆసియా అండర్–15 బాక్సింగ్ చాంపియన్షిప్ (బాలికల విభాగం)లో 8 మంది భారత బాక్సర్లు ఫైనల్లోకి దూసుకెళ్లారు. దాంతో వేర్వేరు కేటగిరీల్లో కనీసం 8 రజతాలు భారత్కు ఖాయమయ్యాయి. అక్షిత (33 కేజీలు), అన్జీ (37 కేజీ), సోనియా (40 కేజీలు), తాన్వి (43 కేజీలు), హన్షిక (46 కేజీలు), సునైనా (58 కేజీలు), భూమిక (61 కేజీలు), తాన్వి (64 కేజీల విభాగం) తమ సెమీ ఫైనల్ బౌట్లలో గెలిచి ఫైనల్లోకి ప్రవేశించారు. ఇతర భారత బాక్సర్లలో జియా (35 కేజీలు), ఖుషీ రాణా (49 కేజీలు), కనిష్క (52 కేజీలు), ఆష్వి (67 కేజీలు), మాన్వి (70+ కేజీలు) సెమీ ఫైనల్ బౌట్లలో పరాజయం పాలయ్యారు. -
గుకేశ్కు ఆరో స్థానం
వార్సా (పోలండ్): సూపర్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్ను భారత ఆటగాడు గుకేశ్ దొమ్మరాజు ఆరో స్థానంతో ముగించాడు. ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ కలిపి అతను మొత్తం 17 పాయింట్లు సాధించాడు. ర్యాపిడ్ విభాగంలో 9 పాయింట్లు సాధించిన గుకేశ్ బ్లిట్జ్లో 8 పాయింట్లు మాత్రమే రాబట్టగలిగాడు. ఈ టోర్నమెంట్లో అమెరికాకు చెందిన హన్స్ నీమన్ విజేతగా నిలిచాడు. ర్యాపిడ్, బ్లిట్జ్ విభాగాల్లో కలిపి మొత్తం 22.5 పాయింట్లు సాధించిన నీమన్ 50 వేల డాలర్ల బహుమతిని సొంతం చేసుకున్నాడు. శనివారం 9 బ్లిట్జ్ రౌండ్లలో బరిలోకి దిగిన గుకేశ్... 3 రౌండ్లలో గెలవగా, 4 రౌండ్లలో ఓటమిని ఎదుర్కొన్నాడు. మరో 2 రౌండ్లు డ్రాగా ముగిశాయి. వెస్లీ సో (అమెరికా), నీమన్ (అమెరికా), జాన్ డ్యూడా (పోలండ్)లపై విజయం సాధించిన గుకేశ్...అలీరెజా ఫిరోజ్ (ఫ్రాన్స్), వ్లదీమర్ ఫెడోసీవ్ (రష్యా), ఫాబియో కరువానా (అమెరికా), సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతుల్లో పరాజయంపాలయ్యాడు. వొటాజెక్ (పోలండ్), మ్యాగ్జిమ్ లాగ్రేవ్ (ఫ్రాన్స్)లతో అతని ఆట సమంగా ముగిసింది. 16వ రౌండ్లో గుకేశ్ చేతిలో ఓడినా... కోలుకొని చివరకు నీమన్ చాంపియన్గా నిలవడం విశేషం. -
సాహిల్ జాదవ్కు కాంస్యం
షాంఘై (చైనా): ప్రపంచ కప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నమెంట్లో భారత ఆటగాడు సాహిల్ జాదవ్ కాంస్యంతో మెరిశాడు. శనివారం పురుషుల కాంపౌండ్ విభాగంలో మూడో స్థానం కోసం జరిగిన పోరులో జాదవ్ 147–144 స్కోరుతో మార్టీన్ డామ్సో (డెన్మార్క్)పై విజయం సాధించాడు. కాంపౌండ్లో భారత్కు లభించిన పతకం ఇదొక్కటే కావడం విశేషం. 25 ఏళ్ల సాహిల్ ప్రస్తుత వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ చాంపియన్ కూడా. డామ్సోతో జరిగిన మ్యాచ్లో తొలి ఎండ్లో 29–30తో వెనుకబడిన సాహిల్, రెండో ఎండ్లో 27–30తో పైచేయి సాధించాడు. ఆ తర్వాత 29–28, 30–29తో భారత ఆర్చర్ ముందంజ వేయగా... అప్పటికే నాలుగు పాయింట్లు వెనుకబడిన డామ్సో చివరి ఎండ్ను 30–29తో ముగించినా లాభం లేకపోయింది. జాదవ్ ఖాతాలో కాంస్య పతకం చేరింది. అంతకు ముందు జరిగిన సెమీఫైనల్లో జాదవ్ 146–147 స్కోరుతో ప్రస్తుత వరల్డ్ చాంపియన్ నికోలస్ గిరార్డ్ (ఫ్రాన్స్) చేతిలో పరాజయంపాలయ్యాడు. నేడు జరిగే మహిళల రికర్వ్ ఫైనల్ (టీమ్ ఈవెంట్)లో చైనాతో భారత్ తలపడనుండగా... వ్యక్తిగత విభాగంలో సిమ్రన్జిత్ కౌర్ సెమీఫైనల్ బరిలోకి దిగుతుంది. -
వినేశ్ ఫొగాట్కు డబ్ల్యూఎఫ్ఐ షోకాజ్
రిటైర్మెంట్ను వెనక్కి తీసుకొని అంతర్జాతీయ రెజ్లింగ్ బరిలోకి దిగాలని భావిస్తున్న స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్కు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) షాక్ ఇచ్చింది. క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడటం, డోపింగ్ నిబంధనల ఉల్లంఘనవంటి ఆరోపణలతో ఆమెకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. పైగా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత పునరాగమనానికి అనుసరించాల్సిన నిబంధనల ప్రకారం ఆమె పోటీల్లో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. దీని ప్రకారం ఈ ఏడాది జూన్ 26 వరకు వినేశ్ దేశవాళీ పోటీల్లో కూడా బరిలోకి దిగే అవకాశం లేదు. నేటి నుంచి గోండాలో జరిగే జాతీయ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నీలో పాల్గొని ఆసియా క్రీడల కోసం సన్నద్ధం కావాలని వినేశ్ భావించింది. పారిస్ ఒలింపిక్ క్రీడల సందర్భంగా వినేశ్ ప్రవర్తన ‘రెజ్లింగ్కు చెడ్డపేరు తెచ్చింది’ అని డబ్ల్యూఎఫ్ఐ ఆరోపించింది. గతంలో డబ్ల్యూఎఫ్ఐకి వ్యతిరేకంగా ఉద్యమం చేసిన వినేశ్...ఇటీవల మరోసారి విమర్శలు చేయడంతోనే ఆమెపై చర్యకు డబ్ల్యూఎఫ్ఐ ఉపక్రమించింది. -
దుమ్ములేపిన రషీద్, గిల్.. టాప్-2కు దూసుకొచ్చిన గుజరాత్
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. శనివారం జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 77 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ 16.3 ఓవర్లలో 152 పరుగులకే కుప్పకూలింది. రవీంద్ర జడేజా 38 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, వైభవ్ సూర్యవంశీ (16 బంతుల్లో 36 పరుగులు) మరోసారి ఆకట్టుకున్నాడు. వీరిద్దరు మినహా మిగతావారు విఫలం కావడంతో రాజస్తాన్ లక్ష్య ఛేదనలో పూర్తిగా చతికిలపడింది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4 వికెట్లతో చెలరేగగా, జాసన్ హోల్డర్ మూడు వికెట్లు తీశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ (84), సాయి సుదర్శన్ (55) అర్థసెంచరీలతో రాణించారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ (20 బంతుల్లో 37 నాటౌట్), రాహుల్ తెవాటియా (4 బంతుల్లో 14 నాటౌట్) రాణించడంతో గుజరాత్ 229 పరుగులు చేసింది. రాజస్తాన్ బౌలర్లలో బ్రిజేశ్ శర్మ 2 వికెట్లు తీయగా, యష్రాజ్, జడేజా చెరొక వికెట్ తీశారు. గుజరాత్ టైటాన్స్ 11 మ్యాచ్ల్లో ఏడు విజయాలతో 14 పాయింట్లు సాధించి పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు వరుసగా రెండో ఓటమి చవిచూసిన రాజస్తాన్ ఐదో స్థానానికి పడిపోయింది.గుజరాత్ ఓపెనర్ల దూకుడు..టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్కు ఓపెనర్లు సాయి సుదర్శన్, శుబ్మన్ గిల్ శుభారంబాన్ని ఇచ్చారు. తొలి వికెట్కు ఈ ఇద్దరు శతక భాగస్వామ్యం (118 పరుగులు) జోడించి ఇన్నింగ్స్కు గట్టి పునాది వేశారు. అర్థసెంచరీ అనంతరం సాయి సుదర్శన్ వెనుదిరిగినప్పటికీ, ఆ తర్వాత వచ్చిన బట్లర్, వాషింగ్టన్ సుందర్లతో కలిసి గిల్ భాగస్వామ్యాలు నిర్మించాడు. చివర్లో సుందర్, తెవాటియా ధాటిగా ఆడడంతో గుజరాత్ 220 ప్లస్ స్కోరును దాటింది.చేధనలో చతికిలపడి..230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్కు వైభవ్ సూర్యవంశీ తన దనాధన్ ఇన్నింగ్స్తో మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే సూర్యవంశీ ఔటైన తర్వాత రాజస్తాన్ వెనువెంటనే వికెట్లు కోల్పోయింది. జురేల్, జడేజాలు కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకోవడం మినహా ఏం చేయలేకపోయారు. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన రాజస్తాన్ ఓటమి దిశగా పయనించింది. ఈ సీజన్లో గుజరాత్ చేతిలో రాజస్తాన్కు ఇది రెండో ఓటమి కావడం గమనార్హం.A 𝙏𝙞𝙩𝙖𝙣𝙞𝙘 𝙑𝙞𝙘𝙩𝙤𝙧𝙮 by 7⃣7⃣ runs✌️4⃣th consecutive win for @gujarat_titans as they move to no.2⃣ in the Points Table 🔢This is also #GT's biggest #TATAIPL win (by runs) 👏👏Scoreboard ▶️ https://t.co/t7CEEL9Bzp#KhelBindaas | #RRvGT pic.twitter.com/jXKWcdBfru— IndianPremierLeague (@IPL) May 9, 2026చదవండి: వైభవ్ ప్రపంచ రికార్డు.. ఐపీఎల్లో తొలి క్రికెటర్గా! -
వైభవ్ ప్రపంచ రికార్డు.. ఐపీఎల్లో తొలి క్రికెటర్గా!
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ విధ్వంసకర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తన పేరిట మరో రికార్డును లిఖించుకున్నాడు. ఐపీఎల్లో ఒక సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్ల జాబితాలో వైభవ్ చోటు దక్కించుకున్నాడు. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో వైభవ్ 3 సిక్సర్లు కొట్టడం ద్వారా ఈ సీజన్లో అతడి సిక్సర్ల సంఖ్య 40కి చేరుకుంది. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ 40 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. అయితే మొదటి స్థానంలో ఉన్న అభిషేక్ శర్మ 2024 సీజన్లో ఓవరాల్గా కొట్టిన సిక్సర్ల సంఖ్య 42. అయితే ఈ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్లు పూర్తవ్వలేదు. దీంతో మిగిలిన మ్యాచ్లు పూర్తయ్యేసరికి వైభవ్ ఇంకా ఎన్ని సిక్సర్లు కొడుతాడో చూడాలి. ఇప్పటికైతే వైభవ్ 40 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ (2025 సీజన్లో 39 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (2016 సీజన్లో 38 సిక్సర్లు, 2024 సీజన్లో 38 సిక్సర్లు), సూర్యకుమార్ (2025 సీజన్లో 38 సిక్సర్లు), రిషబ్ పంత్ (2024 సీజన్లో 37 సిక్సర్లు) ఉన్నారు.👉ఒక ఐపీఎల్ సీజన్లో తొలి పవర్ ప్లే (1-6 ఓవర్లు) అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్లలో వైభవ్ సూర్యవంశీ 30 సిక్సర్లతో తొలి స్థానంలో ఉన్నాడు. అభిషేక్ శర్మ ( 29 సిక్సర్లు, 2024 సీజన్), అభిషేక్ శర్మ (27 సిక్సర్లు, 2026 సీజన్*), జయసూర్య (22 సిక్సర్లు, 2008 సీజన్), ట్రావిస్ హెడ్ (22 సిక్సర్లు, 2024 సీజన్), జైస్వాల్ (22 సిక్సర్లు, 2025 సీజన్) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.👉 ఐపీఎల్ సీజన్లో ఇన్నింగ్స్ను సిక్సర్తో ప్రారంభించడం వైభవ్ సూర్యవంశీకి ఇది ఏడోసారి. ఈ సీజన్లో ఇది నాలుగోసారి కావడం విశేషం.👉 ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ (84), సాయి సుదర్శన్ (55) అర్థసెంచరీలతో రాణించారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ (20 బంతుల్లో 37 నాటౌట్), రాహుల్ తెవాటియా (4 బంతుల్లో 14 నాటౌట్) రాణించడంతో గుజరాత్ 229 పరుగులు చేసింది. రాజస్తాన్ బౌలర్లలో బ్రిజేశ్ శర్మ 2 వికెట్లు తీయగా, యష్రాజ్, జడేజా చెరొక వికెట్ తీశారు.MAKING IT A HABIT 🤩🎥 Just Vaibhav Sooryavanshi with yet another high-intent knock 🙌Updates ▶️ https://t.co/t7CEEL9Bzp#TATAIPL | #KhelBindaas | #RRvGT | @rajasthanroyals pic.twitter.com/LYEfiG4wnZ— IndianPremierLeague (@IPL) May 9, 2026చదవండి: ఆర్చర్ 11 బంతుల ఓవర్.. హనీ ట్రాప్ నిజమేనా? -
ఆర్చర్ 11 బంతుల ఓవర్.. హనీ ట్రాప్ నిజమేనా?
రాజస్తాన్ రాయల్స్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ఆర్చర్ 5 వైడ్లు వేశాడు. ఆరు బంతులు వేయాల్సిన చోట 11 బంతులు వేసిన ఆర్చర్ 18 పరుగులు సమర్పించుకున్నాడు. తద్వారా ఐపీఎల్లో ఒక ఇన్నింగ్స్లో తొలి ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్గా ఆర్చర్ నిలిచాడు. ఇక ఆర్చర్ మరో రికార్డు కూడా మూటగట్టుకున్నాడు. ఐపీఎల్లో బంతుల పరంగా అత్యంత సుదీర్ఘమైన ఓవర్ వేసిన ఏడో బౌలర్గా ఆర్చర్ నిలిచాడు. గతంలో మహ్మద్ సిరాజ్, తుషార్ దేశ్పాండే, శార్దూల్ ఠాకూర్, సందీప్ శర్మ, హార్దిక్ పాండ్యా, అర్ష్దీప్ 11 బంతుల ఓవర్ వేశారు.👉మహ్మద్ సిరాజ్ (11 బంతులు, 2023లో ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో)👉 తుషార్ దేశ్పాండే (11 బంతులు, 2023లో లక్నోతో మ్యాచ్లో)👉 శార్దూల్ ఠాకూర్ (11 బంతులు, 2025లో కేకేఆర్తో మ్యాచ్లో)👉 సందీప్ శర్మ (11 బంతులు, 2025లో ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో)👉 హార్దిక్ పాండ్యా (11 బంతులు, 2025లో గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో)👉 అర్ష్దీప్ సింగ్ (11 బంతులు, 2026లో గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో)అయితే సోషల్ మీడియాలో జోఫ్రా ఆర్చర్ను క్రికెట్ అభిమానులు దారుణంగా ట్రోల్ చేశారు. ఇటీవలే హనీట్రాప్ అంశం తెరమీదకు రావడం, ఆర్చర్ కూడా గుజరాత్ తో మ్యాచ్కు ముందు ఫిక్సింగ్కు పాల్పడినట్లు ఆరోపించారు. ఒక అభిమాని శ్రుతి మించి ఆర్చర్పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఆర్చర్ శనివారం ఉదయం జైపూర్ హోటల్లో అమ్మాయితో కనిపించాడని.. సాయంత్రానికి నోబాల్ సహా ఐదు వైడ్లు వేయడం చూస్తుంటే ఎక్కడో తేడా కొడుతుంది* అంటూ పేర్కొన్నాడు. ఆర్చర్ తన కెరీర్లోనే అత్యంత చెత్త ఓవర్ వేసి జైస్వాల్ కెరీర్ నాశనం చేశాడంటూ కొందరు అభిమానులు కామెంట్లు చేశారు.హనీట్రాప్ అంటే..'హనీ ట్రాపింగ్' అంటే క్రికెటర్లను ప్రేమ సంబంధమైన లేదా వ్యక్తిగత సంబంధాల ద్వారా మోసగించడం, లొంగదీసుకోవడం, బ్లాక్మెయిల్ చేయడం లేదా ఉచ్చులో పడేయడం వంటి పరిస్థితులను సూచిస్తుంది. తాజాగా జోఫ్రా ఆర్చర్ 11 బంతుల ఓవర్ వేసిన తర్వాత, అతని పేరు హనీ ట్రాప్ వివాదంతో ముడిపడి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ ఆటగాళ్లు హనీ ట్రాప్కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని బీసీసీఐ భయపడినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ సమస్యను అరికట్టడానికి, టీమ్ మేనేజర్ అనుమతి లేకుండా అనధికార వ్యక్తులు ఎవరూ హోటల్ గదుల్లోకి ప్రవేశించకుండా చూసుకోవాలని బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలకు ఇప్పటికే కఠిన ఆదేశాలు జారీ చేసింది.Not a very good start for Rajasthan and for Jofra Archer😬😬 17 runs in 1 over for Gujarat 🔥 A lot of Freebies from Archer😐 pic.twitter.com/EARUdGdnWp— STUMP THEORY (@SANIL__18) May 9, 2026చదవండి: పంజాబ్ కింగ్స్ అత్యవసర సమావేశం.. అర్ష్దీప్పై వేటు! -
IPL 2026: రాజస్తాన్పై గుజరాత్ టైటాన్స్ విజయం
శనివారం జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 77 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ 16.3 ఓవర్లలో 152 పరుగులకే కుప్పకూలింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఓటమి దిశగా రాజస్తాన్ రాయల్స్గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ ఓటమి దిశగా పయనిస్తోంది. 15 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ రాయల్స్ 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. దాసున్ షనక 9 పరుగులతో క్రీజులో ఉన్నాడు.ఒకే ఓవర్లో రెండు వికెట్లు.. కష్టాల్లో రాజస్తాన్గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ కష్టాల్లో పడింది. రషీద్ ఖాన్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. ఫెరీరా (4)ను క్లీన్బౌల్డ్ చేసిన రషీద్ ఖాన్ అంతకముందు 24 పరుగులు చేసిన ధ్రువ్ జురేల్ను కూడా క్లీన్బౌల్డ్గా పెవిలియన్ చేర్చాడు. 8 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ రాయల్స్ 5 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. రెండో వికెట్ కోల్పోయిన రాజస్తాన్మూడు పరుగులు చేసిన స్టాండ్ ఇన్ కెప్టెన్ జైస్వాల్ రబాడ బౌలింగ్లో వెనుదిరగడంతో రాజస్తాన్ 40 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. సూర్యవంశీ (38) ఔట్.. రాజస్తాన్ 38/1230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ ఛేదనను ధాటిగా ఆరంభించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల సునామీ సృష్టించాడు. అయితే సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో మూడు ఫోర్లు బాదిన సూర్యవంశీ 36 పరుగులు చేసి అర్షద్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో రాజస్తాన్ 38 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.రాజస్తాన్ లక్ష్యం 230 పరుగులుఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్ రాజస్తాన్ రాయల్స్ ముందు 230 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ (84), సాయి సుదర్శన్ (55) అర్థసెంచరీలతో రాణించారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ (20 బంతుల్లో 37 నాటౌట్), రాహుల్ తెవాటియా (4 బంతుల్లో 14 నాటౌట్) రాణించడంతో గుజరాత్ 229 పరుగులు చేసింది. రాజస్తాన్ బౌలర్లలో బ్రిజేశ్ శర్మ 2 వికెట్లు తీయగా, యష్రాజ్, జడేజా చెరొక వికెట్ తీశారు.గిల్ (84) ఔట్.. మూడో వికెట్ డౌన్84 పరుగులు చేసిన శుబ్మన్ గిల్ బ్రిజేశ్ శర్మ బౌలింగ్లో తుషార్ దేశ్పాండేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో గుజరాత్ టైటాన్స్ 185 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.16 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ 16 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. గిల్ (78), వాషింగ్టన్ సుందర్ 17 పరుగులతో ఆడుతున్నాడు.మరో వికెట్ డౌన్జోస్ బట్లర్ కూడా ఔటయ్యాడు. రవీంద్ర జడేజా బౌలింగ్లో డోనోన్కు క్యాచ్ ఇచ్చి 13 పరుగులకే జోస్ బట్లర్ వెనుదిరిగాడు. స్కోరు 15 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 166గా ఉంది.సాయి సుదర్శన్ ఔట్ సాయి సుదర్శన్ 55 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. మరోవైపు, శుభ్మన్ గిల్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. క్రీజులో బట్లర్ 6 పరుగులతో ఉన్నాడు. సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ గుజరాత్ టైటాన్స్ స్కోరు 10 ఓవర్లకి వికెట్ నష్టపోకుండా 114గా ఉంది. సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ బాదాడు. 32 బంతుల్లో 52 పరుగుల చేశాడు. శుభ్మన్ గిల్ 29 బంతుల్లో 49 పరుగులు చేశాడు. గుజరాత్ ఓపెనర్లు దూకుడురాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ దూకుడు ప్రదర్శిస్తోంది. 6 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 81 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (39), శుబ్మన్ గిల్ (32) పరుగులతో ఆడుతున్నారు.4 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (34), గిల్ (7) పరుగులతో ఆడుతున్నారు.ఒకే ఓవర్లో 18 పరుగులిచ్చిన ఆర్చర్గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్ జోఫ్రా ఆర్చర్ తొలి ఓవర్లోనే వైడ్ల రూపంలో 18 పరుగులు సమర్పించుకున్నాడు. 2 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. సుదర్శన్ (14), గిల్ (2) పరుగులతో ఆడుతున్నారు.టాస్ నెగ్గిన రాజస్తాన్..టాస్ గెలిచిన రాజస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. పరాగ్ తొడ కండరాల గాయంతో దూరం కావడంతో ఈ మ్యాచ్కు రాజస్తాన్ను జైస్వాల్ నడిపించనున్నాడు. ఇక గుజరాత్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. మానవ్ సుతర్ స్థానంలో ప్రసిధ్ క్రిష్ణ జట్టులోకి వచ్చాడు. మరోవైపు రాజస్తాన్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. హెట్మైర్తో పాటు యష్రాజ్ పుంజా తుదిజట్టులోకి వచ్చాడు. ఈ సీజన్లో తొలి అంచె పోటీలో రాజస్తాన్పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. సొంతగడ్డపై మ్యాచ్ ఆడుతున్న రాజస్తాన్ గుజరాత్పై ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అన్నది చూడాలి. ముఖాముఖి పోరులో ఇప్పటివరకు ఇరుజట్లు తొమ్మిది మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఇందులో గుజరాత్ ఆరుసార్లు నెగ్గితే.. రాజస్తాన్ మూడుసార్లు విజయాన్ని అందుకుంది. జైపూర్లో కూడా గుజరాత్దే పైచేయి. ఇక్కడ ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండింటిలో గుజరాత్ గెలుపొందింది.తుది జట్లు:గుజరాత్ టైటాన్స్: శుభ్మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), నిషాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్.రాజస్తాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్(కెప్టెన్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, శుభమ్ దూబే, దాసున్ షనక, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్పాండే, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజా.గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ సబ్స్: ప్రసిద్ధ్ కృష్ణ, గ్లెన్ ఫిలిప్స్, అనుజ్ రావత్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కుమార్ కుశాగ్రారాజస్థాన్ రాయల్స్ ఇంపాక్ట్ సబ్లు: వైభవ్ సూర్యవంశీ, ఆడమ్ మిల్నే, రవి సింగ్, సుశాంత్ మిశ్రా, రవి బిష్ణోయ్ -
పంజాబ్ కింగ్స్ అత్యవసర సమావేశం.. అర్ష్దీప్పై వేటు!
ఐపీఎల్ 2026 సీజన్లో ఊహించని సంఘటనలు చాలానే జరుగుతున్నాయి. ఇటీవలే రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్తో పాటు పంజాబ్ కింగ్స్ ఆటగాడు యజ్వేంద్ర చాహల్ నిషేధిత ప్రాంతాల్లో ఈ-సిగరేట్ తాగడం పెను దుమారం రేపింది. ఇప్పటికే పరాగ్పై యాక్షన్ తీసుకున్న బీసీసీఐ రూ. 25 లక్షల జరిమానా విధించింది. అయితే చాహల్ విషయంలో బీసీసీఐ ఇంకా ఎలాంటి చర్య తీసుకోలేదు. ఎందుకంటే ఈ వివాదంలో చాహల్తో పాటు పంజాబ్ ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా అర్ష్దీప్ సింగ్ ఇన్స్టాగ్రామ్ నుంచి ఈ వీడియో లీకవ్వడం, అతడే వేప్ (ఈ-సిగరేట్)ను చాహల్కు అందించడం వీడియోలో కనిపించింది. తాజాగా ఈ వివాదానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ బయటికి వచ్చింది. ఇప్పటికే పంజాబ్ కింగ్స్ యాజమాన్యం అర్ష్దీప్ను డ్రెస్సింగ్ రూమ్లో జరిగే పరిణామాలను వ్లాగ్గా తీయడం ఆపేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇలాంటి చర్యల వల్ల డ్రెస్సింగ్ రూమ్ వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అవుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా శనివారం ధర్మశాల స్టేడియంలో ప్రాక్టీస్ ముగిసిన అనంతరం పంజాబ్ కింగ్స్ యాజమాన్యం ఆటగాళ్లందరితో సమావేశమైనట్లు తెలిసింది. ఐపీఎల్ ముగిసేవరకు ఆటగాళ్లు వ్లాగ్ చేయడం, దానిని సోషల్ మీడియాలో షేర్ చేయడాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ మీటింగ్లో అర్ష్దీప్ హైలైట్ అయ్యాడు. చాహల్ చర్యకు పరోక్షంగా అర్ష్దీప్ కారణమయ్యాడు. కాగా అర్ష్దీప్కు ఇన్స్టాలో 6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. మరోసారి ఇలాంటి చర్యకు పాల్పడితే జట్టు నుంచి నిషేధం ఎదుర్కోవాల్సి వస్తోందని అర్ష్దీప్ను హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ-సిగరేట్ తాగిన చాహల్ను కూడా పంజాబ్ మందలించినట్లు సమాచారం. ఇక నుంచి పంజాబ్ కింగ్స్ అధికారిక సోషల్ మీడియా ఖాతాలోనే ఆటగాళ్లంతా తమ వీడియోలను షేర్ చేసుకోవాలని ఆదేశించింది. అందుకు ఆటగాళ్లందరి నుంచి ఇప్పటికే సంతకాలు కూడా తీసుకోవడంతో పాటు ఏ ప్లేయర్ కూడా తమ వ్యక్తిగత అకౌంట్స్లో వీడియోలు పంచుకోవద్దని సూచించింది. ఇక పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో తొలి అంచె పోటీల్లో వరుస విజయాలతో టేబుల్టాపర్గా నిలిచింది. అయితే రెండో అంచె పోటీల్లో పరాజయాలు చవిచూసి ప్రస్తుతం పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్ తన తర్వాతి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడనుంది.చదవండి: అయ్యర్కు షాక్.. శాంసన్కు డబుల్ ప్రమోషన్! -
అయ్యర్కు షాక్.. శాంసన్కు డబుల్ ప్రమోషన్!
టీమిండియా టీ20 కెప్టెన్గా సూర్యకుమార్పై త్వరలో వేటు పడనుంది. ఈ మేరకు బీసీసీఐ కొత్త టీ20 కెప్టెన్ను ఎంపిక చేసేందుకు ఇప్పటికే కసరత్తులు ప్రారంభించింది. అయితే శ్రేయస్ అయ్యర్ తదుపరి భారత టీ20 కెప్టెన్గా బాధ్యతలు తీసుకుంటాడంటూ వార్తలు వస్తున్న వేళ.. తాజాగా కెప్టెన్సీ రేసులోకి అనూహ్యంగా సంజూ శాంసన్ పేరు తెరమీదకు రావడంతో పోటీ ఆసక్తిగా మారింది. ఎందుకంటే అయ్యర్ కెప్టెన్ అయితే సంజూ శాంసన్ కెరీర్ ప్రమాదంలో పడుతుందని ఊహాగానాలు వ్యక్తమయిన వేళ శాంసన్ ఏకంగా కెప్టెన్ కుర్చీపై కర్చీఫ్ వేసి అయ్యర్కే ఎసరు పెట్టినట్లు తెలుస్తోంది. టీ20 కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ అయ్యర్కే అధిక ప్రాధన్యమిచ్చే అవకాశమున్నప్పటికీ శాంసన్ రేసులోకి వస్తే అతడిని పరిగణలోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. దీంతో కెప్టెన్ కావాలనుకున్న అయ్యర్కు ఇప్పుడు శాంసన్ రూపంలో పెద్ద గండం వచ్చి పడింది. ఐపీఎల్ 2026 సీజన్కు ముందు రాజస్తాన్ రాయల్స్ నుంచి సీఎస్కేకు ట్రేడింగ్ అయిన సంజూ శాంసన్ సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం సీఎస్కేకు అతడు కెప్టెన్ కాకపోయినప్పటికీ గతంలో రాజస్తాన్ రాయల్స్కు నాయకత్వం వహించిన అనుభవం శాంసన్కు ఉపయోగపడనుంది. అనుభవానికి తోడు కెప్టెన్గా రాజస్తాన్ను విజయవంతంగా నడిపించడమే శాంసన్ను కెప్టెన్సీ రేసులో నిలబెట్టినట్లు కనిపిస్తోంది. ఇక టీమిండియా వచ్చే జూన్, జూలై నెలల్లో ఇంగ్లండ్, ఐర్లాండ్లో వైట్బాల్ సిరీస్ ఆడనుంది. ఈ పర్యటనకు సంబంధించి ఆటగాళ్ల ఎంపిక ఐపీఎల్ ప్రదర్శనపైనే ఆధారపడి ఉంటుంది. ముంబై బ్యాటర్గా సూర్యకుమార్ దారుణ ప్రదర్శన కనబరుస్తుండడంతో అతడు చోటు కోల్పోయే అవకాశముంది. ఇప్పటికే పరుగుల పరంగా శాంసన్, శ్రేయస్ అయ్యర్ టాప్ ప్లేస్ కోసం పోటీ పడుతున్నారు.శాంసన్ ఎందుకంటే?భారత తదుపరి టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ స్థానాన్ని భర్తీ చేసే రేసులో శాంసన్కు అనుకూలంగా ఉన్న అంశం ఏంటంటే.. అతను భారత టీ20 జట్టులో నిలకడగా ఉండటమే. 2024 టీ20 ప్రపంచ కప్ నుంచి జట్టుతో పాటు కొనసాగుతున్న శాంసన్ ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. 62 మ్యాచ్లాడి మూడు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలతో 1,399 పరుగులు సాధించాడు. ఈ ఏడాది ప్రారంభంలో భారత్ టీ20 ప్రపంచ కప్ విజయంలో కూడా అతను కీలక పాత్ర పోషించాడు. శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో కెప్టెన్గా రాణిస్తున్నప్పటికీ అంతర్జాతీయంగా టీమిండియా ఆడే టీ20 జట్టులో ఇప్పటివరకు చోటు లేకపోవడం మైనస్గా మారింది. అయ్యర్ భారత్ తరఫున తన చివరి టీ20 మ్యాచ్ను 2023 డిసెంబర్ 3న ఆడాడు. ఒకవేళ అయ్యర్ పొట్టి ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇస్తే మాత్రం అతడికి బూస్టప్ అని చెప్పొచ్చు. దీనికి తోడు అతను టీ20 కెప్టెన్ అయితే అతని కెరీర్ గ్రాఫ్ కూడా పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20ల కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ భారత టీ20 కెప్టెన్గా సూర్యకుమార్నే కొనసాగించే అవకాశం ఉందని, అయితే మరోసారి పేలవ ఫామ్ కనబరిస్తే మాత్రం సూర్య స్థానంలో బీసీసీఐ కొత్త కెప్టెన్ను ఎంపిక చేయనుంది.చదవండి: చిక్కుల్లో జైస్వాల్, షఫాలీ.. నిషేధం పడే అవకాశం! -
చిక్కుల్లో జైస్వాల్, షఫాలీ.. నిషేధం పడే అవకాశం!
