Komaram Bheem
-
పాఠశాలల్లో సమ్మర్ క్యాంపులు షురూ
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలోని 50 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో గురువారం నుంచి సమ్మర్ క్యాంపులు ప్రారంభమయ్యాయి. ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు 15 రోజుల పాటు శిక్షణ అందించనున్నారు. సెలవులు సద్వినియోగం చేసుకునేలా ఇండోర్ గేమ్స్ క్యారమ్, చెస్, యోగా, డ్యాన్స్, స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు, పెయింటింగ్, కరాటే, సంగీతం వంటి అంశాలను ఉచితంగా నేర్పించనున్నారు. ఒక్కో పాఠశాలలకు రూ.50 వేలు ఖర్చు చేస్తున్నారు. ప్రతీ స్కూల్లో వందమందికి శిక్షణ అందిస్తున్నారు. విద్యార్థుల అల్పాహారం కోసం రోజుకు రూ.15, మెటీరియల్ కోసం పాఠశాలకు రూ.10వేల చొప్పున, శిక్షకులకు రూ.3వేల చొప్పున అందించనున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. రోజువారీగా శిక్షణకు సంబంధించిన ఫొటోలను ప్రధానోపాధ్యాయులు ఎంఈవోలకు పంపించాలని డీఈవో యాదయ్య ఆదేశించారు. -
‘పది’పై ప్రణాళికేది?
● ఏటా దిగజారుతున్న ఫలితాలు ● వెనుకబడిపోతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ● గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు నయం ● విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి దృష్టి సారిస్తే మేలు ఆసిఫాబాద్రూరల్: పదో తరగతి పరీక్షలపై సరైన ప్రణాళికలు అమలు చేయకపోవడంతో ఫలితాలు మరోసారి నిరాశ పరిచాయి. నాలుగేళ్లుగా రాష్ట్రస్థాయిలో జిల్లా చివరి నుంచి రెండు, మూడు స్థానాల్లో నిలుస్తున్నా దిద్దుబాటు చర్యలు తీసుకోకపోవడం విద్యాశాఖ అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. 2021– 22 విద్యా సంవత్సరంలో జిల్లా 32వ స్థానంలో నిలవగా, మరుసటి ఏడాది కొంత మెరుగుపడి 30వ స్థానంలో నిలిచింది. గతేడాది 31వ స్థా నంలో నిలవగా, 2024– 25 విద్యా సంవత్సరంలో మళ్లీ 32వ స్థానానికి పడిపోయింది. జీవితంలో కీలకమైన పదో తరగతిలో ఫెయిల్ కావడంతో చాలా మంది విద్యార్థులు అక్కడితోనే ఆగిపోతున్నారు. మారుమూల పల్లెల్లో ఉత్తీర్ణత సాధించని ఆడపిల్ల లకు తల్లిదండ్రులు బాల్యవివాహాలు జరిపిస్తుండగా, బాలురు వ్యవసాయ, కూలీ పనులకు వెళ్తున్నా రు. ‘విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం.. ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నాం’ అంటూ అధికారులు చెబుతున్న మాటలు సత్ఫలితాలను ఇవ్వడంలేదు. ఫలితాలు ఇలా..జిల్లావ్యాపంగా మొత్తం 157 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో మూడు ఎయిడెడ్ పాఠశాలల్లో 39 మంది 26 మంది(66 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, 37 గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలల్లో 1,182 మందికి 1090(92 శాతం), 15 కస్తూ రిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో 496 మందికి 468 మంది(94 శాతం), 50 జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో(లోకల్బాడీ) 2,129 మందికి 1,659 మంది(78 శాతం), ఏడు ప్రభుత్వ పాఠశాలల్లో 277 మందికి 169మంది(61శాతం), రెండు మోడల్ స్కూళ్లలో 166 మందికి 157 మంది(95 శాతం), నాలుగు బీసీ వెల్ఫేర్ స్కూళ్లలో 275 మందికి 272 మంది(99 శాతం), మూడు మైనార్టీ గురుకులాల్లో 145 మందికి 131 మంది(92 శాతం), ఐదు సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 230 మందికి 226 మంది(98 శాతం), మూడు గిరిజన సంక్షేమ గురుకులాల్లో 496 మందికి 484 మంది(97 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లతో పోల్చితే ప్రభుత్వ, లోకల్బాడీ పాఠశాలల్లోనే తక్కువ ఉత్తీర్ణత నమోదైంది. జిల్లాలో 41 ప్రైవేట్ సూళ్లు ఉండగా, 1066 మందికి 972 మంది పాసయ్యారు. తగ్గిన పర్యవేక్షణ..కొన్నేళ్లుగా జిల్లాకు రెగ్యులర్ విద్యాధికారిని నియమించడం లేదు. మంచిర్యాల డీఈవో యాదయ్య ప్రస్తుతం జిల్లా విద్యాధికారిగా కొనసాగుతున్నారు. రెగ్యులర్ అధికారి లేకపోవడంతో విద్యాశాఖపై పర్యవేక్షణ తగ్గుతుందనే అభిప్రాయం ఉంది. ఉపాధ్యాయులు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థులు సక్రమంగా పాఠశాలలకు హాజరుకాకపోవడంతో వారికి విషయ పరిజ్ఞానం పెరగడం లేదు. ఈ కారణంతోనే వసతి, గురుకులాల్లోని విద్యార్థుల మాదిరి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేకపోతున్నారు. పదో తరగతి విద్యార్థులకు జనవరి నుంచి కాకుండా ఆగస్టు నుంచి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి బోధి స్తే ఉపయోగం ఉంటుంది. 2025– 26 విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు మెరుగైన ఫలితాల సాధనకు సమష్టి కృషి చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. దృష్టి సారిస్తాం జిల్లాలో తక్కు వ ఉత్తీర్ణత శాతం నమో దు చేసిన పాఠశాలలపై ప్ర త్యేక దృష్టి సారిస్తాం. వచ్చే విద్యా సంవత్సరంలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు చర్యలు తీసుకుంటాం. ఎక్కువ మంది పదో తరగతి విద్యార్థులు గణితం, సైన్స్ సబ్జెక్టులోనే ఫెయిల్ అయ్యారు. గతేడాదితో పోల్చితే నాలుగు శాతం ఉత్తీర్ణత పెరిగినా జిల్లా 32వ స్థానంలో నిలిచింది. – యాదయ్య, ఇన్చార్జి డీఈవోఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్లోనే..పదో తరగతి విద్యార్థులు ఎక్కువ మంది ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించడం లేదు. ప్రాథమిక స్థాయి నుంచి చతుర్విద ప్రక్రియలపై పట్టు సాధిస్తేనే లెక్కలు సులువుగా చేయవచ్చు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇంగ్లిష్పై పట్టు సాధించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రాథమిక పాఠశాల స్థాయిలోనే చతుర్విద ప్రక్రియలు, భాషా నైపుణ్యాలు పెంచడంపై దృష్టి సారిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. -
వందశాతం అక్షరాస్యత సాధించాలి
● అదనపు కలెక్టర్ దీపక్ తివారిఆసిఫాబాద్: జిల్లాలో వందశాతం అక్షరాస్యత సాధించేందుకు అధికారులు కృషి చేయాలని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్తో కలిసి విద్య, వైద్య, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, సెర్ప్, మెప్మా అధికారులతో నవభారత సాక్షరత కార్యక్రమంలో అక్షరాస్యత సాధనపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రాయోజిత పథకాల్లో ఉల్లాస్ ఒకటని తెలిపారు. నవభారత్ సాక్షరత కార్యక్రమంలో భాగంగా పాఠశాలస్థాయిలో విద్యావకాశం కోల్పోయిన 15 సంవత్సరాలు, ఆ పైబడిన నిరక్షరాస్యులకు జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ప్రాథమిక అక్షరాస్యత, ప్రాథమిక విద్యతో పాటు డిజిటల్ అక్షరాస్యత కీలకమన్నారు. జీవన నైపుణ్యాలు, ఆర్థిక అక్షరాస్యత, వృత్తి నైపుణ్యాలతో నిరంతరం విద్యనందించడమే పథకం లక్ష్యమని తెలిపారు. చదవడం, రాయడం, అంకెలు గుర్తించడం, కనీస సామర్థ్యాలతో కూడిన లెక్కలు చేయడం నేర్చుకోవాలని సూచించారు. వయోజనులకు విద్యనందించేందుకు స్వచ్ఛంద బోధకులు అవసరమని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులను తప్పనిసరిగా ప్రాథమిక పాఠశాలలో చేర్పించడం, ఉన్నత పాఠశాల విద్య పూర్తయిన విద్యార్థులు ఇంటర్మీడియెట్ కళాశాలలో చేరే విధంగా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. బడీడు గల పిల్లలెవరూ బడి బయట ఉండకూడదన్నారు. అక్షర్యాస్యతలో జిల్లాను ముందు వరుసలో ఉంచేందుకు సమష్టి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. సమావేశంలో ఇన్చార్జి డీఈవో యాదయ్య, డీఆర్డీవో దత్తారావు, డీపీవో భిక్షపతి, డీఎంహెచ్వో సీతారాం, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, అదనపు డీఆర్డీవో రామకృష్ణ, విద్యాశాఖ అధికారులు ఉదయబాబు, మధుకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సమ్మర్ క్యాంపులు సద్వినియోగం చేసుకోవాలి
ఆసిఫాబాద్రూరల్: విద్యార్థులు సమ్మర్ క్యాంపులు సద్వినియోగం చేసుకోవాలని యువజన క్రీడాశాఖ అధికారి, డీటీడీవో రమాదేవి అన్నారు. ఆసిఫాబాద్ మండలం బూర్గుడ సమీపంలోని మోడల్ స్కూల్లో నెట్బాల్ వేసవి శిక్షణ శిబిరాన్ని గురువారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా వేసవి సెలవుల్లో విద్యార్థులకు ఉదయం, సాయంత్రం పది క్రీడాంశాల్లో ఉచితంగా శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు తమ పరిధిలో శిబిరానికి వెళ్లి క్రీడలపై పట్టు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్వో మీనారెడ్డి, శిక్షకుడు తిరుపతి, విద్యార్థులు పాల్గొన్నారు. -
బొగ్గు గనులపై ఘనంగా కార్మిక దినోత్సవం
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియాలోని బొగ్గు గనులు, ఇతర డిపార్టుమెంట్లలో గురువారం 139వ కార్మిక దినోత్సవాన్ని కార్మికులు ఘనంగా జరుపుకొన్నారు. కైరిగూడ ఓసీపీతోపాటు గోలేటి సీహెచ్పీ, ఏరియా స్టోర్స్, వర్క్షాప్, గోలేటి టౌన్షిప్లోని కేఎల్ మహేంద్రభవన్, తెలంగాణ భవన్ల వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. ఎర్ర జెండాలు ఎగురవేసి కార్మిక అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. గోలేటి బస్టాండ్, రెబ్బెన మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాల యం, భవన్ నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయాల వద్ద ఎర్రజెండా ఎగురవేశారు. ఆయా కార్యక్రమాల్లో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, ఉపాధ్యక్షు డు బయ్య మొగిళి, ఆర్గనైజింగ్ కార్యదర్శులు జగ్గయ్య, శేషు, కిరణ్బాబు, టీబీజీకేఎస్ ఏరి యా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్రావు, ఏఐటీయూసీ రీజియన్ అధ్యక్షుడు బోగే ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. -
5న జిల్లాకు కేంద్ర మంత్రి ‘గడ్కరీ’
● ఎంపీ గోడం నగేశ్రెబ్బెన(ఆసిఫాబాద్): జాతీయ రహదారి– 363 ప్రారంభోత్సవానికి ఈ నెల 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ జిల్లాకు రానున్నారని ఎంపీ గోడం నగేశ్ తెలిపారు. కాగజ్నగర్ ఎక్స్రోడ్డు వద్ద గల వాసవీ జిన్నింగ్ మిల్లులో కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల బీజేపీ నాయకులతో గురువారం ఎమ్మెల్యే హరీశ్బాబుతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా నుంచి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మహారాష్ట్ర సరిహద్దు వరకు నిర్మించి జాతీయ రహదారిని కేంద్ర మంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. ఇందుకోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయన్నారు. సభాస్థలి వద్ద పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. రెండు జిల్లాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆసిఫాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి
పెంచికల్పేట్(సిర్పూర్): వరిధాన్యం కొనుగో లు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అన్నారు. పెంచికల్పేట్ మండలం ఎల్కపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి న కొనుగోలు కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మద్దతు ధర లభిస్తుందని తెలిపారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అ ధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే గొంట్లపేట్లో కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ వెంకటేశ్వర్రావు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీవో అల్బర్ట్, ఏపీఎం కొనయ్య, ఏఈవోలు శ్రీవిద్య, గౌసియాబేగం, బీజేపీ మండల అధ్యక్షుడు రాజేశ్వర్, నాయకులు చప్పిడే సత్యనారాయణ, నగేశ్ తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన విద్యార్థుల సత్తా●
● ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో 93.8 శాతం ఉత్తీర్ణత ● 13 స్కూళ్లలో వందశాతం ఫలితాలు కెరమెరి(ఆసిఫాబాద్): గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటారు. జిల్లాలో మొత్తం 36 ఆశ్రమ ఉన్నత పాఠశాలలు ఉండగా 13 పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి. 1,170 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 1,089 మంది పాసయ్యారు. మొత్తం 93.8 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 508 మంది బాలురకు 467 మంది, 662 మంది బాలికలకు 622 మంది ఉత్తీర్ణులయ్యారు. గతేడాది 91 శాతం ఫలితాలు సాధించగా ఈసారి 93.8 శాతం సాధించి భేష్ అనిపించుకున్నారు. బంబారా, రొంపెల్లి, బాబాపూర్, కమ్మర్గాం, సోమిని, జైనూర్, మహాగాం, మోడి, అనార్పల్లి, మార్లవాయి, పోచంలొద్ది, కెరమెరి(హట్టి), రాంజీగూడ ఆశ్రమోన్నత పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణతతో ప్రభంజనం సృష్టించాయి. మిగిలిన 23 ఆశ్రమ పాఠశాలలు కూడా 90 శాతానికి పైగా ఉత్తీర్ణత సాధించాయి. వందశాతం యాక్షన్ ప్లాన్ అమలు వందశాతం యాక్షన్ ప్లాన్ అమలు చేయడంతోపాటు ఉదయం 5 నుంచి 7 వరకు, సాయంత్రం 7 నుంచి 10 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. నిత్యం గ్రాండ్ టెస్టులు, ఒక్కో సబ్జెక్టుల్లో 30 స్లిప్ టెస్టులు, సీ, డీ గ్రేడ్లో ఉన్న విద్యార్థులను గుర్తించి రెమెడియల్ తరగతులు నిర్వహించడంతో ఉత్తమ ఫలితాలు సాధించగలిగామని గిరిజన సంక్షేమశాఖ డీడీ పి.రమాదేవి, అకాడమిక్ మానిటరింగ్ అధికారి పుర్క ఉద్దవ్ తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు, ఉపాధ్యాయులను అభినందించారు. ఇదే స్ఫూర్తితో వచ్చే విద్యా సంవత్సరం వందశాతం ఫలితాల సాధనకు కృషి చేయాలని సూచించారు. -
ఆనాటి చరిత్ర కాలగర్భంలోకి..
కడెం:మండలంలోని బెల్లాల్ సమీపంలో గోదావరి, కడెం నది కలిసే ప్రాంతంలో 1200 ఏళ్ల క్రితం నాటి మల్లికార్జున స్వామి ఆలయ చరిత్ర కాలగర్భంలోకి కలిసిపోతుంది. ఆలయ గర్భంలో నిధులు, నిక్షేపాలు ఉన్నాయని వందల ఏళ్ల క్రితం ఆలయాన్ని, దేవతమూర్తుల విగ్రహాలను నాడు కొందరు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో స్తంభాలు పడి ఓ వ్యక్తి మృతిచెందినట్లు పెద్దలు చెబుతున్నారు. పురాతన ఆలయాన్ని పరిరక్షించకపోవడంతో అనాటి చరిత్రా క ఆనవాళ్లు కనుమరుగవుతున్నాయి. విగ్రహాల త లభాగాలు లేకుండా పోగా, రాతిస్తంభాలు గోదా వరి ఒడ్డున కుప్పలుగా ఉన్నాయి. ప్రస్తుతం పురా తన ఆలయం ఉన్నచోట గ్రామానికి చెందిన వారు నూతన ఆలయ నిర్మాణం చేపడుతున్నారు. 1200 ఏళ్ల క్రితం నాటి చరిత్రని, శివ సాహిత్యం పొందడానికి ఆత్మహుతి చేసుకున్న వీరగల్లు విగ్రహంగా భావిస్తున్నట్లు తెలంగాణ చరిత్రబృందం కన్వీనర్ హరగోపాల్, రాజ్కుమార్ తెలిపారు. -
ప్రారంభోత్సవం విజయవంతం చేయాలి
● ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు రెబ్బెన(ఆసిఫాబాద్): మంచిర్యాల జిల్లా నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు నిర్మించిన జాతీయ రహదారి ప్రారంభోత్సవం విజయవంతం చేయాలని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వా యి హరీశ్బాబు అన్నారు. కాగజ్నగర్ ఎక్స్రోడ్ వద్ద బుధవారం సభాస్థలి వేదిక నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రవా ణాను మరింత మెరుగుపర్చేందుకు కేంద్ర ప్ర భుత్వం సుమారు రూ.3500 కోట్లతో నాలుగు వరుసలతో జాతీయ రహదారి నిర్మించిందని తెలిపారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ చేతుల మీదుగా మే 5న కాగజ్నగర్ ఎక్స్రోడ్ వద్ద ఎన్హెచ్– 363 ప్రారంభోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జాతీయ రహదారుల సంస్థ రీజినల్ అధికారి శివశంకర్, ప్రాజెక్టు డైరెక్టర్ అజయ్ మణికుమార్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఘనంగా బసవేశ్వర మహరాజ్ జయంతి ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో బసవేశ్వర మహరాజ్ జయంతి బుధవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్ డేవిడ్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు బసవేశ్వర మహరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్నర్ రమేశ్, లింగాయత్ సంక్షేమ సంఘం ప్రతినిధులు దీకొండ సతీశ్కుమార్, వాసుదేవన గిరీశ్కుమార్, భద్రయ్య, సభ్యులు పాల్గొన్నారు. -
ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీలు అమలుచేయాలి
బెల్లంపల్లి: అసెంబ్లీ ఎన్నికల్లో ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆటోజేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్ డిమాండ్ చేశారు. గతనెల 25న మెదక్ జిల్లా నర్సాపూర్లో ప్రారంభించిన ఆ టో రథయాత్ర బుధవారం బెల్లంపల్లికి చేరుకు ంది. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఆటో డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు కట్టా రాంకుమార్, నా యకులు, ఆటో డ్రైవర్లు రథయాత్ర కు స్వా గతం పలికారు. బజారుఏరియా పురవీఽ దుల మీదుగా రథయాత్ర, ఆటోలతో ర్యాలీ చేశారు. రథయాత్ర మే 27న హైదరాబాద్కు చేరుకుంటుందని, ఈసందర్భంగా ఇందిరాపార్కులో ని ర్వహించే ఆటో ఆకలి కేకలు మహాసభకు ఆటో డ్రైవర్లు తరలిరావాలని కోరారు. -
పదిలో మళ్లీ నిరాశ
● రాష్ట్రస్థాయిలో 32వ స్థానంలో జిల్లా ● 6,480 మంది విద్యార్థులకు 5,654 మంది పాస్ ● వందశాతం ఉత్తీర్ణత సాధించిన పలు పాఠశాలలు ఆసిఫాబాద్రూరల్: పదో తరగతి ఫలితాల్లో జిల్లాకు మళ్లీ నిరాశే ఎదురైంది. బుధవారం విడుదలైన ఫలితాల్లో ఇతర జిల్లాలతో పోల్చితే వెనుకబడిపోయింది. గతేడాది రాష్ట్రస్థాయిలో 31వ స్థానంలో నిలవగా, 2024– 25 విద్యా సంవత్సరంలో జిల్లా 32వ స్థానానికి పడిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు పాఠశాలలకు సక్రమంగా హాజరు కాకపోవడం, రెగ్యులర్ డీఈవో లేకపోవడంతో ఆశించిన ఫలితాలు రాలేదు. పాఠశాలలపై పర్యవేక్షణ లేకపోవడం కూడా కారణమని తెలుస్తోంది. కొన్నేళ్లుగా ఇలాంటి ఫలితాలే పునరావృతమవుతున్నా.. విద్యాశాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. రానున్న విద్యా సంవత్సరంలోనైనా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. 5,654 మంది ఉత్తీర్ణత జిల్లావ్యాప్తంగా 170 ఉన్నత పాఠశాలలు ఉండగా, 6,480 మంది విద్యార్థులు పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 5,654 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 3,035 మంది బాలురు పరీక్షలు రాయగా, 2,539 మంది(83.66 శాతం) ఉత్తీర్ణత సాధించగా, 3,445 మంది బాలికలకు 3,115 మంది(90.42) పాసయ్యారు. సత్తా చాటిన ‘ప్రభుత్వ’ విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, గురుకులాలు, కస్తూరిబా గాంధీ విద్యాలయాలు, మోడల్ స్కూళ్లు, గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు ముందంజలో నిలిచారు. ఇక్కడ 99 మందికి 96 మంది ఉత్తీ ర్ణత నమోదు చేశారు. వర్షిత్ 600మార్కులకు 564 సాధించి టాపర్గా నిలవగా, సైయాద్ ఉమేజ నజ్ 561 మార్కులు సాధించారు. స్థానిక మహాత్మా జ్యోతిబా పూలే బాలుర పాఠశాలలో 70 మందికి 96 మంది పాసయ్యారు. వరుణ్ 561 మార్కులు, కార్తీక్ 543 మార్కులు సాధించారు. జ్యోతిబా పూలే బాలికల పాఠశాలలో 69 మందికి 68 ఉత్తీర్ణులు కా గా, లిఖిత 556, అశ్విని 553 మార్కులతో స్కూల్ టాపర్లుగా నిలిచారు. గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో 73 మందికి 72 మంది ఉత్తీర్ణత సాధించగా, అక్కిరెడ్డి ఐశ్వర్య 553, మాయావతి 552, కీర్తన 540 మార్కులు పొందారు. బాలుర సాంఘిక సంక్షేమ గురుకులంలో 75 మందికి 73 ఉత్తీర్ణులు కాగా, వంశీ 560, రోహన్ 541 మార్కులు సాధించారు. ఆసిఫాబాద్ కేజీబీవీలో 42 మందికి 41 మంది, ఆసిఫాబాద్ బాలికల ఉన్నత పాఠశాలలో 102 మంది 84 మంది పాసయ్యారు. బాలికల ఉన్నత పాఠశాలలో సాత్విక 541, తేజశ్విని 522 మార్కులతో టాపర్లుగా నిలిచారు. బాలుర ఉన్నత పాఠశాలలో 94 మందికి 69 మంది, జన్కాపూర్ పాఠశాలలో 71 మందికి 59 మంది ఉత్తీర్ణులయ్యారు. మర్యాదాస్ 519, శంకర్ 511 మార్కులు సాధించారు. బూర్గుడ పాఠశాలలో 74 మందికి 55 మంది ఉత్తీర్ణులు కాగా, 487 మార్కులతో ఉమేష్, 476 మార్కులతో సాయివర్షిణి టాపర్లుగా నిలిచారు. ఇక్కడ వంద శాతం ఉత్తీర్ణత జిల్లాలోని పలు పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి. కెరమెరి మండలంలోని మోడి కేజీబీవీలో 16 మంది 16 మంది, మోడి ఉన్నత పాఠశాలలో 9 మంది 9 మంది, గోయగాం ఉన్నత పాఠశాలలో 35 మందికి 35 మంది, జైనూర్ కేజీబీవీలో 35 మందికి 35 మంది, చింతలమానెపల్లి మండలం డబ్బా ఉన్నత పాఠశాలలో 12 మందికి 12 మంది, బాబాపూర్ ఉన్నత పాఠశాలలో ఆరుగురికి ఆరుగురు, రెబ్బెన మండలంలోని తుంగెడ ఉన్నత పాఠశాలలో 16 మందికి 16 మంది, వాంకిడి కేజీబీవీలో 38 మందికి 38 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.నాలుగేళ్లుగా పదో తరగతి ఫలితాలు ఇలా.. విద్యా సంవత్సరం విద్యార్థులు ఉత్తీర్ణత శాతం రాష్ట్రస్థాయిలో స్థానం 2021–22 7,007 5,605 79 32 2022– 23 6,670 5,061 75 30 2023– 24 6,393 5,325 83 31 2024– 25 6,480 5,654 87 32 -
మూడు కిలోమీటర్లు వెళ్తేనే నీరు
ఇంద్రవెల్లి మండలంలోని తేజాపూర్ పంచాయతీ పరిధిలోని సాలేగూడలో నీటి కోసం గ్రామస్తులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గ్రామానికి మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో అవస్థలు పడుతున్నారు. గ్రామశివారులో వ్యవసాయ బోరు బావుల నుంచి, ట్యాంకర్ ద్వారా నీటిని తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం బోరుబావులు అడుగంటడంతో నీళ్లు రావడం లేదు. అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. గ్రామానికి 3 కి.మీ దూరంలో సిరికొండ మండలం రాంపూర్కు బైక్లు, ఎడ్లబండ్లపై నీటిని తెచ్చుకుంటున్నారు. కలెక్టర్ రాజర్షి షా, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ స్పందించి గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. – ఇంద్రవెల్లి -
గుండెపోటుతో ట్రెయినీ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మృతి
భీమారం: మండల కేంద్రానికి చెందిన రామళ్ల సాగర్ ట్రెయినీ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతిచెందాడు. అతని బంధువులు తెలిపిన వివరాలు.. కొన్నినెలల క్రితం సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్గా ఎంపికై న సాగర్ (29) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురంలో శిక్షణ పొందుతున్నాడు. శిక్షణలో భాగంగా కాలికి దెబ్బతగలంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలనడంతో గతనెల 26న స్వగ్రామానికి వచ్చాడు. బంధువుల వివాహం ఉండటంతో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి బుధవారం మంచిర్యాలకు వెళ్లాడు. అక్కడ ఒక హోటల్ వద్ద కూర్చున్న సాగర్ అకస్మాత్తుగా కిందపడిపోయాడు. వెంటనే గమనించి అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. సాగర్ మృతితో భీమారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గుండెపోటుతో సింగరేణి కార్మికుడు మృతిబెల్లంపల్లి: బెల్లంపల్లి రడగంబాల బస్తీకి చెందిన మారెపల్లి రవీందర్ రెడ్డి (56) శాంతిఖని సింగరేణి కార్మికుడు గుండెపోటుతో మృతిచెందాడు. టూటౌన్ ఎస్సై కె.మహేందర్ కథనం ప్రకారం..భార్య, పిల్లలు ఊరికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న రవీందర్ రెడ్డి మంగళవారం రాత్రి భోజనం చేస్తూ కుర్చీలో కుప్పకూలిపోయాడు. బుధవారం ఆన్లైన్లో ఆర్డర్ చేసిన పార్సిల్ రావడంతో విషయాన్ని భర్తకు చెప్పడానికి భార్య మంజు పలుమార్లు ఫోన్ చేసింది. లిఫ్ట్ చేయకపోవడంతో సహచర కార్మికుడికి ఫోన్ చేసి ఓసారి ఇంటికి వెళ్లి చూడాలంది. అతను వెళ్లి ఇంటి కిటికీ నుంచి చూడగా కుర్చీలో రవీందర్ రెడ్డి బిగుసుకుపోయి ఉన్నట్లు గుర్తించాడు. చుట్టుపక్క ఇళ్ల వారిని పిలిచి తలుపు పగులగొట్టి చూసేసరికి మృతి చెంది ఉన్నాడు. కుటుంబ సభ్యులకు ఆయన సమాచారమిచ్చారు. భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గేదెల మృతి కారకుడికి 9 నెలల జైలుఆసిఫాబాద్: విద్యుత్ తీగలు అమర్చి, నాలుగు గేదెల మృతికి కారణమైన తిర్యాణి మండలం చెలిమెల కొలాంగూడకు చెందిన టేకం కొండుకు 9 నెలల జైలుశిక్ష విధిస్తూ జిల్లా సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ బుధవారం తీర్పుచెప్పారు. తిర్యాణి ఎస్సై శ్రీకాంత్ కథనం ప్రకారం.. తిర్యాణి నుంచి మాణిక్యాపూర్ వెళ్లే మార్గంలో గుట్టమేడి అటవీ ప్రాంతంలో జంతువులకోసం టేకం కొండు విద్యుత్ తీగలు అమర్చాడు. గ్రామానికి చెందిన కుర్రిసంగ భీమ్రావు, ఆత్రం భుజంగరావు, మడావి సోంబాయి, బొమ్మగోని విజయలకు చెందిన నాలుగు గేదెలు 2017 మే 31న మేతకు వెళ్లి తిరిగి రాలేదు. ఈక్రమంలో అటవీప్రాంతంలో గాలించగా విద్యుత్ తీగలు తగిలి మృతిచెంది ఉన్నాయి. బాధితుల ఫిర్యాదుతో అప్పటి ఎస్సై బుద్దేస్వామి కేసు నమోదు చేశారు. రెబ్బెన సీఐ బుద్దేస్వామి, తిర్యాణి ఎస్సై శ్రీకాంత్ కోర్టులో సాక్షులు ప్రవేశపెట్టగా పీపీ జనన్మోహన్ రావు విచారించి నేరం రుజువుచేశారు. ఈ మేరకు న్యాయమూర్తి తీర్పు చెప్పారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన కోర్టు లైజనింగ్ అధికారి రాంసింగ్, కానిస్టేబుల్ వినోద్, పోలీసు అధికారులను ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అబినందించారు. -
తాత్విక ధోరణితో సమున్నత జీవితం
● ’జీవితమే ఒకపుస్తకం’గ్రంథ పరిచయ కార్యక్రమంలో సాహితీవేత్తలు ● జిడ్డు కృష్ణమూర్తి ఆంగ్లపుస్తకాన్ని అనువదించిన జిల్లాకవి నిర్మల్ఖిల్లా: తాత్విక ధోరణి ద్వారానే సమున్నత జీవితం సిద్ధిస్తుందని జిల్లాకు చెందిన పలువురు సాహితీవేత్తలు అభిప్రాయపడ్డారు. జిల్లాకేంద్రంలోని కావేరి ఫౌండేషన్ గ్రంథాలయంలో మంగళవారం రాత్రి ‘జీవితమే ఒక పుస్తకం’గ్రంథ పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, అనువాదకర్త కె.మచ్చేందర్..ప్రపంచ తాత్వికవేత్త జిడ్డు కృష్ణమూర్తి ప్రసంగాల సమాహార గ్రంథం ‘ది బుక్ ఆఫ్ లైఫ్’అనే ఆంగ్ల పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. కార్యక్రమంలో పాల్గొన్న సాహితీవేత్తలు మాట్లాడుతూ రెండున్నరేళ్ల పాటు కష్టపడి ఈ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించడం ప్రశంసనీయమని కొనియాడారు. కావేరి ఫౌండేషన్ చైర్మన్ అప్పాల చక్రధారి, సాహితీవేత్తలు టి.సంపత్ కుమార్, నరసయ్య, రవీంద్రబాబు, తుమ్మల దేవరావు, కృష్ణంరాజు, మునిమడుగుల రాజారావు, ఆకుల సుదర్శన్, అంబటి నారాయణ, అనిత, నాగరంజని, నూకల విజయ్కుమార్, దీపక్, పోలీస్ భీమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉమెన్స్ హ్యాండ్బాల్ విజేత ఉమ్మడి ఆదిలాబాద్
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని సింగరేణి హైస్కూల్ మైదానంలో మూడు రోజులు జరిగిన రాష్ట్రస్థాయి 54వ సీనియర్ మహిళల తెలంగాణ హ్యాండ్బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జట్టు విజేతగా, రంగారెడ్డి జట్టు రన్నరప్గా నిలిచింది. బుధవారం ఫైనల్మ్యాచ్లో ఈ జట్లు తలపడగా ఆదిలాబాద్ జట్టు 13, రంగారెడ్డి జిల్లా జట్టు 11 గోల్స్ వేసింది. మూడో స్థానంలో వరంగల్, నాలుగో స్థానంలో ఖమ్మం జట్లు నిలిచాయని, గెలిచిన జట్లకు నిర్వాహకులు షీల్డ్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా హ్యాండ్బాల్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేశ్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి జట్టు కోసం 20 మందిని ఎంపిక చేసి వరంగల్లో కోచింగ్ ఇస్తామన్నారు. గుజరాత్లోని బూజ్లో ఈనెల 21 నుంచి 27 వరకు నిర్వహించే జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్రజట్టు పాల్గొంటుందన్నారు. ఈ పోటీల్లో తెలంగాణ ఉమ్మడి 10 రాష్టాల నుంచి 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పవన్కుమార్, టోర్నమెంట్ ఆర్గనైజర్ కాంపెల్లి సమ్మయ్య, కోశాధికారి రమేశ్రెడ్డి, గ్రౌండ్ ఇన్చార్జి నస్పూరి తిరుపతి పాల్గొన్నారు. ● రన్నర్ప్గా రంగారెడ్డి జట్టు -
‘ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి’
ఆసిఫాబాద్: ఛత్తీస్గఢ్లోని కర్రెగుట్ట ప్రాంతంలో చేపట్టిన ఆపరేషన్ కగార్ నరమేధాన్ని వెంటనే నిలిపివేయాలని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్కుమార్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం మా వోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డి మాండ్ చేశారు. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరుగుతున్న యుద్ధంలో అమాయకులైన ఆదివాసీలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మానవ హక్కులను హరిస్తున్నారని మండిపడ్డారు. మావోయిస్టులపై జరుగుతున్న హత్యాకాండను ఖండించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చందన్షా, నాయకులు భీమ్రావు, సుభాష్, కనక ప్రకాశ్, బాదిరావు, రామ్కిషన్ పాల్గొన్నారు. -
విత్తనపూజకు వేళాయె
● జంగుబాయి సన్నిధిలో ఆదివాసీల పూజలు ● ఆలయంలో రేపటి నుంచి నెలరోజులు ఉత్సవాలుకెరమెరి(ఆసిఫాబాద్): ఆనాదిగా వస్తున్న ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడడంలో ఆదివాసీలు ముందుంటున్నారు. జూన్ 8న మృగశిరకార్తె ప్రవేశించనుండడంతో ఆదివాసీలు తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని మహరాజ్గూడ అడవుల్లో కొలువైన జంగుబాయికి పుణ్యక్షేత్రంలో విత్తన పూజకు శ్రీకారం చుట్టారు. అక్కడి గుహలోకి వెళ్లి దీపం వద్ద పూజలు చేస్తారు. రావుడ్, పోచమ్మ, మైసమ్మకు విత్తనాలు చూపించి మొక్కి అమ్మవార్లకు నైవేద్యం చూపిస్తారు. విత్తన పూజల అనంతరం తమ పొలాల్లో విత్తనాలు నాటడం ప్రారంభిస్తారు. దీన్ని గోండి భాషలో ‘మొహతుక్’అంటారు. అదేవిధంగా గిరి గ్రామాల్లో ఏటా జరిగే విత్తన పూజల ముందుగా జంగుబాయి అమ్మవారికి విత్తనాలు చూపెట్టాక పొలాల్లో నాటడంతో అధిక దిగుబడి వస్తాయని భక్తుల నమ్మకం. నేడు దీపోత్సవం జంగుబాయి సన్నిధిలో గురువారం దీపోత్సవం, శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలు నెల రోజుల పాటు నిర్వహిస్తారు. వివిధ గ్రామాలకు చెందిన మోళంలు తరలివచ్చి పూజలు చేస్తాయి. దుక్కిలతో దున్ని విత్తనాలు వేసేందుకు తమ పొలాలను రైతులు సిద్ధం చేశారు. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, కుమురం భీం జిల్లాలోనే ఆదివాసీలు అధికంగా ఉన్నారు. దేవతలకు విత్తనాలను చూపిస్తారు మే మాసంలో అన్ని గ్రామాల్లో గ్రామ పటేల్ ఇంట్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆదివాసీల కులదైవమైన పాటేరు అమ్మోరు, జంగుబాయి, గాంధారి కిల్ల, పద్మాల్పురి కాకో వద్దకు వెళ్లి విత్తనాలను చూపిస్తారు. అక్కడే దేవతల ఆశీర్వాదం తీసుకుని తిరుగుపయనమవుతారు. అనంతరం గ్రామంలో ఉన్న ఆకిపేన్, అమ్మోరు, పోచమ్మ వద్దకు వెళ్లి విత్తనాలతో పూజలు చేస్తారు. అదే రోజు రాత్రి 2.5 కిలోల జొన్నలతో గట్క తయారు చేసి ఆరగిస్తారు. అర్ధరాత్రి అడవికి వెళ్లి (కుమ్ముడ్) చెట్టు ఆకులను తీసుకువచ్చి డొప్పలు తయారు చేసి ఇళ్లల్లో ఇస్తారు. అందులో పూజ చేసిన విత్తనాలు వేస్తారు. ఈ కార్యక్రమంతా మృగశిర మాసానికి కొద్ది రోజుల ముందుగా నిర్వహిస్తారు. విత్తన పూజలు(మొహతుక్) విత్తన పూజ చేయాలన్న రోజు రైతు కుటుంబమంతా ఉదయాన్నే పొలం బాట పడుతారు. ఉదయం ఇంటిని శుభ్రం చేసి పేడతో అలుకు చల్లుతారు. పొలానికి వెళ్లాక జొన్నతో గట్కా తయారు చేసి కులదైవంతోపాటు నేల తల్లికి సమర్పిస్తారు. అనంతరం పొలంలో విత్తనాలు చల్లి అరకకు ప్రత్యేక పూజలు చేసి విత్తనాలు నాటుతారు. గ్రామ పటేల్ ఇంటి ఎదుట మహిళలు సంప్రదాయ నృత్యాలు చేస్తారు. పురుషులు గిల్లిదండా ఆట ఆడుతారు. తర్వాత సహపంక్తి భోజనం చేస్తారు. చంచి భీమల్ దేవుడి కల్యాణంతో.. ఆదివాసీల ఇష్టదైవమైన చంచి భీమల్ దేవుడి కల్యాణం సందర్భంగా ఏటా ఏప్రిల్, మే మాసంలో విత్తనాలను దేవుడికి చూపిస్తారు. ఆరోజు ఆదివాసీలు భీమల్ దేవుడికి సంప్రదాయ పూజలు చేస్తారు. అడవుల్లో లభించే ఆకులతో ఆరు డొప్పలను తయారు చేస్తారు. అందులో అన్ని విత్తనాలను కలిపి భీమల్ దేవునికి చూపిస్తారు. అనంతరం వాటిని ఇళ్లకు తీసుకెళ్లి దాచి పెడ్తారు. ఆరోజు పిండి వంటలు చేసి ఆరగిస్తారు. మృగశిర కార్తె ప్రారంభంతో ఆ విత్తనాలను తమ పొలాల్లో చల్లుతారని పలువురు చెబుతున్నారు. దేవతలకు చూపించాకే.. పొలాల్లో విత్తనాలు నాటే కొన్నిరోజుల ముందు కుల దేవతలకు వాటిని చూపిస్తాం. ప్రత్యేక పూజలు చేశాకే పొలానికి వెళ్లి జొన్నగట్కాను వండి ఆరగిస్తాం. నేలతల్లికి ప్రత్యేక పూజలు చేసి విత్తనాలు నాటడం ప్రారంభిస్తాం. – సలాం శ్యాంరావు, జంగుబాయి ఉత్సవ కమిటీ చైర్మన్ ఆచారాలు పాటిస్తున్నాం ఆదివాసీలు ఆచారాలు, సంప్రదాయాలు పాటిస్తూ వస్తున్నారు. ఏళ్ల క్రితం నుంచి ప్రారంభమైన విత్తన(మొహతుక్) పూజలు ఇప్పుడు కూడా చేస్తున్నాం. పూజలు చేయందే విత్తనాలు నాటం.– పుర్క బాపూరావు, జంగు బాయి ఉత్సవ కమిటీ, ప్రచార కార్యదర్శి -
నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తే చర్యలు
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆసిఫాబాద్: నిషేధిత నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తే దుకాణాల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం అదనపు కలెక్టర్ డేవిడ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రావూరి శ్రీనివాస్తో కలిసి వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు, విత్తన విక్రయ డీలర్లతో వానాకాలం సంసిద్ధత, నిషేధిత పత్తి విత్తనాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మట్లాడుతూ వానాకాలం సీజన్లో జిల్లాలో 70 శాతం పత్తి సాగవుతుందని, రైతులకు కల్తీ, నిషేధిత పత్తి విత్తనాలు విక్రయించొద్దన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నో ఆశలతో రైతులు పత్తి సాగు చేస్తారని, నకిలీ విత్తనాలు మొలకెత్తకపోతే ఆ కుటుంబం అప్పుల్లో కూరుకుపోతుందన్నారు. ప్రభుత్వ అనుమతి పొందిన, గుర్తింపు ఉన్న కంపెనీల విత్తనాలు మాత్రమే విక్రయించాలని ఆదేశించారు. రైతులకు అవగాహన కల్పించాలన్నారు. విత్తనాలు, మందులు కృత్రిమ కొరత సృష్టించవద్దని, అధిక ధరలకు విక్రయించొద్దని సూచించారు. దుకాణాల యజమానులు విధిగా స్టాకు రిజిస్టర్, ధరల పట్టిక, రశీదు, రిజిస్టర్, ఈ– పాస్ మిషన్ నిర్వహించాలన్నారు. పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసి నకిలీ పత్తి విత్తనాల విక్రయాన్ని నియంత్రిస్తామని తెలిపారు. సమావేశంలో వ్యవసాయ శాఖ ఏడీఏ మనోహర్, అధికారులు, విత్తన డీలర్లు పాల్గొన్నారు. -
సమ్మర్ క్యాంపులకు సై
● జిల్లాలో నేటి నుంచి 10 శిబిరాల్లో శిక్షణ ● ఈ నెల 31 వరకు నిర్వహణ ఆసిఫాబాద్రూరల్/ఆసిఫాబాద్అర్బన్: సమ్మర్ క్యాంపులకు సమయం ఆసన్నమైంది. యువజన క్రీడాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో పది శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశారు. పది క్రీడాంశాల్లో గురువారం నుంచి నెలరోజులపాటు బాలబాలికలకు ఉచిత శిక్షణ అందించనున్నారు. మానసికోల్లాసం, దేహదారుఢ్యంపాటు స్నేహభావం పెంచేందుకు క్రీడలు ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో పది కేంద్రాలు జిల్లాలోని మూడు మండలాల్లో పది శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం పది క్రీడాంశాల్లో పది మంది శిక్షకులను ఎంపిక చేశారు. వారికి కేటాయించిన క్రీడల్లో ఈ నెల 1 నుంచి 31 వరకు శిక్షణ ఇవ్వనున్నారు. అవసరమైన క్రీడాసామగ్రి సైతం అందించనున్నారు. ఆసిఫాబాద్ మండలంలోని జన్కాపూర్, రాజంపేట్, బూర్గుడ, తిర్యాణి మండలంలోని రొంపెల్లి, తిర్యాణి, రాళ్లకన్నెల్లి, కాగజ్నగర్లోని బురదగూడ, సారండి, వెంపల్లి, నజ్రుల్నగర్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. విద్యార్థుల్లో క్రీడానైపుణ్యం పెంచేందుకు శిక్షణ శిబిరాలు దోహదపడనున్నాయి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 8:30 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు శిక్షణ కొనసాగుతుందని సంబంధిత అధికారులు తెలిపారు. ఒక్కో కేంద్రంలో 40 మంది నుంచి 50 మంది విద్యార్థుల వరకు పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. -
ఆశ్రమ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు
ఉట్నూర్రూరల్: ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. బుధవారం ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా తన క్యాంపు కార్యాలయంలో డీడీ అంబాజీ, ఏసీఎంవో జగన్ను అభినందించారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి 96 శాతం ఫలితాలు సాధించినట్లు ఏసీఎంవో జగన్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 108 పాఠశాలలు, అందులో 65 పాఠశాలలు వంద శాతం వచ్చాయని పేర్కొన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పదిలో ఉత్తమ ఫలితాలు సాధనకు ఐటీడీఏ పీవో సారథ్యంలో చేపట్టిన మిషన్ లక్ష్యం ఎంతో మేలు చేసిందన్నారు. వచ్చే ఏడాదిలో పదిలో వందశాతం ఫలితాలు సాధించేలా కృషిచేయాలని ఐటీడీఏ పీవో పేర్కొన్నారు. -
మహిళా ఉద్యోగులకు క్రీడాపోటీలు
రెబ్బెన(ఆసిఫాబాద్): ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఏరియాలోని వర్క్షాప్లో బుధవారం మహిళా ఉద్యోగులకు క్రీడాపోటీలు నిర్వహించా రు. ఆ సంఘం గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి మాట్లాడుతూ సింగరేణి చరిత్రలో మేడే సందర్భంగా మహిళా ఉద్యోగులకు మొదటిసారిగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పోటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటికే గోలేటి సీహెచ్పీ, జీఎం కార్యాలయం, కై రిగూడ ఓసీపీల్లో పోటీలు నిర్వహించగా, అక్కడి మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారని అన్నారు. సింగరేణిలో పురుషులతో సమానంగా మహిళలు సత్తా చాటుకుంటున్నారని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ అన్నిరంగాల్లో రాణించాలని కోరారు. కార్యక్రమంలో బ్రాంచి ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి, ఆర్గనైజింగ్ కార్యదర్శి కిరణ్బాబు, కైరిగూడ ఫిట్ కార్యదర్శి మారం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
బాల్యవివాహాలు జరిపిస్తే కేసులు
రెబ్బెన(ఆసిఫాబాద్): నిర్ణీత వయస్సు రాకుండా బాల్యవివాహాలు జరిపిస్తే కేసులు నమోదు చేస్తామని డీసీపీవో బూర్ల మహేశ్ హెచ్చరించారు. మండలంలోని నారాయణపూర్లో ఓ మైనర్ బాలికకు వివాహం జరిపిస్తున్నట్లు సమాచారం రావడంతో.. బుధవారం జిల్లా బాలల సంరక్షణ విభాగం, చైల్డ్ హెల్ప్లైన్ సిబ్బంది అదనపు కలెక్టర్ దీపక్ తివారి ఆదేశాల మేరకు గ్రామానికి వెళ్లి వివాహాన్ని అడ్డుకున్నారు. బాలికను కౌన్సెలింగ్ నిమిత్తం సఖి కేంద్రానికి తరలించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో బాల్యవివాహాల నిర్మూలనకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు, పౌర సమాజం సహకరించాలని కోరారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే బాల్య వివాహాల నిషేధ చట్టం– 2006 ప్రకారం రెండేళ్ల నాన్ బెయిలెబుల్ జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తామని తెలిపారు. బాల్య వివాహాలు నిర్వహించినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్లైన్ సూపర్వైజర్ ఝాన్సీరాణి, సిబ్బంది పాల్గొన్నారు. -
జేఏసీ పోరాటాలకు టీబీజీకేఎస్ సంపూర్ణ మద్దతు
రెబ్బెన(ఆసిఫాబాద్): కాంట్రాక్టు కార్మికుల జీతాల పెంపు కోసం జేఏసీ ఆధ్వర్యంలో జరిగే పోరాటాలకు టీబీజీకేఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ సంఘం బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్రావు తెలిపారు. గోలేటి టౌన్షిప్లోని యూనియన్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కార్మికుల జీతాల పెంపుపై మేడే రోజు సీఎం రేవంత్రెడ్డి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. చాలా కాలంగా కాంట్రాక్టు కార్మికుల జీతాలు పెరగకపోవడంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఎన్నికల సందర్భంగా కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు లేదా జీవో నంబర్ 22 ప్రకారం నెలకు రూ.25వేలు తగ్గకుండా అందేలా చూస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారిక కార్మిక వేడుకల్లో సీఎం కాంట్రాక్టు కార్మికులకు తీపి కబురు చెప్పాలని అన్నారు. కార్మికుల జీతాల పెంపుతోపాటు ఈఎస్ఐ వైద్య సౌకర్యం, 2022 సెప్టెంబర్ 26న సెంట్రల్ లేబర్ అధికారుల సమక్షంలో జరిగిన ఒప్పందంలోని అంశాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏరియా నాయకులు మారిన వెంకటేశ్, సెంట్రల్ కమిటీ నాయకులు సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
చిరు ధాన్యాలపై సాగుపై దృష్టి సారించాలి
తిర్యాణి(ఆసిఫాబాద్): రైతులు చిరుధాన్యాలపై దృష్టి సారించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. మండలంలోని మొహింద గుడిపేట గ్రామంలో సోలార్ పంపు సెట్లతో సాగు చేస్తున్న చిరుధాన్యాల పంటను మంగళవారం పరిశీలించారు. అనంతరం రైతులతో సమావేశం నిర్వహించారు. పీవో మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో పండించే కూరగాయలను ఆశ్రమ పాఠశాలలకు సరఫరా చేసి రైతులకు ధర గిట్టుబాటు అ య్యేలా చూస్తామన్నారు. మండలంలో త్వరలోనే ఐటీడీఏ ఆధ్వర్యంలో దాల్మిల్ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రా మంలో బావి ఏర్పాటు చేయాలని గ్రామస్తులు పీవో దృష్టికి తీసుకెళ్లగా, సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో ఐటీడీఏ జేఈ బద్రోద్దీన్, గ్రామ పటేల్ మడావి భీంరావు, ఆత్రం భీంరావు, రైతులు భుజంగరావు, జలపతిరావు, పైకు తదితరులు పాల్గొన్నారు. -
గొంతు తడిపేలా..!
