breaking news
Orissa
-
ప్రాణహాని లేకుండా చూడడమే లక్ష్యం
● సీఎం మోహన్చరణ్ మాఝి భువనేశ్వర్: మోంథా తుఫాన్ విపత్కర పరిస్థితుల్లో ఎటువంటి ప్రాణహాని లేకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి మోహన్చరణ్ మాఝి అన్నారు. ఈ మేరకు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో వివిధ జిల్లాలు ముఖ్యంగా దక్షిణ ఒడిశా జిల్లాల్లో భారీ వర్షం, ఈదురు గాలులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ వైపరీత్యంలో ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి ఒక్కరినీ తుఫాన్, వరద ఆశ్రయ కేంద్రాలకు లేదా ఇతర సురక్షిత ప్రదేశాలకు తరలించాలని ఆదేశించారు. గతేడాది దానా తుఫాను సమయంలో విజయవంతంగా ప్రజలను సకాలంలో సురక్షిత ప్రాంతాలకు తరలించిన విషయాన్ని గుర్తు చేశారు. తుఫాన్ తదనంతర కార్యాచరణలో పునరుద్ధరణ అత్యంత కీలకమన్నారు. ఇంజినీరింగ్ విభాగాలు పూర్తిగా సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. తుఫాను తీవ్రతతో కూలిన చెట్లతో రాకపోకలకు ఆటంకం కలగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. తుఫాన్ తర్వాత నష్టాన్ని వెంటనే అంచనా వేసి రైతులకు అవసరమైన సాయం అందజేయాలని వ్యవసాయ శాఖను ఆదేశించారు. 8 జిల్లాలపై తుఫాన్ ప్రభావం గంజాం, గజపతి, రాయగడ, కొరాపుట్, మల్కన్గిరి, కంధమల్, కలహండి మరియు నవరంగ్పూర్తో సహా 8 జిల్లాల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. సురక్షిత ప్రాంతాల్లో ప్రజలకు ఆశ్రయం కల్పించేందుకు 2,048 తుఫాన్, వరద ఆశ్రయాలను సిద్ధం చేశారు. ఈ కేంద్రాలకు 8 జిల్లాల నుంచి ఇప్పటివరకు 11,396 మందిని తరలించారు. అవసరమైతే మరో 30,554 మందిని తరలిస్తారు. 1,871 మంది గర్భిణులను ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. మరో 822 మందిని తరలిస్తారు. మొత్తం 2,693 మంది గర్భిణులను ఆరోగ్య కేంద్రాలకు తరలిస్తారు. తుఫాన్ను ఎదుర్కోవడానికి 30 యూనిట్ల ఓడ్రాఫ్, 5 యూనిట్ల ఎన్డీఆర్ఎఫ్ మరియు 123 అగ్నిమాపక దళం బృందాలను మోహరించారు. మరిన్ని బృందాలు అప్రమత్తంగా ఉన్నాయి. అవసరమైతే వారిని మోహరిస్తారు. ప్రభావిత 8 జిల్లాల్లోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను ఈనెల 30 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అధికారులు సిద్ధంగా ఉండాలి ఇంజినీరింగ్ విభాగాలు నిరంతర విద్యుత్ సరఫరా మరియు తాగునీటి సరఫరా కోసం సిద్ధంగా ఉండాలని ప్రత్యేకంగా ఆదేశించారు. ప్రత్యామ్నాయంగా జనరేటర్ సెట్లను సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రభావిత ప్రాంతాల్లోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో పాముకాటు చికిత్స కోసం తగినంత ఇంజెక్షన్లు, మందులు మరియు చికిత్స కిట్లను సిద్ధంగా ఉంచుతారు. ఈనెల 31 వరకు సముద్రం మరియు కొండ ప్రాంతాలను సందర్శించకుండా పర్యాటకులను నిషేధించారు. మత్స్యకారులు సముద్రంలోకి ప్రవేశించవద్దని హెచ్చరించారు. -
అంకితభావంతో విధులు నిర్వర్తించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉద్యోగ సర్వీసులో ఎలాంటి పొరపాట్లు చేయరాదని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విజిలెన్స్ అవేర్నెస్ వీక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఉద్యోగి అంకితభావంతో విధులు నిర్వర్తించాలని, ఎలాంటి లంచాలకు తావు ఇవ్వకూడదని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఏసీబీ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్.వి.రమణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ఏసీబీ డీజీపీ ఆదేశాల మేరకు అక్టోబరు 27 నుంచి నవంబరు 2 వరకు ఏసీబీ విజిలెన్స్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి జి.ఎ.సూర్యనారాయణ, ఏసీబీ ఇన్స్పెక్టర్ కె.భాస్కరరావు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
భారీగా పట్టుబడిన గంజాయి
పర్లాకిమిడి: గజపతి జిల్లాలోని మోహనా బ్లాక్ అడవ పోలీసు అధికారులు సోమవారం రాత్రి భారీగా గంజాయిని పట్టుకున్నారు. పెట్రోలింగ్ జరుపుతుండగా పికప్ వ్యాన్, కారులో అక్రమంగా రవాణా చేస్తున్న 4 క్వింటాళ్ల 15 కిలోల గంజాయిని అబ్కారీ శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. వీటి విలువ సుమారు రూ.41.05 లక్షలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తమకు వచ్చిన సమాచారం మేరకు అడవ పోలీసులు, అబ్కారీ సిబ్బంది మోహనా రోడ్డులో ఈ రెండు వాహనాలను పట్టుకుని సీజ్ చేశారు. అలాగే ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. -
విద్యుత్ షాక్తో ఇద్దరు మృతి
పోలాకి: జిల్లాలో వేర్వేరు చోట్ల విద్యుత్ షాక్కు గురై ఇద్దరు మృత్యువాతపడ్డారు. పోలాకి మండలంలో తీరప్రాంత గ్రామమైన గుల్లవానిపేటలో కారి రామచంద్రరావు(37) దీపావళి సందర్భంగా ఇటీవల ఇంటికి సీరియల్సెట్ అలంకరించాడు. తుఫాన్ నేపథ్యంలో ఎక్కువగా గాలులు వీస్తున్నందున మంగళవారం సీరియల్ సెట్ తొలగించే క్రమంలో విద్యుత్ షాక్కు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. రామచంద్రరావుకు భార్య మమత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, ఇంటికి ఆసుకుని ఉన్న విద్యుత్లైన్ తగలడంతోనే ప్రమాదం జరిగిందని, హైటెన్షన్ వైర్లు తొలగించాలని కోరినా ట్రాన్స్కో అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ట్రాన్స్కో సిబ్బంది మాత్రం ఇంటి వద్దే విద్యుత్షాక్కు గురైనట్లు చెబుతున్నారు. పోలాకి ఎస్ఐ రంజిత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. బొంతలకోడూరులో వీఆర్ఏ.. ఎచ్చెర్ల : బొంతలకోడూరు పంచాయతీ వీఆర్ఏ బి.నర్సింహులు (45) మంగళవారం విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. భవానీ మాల వేసిన ఈయన సన్నిధానానికి విద్యుత్ సరఫరా రాకపోవడంతో జాయింట్ కలిపేందుకు వెళ్లి షాక్కు గురైనట్లు గ్రామస్తులు చెబుతున్నారు. చికిత్స నిమిత్తం రిమ్స్కు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నర్సింహులకు ముగ్గురు కుమార్తెలు, భార్య ఉన్నారు. రామచంద్రరావు(ఫైల్)నర్సింహులు (ఫైల్) -
విగతజీవిగా యువకుడు
మల్కన్గిరి: స్థానిక పోలీసుస్టేషన్ పరిధి ఇర్మాగూడ గ్రామానికి చెందిన లలిన్ మాడి కాలువలో తన బైక్తో పాటు మృతదేహమై మంగళవారం సాయంత్రం కనిపించాడు. అయితే ఇది హత్య అని ఫిర్యాదు రావడంతో మల్కన్గిరి ఐఐసీ రీగాన్కీండో హత్య కేసు నమోద్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన యువకుడు కొన్ని గంటల్లో కాలువలో శవమై కనిపించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెడపై తీవ్రమైన కత్తిగాట్లు ఉండడంతో ఇది హత్యగా భావిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని మల్కన్గిరి ప్రభుత్వాస్పత్రికు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భవితకు రక్షణ
యువతకు శిక్షణ.. ● స్వయం ఉపాధి కోర్సులతో ఆర్థిక భరోసా ● ఎచ్చెర్ల మహిళా ప్రాంగణం వేదికగా ట్రైనింగ్ ● ఆసక్తి చూపుతున్న మహిళలు ఎచ్చెర్ల : ప్రస్తుత పోటీ ప్రపంచంలో డిగ్రీ పట్టాలు చేతిలో ఉన్నా ఉద్యోగాలు అంత తొందరగా రావడం లేదు. ప్రిపరేషన్తోనే కాలం గడిచిపోతుంది తప్ప కొలువు చేతికి అందడం లేదు. పదో తరగతి తర్వాత ఆపేస్తే ఇక అంతే సంగతి. ఈ నేపథ్యంలో స్వయం ఉపాధిపై చాలా మంది మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా యువతులు ఉపాధి, ఉద్యోగావకాశాలు పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి వారికి శిక్షణలు కీలకం. అందుకే ప్రభుత్వమే యువతుల కోసం అనేక అంశాల్లో శిక్షణ ఇస్తోంది. హోటల్ మేనేజ్మెంట్, కంప్యూటర్ తదితర అంశాల్లో కోర్సులు ఆఫర్ చేస్తోంది. ఎచ్చెర్ల మహిళా ప్రాంగణం వేదికంగా మహిళల కోసం హోటల్ మేనేజ్మెంట్, గెస్ట్ సర్వీస్ అసోసియేషన్, టెలీ కాలింగ్, కంప్యూటర్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్, సాఫ్ట్స్కిల్స్ కోర్సులు నిర్వహిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో దీన్దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన కింద ఉచితంగా శిక్షణ ఇస్తోంది. భోజన, వసతి సదుపాయాలతో ఈ ప్రాంగణంలో కోర్సులకు సంబంధించి కనీస విద్యార్హత 10వ తరగతి కలిగిన గ్రామీణ యువతకు శిక్షణ ఇస్తున్నారు. 18 నుంచి 35 ఏళ్ల మహిళలు అర్హులు. 90 రోజుల పాటు శిక్షణ ఉంటుంది. ఇప్పటికి 3 బ్యాచ్లకు శిక్షణ ఇచ్చి 90 మందికి ఉపాధి కల్పించారు. ప్రస్తుతం ఇక్కడ 4, 5 బ్యాచ్లకు సంబంధించి 70 మందికి శిక్షణ ఇస్తున్నారు. మంచి ఉద్యోగావకాశాలు ఇక్కడ ఉపాధి శిక్షణలో నైపుణ్యతను సాధించిన మహిళలకు విశాఖ హెచ్ఆర్ గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్, విశాఖ భారత్ బ్యాంక్, అమెజాన్, ప్లిఫ్కార్ట్, హోటల్ మేనేజ్మెంట్, పేరడైజ్, భాష్యవ స్కూల్స్, చిత్తూరులోని అమరాన్ బ్యాటరీస్ వంటి కంపెనీల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నారు. వీరికి నెలకు రూ.20 వేల వేతనంతో కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పూర్తిచేసుకున్న వారి తల్లిదండ్రులకు 2018 నుంచి ఉపాధి పథకం జాబ్కార్డు కలిగి ఉండి 100 రోజులు పనిదినాలు పూర్తి చేసుకుంటే వారి అకౌంట్స్లో రూ.24 వేలును ఉపాధి హామీ పథకం ద్వారా జమ చేస్తున్నారు. ఉపాధి లక్ష్యంతో.. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన నేను ఉపాధి లక్ష్యంగా కోర్సులో చేరాను. కోర్సు పూర్తిచేసిన అనంతరం స్వయం ఉపాధి సాధించి ఇంటికి ఆర్థికంగా సహాయ పడతాను. దూరవిద్యలో ఉన్నత విద్యను కొనసాగిస్తాను. – కె.శ్రావణి, ఎం.లింగాలవలస ఆర్థిక భరోసా శిక్షణ ద్వారా ఆర్థికంగా స్థిరపడతాననే నమ్మకం కలుగుతుంది. శిక్షణలో బాగా మెలకువలు నేర్పిస్తున్నారు. తల్లిదండ్రులు ప్రోద్బలంతో శిక్షణలో చేరాను. ఓ వైపు చదువు కొనసాగిస్తూ మరోవైపు శిక్షణ పొందుతున్నాను. – కె.భవానీ, చీపురుపల్లి నమ్మకం పెరిగింది కోర్సు వల్ల ఉపాధి లభిస్తుందనే నమ్మకం కుదిరింది. కంప్యూటర్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్పై అనేక విషయాలు నేర్పిస్తున్నారు. భవిష్యత్తులో స్థిరపడగలననే నమ్మకం కుదిరింది. – టి.పుష్పలత, బైరిపురంచదువు కొనసాగిస్తూ... డిగ్రీ చదువును కొనసాగిస్తూ శిక్షణ పొందుతున్నాను. ఇక్కడ శిక్షణ ద్వారా అనేక విషయాలను తెలుసుకుంటున్నాను. ఉద్యోగం సాధించడానికి ఈ శిక్షణ చాలా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను. – ఎల్.లలిత, ఇప్పిలి ఆర్థిక ఆసరా.. ప్రస్తుతం నాలుగు, ఐదు బ్యాచ్లకు శిక్షణ కొనసాగుతుంది. శిక్షణ అనంతరం సర్టిఫికెట్ల జారీతో పాటు ప్లేస్మెంట్స్ కల్పిస్తున్నాం. కోర్సు విజయవంతంగా ముందుకు సాగుతుంది. తర్వాత బ్యాచ్ వివరాలు త్వరలో ప్రకటిస్తాం. – కె.గౌరీశ్వరీ, ఇన్స్ట్రక్టర్, పొందూరు -
గంజాయితో ఒడిశా మహిళా అరెస్టు
పలాస: ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా గుల్బా గ్రామానికి చెందిన మహిళ మిక్కికుమారి మాలిక్ను మంగళవారం సుమారు రూ.55వేలు విలువైన 11 కిలోల గంజాయితో అరెస్టు చేసినట్లు పలాస జీఆర్పీ ఎస్ఐ కోటేశ్వరరావు చెప్పారు. ఆర్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మాల్యాద్రి సిబ్బందితో కలిసి తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా ఓ మహిళ కనిపించింది. ట్రాలీ బ్యాగ్ తనిఖీ చేయగా గంజాయి బయటపడింది. వెంటనే రైల్వే పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కళాశాలలో తనిఖీలు ఇచ్ఛాపురం: పట్టణంలోని స్వర్ణభారతి జూనియర్ కళాశాలను ఆర్ఐఓ తవిటినాయుడు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను, ల్యాబ్లను పరిశీలించారు. మోంథా తుఫాన్ నేపథ్యంలో ఎటువంటి తరగతులు నిర్వహించకూడదని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ చాట్ల తులసీదాస్, రాము, ప్రిన్సిపాల్ జె.జయప్రకాష్, సందీప్, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. టెక్కలి రూరల్: మండలంలోని నౌపడ ఆర్ఎస్ రైల్వే గేటు సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కటక్కు చెందిన బెహరా కన్న మూలపేట పోర్టులో పనిచేస్తూ తన అత్తగారి గ్రామమైన సంతబొమ్మాళి మండలం ఆకాశ లక్కవరంలో నివాసముంటున్నారు. మంగళవారం రాత్రి భార్య సుకన్య(ఐదు నెలల గర్భిణి)తో కలసి ద్విచక్రవాహనంపై టెక్కలి వైపు వస్తుండగా నౌపడ ఆర్ఎస్ రైల్వే గేటు దాటిన తర్వాత వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ గాయపడటంతో స్థానికులు టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. కన్నకు కుడి చెయ్యి విరగ్గా.. సుకన్యకు సైతం గాయాలయ్యాయి. టెక్కలి పోలీసులు వివరాలు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జిల్లాస్థాయి సివిల్ సర్వీసెస్ క్రీడా ఎంపికలు వాయిదా శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల క్రీడా ఎంపిక పోటీలు వాయిదా పడ్డాయి. తుఫాను కారణంగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఈనెల 30వ తేదీన జరగాల్సిన ఎంపిక పోటీలను వాయిదా వేసినట్టు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎ.మహేష్బాబు తెలిపారు. తదుపరి ఎంపికల తేదీని త్వరలో వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు (ఆఫీస్ సబార్డినేట్ నుంచి జిల్లా అధికారి వరకు) వారిలో ఉన్న క్రీడానైపుణ్యాన్ని ప్రదర్శించేందుకుగాను ఏటా సివిల్ సర్వీసెస్ క్రీడా పోటీల పేరిట ఎంపిక పోటీలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వృద్ధురాలిపై దాడి..బంగారం చోరీ సారవకోట: బుడితి గ్రామంలో నక్క చెల్లెమ్మ (80) అనే వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి బంగారం చోరీ చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బుడితిలో నక్క చెల్లెమ్మ తన ఒంటరి వృద్ధురాలు సోమవారం రాత్రి తన ఇంట్లో నిద్రపోయింది. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తికి ఇంట్లోకి చొరబడి వృద్ధురాలి చెవి, ముక్కుకు ఉన్న అరతులం బంగారు వస్తువులు తెంచేశాడు. ఆమె ప్రతిఘటించడంతో దుండగుడు ఇనుప చువ్వతో దాడికి పాల్పడటంతో మెడపై తీవ్ర గాయమైంది. వృద్ధురాలి కేకలు విని స్థానికులు చేరుకునే లోపే దుండగుడు పరారయ్యాడు. అవంతరం బాధితురాలిని బుడితి సీహెచ్సీకి తరలించి వైద్యం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు బుడితి ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. ఎస్ఐ అనిల్కుమార్ కేసు నమోదు చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. -
విద్యాదానం కార్యక్రమం ప్రారంభం
రాయగడ: పట్టణంలోని వివిధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పాఠాలు చెప్పేందుకు స్థానిక శిష్టకరణాల సంఘం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు స్థానిక శ్రీరామలింగేశ్వర ఆలయం ప్రాంగణంలో విద్యాదానం కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ నెలకు రెండు రోజులు 5 నుంచి 8వ తరగతుల్లో చదువుతున్న విద్యార్థులకు తమ సంఘం ద్వారా ఉచితంగా పాఠాలు చెప్పేందుకు విద్యాదానం పేరిట కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఉపాధ్యాయులు హరిశంకర్ పట్నాయక్, లక్ష్మీప్రసాద్ పట్నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు పాఠాలు బోధిస్తారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం కోశాధికారి సారధి పట్నాయక్, సభ్యులు గిరీష్ పట్నాయక్, కేకేఎం పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
పునరావాస కేంద్రాలకు 118 మంది గర్భిణులు
భువనేశ్వర్: మోంథా తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై కనిపిస్తోంది. దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం తూర్పు కోస్తా రైల్వే (ఈకోర్) మరియు దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) సీనియర్ అధికారులతో తుఫాన్ మోంథా సన్నద్ధతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. తూర్పు తీరం వెంబడి ముంచుకొస్తున్న మోంథా తుఫాన్ దృష్ట్యా రైల్వే నెట్వర్క్ సన్నద్ధతను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రయాణికుల భద్రత, రైలు రవాణా నియంత్రణ, సత్వర పునరుద్ధరణ కార్యకలాపాల ప్రణాళిక, స్థానిక రైల్వే యంత్రాంగం మరియు విపత్తు నిర్వహణ సంస్థలతో సమన్వయం చర్యలను గమనించారు. తూర్పు కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్, ప్రధాన విభాగాధిపతులు మరియు మండల రైల్వే మేనేజర్లు (డీఆర్ఎం) సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. తుఫాను తాకిడి ప్రాంతాలు ప్రధానంగా వాల్తేరు మరియు ఖుర్దారోడ్ మండలాల్లో చేపట్టిన ముందు జాగ్రత్త చర్యల గురించి మంత్రికి వివరించారు. ప్రయాణికుల భద్రత నిర్ధారణ, నిరంతరాయ కమ్యూనికేషన్ వ్యవస్థ పరిరక్షణ, విపత్తు ప్రతిస్పందన బృందాల నియామకం అంశాలపై మంత్రి దృష్టి సారించారు. తుఫాను తదనంతర రైలు సేవల సత్వర పునరుద్ధరణపై రైల్వే జోన్లు హై అలర్ట్లో ఉంటూ చురుకుగా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. స్థానిక లోక్సేవా భవన్లో మంగళవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి మోంథా తుఫాను పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ విభాగం మంత్రి సురేష్ కుమార్ పూజారి హాజరయ్యారు. ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి, అభివృద్ధి కమిషనర్, ప్రత్యేక సహాయ కమిషనర్ (ఎస్ఆర్సీ), వాతావరణ శాస్త్రవేత్తలు, జలవనరుల శాఖ కార్యదర్శి, పోలీస్ మరియు అగ్నిమాపక శాఖ డీజీలు హాజరయ్యారు. మోంథా తుఫాను తీవ్ర తుఫానుగా మారింది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తీరం సమీపిస్తోంది. మోంథా మచిలీపట్నం, కాకినాడ తీరాలు గుండా గోపాల్పూర్ తీరానికి చేరువవుతుంది. తుఫాను తీరం తాకే ప్రక్రియ క్రమంగా పుంజుకుంటోంది. తుఫాన్ ప్రభావంతో వర్షపాతం క్రమేపీ పెరుతుతోంది. గంజాం జిల్లా పత్రపూర్లో అత్యధికంగా 117 మిల్లీ మీటర్లు, గజపతి జిల్లా గొషాణిలో 115 మిల్లీ మీటర్లు, మోహనాలో 112 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జంట నగరాలు భువనేశ్వర్లో 18 మిల్లీ మీటర్లు, కటక్లో 12 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. రాష్ట్రం చేరుకునే సమయానికి తుఫాన్ బలహీనపడుతుందని వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ తెలిపారు. ఇది దక్షిణ ఒడిశా మీదుగా ఛత్తీస్గఢ్ వైపు వెళుతుంది. దీంతో మల్కన్గిరి, గంజాం, గజపతి, రాయగడ, కంధమల్, కలహండి మరియు నవరంగ్పూర్లు ప్రభావితం అవుతాయి. ఒడిశాలో తుఫాను బలహీనపడడంతో గాలులు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. 28 రాత్రి నుంచి 29 ఉదయం మధ్య దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్రో తెలిపారు. ● పుకార్లను నమ్మవద్దు: ఐఎండీ డీజీ మోంథా తుఫానుకు సంబంధించిన ఎలాంటి పుకార్లను నమ్మవద్దని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్రో తెలిపారు. 28వ తేదీ మంగళవారం సాయంత్రం నుంచి 29వ తేదీ ఉదయం వరకు వాతావరణం ఉధృతంగా ఉంటుందన్నారు. దక్షిణ ఒడిశాలో వర్షాలు ప్రారంభమై వర్షపాతం క్రమంగా పెరుగుతుందని పేర్కొన్నారు. 29వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. వర్షాలు వరి పంటను దెబ్బతీస్తాయని, పూరిళ్లు ప్రభావితమవుతాయని పేర్కొన్నారు. మోంథా తుఫాను ప్రభావంతో ఏర్పడిన అల్లకల్లోల పరిస్థితుల కారణంగా గంజాం జిల్లాలోని గోపాల్పూర్ సమీపంలోని సముద్రంలో 28 ఫిషింగ్ ట్రాలర్లు చిక్కుకుపోయాయి. గోపాల్పూర్ ఓడరేవు నుంచి ఒక పెద్ద నౌక సహాయక చర్యల కోసం సముద్రంలోకి వెళ్లింది. 28 ట్రాలర్లను గోపాల్పూర్ ఓడరేవుకు తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధిక ఆటుపోట్లు మరియు అల్లకల్లోలమైన సముద్ర ఉపరితలం కారణంగా ట్రాలర్లు ఆంధ్రప్రదేశ్ వైపు ప్రయాణించలేకపోయాయి. పడవల్లో మత్స్యకారులు ఉండడంతో జిల్లా యంత్రాంగం తక్షణ సహాయ చర్యలను అభ్యర్థించింది. దీనికి ప్రతిస్పందనగా గోపాల్పూర్ పోర్ట్ అధికారులు అన్ని ట్రాలర్లను సురక్షితంగా ఒడ్డుకు చేర్చే ప్రయత్నాలను ప్రారంభించారు. కొండ చరియలు విరిగిపడే అవకాశం తుఫాను వాతావరణం ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా కళింగ ఘాటి కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితి దృష్ట్యా ఈ మార్గం వినియోగాన్ని నివారించారు. కళింగ ఘాట్ రోడ్లపై అడ్డుకట్టలు ఏర్పాటు చేసి వాహనాల రవాణా స్తంభింపజేశారు. కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున సమీపంలోని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. మోంథా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున రోడ్డును సీల్ చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం సముద్రంలో మత్స్యకారులు ఎవరూ లేరని రాష్ట్ర రెవెన్యు, విపత్తు నిర్వహణ విభాగం మంత్రి సురేష్ కుమార్ పూజారి తెలిపారు. ఇండియన్ కోస్ట్ గార్డు హెలికాప్టర్లు సముద్రంలో తనిఖీ చేశాయి. సముద్రంలో చేపల వేట పడవల కదలిక కోసం వారు తనిఖీ చేశారు. తనిఖీ తర్వాత సముద్రంలో ఒడిశా నుంచి నావికులు లేనట్లు తేలింది. ఇంతకుముందు సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు గోపాల్పూర్ తీరానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో వారికి వసతి మరియు ఆహారం ఏర్పాట్లు చేశారని మంత్రి వివరించారు. రాయగడ: మోంథా తుఫాన్ ప్రభావంతో పలు రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. స్థానిక బస్టాండ్ ప్రయాణికులతో రద్దీగా మారింది. తమ గమ్యాలకు చేరుకునేందుకు ప్రయాణికులు బస్సుల కోసం ఎగబడుతున్నారు. రాయగడ మీదుగా కొరాపుట్, మల్కన్గిరి, జయపురం, నవరంగపూర్ వంటి ప్రాంతాలకు వెళ్లేందుకు బస్టాండులో ప్రయాణికులు బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు. దీంతో పలువురు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. రైల్వేస్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం హెల్ప్లైన్ డెస్క్ మంగళవారం నుంచి ప్రారంభమైంది. అత్యవసర సమయాల్లో ప్రయాణికులకు తాజా సమాచారాన్ని అందించేందుకు రైల్వే విభాగం ఈ మేరకు చర్యలు తీసుకుంది -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
రాయగడ: స్థానిక రాణిగుడఫారానికి చెందిన కేకే పాత్రో రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలకు గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లా కోర్టులో విధులు నిర్వహిస్తున్న ఆయన మంగళవారం కోర్టుకు సంబంధించిన కాగితాలను పంపిణీ చేసేందుకు సైకిల్పై వెళ్తున్నాడు. అదే సమయంలో ఎదురుగా వచ్చిన ఒక బైకు అతనిని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన తల, చేతికి గాయాలయ్యాయి. అక్కడివారు వెంటనే అతడిని చికిత్స కోసం ఆటోలో ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు బైకు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బోండఘాటిలో ఈదురుగాలులు మల్కన్గిరి: జిల్లాలోని ఖోయిర్పూట్ సమితి బోండఘాటీపై తుఫాన్ ప్రభావంతో ఈదురుగాలులు ప్రభావం చూపాయి. దీంతో అక్కడి గిరిజనులను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రజలను ఇళ్లలోనే ఉండమని సూచించారు. ఒకవేళ వర్షం పెరిగితే పునరావాస కేంద్రాలకు తరలిస్తామని పేర్కొన్నారు. అటవీ శాఖ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. 20 సెల్ఫోన్లు స్వాధీనం జయపురం: ఆపరేషన్ ఆఫ్ మిస్సింగ్ మొబైల్ ఫోన్లో భాగంగా జయపురం పట్టణ పోలీసులు పలువురు దొంగల నుంచి 20 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని సెల్ఫోన్ పోగొట్టుకున్నవారికి అందజేసినట్లు జయపురం సబ్ డివిజన్ పోలీసు అధికారి పార్ధ జగదీష్ కశ్యప్ వెల్లడించారు. కార్యక్రమంలో పట్టణ పోలీసు అధికారి ఉల్లాస చంద్రరౌత్, ఎస్ఐ సిద్దార్థ బెహర తదితరులు పాల్గొన్నారు. వినతుల వెల్లువ జయపురం: స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో వినతులు వెల్లువెత్తాయి. కొరాపుట్ జిల్లా కలెక్టర్ మనోజ్ సత్యవాన్ మహాజన్ అధ్యక్షతన జరిగిన ఈ శిబిరంలో 47 వినతులు అందాయి. ఫిర్యాదులను పరిశీలించి వెంటనే వాటిపై చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జయపురం సబ్ కలెక్టర్ అక్కవరం శొశ్యారెడ్డి, కొరాపుట్ ఎస్పీ రోహిత్ వర్మ, జయపురం సబ్ డివిజన్ పోలీసు అధికారి పార్ధ జగదీష్ కశ్యప్, ఐఏఎస్ అధికారి సంతోష్ ప్రదాన్, సమగ్ర ట్రైబల్ డవలప్మెంట్ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ తృప్తి బొరాయి తదితరులు పాల్గొన్నారు. ఏనుగుల బీభత్సం రాయగడ: జిల్లాలోని బిసంకటక్ సమితి పరిధి హజారిడంగ్ పంచాయతీ లెలిబడి గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గ్రామంలోని రాయిధుపాణి స్వయం సహాయక బృందానికి చెందిన మహిళలు నిర్వహిస్తున్న కోళ్ల ఫారంను అదేవిధంగా బయోప్లక్ చేపల పెంపకం కేంద్రంను ధ్వంసం చేశాయి. దీంతో రూ.లక్షల్లో నష్టం వాటిళ్లింది. సుమారు మూడు ఏనుగులు సోమవారం రాత్రి గ్రామంలోకి చొరబడి అరటి, పనస తదితర పంటలను ధ్వంసం చేయడంతో పాటు కోళ్లఫారం, చేపల పెంపక కేంద్రాలను నేలమట్టం చేశాయి. దీనిపై బిసంకటక్ అటవీ శాఖ రేంజర్ హేమ్ బెహరను సంప్రదించగా ఏనుగుల సంచారం విషయమై అప్రమత్తంగా ఉన్నామన్నారు. సమీప అడవుల నుంచి అవి ఈ ప్రాంతానికి వచ్చినట్లు తెలియజేశారు. ఏనుగు దాడుల కారణంగా నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం తరుపున సహకారం అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
భక్తులు రావొద్దు
కొరాపుట్: మోంథా తుఫాన్పై కొరాపుట్, నబరంగ్పూర్ జిల్లాల్లో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. కొరాపుట్ జిల్లా నందపూర్ మార్గంలో చెట్టు కూలింది. బొయిపరిగుడ సమితి దండకారణ్యంలోని సహజ సిద్ధ పుణ్యక్షేత్రం గుప్తేశ్వరంను మూసి వేస్తున్నట్లు జిల్లా అధికార యంత్రాంగం ప్రకటించింది. ఈనెల 30వ తేదీ వరకు భక్తులు రావద్దని ప్రకటించారు. చరిత్రలో కరోనా సమయంలో తప్ప ఏనాడూ మూసివేయని గుప్తేశ్వరం మూసివేయడం గమనార్హం. అలాగే లమ్తాపుట్ సమితిలోని ప్రఖ్యాత డుడుమా జలపాతం ప్రధాన ద్వారాన్ని అధికారులు మూసివేశారు. ఆంధ్రా – ఒడిశా వివాదాస్పద ప్రాంతం కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి కొఠియాలో ఐదుగురు గర్భిణులను కొండ గ్రామాల నుంచి కొఠియా ఆస్పత్రికి తరలించారు. ఈస్ట్కోస్ట్ రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం కొరాపుట్ రైల్వేస్టేషన్లో హెల్ప్లైన్ని ఏర్పాటు చేసింది. కొరాపుట్ – జగదల్పూర్ల మధ్య అన్ని రకాలు రైల్వే సర్వీసులు రద్దు చేశారు. -
ప్రయాణాలు రద్దు చేసుకోవాలి
భువనేశ్వర్: మోంథా తీరం దాటనున్న నేపథ్యంలో ప్రయాణికులు అత్యవసరమైతే తప్ప.. ప్రయాణాలు రద్దు చేసుకోవాలని రైల్వేశాఖ విజ్ఞప్తి చేసింది. తుఫాన్ ఉద్ధృతి నేపథ్యంలో 42 ట్రైన్లను రద్దు చేశారు. 2 రైళ్లను దారి మళ్లించారు. 5 రైళ్ల సేవలను పాక్షికంగా రద్దు చేశారు. మరో 8 రైళ్లను ఆలస్యంగా నడిపించారు. ముఖ్యమైన రైళ్లలో 11020 కోణార్క్ ఎక్స్ప్రెస్ మంగళవారం రద్దు చేశారు. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు తాజా స్థితిని తనిఖీ చేసుకోవాలని సూచించారు. ఖుర్దారోడ్ మండలంలోని పలాస, ఖుర్దారోడ్ మరియు భువనేశ్వర్లలో హెల్ప్ డెస్క్లను ప్రారంభించింది. వాల్తేర్ మండలంలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, దువ్వాడ మరియు రాయగడ వద్ద హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసింది. అలాగే ప్రశాంతి ఎక్స్ప్రెస్ రద్దు చేశారు. -
జాతీయస్థాయికి తొమ్మిదో తరగతి విద్యార్థిని ప్రాజెక్టు
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా స్వాభిమాన్ ప్రాంతానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని లలిత ఖిల్ రూపొందించిన ‘సేప్టీబోట్’ప్రాజెకుట జాతీయస్థాయి ప్రదర్శనకు అర్హత సాధించింది. పాస్కల్ సూత్రం ఆధారంగా రూపొందించిన ఈ ప్రాజెక్టు ఈస్ట్ రీజియన్లోని కోల్కతా నుంచి ఏఎంపికై నవంబర్ 18న భోపాల్లో జరగబోయే జాతీయస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తారు. సేప్టీబోట్ మోడల్ను మల్కన్గిరి జిల్లా చిత్రకొండ సమితి దోరగూడ పంచాయతీ పరిధిలోని బురిడిపూట్ గ్రామానికి చెందిన లలిత ఖిల్ రూపొందించారు. ఈమె ప్రస్తుత్తం ఆర్ఎస్సీ–6 గ్రామంలో ఉన్న ప్రభుత్వ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది. చిత్రకొండ జలాశయంలో తరచూ పడవలు బోల్తా పడి ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న విద్యార్థిని సేప్టీబోట్ ప్రాజెక్ట్ను రూపొందించి జాతీయ స్థాయికి ఎంపికై ంది. ప్రాజెక్టు రూపకల్పనలో ఆమెకు గైడ్ టీచర్ దేవబ్రత దాస్ సహకరించగా, ప్రధానోపాధ్యాయులు డంబరుధర్ గోలరీ, లలిత ప్రోత్సహించారు. విద్యార్థిని తల్లి దమయంతి ఖిల్, తండ్రి పర్షు ఖిల్లను గ్రామస్తులు అభినందించారు. -
దెబ్బకు ఠా.. దొంగల ముఠా
● కాకినాడ ముఠాను పట్టుకున్న పోలీసులు ● ఒక్కొక్కరిపై లెక్కకు మించి కేసులు ● నిందితుల నుంచి 186 గ్రాముల బంగారం, 263 గ్రాముల వెండి స్వాధీనం శ్రీకాకుళం క్రైమ్: రాత్రిపూట ఇళ్లకు కన్నాలు వేసి ఆభరణాలు దోచుకుపోయే కాకినాడ దొంగల ముఠాను శ్రీకాకుళం రూరల్ పోలీసులు పట్టుకున్నారు. నిందితులైన రేకడి వెంకటేశ్వర్లు, ధర్మాది ప్రసాద్, మాడెం మోహన్కుమార్ల వద్ద నుంచి 186 గ్రాముల బంగారం, 263 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ(క్రైమ్) పి.శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పదేళ్ల నుంచి నేరాలు కాకినాడ జగన్నాయకపురానికి చెందిన వెంకటేశ్వర్లు, ప్రసాద్లు గత పదేళ్లు నుంచి చోరీలు చేస్తున్నారు. ఒకరు రాత్రిపూట తాళాలు వేసిన ఇళ్ల తలుపులను విరగ్గొట్టే రకమైతే, మరొకడు బీరువా తాళాలు అలవోకగా తెరిచేవాడు. వెంకటేశ్వర్లుపై 23 కేసులుండగా, ప్రసాద్పై 36 ఉన్నాయి. ఇద్దరిపై కాకినాడ–4 టౌన్, 1 టౌన్లో సస్పెక్ట్ షీట్లు కూడా ఉన్నాయి. కాకినాడలో చోరీలకు సంబంధించి అక్కడి సెంట్రల్ జైల్కు ఈ ఏడాది ఏప్రిల్లో వెళ్లిన వీరికి, అక్కడ హత్యానేరంతో వచ్చిన కాకినాడ రాసిల్లిపేటకు చెందిన మాడెం మోహన్కుమార్ పరిచయమయ్యాడు. ఆగస్టు వరకు అదే జైలులో వీరి సావాసం బలపడింది. మోహన్కుమార్ చోరీ సొత్తు అమ్మడంలో, జైలుకు వెళ్లిన నేరస్తులను బెయిల్పై తీసుకొచ్చి కొత్త నేరాలు చేయించడంలో దిట్ట. ఈ క్రమంలో గత నెల 28వ తేదీన రాత్రి గార మండలంలోని కె.మత్స్యలేశం – కళింగపట్నం పోర్టులో వరుసగా మూడిళ్లపై చోరీకి ఎగబడ్డారు. అలాగే నందగిరిపేట, రూరల్ మండలం రాగోలులో కూడా చోరీలు చేశారు. ఫింగర్ ప్రింట్ సాయంతో గారలో మూడిళ్లవారు ఒకరు 45 తులాలని, మరొకరు 25 తులాలని, ఇంకొకరు 10 తులాలు పోయాయని ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు అతిపెద్ద కేసు అని డీఎస్పీ వివేకానంద పర్యవేక్షక్షణలో సీఐ పైడపునాయుడు, గార, రూరల్ ఎస్ఐలు టీమ్లుగా ఏర్పడ్డారు. ఫింగర్ ప్రింట్ సీఐ భరత్కుమార్ తన క్లూస్టీమ్తో ఆధారాలు సేకరించి వెరిఫై చేయడం, అవి కాకినాడ జిల్లాకు చెందిన ముద్దాయిలుగా ట్రేస్ కావడంతో విచారణ చేపట్టారు. వీరు ఈనెల 26న తండేవలస వైపు వెళ్లే తారురోడ్డుకు కుడివైపున ఉన్న జగనన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి వద్ద ఉన్నారన్న సమాచారం తెలుసుకున్న రూరల్ ఎస్ఐ రాము రెవెన్యూ అధికారుల సమక్షంలో తమ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. తప్పుడు ఫిర్యాదులు గారలో ఒకరు ఇచ్చిన ఫిర్యాదులో 45 తులాలు పోయిందని చెప్పారని, కానీ 15 తులాలే పోయాయని, మిగతా ఇద్దరిళ్లల్లో ఏమీ పోలేదని, దూసిలో ఒక ఫిర్యాదుదారు 17 తులాలు పోయిందని అన్నారని, కానీ వారింట్లో పోయింది కేవలం రూ.800 లేనని అదనపు ఎస్పీ వెల్లడించారు. కాశీబుగ్గలో కూడా తొమ్మిది బంగారు వస్తువులు 43 తులాలున్నాయని ఫిర్యాదిచ్చారని, వాస్తవంగా 30 తులాలు పోయిందన్నారు. ఇకపై ఇటువంటి తప్పుడు ఫిర్యాదులు ఇస్తే న్యాయపరంగా సలహాలు తీసుకుని కేసులు కడతామన్నారు. పట్టుకోవడంలో కృషి చేసిన ఫింగర్ ప్రింట్ సీఐ భరత్కుమార్, సీఐ పైడపునాయుడు, ఎస్ఐ రాము, కానిస్టేబుల్ జగదీష్లను అభినందించారు. -
సురక్షిత ప్రాంతాలకు ప్రజలు
మంగళవారం శ్రీ 28 శ్రీ అక్టోబర్ శ్రీ 2025భారీ వానలు..పర్లాకిమిడి: మోంథా ప్రభావంతో గజపతి జిల్లాలో సోమవారం సాయంత్రం నుంచి వానలు పడుతున్నాయి. జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యల్లో భాగంగా ఆర్.ఉదయగిరి, మోహన, నువాగడ ప్రాంతాల్లో గర్భిణులను, కొండలపై నివసిస్తున్న ప్రజలను తుఫాన్ షెల్టర్లు, ప్రభుత్వ పాఠశాలలకు తరలిస్తున్నారు. కలెక్టర్ మధుమిత రాయగఢ, ఆర్.ఉదయగిరి, కాశీనగర్ వరద ముంపు ప్రాంతాలను సందర్శించి అధికారులకు తగు సూచనలు చేశారు. కొండ చరియలు విరిగిపడే ప్రాంతాలు, స్థలాలను కలెక్టర్ పలు ప్రభుత్వ శాఖల ద్వారా సేకరించారు. ప్రస్తుతానికి సోమవారం నుంచి బుధవారం వరకూ అన్ని ప్రభుత్వ పాఠశాలలు, స్థానిక కళాశాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రభుత్వ అధికారుల సెలవులను రద్దు చేసింది. కొండచరియలు విరిగిపడే ప్రాంతాలు ఇలా ఉన్నాయి. మల్కన్గిరిలో రెడ్ అలర్ట్ వుల్కన్గిరి : జిల్లాలోని మోంథా తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో మల్కన్గిరి కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ స్కూళ్లు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. అక్టోబర్ 28, 29 తేదీల్లో సెలవులు పరిస్థితిని సమీక్ష నిర్వహించాక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సైక్లోన్ పరిస్థితిని ఎదుర్కోవడానికి జిల్లాలో 11 అగ్నిమాపక బృందాలు సిద్ధంగా ఉన్నాయని, ఇతర జిల్లాల నుంచి మూడు ఓడ్రాఫ్ టీమ్లు, ఒక ఒక ఎన్డీఆర్ఎఫ్ టీమ్ అందుబాటులో ఉంచారు. బలమైన గాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు కూలిపోవచ్చని భావించి ఇతర జిల్లాల నుంచి విద్యుత్ సిబ్బందిని పిలిపించారు. నదీ తీర ప్రాంతాలపై దృష్టి పెట్టారు. కొఠియాను తాకిన తుఫాన్ కొరాపుట్: తుఫాన్ కొటియాని తాకింది. సోమవారం సాయంత్రం ఆంధ్రా–ఒడిశా వివాదాస్పద ప్రాంతం కొటియాలో వర్షం ప్రారంభమైంది. కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి కొటియా తడిసి ముద్దయ్యింది. సరిహద్దు ఆంధ్రా నుంచి భారీ మేఘాలు వచ్చి చుట్టుముట్టాయి. కొండ ప్రాంతాల గ్రామాల ప్రజలు ఇళ్లకి పరిమితమయ్యారు. ప్రముఖ పర్యాటక ప్రాంతం దేవమాలి నిర్మానుష్యంగా మారింది. కొండ దిగువ ప్రాంతంలో పర్యాటకులను స్థానికులు వారించి వెనక్కి పంపిస్తున్నారు. -
దొంగతనాల్లో నిందితుల అరెస్టు
జయపురం: జయపురం పట్టణ పోలీసు స్టేషన్, మల్కన్గిరి జిల్లాలో జరిగిన దొంగతనాల్లో నిందితులను అరెస్టు చేసినట్లు పట్టణ పోలీసు అధికారి ఉల్లాస్ చంద్ర ప్రధాన్ సోమవారం వెల్లడించారు. ఈ కేసుల్లో ప్రధాన నిందితులు ఇద్దరిని అరెస్టు చేశామని, వారి నుంచి రూ.5లక్షలు నగదు, ఒక యమహా ఎంటీ బైక్, ఒక టాటా టైగర్ కారు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. అరెస్టయిన నిందితులు జయపురం ఇరిగేషన్ కాలనీ శాంతిరాజ్ నాగ్ ఉరఫ్ రాహుల్(19), జయనగర్ నివాసి అభినాష్ మహరాణ ఉరఫ్ ఆకాశ్ (28) లు అని వెల్లడించారు. గత ఏప్రిల్ 15న జయపురం హనాగుడ నివాసి రాధామోహణ పట్నాయిక్ ఫిర్యాదు చేశారని, అతడి ఫిర్యాదులో 14వ తేదీ రాత్రి కొంత మంది దుండగులు తన పక్కింటిలో దొంగతనం చేసి బంగారు, వెండి నగలతో పాటు రూ.10 వేలు దొంగిలించారని పేర్కొన్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరపగా రాహుల్ అతడి సహచరుడు ఆకాష్లు దొంగతనం చేశారని గుర్తించామన్నారు. వారు బంగారు నగలను కె.మురళి అనే బంగారు వ్యాపారికి రూ.50 వేలకు అమ్మినట్లు వెల్లడించారు. వారిని అరెస్టు చేసి విచారించగా మల్కన్గిరిలో కూడా దొంగతనం చేసినట్లు రాహుల్ వెల్లడించాడని, గత జూన్ నెలలో రాహుల్, ఆకాష్లు తమ సహచరులు రాజు నాయిక్, భరత్ నాయిక్, అజయ్, కె.సుమన్ ఆచారిలతో ప్రసాద్ జ్యుయలరీ షాపులో బ్యాగ్లో ఉంచిన దాదాపు 1.2 కిలోల బంగాను నగలు దొంగిలించారని, అనంతరం చిత్రకొండ పారిపోయారని, అక్కడి నుంచి విశాఖపట్నం వెళ్లారని అక్కడ నుంచి వారు బంగాను నగలు అమ్మేందుకు ఎస్.వెంకటేష్, కె.మురళి లను సంప్రదించారని, అయితే వాటిని అమ్మటం సాధ్యం కాదని తెలుసు కొని వారు విజయనగరం వచ్చి ఒక మెల్టింగ్ మిషన్ కొని బంగారు నగలు కరిగించారని అందులో కొంత బంగారం అమ్మారని, మిగతా బంగారం తర్వాతఅమ్మేందుకు ఉంచారని వెల్లడించారు. సీజ్ చేసిన నగదు, వాహనాలను మల్కన్గిరి పోలీసులకు అప్పగిస్తామని వెల్లడించారు. 36.ఎ. అరెస్టయిన ఇద్దరు దొంగలు 36.బి. దొంగల వద్ద పట్టుబడిన రూ.5 లక్షల నగదు 36.సి . దొంగతనాలకు వారు వినియోగించే కారు, బైక్లు -
ముమ్మరంగా గాలింపు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని డేఅండ్నైట్ కొత్త వంతెన పైనుంచి నాగావళి నదిలో ఆదివారం అర్ధరాత్రి దూకేసిన మహిళ కోసం ఫైర్ సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సోమవారం ముమ్మర గాలింపు చేపట్టాయి. రోప్లతో కొందరు నదిలోకి దిగగా, బోట్లలో ఎన్డీఆర్ఎఫ్ బృందం తిరిగింది. నదిలో ప్రవాహ ఉద్ధృతి ఎక్కువగా ఉండడం వలన ఆచూకీ కనిపెట్టడం కష్టంగా మారిందని ఏడీఎఫ్వో శ్రీనుబాబు అన్నారు. కాగా రెండో పట్టణ సీఐ ఈశ్వరరావు మాట్లాడుతూ.. మహిళ దువ్వు రాజ్యలక్ష్మి అదృశ్యమైనట్లు కేసు నమోదు చేశామన్నారు. రైలు నుంచి జారిపడిన మహిళకు గాయాలు ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం రైలు నిలయంలో రైలు నుంచి దిగుతూ జారిపడిన మహిళకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు.. మండలంలోని బొడ్డకాళి గ్రామానికి చెందిన దారపు లోలాక్షి కుటుంబ సభ్యులతో కలిసి ఒడిశాలోని పారాదీప్లో నివాసముంటుంది. ఆమె బంధువుల ఇంట్లో జరిగే ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు భువనేశ్వర్ – సికింద్రాబాద్ విశాఖ ఎక్సప్రెస్లో సోమవారం ఇచ్ఛాపురం వచ్చింది. ఈ క్రమంలో ట్రైన్ స్టేషన్లోని మొదటి ప్లాట్ఫారంపై ఆగింది. తుఫాన్ కారణంగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్లాట్ఫారంపై వర్షపు నీరు చేరింది. ఆమె రైలు నుంచి లగేజీతో పాటు దిగుతుండగా కాలుజారి కింద పడిపోవడంతో తలకు తీవ్రగాయమైంది. స్థానికులు 108కి సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రురాలిని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. వ్యక్తి అత్మహత్య రణస్థలం: మండలంలోని కొండములగాం పంచాయతీ ముక్తుంపురం గ్రామానికి చెందిన మంత్రి పెద్ద అప్పలనాయుడు (37) ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, జేఆర్పురం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఈనెల 18వ తేదీన అప్పలనాయుడికి భార్య రోజాతో ఇంట్లో గొడవ జరిగింది. దీంతో భార్య రోజా ఇద్దరు పిల్లలను పట్టుకుని తమ కన్నవారి ఇంటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కి కరెంట్ వైర్లతో ఉరివేసుకుని మృతి చెందాడు. కుటుంబ సభ్యులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. భార్య రోజా ఇచ్చిన ఫిర్యాదు మేరకు జేఆర్పురం ఎస్ఐ ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అంతా నా ఇష్టం..? సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తానేమి చెబితే అదే జరగాలని.. తాను చెప్పే వారికే బిల్లులివ్వాలని.. తనకు చెప్పకుండా టెండర్లు పిలవడానికి కుదరదంటూ శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అధికారులకు హకుం జారీ చేసినట్లు సమాచారం. శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తనకు చెప్పకుండా ఏ పనులు చేయడానికి లేదని, ఏవైనా పనులు చేసినా.. ఎవరికై నా పనులు అప్పగించినా తనకు తెలియజేయాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయం ఇటు అధికారులు.. అటు కాంట్రాక్టర్లలో చర్చనీయాంశంగా మారింది. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ పీవీవీడీ ప్రసాదరావు, మున్సిపల్ ఇంజినీర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మగ ఉపాధ్యాయుల నియామకాలు ఆపాలి శ్రీకాకుళం: రాష్ట్రవ్యాప్తంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అమ్మాయిల గురుకులాల్లో మగ ఉపాధ్యాయుల నియామకాలు ఆపాలని దళిత ప్రజా సంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు నగరంలోని ఆదివారంపేటలో ఉన్న అంబేడ్కర్ విగ్రహం నుంచి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల జిల్లా కో–ఆర్డినేటర్ కార్యాలయం వద్దకు దళిత ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా మైనర్ బాలికలపై లైంగిక దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. అమ్మాయిల గురుకులాల్లో మగ ఉపాధ్యాయులను నియమించవద్దని జునైల్ కోర్టు తీర్పులు ఉన్నప్పటికీ.. గురుకులాల సొసైటీ కార్యదర్శి చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కో–ఆర్డినేటర్ యశోదలక్ష్మి వినతిపత్రం అందజేశారు. -
77 వినతుల స్వీకరణ
రాయగడ: జిల్లాలోని రామనగుడ సమితి కార్యాలయం సమావేశం హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన వినతుల స్వీకరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అశుతొష్ కులకర్ణి పాల్గొన్నారు. సమితి పరిధిలో గల వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వారి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. 77 వినతులను స్వీకరించారు. ఇందులో 61 వ్యక్తిగత సమస్యలుగా గుర్తించారు. మిగిలిన 27 గ్రామ సమస్యలుగా పరిగణలోకి తీసుకున్నారు. స్వీకరించిన వినతులను సంబంధిత శాఖ అధికారులు సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గుణుపూర్ సబ్ కలెక్టర్ అనీల్ దుదుల్ అభిషేక్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి అసీమారావు, జిల్లా సామాజిక సురక్షా అధికారి శ్రీకాంత్ పాణిగ్రహి, తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా పరలా నృత్య ఉత్సవాలు
పర్లాకిమిడి: పర్లాకిమిడిలో కళాకారులు అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జించారని, వారి కోసం బెత్తగుడ వద్ద ఒక ఓపెన్ ఆడిటోరియం త్వరితగతిన పనులను పూర్తిచేయాలని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోడూరు నారాయణ రావు అన్నారు. స్థానిక రాజవీధిలో అర్బన్ బ్యాంకు గ్రౌండ్స్ వద్ద నాల్గో పరలా ఉత్సవాలను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ ఉత్సవాలు రెండు రోజులుగా కొనసాగుతుండగా సోమవారం ముగింపు కార్యక్రమానికి త్రిధార (భువనేశ్వర్) గురు డాక్టర్ గజేంద్ర కుమార్ పండా, సెంచూరియన్ విశ్వవిద్యాలయం డైరక్టర్ దుర్గాప్రసాద్ పాఢి, జిల్లా టూరిజం శాఖ అధికారి (ఇన్చార్జి) అరుణ్ కుమార్ త్రిపాఠి, మాజీ చైర్మన్ నృసింగ చరణ్ పట్నాయిక్ తదితరులు హాజరయ్యారు. ఈ పరలా నృత్య ఉత్సవాలకు జపాన్ దేశం నుంచి విచ్చేసిన త్రిధాన్ గురు చిసాతో మియురా ఒడిస్సీ నృత్యంలో ప్రేక్షకులను అలరించగా, సోలో కూచిపూడి డ్యాన్సర్ రికో కోజిమా (జపాన్), శ్రీజగన్నాథ ఒడిస్సీ కళాకేంద్రం విద్యార్థులు పాల్గొని అనేక నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. కార్యక్రమం చివర్న గురు గజేంద్ర కుమార్ పండాను జగన్నాథ ఒడిస్సీ కళాకేంద్రం డైరెక్టర్ డి.ప్రియాంక సన్మానించారు. అనంతరం డ్యాన్స్ మాస్టర్ రూపాంజలీ దాస్ను జ్ఞాపికను అందజేసి సత్కరించగా, కార్యక్రమాన్ని జిల్లా సాంస్కృతిక శాఖ అధికారిని అర్చనా మంగరాజ్, ముఖ్యవక్తగా ఆదర్శదాస్ విచ్చేసి వ్యవహరించారు. -
నెల రోజులుగా అంధకారంలోనే..