టీమిండియా క్రికెటర్లు జైస్వాల్, షఫాలీ వర్మ చిక్కుల్లో పడ్డారు. జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) భారత క్రికెటర్లు యశస్వి జైస్వాల్, షఫాలీ వర్మలకు నోటీసులు జారీ చేసింది. వీరిద్దరు డోపింగ్ టెస్టుకు అందుబాటులోకి రాకపోవడంపై నాడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జైస్వాల్, షఫాలీ వర్మల పేర్లపై ‘మిస్ టెస్ట్’ నమోదు చేసింది. దీనిపై ఏడు రోజల్లోగా సమాధానమివ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. ఇదే విషయాన్ని ఇప్పటికే ఐసీసీతో పాటు బీసీసీఐకి కూడా నాడా నివేదించింది. గడువులోగా సమాధానం ఇవ్వకపోతే ఈ ఇద్దరు క్రికెటర్లపై నిషేధం పడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. విషయంలోకి వెళితే.. నాడా నిబంధనల ప్రకారం.. 'రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్స (ఆర్టీపీ)లో ఉన్న ఆటగాళ్లు తాము ఎక్కడ ఉంటున్నామో ముందే సమాచారం అందించాలి. దీనినే 'వేర్ అబౌట్ క్లాజ్' అంటారు. గతేడాది డిసెంబర్ 17న డోప్ కంట్రోల్ ఆఫీసర్ పరీక్ష కోసం వెళ్లగా, జైస్వాల్ తాను చెప్పిన చోట అందుబాటులో లేరు. అలాగే నవంబర్ 7న షెఫాలీ వర్మ కూడా తాను ఇచ్చిన అడ్రస్లో లేకపోవడంతో ఆమె టెస్ట్ కూడా మిస్ అయ్యింది. కేవలం టెస్టుకు గైర్హాజరు కావడమే కాకుండా, దీనిపై వివరణ ఇవ్వాలని నాడా పంపిన నోటీసులను కూడా వీరిద్దరూ నిర్లక్ష్యం చేసినట్లు సమాచారం. ఫిబ్రవరి 18, 20 తేదీల్లో సమాధానం చెప్పాలని కోరినప్పటికీ, వీరి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో నాడా తాజాగా వీరిద్దరికీ నోటీసులు జారీ చేసింది.నిషేధం పడనుందా?ప్రస్తుతానికి వీరిద్దరిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశం లేదని సమాచారం. ఎందుకంటే నాడా/వాడా నిబంధనల ప్రకారం.. ఒక ఏడాదిలో (12 నెలలు) మూడుసార్లు టెస్టుకు అందుబాటులో లేకపోతేనే దానిని నేరంగా పరిగణిస్తారు. ప్రస్తుతం వీరు కేవలం ఒకసారి మాత్రమే టెస్ట్ మిస్ అయ్యారు. అయితే మరో రెండుసార్లు ఇలాగే జరిగితే మాత్రం సదరు ఆటగాళ్లపై 2 ఏళ్ల వరకు నిషేధం విధించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న యశస్వి జైస్వాల్ ఈ నోటీసులపై ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.చదవండి: ఫిన్ అలెన్ చరిత్ర.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా! -
నిప్పులు చెరుగుతున్న ఢిల్లీ కుర్రాడు!
అంతర్జాతీయ స్థాయిలో అపార అనుభవం... క్లిష్ట పరిస్థితుల్లో క్రీజులో పాతుకుపోయే తత్వం... బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలయించే సత్తా ఉన్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని ఓ అనామక బౌలర్ క్లీన్ బౌల్డ్ చేశాడు! అదేదో కోహ్లి తప్పిదం వల్ల వికెట్ కోల్పోయాడా అంటే ముమ్మాటికి కాదు. గుడ్ లెంగ్త్లో పడిన బంతి అనూహ్యంగా దూసుకొచ్చి కోహ్లి వికెట్ను గిరాటేసింది. ఏం జరిగిందో అర్థం చేసుకునేలోపే విరాట్ వికెట్ నేలకూలింది. ‘కింగ్’ కోహ్లిని బోల్తా కొట్టించిన బౌలర్ పేరే ‘ప్రిన్స్’!పట్టుమని పది ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన అనుభవం కూడా లేని ఈ ఢిల్లీ కుర్రాడు... ఈ ఏడాది ఐపీఎల్లో అదరగొడుతున్నాడు. బ్యాటర్ల జోరు సాగుతున్న లీగ్లో పేస్ బౌలింగ్ తడాఖా చూపుతున్నాడు. గంటకు 140 కిలోమీటర్లకు పైగా వేగం... ప్రతి బంతిని అనుకున్న చోట వేయగల కచ్చితత్వం... అవసరమైతే స్లో బంతులతో బురిడీ కొట్టించగల నైపుణ్యం... వెరసి 24 ఏళ్ల ప్రిన్స్ యాదవ్ను ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. ఐపీఎల్ తాజా సీజన్లో 16 వికెట్లు తీసిన ప్రిన్స్ భవిష్యత్తుపై ఆశలు రేపుతున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ (Prince Yadav) ఐపీఎల్లో చక్కటి బౌలింగ్తో ఆకట్టుకుంటున్నాడు. తాజా సీజన్లో 10 మ్యాచ్లాడిన ప్రిన్స్ 16 వికెట్లతో విజృంభించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్లో లక్నో జట్టు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా... వారి బౌలింగ్ బృందంపై అందరి దృష్టి పడటం వెనక ప్రిన్స్ యాదవ్ ప్రతిభ దాగి ఉంది. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ కుర్రాడు... గతేడాది ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. అయితే ఇతర బౌలర్లు సత్తా చాటడంతో అతడికి పెద్దగా అవకాశాలు దక్కలేదు. కానీ ఈ ఏడాది మాత్రం మొహమ్మద్ షమీతో కలిసి ప్రిన్స్ ప్రత్యర్థులను వణికిస్తున్నాడు. జట్టుకు అవసరమైనప్పుడల్లా వికెట్లు పడగొడుతూ... నిలకడ కనబరుస్తున్నాడు.మొహసిన్ ఖాన్, మయాంక్ యాదవ్ (Mayank Yadav) గాయాలతో సతమతమవుతున్న సమయంలో ప్రిన్స్ యాదవ్ టీమ్ మేనేజ్మెంట్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. సాంకేతికంగా ‘ప్లే ఆఫ్స్’ రేసులో ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై ప్రిన్స్ తన పవర్ చూపాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్ రెండో బంతికి విరాట్ను అవుట్ చేసిన అతడు... ఆ తర్వాత మరో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. చక్కటి భాగస్వామ్యం సాగుతున్న సమయంలో పడిక్కల్ను రిటర్న్ క్యాచ్ ద్వారా వెనక్కి పంపిన ప్రిన్స్... జితేశ్ శర్మను ఓ చక్కటి బంతితో బుట్టలో వేసుకొని బెంగళూరుకు పరాజయం రుచి చూపాడు.ఈ ఒక్క మ్యాచ్ అనే కాకుండా... తాజా సీజన్లో అతడి బౌలింగ్ ప్రభావవంతంగా సాగింది. కోహ్లిని అవుట్ చేసిన అనంతరం అతడు గాల్లోకి ఎగురుతూ సంబరాలు చేసుకోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరగగా... అంత పెద్ద స్టార్ వికెట్ తీసినప్పుడు ఆ మాత్రం ఆనందం కలగడంలో తప్పేముందనే అభిప్రాయాలే ఎక్కువ వినిపించాయి. తాజా సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్న ప్రిన్స్... ఇదే జోరు, నిలకడ కొనసాగిస్తే... భవిష్యత్తులో స్టార్గా ఎదిగే అవకాశాలున్నాయి. అన్షుల్ అదుర్స్ టీమిండియా తరఫున ఒక టెస్టు మ్యాచ్ ఆడిన అన్షుల్ కంబోజ్ ఈ ఏడాది ఐపీఎల్లో రాణిస్తున్నాడు. రంజీ ట్రోఫీలో ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు పడగొట్టడం ద్వారా వెలుగులోకి వచ్చిన అన్షుల్ కంబోజ్ను తొలుత ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసుకుంది. అక్కడ అతడికి పెద్దగా అవకాశాలు రాకపోగా... గతేడాది వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ దాదాపు మూడున్నర కోట్లకు అన్షుల్ను సొంతం చేసుకుంది. 2025 సీజన్లో చెన్నై తరఫున 8 మ్యాచ్లాడిన కంబోజ్ 8 వికెట్లతో ఫర్వాలేదనిపించాడు. అయితే నిరుడు చెన్నై ప్రదర్శన నాసిరకం కావడంతో అన్షుల్కు కూడా ఏదీ కలిసి రాలేదు. కానీ దేశవాళీల్లో నిలకడ కొనసాగించిన అన్షుల్... ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు.బ్యాటర్ల జోరు సాగిన ఆ టెస్టు మ్యాచ్లో ఒక వికెట్ పడగొట్టిన కంబోజ్... అవకాశం వచ్చిన ప్రతి చోట తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. ఈ ఏడాది ప్రధాన పేసర్లు గాయాలతో ఇబ్బంది పడుతుండటంతో... చెన్నై బౌలింగ్ భారాన్ని భూజలకెత్తుకున్న అన్షుల్ చక్కటి ప్రదర్శనతో తన విలువ పెంచుకున్నాడు. 10 మ్యాచ్ల్లో 18.70 సగటుతో 17 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుత సీజన్లో బ్యాటర్ల వీర విధ్వంసం సాగుతున్న సమయంలోనూ... అన్షుల్ ఎకానమీ రేటు కూడా 9కి లోపే (8.91) ఉండటం విశేషం. వేగం కంటే... వైవిధ్యం, కచ్చితత్వంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్న 25 ఏళ్ల అన్షుల్ ఇదే జోష్ కనబరిస్తే భవిష్యత్తులో అతడికి మరిన్ని అవకాశాలు రావడం తధ్యం!పదును తగ్గలే! స్టార్ బౌలర్లే వికెట్లు పడగొట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఐపీఎల్లో... వెటరన్ బౌలర్లు తమ పదును తగ్గలేదని నిరూపించుకుంటున్నారు. ఇటీవల ఐసీసీ టి20 వరల్డ్కప్ టోర్నిలో చక్కటి బౌలింగ్తో టీమిండియా వరసగా రెండోసారి చాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించిన జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్లో తేలిపోతుండగా... నాలుగేళ్లుగా టీమిండియా దరిదాపుల్లో కనిపించని భువనేశ్వర్ కుమార్ వరుస వికెట్లతో సత్తా చాటుతున్నాడు.జాతీయ జట్టు తరఫున 21 టెస్టులు, 121 వన్డేలు, 87 టి20 మ్యాచ్లాడిన 36 ఏళ్ల భువనేశ్వర్ కుమార్... తాజా సీజన్లో తన స్వింగ్తో కట్టిపడేస్తున్నాడు. మూడు ఫార్మాట్లలో కలిపి టీమిండియా తరఫున 294 వికెట్లు తీసిన భువీ... ఐపీఎల్ 19వ సీజన్లో 10 మ్యాచ్ల్లో 17.52 సగటుతో 17 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అది కూడా కేవలం 7.64 ఎకానమీతో కావడం గమనార్హం. ‘స్వింగ్ సుల్తాన్’ అనే పేరుకు న్యాయం చేస్తూ... ‘పవర్ ప్లే’లో వికెట్లు పడగొడుతున్న భువనేశ్వర్... బెంగళూరు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 2022లో టీమిండియా తరఫున చివరి మ్యాచ్ ఆడిన భువీ ఇంకా తనలో పదును తగ్గలేదని నిరూపిస్తున్నాడు. ఐపీఎల్లో 200కు పైగా వికెట్లు పడగొట్టిన భువనేశ్వర్... ఈ ఘనత సాధించిన తొలి పేసర్గా రికార్డుల్లోకెక్కాడు. మరోవైపు ఫిట్నెస్ విషయంలోనూ ఎంతో మెరుగ్గా ఉన్న భువీ... ఐపీఎల్లో 200 మ్యాచ్లాడిన తొలి పేస్ బౌలర్గానూ నిలిచాడు.చదవండి: ఐపీఎల్లో పరుగుల వరద.. కారణం ఇదే!మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ తరఫున షమీ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. చాన్నాళ్లుగా భారత జట్టుకు దూరమైన షమీ... దేశవాళీల్లో నిలకడగా వికెట్లు పడగొడుతున్నాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసే తన అలవాటు ఈ సీజన్లోనూ కొనసాగిస్తున్న షమీ... తనలో ఇంకా సత్తా తగ్గలేదని చాటుతున్నాడు. ధారాళంగా పరుగులు ఇస్తాడనే ముద్ర పడ్డ హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ తాజా ఐపీఎల్లో 10 మ్యాచ్ల్లో 11 వికెట్లు తీశాడు. గతంతో పోలిస్తే ఎంతో నియంత్రణతో బౌలింగ్ చేస్తున్న సిరాజ్... పొదుపైన బౌలింగ్తోనూ ఆకట్టుకుంటున్నాడు. అంతర్జాతీయ స్టార్లు రబాడ, ఇషాన్ మలింగ, ఆర్చర్ సైతం వికెట్ల వేటలో ముందున్నారు. సీనియర్ పేసర్లు స్టార్క్, కమిన్స్, హాజిల్వుడ్ గాయాలతో ఎక్కువ మ్యాచ్లు ఆడకపోవడంతో వారికి ఈ జాబితాలో చోటు దక్కలేదు.–సాక్షి, క్రీడావిభాగం -
పాక్ జట్టులో రోహిత్, గిల్..!
పాకిస్తాన్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఓ ఘోర తప్పిదం జరిగింది. బ్రాడ్కాస్టర్ చేసిన ఓ భారీ పొరపాటు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పాక్ ఆటగాళ్ల గణాంకాలు చూపాల్సిన సమయంలో, స్క్రీన్పై భారత క్రికెటర్ల పేర్లు కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.పాక్-బంగ్లా మధ్య తొలి టెస్ట్ మే 8న షేర్-ఏ బంగ్లా స్టేడియం వేదికగా ప్రారంభమైంది. రెండో రోజు ఆట సందర్భంగా బ్రాడ్కాస్టర్ పాక్ జట్టు టెస్ట్ గణాంకాలను ప్రదర్శించే గ్రాఫిక్ను చూపించింది. అయితే అందులో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, అర్షదీప్ సింగ్ తదితర భారత ఆటగాళ్ల పేర్లు కనిపించాయి.ఈ తప్పిదం వెంటనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అభిమానులు మీమ్స్, సరదా కామెంట్లతో బ్రాడ్కాస్టర్ను ట్రోల్ చేశారు. కొందరు ఐపీఎల్ మోడ్లోనే గ్రాఫిక్స్ తయారు చేశారా..? అంటూ సెటైర్లు వేశారు. మరోవైపు పాక్ అభిమానులు మాత్రం ఇది సాధారణ తప్పిదం కాదని, నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే, బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు చేసింది. కెప్టెన్ నజ్ముల్ హొసేన్ షాంటో అద్భుత సెంచరీతో జట్టును నిలబెట్టాడు. మొమినుల్ హక్ 91, ముష్ఫికర్ రహీం 71 పరుగులతో కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 413 పరుగులకు ఆలౌటైంది. పాక్ బౌలర్లలో మొహమ్మద్ అబ్బాస్ ఐదు వికెట్లతో మెరవగా.. షాహీన్ అఫ్రిది 3, హసన్ అలీ, నౌమన్ అలీ తలో వికెట్ తీశారు. కాగా, ఈ మ్యాచ్కు పాక్ స్టార్ బ్యాటర్ గాయం కారణంగా దూరమయ్యాడు. -
స్కాట్లాండ్ టీమ్లో చేరిన పాక్ మాజీ కెప్టెన్
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ అజహర్ అలీ స్కాట్లాండ్ క్రికెట్ జట్టుతో చేతులు కలిపాడు. త్వరలో నేపాల్లో జరిగే ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ లీగ్-2 టోర్నీ కోసం ఆ జట్టు బ్యాక్రూమ్ స్టాఫ్ కన్సల్టెంట్గా చేరాడు. ఈ టోర్నీలో స్కాట్లాండ్ , నేపాల్తో పాటు అమెరికా పాల్గొంటుంది. 2010-22 మధ్యలో పాక్ తరఫున కీలక బ్యాటర్గా వ్యవహరించిన 41 ఏళ్ల అలీ.. రిటైర్మెంట్ అనంతరం పాక్ జాతీయ జట్టు సెలెక్టర్గా కూడా పని చేశాడు.కెరీర్లో 97 టెస్టులు, 53 వన్డేలు ఆడిన అలీ.. దాదాపు 9000 పరుగులు చేశాడు. ఇందులో ఓ ట్రిపుల్ సెంచరీ సహా 21 సెంచరీలు, 47 అర్ద సెంచరీలు ఉన్నాయి. అలీ ప్రస్తుత పాక్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజమ్కు అత్యంత సన్నిహితుడు. వీరిద్దరి మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. 2016లో వెస్టిండీస్పై బాబర్ వరుసగా మూడు వన్డే సెంచరీలు సాధించిన సమయంలో అలీ జట్టు పాక్ కెప్టెన్గా ఉన్నాడు. అలాగే 2017 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన పాక్ జట్టులో ఈ ఇద్దరూ కీలక సభ్యులు.క్రికెట్ వరల్డ్కప్ లీగ్-2 విషయానికొస్తే.. ఈ టోర్నీ మే 12న ప్రారంభం కానుంది. ఆ రోజు స్కాట్లాండ్ నేపాల్తో తొలి మ్యాచ్ ఆడనుంది. అనంతరం మే 14న అమెరికాతో తలపడనుంది. తిరిగి మే 18, 20 తేదీల్లో మరోసారి ఈ జట్ల మధ్య మ్యాచ్లు జరగనున్నాయి. -
సీఎస్కే నుంచి రికార్డు లాగేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్కు మరో చేదు అనుభవం ఎదురైంది. నిన్న (మే 8) కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో పరాజయంపాలై ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపుగా అంతం చేసుకుంది. నిన్నటి మ్యాచ్లో డీసీ బ్యాటర్లు నెమ్మదిగా ఆడుతూ ఓ అవమానకర రికార్డును తమ పేరిట నమోదు చేసుకున్నారు.ముందుగా బ్యాటింగ్ చేసిన వారు నిర్ణీత 20 ఓవర్లలో 142 పరుగులు మాత్రమే చేశారు. ఓ దశలో జట్టు 89/5 స్కోరుతో కష్టాల్లో పడగా, కెప్టెన్ అక్షర్ పటేల్, అశుతోష్ శర్మ ఇన్నింగ్స్ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. అయితే ఇద్దరూ కలిసి 46 బంతుల్లో కేవలం 39 పరుగులే చేయడం విమర్శలకు దారితీసింది.ప్రత్యేకంగా 12 నుంచి 16వ ఓవర్ మధ్య వీరిద్దరు కేవలం 11 పరుగులే సాధించారు. ఇందులో 19 డాట్బాల్స్ ఉండటం గమనార్హం. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఆ దశలో అత్యల్ప పరుగులు చేసిన జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచింది. గతంలో ఈ చెత్త రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఉండేది. సీఎస్కే గత సీజన్లో ఇదే కోల్కతాపై 12 నుంచి 16 ఓవర్ల మధ్య 12 పరుగులు మాత్రమే చేసింది. ఇప్పుడు డీసీ ఆ రికార్డును అధిగమించింది.ఇక లక్ష్య ఛేదనలో కేకేఆర్ బ్యాటర్లు చెలరేగిపోయారు. ఓపెనర్ ఫిన్ అలెన్ సెంచరీతో (47 బంతుల్లో 100 నాటౌట్; 5 ఫోర్లు, 10 సిక్సర్లు) కదంతొక్కగా, కేకేఆర్ కేవలం 14.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఈ గెలుపుతో కేకేఆర్ ప్లే ఆఫ్స్ బెర్త్పై ఆశలు సజీవంగా ఉంచుకుంది. తొలి ఆరు మ్యాచ్ల్లో ఐదింట ఓడి, ఒక్క గెలుపు కూడా లేకుండానే నిష్క్రమించేలా కనిపించిన కేకేఆర్.. ఆతర్వాత ఒక్కసారిగా విజయాల బాట పట్టింది. వరుసగా నాలుగు మ్యాచ్ల్లో గెలిచి అనూహ్యపోరాటాన్ని ప్రదర్శిస్తుంది. ప్రస్తుతం కేకేఆర్ పదింట నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ఈ జట్టుకు ఇంకా నాలుగు మ్యాచ్లు ఉన్నాయి. ఈ నాలుగిట్లో గెలిస్తే ప్లే ఆఫ్స్ అవకాశాలు తప్పక ఉంటాయి. పంజాబ్తో జరగాల్సిన ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే.ఎస్ఆర్హెచ్ (14), పంజాబ్ కింగ్స్ (13), ఆర్సీబీ (12), రాజస్థాన్ (12), గుజరాత్ (12), సీఎస్కే (10) పాయింట్ల పట్టికలో టాప్-6 జట్లుగా ఉండి, నాలుగు ప్లే ఆఫ్స్ బెర్త్ల కోసం ప్రధానంగా పోటీపడుతున్నాయి. ఈ జట్లతో కేకేఆర్ (9) పోటీపడాల్సి ఉంది. -
స్విమ్మింగ్లో చరిత్ర సృష్టించిన బెంగళూరు టెకీ దంపతులు
బెంగళూరుకు చెందిన టెకీ దంపతులు దనిష్ అబ్డి, వృశాలీ ప్రసాదే స్విమ్మంగ్లో అరుదైన సాహసం చేసి చరిత్ర సృష్టించారు. వీరు శ్రీలంక నుంచి భారత్ వరకు సముద్ర మార్గంలో ఈదుతూ సుమారు 32 కిలోమీటర్ల దూరాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న రామసేతు మార్గం గండా ఈ ఫీట్ సాధించడం విశేషం.దనిష్-వృశాలీ జంట శ్రీలంకలోని తలైమన్నార్ నుంచి ప్రయాణం ప్రారంభించి, తమిళనాడులోని ధనుష్కోడి వద్ద ముగించారు. ఇండియన్ ఓషియన్లో అలలు, బలమైన ప్రవాహాలను ఎదుర్కొంటూ వారు 10 గంటల 45 నిమిషాల్లో ఈ సాహస యాత్రను పూర్తి చేశారు.బెంగళూరు నివాసులైన డానిష్ అబ్ది మరియు వృషాలి ప్రసాద్, శ్రీలంకలోని తలైమన్నార్ నుండి భారతదేశంలోని ధనుష్కోడి వరకు సముద్రంలో 32 కిలోమీటర్లు ఈదారు.#SriLanka #Dhanushkodi #UANow pic.twitter.com/NylspcpXNi— UttarandhraNow (@UttarandhraNow) May 8, 2026ఈ ప్రయాణంలో కోస్ట్ గార్డులు, వైద్య సిబ్బంది, ఎస్కార్ట్ బోట్లు వారికి సహకరించాయి. సముద్రంలో కఠిన పరిస్థితులు ఎదురైనా ఇద్దరూ ధైర్యంగా ముందుకు సాగారు. ఈ ఫీట్ను సాధించికా దనిష్-వృశాలీ జంట సోషల్మీడియాలో ఇలా పోస్ట్ చేసింది. శ్రీలంక నుంచి భారత్ వరకు విజయవంతంగా ఈదాం. ఇది చాలా కఠినమైన ప్రయాణం అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ పోస్టు వైరల్గా మారగా, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.దనిష్-వృశాలీ దంపతులు గతంలో కూడా సముద్ర ఈత పోటీల్లో పాల్గొన్నారు. అయితే కలిసి చేసిన తొలి భారీ ఓపెన్ వాటర్ స్విమ్ ఇది. భారత్, శ్రీలంకల మధ్య సాంస్కృతిక అనుబంధాన్ని గుర్తుచేసే ప్రయత్నంగా కూడా ఈ సాహసాన్ని వారు చేపట్టినట్లు తెలుస్తోంది. -
రోహిత్ శర్మకు చేదు అనుభవం
టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మకు చేదు అనుభవం ఎదురైంది. కారులో ప్రయాణిస్తూ అభిమానులకు అభివాదం చేస్తుండగా.. సడెన్గా ఇద్దరు కుర్ర అభిమానులు రోహిత్ చేతికి ఉన్న ఖరీదైన వాచీని లాగే ప్రయత్నం చేశారు. Rohit Sharma Fans tried to snatch his 3.25 Cr "Giraffe" watch from his wrist. And suddenly he close the mirror. pic.twitter.com/vMIQFxcdxt— Aman (@Proteinkohli) May 8, 2026వెంటనే అప్రమత్తమైన రోహిత్ సదరు కుర్రాళ్లను మందలిస్తూ.. అద్దాలు మూసివేశాడు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగింతో తెలీదు కానీ, దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతుంది. రోహిత్ ధరించిన ఆ వాచీ విలువు రూ.3.25 కోట్లని తెలుస్తోంది. వాచీ బ్రాండ్ నేమ్ రోలెక్స్ జిరాఫ్ అని అంటున్నారు.ఇదిలా ఉంటే, రోహిత్ ప్రస్తుతం ఐపీఎల్ 2026తో బిజీగా ఉన్నాడు. సీజన్ ఆరంభంలో గాయపడిన అతను.. ఇటీవలే రీఎంట్రీ ఇచ్చాడు. వచ్చీరాగానే లక్నో సూపర్ జెయింట్స్పై మెరుపు ఇన్నింగ్స్ (44 బంతుల్లో 84) ఆడాడు. ఫలితంగా ముంబై 229 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలుండగానే ఛేదించింది.అయితే ఈ గెలుపు ముంబైకి కంటితుడుపుగా మాత్రమే పనికొచ్చింది. ఎందుకంటే ఆ జట్టు అప్పటికే ప్లే ఆఫ్స్ అవకాశాలను చాలా సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుతం ముంబై 10 మ్యాచ్ల్లో మూడే విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఆ జట్టు ఇకపై ఆడాల్సిన నాలుగు మ్యాచ్ల్లో గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. -
గిట్టుబాటు కాదనే.. స్టేడియం మార్పు
శివాజీనగర: బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో 7, 8 వేల సీట్లు స్పాన్సర్లు, ఇతరులకు ఇవ్వాల్సి ఉంటుంది. అది వర్క్ఔట్ కాదని ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ను మార్చినట్లు తెలిసింది అని హోం మంత్రి జీ.పరమేశ్వర్ తెలిపారు. ఐపీఎల్ ఫైనల్స్ను గుజరాత్లోని అహ్మదాబాద్కు మార్చడంపై గురువారం నగరంలో స్పందిస్తూ, మ్యాచ్కు భద్రత గురించి ఎలాంటి ఫిర్యాదు రాలేదు. ఇప్పటికి 5 మ్యాచ్లు ఇక్కడ జరిగాయని చెప్పారు. చిన్నస్వామిలో 33 వేల సీట్లు ఉన్నాయి. 7– 8 వేల సీట్ల (టికెట్లు)ను స్పాన్సర్లు తదితరులకు ఇవ్వాల్సి ఉంటుంది. 25 వేలు సీట్లు నిర్వాహకులకు మిగులుతాయి, ఇది గిట్టుబాటు కాదని స్టేడియాన్ని మార్చారని నాకు తెలిసిందన్నారు. ఎమ్మెల్యేల ఉచిత టికెట్లకు, దీనికి సంబంధం లేన్నారు. నాలుగు పాస్లు ఇస్తే ఏమవుతుంది? అని ప్రశ్నించారు. వినతి మేరకు సస్పెన్షన్ రద్దు ఐపీఎస్ రామచంద్రరావు సస్పెన్షన్ రద్దుపై స్పందిస్తూ, సీఎం అనుమతి తీసుకొని రద్దు చేశారు, ఈ నెలాఖరులో ఆయన రిటైరవుతారు, పెన్షన్ సెటిల్మెంటు తదితరాలు ఉన్నాయని, సస్పెన్షన్ ఎత్తేయాలని రామచంద్రరావు సీఎంకు విన్నవించారు, కావాలంటే తరువాత విచారణను కొనసాగించవచ్చని అభ్యరి్థంచారు అని తెలిపారు. -
అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్
ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ ఆశలు దాదాపు అంతమయ్యాయి. అయినా ఆ జట్టు టెక్నికల్గా ఇంకా రేసులో ఉంది. అయితే డీసీ కెప్టెన్ అక్షర్ పటేల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. నిన్న (మే 8) కేకేఆర్ చేతిలో ఓటమి అనంతరం అక్షర్ మాట్లాడుతూ.. ఈ సీజన్కు మా పని అయిపోయిందన్నట్లు వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు డీసీ అభిమానులను తీవ్రంగా బాధిస్తున్నాయి. ప్లే ఆఫ్స్ తలుపులు పూర్తిగా మూసుకోకముందే ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని వారు మండిపడుతున్నారు. చివరి నిమిషం వరకు పోరాడకుండా చేతులెత్తేస్తున్నట్లు ప్రకటించిన అక్షర్ను వెంటనే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అక్షర్ వ్యాఖ్యలతో సహచర సభ్యులు కూడా షాకయ్యారు. అక్షర్ ఇలా అనేశాడేంటీ అని చెవులు కొరుక్కున్నారు.వాస్తవానికి డీసీకి ప్లే ఆఫ్స్ చేరేందుకు ఇంకా తలుపులు పూర్తిగా మూసుకుపోలేదు. ఆ జట్టు ఇంకా 3 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ మూడింటిలో భారీ విజయాలు సాధిస్తే.. ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నట్లే. అయితే అది ఇతర జట్ల జయాపజయాలు, రన్రేట్పై ఆధారపడి ఉంటుంది. ఢిల్లీ ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్ల్లో 4 విజయాలు, 7 పరాజయాలతో 8 పాయింట్లు సాధించి, పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది.ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ (14), పంజాబ్ కింగ్స్ (13), ఆర్సీబీ (12), రాజస్థాన్ (12), గుజరాత్ (12), సీఎస్కే (10) పాయింట్ల పట్టికలో టాప్-6 జట్లుగా ఉండి, నాలుగు ప్లే ఆఫ్స్ బెర్త్ల కోసం ప్రధానంగా పోటీపడుతున్నాయి. ఈ జట్లను కాదని డీసీకి (8) ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కడం కష్టమే అయినప్పటికీ.. అసాధ్యం మాత్రం కాదు.గొప్పగా ప్రారంభించి..ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్ను గొప్పగా ప్రారంభించింది. లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్పై విజయాలతో ఆత్మవిశ్వాసం పెంచుకుంది. అయితే గుజరాత్ టైటాన్స్తో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్లో డేవిడ్ మిల్లర్ తీసుకున్న తప్పుడు నిర్ణయం (కుల్దీప్ యాదవ్కు సింగిల్ ఇవ్వకపోవడం) తర్వాత జట్టు మూమెంటం పూర్తిగా కోల్పోయింది. ఆ తర్వాత 9 మ్యాచ్ల్లో 7 ఓటములు ఎదర్కొని నిష్క్రమణకు సమీపించింది. -
రాష్ట్ర మంత్రిగా కేకేఆర్ మాజీ ఆటగాడు
టీమిండియా మాజీ క్రికెటర్, కేకేఆర్ మాజీ బౌలర్ అశోక్ దిండా పశ్చిమ బెంగాల్ నూతన క్రీడా మంత్రిగా నియమితుడయ్యాడు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో 294కు గానూ 206 స్థానాల్లో విజయఢంకా మోగించిన బీజేపీ, దిండాకు తమ మంత్రివర్గంలో స్థానం కల్పించింది. దిండా మోయ్నా నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. టీఎంసీ అభ్యర్ది చందన్ మొండల్పై 14000 పైచిలుకు మెజార్టీతో గెలిచాడు. గత ఎన్నికల్లో (2021) స్వల్ప తేడాతో విజయం సాధించిన దిండా, ఈసారి భారీ ఆధిక్యంతో విజయం సాధించి మంత్రి అయ్యాడు.42 ఏళ్ల దిండా 2021లో క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికి బీజేపీలో చేరాడు. దిండా అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువ కాలం నిలవకపోయినా, దేశీయ క్రికెట్లో అద్భుతంగా రాణించాడు. బెంగాల్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 420 వికెట్లు, లిస్ట్-ఏ క్రికెట్లో 151 వికెట్లు పడగొట్టాడు. దిండా బెంగాల్ జట్టుకు కెప్టెన్గా కూడా వ్యవహరించాడు.2009లో టీమిండియా అరంగేట్రం చేసి 13 వన్డేలు, 9 టీ20లు ఆడి 29 వికెట్లు తీశాడు. కుడి చేతి వాటం మీడియం పేసర్ అయిన దిండా ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చి టీమిండియా అవకాశాలు దక్కించుకున్నాడు. క్యాష్ రిచ్ లీగ్లో కేకేఆర్, ఆర్సీబీ, ఢిల్లీ, పూణే వారియర్స్, రైజింగ్ పూణే జెయింట్స్ తరఫున 78 మ్యాచ్లు ఆడిన దిండా 69 వికెట్లు తీశాడు. 2010లో టీమిండియా ఆసియా కప్ గెలిచిన జట్టులో దిండా సభ్యుడిగా ఉన్నాడు.కాగా, గత బెంగాల్ ప్రభుత్వంలోనూ మనోజ్ తివారి అనే టీమిండియా, కేకేఆర్ మాజీ క్రికెటర్ క్రీడా మంత్రిగా వ్యవహరించాడు. అతడు తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఎన్నికైన కొంతకాలం పాటు క్రీడా శాఖను పర్యవేక్షించాడు. -
షమీ రీఎంట్రీకి ముహూర్తం ఖరారు..!
