breaking news
National
-
రీల్స్.. ఐటెం సాంగ్స్.. విజయ్కు ఉదయనిధి స్ట్రాంగ్ కౌంటర్
తమిళనాడు అసెంబ్లీలో అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చ సందర్భంగా.. ముఖ్యమంత్రి విజయ్ ప్రతిపక్షం పేరు ప్రస్తావించకుండానే తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే దీనికి డీఎంకే తరఫున ఉదయనిధి స్టాలిన్.. విజయ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. గత డీఎంకే ప్రభుత్వ పథకాలనే కొత్తగా తమవిగా విజయ్ ప్రచారం చేసుకుంటున్నారని ఉదయనిధి ఆరోపించారు. మహిళా హక్కుల భృతి, పాఠశాల అల్పాహార పథకం.. ఈ పథకాలు డీఎంకే హయాంలోనే ప్రారంభమయ్యాయని, ఇప్పుడు వాటిపై కొత్త ప్రభుత్వం స్టిక్కర్ అతికించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.రాష్ట్రంలో విద్యుత్ కోతలు తీవ్రంగా పెరిగాయని, కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించే పరిస్థితి వచ్చిందని అన్నారు. కావేరీ డెల్టా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మినీ పవర్ కట్ల నుంచి భారీ విద్యుత్ అంతరాయాల వరకు ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. "అన్నా వస్తే పవర్ వస్తుంది అన్నారు.. ఇప్పుడు తమిళనాడుకే పవర్ పోయింది" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.మహిళల భద్రత అంశంపైనా ఉదయనిధి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విజయ్ ప్రభుత్వం ఏర్పడిన నెలరోజుల్లోనే 200కు పైగా లైంగిక నేరాలు నమోదయ్యాయని పేర్కొన్నారు. "మహిళలపై జరుగుతున్న నేరాలు చూస్తుంటే మనం తమిళనాడులో ఉన్నామా? లేదంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోంది" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.అయితే సభలో అత్యంత చర్చనీయాంశంగా మారింది మాత్రం.. సీఎం విజయ్పై ఆయన చేసిన వ్యక్తిగత, రాజకీయ విమర్శలే. "అసెంబ్లీని సినిమా హాల్లా మార్చేశారు. సభలో కూడా నటించడం మొదలుపెట్టారు" అంటూ ఉదయనిధి ఎద్దేవా చేశారు. విజయ్ ప్రసంగాన్ని ఉద్దేశించి.. "విజయ్ నటిస్తుంటే స్పీకర్ కట్ చెబుతున్నారు.. మళ్లీ యాక్షన్ చెప్పగానే మొదలుపెడుతున్నారు" అని ఉదయ్నిధి వ్యాఖ్యానించారు.అంతేకాదు, "రేపటి నుంచి విజయ్ అసెంబ్లీకి క్యార్వాన్, మేకప్ మ్యాన్, ఫైట్ మాస్టర్లను కూడా తీసుకొస్తారేమో’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ట్రెండ్ కావడానికే అసెంబ్లీని వాడుకుంటున్నారు. రీల్స్ చేసుకోవడానికే వస్తున్నారా? పాలనపై బాధ్యత లేదా? అంటూ వరుస ప్రశ్నలు సంధించారు. సభలో విజిల్స్ వేయడం కనిపిస్తోంది. రేపు ఎమ్మెల్యేలతో ఐటెం సాంగ్స్కు డ్యాన్సులు చేయిస్తారేమో అంటూ ఉదయ్నిధి, టీవీకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.ఇదిలా ఉంటే అంతకు ముందు సీఎం విజయ్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అవినీతిపై విచారణలు కొనసాగుతాయని, తప్పు చేసిన వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. "మాది యాక్టర్ పార్టీ అని ఎగతాళి చేశారు. కానీ ప్రజల మధ్య నుంచే వచ్చి ఈ స్థాయికి చేరుకున్నాం" అంటూ విమర్శలకు సమాధానం ఇచ్చారు.అయితే.. ఉదయ్నిధి వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అధవ్ అర్జున్.. పార్టీ పేరు కూడా చెప్పకుండానే కొందరు ఉలిక్కిపడుతున్నారని వ్యాఖ్యానించారు. అవినీతి జరిగి ఉంటే ఆ డబ్బంతా తిరిగి ప్రభుత్వ ఖజానాకు చేరుస్తామని చెప్పారు. తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.మొత్తానికి తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు అధికార టీవీకే ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం డీఎంకే మధ్య రాజకీయ పోరుకు వేదికగా మారాయి. సీఎం విజయ్ విమర్శలు.. ఉదయనిధి చేసిన ప్రతివిమర్శలు.. వాటికి అధికార పక్షం ఇచ్చిన కౌంటర్లు ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. -
అర్ధరాత్రి పోలీసుల రహస్య పూజలు..స్టేషన్లో మేక బలి!
సాక్షి, చెన్నై : తమిళనాడులోని సేలం జిల్లా ఓమలూరు సమీపంలో ఉన్న తీవట్టిపట్టి పోలీస్ స్టేషన్లో చోటుచేసుకున్న ఒక వింత ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది. పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలను తగ్గించడం కోసమంటూ.. పోలీసులు అర్ధరాత్రి దాటిన తర్వాత రహస్యంగా మేకను బలి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించడం వెలుగులోకి వచ్చింది. తివట్టిపట్టి పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం ఇన్స్పెక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో, సబ్–ఇన్స్పెక్టర్లు , కొందరు సిబ్బంది కలిసి ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం వేకువ జాము వరకు పోలీసు స్టేషన్లో రహస్యంగా పూజలు నిర్వహించారు. ఒక మేకను బలి ఇచ్చి, దాని రక్తాన్ని పోలీస్ స్టేషన్ ముఖద్వారం వద్ద చల్లారు. రక్షణ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్లోనే ఇలా జంతు బలి ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవడంతో, ఈ వ్యవహారంపై పోలీస్ ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారుల విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇటీవల కాలంగా పోలీసు స్టేషన్ పరిధిలో నేరాలు ఎక్కువగా జరుగుతుండటం, తమకు విశ్రాంతి, సెలవులు కూడా లేకుండా ఉక్కిరి బిక్కిరి అయ్యేపరిస్థితి ఉండటంతోనే ఈ పూజలలో లీనమైనట్టుగా అక్కడి సిబ్బంది వాపోవడం గమనార్హం. -
డైపర్ల విరాళాల ఉద్యమం చేపట్టిన కాక్రోచ్ జనతా పార్టీ
న్యూఢిల్లీ: ‘నీట్’ పేపర్ లీకేజీ వ్యవహారం దేశ రాజధానిలో తీవ్ర దుమారం రేపుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన ప్రదర్శనలు మంగళవారంతో నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో, పేపర్ లీకేజీలపై తమ నిరసనను మరింత ఉధృతం చేసేందుకు ఆందోళనకారులు ‘డైపర్ ఏ డే కీప్స్ లీక్స్ అవే’ (రోజుకో డైపర్ లీకేజీలను అడ్డుకుంటుంది) అనే నినాదంతో ఒక వినూత్నమైన ‘డైపర్ల విరాళాల ఉద్యమాన్ని’ ప్రారంభించారు. జంతర్ మంతర్ వద్దకు వచ్చే వారు ఒక డైపర్ను తీసుకొచ్చి, దానిపై మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్ను రాసి ఇవ్వాలని, వాటిని విద్యాశాఖ మంత్రికి అందజేస్తామని నిరసనకారులు ప్రకటించారు.ఉధృతమవుతున్న ఆందోళనలు గత శనివారం మధ్యాహ్నం ప్రారంభమైన ఈ ధర్నా కార్యక్రమం రేయింబవళ్లు కొనసాగుతోంది. భారీగా పోలీసులు మోహరించినప్పటికీ, విద్యార్థులు, మద్దతుదారులు రాత్రి వేళల్లో కూడా నిరసన స్థలంలోనే బస చేస్తున్నారు. సోమవారం రాత్రి, నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల స్మారకార్థం జంతర్ మంతర్ వద్ద కొవ్వొత్తులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. తొలుత పోలీసులు ఈ కొవ్వొత్తుల ప్రదర్శనకు అనుమతించలేదని, ఆ తర్వాత అనుమతి లభించిందని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తెలిపారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు ఈ పోరాటం ఆగేది లేదని నిరసనకారులు స్పష్టం చేశారు.పరీక్షా కేంద్రాలకు కొన్ని నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను రీ-టెస్ట్ రాయడానికి అనుమతించకుండా అధికారులు కఠినంగా వ్యవహరించారని, కానీ ఇంత పెద్ద పేపర్ లీకేజీకి కారణమైన వారిపై మాత్రం చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని అభిజీత్ దిప్కే తీవ్రంగా విమర్శించారు. తప్పు చేసిన వారిని వదిలేసి, అమాయక విద్యార్థులను అధికారులు వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆదివారం జరిగిన రీ-టెస్ట్కు హాజరైన పలువురు నీట్ అభ్యర్థులు కూడా ఈ నిరసనల్లో పాల్గొని తమ చేదు అనుభవాలను పంచుకున్నారు. పరీక్షా విధానంలో పారదర్శకత తీసుకురావాలని డిమాండ్ చేస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా జంతర్ మంతర్ వద్దకు వచ్చి విద్యార్థుల బాధలను ఆలకించాలని వారు విజ్ఞప్తి చేశారు.తనిఖీల వివాదం – పోలీసుల వివరణఈ నిరసనల్లో ఎస్ఎఫ్ఐ, ఐసా, ఏఐఎస్ఎఫ్ వంటి వామపక్ష విద్యార్థి సంఘాలు కూడా పాల్గొన్నాయి. విద్యార్థుల కోసం నిరసన స్థలంలోనే ఒక ఉచిత గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. కాగా, ధర్నాలో పాల్గొనకుండా విద్యార్థులను అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు వారి ఆధార్ కార్డులను, చిరునామా వివరాలను సేకరిస్తున్నారని అభిజీత్ దిప్కే ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను ఢిల్లీ పోలీసులు పూర్తిగా ఖండించారు. తాము జంతర్ మంతర్ వద్ద ఎలాంటి ఆధార్ తనిఖీలు చేపట్టలేదని, అటువంటి వివరాలేవీ సేకరించలేదని, ఆ ఆరోపణలన్నీ వాస్తవ విరుద్ధమని పోలీసులు స్పష్టం చేశారు. -
షాక్ అనాలా?.. అద్భుతం అనాలా??.. 'ఇది నా పేపర్ కాదు' అనుకుంది!
ఆమెకు 95.2 శాతం మార్కులు వచ్చాయి. చాలా మంది విద్యార్థులకు అది కలల ఫలితమే. కుటుంబ సభ్యులు కూడా సంతోషించారు. కానీ ఆ విద్యార్థిని మాత్రం సంతృప్తి చెందలేదు. తన సమాధాన పత్రాల్లో ఎక్కడో పొరపాటు జరిగిందనే నమ్మకంతో రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసింది. ఆ తర్వాత వచ్చిన ఫలితం చూసి ఆమె మాత్రమే కాదు.. విద్యా వర్గాలే ఆశ్చర్యపోయాయి. ఏకంగా 24 మార్కులు పెరిగి.. దేశ టాపర్ల సరసన నిలిచింది. ఈ అద్భుత ఘనత సాధించింది ఝార్ఖండ్లోని రాంచీకి చెందిన అవనీ కేజ్రీవాల్. డీపీఎస్ సేల్ టౌన్షిప్ స్కూల్లో కామర్స్ విద్యార్థినిగా చదివిన ఆమె, సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో తొలుత 95.2 శాతం మార్కులు సాధించింది. ఫలితాలు బాగానే ఉన్నప్పటికీ తన ప్రదర్శనకు వచ్చిన మార్కులు సరిపోవని భావించిన అవనీ, సమాధాన పత్రాల రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసింది. అక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. రీవాల్యుయేషన్ అనంతరం ఆమె మార్కులు ఏకంగా 24 పెరిగాయి. దీంతో ఇంగ్లీష్ కోర్, అకౌంటెన్సీ, బిజినెస్ స్టడీస్, ఎకనామిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో పూర్తి మార్కులు సాధించి 500కి 500 స్కోర్తో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. అదనపు సబ్జెక్ట్గా తీసుకున్న గ్రాఫిక్స్లో కూడా 99 మార్కులు సాధించింది.ఫలితాలు ప్రకటించిన రోజే తనకు పూర్తి సంతృప్తి కలగలేదని అవనీ చెబుతోంది. ఏడాది పొడవునా తాను పడిన కష్టానికి తగిన ఫలితం రాలేదని భావించానని, అందుకే రీవాల్యుయేషన్కు వెళ్లానని తెలిపింది. తన సమాధానాలపై, తన శ్రమపై ఉన్న నమ్మకమే ఈ నిర్ణయం తీసుకునేలా చేసిందని చెప్పింది.అవనీ విజయ రహస్యం కూడా ఆసక్తికరంగానే ఉంది. రోజుకు ఎన్ని గంటలు చదివానన్నది కాదు.. ఎన్ని లక్ష్యాలు పూర్తి చేశానన్నదే ముఖ్యమని ఆమె చెబుతోంది. ప్రతిరోజూ రెండు లేదా మూడు టాపిక్లు పూర్తి చేయాలని నిర్ణయించుకుని, అవి పూర్తయ్యే వరకు క్రమశిక్షణతో చదివేదాన్నని తెలిపింది. సోషల్ మీడియా విషయంలోనూ విద్యార్థులకు ఆమె ఒక సందేశం ఇచ్చింది. దాన్ని పూర్తిగా దూరం పెట్టాల్సిన అవసరం లేదని, కానీ చదువుకు ఆటంకం కలిగించకుండా పరిమితంగా ఉపయోగించాలని సూచించింది.వ్యాపారవేత్త మితేష్ కేజ్రీవాల్, గృహిణి పూనమ్ కేజ్రీవాల్ దంపతుల కుమార్తె అయిన అవనీ.. భవిష్యత్తులో బిజినెస్ మేనేజ్మెంట్లో ఉన్నత విద్యను అభ్యసించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే సీయూఈటీ-యూజీ 2026 పరీక్ష కూడా రాసింది. భవిష్యత్తులో సొంత వ్యాపారాన్ని స్థాపించి విజయవంతమైన ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలని కలలు కంటోంది.అవనీ సాధించిన ఈ ఘనతపై పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. ఆమె విజయం వేలాది మంది విద్యార్థులకు స్ఫూర్తినిస్తుందని పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జయా చౌహాన్ పేర్కొన్నారు.ఒక రీవాల్యుయేషన్ అభ్యర్థన.. 24 అదనపు మార్కులు.. 95.2 శాతం నుంచి పర్ఫెక్ట్ 100 శాతం. అవనీ కథ ఇప్పుడు దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఒక సందేశంగా మారింది. ఫలితంపై సందేహం ఉంటే వదిలేయకుండా.. తమ కృషిపై నమ్మకంతో ముందడుగు వేయాలని ఆమె విజయం చెబుతోంది. -
రూ.50 లక్షల సుపారీతో జిమ్ ట్రైనర్ హత్య?
కర్ణాటక : జిమ్ ట్రైనర్ విజయ్ హత్య కేసులో ఒక పలుకుబడి ఉన్న వ్యాపారవేత్త ప్రమేయం ఉందని మృతుని కుటుంబం ఆరోపణలు చేసింది. మరోవైపు పోలీసులు ఆదివారంనాడు నలుగురిని అరెస్ట్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వివరాలు.. కోలారు జిల్లా, ముళబాగిలుæకు చెందిన జిమ్ ట్రైనర్ విజయ్ యాదవ్ (35), బన్నేరుఘట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జూన్ 10న రాగిహళ్లి సమీపంలో అతని మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో లభ్యమైంది. పోలీసులు విచారణ చేపట్టి సాంకేతిక ఆధారాల ఆధారంగా శ్రీరామ్, సుమిత్, వెంకటేశయ్య, బాబు అనే నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఏం జరిగిందంటే... విజయ్ బంధువు, న్యాయవాది వాసుదేవరెడ్డి ఈ కేసుపై స్పందిస్తూ, ‘విజయ్ కోలారు జిల్లాలోని ముళబాగిలువాసి. సుమారు ఏడాది క్రితం బెంగళూరుకు వచ్చి అక్కడే ఉంటూ జిమ్ట్రైనర్గా పనిచేస్తున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న విజయ్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, అతనికి జిమ్లో ఒక యువతితో పరిచయమైనట్లు తెలిసింది. ఆ యువతి తండ్రి ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరుకు చెందిన ప్రముఖ రియల్టర్– వ్యాపారవేత్త. తన కూతురితో మాట్లాడవద్దని అతడు విజయ్ను తీవ్రంగా హెచ్చరించాడు. దీంతో విజయ్ సొంతూరికి వెళ్లిపోయాడు. ఆ యువతి విజయ్ను వెతుకుతూ ముళబాగిలుకి వచ్చింది. అంతకుముందు, ఆ యువతి, విజయ్ 21 రోజుల పాటు ఉత్తర భారతదేశంలో టూర్కి వెళ్లారు. కే.ఆర్.పురం పోలీస్స్టేషన్లో యువతి అదృశ్యం కేసు కూడా నమోదైంది. విజయ్ బెంగళూరు విడిచి వెళ్లాలని ఆమె తండ్రి తీవ్రంగా హెచ్చరించాడు. ఇదంతా చూసి విజయ్ భార్య విడాకులు, భరణం కోసం కేసు దాఖలు చేసింది, అది కోర్టులో విచారణలో ఉంది. ఆర్థిక ఇబ్బందుల్లో పడిన విజయ్, బెంగళూరు కె.ఆర్.పురానికి తిరిగి వచ్చి ఒక జిమ్లో ట్రైనర్గా చేరాడు. ఈ హత్యకు పాల్పడిన వారు రౌడీషీటర్లు. వారికి ఆ యువతి తండ్రి రూ.25 లక్షల నుంచి 50 లక్షల సుపారి ఇచ్చి హత్య చేయించాడు. కొంతమంది న్యాయవాదులు ఈ సుపారీని కుదిర్చారు. ఈ హత్య వెనుక ఆ న్యాయవాదులే ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది. ఆ న్యాయవాదులను కూడా అరెస్టు చేయాలి’ అని వాసుదేవ రెడ్డి డిమాండ్ చేశారు. డీఐజీ ఎస్. గిరీష్ స్పందిస్తూ, ‘ఈ హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశాం. వారిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ జరుపుతాం,‘ అని తెలిపారు. -
టెలిగ్రామ్ సేవలు పునఃప్రారంభం
సాక్షి, ఢిల్లీ: దేశంలో టెలిగ్రామ్ సేవలు మళ్లీ పునఃప్రారంభమయ్యాయి. జూన్ 21న జరిగిన నీట్ రీఎగ్జామ్ రీత్యా భద్రతా కారణాలతో టెలిగ్రామ్ సేవలను జూన్ 22వరకూ టెలిగ్రామ్ యాక్సెస్ తాత్కాలికంగా కేంద్రం నిలిపివేసింది. ఎగ్జామ్ ముగియడంతో సేవలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అదే విధంగా ఈ నెల 30 వరకు టెలిగ్రామ్లోని ఎడిట్ ఆఫ్షన్ తొలిగింపు కొనసాగనుంది. పేపర్ లీక్ మోసాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.జూన్ 21న నీట్ ఎగ్జామ్ ప్రశాతంగా ముగిసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారిక గణాంకాల ప్రకారం పునఃపరీక్షకు దేశవ్యాప్తంగా 20 లక్షల కంటే ఎక్కువ మంది విద్యార్థులు హజరైనట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో నీట్ పరీక్షను దాదాపు 3.65 లక్షల మంది విద్యార్థులు రాశారు. కొన్ని ప్రాంతాలలో విద్యార్థులు సమయానికి రాకపోవడంతో విద్యార్థులను పరీక్ష కేంద్రాలలోకి అనుమతించలేదు. దీంతో వారు పరీక్షకు అనుమతించాలని తీవ్రంగా విలపించారు. ఇలాంటి చిన్న చిన్న ఘటనలు మినహా ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది -
అడ్రస్ మారితే చెప్పాల్సిందే!
సాక్షి, న్యూఢిల్లీ: నివాస చిరునామా మారినప్పుడు ఆ విషయాన్ని యాజమాన్యానికి తెలియజేయాల్సిన బాధ్యత ఉద్యోగిదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అడ్రస్ అప్డేట్ చేయకపోవడం వల్ల పాత చిరునామాకు పంపిన షోకాజ్ నోటీస్ అందలేదని, అందువల్ల తనపై తీసుకున్న చర్యలు చెల్లవంటూ వాదించడాన్ని అంగీకరించలేమని తేల్చిచెప్పింది. ముందుగా అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన ఓ ఉద్యోగిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ లేబర్ కోర్టు, అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రిఫిలిస్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో పనిచేసే అర్జున్ గుప్తా అనే ఉద్యోగి అనుమతి లేకుండా 24 రోజులు విధులకు గైర్హాజరయ్యాడు. దీంతో యాజమాన్యం అతని సొంత రాష్ట్రం బిహార్లోని చిరునామాకు షోకాజ్ నోటీసు పంపింది. అయితే, అప్పటికే నోయిడాకు మకాం మార్చానని, ఆ నోటీసు అందలేదని పిటిషనర్ వాదించాడు. తల్లికి అనారోగ్యం వల్లే తాను విధులకు హాజరుకాలేదని పేర్కొన్నాడు. దీనిపై విచారించిన లేబర్ కోర్టు, అలహాబాద్ హైకోర్టు ఉద్యోగికి అనుకూలంగా తీర్పునివ్వగా యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఉద్యోగి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరయ్యాడని, తల్లి అనారోగ్యానికి ఆధారాలు చూపలేదని యాజమాన్యం వాదించింది. అయితే, చిరునామా మారినందున నోటీసు అందలేదని, విధుల్లోకి చేరనివ్వకపోవడం చట్టవిరుద్ధమని ఉద్యోగి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ అప్పీల్ను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం విచారించింది. ‘రికార్డుల్లో ఉన్న చిరునామాకే యాజమాన్యం సమాచారం పంపుతుంది. అడ్రస్ మారినప్పుడు చెప్పాల్సిన బాధ్యత ఉద్యోగిదే. తన వైఫల్యాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉద్యోగికి ఇవ్వలేం. తల్లి అనారోగ్యానికి సంబంధించి కనీస వైద్య ఆధారాలను కూడా సమర్పించలేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తగిన ఆధారాలు లేకుండానే ఉద్యోగికి అనుకూలంగా కింది కోర్టులు ఇచ్చిన తీర్పులను ధర్మాసనం రద్దు చేసింది. సదరు ఉద్యోగిని విధుల నుంచి తొలగిస్తూ కంపెనీ తీసుకున్న నిర్ణయం చట్టబద్ధమేనని తీర్పు వెలువరించింది. -
సమాధిని తవ్వి బంగారు గొలుసు చోరీ
కోయంబత్తూరు: తమిళనాడులోని కోయంబత్తూరులో మానవత్వానికి మచ్చతెచ్చేలాంటి ఘటన వెలుగుచూసింది. చనిపోయిన ఒక చేపల వ్యాపారి సమాధిని గుర్తుతెలియని దుండగులు అర్ధరాత్రి వేళ తవ్వి, అతడి మృతదేహంపై ఉన్న బంగారు గొలుసును దొంగిలించారు. కుటుంబ సభ్యులు మృతుడితో పాటే పూడ్చిపెట్టిన ఆభరణాన్ని ఇలా కిరాతకంగా దోచుకెళ్లడం స్థానికంగా కలకలం రేపింది. ఈ అమానుష చర్యతో దిగ్భ్రాంతికి గురైన కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పీళమేడు పోలీసులు కేసు నమోదు చేసుకుని, ముగ్గురు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.సెంటిమెంట్గా బంగారు గొలుసుకోయంబత్తూరు సౌరిపాళ్యం ప్రాంతానికి చెందిన 60 ఏళ్ల నాగరాజ్ చేపల వ్యాపారం చేస్తూ జీవించాడు. అనారోగ్య కారణాలతో ఆయన జూన్ 6న మరణించగా, మరుసటి రోజే కుటుంబ సభ్యులు స్థానిక శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. నాగరాజ్కు తాను ఎప్పుడూ ధరించే చేప ఆకారపు పెండెంట్ ఉన్న బంగారు గొలుసు అంటే ఎంతో ఇష్టం. ఆ సెంటిమెంట్తో, ఆయన చివరి కోరికను గౌరవిస్తూ, కుటుంబ సభ్యులు ఆ గొలుసును తీయకుండానే నాగరాజ్ మృతదేహంతో పాటు పూడ్చిపెట్టారు.16వ రోజు బయటపడిన దారుణంనాగరాజ్ మరణించిన 16వ రోజు అంత్యక్రియల ఆచారాలను నిర్వహించడానికి ఆయన కుమారుడు వెంకటేష్ కుమార్, ఇతర బంధువులు శ్మశానవాటికకు వెళ్లారు. అక్కడ సమాధి చుట్టూ ఉన్న మట్టిని ఎవరో తవ్వినట్లు గమనించి వారికి అనుమానం వచ్చింది. దీంతో వారు అక్కడ విచారించగా, శ్మశానవాటిక కేర్టేకర్గా పనిచేస్తున్న 27 ఏళ్ల కార్తికేయన్ అసలు విషయం బయటపెట్టాడు. ఇద్దరు స్థానిక వ్యక్తులు రాత్రి వేళ వచ్చి సమాధిని తవ్వి, మృతదేహం నుంచి సుమారు 24 గ్రాముల బరువున్న బంగారు గొలుసును దొంగిలించి పారిపోయారని తెలిసింది.పోలీసులకు ఫిర్యాదు ఈ దారుణ ఘటనపై మృతుడి కుమారుడు వెంకటేష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పీళమేడు పోలీసులు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ దొంగతనంలో శ్మశానవాటిక కేర్టేకర్ కార్తికేయన్ పాత్రపై కూడా పోలీసులు నిఘా పెట్టారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. -
నీట్పై సీఎం విజయ్ సంచలన వ్యాఖ్యలు
చైన్నై: నీట్ పరీక్షపై తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైద్య అర్హత పరీక్షలకు దేశవ్యాప్తంగా నీట్ ఒక్కటే అర్హత పరీక్షగా ఉందని తద్వారా అది అనేక వివాదాలకు మూలంగా నిలిచిందన్నారు. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు. విజయ్ సీఎం హోదాలో తొలిసారిగా ఈ రోజు (మంగళవారం) ఆ రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడారు. విజయ్ మాట్లాడుతూ" గత కొన్నేళ్లుగా నీట్ పరీక్ష అనేక వివాదాలకు మూలంగా ఉంది. ఒత్తిడి కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం మొదలుకొని, దేశంలో వైద్య విద్య విశ్వసనీయతను దెబ్బతీసేలా ప్రశ్నపత్రాలు లీకవడం వరకు ఈ వివాదం కొనసాగింది. ఈ పరీక్షను రద్దు చేసి, 12వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లను కేటాయించాలని తమిళనాడు పదేపదే పిలుపునిచ్చింది". అని అన్నారు. ప్రస్తుతం వివిధ రాష్ట్రాలలో అమలులో ఉన్న రెండు భాషల విధానం, అంటే తమిళం (రాష్ట్ర భాషగా), ఇంగ్లీష్ (ప్రపంచ భాషగా) సరిపోతుందని నొక్కి చెప్పారు.కరూర్ తొక్కిసలాటకరూర్ తొక్కిసలాటపై ఆయన మాట్లాడుతూ "41 మంది ప్రాణాలు కోల్పోయిన ఆ విషాదం గురించి నా బాధను నేను మాటల్లో చెప్పలేను. ఆ బాధ నన్ను ఎప్పటికీ వదిలిపెట్టదు. కానీ ఆ నిందను కూడా మాపై వేస్తున్నారు. ఇది దారుణం. రాజకీయాలు ఇంత క్రూరంగా ఉంటాయా అని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ విజయంపై విజయ్ ప్రసంగిస్తూ " ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ అన్ని కష్టాలను అధిగమించి విజయం సాధించిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే గెలవడానికి అనేక కుట్రలను, ఆంక్షలను అధిగమించాల్సి వచ్చిందని తెలిపారు.తమిళనాడు ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకోవడానికి మేము పడిన కష్టాలు మాకు మాత్రమే తెలుసు… కానీ ఇదంతా తెలిసినప్పటికీ, కొందరు ఏమీ అర్థం కానట్టు నటిస్తూ, అతను కేవలం ఒక నటుడు, పార్టీ కూడా నటుల పార్టీనే అని ఎగతాలిగా మమ్మల్ని విమర్శిస్తారు. ఈ విజయం కోసం ఎన్నో కుట్రలను, కుతంత్రాలను అధిగమించి విజయం సాధించాం. " అని విజయ్ అన్నారు.డీఎంకే అవినీతిఇది వరకూ ప్రభుత్వం డీఎంకేలా తాము అవినీతి చేయబోమని పార్టీ ఫండ్స్ కోసం టాస్మాక్ ఆదాయాన్ని డీఎంకే లూటీ చేసిందని ఆరోపించారు. ద్విబాషా విధానానికే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తేల్చిచెప్పారు.కాగా ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన వెంటనే విజయ్ పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవలే రైతులకు భారీ స్థాయిలో రుణమాఫీ ప్రకటించారు. అదేవిధంగా మరెన్నో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ అనూహ్య విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తారుమారు చేస్తూ ఆ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అనంతరం కొద్ది రోజల పాటు గవర్నర్ వ్యవహారంతో డ్రామా నడిచిన మిత్రపక్షాల సహాయంతో ఎట్టకేలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో తొలిసారిగా సీఎం హోదాలో ప్రసంగించారు. -
ముంబై: మరో 48 గంటల్లో రుతుపవనాలు!
ముంబై: ముంబై నగరవాసుల సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడనుంది. గత కొంతకాలంగా మందగించిన నైరుతి రుతుపవనాలు మళ్లీ పుంజుకున్నాయి. రాబోయే 48 గంటల్లో రుతుపవనాలు ముంబై సహా మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం నగరంలో కురిసిన వర్షాలు ముందస్తు రుతుపవన జల్లులేనని స్పష్టం చేసిన అధికారులు, రానున్న రెండు రోజుల్లో అధికారికంగా రుతుపవనాల రాకను ప్రకటించే అవకాశం ఉందని తెలపడంతో తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్న జనానికి పెద్ద ఊరట లభించినట్లయింది.పుంజుకున్న రుతుపవనాలుఅరేబియా సముద్రం, బెంగాళాఖాతంలో బలహీనమైన వాతావరణ వ్యవస్థలు, ఎల్ నినో ప్రభావం వల్ల ఈ ఏడాది రుతుపవనాల రాక ఆలస్యమైంది. సాధారణంగా జూన్ 11 నాటికే ముంబైని తాకాల్సిన రుతుపవనాలు, గత వారం రోజులుగా మరింత మందగించాయి. అయితే, తాజా పరిణామాల ప్రకారం పశ్చిమ తీరం వెంబడి రుతుపవన వ్యవస్థ మళ్లీ బలాన్ని పుంజుకుంటోంది. ఇప్పటికే మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, బీహార్లలోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని, రాబోయే రెండు రోజుల్లో ఈ పురోగతి మరింత వేగవంతం కానుందని వాతావరణ శాఖ పేర్కొంది.వేగాన్ని నియంత్రిస్తున్న అల్పపీడనంరుతుపవనాలు మళ్లీ కదిలినప్పటికీ, వాటి ప్రయాణం సాధారణం కంటే నెమ్మదిగానే సాగుతోందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఈ సమయంలో వర్షాలను తీవ్రం చేసే బెంగాళాఖాతంలోని అల్పపీడన వ్యవస్థ ఇంకా ఏర్పడకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. జూన్ చివరి నాటికి మాత్రమే ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఆలస్యం కారణంగా ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ వంటి ఉత్తరాది రాష్ట్రాలకు రుతుపవనాల రాక మరింత ఆలస్యమై, జూలై మొదటి వారంలో అక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది.దేశవ్యాప్తంగా 43 శాతం వర్షపాత లోటుప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షపాత లోటు ఆందోళనకరంగానే ఉంది. ఈ సీజన్లో ఇప్పటివరకు సాధారణంగా కురవాల్సిన 106 మిమీ వర్షపాతానికి గానూ కేవలం 60.6 మిమీ మాత్రమే నమోదైంది. అంటే దేశవ్యాప్తంగా 43 శాతం వర్షపాత లోటు నెలకొంది. ఇందులో మధ్య భారతదేశం అత్యధికంగా 67 శాతం లోటుతో అతలాకుతలమవుతుండగా, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో 40 శాతం, దక్షిణ భారతదేశంలో 28 శాతం, వాయువ్య భారతదేశంలో 15 శాతం మేర వర్షపాత లోటు నమోదైంది. రాబోయే 48 గంటల్లో ముంబైలోకి రుతుపవనాల ప్రవేశం దేశవ్యాప్త వర్షాలపై సానుకూల ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. -
లక్నో అగ్నిప్రమాదం: మరణంలోనూ వీడని స్నేహబంధం!
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఆలీగంజ్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం 15 మందిని బలితీసుకుంది. ఈ ప్రమాదంలో కాన్పూర్కు చెందిన ఇద్దరు ప్రాణస్నేహితులు, యానిమేషన్ స్టూడియో సహోద్యోగులు అయిన సంయమ్ విజ్ (28), సూరజ్భన్ సింగ్ (25) కూడా మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.నాన్నమ్మ అంత్యక్రియలకు రావాల్సిన వాడు..కాన్పూర్లోని గోవింద్ నగర్ బ్లాక్-11 నివాసి అయిన సంయమ్ విజ్ కుటుంబం ఇప్పటికే శోకంలో మునిగి ఉంది. ఇటీవలే సంయమ్ నానమ్మ మరణించగా, మంగళవారం రోజున ఆమె 13వ రోజు ఆబ్ధికం జరగాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సంయమ్ లక్నో నుంచి ఇంటికి రావాల్సి ఉండగా, అంతలోనే అతను మరణించాడనే వార్త కుటుంబ సభ్యులను కుదిపేసింది. కొన్ని సంవత్సరాల క్రితమే తండ్రి పుష్పరాజ్ విజ్ మరణించడంతో, సంయమ్ ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూ వస్తున్నాడు.తల్లికి తెలియని కొడుకు మరణవార్తమరో మృతుడు కాన్పూర్ బర్రా-7 నివాసి అయిన సూరజ్భన్ సింగ్ కథ కూడా గుండెల్ని పిండేసేలా ఉంది. తండ్రి లేని ఆ కుటుంబంలో తల్లి మీరా దేవి, తమ్ముడు సామ్రాట్లకు సూరజ్భనే ప్రధాన ఆధారం. ప్రతి వారాంతంలో ఇంటికి వచ్చే సూరజ్భన్, ఆదివారమే తిరిగి లక్నోలో విధులకు హాజరయ్యాడు. అదే తన చివరి ప్రయాణం అవుతుందని ఎవరూ ఊహించలేదు. కొడుకు మరణవార్త వింటే ఎక్కడ గుండె పగిలిపోతుందోనని, ఆమె అనారోగ్యానికి గురవుతుందనే భయంతో బంధువులు ఇప్పటివరకు ఆ తల్లికి ఈ చేదు నిజం చెప్పలేదు.మరణంలోనూ విడిపోని స్నేహంసంయమ్, సూరజ్భన్ ఇద్దరూ చిన్నప్పటి నుంచి ప్రాణస్నేహితులు. కలిసి చదువుకున్నారు. ఒకే యానిమేషన్ స్టూడియోలో ఉద్యోగంలో చేరారు. చివరకు మరణంలోనూ కలిసేవున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఇద్దరు యువ నిపుణులు ఇలా అకాల మరణం చెందడంతో స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. పెళ్లిళ్లు, కుటుంబ వేడుకల గురించి చర్చించుకోవాల్సిన ఇళ్లలో ఇప్పుడు అంత్యక్రియల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది కూడా చదవండి: లక్నో అగ్ని ప్రమాదం: భవనం వెనుక విస్తుపోయే నిజాలు! -
టీఎంసీ సంక్షోభం.. అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలు!
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో తిరుగుబాటు వర్గాలు పార్టీ మమతా బెనర్జీకి షాక్ల మీద షాకులు ఇస్తున్నాయి. ఇప్పటికే ఎంపీల వర్గం విలీనం పేరుతో వేరు కుంపటి పెట్టుకున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యేల వర్గం ఆమెను పార్టీ చైర్పర్సన్ పదవి నుంచి తొలగించినట్లు ప్రకటించడమే కాకుండా.. కొత్త నాయకత్వ నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించుకుంది. అంతేకాదు ఈ విషయమై ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తామని కూడా చెబుతోంది. దీంతో టీఎంసీలో అంతర్గత సంక్షోభం మరో మలుపు తిరిగినట్లైంది.ప్రతిపక్ష నేత(తాత్కాలిక) రితబ్రత బెనర్జీ (Ritabrata Banerjee) నేతృత్వంలోని అసంతృప్త వర్గం సోమవారం కోల్కతాలోని న్యూ టౌన్లో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, కౌన్సిలర్లు సహా దాదాపు 500 మంది టీఎంసీ నాయకులు హాజరైనట్లు తిరుగుబాటు వర్గం ప్రకటించింది. ఈ సమావేశంలో 30 మంది సభ్యులతో కూడిన జాతీయ కార్యవర్గాన్ని (National Working Committee) ఏర్పాటు చేస్తూ, తామే అసలైన తృణమూల్ కాంగ్రెస్ అని ప్రకటించారు.కొత్త అధినేత అరూప్ రాయ్సమావేశంలో ఎమ్మెల్యే అనూప్ రాయ్ను కొత్త చీఫ్గా ఎన్నుకున్నట్లు తిరుగుబాటు వర్గం వెల్లడించింది. అలాగే మాజీ కోల్కతా మేయర్ ఫర్హిద్ హకీమ్ , అరోప్ బిశ్వాస్, రతిన్ ఘోష్, సబీనా యాస్మిన్లను ఉపాధ్యక్షులుగా నియమించారు. రితబ్రత బెనర్జీ, జావేద్ ఖాన్, సందీపన్ సాహాలను ప్రధాన కార్యదర్శులుగా, అఖ్రుజ్జమాన్ అన్సారిని ఖజానాదారుగా నియమించినట్లు ప్రకటించారు.ఎవరీ అరూప్?అరూప్ రాయ్ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. హౌరా ప్రాంతానికి చెందిన ఆయన, తృణమూల్ కాంగ్రెస్ ఆవిర్భావం నుంచి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. హౌరా సెంట్రల్ నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన, మమత ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశారు. ప్రస్తుతం టీఎంసీలో తిరుగుబాటు వర్గం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో అరూప్ రాయ్ను పార్టీ చైర్పర్సన్గా ఎన్నుకున్నట్లు ప్రకటించడం రాజకీయంగా సంచలనంగా మారింది. ఒకప్పుడు మమతకు నమ్మినబంటుగా ఉన్న నేతే ఇప్పుడు ఆమెకు ప్రత్యామ్నాయ నాయకుడిగా ముందుకు రావడం చర్చనీయాంశంగా మారింది.మమతకి మరో చాన్స్మమత బెనర్జీని పార్టీ నుంచి పూర్తిగా దూరం చేయలేదని, ఆమె కోరుకుంటే ప్రధాన సలహాదారుగా (Chief Advisor) వ్యవహరించవచ్చని తిరుగుబాటు వర్గం వ్యాఖ్యానించడం రాజకీయంగా మరింత చర్చనీయాంశమైంది. పార్టీ రాజ్యాంగం ప్రకారం ప్రతి మూడేళ్లకోసారి జాతీయ కార్యవర్గాన్ని పునర్వ్యవస్థీకరించాల్సి ఉండగా, 2022లో ఏర్పాటైన కమిటీ గడువు ముగిసినా కొత్త కమిటీ ఏర్పాటు చేయలేదని వారు ఆరోపిస్తున్నారు.మమత, అభిషేక్ ఫొటోలకు చోటు లేదు!తిరుగుబాటు వర్గం నిర్వహించిన సమావేశంలో టీఎంసీ పార్టీ గుర్తు కనిపించినప్పటికీ, మమత బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఫొటోలు కనిపించకపోవడం గమనార్హం. ఇది పార్టీపై తమ హక్కును ప్రకటించే ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు.టీఎంసీ క్రమశిక్షణా చర్యలుమరోవైపు అధికారిక టీఎంసీ నాయకత్వం కూడా వేగంగా స్పందించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఫిర్హాద్ హకీమ్, అరోప్ బిశ్వాస్, అరూప్ రాయ్, జావేద్ ఖాన్, రతిన్ ఘోష్, బిప్లబ్ మిత్రా, స్నేహాశిష్ చక్రవర్తి, సబీనా యాస్మిన్ తదితరులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.ఎంపీల దారి వేరే..!టీఎంసీలో అసంతృప్తి ఎమ్మెల్యేలకే పరిమితం కాలేదు. ఇప్పటికే 20 మంది తిరుగుబాటు ఎంపీలు పార్టీకి గుడ్బై చెబుతూ **నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (NCPI)**లో విలీనమయ్యారు. అంతేకాదు, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ప్రకటించారు. త్రిపురలో వెయ్యి ఓట్లకే పరిమితమైన ఓ అనామక పార్టీ ఒక్కసారిగా జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారడం విశేషం.ఒరిజినల్ టీఎంసీ ఏది?పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే టీఎంసీలో అసంతృప్తి స్వరాలు వినిపించడం మొదలైంది. అయితే పార్టీ ఆవిర్భావం తర్వాత ఇంత పెద్ద స్థాయిలో నాయకత్వానికే సవాల్ విసిరిన ఘటన ఇదేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవైపు తిరుగుబాటు వర్గం తమదే అసలైన టీఎంసీ అని ప్రకటిస్తుండగా, మరోవైపు అధికారిక నాయకత్వం క్రమశిక్షణా చర్యలకు దిగింది. దీంతో పార్టీ గుర్తు, సంస్థాగత హక్కులు, నాయకత్వంపై పోరు మరింత ముదిరే సంకేతాలు కనిపిస్తున్నాయి.అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలు!ఇప్పటివరకు ఇది కేవలం రాజకీయ తిరుగుబాటులా కనిపించినా.. అసలు పోరు ఇకపై ఎన్నికల సంఘం వద్ద జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. "అసలైన తృణమూల్ కాంగ్రెస్" ఎవరిది? పార్టీ గుర్తుపై హక్కు ఎవరికుంది? తిరుగుబాటు వర్గం బలం ఎంత? మమతా బెనర్జీ తదుపరి అడుగు ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానాలు రానున్న రోజుల్లోనే తేలనున్నాయి. అందుకే బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి ఒక్క అంశంపైనే ఉంది... టీఎంసీ సంక్షోభం అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలైందా?. -
లక్నో అగ్ని ప్రమాదం: భవనం వెనుక విస్తుపోయే నిజాలు!
అలీగంజ్: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం సంభవించిన అగ్నిప్రమాదం దేశాన్ని తీవ్రంగా కలచివేసింది. ఒక యానిమేషన్ కోచింగ్ సెంటర్లో చెలరేగిన మంటలు, దట్టమైన పొగ కారణంగా 15 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ఘోర విషాదం వెనుక నిబంధనల ఉల్లంఘనలు, అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. నివాస గృహంగా అనుమతి పొందిన ఒక భవనాన్ని, ఎలాంటి భద్రతా ప్రమాణాలు లేకుండా కమర్షియల్ కాంప్లెక్స్గా మార్చేయడమే ఈ దారుణానికి ప్రధాన కారణమని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.అనుమతి నివాసానికే.. వ్యాపారం మాత్రం కోట్లలోలక్నో డెవలప్మెంట్ అథారిటీ రికార్డుల ప్రకారం.. ఉషా మెహతా మార్గ్లో ఉన్న ఈ అంతస్తుల భవనానికి 2014లో కేవలం ‘నివాస భవనం’గానే అనుమతి లభించింది. రామేశ్వరం గ్రూప్నకు చెందిన వీరేంద్ర ప్రసాద్ శుక్లా, సురేంద్ర ప్రతాప్ శుక్లా, ధీరేంద్ర ప్రతాప్ శుక్లాల పేరిట ఈ ప్లాన్ ఆమోదం పొందింది. ఆ తర్వాత కాలంలో ఈ ఆస్తి చేతులు మారింది. కాగితాల్లో ఇది నివాస ప్రాంతంగానే ఉన్నప్పటికీ, నిబంధనలను తుంగలో తొక్కి ఇందులో ఆఫీసులు, యానిమేషన్ శిక్షణ కేంద్రాలు వంటి వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించారు. దీనికి సంబంధించి ఎలాంటి కమర్షియల్ అనుమతులు గానీ, ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్ (అగ్నిమాపక శాఖ అనుమతి) గానీ తీసుకోలేదని దర్యాప్తులో తేలింది.బయోమెట్రిక్ లాక్ మృత్యుపాశంఈ భవనంలో కనీస అత్యవసర నిష్క్రమణ మార్గం లేకపోవడం, పైకప్పు కు వెళ్లే దారిని మూసివేయడం పెద్ద తప్పిదాలని అధికారులు పేర్కొన్నారు. అన్నింటికంటే దారుణంగా, ఈ కోచింగ్ సెంటర్ ఎంట్రీ సిస్టమ్ కోసం ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ బయోమెట్రిక్ మెకానిజం, ప్రమాదం జరిగిన సమయంలో కరెంట్ పోవడంతో పూర్తిగా జామ్ అయిపోయింది. దీంతో లోపల ఉన్న విద్యార్థులు బయటకు రాలేక, దట్టమైన పొగలో ఊపిరాడక లోపలే చిక్కుకుపోయారు. సోమవారం మధ్యాహ్నం మంటలు చెలరేగగానే రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగినప్పటికీ, ఈ లోపభూయిష్టమైన భవన నిర్మాణం వల్ల సహాయక చర్యలు అత్యంత కఠినంగా మారాయి.మున్సిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్యంఈ దందాలో స్థానిక మున్సిపల్ అధికారుల పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. లక్నో మున్సిపల్ కార్పొరేషన్ 2022 నుండి ఈ భవనం నుండి ‘కమర్షియల్ ప్రాపర్టీ టాక్స్’ వసూలు చేస్తోంది. అంటే, ఇక్కడ నివాస భవనంలో వ్యాపారం సాగుతోందనే విషయం అధికారులకు ముందే తెలుసు. అయినా వారు కళ్లు మూసుకున్నారు. ఈ ఘోరానికి కారణమైన నలుగురిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయగా, నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు. ల్యాండ్ యూజ్ మార్పిడిని పట్టించుకోని మాజీ ఎల్డీఏ సిబ్బంది, ఇంజనీర్లతో సహా మొత్తం 16 మంది అధికారుల జాబితాను సిద్ధం చేసి, వారిపై కఠిన చర్యలకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది.ఇది కూడా చదవండి: కోచింగ్ సెంటర్లో ఘోర అగ్ని ప్రమాదం.. 14మంది మృతి -
రేపే వివాహం.. నిప్పులు పోసిన పోకిరీ
కర్ణాటక: మైసూరు జిల్లాలోని టి.నరసిపుర తాలూకాలోని కెంపయ్యన హుండి గ్రామంలో ఘోర దుర్ఘటన జరిగింది. తల్లిదండ్రులు, కూతురు మరణ వాంగూల్మం రాసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. శివన్న–నాగరత్న దంపతులు, వారి కుమార్తె రక్షిత (20) మృతులు. అదే గ్రామానికి చెందిన ఉల్లాస్ గౌడ అనే వ్యక్తి ఈ కుటుంబాన్ని వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. విలన్.. ఉల్లాస్గౌడ శివన్న, నాగరత్న దంపతులు కూతురు రక్షితకు పెళ్లి సంబంధం కుదిర్చారు. ఈ నెల 24న ఆ యువతి వివాహానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈలోగా ఉల్లాస్గౌడ రక్షితను ప్రేమించానని, తానే పెళ్లి చేసుకుంటానని ఆమె తల్లిదండ్రులకు చెప్పాడు. కానీ రక్షిత, ఆమె తల్లిదండ్రులు అతనిని అంగీకరిచలేదు. కానీ ఆ యువకుడు రక్షితను వెంటాడుతూ వేధిస్తున్నాడు. రక్షితతో పెళ్లి నిశ్చయమైన యువకునికి చెడు సందేశాలను పంపసాగాడు.తాను ఆమెను ప్రేమించానని, నీవు పెళ్లి చేసుకోరాదని బెదిరించాడు. గ్రామంలోనూ ఇదే మాదిరిగా ప్రచారం చేయసాగాడు. దీంతో పెళ్లి రద్దయ్యే పరిస్థితి ఏర్పడింది. తీవ్ర ఆవేదన చెందిన రక్షిత, ఆమె తల్లిదండ్రులు ఆదివారం రాత్రి ఇంట్లో ఉరివేసుకున్నారు. స్థానికులు సోమవారం ఉదయం గుర్తించారు. పెళ్లి వేడుకతో కళకళలాడాల్సిన ఇల్లు స్మశానంలా ఏడుపులతో మార్మోగింది. వరుణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. జిల్లా ఎస్పీ మల్లికార్జున బాలాదండి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు వారి డెత్నోట్ను స్వా«దీనం చేసుకుని విచారణ చేపట్టారు. ఉల్లాస్గౌడను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరారు. -
ఎల్ నినో ముప్పు: ఆ 10 రాష్ట్రాల్లో ‘ప్లాన్ బి’!
దేశవ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న తరుణంలో భారత వ్యవసాయ రంగాన్ని ‘ఎల్ నినో’ భయం వణికిస్తోంది. సుమారు 9 నుంచి 10 రాష్ట్రాలపై ఈసారి ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉండబోతోందన్న ముందస్తు అంచనాలతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. వర్షభావ పరిస్థితులు ఎదురైతే రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు వీలుగా ముందే ‘ప్లాన్ బి’ (ప్రత్యామ్నాయ ప్రణాళిక)ను సిద్ధం చేస్తోంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ అయ్యాయి.ఆ 10 రాష్ట్రాలపైనే నజర్రాబోయే ఖరీఫ్ సీజన్లో ఎల్ నినో కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉన్న 9 నుంచి 10 రాష్ట్రాలను కేంద్రం గుర్తించింది. ఆయా రాష్ట్రాల్లోని అత్యంత వర్షపాతం తక్కువగా నమోదయ్యే జిల్లాలను తక్షణమే గుర్తించాలని అధికారులను ఆదేశించింది. వాతావరణ మార్పుల వల్ల వర్షాలు తగ్గుముఖం పట్టే జిల్లాలకు ప్రత్యేక వ్యూహాలను, పంటల వారీ ప్రత్యామ్నాయ ప్రణాళికలను సిద్ధం చేయాలని కేంద్రం సూచించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లోని దాదాపు 326 జిల్లాల్లో వర్షపాతం తగ్గవచ్చని, పంట నష్టం జరగకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది.క్షేత్రస్థాయికి శాస్త్రీయ సలహాలురైతులను ఆందోళనకు గురిచేసేలా కాకుండా, వారికి ధైర్యాన్నిస్తూ, సమస్యలను పరిష్కరించేలా శాస్త్రీయ సలహాలను అందించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగాలు, వ్యవసాయ శాఖలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, విస్తరణాధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. వాతావరణం అనుకూలించని పక్షంలో రైతులకు సకాలంలో అందుబాటులో ఉంటూ ప్రత్యామ్నాయ మార్గాలను చూపే బాధ్యతను వీరికి అప్పగించారు.నీటి పొదుపు.. తేమ నిర్వహణే కీలకంవర్షపాతం తక్కువగా ఉండే ప్రాంతాల్లో నీటి పరిరక్షణ, భూమిలో తేమ నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం పేర్కొంది. మల్చింగ్ పద్ధతులు, అంతర పంటల సాగు, స్థానిక వాతావరణ పరిస్థితులకు తట్టుకునే ప్రత్యామ్నాయ పంటల రకాలను ప్రోత్సహించాలని సూచించింది. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఐసీఏఆర్ సంస్థల పరిశోధనలు కేవలం ల్యాబ్లకే పరిమితం కాకుండా, సకాలంలో రైతులకు చేరినప్పుడే వాటికి సార్థకత లభిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.పప్పుధాన్యాల స్వయంసమృద్ధిపై ఫోకస్భారతదేశం పప్పుధాన్యాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ‘పప్పుధాన్యాల స్వయంసమృద్ధి మిషన్’ కింద కేంద్రం కసరత్తు ముమ్మరం చేసింది. ఎల్ నినో ముప్పు నేపథ్యంలో దేశీయంగా పత్తి, పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా కంది, మినుము, పెసర పంటల సాగును విస్తరింపజేయాలని, పంటల మార్పిడి పద్ధతులను పెంచడంతో పాటు రైతులకు నాణ్యమైన విత్తనాలు, సాంకేతిక సహాయం అందించాలని రాష్ట్రాలను కోరింది.ఎరువుల నిల్వలు సిద్ధంవర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ ఎరువుల కొరత రాకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఎరువుల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని సమీక్షలో వెల్లడించారు. అయితే, రుతుపవనాల గమనాన్ని బట్టి స్థానికంగా ఎక్కడైనా కొరత ఏర్పడే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి, అక్కడికి ముందే ఎరువుల స్టాక్ను చేర్చాలని అధికారులను మంత్రి చౌహాన్ ఆదేశించారు. దేశంలోని జలాశయాల నీటి మట్టాలు, మార్కెట్ ధరలపై కూడా నిరంతర నిఘా ఉంచామన్నారు.నిరంతర సమీక్షలు.. ఫీడ్బ్యాక్ఈ సవాలుతో కూడిన ఖరీఫ్ సీజన్ను విజయవంతంగా అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిరంతర సమన్వయం అవసరమని కేంద్రం భావిస్తోంది. క్షేత్రస్థాయి నుంచి ప్రతి వారం నివేదికలను, రైతుల నుంచి ఫీడ్బ్యాక్ను సేకరించాలని నిర్ణయించింది. వాతావరణ ముప్పులను ముందే అంచనా వేస్తూ, ఎప్పటికప్పుడు సమీక్షలు జరపడం ద్వారా ఖరీఫ్ పంటలను, రైతుల ఆదాయాన్ని కాపాడవచ్చని కేంద్ర వ్యవసాయ శాఖ భరోసా ఇస్తోంది. -
భారత్తో అమెరికా రూ.4,560 కోట్ల డీల్
వాషింగ్టన్: భారత్కు విక్రయిస్తున్న అపాచీ హెలికాప్టర్లు, ఎం777ఏ2 అత్యంత తేలికైన శతఘ్నుల్లో ఉపయోగించే ఉపకరణాలు, వాటి సర్వీసింగ్కు సంబంధించిన 482.2 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.4,561కోట్ల) విలువైన ఒప్పందాన్ని అమెరికా లాంఛనంగా నోటిఫై చేసింది. లాంఛనంగా నోటిఫై చేసిన ఈ వివరాలను విదేశీ సైనిక కొనుగోళ్ల ప్రాజెక్టులను చూసుకునే అమెరికా భద్రతా సహకార ఏజెన్సీ(డీఎస్సీఏ) జూన్ 17వ తేదీన తన ఫెడరల్ రిజిస్టర్లో పొందుపరిచింది. అంతకుముందే మే 18వ తేదీన అపాచీ హెలికాప్టర్లు, ఎం777ఏ2 హవిట్జర్ల సర్వీసింగ్ సేవల అమ్మకంపై అమెరికా కాంగ్రెస్కు ఆ దేశ విదేశాంగ శాఖ సమాచారం ఇచ్చింది. పర్వతమయ సరిహద్దుల్లో శత్రుసేనల పీచమణిచేందుకు భారత్ విదేశీ సైనిక కొనుగోళ్ల మార్గంలో అమెరికా నుంచి అపాచీ హెలికాప్టర్లు, శతఘ్నులను కొనుగోలుచేయడం తెల్సిందే. ఇవిగాక ఏహెచ్–64ఈ అపాచీ యుద్ధ హెలికాప్టర్లనూ భారత్ ప్రస్తుతం వినియోగిస్తోంది. ఈరకం ప్రపంచంలోనే అత్యుత్తమమైన యుద్ధహెలికాప్టర్లలో ఒకటి. ఇది అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేయడంతోపాటు యుద్ధక్షేత్రాల్లో సైన్యానికి సైనిక, ఆయుధ సరఫరాలో ఎంతగానో సాయపడుతుంది. తాజాగా నోటిఫై అయిన ఒప్పందం ప్రకారం ఎం777ఏ2 శతఘ్నుల సేవల ఒప్పందాన్ని సుదీర్ఘకాలం కొనసాగించాలని భారత్ భావిస్తోంది. ఒప్పందంలో భాగంగా ఆయుధాల విడిభాగాల అందజేత, మరమ్మత్తు, పాడైనవి మార్చేసి కొత్తవి బిగించడం, వాటిని ఉపయోగించే సిబ్బందికి శిక్షణ, ఇతర సాంకేతిక తోడ్పాటును భారత దళాలకు అమెరికా అందించనుంది. శతఘ్నులకు సంబంధించి 230 మిలియన్ డాలర్లు, అపాచీ హెలికాప్టర్లకు సంబంధించి 198.2 మిలియన్ డాలర్లు మొత్తంగా 482.2 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది. వాస్తవానికి అపాచీ సపోర్ట్ సర్వీసుల ప్రధాన కాంట్రాక్ట్ బోయింగ్ కంపెనీ, లాక్హీడ్ మార్టీన్లతో భారత్ గతంలో కుదుర్చుకుంది. శతఘ్నులకు సంబంధించి బ్రిటన్లోని కంబ్రియాలోని బీఏఈ సిస్టమ్స్తో భారత్ ప్రధాన సర్వీస్ కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. ఇప్పుడు కొత్తగా సహాయక సేవల అమ్మకం ఒప్పందాన్ని అమెరికాతో భారత్ కుదుర్చుకుంది. అమెరికా–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపరిచే ఉద్దేశంతోనే సేవల అమ్మకాన్ని ముందుకొచ్చామని అమెరికా రక్షణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘ఎప్పటికప్పుడు రిపేర్లు, కొత్త విడిభాగాల బిగింపుతో ఆయుధాల సన్నద్ధత పెరిగి రక్షణ భాగస్వామ్య దేశమైన భారత్లో భద్రత మరింత పటిష్టమవుతుంది. ఇది ఇండోపసిఫిక్, దక్షిణాసియా ప్రాంతంలో సుస్థిరత, శాంతి, ఆర్థికాభివృద్ధికి బాటలుపరుస్తుంది’’అని అమెరికా పేర్కొంది. -
నేతలు జంప్.. ఇది ఫిరాయింపుల తుపాన్.. ఏం జరుగుతోంది?
దేశ రాజకీయాల్లో మరోసారి ఫిరాయింపుల రాజకీయాలు వేగం పుంజుకున్నాయి. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టి ప్రజాప్రతినిధులు పార్టీలు మారుతున్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనలను ఆసరాగా చేసుకుని ప్రజాప్రతినిధులు అనర్హత నుంచి తప్పించుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార బలం పెంచుకోవడానికి జరుగుతున్న ఈ రాజకీయ వ్యూహాలు ప్రజాస్వామ్య విలువలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. తరచూ జరిగే పార్టీ మార్పులు రాజకీయ పార్టీలపైనే కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థపై కూడా ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ రాజకీయాల్లో పెరుగుతున్న ఫిరాయింపులు, వాటి వెనుక ఉన్న కారణాలు, చట్టపరమైన అంశాలు మరోసారి చర్చనీయాంశాలుగా మారాయి.దేశ రాజకీయాల్లో మరోసారి పెద్ద ఎత్తున ఫిరాయింపులు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీలపై ప్రజల్లో విశ్వాసం క్షీణిస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు లోక్సభ సభ్యులు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేకు చెందిన శివసేనలో అధికారికంగా చేరారు. 2022లో శివసేనను చీల్చి, భారతీయ జనతా పార్టీతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన షిండే.. ఇప్పుడు మరోసారి ఫిరాయింపులను ప్రోత్సహించారు. "ఆపరేషన్ టైగర్" పేరుతో సాగిన ఈ ప్రక్రియలో ఒక్కో ఎంపీకి రూ.50 కోట్లు చెల్లిస్తున్నారని, అందులో రూ.15 కోట్లు ముందుగానే ఇచ్చారని ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గం ఆరోపణలు చేస్తోంది.పార్టీ ఎంపీల్లో మూడింట రెండొంతుల మంది మారుతుండడంతో ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హత తప్పించుకుంటారని విశ్లేషకులు వాదిస్తున్నారు. అయితే, ఎంపీల బృందం మరో పార్టీలో చేరాలంటే, ముందు వారి అసలు పార్టీ కూడా అదే తరహా విలీనాన్ని అధికారికంగా ఆమోదించాలనే నిబంధన ఉందన్న వాదన కూడా ఉంది.వరసగా ఫిరాయింపులుఈ ఫిరాయింపులకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ నుంచి కూడా పార్టీ మార్పులు జరిగాయి. ఏప్రిల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుల్లో ఏడుగురు భారతీయ జనతా పార్టీలో చేరారు. మేలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత, లోక్సభలో ఆ పార్టీకి చెందిన 28 మంది ఎంపీల్లో 20 మంది త్రిపుర కేంద్రంగా ఉన్న, పెద్దగా గుర్తింపు లేని నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో విలీనమవుతున్నట్లు ప్రకటించారు.వ్యంగ్యంగా చెప్పాలంటే.. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా లేని నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుల్లో కొందరికి ఈ ప్రముఖ ఫిరాయింపు విషయం కూడా తెలియలేదు. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా ఫిరాయింపుల నుంచి సురక్షితంగా కనిపించడం లేదు. సమాజ్వాదీ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్)లో కూడా ఇలాంటి పరిణామాలు పునరావృతమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఆ పార్టీల నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఈ రెండు పార్టీలకు లోక్సభలో వరుసగా 37 మంది, 8 మంది ఎంపీలు ఉన్నారు.ఈ రాజకీయ పరిణామాల వెనుక అతిపెద్ద లబ్ధిదారుగా బీజేపీ నిలుస్తోంది. పార్లమెంట్లో మద్దతు పెంచుకునే ప్రయత్నాలను వేగవంతం చేస్తోంది. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ రాజకీయ అవకాశవాదం, ఫిరాయింపులను అరికట్టే లక్ష్యంతో తీసుకొచ్చారు. ఇప్పుడు అది ‘‘ప్రభావం కోల్పోయిన నిబంధన’’గా మారింది. -
కొలీజియం నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేం!