జయపురం: జయపురం సమితి భరిణిపుట్ పంచాయతీ గదియగుడ గ్రామం నెల రోజులుగా అంధకారంలో మగ్గుతోంది. విద్యుత్ అధికారులకు, సిబ్బందికి విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని గదియగుడ గ్రామ ప్రజలు ఆరోపించారు. సోమవారం ఆ గ్రామం అజాద్ యువజన సంఘం కార్యకర్తలు టాటా విద్యుత్ సప్లై విభాగ కార్యనిర్వాహక ఇంజినీర్ అజయ చౌదురిని కలసి ఒక వినతి పత్రం సమర్పించారు. అందులో టాటా విద్యుత్ కంపెనీ ఉద్యోగులు నిర్లక్ష్యం కారణంగా తమ గ్రామంలో గత నెల రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆరోపించారు. తాము విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లిస్తున్నామని అయినా గత నెల రోజుల కంటే ఎక్కువగా కరెంటు లేదని తెలిపారు. ఆన్లైన్లో అధికారులకు, సంబంధిత సిబ్బందికి ఫిర్యాదులు పంపినా స్పందించడం లేదని ఆ గ్రామ అజాద్ యువజన సంఘం సాధారణ కార్యదర్శి జితేంద్ర నాయిక్ విద్యుత్ ఇంజినీర్కు అందజేసిన లేఖలో వెల్లడించారు. తమ గ్రామ విద్యుత్ సరఫరా బాధ్యతలో ఉన్న సిబ్బంది నిర్లక్ష్యమే తమ గ్రామ అంధకారానికి కారణమని ఆరోపించారు. ఎక్కడైనా విద్యుత్ తీగలు విచ్ఛిన్నమైతే సిబ్బంది వెంటనే రిపేరు చేయాలని, కానీ సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, తక్షణం గ్రామానికి విద్యుత్సరఫరా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో ఆజాద్ యువజన సంఘ సభ్యులు ఈశ్వర మహంతితో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. -
రాయగడ జిల్లాలో 164 సురక్షిత ప్రాంతాల ఏర్పాటు
రాయగడ: మోంథా తుఫాన్పై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలోని పదకొండ సమితుల్లో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను గుర్తించిన యంత్రాంగం ఈ మేరకు 164 సురక్షిత ప్రాంతాలను ఏర్పాటు చేసింది. అదేవిధంగా తుఫాను ప్రభావిత ప్రాంతాల నుంచి 7586 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో గల వందమందికి పైగా గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన అత్యవసర సమావేశంలో సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి ధన,ప్రాణ నష్టం సంభవించకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. భువనేశ్వర్: మోంథా తుఫాన్ భయాందోళనలతో ప్రజలు అవసరాలకు మించి బంగాళాదుంపలు వంటి నిత్యావసర పదార్థాలు కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలో అనేక మార్కెట్లలో విక్రేతలు ఈ బలహీనతను సొమ్ము చేసుకునేందుకు కృత్రిమ కొరత సష్టించి మరింత బెంబేలెత్తిస్తున్నారు. భువనేశ్వర్, కటక్, బరంపురం వంటి ప్రముఖ ప్రాంతాల్లో కొరత భయంతో చాలామంది వినియోగదారులు బంగాళాదుంపలు ఒకేసారి 4 నుంచి 5 కిలోల కొనుగోలు చేస్తున్నారు. దీనితో స్థానిక విక్రేతలు ధరలు పెంచారు. రాష్ట్రంలో అవసరమైన నిత్యావసర వస్తువులు ముఖ్యంగా బంగాళాదుంపలు పుష్కలంగా ఉన్నాయని, ఒడిశా వ్యాపారుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి సుధాకర్ పండా ప్రజలకు హామీ ఇచ్చారు. గత రెండు రోజులుగా కోల్కతా నుంచి తాత్కాళిక సరఫరా అంతరాయాలు ఉన్నప్పటికీ, అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలో తగినంత బంగాళాదుంప నిల్వలు ఉన్నాయన్నారు. కోల్కత్తాలో ఇంధన సరఫరా దుకాణాలు మూసివేయడంతో రాష్ట్రానికి బంగాళాదుంపలు రవాణా తాత్కాళికంగా స్తంభించింది. సోమవారం నుంచి పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది ట్రక్కులు రవాణా మొదలైంది. మంగళవారం ఉదయం సరికి నిల్వలు యథాస్థితికి చేరుతాయన్నారు. ప్రస్తుతం బంగాళాదుంపల ధర కిలోకు రూ.20 వరకు ఉంది. కొంతమంది చిరువ్యాపారులు కొన్ని మార్కెట్లలో కిలోకు రూ.25 చొప్పున అమ్ముతున్నారని తెలిపారు. భయపడాల్సిన అవసరం లేదు. నిల్వ స్థిరంగా కొనసాగుతోంది. తగినంతగా ఉందని హామీ ఇచ్చారు. తుఫాన్ హెచ్చరికల సమయంలో బ్లాక్ మార్కెటింగ్, ధరల తారుమారుకి పాల్పడే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారుల సమాఖ్య హెచ్చరించింది. కృత్రిమ కొరతను నివారించడానికి అధికారుల సమన్వయంతో పరిస్థితి అనుక్షణం సమీక్షిస్తున్నారు. మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి ప్రాంతంలో ట్రాక్టర్ యజమానుల సంఘం ఏర్పాటైంది. సంఘ నాయకులు సోమవారం సమావేశమై పలు సమస్యలపై చర్చించారు. రెవెన్యూ, మైనింగ్ అధికారుల దాడులతో ఎదుర్కొంటున్న సమస్యలను సభ్యులు ప్రస్తావించారు. ఇసుక, చిప్స్, మెటల్, రాయి, మురుమ్ తరలించే సమయంలో అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేయడంతోపాటు రూ. 50 వేల నుంచి రెండు లక్షల రూపాయల వరకు జరిమానాలు విధిస్తుండడంతో తీవ్రంగా నష్టపోతున్నామని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ట్రాక్టర్ యజమానులు నెలవారీ ఫైనాన్స్ కిస్తీలను చెల్లించడానికి కష్టాలు ఎదుర్కొంటుంటే అధికారుల దాడులు, కేసులతో మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం సంఘ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా చైతన్య చౌదరి, కార్యదర్శిగా గంగా మాడి, ఖజాంచీగా గౌతమ్ మిశ్రా , ఉపాధ్యక్షుడుగా మధుసూదన్ మాడి, సంయుక్త కార్యదర్శిగా పరిమళ్ మిశ్రా, మీడియా సెల్ ఇన్చార్జిగా సుమన్ పాల్, లీగల్ అడ్వయిజర్గా గోపాల్ విశ్వస్, ప్రతి పంచాయతీ నుంచి ఇద్దరిని సభ్యులుగా ఎన్నుకున్నారు. -
ఉత్సాహంగా ముగ్గులు పోటీలు
జయపురం: పవిత్ర కార్తిక మాసం సందర్భంగా స్థానిక ప్రతిమ అంభిక ట్రస్టు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు సోమవారం నిర్వహించారు. కుంజిబిహారి మందిర ప్రాంగణంలో నిర్వహించిన పోటీలలో జానకీ పాణిగ్రహి, జును పండ, బినోదినీ దాస్ పర్యవేక్షించగా.. మహిళలు, బాలికలు, యువతులు ఉత్సాహంతో పాల్గొన్నారు. వారంతా సంప్రదాయ ముగ్గులు వేశారు. పోటీలు మీనతి పాఢి, రాజేశ్వరి నంద, వందన పట్నాయక్, సుజాత కుమారి పాత్రో, మమత సువార్, పుష్పాంజలీ రథ్, కబిత మంజరి పొలాయ్, కల్యాణి, సుస్మిత, సంధ్యా ప్రధాని, జయలక్ష్మీ మహాపాత్రో, బసంత మిశ్ర,తులసీ పండిత పాల్గొన్నారు. ప్రధమ బహుమతిని మీనతి పాఢి, రెండవ బహుమతిని పుష్పాంజలీ రథ్, మూడో బహుమతి రాజేశ్వరి నంద, కవితమంజరి పొలయ్లు దక్కించుకున్నారు. విజేతలకు బహుమతులు, పోటీలలో పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలను ప్రతిమ అంభిక ట్రస్ట్ అధ్యక్షురాలు మమత బెహర అందజేసి సత్కరించారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
రణస్థలం: లావేరు మండలంలోని తాళ్లవలస జాతీయ రహదారి–16పై కిల్లారి జగదీష్ (28) రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. లావేరు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. తాళ్లవలస గ్రామానికి చెందిన జగదీష్ తన కోళ్లఫారానికి వెళ్లేందుకు సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో రోడ్డు దాటుతుండగా.. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో జగదీష్ అక్కడికక్కడే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. తండ్రి నారాయణరావు తాళ్లవలస గ్రామానికి రోడ్డు అవతల ఉన్న కోళ్లఫారం నడుపుతున్నాడు. తల్లి శశిరేఖ జేఆర్పురం పోలీస్స్టేషన్ సమీపంలోని గణేష్ కాంప్లెక్స్లో పేపర్ ప్లేట్ల వ్యాపారం చేస్తుంటారు. మృతుడికి ఇద్దరు అన్నదమ్ములు హరీష్, యశ్వంత్ ఉన్నారు. జగదీష్ మృతితో తాళ్లవలస గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. లావేరు ఎస్ఐ జి.లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
హోటళ్ల బుకింగ్లు, రిజర్వేషన్ల రద్దు
భువనేశ్వర్: మోంథా తుఫాన్ నేపథ్యంలో రానున్న మూడు రోజులపాటు అన్ని బుకింగ్లు, రిజర్వేషన్న్లను రద్దు చేయాలని హోటళ్ల యజమానులను గంజాం జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల 28వ తేదీ సాయంత్రం, రాత్రి సమయంలో మచిలీపట్నం, కళింగపట్నం మధ్య (ఆంధ్రప్రదేశ్) తీరాన్ని దాటే అవకాశం ఉందన్నారు. ఈ పరిణామాల దృష్ట్యా గంజాం జిల్లాకు ఐఎండీ ఈ నెల 27న ఆరెంజ్ హెచ్చరిక, 28న రెడ్ హెచ్చరిక జారీ చేసిందన్నారు. పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసిందన్నారు. మేకల కాపరిపై ఎలుగుబంటి దాడిమల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా మాత్తిలి సమితి దేగూడ గ్రామంలో సోమవారం మేకలు కపరిపై ఎలుగుబంటి దాడి చేసింది. లైఖాన్ కుమార్కు తీవ్రగాయాలయ్యాయి. రోజులాగే లైఖాన్ గ్రామం నుంచి మేకలు తీసుకొని సమిప అడవికి మేత కోసం తీసుకెళ్లాడు. సాయంత్రం అవుతుండగా తిరిగి వస్తున్న సమయంలో ఎలుగుబంటి అకస్మాతుగా అతనిపై దాడి చేసింది. కేకలు వేయడంతో సవీపంలో ఉన్నవారు చేరుకుని లైఖాన్ను ఎలుగుబంటి నుంచి రక్షించారు. వెంటనే మాత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించారు. . కోతుల దాడిలో వ్యక్తికి గాయాలు టెక్కలి రూరల్: మండలంలోని బన్నువాడ గ్రామంలో సోమవారం కోతుల దాడిలో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన పల్లి మోహన్రావు అనే రైతు తన పెరట్లో అరటి చెట్లను కోతులు ధ్వంసం చేస్తుండగా వాటిని అదుపు చేసేందుకు కర్ర పట్టుకొని వెళ్లాడు. దీంతో కోతులు అతడిపై దాడి చేశాయి. గాయాలపాలైన అతడిని వైద్యం కోసం టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ‘టెట్ నుంచి మినహాయించాలి’ వజ్రపుకొత్తూరు: సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని స్కూల్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా సహాధ్యక్షుడు నెమలపురి విష్ణుమూర్తి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేయకుండా హడావుడిగా టెట్ నోటిఫికేషన్ జారీ చేయడం అన్యాయమన్నారు. టెట్ నోటిఫికేషన్ తక్షణమే నిలుపుదల చేయాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని విద్యా హక్కు చట్టం 2009 లోని సెక్షన్ 23ని సవరించే విధంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిస్థితిని చక్కదిద్దేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. 20 నుంచి 30 ఏళ్ల సర్వీసు ఉన్న ఉపాధ్యాయులకు ఇప్పుడు టెట్ పరీక్ష నిర్వహించడమేంటని ఆయన ప్రశ్నించారు. గణిత శాస్త్ర ఉపాధ్యాయులు జీవశాస్త్రం రాయాలనడం ఎంత వరకు సమంజసమో ఆలోచన చేసి, ప్రభుత్వం వెంటనే స్పందించి సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
మాల్యవంత్ మహోత్సవాలు
డిసెంబర్ 14 నుంచి 18 వరకు..మల్కన్గిరి: ఏటా సంప్రదాయబద్ధంగా నిర్వహించే మాల్యవంత్ మహోత్సవాలను ఈసారి కూడా వైభవంగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఉత్సవ ఏర్పాట్లపై సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సమీక్షించారు. ఉత్సవాలను స్థానిక డీఎన్కే క్రీడా మైదారంలో డిసెంబర్ 14 నుంచి 18వ తేదీ వరకూ జిల్లా స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించారు. ముందుగా నవంబర్ 30వ తేదీన జిల్లాలోని ఏడు సమితుల నుంచి పవిత్ర నదీ జలాలు సేకరించి స్థానిక బైరవీ మందిరం వద్దకు తెచ్చి అక్కడ నుంచి భారీ ఉరేగింపుతో జగన్నాథ్ మందిరంలో ఉంచాలని నిర్ణయించారు. 1, 2, 3 తేదీల్లో సమితిస్థాయిలో ఉత్సవాలు జరుపుతారు. అనంతరం పర్వతోరోహణ, పడవ పందాలను నిర్వహించి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్, జిల్లా ఎస్పీ వినోద్ పటేల్, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సమారి టంగులు, జెడ్పీ ఉపాధ్యక్షుడు పతిత పావన్ వైద్య, డీఎఫ్వో సాయికిరణ్, జిల్లా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధాన్, జిల్లా అదనపు కలెక్టర్ వేద్బర్ ప్రధాన్, డీఆర్డీఏ అధికారి ప్రమిళా మాఝి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కొరాపుట్, నబరంగ్పూర్ జిల్లాల్లో అత్యవసర సేవలు
కొరాపుట్: తుఫాన్ నేపథ్యంలో కొరాపుట్, నబరంగ్పూర్ జిల్లాల్లో అత్యవసర సేవలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సోమవారం కొరాపుట్ కలెక్టర్ సత్యవాన్ మహాజన్ మీడియాతో మాట్లాడారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ విభాగాల సిబ్బందికి 28,29,30 తేదీల్లో సెలవులు రద్దు చేసినట్లు ప్రకటించారు. సమితి, తహసీల్దార్ కార్యాలయాలు 24 గంటలూ పని చేస్తాయన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించామన్నారు. రైతులకు పంట నష్టం కలగకుండా సహాయం అందిస్తామన్నారు. ఏదైనా నష్టం వస్తే ప్రభుత్వం పరిహారం ఇస్తుందన్నారు. అత్యవసర వైద్య సేవల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ సత్యవాన్ ప్రకటించారు. మరో వైపు ప్రముఖ పర్యటక కేంద్రాల వద్దకు ఈ మూడు రోజులు పర్యాటకులు రావద్దని ప్రజా ప్రతినిధులు కోరారు. కొత్త వలస–కిరండోల్ రైలు మార్గంలో కొరాపుట్–జగదల్పూర్ మధ్య అన్ని ప్రయాణికుల రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. విశాఖ పట్నం, భువనేశ్వర్, రూర్కెలా, కోల్కతా మార్గాలకు రాకపోకలు నిలిచి పోయాయి. మరో వైపు కొరాపుట్, నబరంగ్పూర్ జిల్లాలలో సోమవారం తేలిక పాటి జల్లులు పడ్డాయి. అవినీతికి దూరంగా ఉండాలి పర్లాకిమిడి: ఉద్యోగులు అవినీతికి దూరంగా ఉండాలని అధికారులు అన్నారు. అవినీతి నివారణ సచేతన వారోత్సవాలను పురస్కరించుకుని సోమవారం ఉదయం గజపతి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అన్ని శాఖల ఉద్యోలతో అవినీతికి దూరంగా ఉంటామని ప్రమాణం చేయించారు. అవినీతి, లంచం తీసుకోకుండా ప్రజలకు నిస్వార్ధంగా సేవలు అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ప్రమాణపాఠాన్ని ఆదనపు కలెక్టర్ జగన్నాధ పాడి, జిల్లా సంక్షేమశాఖ అధికారి సాల్మన్ రైకా చదివి వినిపించారు. కార్యక్రమంలో జిల్లా సాంస్కృతిక శాఖ అధికారిని అర్చనా మంగరాజ్, ఆదనపు పౌరసరఫరాల శాఖ అధికారి సుహాన్స్భోయి, డీపీఐఆర్వో ప్రదిప్త గురుమయి పాల్గొన్నారు. -
డీఈవో బాధ్యతల స్వీకరణ
జయపురం: కొరాపుట్ జిల్లా విద్యాశాఖాధికారిగా కరుణకర్ భుయె సోమవారం జయపురంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతించారు. స్థానిక బ్లాక్ విద్యాధికారి కార్యాలయంలో ఉద్యోగులు కరుణాకర్ను సన్మానించారు. అనంతరం బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి కార్యాలయాన్ని సందర్శించారు. జిల్లా విద్యాధికారిగా బాధ్యతలు చేపట్టి మొదటి సారి కార్యాలయానికి వచ్చిన ఆయనకు బ్లాక్ విద్యాధికారి చందన కుమార్ నాయిక్, విద్యావిభాగ సిబ్బంది పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. వారితో పాటు విద్యాధికారి రాజేంద్ర నారాయణ పాఢీ, జిల్లా అమలా సంఘ అధ్యక్షులు శిశిభూషణ దాస్, విద్యా విభాగ అధికారులు బాల గోపాల మిశ్ర, సాంతను జెన, సమితి విద్యాధికారి కె.గోపాల్, ప్రభుత్వ సమితి విద్యాధికారి సోమనాథ్ గదబ, కిరణ్ మహారాణ, రంజన్ మహంతి, మనోజ్ కుమార్ పట్నాయక్, లిపిస మురళీ సాహు, సునీత నాయిక్, శుభశ్రీ పాత్రో తదితరులు నూతన డీఈవోకు స్వాగతం పలికి దుశ్శాలువతో సత్కరించారు. బ్లాక్ విద్యాధికారి చందన కుమార్ నాయక్ కార్యాలయ ఉద్యోగులను పరిచయం చేశారు. -
నవంబర్ 12న యాదవ మహాసభ
కంచిలి: అఖిల భారత యాదవ మహాసభ సమావేశాన్ని నవంబర్ 12వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా సంఘ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ నర్తు రామారావు తెలియజేశారు. ఆరోజున సోంపేట పట్టణంలోని వీబీఆర్ కల్యాణ మండపంలో ఉదయం 9 గంటలకు సమావేశం జరుగుతుందన్నారు. ఈ విషయమై కంచిలిలో రాధాకృష్ణ మందిరం ప్రాంగణంలోని సంఘ నేతలతో కలిసి సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ మహాసభకు జిల్లావ్యాప్తంగా ఉన్న యాదవ సోదరులంతా పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. యాదవుల ఐక్యత వర్థిల్లాలని నినాదాలు చేశారు. సమావేశంలో రాపాక చిన్నారావు, నర్తు ప్రేమ్కుమార్, సాలిన లక్ష్మణమూర్తి, ఈశ్వరరావు, జోగారావు, వెంకటరావు, దాలయ్య, రామదాసు, వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు. -
గోమాంసం అమ్మకానికి తీసుకెళ్తున్న వ్యక్తి అరెస్టు
జయపురం: గోమాంసం విక్రయానికి తీసుకెళ్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. జయపురం సదర్ పోలీసు అధికారి సచిన్ ప్రదాన్ వివరణ ప్రకారం నేటి ఉదయం పోలీసు సబ్ఇన్స్పెక్టర్ అమీయచరణ్ సాగరియతో పోలీసు టీమ్ పెట్రోలింగ్ జరుపుతుండగా జయపురం సమితి హడియ పంచాయితీ పుట్ర గ్రామ సమీప పండకిగుడ జంక్షన్ వద్ద ఒక వ్యక్తి బైక్పై పశుమాంసం తీసుకువెళ్తుండగా కొంత మంది యువకులు పట్టుకున్న సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఆ వ్యక్తిని విచారించగా పశుమాంసం విక్రయానికి తీసుకెళ్తున్నట్లు వెల్లడైంది. అతడు బైక్పై తీసుకెళ్తున్న సంచిలో 49 గోమాంసం ప్యాకెట్లు బయటపడగా వాటిని సీజ్ చేసి వ్యక్తిని అరెస్టు చేశారు. ఆ వ్యక్తి బొరిగుమ్మ పోలీసు స్టేషన్ కేవిడి గ్రామం సబసాన్ కులదీప(70) అని వెల్లడించారు. పశు డాక్టర్ సమక్షంలో గోమాంసం నమూనా తీసి పరీక్షించేందుకు భువనేశ్వర్ పంపనున్నట్లు వెల్లడించారు. నిందితుడిని గోహత్య నేరం కింద అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. -
తుఫాన్కు సర్వ సన్నద్ధత
● 7 జిల్లాల్లో ఉద్యోగుల సెలవులు రద్దు ● తీరం చేరాలని మత్స్యకారులకు పిలుపు భువనేశ్వర్: తుఫాన్ ముప్పు పొంచి ఉన్నందున రాష్ట్రం అంతటా అలర్ట్ ప్రకటించారు. వాతావరణ శాఖ అంచనా ప్రకారం మోంథా తుఫాన్ కదలిక మార్గం ఒడిశా వైపు నేరుగా లేనప్పటికీ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు దాని ప్రభావాలను అనుభవించే అవకాశం ఉందని భావిస్తున్నారు. గంజాం నుండి పారాదీప్ వరకు కోస్తా జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. దక్షిణ ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నందున గంజాం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అవగాహన ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాష్ట్రంపై మోంథా తుఫాన్ ముప్పు లేకున్నా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 7 జిల్లాల్లో ఉద్యోగుల సెలవులను రద్దు చేసింది. సెలవులో ఉన్నవారు వెంటనే ప్రధాన కార్యాలయానికి తిరిగి రావాలని ఆదేశించింది. కొరాపుట్, మల్కన్గిరి, గజపతి, గంజాం, కలహండి, బాలాసోర్, కేంద్రాపడా 7 జిల్లాల కలెక్టర్లు సిబ్బంది సెలవులు రద్దు చేసినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. తుఫాన్ కారణంగా రాష్ట్రంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది. దీనివల్ల కొన్ని జిల్లాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉంది. తుఫాన్ ఆశ్రయ కేంద్రాలు, సహాయ కేంద్రాలను సిద్ధం చేశారు. రైల్వే, రోడ్డు జామ్లు సంభవించే అవకాశం ఉన్నందున రాకపోకలకు అడ్డంకులు తొలగించేందుకు ఓడ్రాఫ్ బందాన్ని అప్రమత్తం చేశారు. తుఫాన్ను ఎదుర్కోవడానికి సన్నద్ధతను రెవెన్యూ, విపత్తు నిర్వహణ విభాగం మంత్రి సురేష్ కుమార్ పూజారి సమీక్షించారు. తీర ప్రాంతం జిల్లా కలెక్టర్లు, ప్రత్యేక సహాయ కమిషనర్, సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాలుపంచుకున్నారు. సమీక్ష తర్వాత మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం ఏదైనా తుఫాన్ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని అన్నారు. జలవనరులు, పంచాయతీరాజ్, వ్యవసాయం, ఆరోగ్యం, విద్యుత్ శాఖలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు. సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులను అప్రమత్తం చేయడానికి అధికారులు లౌడ్స్పీకర్లు, మెగాఫోన్లను ఉపయోగిస్తున్నారు. వెంటనే ఒడ్డుకు తిరిగి రావాలని కోరారు. చాలా మంది మత్స్యకారులు ఇప్పటికే తీరానికి చేరారు. మరి కొంత మంది సముద్రంలోనే ఉన్నారు. సముద్రం లోనికి వెళ్లిన చేపల వేట పడవలను సురక్షితంగా తీరం చేర్చేందుకు చురుకుగా సన్నాహాలు చేస్తున్నారు. పర్యాటకులకు సూచన మోంథా తుఫాన్ దృష్ట్యా ఈ నెల 27, 28 మరియు 29 తేదీలలో పర్యాటకులను సముద్రంలోకి లేదా బీచ్లోకి అనుమతించబోమని పూరీ జిల్లా యంత్రాంగం ప్రకటించింది. తుఫాన్ కారణంగా సముద్రంలో అధిక ఆటుపోట్లు దృష్ట్యా పర్యాటకులను సముద్రం లోనికి అనుమతించేది లేదన్నారు. బ్లూ ఫ్లాగ్ బీచ్, నీలాద్రి బీచ్తో సహా ఇతర ప్రాంతాల్లో లైఫ్గార్డ్లను మోహరించారు. విపత్కర పరిస్థితుల నిర్వహణకు అవసరమైన సరంజామాతో వీరిని నియమించారు. తుఫాన్ నేపథ్యంలో సందర్శకుల భద్రతను పరిరక్షించడం ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. నేటి నుంచి వర్షాలు తుఫాన్ ప్రభావం కారణంగా సోమవారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఈ నెల 28, 29 తేదీలలో రాష్ట్రం అంతటా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ శాస్త్రవేత్త మనోరమ మహంతి తెలిపారు. ఈ నెల 27 నుంచి 30 వరకు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. గాలి వేగం గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ వేగం గంటకు 110 కిలో మీటర్ల వరకు పుంజుకునే అవకాశం ఉందని ఆమె తెలిపారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాతావరణ వ్యవస్థ తీవ్ర వాయుగుండంగా బలపడింది. సోమవారం (అక్టోబర్ 27) ఉదయం నాటికి ఇది తుఫాన్గా అక్టోబర్ 28 (మంగళ వారం) నాటికి తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకారం, ఈ నెల 28 సాయంత్రం లేదా రాత్రి సమయంలో తుఫాన్ మోంథా ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకుతుందని అంచనా. అంగన్వాడీ కేంద్రాలు మూత తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాలు మూసివేస్తారు. గర్భిణులను వైద్య కేంద్రాలకు తరలిస్తారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా తెలిపారు. అంగన్వాడీ, ఆశా కార్యకర్తలకు ఈ బాధ్యత కేటాయించినట్లు ఆమె తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
రాయగడ: జిల్లాలోని మునిగూడ పోలీసుస్టేషన్ పరిధిలోని బూరుకుగూడ మలుపు వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా వారిని బంకిలి గ్రామానికి చెందిన అర్జున్ శికక (23), గోవర్ధన్ గ్రామానికి చెందిన దేవాషిస్ సాహు (24) గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మునిగూడ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాలు ప్రకారం.. దేవషిస్ బైక్పై సమీపంలో గల ఆస్పత్రికి వెళ్తుండగా ఎదురుగా మరో బైక్పై అర్జున్ వచ్చి ఎదురెదురుగా ఢీకొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
1 నుంచి చెకుముకి సంబరాలు
శ్రీకాకుళం: జిల్లాలో నవంబర్ 1న మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహిస్తున్నట్లు జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గొంటి గిరిధర్, కుప్పిలి కామేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీకాకుళంలోని యూటీఎఫ్ భవన్లో జనవిజ్ఞాన వేదిక కార్యదర్శి వర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30 మండలాల్లో ఎంఈఓలు, హెచ్ఎంలు, చెకుముకి మండల కన్వీనర్లు, ఉపాధ్యాయులు, సైన్స్ ఉద్యమాభిమానులు, విద్యార్థులు హాజరై సంబరాలు విజయవంతం చేయాలన్నారు. అదే విధంగా నవంబర్ 11 నుంచి 20 వరకు శ్రీకాకుళంలో జరిగే సిక్కోలు పుస్తక మహోత్సవం విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా వ్యవస్థాపక కార్యదర్శి కొత్తకోట అప్పారావు, జిల్లా గౌరవాధ్యక్షులు బొడ్డేపల్లి మోహనరావు, బొడ్డేపల్లి జనార్దనరావు, జిల్లా ఉపాధ్యక్షులు పాలకొండ కూర్మారావు, సైన్స్ అండ్ కమ్యూనికేషన్ జిల్లా కన్వీనర్ హనుమంతు మన్మధరావు, ఎడ్యుకేషన్ సబ్ కమిటీ జిల్లా కన్వీనర్ పాలవలస ధర్మారావు, సమత జిల్లా కన్వీనర్ పేడాడ వేదవతి, ఆడిట్ జిల్లా కన్వీనర్ బి.ఉమామహేశ్వరరావు, యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షులు బి.ధనలక్ష్మి పాల్గొన్నారు. -
కలియుగ కై లాసం.. ఎండల మల్లన్న క్షేత్రం
టెక్కలి : కలియుగ కై లాసంగా పేరుగాంచిన టెక్కలి మండలం రావివలసలోని ఎండల మల్లికార్జునస్వామి దేవాలయం కార్తీకమాస తొలి సోమవారం పూజలకు సన్నద్ధమైంది. జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అక్టోబర్ 27న తొలి సోమవారం, నవంబర్ 3న రెండవ సోమవారం, 11న మూడవ సోమవారం, 17న నాల్గవ సోమవారాల ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శీర్షాభిషేకం టికెట్ ధర రూ.40, ప్రత్యేక దర్శనం టికెట్ ధర రూ.20, కేశఖండన రూ.40, రుద్రాభిషేకం రూ.58 రూపాయల చొప్పున ధరలు నిర్ణయించారు. ఇదీ స్థల చరిత్ర.. ఎండల మల్లికార్జున స్వామి ఆలయం చరిత్రను ఎంతో మంది వేదపండితులు ఎన్నో రకాలుగా అభివర్ణించారు. వారి మాటల్లో చెప్పాలంటే... ‘త్రేతా యుగంలో రావణ సంహారం అనంతరం రాముడు తన పరివారంతో అయోధ్యకు వెళ్తూ మార్గ మధ్యలో సుమంచ పర్వతంగా పిలువబడే ప్రస్తుతం రావివలస ప్రాంతంలో తపస్సు చేయాలని వానర వైద్యుడు సుశేణుడికి ఆజ్ఞ చేశారు. కొన్ని సంవత్సరాలు తరువాత సుశేణుడి యోగ క్షేమాలు తెలుసుకునేందుకు ఆంజనేయుడు ఈ ప్రాంతాన్ని సందర్శించగా, సుశేణుడు ధ్యాన సమాధి కావడం గమనిస్తాడు. దీంతో సుశేనుడు పార్థివ దేహాన్ని పూడ్చి వేసి, ఆ సమాధిపై జింక చర్మాన్ని ఆనవాలుగా వేసి విషయాన్ని రామునికి తెలియజేస్తాడు. రాముడు తన పరివారంతో సుశేణుడి సమాధి వద్దకు చేరుకోగా, ఆ సమాధిపై స్వయంభూలింగం వెలియడంతో పాటు దానిపై మల్లెపూల దండ ఉండటం గమనిస్తారు. జింక చర్మం, మల్లెపూల దండతో ఉన్న ఆ లింగానికి ‘మల్లికాజినుడు’ అని నామకరణం చేసి, సమీపంలో ఉన్న కోనేరులో సీతమ్మ స్నానం చేసి కొండపై విశ్రమించి ఆ లింగానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అప్పటి నుంచి మల్లికాజినుడు నామకరణం కొనసాగగా, తర్వాత ద్వాపరయుగంలో అర్జునుడు ఈ ప్రాంతంలో శివుని కటాక్షం కోసం తపస్సు చేయగా, శివుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలి అని అడుగగా.. నీ నామం తర్వాత నా పేరు ఉండాలని అని కోరగా, దీంతో శివుడు ఆ వరాన్ని ప్రసాదించగా, ఆ కాలంలో ‘మల్లికార్జునుడు’ అనే నామం కొనసాగింది. కాలానుగుణంగా ఈ లింగం ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తుండడంతో, ఈ యుగం నాటికి ‘ఎండల మల్లికార్జునుడు’గా నామం స్థిరపడింది. అప్పటి నుంచి రావివలస ఎండల మల్లికార్జునుడు వెలసిన ప్రాంతం కలియుగ కై లాసంగా కొనసాగుతోంది. ఎండల మల్లికార్జునుడుఆలయానికి చేరుకోండిలా.. ఎండల మల్లికార్జునుడు ఆలయానికి చేరుకునేందుకు రోడ్డు, రైల్వే మార్గాలు ఉన్నాయి. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం నుంచి టెక్కలి చేరుకుని అక్కడి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న రావివలసలోని ఆలయానికి చేరుకునేందుకు అనేక బస్సులు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. రైల్వే మార్గం విషయానికి వస్తే టెక్కలితో పాటు సమీపంలో సుమారు 5 కిలోమీటర్ల దూరంలో నౌపడ రైల్వే స్టేషన్, 20 కిలోమీటర్ల దూరంలో పలాస రైల్వే స్టేషన్కు చేరుకుని అక్కడి నుంచి బస్సులు, చిన్నపాటి వాహనాల్లో ఆలయానికి చేరుకోవచ్చు. -
చిత్రలేఖన పోటీలకు విశేష స్పందన
జయపురం: ప్రాచీన సంస్కృతి, సంప్రదాయ కళలు, పద్ధతుల పరిరక్షణ లక్ష్యంతో ఏర్పాటు చేసిన జయపురం తరుణ ప్రజ్ఞా భారతి వార్షికోత్సవం సందర్భంగా వివిధ పోటీలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఆదివారం స్థానిక ఎన్.కె.టి రోడ్డు నారాయణి ఆంగ్ల పాఠశాల ప్రాంగణంలో ప్రాచీణ ప్రబంధాలు, చారిత్రిక విషయాలు, చిత్ర లేఖనం పోటీలను సీనియర్, జూనియర్ విభాగాల్లో నిర్వహించారు. ఈ పోటీల్లో అనేక పాఠశాలలు, కళాశాలలు, విశ్వ విద్యాలయాల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. తరుణ ప్రజ్ఞా భారతి జయపురం అధ్యక్షుడు తపన్ కిరణ్ త్రిపాఠీ, ఉపాధ్యక్షుడు రామ శంకర షొడంగి, సాధారణ కార్యదర్శి అజయ్ కుమార్ మల్లిక్, కోశాధికారి రవీంధ్ర మహరాణ, సభ్యులు జానకి పాణిగ్రహి, సబిత త్రిపాఠీ, లిపికా దొలాయి, జగన్నాథ్ పాణిగ్రహి, క్షిరోద్ దాస్, క్షేత్ర మోహన్ నాయక్ పోటీలను పర్యవేక్షించారు. నవంబర్ 2వ తేదీన స్థానిక నారాయణి ఆంగ్ల పాఠశాల మైదానంలో ఉదయం 7.30 గంటల నుంచి విలువిద్య, పరుగు పందెం, కబడ్డీ పోటీలతో పాటు, పిల్లలకు పాటల పోటీలు నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు తపన్ కిరణ్ త్రిపాఠీ వెల్లడించారు. తాము నిర్వహించిన పోటీల్లో ఏ పాఠశాల విద్యార్థులు ఎక్కువ బహుమతులు గెలుచుకుంటారో ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిని తరుణ ప్రజ్ఞా భారతి వార్షికోత్సవంలో ఘనంగా సన్మానిస్తామని ప్రకటించారు. -
ఉపఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు
కొరాపుట్: నువాపడా ఉప ఎన్నికల ప్రచారంలో కొరాపుట్ జిల్లా కాంగ్రెస్ నాయకులు బిజీగా ఉన్నారు. నువాపడా పుర వీధులలో ఆదివారం ఇంటింటి ప్రచారం చేశారు. కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క, కొరాపుట్ జిల్లాకి చెందిన కాంగ్రెస్ శాసన సభా పక్ష నాయకుడు సప్తగిరి ఉల్క, లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర శాంత, మల్కన్గిరికి చెందిన మంగులు శాంతలు ప్రచారం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కేవలం కొరాపుట్ ఎంపీ స్థానం మాత్రమే ఉంది. పార్లమెంటరీ పరిధిలో ఏడు ఎమ్మెల్యే స్థానాలుండగా.. ఆరు స్థానాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పంచాయతీలను యూనిట్గా తీసుకొని కాంగ్రెస్ నాయకులు అక్కడ మకాం వేశారు. మోంథా తుఫాన్ హెచ్చరికలు జారీ భువనేశ్వర్: ముంచుకు వస్తున్న మోంతా తుఫాను నేపథ్యంలో పలు ప్రాంతాలకు వివిధ వర్గాల హెచ్చరికలు జారీ చేశారు. ఎరుపు హెచ్చరిక: ● అక్టోబర్ 28 నుంచి అక్టోబర్ 29: మల్కన్గిరి,కొరాపుట్,రాయగడ,గజపతి, గంజాం ●అక్టోబర్ 29 నుండి అక్టోబర్ 30: మల్కన్గిరి, కొరాపుట్, నవరంగపూర్, కలహండి, రాయగడ ఆరెంజ్ హెచ్చరిక ●అక్టోబర్ 27 నుండి అక్టోబర్ 28: మల్కన్గిరి, కొరాపుట్, నవరంగపూర్, కలహండి, రాయగడ, గజపతి, గంజాం, కంధమల్. ●అక్టోబర్ 28 నుండి అక్టోబరు 29: నవరంగ్పూర్, కలహండి, కంధమల్, నయాగడ్, ఖుర్దా, పూరీ ●అక్టోబర్ 29 నుండి అక్టోబరు 30: నువాపడా, బొలంగీర్, బౌధ్, కంధమల్, గజపతి, గంజాం ప్రధాని నోట కొరాపుట్ కాఫీ కొరాపుట్: దేశ ప్రధాని నరేంద్ర మోదీ కొరాపుట్ కాఫీని మెచ్చుకున్నారు. ఆదివారం ప్రధాని మన్ కీ బాత్ 127వ ఎపిసోడ్లో మాట్లడారు. ‘ఈ రోజు మన్ కీ బాత్లో కాఫీ కోసం ఎందుకు మాట్లాడకూడదు అనిపించింది. దాంతో మాట్లాడాల్సి వచ్చింది. ఈ కాఫీ చాలా అద్భుతంగా ఉంటుంది. కొరాపుట్ కాఫీ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందడం వెనుక అక్కడ గిరిజనుల కృషి ఉంది.’ అన్నారు. కొరాపుట్ కాఫీ ఒడిశా గౌరవంగా అభివర్ణించారు. కొరాపుట్ కాఫీ లాభాలతో పాటు ఇది ఒక అద్భుతమైన జీవన విధానంగా ముందుకు సాగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ కొరాపుట్ కాఫీ రుచి చూడాలని ప్రధాని పిలుపునిచ్చారు. కొరాపుట్ జిల్లాలలో పురాతన కాలంగా గిరిజనులు కాఫీ పంట పండిస్తున్నారు. -