● తాగునీటి సమస్యలపై పోలీసుశాఖ దృష్టి ● మారుమూల గ్రామాల్లో బోర్లు వేయిస్తున్న వైనం ● కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు చేరువసాక్షి, ఆసిఫాబాద్: పోలీసులపై ఉన్న ప్రతికూల అభి ప్రాయాలు తొలగించడంతోపాటు ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడమే లక్ష్యంగా జిల్లా పోలీసుశాఖ ఇటీవల ‘సామాజిక’ పోలీసింగ్కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లాలో మారుమూల గ్రా మాల్లో తాగునీటి ఇబ్బందులు తొలగించేందుకు చర్యలు చేపడుతున్నారు. వేసవి తీవ్రతతో నీటి వనరులు కనుమరుగవుతున్న నేపథ్యంలో బోర్లు వేయిస్తూ నీటి గోస తీరుస్తున్నారు. గతేడాది జూన్ 20న జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న డీవీ శ్రీనివాసరావు త్వరితగతినే జిల్లా పరిస్థితులపై ఆధ్వయనం చేశారు. చట్టాలను కఠినంగా అమలు చేస్తూనే పోలీ సుశాఖలో జవాబుదారీతనం, పారదర్శకత తీసుకొచ్చారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ప్రజల మన్ననలు చూరగొన్నారు. దేశంలోనే రెండో వెనుకబడిన జిల్లా అయిన కుమురంభీం ఆసిఫాబాద్లో మారుమూల తండాలు, గూడేల్లో నివసిస్తున్న గిరిజ నులకు వైద్యసేవలు అందించడం, వృద్ధులకు దు ప్పట్లు, యువత చెడు మార్గాల్లో వెళ్లకుండా అవగా హన కార్యక్రమాలు, వారికి క్రీడా పరికరాల పంపి ణీ.. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలనే ఉద్దేశంతో కుట్టుమిషన్లు పంపిణీ వంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యంజిల్లావ్యాప్తంగా పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా గతేడాది డిసెంబర్ 19న బెజ్జూర్ మండలం నాగవెళ్లి గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. ప్రజలకు దుప్పట్లు, యువతకు వాలీబాల్ కి ట్లు పంపిణీ చేశారు. డిసెంబర్ 24న జైనూర్ మండ ల కేంద్రంలోని ఆదివాసీ భవనంలో ఆదివాసీ మ హిళలకు చేతన ఫౌండేషన్ సహకారంతో 35 కుట్టు మిషన్లు అందించారు. డిసెంబర్ 29న తిర్యాణి మండలం మంగీ గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహణతోపాటు 500 మందికి దుప్పట్లు, విద్యార్థులకు పుస్తకాలు, పెన్ను పంపిణీ చేశారు. ఈ ఏడాది మార్చి 12న జైనూర్లో కరీంనగర్ ప్రతిమ హాస్పిటల్ వారి సహకారంతో మెగా వైద్యశిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలందించారు. జిల్లాస్థాయిలో యువత కోసం కౌటాల పోలీసు స్టేషన్ వేదికగా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించగా 64 టీంలు పాల్గొనడం విశేషం. వేసవిని దృష్టిలో ఉంచుకుని ఆసిఫాబాద్ పట్టణంలో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఏప్రిల్ 16 నుంచి రోజూ సుమారు 500 మందికి ఉచితంగా మజ్జిగ పంపిణీ చేపట్టారు. ప్రతీ మండల కేంద్రంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయించారు.పోలీసుల బాధ్యత చట్టాలు అమలు చేయడమే కాకుండా ప్రజల భద్రత.. వారి జీవనాన్ని మెరుగుపరచడానికి పోలీసులు కృషి చేయాలి. అది తమ బాధ్యతగా గుర్తించాలి. జిల్లాలో తాగునీటి సమస్య ఉన్న కొన్ని గ్రామాలు నా దృష్టికి రావడంతో అక్కడ బోర్లు వేయించే ప్రయత్నం చేశారు. కొన్నిచోట్ల నీళ్లు పడకపోయినా.. మళ్లీ ప్రయత్నించేందుకు చర్యలు చేపట్టాం. కమ్యూనిటీ పోలీసింగ్ను పకడ్బందీగా అమలు చేస్తున్నాం. సామాజిక సేవలో భాగంగా జిల్లాలో మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న గిరిజన ప్రజల జీవన విధానాన్ని మెరుపర్చేందుకు అవసరమైన సహకారం అందిస్తున్నాం. – డీవీ శ్రీనివాసరావు, ఎస్పీ దాహార్తిని తీరుస్తూ..తాగునీటి సమస్యలతో జిల్లాలోని కొన్ని మారుమూల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా పెంచికల్పేట్ మండలం కోయచిచ్చాల గ్రామంలో మంచినీటి సమస్యను పోలీసులు పరిష్కరించారు. సిర్పూర్(యూ) మండలం రుద్రకస గ్రామంలోనూ తాగునీటి సమస్యను గుర్తించి బోరు వేయించారు. -
పకడ్బందీగా నీట్ నిర్వహణ
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో నీట్ పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పా ఠశాలలో ఏర్పాటు చేసిన నీట్ కేంద్రాన్ని మంగళవా రం ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ డేవిడ్తో కలిసి పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించా రు. కలెక్టర్ మాట్లాడుతూ మే 4న నిర్వహించే నీట్ కు జిల్లాలో 287 మంది హాజరవుతారని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు కల్పించాలన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారని, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. ప్రశ్నపత్రాలను పూర్తి బందోబస్తుతో భద్రపరిచినట్లు పేర్కొన్నారు. సమావేశంలో పరీక్ష సమన్వయకర్త లక్ష్మీనరసింహ, పర్వవేక్షకులు ఉదయ్బాబు, శశిధర్ పాల్గొన్నారు. -
సమ్మె విజయవంతం చేయాలి
పెంచికల్పేట్(సిర్పూర్): లేబర్ కోడ్ల రద్దు కోసం వచ్చే నెల 20న నిర్వహించే దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు వెలిశాల క్రిష్ణమాచారి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో మంగళవారం ఆయన మాట్లాడారు. కార్మికుల శ్రమ ను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేందుకు బీజే పీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పోరా టాలతో సాధించుకున్న హక్కులు కాపాడుకోవాడానికి ప్రతీ కార్మికుడు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రభు త్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను అడ్డుకోవా లన్నారు. ఈ సమావేశంలో ఘనపురం శ్రీకాంత్, దిగిడే మల్లిక, పద్మ, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటి కోసం నిరసన
కౌటాల(సిర్పూర్): తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని, సమస్య పరిష్కరించాలని మంగళవారం కౌటాల మండలం వీరవెల్లి గ్రామంలోని నిరుపయోగంగా ఉన్న చేతిపంపు వద్ద మహిళలు నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ 20 రోజులుగా ఎస్సీ కాలనీలోని చేతిపంపు పనిచేయడం లేదని, మిషన్ భగీరథ నీరు సైతం సక్రమంగా రావడం లేదని తెలిపారు. సంబంధిత అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. స్థానికంగా బోర్లు ఉన్న వారిని నీళ్లు అడిగి తాగుతున్నామని వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి తాగునీటి సమస్యలు తీర్చాలని కోరారు. -
రైస్ మిల్లర్లు లక్ష్యాలు పూర్తి చేయాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేఆసిఫాబాద్అర్బన్: జిల్లాలోని రైస్ మిల్లర్లు తమకు కేటాయించిన లక్ష్యాలు పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాలతో కలిసి జిల్లా పౌరసరఫరాలు, సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ ప్ర తినిధులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సన్న, దొడ్డు రకం వడ్లు 56,588 మెట్రిక్ టన్నుల దిగుబడి రావొచ్చన్నారు. అందుకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతుల వద్ద నుంచి నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించా రు. లక్ష్యాలు పూర్తిచేయని మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుని, మిల్లులు సీజ్ చేస్తామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడ, మాయిశ్చర్ డ్రయర్ సదుపాయాలు కల్పించాలని, తేమశాతంపై అవగాహన కల్పించాలన్నారు. ధాన్యం తరలింపునకు 46 వాహనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపా రు. పక్క రాష్ట్రం నుంచి ధాన్యం జిల్లాలోకి రాకుండా వెంకట్రావ్ పేట, గూడెం, సిర్పూర్(టి)లో అంతర్రాష్ట్ర చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. నకిలీ విత్తనాల విక్రయం, రవాణా, వినియోగంపై నిఘా ఏర్పాటు చేయాలన్నారు. భూ సమస్యల పరిష్కారానికి చర్యలుభూభారతి నూతన ఆర్వోఆర్ చట్టం– 2025 ద్వారా భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ రైతువేదికలో మంగళవారం భూభారతి చట్టంపై అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టంపై రైతులు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇందులో అప్పీలు వ్యవస్థ కీలకమన్నారు. తహసీల్దార్ జారీ చేసిన ఉత్తర్వులతో రైతుకు న్యాయం జరగకపోతే ఆర్డీవో, సబ్ కలెక్టర్కు అప్పీలు చేసుకోవచ్చని, అక్కడా న్యాయం జరగని పక్షంలో కలెక్టర్ ద్వారా న్యాయం పొందవచ్చని తెలిపారు. విరాసత్ సమయంలో కుటుంబ సభ్యులందరికీ నోటీసులు జారీ చేస్తారన్నారు. జూన్ 2 తర్వాత ప్రతీ గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో తహసీల్దార్ రోహిత్, ఎంపీడీవో శ్రీనివాస్ పాల్గొన్నారు. -
హైవేతో మారుమూల ప్రాంతాల అభివృద్ధి
● వచ్చే నెల 5న జిల్లాకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ ● పాల్వాయి హరీశ్బాబు రెబ్బెన(ఆసిఫాబాద్): మంచిర్యాల టు మహారాష్ట్ర సరిహద్దు వరకు సుమారు రూ.3500 కోట్లతో నిర్మించిన హైవేతో మారుమూల ప్రాంతాలు అభివృద్ది చెందాయని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అన్నారు. జాతీయ రహదారి– 363ను ప్రారంభించేందుకు మే 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ జిల్లాకు రానున్నారని తెలిపారు. రెబ్బెన మండలంలోని కాగజ్నగర్ ఎక్స్రోడ్ వద్ద జాతీయ రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను మంగళవారం పరిశీలించారు. సభాస్థలితోపాటు హెలిప్యాడ్ ప్రాంతాలను ఎన్హెచ్ఏఐ, ఆర్అండ్బీ అధికారులతో కలిసి సందర్శించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం మీదుగా నిర్మించిన జాతీయ రహదారితో జిల్లావాసులు హైదరాబాద్, తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు మెరుగైన రోడ్డు సౌకర్యం ఏర్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వేల కిలోమీటర్ల మేర రహదారులను నిర్మిస్తోందని తెలిపారు. హైవే– 363 ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్కుమార్తోపాటు ఎంపీ గోడం నగేశ్, స్థానిక శాసన సభ్యులు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టు అధికారి మణికుమార్, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సత్యనారాయణ, ఓబీసీ మోర్చా రాష్ట్ర కోఆర్డినేటర్ వెంకటేశ్, జిల్లా కోశాధికారి అరుణ్లోయ తదితరులు పాల్గొన్నారు. -
వడ్డీ వ్యాపారుల ఇళ్లలో సోదాలు
● పది మందిపై కేసు ● రూ.11లక్షలు, పలు డాక్యుమెంట్లు సీజ్ ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలో అధిక వడ్డీ వసూలు చేస్తూ అక్రమంగా వ్యాపారం చేస్తున్న పలువురి ఇళ్లపై ఏఎస్పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం ఉదయం 5 గంటల నుంచి సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పది మందిపై కేసు నమోదు చేసి, రూ.11 లక్షల నగదు సీజ్ చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. బ్యాంకు చెక్కులు, ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నామన్నారు. సరైన అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారం చేసినా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సోదాల్లో నలుగురు సీఐలు, ఎనిమిది మంది ఎస్సైలు, 50 మంది సిబ్బంది పాల్గొన్నారు. -
తాగునీటి ఇబ్బందులు రానీయొద్దు
పెంచికల్పేట్(సిర్పూర్): తాగునీటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. పెంచికల్పేట్ మండలం ఎల్లూర్ గ్రామ పంచాయతీలోని కోయచిచ్చాలలో మంగళవారం పర్యటించారు. మూడు చేతిపంపులు చెడిపోవడంతో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. ఇంటింటికీ మిషన్ భగీరథ నీటి సరఫరాలో సమస్యలు ఉంటే వెంటనే సంబంధిత శాఖ అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో అల్బర్ట్, ఎస్సై కొమురయ్య, ఆర్డబ్ల్యూ ఏఈ ఖదీర్, ఏపీవో సతీశ్, పంచాయతీ కార్యదర్శి చంద్రయ్య తదితరులు ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి దహెగాం: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండలంలోని దిగిడలో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, నర్సరీ పనులు, సీసీరోడ్ల నిర్మాణాలు, తాగునీటి వనరులను పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో అలసత్వం ప్రదర్శించొ ద్దన్నారు. వర్షాకాలం నాటికి మొక్కలు సిద్ధం చేయాలన్నారు. తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఇనోస్, ఈజీఎస్ ఏపీవో కల్పన తదితరులు ఉన్నారు. -
నాన్న కల నెరవేర్చా..
● మూడో ప్రయత్నంలో ఐఏఎస్ సాధించా.. ● ఆత్మవిశ్వాసంతో సాగితే లక్ష్యసాధన సులువే ● ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా మనోగతం ‘నన్ను కలెక్టర్గా చూడాలనేది మా నాన్న కల.. దాన్ని ఎలాగైనా నెరవేర్చాలని పాఠశాల స్థాయిలోనే నిర్ణయించుకున్నా.. ఆయన అందించిన ప్రోత్సాహంతో ముందుకు సాగా.. రెండుసార్లు విఫలమయ్యా.. అయినా నిరాశ చెందలేదు.. రాత్రింబవళ్లు మరింత కష్టపడి చదివా.. లోటుపాట్లు సవరించుకుని ముందడుగు వేశాను. మూడో ప్రయత్నంలో విజయం సాధించా.. 2023 యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 29వ ర్యాంకు సాధించా.. ఐఏఎస్గా తెలంగాణ క్యాడర్కు ఎంపికయ్యా.. నాన్న కల నెరవేర్చడం నాకెంతో ఆనందానిస్తోంది.. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను అమలు చేసి, పేదలకు సేవ చేయడమే లక్ష్యమని అంటున్నారు ఆదిలాబాద్ జిల్లాకు నూతనంగా విచ్చేసిన ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా. ‘సాక్షి’కి మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. – కై లాస్నగర్ -
వృద్ధ క్రీడాకారులకు అభినందన
ఆసిఫాబాద్అర్బన్: నేషనల్ మాస్టర్స్ గేమ్స్– 2025లో పరుగు పందెంలో పతకాలు సాధించిన ఆసిఫాబాద్ మండలం బూర్గుడ గ్రామానికి చెందిన వైరాగడె శకుంతల, ఆనంద్రావ్ దంపతులను జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో సోమవారం అదనపు ఎస్పీ ప్రభాకర్రావు అభినందించారు. హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాలలో ఈ నెల 20 నుంచి 26 వరకు జరిగిన జాతీయస్థాయి పోటీల్లో శకుంతల 50ప్లస్ ఏజ్ గ్రూపు మహిళా విభాగంలో 10 కిలోమీటర్ల రన్నింగ్ పోటీల్లో మొదటిస్థానం, ఆనంద్రావ్ 55 ప్లస్ ఏజ్గ్రూపు పురుషుల విభాగం రేస్ వాక్లో రెండోస్థానంలో నిలిచారు. ఏఎస్పీ మాట్లాడుతూ గెలవాలనే కోరికకు వయస్సు అడ్డురాదనే నిజాన్ని ఆనంద్రావ్ దంపతులు రుజువు చేశారన్నారు. యువత వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. -
మూడేళ్లుగా నష్టాలే..
ఈ ఫొటోలోని రైతు పేరు నందూసింగ్. రెబ్బెన మండల కేంద్రానికి చెందిన ఈయనకు పులికుంట శివారులో సుమారు 30 ఎకరాల్లో మామిడి తోట ఉంది. తోటల పెంపకంలో దాదాపు 50 ఏళ్ల అనుభవం ఉంది. ఒకప్పుడు టన్నుల కొద్దీ దిగుబడి సాధించాడు. కానీ కొన్నేళ్లుగా ఆశించిన దిగుబడి సాధించలేకపోతున్నాడు. వాతావరణ మార్పులతో చెట్లకు పూత, కాత రావడం లేదు. ఈసారి పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తోటలో వందలాది చెట్లు ఉంటే అతికొద్ది చెట్లకు మాత్రమే కాయలు ఉన్నాయి. అవి కూడా గాలిదుమారానికి రాలిపోతున్నాయి.. ఇలా నందుసింగ్ మాత్రమే కాదు. జిల్లాలో మామిడి తోటలు సాగు చేస్తున్న ప్రతీ రైతుది ఇంచుమించు ఇదే పరిస్థితి. రెబ్బెన(ఆసిఫాబాద్): మామిడి తోటలు సాగు చేస్తున్న రైతులకు మూడేళ్లుగా కాలం కలిసిరావడం లేదు. జిల్లాలోని తేలికపాటి భూములు తోటల పెంపకానికి అనుకూలంగా ఉండటంతో గతంలో ఏటా ఆశించిన ఫలసాయం పొందేవారు. వాతావరణం సైతం అనుకూలించి మంచి దిగుబడి దక్కేది. కానీ కొన్నేళ్లుగా పరిస్థితులు మారిపోయాయి. ఖర్చు లే కుండా దిగుబడి అందించిన తోటల్లో ఇప్పుడు పె ట్టుబడి కూడా రావడం లేదు. మూడేళ్లుగా మామిడి రైతుల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. వాతా వరణ మార్పుల ప్రభావం పూతకాతలపై పడింది. మరోవైపు పంట చేతికందే దశలో గాలిదుమారాలు, అకాల వర్షాలు నిండా ముంచుతున్నాయి. ఆరంభం నుంచే ప్రతికూలంజిల్లాలోని రెబ్బెన, తిర్యాణి, కాగజ్నగర్, సిర్పూర్(టి), జైనూర్ మండలాల్లో ఉద్యావనశాఖ అధికారుల లెక్కల ప్రకారం 982 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. సాధారణంగా కాయలు తెంపే దశలో వచ్చే గాలిదుమారాలు, అకాల వర్షాలతో తోటలు దెబ్బతింటాయి. ఈ ఏడాది మాత్రం సీజన్ ప్రారంభం నుంచే వాతావరణం ప్రతికూలంగా మారింది. జనవరి, ఫిబ్రవరిలో ఈదురుగాలులతో పూత రాలి పిందెల సంఖ్య తగ్గింది. ఇప్పటికీ ఇదే తరహా వాతావరణం ఉండటంతో కాయలు రాలిపోతున్నాయి. వాతావరణం అనుకూలిస్తే ఎకరం తోటలో సుమారు 10 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. కానీ ఈసారి ఉన్న ప్రతికూల పరిస్థితులతో దిగుబడి నాలుగు టన్నులకు మించేలా కనిపించడం లేదు. 136 ఎకరాల్లో నష్టంసీజన్ ప్రారంభంలో పూతలు చూసి మురిసిపోయే రైతులకు ఆ సంతోషం చివరి వరకు ఉండడం లేదు. ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈదురుగాలులు కూడా తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలోని మామిడి తోటలు కోతదశకు చేరుకున్నాయి. కొన్ని రోజులుగా జిల్లా అంతటా వాతావరణం రోజుకో విధంగా మారుతోంది. పగటి పూట అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ.. సాయంత్రం ఆకాశం మేఘావృతమవుతూ బలమైన గాలులు వీస్తున్నాయి. గత నెలలో వడగండ్ల వానతో తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గాలుల ధాటికి చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి. జిల్లాలో గాలులు, అకాల వర్షాలకు 136 ఎకరాల్లోని మామిడి తోటలకు నష్టం వాటిల్లినట్లు ఉద్యానవన శాఖ అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. ప్రభుత్వం పరిహారం అందిస్తుందా లేదా అనేది వేచిచూడాలి. సరైన దిగుబడి లేని మామిడి ఈ ఏడాది గాలిదుమారాలతో దెబ్బతింటున్న తోటలు జిల్లాలో 136 ఎకరాల్లో పంట నష్టంధర ఉన్నా.. మార్కెట్ ఏది?జిల్లాలో మామిడి తోటలు అధికంగానే ఉన్నా అందుబాటులో మార్కెంటింగ్ సౌకర్యం లేదు. స్థానిక రైతులు పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలోని నాగ్పూర్ మార్కెట్కు కాయలు తరలిస్తున్నారు. సుమారు 300 కిలోమీటర్ల దూరంలోని నాగ్పూర్కు తరలించేందుకు వాహనాల కిరాయి, లోడింగ్, అన్లోడింగ్ ఖర్చులు తడిచి మోపెడవుతున్నాయి. మార్కెట్లో కమీషన్ కటింగ్ పేరుతో రైతులను మరింత దోచుకుంటున్నారు. గతేడాది ఈ సమయంలో నాణ్యమైన కాయలకు కిలోకు రూ.25 వరకు ధర పలకగా, ఈసారి ధర కాస్త ఆశాజనకంగా ఉంది. ప్రస్తుతం నాగ్పూర్, కరీంనగర్ మార్కెట్లలో కిలో కాయలకు రూ.60 నుంచి రూ.65 చెల్లిస్తున్నారు. దిగుబడి అంతంత మాత్రంగా ఉన్నా కాయలకు ధర ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న ధరే చివరివరకు కొనసాగుతుందనే నమ్మకం లేదు. పది రోజుల క్రితం నుంచే కోతలు మొదలయ్యాయి. పూర్తిస్థాయిలో పూర్తయితే మార్కెట్కు టన్నుల కొద్ది కాయలు వచ్చి ధర తగ్గవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. నాణ్యమైన కాయలకు మాత్రమే రూ.60 నుంచి రూ.65 వరకు చెల్లిస్తూ.. రాలిన కాయలకు మాత్రం కిలోకు రూ.20 లోపే చెల్లిస్తున్నారు. సర్వే చేపట్టాం ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు మామిడి తోటలకు అనుకూలంగా లేవు. సీజన్ మొదటి నుంచి వీస్తున్న ఈదురుగాలులు, గాలి దుమారాలతో పూత, కాత రాలిపోయింది. దానికి తోడు బలమైన గాలులకు కాయలు రాలిపోవడంతో పాటు కొమ్మలు, చెట్లు విరిగిపడి రైతులకు తీవ్రంగా నష్టాన్ని కలిగించాయి. మామిడి తోటలను పరిశీలించి సర్వే చేపట్టాం. జిల్లాలో 136 ఎకరాల్లో తోటలు దెబ్బతిన్నట్లు గుర్తించి ప్రభుత్వానికి నివేదించాం. – ఎంఏ నదీం, ఆసిఫాబాద్ డివిజన్ ఉద్యావన శాఖ అధికారి -
విద్యుత్ లైన్ కోసం వినూత్న నిరసన
ఆసిఫాబాద్అర్బన్: తిర్యాణి మండలం గోవె న పంచాయతీ పరిధిలోని నాయకపుగూడకు విద్యుత్లైన్ వేసేందుకు అటవీశాఖ అనుమతులు ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశా రు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని డీఎఫ్వో కార్యాలయం ఎదుట సోమవారం వినూత్నంగా నోటిపై చేతులు పెట్టుకుని మౌనంగా నిరసన తెలిపారు. 60 ఏళ్లుగా గ్రామానికి విద్యు త్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. కలెక్టర్, ఐటీడీఏ పీవో, ఎమ్మెల్యేకు తమ గోడు వినిపించినా పరిష్కారం కాలేదన్నారు. విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు అటవీ అధికారులు అనుమతులు మంజూరు చేసి, చీకటి నుంచి వెలుగులోకి వచ్చేందుకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎల్లయ్య, భీమయ్య, రాజం, మైసవ్వ, లస్మవ్వ, పోశవ్వ తదితరులు పాల్గొన్నారు. -
‘పల్లెల అభివృద్ధే ధ్యేయం’
బెజ్జూర్: మారుమూల పల్లెల అభివృద్ధే ప్రభు త్వ ధ్యేయమని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నా రు. మండలంలోని కొర్తగూడలో సోమవారం గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. త్వరలో ఇందిరమ్మ ఇళ్లు, యువతకు ఉద్యోగాలు, రాజీవ్ యువ వికా సంతో రుణాలను ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. అనంతరం పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన రోడ్డు పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి, టీపీసీసీ మెంబర్ అర్షద్ హుస్సేన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీవర్ధన్, నాయకులు జగ్గాగౌడ్, విశ్వేశ్వర్, శ్రీనివాస్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు
● అదనపు కలెక్టర్ దీపక్ తివారి ● ప్రజావాణిలో అర్జీలు స్వీకరణఆసిఫాబాద్అర్బన్: జిల్లా ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంబీఏ చదివిన తాను వాహన ప్రమాదంలో గాయపడి ఇంటి వద్ద ఉంటున్నానని, జిల్లా కేంద్రంలో ఏదైనా కార్యాలయంలో ఉపాధి అవకాశం కల్పించాలని రవిచంద్ర కాలనీకి చెందిన పర్చకి శారద కోరారు. తెలంగాణ మైనార్టీ కళాశాలలో అధ్యాపకుడి ఉద్యోగానికి ఒప్పంద ప్రతిపాదికన పనిచేసేందుకు దరఖాస్తు చేసుకున్న తనకు మెరిట్ ఉన్నా ఉద్యోగం రాలేదని, న్యాయం చేయాలని కాగజ్నగర్ మండలం రాస్పెల్లి గ్రామానికి చెందిన కోటేశ్ విన్నవించాడు. తన భర్త మరణించాడని, వితంతు పింఛన్ మంజూరు చేయాలని కౌటాల మండలం సాండ్గాం గ్రామానికి చెందిన మీరాబాయి దరఖాస్తు చేసుకుంది. ఆసిఫాబాద్ మండలం చిర్రకుంట శివారులోని పట్టా భూమిని ఆన్లైన్లో నమోదు చేసి, పట్టా పాసు పుస్తకం మంజూరు చేయాలని కుంరం లచ్చు అర్జీ అందించాడు. తన తండ్రి పేరుతో ఉన్న భూమిని కౌటాల మినీ స్టేడియం ఏర్పాటుకు తీసుకుని ఇప్పటివరకు పరిహారం అందించలేదని, న్యాయం చేయాలని కౌటాలకు చెందిన రాచకొండ అశోక్ కోరాడు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే అర్జీలు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. -
ఉల్లం‘ఘనుల’పై ఫోకస్
● రాంగ్రూట్, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న వాహనదారులపై చర్యలు ● మొదటిసారి పట్టుబడితే కౌన్సెలింగ్ ● మళ్లీ అదే తప్పు చేస్తే మాత్రం జైలుకు పంపించేలా కేసులుసాక్షి, ఆసిఫాబాద్: వాహనదారులకు బిగ్ అలర్ట్.. రాంగ్ రూట్లో వెళ్తున్నారా.. అయితే ఇకపై నేరుగా జైలుకే అని హెచ్చరిస్తున్నారు జిల్లా పోలీసులు. ఇప్పటికే జిల్లా కేంద్రంలో కఠిన ట్రాఫిక్ నిబంధనలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఓ వైపు నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధిస్తున్నా కొందరు నిర్లక్ష్యంగా వాహనాలు నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలకు రాంగ్ రూట్లో వెళ్లటమే ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు. రాంగ్ రూట్ వెళ్తూ తొలిసారిగా పట్టుబడిన వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. వారితో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే జరిగే నష్టాలను తెలుపుతూ ఉన్న ఫ్లకార్డులను ప్రధాన కూడళ్లలో ప్రదర్శించేలా చిన్నపాటి శిక్షలు సైతం విధిస్తున్నారు. మళ్లీ మళ్లీ తప్పు చేస్తే మాత్రం నేరుగా జైలుకు పంపించేందుకు సిద్ధమవుతున్నారు. 82 మంది కేసులు నమోదుజిల్లాలో కఠినమైన ట్రాఫిక్ చట్టాలు ఉన్నా చాలా మంది వాహనదారులు ఉల్లంఘిస్తున్నారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్తో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా ఆసిఫాబాద్ పట్టణంలో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు సబ్డివిజన్ ఏఎస్పీ చిత్తరంజన్ చర్యలు చేపట్టారు. నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానాలు విధిస్తూ కొరడా ఝుళిపిస్తున్నారు. అయితే కొందరు వాహనదారులు మాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పోలీసులు మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు. రాంగ్ రూట్లో వాహనాలు నడిపేవారిని గుర్తించేందుకు పట్టణంలో వంద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 281సెక్షన్ కింద కేసు ఫైల్ చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు రాంగ్ రూట్, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన 82 మందిపై ఆసిఫాబాద్ పట్టణ పోలీసులు 32 కేసులు నమోదు చేశారు. అందులో 77 బైకులు, రెండు ట్రాక్టర్లు, మూడు ఆటోలు ఉన్నాయి. ఫ్లకార్డులతో ప్రదర్శన... సోమవారం మధ్యాహ్నం పట్టణం నుంచి ముగ్గురు యువకులు క్లేసాపూర్ పెద్దవాగు బ్రిడ్జిపై రాంగ్ రూట్లో వెళ్తున్నారు. ఆ సమయంలో గోలేటి నుంచి పట్టణంలోకి వస్తున్న ఏఎస్పీ చిత్తరంజన్ వారి వాహనాన్ని ఆపి స్థానిక పోలీసు స్టేషన్కు తరలించారు. అనంతరం డ్రైవర్తోపాటు ఉన్న మరో ఇద్దరు యువకులకు రెండు గంటలపాటు పట్టణంలో అంబేడ్కర్ కూడలి వద్ద ఫ్లకార్డులను ప్రదర్శించేలా శిక్ష విధించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే జరిగే నష్టం ఏమిటనే సూక్తులతో ఉన్న ఫ్లకార్డులను వారు సాయంత్రం 6 గంటల నుంచి ప్రదర్శించారు. దీనిపై స్థానికులు ఒకింత ఆశ్చర్యానికి గురైనా.. అమ్మో ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే ఇలాంటి కఠిన శిక్షలు పడుతాయా? అంటూ ఆందోళన చెందారు. అలాగే మూడో యువకుడు కనిపించడం లేదని చర్చించుకోవడం గమనార్హం. స్వచ్ఛందమే.. పనిష్మెంట్ కాదు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తున్న వారితో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించాం. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారు తన భద్రత మాత్రమే కాకుండా ఇతర వాహనదారుల భద్రతకు కూడా బాధ్యత వహించాలి. సోమవారం రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన యువకులు స్వచ్ఛందగా ఇకపై తాము ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడమని చెప్పారు. పనిష్మెంట్లా కాకుండా ఇతరులకూ అవగాహన కల్పించేందుకు మాత్రమే ఫ్లకార్డులతో అంబేడ్కర్ కూడలిలో నిలబడ్డారు. – చిత్తరంజన్, ఏఎస్పీ, ఆసిఫాబాద్ సబ్డివిజన్ -
భూభారతిపై అవగాహన అవసరం
● కలెక్టర్ వెంకటేవ్ దోత్రేదహెగాం(సిర్పూర్): భూభారతి చట్టంపై ప్రతీ రైతుకు అవగాహన అవసరమని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో సోమవారం భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు భూమి ఎంతో ముఖ్యమని, ఎలాంటి భూసమస్యలు ఉన్నా భూభారతి చట్టం ద్వారా పరిష్కారమవుతాయని అన్నారు. అటవీ, రెవెన్యూ సరిహద్దు సమస్యల పరిష్కా రం కోసం ఉమ్మడి సర్వే నిర్వహిస్తామని తెలిపారు. రికార్డుల్లో తప్పులు సరిచేయడానికి అవకాశం ఉందని, అప్పీలు వ్యవస్థ కూడా ఎంతో కీలకమన్నారు. భూమార్పిడిలో సర్వేయర్ రూపొందించిన నక్షను జతపర్చడం ద్వారా భవిష్యత్తులోనూ భూ వివాదాలకు తావు ఉండదని స్పష్టం చేశారు. జూన్ 2 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. హామీ మేరకు చట్టం తెచ్చాంఎన్నికల హామీ మేరకు ధరణి పోర్టల్ను తొలగించి నూతనంగా భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. ఆయన మాట్లాడుతూ ధరణి పోర్టల్తో పేదలకు అన్యాయం జరగగా, సంపన్నులకు మాత్రమే లాభం చేకూరిందన్నారు. రాష్ట్ర ప్రజ లకు భద్రత కల్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, మండల ప్రత్యేకాధికారి సజీవన్, తహసీల్దార్ కవిత, ఏవో రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల కుటుంబాలకు అండగా ఉంటాం
ఆసిఫాబాద్అర్బన్: విధి నిర్వహణలో మరణించిన పోలీసుల కుటుంబాల అండగా ఉంటామని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. ఇటీవల గుండెపోటుతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ ఎండీ బషీరుద్దీన్ కుటుంబ స భ్యులకు సోమవారం జిల్లా కేంద్రంలో రూ.8 లక్షల విలువైన భద్రత చెక్కు అందించారు. ప్రభుత్వ పరంగా అందాల్సిన ఇతర బెని ఫిట్స్ అందేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో సీఐ రాణాప్రతాప్, పోలీసు సంఘం జిల్లా అధ్యక్షుడు విజయ శంకర్రెడ్డి, ఆర్ఐలు పెద్ద న్న, అంజన్న, నాగుల్ మీరా, ఏవో శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ వర్మ పాల్గొన్నారు. -
కల్లాల్లోనే ధాన్యం
దహెగాం: మండల కేంద్రంలో ధాన్యం కుప్పలుఈ ఫొటోలోని రైతు పేరు డోకే మధుకర్. పెంచికల్పేట్ మండల కేంద్రానికి చెందిన ఈయన రెండెకరాల్లో వరి సాగు చేశాడు. కోతలు పూర్తికాగా, ధాన్యం పొలం వద్ద కల్లంలోనే ఆరబెడుతున్నాడు. అకాల వర్షం ముప్పు పొంచి ఉండటంతో ధాన్యం కాపాడుకునేందుకు తిప్పలు పడుతున్నాడు. ఇలా.. జిల్లాలో చాలా మంది రైతులు వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో వడ్ల కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నారు. పెంచికల్పేట్(సిర్పూర్): జిల్లాలో వరికోతలు జో రందుకున్నాయి. రైతులు ధాన్యాన్ని కల్లాల్లో కుప్పలు పోశారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. మరోవైపు శనివారం జిల్లావ్యాప్తంగా గాలిదుమారం బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఆకాశం మేఘావృతమై ఉండటంతో కల్లాల్లోని ధాన్యాన్ని కాపాడుకునేందుకు అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. 34 కొనుగోలు కేంద్రాలు..జిల్లా వ్యాప్తంగా వరి సాగు ఉన్న మండలాల్లో 34 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇందులో ఐకేపీ ఆధ్వర్యంలో 19, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 15 కేంద్రాలు ప్రారంభించనున్నారు. ప్రభుత్వం వరి ఏ గ్రేడు రకానికి రూ.2320, సాధారణ రకానికి రూ.2300 మద్దతు ధర ప్రకటించింది. కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో కొందరు రైతులు ప్రైవేటు వ్యక్తులకు రూ.1800 నుంచి రూ.2వేలకు అమ్ముకుంటున్నారు. కొనుగోలు కేంద్రాల కోసం ఎదురుచూస్తున్న రైతులు ఆకాశం మేఘావృతమై ఉండటంతో ఆందోళన చెందుతున్నారు. చేతికందిన పంటను కాపాడుకునేందుకు తిప్పలు పడుతున్నారు. వర్షం పడే అవకాశం ఉండటంతో కుప్పలపై టార్పాలిన్లు కప్పుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కోరుతున్నారు. జిల్లాలో జోరుగా వరి కోతలు ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు కమ్ముకుంటున్న మబ్బులతో ఆందోళనలో అన్నదాతలుమూడెకరాల్లో సాగు చేశా మూడెకరాల్లో వరి పంట సాగు చేశాను. పది రోజుల క్రితం కోతలు పూర్తయ్యాయి. కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. పొలం సమీపంలోనే ధాన్యం ఆరబెట్టి కాపలా ఉంటున్నాను. ప్రతిరోజూ ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటున్నాయి. ధాన్యాన్ని కాపాడుకోవడానికి అవస్థలు పడుతున్నాం. – ఇర్షాద్, రైతు, ఎల్లూర్ త్వరగా ప్రారంభించాలి పది రోజుల క్రితం కోతలు పూర్తిచేశాం. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వి క్రయించడానికి వేచి చూస్తున్నాం. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. పంటను రక్షించుకో వడానికి ఇబ్బంది పడుతున్నాం. అధికారులు, ప్ర భుత్వం స్పందించి వరి ధాన్యం కొనుగోళ్లకు చర్యలు తీసుకోవాలి. – చప్పిడే సంజీవ్, కొత్తగూడ19 వేల ఎకరాల్లో సాగుప్రస్తుతం యాసంగి సీజన్లో ఆసిఫాబాద్, రెబ్బెన, పెంచికల్పేట్, కాగజ్నగర్, బెజ్జూర్ తదితర మండలాల్లో 19వేల ఎకరాల్లో వరి పంట సాగు చేస్తున్నారు. వట్టివాగు, ఎల్లూర్ బొక్కివాగు, బోరుబావుల కింద సాగు ఎక్కువగా ఉంది. సీడ్ వరి(ఆడ, మగ) కోతలతోపాటు సాధారణ వరి కోతలు 15 రోజులుగా జోరుగా సాగుతున్నాయి. సీడ్ వరి ధాన్యం(ఆడ) ఆయా కంపెనీలే కొంటున్నాయి. సాధారణ రకం, సీడ్ మగ ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ఎక్కువగా విక్రయిస్తారు. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు ధాన్యాన్ని కల్లాల్లోనే ఆరబెడుతున్నారు. -
గాలిదుమారం.. ఆగమాగం
● నేలకొరిగిన వరి, విద్యుత్ స్తంభాలు ● అంధకారంలో గ్రామాలు దహెగాం/పెంచికల్పేట్/ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో శనివారం అర్ధరాత్రి, ఆదివారం గాలిదుమారం బీభత్సం సృష్టించింది. దీనికితోడు చిరుజల్లులు పడటంతో ఆరబెట్టిన ధాన్యం తడిసింది. అర్ధరాత్రి కావడంతో రైతులు ధాన్యం కుప్పలపై టార్పాలిన్లు కప్పలేకపోయారు. దహెగాం మండల కేంద్రం సమీపంలో వరి పంట గాలికి నేలవాలింది. ఐనం గ్రామంలో నాలుగు స్తంభాలు విరిగి పడటంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఆదివారం మధ్యాహ్నం వరకు కరెంటు లేకపోవడంతో మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈదురు గాలులకు పెంచికల్పేట్, సలుగుపల్లి ప్రధాన రహదారిపై లోడుపల్లి వద్ద భారీ వృక్షం నేలకూలింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెంచికల్పేట్ మండలంలోని పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు అంధకారంలో గడిపారు. అకాల వర్షం, ఈదురుగాలులకు ఆసిఫాబాద్ మండలంలో కొమ్ముగూడ, గొల్లగూడ, ఈదులవాడ గ్రామాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. అధికారులు తక్షణమే స్పందించి కొత్త స్తంభాలు ఏర్పాటు చేశారు. కోసేందుకు సిద్ధంగా ఉన్న మామిడి కాయలు రాలగా, వరిపైరు నేలవాలింది. షార్ట్ సర్క్యూట్తో నిరుపేద ఇల్లు దగ్ధంలింగాపూర్: మండలంలోని మా మిడిపల్లి గ్రామానికి చెందిన ఆత్రం తెలంగ్రావ్కు చెందిన ఇల్లు శని వారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగ్రావ్ తల్లి, భార్య, ఒక కుమార్తెతో కలిసి ఇంట్లో నిద్రిస్తుండగా, అర్ధరాత్రి ఈదురుగాలులు వీస్తున్న సమయంలో షార్ట్ సర్క్యూట్తో మంట లు చెలరేగాయి. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే బయటకు పరుగులు తీశారు. చుట్టపక్కల ఉన్న వారు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా.. గాలి తీవ్రతకు అదుపులోకి రాలేదు. ఇంట్లోని బట్టలు, బియ్యం, జొన్నతో పాటు రూ.40వేల నగదు, రెండు తులాల బంగారు ఆభరణాలు, మూ.30 వేల సామగ్రి మంటల్లో కాలిపోయాయని బాధితుడు తెలిపాడు. విష యం తెలుసుకున్న డిప్యూటీ తహసీల్దార్ పెద్దిరాజు ఇంటిని పరిశీలించారు. కలెక్టర్కు వివరాలు సమర్పించి, ప్రభుత్వం నుంచి సాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
ప్రశాంతంగా ‘మోడల్’ పరీక్ష
ఆసిపాబాద్రూరల్: తెలంగాణ మోడల్ స్కూ ళ్లలో 6 నుంచి పదో తరగతి వరకు సీట్ల భర్తీ కోసం ఆదివారం జిల్లాలో నిర్వహించిన ప్రవే శ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆరో తరగతిలో ప్రవేశం కోసం ఉదయం నిర్వహించిన పరీక్షకు 491 మంది విద్యార్థులకు 397 మంది హాజరు కాగా, 94 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహించిన ఏడో తరగతి ప్రవేశ పరీక్షకు 167 మందికి 136 మంది, ఎనిమిదో తరగతికి 120 మందికి 95 మంది, తొమ్మిదో తరగతికి 85 మందికి 66 మంది, పదో తరగతికి 32 మందికి 22 మంది హాజరయ్యారని జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ్బాబు తెలిపారు. జిల్లా కేంద్రంలోని మోడల్ స్కూల్, బాలికల ఉన్నత పాఠశాలలోని కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. -
సమాచారం తెలిసేదెలా..?