వెటరన్ పేసర్ మహ్మద్ షమీ టీమిండియా రీఎంట్రీకి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ విషయమై బీసీసీఐలో సీరియస్గా చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఐపీఎల్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే ఏకైక టెస్ట్ కోసం షమీ ఎంపికకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటనే తారువాయి అని ఓ ప్రముఖ వెబ్సైట్ రాసుకొచ్చింది.షమీ గతకొంతకాలంగా ఫార్మాట్లకతీతంగా ప్రతి దేశవాలీ పోటీలో సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లోనూ లక్నో సూపర్ జెయింట్స్ తరఫున మెరుగ్గా రాణిస్తున్నాడు. వాస్తవానికి షమీ రీఎంట్రీ ఎప్పుడో జరగాల్సింది. కానీ, ఎందుకో వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు సెలెక్టర్లు అతన్ని కరుణించినట్లు తెలుస్తోంది. అతడు చివరిగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు.చాలామంది షమీ కెరీర్ ఖతమైందని అనుకున్నారు. కానీ అతడు మాత్రం ఎప్పుడూ ఆశ వదులుకోలేదు. రోజురోజుకు మెరుగవుతూ 35 ఏళ్ల లేటు వయసులో రీఎంట్రీకి సిద్దమయ్యాడు. ప్రస్తుతం షమీ పూర్తి ఫిట్నెస్తో ఉన్నాడు. ఈ మధ్యలో అతను ఎలాంటి గాయాల బారిన పడకపోతే, ఆఫ్ఘనిస్తాన్తో ఏకైక టెస్ట్లో బరిలోకి దిగడం దాదాపుగా ఖాయమైనట్లే.ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ కోసం మరో సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వర్క్లోడ్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో సిరాజ్కు జోడీగా షమీ బంతిని షేర్ చేసుకోవచ్చు. ఈ మ్యాచ్ కోసం ప్రిన్స్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, కార్తిక్ త్యాగి లాంటి యువ పేసర్ల పేర్లను కూడా పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీరంతా ప్రస్తుత ఐపీఎల్లో ఇరగదీస్తున్నారు. కాగా, ఆఫ్ఘనిస్తాన్తో ఏకైక టెస్ట్ మ్యాచ్ జూన్ 6 నుంచి ముల్లాన్పూర్ వేదికగా జరుగనున్న విషయం తెలిసిందే. -
గీత దాటితే వేటు!
న్యూఢిల్లీ: ఐపీఎల్లో ఇటీవల వెలుగులోకి వచ్చిన పలు వివాదాస్పద ఘటనల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. ‘క్రమశిక్షణారాహిత్యం, నిబంధనల ఉల్లంఘన’ జరుగుతోందంటూ బోర్డు అవినీతి నిరోధక విభాగం ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఆటగాళ్లు, అధికారులతో పాటు పది ఫ్రాంచైజీలను కూడా హెచ్చరించింది. లీగ్ సాగుతున్న సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలపై ప్రత్యేక సూచనలతో కూడిన నియమావళిని జారీ చేసింది. ఇటీవలి పలు పరిణామాలు ఐపీఎల్కు చెడ్డ పేరు తెస్తున్నాయని, వీటిని నిలువరించకపోతే పరిస్థితులు మరింత దిగజారుతాయని హెచ్చరించింది. తాజా సూచనలు సరిగ్గా అమలవుతున్నాయో లేదా తరచుగా పర్యవేక్షించనున్నారు. ఏదైనా తప్పు తేలితే షోకాజ్, జరిమానా మొదలు ఐపీఎల్ నుంచి నిషేధించే అవకాశం కూడా ఉంది. ఏ ఫ్రాంచైజీ లేదా ఆటగాడి పేరును ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా... క్రమశిక్షణ ఉల్లంఘనకు కారణమవుతున్న పలు అంశాలను బోర్డు ప్రస్తావించింది. వీటిలో కొన్ని... 1. ఆటగాళ్ల గదుల్లోకి అనుమతి లేని వ్యక్తుల ప్రవేశంపై నిషేధం: టీమ్ మేనేజర్ అనుమతి లేకుండా పలువురు ఆటగాళ్లు, అధికారులు తమ గదుల్లోకి బయటి వ్యక్తులను అనుమతించిన విషయం వెలుగులోకి వచ్చింది. దీని వల్ల వారిని ఉచ్చులోకి బిగించి తప్పుడు పనుల కోసం ప్రోత్సహించేందుకు ఆస్కారం ఉంది. ఇకపై కుటుంబ సభ్యులైనా సరే మేనేజర్ నుంచి లిఖిత పూర్వక అనుమతి తీసుకోవాలి. లేదంటే హోటల్ లాబీలోనే కలవాలి. 2. మ్యాచ్ సమయంలో ఫ్రాంచైజీ యజమానులు కూడా దూరంగా ఉండాలి: కొందరు ఫ్రాంచైజీ యజమానులు మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే క్రికెటర్లతో మాట్లాడుతూ, కబుర్లు చెబుతూ కనిపిస్తున్నారు. ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. ఇకపై ఇది పూర్తిగా నిషేధం. డగౌట్, డ్రెస్సింగ్ రూమ్లతో పాటు మైదానంలోకి కూడా యజమానులు మ్యాచ్ పూర్తి కాక ముందు ఎవరూ రాకూడదు. 3. అనుమతి లేకుండా బయటకు వెళ్లరాదు: చాలా మంది క్రికెటర్లు, అధికారులు వేళాపాళా లేకుండా హోటల్ నుంచి బయటకు వెళ్లిపోతున్నారు. ఇది చాలా రకాల సమస్యలకు కారణమవుతోంది. ఇకపై అలా కుదరదు. సెక్యూరిటీ లైజన్ ఆఫీసర్ లేదా టీమ్ ఇంటిగ్రిటీ ఆఫీసర్కు సమాచారం అందించి వారి అనుమతితోనే వెళ్లాలి. 4. వేపింగ్పై నిషేధం: రియాన్ పరాగ్ ఉదంతం నేపథ్యంలో ‘వేపింగ్’పై బోర్డు స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. భారతీయ చట్టాల ప్రకారం ఇ–సిగరెట్లు, వేపింగ్పై నిషేధం ఉంది. వీటితో పాటు నిషేధంలో ఉన్న ఎలాంటి వస్తువులను కూడా ఆటగాళ్లు ఉపయోగించరాదు. -
ఫిన్ అలెన్ చరిత్ర.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా!
ఐపీఎల్ 2026 సీజన్లో కేకేఆర్ ఓపెనర్ ఫిన్ అలెన్ తన విలువేంటో తొలిసారి చూపించాడు. శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ ఓపెనర్ శతకంతో చెలరేగాడు. 47 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్న ఫిన్ అలెన్ సుడిగాలి ఇన్నింగ్స్ ధాటికి కేకేఆర్ 143 పరుగుల లక్ష్యాన్ని కేవలం 14.2 ఓవర్లలోనే ఛేదించడం విశేషం. ఈ నేపథ్యంలోనే ఫిన్ అలెన్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.👉 2026 క్యాలెండర్ ఇయర్లో మూడు సెంచరీలు బాదిన తొలి న్యూజిలాండ్ క్రికెటర్గా ఫిన్ అలెన్ నిలిచాడు. ఈ ఏడాదిలో బీబీఎల్లో పెర్త్ స్కార్చర్స్ తరఫున 53 బంతుల్లో 101 పరుగులు చేశాడు. ఇక 2026 టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్ తరఫున 33 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకోవడం విశేషం. తాజాగా ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో 47 బంతుల్లో శతకం సాధించాడు.👉 ఐపీఎల్లో న్యూజిలాండ్ తరఫున సెంచరీ సాధించిన రెండో బ్యాటర్గా ఫిన్ అలెన్ నిలిచాడు. ఫిన్ అలెన్ కంటే ముందు బ్రెండన్ మెక్కల్లమ్ ఈ ఫీట్ సాధించాడు. మెక్కల్లమ్ ఐపీఎల్లో రెండుసార్లు సెంచరీ మార్క్ చేరుకున్నాడు. మెక్కల్లమ్ కేకేఆర్ తరఫున తొలి శతకం, సీఎస్కే తరఫున రెండో శతకాన్ని అందుకున్నాడు.👉 ఢిల్లీతో మ్యాచ్లో సెంచరీ బాదిన ఫిన్ అలెన్ పేసర్ల బౌలింగ్లో 16 బంతుల్లో 27 పరుగులు రాబట్టాడు. అదే సమయంలో స్పిన్నర్ల బౌలింగ్లో 31 బంతుల్లోనే 73 పరుగులు సాధించడం విశేషం. తద్వారా ఐపీఎల్లో స్పిన్నర్ల బౌలింగ్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో ఫిన్ అలెన్ సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు.👉 ఐపీఎల్లో కేకేఆర్ తరఫున ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో ఫిన్ అలెన్ (10 సిక్సర్లు) మూడో స్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో ఆండ్రీ రసెల్ (11 సిక్సర్లు వర్సెస్ సీఎస్కే, 2018), తొలి స్థానంలో బ్రెండన్ మెక్కల్లమ్ (13 సిక్సర్లు వర్సెస్ ఆర్సీబీ, 2008) కొనసాగుతున్నాడు.👉 ఐపీఎల్లో కేకేఆర్ తరఫున ఫిన్ అలెన్ది నాలుగో సెంచరీ. గతంలో మెక్కల్లమ్ (158 నాటౌట్), వెంకటేశ్ అయ్యర్ (104), సునీల్ నరైన్ (109) సెంచరీలు సాధించారు.👉 ఇదే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఈ సీజన్లో అరుణ్జైట్లీ స్టేడియంలో ఢిల్లీకి ఇది వరుసగా ఐదో ఓటమి కావడం గమనార్హం. గతంలో 2013 నుంచి 2015 మధ్య ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా తొమ్మిది మ్యాచ్ల్లో పరాజయం చవిచూసింది.A 47-ball ton with the last 55 runs coming in only 16 balls 🤯Finn Allen finishes with 100* in a successful run chase of 143 🔥🔥Scorecard ▶️ https://t.co/NaWLphmJKY#TATAIPL | #KhelBindaas | #DCvKKR | @KKRiders pic.twitter.com/6Ze0sQosQB— IndianPremierLeague (@IPL) May 8, 2026చదవండి: ఫిన్ అలెన్ సెంచరీ.. ఢిల్లీపై కేకేఆర్ విజయం -
ఫిన్ అలెన్ సెంచరీ.. ఢిల్లీపై కేకేఆర్ విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో కేకేఆర్ వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది. శుక్రవారం ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్లో కేకేఆర్ ఢిల్లీ క్యాపిటల్స్పై 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఫిన్ అలెన్ సెంచరీతో విధ్వంసం సృష్టించడంతో కేకేఆర్ సునాయాస విజయాన్ని అందుకుంది. ఢిల్లీ విధించిన 143 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ 14.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఫిన్ అలెన్ (47 బంతుల్లోనే 100 నాటౌట్) అజేయ సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కామరున్ గ్రీన్ 33 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక్క వికెట్ తీశాడు. అంతకముందు కేకేఆర్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఓపెనర్ పాతుమ్ నిస్సాంక (50) అర్థసెంచరీతో రాణించగా.. చివర్లో అశుతోశ్ శర్మ (39) మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. కేకేఆర్ బౌలర్లలో అనుకుల్ రాయ్, కార్తిక్ త్యాగి చెరో 2 వికెట్లు పడగొట్టగా, వైభవ్ అరోరా, సునీల్ నరైన్, గ్రీన్ తలా ఒక వికెట్ తీశారు.విఫలమైన బ్యాటర్లు..టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కు ఓపెనర్లు పాతుమ్ నిస్సాంక, కేఎల్ రాహుల్ శుభారంభం అందించారు. తొలి వికెట్కు ఈ జోడీ 4.6 ఓవర్లలో 49 పరుగులు సాధించారు. రాహుల్ ఔటైన తర్వాత నిస్సాంక ఒక ఎండ్లో నిలబడినప్పటికీ ఢిల్లీ క్రమంగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. 29 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన నిస్సాంక ఔటైన తర్వాత ఢిల్లీ ఇన్నింగ్స్ నత్తనడకన సాగింది. ఆఖర్లో అశుతోశ్ శర్మ 28 బంతుల్లో 39 పరుగులు చేయడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరును సాధించింది.ఆడుతూ పాడుతూ..143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్కు ఆరంభంలో దురదృష్టం వెంటాడింది. అజింక్యా రహానే రనౌట్ కాగా, అంగ్క్రిష్ రఘువంశీ వికెట్ల మీదకు ఆడుకొని వెనుదిరిగారు. ఈ ఇద్దరు ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కామెరున్ గ్రీన్తో కలిసి ఫిన్ అలెన్ ఇన్నింగ్స్ కొనసాగించాడు. 32 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన ఫిన్ అలెన్ ఆ తర్వాత గేర్ మార్చాడు. ఢిల్లీ బౌలర్లను చీల్చి చెండాడిన అలెన్ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. తొలి 50 పరుగులకు 32 బంతులు తీసుకున్న ఫిన్ అలెన్ రెండో ఫిఫ్టీకి కేవలం 15 బంతులే తీసుకోవడం విశేషం. ఫిన్కు తోడు గ్రీన్ కూడా రెచ్చిపోవడంతో 34 బంతులు మిగిలి ఉండగానే కేకేఆర్ విజయాన్ని అంందుకుంది. సెంచరీతో విధ్వంసం సృష్టించిన ఫిన్ అలెన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో కేకేఆర్ 11 మ్యాచ్ల్లో 4 విజయాలతో పట్టికలో ఏడో స్థానానికి చేరుకోగా, అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచ్ల్లో ఏడు ఓటములతో 8వ స్థానానికి పడిపోయింది.A 𝙆night of sheer dominance 🔥@KKRiders chase down the 🎯 with 34 deliveries to spare and make it 4⃣ wins on the trot 👊💜Scorecard ▶️ https://t.co/NaWLphmJKY#TATAIPL | #KhelBindaas | #DCvKKR pic.twitter.com/e3cpW0J2Xq— IndianPremierLeague (@IPL) May 8, 2026చదవండి: వెంటాడిన దురదృష్టం.. పాపం రహానే, రఘువంశీ! -
వెంటాడిన దురదృష్టం.. పాపం రహానే, రఘువంశీ!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో కేకేఆర్ బ్యాటర్లను దురదృష్టం వెంటాడింది. కెప్టెన్ రహానేతో పాటు వన్డౌన్ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీ తమ తప్పు లేకున్నా పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. ముందుగా రహానే విషయానికొస్తే.. అప్పటికే రహానే ఒక ఫోర్, ఒక సిక్సర్తో మంచి టచ్లో కనిపించాడు. అయితే ఇన్నింగ్స్ మూడో ఓవర్ మిచెల్ స్టార్క్ వేయగా.. ఆ ఓవర్ చివరి బంతిని ఫిన్ అలెన్ స్ట్రెయిట్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే స్టార్క్ తన చేతుల్ని అడ్డుపెట్టడంతో బంతి అతని చేతులకు తగిలి వికెట్లను గిరాటేసింది. నాన్స్ట్రైక్ఎండ్లో ఉన్న రహానే అప్పటికే క్రీజు దాటి బయటికి వచ్చేశాడు. అతను తిరిగి క్రీజులోకి చేరుకునేలోపే బంతి వికెట్లను తాకడంతో చేసేదేం లేక రనౌట్గా వెనుదిరిగాడు. అలా రహానే ఆట ముగిసింది. అక్షర్ పటేల్ వేసిన మరుసటి ఓవర్ నాలుగో బంతిని అంగ్క్రిష్ రఘువంశీ స్వీప్ ఆడే ప్రయత్నంలో మిస్ చేశాడు. దీంతో బంతి వికెట్ల మీదకు వెళ్లింది. అంగ్క్రిష్ బంతిని అడ్డుకునేలోపే వికెట్లను తాకడంతో బెయిల్స్ కిందపడ్డాయి. దీంతో అంపైర్ రఘువంశీని క్లీన్బౌల్డ్ అయినట్లు ప్రకటించాడు. ఇలా వరుస ఓవర్లలో ఇద్దరు కేకేఆర్ టాపార్డర్ బ్యాటర్లను దురదృష్టం వెక్కిరించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఓపెనర్ పాతుమ్ నిస్సాంక (50) అర్థసెంచరీతో రాణించగా.. చివర్లో అశుతోశ్ శర్మ (39) మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. కేకేఆర్ బౌలర్లలో అనుకుల్ రాయ్, కార్తిక్ త్యాగి చెరో 2 వికెట్లు పడగొట్టగా, వైభవ్ అరోరా, సునీల్ నరైన్, గ్రీన్ తలా ఒక వికెట్ తీశారు.𝗖𝗮𝗻 𝘆𝗼𝘂 𝗯𝗲𝗹𝗶𝗲𝘃𝗲 𝗶𝘁? 😮🎥 2⃣ of the unluckiest dismissals you will ever see in the space of 5⃣ deliveries 🫣Delight for #DC 💙Updates ▶️ https://t.co/NaWLphmJKY#TATAIPL | #KhelBindaas | #DCvKKR pic.twitter.com/sScNewgsFK— IndianPremierLeague (@IPL) May 8, 2026 చదవండి: ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్ వింత రికార్డు! -
ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్ వింత రికార్డు!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా కేకేఆర్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ వింత రికార్డు నమోదు చేసింది. ఢిల్లీ ఇవాళ్టితో కలిపి ఆడిన ఐదు మ్యాచ్లను పరిశీలిస్తే ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఒక మ్యాచ్లో భారీ స్కోరు చేస్తే మరో మ్యాచ్లో వంద పరుగుల్లోపే ఆలౌటవ్వడం ఢిల్లీకి మాత్రమే చెల్లింది. విషయంలోకి వెళితే కేకేఆర్తో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఒక దశలో 74 పరుగులకు ఒక వికెట్ మాత్రమే కోల్పోయిన ఢిల్లీ మిగతా 9 వికెట్లను కేవలం 68 పరుగుల వ్యవధిలో కోల్పోవడం గమనార్హం. ఇక చెన్నైసూపర్కింగ్స్తో మ్యాచ్లో 155 పరుగులు చేసి ఓటమి పాలయ్యింది. ఇక రాజస్తాన్ రాయల్స్ విధించిన 226 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించడం విశేషం. దానికి ముందు ఆర్సీబీతో మ్యాచ్లో సొంతగడ్డపై 75 పరుగులకే కుప్పకూలింది. ఇక పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో 264 పరుగులు చేసి కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమిపాలవ్వడం గమనార్హం. పంజాబ్తో మ్యాచ్లోనే కేఎల్ రాహుల్ (67 బంతుల్లో 152 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఇలా వరుసగా ఐదు మ్యాచ్ల్లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ ఎవరికీ సాధ్యం కాని ఆటతీరుతో వింత రికార్డును మూటగట్టుకుంది.చదవండి: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. ఏకైక బ్యాటర్గా -
చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. ఏకైక బ్యాటర్గా
టీమిండియా స్టార్, ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో అత్యంత అరుదైన ఘనత సాధించాడు. కాగా కెప్టెన్గా లక్నో సూపర్ జెయింట్స్ను అరంగేట్ర సీజన్లో (2022)నే ప్లే ఆఫ్స్నకు చేర్చాడు రాహుల్.అయితే, 2024లో జట్టు ప్రదర్శన దిగజారడంతో ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకా బహిరంగంగానే రాహుల్కు చివాట్లు పెట్టాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తనకు స్వేచ్ఛ, గౌరవం లేని చోట ఉండలేనంటూ.. గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్లో చేరాడు రాహుల్.దుమ్ములేపుతున్న కేఎల్ రాహుల్ఐపీఎల్-2025లో ఢిల్లీ తరఫున 13 మ్యాచ్లలో కలిపి 539 పరుగులు సాధించాడు. ఇక ఈ సీజన్లోనూ దుమ్ములేపుతున్న కేఎల్ రాహుల్.. శుక్రవారం కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్ సందర్భంగా అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.అరుణ్జైట్లీ మైదానంలో శుక్రవారం నాటి మ్యాచ్లో 14 బంతుల్లో 23 పరుగులు చేసిన రాహుల్.. ఢిల్లీ తరఫున వెయ్యి పరుగుల మార్కు అందుకున్నాడు. మొత్తంగా ఈ సీజన్లో ఇప్పటికి 11 ఇన్నింగ్స్లో కలిపి 468 పరుగులు పూర్తి చేసుకున్నాడు.ఏకైక బ్యాటర్గాఈ క్రమంలోనే రాహుల్ అరుదైన ఫీట్ సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో మూడు వేర్వేరు జట్ల తరఫున వెయ్యి పరుగుల మైలురాయిని చేరుకున్న ఏకైక బ్యాటర్గా చరిత్రకెక్కాడు. కాగా 2013లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేసిన కేఎల్ రాహుల్.. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లకు ఆడాడు.గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్తో జట్టుకట్టిన రాహుల్.. తాజాగా వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. అంతకు ముందు పంజాబ్ కింగ్స్, లక్నో తరఫునా ఈ ఘనత సాధించాడు.ఐపీఎల్లో మూడు వేర్వేరు జట్ల తరఫున 1000 పరుగులు సాధించిన ఏకైక బ్యాటర్గా కేఎల్ రాహుల్👉పంజాబ్ కింగ్స్- 2548 పరుగులు👉లక్నో సూపర్ జెయింట్స్- 1410 పరుగులు👉ఢిల్లీ క్యాపిటల్స్- 1002* పరుగులు.చదవండి: ఏబీ డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు! -
కాలర్ పట్టుకున్న పూరన్.. కృనాల్ వివరణ!
ఐపీఎల్ 2026 సీజన్లో గురువారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్జెయింట్స్ 9 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో లక్నో జట్టు డబుల్ హ్యాట్రిక్ ఓటములకు చెక్ పెట్టినట్లయింది. అయితే లక్నో ఇన్నింగ్స్ సమయంలో బ్యాటర్ నికోలస్ పూరన్, ఆర్సీబీ బౌలర్ కృనాల్ పాండ్యా మధ్య చిన్న వాగ్వాదం చోటుచేసుకుంది. కృనాల్ విసిరిన బౌన్సర్ను లాంగ్ ఆన్ దిశగా ఆడి సింగిల్ తీశాడు. నాన్స్ట్రైక్ ఎండ్కు చేరుకున్న పూరన్తో కృనాల్ మాటల యుద్ధానికి దిగాడు. ఇద్దరూ సీరియస్గా ఒకరినొకరు చూసుకోవడం కనిపించింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత ఇద్దరూ సరదాగా మాట్లాడుకోవడం కనిపించింది. ఈ నేపథ్యంలో పూరన్ కృనాల్ కాలర్ను పట్టుకొని నెట్టివేయడం కనిపించింది. కానీ ఆ తర్వాత ఈ ఇద్దరు నవ్వుతూ మాట్లాడుకోవడంతో వివాదం సమసిపోయింది. దీనికి సంబంధించిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తాజాగా పూరన్ తన కాలర్ ఎందుకు పట్టుకోవాల్సి వచ్చిందో, అసలు పూరన్తో గొడవేంటనే విషయాన్ని కృనాల్ పాండ్యా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా వివరణ ఇచ్చుకున్నాడు. ‘ఇద్దరి మధ్య గొడవేం లేదు. కేవలం మా మాధ్య ఉన్నది ప్రేమ మాత్రమే. 100 ఐపీఎల్ మ్యాచ్లు పూర్తి చేసుకున్న నా సోదరుడు నికోలస్ పూరన్కు అభినందనలు. నిన్ను చూస్తే గర్వంగా ఉంది. లక్నో ఇన్నింగ్స్ సమయంలో నేను పూరన్ అడిగింది ఏంటో తెలుసా?.. ‘ నా బౌన్సర్ ఎలా ఉంది’ అని అడిగాను. అంతకుమించి మా మధ్య ఏం జరగలేదు’ అని చెప్పుకొచ్చాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే వర్షం అంతరాయంతో 19 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్జెయింట్స్ 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ సెంచరీతో చెలరేగగా, పూరన్ (38), పంత్ (32 నాటౌట్) రాణించారు. అనంతరం 213 పరుగుల రివైజ్డ్టార్గెట్తో బరిలోకి దిగిన ఆర్సీబీ 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులకు పరిమితమైంది. పటీదార్ (61), పడిక్కల్ (34) రాణించగా, ఆఖర్లో టిమ్ డేవిడ్ (40), కృనాల్ (28 నాటౌట్), షెపర్డ్ (23 నాటౌట్) ధాటిగా ఆడినా ఆర్సీబీని గెలిపించలేకపోయారు. ప్రిన్స్ యాదవ్ 3 వికెట్లతో ఆర్సీబీ పతనాన్ని శాసించాడు.Things are heating up in this Revenge Week clash! 🔥A contest within the contest is brewing between #NicholasPooran and #KrunalPandya! 👀#TATAIPL Revenge Week 2026 ➡️ #LSGvRCB | LIVE NOW 👉 https://t.co/gEprGnf2A7 pic.twitter.com/C2oqmrYF0X— Star Sports (@StarSportsIndia) May 7, 2026 Nicholas Pooran and Krunal Pandya having a friendly banter? 😳 pic.twitter.com/hyYoj2J0d7— Deepu (@deepu_drops) May 8, 2026చదవండి: శ్రేయస్ కెప్టెన్ అయితే వీళ్ల కెరీర్ ఖతం! -
ఏబీ డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు!