రాష్ట్రస్థాయి భగవద్గీత పోటీలకు విద్యార్థుల ఎంపిక
నరసన్నపేట: భగవద్గీతలోని 15వ అధ్యాయంలో శ్లోకాల పఠనంపై జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో ఆరుగురిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తున్నట్లు చిన్మయిమిషన్–చిన్మయి సుగుణం స్థానిక ఆశ్రమం స్వామీజీ పరమాత్మానంద ఆదివారం తెలిపారు. నరసన్నపేట శాఖ ఆధ్వర్యంలో మండల స్థాయిలో పోటీలు నిర్వహించగా 44 పాఠశాలల నుంచి 4500 మంది పాల్గొనగా జిల్లా స్థాయికి 120 మంది ఎంపికయ్యారని చెప్పారు. వీరికి ఆదివారం నరసన్నపేటలో పోటీలు నిర్వహించి వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన 16 మందిని ఎంపిక చేశామన్నారు. వీరిలో ఆరుగురు దేవశ్యగౌతమి, పి.సుసాధ్య, ఏ.నైషిత, ఏ.జాహ్నవి, వి.గీత, ఎం.శివాణి నవంబర్ 9న కడపలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. -
విజిలెన్స్ వలలో ట్రెజరీ ఉద్యోగి
● వితంతువు నుంచి రూ. 47 వేలు లంచంగా తీసుకుంటూ పట్టుబడిన వైనం జయపురం: జయపురం స్పెషల్ ట్రెజరీ కార్యాలయంలో ప్యూన్గా పని చేస్తున్న హరిశ్చంద్ర మహాపాత్రో విజిలెన్స్ వలలో చిక్కారు. ఓ వివాహిత నుంచి 47 వేల రూపాయలు లంచంగా తీసుకుంటుండగా శనివారం సాయంత్రం జయపురం విజిలెన్స్ అధికారులకు పట్టుబడ్డారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. చనిపోయిన ఓ ఉద్యోగి భార్యకు రావలసిన పింఛన్, ఇతర బెనిఫిట్స్ బకాయిలు చెల్లించేందుకు 87 వేలు లంచంగా డిమాండ్ చేశాడు. ఆమెకు బకాయిలతో పాటు పింఛన్ బకాయిలు మూడు లక్షల 48 వేల రూపాయలు రావాల్సి ఉంది. రావలసి డబ్బులో 25 శాతం అనగా రూ. 87 వేలు లంచం కావాలని హరిశ్చంద్ర మహాపాత్రో పిమాండ్ చేశారు. అంగీకరించిన ఆమె రూ. 40 వేలు మొదటి విడతగా మహాపాత్రోకు అందజేసింది. అయినా మిగతా రూ. 47 వేలు ఇవ్వమని డిమాండ్ చేస్తూ వచ్చాడు. ఆ డబ్బు ఇస్తేనే పెన్షన్ బకాయిలు రిలీజ్ చేస్తానని లేదా రిలీజ్ చేసేది లేదని మెలిక పెట్టాడు. మరో మార్గం లేక ఆమె జయపురంలోని కొరాపుట్ విజిలెన్స్ ఎస్పీ కార్యాలయ అధికారులను ఆశ్రయించి తన గోడు విన్నవించుకుంది. వారు ఆమెకు హామీ ఇచ్చి ఏమి చేయాలో వివరించారు. రూ. 47 వేలు తీసుకొనివెళ్లి మహాపాత్రోకు అందజేసింది. అప్పటికే వేచి ఉన్న విజిలెన్స్ సిబ్బంది దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా నిందితుడికి చెందిన రెండు ప్రాంతాలలో దాడులు నిర్వహించారు. ఇంకా దర్యాప్తు జరుపుతున్నట్లు విజిలెన్స్ వర్గాలు వెల్లడించాయి. -
బొయిపరిగుడలో జర్దా ముక్త అభిజాన్
జయపురం: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడలో ఆదివారం సమితి స్థాయి తమాకు(జర్దా) ముక్త అభిజాన్ కార్యక్రమం నిర్వహించారు. బొయిపరిగుడ కమ్యూనిటీ ఆస్పత్రి ఇన్చార్జి డాక్టర్ బాణువదత్త నాయిక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సమితి స్థాయి తమాకు ముక్త 3.0 సమావేశం జరిగింది. కార్యక్రమంలో తమాకు సేవించటం, అందువల్ల కలిగే ఆనారోగ్య సమస్య లపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ నాయిక్ మాట్లాడుతూ తమాకు, దానితో తయారు చేసిన బీడీ వంటివి వినియోగించడ వల్ల పలు వ్యాధులు సంక్రమిస్తాయని, అందువల్ల ప్రభుత్వం తమాకు ముక్త అభిజాన్ 3.0 ప్రారంభించిందని వెల్లడించారు. ఈ అభిజాన్ ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభమైందని, ఇది 2025 డిసెంబర్ 9 వ తేదీ వరకు నిర్వహిస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా తమాకు విసర్జణ పై ప్రజలను చైతన్య పరచే కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. బొయిపరిగుడ సమితిని తమాకు ముక్త సమితిగా నిలిపేందుకు సామూహికంగా ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆశిష్ కుమార్ భల్, బీపీఎం హెమరాజ్ పాణిగ్రహి, పి.హెచ్.ఇ.ఓ సునీత పట్నాయిక్, బీఏఎం ప్రమోద్ కుమార్ నాయిక్, ఎల్టీ సూర్యనారాయణ హొత, హెచ్సీడీ అశుతోష్ సాహు, ఎస్టిఎస్ సమీర్ గంతాయత్, ఎంఆర్ఏ సౌరభ మహంకుడొతో పాటు మహిళ, పురుష మహిళ హెల్త్ వర్కర్లు పాల్గొన్నారు. -
ప్రమాద బీమా అందజేత
మల్కన్గిరి: పోలీస్ కానిస్టేబుల్ బుద్రా దోర విధి నిర్వహణలో జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. మృతుని భార్యకు మల్కన్గిరి జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ ప్రధాన శాఖ తరఫున జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయంలో రూ.40 లక్ష చెక్కును ఎస్పీ వినోద్ పటేల్ చేతుల మీదుగా అందజేశారు. బుద్రా దోర పోలీస్ సాలరీ ప్యాకేజీ కింద వేతన ఖాతాను తెరిచారు. బ్యాంక్ తరుఫున బీమా మొత్తం అందజేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ప్యాకేజీ కింద ఖాతా ఉన్న పోలీసు సిబ్బందికి ప్రమాదవస్తు మరణానికి రూ.కోటి, సహజ మరణానికి రూ.10 లక్షల బీమా చెల్లిస్తామని బ్యాంక్ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ వినోద్ కుమార్, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. ఏపీసీపీఎస్ఈఏ నూతన కార్యవర్గం ఎన్నిక శ్రీకాకుళం అర్బన్: ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం శ్రీకాకుళంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు, ఎన్నికల అధికారి బి.బాలకృష్ణ, ఎన్నికల పరిశీలకులు చల్లా దుర్గాప్రసాద్, గురుగుబెల్లి భాస్కర్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా గురుగుబెల్లి భాస్కరరావు, జిల్లా అధ్యక్షుడిగా చల్ల సింహాచలం, ప్రధాన కార్యదర్శిగా అంపోలు షణ్ముఖరావు, సహాధ్యక్షుడిగా బొడ్డు శేఖర్, ఆర్థిక కార్యదర్శిగా యాళ్ల శ్యాంసుందర్, అదనపు ప్రధాన కార్యదర్శిగా శ్రీధర్, మహిళా అధ్యక్షురాలుగా పి.జయమ్మ, రాష్ట్ర కౌన్సిలర్లగా కరిమి రాజేశ్వరరావు, వడమ శరత్బాబు, సూర్య, బి.ప్రదీప్చంద్ర వర్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
బాలియాత్ర విజయవంతం చేయండి
జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో కార్తీక పౌర్ణమి అనంతరం నవంబరు 9న జరగనున్న బాలియాత్రను విజయవంతం చేయాలని నిర్వాహక కమిటీ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు ఆదివారం శ్రీముఖలింగంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధి డాక్టర్ దువ్వాడ జీవితేశ్వరరావు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు యాత్రలో పాల్గొనాలని కోరారు. కుల మతాలకు అతీతంగా జరిగే ఈ ఉత్సవాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించాలన్నారు. కటక్ నుంచి రాజమండ్రి వరకూ మహానది, గోదావరి నదుల మధ్య విరాజిల్లిన కళింగ రాజ్యం పూర్వ వైభవం భావితరాలకు తెలియజేసేందుకు అందరూ కలిసిరావాలని కోరారు. యాత్ర నిర్వహణకు ఎటువంటి విరాళాలు స్వ్కీరించబడవని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ టి.సతీష్కుమార్, ఎంపీటీసీ కె.హరిప్రసాద్, గ్రామపెద్దలు బి.వి.రమణ, అర్చకులు పాల్గొన్నారు. -
తుఫాన్పై యంత్రాంగం అప్రమత్తం
మల్కన్గిరి: మోంథా తుఫాన్ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే ఈ నెల 27 నుంచి 30 వరకు ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు చేశారు. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని మల్కన్గిరి కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ అదికారులను ఆదేశించారు. ముఖ్యంగా అగ్నిమాపక శాఖ, విద్యుత్శాఖ, సరఫరల శాఖ, పోలీసు శాఖలు అలర్ట్గా ఉండాలన్నారు. చిత్రకొండ, బొండాఘట్టీ ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సౌకర్యాలు కల్పించాలన్నారు. మచిలీపట్నం, కాకినాడ మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉన్నందున, మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి మోటు ప్రాంతం శబరి నదీ సరిహద్దున ఉన్నందున అప్రమత్తమైనట్లు వివరించారు. -
జిల్లా యంత్రాంగం అప్రమత్తం
పర్లాకిమిడి: మోంథా ముప్పు ఉన్నందున గజపతి కలెక్టర్ మధుమిత ఆదివారం కలెక్టరేట్ చాంబర్లో విలేకరులతో మాట్లాడారు. తుపాను ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నం వద్ద తీరం దాటనుందని ఐఎండీ జారీ చేయడంతో ఆ ప్రభావంతో గజపతికి తుఫాన్ ముప్పు ఉందని, దీని ప్రభావంతో సుమారు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయని జిల్లా కలెక్టర్ మధుమిత విలేకరుల సమావేశంలో తెలియజేశారు. జిల్లాలో ఏడు సమితి కేంద్రాల్లో అయిదు మండలాలకు తుపాను షెల్లర్లు సిధ్ధం చేశామని, అలాగే అంగన్వాడీ, శిశుసురక్షా కేంద్రాలు మూసివేస్తున్నామని అన్నారు. ఈ తుపాను ముప్పును ఎదుర్కోవడానికి అన్ని ప్రభుత్వ విభాగాలు, బీడీఓ, తహసీల్దార్లు, ఇంజినీర్లకు సెలవులు రద్దు చేశామన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు తెలియజేశారు. రాయగడ బ్లాక్ గంగాబడ, కోయిపూర్, కోండమీద నివసిస్తున్న గిరిజనులకు ఆశ్రయం కల్పించి వారికి అటుకులు, బెల్లం, ఇతర డ్రైఫుడ్ ఆహారం కల్పించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. సోమవారం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్, మంగళవారం రెడ్ అలెర్టు జారీ చేసినట్టు కలెక్టర్ తెలియజేశారు. ఓడ్రాఫ్ సిబ్బంది రెండు బృందాలు సోమవారం నాటికి పర్లాకిమిడి చేరుకుంటాయని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఓస్వాన్ కాన్ఫరెన్స్ హాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోహన, నువాగడ, ఆర్.ఉదయగిరి, రాయఘడ, గుమ్మా, కాశీనగర్, గుసాని అధికారులతో సమీక్ష జరిపారు. -
బడాసింహ్ను పంచాయతీగా గుర్తించాలి
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ సమితి టోలోన పంచాయతీలో గల బడాసింహ్ గ్రామాన్ని పంచాయతీగా గుర్తించాలని కోరుతూ 14 గ్రామాలకు చెందిన ప్రజలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం సబ్ కలెక్టర్ దుద్దుల్ అనిల్ అభిషేక్కు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం టోలన పంచాయతీ పరిధిలో గల కడసింగ్, దెంగకుల్, డుంబడా, సంగోసగాడా, పొడ, సింజంగారిగా, కింతుంగో, ఓడోసార, ఖోరోలా, తోడరో, కింతురుంగా, ఓనరుంగూడ, రూపిడిసింగ్, లోవగోపాడి గ్రామాలు టోలోన పంచాయతీకి సుమారు 10 నుంచి 15 కిలో మీటర్ల దూరం వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఈ గ్రామాలకు సమీపంలో గల బడాసింహ్ గ్రామాన్ని పంచాయతీగా గుర్తిస్తే ఎన్నో సౌకర్యలు పొందుతామని వినతిపత్రంలో పేర్కొన్నారు. -
క్వాంటమ్తో సమూల మార్పులు
ఎచ్చెర్ల : రాజీవ్ గాంధీ వైజ్ఞానికి సాంకేతిక విశ్వవిద్యాలయం శ్రీకాకుళం ప్రాంగణంలో జరుగుతున్న క్విస్కిట్ ఫాల్ –2025 ఉత్సవంలో ఆరో రోజు ఆదివారం విద్యార్థుల్లో నూతనోత్సాహాన్నినింపింది. ఈ సందర్భంగా ఐబీఎం శాస్త్రవేత్త డాక్టర్ రతజిత్ మజుందార్ మాట్లాడుతూ క్వాంటం ద్వారా ప్రపంచంలో అనేక మార్పులను తీసుకురాగలమని చెప్పారు. అనంతరం క్వాంటమ్ ఆల్గారిథమ్స్పై పేరణాత్మక సెషన్ నిర్వహించారు. క్వాంటమ్ సూత్రాలు, ప్రయోగాత్మక అన్వయాలు, భవిష్యత్తు సాంకేతికతలలో పాత్రను వివరిస్తూ విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆసక్తిని పెంచారు. డాక్టర్ జాన్ యల్లా మాట్లాడుతూ విద్యార్థులు సృజనాత్మక ఆలోచనలతో క్వాంటమ్ సమస్యల పరిష్కారాలను ప్రదర్శించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో క్యాంపస్ డైరెక్టర్ కొక్కిరాల వెంకట బాలాజీ, పరిపాలనాధికారి ముని రామకృస్ణ, డీన్ శివరామకృష్ణ, ఫైనాన్స్ అధికారి వాసు, గేదెల రవి, రమేష్, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అబుదాబిలో వలస కూలీ మృతి కంచిలి: పురుషోత్తపురం పంచాయతీ గెద్దలపాడు గ్రామానికి చెందిన వలస కూలీ నక్క నరసింహారావు(49) అబుదాబిలో శుక్రవారం మృతిచెందాడు. నెల రోజుల క్రితం అబుదాబిలో ఎన్.ఎస్.హెచ్. కంపెనీలో వెల్డర్గా పనిచేసేందుకు వెళ్లాడని, అక్కడ కడుపునొప్పితో మృతిచెందినట్లు సమాచారం అందించారని కుటుంబ సభ్యులు తెలిపారు. నరసింహారావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేందుకు కృషి చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్లను కోరారు. బావిలో పడి యువకుడు మృతి టెక్కలి రూరల్: కోటబొమ్మాళి పంచాయతీ ఉప్పరపేటకు చెందిన దండుపాటి గౌరినాయుడు(32) ఆదివారం బావిలో పడి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌరినాయుడుకు మద్యం అలవాటు ఉంది. మద్యం అతిగా సేవించి స్నానానికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనేది తెలియడం లేదు. గమనించిన స్థానికులు వెంటనే బావి నుంచి వ్యక్తిని బయటకు తీసుకువచ్చారు. అనంతరం 108 అంబులెన్సుకు సమాచారం ఇవ్వగా సిబ్బంది చేరుకుని వ్యక్తి మృతిచెందినట్లు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని శవపంచనామ నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గౌరినాయుడుకు భార్య వరలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు చిన్న, కల్పన ఉన్నారు. తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని కోటబొమ్మాళి ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. కంచిలి : పశు సంవర్థక శాఖలో 31 సంవత్సరాలుగా అందించిన సేవలకు గుర్తింపుగా పెద్దశ్రీరాంపురం గ్రామానికి చెందిన విశాఖపట్నం పశుసంవర్థకశాక ఉపసంచాలకుడు డాక్టర్ మాదిన ప్రసాదరావు రైతునేస్తం పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్లోని స్వర్ణభారతి ట్రస్ట్లో రైతునేస్తం, ముప్పవరపు ఫౌండేషన్ సంయుక్తంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో వినూత్న సేవలు అందించే శాస్త్రవేత్తలు, విస్తరణ అధికారులు, ఆదర్శ రైతులకు ఇచ్చే అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం నిర్వహించారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రసాదరావు పురస్కారం అందుకున్నారు. 50 లీటర్ల సారాతో ముగ్గురు అరెస్టు సోంపేట: సోంపేట ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో ఆదివారం దాడులు నిర్వహించి 50 లీటర్ల సారాతో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ సీఐ రమణ తెలిపారు. ఒడిశా రాష్ట్రం నుంచి ఆటోలో సారా రవాణా చేస్తున్న పిడిమందస గ్రామానికి చెందిన కడ్డాల రాజారావు, ఇప్పిలి ఉమామహేశ్, అగ్గున నారాయణలను పట్టుకుని అరెస్టు చేశామన్నారు. సారా తయారుచేసినా, విక్రయించినా, రవాణా చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. దాడుల్లో ఎక్సైజ్ సిబ్బంది గుణాకర్, భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
బ్రహ్మ మురారి సురార్చిత లింగం..!
● ‘బ్రహ్మసూత్ర శివలింగాలు’ కొలువైన క్షేత్రంగా శ్రీముఖలింగం ● అరుదైన దేవాలయంగా గుర్తింపు జలుమూరు: దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ శైవక్షేత్రం శ్రీముఖలింగం మరో ప్రత్యేకతనూ కలిగి ఉంది. ఎంతో అరుదైన ‘బ్రహ్మసూత్రాల శివలింగాలు’ కలిగిన క్షేత్రంగా ప్రాశస్త్యం పొందింది. భీమేశ్వరుడు, సోమేశ్వరుడు, వరుణేశ్వరుడు, ఈశాన్య ఈశ్వరుడు, ఎండల మల్లికార్జునులను బ్రహ్మసూత్రాల శివలింగాలుగా పిలుస్తారు. ఇవి కొలువైన క్షేత్రాలు దేశంలో వేలిపై లెక్కపెట్టవచ్చు. అంతటి ప్రాముఖ్యత కలిగిన శివాలయం మన జిల్లాలో ఉండటం సిక్కోలు ప్రజల అదృష్టంగా చెప్పవచ్చు. బ్రహ్మసూత్రాల శివలింగాలను దర్శించుకుంటే సాక్షాత్తు ఆ పరమేశ్వురుడిని దర్శనం చేసుకోవడంగా, పూర్వజన్మ సుకృతంగా భక్తులు భావిస్తారు. ముఖ్యంగా కార్తీక మాసంలో శ్రీముఖలింగం క్షేత్రానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కాశీలో లింగం, గంగలో స్నానం, శ్రీశైలంలో శిఖరం, శ్రీముఖలింగంలో ముఖదర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఇక్కడ జరిగే కార్తీక మాస ఉత్సవాలలో పాల్గొనేందుకు భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివస్తుంటారు. కృతయగంలో గోవిందేశ్వరుడు అనే నామంతో కనాకాకృతిలో, త్రేతాయగంలో మధుకేశ్వరుడనే నామంతో రజతాకృతిలో, ద్వాపరయుగంలో జయంతేశ్వరుడనే నామంతో కాంస్యాకృతిలో, కలియగంలో ముఖలింగేశ్వరుడనే పేరుతో ముఖం దాల్చి శిలాకృతిలో శివుడు శ్రీముఖలింగం క్షేత్రంలో దర్శనమిస్తున్నాడు. -
భువనేశ్వర్ విమానాశ్రయం డీజీఎం అరెస్టు
భువనేశ్వర్: స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉమాకాంత్ పటేల్ని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. తన వైవాహిక స్థితిని దాచిపెట్టి ఎయిర్ హోస్టెస్ను మోసం చేసి అక్రమ సంబంధం కొనసాగించాడనే ఆరోపణలపై అరెస్టు చేశారు. అతనికి వ్యతిరేకంగా భారతీయ న్యాయ సంహితలోని బహుళ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు తర్వాత శనివారం అతడిని కోర్టు ముందు హాజరుపరిచారు. ఉమాకాంత్ పటేల్ ఢిల్లీ విమానాశ్రయం నుంచి 4 నెలల క్రితం స్థానిక విమానాశ్రయానికి బదిలీ చేయబడ్డాడు. ఢిల్లీలో తన పదవీకాలంలో ఒక ప్రైవేట్ ఎయిర్లైన్స్లో పని చేస్తున్న ఎయిర్హోస్టెస్తో ప్రేమ వ్యవహారం కొనసాగించాడు. తాను అవివాహితుడినని మాయమాటలు చెప్పి లైంగిక సంబంధాన్ని ఏర్పరచుకున్నాడని ఆరోపణ. ప్రియురాలు గర్భవతిగా ఖరారు కావడంతో ఆమెను బెదిరించి గర్భస్రావం చేయించుకోవాలని బలవంతం చేశాడు. ఇంతలో ఎయిర్హోస్టెస్ తన మకాం భువనేశ్వర్కు మార్చి తన పనిని కొనసాగించింది. ఉమాకాంత్ పటేల్ అప్పటికే వివాహితుడు మరియు ఒక బిడ్డ తండ్రిగా ప్రియురాలు తెలుసుకోవడంతో విషయం మలుపు తిరిగింది. అతనితో గొడవ పడిన తర్వాత ఆమెను బెదిరించడంతో ఎయిర్పోర్ట్ పోలీస్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఉమాకాంత్ పటేల్ను అరెస్టు చేశారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తాచుపాము కలకలం మల్కన్గిరి: జిల్లాలో బలిమెల పట్టణం 12వ వార్డులోని డంపింగ్ యార్డ్ కాలనీలో ఒక వ్యక్తి ఇంట్లో శుక్రవారం రాత్రి తాచుపాము కలకలం సృష్టించింది. దీంతో వెంటనే వారు బలిమెల స్నేక్ హైల్ప్లైన్ సభ్యుడు రాజేంద్ర ఖోరకు సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చి అతికష్టం మీద పామును పట్టుకున్నాడు. అనంతరం శనివారం ఉదయం నక్కమామ్ముడి పంచాయతీ డుమరిపదో అడవిలో విడిచిపెట్టాడు. -
కార్మికుల హక్కులు కాల రాస్తున్నారు
జయపురం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాల రాస్తున్నాయని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) సాధారణ ఒడిశా రాష్ట్ర కార్యదర్శి బిజయ జెన ధ్వజమెత్తారు. స్థానిక కార్మిక భవనంలో ఏఐటీయూసీ కొరాపుట్ జిల్లా కార్యదర్శి ప్రమోద్ కుమార్ మహంతి అధ్యక్షతన కొరాపుట్, నవరంగపూర్, మల్కన్గిరి జిల్లాల కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో కేంద్ర ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాలను హరించే కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చిందన్నారు. మరలా ప్రస్తుతం కార్మికులు రోజుకు 10 గంటల పని చేయాలన్న మరో చట్టాన్ని తెచ్చిందని దుమ్మెత్తిపోశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మికులు, ఉద్యోగులకు నిర్దేశించిన 8 గంటల పని దినాలను, 10 గంటలకు పెంచిందని, అలాగే మహిళా ఉద్యోగులు రాత్రులు కూడా పని చేయాలనే చట్టాలు తీసుకు రావడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. పాలకులు తీసుకుంటున్న కార్మిక వ్యతిరేక చర్యలకు నిరసనగా నవంబర్ 10వ తేదీ వరకు ప్రతీ జిల్లాలో ఆందోళనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం మొండికేస్తే డిసంబర్ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు భువనేశ్వర్లో ధర్నాలు, ప్రదర్శనలు చేపడతామని హెచ్చరించారు. ఈనెల 31వ తేదీన ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ప్రతిష్టా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయా జిల్లాల్లో కార్మికుల సమస్యలపై అధికారులకు వినతిపత్రాలు అందజేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కార్మిక నేత జుధిస్టర్ రౌళో, ఉత్తమ మల్లిక్, డొమయ్ మఝి, సనాతన సాహు, భాను పూజారి, మహానంద దుర్గ, కమ్యూనిస్టు పార్టీ కొరాపుట్ జిల్లా కార్యదర్శి రామకృష్ణ దాస్ తదితరులు పాల్గొన్నారు. -
● ముగిసిన టెక్ ఉత్సవ్
పర్లాకిమిడి: స్థానిక ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీలో నిర్వహిస్తున్న టెక్ ఉత్సవ్–2025 శనివారంతో ముగిసింది. రెండు రోజుల పాటు సృజనాత్మక ఆలోచనలు టెక్నాలజీతో అనుసంధానం అనే సబ్జెక్టుపై వేడుకలు నిర్వహించారు. సెంచూరియన్ వర్సిటీ రిజిస్ట్రార్ డా.అనితా పాత్రో ఉత్సవాలను ప్రారంభించగా.. డీన్ (ఇంజినీరింగ్ స్కూల్) ప్రొ.డా.ప్రఫుల్ల కుమార్ పండా స్వాగత ఉపన్యాసం చేశారు. విద్యార్థులు కంప్యూటర్ సైన్సులో కొత్త ఆవిష్కరణలు చేయాలని ఆకాంక్షించారు. ఇంజినీరింగ్ విద్యపై మక్కువ ఉన్న విద్యార్థులు భవిష్యత్తులో సృజనాత్మక, టెక్నాలజీతో సంబంధ ఉన్న ఆవిష్కరణలు సృష్టించడంపై దృష్టి సారించాలని డా.అనితా పాత్రో సూచించారు. అనంతరం కంప్యూటర్ ఇంజినీర్ విద్యార్థులకు హాకథాన్, కోడింగ్, ప్రాజెక్టు ఎక్స్పో, డిజిటల్ పెయింటింగ్, ట్రెజర్ హంట్ పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో డైరక్టర్ (అడ్మిన్) ప్రొ.డా.దుర్గాప్రసాద్ పాడి, స్టూడెంట్స్ వ్యవహారాల డీన్ డా.రితీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పశువుల అక్రమ రవాణా అడ్డగింత
జయపురం: సదర్ పోలీసుస్టేషన్ పరిధి 26వ జాతీయ రహదారిలో ఒక ట్రక్కులో పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న విషయం తెలిసిన జయపురం హిందూ సమాజ్ కార్యకర్తలు ట్రక్కును అడ్డుకున్నారు. వెంటనే పట్టణ పోలీసులు చేరుకొని ట్రక్కుని స్వాధీనం చేసుకున్నారు. ట్రక్కులో 7 ఆవులతో పాటు 30 ఎద్దులు ఉన్నట్లు గుర్తించారు. వాటిలో 5 ఎద్దుల మృతదేహాలు ఉండడం గమనార్హం. నవరంగపూర్ జిల్లా నుంచి పశువులను తెలంగాణ రాష్ట్రానికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. జీవించి ఉన్న 32 పశువులను పంజియగుడలోని గోశాలకు తరలించారు. పశువులను నవరంగపూర్ జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం తీసుకెళ్తున్నామని, అక్కడ నుంచి మరో ట్రక్కులో హైదరాబాద్ తీసుకెళ్లనున్నట్లు ట్రక్కు డ్రైవర్ పి.రాజు వెల్లడించాడు. ఉత్సాహంగా సురభి శిశు మహోత్సవం జయపురం: జయపురం బ్లాక్ విద్యా విభాగం ఆధ్వర్యంలో కలియగాం గ్రామ పంచాయతీ బొడొజివుని గ్రామంలో శిశు మహోత్సవం సురభి–2025 మహోత్సవం శుక్రవారం ఉత్సాహంగా నిర్వహించారు. కార్యక్రమంలో 18 పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొని సంగీత, నృత్య ప్రదర్శణ పోటీలలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కలియగాం సాధన కేంద్ర కో–ఆర్డినేటర్ రామేశ్వర పండ, జయపురం బ్లాక్ ఎడ్యుకేషన్ విభాగ అధికారి చందన కుమార్ నాయిక్, ఒడిశా నాన్ గెజిటెడ్ ఉద్యోగ సంఘాల సమన్వయ సమితి కొరాపుట్ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శశిభూషణ దాస్, జయపురం విద్యా విభాగ అధికారి రాజేంద్రనాథ్ పాడి, జయపురం విద్యా విభాగ అధికారులు కె.గోపాలరావు, సోమనాథ్ గదబ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ పోటీలకు రాయగడ క్రీడాకారిణి రాయగడ: ఈనెల 28వ తేదీ నుంచి నవంబర్ 3వ తేదీ వరకు థాయిలాండ్లో జరగనున్న అంతర్జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీలకు రాయగడకు చెందిన క్రీడాకారిణి స్వీటీ ప్రధాన్ ఎంపికయ్యారు. ఒడిశా రాష్ట్రం నుంచి బాలికల విభాగంలో స్వీటీకి మాత్రమే ఈ అవకాశం లభించిందని రాయగడ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు హిమాన్షు శేఖర్ పాండియా, కార్యదర్శి సురేష్ చంద్ర పండలు అభినందించారు. అసోసియేషన్తరుపున ఆమెకు రూ.23 వేల ఆర్థిక సాయం అందజేశారు.పంచాయతీ ప్రతినిధులకు ప్రాధాన్యమివ్వాలి మల్కన్గిరి: గ్రామాల్లోని అభివృద్ధి పనుల్లో పంచాయతీ ప్రతినిధులకు ప్రాధాన్యమివ్వాలని ఖోయిర్పూట్ సమితిలో 11 పంచాయతీల సర్పంచ్లు కోరారు. ఈ మేరకు చిత్రకొండ ఎమ్మెల్యే మంగుఖీలో రాష్ట్ర ప్రభుత్వ బికసిత్ గ్రామ – బికసిత్ ఒడిశా కార్యక్రమం కింద చేపడుతున్న పనుల్లో తమకు ప్రాధాన్యమివ్వడం లేదని ఆరోపిస్తూ బీడీవో ఉమాశంకర్ కోయకు వినతిపత్రం శనివారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే పనులు అప్పగిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
శిశుమిత్ర పోలీసుస్టేషన్ ప్రారంభం
మల్కన్గిరి: జిల్లాలోని బలిమెల పట్టణంలో శిశుమిత్ర పోలీసుస్టేషన్ను ఎస్పీ వినోద్ పటేల్ శనివారం ప్రారంభించారు. తమ చిన్న పిల్లలతో కలిసి పోలీసుస్టేషన్కు ఫిర్యాదు చేసేందుకు వచ్చే మహిళలు ఫిర్యాదు చేసే సమయంలో పిల్లలు ఆడుకోవడానికి, చదువుకోవడానికి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అలాగే సీ్త్రలు పిల్లలకు పాలు ఇచ్చేందుకు ప్రత్యేక గదిని సైతం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రష్మిరంజన్ సేనాపతి, చిత్రకొండ ఎస్డీపీవో ప్రదోష ప్రధాన్, ఆర్ఐ సత్యప్రియ విశ్వాల్, బలిమెల ఐఐసీ ధీరాజ్ పట్నాయిక్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర అనుబంధ విభాగాల్లో పలాస నాయకులకు చోటు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో పలాస నియోజవర్గానికి చెందిన నాయకులకు అవకాశం కల్పిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర బీసీ సెల్ సంయుక్త కార్యదర్శిగా డొక్కరి దానయ్య, రాష్ట్ర బూత్ కమిటీ సంయుక్త కార్యదర్శి చింతాడ మాధవరావు, రాష్ట్ర పంచాయతీ విభాగం కార్యదర్శిగా పాలిన శ్రీనివాసరావు, రాష్ట్ర రైతు విభాగం సంయుక్త కార్యదర్శిగా ఉంగ సాయికృష్ణ, రాష్ట్ర గ్రీవెన్స్సెల్ సంయుక్త కార్యదర్శిగా సొర్ర ఢిల్లీరావు, రాష్ట్ర ఇంటెలెక్చువల్ ఫోరం కార్యదర్శిగా మొదవలస మన్మధరావు, రాష్ట్ర పబ్లిసిటీ విభాగం సంయుక్త కార్యదర్శిగా సురేంద్ర త్యాడిలను నియమించారు. రాష్ట్రస్థాయి మృదంగ పోటీల విజేతగా గౌతమ్ కంచిలి: జాడుపూడి గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి బోరిశెట్టి గౌతం రాష్ట్రస్థాయి మృదంగం పోటీల్లో విజేతగా నిలిచాడు. విజయవాడలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి కళా ఉత్సవాల్లో భాగంగా మృదంగ పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచి జాతీయస్థాయికి ఎంపికయ్యాడు. గౌతమ్ గురువు చలపరాయి వినోద్కుమార్ శిష్యరికంలో మహతి సాంస్కృతిక కళాసేవా సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల జిల్లా కేంద్రంలో జరిగిన పోటీల్లో కూడా ప్రథమస్థానం దక్కించుకున్నాడు. నిరుపేద కుటుంబంలో జన్మించినప్పటికీ సంగీతం పట్ల మక్కువ పెంచుకోవడంతో తండ్రి మోహనరావు ప్రోత్సహించారు. గౌతమ్ను మాజీ సర్పంచ్ పిలక చిన్నబాబు, వైఎస్సార్ సీపీ నేత పలికల జయరాం, గ్రామస్తులు శనివారం అభినందించారు. -
తుఫాన్పై అప్రమత్తం
● 15 జిల్లాలు ప్రభావితమయ్యే అవకాశంభువనేశ్వర్: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధత చర్యలను ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా రాష్ట్ర రెవెన్యు మరియు విపత్తు నిర్వహణ విభాగం మంత్రి సురేష్ కుమార్ పూజారి అధ్యక్షతన శనివారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా రాష్ట్రంలోని దక్షిణ మరియు తీర ప్రాంతాల్లో దాదాపు 15 జిల్లాలు ప్రభావితమవుతాయని భావిస్తున్నారు. వాతావరణ వైపరీత్యంతో తలెత్తే ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి జల వనరులు, పంచాయతీ రాజ్, వ్యవసాయం మరియు విద్యుత్ వంటి విభాగాలు అప్రమత్తంగా ఉన్నాయని మంత్రి తెలియజేశారు. తుఫాను తన దిశను మార్చుకున్నా, పూర్తిగా సన్నద్ధంగా ఉన్నామన్నారు. గత అనుభవాల ఆధారంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ముందస్తు ప్రణాళిక మరియు జిల్లా పరిపాలనలతో సమన్వయం పూర్తయిందని, ప్రతి విభాగం వెంటనే స్పందించడానికి సిద్ధంగా ఉందని తెలియజేశారు. ఎవరైనా జల దిగ్బంధంలో చిక్కుకుంటే వారికి వండిన ఆహారాన్ని అందిస్తామన్నారు. ప్రాణాలను రక్షించడమే ప్రధాన కర్తవ్యమని వెల్లడించారు. తీర ప్రాంతాల్లో జాగ్రత్త చర్యలు పారాదీప్లో మత్స్యశాఖ అధికారులు మరియు తీరప్రాంత పోలీసులు ముందస్తు జాగ్రత్త హెచ్చరికలు జారీ చేశారు. ఈనెల 29 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు వెంటనే తీరానికి తిరిగి రావాలని ఆదేశించారు. పారాదీప్ నెహ్రూ బంగళా ఫిషింగ్ హార్బర్, ఒఠొరొబంకి బాలిప్లాట్, సొంఢొకుదొ, నువాబజార్ మరియు చౌముహాని వంటి ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్ల ద్వారా అవగాహన ప్రసార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు మరియు సీనియర్ అధికారులు సమావేశమై వాతావరణ మార్పులు, తాజా స్థితిగతులు అనుక్షణం సమీక్షిస్తున్నారు. రాష్ట్ర తుఫాను నిర్వహణ వ్యూహంపై దృష్టి సారించారు. తుఫాను ఆశ్రయ కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయి. పొడి ఆహార సామాగ్రి తగినంతగా నిల్వలు అందుబాటులో ఉంచుకోవాలని ప్రత్యేక సహాయ కమిషనర్ (ఎస్ఆర్సీ) జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అల్ప పీడన ప్రాంతం ప్రస్తుతం అండమాన్ ప్రాంతానికి సమీపంలో దాదాపు 1,000 కిలోమీటర్ల దూరంలో వాయుగుండంగా మారిందని, పశ్చిమ–వాయువ్య దిశలో కదులుతోందని తెలిపారు. -
రొయ్యిల కోసం వెళ్లి.. విగతజీవిగా మారి..