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి హైకోర్టు, సుప్రీంకోర్టు కొలీజియంలు తీసుకునే నిర్ణయాల్లో న్యాయపరంగా జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేవలం సీనియారిటీ ఉన్నంత మాత్రాన జడ్జిగా పదోన్నతి పొందడం హక్కుగా మారదని తేల్చిచెప్పింది. తనకంటే జూనియర్లకు హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించడాన్ని సవాలు చేస్తూ హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఓ జిల్లా ప్రిన్సిపల్ జడ్జి దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. అసలేం జరిగిందంటే... హైకోర్టు కొలీజియం సిఫారసుల మేరకు సుప్రీంకోర్టు కొలీజియం జూన్ 2వ తేదీన న్యాయాధికారులు చిరాగ్భాను సింగ్, భూపేశ్ శర్మ, యోగేశ్ జస్వాల్లను హిమాచల్ హైకోర్టు న్యాయమూర్తులుగా ఎంపిక చేసింది. అయితే, వీరు ముగ్గురూ తన కంటే జూనియర్లని ధర్మశాల ఫ్యామిలీ కోర్టులో ప్రిన్సిపల్ జడ్జిగా పనిచేస్తున్న అరవింద్ మల్హోత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ ముగ్గురినీ హైకోర్టు జడ్జిలుగా పదోన్నతి కల్పించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల సిఫార్సు చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్ను జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ జాయ్మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. పిటిషనర్ వాదన ఇదీ.. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అరవింద్ మల్హోత్రా పదోన్నతి అంశాన్ని పునఃసమీక్షించాలని గతంలో సుప్రీంకోర్టు, హిమాచల్ హైకోర్టు కొలీజియంను కోరిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అయితే, ఆ పునఃసమీక్ష జరగలేదని, పైగా ఆయన కంటే జూనియర్లను హైకోర్టు జడ్జిలుగా సిఫార్సు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని, ఇది ఆయన హక్కులను హరించడమేనని కోర్టుకు విన్నవించారు.తుది తీర్పు.. పిటిషన్ కొట్టివేత సుప్రీంకోర్టు కొలీజియం ఇప్పటికే హైకోర్టు సిఫార్సులను ఆమోదించినందున, దాన్ని ఇప్పుడు న్యాయసమీక్షకు గురిచేయలేమని ధర్మాసనం తీర్పులో పేర్కొంది. ఈ వ్యవహారంలో ఎలాంటి విధానపరమైన లోపం తమకు కనిపించలేదని స్పష్టం చేసింది. అయితే పిటిషన్ను ఉపసంహరించుకుని, హైకోర్టులోని సంబంధిత అధికారులకు పరిపాలనా పరంగా వినతిపత్రం సమరి్పంచుకోవచ్చని పిటిషనర్కు సూచించింది. ధర్మాసనం సూచన మేరకు పిటిషనర్ తన పిటిషన్ను వెనక్కి తీసుకోవడంతో, కేసును కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. ధర్మాసనం ఏమన్నదంటే.. ఈ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. కేవలం సీనియారిటీ ఉన్నంత మాత్రాన పదోన్నతికి అర్హత లభించదని స్పష్టం చేసింది. కొలీజియం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని సిఫార్సులు చేసిన తర్వాత, కోర్టులు ఆ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేవని పేర్కొంది. న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో కొంత గోప్యత కూడా ఉంటుందని గుర్తు చేసింది. కొలీజియం నిర్ణయాలపై విచారణ జరిపి కొత్త వివాదాలకు తాము తెరతీయదలచుకోలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషనర్కు ఇంకా పదేళ్ల సరీ్వసు ఉన్నందున ఓపిక పట్టాలని, భవిష్యత్తులో అవకాశం రావొచ్చని సూచించింది. -
ఉద్ధవ్ ‘సేన’లో చీలిక
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన (యూబీటీ) పార్లమెంటరీ పార్టీ అధికారికంగా చీలిపోయింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు లోక్సభ ఎంపీలు అధికార పక్షం, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో అధికారికంగా చేరారు. తాజా పరిణామంతో శివసేన (యూబీటీ) తిరుగుబాటు ఎంపీల రాజకీయ భవితవ్యంపై కొన్ని రోజులుగా తీవ్రస్థాయిలో సాగుతున్న ఊహాగానాలకు తెరపడినట్లయింది. తాజా పరిణామంతో శివసేనపై షిండే పట్టు మరింత బలపడటంతోపాటు, రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ప్రభావం మరింతగా పెరిగింది. సోమవారం ముంబైలో షిండే, సీనియర్ నేతలు పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఉద్ధవ్ వర్గంలోని ఆరుగురు ఎంపీలు శివసేనలో చేరారు. అనంతరం, ఆరుగురితో కలిసి షిండే మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ టైగర్ విజయవంతంగా పూర్తయిందని ఈ సందర్భంగా ప్రకటించారు. ‘ఈ రోజు ఇక్కడ నా పక్కన ఏకంగా ఆరు పులులున్నాయి. ఈసారి మేం సిక్స్ కొట్టాం’అని చెప్పారు. ఈ 6 ఎంపీలు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమైన రాజకీయ దురంధరులు అంటూ పొగిడారు. వీరి చేరిక కోసం పక్కా ప్రణాళికతో చేపట్టిన ఆపరేషన్ టైగర్ విజయవంతంగా పూర్తయిందంటూ చెప్పుకొచ్చారు. 13కు చేరిన షిండే వర్గం ఎంపీలు ఢిల్లీలో ఐదు రోజుల క్రితం జరిగిన శివసేన (యూబీటీ) పార్లమెంటరీ పార్టీ భేటీకి మొత్తం 9 మంది ఎంపీలకుగాను ఆరుగురు డుమ్మాకొట్టగా ముగ్గురు మాత్రమే హాజరయ్యారు. ఆ ఆరుగురే తాజాగా షిండే పార్టీలో చేరారు. వారు..సంజయ్ దేశ్ముఖ్, సంజయ్ జాదవ్, సంజయ్ దినా పాటిల్, నగేశ్ పాటిల్, ఓం ప్రకాశ్ రాజే నింబాల్కర్, భావుసాహెబ్ వాక్చౌరె ఉన్నారు. వీరంతా కలిసి బయటకు రావడంతో ఫిరాయింపుల చట్టం పరిధిలోకి రాకుండా ఉండేందుకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ ఈ వర్గానికి లభించినట్లయింది.ఉద్ధవ్ భేటీకి ఎమ్మెల్సీ, ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా శివసేన(యూబీటీ)లో మరో ముసలం మొదలయిందా అంటే, అవుననే అంటున్నారు. సోమ వా రం ఆరుగురు లోక్సభ ఎంపీలు షిండే శివసేనలో చేరారు. అదే సమయంలో ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఏర్పాటు చేసిన భేటీకి ముగ్గురు కీలక ప్రజాప్రతినిధులు మొహం చాటేయడమే ఇందుకు కారణంగా మారింది. వర్షాకాల సమావేశాల్లో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు శివసేన(యూబీటీ) ప్రధాన కార్యాలయం శివాలయ్లో ఉద్ధవ్ ఠాక్రే సమావేశం ఏర్పాటు చేశారు. భేటీకి ఎమ్మెల్యేలు సంజయ్ పొట్నిస్, రాహుల్ పాటిల్, ఎమ్మెల్సీ సునీల్ షిండే డుమ్మా కొట్టారు. -
రెబెల్స్ చీఫ్గా అరూప్
కోల్కతా: మాజీ సీఎం మమతా బెనర్జీ సారథ్యంలో ఉన్న టీఎంసీని తమ అ«దీనంలోకి తెచ్చుకునేందుకు తిరుగుబాటు వర్గం వేగంగా పావులు కదుపుతోంది. సోమవారం ప్రతిపక్ష నేత రితబ్రత బెనర్జీ అధ్యక్షతన సమావేశమైన టీఎంసీ రెబెల్ వర్గం ఎమ్మెల్యేలు తమ చైర్పర్సన్గా అరూప్ రాయ్ను ఎన్నుకున్నారు. కార్యక్రమానికి కౌన్సెలర్లు, ఇతర నేతలు సైతం హాజరయ్యారు. రాయ్ని ఏకగ్రీవంగా పార్టీ చైర్పర్సన్గా ఎన్నుకున్నామని చెప్పారు. అంతేకాకుండా, మాజీ మంత్రి అరూప్ బిశ్వాస్, ఎమ్మెల్యేలు ఫిర్హాద్ హకీమ్, రతిన్ ఘోష్, సబినా యాస్మిన్లను వైస్ చైర్పర్సన్లుగా, రితబ్రత బెనర్జీ, జావెద్ ఖాన్, సాందీపన్ సాహాలను ప్రధాన కార్యదర్శులుగాను, అఖ్రుజ్జమాన్ అన్సారీని ట్రెజరర్గాను నియమించారు. మమత సారథ్యంలోని టీఎంసీని సంస్థాగతంగా సవాల్ చేసే చర్యగా దీనిని భావిస్తున్నారు. అసెంబ్లీలో ప్రారంభమై, పార్లమెంట్కు సైతం పాకిన ఈ తిరుగుబాటు ఇప్పుడు పార్టీ అధిష్టానానికి కూడా చేరుకుందనే సంకేతాన్ని ఈ పరిణామంతో స్పష్టమవుతోంది. తమ వర్గానికి చట్టబద్ధత కల్పించేందుకుగాను పార్టీ రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే సోమవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించామని, ఈ వివరాలను ఎన్నికల సంఘానికి తెలియజేస్తామని బెనర్జీ స్పష్టం చేశారు. తమదే టీఎంసీ అంటూ ఆయన.. ఏది అసలైన టీఎంసీనో ఎన్నికల కమిషనే నిర్ణయిస్తుందని కూడా చెప్పారు. నూతన నాయకత్వం త్వరలోనే వివిధ స్థాయిల్లో పార్టీ నియామక, సంస్థాగత నిర్మాణాన్ని పునరుద్ధరిస్తుందని ఆయన చెప్పారు. త్వరలోనే జిల్లా కమిటీలను, రాష్ట్ర విభాగాన్ని, ప్రతినిధుల ప్యానెల్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇష్టమైతే, తమ వర్గానికి మమతా బెనర్జీ ముఖ్య సలహాదారుగా ఉండవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ఆమె ముఖ్య సలహాదారుగా వస్తానంటే సాదరంగా స్వాగతిస్తామని చెప్పారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తర్వాత టీఎంసీ పార్టీలో మునుపెన్నడూ లేని రీతిలో తీవ్ర సంక్షోభం తలెత్తడం తెలిసిందే. అసెంబ్లీకి ఎన్నికైన 80 మందికిగాను ఏకంగా 58 మంది రెబెల్ వర్గంలో చేరగా, పార్లమెంట్లో 28 మంది ఎంపీల్లో 20 మంది వేరు కుంపటి పెట్టుకున్నారు. -
డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపండి
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన మెగా డీఎస్సీ ప్రక్రియలో భారీస్థాయిలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని.. మొత్తం వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో విచారణ జరిపించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ను వైఎస్సార్సీపీ కోరింది. చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రక్రియను పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసం మలిచిందని ఆ పార్టీ అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజారాణి ఆరోపించారు. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో పక్కా ప్రణాళికతో రూపొందించిన భారీ కుంభకోణమని.. అందుకే సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆమె కోరారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినపతిపత్రం అందచేశారు. అందులోని ముఖ్యాంశాలు.. పోస్టుల భర్తీలో పారదర్శకతకు పాతర 16వేల పోస్టుల భర్తీ కోసం జరిపిన డీఎస్సీ పరీక్షలో పారదర్శకతను కాపాడే అన్ని చర్యలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తొలగించింది. గతంలో ప్రశ్నపత్రాల తయారీ బాధ్యత ఎస్సీఈఆర్టీకీ, పరీక్షల నిర్వహణ బాధ్యత డీఎస్సీ కన్వినర్కు ఉండేది. అయితే, ఈసారి రెండు బాధ్యతలను కూడా ఎస్సీఈఆర్టీ డైరెక్టర్కే అప్పగించడం ద్వారా అక్రమాలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అలాగే, ప్రశ్నపత్రాల అప్లోడ్ తదితర బాధ్యతలను అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అప్పగించారు. ప్రశ్నపత్రాల తయారీలో పాల్గొన్న ఓ అవుట్సోర్సింగ్ ఉద్యోగి అదే డీఎస్సీలో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించడం పేపర్ లీక్కు ప్రత్యక్ష నిదర్శనం. అయితే, మెరిట్ జాబితా నుంచి అతని పేరు తొలగించారు. ఫలితాల ప్రకటనలోనూ గందరగోళం ఇక ఫలితాల ప్రకటనలో కూడా ప్రభుత్వం పారదర్శకత పాటించలేదు. గతంలో కలెక్టరేట్ నోటీసుబోర్డులపై మెరిట్ లిస్టులు, మెరిట్–కమ్–రోస్టర్ జాబితాలు ప్రదర్శించేవారు. ఈసారి ఆన్లైన్కు పరిమితం చేయడంతో అభ్యర్థులు ఇబ్బందిపడ్డారు. నిబంధనల ప్రకారం మెరిట్, రిజర్వేషన్లు, కటాఫ్ మార్కుల ఆధారంగా ఎంపిక పూర్తయిన తర్వాతే ధృవపత్రాల పరిశీలన జరగాలి. కానీ, ధ్రువపత్రాల పరిశీలన అనంతరం కూడా పలువురు అభ్యర్థులను తప్పించారు. స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు గతంలో స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు కూడా తప్పనిసరిగా డీఎస్సీ పరీక్ష రాయాల్సి ఉండేది. అయితే, కొత్త జీఓల ద్వారా వారిని పరీక్ష నుంచి మినహాయించారు. నియామకాలు పూర్తయ్యాక మళ్లీ పాత విధానాన్నే పునరుద్ధరిస్తూ ప్రభుత్వం కొత్త జీఓలు జారీచేసింది. మరోవైపు.. టీచర్ పోస్టుల కోసం బేరసారాలు జరిగినట్లు ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఫోన్ నంబర్లు తెలిసినా అసలు నిందితుల పేర్లు ఎఫ్ఐఆర్లో నమోదుచేయకుండా దర్యాప్తును బలహీనపరిచారు. ఈ డీఎస్సీ కుంభకోణం పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్మెంట్ స్కాం కంటే తీవ్రమైనది. అందువల్ల సీబీఐ వంటి స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించి లక్షలాది మంది నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలి. -
ఖతార్లో భారీ పేలుడు: 12 మంది భారతీయులు మృతి
ఖతార్ గ్యాస్ పోర్టులో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఇందులో 13 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు సోమవారం రాత్రి ప్రకటించారు. మృతుల్లో 12 మందిని భారతీయులుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మొత్తం 66 మంది కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. ఆదివారం రాత్రి ఖతార్లోని రాస్ లఫాన్ ఎల్ఎన్జీ కాంప్లెక్స్లో భారీ పేలుడు జరిగింది. ఖతార్ అధికారులు సోమవారం మృతుల వివరాలను ధ్రువీకరించారని అక్కడి భారత రాయబార కార్యాలయం ఎక్స్లో తెలిపింది."రాస్ లఫాన్ ఘటనలో నిన్న రాత్రి 12 మంది భారతీయులు దురదృష్టవశాత్తు మరణించినట్టు ఖతార్ అధికారులు ధ్రువీకరించారు. మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం" అని రాయబార కార్యాలయం ప్రకటనలో తెలిపింది.కాగా, మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారని ఖతార్ ఇంధన మంత్రి సాద్ అల్-కాబీ కూడా సోమవారం మీడియాకు చెప్పారు. గాయపడ్డవారికి వైద్య చికిత్స అందుతోందని, వారిలో ఎవరి ప్రాణాలకూ ప్రమాదం లేదని సాద్ అల్-కాబీ తెలిపారు. మార్చిలో ఖతార్పై ఇరాన్ దాడి తర్వాత నిలిపివేసిన కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తున్న సమయంలో ఈ పేలుడు జరిగిందని, 66 మంది గాయపడ్డారని ఆయన తెలిపారు. Qatari authorities have confirmed that 12 Indian nationals have unfortunately passed away in the Ras Laffan incident yesterday night. We extend our deepest condolences to the bereaved families and prayers for the departed souls. Qatari authorities have also confirmed that all…— India in Qatar (@IndEmbDoha) June 22, 2026 -
రూ. 50 రైడ్కి, రూ 3 వేలు : ఆటో డ్రైవర్ ఘరానా దందా
ఐటీ రాజధాని బెంగళూరులో ఆటో డ్రైవర్ ఆగడం ఒకటి వెలుగులోకి వచ్చింది.బెంగళూరు నగరానికి మొదటిసారి వచ్చిన ఇద్దరు పల్లెటూరి యువకులను ఒక ఆటో డ్రైవర్ బెదిరించి, దాడి చేసి డబ్బులు లాక్కున్నాడనే వార్త సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతోంది. కొత్తగా వచ్చే పర్యాటకుల భద్రతపై ఈ ఘటన మరోసారి ఆందోళనలను రేకెత్తించింది.అసలేం జరిగింది?శాను అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎక్స్ వేదికగా ఈ షాకింగ్ ఘటనను పంచుకున్నారు. వరుస పోస్టుల్లో ఈ సంఘటన వివరాలను షేర్ చేశారు. దీనికి ప్రకారం ఇద్దరు టీనేజ్ యువకులు మొదటిసారి బెంగళూరులోని సర్ ఎం. విశ్వేశ్వరయ్య టెర్మినల్ (SMVT) రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. వారు అక్కడ నుండి హోసూరు వెళ్ళవలసి ఉంది. ఆటో కోసం చూస్తుండగా..ఇతగాడు వాలిపోయాడు.రైల్వే స్టేషన్ వద్ద ఒక ఆటో డ్రైవర్ వారిని కలిసి, బస్ స్టాండ్ దగ్గర దింపుతానని, ఒక్కొక్కరికి రూ. 50 చొప్పున ఛార్జ్ అవుతుందని నమ్మబలికాడు. అయితే ఆ యువకులకు నగరం గురించి ఏమీ తెలియదని గ్రహించిన ఆటో డ్రైవర్ వారిని దోచుకోవాలనే ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగానే దారిలో తనతో పాటు మరో వ్యక్తిని కూడా ఆటో ఎక్కించుకున్నాడు. ఆపై వారిని అత్తిబెలె వైపు ఉన్న ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు.అక్కడ ఆటో ఆపి, ఆ ఇద్దరు యువకుల నుండి రూ. 3,000 డిమాండ్ చేశారు. అంత డబ్బు తమ వద్ద లేదని యువకులు చెప్పడంతో, ఆటో డ్రైవ, అతని అనుచరుడు కలిసి వారి మొబైల్ ఫోన్లు లాక్కొని, వారిపై దాడి చేశారు. ఈ దాడి జరుగుతున్న సమయంలోనే బాధితులు ఎలాగోలా ఇంజనీర్ శానుకు ఫోన్ చేయగలిగారు. బాధితులు తనను కాల్ చేశారని, అప్పుడు అబ్యాక్గ్రౌండ్లో కేకలు, గొడవ వినబడుతుండగానే ఫోన్ కట్ అయి పోయిందనీ ఆ తర్వాత ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయని తెలిపాడు.ఇదీ చదవండి: లక్ అంటే వీరిదే : కారు నుజ్జు నుజ్జు, షాకింగ్ సీసీటీవీ విజువల్స్చివరికి ఆ యువకులు బ్రతిమిలాడి, బేరసారాల తరువాత డిరూ. 2,400 చెల్లించడానికి అంగీకరించడంతో ఫోన్లను తిరిగి ఇచ్చేశారు. ఆ యువకుల వద్ద అంత నగదు లేకపోవడంతో యూపీఐ (UPI) ద్వారా ఆన్లైన్ పేమెంట్ చేశారు. ఇంజనీర్ శాను ఆ యూపీఐ లావాదేవీకి సంబంధించిన స్క్రీన్షాట్ను షేర్ చేస్తూ, ఈ డిజిటల్ ఆధారాల సహాయంతో నిందితులను పట్టుకోవాలంటూ బెంగళూరు పోలీసులను ట్యాగ్ చేశారు. మరి బెంగళూరు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.ఇదీ చదవండి: ఆస్తి తగాదా : నటుడు సోదరుడికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమంBangalore auto walas are brutal to innocent people!Hoping to earn their livelihood, two young boys from a village just reached SMVT railway station. They took an auto to Attibele as they wanted to go to Hosur.After the ride, the auto driver demanded ₹3000 just for 35 km???…— Sanu (@SanuThink) June 22, 2026నెటిజన్ల ఆగ్రహంఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువు కోసం, ఉద్యోగాల కోసం దేశం నలుమూలల నుండి బెంగళూరుకు వచ్చే విద్యార్థులు, యువతకుఇలాంటి ఘటనలు భయాందోళనలు కలిగిస్తాయని, ఇది నగరం పేరును చెడగొడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఇదీ చదవండి: ఆ పిక్స్ అందుకే పోస్ట్ చేయలేదు, కానీ బీచ్లో బికినీ కాక..? -
NEET ఎగ్జామ్ మిస్.. విద్యార్థుల కన్నీళ్లు.. తప్పెవరిది?
సాక్షి,బెంగళూరు: కర్ణాటకలో నీట్ పరీక్షపై రాజకీయ దుమారం రేగింది. బెంగళూరులో కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీ కారణంగానే ముగ్గురు విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మీడియా ఎదుట వాపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఆదివారం జరిగిన ఈ సంఘటన విద్యార్థులు, తల్లిదండ్రులు, రాజకీయ పార్టీల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. నిన్న దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు నీట్ యూజీ రీ-టెస్ట్ రాసినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అయితే బెంగళూరులో కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీ కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి, పరీక్షా కేంద్రాలకు చేరుకోవడంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది. విద్యార్థులు 1.30 గంటలకు రిపోర్ట్ చేయాలని విద్యాశాఖ సూచించింది. కానీ ట్రాఫిక్ పెరగడంతో తల్లిదండ్రులు బైక్లను ఫుట్పాత్లపై నడిపే పరిస్థితి వచ్చింది. చివరికి ముగ్గురు విద్యార్థులు ఆలస్యంగా చేరుకోవడంతో పరీక్షకు అనుమతి ఇవ్వలేదు. వారు గేటు ఎక్కి లోపలికి వెళ్లాలని ప్రయత్నించినా, నిర్వాహకులు గేట్లను మూసివేశారు.అయితే తల్లిదండ్రులు కాంగ్రెస్ ర్యాలీని తప్పుబట్టారు. 7 కిలోమీటర్ల దూరం సాధారణంగా 20 నిమిషాల్లో పూర్తవుతుంది. కానీ ర్యాలీ కారణంగా 35 నిమిషాలకుపైగా పట్టింది. పిల్లల భవిష్యత్తు కోసం ర్యాలీలు నగర బయట జరగాలి అని ఓ తండ్రి అసహంన వ్యక్తం చేశారు. మరొకరు రాహుల్ గాంధీ విద్యార్థుల కోసం కోటాకు వెళ్లారు. కానీ ఆయన పార్టీ ర్యాలీ వల్ల నలుగురు విద్యార్థులు పరీక్ష మిస్సయ్యారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అని ప్రశ్నించారు.ఈ ఘటనపై బీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ‘కాంగ్రెస్ అధికార దాహం కోసం ఎంత వరకు దిగజారుతుంది?’ అంటూ వీడియోను షేర్ చేశారు. దీనికి కాంగ్రెస్ మంత్రి ప్రియాంక్ ఖర్గే ‘కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదు. గత దశాబ్దంలో 89 పేపర్ లీకులు జరిగాయి’ అని ప్రతిస్పందించారు.కాంగ్రెస్ నేత బీకే హరిప్రసాద్ ‘కొంతమంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని విన్నాను. వారికి కలిగిన అసౌకర్యంపై విచారం వ్యక్తం చేస్తున్నాను. కానీ బీజేపీ పాలనలో కూడా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దానికి వారు క్షమాపణ చెప్పారా?’అని ప్రశ్నించారు. జేడీఎస్ అధినేత హెచ్డీ కుమారస్వామి ఈ ఘటనను ప్రభుత్వానికి అవమానకరమైన పరిణామంగా అభివర్ణించారు.Bengaluru, Karnataka: A parent of one of the students says, "Rahul Gandhi, D.K. Shivakumar, and even the Commissioner of Police, Bengaluru, do not seem to be concerned. Rahul Gandhi went to Kota for the cause of students, right? But because of his party's function today, four… https://t.co/1ixZBqPcRc pic.twitter.com/No3W5edKEb— IANS (@ians_india) June 21, 2026 -
అగ్నిప్రమాదంపై ప్రధాని విచారం.. ఎక్స్గ్రేషియా ప్రకటన
యూపీ: లక్నోలోని కోచింగ్ సెంటర్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయమై ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. " లక్నోలో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అధికారులు సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారు". అని ప్రధాని విచారం వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుండి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 పరిహారం అందజేస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. కాగా ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నం లక్నోలోని ఓ కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తో్ంది.ప్రమాదం ఎలా జరిగింది?ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం 3 గంటల సమయంలో అలీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉషా మెహతా మార్గ్లో ఉన్న మూడంతస్తుల వాణిజ్య భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్లోని ఒక దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ప్రారంభమయ్యాయని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మంటలు క్షణాల్లోనే పై అంతస్తులకు విస్తరించాయి. ఆ సమయంలో రెండో, మూడో అంతస్తుల్లో కంప్యూటర్ కోచింగ్ సెంటర్, లైబ్రరీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. భవనం మొత్తం పొగలు, మంటలు అలుముకోవడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే అగ్నిమాపక దళం వెంటనే స్పందించినప్పటికీ అయితే మంటలు భారీగా ఉండటంతో లోపలికి వెళ్లడం అగ్నిమాపక సిబ్బందికి కష్టతరమైంది. నిచ్చెనల సహాయంతో కిటికీలను పగలగొట్టి లోపల చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ భారీగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ స్పందించారు. గాయపడిన బాధితులకు సమీప ఆసుపత్రుల్లో మెరుగైన ఉచిత వైద్య చికిత్స అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.Anguished by the loss of lives in a fire mishap in Lucknow, Uttar Pradesh. My condolences to the bereaved families. May the injured recover at the earliest. Rescue operations are underway and authorities are providing all possible assistance. An ex-gratia of Rs. 2 lakh from…— PMO India (@PMOIndia) June 22, 2026 -
నదిలో లక్షల కోట్ల నిధి.. చేతికందేలా ఉన్నా తీసుకోలేని పరిస్థితి!
హిమాలయాల్లో ఓ పవిత్రమైన సరస్సు ఉంది. దాని అడుగు భాగంలో లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే అపారమైన బంగారు, వెండి ఆభరణాలున్నాయంటే మీరు నమ్ముతారా? ఆధ్యాత్మికతకు ఆలవాళంగా ఉన్న ఆ సరస్సులో.. నాగుపాము పడగను పోలిన పువ్వులుండే మొక్కలు ఎందుకున్నాయి..? సరస్సు అడుగుభాగంలోని నిధులను కాపాడేందుకు యక్షులు స్వయంగా ఈ మొక్కల రూపంలో నిఘా పెడతారా? లేక.. మరేమైనా విశేషాలున్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే.. హిమాలయ రాష్ట్రాల్లో కీలకమైన హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో.. సముద్రమట్టానికి 3,334 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర క్షేత్రమే కమ్రూనాగ్. ఇక్కడి కమ్రూనాగ్ సరస్సు ఎన్నెన్నో వింతలను తనలో ఇముడ్చుకుంది. మహాభారత కాలంలో రత్నాయుధుడు ఓ గొప్ప వీరుడు, యోధుడు. ఇతణ్నే కమ్రూనాగ్ అని పిలుస్తారు. శ్రీకృష్ణుడి వ్యూహం ప్రకారం కమ్రూనాగ్ తన తలను త్యాగం చేయాల్సి రాగా.. అందుకు ప్రతిఫలంగా కలియుగంలో నువ్వు భక్తులతో పూజలందుకుంటావని కృష్ణుడు వరమిచ్చాడు. అలా.. కమ్రూనాగ్ ఈ ప్రాంతంలో కొలువుదీరాడు..కమ్రూనాగ్ ఒక యక్షుడు. ఆయనను పూజించే భక్తులు భక్తిభావంతో కమ్రూనాగ్ సరస్సులో బంగారు, వెండి నాణేలను వేయడం ఆనవాయితీగా మారింది. ద్వాపరయుగాంతం నుంచి మొదలుకుని.. కలియుగారంభం.. ఆ తర్వాతి కాలంలో భక్తులు వేసిన కానుకలతో ఈ సరస్సు అడుగు భాగం లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, నాణేలకు నిలయంగా మారిపోయింది. ఈ నిధిని తస్కరించడానికి ఎవరూ సాహసించరు. అలా ప్రయత్నిస్తే.. ఇక్కడి నాగుపాములు, యక్షులు వారిని ఊరికే వదిలి పెట్టరని భక్తుల విశ్వాసం.ప్రపంచంలో ఎక్కడా కనిపించని నాగుపాము పడగను పోలిన అరుదైన పుష్పాలు కమ్రూనాగ్ సరస్సు వద్ద దర్శనమిస్తాయి. వీటిని హిమాలయన్ కోబ్రాలిల్లీ అని పిలుస్తారు. స్థానికులు వీటిని బిషర్ అని పిలుస్తారు. దీని శాస్త్రీయనామం అరిసెమా ప్రోపింక్వమ్. పువ్వు పైభాగం పడగ విప్పిన నాగుపాము ఆకారాన్ని పోలిఉంటుంది. అంతేకాదు.. పాము నాలిక బయటకు వచ్చినట్లుగా.. ఈ పువ్వు అగ్రభాగం కనిపిస్తుంది. ఈ పుష్పాలు గోధుమ, ఊదా, ఆకుపచ్చ రంగులతో చారలను కలిగి ఉంటాయి. మొదటిసారి ఈ పుష్పాలను చూసేవారు.. నిజంగానే అక్కడ పాము ఉందని భ్రమపడడం ఖాయం. కమ్రూనాగ్ ట్రెకింగ్ మార్గంలో, సరస్సు వద్ద ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.అయితే.. యక్షులు ఈ పువ్వుల రూపంలో ఉంటూ కమ్రూనాగ్ సరస్సులోని నిధులను కాపాడుతారని ఇక్కడి వారు విశ్వసిస్తారు. ఈ సరస్సును చేరుకనేందుకు నేరుగా రోడ్డుమార్గం లేదు. మండి నుంచి రోహండా అనే గ్రామానికి చేరుకుని.. అక్కడి నుంచి నిటారైన కొండమార్గంలో 6 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇందుకు నాలుగు గంటల వరకు సమయం పడుతుంది. అలా కఠినమైన ట్రెక్కింగ్ మార్గంలో ప్రయాణించి, కమ్రూనాగ్ సరస్సును చేరుకోవచ్చు. మే నెల మొదలు.. అక్టోబరు వరకు ఈ మార్గం ట్రెకింగ్కు అనుకూలంగా ఉంటుంది. ప్రతీఏడాది జూన్లో ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది. -
లక్ అంటే వీరిదే : కారు నుజ్జు నుజ్జు, షాకింగ్ సీసీటీవీ విజువల్స్
కేరళలోని తిరువనంతపురంలోని కిలిమనూర్ వద్ద MC రోడ్డు వద్ద క్షణాల్లో మృత్యుముఖం నుంచి తప్పించుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఆగి ఉన్న కారును వేగంగా వచ్చిన ఒక ట్రైలర్ ట్రక్బలంగా ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తూ తల్లీబిడ్డల తోపాటు, తండ్రి కూడా ఆ భయంకరమైన ప్రమాదం నుంచి ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఇది చూసి చాలామంది ఆశ్చర్యపోయారురోడ్డు పక్కన నిలిపిన కారు నుండి ఓ మహిళ తన బిడ్డతో దిగిన మరుక్షణమే, వెనుక నుండి వచ్చిన ట్రక్కు ఆ కారును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు తునాతునాకలైపోయింది. కానీ కారులో ఉన్న వారిద్దరికీ ఎటువంటి తీవ్ర గాయాలు కాలేదు. ఈ భయంకరమైన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.जाको राखे साइयाँ मार सके ना कोईA mother and child had a miraculous narrow escape📍KERALA pic.twitter.com/gYmHVUg1zx— Karan Singh / करन सिंह (@Journo_Karan) June 22, 2026 నిజంగా లక్ అంటే వీరిదే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వాహనం నడిపినందుకు గాను ట్రక్ డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేసి, ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఇదీ చదవండి: ఆ పిక్స్ అందుకే పోస్ట్ చేయలేదు, కానీ బీచ్లో బికినీ కాక..? -
ఈట్ ఫాస్ట్, ఒక్కో నిమిషానికి గంట ఎక్కువ : షాకింగ్ కంపెనీ నోటీసు
కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగుల కష్టాలు, పనివిధానం గురించి ఇప్పటికే అనేక అంశాలు చర్చనీయాంశమైనాయి. ఉద్యోగుల వర్క్ కల్చర్, ఒత్తిడిపై అనేక కథనాలు చాలానూ చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఒక వివాదాస్పద ఆఫీస్ నోటీసుసోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టోరీ ఏంటంటే..ఉద్యోగులు లంచ్ బ్రేక్ కోసం ఎక్కువ సమయం తీసుకుంటే వారికి పెనాల్టీ విధిస్తామంటూ ఒక ఆఫీస్ బోర్డుపై పెట్టిన నోటీసు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది పని సంస్కృతి (workplace culture) , ఉద్యోగుల హక్కులపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.ఇంతకీ నోటీసులో ఏముంది?ఈ నోటీసు ఏ కంపెనీకి చెందిందో స్పష్టంగా లేదు కానీ, అందులోని నిబంధనలు మాత్రం చాలా కఠినంగా ఉన్నాయి. దీని ప్రకారం ఉద్యోగులకు కేటాయించిన 30 నిమిషాల లంచ్ బ్రేక్ సమయం దాటితే, ఆ అదనపు సమయానికి బదులుగా జీతం లేని అదనపు గంటలు (unpaid work hours) పని చేయాల్సి ఉంటుంది. లంచ్ బ్రేక్ 30 నిమిషాల కంటే ఒక నిమిషం ఎక్కువైనా సరే... దానికి బదులుగా సాయంత్రం 6 గంటల తర్వాత కంపెనీ కోసం 60 నిమిషాల పాటు ఉచితంగా 'ఫోకస్ టైమ్' (Unpaid Focus Time) కేటాయించాల్సి ఉంటుంది. If your management writes policies like this, don't be surprised when your best employees write resignation emails. pic.twitter.com/3v5jZGA3XS— Nalini Unagar (@NalinisKitchen) June 22, 2026 ఒకవేళ 31 నిమిషాలు లంచ్ బ్రేక్ తీసుకుంటే, సాయంత్రం 6 గంటలకు వెళ్లాల్సిన వాళ్లు 7:00 గంటల వరకు ఆఫీసులోనే ఉండాలి. అందుకే "త్వరగా తినండి" (Eat faster) అంటూ నోటీసు చివరలో ఘాటు హెచ్చరిక కూడా ఉండటం గమనార్హం. ఇదీ చదవండి: ఆస్తి తగాదా : నటుడు సోదరుడికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమంనెటిజన్ల తీవ్ర ఆగ్రహంనెటిజన్లు కంపెనీ వైఖరిపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది చట్టవిరుద్ధమని, అనాగరికమని విమర్శిస్తున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైతే గంట సేపు ఉచితంగా పని చేయడం, ఓకే మరి, ఆఫీస్ సమయం ముగిసిన తర్వాత ఉద్యోగి ఒక్క నిమిషం ఎక్కువ పనిచేసినా ఒక గంట అదనపు జీతం ఇస్తారా . సాయంత్రం 6:01 వరకు ఉంటే గంట జీతం ఇవ్వాలి అంటూ కొంతమంది కౌంటరిచ్చారు.ఇదీ చదవండి: డీఏ పెంపు, లక్ష ఉద్యోగాలు : బెంగాల్లో బీజేపీ తొలి బడ్జెట్లో వరాల జల్లుఇలాంటి వేధింపుల వల్లే తాము రిమోట్ ఉద్యోగాల (Work from home) వైపు మొగ్గు చూపుతామని, ఆఫీస్ ఉద్యోగాలను వదులుకుంటామని మరికొందరు పేర్కొన్నారు. కొందరు మాత్రం వ్యాపార యజమానులు కూడా రాత్రింబగళ్లు కష్టపడతారని, ఉద్యోగులలో క్రమశిక్షణ కోసమే ఇలాంటివి పెడతారంటూ యజమానులు కొంతమంది స్పందించారు. ఇదీ చదవండి: ఆ పిక్స్ అందుకే పోస్ట్ చేయలేదు, కానీ బీచ్లో బికినీ కాక..?నోటీసు నిజమేనా?ఈ నోటీసుపై కంపెనీ పేరు గానీ, ఎలాంటి లోగో గానీ లేకపోవడంతో ఇది నిజమైనదేనా లేక కేవలం సోషల్ మీడియాలో లైకులు, అటెన్షన్ కోసం క్రియేట్ చేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. "ఒకవేళ 5 నిమిషాలు త్వరగా లంచ్ ముగించుకుని వస్తే.. 5 గంటల లీవ్ ఇస్తారా?" అంటూ కొందరు జోకులు పేలుస్తున్నారు. -
ఆ పిక్స్ అందుకే పోస్ట్ చేయలేదు, కానీ బీచ్లో బికినీ కాక..?
ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ రీటా సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట ఆడవాళ్ల బట్టలపై చర్చను లేవనెత్తింది. భారతీయ మహిళలు బీచ్కు వెళ్లి, స్విమ్సూట్ లేదా బికినీలో వేలకొద్దీ ఫోటోలు తీసుకున్నా, వాటిని ఫోన్ మెమోరీలోదాచుకోవడం తప్ప, సోషల్ మీడియాలో ఎందుకు పోస్ట్ చేయరు. ఎందుకంటే సమాజం ఏమనుకుంటుంది? పక్కింటి ఆంటీ ఎలా కామెంట్ చేస్తుంది? ఆ వీడియో లేదా ఫోటో చూసి మిమ్మల్ని అవమానకరమైన పేర్లతో పిలిస్తే? అని భయం వెంటాడుతుంది అంటూనే కొన్ని ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేయడం అగ్గి రాజేసింది.తాను కూడా బికీనీలు వేసుకుని ఫోటోలు దిగినా, వాటిని ఇన్స్టాగ్రామ్లో పెట్టనని రీటా గుర్తు చేసుకున్నారు. ఎందుకంటే భారత్లో ఉన్న 24 ఏళ్ల జీవితం తనకు ఎలాంటి బట్టలు వేసుకోవాలో,దుస్తుల విషయంలోఎంత జాగ్రత్తగా ఉండాలో నేర్పించిందన్నారు. కానీ భయపడుతూ, ఎన్నాళ్లుంటాం అని ప్రశ్నించింది. అందుకే తన మైండ్ సెట్ మార్చుకుని ఈ ఫోటోలను పోస్ట్ చేస్తున్నా అన్నారు.‘‘ఒక భారతీయ మహిళగా ఇలాంటి వీడియోను పోస్ట్ చేస్తానని తానెపుడూ అనుకోలేదు. అలా అని నేనెపుడూ బికినీ వేసుకోలేదని కాదు. థాయ్లాండ్ , ఇండోనేషియాలో చాలాసార్లు బికినీ ధరించా. అక్కడ బీచ్లలో ఇది చాలా కామన్. అయితే పూర్తిగా దుస్తులు కప్పుకున్నప్పుడు కూడా, ఏదో ఒకటి విమర్శిస్తారు. కళ్లార్పకుండా తదేకంగా చూస్తూనే ఉంటారు. సో.. జనం ఏదో అంటారనే రెండో ఆలోచన కూడా చేయకుండా తాను ఆ వీడియోను పోస్ట్ చేస్తున్నా’’ అని చెప్పింది. View this post on Instagram A post shared by Rita | Travel & Itineraries (@travelwith.rita) బికీనీలో ఫోటో పెడితే ఏమవుతుందని చాలా కాలం ఆలోచించాను. కానీ ఏ దేశమేగినా అక్కడ తగ్గట్టు ఉండాలని గ్రహించాను. నేను ఫరీదాబాద్లో బికీనీ వేసుకోను కదా, బీచ్లోనే వేసుకుంటాను. అలాగే బీచ్కి వెళ్లి ఒళ్లంతా కప్పేసే బట్టలు వేసుకోలేము కదా అని రాసుకొచ్చారు. అంతేకాదు ఇండియన్ అంకుల్స్ కేవలం షార్ట్స్ వేసుకుని, సరిగ్గా స్విమ్సూట్ కూడా లేకుండానే సముద్రాలు, పూల్స్లోకి దిగుతుంటారని గుర్తు చేశారు. చాలా దేశాల్లో తాను బికీనీ వేసుకున్నప్పుడు అక్కడెవరూ తనను వింతగా చూడలేదని, ఎవరి పని వారు చూసుకుంటారని రీటా చెప్పారు. నిజానికి మన భయమంతా సమాజం గురించే. చిన్నప్పటి నుండి మనకు అలవాటు చేసిన ఆలోచనా విధానం వల్లే వస్తుందని ఆమె స్పష్టం చేశారు. అయితే తాను మాట్లాడేది కేవలం బికీనీల గురించి కాదు, మన బాడీతో కంఫర్టబుల్గా ఉండటం, భయంతో మన ఫీలింగ్స్ను అనుభవాలను కోల్పోకపోవడం గురించి అని చెప్పారు.ఈ వీడియోపై నెటిజన్ల నుండి భిన్నమైన స్పందనలు వచ్చాయి. కొంతమంది ఆమెకు మద్దతుగా నిలిస్తే, మరికొంతమంది ఆమెను జడ్జ్ చేస్తూ, నానా మాటలు అన్నారు. ‘నీ బాడీ. నీ యిష్టం’ అని కొందరు మహిళలు ఆమెను సమర్ధించారు. థాయిలాండ్లో గుడ్లప్పగించి చూడకపోవడం వల్ల స్వేచ్ఛగా ఫీలవుతాం అంటూ చాలా మంది మహిళలు ఆమెకు మద్దతు తెలిపారు. ఇదీ చదవండి: డీఏ పెంపు, లక్ష ఉద్యోగాలు : బెంగాల్లో బీజేపీ తొలి బడ్జెట్లో వరాల జల్లుమహిళల దుస్తుల ఎంపికను బట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేసే సంకుచిత స్వభావం ఇంకా సమాజంలో కొనసాగుతూనే ఉంది. మహిళలు ఏం వేసుకోవాలో నియంత్రించే కంటే,ఇలాంటి పురుషాధిక్య, వివక్షతోకూడిన ఆలోచనలను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయ పడ్డారు.రీటాను విమర్శించిన వారిలో ఎక్కువమంది పురుషులే ఉన్నారు. ఈమెకు దూరంగా ఉండండి అని కొందరంటే, పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా కాపీ కొడుతూ, మళ్లీ దానికి సమర్థన ఒకటి అని మండిపడ్డారు. పద్ధతిగా బట్టలు వేసుకోవడం అంటే స్వేచ్ఛను వదులకున్నట్టు కాదు మరికొరు విమర్శించారు. ఇదీ చదవండి: ఆస్తి తగాదా : నటుడు సోదరుడికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం -
కోచింగ్ సెంటర్లో ఘోర అగ్ని ప్రమాదం.. 14మంది మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఒకే ప్రమాదంలో రెండు విషాదాలు చోటు చేసుకోవడం మరింత కలచివేసింది.సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో అలీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉషా మెహతా మార్గ్లో ఉన్న మూడంతస్తుల వాణిజ్య భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్లోని ఒక దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ప్రారంభమయ్యాయని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.మంటలు క్షణాల్లోనే పై అంతస్తులకు విస్తరించాయి. ఆ సమయంలో రెండో, మూడో అంతస్తుల్లో కంప్యూటర్ కోచింగ్ సెంటర్, లైబ్రరీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. భవనం మొత్తం పొగలు, మంటలు అలుముకోవడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.దట్టమైన పొగలు, మంటల మధ్య చిక్కుకుని కొంతమంది విద్యార్థులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోగా, మరికొందరు ప్రాణాలు రక్షించుకునేందుకు పై అంతస్తుల నుండి దూకే క్రమంలో తొక్కిసలాటలో మరణించారు. బయటకు వచ్చే మార్గం మూసుకుపోవడంతో విద్యార్థులు కిటికీలు, రైలింగ్ల నుండి దూకారు. ఈ సమయంలో ఒక యువకుడు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు.సమాచారం అందుకున్న వెంటనే లక్నో చీఫ్ ఫైర్ ఆఫీసర్ నేతృత్వంలో 14 అగ్నిమాపక వాహనాలు, ఒక హైడ్రాలిక్ ప్లాట్ఫారమ్ వాహనం ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పోలీసులు, స్థానికులు కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ఐదారు మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అయితే మంటలు భారీగా ఉండటంతో లోపలికి వెళ్లడం అగ్నిమాపక సిబ్బందికి కష్టతరమైంది. నిచ్చెనల సహాయంతో కిటికీలను పగలగొట్టి లోపల చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ప్రాథమికంగా 11 మంది మృతి చెందినట్లు సమాచారం. అనంతరం మృతుల సంఖ్య 14కి చేరింది.ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. గాయపడిన బాధితులకు సమీప ఆసుపత్రుల్లో మెరుగైన ఉచిత వైద్య చికిత్స అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. -
ఆస్తి తగాదా : నటుడు సోదరుడికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం
బాలీవుడ్ ప్రముఖ నటుడు, స్త్రీ 2, ఓఎమ్జి-2 మిమి, మీర్జాపూర్ లాంటి చిత్రాలతో ఆకట్టుకున్న పంకజ్ త్రిపాఠికి చేదు అనుభవం ఎదురైంది. పూర్వీకుల నుంచి వచ్చిన భూమిగా వచ్చిన ఆస్తి తాగాదాలో పంకజ్ త్రిపాఠి సోదరుడు బీజేంద్రనాథ్ తివారీ తీవ్రంగా గాయపడిన సంగతి కలకలం రేపింది. బిహార్ రాష్ట్రం గోపాల్ గంజ్ జిల్లాలోఈ ఘటన చోటు చేసుకుంది.పోలీసుల వివరాల ప్రకారం నటుడు పంకజ్ త్రిపాఠి స్వగ్రామమైన బరౌలీ పట్టణంలోని బెల్సంద్ వద్ద ఈ దాడి జరిగింది. భూ వివాదానికి సంబంధించిన గొడవ కారణంగా కొందరు వ్యక్తులు బీజేంద్రనాథ్ తివారీపై కర్రతో దారుణంగా దాడిచేశారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు.హుటాహుటిన అతడిని గోపాల్ గంజ్ మోడల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం పాట్నాలోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. అతని ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇదీ చదవండి: డీఏ పెంపు, లక్ష ఉద్యోగాలు : బెంగాల్లో బీజేపీ తొలి బడ్జెట్లో వరాల జల్లుఈ ఘటనపై పోలీసులు వేగంగా స్పందించి దాడికి సంబంధించి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడిని గుర్తించి జుడీషియల్ కస్టడీకి పంపినట్లు గోపాల్గంజ్ ఎస్పీ వినయ్ తివారీ తెలిపారు. బాధితుడి కుటుంబ సభ్యుల నుండి ఇంకా ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు అందనందున పూర్తి స్థాయి చట్టపరమైన ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని, అధికారిక ఫిర్యాదు అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై మాట్లాడేందుకు పంకజ్ త్రిపాఠి కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఈ దాడి ఘటనపై జేడీయూ జాతీయ ప్రతినిధి రాజీవ్ రంజన్ తీవ్రంగా ఖండించారు. నేరస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠినమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.Gopalganj, Bihar: Brother of actor Pankaj Tripathi, Bijendra Nath Tiwari, sustained critical injuries in a sharp-weapon attack linked to an old dispute. He was shifted to Patna for advanced treatment, while police formed a special team and launched raids to apprehend the accused. pic.twitter.com/uZRLUN3WNs— IANS (@ians_india) June 21, 2026ఇదీ చదవండి: అమెరికాలో తెలంగాణా విద్యార్థి అరుణ్ సాయి రెడ్డి హఠాన్మరణం -
కాక్రోచ్ పార్టీ సంచలన ఆరోపణలు!
నీట్-యూజీ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం, అవకతవకల నడుమ మరోసారి పరీక్షను నిర్వహించారు. అయితే దీనిపై కూడా దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరోవైపు కేంద్రం తీరును ఖండిస్తూ.. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఇప్పుడు సంచలన ఆరోపణలకు దిగింది.. నీట్-యూజీ పేపర్ లీక్ వివాదంపై కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకుడు, సోషల్ మీడియా ద్వారా ప్రాచుర్యం పొందిన అభిజిత్ దీప్కే.. నిరసనకారుల పట్ల అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జంతర్మంతర్లోని మరుగుదొడ్లకు వరుసగా రెండో రోజూ నీటి సరఫరా నిలిచిపోయిందని ఆయన ఆరోపించారు. నిరసనలకు వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు, కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. వెంటనే నీటి సరఫరాను పునరుద్ధరించాలని ఆయన సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు.అంతేకాకుండా నిరసనకారులకు నీళ్లు, అరటిపండ్లు పంపిణీ చేస్తున్న వారి ఆధార్ కార్డు వివరాలు, చిరునామాలు సేకరిస్తున్నారని ఢిల్లీ పోలీసులపై ఆరోపణలు చేశారు. ప్రజలకు సహాయం చేస్తున్న వారిని సైతం అనుమానాస్పదంగా చూడటం సరైంది కాదని అభిజిత్ పేర్కొన్నారు.జంతర్మంతర్లో నిరసనకారుల కోసం స్వచ్ఛంద సంస్థలు, మద్దతుదారులు లంగర్ ఏర్పాటు చేసి ఆహారం, లస్సీ పంపిణీ చేస్తున్నారు. అనేక మంది రాత్రంతా అక్కడే బస చేస్తుండటంతో చెప్పులు, సామాన్లు, పాత్రలు అక్కడే కనిపిస్తున్నాయి. పోలీసులు అనుమతి గడువు ముగిసిందని తెలిపినా.. ప్రత్యామ్నాయ వేదిక కేటాయించే వరకు తాము నిరసన కొనసాగిస్తామని సీజేపీ ప్రతినిధులు స్పష్టం చేశారు.నీట్-యూజీ లీక్ వ్యవహారంలో తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపిస్తున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కూడా ఈ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ ఉద్యమానికి తాజాగా రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి.మరోవైపు మహారాష్ట్రకు చెందిన సామాజిక కార్యకర్త జ్ఞానేశ్వర్ రఘునాథ్ థోరట్ఈ నిరసనల్లో చేరడం హైలైట్ అయ్యింది. “విద్యార్థులు సంవత్సరాల పాటు కష్టపడి పరీక్షలకు సిద్ధమవుతారు. కానీ కొందరి లాభం కోసం పరీక్షల విశ్వసనీయత దెబ్బతింటే అది లక్షలాది కుటుంబాలకు అన్యాయం చేసినట్టే” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.నీట్-యూజీ పేపర్ లీక్ వివాదం ఇప్పటికే దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. మరోవైపు రీ టెస్ట్ను కూడా ఎన్టీఏ సరిగ్గా నిర్వహించలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో ఇప్పుడు జంతర్మంతర్ వేదికగా కొనసాగుతున్న నిరసనలు, కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆరోపణలు మరోసారి ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మార్చాయి. పరీక్షల పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్తు, ప్రభుత్వ బాధ్యతలపై ప్రశ్నలు లేవనెత్తుతున్న ఈ ఉద్యమం ఇంకా ఎంత దూరం వెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది. -
37 ఏళ్ల ఎదురుచూపు.. విధి ఆడిన వింత నాటకం!
“పిల్లలు సెటిల్ అయిపోయారు. హమ్మయ్యా.. ఇంక రిటైర్మెంట్ తర్వాత హాయిగా జీవిద్దాం” అని ఎన్నో కలలు కనే వాళ్లు ఉంటారు. కానీ ఆ కలలన్నీ నిజం కావడానికి జీవితం అవకాశం ఇస్తుందనే గ్యారంటీ లేదు. 37 ఏళ్ల పాటు ఉద్యోగానికే జీవితాన్ని అంకితం చేసిన ఓ పెద్దాయన.. తన జీవితంలోని అరుదైన క్షణం కోసం ఎదురు చూశాడు. కానీ, విధి వింత నాటకం ఆడింది. ఓ వైద్యురాలు సోషల్ మీడియాలో పంచుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.68 ఏళ్ల ఓ వ్యక్తి ఇటీవల గుండెపోటుతో ఆస్పత్రిలో చేరగా.. వైద్యులు ఎంత ప్రయత్నించినా ప్రాణాలు కాపాడలేకపోయారు. అయితే ఆయన మరణం కంటే ఎక్కువగా అందరినీ కలచివేసింది ఆయన భార్య చెప్పిన విషయం.వైద్యురాలు డాక్టర్ ధివ్య ధ్యానా సోషల్ మీడియాలో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ పెద్దాయన కేవలం రెండు నెలల క్రితమే ఉద్యోగ విరమణ పొందాడు. అదే కంపెనీలో ఏకంగా 37 సంవత్సరాలు పనిచేశాడు. ఉద్యోగ జీవితమంతా కుటుంబ పోషణకే ప్రాధాన్యం ఇచ్చాడు. భార్య, ముగ్గురు పిల్లల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించాడు. ఈ క్రమంలో కుటుంబ విహారయాత్రలు, స్నేహితులతో పర్యటనలు, వ్యక్తిగత ఆనందాలన్నింటినీ వాయిదా వేస్తూ వచ్చాడు. “ఇప్పుడు కష్టపడతాను.. రిటైర్ అయిన తర్వాత జీవితాన్ని ఎంజాయ్ చేస్తాను” అని భార్యకు తరచూ చెప్పేవాడట.చివరకు రిటైర్మెంట్ వచ్చిన తర్వాత భార్యతో కలిసి నెల రోజుల పాటు ప్రపంచాన్ని చుట్టేయాలని నిర్ణయించుకున్నాడు. ఆగస్టులో జరగాల్సిన ఆ పర్యటన కోసం టికెట్లు, హోటల్ బుకింగ్లు సహా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కానీ ఆ కలల యాత్ర ప్రారంభం కాకముందే ఆయన గుండెపోటుతో మరణించాడు.ఈ ఘటనను వివరిస్తూ డాక్టర్ ధివ్య ధ్యానా భావోద్వేగానికి గురయ్యారు. “37 ఏళ్ల కష్టానికి ప్రతిఫలంగా జీవితాన్ని ఆస్వాదించాలనుకున్న వ్యక్తి.. ఆ క్షణం వచ్చేలోపే వెళ్లిపోయాడు. ఇలాగే ఎంతో మంది తమ సమయం, ఆరోగ్యం, స్వేచ్ఛను త్యాగం చేస్తూ భవిష్యత్తు కోసం మాత్రమే జీవిస్తున్నారు” అని పేర్కొన్నారామె.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వేలాది మంది నెటిజన్లు స్పందిస్తూ.. తమ కుటుంబాల్లోనూ ఇలాంటి కథలు ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు. రిటైర్మెంట్ తర్వాత జీవితాన్ని ఆస్వాదిద్దామనుకుని.. ఆ అవకాశమే దక్కని బంధువులు, స్నేహితుల గురించి గుర్తుచేసుకుంటున్నారు. View this post on Instagram A post shared by Dr Dhivya Dhyana (@drdhivyadhyana)జీవితం ఎప్పుడూ మన ప్రణాళికల ప్రకారం సాగదని.. భవిష్యత్తు కోసం వర్తమానాన్ని పూర్తిగా త్యాగం చేయడం సరైనది కాదని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. పని, బాధ్యతలు ఎంత ముఖ్యమైనవైనా.. కుటుంబంతో గడిపే సమయం, ఆరోగ్యం, చిన్న చిన్న ఆనందాలు కూడా అంతే విలువైనవని నిపుణులు సూచిస్తున్నారు. -
డీఏ పెంపు, లక్ష ఉద్యోగాలు : బెంగాల్లో బీజేపీ తొలి బడ్జెట్లో వరాల జల్లు
కోలకతా, సాక్షి: పశ్చిమ బెంగాల్లో బీజేపీ సర్కార్ తొలిసారి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. బెంగాల్ ప్రజలను ఆకట్టుకునేదిశగా లక్ష ఉద్యోగాలు, ఇందులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్,ఉద్యోగులకు డీఏ పెంపు లాంటి అనేక జనాకర్షక తాయిలాలను ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి స్వపన్ దాస్గుప్తా సోమవారం ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వపు మొట్టమొదటి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రాష్ట్ర రుణ భారాన్ని తగ్గించడం, ఆదాయ వసూళ్లను పెంచడం, మౌలిక సదుపాయాల ఆధారిత వృద్ధిని వేగవంతం చేయడంపై దృష్టి సారిస్తూ, ప్రభుత్వ ఆర్థిక ప్రాధాన్యతలను ఆయన వివరించారు."వికసిత్ భారత్" విజన్కుఅనుగుణంగానే "వికసిత్ బంగ్లా"అభివృద్ధి ఎజెండా ఉంటుందని ఆర్థిక మంత్రి వెల్లడించారు. మునుపటి ప్రభుత్వం నుండి తమకు రూ. 8.15 లక్షల కోట్ల అప్పు వారసత్వంగా వచ్చిందని, అయితే ప్రస్తుతమున్న అన్ని సామాజిక సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.బడ్జెట్లోని ముఖ్యాంశాలు:లక్ష ఉద్యోగాలు : ప్రభుత్వ రంగంలో లక్ష ఖాళీలను భర్తీ చేయనున్నామనే ప్రకటన ప్రధానంగా నిలిచింది. ఇందులో 33 శాతం సీట్లను మహిళలకు కేటాయించారు. పోలీస్ శాఖలో 20వేల పోస్టులు, విద్యాశాఖలో 50,000 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిలో ప్రస్తుతం ఉన్న ఐదేళ్ల సడలింపును మరో రెండేళ్లపాటు పొడిగించారు.ప్రభుత్వ ఉద్యోగుల కరవు భత్యాన్ని (DA) అక్టోబర్ నుండి 20శాతం పెంచనున్నారు.ప్రభుత్వ మరియు ప్రభుత్వ సాయం పొందే పాఠశాలల్లో చదువుకునే బాలికలకు రూ. 50,000 స్కాలర్షిప్ అందజేస్తారు.అలాగే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అందిస్తున్న రాష్ట్రాల్లో ఇపుడిక బెంగాల్ కూడా చేరిపోయింది. ఇందు కోసం రూ. 550 కోట్లు కేటాయించారు. దీని కోసం త్వరలోనే 'పింక్ కార్డ్' (Pink Card) పథకాన్ని ప్రారంభించనున్నారు.అన్నపూర్ణ యోజన పథకం కోసం రూ. 36,000 కోట్లు కేటాయించారు.పీఎం ఆవాస్ యోజన కింద బెంగాల్లో మరో 25 లక్షల మందికి పీఎం ఆవాస్ ఇళ్లను నిర్మించి ఇస్తారు.ఉపాధి హామీ పథకం (MGNREGA) పని దినాలను 100 రోజుల నుండి 125 రోజులకు పెంచారు.వలస కార్మికులకు ఆయుష్మాన్ భారత్: వలస కూలీల కోసం ఆయుష్మాన్ భారత్ కార్డులను అందజేస్తారు. గిగ్ కార్మికుల (Gig workers) కోసం సంక్షేమ బోర్డును ప్రతిపాదించారు.కోల్కతా సమీపంలో సరికొత్త 'గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం' (Greenfield airport) ఏర్పాటు కానుంది.ఎమ్మెల్యే నిధుల పెంపు: ఎమ్మెల్యే అభివృద్ధి నిధులను రూ. 70 లక్షల నుండి రూ. 1 కోటికి పెంచారు.AI మిషన్ ప్రారంభం, భూమి రికార్డుల డిజిటలైజేషన్, మైనింగ్ కార్యకలాపాల కోసం కేంద్రీకృత వేలం విధానంసివిక్ వాలంటీర్ల సంఖ్యలో 2000 పెంపు, గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటు, కండక్టర్లకు వేతనం పెంపు రిటైర్డ్ జర్నలిస్టులకు రూ. 5,000 నెలవారీ పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించినట్టు ఆర్థికమంత్రి వెల్లడించారు. దీంతోపాటు రాజకీయ కారణాలతో జైలులో ఉన్న వారికి నెలకు రూ.10,000 అందించనున్నారు. సాంప్రదాయ బెంగాలీ చాపలు , జనపనారతో తయారు చేసిన ఫైల్లో ఈ బడ్జెట్ను తీసుకురావడం మరో విశేషం. ఇదీ చదవండి: అమెరికాలో తెలంగాణా విద్యార్థి అరుణ్ సాయి రెడ్డి హఠాన్మరణం -
కోడింగ్ను మింగేస్తున్న ఏఐ.. ‘టాపర్ల’ సరికొత్త నిర్ణయం!
న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ప్రపంచాన్ని శాసిస్తున్నదని, భవిష్యత్ ఉద్యోగాలన్నీ దానివేనని అంతా భావిస్తున్న తరుణంలో దేశంలోని ఐఐటీ ప్రవేశాల్లో సరికొత్త ట్రెండ్ సంచలనం సృష్టిస్తోంది. దేశంలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన ఐఐటీ టాపర్లు మాత్రం కంప్యూటర్ సైన్స్కు బదులుగా ‘సివిల్ ఇంజనీరింగ్’ వైపు మొగ్గు చూపుతున్నారు. రోడ్లు, భవనాలు, నగరాల నిర్మాణం వైపు ఈ టాలెంటెడ్ విద్యార్థులు ఎందుకు అడుగులు వేస్తున్నారనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.ఏఐ భయాలు.. మౌలిక వసతుల జోరుగత రెండు దశాబ్దాలుగా కంప్యూటర్ సైన్స్ (సీఎస్ఈ)ఐఐటీ అడ్మిషన్లలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం ఏఐ టూల్స్ సెకన్ల వ్యవధిలో క్లిష్టమైన కోడింగ్ను పూర్తి చేస్తుండటంతో, రాబోయే 10-15 ఏళ్లలో సాఫ్ట్వేర్ ఉద్యోగాల భవిష్యత్తు ఎలా ఉంటుందోననే అనిశ్చితి ఐఐటీ టాపర్లలో మొదలైంది. ఇదే సమయంలో భారతదేశంలో ఎక్స్ప్రెస్వేలు, మెట్రో లైన్లు, స్మార్ట్ సిటీలు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు శరవేగంగా విస్తరిస్తున్నాయి. ఈ భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల నిర్వహణకు వేలాది మంది ఇంజనీర్ల అవసరం ఉండటంతో, సివిల్ ఇంజనీరింగ్ను టాపర్లు సురక్షితమైన కెరీర్ ఆప్షన్గా భావిస్తున్నారు.జీతాల తేడాలున్నా మారని ట్రెండ్ప్లేస్మెంట్ల పరంగా చూస్తే ఇప్పటికీ కంప్యూటర్ సైన్స్, ఏఐ విభాగాలదే పైచేయిగా ఉంది. ఉదాహరణకు 2026 క్యాంపస్ సెలక్షన్స్ లో ఐఐటీ రూర్కీకి చెందిన డేటా సైన్స్, ఏఐ మొదటి బ్యాచ్ విద్యార్థులు 100 శాతం ప్లేస్మెంట్స్ సాధించారు. ఐఐటీ మద్రాస్లో కంప్యూటర్ సైన్స్ విద్యార్థుల సగటు ప్యాకేజీ రూ. 46 లక్షలుగా ఉంటే, సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు రూ. 17.2 లక్షలు మాత్రమే దక్కింది. అయినప్పటికీ భవిష్యత్తులో సాఫ్ట్వేర్ రంగాన్ని ఏఐ శాసించే ప్రమాదం ఉండటంతో, లాంగ్ టర్మ్ భద్రత కోసం టాపర్లు సివిల్ వైపే మొగ్గు చూపుతున్నారు.రెండు రంగాల జీవనశైలి.. విభిన్నంసివిల్ ఇంజనీరింగ్ ఎంచుకునే వారు ప్రాజెక్ట్ సైట్లలో తిరుగుతూ, కాంట్రాక్టర్లు, ఆర్కిటెక్ట్లతో కలిసి క్షేత్రస్థాయిలో పని చేయాల్సి ఉంటుంది. తాము నిర్మించిన వంతెనలు, రోడ్లు కళ్లముందే సాకారం కావడం వీరికి ఒక తృప్తిని ఇస్తుంది. అదే సమయంలో ఏఐ ప్రొఫెషనల్స్ పూర్తిగా ఆఫీస్ లేదా రిమోట్ వర్క్ చేస్తూ, రోజంతా కంప్యూటర్ల ముందే గడపాల్సి ఉంటుంది. ప్రస్తుతం సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి అర్బన్ ప్లానింగ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ వంటి సరికొత్త రంగాలతో పాటు ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్, సొంతంగా స్టార్టప్లు పెట్టుకునే అద్భుతమైన అవకాశాలు లభిస్తున్నాయి. -
కాంగ్రెస్లో మళ్లీ ‘థరూర్’ మంటలు
న్యూఢిల్లీ: ఎంపీ శశి థరూర్ మరోసారి కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారానికి కారణమయ్యారు. జమ్ముకశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయంటూ ఆయన చేసిన సోషల్ మీడియా పోస్ట్, సొంత పార్టీ నేతల నుంచే గట్టి విమర్శలకు దారితీసింది. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో జరిగిన భేటీపై థరూర్ సానుకూల వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాజకీయంగా వేడి పుట్టిస్తోంది.గవర్నర్తో భేటీ.. థరూర్ సానుకూల వ్యాఖ్యలుశ్రీనగర్ పర్యటనలో ఉన్న తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను కలిశారు. ఈ భేటీ అనంతరం ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. ‘ఎల్జీతో అద్భుతమైన సమావేశం జరిగింది. కశ్మీర్లో పరిస్థితులు, సాధారణ స్థితి వైపు సాగుతున్న ప్రోత్సాహకరమైన పురోగతిపై చర్చించాం’ అని పేర్కొన్నారు. స్థానిక రచయితల సంఘం, మహిళా సంఘాల ప్రతినిధులతో ఎల్జీ మాట్లాడుతుండటం సానుకూల పరిణామమని, ఇంకా ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ, ఈ భేటీ తనకు ఎంతో ఆశాజనకంగా అనిపించిందని థరూర్ రాసుకొచ్చారు. In Srinagar! Had the honour of an excellent meeting with Lieutenant-Governor Shri @manojsinha_ at Lok Bhavan today. We discussed the situation in the state and the encouraging progress towards normalcy. When I arrived he was chatting to the President of the Kashmiri Writers’… pic.twitter.com/hm1lz3qDGF— Shashi Tharoor (@ShashiTharoor) June 21, 2026సొంత పార్టీ నుంచే ఘాటు కౌంటర్థరూర్ వ్యాఖ్యలపై జమ్మూ కాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రవీందర్ శర్మ తీవ్రంగా స్పందించారు. గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకోవడానికి థరూర్ స్థానిక ప్రజలను కలిసి ఉంటే బాగుండేదని ఎక్స్లో కౌంటర్ ఇచ్చారు. ఏడేళ్ల క్రితం తాము కోల్పోయిన రాష్ట్ర హోదా కోసం పోరాడుతున్న సొంత పార్టీ నాయకులను కలవడానికి కనీసం సమయం కేటాయించకపోవడాన్ని శర్మ తప్పుబట్టారు.ప్రధాని మోదీపై వ్యాఖ్యల వివాదంశశి థరూర్ ఇలా సొంత పార్టీలోనే విమర్శలు ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. అమెరికా నౌకాదళ దిగ్బంధం మధ్య ముగ్గురు భారతీయ నావికుల మరణంపై, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని మోదీ జరిపిన చర్చలను థరూర్ సమర్థించడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. అయితే, దీనిపై థరూర్ స్పందిస్తూ.. తానేమీ రాజకీయంగా ప్రశంసించలేదని, భారతీయ పౌరుల భద్రత గురించే మాట్లాడానని, దీన్ని అనవసరంగా వివాదం చేస్తున్నారని అన్నారు. -
NEET రీ-ఎగ్జామ్.. వెలుగులోకి భారీ కుంభకోణం!
అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించిన నీట్-యూజీ రీ-ఎగ్జామ్లో భారీ కుంభకోణం వెలుగుచూసింది. అభ్యర్థులకు బదులుగా వేరొకరు పరీక్ష రాస్తూ పట్టుబడిన వ్యవహారాలు సంచలనంగా మారాయి. ఘటనపై అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టగా, ఒక్క బీహార్లోనే ఇప్పటివరకు 30 మందిని అరెస్ట్ చేశారు. ఈ మోసం వెనుక ఉన్న అసలు సూత్రధారులు, నెట్వర్క్ను గుర్తించే పనిలో దర్యాప్తు సంస్థలు నిమగ్నమయ్యాయి.బిహార్లో నీట్ రీటెస్ట్-2026 సందర్భంగా భారీ అక్రమాలు వెలుగు చూశాయి. పరీక్ష రాస్తున్న వారి స్థానంలో ఇతరులు హాజరయ్యిన ఘటనలు బయటపడటంతో అధికారులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో మొత్తం 30 మంది అరెస్టు కాగా, అందులో 9 మంది నకిలీ అభ్యర్థులుగా పరీక్ష రాస్తూ పట్టుబడటం కలకలం రేపింది. లఖిసరాయ్ జిల్లాలో పలు పరీక్ష కేంద్రాల్లో జరిగిన తనిఖీల్లో ఈ మోసం బయటపడింది. కేఆర్కే హైస్కూల్ పరీక్ష కేంద్రం నుంచి ఒకరు, కేంద్రీయ విద్యాలయం నుంచి ఏడుగురు, హసన్పూర్ స్కూల్ నుంచి మరో వ్యక్తి.. నకిలీగా పరీక్ష రాస్తూ పట్టుబడ్డారు. వీరంతా వేరే అభ్యర్థుల స్థానంలో పరీక్షకు హాజరైనట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనతో పాటు మరో 21 మందిని కూడా అనుమానితులుగా అరెస్టు చేశారు. వీరి పాత్ర ఈ మోసపూరిత నెట్వర్క్లో ఉందా? అనే కోణంలో అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు. మొత్తం అరెస్టుల సంఖ్య 30కి చేరగా.. ఆ సంఖ్య పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు.అరెస్టయిన వారిని ఎస్డీఎం ప్రభాకర్ కుమార్, ఎస్డీపీవో శివమ్ కుమార్ పర్యవేక్షణలో ప్రశ్నిస్తున్నారు. విచారణలో వెలుగులోకి వస్తున్న సమాచారం ఆధారంగా ప్రత్యేక పోలీసు బృందాలు సంబంధిత ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నాయి. ఈ మోసానికి వెనుక పెద్ద నెట్వర్క్ ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.లఖిసరాయ్ జిల్లా మేజిస్ట్రేట్ శైలేంద్ర కుమార్, ఎస్పీ ప్రేరణ కుమార్ ఈ కేసు విచారణను స్వయంగా పర్యవేక్షిస్తున్నారని అధికారులు తెలిపారు. మరింత మంది ఈ రాకెట్లో భాగమై ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే NEET పరీక్షలో ఇలాంటి మోసాలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. పూర్తి నెట్వర్క్ను బయటకు తీసేందుకు విచారణ కొనసాగుతుండగా, మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై పరీక్ష నిర్వహణ సంస్థ ఎన్టీఏ స్పందించాల్సి ఉంది. -
కోడింగ్ టు ప్రిస్క్రిప్షన్: సత్తా చాటిన ‘ఆకృతి @ 32’
కలలు కనడానికి వయసుతో నిమిత్తం లేదని, సంకల్పం బలంగా ఉంటే ఎంతటి కఠినమైన లక్ష్యాన్నైనా సాధించవచ్చని నిరూపించారు ముంబైకి ఆకృతి గోయల్. ఇంజనీరింగ్ పూర్తి చేసి, మంచి జీతంతో ఉద్యోగం చేస్తున్నప్పటికీ.. డాక్టర్ కావాలనే చిన్నప్పటి కల ఆమెను నిద్రపోనివ్వలేదు. 32 ఏళ్ల వయసులో ఇంకా పెళ్లి కాలేదనే హేళనలను, ‘ఈ వయసులో ‘నీట్’ రాస్తారా?’ అనే మాటలను లెక్కచేయకుండా, కేవలం 10 నెలల కఠోర ప్రిపరేషన్తో నీట్ (NEET UG) పరీక్షను క్రాక్ చేసి సరికొత్త రికార్డు సృష్టించారు ఆకృతి గోయల్.బిట్స్ పిలానీ నుండి ఎంబీబీఎస్ వైపు అడుగులుఆకృతికి చిన్నతనం నుంచే మెడిసిన్ వైపు మక్కువ ఉన్నప్పటికీ, కొన్ని పరిస్థితుల వల్ల ఇంజనీరింగ్ దిశగా వెళ్లాల్సి వచ్చింది. ఆమె ప్రతిష్టాత్మక ‘బిట్స్ పిలానీ’లో ఎంఎస్సీ ఎకనామిక్స్, బిటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్లో డ్యూయల్ డిగ్రీ పూర్తి చేశారు. చదువు తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్లకు వెళ్లకుండా, స్వయంగా ఇంటర్వ్యూల ద్వారా స్టార్టప్లలో ఉద్యోగాలు సంపాదించారు. ఆ తర్వాత ‘హీలోఫీ’ అనే స్టార్టప్లో లీడర్షిప్ పాత్రను పోషిస్తూ, నేరుగా సీఈఓతో కలిసి మిలియన్ డాలర్ల ప్రాజెక్టులను విజయవంతంగా హ్యాండిల్ చేశారు.ఉద్యోగానికి గుడ్ బై.. సమాజం నుండి అవహేళనలువరుసగా లేట్ నైట్ షిఫ్టులు, విపరీతమైన పని ఒత్తిడి కారణంగా 2020 జనవరిలో ఆకృతి అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఆమె తన ఉద్యోగాన్ని వదిలేసి, మళ్లీ డాక్టర్ కావాలనే తన చిన్ననాటి కల వైపు అడుగులు వేశారు. అయితే, 30 ఏళ్లు దాటిన ఆకృతి ఉద్యోగం వదిలేసి పరీక్షలకు సిద్ధమవడాన్ని చుట్టుపక్కల వారు తప్పుపట్టారు. ‘ఈ వయసులో పెళ్లి చేసుకోకుండా నీట్ ప్రిపరేషన్ ఏంటి?’ అంటూ ఎగతాళి చేశారు. కానీ ఆ విమర్శలనే ఆమె తన విజయానికి ఇంధనంగా మార్చుకున్నారు.10 నెలల కఠోర దీక్ష.. 676 మార్కులతో..దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్లీ పుస్తకాలు పట్టడం ఆకృతికి అంత సులువు కాలేదు. తొలుత ఆన్లైన్లో ఉచిత బయాలజీ క్లాసులు వింటూ, రోజుకు 10 గంటల చొప్పున చదవడం ప్రారంభించారు. కేవలం 10 నెలల ప్రిపరేషన్ కాలంలో ఆమె 100 కి పైగా మాక్ టెస్టులు రాశారు. 2021లో నీట్ ఫలితాలు విడుదలైనప్పుడు, ఆమె 676 స్కోరుతో, ఆల్ ఇండియా లెవెల్లో 1,118వ ర్యాంకు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఆమె హిందూ రావు మెడికల్ కాలేజీ(ఢిల్లీ)లో ఎంబీబీఎస్ చదువుతూ, సరికొత్త జీవితాన్ని ప్రారంభించారు. -
భర్త వద్ద పనిచేసే యువకునితో అక్రమ సంబంధం..!
ఉన్నంతలో కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. ఆమె కాపురం బాగుండాలని దేవుళ్లను ప్రార్థించారు. కానీ కూతురు మాత్రం ఖతర్నాక్గా మారింది. భర్త వద్ద పనిచేసే యువకునితో అక్రమ సంబంధం పెట్టుకుని భర్తనే పరలోకానికి పంపింది. ఈ సంఘటనతో ఆమె, ప్రియుడు కటకటాల్లో ఉన్నారు. బెళగావి జిల్లా హుక్కేరి వద్ద అనైతిక బంధం, రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్త, రిటైర్డు జవాన్ సందీప్ మంజరగి (46) ని సెలైన్లో విషం ఎక్కించి హతమార్చిన భార్య సుమ కేసులో మరో విషాదం చోటుచేసుకుంది. ఈ పరిణామాలతో సమాజంలో పరువు పోయిందని తీవ్ర మనోవేదనకు గురైన సుమ తల్లి మహాదేవి (57) ఆత్మహత్య చేసుకుంది. కూతురి నిర్వాకం గురించి ముమ్మరంగా ప్రచారం సాగుతుండడం చూసిన తల్లి ఆ రోజు ఇంటి నుంచి బయటకు కూడా రావడం లేదు. తలెత్తుకోలేకపోతున్నామని కుంగిపోయింది. శనివారంనాడు హుక్కేరి తాలూకా ఘోడ గేరి గ్రామంలోని ఇంట్లో మహాదేవి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -బెంగళూరు -
తమిళనాడులో టోర్నడో బీభత్సం.. భారత్లోనే అరుదైన ఘటన
చెన్నై: తమిళనాడులో అరుదైన టోర్నడో ఒకటి దర్శనమిచ్చింది. తుత్తూకుడిలో భారీ మేఘాల మధ్య నుంచి నేల వరకు విస్తరించిన సుడిగాలి ఆకారపు ఫన్నెల్ (Funnel Cloud) కనిపించింది. వాతావరణ నిపుణులు దీనిని అరుదైన టోర్నడో ఘటనగా గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.భారత్లో టోర్నడోలు కనిపించడం చాలా అరుదు. టోర్నడోలు సాధారణంగా అమెరికాలోని "టోర్నడో అలీ" ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తమిళనాడులో ఇలాంటి ఘటనలు దాదాపు కనిపించవు. అందుకే తుత్తూకుడిలో నమోదైన ఈ దృశ్యం వాతావరణ శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.Fascinating view of rare tornado taken from #Thoothukudi Airport parking space. The Tornado emerged at Vagaikulam recks damage to a toll plaza on Thoothukudi - Tirunelveli National Highway, before disappearing at airport. @xpresstn @NewIndianXpress #Tornado pic.twitter.com/wWhOhIJy6u— Godson Wisely Dass (@tnie_godson) June 21, 2026ఆదివారం సాయంత్రం తూత్తుకుడి ప్రాంతంలో తీవ్ర ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష మేఘాలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో వాతావరణంలో అస్థిరత (Atmospheric Instability), తేమ, గాలి దిశల్లో మార్పులు కలిసి టోర్నడో ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులను సృష్టించాయి. ఫలితంగా మేఘం నుంచి కిందికి దిగిన సుడిగాలి నేలను తాకి కొద్దిసేపు టోర్నడోగా మారింది. టోర్నడో బలహీనంగా ఉండటంతో కొద్దిసేపటికే చెదిరిపోయిందని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ ఇది పూర్తిస్థాయి టోర్నడోగా గుర్తించబడటం విశేషం. దీని వల్ల టోల్ప్లాజా వద్ద కొంత ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. தூத்துக்குடி: வாகைகுளம் பகுதியில் சுழல் காற்று.. வைரலாகும் காட்சிகள். அரிதினும் அரிதான நிகழ்வு என சுயாதீன வானிலை ஆய்வாளர் பிரதீப் ஜான் பதிவு#Thoothukudi | #Tornado pic.twitter.com/8PBBwrp8ub— PttvOnlinenews (@PttvNewsX) June 21, 2026టోర్నడో అంటే ఏమిటి?టోర్నడో అనేది ఉరుములు, మెరుపులతో కూడిన భారీ మేఘం (Thunderstorm Cloud) నుంచి నేల వరకు విస్తరించే అత్యంత వేగంగా తిరిగే గాలి స్తంభం. ఇది నేలను తాకినప్పుడు ధూళి, ఇసుక, చెత్తను పైకి లేపుతూ భయానక దృశ్యాన్ని సృష్టిస్తుంది. గంటకు వందల కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుంది. అయితే, భారత్లో టోర్నడోలు చాలా తక్కువగా నమోదవుతాయి. సాధారణంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా, గంగా మైదాన ప్రాంతాల్లో అప్పుడప్పుడు కనిపించినా, దక్షిణ భారతదేశంలో ఇవి అత్యంత అరుదు అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.Thoothukudi Airport 😯😲 💥 pic.twitter.com/9O9mp6JOQI— Amutha (@Amutha74247715) June 22, 2026#WATCH | Thoothukudi, Tamil Nadu | Strong cyclonic winds cause heavy damage in the region.(Visuals from the Vaagaikulam toll plaza area) pic.twitter.com/39TfpIilzs— ANI (@ANI) June 22, 2026 -
అతడు అరవడు.. హంగామా చేయడు.. సునామీలా ప్రభావం చూపిస్తాడు!
రాజకీయాల్లో విజయానికి పెద్ద పెద్ద సభలు, ఘాటు విమర్శలు, నిత్యం వార్తల్లో ఉండే హడావిడి తప్పనిసరి కాదని నిరూపించిన నాయకుడు విజయ్. వెండితెరపై స్టార్గా కోట్లాది అభిమానులను సంపాదించిన ఆయన.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా అదే నిశ్శబ్ద శైలిని కొనసాగించారు. కానీ ఆ మౌనం బలహీనత కాదు!. విమర్శలు, అవమానాలు, వ్యక్తిగత విషాదాలు, ఎన్నో ఒడిదొడుకులను దాటుకుంటూ ఆయన ఈ స్థాయికి వచ్చారు. బయటకు కనిపించే విజయ్ కథ ఒకటైతే.. ఆయన విజయానికి పునాది వేసిన మరో కథ ఉంది. చాలా మందికి తెలియని ఆ ప్రయాణం పరిశీలిస్తే.. తమిళ సినీ దర్శకుడు ఎస్.ఏ. చంద్రశేఖర్, శోభ దంపతుల కుమారుడిగా సినీ కుటుంబంలో జన్మించిన విజయ్, చిన్న వయసులోనే కెమెరా ముందుకు వచ్చారు. అయితే ఆయన బాల్యం పూర్తిగా ఆనందంగా సాగిపోలేదు. విజయ్కు ఎంతో ఇష్టమైన సోదరి విద్య చిన్న వయసులోనే అనారోగ్యంతో మరణించింది. ఆ ఘటన విజయ్ను తీవ్రంగా కలచివేసిందని ఆయన కుటుంబ సభ్యులు పలుమార్లు చెప్పారు. సోదరి మరణం తర్వాత విజయ్ మరింత మౌనంగా మారిపోయారని, తన భావోద్వేగాలను బయటకు వ్యక్తపరచడం తగ్గించారని చెబుతుంటారు. నేటికీ ఆయన నిర్మించిన కొన్ని సంస్థలు, సేవా కార్యక్రమాల్లో ‘విద్య’ పేరు కనిపించడం ఆ అనుబంధానికి నిదర్శనం.చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ను ప్రారంభించిన విజయ్.. హీరోగా మారిన తొలి రోజుల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. నటన రాదని, స్టార్ మెటీరియల్ కాదని, తండ్రి అండతో మాత్రమే అవకాశాలు వస్తున్నాయని విమర్శకులు ఎద్దేవా చేశారు. కానీ విజయ్ ఎప్పుడూ మాటలతో సమాధానం ఇవ్వలేదు. ప్రతి సినిమాతో తనను తాను నిరూపించుకుంటూ ముందుకు సాగారు. అదే ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది.కాలక్రమంలో తమిళ సినీ పరిశ్రమలో అగ్రనటుడిగా ఎదిగిన విజయ్ను ప్రత్యేకంగా నిలబెట్టింది కేవలం స్టార్డమ్ కాదు.. ప్రజలతో ఏర్పరచుకున్న అనుబంధం. విద్యార్థులకు ప్రోత్సాహం, పేదలకు సాయం, ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులకు అండగా నిలవడం వంటి సేవా కార్యక్రమాలను ఆయన నిశ్శబ్దంగానే కొనసాగించారు. ముఖ్యంగా అభిమాన సంఘాలను సేవా కార్యక్రమాల వైపు మళ్లించడం ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందారు.తమిళుల ఆత్మగౌరవం, భాష, సంస్కృతి, యువత భవిష్యత్తు వంటి అంశాలపై ఆయన తీసుకున్న వైఖరి ప్రజల్లో విశ్వాసాన్ని పెంచింది. జల్లికట్టు ఉద్యమం నుంచి వివిధ ప్రజా సమస్యల వరకు తన మద్దతును వ్యక్తం చేస్తూ యువతకు మరింత చేరువయ్యారు. ఈ క్రమంలో స్టార్డమ్ను పరిగణనలోకి తీసుకుని.. ముసుగులేసుకుని మరీ ఆయన ఆయా వేదికల వద్దకు వెళ్లేవారు. ఇక.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన శైలి మారలేదు. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడటం, చెప్పాల్సిన విషయాన్ని సూటిగా చెప్పడం, ప్రజల మధ్య నిశ్శబ్దంగా పని చేయడం ఆయన బలంగా మారింది.విజయ్ వ్యక్తిత్వంలో మరో ఆసక్తికర కోణం కూడా ఉంది. బయటకు కనిపించేంత హడావిడి ఆయన జీవితంలో ఉండదు. సినిమా వేడుకలు, వ్యక్తిగత కార్యక్రమాలు, రాజకీయ సమావేశాల్లో కూడా అవసరమైనంత మేరకే కనిపిస్తారు. అందుకే ఆయనను దగ్గరగా చూసిన వారు ‘రిజర్వ్డ్’ వ్యక్తిగా అభివర్ణిస్తుంటారు. కానీ ప్రజల సమస్యల విషయంలో మాత్రం తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పడంలో వెనుకాడరు.అందుకే విజయ్ కథ కేవలం ఓ సినీ హీరో సీఎం అయిన కథ కాదు. వ్యక్తిగత విషాదాలను అధిగమించి, విమర్శలను అవకాశాలుగా మలుచుకుని, మౌనాన్నే తన బలంగా మార్చుకున్న వ్యక్తి కథ. అందుకే అభిమానులు ఆయన గురించి ఒక్క మాట చెబుతారు...“ఆయన కొందరిలా అరవడు.. హంగామా చేయడు.. సినీ ప్రత్యర్థులపై నోటికి వచ్చినట్లు మాట్లాడడు.. రాజకీయాల్లో ఇష్టానుసారం విమర్శలు చేస్తూ ఊగిపోడు.. సైలెంట్ సునామీలా ప్రభావం మాత్రమే చూపిస్తాడు!”. -
మంత్రి విశ్వనాథన్ స్టెప్పులు
సాక్షి, చెన్నై : మధురై మేలూర్ మారథాన్లో కాంగ్రెస్ మంత్రి మాస్ స్టెప్పుల వీడియో వైరల్గా మారి రాజకీయంగా దుమారం రేపింది. సీఎం విజయ్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని ఆదివారం మేలూరులో కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి విశ్వనాథన్ అక్కడ ఉన్న యువత, కార్యకర్తలతో పాటుగా ఓ మహిళా కార్యకర్తతో కలిసి స్టెప్పులు అదరగొట్టారు.ఈ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో విమర్శలతో వైరల్ అయింది. స్టేజీపై ఉన్న టీవీకే మహిళా నేతలు, యువ కార్యకర్తలతో కలిసి మంత్రి విశ్వనాథన్ కూడా ఏమాత్రం మొహమాటపడకుండా ఊరమాస్ స్టెప్పులు వేశారు. ఆ రాష్ట్ర ఉన్నత విద్యను శాసించే స్థానంలో ఉన్న ఒక బాధ్యతాయుతమైన మంత్రి, ఇలా బహిరంగంగా సినిమా పాటకు స్టెప్పులు వేయడం తమిళనాడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. దీంతో మంత్రి విశ్వనాథన్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తమిళనాడు సీఎం విజయ్, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పుట్టినరోజుల సందర్భంగా మధురై జిల్లా మేలూర్లో ‘డ్రగ్స్ రహిత మేలూర్ – మహిళల రక్షణ’ అనే నినాదంతో ఒక భారీ అవేర్నెస్ మారథాన్ పోటీని నిర్వహించామన్నారు. టీవీకే, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు.కార్యక్రమంలో పాల్గొన్న యువత తనను వారితోపాటుగా డ్యాన్స్ చేయమని కోరగా, వారి ఉత్సాహాన్ని కాదనలేకపోయానని, పండుగ వాతావరణంలో జరిగిన ఈ ఘటనను కొందరు రాజకీయం చేయడం సరికాదన్నారు. 'வாடி வாடி கைபடாத CDபள்ளியில் நடைபெற்ற நிகழ்ச்சியில் குத்தாட்டம் போட்ட உயர்கல்வித்துறை அமைச்சர் விஸ்வநாதன்#HigherEducationMinister #Viswanathan #TVKVijay pic.twitter.com/coEu8Q93Ir— M.M.NEWS உடனடி செய்திகள் (@rajtweets10) June 21, 2026 -
ఆకలి ముందు మరణ భయం ఎంత?
దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున ప్రవహించే యమునా నది కేవలం కాలుష్యానికే కాదు, వందలాది కుటుంబాల ఆకలి కేకలకు కూడా చిరునామాగా మారింది. అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు, పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీటితో నిండిన ఆ నల్లటి నీటిలోకి రోజూ కొందరు ప్రాణాలను పణంగా పెట్టి దూకుతున్నారు. నది అడుగున పూడుకుపోయిన నాణేలు, స్క్రాప్ మెటల్స్ కోసం వారు సాగిస్తున్న ఈ మృత్యుపోరాటం మానవ నాగరికతకు ఒక మాయని మచ్చ. పాలకుల నిర్లక్ష్యం, బతుకుదెరువు లేని దీనస్థితి నడుమ యమున కాయిన్ డైవర్ల జీవితాలు నదిలోని విష రసాయనాల కంటే ఘోరంగా మారుతున్నాయి.యమునా నదిలో ఊపిరి బిగబట్టి..ఢిల్లీలో ప్రవహించే యమునా నది భారతదేశంలోనే అత్యంత కలుషితమైన జలవనరుగా మారింది. అయినప్పటికీ, ఆ విషపు నీటి అడుగున ఏదో ఒక అద్భుతం జరగకపోతుందా, తమ ఆకలి తీరకపోతుందా అనే ఆశతో రాజ్వీర్ సింగ్, బనార్ సింగ్ వంటి డైవర్లు ప్రతిరోజూ నదిలోకి మునుగుతున్నారు. ఇది వారు నిన్న మొన్న ప్రారంభించిన పని కాదు. కేవలం ఒక గుటక మంచి నీరు తాగి, మళ్లీ ఆ నల్లటి నీటిలోకి దూకడానికి సిద్ధమవుతూ, ‘నేను నా జీవితాన్ని వెళ్లదీయడం కోసం గత నలభై ఏళ్లుగా ఇదే పని చేస్తున్నాను’ అని రాజ్వీర్ సింగ్ తన సుదీర్ఘమైన, బాధాతప్తమైన ప్రయాణాన్ని వివరించాడు.ఆకలి తీర్చే ఆ ఒక్క రూపాయిఈ డైవర్లు నదిలో కేవలం భక్తులు విసిరే నాణేల కోసమే వెతకడం లేదు. వారి చేతులు నది అడుగున పేరుకుపోయిన బురదలో కూరుకుపోయిన పాత ఇనుప ముక్కలు, ప్లాస్టిక్ సీసాలు.. ఇలా గుజరీ మార్కెట్లో అమ్ముడుపోయే ఏ వస్తువు దొరికినా ఏరుకుంటారు. ఇంత ప్రాణాంతకమైన పని చేస్తే వారికి రోజుకు సగటున లభించే కూలి కేవలం రూ. 600 మాత్రమే. తాము పడుతున్న కష్టానికి దక్కే అల్ప ప్రతిఫలాన్ని చూపిస్తూ, రాజ్వీర్ తన చేతిలో ఉన్న ఒకే ఒక్క రూపాయి నాణేన్ని మీడియాకు చూపించినప్పుడు, అక్కడ వారి దారిద్ర్యం స్పష్టంగా కనిపించింది.నమ్మకమే వారి ఊపిరి‘భగవంతుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడనే నమ్మకం మాకు ఉంది. యమున మాకు తల్లి లాంటిది, ఇన్నేళ్లుగా ఆమె మాకు అన్నం పెడుతోంది’ అని బనార్ సింగ్ తన అచంచలమైన విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. సరిగ్గా అదే సమయంలో అతని స్నేహితుడు నల్లటి నీటి నుండి పైకి లేస్తూ, బురదలో పూడుకుపోయిన ఒక చిన్న వినాయకుడి విగ్రహాన్ని బయటకు తీశాడు. ఏటా జరిగే గణేష్ చతుర్థి విగ్రహాల నిమజ్జనాల కారణంగా, యమునా నది అడుగున ఉన్న బురదలో వీరికి ఎక్కువగా వినాయకుడి విగ్రహాలే లభ్యమవుతుంటాయి.రసాయనాల నది.. నరకప్రాయంఈ కాయిన్ డైవర్ల దినచర్య వెనుక ఉన్న అసలు నిజం అత్యంత భయంకరమైనది. యమునా నదిలోకి దిగే పురుషులు అత్యంత ప్రతికూలమైన, ప్రమాదకరమైన పని వాతావరణాన్ని ఎదుర్కొంటున్నారు. శుద్ధి చేయని మురుగునీరు, పారిశ్రామిక రసాయనాల వ్యర్థాలు, విషపూరితమైన భారీ లోహాలతో నిండిన ఈ నది, ఇప్పుడు కేవలం ఒక జలమార్గం కాదు; అదొక జీవసంబంధ, రసాయన ప్రమాదకర ప్రాంతంగా రూపాంతరం చెందింది. ఈ పారిశ్రామిక రసాయనాలతో నిరంతరం ఉండే సంపర్కం వారి శరీరాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.దెబ్బతింటున్న ఆరోగ్యంఈ విషపూరిత నీటి వల్ల వీరికి దీర్ఘకాలిక, బాధాకరమైన చర్మ వ్యాధులు, తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా పొంచి ఉంది. ‘నా చేతులపై ఉన్న ఈ నల్లటి, గరుకైన చర్మం నదిలోని రసాయనాల వల్లే వచ్చింది’ అని బనార్ సింగ్ తన చేతులను చూపిస్తూ దశాబ్దాలుగా నదిలో గడపడం వల్ల తన శరీరానికి జరిగిన నష్టాన్ని వివరించాడు. 40 డిగ్రీల సెల్సియస్ మండుటెండలో నిలబడి, ఆపై పారిశ్రామిక రసాయనాల కాక్టెయిల్లా మారిన నదిలోకి దూకడం వారి దారుణమైన మనుగడకు అద్దం పడుతోంది.తోడుగా నిలిచిన మూగజీవంజీవితం ఒక నిరంతర పోరాటంగా మారినప్పటికీ, కుటుంబాలను పోషించడానికి, ఆకలి తీర్చుకోవడానికి రాజ్వీర్, బనార్లకు ఈ ప్రమాదకరమైన పనే శరణ్యమైంది. వారు నదిలో నాణేల కోసం వెతుకుతుంటే, వారికి తోడుగా వారి పెంపుడు కుక్క కూడా నిశ్శబ్దంగా వారి పక్కనే ఈదుకుంటూ వెళ్తుంది. వారు ఎప్పుడు సురక్షితంగా ఒడ్డుకు చేరుకుంటారా అని తీరం వైపు ఒకరు నమ్మకంతో ఎదురుచూస్తూ ఉంటారు. ప్రాణాలు పోతాయని తెలిసినా, ఆకలి ముందు ఆ భయం ఓడిపోతోందనే నిజానికి వీరి జీవితాలే సాక్ష్యం.ఇది కూడా చదవండి: నాటి ఇందిర ట్విస్ట్ నుండి నేటి శివసేన చీలిక వరకూ.. -
‘యూజ్లెస్ ఫెలోస్.. మీ సంగతి తేలుస్తా’
కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహనం కోల్పోయారు. కర్ణాటకలో నిర్వహించిన కాంగ్రెస్ ‘సంకల్ప సమావేష’ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తుండగా.. కొందరు కార్యకర్తలు అత్యుత్సహం ప్రదర్శించారు. అయితే.. వద్దని వారిస్తున్న వాళ్లు అదే పని చేయడంతో ఖర్గేకు కోపమొచ్చింది. యూజ్లెస్ ఫెలోస్.. అంటూ గట్టిగానే మందలించారాయన. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘సంకల్ప సమావేష’ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తుండగా.. సభలోని కొందరు కార్యకర్తలు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు మద్దతుగా ‘డీకే.. డీకే’ అంటూ నినాదాలు చేశారు.దీంతో అసహనానికి గురైన ఖర్గే.. “ఇక్కడ మీరు నినాదాలు చేస్తే దేశమంతా ప్రభావితమవుతుందా? ఇది ఒక వ్యక్తి కార్యక్రమం కాదు.. పార్టీ కార్యక్రమం. మీరంతా పనికిమాలిన వాళ్లు(యూజ్లెస్ ఫెలోస్). ఇక్కడ వ్యక్తుల ఆరాధనకు స్థానం లేదు. మనందరినీ ఒక్కచోటికి తీసుకొచ్చేది పార్టీ మాత్రమే. అది గుర్తించండి” అంటూ మండిపడ్డారు.తనకు 58 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని పేర్కొన్న ఖర్గే.. “ఎంతో మంది నాయకులు ఇక్కడికి వచ్చారు. వారి కంటే పార్టీ వారికి ఎక్కువ ఇచ్చింది. ఇక్కడ నినాదాలు చేసిన వారందరి వీడియో ఫుటేజ్ను పరిశీలిస్తాను. ఆ తర్వాత క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు.కార్యకర్తలు అలా నినాదాలు చేస్తున్న సమయంలో.. వేదికపైనే ఉన్న డీకే శివకుమార్ తన కుర్చీలోంచి లేచి ఆపమంటూ సైగలు చేశారు. అయినా కూడా వాళ్లు ఆగలేదు. ఆ సమయంలో వేదికపై కూర్చున్న మాజీ సీఎం సిద్ధరామయ్య డీకేను చూస్తూ ఉండిపోయారు.#WATCH | Bengaluru, Karnataka: Congress President Mallikarjun Kharge loses his cool at party workers during the Sankalpa Samavesha programme after the workers raised “DK-DK” slogans“Will the entire country be affected if you shout here? This is not an individual’s programme, it… pic.twitter.com/jmO0rLMftK— ANI (@ANI) June 21, 2026ఖర్గే వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్లో వ్యక్తి కంటే పార్టీ ముఖ్యమనే సందేశాన్ని ఇవ్వడానికే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సభలో డీకే శివకుమార్ అనుచరుల నినాదాలపై ఖర్గే బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేయడం కర్ణాటక కాంగ్రెస్లోని అంతర్గత రాజకీయాలపై మరోసారి చర్చకు దారితీసింది. కేడర్ను ఉద్దేశించి ఖర్గే అంతలా మాట్లాడిన అవసరం లేదంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. -
మహా రాజకీయం.. ఉద్ధవ్కు బిగ్ షాక్
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన(UBT)కు చెందిన ఆరుగురు లోక్సభ ఎంపీలు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో అధికారికంగా చేరనున్నట్లు సమాచారం. ఈ పరిణామం ఉద్ధవ్ వర్గానికి భారీ రాజకీయ ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. మహారాష్ట్రలో కొన్ని రోజులుగా సాగుతున్న ‘ఆపరేషన్ టైగర్’కు ఇది కీలక మలుపుగా భావిస్తున్నారు.గత కొన్ని రోజులుగా శివసేన (యూబీటీ)లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఎంపీలు వరుసగా షిండే వర్గంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆ ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో ఆరుగురు ఎంపీలు.. ఏక్నాథ్ షిండే సమక్షంలో పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. షిండే వర్గంలో చేరుతున్న వారిలో ఎంపీలు సంజయ్ దినా పాటిల్, సంజయ్ దేశ్ముఖ్, సంజయ్ జాధవ్, భౌసాహెబ్ వక్చౌరే, నాగేశ్ పాటిల్ అష్టికర్, ఓంప్రకాశ్ రాజే నింబాల్కర్ ఉన్నట్లు సమాచారం. వీరిలో కొందరు ఇప్పటికే బహిరంగంగా షిండే నాయకత్వానికి మద్దతు ప్రకటించగా, మరికొందరు తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం అధికార పక్షంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.ఇటీవలే ఎంపీ ఓంప్రకాశ్ రాజే నింబాల్కర్ అధికారికంగా షిండే శివసేనలో చేరడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఆ వెంటనే మరికొందరు ఎంపీలు కూడా అదే బాట పట్టడంతో ఉద్ధవ్ థాక్రే వర్గంలో ఆందోళన నెలకొంది. లోక్సభ ఎన్నికల్లో మంచి ప్రదర్శన కనబరిచిన యూబీటీకి ఇది ఊహించని పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు మహారాష్ట్ర అధికార కూటమి ఈ పరిణామాన్ని తమ రాజకీయ విజయంగా ప్రచారం చేస్తోంది. అధికార పక్షంతో ఉంటేనే ప్రజల సమస్యలను సమర్థంగా పరిష్కరించగలమనే అభిప్రాయంతో పలువురు ప్రజాప్రతినిధులు ముందుకు వస్తున్నారని పలువురు మంత్రులు చెబుతున్నారు.అయితే ఉద్ధవ్ థాక్రే వర్గం మాత్రం ఈ పరిణామాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. పార్టీ నాయకుడు సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. కొందరు అసంతృప్త ఎంపీలు ఇంకా తమతోనే సంప్రదింపులు జరుపుతున్నారని, పార్టీని వీడిన వారిలో కొందరు తిరిగి వచ్చే అవకాశమూ ఉందని చెప్పారు. శివసేన (యూబీటీ) బలహీనపడలేదని, కార్యకర్తల మద్దతు తమకే ఉందని ఆయన స్పష్టం చేశారు.2022లో జరిగిన శివసేన చీలిక తర్వాత మహారాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. అప్పట్లో ఏక్నాథ్ షిండే నేతృత్వంలో పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయగా, ఇప్పుడు అదే తరహాలో ఎంపీల స్థాయిలోనూ వలసలు కొనసాగడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ తాజా చేరికలతో మహారాష్ట్రలో షిండే వర్గం మరింత బలోపేతం అవుతుండగా, ఉద్ధవ్ థాక్రే వర్గం ముందు కొత్త సవాళ్లు నిలుస్తున్నాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామాలు మహారాష్ట్ర రాజకీయ సమీకరణాలపై గణనీయ ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. -
ఢిల్లీలో సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి ఢిల్లీ బాట పట్టారు. ఆదివారం రాత్రి ముంబై మీదుగా హస్తినకు చేరుకున్నారు. రెండు రోజుల పాటు ఇక్కడే ఉండి కేంద్ర మంత్రులతో కీలక చర్చలు జరపనున్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్–2 విస్తరణ, పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై కేంద్రంతో నేరుగా తేల్చుకోవాలని ఆయన భావిస్తున్నారు. మెట్రో రైలు పెండింగ్ అంశాలను పరిష్కరించేందుకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్తో సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రేవంత్ ఇప్పటికే లేఖ రాసిన విషయం తెలిసిందే.‘ఈ నెల 22, 23 తేదీల్లో నేను ఢిల్లీలోనే అందుబాటులో ఉంటాను. మీరు చొరవ తీసుకుని రైల్వే మంత్రితో సమావేశం ఏర్పాటు చేయండి’అని రేవంత్ లేఖలో కోరారు. అలాగే, రాయదుర్గంలో ఎస్బీఐ భూమి వేలం వివాదానికి సంబంధించి రేవంత్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసే అవకాశం ఉంది. ఈ భేటీలో ఎస్బీఐ చైర్మన్పై ఆయన ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వపరమైన పనులతోపాటు, రాష్ట్ర రాజకీయాలపైనా సీఎం దృష్టి సారించనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీలను కలవనున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ, పార్టీ రాజకీయ పరిణామాలపై వారితో చర్చించే అవకాశం ఉంది. -
‘రీ–నీట్’ కఠినమే..
సాక్షి, హైదరాబాద్/సాక్షి, అమరావతి: వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించిన నీట్ యూజీ–2026 పునఃపరీక్ష దేశవ్యాప్తంగా ఆదివారం ముగిసింది. గత మే 3న జరిగిన తొలి పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కారణంగా రద్దు కావడంతో, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) రీఎగ్జామ్ నిర్వహించింది. ఈ క్రమంలో మునుపెన్నడూ లేనివిధంగా త్రీటైర్ సెక్యూరిటీ, బయోమెట్రిక్ వెరిఫికేషన్, జామర్ల నిఘా నడుమ పరీక్ష జరిగింది. తెలంగాణలో మొత్తం 73,059 మంది అభ్యర్థులకు హాల్టికెట్లు జారీ చేయగా, 65,087 (89.09 శాతం) మంది హాజరయ్యారు. తొలి నీట్ పరీక్షతో పోలిస్తే రీ–ఎగ్జామ్కు హాజరైన విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. రాష్ట్రంలో పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష రాసిన విద్యార్థులు, సబ్జెక్ట్ నిపుణులు అందించిన సమాచారం ప్రకారం.. మే 3న జరిగిన పరీక్షతో పోలిస్తే రీఎగ్జామ్ ప్రశ్నపత్రం కాస్త కఠినంగా, ఎక్కువ సమయం తీసుకునేలా (లెంగ్తీగా) ఉందని వెల్లడైంది. కొరవడిన సమతుల్యత: రద్దయిన నీట్ పరీక్షతో పోలిస్తే పునఃపరీక్షలో బయాలజీ విభాగం సులభంగానే ఉందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ప్రశ్నలన్నీ నేరుగా ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచే అడిగినట్టు తెలిపారు. కొన్ని అధ్యాయాల నుంచి అసలు ప్రశ్నలే లేవని, అధ్యాయాల పరంగా సమతుల్యత కొరవడిందని సబ్జెక్ట్ నిపుణులు భావిస్తున్నారు. స్టేట్మెంట్, మల్టిపుల్ చాయిస్ జతపరచడం వంటి ప్రశ్నలు ఎక్కువగా ఉండటంతో ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చినట్టు తెలిపారు. గత పరీక్షలతో పోలిస్తే కెమిస్ట్రీ, ఫిజిక్స్ కొంత కఠినంగానే ఉన్నట్టు నిపుణులు వెల్లడించారు. ముఖ్యంగా ఫిజిక్స్ గత రెండు పరీక్షలతో పోలిస్తే చాలా మారిపోయినట్టు పేర్కొన్నారు. గతంలో మోడరన్ ఫిజిక్స్, సెమీకండక్టర్ నుంచి నేరుగా సిద్ధాంతపరమైన ప్రశ్నలు రాగా, ఈసారి సీన్ రివర్స్ అయింది. జేఈఈ మెయిన్ స్థాయి క్లిష్టత ఫిజిక్స్లో ఉందని వెల్లడైంది. మెకానిక్స్ నుంచి వచ్చిన ప్రశ్నలు జేఈఈ మెయిన్ స్థాయిని తాకగా, ఎలక్ట్రోస్టాటిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ విభాగాల్లో డయాగ్రమ్స్ ఇచ్చి, అందులో రెండు మూడు సూత్రాలు ప్రయోగించాల్సినట్టుగా ప్రశ్నలను క్లిష్టతరం చేశారు. దీంతో ఒక్క ఫిజిక్స్ విభాగానికి గంటన్నర, ఆపైన కేటాయించాల్సి వచ్చిందని విద్యార్థులు చెప్పారు. ఈసారి స్కోర్, మెరిట్ ర్యాంకులను ఫిజిక్స్ శాసిస్తుందని నిపుణులు అంటున్నారు. ఇక కెమిస్ట్రీలో ప్రశ్నలన్నీ ఎన్సీఈఆర్టీ నుంచి వచ్చాయి. ఫిజికల్ కెమిస్ట్రీలో లెక్కలన్నీ నేరుగా ఫార్ములా ఆధారంగానే ఉన్నాయి. ఇన్ఆర్గానిక్లో మల్టిపుల్ స్టేట్మెంట్స్, అస్సెర్షన్–రీజన్ ప్రశ్నలు ఎక్కువగా ఇవ్వడంతో వాటిని చదవడానికి ఎక్కువ సమయం పట్టిందని విద్యార్థులు అన్నారు. ఆర్గానిక్ కెమిస్ట్రీ అత్యంత ఇబ్బందిగా అనిపించిందని నిపుణులు అంచనా వేశారు. డైరెక్ట్ ప్రశ్నలు తగ్గించి, రసాయన చర్యల అంతర్గత విధానంపై లోతైన ప్రశ్నలు అడిగారని, దీంతో ఆప్షన్లు చాలా దగ్గరగా ఉండటంతో విద్యార్థులు పొరపాట్లు చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇక్కడ నెగిటివ్ మార్కుల ఉచ్చులో విద్యార్థులు పడే వీలుందన్నారు. కటాఫ్ అంచనా ఇలా.. ! 2025తో పోలిస్తే ఈసారి కూడా నీట్ ప్రశ్నపత్రం కఠినంగా ఉండటంతో కటాఫ్లు పెద్దగా పెరిగే అవకాశం లేదని నిపుణుల అంచనా. మే నెలలో నిర్వహించిన నీట్ ప్రశ్నపత్రం కొంత సులభంగా ఉండటంతో గతేడాదితో పోలిస్తే కటాఫ్లు పెరుగుతాయని భావించారు. పునఃపరీక్షతో ఆ పరిస్థితులు తారుమారయ్యాయి. 2025 తరహాలోనే కటాఫ్లు ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కౌన్సెలింగ్ ముగిసే సమయానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో జనరల్ అభ్యర్థులకు 605–610 మార్కుల వద్ద కన్వీనర్ సీట్లు వచ్చాయి. ప్రైవేట్ కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద 540–550 మార్కులు వచ్చిన వారికి చివరి విడతల్లో సీట్లు దక్కాయి. బీసీలకు ప్రభుత్వ కాలేజీల్లో 575–595 మార్కుల మధ్య చివరి సీట్లు కేటాయించబడ్డాయి. ప్రైవేట్లో బీసీ విద్యార్థులకు 490–510 మార్కుల వరకు కూడా సీట్లు లభించాయి. ఎస్సీ విద్యార్థులకు కటాఫ్ ప్రభుత్వ కాలేజీల్లో 495 – 510 మార్కుల మధ్య, ప్రైవేటులో 435–450 మార్కుల శ్రేణిలో ఉంది. ఈ క్రమంలో ఆయా కేటగిరీల్లో గతేడాది కటాఫ్ కంటే 10 నుంచి 20 మార్కులు అదనంగా సాధించిన వారికి ఈసారి కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్లు దక్కే అవకాశం ఉంటుందని అంచనా. మొబైల్తో పట్టుబడ్డ అభ్యర్థి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని పరీక్ష కేంద్రంలో అక్రమాలకు యత్నించిన అభ్యర్థి పట్టుబడ్డాడు. జండావత్ నరేందర్ అనే అభ్యర్థి తన మొబైల్ ఫోన్ను టాయిలెట్లోని ఫ్లష్ ట్యాంక్లో దాచిపెట్టాడు. పరీక్ష సమయంలో టాయిలెట్కు వెళ్లి ఆ మొబైల్ను ఉపయోగించే ప్రయత్నం చేయగా ఇని్వజిలేటర్లు గుర్తించి, అతడిని పోలీసులకు అప్పగించారు. కాగా, పరీక్ష నిర్వహణ కోసం హైదరాబాద్లోని ఇంటరీ్మడియట్ విద్యాశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్ను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సందర్శించారు. ట్రాఫిక్ జామ్తో పరీక్షకు దూరం మెదక్ కలెక్టరేట్: మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మండల కేంద్రానికి చెందిన వంజరి అనే విద్యార్థిని ఆదివారం స్థానిక డిగ్రీ కళాశాలలో జరిగే నీట్ పరీక్ష రాయడానికి బస్సులో వచ్చింది. అయితే పట్టణంలో ఏర్పడిన భారీ ట్రాఫిక్ జామ్ వల్ల ఆమె పరీక్ష కేంద్రానికి చేరుకోవడానికి 10 నిమిషాలు ఆలస్యమైంది. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమనే నిబంధన వల్ల అధికారులు ఆమెను పరీక్షకు అనుమతించలేదు. పరీక్ష రాసే అవకాశం ఇవ్వాలని తన తల్లితో కలిసి అరగంటపాటు పరీక్ష కేంద్రం వద్దే నిరీక్షించినా ఫలితం లేకపోవడంతో కన్నీరుమున్నీరైంది. -
అమర్నాథ్ యాత్రకు ‘ఆపరేషన్ శివ’
సాక్షి, న్యూఢిల్లీ: జూలై 3వ తేదీ నుంచి మొదలయ్యే అమర్నాథ్ యాత్రకు మునుపెన్నడూ లేని విధంగా భారీ భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. ఆపరేషన్ శివ పేరుతో సైన్యం ఈసారి ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తోంది. యాత్రకు సరికొత్త టెక్నాలజీతో యాంటీ–డ్రోన్ వ్యవస్థతో భద్రతను కల్పించనుంది. సున్నితమైన 55 ప్రాంతాల్లో అత్యాధునిక యాంటీ–డ్రోన్ గన్లు, నిఘా పరికరాలను మోహరించారు. దేశంలోనే మొదటిసారిగా ఇంత పెద్ద సంఖ్యలో ఇలాంటి వ్యవస్థను ఉపయోగించడం ఇదే మొదటిసారి. ఎల్రక్టానిక్ వార్ఫేర్ పరికరాలు, ప్రత్యేక నిఘా వ్యవస్థలు శత్రు డ్రోన్లను గుర్తించి క్షణాల్లో నిరీ్వర్యం చేయగలవు. సుమారు 400 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న జమ్మూ–శ్రీనగర్ జాతీయ రహదారి, బాల్తాల్, పహల్గామ్ మార్గాలను ఈ వ్యవస్థ పర్యవేక్షిస్తుంది. ఆర్మీ నార్తర్న్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ స్వయంగా బాల్తాల్, సోన్మార్గ్ ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. కమాండోల మోహరింపు: యాత్ర మార్గంలో క్యూఆర్టీ, క్యూఈటీ, బాంబు నిరోధక దళాలు, డాగ్ స్క్వాడ్లు, మౌంటెన్ రెస్క్యూ టీమ్లను అందుబాటులో ఉంచారు. లఖన్పూర్ నుంచి పవిత్ర అమర్నాథ్ గుహ వరకు ఉన్న మార్గాన్ని హై అలర్ట్ జోన్గా ప్రకటించారు. సరిహద్దుకు దగ్గరగా ఉన్నందున అదనంగా బలగాలను నియమించారు. -
అయోధ్యను విడిచి వెళ్లొద్దు
అయోధ్య: అయోధ్య రామాలయంలో విరాళాల నిర్వహణలో భారీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్).. ఆలయ ట్రస్ట్ సభ్యులతోపాటు, ముఖ్య ఉద్యోగులను అయోధ్యను విడిచి వెళ్లవద్దంటూ ఆదివారం ఆదేశాలు జారీచేసింది. భక్తులు విరాళాలుగా అందించిన బంగారం, వెండి, ఇతర విలువైన లోహాల నమోదు, భద్రపర్చడంలో తీవ్ర వ్యత్యాసాలున్నట్లు ఆలయ అధికారుల విచారణలో తేలిందని సిట్ తెలిపింది. 2025 జనవరి–ఫిబ్రవరిలో జరిగిన మహాకుంభమేళాలో భక్తుల రద్దీ విపరీతంగా ఉన్న సమయంలో ఎక్కువ అవకతవకలు జరిగినట్లుగా గుర్తించామని సిట్ పేర్కొంది. -
సీబీఎస్ఈ రీవాల్యుయేషన్ ఫలితాల వెల్లడి
న్యూఢిల్లీ: 12వ తరగతి బోర్డు పరీక్షల జవాబు పత్రాల వెరిఫికేషన్, రీ–వాల్యుయేషన్ ఫలితాలను సీబీఎస్ఈ ఆదివారం విడుదల చేసింది. మొదటి విడతలో భాగంగా మొత్తం దరఖాస్తుల్లో 87 శాతానికి పైగా ఫలితాలను ప్రకటించినట్లు తెలిపింది. విడతల వారీగా మిగతా దరఖాస్తుల ఫలితాలను కూడా వెల్లడిస్తామని, మొత్తం ప్రక్రియ కూడా తొందరలోనే ముగియనుందని ఎక్స్లో ప్రకటించింది. విద్యార్థులు తమ ఫలితాలను సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చని తెలిపింది. రీ వాల్యుయేషన్ను పక్కాగా చేపట్టామని, ఈ విషయంలో వచ్చే వదంతులను నమ్మవద్దని కోరింది. -
అజేయంగా మన సముద్ర శక్తి
కోల్కతా: ఒక దేశం ఆర్థిక, వ్యూహాత్మక ప్రభావానికి బలమైన నౌకాదళ సామర్థ్యమే నిర్ణయాత్మక అంశమని ప్రధాని మోదీ చెప్పారు. అందుకు అనుగుణంగానే భారత్ సన్నద్ధమవుతోందని వివరించారు. దేశీయ పరిజ్ఞానంతో నిర్మించిన మూడు కీలక యుద్ధనౌకలు ఐఎన్ఎస్ దుణగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రయ్ని మోదీ ఆదివారం జాతికి అంకితం చేశారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని శ్యామప్రసాద్ ముఖర్జీ పోర్టులో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సముద్రయాన సామర్థ్యాలు కలిగిన దేశం శక్తివంతమైనదిగా, అధిక ఆర్థిక, వ్యూహాత్మక ప్రభావాన్ని కలిగి ఉంటుందని గుర్తుచేశారు. అజేయమైన సముద్ర శక్తిగా భారత్ వేగంగా ఎదుగుతోందని తెలిపారు. ఐన్ఎస్ దుణగిరి, ఐన్ఎస్ అగ్రయ్, ఐఎన్ఎస్ సంశోధక్ నౌకలు సముద్ర పోరాటం, హైడ్రోగ్రాఫిక్ సర్వేయింగ్, జలాంతర్గామి వ్యతిరేక యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తాయని ప్రధాని మోదీ తెలిపారు. 2022లో ‘ఐఎన్ఎస్ విక్రాంత్’విమాన వాహక నౌకను ప్రారంభించడం ద్వారా భారత్ తన సముద్ర సామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పిందని అన్నారు. కొత్త నౌకలను మనదేశంలోనే డిజైన్ చేసి, నిర్మించామని, దేశ ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తున్నాయని హర్షం వ్యక్తంచేశారు. ఉపాధి ఇంజిన్గా ‘మారిటైమ్’లక్షలాది ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యం మారిటైమ్ రంగానికి ఉందని, ‘అభివృద్ధి చెందిన భారత్’కు ఇది ఉపాధి ఇంజిన్గా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఆధునిక నౌక నిర్మాణానికి వేల టన్నుల ఉక్కు, ఎలక్ట్రానిక్స్, యంత్ర పరికరాలు, విడిభాగాలు అవసరమవుతాయని, వీటి తయారీకి అనేక కంపెనీలు పనిచేస్తున్నాయని, తద్వారా వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తోందని ప్రధానమంత్రి తెలియజేశారు.కొత్త నౌకల విశేషాలు.. ఐఎన్ఎస్ దుణగిరి: ఇది అత్యాధునిక స్టెల్త్ యుద్ధ నౌక. బ్రహ్మోస్ క్షిపణులు, మధ్యశ్రేణి గగనతల క్షిపణి వ్యవస్థ, ఆయుధాలు, సెన్సర్లు ఇందులో అమర్చారు. దీని పొడవు 149 మీటర్లు. 2022 జూలై 15న జలప్రవేశం చేసింది. ఐఎన్ఎస్ సంశోధక్: ఇది భారీ సర్వే నౌక. భారత తీర ప్రాంతాలు, లోతైన సముద్ర జలాల్లో హైడ్రోగ్రాఫిక్ సర్వేలు నిర్వహించడానికి ఈ నౌక సాయపడుతుంది. రక్షణ, పౌర అవసరాల కోసం సముద్ర గర్భ డేటాను సేకరించడానికి ఇది తోడ్పడుతుంది. దీని పొడవు 110 మీటర్లు. 2023 జూన్ 13వ తేదీన తొలిసారిగా జలప్రవేశం చేసింది. విపత్కర పరిస్థితుల్లో సహాయ చర్యలకు, మానవీయ సాయం పంపిణీ, రక్షణ చర్యలు చేపట్టేందుకు వీలుగా సంశోధక్ను నిర్మించారు.ఐఎన్ఎస్ అగ్రయ్:ఇది అర్నాల తరగతికి చెందిన జలాంతర్గామి విధ్వంసక నౌక. తీరప్రాంత జలాల్లో శత్రు దేశాల జలాంతర్గాములను గుర్తించి, నాశనం చేయగలదు. తేలికపాటి టార్పెడోలు, స్వదేశీ రాకెట్ లాంచర్లు, అత్యాధునిక సోనార్ వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. 77.6 మీటర్ల పొడవు ఉంటుంది. -
యోగాతో ప్రపంచ శాంతి
కోల్కతా: వ్యక్తిగత ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా, ప్రపంచ శాంతికి బాటలు వేయడంలో యోగా ఒక గొప్ప ఉత్ప్రేరకంగా పని చేయగలదని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. సమాజంలో సామూహిక శాంతి, ప్రజల మధ్య సామరస్యాన్ని పెంపొందించే లక్షణం యోగాలో ఉందని వివరించారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని రెడ్ రోడ్లో ఆదివారం నిర్వహించిన 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సమతుల్య వ్యక్తిగత జీవనశైలికి యోగా అవసరమని అన్నారు. అన్ని వయసుల వారు ఈ సంప్రదాయాన్ని ఆచరించవచ్చని సూచించారు. పని, పోషణ, నిద్రలతో కూడిన సమతుల్య జీవనశైలే దుఃఖాన్ని నిర్మూలించడానికి కీలకమని, ఇందుకు యోగా తోడ్పడుతుందని వెల్లడించారు. చాలామంది తమ ఆధునిక జీవనశైలిలో సమతుల్యతను కాపాడుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. సమతుల్యమైన రీతిలో జీవించే విధానాన్ని యోగా మనకు నేర్పుతుందని, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలను కూడా బోధిస్తుందని పేర్కొన్నారు. మన శరీరాన్ని సరైన స్థితిలో ఉంచుకోవడం నేర్చుకున్నప్పుడు, ఆరోగ్యం ఒక అలవాటుగా మారుతుందని వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక వేడుక యోగా అనేది మానసిక ఆరోగ్యం ద్వారా శారీరక దృఢత్వాన్ని సాధించడానికి మార్గం చూపుతుందని అన్నారు. యోగా అనేది వ్యక్తిగత జీవనశైలికే కాకుండా, ఈ ప్రపంచం మెరుగైన భవిష్యత్తుకు ఎంతో అవసరమని స్పష్టంచేశారు. సమతుల్యత, ఆత్మజ్ఞానం, అంతర్గత స్థిరత్వాన్ని యోగా పెంపొందిస్తుందని.. ఈ విలువలు సమాజంలో విభజనలు, సంఘర్షణను అంతం చేస్తాయని వ్యాఖ్యానించారు. యోగాను కేవలం ఒక నిర్దిష్ట రోజుకు లేదా ఒక కార్యక్రమానికి మాత్రమే పరిమితం చేయకూడదని ప్రతిజ్ఞ చేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. యోగాను మన జీవితాల్లో, భావి తరాల జీవితాల్లోనూ ఒక భాగంగా చేసుకోవాలని తేల్చిచెప్పారు. వివిధ దేశాలు, సంస్కృతులకు చెందిన ప్రజలను ఏకం చేస్తూ, యోగా నేడు ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక వేడుకగా మారిందని మోదీ హర్షం వ్యక్తంచేశారు. భూమిపై అత్యంత సుదీర్ఘమైన రోజుగా నిలిచే జూన్ 21వ తేదీ ఇప్పుడు యోగా కారణంగా అతిపెద్ద సామూహిక వేడుకల దినంగా మారిందని పేర్కొన్నారు. వేలాది మందితో కలిసి యోగాసనాలు కోల్కతాలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ వేలాది మందితో కలిసి యోగాసనాలు వేశారు. తెల్ల రంగు టీ–షర్టు, ప్యాంట్ ధరించిన మోదీ ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే అభ్యాసకుల యోగాసనాలను నిశితంగా గమనించారు. కొన్ని సూచనలు జారీ చేశారు. ఈ వేడుకల్లో వృద్ధులు, చిన్నారులు సహా అన్ని వయసుల వారు పాల్గొన్నారు.టోక్యో నుంచి న్యూయార్క్ దాకా.. వాషింగ్టన్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమాల్లో ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొని, యోగాసనాలు వేశారు. ఆరోగ్యం, సమతుల్యత, శ్రేయస్సుకు యోగా ఒక చక్కని మార్గమని వీరంతా చాటారు. జపాన్ రాజధాని టోక్యోలోని చారిత్రక ఆలయాల దగ్గర్నుంచి న్యూయార్క్లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ వరకు ఇందుకు వేదికలుగా మారాయి. ఈ ఏడాది ఆరోగ్యకరమైన వృద్ధాప్యం ఇతివృతంతో కార్యక్రమాలు జరుగుతున్నాయి. చైనాలోని షాంఘై నగరంలో భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం చేపట్టిన కార్యక్రమానికి 400 మంది హాజరయ్యారు. ఆ్రస్టేలియాలోని కాన్బెర్రాలోగల ఓల్డ్ పార్లమెంట్ హౌస్ భారత హైకమిషన్ చేపట్టిన కార్యక్రమం యోగా ఆ్రస్టేలియా సీఈవో జోష్ ప్రియోర్ నేతృత్వం వహించారు. అమెరికాలోని న్యూయార్క్లోగల టైమ్స్ స్క్వేర్లో పెద్ద ఎత్తున జరిగిన యోగా ఉత్సవాలకు భారత కాన్సులేట్ జనరల్ నాయకత్వం వహించారు. ఇంకా, బంగ్లాదేశ్ రాజధాని ఢాకా, న్యూజిలాండ్ లోని వెల్లింగ్టన్, ఫిన్లాండ్ రాజధాని హెల్సింకి, జర్మనీ రాజధాని బెర్లిన్, యూకే రాజధాని లండన్, మలేసియా రాజధాని కౌలాలంపూర్, తుర్కియేలోని అంకారా, సౌదీ అరేబియాలోని రియద్, స్పెయిన్లోని బార్సిలోనా, కెనడాలోని టొరంటోతోపాటు అనేక దేశాల్లోనూ కార్యక్రమాలు జరిగాయి. అమెరికాలోని వాషింగ్టన్లోగల లింకన్ మెమోరియల్లో భారత ఎంబసీ నిర్వహించిన జరిగిన కార్యక్రమానికి వందలాదిగా హాజరయ్యారు. -
ప్రీవెడ్డింగ్ షూట్లో చిన్నారి పెళ్లికూతురు
బీడ్: సామాజిక మాధ్యమాల్లో పెళ్లికి ముందు ఫొటోషూట్లు, రీల్స్ అప్లోడ్ చేసే ధోరణి పెరిగిపోయింది. ఈ ధోరణే ఓ బాల్య వివాహాన్ని ఆపింది. 15 ఏళ్ల బాలికను కాపాడింది. పెళ్లికి ముందు చేసిన ఫొటోషూట్ ఓ బాల్య వివాహాన్ని అడ్డుకుంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన చిత్రాలు అధికారుల దృష్టికి చేరడంతో వెంటనే చర్యలు చేపట్టారు. 15 ఏళ్ల బాలికను రక్షించి, పెళ్లిని నిలిపివేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో చోటుచేసుకుంది. సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేసిన ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ చిత్రాలపై జిల్లా కలెక్టర్ వివేక్ జాన్సన్కు సమాచారం అందింది. జియోరాయ్ తాలూకాలో 15 ఏళ్ల బాలికకు 23 ఏళ్ల యువకుడితో జరగాల్సిన పెళ్లిని కలెక్టర్ జోక్యంతో నిలిపేశారు. వారి పెళ్లిని జూన్ 19న నిలిపివేశారని బాలల సంక్షేమ కమిటీ ఛైర్పర్సన్ అశోక్ టాంగడే తెలిపారు.‘బాలిక చేతులపై మెహందీ’తో కనిపెట్టి..అశోక్ టాంగడే తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా మహిళా, శిశు అభివృద్ధి శాఖ అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అధికారుల బృందం వెంటనే గ్రామానికి చేరుకుంది. అక్కడ పెళ్లి జరుగుతున్నట్టు బయటకు కనిపించే ఆనవాళ్లు ఏవీ లేకపోయినా, బాలిక చేతులపై వరుడి పేరు ఉన్న పెళ్లి మెహందీ కనిపించింది. పెళ్లికి ముందు ఫొటోషూట్ చిత్రాలను పరిగణనలోకి తీసుకున్న బృందం బాలికను రక్షణ కస్టడీలోకి తీసుకుందని, దర్యాప్తు కొనసాగుతోందని అశోక్ టాంగడే తెలిపారు. బాల్య వివాహం విషయంలో సంబంధం ఉన్న వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. -
టెకీ రాధా గాయత్రి కేసులో కీలక పరిణామం
ముస్సోరీ: ఉత్తరాఖండ్లోని ముస్సోరీ హిల్ స్టేషన్లో గల ఒక హోటల్లో అనుమానాస్పద స్థితిలో మరణించిన తెలుగు సాఫ్ట్వేర్ ఉద్యోగిని రాధా గాయత్రి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాధా గాయత్రి మృతిపై ఆమె తండ్రి ముస్సోరీ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మృతురాలి భర్త శ్రీచరణ్పై పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.తన కుమార్తె మరణం వెనుక బలమైన అనుమానాలు ఉన్నాయని, దీనిని హత్యగా పరిగణించి సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.తన ఫిర్యాదులో శ్రీచరణ్ ప్రవర్తనపై రాధా గాయత్రి తండ్రి పలు సంచలన ఆరోపణలు చేశారు.పెళ్లయినప్పటి నుంచి శ్రీచరణ్ తన కుమార్తెతో సరిగ్గా కలిసి ఉండేవాడు కాదని, ఆమెను తీవ్ర మానసిక వేధింపులకు గురిచేసేవాడని పేర్కొన్నారు. శ్రీచరణ్ ఒక సైకోలా ప్రవర్తించేవాడని, నిరంతరం నిఘా ఉంచేందుకు గాయత్రి బ్యాగులో ట్రాకర్ కూడా పెట్టేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. భర్త పెట్టే వేధింపుల గురించి గాయత్రి గతంలో తమతో పలుమార్లు చెప్పి ఏడ్చిందని ఆయన ఫిర్యాదులో వివరించారు. కుమార్తె మరణంపై భర్త శ్రీచరణ్ వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.రాధా గాయత్రికి లోబీపీ ఉందని శ్రీచరణ్ అబద్ధాలు చెబుతున్నాడని, కానీ ఆమె ఆరోగ్య చరిత్రలో ఎప్పుడూ బీపీ సమస్యే లేదని స్పష్టం చేశారు. భార్య చనిపోతే శ్రీచరణ్ ఎందుకు మౌనంగా ఉన్నాడని ఆయన ప్రశ్నించారు. అలాగే, హోటల్లో బీరులో మత్తు పదార్థాలు కలిపారనే వార్తలు మీడియాలో వస్తున్నాయని, ఈ కోణంలో కూడా పోలీసులు లోతుగా విచారణ జరపాలని కోరారు.ఈ కేసులో పోలీసులు ప్రాథమిక ఆధారాలను సేకరించడంలో నిర్లక్ష్యం వహించారని రాధా గాయత్రి తండ్రి ఆరోపించారు.ఘటన జరిగిన రోజున భర్త శ్రీచరణ్ రక్త నమూనాలను ఎందుకు సేకరించలేదని ఆయన నిలదీశారు. ఈ కేసులో నిజాలు బయటకు రావాలంటే ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా శాస్త్రీయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఘటనకు ముందు జరిగిన 48 గంటల ఆర్థిక లావాదేవీలను పరిశీలించాలని, రాధకు నిజంగానే మత్తు పదార్థాలు ఇచ్చారా లేదా అనేది తేల్చాలన్నారు. దీంతో పాటు హోటల్ రికార్డులు, ఫోన్ కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజీలను తక్షణమే భద్రపరచాలని ముస్సోరీ పోలీసులను కోరారు. తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేశారు. -
మళ్లీ కలకలం.. నీట్ ప్రశ్నపత్రం ఉందంటూ రూ.30 వేల డిమాండ్
అజ్మీర్: దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు నీట్-యూజీ రీ ఎగ్జామ్ రాస్తున్న వేళ ఓ వార్త ఆదివారం బయటకు వచ్చి కలకలం రేపింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి వీడియో కాల్లో మాట్లాడుతూ.. తన వద్ద నీట్ ప్రశ్నపత్రం ఉందని చెబుతూ, దాన్ని ఇవ్వాలంటే రూ. 30,000 చెల్లించాలని కొందరు విద్యార్థులను డిమాండ్ చేశాడు. రాజస్థాన్లోని అజ్మీర్లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. డీఏవీ కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షుడు కృష్ణ సింగ్ ఠాకూర్ ఈ విషయం గురించి తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.వీడియో కాల్లో దుండగుడు ప్రశ్నపత్రం చూపిస్తూ విద్యార్థుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నాడని ఠాకూర్ ఆరోపించారు. ఈ విషయం కళాశాలలో కొత్తగా చేరిన ఓ విద్యార్థిని తనకు చెప్పిందని, ఆమె చెప్పిన నంబర్కు తానే ఫోన్ చేసి నిజానిజాలు తెలుసుకున్నానని ఠాకూర్ తెలిపారు."రేపు నీట్ పరీక్ష ఉంది. విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తూ డబ్బు వసూలు చేస్తున్నారు. నాకు ప్రశ్నాపత్రం చూపించి రూ. 30,000 చెల్లించాలని చెప్పారు. ఆ సంభాషణ రికార్డింగ్ను పోలీసులకు ఇచ్చాను" అని ఆయన తెలిపారు. డబ్బు పంపాలని క్యూ ఆర్ కోడ్ కూడా పంపారని ఆరోపించారు.ఇప్పటికే పలువురు విద్యార్థులు ఈ మోసానికి గురయ్యారని ఠాకూర్ తెలిపారు. ఇలాంటి మోసగాళ్లను నమ్మకుండా పరీక్ష ప్రిపరేషన్పైనే దృష్టి పెట్టాలని అభ్యర్థులకు సూచించారు. అదనపు పోలీసు సూపరింటెండెంట్ హిమాన్షు జంగిడ్ను కలిసి ఈ ఘటన వివరాలు చెప్పానని, క్యూ ఆర్ కోడ్, కాల్ చేసిన నంబర్ సహా డిజిటల్ ఆధారాలు అందజేశానని వెల్లడించాడు. ఆయన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.మొబైల్ నంబర్ ఉన్న ప్రదేశం, క్యూ ఆర్ కోడ్కు అనుసంధానమైన బ్యాంకు ఖాతా వివరాలు గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. వీడియో కాల్లో చూపించిన ప్రశ్నపత్రం నిజమైనదేనా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అజ్మీర్ పోలీసు సూపరింటెండెంట్ ఉషా యాదవ్ పరీక్ష రాసే అభ్యర్థులు మోసగాళ్ల ఉచ్చులో పడవద్దని హెచ్చరించారు."వీడియో కాల్ ద్వారా పరీక్ష ప్రశ్నపత్రాలు అమ్ముతున్నారనే విషయం మా దృష్టికి వచ్చింది. పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. పరీక్షల సమయంలో సైబర్ మోసగాళ్లు చురుకుగా మారి అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుంటారు" అని ఆమె చెప్పారు. ఇది పెద్ద స్థాయి ప్రశ్నాపత్రం లీక్ ముఠాలో భాగమా, లేక విద్యార్థులను మోసం చేసే కొత్త పద్ధతా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.మే 3న జరిగిన పరీక్ష ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలు కలకలం రేపిన విషయం తెలిసిందే. దీంతో రీఎగ్జామ్ నిర్వహించారు. ఆదివారం దాదాపు 22 లక్షల మంది అభ్యర్థులు నీట్-యూజీ మళ్లీ రాస్తున్నారు. -
అమ్మోనియం గ్యాస్ లీక్.. ఏడుగురు మహిళలు మృతి
సాక్షి,చెన్నై: తమిళనాడు ఘోరం జరిగింది. తిరువళ్లూరు రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లో అమ్మోనియం గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో ఏడుగురు మహిళలు మృతి చెందారు. 40 మంది అస్వస్థతకు గురయ్యారు. అమ్మోనియం గ్యాస్ లీక్పై సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటన స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి. బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతుండగా.. బాధితుల్లో ఎక్కువ మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. తిరువళ్లూరు జిల్లా పెరియపాలయం సమీపంలోని కన్నిగైపైర్లో సెయింట్ పీటర్స్ అండ్ పాల్ సీఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ ఫెసిలిటీలో ఈ ఘటన జరిగింది. గ్యాస్ లీక్ అవ్వడంతో రొయ్యల ప్రాసెసింగ్ బాధితులు ఆయాసం, కళ్లు తిరగడం, వాంతులు చేసుకున్నారు.గ్యాస్ లీకేజీ ఘటనపై సమాచారం అందుకున్న సహాయక బృందాలు బాధితుల్ని రక్షించే ప్రయత్నం చేశారు. పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు..ప్రాసెసింగ్ యూనిట్లో అమర్చిన మెజర్ వాల్వ్ నుంచి ఈ గ్యాస్ లీక్ జరిగినట్లు సమాచారం.సీఎం విజయ్ విచారం ఘటనపై సీఎం విజయ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయడంతో పాటు, మంత్రులు ఘటన స్థలాన్ని సందర్శించాలని సూచించారు. ప్రమాదంపై త్రిసభ్యకమిటీని ఏర్పాటు చేశారు.మరోవైపు ఈ దుర్ఘటనపై తమిళనాడు గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ తీవ్రంగా విచారం వ్యక్తం చేశారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ‘తిరువళ్లూరు జిల్లా, పెరియపాలయం సమీపంలోని కన్నిగైపేర్ గ్రామంలోని రొయ్యల ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో జరిగిన ఘోరమైన అమ్మోనియా గ్యాస్ లీక్ ఘటనలో అమూల్యమైన ప్రాణాలు కోల్పోవడం, పలువురు కార్మికులు గాయపడటం పట్ల నేను తీవ్రంగా విచారిస్తున్నాను’అని గవర్నర్ కార్యాలయంలో లోక్ భవన అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ దురదృష్టకర విషాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన బాధిత కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం. ఈ కష్ట సమయంలో వారికి మనోధైర్యం, ధైర్యం కలగాలని నేను ప్రార్థిస్తున్నాను. చికిత్స పొందుతున్న వారందరూ త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యంతో తిరిగి రావాలని గవర్నర్ ఆకాంక్షిస్తున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొంది. -
45 నిమిషాల పాటు ఎయిర్పోర్టులోనే ప్రధాని మోదీ
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ విమానాశ్రయంలోనే 45 నిమిషాల పాటు ఉండిపోయారు. నీట్-యూజీ (NEET-UG) రీ-ఎగ్జామ్ హాజరయ్యే విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలకు వెళ్లేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడకుండా.. ట్రాఫిక్ సాఫీగా సాగేలా చూడటం కోసం ప్రధాని.. ఢిల్లీ విమానాశ్రయంలోనే కాసేపు వేచి ఉన్నారు.పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో ప్రధాని మోదీ తన తిరుగు ప్రయాణాన్ని కాస్త ఆలస్యం చేసుకున్నారు. అధికారిక సమాచారం ప్రకారం.. ప్రధాని మధ్యాహ్నం 1:15 గంటల ప్రాంతంలో ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు.నీట్ (NEET) పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండటంతో ఆయన విమానాశ్రయం నుండి వెంటనే తన నివాసానికి బయలుదేరడానికి బదులుగా.. అక్కడే వేచి ఉండాలని నిర్ణయించుకున్నారు. విమానాశ్రయం నుండి ప్రధాని కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్ నిలిపివేస్తారు. దీంతో రోడ్లపై ట్రాఫిక్ జామ్తో విద్యార్థులు పరీక్షకు ఆలస్యం కాకూడదని.. పరీక్షా ప్రారంభమైన తర్వాత ప్రధాని మోదీ ఎయిర్ పోర్టు నుంచి బయటకు వెళ్లారు.దేశంలో వైద్యవిద్య ప్రవేశాల భవిష్యత్ను నిర్ణయించే నీట్–యూజీ 2026 రీ ఎగ్జామ్ ఇవాళ (ఆదివారం) ప్రారంభమైంది. గత నెల 3వ తేదీన నిర్వహించిన పరీక్ష.. పేపర్ లీక్, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో రద్దు కావడంతో దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు మరోసారి పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నేడు నీట్ రీఎగ్జామ్ నిర్వహిస్తోంది. తెలంగాణలో సుమారు 73 వేల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పెన్–పేపర్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. దేశంలోని 551 నగరాల్లోని 5,440 కేంద్రాలతోపాటు విదేశాల్లోని 14 నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
భారత్ - ఈయూ ఒప్పందం: పీయూష్ గోయల్ కీలక ప్రకటన!