క్రికెట్ ప్రపంచంలో సరికొత్త సంచలనం వైభవ్ సూర్యవంశీ. గతేడాది కాలంగా ఫార్మాట్లకు అతీతంగా విధ్వంసకర బ్యాటింగ్తో విరుచుకుపడుతున్నాడు ఈ లెఫ్టాండర్ బ్యాటర్. ఇటు ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరఫునా.. అటు భారత్ అండర్-19 జట్టు తరఫున దుమ్ములేపుతున్నాడు.టాప్-5లోఐపీఎల్-2026లో ఇప్పటికి పది మ్యాచ్లలో కలిపి 404 పరుగులు చేసిన వైభవ్.. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో టాప్-5లో కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో త్వరలోనే అతడు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టడం ఖాయమంటూ మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఏబీ డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు!ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ సంచలన రీతిలో స్పందించాడు. పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీతో.. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో తనను తాను నిరూపించుకుంటున్న 22 ఏళ్ల జేకబ్ బెతెల్ను పోల్చాడు. ఈ మేరకు.. ‘‘గతంలోనూ ఇతడి పేరును నేను పలుమార్లు ప్రస్తావించాను.అతడు అత్యద్భుతమైన ఆటగాడు. అయితే, మున్ముందు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వయసులో తేడా ఉండవచ్చు కానీ.. అతడి ఆట వైభవ్ సూర్యవంశీని గుర్తుకుతెస్తుంది. ఇద్దరూ ఎడమచేతి వాటం బ్యాటర్లే.ఇద్దరూ క్రికెట్ సూపర్స్టార్లుగా ఎదుగుతారుఅత్యద్భుతమైన ప్రతిభ ఉన్న ఆటగాళ్లు. వీరిద్దరికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. ఇద్దరూ క్రికెట్ సూపర్స్టార్లుగా ఎదుగుతారు. ఈ క్రమంలో వారెంతో నేర్చుకుంటారు. అయితే, ముందుగా చెప్పినట్లు సవాళ్లను విజయవంతంగా అధిగమిస్తేనే అంతా సజావుగా సాగుతుంది. నేను మాత్రం వీరి భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉంటుందని భావిస్తున్నా’’ అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.జేకబ్ వైభవ్లా చిన్నపిల్లాడు కాదని.. అయితే, ఇద్దరి బ్యాటింగ్ ఒకే విధంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. జేకబ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు (ఆర్సీబీ)తోనే కొనసాగాలని తాను కోరుకుంటున్నట్లు డివిలియర్స్ తెలిపాడు. వైఫల్యాలే...కాగా ఇంగ్లండ్ ఓపెనర్గా జేకబ్ బెతెల్ సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. భవిష్య కెప్టెన్గానూ నీరాజనాలు అందుకుంటున్న అతడు.. ఇటీవల టీ20 ప్రపంచకప్-2026 సెమీ ఫైనల్లో విశ్వరూపం ప్రదర్శించాడు. టీమిండియాపై 48 బంతుల్లోనే 105 పరుగులతో సత్తా చాటాడు. అయితే, జట్టును మాత్రం గెలిపించుకోలేకపోయాడు.ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న బెతెల్కు పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఫిల్ సాల్ట్- విరాట్ కోహ్లి ఓపెనింగ్ జోడీగా కుదురుకోవడంతో అతడికి మొండిచేయి ఎదురవుతోంది. అయితే, సాల్ట్ వేలి గాయం కారణంగా దూరం కాగా.. బెతెల్కు అనూహ్యంగా అవకాశం వచ్చింది. కానీ అతడు దీనిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటికి ఆడిన నాలుగు మ్యాచ్లలో కలిపి 43 పరుగులే చేశాడు.చదవండి: Shreyas Iyer: శ్రేయస్ కెప్టెన్ అయితే వీళ్ల కెరీర్ ఖతం! -
IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్పై కేకేఆర్ విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో కేకేఆర్ వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది. శుక్రవారం ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్లో కేకేఆర్ ఢిల్లీ క్యాపిటల్స్పై 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఢిల్లీ విధించిన 143 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ 14.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఫిన్ అలెన్ (47 బంతుల్లోనే 100 నాటౌట్) అజేయ సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కామరున్ గ్రీన్ 33 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక్క వికెట్ తీశాడు. అంతకముందు కేకేఆర్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది.ఫిన్ అలెన్ హాఫ్ సెంచరీ.. లక్ష్యానికి చేరువగా కేకేఆర్ఐపీఎల్ 19వ సీజన్లో ఫిన్ అలెన్ తొలిసారి తన ప్రభావం చూపిస్తుండడంతో కేకేఆర్ లక్ష్యానికి చేరువగా వస్తోంది.143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ప్రస్తుతం 12 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. ఫిన్ అలెన్ (61), గ్రీన్ (29) పరుగులతో ఆడుతున్నారు.ఏడు ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ 2 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. ఫిన్ అలెన్ (32), కామెరున్ గ్రీన్ (10) పరుగులతో ఆడుతున్నారు.రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. అక్షర్పటేల్ బౌలింగ్లో అంగ్క్రిష్ రఘువంశీ (1) క్లీన్బౌల్డ్గా వెనుదిరిగాడు. అంతకముందు 13 పరుగులు చేసిన కెప్టెన్ రహానే రనౌటయ్యాడు. 4 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ 2 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది.కేకేఆర్ లక్ష్యం 143 పరుగులు..కేకేఆర్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్లో దారుణంగా విఫలమైంది. కేకేఆర్ బౌలర్ల కట్టుదిట్టమైన బంతులకు ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఓపెనర్ పాతుమ్ నిస్సాంక (50) అర్థసెంచరీతో రాణించగా.. చివర్లో అశుతోశ్ శర్మ (39) మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. కేకేఆర్ బౌలర్లలో అనుకుల్ రాయ్, కార్తిక్ త్యాగి చెరో 2 వికెట్లు పడగొట్టగా, వైభవ్ అరోరా, సునీల్ నరైన్, గ్రీన్ తలా ఒక వికెట్ తీశారు.ఆరో వికెట్ కోల్పోయిన ఢిల్లీఅక్షర్ పటేల్ (11) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ 128 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది.18 ఓవర్లలో ఢిల్లీ 126/518 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. అశుతోశ్ శర్మ (28), అక్షర్ పటేల్ (10) పరుగులతో ఆడుతున్నారు.ఒకే ఓవర్లో రెండు వికెట్లుపదో ఓవర్ రెండో బంతికి నిస్సాంకను అవుట్ చేసిన అనుకుల్ రాయ్.. ఐదో బంతికి స్టబ్స్(2)ను బౌల్డ్ చేశాడు. దీంతో ఢిల్లీ ఐదో వికెట్ కోల్పోయింది.నాలుగో వికెట్ డౌన్10.2అనుకుల్ రాయ్ బౌలింగ్లో నిస్సాంక స్టంపౌట్. 29 బంతుల్లో 50 పరుగుల చేసి నిష్క్రమించిన నిస్సాంక. క్రీజులోకి అక్షర్ పటేల్. ఢిల్లీ స్కోరు: 89-4(10.4). స్టబ్స్ రెండు పరుగులతో ఉన్నాడు.మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీసునిల్ నరైన్ బౌలింగ్లో రోవ్మన్ పావెల్కు క్యాచ్ ఇచ్చి అవుటైన సమీర్ రిజ్వి (3). క్రీజులోకి ట్రిస్టన్ స్టబ్స్ స్కోరు: 80-3 (10).రెండో వికెట్ డౌన్8 పరుగులు చేసిన నితీశ్ రానా కామెరున్ గ్రీన్ బౌలింగ్లో సునీల్ నరైన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో 74 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. నిస్సాంక 43 పరుగులతో ఆడుతున్నాడు.తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్కేకేఆర్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కేఎల్ రాహుల్ (23) రూపంలో తొలి వికెట్ వికెట్ కోల్పోయింది. కార్తిక్ త్యాగి బౌలింగ్లో భారీ షాట్ ఆడే యత్నంలో బ్యాట్ ఎడ్జ్కు తగిలిన బంతి గాల్లోకి లేచింది. మిడాన్లో ఉన్న కామెరున్ గ్రీన్ ఎలాంటి తప్పు చేయకుండా క్యాచ్ అందుకున్నాడు. ఆరు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. నిస్సాంక 31 పరుగులతో ఆడుతున్నాడు.4 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టపోకుండా 39 పరుగులు చేసింది. నిస్సాంక (25) పరుగులతో ధాటిగా ఆడుతుండగా, కేఎల్ రాహుల్ (14) అతడికి సహకరిస్తున్నాడు.టాస్ నెగ్గిన కేకేఆర్టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు ఎలాంటి మార్పు లేకుండానే మ్యాచ్లో బరిలోకి దిగుతున్నాయి. ముఖాముఖి పోరులో ఇరుజట్లు 34 సార్లు తలపడ్డాయి. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ 19 సార్లు, 15 సార్లు కేకేఆర్ గెలిచింది. ఇక అరుణ్జైట్లీ స్టేడియంలో కేకేఆర్ 6 సార్లు, ఢిల్లీ 5 సార్లు విజయం సాధించాయి.తుది జట్లు:కోల్కతా నైట్ రైడర్స్: అజింక్య రహానే(సి), అంగ్క్రిష్ రఘువంశీ(w), కామెరాన్ గ్రీన్, రోవ్మన్ పావెల్, మనీష్ పాండే, రింకూ సింగ్, సునీల్ నరైన్, అనుకుల్ రాయ్, కార్తీక్ త్యాగి, వైభవ్ అరోరా, వరుణ్ చకరవర్తిఢిల్లీ క్యాపిటల్స్: పాతుమ్ నిస్సాంక, కేఎల్ రాహుల్(w), నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(సి), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, లుంగి ఎన్గిడి, ముఖేష్ కుమార్కోల్కతా నైట్ రైడర్స్ ఇంపాక్ట్ సబ్లు: రమణదీప్ సింగ్, ఫిన్ అలెన్, తేజస్వి దహియా, నవదీప్ సైనీ, టిమ్ సీఫెర్ట్ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ సబ్లు: కరుణ్ నాయర్, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, అభిషేక్ పోరెల్, డేవిడ్ మిల్లర్🚨Toss update from Delhi🚨@kkriders won the toss and elected to bowl first against @DelhiCapitals Updates ▶️ https://t.co/NaWLphmJKY#TATAIPL | #KhelBindaas | #DCvKKR pic.twitter.com/Nd38qv8r3f— IndianPremierLeague (@IPL) May 8, 2026 -
ఫైనల్లో చైనాతో ఢీ.. చరిత్రకు అడుగు దూరంలో
ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నమెంట్లో భారత మహిళల రికర్వ్ జట్టు పెను సంచలనం సృష్టించింది. దీపిక కుమారి, అంకిత, కుంకుమ్లతో కూడిన భారత జట్టు 10 సార్లు ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత దక్షిణ కొరియా జట్టును బోల్తా కొట్టించింది. షాంఘై వేదికగా గురువారం జరిగిన సెమీఫైనల్లో భారత బృందం 5–1 సెట్ల (58–55, 56–56, 58–56) స్కోరుతో లీ యున్జీ, ఒ యెజిన్, కాంగ్ చెయంగ్లతో కూడిన దక్షిణ కొరియా జట్టును ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది.ఈ క్రమంలో ఆదివారం జరిగే ఫైనల్లో చైనా జట్టుతో భారత్ తలపడుతుంది. తొలి రౌండ్లో భారత్ 6–2 సెట్ల (53–56, 57–54, 55–54, 55–51) స్కోరుతో ఉజ్బెకిస్తాన్ జట్టుపై, క్వార్టర్ ఫైనల్లో 5–4 సెట్ల (53–54, 54–49, 58–56, 55–56, 28–25) స్కోరుతో వియత్నాం జట్టుపై విజయం సాధించింది. 1988 సియోల్ ఒలింపిక్స్లో మహిళల ఆర్చరీ టీమ్ ఈవెంట్ను ప్రవేశ పెట్టారు. 1988 సియోల్ నుంచి 2024 పారిస్ ఒలింపిక్స్ వరకు జరిగిన 10 విశ్వ క్రీడల్లో మహిళల రికర్వ్ టీమ్ విభాగంలో దక్షిణ కొరియా జట్టే స్వర్ణ పతకాలు సాధించడం విశేషం.మరోవైపు.. పురుషుల రికర్వ్ టీమ్ విభాగంలో బొమ్మదేవర ధీరజ్, తరుణ్దీప్ రాయ్, యశ్దీప్లతో కూడిన భారత జట్టు పేలవ ప్రదర్శన కనబరిచింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన భారత జట్టు రెండో రౌండ్లో 2–6 సెట్ల (52–55, 54–54, 53–53, 53–57) స్కోరుతో అబ్దుర్ రెహమాన్, రామకృష్ణ సాహా, మిషాద్లతో కూడిన బంగ్లాదేశ్ జట్టు చేతిలో ఓడిపోయింది. వ్యక్తిగత విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్, తరుణ్దీప్ రాయ్ మూడో రౌండ్ చేరుకున్నారు. -
శ్రేయస్ కెప్టెన్ అయితే వీళ్ల కెరీర్ ఖతం!
టీమిండియా ఇటీవలే 2026 టీ20 ప్రపంచకప్ గెలిచిన సంగతి తెలిసిందే. సూర్యకుమార్ సారథ్యంలో భారత్ మూడోసారి పొట్టి కప్పును అందుకుంది. అయితే బీసీసీఐ మాత్రం అప్పుడే 2028 టీ20 ప్రపంచకప్ కోసం సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో మెన్ ఇన్ బ్లూను సరికొత్తగా తయారు చేసేందుకు కసరత్తులు నిర్వహిస్తోంది. ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ తర్వాత టీ20 ప్రపంచకప్ అందుకున్న మూడో కెప్టెన్గా సూర్యకుమార్ నిలిచాడు. అయితే బీసీసీఐ మాత్రం వచ్చే 2028 టీ20 ప్రపంచకప్ నాటికి సూర్యకుమార్ స్థానంలో కొత్త టీ20 కెప్టెన్ను ఎంపిక చేయాలనే యోచనలో ఉంది. ఇప్పటికే ఐపీఎల్లో తన కెప్టెన్సీతో అదరగొడుతున్న శ్రేయస్ అయ్యర్తో పాటు గిల్ కూడా రేసులో ఉన్నాడు. కానీ బీసీసీఐ మాత్రం శ్రేయస్ అయ్యర్వైపే మొగ్గుచూపే అవకాశముంది. ఐపీఎల్లో విజయవంతమైన కెప్టెన్లలో శ్రేయస్ ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. బ్యాటింగ్లో మంచి స్ట్రైక్రేట్తో పరుగులు సాధించడంతో పాటు ఐపీఎల్ 2024 సీజన్లో కేకేఆర్ను విజేతగా నిలిపాడు. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ను 2025లో ఫైనల్ చేర్చాడు. ఈ సీజన్లోనూ శ్రేయస్ కెప్టెన్గా సత్తా చాటుతూ పంజాబ్ను టైటిల్ దిశగా నడిపిస్తున్నాడు. ఒకవేళ శ్రేయస్ అయ్యర్ టీమిండియా టీ20 కెప్టెన్ అయితే మాత్రం ముగ్గురు ఆటగాళ్ల కెరీర్కు ముగింపు పడినట్లేనని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ ముగ్గురే ప్రస్తుత టీ20 కెప్టెన్ సూర్యకుమార్, సంజూ శాంసన్, వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.సూర్యకుమార్ యాదవ్శ్రేయస్ అయ్యర్ టీమిండియా టీ20 కెప్టెన్ అయితే మాత్రం మొదట జట్టు నుంచి దూరమయ్యేది సూర్యకుమార్. టీ20 క్రికెట్లో సూర్యకుమార్కు ఘనమైన రికార్డు ఉంది. మిస్టర్ 360 డిగ్రీస్ పేరుతో అతడిని అందరూ ముద్దుగా పిలుచుకుంటారు. అయితే గత రెండేళ్లలో సూర్యకుమార్ ఆటతీరు దారుణంగా ఉంది. ముఖ్యంగా కెప్టెన్ అయిన తర్వాత అతడిలో మునుపటి ఆట కనిపించడం లేదు. ఇందుకు గణాంకాలే సాక్ష్యం. 2025 సీజన్లో టీమిండియా తరఫున 19 టీ20 మ్యాచ్లాడిన సూర్యకుమార్ 218 పరుగులు సాధించాడు. ఇక ఈ ఏడాది 14 మ్యాచ్లాడిన సూర్య 484 పరుగులు సాధించాడు. గతంలో ఒకే ఏడాదిలో వెయ్యి పరుగులు అవలీలగా సాధించిన సూర్య క్రమంగా తన ఫామ్ను కోల్పోతూ వచ్చాడు. 2026 టీ20 ప్రపంచకప్లోనూ సూర్యకుమార్ 136 స్ట్రైక్రేట్తో 242 పరుగులు మాత్రమే చేశాడు. కీలకమైన మ్యాచ్ల్లో పూర్తిగా విఫలమయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 19వ సీజన్లోనూ సూర్యకుమార్ బ్యాటర్గా పూర్తిగా విఫలమయ్యాడు. 10 మ్యాచ్ల్లో కేవలం 195 పరుగులు మాత్రమే చేశాడు. మరో విషయం ఏంటంటే.. అయ్యర్ టీమిండియాలోకి వస్తే నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వస్తాడు. సూర్య కూడా అదే స్థానంలో బరిలోకి దిగుతుంటాడు. వయసు పరంగా చూసుకున్నా శ్రేయస్ (31 ఏళ్లు) కంటే సూర్యకుమార్(35 ఏళ్లు) నాలుగేండ్లు పెద్ద. ఏ లెక్కన చూసుకున్నా శ్రేయస్ టీమిండియా టీ20 జట్టులోకి ఎంట్రీ ఇస్తే మొదటి వికెట్ సూర్యకుమార్దే.సంజూ శాంసన్ఈ లిస్టులో సంజూ శాంసన్ పేరు ఉండడం కాస్త ఆశ్చర్యంగా అనిపించినా నమ్మక తప్పదు. ప్రస్తుతం టీమిండియా జట్టులో అభిషేక్తో కలిసి శాంసన్ ఓపెనింగ్ వస్తున్నాడు. 2026 టీ20 ప్రపంచకప్లోనూ సూపర్-8 దశ నుంచి ఫామ్ అందుకున్న శాంసన్ టీమిండియాకు టైటిల్ అందించడంతో పాటు ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును ఎగరేసుకుపోయాడు. అయితే శ్రేయస్ కెప్టెన్ అయితే అతడి మదిలో కొందరు యువ ఆటగాళ్లు పేర్లు మెదలడం ఖాయం. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్కు ఆడుతున్న ప్రియాన్ష్ ఆర్య సహా రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ పేర్లను బయటపెట్టే అవకాశముంది. ఈ లెక్కన వీరిద్దరిలో ఎవరు జట్టులోకి వచ్చినా సంజూ శాంసన్ డగౌట్కు పరిమితం అవ్వాల్సిందే. ఇప్పటికే గిల్, జైస్వాల్ రూపంలో ఓపెనింగ్ స్థానానికి పోటీ తీవ్రంగా ఉంది. దీంతో శాంసన్ ఫామ్ కోల్పోయి సరిగ్గా ఆడకుంటే మాత్రం కెరీర్ కూడా ప్రమాదంలో పడినట్లే.కుల్దీప్ యాదవ్కుల్దీప్ యాదవ్ టీమిండియాలో సీనియర్ బౌలర్గా ఉన్నాడు. మూడు ఫార్మాట్లు ఆడుతున్న క్రికెటర్లలో కుల్దీప్ కూడా ఒకడు. అయినప్పటికీ శ్రేయస్ కెప్టెన్ అయితే కుల్దీప్ జట్టులో స్థానంలో కోల్పోవచ్చు. తనకంటూ స్ట్రాంగ్ బౌలర్లు కావాలని అయ్యర్ అనుకుంటే మాత్రం కుల్దీప్ స్థానంలో పంజాబ్ కింగ్స్ స్పిన్నర్, యజ్వేంద్ర చాహల్ జట్టులోకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. 2026 టీ20 ప్రపంచకప్లోనూ వరుణ్ చక్రవర్తి స్థానంలో కుల్దీప్ ఆడాడు. ఇక ఐపీఎల్ 2026 సీజన్లోనూ కుల్దీప్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇప్పటివరకు 10 మ్యాచ్లాడిన కుల్దీప్ కేవలం ఏడు వికెట్లు మాత్రమే తీశాడు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ అయినంత మాత్రానా వీళ్ల కెరీర్కు ఇప్పటికిప్పుడు ముప్పు లేకపోయినా భవిష్యత్తులో జరిగే అవకాశముంది. అయితే ఇదంతా కేవలం ఊహాగానాలు మాత్రమే అన్న విషయం గుర్తుంచుకోవాలి.చదవండి: దిగ్గజ క్రికెటర్ ఇంట్లో మాజీ అధికారి ఆత్మహత్య! -
పాక్తో టెస్టు.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ కెప్టెన్
బంగ్లాదేశ్ టెస్టు జట్టు కెప్టెన్ నజ్ముల్ హుసేన్ షాంటో సరికొత్త చరిత్ర సృష్టించాడు. బంగ్లా సారథులకు ఇప్పటి వరకు సాధ్యం కాని అరుదైన ఘనత సాధించాడు. రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం బంగ్లాదేశ్లో పర్యటిస్తోంది.ఆదిలోనే షాకులుఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య ఢాకా వేదికగా శుక్రవారం తొలి టెస్టు మొదలైంది. షేరే బంగ్లా జాతీయ స్టేడియం వేదికగా టాస్ గెలిచిన పర్యాటక పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్కు ఆదిలోనే షాకులు తగిలాయి.ఓపెనర్లు మహ్మదుల్ హసన్ జాయ్ (8), షాద్మన్ ఇస్లాం (13) స్వల్ప వ్యవధిలోనే అవుటయ్యారు. ఈ క్రమంలో వన్డౌన్ బ్యాటర్ మొమినుల్ హక్తో కలిసి కెప్టెన్ నజ్ముల్ హుసేన్ షాంటో ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.శతక్కొట్టి.. చరిత్ర సృష్టించి..మొత్తంగా 200 బంతులు ఎదుర్కొన్న మొమినుల్ హక్ 10 ఫోర్ల సాయంతో 91 పరుగులు చేశాడు. అయితే, నొమన్ అలీ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంలో హక్ సెంచరీకి తొమ్మిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఇక నాలుగో నంబర్ బ్యాటర్ షాంటో మాత్రం శతకం పూర్తి చేసుకోగలిగాడు.మొత్తంగా 130 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 101 పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే నజ్ముల్ హుసేన్ షాంటో సరికొత్త చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్ తరఫున టెస్టుల్లో పాకిస్తాన్పై సెంచరీ చేసిన తొలి కెప్టెన్గా నిలిచాడు.ఇదిలా ఉంటే.. శుక్రవారం నాటి తొలిరోజు ఆట పూర్తయ్యేసరికి బంగ్లాదేశ్ 85 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 301 పరుగులు చేసింది. మొమినుల్, షాంటోలతో పాటు.. సీనియర్ బ్యాటర్ ముష్పికర్ రహీం రాణించాడు. రహీం 48, లిటన్ దాష్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. పాకిస్తాన్ బౌలర్లలో షాహిన్ ఆఫ్రిది, మొహమ్మద్ అబ్బాస్, హసన్ అలీ, నొమన్ అలీ తలా ఒక వికెట్ పడగొట్టారు.పాకిస్తాన్పై టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బంగ్లాదేశ్ కెప్టెన్లు👉నజ్ముల్ హుసేన్ షాంటో- 130 బంతుల్లో 101 రన్స్👉ముష్ఫికర్ రహీం- 143 బంతుల్లో 53 రన్స్👉ముష్ఫికర్ రహీం- 88 బంతుల్లో 49 రన్స్👉మొమినుల్ హక్- 93 బంతుల్లో 41 రన్స్.చదవండి: ఓ 4 పాస్లు ఇస్తే ఏమౌతుంది?.. ఐపీఎల్ చైర్మన్ స్ట్రాంగ్ రియాక్షన్! -
దిగ్గజ క్రికెటర్ ఇంట్లో మాజీ అధికారి ఆత్మహత్య!
శ్రీలంక దిగ్గజ క్రికెటర్ అరవింద డి సిల్వా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీలంక ఎయిర్లైన్స్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తోన్న కపిల చంద్రసేన అరవింద డి సిల్వా ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. అరవింద డిసిల్వా భార్య అనుష్క డి సిల్వా, కపిల చంద్రసేన భార్య ప్రియాంక నియోమలి స్వయానా అక్కా చెల్లెల్లు కావడం గమనార్హం.విషయంలోకి వెళితే.. మే 7న (గురువారం) కపిల చంద్రసేన కొల్లుపిటియాలోని పెడ్రిస్ ప్లేస్లో ఉన్న అరవింద డిసిల్వా నివాసానికి చేరుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున అరవింద డిసిల్వా ఇంట్లోని బెడ్రూమ్లో కపిల చంద్రసేన నిర్జీవ స్థితిలో పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. అయితే మరణానికి గల అసలు కారణం పోస్టుమార్టం రిపోర్ట్లో బయటపడనుంది.ఇటీవలే చంద్రసేన విమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించి ఒక కంపెనీ నుంచి 2 మిలియన్ డాలర్లు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన మరణించడానికి ఒక్కరోజు ముందు కొలంబో ప్రధాన న్యాయమూర్తి కపిల చంద్రసేనపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దాన్ని తప్పించకునేందుకు అరవింద డిసిల్వా ఇంటికి వచ్చారా లేక వేరే కారణం ఏమైనా ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక కపిల చంద్రసేన మరణ వార్త తెలియగానే లంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ అరవింద డిసిల్వా నివాసానికి చేరుకున్నాడు. శ్రీలంక క్రికెట్లో మూలస్తంభాల్లో ఒకడిగా అరవింద డిసిల్వా గుర్తింపు పొందాడు. లంక జట్టు 1996 వన్డే వరల్డ్కప్ గెలవడంలో అరవింద డిసిల్వాది కీలకపాత్ర పోషించాడు. పాకిస్తాన్లోని లాహోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన 1996 ప్రపంచకప్ ఫైనల్లో చేజింగ్లో అజేయ సెంచరీతో మెరిసిన డిసిల్వా తన జట్టుకు తొలి టైటిల్ను అందించాడు. 1984లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అరవింద డిసిల్వా లంక తరఫున 93 టెస్టులు, 308 వన్డే మ్యాచ్లు ఆడాడు. రెండు ఫార్మాట్లు కలిపి 15వేలకు పైగా పరుగులు సాధించిన అరవింద డిసిల్వా 31 సెంచరీలు, 86 అర్థసెంచరీలు సాధించాడు. ఇక బౌలింగ్లోనూ డిసిల్వా రెండు ఫార్మాట్లు కలిపి 135 వికెట్లు పడగొట్టాడు. 2003 వన్డే వరల్డ్కప్లో సెమీస్లో శ్రీలంక ఓటమి అనంతరం అరవింద డిసిల్వా తన అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికాడు.చదవండి: ఆర్సీబీ ఓటమి.. వరుస ఓటములకు లక్నో చెక్! -
ఓ 4 పాస్లు ఇస్తే ఏమౌతుంది?.. ఐపీఎల్ చైర్మన్ స్ట్రాంగ్ రియాక్షన్!