● బందరువానిపేటలో 8వ తరగతి విద్యార్థి మృతి గార: సరదాగా రొయ్యిల కోసం వెళ్లిన కుమారుడు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గార మండలం బందరువానిపేట గ్రామానికి చెందిన గంగాడ లక్ష్మణరావు (బేతాళుడు), లక్ష్మమ్మల రెండో కుమారుడు అప్పలరాజు (12) స్థానిక హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం స్కూల్ నుంచి వచ్చి పుస్తకాలు ఇంటిదగ్గర పెట్టి సమీపంలోని గెడ్డలో తోటి స్నేహితులతో కలిసి రొయ్యిలు పట్టుకునేందుకు వెళ్లాడు. స్నేహితులు ఇంటికి వచ్చినా కుమారుడు ఇంటికి చేరలేదు. చాలా రోజులుగా ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్న అప్పలరాజు ఆచూకీ కోసం గ్రామంలోని బందువుల ఇళ్ల వద్ద, పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. శనివారం నాగులచవితి నాడు గెడ్డ–సముద్రం కలిసే ప్రాంతంలో అప్పలరాజు విగతజీవిగా కనిపించడంతో స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారమందించారు. మృతుడికి అన్న, తమ్ముడు ఉన్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ చోడిపల్లి గంగరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆదిత్యున్ని దర్శించుకున్న హైకోర్టు జడ్జిలు
అరసవల్లి/గార: అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి సత్తి, జస్టిస్ గేదెల తుహీన్కుమార్ శనివారం దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అధికారులు, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ తదితరులంతా పూర్ణకుంభ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. న్యాయమూర్తులకు జ్ఞాపికలు అందజేశారు. అనంతరం శ్రీకూర్మంలో కూర్మనాథున్ని దర్శించుకున్నారు. కార్యక్రమంలో అర్చకులు ఇప్పిలి రంజిత్ శర్మ, ఇప్పిలి సాందీప్శర్మ, ఇప్పిలి షణ్ముఖశర్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీకూర్మంలో జరిగిన కార్యక్రమంలో ఈఓ కోట నరసింహనాయుడు, అర్చకులు లక్ష్మణాచార్యులు, కిషోర్బాబు పాల్గొన్నారు. -
వారి నేత్రాలు సజీవం
శ్రీకాకుళం కల్చరల్ : జిల్లా కేంద్రంలోని పేర్లవీధికి చెందిన కోరాడ రమణమ్మ(96), ప్రశాంతినగర్కు చెందిన పొట్నూరు వెంకటనారాయణ(83), రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో కలిగి ఆదినారాయణ (67) మృతి చెందడంతో వారి నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. విషయాన్ని రెడ్క్రాస్ చైర్మన్ జగన్మోహనరావుకు తెలియజేశారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం సిబ్బంది వచ్చి కార్నియాలు సేకరించి విశాఖపట్నంలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. నేత్రదాతల కుటుంబ సభ్యులను రెడ్క్రాస్ చైర్మన్తో పాటు సెక్రటరీ మల్లేశ్వరరావు, ట్రెజరర్ దుర్గా శ్రీనివాస్, సభ్యులు శనివారం అభినందించారు. నేత్రదానం చేయాలనుకునే వారు 78426 99321 నంబరును సంప్రదించాలని కోరారు. రమణమ్మ ఆదినారాయణ వెంకటనారాయణ -
పంచారామాలకు ప్రత్యేక బస్సులు
● అక్టోబర్ 26 నుంచి వచ్చే నెల 16 వరకు క్షేత్రాల దర్శనం ● భక్తులు సద్వినియోగం చేసుకోవాలి: డీపీటీవో పంచారామాలను దర్శించుకునే భక్తులు ఒక్కొక్కరికి టికెట్ ఖరీదు సూపర్లగ్జరీ బస్సుకు రూ.2400, అల్ట్రాడీలక్స్ బస్సుకు రూ.2,350 ప్రయాణచార్జీగా నిర్ణయించారు. ముందస్తు టికెట్ కోసం ఆన్లైన్/అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యం కల్పించారు. గ్రూప్గా అయ్యప్పభక్తులు వస్తే శబరిమలకు కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నారు. ఆన్లైన్ టికెట్ల కోసం www.apsrtconline.in సంప్రదించవచ్చు. పూర్తి వివరాలకు 9959225608 నంబర్లను సంప్రదించవచ్చు. శ్రీకాకుళం అర్బన్: హిందువులకు ప్రీతిపాత్రమైన మాసం కార్తీకం. ఈ నెల రోజులు వ్రతాలు, నోములు ఆచరించడం, దేవాలయాల సందర్శన ఎక్కువగా చేస్తుంటారు. ఎక్కువగా జిల్లాలోని శైవక్షేత్రాలతో పాటు పంచారామాలకు భక్తులు వెళ్తుంటారు. ఈ క్రమంలో ఎప్పట్లాగే ఈ ఏడాది కూడా ఏపీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం ఒకటి, రెండో డిపోల నుంచి పంచారామాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. సోమవారం ఒకే రోజు రాష్ట్రంలోని ఐదు శైవ క్షేత్రాలు అనగా అమరావతిలో అమరేశ్వరస్వామి, భీమవరంలోని సోమేశ్వరస్వామి, పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వరస్వామి, ద్రాక్షారామంలోని భీమేశ్వరస్వామి, సామర్లకోటలోని కుమారరామ భీమేశ్వరస్వామి ఆలయాలకు తీసుకెళ్తారు. కార్తీకమాసంలో ప్రతి ఆదివారం అనగా ఈ నెల 26, నవంబర్ 2, 9, 16వ తేదీలలో శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఆదివారం సాయంత్రం 4గంటలకు బస్సు బయలుదేరుతుంది. సోమవారం ఒకేరోజున ఐదు పుణ్యక్షేత్రాలైన పంచారామాలను దర్శింపజేసి మరలా మంగళవారం ఉదయం 6 గంటలకు శ్రీకాకుళం కాంప్లెక్స్కు చేరుకుంటుంది. కార్తీకమాసం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం పంచారామాల దర్శనం కోసం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ నెల 26, అక్టోబరు 2, 9, 16వ తేదీలలో ప్రత్యేక బస్సులు నడపనున్నాం. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – సీహెచ్, అప్పలనారాయణ, డీపీటీఓ -
అటవీ భూములకు రక్షణ కల్పించాలి
జయపురం: జయపురం సబ్ డివిజన్ బొరిగుమ్మ తహసీల్ పరిధి బముణిగుడ గ్రామ ప్రాంతంలో కొంతమంది కబ్జా చేసిన గోచర, అటవీ, దేవదాయ భూములకు వారి నుంచి విముక్తి కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ మేరకు గ్రామస్తులంతా సామాజిక కార్యకర్త బి.హరిరావు నేతృత్వంలో కాలి నడకన 26వ జాతీయ రహదారి మీదుగా జయపురం సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని నిరసన తెలిపారు. అనంతరం సబ్ కలెక్టర్ అక్కవరం శొశ్యారెడ్డికి వినతిపత్రం అందజేశారు. బముణిగుడ గ్రామ సమీపంలోని భైరాగిపొదర్ మౌజలో ఉన్న ప్రభుత్వ, గోచర(పశువులు మేసే భూములు), అటవీ భూములు, దేవదాయ భూములను కొంతమంది ఆక్రమించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే గ్రామ పంచాయతీ ద్వారా ఆ భూముల్లో నాటిన పండ్ల మొక్కను తొలగించి, మొక్కజొన్న పంటలు పండిస్తున్నారని ఆరోపించారు. అందువలన అధికారులు పరిశీలించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
నాలుగు పూరిళ్లు దగ్ధం
మందస: బుడారుసింగ్ పంచాయతీ పద్మపురంకాలనీ గిరిజన గ్రామంలో శనివారం మధ్యాహ్నం ఎండ తీవ్రత వల్ల చెలరేగిన కార్చిచ్చు వల్ల నాలుగు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఆ సమయంలో గిరిజనులకు పనులకు వెళ్లిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. కొందరు స్థానికులు గుర్తించి మందస అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వగా.. అక్కడ సాంకేతిక ఇబ్బందుల నేపథ్యంలో పలాస అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే సవర లాలు, సవర ఉదయ్, సవర ఢిల్లీ, సవర నోబిల్కు చెందిన ఇళ్లు కాలిబూడిదయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ.15 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. -
విద్యుత్ రంగంలో వృద్ధి అభినందనీయం
● గవర్నర్ హరిబాబు కంభంపాటిభువనేశ్వర్: పునరుత్పాదక విద్యుత్ రంగంలో రాష్ట్రం వృద్ధి సాధించడం అభినందనీయమని గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి అన్నారు. స్థానిక రాజ్ భవన్లో ఇంధన శాఖ కార్యకలాపాలను శనివారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా పునరుత్పాదక ఇంధన మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడానికి సబ్స్టేషన్ల సమీపంలో పంపిణీ చేయబడిన సౌర శక్తి వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. సౌరశక్తి వ్యవస్థకు అనువైన స్థలం గుర్తించడం పెను సవాలుగా పేర్కొన్నారు. అలాగే గ్రీన్ హైడ్రోజన్లో ఉద్భవిస్తున్న అవకాశాలను తెలియజేశారు. ఎన్టీపీసీతో దాని ఉత్పత్తి కోసం సహకారాన్ని సూచించారు. ముఖ్యంగా ఐఐటీలు మరియు ఐఐఎంల నుంచి విద్యార్థులలో అవగాహన కార్యక్రమాలను ప్రోత్సహించారు. పీఎం సూర్యఘర్ అమలు చేయాలి పీఎం సూర్య ఘర్ను పెద్ద ఎత్తున అమలు చేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు. టాటా పవర్ నిర్వహించే యుటిలిటీ–లెడ్ అగ్రిగేషన్ (యూఎల్ఏ) మోడల్ కింద ఒక కిలో వాట్ రూఫ్ టాప్ సోలార్ (ఆర్పీఎస్) వ్యవస్థ అమలును ఆయన సమీక్షించారు. అనంతరం పీఎం–కుసుమ్ పథకం అమలు గురించి చర్చించారు. ప్రభుత్వం పామాయిల్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నందున, ఉద్యానవన శాఖ ద్వారా రైతులు పీఎం–కుసుమ్ పథకం కింద సౌర శక్తితో పనిచేసే పంపులను ఉపయోగించుకునేలా మరియు దాని ప్రయోజనాలను పొందేలా ప్రోత్సహించవచ్చునన్నారు. సమావేశంలో కార్యదర్శి రూపా రోషన్ సాహు, విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి విశాల్ కుమార్ దేవ్, ఓపీటీసీఎల్ సీఎండీ భాస్కర్ జ్యోతి శర్మ, విద్యుత్ శాఖ సీనియర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
5 ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం
భువనేశ్వర్: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ అధ్యక్షతన స్థానిక లోక్సేవా భవన్లో 29వ మంత్రివర్గ సమావేశం శనివారం జరిగింది. మత్స్య – పశు వనరులు, వ్యవసాయం, రైతుల సాధికారత, వాణిజ్య – రవాణా, గృహ నిర్మాణం – పట్టణాభివృద్ధి విభాగాలకు సంబంధించిన 5 ప్రతిపాదనలు ఆమోదించినట్లు ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా తెలిపారు. మా శ్యామకాళీ సన్నిధిలో ఎమ్మెల్యే రూపేష్ పర్లాకిమిడి: పట్టణంలోని నెహ్రూ జంక్షన్ వద్ద కొలువైన మా శ్యామ కాళీ దేవిని పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి శనివారం దర్శించుకున్నారు. ఆయనతో పాటు బీజేడీ జిల్లా అధ్యక్షుడు ప్రదీప్నాయక్, పురపాలక అధ్యక్షురాలు నిర్మలా శెఠి, కౌన్సిలర్ నారాయణరావు బెహరా, సనోజ్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. అధికారులకు సెలవులు రద్దుపర్లాకిమిడి: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారి ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ వద్ద తీరం దాటనున్న దృష్ట్యా దక్షిణ, ఉత్తర ఒడిశాకు ముప్పు ఉన్నట్లు అదనపు జిల్లా మాజిస్ట్రేట్ (రెవెన్యూ) మునీంద్ర హానగ తెలియజేశారు. ఈ తుపానుకు మంథా అని పేరు పెట్టారు. తుపాను వల్ల గంజాం, గజపతి, రాయఘడ, కొందమాల్ జిల్లాలకు ఎల్లో వార్నింగ్ను జారీ చేశారు. ఈనెల 26 నుంచి 29 వరకూ పలు జిల్లాలకు సంభవించనున్న తుపాను దృష్ట్యా కలెక్టర్ ఈనెల 25 నుంచి 30 వరకూ ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు హెడ్క్వార్టర్లో ఉండాలని జీవో జారీ చేశారు. నృత్య ప్రదర్శనలు పర్లాకిమిడి: పట్టణంలోని రాజవీధిలో ఉన్న జగన్నాథ మందిర ప్రాంగణం వద్ద భక్తి పుష్పాంజలి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో భక్తి సంగీత, నృత్య కార్యక్రమాన్ని దేవీమఠం మహంత రామానంద దాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎస్బీఐ విశ్రాంత ఉద్యోగి హరిమోహన్ పట్నాయిక్ అధ్యక్షత వహించగా, సెంచూరియన్ వర్సిటీ ఉద్యోగి ఉదయచంద్ర మహాపాత్రో, గోపినాథ మిశ్రా, బి.బి.మహంతి సహకారంతో జరిగింది. తొలుత కుమారి తపస్వీ కోరో ఒడియా శాసీ్త్రయ నృత్యంతో ప్రారంభమయ్యింది. అనంతరం భక్తి సంగీత కార్యక్రమం జరిగింది. ఇన్ఫోసిస్కు 117 మంది ఎంపిక టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన 117 మంది విద్యార్థులు సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్లో ఉద్యోగాలకు ఎంపికై నట్లు కళాశాల డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు శనివారం విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఓడీలు, అధ్యాపకుల కృషి, విద్యార్థుల శ్రమ కారణంగా మంచి ఉద్యోగాలు సాధిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, ప్లేస్మెంట్ హెచ్ఓడీ ఎం.సంతోష్కుమార్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ హెచ్ఓడీ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. తల్లికి అంత్యక్రియలు చేసిన తనయ సోంపేట: తల్లికి కుమార్తె అంత్యక్రియలు నిర్వహించిన ఘటన సోంపేట మండలం తోటవూరులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కోనేటి పార్వతి (46) అనారోగ్యంతో మృతి చెందింది. ఈమె భర్త భాస్కరరావు కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్నాడు. కుమారుడు మానసిక రోగి. దీంతో కుమార్తె గౌరి పుట్టెడు దుఃఖంతోనే తల్లికి అంత్యక్రియలు పూర్తి చేసింది. -
జాగ్రత్త
శుక్రవారం శ్రీ 24 శ్రీ అక్టోబర్ శ్రీ 2025సైబర్ నేరగాళ్లతో..పర్లాకిమిడి: సైబర్ నేరాల నుంచి మనం సురక్షితంగా ఉండేందుకు మొబైల్స్కు వచ్చే ఏపీకే ఫైల్స్, సోషల్ మీడియా, తెలియని ఫోన్కాల్స్, ఆన్లైన్లో వివిధ వస్తువులు కోనుగోళ్లలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ జ్యోతింద్ర కుమార పండా అన్నారు. స్థానిక కాలేజ్ జంక్షన్ గుండిచామందిరం వద్ద గురువారం సాయంత్రం ‘సైబర్ సెక్యూరిటీ అభిజాన్ ప్రచారం– 2025’ను కలెక్టర్ మధుమిత ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ పబ్లిక్ ప్రచార సభకు జిల్లా అటవీ శాఖ అధికారి కె.నాగరాజు, యునైటెడ్ బ్యాంకు ప్రాంతీయ డైరక్టర్ ఆర్.సరక, శ్రీ కృష్ణచంద్ర గజపతి కళాశాల ప్రిన్సిపల్ రాధాకాంత భుయ్యాన్, డీఈఓ డాక్టర్ మయాధార్ సాహు, మహిళా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మహేంద్ర తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ పండా మాట్లాడుతూ, సైబర్ సురక్షిత ప్రచారం ఈనెల 18 నుంచి నవంబరు 17 వరకూ జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నామని, ఎవరైనా డబ్బులు పోగొట్టుకున్న సమయంలో జిల్లా ఎస్పీ కార్యాలయంలో సైబర్ డెస్క్లో ఫిర్యాదు చేయాలని కోరారు. గత రెండేళ్లుగా సైబర్ నేరాలు అరికట్టడానికి తగు సాఫ్ట్వేర్ టూల్స్ లేనికారణంగా అభియోగాలు పరిష్కరించలేకపోయామని, ప్రస్తుతం సైబర్ నేరాల సంఖ్య పెరిగిన దృష్ట్యా ప్రజల అభియోగాలు స్వీకరిస్తున్నామని అన్నారు. అనంతరం కలెక్టర్ మధుమిత మాట్లాడుతూ, వ్యక్తిగత సమాచారం సోషల్ మీడియాలో జతచేయరాదని, తక్కువ వడ్డీలకు రుణాలు అందజేస్తామన్న సైబర్ నేరగాళ్ల వలలో పడరాదని, ఏటీఎంల వద్ద డెబిట్, క్రెడిట్ కార్డులను అపరిచిత వ్యక్తులకు ఇచ్చి డబ్బులు పోగొట్టుకోకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. సైబర్ మోసాలకు గురైన వారు టోల్ ఫ్రీ నంబర్ 1930 కు తక్షణమే ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సైబర్ నిపుణుడు డాక్టర్ డి.ఈశ్వరరావు అన్నారు. ఈ సమావేశంలో సైబర్ నేరాలు అరికట్టే మస్కట్ను అధికారులు ఆవిష్కరించారు. సైబర్ సురక్షిత ప్రచారసభలో మాట్లాడుతున్న ఎస్పీ జ్యోతింద్ర కుమార్ పండా సైబర్ నేరాలను అరికట్టే మస్కట్తో జిల్లా అధికారులు నువాపడా ఉప ఎన్నిక -
సహకార పాలసీ డ్రాఫ్ట్పై వర్క్షాప్
–10లోuకాళీమాత పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. గుమ్మా బ్లాక్ చతువా కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆహారం తయారు చేసే కేంద్రాలు పరిశీలించారు. జయపురం: ఒడిశా రాష్ట్ర ప్రథమ నూతన సహకార పాలసీ–2025 డ్రాఫ్ట్ కమిటీ ప్రాంతీయ స్థాయి వర్క్షాపు గురువారం జయపురం సంధ్యా ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ వర్క్షాపులో కొరాపుట్, రాయగడ, మల్కన్గిరి, నవరంగపూర్, కలహండి జిల్లాల్లోని సహకార రంగ సభ్యులు పాల్గొన్నారు. వర్క్షాపులో కొరాపుట్ కలెక్టర్ మనోజ్ సత్యబాన్ మహజన్, కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం మచ్చ, భవాణీపట్న సెంట్రల్ కోఆపరేటిక్ బ్యాంక్ అధ్యక్షుడు గిరీష్ బెహరా, కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడు ఈశ్వర చరణ పాణిగ్రహి, రాష్ట్ర సహకార పాలసీ–2025 డ్రాఫ్ట్ కమిటీ సభ్యులు ఫ్రొఫెసర్ హరేకృష్ణ మిశ్ర, గోపబందు శతపతి, కొరాపుట్ డీఆర్సీసీఎస్ మోనిక రాయ్, జాయింట్ కార్యదర్శి సంగ్రామ కేశరి రౌత్ తదితరులు రాష్ట్ర సహకార ఉద్యమం, నూతన సహకార పాలసీ 2025 పై ప్రసంగించారు. వర్క్షాపులో పాల్గొన్న వారు నూతన సహకార పాలసీపై తమ అభిప్రాయాలు తెలియజేశారు. కార్యక్రమంలో రాధా వినోద్ సామంతరాయ్, కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ పరిచాలన కమిటీ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి ఇందిర నందో, మాజీ డైరెక్టర్ బిరేన్ మోహణ పట్నాయిక్, కేసీసీ బ్యాంక్ సీనియర్ డైరెక్టర్ రమాకాంత రౌళో, డైరెక్టర్ ఝడేశ్వర ఖడంగ, మిటు పాత్ర, అరుణ భొటొమిశ్ర, బిపద మండల్, కర్పూర హంతాల్, చిత్తరంజన్ ప్రధాన్, అమరలాల్ అహుజ, సుకాంత త్రిపాఠీ తదితరులు తమ అభిప్రాయాలు తెలిపారు. -
పట్టుకెళ్తూ.. పట్టుబడుతూ..!
గంజాయి రవాణాపై నిఘా పెట్టాం. సరిహద్దు ప్రాంతాలపై దృష్టి సారించాం. ఈ విషయంలో సర్కిల్ పరిధిలో అన్ని పోలీస్స్టేషన్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. గంజాయి రవాణా తీవ్ర నేరం. ఈ విషయంలో ఎవరూ ట్రాప్లో పడొద్దు. జీవితాన్ని పాడు చేసుకోవద్దు. కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. –ఎన్.సన్యాసినాయుడు, సీఐ, పాతపట్నం హిరమండలం: సెప్టెంబర్ 4న కొజ్జిరియా జంక్షన్ వద్ద కవిటి పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఒడిశాకు చెందిన సాగర్ బెహరా 21.30 కిలోల గంజాయితో పట్టుబడ్డాడు. ●సెప్టెంబర్ 22న ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్లో అజయ్ అనే వ్యక్తి 15 కిలోల గంజాయితో పట్టుబడ్డా డు. తమిళనాడుకు చెందిన విజయ్ ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి తమిళనాడుకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ●సెప్టెంబర్ 26న పలాస రైల్వేస్టేషన్లో తమిళనా డు రాష్ట్రం తూత్కుడికి చెందిన మారిష్ 14 కిలోల గంజాయితో పట్టుబడ్డాడు. రాయగడ ప్రాంతానికి చెందిన రాహుల్ వద్ద గంజాయి కొనుగోలు చేసి రవాణా క్రమంలో పలాస రైల్వేస్టేషన్లో దొరికిపోయాడు. ●ఈ నెల 8న పలాస రైల్వేస్టేషన్లో గంజాయి తరలిస్తున్న కర్ణాటకకు చెందిన సాకత్ ఆలీ పట్టుబడ్డా డు. బరంపురంలో గంజాయి కొనుగోలు చేసి తరలిస్తుండగా 3 కిలోల గంజాయితో పట్టుబడ్డాడు. ఒడిశాలో సాగవుతున్న గంజాయి మన జిల్లా మీదుగా ఇతర రాష్ట్రాలకు తరలిపోతోంది. ప్రధానంగా ఇచ్ఛాపురం, పలాస రైల్వేస్టేషన్ల వరకు బస్సులు, ఇతర వాహనాల ద్వారా గంజాయి తీసుకొస్తున్న అక్రమ రవాణాదారులు అక్కడి పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్నారు. మొత్తానికి గంజాయి అక్రమ రవాణా నిత్యకృత్యంగా మారింది. గంజా యి మూలాలన్నీ ఒడిశా వైపే ఉన్నా రవాణాకు మన జిల్లానే వినియోగిస్తున్నారు. ఒడిశా నుంచి వచ్చిన వారి విషయంలో పోలీస్ నిఘా ఉంది. తనిఖీల్లో ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారే పట్టుబడుతున్నారు. కొందరు నేరుగా ఒడిశాకు వెళ్లి సరుకు తీసుకెళ్లే క్రమంలో పట్టుబడతుండగా.. మరికొందరు రవాణాకు రూ.5 వేల వంతున కమీషన్ తీ సుకొని తరలిస్తూ పోలీసులకు దొరికిపోతున్నారు. ఒడిశా నుంచి అధికం.. జిల్లాకు ఆనుకొని ఎక్కువగా ఒడిశా సరిహద్దు ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా ఒడిశాలో ని జయపురం, రాయగడ, గుడారి, గుణుపూర్, గుమ్మ, శరంగో, చంద్రగిరి, దిగపొండి, మోహన, ఆర్.ఉదయగిరి తదితర ప్రాంతాల్లో గంజాయి ఎక్కువగా సాగుచేస్తున్నారు. ఆయా ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు గంజా యి కొనుగోలు చేస్తున్నారు. అనంతరం జిల్లాలోని పలాస, ఇచ్ఛాపురం, సోంపేట, నౌపడ, శ్రీకాకుళం రోడ్డు మీదుగా కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, తెలంగాణ, బీహార్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. గంజాయి మాఫియాలో సామాన్యులే ఎక్కువ గా సమిధులుగా మారుతున్నారు. అమాయక గిరిజనులు, మహిళలు, విద్యార్థులు ఎక్కువగా పట్టుబడుతున్నారు. ఇటీవల పలాస రైల్వేస్టేషన్లో మహిళలు పట్టుబడ్డారు. వారు బీహార్లో హోటల్లో పనిచేసే వారు కావడం గమనార్హం. రూ.5 వేలు వరకూ కమీషన్ అందిస్తామని చెప్పడంతో వారంతా ఒడిశా నుంచి గంజాయి తెచ్చి పలాస రైల్వేస్టేషన్ నుంచి తరలించే క్రమంలో పట్టుబడ్డారు. మాఫియాకు కారణమైన అసలు సూత్రధారులు మాత్రం పట్టుబడటం లేదు. అవసరాలను, కుటుంబ పరిస్థితులను ఎరగా వేసుకొని ముగ్గులోకి దించుతూ బంగారు భవిష్యత్ను పాడుచేస్తున్నారు. -
కేకే రైల్వే లైన్లో ట్రాక్ మీద రాళ్లు
కొరాపుట్: కొత్తవలస–కిరండోల్ రైల్వే లైన్లో మళ్లీ ట్రాక్పై రాళ్లు పడ్డాయి. గురువారం సాయంత్రం కొరాపుట్–జయపూర్ రైల్వే లైన్లో జరతి–మాలిగుడ రైల్వే స్టేషన్ల వద్ద కొండ చరియలు విరిగి ట్రాక్ మీదకు చొచ్చుకు వచ్చాయి. అదే మార్గంలో అదే సమయంలో విశాఖ పట్నం నుంచి కిరండోల్ వెళ్తున్న ప్యాసింజర్ రైలు నిలిచి పోయింది. మరో వైపు జగదల్పూర్ నుంచి కొరాపుట్ వైపు వస్తున్న రూర్కెలా ఇంటర్ సిటీ రైలుని జరతి స్టేషన్ వద్ద నిలిపి వేశారు. కొరాపుట్, జగదల్పూర్ నుంచి రైల్వే సహాయక బృందాలు ఆగమేఘాల మీద ప్రమాద ప్రాంతానికి చేరుకున్నాయి. రాళ్లను తొలగించి ట్రాక్ క్రమబద్ధీకణ పనుల్లో నిమగ్నమయ్యారు. సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం కొరాపుట్: ౖసెబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నబరంగ్పూర్ జిల్లా ఎస్పీ మడకర్ సందీప్ సంపత్ అన్నారు. నబరంగ్పూర్ జిల్లా కేంద్రం మెయిన్ రోడ్డులో రామ మందిరం వద్ద సైబర్ అవగాహన ర్యాలీ గురువారం నిర్వహించారు. అపరిచిత ఫోన్కాల్స్ వస్తే వారికి బ్యాంక్ డీటైల్స్ ఇవ్వద్దని సూచించారు. ఓటీపీ నంబర్ చెబితే ఖాతాలు ఖాళీ అవుతాయని హెచ్చరించారు. ర్యాలీలో కలెక్టర్ మహేశ్వర్ స్వయ్ తదితరులు పాల్గొన్నారు. భువనేశ్వర్: రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపిన ఒడిశా పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ నియామక పరీక్ష కుంభకోణం దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆదేశాల మేరకు ఈ చర్యను చేపట్టారు. నియామక ప్రక్రియలో విస్తృతమైన అవకతవకలు, అవినీతి ఆరోపణలు తలెత్తిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కుంభకోణంలో అంతర్ రాష్ట్ర వ్యవస్థీకత నేరస్తుల ముఠా ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం క్రైమ్ శాఖ సీఐడీ నిర్వహించిన ప్రాథమిక దర్యాప్తులో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సహా ఇతర రాష్ట్రాల ప్రమేయం ఉండవచ్చని తేలింది. సమగ్ర దర్యాప్తును నిర్ధారించడం, అవినీతిని బహిర్గతం చేయడం, దోషులను నిర్ధారించి చట్టపరమైన చర్యలు చేపట్టడం ముఖ్యమంత్రి నిర్ణయం లక్ష్యంగా పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీసు, ఇతర యూనిఫాం సర్వీసులలో సిబ్బందిని ఎంపిక చేయడానికి శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ చర్య నియామక ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకువస్తుందని భావిస్తున్నారు. ట్రైన్ ఢీకొని వృద్ధుడు మృతి రాయగడ: ట్రైన్ ఢీకొన్న సంఘటనలో మృతుడు జిల్లాలోని మునిగుఢ సమితి ఆంబొదల పోలీస్ స్టేషన్ పరిధిలోని భూడిపుడా గ్రామానికి చెందిన భగీరధి టక్రి (62)గా గుర్తించారు. గురువారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి మునిగుడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. మునిగూడ నుంచి వేదాంత కంపెనీకి అనుసంధానించే ట్రైన్ లైన్లో భాగంగా అంబొదల వద్ద ట్రైన్ లైన్ను దాటుతుండగా వెనుక నుంచి కంపెనీకి వెళ్లే గూడ్స్ ట్రైన్ ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన ఆయనను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. మెరుగైన చికిత్స కోసం బరంపురం తరలిస్తుండగా మార్గంలో వృద్ధుడు మృతి చెందినట్లు సమాచారం. -
అంధులకు ఏఐ టెక్నాలజీ కళ్లద్దాలు
శ్రీకాకుళం రూరల్: రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో అంధుల కోసం ఏఐ టెక్నాలజీతో రూపొందించిన కళ్లద్దాలను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చేతుల మీదుగా గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేఎఫ్ఆర్సీ ఆర్గనైజేషన్ అఛలా హెల్త్ సర్వీస్ ఆర్థిక సహాయంతో జెమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో అంధులకు కళ్లద్దాలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ కళ్లద్దాలు ఖరీదుతో కూడుకున్నవి అయినప్పటికీ కేంద్ర రాష్ట్రాల ద్వారా వచ్చే ఫండ్స్ నుంచి కొనుగోలు చేసేలా తక్కువ ధరకు అందించేందుకు సహకరిస్తామన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ జెమ్స్ ఆసుపత్రి పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటోందన్నారు. జెమ్స్ ఆస్పత్రి ఫౌండర్ బొల్లినేని భాస్కరరావు మాట్లాడు తూ ఏఐ టెక్నాలజీ కళ్లద్దాల వల్ల అంధులమనే భావన వారిలో తొలగిపోతుందన్నారు. కార్యక్ర మంలో కేఎఫ్ఆర్సీ చైర్మన్ డాక్టర్ వి.భుజంగరావు, అఛలా హెల్త్ సర్వీస్ సీఈఓ రాజేష్రాజు, కళాశాల డీన్ డాక్టర్ లక్ష్మీలలిత, వైద్యులు డాక్టర్ సుధీర్, డాక్టర్ అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సైబర్ భద్రత అవగాహన
మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి ఎంవీ 79 పోలీసు స్టేషన్లో సైబర్ భద్రతపై ఐఐసీ చంద్రకాంత్ అవగాహన కల్పించారు. మోసాల గురించి ప్రజలకు వివరించేందుకు ఈ నెల 18 నుంచి నవంబర్ 17వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫేస్బుక్, వాట్సాప్ మోసాలు, బ్యాంక్ ఫ్రాడ్లు, తెలియని లింక్లపై క్లిక్ చేయకూడదని, వ్యక్తిగత సమాచారాన్ని ఆన్లైన్లో పంచుకోవద్దని, సందేహాస్పద చర్యలు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. అలానే మోసాల బారిన పడకుండా ఉండేందుకు, సైబర్ హెల్ప్లైన్ నంబర్ 1930కు కాల్ చేయవచ్చని పేర్కొన్నారు. -
ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి
జయపురం: జయపురం సబ్డివిజన్ కుంద్ర సమితిలో ప్రజలు వివిధ సమస్యలపై గురువారం సహిద్ లక్ష్మణ నాయిక్ మూల ఆదివాసీ సంఘం సమితి కార్యాలయాన్ని, బ్లాక్ విద్యా విభాగ కార్యాలయాలను ముట్టడించారు. మూల ఆదివాసీ సంఘ అధ్యక్షుడు మహేశ్వర పెంటియ, కార్యదర్శి త్రినాథ్ సామరత్ నేతృత్వంలో సహిద్ లక్ష్మణ నాయిక్ మైదానం నుంచి భారీ ర్యాలీ చేసి తన డిమాండ్లను వినిపిస్తూ బ్లాక్ విద్యా విభాగ కార్యాలయానికి చేరి కార్యాలయాన్ని ఘెరావ్ చేశారు. బనువగుడ పంచాయితీ దిసారీగుడ పాఠశాల ఉపాధ్యాయుడు త్రినాథ్ హరిజన్ ను బొయిపరిగుడ సమితి టంగిణిగుడ పాఠశాలకు బదిలీ చేశారని, ఆ బదిలీని రద్దు చేసి అతడిని తిరిగి కుంధ్రా సమితి దిసారిగుడ పాఠశాలకు పంపాలని, పాఠశాలలో సుదీర్ఘ కాలం నుంచి పనిచేస్తున్న వారిని వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఓ వినతిని బ్లాక్ అదనపు బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారికి అందజేశారు. తక్షణ చర్యలు తీసుకోకుంటే ధర్నా చేస్తామన్నారు. నాలుగు గంటలకు పైగా ఆందోళన జరిపి బీఈఓ లేకపోవడం వల్ల ఏబీఈఓ పొపాయి బెహరాకు వినతి పత్రం అందజేశారు. అనంతరం కుంద్ర బీడీఓ కార్యాలయాన్ని ముట్టడించిన మూల ఆదివాసీ సంఘ శ్రేణులు కుంద్ర సమితి కార్యాలయంలో బీడీఓ పి.మనశ్విత లేకపోవడం వల్ల సమితి కార్య నిర్వాహక అధికారి రమాకాంత నాయిక్కు మెమోరాండం అందజేశారు. అందులో కుంధ్ర పంచాయతీ అధ్యక్షురాలిపై అవిశ్వాసం తీసుకు వచ్చి ఒక ఆదివాసీ మహిళను అధ్యక్ష పదవి నుంచి తొలగించారని ఆరోపించారు. అక్కడ ఓ పురుషుడిని కూర్చోబెట్టారని తెలిపారు. ఆ స్థానంలో మరో ఆదివాసీ మహిళను ఉంచకుండా కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఆందోళనలో ఆదివాసీ సంఘ అధ్యక్షుడు మహేశ్వర పెంటియ, కార్యదర్శి త్రినాథ్ సామరత్ లతో పాటు కార్యనిర్వాహక అధ్యక్షులు భజమన్ శాంత, ఉపాధ్యక్షుడు చంధ్ర సాగరియ, దుర్యోధన హరిజన్, సుభేంధ్ర భూమియ, ధనీరాం బారిక్, సాధారణ కార్యదర్శి దామోదర గోండ్, ఘాశీ భొత్ర, జగత్ నాయిక్, గుప్త నాయిక్, పూర్ణ శాంత తదితరులు పాల్గొన్నారు. -