తిర్యాణి(ఆసిఫాబాద్): జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం ఉపాధిహామీ పనులు జోరుగా సాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎండను సైతం లెక్క చేయకుండా కూలీలు పనులకు వెళ్తున్నారు. అయితే జిల్లాలో ఉపాధి కూలీలకు పే స్లిప్ల పంపిణీ నిలిచిపోవడంతో వేతన వివరాలు తెలియడం లేదు. పనులకు వెళ్లేవారు చాలా మందికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జన్మన్ రేగా యాప్పై అవగాహన లేకపోవడంతో వివరాలు తెలుసుకోవడం కష్టంగా మారింది. మూడేళ్లుగా ఇదే తంతు..జిల్లావ్యాప్తంగా 1.23 లక్షల జాబ్కార్డులు ఉండగా 2.43 లక్షల మంది కూలీలు సభ్యత్వం కలిగి ఉన్నారు. ఇందులో 91 వేల జాబ్కార్డులు యాక్టీవ్గా ఉండగా 1.70 లక్షల కూలీలు నిత్యం పనులకు వెళ్తున్నారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో ఒకటి, రెండు మండలాలను మినహాయిస్తే మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఉపాధిహామీ పనులు చేపడుతున్నారు. కూలీలకు మాత్రం వేతన స్లిప్లు ఇవ్వడం లేదు. మూడేళ్ల క్రితం వరకు సక్రమంగా అందించగా, వివిధ కారణాలతో పంపిణీ నిలిపివేశారు. ప్లే స్లిప్లో కూలీ పేరు, పని ప్రదేశం పేరు, ఎన్ని పని దినాలు చేశారు, రోజుకు కూలి ఎంత పడింది, చేసిన పని దినాలు ద్వారా వచ్చే వేతనం ఎంత, తదితర వివరాలు ఉంటాయి. వంద రోజులు పూర్తికావడానికి ఇంకా ఎన్ని రోజులు మిగిలి ఉన్నాయి అనే సమాచారం కూడా అందులో తెలియజేస్తారు. సదరు కూలీకి ఏ పని ప్రదేశంలో ఎన్ని రోజులు పని చేశారో, ఎంత వేతనం వస్తుందో సృష్టంగా అర్థమయ్యేది. ప్రస్తుతం స్లిప్ల పంపిణీ చేయకపోవడంతో కూలీలకు వారానికి ఎంత పడుతుందో తెలియడం లేదు. వివరాలు స్పష్టంగా తెలిస్తే ఒక వారం తక్కువ పడినా.. మరోవారం నుంచి గరిష్ట వేతనం కోసం అధికంగా పని చేసేందుకు ఆసక్తి చూపుతారు. ఉపాధిహామీ గరిష్ట వేతనం రూ.307 కాగా జిల్లాలో ప్రస్తుతం సగటు కూలి రూ.220 వరకు మాత్రమే ఉంది. యాప్పై అవగాహనేది..?ఉపాధిహమీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు సంబంధించి హాజరు, వేతన వివరాలు, మిగిలి ఉన్న పనిదినాలు వంటి వివరాలు ‘జన్మన్ రేగా‘ పేరుతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్లోనూ పొందుపరుస్తున్నారు. జిల్లాలో గిరిజనులతోపాటు సాధారణ ప్రజలకు అవగాహన లేదు. క్షేత్రస్థాయిలో ఈ యాప్పై ఈజీఎస్ అధికారులు, సిబ్బంది కూలీలకు సక్రమంగా అవగాహన కల్పించలేదు. అసలు ఈ యాప్ ఉన్నట్లు కూడా పది శాతం మంది కూలీలకు కూడా తెలియదు. ఎంత పడుతున్నాయో.. ఉపాధి పనులకు క్రమం తప్పకుండా వెళ్తుంటా. కానీ రోజుకు కూలీ ఎంత పడుతుందో తెలియడం లేదు. నాలుగైదు వారాలకు సంబంధించిన డబ్బులు పడ్డాక ఒకసారి పోస్టాఫీస్ ఖాతా నుంచి విత్డ్రా చేసుకుంటున్నా. ప్రతీ వారం ఎంత కూలి పడుతున్నాయో అర్థం కావడం లేదు. – మల్రాజ్ శ్రీనివాస్, గోలేటి, మం.రెబ్బెన పే స్లిప్లు అందించాలి ఉపాధి పనులు చేస్తున్న కూలీలందరికీ ప్రతీ వారం తప్పనిసరిగా పే స్లిప్లు అందించాలి. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం జన్మన్ రేగా యాప్ అందుబాటులోకి తెచ్చినా క్షేత్రస్థాయిలో కూలీలకు అవగాహన కల్పించడం లేదు. – రాయిల్ల నర్సయ్య, జిల్లా అధ్యక్షుడు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లాలో నిలిచిన ఉపాధి కూలీల పే స్లిప్ల పంపిణీ ‘జన్మన్ రేగా’ యాప్పైనా అవగాహన కరువు వివరాలు తెలియక ఇబ్బందులుకూలీలు నష్టపోయే అవకాశంసాధారణంగా ఉపాధిహామీ పథకం పనులకు సంబంధించిన డబ్బులు పోస్టాఫీస్ లేదా బ్యాంకు ఖాతాల ద్వారా చెల్లిస్తున్నా రు. జిల్లాలో ఇప్పటికీ సగానికి పైగా పోస్టాఫీస్ ఖాతాల్లోనే జమ అవుతున్నాయి. కూలీలకు ఒకేసారి రెండు లేదా అంతకన్నా ఎక్కువ వారాలకు సంబంధించిన మొత్తాలను ఒకేసారి జమ చేస్తుంటారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో అధికంగా నిరాక్ష్యరాసులు ఉన్నారు. వారికి ఖాతాల్లో ఎంత నగదు జమయ్యిందో తెలియడం లేదు. బీపీఎంలు నగదు విత్డ్రా సమయంలో గతంలో పలు అక్రమాలకు పాల్పడ్డారు. అమాయకులను మోసం చేశారు. ఒకవేళ బ్యాంక్ ఖాతాల్లో జమ చేసినా ఏటీఎంలు లేక మినీ ఏటీఎంలను ఆశ్రయించాల్సిందే. వేతన వివరాలు తెలియకుంటే మినీ ఏటీఎం నిర్వాహకులు సైతం అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది. -
ఒప్పందాలతోనే సరి.. అమలు ఏది మరి?
● స్ట్రక్చరల్ ఒప్పందాలకు కలగని మోక్షం ● ఉత్తర్వుల జారీలో సింగరేణి జాప్యం ● నష్టపోతున్న కార్మికులు ● గుర్తింపు సంఘం ఒత్తిడికి డిమాండ్శ్రీరాంపూర్: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి నిర్వహించిన స్ట్రక్చరల్ సమావేశాలు చాలా కాలం తర్వాత ఫలప్రదమయ్యాయి. అనేక డిమాండ్లపై యాజమాన్యానికి, గుర్తింపు కార్మిక సంఘానికి మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందాల అమలులో జాప్యం కార్మికులను నిరాశకు గురి చేస్తోంది. గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు యాజమాన్యంతో జరిపిన చర్చల్లో ఆమోదించిన డిమాండ్లు ఇప్పటికీ కాగితంపైనే ఉన్నాయి. సమావేశాల పునరుద్ధరణఐదేళ్లుగా నిలిచిన స్ట్రక్చరల్ సమావేశాలు 2024లో ఏఐటీయూసీ గుర్తింపు ఎన్నికల్లో గెలిచిన తర్వాత పునఃప్రారంభమయ్యాయి. నవంబర్ 24న డైరెక్టర్ (పర్సనల్ అడ్మినిస్ట్రేషన్), మార్చి 6, 2025న సీఎండీ స్థాయిలో సమావేశాలు జరిగాయి. ఏఐటీయూసీ నాయకులు మెడికల్ అన్ఫిట్ కార్మికులకు సర్ఫేస్ ఉద్యోగాలు, సొంత ఇళ్ల కార్మికులకు క్వార్టర్ వెకేషన్ సర్టిఫికెట్, డిస్మిస్ కార్మికులకు ఉద్యోగ పునరుద్ధరణ వంటి డిమాండ్లను ప్రస్తావించారు. కమిటీల జాప్యంసొంత ఇంటి పథకం, పెర్క్స్పై పన్ను మినహాయింపు, విజిలెన్స్ కేసుల పరిష్కారం వంటి డిమాండ్లపై కమిటీలు ఏర్పాటు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. అయితే, కమిటీల ప్రక్రియలో జాప్యం నివారించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. యజమాన్యం వెంటనే ఉత్తర్వులు జారీ చేసి, కమిటీల నివేదికలను త్వరితగతిన సమర్పించాలని కార్మికులు కోరుతున్నారు. స్ట్రక్చరల్ సమావేశాలు కార్మిక సంక్షేమానికి ఆశాకిరణంగా నిలిచినప్పటికీ, ఒప్పందాల అమలులో జాప్యం కార్మికుల నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. యాజమాన్యం ఒప్పందాల అమలుకు ఉత్తర్వులు జారీ చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఉత్తర్వుల కోసం యాజమాన్యంపై ఒత్తిడి.. కంపెనీ స్థాయిలో డైరెక్టర్ (పా), సీఎండీ లెవల్ స్ట్రక్షరల్ సమావేశంలో జరిగిన ఒప్పందాలపై యాజమాన్యం వెంటనే ఉత్తర్వులు విడుదల చేయాలి. జాప్యం సరికాదు. ఈ డిమాండ్ల పరిష్కారం కోసం చాలా కాలంగా కార్మికవర్గం ఎదురుచూస్తుంది. ఉత్తర్వుల కోసం యాజమాన్యంపై ఒత్తిడి తెస్తున్నాం. – కొరిమి రాజ్కుమార్, ఏఐటీయూసీ కేంద్ర ప్రధాన కార్యదర్శిఒప్పందాల్లో జాప్యంయాజమాన్యం కొన్ని డిమాండ్లకు భేషరతుగా ఒప్పుకుంది. మరికొన్నింటిపై కమిటీలు ఏర్పా టు చేస్తామని చెప్పింది. ప్రమోషన్లలో సర్వీసు నిబంధనల మార్పు, శ్రీరాంపూర్ ఓసీపీ ప్రాజె క్టు కోడ్ల విభజన, హైదరాబాద్లో సూపర్ స్పె షాలిటీ ఆసుపత్రి ఏర్పాటు, క్యాంటీన్ల స్వయం నిర్వహణ వంటి ఒప్పందాలు కుదిరాయి. మైనింగ్ స్టాఫ్, ఈఅండ్ఎం సూపర్వైజర్లు అండర్ గ్రౌండ్లో మెడికల్ అన్ఫిట్ అయితే వారికి సర్ఫేస్లో సూటబుల్ జాబ్ ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. ఈ డిమాండ్ పరిష్కారం కోసం వీరంతా ఎన్నో ఏళ్లు నుంచి చూస్తున్నారు. జేఎంవో, జేటీవో, జేఏవోలకు ప్రమోషన్కు సంబంధించిన అంశంలో ఏ1 గ్రేడ్లో ఐదు సంవత్సరాల సర్వీసు చేసి ఉంటేనే వారికి ఎగ్జిక్యూటీ వ్గా పదోన్నతి కల్పిస్తుండగా దాన్ని మార్చుతూ ఏ గ్రేడ్లోనే ఐదేళ్లు సర్వీసు ఉన్న కూడా ప్రమోషన్ ఇవ్వడానికి ఒప్పందమైంది. కాని దీనికి కూడా ఉత్తర్వులు రాలేదు. డిస్మిస్ కార్మికులందరికీ ఐదేళ్ల కాలంలో కనీసం ఒక సంవత్సరం 100 మస్టర్లు ఉంటే తిరిగి ఉద్యోగం కల్పిండానికి యాజమాన్యం ఒప్పుకుంది. ఈ ఒప్పందాలపై ఉత్తర్వులు వెలువడతాయని ఆశించిన కార్మికులకు నిరాశే మిగిలింది. -
అదనపు కలెక్టర్ నివాసంలో షార్ట్ సర్క్యూట్
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో గల అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ నివాసంలో ఆదివారం సాయంత్రం షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఇంట్లోని ఏసీ నుంచి ఒక్కసారిగా పొగ, మంటలు వ్యాపించాయి. గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక ఫైర్స్టేషన్కు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఇంట్లోని బీరువా, అందులోని పుస్తకాలు, రెండు ల్యాప్టాప్లు, ఫర్నిచర్, మంచం కాలిపోయాయి. సుమారు రూ.4.5 లక్షలు నష్టం వాటిల్లినట్లు ఫైర్ అధికారి కార్తీక్ తెలిపారు. -
పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు
ఆసిఫాబాద్: స్థానిక సంస్థల గెలుపు కోసం సైనికు ల్లా పని చేయాలని, పని చేసే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియా జ్ అహ్మద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్లో ఆదివారం డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు అధ్యక్షతన నిర్వహించిన భారత్ సంవిధాన్ బచావో సభకు ఎమ్మెల్సీ దండె విఠల్తో కలిసి హాజ రయ్యారు. ఆయన మాట్లాడుతూ రాజకీయ, ఆర్థిక సమానత్వం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని, పార్టీ అభివృద్ధి కోసం గ్రామ కమిటీలు వేయనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుందని, పార్టీలో జరిగే ప్రతీ విష యం కార్యకర్తలలకు తెలియజేస్తామన్నారు. ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పా లనలో అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. జిల్లావాసులకు ప్రాణాధారమైన అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేస్తామ ని తెలిపారు. పెద్దపల్లి గ్రంథాలయ చైర్మన్ అన్నయ్యగౌడ్ మాట్లాడుతూ కమిటీల్లో అవకాశం ఇచ్చిన నాయకులు సమావేశాలకు హాజరు కాకుంటే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పీసీసీ అధ్యక్షుడు సూచించారని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు మాట్లాడుతూ నియోజకవర్గ, మండలస్థాయి సమావేశాలు నిర్వహించి పార్టీ అభివృద్ధి కోసం నిర్వహించే కార్యక్రమాలు గురించి దిశానిర్దేశం చేస్తామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ కార్యకర్తలు సంక్షేమ పథకాల్లో వాటా మాత్రమే అడుగుతున్నారని, వాటిని అందించాల్సిన బాధ్యత నాయకులపై ఉందన్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీరా శ్యాంనాయక్ మాట్లాడుతూ మాట వినకుంటే అధికారులను సర్వీస్ నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. సమావేశంలో మాజీ ఎంపీపీ బాలేశ్గౌడ్, ఎస్సీ సెల్ జిల్లా నాయకుడు వసంత్రావు, కాంగ్రెస్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు గుండ శ్యామ్, మాజీ జెడ్పీ చైర్మన్ గణపతి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేశ్, మైనార్టీ నాయకుడు మునీర్ అహ్మద్, మండలాల అధ్యక్షుడు, నాయకులు పాల్గొన్నారు. ● రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ అహ్మద్ -
సామ్, మామ్ పిల్లలను గుర్తించాలి
వాంకిడి: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఎత్తు, బ రువు చూసి వారి ఆరోగ్య స్థితిని అంచనా వేసి సామ్, మామ్ పిల్లల నివేదికలు అందజేయాలని జిల్లా సంక్షేమశాఖ అధికారి ఆడెపు భాస్కర్ సూచించారు. శని వారం మండలంలోని బంబార రైతువేదికలో అంగన్వాడీ టీచర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామ్, మామ్ ద్వారా బలహీన పిల్లలను గుర్తించి అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందించాలని సూచించారు. పిల్లల ఆ రోగ్య పరిస్థితిని మెరుగుపరిచి రోజువారీ వివరాలను పోషణ్ ట్రాకర్లో నమోదు చేయాలని తెలిపారు. పి ల్లలు, బాలింతలు, గర్భిణులకు సేవలందించాలని పేర్కొన్నారు. పౌష్టికాహారం అందేలా నిత్యం పర్యవేక్షించాలని సూచించారు. సమావేశంలో జిల్లా పోషణ్ అభియాన్ కోఆర్డినేటర్ గో పాలకృష్ణ, సూపర్వైజర్లు భారతి, కుమారి, లత, బ్లాక్ కోఆర్డినేటర్ తౌఫిక్, బాలల సంరక్షణ విభాగం సోషల్ వర్కర్ డోంగ్రి ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘భూభారతి’తో సమస్యలు పరిష్కారం
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ● చట్టంపై అవగాహన సదస్సు తిర్యాణి: ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి–2025 రెవెన్యూ చట్టం ద్వారా భూసమస్యలకు పరిష్కారం దొరుకుతుందని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సుకు ఎమ్మెల్సీ దండె విఠల్, ఆర్డీవో రాజేశ్వర్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చట్టంలోని అప్పీల్ వ్యవస్థ ద్వారా రైతులెవరైనా అన్యాయానికి గురైనప్పుడు న్యాయం పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. గ్రామాల్లో ఇప్పటికీ చాలావరకు భూమి హద్దుల గొడవలున్నాయని పేర్కొన్నారు. వాటి పరిష్కారానికి భూభారతి సర్వే ఉపయోగపడనుందని తెలిపారు. జూన్ 2 తర్వాత ప్రతీ గ్రామంలో భూసమస్యలపై రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి రమాదేవి, తహసీల్దార్ సూర్యప్రకాశ్, పీఏసీఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్, ఏవో వినయ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెబ్బెన మండల కేంద్రంలో..రెబ్బెన(ఆసిఫాబాద్): మండల కేంద్రంలోని రైతువేదికలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించగా ఎమ్మెల్సీ దండె విఠల్, ఆర్డీవో లోకేశ్వర్తో కలిసి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే హాజరై మాట్లాడారు. భూమి కొనుగోలు, విరాసిత్, వారసత్వ భూ మి మార్పిడిలో సర్వేయర్ రూపొందించిన కమతం నక్షా జతపర్చడం మూలంగా భవిష్యత్లో భూము ల హద్దులు, ఇతర వివాదాలకు తావుండదని పే ర్కొన్నారు. జూన్ 2 తర్వాత ప్రతీ గ్రామానికి గ్రామపాలన అధికారులు వస్తారని తెలిపారు. అన్ని గ్రా మాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూభారతిపై మరింత అవగాహన కల్పించి రైతుల నుంచి భూ సమస్యలపై అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నా రు. ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ.. ధరణిలోని లోపాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం భూభా రతి చట్టం తెచ్చిందని చెప్పారు. ధరణి కారణంగా స్వయంగా తానే ఇబ్బందులకు గురైనట్లు గుర్తు చే శారు. డీపీవో భిక్షపతి, తహసీల్దార్ రామ్మోహన్రా వు, ఎంపీడీవో శంకరమ్మ, ఏవో దిలీప్, ట్రాన్స్పో ర్ట్స్ నాన్ ఎక్స్ అఫీషియల్ సభ్యుడు లావుడ్య రమేశ్, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్రావు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పల్లె ప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ఆసిఫాబాద్: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు అదనపు కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధి లో లబ్ధిదారులు చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప నులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాని కి లబ్ధిదారుల ఎంపిక పాదర్శకంగా ఉండాలని సూ చించారు. పథకం అమలులో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చాలని ప్రభుత్వం ఇందిరమ్మ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. అదనపు కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ భుజంగరావు తదితరులున్నారు. ఇంటి నిర్మాణ పనుల పరిశీలనవాంకిడి: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో చేపట్టిన మోడల్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి పరిశీలించారు. త్వరగా పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వాంకిడి గ్రామపంచాయతీ పరిధిలోని ఎల్ఆర్ఎస్ స్థలాలను పరిశీలించారు. రిజిస్ట్రేషన్లు త్వరగా పూర్తయ్యేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కార్యదర్శి శివకుమార్ సూచనలు చేశారు. అనంతరం ఇందిరమ్మ మోడల్ గ్రామపంచాయతీ జైత్పూర్ గ్రామాన్ని సందర్శించారు. లబ్ధిదారులతో మాట్లాడి సందేహాలను నివృత్తి చేశారు. గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. డీపీవో భిక్షపతి, తహసీల్దార్ రియాజ్ అలీ, ఎంపీడీవో ప్రవీణ్కుమార్, వివిధ శాఖల అధికారులున్నారు. -
గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి
● ఎమ్మెల్సీ దండె విఠల్ ● ఆలయంలో పూజలు తిర్యాణి: ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న గీత కా ర్మికుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్సీ దండె విఠల్ పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ జెన్సీ ప్రాంతాల్లో లైసెన్స్లు లేకుండా ఇబ్బందులు పడుతున్న గీత కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలిపా రు. ఎల్లమ్మ గుడి అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటా యించి ప్రహరీ, కమ్యూనిటీ హాల్ నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం గౌడ కులస్తులు ఎమ్మెల్సీని శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్రావు, జిల్లా నాయకుడు జువ్వాజి అనిల్గౌడ్, మోకు దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాళ్ల శ్రీనివాస్గౌడ్, ప్రచార కార్యదర్శి మార్క శంకర్గౌడ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు చిత్తారి సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
ఫిర్యాదులపై స్పందించాలి
వాంకిడి: పోలీస్స్టేషన్కు వచ్చిన బాధితుల ఫిర్యాదులు స్వీకరించి సత్వరమే పరిష్కరించాలని ఏఎస్పీ చిత్తరంజన్ సూచించారు. శనివారం మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్లో వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్స్టేషన్ పరిసరాలు, రిసెప్షన్, రి కార్డులు తనిఖీ చేశారు. ఎస్సై, పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. సమస్యలు తె లుసుకున్నారు. గ్రామాల్లో ప్రజలకు అవగా హన కల్పించి సీసీ కెమెరాలు అమర్చుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాల ని ఆదేశించారు. అనంతరం పోలీస్స్టేషన్ ఆ వరణలో మొక్కలు నాటారు. సీఐ సత్యనారా యణ, ఎస్సై ప్రశాంత్, సిబ్బంది ఉన్నారు. -
ఆర్టీసీ యాప్లపై ప్రచారం
ఆసిఫాబాద్అర్బన్: ఆర్టీసీ యాప్ల ద్వారా అందిస్తున్న అత్యాధునిక సేవలను ప్రజల్లోకి తీసుకవెళ్లడంలో భాగంగా డిపో మేనేజర్ కేవీ రాజశేఖర్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావ్కు క్యూఆర్ కోడ్ కలిగిన స్కానర్ కీచైన్ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఆర్టీసీ ఆధునిక సౌకర్యాలను ప్రయాణికులు పూర్తిగా వినియోగించుకోవాలని సూ చించారు. ఆర్టీసీ యాప్లతో ప్రయాణికులకు సేవలు సులభతరమైనట్లు పేర్కొన్నారు. అనంతరం ఫైర్స్టేషన్, ఎస్హెచ్వో కార్యాలయాల్లో క్యూఆర్ కోడ్ కీచైన్లు అందజేశారు. -
పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి
ఆసిఫాబాద్రూరల్: నీట్ను పకడ్బందీగా నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతినిధులు కలెక్టర్, ఎస్పీ, ఉన్నతాధికారులకు సూచించారు. శనివా రం న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స మీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ.. నీట్ను లోటుపాట్లు లేకుండా పటిష్ట బందోబస్తు మధ్య నిర్వహించేలా చర్యలు తీసుకో వాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో పూర్తి ఏర్పా ట్లు చేయాలని, భద్రత చర్యలు చేపట్టాలని తెలిపా రు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ.. మే 4న మధ్యాహ్నం 2నుంచి సా యంత్రం 5గంటల వరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించే నీట్ పరీక్షకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షకు 287 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. కార్య క్రమంలో ఏఎస్సీ ప్రభాకర్రావు, పరీక్షల సమన్వయకర్త లక్షీనరసింహ, పర్వవేక్షకులు ఉదయ్బాబు, శశిధర్ తదితరులు పాల్గొన్నారు. -
బోధన నైపుణ్యాలపై శిక్షణ
● వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ● ఇప్పటికే రిసోర్స్పర్సన్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం ● ఒక్కో సబ్జెక్టుకు ఇద్దరు చొప్పున ఎంపికకెరమెరి(ఆసిఫాబాద్): ఉపాధ్యాయుల్లో బోధన నైపుణ్యాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవుల్లో శిక్షణ అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఉపాధ్యాయులకు శిక్షణ అందించేందుకు రిసోర్స్పర్సన్ల ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అయితే సెలవుల్లో శిక్షణ తరగతులు నిర్వహించడంపై కొంతమంది టీచర్ల నుంచి వ్యతిరేకత వస్తోంది. వెనుకబడుతున్న విద్యార్థులుజిల్లాలో 730 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 2,225 మంది ఉపాధ్యాయలు పనిచేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో చాలామంది చదవడం, రాయడం కూడా రావడం లేదని, చతుర్విద ప్రక్రియలు చేయడం లేదని విద్యాశాఖ అధి కారులు గుర్తించారు. కనీస సామార్థ్యాలు సాధించడంలో వెనుబడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఉపాధ్యాయుల్లో బోధన నైపుణ్యాలు పెంచడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని భావిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన సర్వేల ఆధారంగా ప్రాథమిక, ఉన్నత స్థాయి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఎన్నడూ లేని విధంగా టీచర్లకు శిక్షణ అందించనున్నారు. రాష్ట్ర విద్యాశాఖ సంబంధిత సబ్జెక్టుల్లో నైపుణ్యత పెంచుకునే విధంగా అవగాహన కల్పించనున్నారు. ఐసీటీ టూల్స్, ఏఐ విద్య, అకాడమిక్ పరంగా వచ్చే విద్యా సంవత్సరం వచ్చే మార్పులు, తదితర విషయాల గురించి వివరించునున్నారు. ఈ నెల 30 వరకు మండల, జిల్లా పరిధిలోని రిసోర్స్పర్సన్ల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఈ జాబితాను ఎస్సీఈర్టీకి పంపించనున్నారు. నిరాసక్తత..ఇటీవల మండలాల నుంచి రిసోర్స్ పర్సన్లను నామినేట్ చేయాలని ఉన్నతాధికారులు మండల విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆసక్తి ఉన్న వారు దరఖాస్తులు చేయాలని ఉపాధ్యాయులకు తెలిపారు. అయితే అందుకు నిరాసక్తత చూపుతున్నారు. వేసవి సెలవుల్లో కుటుంబంతో కలిసి గడుపుదామనే సమయంలో శిక్షణ నిర్వహించడం సరికాదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. దీంతో కొన్నిచోట్ల రిసోర్స్పర్సన్లు దరఖాస్తు చేయలేదని సమాచారం. చేసేదేమీ లేక ఎంఈవోలే కొందరిని నామినేట్ చేస్తున్నారు. లోటు పూడ్చేలా..కరోనా మహమ్మారి మిగిల్చిన అభ్యసన లోటును పూడ్చేందుకు రాష్ట్ర విద్యాశాఖ అనేక ప్రయత్నాలు చేస్తోంది. వివిధ బోధన పద్ధతులు ఉపయోగిస్తున్నప్పటికీ ప్రాథమిక స్థాయిలో చదవడం, సొంతంగా రాయడం, చతుర్విద ప్రక్రియలు చేయడంలో కొంతమంది విద్యార్థులు వెనకబడి ఉన్నారు. ఉన్నతస్థాయిలో విద్యార్థులు కూడా విషయాలను అర్థం చేసుకుని సొంతంగా రాయలేకపోవతున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ప్రతీ టీచర్ శిక్షణకు హాజరు కావాలి మండల స్థాయిలో టీచర్లకు వేసవిలో నిర్వహించే శిక్షణకు ప్రతీ టీచర్ హాజరు కావాలి. రానున్న విద్యా సంవత్సరం నుంచి వచ్చే మార్పులు, నూతన బోధన పద్ధతుల గురించి వివరిస్తారు. బోధన సామర్థ్యాలు పెరిగేందుకు ఇది దోహదపడుతుంది. శిక్షణకు సద్వినియోగం చేసుకోవాలి. – ఉప్పులేటి శ్రీనివాస్, క్వాలిటీ కోఆర్డినేటర్ ఎంపిక ఇలా..రిసోర్స్పర్సన్ల్ ఎంపిక బాధ్యత కలెక్టర్ ఆధ్వర్యంలో డీఈవోలు డైట్ అధ్యాపకులు, బీఎడ్ అధ్యాపకులు, ఇతర అధికారులకు అప్పగించారు. ఇంటర్వూ, డెమోలు నిర్వహించి ఎంపిక చేయనున్నారు. ప్రతీ మండలం నుంచి ఒక్కో సబ్జెక్టుల్లో ఇద్దరు చొప్పున జిల్లా పరిధిలో స్కూల్ అసిస్టెంట్లను రిపోర్స్పర్సన్లుగా ఎంపిక చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత వేసవి మే నెలలో జిల్లాలోని ఉపాధ్యాయులకు వీరు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. డీఆర్పీలకు రాష్ట్రస్థాయిలో శిక్షణ నిర్వహించనున్నారు. వీరు ఎంఆర్పీలకు జిల్లాస్థాయిలో, ఎంఆర్పీలు మండలస్థాయిలో ఐదురోజులు శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తారు. -
నామినేషన్ పద్ధతిలో బొగ్గుబ్లాకులు అప్పగించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): రాష్ట్రంలోని బొగ్గు బ్లా కులను నామినేషన్ పద్ధతిలో సింగరేణి సంస్థకే కేటాయించాలని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్ రావు డిమాండ్ చేశారు. టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ పిలుపు మేరకు శుక్రవారం గోలేటి టౌన్షిప్లోని జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జీఎం విజయ భాస్కర్రెడ్డికి వినతిపత్రం అందించారు. శ్రీనివాస్ రావు మాట్లాడుతూ సింగరేణి ఉద్యోగులకు మెరుగైన వైద్య సౌకర్యం కల్పించేందుకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చే యాలని, మెడికల్ కార్డులు అందించాలన్నా రు. కార్మిక కాలనీలకు రక్షిత మంచినీటి సరాఫరా చేయడంతోపాటు మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని అన్నారు. గోలేటి ఓసీపీని త్వరగా ప్రారంభించాలని డిమాండ్ చేశారు. నాయకులు మంగీలాల్, వెంకటేశం, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, రమేశ్, సమ్మయ్య, ఓదెలు పాల్గొన్నారు. -
భూభారతితో రైతులకు మేలు
పెంచికల్పేట్/కౌటాల: కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భూభారతి చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని ఎమ్మెల్సీ దండె విఠల్, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. పెంచికల్పేట్, కౌటాలలోని రైతువేదికల్లో శుక్రవారం భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్ష మేరకే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. గత ప్రభుత్వంలో ధరణి పోర్టల్తో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, నూతనంగా వచ్చిన భూభారతి చట్టంతో ఆ సమస్యలు తొలగిపోతాయన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 2 నుంచి ప్రతీ గ్రామంలో సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. రైతులకు భూమితో ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుందన్నారు. పెంచికల్పేట్ మండలం కొండపల్లిలో అటవీ, రెవెన్యూ శాఖల సమన్వయంతో సర్వే నిర్వహించి హద్దులు గుర్తించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎండలు మండుతున్న నేపథ్యంలో ఉపాధిహామీ పని ప్రదేశాల్లో టెంటు, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకుని రావాలని కోరారు. ఆయా సమావేశాల్లో అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, కాగజ్నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్దల దేవయ్య, ఏడీ మనోహర్, ఈఈ ప్రభాకర్, తహసీల్దార్లు వెంకటేశ్వర్రావు, పుష్పలత, ఎంపీడీవోలు అల్బర్ట్, రమేశ్, ఏవోలు మనీషా, ప్రేమలత, ఎస్సై కొమురయ్య, పంచాయతీ కార్యదర్శులు, ఏఈవోలు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
సమ్మె కాలపు ఒప్పందాలు అమలు చేయాలి
రెబ్బెన: గోలేటిలో పనిచేస్తున్న కోల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు, క్లీనర్లకు సమ్మె కాలపు ఒప్పందాలు అమలు చేయాలని ఏఐటీయూసీ బె ల్లంపల్లి రీజియన్ అధ్యక్షుడు బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం కోల్ ట్రాన్స్పో ర్టు కార్మికులు విధులు బహిష్కరించి రాస్తారోకో చేపట్టారు. ఆయన మాట్లాడుతూ కోల్ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం, యూనియన్ మధ్య జరిగిన అగ్రిమెంట్ ప్రకారం ప్రతినెలా 15లోగా వేతనాలు చెల్లించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశా రు. కోల్ ట్రాన్స్పోర్టు వర్కర్స్ యూనియన్ గోలేటి బ్రాంచి అధ్యక్షుడు స్వామి, కార్యదర్శి లక్ష్మీనారాయణ, నాయకులు తిరుపతి, సంతోష్, చందర్లాల్, సతీశ్ పాల్గొన్నారు. -
ఇద్దరు వధువులు.. ఒక వరుడు
ఆదిలాబాద్ జిల్లా: వివాహం చేసుకునేందుకు అమ్మాయిలు దొరక్క చాలా మంది యువకులు ‘పెళ్లి కాని ప్రసాద్లు’గా మిగిలిపోతున్నారు. కొందరు ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటున్నారు. ఒక వైపు పరిస్థితులు ఇలా ఉంటే.. మరో వైపు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ గిరిజన యువకుడు ఇద్దరు యువతులతో ప్రేమాయణం నడిపి, ఇద్దరినీ ఒకే మండపంలో వివాహం చేసుకున్నాడు. జైనూర్ మండలం అడ్డెసరాకు చెందిన ఆత్రం రంభబాయి, భాద్రుషావ్ దంపతుల కుమారుడు ఆత్రం చత్రుషావ్.. అదే గ్రామానికి చెందిన సెడ్మకి సోమిత్రబాయి, భీంరావ్ల కుమార్తె జంగుబాయి నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం సాంగ్వి గ్రామానికి చెందిన గోడం రంభబాయి, యాదోరావ్ కుమార్తె సోన్దేవితో చత్రుషావ్కు పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య ఏడాదిగా ప్రేమాయణం సాగుతోంది. విషయం తెలుసుకున్న జంగుబాయి రాయిసెంటర్ను ఆశ్రయించింది. రాయిసెంటర్ పెద్దలు 15 రోజుల క్రితం మూడు కుటుంబాలతో చర్చించారు. యువతులిద్దరూ చత్రుషావ్తో కలిసి ఉండేందుకు ఒప్పుకున్నారు. దీంతో గురువారం బంధువుల సమక్షంలో వరుడి స్వగృహంలో వీరికి వివాహం జరిపించారు. కాగా, ఇటీవల ఇదే జిల్లాలో సిర్పూర్(యూ) మండలం గుంనూర్ (కె)కు చెందిన ఓ యువకుడు కూడా ఇద్దరు యువతులను పెళ్లి చేసుకోవడం తెలిసిందే. -
బాల్యవివాహాలు అరికట్టాలి
ఆసిఫాబాద్అర్బన్: బాల్య వివాహాలు అరికట్టాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ ప్రియాంక కనుంగో అ న్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలను ఢిల్లీ నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, జిల్లా బాల ల సంరక్షణ అధికారి బూర్ల మహేశ్కు పలు సూచనలు చేశారు. జాతీయ బాలల హక్కు ల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ మాట్లాడు తూ జిల్లాలో ఎక్కడా బాల్యవివాహాలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నా రు. ఎవరినీ ఉపేక్షించకుండా మొదట జుడిషయల్ ఇంజెక్షన్ ఆర్డర్స్ జారీ చేసి, సంబంధిత పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సూచించారు. బాల్య వివాహాల ముక్త్ భారత్గా తీర్చిదిద్దేందుకు సమన్వయంతో కృషి చేయాలన్నారు. బాలల హక్కుల ఉల్లంఘనలు జరగకుండా పనిచేయాలని ఆదేశించారు. బాల్య వివాహాలతో జరిగే నష్టాలను గ్రామాల్లో వివరించాలని సూచించారు. -
ఉగ్రవాదుల చర్యలు అమానుషం
ఆసిఫాబాద్: జమ్మూకశ్మీర్లోని పహల్గాం స మీపంలో జరిగిన ఉగ్రవాదుల దాడులు అ మానుషమని, దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆసిఫాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాపర్తి రవీందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బార్ అసోసియేషన్ హాల్లో ఉగ్రదాడిలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చే కూరాలని గురువారం న్యాయవాదులు మౌనం పాటించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు చంద్రకుమార్, కార్యదర్శి చరణ్, న్యాయవాదులు టి.సురేశ్, జగన్మోహన్రావు, శ్యాంకుమార్, సతీశ్బాబు, విద్యాసాగర్, అంజలి, గణపతి, గణేశ్, అరవింద్ పాల్గొన్నారు. -
‘కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం’
వాంకిడి: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్రావు అన్నారు. మండలంలోని సమేల గ్రామంలో ఉపాధిహామీ పథకం కింద రూ.13 లక్షలతో మంజూరైన సీసీరోడ్డు పనులను గురువారం ప్రారంభించారు. ఆ యన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చు ట్టిందన్నారు. పేదలకు ఇళ్లు, రైతులు, ఉపాధి హామీ కూలీలు, నిరుద్యోగులకు ఆర్థిక తోడ్పా టు అందిస్తుందన్నారు. అన్నివర్గాల వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని పే ర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుర్నులె నారాయణ, యూత్ అ ధ్యక్షుడు ప్రశాంత్, నాయకులు జీవన్, నాగభూషన్, సంతోష్, తిరుపతి పాల్గొన్నారు. -
సమగ్ర వివరాలు నమోదు చేయాలి
ఆసిఫాబాద్అర్బన్: ప్రధాన మంత్రి గతిశక్తి పోర్టల్లో సమగ్ర వివరాలు నమోదు చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీఎం గతిశక్తి వివరాల నమోదుపై గురువారం విద్య, వైద్యం, శిశు సంక్షేమం, రహదారులు, తాగునీటి శాఖల అధికా రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని యాజమాన్యాల కింద పనిచేస్తున్న పాఠశాలల వివరాలు, జిల్లా ఆస్పత్రులు, ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ర హదారులు, తాగునీటి వనరుల వివరాలను పోర్టల్ లో నమోదు చేయాలన్నారు. తద్వారా సౌకర్యాలు లేని గ్రామాలను ఎంపిక చేసి నిధులు మంజూరు చేసే అవకాశం ఉంటుందన్నారు. ప్రతీ జిల్లాస్థాయి అధికారికి లాగిన్ ఐడీ ఉండాలని, పోర్టల్లో 70 మంత్రిత్వ శాఖల వివరాలు ఉంటాయన్నారు. వివరాల నమోదులో శ్రద్ధ వహించాలన్నారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, డీటీడీవో రమాదేవి, ఇన్చార్జి డీఈవో ఉదయ్బాబు, డీపీవో భిక్షపతిగౌడ్, డీఎంహెచ్వో సీతారాం, పంచాయతీరాజ్ ఇంజినీర్లు ప్రభాకర్, కృష్ణ, ఈ డిస్ట్రిక్ మేనేజర్ గౌతమ్కుమార్, పీఎం జన్మన్ సమన్వయకర్త మణివేలు తదితరులు పాల్గొన్నారు. -
వడదెబ్బతో యువకుడు మృతి
నిర్మల్టౌన్: వడదెబ్బతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన గురువారం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని బ్రహ్మపూరి కాలనీకి చెందిన మహ్మద్ బేగ్ కుమారుడు సోఫిబేగ్ (25) గత రెండు రోజుల క్రితం వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురయ్యాడు. ఈక్రమంలో గురువారం ఇంట్లో మృతి చెందాడు. కాగా సోఫిబేగ్ మూడు నెలల క్రితం దుబాయ్ నుంచి నిర్మల్కు వచ్చాడు. మేకల కాపరి..ముధోల్: మండలంలోని మచ్కల్ గ్రామానికి చెందిన షెల్కే లింగురాం(58) అనే మేకల కాపరి వడదెబ్బతో మృతి చెందాడు. కు టుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగురాం మేకలు కాస్తూ జీవనం సాగించేవాడు. రోజు మాదిరిగానే బుధవారం గ్రామ సమీపంలో ఉన్న చెరువు వద్ద పెద్ద కుమారుడు గంగాధర్తో కలిసి మేకలను మేపుతున్నాడు. ఈక్రమంలో మిట్ట మ ధ్యాహ్నం ఒక్కసారిగా లింగురాం కుప్పకూలి పోయాడు. గంగాధర్ చెట్టు నీడకు తీసుకెళ్లేందు కు ప్రయత్నించగా లింగురాం స్పందించలేదు. వెంటనే గ్రామంలోకి వెళ్లి కుటుంబసభ్యుల కు, గ్రామస్తులకు సమాచారం అందించారు. వారు వచ్చే సరికి లింగురాం మృతి చెంది ఉన్నాడు. లింగురాంకు భార్య లక్ష్మి, కుమారులు గంగాధర్, శ్రావణ్, కుమార్తె పూజ ఉన్నారు. బెల్లం, పటిక పట్టివేతతాండూర్: జాతీయ రహదారి మీదుగా అక్రమంగా నాటుసారా తయారీకి వినియోగించే బెల్లం, పటికను తరలిస్తుండగా గురువారం ఎకై ్సజ్ టాస్క్ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. గోలేటికి చెందిన దుర్గం రాజ్కుమార్, దాగం సంజు, అజ్మీరా చందు అనే వ్యక్తులు బెల్లం, పటిక తరలిస్తున్నారన్న సమాచారం మేరకు ఐబీ తాండూర్ ప్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఎకై ్సజ్ అధికారులు కారును తనిఖీ చేసి పట్టుకున్నారు. -
ఆత్మహత్యకు యత్నించిన యువతి..