భారత్ - 27 దేశాల యూరోపియన్ యూనియన్ మధ్య కుదరబోయే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దేశ ఆర్థికాభివృద్ధికి ఒక కీలక మైలురాయిగా మారనుంది. ఈ ఒప్పందంపై 2026 డిసెంబర్ నాటికి సంతకం చేసే అవకాశం ఉందని, ఆ తరువాత 2027 ఫిబ్రవరి - మార్చి నెలలలో అమలులోకి రానున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు.ఈ ఒప్పందాన్ని 'అన్ని ఒప్పందాలకు మాతృక' (Mother of All Deals) లాంటిదని అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక భాగస్వామ్యాల్లో ఒకటిగా నిలవనుంది. భారత్ - ఈయూ కలిసి ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి (GDP)లో సుమారు 25 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అంతేకాకుండా.. ప్రపంచ అంతర్జాతీయ వాణిజ్యంలో దాదాపు మూడవ వంతు వాటా ఈ రెండు భాగస్వామ్యాలదే.ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత, భారతదేశం నుంచి ఈయూ దేశాలకు ఎగుమతి చేసే సుమారు 93 శాతం వస్తువులకు సుంకం లేకుండా మార్కెట్ ప్రవేశం లభిస్తుంది. దీని వలన భారతీయ వస్త్రాలు, ఔషధాలు, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు వంటి అనేక రంగాలకు భారీ అవకాశాలు ఏర్పడతాయి.మరోవైపు, ఈయూ దేశాల నుంచి దిగుమతి అయ్యే లగ్జరీ కార్లు, వైన్ వంటి వస్తువులపై సుంకాలు తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల భారత వినియోగదారులు ఈ ఉత్పత్తులను తక్కువ ధరలకు కొనుగోలు చేసే అవకాశం కలుగుతుంది. అయితే దేశీయ పరిశ్రమలపై ప్రభావం పడకుండా తగిన రక్షణ చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది.మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచ దేశాల దృష్టి భారతదేశంపై ఉందని పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో అనేక దేశాలు ఇండియాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో అమెరికాతో కూడా వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి. అలాగే కెనడా కూడా భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకోవడానికి సన్నద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: జాబ్ కోసం పోతే.. షాకింగ్ అనుభవం! -
పరీక్షకు కొద్ది గంటల ముందు ‘నీట్’ అభ్యర్థి ఆత్మహత్య
ఘజియాబాద్: దేశవ్యాప్తంగా నేడు (ఆదివారం) నీట్ యూజీ పరీక్ష జరుగుతోంది. ఈ పరీక్షకు కొద్ది గంటలముందు ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ‘నీట్’కు సిద్ధం అవుతున్న 22 ఏళ్ల ఒక యువకుడు తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. మరణానికి కొద్ది నిమిషాల ముందు సదరు విద్యార్థి తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన ఒక వీడియో క్లిప్ ఇప్పుడు ఈ కేసులో అత్యంత కీలకంగా మారింది.మొబైల్ వీడియోలో సంచలన నిజాలుఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లా విజయ్ నగర్ నివాసి అయిన జతిన్ కుమార్ అనే యువకుడు నీట్-యూజీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాడు. అయితే, అతడు తన గదిలో విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తులో భాగంగా జతిన్ మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులకు అందులో ఒక వీడియో క్లిప్ లభ్యమైంది. తాను చనిపోవడానికి కొద్దిసేపటి ముందే జతిన్ దానిని రికార్డ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ వీడియోలో.. ఆదివారం జరగబోయే నీట్ పునఃపరీక్ష గురించి తనకు ఎలాంటి ఒత్తిడి లేదని ఆ యువకుడు స్పష్టం చేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ వాస్తవికతను, డిజిటల్ ఆధారాలను ఫోరెన్సిక్ బృందాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి.అర్ధరాత్రి వరకు చదువుకుని.. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం అర్ధరాత్రి దాటే వరకు జతిన్ తన గదిలో చదువుకుంటూనే ఉన్నాడు. తీరా శుక్రవారం ఉదయం నిద్ర లేపేందుకు వెళ్లిన బంధువులకు అతడు అపస్మారక స్థితిలో కనిపించడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న కోత్వాలి నగర్ పోలీసులు, గదిలోని సీలింగ్ ఫ్యాన్కు ఒక ఉరితాడు వేలాడుతూ ఉండటాన్ని, జతిన్ మృతదేహం కింద పడి ఉండటాన్ని గమనించారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉపాసన పాండే ఈ కేసుపై స్పందిస్తూ.. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, అన్ని కోణాల్లోనూ లోతుగా విచారణ జరుపుతున్నామని వెల్లడించారు.యూపీలో వరుస విషాదాలుమే 3న జరిగిన నీట్-యూజీ పరీక్షలో పేపర్ లీకేజీ ఆరోపణలు రావడంతో, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆ పరీక్షను రద్దు చేసి సీబీఐ విచారణకు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ గందరగోళ పరిస్థితులు విద్యార్థులను తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేస్తున్నాయి. కేవలం ఘాజియాబాద్లోనే కాకుండా, లక్నోలో కూడా 17 ఏళ్ల ఒక విద్యార్థిని మంగళవారం తన గదిలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. మే 3 పరీక్షలో మంచి మార్కులు సాధించి, సీటు వస్తుందనే నమ్మకంతో ఉన్న ఆ విద్యార్థిని పరీక్ష రద్దు కావడంతో తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. -
ముగిసిన నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్
నీట్ యూజీ అప్డేట్స్ముగిసిన రీ-ఎగ్జామ్నీట్ యూజీ (NEET-UG) 2026 పునఃపరీక్ష ముగిసింది మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు పరీక్ష జరిగిందికొనసాగుతున్న పరీక్షకొనసాగుతున్న నీట్ యూజీ (NEET-UG) 2026 పునఃపరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు పరీక్షపెన్ అండ్ పేపర్ విధానంలో నీట్ యూజీనీట్ యూజీ ప్రారంభం దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్ యూజీ (NEET-UG) 2026 పునఃపరీక్ష నేటి (జూన్ 21, ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల ప్రారంభమైంది. అత్యంత రహస్యంగా, కట్టుదిట్టమైన రక్షణ వలయంలో ప్రశ్నపత్రాలను స్థానిక పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాల పహారా మధ్య పరీక్షా కేంద్రాలకు సురక్షితంగా తరలించారు. దేశంలోని 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 కేంద్రాలలో మొత్తం 22.79 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు. పరీక్షను అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా నిర్వహించేందుకు నేషనల్... టెస్టింగ్ ఏజెన్సీ భారీ భద్రతా ఏర్పాట్లను చేసింది. దేశవ్యాప్తంగా 5,440 పరీక్షా కేంద్రాల్లోని 95,000 కంటే ఎక్కువ గదుల్లో 1.38 లక్షలకు పైగా సీసీటీవీ కెమెరాలను అమర్చారు. వీటిని జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో కంట్రోల్ రూమ్ల ద్వారా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.మాల్ప్రాక్టీస్కు అడ్డుకట్ట వేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విశ్లేషణ, పరీక్షా కేంద్రాల్లో 51,000 కంటే ఎక్కువ జామర్లు, బయోమెట్రిక్ తనిఖీలు మరియు ఫేస్ అథెంటికేషన్ (ముఖ గుర్తింపు) ప్రక్రియలను అమలు చేస్తున్నారు. హై-సెన్సిటివిటీ మెటల్ డిటెక్టర్ల ద్వారా అభ్యర్థులకు క్షుణ్ణంగా తనిఖీలు (ఫ్రిస్కింగ్) చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు. అభ్యర్థులు తమతో పాటు అడ్మిట్ కార్డ్, చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడీ కార్డ్, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను తప్పనిసరిగా తీసుకురావాలని ఎన్టీఏ ముందే సూచించింది. -
‘అయోధ్య’ విరాళాల్లో గోల్మాల్: ‘సిట్’కు షాకిచ్చిన ఫుటేజ్!
అయోధ్య: అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయానికి భక్తులు సమర్పించిన విరాళాలు, కానుకల నిర్వహణలో భారీ అక్రమాలు జరిగినట్లు వెల్లడయ్యింది. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సీట్) విరాళాల సొమ్ము చోరీకి గురైనట్లు బలమైన ఆధారాలను కనుగొంది. దీనికి సంబంధించిన ప్రాథమిక నివేదికను త్వరలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు సిట్ సమర్పించనుంది.సీసీటీవీ ఫుటేజ్ ట్యాంపరింగ్గడిచిన ఆరు రోజులుగా అయోధ్యలో సిట్ బృందం ముమ్మరంగా విచారణ జరిపింది. ఆలయ హుండీల నుంచి సేకరించిన నగదును లెక్కించే సమయంలో సీసీటీవీ ఫుటేజ్పై చేతివాటం ప్రదర్శించినట్లు దర్యాప్తులో తేలింది. కొన్ని కీలకమైన సీసీటీవీ దృశ్యాలను కావాలనే డిలీట్ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భక్తులు సమర్పించిన బంగారం, వెండి, వజ్రాభరణాలను నకిలీ వాటితో మార్చేసారనే ఆరోపణలపై సిట్ లోతుగా విచారించింది. నిర్లక్ష్యంతో పాటు దీని వెనుక పెద్ద కుట్ర కోణం దాగి ఉందనే దిశగా అధికారులు దర్యాప్తు సాగిస్తున్నారు.ట్రస్ట్ పెద్దలపై అనుమానాలుఈ భారీ అక్రమాలకు సంబంధించి సిట్ ఇప్పటివరకు ట్రస్ట్ అధికారులు, మేనేజ్మెంట్ సిబ్బంది, బ్యాంక్ ఉద్యోగులతో సహా దాదాపు 150 మందిని ప్రశ్నించింది. ట్రస్ట్ కార్యనిర్వాహకుడు అనిల్ మిశ్రా, కన్స్ట్రక్షన్ ఎయిడ్ గోపాల్ రావు పాత్రలపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ కూడా ప్రస్తుతం నిఘా నీడలో ఉన్నారు. లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్న ఎస్బీఐ, టీసీఎస్లకు చెందిన ఆరుగురు ఉద్యోగులను కూడా ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో తిన్ను యాదవ్ అనే వ్యక్తితో పాటు కొందరు బ్యాంక్ సిబ్బందిపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యే అవకాశం ఉంది.ఆలయ ట్రస్ట్లో భారీ మార్పులకు సిట్ సిఫార్సులుట్రస్ట్కు చెందిన కీలక అధికారులు దర్యాప్తు పూర్తయ్యే వరకు అయోధ్య విడిచి వెళ్లకూడదని సిట్ ఆదేశించింది. ఆలయ నిర్వహణలో పారదర్శకత కోసం కాశీ విశ్వనాథ్ ఆలయం తరహాలోనే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను నియమించాలని, ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణను పెంచాలని సిట్ సూచించనుంది. అలాగే విరాళాల లెక్కింపునకు బ్యాంకులు కేవలం రెగ్యులర్ ఉద్యోగులను మాత్రమే నియమించాలని, క్రమం తప్పకుండా ఆడిటింగ్ నిర్వహించాలని నివేదికలో సిఫార్సు చేయనున్నట్లు సమాచారం. -
భారత్పై విషం చిమ్మిన పాక్
ఢిల్లీ: భారతలోని ముస్లిం ప్రార్థనా స్థలాలకు ముప్పు పొంచి ఉందంటూ పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ చేసిన వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా బదులిచ్చింది. జర్దారీ వ్యాఖ్యలు అత్యంత ద్వేషంతో రాజకీయ దురుద్దేశంతో కూడినవని విదేశాంగ శాఖ కొట్టిపడేసింది. భారతదేశ అంతర్గత వ్యవహారాల గురించి మాట్లాడే హక్కు ఇస్లామాబాద్కు ఎంతమాత్రం లేదని మరోసారి స్పష్టం చేసింది.ఇటీవల పాకిస్థాన్ అధ్యక్షుడు భారత్పై విషం చిమ్మారు. ఎక్స్ వేదికగా భారత్ను విమర్శిస్తూ "భారతదేశంలోని వారణాసిలో ఉన్న 1000 ఏళ్ల నాటి 'మసీదు గంజ్ షహీదా'తో సహా చారిత్రక ముస్లిం మతపరమైన కట్టడాల కూల్చివేతలు ఆందోళనకరంగా ఉన్నాయి. ఇటువంటి చర్యలను తక్షణమే నిలిపివేయాలి, ఇలాంటి చర్యలు కొనసాగితే, అవి భారతదేశ విచ్ఛిన్నానికి నిరంతర అశాంతికి దారితీసే ప్రమాదం ఉంది" అని ఎక్స్ వేదికగా విమర్శించారు. తాజాగా దీనికి భారత్ తీవ్రస్థాయిలో బదులిచ్చింది.భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయమై మాట్లాడుతూ... "పాకిస్థాన్ అధ్యక్షుడు చేసిన నిరాధారమైన వ్యాఖ్యలను భారతదేశం ఖచ్చితంగా తిరస్కరిస్తోంది. భారతదేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించడానికి అతనికి ఎలాంటి హక్కు లేదు. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పాకిస్థాన్ స్వంత మానవ హక్కుల రికార్డును గమనిస్తే, ఆ దేశ అధ్యక్షుడి వ్యాఖ్యలు మరీ హాస్యాస్పదంగా అనిపిస్తాయి. వివిధ మతాలకు చెందిన మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని, వారిని వేధించడంలో పాకిస్థాన్కు ఉన్న సుదీర్ఘమైన, దురదృష్టకరమైన చరిత్ర ప్రపంచమంతటికీ తెలిసిందే" అని స్పష్టం చేశారు.అయితే పాకిస్థాన్లో హిందువులపై జరిగే దాడులు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే విషయమై అక్కడి స్వచ్ఛంద సంస్థలు, ఇతర అంతర్జాతీయ పర్యవేక్షక సంస్థలు కూడా ఆ దేశంలో మతపరమైన హింసపై నిరంతరం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా హిందువులు, ఇతర మైనారిటీ వర్గాలపై అక్కడ నిరంతరం దాడులు జరుగుతున్నాయని మానవ హక్కుల సంఘాలు పేర్కొంటున్నాయి. రాజకీయ ప్రేరేపిత దాడిజర్దారీ వ్యాఖ్యలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవని, ఆ దేశంలో కొనసాగుతున్న మతోన్మాదం, ద్వేషపూరిత విధానాల నుంచే ఇవి పుట్టుకొచ్చాయని జైస్వాల్ ముగించారు. "ఈ వాస్తవాలను పరిగణనలోకి తీసుకుంటే, పాకిస్థాన్ అధ్యక్షుడి వ్యాఖ్యలు కేవలం ఆ దేశ జాతీయ విధానాలైన మతోన్మాదం, ద్వేషం ఆధారంగా చేసిన ఒక ఉద్దేశపూర్వక రాజకీయ దాడిగా మాత్రమే పరిగణించవచ్చు" అని ఆయన అన్నారు.వారణాసిలోని చారిత్రాత్మక 'మస్జిద్ గంజ్ షహీదా'తో పాటు భారతదేశంలోని ఇతర ముస్లిం ప్రార్థనా స్థలాల కూల్చివేతకు ముప్పు ఉందంటూ జర్దారీ సామాజిక మాధ్యమం ఎక్స్ (X) లో చేసిన పోస్ట్కు సమాధానంగా భారత్ ఈ ఘాటు స్పందన ఇచ్చింది. భారతదేశ అంతర్గత విషయాల్లో ఇస్లామాబాద్ జోక్యం చేసుకోకూడదని న్యూఢిల్లీ ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తూనే ఉంది. -
నీట్ రీ-ఎగ్జామ్: నాగ్పూర్, అహిల్యానగర్, లాతూర్లలో టైట్ సెక్యూరిటీ
ముంబై: గత దఫాలో చోటుచేసుకున్న పేపర్ లీకేజీ ప్రకంపనల నేపథ్యంలో, నేడు (ఆదివారం) దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్-యూజీ పునఃపరీక్షకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మహారాష్ట్రలో మునుపెన్నడూ లేని విధంగా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నీటీ యూజీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన నాగ్పూర్, అహిల్యానగర్, లాతూర్ తదితర ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. పరీక్షలు పూర్తి పారదర్శకంగా, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా నిర్వహించేందుకు పోలీసులు, కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగాలు, సీసీటీవీ కెమెరాలతో కూడిన గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఎలాంటి భయాందోళనలు లేకుండా పరీక్షకు హాజరుకావాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పిలుపునిచ్చారు.నాగ్పూర్లో ఉచిత ప్రయాణం నాగ్పూర్లోని 30 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 12,512 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద తనిఖీలు ముమ్మరం చేయడంతో అక్కడ దాదాపు ‘పోలీస్ క్యాంప్’ వాతావరణం తలపిస్తోంది. అభ్యర్థుల గుర్తింపును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. మరోవైపు, విద్యార్థులకు రవాణా ఇబ్బందులు కలగకుండా నాగ్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ తమ ‘ఆప్లీ బస్’ సర్వీసుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించింది. అడ్మిట్ కార్డ్ చూపించి విద్యార్థులు ఈ ఏసీ బస్సుల్లో పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారు.అహిల్యానగర్లో సీఆర్పీఎఫ్ పహారాఅహిల్యానగర్ జిల్లాలో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 గంటల వరకు జరిగే ఈ పరీక్ష కోసం 12 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ 5,385 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ప్రశ్నపత్రాల రవాణాలో ఎలాంటి లోపాలు జరగకుండా స్థానిక పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. పరీక్షా కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకున్నారు. అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేక వైద్య బృందాలను కూడా అందుబాటులో ఉంచారు.లాతూర్లో తగ్గిన కేంద్రాలు గత వివాదాల దృష్ట్యా లాతూర్ జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడం కోసం పరీక్షా కేంద్రాల సంఖ్యను గతేడాది ఉన్న 34 నుండి ఈసారి 24కి తగ్గించింది. ఇక్కడ సుమారు 14,000 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. జిల్లా కలెక్టర్ స్వయంగా పరీక్షా కేంద్రాలను సందర్శించి భద్రతను సమీక్షించారు. పరీక్షల నిర్వహణను పర్యవేక్షించడానికి డ్యూటీ మేజిస్ట్రేట్లు, రాష్ట్ర అబ్జర్వర్లను ప్రత్యేకంగా నియమించారు. -
Father's Day: నాన్న అడుగు జాడల్లో..
నేడు(జూన్ 21) ఫాదర్స్ డే.. మనల్ని ఉత్తములుగా తీర్చిదిద్దేందుకు మన తండ్రులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ, వారిని గౌరవించుకునే శుభ సందర్భం ఇది. మనలో చాలా మందికి మన తండ్రులే రోల్ మోడల్స్. వారి అడుగుజాడల్లో నడవాలని, వారి కీర్తిని మరింత ముందుకు తీసుకెళ్లాలని వారు కోరుకుంటారు. దీనికి బలమైన ఉదాహరణలు రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తాయి. రాజకీయ ప్రయాణంలో కలిసి నడిచిన, నడుస్తున్న కొందరు తండ్రీ-కొడుకులు, తండ్రీ-కూతుళ్ల గురించి ఈ కథనం చెబుతుంది.లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన తనయులురాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జీవితం నిరంతరం వివాదాలతో ముడిపడి ఉన్నప్పటికీ, బిహార్ రాజకీయాల్లో తిరుగులేని నేతగా పేరుగాంచారు. ఆయన రెండుసార్లు బీహార్ ముఖ్యమంత్రిగా, ఐదేళ్లపాటు కేంద్ర రైల్వే మంత్రిగా పనిచేశారు. ఆయనకు తొమ్మిది మంది సంతానం (ఏడుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు) కాగా, వీరిలో ఇద్దరు కుమారులు ప్రస్తుతం బిహార్ రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. వీరిలో తేజస్వి యాదవ్ ప్రస్తుతం బిహార్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. గతంలో బిహార్ ఉప ముఖ్యమంత్రిగానూ పనిచేశారు. మరొక కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ బీహార్ మాజీ ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. వీరిద్దరూ తమ తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయాల్లో కొనసాగుతున్నారు.బాల్ థాకరే.. ఉద్ధవ్ థాకరేశివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నేతగా పేరొందారు. తన సొంత పార్టీని ప్రారంభించడానికి ముందు ఆయన కార్టూనిస్ట్గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. ఆయన మరాఠీ మాట్లాడే ప్రజల బలమైన పక్షపాతిగా, ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిగా, తన శ్రేణులపై అపారమైన పట్టును కలిగి ఉన్న నేతగా గుర్తింపు పొందారు. ఆయన కుమారుడు ఉద్ధవ్ థాకరే, తన తండ్రి మరణానంతరం 2012లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన నాయకత్వంలో శివసేన ఒక ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది. ఉద్ధవ్ ఎల్లప్పుడూ తన పంథాను కాపాడుకుంటూ పార్టీ జెండాను స్థిరంగా నిలిపే ప్రయత్నం చేస్తున్నారు.శరద్ పవార్ - సుప్రియా సూలేఇండియన్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)వ్యవస్థాపకుడు శరద్ పవార్, మహారాష్ట్ర రాజకీయాల్లో ‘మాస్టర్ ట్రబుల్షూటర్’ గా పేరొందారు. అన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా ఆయనకు ఎంతో గౌరవం అందుకుంటున్నారు. ఆయన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా, కేంద్రంలో పలు కీలక మంత్రిత్వ శాఖల పోర్ట్ఫోలియోలను నిర్వహించారు. ఈ మరాఠా దిగ్గజం శివసేన- కాంగ్రెస్ నాయకులను ఒకతాటిపైకి తెచ్చి, బీజేపీయేతర ‘మహా వికాస్ అఘాడి’ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే 2006లో రాజ్యసభకు ఎన్నికవడం ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆమె ముఖ్యంగా మహిళల హక్కుల కోసం పోరాడుతున్నారు. భ్రూణ హత్యలు, ఇతర సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా పలు చైతన్య ప్రచారాలకు ఆమె నాయకత్వం వహించారు.జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీభారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో జవహర్లాల్ నెహ్రూ అత్యంత కీలకంగా వ్యవహరించారు. ఆయన స్వతంత్ర భారతదేశపు ప్రథమ ప్రధానమంత్రి మాత్రమే కాకుండా, దేశంలోనే అత్యంత సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. తన తండ్రిలాగే ఆయన కుమార్తె ఇందిరా గాంధీ కూడా ప్రపంచవ్యాప్తంగా అపారమైన గుర్తింపు పొందిన రాజకీయ నాయకురాలిగా ఎదిగారు. ఆమె భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించారు. తన తండ్రి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఇందిర ఆయనకు కీలక సహాయకురాలిగా ఉన్నారు. ఆయనతో పాటు అనేక విదేశీ పర్యటనలకు వెళ్లారు. 2020లో గత శతాబ్దాన్ని శాసించిన ప్రపంచంలోని ‘100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల’ జాబితాలో ఇందిరా గాంధీని ప్రతిష్టాత్మక ‘టైమ్’ పత్రిక చేర్చడం విశేషం.రాజీవ్ గాంధీ – ప్రియాంక, రాహుల్ గాంధీఇందిరా గాంధీ పెద్ద కుమారుడైన రాజీవ్ గాంధీ, తన తల్లి హత్య తర్వాత భారతదేశ ఆరవ ప్రధానమంత్రి అయ్యారు. కేవలం 40 సంవత్సరాల వయస్సులోనే దేశ ప్రధాని పదవిని చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా ఆయన చరిత్రకెక్కారు. దురదృష్టవశాత్తూ ఆయన కూడా 1991లో హత్యకు గురయ్యారు. ఆయన సంతానమైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇద్దరూ ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత చురుకైన పాత్ర పోషిస్తున్నారు. రాహుల్ గాంధీ గతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇక ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అయ్యే వరకు చాలా కాలం పాటు తన తల్లికి నమ్మకమైన ఎన్నికల ప్రచార మేనేజర్గా వ్యవహరించారు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా వీరిద్దరూ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. -
కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఇటీవల జరిగిన ఏడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. ముఖ్యంగా బీజేపీ–జేడీఎస్ కూటమిలో క్రాస్ ఓటింగ్ ఆరోపణలు రెండు పార్టీల మధ్య ఉన్న అంతర్గత విభేదాలను బయటపెట్టినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీంతో, కర్ణాటక రాజకీయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.కాగా, 2023 సెప్టెంబర్లో అధికారికంగా ఎన్డీయేలో చేరిన జేడీఎస్, బీజేపీతో కలిసి కాంగ్రెస్ను ఎదుర్కోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో జేడీఎస్ అధినేత హెచ్డీ కుమారస్వామికి కేంద్రంలో మంత్రి పదవి కూడా లభించింది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన రెండు పార్టీలు, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత అనుమానాల మేఘాల్లో చిక్కుకున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల బదిలీ ఆశించిన స్థాయిలో జరగలేదని, కూటమి ఎమ్మెల్యేలలో కొందరు క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారనే ప్రచారం జోరుగా సాగుతోంది.దీంతో బీజేపీ–జేడీఎస్ మధ్య ఉన్న సత్సంబంధాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైకి ఐక్యత కనిపిస్తున్నప్పటికీ, లోలోపల అసంతృప్తి ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఈ ప్రచారాన్ని కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి కొట్టిపారేశారు. బెంగళూరులోని జేడీఎస్ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీతో తమ పొత్తులో ఎలాంటి సమస్య లేదన్నారు. త్వరలో ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడిని కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల అంశంపై పూర్తి వివరాలు తెలియజేస్తానని చెప్పారు.ఈ సందర్భంగా ఎన్నికల్లో కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగాయని కుమారస్వామి ఆరోపించారు. ఈ విషయంపై దర్యాప్తు ఎవరు చేస్తారు? ఎవరికి ఫిర్యాదు చేయాలి? అని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత వెలుగులోకి వచ్చిన క్రాస్ ఓటింగ్ వివాదం కూటమి భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. -
World Music Day: హిట్ అయిన ఫార్ములానే సంగీతమా?
ముంబై: సంగీతం అంటే కేవలం ట్రెండ్స్, చార్ట్బస్టర్ నంబర్లు, కోట్ల వ్యూస్ మాత్రమేనా? అంటే కాదనే సమాధానం ఇస్తున్నారు భారతీయ సంగీత ప్రపంచాన్ని ఏలుతున్న ఆరుగురు ప్రముఖ మహిళా సింగర్స్. నేడు(జూన్ 21) అంతర్జాతీయ సంగీత దినోత్సవం సందర్భంగా షల్మాలి ఖోల్గడే, జస్లీన్ రాయల్, లీసా మిశ్రా, కయాన్, డీజే నినా షా, ప్రతీక్షా శ్రీవాస్తవ వంటి స్టార్ ఆర్టిస్ట్లు నేటి మ్యూజిక్ ఇండస్ట్రీ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్పొరేట్ ఫార్ములాలు, ఆల్గారిథమ్స్ల వెనక పడకుండా, సంగీతంలో ‘రిస్క్’ తీసుకునే ధైర్యాన్ని ఇండస్ట్రీ అలవర్చుకోవాలని వారు పిలుపునిచ్చారు.ఫార్ములాలు వద్దు.. భావోద్వేగాలే ముఖ్యంనేటి ఇండస్ట్రీ కేవలం గతంలో హిట్ అయిన ఫార్ములాలనే నమ్ముకుంటూ, కొత్తదనాన్ని చంపేస్తోందని ఈ సింగర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఒక సీజన్ మాత్రమే వినే పాటల కంటే, శ్రోతల గుండెల్లో నిలిచిపోయే సంగీతమే నిజమైనదని షల్మాలి ఖోల్గడే స్పష్టం చేశారు. పాట అనేది మనుషులను భావోద్వేగంగా కదిలించాలని జస్లీన్ రాయల్ అభిప్రాయపడగా, ఇండస్ట్రీ కేవలం కొన్ని క్లిప్ల కోసం మాత్రమే పాటలను డిజైన్ చేస్తోందని, కానీ శ్రోతలు మాత్రం ఒక మంచి ఆర్టిస్ట్ను ఫాలో అవ్వాలని కోరుకుంటున్నారని ప్రతీక్షా శ్రీవాస్తవ పేర్కొన్నారు.నాయకత్వ స్థానాల్లో మహిళలు పెరగాలిమ్యూజిక్ రంగంలో అద్భుతమైన మహిళా టాలెంట్ ఉన్నప్పటికీ, వారికి సరైన అవకాశాలు, గుర్తింపు దక్కడం లేదని జస్లీన్ రాయల్ అన్నారు. పరిశ్రమలో కీలక నిర్ణయాలు తీసుకునే లీడర్షిప్ స్థానాల్లో మరికొంత మంది మహిళలు రావాల్సిన అవసరం ఉందని ఆమె ఆకాంక్షించారు. అలాగే నేటి డిజిటల్ యుగంలో సింగర్స్ కేవలం పాటలు పాడటమే కాకుండా కంటెంట్ క్రియేటర్లుగా, మార్కెటర్లుగా మారాల్సి వస్తోందని, దీనివల్ల వారిపై తీవ్రమైన మానసిక, సృజనాత్మక ఒత్తిడి పెరుగుతోందని డీజే నినా షా ఇండస్ట్రీలోని మరో కోణాన్ని బయటపెట్టారు.సాంకేతికత - రిస్క్ తీసుకునే ధైర్యంఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక సాంకేతికతను లీసా మిశ్రా ఒక మంచి సాధనంగా అభిప్రాయపడ్డారు. సాంకేతికతను కేవలం సహాయకారిగా వాడుకోవాలే తప్ప, అది క్రియేటర్గా మారకూడదన్నారు. రిస్క్ తీసుకోకపోతే బోర్ కొట్టించే సంగీతమే మిగులుతుందని ఆమె హెచ్చరించారు. సోషల్ మీడియా ప్రపంచం నుండి కాస్త దూరంగా జరిగి, మనసుకు నచ్చిన సొంత శైలిలోనే, ట్రెండ్స్ను ఫాలో అవ్వకుండా నిజాయితీగా రిస్క్ తీసుకుంటూ పాటలు చేయడమే నేటి తరం కళాకారులకు అత్యంత అవసరమని ఈ ఆరుగురు మహిళా మణులు తేల్చి చెప్పారు. -
మెలోనిపై మరోసారి మండిపడ్డ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాని మెలోని మధ్య వైరం రోజురోజుకు ముదురుతుంది. తాజాగా మెలోని వ్యాఖ్యలకు ట్రంప్ కౌంటరిచ్చారు. ఇటలీలో ఆమె పనులు సరిగ్గా లేవని అందుకే ఆమె.. తనను విమర్శిస్తూ కొత్త ఎత్తుగడలు వేస్తున్నారన్నారు. అయితే దీనికి మెలోనీ సైతం కౌంటరిచ్చింది. తన ప్రజాదారణతో మీకేం పని అని ట్రంప్ను ప్రశ్నించింది. డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ ఏదో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా ఆయన ఇటలీ ప్రధానిపై చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య అగ్గి రాజేస్తున్నాయి.. ట్రంప్ వ్యాఖ్యలను మెలోని ఇదివరకే ఖండించగా మరోసారి సోషల్ మీడియా వేదికగా ట్రంప్ రెచ్చిపోయారు.తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా స్పందిస్తూ.."ఇటలీలో మెలోని ప్రజాదరణ చాలా బలహీనంగా ఉంది. ఇరాన్ అణుబాంబు తయారీని అడ్డుకునే విషయంలో ఆమె అమెరికాకు మద్దతు ఇవ్వకపోవడమే దీనికి కారణం కావచ్చు. నిజానికి ఇటలీని అమితంగా ప్రేమించేది, రక్షించేది అమెరికా మాత్రమే ఆ మాటకు వస్తే నాటో కూడా ఇరాన్ విషయంలో అలాగే వ్యవహరించింది" అని రాసుకొచ్చారు.అదేవిధంగా యుద్ధ సమయంలో ఇటలీకి చెందిన రన్వేలను లేదా ల్యాండింగ్ స్ట్రిప్స్ను అమెరికా వాడుకోకుండా మెలోని అడ్డుకున్నారని ఆరోపించారు. ఇటలీతో పాటు ఇతర నాటో కూటమి దేశాల రక్షణ కోసం అమెరికా ప్రతిటా వందల బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తోంది. అయినప్పటికీ మెలోని కనీసం మా విమానాలు ల్యాండ్ అవ్వడానికి కూడా అనుమతించలేదు. ఇది మాకు తీవ్రమైన రవాణా ఇబ్బందిని కలిగించిందని.. ఇప్పుడు తన ప్రజాదరణ రేటింగ్లను పెంచుకోవడం కోసమే ఆమె నాతో స్నేహం నటిస్తున్నారని ట్రంప్ మండిపడ్డారు.మెలోని స్పందనట్రంప్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని అంతే తీవ్రంగా స్పందించారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమె ట్రంప్కు గట్టి కౌంటర్ ఇచ్చారు. "ఇలాంటి కారణం లేని, నిరంతర దాడులు అర్థరహితమైనవి. మీతో స్నేహం చేయడం వల్ల నా ప్రజాదరణ పెరిగిందేమీ లేదు, అది మీతో ఉండే సంబంధాలపై ఆధారపడి కూడా లేదు. ఇటలీ జాతీయ ప్రయోజనాలను కాపాడటంలో నాకున్న సామర్థ్యంపైనే నా ప్రజాదరణ ఆధారపడి ఉంటుంది. నేను ఎప్పుడూ దాన్నే చేస్తూ వచ్చాను" అని మెలోని స్పష్టం చేశారు.ఏది ఏమైనప్పటికీ, నా ప్రజాదరణ గురించి మీకేం అవసరం లేదు. దానికి బదులు మీ పాపులారిటీపై మీరు దృష్టి పెడితే మంచిదని నా సూచన అంటూ మెలోని ట్రంప్పై విరుచుకుపడ్డారు.వివాదం ఎలా మెుదలైందంటే..ట్రంప్ మాట్లాడుతూ " నేను మెలోనితో మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఆమె నాతో ఫోటో దిగాలని ఎంతగానో తపించింది. నేను అసలు ఫోటో దిగకూడదనే అనుకున్నాను, కానీ ఆమెను చూసి జాలిపడి మాట్లాడాను. నాతో మాట్లాడినందుకు ఆమె ఇప్పుడు సంతోషంగానే ఉండి ఉంటుంది" అని అన్నారు. దీనికి ఘాటుగా బదులిచ్చిన మెలోని "డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు పూర్తిగా కల్పితాలు, ఈ ప్రవర్తన నన్ను ఆశ్చర్యపరిచింది. అమెరికా అధ్యక్షుడు తన సొంత మిత్రదేశాల పట్ల ఎందుకు ఇలా ప్రవర్తిస్తారో అర్థం కావడం లేదు. అయితే పాశ్చాత్య దేశాల శత్రువుల పట్ల, అమెరికా శత్రువుల పట్ల ఆయన ఇంత పట్టుదల చూపించకపోవడం విచారకరం. నేను గానీ, నా దేశం ఇటలీ గానీ ఎవరిముందూ ఎన్నటికీ మోకరిల్లం, బతిమాలం" అని మెలోని తేల్చిచెప్పారు. -
‘జీలం’ ఒడ్డున అద్భుత యోగా విన్యాసాలు
శ్రీనగర్: నేడు(ఆదివారం) అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో జమ్ముకశ్మీర్ లోయలో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. పచ్చని ప్రకృతి, గలగల పారే జీలం నది కలయిక మధ్య సరికొత్త యోగా జోష్ కనిపించింది. ఫిట్నెస్, మానసిక ప్రశాంతతను చాటిచెబుతూ జమ్ముకశ్మీర్ స్పోర్ట్స్ కౌన్సిల్ నిర్వహించిన ఈ ప్రత్యేక ఈవెంట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.జీలం నది సాక్షిగా యోగాసనాలుఅంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కశ్మీర్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో శ్రీనగర్లోని జీలం నది ఒడ్డున యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. కనువిందు చేసే కాశ్మీరీ లోయల నేపథ్యంలో సాగిన ఈ వినూత్న వెల్నెస్ సెషన్లో వందలాది మంది యోగా ప్రేమికులు, క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చల్లని నదీ తీరాన ప్రకృతితో మమేకమవుతూ ప్రతి ఒక్కరూ వివిధ రకాల యోగాసనాలను ప్రదర్శించి ఫిట్నెస్పై తమకున్న మక్కువను చాటుకున్నారు.క్రీడాకారుల అద్భుత ప్రదర్శనఈ విశేష వేడుకలో వివిధ క్రీడా విభాగాలకు చెందిన అథ్లెట్లు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం. నిత్య జీవితంలో ఎదురయ్యే శారీరక, మానసిక ఒత్తిళ్లను అధిగమించడానికి యోగా ఏ విధంగా తోడ్పడుతుందో ఈ సందర్భంగా క్రీడాకారులు ఆచరించి చూపించారు. క్రీడల్లో రాణించాలన్నా, నిత్యం చురుగ్గా ఉండాలన్నా యోగాను మించిన సాధనం లేదని ఈ కార్యక్రమం ద్వారా వారు నిరూపించారు.సరికొత్త చైతన్యం వైపు అడుగులుభారతీయ ప్రాచీన సంస్కృతి అయిన యోగా విశిష్టతను ప్రతి ఒక్కరికీ చేరవేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు వెల్లడించారు. రోజువారీ జీవితంలో యోగాను ఒక భాగం చేసుకోవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన పెంచడమే తమ ముఖ్య ఉద్దేశమని వారు పేర్కొన్నారు. కాశ్మీర్ లోయలో నిర్వహించిన ఈ వినూత్న ప్రయత్నం మరింత మందిని యోగా వైపు నడిపించేందుకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
డబ్బు ఎక్కడిది?.. టీఎంసీకి కొత్త తలనొప్పి!
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. పార్టీ నిధులపై పెత్తనం కోసం తృణమూల్ కాంగ్రెస్లో అంతర్గత పోరు మరింత ముదిరింది. టీఎంసీకి నిధులెక్కడి నుంచి వచ్చాయన్నది తేల్చాలంటూ రెబల్ ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదుల మేరకు బ్యాంకు అధికారులు మూడు ఖాతాల్లో ఉన్న రూ.440 కోట్ల నిధుల లావాదేవీలను నిలిపి వేశారు.ఈ క్రమంలో మూడు ప్రైవేట్ బ్యాంకు ఖాతాల్లో ఉన్న ఈ నిధులను విత్ డ్రా చేయడం లేదా వేరే ఖాతాల్లోకి బదిలీ చేయడం ఇక కుదరదని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. టీఎంసీ రెబల్ ఎమ్మెల్యేలు ఇటీవల బిధాననగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మూడు అకౌంట్లలోకి నిధులు చట్ట ప్రకారం వచ్చాయా లేదా కట్–మనీ వసూళ్లు, ప్రభుత్వ నిధులను మళ్లించారా లేదా కుంభకోణాలు వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల ద్వారా వచ్చాయా అన్నది విచారణ చేపట్టి తేల్చాలని వారు కోరారు. కాగా, పార్టీ బ్యాంకు అకౌంట్లను అధికారులు ఫ్రీజ్ చేయడానికి సంబంధించి పూర్తి వివరాలు అందలేదని మమత వర్గం తెలిపింది.రెబల్స్ ఫిర్యాదును పరిశీలించిన అధికారులు మూడు ప్రైవేట్ బ్యాంకు ఖాతాల్లో ఉన్న మొత్తం రూ.440 కోట్ల నిధుల లావాదేవీలను తాత్కాలికంగా నిలిపివేశారు. మరోవైపు, ఈ వ్యవహారం టీఎంసీలోని అంతర్గత విభేదాలను మరింతగా బయటపెట్టడంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. -
నాటి ఇందిర ట్విస్ట్ నుండి నేటి శివసేన చీలిక వరకూ..
మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న హైడ్రామా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరాఠా గడ్డపై పార్టీల చీలికలు, అర్ధరాత్రి ప్రభుత్వాల ఏర్పాటు, నమ్మినవారే నట్టేట ముంచడం వంటి పరిణామాలు ఈనాటివి కావు. 1960ల కాలం నుండి సాగుతున్న ఈ అధికార వ్యూహ ప్రతివ్యూహాల వెనుక ఒక సుదీర్ఘ చరిత్ర ఉంది. నాటి కాంగ్రెస్ విభజన, శరద్ పవార్ తొలి తిరుగుబాటు నుండి నేటి శివసేన సంక్షోభం వరకు మహారాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న సంచలనాలివే..కాంగ్రెస్ చారిత్రాత్మక చీలిక: ఇందిరా గాంధీ బహిష్కరణభారత రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిన అత్యంత కీలకమైన ఘట్టం నవంబర్ 1969లో చోటుచేసుకుంది. రాష్ట్రపతి ఎన్నికల సమయం నుండి కాంగ్రెస్లో రాజుకుంటున్న విభేదాలు.. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ బహిష్కరించేలా చేశాయి. పార్టీ అధ్యక్షుడు ఎస్. నిజలింగప్ప నేతృత్వంలోని వర్కింగ్ కమిటీ ఇందిరకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోగా, ఇందిరా గాంధీ మాత్రం మెజారిటీ ఎంపీల మద్దతు తనకే ఉందంటూ తిరుగుబాటు చేశారు. 167 మంది ఎంపీల మద్దతుతో ఆమె కాంగ్రెస్ (ఆర్) గ్రూపును ఏర్పాటు చేసి తన అధికారాన్ని నిలబెట్టుకున్నారు.38 ఏళ్ల వయసులోనే సీఎం.. శరద్ పవార్ తొలి తిరుగుబాటు1969 కాంగ్రెస్ చీలిక తర్వాత మహారాష్ట్రలో యశ్వంతరావు చవాన్, ఆయన శిష్యుడైన శరద్ పవార్ ఇందిరా గాంధీ పక్షాన నిలిచారు. అయితే, 1977 అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) తర్వాత కాంగ్రెస్ మరోసారి విడిపోయింది. ఇందిరా గాంధీ కాంగ్రెస్ (ఐ) ఏర్పాటు చేయగా, చవాన్, పవార్ కాంగ్రెస్ (యు) లో ఉండిపోయారు. ఆ తర్వాత జనతా పార్టీని అధికారానికి దూరంగా ఉంచేందుకు రెండు కాంగ్రెస్ గ్రూపులు చేతులు కలిపి వసంత్దాదా పాటిల్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. కానీ 1978లో శరద్ పవార్ కేవలం 38 ఏళ్ల వయసులో కాంగ్రెస్ (యు) నుండి విడిపోయి, జనతా పార్టీ మద్దతుతో 'ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్' కూటమిని ఏర్పాటు చేసి మహారాష్ట్ర చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.మరాఠా గడ్డపై శివసేన శకం.. బీజేపీతో దోస్తీకాంగ్రెస్ అంతర్గత పోరు నడుస్తున్న సమయంలోనే, 1966లో బాల్ కేశవ్ థాకరే (బాలాసాహెబ్ థాకరే) శివసేన పార్టీని స్థాపించారు. ముంబై వేదికగా మరాఠీ ప్రజల హక్కుల కోసం పోరాడుతూ, దూకుడు రాజకీయాలతో క్షేత్రస్థాయిలో ఈ పార్టీ బలమైన శక్తిగా ఎదిగింది. ఇదే క్రమంలో హిందుత్వ ఎజెండాతో బీజేపీతో శివసేనకు 25 ఏళ్ల సుదీర్ఘ బంధం కుదిరింది. మహారాష్ట్రలో శివసేన పెద్దన్న పాత్ర పోషించగా, 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక రాష్ట్రంలో బీజేపీ బలం పెరగడంతో ఈ సమీకరణలు మారడం ప్రారంభించాయి. 1995లో మొదటిసారి శివసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి మనోహర్ జోషి సీఎం అయ్యారు.విదేశీ మూలాల వివాదం: ఎన్సీపీ ఆవిర్భావం1999లో సోనియా గాంధీ విదేశీ మూలాల అంశాన్ని తెరపైకి తెస్తూ శరద్ పవార్ కాంగ్రెస్ నుండి రెండోసారి బయటకు వచ్చారు. ఆయన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని స్థాపించారు. విడిపోయినప్పటికీ, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో శివసేన-బీజేపీ కూటమిని అడ్డుకోవడానికి కాంగ్రెస్, ఎన్సీపీ చేతులు కలిపి విలాస్రావ్ దేశ్ముఖ్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. ఆ తర్వాత పవార్ కేంద్రంలో యూపీఏ ప్రభుత్వంలో కీలక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.ఐదు రోజుల ముచ్చటైన ప్రభుత్వం.. మహా వికాస్ అఘాడీ2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత శివసేన, బీజేపీ కలిసి పోటీ చేసినప్పటికీ సీఎం పదవి విషయంలో వచ్చిన విభేదాలతో కూటమి విడిపోయింది. ఆ సమయంలో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా తెల్లవారుజామున ప్రమాణ స్వీకారం చేయడం సంచలనం సృష్టించింది. కానీ ఈ ప్రభుత్వం కేవలం ఐదు రోజులే నిలిచింది. శరద్ పవార్ వ్యూహాత్మకంగా తన ఎమ్మెల్యేలను కాపాడుకుని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలను కలిపి ‘మహా వికాస్ అఘాడీ’ కూటమిని తెరపైకి తెచ్చారు. దీనితో ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రి అయ్యారు.2026 కొత్త సంక్షోభం.. ఉద్ధవ్ చేజారిన ముంబై కోటజూన్ 2022 లో ఏకనాథ్ షిండే తిరుగుబాటుతో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం కూలిపోయింది. షిండే మెజారిటీ ఎమ్మెల్యేలతో బీజేపీతో కలిసి సీఎం అయ్యారు. పార్టీ పేరు, విల్లు-బాణం గుర్తు కూడా షిండే వశమయ్యాయి. ఆ మరుసటి ఏడాది 2023 లో అజిత్ పవార్ సైతం ఎన్సీపీని చీల్చి షిండే ప్రభుత్వంలో చేరారు. కాగా, 2026 లో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యుబిటి) మరో భారీ చీలిక వైపు వెళ్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆరుగురు లోక్సభ ఎంపీలు స్పీకర్కు లేఖ ఇవ్వడం, ఢిల్లీ సమావేశానికి గైర్హాజరు కావడం కలకలం రేపుతోంది. దశాబ్దాలుగా ఉద్ధవ్ చేతిలో ఉన్న బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ తన మేయర్ను కూర్చోబెట్టడంతో ప్రస్తుతం ఉద్ధవ్ కేవలం ఒకే ఒక్క మున్సిపల్ కార్పొరేషన్కు పరిమితమయ్యారు. -
ఈ రోజే నీట్ రీఎగ్జామ్.. కట్టుదిట్టమైన భద్రత
ఈ రోజు జరగనున్న నీట్ రీఎగ్జామ్కు ఎన్టీఏ దేశ వ్యాప్తంగా అత్యంత పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసింది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని పేర్కొంది. పరీక్షలు ఎటువంటి అక్రమాలు జరగకుండా నిరంతరం పర్యవేక్షించేందుకు 1.38 లక్షల సీసీటీవీ కెమెరాలు మానటరింగ్ చేయనున్నట్లు పేర్కొంది.అదేవిధంగా ఏఐ ఆధారిత సీసీటీవీలు, 51,311 జామర్లతో ఎలక్ట్రానిక్ పరికరాల నియంత్రణ చేపట్టనుంది. మరోవైపు తెలుగురాష్ట్రాల్లో నీట్ రీఎగ్జామ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో 2.95 లక్షల మంది నీట్ పరీక్ష రాయనున్నారు.వీరికోసం ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఏపీలో 65,790 మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాయనున్నారు. పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 185 కేంద్రాలు ఏర్పాటు చేశారు.కాగా దేశవ్యాప్తంగా ఆదివారం జరగనున్న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) రీ-ఎగ్జామ్ కేవలం 22 లక్షల మంది విద్యార్థులు రాయనున్నారు. కాగా మే 3న జరిగిన పరీక్ష పేపర్ లీక్ కావడం, ఆ తర్వాత పరీక్షను రద్దు చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి, నిరసనలకు దారితీసింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్లు కూడా వచ్చాయి. అయితే, ఈ ఘటనపై కేంద్రం విచారం వ్యక్తం చేస్తూనే... తాము పారదర్శకతకే ప్రాధాన్యత ఇచ్చామని స్పష్టం చేసిందిదీంతో ఈ పరీక్ష వైద్య విద్యార్థులకే కాకుండా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక పెద్ద అగ్నిపరీక్షగా మారింది. మే నెలలో జరిగిన మొదటి విడత పరీక్షలో పేపర్ లీకేజీ వివాదం చెలరేగడంతో, కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి నిలబెట్టుకోవడానికి కేంద్రం ఈసారి సర్వశక్తులూ ఒడ్డుతోంది.పరీక్ష సమయాలు పరీక్ష సమయం మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 5:15 గంటల వరకు పరీక్ష జరగనుంది.దివ్యాంగులకు మినహాయింపు: అదనపు సమయానికి అర్హులైన దివ్యాంగ విద్యార్థులకు సాయంత్రం 6:20 గంటల వరకు సమయం కేటాయించారు.రిపోర్టింగ్ సమయం: విద్యార్థులు ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల లోపు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని NTA స్పష్టం చేసింది. -
ప్రపంచాన్ని యోగా ఏకం చేసింది.. మోదీ
కోల్కతా: ప్రపంచం మెుత్తాన్ని యోగా ఏకం చేసిందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఈరోజు (ఆదివారం) 12 వ యోగా దినోత్సవం సందర్భంగా కోల్కతాలో నిర్వహించిన ప్రత్యేక యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బెంగాల్లో రామకృష్ణ పరమహాంస లాంటి మహానీయులు జన్మించారన్నారు. కాగా కోల్కతాలోని రెడ్రోడ్లో నిర్వహించిన కార్యక్రమంలో 35 వేల మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోల్కతాలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ "యోగా దినోత్సవ కార్యక్రమాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చొరవ చూపిస్తున్నారు. ఈ రోజు భౌగోళిక సరిహద్దులను దాటి ఒక భారీ సామూహిక ఉద్యమంగా ఎదిగింది. యోగా దినోత్సవం ప్రపంచంలోనే అతిపెద్ద పండుగగా మారింది, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి ఇందుకు సంబంధించిన అద్భుతమైన దృశ్యాలు వస్తున్నాయి" అని అన్నారు.ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో జూన్ 21వ తేదీకి ఒక ప్రత్యేక విశిష్టత ఉందని, ఎందుకంటే ఇది సంవత్సరంలోనే అత్యంత సుదీర్ఘమైన పగలు (Longest Day) కలిగిన రోజు అని ప్రధాని గుర్తు చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం కారణంగా ఈ తేదీకి ఇప్పుడు అదనంగా మరొక ప్రపంచ గుర్తింపు లభించిందని ఆయన అన్నారు. కాగా ఈ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలో 40 ప్రాంతాలతో పాటు దేశవ్యాప్తంగా 100 ప్రముఖ ప్రదేశాల్లో యోగా డే వేడుకలు నిర్వహించారు. -
2030 కంటే ముందే స్వదేశీ బ్రహ్మోస్
సాక్షి, హైదరాబాద్: బ్రహ్మోస్.. ఆపరేషన్ సిందూర్లో లక్ష్యాన్ని ఛేదించి శత్రువుకు నిద్రలేని రాత్రులు చూపించిన.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూజ్ మిస్సైల్. భారత్–రష్యా సంయుక్తంగా దీనిని అభివృద్ధి చేశాయి. దీనిని భూమి, సముద్రం, జలాంతర్గామి, యుద్ధ విమానాల నుంచి ప్రయోగించవచ్చు. ఒక్కసారి లక్ష్యాన్ని నిర్దేశించి ప్రయోగిస్తే.. ఇది స్వయంచాలకంగా టార్గెట్ను ధ్వంసం చేస్తుంది. శత్రువుల రాడార్లకు చిక్కకుండా చాలా తక్కువ ఎత్తులో దూసుకుపోవడం దీని ప్రత్యేకత. ఇలాంటి క్షిపణుల తయారీలో హైదరాబాద్ సైతం కీలకంగా వ్యవహరిస్తోందని బ్రహ్మోస్ డైరెక్టర్ జనరల్, బ్రహ్మోస్ ఏరోస్పేస్ సీఈవో, ఎండీ జైతీర్థ్ ఆర్. జోషి తెలిపారు. ఎన్డీఈ–2026 సదస్సు వివరాలు వెల్లడించేందుకు ఏర్పాటైన సమావేశంలో ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... నూరు శాతం దేశీయంగా.. బ్రహ్మోస్ క్షిపణుల తయారీకి అవసరమైన 85 శాతం విడిభాగాలను దేశీయంగా సమకూర్చుకుంటున్నాం. కొన్ని ఎలక్ట్రానిక్ విడిభాగాల విషయంలో వెనుకబడ్డాం. సెమీకండక్టర్ పరికరాలు దిగుమతి చేసుకుంటున్నాం. నూరు శాతం తయారీ దేశీయంగా సాధ్యమే. 2030 కంటే ముందే ఈ కల సాకారం అవుతుంది. కాన్సెప్ట్ రెడీ అయితే మూడేళ్లలోనే సరికొత్త బ్రహ్మోస్ క్షిపణిని అభివృద్ధి చేయగల సత్తా మనకు ఉంది. ఈ మేరకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) పూర్తిస్థాయి సామర్థ్యం సొంతం చేసుకుంది. ప్రస్తుతం సంస్థ వద్ద 6 బిలియన్ డాలర్ల (సుమారు రూ.56 వేల కోట్లు) విలువైన ఆర్డర్ బుక్ ఉంది. ఇప్పటికే బ్రహ్మోస్ క్షిపణులను ఫిలిప్పీన్స్కు సరఫరా చేస్తున్నాం. వియత్నాంకు అతి త్వరలోనే అందించనున్నాం. ఈ క్షిపణుల కోసం పశ్చిమ, తూర్పు ప్రాంతంలోని చాలా దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. రష్యా సైతం అడుగుతోంది. 10 రోజుల్లో ఒక క్షిపణిని తయారు చేయగలం. 20 శాతం హైదరాబాద్ నుంచే.. బ్రహ్మోస్ ఇండస్ట్రి కన్సార్షియంలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని 200కుపైగా చిన్న, మధ్యతరహా కంపెనీలున్నాయి. బ్రహ్మోస్ క్షిపణుల తయారీలో వాడే విడిభాగాలను ఈ కన్సార్షియంలో ఉన్న కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. మిసైళ్ల అసెంబ్లింగ్లోనూ ఇవి పాలుపంచుకుంటున్నాయి. కన్సార్షియంలోని 20 శాతం కంపెనీలు హైదరాబాద్ నుంచే ఉంటాయి. భాగస్వామ్య కంపెనీలకు సాంకేతిక బదిలీ, నిపుణులకు శిక్షణ ఇస్తున్నాం. హైదరాబాద్, నాగ్పూర్, పిలానీ, లక్నో వద్ద సంస్థకు తయారీ కేంద్రాలున్నాయి. 4 యూనిట్లలో మూడవ షిఫ్ట్ మొదలుపెట్టబోతున్నాం. బ్రహ్మోస్ ప్రాజెక్టులో డిజైన్, డెవలప్మెంట్, తయారీలో హైదరాబాద్ అత్యంత కీలకపాత్ర పోషిస్తోంది. తెలంగాణలో సర్వే పూర్తి.. కొత్త ప్లాంటుకు 400–500 ఎకరాలు అవసరం. ఏపీ ప్రభుత్వం చూపించిన స్థలం అనువైనది కాదు. తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర వద్ద సర్వే పూర్తి చేశాం. ప్లాంటు ఎక్కడ ఏర్పాటు చేస్తారనే నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదే. ప్లాంటు ఏర్పాటు ముఖ్యం కాదు. అందుకు అవసరమైన ఎకో సిస్టమ్ ప్రధానం. వాస్తవానికి ఈ రంగంలో దేశవ్యాప్తంగా మానవ వనరుల కొరత చాలా ఉంది. ఇండియన్ సొసైటీ ఫర్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ (ఐఎస్ఎన్టీ) వచ్చే నవంబర్లో నాన్ డిస్ట్రక్టివ్ ఇవాల్యుయేషన్ (ఎన్డీఈ)–2026, ఏరోఎన్డీటీ–2026 సదస్సులను నిర్వహిస్తోంది. 15–17 తేదీల్లో జరిగే ఈ కార్యక్రమాలకు హైటెక్స్ వేదిక. దేశ, విదేశాల నుంచి రక్షణ, వైమానిక, ఇంధన, తయారీ రంగాలకు చెందిన 2వేల మంది నిపుణులు పాలుపంచుకోనున్నారు. -
బెంగాల్కు పునర్వైభవం
తారకేశ్వర్: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అరాచక పాలన సంకెళ్లను ఛేదించుకొని బీజేపీ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి దిశగా కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆయన శనివారం బెంగాల్లో పర్యటించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ఇక్కడ అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. హూగ్లీ జిల్లాలోని తారకేశ్వర్లో ‘పశ్చిమ్బంగ దివస్’వేడుకలకు హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. బెంగాల్ గాలిలో ఇప్పుడు ఒక తాజాదనం కనిపిస్తోందని అన్నారు. బెంగాల్ వైభవం తిరిగి మొదలైనట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజల ముఖాల్లో ఒక కొత్త కాంతి దర్శనమిస్తోందని, గ్రామాల్లో ఆనందం, నమ్మకం అనే భావన వ్యక్తమవుతోందని చెప్పారు. ప్రజల ఒక్క ఓటు ఎలాంటి మార్పును తీసుకురాగలదో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోందని వెల్లడించారు. ప్రజాస్వామ్యానికి ఉన్న శక్తిని బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తీర్పు నిరూపించిందని ఉద్ఘాటించారు. గత ప్రభుత్వాల వల్ల జరిగిన నష్టాన్ని సరిదిద్దడానికి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం సూపర్ఫాస్ట్ స్పీడ్తో పని పనిచేస్తోందని మోదీ తేల్చిచెప్పారు. ఇప్పుడు మధ్యవర్తులు లేరు, అడ్డంకులు లేవు ‘‘రైల్వేలు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, మత్స్య పరిశ్రమ, అనుసంధాన రంగాల్లో పలు ప్రాజెక్టులు ప్రారంభించాం. ఇవి బెంగాల్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి, కొత్త అవకాశాలను సృష్టిస్తాయి. బెంగాల్ తన నూతన భవిష్యత్తును నిర్మించుకుంటోంది. ఈ ప్రాజెక్టులు బెంగాల్ అభివృద్ధికి కొత్త ఊపునిస్తాయి, ఇక్కడి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. రాజకీయ వైరం కారణంగా ఇక్కడ ఏళ్ల తరబడి అనేక సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి, కొన్ని ఆలస్యమయ్యాయి. నేడు ఆ అడ్డంకులన్నింటినీ అధిగమించి, ప్రతి ప్రభుత్వ పథకం ప్రయోజనాలను నేరుగా ప్రజలకు చేరవేస్తున్నాం. ఇప్పుడు మధ్యవర్తులు లేరు, అడ్డంకులు లేవు. భారత్–బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె నిర్మాణానికి గత ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది. ఇప్పుడు అవన్నీ తొలగిపోయాయి. కంచె నిర్మాణానికి చర్యలు మొదలయ్యాయి’’ అని మోదీ ఉద్ఘాటించారు. అభివృద్ధికి గేటు వే తూర్పు భారత్ రాయ్రంగ్పూర్: కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో నిర్లక్ష్యానికి గురైన తూర్పు భారతదేశం ఇప్పుడు అభివృద్ధికి ఒక ముఖద్వారంగా ఎదుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. ఆయన శనివారం ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో పర్యటించారు. రాయ్రంగ్పూర్లో రూ.47,600 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. అభివృద్ధి పథంలో ఒడిశా వేగంగా ముందుకు సాగుతోందని హర్షం వ్యక్తంచేశారు. తూర్పు భారతదేశ అభివృద్ధి ద్వారా దేశాన్ని అభివృద్ధి చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. ‘పూర్వోదయ’విధానంపై ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర వనరులను అవకాశాలుగా మారుస్తోందని చెప్పారు. ఇప్పటివరకు రూ.20 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. ముర్ము అత్తగారి గ్రామానికి మోదీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 68వ జన్మదినాన్ని పురస్కరించుకొని మయూర్భంజ్ జిల్లాలోని ఆమె అత్తగారి గ్రామమైన పహద్పూర్ను మోదీ సందర్శించారు. ఈ గ్రామాన్ని ‘సోలార్ విలేజ్’గా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. పహద్పూర్ ఒక ఆదర్శవంతమైన సౌరశక్తి ఆధారిత గ్రామంగా ఎదుగుతుందని చెప్పారు. రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మయూర్భంజ్ నేల నుంచి దేశ అత్యున్నత రాజ్యాంగ పదవికి ఆమె ఎదిగిన తీరు ఒడిశాకు, దేశానికి ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. సంతాలీ భాషకు ‘ఓల్ చికి’లిపిని సృష్టించిన పండిట్ రఘునాథ్ ముర్ముకు మోదీ నివాళులరి్పంచారు.కిసాన్ సమ్మాన్ నిధి విడుదల ప్రధాని మోదీ బెంగాల్ పర్యటనలో పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత సొమ్మును విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9.44 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.18,880 కోట్లను నేరుగా బదిలీ చేశారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, అగ్రి స్టాక్, నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫారి్మంగ్, ప్రధానమంత్రి ధన్–ధాన్య కృషి యోజన వంటి పథకాలను మోదీ ప్రారంభించారు. -
నేడే నీట్ రీఎగ్జామ్
సాక్షి, హైదరాబాద్: దేశంలో వైద్యవిద్య ప్రవేశాల భవిష్యత్ను నిర్ణయించే నీట్–యూజీ 2026 రీ ఎగ్జామ్ ఆదివారం జరగనుంది. గత నెల 3వ తేదీన నిర్వహించిన పరీక్ష.. పేపర్ లీక్, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో రద్దు కావడంతో దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు మరోసారి పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నేడు నీట్ రీఎగ్జామ్ నిర్వహిస్తోంది. తెలంగాణలో సుమారు 73 వేల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పెన్–పేపర్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. దేశంలోని 551 నగరాల్లోని 5,440 కేంద్రాలతోపాటు విదేశాల్లోని 14 నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పేపర్ లీక్తో రద్దు... ఎన్టీఏపై విమర్శల వెల్లువ గత నెల 3న జరిగిన నీట్కు ముందు వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో ప్రశ్నపత్రం బయటకు వచ్చినట్టు కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. జీవశాస్త్రం, రసాయన శాస్త్రానికి చెందిన అనేక ప్రశ్నలు ముందుగానే సోషల్మీడియాలో చక్కర్లు కొట్టినట్టు ఆరోపణలు రావడంతో పరీక్ష సమగ్రత దెబ్బతిన్నదని ఎన్టీఏ నిర్ధారించింది. దీంతో పరీక్షను పూర్తిగా రద్దు చేసి రీఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో ఎన్టీఏ పరీక్షల నిర్వహణ విధానంపై పలు విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కూడా కొనసాగుతోంది. ఈసారి ఎలాంటి వివాదాలకు తావులేకుండా ప్రభుత్వం పూర్తిస్థాయిలో భద్రతా చర్యలు చేపట్టింది. ప్రశ్నపత్రాల తయారీలో పాల్గొనే నిపుణులను రహస్య ప్రదేశాలకు తరలించి డిజిటల్ కమ్యూనికేషన్పై పూర్తిగా ఆంక్షలు విధించారు. ప్రశ్నల బ్యాంకును విస్తరించడం, ప్రశ్నపత్ర రూపకల్పనలో ఎక్కువ మంది నిపుణులను భాగస్వామ్యం చేయడం, గోప్యతా నిబంధనలను కఠినతరం చేయడం వంటి చర్యలు తీసుకున్నారు. పకడ్బందీ ఏర్పాట్లు చేశాం : ఎన్టీఏ నీట్ రీఎగ్జామ్ అత్యంత పారదర్శకంగా, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం వెల్లడించింది. 95,000లకు పైగా పరీక్ష గదుల్లో మొత్తం 1,38,560 సీసీటీవీ కెమెరాలను అమర్చారు. లైవ్ ఫీడ్లను జాతీయ, ఆయా రాష్ట్ర స్థాయిలో వర్చువల్గా పర్యవేక్షిస్తారు. ఎల్రక్టానిక్ అక్రమాలను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా 51,311 జామర్లను ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష గదికి ఇద్దరు ఇన్విజిలేటర్లు ఉంటారు. అభ్యర్థుల తనిఖీకి 38,795 మంది సిబ్బందిని, బయోమెట్రిక్ వెరిఫికేషన్కు 48,448 మందిని రంగంలోకి దించారు. ఈసారి బయోమెట్రిక్ సిబ్బందిని రెట్టింపు చేయడమే కాకుండా ఫేస్ అథెంటికేషన్ సదుపాయాన్ని కూడా కల్పించారు. సాంకేతిక సమస్యల తక్షణ పరిష్కారానికి ప్రతి కేంద్రంలో ఒక సెంటర్ సిస్టమ్స్ ఆఫీసర్ అందుబాటులో ఉంటారు. పరీక్షా కేంద్రాల్లో సుమారు 6,700 మంది అబ్జర్వర్లు విధుల్లో ఉండగా, 100 మందికి పైగా వర్చువల్ అబ్జర్వర్లు కేంద్ర కార్యాలయం నుంచి నిరంతరం లైవ్ సీసీటీవీ ఫుటేజీని పర్యవేక్షిస్తారు. ఈ ఫుటేజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టూల్స్తో విశ్లేíÙంచి, ఎక్కడైనా తేడాలు ఉంటే వెంటనే గుర్తిస్తారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల పనితీరు, విద్యుత్ బ్యాకప్, వైద్య సదుపాయాలు, అత్యవసర పరిస్థితుల నిర్వహణపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా మాక్డ్రిల్ రీ ఎగ్జామ్కు ముందు శనివారం దేశవ్యాప్తంగా మాక్డ్రిల్ నిర్వహించారు. రాష్ట్రంలో కూడా ఎంపిక చేసిన అన్ని పరీక్ష కేంద్రాల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లో భద్రతా వ్యవస్థలు, ప్రశ్నపత్రాల రవాణా, అభ్యర్థుల ప్రవేశ ప్రక్రియలను పరీక్షించారు. ప్రశ్నపత్రాల భద్రత కోసం జిల్లా యంత్రాంగాలు, పోలీసు బలగాలు, ఎస్కార్ట్ బృందాలు కలిపి రెండు లక్షల మందికి పైగా సిబ్బందిని రంగంలోకి దించారు. పేపర్ లీకేజీలకు సోషల్ మీడియా వేదికలు ఉపయోగించారనే ఆరోపణల నేపథ్యంలో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. నీట్ రీ ఎగ్జామ్ ప్రశ్నపత్రం లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ఎన్టీఏ ఖండిస్తూ, విద్యార్థులు వదంతులను నమ్మొద్దని సూచించింది. అనుమానాస్పద సమాచారం, నకిలీ పేపర్లపై ఫిర్యాదులకు ప్రత్యేక పోర్టల్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే నీట్ రీ ఎగ్జామ్ ఎన్టీఏ విశ్వసనీయత, దేశంలోని అత్యంత కీలక ప్రవేశ పరీక్షల పారదర్శకతకు అగ్నిపరీక్షగా మారింది. -
రియా కపూర్ రూ.1.35 కోట్ల చెవి రింగులు మాయం
ముంబై: ఇటీవల అమెరికా వెళ్లిన బాలీవుడ్ దర్శకురాలు, ఫ్యాషన్ స్టయిలిస్ట్ రియా కపూర్ అద్దెకు తెచ్చుకున్న రూ.1.35 కోట్ల విలువైన వజ్రపు చెవి రింగులను పోగొట్టుకున్నారు. ఈ మేరకు ఆమె సన్నిహితురాలు ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ సవ్లీన్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదుపై సహర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. న్యూయార్క్లో జరిగే మెట్ గాలాలో పాల్గొనేందుకు రియా కపూర్ ముంబైలోని మెహతా జువెల్లర్స్ అండ్ గోయెంకా జువెల్లర్స్ వద్ద ఖరీదైన రెండు జతల చెవి రింగులను అద్దెకు తీసుకున్నారు. వాటిని సవ్లీన్ సింగ్కు ఇవ్వగా, ఆమె తన బ్యాగులో పెట్టుకున్నారు. రియా, సవ్లీన్ బృందం ఏప్రిల్ 17వ తేదీన ముంబై నుంచి దుబాయ్కి, అక్కడి నుంచి న్యూయార్క్కు 28న చేరుకున్నారు. న్యూయార్క్లో బస చేసిన పియెర్రె హోటల్కు వెళ్లాక బ్యాగు తెరిచి చూడగా రెండు వేర్వేరు బాక్సుల్లో ఉన్న చెవి రింగులు కనిపించలేదు. వీటితోపాటు సుమారు రూ.లక్షన్నర విలువైన మరో రెండు జతల చెవిరింగులు బ్యాగులో లేవు. తిరిగి ముంబై వచ్చాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆభరణాలు ముంబైలో మాయమయ్యాయా లేక దుబాయ్, అమెరికాలో ఎవరైనా దొంగిలించారా అనేది తేల్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు శనివారం తెలిపారు. -
ఆ 60 కేజీల వెండి ఎక్కడ?