మాజీ ఎమ్మెల్యే అరెస్టు అన్యాయం
పర్లాకిమిడి: గంజాం జిల్లా బీజేపీ నేత, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు పిత్తాబాస పండా హత్య కేసులో 12 మంది నిందితులను బరంపురం ఎస్పీ అరెస్టు చేశారు. అందులో బరంపురం మాజీ ఎమ్మెల్యే, బీజేడీ నాయకుడు విక్రమ్ పండా, మాజీ మేయర్ (బీ.ఈ.ఎం.సీ.) శివశంకర్ దాస్ ఆలియాస్ పింటు దాస్, 41వ వార్డు కార్పొరేటర్ మళయకుమార్ బిశోయి ఉండటంతో బీజేడీ (గంజాం) నాయకుడు భృగుభక్షి పాత్రో గురువారం విలేకరులతో మాట్లాడారు. ఎటువంటి ఆధారాలు లేకుండా సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే విక్రమ్ పండాను బుధవారం అర్ధ రాత్రి అరెస్టు చేయడం అన్యాయమన్నారు. మాజీ ఎంపీ(బరంపురం)చంద్రశేఖర సాహు, మాజీ ఎమ్మెల్యే చ్యావు పట్నాయక్తో కలిసి బరంపురం ఎస్పీని కలిశామన్నారు. విక్రమ్ పండాను ఎ1 నిందితుడిగా చేర్చడంలో ఎటువంటి ఆధారాలు ఉన్నాయో ఎస్పీని అడిగినా చెప్పలేకపోయారన్నారు. గంజాం జిల్లాలో బీజేడీకి నామరూపాలు లేకుండా చేయడానికే తమ పార్టీ నాయకులను అరెస్టు చేశారని ఆరోపించారు. న్యాయవాది పిత్తబాస్ పండా హత్య అక్టోబర్ 6న జరిగిందన్నారు. ఈ హత్య వెనుక నిందితులు ఎవరు ఉన్నారో తేల్చకుండా మాజీ ఎమ్మెల్యే (గోపాల్పూర్) విక్రమ్ పండాను అరెస్టు చేయడం తగదన్నారు. -
అత్తింటి ఎదుట కోడలి న్యాయదీక్ష
వజ్రపుకొత్తూరు రూరల్ : అత్తామామలు ఇంట్లోకి రానివ్వడం లేదంటూ కోడలు న్యాయదీక్షకు దిగిన ఘటన వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లిలో గురువారం చోటుచేసుకుంది. బాధితులు, స్థానికులు చెప్పిన వివరాలు మేరకు. అక్కుపల్లి గ్రామానికి చెందిన యంపళ్ల అనూషకు అదే గ్రామానికి చెందిన మడ్డు సుధీర్తో 2022లో వివాహం జరిగింది. ఇద్దరూ సాప్ట్వేర్ ఉద్యోగులు కావడంలో బెంగళూరులో కాపురం పెట్టారు. వీరికి 10 నెలల చిన్నారి ఉంది. అనూష ప్రస్తుతం కన్నవారి ఇంటి వద్దే ఉంటోంది. ఇటీవల భార్యాభర్తల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. ఈ నెల 21న అత్తవారింటికి పాపతో కలిసి వచ్చిన అనూషను ఇంట్లోకి అనుమతించకుండా అత్తమామలు అడ్డుకున్నారు. అప్పటికి ఇంట్లోనే భర్త సుధీర్ కూడా ముఖం చాటేశాడు. అయితే నీ భర్త ఇంట్లో లేడని, బెంగళూరులో ఉన్నాడంటూ బదులిస్తూ ఇంట్లోకి రానివ్వలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తమకు జరిగిన అన్యాయం కోసం బాధితురాలు డయల్ 100కు కాల్ చేయడంతో స్థానిక పోలీసులు సంప్రదించినా ప్రయోజనం లేకపోయిందని వాపోయింది. దీంతో తప్పని పరిస్థితిలో మూడు రోజులుగా భర్త ఇంటి ముందు న్యాయ దీక్షకు బాధితురాలు పూనుకుంది. విషయం తెలుసుకున్న ప్రజా సంఘాలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో గురువారం ఘటన స్థలానికి చేరుకొని బాధితరాలికి మద్దతుగా నిలిచారు. అత్తమామలకు సర్దిచెప్పడంతో తాత్కాలికంగా ఇంట్లోకి అనుమతించినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. -
జిల్లా స్థాయి విజ్ఞాన నాటక పోటీ నిర్వహణ
మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం జిల్లా స్థాయి విజ్ఞాన నాటక పోటీలను నిర్వహించారు. మానవ సంక్షేమంలో విజ్ఞాన శాస్త్రం అనే అంశంపై నాటకం ప్రదర్శించారు. కార్యక్రమంలో శ్రీశరత్రౌత్, జిల్లా సైన్స్ ఇన్స్పెక్టర్, ప్రధాన ఉపాధ్యాయురాలు మమతా స్వాయి సంయుక్తంగా ప్రారంభించారు. ఉత్సవంలో ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి చిత్తరంజానన్ పాణిగ్రహి పాల్గొన్నారు. విద్యార్థుల్లో విజ్ఞానం పెరిగేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మల్కన్గిరి ఉన్నత పాఠశాలకు ప్రథమ స్థానం, కలిమెల సమితి ఎంవీ 79 పాఠశాలకు ద్వితీయ స్థానం, బలిమెల ప్రభుత్వ పాఠశాలకు తృతీయ స్థానాలు దక్కాయి. చిత్రకొండ సమితి ఆర్ఎస్సి 6 గ్రామానికి లలితా ఖీలోకు ప్రత్యేక బహుమతి అందజేశారు. నాటకాన్ని ప్రదర్శిస్తున్న మల్కన్గిరి పాఠశాల విద్యార్థులు -
బంగారం ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా
గార: అప్పుతో సహా వడ్డీ చెల్లిస్తానని చెప్పినా తాను తాకట్టు పెట్టిన బంగారం ఇవ్వడం లేదంటూ గార మండలం బందరువానిపేటకు చెందిన మైలపల్లి పద్మశ్రీ అనే వివాహిత గురువారం కె.మత్స్యలేశం గ్రామానికి చెందిన పొట్నూరు కూర్మారావు ఇంటి వద్ద నిరసన చేపట్టింది. తన కుమారుడితో కలిసి పురుగుమందు డబ్బా పట్టుకోని న్యాయం జరగకపోతే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామని చెప్పడంతో కలకలం రేగింది. 2022లో స్థానిక ఏపీజీవీబీలో 22 తులాలు బంగారం తాకట్టు ఉందని, డబ్బులిస్తే బంగారం విడిపిస్తానని చెప్పడంతో కూర్మారావు డబ్బులిచ్చారని, ఆ సమయంలో బ్యాంకు నుంచి విడిపించి కూర్మారావు దగ్గర బంగారం తాకట్టు పెట్టానని పద్మశ్రీ చెప్పింది. ఆ బంగారం విడిపించేందుకు రెండు రోజుల క్రితం వెళ్లగా డబ్బులెక్కువ లెక్క చెప్పారని, పెద్దలకు చెప్పినా న్యాయం జరగకపోవడంతో నిరసన చేపట్టాల్సి వచ్చిందని తెలిపింది. ఈ విషయమై ఎస్ఐ సీహెచ్.గంగరాజు వద్ద ప్రస్తావించగా తమకు ఫిర్యాదు రాలేదని చెప్పారు. -
నెట్వర్క్ పట్టి
కొండపైకి ఎక్కి..మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా చిత్రకొండ సమితిలో మొత్తం 9 పంచాయతీలు జోడాం, పనాస్పూట్, రల్లేగేఢ, పప్పారమేట్ల, గాజుల్మామ్ముడి, కూర్మానూర్, బోఢపోఢ, బోఢపోధర్, దూలిపూట్ ఉన్నాయి. వీటిలో 151 గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ మొబైల్ సేవల కోసం 30 సెల్ టవర్లు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. స్మార్ట్ఫోన్లు కూడా గత ప్రభుత్వం ఇచ్చింది. కానీ నెట్వర్క్ లేకపోవడంతో అవన్నీ దిష్టి బొమ్మల్లా మిగిలాయి. ఇక పంచాయతీ కార్యాలయ పనులు కూడా కొండెక్కితే గానీ జరగడం లేదు. గురువారం రల్లేగేఢ పంచాయతీ పనుల కోసం ఆధార్ కార్డు, పీఎం కిసాన్, కేవైసీ వంటి వాటి కోసం అధికారులు కొండపైకి ఎక్కి సాయంత్రం వరకు అక్కడే పనిచేశారు. -
అబుదాబిలో వలస కార్మికుడు మృతి
● ఏడు నెలలు క్రితం ఉపాధి కోసం అన్నతో పయనం ● సన్యాసిపుట్టుగలో విషాద ఛాయలు ఇచ్ఛాపురం రూరల్: పొట్టకూటి కోసం గల్ఫ్ వెళ్లిన కన్న కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తెలుసుకుని ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఇచ్ఛాపురం మండలం కేశుపురం పంచాయతీ సన్యాసిపుట్టుగ గ్రామానికి చెందిన మాసుపత్రి విజయ్(21) ఉపాధి కోసం ఏడు నెలలు క్రితం తన అన్నయ్య బన్నీతో కలిసి అబుదాబి వెళ్లాడు. అన్నదమ్ములిద్దరూ అబుదాబిలోని ఎన్హెచ్ఎస్ కంపెనీ కన్స్ట్రక్షన్లో స్ట్రాచలర్ ఫిట్టర్గా పని చేస్తున్నారు. బుధవారం ఉదయం ఆరు గంటలకు తామంతా క్షేమంగా ఉన్నామంటూ తల్లిదండ్రులతో విజయ్ మాట్లాడాడు. ఇంతలో ఏమైందో ఏమో గానీ గురువారం ఉదయం పెద్ద కొడుకు బిన్నీ తల్లిదండ్రులకు పిడుగులాంటి వార్త చేరవేశాడు. తమ్ముడు బుధవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందాడంటూ కన్నీరుమున్నీరుగా విలపించాడు. దీంతో తల్లిదండ్రులు శంకర్, లోలమ్మలు కుప్పకూలిపోయారు. కుమారుడి మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించాలని ప్రభుత్వాన్ని కన్నీటిపర్యంతంగా వేడుకుంటున్నారు. -
బీల భూముల్లో.. మొగలి పరిమళాలు
● సిరులు కురిపిస్తున్న మొగలి పూలు ● ఒడిశా మొక్కలతో సాగు ● పెట్టుబడి లేని పంట కావడంతో ఆసక్తి చూపుతున్న రైతులు కవిటి: ఉద్దానం బీలప్రాంతంలో పంట భూములకు రక్షణగా ఏర్పాటు చేసుకున్న మొగలిచెట్లు రైతులకు పెట్టుబడి లేని ఆదాయవనరుగా మారాయి. ఏడాదిలో ఆరు నెలలకు పైగా మంచి ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి. పండగలు, ఇతర సీజన్లో ఒక్కో పువ్వు రూ.40 నుంచి రూ.42 వరకు అమ్ముడుపోతుంటాయి. ఇక్కడి రైతులు వేకువజామునే చేతిలో దొనికత్తి పట్టుకుని వెళ్లి మొగలిపూల సేకరణలో నిమగ్నమవుతుంటారు. అదృష్టం కలిసివస్తే ఒక్కోవ్యక్తి రోజుకు 20 పువ్వుల వరకు దొరుకుతాయి. ప్రభుత్వపోరంబోకు భూమిలోనివైతే ఎవరైనా కోసుకోవచ్చు. అదే రైతు తన తోటలో మొగలిచెట్లు నాట్లు వేస్తే వాటిని సదరు రైతు మాత్రమే కోయాల్సి ఉంటుంది. ప్రత్నామ్నాయ పంటగా.. ఇటీవల కాలంలో రైతులు తమ భూముల్లో వరి, చోడి తదితర పంటలకు ప్రత్యామ్నాయంగా మొగలిపంట సాగుకే మొగ్గు చూపుతున్నారు. వర్షాధారంగా కవిటి ఉద్దానం బీలలోని చిత్తడి నేలల్లో నీటి ఊ టలే పదునుగా మొగలి పంట వస్తోంది. ఇప్పటికే కొంతమంది రైతులు తమ భూముల్లో మొగలి డొంకల్ని పెంచుతున్నారు. వారి వద్ద నుంచి పంట కోసుకునేందుకు ఏడాదికి కొంత మొత్తం చెల్లించి కాంట్రాక్ట్ పొందుతారు. అలా రైతుల భూములు లీజుకు తీసుకున్న కొందరు ఇదే పంటపై మంచి ఆదాయం పొందుతున్నారు. స్వల్పవ్యవధిలో ఏపుగా పెరిగే మొక్కల కోసం పొరుగు రాష్ట్రం ఒడిశాకు వెళ్లి నాణ్యమైన మొగలి అంట్లను కూడా ఇక్క డికి తీసుకొస్తున్నారు. మన వద్ద లభించే మొగలి మొక్కల కన్నా ఒడిశా మొక్కల నుంచి వచ్చే పూల కు గిరాకీ ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. వీరంతా ఇక్కడి నుంచి ద్విచక్ర వాహనాలు, ఆటోల్లో ఒడిశా వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. కపాసుకుద్థి రెవెన్యూలో రెండున్నర ఎకరాల పొలం ఉంది. ఇందులో రెండు ఎకరాలలో వరిసాగు చేస్తున్నాం. మిగిలిన 30 సెంట్ల భూమిలో గట్టు చుట్టూ మొగలి మొక్కలు నాటాం. ఏడాది కి రూ.40,000 లీజుకు కుదుర్చుకోవడం ద్వారా మొగలిపంట నుంచి ఆదాయం వస్తోంది. – ఆరంగి శివాజీ, చిక్కాఫ్ సంస్థ ఎండీ, ముత్యాలపేట కొబ్బరి, వరికి ప్రత్యామ్నాయంగా ఒడిశా వెళ్లి మొగలి అంట్లు తెచ్చినాటాను. బాగా ఎదిగేందుకు ఆవుపేడ మొదళ్లలో వేశాను. మొక్కలు చక్కగా పెరిగాయి. బాగా కలిసి వస్తుందనే నమ్మకంతో మొగలిసాగు చేసేందుకు నిర్ణయం తీసుకున్నాను. – బంజు పాపారావు, మొగలిసాగుదారు, కె.కపాసుకుద్ధి -
ఘనంగా కాళీమాత పూజలు
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కాళీ మాతకు గురువారం ప్రత్యేక పూజాలు నిర్వహించారు. ఈ పూజను బెంగాళీ సంప్రదయంలో జగన్నాథ్పల్లి గ్రామంలో మా పోలీ మాంగళరూపాంలో సర్వజననీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కోరుకొండ, మాత్తిలి, డ్యామ్సైడ్, కలిమెల, పోడియ, ఎం.వి 43 గ్రామాల్లో అమ్మావారి ముర్తులను నిలిపి పూజలు చేస్తున్నారు. ప్రతి మండపం వద్ద బెంగాళీ సంప్రదాయ భజనలు నిర్వహిస్తున్నారు. చతువా కేంద్రం తనిఖీ పర్లాకిమిడి: గజపతి జిల్లాలో గుమ్మా బ్లాక్లో పలు చతువా ఉత్పాదక కేంద్రాలను సబ్ కలెక్టర్ అనుప్ పండా గురువారం సందర్శించారు. గర్భిణులు, బాలింతలకు అంగన్వాడీ కేంద్రాల్లో అందజేసే పోషక విలువలు ఉన్న డ్రై ఫుడ్ (చతువా)ను సరైన పధ్ధతిలో తయారుచేసే రెండు కేంద్రాలను తనిఖీ చేశారు. సబ్ డివిజనల్ ప్రోగ్రాం అధికారి స్నిగ్దారాణి భుయ్యాన్, సీడీపీఓ పుష్పాంజలి సాహు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. జలుమూరు: కార్తిక మాసంలో శ్రీముఖలింగం రాలేని భక్తులకు వారి గోత్రనామాలు వాట్సాప్ ద్వారా తెలియజేస్తే ఉచితంగా పూజలు నిర్వహిస్తామని అనువంశక అర్చకులు నాయుడుగా రి రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. జన్మనక్షత్ర, గ్రహదోషాలు పోవడానికి ఉచిత పూజలు చేస్తామని, దీనికోసం ఎటువంటి రుసుం చెల్లించనవసరం లేదని పేర్కొన్నారు. ఆసక్తిగల భక్తు లు 9493577098 నంబర్కు వాట్సాప్ ద్వారా వివరాలు తెలియజేయాలని కోరారు. 14న బాలల సంఘం రాష్ట్ర సమ్మేళనం శ్రీకాకుళం (పీఎన్కాలనీ): నవంబర్ 14న జరి గే బాలల సంఘం రాష్ట్ర సమ్మేళనం విజయవంతం చేయాలని అఖిల భారత యువజన సమా ఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడ యుగంధర్ కోరారు. ఈ మేరకు శ్రీకాకుళం క్రాంతిభవన్లో గురువారం పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ రోజురోజుకూ పెరుగుతోందన్నారు. పేరుకు చట్టాలు ఉన్నా యి తప్ప బాలకార్మికుల నియంత్రణ జరగడంలేదన్నారు. బాల్య వివాహాలు జరుగుతున్నా నియంత్రణ కరువైందన్నారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాస్లు మాట్లాడుతూ నేటి సమాజంలో బాలలు గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలుగా మారి భవిష్యత్తును దూరం చేసుకుంటు న్న నేపథ్యంలో రాష్ట్ర యువజన సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘ నాయకులు గిరిబాబు, సురేష్, వెంకట రావు తదితరులు పాల్గొన్నారు. -
ఫేక్ వెబ్ చానెళ్లపై చర్యలు తీసుకోవాలి
కొరాపుట్: ఫేక్ వెబ్ చానళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కొరాపుట్ డీసీసీ ప్రెసిడెంట్ రూపక్ తురుక్ డిమాండ్ చేశారు. గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. కొరాపుట్ జిల్లా కేంద్రంలో రూపక్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ పిలుపుమేరకు ప్రతి జిల్లాలోనూ ఫేక్ వెబ్ చానల్స్కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నామన్నారు. తమ పార్టీ నాయకులను లక్ష్యంగా పెట్టుకొని తప్పడు ప్రసారాలు చేస్తున్నాయన్నారు. ఇటువంటి వాటిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పార్టీ సీనియర్ నాయకుడు మనోజ్ ఆచార్య పాల్గొన్నారు. మల్కన్గిరిలో.. మల్కన్గిరి: పీసీసీ అధ్యక్షుడు భక్తచరణ దాస్ పేరుతో నిరాధార వార్తలు, వ్యాఖ్యలు వైరల్ చేస్తున్న ఫేక్ వెబ్ చానళ్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా కంగ్రెస్ అధ్యక్షుడు జి.శ్రీనివాసురావు డిమాండ్ చేశారు. గురువారం మల్కన్గిరి ఆదర్శ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జిల్లా పరిషత్ సభ్యుడు కృష్ణచంద్ర అనుగు, కాంగ్రెస్ నేతలు భీమా బార్ష, రామకృష్ణ మండల్, దశరధి దురక, భాస్కర్ పర్చా, పద్మా పాంగి, చిన్నరావు, ప్రభాకర్ పాల్, ఇతర సభ్యులు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ భవన్ నుంచి ర్యాలీ నిర్వహించారు. -
బీజేపీ ఎమ్మెల్యేతో నాకు ప్రాణహాని
● ఎచ్చెర్లలో టీడీపీ కార్యకర్త ఆరోపణ రణస్థలం: ఎచ్చెర్ల బీజేపీ ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావుతో తనకు ప్రాణహాని ఉందని రణస్థలం మండలం బంటుపల్లిలో పాశపు శ్రీనివాసరావు అనే టీడీపీ కార్యకర్త ఆందోళన వ్యక్తం చేశారు. తన భూమిని లాక్కునేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. బంటుపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 26/9లో 3.71 ఎకరాల భూమిపై తన కుటుంబం, కొరిపిల్లి రాధాకుమారి కుటుంబాల మధ్య వివాదం ఉండగా, ఈ సమస్య ఇప్పటికే న్యాయస్థానంలో ఉందన్నారు. భూమిలో ఉన్న జీడి, టేకు చెట్లను పొందూరు మండలంలోని బొట్లపేటకు చెందిన గురాల సుమంత్, రణస్థలం మండలంలోని యాగాటిపాలేనికి చెందిన కొరిపల్లి రాధాకుమారి, కొరిపల్లి శ్రీనివాసరావు, కొరిపల్లి వీరబాబులు 15 రోజుల కిందట దౌర్జన్యంగా నరికివేశారని తెలిపారు. ఈ నెల 13న పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. అధికారులు చెట్ల నరికివేతను నిలిపివేసినప్పటికీ, మళ్లీ గురువారం చెట్లను నరికి కలప తరలించుకుపోయారన్నారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే తన భూమిని కబ్జా చేసేందుకు పన్నాగం పన్నుతున్నారని, అందుకు పోలీసులు సహకరిస్తున్నారని శ్రీనివాసరావు ఆరోపిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యేతో తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. చెట్లు కొట్టిన వ్యక్తికి, భూమికి ఎలాంటి సంబంధం లేదన్నారు. దీనిపై గురాల సుమంత్ స్పందిస్తూ అగ్రిమెంట్ ప్రకారం ప్రస్తుతం భూమి తన ఆధీనంలో ఉందన్నారు. ఎమ్మెల్యేకు సంబంధం లేదని, తనకు అడ్డొస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించాడు. -
ఉప ఎన్నికకు సన్నద్ధం
● పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు ● పోలీసు ఉన్నతాధికారుల సమీక్షలో డీజీపీ యోగేష్భువనేశ్వర్: నవంబర్ 11న నువాపడా శాసనసభ నియోజక వర్గానికి ఉప ఎన్నికకు సంబంధించి పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్లు రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) యోగేష్ బహదూర్ ఖురానియా తెలిపారు. ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, న్యాయంగా, పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, ప్రముఖుల కదలికల భద్రతకు సంబంధించి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని దేశించారు. సీఆర్పీసీ సెక్షన్ 107, 110 కింద అనుమానిత వ్యక్తులను అరెస్టు చేయడం, అక్రమ డబ్బు ప్రవాహాన్ని అరికట్టడం, అక్రమ ఆయుధాలు, మద్యం స్వాధీనం చేసుకోవడం వంటి నివారణ చర్యలను ముమ్మరం చేయాలన్నారు. పోలింగ్ రోజుకు ముందే పెండింగ్లో ఉన్న నాన్–బెయిలబుల్ వారెంట్లను (ఎన్బీడబ్ల్యూ) అమలు చేయాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల చొరబాటు నివారణకు మొబైల్ పెట్రోలింగ్ బలోపేతం చేయాలని సూచించారు. ● ఫ్లయింగ్ స్క్వాడ్లను మోహరింపుతో పాటు కీలకమైన ప్రవేశ కేంద్రాల వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని అదనపు డీజీపీ (శాంతి భద్రతలు) సంజయ్ కుమార్ సూచించారు. ● రాష్ట్ర నిఘా విభాగం డైరెక్టర్ ఆర్. పి. కోచే మాట్లాడుతూ నియోజకవర్గం, పరిసర ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిస్థితిని నిశితంగా పరిశీలించాలని డీఐజీలు, ఎస్పీలను కోరారు. ● మావోయిస్టుల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో జిల్లాలోని ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్లు, మావోయిస్టు వ్యతిరేక డ్రైవ్లను ముమ్మరం చేసినట్లు ఏడీజీపీ (నక్సల్ వ్యతిరేక ఆపరేషన్స్) సంజీవ్ పండా తెలిపారు. ప్రశాంతమైన పోలింగ్ జరిగేలా సమగ్ర భద్రతా ప్రణాళికలను రూపొందించినట్లు వివరించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం జిల్లా పోలీసు సిబ్బందితో పాటు మొత్తం 14 కంపెనీల కేంద్ర సాయుధ పోలీస్ దళం (సీఏపీఎఫ్), 5 ప్లాటూన్ల ఓఎస్ఏపీ/ఏపీఆర్, 35 మొబైల్ పెట్రోలింగ్ యూనిట్లు, 18 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 18 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్లు (ఎస్ఎస్ టీ) మోహరిస్తున్నట్లు వివరించారు. సమావేశంలో డీజీపీ (క్రైమ్ శాఖ) వినయ్తోష్ మిశ్రా, డైరెక్టర్ (నిఘా) ఆర్.పి.కోచే, అదనపు డీజీపీ (ప్రధాన కార్యాలయం) అరుణ్ బోత్రా, అదనపు డీజీపీ (ఎస్ఏపీ) రాజేష్ కుమార్, ఇనస్పెక్టర్ జనరల్ (ఎస్ఏపీ) ఎస్.కె. గజ్వియే సహా పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
ఘనంగా శిశు మహోత్సవం
జయపురం: జయపురం బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి కార్యాలయ పరిధి కుంత్రర్కాల్ సాధన కేంద్ర ఓజెయి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో బుధవారం శిశు మహోత్సవం సురభి 2025 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కుంతర్కాల్ కమ్యూనిటీ సాధన కేంద్రం కో–ఆర్డినేటర్ రుద్రప్రసాద్ పాణిగ్రహి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 16 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఒడిశా ప్రాథమిక విద్య డైరెక్టరేట్ అధికారి రంజన్కుమార్ రథ్, జయపురం బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి చందన్కుమార్ నాయిక్, ఒడిశా రాష్ట్ర నాన్గెజిటెడ్ కర్మచారి సమన్వయ కమిటీ కొరాపుట్ జిల్లా అధ్యక్షుడు శిశిభూషణ్ దాస్, ఎడ్యుకేషన్ విభాగాఽధికారి రాజేంద్ర నారాయణ పాఢీ, ప్రభుత్వ కమ్యూనిటీ విద్యాధికారి కె.గోపాలరావు, ప్రభుత్వ కమ్యూనిటీ విద్యాధికారి సోమనాథ్ గదబ, సురేంద్రకుమార్ పట్నాయిక్, పి.హరిశ్చంద్రరావు పాల్గొన్నారు. -
సైబర్ నేరాలపై అవగాహన
రాయగడ: ఎస్పీ స్వాతి ఎస్.కుమార్ ఆదేశాల మేరకు కళ్యాణసింగుపూర్లో మంగళవారం సైబర్ సురక్షపై పోలీసులు భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా చైతన్య రథాన్ని ఎస్డీపీఓ గౌరహరి సాహు ప్రారంభించారు. సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో సైబర్ విభాగం డీఎస్పీ అవినాష్ రెండ్డి, హెచ్ఆర్ పీసీ సంతోష్కుమార్ సతపతి, ఐఐసీ నీలకంఠ బెహర, ఏఎస్ఐ హేమంత్కుమార్ బరడి తదితరులు పాల్గొన్నారు.ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్ దగ్ధంభువనేశ్వర్: స్థానిక నీలాద్రి విహార్ సెక్టార్–4 ప్రాంతంలోని ఎలక్ట్రిక్ స్కూటర్ స్టోర్ రూమ్లో బుధవారం మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే షాపులోని స్కూటర్లు కాలిపోయాయి. మంటలకు కారణం తెలియలేదు. తేనేటీగల దాడిలో ఐదుగురికి గాయాలు రాయగడ: తేనెటీగల దాడిలో ఐదుగురు గాయాలపాలయ్యారు. జిల్లాలోని కళ్యాణ సింగుపూర్ అటవీ రేంజ్ కార్యాలయం సమీపంలో ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. గాయాలపాలైన వారిలో కమలా హికక, ఇలిగ కడ్రక, జి.నాగభూషణరావు, జి.త్రిపాఠి, ఇరుపతి నాయుడు ఉన్నారు. వీరంతా కళ్యాణ సింగుపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. రైలు ఢీకొని యువతికి గాయాలు రాయగడ: స్థానిక పితామహాల్ రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద బుధవారం రైలు ఢీకున్న ఘటనలో ఓ యువతి తీవ్రగాయాలపాలయ్యింది. సదరు సమితి పితామహాల్ పంచాయతీలోని కొందోకిలుము గ్రామానికి చెందిన తులసి ఉలక ప్రమాదానికి గురైనట్లు రైల్వే వర్గాలు తెలియజేశాయి. రాయగడ మీదుగా విజయనగరం వెళ్లే గూడ్స్ రైలు వస్తున్న కారణంగా లెవెల్ క్రాసింగ్ గేటును మూసివేశారు. ఈ క్రమంలో తులసి లెవెల్ క్రాసింగ్ దాటుతున్న సమయంలో గూడ్స్ ఆమెను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. తీవ్రగాయాలకు గురైన ఆమెను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న రాయగడ, శెశిఖాల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పిడుగపాటుకు యువకుడు బలి రాయగడ: పిడుగు పాటుకు ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన జిల్లాలోని కళ్యాణ సింగుపూర్ సమితి నారాయణపూర్ పంచాయతీ పరిధి సనొతొండ్ర గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. మృతుడు అదే గ్రామానికి చెందిన బొగి నచిక (20)గా గుర్తించారు. మంగళవారం సాయంత్రం పచ్చగడ్డి కోసం సమీపంలోని అడవులకు వెళ్లాడు. అదే సమయంలో వర్షం కురవడంతో పాటు ఉరుములు, మెరుపులతో పిడుగు పడటంతో నచిక సంఘటన స్థలం వద్దే మృతి చెందాడు. అటువైపుగా వెళ్లిన కొందరు గ్రామస్తులు చూసి ఈ విషయాన్ని నచిక తండ్రి కృష్ణ నచికకు తెలియజేశారు. విగతజీవుడై పడి ఉన్న కొడుకు మృతదేహాన్ని చూసి గ్రామస్తుల సహాయంతో ఇంటికి తీసుకువెళ్లాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణ సింగుపూర్ పీహెచ్సీకి తరలించారు. -
గుసాని సమితిలో బీజేడీ నేతల పాదయాత్ర
పర్లాకిమిడి: జిల్లాలోని గుసాని సమితిలో బీజేడీ పార్టీ నాయకులు జనసంపర్క పాదయాత్రను బుధవారం జరిపారు. పాదయాత్ర తొలుత ఏడో మైలు జంక్షన్ నుంచి గుసాని బ్లాక్ బీజేడీ పార్టీ కార్యాలయం వరకూ సాగింది. పాదయాత్రలో పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, బీజేడీ జిల్లా అధ్యక్షులు ప్రదీప్ నాయక్, జిల్లా పరిషత్ చైర్మన్ గవర తిరుపతిరావు, గుసాని సమితి చైర్మన్ ఎన్.వీర్రాజు, పెద్ద కొత్తూరు పంచాయతీ నాయకులు ఎం.సూర్యనారాయణ, బిజేడీ ఛత్ర యువజన అధ్యక్షులు త్రిపాఠి, ఆర్ఎంసీఎస్ అధ్యక్షులు ఎస్.గజపతిరావు తదితరులు ఉన్నారు. ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి ప్రారంభమైన పాదయాత్ర నవంబర్ తొమ్మిదో తేదీ వరకూ కొనసాగుతోందని బీజేడీ నాయకులు ప్రదీప్ నాయక్ తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అమలు చేసిన అనేక పథకాలు ప్రతి ఇంటికి చేరాలని ప్రదీప్ నాయక్ అన్నారు. -
కాళీ పూజలకు పోటెత్తిన భక్తులు
రాయగడ: స్థానిక బ్లాక్ కాలనీ సమీపంలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాళీపూజలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం కాళీమాతకు సమర్పించే సంధ్యా హారతిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. కాళీమాతను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. ● మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కాళీమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యంగా బెంగాలీ సంప్రదాయంలో జగ్గన్నాద్పల్లి గ్రామంలో సర్వజనానీ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక పూజలు జరిగాయి. కోరుకొండ, మాత్తిలి, డ్యామ్సైడ్, కలిమెల, పోడియ, యం.వి.43 గ్రామాల్లో కూడా పూజలు జరిగాయి. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
ఎలుగుబంట్లు హల్చల్
● భయం గుప్పిట్లో ప్రజలుజయపురం: జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మ సమితి బి.సింగపూర్ గ్రామ ప్రాంతంలో మరోసారి ఎలుగుబంట్లు స్వైర విహారం చేశాయి. కొద్ది రోజుల కిందట బి.సింగపూర్ రహదారిలో వృద్ధుడిపై ఎలుగుబంట్ల దాడి చేశాయి. ఈ దాడిలో గాయపడిన వృద్ధుడు మృతి చెందాడు. ఈ సంఘటన ప్రజలు మరువ కుండానే మంగళవారం రాత్రి మూడు ఎలుగుబంట్లు బిసింగపూర్లో స్వైర విహారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిశాయి. గ్రామంలోని విద్యుత్ సబ్స్టేషన్ ప్రాంతంలో కనిపించాయి. సబ్స్టేషన్లో పనిచేసే ఉద్యోగులు భయంతో పారిపోయారు. గ్రామ ప్రజలు కూడా భయంతో ఇళ్ల నుంచి బయటకు రావటంలేదు. బి.సింగపూర్ ప్రాంతంలో తరచూ ఎలుగుబంట్లు తిరుగుతున్నాయని, గ్రామాల్లోనికి రాకుండా తగిన చర్యలు చేపట్టాలని గతంలో అనేక మార్లు అటవీ విభాగ అధికారులకు తెలియజేసినా తగిన చర్యలు చేపట్టడం లేదన్నారు. తరచూ అవి గ్రామ ప్రాంతాల్లోనికి వస్తున్నాయని, పంటలను పాడు చేస్తున్నాయి. ప్రజలపై దాడి చేస్తూ ప్రాణాలు తీస్తున్నాయి. అడవులు తగ్గిపోవటం వలన వణ్యప్రాణులకు ఆహార కొరత కారణంగా అవి గ్రామ ప్రాంతాల బాట పడుతున్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అటవీ అధికారులు గ్రామ ప్రాంతాలకు వచ్చే వన్యజంతువులను పట్టి వాటిని సురక్షిత అటవీ ప్రాంతాల్లో విడిచిపెట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు చేయాలి
జయపురం: ఒడిశా అమలా సంఘ నిధుల దుర్వినియోగం, నిధుల స్వాహా ఆరోపణలపై దర్యాప్తు జరపాలని కొరాపుట్ జిల్లా అమలా సంఘ అధ్యక్షులు శశిభూషణ దాస్ డిమాండ్ చేశారు. స్థానిక బ్లాక్ విద్యాధికారి కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారు ఏడాది నుంచి కొంతమంది రెవెన్యూ అమలా సంఘ కార్యకర్తలు ఒడిశా అమలా సంఘ్ నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపిచారు. దీనిపై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర హోం విభాగ కార్యదర్శి, సాధారణ పాలన విభాగ కార్యదర్శి, కొరాపుట్ జిల్లా కలెక్టర్, కొరాపుట్ జిల్లా ఎస్పీల దృష్టికి కూడా నిధుల దుర్వినియోగం విషయాన్ని తీసుకెళ్లామన్నారు. నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలపై స్పందించి వెంటనే విచారణ చేయాలని కొరాపుట్ జిల్లా కలెక్టర్ను రాష్ట్ర హోం విభాగ కార్యదర్శిని ఆదేశించినప్పటికీ ఫలితం లేదన్నారు. ఇప్పటికై న వెంటనే దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. సీనియర్ సభ్యులు కై లాస సామంతరాయ్, జగన్నాధ మఝి, జోగేంద్ర చౌదరి, జగన్నాధ్ దాస్ ప్రసంగించారు. సమావేశంలో త్రినాథ్ పండ, ప్రతీక్ మిశ్ర, సంతూన్ జెన, బాలగోపాల మిశ్ర పాల్గొన్నారు. డిసెంబర్ 13, 14 తేదీల్లో కొరాపుట్ జిల్లా అమలా సంఘ భవనంలో మరోసారి సమావేశం కానున్నట్టు సంఘ నాయకుడు శశిభూషణ దాస్ చెప్పారు. -
పైసలిస్తేనే పనులు..?