ఖానాపూర్: ప్రేమించిన యువకుడితో పెళ్లికి తల్లి దండ్రులు అంగీకరించకపోవడంతో యువతి ఆత్మహత్యాయత్నం చేయగా చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతి చెందింది. ప్రోబేషనరీ ఎస్సై శ్రావణి తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్ మండలం కొలాంగూడ గ్రామానికి చెందిన ఆత్రం స్వప్న(18) గ్రామానికి చెందిన ఒక యువకుడిని ప్రేమించింది. దీనికి యువతి తల్లిదండ్రులు ఒప్పుకోకుండా కొన్ని రోజులు వేచి ఉండాలని తెలిపారు. మనస్తాపానికి గురైన స్వప్న గుర్తు తెలియని పురుగుల మందు తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడి నుంచి నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మృతిచెందిందని ఎస్సై తెలిపారు. మృతురాలి తండ్రి దేవురావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పేర్కొన్నారు. -
పోక్సో కేసుల విచారణ వేగవంతం చేయాలి
ఆసిఫాబాద్: పోక్సో కేసుల విచారణ వేగంగా పూర్తి చేయాలని, నాణ్యతతో ఇన్వెస్టిగేషన్ చేపట్టాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో గురువారం నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడు తూ కేసు నమోదు నుంచి చార్జిషీట్ వరకు పారదర్శకంగా దర్యాప్తు చేసి, కోర్టులో దాఖలు చేయాలన్నా రు. సంబంధిత న్యాయమూర్తులను స్వయంగా కలి సి కేసుల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కమ్యూనిటీ పోలీ సింగ్ ద్వారా గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సైబర్ క్రైమ్, డయల్ 100 వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన క ల్పించాలన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి, జూదం, బియ్యం రవాణా, పశువుల అక్రమ రవాణాపై దృష్టి సారించాలని సూచించారు. తరచూ ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, ఇతరులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారితోపాటు, గ్రూప్ అడ్మిన్లపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపిన ఆసిఫాబాద్ సీఐ రవీందర్, ఎస్సై అంజన్న, కానిస్టేబుల్ సాగర్, తిరుపతికి ప్రశంసాపత్రాలు అందించి అభినందించారు. అదనపు ఎస్పీ ప్రభాకర్రావు, ఏఎస్పీ చిత్తరంజన్, స్పెషల్ బ్రాంచి ఇన్స్పెక్టర్ రాణాప్రతాప్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీధర్, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. ఉగ్రదాడి మృతులకు పోలీసుల సంతాపంఆసిఫాబాద్: జమ్ముకశ్మీర్లోని పహల్గాం సమీపంలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, పోలీసు అధికారులు సంతాపం తెలిపారు. రెండు నిముషాలపాటు మౌనం పాటించారు. టూరిస్టులను ఉగ్రవాదులు కాల్చి చంపడాన్ని ఎస్పీ తీవ్రంగా ఖండించారు. ఎస్పీ డీవీ శ్రీనివాసరావు -
ఫోన్కాల్ రచ్చ ప్రాణం తీసింది..!
● భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య ● సోదరుడికి ఫోన్ చేయడమే శాపమైందా..? ● విద్యార్థి సంఘాలు, కుటుంబ సభ్యుల ఆందోళన ● అదనపు కలెక్టర్, పోలీసుల జోక్యంతో విరమణమంచిర్యాలక్రైం: ఫోన్ కాల్ విషయమై జరిగిన రచ్చ ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకునేలా చేసింది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భీమిని మండలం జగ్గయ్యపేటకు చెందిన జంగంపల్లి గోపాల్, నాగమ్మ దంపతుల రెండో కూతురు లక్ష్మిప్రసన్న మంచిర్యాలలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతోంది. గురువారం ఉదయం హాస్టల్ భవనం నాలుగో అంతస్తు నుంచి దూకింది. కళాశాల విద్యార్థులు, సిబ్బంది ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మధ్యాహ్నం చనిపోయింది. మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, సీఐ ప్రమోద్రావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థిని ఆత్మహత్యకు కళాశాల సిబ్బంది, నైట్వాచ్మెన్ మహేశ్ వేధింపులే కారణమంటూ ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు. అదనపు కలెక్టర్ మోతీలాల్ ఆస్పత్రికి చేరుకోగా.. విద్యార్థిని తండ్రి గోపాల్ ఆయన కాళ్లపై పడి న్యాయం చేయాలంటూ వేడుకున్నాడు. లక్ష్మిప్రసన్న మృతికి కారణమైన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. రూ. 20లక్షలు పరి హా రం, కుటుంబంలో ఒకరికి ప్ర భుత్వ ఉద్యోగం ఇవ్వాలని అ న్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్, నా యకులు పాల్గొన్నారు. మృతురాలి కుటుంబ సభ్యులతో మా ట్లాడిన అదనపు కలెక్టర్.. న్యాయం చేస్తామని హామీనివ్వడంతో ఆందోళన విరమించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ వెల్లడించారు. అసలేం జరిగింది.. ఈ నెల 23న రాత్రి 9.30గంటలకు లక్ష్మిప్రసన్న తన చిన్నమ్మ కొడుకు వెంకటేష్కు వాచ్మెన్ మహేశ్ సెల్ఫోన్ నుంచి ఫోన్ చేసింది. తర్వాత 9.45గంటలకు వెంకటేష్ వాచ్మెన్కు ఫోన్ చేసి ఇంత రాత్రి ఫోన్ ఎందుకు ఇచ్చావంటూ బెదిరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్త ఔట్సోర్సింగ్ ఏజెన్సీ మేనేజర్ మల్లేష్కు ఫోన్ ద్వారా వెంకటేష్ ఫిర్యాదు చేయడం, మహేశ్పై మల్లేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉద్యోగంలో నుంచి తొలగిస్తానని బెదిరించడం, ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ అనూష దృష్టికి తీసుకెళ్లడం వరకు వెళ్లాయి. అయితే ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం, వాచ్మెన్ మహేశ్ లక్ష్మిప్రసన్నపై ఒత్తిడి చేసి వేధించారని, భరించలేకనే ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు, విద్యార్థిని చిన్నమ్మ కొడుకు వెంకటేష్ ఆరోపించారు. -
నిర్మల్లోనే నాణ్యమైన విద్య
● ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డినిర్మల్టౌన్: హైదరాబాద్ విద్యాసంస్థలకు దీటుగా నిర్మల్లోనే ఆల్ఫోర్స్ విద్యాసంస్థ నాణ్యమైన విద్య అందిస్తుందని విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి అన్నారు. ఇంటర్మీడియట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు గురువారం జిల్లా కేంద్రంలోని ఆల్ఫోర్స్ బాలికల జూనియర్ కళాశాలలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆల్ఫోర్స్లో విద్యతో పాటు విలువలను అందిస్తామన్నారు. టాపర్స్ వీరే.. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ బాలికల విభాగంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాపర్స్గా నర్వాడే కృష్ణవేణి 468/470, జోషి ప్రసూన శ్రీ 468/470, పడిగెల కీర్తిశ్రీ కి 468/470, బాలుర విభాగంలో బోనాల శ్రీ చరణ్ 467/470, వడకపూర్ అఖిల్ 467/470, కార్తికేయన్ 467/470 మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో సామ ఫిర్దోస్ 438/440, జోహా మహావీష్ 438/440, నబిలా తహరీమ్ 438/440 మార్కులు సాధించారు. సెకండ్ ఇయర్లో ఎంపీసీ, బైపీసీ విభాగాలలో కవల్ ప్రీత్కౌర్ 995/100, సుమయ కణం 994/100, జాదవ్ నవ్యశ్రీ 993/1000 మార్కులు సాధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాపర్లుగా నిలిచారు. కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
లింగాపూర్లో దొంగతనం
కడెం: మండలంలోని లింగాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి దొంగతనం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుగిల్ల బుచ్చన్న కొడుకు దుబాయ్ వెళ్లగా కోడలు సరిత అత్తమామలతో కలి సి ఉంటుంది. బుధవారం సరిత తల్లిగారింటికి వెళ్లగా బుచ్చన్న గదికి తాళం వేసి పక్క గదిలో నిద్రించాడు. తె ల ్లవారుజాము చూసేసరికి గది తాళం, బీరువా తలుపులు పగులగొట్టి ఉన్నాయి. పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ అజయ్, ఎస్సై కృష్ణసాగర్రెడ్డి, క్లూస్టీం, డాగ్స్క్వాడ్తో గదిని పరిశీలించారు. తులం బంగారం, 11 తులాల వెండి ఎత్తుకెళ్లినట్లు, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. కాగా ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీఐ, ఎస్సైలు సూచించారు. -
ఊపిరాడక 20 మేకలు మృతి
ఆదిలాబాద్టౌన్(జైనథ్): భోరజ్ మండలం సిర్సన్న గ్రామంలో గురువారం 20 మేకలు ఊపిరాడక మృతిచెందాయి. గ్రామంలోని ఆత్రం యాదవ్, గెడాం వికాస్లు తమ మేకలను మేపడానికి గ్రామంలోని వైకుంఠధా మం ప్రాంతానికి తీసుకెళ్లారు. మధ్యాహ్నం తిరిగి ఇంటికి తీసుకెళ్లాల్సి ఉండగా, వాటిని వైకుంఠధామంలోని స్నానాల గదిలో ఉంచి తలుపులు వేశారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో వెళ్లి చూసేసరికి ఊపిరాడక 20 మేకలు మృతిచెందాయి. రేకులు ఉండటం, తలుపులు వేసి ఉండడంతో ఎండ తీవ్ర త తట్టుకోలేక, ఊపిరాడక మృతిచెందాయని తె లుస్తోంది. వీటి విలువ దాదాపు రూ.2లక్ష ల వరకు ఉంటుందని, ప్రభుత్వం నష్టపరి హా రం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. జొన్న పంట దగ్ధంఆదిలాబాద్టౌన్(జైనథ్): సాత్నాల మండలంలోని మేడిగూడకు చెందిన కళ్లెం రాంరెడ్డి అనే రైతుకు చెందిన రెండెకరాల జొన్న పంట దగ్ధమైంది. గురువారం చేనుకు ఆనుకొని ఉన్న పక్క చేను రైతు గట్లపై ఉన్న చెత్తను తొలగించేందుకు నిప్పు పెట్టడంతో ప్రమాదవశాత్తు జొన్న పంటకు నిప్పంటుకుంది. దీంతో పంట పూర్తిగా కాలిబూడిదైంది. పంట చేనులో ఉన్న 50 పైపులు కూడా మంటలో కాలిపోయినట్లు రైతు వాపోయాడు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు.ఉన్నాయి. పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ అజయ్, ఎస్సై కృష్ణసాగర్రెడ్డి, క్లూస్టీం, డాగ్స్క్వాడ్తో గదిని పరిశీ లించారు. తులం బంగారం, 11 తులాల వెండి ఎ త్తుకెళ్లినట్లు, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నా రు. కాగా ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీఐ, ఎస్సైలు సూచించారు. విద్యుత్షాక్కు గురైన వ్యక్తి మృతినర్సాపూర్(జి): డొంగుర్గాం గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై చికిత్స పొందుతున్న వ్యక్తి గురువారం మృతిచెందాడు. ఎస్సై సాయికిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. ధనే విజయ్(51) ఈనెల 11న జంగిపల్లి చిన్నయ్య వ్యవసాయ క్షేత్రంలోని ట్రాన్స్ఫార్మర్ దగ్గర మోటార్ పైపులను చెక్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాన్స్ఫార్మర్కు తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నిర్మల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు బుధవారం డిశ్చార్జి చేయగా డొంగుర్గాం గ్రామానికి తీసుకురాగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. విజయ్ తమ్ముడు వినయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
వాంకిడి: బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై ఒక మహిళ మృతి చెందిన ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై ప్రశాంత్, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. బంబార గ్రామానికి చెందిన నాగుల విలాస్, నాగుల ఉమా (48) దంపతులు బుధవారం కాగజ్నగర్ మండలం నవేగాంలోని బంధువుల ఇంటికి ద్విచక్రవాహనంపై వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో సాయంత్రం జాతీయ రహదారిపై బంబార గ్రామ సమీపంలోని యూటర్న్ వద్ద వెనుక నుంచి వచ్చిన ఓ ద్విచక్రవాహనం వీరి వాహనాన్ని వేగంగా ఢీకొట్టింది. దీంతో వెనకాల కూర్చుని ఉన్న ఉమా రోడ్డు డివైడర్పై పడగా తలకు, చేతికి బలమైన గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం అంబులెన్స్లో మహా రాష్ట్రలోని చంద్రపూర్కు తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆమె మృతి చెందింది. ఈ ప్రమాదంలో నాగుల విలాస్కు గాయాలయ్యాయి. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఎల్సీకి సాంకేతికత!
● విద్యుత్ ప్రమాదాల నివారణకు యాప్ ● ఇక ఆన్లైన్లో విద్యుత్ లైన్ క్లియరెన్స్ ● అందుబాటులోకి తీసుకొచ్చిన ఎన్పీడీసీఎల్ ● యాప్పై అధికారులు, ఉద్యోగులకు శిక్షణ పూర్తిమంచిర్యాలరూరల్(హాజీపూర్): విద్యుత్ విని యోగదారులకు మరింతగా మెరుగైన, నాణ్య మైన సేవలు అందించేందుకు తెలంగాణ ఎన్పీడీసీఎల్ ఆధునిక సాంకేతిక పద్ధతులు అవలంభిస్తోంది. ఇందులో భాగంగా విద్యుల్ లైన్ క్లియరెన్స్ (ఎల్సీ) సులభంగా ఉండేలా చర్యలు చేపట్టింది. ఫోన్కాల్ ద్వారా ఎల్సీ తీసుకోవడం వల్ల కొన్ని సందర్భాల్లో విద్యుత్ ప్రమాదాలతో పాటు అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు ఎల్సీ (విద్యుత్ సరఫరా నిలిపివేత, పునరుద్ధరణ)తీసుకోవడానికి ఎన్పీడీసీఎల్ ప్రత్యేక యాప్ రూపొందించింది. ఇప్పటి వరకు ఎల్సీ తీసుకుంటే తీసుకున్న ఉద్యోగికి, సబ్స్టేషన్ ఆపరేటర్కు మాత్రమే తెలి సేది. కానీ యాప్ ద్వారా ఏఈ, ఏడీఈ, డీఈలు కూడా తెలుసుకునే అవకాశం కలుగుతుంది. దీంతో ఎల్సీపై అందరి పర్యవేక్షణ కొనసాగుతుంది. అమలు ఇలా.. ఎల్సీ తీసుకోవాలనుకునే లైన్మెన్ యాప్ ఓపెన్ చేసి అందులో సంబంధిత ఏఈకి విన్నవించుకుంటే ఏఈ పరిశీలించి ఫీడర్లో ఎల్సీ ఇవ్వడానికి వీలు ఉందా లేదా అని పరిశీలించి అనుమతి ఇస్తారు. ఏఈ అనుమతి మేరకు లైన్మెన్, సబ్స్టేషన్ ఆపరేటర్కు యాప్ ద్వారా సమాచారం అందుతుంది. దీని ఆధారంగా యాప్లో నిర్దిష్టంగా పేర్కొన్న ఫీడర్లో ఎల్సీ ఇస్తారు. దీంతో విద్యుత్ సరఫరా నిలిపివేత, పునరుద్ధరణ పనులు బాధ్యతగా జరుగుతాయి. ఎలాంటి పొరపాట్లు జరగకుండా యాప్ తగు సూచనలు ఇస్తుంది. హెల్మెట్ ధరించాలని, హ్యాండ్ గ్లౌజ్లు పెట్టుకోవాలని, ఎర్త్ రాడ్ వాడాలని, ఏబీ స్విచ్ ఓపెన్ చేశారా లేదా వంటి జాగ్రత్తలు యాప్ గుర్తు చేస్తుంది. ఎక్కడైనా డబుల్ ఫీడరింగ్ ఉందా..? ఈ ఫీడర్కు వేరే ఫీడర్తో అనుసంధానం ఉందా..? వంటి సమాచారాన్ని కూడా తెలియజేస్తుంది. డబుల్ ఫీడరింగ్ ఉంటే రెండు ఫీడర్లలో ఎల్సీ తీసుకోవడమా..? లేదా ఇతరత్రా జాగ్రత్తలు తీసుకోవచ్చా..? అని సంయమనం చేసుకుని సిబ్బంది పనులు పూర్తి చేస్తారు. ఎల్సీ తీసుకున్న ఫీడర్లో పని కాగానే సంబంధిత లైన్మెన్ యాప్లో ఆ సమాచారాన్ని పొందుపరచి విద్యు త్ సరఫరా పునరుద్ధరించవచ్చనే సంకేతాన్ని, సమాచారాన్ని యాప్ ద్వారా చేరవేస్తారు. దీన్ని సంబంధిత సెక్షన్ ఏఈ పరిశీలించి సబ్స్టేషన్ ఆపరేటర్కు చేరవేస్తారు. దీంతో ఎల్సీ తీసుకున్న ఫీడర్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తారు.అనవసర ఎల్సీలకు చెక్ విద్యుత్ వినియోగదారులకు మరింత ఉత్తమ సేవలు అందించడంతో పాటు భద్రతా ప్రమాణాలు పెంచడానికి ఎన్పీడీసీఎల్ ఎల్సీ యాప్ను ప్రత్యేకంగా రూపొందించింది. యాప్తో ఉద్యోగుల మధ్య సమన్వయం ఉంటుంది. ఏ లైన్పై పనులు జరుగుతున్నాయో కూడా సులభంగా తెలుస్తోంది. మొత్తంగా అనవసర ఎల్సీలు తగ్గుతాయి. యాప్ ద్వారా విద్యుత్ అంతరాయాలు, మానవ తప్పిదాలు, విద్యుత్ ప్రమాదాల నివారించవచ్చు. – గంగాధర్, ఎస్ఈ, మంచిర్యాల -
ఘనంగా సామూహిక వివాహ వేడుకలు
● ఏకమైన నాలుగు జంటలుఇంద్రవెల్లి: మండలంలోని అంజీ గ్రామపంచాయతీ పరిధి మామిడిగూడలో గురువారం ఆంద్ సమాజ్ ఆధ్వర్యంలో పరమాహంస సద్గురు పూలాజీబాబా సంస్థాన్ వద్ద సామూహిక వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వివాహ వేడుకల్లో అదే గ్రామానికి చెందిన నాలుగు జంటలు ఏకమయ్యాయి. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి, పట్నాపూర్ శ్రీ సద్గురు పరమాహంస పూలాజీబాబా ధ్యాన్ మందిర్ వ్యవస్థాపకుడు కేశవ్ ఇంగ్లేతో పాటు ఆయా గ్రామాల ప్రజలు, బంధువులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఐటీడీఏ పీవీటీసీ ఏపీవో మెస్రం మనోహర్, ఆదివాసీ పెద్దలు డాకురే రాందాస్, కరాడే మారుతి, మెస్రం శేఖర్బాబు తదితరులు ఉన్నారు. -
పెళ్లి నుంచి వస్తూ తిరిగిరాని లోకాలకు..
జన్నారం: బంధువుల పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న ఫిజియో థెరఫిస్టును రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబలించింది. ఎస్సై రాజవర్దన్ గురువారం తెలిపిన వివరాల ప్రకారం గుడిహత్నూర్కు చెందిన ఉరిమెత జంగుబాబు (30) జన్నారం మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఫిజియో థెరఫిస్టుగా పని చేస్తున్నాడు. గురువారం బంధువుల పెళ్లికి కలమడుగుకు వెళ్లాడు. సాయంత్రం తిరిగి వస్తున్న క్రమంలో కొమ్ముగూడెం వద్ద ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీకొట్టి ఎగిరిపడ్డాడు. జంగుబాబు అక్కడికక్కడే మృతి చెందగా స్కూటిపై ఉన్న ఇందన్పల్లి గ్రామానికి చెందిన వంశీ తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్సై అక్కడకు చేరుకు ని వంశీని జన్నారం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం లక్షేట్టిపేటకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
‘తార’ సేవలు భేష్
● ఎస్పీ అఖిల్ మహాజన్ ● ఘనంగా పోలీసు జాగిలం అంత్యక్రియలుఆదిలాబాద్టౌన్: పోలీసు శాఖకు జాగిలం తార అందించిన సేవలు మరువలేనివని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. 2013 బ్యాచ్లో పోలీసు వ్యవస్థలోకి వచ్చిన తార జిల్లాలో పేలుడు పదార్థాలను కనుగొనడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. పోలీసు జాగిలం తార మృతిచెందడంతో గురువారం పోలీసు కార్యాలయంలో అంత్యక్రియలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ పాల్గొని తారకు శాలువా, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ వీఐపీలు జిల్లాపర్యటనకు వచ్చిన సందర్భంగా భద్రత విషయంలో తనిఖీలు నిర్వహించడంలో తార సేవలు ఎంతగానో దోహద పడ్డాయని గుర్తు చేశారు. పోలీసు జాగిలాలకు సకల సదుపాయాలు కల్పించాలని, ఎండ తీవ్రత దృష్ట్యా ప్రతీ జాగిలానికి కూలర్ ఏర్పాటు చేయాలని సూచించారు. రిజర్వు ఇన్స్పెక్టర్ వెంకటి, మురళి, డాగ్స్క్వాడ్ సిబ్బంది రమేశ్, తిరుమలేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆదివాసీ వంటలకు డిమాండ్
● ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ● ఉట్నూర్లో ఇప్పపువ్వు పండుగ కార్యక్రమంఉట్నూర్రూరల్: ఆదివాసీ సాంప్రదాయ వంటలకు ఎంతో డిమాండ్ ఉందని, అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. గురువారం ఉట్నూర్ కేబీ ప్రాంగణంలోని పీఎంఆర్సీ సమావేశ మందిరంలో 8వ ఇప్పపువ్వు పండుగ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్లు పాల్గొన్నారు. మహిళలు ఇప్పపువ్వులతో తయారు చేసిన వంటకాలు ప్రదర్శించారు. ఆదివాసీ మహిళలు ఆదివాసీ పద్దతులు, సాంప్రదాయ వంటకాలపై అధికారులకు వివరించి తినిపించారు. అధికారులు మాట్లాడుతూ ఇప్పపువ్వు లడ్డులో ఎన్నో పోషకాలు ఉన్నాయన్నారు. ఈ లడ్డూలు ఉట్నూర్ ఎక్స్రోడ్డులో అందుబాటులో ఉంటాయని తెలిపారు. 12 మంది గిరిజన మహిళా సంఘం సభ్యులు ఇప్పపువ్వుల లడ్డూలు తయారుచేస్తూ ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరీబాయి, దుర్గు పటేల్, సహకార మిత్ర సంస్థ మేనేజర్ విఠల్, పేసా కోఆర్డినేటర్ వసంత్రావు, రాయి సెంటర్ల్ల, సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
మండుటెండల్లో జాగ్రత్తలే రక్ష
● కార్మికులు, కూలీలు, ప్రజలకు అందుబాటులో ఓఆర్ఎస్ ప్యాకెట్లు ● వడదెబ్బ లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీఎంహెచ్వో సీతారాం కౌటాల: జిల్లాలో భానుడు భగభగ మండుతున్నాడు. జిల్లావ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ దాటుతున్నాయి. ఎండ తీవ్రతకు పట్టణాలు, పల్లెల్లో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. 15 మండలాలు అలర్ట్ జోన్లో ఉండగా.. తిర్యాణి మండలం వార్నింగ్ జోన్కు సమీపంలో ఉంది. ఎండల్లో రక్షణ చర్యలు తీసుకోకుండా తిరిగితే వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. కెరమెరి మండలం జోడేఘాట్లో విధులు నిర్వర్తిస్తున్న సీఆర్టీ(కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్) కనక కాశీరాం(41) బుధవారం వడదెబ్బతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు మండుటెండల్లో జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి(డీఎంహెచ్వో) సీతారాం సూచించారు. ఉదయం, సాయంత్రం మాత్రమే బయటికి వెళ్లి పనులు చేసుకోవాలని సూచించారు. వేసవిలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురువారం ‘సాక్షి’కి వివరించారు. వేసవిలో ఆరోగ్య రక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?డీఎంహెచ్వో : జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగా యి. ఉదయం 11 గంటల నుంచి మూడు గంటల మధ్య ఎండ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఉపాధిహామీ కూలీలు, రైతులు ఉదయం 10 గంటలలోపే పనులు ముగించుకుని ఇళ్లకు చేరుకోవాలి. ఎండలో తిరగాల్సి వస్తే ఓఆర్ఎస్ ప్యాకెట్, లేదా ఇంట్లో నిమ్మరసం, ఉప్పు, చక్కెర వేసుకుని తాగితే ఉపశమనం ఉంటుంది. సీజనల్గా లభించే పుచ్చకాయ, కర్బూజా, కీరదోస, బత్తాయి, ద్రాక్ష, పైనాపిల్ వంటి పండ్ల రసాలు, అంబలి, మజ్జిగ తాగాలి. వడదెబ్బ లక్షణాలు ఎలా ఉంటాయి..?డీఎంహెచ్వో: వడదెబ్బ ఎవరికైనా తగలవచ్చు. శిశువులు, చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులపై అధిక ప్రభావం ఉంటుంది. ఒక్కోసారి ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుంది. వేసవిలో చెమట రూపంలో నీరు ఎక్కువగా బయటకు పోతుంది. ప్రతిఒక్కరూ రోజుకు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీళ్లు తాగాలి. తల తిరగడం, వాంతులు, విరేచనాలు, దాహంగా ఉండడం, శ్వాసక్రియ పెరుగుదల, చెమటలు రాకపోవడం, కడుపు నొప్పి, బీపీ తగ్గడం, మూత్రం రాకపోవడం వంటి లక్షణాలు ఉంటే వడదెబ్బ గురైనట్లు గుర్తించాలి. వెంటనే స్థానిక ఆస్పత్రిలో వైద్యుడిని సంప్రదించాలి. వేసవిలో వైద్య ఆరోగ్యశాఖ ప్రణాళిక ఏంటి..?డీఎంహెచ్వో: ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో వడదెబ్బపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం. అత్యవసర పనిపై వెళ్తే తలకు టోపీలు, తెల్లని రుమాలు ధరించి, శుద్ధమైన తాగునీటిని వెంట తీసుకెళ్లాలి. జిల్లాలోని పీహెచ్సీలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ సిబ్బంది, ఆశవర్కర్ల వద్ద, ఉపాధిహామీ, ఆర్టీసీ డిపోల్లో కార్మికుల కోసం 55 వేలకు పైగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాం. మరో 60 వేల వరకు ప్యాకెట్లు నిల్వ ఉన్నాయి. వేసవిలో నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నాం. వైద్యులు, మందుల కొరత ఉందా..?డీఎంహెచ్వో: గతంలో పీహెచ్సీల్లో మందుల కొరత ఉన్న మాట వాస్తవమే. ప్రస్తుతం పీహెచ్సీల్లో అన్నిరకాల మందులు అందుబాటులో ఉంచాం. జిల్లా కేంద్రంలో మందుల పంపిణీ కేంద్రం ఏర్పాటు చేయడంతో వేగంగా మందులను పీహెచ్సీలకు సరఫరా చేస్తున్నారు. ఎండల నేపథ్యంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫ్లూయిడ్స్ అందుబాటులో ఉన్నాయి. పీహెచ్సీల్లో 22 మంది, యూపీహెచ్సీల్లో 44 మంది వైద్యులకు 18 మంది పనిచేస్తున్నారు. కొరత ఉన్నచోట కొత్తగా వైద్యులను నియమించాల ని ప్రభుత్వానికి నివేదించాం. ఆయుష్ వైద్యు ల సేవలను వినియోగించుకుంటూ పీహెచ్సీల్లో సేవలందిస్తున్నాం. వేసవిలో ఎలాంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంది..?డీఎంహెచ్వో: వేసవిలో విరేచనాలు, డయేరియా, కామెర్లు, తట్టు, గవద బిల్లల సమస్యలు తలెత్తుతాయి. ఎండలు ఉక్కపోత కారణంగా డీహైడ్రేషన్కు గురయ్యే ప్రమాదం ఉంది. వేసవిలో తేలికపాటి ఆహారం తీసుకోవాలి. నూనె పదార్థాలు, వేపుడు, జంక్ఫుడ్ మాంసాహా రం, మద్యం ఎక్కువగా తీసుకుంటే సమస్యలు తలెత్తే ప్రమాదముంది. పిల్లలను శీతల పానీయాలకు దూరంగా ఉంచాలి. వదులుగా ఉండే కాటన్ బట్టలు వేసుకోవాలి. వైద్య సిబ్బంది, ప్రజలకు మీరిచ్చే సలహాలు..?డీహెంహెచ్వో: జిల్లాలో ఎండల ప్రభావం ఎక్కువగా ఉండడంతో జిల్లా నుంచి పీహెచ్సీ వరకు సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించాం. ఎప్పటికప్పుడు కలెక్టర్తో కలిసి వైద్య సిబ్బందితో సమీక్షలు జరుపుతున్నాం. పంచాయతీశాఖ, ఈజీఎస్, పోలీస్శాఖ, వైద్యశాఖ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. వైద్యులు అందుబాటులో ఉండి సేవలు అందించాలని ఆదేశించాం. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే శాఖాపరంగా చర్యలు తప్పవని హెచ్చరించాం. ప్రజలు శుభకార్యాలు, విహార యాత్రలకు వెళ్లిన సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం 10 గంటలలోపు సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రమే బయటకు వెళ్లాలి. జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు (డిగ్రీల సెల్సియస్లో)ప్రాంతం బుధ గురు తిర్యాణి 44.9 44.8 ఎల్కపల్లి 44.8 44.8 కెరమెరి 44.8 45.0 వంకులం 44.7 44.8 సిర్పూర్(టి) 44.6 44.4 ఆసిఫాబాద్ 44.6 44.9 లోనవెల్లి 44.5 44.1 -
అప్పీల్ వ్యవస్థ చాలా కీలకం
కెరమెరి(ఆసిఫాబాద్): భూభారతి చట్టంలో అప్పీల్ వ్యవస్థ చాలా కీలకమైందని, రైతులకు ఈ చట్టంపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండలంలోని కెస్లాగూడ రైతువేదికలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ దండె విఠల్, అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి రైతులకు అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతుల భూసమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. రైతులకు అన్యాయం జరిగితే కలెక్టర్, ఆర్డీవో, సీసీఎల్ స్థాయిలో అప్పీలు చేసుకోవచ్చని తెలిపారు. అర్హులైన వారిని గ్రామ అధికారి, సర్వేయర్లుగా నియమిస్తామని అన్నారు. రైతులకు న్యాయం చేస్తాంఅనంతరం ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ భూభారతి చట్టం ద్వారా రైతులకు న్యాయం చేస్తామని అన్నారు. ధరణి పోర్టల్తో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగేవని, ఇప్పుడు అలాంటి సమస్యలు ఉండవన్నారు. సాదాబైనామాల ప్రకారం కొనుగోలు చేసిన భూములకు సైతం పరిష్కారం లభిస్తుందన్నారు. చట్టంలోని అంశాలపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, తహసీల్దార్ దత్తుప్రసాద్, ఎంపీడీవో అంజద్పాషా, కాంగ్రెస్ ఆసిఫాబాద్ నియోకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్, రైతులు పాల్గొన్నారు. ప్రతీ రైతుకు భూభారతి చట్టంపై అవగాహన ఉండాలి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి
● అదనపు కలెక్టర్ దీపక్ తివారిలింగాపూర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండలంలో పైలట్ గ్రామంగా ఎంపికై న జాముల్ధారలో గురువారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి దారులతో సమావేశమయ్యారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. లబ్ధిదా రులకు త్వరగా రుణాలు మంజూరు చేయాలని ఏపీఎం తిరుపతికి సూచించారు. అలాగే గ్రామంలో వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఈఈలు సిద్దిక్, రాకేశ్, డీఈఈ నరేశ్, ఎంపీడీవో రాంచందర్, ఏఈలు అరవింద్, కృష్ణతేజ, ఏపీవో చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలిఆసిఫాబాద్: వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. సిర్పూర్(యూ) మండల కేంద్రంలోని పంప్హౌజ్ను గురువారం పరిశీలించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మండలంలో ఎక్కడైనా తాగునీటి సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, సమన్వయంతో పనిచేయాలన్నారు. పైప్లైన్ల ద్వారా నీటిని సరఫరా చేయలేని ప్రాంతాలకు నీటి ట్యాంకులు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తాగునీటిని అందించాలని సూచించారు. నిరుపేదలకు గూడు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఆయన వెంట ఇరిగేషన్, ఇతర శాఖల అధికారులు ఉన్నారు. -
ఏసుక్రీస్తు పునరుత్థాన జాతర
● సీఎస్ఐ చర్చి ఆవరణలో మహోత్సవం ● పెద్ద ఎత్తున తరలిరానున్న క్రైస్తవులు ● ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తిలక్సెట్టిపేట: ఏసుక్రీస్తు పునరుత్థాన మహోత్సవ ప్రాంతీయ జాతరను సీఎస్ఐ చర్చి ఆవరణలో ఈ నెల 25, 26న నిర్వహించనున్నారు. ఈ జాతరకు సుదూర ప్రాంతాల నుంచి క్రైస్తవులు పెద్దఎత్తున తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక ప్రార్థనలకు అన్ని ఏర్పాట్లు చేశారు. 1920లో నిర్మాణం.. ఏటా ఏప్రిల్ 25, 26వ తేదీల్లో సీఎస్ఐ చర్చిలో ఈ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్రంలో మెదక్ తర్వాత రెండో పెద్దచర్చిగా పేరొందిన లక్సెట్టిపేట సీఎస్ఐ చర్చి జిల్లాలోని చారిత్రక కట్టడాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. లక్సెట్టిపేట పట్టణ సమీపంలో సుమారు 100 ఎకరాలకు పైగా పచ్చటి పొలాలు, టేకు చెట్ల వనంలో మిషన్ కాంపౌండ్ ప్రాంతంలోని ఆహ్లాదకరమైన వాతావరణంలో సీఎస్ఐ చర్చిని ఆంగ్లేయులు నిర్మించారు. 1920లో ఇక్కడికి వచ్చిన ఇంగ్లాండ్ దేశస్తుడు రెవ సీజీ అర్లి దొర నిర్మాణం ప్రారంభించాడు. ఇంగ్లాండ్ నుంచి రంగురంగుల అద్దాలు, దగ్గరలోని గూడెం గుట్ట, గువ్వల గుట్ట, చిన్నయ్య గుట్టల నుంచి రాళ్లు తెప్పించాడు. సమీప బొట్లకుంటలోని నీటిని నిర్మాణానికి ఉపయోగించారు. మహారాష్ట్ర శిల్పకళాకారులు ఆకర్షణీయంగా నిర్మాణాన్ని తీర్చిదిద్దారు. నిర్మాణం పనులు సాగుతుండగా వేసవి కాలంలో వడదెబ్బ తగిలి అనారోగ్యానికి గురై అర్లి దొర తిరిగి ఇంగ్లాండ్ వెళ్లిపోయాడు. ఆ తర్వాత 1935లో రివ హెచ్ బర్డ్ చర్చి నిర్మాణాన్ని పరిశీలించి పూర్తి చేయించాడు. అనంతరం ఇక్కడకు మిషనరీగా వచ్చిన రెవ ఫాస్పూట్ చర్చిని సీఎస్ఐ చర్చిగా నామకరణం చేసి ప్రారంభించాడు. ఘనంగా ఏర్పాట్లు.. జాతర ఏర్పాట్లను సీఎస్ఐ చర్చి కమిటీ సభ్యులు ఫాధర్ డేవిడ్పాల్ పర్యవేక్షిస్తున్నారు. 25న ఉదయం గ్రామాల్లో పర్యటిస్తూ సాయంత్రం ఊత్కూరు చౌరస్తా నుంచి భాజాభజంత్రీలతో పెద్ద ఎత్తున క్రైస్తవులు ర్యాలీగా చర్చి వద్దకు చేరుకుంటారు. 7 గంటలకు సిలువ వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేసి కీర్తనలు పాడుతారు. 26న ఉదయం నుంచి చర్చిలో ప్రత్యేక కీర్తనలు పాడుతూ పలు సాంసృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం సిలువ గుట్టపైకి వెళ్లి కొవ్వొత్తులు వెలిగిస్తారు. -
కొవ్వొత్తులతో నివాళి
ఆసిఫాబాద్: కశ్మీర్లోని పహల్గాం సమీపంలో జరిగిన దారుణమైన ఉగ్ర దాడిని నిరసిస్తూ, ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళిగా బుధవారం రాత్రి బజరంగ్దళ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వివేకానంద చౌక్ నుంచి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. టూరిస్టులపై విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చడాన్ని తీవ్రంగా ఖండించారు. నాయకులు మాట్లాడుతూ హిందువులపై దాడికి పాల్పడిన ముష్కరులకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. బీజేపీ నాయకులు అరిగెల మల్లికార్జున్, బజరంగ్దళ్, జాగో హిందూ జాగో, ఆర్ఎస్స్, హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
భూభారతితో సమస్యలు పరిష్కారం
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేచింతలమానెపల్లి/బెజ్జూర్: భూభారతి చట్టంతో రైతుల భూముల సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. చింతలమానెపల్లి మండలం బాలాజీ అనుకోడ, బెజ్జూర్ మండల కేంద్రంలోని రైతువేదికల్లో బుధవారం ఎమ్మెల్సీ దండె విఠల్, అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ వ్యక్తికి ఆధార్ ఉన్నట్లు భూముల సర్వే నంబర్కు ప్రభుత్వం భూధార్ జారీ చేస్తుందని తెలిపారు. భూభారతి చట్టంలో అప్పీలు చేసే అవకాశం ఉండటంతో భూవివాదాలకు పరిష్కారం లభిస్తుందన్నారు. జూన్ 2 నుంచి అన్ని మండలాల్లో చట్టం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. అటవీ హద్దుల సమస్యల పరిష్కారం కోసం ఉమ్మడి సర్వేకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ధరణిని బొంద పెట్టి భూభారతి తెచ్చాం గత ప్రభుత్వం అమలు చేసిన ధరణిని బొందపెట్టి భూభారతి చట్టాన్ని తెచ్చామని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. ధరణి పోర్టల్తో చాలామంది రైతులు బాధితులుగా మారిపోయారన్నారు. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో అధికారులు సైతం ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. వీఆర్వో వ్యవస్థను ప్రవేశపెట్టి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం బెజ్జూర్లో సీఎం రేవంత్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఆయా కార్యక్రమాల్లో డీఏవో శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ దేవయ్య, పీఏసీఎస్ చైర్మన్ ఓంప్రకాశ్, ఏడీఏ మనోహర్, తహసీల్దార్లు మునావర్ షరీఫ్, భూమేశ్వర్, ఎంపీడీవో ప్రవీణ్కుమార్, ఏవో నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
సమ్మర్ సెలవులొచ్చాయ్..