లక్నో: అయోధ్యలోని రామమందిరం నిర్మాణం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు స్వయంగా వచ్చి దానమిచ్చిన విరాళాల నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణల నడుమ మరో కొత్త ఆరోపణ మొదలైంది. ప్రధాన ఆలయ గర్భగుడిలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం రోజున రామ్లల్లాకు తాము సమర్పించిన 60 కేజీల వెండి వస్తువుల ఆచూకీపై ఆలయ నిర్వాహకులు ఎలాంటి సమాధానం చెప్పట్లేరని ఇండియా బులియన్ అండ్ జువెల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అనురాగ్ రస్తోగీ వెల్లడించారు. 4.62 కేజీల బరువైన నాలుగు పెద్ద వెండి ఇటుకలు, 34.64 కేజీల బరువైన 30 వెండి వస్తువులు సహా మొత్తంగా 60 కేజీల వెండిని విరాళం ఇచ్చినట్లు రసీదుల్లో స్పష్టంగా ఉంది. కానీ ఆలయ విరాళాల లెక్కలు, రికార్డుల ప్రకారం ఈ వెండి, వెండి వస్తువులు ఎక్కడున్నాయో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇప్పటికే వివాదం మొదలవడంతో ఏర్పాటైన ప్రత్యేకదర్యాప్తు బృందం(సిట్) సభ్యులు గత ఆరు రోజులుగా వెతుకుతున్నా వీటి జాడ ఎక్కడుందో కనిపెట్టలేకపోయారు. విచారణలో భాగంగా అధికారులు రామ్లల్లాలో బంగారం, విరాళాల బాధ్యతలు చూసుకుని రాంశంకర్ యాదవ్ అలియాస్ టిన్ను, కృష్ణదేవ్ తివారీ, మరో నలుగురు పూజారులను ప్రశ్నించారు. -
మీ అనురాగమే నన్ను ముందుకు నడిపిస్తోంది
న్యూఢిల్లీ: తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆప్యాయత, అనురాగాలే తనను ముందుకు నడిపిస్తున్నాయని, దేశ సేవను కొనసాగించడానికి స్ఫూర్తినిస్తున్నాయని వివరించారు. దేశానికి తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా చరిత్ర సృష్టించిన ముర్ము 1958 జూన్ 20న ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో జన్మించారు. శనివారం 68వ పడిలోకి ప్రవేశించారు. తన పుట్టినరోజు సందర్భంగా ప్రజలు ఆప్యాయ తతో పంపించిన సందేశాలు, శుభాకాంక్షలు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టుచేశారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓంబిర్లా తదితరులకు ముర్ము ధన్యవాదాలు తెలిపారు. ముర్ము ప్రయాణం స్ఫూర్తిదాయకం: మోదీ రాష్ట్రపతి ముర్ము ధైర్యం, సరళత, వినమ్రత, ప్రజాసేవ పట్ల అచంచలమైన అంకితభావంతో కూడిన ప్రయాణం దేశవ్యాప్తంగా ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని ప్రధాని మోదీ వెల్లడించారు. సుదీర్ఘ ప్రజా జీవితంలో ముర్ము దేశానికి విశేషమైన సేవలందించారని, ముఖ్యంగా అట్టడుగు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం కృషి చేశారని కొనియాడారు. -
‘చెక్క’నైన చాక్లెట్
చాక్లెట్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు? పిల్లల నుంచి పెద్దల దాకా చాక్లెట్ అంటే నచ్చని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. కొన్ని చాక్లెట్లు గట్టిగా, కొన్ని మెత్తగా ఉంటాయి. నోట్లో వేసుకోగానే మంచులా కరిగిపోయే చాక్లెట్ను ఎప్పుడైనా చూశారా? జపాన్కు చెందిన ఒక మిఠాయి తయారీ సంస్థ ప్రపంచంలోనే అత్యంత పలుచనైన చాక్లెట్ను తీసుకొచ్చింది.ఇటలీకి చెందిన సంప్రదాయ పొరల చాక్లెట్ల నుంచి ప్రేరణ పొంది తయారుచేసిన ఈ చాక్లెట్కు ‘కోర్టెసియా’అని పేరు పెట్టారు. ఇటాలియన్ భాషలో దీనికి ‘చెట్టు బెరడు’అని అర్థం. కేవలం 0.03 మిల్లీమీటర్ల పలుచని చాక్లెట్ పొరను తీసుకుని, చెట్టు బెరడుతో కప్పినట్టు గుండ్రటి కొమ్మను పోలిన ఆకారంలోకి దీన్ని చుడతారు. ఇంతటి సూక్ష్మమైన చాక్లెట్ పొర ను సాధారణ యంత్రాలతో తయారు చేయడం అసాధ్యం. ఇందుకోసం ఒక స్థానిక యంత్రాల నిపుణుడి సహకారంతో దాదాపు ఒకటిన్నర సంవత్సరానికి పైగా శ్రమించి, ఒక ప్రత్యేకమైన మెషీన్ను తయారుచేశారు.ఈ యంత్రం ద్వారా చాక్లెట్ను అత్యంత నైపుణ్యంతో ఒకే ఒక పలుచని పొరలాగా చుడతారు. చాక్లెట్ నోట్లో పూర్తిగా కరుగుతుంటే దాని రుచే వేరని.. అందుకే తాము ఇలా తయారుచేశామని ఈ చాక్లెట్ తయారీ కంపెనీ వ్యవస్థాపకుడు శాన్క్లిక్కా చెబుతున్నారు. ఈ విభిన్నమైన డెజర్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన తర్వాత, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది చెఫ్లు, ప్రముఖ సంస్థలు కోర్టెసియాను అనుకరించడానికి ప్రయత్నించాయి. కానీ ఇప్పటివరకు అది ఎవరికీ సాధ్యం కాలేదు! ఎందుకంటే, ఆ చాక్లెట్ను అంత పలుచగా నొక్కడానికి ఉపయోగించే ప్రత్యేకమైన యంత్రం ప్రపంచం మొత్తం మీద ఒకే ఒక్కటి ఉంది కాబట్టి. ఈ చాక్లెట్ గురించి తెలిశాక మీకూ తినాలని అనిపిస్తోందా అయితే జపాన్కు వెళ్లాల్సిందే! -
ఔరా... కైమెరా...!
రకరకాల, రంగు రంగుల ఆపిల్ పళ్లను కొనడం, తినడం సాధారణమే. కానీ ఒక ఆపిల్ కోసం జనం తండోపతండాలుగా ఓ షాప్కు వెళ్లడం ఎక్కడైనా చూశారా? అది కూడా కొనడానికి, తినడానికి కాదు.. కేవలం చూడటానికి, వీలైతే ఒకసారి ముట్టుకోవడానికి.న్యూజిలాండ్లో ప్రస్తుతం అలాంటి విచిత్రమే జరుగుతోంది. సగం ఎరుపు, సగం పసుపు రంగుతో కనిపిస్తున్న ఓ అరుదైన ఆపిల్ స్థానిక ప్రజలను అమితంగా ఆకట్టుకుంటోంది. న్యూజిలాండ్లోని క్రైస్ట్చర్చ్ నగర శివారులో ఉన్న ఓ పండ్ల దుకాణంలో ఈ అరుదైన ఆపిల్ ప్రస్తుతం సెలబ్రిటీ హోదా అనుభవిస్తోంది. మార్కెట్కు మే నెలలో వచ్చిన రెడ్ బ్రేబర్న్ ఆపిళ్ల సరఫరాలో ఈ వింత పండు బయటపడింది. దీన్ని చూసి దుకాణ సిబ్బంది మొదట తమ కళ్లను తామే నమ్మలేకపోయారు. సాధారణంగా పండ్లలో రంగు తేడాలు కనిపిస్తుంటాయి.కానీ ఇలా రెండు వేర్వేరు రంగులు కచ్చితంగా సమానంగా విడిపోయి ఉండటం వారినెంతగానో ఆశ్యర్యపరిచింది. దీంతో ఆ ఆపిల్ను జాగ్రత్తగా భద్రపరిచారు. అయితే, దీని గురించి ఆనోటా ఈనోటా చుట్టుపక్కలకు పాకడం, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో సన్షైన్ మార్కెట్కు సందర్శకులు క్యూ కట్టారు. కొందరు సెల్ఫీలు తీసుకుంటుంటే, మరికొందరు పిల్లలను తీసుకువచ్చి ప్రకృతి అద్భుతమంటూ చూపిస్తున్నారు.ఇంకొందరైతే అదృష్టం కోసం ఆపిల్ను తాకాలని కూడా కోరుతున్నారట. ఇలాంటి పండ్లను శాస్త్ర పరిభాషలో ‘కైమెరా ఆపిల్‘ అని పిలుస్తారు. కైమెరా అంటే ఒకే జీవిలో రెండు వేర్వేరు జన్యు లక్షణాలు ఉండటం. పది లక్షల ఆపిళ్లలో ఒకటి మాత్రమే ఇలా రూపుదిద్దుకునే అవకాశముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
2024లో శరద్ పవార్ ఏమన్నారో ఇప్పుడదే..
ఒకప్పుడు కాంగ్రెస్కు దాదాపు ప్రత్యామ్నాయంగా ఎదిగిన ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు రాజకీయంగా బలహీనపడుతున్నాయి. బీజేపీ వేగంగా తన ప్రభావాన్ని విస్తరిస్తున్న వేళ.. ప్రతిపక్ష ఐక్యత మరోసారి ప్రధాన చర్చగా మారింది. ఇలాంటి సమయంలో ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్తో మరింత దగ్గరయ్యే అవకాశం ఉందనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి.తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ వంటి పార్టీల భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్లో ఆయా పార్టీల విలీనం జరుగుతుందా? లేక సీట్ల సర్దుబాటుతోనే కలిసి ముందుకెళ్తారా? అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో శరద్ పవార్ రెండేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలు మరోసారి ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రాంతీయ పార్టీల భవిష్యత్తు, కాంగ్రెస్తో వాటి సంబంధాలు, ప్రతిపక్ష రాజకీయాల పునర్వ్యవస్థీకరణ ఎలా ఉంటుందన్న ఆసక్తి నెలకొంది. ఎన్సీపీ (శరద్చంద్ర పవార్) అధినేత శరద్ పవార్ రెండేళ్ల క్రితం చేసిన "ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్తో కలిసే అవకాశం ఉంది" అనే వ్యాఖ్య ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది.లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల కూటమి ఏర్పాటు, సీట్ల సర్దుబాటు వంటి అనేక అంశాలు కాంగ్రెస్కు తలనొప్పి తెచ్చిపెట్టేవి. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నట్లు కనపడుతోంది. విలీనం అయినా కాకపోయినా, ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్తో మరింత సన్నిహిత సంబంధం ఏర్పడటం, నియోజకవర్గాల వారీగా సీట్ల ఒప్పందం కుదుర్చుకోవడం మరింత సులభం కావచ్చు.2024లో శరద్ పవార్ ఏమన్నారు? ఎన్సీపీ (శరద్చంద్ర పవార్) అధినేత శరద్ పవార్ 2024 లోక్సభ ఎన్నికల ప్రచారం సమయంలో మహారాష్ట్రలోని సాతారాలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక విషయం చెప్పారు. మరో రెండేళ్లలో పలు ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్తో మరింత సన్నిహితంగా కలిసిపోతాయని అన్నారు. లేదంటే కాంగ్రెస్లో విలీనం అయ్యే మార్గాన్ని పరిశీలిస్తాయని ఆయన అన్నారు. ఆయన సొంత పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్చంద్ర పవార్) గురించి మాట్లాడుతూ.. తన పార్టీకి, కాంగ్రెస్కు మధ్య ఎలాంటి తేడా కనిపించడం లేదని చెప్పారు.పవార్ గురించి చాలా మందికి తెలుసు. ఆయన ఆలోచించకుండా మాట్లాడరు. ఆయన మాట్లాడే ప్రతి మాటలోనూ లోతైన అర్థం ఉంటుంది. సరైన సమయంలోనే మాట్లాడతారు. ఆ సమయంలో కాంగ్రెస్ స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే పవార్ అలా మాట్లాడి ఉండొచ్చని విశ్లేషకులు చెప్పారు.ఏడాది క్రితమే ఎన్సీపీ చీలిపోయింది. చాలా మంది నేతలు శరద్ పవార్ తన మేనల్లుడు అజిత్ పవార్ వైపు వెళ్లారు. రాష్ట్ర ఎన్నికల వేళ ఆ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని, అలాగే జాతీయ స్థాయిలో పెద్ద పాత్ర పోషించే అవకాశాన్ని పరిశీలించాలని సీనియర్ పవార్ భావించి ఉండవచ్చు. ఆ తర్వాత శరద్ పవార్ చేసిన వ్యాఖ్యపై కాంగ్రెస్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు 99 స్థానాలు దక్కాయి. శరద్ పవార్తో పాటు ఆయన ద్వారా ఇతర ప్రాంతీయ నాయకులను సంప్రదించి మరింత సమన్వయం పెంచి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో. ఆ తర్వాత హరియాణా, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల విజయాల వల్ల బీజేపీకి మళ్లీ బలం లభించింది.ఆ అంచనాకు మళ్లీ ప్రాధాన్యం సరిగ్గా రెండేళ్ల తర్వాత ఇప్పుడు పవార్ చెప్పిన అంచనాకు మళ్లీ ప్రాధాన్యం లభిస్తోంది. ప్రాంతీయ పార్టీలు బలహీనపడ్డాయి. బీజేపీ వేగంగా తన ప్రభావాన్ని విస్తరిస్తోంది. ఆత్మవిశ్వాసంతో పార్లమెంట్లో 2/3 మెజారిటీ సాధించాలనే లక్ష్యంతో ప్రతిపక్ష పార్టీల్లో చీలికలను ప్రోత్సహిస్తోంది.పశ్చిమ బెంగాల్లో తిరుగులేని నాయకురాలిగా ఒకప్పుడు రాష్ట్రాన్ని ఏలిన మమతా బెనర్జీ ఇప్పుడు ఓటమి పాలయ్యారు. ఆమె పార్టీ వేగంగా ముక్కలవుతోంది. ఆమె ఎమ్మెల్యేలలో, లోక్సభ సభ్యుల్లో దాదాపు 2/3 మంది ఆమెను వీడిపోయారు. రెబల్స్ ఎన్సీపీఐ అనే చిన్న పార్టీలో విలీనమై, ఇప్పుడు తాము బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు మద్దతు ఇస్తామని ప్రకటించారు.ఇటు మహారాష్ట్రలో శివసేన (యూబీటీ) మరో చీలిక ఊహాగానాలను ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ జూన్ 8న రెండేళ్ల తర్వాత ఇండియా కూటమి సమావేశం ఏర్పాటు చేసింది. ఇంతకుముందు ఈ కూటమిపై ఆసక్తి చూపని మమతా బెనర్జీ.. ఈ సారి మాత్రం సోనియా గాంధీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.ఆ వెంటనే మమ, పవార్ తమ బలహీనపడిన పార్టీలను కాంగ్రెస్లో విలీనం చేయవచ్చనే ప్రచారం మొదలైంది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధులు ఆ వార్తలను ఖండించినా మాజీ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్న వారందరూ "ఘర్ వాపసీ" చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.ప్రాంతీయ పార్టీలు నిజంగా కాంగ్రెస్లో విలీనం అవుతాయా? లేక తమ ప్రత్యేక గుర్తింపును కాపాడుకుంటూనే చేతులు కలుపుతాయా? అన్న ప్రశ్నకు ఇప్పుడే సమాధానం లేదు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. మారుతున్న రాజకీయ సమీకరణల్లో ప్రతిపక్షం మనుగడ కోసం కొత్త వ్యూహాలు తప్పనిసరి అవుతున్నాయి. శరద్ పవార్ రెండేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ చర్చకు రావడం కూడా అదే సంకేతాన్ని ఇస్తోంది. రానున్న రోజుల్లో విలీనాలు జరుగుతాయా, లేక సీట్ల పొత్తులతోనే ప్రతిపక్షం కొత్త రూపం దాల్చుతుందా అన్నది భారత రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారనుంది. -
స్టాలిన్కు మరో ఎదురుదెబ్బ.. డీఎంకేకు ఆ పార్టీ గుడ్బై
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) కూటమితో దాదాపు ఆరు దశాబ్దాలుగా కొనసాగుతున్న సుదీర్ఘ రాజకీయ బంధానికి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ) అధికారికంగా ముగింపు పలికింది. డీఎంకే నేతృత్వంలోని కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.తమిళనాడులో టీవీకే గెలుపు ఆ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చివేశాయి. విజయ్ సీఎం కావడంతో అక్కడ పార్టీల పొత్తుల లెక్కలు మారుతున్నాయి. ఇదివరకే కాంగ్రెస్ పార్టీ డీఎంకేకు గుడ్బై చెప్పగా ఇప్పుడు ఆ జాబితాలో ఐయూఎంఎల్ నిలిచింది.ఈ నిర్ణయంపై ఐయూఎంఎల్ జాతీయ అధ్యక్షుడు కేఎం కాదర్ మొహిదీన్ మాట్లాడుతూ "ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు మారాయి. ద్రవిడ మోడల్ పరిపాలన కొనసాగుతుందని మేము ఆశించాము, కానీ ప్రజల తీర్పు భిన్నంగా ఉంది. ఎన్నికల్లో టీవీకే పార్టీకి సంపూర్ణ మెజారిటీకి కొద్దిగా సీట్లు తగ్గినప్పుడు, రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వాన్ని కాపాడటానికి, రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశాన్ని నివారించడానికి ఐయూఎంఎల్ మద్దతు ప్రకటించింది," అని ఆయన వివరించారు.తాము డీఎంకే కూటమితో కలిసి దాదాపు 60 ఏళ్లు ప్రయాణించామని, ఈ కాలంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక సంస్థల ప్రతినిధుల రూపంలో తమ పార్టీకి ప్రాతినిధ్యం లభించిందని పేర్కొన్నారు. ఈమేరకు పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. డీఎంకేతో సంబంధాలను తెంచుకుంటూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. అలాగే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులపై తదుపరి దశలో నిర్ణయం తీసుకుంటామని పార్టీ స్పష్టం చేసింది. సాధారణంగా డీఎంకే వైపు మొగ్గు చూపే మైనారిటీ ఓటర్లు, ఈసారి టీవీకే వైపు మెుగ్గుచూపడం సైతం ఈ నిర్ణయానికి ఒక కారణంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఆరు దశాబ్ధాల బంధానికి తెరడీఎంకే.. ఐయూఎంఎల్ బంధం ఇప్పటిది కాదు దాదాపు ఆరు దశాబ్ధాలుగా 1967 నుండి ఐయూఎంఎల్ పార్టీ డీఎంకే కూటమితో కలిసి నడుస్తోంది. డీఎంకేకు అత్యంత నమ్మకమైన, సన్నిహిత ముస్లిం మిత్రపక్షంగా ఈ పార్టీ గుర్తింపు పొందింది. మధ్యలో 1996, 2001 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఏఐఏడీఎంకే కూటమి తరపున పోటీ చేసినప్పటికీ, డీఎంకేతో దీని రాజకీయ సంబంధాలు ఇన్నేళ్లుగా చెక్కుచెదరకుండా కొనసాగుతూ వచ్చాయి.2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఐయూఎంఎల్ పార్టీ డీఎంకే కూటమిలో భాగంగా పోటీ చేసి రెండు స్థానాలను గెలుచుకుంది. అయితే, ఎన్నికల అనంతరం మారిన సమీకరణాల నేపథ్యంలో, ఆ పార్టీ టీవీకే నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ప్రకటించి, అధికార కూటమిలో చేరింది. అంతేకాకుండా రాష్ట్ర మంత్రివర్గంలోనూ స్థానాన్ని దక్కించుకుంది.కాగా ఇప్పటికే డీఎంకే కూటమి నుంచి పలు మిత్రపక్షాలు దూరమయ్యాయి. గతంలోనే కాంగ్రెస్, లెఫ్ట్ (కమ్యూనిస్ట్) పార్టీలు, విడుతలై చిరుతైగల్ కట్చి (VCK) లు డీఎంకే కూటమి నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించాయి. మరో మిత్రపక్షమైన మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం (MDMK) కూడా కూటమిలో తన స్థానంపై పునరాలోచనలో ఉన్నట్లు సమాచారం. -
పీఎం కిసాన్ నిధులు విడుదల
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ప్రధాని మోదీ 26వ విడత పీఎం–కిసాన్ నిధులను విడుదల చేశారు. శనివారం హూగ్లీ జిల్లా తారకేశ్వర్ పర్యటనలో ఉన్న మోదీ బటన్ నొక్కి రైతులకు డబ్బులు రిలీజ్ చేశారు. దీంతో దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం కిసాన్కు సంబంధించిన రూ. 2 వేలు అకౌంట్లలో జమయ్యాయి. ఈ పథకం ద్వారా మెుత్తంగా 9.44 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.18,880 కోట్లు జమయ్యాయి. 2019లో ఈ పథకం ప్రారంభం కాగా ఇప్పటివరకు మొత్తం రూ.4.46 లక్షల కోట్లను రైతులకు సాగు సాయంగా విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. ఏటా మూడు విడతలలో ఈ డబ్బును అందజేస్తుంది. పీఎం కిసాన్ ద్వారా ఒక్కో రైతుకు మెుత్తం రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయం అందుతుంది. -
భార్య పరిహారం తీసుకొని వెళ్లిపోయింది.. జవాన్ తండ్రి ఆవేదన
దిస్పూర్: ఇటీవల అస్సాంలో జరిగిన విమాన ప్రమాదంలో లెఫ్టినెంట్ శుభమ్ కుమార్ వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మరణాంతరం అందించిన పరిహారం విషయంలో ఇప్పుడు తీవ్ర వివాదం చెలరేగుతుంది. ఎక్స్గ్రేషియాకు సంబంధించిన రూ.21 లక్షల చెక్కును తమకు తెలియకుండా తన భార్య అనే చెప్పబడే మహిళకు ఇచ్చారని ఆమె కనీసం తన కర్మకాండలకు కూడా ఉండకుండా వెళ్లిపోయిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.అసోంలోని జోర్హాట్ సమీపంలో జరిగిన భారత వైమానిక దళ (IAF) విమాన ప్రమాదంలో ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో బీహార్లోని జహానాబాద్ జిల్లాకు చెందిన ఫ్లైట్ లెఫ్టినెంట్ శుభమ్ కుమార్ ఒకరు. బీహార్ ప్రభుత్వం అమర జవాను కుటుంబానికి రూ. 21 లక్షల ఆర్థిక సహాయం చెక్కును అందించింది. ఈ చెక్కును అధికారులు శుభమ్ కుమార్ భార్య అయిన శ్రేయా రాయ్కి అందజేశారు. అయితే శుభమ్ కుమార్కు పెళ్లి అయిన విషయమే తమకు తెలియదని అతని తల్లిదండ్రులు చెప్పడంతో ఈ వివాదం మొదలైంది.అయితే తన కొడుకుకు పెళ్లైన సంగతే తనకు తెలియదని నవంబర్ నెలలో పెద్దలు కుదిర్చిన పెళ్లి చేయడానికి ఇంట్లో ఏర్పాట్లుజరుగుతున్నాయని ఆయన తెలిపారు. అయితే శ్రేయాతో శుభమ్ కుమార్ అంతకుముందే రహస్యంగా కోర్టు వివాహం చేసుకున్నాడని అధికారులు తెలిపారని ఆ విషయంతో వారు చెప్పే వరకూ తనకు తెలియదన్నారు. కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా అధికారులు ఆ చెక్కును ఆమెకు ఎలా ఇచ్చేస్తారని ఆయన ప్రశ్నించారు. కొడుకు చనిపోయిన తర్వాత శ్రేయా రాయ్ తమ ఇంటికి వచ్చిందని అయితే కర్మకాండలు పూర్తి కాకముందే ఆమె అధికారులతో మాట్లాడి రూ. 21 లక్షల చెక్కును తీసుకుని తన ఇంటికి వెళ్లిపోయిందని శుభమ్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.పరిహారం తీసుకున్నప్పుడు బాధ్యతలు నిర్వహించాల్సిన బాధ్యత కూడా తనపైనే ఉంటుంది కదా అని ఆయన ప్రశ్నించారు. తమ కుటుంబం అంతా కొడుకు సంపాదన పైనే ఆధారపడి బతుకుతోందని, ఇప్పుడు తమను రోడ్డున పడేశారని వాపోయారు. అయితే వైమానిక దళ నిబంధనల నిబంధనల ప్రకారం అమర జవాన్ల భార్యలకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి, ప్రభుత్వం ఆ చెక్కును ఆమెకు అందజేసిందని అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో పెద్ద చర్చకు దారి తీసింది. చట్టపరమైన హక్కులు ఒకవైపు ఉంటే, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఆదుకోవాల్సిన నైతిక బాధ్యత సైతం మరొకవైపు ఉంటుందంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. -
సీఎం విజయ్ పుట్టినరోజు.. ప్రభుత్వం బంపర్ ఆఫర్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ 52వ పుట్టినరోజు సందర్భంగా జూన్ 21, 22 (ఆదివారం, సోమవారం) తేదీల్లో రాష్ట్రంలోని మూడు ప్రధాన జంతుప్రదర్శనశాలల్లో ప్రజలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.అటవీ శాఖ మంత్రి ఆర్.వి.రంజిత్కుమార్ మాట్లాడుతూ.. వండలూరులోని అరిజ్ఞర్ అన్నా జంతుప్రదర్శనశాల, వెల్లూరు జిల్లాలోని అమిర్థి జంతుప్రదర్శనశాల, సేలం జిల్లాలోని కురుంబపట్టి జంతుప్రదర్శనశాలలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని చెప్పారు.ఉచిత ప్రవేశం పొందాలంటే సందర్శకులు ముందుగానే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని టికెట్లు తీసుకోవాలి. "ఉచిత ప్రవేశం వల్ల శాఖకు ఆర్థిక నష్టం ఉండదు. ఈ రెండు రోజుల టికెట్ వ్యయం సుమారు రూ.కోటి అవుతుంది. ఆ మొత్తాన్ని నా కుటుంబ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వానికి తిరిగి చెల్లిస్తాం" అని మంత్రి స్పష్టం చేశారు.భారీ రద్దీ?వన్యప్రాణి ప్రేమికులు, జంతుప్రదర్శనశాల అధికారులు వండలూరు జంతుప్రదర్శనశాలకు భారీ సంఖ్యలో సందర్శకులు వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకేసారి గరిష్ఠంగా 15,000 మంది మాత్రమే ఈ జంతుప్రదర్శనశాలకు వెళ్లే వీలు ఉంటుంది. అయితే ఉచిత ప్రవేశం వల్ల సందర్శకుల సంఖ్య లక్ష దాటితే జంతువుల సంక్షేమం, ప్రజల భద్రతపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు.ఈ ఆందోళనలపై మంత్రి స్పందిస్తూ.. ముందు జాగ్రత్తగా వండలూరు జంతుప్రదర్శనశాలకు రోజుకు గరిష్ఠంగా 50,000 ఆన్లైన్ టికెట్లు మాత్రమే జారీ చేస్తామని తెలిపారు. ఇప్పటికే లోపల ఉన్న సందర్శకుల సంఖ్య ఆధారంగా కౌంటర్ల వద్ద టికెట్ల పంపిణీని నియంత్రిస్తామని చెప్పారు.గిండి చిల్డ్రన్స్ పార్కుకు మినహాయింపు లేదుచెన్నైలోని గిండి చిల్డ్రన్స్ పార్కును స్థలాభావం, అధిక రద్దీ కారణంగా ఉచిత ప్రవేశ పథకం నుంచి మినహాయించారు. వండలూరు జంతుప్రదర్శనశాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై సమీక్షించేందుకు ప్రధాన వన్యప్రాణి సంరక్షణ అధికారి రాకేశ్ కుమార్ దోగ్రా ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం జరగనున్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా జూన్ 22న కాంచీపురం జిల్లావ్యాప్తంగా 52,000 మొక్కలు నాటే భారీ కార్యక్రమాన్ని అటవీ శాఖ చేపడుతుందని మంత్రి తెలిపారు. -
కూలిన హనుమాన్ మందిరం మండపం.. ఆరుగురు మృతి
మహారాష్ట్ర పర్భనీ జిల్లా యశ్వాడీలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న హనుమాన్ మందిరం మండపం కుప్పకూలింది. ఈ ప్రమాద ఘటనలో ఆరుగురు భక్తులు మృతిచెందగా శిథిలాల కింద మరో 20 మందికి పైగా చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే అక్కడి చేరుకున్న సహాయక సిబ్బంది క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
ఐదేళ్లు లివిన్, ఇపుడు రేప్ అంటే? కేసు కొట్టేసిన హైకోర్టు
పరస్పర అంగీకారంతో కూడిన సుదీర్ఘ సంబంధాలపై అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) కీలకమైన తీర్పు నిచ్చింది. కేవలం పెళ్లి చేసుకుంటాననే వాగ్దానాన్ని నెరవేర్చలేదనే కారణంతో ఇద్దరు వయోజనుల మధ్య ఉన్న దీర్ఘకాలిక శారీరక సంబంధాన్ని అత్యాచారం (Rape)గా పరిగణించ లేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఓ యువకుడిపై నమోదైన రేప్ కేసును న్యాయస్థానం పూర్తిగా కొట్టేసింది సంజయ్ సరోజ్ అలియాస్ సంజయ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ను అనుమతిస్తూ జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ ఉత్తర్వును జారీ చేసింది.కేసు నేపథ్యంపోటీ పరీక్షల ప్రిపరేషన్ కోసం 2014లో ప్రయాగ్రాజ్ వచ్చింది బాధిత యువతి. ఈ క్రమంలో దూరపు బంధువు, నిందిత యువకుడు చదువు, వసతి విషయంలో ఆమెకు సహాయం చేశాడు. ఈ క్రమంలో వారిద్దరూ దగ్గరయ్యారు. 2019 దాకా దాదాపు ఐదేళ్ల పాటు సహజీవనం చేశారు. తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. అతను ముఖం చాటేశాడు. దీంతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తనతో శారీరక సంబంధం పెట్టుకుని, ఇపుడు పెళ్లి మాట ఎత్తితే కొట్టి, బెదిరంపులకు పాల్పడుతున్నాడంటూ 2019లో ప్రయాగ్రాజ్లోని కల్నల్గంజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. తన అశ్లీల వీడియో తీసి బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నాడని కూడా పేర్కొంది. 2020లో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేయగా, 2021లో మేజిస్ట్రేట్ దీనిని పరిగణనలోకి తీసుకున్నారు. దీనిపై నిందితుడు హైకోర్టును ఆశ్రయించి, తనపై ఉన్న క్రిమినల్ విచారణను కొట్టివేయాలని కోరాడు. కేసును, ఇరుపక్షాల వాదనలను విశ్లేషించిన అనంతరం, వారి సంబంధం చాలా సంవత్సరాలు, పరస్పర అంగీకారంతోనే సాగిందని జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ నేతృత్వంలోని ఏకసభ్య బెంచ్ నిర్ధారించింది.ఐదేళ్ల సుదీర్ఘ సంబంధాల తర్వాత , ప్రతిసారీ కేవలం పెళ్లి వాగ్దానం వల్లే ఆమె శారీరక సంబంధానికి అంగీకరించిందంటే విశ్వసించలేమని కోర్టు పేర్కొంది. వైద్య పరీక్షల్లో ఆమెపై ఎలాంటి గాయాలు ఉన్నట్లు తేలలేదనీ, ఇరువురి సమ్మతితోనే ఈ బంధం కొనసాగిందని కోర్టు అభిప్రాయపడింది. దీర్ఘకాలిక సంబంధాల్లో తేడాలొచ్చినపుడు, లేదా విఫలమై నప్పుడు దానిని అత్యాచారంగా పరిగణించడం, చట్టాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని హైకోర్టు హెచ్చరించింది. ఇదీ చదవండి: బీమా లేకుండానే చీప్గా కాంటాక్ట్ లెన్స్ : అమెరికన్ మహిళ సంబరంఫిర్యాదుదారు తన పూర్తి అంగీకారంతో నిందితుడితో శారీరక సంబంధాలు ఏర్పరచు కున్నప్పుడు ఇది కేవలం పరస్పర అంగీకారంతో కూడిన సంబంధం దెబ్బతినడం మాత్రమే కానీ, అత్యాచారం కిందికి రాదని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కారణంగా, నిందితుడిపై క్రిమినల్ విచారణను కొనసాగించడం సమంజసం కాదని పేర్కొంటూ, అతనిపై ఉన్న అన్ని చట్టపరమైన విచారణలను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు 34 పేజీల సుదీర్ఘమైన తీర్పును వెలువరించింది. అంతేకాదు ట్రయల్ కోర్టులోని కేసు ప్రొసీడింగ్స్ మొత్తాన్ని హైకోర్టు రద్దు చేసింది.ఇదీ చదవండి: ముస్లిం, హిందూ జంట ప్రేమ పెళ్లి, ఆ తర్వాతి కథ తెలిస్తే! -
‘చాలా చెప్పాలి..కానీ లాభం లేదు’ అంటూ ఆత్మహత్య, ఫేస్బుక్ వీడియో
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని అశోక్ విహార్లో ఒక 19 ఏళ్ల యువకుడు నివాస భవనం పైనుంచి కిందపడి మరణించిన ఘటన విషాదాన్ని నింపింది. కిందపడిన వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. దర్యాప్తు కొనసాగుతోంది.అశోక్ విహార్ ఫేజ్-2లోని స్వాభిమాన్ అపార్ట్మెంట్స్లో ఈ ఘటన జరిగింది. పోలీసుల సమాచారం ప్రకారంబాధితుడిన అనురాగ్గా గుర్తించారు. ఆజాద్పూర్లోని లాలా బాగ్ నివాసి అయిన అనురాగ్ తండ్రి రాజా రామ్, ఢిల్లీ హోమ్ గార్డ్లో పనిచేస్తున్నారు. ఏమైందో తెలియద గానీ శుక్రవారం సాయంత్రం 4:45 గంటల సమయంలో ఒక యువకుడు భవనంపైనుచి దూకేశాడనే సమాచారం అశోక్ విహార్ పోలీస్ స్టేషన్కు తెలిసింది. వెంటనే బాధితుడిని దీప్ చంద్ బంధు ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.పోలీసు బృందం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది. కేసు తీవ్రత దృష్ట్యా, ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సాక్ష్యాలను సేకరించడానికి క్రైమ్ టీమ్ను కూడా పిలిపించారు.పోస్ట్మార్టం , తదుపరి చట్టపరమైన ప్రక్రియల కోసం మృతదేహాన్ని బాబూ జగ్జీవన్ రామ్ మెమోరియల్ (BJRM) ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు.ఫేస్బుక్ వీడియోదర్యాప్తులో భాగంగా ఘటనకు కొద్దిసేపటి ముందు అనురాగ్ తన ఫేస్బుక్ ఖాతాలో ఒక వీడియోను అప్లోడ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. "ఇది నా మొదటి వీడియో చివరిdr కూడా. నేను ఎవరినైనా బాధపెట్టి ఉంటే వాందరికీ సారీ. అలాగే నా వల్ల తమ జీవితాలు సరిగ్గా సాగడం లేదని భావించే వారికి క్షమాపణలు. చాలామందితో చాలా విషయాలు చెప్పాలనుకున్నాను, కానీ దానివల్ల మారేదేమీ లేదు" అని వీడియోలో పేర్కొన్నాడు.ఇదీ చదవండి: బీమా లేకుండానే చీప్గా కాంటాక్ట్ లెన్స్ : అమెరికన్ మహిళ సంబరంప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఇది ఆత్మహత్య కేసు కావచ్చునని తెలుస్తోంది. అయితే, ఏదైనా కుట్ర లేదా ఇతర కారణాల కోణంతో సహా అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతని ఆత్మహత్యకు పురికొల్పిన పరిస్థితులు ఇంకా తెలియరాలేదని, పోస్ట్మార్టం నివేదిక, తదుపరి దర్యాప్తు తర్వాత మరణానికి గల కారణంపై స్పష్టత వస్తుందని పోలీసులు పేర్కొన్నారు.ఇదీ చదవండి: ముస్లిం, హిందూ జంట ప్రేమ పెళ్లి, ఆ తర్వాతి కథ తెలిస్తే! -
కేంద్రం కీలక ప్రకటన.. 16 రకాల మందులు బ్యాన్!
ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం 16 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ (FDC) మందుల తయారీ, విక్రయం, పంపిణీపై దేశవ్యాప్తంగా నిషేధం విధించింది. ఈ మందులకు సరైన వైద్యపరమైన ఆధారాలు లేకపోవడంతో పాటు, వాటి వల్ల కలిగే ప్రయోజనాల కంటే.. ప్రమాదాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణుల కమిటీ తేల్చడంతో ఈ నిర్ణయం తీసుకుంది.ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ (FDC) మందులు అంటే.. రెండు లేదా అంతకంటే ఎక్కువ ఔషధ పదార్థాలను ఒకే మాత్ర లేదా ఔషధ రూపంలో నిర్దిష్ట నిష్పత్తిలో కలిపి తయారు చేసేవి. కొన్ని సందర్భాల్లో ఇవి రోగులకు సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, ఆరోగ్యానికి హానికరంగా మారే అవకాశం ఉంటుంది.ఈ అంశంపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు.. డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ (DTAB) నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ వివిధ ఔషధ కలయికలను సమీక్షించి, వైద్యపరంగా సమర్థించలేని, చికిత్సాపరంగా ప్రయోజనం లేని లేదా హానికరంగా మారే అవకాశమున్న మందులను గుర్తించింది.కంపెనీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940లోని సెక్షన్ 26A కింద నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో గుర్తించిన 16 రకాల ఎఫ్డీసీ మందుల తయారీ, విక్రయం, పంపిణీ, సరఫరాను దేశవ్యాప్తంగా వెంటనే బ్యాన్ చేసింది.కేంద్రం నిషేదించిన మందుల జాబితాలో యాంటీబయాటిక్ మిశ్రమాలు, నొప్పి నివారణ ఫార్ములేషన్లు, యాంటిస్పాస్మోడిక్ మందులు, కొన్ని చర్మ సంబంధిత తయారీలు ఉన్నాయి.ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్ విత్ ఇథోహెప్టాజైన్; డైసైక్లోమైన్, పారాసెటమాల్ అండ్ క్లిడినియం బ్రోమైడ్; డైసైక్లోమైన్, పారాసెటమాల్, క్లిడినియం బ్రోమైడ్ అండ్ క్లోర్డియాజెపాక్సైడ్; గ్లిక్లాజైడ్ అండ్ క్రోమియం పికోలినేట్; అండ్ పారాసెటమాల్ అండ్ లిగ్నోకైన్ వంటి కాంబినేషన్లు నిషేధానికి గురయ్యాయి.అమోక్సిసిలిన్ విత్ సెరాటియోపెప్టిడేస్, అమోక్సిసిలిన్ విత్ సెరాటియోపెప్టిడేస్ అండ్ లాక్టోబాసిల్లస్ స్పోరోజెనెస్, అమోక్సిసిలిన్ విత్ క్లోక్సాసిలిన్, లాక్టిక్ యాసిడ్ బాసిల్లస్ అండ్ సెరాటియోపెప్టిడేస్, సెఫాడ్రాక్సిల్తో ప్రోబెనెసిడ్, అండ్ సెఫ్యూరాక్సిమ్ విత్ సెరాటియోపెప్టిడేస్ వంటి యాంటీబయాటిక్స్ను కూడా నిషేధించారు. వీటికి తగిన చికిత్సా ప్రయోజనం లేదని నిపుణులు అభిప్రాయపడ్డారు.చర్మ సంరక్షణ ఉత్పత్తుల విభాగంలో.. అలోవేరా లేదా అలోవేరా ఎక్స్ట్రాక్, విటమిన్ ఈ, జోజోబా ఆయిల్, ఆరంజ్ ఆయిల్, వీట్ జెర్మ్ ఆయిల్, టీ ట్రీ ఆయిల్, అల్లంటోయిన్, డి-పాంథెనాల్ వంటివి ఉన్నాయి.సురక్షితమైన మందులను ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయడానికి కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో కూడా ఇలాంటి ఎఫ్డీసీ మందులను ప్రభుత్వం నిషేధించింది. రాష్ట్ర ఔషధ నియంత్రణ అధికారులు, నియంత్రణ సంస్థలు, అమలు విభాగాలు ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. అలాగే తయారీదారులు, దిగుమతిదారులు, పంపిణీదారులు, ఇతర సంబంధిత సంస్థలు చట్టానికి అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. -
ముస్లిం, హిందూ జంట ప్రేమ పెళ్లి, ఆ తర్వాతి కథ తెలిస్తే!
ఉత్తరప్రదేశ్లోని బదౌన్ (Budaun) జిల్లాలో జరిగిన ఒక మతాంతర వివాహం, అనంతర పరిణామాలు చర్చనీయాంశంగా నిలిచాయి. ఈ ప్రేమ వివాహం ఒక కుటుంబంలో సంబరాలకు దారి తీయగా, మరో కుటుంబంమాత్రం విచారంలో మునిగి పోయింది. ముస్లిం యువతి (హీరా నాజ్ బీ) హిందూ యువకుడిని (అతుల్) వివాహం చేసుకుని, హిందూ మతంలోకి మారి హిమాన్షీ కుమారిగా పేరు మార్చుకున్న 19 ఏళ్ల యువతికథ ఇది. దీనికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇంతకీ ఏమైంది అంటే.. 2023లో హీరా నాజ్ బీ 10వ తరగతి చదువుతున్నప్పుడు వారి గ్రామానికి సమీపంలో అతుల్తో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. మూడేళ్ల తర్వాత, ఈ ఏడాది జనవరిలో వారు ఆర్య సమాజ్ ఆలయంలో రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 'లివ్-ఇన్' సర్టిఫికేట్ తీసుకుని, ఆమె తిరిగి తన తల్లిదండ్రుల వద్దకి వెళ్ళిపోయింది.అయితే ఈ విషయం యువతి ఇంట్లో తెలియడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమెను తీవ్రంగా కొట్టి, గదిలో బంధించారు. దీంతో ఆమె 100 నంబర్కు డయల్ చేసి, తనకు ప్రాణభయం ఉందని పోలీసుల సహాయం కోరింది.మరోవైపు యువతి మైనర్ అని, అతుల్ ఆమెను ప్రలోభపెట్టాడని యువతి కుటుంబం ఫిర్యాదు చేసింది. అయితే, పోలీసులు ఇరు వర్గాలను స్టేషన్కు పిలిపించి విచారించారు.యువతి తాను మేజర్ (వయస్సు నిండిన వ్యక్తినని) అని, తన ఇష్టపూర్వకంగానే అతుల్తో వెళ్తానని ఖరాఖండిగా తేల్చి చెప్పేసింది. చట్టప్రకారం ఆమె వయోజనురాలు కావడంతో, పోలీసులు ఆమె నిర్ణయానికే మొగ్గుచూపి వారిని కలిసి వెళ్ళడానికి అనుమతించారు.Budaun, Uttar Pradesh - A muslim girl Heena Nazmi broke all religious ties and married with Hindu boyfriend Atul at Khatushyam Mandir after court marriage.Now her new name is Himanshi. After that once again proved love has no religious boundaries. pic.twitter.com/0EsMjLLago— ॐ Er Prince Raj 🚩 (@PrinceRaj628) June 18, 2026 "> ఇదీ చదవండి : రూ. 18 కోట్ల మేయర్ కిడ్నాప్ డ్రామా : సంచలన ఆరోపణలు అబ్బాయి కుటుంబం సంబరాలువీరి ప్రేమను ఆమోదించిన అతుల్ కుటుంబ సభ్యులు, బజరంగ్ దళ్ సభ్యులసమక్షంలో వీరిద్దిరికీ బదౌన్లోని ఖాటూ శ్యామ్ ఆలయంలో మళ్లీ ఘనంగా వివాహం జరిపించారు. హిందూత్వ సంస్థలు మరియు బజరంగ్ దళ్ సభ్యులు దీనిని 'ఘర్ వాప్సీ' (Ghar Wapsi) గా అభివర్ణించారు. ఆలయం వెలుపల జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ, మిఠాయిలు పంచుకుంటూ, దాదాపు 300 మంది తరలి ఇచ్చి నూతన వధువును చూడటానికి వచ్చారు. ఇది స్థానికంగా ఆసక్తికరంగా మారింది.అయితే ఈ పెళ్లి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న జాస్మా గ్రామానికి చెందిన ముస్లిం ప్రజలు మౌనంగా ఉండిపోయారు. ఒక రకమైన నిశ్శబ్దం,విచారం, ఆందోళన,నెలకొన్నాయి. తాము దీనిపై ఎలాంటి నిరసన వ్యక్తంచేసినా, తిరిగి తమపైనే చర్యలు లేదా పరిణామాలు ఉంటాయేమోననే భయంతో వారు మౌనంగా ఉండిపోయారు.ఇదీ చదవండి: బీమా లేకుండానే చీప్గా కాంటాక్ట్ లెన్స్ : అమెరికన్ మహిళ సంబరంఅయితే అదృష్టవశాత్తూ ఈ ఉదంతంలో ఎలాంటి మతపరమైన ఘర్షణలు లేదా శాంతిభద్రతల సమస్యలు తలెత్తలేదు. కొత్త సెక్షన్ 69 ప్రకారం ఇటువంటి కేసుల్లో మేజిస్ట్రేట్ ముందు యువతి ఇచ్చే స్టేట్మెంట్కు మాత్రమే చట్టపరమైన విలువ ఉంటుందని, ఈ కేసులో యువతి మొదటి నుండి ఒకే మాటపై నిలబడటం వల్ల ఎలాంటి FIR నమోదు కాకుండానే వివాదం పరిష్కారమైందని అధికారులు తెలిపారు.ఇక్కడ యువతి ముస్లిం, యువకుడు హిందూ కావడం వల్ల సమస్య సులువుగా ముగిసింది. ఒకవేళ పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉండి ఉంటే (అంటే యువతి హిందూ, యువకుడు ముస్లిం అయితే) పరిస్థితి ఇంత ప్రశాంతంగా ఉండేది కాదు. హిందూ సంస్థలు దీనిని 'లవ్ జిహాద్' (Love Jihad) గా చిత్రీకరించి తీవ్రంగా నిరసనలు తెలిపేవి, అది శాంతిభద్రతల సమస్యగా మారేదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక సీనియర్ పోలీసు అధికారి అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: రూ. 3,800 కోట్ల గిఫ్ట్ : మురిసిపోయిన డొనాల్డ్ ట్రంప్ -
కాంగ్రెస్కు శశిథరూర్ ఝలక్
తిరువనంతపురం: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మరోసాకి కాంగ్రెస్ను ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అమెరికా జరిపిన దాడిలో భారత నావికుల మృతి పట్ల కేంద్రాన్ని కాంగ్రెస్ ఎండగడుతున్న తరుణంలో మోదీకి థరూర్ మద్దతుగా మాట్లాడారు. ఇటీవల జరిగిన జీ7 సమ్మిట్లో భారత్ సమస్యను తగిన రీతిలో మోదీ తెలియజేశారన్నారు.కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వ్యవహారం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తన ప్రతిపక్ష బీజేపీ విధానాలకు పలుమార్లు మద్ధతిస్తూ సొంత పార్టీని తరచుగా ఇబ్బందులకు గురిచేస్తారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ను మరోసారి ఇరకాటంలో పడేశాయి. ఇటీవల హర్ముజ్ జలసంధి ఒమన్ తీరంలో అమెరికా జరిగిన దాడిలో ముగ్గురు భారత నావికులు మరణించారు. ఈ అంశంలో కేంద్రం తగిన విధంగా స్పందించడం లేదని కాంగ్రెస్ ఎండగడుతుంది. ఇటీవల జరిగిన జీ-7 సమ్మిట్లోనూ ప్రధాని ఈ విషయంపై ట్రంప్తో తగిన విధంగా స్పందించలేదని మౌనంగా ఉన్నారని విమర్శలు గుప్పించింది.అయితే కాంగ్రెస్ ప్రధానిని ఎండగట్టే యత్నం చేస్తుంటే.. ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ మాత్రం మోదీని ప్రశంసిస్తూ మాట్లాడారు. "ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షునితో జరిగిన బహిరంగ, ప్రైవేట్ సమావేశాల్లోనూ తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. యుద్ధ సమయంలో వాణిజ్య నౌకల్లోని పౌర నావికులు పోరాటానికి లక్ష్యం కాకూడదనే సందేశాన్ని తెలియజేయడం చాలా ముఖ్యం. వారు సైనికులు కాదు,ఒకవేళ వారు అమెరికా నౌకదళ దిగ్భందనాన్ని ఉల్లంఘిస్తుంటే వారిని మరో పద్ధతిలో నిరోధించండి కానీ చంపడం మార్గం కాదు ప్రధాని మోదీ తెలియజేసిన సందేశం ఇదే," అని థరూర్ అన్నారు.అయితే ఒమన్ తీరంలో నావికుల మృతిపై మోదీ మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తున్న సమయంలో థరూర్ వాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. శశిథరూర్ వ్యాఖ్యలను సమర్థిస్తూ బీజేపీ కౌంటర్ మెుదలు పెట్టింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ "కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బండారం బయటపెట్టారు. కాంగ్రెస్ నాయకులు ప్రధాని నరేంద్రమోదీజీ దౌత్యనీతిని బహిరంగంగా ప్రశంసిస్తున్నారు. భారతదేశ జాతీయ ప్రయోజనాలను కాపాడే విషయంలో ప్రధాని మోదీకే మొదటి స్థానం "అని అన్నారు. -
ఎల్ నినోను బ్లేమ్ చేయొద్దు.. అసలు కారణాలు వేరే!
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల కదలికలు అనూహ్యంగా నిలిచిపోవడంతో రైతులు, వాతావరణ నిపుణుల్లో ఆందోళన పెరుగుతోంది. వర్షాలు ముందుకు సాగాల్సిన సమయంలో అకస్మాత్తుగా ఆగిపోవడం వల్ల అనేక ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా ఈ సమయానికే దేశమంతటా రుతుపవనాల విస్తరణ వేగంగా జరగాలి. కానీ ఈసారి ఆ సహజ గమనంలో అంతరాయం ఏర్పడినట్టు కనిపిస్తోంది. ఈ పరిస్థితికి ఎల్ నినోనే ప్రధాన కారణమని అంతా భావిస్తున్నారు. అయితే లోతైన అధ్యయనాలు కొనసాగుతున్న కొద్దీ, శాస్త్రవేత్తలు ఈ మార్పు వెనుక ఒకే కారణం కాకుండా.. ఇంకా చాలా ఉన్నాయని చెబుతున్నారు..పసిఫిక్ సముద్రంలో చోటుచేసుకుంటున్న వాతావరణ అస్థిరతలు, భారత మహాసముద్రంలో తేమ ప్రవాహాల్లో మార్పులు, అలాగే ఖండాల మధ్య గాలుల సమతుల్యతలో వచ్చిన వ్యత్యాసాలు కలిసి ఈ పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా రుతుపవనాలు ముందుకు సాగడానికి అవసరమైన తక్కువ పీడన వ్యవస్థలు ఈసారి సమయానికి ఏర్పడకపోవడం ప్రధాన కారణాల్లో ఒకటిగా గుర్తిస్తున్నారు. బంగాళాఖాతంలో బలమైన తక్కువ పీడన కేంద్రాలు లేకపోవడం వల్ల వర్ష మేఘాలు లోపలికి చొచ్చుకుపోవడం తగ్గిపోయింది.ఇక ఉత్తర భారతంపై తరచూ ప్రభావం చూపే పశ్చిమ దిశ వాతావరణ వ్యవస్థలు ఈసారి అసాధారణంగా క్రియాశీలంగా మారాయి. ఇవి పొడి గాలులను దక్షిణ దిశకు తీసుకువచ్చి, తేమను తగ్గించడంతో మేఘాల ఏర్పాటుకు అనుకూలం కాని పరిస్థితిని సృష్టించాయి. ఫలితంగా రుతుపవనాలు ముందుకు సాగాల్సిన దారి మధ్యలోనే బలహీనపడినట్టు కనిపిస్తోంది. సాధారణంగా ఒక వ్యవస్థ బలహీనపడితే మరొక వ్యవస్థ దాన్ని పూరిస్తుంది. కానీ ఈసారి అన్ని సహజ చక్రాలు ఒకేసారి అనుకూలంగా లేకపోవడం వల్ల సమతుల్యత దెబ్బతింది.అలాగే భూమధ్యరేఖ ప్రాంతంలో వర్షాలను ప్రభావితం చేసే సహజ చక్రం కూడా ఈ సమయంలో అనుకూలంగా లేకపోవడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది. దీని వల్ల వర్ష మేఘాల సమూహాలు బలపడకుండా విడిపోయి, నిర్దిష్ట ప్రాంతాల్లో కేంద్రీకృతం కావడం తగ్గింది. దీంతో విస్తృత స్థాయిలో వర్షాలు కురవాల్సిన అవకాశం తగ్గిపోయింది.కాబట్టి ఎల్ నినో ప్రభావం ప్రారంభ దశలో ఉన్నప్పటికీ.. అది ఒక్కటే ఈ స్థాయి విఘటనకు కారణం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అది కేవలం మొత్తం వాతావరణ సమీకరణంలో ఒక భాగం మాత్రమేనని, కానీ అసలు సమస్య అనేక వ్యవస్థల సమకాలీన అసమతుల్యతతో ముడిపడి ఉందని చెబుతున్నారు. అంటే రుతుపవనాల కదలికను ఎల్ నినో అనే ఒకే కారణంతో వివరించడం ఇప్పుడు సాధ్యం కాదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.అయితే ప్రస్తుతం వాతావరణ శాఖ అంచనాల ప్రకారం జూన్ చివరి వారంలో పరిస్థితులు కొంత మారే అవకాశం ఉంది. సముద్ర ఉపరితల గాలులు తిరిగి బలపడడం, భూమధ్యరేఖ నుంచి వచ్చే తేమ ప్రవాహం పెరగడం, పై స్థాయిలో గాలుల దిశ అనుకూలంగా మారడం వంటి అంశాలు కలిసి రుతుపవనాలకు మళ్లీ ఊపునివ్వవచ్చని భావిస్తున్నారు. అయితే ఇది ఎంత వేగంగా జరుగుతుందన్నదే కీలకంగా మారింది.మొత్తానికి ఈసారి రుతుపవనాల నిలకడ వెనుక ఒకే కారణం కాకుండా అనేక వాతావరణ వ్యవస్థల సంక్లిష్ట పరస్పర ప్రభావం ఉందని స్పష్టమవుతోంది. సహజ వాతావరణ చక్రాల్లో చిన్న మార్పు కూడా దేశవ్యాప్తంగా వర్షాలపై ఎంత పెద్ద ప్రభావం చూపుతుందో ఈ పరిస్థితి మరోసారి గుర్తు చేస్తోంది. రైతుల ఆశలు వర్షాలపై ఆధారపడి ఉన్న నేపథ్యంలో, రాబోయే రోజుల్లో ఈ వాతావరణ సమతుల్యత ఎంత త్వరగా తిరిగి వస్తుందన్నదే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం. -
మా ఆయన పాత ఫోన్ దాచేస్తున్నాడు!
విష్ణు ఇంట్లో ఒక పాత స్మార్ట్ఫోన్ చాలారోజులుగా అలాగే పడిఉంది. ఇప్పుడు అతని భార్య మహేశ్వరి ఆ ఫోన్ను అమ్మాలని చూస్తోంది. కానీ విష్ణు మాత్రం అందుకు అంగీకరించడం లేదు. మహేశ్వరి మాత్రం “ఇంట్లో పడేసి ఉంచడం ఎందుకు? అమ్మేయొచ్చు కదా” అని పదే పదే అంటోంది. కానీ విష్ణు మాత్రం ప్రతి సారి ఏదో ఒక కారణం చెప్పి విషయం తప్పించుకుంటున్నాడు. అసలు విషయం ఏమిటంటే.. తన భార్యకు కూడా తెలియని సున్నితమైన వ్యక్తిగత డేటా అందులో ఉందన్న ఆందోళన అతడిని వెంటాడుతోంది.ఇది ఒక్క విష్ణు కథ మాత్రమే కాదు.. ఇలాంటి ఆందోళనే ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా మందిలో కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఇండియన్ల మనసులో ఇదే సందేహం. పాత ఫోన్ అమ్మితే డబ్బు వస్తుంది. కానీ ఆ ఫోన్లో ఉన్న డేటా ఏమవుతుంది? అనే భయం మాత్రం ఎక్కువవుతోంది. కొత్త సర్వే ఒకటి చెబుతున్నదాని ప్రకారం దాదాపు 70 శాతం మంది భారతీయులు తమ పాత స్మార్ట్ఫోన్లను అమ్మడానికి వెనుకడుగు వేస్తున్నారు. కారణం ఒక్కటే.. డేటా ప్రైవసీపై భయం.రీసేల్ ఫ్లాట్ఫారమ్ క్యాషీఫై దేశంలో వేల మందిపై నిర్వహించిన ఈ సర్వేలో ఆసక్తికర విషయం వెలుగు చూసింది. ప్రజలు ఇప్పుడు ఫోన్ అమ్మకంలో ధర కంటే భద్రతకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. దాదాపు 45 శాతం మంది “ఎక్కడ అమ్ముతున్నాం, డేటా సేఫ్గా డిలీట్ అవుతుందా లేదా?” అన్నదే ప్రధానంగా చూస్తున్నారు. ధరను ముఖ్యంగా చూసే వారు 29.5 శాతం మాత్రమే ఉండటం ఈ మార్పును స్పష్టంగా చూపిస్తోంది.ఇంకా ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.. వందలో 83 మంది ఫోన్ అమ్మే ముందు ఫ్యాక్టరీ రీసెట్ చేస్తారు. కానీ అదే గ్రూపులో 41 శాతం మంది ఫ్యాక్టరీ రీసెట్తో డేటా పూర్తిగా పోదని తమకు తెలుసని అంటున్నారు. అంతేకాదు.. ప్రతి ముగ్గురిలో ఒకరు పాత ఫోన్ల నుంచి డిలీట్ చేసిన డేటాను తిరిగి రికవర్ చేయగలిగామని చెప్పారు. అంటే ప్రజలు వాళ్లు చేస్తున్న పని కూడా పూర్తి నమ్మకం లేకుండా ఉన్నారన్నమాట.అయితే భారతీయుల ఈ భయమే మార్కెట్ను పూర్తిగా మార్చేస్తోంది. దాదాపు 69 శాతం మంది “సర్టిఫైడ్ డేటా డిలీషన్” ఉంటేనే ఫోన్ అమ్ముతామని చెబుతున్నారు. 83 శాతం మంది అయితే డేటా పూర్తిగా తొలగించబడిందని చెప్పే సర్టిఫికెట్ తప్పనిసరిగా కావాలని అంటున్నారు. అంతేకాదు, సురక్షిత డేటా డిలీషన్ కోసం చిన్న ఫీజు చెల్లించడానికి కూడా చాలా మంది సిద్ధంగా ఉన్నారు. అంత తీవ్రంగా సమస్య పెరిగిపోయింది.ఈ “సర్టిఫైడ్ డేటా డిలీషన్” అన్నది సాధారణంగా పాత ఫోన్లు కొనుగోలు చేసే రిసేల్ ప్లాట్ఫామ్స్, రిఫర్బిష్ కంపెనీలు లేదంటే ఈ-వేస్ట్ రీసైక్లింగ్ సంస్థలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి ఫోన్ను కొనుగోలు చేసిన తర్వాత ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ టూల్స్తో డేటాను పూర్తిగా తుడిచేసి(ERASE).. తిరిగి రికవర్ చేయలేని స్థాయిలో డిలీట్ చేస్తాయి. ఆ ప్రక్రియ పూర్తైన తర్వాతే ఒక “డేటా డిలీషన్ సర్టిఫికెట్” ఇస్తారు. ఇప్పుడు సమస్య ఏమిటంటే.. ఇదో పెద్ద తతంగం అని వినియోగదారుడు భావించడం. అలాగే అన్ని రిసేల్ ప్లాట్ఫామ్స్ ఈ స్థాయి హామీ ఇవ్వడం లేదు. అందుకే చాలామంది ఫోన్లు అమ్మకుండా ఇంట్లోనే దాచుకుంటున్నారు.ఇంకా పెద్ద విషయం ఏమిటంటే, 87 శాతం మంది భారతీయులు పాత ఫోన్లు తిరిగి అమ్మకానికి వచ్చే ముందు డేటా డిలీషన్పై కఠినమైన చట్టాలు ఉండాలని కోరుతున్నారు. అంటే ఇది కేవలం వ్యక్తిగత భయం కాదు.. వ్యవస్థపరమైన సమస్యగా మారిపోయింది.సో.. విష్ణు తన పాత ఫోన్ను ఎందుకు దాచిపెట్టాడో అర్థమయ్యిందా?. ఆ ఫోన్ను బయటకు తీస్తే డబ్బు వస్తుంది. కానీ ఆ ఫోన్లో ఉన్న డేటా ఎవరి చేతికి వెళ్తుందో? అనే ప్రశ్న మాత్రం అతన్ని ఆపేస్తోంది. విష్ణు మాత్రమే కాదు.. ఓ అనిత, ఓ రాకేశ్.. ఇలా ఎందరో ఆగిపోవడానికి అసలు కారణం కూడా అదే. -
‘ఎన్టీఏ అబుదాబి’ నిర్వాకంపై రాహుల్ నిప్పులు!