ఆమదాలవలస రూరల్: అక్రమార్జనలో ఆమదాలవలస సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అగ్రగామిగా నిలుస్తోంది. దస్త్రావేజులకు అక్రమ ధరలు పలికించడంలో ఇక్కడి అధికారులు, సిబ్బంది కీలకంగా నిలుస్తున్నారు. వాస్తవంగా భూములకు సంబంధించి క్రయ, సెటిల్మెంట్, కుటుంబ పంపకం, సవరణ, మార్ట్గేజ్ వంటి దస్త్రావేజులు నిత్యం రిజిస్ట్రేషన్ చేస్తుంటారు. అయితే భూములకు సంబంధించి గానీ, నివాస స్థలానికి సంబంధించి గానీ చిన్న, చిన్న తప్పులను బూచీగా చూపించి తిరస్కరణ పేరుతో ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. అనంతరం రిజిస్ట్రేషన్లలో భారీగా వసూలు చేస్తున్నారు. ఒక్కో దస్త్రావేజుకు సుమారుగా రూ.10 వేలు నుంచి రూ.లక్షల్లో వసూళ్లు చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా తహసీల్దార్ సర్వే నంబర్ నిర్ధారణ కోసం జారీ చేసిన ధ్రువీకరణ పత్రంతో భూముల రిజిస్ట్రేషన్లు చేసేందుకు రూ.10 వేలు నుంచి రూ.50 వేల వరకు ఇక్కడ సిబ్బంది వసూలు చేస్తున్నారు. జీతాల కంటే అక్రమార్జనే ఎక్కువ ఇక్కడ పనిచేసే అధికారులు, సిబ్బందికి ప్రభుత్వం ఇచ్చే జీతాలు కంటే అధిక మొత్తంలో నిత్యం అక్రమార్జన చేకూరుతోంది. దీంతో భూములు కొనుగోలు చేసినవారు రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి ఈ కార్యాలయానికి రావాలంటే భయపడుతున్నారు. వాస్తవంగా ఇటీవల ఆమదాలవలస మున్సిపాలిటీలోని రావికంటిపేటకు చెందిన ఒక వ్యక్తి వద్ద సర్వే నంబర్ను తప్పుగా చూపించి రూ.లక్షల్లో వసూలు చేయటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతేకాకుండా ఇదే మున్సిపాటీలోని అక్కివలస రెవెన్యూ గ్రామంలో లింక్ దస్త్రావేజులో చిన్న తప్పును చూపించి ఇదే తరహాలో దోచుకున్నారు. అలాగే ప్రభుత్వం గతంలో అందించిన కాలనీలు ప్రభుత్వ భూములు అయినందున రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం ఉండదు. అయితే ఇటీవల కాలంలో ఆమదాలవలస మున్సిపాలిటీ, ఐ.జె.నాయుడు కాలనీ, సొట్టవానిపేట కాలనీ తదితర ప్రాంతాల్లో అనేక గ్రామాల నుంచి గ్రామకంఠం సర్వే నంబర్తో తహసీల్దార్లు, వీఆర్వోలు అందించిన ధ్రువీకరణ పత్రాలతో పలు రిజిస్ట్రేషన్లు చేయించి రూ.లక్షల్లో దోచుకునే దందా ఈ కార్యాలయంలో కొనసాగుతుండడం గమనార్హం. కార్యాలయంలో కలెక్షన్ కింగ్ ఆమదాలవలస సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక సాధారణ ఉద్యోగి చక్రం తిప్పుతున్నాడు. దస్త్రావేజులకు అక్రమ ధరలు నిర్ధారించడంలో ఆయనకు సాటి మరొకరు ఉండరనే విధంగా వ్యవహరిస్తున్నాడు. ఈ సాధారణ ఉద్యోగి కార్యాలయంలో కొందరు బినామీ ఉద్యోగులను ఏర్పాటు చేసుకొని భూ కొనుగోలు దారులనుంచి భారీ ముడుపులు అందుకుంటున్నాడనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా స్థానికంగా ఉండే కొందరు లేఖర్లును అడ్డం పెట్టుకొని, అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్నాడనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఆయనకు అక్కడ పనిచేసే అధికారి కూడా ఏమీ చేయలేరనే విధంగా వ్యవహరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇక్కడ జరుగుతున్న భారీ అవినీతి, అక్రమాల నియంత్రణపై జిల్లా అధికారులు కూడా కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అందువలన ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు అమదాలవలస సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. -
పాముకాటుతో వృద్ధురాలి మృతి
రాయగడ: పాముకాటుతో వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన జిల్లాలోని బిసంకటక్ సమితి హటోమునిగుడ పంచాయతీ గొంటిఖాల్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. మృతురాలు సాలహుయిక (60)గా గుర్తించారు. తన సొంత పొలంలో వ్యవసాయం పనులు చేస్తున్న సమయంలో పాము కాటుకు గురైన ఆమెను కుటుంబీకులు వెంటనే స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించాలని సూచించారు. అదేమీ పట్టించుకోకుండా కుటుంబీకులు కరాపాడి గ్రామంలోని ఒక మత్రం వేసే వారి ఇంటికి తీసుకువెళ్లారు. మూఢనమ్మకాల కారణంగా ఆమెకు సకాలంలో మెరుగైన చికిత్స అందకపొవడంతో ప్రాణాలు కోల్పోయింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఫిర్యాదుభువనేశ్వర్: నువాపడా ఉప ఎన్నిక ప్రచారంలో రాష్ట్ర పాఠశాలలు, సామూహిక విద్యా విభాగం మంత్రి నిత్యానంద్ గోండ్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు ఆరోపణ వెల్లువెత్తాయి. భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల కోసం నువాపడా నర్సింగ్ శిక్షణ కళాశాలలో రాజకీయ కార్యక్రమం నిర్వహించడం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగా విపక్ష బిజూ జనతా దళ్ ఆరోపించింది. ఈ మేరకు బిజూ జనతా దళ్ ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ)కి కలిసి మంత్రి నిత్యానంద్ గోండ్పై వ్యతిరేకంగా ఫిర్యాదు చేసింది. -
ఘనంగా మా శ్యామకాళీ ఉత్సవాలు
పర్లాకిమిడి: స్థానిక ఐదో వార్డు కటిక వీధి జంక్షన్ వద్ద మా శ్యామకాళీ పూజా వేడుకలు ఘనంగా బుధవారం ఘనంగా జరిగాయి. మహిళలు పెద్ద ఎత్తున కాళీని దర్శించుకుని దీపారాధన చేపట్టారు. పోరుగు రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, కోరసవాడ నుంచి కూడా భక్తులు వచ్చారు. గత 28 సంవంత్సరాలుగా పర్లాకిమిడిలో మాశ్యామ కాళీ ఉత్సవాలు జరుపుతున్నట్టు కమిటీ కార్యదర్శి బి.బి.మహాంతి తెలియజేశారు.సైబర్ భద్రత అవగాహన మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి ఎం.వి 79 పోలీసు స్టేషన్లో బుధవారం సైబర్ భద్రతపై అవగాహన కర్యక్రమాన్ని ఐఐసీ చంద్రాకాంత్ తండి నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న మోసలు గూర్చి ప్రజాల్లో చైతన్యం కల్పించడం కోసం ఈ కర్యక్రమాన్ని ఈ నెల 18 నుంచి నవంబర్ 17వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. ఫేస్బుక్, వాట్సాప్ మోసాలను వివరించారు. తెలియని లింక్లపై క్లిక్ చేయకూడదని, వ్యక్తిగత సమాచారాన్ని ఆన్లైన్లో పంచుకోవద్దుని, అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. మోసాల బారిన పడకుండా ఉండేందుకు, సైబర్ హెల్ప్లైన్ నంబర్ 1930కు ఫోన్ చేయాలని ఐఐసీ చంద్రకాంత్ తండి తెలిపారు. -
తేనెటీగల పెంపకంతో ఉపాధి
ఆమదాలవలస: తేనెటీగల పెంపకాన్ని శాసీ్త్రయ పద్ధతిలో అభివృద్ధి చేసుకొని, తద్వారా యువత ఉపాధి అవకాశాలు పొందవచ్చునని కేవీకే ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డాక్టర్ కె.భాగ్యలక్ష్మి అన్నారు. స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో నాబార్డు, కేవీకే సంయుక్తంగా తేనెటీగల పెంపకంపై యువతకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తేనెటీగల పెంపకం ద్వారా రైతులు, మహిళలు, యువత ఆర్థికంగా లాభపడే అవకాశం ఉందన్నారు. శిక్షణలో పాల్గొన్నవారు తేనెటీగల పెంపకాన్ని వృత్తిగా స్వీకరించి, పరిశ్రమలుగా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. నాబార్డు డీడీఎం కె.రమేష్ కృష్ణ మాట్లాడుతూ తేనెటీగల పెంపకాన్ని వ్యాపారపరంగా అభివృద్ధి చేసుకోవాలనుకునే వారికి నాబార్డు నుంచి తగిన ఆర్థిక సాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు. డీఆర్డీఏ డీపీవో బి.నారాయణరావు మాట్లాడుతూ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిక్షణలో పాల్గొన్న రైతులు, యువత తేనెటీగల పెంపకానికి సంబంధించిన నైపుణ్యాలను నేర్చుకుని, అనుభవజ్ఞులైన వ్యాపారవేత్తలతో అనుసంధానం కావాలని సూచించారు. అనంతరం సస్యరక్షణ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.అనూష తేనెటీగల సంరక్షణ, వ్యాధుల నివారణ, శాసీ్త్రయ మెలకువలపై వివరించారు. విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ జి.ఎస్.రాయ్ తేనెటీగల పెంపకాన్ని వ్యాపారవేత్తల దిశగా విస్తరించాల్సిన అవసరాన్ని వివరించారు. గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ బి.సునీత తేనె ఆధారిత ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇచ్చారు -
సైబర్ నేరాలపై అప్రమత్తం
పర్లాకిమిడి: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, గజపతి జిల్లాలో ఆర్.ఉదయగిరి బ్లాక్లో అనుగురు పంచాయతీ, రామగిరి గుమ్మాలో బుభునీ పంచాయతీ, కాశీనగర్ బ్లాకులోని పలు పంచాయతీల్లో సైబర్ నేరాలపై అవగాహన ర్యాలీలు, పలు తహసీల్దార్ కార్యాలయాల్లో సభలను పోలీసు అధికారులు బుధవారం నిర్వహించారు. గుర్తుతెలియని వారికి ఏటీఎం పిన్ నంబర్ ఇవ్వడం, తెలియని లింకులు ఓపెన్ చేయడం వల్ల డబ్బులు పోవడం వంటివి జరుగుతున్నాయని ఎస్.డి.పి.ఒ అమితాబ్ పండా అన్నారు. ఆధార్, ఏటీఎం కార్డులు అప్డేట్ చేస్తామని ఫేక్ యాప్, మేసేజ్లు వస్తాయని, ఓ.టీ.పీ చెబితే డబ్బులు అకౌంట్ నుంచి మాయమవుతాయన్నారు. ఇటువంటి సంఘటనలు జరిగితే 1930కు వెంటనే రిపోర్టు చేయాలని, సంబంధిత బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు ఇవ్వాలన్నారు. -
కోడూరుకు అపూర్వ స్వాగతం
పర్లాకిమిడి: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కోడూరు నారాయణరావును పార్టీ అధిష్టానం ఇటీవల నియమించింది. గజపతి జిల్లా గుసాని సమితి లాబణ్యగడ, గారబంద, బాగుసల, కంట్రగడ, ఉప్పలాడ, ఏడోమైలు మీదుగా పర్లాకిమిడికి బుధవారం సాయంత్రం భువనేశ్వర్ నుంచి పలాస చేరుకున్నారు. కారులో దారిపోడుగునా మాజీ ఎమ్మెల్యే కోడూరుకు పూల మాలలు వేసి, బాణసంచా కాలుస్తూ అపూర్వ స్వాగతం లభించింది. పర్లాకిమిడి చేరిన తరువాత కోడూరు నారాయణరావు మార్కెట్ జంక్షన్ వద్ద మహారాజా కృష్ణచంద్ర గజపతి నారాయణ దేవ్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నబకిశోర శోబోరో, జిల్లా సాధారణ కార్యదర్శి ప్రశాంత్, ఉప్పలాడ ఆర్.ఎం.సి.ఎస్ డైరక్టర్ బల్ల ధనుంజయ, కోడూరు జీవన్, కిరణ్ తదితరులు ఉన్నారు. -
సురక్షా పరికరాల పంపిణీ
జయపురం: జయపురం మున్సిపాలిటీ తరఫున పారిశుధ్య పనివారికి వ్యక్తగత రక్షణ, భద్రతకు ఉపయోగ పడే పరికరాలను బుధవారం అందజేశారు. ప్రభుత్వ గరిమ్ పథకంలో భాగంగా స్థానిక టౌన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ నరేంద్రకుమార్ మహంతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మహంతి మట్లాడుతూ.. పట్టణ పరిశుభ్రతకు పారిశుద్ధ్య పనివారు ఎంతో కష్టపడి పని చేస్తున్నారని కొనియాడారు. వారికి రక్షణ, భద్రత కల్పించటం మున్సిపాలిటీ బాధ్యత అన్నారు. మున్సిపాలిటీలో 200 మందికి సురక్షా పరికరాలు అందజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి బాధ్యతలు నిర్వహిస్తున్న జయపురం పబ్ కలెక్టర్ అక్కవరం శొశ్యా రెడ్డి, అదనపు కార్యనిర్వాహక అధికారి పూజ గదబ పాల్గొన్నారు. -
గుణుపూర్లో భారీ అగ్ని ప్రమాదం
● రెడీమేడ్ వస్త్ర దుకాణం దగ్ధం ● లక్షలాది రూపాయల ఆస్తి నష్టంరాయగడ: జిల్లాలోని గుణుపూర్ పాతబస్టాండ్ సమీపంలో ఉన్న అయ్యప్ప రెడీమేడ్ బట్టల షాపులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనలో లక్షలాది రూపాయల విలువచేసే రెడీమేడ్ వస్త్రాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అక్కడి వారు కొందరు అగ్ని ప్రమాదానికి సంబంధించి షాపు యజమానికి, అదేవిధంగా అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. గుణుపూర్, గుమడల అగ్నిమాపక కేంద్రాల సిబ్బంది శకటాలతో సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే షాపు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో మూపో అంతస్తులో నలుగురు వ్యక్తులు చిక్కికుపోవడంతో వారిని అగ్నిమాపక సిబ్బంది కాపాడి కిందకు సురక్షింతంగా దించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. -
● ఇద్దరు అరెస్టు.. 12 తుపాకులు స్వాధీనం
పర్లాకిమిడి: గజపతి జిల్లాలోని మోహనా బ్లాక్ డంబగుడ పంచాయతీ గోలపాజు గ్రామంలో నాటు తుపాకులు తయారు చేస్తున్న కేంద్రంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 12 నాటు తుపాకులు, యంత్రాలు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఎస్పీ జ్యోతింద్ర పండా మోహనా పోలీసుస్టేషన్లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. గోలపాజు గ్రామంలో గణశ్యాం ప్రధాన్, హరిశ్చంద్ర మల్లిక్లు అక్రమంగా నాటు తుపాకులు తయారుచేసి గంజాం, గజపతి, కంధమాల్, బౌధ్ జిల్లాలకు రవాణాచేస్తున్నారని చెప్పారు. పూర్తి వివరాలు సేకరించి నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. విలేకరుల సమావేశంలో సబ్డివిజనల్ పోలీసు అధికారి సురేష్ కుమార్ త్రిపాఠి, మోహనా ఠానా ఐఐసీ బంసత కుమార్ శెఠి, హవిల్దారు ప్రశాంత పలక తదితరులు పాల్గొన్నారు. -
ఆదివాసీల అభివృద్ధే ‘వనవాసీ’ లక్ష్యం
జయపురం: మారుమూల అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీ గిరిజనుల అభివృద్ధే ధ్యేయంగా భారతీయ వనవాసీ కళ్యాణ ఆశ్రమం నెలకొల్పినట్లు వనవాసీ ప్రాంతీయ కో–ఆర్డినేటర్ లక్ష్మీకాంత మిశ్ర వెల్లడించారు. వనవాసీ కళ్యాణ ఆశ్రమం ఒడిశా, రమేష్చంద్ర మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ న్యూఢిల్లీ సహకారంతో బుధవారం జయపురం సమితి కుంద్ర సమితి ఇందుగుడ, బొయిపరిగుడ సమితి నందనమాలా గ్రామాల్లో ఆదివాసీలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ప్రాంతీయ కో ఆర్డినేటర్ రతికాంత సాహు భారతీయ వనవాసీ కార్యకలాపాలను వివరించారు. కార్యక్రమంలో వనవాసీ కళ్యాణ ఆశ్రమం జిల్లా అధ్యక్షుడు బాలాజీ బెహరా, జయపురం పట్టణ అధ్యక్షుడు శశిభూషణ పట్నాయిక్, కొరాపుల్ జల్లా కో–ఆర్డినేటర్ దుర్జోధన బిశాయి, బికాశ చంద్ర చౌధురి, ప్రభుదాన్ పొరజ, ప్రఫుల్ల బిశాయి, ప్రతాప్ పట్నాయిక్, లోకనాథ నాయిక్, సునామణి నాయిక్ తదితరులు పాల్గొన్నారు. -
మాదినకు రైతునేస్తం పురస్కారం
కంచిలి: మండలంలోని పెద్ద శ్రీరాంపురం గ్రామానికి చెందిన డాక్టర్ మాదిన ప్రసాదరావు పద్మశ్రీ ఐవీ సుబ్బారావు రైతు నేస్తం పురస్కారానికి ఎంపికై నట్లు ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రసాదరావు ప్రస్తుతం విశాఖపట్నంలోని పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో కూడా ఇతను పశుసంవర్ధక శాఖలో అందిస్తున్న సేవలకు పలు అవార్డులు లభించాయి. తాజాగా రైతునేస్తం పురస్కారానికి ఎంపికై నట్లు సమాచారం అందినట్లు తెలిపారు. ఈ పురస్కారాన్ని ఈనెల 26వ తేదీన హైదరాబాద్లోని శంషాబాద్ దగ్గరలో ఉన్న స్వర్ణభారత్ ట్రస్ట్లో రైతునేస్తం, ముప్పవరపు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో ప్రదానం చేస్తారని వెల్లడించారు. మాజీ నక్సలైట్ అప్పారావు మృతి పలాస: మండలంలోని బొడ్డపాడు గ్రామానికి చెందిన మాజీ నక్సలైట్, అమరవీరుడు తామాడ గణపతి సహచరుడు బొడ్డు అప్పారావు (80) అనారోగ్యంతో బుధవారం ఉదయం తన స్వగృహంలో మృతి చెందారు. ఉద్దానం ప్రాంతానికి చెందిన వివిధ విప్లవ ప్రజా సంఘాల కన్నీటి వీడ్కోలు మధ్య అంతమ యాత్ర చేపట్టి ఘనంగా అంత్యక్రియలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సంతాప సభలో వక్తలు మాట్లాడుతూ అప్పారావు శ్రీకాకుళం ఉద్యమంలో పాల్గొని, అనేక కష్టాలను ఎదుర్కొని బొడ్డపాడు గ్రామాభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారన్నారు. బొడ్డపాడు హైస్కూల్కు ఉపాధ్యాయులు కావాలని, బీసీ వసతి గృహం కావాలని, ఉద్దానం ప్రాంతానికి మంచినీటి సదుపాయం కావాలని తదితర డిమాండ్లతో 21 రోజుల పాటు అమరణ నిరాహార దీక్ష చేపట్టి వాటిని సాధించి పెట్టిన వ్యక్తి అని కొనియాడారు. గ్రామంలో యువకులను రాజకీయంగా చైతన్యం చేసి గ్రామాన్ని ఐక్యంగా నడిపించిన గొప్ప నాయకుడన్నారు. ఆయన మృతి గ్రామానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వివిధ విప్లవ పార్టీల నాయకులు దాసరి శ్రీరాములు, గొరకల బాలకృష్ణ, తామాడ సన్యాసిరావు, మద్దిల రామారావు, దున్న గోవిందరావు, సాలిన వీరాస్వామి, సర్పంచి తామాడ మదన్, పోతనపల్లి కుసుమ, బత్తిన కృష్ణమూర్తి, పోతనపల్లి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. కొలిక్కి వస్తున్న చోరీ కేసులు శ్రీకాకుళం క్రైమ్: ఇటీవల గార మండలం కళింగపట్నం పోర్టు కేంద్రంగా వరుస ఇళ్లల్లో జరిగిన చోరీకి సంబంధించిన కేసు కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తోంది. కాకినాడకు చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించినట్లు, వారి వద్ద నుంచి కొంత బంగారాన్ని రికవరీ చేసి, మరికొంత రికవరీ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ నిందితులు జిల్లాలోని కళింగపట్నం, దూసి, గార, నందగిరిపేట, మరికొన్ని ప్రాంతాల్లో సైతం చోరీలకు పాల్పడినట్లు సమాచారం. ఒక్కొక్కరూ 10 నుంచి 20కు పైగా కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నట్లు తెలుస్తోంది. విజయవంతం చేయండి శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం జిల్లాలో ఉన్న పీఏసీఎస్ ఉద్యోగులంతా విజయవాడలోని రాష్ట్ర సహకార బ్యాంకు వద్ద ఈనెల 27వ తేదీన నిర్వహించనున్న ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ఏపీ స్టేట్ పీఏసీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గిరిబుచ్చి రంగనాథ్, జిల్లా అధ్యక్షుడు లోలుగు మోహనరావు, ప్రధాన కార్యదర్శి బి.రామారావులు బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ఇప్పటికే సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంత్రులు, కమిషనర్కు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేదన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాలకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లావ్యాప్తంగా ఓపెన్ హౌస్ శ్రీకాకుళం క్రైమ్: అమరవీరుల స్మారకోత్సవాల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా పోలీస్స్టేషన్లలో బుధవారం ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆయుధాలు, ట్రాఫిక్ పరికరాలు, నియమాలు, సైబర్ క్రైమ్పై వివరించారు. రోజువారీ ఉపయోగించే సాంకేతిక పరికరాలు, వైర్లెస్ సెట్ కమ్యూనికేషన్, బాంబ్ డిస్పోజల్ సామాగ్రి, పోలీసు జాగిలాలు, డ్రోన్స్ పనితీరు, బాడీ వార్న్ కెమెరాలు, బ్రీత్ ఎనలైజర్స్, పేలుడు పదార్థాల గుర్తింపు, సిగ్నల్స్, స్పీడ్గన్, గ్యాస్ గన్లను చూపించి వివరించారు. రిసెప్షన్, విశ్రాంతి, కంప్యూటర్, ప్రాపర్టీ, లాకర్ రూమ్లను చూపించి ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ నమోదు, దర్యాప్తు, ఛార్జిషీటు వంటి అంశాలను తెలియజేశారు. -
పేద విద్యార్థులకు అండగా ఉంటాం
రాయగడ: నిరుపేదలైన విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించి వారికి అండగా నిలవాలని తమ సంఘం భవిష్యత్ ప్రణాళికలో రూపొందిస్తున్నామని శిష్ట కరణాల సంఘం అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ పట్నాయక్ అన్నారు. స్థానిక స్వాగత్ హోటల్ సమీపంలోని శ్రీరామలింగేశ్వర మందిరం ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన సంఘం సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రసంగించారు. సంఘం ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ పేద విద్యార్థులకు అండగా నిలవాలన్నది ధ్యేయంగా పనిచేసేందుకు అంతా సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 26వ తేదీన నుంచి విద్యాదానం పేరిట ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా సంఘం వనమహోత్సవాన్ని డిసెంబర్ 24వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల విద్యుత్షాక్తో గాయపడిన సోమేష్ అనే వ్యక్తికి వైద్య ఖర్చుల నిమిత్తం కొంత ఆర్థికసాయాన్ని సంఘం తరఫున అందించారు. సమావేశంలో సంఘం కార్యదర్శి పి.మహేష్ పట్నాయక్, సహాయ కార్యదర్శి సారధి పట్నాయక్, బాలక్రిష్ణ పట్నాయక్, కె.కె.ఎం.పట్నాయక్, కోశాధికారి లక్ష్మీ ప్రసాద్ పట్నాయక్ పాల్గొన్నారు. -
చెస్ పోటీల పోస్టర్ ఆవిష్కరణ
టెక్కలి: ఆలిండియా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 26న టెక్కలిలో నిర్వహించనున్న జిల్లాస్థాయి చెస్ పోటీల పోస్టర్ను ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి ఆధ్వర్యంలో మంగళవారం ఆవిష్కరించారు. స్థానిక ఆల్ఫాజెన్ పాఠశాలలో నిర్వహించనున్న పోటీలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని ఆలిండియా చెస్ ఫెడరేషన్ సభ్యుడు ఎస్.భీమారావు, జిల్లా సభ్యుడు ఐ.అవినాష్ కోరారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద స్పృహ లేకుండా పడివున్న వ్యక్తిని రిమ్స్లో చేర్పించగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు రెండో పట్టణ సీఐ ఈశ్వరరావు తెలిపారు. ఈనెల 19న ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద ఎటువంటి గాయాలు లేకుండా స్పృహ లేకుండా శృంగవరపు సూర్యనారాయణ (55) పడి ఉండటాన్ని చూసిన స్థానికులు రిమ్స్కు తరలించారన్నారు. ఏ గ్రామస్తుడో తెలియనందున తెలిసినవారు స్టేషన్కు సమాచారమివ్వాలని, లేదంటే 63099 90824 నంబర్కు డయల్ చేసి తెలియజేయాలన్నారు. -
అమరవీరుల త్యాగాలను జాతి మరవదు
పర్లాకిమిడి: గజపతి జిల్లా బెత్తగుడ పోలీసు గ్రౌండ్స్లో మంగళవారం పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా ముఖ్యఅథిగా విచ్చేశారు. అమరవీరుల స్థూపం వద్ద రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్ ప్యారెడ్ కమాండెంట్ నిరంజన్నాయక్, రెండో కమాండెంట్ ఖుసిరాం భుయి పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. గజపతి జిల్లాలో విధి నిర్వహణలో వివిధ సంఘటనల్లో అమరవీరులైన జవాన్లకు ఎస్పీ అంజలి ఘటించారు. రాష్ట్ర గవర్నర్, హోంశాఖ మంత్రి పంపిన సందేశాన్ని ఎస్పీ చదివి వినిపించారు. ప్యారెడ్ కమాండెంట్, పోలీసు బెటాలియన్ల గౌరవ వందనాన్ని ఎస్పీ స్వీకరించారు. 2008లో మల్కన్గిరి జిల్లాలో మషైరా వద్ద మావోయిస్టుల ఎదురు కాల్పుల్లో వీరమరణం చెందిన ఇద్దరు జవాన్లు సింహాచల ప్రధాన్, బిశ్వజిత్ జెన్నా కుటుంబ సభ్యులను ఎస్పీ సత్కరించారు. 3వ ఎస్.ఎస్ కమాండెంట్ అశోక్ కుమార్ మహంతి, డీఎస్పీ అమితాబ్ పండా, ఎస్డీపీఓ మాధవానంద నాయక్, 3వ బెటాలియన్ ట్రైనర్ కందర్ప పాత్రో, తదితరులు పాల్గొన్నారు. నబరంగ్పూర్లో.. కొరాపుట్: పోలీస్ అమరుల బలి దానాలు జాతి మరవదని నబరంగ్పూర్ జిల్లా ఎస్పీ మడకర్ సందీప్ సంపత్ ప్రకటించారు. మంగళవారం పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని జానకీనగర్లో గల పోలీస్ రిజర్వ్ గ్రౌండ్స్లో సాయుధ బలగాలను ఉద్దేశించి ప్రసంగించారు. అమరుడైన ప్రతి పోలీసు తన విధి నిర్వహణ కోసం ప్రాణత్యాగం చేయడం జాతి కోసం చేసిన త్యాగమన్నారు. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా 191 మంది పోలీసులు విధి నిర్వహణలో మృతి చెందారని చదివి వినిపించారు. ఒడిశాలో ఇద్దరు పోలీసులు బలి దానాలు చేశారన్నారు. ఒడిశా గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు, ముఖ్యమంత్రి మొహన్ చరణ్ మజ్జిల సందేశాలను చదివి వినిపించారు. జిల్లాకు చెందిన ప్రశాంత్ పాత్రో మావోయిస్టుల కాల్పల్లో మృతి చెందడంతో అతని చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఏఎస్పీ, డీఎస్పీ, ఎస్డీపీఓలు పాల్గొన్నారు. -
షార్ట్ సర్క్యూట్తో విద్యుత్ ప్రమాదం
ఇచ్ఛాపురం: పట్టణంలోని బెల్లుపడ కాలనీలో మంగళవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఫైర్ సిబ్బంది తెలిపిన వివరాల మేరకు.. బెల్లుపడ కాలనీలో నివాసముంటున్న ఆటో డ్రైవర్ సీహెచ్ అనిల్ మేడ పైగదిలో పొగలు రావడం గమనించి స్థానికులు అతనికి తెలియజేశారు. వెంటనే పై గదిలోకి వెళ్లి తలుపు తీసి చూడగా గది మొత్తం మంటలు, పొగ వ్యాపించి ఇంట్లోని గృహోపకరణాలు కాలిపోతున్నాయి. వెంటనే విద్యుత్, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. విద్యుత్ సరఫరాని నిలిపి వేయడంతో స్థానికుల సహకారంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న విద్యుత్, ఫైర్ సిబ్బంది ఇంటిని పరిశీలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయని, సుమారుగా రూ.2 లక్షల ఆస్థి నష్టం జరిగి ఉంటుందని ఫైర్ ఆఫీసర్ ప్రశాంత్కుమార్ తెలిపారు. సమాచారం అందుకున్న వార్డు కౌన్సిలర్ జి.ప్రదీప్ కుటుంబ సభ్యులను పరామర్శించి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. -
పోలీసుల సేవలు చిరస్మరణీయం
● రాయగడ ఎస్పీ స్వాతి ఎస్ కుమార్ రాయగడ: స్థానిక చందిలి పోలీస్ స్టేషన్ సమీపంలోని రిజర్వ్ పోలీస్ మైదానంలో మంగళవారం 66వ పోలీస్ సహీద్ దినోత్సవాన్ని జిల్లా పోలీస్ యంత్రాంగం నిర్వహించింది. ఎస్పీ స్వాతి ఎస్ కుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా సహీద్ స్థూపం వద్ద అమర వీరులకు నివాళులర్పించారు. అనంతరం ఆమె ప్రసంగిస్తూ.. పోలీసు సేవల చిరస్మరణీయమని కొనియాడారు. శాంతి భద్రతలు పరిరిక్షించే విషయంలో అమరులైన ఎంతోమంది పోలీసుల త్యాగం మరువలేనిదని అన్నారు. అనంతరం అమరులైన పోలీస్ కుటుంబాలకు చెందిన వారికి నగదు బహుమతులు అందించి సన్మానించారు. -
మొక్కలతోనే మనుగడ
మల్కన్గిరి: మొక్కలతోనే మానవ, జీవరాశుల మనుగడ సాధ్యమని వక్తలు అన్నారు. మల్కన్గిరి జిల్లా కోరుకొండ సమితి చితాపారి పంచాయతీ విరకిశోరపూర్ గ్రామంలో పర్యావరణవేత్త దీపారాణి నాయక్ పర్యవేక్షణలో యువజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో సంఘ అధ్యక్షుడు జగన్నాథ్ హంతాల్ నేతృత్వంలో వంద మొక్కలను మంగళవారం నాటారు ముఖ్యఅతిథిగా చిత్రకొండ బీఈవో గాయత్రీ దేవి, కండేల్ ఉన్నత ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బసంత్ కుమార్ రాణా ఇతర సిబ్బంది పాల్గొని వివిధ ఔషధ మొక్కలు నాటారు. సందర్భంగా పర్యావేరణవేత్త దీపారాణి మాట్లాడుతూ.. బాణసంచాతో పర్యావరణాన్ని కాలుష్యం చేయటం కంటే మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. -
రూ.50 లక్షల బీమా అందజేత
నరసన్నపేట: భారతీయ స్టేట్ బ్యాంకు ఖాతాదారులకు ప్రమాద బీమా కల్పిస్తున్నామని, దీంట్లో భాగంగా లుకలాంకు చెందిన మాజీ సైనికుడు బొత్స శ్రీరాములు కుటుంబానికి ప్రమాద బీమా రూ.50 లక్షలు మంజూరయ్యిందని బ్యాంకు మేనేజర్ డి.మధుసూదనరావు తెలిపారు. మంగళవారం శ్రీరాములు భార్య సూరీడుకు రూ.50 లక్షల చెక్కు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇటీవల శ్రీరాములు చెట్టుపై నుంచి జారిపడి మృతి చెందారని, ఈయన శాలరీ ఖాతా తమ బ్యాంకులో ఉండడంతో ఆయన కుటుంబానికి ప్రమాద బీమా మంజూరైందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ఎస్బీఐ శాలరీ, ఫెన్షన్ ప్యాకేజీలో అకౌంట్ కలిగి ఉంటే వారికి ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు. కార్యక్రమంలో పూర్వపు బ్యాంకు చీఫ్ మేనేజర్ పి.సురేష్, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలో చేరికలు కంచిలి: మండలంలోని మఠం సరియాపల్లి పంచాయతీ పరిధి రాగుపురం గ్రామానికి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు కూటమి పరిపాలనపై అసంతృప్తి కలగడంతో వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి స్థానిక సర్పంచ్ కొణపల సురేష్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సోమవారం చేరారు. వీరిని ఎంపీపీ పైల దేవదాస్రెడ్డి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్సార్సీపీలో చేరినవారిలో బదకల ధర్మారావు, బుడ్డెపు కాళిదాసు, పిలక పురుషోత్తంలు ఉన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ సభ్యుడు బుడ్డెపు విశ్వనాథం, నేతలు గేదెల మాదాలు, బదకల ఢిల్లీరావు, దుబ్బ ఢిల్లీరావు, బదకల చిన్న దుర్యోధన, పిలక చిన్నయ్య పాల్గొన్నారు. తప్పిన పెను ప్రమాదం వజ్రపుకొత్తూరు రూరల్: మండలంలోని గరుడభద్ర సమీపంలో రాజాం – గరుడభద్ర రోడ్డుపై సోమవారం విద్యుత్ స్తంభం విరిగి నేలకొరిగింది. చినవంక గ్రామానికి చెందిన సాన కృష్ణ, పల్లిసారధి గ్రామానికి చెందిన ఉప్పరపల్లి రామారావు ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఘటనలో వారిద్దరూ చిన్న చిన్న గాయాలతో బయటపడగా, ద్విచక్ర వాహనం నుజ్జుయినట్లు బాధితులు తెలిపారు. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. కాగా ఈ విద్యుత్ స్తంభాన్ని ప్రైవేట్ వ్యక్తులు అనాధికారికంగా ఏర్పాటు చేసినట్లు విద్యుత్ శాఖాధికారులు చెబుతున్నారు. మృతదేహం లభ్యం గార: మండలంలోని మొగదాలపాడు బీచ్లో గల్లంతైన పొందూరు మండలం కింతలి – ఖాజీపేట గ్రామానికి చెందిన అలబాన జగదీష్కుమార్(19) మృతదేహం లభ్యమైందని ఏఎస్ఐ తెలుగు చంద్రమోహన్ తెలిపారు. శనివారం జగదీష్ తన పుట్టిన రోజు సందర్భంగా తోటి స్నేహితులతో బీచ్కు వెళ్లి గల్లంతయ్యాడు. దీంతో మృతదేహాన్ని సోమవారం శ్రీకూర్మం– మత్స్యలేశం తీరంలో మత్స్యకారులు గమనించి సమాచారమందించారు. పోస్టుమార్టం చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. సోంపేటలో అగ్ని ప్రమాదం సోంపేట: పట్టణంలోని చలపతి గోర్జి వీధిలో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో రూ.50 వేలు విలువ కలిగిన వస్తువులు కాలిపోయినట్లు స్థానికులు, అధికారులు తెలియజేశారు. అగ్నిమాపక అధికారులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన బత్తుల రుద్రయ్య అనే వ్యాపారి గోర్జి వీధిలో పెంకుటింటిని అద్దెకు తీసుకుని గృహోపకరణ వస్తువులు విక్రయించడానికి నిల్వ చేసి ఉన్నాడు. సోమవారం రాత్రి దీపావళి సందర్భంగా తారాజువ్వలు ఆ ఇంట్లో పడడంతో గృహోపకరణ వస్తువులు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. -
మల్కన్గిరి సబ్ జైల్లో దీపావళి సంబరాలు
మిఠాయిలు అందజేస్తున్న అధికారులు మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కేంద్రంలోని సబ్ జైల్లో సోమవారం రాత్రి దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జైల్ సూపరింటెండెంట్ దిలీప్ కుమార్ బెహర ఆధ్వర్యంలో 600 మంది ఖైదీలు ఉత్సవంలో పాల్గొన్నారు. ముందుగా లక్ష్మీ పూజను నిర్వహించి ఖైదీలకు స్వీట్లు ,పండ్లు పంపిణి చేశారు . అనంతరం ఖైదీల మధ్య కవితలు పోటీలు, నాటకం వేసి ఉత్సాహ పరిచారు. ఈ సందర్భంగా జల్ సూపరింటెండెంట్ దిలీప్కుమార్ మాట్లాడుతూ.. దీపావళి వెలుగు చీకట్లను పోగొట్టినట్టే ప్రతి వ్యక్తి తన జీవితంలో కొత్త వెలుగులు తీసుకురావాలన్నారు. ఖైదీలు సరికొత్త ఆరంభానికి సన్నద్ధమవ్వాలని ఆకాంక్షించారు. -
భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
● శ్రీకాకుళం ఆర్డీవో సాయి ప్రత్యూష జలుమూరు: కార్తీక మాసంలో శ్రీముఖలింగం స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో బందోబస్తు నిర్వహించాలని శ్రీకాకుళం ఆర్డీవో సాయి ప్రత్యూష అధికారులను ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. నెల రోజుల పాటు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారని, అందువలన ఉచిత ప్రసాదం, తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాట్లపై గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీ విస్తరణ అధికారులు, ఎంపీడీవోలకు పలు సూచనలు చేశారు. అలాగే క్యూలో భక్తులు ఎండలో ఉండకుండా నీడ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా భక్తులు ఈ ఏడాది అధిక సంఖ్యలో రానున్నారని, వీరి ప్రయాణానికి బస్సుల ఏర్పాట్లు చూడాలన్నారు. పారిశుద్ధ్య లోపం లేకుండా చూడడంతో పాటు మెడికల్ క్యాంప్లు ఏర్పాటు చేయాలని తహసీల్దార్ను అదేశించారు. సమావేశంలో ఎంపీడీవో చిన్నమ్మడు, ఈవోపీఆర్డీ ఉమా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా కాళీ పూజలు ప్రారంభం
రాయగడ: స్థానిక బ్లాక్ కాలనీ వద్ద ఫ్రెండ్స్ యూత్ అసొసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి నుంచి కాళీ పూజలు ప్రారంభమయ్యాయి. సమీపంలోని నాగావళి నది నుంచి శుద్ధ జలాలను తీసుకువచ్చి మండపంలో ఉంచడంతో పూజా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సోమవారం ఉదయం మా గురుతార పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పూజా పెండాల్ ఆకట్టుకుంటుంది. అదేవిధంగా మందిరం ప్రాంగణంలో వరహా సహీత లక్ష్మీ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ నెల 31వ తేదీ వరకు పూజలు జరుగుతాయని నిర్వాహకులు తెలియజేశారు. గుణుపూర్లో.. గుణుపూర్లో కూడా దక్షాణ కాళీ పూజలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభమైన దక్షిణ కాళీ పూజలు ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగుతాయి. మంగళవారం ఉదయం సూర్యపూజ, నవగ్రహ, దశమహా విద్య పూజలను నిర్వహించారు. -
సిరిధాన్యాల పంటపై ప్రచార రథం ప్రారంభం
పర్లాకిమిడి: కాశీనగర్ బ్లాక్ కె.సీతాపురం గ్రామంలో మంగళవారం శ్రీఅర్ణఅభియాన్, మరియు ఒడిషా మిల్లెట్ మిషన్ ఆర్థిక సాయంతో సెంటర్ ఫర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ సంస్థ (సిసిడి) రాగులు, జొన్నలు, వలిశెలు, కొర్రలు వంటి సిరిధాన్యాలపై సచేతన రథాన్ని కాశీనగర్ సమితి అధ్యక్షురాలు బల్ల శాయమ్మ జెండా ఊపి ప్రారంభించారు. కాశీనగర్ సమితిలో 11 గ్రామ పంచాయతీలు సిధ్ధ మణుగు, రాణీపేట, ఖరడ, అల్లడ, కిడిగాం, హడ్డుబంగి, పర్తాడ, ఖండవ తదితర గ్రామాల్లో జొన్న, రాగుపంటపై అవగాహన కల్పిస్తారు. ఈ ప్రచార కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, వంశధార కృషి ఉత్పాదక బోర్డు సభ్యులు, సీసీడీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. -
జీడి ఫ్యాక్టరీ దగ్ధం
పర్లాకిమిడి: గజపతి జిల్లా గుసాని బ్లాక్ లావణ్యగడ పంచాయతీ బోడోపద గ్రామం వద్ద జీడి ప్యాక్టరీ దీపావళి రాత్రి ఆకస్మికంగా దగ్ధం కావడంతో ఒక కోటి 70 లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. ఫ్యాక్టరీ సంఘటన స్థలానికి వచ్చి ఫ్యాక్టరీ యజమాని బి.వి.జగన్నాథరావు తలుపులు తెరవడంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం జగన్నాథరావు విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు గారబంద ఐఐసీ ప్రశాంత నిషిక తెలియజేశారు. ఐఐసి నిషిక సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఉదయం 9 గంటల సమయంలో లాబణ్యగడ సమీపంలో శ్రీజగన్నాథ్ కాష్యూ ఇండస్ట్రీస్ దీపావళి పర్వదినం పురస్కరించుకుని కొంచెం వేగంగా ఫ్యాక్టరీ బంద్ చేశారు. అక్కడకు రెండు గంటల తర్వాత ఆయనకు ఫ్యాక్టరీ తగలబడి పొగ వస్తోందని గ్రామస్తులు చెప్పడంతో ఆయన పలాస నుంచి లావణ్యగడ చేరుకుని గారబంద పోలీసు స్టేషన్, పర్లాకిమిడి అగ్నిమాపక దళంకు ఫోన్ చేశారు. సంఘటనా స్థలానికి అగ్నిమాపక దళం వచ్చి మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేశారు. తగలబడిపోతున్న ఫ్యాక్టరీ తలుపులు అకస్మాత్తుగా ఫ్యాక్టరీ యజమాని జగన్నాథ రావు తెరవడంతో ఆయనకు మంటలు అంటుకుని ఒళ్లు కాలిపోయింది. యజమానిని వెంటనే విశాఖపట్నంలో ఒక ప్రైవేటు ఆసుపత్రికి స్థానికులు తరలించారు. అయితే ఫ్యాక్టరీలో జీడి బస్తాలు 1200, జీడితోక్కు బస్తాలు అధికంగా ఉండటంతో మంటలు ఆర్పలేక పోయారు. దాదాపు 15 గంటలు అగ్నిమాపక దళం ఫైర్ ఫైటింగ్ చేసిన ఉదయం పది గంటల వరకూ మంటలను అదుపులోకి తేలేకపోయారు. అగ్నికి ఆహుతైన శ్రీజగన్నాధ జీడి ఇండస్ట్రీకి దాదాపు రూ. కోటి 70 లక్షలు నష్టం వాటిల్లినట్టు జగన్నాథరావు బంధువులు తెలియజేశారు. దీనిపై గారబంద పోలీసు అధికారులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యువతి ఆత్మహత్య
రాయగడ: స్థానిక గాంధీనగర్ నాలుగో లైన్లో ఉంటున్న యువతి సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చే సుకుంది. ఈమెది జిల్లాలోని మునిగుడ పోలీస్ స్టేషన్ పరిధి నియాలి గ్రామానికి చెందిన లిజ పిడికక (20)గా పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పిడికక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. లిజ పిడికక స్థానిక అటానమస్ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతూ.. గాంధీనగర్లో అద్దె ఇంట్లో ఉంటుంది. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఉరివేసుకుని చనిపోగా.. ఆత్మహత్యకు కా రణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. బాలాసోర్లో బాణసంచా దుకాణం దగ్ధం భువనేశ్వర్: బాలాసోర్లోని బాణసంచా దుకాణం దగ్ధమైంది. నిప్పు రవ్వలు తాకి పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్షుల కథనం. పేలుడు సంభవించిన కాసేపట్లో దుకాణం దగ్ధమైంది. ప్రజలు బెంబేలెత్తి పరుగులు తీశారు. బాలాసోర్ అజమాబాద్ కాలేజ్ రోడ్ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. లక్షల రూపాయల విలువైన బాణాసంచా సామగ్రి మంటల్లో బూడిదగా మారింది. స్థానిక అగ్నిమాపక దళం రంగంలోకి దిగి మంటలను నివారించింది. బాణసంచా పేలి స్కూటీ దగ్ధం భువనేశ్వర్: డిక్కీలో బాణసంచా పేలడంతో స్కూటీ దగ్ధం అయింది. ఈ సంఘనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కటక్ నగరం చౌలియాగంజ్ అపర్ణానగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. స్కూటర్ నడుపుతున్న వ్యక్తితో సహా కూర్చున్న వ్యక్తి ఈ పేలుడులో తీవ్రంగా గాయపడ్డారు. వీరివురు కటక్ నగరం మఠ్ సాహికు చెందిన వారుగా గుర్తించారు. స్థానిక ఎస్సీబీ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో చికిత్సం కోసం చేర్పించారు. కారు ప్రమాదంలో బీఎస్ఎఫ్ జవాన్ మృతి మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి మోటు పోలీసుస్టేషన్ పరిధిలో ఆంధ్రా–ఒడిశా సరిహద్దు చింతూరులో మంగళవారం తెల్లవారుజామున జరిగిన కారు ప్రమాదంలో మల్కన్గిరి జిల్లా బలిమెల ప్రాంతంలో ఉన్న బీఎస్ఎఫ్ 142 బెటాలియన్ జవాను మృతి చెందాడు. కారులో ఉన్న మరో ఆరుగురు గాయపడ్డారు. సెలవులకు ఇళ్లకు వెళ్లి తిరిగి విధుల్లో చేరడం కోసం సోమవారం రాత్రి కొందరు జవాన్లు కారులో వస్తుండగా చింతూరు వద్ద కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో ముందు సీట్లో ఉన్న జవాన్ గౌరవ్ పాండే సంఘటన స్థలంలో మృతి చెందగా క్షతగాత్రులను చింతూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