పాఠశాలలకు వేసవి సెలవులు వచ్చాయి. ఈ నెల 9 నుంచి ప్రారంభమైన సమ్మెటీవ్ అసెస్మెంట్ పరీక్షలు 17 వరకు కొనసాగాయి. చివరిరోజు బుధవారం తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. అనంతరం 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు ప్రదానం చేశారు. వసతిగృహాల్లోని విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఇంటిబాట పట్టారు. ఆసిఫాబాద్, కాగజ్నగర్ బస్టాండ్లు రద్దీగా మారాయి. ఈ నెల 13 నుంచి జూన్ 11 వరకు ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. తిరిగి జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. – ఆసిఫాబాద్రూరల్ -
విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు
రెబ్బెన(ఆసిఫాబాద్): స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమాలతో విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్రెడ్డి అన్నారు. గోలేటి టౌన్షిప్లోని సింగరేణి ఉన్నత పాఠశాలలో బుధవారం భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ డెన్ ప్రారంభించారు. జీఎం మాట్లాడుతూ సమాజ సేవతోపాటు అత్యవసర పరిస్థితుల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ అందించే సేవలు గొప్పవన్నారు. పాఠశాల స్థాయి నుంచే స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమాలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాల పెంపు, స్వయంకృషితో ఎదగడం, శారీర క, మానసిక దృఢత్వానికి దోహదపడుతాయని తెలిపారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా జీవించగలిగే ఆత్మస్థైర్యాన్ని ఇస్తాయన్నారు. ఈ సందర్భంగా జా తీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న విద్యార్థులను అభినందించారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ రూ పొందించిన గుడారం, నివాస సమూహాల నమూనాలను పరిశీలించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు ప్రగతి పత్రాలు అందించారు. రానున్న విద్యా సంవత్సరంలో విద్యార్థులంతా ఫస్ట్క్లాస్లో ఉత్తీర్ణత సాధించాలని, దీనిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రెడ్డిమల్ల తిరుపతి, సీనియర్ పీవో ప్రశాంత్, హెచ్ఎం రవితేజ, ఉపాధ్యాయులు ఆర్లారెడ్డి, పీఈటీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
భయాందోళనలో ‘గిరి’ గ్రామం
● ఒకే కుటుంబంలో నలుగురు మృతి ● నెల క్రితం గ్రామం వదిలి వెళ్లిన కుటుంబాలు ● సమీప గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో తలదాచుకుంటున్న వైనం ● భయం వీడాలని కోరిన ఏఎస్పీ చిత్తరంజన్ సాక్షి, ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ మండలం సమతులగుండం గ్రామం జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గిరిజన గ్రామంలో 11 కుటుంబాలు కొన్నేళ్లుగా జీవిస్తున్నాయి. అక్కడి చేరుకోవాలంటే వాగులు వంకలు దాటాల్సిందే. ఎనిమిది కిలోమీటర్ల మేర రోడ్డు సౌకర్యమే లేదు. వ్యవసాయంపై ఆధారపడిన ఆ గ్రామస్తులు నెలరోజుల కిందట ఉన్న ఫలంగా ఇళ్లను ఖాళీ చేసి లింగాపూర్ మండలం భీమన్గొందిలోని ప్రాథమిక పాఠశాలలో తలదాచుకున్నారు. గత మార్చిలో గ్రామానికి చెందిన ఆత్రం రాజు(40), సోనుబాయి(35) దంపతులతోపాటు వారి కుమారులు భీము(22), మారుతి(20) అనారోగ్య కారణాలతో నెల రోజుల వ్యవధిలో మరణించడమే ఇందుకు కారణం. రాజు కుటుంబ సభ్యులు చనిపోవడంతో ఊరికి ఏదో పీడ ఆవహించిందన్న భయాందోళనతో 10 కుటుంబాలు గ్రామం వీడాయి. ఒక్క కుటుంబం మాత్రం చావోరేవో అన్న ధైర్యంతో అక్కడే ఉంటోంది. మూఢ నమ్మకం.. భయం చుట్టూ అడవులు.. ఆ అడవుల మధ్యలో ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడిలో ఉన్న ఊరు భయంతో గజగజలాడుతోంది. భయాందోళనతో సమతులగుండం గ్రామ ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి నెల రోజులుగా సమీప గ్రామంలో బిక్కుబిక్కు మంటూ జీవిస్తున్నారు. ఇది జిల్లావ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో ఏఎస్పీ చిత్తరంజన్ మంగళవారం ఉదయం ఆయా గ్రామాల్లో పర్యటించారు. సమతులగుండం ప్రజలను పరామర్శించారు. డాక్టర్తో వారికి వైద్యపరీక్షలు చేయించారు. భయం వీడి తిరిగి సొంత గ్రామానికి రావాలని గ్రామస్తులను కోరారు. పట్టువీడని గ్రామస్తులు జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్లలో దూరంలో ఉన్నప్పటికీ ఆ గ్రామం అభివృద్ధికి నేటికీ ఆమడ దూరంలోనే ఉంటోంది. పైగా మూఢ నమ్మకాలతో గిరిజనులు భయాందోళనకు గురవుతున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. అపోహలను తొలగించడానికి జిల్లా యంత్రాంగం కృషి చేయకపోవడంతో సమతులగుండం ప్రజలు నేడు ఊరు ఖాళీ చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. గ్రామానికి ఏదో పీడ ఆవహించిందన్న మూఢనమ్మకంలో గ్రామం వీడిన సమతులగుండం గ్రామస్తులు మళ్లీ తిరిగి ఊరికి చేరుకోవడానికి ససేమీరా అంటున్నారు. ఏఎస్పీ చిత్తరంజన్ స్వయంగా వెళ్లి వారితో మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. చివరకు మీకు నెలనెలా రేషన్ సరుకులు అందేలా సంబంధిత అధికార యంత్రాంగంతో మాట్లాడుతామని హామీ ఇచ్చినా.. వారు సుముఖంగా లేకపోవడం వారి భయాందోళనను తెలియజేస్తోంది. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు మూఢ నమ్మకాలపై కళాజాత బృందాలతో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. -
బాలికలదే హవా
● బాలురలతో పోల్చితే ఉత్తమ ఫలితాలు సాధించిన వైనం ● రాష్ట్రస్థాయిలోనూ మెరుగుపడిన జిల్లా ర్యాంకు ● సెకండియర్లో 2, ఫస్టియర్లో 4వ స్థానం..ఆసిఫాబాద్రూరల్: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో మ రోసారి బాలికలు మెరిశారు. బాలురలతో పోలిస్తే ఎక్కువ మంది ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రస్థాయిలో కూడా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా స్థానం గతేడాదితో పోలిస్తే మెరుగుపడింది. కేజీబీ వీలు, గురుకులాలు, ప్రభుత్వ కళాశాలలు మెరుగైన ఉత్తీర్ణత శాతం నమోదు చేశాయి. తిర్యాణి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన బైపీసీ సెకండియర్ విద్యార్థి గున్నాల పూజిత 1000 మార్కులకు 990 మార్కులతో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించింది. ఫలితాలు ఇలా..మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో సెకండియర్లో జిల్లా రెండో స్థానంలో నిలవగా, ఫస్టియర్ ఫలితాల్లో నాలుగో స్థానంలో నిలిచింది. కొన్నేళ్లుగా జిల్లా రెండు, మూడు స్థానాల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. అయితే గతేడాది మాత్రం ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 7, ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 8వ స్థానంలో నిలిచింది. 2024– 25 విద్యాసంవత్సరంలో ఫస్టియర్ జనరల్ విభాగంలో 3,995 మంది విద్యార్థులు హాజరు కాగా, 2,816(70.49శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ విభాగంలో 761 మంది విద్యార్థులకు 538(70.70శాతం) మంది పాసయ్యారు. ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 4,199 మంది విద్యార్థులు హాజరు కాగా, 3,339(79.52శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ విభాగంలో 721 మందికి 609(84.47) మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది కూడా బాలురులతో పోల్చితే బాలికలే ఎక్కువ మంది పాసయ్యారు. ఫస్టియర్లో జనరల్, ఒకేషనల్ విభాగాల్లో 2,133 మంది బాలురులు పరీక్షలు రాయగా, 1,255 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 2,623 మంది హాజరు కాగా, 2,099 మంది పాసయ్యారు. ఇక సెకండియర్లో 2,212 మంది బాలురులకు 1,564 మంది ఉత్తీర్ణులు కాగా, బాలికలు 2,708 మందికి 2384 మంది పాసయ్యారు. సత్తా చాటిన ‘ప్రభుత్వ’ విద్యార్థులుజిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటినట్లు ప్రిన్సిపాల్ మహేశ్వర్ తెలిపారు. ఫస్టియర్లో 157 మందికి 120 మంది, సెకండియర్లో 157 మందికి 156 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీ గ్రూపులో అదిబా తహిరీం 1000 మార్కులకు 971, హర్షిత 970, సమత 964, సౌమ్య 934, బైపీసీలో విద్య 968, సీఈసీలో సాహిత్య 932, ఎంఈసీలో శ్రీవిద్య 859 మార్కులు సాధించారు. ఇక ఫస్టియర్ ఎంపీసీ గ్రూపులో సైరి బాను 470 మార్కులకు 445, బైపీసీలో వైష్ణవి 440 మార్కులకు 425, సీఈసీలో చందన 500 మార్కులకు 478, ఎంఈసీలో వైష్ణవి 500 మార్కులకు 435 మార్కులు సాధించారు. జిల్లా కేంద్రంలో బాలికల గురుకుల కళాశాలలో ఫస్టియర్ విద్యార్థులు 124 మందికి 115 మంది(93 శాతం) ఉత్తీర్ణులు కాగా, సెకండియర్లో 108 మంది 108 మంది(వందశాతం), యూఆర్జేసీలో ఫస్టియర్ విద్యార్థులు 65 మందికి 62(95 శాతం), సెకండియర్లో 63 మందికి 61 మంది(97 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఆసిఫాబాద్లోని మహాత్మా జ్యోతిబా పూలే కళాశాలకు చెందిన ఎంపీసీ ఫస్టియర్ విద్యార్థిని అశ్విని 447, సెకండియర్ బైపీసీ విద్యార్థిని అంజలి 970 మార్కులు సాధించారు. -
ప్రజలకు అందుబాటులో ఉంటా
● ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబుచింతలమానెపల్లి(సిర్పూర్): నియోజకవర్గ ప్రజల కు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అన్నారు. మండలంలోని బాలాజీ అనుకోడ రైతు వేదికలో మంగళవారం చింతలమానెపల్లి, బెజ్జూర్ మండలాలకు చెందిన 189 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల శివార్లలో పోడు రైతులను అధికారులు ఇబ్బందులు కలిగించడం సరికాదన్నారు. అధికారులు తీరు మార్చుకోవాలని హితవు పలికారు. పోడు రైతులపై దాడులకు పాల్పడితే సహించేది లేదన్నారు. ఫారెస్టు అధికారులు భూముల్లోకి వస్తే తనకు సమాచారం అందించాలని, వెంటనే అందుబాటులోకి వస్తానని తెలిపారు. అనంతరం రవీంద్రనగర్లో రూ.35లక్షలతో నిర్మించిన సీసీరోడ్లను ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు మునావర్ షరీఫ్, భూమేశ్వర్, డీటీలు భీమ్లానాయక్, దౌలత్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. -
భూగర్భ జలాల పెంపునకు కృషి చేయాలి
● అదనపు కలెక్టర్ దీపక్ తివారి ఆసిఫాబాద్: జిల్లాలో భూగర్భ జలాల పెంపునకు కృషి చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి మున్సిపల్ కమిషనర్లు, భూగర్భ జలశాఖ, మిషన్ భగీరథ ఇంజినీర్లు, ప్రజారోగ్య కార్యనిర్వాహక శాఖ ఇంజినీర్లు, నీటి పారుదల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీ శాఖ అధికారులతో కూడిన పర్యవేక్షక కమిటీతో సమావేశమయ్యారు. నీటి వినియోగం, పొదుపు, భూగర్భ నీటి మట్టం తరిగిపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భూగర్భ నీటి మట్టాన్ని పెంపొందించేందుకు పర్యవేక్షక కమిటీ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సాగునీరు, తాగునీరు పొదుపుగా వినియోగించడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో వాల్టా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు. చేతిపంపులు, బావులు, సాగునీటి చెరువులు, ప్రాజెక్టులు, వ్యవసాయ పంపుసెట్ల పూర్తి వివరాల నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. -
రైతులకు భూభారతిపై అవగాహన ఉండాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేలింగాపూర్/జైనూర్: భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి నూతన ఆర్వోఆర్ చట్టంపై రైతులకు అవగాహన ఉండాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. లింగాపూర్ మండలకేంద్రంతోపాటు సిర్పూర్(యూ) మండలం మహాగామ్, జైనూర్ మండలం గౌరిలోని రైతువేదికల్లో మంగళవారం అవగాహన సదస్సులు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ నెల 30 వరకు అవగాహన సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. అప్పీల్ వ్యవస్థతో రైతులకు మేలు జరుగుతుందన్నారు. అనంతరం లింగాపూర్లో బావులు, బోర్లు వేయకుండా అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరిస్తామని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. సమావేశంలో ఎమ్మెల్సీ దండె విఠల్, అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథ్, ఎంపీడీవోలు రాంచందర్, రామకృష్ణారావు, తహసీల్దార్ ఉదయ్కుమార్, మండల ప్రత్యేకాధికారి జాదవ్ గుణవంత్రావు, డీటీ పెద్దిరాజు, ఏవో సంజయ్కుమార్, ఏఈ మల్లయ్య, ఎంపీవో రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు అవగాహన కల్పించాలిఆసిఫాబాద్: భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, గృహనిర్మాణ శాఖ అధికారులతో భూభారతి ఆర్వోఆర్ చట్టం అవగాహన సదస్సులు, పైలట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, మిగిలిన గ్రామాల్లో అర్హుల జాబితా రూపకల్పన అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ జిల్లాల్లో భూభారతి నూతన ఆర్వోఆర్ చట్టంలోని అంశాలపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించి, చట్టం హక్కులు, అంశాలను వివరించాలన్నారు. అలాగే పైలట్ గ్రామాల్లో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, మిగిలిన గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీ సభ్యులు ప్రతిపాదించిన జాబితాను గెజిటెడ్ అధికారులతో మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. సిర్పూర్(యూ) తహసీల్దార్ కార్యాలయం నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావు వీడియో కాన్ఫరెన్స్కు హాజరు కాగా, జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ దీపక్ తివారి, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టంపై జిల్లాలోని ఆరు మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహించామని తెలిపారు. ఈ నెల 28 వరకు మిగిలిన తొమ్మిది మండలాల్లో పూర్తి చేస్తామన్నారు. పైలట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. -
ముగిసిన అటల్ టింకరింగ్ కమ్యూనిటీ ప్రోగ్రాం
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశుమందిర్లో ఐదు రోజులుగా కొనసాగుతున్న అటల్ టింకరింగ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం మంగళవారం ముగిసింది. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా సైన్స్ అధికారి కటు కం మధుకర్ మాట్లాడుతూ విద్యార్థులు నే ర్చుకున్న అంశాలను నిత్యజీవితంలో ఉపయోగించుకొని కొత్త ఆవిష్కరణలు చేయాలన్నారు. ఈ సందర్భంగా ఐదు రోజులుగా విద్యార్థులు నేర్చుకున్న అంశాలను ప్రదర్శించారు. అనంతరం వారికి ప్రశంసాపత్రాలు అందించారు. ఉదయం పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు దేవభూషణం, రాధాకృష్ణాచారి, సహాకార్యదర్శి భోగ మధుకర్, వేణుగోపాల్, శిక్షకులు సాయికృష్ణ, ల్యాబ్ ఇన్చార్జి శ్రీకాంత్, ప్రధానాచార్యులు గుండేటి కోటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
సర్కారు చదువు.. సివిల్స్లో ర్యాంకు
● సత్తా చాటిన రాంటెంకి సుధాకర్ కౌటాల(సిర్పూర్): యూపీఎస్సీ– 2024 సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాల్లో కౌటాల మండలం బోదంపల్లి గ్రామానికి చెందిన రాంటెంకి సుధాకర్ ఆలిండియా స్థాయిలో 949 ర్యాంకు సాధించారు. నిరుపేద కు టుంబానికి చెందిన రాంటెంకి సోమయ్య, ప్రమీల దంపతులకు ముగ్గురు సంతానం. రెండో కుమారుడు సుధాకర్ విద్యాభ్యాసం మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లో సాగింది. బోదంపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు, ఆ తర్వాత పదో తరగతి వరకు సిర్పూర్(టి)లోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో పూర్తి చేశా రు. నాగోల్లోని గురుకుల కళాశాలలో ఇంటర్మీడియెట్ విద్యనభ్యసించారు. అనంతరం ఖరగ్పూర్ ఐఐటీలో మెకానిక్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. మొదటి నుంచే సివిల్స్లో సత్తా చాటాలనే పట్టుదలతో హైదరాబాద్లోని ఎస్సీ స్టడీ సర్కిల్లో ప్రత్యేక శిక్షణ పొందాడు. యూపీఎస్సీ పరీక్షల్లో మూడుసార్లు ప్రయత్నించి విఫ లం కాగా, నాలుగో ప్రయత్నంలో 949 ర్యాంకు సాధించాడు. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో చదివిన మారుమూల ప్రాంతానికి చెందిన సుధాకర్ సివిల్స్ ర్యాంక్ సాధించడంపై బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ట్విటర్లో అభినందించారు. సుధాకర్ సివిల్స్లో సత్తా చాటడంతో మంగళవారం బోదంపల్లిలో సందడి నెలకొంది. స్థానికులు సుధాకర్ కుటుంబ సభ్యులను అభినందించారు. సోషల్ మీడియాలో శుభాంకాంక్షలు వెల్లువెత్తాయి. -
పెండింగ్ వేతనాలు చెల్లించాలని వినతి
ఆసిఫాబాద్రూరల్: బీసీ వసతిగృహాల్లో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని సోమవారం ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమశాఖ అధికారి సజీవన్కు వినతిపత్రం అందించారు. ఆ సంఘం రాష్ట్ర నాయకుడు బ్రహ్మానందం మాట్లాడుతూ జిల్లాలోని బీసీ వసతిగృహాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ వర్కర్లకు 12 నెలలుగా వేతనాలు రావడం లేదన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి పెండింగ్ వేతనాలు చెల్లించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. లేనిపక్షంలో నిరవధిక సమ్మెకు పిలుపునిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు కొమురయ్య, పార్వతి, లక్ష్మి, జ్యోతి, శారద, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
భూ సమస్యల పరిష్కారానికి భూభారతి
కాగజ్నగర్రూరల్: భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి నూతన ఆర్వోఆర్ చట్టాన్ని తీసుకువచ్చినట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. కాగజ్నగర్ మండలం వంజిరీలోని రైతు వేదికలో భూభారతి చట్టంలోని హక్కులు, అంశాలపై సోమవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబుతో కలిసి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ భూభా రతి ద్వారా రికార్డుల్లో తప్పులను తహసీల్దార్ కార్యాలయంలో సరిచేసుకునే అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు మాట్లాడుతూ ధరణి చట్టంతో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని ఆరోపించారు. కొత్త భూభారతి చట్టంలో అప్పీల్ వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా భూభారతి పోర్టల్లో రైతులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, తహసీల్దార్ కిరణ్, డీఏవో శ్రీనివాసరావు, ఏవో రామకృష్ణ పాల్గొన్నారు. ‘భూభారతి’పై అవగాహన అవసరంసిర్పూర్(టి): భూభారతి ఆర్వోఆర్ చట్టంపై ప్రతిఒక్కరికి అవగాహన అవసరమని ఎమ్మెల్సీ దండె విఠల్, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో సోమవారం భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, తహసీల్దార్ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. -
● ఉమ్మడి జిల్లాలో వికసిస్తూ.. ముళ్లను సైతం ముద్దాడుతూ ● తొలి ఎన్నికల నుంచే సత్తా చాటిన ఉద్యమ పార్టీ ● ‘తెలంగాణ’ ఏర్పాటు తర్వాత రెండుసార్లు ప్రభంజనం ● మొన్నటి ఎన్నికల్లో మాత్రం ప్రతికూలం ● కేడర్పైనే కీలక నేతల ధీమా ● రజతోత్సవ వేళ శ్రేణుల్లో మళ్లీ ఉత్సాహం ●
ఉమ్మడి జిల్లా నుంచి 30 వేల మంది ఆసిఫాబాద్: ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ సిల్వర్జుబ్లీ వేడుకలకు ఉమ్మడి జిల్లా నుంచి 30 వేల మందిని తరలించనున్నాం. ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి 350 ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తున్నాం. అధిష్టానం ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలి. – కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే సాక్షి, ఆదిలాబాద్: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రజతోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 27న వరంగల్లో భారీ మహాసభకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు పార్టీ కేడర్ సన్నద్ధమవుతోంది. 25 ఏళ్ల ఆ పార్టీ ప్రస్థానంలో రాష్ట్రంలో మాదిరే జిల్లాలోనూ అనేక ఆటుపోట్లను ఎదుర్కొంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గులాబీ పార్టీ రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోనూ పటిష్టంగా రూపొందింది. అయితే గత ఎన్నికల్లో ఓటమితో కొంత నైరాశ్యం చోటు చేసుకుంది. పలువురు నేతలు పార్టీని వీడినా పునాది లాంటి కార్యకర్తలు వెన్నంటే ఉన్నారన్న అభిప్రాయం నాయకత్వంలో ధీమా నింపుతోంది. పార్టీ రజతోత్సవం తర్వాత మరింత ఉత్సాహం చోటు చేసుకోనుందని, రానున్న రోజుల్లో కేసీఆర్ పాలననే ప్రజలు కోరుకుంటున్నారని ఆ పార్టీ శ్రేణులు నర్మగర్భంతో పేర్కొంటున్నారు. మొదటి ఎన్నికలతోనే ప్రభంజనం.. బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) పార్టీ 2001 ఏప్రిల్ 27న ఏర్పడింది. 2004 సార్వత్రిక ఎన్నికల్లో మొదటిసారి రాష్ట్రంలో పోటీ చేసింది. తెలంగాణలో 26 సీట్లలో గెలుపొందింది. ఉమ్మడి జిల్లాలో ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ ముథోల్ నుంచి నారాయణరావు పటేల్, బోథ్ నుంచి సోయం బాపూరావు, ఖానాపూర్ నుంచి అజ్మీరా గోవింద్ నాయక్ గెలుపొందారు. పార్లమెంట్ ఎన్నికల్లో నాడు ఆదిలాబాద్ ఎంపీ జనరల్ స్థానంగా ఉండగా, అప్పట్లో గులాబీ పార్టీ నుంచి టి.మధుసూదన్రెడ్డి గెలుపొందారు. ఈ విధంగా ఆ పార్టీ ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్ పార్లమెంట్తోపాటు మూడు అసెంబ్లీ స్థానాలను కై వసం చేసుకుంది. అప్పట్లోనే అసమ్మతి వర్గం.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధినేత కేసీఆర్ నాడు పార్టీ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులందరినీ రాజీనామా చేయాలని కోరారు. అయితే అప్పట్లో ఎంపీ మధుసూదన్రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే గోవింద్నాయక్ కేసీఆర్కు మద్దతుగా రాజీనామా చేయగా, బోథ్ నుంచి గెలుపొందిన సోయం బాపూరావు, ముథోల్ నుంచి గెలుపొందిన నారాయణరావు పటేల్ అసమ్మతి వర్గంగా నిలిచారు. దీంతో మొదటి ఎన్నికల తర్వాత రాష్ట్రంలో, ఇటు జిల్లాలోనూ అసమ్మతి వర్గం కారణంగా పార్టీకి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. ఉప ఎన్నికల్లో మళ్లీ ఎంపీగా పోటీ చేసిన మధుసూదన్రెడ్డి, ఖానాపూర్లో తిరిగి పోటీ చేసిన గోవింద్ నాయక్ ఇద్దరూ ఓటమి చెందారు. దీంతో జిల్లాలో పార్టీ పరిస్థితి కొంత డీలా పడింది. ఇక వెనుదిరిగి చూడని వైనం.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటం, బీఆర్ఎస్కు ప్రజల్లో ఆదరణ పెరగడంతో ఇతర పార్టీల్లోని ముఖ్య నేతలంతా బీఆర్ఎస్లోకి వలస వచ్చారు. దీంతో పార్టీ బలంగా తయారైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ దూసుకుపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జెడ్పీని సైతం కై వసం చేసుకుంది. మున్సిపాలిటీల్లోనూ పాగా వేసింది. 2014 ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఏకంగా ఏడు స్థానాల్లో గెలుపొందింది. నిర్మల్, సిర్పూర్లో ఐకేరెడ్డి, కోనప్పలు బీఎస్పీ నుంచి గెలుపొంది ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. ఆ ఎన్నికల్లో ముథోల్ నుంచి ఏకై క స్థానం గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కూడా ఆ తర్వాత కాలంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ విధంగా పూర్తిగా ఉమ్మడి జిల్లా గులాబీమయంగా తయారైంది. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లాలో ఏకంగా తొమ్మిది స్థానాల్లో గెలుపొందగా, ఆసిఫాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసిన ఆత్రం సక్కు గెలుపొందారు. ఆ తర్వాత ఆయన కూడా గులాబీ పార్టీలో చేరడంతో పదికి పది స్థానాలు బీఆర్ఎస్ హస్తగతం అయ్యాయి. ఈ విధంగా ఉద్యమకాలంలో ఉమ్మడి జిల్లాలో గులాబీ పార్టీ మొదట్లో ఆటుపోట్లు ఎదుర్కొన్నా, ప్రత్యేక రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా అవతరించింది. కలిసిరాని కాలం.. అయితే 2023 ఎన్నికలు బీఆర్ఎస్కు కలిసి రాలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు అధికారంలో ఉన్న గులాబీ పార్టీకి ఒక విధంగా ఎదురుదెబ్బ తగిలింది. ఉమ్మడి ఆదిలాబాద్లో కేవలం బోథ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లోనే ఆ పార్టీ అభ్యర్థులు అనిల్ జాదవ్, కోవ లక్ష్మి గెలుపొందారు. ఇదిలా ఉంటే మొదటి నుంచి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. ఆదిలాబాద్ పరంగా 2004లో మధుసూదన్ రెడ్డి, 2014లో గోడం నగేష్ గులాబీ పార్టీ నుంచి ఎంపీలుగా గెలిచారు. ఇక పెద్దపల్లి నుంచి 2014లో బాల్క సుమన్, 2019లో వెంకటేశ్ నేత ఎంపీలుగా మారారు. ఉమ్మడి జిల్లాలో జెడ్పీ చైర్మన్గా వల్లకొండ శోభారాణి సత్యనారాయణ గౌడ్, ఆ తర్వాత రాథోడ్ జనార్దన్ వ్యవహరించారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత నాలుగు జెడ్పీలు ఏర్పడగా, ఈ నాలుగింటిలోనూ బీఆర్ఎస్ పాగా వేసింది. అయితే గత ఎన్నికల్లో చేదు ఫలితాలు ఎదురుకావడం, ఈ క్రమంలో పార్టీని పలువురు నేతలు వీడినా కార్యకర్తలు మాత్రం వెన్నంటి ఉన్నారనే ధీమా గులాబీ ముఖ్యనేతల్లో వ్యక్తమవుతోంది. మళ్లీ పుంజుకున్న వైనం.. 2009 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్కు చెన్నూర్ నుంచి నల్లాల ఓదెలు, మంచిర్యాల నుంచి గడ్డం అరవింద్రెడ్డి, సిర్పూర్ నుంచి కావేటి సమ్మయ్య గెలుపొందారు. దీంతో పార్టీ మళ్లీ పుంజుకుంది. ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం తీవ్రరూపం దాల్చడం, సబ్బండ వర్గాలు కలిసి రావడంతో బీఆర్ఎస్కు కలిసి వచ్చింది. అప్పట్లో కేసీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా, తిరిగి ఉప ఎన్నికల్లో ఆ మూడు స్థానాల నుంచి గెలుపొందింది. ఈ విధంగా పార్టీ తన స్థానాన్ని పదిలపర్చుకుంది. రాజకీయ సుస్థిరత సాధించింది. 2009 ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన జోగు రామన్న మధ్యలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేపథ్యంలో ప్రజల అభీష్టం మేరకు ఆ పార్టీకి రాజీనామా చేసి 2012లో బీఆర్ఎస్లో చేరారు. గులాబీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఎమ్మెల్యేల సంఖ్య నాలుగుకు పెరగగా ఉమ్మడి జిల్లాలో పార్టీ బలంగా మారింది. -
ఘనంగా ఈస్టర్ వేడుకలు
కౌటాల(సిర్పూర్): జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం ఈస్టర్ వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. కౌటాల మండల కేంద్రంతోపాటు విజయనగరం, యాపలగూడ, శివలింగాపూర్, సదాశివపేట గ్రామాల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. విజయనగరం చర్చిలో ఫాదర్ సీజో, యాపలగూడలో ఫాదర్ శేరిన్, కౌటాలలో ఫాదర్ టామ్, సదాశివపేటలో పాస్టర్ శ్రీనివాస్, మార్కెట్ ఏరియాలో పాస్టర్ శాంతికుమార్ ఈస్టర్ సందేశం అందించారు. శివలింగపూర్ చర్చిలో పాస్టర్ సువార్త రాజన్న మాట్లాడుతూ యేసు క్రీస్తు శిలువపై చనిపోయి ఆదివారం పునరుత్థానంగా మరణాన్ని జయించిన సందర్భంగా ఈస్టర్ వేడుకలు జరుపుకొంటామని తెలిపారు. యేసు క్రీస్తు చూపిన మార్గంలో క్రైస్తవులు నడవాలని పిలుపునిచ్చారు. అనంతరం భక్తులుకు ప్రేమవిందు(అన్నదానం) నిర్వహించారు. -
మాట నిలుపుకున్న సీఎం..