న్యూఢిల్లీ: వైద్య విద్య ప్రవేశ పరీక్ష ‘నీట్’ (NEET) నిర్వహణ తీరుపై మరోసారి తీవ్ర దుమారం రేగింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) చేసిన ఒక పొరపాటు ఒక విద్యార్థి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమే కాకుండా, దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. నాగ్పూర్కు చెందిన ఒక విద్యార్థికి రీ-ఎగ్జామ్ సెంటర్ ఏకంగా విదేశాల్లో (అబుదాబి) కేటాయించడంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శనివారం కేంద్ర ప్రభుత్వంపై, ఎన్టీఏపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నాగ్పూర్కు చెందిన ఒక విద్యార్థి నెల రోజులుగా ఎంతో కష్టపడి నీట్ రీ-ఎగ్జామ్ కోసం సన్నద్ధమయ్యాడు. అయితే పరీక్షకు సరిగ్గా ఒక్కరోజు ముందు అతను తన అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోగా, అందులోని పరీక్షా కేంద్రం చూసి షాక్కు గురయ్యాడు. ఆ విద్యార్థికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ‘అబుదాబి’లో సెంటర్ కేటాయించారు. ఈ ఉదంతంపై రాహుల్ గాంధీ ఎక్స్ ‘ఎక్స్’ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేస్తూ, ఎన్టీఏ పనితీరును తప్పుపట్టారు. అసలు ఇలాంటి ఘోరమైన తప్పు ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. ‘విద్యార్థి ఉన్న నగరంలోనే ఒక పరీక్షా కేంద్రాన్ని సరిగ్గా కేటాయించలేని విద్యా వ్యవస్థకు, ఇలాంటి అత్యున్నత స్థాయి పరీక్షలను నిర్వహించే హక్కు ఎక్కడిది?’ అని ప్రశ్నించారు.విద్యార్థుల, వారి తల్లిదండ్రుల సహనాన్ని ఎన్టీఏ పరీక్షిస్తోందని ఆయన మండిపడ్డారు. ఇటీవల తాను కోటాలో విద్యార్థులను కలిసి వారి బాధలను పంచుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ, ప్రస్తుత విద్యా వ్యవస్థ యువతను పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితిని విమర్శిస్తూ.. ‘ఇది నిజమైన విద్యా వ్యవస్థ కాదు, ఇది ఒక తరానికి చెందిన డబ్బును, సమయాన్ని, మానసిక ప్రశాంతతను నిలువునా దోపిడీ చేసిందన్నారు. పిల్లల భవిష్యత్తుతో జూదం ఆడటం ఇకనైనా ఆపాలని కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు. దేశంలోని విద్యార్థులకు బాధ్యతాయుతమైన, సమాధానం చెప్పే విద్యా వ్యవస్థ, పరీక్షా యంత్రాంగం అవసరమని ఇందుకోసం తాము పోరాడి తీరుతామని రాహుల్ గాంధీ హెచ్చరించారు.ఇది కూడా చదవండి: ‘నీట్’ మరో షాక్: ఒడిశా విద్యార్థినికి 1500 కి.మీ దూరంలో సెంటర్! -
‘నీట్’ మరో షాక్: ఒడిశా విద్యార్థినికి 1500 కి.మీ దూరంలో సెంటర్!
భువనేశ్వర్: నీట్-యూజీ (NEET-UG) రీటెస్ట్ రాయబోతున్న ఒక ఒడిశా విద్యార్థినికి ఊహించని షాక్ తగిలింది. జూన్ 21న పరీక్ష జరగనుండగా, కేవలం ఒక్క రోజు ముందు ఆమెకు దాదాపు 1,500 కిలోమీటర్ల దూరంలోని ఉత్తరాఖండ్కు చెందిన డెహ్రాడూన్లో పరీక్షా కేంద్రాన్ని కేటాయించారు. మొదట భువనేశ్వర్లో సెంటర్ ఇచ్చిన అధికారులు, ఇప్పుడు రీటెస్ట్ అడ్మిట్ కార్డ్లో డెహ్రాడూన్ అని మార్చడంతో ఆ విద్యార్థిని, ఆమె కుటుంబం తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. ఈ గందరగోళం సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో, విద్యార్థిని భవిష్యత్తును కాపాడాలంటూ అధికారులకు విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.భువనేశ్వర్ టు డెహ్రాడూన్ఈ తప్పిదాన్ని ‘వెటరన్స్ క్లబ్ ఒడిశా’ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తెచ్చింది. సదరు విద్యార్థిని మొదట రాసిన నీట్ పరీక్షకు భువనేశ్వరే కేంద్రంగా ఉంది. కానీ, రీటెస్ట్ కోసం జారీ చేసిన కొత్త అడ్మిట్ కార్డ్ను చూసి ఆ కుటుంబం నిర్ఘాంతపోయింది. కేవలం కొన్ని గంటల వ్యవధిలో అంత దూరం ప్రయాణించడం ఆర్థికంగా, ప్రాక్టికల్గా అసాధ్యమని, దీనివల్ల విద్యార్థిని పరీక్షకు హాజరయ్యే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.న్యాయం కోసం మాజీ సైనికుడి పోరాటంబాధిత విద్యార్థిని తండ్రి, మాజీ సైనికుడు సంజయ్ బిస్వాల్ ఈ తప్పిదంపై ఇండియన్ ఎక్స్-సర్వీసెస్ లీగ్ ఒడిశా విభాగంతో పాటు ఇతర ఉన్నతాధికారులకు అత్యవసర అప్పీళ్లు సమర్పించారు. తన కుమార్తెకు స్వరాష్ట్రంలోనే లేదా ఇంటికి దగ్గరగా ఎక్కడైనా పరీక్షా కేంద్రాన్ని మార్చాలని ఆయన అభ్యర్థించారు. పరీక్ష సమయం ముంచుకొస్తున్న తరుణంలో, ఈ ఆకస్మిక మార్పు విద్యార్థులను, తల్లిదండ్రులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తోంది.ఒకవైపు ఉచిత రవాణా.. మరోవైపు అందని స్పందనమరోవైపు, ఒడిశా ప్రభుత్వం నీట్ రీటెస్ట్ రాసే అభ్యర్థుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉచిత రవాణా సౌకర్యాలను ప్రకటించింది. ఖుర్దా జిల్లాలోనే 26 కేంద్రాలకు గానూ 108 బస్సులను ఏర్పాటు చేశారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఇంతగా సాయం అందిస్తున్నా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చేసిన ఈ పొరపాటు కారణంగా ఒక విద్యార్థిని ప్రయాణం ప్రశ్నార్థకంగా మారింది. పరీక్షకు కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ, ఈ వ్యవహారంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. -
‘ఒక్క ఎగ్జామ్తో అయిపోలేదు’.. యాక్టర్ ఎమోషనల్ మెసేజ్!
ముంబై: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET-UG) 2026 రీ-ఎగ్జామినేషన్ ఆదివారం(జూన్ 21) జరగనుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయనున్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ నటుడు ఉపేంద్ర చౌహాన్ విద్యార్థుల్లో ధైర్యాన్ని నింపేందుకు ‘టైమ్స్ నౌ డిజిటల్’ ద్వారా ఒక సందేశాన్ని పంచుకున్నారు. పరీక్షలో విజయం సాధిస్తే మంచిదేనని, ఒకవేళ విఫలమైనా అది జీవితాంతం కాదని చెబుతూ, మానసిక ఒత్తిడిలో ఉన్న అభ్యర్థులకు ఆయన ధైర్యాన్ని నూరిపోశారు.‘జీవితంలోనూ లెక్కలేనన్ని అపజయాలు’తాను కూడా కెరీర్లో ఎన్నో ఒడిదొడుకులను, లెక్కలేనన్ని తిరస్కరణలను ఎదుర్కొన్నానని ఉపేంద్ర చౌహాన్ గుర్తుచేసుకున్నారు. ఒకానొక సమయంలో తన కలలు చేజారిపోతున్నాయని, జీవితంలో ఇంకేమీ మిగల్లేదని తీవ్ర నిరాశకు గురైన క్షణాలను ఆయన పంచుకున్నారు. అయితే ఆ కష్ట కాలమే తనను ఈ రోజు ఒక బలమైన వ్యక్తిగా తీర్చిదిద్దిందని, జీవితాన్ని చూసే సరైన మార్గాన్ని నేర్పిందని వివరించారు. జీవితం అనే పెద్ద ప్రయాణంలో ఇలాంటి కఠినమైన పరీక్షలు చాలా చిన్నవని, అపజయాలే మనిషి ఎదుగుదలకు, పరిమితులను దాటి ముందుకు సాగడానికి దోహదపడతాయని ఆయన తెలిపారు.సాఫ్ట్వేర్ ఇంజనీర్ టు యాక్టర్తన సొంత జీవిత ప్రయాణాన్ని ఉదాహరణగా చూపుతూ ఉపేంద్ర విద్యార్థులకు కీలక విషయాలను వివరించారు. తాను కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పూర్తి చేసి, మొదట సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని అనుకున్నట్లు తెలిపారు. కానీ, ఆ తర్వాత అనుకోకుండా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి ఏడేళ్లపాటు విజయవంతంగా బిజినెస్ రన్ చేశానని చెప్పారు. ఆ సమయంలో తనకు నటుడిని అవుతానని అస్సలు తెలియదని, జీవితంలో తన అసలైన లక్ష్యం చాలా ఆలస్యంగా గుర్తించానని అన్నారు. ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ప్రతి ఒక్కరూ జీవితానికి ఒక అవకాశం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.‘పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే.. జీవితాన్ని దాని దారిన సాగనివ్వండి. జీవితం చాలా అందమైనది, దానిని ప్రేమించండి’ అంటూ విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు.ఇది కూడా చదవండి: అగ్రహీరో బ్యానర్లో ద్రౌపది ముర్ము బయోపిక్ -
అగ్రహీరో బ్యానర్లో ద్రౌపది ముర్ము బయోపిక్
ముంబై: సినీ రంగంలో మిస్టర్ పర్ఫెక్ట్ ఖాన్గా పేరు తెచ్చుకున్న స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మరో స్ఫూర్తిదాయక కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవిత ప్రయాణాన్ని ఒక డాక్యుమెంటరీ రూపంలో ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ రూపొందిస్తోంది. డాక్యుమెంటరీలు తీయడంలో పేరుగాంచిన దర్శకురాలు స్వాతి చక్రవర్తి భత్కల్ ఈ ప్రాజెక్ట్కు దర్శకత్వం వహిస్తున్నారు.ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ సరికొత్త సంచలనందేశంలోనే అత్యున్నత రాజ్యాంగ పదవిని అధిష్టించిన తొలి గిరిజన మహిళగా, దేశానికి రెండవ మహిళా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. ఆమె వ్యక్తిగత, ప్రజా జీవితంలోని అద్భుత విజయాలను ఈ డాక్యుమెంటరీ ద్వారా ఆమిర్ ఖాన్ ప్రపంచానికి చూపించబోతున్నారు. గతంలో ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై వచ్చిన ‘రుబారు రోష్ని’ (2019) అనే అవార్డు విన్నింగ్ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించిన స్వాతి చక్రవర్తి భత్కల్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను తెరకెక్కిస్తుండటం విశేషం.రాజకీయాలకు అతీతంగా.. ఈ డాక్యుమెంటరీ కేవలం ద్రౌపది ముర్ము రాజకీయ విజయాల చుట్టూనే తిరగదు. ఒడిశాలోని ఒక చిన్న గిరిజన గ్రామంలో ప్రారంభమైన ఆమె బాల్యం, ప్రజాసేవలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లు, వాటన్నింటినీ తట్టుకుని నిలబడిన ఆమె పోరాట పటిమను ఈ చిత్రంలో చూపించనున్నారు.సొంత ఊరిలో షూటింగ్రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బాల్యానికి సంబంధించిన కీలక సన్నివేశాలను మరింత సహజంగా పునర్నిర్మించడం కోసం, చిత్ర బృందం ఒడిశాలోని ఆమె సొంత గ్రామంలో ఇప్పటికే కొన్ని భాగాలను చిత్రీకరించినట్లు సమాచారం. ఈ కథను అత్యంత సహజంగా తెరకెక్కించేందుకు అక్కడి ప్రజలను, నటీనటులను కూడా ఈ ప్రాజెక్ట్లో భాగస్వామ్యం చేశారు. గత ఏడాది (2025) ఆమిర్ ఖాన్ నటించిన ‘సితారే జమీన్ పర్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శనను రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన చర్చలు నడిచినట్లు తెలుస్తోంది. -
ఢిల్లీలో సీజేపీ నిరసనలు..
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ధర్నాకి దిగింది. విద్యా వ్యవస్థలో అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహించాలని, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది.సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నిరసనల్లో పాల్గొంటూ, కేంద్ర విద్యాశాఖ పనితీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా నీట్ పరీక్ష పేపర్ లీక్, సీబీఎస్సీ మూల్యాంకన వివాదాలు, నియామక పరీక్షల్లో అవకతవకలపై బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీజేపీ నిరసనల సందర్భంగా భారీ ఎత్తున నిరుద్యోగులు అక్కడికి చేరుకున్నారు. 20 जून को कॉकरोचो के सरदार ने जंतर मंतर के रंगारंग कार्यक्रम के लिए चम्मच और थाली लाने के लिए कहा है ताकि आते जाते राहगीर अपने घर का बासी खाना इनके थाली में डाल जाए और यह चम्मच चाट कर खाएं pic.twitter.com/GFTHnG1xVo— Kikki Singh (@singh_kikki) June 19, 2026ఇదిలా ఉండగా.. ఇటీవల సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ పొందిన కాక్రోచ్ జనతా పార్టీ, యువతలో పెరుగుతున్న అసంతృప్తికి ప్రతీకగా మారింది. జూన్ 6న ఢిల్లీలో నిర్వహించిన తొలి భారీ నిరసనకు వందలాది మంది విద్యార్థులు, యువత హాజరయ్యారు. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు.. సీజేపీ నాయకత్వం ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాసి, పరీక్షల అవకతవకల కారణంగా నష్టపోయిన విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. దేశవ్యాప్తంగా యువత ఎదుర్కొంటున్న విద్య, ఉద్యోగ సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకున్న సీజేపీ ఉద్యమం రాబోయే రోజుల్లో మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
మళ్లీ నిర్లక్ష్యం?.. నాగ్పూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ సెంటర్
నీట్ రీటెస్ట్కు సిద్ధమవుతున్న ఓ విద్యార్థికి ఊహించని షాక్ తగిలింది. మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన అభ్యర్థి అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోగా.. పరీక్షా కేంద్రం ఏకంగా యూఏఈలోని అబుదాబిగా కనిపించింది. పాస్పోర్టే లేని విద్యార్థికి విదేశంలో పరీక్షా కేంద్రం కేటాయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..రేపు(జూన్ 21న) జరగనున్న రీ-నీట్ యూజీ 2026 పరీక్ష కోసం నాగ్పూర్కు చెందిన అబ్దుల్లా మహ్మద్ తాలిబ్ అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకున్నాడు. అయితే అందులో పరీక్షా కేంద్రంగా భారత్లోని నగరం కాకుండా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) రాజధాని అబుదాబిలోని ఓ భారతీయ పాఠశాల పేరు కనిపించింది. నాగ్పూర్ నుంచి దరఖాస్తు చేసుకున్న తాను విదేశీ పరీక్షా కేంద్రం ఎలా పొందానని విద్యార్థి, అతని కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు.పాస్పోర్టే లేదు.. పరీక్ష ఎలా?..ఈ ఘటనలో మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. అబ్దుల్లా వద్ద పాస్పోర్టు కూడా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో అబుదాబికి వెళ్లి పరీక్ష రాయడం అసాధ్యమని పేర్కొన్నారు. అడ్మిట్ కార్డులోని వివరాల స్క్రీన్షాట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం మరింత చర్చనీయాంశమైంది.ఎన్టీఏ స్పందనఈ విషయాన్ని విద్యార్థి కుటుంబ సభ్యులు వెంటనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) దృష్టికి తీసుకెళ్లారు. ఫిర్యాదు అందుకున్న అధికారులు ఇది టెక్నికల్ గ్లిచ్ (సాంకేతిక లోపం) కారణంగా జరిగిందని అంగీకరించినట్లు సమాచారం. అలాగే తప్పును సరిదిద్ది, సరైన పరీక్షా కేంద్రంతో కొత్త అడ్మిట్ కార్డు జారీ చేస్తామని హామీ ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు ఎన్టీఏ నుంచి ఈ-మెయిల్ కూడా వచ్చినట్లు వెల్లడించారు.ఇదేకాదు.. రేపటి రీటెస్ట్ నేపథ్యంలో ఎన్టీఏ నిర్లక్ష్యం బయటపడుతోంది. హాల్ టికెట్స్, ఎగ్జామ్ టైమింగ్.. సెంటర్లలో గందరగోళం నెలకొంది. మరో విద్యార్థికి సాయంత్రం 4గం.ఎగ్జామ్ అని సమాచారం. అయితే కంగారుపడక్కర్లేదంటూ ఆయా విద్యార్థులకు ఎన్టీఏ సందేశాలు పంపుతున్నట్లు తెలుస్తోంది. #UPDATE | Responding to reports of a Nagpur student being allotted an Abu Dhabi examination centre for the NEET UG 2026 re-exam, NTA DG Abhishek Singh tells ANI that the issue has been resolved and the “candidate has now been allotted a centre in Nagpur.”(File photo) https://t.co/dvlYNBdYPN pic.twitter.com/Q6S5l8g1SL— ANI (@ANI) June 20, 2026నీట్ యూజీ పరీక్ష కోసం విదేశాల్లో కూడా పరీక్షా కేంద్రాలు ఉంటాయి. విదేశాల్లో నివసిస్తున్న భారతీయ విద్యార్థులు, NRIలు, OCI అభ్యర్థుల కోసం ఎన్టీఏ కొన్ని అంతర్జాతీయ నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. గత కొన్నేళ్లుగా అబుదాబి, దుబాయ్, దోహా, కువైట్ సిటీ, మస్కట్, మనామా, రియాద్, షార్జా, సింగపూర్, కౌలాలంపూర్ వంటి నగరాల్లో NEET పరీక్షా కేంద్రాలు ఉన్నాయి.నాగ్పూర్లో దరఖాస్తు చేసిన విద్యార్థికి పొరపాటున అబుదాబి కేంద్రం కేటాయించడమే ఈ వివాదానికి కారణమైంది.జూన్ 21న రీ-నీట్పేపర్ లీకేజీ నేపథ్యంలో రద్దైన నీట్ పరీక్షను.. రేపు మధ్యాహ్నాం 2 గంటల నుంచి 5.15 గంటల వరకు పెన్-అండ్-పేపర్ విధానంలో నిర్వహించనున్నారు. అడ్మిట్ కార్డులో వ్యక్తిగత వివరాలు, పరీక్షా కేంద్రం తదితర అంశాల్లో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని ఎన్టీఏ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య మాక్డ్రిల్ కూడా నిర్వహించబోతోంది. -
తేజ్ ప్రతాప్ యాదవ్ హత్యకు కుట్ర?
పట్నా: బిహార్ రాజకీయాల్లో కలకలం చెలరేగింది. రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ పట్నాలో పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఆర్జేడీ విద్యార్థి విభాగం మాజీ అధ్యక్షుడు ఆకాష్ యాదవ్తో పాటు మరో ఏడుగురు కలిసి తనను, తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని ఆయన సచివాలయం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ వ్యవహారంపై కోర్టును ఆశ్రయించడంతో పాటు, తనకు తక్షణమే భద్రత పెంచాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.నివాసంలోకి చొరబాటు.. ప్రతిపక్షాల కుట్ర?తనను అంతమొందించేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని తేజ్ ప్రతాప్ యాదవ్ ఆరోపించారు. పట్నాలోని తన నివాసంలోకి నలుగురు వ్యక్తులు బలవంతంగా చొరబడ్డారని, వారిని పట్టుకునేందుకు ప్రయత్నించేలోపే వారు పరారయ్యారని మీడియాకు తెలిపారు. ప్రతిపక్ష నేతలతో చేతులు కలిపిన ఆకాష్ యాదవ్, ఈ తరహా హత్యాయత్నాలకు పాల్పడుతున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ను, తనను ఒకేసారి మట్టుబెట్టాలనేది వారి ప్లాన్ అని తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు.రివర్స్ కేసు.. చిన్నారి అపహరణ బెదిరింపులుఇదిలా ఉంటే, ఈ కేసులో మరో ఊహించని మలుపు చోటుచేసుకుంది. తేజ్ ప్రతాప్పై కూడా పట్నాలో ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆకాష్ యాదవ్ కుటుంబానికి చెందిన ఒక నివాసంలోకి తేజ్ ప్రతాప్ బలవంతంగా దూసుకెళ్లారని, అక్కడ ఉన్న ఒక చిన్నారిని తన ‘కూతురు’గా పిలుస్తూ, ఆమెను కలవనివ్వకపోతే అపహరిస్తామని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో అమెరికా నంబర్ నుండి తమకు బెదిరింపు కాల్స్ వచ్చాయని బాధితులు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, వాయిస్ నోట్స్ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.రాజకీయ కక్ష సాధింపే..తనపై వచ్చిన ఆరోపణలను తేజ్ ప్రతాప్ యాదవ్ పూర్తిగా తోసిపుచ్చారు. గతంలో సదరు వ్యక్తి ప్రవర్తనపై తాను చట్టపరమైన నోటీసులు పంపినందుకే, కక్ష గట్టి తనపై తప్పుడు కథనాలతో కూడిన ఎఫ్ఐఆర్ నమోదు చేయించారని సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. కొన్ని నెలల క్రితం సోషల్ మీడియా వివాదాల కారణంగా లాలూ ప్రసాద్ యాదవ్ తన కుమారుడైన తేజ్ ప్రతాప్ను పార్టీ నుండి బహిష్కరించిన సంగతి తెలిసిందే.ఇది కూడా చదవండి: ఒడిశా లెక్కలే ధర్మేంద్ర ప్రధాన్ను కాపాడుతున్నాయా? -
ఒడిశా లెక్కలే ధర్మేంద్ర ప్రధాన్ను కాపాడుతున్నాయా?
న్యూఢిల్లీ: నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ పరీక్ష నిర్వహణలో తెలెత్తిన అవకతవకల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. విపక్షాలు ఆయన రాజీనామా చేయాలంటూ గట్టిగా పట్టుబడుతున్నప్పటికీ, బీజేపీ మాత్రం ప్రధాన్కు అండగా నిలుస్తోంది. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, గట్టిగా వెనకేసుకొస్తుండటం వెనుక బలమైన రాజకీయ, ఎన్నికల వ్యూహాలు దాగి ఉన్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.బీజేపీ ట్రబుల్ షూటర్.. అమిత్ షా తర్వాత..ధర్మేంద్ర ప్రధాన్ కేవలం మంత్రి మాత్రమే కాదు, బీజేపీ అగ్రనాయకత్వంలో అత్యంత నమ్మకమైన ఎన్నికల వ్యూహకర్త. అమిత్ షా తర్వాత పార్టీలో సంక్లిష్టమైన ఎన్నికల వ్యవహారాలను చక్కదిద్దగల సమర్థుడిగా ఆయనకు పేరుంది. ఎలాంటి హడావుడి లేకుండా, తెరవెనుక ఉండి వ్యూహాలు రచించడంలో ఆయన దిట్ట. విబేధాలను పరిష్కరించడం, రాష్ట్రాల నాయకత్వాలను సమన్వయం చేయడం, బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంలో ప్రధాన్ శైలి ప్రత్యేకం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షాలతో ఉన్న సన్నిహిత సంబంధాలు పార్టీలో ఆయన స్థానాన్ని మరింత పటిష్ఠం చేశాయి.ఒడిశాలో చారిత్రాత్మక విజయం2024 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన చారిత్రాత్మక విజయం ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయ ఎదుగుదలకు మైలురాయిగా నిలిచింది. ఒడిశాకు చెందిన సీనియర్ నేతగా, అక్కడ దాదాపు 24 ఏళ్ల నవీన్ పట్నాయక్ సుదీర్ఘ పాలనకు ముగింపు పలకడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ అద్భుత విజయంతో ఒడిశాలో బీజేపీ తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హిందీ మాట్లాడే రాష్ట్రాలకే పరిమితం కాకుండా, ఇతర ప్రాంతాలకు పార్టీని ఎలా విస్తరించాలో ప్రధాన్ తన వ్యూహాలతో నిరూపించారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం, దేశవ్యాప్త రాజకీయ నెట్వర్క్ ఆయనను పార్టీలో కీలక నేతగా మార్చాయి.హర్యానా, బిహార్లలో ఊహించని విజయాలురాజకీయంగా ఎంతో సవాలుతో కూడుకున్న రాష్ట్రాల్లో ధర్మేంద్ర ప్రధాన్ తన వ్యూహాలతో పార్టీని గెలిపించారు. 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉన్నప్పటికీ, ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేసినా.. ప్రధాన్ నేతృత్వంలో బీజేపీ వరుసగా మూడోసారి విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అలాగే 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించడంలో క్షేత్రస్థాయి వ్యూహకర్తగా ప్రధాన్ కీలక పాత్ర పోషించారు. సీట్ల సర్దుబాటు, కూటమి నిర్వహణను ఆయన సమర్థవంతంగా అదుపు చేశారు.యూపీ టర్నింగ్ పాయింట్.. నందిగ్రామ్ సంచలనంభారతదేశంలోనే అత్యంత సంక్లిష్టమైన 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ధర్మేంద్ర ప్రధాన్ ఇన్ఛార్జ్గా వ్యవహరించారు. బూత్ స్థాయి నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి, 255కు పైగా స్థానాలతో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చేలా చేశారు. అంతకుముందు 2017 ఉత్తరాఖండ్ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 57 స్థానాలు సాధించడంలో, 2014 జార్ఖండ్ గెలుపులో ఆయన పాత్ర ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా 2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘నందిగ్రామ్’ నియోజకవర్గ బాధ్యతలను ప్రధాన్ తీసుకుని, మమతా బెనర్జీపై సువేందు అధికారి విజయం సాధించేలా వ్యూహాలు రచించడం బీజేపీ చరిత్రలో ఒక మైలురాయి.లీకుల వివాదం ఉన్నా.. నీట్ వివాదం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్నందున విపక్షాల డిమాండ్ సమంజసమే అయినప్పటికీ, బీజేపీ మాత్రం ప్రధాన్ రాజీనామాకు ఒప్పుకోవడం లేదు. రాజకీయ విశ్లేషకురాలు నీర్జా చౌదరి అభిప్రాయం ప్రకారం.. విపక్షాల ఒత్తిడికి తలొగ్గి ఇప్పుడు ప్రధాన్తో రాజీనామా చేయిస్తే, అది ఒక సంప్రదాయంగా మారి భవిష్యత్తులో మరిన్ని రాజీనామాలకు విపక్షాలు డిమాండ్ చేసే అవకాశం ఉందని బీజేపీ భయపడుతోంది. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో పవన్ బన్సల్, కామన్వెల్త్ గేమ్స్ వివాదాల సమయంలో ఇలాగే జరిగిందని పార్టీ గుర్తు చేసుకుంటోంది. ఒకవేళ ప్రధాన్ను మార్చాలనుకున్నా, విపక్షాల ఒత్తిడితో కాకుండా తర్వాత ఎప్పుడైనా క్యాబినెట్ విస్తరణలో భాగంగానే ఆ పని చేయవచ్చని ఆమె విశ్లేషించారు.జవాబుదారీతనంపై చర్చమరోవైపు నీట్, సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షల ఆన్-స్క్రీన్ మార్కింగ్ అవకతవకల నేపథ్యంలో విద్యాశాఖలో మంత్రుల జవాబుదారీతనంపై తీవ్ర చర్చ నడుస్తోంది. రాజకీయ విశ్లేషకుడు నిఖిల్ జైన్ ప్రకారం.. పార్టీకి రాజకీయంగా, సంస్థాగతంగా అవసరమైన నాయకులను మంత్రులుగా నియమించడం సాధారణమే. అయితే, మంత్రిత్వ శాఖ పరిధిలో వివాదాలు వచ్చినప్పుడు మంత్రులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. రోజువారీ పరిపాలనను బ్యూరోక్రాట్లు (అధికారులు) చూసుకున్నప్పటికీ, విధానపరమైన నిర్ణయాలు, ప్రజలకు, పార్లమెంటుకు సమాధానం చెప్పే బాధ్యత మంత్రులదే. గతంలో రైలు ప్రమాదాలు జరిగినప్పుడు నైతిక బాధ్యత వహిస్తూ లాల్ బహదూర్ శాస్త్రి, నితీష్ కుమార్ వంటి నేతలు రాజీనామా చేసిన ఉదాహరణలను ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: అమెరికా-ఇరాన్ యుద్ధం: ప్రపంచాన్ని కుదిపేసిన మహా నష్టం -
‘మోగ్లీ గర్ల్’ పూజ ఇక లేదు
అడవిలో ఒంటరిగా కనిపించిన ఆ చిన్నారి కథ ఒకప్పుడు దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. మానవ సమాజానికి దూరంగా గడిచిన బాల్యం నుంచి, మనుషుల మధ్య జీవించడం నేర్చుకున్న ఆమె జీవితం పోరాటానికి ప్రతీకగా నిలిచింది. అయితే ఎన్నో కష్టాలు, ఆరోగ్య సమస్యలను అధిగమిస్తూ సాగిన ఆ ప్రయాణం చివరకు ఆగిపోయింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మోగ్లీ గర్ల్’ ఎహ్సాస్ (18) ఇక లేదు.చిన్నారిగా అడవుల్లో దొరికిందని అధికారులు చెబుతున్న ఎహ్సాస్ అలియాస్ పూజ చిన్నవయసులోనే కన్నుమూసింది. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఊపిరితిత్తుల వ్యాధి కారణంగా వచ్చిన తీవ్రమైన రక్త సంక్రమణ (సెప్టీసీమియా) ఆమె మృతికి కారణమైందని వైద్యులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో చికిత్స పొందుతూ ఆమె జూన్ 15నే మరణించిందట. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎహ్సాస్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన ఆమె ఆరోగ్యం మెరుగుపడటంతో జూన్ 11న డిశ్చార్జ్ చేశారు. అయితే జూన్ 15న ఒక్కసారిగా పరిస్థితి విషమించడంతో తిరిగి ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది.ఎహ్సాస్ కథ 2017 జనవరిలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్ జిల్లా కతర్నియాఘాట్ అటవీ ప్రాంతంలోని మోతీపూర్ రేంజ్ సమీపంలో ఆమె కనిపించింది. అప్పటికి ఆమె మానవ సమాజంతో ఎలాంటి సంబంధం లేకుండా జీవిస్తున్నట్లు కనిపించింది. ఆమె ప్రవర్తన కూడా వింతగా అనిపించింది. నాలుగు కాళ్లపై నడవడం, దుస్తులు ధరించడానికి నిరాకరించడం, మనుషులు దగ్గరకు వస్తే దూకుడు దాడులు చేయడం.. ఇవన్నీ అధికారుల్ని ఆశ్చర్యపరిచింది. దీంతో ప్రముఖ రచయిత రుడ్యార్డ్ కిప్లింగ్ రచించిన ‘జంగిల్ బుక్’లోని మొగ్లీ పాత్రతో పోలుస్తూ ఆమెను ‘మోగ్లీ గర్ల్’గా పిలవడం ప్రారంభించారు.రక్షించిన తర్వాత బాలికను తొలుత ‘పూజ’గా పేరు పెట్టిన అధికారులు.. అనంతరం లక్నోలోని ప్రత్యేక బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. అక్కడ ఆమెకు ‘ఎహ్సాస్’ అనే పేరు పెట్టారు. వైద్య పరీక్షల్లో ఆమె మెదడు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందలేదని, మేధో వికలాంగతతో పాటు ఎపిలెప్సీ (మూర్ఛ) సమస్యలు కూడా ఉన్నట్లు తేలింది. అయినప్పటికీ, సంవత్సరాల తరబడి అందించిన వైద్య సేవలు, థెరపీ, పునరావాస కార్యక్రమాల వల్ల ఆమె ప్రవర్తనలో గణనీయమైన మార్పు వచ్చింది.క్రమంగా దుస్తులు ధరించడం, సంరక్షకులను గుర్తుపట్టడం, సామాజిక జీవనంలోని కొన్ని అంశాలకు అలవాటు పడడం నేర్చుకుంది. ఆమెను చూసుకునే సిబ్బందితో ఆత్మీయ బంధం ఏర్పడింది. ముఖ్యంగా సంరక్షకురాలు రాణిని ‘అమ్మ’ అని పిలుస్తూ ఎంతో సన్నిహితంగా ఉండేదని సహచరులు గుర్తు చేసుకున్నారు.ఎహ్సాస్ మరణంపై భావోద్వేగానికి గురైన రాణి, ‘‘ఒకరోజు ఆమె పూర్తిగా కోలుకుంటుందని ఎప్పుడూ నమ్మేదాన్ని. ఇప్పుడు ఆమె జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి’’ అని ఆవేదన వ్యక్తం చేశారు."ఆమె ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? అడవిలోకి ఎలా చేరింది? అన్న ప్రశ్నలు నేటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. అడవిలో ఒంటరిగా కనిపించిన ఓ బాలిక.. సమాజంలో కలిసిపోవడానికి ప్రయత్నించడం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. ‘మోగ్లీ గర్ల్’గా దేశం గుర్తుపెట్టుకున్న ఎహ్సాస్ జీవితం మాత్రం ఒక అసాధారణ గాథగా నిలిచిపోయింది. -
రాజ్నాథ్ నివాసంలో రహస్య భేటీ?
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని వేదికగా కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో పాటు పలు రాష్ట్రాల గవర్నర్ల మార్పునకు తెరవెనుక భారీ కసరత్తు జరుగుతోంది. ఇందులో భాగంగానే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సరికొత్త వ్యూహాలతో రంగంలోకి దిగింది. తాజాగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో రహస్య భేటీ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సమావేశానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ అగ్రనేతలు హాజరయ్యారని తెలిసింది.దాదాపు ఐదు గంటల పాటు సాగిన ఈ చర్చల్లో రాబోయే ఎన్నికలు, ప్రభుత్వ పనితీరు, కీలక నియామకాలపై అధిష్టానం రోడ్మ్యాప్ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కేబినెట్లో ఈసారి భారీగానే మార్పులుంటాయనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. దాదాపు 40 శాతం వరకు మంత్రివర్గంలో మార్పులకు అవకాశం ఉందంటున్నారు. మంత్రుల శాఖల్లో మార్పులు చేపట్టడంతోపాటు, కొందరికి ఉద్వాసన పలికే అవకాశముందని, కొత్త వారికీ చోటు కల్పిస్తారని సమాచారం. మంత్రుల పనితీరు, వయస్సు రీత్యా సమతుల్యత, ఎన్నికల్లో పార్టీకి చేకూరే లబ్ధి.. ఈ మూడు అంశాల ఆధారంగానే ఆర్ఎస్ఎస్ తన ప్రాధాన్యతలను బీజేపీ అధిష్టానానికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. పాతవారికి కొన్ని అదనపు బాధ్యతలు అప్పగిస్తూనే, కేబినెట్లోకి యువ రక్తాన్ని ఎక్కించేందుకు సంఘ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.రాష్ట్రాలపైనా కన్ను..కేవలం మంత్రివర్గ విస్తరణే కాకుండా, రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లను మార్చడం ద్వారా కేంద్రం, రాష్ట్రాల మధ్య పరిపాలనాపరమైన సమన్వయాన్ని మరింత పటిష్టం చేయాలని కేంద్రం భావిస్తోంది. భావజాలం, పరిపాలనాపరంగా గట్టి పట్టున్న వారినే గవర్నర్లుగా నియమించేలా ఆర్ఎస్ఎస్ తన అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ జాతీయ పదాధికారుల కమిటీలోనూ కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. -
ఉద్ధవ్ థాక్రే సంచలన ప్రకటన
ముంబై: తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎంపీలు తిరుగుబాటు ప్రకటించడంపై శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్ని సవాళ్లు, అవరోధాలు ఎదురైన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. సుమారు 13 ఏళ్లుగా పార్టీకి సారథ్యం వహిస్తున్నానంటూ ఆయన.. తన హయాంలోనే పార్టీ తీవ్ర సవాళ్లను, వ్యక్తిగత దాడులను ఎదుర్కొందని చెప్పారు. పార్టీ నన్ను వద్దనుకుంటే బాధ్యతల నుంచి వైదొలిగేందుకు సైతం సిద్ధంగా ఉన్నానన్నారు.నాలుగేళ్లలో రెండుసార్లు పార్టీలో చీలిక రావడంపై ఆయన శుక్రవారం మొదటిసారిగా పైవిధంగా స్పందించారు. శివసేన 60వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఉద్ధవ్ మాట్లాడారు. తనకు నాయకత్వ బాధ్యతల్లో కొనసాగాలన్న కాంక్ష లేదని చెప్పారు. ‘పార్టీకి చెందిన వారు తదుపరి అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తానని ముందుకు వస్తే సంతోషిస్తా. అదే సమయంలో, ద్రోహులు, దొంగలకు పార్టీని అప్పగించబోను’ అని ఆయన పేర్కొన్నారు.అసలు సినిమా ముందుంది: ఏక్నాథ్ షిండేఅసలు సినిమా ముందుందంటూ శివసేన చీఫ్, మహారాష్ట్ర డిప్యూటీ ఎంసీ ఏక్నాథ్ షిండే పరోక్షంగా ఉద్ధవ్ ఠాక్రేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పులి తోలు కప్పుకున్నంత మాత్రాన తోడేలు పులిగా మారిపోదంటూ ఎద్దేవా చేశారు. ఉద్ధవ్ సారథ్యంలోని శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు షిండే పక్షాన చేరారంటూ వస్తున్న వార్తల వేళ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.మరోవైపు ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలు పార్టీని వీడేందుకు సిద్ధమవడం ఆ వర్గానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ఈ పరిణామంతో షిండే వర్గం పార్లమెంటు స్థాయిలో మరింత బలోపేతం అవుతుండగా, ఉద్ధవ్ వర్గం అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మొత్తంగా చూస్తే, 2022లో జరిగిన శివసేన చీలిక తర్వాత మొదటిసారిగా ఉద్ధవ్ వర్గం మరో పెద్ద తిరుగుబాటును ఎదుర్కొంటుండగా, షిండే వర్గం మాత్రం దీనిని తమ రాజకీయ విజయంగా ప్రచారం చేస్తోంది. మహారాష్ట్ర రాజకీయాల్లో రానున్న రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఫలించిన రుక్మిణి వసంత్ పోరాటం
కృత్రిమ మేధ (AI) సాంకేతికత దుర్వినియోగం మరోసారి సినీ పరిశ్రమను కుదిపేసింది. ప్రముఖ నటి రుక్మిణి వసంత్కు సంబంధించినట్లు ప్రచారం చేసిన అసభ్యకర ఫొటోలు, వీడియోలు పూర్తిగా నకిలీవని తేలడంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన బెంగళూరు పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా.. పలువురు నటి చూపించిన చొరవను అభినందిస్తున్నారు.'కాంతార' ఫేమ్ నటి రుక్మిణి వసంత్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అయిన బికినీ ఫొటోలు, వీడియోలు తీవ్ర వివాదానికి దారితీశాయి. స్విమ్మింగ్ పూల్ వద్ద బికినీలో ఫొటోషూట్ చేసినట్లు ప్రచారం కాగా.. ఆ వీడియోలు, ఫొటోలు పూర్తిగా ఏఐ సాయంతో సృష్టించినవేనని రుక్మిణి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, తన వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘిస్తూ అసత్య ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు.‘‘నా పేరుతో వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు అన్నీ ఫేక్. వాటిని ఏఐ సాయంతో రూపొందించారు. ఈ వ్యవహారాన్ని నేను తీవ్రంగా పరిగణిస్తున్నాను. వాటిని సృష్టించిన వారిపైనా, ప్రచారం చేస్తున్న వారిపైనా చట్టపరమైన చర్యలు ప్రారంభించాం’’ అని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి కంటెంట్ను ఎవరూ షేర్ చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ ఘటనపై రుక్మిణి వసంత్ బెంగళూరు నగర సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఏఐ సాంకేతికతను ఉపయోగించి అభ్యంతరకర చిత్రాలు, వీడియోలు తయారుచేసి సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. దీనివల్ల తన గౌరవానికి భంగం కలగడమే కాకుండా మానసిక వేదనకు గురయ్యానని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఐటీ చట్టం, భారతీయ న్యాయ సంహిత (BNS)లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాల సాయంతో నిందితులను గుర్తించిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నేరానికి ఉపయోగించినట్లు భావిస్తున్న మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.అరెస్ట్ అయిన వారిలో బాగలకోట జిల్లా చిలకముఖి గ్రామానికి చెందిన రవికుమార్ (24), ప్రస్తుతం బెంగళూరులోని కామాక్షిపాళ్యలో నివసిస్తున్న చంద్రకాంత్ (33), మహాలక్ష్మీనగర్కు చెందిన రంజిత్ (25) ఉన్నారు. వీరిని కోర్టులో హాజరుపరచగా, కేసుపై మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.ఇటీవలి కాలంలో ఏఐ సాయంతో రూపొందిస్తున్న డీప్ఫేక్లు, మార్ఫింగ్ చిత్రాలు సినీ తారలు, ప్రజాప్రతినిధులు, సామాన్యులను సైతం ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా నటీమణుల ఫొటోలను అభ్యంతరకరంగా మార్చి వైరల్ చేయడం ఆందోళన కలిగిస్తోంది. గతంలోనూ పబ్లిక్ ఈవెంట్లలో మహిళా నటీమణుల శరీర భాగాలను జూమ్ చేసి చిత్రీకరించడంపై రుక్మిణి వసంత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏఐ సాయంతో ఏకంగా నకిలీ ఫొటోషూట్లను సృష్టించడంపై పోరాటం మొదలుపెట్టి విజయవంతం అయ్యారు.ఇటీవల పలువురు సినీ నటీమణులు, టెలివిజన్ యాంకర్లు కూడా తమ పేర్లతో ప్రచారం అవుతున్న ఏఐ ఫొటోలు, వీడియోలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నటి, యాంకర్ అనసూయ కూడా ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో డీప్ఫేక్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం మరింత స్పష్టమవుతోంది. -
పీఎం–వీబీఆర్వై కింద 70 లక్షల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన(పీఎం–వీబీఆర్వై) కింద దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 70 లక్షలకుపైగా ఉద్యోగాలను సృష్టించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఆయన శుక్రవారం 15 లక్షల మంది ఉద్యోగులు, యాజమాన్యాలకు రూ.2,400 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను బదిలీ చేశారు. ప్రభుత్వం, యువత, పరిశ్రమలు కలిసి పనిచేస్తే ఉద్యోగాల కల్పన అనేక రెట్లు పెరుగుతుందని ఈ సందర్భంగా చెప్పారు. పీఎం–వీబీఆర్వై పథకం కింద లబి్ధదారులకు సామాజిక భద్రత లభించిందని అన్నారు. కొత్త ఉద్యోగాలను సృష్టించే సంస్థలను లేదా యజమానులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ పథకం తొలిసారి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు, పరిశ్రమలకు మధ్య వారధిగా నిలుస్తుందని వెల్లడించారు. దేశమంతటా ఉపాధి కల్పనకు మద్దతు ఇస్తున్నామని, యువతకు సాధికారత కల్పిస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తు కోసం మరింత బలమైన శ్రామిక శక్తిని నిర్మిస్తున్నామని ఉద్ఘాటించారు. మన యువత ఆకాంక్షలు, నైపుణ్యాలు, సామర్థ్యాలే ‘వికసిత్ భారత్’కు బాటలు వేస్తాయని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో ప్రపంచ వృద్ధి, ఆవిష్కరణలను ముందుకు నడిపించడంలో భారత యువతదే కీలక పాత్ర అని అన్నారు. 21వ శతాబ్దంలో నైపుణ్యం, ఆవిష్కరణలను ప్రోత్సహించి, అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను నెలకొల్పే దేశాలకే అవకాశాలు దక్కుతాయని ప్రధానమంత్రి స్పష్టంచేశారు. ఈ మూడు రంగాల్లో భారతదేశానికి తిరుగులేదన్నారు. పీఎం–వీబీఆర్వై పథకానికి ప్రభుత్వం రూ.99,446 కోట్లు కేటాయించింది. రెండేళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద తొలిసారిగా ఉద్యోగంలో చేరే ఉద్యోగులకు రూ.15,000 వరకు అందిస్తారు. ప్రతి కొత్త ఉద్యోగికి గాను యాజమాన్యానికి నెలకు రూ.3,000 వరకు అందజేస్తారు. కొత్త ఉద్యోగాలను సృష్టించేలా యాజమాన్యాలను ప్రోత్సహించాలన్నదే ఈ పథకం ఉద్దేశం. -
నేడు నీట్ మాక్డ్రిల్
న్యూఢిల్లీ: ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ రీ–ఎగ్జామ్ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నేడు దేశ వ్యాప్త మాక్డ్రిల్ చేపట్టనుంది. ఈ పరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా అత్యంత సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగానే ఈ కసరత్తు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రశ్నపత్రాల తరలింపు మొదలుకొని బందోబస్తు దాకా ఏర్పాట్లను ఈ మాక్డ్రిల్లో భాగంగా సరిచూసుకుంటారు. ఆదివారం జరిగే ఎగ్జామ్ కోసం ప్రశ్నపత్రాలను జిల్లాల యంత్రాంగాలు, పోలీసుల సాయంతో బందోబస్తు నడుమ పరీక్ష కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఎన్టీఏ వెల్లడించింది. ఆదివారం మధ్యాహ్నం రీ–ఎగ్జామ్ పెన్ అండ్ పేపర్ మోడ్లో దేశవ్యాప్తంగా ఉన్న 551 నగరాలతోపాటు, విదేశాల్లోని 14 నగరాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు జరుగుతుందని తెలిపింది. మొత్తం 22.79 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారని పేర్కొంది. దివ్యాంగులైన అభ్యర్థులకు 6.20 గంటల వరకు పరీక్ష రాసేందుకు అనుమతిస్తామని వివరించింది. అభ్యర్థులు 11 నుంచి 1.30 గంటల మధ్యలో కేంద్రానికి చేరుకోవాలని, కచ్చితంగా 1.30 గంటలకు అధికారులు గేట్లు మూసివేస్తారని స్పష్టం చేసింది. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థులను లోపలికి అనుమతించబోరని పేర్కొంది. పరీక్ష కోసం పోలీసులు, జిల్లా యంత్రాంగం కలిపి దేశవ్యాప్తంగా 2 లక్ష మంది సేవలను వినియోగించుకుంటున్నామంది. అన్ని పరీక్ష కేంద్రాల్లోనూ సెంట్రలైజ్డ్ కంట్రోల్ రూంలతో అనుసంధానమై ఉండే సీసీటీవీ నిఘా, ఒకరికి బదులుగా మరొకరు రాసేందుకు అవకాశం లేకుండా ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ ధ్రువీకరణ, పరీక్ష కేంద్రాల ప్రవేశద్వారాల వద్ద హై సెన్సిటివిటీ మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేశామని వివరించింది. తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే సామాజిక మాధ్యమాలపై ఓ కన్నేసి ఉంచామని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. సాంకేతిక సమస్యల కారణంగా బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తికాని పక్షంలో అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోని సూపరింటెండెంట్ వద్ద ఉండే ఫార్మాట్లో స్వయం ధ్రువీకరణ పత్రంపై సంతకం చేస్తే సరిపోతుందని కూడా ఎన్టీఏ తెలిపింది. వేసవి పరిస్థితులు కొనసాగుతున్నందున పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, ఫ్యాన్లు, ఇతర సౌకర్యాలు కల్పించామని తెలిపింది. వైద్య విద్యార్థులకు సెలవు ఇవ్వకండి నీట్ రీ–ఎగ్జామ్ నేపథ్యంలో వైద్య విద్యార్థులకు ఈ నెల 20, 21వ తేదీల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ సెలవు మంజూరు చేయవద్దని నేషనల్ మెడికల్ కమిషన్ అన్ని వైద్య కళాశాలలు, సంస్థలను ఆదేశించింది. నీట్ పరీక్షల్లో వైద్య విద్యార్థులు జోక్యం చేసుకున్నట్లు గతంలో అనేక పర్యాయాలు వెల్లడైన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు గురువారం నోటీస్ జారీ చేసింది. అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోండి జూన్ 21న జరగబోయే నీట్ రీ–ఎగ్జామినేషన్కు సంబంధించి అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డ్లను డౌన్లోడ్ చేసుకోవాలని రిమైండర్ ఎస్ఎమ్ఎస్లు, ఈమెయిల్లు, వాట్సాప్ నోటిఫికేషన్లను పంపుతున్నట్లు ఎన్టీఏ శుక్రవారం తెలిపింది. అదే సమయంలో, మోసపూరిత సందేశాలు, నకిలీ సమాచారంపై అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులను హెచ్చరించింది. ఎస్ఎంఎస్లు Nఐఇ్కఉ్క అనే ఐడీ ద్వారా nౌట్ఛp y.n్ఛ్ఛ్ట.n్ట్చఃnజీఛి.జీn. ద్వారా మెయిళ్లను పంపుతామంది. -
టెలిగ్రామ్పై నిషేధం సబబే
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ రీ–ఎగ్జామ్ను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. పేపర్ లీకేజీలను నివారించేందుకు జూన్ 22 వరకు యాప్ను బ్యాన్ చేస్తూ కేంద్రం జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ టెలిగ్రామ్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం శుక్రవారం కొట్టివేసింది. జస్టిస్ తేజస్ కరియా సారథ్యంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. విచారణ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. టెలిగ్రామ్ యాప్లోని సాంకేతిక ఫీచర్ల ద్వారా ఆటోమేటెడ్ బాట్ అకౌంట్లను సష్టించి, ఒకేసారి పెద్ద ఎత్తున సమాచారాన్ని బదిలీ చేసే అవకాశం ఉందన్నారు. ఒక బాట్ను బ్లాక్ చేస్తే, దానంతటదే మరో బాట్కు సమాచారం బదిలీ అయ్యే (మిర్రర్ ఛానల్) వ్యవస్థ ఇందులో ఉందని వివరించారు. 21న జరిగే నీట్ రీ–ఎగ్జామినేషన్ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ), కేంద్ర ఉన్నత విద్యా శాఖ సిఫార్సుల మేరకే తాత్కాలికంగా బ్లాక్ చేసినట్లు వివరించారు. అయితే, నీట్కు సంబంధించి చట్టవిరుద్ధంగా ఉన్న 900 పైగా లింకులను ఏఐ సాంకేతికత ద్వారా ఇప్పటికే తొలగించామని టెలిగ్రామ్ వాదించింది. కొందరు చేసిన తప్పులకు 15 కోట్లకు పైగా ఉన్న సాధారణ యూజర్లను శిక్షించడం వారి హక్కులను హరించడమేనని పేర్కొంది. కేవలం ఒక వర్గానికి చెందిన అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారనే కారణంతో, ఏ సంబంధం లేని 15 కోట్ల మంది సాధారణ యూజర్ల యాప్ వినియోగాన్ని ఎలా నిరోధిస్తారని ఈ సందర్భంగా ధర్మాసనం కేంద్రాన్ని మౌఖికంగా ప్రశ్నించింది. వాదనల అనంతరం టెలిగ్రామ్ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు జస్టిస్ తేజస్ కరియా తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఐటీ చట్టంలోని సెక్షన్ 69ఏ కింద ఒక సామాజిక మాధ్యమ వేదికను బ్లాక్ చేసే అధికారం కేంద్రానికి ఉందని స్పష్టం చేశారు. జరగబోయే నష్టాన్ని నివారించేందుకు కేంద్రం అనుసరించిన విధానంపై సంతృప్తి వ్యక్తం చేశారు. -
ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఆరోపణల పిల్ కొట్టివేత
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేల కొనుగోళ్లు, రాజకీయ ఫిరాయింపులు పెరిగిపోయాయంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) సుప్రీంకోర్టు కొట్టివేసింది. తగిన ఆధారాలు లేకుండా చేసిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టం చేసింది.కేకే రమేశ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం.. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది సి.ఆర్. జయ సుకిన్ వాదనలు వినిపిస్తూ.. దేశంలో ప్రస్తుతం ప్రజాస్వామ్య విలువలు మంటగలుస్తున్నాయని వ్యాఖ్యానించారు. డబ్బు, బెదిరింపులకు పాల్పడి అధికార పార్టీలు ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్విర్యం చేస్తున్నాయన్నారు. పలు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన వెంటనే ప్రత్యర్థి పార్టీల్లో చేరుతున్నారని, ప్రత్యేక విమానాల్లో వారిని క్యాంపులకు తరలిస్తున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రాజ్యాంగంలోని ఆర్టీకల్ 190 ప్రకారం ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్లు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఆమోదించాల్సి ఉన్నప్పటికీ, ఆ నిబంధనలను పూర్తిగా పక్కనపెడుతున్నారని చెప్పారు. ఈ అంశాలపై జోక్యం చేసుకోవాలని కోరారు. అయితే, పిటిషనర్ వాదనలపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. -
నేవీకి నూతన శక్తి
కోల్కతా: స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన మూడు కీలక నౌకలను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం భారత నౌకా దళంలోకి లాంఛనంగా ప్రవేశపెట్టనున్నారని అధికార వర్గాలు తెలియజేశాయి. పశ్చిమ బెంగాల్లోని శ్యామప్రసాద్ ముఖర్జీ ఓడరేవులో ఈ కార్యక్రమం జరుగుతుందని శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించాయి. సముద్ర పోరాటం, హైడ్రోగ్రాఫిక్ సర్వే, జలాంతర్గామి వ్యతిరేక యుద్ధం వంటి కార్యాచరణల కోసం ఈ నౌకలను నిర్మించినట్లు తెలిపాయి. ఈ మూడు నౌకలకు దునగిరి, సంశోధక్, అగ్రయ్ అని పేరుపెట్టారు. భారత నావికాదళానికి చెందిన వార్íÙప్ డిజైన్ బ్యూరో వీటిని డిజైన్ చేసింది. కోల్కతాలోని రక్షణ రంగ సంస్థ గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్, ఇంజనీర్స్(జీఆర్ఎస్ఈ) లిమిటెడ్ నిర్మించింది. దునగిరి నౌకలో అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్లు అమర్చారు. ఇందులో బ్రిహ్మోస్ క్షిపణులు కూడా ఉన్నాయి. ఈ నౌకతో భారత నౌకాదళం పోరాట సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని అంటున్నారు. సంశోధక్ అనే సర్వే నౌకను తీరప్రాంత, లోతైన నీటి హైడ్రోగ్రాఫిక్ సర్వేల కోసం, సముద్ర శాస్త్ర, భూ¿ౌతిక డేటాను సేకరించడానికి రూపొందించారు. ఇక అగ్రయ్ అనేది అర్నాల తరగతికి చెందిన ఒక జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ నౌక. తీరప్రాంత జలాల్లో నీటి అడుగున ఉన్న ముప్పును గుర్తించి, ఎదుర్కోవడానికి తేలికపాటి టార్పెడోలు, స్వదేశీ రాకెట్ లాంచర్లు, జల సోనార్ వ్యవస్థలు అమర్చారు. ఈ మూడు నౌకల్లో 75 శాతానికి పైగా స్వదేశీ కంటెంట్ ఉందని, వీటి నిర్మాణంలో 200కు పైగా ఎంఎస్ఎంఈలు పాలుపంచుకున్నాయని అధికార వర్గాలు చెప్పాయి. నేడు, రేపు ఒడిశా, బెంగాల్లో మోదీ పర్యటన న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం, ఆదివారం ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పర్యటించబోతున్నారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేస్తారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతుల ఖాతాల్లో 23వ విడత నిధులు జమచేస్తారు. దేశవ్యాప్తంగా 9.44 కోట్లమంది బ్యాంకు ఖాతాల్లోకి 18,800 కోట్లు బదిలీ చేయబోతున్నారు. శనివారం ఒడిశా రాష్ట్రంలో మయూర్భంజ్లోని పవిత్ర క్షేత్రాలైన సంథాలి జహెరా, హో జహెరాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి ప్రార్థనల్లో పాల్గొంటారు. అలాగే బెంగాల్లోని హూగ్లీ జిల్లాలో ‘పశ్చిమ బంగ దివస్’వేడుకలకు హాజరవుతారు. ఆదివారం ఉదయం కోల్కతాలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం పలు వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫామింగ్, ప్రధానమంత్రి ధన్–ధాన్య కృషి యోజనను ప్రారంభిస్తారు. -
పాత వాహనం ఇచ్చేశాక.. ఆర్సీ రద్దు తప్పనిసరి!
సాక్షి, న్యూఢిల్లీ: పాత వాహనాలను తుక్కుగా (స్క్రాప్) మార్చిన తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) రద్దు చేయించడం తప్పనిసరి అని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ స్పష్టం చేసింది. వాహనాన్ని ఏదో ఒక గ్యారేజీలో స్క్రాప్ కింద వేసి వదిలేస్తే భవిష్యత్తులో న్యాయపరమైన, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. మోటారు వాహనాల చట్టం–1988 నిబంధనల ప్రకారం అ«దీకృత ‘రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ’(ఆర్వీఎస్ఎఫ్) కేంద్రాల్లోనే పాత వాహనాలను తుక్కుగా మార్చాలని, అనంతరం ఆర్టీఓ కార్యాలయంలో విధిగా ఆర్సీని రద్దు చేసుకోవాలని తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది. కాగా ఈ నోటిఫికేషన్ వచ్చిన 30 రోజుల్లోగా అభ్యంతరాలు, సలహాలు ఇచ్చేందుకు కేంద్రం అవకాశం కల్పించింది. నిబంధన ఎవరికి వర్తిస్తుందంటే.. వాయు కాలుష్య నియంత్రణ, రహదారి భద్రత లక్ష్యంగా కేంద్రం వాహన స్క్రాపేజ్ విధానాన్ని అమలు చేస్తోంది. దీని ప్రకారం 20 ఏళ్లు దాటిన వ్యక్తిగత (ప్రైవేటు) వాహనాలకు, 15 ఏళ్లు నిండిన వాణిజ్య (కమర్షియల్) వాహనాలకు ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లలో (ఏటీఎస్) ఫిట్నెస్ పరీక్ష తప్పనిసరి. ఈ పరీక్షలో విఫలమైన వాహనాలను రోడ్లపై నడపడానికి వీల్లేదు. వీటిని ఎండ్–ఆఫ్–లైఫ్ (ఈఎల్వీ) వాహనాలుగా పరిగణించి అధికారిక కేంద్రాల్లో తుక్కుగా మార్చాల్సిందే. 15 ఏళ్లు నిండిన ప్రభుత్వ వాహనాలను నేరుగా స్క్రాప్ చేయాలి. నిర్లక్ష్యం చేస్తే ముప్పు పాత వాహనాన్ని అనధికారికంగా తుక్కుగా మార్చి ఆర్సీ రద్దు చేయించకపోతే, ఆ వాహనం చట్టపరంగా పాత యజమాని పేరుతోనే కొనసాగుతుంది. దీనివల్ల పలు ఇబ్బందులు ఎదురవుతాయి. చట్టపరమైన చిక్కులు: వాహనం ఇంజిన్, ఛాసిస్ నంబర్లను దురి్వనియోగం చేసి నేరస్థులు నకిలీ వాహనాలు సృష్టించినా, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినా చట్టపరంగా యజమానే బాధ్యత వహించాల్సి ఉంటుంది. పోలీసు కేసులు నేరుగా యజమానిపైనే నమోదవుతాయి. అంతేకాదు, ఆ నకిలీ వాహనం పేరుతో నమోదయ్యే ట్రాఫిక్ చలాన్లు, పెండింగ్ పన్నుల నోటీసులు నేరుగా యజమాని ఇంటికే వస్తాయి. ఆర్సీ రద్దు చేయకుండా వదిలేస్తే.. ప్రభుత్వం, ఆటోమొబైల్ సంస్థలు అందించే రాయితీలను కోల్పోతారు. రద్దుతో ప్రయోజనాలు సరైన పద్ధతిలో స్క్రాప్ చేసి, ఆర్టీఓ వద్ద ఆర్సీని రద్దు చేసుకున్న వారికి కొత్త వాహనాల కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం, ఆటోమొబైల్ సంస్థలు పలు ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. తుక్కు విలువ (స్క్రాప్ వాల్యూ) నేరుగా యజమాని బ్యాంకు ఖాతాలో జమవుతుంది. కొత్త వాహనం కొనుగోలు సమయంలో రిజి్రస్టేషన్ ఫీజును పూర్తిగా మాఫీ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల మేరకు కొత్తవాహనం రోడ్డు పన్నులో 25 శాతం వరకు రాయితీ లభిస్తుంది. కార్ల తయారీ సంస్థలు (మారుతీ సుజుకీ, టాటా, మహీంద్రా తదితర సంస్థలు) కొత్త కారు ఎక్స్–షోరూమ్ ధరపై 1.5 శాతం లేదా రూ.20 వేల వరకు తగ్గింపు ఇస్తున్నాయి. వాణిజ్య వాహనాలకు ఎక్స్–షోరూమ్ ధరపై 2.75 శాతం నుంచి 3 శాతం వరకు ప్రత్యేక రాయితీ వర్తిస్తుంది.ఆర్సీ రద్దు ప్రక్రియ ఇలా.. వాహనాన్ని ముందుగా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆర్వీఎస్ఎఫ్ కేంద్రానికి అప్పగించాలి. వారు వాహనం స్వీకరించినట్లు ‘సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్’, తుక్కుగా మార్చాక ‘సర్టీఫికెట్ ఆఫ్ వెహికల్ స్క్రాపింగ్’జారీ చేస్తారు. ఈ ధ్రువపత్రాలతో పాటు ఒరిజినల్ ఆర్సీని తీసుకుని ఆర్టీఓ కార్యాలయంలో ఫారం–26 నింపి దరఖాస్తు చేయాలి. పత్రాల పరిశీలన అనంతరం ఆర్టీఓ అధికారులు ఆర్సీని అధికారికంగా రద్దు చేస్తారు. కొన్ని రాష్ట్రాల్లో పరివాహన్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పించారు. దరఖాస్తుకు అవసరమైన పత్రాలు → ఒరిజినల్ రిజి్రస్టేషన్ సర్టీఫికెట్ (ఆర్సీ) → స్క్రాపింగ్ కేంద్రం జారీ చేసిన ధ్రువపత్రాలు (సీవోడీ, సీవీఎస్) → యజమాని ఆధార్, పాన్ కార్డు కాపీలు → వాహనాన్ని స్వచ్ఛందంగా తుక్కుగా మారుస్తున్నట్లు తెలిపే అఫిడవిట్ → వాహనంపై రుణం ఉంటే.. సంబంధిత బ్యాంకు జారీ చేసిన నో అబ్జెక్షన్ సర్టీఫికెట్ (ఎన్ఓసీ) తప్పనిసరి. -
షాకింగ్ .. విమానంపై పిడుగు కలకలం
సాక్షి,కోల్కతా: ఈ రోజు శుక్రవారం ఉదయం కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.141 మంది ప్రయాణికులతో టేకాఫ్కు సిద్ధంగా ఉన్న విమానంపై అకస్మాత్తుగా పిడుగుపడింది. దీంతో ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే భద్రతా సిబ్బంది తక్షణమే స్పందింది ప్రయాణికులను వేరే విమానంలో తరలించారు.కోల్కతాలో ఈ రోజు ఉదయం భారీ ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం సమయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయం నుంచి అగర్తలా వెళ్లాల్సిన ఇండిగో విమానం (6E6068) టేకాఫ్ కోసం పార్కింగ్ స్థలంలో సిద్ధంగా ఉంది . అయితే ఆ సమయంలోనే హఠాత్తుగా విమానంపై పిడుగు పడింది. దీంతో ఒక్కసారిగా విమానంలో పవర్ ఆఫ్ కావడంతో అక్కడే ఉన్న విమాన సిబ్బంది వెంటనే ప్రయాణికులందరినీ విమానం నుంచి దించివేసి, వేరొక విమానంలో వారిని గమ్యస్థానానికి తరలించారు.అయితే ఈ ప్రమాద సమయంలో విమానంలో 141 మంది ప్రయాణికులు, 6 మంది సిబ్బంది ఉన్నారు. విమానంలో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే ఇద్దరు గ్రౌండ్ సిబ్బంది స్వల్పంగా ప్రభావితం కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. పిడుగులతో విమానానికి ఏం కాదా?సాధారణంగా విమానంపై పిడుగు పడినా వాటికి ఎటువంటి ప్రమాదం సంభవించదు. విమానాలు పిడుగుపాటును తట్టుకునేలా అత్యంత సురక్షితమైన సాంకేతికతతో డిజైన్ చేయబడి ఉంటాయి. సాధారణంగా విమానాల పైభాగం వాహక లోహంతో ఒక 'ఫారెడే కేజ్' లా పనిచేస్తుంది. దీనివల్ల పిడుగు ద్వారా వచ్చిన విద్యుత్ విమానం వెలుపలి ఉపరితలం గుండా ప్రవహించి గాల్లోకి వెళ్లిపోతుంది. దీంతో వాటికి ఎటువంటి ప్రమాదం సంభవించదు. -
భారత్-పాక్ సరిహద్దుల్లో అరుదైన ‘షేక్హ్యాండ్’
శ్రీనగర్: ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం.. భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో.. జమ్మూకశ్మీర్లోని నియంత్రణ రేఖ (LoC) వద్ద అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. భారత సైన్యం అదుపులో ఉన్న పాకిస్థాన్ పౌరుడు అసద్ ఖాన్ను స్వదేశానికి అప్పగించే సందర్భంగా ఇరు దేశాల సైన్యాధికారులు పరస్పరం కరచాలనం చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. మానవతా విలువలకు కట్టుబడి ఉన్న భారత సైన్యం.. అసద్ ఖాన్ను గౌరవంగా చూసుకుంది. అనంతరం పాకిస్థాన్ సైన్యానికి అప్పగించింది. దీంతో పాక్ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.జమ్మూకశ్మీర్లోని కుప్వారా జిల్లా తీత్వాల్ సెక్టార్ పరిధిలోని సిమారి ప్రాంతంలో గత వారం నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన అసద్ ఖాన్ను భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. ఆయన పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా (కేపీకే) ప్రాంతానికి చెందినవాడని సైన్యం వెల్లడించింది. అయితే, అతడిని విడుదల చేయాలని పాకిస్థాన్లోని పలువురు నెటిజన్లు భారత సైన్యాన్ని కోరారు.కొంతకాలం పాటు నిర్బంధంలో ఉంచిన అధికారులు.. అసద్ ప్రవర్తనపై ఎటువంటి అనుమానం రాకపోవడంతో తిరిగి స్వదేశానికి పంపాలని నిర్ణయించుకున్నారు. దీంతో అసద్ ఖాన్ను సరిహద్దు క్రాసింగ్ పాయింట్ దగ్గర పాకిస్థాన్ సైన్యానికి అధికారికంగా అప్పగించారు. ఈ సందర్భంగా తీసిన చిత్రాలను భారత సైన్యం తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో విడుదల చేసింది. వాటిలో భారత సైన్యానికి చెందిన మేజర్ హోదా అధికారి, పాకిస్థాన్ సైన్యాధికారితో కరచాలనం చేస్తున్న దృశ్యం కనిపించింది.Repatriation of Pak NationalA Pakistani national, Asad Khan, a resident of Khyber Pakhtunkhwa (KPK), who was apprehended in Simari village, Kupwara, on 12 June 2026 after crossing the Line of Control, was repatriated to Pakistan on 18 June 2026.During his stay in India, Asad… pic.twitter.com/4MUKLUylZh— Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) June 19, 2026ఈ సందర్భంగా భారత సైన్యం విడుదల చేసిన ప్రకటనలో, “ఖైబర్ పఖ్తూన్ఖ్వా నివాసి అసద్ ఖాన్ జూన్ 12న నియంత్రణ రేఖ దాటి సిమారి గ్రామం వద్ద పట్టుబడ్డాడు. జూన్ 18న అతడిని పాకిస్థాన్కు తిరిగి పంపించాం. భారత్లో ఉన్నంత కాలం అతడిని గౌరవంగా.. మానవతా దృక్పథంతో చూసుకున్నాం. సైన్యం నైతిక విలువలకు నిదర్శనం” అని పేర్కొంది. -
ఇండియా కూటమిలో చేరనున్న డీఎంకే..?