ఐపీఎల్-2026 ఫైనల్ వేదికను బెంగళూరు నుంచి అహ్మదాబాద్కు మార్చడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) ఏకంగా 10 వేలకు పైగా కాంప్లిమెంటరీ టికెట్లు కోరిందనే వార్తలు విమర్శలకు తావిచ్చాయి. ఇలాంటి తరుణంలో హోం మంత్రి జీ.పరమేశ్వర్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో 7, 8 వేల సీట్లు స్పాన్సర్లు, ఇతరులకు ఇవ్వాల్సి ఉంటుంది.. అది వర్క్ఔట్ కాదని ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ను మార్చినట్లు తెలిసింది అని హోం మంత్రి జీ.పరమేశ్వర్ తెలిపారు. నాలుగు పాస్లు ఇస్తే ఏమవుతుంది?ఐపీఎల్ ఫైనల్స్ను గుజరాత్లోని అహ్మదాబాద్కు మార్చడంపై స్పందిస్తూ.. ‘‘భద్రత గురించి ఎలాంటి ఫిర్యాదు రాలేదు. ఇప్పటికి 5 మ్యాచ్లు ఇక్కడ జరిగాయి. చిన్నస్వామిలో 33 వేల సీట్లు ఉన్నాయి. 7– 8 వేల సీట్ల (టికెట్లు)ను స్పాన్సర్లు తదితరులకు ఇవ్వాల్సి ఉంటుంది.25 వేలు సీట్లు నిర్వాహకులకు మిగులుతాయి, ఇది గిట్టుబాటు కాదని స్టేడియాన్ని మార్చారని నాకు తెలిసింది’’ అన్నారు. ఎమ్మెల్యేల ఉచిత టికెట్లకు, దీనికి సంబంధం లేన్నారు. నాలుగు పాస్లు ఇస్తే ఏమవుతుంది? అని ప్రశ్నించడం గమనార్హం.ఇదిలా ఉంటే.. ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ కూడా ఈ విషయంపై స్పందించారు. అభిమానుల సౌకర్యం కోసమే ఐపీఎల్ 19వ సీజన్ ఫైనల్ వేదికను అహ్మదాబాద్గా నిర్ణయించినట్లు తెలిపారు. ఐపీఎల్ చైర్మన్ స్ట్రాంగ్ రియాక్షన్!కాగా మే 31న జరగనున్న ఐపీఎల్-2026 ఫైనల్కు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. గత సీజన్ విజేత జట్టు సొంత మైదానంలో ఈ ఏడాది ఫైనల్ జరగడం పరిపాటి.అయితే పలు కారణాల వల్ల వేదికను మార్చినట్లు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు. ఐపీఎల్ 2025లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజేతగా నిలవగా... ఈ సారి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఫైనల్ నిర్వహించాల్సి ఉంది. కానీ చిన్నస్వామి స్టేడియం సామర్థ్యం తక్కువగా ఉండటంతో పాటు... కర్ణాటక క్రికెట్ సంఘం (KSCA) పెద్ద సంఖ్యలో కాంప్లిమెంటరీ టికెట్లు కోరడం... గతేడాది ఆర్సీబీ విజయోత్సవం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందడంతో వేదిక మార్చినట్లు తెలుస్తోంది.చిన్నస్వామి స్టేడియం సామర్థ్యం 35 వేలు కాగా... నరేంద్ర మోదీ స్టేడియంలో 1,32,000 మంది మ్యాచ్ను వీక్షించే అవకాశం ఉంది. ‘సాధారణంగా చూసుకుంటే ఈ ఏడాది బెంగళూరులో ఐపీఎల్ ఫైనల్ జరగాలి. దీని కోసం మేం కర్ణాటక క్రికెట్ సంఘాన్ని సంప్రదించాం. ఉచిత టికెట్లుగతేడాది ఫైనల్ అనంతరం తొక్కిసలాట జరిగింది. దీంతో పాటు పలు సవాళ్లు ఎదురయ్యాయి. తమ సభ్యులు, అనుబంధ క్లబ్లతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలకు ఉచిత టికెట్లు ఇవ్వాల్సి ఉంటుందని కర్ణాటక సంఘం తెలిపింది.స్టేడియం సామర్థ్యం కూడా ఎక్కువ లేదు. ఐపీఎల్ ఫైనల్పై ఆసక్తి అత్యధికంగా ఉంటుంది. ప్రపంచ నలుమూలల నుంచి అభిమానులు ఈ మ్యాచ్ను చూసేందుకు వస్తారు. వారి కోసం ఎక్కువ సీట్లు అందుబాటులో ఉండాలి. అదే సమయంలో ఐసీసీ బోర్డు సమావేశం కూడా ఉంది. దాని కోసం కూడా చాలా మంది సభ్యులు వస్తున్నారు. ఇలా వీటిన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే పెద్ద వేదిక అయితేనే సముచితంగా ఉంటుందని భావించాం.అందుకే అహ్మదాబాద్ను ఎంచుకున్నాం. ఒకవేళ గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ ట్రోఫీ నెగ్గి ఉంటే... ఈ సారి చెన్నైలోనే ఫైనల్ నిర్వహించేవాళ్లం’ అని ధుమాల్ వివరించారు.చదవండి: ఆమెతో బంధం ఇక చట్టబద్ధం -
ఆమెతో బంధం ఇక చట్టబద్ధం
టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ఇటీవలే తన ప్రేయసి సోఫీ షైన్తో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టాడు. ఢిల్లీలో అత్యంత సన్నిహితుల మధ్య ఈ ఏడాది ఫిబ్రవరి 21న వీరి వివాహం జరిగింది. ఇప్పుడు ఈ జంట తమ బంధాన్ని చట్టపరంగా పదిలం చేసుకుంది.గురుగ్రామ్లోని మ్యారేజ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లిన శిఖర్- సోఫీ తమ పెళ్లిని రిజిస్టర్ చేయించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయం గురించి రిజిస్ట్రార్ ఆఫీసులో పనిచేసే ఓ అధికారి PTIతో మాట్లాడుతూ..కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య‘‘శిఖర్ ధావన్.. ఆయన భార్య బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మ్యారేజ్ రిజిస్ట్రార్ ఆఫీసుకి వచ్చారు. దాదాపు ఏడుగురు కుటుంబ సభ్యులు, స్నేహితులు వారితో పాటు ఉన్నారు. దాదాపు 35 నిమిషాల్లో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైంది. వారికి మ్యారేజ్ సర్టిఫికెట్ ఇచ్చి పంపించాము’’ అని సదరు అధికారి పేర్కొన్నారు.ఆయేషాతో విడాకులుకాగా టీమిండియా ఓపెనర్గా రాణించిన శిఖర్ ధావన్ గతంలో ఆయేషా ముఖర్జీ అనే ప్రవాస భారతీయురాలిని పెళ్లి చేసుకున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషాతో ఫేస్బుక్లో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీయగా.. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. డివోర్సీ అయిన ఆయేషాకు అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉండగా.. శిఖర్ ధావన్తో కలిసి ఆమె కుమారుడు జొరావర్కు జన్మనిచ్చారు.అయితే, అభిప్రాయ భేదాల కారణంగా శిఖర్పై తీవ్ర ఆరోపణలు చేసింది ఆయేషా. ఇద్దరూ విడిపోయినట్లు ప్రకటించగా.. 2023లో ఢిల్లీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. ఈ క్రమంలో చాలాకాలం ఒంటరిగా ఉన్న శిఖర్ ధావన్.. ఐర్లాండ్కు చెందిన సోఫీ షైన్తో ప్రేమలో పడ్డాడు.ఆమెతో బంధం ఇక చట్టబద్ధంకొన్నాళ్లపాటు డేటింగ్ చేసిన ఈ జంట ఇటీవలే అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. తాజాగా తమ బంధాన్ని చట్టబద్ధం చేసుకుంది. కాగా శిఖర్ ధావన్ టీమిండియా తరఫున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 2315, వన్డేల్లో 6793, టీ20లలో 1759 పరుగులు చేశాడు. ఐపీఎల్లో 222 మ్యాచ్లు ఆడిన గబ్బర్ రికార్డు స్థాయిలో 6768 పరుగులు సాధించాడు.చదవండి: ‘నా నిర్లక్ష్యం... తెలివి తక్కువతనం’Gurugram: Cricketer Shikhar Dhawan registered his marriage with his wife Sophie Shine at the marriage registrar office.The couple had earlier tied the knot in a private ceremony held in Delhi on February 21, 2026. pic.twitter.com/reNrML8PHb— Greater Noida West (@GreaterNoidaW) May 6, 2026 -
‘నా నిర్లక్ష్యం... తెలివి తక్కువతనం’
సిడ్నీలోమద్యం తాగి కారు నడిపిన నేరంపై ఇటీవల పోలీసులకు చిక్కిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తాను చేసిన పని పట్ల చింతిస్తున్నానని అన్నాడు. తన ప్రవర్తన పూర్తిగా ‘నిర్లక్ష్యపూరితం... తెలివి తక్కువతనం’ అని అతడు వ్యాఖ్యానించాడు. పరిమితికి మించితన మిత్రుడి ఇంటి వద్ద మద్యం సేవించిన అనంతరం స్వయంగా కారు నడిపిన వార్నర్... సిడ్నీ పోలీసుల తనిఖీ సాగుతుండటంతో ఆ స్థలానికి కాస్త ముందే కారు దిగి పరీక్ష నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే దీనిని గుర్తించిన పోలీసులు పరీక్ష నిర్వహించగా అతను పరిమితికి మించి మద్యం తీసుకున్నట్లు తేలింది. దాంతో కేసు బుక్ చేసి స్టేషన్కు తీసుకెళ్లారు. ఈ కేసు విషయంలో కోర్టులో వార్నర్ తరఫున అతని లాయర్ బాబీ హిల్ హాజరయ్యాడు. వార్నర్ తాను తప్పు చేసినట్లుగా అంగీకరిస్తున్నాడని, ఎలాంటి శిక్షకైనా సిద్ధమని హిల్ కోర్టులో వెల్లడించాడు. పరీక్షకు 11 నిమిషాల ముందే వార్నర్ 3 గ్లాస్ల వైన్ తీసుకున్నట్లు లాయర్ చెప్పాడు. పెద్ద తప్పు‘చాలా మంది ఎన్నో తప్పులు చేస్తుంటారు. వాటిని అంగీకరించడమై సరైన పని. అసలు మద్యం సేవించాక టాక్సీలో వెళ్లకుండా నేను కారు నడపడం పెద్ద తప్పు. క్రికెటర్ అయినా, డాక్టర్ అయినా, ఏ వృత్తిలో ఉన్నా ఇలాంటి స్థితిలో ప్రమాదం వెంటాడుతూనే ఉంటుంది’ అని వార్నర్ తాను చెప్పదల్చుకున్న విషయాన్ని లాయర్ ద్వారా కోర్టు ముందుంచాడు. వార్నర్లో అపరాధ భావన ఉందని, క్రికెటర్ పేరుతో ఎలాంటి సడలింపులు అతడు కోరుకోవడం లేదని, న్యూసౌత్వేల్స్లోని ఇతర సామాన్య పౌరుల్లాగే తనకు శిక్ష వేయాలని వార్నర్ కోరుకుంటున్నట్లు లాయర్ స్పష్టం చేశాడు. ఈ కేసు జూన్ 24కు వాయిదా పడింది. -
రెండు రాష్ట్రాల టాపర్గా ఎంఎస్ ధోని
టీమిండియా దిగ్గజ ఆటగాడు, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్టైమ్ గ్రేట్ అయిన ఎంఎస్ ధోని, ఓ ఆర్దికపరమైన అంశానికి సంబంధించి రెండు రాష్ట్రాల టాపర్గా నిలిచాడు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో అత్యధిక వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారుగా రికార్డు నెలకొల్పాడు.ఇన్కమ్ ట్యాక్స్ శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, బిహార్-ఝార్ఖండ్ కలిపి గత ఆర్థిక సంవత్సరంలో సుమారు ₹20,000 కోట్ల ఆదాయపు పన్ను వసూలు చేశాయి. ఇందులో ₹12,000 కోట్లు ఒక్క ఝార్ఖండ్ రాష్ట్రం నుంచే వచ్చాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ అత్యధిక వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుగా ధోని నిలిచాడు. ఈ విషయాన్ని బిహార్-ఝార్ఖండ్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ డా. డి. సుధాకర రావు మీడియాకు వెల్లడించారు.ధోని ఎంత పన్ను చెల్లించాడన్న వివరాలను అధికారికంగా వెల్లడించకపోయినా, అతని ఆస్తులు, పెట్టుబడులు, బ్రాండ్ ఎండార్స్మెంట్ల ఆధారంగా సుమారు ₹38 కోట్ల పన్ను చెల్లించినట్లు అంచనా వేస్తున్నారు.ధోని నికర సంపద మరియు ఆదాయాలు: 2026 మే నాటికి ధోని నికర సంపద సుమారు ₹1,060 కోట్లుగా అంచనా వేయబడింది. సంవత్సరానికి సుమారు ₹75 కోట్లు వివిధ వనరుల ద్వారా సంపాదిస్తున్నాడు. టెక్నాలజీ, ఫిన్టెక్ రంగాల్లో కార్స్24, గరుడ ఏరోస్పేస్, ఖటాబుక్ వంటి కంపెనీలకు బ్రాండ్ అంబాసడర్గా, ఇన్వెస్టర్గా ఉన్నాడు.ఫుడ్ & బెవరేజెస్ రంగంలో సెవెన్ ఇంక్ బ్రివ్స్, హౌస్ ఆఫ్ బిర్యాని, షాకా హ్యారీ (ప్లాంట్ బేస్డ్ మీట్) వంటి బ్రాండ్లతో ముడిపడి ఉన్నాడు. క్రీడా యాజమాన్యంలో చెన్నైయిన్ ఎఫ్సి (ISL ఫుట్బాల్), మహి రేసింగ్ టీమ్ ఇండియా (సూపర్స్పోర్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్)కు కో-ఓనర్గా ఉన్నాడు.ధోని పేరిట రాంచీలో 7 ఎకరాల్లో ఓ లగ్జరీ ఇళ్లు ఉంది. 100కి పైగా వింటేజ్, మోడరన్ బైకులు ఉన్నాయి. వీటన్నటి కోసం ఓ గాజు గోడల గ్యారేజీ ఉంది. అలాగే 43 ఎకరాల ఫామ్ను నిర్వహిస్తూ వాణిజ్యపరంగా కూరగాయలు సాగు చేస్తున్నాడు.భారతీయ క్రికెటర్లలో ఎవరు ఎంత పన్ను చెల్లిస్తున్నారు..?(2023-24 ఆర్థిక సంవత్సరం ఆధారంగా)- విరాట్ కోహ్లీ : ₹66 కోట్లు - ఎంఎస్ ధోని : ₹38 కోట్లు - సచిన్ టెండూల్కర్ : ₹28 కోట్లు - సౌరవ్ గాంగూలీ : ₹23 కోట్లు - హార్దిక్ పాండ్యా : ₹13 కోట్లు -
టీమిండియాతో జతకట్టనున్న పంజాబ్ కింగ్స్ కోచ్
టీమిండియాకు సంబంధించి ఓ కీలక అప్డేట్ అందుతోంది. ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే పంజాబ్ కింగ్స్ స్నిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే టీమిండియా కోఠరిలో అదే హోదాలో జాయిన్ కానున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ క్రిక్బజ్ ఓ కథనంలో పేర్కొంది.బహుతులే.. ఈ విషయమై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తోనూ చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం గంభీర్ హెడ్ కోచ్గా, సితాంశు కోటక్ బ్యాటింగ్ కోచ్గా, టెన్ డస్కట్ అసిస్టెంట్ కోచ్గా, మోర్నీ మార్కెల్ బౌలింగ్ కోచ్గా, దిలీప్ ఫీల్డింగ్ కోచ్గా వ్యవహరిస్తున్నారు. స్పిన్ బౌలింగ్ కోచ్ పదవి గతకొంతకాలంగా ఖాళీగా ఉంది. ఈ ఖాళీని బహుతులేతో భర్తీ చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.53 ఏళ్ల బహుతులే దేశీయ క్రికెట్లో మంచి లెగ్ స్పిన్నర్గా పేరు సంపాదించాడు. 343 దేశీయ మ్యాచ్ల్లో 837 వికెట్లు తీశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతడు 9 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీల సాయంతో 6176 పరుగులు సాధించాడు. దేశవాలీ క్రికెట్ను ముంబై, మహారాష్ట్ర, అస్సాం జట్ల తరఫున ఆడిన బహుతులే.. అంతర్జాతీయంగా 2 టెస్టులు, 8 వన్డేలు ఆడి 5 వికెట్లు తీశాడు.కోచింగ్ అనుభవం:- 2021లో ఇండియా-ఏ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో బౌలింగ్ కోచ్గా పని చేశాడు. - బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో నాలుగు సంవత్సరాలు బౌలింగ్ కోచ్గా పని చేశాడు. - రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్లతో పాటు కేరళ, బెంగాల్, గుజరాత్ జట్లకు హెడ్ కోచ్గా కూడా పనిచేశాడు.రికీ పాంటింగ్ హెడ్ కోచ్గా ఉన్న పంజాబ్ కింగ్స్లో బహుతులే స్పిన్ బౌలింగ్ కోచ్గా మంచి సేవలందిస్తున్నాడు. అతడి మార్గదర్శకత్వంలో పంజాబ్ స్పిన్ విభాగం (యుజ్వేంద్ర చాహల్, హర్ప్రీత్ బ్రార్) అద్భుతంగా రాణిస్తుంది. ఈ అనుభవం భారత జాతీయ జట్టు స్పిన్నర్ల అభివృద్ధికి ఉపయోగపడుతుందని బీసీసీఐ భావిస్తోంది. -
బాదుడే బాదుడు.. కారణం ఇదేనా?
ఒకప్పుడు 180 పరుగులు చేస్తే చాలు మ్యాచ్ గెలిచేసినట్లే అనే నమ్మకం ఉండేది! ఇక 200 మార్క్ దాటితే ఛేదన అసాధ్యమనిపించేది!! కానీ ఇప్పుడు లెక్కలు మారాయి. ఐపీఎల్ 19వ సీజన్లో అయితే 220 పరుగులు చేసిన జట్లకు కూడా... విజయంపై ధీమా ఉండటం లేదు.బ్యాటింగ్కు అనుకూలించే ఫ్లాట్ పిచ్లు... అంతర్జాతీయ మ్యాచ్లతో పోలిస్తే చిన్న బౌండరీలు... పవర్ప్లేలోనే బౌలర్ల భరతం పట్టే ఓపెనింగ్ జోడీలు.. మధ్య ఓవర్లలో పరుగుల వరద పారించే మిడిలార్డర్ బ్యాటర్లు... డెత్ ఓవర్స్లో బంతిని చీల్చిచెండాడే ఫినిషర్లు... అవసరమైతే అదరగొట్టే ‘ఇంపాక్ట్ ప్లేయర్లు’...వెరసి ఎన్ని పరుగులు చేస్తే మ్యాచ్ గెలవొచ్చు అనే సమీకరణాలు మారిపోతున్నాయి. తాజా సీజన్లో 41 సార్లు రెండొందలకు పైగా పరుగులు నమోదు అయ్యాయంటే బాదుడు ఏ స్థాయిలో సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ సీజన్లో 200కుపైగా పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించి కూడా పరాజయం పాలైన జట్లు చాలా ఉన్నాయి. ఢిల్లీ, పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ అయితే అరాచకానికి అర్థం మార్చింది. తొలుత ఢిల్లీ క్యాపిటల్స్ 264 పరుగులు రికార్డు స్కోరు చేస్తే... దాన్ని పంజాబ్ కింగ్స్ మరో 7 బంతులు మిగిలుండగానే ఛేదించి వారెవ్వా అనిపించింది. ఈ సీజన్లో సాగుతున్న పరుగుల ఊచకోతను ఓసారి పరిశీలిస్తే... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్లో బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్నారు. 49 మ్యాచ్ల్లో 41 సార్లు రెండొందల పైచిలుకు పరుగులు నమోదయ్యాయి. బౌలింగ్ చేస్తున్నది గల్లీ బౌలర్లా అన్నట్లు... బ్యాటింగ్ చేయడం ఇంత సులువా అనిపించేలా బ్యాటర్ల వీరవిహారం కొనసాగుతోంది. గతేడాది ఐపీఎల్లో 200పైగా లక్ష్యాన్ని 9 సార్లు ఛేదించగా... ఈ సీజన్లో ఇంకా లీగ్ మ్యాచ్లు ముగియకముందే ఈ సంఖ్య 12గా ఉంది. ఈ ఏడాది సాగుతున్న విధ్వంసకాండ చూస్తుంటే ఈ సంఖ్య మరింత పెరగడం ఖాయమే. ఒకప్పుడు భారీ స్కోరులా కనిపించిన 200 పరుగుల మార్క్ ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు రెండొందల పైచిలుకు పరుగులు చేయడం పరిపాటిగా మారింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.తొలి 10 ఓవర్లే... టి20ల్లో చేజింగ్ చేసే జట్టుకు గెలుపు సులభం అనేది జగమెరిగిన సత్యం. చేయాల్సిన పరుగులు, అందుబాటులో ఉన్న బంతులపై స్పష్టమైన అవగాహన ఉండటంతో చేజింగ్ జట్లు దాన్ని బట్టి ముందుకు సాగుతుంటాయి. ఈ సీజన్లో 12 సార్లు రెండొందలకు పైగా లక్ష్యాలను ఛేదించగా... వాటిలో 10 సార్లు సగం ఓవర్లకు ముందే లక్ష్యంలోని సగం పరుగుల కన్నా ఎక్కువ సాధించాయి. అది కూడా రెండు కంటే తక్కువ వికెట్లు మాత్రమే కోల్పోయి. దీంతో చేజింగ్ జట్లకు మంచి శుభరంభాలు దక్కాయి. సాధించాల్సిన రన్రేట్ పదికి లోపు ఉన్న ప్రతి సందర్భంలో చేజింగ్ జట్లు సునాయాసంగా గెలుపొందుతున్నాయి. ‘ఇంపాక్ట్’ ప్లేయర్... సాధారణంగా క్రికెట్లో ఒక్కో జట్టు తరఫున 11 మంది మాత్రమే బరిలోకి దిగాల్సి ఉన్నా... ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధనతో ఆ సంఖ్య 12కు మారింది. మైదానంలో 11 మందే ఉన్నా... ఒక అదనపు బ్యాటర్ సేవలను వినియోగించుకునేందుకు తోడ్పడే ఈ నిబంధన భారీ స్కోర్లకు కారణంగా నిలుస్తోంది. ‘బ్యాటింగ్ చేసేందుకు జట్టులో ఒక అదనపు ఆటగాడు ఉన్నాడు అని తెలిస్తే... టాపార్డర్ మరింత స్వేచ్ఛగా ఆడుతుంది’ అని కోహ్లి అన్నట్లు... ఈ ‘ఇంపాక్ట్ ప్లేయర్’ భారీగా పరుగులు చేయకున్నా... అతడున్నాడనే నమ్మకంతో మిగిలినవాళ్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ నిబంధన సరిగ్గా లేదని ఇప్పటికే పలువురు దిగ్గజాలు ఆరోపించినా... నిర్వాహకులు మాత్రం దాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. చిన్న బౌండరీలు... దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల మైదానాలతో పోల్చుకుంటే... మన దగ్గర బౌండరీలు చిన్నవి. అందులోనూ ఐపీఎల్లో అవి మరింతగా కుచించుకుపోతున్నాయి. హ్యాపీడేస్ సినిమాలో ‘టచ్ చేస్తే ఫోర్ రా’ అన్న తరహాలో బంతి బ్యాట్కు తాకిందే తడువు బౌండరీ వైపు పరుగులు తీస్తోంది. దీనికి వేగవంతమైన ఔట్ ఫీల్డ్ కూడా ఒక కారణమే. తాజా ఐపీఎల్లో కొన్ని సందర్భాల్లో 60 మీటర్ల కంటే తక్కువ దూరం వెళ్లిన బంతి సైతం సిక్స్గా మారిందంటే మన గ్రౌండ్లు బ్యాటర్లకు ఎంత ఉపయోగకరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దీని వల్లే కొన్ని మ్యాచ్ల్లో ఫోర్ల కంటే ఎక్కువ సిక్స్లు నమోదవుతున్నాయి.‘పవర్’ ప్లే ఈ ఏడాది నమోదైన రికార్డు లక్ష్యఛేదనలను గమనిస్తే... ‘పవర్ ప్లే’ (1–6 ఓవర్లు)లో దంచికొట్టిన జట్టుదే పైచేయి అనేది స్పష్టమవుతోంది. ఫీల్డింగ్ నిబంధనలు భారీ షాట్లకు అనుకూలంగా ఉండే ఈ సమయంలో భారీగా పరుగులు రాబట్టేందుకు ప్రతీ జట్టు ప్రయత్నిస్తోంది. పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రియాన్‡్ష ఆర్య తొలి ఆరు ఓవర్లలోనే మ్యాచ్ను ముగించాలనే కసితో బాదేస్తుంటే... సన్రైజర్స్ ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ‘పవర్ ప్లే’లోనే మ్యాచ్ను డిసైడ్ చేస్తున్నారు. మిగిలిన జట్లు కూడా ఇలా పవర్ప్లేలోనే ఎక్కువ పరుగులు సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. ‘‘పవర్ ప్లే’లో 30 గజాల సర్కిల్ బయట ఇద్దరు ఫీల్డర్లకే అనుమతి ఉండటంతో... ఈ దశలోనే భారీ షాట్లు ఆడాలని ఓపెనర్లు నిర్ణయించుకుంటున్నారు. బంతి కాస్త అనుకూలంగా ఉన్నా... దాన్ని గీత దాటించడమే పనిగా పెట్టుకుంటున్నారు. ఐపీఎల్–2025లో పవర్ ప్లేలో ఓవర్కు 10.48 రన్రేట్తో పరుగులు రాబట్టగా... ఈ ఏడాది అది 11.78గా ఉంది. అంటే పవర్ప్లే 12 శాతం దూకుడు పెరిగినట్లు లెక్క. బ్యాటింగ్ పిచ్లు... టెస్టు క్రికెట్ మాదిరిగా అటు బ్యాటింగ్కు ఇటు బౌలింగ్కు సమానంగా సహకరించే పిచ్ల సంఖ్య తగ్గిపోయింది. అభిమానులను అలరించాలనే ఉద్దేశమే తప్ప... ఆటలో బ్యాలెన్స్ పాటించాలనే సోయి లేకుండా పోతోంది. దీంతో బ్యాటింగ్కు స్వర్గధామం లాంటి పిచ్లే దర్శనమిస్తున్నాయి. బుమ్రా, కమిన్స్, స్టార్క్, హాజల్వుడ్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లు సైతం... పిచ్ నుంచి ఏమాత్రం సహకారం లభించక చేష్టలుడిగి చూస్తుండిపోతున్నారు. నిన్న కాక మొన్న వచ్చిన కుర్రాళ్లు కూడా... అంతర్జాతీయ స్థాయిలో అపార అనుభవం ఉన్న బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటున్నారంటే అందుకు తారు రోడ్ల లాంటి ‘ఫ్లాట్ పిచ్’లు కూడా ఒక కారణమే. చదవండి: భారత టీ20 జట్టు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!ఆ మ్యాచ్ పరాకాష్ట! తాజా సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ అయితే దూకుడుకు అర్థం మార్చింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న క్యాపిటల్స్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 67 బంతుల్లోనే 16 ఫోర్లు, 9 సిక్స్ల సాయంతో అజేయంగా 152 పరుగులు చేశాడు. తద్వారా ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. అతడికి నితీశ్ రాణా సహకారం తోడవడంతో ఢిల్లీ కొండంత స్కోరు చేసింది.తొలి ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం ఆనందంగా కనిపించిన రాహుల్... ఛేదన ప్రారంభమైన ఆరు ఓవర్లలోనే నీరసించిపోయాడు. ప్రతి బంతిని బౌండరీ దాటించడమే పరమావధి అన్నట్లు పంజాబ్ ఓపెనర్లు చెలరేగిపోతుంటే... కేఎల్ రాహుల్ నిచ్చేష్టుడిలా వికెట్ల వెనక నిలబడిపోయాడు. ప్రియాన్ష్ ఆర్య (priyansh arya) 17 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్ల సాయంతో 43 పరుగులు చేస్తే... ప్రభ్సిమ్రన్ సింగ్ 26 బంతుల్లో 9 ఫోర్లు, 5 సక్స్లతో 76 పరుగులు చేశాడు. చివర్లో శ్రేయస్ అయ్యర్ (shreyas iyer) 36 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్లతో అజేయంగా 71 పరుగులు చేయడంతో పంజాబ్ జట్టు సునాయాసంగా మ్యాచ్ గెలిచేసేంది. ఈ మ్యాచ్ గణాంకాలు పరిశీలిస్తే... ఛేదనలో పంజాబ్ ‘పవర్ ప్లే’లోనే మ్యాచ్ను లాగేసుకుంది. తొలి ఆరు ఓవర్లలోనే 116 పరుగులు చేసి లక్ష్యంలోని 43.8 శాతం పరుగులను ఖాతాలో వేసుకుంది. దీంతో మిగిలిన పని మరింత సులువైంది. – సాక్షి క్రీడావిభాగం -
భారత టీ20 జట్టు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!
భారత టీ20 జట్టు కెప్టెన్సీ మార్పుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు సూర్యకుమార్ యాదవ్ నుంచి శ్రేయస్ అయ్యర్కు బదిలికానున్నట్లు సమాచారం. ఈ మేరకు బీసీసీఐ శ్రేయస్ అయ్యర్కు మెసేజ్ కూడా పంపినట్లు తెలుస్తోంది.సూర్యకుమార్ నేతృత్వంలో భారత్ 2026 టీ20 వరల్డ్ కప్ను గెలిచినప్పటికీ, అతని ఇటీవలి బ్యాటింగ్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. దీంతో బీసీసీఐ లాంగ్ టర్మ్ ప్లానింగ్తో (2028 టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకుని) కొత్త నాయకుడిని ఎంపిక చేయాలని భావిస్తోంది. వయసు మరియు జట్టులో యంగ్ కోర్ను బలోపేతం చేయాలనే ఆలోచన కూడా ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది.శ్రేయస్సే ఎందుకు..? ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా శ్రేయస్ ఐపీఎల్ ఆకట్టుకున్నాడు. కెప్టెన్సీతో పాటు వ్యక్తిగత ప్రదర్శనలతోనూ సెలెక్టర్లను మెప్పించాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 9 ఇన్నింగ్స్లో 333 రన్స్ సాధించి 47.57 సగటు, 164.04 స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. ప్రశాంతంగా జట్టును నడిపించే విధానం శ్రేయస్ కెప్టెన్సీ కేసును బలపరిచాయి.శ్రేయస్కు గతంలో భారత టెస్ట్ మరియు వన్డే జట్లకు కెప్టెన్గా పని చేసిన అనుభవం కూడా ఉంది. అతని కామ్ అండ్ కూల్ అప్రోచ్, మెచ్యూర్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ భారత టీ20 జట్టుకు కావాల్సిన లక్షణాలుగా పరిగణించబడుతున్నాయి.పేలవ ఫామ్లో సూర్యప్రస్తుత ఐపీఎల్ సీజన్లో సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్లో ఉన్నాడు. 10 ఇన్నింగ్స్ల్లో కేవలం 195 రన్స్ మాత్రమే చేశాడు. స్ట్రైక్ రేట్ (145.52) కూడా చాలా దారుణంగా ఉంది. ప్రస్తుత బ్యాటింగ్ ఫామ్ కారణంగా సూర్య టీమిండియా కెప్టెన్సీ స్థానం ప్రమాదంలో పడింది.కెప్టెన్సీ పోయినా జట్టులో ఉంటాడు..!సూర్య భారత టీ20 జట్టు కెప్టెన్సీ కోల్పోయినా, సాధారణ ఆటగాడిగా జట్టులో కొనసాగే అవకాశం ఉంది. ఐపీఎల్లో ఇంకా కొన్ని మ్యాచ్లు ఆడాల్సి ఉండగా.. వాటిలో ఫామ్ను నిరూపించుకుంటే, తప్పక త్వరలో జరుగబోయే ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్లకు ఎంపిక కావచ్చు. -
వైభవ్ సూర్యవంశీ 21 ఏళ్లకే రిటైరవుతాడు..!