గతంలో అమరవీరులకు నివాళులర్పించాలంటే ఎన్నో ఆంక్షలు ఉండేవి. కొట్లాడి సాధించుకున్న స్వరాష్ట్రంలోనైనా పరిస్థితి మారుతుందేమోనని ఆశించాం. కానీ పదేళ్లలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదు. పీసీసీ హోదాలో ఇంద్రవెల్లిలో పర్యటించిన రేవంత్రెడ్డి సీఎం కాగానే ఇంద్రవెల్లి స్మృతి వనానికి ఇచ్చిన మాట ప్రకారం రూ.కోటి కేటాయించారు. 15 మంది అమరవీరుల కుటుంబీకులను గుర్తించి వారిలో కొంత మందికి సాయం అందించాం. ఇంకా ఉన్నారని తెలుస్తోంది. వారిని సైతం అధికారికంగా గుర్తించి సాయం అందించేలా చూస్తాం. – వెడ్మ బొజ్జు, ఖానాపూర్ ఎమ్మెల్యే -
సెలవుల్లో సమ్మర్ క్యాంపులు
● మే 1 నుంచి 31 వరకు క్రీడాశిబిరాలు ● యువజన శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఆసిఫాబాద్రూరల్: విద్యార్థులు వేసవి సెలవులు సద్వినియోగం చేసుకునేలా జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపులు నిర్వహించనున్నారు. విద్యార్థుల్లో మానసికోల్లాసం, దేహదారుఢ్యం పెంపొందించేందుకు గ్రామస్థాయిలో ఈ క్రీడా శిక్షణ శిబిరాలు దోహదపడనున్నాయి. విద్యార్థులకు పది రకాల క్రీడల్లో నెలరోజుల పాటు ఉచిత శిక్షణ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాలబాలికలు తమకు నచ్చిన ఆటలో నైపుణ్యాలు పెంచుకునేలా శిక్షణ అందించేందుకు పీడీలు, పీఈటీలు, సీనియర్ క్రీడాకారుల నుంచి ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఇప్పటివరకు 25 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. గతంలో నిర్వహించిన సమ్మర్ క్యాంపుల్లో శిక్షణ అందించిన వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఐదు మండలాల్లో శిబిరాలుజిల్లాలోని ఆసిఫాబాద్, రెబ్బెన, కెరమెరి, కాగజ్నగ ర్, తిర్యాణి మండలాల్లో క్రీడా శిక్షణ శిబిరాలు ఏ ర్పాటు చేయనున్నారు. పది క్రీడల కోసం పది మంది శిక్షకులను ఎంపిక చేయనున్నారు. మే 1 నుంచి 31 వరకు సమ్మర్ క్యాంపులు కొనసాగుతాయి. శిక్షణకు సంబంధించిన క్రీడా సామగ్రిని సైతం అధికారులే పంపిణీ చేస్తారు. అథ్లెటిక్స్, హ్యాండ్బాల్, నెట్బాల్, ఖోఖో, వాలీబాల్, కబడ్డీ, బాక్సింగ్, సాఫ్ట్బాల్, యోగా, ఫుట్బాల్, షూటింగ్ బాల్ క్రీడల్లో శిక్షణ అందించనున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా చాలాప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటుతున్నాయి. ఎండలు ఎక్కువ ఉండటంతో ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 8:30 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు శిక్షణ కొనసాగుతుంది. ఒక్కో శిక్షణ శిబిరంలో 40 నుంచి 50 మంది వరకు పిల్లలు పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. కోచ్లకు రూ.4000 వేతనం ఇవ్వనున్నారు. త్వరలో బడులకు సెలవులుఇప్పటికే పాఠశాలల్లో విద్యార్థులకు పరీక్షలు ముగి శాయి. ప్రోగ్రెస్ కార్డులు అందించిన తర్వాత ఈ నెల 23 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రా రంభం కానున్నాయి. వేసవి సెలవులను విద్యార్థులు వృథా చేసుకోకుండా క్రీడాశిబిరాలను సద్విని యోగం చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఆటల వైపు మళ్లిస్తే శారీరకంగా, మానసికంగా దృఢంగా మారుతారని చెబుతున్నారు. అలాగే చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా ఉంటారు. కోచ్ల ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి పది శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. సద్వినియోగం చేసుకోవాలి జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శి బిరాలు నిర్వహించేందు కు ఏర్పాట్లు చేస్తున్నాం. వ చ్చే నెల 1 నుంచి 31 నిర్వహించే సమ్మర్ క్యాంపులను స ద్వినియోగం చేసుకోవాలి. తల్లిదండ్రులు తమ పి ల్లలను శిబిరాలకు పంపించాలి. దాగి ఉన్న క్రీడానైపుణ్యం వెలికి తీసేందుకు ఉపయోగపడతాయి. – రమాదేవి, జిల్లా యువజన క్రీడల అధికారి -
దంచికొడుతున్న ఎండలు
కౌటాల: జిల్లాలో ఎండలు భగ్గుమంటున్నాయి. వేడి, తీవ్రమైన ఉక్కపోతతో జనం అవస్థలు పడుతున్నారు. ఆదివారం తిర్యాణి మండలం గిన్నెధరిలో 44.0 డిగ్రీల సెల్సియస్ పగటి ఉష్ణోగ్రత నమోదు కాగా, తిర్యాణి 43.9, ఎల్కపల్లి, వాంకిడిలో 43.8, బెజ్జూర్, ఆసిఫాబాద్, కౌటాల, ధనోరాలో 43.7 డిగ్రీలు నమోదైంది. ఈస్టర్ నేపథ్యంలో ప్రార్థనల కోసం చర్చీలకు వెళ్లేందుకు క్రైస్తవులకు తిప్పలు తప్పలేదు. వడగాలులకు ద్విచక్ర వాహనాదారులు, చిరువ్యాపారులు అల్లడిపోయా రు. జిల్లాలోని 15 మండలాలు అలర్ట్ జోన్లో ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. -
విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఆసిఫాబాద్/ఆసిఫాబాద్అర్బన్: ఆర్టీసీలో విరమణ పొందిన ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని రిటైర్ట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కనుకుంట్ల రామ్చందర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఆర్టీసీకి 30 నుంచి 40 సంవత్సరాలపాటు సేవలందించి విరమణ పొందిన ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉద్యోగ విరమణ అనంతరం ఆర్టీసీ నుంచి రావాల్సిన మొత్తాలు పెండింగ్లో ఉండడంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నూతన కమిటీ ఎన్నికఆసిఫాబాద్ ఆర్టీసీ డిపో రిటైర్ట్ ఉద్యోగుల నూతన కమిటీని రిటైర్డ్ ఉద్యోగుల రాష్ట్ర సహాయక కార్యదర్శి రాంచందర్, రీజినల్ అధ్యక్షుడు హనుమంత్రావు, రీజినల్ ముఖ్య సలహాదారుడు సత్యనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ నర్సింగ్రావు ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డిపో అధ్యక్షుడిగా కె.మల్లేశం, కార్యదర్శిగా టి.దివాకర్, ఉపాధ్యక్షులుగా పాషా, ప్రభాకర్రావు, లింగయ్య, సహాయ కార్యదర్శులుగా మహబూబ్, మోహన్, భూమన్న, కోశాధికారిగా టీఎం సింగ్, ప్రచార కార్యదర్శిగా ఆరీఫ్ను ఎన్నుకొన్నారు. -
అమరులారా వందనం
● అధికారిక స్మరణం.. ఆదివాసీల సంబురం ● 44 ఏళ్ల తర్వాత ఇంద్రవెల్లిలో స్వేచ్ఛగా నివాళి ● అమరుల త్యాగాలను స్మరించుకున్న నేతలు ● ఇచ్చిన మాట నెరవేర్చమన్న మంత్రి సీతక్క భూమి కోసం.. భుక్తి కోసం.. విముక్తి కోసం పోరాడి ప్రాణాలను త్యజించిన ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా నిర్వహించింది. ఆంక్షలు లేకుండా వేడుకలు నిర్వహించడంపై ఆదివాసీలు హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన గిరిపుత్రులు 1981 ఏప్రిల్ 20న అమరులైన వీరులకు స్వేచ్ఛగా నివాళులర్పించారు. తొలుత ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని గోండ్గూడ నుంచి తమ సంప్రదాయ వాయిద్యాల నడుమ స్తూపం వరకు చేరుకున్నారు. స్మారక జెండా వద్ద పూజలు చేశారు. అనంతరం అమరులకు నివాళులర్పించారు. – ఇంద్రవెల్లి/కై లాస్నగర్ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్మృతివనంలో ఆదివారం నిర్వహించిన వేడుకలకు రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు, జీసీసీ చైర్మన్ కొట్నాక్ తిరుపతి, మాజీ ఎంపీలు సోయం బాపూరావ్, వేణుగోపాలాచారి, ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి ఆత్రం సుగుణతో కలిసి పూజలు చేసి జెండా ఆవిష్కరించారు. స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అధికారికంగా సంస్మరణ దినోత్సవం నిర్వహించామన్నారు. ఆదివాసీలకు ఆర్వోఎఫ్ఆర్ ద్వారా భూ హక్కు కల్పించామని పేర్కొన్నారు. ఏజెన్సీలోని సమస్యలను పరిష్కరించేలా ఐటీడీఏ పీవో, కలెక్టర్, అటవీ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. స్మృతివనాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్ది ఆగస్టు 9న అధికారికంగా ప్రారంభిస్తామని పేర్కొన్నారు. అనంతరం ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్రం భుజంగ్రావు రచించిన ‘ఆ గాయానికి 44 ఏళ్లు’ పేరిట ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. మరోవైపు స్తూపం వద్ద, పరిసర ప్రాంతంలో ఉట్నూర్ ఏఎస్పీ కాజల్సింగ్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ అఖిల్ మహాజన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా, సబ్ కలెక్టర్ యువరాజ్, డీఎఫ్వో ప్రశాంత్ బాజీరావు పాటిల్, పలువురు ఆదివాసీ సంఘాల నాయకులు, సార్మేడీలు, పటేళ్లు పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బీఆర్ఎస్ ఖానాపూర్ ఇన్చార్జి భూక్యా జాన్సన్నాయక్లు తమ పార్టీ కార్యకర్తలతో కలిసి స్తూపం వద్ద నివాళులర్పించారు. అమరవీరుల కుటుంబాలకు వాహనాలు అందజేత అమరవీరుల కుటుంబీకుల్లోని భోరుజ్గూడ గ్రామానికి చెందిన హెరేకుమ్ర సావిత్రిబాయి, అనంతపూర్ గ్రామానికి చెందిన తొడసం హనుమంత్రావ్, సిరికొండ మండలంలోని సోన్పల్లి గ్రామానికి చెందిన సిడాం జంగు, పెందోర్ సీతాబాయిలకు ట్రైకార్ పథకం ద్వారా మూడు ట్రాక్టర్లు, ఒక బొలెరో వాహనాలను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అలాగే ఇంద్రవెల్లి, గుడిహత్నూర్, ఉట్నూర్ మండలాలతో పాటు శ్యాంపూర్ మండల సమాఖ్యలకు రూ.159.62 కోట్ల విలువైన సీ్త్ర నిధి, బ్యాంకు లింకేజీతో కూడిన రుణాల చెక్కులు అందజేశారు. -
తెలంగాణ ఉద్యమకారుల ప్లీనరీని విజయవంతం చేయాలి
రెబ్బెన: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆ ధ్వర్యంలో ఈనెల 21న సికింద్రాబాద్లో ని ర్వహించనున్న తెలంగాణ ఉద్యమకారుల ఫ్లీ నరీని విజయవంతం చేయాలని ఫోరం రాష్ట్ర కోకన్వీనర్ దుర్గం రవీందర్, నియోజకవర్గ క న్వీనర్ ఆజ్మీర బాబురావు కోరారు. శనివా రం గోలేటి టౌన్షిప్లో వారు విలేకరులతో మాట్లాడారు. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, నెలకు రూ.25వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల సంక్షేమ బోర్డు లక్ష్యంగా ఫోరం రాష్ట్ర చైర్మన్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్లీనరీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫ్లీనరీకి జిల్లా నుంచి ఉద్యమకారులు అధికసంఖ్యలో హాజరుకావాలని కోరారు. ఉద్యమకారుల ఫోరం నాయకులు తోట లక్ష్మణ్, బోగే ఉపేందర్ పాల్గొన్నారు. -
నీరు లేక నిర్జీవం
● కళావిహీనంగా జోడేఘాట్ పార్క్ ● సంరక్షణకు నోచుకోని మొక్కలు ● వెలవెలబోతున్న మానవ ఆకృతి ● లోపించిన అధికారుల పర్యవేక్షణకెరమెరి(ఆసిఫాబాద్): జల్.. జంగల్.. జమీన్ నినా దంతో నైజాం సర్కారును గడగడ లాడించిన కు మురంభీం పురిటి గడ్డ జోడేఘాట్ నిర్లక్ష్యానికి గురవుతోంది. ఇక్కడ ఏర్పాటు చేసిన పార్క్లో నాటిన మొక్కలు సంరక్షణకు నోచుకోక ఎండిపోయాయి. 2016 అక్టోబర్లో అధికారులు 29,750 మొక్కలు నాటించి సంరక్షణ బాధ్యత మరిచిపోయారు. దీంతో మొక్కలన్నీ నీరందక నిర్జీవమై పోయాయి. ప్ర స్తుతం 100 మొక్కలైనా కనిపించడం లేదు. ఏటా హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు కూడా సంరక్షణకు నోచుకో ఎండిపోయాయి. ఆదరణకు నోచుకోక..జోడేఘాట్ వద్ద ఏర్పాటు చేసిన పార్క్లో వంద రకాల ఔషధ మొక్కలతోపాటు సుగంధ ద్రవ్యాల మొక్కలు కూడా నాటారు. పార్క్లో మానవాకృతి ని నిర్మించారు. ఏ ఔషధ మొక్క ఏ అవయవానికి మేలు చేస్తుందో అందరికీ తెలిపే ప్రయత్నం చేశా రు. ఒక్కో అవయవం వద్ద ఒక్కో రకమైన ఔషధ మొక్క నాటారు. మిగతా స్థలంలో సుగంధ, సీతా ఫలం, జామ, మామిడి, కానుగ మొక్కలతో పాటు 150 ఆపిల్ మొక్కలూ నాటారు. మొక్కలకు నీటిని అందించేందుకు ఓ కూలీని నియమించారు. కానీ.. అనతి కాలంలోనే నీళ్లు లేక మొక్కలు ఎండిపోవడంతో పట్టించుకునే వారు కరువయ్యారు. పక్కనే ని ర్మించిన లోటస్ ఫాండ్ నీరు లేక వెలవెలబోతోంది. అలంకారప్రాయమైన బోరుగ్రామంలో నీటి సమస్య అధికంగా ఉంది. తాగడానికే నీరు దొరకని పరిస్థితి. గతంలో ఐటీడీఏ, టూ రిజం శాఖ అధికారులు నాటిన మొక్కల సంరక్షణకు ఏర్పాటు చేసిన బోరు ప్రస్తుతం నిరుపయోగమైంది. భూగర్భజలం అడుగంటి చుక్కా నీరు లేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం అది కూడా అలంకారప్రాయమైంది. దీంతో మొక్కలు చనిపోవడానికి నీరు లేకపోవడం ఓ కారణమైతే, అధికారుల నిరాదరణ మరో కారణమని గ్రామస్తులు చెబుతున్నారు. మళ్లీ మొక్కలు నాటి సంరక్షించాలని కోరుతున్నారు. కంచె ఏర్పాటు చేయాలి గతంలో ఏర్పాటు చేసిన పార్క్ ప్రస్తుతం మొక్కలు లేకుండా కళావిహీనంగా కనిపిస్తోంది. కంచె ఏర్పాటు చేయకపోవడంతో మొక్కలకు రక్షణ లేకుండా పోయి ఎండిపోయాయి. భూగర్భజలాలు అడుగంటి బోరు నిరుపయోగమైంది. అధికారులు స్పందించి మళ్లీ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి. – పెందోర్ రాజేశ్వర్, జోడేఘాట్ భూగర్భజలాలు అడుగంటి.. పార్క్లో గతేడాది 3,200 మొక్కలు నాటాం. కంచె లేకపోవడంతో వాటికి రక్షణ కరువైంది. గతంలో పార్కులోని మొక్కల రక్షణకు ఓ వ్యక్తిని నియమించారు. కానీ.. ప్రస్తుతం నిధులు లేక రెండేళ్ల నుంచి రక్షణ కరువైంది. బోరు నీరు అడుగంటింది. భూగర్భం జలాలు ఇంకి ఇబ్బంది తప్పడం లేదు. – మల్లయ్య, ఈజీఎస్ ఏపీవో, కెరమెరి -
● నేడు ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవం ● తొలిసారిగా అధికారికంగా నిర్వహణ ● ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాట్లు ● మంత్రి సీతక్క, ప్రజాప్రతినిధుల రాక
ఆ ఘటనలో నా భర్త చనిపోయిండుఇంద్రవెల్లి ఘటనలో నా భర్త కొద్దు చనిపోయిండు. ఆ తరువాత నేను కూలీనాలి చేసి నా కొడుకును పెంచి పెద్ద చేసిన. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నా భర్త మరణాన్ని గుర్తించిండ్రు. ఇంటి స్థలం ఇచ్చిండ్రు. ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేసిండ్రు. ఐటీడీఏ ద్వారా రుణం ఇస్తే నా కొడుకుకు ఉపాధి దొరుకుతది. – సెడ్మాకి లచ్చుబాయి, తాటిగూడ నా కుటుంబాన్ని ఆదుకోవాలినాడు ఇంద్రవెల్లిలో సంతకు నా భర్త శంభుతో కలిసి వెళ్లిన. అక్కడి నుంచే ఇద్దరం మీటింగ్కు వెళ్లినం. ఆ సందర్భంగా పోలీసుల కాల్పుల్లో నా కుడి చేయికి గాయమైంది. నా భర్తకు కూడా తుపాకీ బుల్లెట్ల గాయంతో ఇంటికొచ్చి కొద్ది రోజుల తరువాత చనిపోయిండు. చేతికి గాయం కారణంగా ఇప్పటికీ నేను ఏ పనీ చేయలేకపోతున్న. ఉన్న ఒక్క కొడుకు కూడా అనారో గ్యంతో చనిపోయిండు. కోడలు వద్ద ఉంటూ కాలం వెల్లదీస్తున్న. ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ కూడా వస్తలేదు. చాలా కష్టంగా ఉంది. ప్రభుత్వం గుర్తించి ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి నా కుటుంబాన్ని ఆదుకోవాలె. – మడావి జంగుబాయి, కన్నాపూర్ సాక్షి, ఆదిలాబాద్/ఇంద్రవెల్లి: ఇంద్రవెల్లి మురిసిపోతుంది. నేడు అమరవీరుల సంస్మరణ దినోత్సవా నికి సిద్ధమైంది. ఏటా మాదిరిగానే కాకుండా ఈ సా రి ఓ ప్రత్యేకత ఉంది. 43ఏళ్లుగా నిర్బంధాలు, ఆంక్షల మధ్య అమరవీరులకు నివాళులు అర్పించగా, ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా సంస్మరణ వేడుకలను నిర్వహిస్తోంది. ఈ మేరకు కొద్ది రో జులుగా జిల్లా అధికారులే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఫలితంగా ఈసారి స్వేచ్ఛగా నివాళులు అ ర్పించవచ్చన్న మురిపెం ఆదివాసీల్లో కనిపిస్తోంది. స్మృతివనంలో కళకళలాడుతున్న స్తూపం .. ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం.. ఆదిలాబాద్ నుంచి ఉట్నూర్ వెళ్లే మార్గ మధ్యలో ఇంద్రవెల్లి గ్రామ శివారులో నిలువెత్తుగా దర్శనమిస్తోంది. అయితే ఇ న్నాళ్లుగా ఆ స్తూపం ఆవరణలో అభివృద్ధి మచ్చుకు కనిపించేది కాదు. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీ ఎం రేవంత్రెడ్డి ఇంద్రవెల్లి ప్రాంతం, ఆదివాసీల అ భ్యున్నతిపై దృష్టి సారించారు. ముఖ్యమంత్రి అయి న తర్వాత ఆయన తొలుత ఇక్కడికే వచ్చారు. ఆ సమయంలోనే స్తూపం వద్ద అభివృద్ధి పనుల కో సం దాదాపు రూ.కోటి కేటాయించారు. ఆ నిధులతో అక్కడ ఎకరం స్థలంలో అమరవీరుల స్మృతివ నం అభివృద్ధి చేశారు. అందులో భాగంగా చుట్టూ ప్రహరీ నిర్మించారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం కూడా పూర్తి చేశారు. ఈసారి సంస్మరణ దినోత్సవా న్ని అధికారికంగా ఘనంగా నిర్వహించేందుకు కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా కొద్ది రోజులుగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం నిర్వహించనున్న కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఉమ్మడి జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. భూమి, భుక్తి, విముక్తి కోసం... ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో 1981 ఏప్రిల్ 20న జరిగిన సంఘటనకు నేటితో 44 ఏళ్లవుతోంది. భూమి, భుక్తి, విముక్తితో పాటు స్వయం పరిపాలన కోసం ఆది వాసీలు పోరాటం చేశారు. అటవీ అధికా రులు, షావుకార్ల దౌర్జన్యం నశించాలనే డి మాండ్తో గిరిజన రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నాడు ఇంద్రవెల్లిలో సభ ఏర్పాటు చేశారు. దీనికి పీపుల్స్వార్ మద్దతునిచ్చింది. అప్పట్లో ప్రభుత్వం సభ నిర్వహణకు అనుమతినిచ్చినట్టే ఇచ్చి ఆ తర్వాత రద్దు చేసింది. విషయం తెలియక ఆదివా సీగూడేల నుంచి పెద్ద ఎత్తున సభకు తరలివచ్చా రు. అయితే సభాస్థలాన్ని ఖాళీ చేయాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో ఆది వాసీలు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇలా ఘర్షణ వాతావరణంలో పోలీసులు కా ల్పులు జరపడంతో పలువురు ఉద్యమకారులు (15 మంది అధికారికంగా) మృతి చెందారు. కాల్పుల ఘటనలో అమరులైన ఆదివాసీల స్మారకార్థం రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఇంద్రవెల్లి వద్ద 80 అడుగుల స్తూపం నిర్మించారు. ఆ తర్వాత ప్రభుత్వాలు స్తూపం వద్ద సంస్మరణ దినోత్సవం నిర్వహణపై నిషేధాజ్ఞలు విధించాయి. దీంతో ఏళ్ల పాటు ఏప్రిల్ 20 వచ్చిందంటే అక్కడ భారీ ఎత్తున పోలీసుల బందోబస్తు కనిపించేది. స్తూపాన్ని 1986 మార్చిలో గుర్తు తె లియని వ్యక్తులు డైనమెట్లతో పేల్చా రు. గిరిజనులు ఆందోళనతో 1987లో ప్రభుత్వం ఐటీడీఏ నిధులతో రెండోసారి నిర్మించింది. 2015 నుంచి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇవ్వకపోయినా ఆంక్షలు సడలించింది. అయితే పోలీసు బందోబస్తు మాత్రం అదే రీతిలో ఉండేది. ఈ ఏడాది మాత్రం అలాంటివేమీ లేకుండా ఆదివాసీలు స్వేచ్ఛగా నివాళులు అర్పించేందుకు సిద్ధమయ్యారు. చివరి దశకు స్మృతి వనం పనులు నాటి అమరుల కుటుంబీకులతో పాటు గాయాలైన వారిని ఏ ప్రభుత్వం కూడా ఆదుకోలేదు. నాలుగేళ్ల క్రితం అప్పటి ఎంపీ సోయం బాపూరావ్ అమరుల కుటుంబీకులకు రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్రెడ్డి, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెంచారు. స్తూపం వద్ద స్మృతి వనం ఏర్పాటుకు రూ.97లక్షల నిధులు కేటా యించారు. చుట్టూ ప్రహరీతో పాటు కమ్యూనిటీ హాల్ నిర్మాణం, స్తూపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసి సుందరంగా తీర్చిదిద్దారు. ప్రభుత్వం వద్ద ఉన్న రికార్డుల ప్రకారం 15 మంది అమరవీరుల కుటుంబీకులకు మండలంలోని ముత్నూర్ సమీపంలో గతేడాది ఇళ్ల స్థలాలు కేటాయించి హక్కు పత్రాలు అందించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. ఇటీవల ఆ పనులను ప్రారంభించారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం నేడు అధికారికంగా నివాళులు నేడు ఉదయం 11 గంటలకు అధికారికంగా నిర్వహించనున్న సంస్మరణ సభకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ఉమ్మడి జిల్లా నుంచి ఆదివాసీలు తరలివచ్చి నివాళులర్పించనున్నారు. మంత్రి చేతుల మీదుగా అమరుల కుటుంబీకులకు ట్రైకార్ ద్వారా రూ.10 లక్షల చొప్పున రుణ సౌకర్యం కల్పించనున్నారు. కాగా, నాటి ఘటనలో గాయపడిన వారిని కూడా ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. 1981 ఏప్రిల్ 20 జల్..జంగల్...జమీన్ కోసం ఉద్యమించిన అడవిబిడ్డలపై అప్పటి సర్కారు తుపాకీ ఎక్కుపెట్టింది. తూటాల వర్షం కురిపించింది. హక్కుల సాధనలో 15 మంది గిరిజనులు అమరులయ్యారు. వారి రక్తపుటేరులతో తడిసిన వనసీమ ఎర్రబారింది. అడవిబిడ్డల అమరత్వం నింగికెగిసింది. అగ్ని శిఖలా ఇంద్రవెల్లిలో అమరుల స్తూపమై నిలిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాటి ప్రభుత్వాల పాలనలో స్వేచ్ఛగా నివాళులర్పించలేని దుస్థితి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం కొంతమేర సడలింపు ఇచ్చింది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరుల స్తూపం వద్ద స్మృతి వనం ఏర్పాటుకు నిర్ణయించింది. అలాగే సంస్మరణ దినోత్సవాన్ని ఈ ఏడాది అధికారికంగా నిర్వహించేందుకు సన్నద్ధమైంది. -
అభివృద్ధి పనుల్లో అలసత్వం ఉపేక్షించం
నిర్మల్చైన్గేట్: ‘అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యానికి తావులేదు.. పనులు చేయడంలో అలసత్వం వహించేవా రిని ఉపేక్షించేది లేదు.. పనులను నిర్ణీత గడువులో పు నాణ్యతతో పూర్తి చేయించాలి’ అని రాష్ట్ర పంచా యతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణనీటి సరఫ రా, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీత క్క అధికారులను ఆదేశించారు. నిర్మల్ కలెక్టరేట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి పనులపై శని వారం ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టెండర్ దశ నుంచే పనులు వేగవంతం చేసి, వర్షాకాలానికి ముందు పనులు పూర్తిచేయాలన్నా రు. ఆలస్యం చేస్తున్న గుత్తేదారులకు నోటీసులు జా రీ చేసి, పనులు పూర్తి చేయించాలని సూచించారు. పనుల నాణ్యతపై రాజీ లేకుండా చూడాలని, కాంట్రాక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సూచనలి వ్వాలని ఆదేశించారు. సాగునీరు, తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికా రులను ఆదేశించారు. అధికారులు ప్రజాప్రతినిధులకు వాస్తవాలు చెప్పాలని, ఫీల్డ్ విజిట్ చేసి ఏఈలు మిషన్ భగీరథ పనులు సమీక్షించుకోవాలన్నారు. అంగన్వాడీల బలోపేతం, సౌకర్యాల విస్తరణత్వరలో అంగన్వాడీల్లో టీచర్లు, ఆయాల ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు. సొంత భవనాలు లేని కేంద్రాలకు రూ.12 లక్షలతో పక్కా భవనాలు నిర్మిస్తామని పేర్కొన్నారు. గతంలో మండలానికో భవనం నిర్మిస్తే, ఇప్పుడు రెండు నిర్మించేలా ప్రణా ళికలు సిద్ధం చేశామన్నారు. మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలకు సొంత భవనాలు, విద్యుత్, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. మినీ అంగన్వాడీలను అప్గ్రేడ్ చేస్తామని, సీనియర్ సిటిజన్ డే కేర్ సెంటర్లు, ట్రాన్స్జెండర్ క్లినిక్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మహిళా సంఘాలకు చెక్కులు..మంత్రి సీతక్క, కలెక్టరేట్కు చేరుకోగానే పోలీసులు గౌరవ వందనం చేశారు. మహిళా పోలీసులు ఏర్పా టు చేసిన ‘శివంగి’ బృందాన్ని లాంఛనంగా ప్రారంభించి, రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుందని కొని యాడారు. తర్వాత మహిళా సంఘాలు, మెప్మాలకు మంజూరైన చెక్కులను కలెక్టర్ అభిలాష అభినవ్, ప్రజాప్రతినిధుల సమక్షంలో పంపిణీ చేశారు. బ్యాంక్ లింకేజీ, రుణాల మంజూరు, వసూలులో ని ర్మల్ జిల్లా ప్రగతిని మంత్రి ప్రశంసించారు. స మావేశంలో ఎంపీ గోడం నగేశ్, నిర్మల్, ఆదిలాబా ద్, ముధోల్, ఖానాపూర్, సిర్పూర్, ఆసిఫాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు మహేశ్వర్రెడ్డి, పాయల్ శంకర్, పవా ర్ రామారావు పటేల్, వెడ్మా బొజ్జు పటేల్, పాల్వా యి హరీశ్బాబు, కోవ లక్ష్మి, అనిల్ జాదవ్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఐసీడీఎస్ సెక్రటరీ అనితా రామచంద్రన్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల కలెక్టర్లు కు మార్ దీపక్, అభిలాష అభినవ్, ఐటీడీఏ పీవో కు ష్బూగుప్తా, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యానికి తావులేదు అలసత్వం వహించే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి త్వరలో అంగన్వాడీల్లో ఖాళీల భర్తీ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఉమ్మడి జిల్లా పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, సీ్త్ర శిశు సంక్షేమ శాఖలపై సమీక్ష అభివృద్ధి పనుల తీరుపై ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల అసంతృప్తి -
కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలి
ఆసిఫాబాద్: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సూచించారు. శనివారం హైదరాబాద్లోని సచివాలయం నుంచి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్తో కలిసి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో యాసంగి వడ్ల కొనుగోలు, సన్నబియ్యం పంపిణీ, తాగునీటి సరఫరా అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రైతు సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. సక్రమంగా సన్నబియ్యం పంపిణీ చేయాలని, వేసవిలో తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడుతూ.. జిల్లాలో 34 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సుమారు 48 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. మే మొదటి వారం నుంచి వరి కోతలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని, రైతులు ఎలాంటి ఇబ్బంది పడకుండా కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అర్హులందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తా మని, వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చూ సేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నా రు. మిషన్ భగీరథ పథకం కింద ప్రతీ ఇంటికి నల్లా ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని చెప్పారు. న ల్లాలు లేని చోట్ల ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీ రు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావు, జిల్లా సహకార, నీటిపారుదల శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఆలయ భూముల్లో ‘ఇందిరమ్మ’ నిర్మాణాలు
ఆలయ భూముల్లో ‘ఇందిరమ్మ’ నిర్మాణాలుఆసిఫాబాద్ మండలంలోని కేశవనాథ ఆలయ భూముల్లో పలువురు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టారు. మండలంలోని గోవింద్పూర్ గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేయగా గ్రామానికి ప్రభుత్వం సుమారు 106 ఇళ్లు మంజూరు చేసింది. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణాలు పిల్లర్ల దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న ఆలయ కమిటీ ప్రతినిధులు, దేవాదాయశాఖ అధికారులు బుధవారం ఆక్రమణకు గురై న ఆలయ భూముల వద్దకు వెళ్లి నిర్మాణ పనులు అడ్డుకున్నారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు స దరు స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్లు లేనప్పటికీ ఇంటి నిర్మాణానికి అధికారులు అనుమతులివ్వడం గమనార్హం. కేశవనాథ ఆలయ భూముల్లో ఇళ్ల నిర్మాణాల వెనుక ఎవరి హస్తముందన్న విషయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కాగా, ఆలయ భూములను సంరక్షించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. -
బిల్లు వెనక్కి తీసుకోవాలని ర్యాలీ
ఆసిఫాబాద్అర్బన్: వక్ఫ్ చట్ట సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని ముస్లింలు డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా ము స్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని జామా మసీదు నుంచి అంబేడ్కర్ చౌక్ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మసీద్ ఇమామ్లు మౌలానా అయుజ్ అష్రఫీ, హఫీజ్ తహేర్ హష్మీ మాట్లాడారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న వక్ఫ్ చట్ట సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. వక్ఫ్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ముస్లింలు నిర్వహించిన ర్యాలీకి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్రావ్, మాజీ ఎంపీపీ బాలేశ్వర్గౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్ మల్లేశ్, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు భూక్య రాజు తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ఫయాజ్, అబ్దుల్లా, అమన్, ఉబెదిబిన్ యహియా, అబ్దుల్ రహమాన్, రాఫిక్ అహ్మద్, జావిద్ గులాం, అబ్బు, సలీం, సాజిద్, అహ్మద్, తాజ్, ఇమ్రాన్, ఆసిఫ్, జమీల్ తదితరులు పాల్గొన్నారు. -
నేరాల నిర్మూలన కోసమే కార్డన్సెర్చ్
తిర్యాణి: నేరాల నిర్మూలన కోసమే కార్డెన్సెర్చ్ నిర్వహిస్తున్నట్లు రెబ్బన సీఐ బుద్దె స్వామి అన్నా రు. మండలంలోని నాయకపుగూడ గ్రామంలో శుక్రవారం 45 మంది పోలీసు సిబ్బందితో కార్డెన్సెర్చ్ చేపట్టారు. ఇందులో భాగంగా దాదాపు 200 ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని 12 వాహనాలను గుర్తించి సీజ్ చేశారు. అనంతరం సీఐ మాట్లాడుతూ.. గ్రా మంలో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పో లీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అ సాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యహరించనున్నట్లు హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సైలు ఎంబడి శ్రీకాంత్, చంద్రశేఖర్, సందీప్, ఏఎస్సైలు నారాయణ, వేణుగోపాల్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
చదువుతోనే సమాజంలో గుర్తింపు
బెజ్జూర్: చదువుతోనే సమాజంలో గుర్తింపు ఉంటుందని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సుందిళ్ల రమేశ్ పేర్కొన్నారు. మండలంలోని తలాయి గ్రామంలో శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి ఆయన మాట్లాడారు. యువత చదువులో ముందుండాలని, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. బాల్య వివాహాలను అరికట్టాలని, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలని తెలిపారు. మద్యం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. ఆరోగ్య నియమాలు పాటించాలని తెలిపారు. ఓటు హక్కుపై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. వన్యప్రాణులను సంరక్షించుకోవడం అందరి బాధ్యత అని తెలిపారు. మూఢనమ్మకాలు వీడాలని సూచించారు. మహనీయుల అడుగుజాడల్లో యువత నడుస్తూ చదువులో రాణించి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతోపాటు 12 అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అంతకుముందు గ్రామంలో మహిళలతో అక్షరాలు దిద్దించారు. -
పోగొట్టుకున్న ల్యాప్టాప్ ప్రయాణికుడికి అందజేత
ఆసిఫాబాద్అర్బన్: బస్సులో పోగొట్టుకొన్న ల్యాప్టాప్ను తిరిగి ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికుడికి అప్పగించారు. వివరాలు.. ఆర్టీసీ ఆసిఫాబాద్ డిపోకు చెందిన లహరి బస్సు ఈ నెల 17వ తేదీన హైదరాబాద్ నుంచి కాగజ్నగర్కు వస్తోంది. అందులో ప్రయాణిస్తున్న అజయ్కుమార్ తన ల్యాప్టాప్ను బస్సులోనే మరిచిపోచి కాగజ్నగర్ బస్టాండ్లో దిగి పోయాడు. బస్సు దిగిన కాసేపటికి ల్యాప్టా ప్ను అందులోనే మరిచిపోయిన విషయాన్ని గుర్తించిన అజయ్కుమార్ వెంటనే ఆసిఫా బాద్ డిపోకు వచ్చాడు. అక్కడి ఆర్టీసీ అధికా రులకు విషయం తెలిపాడు. వెంటనే హెడ్ కానిస్టేబుల్, ట్రాఫిక్ ఇన్చార్జి భారతి, కానిస్టేబుల్ విజయలక్ష్మి పర్యవేక్షణలో డ్రైవర్ సహకారంతో సదరు బస్సులో ల్యాప్టాప్ను గు ర్తించి అజయ్కుమార్కు చెందినదిగా నిర్ధారించి అతడికి అందజేశారు. అజయ్ ఆర్టీసీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. -
‘సర్కార్’లోనూ ప్రీ ప్రైమరీ