సాక్షి, చెన్నై: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఎవరూ ఉండరంటారు.. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అదే విషయం మరోసారి రుజువయ్యేలా కనిపిస్తుంది. ఇటీవలే ఇండియా కూటమి నుంచి వైదొలిగిన డీఎంకేకు... రాహుల్ గాంధీ మరోసారి కలిసి పనిచేసేలా రాయబారం పంపినట్లు సమాచారం. అసలేం జరిగిందంటే ...?ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు దేశవ్యాప్తంగా అధికార ఎన్టీఏ కూటమిని మరింత బలీయంగా మార్చగా అదే సమయంలో ఇండియా కూటమిని బలహీన పరిచాయి. కూటమిలో ప్రధానంగా ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్, బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓడిపోవడం.. అదే విధంగా టీవీకేకు మద్ధతిచ్చి మిత్ర ధర్మాన్ని పాటించలేదని ఆగ్రహం చెంది.. ఇండియా కూటమి నుంచి వైదొలిగింది. ఈ పరిస్థితులు నడుమ ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్బంగా డీఎంకే అధినేత స్టాలిన్ "గౌరవనీయ ప్రతిపక్ష నాయకులు తిరు రాహుల్ గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు మంచి ఆరోగ్యంతో, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను." అని సాధారణంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే దీనికి బదులిచ్చిన రాహుల్ గాంధీ "భారతదేశ భావనను, మన రాజ్యాంగాన్ని, సమాఖ్యవాదాన్ని పరిరక్షించాలనే మన ఉమ్మడి సంకల్పం మనకు మార్గదర్శకంగా కొనసాగుతుంది - ఇది మన ప్రజాస్వామ్య ఆత్మ కోసం చేసే పోరాటం, మనం గెలిచే వరకు దీన్ని కలిసికట్టుగా పోరాడతాం." అని ప్రత్యత్తరమిచ్చారు. దీంతో రాహుల్ వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో హాట్టాఫిక్గా మారాయి. ఇండియా కూటమిలోకి మళ్లీ రావాలని రాహుల్ స్టాలిన్కు రాయభారం పంపారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా గతేడాది రాహుల్ గాంధీకి స్టాలిన్ శుభాకాంక్షలు తెలుపుతూ "రక్త సంబంధంతో కాదు, ఆలోచన, దార్శనికత, లక్ష్య సాధన ద్వారా బంధించబడిన నా ఆదర్శ సోదరుడు మీరు ఇలాగే దృఢంగా నిలబడి, ధైర్యంతో నాయకత్వం వహించాలి. ఉజ్వల భారతదేశం వైపు మన పయనించే ఈ ప్రయాణంలో విజయం మనదే అవుతుంది." అని రాహుల్ ని ప్రశంసిస్తూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఏడాది మాత్రం నామమాత్రంగా విషెస్ చెప్పారు. -
కర్ణాటకలో క్రాస్ ఓటింగ్.. కాంగ్రెస్ ఘన విజయం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ తీవ్ర కలకలం రేపుతోంది. మొత్తం 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి 135 మంది సభ్యుల బలం ఉండగా ఏకంగా 151 ఓట్లను సాధించి, 5 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష బీజేపీ కేవలం 2 స్థానాలను మాత్రమే గెలుచుకోగా, జేడీఎస్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జేడీఎస్ (JD-S) పార్టీలకు చెందిన 12 మంది వరకు ఎమ్మెల్యేలు తమ పార్టీ ఆదేశాలను ధిక్కరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా ఓటు వేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా జేడీఎస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డట్లు సమాచారం. ఆ పార్టీకి అసెంబ్లీలో 18మంది ఎమ్మెల్యేలున్నారు. అంటే జేడీఎస్ అభ్యర్థికి 18ఓట్లు రావాలి. కానీ, జేడీఎస్ మొదటి ప్రాధాన్యతా ఓట్లు 14 మాత్రమే వచ్చాయి. అంటే, నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డట్లు సమాచారం. బీజేపీ కనీసం మూడు ఓట్లను కోల్పోగా కాంగ్రెస్కు అదనంగా వచ్చిన ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయనే గందరగోళం ఏర్పడింది. దీనిపై విచారణ సాగుతుంది.ఈ క్రాస్ ఓటింగ్ ద్వారా కాంగ్రెస్ అఖండ విజయం సాధించగా, ప్రతిపక్ష శిబిరంలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. బీజేపీ, జేడీఎస్ కూటమి నుండి క్రాస్ ఓటింగ్ జరగడంపై ఆయా పార్టీల అగ్రనాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అంతర్గత విచారణ జరిపి, బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని బిజెపి నేతలు ప్రకటించారు. కాగా సీఎంగా డీకే శివకుమార్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికలు ఇందులో కాంగ్రెస్ విజయం సాధించడంతో ఈ గెలుపుపై ఆయన సంతోషం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. -
'నేను బాబా టిల్లూ : బాబా బైక్ స్టంట్స్ వీడియో వైరల్
సోషల్మీడియాలో రోజుకో కొత్త వింత పుట్టుకొస్తూనే ఉంటుంది. ఆశ్చర్యపరిచే, నవ్వించే ఫన్నీ వీడియోలు ఎన్నో వస్తుంటాయి. సాధారణంగా యువకులకు బైక్ లంటే చాలా క్రేజ్ ఉంటుంది, కానీ ఒక బాబా బైక్పై విన్యాసాలు చేయడం చూశారా? తాజాగా ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. కాషాయ వస్త్రాలు ధరించి, రద్దీగా ఉండే రహదారిపై చేసిన బైక్ స్టంట్స్ చేశారు. రన్నింగ్ బైక్పై బైక్ హ్యాండిల్ను చేతులతో కాకుండా ఒక కాలుతో పట్టుకుని, రెండు చేతులు గాల్లో ఊపుతూ స్టంట్స్ చేశారు. ఆయన బ్యాలెన్సింగ్ చూసి చుట్టుపక్కల వాహనదారులు కూడా నోరెళ్లబెడుతున్నారు. తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోపై జనాలు ఎంతో రొమాంటిక్, ఫన్నీ కామెంట్స్ చేస్తూ బాగా లైక్ చేస్తున్నారు. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో bittu_22k అనే అకౌంట్ నుండి షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోకు 4.7 మిలియన్లకు పైగా వ్యూస్, అలాగే 1.79 లక్షలకి పైగా లైక్స్ వచ్చాయి. అయితే ఇది ఏ ప్రాంతానికి చెందిందనే వివరాలు అందుబాటులో లేవు.రన్నింగ్ బైక్పై బాబా చేసిన ఈ స్టంట్ చూసి జనాలే షాక్ అవుతున్నారు. అయితే, రోడ్డుపై ఇలాంటి స్టంట్స్ చేయడం ప్రాణాంతకం కాబట్టి, చాలా మంది దీనిని ప్రమాదకరమైన చర్యగా పేర్కొంటున్నారు.'యమరాజుతో డైరెక్ట్ కనెక్షన్' అంటూ నెటిజన్లు తెగ సెటైర్లు వేశారు. View this post on Instagram A post shared by Viral Controversy (@viralcontroversy) నెటిజన్ల ఫన్నీ కామెంట్స్"బాబాకు బహుశా యమరాజుతో డైరెక్ట్ ఫ్రెండ్షిప్ ఉన్నట్టుంది.", "నేను బాబా టిల్లూ..." అని కామెంట్ చేశారు. "బాబా గారి బైక్ బహుశా ఆటోమేటిక్ అనుకుంటా!" అని ఒకరు, "బాబా తన శక్తులన్నింటినీ ఇక్కడే వాడుతున్నారు." అని మరొకరుకామెంట్ చేశారు.నోట్ : అత్యంత ప్రమాదకరమైన ఇలాంటి స్టంట్లు చేయడం అస్సలు సరికాదు. ఇది సదరు వ్యక్తి ప్రాణాలకే కాకుండా, రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారుల ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతుందని గమనించాలి. సో...ఇలాంటి నిర్లక్ష్యపు విన్యాసాలు ఏదో థ్రిల్ ఇస్తాయనుకోవడం పొరబాటే. కాదూ కూడదంటే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
NEET రూ. కోటి ఇవ్వండి : ప్రధానికి సీజేపీ అభిజీత్ బహిరంగ లేఖ
నీట్ (NEET) పేపర్ లీక్ వివాదంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక బహిరంగ లేఖ రాశారు. ఆత్మహత్యలకు పాల్పడిన నీట్ బాధితుల కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నీట్ అవకతవకలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్తో శాంతియుత ఉద్యమాన్ని సాగిస్తున్న అభిజీత్ తన తాజా డిమాండ్తో ఒక లేఖను ఎక్స్లో పోస్ట్ చేశారు. నీట్ (NEET) 2026 పరీక్షా పేపర్ లీక్ వివాదం, పరీక్ష రద్దు మరియు రీ-టెస్ట్ నిర్ణయాల వల్ల కలిగిన తీవ్ర మానసిక ఒత్తిడి, నిరాశ కారణంగా దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఈ నేపథ్యంలో గత కొన్ని వారాలుగా 11 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, అందులో ఐదు మరణాలు గత 48 గంటల్లోనే సంభవించాయని దీప్కే లేఖలో పేర్కొన్నారు. వరుసగా జరుగుతున్న పేపర్ లీకేజీ సంఘటనలు, రీ-టెస్ట్ ఒత్తిడికి తట్టుకోలేక తీవ్ర మనస్తాపంతో ఉసురు తీసుకుంటున్నవిద్యార్థల కుటుంబాలలో తీవ్ర మానసిక ఆందోళనను రేకెత్తిస్తోందని వాదించారు. ఈ ఒత్తిడి యువతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ఘోరమైన ధోరణి తగ్గకపోగా, మరింత తీవ్రమవుతోంది. గత రెండు నెలల్లో, ఆత్మహత్యలకు పాల్పడిన పలువురు విద్యార్థుల శోకతప్త కుటుంబాలను తాను వ్యక్తిగతంగా కలుసుకున్నానంటూ అభిజీత్ దీప్కే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రధాని తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. విద్యాపరమైన నిరాశ కారణంగా ఇకపై ఏ యువ విద్యార్థి బలికాకుండా ఉండేందుకు అవసరమైన నిర్మాణాత్మక సంస్కరణలను తీసుకు రావాలని ప్రధానికి సూచించారు.ఇదీ చదవండి: షాకింగ్ : కట్టేసి, జుట్టు కత్తిరించి, పైశాచికంగా.. వీడియో వైరల్పిల్లలను కోల్పోయిన భరించలేని మానసిక వేదనతో పాటు, ఈ కుటుంబాలు ఇప్పుడు ఆర్థికంగా కూడా భారీగా నష్టపోయాయని పేర్కొన్నారు. పిల్లల మంచి భవిష్యత్తు కోసం చాలా కుటుంబాలు పెద్ద మొత్తంలో విద్యా రుణాలు తీసుకున్నాయని, అయితే విద్యావ్యవస్థలోని లోపాలతో వారి ఆశలు ఆడియాలయ్యాయని చెప్పారు.ఇదీ చదవండి: అచ్చం ఖడ్గం సినిమాలోలా : విద్యావ్యవస్థపై వ్యాపారవేత్త సెటైర్లుOpen Letter to PM:We urge PM @narendramodi to provide ₹1 crore in compensation to the families of students who died by suicide due to the paper leak crisis. pic.twitter.com/p6gOuNRvsT— Abhijeet Dipke (@abhijeet_dipke) June 19, 2026అభిజీత్ దీప్కే డిమాండ్స్తమ జీవితకాల పొదుపు మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి, విద్యా రుణాలు తీసుకున్న బాధిత కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున ఆర్థిక సహాయం అందించాలి.పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుని జవాబుదారీలను చేయాలి.విద్యావ్యవస్థలో జరుగుతున్న వరుస లోపాలు, పేపర్ లీకేజీల వల్ల ప్రజల్లో నమ్మకం పోయిందని పేర్కొంటూ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. జంతర్ మంతర్ వద్ద జూన్ 21 నిరసనమరో వైపు తమ డిమాండ్లను నెరవేర్చాలని , పోటీ పరీక్షలపై మళ్లీ నమ్మకాన్ని పునరుద్ధరించేలా సంస్కరణలు తీసుకురావాలని కోరుతూ ఇప్పటికే ఢిల్లీలోని జంతర్మంతర్ సహా, దేశంలో అనేక ప్రధాన నగరాల్లో ఉద్యమాన్ని చేపట్టింది సీజేపీ ఆధ్వర్యంలో మరింత ఒత్తిడి తెచ్చేందుకు జూన్ 20 నుండి దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గుమిగూడనున్నట్లు దీప్కే ప్రకటించారు. కాగా, నీట్ యూజీ (NEET UG 2026) రీ-ఎగ్జామినేషన్ జూన్ 21న దేశవ్యాప్తంగా కేటాయించిన పరీక్షా కేంద్రాలలో జరగాల్సి ఉంది.ఇదీ చదవండి: 60 ఏళ్లకి లవ్, 75 రోజులకే పెళ్లి : నటి లవ్ స్టోరీ -
షాకింగ్ : కట్టేసి, జుట్టు కత్తిరించి, పైశాచికంగా.. వీడియో వైరల్
ఛత్తీస్గఢ్లోని కోరియా జిల్లా పాండోపారా గ్రామంలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భార్య, నలుగురు బిడ్డల తల్లిపై అనుమానంతో భర్త అతి దారుణంగా ప్రవర్తించిన వైనం దిగ్భ్రాంతి రేపింది. ఈ ఘోరానికి సంబంధించిన వీడియోపై నెటిజన్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రాయ్పూర్కు ఉత్తరాన సుమారు 350 కి.మీ దూరంలో ఈ ఘటనచోటు చేసుకుంది. బాధితురాలు తారా బాయి (32)కు నిందితుడు జితేంద్ర ఘసియాతో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. విబేధాలతో భార్యాభర్త లిద్దరు విడిగా ఉంటున్నారు. అయితే పిల్లలు మాత్రం తండ్రి వద్దే ఉంటున్నారు.భార్యపై అనుమానంతో అత్యంత అమానుషంగా దాడి చేశాడు జితేంద్ర. చేతులు కాళ్లు, కట్టేసి ఆమె పదే పదే దాడి చేశాడు. అనంతరం ఆమె జుట్టును కత్తిరించి తీవ్ర అవమానానికి గురిచేశాడు .ఈ దారుణాన్ని అడ్డుకోవాల్సింది పోయి, మరో మహిళకూడా ఆమెపై చేయి చేసుకోవడం ఈ వీడియోలో చూడొచ్చు. ఈ ఘాతుకాన్ని రికార్డ్ కూడా చేశాడు. 💔 #DalitWoman Tara Bai was brutally assaulted by her estranged husband in Chhattisgarh: tied up, beaten, head shaved, smeared with black substance & forced to drink urine. Caste & gender violence continue. Justice for Tara Bai! #StopViolence #ShotOnPaPhone #ApolloTyres pic.twitter.com/zCBduhT2oS— Kavita Kumari (@KavitaDevi5252) June 19, 2026అసలేం జరిగింది? అయితే, ఏడాది క్రితం భర్త ఆమెను వదిలేయడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఆమె, తన సామాజిక వర్గానికి చెందిన ఒక పరిచయస్తుడి ఇంట్లో ఆశ్రయం పొందుతోంది. నిందితుడు ఆమెను ఇంటి బయటకు రప్పించి, అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా చంపేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత రాక్షసుడిలా మారిపోయాడు. దారుణంగా కొట్టి అమానుషంగా ప్రవర్తించడంతోపాటు, మూత్రం తాగించాడు. ఇదీ చదవండి: అచ్చం ఖడ్గం సినిమాలోలా : విద్యావ్యవస్థపై వ్యాపారవేత్త సెటైర్లుబాధితురాలు ఫిర్యాదు చేయడంతో, స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.తనపై పిడిగుద్దులు కురిపించి, తన జుట్టును కత్తిరించారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన స్థానిక పోలీసులు ఆమె భర్తపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఘటనా స్థలంలో ఉన్న ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయడంతోపాటు, వీడియో ఫుటేజీని పరిశీలిస్తున్నామన్నారు. విచారణ అనంతరం నిందితుడిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఒక పోలీసు అధికారి ప్రకటించారు.ఇదీ చదవండి: బీమా లేకుండానే చీప్గా కాంటాక్ట్ లెన్స్ : అమెరికన్ మహిళ సంబరంఇదీ చదవండి: 60 ఏళ్లకి లవ్, 75 రోజులకే పెళ్లి : నటి లవ్ స్టోరీ -
నా కొడుకు రాజకీయాల్లోకి రాడు.. పళని సంచలన ప్రకటన
సాక్షి, చైన్నె: తన కుమారుడు మిథున్ రాజకీయాల్లోకి ప్రవేశించబోవడం లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం ఎడప్పాడి కె. పళనిస్వామి స్పష్టం చేశారు. తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియాలో వస్తున్న ఊహాగానాలను ఖండిస్తూనే, కొత్తగా ఏర్పాటైన టీవీకే కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.వారసత్వ రాజకీయాలపై క్లారిటీతన కుమారుడు మిథున్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు కొన్ని టీవీ ఛానళ్లలో జరుగుతున్న చర్చలు ముమ్మాటికీ అవాస్తవమని ఖండించారు. ఆయన కేవలం అన్నాడీఎంకే ప్రాథమిక సభ్యుడిగా మాత్రమే ఉన్నారన్నారు. పార్టీలో ఎలాంటి పదవిలోనూ లేరని, తన కుమారుడు మిథున్ భవిష్యత్తులోనూ రాజకీయాల్లోకి రాబోరని నేను కచ్చితంగా, స్పష్టంగా తెలియజేస్తున్నానని అన్నారు. మీడియా సంస్థలు ఇలాంటి అవాస్తవ ప్రచారాలను నిలిపివేయాలని కోరారు. అలాగే అన్నాడీఎంకేను ఎవరూ కదిలించలేరని, గెలుపోటములు సహజమని వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగం కేవలం కలలో వేసిన నీటి మూట లాంటిదని ఎద్దేవా చేశారు.మళ్లీ రాజుకున్న అసంతృప్తి మరోవైపు.. అన్నాడీఎంకేలో అసమ్మతి జ్వాలలు చల్లారడం లేదు. గురువారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే, అసంతృప్త ఎమ్మెల్యేలంతా సీనియర్ నేత సి.వి. షణ్ముగం నివాసంలో ఆకస్మికంగా సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే విషయంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మధ్య తీవ్ర అభిప్రాయ భేదాలుతలెత్తిన విషయం తెలిసిందే. పార్టీ సీనియర్లు వేలుమణి, సి.వి. షణ్ముగం నేతృత్వంలోని 25 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయడంతోపార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామికి షాక్ తప్పలేదు. ఆ తదుపరి పరిణామాలతో పార్టీకి, ఎమ్మెల్యే పదవికి నలుగురు రాజీనామా చేశారు. చివరకు రాజీ చర్చలతో వేలుమణితోపాటుగా ఇతర ఎమ్మెల్యేలు పళణి పక్షాన చేరారు. అయితే, సీవీ షణ్ముగం, సీ విజయ భాస్కర్ మాత్రం దూరంగా ఉంటూ వచ్చారు. వీరిలో సీ విజయ భాస్కర్ తన ఎమ్మెల్యే పదవికి బుధవారం రాజీనామా చేశారు. సీవీ షణ్ముగం మాత్రం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీ సర్వ సభ్య సమావేశం నిర్వహించాలని పట్టుబడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో గురువారం చెన్నైలోని సీవీ షణ్ముగం నివాసంలో జరిగినæ ఆకస్మిక సమావేశంలో వేలుమణి, నత్తం విశ్వనాథన్, కె.పి. అన్బళగన్ హాజరు కావడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. -
విజయ్ బిగ్ మూవ్.. ఇరకాటంలో కాంగ్రెస్!
కావేరీ నది జలాలపై కర్ణాటక ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న మేకెదాటు డ్యామ్ ప్రాజెక్ట్కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ శుక్రవారం ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెడుతూ.. కేంద్రం కూడా ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని తన రాష్ట్ర రైతుల హక్కులను కాపాడే దిశగా గట్టి వైఖరి ప్రదర్శించారు.కర్ణాటక ప్రభుత్వం రూ. 9,000 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ జలాశయ ప్రాజెక్ట్ ఏకపక్ష చర్యగా ఉందని ఆ తీర్మానంలో తమిళనాడు ఆరోపించింది. కావేరీ జల వివాద ట్రైబ్యునల్ తీర్పు (2007).. అలాగే సుప్రీంకోర్టు తీర్పు (2018)ను ఉల్లంఘించే ప్రయత్నంగా ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగుతోందని తీర్మానంలో సీఎం విజయ్ పేర్కొన్నారు.ఈ తీర్మానం ప్రకారం కావేరీ బేసిన్ ఇప్పటికే నీటి కొరత ఉన్న ప్రాంతమని, అందుబాటులో ఉన్న నీరు రాష్ట్రాల మధ్య పంచబడిపోయిందని ఆయన పేర్కొన్నారు. అందువల్ల కొత్త ప్రాజెక్టులు లేదా అదనపు నీటి వినియోగానికి అవకాశం లేదని స్పష్టం చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని మేకెదాటు ప్రాజెక్ట్కు ఎలాంటి అనుమతులు, సాంకేతిక లేదంటే పర్యావరణ క్లియరెన్స్లు ఇవ్వకూడదని తమిళనాడు అసెంబ్లీ తరఫున కోరారాయన. కేంద్ర జల సంఘం కూడా ఈ ప్రాజెక్ట్ వివరాల నివేదికను పరిశీలించకూడదని తీర్మానంలో సూచించారు.నీరు అనేది ప్రజల ప్రాథమిక హక్కు అని, దాన్ని కాపాడటం తమ ప్రభుత్వ బాధ్యత అని సీఎం విజయ్ స్పష్టం చేశారు. రాజకీయ భేదాలు ఉన్నా ప్రజల ప్రయోజనాల విషయంలో అందరూ ఏకతాటిపై నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ చర్చలో డీఎంకే, ఇతర పక్షాలు సైతం తీర్మానానికి మద్దతుగా మాట్లాడాయి.#TamilNadu CM Joseph #Vijay passed a resolution in assembly opposing Karnataka’s Mekedatu dam on Cauvery, citing tribunal and #SupremeCourt violations.#20xSubscribedSMEIPO pic.twitter.com/WaMKj7isb7— News Update (@NewsNew1578) June 19, 2026బెంగళూరు తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు జలవిద్యుత్ ఉత్పత్తి కోసం ఈ ప్రాజెక్ట్ అవసరమని కర్ణాటక చెబుతోంది. అయితే.. తమిళనాడు మాత్రం ఇది తమ రాష్ట్ర నీటి హక్కులకు నష్టం కలిగిస్తుందని గట్టి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇదే సమయంలో ఈ అంశంపై ముఖ్యమంత్రి విజయ్, దేశ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసి.. కర్ణాటక సమర్పించిన డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను తిరస్కరించాలని కోరడం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామాలతో మేకెదాటు వివాదం మరోసారి దేశవ్యాప్తంగా రాజకీయంగా వేడెక్కింది.👉ఈ తీర్మానంలో అత్యంత కీలక అంశంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన చీలిక. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, అదే పార్టీకి చెందిన నాయకత్వం ఉన్నప్పటికీ తమిళనాడు కాంగ్రెస్ నాయకులు మాత్రం విజయ్ సర్కార్ తీసుకున్న తీర్మానానికి మద్దతు ఇవ్వడం రాజకీయంగా విభేదాలకు దారితీసింది. రెండు రాష్ట్రాల్లో ఒకే పార్టీ వేర్వేరు వైఖరులు తీసుకోవడం కాంగ్రెస్ను చిక్కుల్లోకి పడేసింది.కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఈ తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, మేకెదాటు ప్రాజెక్ట్ తమ రాష్ట్ర అభివృద్ధి, బెంగళూరు తాగునీటి అవసరాలకు అవసరమని వాదిస్తున్నారు. కేంద్రం నుంచి అనుమతులు తీసుకుని ముందుకు సాగుతామని వారు స్పష్టం చేస్తున్నారు.అదే సమయంలో తమిళనాడు కాంగ్రెస్ నేతలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వ తీర్మానానికి అనుకూలంగా స్పందిస్తూ, కావేరీ జలాలపై తమిళనాడు హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ పడలేమని వారు చెబుతున్నారు. ఇలా రెండు రాష్ట్రాల్లో ఒకే పార్టీ నేతలు భిన్న భిన్న వైఖరులు తీసుకోవడంతో కాంగ్రెస్ హైకమాండ్కు పరిస్థితి ఇరకాటంగా మారింది. ఈ ప్రాజెక్టు నేపథ్యం.. మేకెదాటు ప్రాజెక్ట్ కర్ణాటకలోని కనకపుర–రామనగర ప్రాంతాల మధ్య కావేరీ నదిపై నిర్మించాలనుకుంటున్న బ్యాలెన్సింగ్ జలాశయ ప్రాజెక్ట్. మేకెదాటు అంటే కన్నడలో “మేక దూకిన స్థలం” అని అర్థం. ఇక్కడ నది సన్నని లోయలో వేగంగా ప్రవహిస్తుంది. ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం బెంగళూరుకు తాగునీరు అందించడం మరియు జలవిద్యుత్ ఉత్పత్తి చేయడం.కావేరీ నీటి ప్రవాహాన్ని నియంత్రించేందుకు రిజర్వాయర్ నిర్మించాలన్నది కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదన. ఇదేం కొత్తది కాదు. 1940 నుంచే ఉంది. అయితే 2017లో అప్పటి ప్రభుత్వం తెర మీదకు తీసుకొచ్చింది. అయితే మేకెదాటు వల్ల దిగువ రాష్ట్రం తమిళనాడు నీటి ప్రవాహం తగ్గుతుందని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అంశం మాత్రమే కాకుండా రెండు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలిక జల వివాదంగా మారింది. -
అచ్చం ఖడ్గం సినిమాలోలా : విద్యావ్యవస్థపై వ్యాపారవేత్త సెటైర్లు
ఉన్నత చదువులు చదువు కుంటే భవిష్యత్తు బావుంటుంది అని అందరం అనుకునే మాట. చదువును మించిన సంపద లేదని చిన్నప్పటినుంచీ మన తల్లిదండ్రులు,గురువులు నేర్పిన పాఠం. అయితే సామాజిక వాస్తవాలను, విద్యారంగంలోని లోపాలను ఎత్తి చూపడానికి ఖడ్గం సినిమాలో చెప్పినట్టు చదువుకున్నవారు గుమస్తాలుగా, చదువురానివారు వ్యాపారవేత్తలుగా మారి పోతున్నారనే మాట చలామణీలో ఉంది. అచ్చం ఇలాగే డిగ్రీలొద్దు..బొగ్రీలొద్దు అంటూ ప్రముఖ ఇన్వెస్టర్ అభిప్రాయం నెట్టింట సందడి చేస్తోంది. భారతీయ విద్యా వ్యవస్థ,ప్రమాణాలపై ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.మార్సెల్లస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ (Marcellus Investment Managers) వ్యవస్థాపకుడు, సీఐఓ సౌరభ్ ముఖర్జియా ఇటీవల ఒక పాడ్కాస్ట్లో క్లాస్ 12 (ఇంటర్మీడియట్) తర్వాత చదువు ఆపేయండి పెద్దగా ఫలితంలేదు అన్నట్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ మధ్యతరగతి కాలేజ్ చదువుల విషయంలో తప్పు చేస్తోందని అభిప్రాయపడ్డారు. ఉద్యోగాల్లోకి ప్రవేశిస్తున్న యువతకు భారతదేశ విద్యావ్యవస్థ ఎలాంటి విలువను జోడించడం లేదని విమర్శించారు. అంతేకాదు దేశంలో అత్యధికంగా సంపాదించేవారు డిగ్రీలు పూర్తి చేసినోళ్లు.. కేవలం 12వ తరగతి చదివి చదువు ఆపేసిన వారే అంటూ సెటైర్లు వేశారు. భారతదేశంలోని కంపెనీలు/యజమానులు కాలేజ్ డిగ్రీ వల్ల విద్యార్థులకు ఎలాంటి అదనపు నైపుణ్యాలు రావడం లేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారని ముఖర్జియా పేర్కొన్నారు.బట్టీ పట్టే (రట్నా మారో) విధానంభారతదేశ విద్యా విధానం ఇప్పటికీ కేవలం బట్టీ చదువులు, రుద్దుడుపైనే ఆధారపడుతోందని ముఖర్జియా అన్నారు. ఆయన మాటల్లో చెప్పాలంటే, బట్టీ పట్టడం, పోయి ఎగ్జామ్లో రాయడం తప్పే పిల్లలకు ఒరిగేదేమీ లేదన్నారు. ఈ విధానం వల్ల విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఎలక్ట్రిక్ వాహనాలు (EV), బయోటెక్, క్లీన్ టెక్ , అధునాతన సైన్స్ వంటి సరికొత్త సాంకేతిక ప్రపంచానికి సిద్ధం కాలేకపోతున్నారన్నారు.అసలు ఏఐ విషయాన్ని పక్కన పెడితే, మన డేటాలోనే ఈ సమస్య స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. పట్టభద్రుల నిరుద్యోగిత గణాంకాలు దీని తీవ్రతను తెలియజేస్తోందని వాదించారు. కాలేజీల నుండి బయటకు వస్తున్న ప్రతి 100 మంది గ్రాడ్యుయేట్లలో కేవలం ముగ్గురు మాత్రమే వారు పాసైన సంవత్సరంలో ఉద్యోగం పొందుతున్నారని చెప్పారు.డిగ్రీలున్నవారే నిరుద్యోగులుగా!గ్రాడ్యుయేట్ల నిరుద్యోగిత రేటు దాదాపు 30-40 శాతం వరకు ఉందని, అదే చదువురాని వారిలో (illiterate) ఇది కేవలం 3శాతం మాత్రమే ఉందని ఆయన పేర్కొన్నారు.యూనివర్సిటీ వ్యవస్థ అనేది నైపుణ్యాలు పెంచేదిశగా కాకుండా బండ చదువులు ప్రక్రియగా మారిందని విమర్శించారు. ఇది స్కూలు రోజులనుండే మొదలవుతోందని, ప్రాథమిక స్థాయినుంచే బట్టీ పట్టడమనే అలవాటుతో వారి మెదళ్లు మొద్దుబారిపోతున్నాయని విశ్లేషించారు. ఫలితంగా భారత్ అధునాతన రంగాలలో సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ఇబ్బంది పడుతోందని అన్నారు. ఏ రంగంలోనూ అభివృద్ధి చెందలేకపోతున్నామంటూ ( నా తో హమ్ AI మే హై, నా EV మే, నా బయోటెక్ మే, నా క్లీన్ టెక్ మే) అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.ఈసందర్భంగా తాను రాసిన పుస్తకం 'బ్రేక్పాయింట్' (Breakpoint) ను ప్రస్తావిస్తూ... భారతదేశంలో అత్యధికంగా సంపాదించే కొందరు వ్యక్తులు 12వ తరగతి ముగించి చదువు ఆపేసిన వారేనని కంపెనీల యజమానుల ధోరణిని బట్టి అర్థమవుతోందని ముఖర్జియా చెప్పారు. దీనికి ముంబై లేబర్ మార్కెట్ను ఆయన ఒక ఉదాహరణగా తీసుకున్నారు, ఏసీ ఆఫీస్ ఉద్యోగం కోసం ప్రయత్నించే ఒక గ్రాడ్యుయేట్ కంటే, కన్స్ట్రక్షన్ సైట్ (నిర్మాణ రంగం)లో పనిచేసే వ్యక్తి ఎక్కువ సంపాదించవచ్చు.ఒక నిర్మాణ కార్మికుడు డిగ్రీ చదివిన వ్యక్తి కంటే రెండు రెట్లు ఎక్కువ సంపాదిస్తాడు, ఒక జేసీబీ ఆపరేటర్ అంతకంటే ఎక్కువ సంపాదించగలడని ఆయన ఉదాహరించారు.ఇది కేవలం విద్యావ్యవస్థకు సంబంధించిన సమస్య మాత్రమే కాదనీ, ఆర్థిక వ్యవస్థకు సంబంధించినది కూడా అభిప్రాయపడ్డారు. భారతదేశం ఆధునిక ప్రపంచంతో పోటీ పడాలంటే, మన విద్యా విధానం బట్టీ పద్ధతుల నుండి బయటపడి, యువతకు "ఎలా ఆలోచించాలి" అనేది నేర్పించాల్సి ఉంటుందని సూచించారు. ఇదీ చదవండి: 60 ఏళ్లకి లవ్, 75 రోజులకే పెళ్లి : నటి లవ్ స్టోరీ -
టెలిగ్రామ్కు ఢిల్లీ హైకోర్టు షాక్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన టెలిగ్రామ్ యాప్ తాత్కాలిక నిషేధంపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధాన్ని కోర్టు సమర్థిస్తూ.. ఆ నిర్ణయం సరైన కారణాలతో తీసుకున్నదేనని శుక్రవారం స్పష్టం చేసింది.జూన్ 21న జరగనున్న నీట్ యూజీ రీ పరీక్ష నేపథ్యంలో, ప్రశ్నాపత్రాలు లీక్ కావడం లేదా దుర్వినియోగం జరగకుండా ముందస్తు జాగ్రత్తగా కేంద్రం టెలిగ్రామ్ యాప్పై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ టెలిగ్రామ్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ఢిల్లీ హైకోర్టు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకున్న చర్యగా దీన్ని సమర్థించింది.కోర్టు వ్యాఖ్యానిస్తూ, ప్రభుత్వానికి సరైన కారణాలు ఉన్నాయని, సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ 69ఏ ప్రకారం విధించిన విధానాన్ని పూర్తిగా పాటించారని పేర్కొంది. అందుబాటులో ఉన్న అత్యల్ప పరిమితి చర్య ఇదేనని అభిప్రాయపడింది.కేంద్ర ప్రభుత్వం తన వాదనల్లో టెలిగ్రామ్ ఛానెళ్లు ఉగ్రవాద కార్యకలాపాలు, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల రవాణా వంటి అక్రమ కార్యకలాపాలకు వేదికగా మారుతున్నాయని తెలిపింది. ఇవి ఒక విధంగా “చీకటి వెబ్” తరహాలో పనిచేస్తూ, నేరగాళ్లను గుర్తించడం కష్టతరం చేస్తున్నాయని కోర్టుకు వివరించింది.మరోవైపు, టెలిగ్రామ్ ఈ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ, ఇది కోట్లాది వినియోగదారుల హక్కులకు భంగం కలిగిస్తుందని వాదించింది. పేపర్ లీక్లను అడ్డుకోవడానికి యాప్ను నిషేధించడం సరైన పరిష్కారం కాదని, ఇతర యాప్ల ద్వారానూ ఇలాంటి సమస్యలు జరుగుతాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన హైకోర్టు, ప్రభుత్వ నిర్ణయంలో లోపం లేదని తేల్చింది. నిషేధ ఉత్తర్వులు కారణాలతో కూడుకున్నవని, అవి సరైన పరిశీలనతో తీసుకున్నవేనని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో దేశంలో టెలిగ్రామ్ యాప్పై విధించిన తాత్కాలిక నిషేధం నిర్ణయించిన గడువు వరకు కొనసాగనుంది. -
భారత్ ఏఐ కలను వెంటాడుతున్న కొత్త విలన్!
కృత్రిమ మేధ (AI) రంగంలో ప్రపంచ శక్తిగా ఎదగాలని భారత్ భారీ ప్రణాళికలు రచిస్తోంది. వేల కోట్ల పెట్టుబడులతో కొత్త డేటా సెంటర్లు, క్లౌడ్ మౌలిక సదుపాయాలు, ఏఐ కంప్యూటింగ్ హబ్లు ఏర్పాటవుతున్నాయి. అయితే ఈ డిజిటల్ కలలకు ఇప్పుడు ఊహించని సవాల్ ఎదురు కాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా నిర్మించబోతున్న డేటా సెంటర్లపై నిర్వహించిన తాజా అధ్యయనం భారత్కు హెచ్చరికలు జారీ చేసింది. అది విద్యుత్ కొరతో.. నీటి కొరతో కాదంట.. ఏఐ విప్లవం ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. చాట్బాట్లు, జనరేటివ్ ఏఐ, క్లౌడ్ సేవలు, డిజిటల్ లావాదేవీలు.. ఇవన్నీ నడవాలంటే భారీ డేటా సెంటర్లు అవసరం. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, టెక్ కంపెనీలు బిలియన్ల డాలర్లు పెట్టుబడులు పెడుతున్నాయి. భారత్ కూడా ఈ పోటీలో ముందంజలో ఉండేందుకు ప్రయత్నిస్తోంది. డేటా లోకలైజేషన్ విధానాలు, పెరుగుతున్న ఇంటర్నెట్ వినియోగం, ఏఐ అవసరాలు దేశాన్ని ప్రపంచ డేటా సెంటర్ హబ్గా మార్చే దిశగా నడిపిస్తున్నాయి. కానీ, వాతావరణ మార్పుల ప్రభావం దేశంలోని డేటా సెంటర్ల పనితీరును తీవ్రంగా దెబ్బతీయొచ్చని ఓ నివేదిక చెబుతోంది. భారత్లో వేగవంతమైన ఏఐ విస్తరణకు ప్రకృతి నుంచి సవాళ్లు ఎదురు కాబోతున్నాయి. తాజాగా విడుదలైన ‘‘2026 Global Analysis of Planned Data Centres for Physical Climate Risk and Resilience’’ నివేదిక ఈ వివరాలను సమగ్రంగా వెల్లడించింది. వాతావరణ ప్రమాదాలపై పరిశోధనలు చేసే ఎక్స్డీఐ (Cross Dependency Initiative - XDI) సంస్థ ఈ అధ్యయనాన్ని చేపట్టింది.ప్రపంచవ్యాప్తంగా నిర్మాణ దశలో ఉన్న లేదా ప్రణాళికలో ఉన్న 2,595 డేటా సెంటర్లను పరిశీలించిన ఈ అధ్యయనం ఒక కీలక విషయాన్ని గుర్తించింది. ఇప్పటివరకు డేటా సెంటర్ల గురించి చర్చలు ప్రధానంగా విద్యుత్ వినియోగం, నీటి అవసరాల చుట్టూనే తిరిగాయి. కానీ భవిష్యత్తులో అసలు ముప్పు నేరుగా వాతావరణ మార్పుల వల్ల రావచ్చని ఈ నివేదిక చెబుతోంది.భారత్ పరిస్థితి ఏంటి?.. ఈ విశ్లేషణ ప్రకారం వాతావరణ సంబంధిత ప్రమాదాల తీవ్రతలో భారత్ ప్రపంచవ్యాప్తంగా 11వ స్థానంలో ఉంది. ముఖ్యంగా దేశంలోని కీలక టెక్నాలజీ కేంద్రాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు.. ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా డేటా సెంటర్ల కార్యకలాపాలు దెబ్బతినే ప్రమాదం ఉన్న టాప్-30 ప్రాంతాల్లో చోటు దక్కించుకున్నాయి.ఇది సాధారణ హెచ్చరిక కాదు. ఎందుకంటే భారత్లో ప్రస్తుతం డేటా సెంటర్ పెట్టుబడుల పోటీ ఎక్కువగా ఈ రాష్ట్రాల చుట్టూనే తిరుగుతోంది. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలు ఇప్పటికే ప్రధాన డేటా హబ్లుగా ఎదుగుతున్నాయి. ఇక్కడే భవిష్యత్తు ఏఐ మౌలిక సదుపాయాల నిర్మాణం కూడా వేగంగా సాగుతోంది.వేడి ఎందుకు అంత ప్రమాదకరం?వరదలు వస్తే భవనాలు దెబ్బతింటాయి. తుఫాన్లు వస్తే మౌలిక సదుపాయాలు నాశనం అవుతాయి. కానీ తీవ్ర ఉష్ణోగ్రతల ప్రభావం అంత స్పష్టంగా కనిపించదు. అయినప్పటికీ అది మరింత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. డేటా సెంటర్లలో వేల సంఖ్యలో సర్వర్లు నిరంతరం పనిచేస్తుంటాయి. ఇవి సహజంగానే భారీగా వేడిని ఉత్పత్తి చేస్తాయి. అందుకే వాటిని చల్లబరచడానికి అధునాతన కూలింగ్ వ్యవస్థలు అవసరం. బయట ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ కూలింగ్ ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి.అంతేకాదు..విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుందిపరికరాల సామర్థ్యం తగ్గుతుందిసర్వర్ వైఫల్యాల ప్రమాదం పెరుగుతుందిసేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంటుందినిర్వహణ ఖర్చులు పెరుగుతాయిఅంటే డేటా సెంటర్ భవనం సురక్షితంగానే ఉన్నా.. తీవ్ర వేడి కారణంగా దాని పనితీరు దెబ్బతినే అవకాశం ఉంటుంది.అసలు ముప్పు భవనం బయటే ఉందా?ఈ నివేదికలో మరో ఆసక్తికర అంశం కూడా ఉంది. డేటా సెంటర్ ఎంత బలంగా నిర్మించినా అది ఒంటరిగా పనిచేయదు. దానికి విద్యుత్ సరఫరా, నీటి వనరులు, టెలికాం నెట్వర్క్లు, రవాణా వ్యవస్థలు, సరఫరా గొలుసులు అవసరం. ఒకవేళ తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగా విద్యుత్ గ్రిడ్లు విఫలమైతే? నీటి సరఫరా నిలిచిపోతే? రవాణా వ్యవస్థలు స్తంభిస్తే? డేటా సెంటర్ నేరుగా దెబ్బతినకపోయినా దాని కార్యకలాపాలు ఆగిపోవచ్చు.యూరప్లో నిర్వహించిన మరో అధ్యయనాన్ని ఉదహరిస్తూ ఎక్స్డీఐ ఒక కీలక విషయాన్ని పేర్కొంది. నేరుగా భవనానికి జరిగే నష్టం కంటే ఇలాంటి పరోక్ష మౌలిక సదుపాయాల వైఫల్యాల వల్ల కలిగే ఆర్థిక నష్టం పది రెట్లు ఎక్కువగా ఉండొచ్చని అంచనా.ప్రపంచానికి కూడా ఇదే సమస్యఈ ముప్పు కేవలం భారత్కే పరిమితం కాదు. దక్షిణాసియా, ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా ప్రాంతాలు మొత్తం అధిక ప్రమాద జోన్లుగా గుర్తించబడ్డాయి. ప్రస్తుతం దక్షిణాసియాలో ప్రణాళికలో ఉన్న డేటా సెంటర్లలో సుమారు 12 శాతం ఇప్పటికే అధిక ప్రమాద కేటగిరీలో ఉన్నాయి. అధిక కార్బన్ ఉద్గారాలు కొనసాగితే శతాబ్దం చివరినాటికి ఈ ప్రమాదం మూడింతలకు పైగా పెరిగే అవకాశం ఉందని నివేదిక హెచ్చరిస్తోంది. భారత్తో పాటు బ్రెజిల్, మెక్సికో, ఇండోనేషియా, స్పెయిన్ వంటి దేశాల్లో కూడా తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా కార్యకలాపాలకు అంతరాయం కలిగే ప్రమాదం అధికంగా ఉందని పేర్కొంది.బీమా ఖర్చులు కూడా..డేటా సెంటర్లపై పెట్టుబడులు పెరుగుతున్న కొద్దీ బీమా సంస్థలు కూడా వాతావరణ ప్రమాదాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత రీఇన్సూరెన్స్ సంస్థ Swiss Re అంచనా ప్రకారం ప్రస్తుతం సుమారు 10.6 బిలియన్ డాలర్లు ఉన్న డేటా సెంటర్ బీమా మార్కెట్ 2030 నాటికి 24.2 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది. అంటే భవిష్యత్తులో వాతావరణ ప్రమాదాలు పెరిగితే బీమా ప్రీమియంలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇది కొత్త ప్రాజెక్టుల వ్యయాలను మరింత పెంచుతుంది.మరి పరిష్కారం మాటేంటి?..అయితే ఇది అనివార్యమైన సంక్షోభం కాదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రణాళిక దశలో ఉన్న డేటా సెంటర్ల విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని సూచిస్తున్నారు.సరైన ప్రాంతాల ఎంపికఅధునాతన కూలింగ్ టెక్నాలజీలువాతావరణ నిరోధక డిజైన్లుబలమైన విద్యుత్ బ్యాకప్ వ్యవస్థలునీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడంపునరుత్పాదక ఇంధనాల వినియోగం.. ఇలాంటి చర్యలు భవిష్యత్తు ప్రమాదాలను తగ్గించగలవని పేర్కొంటున్నారు.ఏఐ యుగంలో డేటా సెంటర్లు కొత్త కాలపు ఫ్యాక్టరీలుగా మారుతున్నాయి. డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఇవే వెన్నెముక. భారత్ ప్రపంచ ఏఐ శక్తిగా ఎదగాలంటే కేవలం పెట్టుబడులు ఆకర్షించడం సరిపోదు. ఆ మౌలిక సదుపాయాలు రాబోయే దశాబ్దాల్లో పెరుగుతున్న వేడి, తీవ్రమవుతున్న వాతావరణ మార్పులను కూడా తట్టుకునేలా ఉండాలి. లేకపోతే నేటి డిజిటల్ కలలు.. రేపటి క్లైమేట్ రిస్క్ల ముందు నిలబడలేకపోవచ్చు. ఇదే తాజా నివేదిక ఇస్తున్న అసలు హెచ్చరిక. -
ఖాళీగా ఓలా.. అయినా ఉబర్ కోసం అరగంట వెయిటింగ్!
ధర తక్కువగా ఉండడమో లేదంటే వెంటనే అందుబాటులో ఉండడమో.. ఈ కారణాలతోనే వినియోగదారుడు ఏదైనా ఎంచుకుంటాడని అనుకుంటాం. కానీ బెంగళూరు విమానాశ్రయంలో జరిగిన ఓ సంఘటన మాత్రం అందుకు భిన్నమైన చిత్రాన్ని చూపించింది. ఓలా క్యాబ్లు సిద్ధంగా ఉన్నా.. ప్రయాణికులు మాత్రం అరగంటపాటు ఉబర్ కోసం వేచి ఉండడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.బెంగళూరుకు చెందిన ఆకాశ్ కొటాల్వార్ అనే వ్యక్తి తన లింక్డ్ఇన్ పోస్టులో ఆసక్తికర అనుభవాన్ని పంచుకున్నాడు. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-2లో దిగిన తర్వాత ఉబర్ గో సేవ కోసం దాదాపు 30 నుంచి 40 మంది ప్రయాణికులు క్యూలో నిలబడి ఉన్నారని తెలిపాడు. అదే సమయంలో ఓలా కౌంటర్ వద్ద క్యాబ్లు సిద్ధంగా ఉన్నాయని, వెంటనే ప్రయాణం ప్రారంభించవచ్చని సిబ్బంది చెబుతున్నప్పటికీ ఎవరూ అక్కడికి వెళ్లలేదని పేర్కొన్నాడు. అయితే.. ఆకాశ్ కూడా ఉబర్ కోసం సుమారు 30 నిమిషాల నిరీక్షణ సమయం కనిపించిందని, అయినప్పటికీ ఓలాకు మారకుండా ఉబర్లోనే ఖరీదైన ‘ఉబర్ కంఫర్ట్’ సేవను ఎంచుకున్నానని ఆకాష్ తెలిపాడు. తనలాగే క్యూలో ఉన్నవారిలో కూడా ఎవరూ ఓలాకు మారలేదని చెప్పాడు.కారణం ఏంటంటే.. ఇది బ్రాండ్ లాయల్టీ (బ్రాండ్పై అభిమానం) కంటే "స్విచింగ్ కాస్ట్" అనే మానసిక భావనకు ఉదాహరణ అని ఆకాష్ అభిప్రాయపడ్డాడు. కొత్త సేవకు మారితే ఏమవుతుందో తెలియని అనిశ్చితి, ఇప్పటికే అలవాటైన సేవను వదలాలనే ఇబ్బంది.. దీనినే 'స్విచింగ్ కాస్ట్'గా పిలుస్తారు. ఈ కేసులో.. జర్నీ కోసం మరో యాప్ డౌన్లోడ్ చేయడం, కొత్త సేవను ప్రయత్నించడం, అనిశ్చితిని ఎదుర్కోవడం కంటే ఇప్పటికే తెలిసిన సేవనే వినియోగదారులు ఎంచుకుంటారని వివరించాడు. అంటే.. ప్రజలు కేవలం తక్కువ ధర కోసం కాకుండా, "ఏం జరుగుతుందో ముందే తెలిసిన నమ్మకం" కోసం కూడా ఎక్కువ డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటారన్నమాట.ఈ పోస్టుపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు ఉబర్ సేవలు గతంలో మరింత స్థిరంగా, వినియోగదారులకు అనుకూలంగా ఉండటంతో ప్రజలు దానిని ఎక్కువగా నమ్ముతున్నారని వ్యాఖ్యానించారు. మరికొందరు మాత్రం వినియోగదారుల నిర్ణయం పరిస్థితిని బట్టి మారుతుందని, ధరలు, సౌలభ్యం, ప్రయాణ సమయం వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతాయని అభిప్రాయపడ్డారు.మొత్తంగా.. బెంగళూరు విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన ఒక విషయాన్ని స్పష్టం చేసింది. వినియోగదారుల ఛాయిస్ మన అంచనాలకు తగ్గట్లు ఉండదు. కొన్నిసార్లు నమ్మకం, అలవాటు, ముందస్తు అనుభవం కూడా వారి నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే ఓలా క్యాబ్లు సిద్ధంగా ఉన్నా.. ఉబర్ కోసం ప్రయాణికులు క్యూలో నిలబడిన దృశ్యం ఇప్పుడు చర్చకు దారితీసింది. -
పాకిస్తాన్కు బిగ్ షాక్.. భారత్ దెబ్బ అదుర్స్
దాయాది దేశం పాకిస్తాన్పై భారత్ మరోసారి విరుచుకుపడింది. ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్, పాక్ మధ్య సింధూ జలాల ఒప్పంద విషయంలో పాకిస్తాన్ను కడిగిపారేసింది. పాత ఒప్పందానికి ఇప్పుడు కాలం చెల్లిపోయిందని గట్టి హెచ్చరికలు చేసింది. అలాగే, అంతర్జాతీయ వేదికలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలనే పాక్ కుటిల ప్రయత్నాలకు భారత్ స్ట్రాంగ్ కౌంటరిచ్చింది.జెనీవాలో శుక్రవారం ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి 62వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భారత్ తన 'రైట్ ఆఫ్ రిప్లై'ను ఉపయోగించుకుంది. ఈ సందర్భంగా భారత శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ అనుపమ సింగ్ మాట్లాడుతూ.. భారత్పై పాకిస్తాన్ చేసిన ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చారు. సింధు జలాల ఒప్పందంపై భారత వైఖరి అత్యంత స్పష్టంగా ఉందన్నారు. ఒకవైపు ఉగ్రవాదాన్ని ఒక ప్రభుత్వ విధానంగా మార్చుకున్న పాకిస్తాన్, అంతర్జాతీయ సహకార ఫలాలను, డిమాండ్ చేయడం ఆ దేశ అవివేకానికి నిదర్శనమన్నారు. 1960లో కుదిరిన ఈ ఒప్పందం ప్రస్తుత పరిస్థితులకు, మారుతున్న ప్రపంచ పరిణామాలకు ఎంతమాత్రం సరిపోదని తేల్చి చెప్పారు. కాలం మారిందని, అలాగే ఒప్పందం కూడా మారాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఆరు దశాబ్దాల నాటి ఈ ఒప్పందాన్ని ఎప్పటికీ చెక్కుచెదరని శాశ్వత హక్కుగా లేదా జవాబుదారీతనం లేని అధికారంగా భావించలేమని స్పష్టం చేశారు. అంతర్జాతీయ వేదికలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలనే పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాలన్నారు.#WATCH | First Secretary at the Permanent Mission of India to the United Nations, Anupama Singh says, "Our position on Indus Water Treaty is well known. It defies logic that a state which exports terror as an instrument of policy continues to demand the privileges of cooperation… pic.twitter.com/D3takMgklM— ANI (@ANI) June 18, 2026అలాగే, పాక్ను ఫ్రాంకెన్స్టైన్ స్టేట్ (సొంతంగా సృష్టించిన భూతం చేతిలోనే నాశనమయ్యే పరిస్థితి)గా అభివర్ణించారు. పాక్ తన అంతర్గత సవాళ్ల పరిష్కారంపై దృష్టిపెట్టాలని హితవు పలికారు. పాక్ రక్షణ మంత్రే స్వయంగా ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడం, వారిని మోహరించడం తమ ప్రభుత్వ విధానమని గతంలో బహిరంగంగానే అంగీకరించారని ఆమె గుర్తు చేశారు. అంతటి ఉగ్రవాద చరిత్ర ఉంచుకుని, మళ్లీ తామే ఉగ్రవాద బాధితులమని పాక్ చెప్పుకోవడం ఒక పెద్ద హాస్యాస్పదంగా ఉందన్నారు. వారు పెంచిన ఉగ్రవాద భూతమే ఇప్పుడు తనను తిరిగి కరుస్తుంటే పాక్ షాక్కు గురవుతోందని దుయ్యబట్టారు.అయితే, గతేడాది పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది మరణించిన నేపథ్యంలో, పాకిస్తాన్ ఉగ్రవాదానికి స్వస్తి పలికేంత వరకు సింధూ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని భారత్ నిర్ణయించింది. పాకిస్తాన్ మనుగడ పూర్తిగా సింధూ నదీ వ్యవస్థపైనే ఆధారపడి ఉంది. పాక్లో 16 మిలియన్ హెక్టార్ల వ్యవసాయ భూమిలో దాదాపు 80 శాతం భూమికి ఈ నదీ జలాలే ఆధారం. అంతేకాకుండా, ఆ దేశం ఉపయోగించే మొత్తం నీటి వినియోగంలో 93 శాతం సింధూ నది నుంచే వస్తుంది. ఈ నేపథ్యంలో, తన దేశ ఆర్థిక, భౌగోళిక మనుగడకు కారణమైన నదీ జలాల విషయంలో పాక్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని భారత్ సూచించింది. -
బుడతడి బిగ్ షాట్.. అమ్మ ఐఫోన్ జలసమాధి
ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లలతో గడిపే సమయం కంటే ఫోన్లతో గడిపే సమయమే ఎక్కువైందని చాలామంది అంటుంటారు. అయితే ఆ మాటను ఓ చిన్నారి చాలా సీరియస్గా తీసుకున్నాడేమో! తన తల్లి చేతిలో ఉన్న ఖరీదైన ఐఫోన్ను ఏకంగా సరస్సులోకి విసిరేసి "డిజిటల్ డిటాక్స్"కు శ్రీకారం చుట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ మహిళ తన కుమారుడితో కలిసి బోట్ రైడ్కు వెళ్లింది. ప్రకృతి అందాలను ఆస్వాదించడం, కొడుకుతో సరదాగా గడపడం పక్కన పెట్టి, ఆ క్షణాలను ఐఫోన్లో బంధించడంలో బిజీగా ఉంది. ఇదంతా గమనించిన చిన్నారి... "అమ్మకు ఈ ఫోన్నే ఎక్కువ ఇష్టమా? లేక నేనా?" అన్నట్లు ఒక్కసారిగా ఫోన్ లాక్కొని నేరుగా సరస్సులోకి విసిరేశాడు.ఫోన్ నీటిలో పడిపోయిన వెంటనే తల్లి ముఖంలో కనిపించిన షాక్ చూస్తే, అది సాధారణ ఫోన్ కాదని, బహుశా ఈఎంఐలు ఇంకా పూర్తికాని ఐఫోన్ అయి ఉంటుందని నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. "బాలుడు ఏ తప్పూ చేయలేదు.. కుటుంబ సమయాన్ని కాపాడాడు". "ఆ చిన్నోడికి పర్యావరణ అవార్డు ఇవ్వాలి... కనీసం రెండు గంటలు అయినా అమ్మ సోషల్ మీడియాకు దూరమైంది", "స్టీవ్ జాబ్స్ ఉంటే ఈ వీడియో చూసి ఏడ్చేవాడు" అంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది.Kid throws his mom’s iPhone into the lake during a boat ride 😂 pic.twitter.com/HJs4z7F6lt— Duniya Ke Kalesh (@yadav_army11902) June 18, 2026మరికొందరు అయితే ఆ బాలుడిని "లేక్ సెక్యూరిటీ ఫోర్స్" చీఫ్గా నియమించాలని సూచిస్తున్నారు. "బోట్లో అందరూ ప్రకృతిని చూస్తుంటే, ఒక్క అమ్మ మాత్రమే స్క్రీన్ను చూస్తోంది. అందుకే అతను కఠిన నిర్ణయం తీసుకున్నాడు" అని సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, ఈ ఘటన తర్వాత ఆ చిన్నారికి ఐస్క్రీమ్ దొరికిందో లేదో తెలియదు గానీ, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు మాత్రం దొరికిపోయారు. కానీ ఆ తల్లికి మాత్రం ఇప్పటికీ సరస్సు వైపు చూస్తే నీళ్లలో మునిగిపోయిన iPhone, అందులో ఉన్న ఫోటోలు, కాంటాక్టులు గుర్తుకు వస్తుండొచ్చు. -
‘అఖిలేశ్ తన ఎంపీలను కాపాడుకోవాలి’
లక్నో: సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)కి చెందిన పార్లమెంట్ సభ్యులు కొందరు వేరు కుంపటి పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలపై యూపీ మంత్రి, సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ చీఫ్ ఓం ప్రకాశ్ రాజ్భర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తమ ఎంపీలను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేసుకోవాలని సూచించారు.అలాగే.. ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. కొందరు తిరుగుబాటు ఎంపీలు బయటకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. వీరికి రెబల్ బల్లియా కుమారుడి నాయకత్వంలో బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. పార్టీలో బ్రాహ్మణులకు జరుగుతున్న అవమానాలే ఇందుకు కారణమన్నారు. ఎస్పీలో చీలిక తథ్యమంటూ గత రెండు రోజులుగా ఆయన ఇలాంటి ప్రకటనలు చేస్తుండటం గమనార్హం. ఇందులో నేరుగా ఆయన ఎవరి పేరునూ ప్రస్తావించనప్పటికీ, సనాతన్ పాండేను ఉద్దేశించే అయి ఉండొచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. ఈ పుకార్లను కొట్టివేసిన అఖిలేశ్ యాదవ్.. రాజ్భర్ను పుకార్ల శాఖ మంత్రిగా అభివర్ణించారు.ఎన్డీఏపై కాంగ్రెస్ ధ్వజం మరోవైపు.. ప్రతిపక్షాల నుంచి అధికార ఎన్డీఏలోకి కొనసాగుతున్న వలసలకు హోం మంత్రి అమిత్ షా కుట్రలే కారణమని కాంగ్రెస్ నిందించింది. ఎన్డీఏను అమిత్ షా నేషనల్ డిఫెక్టర్స్ అలయన్స్ (జాతీయ ఫిరాయింపుదారుల కూటమి)గా మార్చేశారని వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ గురువారం మీడియాతో మాట్లాడారు. అధికార ఎన్డీఏ కూటమికి లోక్సభలో మూడింట రెండొంతుల మెజారిటీని సాధించేందుకు అమిత్ షా చేస్తున్న కుటిల ప్రయత్నాలను తిప్పికొట్టడానికి తమ పార్టీ మిత్రపక్షాలతో సంప్రదింపులు జరుపుతోందని ఆయన చెప్పారు. -
బంగాళాఖాతంలోకి పాక్ జలాంతర్గాములు!