రద్దీ నియంత్రణకు ప్రత్యేక రైళ్లు: జనరల్ మేనేజర్
భువనేశ్వర్: పండగ సీజన్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాల్ని మెరుగపరచడంపై రైల్వే శాఖ ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. అదనపు రైళ్ల నిర్వహణతో రైల్వే ప్రాంగణాలు, రైళ్లలో బాణసంచా రవాణా నివారణ, ఇతరేతర భద్రతా చర్యల నిర్వహణ కోసం వార్ రూమ్ వ్యవస్థని ప్రవేశ పెట్టినట్లు తూర్పు కోస్తా రైల్వే మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ తెలిపారు. రాత్రింబవళ్లు ఈ వ్యవస్థ పనిచేస్తుంది. జోనల్, మండల స్థాయిలో అధికారులు ప్రత్యక్షంగా దీని కార్యాచరణ పర్యవేక్షిస్తున్నారు. ఇబ్బంది లేని ప్రయాణాన్ని సులభతరం చేయడానికి రైల్వే శాఖ దేశ వ్యాప్తంగా 12,000 పైబడి ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. వీటిలో తూర్పు కోస్తా రైల్వే 367 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఖుర్దారోడ్, వాల్తేరు, సంబల్పూర్ మండలాల్లో 900 పైబడి సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి రాత్రింబవళ్లు ప్రయాణికుల సౌకర్యాలపై నిఘా కొనసాగిస్తున్నట్లు జనరల్ మేనేజరు వివరించారు. ఖుర్దారోడ్ రైల్వే మండలంలో ఈ ఏర్పాట్లుని స్థానిక అదనపు మండల రైల్వే అధికారి పి. కె. బెహరా వివరించారు. స్థానిక మండల రైల్వే కార్యాలయంలో మంగళ వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
గాలి గరళం
● దివ్వెల పండగతో కాలుష్యం ● జంట నగరాల్లో దిగజారిన వాయు నాణ్యతభువనేశ్వర్: దీపావళి వేడుకలు పలు చోట్ల వాతావరణ కాలుష్యాన్ని ప్రేరేపించగా మరి కొన్ని చోట్ల చిరు ప్రమాదాలు సంభవించాయి. ప్రధానంగా భువనేశ్వర్, కటక్ జంట నగరాల్లో కాలుష్య స్థాయిలను పెంచాయి. దీపావళి రాత్రి జంట నగరాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. జంట నగరాల్లో దీపావళి వేడుకల సందర్భంగా కాలుష్య నియంత్రణ మార్గదర్శకాలను విస్మరించారు. ఈ వైపరీత్యం దృష్ట్యా అనుబంధ యంత్రాంగాలు ముందస్తుగా బాణసంచా కాల్చడంపై జారీ చేసిన ఆంక్షల్ని గాలికి వదిలేయడంతో వాయు కాలుష్యం అనివార్యమైంది. రాత్రి 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పటాకులు పేల్చడానికి జంట నగరాల కమిషనరేట్ పోలీసులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ అర్ధరాత్రి దాటినా కూడా బాణసంచా కాల్చడం నిరవధికంగా కొనసాగించారు. పోలీసు యంత్రాంగం జారీ చేసిన ఉత్తర్వులు వాస్తవ కార్యాచరణకు నోచుకోలేదు. ఆంక్షల అమలు పట్ల అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైందనే విమర్శలు వ్యాపించాయి. అపరిమిత బాణసంచా కాల్చడంతో కాలుష్యం పెరిగి గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) దిగ జారింది. రాజధాని భువనేశ్వర్లో వివిధ ప్రాంతాలలో గాలి కలుషితమైంది. నగరంలో సమగ్రంగా ఏక్యూఐ 180కి పడిపోయింది. స్థానిక లక్ష్మీసాగర్ ప్రాంతంలో 185 ఏక్యూఐ, బాపూజీ నగర్ ప్రాంతంలో ఏక్యూఐ 174గా నమోదైంది. సాధారణంగా 100 కంటే అధిక ఏక్యూఐ ప్రమాదకరంగా పరిగణిస్తారని నిపుణుల సమాచారం. వాతావరణంలో దుమ్ము కణాలు పెరిగితే శ్వాసకోశ సమస్యలు మరియు చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఈ వర్గం సమాచారం. ఈ ఏడాది దీపావళి వేడుకలు పలు చోట్ల విషాదంగా పరిణమించాయి. కటక్ నగరంలో 100 మందికి పైగా గాయపడ్డారు. వారిలో 40 మంది చికిత్స కోసం కటక్ ఎస్సీబీ వైద్య బోధన ఆస్పత్రి అత్యవసర, ట్రామా కేర్ విభాగాల్లో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ పరిస్థితిపై నగర వేయరు ఆందోళన వ్యక్తం చేశారు. ఆంక్షలను అధిగమించి భారీ పేలుడు పటాకులు పేల్చడంతో శబ్ద కాలుష్యం సంభవించిందన్నారు. భువనేశ్వర్లో పలు చోట్ల దీపావళి రోజున బాణసంచా పేలుళ్లలో గాయపడిన వారు స్థానిక క్యాపిటల్ ఆస్పత్రిలో చేరారు. ఇక్కడ 62 మంది బాణాసంచా పేలుడు బాధితులు చికిత్స పొందుతున్నట్లు ఆస్పత్రి వర్గాల విశ్వసనీయ సమాచారం. కటక్ నగరం పిఠాపూర్ ప్రాంతంలో బాణసంచా పేలుళ్ల సమయంలో మంటలు చెలరేగాయి. ఈ సంఘటనలో ఒక కారు దగ్ధం అయింది. క్షీణించిన దృశ్య మాన్యత అపరిమిత బాణాసంచా కాల్చడంతో గాలి నాణ్యత బాగా క్షీణించింది. దృశ్యమాన్యత దిగజారింది. భువనేశ్వర్లో చాలా చోట్ల దృశ్య మాన్యత 200 మీటర్ల కంటే తక్కువగా, కటక్లో కేవలం 50 మీటర్ల కంటే తక్కువగా పడిపోయింది. దీని వల్ల వాహనదారులు మరియు పాదచారులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. గత ఏడాది కంటె ఈ ఏడాది గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) గణనీయంగా దిగజారిందని పర్యావరణ నిపుణుల సమాచారం. -
‘తేనెటీగల దాడిపై దర్యాప్తు చేయండి’
కొరాపుట్: ఆర్ఎస్ఎస్ కవాతుపై తేనె టీగలు దాడి చేయడంపై దర్యాప్తు చేయాలని హిందూ పరివార్ సంస్థలు డిమాండ్ చేశాయి. మంగళవారం సాయంత్రం నబరంగ్పూర్ జిల్లా కేంద్ర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 19వ తేదిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు సందర్భంగా కార్యకర్తలు నబరంగ్పూర్ జిల్లా కేంద్ర మెయిన్ రోడ్డులో భారీ కవాతు జరిపారు. ఈ కవాతు చమిరియా గుడ నుంచి మజ్జి గూడ వరకు కొనసాగింది. కానీ మార్గ మధ్యంలో డీఆర్డీఏ కార్యాలయం వద్ద ఒక్కసారిగా వందలాది తేనెటీగలు కవాతుపై దాడి చేశాయి. దాంతో సుమారు 40 మంది కార్యకర్తలు గాయాలపాలై ఆస్పత్రిలో చేరారు. ఈ ఘటన అనుమానాస్పదంగా ఉందని హిందూ సంస్థల నాయకులు ఆరోపించారు. దీని వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఫిర్యాదు చేసిన వారిలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర కోశాధికారి సుశీల్ జైన్, జిల్లా ప్రచార ప్రముఖ్ విక్రం జైన్, హిందూ ఏక్తా వాహిని జిల్లా అధ్యక్షుడు గౌరీ శంకర్ సాహు, బీజేపీకి చెందిన దొయితరి మజ్జి, అడ్వకేట్ ప్రశాంత్ పట్నయక్,సంతోష్ తదితరులు ఉన్నారు. -
చిలికా సరస్సులో చిక్కుకున్న పడవ
భువనేశ్వర్: యాంత్రిక లోపం కారణంగా పడవ చిలికా సరసులో మధ్యలో చిక్కుకుంది. ఈ పడవలో 40 మంది ప్రయాణికులతో పాటు 15 వాహనాలు ఉన్నాయి. జొహ్నికుదొ నుంచి సతొపొడా తీరానికి వెళుతుండగా మంహిషాకుద్దొ సమీపంలో గంటసేపు పడవ అకస్మాత్తుగా స్తంభించి పోయింది. నిస్సహాయ స్థితిలో ప్రయాణికులు బిక్కుబిక్కుమని గడిపారు. మార్గమధ్యంలో ఇంజిన్ అకస్మాత్తుగా ఆగిపోయింది. పునరుద్ధరణకు సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించక పోవడంతో ఈ పరిస్థితి తాండవించిందని ప్రత్యక్ష సాక్షుల కథనం. అదృష్టవశాత్తు ఈ సంఘటనలో ప్రాణ హాని ఇతరేతర నష్టం సంభవించ లేదు. సహాయక బృందం ఘటనా స్థలానికి చేరి పడవలో చిక్కుకున్న వ్యక్తులతో సహా వాహనాల్ని సురక్షితంగా గమ్యం చేర్చింది. ఈ సంఘటనపై సర్వత్రా విచారం వ్యక్తం అవుతోంది. చిలికా సరసులో పడవ సేవల నిర్వహణ, భద్రతా ప్రమాణాలపై ఆందోళనలను రేకెత్తించింది. -
సంస్కారవంతమైన సమాజమే ధ్యేయం కావాలి
● సాహితీ సభలో వక్తలుజయపురం: కుసంస్కారాన్ని రూపుమాపి సంస్కారవంతమైన సమాజ నిర్మాణమే ప్రధాన లక్ష్యం కావాలని అందుకు సాహిత్యం బీజం వేయాలని ప్రముఖ ఒడియా దినపత్రిక ప్రమయ జయపురం ఎడిషన్ బ్యూరో, డీజీఎం ప్రకాశ చంద్రదాస్ అన్నారు. ప్రముఖ సాహితీ వేత్తలు హరిహర కరసుధా పట్నాయక్, జానకీ పాణిగ్రహిలు దీపావళి సందర్భంగా సంయుక్తంగా స్థానిక సాహితీ భవనం ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన సాహితీ సభలో ప్రకాశ చంద్ర దాస్ ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ధనం, భోగం, విలాసాలే కుసంస్కారానికి మూల కారణాలు అన్నారు. వాటితోనే నేడు సమాజం నడుస్తుండడంతో శాంతి, సంస్కారం, క్రమశిక్షణ, సౌమరశ్యతలకు మనిషి దూరమవుతున్నాడని అన్నారు. బుద్ధుడు, అశోకుడు, మహాత్మాగాంధీ చూపిన నీతి, ఆదర్శం, అహింసలను మనిషి మరిచిపోయి అక్రమ మార్గాలలో వేగంగా ఫలితాలు పొందాలని భావిస్తున్నారని అన్నారు. ఇలాంటి సంస్కృతిని విడనాడాలన్నారు. మన అందమైన భవిత మన చేతుల్లోనే ఉందన్నారు. ప్రతిఒక్కరూ మన భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని తెలుసుకొని లాభం, మోహం, ఈర్ష్య, ద్వేషం, హింస, అహంకారం విడనాడాలని పిలుపు నిచ్చారు. ఈ దుర్గుణాల నుంచి ప్రజలను దూరం చేసే శక్తి సాహిత్యానికి ఉందన్నారు. సంస్కారవంతమైన సమాజ నిర్మాణానికి మంచి సాహిత్యం అందించాలన్నారు. సాహిత్యకులు, ఉపాధ్యాయుడు డాక్టర్ జుగల్ కిశోర్ మిశ్ర, అధ్యాపకులు డాక్టర్ మనోరంజన్ ప్రధాన్ మాట్లాడుతూ.. సంస్కారాన్ని ఎలా నిరోధించాలి, ఆరోగ్యకరమైన, ఆదర్శ సమాజాన్ని ఎలా నిర్మించాలో వివరించారు. జిన్ను పండ, కాంచన సాహు, ప్రజాపిత బ్రహ్మ కుమారి సంస్థ బీర కిశోర్ హత్త, నిరంజన్ పాణిగ్రహి, మీణతి దాస్, సబిత శతపతిలు సమాజ నిర్మాణంలో సాహిత్యం పాత్రను వివరించారు. కార్యక్రమంలో సినీ నటులు ప్రకాశ మహంతి, డాక్టర్ శుదాంశు శేఖర పట్నాయక్, సురేష్ హత్త, న్యాయవాది మదన మోహననాయిక్, శౌభాగిణి నందో, భారతీ మిశ్ర, ఉమారాణి దాస్, నందినీ పట్నాయక్, మీణ కేతన దాస్, కనకలత రథ్, ప్రమోద్ కుమార్ రౌళో, భారతీ మిశ్ర, అశోక్ కుమార్ పొలాయి, సుక్తా సాయి పాల్గొన్నారు. -
సంప్రదాయ పోటీలు ప్రారంభం
జయపురం: ప్రాచీన సంప్రదాయ సంస్కృతి, కళలు, నృత్య సంగీతాల పరిరక్షణ కోసం నెలకొల్పిన జయపురం తరుణ ప్రజ్ఞా భారతి–2025 వార్షికోత్సవాల పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. స్థానిక ఎన్కేటీ రోడ్డు నారాయణి ఆంగ్ల పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో యోగ గురువులు జానకీ పాణిగ్రహి, కృష్ణారావు దొరలు ఉత్కళ ఆరాధ్య దైవం శ్రీజగన్నాథునికి దీప ప్రజ్వలన చేసి ప్రారంభోత్సవం చేశారు. సూర్య నమస్కారాలతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలోయోగాసనాలు, శంఖనాథం, హుళి హుళి శబ్ధాలు, భారతీయ సంస్కృతిపై వక్తృత్వ, గీత శ్లోకాల పఠనం పోటీలు నిర్వహించారు. జయపురం తరుణ ప్రజ్ఞాభారతి అధ్యక్షుడు తపన కుమార్ త్రిపాఠీ మాట్లాడుతూ మన ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలు కళలు క్రీడలు పరిరక్షణ కోసం డాక్టర్ గంగాధర నందో తరుణ ప్రజ్ఞా భారతిని స్థాపించారని, ఆయన ఆశయాల మేరకు ఏటా సంప్రదాయాలపై పోటీలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో ప్రజ్ఞా భారతి ఉపాధ్యక్షులు రామశంకర షొడంగి, కార్యదర్శి అజయ కుమార్ మల్లిక్, సహాయ కార్యదర్శి సువర్ణ ఖిళో, కోశాధికారి రవీంద్ర మహరాణలతో పాటు సబిత త్రిపాఠఋ, తపశ్విణీ కుమారీ సాహు, లిపికా దొలాయి, రీతాంజళి డాకువ, జి. మహేష్, జగన్నాఽథ్ పాణిగ్రహిల సహకారంతో నిర్వహించిన పోటీల్లో న్యాయ నిర్ణేతగా మనోజ్ మిశ్ర, క్షీరోద్ సాహు, మృత్యంజయ సాహు, సంజుక్త రౌత్ పాల్గొన్నారు. -
471 పంచాయతీ కార్యాలయాలకు శంకుస్థాపన
భువనేశ్వర్: గ్రామీణ ప్రాంతాల్లో సుపరిపాలన మెరుగుదల కోసం ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆదివారం లోక్ సేవా భవన్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 471 గ్రామ పంచాయతీ కార్యాలయాలకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అంత్యోదయ గృహ యోజన మొదటి విడతను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి అంత్యోదయ గృహ యోజన కింద 48,693 మంది లబ్ధిదారులకు మొదటి విడతగా ఒక్కొక్కరికి రూ. 40,000 చొప్పున పంపిణీ చేశారు. గ్రామీణ ఒడిశాలోని నిరుపేద కుటుంబాలకు పక్కా ఇల్లు అందించడం ఈ పథకం లక్ష్యంగా పేర్కొన్నారు. నువాపడా, కలహండి మినహా అన్ని జిల్లాల్లో 471 గ్రామ పంచాయతీ కార్యాలయాలకు శంకుస్థాపనలు జరిగాయి. ప్రతి కార్యాలయం రూ.35 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తారు. కేంద్రం, రాష్ట్రం సంయుక్త నిధులతో ఈ భవనాలు నిర్మించి వన్–స్టాప్ సేవా కేంద్రాలుగా పనిచేయిస్తారు. సర్పంచ్, పంచాయతీ కార్యనిర్వహణ అధికారి, జూనియర్ ఇంజనీర్, గ్రామ రోజ్గార్ సేవక్, అకౌంటెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోసం ఈ సముదాయంలో ప్రత్యేక గదులను కలిగి ఉంటాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ప్రజా సేవల పంపిణీ, పాలనను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతను ఈ చొరవ ప్రతిబింబిస్తుందన్నారు. ఈ ఏడాది మార్చి 30న ప్రారంభించబడిన అంత్యోదయ గృహ యోజన 2027–28 నాటికి పేదల కోసం 5 లక్షల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పేర్కొన్నారు. దీని కోసం బడ్జెట్లో రూ.7,550 కోట్లు కేటాయించారు. ఈ పథకంలో భాగంగా ప్రతి లబ్ధిదారునికి 3 విడతలుగా సమగ్రంగా రూ. 1.20 లక్షలు అందజేస్తారు. తొలి విడతలో రూ. 40,000, రెండవ విడతలో రూ. 65,000 చివరగా మూడవ విడతలో రూ.15,000. నాలుగు నెలల్లోపు ఇంటి నిర్మాణం పూర్తి చేసిన లబ్ధిదారులకు రూ. 20,000, 6 నెలల్లోపు పూర్తి చేసిన వారికి రూ. 10,000 చొప్పున ప్రోత్సాహకం లభిస్తుంది. ప్రస్తుతం 28 జిల్లాల్లో 48 వేల 693 మంది లబ్ధిదారులు తొలి విడత నిధులు అందుకున్నారు. వారందరికి సమగ్రంగా రూ. 1,947.72 కోట్లు పంపిణీ చేశారు. అన్ని ఇళ్లలో మరుగుదొడ్లు, పైపుల ద్వారా నీటి సరఫరా వంటి అవసరమైన సౌకర్యాలు ఉంటాయి. ఈ పథకంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వేతన ఉపాధికి సంబంధించిన నిబంధనలు ఇమిడి ఉన్నాయి. ప్రతి పేద మరియు నిస్సహాయ కుటుంబానికి సురక్షితమైన, శాశ్వత ఆశ్రయం కల్పించడం లక్ష్యం. తద్వారా వారు గౌరవంగా జీవించగలుగుతారని ముఖ్యమంత్రి వివిధ పంచాయతీల లబ్ధిదారులు, సర్పంచ్లకు ఉద్దేశించి వర్చువల్గా సంభాషించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్, తాగు నీటి విభాగం మంత్రి రబీ నారాయణ్ నాయక్ ప్రసంగిస్తూ గ్రామ పంచాయతీ భవనాలు గ్రామీణ పాలనకు కీలకం అని అభివర్ణించారు. పౌరుల అంచనాలకు అనుగుణంగా అట్టడుగు స్థాయిలో సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేసేందుకు విశేషంగా కృషి చేస్తున్నారు. ఈ భవనాలు ప్రజా సేవ మరియు గ్రామీణాభివృద్ధిలో ఒక కొత్త మైలురాయిగా మారతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా, పంచాయతీ రాజ్, తాగునీటి శాఖ డైరెక్టర్ వినీత్ భరద్వాజ్, పంచాయితీ రాజ్ కమిషనర్ కమ్ సెక్రటరీ గిరీష్ ఎస్.ఎన్. స్పెషల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వంయి, 28 జిల్లాల నుంచి జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
ఆర్పీఎఫ్ ఆపరేషన్ సేవ
రాయగడ: స్థానిక రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ సిబ్బంది ఆపరేషన్ సేవలో భాగంగా గర్భిణి ప్రయాణికురాలికి సకాలంలో ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించి తమ ఔదర్యాన్ని చాటుకున్నారు. వివరాల్లొకి వెళితే... శనివారం కొరాపుట్ నుంచి భువనేశ్వర్ హిరాఖండ్ ఎక్స్ప్రెస్లో గర్భిణి నేహానాగ్ తన భర్తతో కలిసి కొరాపుట్ నుంచి బయలు దేరారు. హిరాఖండ్ ఎక్స్ప్రెస్లోని ఏ–1 కోచ్లొ బెర్త్ నంబర్ 49లో ప్రయాణిస్తున్న ఆమెకు ప్రసవ నొప్పులు రావడంతో వాట్సాప్ మెసేజ్ ద్వారా ఆమె భర్త తహీర్ అహ్మద్ రైల్వే ఆపరేషన్ సేవకు సమాచారం అందించారు. దీనిపై స్పందించిన రైల్వే (విశాఖపట్నం) అధికారులు రాయగడ రైల్వే ఆర్పీఎఫ్ సిబ్బందికి తెలియజేశారు. రాయగడకు శనివారం రాత్రి 11.20 గంటలకు ఒకటో ప్లాట్ఫాంకు చేరుకుంది. అప్పటికే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి ఏడీఎం డాక్టర్ ఎల్.ఎన్.స్వయి, వైద్య సిబ్బందితో వద్ద వేచిఉన్న ఆర్పీఎఫ్ సిబ్బంది గర్భిణిని ట్రైన్ నుంచి కిందకు దింపారు. అనంతరం వైద్య సిబ్బంది పరీక్షించిన వెంటనే ఆమెను ఆస్పత్రికి చేర్పించాలని సూచించడంతో అంబులెన్స్ సహాయంతోకు తరలించారు. -
మహిళా డిగ్రీ కళాశాలలో పోషణ వారోత్సవాలు
పర్లాకిమిడి: స్థానిక మహిళా డిగ్రీ కళాశాలలో పోషణ వారోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో కళాశాల విశ్రాంత అధ్యక్షులు డాక్టర్ భారతీ పాణిగ్రాహి ముఖ్యఅతిథిగా మాట్లాడారు. గ్రామాల్లో నివసిస్తున్న కిశోర బాలికలు, గర్భిణులు పోషక విలువలు గల ఆహారం తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం పోషక ఆహారం అందిస్తున్నట్టు వివరించారు. కార్యక్రమంలో మహిళా కళాశాల అధ్యాపకులు డాక్టర్ కళ్యాణీ మిశ్రా పాల్గొన్నారు.జోరుగా అభివృద్ధి పనులు పర్లాకిమిడి: పట్టణంలోని రెండవ వార్డు శంకర్బాస్ చెరువు వద్ద పురపాలక సంఘం ఆధ్వర్యంలో పెద్ద కల్వర్టు పనులు చురుగ్గా సాగుతున్నాయి. సుమారు రూ.7 కోట్లతో శంకర్బాస్ చెరువు, కాలవ గట్టు, డ్రైనేజీ కల్వర్టులు నిర్మిస్తున్నారు. దీంతో బస్టాండ్కు వెళ్లే వాహనాలను దారిమళ్లిస్తున్నారు. మరో పది రోజుల్లో కల్వర్టు పనులు పూర్తవుతాయని బరంపురం కంట్రాక్టరు తెలియజేశారు.నాటు బాంబులు స్వాధీనం భువనేశ్వర్: పూరీ పట్టణ ప్రాంతంలో అక్రమ బాణాల తయారీ స్థావరంపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆరు బస్తాల్లో నాటు బాంబులను స్వాధీనపరచుకున్నారు. ఈ ప్రాంగణంలో మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలపై ఒకరిని అరెస్టు. సదర్ పోలీసులు పూరీ నరహరిపూర్లోని శ్రీకాంత్ మిశ్రా ఇంటిలో ఈ బాంబుల తయారీ కొనసాగుతున్నట్లు నిర్ధారించి అతన్ని అరెస్టు చేసినట్లు పూరీ సదరు ఠాణా పోలీసులు తెలిపారు.రైల్వే స్టేషన్లో గంజాయి పట్టివేతజయపురం: జయపురం రైల్వే స్టేషన్లో జయపురం అబ్కారీ విభాగ సిబ్బంది ముగ్గురు వ్యక్తులను సోదా చేసి వారి బ్యాగ్లో ఆరు కిలోల గంజాయి పట్టుకున్నట్లు జయపురం అబ్కారీ విభాగ అధికారి శశికాంత దత్ వెల్లడించారు. అరెస్టయిన వారు కొట్పాడ్ సమితి కలియపొదర్ గ్రామం దీనబందు పెంటియ(25), కయగుడ ధవుడపల్లి మోచిరాం కుంభార్(25)రామనాథ్ కుంభార్(31)లు అని వెల్లడించారు. వారి నుంచి స్వాధీన పరచుకున్న గంజాయి విలువ రూ.60 వేలు ఉంటుందని అంచనా. ఆయన వివరణ ప్రకారం ఆదివారం ఉదయం అబ్కారీ అధికారి శశికాంత దత్, ఓఐసీ సుభ్రత్ కేశరి హిరన్, ఏఏస్ఐ బలరాం దాస్ అబ్కారి సిబ్బందితో పెట్రోలింగ్ జరుపుతున్నారు. ఆ సమయంలో రైల్వే ప్లాట్ ఫారంపై ముగ్గురు వ్యక్తులు నించుని ఉన్నారు. సామలేశ్వరీ ఎక్స్ప్రెస్ రైలు కోసం వారు వేచి చూస్తున్నారు. వారిపై అనుమానం వచ్చి అబ్కారీ సిబ్బంది బ్యాగ్లను తనిఖీచేయగా వాటిలో గంజాయి బయట పడింది. వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రాంతంలో గంజాయి కొని ఇతర ప్రాంతాల్లో అమ్మేందుకు తీసుకు వెళ్తున్నట్లు అబకారి అధికారి వెల్లడించారు. -
సమైక్య ఒడిశా నిర్మిద్దాం
● గవర్నర్ పిలుపుభువనేశ్వర్: ఉత్కళ కేసరి డాక్టర్ హరేకృష్ణ మహతాబ్ ఆదర్శాలు, దార్శనికతను ప్రతిబింబించే సుసంపన్న, శక్తివంతమైన, స్వావలంబనతో కూడిన సమైక్యమై ఒడిశాను నిర్మించడానికి కలిసి పనిచేయాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి కోరారు. కటక్ నగరంలో సరళ భవన్లో జరిగిన డాక్టర్ హరేకృష్ణ మహతాబ్ 125వ జయంతి వేడుకల్లో గవర్నర్ మాట్లాడుతూ గొప్ప నాయకుల జీవితం కేవలం గుర్తుంచుకోవాల్సిన కథ మాత్రమే కాదు అనుసరించాల్సిన సందేశం అని అన్నారు. ఆయన ప్రయాణంలోని ప్రతి అధ్యాయం మనకు దృఢ సంకల్పం, ధైర్యం, దార్శనికతతో జీవించడానికి స్ఫూర్తినిస్తుందన్నారు. డాక్టర్ మహతాబ్ జమిందారు కుటుంబంలో జన్మించినప్పటికీ, త్యాగం, ప్రజా సేవతో కూడిన జీవితాన్ని ఎంచుకున్నారని డాక్టర్ కంభంపాటి పేర్కొన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో చేరడం ద్వారా, నిజమైన నాయకత్వం అంటే వ్యక్తిగత సుఖం కంటే సామూహిక సంక్షేమం పరిరక్షణ శక్తివంతమైనదనే సందేశం ఆదర్శప్రాయంగా పేర్కొన్నారు. వికసిత్ ఒడిశా కోసం, పరివర్తనాత్మక మార్పు కోసం పనిచేయడానికి మార్గనిర్దేశం చేయాలి అని ఆయన అన్నారు. ఆధునిక ఒడిశాను రూపొందించడంలో డాక్టర్ మహతాబ్ దార్శనిక పాత్రను హైలైట్ చేస్తూ, భువనేశ్వర్ను రాష్ట్ర కొత్త రాజధానిగా స్థాపించడం, హిరాకుడ్ ఆనకట్టను నిర్మించడం, పరిశ్రమలు మరియు విద్యా సంస్థలను ప్రోత్సహించడంలో ఆయన చేసిన చొరవలను డాక్టర్ కంభంపాటి గుర్తుచేశారు. ‘ఇవి కేవలం పాలనా చర్యలు మాత్రమే కాదు, స్వావలంబన మరియు సాధికారత కలిగిన ఒడిశాను నిర్మించడంలో మైలురాళ్లు’ అని ఆయన అన్నారు. రచయిత, సంపాదకుడు, సామాజిక సంస్కర్తగా ప్రజాతంత్ర, ఝంకార్ ద్వారా ప్రజా చైతన్యాన్ని మేల్కొల్పిన డాక్టర్ మహతాబ్ సహకారాన్ని కూడా గవర్నర్ ప్రశంసించారు. ‘ఒడిశా ఆత్మ దాని భాష, సంస్కృతి వారసత్వంలో ఉంటుందని ఆయన విశ్వసించారు‘ అని డాక్టర్ కంభంపాటి అన్నారు. సరళ సాహిత్య సంసద్ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు గవర్నర్ ప్రశంసిస్తూ, ఒడిశాకు ఉజ్వల భవిష్యత్ను రూపొందించడానికి ధైర్యం, సమగ్రత, దూరదృష్టితో డాక్టర్ మహతాబ్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరినీ కోరారు. కటక్ ఎంపీ భర్తహరి మహతాబ్, ప్రొఫెసర్ ఖారవేళ మహంతి, సరళ సాహిత్య సంసద్ అధ్యక్షుడు ప్రభాకర్ స్వంయి, మాజీ ప్రధాన కార్యదర్శి, రచయిత సహదేవ సాహు, ప్రొఫెసర్ నిరంజన్ త్రిపాఠి, సరళ సాహిత్య సంసద్ కార్యదర్శి మాట్లాడారు. -
సెల్ఫీ సరదా..
● జలపాతంలో జారిపడిన యువకుడు రాయగడ: సెల్ఫీ తీసుకుంటుండగా ఓ యువకుడు అదుపుతప్పి జలపాతంలో జారిపడి తీవ్రగాయాలకు గురయ్యాడు. సదరు సమితి దుర్గాపాడు జల పాతం వద్ద ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. గాయాలకు గురైన వ్యక్తిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం తోటి స్నేహితులు తరలించారు. వివరాల్లోకి వెళితే.. సమితి పరిధిలోని జమిడిపేట సమీపంలో ఉన్న దుర్గాపాడు గ్రామం వద్ద జలపాతం సందర్శించేందుకు కొంతమంది పర్యాటకులు వెళ్లారు. ఈ క్రమంలో ఎత్తయిన రాళ్ల మధ్య నిలబడి సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి కిందపడిన ఆ యువకుడు తీవ్రగాయాలకు గురయ్యాడు. అయితే యువకుని వివరాలు తెలియాల్సి ఉంది. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తిగా సమాచారం. దుర్గాపాడు జలపాతం వద్ద ఇటువంటి అందమైన ప్రదేశాలు ఉండటంతో పాటు ఫొటోలకు అనుకూలంగా జలపాతాలు, సుందర దృశ్యాలు ఉండటంతో ముచ్చటపడి అక్కడకు వెళ్లిన పర్యాటకులు ప్రమాదాలకు తరచూ గురువుతున్నారు. జిల్లా యంత్రాంగం ఈ నేపథ్యంలో చర్యలు తీసుకుని ఆ ప్రాంతంలో ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పర్యాటకులు అంటున్నారు. -
నేటి నుంచి కాళీ పూజలు ప్రారంభం
రాయగడ: స్థానిక బ్లాక్ కాలనీ సమీపంలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలొ కాళీ పూజలు సొమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 42 సంవత్సరాలుగా ఈ పూజలను నిర్వహిస్తుండటం విశేషం. ఈ నెల 31వ తేదీ వరకు పూజలు కొనసాగుతాయని నిర్వాహకులు ఆదివారం తెలిపారు. 11 రోజులు జరిగే కాళీపూజల్లో భాగంగా సోమవారం సాయంత్రం ఆహ్వాన, సూర్యపూజ, మండపం శుద్ధి, సంధ్యా దేవి స్వాగతం, కళశ ప్రదర్శన, ద్వారపాల, ప్రాణప్రతిష్ట తదితర పూజలను నిర్వహిస్తారు. అలాగే ఈ నెల 21 నుంచి 31వ తేదీ వరకు మా గురుతార, త్రిపుర సుందరి, భువనేశ్వరి, త్రిపుర భైరవి, చిన్నమస్త, ధూమావతి, బగలాముఖి, మాతాంగిణి, కమలాత్మిక, బాల్యకుమార్, పూర్ణాహుతి పూజలు ఉంటాయని అసోసియేషన్ కార్యదర్శి శివకుమార్ పట్నాయక్ చెప్పారు. ఉత్సవాల్లో భాగంగా ఈ ఏడాది 200 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 50 వేల మంది రోజూ అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. రోజూ రాత్రి వేళ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. -
నియమగిరిలో మావోల కోసం పోస్టర్లు
రాయగడ: నియమగిరి పర్వత ప్రాంతాల్లో మావోయిస్టుల బెడద నుంచి ప్రజల్ని విముక్తి కలిగించడంతో ఆ ప్రాంతంలో శాంతి నెలకొల్పేందుకు ఒడిశా పోలీసులు మరో అడుగు ముందుకు వేశారు. జిల్లాలోని కల్యాణ సింగుపూర్ సమితి పరిధిలో గల నియమగిరి పర్వత ప్రాంతాల్లో అదేవిధంగా మునిగుడ, చంద్రపూర్ సమితుల్లో గల వివిధ ప్రాంతాల్లో మావోయిస్టులను పట్టుకోండి.. అందుకు తగ్గ బహుమతులను పొందండి అన్న నినాదాలతో పోస్టర్లు అతికించారు. కళ్యాణసింగుపూర్ సమితి పర్శాలి పంచాయతీ కార్యాలయం, అదేవిధంగా సమితి కార్యాలయాల్లో ఈ తరహా పోస్టర్లు దర్శనం ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్టర్లలో మావో కేంద్ర కమిటీకి చెందిన గణేష్ ఉయికే, స్వతంత్ర జోన్ కమిటీ సభ్యులు నిఖిల్ ఒరాఫ్ శివాజీ, సుదర్శన్ ఒరఫ్ వికాష్, అంకిత ఒరఫ్ ఇందు, శుక్ర ఒరప్ క్రిష్ణ, నితు, అన్వేష ఒరఫ్ రేణు, డివిజినల్ కమిటి సభ్యులు మమత ఒరఫ్ సాయితేజ్, నకుల్ ఒరప్ చంద్ర తదితర మావో నేతల ఫొటోలతో పాటు వారి పక్కనే ప్రకటించిన బహుమతి నగదును ముద్రించారు. ఎవరైనా వారి (మావో) వివరాలు కచ్చితంగా తెలియజేస్తే వారి వివరాలు పోలీసులు గోప్యంగా ఉంచుతుందని అదేవిధంగా పట్టిన మావొయిస్టుకు ప్రకటించిన బహుమతి నగదును అందజేస్తామని పొస్టర్లలొ ప్రచురించి ఏర్పటు చేయడం విశేషం. గత కొద్ది కాలంగా నియమగిరి పర్వత ప్రాంతాల్లొ మావొ కదలికలు ఎక్కువగా ఉండటంతొ వారిని అనిచివేసే ప్రక్రియలొ భాగంగా ఒడిశా ప్రభుత్వం ఈ మేరకు తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని ఆ ప్రాంత ప్రజలు గుసగుసలాడుకొవడం వినిపిస్తుంది. -
మందుగుండు సామగ్రి సీజ్
పొందూరు: పొందూరులో ఎటువంటి లైసెన్సు లేకుండా మందుగుండు సామగ్రి విక్రయిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని సామగ్రి సీజ్ చేసినట్లు ఎస్సై వి.సత్యనారాయణ తెలిపారు. ఆదివారం మార్కెట్ వీధిలో దీపావళి సామాన్లు విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించగా రూ.1,09,623 విలువైన మందుగుండు గుర్తించామన్నారు. పొట్నూరు వెంకటరావు వద్ద రూ.40,088, జామి మణికంఠ వద్ద రూ.59,717, గుడ్ల రవి వద్ద రూ. 9,818 విలువైన సామగ్రి స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ‘నాభూమి..నాదేశం’ స్మారక శిలాఫలకం కూల్చివేత టెక్కలి: గత వైఎస్సార్సీపీ హయాంలో ఆజాదీకా అమృత మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా టెక్కలి మండలం విక్రంపురం వద్ద ఎర్ర చెరువు గట్టుపై ఏర్పాటు చేసిన ‘నాభూమి నాదేశం’ స్మారక శిలా ఫలకాన్ని కూల్చివేశారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగానికి గుర్తుగా.. భావి తరాలకు పుడమితల్లి విలువను తెలియజేసే విధంగా.. మాతృభూమి రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వీరులకు గుర్తుగా ప్రతి పంచాయతీలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో వీటిని నిర్మించారు. దీనిలో భాగంగా టెక్కలి మండలం బొప్పాయిపురం పంచాయతీ విక్రంపుర వద్ద స్మారక శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు దానిని కూల్చివేసి ఒక వైపు కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని.. మరో వైపు స్వాతంత్య్ర సమరయోధులు, వీరుల త్యాగాన్ని నేలమట్టం చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి కంచిలి: బూరగాంలో జాతీయ రహదారి పక్కన ఇటీవల మతిస్థిమితం లేని వ్యక్తి ఫిట్స్వచ్చి పడి ఉండగా శ్రీకాకుళం రిమ్స్లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 17న మృతిచెందాడు. మృతుడి వయసు సుమారు 45 ఏళ్లు ఉండవచ్చని, గోధుమ రంగు టీ షర్టు, నలుపు ప్యాంట్ ధరించి ఉన్నాడని, వివరాలు తెలిస్తే కంచిలి పోలీస్స్టేషన్లో సమాచారం అందించాలని పోలీసులు కోరారు. ఆర్జీయూకేటీలో క్విస్కిట్ ఫాల్ ఫెస్ట్ ఎచ్చెర్ల: ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్లో ఈ నెల 21 నుంచి 27 వ తేదీవరకూ క్విస్కిట్ ఫాల్ ఫెస్ట్ –2025 నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని డైరెక్టర్ కె.బాలాజీ తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పరిశోధన అంశాలకు సంబంధించి వినియోగిస్తున్న క్వాంటమ్ టెక్నాలజీపై విద్యార్థులు, అధ్యాపకులకు అవగాహన కల్పించా లని ఐబీఎం క్వాంటమ్ సంస్థ నిర్ణయించిందని తెలిపారు. దీని కోసం కొన్ని విద్యాసంస్థలను ఎంపిక చేసి అక్కడ సదస్సులు నిర్వహించనున్నారు. నేషనల్ క్వాంటమ్ మిషన్లో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారంతో సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సదస్సుకు నేరుగా నాలుగు వేల మంది విద్యార్థులు, ఆన్లైన్లో మరో ఆరువేల మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. తొలిరోజు అమరావతి క్వాంటమ్ వ్యాలీ సలహాదారు, ఐబీఎం క్వాంటమ్ ఇండియన్ లీడర్ ఎల్. వెంకటసుబ్రహ్మణ్యం హాజరై ప్రసంగించనున్నార ని, తర్వాత 3 రోజులు పాటు దేశ, విదేశాల నుంచి వచ్చే నిపుణులు అవగాహన కల్పించనున్నారని చెప్పారు. రెండు రోజులు పాటు హ్యాకథాన్ నిర్వహించి, చివరి రోజు ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించనున్నామన్నారు. క్యాంపస్లో సీఎస్ఈ విద్యార్థులు దూదేకుల ఖాశివంలి, కాటం నిఖిల్తేజ, చెరుకూరి ప్రవీణ్కుమా ర్, తృతీయ సంవత్సరం చదువుతున్న చదువుల జాన్బాబు, ద్వితీయ సంవత్సరం విద్యార్థి కిమిడి గుణశ్రీలు రెండేళ్ల నుంచి క్వాంటమ్ టెక్నాలజీపై అధ్యయనం చేస్తూ పలు సదస్సులకు హాజరయ్యా రని చెప్పారు. క్వాంటమ్ టెక్నాలజీకి వీరు ఆలోచనలు పంపగా ఐబీఎం సంస్థ గుర్తించి ఈ సదస్సు నిర్వహణకు ఎంపిక చేసిందని డైరెక్టర్ తెలిపారు. -
షణ్ముఖపాత్రోకి ఘన నివాళి
కొరాపుట్: గుండె పోటుతో మరణించిన ప్రముఖ న్యాయవాది, సంఘ సేవకుడు షణ్ముఖ పాత్రో (50)కి న్యాయవాదులు నివాళులర్పించారు. నబరంగ్పూర్ బార్ ఆసోసియేషన్ కార్యాలయం ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మౌనం పాటించారు. నబరంగ్పూర్లో న్యాయవాద వృత్తి ప్రారంభించి అనంతరం సుప్రీం కోర్టులో న్యాయవాదిగా సేవలు అందించారన్నారు. ఈ ప్రాంతంలో గిరిజనుల సేవలకు ప్రారంభించిన గోవిందాలయ ట్రస్ట్కి సహాయ, సహాకారాలు అందించడానికి న్యాయవాదులు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సిరాజుద్దిన్ ఆహ్మద్, సంతోష్ మిశ్ర, రఘునాథ పాడి, తదితరులు పాల్గొన్నారు. -
‘మట్టి ప్రమిదలు వాడుదాం’
జయపురం: దీపావళికి ప్రకృతికి నష్టం వాటిల్లకుండా చూసుకుందామని జయపురం సిటీ ఉన్నత పాఠశాల ఎకో క్లబ్బు విద్యార్థులు కోరుతున్నారు. మట్టి దీపాలు వెలిగించి ఘనంగా దీపావళి జరుపుకోవాలని కోరుతూ ఓ ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. వారు స్వయంగా మట్టి దీపాలు (ప్రమిదలు) తయారు చేస్తూ వాటిని ప్రజలకు చూపి మట్టి దీపాలు వెలిగించాలని ఉద్బోధిస్తున్నారు. మట్టి దీపాలు ఎలా తయారు చేయాలో స్థానిక మట్టి వస్తువులు తయారు చేసే గోప సుందర పాణిగ్రహి సిటీ ఉన్నత పాఠశాల సెక్యూరిటీ గార్డు సునీల భొత్రలు ఎకో క్లబ్బు సభ్యులకు వివరించి వారిచే స్వయంగా చేయించారు. దీపావళిని ప్రతి విద్యార్థి మట్టి దీపాలతోనే ఇంటిలో జరుపుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమం ఎకో క్లబ్బు ఉపాధ్యాయులు ప్రతాప్ కుమార్ పట్నాయిక్, సిటీ ఆంగ్ల పాఠశాల ప్రిన్సిపాల్ సుధాకర పట్నాయిక్ నిర్వహిస్తున్నారు.ఘనంగా సురభి మహోత్సవం -
శ్రమదానం
పర్లాకిమిడి: పాతపట్నం రోడ్డులో మహేంద్రతనయ నది వద్ద ఉన్న శ్మశాన వాటికను గ్రీన్ ఎర్త్, జిల్లా యంత్రాంగం, గాయత్రీ పరివార్ కలిసి ఆదివారం ఉదయం శుభ్రం చేశారు. దీపావళి పురస్కరించుకుని పలువురు పితృకర్మలు మహేంద్ర తనయ నది వద్ద చేస్తారు. మహేంద్రతనయ ఒడ్డున ఉన్న శ్మశానవాటిక వద్ద పేరుకుపోయిన పిచ్చి మొక్కలు, బూడిద తొలగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనింగ్ అధికారి దిపేన్ పోరిడా, ఆదర్శ పోలీసు స్టేషన్ ఎస్ఐ ప్రపుల్ల జగదానంద, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్కుమార్ మిశ్రా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జితేంద్ర పట్నాయక్, కార్యదర్శి ఎం.పృఽథ్వీరాజ్, గాయత్రీ పరివార్కు చెందిన మనోజ్ దాస్, సంతోష్ గంతాయత్, తదితరులు పాల్గొన్నారు. -
పుట్టినరోజు నాడే విషాదం
● మొగదాలపాడు బీచ్లో యువకుడు గల్లంతు ● కింతలి ఖాజీపేటలో విషాదఛాయలు గార/పొందూరు: పుట్టిన రోజు వేడుకల కోసం స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వచ్చిన యువకుడు గల్లంతైన ఘటన మొగదాలపాడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొందూరు మండలం కింతలి ఖాజీపేట గ్రామానికి చెందిన అలబాన జగదీష్కుమార్ విశాఖపట్నంలోని ఐటీఐ చదువుతున్నాడు. దీపావళి సెలవులకు ఇంటికి వచ్చిన జగదీష్కు ఆదివారం పుట్టిన రోజు కావడంతో మరో నలుగురి స్నేహితులతో కలిసి గార మండలం వత్సవలస పంచాయతీ మొగదాలపాడు వచ్చారు. సాయంత్రం బీచ్లో స్నానానికి దిగిన ఐదుగురు కేరింతల్లో ఉండగా భారీ అలకు జగదీష్ గల్లంతయ్యాడు. వెంటనే గాలించినా జాడ దొరకలేదు. మైరెన్ సీఐ బి.ప్రసాదరావు ఘటనా స్థలానికి వెళ్లి సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. జగదీష్ స్నేహితులతో మాట్లాడి వివరాలు సేకరించారు. జగదీష్ తండ్రి గోవిందరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు, గాలింపు చర్యలు చేపట్టామని ఏఎస్ఐ తెలుగు చంద్రశేఖర్ తెలిపారు. -
బస్సు ఆపలేదని నిరసన
పోలాకి : బస్సు ఆపడం లేదంటూ బెలమర జంక్షన్ సమీపంలో జీడిపప్పు ఫ్యాక్టరీ వద్ద మహిళలు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ప్రతిరోజూ సాయంత్రం 5.30 సమయంలో గుప్పెడుపేట–నరసన్నపేట ఆర్టీసీ బస్సు ఫ్యాక్టరీ వద్ద ఆగడంతో మహిళా కార్మికులు ఎక్కేవారు. ఉచిత బస్సు పథకం వచ్చిన తర్వాత డ్రైవర్ బస్సు ఆపడంలేదు. ఇదేంటని మహిళలు ప్రశ్నిస్తే అక్కడ స్టాప్లేదని, ముందున్న స్టాప్ దగ్గరకు రావాలని దురుసుగా సమాధానం చెప్పడంతో మహిళలు ఆగ్రహించి బస్సును రోడ్డుమీదే ఆపేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రంజిత్ డ్రైవర్, మహిళలతో మాట్లాడారు. రిక్వెస్ట్ స్టాప్గా పరిగణించాలని సూచించడంతో వివాదం సద్దుమణిగింది. దాదాపు 20 మంది మహిళలు నిత్యం బస్సుకోసం వేచి ఉన్నచోట కాదని, ఇంకోచోట స్టాప్ ఉందని తప్పించుకుంటే ఊరుకునేది లేదని మహిళలు స్పష్టం చేశారు. టికెట్ తీసుకున్నపుడు ఉన్న స్టాప్, ఉచితం అన్నప్పుడు ఎందుకుండదని నిలదీయటం గమనార్హం. వృద్ధుడు ఆత్మహత్య రణస్థలం: లావేరు మండలం బెజ్జిపురం గ్రామానికి చెందిన గురజాపు అప్పలనాయుడు (69) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అప్పలనాయుడు ఈ నెల 10న సాయంత్రం మద్యం సేవించి కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. భార్య మందలించడంతో మనస్థాపం చెంది పురుగుల మందు తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించాడు. కుమారుడు దుర్గారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లావేరు హెచ్సీ ఎం.విజయానంద్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: పాతపట్నంలోని కిరణ్మయి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఈ నెల 24న మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ మేళాలో డాక్టర్ రెడ్డీస్, హెట్రో, టాటా ఎలక్ట్రానిక్స్, రాయల్ ఎన్ఫీల్డ్, కియా మోటార్స్తో సహా మొత్తం 11 ప్రైవేటు కంపెనీలు పాల్గొంటాయని పేర్కొన్నారు. టెన్త్ నుంచి డిగ్రీ వరకు చదివిన 18 నుంచి 30 ఏళ్ల అభ్యర్థులు అర్హులని తెలిపారు. కాకుళం, విశాఖపట్నం, శ్రీసిటీ (నెల్లూరు), హైదరాబాద్, చైన్నె వంటి నగరాల్లో సుమారు 500 ఉద్యోగావకాశాలు లభిస్తాయని వివరించారు. అభ్యర్థులు తప్పనిసరిగా naipunyam.a p.gov.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఉరిటి సాయికుమార్ తెలిపారు. ఫొటోలు, ధ్రువపత్రాలతో ఉదయం 9 గంటలకు మేళా ప్రాంగణానికి చేరుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 8317652552 నంబర్ను సంప్రదించాలని కోరారు. ఘనంగా నరక చతుర్దశి అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయ ఉద్యావన మండపంలో ఆదివారం సాయంత్రం నరకచతుర్దశి ఘనంగా జరిగింది. దీపావళి పండగ సందర్భంగా ముందుగా ఉషాపద్మిని ఛాయా సమేతంగా సూర్యనారాయణస్వామి ఉత్సవ మూర్తులను తిరువీధిగా తీసుకువచ్చి ఉద్యాన మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో నరకాసురుడి ప్రతిరూపాన్ని దహనం చేశారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