● ఇప్పటికే 11 స్కూళ్లలో అమలు ● వచ్చే ఏడాది మరిన్ని బడుల్లోనూ.. ● ‘ప్రైవేట్’కు దీటుగా విద్యాబోధన దహెగాం: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వం సర్కార్ బడులను తీర్చిదిద్దుతోంది. ‘ప్రైవేట్’ లో మాదిరిగానే ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రీ ప్రైమ రీ ఎడ్యుకేషన్ (పూర్వ ప్రాథమిక విద్య) విధానాన్ని అమలు చేస్తోంది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీనీ కొనసాగిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఆటాపాటలతో విద్యను బోధిస్తున్నట్లే ప్రభుత్వ పాఠశాలల్లోనూ చదువు నేర్పించనున్నా రు. రెండేళ్లుగా పూర్వ ప్రాథమిక విద్యను జిల్లాలోని 11 ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి మరిన్ని పాఠశాలల్లోనూ ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు కసరత్తు చేస్తోంది. సంఖ్యకు తగినట్లు నిధులుపూర్వ ప్రాథమిక విద్య అమలు చేస్తున్న పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. 10 నెలలకు గాను ఒక్కో పాఠశాలకు సుమారు రూ.1.70 లక్షలు ఇస్తోంది. విద్యార్థులకు బోఽధించడానికి ఇన్స్ట్రక్టర్కు నెలకు రూ.8వేలు, ఆయాకు రూ.6వేలు చెల్లిస్తోంది. చిన్నారులు ఆడుకోవడానికి ఆట వస్తువుల కోసం సంవత్సరానికి రూ.20వేలు, ఆరోగ్యం, పరిశుభ్రత అవసరాలకు రూ.10వేలు, బోధన అభ్యసన సామగ్రి కోసం ఒక్కో విద్యార్థికి రూ.500 వెచ్చిస్తోంది. విద్యార్థులకు ఆట బొమ్మలతో అక్షరాలు, అంకెలు గుర్తు పట్టేలా ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య, అక్షరాస్యత సామర్థ్యం పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. మరిన్ని పాఠశాలల్లోనూ..!ఇప్పటికే జిల్లాలోని 11 ప్రాథమిక పాఠశాల్లో పూర్వ ప్రాథమిక విద్య కొనసాగుతుండగా వచ్చే విద్యాసంవత్సరం నుంచి మరిన్ని పాఠశాలల్లో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పాఠశాలల వివరాలు యూడైస్లో ఎంట్రీ చేస్తున్నందున దాని ఆధారంగా వచ్చే విద్యాసంవత్సరం జిల్లాలో సుమారు 20 నుంచి 25 పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి. కాగా, ఇందుకు జిల్లా నుంచి ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. నిరుపేద కుటుంబాల పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపే స్థోమత లేనందున ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య అమలు చేస్తే వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం పూర్వ ప్రాథమిక విద్య సత్ఫలితాలనిస్తోందని విద్యావేత్తలు చెబుతున్నారు. చిన్ననాటి నుంచే రాణించేలా..2020 నూతన విద్యావిధానంలో కేంద్ర ప్రభుత్వం పలు మార్పులు తీసుకువస్తోంది. పూర్వ ప్రాథమిక విద్య ఉద్దేశం, విద్యార్థులు విద్యలో చిన్ననాటి నుంచే రాణించేలా కసరత్తు చేస్తోంది. అక్షరాలు, అంకెలను గుర్తించేలా తయారు చేయడం, ప్రీ ప్రైమరీ విద్యను సార్వత్రీకరించడం, మూడేళ్ల నుంచి 18 ఏళ్ల పిల్లలందరికీ నాణ్యమైన విద్యను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. మరిన్ని పాఠశాలల్లోనూ.. జిల్లాలోని 11 ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య అమలవుతోంది. ఈ విధానం ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయి. విద్యార్థులు పాఠశాలకు రావడానికి అలవాటు పడుతున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారుల్లాగే ఈ పాఠశాలలకు వస్తున్న పిల్లలకు ఆట బొమ్మలతో అక్షరాలు, అంకెలను గుర్తించడం నేర్పిస్తున్నారు. యూడైస్ ఆధారంగా వచ్చే విద్యాసంవత్సరం జిల్లాలో మరో 20 నుంచి 25 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విధానం అమలయ్యే అవకాశముంది. – యాదయ్య, ఇన్చార్జి డీఈవో‘ప్రీ ప్రైమరీ’ అమలయ్యే పాఠశాలల వివరాలుమండలం గ్రామాలు దహెగాం హత్తిని, ఇట్యాల, కుంచవెల్లి బెజ్జూర్ బెజ్జూర్, కుకుడ, సల్గుపల్లి, పాపన్పేట్ కాగజ్నగర్ చింతగూడ, కాగజ్నగర్లోని 14వ వార్డు యూపీఎస్ వాంకిడి కిరిడి కెరమెరి సావర్ఖేడ -
భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే
కౌటాల: మండల కేంద్రంలోని కతోలిక చర్చిలో శుక్రవారం గుడ్ ఫ్రై డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కౌటాల చర్చి ఫాదర్ టోమ్ మాట్లాడు తూ.. యేసు క్రీస్తు ప్రేమమయుడని తెలిపారు. తన ప్రేమను రుజువు చేసుకోవడానికి కల్వరిపై తన ప్రా ణం పెట్టినట్లు వివరించారు. యాపలగూడ చర్చిలో ఫాదర్ రాజరత్నం క్రైస్తవులకు దేవుని వ్యాకం బో ధించారు. కౌటాల మండలంలోని విజయనగరం చర్చిలో ఫాదర్ సీజో, యాపలగూడలో ఫాదర్ శేరి న్, శివలింగపూర్లోని చర్చిలో పాస్టర్ సువార్త రాజ న్న, సదాశివపేటలోని చర్చిలో పాస్టర్ శ్రీనివాస్ క్రైస్తవులకు దేవుని వ్యాకం బోధించారు. కల్వరి గిరి పై ప్రార్థనలుమండల కేంద్రంలోని కల్వరి గిరి (గుట్ట) పై క్రైస్తవులు సాయంత్రం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మండ ల కేంద్రంతో పాటు విజయనగరం, యాపలగూడ, చింతలమానెపల్లి మండలం బాలాజీ అనుకోడ గ్రా మాల్లోగల ప్రార్థన మందిరాల్లోని క్రైస్తవులంతా క్రీ స్తు కీర్తనలు పాడుతూ స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుంచి కల్వరి గిరి పైకి ర్యాలీగా వెళ్లారు. అనంతరం క్రైస్తవులకు మహాన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
ఘనంగా ‘మర్యాదపూర్వక దినోత్సవం’
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఆవరణలో శుక్రవారం మర్యాదపూర్వక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు ట్రాఫిక్ సూపర్వైజర్ భా రతి సిబ్బందితో కలిసి కృతజ్ఞతగా పూలు, క్యూఆర్కోడ్ కీచెయిన్స్ అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. ప్రయాణికులందరినీ ఆర్టీసీ కుటుంబ సభ్యులుగా భావిస్తుందని చెప్పా రు. ప్రయాణికుల గౌరవం, సౌకర్యం కాపాడే దిశగా ప్రతీ ఉద్యోగి పని చేయాలని సూచించారు. అంకితభావంతో ప్రయాణికులతో మర్యాద పూర్వకంగా నడుచుకుని సంస్థ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఆర్టీసీకి సంబంధించిన అన్ని అధికారిక గ్రూప్లతో కనెక్ట్ కావచ్చనే వివరాలు వెల్లడించారు. -
దేవుడి భూములు కబ్జా
ఆసిఫాబాద్: ఆలయ భూములనూ అక్రమార్కులు వదలడంలేదు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని కేశవనాథ ఆలయ భూములు కూడా అన్యాక్రాంతమవుతున్నాయి. ఆసిఫాబాద్ మండలంలోని సర్వే నంబర్ 80/ఏ, 80/బీ, 81, 82, 83, 84, 94లలో 89.13 ఎకరాల దేవాదాయశాఖ భూమి ఉంది. కాగా, గోవింద్పూర్ శివారులోని సర్వే నంబర్ 83లోని భూమి ఆక్రమణకు గురైంది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భూ ములకు ఏటా వేలం నిర్వహించి కౌలుకు ఇస్తున్నా రు. ఏటా వచ్చే సుమారు రూ.20లక్షలను దేవాదా యశాఖ ఖాతాలో జమ చేస్తున్నారు. అధికారులు భూముల రక్షణపై దృష్టి సారించకపోవడంతో ఆల య భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. కేశవనాథ ఆలయ భూముల్లో తొలుత తాత్కాలిక అనుమతులు, అనంతరం పక్కా భవనాలు నిర్మించి కొందరు కబ్జా చేస్తున్నారు. ఈ ఆలయానికి సంబంధించిన సర్వే నంబర్ 83లో 8.32 ఎకరాల భూమి ఉండగా, గోవింద్పూర్కు చెందిన కొందరు 1.18 ఎకరాల భూమిలో అక్రమార్కులు షెడ్లు నిర్మించుకున్నారు. కొందరైతే పక్కా భవన నిర్మాణాలు పూర్తి చేశారు. ఆక్రమణకు గురైన భూమికి సంబంధించి సదరు వ్యక్తులకు నోటీసులు జారీ చేయగా, వారు రాజకీయ నాయకులను ఆశ్రయించి వాటిని దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2001లో 1.18 ఎకరాల్లో తాత్కాలిక షెడ్డు నిర్మించుకున్నాక వారితో ఏటా భూమికి అద్దె చెల్లించేలా ఒప్పందం రాసుకున్నారు. ఒప్పందం ప్రకారం అద్దె చెల్లించడం లేదు. పైగా తాత్కాలిక ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన ఆక్రమణదారులు అపై పక్కా ఇళ్లు నిర్మించుకుంటున్నారు. ఈ విషయాన్ని దేవాదాయశాఖ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు నివేదిక కూడా అందజేశారు. సర్వే చేయాలని ఏడాదిగా కోరుతున్నా..కేశవనాథ ఆలయ భూముల సర్వే కోసం రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసి ఏడాది గడుస్తున్నా వారు సర్వే చేపట్టక పోవడంతో సదరు భూములు అన్యాక్రాంతమవుతూనే ఉన్నాయి. ఆలయ భూములకు కొలతలు చేపట్టి హద్దులు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. ఆలయ భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల దృష్టికి తీసుకెళ్లాం కేశవనాథ ఆలయ భూముల ఆక్రమణపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. దేవాదాయశాఖ ఉన్నతాధికారులతో పాటు సంబంధిత రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాం. ఆలయ భూముల రక్షణకు చర్యలు తీసుకుంటాం. – వేణుగోపాల్ గుప్తా, ఆలయ ఈవో తాత్కాలికం.. ఆపై శాశ్వతం.. వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు హద్దుల ఏర్పాటు ఎప్పుడో..? చోద్యం చూస్తున్న అధికారులు -
నిలిచిన ‘ఉపాధి’ వేతనాలు
● రెండున్నర నెలలుగా పెండింగ్ ● ఇబ్బందులు పడుతున్న కూలీలు ● జిల్లాలో రూ.14.27కోట్ల బకాయిలు తిర్యాణి: ఉపాధిహామీ కూలీల వేతనాలు నిలిచా యి. రెండు నెలలుగా వేతనాలు చెల్లింపులు నిలి చి వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దారి ద్య్ర రేఖకు దిగువనున్న వారికి ఉపాధి కల్పించా లని 2005లో కేంద్రం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహమీ పథకాన్ని ప్రవేశపెట్టి ఒక్కో కూలీకి వందరోజుల పని కల్పిస్తోంది. ప్రారంభంలో కూలీలకు ఎంతగానో ఉపయోగపడింది. క్రమక్రమంగా పథకంలో మార్పులు చేయడం.. నిబంధనలకు లోబడి వేతనాలు సరైన సమయంలో విడుదల చేయకపోవడంతో కూలీలు త్రీవ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ఉపాధిహామీ కింద 1.23 లక్షల జాబ్కార్డులుండగా, 2.43 లక్షల మంది కూలీలున్నారు. ఇందులో 91వేల జాబ్ కార్డులు యాక్టివ్లో ఉండగా 1.70 మంది కూలీలు నిత్యం పనులకు వెళ్తున్నారు. పోస్టాఫీస్ చుట్టూ ప్రదక్షిణలుఉపాధిహామీ పథకంలోని చట్టం ప్రకారం కూలీ లు పని చేసిన 21 రోజుల్లోనే వేతనాలు అందించాలి. కానీ.. ఫిబ్రవరి రెండవ వారం నుంచి ఇప్పటివరకు కూలీలకు వేతనాలు అందలేదు. జిల్లాలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి ఫిబ్రవరి రెండో వారం నుంచి మార్చి 31 వరకు ఉపాధి పనులు చేపట్టిన 70,614 మంది కూలీలకు సంబంధించి రూ.6.65 కోట్ల వేతనాలు పెండింగ్లో ఉ న్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్ 1నుంచి ఇప్పటివరకు వరకు 74,862 మంది కూలీలు పనులకు వెళ్లగా వీరికి అందాల్సిన రూ.7.61 కోట్లు రాలేదు. మొత్తంగా దాదాపు రెండున్నర నెలలకు సంబంధించి రూ.14.27 కోట్లు ఉపాధి కూలీల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. అయితే వానాకాలం పంటల సాగు ముగిసాక రైతు కూలీలకు పని దొరకకపోవడంతో ఉపాధి పనులకు వెళ్లేందుకు ఆసక్తి కనబరిచారు. అయితే గత 10 వారాలకు సంబంధించిన వేతనాల చెల్లింపులు పూర్తిగా ఆగిపోవడంతో కూలీలకు కుటుంబ పోషణ భారంగా మారింది. జిల్లాలో ఎక్కువగా కూలీలకు సంబంధించి పోస్టాఫీస్ ఖాతాలోనే వేతనాలు జమ అవుతుంటాయి. వేతనాలు వచ్చాయో.. లేదో.. తెలియక కూలీలు నిత్యం పోస్టాఫీస్ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఆరువారాల పైసలు రావాలె వానాకాలం పంటల సీజన్ ముగిసాక వ్యవసాయ పనులేవీ లేక ఉపాధిహామీ పనులకు వెళ్లినం. ఆరు వారాలకు సంబంధించిన పైసలు ఇంకా అకౌంట్లో పడలేదు. వారానికి రెండుసార్లు పైసలు పడ్డయో.. లేదోనని పోస్టాఫీస్కు వెళ్లి తెలుసుకుంటున్నం. – శంకరమ్మ, గోలేటి, రెబ్బెన వేతనాలు వెంటనే చెల్లించాలె ఉపాధిహామీ పనులకు సంబంధించిన రెండు నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నయ్. పనులకు వెళ్లినా డబ్బులు రాకపోవడంతో చాలా కష్టమవుతోంది. వేతనాలు ఎప్పు డు వస్తయోనని ఉపాధిహమీ సిబ్బందిని అడిగితే ఎవరూ సరైనా సమాధానం ఇవ్వడం లేదు. – దుర్శెట్టి సతీశ్, తిర్యాణి -
యువ కార్మికులు అంకితభావంతో పనిచేయాలి
● జీఎం విజయ భాస్కర్రెడ్డిరెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణిలో నూతనంగా ఉద్యోగాలు పొందుతున్న యువ కార్మికులు అంకితభావంతో పనిచేసి సంస్థ పురోభివృద్ధికి తోడ్పాటు ను అందించాలని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్రెడ్డి అన్నారు. గోలేటి టౌన్షిప్లోని జీఎం కార్యాలయ ఆవరణలో కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు పొందిన వారికి గురువారం నియామక పత్రాలు అందించారు. జీఎం మాట్లాడుతూ సింగరేణి ఉద్యోగంలో చేరే యువకులు సంస్థ ఖ్యాతిని పెంచాలన్నారు. సింగరేణిలో ఉద్యోగం లభించడం అదృష్టంగా భావించాల ని, క్రమశిక్షణతో పనిచేసి ఉత్పత్తి, ఉత్పాదకత, లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని సూచించారు. సింగరేణి సంస్ధ ఉద్యోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు మరే కంపెనీ కల్పించదన్నారు. విధుల కు గైర్హాజరు కావ్దొదన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచి ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి, కై రి గూడ పీవో నరేందర్, ఎస్వోటూజీఎం రాజమల్లు, డీజీఎం ఉజ్వల్కుమార్, ఏరియా సెక్యూరిటీ అధికా రి ఉమాకాంత్, పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి, ప్రాజెక్టు ఇంజనీరు వీరన్న, డీవైపీఎం వేణు తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యతతో ఇళ్లు నిర్మించాలి
● అదనపు కలెక్టర్ దీపక్ తివారికౌటాల(సిర్పూర్): నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండలంలోని నాగేపల్లి గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను గురువారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఇంటి నిర్మాణ పనుల ఫొటోలను యాప్తోపాటు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. పనులు ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు పరిశీలించాలన్నారు. అనంతరం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో రాజీవ్ యువవికాసం కౌంటర్లలో దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. దరఖాస్తుల వివరాలు పకడ్బందీగా ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. అనంతరం కార్యాలయ ఆవరణలో చేపట్టిన ఇందిరమ్మ నమూనా ఇంటి నిర్మాణాన్ని పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీవో కోట ప్రసాద్, ఎంపీవో మహేందర్రెడ్డి, ఏపీవో పూర్ణిమ తదితరులు ఉన్నారు. -
ప్రజలకు చేరువ కావాలి
కెరమెరి(ఆసిఫాబాద్): పోలీసులు ప్రజలకు మరింత చేరువ కావాలని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను గురువారం తనిఖీ చేశారు. సిబ్బంది విధుల గురించి ఎస్సై విజయ్ను అడిగి వివరాలు తె లుసుకున్నారు. కేసులకు సంబంధించిన ఫైళ్లు, రికార్డులను పరిశీలించారు. అనంతరం ఏఎస్పీ మా ట్లాడుతూ ప్రజల సమస్యలు ఓపికగా విని పరిష్కరించాలని సూచించారు. పోలీసు అధికారులు, సిబ్బందికి గ్రామాలపై అవగాహన ఉండాలన్నారు. ప్రజలతో మమేకమై వారితో స్నేహ సంబంధాలు మెరుగుపర్చుకోవాలన్నారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి ప్రతిఫలం దక్కుతుందని పేర్కొన్నారు. -
భూభారతితో సత్వర పరిష్కారం
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేవాంకిడి(ఆసిఫాబాద్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూభారతి ఆర్వోఆర్ చట్టం ద్వారా భూసమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. వాంకిడి మండల కేంద్రంలోని రైతువేదికలో గు రువారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని, నిజమైన భూమి యజ మానికి న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం ఉందని, సమస్యల పరిష్కారంలో అప్పీల్ వ్యవస్థను తీసుకువచ్చినట్లు వివరించారు. తహసీల్దార్ జారీ చేసిన ఆర్డర్పై ఆర్డీవోకు, ఆ ఆర్డర్పై కలెక్టర్కు అప్పీలు చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. ధరణి పోర్టర్లో ఈ అవకాశం లేదని, విరాసత్ పట్టా మార్పిడిపై సంబంధిత పట్టాదారులకు నోటీసులు జారీ చేసే విధానం అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు. కొనుగోలు, తనాఖా, దానం, పాలు పంపకాల ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేసి హక్కుల రికార్డులో మార్పులు చేసి పట్టాదారుకు పాసు పుస్తకం జారీ చేస్తారని తెలిపారు. ఈ ప్రక్రియ ఒకే రోజులో పూర్తయ్యేలా చట్టంలో పొందుపరిచినట్లు వివరించారు. ప్రతీ రైతు హక్కులు, అంశాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రియాజ్ అలీ, ఎంపీడీవో ప్రవీణ్కుమార్, ఏవో గోపికాంత్ తదితరులు పాల్గొన్నారు. -
టీకాతోనే పశువులకు రక్ష!
● ‘గాలికుంటు’ నివారణకు టీకాలు ● నెల రోజులపాటు కొనసాగనున్న కార్యక్రమం ● సద్వినియోగం చేసుకోవాలని అధికారుల సూచన ● జిల్లాలో 3.1 లక్షల పశువులు కౌటాల(సిర్పూర్): ఏటా వివిధ రకాల వ్యాధులతో పశువులు, జీవాలు వందల సంఖ్యలో మృత్యువాత పడుతుండటంతో పోషకులు, రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. పశువుల మరణాలు అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఏటా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం చేపడుతోంది. ఈ నెల 15 నుంచి జిల్లాలో ప్రారంభమైన టీకాల కార్యక్రమం మే 15 వరకు కొనసాగనుంది. పశువులకు సోకే వ్యాధులపై పాడిరైతులు అవగాహన కలిగి ఉంటూ సకాలంలో నివారణ టీకాలు వేయించాలని అధికారులు సూచిస్తున్నారు. వ్యాధి లక్షణాలు ఇలా..గాలికుంటు వ్యాధి సూక్ష్మక్రిములతో వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకిన గేదెలు, ఆవులు 24 గంటలోగా బక్కచిక్కి అల్సర్ బారిన పడతాయి. రెండు నుంచి ఆరు రోజుల వరకు జ్వరం ఎక్కువగా ఉంటుంది. నోరు, పెదాలు, నాలుక, చన్నులతో పాటు కాళ్ల గిట్టల మధ్య పుండ్లు ఏర్పడి వ్యాధి ముదురుతుంది. వ్యాధి బారిన పడిన పశువులు ముడుచుకుని పడుకుంటాయి. మేత, నీళ్లకు దూరంగా ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తి తగ్గడంతో పశువులు, దూడలు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలాంటి వాటికి క్రమం తప్పకుండా పరీక్షలు చేయించాలి. నోరు, పెదాలు, నాలుక, కాళ్లగిట్టల వద్ద ఉన్న పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ లేదా నార్మల్ సైలెన్ నీటితో శుభ్రం చేయాలి. రెండోసారి ఇన్ఫెక్షన్ రాకుండా యాంటీ బయాటిక్స్ మందులు, వ్యాధి నిరోధక శక్తి పెంచేందుకు బీ కాంప్లెక్స్ మందులు వాడాలని పశువైద్యులు సూచిస్తున్నారు. పశువులకు గాలి ద్వారా సోకే గాలికుంటు వ్యాధిపై రైతులు నిర్లక్ష్యం వహించకుండా పశు సంవర్ధక శాఖ వైద్యుల సలహా మేరకు క్రమం తప్పకుండా ఏడాదికి రెండుసార్లు టీకాలు వేయించాలి. గాలికుంటు ప్రాణాంతకమైన వ్యాధి కావడంతో చిన్నపాటి అలసత్వం చేసినా పశువు మృతి చెందే ప్రమాదం ఉంటుంది. వ్యాధి బారిన పడిన పశువులను ఇతర వాటికి దూరంగా ఉంచాలి. ఎప్పటికప్పుడు పశువుల పాకను శుభ్రం ఉంచాలి. వారానికి ఒకసారి కొట్టంలో సున్నం చల్లి, క్రిమికీటకాల నివారణకు చర్యలు తీసుకోవాలి. వ్యాధి సోకిన గేదె, ఆవు నుంచి తీసిన పాలను 100 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేసిన తర్వాతే తాగాలి. పశువు చనిపోతే గోతిలో వేసి బ్లీచింగ్ పౌడర్ చల్లి పాతిపెట్టాలి. సద్వినియోగం చేసుకోవాలి రైతులు పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించా లి. ఈ నెల 15 గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కా ర్యక్రమం ప్రారంభించాం. షెడ్యూల్ ప్రకారం మే 15 వరకు అన్ని గ్రామాల్లోని పశువులకు ఉచితంగా టీకాలు వేస్తాం. పశుపోషకులు, రైతులు స్వదినియోగం చేసుకోవాలి. టీకాలు వేయించడం ద్వారా పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. మేకలు, గొర్రెలు, పశువులకు ఎలాంటి వ్యాధులు సోకినా పశువైద్యశాఖ సిబ్బందికి సమాచారం అందించాలి. – సురేశ్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిఏటా రెండుసార్లు..వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమతో రైతులు ఆర్థికంగా బలపడుతున్న నేపథ్యంలో వారు నష్టపోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రతీ సంవత్సరం రెండుసార్లు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. జిల్లాలో రెండు ఏరియా పశువైద్యశాలలు ఉండగా 18 ప్రాథమిక పశువైద్యాశాలలు ఉన్నాయి. ఏడు పశువైద్యాశాల సబ్సెంటర్లు ఉన్నాయి. ఆవులు, గేదెలు మొత్తం 3,13,896 ఉన్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలో ఈ నెల 15 నుంచి మే 15 వరకు నెల రోజులపాటు టీకాలు వేయనున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. షెడ్యూల్ ప్రకారం ప్రతీరోజు ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు గ్రామాల్లోకి వెళ్లి టీకాలు వేస్తున్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్ధక శాఖ అధికారులు కోరుతున్నారు. -
‘ఎల్ఆర్ఎస్’ చెల్లింపులు వేగవంతం చేయాలి
ఆసిఫాబాద్అర్బన్: ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో అందిన దరఖాస్తుల్లో అర్హులైన వారు రుసుము చెల్లించేలా ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర పురపాలిక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ అధికారులతో ఎల్ఆర్ఎస్ రుసుం వసూలు ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 25శాతం రాయితీతో రుసుము చెల్లించే గడువు ఈ నెల 30 వరకు ఉందని తెలిపారు. రుసుము చెల్లించిన వారికి ప్రొసీడింగ్ అందించాలని ఆదేశించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో వెంకటేశ్ దోత్రే మాట్లాడారు. జిల్లాలో ఎల్ఆర్ఎస్ పథకం కింద 7,212 దరఖాస్తులు అందాయని, విచారణ అనంతరం 5,470 అర్హులైన దరఖాస్తుదారులు రుసుము చెల్లించాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు 1,022 మంది రుసుము వసూలు చేసేలా కార్యదర్శులు, వార్డు అధికారుల ద్వారా సంప్రదించి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. రుసుము చెల్లించిన 328 మందికి ప్రొసీడింగ్స్ అందించామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, డీపీవో భిక్షపతిగౌడ్, పట్టణ ప్రణాళిక అధికారి యశ్వంత్, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
ఆదివాసీలు హక్కులు సాధించుకోవాలి
ఆసిఫాబాద్అర్బన్: ఆదివాసీలు ఏకతాటిపైకి వచ్చి హక్కులు సాధించుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, ఆ పార్టీ సీనియర్ నాయకుడు అరిగెల నాగేశ్వర్రావు అన్నారు. కెరమెరి మండలం జోడేఘాట్లో నిర్వహించిన సమావేశాల్లో తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై న కోట్నాక విజయ్, వ్యవస్థాపక అధ్యక్షుడు బుర్స పోచయ్యను గురువారం జిల్లా కేంద్రంలో సన్మానించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పెంటయ్య, నాయకులు ప్రసాద్గౌడ్, దీపక్, మాటూరి జయరాజ్, మురళీగౌడ్, శ్రీకాంత్, శంకర్, నగేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అటవీశాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే ‘పాల్వాయి’
బెజ్జూర్(సిర్పూర్): హైదరాబాద్లో రాష్ట్ర అట వీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ను గురువారం సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ మర్యాదపూర్వకంగా కలిశారు. పోడు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందించారు. ఎమ్మె ల్యే హరీశ్బాబు మాట్లాడుతూ పోడు రైతులను అటవీశాఖ అధికారులు వేధిస్తున్నారని ఆరోపించారు. బెదిరింపులకు పాల్పడుతూ వారి జీవనాధారాన్ని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. తునికాకు సేకరణను కూడా అడ్డుకుంటున్నారని తెలిపా రు. స్పందించిన మంత్రి పోడు రైతులకు ఇబ్బందులకు గురిచేయొద్దని పీసీసీఎఫ్ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు డోబ్రియల్ను ఆదేశించారు. -
పరీక్షలు
కంటి‘పాప’లకు● చిన్నారుల్లో నేత్ర, మానసిక సమస్యలు గుర్తింపు ● ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో ఆరోగ్య పరీక్షలు ● జిల్లాలో 973 అంగన్వాడీ కేంద్రాలు ● జూన్ వరకు కొనసాగనున్న ప్రక్రియకనర్గాంలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులను పరీక్షిస్తున్న ఆర్బీఎస్కే సిబ్బంది ప్రతిరోజూ 150 మందికి..చిన్నారుల్లో కంటి, మానసిక రుగ్మతలు నిర్మూలించేందుకు 100 రోజులపాటు జిల్లావ్యాప్తంగా మూడు బృందాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఒక్కొక్క బృందంలో ఇద్దరు డాక్టర్లు, ఒక ఫార్మసిస్ట్, ఒక ఏఎన్ఎం, ఒక అప్తోమెట్రిస్ట్ ఉంటారు. ఒక్కొక్క బృందంలోని సభ్యులు ప్రతిరోజూ అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లి పరీక్షలు చేస్తున్నారు. ఒక్కరోజులో 150 మంది పిల్లలను పరీక్షిస్తారు. జిల్లాలో 973 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా 41,782 మంది పిల్లలు ఉన్నట్లు గుర్తించా రు. రోజుకు 150 మంది చొప్పున వందరోజుల్లో పరీక్షలు పూర్తి చేయనున్నారు. అయితే ఆర్బీఎస్కే బృందాలు పది ఉన్నా అప్తోమెట్రిస్ట్లు తక్కువగా ఉండటంతో జి ల్లాలో మూడు బృందాలు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూడు నెలల్లో లక్ష్యం పూర్తి కావడం కష్టంగా మారింది. కంటి పరీక్షలు చేసే నిపుణులను నియమించుకుంటే గడువులోగా లక్ష్యాన్ని చేరుకోవచ్చు. వాంకిడి(ఆసిఫాబాద్): ప్రాథమిక దశలోనే కంటి, మానసిక సమస్యలు గుర్తించి చికిత్స అందించేందుకు ఈ నెల 7 నుంచి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం(ఆర్బీఎస్కే) ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు వైద్యారోగ్య శాఖ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తోంది. మొదటి విడతలో ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకునే విద్యార్థులకు, రెండో విడతలో 5, 6, 7 తరగతుల విద్యార్థులకు రక్తహీనతపై స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. అవసరమైన వారికి మందుల అందించి చికిత్స చేయించారు. మూడో విడతలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకునే ఆరేళ్లలోపు పిల్లల్లో మానసిక, కంటి సమస్యలను గుర్తించి తక్షణ చికిత్స అందించేలా కార్యాచరణ రూపొందించారు. ఈ నెల 7న ప్రారంభమైన కార్యక్రమం జూన్ వరకు వందరోజులపాటు కొనసాగనుంది. సమస్యలు గుర్తించేందుకు 42 ప్రశ్నలు..జీవన విధానంలో వస్తున్న మార్పులు, ఆహారపు అలవాట్లుతో బాల్యంలోనే పిల్లలకు అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. చిన్న పిల్లల్లో కంటి, మానసిక సమస్యలను గుర్తించడానికి అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. త్వరగా అర్థం చేసుకుని సమాధానం చెప్పేలా మొత్తం 42 సులువైన ప్రశ్నలు రూపొందించారు. ముందస్తుగా అంగన్వాడీ టీచర్లు పిల్లల తల్లిదండ్రులకు సమాచారం అందిస్తారు. పిల్లలను తల్లిదండ్రులతోపాటు కూర్చోబెట్టి బొమ్మలతో కూడిన చిత్రాలను చూపిస్తూ ప్రశ్నలు అడుగుతారు. ఆ సమయంలో పిల్లల నుంచి వచ్చే సమాధానాలకు అనుగుణంగా సమస్యను గుర్తిస్తారు. పిల్లల్లో ఎదుగుదల లోపాలు, జన్యుపరమైన సమస్యలతోపాటు కంటిలో వచ్చే కార్నియా, మెల్లకన్ను, తదితర సమస్యలు గుర్తిసా రు. ఆ తర్వాత మందల పంపిణీ చేయడం లేదా ఆస్పత్రిలో చేర్పించేందుకు చర్యలు చేపడతారు. కంటి సమస్య ఎక్కువగా ఉంటే అద్దాలు అందజేస్తారు. శస్త్ర చికిత్స కూడా చేయిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 7 నుంచి ఇప్పటివరకు వరకు సుమారుగా 2,500 మందికిపైగా పిల్లలను పరీక్షించారు. ఇందులో దృష్టిలోపం ఉన్న వారు ముగ్గురు, ఇతర నేత్ర సంబంధ ఇబ్బందులు 13 మందికి ఉన్నట్లు గుర్తించారు. వారందరికీ ఉచితంగా చికిత్స చేయించి కళ్లద్దాలు అందజేయనున్నారు. అన్ని కేంద్రాల్లో పరీక్షలు జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లల్లో కంటి, మానసిక సమస్యలు గుర్తించేలా కార్యాచరణ రూపొందించాం. వాంకిడి, ఆసిఫాబాద్, రెబ్బెన, కాగజ్నగర్ మండలాల్లో ఆర్బీఎస్కే ప్రత్యేక బృందాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. సమస్యలు ఉన్న పిల్లలకు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తాం. అలాగే అవసరమైన వారికి కళ్లద్దాల పంపిణీ చేస్తాం. ప్రభుత్వం ఉచితంగా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – సీతారాం, డీఎంహెచ్వో -
● నిషేధిత వస్తువుల రవాణాకు అడ్డాలుగా ట్రాన్స్పోర్టులు ● ఇటీవల నకిలీ విత్తనాలు పట్టివేత ● అక్రమార్కులకు వరంగా మారుతున్న వైనం
నిఘా పెంచాంట్రాన్స్పోర్ట్ కార్యాలయాలపై నిఘా పెంచాం. ఎస్పీ ఆదేశాల మేరకు నకిలీ పత్తి విత్తనాల సరఫరాపై ప్రధానంగా దృష్టి సారించాం. వీటితోపాటు అనుమతులు లేని నకిలీ వ్యవసాయ మందులు, ఉత్పత్తులు, గ్లైఫోసెట్ రౌండప్ మందులపైనా నిఘా ఉంటుంది. ఎవరైనా అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. కేసులు నమోదు చేస్తాం. – రాణాప్రతాప్, టాస్క్ఫోర్స్ సీఐ, కాగజ్నగర్ చింతలమానెపల్లి(సిర్పూర్): వివిధ ప్రాంతాల నుంచి వస్తువులు తరలించడానికి జిల్లాలో ట్రాన్స్పోర్టు కంపెనీలు తమ కార్యాలయాలు ఏర్పాటు చేశాయి. వీటి ద్వారా పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు ని త్యం భారీఎత్తున సరుకులు చేరవేస్తున్నారు. కాగజ్నగర్ పట్టణంలో సుమారు 15 ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయాలు, ఆసిఫాబాద్లో మరో 15 ట్రాన్స్పోర్ట్ కార్యాలయాలు ఉన్నాయి. ఇవే కాకుండా స్థానిక ట్రాన్స్పోర్ట్లు కూడా ఉన్నాయి. సులువుగా సరుకు రవాణా వస్తువులు, అనుమతి ఉన్న, ప్రజా అవసరాల సరుకులు రవాణా చేయడానికి ట్రాన్స్పోర్ట్ కార్యాలయాలు ఉపయోగపడుతున్నాయి. అలాగే అక్రమ వస్తువులు, అనుమతి లేని, నిషేధం ఉన్న వస్తువులు, సరుకులు కూడా గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ వాహనాలు, ట్రాన్స్పోర్ట్ కార్యాలయాల ద్వారా నిత్యం గ్రామీణ ప్రాంతాలకు సరుకు ర వాణా జరుగుతోంది. వీటిని అనుకూలంగా మా ర్చుకున్న వ్యాపారులు తమకు కావాల్సిన సరుకును తరలించేందుకు ట్రాన్స్పోర్టులను వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా ఏటా జిల్లాలోకి వర్షాకా లం సీజన్కు ముందే జనవరి, ఫిబ్రవరి నుంచి జిల్లాలోకి నకిలీ పత్తి విత్తనాలు డంప్ చేసి రహస్య ప్రాంతాల్లో నిల్వ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, మహారా ష్ట్రకు చెందిన వ్యాపారులు ఈ ట్రాన్స్పోర్టులను విని యోగించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిఘా కరువు ట్రాన్స్పోర్ట్ కంపెనీల వాహనాల ద్వారా తరలించే వస్తువులు, కార్యాలయాలపై నిఘా తక్కువగా ఉంటోంది. కార్యాలయాల నిర్వహణ, వాహనాల్లో స రుకు రవాణాకు ట్రాన్స్పోర్ట్ కంపెనీలు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుంటాయి. కానీ నిత్యం భారీ సంఖ్యలో తరలించే వస్తువులపై నిఘా ఏర్పా టు చేయడం ఆయా శాఖలకు తలకు మించిన భా రంగా మారింది. పోలీస్, విజిలెన్స్, ఎకై ్సజ్ శాఖలు మాత్రమే అడపాదడపా తనిఖీ చేపడుతున్నాయి. పూర్తిస్థాయి ప్యాకింగ్తో వచ్చే పార్సిళ్లను పరిశీలించడం సిబ్బందికి కష్టమవుతోంది. ఇది అక్రమంగా వస్తువులను తరలించి సొమ్ము చేసుకునే వారికి వరంగా మారుతోంది. నకిలీ విత్తనాలు, నిషేధిత మందులు, ట్యాక్స్లు చెల్లించని వస్తువులు ట్రాన్స్పోర్ట్ కంపెనీల ద్వారా తరలిస్తున్నారు. తద్వారా భారీగా ఆదాయం గడిస్తున్నారు. మరోవైపు మార్కెట్లో నిషేధిత వస్తువులు, నాణ్యత లేని సరుకు వినియోగిస్తూ సాధారణ ప్రజలు నష్టపోతున్నారు. కల్తీ వస్తువులు మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. అవగాహన లేకపోవడంతో జిల్లాలోని గిరిజన ప్రజలు సులువుగా మోసపోతున్నారు. పోలీసుశాఖ దృష్టి వర్షాకాలం సీజన్కు ముందే ఇటీవల భారీగా నకిలీ విత్తనాలు సరఫరా కావడం కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో విశ్వసనీయ సమాచారంతో ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలోనూ నిషేధిత విత్తనాలు పట్టుబడడంతో పోలీసుశాఖ అప్రమత్తమైంది. ట్రాన్స్పోర్ట్ కంపెనీల కార్యకలాపాలపై దృష్టి సారించింది. కాగజ్నగర్, ఆసిఫాబాద్ పట్టణాల్లో వ్యవసాయ, పోలీసు శాఖల అధికారులు ఇటీవల తనిఖీ లు చేపట్టారు. ప్రధానంగా నకిలీ విత్తనాలు జిల్లాలోని మార్కెట్లను ముంచెత్తే అవకాశం ఉన్నందున ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. చెక్పోస్టులను బలోపేతం చేయడంతోపాటు ట్రాన్స్పోర్టు కంపెనీలపై నిఘా ఉంచితే నిషేధిత విత్తనాలు, పురుగు మందులు, ట్యాక్స్ లేని వస్తువులు, సరుకుల దిగుమతిని పకడ్బందీగా అడ్డుకోవచ్చు.కాగజ్నగర్లోని ఓ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ద్వారా నకిలీ విత్తనాలు సరఫరా అవుతున్నాయనే సమాచారంతో టాస్క్ఫోర్స్ అధికారులు ఈ నెల 9న తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 45 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. బెజ్జూర్ మండలానికి చెందిన ఓ వ్యక్తి పేరు మీద విత్తనాల సంచి వచ్చినట్లు గుర్తించారు. పట్టుబడిన విత్తనాల విలువ రూ.1,57,500 ఉంటుందని అధికారులు తెలిపారు... ఇలా పలు ట్రాన్స్పోర్టుల ద్వారా జిల్లాలోకి అక్రమంగా నకిలీ విత్తనాలు, ట్యాక్స్ లేని వస్తువులు సరఫరా అవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. -
ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలు!