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల వయసుకే దాదాపు అన్ని రికార్డులు తన పేరిట లిఖించుకుని క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్ లాంటి మెగా లీగ్లో వైభవ్ను ఆపడం అసాధ్యంగా కనిపిస్తుంది. ఈ బుడ్డోడి బీభత్సం చూసేందుకు రెండు కళ్లు చాలడం లేదు. త్వరలో ఇతగాడిని టీమిండియాకు ఎంపిక చేయాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్నాయి. వైభవ్ టీమిండియా భవిష్యత్ ఆశాకిరణం అంటూ వేనోళ్లు కొనియాడుతున్నాయి.తాజాగా ఇంగ్లండ్ దిగ్గజం ఫిల్ టఫ్నెల్ వైభవ్ను పొగుడుతూనే, ఓ సరదా కామెంట్ చేశాడు. వైభవ్ ఇదే జోరును కొనసాగిస్తే 21 ఏళ్లకే బర్నౌట్ అవుతాడని అన్నాడు. ఆ వయసుకే కావాల్సినంత డబ్బు సంపాదించుకొని రిటైరవుతాడని చమత్కరించాడు. ‘స్టిక్ టు క్రికెట్’ అనే పాడ్కాస్ట్లో టఫ్నెల్ ఈ వ్యాఖ్యలు చేశాడు.మైఖేల్ వాన్, అలిస్టర్ కుక్, డేవిడ్ లాయిడ్ లాంటి ఇతర ఇంగ్లండ్ దిగ్గజాలతో కలిసి పాల్గొన్న ఈ షోలో టఫ్నెల్ వైభవ్పై ప్రశంసల వర్షం కురిపించాడు. ముఖ్యంగా అతడి ఐపీఎల్ 2026 ప్రదర్శనలను కొనియాడాడు.తరుచూ టీమిండియా క్రికెటర్లపై అక్కసు వెళ్లగక్కే మైఖేల్ వాన్ కూడా వైభవ్ను ఈ సందర్భంగా ప్రశంసించాడు. క్రిస్ గేల్ లాంటి విధ్వంసకర యోధుడు కెరీర్ మధ్యలో 30 బంతుల్లో సెంచరీ చేస్తే వైభవ్ కెరీర్ ప్రారంభంలో, అదీ 14 ఏళ్ల వయసులోనే 35 బంతుల్లో శతక్కొట్టాడని కొనియాడాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో వైభవ్ ఇప్పటికే 37 సిక్సర్లు కొట్టి బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాడని అన్నాడు.మరో ఇంగ్లండ్ దిగ్గజం అలిస్టర్ కుక్ వైభవ్ను ప్రపంచంలోనే అత్యుత్తమ సిక్స్ హిట్టర్ అని ఆకాశానికెత్తాడు. మొత్తంగా తొలిసారి ఇంగ్లండ్ దిగ్గజాలంతా వైభవ్ను ముక్తకంఠంతో కొనియాడారు.కాగా, 2011 మార్చి 27న జన్మించిన వైభవ్.. ఇప్పటికే పురుషుల టీ20 క్రికెట్లో చాలా రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అతడి విధ్వంసం తారాస్థాయిలో కొనసాగుతుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు 10 ఇన్నింగ్స్లు ఆడిన వైభవ్.. 40.40 సగటున, 237.65 స్ట్రయిక్రేట్తో ఓ సెంచరీ, రెండు అర్ద సెంచరీల సాయంతో 404 పరుగులు చేసి, తన జట్టు (రాజస్థాన్ రాయల్స్) విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. -
ఐపీఎల్లో హనీ ట్రాప్..?
ఐపీఎల్ 2026 సీజన్లో 'హనీ ట్రాప్' ప్రమాదాలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అప్రమత్తమైంది. ఆటగాళ్ల భద్రత, టోర్నీ సమగ్రత దృష్ట్యా అన్ని ఫ్రాంచైజీలకు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సంతకంతో ఏడు పేజీల అధికారిక నోటీసు పంపినట్లు సమాచారం.ఐపీఎల్ సమయంలో కొందరు ఆటగాళ్లు తమ గర్ల్ఫ్రెండ్స్తో కలిసి హోటళ్లలో ఉండటం, ప్రయాణాలు చేయడం పట్ల బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లుగా ఉన్న వ్యక్తుల ద్వారా జట్టు వ్యూహాలు, అంతర్గత సమాచారం బయటకు వెళ్లే అవకాశం ఉందని బీసీసీఐ భావిస్తోంది.ఈ నేపథ్యంలో అన్ని జట్ల మేనేజ్మెంట్లకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఆటగాళ్లను కలిసే అతిథుల వివరాలు, హోటల్ కదలికలన్నిటినీ రికార్డు చేయాలని సూచించింది. అవసరమైతే అకస్మిక తనిఖీలు కూడా నిర్వహిస్తామని స్పష్టం చేసింది.నిబంధనలు ఉల్లంఘించినట్లయితే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇందులో షోకాజ్ నోటీసులు, భారీ జరిమానాలు, సస్పెన్షన్ లేదా డిస్క్వాలిఫికేషన్ వంటి చర్యలు ఉండొచ్చని తెలిపింది. చట్టపరమైన ఉల్లంఘనలు ఉంటే పోలీసు కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.కాగా, ఇలాంటి ప్రమాదాల నేపథ్యంలో బీసీసీఐ ఆటగాళ్లను అప్రమత్తం చేయడం ఇది తొలిసారి కాదు. గతంలో కూడా భారత జట్టు విదేశీ పర్యటనల సమయంలో కుటుంబ సభ్యులు, భాగస్వాముల ప్రయాణాలపై పరిమితులు విధించింది.ముఖ్యంగా 2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఓటమి తర్వాత బోర్డు మరింత కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఐపీఎల్ నిర్వహణలో ఆఫ్ఫీల్డ్ వ్యవహారాలపై కూడా బీసీసీఐ ప్రత్యేక దృష్టి పెట్టడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఏదో జరుగుతుందని ఫ్యాన్స్ గుసగుసలాడుకుంటున్నారు. -
బ్యాటింగ్లో మార్ష్ బౌలింగ్లో ప్రిన్స్
మ్యాచ్లో ఓడితే ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు కోల్పోయే స్థితిలో మైదానంలోకి దిగిన లక్నో తీవ్ర ఒత్తిడి మధ్య సత్తా చాటింది. చక్కటి ఆటతో బెంగళూరును చిత్తు చేసింది. మార్ష్ మెరుపు సెంచరీతో భారీ స్కోరు నమోదు చేసిన జట్టు...ప్రిన్స్ పదునైన బౌలింగ్తో ఆర్సీబీని కట్టడి చేయగలిగింది. పాటీదార్, డేవిడ్ దూకుడు డిఫెండింగ్ చాంపియన్ను గెలిపించడానికి సరిపోలేదు. వరుసగా ఆరు ఓటముల తర్వాత లక్నోకు ఈ గెలుపు దక్కడం విశేషం. లక్నో: ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న లక్నో సూపర్ జెయింట్స్కు కాస్త ఊరట లభించింది. తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో టీమ్ సమష్టి ప్రదర్శన కనబర్చింది. గురువారం జరిగిన పోరులో లక్నో 9 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై విజయం సాధించింది. వర్షం కారణంగా ఆటకు పదే పదే అంతరాయం కలగడంతో ఇన్నింగ్స్ను 19 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన లక్నో 19 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (56 బంతుల్లో 111; 9 ఫోర్లు, 9 సిక్స్లు) ఐపీఎల్లో తన రెండో సెంచరీని నమోదు చేయగా...నికోలస్ పూరన్ (23 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్), రిషభ్ పంత్ (10 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక పరుగులు సాధించారు. అనంతరం బెంగళూరు లక్ష్యాన్ని డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 19 ఓవర్లలో 213 పరుగులుగా నిర్ణయించారు. బెంగళూరు 19 ఓవర్లలో 6 వికెట్లకు 203 పరుగులు చేసి ఓడిపోయింది. రజత్ పాటీదార్ (31 బంతుల్లో 61; 3 ఫోర్లు, 6 సిక్స్లు), టిమ్ డేవిడ్ (17 బంతుల్లో 40; 4 ఫోర్లు, 3 సిక్స్లు) మినహా మిగతావారు ప్రభావం చూపలేదు. పంత్ జోరు... లక్నో ఓపెనర్ మార్ష్ దూకుడుగా ఇన్నింగ్స్ మొదలు పెట్టగా, సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన అర్షిన్ కులకర్ణి (17) తడబడ్డాడు. ఏకపక్షంగా మార్ష్ బౌండరీల జోరు సాగింది. హాజల్వుడ్ ఓవర్లో రెండు సిక్స్లు కొట్టిన మార్ష్...కృనాల్ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టాడు. ఆ తర్వాత సలామ్ ఓవర్లో 2 సిక్స్లు, ఫోర్ బాదడంతో పాటు హాజల్వుడ్ ఓవర్లో కూడా మార్ష్ 3 ఫోర్లు కొట్టడంతో పవర్ప్లే ముగిసే సరికి స్కోరు 68 పరుగులకు చేరగా, 20 బంతుల్లోనే మార్ష్ అర్ధసెంచరీ పూర్తయింది. అర్షిన్ వెనుదిరిగిన తర్వాత పూరన్ తనదైన శైలిలో ధాటిగా ఆడాడు. మరో వైపు షెఫర్డ్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ బాదిన మార్ష్ 49 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు. అతను సెంచరీ అందుకునే సమయానికి జట్టు స్కోరు 139 పరుగులు అంటే మార్ష్ జోరు ఎలా సాగిందో అర్థమవుతుంది. మార్ష్, పూరన్ తక్కువ వ్యవధిలో అవుటైనా...పంత్ మెరుపులతో స్కోరు 200 దాటింది. హాజల్వుడ్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన అతను...సలామ్ వేసిన చివరి ఓవర్లో వరుసగా 4, 4, 6తో ముగించాడు. కోహ్లి డకౌట్... ఛేదనలో ఆర్సీబీకి సరైన ఆరంభం లభించలేదు. బెతెల్ (4) వైఫల్యం కొనసాగగా...ప్రిన్స్ వేసిన అద్భుత బంతికి విరాట్ కోహ్లి (0) డకౌటయ్యాడు. 2023 సీజన్ తర్వాత కోహ్లి డకౌట్ కావడం ఇదే తొలిసారి. ఈ దశలో పాటీదార్ సిక్సర్లతో చెలరేగిపోగా, పడిక్కల్ (25 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచాడు. వీరిద్దరు మూడో వికెట్కు 53 బంతుల్లోనే 95 పరుగులు జోడించడంతో బెంగళూరుకు విజయావకాశాలు కనిపించాయి. అయితే ఎనిమిది పరుగుల తేడాతో వీరిద్దరితో పాటు జితేశ్ (1) కూడా అవుట్ కావడంతో జట్టు కష్టాలు పెరిగాయి. ఇలాంటి స్థితిలో డేవిడ్ దూకుడైన ఆటతో టీమ్లో ఆశలు రేగాయి. 22 బంతుల్లో 55 పరుగులు చేయాల్సి ఉండగా డేవిడ్ను షహబాజ్ అవుట్ చేయడంతో ఆర్సీబీకి గెలుపు కష్టంగా మారిపోయింది. స్కోరు వివరాలు లక్నో సూపర్జెయింట్స్ ఇన్నింగ్స్: మార్ష్ (సి) బెతెల్ (బి) హాజల్వుడ్ 111; అర్షిన్ (సి) పాటీదార్ (బి) కృనాల్ 17; పూరన్ (సి) కృనాల్ (బి) సలామ్ 38; పంత్ (నాటౌట్) 32; మార్క్రమ్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 10; మొత్తం (19 ఓవర్లలో 3 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–95, 2–165, 3–194. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–34–0, హాజల్వుడ్ 4–0–49–1, కృనాల్ 4–0–31–1, సలామ్ 4–0–53–1, సుయాశ్ 2–0–21–0, షెఫర్డ్ 1–0–16–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: బెతెల్ (సి) ప్రిన్స్ (బి) షమీ 4; కోహ్లి (బి) ప్రిన్స్ 0; పడిక్కల్ (సి) అండ్ (బి) ప్రిన్స్ 34; పాటీదార్ (సి) మార్క్రమ్ (బి) షహబాజ్ 61; జితేశ్ (సి) పంత్ (బి) ప్రిన్స్ 1; డేవిడ్ (సి) రాఠీ (బి) షహబాజ్ 40; కృనాల్ పాండ్యా (నాటౌట్) 28; షెఫర్డ్ (నాటౌట్) 23; ఎక్స్ట్రాలు 12; మొత్తం (19 ఓవర్లలో 6 వికెట్లకు) 203. వికెట్ల పతనం: 1–9, 2–9, 3–104, 4–106, 5–112, 6–167. బౌలింగ్: షమీ 4–0–33–1, ప్రిన్స్ 4–0–33–3, మయాంక్ 4–0– 50–0, రాఠీ 4–0–50–0, షహబాజ్ 3–0–33–2. -
ఆర్సీబీ ఓటమి.. వరుస ఓటములకు లక్నో చెక్!
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్జెయింట్స్ వరుస పరాజయాలకు ఎట్టకేలకు ఆరు వరుస ఓటములకు పుల్స్టాప్ పెట్టింది. గురువారం సొంత మైదానంలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్జెయింట్స్ 9 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. వర్షం అంతరాయంతో మ్యాచ్ను 19 ఓవర్లకు కుదించారు. 213 పరుగుల రివైజ్డ్ టార్గెట్తో బరిలోకి దిగిన ఆర్సీబీ 19 ఓవర్లలో 6 వికెట్లు నష్టాపోయి 203 పరుగులకు పరిమితమైంది. కెప్టెన్ పటీదార్ (61) అర్థసెంచరీతో రాణించగా, పడిక్కల్ (34) పర్వాదలేదనిపించాడు. ఆఖర్లో టిమ్ డేవిడ్ (40), కృనాల్ పాండ్యా (28 నాటౌట్) పర్వాలేదనిపించారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ మూడు వికెట్లతో మెరవగా, షమీ, షాబాజ్ అహ్మద్లు చెరొక వికెట్ తీశారు.అంతకముందు లక్నో సూపర్జెయింట్స్ నిర్ణీత 19 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (111) సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. పూరన్ (29) రాణించాడు. ఆఖర్లో కెప్టెన్ రిషబ్ పంత్ (10 బంతుల్లో 32 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ధనాదన్ ఇన్నింగ్స్తో అలరించాడు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్వుడ్, రసిక్ సలామ్, కృనాల్ పాండ్యా తలా ఒక వికెట్ తీశారు. కాగా లక్నో ఆరు వరుస ఓటముల తర్వాత గెలుపును అందుకోవడం విశేషం. -
కంగ్రాట్స్ సూర్యా భాయ్.. తండ్రిగా ప్రమోషన్!
టీమిండియా టీ20 కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తండ్రయ్యాడు. అతడి భార్య దేవీషా షెట్టీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో ఈ శుభవార్త తెలియడంతో, కుటుంబంతో సమయం గడిపేందుకు సూర్య జట్టుకు దూరమయ్యాడు. దీంతో మే 10న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగాల్సిన కీలక మ్యాచ్కు అతడి లభ్యతపై సందేహాలు నెలకొన్నాయి. బిడ్డ పుట్టిన కారణంగా, కుటుంబ బాగోగులు చూసుకోవడానికి సూర్య ఈ వారం జట్టుతో కలిసి రాయ్పూర్కు ప్రయాణించలేదు. 2016లో వివాహం చేసుకున్న సూర్య-దేవీషా జంట, తమ కుమార్తె రాకతో ఆనందంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో సూర్యకుమార్ దంపతులకు అభిమానులు కంగ్రాట్స్ తెలిపారు. ‘ కంగ్రాట్స్ సూర్యా భాయ్’ అని కామెంట్లు పెడుతున్నారు.సూర్య క్రికెట్ ప్రయాణంలో దేవీషా నిరంతరం మద్దతుగా నిలుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ శుభ సందర్భంలో క్రికెట్ ప్రపంచం నుంచి ఈ జంటకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ను కెప్టెన్సీ సమస్య వెంటాడుతోంది. రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెన్నునొప్పితో బాధపడుతుండటంతో గత మ్యాచ్లో (లక్నో సూపర్జెయింట్స్పై) సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా వ్యవహరించి జట్టును గెలిపించాడు. హార్దిక్ ఇంకా కోలుకోకపోవడం, సూర్య కుటుంబ కారణాలతో అందుబాటులో లేకపోవడంతో ఆర్సీబీతో మ్యాచ్కు బుమ్రా స్టాండ్-ఇన్ కెప్టెన్గా వ్యవహరించే అవకాశముంది. View this post on Instagram A post shared by Surya Kumar Yadav (SKY) (@surya_14kumar) చదవండి: తొలి క్రికెటర్గా మిచెల్ మార్ష్! -
తొలి క్రికెటర్గా మిచెల్ మార్ష్!
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీతో మ్యాచ్లో లక్నో సూపర్జెయింట్స్ ఓపెనర్ మిచెల్ మార్ష్ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. తద్వారా లక్నో తరఫున ఐపీఎల్లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన తొలి క్రికెటర్గా మిచెల్ మార్ష్ అరుదైన ఘనత సాధించాడు. రొమారియో షెపర్డ్ వేసిన యార్కర్ బంతిని బౌండరీ తరలించడం ద్వారా ఐపీఎల్లో రెండో సెంచరీ సాధించాడు. 49 బంతుల్లోనే సెంచరీ సాధించిన మిచెల్ మార్ష్ ఇన్నింగ్స్లో 9 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. అయితే గతంలో లక్నో తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ రిషబ్ పంత్ పేరిట ఉంది. గతేడాది ఇదే స్టేడియంలో ఆర్సీబీపైనే పంత్ 54 బంతుల్లో శతకం సాధించాడు. తాజాగా పంత్ రికార్డును బద్దలు కొట్టిన మార్ష్ ఫాస్టెస్ట్ సెంచరీతో ఆ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఓవరాల్గా మార్ష్కు ఐపీఎల్లో ఇది రెండో సెంచరీ. తొలి సెంచరీ కూడా లక్నో తరఫునే సాధించాడు. గతేడాది సీజన్లో గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో సెంచరీ సాధించిన మార్ష్ 64 బంతుల్లో 117 పరుగులు సాధించాడు. ఇక లక్నో తరఫున రెండు సెంచరీలు సాధించిన రెండో ఆటగాడిగా మార్ష్ నిలిచాడు. గతంలో కేఎల్ రాహుల్ ఈ ఫీట్ సాధించాడు. డికాక్, స్టోయినిస్, పంత్లు తలా ఒక సెంచరీ బాదారు.Crunched, clobbered, Celebrations 💯🎥 Mitchell Marsh brings up a 𝘀𝗶𝘇𝘇𝗹𝗶𝗻𝗴 𝗰𝗲𝗻𝘁𝘂𝗿𝘆 in some style 🔥🫡Updates ▶️ https://t.co/W0eDq9aWb7#TATAIPL | #KhelBindaas | #LSGvRCB | @LucknowIPL pic.twitter.com/xQxi3buH6j— IndianPremierLeague (@IPL) May 7, 2026చదవండి: ‘రగులుతున్న అసంతృప్తి’.. గంభీర్పై సంచలన ఆరోపణలు! -
‘రగులుతున్న అసంతృప్తి’.. గంభీర్పై సంచలన ఆరోపణలు!
టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్పై భారత మాజీ క్రికెటర్ అతుల్ వస్సన్ సంచలన ఆరోపణలు చేశాడు. గంభీర్ దూకుడు స్వభావం, అతడి కఠిన వైఖరితో జట్టులోని కొంతమంది ఆటగాళ్లు అసంతృప్తితో రగిలిపోతున్నారని పేర్కొన్నాడు. అయితే వస్సన్ ఆ ఆటగాళ్ల పేర్లను వెల్లడించడానికి నిరాకరించాడు. అతుల్ వస్సన్ మాట్లాడుతూ.. 'గంభీర్ చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. గంభీర్ ఎప్పుడూ తాను చెప్పిందే జరగాలి, ఇంకేమీ చేయకూడదు అన్నట్లుగా వ్యవహరిస్తుంటాడు. మొదటి నుంచి గంభీర్ స్వభావం అలాగే ఉంటుంది. ధనిక కుటుంబం నుంచి వచ్చినప్పటికీ గంభీర్ ఆటలో మంచి టెక్నిక్ ఉండడంతో పాటు మంచి తెలివిమంతుడు. అయితే అతనికి ఉండే ఈగో వేరే లెవెల్లో ఉంటుంది. అదెలా అంటే అతను ఏదైనా అనుకుంటే అవతలి వ్యక్తుల కూడా తనకు మద్దతు ఇవ్వాల్సిందే అన్నంత కఠినంగా ఉండేవాడు. ఆ కఠినత్వం క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాకా కూడా గంభీర్లో అలాగే కొనసాగడం ఆటగాళ్లతో గొడవలు పడేలా చేసింది. అందుకే ఐపీఎల్లో కోహ్లీతో ఢీ అంటే ఢీ అన్నాడు. ఇక భారత జట్టుకు ప్రధాన కోచ్గా గంభీర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత అతడి కఠినత్వ వైఖరి పట్ల టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో కొంతమంది ఆటగాళ్లు అసంతృప్తితోనే ఉన్నారు. వారి పేర్లు చెప్పడం నాకిష్టం లేదు. కానీ వాళ్లు మాత్రం గంభీర్ ప్రవర్తనతో కచ్చితంగా సంతోషంగా లేరని చెప్పగలను.'అని చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియా తరఫున అతుల్ వస్సన్ 4 టెస్టు మ్యాచ్ల్లో 10 వికెట్లు, 9 వన్డేల్లో 11 వికెట్లు పడగొట్టాడు.చదవండి: భువనేశ్వర్ అరుదైన రికార్డు.. తొలి పేసర్గా! -
భువనేశ్వర్ అరుదైన రికార్డు.. తొలి పేసర్గా!
ఐపీఎల్ 2026 సీజన్లో సూపర్ ఫామ్ కనబరుస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ లక్నోతో మ్యాచ్లో అరుదైన రికార్డు సాధించాడు. లక్నో సూపర్జెయింట్స్తో మ్యాచ్ భువనేశ్వర్కు 200వ మ్యాచ్ కావడం విశేషం. ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన తొలి పేసర్గా భువనేశ్వర్ అరుదైన రికార్డు సాధించాడు. ఓవరాల్గా ఐపీఎల్లో 200 మ్యాచ్లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో భువనేశ్వర్ కుమార్ 12వ స్థానంలో ఉన్నాడు. అయితే ఈ 12 మంది భారత ఆటగాళ్లే కావడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. ఇక భువనేశ్వర్ కుమార్ ఇప్పటివరకు ఐపీఎల్లో 199 మ్యాచ్ల్లో 215 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ తరఫున 10 మ్యాచ్ల్లో 17 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో లీడింగ్లో ఉన్నాడు. 2011లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన భువనేశ్వర్ తొలుత పుణే వారియర్స్ (2011-2013 వరకు) 26 మ్యాచ్లు, ఎస్ఆర్హెచ్ (2014-2024 వరకు) 129 మ్యాచ్లు, ఆర్సీబీ (2025 నుంచి) 44 మ్యాచ్లు ఆడాడు.అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాళ్ల జాబితా..మహేంద్ర సింగ్ ధోని: 278 మ్యాచ్లు (2008-2025)రోహిత్ శర్మ: 277 మ్యాచ్లు (2008-2026)విరాట్ కోహ్లీ: 276 మ్యాచ్లు (2008-2026)రవీంద్ర జడేజా: 264 మ్యాచ్లు (2008-2026)దినేష్ కార్తీక్: 257 మ్యాచ్లు (2008-2024)శిఖర్ ధావన్: 222 మ్యాచ్లు (2008-2024)రవిచంద్రన్ అశ్విన్: 221 మ్యాచ్లు (2009-2025)అజింక్య రహానే: 207 మ్యాచ్లు (2008-2026)సురేష్ రైనా: 205 మ్యాచ్లు (2008-2021)రాబిన్ ఊతప్ప: 205 మ్యాచ్లు (2008-2022)అంబటి రాయుడు: 204 మ్యాచ్లు (2010-2023)భువనేశ్వర్ కుమార్: 200 మ్యాచ్లు (2011-2026)చదవండి: దొరికిపోయిన చాహల్.. పంజాబ్ జట్టుకు శిక్ష తప్పదా? -
IPL 2026: ఆర్సీబీపై లక్నో విజయం
గురువారం సొంత మైదానంలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్జెయింట్స్ 9 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. వర్షం అంతరాయంతో మ్యాచ్ను 19 ఓవర్లకు కుదించారు. 213 పరుగుల రివైజ్డ్ టార్గెట్తో బరిలోకి దిగిన ఆర్సీబీ 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టాపోయి 203 పరుగులకు పరిమితమైంది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 19 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.టిమ్ డేవిడ్ ఔట్.. ఆరో వికెట్ డౌన్ధాటిగా ఆడుతున్న టిమ్ డేవిడ్ (40) ఔట్ కావడంతో ఆర్సీబీ 158 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ఆర్సీబీ విజయానికి 21 బంతుల్లో 55 పరుగులు అవసరం.ఒకే ఓవర్లు రెండు వికెట్లు తీసిన ప్రిన్స్ఆర్సీబీతో మ్యాచ్లో లక్నో మళ్లీ ట్రాక్లోకి వచ్చింది. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో బౌలింగ్కు వచ్చిన ప్రిన్స్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు. ఓవర్ తొలి బంతికి పడిక్కల్ (34)ను పెవిలియన్ చేర్చిన ప్రిన్స్ ఐదో బంతికి జితేశ్ శర్మను ఔట్ చేశాడు. దీంతో ఆర్సీబీ 107 పరుగుల వద్ద 4వ వికెట్ కోల్పోయింది. ఆర్సీబీ విజయానికి 48 బంతుల్లో 106 పరుగులు అవసరం.పటీదార్ ఫిఫ్టీ.. వంద దాటిన ఆర్సీబీ213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పటీదార్ (60) అర్థసెంచరీ సాధించగా, పడిక్కల్ 34 పరుగులతో ఆడుతున్నాడు.7 ఓవర్లలో ఆర్సీబీ 60/2ఏడు ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ 2 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. పడిక్కల్ (26), పటీదార్ (25) పరుగులతో ఆడుతున్నారు.రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో కోహ్లీ డకౌట్గా వెనుదిరిగాడు. అంతకముందు ఓపెనర్ జాకబ్ బెథెల్ 4 పరుగులు చేసి షమీ బౌలింగ్లో ఔటయ్యాడు. ప్రస్తుతం ఆర్సీబీ 2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 11 పరుగులు చేసింది.ఆర్సీబీ టార్గెట్ 213 పరుగులుఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఆర్సీబీతో మ్యాచ్లో లక్నో సూపర్జెయింట్స్ నిర్ణీత 19 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (111) సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. పూరన్ (29) రాణించాడు. ఆఖర్లో కెప్టెన్ రిషబ్ పంత్ (10 బంతుల్లో 32 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ధనాదన్ ఇన్నింగ్స్తో అలరించాడు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్వుడ్, రసిక్ సలామ్, కృనాల్ పాండ్యా తలా ఒక వికెట్ తీశారు. మ్యాచ్కు పలుమార్లు వర్షం అంతరాయం కలిగించడంతో ఆటను 19 ఓవర్లకు కుదించి ఆర్సీబీ ముందు 213 పరుగుల రివైజ్డ్ టార్గెట్ నిర్దేశించింది.రెండో వికెట్ కోల్పోయిన లక్నో111 పరుగులు చేసిన మిచెల్ మార్ష్ హాజిల్వుడ్ బౌలింగ్లో బెతెల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో లక్నో 165 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 17 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది.లక్నో, ఆర్సీబీ మ్యాచ్కు వర్షం మరోసారి అంతరాయం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్ను 19 ఓవర్లకు కుదించారు. ప్రస్తుతం లక్నో సూపర్జెయింట్స్ 16 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 165 పరుగులు చేసింది. మార్ష్ (111), పూరన్ (29) పరుగులతో ఆడుతున్నారు.మిచెల్ మార్ష్ సెంచరీ.. లక్నో 139/1ఆర్సీబీతో మ్యాచ్లో లక్నో ఓపెనర్ మిచెల్ మార్ష్ సెంచరీతో మెరిశాడు. 49 బంతుల్లోనే శతకం మార్క్ అందుకున్న మార్ష్ ఇన్నింగ్స్లో 9 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. 14 ఓవర్లు ముగిసేసరికి లక్నో వికెట్ నష్టానికి 145 పరుగులు చేసింది. పూరన్ 14 పరుగులతో ఆడుతున్నాడు.తొలి వికెట్ కోల్పోయిన లక్నోవర్షం అంతరాయం తర్వాత మొదలైన మ్యాచ్లో లక్నో సూపర్జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన అర్షిన్ కులకర్ణి కృనాల్ పాండ్యా బౌలింగ్లో పటీదార్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం లక్నో 11 ఓవర్లలో వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. వరుణుడి అడ్డంకి ఆటకు వరుణుడు అడ్డంకి కలిగించాడు. 9 ఓవర్ల నాటికి లక్నో స్కోరు వికెట్ నష్టపోకుండా 95గా ఉంది. మిచెల్ మార్ష్ అర్థ సెంచరీ బాదాడు. మిచెల్ మార్ష్ 76, అర్షిన్ కులకర్ణి 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. దంచుతున్న మిచెల్ మార్ష్లక్నో ఓపెనర్ మిచెల్ మార్ష్ దంచికొడుతున్నాడు. 5 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్జెయింట్స్ వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (46), అర్షిన్ కులకర్ణి (8) పరుగులతో క్రీజులో ఉన్నారు.4 ఓవర్లలో లక్నో 39/04 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్జెయింట్స్ వికెట్ నష్టపోకుండా 39 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (30), అర్షిన్ కులకర్ణి (8) పరుగులతో ఆడుతున్నారు.మ్యాచ్కు వర్షం అంతరాయంలక్నో, ఆర్సీబీ మధ్య జరుగుతున్న మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. వర్షం పడే సమయానికి లక్నో 1.3 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా 12 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (7), అర్షిన్ కులకర్ణి (4) పరుగులతో ఆడుతున్నారు.టాస్ నెగ్గిన ఆర్సీబీటాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ జట్టు ఎలాంటి మార్పు లేకుండా బరిలోకి దిగుతోంది. మరోవైపు లక్నో జట్టు మాత్రం మూడు మార్పులతో ఆడుతోంది. జోస్ ఇంగ్లిస్ స్థానంలో అర్షిల్ కులకర్ణి, మనిరమన్ స్థానంలో షాబాజ్ అహ్మద్, మోసిన్ ఖాన్ స్థానంలో దిగ్వేష్ రాఠీ జట్టులోకి వచ్చారు.ముఖాముఖి పోరులో ఇరజట్లు ఏడుసార్లు తలపడ్డాయి. ఇందులో ఆర్సీబీ ఐదు సార్లు, లక్నో రెండుసార్లు గెలుపొందాయి. ఏక్నా స్టేడియంలో ఆర్సీబీ ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ విజయం సాధించడం విశేషం. ఈ సీజన్లో తొలి అంచె పోటీలో లక్నో సూపర్ జె యింట్స్పై ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.తుది జట్లు:రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, రసిఖ్ సలాం దార్, జోష్ హేజిల్వుడ్.లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, అర్షిన్ కులకర్ణి, నికోలస్ పూరన్, ఐడెన్ మర్క్రమ్, రిషబ్ పంత్(వికెట్ కీపర్/కెప్టెన్), అక్షత్ రఘువంశీ, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, దిగ్వేష్ సింగ్ రాఠీ, మహ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్.🚨 Toss 🚨@RCBTweets have won the toss and elected to bowl first against @LucknowIPL in Lucknow.Updates ▶️ https://t.co/W0eDq9aWb7#TATAIPL | #KhelBindaas | #LSGvRCB pic.twitter.com/Z5DSxyelwt— IndianPremierLeague (@IPL) May 7, 2026 -
దొరికిపోయిన చాహల్.. పంజాబ్ జట్టుకు శిక్ష తప్పదా?