నవభారత నిర్మాణంలో..ఆర్ఎస్ఎస్ది కీలక పాత్ర
కొరాపుట్: నవ భారత నిర్మాణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ది కీలక పాత్ర అని పశ్చిమ ఒడిశా ఫిజికల్ ఇన్స్ట్రక్టర్ హరేకృష్ట మజ్జి పేర్కొన్నారు. ఆదివారం నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలలో పాల్గొని ప్రసంగించారు. స్వాతంత్య్రం ముందు నుంచి హిందూ ఐక్యత కోసం ఆర్ఎస్ఎస్ పోరాటం చేసిందన్నారు. మనకు బయట ఎవరూ శత్రువులు లేరన్నారు. మనలో ఐక్యత లేక పోవడంతో అదే శత్రువుగా మారిందన్నారు. ప్రతి వ్యక్తి సామాజిక ఐక్యతతో ఉండాలన్నారు. సొంత కుటుంబంతో ప్రేమ, ఆప్యాయతలతో గడపాలన్నారు. ప్రభుత్వం ఆస్తి, ప్రజల ఆస్తి అని గుర్తించాలన్నారు. పన్నులు, విద్యుత్ బిల్లులు, ఇతర ప్రభుత్వ చెల్లింపులు దేశభక్తితో జరగాలన్నారు. ప్రతి వ్యక్తి మెక్కలు నాటడం, కాలుష్య వ్యతిరేక పోరాటం చేయాలన్నారు. సమాజంలో నాణ్యమైన విలువులతో సంభాషణలు చేయడం అవసరమన్నారు. మాతృ భాష, స్వదేశీ ఉత్పత్తుల వినియోగం అలవాటుగా మారాలన్నారు. ఈ సందర్భంగా రెండు వేల మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తమ సంప్రదాయ దుస్తులు ధరించి భారీ ప్రదర్శన చేశారు. ఈ ర్యాలీ చమిరియాగుడ నుంచి మజ్జి గుడ జంక్షన్ వరకు సాగింది. బీజేపీకి చెందిన నబరంగ్పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి సాధారణ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నబరంగ్పూర్ జిల్లా సర్ సంఘచాలక్ జుదిష్ట గోండో, ప్రత్యేక పరిశీలకుడు ఎస్.సుబ్రహ్మణ్యం (రాజమండ్రి), తదితరులు పాల్గొన్నారు. -
యోగాతో మానసిక ఉల్లాసం
పర్లాకిమిడి: గజపతి జిల్లా వాకర్స్ క్లబ్ వార్షికోత్సవం, ప్రపంచ మానసిక స్వస్థ్య దినోత్సవం సందర్భంగా శ్రీధర్నగర్లో ఆదివారం సి.సి.డి స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో పతంజిలి యోగా సభ్య బృందానికి మానసిక ఆరోగ్య సూత్రాలను జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి మానసిక వైద్యులు ప్రాణ్ రంజన్ నాయక్ తెలియజేశారు. మానసిక రోగులు ఎలా ప్రవర్తిస్తారు, వారి రోగ లక్షణాలు, ఉపశమనం గురించి తెలియజేశారు. యోగా క్రమం తప్పకుండా అభ్యసించడం వల్ల కోన్ని మానసిక రుగ్మతలు తగ్గుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మానసిక వైద్యులు సతీష్ కుమార్ మహాపాత్రో, జతిన్ పట్నా, ప్రదీప్ కుమార్ మహాపాత్రో, తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా దీపావళి
పర్లాకిమిడి: స్థానిక సరస్వతీ శిశు విద్యామందిర్లో శనివారం సాయంత్రం దీపావళి పండను ముందస్తుగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని దేవీ మఠం మహాంత రామానంద దాస్ విచ్చేశారు. విద్యాలయం పర్యవేక్షణ కమిటీ కార్యదర్శి చంద్రశేఖర పట్నాయక్ జ్యోతిప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెడుపై మంచి విజయం సాధించేందుకే ఈ పండగ నిర్వహిస్తారన్నారు. భారత త్రివిధ దళాలు సాధించిన ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకుని పలువురు కోనియాడారు. కాశ్మీర్లో పెహల్గాం వద్ద ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకులకు శ్రద్ధాంజలి తెలిపారు. అనంతరం 2000 దీపాలు పాఠశాల ఆవరణలో భారత్ మాత ఆకారంలో వెలిగించి దీపావళిని ఆనందోత్సవాలతో నిర్వహించారు. అనంతరం విద్యార్థులు పాఠశాలలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు శిశుమందిర్ ప్రధాన ఆచార్యులు సరోజ్ పండా ఆధ్వర్యంలో జరిగాయి. -
భారీగా మందుగుండు నిల్వలు సీజ్
కంచిలి: మండలంలో అనుమతి పొందిన నాలుగు మందుగుండు దుకాణాల్లో అధిక మొత్తంలో టపాసులు నిల్వలు ఉన్నాయనే కారణంతో పోలీసులు ఆ సరుకును సీజ్ చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటనలో వివరాలు తెలియజేశారు. కంచిలిలో బలియాపుట్టుగ వద్ద తెల్లి వైకుంఠరావుకు చెందిన రూ.2,69,470ల సరుకు, అంపురం వద్ద సుంకర మణికంఠకు చెందిన రూ.1,71,900ల సరుకు, జాడుపూడిలో దూపాన సునీల్కు చెందిన రూ. 1,16,497లు విలువ కలిగిన సరకు, అదే గ్రామంలో దూపాన శ్రీనివాసరెడ్డికి చెందిన రూ.1,15,300 లు విలువ గల సరకును సీజ్ చేసినట్లు వెల్లడించారు. సారవకోట: మండలంలోని కొమ్ముసరియాపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి టాస్క్ఫోర్స్ సిబ్బంది రూ.50 వేలు విలువ కలిగిన బాణసంచా స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన పైల సుశీల, లుకలాపు తిరుపతిరావు బాణసంచాతో పాటు బాణసంచా తయారు చేయడానికి కావాల్సిన ముడి సరుకులు కలిగి ఉండడంతో టాస్క్ఫోర్స్ సిబ్బంది వారి ఇళ్లపై దాడిచేసి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బాణసంచాను సారవకోట పోలీసుస్టేషన్కు అప్పగించారు. దీంట్లో పైల సుశీల వద్ద నుంచి రూ.30 వేలు విలువ కలిగిన బాణసంచా, లుకలాపు తిరుపతిరావు నుంచి రూ.20 వేలు విలువ కలిగిన బాణసంచా స్వాధీనం చేసుకుని ఇరువురిపై కేసు నమోదు చేశారు. -
అమోనియా కంటైనర్ బోల్తా
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలంలోని జర్జంగి గ్రామ సమీప జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఒక భారీ కంటైనర్ బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఒడిశా నుంచి శ్రీకాకుళం వైపు అమోనియా లోడ్తో వెళ్తున్న భారీ కంటైనర్ జర్జంగి గ్రామ సమీపంలోకి రాగానే అదుపు తప్పి డివైర్ను ఢీకొని బోల్తాపడింది. సమాచారం అందుకున్న కోటబొమ్మాళి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు జరుగకుండా చర్యలు తీసుకున్నారు. అరసవల్లి: రాష్ట్రంలో మన జిల్లాను స్వచ్ఛంగా మార్చుకుందామని కేంద్రమంత్రి కె.రామ్మోహన్నాయుడు పిలుపునిచ్చారు. మూడో శనివారం పురస్కరించుకొని వాయు కాలుష్య నివారణ థీమ్తో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని అరసవల్లి ఇంద్ర పుష్కరిణి వెనుక భాగంలో కాజీపేట కూడలి వద్ద చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యకర సమాజాన్ని రూపొందించవచ్చన్నారు. అనంతరం కార్పొరేషన్ అధికారుల ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎమ్మెల్యే గొండు శంకరరావు, కార్పొరేషన్ కమిషనర్ ప్రసాదరావు, అరసవల్లి ఆలయ ఈవో కేఎన్వీడీవీ ప్రసాద్, జిల్లా పర్యాటక శాఖాధికారి ఎన్.నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ఆమదాలవలస: ఇటీవల కొన్ని పత్రికలు, ఛానళ్లలో వచ్చిన వార్త కథనాలు పూర్తి అవాస్తవమని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. తనకు ఎటువంటి గ్యాంగ్లు లేవని, తన బలం ప్రజలేనని తెలిపారు. తప్పుడు ప్రచారాలను ప్రజలు ఎవరు నమ్మవద్దని కోరారు. కొంతమంది వ్యక్తులు బాధితులను ఉసుగొల్పి తప్పుడు ఆరోపణలు చేయించారన్నారు. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులకు తన సాను భూతి తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుపై పోలీసు అధికారులు సమగ్ర విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. వార్తలు ప్రచురించే ముందు ధ్రువీకరించుకోవాలని మీడియా ప్రతినిధులకు సూచించారు. ఇచ్ఛాపురం రూరల్: భార్యతో కలిసి విహార యాత్రకు వెళ్తున్న యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో స్వగ్రామం లొద్దపుట్టిలో విషాదచాయలు అలముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని లొద్దపుట్టి గ్రామం అంబుగాం వీధికి చెందిన పిట్ట మోహనరావు, కుమారీల కుమారుడు పిట్ట వసంత్(32) కాకినాడలో చార్టర్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం తండ్రి మోహనరావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ భారాన్ని మోస్తున్న వసంత్, ఈ ఏడాది మార్చి 7న ఇచ్ఛాపురం బెల్లుపడకు చెందిన సంధ్య ఉరఫ్ ఇందును వివాహం చేసుకున్నాడు. శనివారం అరకు విహార యాత్ర కోసం తన ద్విచక్ర వాహనంపై భార్య సంధ్యను తీసుకొని వెళ్తుండగా, ప్రత్తిపాడు మండలంలోని ధర్మవరం గ్రామ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంజరిగింది. ఈ ప్రమాదంలో వసంత్ అక్కడికక్కడే మృతి చెందగా, భార్య తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలై చికిత్స పొందుతోంది. జాతీయ రహదారిపై ధర్మవరం గ్రామ సమీపంలో రొయ్యల మేత తీసుకెళ్తున్న వ్యాన్ మరమ్మతులకు గురికావడంతో నిలిపివేశారు. ఆగి ఉన్న వ్యాన్ను వసంతకుమార్ బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. నవ దంపతులను మృత్యువు విడగొట్టిందని బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు. -
వ్యాధుల నివారణకు సమగ్ర చర్యలు
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశం హాల్లో వేక్టర్ వ్యాధి (దోమల ద్వారా వచ్చే వ్యాధులు) నివారణకు శనివారం జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ సమగ్ర చర్యలు ప్రారంభించారు. మలేరియా, డెంగీ, చికున్ గున్యా వంటి వ్యాధుల ఉధృతిని నియంత్రించేందుకు ప్రతి సమితిలో ప్రత్యక శిబిరాలను ఏర్పాటు చేసి అవగాహన కర్యక్రమాలు నిర్వహస్తామని జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ దోలామణి ప్రధాన్ అన్నారు. వర్షకాలంలో దోమలు ఎక్కువగా ఉన్నందున్న ప్రతి గ్రామంలో పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. దోమ తెరలు వాడాలని, జిల్లా కేంద్రం ప్రతీరోజు ఫాగింగ్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా నిల్వ నీటిని తొలగించాలన్నారు. కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య, మాలేరియశాఖల వైద్యులు పాల్గొన్నారు. -
ఆర్ఎస్ఎస్ శత వార్షికోత్సవాలు ప్రారంభం
జయపురం: రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శతవార్షిక వేడుకలను జయపురం ఆర్.ఎస్.ఎస్ శాఖ శనివారం ఘనంగా నిర్వహించింది. స్థానిక భూపతి వీధి కనకదుర్గ మందిర ప్రాంగణంలో నిర్వహించిన శతాబ్ది ఉత్సవాల్లో జయపురంలో పాణినాళ వీధి, రాధామాధవ వీధి, కెల్లా వీధికి చెందిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు శత వార్షిక వేడుకల్లో పాల్గొన్నారు. న్యాయవాది, మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ బిరేష్ పట్నాయక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బిరేష్ పట్నాయక్ దీప ప్రజ్వలన చేసి శత వార్షిక ఉత్సవాన్ని ప్రారంభించారు. ముఖ్యవక్తగా అధ్యాపకులు, గ్రామ వికాశ కార్యకర్త బిజయకుమార్ భట్, పట్టణ ఆర్ఎస్ఎస్ సంఘ పరిచాలకులు డాక్టర్ నిరంజన్ మిశ్ర వేదికపై ఆశీనులయ్యారు. వక్తలు ఆర్ఎస్ఎస్ గత వందేళ్లుగా దేశానికి అందిస్తున్న సేవలను వివరించారు. ఆర్ఎస్ఎస్ సంఘం జాతి, కుల, మతాలకు ఎటువంటి ప్రాధాన్యత నీయలేదని వెల్లడించారు. ఎవరు ఏ ధర్మం వారైనా దేశ భక్తి, హిందూ దేశ నిర్మాణం పట్ల ఆసక్తి ఉన్న వారెవరైనా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. హిందూ రాష్ట్ర నిర్మాణ ఉద్యమంలో ప్రజలను చైతన్యపరచేందుకు కార్యకర్తలు సమైఖ్యంగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సుభ్రత పండా, సత్యనారాయణ మిశ్ర, కార్యదర్శి సురేష్ నందా, శుభం పండాలు ఆర్ఎస్ఎస్ ప్రార్థన గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సభ్యులు ప్రేమానంద నాయక్, నారాయణ మిశ్ర, ప్రపుల్ల రాయ్, బలరాం పాడీ, సుధాంశు పాడీ, తేజశ్వీ చౌదరి, జితు దొలాయ్, గుప్త పాహిగ్రహి, వై.ఎస్.ఖన్నతోపాటు 50 మందికి పైగా పాల్గొన్నారు. -
మధ్యాహ్న భోజనం అపహాస్యం
కొత్తూరు: మండలంలోని కర్లెమ్మ పంచాయతీ మహాసింగిగూడ ఆర్ఆర్ కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం అపహ స్యం చేసేవిధంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏకోపా ధ్యాయ పాఠశాలలో 18 మంది విద్యార్థులు చదువుతున్నారు. 18 మంది పిల్లలకు పాఠశాల అవరణలో వంట చేయడం లేదు. ఇంటి వద్ద వంట చేసి పాఠశాలకు వంట ఏజెన్సీ సభ్యురాలికి బదులు ఆమె భర్త ప్రతిరోజూ తీసుకొచ్చి విద్యార్థులకు వడ్డన చేస్తుంటారు. శనివారం మధ్యాహ్నం భోజనాన్ని పాఠశాలలో కేవలం నలుగు విద్యార్థులు మాత్రమే చేశారు. అయితే నలుగు విద్యార్థులకు కేవలం అన్నం, కూర పెట్టారు తప్ప, చారు మాత్రము తీసుకు రాలేదు. చారులేక పోవడంతో విద్యార్థులు భోజనం చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. మిగిలిన 14 మంది విద్యార్థులు గ్రామంలో జరిగిన అన్నదాన కార్యక్రమానికి హాజరైనట్లు పాఠశాల ఉపాధ్యాయుడు తెలిపారు. పాఠశాల వద్ద గదులు సక్రమంగా లేకపోవడం వలన ఇంటి వద్ద వంట చేయిస్తున్నట్లు చెప్పారు. -
పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన
జయపురం: జయపురం మున్సిపాలిటీ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులు శనివారం ఆందోళన చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. రెండు నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో గల 10 ట్రాక్టర్లలో పని చేస్తున్న 30 మంది, 20 టాటా ఏస్ వాహనాలలో పని చేస్తున్న 40 మంది పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనలో పాల్గొన్నారు. జీతాలు ఇచ్చేంత వరకు వాహనాలు నడిపేదే లేదన్నారు. కంట్రాక్టర్ వచ్చి నెల జీతం చెల్లించటంతో ఆందోళన విరమించి పనుల్లోకి చేరారు. మున్సిపాలిటీ నిబంధన ప్రకారం పారిశుద్ధ్య కార్మికులను కంట్రాక్టర్ ప్రతి నెలా జీతాలు చెల్లించకపోతే.. మున్సిపాలిటీ చెల్లించాలన్నారు. రెండు రోజుల్లో దీపావళి ఉన్నా కంట్రాక్ట్ కంపెనీ జీతాలు ఇవ్వకపోవటంతో ఆందోళనకు దిగినట్లు డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు తెలిపారు. ఈపీఎఫ్, ఈఎస్ఐలు ప్రతి నెలా సకాలంలో జమ చేయటం లేదని ఆరోపించారు. ఒప్పందం ప్రకారం వీటిని ప్రతి నెలా కంట్రాక్టర్ జమ చేయాలని, లేకపోతే జరిమానా పడుతుందన్నారు. మున్సిపాలిటీ కంట్రాక్ట్ సంస్థకు పట్టణ పారిశుద్ధ్యం నిమిత్తం నెలకు రూ.76 లక్షలకు పైగా బిల్లు చెల్లిస్తుందన్నారు. మున్సిపాలిటీలో గల 28 వార్డులను 4 జోన్లుగా విభజించి 371 మంది పారిశుద్ధ్య స్వీపర్లను నియమించింది. వీరిలో ఆందోళన చేపట్టిన 70 మంది వాహనాల్లో పని చేస్తున్నారు. -
మోసం చంద్రబాబు నైజం
జలుమూరు: ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా మోసం చేయడమే చంద్రబాబు నైజమని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ధ్వజమెత్తారు. మండలంలోని కరవంజ – టెక్కలిపాడు క్లస్టర్ సమావేశంలో శనివారం మాట్లాడారు. పేదలకు వైద్యం దూరం చేయడమే చంద్రబాబు ధ్యేయమన్నారు. అందుకు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నాడన్నారు. దీనికి వ్యతిరేకంగా కోటి సంతకాలు కార్యక్రమం తలపెట్టామని తెలియజేశారు. అన్నమయ్య జిల్లాలోని మునకల చెరువుతో పాటు నరసన్నపేట నియోజకవర్గంలో బుడితి వద్ద అవలింగి గ్రామంలో మినీ పరిశ్రమ పెట్టి టీడీపీ నాయకులు మద్యం కల్తీ చేస్తున్నారని మండిపడ్డారు. నరసన్నపేటలో ఎమ్మెల్యే రమణమూర్తిదే సిండికేట్ అని, వారి కుటుంబ సభ్యుల పేరిట మద్యం షాపులు ఉన్నాయని వివరించారు. అవలింగిలో కల్తీ జరిగిన మద్యం పట్టుకున్న అధికారులు ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో వివరించాలన్నారు. రాష్ట్రంలో 62 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, రైతు పండించిన పంటలకు మద్దతు ధర లేదని మండిపడ్డారు. అనంతరం డిజిటల్ బుక్ పోస్టర్ ఆవిష్కరించి, కోటి సంతకాల సేకరణ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ వాన గోపి, జిల్లా కార్యదర్శి ఎం.శ్యామలరావు, సర్పంచ్ జుత్తు నేతాజీ, గొల్లంగి జగన్నాథరావు, జిల్లా బూత్ లెవెల్ అధ్యక్షుడు దామ మన్మథరావు, రకావాడ చందనబాబు, ధర్మాన జగన్, ధర్మాన బువాజీ, తర్ర జీవరత్నం, కె.కూర్మారావు, బండి ఎర్రన్న, బలగ లక్ష్మీ, అర్జున్, ఎస్వీ రమణ తదితరులు పాల్గొన్నారు. -
సైబర్ మోసాలపై అవగాహన
పర్లాకిమిడి: రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాలు అరికట్టడానికి ‘సైబర్ సేఫ్టీ ప్రచారం 2025’ను కళింగ స్టేడియంలో ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మఝి ప్రారంభించారు. ప్రత్యక్ష ప్రసారాన్ని సెంచూరియన్ వర్సిటీలోని ఓపెన్ స్టేడియంలో శనివారం ప్రసారం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా, అదనపు ఎస్పీ సునీల్ కుమార్ మహంతి, సబ్ డివిజనల్ పోలీసు అధికారి మాధవానంద నాయక్, ఐఐసీ (పర్లాకిమిడి) ప్రశాంత భూపతి, గురండి పోలీసు అధికారి ఓంనారయణ పాత్రో, అటవీ శాఖ అధికారులు హాజరయ్యారు. స్టాప్, వెరిఫై, సెక్యూర్ పేరిట 16 జిల్లాలో సైబర్ రథాలు ప్రచారంలో పాల్టొంటాయని అధికారులు తెలియజేశారు. నెల రోజులపాటు ప్రజల్లో సైబర్ నేరాలు, నెట్ బ్యాంకింగ్ సేవల్లో జాగ్రత్త వహించడం, ఏ.టి.ఎంలో సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని ఎస్పీ జ్యోతింద్ర పండా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెంచూరియన్ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ అనితా పాత్రో, డైరెక్టర్ (అడ్మిన్) దుర్గాప్రసాద్ పాడీ, సోయెట్ డీన్ డాక్టర్ ప్రపుల్ల కుమార్ పండా, తదితరులు పాల్గొన్నారు. -
నువాపడా ఉప ఎన్నిక హోరు
● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు భువనేశ్వర్: బిజూ జనతా దళ్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజేంద్ర ఢొలొకియా అకాల మరణంతో నువాపడా శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఏడాది నవంబర్ 11న ఈ ఎన్నిక జరుగుతుంది. ఉప ఎన్నికకు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు తమ నామినేషన్ దస్తావేజులు శనివారం దాఖలు చేశారు. ఈ సందర్భంగా సీనియర్ గిరిజన నాయకుడు, కాంగ్రెస్ అభ్యర్థి ఘసిరామ్ మాఝీ ఆయన అనుచరులతో భారీ ఊరేగింపులో పాల్గొన్నారు. బడుగు, గిరిజన వర్గాలతో బలమైన సంబంధాలకు పేరుగాంచిన ఘసిరామ్ మాఝీ గత 2024 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. భూమి హక్కులు, గిరిజన వర్గాల సంక్షేమం వంటి కీలకమైన స్థానిక సమస్యలను పరిష్కరించడంలో తన నిబద్ధతను నొక్కి చెప్పారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి జయ ఢొలొకియా నువాపడా సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సామల్, మంత్రులు గణేష్ రామ్ సింగ్ ఖుంటియా, రబి నారాయణ్ నాయక్, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బసంత్ పండా, జిల్లా అధ్యక్షుడు కమలేష్ దీక్షిత్, ఇతర పార్టీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
అనుమతులెలా ఇచ్చారు..?
టెక్కలి: జనావాసాలు, విద్యా సంస్థలు ఉన్న ప్రాంతాల్లో బాణసంచా విక్రయాలకు ఎలా అనుమతులిచ్చారని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ టెక్కలి అగ్నిమాపక అధికారి సూర్యారావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్కలిలో ప్రత్యేక పారిశుద్ధ్య పనుల పరిశీలన కోసం విచ్చేసిన ఆయన ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఎదురుగా ఏర్పాటు చేసిన బాణసంచా విక్రయ దుకాణాలను చూసి అసహనం వ్యక్తం చేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఎటువంటి పరిశీలన, స్థానిక అభ్యంతరాలు చూడకుండా కేవలం పత్రాలు చూసి అనుమతులు ఇచ్చారా అని నిలదీశారు. తక్షణమే అభ్యంతరకంగా ఉన్న దుకాణాన్ని మార్పు చేయాలని ఆదేశించారు. ఆయనతో పాటు టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, తహసీల్దార్ బి.సత్యం, డీఎల్పీవో ఐ.వి.రమణ తదితరులు పాల్గొన్నారు. -
హత్యా నేరంపై ముగ్గురు అరెస్టు
మల్కన్గిరి: హత్యా నేరంపై ముగ్గురు అరెస్టు చేశామని, మరొకరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. మల్కన్గిరి జిల్లా మాత్తిలి సమితిలో ఈ నెల నాలుగో తేదీన నమడాగూఢ గ్రామ చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. దర్యాప్తు చేసిన మాత్తిలి పోలీసులు మృతుడు విష్ణు నాయక్గా గుర్తించారు. ఆయన తంత్రి విజయ్ నాయక్ తన బిడ్డను ఎవరో హత్య చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ దిశగా దర్యాపు చేశారు. మృతుడి ఫోన్ నంబర్ ఆధారంగా సాకేతిక డేటా, పరిసర పరిస్థతులను పరిశీలించి హత్యతో సంబంధం ఉన్నట్టు భావిస్తున్న ముగ్గురిని శనివారం అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ప్రధాన నిందితులుగా దీపక్ ఓరా, శంకర్ ఇడియా, సాగర్ సునాం, మనోజ్ గౌడ్లను అరెస్టు చేయగా.. దీపక్ పరారీలో ఉన్నట్టు మాత్తిలి ఐఐసీ దీపాంజలి ప్రదాన్ తెలిపారు. నిందితులను కోర్టుకు తరలించినట్టు పేర్కొన్నారు. మృతుడు తండ్రి మాట్లాడుతూ.. నిందితులకు కఠిన శిక్ష వేయాలని వేడుకున్నారు. -
రెండు బైక్లు ఢీ
మల్కన్గిరి : కోరుకొండ సమితి టెక్బేడ రహదారిలో శనివారం రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. మల్కనన్గిరికి చెందిన రామ్కుమార్ (35), యమున సర్థార్ (28) ద్విచక్ర వాహనంపై బయలుదేరి మల్కన్గిరి–బలిమెల ప్రధాన రహదారిలో టెక్బేడ వద్దకు వచ్చేసరికి ఎదురుగా కోరుకొండ సమితిలోని ఇందిరా ఆవాస్ కాలనీకి చెందిన మోహన్ మాఝి (23), మధు జానీ బైక్పై వచ్చి ఢీకొట్టారు. ఈ ఘటనలో రామ్కుమార్ ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. స్థానికులు వెంటనే స్పందించి కోరుకొండ పోలీసులకు సమాచారం అందించడంతో ఐఐసీ హిమాన్షు శేఖర్బారిక్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను అంబులెన్సులో తరలించగా యమున, మోహన్ చికిత్స పొందుతూ మృతిచెందారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
త్రుటిలో తప్పిన ప్రమాదం
రాయగడ: జిల్లాలోని కొలనార సమితి కుమార్ ధముని కూడలిలో బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తిని వెనుక నుంచి లారీ బలంగాఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనచోదకుడు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. డుమురిగుడ పంచాయతీ పొరొడిగుడ గ్రామానికి చెందిన కపిల్భొయ్ అనే యువకుడు బైక్పై వెళ్తుండగా కుమారఖర్ధముని వద్ద మలుపు తిరుగుతుండగా వెనుక నుంచి వస్తున్న లారీ అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో యువకుడు సకాలంలో బైక్ నుంచి దూకేయడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. బైకు లారీ కిందకు దూసుకుపోవడంతో నుజ్జునుజ్జయ్యింది. నిర్లక్ష్యంగా వాహనం నడిపిన లారీ డ్రైవర్ను స్థానికులు నిలదీశారు. మునిగుడలో శిశు మహోత్సవాలు రాయగడ: జిల్లాలోని మునిగుడ ప్రభుత్వ నోడల్ ఉన్నత పాఠశాలలో శిశుమహోత్సవం సురభి–25 పేరిట శనివారం ఉత్సవాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయులు సుభాష్ కొర, అక్షయ రోదోల ఆధ్వర్యంలొ జరిగిన ఉత్సవాల్లో బీఈవో గణేష్ సొబొరో, ఏబీఈవో సుభాష్ సింగ్, సురభీ పాల్గొన్నారు. కార్యక్రమ ఉద్దేశాన్ని బీఈవో సొబొరో వివరించారు. విద్యార్థుల్లో కళారంగంపై ఉన్న ఆసక్తిని.. వారి ప్రతిభను బయటకు తీసేందుకు ఇటువంటి తరహా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో 16 క్లస్టర్ విద్యాలయాలకు చెందిన 160 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకోగా విద్యార్థుల మధ్య నిర్వహించిన చిత్రలేఖనం, వక్తృత్వ, క్విజ్ తదితర పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. షణ్ముఖపాత్రోకు ఎమ్మెల్యే నివాళి కొరాపుట్: ప్రముఖ స్వచ్ఛంద సేవకుడు షణ్ముఖ పాత్రో ఇటీవల మృతి చెందారు. దీంతో ఆయన భౌతికకాయాన్ని ప్రముఖులు సందర్శించి నివాళులర్పిస్తున్నారు. ఇందులో భాగంగా బీజేపీకి చెందిన నబరంగ్పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి.. నందాహండి సమితి సొరుగుడ గ్రామంలో గోవిందాలయ ఆశ్రమంలో షణ్ముఖ పాత్రో భౌతికకాయానికి శనివారం నివాళులర్పించారు. షణ్ముఖపాత్రో సేవలు గుర్తు చేశారు. జిల్లాకి చెందిన షణ్ముఖ సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్నారు. ఈ ప్రాంతంలో గోవిందాలయ స్వచ్ఛందసంస్థను ఏర్పాటు చేసి అంబులైన్స్, గిరిజనులకు విద్యాబోధన తదితర సేవలు అందజేసేవారు. గంజాయి స్వాధీనం కొరాపుట్: గంజాయి తరలిస్తున్న వారిని కొరాపుట్ రైల్వే పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. కొరాపుట్ రైల్వే స్టేషన్లో జీఆర్పీ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. పాండిచేరికి చెందిన ప్యాసింజర్లు ఎం.ప్రభాకర్, అజయ్ కదలికలు అనుమానంగా ఉండడంతో వారి బ్యాగులు పరిశీలించగా.. అందులో నాలుగు కిలోల గంజాయి పట్టుబడింది. తమ దుస్తుల మధ్య గంజాయి దాచి పెట్టారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి గంజాయి సీజ్ చేశారు. -
ఆదివారం శ్రీ 19 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
కొరాపుట్ : పలక, బలపం పట్టుకోవాల్సిన చేతులు కత్తిపట్టాయి. ప్రాణం అంటే కూడా ఏంటో తెలియని వయసులో మరో ప్రాణాన్ని బలిగొన్నాయి. ఓ వ్యక్తితో ఉన్న వైరం అతని కుమారుడిని చంపే వరకు వెళ్లింది. ఈ దారుణ ఘటన శనివారం నబరంగ్పూర్ జిల్లా పపడాహండి సమితి తెంతులికుంట్ పంచాయతీ క్రిష్టగుడ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శివ మహురియా కుమారుడు మజేష్ మహురియా(5) శనివారం ఉదయం నుంచి కనిపించలేదు. దీంతో తండ్రి అన్నిచోట్లా వెతికాడు. చివరికి పాడుబడిన ఓ ఇంట్లో మజేష్ మృతదేహం కనిపించింది. శివ రాక చూసి నిందితుడు వెంటనే పక్క గదిలోకి వెళ్లి దాక్కున్నాడు. మృతదేహం పక్కన కత్తి పడి ఉండటాన్ని గుర్తించి వెంటనే గ్రామస్తులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ఆరా తీయగా ఈ దారుణ ఘటనకు పాల్పడినది సమీప బంధువైన 14 ఏళ్ల బాలుడిగా గుర్తించారు. అనంతరం నిందిత బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు. శివకు, నిందితుడికి మధ్య ఇటీవల వివాదం జరిగింది. ఆ కక్ష పెట్టుకుని శివ కుమారుడిని హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందిత బాలుడిని తీసుకెళ్తున్న పోలీసులు మజేష్ మృతదేహం ఘటనా స్థలంలో కత్తి -
విద్యుత్ భద్రతపై అవగాహన యాత్ర
జయపురం: విద్యుత్ వినియోగదారులు, విద్యుత్ ఉద్యోగుల రక్షణ, భద్రతపై అవగాహనకు టీపీఎస్ఓడీఎల్ (టాటా పవర్ సప్లయ్ ఒడిశా డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్) ఉద్యోగి ఇ.సౌమ్యరంజన్ లెంక జయపురం విద్యుత్ ఇంజినీరింగ్ విభాగ కార్యాలయం నుంచి శనివారం సైకిల్ యాత్ర ప్రారంభించారు. ఆయన జయపురం నుంచి వయా బరంపురం మీదుగా బలంగీర్ వరకు సైకిల్ యాత్ర చేస్తారు. జయపురం సర్కిల్ హెడ్ మన్మథనాథ్ మిశ్ర, దేబేస్ పండ, బిశ్వజిత్ మెండులి విద్యుత్ సురక్షా అధికారి ప్రమోద్ కుమార్ బెహరలు పచ్చ జెండా ఊపి సైకిల్ యాత్రను ప్రారంభించారు. విద్యుత్ వినియోగం, విధి నిర్వహణలో ఎల్లప్పుడూ రక్షణ జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు. సైకిల్ యాత్ర మధ్యలో గ్రామాలు, పట్టణాలు, విద్యాలయాలలో సౌరశక్తి సద్వినియోగం, విద్యుత్ సురక్షలపై పాదయాత్ర, సభలు, నిర్వహించి ప్రజలను, విద్యార్థులను సచేతనులను చేసేందుకు ప్రయత్నిస్తానని సైకిల్ యాత్ర నిర్వహిస్తున్న లెంక వెల్లడించారు. కార్యక్రమంలో ఎంఈఆర్టీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సంతోష్ కుమార్ మహంతి, చందన రెడ్డి, రాజేష్ కుమార్ సాహు, పరిమల పాల్, బిచిత్ర కుమార్ బెహర, రంధీర్ సింగ్ పాల్గొన్నారు. -
మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి చేయాలి
రాయగడ: మునిగుడ సమితి పరిధిలోని వివిధ గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు ప్రజా ప్రతనిధులు కృషి చేయాలని వారి వారి ప్రాంతాల్లోని సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించే అవకాశం కలుగుతుందని బీడీవో కృష్ణ చంద్ర దళపతి అన్నారు. స్థానిక సమితి సమావేశం హాల్లో పంచాయతీ సర్పంచ్లు, సమితి, వార్డు సభ్యులతో శనివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. పంచాయతీల్లో వికసిత గ్రామం, వికసిత ఒడిశా పథకాలు సక్రమంగా అమలు జరిగేలా చూడాలన్నారు. గ్రామాలకు అనుసంధానించే రహదారులు, విద్య, వైద్యం అవాస్ గృహాలు వంటి మౌలిక సౌకర్యాలు అందరికీ అందేలా సహకరించాలని అన్నారు. గ్రామీణ గృహ నిర్మాణ యోజన పథకంలో భాగంగా లబ్ధిదారులు సులువుగా పథకాన్ని పొందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమితి అధ్యక్షురాలు దుఖిని నుండ్రుక అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు సంతోష్ సున, జిల్లా పరిషత్ సభ్యులు మాధవీ కొంధొపాణి, సమితి ఉపాధ్యక్షులు ఆదర్శ కులసిక, ఎంపీ ప్రతినిధి రజనీకాంత్ పడాల్ పాల్గొన్నారు. -
అమ్మో భయం!
చెట్టు మీద దెయ్యం.. కొరాపుట్ : కొరాపుట్ జిల్లాలో రెండు రోజులుగా గిరిజనుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఆత్మ చెట్టు (హంటర్ ట్రీ) కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. ఎటువంటి వివాదాలకు తావులేకుండా పోలీసులే ప్రజాప్రతినిధుల సమక్షంలో చెట్టును దగ్ధం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సిమిలిగుడ సమితి సుభయ్ గ్రామంలో ఇద్దరు వ్యక్తులు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆందోళనకు గురైన గ్రామస్తులు మంత్రగాడి వద్దకు వెళ్లారు. అతను పూజలు చేసి గ్రామ శివారులోని చెట్టుపై ఆత్మ ఉందని, చెట్టు కొట్టేసి నదిలో నిమజ్జనం చేయాలని సూచించాడు. దాంతో గ్రామ యువకులు చెట్టును కొట్టేసి ట్రాక్టర్లో వేసి నదిలో వేయడానికి వెళ్లారు. నదిని ఆనుకుని ఉన్న ప్రతి గ్రామంలోనూ స్థానికులు తమ పరిధిలో చెట్టుని నిమజ్జనం చేయడానికి వీళ్లేదని ప్రతిఘటించారు. పలుచోట్ల తమ సంప్రదాయ ఆయుధాలు పట్టుకొని పహారా కాశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ట్రాక్టర్ను స్వాధీనం చేసుకొని స్టేషన్కు తరలించారు. అన్ని గ్రామాల ప్రజలను రప్పించి ప్రజాప్రతినిధుల సమక్షంలో మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించారు. అనంతరం సునాబెడా పోలీస్ స్టేషన్ పరిధిలోనే దగ్ధం చేశారు. -
పర్యావరణంపై చైతన్యం అవసరం
జయపురం: పర్యావరణంపై ప్రజల్లో చైతన్యం అవసరమని వక్తలు అన్నారు. జయపురం తెలుగు సాంస్కృతిక సమితి నిర్వహిస్తున్న సిటీ ఉన్నత పాఠశాల విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలల్లోని పాఠశాలల విద్యార్థులతో కలిసి పర్యావరణ పరిరక్షణపై చైతన్య కార్యక్రమాలకు శనివారం శ్రీకారం చుట్టారు. సిటీ ఉన్నత పాఠశాల విద్యార్థులు సైకిళ్లపై జయపురం సమితి గొడొపొదర్ గ్రామానికి వెళ్లి ఆ గ్రామంలోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని, పారిశుద్ధ్య పరిరక్షణలో గ్రామస్తులను మమేకం చేసి వారిచే మొక్కలు నాటించటం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేలా చూడాలని సూచించారు. ఉభయ పాఠశాలల విద్యార్థులు పర్యావరణంపై ముఖాముఖి చర్చించుకుని ఒకరి అభిప్రాయాలను మరొకరు తెలుసుకున్నారు. అనంతరం సాంస్కృతిక ప్రదర్శణలతో అలరించారు. సిటీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రతాప్ పట్నాయక్ పర్యావరణ ఆవశ్యకతను వివరించారు. గొడొపొదర్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు దిలీప్ పండ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు సిటీ ఉన్నత పాఠశాల విద్యార్థులు చేపట్టిన కార్యక్రమం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమానికి షోషియల్, ఎడ్యుకేషనల్ ఎన్విరాన్మెంటల్ వెల్ఫేర్ అసోసియేషన్ (సీవా) అధ్యక్షులు సుధాకర పట్నాయక్, సీనియర్ సభ్యులు కె.మోహనరావు, జి.వెంకటరెడ్డి సహకరించగా సిటీ స్కూల్ ఉపాధ్యాయులు జి.సాయిశేఖర్, ధనపతి భొత్రలు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. -
ఆశా కార్యకర్తల ఆందోళన
రాయగడ: ఆల్ ఒడిశా ఆశా కార్యకర్తల మహాసంఘం పిలుపు మేరకు జిల్లా ఆశా కార్యకర్తల సంఘం శనివారం ఆందోళన చేపట్టింది. కనీస వేతనం రూ.18 వేలు చెల్లించాలని ఏడీఎం రమేష్ చంద్రనాయక్కు వినతిపత్రం అందజేశారు. ముందుగా గాంధీ పార్క్ నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. సంఘం రాయగడ శాఖ అధ్యక్షురాలు తమల్ సాహుకార్ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీలో భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు జోగేశ్వర్ దాస్, సభ్యుడు అరుణ్కుమార్ లెంక తదితరులు పాల్గొన్నారు. కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా గిరిజన సాంస్కృతిక ఉత్సవం మండయ్–2025 డిసెంబర్ 12వ తేదీ నుంచి ప్రారంభవుతాయని రాష్ట్ర గిరిజన, ప్రాధమిక విద్యా, మైనారిటీ శాఖా మంత్రి నిత్యానంద గొండో ప్రకటించారు. నబరంగ్పూర్ జిల్లా కేంద్రంలోని మిషన్ శక్తి సమావేశ మందిరంలో శనివారం జరిగిన మండయ్ సన్నాహక సమావేశంలో ప్రసంగించారు. ఈ ఉత్సవాలు డిసెంబర్ 16వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. మండయ్ శుభారంభం నవంబర్ 25వ తేదీన ఉమ్మర్కోట్ డివిజన్ డోడ్ర సమీపంలో పుడాఘఢ్ వద్ద ప్రారంభ పూజలు జరుగుతాయన్నారు. అనంతరం పంచాయతీ, సమితి, జిల్లా స్థాయిలో ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల కళాకారులు ముగింపు వేడుకలలో తమ ప్రదర్శనలు ఇస్తారని మంత్రి గొండో ప్రకటించారు. సమావేశంలో నబరంగ్పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి, జిల్లా కలెక్టర్ మహేశ్వర్ స్వయ్, వివిధ శాఖల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, కళాకారులు పాల్గొన్నారు. -
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా రమేష్ సాహు
● జనరల్ సెక్రటరీగా పూర్ణిమా ప్రియ దర్శిని కొరాపుట్: అధికార భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా రమేష్ సాహు నియమితులయ్యారు. నబరంగ్పూర్ జిల్లా ఉమ్మర్ కోట్ పట్టణానికి చెందిన రమేష్ పార్టీ ఆవిర్భాం నుంచి కొనసాగుతున్నారు. గతంలో పార్టీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు రాష్ట్ర పదవులు నిర్వర్తించారు. అలాగే కొరాపుట్ జిల్లాకి చెందిన పూరి ్ణ మా ప్రియ దర్శిని నాయక్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. పూర్ణిమా కొరాపుట్ జిల్లాలో బీజేపీ పటిష్టానికి కృషి చేశారు. గతంలో జిల్లా స్థాయిలో మహిళా విభాగంలో పార్టీకి సేవలు చేశారు.ఉచిత నేత్రవైద్య శిబిరం రాయగడ: సదరు సమితి పరిధిలోని పారిశ్రామిక ప్రాంతమైన జేకే పేపర్ మిల్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సీఎస్ఆర్ సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రాజెక్టు రోషిని ద్వారా గురువారం ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పితామహాల్లోని ఎల్.వి.ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ సహకారంతో నిర్వహించిన వైద్య శిబిరంలో జేకేపూర్ పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులకు పరీక్షించి 23 మందికి క్యాటరాక్ట్, 27 మందికి దష్టిలోపం ఉన్నట్టు వైద్యులు గుర్తించి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం వారికి ఎల్.వి.ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్లో ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించారు. శిబిరంలో విజన్ టెక్నిషియన్ జగదీస్ కొండగొరి, జేకే పేపర్ మిల్ అసిస్టెంట్ మేనేజర్ హరిహర ఖమారి పాల్గొన్నారు. కార్యాలయాల సందర్శన పర్లాకిమిడి: గజపతి జిల్లా కలెక్టర్ మధుమిత శుక్రవారం పర్లాకమిడిలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించారు. జిల్లా ట్రెజరీ, ఆర్టీవో, ఆదర్శ పోలీస్స్టేషన్లను సందర్శించి రికార్డులు పరిశీలించారు. స్థానిక మోడల్పోలీస్స్టేషన్లో సబ్ డివిజనల్ పోలీసు అధికారి మాధవానంద నాయక్, ఐఐసీ ప్రశాంత భూపతితో క్రైం రేటుపై సమీక్షించారు. పౌష్టికాహారంపై అవగాహన కొరాపుట్: పౌష్టికాహారంపై మహిళలకు అవగాహన ఉండాలని నబరంగ్పూర్ మహిళా మహా విద్యాలయం అధ్యాపకురాలు డాక్టర్ సంజుక్త పండా పేర్కొన్నారు. శుక్రవారం మహా విద్యాలయం ఆవరణలో పౌష్టికాహారంపై మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆహార అలవాట్లపై లోపంతో మహిళలు అనారోగ్యం పాలవుతున్నారని తెలిపారు. సంప్రదాయబద్ధంగా వస్తున్న మిల్లెట్ల వినియోగం పెరగాలన్నారు. సమావేశం లో ప్రిన్స్పాల్ మల్లేశ్వరి సాహు, ప్రొఫెసర్ సునితా పాత్రో, ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ సౌర పాల్గొన్నారు. ల్యాప్టాప్ దొంగల అరెస్టు పర్లాకిమిడి: గజపతి జిల్లా మోహన బ్లాక్లో మిషన్ శక్తి కార్యాలయంలో రెండు రోజుల కిందట ల్యాప్టాప్ను కొందరు దొంగిలించారు. మోహన పోలీసు సిబ్బంది దర్యాప్తు చేసి మోహ న బ్లాక్ సంతోషినగర్కు చెందిన ఇద్దరు యువ కులు అంకిత్ నాయక్, అభిజిత్ పాత్రోలను అరెస్టు చేసి శుక్రవారం మోహన కోర్టుకు తరలించినట్టు ఐఐసి శుభ్రాంత్ పండా తెలియజేశారు.