ఆసిఫాబాద్అర్బన్: ఆసిఫాబాద్ మండలం గో వింద్పూర్ శివారుల్లోని సర్వే నం.83లోని కేశవనాథ స్వామి ఆలయ భూముల్లో అదే గ్రామానికి చెందిన కొందరు అక్రమ నిర్మాణాలు చేపడుతుండడంతో బుధవారం దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ కమిటీ ప్రతినిధులు అడ్డుకున్నారు. ఇటీవల ఆలయ భూములకు వేలం నిర్వహించేందుకు తేదీని ప్రకటించారు. గోవింద్పూర్లో వేలానికి సంబంధించిన పోస్టర్ అంటించేందుకు దేవాదాయ శాఖ కార్యనిర్వాహణ అధికారి వేణుగోపాల్ గుప్తా, బాపిరెడ్డి, ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ రవికిషన్, అటెండర్ రాజేశ్వర్, అలయ అర్చకుడు నరేశ్శర్మ, కమిటీ సభ్యులు మనోజ్కుమార్, సుగుణాకర్ వెళ్లారు. ఆల యం భూముల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్న వారిని ప్రశ్నించడంతో వాగ్వాదం జరిగింది. నిర్మాణాలను తొలగించకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. -
స్పౌజ్ బదిలీలకు గ్రీన్ సిగ్నల్
● ఉమ్మడి జిల్లాలో ఆరుగురికి అవకాశం ● ఆసిఫాబాద్ నుంచి ఆదిలాబాద్కు నలుగురు, మంచిర్యాలకు ఇద్దరు.. ఆదిలాబాద్టౌన్: స్పౌజ్ బదిలీలకు ప్రభుత్వం మరోసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల 38 మంది స్పౌజ్ ఉపాధ్యాయులు (భార్య, భర్త) ఇతర జిల్లాల నుంచి ఆదిలాబాద్ జిల్లాకు వ చ్చిన విషయం తెలిసిందే. తాజాగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ స్పౌజ్ బదిలీలకు సంబంధించి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాలో ఆరుగురు సొంత జిల్లాలకు బదిలీపై వెళ్లనున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ నుంచి ఆదిలాబాద్కు నలుగురు స్కూల్ అసిస్టెంట్లు (తెలుగు) బదిలీపై రానుండగా, ఆసిఫాబాద్ నుంచి మంచిర్యాలకు ఇద్దరు సాంఘిక శాస్త్రం ఎస్ఏలు బదిలీపై వెళ్లనున్నారు. 317 ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. 23న రిలీవ్.. సంబంధిత జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఈనెల 22న రిలీవ్ అయి వారికి కేటాయించిన జిల్లాలో 23న విధుల్లో చేరాలని విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే ఇటీవల మ్యూచువల్ బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు జారీ అయిన విషయం తెలిసిందే. ఆదిలాబాద్ జిల్లాకు 24 మంది మ్యూచువల్ బదిలీపై రానుండగా, అదే సంఖ్యలో ఇతర జిల్లాలకు ఇక్కడి నుంచి వెళ్లనున్నారు. మంచిర్యాల నుంచి ఓ సీనియర్ అసిస్టెంట్ డీఈవో కార్యాలయానికి రానుండగా, ఇక్కడి నుంచి ఒకరు మంచిర్యాలకు వెళ్లనున్నారు. -
ప్రజలతో మమేకం.. సేవలకు ప్రాధాన్యం
● జిల్లాలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు ● మత్తు పదార్థాల వినియోగం అరికట్టడమే లక్ష్యం ● గ్రామీణ ప్రాంతాల్లో ఆటల పోటీలు నిర్వహణ, కిట్లు అందజేతబెట్టింగ్కు దూరంగా..ఇటీవల పోలీస్శాఖ ఆధ్వర్యంలో కౌటాలలో జిల్లాస్థాయి వాలీ బాల్ పోటీలు నిర్వహించారు. యువత పోటీల్లో పాల్గొనడంతో బెట్టింగ్కు దూరంగా ఉన్నారు. బెట్టింగ్, చెడువ్యసనాల బారిన పడితే కలిగే నష్టాల ను వివరించారు. ప్రతీసారి సెలవుల్లో పోటీలు నిర్వహించి యువతను ప్రోత్సహించాలి. – రవి, మురళీగూడ, మం.పెంచికల్పేట్ సేవా కార్యక్రమాలు చేపడుతున్నాంనేను విధుల్లో చేరిన మొదట్లో కాగజ్నగర్లో భర్త తాగుడుకు బానిస కావడంతో ముగ్గురు కుమార్తెలతో కలిసి తల్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. ప్రజలు మద్యానికి బానిసై క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. యువత గంజాయి, గుట్కాలను వినియోగించి అనారోగ్యం బారిన పడుతున్నారు. భద్రత కల్పించడంతో పాటు సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. క్రీడలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో పోటీలు నిర్వహిస్తున్నాం. – డీవీ శ్రీనివాసరావు, ఎస్పీ కౌటాల(సిర్పూర్): శాంతి భద్రతలు పరిరక్షించడంలో పోలీసుల పాత్ర కీలకం.. వారికి బాధ్యతలు, ఒత్తిళ్లు ఎక్కువే.. అడవుల జిల్లాగా పేరుగాంచిన ఈ ప్రాంతాన్ని గంజాయి, గుట్కా, గుడుంబా ఇతర వ్యసనాలు పట్టి పీడిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని యువత, ప్రజలు బానిసలుగా మారుతున్నారు. ఈ క్రమంలో పోలీసుశాఖ ‘పోలీసులు మీ కోసం’ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజలతో మమేకమవుతూనే.. అక్ర మాలు, మత్తు పదార్థాలపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రత్యేక చొరవ.. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గంజాయి, గుండుబా, గుట్కా, మట్కా, బెట్టింగ్ కట్టడికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. వాటి వినియోగంతో కలిగే అనర్థాలను తెలియజేసేందుకు నేరుగా ప్రజల మధ్యకు వెళ్తున్నారు. మారుమూల గ్రామాల్లో పర్యటించి ప్రజల అవసరాలు, వారి జీవన విధానం తెలుసుకుంటున్నారు. సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని, ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కార మార్గం కాదంటూ.. ప్రజలను చైతన్యపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఏ సమస్య వచ్చినా.. వాటి పరిష్కారంలో యువత కీలక భూమిక పోషిస్తుంది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా చదువుపై దృష్టి సారించడంతోపాటు యువత చెడుమార్గంలో వెళ్తే జరిగే అనర్థాలను వివరిస్తున్నారు. గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు యువత భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నారు. మత్తు వదిలేలా.. ప్రజలతో ఎస్పీ శ్రీనివాసరావు మమేకం కావడమే కాకుండా జిల్లాలో పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అన్ని మండలాల్లో పోలీసులు– మీ కోసం కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాలు, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో గుడుంబా, గుట్కా నియంత్రణపై ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లాలో నేరాలు అరికట్టేందుకు ప్రధాన కూడళ్లు, కాలనీల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కేసులను పరిష్కరించడంలో దోహదపడుతున్నాయి. సీసీ కెమెరాల సాయంతో గతేడాదితో తొమ్మిది కేసులు పరిష్కారమయ్యాయి. గతేడాది వివిధ కార్యక్రమాల్లో భాగంగా 746 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆసిఫాబాద్, కాగజ్నగర్ పోలీస్ సబ్ డివిజన్లలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో కొన్ని నెలలుగా కాలనీలు, బస్తీల్లో బ్లూకోల్ట్స్ తదితర సిబ్బంది పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. దొంగతనాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. సేవా కార్యక్రమాలు సైతం.. పోలీసులు మీకోసం కార్యక్రమాల్లో భాగంగా ప్రజలకు సైబర్ సెక్యూరిటీ, రోడ్ సేఫ్టీ, గుడ్ టచ్– బ్యాడ్ టచ్, గంజాయి, ఆన్లైన్ మోసాలు, గుట్కా, మట్కా, జూదం, మహిళల భద్రత కమ్యూనిటీ పోలీసింగ్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళ భద్రత కోసం షీటీంలు ఏర్పాటు చేసి చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల బెజ్జూర్ మండలం నాగవల్లిలో పేదలకు నిత్యావసర సరుకులు, దుప్పట్లు, యువతకు వాలీబాల్, క్రికెట్ కిట్లు ఇచ్చారు. వైద్యశిబిరం నిర్వహించి మందులు పంపిణీ చేశారు. జైనూర్లో ఆదివాసీ మహిళలకు 35 కుట్టు మిషన్లు అందించారు. రెబ్బెన మండలం గోండుగూడ, కాగజ్నగర్ డివిజన్లోని కనికి, తుమ్మిడిహెట్టి, తాటిపల్లి, సిర్పూర్(యూ) మండలం పవర్గూడ గ్రామాల్లోని ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేశారు. గత నెల 12న జైనూర్లో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. మార్చి 5న సిర్పూర్–యూ మండలం దుద్దేకాస గ్రామంలో సరుకులు, పండ్లు పంపిణీ చేశారు. మార్చి 2న ఏఎస్పీ చిత్తరంజన్ తిర్యాణి మండలం గోవెన, కుర్సిగూడ, నాయకపుగూడ గ్రామాలకు కాలినడకన దాదాపు 20 కి.మీ. దూరం వెళ్లి ఆదివాసీల సమస్యలు తెలుసుకున్నారు. యువతకు వాలీబాల్ కిట్లు, స్పోర్ట్ టీషర్టులు పంపిణీ చేశారు. మార్చి 24న కౌటాల పోలీస్ స్టేషన్లో మూడు రోజులపాటు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన జట్లకు నగదుతోపాటు బహుమతులు అందించారు. బోదంపల్లిలో నిరుపేద మహిళకు పోలీసులు నిర్మించిన ఇంటిని ప్రారంభించారు. తుమ్మిడిహెట్టి గ్రామంలో దుప్పట్లు, వైద్యశిబిరం నిర్వహించారు. -
‘రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు’
కాగజ్నగర్రూరల్: రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అఘాయిత్యాలు పెరిగాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. నల్గొండ జిల్లాకు చెందిన మల్లీశ్వరికి నివాళిగా బుధవారం పట్టణంలోని రాజీవ్గాంధీ చౌరస్తా వద్ద కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఏడేళ్లు సహజీవనం చేసిన తర్వాత మల్లీశ్వరిని యువకుడు మోసం చేసి వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడని, బాధితురాలు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందన్నారు. ఆత్మహత్మకు కారణమైన నిందితులను ఇప్పటికీ అరెస్టు చేయకపోవడం దారుణమన్నారు. మహిళలకు రక్షణ కల్పించలేని సీఎం రేవంత్రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు వరలక్ష్మి, రమాదేవి, లావణ్య, కమల, బీనా మండల్, రింకు మండల్ తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేఆసిఫాబాద్: అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ చాంబర్లో బుధవారం ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, ఎం.డేవిడ్తో కలిసి భూభారతి చట్టం అమలు, సన్నబియ్యం పంపిణీ, నకిలీ విత్తనాల అక్రమ రవాణాపై చర్యలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, అర్హుల జాబితా రూపకల్పన, వేసవిలో తాగునీటి సరఫరా అంశాలపై విలేకరులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టంలో రైతులకు మేలు కలిగే విధంగా అప్పీలు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. విరాసత్, పాలు పంపకాలు, కొనుగోలు పట్టా మార్పిడిలో సంబంధీకులకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందన్నారు. భూభారతి చట్టంపై ఈ నెల 17 నుంచి 30 వరకు రైతులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 314 పౌరసరఫరాల దుకాణాల ద్వారా ఇప్పటివరకు 90 శాతం సన్నబియ్యం పంపిణీ పూర్తయిందని వివరించారు. జిల్లాలో 80 శాతం పత్తి సాగవుతున్న నేపథ్యంలో నకిలీ విత్తనాలు విక్రయించకుండా విస్తృత స్థాయిలో తనిఖీలు చేపడతామని పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మండలస్థాయిలో తహసీల్దార్, ఎస్సై, వ్యవసాయ శాఖ అధికారులతో టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. పైలట్ గ్రామాల్లో విడతల వారీగా బిల్లుల చెల్లింపులు జరుగుతాయన్నారు. మిగిలిన గ్రామాల్లో అర్హుల జాబితా రూపొందించేందుకు మండలస్థాయిలో గెజిటెడ్ స్థాయి అధికారులతో గడపగడపకూ సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు. తాగునీటి సమస్య తలెత్తకుండా పైప్లైన్లకు మరమ్మతులు చేపట్టి మిషన్ భగీరథ పథకంలో నల్లా కనెక్షన్ల ద్వారా శుద్ధమైన తాగునీరు సరఫరా చేస్తున్నామని తెలిపారు. తాగునీటి సరఫరా చేయలేని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నామన్నారు. మిషన్ భగీరథ అధికారులతో ప్రతిరోజూ అదనపు కలెక్టర్ సమీక్షిస్తున్నారన్నారు. ఎస్పీ డీవీ శ్రీనివాసరావు మాట్లాడుతూ నకిలీ విత్తనాలు సరఫరా చేసే వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామన్నారు. విత్తన విక్రయదారులు నిబంధనల ప్రకారం ప్రభుత్వం గుర్తించిన విత్తనాలు మాత్రమే విక్రయించాలని ఆయన సూచించారు. -
మోటర్ తెచ్చిన తంటాలు
రెబ్బెన/బెల్లంపల్లి: బెల్లంపల్లి సింగరేణి ఏరియాలోని మాదారం టౌన్షిప్లో కార్మికులు, కార్మికేతర కుటుంబాలను జనవరి నుంచి నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. తరచూ మోటర్లు కాలిపోతుండగా, మరమ్మతులకు గరిష్టంగా రెండు వారాలపైనే సమయం పడుతోంది. వేసవి కావడంతో నీటి కోసం కాలనీ ప్రజలు అల్లాడుతున్నారు. తాజాగా మంగళవారం రాత్రి మరోసారి మోటర్ చెడిపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. మాదారం కాలనీవాసులకు మహావీర్ఖని(ఎంవీకే) –1 ఇంకై ్లన్ సమీపంలో వేసిన బోర్లో మోటర్ బిగించి అంతర్గత పైపులైన్ ద్వారా తాగునీటిని అందిస్తున్నారు. అయితే అంతుచిక్కని కారణాలతో ఇక్కడ ఏర్పాటు చేసిన పంపు మోటరు తరచూ చెడిపోతోంది. నాలుగు నెలల్లో నాలుగుసార్లు మరమ్మతులకు గురైంది. గడిచిన నెలన్నర వ్యవధిలోనే రెండుసార్లు చెడిపోయిందని స్థానికులు తెలిపారు. సమస్య పరిష్కారం కోసం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాల మేరకు సింగరేణి జీఎం రెండు కొత్త పంపు మోటర్లను తెప్పించారు. 75 హెచ్పీ సామర్థ్యం కలిగిన మోటర్లు తీసుకురాగా, అవి బోర్ హోల్లో పట్టలేదు. కొత్తగా బోరులో పట్టే మోటర్లను తీసుకువచ్చి బిగించడం లేదా 75 హెచ్పీ సామర్థ్యం కలిగిన మోటర్లకు సరిపడేలా కొత్త బోరు హోల్ వేయడమో చేస్తేగానీ నీటి సమస్య తీరే అవకాశం కనిపించడం లేదు. రోడ్డుపై కాలనీవాసుల ఆందోళన తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో మా దారంటౌన్ షిప్ కార్మిక కుటుంబాల మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. కైరిగూడ ఆర్చీ వద్ద సింగరేణి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఐఎన్టీయూసీ ఏరియా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ మాదారం టౌన్షిప్లో నెలలో పది నుంచి పద్నాలుగు రోజులపాటు నీటి సరాఫరా లేకపోతే కార్మిక కుటుంబాలు ఎలా బతకాలని ప్రశ్నించారు. నీటి సరాఫరా నిలిచిపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరాఫరా చేస్తూ చేతులు దులుపుకొంటున్నారన్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోతే జీఎం కార్యాలయం ఎదుట బైఠాయిస్తామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న ఎస్వోటూజీఎం రాజమల్లు సంఘటన స్థలానికి వెళ్లి ఐఎన్టీయూసీ, కార్మిక కుటుంబాలతో మాట్లాడారు. రెండు రోజుల్లో పంపులకు మరమ్మతులు చేయించి నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని, అప్పటివరకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్మిక కుటుంబాలకు మద్దతుగా ఏఐటీయూసీ నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. సెంట్రల్ కమిటీ నాయకులు ప్రకాశ్రావు, రామారావు, ఏరియా కార్యదర్శి చంద్రకుమార్, ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి తిరుపతి, ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి, కార్మికులు అనిల్, పోశం, శంకర్, రఘునాథరెడ్డి, రమేశ్, సత్యనారాయణ, మధు తదితరులు పాల్గొన్నారు. నాలుగు నెలలుగా తరచూ కాలిపోతున్న వైనం మాదారం టౌన్షిప్ కాలనీవాసులకు తప్పని నీటి కష్టాలు సమస్య పరిష్కరించాలని రోడ్డుపై బైఠాయింపు -
యువ వికాసానికి స్పందన
● ఈ నెల 14 వరకు 28,116 దరఖాస్తులుకార్పొరేషన్ల వారీగా దరఖాస్తులుఆసిఫాబాద్అర్బన్: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధికోసం రుణాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం పథకానికి జిల్లాలో స్పందన వచ్చింది. నిరుద్యోగులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. పలుమార్లు సర్వర్ సమస్యలు తలెత్తినా ప్రజాపాలన కేంద్రాలు, మీసేవ కేంద్రాల వద్ద క్యూలైన్లు కట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగలకు సబ్సిడీపై రుణాలు అందించనుంది. మొదట ఈ నెల 5 వరకు గడువు నిర్ణయించారు. అయితే సర్వర్ సమస్యలు, దరఖాస్తుదారులు కుల, ఆదాయ ఇతర ధ్రువీకరణ పత్రాలు పొందడంలో తీవ్ర జాప్యం జరగడం.. అలాగేఏ యూనిట్కు అప్లై చేసుకుంటే ఎంత మొత్తం రుణం మంజూరు చేస్తారో నిర్ణయం కాకపోవడంతో చాలామంది దరఖాస్తు చేసుకునేందుకు వెనుకడుగు వేశారు. ఆ తర్వాత ప్రభుత్వం గడువును ఈ నెల 14 వరకు పొడిగించింది. ఇప్పటివరకు జిల్లాలో 28,116 దరఖాస్తులు వచ్చినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. అదృష్టం ఎవరికో..రాజీవ్ యువ వికాసం పథకానికి భారీగా దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో అదృష్టం ఎవరిని వరిస్తుందోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యువతతోపాటు పలువురు రైతులు మండల కేంద్రాలతోపాటు ఆసిఫాబాద్, కాగజ్నగర్ పట్టణాలో ని మున్సిపాలిటీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాల్లో కూడా దరఖాస్తులు సమర్పించారు. ఇటీవల వరుసగా సెలవులు వచ్చినా ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఈ కేంద్రాలను తెరిచి ఉంచారు. మున్సిపల్, మండల కమిటీలు దరఖాస్తులను పరిశీలించి జిల్లా కమిటీకి సమర్పించనున్నారు. జిల్లా కమిటీలోని సభ్యులు జాబితాను పరిశీలించి అర్హులకు రుణాలు మంజూరు చేయనున్నారు. జిల్లాలో ఎస్సీ వర్గానికి 2,185 యూనిట్లు, బీసీ వర్గానికి చెందిన వారికి 1,845 యూనిట్లు, ఎస్టీ సామాజిక వర్గానికి 3,855 యూనిట్లు కేటాయించారు. సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ రుణాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి. రూ.50వేల యూనిట్లకు వందశాతం రాయితీ ఉండటంతోపాటు బ్యాంకులతో నిమిత్తం లేకుండా రుణం మంజూరవుతుంది. అలాగే వెరిఫికేషన్ ప్రక్రియ కూడా వేగంగా పూర్తవుతుంది. మైనార్టీ విభాగానికి సంబంధించి యూనిట్లు ప్రభుత్వం నుంచి మంజూరవుతాయి. – అబ్దుల్ నదీం, డీఎండబ్ల్యూవోఎస్సీ 6,836 ఎస్టీ 7,233 బీసీ 12,096 మైనార్టీ 1,918 క్రిస్టియన్ 33 మొత్తం 28,116 -
భూభారతితో సమస్యలు పరిష్కారం
ఆసిఫాబాద్: భూభారతి నూతన ఆర్వోఆర్ చట్టం ద్వారా భూసమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, ఎం.డేవిడ్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్రావులతో కలిసి మండల ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, గృహనిర్మాణ శాఖ, మిషన్ భగీ రథ ఇంజనీరింగ్ శాఖల అధికారులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, అర్హుల జాబితా, ఎంపిక, తాగునీటి సరఫరా అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భూభారతి చట్టం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, తాగునీటి సరఫరాపై సీఎం రేవంత్రెడ్డి రాష్ట్ర మంత్రులతో కలిసి హైదరాబాద్లో సమీ క్షా సమావేశం నిర్వహించారని తెలిపారు. నూతన భూభారతి చట్టంలోని అంశాలపై అధికారులకు అ వగాహన ఉండాలని సూచించారు. పైలట్ గ్రామాల్లో నమూనా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. ఇతర గ్రామాల్లో అర్హుల జాబితాను ఇందిరమ్మ కమిటీ సభ్యుల సహకారంతో క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. అత్యంత పేదవారిని గుర్తించి వారికి ప్రాధాన్యతనివ్వాలని, అనర్హులు జాబితాలో లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మిషన్ భగీరథ పథకంలో నల్లా కలెక్షన్ ద్వారా నీటిని సరఫరా చేయలేని ప్రాంతాలకు వాటర్ ట్యాంకులు, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటి సరఫరా చర్యలు చేపట్టాలన్నారు. పైప్లైన్ లేని గ్రామాలను గుర్తించి మరమ్మతులు చేయాలని ఆదేశించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే -
నీటి కుంటల ఏర్పాటుకు శ్రీకారం
రెబ్బెన(ఆసిఫాబాద్): జల వనరులను పెంపొందించాలనే లక్ష్యంతో సింగరేణి యాజమాన్యం నీటి బిందువు –జల సింధువు కార్యక్రమంలో భాగంగా నీటి కుంటల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని సివిల్ జీఎం సూర్యనారాయణ, ఎన్విరాన్మెంట్ జీఎం సైదులు తెలిపారు. జనరల్ మేనేజర్ విజయ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జలవనరుల పెంపు కోసం బెల్లంపల్లి ఏరియాలో చేపట్టిన నీటి కుంటల ఏర్పాటు పనులను మంగళవారం పరిశీలించారు. గోలేటి గ్రామ శివారులోని పంట పొలాల వద్ద చేపట్టిన నీటి కుంటల పనులను పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు వివరించారు. సింగరేణి సంస్థ చేపట్టిన కార్యక్రమం ద్వారా భూగర్భ జలాలు పెరిగి రైతులకు సాగునీరు అందుబాటులోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో డీజీఎం సివిల్ ఎస్కే మదీనా బాషా, ఎన్విరాన్మెంట్ అధికారి హరీశ్, ఏరియా ఎస్టేట్స్ అధికారి సాగర్, ఈఈ సివిల్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు. -
అప్రమత్తతతోనే అగ్ని ప్రమాదాల నివారణ
ఆసిఫాబాద్అర్బన్: అప్రమత్తతతోనే అగ్ని ప్ర మాదాల నివారణ సాధ్యమవుతుందని జిల్లా ఫైర్ అధికారి సురేశ్కుమార్ అన్నారు. అగ్ని మాపక వారోత్సవాల్లో భాగంగా రెండోరోజు మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ప్రయాణికులకు అగ్ని ప్రమాదాల నివారణ, అరికట్టడం ఎలా అనే అంశంపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ ‘అగ్ని నివారణపై అవగాహన పెంచుదాం.. సురక్షిత భారతాన్ని నిర్మిద్దాం’ అనే నినాదంతో ఈ నెల 14 నుంచి 20 వరకు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలి పారు. అనంతరం అగ్ని ప్రమాదాల నివారణ కు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోస్టర్ ఆవిష్కరించారు. లీడింగ్ ఫైర్మెన్ శ్రీనివాస్, డీవోపీలు నర్సింగ్, రమేశ్, ఫైర్మెన్లు స్వామి, శరత్, శివకుమార్, నరేష్, హోగార్డులు రాము, జనార్దన్, తులసీదాస్ ఉన్నారు. -
మే 20న దేశవ్యాప్త సమ్మె
ఆసిఫాబాద్అర్బన్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా మే 20న దేశవ్యాప్త సమ్మె చేపట్టినట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు లోకేశ్, టీయూసీఐ జిల్లా కార్యదర్శి తిరుపతి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవనంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దివాకర్ అధ్యక్షతన మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కేంద్రం ప్రభుత్వం నాలుగు లే బర్ కోడ్లు వెంటనే రద్దు చేసి, కార్మికులు పోరాట లతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలను యథా విధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక చట్టాలను సైతం రద్దు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్, ఆర్టీసీ రిటైర్డ్ కార్మిక సంఘం జిల్లా అ ధ్యక్షుడు మల్లేశం, నాయకులు శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ రైలు 20గంటలు ఖాళీ..!
● నందిగ్రామ్ ఎక్స్ప్రెస్ రైలు కాజీపేట జంక్షన్ వరకు పొడగిస్తే మేలు ● ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రయాణికులకు రవాణా సౌకర్యం ● ఎంపీలు స్పందించాలని రైల్వే ప్రయాణికుల విజ్ఞప్తి బెల్లంపల్లి: ముంబయి ఛత్రపతి శివాజీ టెర్మినల్ నుంచి బల్లార్షా వరకు నందిగ్రామ్ ఎక్స్ప్రెస్ రైలు(నం.11001/2) వయా నాందేడ్, ఆదిలాబాద్ మీదుగా నిత్యం రాకపోకలు సాగిస్తోంది. ప్రస్తుతం ఈ రైలును వరంగల్ జిల్లా కాజీపేట జంక్షన్ వరకు పొడగించాలనే డిమాండ్ కొంతకాలంగా వినిపిస్తోంది. ఉత్తర తెలంగాణ ప్రజలు మహారాష్ట్ర రాజ ధాని ముంబయి వెళ్లడానికి సరైన రైలు ప్రయాణ సౌకర్యం లేకుండా పోయింది. కాజీపేట, హైదరా బాద్ వెళ్తే గానీ ముంబయికి వెళ్లే పరిస్థితులు లేవు. ప్రస్తుతం ముంబయి నుంచి బల్లార్షా జంక్షన్ వరకు నందిగ్రామ్ ఎక్స్ప్రెస్ నడుస్తోంది. ఆ రైలును కాజీపేట జంక్షన్ వరకు పొడగించడం వల్ల రైల్వేపై ఏ మాత్రం భారం పడకపోగా ఉత్తర తెలంగాణ జిల్లాల పరిధిలోని ప్రయాణికులకు ఎంతగానో మేలు జరిగి రవాణా సౌకర్యం మెరుగవుతుంది. సమయం సద్వినియోగం చేసుకుంటే.. ముంబయి ఛత్రపతి శివాజీ టెర్మినల్ నుంచి బయల్దేరిన నందిగ్రామ్ ఎక్స్ప్రెస్ రైలు వయా నాందేడ్, ఆదిలాబాద్ మీదుగా బల్లార్షా జంక్షన్కు చేరుకుంటుంది. ఆ తర్వాత అక్కడే దాదాపు 20గంటలపాటు ఖాళీగా ఉంటుంది. ఆ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కాజీపేట జంక్షన్ వరకు పొడగిస్తే కాజీపేట–బల్లార్షా సెక్షన్ పరిధిలో ఉన్న సిర్పూర్ కాగజ్నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట తదితర ప్రాంతాల ప్రయాణికులకు ఉపయుక్తంగా ఉండడంతోపాటు రైల్వేకు ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాల ప్రజలకు ముంబయి వెళ్లడానికి ఒక్క రైలు సౌకర్యం కూడా లేదు. దీంతో ముంబయి వెళ్లాల్సిన ప్రయాణికులు కాజీపేట జంక్షన్కు వెళ్లి కోణార్క్ ఎక్స్ప్రెస్ లేదా విశాఖ నుంచి ఎల్టీటీ ద్వారా వెళ్లాల్సి వస్తోంది. అదీ సాధ్యం కాకపోతే నిజామాబాద్ జంక్షన్కు వెళ్లి దేవగిరి ఎక్స్ప్రెస్లో ముంబయి వెళ్లాల్సిన ప్రతికూల పరిస్థితులు ఉంటున్నాయి. నందిగ్రామ్ ఎక్స్ప్రెస్ను కాజీపేట జంక్షన్ వరకు పొడగించిన తర్వాత కూడా మరో 11గంటలపాటు రైలు ఖాళీగా ఉండే అవకాశాలు ఉండనున్నాయి. అక్కడ ప్రాథమిక నిర్వహణకు అవకాశం ఉంటుంది. ప్రసుత్తం కాజీపేటలో రెండు ఫిట్లైన్లు అందుబాటులో ఉండడం కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. కాగా, ఆదిలాబాద్ జిల్లా ప్రయాణికులకు వరంగల్ జిల్లా మరింత చేరువవుతుంది. ఎంపీలు స్పందిస్తే ఎంతోమేలు నందిగ్రామ్ ఎక్స్ప్రెస్ రైలు పొడగింపు కోసం ఉత్తర తెలంగాణ ప్రాంతం నుంచి ఎన్నికై న ఎంపీలు స్పందించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. బల్లార్షా జంక్షన్ నుంచి కాజీపేట జంక్షన్ వరకు పొడగించే ప్రయత్నాలు చేయాలి. దీంతోపాటు పెద్దపల్లి నుంచి నిజామాబాద్ రైల్వే మార్గంలో వారానికి మూడు రోజులు ముంబయికి రైలు నడపడంతోపాటు బల్లార్షా–వార్ధా మార్గంలో నూతన వీక్లీ సర్వీసు ప్రవేశ పెడితే ఉత్తర తెలంగాణ ప్రయాణికులకు ముంబయి వెళ్లడానికి సౌకర్యంగా ఉంటుంది. ఈ ప్రాంత ఎంపీలు చిత్తశుద్ధితో కృషి చేయాలని రైలు ప్రయాణికులు కోరుతున్నారు. రద్దు చేసిన రైళ్లను పునరుద్ధరించాలి కరోనా కంటే ముందు నడిపించిన ఆనంద్ వన్(రైలు నెం.22127/28) సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలును అర్ధంతరంగా రద్దు చేశా రు. ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు పునః ప్రా రంభించలేదు. ఈ రైలు కాజీపేట జంక్షన్ నుంచి బయల్దేరి లోక్మాన్య తిలక్ టెర్మినల్ వయా బల్లార్షా, వార్ధా, అమరావతి, అకో లా భూసావల్, మన్మాడ్ మీదుగా ముంబ యి వెళ్లేది. ఈ రైలు వల్ల ప్రయాణ సమ యం తక్కువగా ఉండి ప్రయాణికులకు సౌ కర్యవంతంగా ఉండేది. కానీ ఈ రైలు నిలిపివేయడం వల్ల ముంబయి వెళ్లే ఉత్తర తెలంగాణ ప్రయాణికులకు కష్టాలు పెరిగాయి. -
పెండింగ్ వేతనాలు చెల్లించాలని నిరసన
ఆసిఫాబాద్రూరల్: బీసీ వసతిగృహాల్లో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఐఎఫ్ టీయూ రాష్ట్ర నాయకుడు బ్రహ్మనందం డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట మంగళవారం కార్మికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ బీసీ వసతిగృహాల్లో ఔట్సో ర్సింగ్ వర్కర్లకు 12 నెలలుగా వేతనాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రతినెలా నిత్యావసర వస్తువులు, అత్యవసర ఖర్చులకు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. రూ.13,600 నెలసరి జీతంతో బతుకుతున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించకపోవడం సరికాదన్నారు. ఈఎస్ఐ, ఈపీఎఫ్ ప్రతినెలా చెల్లించాలని డిమాండ్ చేశారు. సమ స్య పరిష్కరించకుంటే నిరవధిక సమ్మెకు పిలుపుని స్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు జగజంపుల తిరుపతి, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమురయ్య, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు లక్ష్మి, శారద, పార్వతి, శకుంతల, పోషక్క, సరోజ, జ్యోతి, సుజాత పాల్గొన్నారు. -
వైద్యసిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వినతి
కెరమెరి(ఆసిఫాబాద్): జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదని, వారిపై తక్షణ మే చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్ రాథోడ్ రమేశ్ కోరారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో మంగళవారం డీఎంహెచ్వో సీతారాంను కలిసి వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ పేదల కు ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్ర భుత్వం ఆస్పత్రులు ఏర్పాటు చేసినా సిబ్బంది, డాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల కెరమెరి పీహెచ్సీకి వైద్యం కో సం వెళ్తే.. అక్కడ ఎవరూ లేని పేర్కొన్నారు. ఆయన వెంట నాయకులు నైతం మోహన్, నైతం భానుచందర్, చౌరే మహేశ్ ఉన్నారు. -
పాఠశాలల్లో సర్వే షురూ
ఆసిఫాబాద్రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడంతోపాటు యూడైస్ ప్లస్ పోర్టల్లో వివరాలు సరిచూసేందుకు జిల్లాలో మంగళవారం నుంచి స ర్వే ప్రారంభమైంది. జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ అబిద్ అలీ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 591 పాఠశాలల్లో 61 మంది ఛాత్రోపాధ్యాయులు ఈ నెల 21 వరకు సర్వే చేస్తారని తెలి పారు. తొలిరోజు 126 పాఠశాలల్లో వివరాలు సేకరించామని వెల్లడించారు. గతంలో హెచ్ఎంలు యూడైస్ ప్లస్లో నమోదు చేసిన వివరాలు సక్రమంగా ఉన్నాయా.. లేదా అని పరిశీలించి తప్పులు ఉంటే సరిచేసి కార్యాలయంలో అందజేస్తారని పేర్కొన్నారు. -
సర్కారు బడుల్లో సర్వే
పాఠశాలల్లో వాస్తవ పరిస్థితులు తెలియజేసేందుకు రూపొందించిన యూడైస్ ప్లస్(డిస్ట్రిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్)లో తరచూ తప్పులు దొర్లుతున్నాయి. ఆన్లైన్లో ఉండే వివరాలకు పాఠశాలల్లో రికార్డులకు సరిపోలడం లేదు. విద్యార్థులు ఎంతమంది ఉన్నారు.. మరుగుదొడ్లు ఉన్నాయా.. తరగతి గదులెన్నీ.. తదితర విషయాల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ క్షేత్రస్థాయిలో వివరాలు పరిశీలించేందుకు తొలిసారి థర్ట్ పార్టీతో సర్వే చేపట్టనుంది. మంగళవారం నుంచి ఎంపిక చేసిన పాఠశాలల్లో వివరాల సేకరణ కొనసాగనుంది. -
బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేడ్కర్
ఆసిఫాబాద్అర్బన్: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం షెడ్యూల్ కులాల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అధికారులు, అంబేడ్కర్ యువజన సంఘాలు, కుల సంఘాల నాయకులతో కలిసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ బలహీన వర్గాల సంక్షేమ కోసం అంబేడ్కర్ తన జీవి తాన్ని త్యాగం చేశారన్నారు. జిల్లా కేంద్రంలోని లుంబినీ దీక్ష భూమి అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ అసమానతలు, కుల వివక్ష ఉన్న రోజుల్లోనే అంబేడ్కర్ అత్యున్నత చదువులు చదివి డాక్టరేట్లు పొందారని గుర్తు చేశారు. సమానత్వం, స్వేచ్ఛ. సోదరభావం విలువలు నిలబెట్టేందుకు కృషి చేయాలని సూచించారు. కులాంతర వివాహం చేసుకున్న పలు జంటలకు ఆర్థిక ప్రోత్సాహం కింద ఒక్కొక్కరికి రూ.2.5లక్షల విలువైన బాండ్లు అందజేశారు. అంతకు ముందు జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో గల అంబేడ్కర్ విగ్రహానికి అధికా రులు, ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి సజీవన్, డీపీవో భిక్షపతిగౌడ్, డీపీఆర్వో సంపత్కుమార్, విద్యాశాఖ అధికారి ఉదయ్బాబు, నాయకులు అరిగెల నాగేశ్వర్రావు, అజ్మీరా శ్యాంనాయక్, రేగుంట కేశవ్రావు, మెంగాజీ, అశోక్, రూప్నార్ రమేశ్, ఆత్మారాం, అలీబిన్ అహ్మద్, సత్యనారాయణ పాల్గొన్నారు. కాగజ్నగర్రూరల్: పట్టణంలోని అంబేడ్కర్ వి గ్రహానికి ఎమ్మెల్యే హరీశ్బాబు నివాళులర్పించారు. డాక్ట ర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రచించిన రా జ్యాంగంతోనే ప్రస్తుతం భారతదేశం అవిచ్ఛిన్న భూభాగంగా ఉందన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. -
‘జుబ్లీ మార్కెట్ తరలిస్తే సహించేది లేదు’
ఆసిఫాబాద్అర్బన్: రాజంపేటలోని జుబ్లీ మార్కెట్ను తరలిస్తే సహించేది లేదని ఎమ్మె ల్యే కోవ లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం డీపీవో భిక్షపతిగౌడ్తో కలిసి మార్కెట్ ను పరిశీలించారు. జుబ్లీ మార్కెట్లోనే కూరగాయలు, చికెన్, మటన్, చేపలు విక్రయించాల్సి ఉండగా, పట్టణంలో పలుచోట్ల అమ్ముతున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసిఫాబాద్ పట్టణంలో కూరగాయలు, మాంసాహార దు కాణాలు ఏర్పాటు చేయొద్దని, జుబ్లీ మార్కెట్లోనే విక్రయాలు సాగేలా చర్యలు తీసుకో వాలని ఆదేశించారు. రాజంపేట పంచాయ తీ, ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో వ్యాపారలన్నీ ఒకేచోట కొనసాగించాలన్నారు. ప్రజలు, వ్యాపారులకు ఇబ్బందులు కలిగిస్తే ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్ ఉన్నారు. -
పోరాడితేనే ఆదివాసీలకు మనుగడ
● తుడుందెబ్బ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బుర్స పోచయ్య ● జోడేఘాట్లో ముగిసిన రాష్ట్ర మహాసభలు కెరమెరి(ఆసిఫాబాద్): హక్కులు, చట్టాల రక్షణ కోసం పోరాడితేనే ఆదివాసీలకు మనుగడ అని తుడుందెబ్బ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బుర్స పోచ య్య, రాష్ట్ర అధ్యక్షుడు కోట్నాక విజయ్కుమార్ అన్నారు. కెరమెరి మండలం జోడేఘాట్లో నిర్వహిస్తున్న రాష్ట్ర మహాసభలు సోమవారం ముగిశాయి. వారు మాట్లాడుతూ రాంజీగోండు, కుమురంభీం హక్కుల సాధన కోసం చేసిన ప్రాణత్యాగం వృథా కావొద్దన్నారు. మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. అంతకు ముందు కుమురంభీం విగ్రహానికి నివాళులర్పించారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్, నాయకులు నగేశ్, రఘుపతిరావు, రవి, బాపు, నరసింహరావు, కిశోర్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గంఆదివాసీ హక్కుల పోరాట సమితి(తుడుందెబ్బ) నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షుడుగా బుర్స పోచయ్య, రాష్ట్ర అధ్యక్షుడు కోట్నాక విజయ్, కార్యనిర్వాహక అధ్యక్షులుగా గుర్రాల రవీందర్, ఈసం నర్సయ్య, ఉపాధ్యక్షులుగా బాపు, మెస్రం మోతీ రాం, పెందోర్ జలపతి, సోయం రాజేందర్, జంగు, పెందోర్ ధర్మూ, ప్రధాన కార్యదర్శిగా సిద్దిబో యిన లక్ష్మీనారాయణ, కార్యదర్శులుగా ఆలం కిశోర్, కుడ్మెత తిరుపతి, ఆత్రం రవీందర్, పెందోర్ మారుతి, కోశాధికారిగా చందా రఘుపతిరావు, కార్యవర్గ సభ్యులుగా సోయం జంగు, ధారబోయిన రమేశ్, ఆత్రం బిర్సను ఎన్నుకున్నారు. -
అంబేడ్కర్ జీవితం ఆదర్శనీయం
ఆసిఫాబాద్అర్బన్: అంబేడ్కర్ జీవితం ప్రతీ ఒక్కరి కి ఆదర్శనీయమని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నా రు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయ ఆవరణ లో సోమవారం బీఆర్ అంబేడ్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నేడు ప్రజలు అనుభవిస్తున్న హక్కులన్నీ రాజ్యాంగ ఫలాలేనని అన్నారు. రాజ్యాంగంలో పొందుపర్చిన ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐ రాణాప్రతాప్, రవీందర్, ఆర్ఐ పెద్దన్న, పోలీసు సంఘం జిల్లా అధ్యక్షు డు విజయ శంకర్రెడ్డి, సీసీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కార్యాలయంలో సోమవారం జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. 1944 ఏప్రిల్ 14న ముంబై ఓడరేవులో జరిగిన అగ్ని ప్రమాదంలో అమరులైన సిబ్బంది ఆత్మకు శాంతి చేకూరాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సురేశ్కుమార్, లీడింగ్ ఫైర్మ్యాన్ శ్రీనివాస్ నేతృత్వంలో రెండు నిమిషాలపాటు మౌనం పా టించారు. అనంతరం జిల్లా అధికారి మాట్లాడుతూ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో వారం రోజులపాటు వివిధ రకాల అంశాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. ఈ ఏడాది యూ ఫైట్ టు ఇగ్నైట్– ఫైర్ సేఫ్ ఇండియా నేపథ్యంతో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తున్నామన్నారు. వేసవి నేపథ్యంలో అగ్ని ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ నెల 20 వరకు వారోత్సవాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా అగ్నిమాపక వస్తువులు ప్రదర్శించారు. కార్యక్రమంలో డీవోపీలు నర్సింగ్రావు, రమేశ్, ఫైర్మ్యాన్లు స్వామి, శరత్, శివకుమార్, నరేశ్, హోంగార్డులు రాము, జనార్దన్, తులసీదాస్ పాల్గొన్నారు. -
ప్రజాపాలన తీసుకొచ్చాం
● ఎన్నికల హామీలు నెరవేరుస్తున్నాం ● డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ● మంచిర్యాల నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన మంచిర్యాలటౌన్: అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు ప్రజాపాలన తీసుకొచ్చామని, ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయనకు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఘన స్వాగతం పలికారు. అనంతరం మంచిర్యాలలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఐబీ ఆవరణలో మాతాశిశు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణ పనులను పరిశీలించారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా కేక్ కట్ చేశారు. జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ తాను మార్చి 16, 2023లో పీపుల్స్ మార్చ్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర ప్రారంభించానని, అదే ఏడాది ఏప్రిల్ 14న మంచిర్యాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేను పిలిపించామని తెలిపారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఏంటో తెలిసిందని, మొదటి నుంచి పార్టీకి అండగా ప్రేమ్సాగర్రావు నిలిచారని, ఆయనకు కార్యకర్తలు తోడుగా నిలుస్తున్నారని అన్నారు. పాదయాత్ర సమయంలో మంచిర్యాలలోని మాతాశిశు ఆసుపత్రిని గోదావరి ఒడ్డున కట్టవద్దని చెప్పినా వినకపోవడంతో అక్కడే నిర్మించడం వల్ల వరదల్లో మునిగి పోయిందని తెలిపారు. నాడే ప్రజలకు అందుబాటులో ఉండేలా ఎంసీహెచ్ నిర్మిస్తామని ఇచ్చిన హామీ ప్రకారం ఐబీ ఆవరణలో నిర్మిస్తున్నట్లు చెప్పారు. గోదావరి నది వరదతో రాళ్లవాగు ఉప్పొంగి ఈ ప్రాంతం మునిగిపోతుందని, కరకట్ట నిర్మించాలని నాడు ప్రజలు కోరారని, వారి కోరిక మేరకు కరకట్టను నిర్మిస్తున్నామని అన్నారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించి సాగు, తాగునీరు అందిస్తామని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అర్ధంతరంగా నిలిపి వేసిన ప్రాజెక్టును ప్రారంభించి పూర్తి చేస్తామన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో రూ.765 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం అభినందనీయమని అన్నారు. ఈ సభలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, జైబాపు, జైభీం, జైసంవిధాన్ కోఆర్డినేటర్ రుద్ర సంతోశ్ తదితరులు పాల్గొన్నారు. -
రక్తదానం.. మరొకరికి ప్రాణదానం
● ఏఎస్పీ చిత్తరంజన్ వాంకిడి(ఆసిఫాబాద్): రక్తదానం మరొకరికి ప్రాణదానం వంటిదని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నా రు. బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో వాంకిడి మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహార ఆవరణలో ఆదివారం ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ఆపదలో ఉన్నవారికి రక్తం దానం చేయడంలో ముందుండాలని పిలుపునిచ్చారు. తద్వారా ఒకరి ప్రాణాలు నిలబెట్టిన వారవుతారని అన్నారు. సమాజ సేవలో బా ధ్యతగా ఉంటూ వ్యక్తిగత ఎదుగుదలపై దృష్టి సా రించాలని సూచించారు. మహనీయుని జయంతి సందర్భంగా సామాజిక కార్యక్రమం నిర్వహించ డం అభినందనీయమని కొనియాడారు. రక్తదానం చేసిన యువకులను అభినందించారు. 22 యూని ట్ల రక్తం సేకరించి ఆసిఫాబాద్ రక్తనిధి కేంద్రానికి అప్పగించినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సీఐ సత్యనారాయణ, రక్తనిధి కేంద్రం వై ద్యుడు అమ్జద్, బౌద్ధ సంఘం, బీఎస్ఐ, సిద్దార్థ యువజన సంఘం, సమతా సైనిక్ దళ్, రమాబా యి మహిళా సంఘం నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్తోనే అభివృద్ధికౌటాల(సిర్పూర్): కాంగ్రెస్ పార్టీతోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. కౌటాల మండలం మొగడ్దగడ్ గ్రామంలో ఆదివారం రాత్రి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని కించపరుస్తు న్న బీజేపీకి రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. బీజేపీ పాలనలో దేశంలో అభివృద్ధి జరగడం లేదని ఆరోపించారు. అంతకుముందు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరగా, వారికి కండువా కప్పి ఆహ్వానించా రు. కార్యక్రమంలో నాయకులు ఖాళీం, భూషన్, ఉ ద్దవ్, కార్తీక్, సుదర్శన్, సంతోష్, వినోద్, సోను, జో గు, భాస్కర్, పోశం తదితరులు పాల్గొన్నారు.