టీమిండియా క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ తన చర్యతో పంజాబ్ కింగ్స్ జట్టు మొత్తాన్ని చిక్కుల్లో పడేసేలా కనిపిస్తోంది. పంజాబ్ కింగ్స్ ప్రయాణం చేస్తున్న విమానంలో చాహల్..వేప్( ఈ-సిగరేట్) తాగిన వీడియో ఫుటేజీ బయటికి వచ్చింది. వీడియోలో చాహల్ వేప్ను పీల్చుతూ అడ్డంగా దొరికిపోయాడు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్కు ముందు అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్కు విమాన ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ సహచర క్రికెటర్ అర్షదీప్ సింగ్ ఇన్స్టాగ్రామ్లో ఒక వ్లాగ్ గా దర్శనమిచ్చింది. అయితే అసలు వ్లాగ్లోని వీడియోలో చాలా ఫుటేజీని ఎడిట్ చేసి కుదించినట్లు ఇన్స్టా ఖాతాదారులు పేర్కొన్నారు. అసలు వీడియోలో చాహల్ ఒక్కడే కాకుండా అతడి పక్కన ఉన్న శశాంక్ సింగ్, ఇతర పంజాబ్ ప్లేయర్లు కూడా ఈ-సిగరేట్ తాగే అవకాశం లేకపోలేదని కామెంట్లు చేశారు. అయితే విమాన ప్రయాణంలో సిగరేట్ (ఈ-సిగరెట్ అయినా) తాగడం నిషేధం. సిగరేట్ పొగ వల్ల ప్రమాదం జరిగేందుకు ఆస్కారముంది. చాహల్ ప్రవర్తన విమాన భద్రతా ప్రమాణాలను ఉల్లంఘిస్తుంది. ఇప్పటికే ఈ సీజన్లోనే పంజాబ్తో మ్యాచ్ సందర్భంగా రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్రూమ్లో వేప్ను ఉపయోగిస్తూ పట్టుబడ్డాడు. దీనిపై పెద్ద వివాదం నెలకొంది. అయితే బీసీసీఐ మాత్రం పరాగ్ను మందలిస్తూ అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానాతో సరిపెట్టింది. కానీ ఈసారి చాహల్ వేప్ ఉపయోగించినట్లు తేలితే మాత్రం అతడితో పాటు పంజాబ్ జట్టు మొత్తానికి శిక్ష పడే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే చాహల్తో పాటు పంజాబ్ జట్టు మొత్తం అదే విమానంలో ఉండడం గమనార్హం.చాహల్ చర్య నిజమని తేలితే ఐపీఎల్ నిర్వాహకులు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనేది ఆసక్తిగా మారింది. అయితే దీనిపై చాహల్ నుంచి కానీ, అటు పంజాబ్ కింగ్స్ జట్టు యాజమాన్యం కానీ ఇంకా స్పందించలేదు. అయితే ఈ వీడియో నకిలీదా లేక నిజమైనదా అన్నది తెలియాల్సి ఉంది. ఇక పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో అదరగొడుతోంది. తొలి అంచె పోటీల్లో ఒక్క మ్యాచ్లోనూ ఓడిన పంజాబ్ రెండో అంచె పోటీల్లో హ్యాట్రిక్ ఓటములను చవిచూసింది. బుధవారం ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో 236 పరుగుల భారీ టార్గెట్ను ఛేదించే క్రమంలో పంజాబ్ చతికిలపడింది. ప్రస్తుతం పంజాబ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. Look at Yuzvendra Chahal, man. He was risking everyone’s safety by vaping an e-cigarette inside the flight while Shashank Singh and other Punjab Kings players were around him. 👀This is totally unacceptable and highly risky for everyone. Such behavior violates flight safety… pic.twitter.com/YnXlPmPhjr— Sonu (@Cricket_live247) May 7, 2026చదవండి: కమిన్స్కు క్రికెట్ ఆస్ట్రేలియా భారీ ఆఫర్! -
కమిన్స్కు క్రికెట్ ఆస్ట్రేలియా భారీ ఆఫర్!
ఆస్ట్రేలియా క్రికెటర్, సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆస్ట్రేలియా వన్డే, టెస్టు కెప్టెన్గా ఉన్న కమిన్స్ను ప్రైవేటు లీగ్లు ఆడకుండా జట్టుతోనే ఎక్కువగా అట్టిపెట్టుకోవాలని భావిస్తున్న క్రికెట్ ఆస్ట్రేలియా అతడికి మూడేళ్ల కాలానికి గాను 12 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 113 కోట్లు) అందించనుంది. ఈ మేరకు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ తమ కథనంలో పేర్కొంది. ఈ ఆఫర్కు కమిన్స్ ఓకే చెబితే మాత్రం ఏడాదికి 4 మిలియన్ డాలర్ల చొప్పున అందుకోనున్నాడు. ఆస్ట్రేలియా తరఫున ఆడడం మానేసి గ్లోబల్ టీ20 లీగ్ల్లో తమకు ప్రాతినిధ్యం వహించేందుకు ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీ కమిన్స్కు 10 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు రూ.62.22కోట్లు) ఆఫర్ ఇచ్చిందన్న వార్తల నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కొత్త ఒప్పందం ప్రకారం కమిన్స్ ఆడే మ్యాచ్ల సంఖ్యతో సంబంధం లేకుండా ఈ భారీ మొత్తం అందుతుంది. ప్రస్తుతం ప్రపం చవ్యాప్తంగా వివిధ దేశాల్లో జరుగుతున్న ప్రైవేట్ టీ20 లీగ్ల (ముఖ్యంగా బిగ్బాష్, ఐపీఎల్, ఎంఎల్సీ) హవా పెరిగిపోవడంతో, టాప్ క్లాస్ ఆటగాళ్లు జాతీయ జట్టుకు దూరమయ్యే ప్రమాదం ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా ఆందోళన చెందుతోంది.ముఖ్యంగా ఆస్ట్రేలియాను ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్, వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిపిన కమిన్స్ను ఇతర లీగ్ల వైపు వెళ్లకుండా, కేవలం జాతీయ జట్టు అవసరాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేలా క్రికెట్ ఆస్ట్రేలియా ఈ మెగా డీల్ను రూపొందించినట్లు తెలుస్తోంది.ఇదే విషయమై క్రికెట్ ఆస్ట్రేలియా హెడ్ ఆఫ్ క్రికెట్ జేమ్స్ ఆల్సోప్ స్పందించారు. ‘కమిన్స్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లను కాపాడుకోవడం మాకు అవసరం. మూడు ఫార్మాట్లు (టెస్టు, వన్డే, టీ20లు) ఆడే పాట్ కమిన్స్, జోష్ హేజిల్వుడ్ వంటి స్టార్లకు ఇప్పుడు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. అందుకే వారిని ఇతర క్రికెట్ లీగ్లవైపు ఆకర్షణకు గురవ్వకుండా ఆస్ట్రేలియా క్రికెట్కు కట్టుబడి ఉండేలా చూడటం మా ప్రధాన లక్ష్యం’ అని వివరించారు.ఇక ఐపీఎల్ 2026 సీజన్లో పాట్ కమిన్స్ సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి సీజన్కు లేటుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ కమిన్స్ తన విలువను చూపిస్తున్నాడు. సీజన్లో భాగంగా బుధవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కమిన్స్ రెండు కీలక వికెట్లు తీసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. పంజాబ్పై విజయంతో ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ టేబుల్ టాపర్గా నిలిచింది. చదవండి: ‘ఎవరి తరం కాలేదు.. ఆ ఫీట్ను శ్రేయస్ సాధిస్తాడు’ -
సన్రైజర్స్ను ఆపడం కష్టమే..!
ఐపీఎల్ 2026లో సన్రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ రేసులో అన్ని జట్లకంటే ముందుకొచ్చింది. తాజాగా పంజాబ్ కింగ్స్ను ఓడించడంతో పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానానికి దూసుకొచ్చింది. ఇకపై ఆడాల్సిన మూడు మ్యాచ్ల్లో రెండు గెలిచినా, ఆ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్ల్లో 7 విజయాలు సాధించిన సన్రైజర్స్.. సెకెండ్ బెస్ట్ రన్రేట్తో (0.737) 14 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. తదుపరి 3 మ్యాచ్ల్లో సన్రైజర్స్ ప్రత్యర్దులు గుజరాత్, సీఎస్కే, ఆర్సీబీ. ఈ మూడు మ్యాచ్లు మే 12, 18, 22 తేదీల్లో అహ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్ వేదికలుగా జరుగనున్నాయి.ఇదిలా ఉంటే, ఈ సీజన్లో సన్రైజర్స్ ప్రయాణం తొలుత అంత సాఫీగా సాగలేదు. మొదటి 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్ల్లో ఓటమిపాలై, ఢీలాగా ఉండింది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడం ఈ జట్టుపై భారీ ప్రభావం చూపించింది. అయితే ఐదో మ్యాచ్ నుంచి తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్ జట్టును గాడిలోకి తెచ్చాడు. వ్యక్తిగతంగా సత్తా చాటడంతో పాటు జట్టును విజయపథంలో నడిపించసాగాడు. ఇషాన్ సారథ్యంలో మొదటి 4 మ్యాచ్ల్లో మూడింట ఓడిన సన్రైజర్స్.. ఆతర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించి గాడిలో పడింది.అయితే సన్రైజర్స్కు అసలు బ్రేక్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ తిరిగొచ్చిన తర్వాతే వచ్చింది. అప్పటిదాకా బౌలింగ్లో బలహీనంగా ఉండిన సన్రైజర్స్ కమిన్స్ రాకతో ఒక్కసారిగా బలపడినట్లైంది. కమిన్స్ వ్యక్తిగతంగా సత్తా చాటుతూ యువ బౌలర్లకు మార్గదర్శంగా నిలిచాడు. అప్పటికే సత్తా చాటుతున్న ఎషాన్ మలింగ కమిన్స్ సలహాలతో మరింత రెచ్చిపోసాగాడు. దేశీయ యువ పేసర్లు సాకిబ్ హుసేన్, ఫ్రఫుల్ హింగే కమిన్స్ మార్గదర్శకత్వంలో రాటుదేలారు. ఆల్రౌండర్ నితీశ్కుమార్ సైతం కమిన్స్ రాకతో సత్తా చాటడం ప్రారంభించాడు. ఈ ఐదురుగు నిలకడగా రాణిస్తుండటంతో సన్రైజర్స్ ప్రస్తుత ఎడిషన్లో అత్యంత ప్రమాదకర పేస్ బౌలింగ్ యూనిట్గా మారిపోయింది. వీరికి స్పిన్నర్ శివాంగ్ కుమార్ కూడా జతకలవడంతో సన్రైజర్స్ అత్యంత పటిష్టమైన బౌలింగ్ విభాగంగా తయారైంది.సీజన్ ప్రారంభంలో బ్యాటింగ్ అత్యంత పటిష్టంగా ఉన్నా, బౌలింగ్ విభాగం సరిగ్గా లేకపోవడం వల్లనే సన్రైజర్స్ అపజయాలు ఎదుర్కొంది. ఇప్పుడు బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా మారడంతో సన్రైజర్స్ తిరుగులేని జట్టుగా మారిపోయింది. కమిన్స్ వచ్చాక సన్రైజర్స్ నాలుగింట మూడు విజయాలు సాధించి, ప్లే ఆఫ్స్ రేసులో అందరికంటే ముందుకొచ్చింది.ఆరెంజ్ ఆర్మీ ఇదే జోరును కొనసాగిస్తే మరో టైటిల్ ఖాయం. మొత్తంగా కమిన్స్ రాక సన్రైజర్స్లో కాకను మరింత పెంచింది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా నిలబెట్టింది. జట్టులో అందరూ గెలుపు కోసం తమవంతు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా బ్యాటింగ్లో టాపార్డర్ అంతా నిలకడగా రాణిస్తున్నారు. ప్రస్తుతం టాప్-4 లీడింగ్ రన్ స్కోరర్లలో ముగ్గురు (క్లాసెన్, అభిషేక్, ఇషాన్) సన్రైజర్సే ఉన్నారు. ఈ ముగ్గురు ప్రత్యర్ది బౌలర్ల పాలిట సింహస్వప్నాల్లా మారారు. బౌలింగ్లో ఎషాన్ మలింగ చెలరేగిపోతున్నారు. ఇతనికి కమిన్స్ జతకలిశాడు. కమిన్స్ కెప్టెన్గానే కాకుండా వ్యక్తిగతంగానూ అద్భుతంగా రాణిస్తున్నాడు. నిన్నటి పంజాబ్ మ్యాచ్లో పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా రెండు కీలక వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. సన్రైజర్స్ శిబిరంలో మరో అన్ సంగ్ హీరో కూడా ఉన్నాడు. అతడే నితీశ్ కుమార్ రెడ్డి. నితీశ్ ఈ సీజన్లో చాలా అగ్రెసివ్గా కనిపిస్తున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తన పాత్రకు న్యాయం చేస్తున్నాడు.సీజన్ ప్రారంభంలో దారుణంగా విఫలమైన ట్రవిస్ హెడ్ కీలక దశలో ఫామ్లోకి రావడం సన్రైజర్స్కు అదనంగా కలిసొస్తున్న అంశం. హెడ్ గత మూడు మ్యాచ్ల్లో తనదైన శైలిలో రెచ్చిపోయాడు. ఇలా ఒకరు కాకపోతే ఒకరు బాధ్యతలను భుజాన వేసుకుంటుండంతో సన్రైజర్స్ తిరుగులేని జట్టుగా మారిపోయింది. ఇది కొనసాగితే ఆ జట్టుకు మరో టైటిల్ ఖాయం. -
దేవజిత్ సైకియా ఆకస్మిక రాజీనామా
బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కీలక నిర్ణయం తీసుకున్నారు. అసోం రాష్ట్ర అడ్వకేట్ జనరల్ పదవికి ఆకస్మికంగా రాజీనామా చేశారు. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.అసోం ముఖ్యమంత్రి హేమంత బిస్వ శర్మ ప్రభుత్వంలో దాదాపు ఐదేళ్ల పాటు అడ్వకేట్ జనరల్గా సేవలందించిన దేవజిత్ సైకియా.. రాజ్యాంగ సంప్రదాయాలను గౌరవిస్తూ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పదవీకాలం ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.క్రికెట్తో పాటు న్యాయరంగంలోనూ సైకియా ప్రత్యేక గుర్తింపు పొందారు. అసోంకు చెందిన ఆయన గతంలో రాష్ట్ర రంజీ జట్టుకు వికెట్కీపర్, మిడిలార్డర్ బ్యాటర్గా సేవలందించారు. అనంతరం న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టి గౌహతి హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 2021లో అసోం రాష్ట్రంలోనే అత్యంత పిన్న వయస్కుడైన అడ్వకేట్ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు.ఇక క్రికెట్ పరిపాలనలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. అసోం క్రికెట్ అసోసియేషన్లో వివిధ హోదాల్లో పని చేసి.. 2022లో బీసీసీఐ జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. అనంతరం జై షా ఐసీసీ చైర్మన్గా వెళ్లిన తర్వాత బీసీసీఐ కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. -
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
సన్రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ మరో అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్తో నిన్న (మే 6) జరిగిన మ్యాచ్లో 13 బంతుల్లో 4 సిక్సర్లు, 2 బౌండరీల సాయంతో 35 పరుగులు చేసి బీభత్సం సృష్టించిన అతను.. విండీస్ విధ్వంసకర యోధుడు క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు.ఓపెనర్గా ఐపీఎల్లో 200కు పైగా స్ట్రైక్రేట్తో అత్యధిక సార్లు 30+ స్కోర్లు నమోదు చేసిన బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు అతడు 14 సార్లు ఈ ఫీట్ను సాధించి గేల్ (13) రికార్డును అధిగమించాడు. నిన్నటి మ్యాచ్లో అభిషేక్ స్ట్రైక్రేట్ ఏకంగా 269.23గా ఉండింది. గత సీజన్ నుంచి అభిషేక్ ప్రత్యర్ది బౌలర్లను షేక్ చేస్తున్నాడు. భయంలేని బ్యాటింగ్తో మెరుపు ఆరంభాలు అందిస్తూ.. జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు భారీ సిక్సర్లతో విరుచుకుపడుతూ బౌలర్ల పాలిట సింహస్వప్నంలా మారాడు. పవర్ప్లేలోనే మ్యాచ్ గమనాన్ని మార్చేస్తూ.. ప్రత్యర్దులను పోరాడే అవకాశం కూడా ఇవ్వడం లేదు.ఈ సీజన్లో అభిషేక్ విధ్వంసం పతాకస్థాయిలో ఉంది. 11 మ్యాచ్ల్లో అతడు 210.18 స్ట్రైక్రేట్తో 475 పరుగులు చేశాడు. ఇందులో 36 సిక్సర్లు, 43 బౌండరీలు, ఓ సెంచరీ, 3 అర్ద సెంచరీలు ఉన్నాయి. అభిషేక్ దూకుడు కారణంగా హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్ రేసులో బలంగా నిలిచింది. నిన్న పంజాబ్తో జరిగిన మ్యాచ్లో అభిషేక్ మెరుపు ఆరంభం ఇవ్వడంతో హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. అనంతరం బౌలర్లు సత్తా చాటడంతో లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. ఈ గెలుపుతో హైదరాబాద్ పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానానికి ఎగబాకి, ప్లే ఆఫ్స్ బెర్త్ను దాదాపుగా ఖరారు చేసుకుంది. -
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2027 సిరీస్ షెడ్యూల్ను క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా ప్రకటించింది. ఐదు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్ కోసం భారత్లో పర్యటించనున్న ఆస్ట్రేలియా.. వచ్చే ఏడాది జనవరి 21న తొలి టెస్ట్ ఆడనుంది. ఈ మ్యాచ్ నాగ్పూర్ వేదికగా జరుగనుంది.అనంతరం జనవరి 29 నుండి చెన్నై వేదికగా రెండో టెస్ట్.. ఫిబ్రవరి 11 నుండి గౌహతి వేదికగా మూడో టెస్ట్.. ఫిబ్రవరి 19 నుండి రాంచీ వేదికగా నాలుగో టెస్ట్.. ఫిబ్రవరి 27 నుండి అహ్మదాబాద్ వేదికగా ఐదో టెస్ట్ ఆడనుంది.కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2027 తేదీల ప్రకటనతో పాటు భారత పర్యటనలోని మరిన్ని సిరీస్ల వివరాలను కూడా క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. బీజీటీ 2027కు ముందు ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత ఏ జట్టుతో మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడనుంది.అలాగే ఆస్ట్రేలియా మహిళల ఏ జట్టు, పురుషుల అండర్-19 జట్టు కూడా సంబంధిత జట్లతో మల్టీ ఫార్మాట్ సిరీస్లు ఆడనుంది. ఈ సిరీస్లకు సంబంధించిన షెడ్యూల్ ఇలా ఉంది.ఆస్ట్రేలియా-ఏతో సిరీస్సెప్టెంబర్ 22- తొలి మల్టీ డే మ్యాచ్ (పుదుచ్చేరి)సెప్టెంబర్ 29- రెండో మల్టీ డే మ్యాచ్ (పుదుచ్చేరి)అక్టోబర్ 6- తొలి వన్డే (పుదుచ్చేరి)అక్టోబర్ 9- రెండో వన్డే (పుదుచ్చేరి)అక్టోబర్ 11- మూడో వన్డే (పుదుచ్చేరి)అండర్-19 జట్టుతో సిరీస్భారత అండర్-19 జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో మూడు వన్డేలు, రెండు మల్టీ డే మ్యాచ్లు ఆడనుంది.సెప్టెంబర్ 18- తొలి వన్డే (రాజ్కోట్)సెప్టెంబర్ 21- రెండో వన్డే (రాజ్కోట్)సెప్టెంబర్ 23- మూడో వన్డే (రాజ్కోట్)సెప్టెంబర్ 27- తొలి మల్టీ డే మ్యాచ్ (రాజ్కోట్)అక్టోబర్ 5- రెండో మల్టీ డే మ్యాచ్ (అహ్మదాబాద్)మహిళల ఏ జట్టుతో సిరీస్ఆస్ట్రేలియా జట్టుతో భారత మహిళల ఏ జట్టు సెప్టెంబర్లో మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడనుంది. ఇందులో 3 టీ20లు (సెప్టెంబర్ 12, 15, 17-మొహాలి), 3 వన్డేలు (20, 23, 25- ధర్మశాల), ఓ మల్టీ డే మ్యాచ్ (29- ధర్మశాల) జరుగనున్నాయి. -
మళ్లీ యాక్షన్లోకి కేన్ మామ
ఐర్లాండ్, ఇంగ్లండ్ జట్లతో త్వరలో జరుగబోయే టెస్ట్ సిరీస్ల కోసం న్యూజిలాండ్ జట్టును నిన్న (మే 6) ప్రకటించారు. ఈ జట్లకు కెప్టెన్గా టామ్ లాథమ్ నియమితుడు కాగా.. గాయాల నుంచి కోలుకున్న ఫాస్ట్ బౌలర్లు కైల్ జేమీసన్, విలియమ్ ఓ రూర్కీ, వెటరన్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ జట్టులోకి తిరిగి వచ్చారు.రెండేళ్ల తర్వాత అవకాశం2024 ఫిబ్రవరిలో వెన్నెముక గాయం కారణంగా టెస్టులకు దూరమైన కైల్ జేమీసన్ ఇప్పుడు మళ్లీ జట్టులోకి వచ్చాడు. 19 టెస్టుల్లో 80 వికెట్లు తీసి అద్భుత రికార్డు కలిగిన జేమీసన్పై న్యూజిలాండ్ జట్టుకు భారీ అంచనాలు ఉన్నాయి.24 ఏళ్ల రూర్కీ సైతం గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చాడు. అతడు ఇప్పటికే 11 టెస్టుల్లో 39 వికెట్లు సాధించి మంచి జోరుమీదున్నాడు. స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ఇటీవలికాలంలో తరుచూ గాయాల బారిన పడుతూ జట్టులోకి వచ్చీ పోతున్నాడు. రాబోయే సిరీస్ల్లో కేన్ కూడా న్యూజిలాండ్కు కీలకం కానున్నాడు.బలమైన పేస్ దళంఐర్లాండ్, ఇంగ్లండ్తో సిరీస్ల కోసం న్యూజిలాండ్ భారీ పేస్ దళాన్ని ఎంపిక చేసింది. జట్టులో మ్యాట్ హెన్రీ, జకరీ ఫౌల్క్స్, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్ లాంటి భయంకరమైన పేసర్లు ఉన్నారు.తొలి పిలుపుసెంట్రల్ డిస్ట్రిక్ట్స్ ఆల్రౌండర్ డీన్ ఫాక్స్క్రాఫ్ట్కు తొలిసారి టెస్టు జట్టులో అవకాశం లభించింది. డీన్.. దేశవాళీ క్రికెట్లో నిలకడైన ప్రదర్శనలతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.కీలక గైర్హాజరీలు- జేకబ్ డఫీ తన తొలి బిడ్డ జననం కారణంగా ఎంపికకు అందుబాటులో లేడు.- మైఖేల్ బ్రేస్వెల్ టెస్టు క్రికెట్కు తాత్కాలికంగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.- మిచెల్ సాంట్నర్ భుజ గాయం నుంచి కోలుకుంటున్నాడు.కాగా, న్యూజిలాండ్ జట్టు ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం ఐర్లాండ్.. మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఐర్లాండ్తో మ్యాచ్ బెల్ఫాస్ట్ వేదికగా మే 27న మొదలు కానుండగా.. ఇంగ్లండ్తో మూడు టెస్ట్లు లార్డ్స్, కెన్నింగ్టన్ ఓవల్, ట్రెంట్బ్రిడ్జ్ వేదికలుగా జూన్ 4, 17, 25 తేదీలోల ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్, ఈ రెండు సిరీస్లను కీలకంగా భావిస్తోంది. ముందున్న భారత్, ఆస్ట్రేలియా, శ్రీలంక, పాకిస్థాన్ సిరీస్లను దృష్టిలో పెట్టుకుని బలమైన జట్టును సిద్ధం చేసుకుంటుంది.ఐర్లాండ్ టెస్ట్ కోసం న్యూజిలాండ్ జట్టు:టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), క్రిస్టియన్ క్లార్క్, డెవాన్ కాన్వే, జాక్ ఫౌల్క్స్, డీన్ ఫాక్స్క్రాఫ్ట్, మాట్ హెన్రీ, కైల్ జామిసన్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, విల్ ఓ'రూర్క్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ రే, రాచిన్ రవీంద్ర, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు:టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), డెవాన్ కాన్వే, జాక్ ఫౌల్క్స్, డీన్ ఫాక్స్క్రాఫ్ట్*, మాట్ హెన్రీ, కైల్ జామిసన్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, విల్ ఓ'రూర్క్, గ్లెన్ ఫిలిప్స్, రాచిన్ రవీంద్ర, నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్, కేన్ విలియమ్సన్ఇంగ్లాండ్ పర్యటనకు ట్రావెలింగ్ రిజర్వ్: బెన్ సియర్స్ -
టీమిండియా చారిత్రక సిరీస్ షెడ్యూల్ విడుదల
వివిధ విభాగాల్లో భారత క్రికెట్ జట్ల ద్వైపాక్షిక సిరీస్ల షెడ్యూల్ను బీసీసీఐ నిన్న (మే 6) విడుదల చేసింది. పురుషులు, మహిళలు, ఏ-జట్లు, అండర్-19 జట్ల మ్యాచ్లకు వేదికలు, తేదీలను ఖరారు చేసింది. ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే భారత క్రికెట్ బిజీ షెడ్యూల్లోకి వెళ్లనుంది. ముఖ్యంగా భారత్-ఏ, మహిళల సీనియర్ టీమ్, అండర్-19 జట్లు వరుస సిరీస్లలో పాల్గొననున్నాయి.ఆస్ట్రేలియా-ఏతో సిరీస్ఆస్ట్రేలియా-ఏ జట్టు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో భారత్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్-ఏ జట్టుతో రెండు మల్టీ డే మ్యాచ్లు, మూడు వన్డేలు ఆడనుంది.సెప్టెంబర్ 22- తొలి మల్టీ డే మ్యాచ్ (పుదుచ్చేరి)సెప్టెంబర్ 29- రెండో మల్టీ డే మ్యాచ్ (పుదుచ్చేరి)అక్టోబర్ 6- తొలి వన్డే (పుదుచ్చేరి)అక్టోబర్ 9- రెండో వన్డే (పుదుచ్చేరి)అక్టోబర్ 11- మూడో వన్డే (పుదుచ్చేరి)అండర్-19 జట్టుకు ఆస్ట్రేలియా సవాల్భారత అండర్-19 జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో మూడు వన్డేలు, రెండు మల్టీ డే మ్యాచ్లు ఆడనుంది.సెప్టెంబర్ 18- తొలి వన్డే (రాజ్కోట్)సెప్టెంబర్ 21- రెండో వన్డే (రాజ్కోట్)సెప్టెంబర్ 23- మూడో వన్డే (రాజ్కోట్)సెప్టెంబర్ 27- తొలి మల్టీ డే మ్యాచ్ (రాజ్కోట్)అక్టోబర్ 5- రెండో మల్టీ డే మ్యాచ్ (అహ్మదాబాద్)చారిత్రక సిరీస్భారత్.. జింబాబ్వే మహిళల జట్టుకు తొలిసారి ఓ ద్వైపాక్షిక సిరీస్ కోసం ఆతిథ్యమివ్వనుంది. టీ20, వన్డే ఫార్మాట్లలో జరిగే ఈ సిరీస్ అక్టోబర్లో జరుగనుంది. ఈ సిరీస్లో తొలుత టీ20లు, ఆతర్వాత వన్డేలు జరుగనున్నాయి. టీ20లకు రాయ్పూర్, వన్డేలకు బరోడా ఆతిథ్యమివ్వనుంది.అక్టోబర్ 16- తొలి టీ20అక్టోబర్ 18- రెండో టీ20అక్టోబర్ 20- మూడో టీ20అక్టోబర్ 23- తొలి వన్డేఅక్టోబర్ 25- రెండో వన్డేఅక్టోబర్ 28- మూడో వన్డేమహిళల ఏ జట్టు vs ఆస్ట్రేలియాఆస్ట్రేలియా జట్టుతో భారత మహిళల ఏ జట్టు సెప్టెంబర్లో మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడనుంది. ఇందులో 3 టీ20లు (సెప్టెంబర్ 12, 15, 17-మొహాలి), 3 వన్డేలు (20, 23, 25- ధర్మశాల), ఓ మల్టీ డే మ్యాచ్ (29- ధర్మశాల) జరుగనున్నాయి.మహిళల ఏ జట్టు vs ఇంగ్లండ్ఇంగ్లండ్ జట్టుతో భారత మహిళల ఏ జట్టు నవంబర్-డిసెంబర్లో మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడనుంది. ఇందులో 3 టీ20లు (నవంబర్ 30, డిసెంబర్ 3, 5- పూణే), 3 వన్డేలు (డిసెంబర్ 8, 11, 14- నవీ ముంబై), ఓ మల్టీ డే మ్యాచ్ (డిసెంబర్ 19- నవీ ముంబై) జరుగనున్నాయి.మహిళల అండర్-19 జట్టు vs శ్రీలంకశ్రీలంక అండర్-19 జట్టు జూన్లో భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో 3 టీ20లు (జూన్ 22, 24, 27- చెన్నై), 3 వన్డేలు (జూన్ 30, జులై 3, 6- పుదుచ్చేరి) జరుగనున్నాయి.మహిళల అండర్-19 జట్టు vs ఇంగ్లండ్ఇంగ్లండ్ అండర్-19 జట్టు నవంబర్-డిసెంబర్లో భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో 5 టీ20లు (నవంబర్ 26, 28 (బరోడా), డిసెంబర్ 1, 3, 6 (సూరత్)) జరుగనున్నాయి. -
పాక్ పర్యటనకు ఆస్ట్రేలియా.. షెడ్యూల్ విడుదల
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మరోసారి పాకిస్తాన్ పర్యటనకు సిద్ధమైంది. మే-జూన్ నెలల్లో జరిగే ఈ పర్యటనలో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్కు సంబంధించిన షెడ్యూల్ ఇవాళ విడుదలైంది.తొలి వన్డే మే 30న రావల్సిండిలో జరుగనుండగా.. మిగతా వన్డేలు జూన్ 2, 4 తేదీల్లో లాహోర్లోని గడాఫీ స్టేడియంలో జరుగనున్నాయి. ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా మే 23న ఇస్లామాబాద్ చేరుకోనుంది.స్టార్ ఆటగాళ్లపై సందేహాలుపాక్ సిరీస్ ఐపీఎల్ ముగింపు సమయానికి ప్రారంభమవుతుండటంతో ఆసీస్ ఆటగాళ్ల లభ్యతపై సందేహాలు నెలకొన్నాయి. కెప్టెన్ పాట్ కమిన్స్ సహా పలువురు సీనియర్ ఆటగాళ్ల అందుబాటుపై స్పష్టత లేదు.ప్రపంచకప్కు ముందు టీ20 సిరీస్ఆస్ట్రేలియా జట్టు ఈ ఏడాది జనవరిలో, టీ20 ప్రపంచకప్కు ముందు కూడా పాకిస్తాన్లో పర్యటించింది. ఆ పర్యటనలో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడింది. ఆ సిరీస్ను పాక్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేయడం విశేషం.బంగ్లాదేశ్ చేతిలో ఓటమిఇటీవల పాక్ బంగ్లాదేశ్ చేతిలో 2-1 తేడాతో వన్డే సిరీస్ కోల్పోయింది. ఈ సిరీస్ కోసం పాక్ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లింది.రేపటి నుంచి టెస్ట్ సిరీస్ప్రస్తుతం పాక్ జట్టు రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం బంగ్లాదేశ్లో పర్యటిస్తుంది. తొలి టెస్ట్ ఢాకా వేదికగా రేపటి నుండి ప్రారంభం కానుంది. రెండో టెస్ట్ సిల్హెట్ వేదికగా మే 16 నుండి మొదలవుతుంది.తర్వాత బంగ్లాదేశ్ టూర్పాకిస్తాన్ సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా జట్టు జూన్ 9 నుంచి బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్ల సిరీస్లు జరుగనున్నాయి. -
ఓపెనర్ల శతకాలు.. చారిత్రక విజయం సాధించిన పాక్
మహిళల క్రికెట్లో పాకిస్తాన్ అద్భుత విజయం సాధించింది. స్వదేశంలో జరిగిన వన్డేలో పసికూన జింబాబ్వేపై 206 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. పాక్ మహిళల క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇదే అతి భారీ విజయం. ఈ గెలుపుతో పాక్ సిరీస్ను కూడా కైవసం చేసుకుంది.జింబాబ్వే తొలిసారి పాక్లో పర్యటిస్తున్న చారిత్రక సిరీస్ ఇది. ఈ పర్యటనలో జింబాబ్వే 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. వన్డే సిరీస్లో భాగంగా జరిగిన రెండో వన్డే ఇది. అంతకుముందు తొలి వన్డేలోనూ పాకిస్తానే విజయం సాధించింది (168 పరుగుల తేడాతో). ఫలితంగా మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. నామమాత్రపు మూడో వన్డే కరాచీ వేదికగా మే 9న జరుగనుంది. అనంతరం 12, 14, 15 తేదీల్లో ఇదే కరాచీ వేదికగా మూడు టీ20లు జరుగనున్నాయి.ఓపెనర్ల శతకాలుతాజా వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 343 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు సదాఫ్ షమాస్ (101), గుల్ ఫెరోజా (100) సెంచరీలతో కదంతొక్కారు. వన్డౌన్ బ్యాటర్ సిద్రా అమీన్ (59 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించింది. మిగతా బ్యాటర్లలో కెప్టెన్ ఫాతిమా సనా 25, ఆలియా రియాజ్ 27, అయేషా జాఫర్ 18 (నాటౌట్) పరుగులు చేశారు.కుప్పకూలిన జింబాబ్వేభారీ లక్ష్య ఛేదనలో జింబాబ్వే 137 పరుగులకే ఆలౌటైంది. ఫాతిమా సనా (6-0-15-3), మొమినా రియాసత్ (8-0-39-2), రమీన్ షమీమ్ (8-2-20-2), సయ్యదా అరూబ్ షా (6-1-18-2), డయానా బేగ్ (7-1-23-1) జింబాబ్వే పతనాన్ని శాశించారు. ఆ జట్టు తరఫున కెలిస్ (32), బిజా (29), పసిపనోద్యా (33 నాటౌట్), లిండోకుహ్లే (20) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. -
ఐపీఎల్ ఫైనల్ పోయింది
బెంగళూరు: అనుకున్నట్లుగానే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన ఐపీఎల్ ఫైనల్ క్రికెట్ మ్యాచ్ మరోచోటుకు మారింది. గుజరాత్లో అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుందని బీసీసీఐ ప్రకటించడంతో బెంగళూరు క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ నెల 31న మ్యాచ్ జరగాల్సి ఉంది. ఎమ్మెల్యేలకు ఉచిత టికెట్లు, చిన్న స్టేడియం కావడం తదితర కారణాలతో మార్చేసినట్లు బీసీసీఐ ప్రకటించడం గమనార్హం. ఇటీవల చిన్నస్వామిలో భద్రతా సమస్యలు తలెత్తాయి. గతంలో తీవ్ర తొక్కిసలాట జరిగి అనేకమంది చనిపోవడం తెలిసిందే. ఇటీవల ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ సమయంలో సుమారు 240 కెమెరాలను పనిచేయలేదు.ఎమ్మెల్యేల టికెట్లకు లింకు లేదు: డీసీఎంఅహ్మదాబాద్లో పెద్ద స్టేడియం ఉంది. ఎక్కువ మంది ప్రేక్షకులు వస్తారని ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ను బెంగళూరు నుంచి అక్కడికి మార్చి ఉండవచ్చు అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. ఎమ్మెల్యేలకు ఉచిత టికెట్ల పంపిణీకి, మ్యాచ్ మార్పునకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఫైనల్ మ్యాచ్ వేదిక మార్పుపై వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. బీసీసీఐ పెద్దలు అలాగే మాట్లాడనీ, సరైన సమాధానం ఇస్తానన్నారు. -
శ్రేయస్ అయ్యర్ మరో టైటిల్ గెలిస్తే...
న్యూఢిల్లీ: ఐపీఎల్లో సారథిగా శ్రేయస్ అయ్యర్ రెండో టైటిల్ను గెలవగలిగితే అతను దిగ్గజ కెప్టెన్ల జాబితాలో చేరతాడని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. జియో స్టార్ ‘అవుట్ ఆర్ నాటౌట్’ కార్యక్రమంలో అయ్యర్ నాయకత్వ లక్షణాలను అతను ప్రశంసించాడు. ‘శ్రేయస్ అయ్యర్ మరో సీజన్లో తన టీమ్ను సమర్థంగా నడిపిస్తున్నాడు. అతను ఢిల్లీ, కోల్కతా, పంజాబ్... ఎక్కడ కెప్టెన్గా చేసినా తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ప్రదర్శించాడు. తన ఆటగాళ్లపై పూర్తి నమ్మకం ఉంచుతాడు. ప్రశాంతంగా తనకు కావాల్సింది రాబట్టగల సామర్థ్యం అతనికి ఉంది. మరో ట్రోఫీ గెలిస్తే ధోని, రోహిత్, గంభీర్ల సరసన శ్రేయస్ చేరతాడు’ అని ఇర్ఫాన్ వ్యాఖ్యానించాడు. -
ప్రతీకార విజయం.. టేబుల్ టాపర్గా ఎస్ఆర్హెచ్!
ఐపీఎల్ 2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) పంజాబ్ కింగ్స్పై ప్రతీకార విజయం సాధించింది. బుధవారం సొంతగడ్డపై పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 33 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 202 పరుగులకు పరిమితమైంది. కూపర్ కన్నోలీ (107 నాటౌట్) అజేయ శతకం వృథాగా మారింది. స్టోయినిస్ (28), సూర్యాంశ్ (25) పర్వాలేదనిపించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమిన్స్, శివాంగ్లు చెరో రెండు వికెట్లు తీయగా, నితీశ్కుమార్, మలింగ, సాకిబ్ హుస్సేన్ తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. క్లాసెన్ (69 ), ఇషాన్ కిషన్ (55) అర్థసెంచరీతో రాణించారు. అంతకముందు అభిషేక్ (35), హెడ్ (38) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 29 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, చాహల్, ఫెర్గూసన్, విజయ్కుమార్లు తలా ఒక వికెట్ తీశారు.ఇషాన్, క్లాసెన్ మెరుపులుటాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్కు ఓపెనర్లు అభిషేక్, హెడ్లు శుభారంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్కు 54 పరుగులు జోడించారు. అనంతరం వన్డౌన్లో వచ్చిన ఇషాన్ కిషన్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. ఇషాన్కు క్లాసెన్ తోడవ్వడంతో ఎస్ఆర్హెచ్ పరుగుల వరద పారింది. 55 పరుగులు చేసి ఇషాన్ ఔటైనా చివర్లో క్లాసెన్, నితీశ్రెడ్డిలు ధాటిగా ఆడడంతో ఎస్ఆర్హెచ్ 230 ప్లస్ స్కోరు సాధించింది.కొంపముంచిన టాపార్డర్..భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు ప్రబ్సిమ్రన్, ప్రియాన్ష్ ఆర్యలు తక్కువ స్కోర్లకే వెనుదిరగడం, ఫామ్లో ఉన్న కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా 5 పరుగులు చేసి ఔటవ్వడంతో పంజాబ్ కష్టాల్లో పడింది. ఈ దశలో కూపర్ కన్నోలి, స్టోయినిస్లు కాసేపు వికెట్లు పతనం అడ్డుకున్నారు. స్టోయినిస్, సూర్యాంశ్ ఔటైనప్పటికీ కూపర్ కన్నోలీ ఆఖరిదాకా నిలిచి అజేయ సెంచరీతో రాణించినప్పటికీ లాభం లేకపోయింది.పట్టికలో ఫస్ట్ ప్లేస్కుఇది ఎస్ఆర్హెచ్కు ఏడో విజయం కాగా.. 14 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు పంజాబ్ 10 మ్యాచ్ల్లో ఆరు విజయాలు, మూడు ఓటమలు కలిపి 13 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.A win that takes the team to the 𝘁𝗼𝗽 𝗼𝗳 𝘁𝗵𝗲 𝘁𝗮𝗯𝗹𝗲 🧡A comfortable 33-run victory at home that takes @Sunrisers to not just 2️⃣ more points but the first spot on the points table 👊🔥SCORECARD ▶️ https://t.co/8L0gAuxW78#TATAIPL | #KhelBindaas | #SRHvPBKS pic.twitter.com/gjgBIMUhG0— IndianPremierLeague (@IPL) May 6, 2026 -
ఎస్ఆర్హెచ్ ఓపెనర్ల అరుదైన ఫీట్!
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ రికార్డుల మీద రికార్డులు సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్, హెడ్లు శుభారంభం ఇవ్వగా.. ఆ తర్వాత మిడిలార్డర్లో ఇషాన్ కిషన్, క్లాసెన్, నితీశ్ కుమార్లు మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. ఇక ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ జంట ఒక అరుదైన ఫీట్ సాధించింది. ఈ సీజన్లో అభిషేక్, ట్రావిస్ హెడ్ జంట 627 పరుగులు సాధించింది. పంజాబ్తో మ్యాచ్లో తొలి వికెట్కు ఈ జంట 54 పరుగులు జోడించడం ద్వారా 600 ప్లస్ మార్కును దాటింది. తద్వారా ఒక సీజన్లో 500కు పైగా పరుగులు సాధించిన జోడీగా అభిషేక్-హెడ్ నిలిచారు. రెండో స్థానంలో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్-వైభవ్ సూర్యవంశీ (457 పరుగులు), గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుబ్మన్ గిల్-సాయి సుదర్శన్ జంట (402 పరుగులు) సాధించి మూడో స్థానంలో కొనసాగుతున్నారు.More than 600 runs as a pair when no one else has gone past 500 😲Abhishek Sharma and Travis Head miles ahead of everyone else 👏#TATAIPL | #KhelBindaas | #SRHvPBKS | @SunRisers pic.twitter.com/MAw6RNVxem— IndianPremierLeague (@IPL) May 6, 2026Combining power and elegance so effortlessly 😲🎥 Abhishek Sharma with two 6️⃣s that make you go WOW 🤩Updates ▶️ https://t.co/8L0gAuxW78#TATAIPL | #KhelBindaas | #SRHvPBKS | @SunRisers pic.twitter.com/ZkNRO3r5ZI— IndianPremierLeague (@IPL) May 6, 2026 -
రికార్డులు బద్దలు కొట్టిన క్లాసెన్
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. పంజాబ్తో మ్యాచ్లో 43 బంతుల్లో 69 పరుగులు సాధించిన క్లాసెన్ ఇన్నింగ్స్లో మూడు ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ తరఫున అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన క్రికెటర్ల జాబితాలో క్లాసెన్ చోటు సంపాదించాడు.ఎస్ఆర్హెచ్ తరఫున క్లాసెస్కు ఇది 14వ అర్థశతకం కాగా.. అభిషేక్ శర్మతో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. 18 హాఫ్ సెంచరీలతో కేన్ విలియమ్సన్ మూడో స్థానంలో, 19 అర్థశతకాలతో శిఖర్ దావన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మొదటి స్థానంలో డేవిడ్ వార్నర్ 42 అర్థశతకాలతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.అంతేకాదు క్లాసెన్ ఈ మ్యాచ్ ద్వారా మరో రికార్డు కూడా సాధించాడు. ఈ సీజన్లో ఇప్పటి దాకా 5 హాఫ్ సెంచరీలు బాది తొలి స్థానంలో నిలిచాడు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, ప్రబ్సిమ్రన్, అయ్యర్లు నాలుగు హాఫ్ సెంచరీలు సాధించి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు.ఎస్ఆర్హెచ్ పంజాబ్ కింగ్స్ ముందు 236 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. క్లాసెన్ (69 ), ఇషాన్ కిషన్ (55) అర్థసెంచరీతో రాణించారు. అంతకముందు అభిషేక్ (35), హెడ్ (38) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 29 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, చాహల్, ఫెర్గూసన్, విజయ్కుమార్లు తలా ఒక వికెట్ తీశారు.Finishing the innings with finesse 🤌🎥 Some delightful shots in the final over from Heinrich Klaasen to finish 69 (43) 👏👏Updates ▶️ https://t.co/8L0gAuxW78#TATAIPL | #KhelBindaas | #SRHvPBKS | @SunRisers pic.twitter.com/jbmQ02eo0h— IndianPremierLeague (@IPL) May 6, 2026 చదవండి: పంజాబ్ అంటేనే అభిషేక్కు పూనకం! -
పంజాబ్ అంటేనే అభిషేక్కు పూనకం!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ మరోసారి చెలరేగింది. తొలి అంచె పోటీలో అభిషేక్ మెరుపు సెంచరీతో భారీ స్కోరు సాధించినప్పటికీ ఆ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ పంజాబ్ చేతిలో ఓటమి చవిచూసింది. అయితే రెండో అంచె పోటీలో భాగంగా సొంతగడ్డపై ఎలాగైనా పంజాబ్పై పైచేయి సాధించాలని భావిస్తున్న ఎస్ఆర్హెచ్ భారీ స్కోరు చేసింది. ఈ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ పంజాబ్తో మ్యాచ్లో మరోసారి చెలరేగాడు. పంజాబ్తో మ్యాచ్ అంటేనే పూనకం వచ్చినట్లుగా చెలరేగిపోతున్నాడు. మ్యాచ్లో ఎక్కువ సేపు నిలవనప్పటికీ ఉన్నంత సేపు అభిషేక్ (13 బంతుల్లో 35, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) దడదడలాడించాడు. 👉 ఈ నేపథ్యంలో పంజాబ్పై గత నాలుగు మ్యాచ్ల్లోనూ అభిషేక్ పరుగుల వరద పారించాడు. అభిషేక్ వరుసగా 66, 141, 74, 35 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్పై 200 ప్లస్ స్కోరు సాధించడం ఎస్ఆర్హెచ్కు ఇది ఎనిమిదోసారి. 👉ముంబై ఇండియన్స్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్పై ఎనిమిది సార్లు 200 ప్లస్ స్కోర్లు సాధించడం విశేషం. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 17 సిక్సర్లు కొట్టింది. ఐపీఎల్లో పంజాబ్తో మ్యాచ్లో ఒక ఇన్నింగ్స్లో ఎస్ఆర్హెచ్ అత్యధిక సిక్సర్లు కొట్టడం ఇదే తొలిసారి.👉 ఇక ఐపీఎల్లో 220 ప్లస్ స్కోరు చేయడం ఎస్ఆర్హెచ్కు ఇది పదోసారి. అయితే ఈ పదిసార్లు ఎస్ఆర్హెచ్నే విజయం వరించడం విశేషం.మ్యాచ్ విషయానికొస్తే.. ఎస్ఆర్హెచ్ పంజాబ్ కింగ్స్ ముందు 236 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. క్లాసెన్ (69 ), ఇషాన్ కిషన్ (55) అర్థసెంచరీతో రాణించారు. అంతకముందు అభిషేక్ (35), హెడ్ (38) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 29 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, చాహల్, ఫెర్గూసన్, విజయ్కుమార్లు తలా ఒక వికెట్ తీశారు.Combining power and elegance so effortlessly 😲🎥 Abhishek Sharma with two 6️⃣s that make you go WOW 🤩Updates ▶️ https://t.co/8L0gAuxW78#TATAIPL | #KhelBindaas | #SRHvPBKS | @SunRisers pic.twitter.com/ZkNRO3r5ZI— IndianPremierLeague (@IPL) May 6, 2026చదవండి: ‘ఎవరి తరం కాలేదు.. ఆ ఫీట్ను శ్రేయస్ సాధిస్తాడు’ -
‘ఎవరి తరం కాలేదు.. ఆ ఫీట్ను శ్రేయస్ సాధిస్తాడు’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్లు విజయవంతమైన కెప్టెన్లుగా ముద్రపడ్డారు. ఇందులో ధోని, రోహిత్లు ఐదేసి సార్లు ఐపీఎల్ ట్రోఫీలు అందుకోగా.. గంభీర్ సారథ్యంలో కేకేఆర్ రెండుసార్లు ఐపీఎల్ టైటిల్స్ అందుకుంది. తాజాగా వీరి సరసన చేరేందుకు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సిద్ధమవుతున్నాడు. 2024లో కేకేఆర్కు మూడోసారి టైటిల్ అందించిన శ్రేయస్ లక్కీ కెప్టెన్గా మారిపోయాడు. జట్లు మారినప్పటికీ తన కెప్టెన్సీ, ఆటతీరుతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్గా అయ్యర్ పేరు సంపాదించాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ను అయ్యర్ విజేతగా నిలబెడితే ధోని, రోహిత్ శర్మను కూడా అధిగమిస్తాడని మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. జియో హాట్స్టార్కు ఇంటర్య్వూ ఇచ్చిన పఠాన్ మాట్లాడుతూ.. 'ధోని, రోహిత్, గంభీర్ వంటి అత్యుత్తమ ఐపీఎల్ కెప్టెన్లను దాటుకొని మరీ తొలి స్థానంలో నిలుస్తాడు. ఎందుకంటే ధోని, రోహిత్, గంభీర్లు ఒకే జట్టుకు టైటిల్స్ అందించారు. కానీ అయ్యర్ మాత్రం ఇప్పటికే కేకేఆర్కు టైటిల్ అందించాడు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్కు కూడా టైటిల్ అందిస్తే వేర్వేరు జట్లకు టైటిల్స్ అందించిన తొలి కెప్టెన్గా అయ్యర్ నిలవనున్నాడు. అంతేకాదు ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్, పంజాబ్ ఇలా మూడు వేర్వేరు జట్లను కూడా ఐపీఎల్లో ఫైనల్ చేర్చిన ఘనత అయ్యర్ సొంతం. ఒకవేళ అయ్యర్ ఈ సీజన్లో అది సాధిస్తే మాత్రం అతడి రికార్డు చెరిగిపోనిదిగా మిగిలిపోతుంది' అని పఠాన్ పేర్కొన్నాడు.ఇక ఐపీఎల్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్కు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న అయ్యర్ 2020 సీజన్లో ఆ జట్టును రన్నరప్గా నిలిపాడు. ఆ తర్వాత కేకేఆర్కు మారిన శ్రేయస్ అయ్యర్ 2024 సీజన్లో ఆ జట్టును చాంపియన్గా నిలిపాడు. 2025 సీజన్లో పంజాబ్ను ఫైనల్ చేర్చిన అయ్యర్ 2026 సీజన్లోనూ ఆ జట్టును టైటిల్ దిశగా అడుగులు వేయిస్తున్నాడు. పంజాబ్ తరఫున 33 మ్యాచ్లు, ఢిల్లీ తరఫున 41 మ్యాచ్లు, కేకేఆర్ తరఫున 29 మ్యాచ్లకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా పనిచేశాడు. అతని సక్సెస్ రేటు 90 శాతం ఉండడం గమనార్హం.చదవండి: ‘ఏం పాపం చేశాం.. ఇదేనా మాకిచ్చే విలువ!’ -
IPL 2026: పంజాబ్పై ఎస్ఆర్హెచ్ గెలుపు
పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 33 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 202 పరుగులకు పరిమితమైంది. కూపర్ కన్నోలీ (107 నాటౌట్) అజేయ శతకం వృథాగా మారింది. స్టోయినిస్ (28), సూర్యాంశ్ (25) పర్వాలేదనిపించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమిన్స్, శివాంగ్లు రెండు వికెట్లు తీయగా.. నితీశ్కుమార్, మలింగ, సాకిబ్ హుస్సేన్ తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది.ఐదో వికెట్ కోల్పోయిన పంజాబ్ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన సూర్యాంశ్ కమిన్స్ బౌలింగ్లో అభిషేక్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 12 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 114 పరుగులుచేసింది.నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో పంజాబ్ కష్టాల్లో పడింది. 28 పరుగులు చేసిన మార్కస్ స్టోయినిస్ శివాంగ్ కుమార్ బౌలింగ్లో కీపర్ ఇషాన్ కిషన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో నాలుగో వికెట్ కోల్పోయింది. 7 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ 4 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది.శ్రేయస్ (5) ఔట్.. మూడో వికెట్ డౌన్భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తోంది. 5 పరుగులు చేసిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇషాన్ మలింగ బౌలింగ్లో ఔట్ అవ్వడంతో పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది.పంజాబ్కు షాక్.. ఓపెనర్లిద్దరు ఔట్236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్కు ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లో కమిన్స్ బౌలింగ్లో ఒక్క పరుగు చేసిన ప్రియాన్ష్ ఆర్య మలింగకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 2వ ఓవర్ తొలి బంతికే నితీశ్ కుమార్ బౌలింగ్ ప్రబ్సిమ్రన్ (3) ఔట్ అయ్యాడు.పంజాబ్ టార్గెట్ 236 పరుగులుఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ పంజాబ్ కింగ్స్ ముందు 236 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. క్లాసెన్ (69 ), ఇషాన్ కిషన్ (55) అర్థసెంచరీతో రాణించారు.అంతకముందు అభిషేక్ (35), హెడ్ (38) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 29 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, చాహల్, ఫెర్గూసన్, విజయ్కుమార్లు తలా ఒక వికెట్ తీశారు.క్లాసెన్ అర్థసెంచరీ.. ఎస్ఆర్హెచ్ 212-3పంజాబ్తో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. 18 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. క్లాసెన్ అర్థసెంచరీతో ఆకట్టుకున్నాడు. నితీశ్కుమార్ (26) పరుగులతో ఆడుతున్నాడు.అర్ధ శతకం బాది ఇషాన్ ఔట్ ఇషాన్ కిషన్ అర్ధ శతకం బాది ఔటయ్యాడు. 32 బంతుల్లో 4 సిక్సులు, 2 ఫోర్ల సాయంతో 55 పరుగులు చేశాడు. క్రీజులోకి నితీశ్ కుమార్ రెడ్డి వచ్చాడు. స్కోరు 174-3 (15 ఓవర్లలో)గా ఉంది.9 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ 107-2పంజాబ్తో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 8వ ఓవర్లో వంద పరుగుల మార్క్ను దాటింది. 9 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ 2 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ఇషాన్ (17), క్లాసెన్ (14) పరుగులతో ఆడుతున్నారు.రెండో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్పంజాబ్తో మ్యాచ్లో ధాటిగా ఆడుతున్న హెడ్ (38) చాహల్ బౌలింగ్లో మార్కో జాన్సెన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఎస్ఆర్హెచ్ 84 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.దంచికొడుతున్న హెడ్6 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టానికి 79 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (35) పంజాబ్ బౌలర్లను ఉతికారేస్తున్నాడు. ఇషాన్ కిషన్ (7) పరుగులతో ఆడుతున్నాడు.అభిషేక్ శర్మ (35) ఔట్పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 54 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 13 బంతుల్లో 35 పరుగులతో దూకుడు ప్రదర్శించిన అభిషేక్ శర్మ ఫెర్గూసన్ బౌలింగ్లో అయ్యర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.టాస్ పంజాబ్దేటాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇరుజట్లు ఒక్కో మార్పుతో బరిలోకి దిగాయి. ఎస్ఆర్హెచ్ జట్టులోకి నితీశ్ కుమార్ రెడ్డి రీఎంట్రీ ఇవ్వగా.. పంజాబ్ జట్టులోకి శశాంక్ సింగ్ తిరిగి వచ్చాడు. ఈ సీజన్లో తొలి అంచె పోటీలో ఎస్ఆర్హెచ్పై పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరి ఎస్ఆర్హెచ్ ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అన్నది చూడాలి. ముఖాముఖి పోరులో ఇరుజట్లు 25 సార్లు తలపడితే ఎస్ఆర్హెచ్ 17 సార్లు, పంజాబ్ 8 సార్లు నెగ్గింది. ఇక హైదరాబాద్లో పంజాబ్తో ఆడిన 10 మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ 9 సార్లు నెగ్గితే.. పంజాబ్ ఒకసారి మాత్రమే గెలిచింది.తుదిజట్లు:పంజాబ్ కింగ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), కూపర్ కన్నోలీ, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), శశాంక్ సింగ్, సూర్యాంశ్ షెడ్జ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, లోకీ ఫెర్గూసన్, విజయ్కుమార్ వైషాక్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్సన్రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(కెప్టెన్), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్స్: ప్రియాంష్ ఆర్య, హర్ప్రీత్ బ్రార్, జేవియర్ బార్ట్లెట్, విష్ణు వినోద్, ముషీర్ ఖాన్సన్రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ సబ్లు: అనికేత్ వర్మ, ప్రఫుల్ హింగే, లియామ్ లివింగ్స్టోన్, హర్ష్ దూబే, హర్షల్ పటేల్ -
ప్రపంచ కప్ జట్టు ప్రకటన
తమ తొలి టీ20 ప్రపంచకప్ కోసం నెదర్లాండ్స్ మహిళల క్రికెట్ జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్గా బాబెట్ డి లీడేను ఎంపికైంది. బాబెట్కు క్రికెట్ వారసత్వం ఉంది. ఆమె మామ టిమ్ డి లీడే, కజిన్ బాస్ డి లీడే ఇప్పటికే పురుషుల వరల్డ్ కప్లలో నెదర్లాండ్స్ తరఫున ఆడారు. ఇప్పుడు అదే కుటుంబానికి చెందిన బాబెట్ డి లీడే మహిళల టీ20 ప్రపంచకప్ జట్టుకు నాయకత్వం వహించనుండటం విశేషం.కాగా, మహిళల టీ20 ప్రపంచకప్ 2026 జూన్ 12 నుంచి ఇంగ్లండ్లోని వివిధ వేదికల్లో జరుగనుంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 12 జట్లు రెండు గ్రూప్లుగా విభజించబడి పోటీపడనున్నాయి. నెదర్లాండ్స్ జట్టు భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ లాంటి పటిష్టమైన జట్లు ఉన్న గ్రూప్-ఏలో ఉంది. ఈ జట్టు తమ తొలి మ్యాచ్ను జూన్ 14న బంగ్లాదేశ్తో ఆడనుంది. అనంతరం భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్లతో ఆడనుంది. కాగా, నెదర్లాండ్స్ జట్టు ఈ ఏడాది నేపాల్లో జరిగిన గ్లోబల్ క్వాలిఫయర్లో కీలక విజయాలు సాధించి, తొలిసారి వరల్డ్ కప్కు అర్హత సాధించింది.నెదర్లాండ్స్ జట్టు: బాబెట్ డి లీడే (సి), కరోలిన్ డి లాంగే, ఫ్రెడెరిక్ ఓవర్డిజ్క్, హన్నా లంధీర్, హీథర్ సీగర్స్, ఐరిస్ జ్విల్లింగ్, ఇసాబెల్ వాన్ డెర్ వోనింగ్, లారా లీమ్హూయిస్, మిర్తే వాన్ డెన్ రాడ్, ఫెబ్ మోల్కెన్బోర్, రాబిన్ రిజ్కే, రోస్లీ లారెన్స్, సాన్యా ఖురానా, సిల్వర్ సీగర్స్, స్టెర్రే కాలిస్