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ విమోచన యుద్ధం వేళ పాకిస్తాన్ నావికాదళాన్ని భారత్ దారుణంగా దెబ్బతీశాక బంగాళాఖాతం జలాల వైపు కన్నెత్తిచూడని పాకిస్తాన్ 55 సంవత్సరాల తర్వాత మళ్లీ బంగాళాఖాతం వైపు దృష్టిసారించింది. చైనా తయారీ హంగోర్ శ్రేణి జలాంతర్గామిని బంగాళాఖాతంలో నిఘా కోసం మొహరించాలని పాక్ యోచిస్తోంది. పీఎన్ఎస్ హంగోర్ జలాంతర్గామి ఇటీవలే కరాచీకి చేరుకుంది. అంతకుముందు చైనా నుంచి వస్తూ అంతర్జాతీయ సముద్రజలాల గుండా పయనిస్తూ ఈ జలాంతర్గామి శ్రీలంక సమీపంగా వచ్చింది.ఈ జలాంతర్గామికి ఎస్కార్ట్గా వస్తున్న నౌకల కాన్వాయ్(ఫ్లోటిల్లా)కు కమాండర్ ఒమర్ ఫరూఖ్ కొలంబో పోర్ట్లో మాట్లాడారు. ‘‘అధునాతన హంగోర్ తరగతి జలాంతర్గామితో పాక్ ఇకపై సముద్రతలంలోనూ తన సత్తా చాటనుంది. బంగాళాఖాతంలో మా కార్యకలాపాలకు ఇది ఎంతో దోహదపడుతుంది. ఇది ఆట తీరును మార్చేసే గేమ్ ఛేంజర్. ఈ రకం ఎనిమిది జలాంతర్గాములను సమకూర్చుకోబోతున్నాం’’అని ఆయన వెల్లడించారు. అరేబియా సముద్రం దాటి బంగాళాఖాతం దాకా తమ నిఘా కార్యకలాపాలను విస్తరించాలని యోచిస్తున్నట్లు కమాండర్ చెప్పడంతో పాక్ కుయుక్తి బహిర్గతమైంది. బంగాళాఖాతం ఎందుకంత కీలకం? భారత్–పాకిస్తాన్ యుద్ధం వేళ డయ్యూ పరిధిలో భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ ఖుక్రీని పాక్కు చెందిన పీఎన్ఎస్ హంగోర్ జలాంతర్గామి మూడు టార్పెడోలతో దాడిచేసి ముంచేసింది. అయినాసరే యుద్ధంపై దీని ప్రభావం ఏమాత్రం పడలేదు. భీకరంగా దాడిచేసిన భారత్ పాక్ పీచమణిచింది. అప్పట్నుంచి బంగాళాఖాతంలో పాక్ జలాంతర్గాముల సంచారమే లేదు. తాజాగా బంగ్లాదేశ్లో హసీనా ప్రభుత్వం కూలడం, పాక్ అనుకూల ప్రభుత్వం కొలువుతీరడంతో దశాబ్దాల తర్వాత బంగాళాఖాతంపై పాక్ కన్నుపడింది. భౌగోళికంగా బంగాళాఖాతంపై భారత పట్టు అధికం.అండమాన్ నికోబార్ దీవులు ఉండటంతో అక్కడి నుంచి సముద్రంలోపలికి 370 కిలోమీటర్లదాకా భారత ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ ఉంది. అక్కడిదాకా సముద్రజలాలపై సర్వాధికారం భారత్కే దఖలుపడుతోంది. ఉత్తర తీరం వైపే విశాఖపట్నంలో భారత నావికాదళ తూర్పు కమాండ్ ప్రధాన స్థావరం ఉంది. ఇదే బంగాళాఖాతం బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, మలేసియా, ఇండోనేసియాలకూ తీరప్రాంతంగా ఉంది.అదీకాకుండా బంగాళాఖాతం అనేది భారత వస్తూత్పత్తులు, ఇంధన వాణిజ్యానికి, నౌకల రాకపోకలకు కీలక మార్గంగా మారింది. ఇంతటి కీలకమైన ప్రాంతంలో పాక్ అడుగుపెట్టడం భారత నావికా, నిఘా కార్యకలాపాలకు అవరోధంగా మారే ఆస్కారముంది. పాక్ తన తీర ప్రాంతానికి సుదూరంగా హిందూ మహాసముద్రంలో బంగాళాఖాతంలో తమ కార్యకలాపాలను విస్తరిస్తే భారత్కు ఎప్పుడూ తలనొప్పేనని యుద్దరంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. సముద్ర జలాల్లో హంగోర్ జలాంతర్గామి -
పెట్టుబడులతో ముందుకు రావాలి
పారిస్: భారత్లో వ్యాపార అభివృద్ధికి, విస్తరణకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులతో రావాలని ఫ్రాన్స్ పారిశ్రామికవేత్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆయన గురువారం ఫ్రాన్స్ రాజధాని పారిస్లో పలు అగ్రశ్రేణి కంపెనీల ముఖ్య కార్యనిర్వహణాధికారులతో(సీఈఓలు) సమావేశమయ్యారు. పెట్టుబడి అవకాశాలు, విస్తరణ ప్రణాళికలపై చర్చించారు. నౌకాయానం, సరుకు రవాణా, రైల్వేలు, నిర్మాణం, కృత్రిమ మేధ(ఏఐ) సహా పలు కీలక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై సంప్రదింపులు జరిపారు.భారతదేశంలో ఉన్న అవకాశాలపై చర్చలు జరిపామని సీఎంఏ సంస్థ సీఓఓ రొడాల్ప్ సాదే పేర్కొన్నారు. ఓడల నిర్మాణం, ఓడల రీసైక్లింగ్, లోతైన సముద్ర ఓడరేవులు, అలాగే కంటైనర్ల నిర్మాణం గురించి కూడా మోదీతో చర్చించామని తెలిపారు. ఫ్రాన్స్, భారత్లు పరస్పర సహకారాన్ని కొనసాగించడంలోనూ, కొత్త భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడంలోనూ గొప్ప అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నట్లు చెప్పారు. సెయింట్ గోబైన్ సంస్థ సీఈఓ బెనాయిట్ బెజిన్, అల్స్టామ్ సీఈఓ మార్టిన్ సియోన్, మిస్ట్రాల్ ఏఐ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ ఆర్థర్ మెన్స్ను సైతం మోదీ కలుసుకున్నారు. అందరికీ అందుబాటులో టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. భారతదేశం దృష్టిలో ఏఐ అంటే ‘అందరినీ కలుపుకొని పోయేది’అని తెలిపారు. అమెరికా ఇటీవల కొన్ని కృత్రిమ మేధ(ఏఐ) నమూనాల వినియోగంపై ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉండాలని మోదీ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. గురువారం పారిస్లో వివాటెక్–2026 టెక్నాలజీ సదస్సులో ఆయన మాట్లాడారు. భారతదేశ సాంకేతిక సామర్థ్యాన్ని ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే డిజిటల్ లావాదేవీల్లో సగం తమ దేశంలోనే జరుగుతున్నాయని గుర్తుచేశారు. ఆర్థిక సమ్మిళితం, విద్య, టెలిమెడిసిన్, వ్యవసాయం, ఇతర రంగాల్లో సాంకేతికతను భారీ స్థాయిలో వినియోగిస్తున్నామని తెలిపారు.సాంకేతికత, నూతన ఆవిష్కరణలు అందరికీ అందుబాటు ఉండడం చాలా ముఖ్యమని ఉద్ఘాటించారు. సాంకేతికత ప్రజాస్వామీకరణతోనే పురోగతి సాధ్యపడుతుందని వివరించారు. ఈ విప్లవాత్మక మార్పుల యుగంలో టెక్నాలజీ అందరికీ ప్రయోజనం చేకూర్చాలని భారత్ విశ్వసిస్తోందని అన్నారు. ఏఐ అనేది ప్రజల జీవితాలను మెరుగుపరచాలని వ్యాఖ్యానించారు. ‘‘మా విధానం స్పష్టంగా ఉంది. మా ప్రభుత్వం సహకరిస్తుంది. పరిశ్రమలు ఆవిష్కరణలు చేస్తాయి. స్టార్టప్లు విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాయి. ప్రపంచ భాగస్వాములు మాతో కలిసి అభివృద్ధి చెందుతారు. మనమందరం కలిసి మునుపెన్నడూ లేనంత వేగంగా ముందుకు సాగుదాం’’అని పారిశ్రామికవేత్తలకు సూచించారు. తమతో కలిసి పని చేయాలని, అందరికీ ఫలితాలను అందించాలని కోరారు. పారిస్లో మోదీకి ఘన స్వాగతం ఫ్రాన్స్లోని ఎవియన్–లెస్–బెయిన్స్లో జీ7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాజధాని పారిస్కు చేరుకున్నారు. పారిస్లోని ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రపంచ పురోగతికి భారత్–ఫ్రాన్స్ భాగస్వామ్యం అత్యంత కీలకమని మోదీ ఈ సందర్భంగా చెప్పారు. భారతదేశాన్ని, ఫ్రాన్స్ను మరింత సన్నిహితంగా మార్చడానికి ప్రవాస భారతీయులు చేస్తున్న కృషిని చూసి తాను గర్వపడుతున్నానని స్పష్టంచేశారు. -
రేపు పీఎం–కిసాన్ నిధుల విడుదల
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 20వ తేదీన 26వ విడత పీఎం–కిసాన్ నిధులను విడుదల చేయనున్నారు. పశ్చిమ బెంగాల్లోని హూగ్లీ జిల్లా తారకేశ్వర్లో పర్యటన సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న 9.44 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.18,880 కోట్లను జమ చేయనున్నారు. పీఎం–కిసాన్ ద్వారా పశ్చిమబెంగాల్లోని 45.35 లక్షల మంది రైతులు రూ.907 కోట్ల మేర అందుకోనున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు.2019లో ఈ పథకం మొదలు కాగా ఇప్పటివరకు మొత్తం రూ.4.46 లక్షల కోట్లను రైతులకు సాగు సాయంగా విడుదల చేసినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. పశ్చిమబెంగాల్లో పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ఫసల్ బీయో యోజన (పీఎంఎఫ్బీవై)ని, రాష్ట్రంలో పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని కూడా ప్రారంభిస్తారని మంత్రి వివరించారు. -
41% లోటు వర్షపాతం
న్యూఢిల్లీ: చినుకులతో రైతన్నకు చిరునవ్వులు తెప్పించే నైరుతి రుతుపవనాలు ఈసారి కర్షకులతో దోబూచులాడుతున్నాయి. దీంతో జూన్ 4 నుంచి జూన్ 18వ తేదీ వరకు నమోదవ్వాల్సిన వర్షపాతంలో 41 శాతం లోటు కన్పించిందని భారత వాతావరణ శాఖ గురువారం ప్రకటించింది. ఈ మేరకు వాతావరణ శాఖ తాజా గణాంకాలను విడుదలచేసింది. జూన్ 4వ తేదీ నుంచి రెండు వారాలపాటు సగటున 72.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సిఉండగా 42.6 మిల్లీమీటర్ల వర్షపాతం దక్కిందని వాతావరణ శాఖ వ్యాఖ్యానించింది.ప్రాంతాల వారీగాచూస్తే మధ్యభారతం(67శాతం), తూర్పు, ఈశాన్య భారతం(42శాతం), దక్షిణభారతం(22 శాతం), వాయవ్యభారతం(6శాతం) లోటు వర్షపాతాలను చవిచూశాయి. రుతుపవనాలు బలంగా, వేగంగా ముందుకు కదలడానికిదోహదపడే విస్తృతస్థాయి వర్షపాత అనుకూల పరిస్థితులు పూర్తి స్థాయిలో లేవు. అందుకే రుతుపవనాలు మహారాష్ట్ర అంతటా విస్తరించకుండా అక్కడే ఆగిపోయాయి. దీంతో దక్షిణభారతంలోని ఇతర రాష్ట్రాలకు రుతపవనాల విస్తృతస్థాయి విస్తరణ ఆలస్యమవుతోంది. ఎందుకీ లోటు? ఉత్తరదిశలో విస్తరణ ఆలస్యం కావడానికి ఐదు అంశాలు కారణమవుతున్నాయి. అరేబియా సముద్రం నుంచి తోడ్పాటు కరువైంది. అరేబియా సముద్రం నుంచి తేమ గాలులు తక్కువ స్థాయిలో రావడంతో రుతుపవనాల విస్తరణ వేగం తగ్గింది. అరేబియా సముద్రం మీదుగా తక్కువ ఎత్తులో భారత్లో ఈశాన్య వైపునకు వీచే గాలులు తగ్గిపోయాయి. ఇవి తగ్గడంతో తేమ సమతులంగా మహారాష్ట్రపై బట్వాడా కావడం సైతం క్షీణించింది. దక్షిణార్థ గోళం నుంచి ఉత్తరార్థ గోళం దిశగా వస్తూ హిందూ మహాసముద్ర పశ్చిమ భాగం, అరేబియా సముద్రం మీదుగా సాగే గాలుల్లోనూ వేగం తగ్గింది. ఈ గాలులే నైరుతు రుతుపవనాలకు తేమను అందిస్తాయి. తేమ తగ్గడంతో వర్షపాతమూ తగ్గిపోయింది. -
ఆరుగురు ఎంపీలు డుమ్మా
న్యూఢిల్లీ: ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన(యూబీటీ) పార్టీలో చీలిక ఖాయమని స్పష్టమవుతోంది. ఇందుకు బలం చేకూర్చేలా గురువారం ఆరుగురు తిరుగుబాటు ఎమ్మెల్యేలు స్పష్టమైన వైఖరిని ప్రదర్శించారు. పార్టీకి చెందిన 9 మంది లోక్సభ ఎంపీలు, ఒక రాజ్యసభ సభ్యుడు కచ్చితంగా ఢిల్లీలో పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరవ్వాలని అగ్రనాయకత్వం విప్ జారీచేయగా గురువారం నాటి సమావేశానికి ఆరుగురు తిరుగుబాటు ఎంపీలు నగేశ్ పాటిల్ అష్టికర్, సంజయ్ దేశ్ముఖ్, సంజయ్ జాధవ్, సంజయ్ దినా పాటిల్, ఓం ప్రకాశ్ రాజే నింబాల్కర్, భావూసాహెబ్ వాక్చౌరే రాలేదు.కేవలం ముగ్గురు లోక్సభ ఎంపీలు అరవింద్ సావంత్, అనిల్ దేశాయ్, రాజాభావూ వాజే, ఒక రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ మాత్రమే హాజరయ్యారు. మెజారిటీ ఎంపీల గైర్హాజరుపై రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ఈ ఆరుగురికి షోకాజ్ నోటీసులు జారీచేస్తాం. విప్ను ఉల్లంఘిస్తూ ఎందుకు సమావేశానికి డుమ్మా కొట్టారని కారణం అడుగుతాం.స్పందన తెలియజేసేందుకు ఏడు రోజుల గడువు ఇస్తాం. స్పందించకపోతే వీళ్లను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాస్తాం’’అని రౌత్ చెప్పారు. అయితే ఇప్పటికే ఆరుగురు రెబల్ ఎంపీలు స్పీకర్ను కలిసి ఒక లేఖ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేనలో తమను కలిపేస్తూ, లోక్సభలో తమకు సీట్లు విడిగా కేటాయించాలని ఆ లేఖలో పేర్కొన్నట్లు వార్తలొచ్చాయి.‘‘ఈ నమ్మకద్రోహులను వదిలిపెట్టేదే లేదు. స్వస్థలాలు, సొంత నియోజకవర్గాల్లో వాళ్లను స్వేచ్ఛగా తిరిగనివ్వం. వాళ్లకు సరైన గుణపాఠం చెప్తాం. మా భయంతో వాళ్లు ఇళ్లకు చేరుకోవాలంటే ఆర్మీ సాయం తప్పదు. భద్రతకు వాయుసేన సాయం తప్పదు. దేశంలో ఇలాంటి పార్టీ ఫిరాయింపుల ఉదంతాలపై సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషన్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి’’అని అన్నారు.రెబల్స్కు భద్రత పెంపు అధికార పార్టీలోకి మారబోతున్నామనే ప్రకటన నేపథ్యంలో ఆ ఆరుగురు రెబల్స్కు మహారాష్ట్రలోని షిండే సర్కార్ వై ప్లస్ భద్రత కల్పించింది. జూన్ 17వ తేదీ నుంచే ఆ ఆరుగురు ఎంపీలకు భద్రత పెంచుతున్నట్లు ఇంటెలిజెన్స్ కమిషనర్ శిరీష్ జైన్ పేరుతో ఉత్త్తర్వు వెలువడింది. తలో రూ.10 కోట్లు తీసుకున్నారు ఢిల్లీలో పార్లమెంటరీ పార్టీ సమావేశం తర్వాత రౌత్ మీడియాతో మాట్లాడారు. ‘‘విశ్వాసఘాతకులకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తోంది. నమ్మక ద్రోహులైన ఎంపీల సంగతి తేలుస్తాం. వాళ్లను వేటాడేందుకు ఆపరేషన్ తుడ్వాను ఆరంభిస్తాం. రెబల్స్ ఇప్పటికే తలో రూ.15 కోట్లు అందుకున్నారు. తాజాగా మరో రూ.10 కోట్లు తీసుకున్నారు. ఢిల్లీలో భద్రత లేదనే భయంతో రాజస్థాన్కు వెళ్లిపోయారు. వాళ్లలో కాస్తయినా నైతికత ఉంటే తక్షణం ఎంపీలుగా రాజీనామా చేయాలి. ఎంపీ హోదా లక్షలాది పార్టీ మద్దతుదారులు, కార్యకర్తల కష్టార్జితం’’అని రౌత్ అన్నారు. -
జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్
న్యూఢిల్లీ/రాంచీ/ఐజ్వాల్: జార్ఖండ్లో గురువారం హోరాహోరీగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కారణంగా ఎన్డీఏ మద్దతున్న స్వతంత్ర అభ్యర్థి పరిమళ్ నఠ్వాణీ అనూహ్య విజయం సాధించారు. గెలుపు ఖాయమనుకున్న కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝా ఓటమిపాలయ్యారు. జార్ఖండ్లో రెండు రాజ్యసభ స్థానాల కోసం మొత్తం 81 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్లో పాల్గొన్నారు.అధికార ‘ఇండియా’కూటమిలోని జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్లకు 56 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. దీంతో ఒక స్థానంలో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) అభ్యర్థి బైద్యనాథ్ రామ్, మరో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ల గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు. ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే కనీసం 28 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే అసెంబ్లీలో ఎన్డీఏకు కేవలం 24 మంది ఎమ్మెల్యేల బలమే ఉంది. కానీ గురువారం జరిగిన ఓటింగ్లో స్వతంత్ర అభ్యర్థి పరిమళ్కు ఏకంగా 28 ఓట్లు పడ్డాయి.క్రాస్ ఓటింగ్కు పాల్పడి పరిమళ్ను గెలిపించారని అధికార ‘ఇండియా’కూటమి ఆరోపించింది. పరిమళ్ పోటీచేసిన స్థానానికి జరిగిన ఓటింగ్లో మూడు ఓట్లను చెల్లనివిగా ప్రకటించారు. వీటిలో రెండు బీజేపీ ఎమ్మెల్యేలవికాగా ఒకటి కాంగ్రెస్ ఎమ్మెల్యేది. ఇక మిగిలిన మిజోరంలో ఒకటి, జార్ఖండ్లో రెండు స్థానాలకు గురువారం ఎన్నికలు జరిపి వెంటనే ఫలితాలను వెల్లడించారు. -
మోదీ 'AI' మంత్రం
ఫ్రాన్స్లో జరుగుతున్న వివాటెక్ 2026 వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ భారత్ కృత్రిమ మేధ (AI) భవిష్యత్పై తన విజన్ను వివరించారు. సాంకేతికత కొద్ది మందికే కాకుండా సమాజంలోని ప్రతి వర్గానికీ ఉపయోగపడాలన్నదే భారత లక్ష్యమని ఆయన అన్నారు.భారత్ పెవిలియన్లో ప్రదర్శించిన 3డీ ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్, AI ఆధారిత ఆరోగ్య సేవల పరిష్కారాలు వంటి ఆవిష్కరణలను సందర్శకులు తప్పక చూడాలని సూచించారు. ముఖ్యంగా Amul రూపొందించిన ‘సార్లాబెన్’ అనే AI అసిస్టెంట్ను ప్రస్తావిస్తూ, ఇది మహిళా పాల ఉత్పత్తిదారులకు రోజువారీ పనుల్లో సహాయపడుతోందని చెప్పారు.భారత్లోని స్టార్టప్ ఎకోసిస్టమ్తో ప్రపంచ టెక్ సంస్థలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన మోదీ, దేశ డిజిటల్ విజయాలను గుర్తు చేశారు. DigiLocker ద్వారా 70 కోట్ల మందికి పైగా సేవలు పొందుతున్నారని, UPI ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల వేదికల్లో ఒకటిగా ఎదిగిందని పేర్కొన్నారు. అలాగే భారత అంతరిక్ష విజయాలు, ప్రత్యేకించి చంద్రయాన్ మిషన్ పేరును ప్రస్తావించారు. -
టెలిగ్రామ్ వాడుతున్నారా?.. కేంద్రం చెప్పింది వింటే షాక్ అవుతారు!
న్యూఢిల్లీ: టెలిగ్రామ్పై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ ద్వారా ఈ విషయాలు తెలిశాయి. టెలిగ్రామ్పై కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధాన్ని సవాల్ చేస్తూ టెలిగ్రామ్ ఢిల్లీ హైకోర్టులో వేసిన కేసులో ఈ అఫిడవిట్ దాఖలైంది. పరీక్షా ప్రశ్నపత్రాల లీకులను అడ్డుకోవాలనే ఉద్దేశంతో కేంద్రం టెలిగ్రామ్ను తాత్కాలికంగా నిలిపివేసిన తర్వాత, ఆ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని టెలిగ్రామ్ కోర్టును ఆశ్రయించింది.ఆ కేసులో కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థిస్తూ ఈ అఫిడవిట్ సమర్పించింది. టెలిగ్రామ్ను ఎందుకు ప్రమాదకర వేదికగా భావిస్తున్నామో వివరించేందుకు ఈ ఆరోపణలను అఫిడవిట్లో పొందుపరిచింది. ఇందులో పిల్లలపై లైంగిక దోపిడీకి సంబంధించిన దృశ్యాల ప్రచారం, సైబర్ మోసాలు, ఉగ్రవాద ప్రచారం, పరీక్షా ప్రశ్నపత్రాల లీకులు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి అంశాలను ప్రస్తావించింది."కొత్త డార్క్ వెబ్"గా మారింది.. టెలిగ్రామ్ "కొత్త డార్క్ వెబ్"గా మారిందని, నేరగాళ్లు, సైబర్ మోసగాళ్లు, తీవ్రవాద సంస్థలు, ఇతర ముప్పు కలిగించే వర్గాలు చట్ట అమలు సంస్థల నిఘా నుంచి తప్పించుకోవడానికి దీన్ని ఎక్కువగా వినియోగిస్తున్నాయని పేర్కొంది.లీకైన ప్రశ్నపత్రాలను పంపడం, సైబర్ మోసాలు, ఉగ్రవాద ప్రచారం, పిల్లలపై లైంగిక దోపిడీకి సంబంధించిన దృశ్యాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఆర్థిక నేరాలు సహా విస్తృత స్థాయిలో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు టెలిగ్రామ్ ప్రధాన వేదికగా మారిందని కేంద్రం ఆరోపించింది."టెలిగ్రామ్ కొత్త డార్క్ వెబ్గా మారి, ముప్పు కలిగించే వర్గాలను ఒకచోటకు చేర్చుతోంది. నేరగాళ్లు టెలిగ్రామ్ ఛానళ్లలో డీప్ వెబ్ లింకులను పంచుతూ, డార్క్ వెబ్ ఫోరమ్లకు అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల నేరగాళ్లను గుర్తించడం, వారి ఆచూకీ కనుగొనడం అధికారులకు కష్టమవుతోంది" అని కేంద్రం తెలిపింది.అఫిడవిట్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. టెలిగ్రామ్లోని గోప్యత, అజ్ఞాతంగా ఉండే సౌకర్యాలు నేర ముఠాలకు బాగా ఉపయోగపడుతున్నాయి. గోప్యత సెట్టింగ్ల ద్వారా ఫోన్ నంబర్లు, టెలిగ్రామ్ గుర్తింపు వివరాలు వంటి సమాచారాన్ని వినియోగదారులు దాచిపెట్టగలుగుతున్నారని, దీనివల్ల ఖాతాల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించడం దర్యాప్తు సంస్థలకు కష్టమవుతోందని కేంద్రం తెలిపింది."మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలు, తీవ్రవాదం, ఉగ్రవాదం, పిల్లల దోపిడీ, సైబర్ మోసాలు వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు టెలిగ్రామ్ వినియోగం పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం గోప్యత సౌకర్యాలే" అని అఫిడవిట్లో పేర్కొంది.తీవ్రవాద సంస్థలకు చెందిన ప్రచార సామగ్రి, హింసను ప్రోత్సహించే విషయాల ప్రసారానికి కూడా టెలిగ్రామ్ గ్రూపులు, ఛానళ్లు వినియోగంలో ఉన్నాయని కేంద్రం ఆరోపించింది."ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న వర్గాలు టెలిగ్రామ్ గ్రూపులు, ఛానళ్ల ద్వారా హింసాత్మక తీవ్రవాద చర్యలు, ఇతర తీవ్ర భావజాల ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, ప్రజా శాంతికి భంగం కలిగించడం వీటి లక్ష్యం" అని అఫిడవిట్లో తెలిపింది.పిల్లలపై లైంగిక దోపిడీ దృశ్యాల ప్రసారం అత్యంత తీవ్రమైన ఆరోపణల్లో ఒకటిగా.. పిల్లలపై లైంగిక దోపిడీకి సంబంధించిన దృశ్యాల ప్రసారం టెలిగ్రామ్ గ్రూపులు, ఛానళ్ల ద్వారా జరుగుతోందని కేంద్రం పేర్కొంది. సైబర్ నేరాలకు టెలిగ్రామ్ ప్రధాన కేంద్రంగా మారిందని కూడా అఫిడవిట్లో కేంద్రం ఆరోపించింది. తప్పుడు గుర్తింపు వివరాలతో నకిలీ ఖాతాలు సృష్టించి ఆర్థిక మోసాలు చేయడం, డేటా లీకులు ప్రచారం చేయడం, సైబర్ నేరాలను సమన్వయం చేయడం వంటివి జరుగుతున్నాయని తెలిపింది. జాతీయ సైబర్ నేరాల ఫిర్యాదుల పోర్టల్ గణాంకాలను ప్రస్తావిస్తూ, సైబర్ మోసాలకు టెలిగ్రామ్ వినియోగంపై ఫిర్యాదులు బాగా పెరిగాయని కేంద్రం తెలిపింది.సైబర్ నేరాలు, అక్రమ నగదు చలామణి ద్వారా వచ్చిన డబ్బును స్వీకరించడానికి, బదిలీ చేయడానికి వినియోగించే మ్యూల్ బ్యాంక్ ఖాతాల కొనుగోలు, అమ్మకాలకూ టెలిగ్రామ్ ఛానళ్లు వినియోగంలో ఉన్నాయని కేంద్రం ఆరోపించింది. ఒక సందర్భంలో.. హానికర ఏపీకే దస్త్రాలు భద్రతా వ్యవస్థలకు గుర్తుపట్టకుండా కనిపించేలా చేసే సాధనాలను ఒక టెలిగ్రామ్ ఛానల్ ప్రచారం చేసిందని కేంద్రం తెలిపింది. మరో ఛానల్లో ఆర్థిక, చెల్లింపు సేవల పేర్లతో కనిపించే హానికర సాఫ్ట్వేర్ ప్రచారం జరిగిందని ఆరోపించింది.ఇప్పటికే లీకైన సమాచార నిల్వల నుంచి సేకరించిన మొబైల్ నంబర్లు, ఆధార్ వివరాలు, ఇతర సున్నితమైన సమాచారాన్ని పౌరులకు అందించేలా టెలిగ్రామ్ బాట్లు పనిచేస్తున్నాయన్న ఆందోళనను కూడా అఫిడవిట్లో వ్యక్తం చేసింది.సైబర్ నేరాలే కాకుండా, పైరసీ చేసిన సినిమాలు, వెబ్ సిరీస్లు, ఇతర కాపీరైట్ ఉన్న విషయాల ప్రసారానికి కూడా టెలిగ్రామ్ ఛానళ్లు విస్తృతంగా వినియోగంలో ఉన్నాయని కేంద్రం ఆరోపించింది. దీనివల్ల కంటెంట్ క్రియేటర్లకు నష్టం కలుగుతోందని, మేధోసంపత్తి హక్కులపై ఆందోళనలు పెరుగుతున్నాయని పేర్కొంది. -
60 ఏళ్లకి లవ్, 75 రోజులకే పెళ్లి : నటి లవ్ స్టోరీ
ప్రేమలో పడటానికి, ఆత్మీయ నేస్తాన్ని మనసారా జీవితంలోకి ఆహ్వానించడానికి వయసుతో పనేముంది. కొందరు తమ ఇరవైలలోనే తమ సోల్మేట్ను కలుసుకుంటారు. మరికొందరు నిజమైన తోడు కోసం దశాబ్దాల తరబడి వేచి ఉంటారు. కానీ అరవై ఏళ్ల వయసులో అంటే ఎవ్వరూ ఊహించరు కదా. ప్రఖ్యాత నటి సుహాసిని ములేది 60లలో కూడా ప్రేమ దొరుకుతుందని నిరూపించారు. సుహానా సఫర్తో ఇటీవల జరిగిన సంభాషణలో, జాతీయ అవార్డు గ్రహీత సుహాసినీ 60 ఏళ్ల వయసులో తన పెళ్లి గురించి గుర్తుచేసుకున్నారు.“నేను 60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాను. అప్పటివరకు నాకు సరైన జోడి దొరకలేదు. నా భర్త చాలా పేరున్న శాస్త్రవేత్త. ఆయన సైన్స్ గురించి మాట్లాడినప్పుడు నాకు ఏమీ అర్థం కాదు, కానీ ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి,” అని తన భర్త గురించి ములే చెప్పుకొచ్చారు. లగాన్, జోధా అక్బర్ వంటి చిత్రాలలో అద్భుత నటనతో ఆకట్టుకుని, అనేక సినిమాల్లో రాణించిన సుహాసిని, ఇక తానెప్పటికీ పెళ్లి చేసుకోలేనేమో ఒంటరిగానే ఉండిపోతానేమే అనుకునేవారట. కానీ విధి మరోలా ఉంది.పేట్ మార్చిన ఫేస్బుక్ మెసేజ్ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తుండగా, ఫేస్బుక్లో అనుకోకుండా లార్జ్ హాడ్రాన్ కొలైడర్ ప్రాజెక్ట్ (LHC) భౌతిక శాస్త్రవేత్త (Physicist) అతుల్ గుర్తు ప్రొఫైల్ రికమండేషన్ కనిపించింది. అరే..భౌతిక శాస్త్రవేత్తలుకూడా ఫేస్బుక్లో ఉన్నారా?’ అనుకున్నారు. తనకు ఎప్పటినుంచో సైన్స్ అంటే ఆసక్తి ఉండటంతో, ఇంకొంచెంఇంట్రస్టింగ్గా అనిపించింది. ‘LHC అంటే ఏంటి?’ అని ఒక మెసేజ్ పంపారు. అంతే అదే ఆమె జీవితాన్ని అందమైన మలుపు తిప్పింది. ఒక్క మెసేజ్వయసు వ్యత్యాసాల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా, వారిద్దరూ అనేకసార్లు మాట్లాడుకున్నారు. అయితే ఒకరోజు అతుల్ ఆమెకు, "బంధాలను మనమే నిర్మించుకోవాలి; అవి ఆకాశం నుండి ఊడిపడవు" అన్నపుడు పట్ల పూర్తి నమ్మకాన్ని పెంచుకుంది. అయితే, ఆమె నమ్మకాన్ని మరింత బలపరిచిన విషయం ఏమిటంటే, ఆయన తన మొదటి భార్య గురించి రాసిన ఒక వ్యాసం. క్యాన్సర్ బారిన పడ్డ తన భార్య చనిపోయేలోపు ఆమె కోరుకున్న కోరికలన్నీ తీర్చారు. అంతేకాకుండా, ఆమెను సంతోషపెట్టేందుకే ఆమె అనారోగ్య సమస్యను ఆయన ఎంతో సానుకూల దృక్పథంతో ఎదుర్కొన్నారు. ఈ విషయం సుహాసిని దృష్టిని ఆకర్షించడమే కాకుండా, ఆమె హృదయాన్ని కూడా తాకింది.అలా కొన్ని రోజులు ఆన్లైన్లో మాట్లాడుకున్నారు. ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. నవంబర్ చివరిలో ముఖాముఖి కలుసుకున్నారు. అలాగే గుర్తును కలిసి, మాట్లాడిన తర్వాత, తన కూతురు సరైన ఎంపిక చేసుకుందని ఆమె తల్లికి నమ్మకం కలిగిందట. అలా సుమారు 75 రోజుల తర్వాత, కుటుంబం అంగీకారంతో 2011 జనవరి 16న వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమకథ ఎంత అసాధారణంగా ఉందంటే, పెళ్లి రిజిస్ట్రార్ కూడా ఆశ్చర్యపోయారట. అయితే తన యవ్వనంలో పెళ్లి చేసుకోనందుకు ఎదుర్కొన్న విమర్శల మాదిరిగానే, 60 ఏళ్ల వయసులో వివాహం చేసుకున్న తర్వాత కూడా ఎదుర్కోవాల్సి వచ్చిందట. జీవితంలో ఆలస్యంగా ప్రేమను కనుగొనడం తాను పొందిన అత్యంత అందమైన అనుభవాల్లో ఒకటిగా నిలిచిందంటారు సుహాసిని. సామాజిక ఒత్తిళ్లకు లొంగిపోయో, వయసు పెరుగుతోందనో ఏవరో చెప్పారనో జీవితంలో అతి ముఖ్యమైన సంబంధంలోకి జారిపోకుండా, నిజాయితీగా ఇరు మనసులు కలిసిన నిష్కల్మషమైన ప్రేమే మిన్న అని చాటి చెప్పారు. ఎవరీ సుహాసినీ ములేసుహాసిని ములే హిందీ, మరాఠీ, అస్సామీ చిత్రాలతో పాటు పలు టెలివిజన్ సీరియల్స్లో నటించారు. నటనతో పాటు, ఆమె డాక్యుమెంటరీ చిత్ర నిర్మాణంలో కూడా పాలుపంచుకున్నారు. తన సుదీర్ఘ కెరీర్లో, ఆమె మొత్తం ఐదు జాతీయ చలనచిత్ర పురస్కారాలను అందుకున్నారు. సుహాసిని ములే 1950 నవంబర్ 20న బిహార్లోని పాట్నాలో మరాఠీ మాట్లాడే కుటుంబంలో జన్మించారు. ఆమె చిన్నతనంలోనే ఆమె తండ్రి మరణించారు. 1965లో, పియర్స్ సబ్బు ప్రకటన కోసం సుహాసిని ములే మోడల్గా ఎంపికయ్యారు. ఈ ప్రకటనను చూసిన తర్వాత, ప్రముఖ చిత్ర దర్శకుడు మృణాల్ సేన్ తన చిత్రం భువన్ షోమ్ (1969)లో ఆమెకు ఒక పాత్రను అందించారు.అలా మొదలైన ఆమె నటనా ప్రస్తానం ఎన్నో విజయవంతమైన పాత్రలు, అవార్డులు, రివార్డులతో అద్వితీయంగా సాగింది. -
ఇసుక మైనింగ్ : బీజేపీ నేత కారుకు నిప్పు, ముగ్గురు సజీవ దహనం
ఛత్తీస్గఢ్లోని కోరియా (Koriya) జిల్లాలో ఇసుక మైనింగ్ వివాదం అత్యంత ఘోరమైన నరమేధానికి దారితీసింది. ఒక ఫార్చ్యూనర్ (Fortuner) కార్ను ట్రక్కుల మధ్య లాక్ చేసి, దానిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో బీజేపీ నేత, నాయకుడు, మాజీ జన్పద్ పంచాయతీ అధ్యక్షుడు భరత్ సింగ్ (లల్లా సింగ్) సహా ముగ్గురు సజీవ దహనమయ్యారు.ఏం జరిగింది?ప్రాథమిక సమాచారం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సోన్హత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నౌగైన్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇసుక క్వారీ నిర్వహణ వివాదాన్ని పరిష్కరించు కోవడానికి, చర్చల కోసం భరత్ సింగ్ను పిలిచారు ప్రత్యర్థులు. అక్కడికి వెళ్లిన వెంటనే ఆయన ప్రయాణిస్తున్న ఫార్చ్యూనర్ కారు చుట్టుముట్టారు. అనంతరం అటూ ఇటూ ట్రక్కులను అడ్డుగా పెట్టి, కారు కదలకుండా లాక్ చేశారు. ఆపై కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో భరత్ సింగ్ కారులోనే సజీవ దహనమయ్యారు. మరణించిన వారిలో భరత్ సింగ్ బంధువులు, వీరేంద్ర సింగ్, నాగేంద్ర సింగ్ ఉన్నారు. వీరేంద్ర సింగ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మరో బంధువు మయాంక్ సింగ్ తీవ్ర గాయాతో బిలాస్పూర్లోని అపోలో ఆసుపత్రిలో అత్యంత విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నారు. ఇదీ చదవండి: జాతీయ స్థాయి బాడీబిల్డర్ : జిమ్ చేసి వచ్చి అంతే కుప్పకూలిపోయాడుగతంలో కాంగ్రెస్లో ఉండి, భూపేష్ బఘేల్ ప్రభుత్వ హయాంలో బీజేపీలో చేరారు. భరత్ సింగ్కు ఇసుక మైనింగ్లో స్థానికంగా మంచి పట్టు ఉంది. ఆ ప్రాంతంలోని ఇసుక క్వారీ కాంట్రాక్టు భరత్ సింగ్ కుటుంబానికి దక్కింది. ఆ తర్వాత, సోన్హట్, కైలాష్పూర్, తెలిముడ, బెలియా , ఛింగురా ప్రాంతాలలో ఇసుక రవాణా, తవ్వకాలకు సంబంధించిన వసూళ్లపై ఆధిపత్య పోరు జరిగిందని స్థానికులు చెబుతున్నారు. భరత్ సింగ్ వర్గానికి , మరో మనోజ్ త్రిపాఠి కుటుంబానికి మధ్య ఈ వివాదం గత కొన్ని నెలలుగా రగులుతోంది. త్రిపాఠి కుటుంబానికి చెందిన టిప్పర్ ట్రక్కుల ద్వారా ఇసుక రవాణా చేసే విషయంలో పేమెంట్లు, వర్గ ఆధిపత్య పోరు పెరిగి పెద్దదై మంగళవారం రాత్రి ఈ ఘోర కలికి దారి తీసింది. ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన దాడి అని, దీనిపై సీబీఐ (CBI) దర్యాప్తు జరిపించాలని బాధితుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.ఇదీ చదవండి : ఎస్ఐ ఉద్యోగం వదిలేసి, ఆస్ట్రేలియాలో రియల్ ఎస్టేట్ కింగ్ అయ్యాడు!ఈ హింసాత్మక ఘటనతో కోరియా జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పోలీసులు ఈ కేసులో నలుగురు ప్రధాన నిందితులను (అక్షత్ త్రిపాఠి, విశాల్ త్రిపాఠి, సత్యప్రకాష్ త్రిపాఠి, మన్ను త్రిపాఠి) అరెస్ట్ చేశారు. మొత్తం తొమ్మిది మందిపై హత్య, హత్యాయత్నం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని అడిషనల్ ఎస్పీ సురేషా చౌబే తెలిపారు. -
జాతీయ స్థాయి బాడీబిల్డర్ : జిమ్ చేసి వచ్చి అంతే కుప్పకూలిపోయాడు!
కర్ణాటకలోని దావెణగిరిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అనేక రాష్ట్ర, జాతీయ స్థాయి బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకున్న బాడీబిల్డర్ సుశీల్ కుమార్ (26) జిమ్లో వర్కౌట్ ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన కొద్ది సేపటికే అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలొదిలిన ఘటన కలకలం రేపింది. అంతర్జాతీయ పోటీకి సిద్ధమవుతున్న ఈ యువ ప్రతిభావంతుడి మరణం అతని కుటుంబానికి, క్రీడా సమాజానికి ,కుటుంబ సభ్యులు, స్నేహితులను తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. దావెణగిరిలో కేటీజే లేఅవుట్ నివాసి అయిన సుశీల్ కుమార్, అతను ప్రస్తుతం ఒక అంతర్జాతీయ బాడీబిల్డింగ్ పోటీకి సన్నద్ధమవుతున్నాడు. మంగళవారం సాయంత్రం జిమ్కు వెళ్లిన సుశీల్ కుమార్, రాత్రి 8.30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంట్లో భోజనం చేసి కూర్చుని అకస్మాత్తుగా కుప్పకూలి పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. మార్గమధ్యలోనే గుండెపోటుతో అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు. లో బ్లడ్ ప్రెషర్ కారణంగా గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు వైద్యులు భావిస్తున్నారు.ఆసుపత్రిలో గ్రూప్-డి ఉద్యోగిగా పనిచేస్తున్న సుశీల్ తల్లి దేవమ్మ కుమారుడి మృతితో కన్నీరుమున్నీరుగా విలపించారు. శోక సంద్రంలో ముగినిపోయిన ఆమె ఇక తనకు దిక్కెవరంటూ గుండెలవిసేలా రోదించిన తీరున పలువురి కంట కన్నీరు తెప్పించింది.(రోజుకు 12 గంటలు, అయినా : 82 ఏళ్ల మన్సుఖ్ కాకా స్టోరీ తెలిస్తే!)కాగా జిమ్ చేసే సమయంలో యువత వైద్యుల సలహాలు, జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కండలు పెంచే క్రమంలో మత్తుమందులు, స్టెరాయిడ్స్ లాంటి వాటి వాడకంపై కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రమబద్ధమైన జీవనశైలి, సరైన ఆహారం, వైద్య పరీక్షలు, అధిక ఒత్తిడి లేకుండా వ్యాయామం చేయడం ఉత్తమ మంటున్నారు. ఇదీ చదవండి : ఎస్ఐ ఉద్యోగం వదిలేసి, ఆస్ట్రేలియాలో రియల్ ఎస్టేట్ కింగ్ అయ్యాడు! -
ఉద్దవ్ సేనలో చీలిక.. ఎవరీ సంజయ్ జాధవ్?
మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఉద్దవ్ థాక్రే శివసేన వర్గంలో చీలిక దాదాపు ఖాయమన్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇవాళ జరిగిన పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశంలో వెలుగులోకి వచ్చిన పరిణామాలు ఆ శిబిరంలో అంతర్గత అసంతృప్తిని స్పష్టంగా బయటపెట్టాయి. శివసేన (యూబీటీ) పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశం గురువారం పార్లమెంట్ భవనంలో జరిగింది. సమావేశానికి హాజరైన వారిలో అనిల్ దేశాయ్, అర్వింద్ సావంత్, రాజాభావ్ వాజే మాత్రమే ఉన్నారు. మిగతా ఎంపీలు గైర్హాజరయ్యారు. ఈ గైర్హాజరు పార్టీ శిబిరంలో మరోసారి కలకలం రేపింది. విలీనం జరగబోతందనే ప్రచారాన్నిఖరారు చేసే దిశగా అడుగులు వేయిస్తోంది. మొత్తం తొమ్మిది మంది UBT లోక్సభ ఎంపీలలో ఆరుగురు ఎంపీలు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనతో చేరే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ గైర్హాజరును ఉద్ధవ్ ఠాక్రే సీరియస్గా తీసుకున్నారు. హాజరుకాని ఎంపీలపై షోకాజ్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. పార్టీ విప్ ఉన్నప్పటికీ సమావేశానికి రాకపోవడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.అయితే.. ఇక్కడే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. గైర్హాజరైన ఆరుగురు ఎంపీలు త్వరలోనే కొత్త పార్లమెంటరీ గ్రూప్ను ఏర్పాటు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎంపీలు లోక్సభ స్పీకర్ను కలిసి శివసేన (షిండే) వర్గంలో తమ విలీనాన్ని గుర్తించాలని లేఖ సమర్పించినట్లు వార్తలు వస్తున్నాయి. అదే గనుక జరిగితే.. ఉద్ధవ్ శిబిరానికి పెద్ద రాజకీయ దెబ్బ తగలనుంది. మరోవైపు.. ఈ కొత్త ఫ్రాక్షన్కు నాయకుడిగా పర్భణీ ఎంపీ సంజయ్ హరిభావు జాధవ్ (బండు జాధవ్) పేరు ముందుకు రావడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. సంజయ్ హరిభావు జాధవ్.. అందరూ ‘‘బండు భాయ్’’ అని పిలుచుకుంటారు. శివసేనలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న నేత. పర్భణీకి చెందిన ఆయన రాజకీయ ప్రస్థానం స్థానిక స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగింది.రెండుసార్లు పర్భణీ ఎమ్మెల్యేగా పని చేసిన ఆయన.. ఆపై హ్యాట్రిక్ ఎంపీగా అదే లోక్సభ స్థానం నుంచి నెగ్గారు. సాధారణ శివసేన కార్యకర్త స్థాయి నుంచి ఎంపీ స్థాయికి ఎదిగిన నేతగా ఆయనకు నియోజకవర్గంలో గట్టి పట్టు ఉంది. అయితే గతంలోనే పార్టీ అంతర్గత అసంతృప్తి కారణంగా ఆయన పేరు వివాదాల్లో కూడా వినిపించింది. 2020లో మిత్రపక్షం ఎన్సీపీ వైఖరి కారణంగా కేడర్కు న్యాయం చేయలేకపోతున్నానంటూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి.. ఎంపీ పదవికి రాజీనామా చేయబోయారు. అయితే ఉద్దవ్ సర్దిచెప్పడంతో దానిని వెనక్కి తీసుకున్నారు.ఇప్పుడు శివసేన (UBT)లో జరుగుతున్న పరిణామాలు ఆయన చుట్టూ మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బాలాసాహెబ్ ఠాక్రే సిద్ధాంతాలకు నిబద్ధమైన, పార్టీ కార్యకర్తల పక్షాన నిలిచే విధేయ శివసైనికుడిగా ఆయనను చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఉద్దవ్ చీలిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండడం గమనార్హం.మరోవైపు, ఉద్దవ్ సేన నేత సంజయ్ రౌత్ ఈ పరిణామాలపై తీవ్రంగా స్పందిస్తూ పార్టీ బలాన్ని కాపాడుకుంటామని స్పష్టం చేశారు. “పార్టీకి రాని వారు మనవారు కాదు” అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ మొత్తం పరిణామాలు చూస్తే, శివసేన (UBT) లోక్సభ శిబిరంలో విభజన దాదాపు ఖాయమన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. సంజయ్ బండు జాధవ్ వంటి అనుభవజ్ఞుడైన నేత పేరు ముందుకు రావడంతో శివసేన (UBT)లో చీలిక అంశం మరింత సీరియస్గా మారిదంటున్నారు. -
ముఖ్యమంత్రి విజయ్కి విశాల్ ఇచ్చిన బహుమతి ఏమిటి?
టీవీకే పార్టీ అధ్యక్షుడు జోసఫ్ విజయ్ను ముఖ్యమంత్రి అయిన తరువాత చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఆయన్ని కలవడానికి వరుస కడుతున్నారనే చెప్పాలి. అలా తాజాగా నటుడు విశాల్ ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్కు మర్చిపోలేని బహుమతిని ఇచ్చారు. అందుకు ముఖ్యమంత్రి విశాల్కు ధన్యవాదాలు తెలిపారు.ఇంతకీ నటుడు విశాల్ ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్కి అందించిన ఆ బహుమతి ఏమిటి? దీని గురించి మీడియా విడుదల చేసిన ప్రకటనలో విశాల్ తెలుపుతూ నేను నెలకొల్పిన దేవి ట్రస్ట్ ద్వారా పలువురు విద్యార్థుల ఉన్నత విద్య సాయం చేస్తున్నాను. అదే విధంగా నేను నిర్వహించే కార్యక్రమాలకు అభినందించడానికి వచ్చే ప్రముఖులకు బొకేలు, పూల మాలలు వంటివి కాకుండా ఆ డబ్బును పేద విద్యార్థులకు సాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా సోమవారం ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ని కలినప్పుడు ఆయనకు బహుమతిగా ఆయన పేరుతో ముగ్గురు పేద విద్యార్థులకు ఉన్నత విద్య చదివిస్తానని చప్పాను. ఆ ముగ్గురు విద్యార్థుల పేరు వివ రాలను కూడా తెలియజేశాను. ఈ బహుమతికి ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ ధన్యవాదాలు తెలిపా రు" అని నటుడు విశాల్ పేర్కొన్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ను నటుడు శింబు, నటి సిమ్రాన్ కుటుంబం, నటుడు శ్యామ్ తదితర సినీ ప్రముఖులు కలిశారు. ఇటీవల నటి స్నేహ, ప్రసన్న దంపతులు కూడా తమ పిల్లలతో సహా కలిశారన్నది గమనార్హం. -
నాకు పెళ్లైంది.. ఇలాంటి మెసేజ్లు పంపవద్దు..!
తమిళనాడు దిండుక్కల్ జిల్లా నత్తం సమీపంలోని వేలాయుధంపట్టికి చెందిన అరవిందన్ (22) కూలీగా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన నాగలక్ష్మితో అతడు గతంలో సన్నిహితంగా మాట్లాడేవాడు. అయితే మూడు నెలల క్రితం నాగలక్ష్మికి సిరుమలై తాళకడై ప్రాంతానికి చెందిన వీరమణి (24)తో వివాహమైంది. వివాహం అనంతరం కూడా అరవిందన్ నాగలక్ష్మికి తరచూ ఫోన్ సందేశాలు పంపుతూ ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించేవాడు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన నాగలక్ష్మి, తనకు పెళ్లైందని, ఇకపై ఇలాంటి సందేశాలు పంపవద్దని హెచ్చరించింది. ఈ విషయాన్ని ఆమె తన భర్త వీరమణికి కూడా తెలిపింది. అయినప్పటికీ అరవిందన్ తన ప్రవర్తన మార్చుకోలేదు.దీంతో నాగలక్ష్మి పేరుతో వీరమణి అరవిందన్కు సిరుమలైకి రావాలని సందేశం పంపినట్లు సమాచారం. నాగలక్ష్మిని కలుసుకోవచ్చన్న ఉద్దేశంతో అరవిందన్ అక్కడికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా వీరమణి, "నా భార్యను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు" అంటూ అరవిందన్తో వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరగడంతో వీరమణి కత్తితో దాడి చేసి అరవిందన్ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.హత్య అనంతరం జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో వీరమణి మృతదేహాన్ని ఇంటి సమీపంలో గొయ్యి తవ్వి పాతిపెట్టాడు. అనంతరం చెత్తతో కప్పి ఎవరికీ తెలియకుండా దాచిపెట్టేందుకు ప్రయత్నించాడు. అయితే ఈ విషయాన్ని వీరమణి తన స్నేహితుడికి చెప్పగా, అతడు గ్రామ పెద్దలకు సమాచారం అందించాడు. వారి ఫిర్యాదు మేరకు రూరల్ డీఎస్పీ శంకర్, ఇన్స్పెక్టర్ ఉలగనాథన్ నేతృత్వంలోని పోలీసులు మంగళవారం తెల్లవారుజామున ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు.అరవిందన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దిండుక్కల్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
మాజీ ప్రధాని కుమారుడికి రూ.7.8 కోట్ల బురిడీ!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఒక భారీ సైబర్ ఫ్రాడ్ వెలుగులోకి వచ్చింది. భారత మాజీ ప్రధానమంత్రి ఇందర్ కుమార్ గుజ్రాల్ కుమారుడు, మాజీ రాజ్యసభ ఎంపీ నరేష్ కుమార్ గుజ్రాల్ సైబర్ నేరగాళ్ల చేతిలో ఏకంగా రూ. 7.80 కోట్ల మేరకు మోసపోయారు. ఆయనలాగే నటిస్తూ (ఇంపర్సనేషన్) దుండగులు ఆయన సిబ్బందిని బురిడీ కొట్టించి ఈ భారీ మొత్తాన్ని కాజేశారు. ఈ ఘోర సైబర్ దోపిడీపై ఢిల్లీ పోలీసు సైబర్ సెల్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తును ముమ్మరం చేసింది.ప్రొఫైల్ పిక్చర్తో మాయాజాలంసైబర్ నేరగాళ్లు ఈ ఘరానా మోసానికి సరికొత్త పంథాను ఎంచుకున్నారు. నరేష్ కుమార్ గుజ్రాల్ ఫోటోను వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకుని, ఆయన ఆఫీస్ సిబ్బందికి మెసేజ్లు పంపారు. తాను ప్రస్తుతం ఒక ముఖ్యమైన సమావేశంలో ఉన్నానని, అర్జంట్గా ఆర్టీజీఎస్ ద్వారా నిర్దేశిత బ్యాంకు ఖాతాకు నిధులు బదిలీ చేయాలని సదరు ఉద్యోగిని నమ్మించారు. అవతలి ఉన్నది తన బాసేనని నమ్మిన ఆ ఉద్యోగి, సదరు ఖాతాకు రూ. 7.80 కోట్లు బదిలీ చేశాడు.అప్రమత్తతతో దక్కిన ఊరటఈ అనుమానాస్పద లావాదేవీపై సదరు ఉద్యోగి నరేష్ గుజ్రాల్ కుమార్తె దీక్షా గుజ్రాల్కు సమాచారం అందించడంతో అసలు విషయం బయటపడింది. వెంటనే ఆమె తన తండ్రిని సంప్రదించగా, తాను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. తాము సైబర్ మోసానికి గురయ్యామని గ్రహించిన దీక్షా గుజ్రాల్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా భారత సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ '1930'కు ఫిర్యాదు చేసి, ఈ-ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సైబర్ విభాగం అధికారులు తక్షణమే స్పందించి, ఆ అకౌంట్లను సీజ్ చేయడంతో దాదాపు రూ. 4 కోట్లు (మొత్తం సొమ్ములో 70 శాతానికి పైగా) ఫ్రీజ్ అయింది.ఎవరీ నరేష్ గుజ్రాల్?వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్ అయిన నరేష్ గుజ్రాల్, శిరోమణి అకాలీదళ్ పార్టీలో కీలక సీనియర్ నేత. ఆయన 2007 నుండి 2022 వరకు పంజాబ్ తరఫున రాజ్యసభ సభ్యునిగా సేవలు అందించారు. అంతకుముందు 2004 లోక్సభ ఎన్నికల్లో జలంధర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఈయన తండ్రి ఇందర్ కుమార్ గుజ్రాల్ 1997-1998 మధ్యకాలంలో భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల సైబర్ సెల్ ఈ డబ్బు ఎక్కడికి చేరిందనే ‘మనీ ట్రైల్’ను గుర్తిస్తూ, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టింది.ఇది కూడా చదవండి: ‘తుఫాన్ వారియర్’గా మోహన్లాల్ -
ఎస్ఐ ఉద్యోగం వదిలేసి, ఆస్ట్రేలియాలో రియల్ ఎస్టేట్ కింగ్ అయ్యాడు!
ప్రభుత్వం ఉద్యోగం, అదీ ఎస్ఐ ఉద్యోగం అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ ఢిల్లీ పోలీస్ శాఖలో ఎస్ఐ ఉద్యోగాన్ని వదిలేసి, ఆస్ట్రేలియా వలస వెళ్లి అక్కడ రియల్ ఎస్టేట్ ఏజెంట్గా సెటిల్ అయ్యాడు. ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదా. నిశాంత్ తోమర్ అనే మాజీ పోలీస్ ఆఫీసర్ తన ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా పంచుకున్న స్ఫూర్తిదాయక ప్రయాణ వివరాలేంటో తెలుసుకుదాం.నిశాంత్ తోమర్ భారతదేశంలోఢిల్లీ పోలీసు విభాగంలో సబ్-ఇన్స్పెక్టర్గా పనిచేసేవారు. అది ఆయనకి తృప్తి నివ్వలేదు. రిస్క్ తీసుకుంటే తప్పజీవితంలో ఏమీ సాధించలేననున్నారు. అంతే జీవితాన్ని మలుపు తీప్పే నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి ఏంటి ఈ నిర్ణయం పిచ్చా అని అందరూ ఖండించారు. అయినా సరే తన మనసు మాటే విన్నారు. 2023లో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆస్ట్రేలియా విమానం ఎక్కేశారు. (రోజుకు 12 గంటలు, అయినా : 82 ఏళ్ల మన్సుఖ్ కాకా స్టోరీ తెలిస్తే!)అక్కడ భవిష్యత్తుపై ఎలాంటి గ్యారంటీ లేదు. అయినా రిస్క్ చేశారు. జీరో నుంచే జీవితాన్ని మళ్లీ ప్రారంభించారు. ఈ పయనంలో ఎన్నో కష్టనష్టాలు తప్పలేదు. ఒక గౌరవప్రదమైన హోదా ఉన్న ఉద్యోగం నుంచి విదేశాలలో ఎంట్రీ-లెవెల్ జాబ్స్ చేయడం, తన సొంతవాళ్లకు దూరంగా కొత్త వాతావరణం, ఒంటరితనం ఇలాంటి ఎన్నో మానసిక, సామాజిక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. అన్నిఅడ్డంకులను అధిగమించి ఆస్ట్రేలియాలో సొంత ఇల్లు నిర్మించుకోవడమే కాకుండా, ప్రస్తుతం అక్కడ ఒక విజయవంతమైన రియల్ ఎస్టేట్ ఏజెంట్గా మారారు. అంతేకాదు ఆస్ట్రేలియాలో వారి మొదటి సొంత ఇంటి కలని సాకారం చేసుకోవాలనుకునే వారు నిశాంత్ను సంప్రదిస్తున్నారు. ఆయన సాయంతో తమ డ్రీమ్ హౌస్ను సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం.అంత ఈజీగా కాలం కలిసి రాలేదు. అవకాశాలను అందుపుచ్చుకోవడం, కొత్త ప్రదేశానికి అనుగుణంగా తనను తాను మార్చు కోవడం, కష్టాలొచ్చాయని కుంగిపోకుండా, వెనకడుగు వేయకుండా ముంకు సాగడం వల్లే ఇది సాధ్యమైంది అంటారు నిశాంత్. కొన్నిసార్లు మిమ్మల్ని ఎక్కువగా భయపెట్టే నిర్ణయాల నుండే జీవితంలో అతిపెద్ద అవకాశాలొస్తాయి అని విదేశాల్లో కరియర్ వెతుక్కునే వారికి సలహా ఇస్తారు. View this post on Instagram A post shared by Nishant Tomar Realtor (@nishant.in.australia) నిశాంత్ చేసిన వీడియో నెట్టింట పలువుర్ని ఆకర్షిస్తోంది.విదేశాల్లో స్థిరపడాలని కలలుకుంటున్న ఎంతో మంది భారతీయులకు ఈ కథ బాగా కనెక్ట్ అయింది. నెటిజన్లు ఆయన నిర్ణయాన్ని అభినందిస్తూ, "ఆస్ట్రేలియా వెళ్లాక రియల్ ఎస్టేట్ రంగంలోకి రావడానికి ఎలాంటి కోర్సులు లేదా ఉద్యోగాలు చేశారు?" అని కామెంట్ల రూపంలో ఆసక్తిగా అడుగుతున్నారు. ఈ వీడియోకి వేలాది లైక్స్ వ్యూస్ వచ్చాయి.ఇదీ చదవండి : అపుడు నెలకు రూ. 25 వేలు, క్యాబ్ డ్రైవర్గా ఇపుడు లక్ష -
డీఎంకే స్టాలిన్కు బిగ్ షాక్
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకేకు చిరకాల మిత్రుడిగా భావించే ఎండీఎంకే (MDMK) అధినేత వైకో, టీవీకే (TVK) అధినేత విజయ్ను కలవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అంతేకాదు, విజయ్ నాయకత్వంపై ప్రశంసలు కురిపించడం, రాబోయే ఎన్నికల్లో టీవీకే ఆశ్చర్యకర ఫలితాలు సాధించే అవకాశం ఉందని వ్యాఖ్యానించడం స్టాలిన్ శిబిరంలో కలకలం రేపుతోంది. దీంతో, వైకో వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.విజయ్ను కలిసిన వైకో.. తాజాగా వైకో, విజయ్ మధ్య భేటీ జరిగింది. ఈ సందర్భంగా విజయ్ రాజకీయ భవిష్యత్తుపై వైకో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాజకీయాల్లో టీవీకే ఇప్పటికే ఒక శక్తిగా అవతరించిందని, యువత, మహిళలు, తొలి ఓటర్లలో విజయ్కు విశేష ఆదరణ ఉందని పేర్కొన్నారు. అలాగే, టీవీకే భవిష్యత్తులో తమిళ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదగగలదు. రాబోయే ఎన్నికల్లో మ్యాజిక్ చేసే అవకాశం కూడా లేకపోలేదు అని వ్యాఖ్యానించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.డీఎంకే కూటమికి గుడ్బై?1994లో డీఎంకే నుంచి విడిపోయి ఎండీఎంకే స్థాపించారు వైకో. ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమి సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్తో చేతులు కలిపి పోటీ చేశారు. ఎండీఎంకేకు నాలుగు సీట్లు కేటాయించగా.. అందులో మూడు సీట్లను డీఎంకే గుర్తు(ఉదయించే సూర్యుడు), మరో అభ్యర్థిని స్వంత గుర్తుతో వైకో బరిలోకి దించారు. ఎన్నికల్లో ఒక చోట విజయం సాధించారు. అయితే, గత కొంతకాలంగా ఎండీఎంకే నేతల వైఖరిలో మార్పు కనిపిస్తోందన్న చర్చ సాగుతోంది. వైకో కుమారుడు, పార్టీ కీలక నేత దురై వైకో కూడా ఇటీవల టీవీకే ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షించింది.ఇక, వైకో వంటి సీనియర్ ద్రవిడ నాయకుడు విజయ్ను బహిరంగంగా ప్రశంసించడం సాధారణ విషయం కాదు. ప్రస్తుతం ఆయన.. డీఎంకే కూటమిలోనే ఉన్నప్పటికీ, భవిష్యత్తు రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ ఎండీఎంకే నిజంగానే డీఎంకే కూటమిని వీడి టీవీకేకు చేరితే, అది స్టాలిన్కు రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బగా మారవచ్చు. అదే సమయంలో విజయ్ పార్టీకి ద్రవిడ రాజకీయాల్లో విశ్వసనీయత పెరిగే అవకాశం ఉంది.நல்லது நடந்தால் ஆதரிப்பேன் வைகோ அதிரடி 🔥🔥🔥@DMKITwing எதுக்கும் துரோகி பட்டம் கட்டி ஒப்பாரி வைக்க ரெடியா இருங்க 🤣🤣🤣 pic.twitter.com/WAVDSuUXFp— TVK Sqυα∂💥 (@TVKVijay24x7) June 18, 2026అయితే, సినీ నటుడు విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తమిళనాడులో సంప్రదాయ డీఎంకే-ఏఐఏడీఎంకే రాజకీయాలకు ప్రత్యామ్నాయం ఏర్పడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా యువ ఓటర్లలో విజయ్కు పెరుగుతున్న ఆదరణ కారణంగా పలు చిన్న, మధ్య తరహా పార్టీలు కూడా టీవీకే వైపు మొగ్గుచూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైకో భేటీ సాధారణ మర్యాదపూర్వక సమావేశమా? లేక భవిష్యత్తు రాజకీయ పొత్తులకు సంకేతమా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.ఎమ్మెల్యే రాజీనామా?ఇటీవల చెన్నైలో పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రి ఆదవ్ అర్జునా వైకోను కలవగా, మరుసటి రోజు సీఎం విజయ్తో వైకో సమావేశం కావడం ఈ ఊహాగానాలకు మరింత బలం ఇచ్చింది. అయితే ఈ భేటీ పూర్తిగా రాజకీయ అంశాలపై కేంద్రీకృతమైందని పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ, అధికారికంగా కూటమి మార్పుపై స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు.. ఎమ్మెల్యే డీఎంకే గుర్తుపై పోటీ చేసి గెలిచినందున తక్షణమే ప్రభుత్వానికి ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వలేని పరిస్థితి ఉందని, అందుకే రాజీనామాలపై ఆలోచన జరుగుతోందన్న సమాచారం కూడా పార్టీ వర్గాల నుంచి వెలువడుతోంది. -
గుండెపోటుతో ఒకటో తరగతి బాలుడు మృతి
బెంగళూరు: గుండెపోటుతో బాలుడు మృతిచెందిన సంఘటన చిత్రదుర్గ జిల్లా హిరియూరు పట్టణంలో బుధవారం జరిగింది. గుండె నొప్పి వచ్చిందని చెప్పి విలవిలలాడుతుండగా ఆస్పత్రికి తరలించేలోగానే చిన్నారి మరణించాడు. హిరియూరు బీజేపీ తాలూకా అధ్యక్షుడు అభినందన్ కుమారుడు వైష్ణవ్ (4), తనకు గుండెల్లో మంటగా ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు సమీప ఆస్పత్రికి తీసికెళ్లారు. పిల్లాడు అల్లాడిపోవడం చూసి వారు భయపడిపోయారు. దారిలోనే బాలుడు తుదిశ్వాస విడిచాడు. ఒకటో తరగతి చిన్నారి ఇక శివమొగ్గ జిల్లాలో సాగర తాలూకా హలసి గ్రామంలో మరో ఘోరం జరిగింది. సాయంత్రం ప్రభుత్వ పాఠశాల వదిలిన తరువాత ఒకటో తరగతి బాలుడు త్రిలోక్ జైన్ (6) ఇంటికి వెళ్లాలని బయట నిలబడి ఉన్నాడు. అయితే కళ్లు తిరిగి కిందపడిపోయాడు. స్థానికులు, ఉపాధ్యాయులు అతని ముఖం మీద నీళ్లు చల్లగా స్పృహలోకి వచ్చాడు. తరువాత నీరు తాగించి కూర్చోబెట్టగా, టాయ్లెట్కు వెళ్తానని పాఠశాలలోని మరుగుదొడ్డికి వెళ్లాడు.ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో తలుపులు తీసి చూడగా బాలుడు చనిపోయి ఉన్నాడు. బాలునికి చిన్నప్పటి నుంచి గుండె సమస్య ఉన్నట్లు తల్లిదండ్రులు గౌతం జైన్, శిల్ప తెలిపారు. ఈ ఘటన గత శనివారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పసిపిల్లల గుండెపోటు మరణాలపై ఆందోళన నెలకొంది. -
100 రోజుల తర్వాత అంత్యక్రియలు
సాక్షి, చెన్నై: పోలీసుల విచారణలో మరణించిన ఆకాష్ అనే యువకుడి మతదేహానికి 100 రోజుల తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలో అంత్యక్రియలు బుధవారం జరిగాయి. మదురై ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ నుండి ఆకాష్ మతదేహాన్ని స్మశాన వాటికకు తరలిస్తున్న సమయంలో పోలీసులకు, అతడి బంధువులకు మధ్య తీవ్ర తోపులాట, ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులతో ఘర్షణకు దిగిన బంధువులు 50 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మార్చురీకే పరిమితం శివగంగై జిల్లా మానామదురైకి చెందిన ఆకాష్ డెలిసన్ (24) అనే యువకుడిని, స్థానికంగా ఇద్దరిపై దాడి చేసిన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పోలీసుల కొట్టడం వల్లే ఆకాష్ కాలు ఎముక విరిగిందని పేర్కొంటూ అతడిని మదురై ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అయితే, చికిత్స పొందుతూ మార్చి 8వ తేదీన ఆకాష్ ప్రాణాలు కోల్పోయాడు. హైకోర్టు ఆదేశాల మేరకు అప్పట్లోనే అతడి మతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు కొట్టి చంపేశారంటూ బంధువులు ఆందోళనకు దిగడంతో మత దేహం మార్చురీకి పరిమితమైంద.100 రోజులుగా నిరసన ఈ ఘటనపై హత్య కేసు నమోదైనప్పటికీ, బాధ్యులైన పోలీసులను వెంటనే అరెస్ట్ చేయాలని, బాధిత కుటుంబానికి తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ ఆకాష్ బంధువులు పలు విడతలుగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ వచ్చారు.అప్పటి వరకు మత దేహాన్ని తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. కోర్టు ఆదేశంతో రంగంలోకి ప్రభుత్వం వంద రోజులకు పైగా మార్చురికి పరిమితమైన ఆకాష్ మతదేహానికి ప్రభుత్వమే అంత్యక్రియలు లేదా దహన సంస్కారాలు నిర్వహించాలని మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ తమిళనాడు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.దీంతో కోర్టు ఉత్తర్వుల ప్రకారం, జిల్లా రెవెన్యూ అధికారి అన్బళగన్ నేతత్వంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆకాష్ మతదేహాన్ని అంత్యక్రియల కోసం ఆసుపత్రి వెలుపలికి తీసుకువచ్చారు. ఆ సమయంలో అక్కడకు చేరుకున్న ఆకాష్ బంధువులు మతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్నారు. ఉద్రిక్తతల నడుమ అంత్యక్రియలు పరస్పరం వాగ్వాదం, తీవ్ర తోపులాట నడుమ ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో అతడి బంధువులు 50 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం, కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆకాష్ కుటుంబీకుల సమక్షంలోనే మదురైలోని తత్తనేరి విద్యుత్ శ్మశానవాటికలో మతదేహానికి దహన సంస్కారాలు పూర్తి చేశారు. -
‘తుఫాన్ వారియర్’గా మోహన్లాల్
తిరువనంతపురం: కేరళలో మత్తుపదార్థాల మహమ్మారిని అంతమొందించేందుకు కేరళ పోలీసులు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాంటీ-డ్రగ్ డ్రైవ్ ‘ఆపరేషన్ తుఫాన్’ సరికొత్త రూపాన్ని సంతరించుకుంది. మత్తు ముఠాల గుండెల్లో వణుకు పుట్టిస్తూ సాగుతున్న ఈ మహా యుద్ధంలోకి మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ స్వయంగా అడుగుపెట్టారు. తాను కూడా ఒక ‘తుఫాన్ వారియర్’గా మారుతున్నట్లు ప్రకటిస్తూ, కేరళ పోలీస్ విభాగానికి తన పూర్తి మద్దతును ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన షేర్ చేసిన ఒక ప్రత్యేక వీడియో ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది.డ్రగ్స్ మాఫియాపై మహా యుద్ధం‘ఆపరేషన్ తుఫాన్ - ద నార్కో హంట్’ పేరుతో కేరళలో సాగుతున్న ఈ భారీ ఆపరేషన్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మోహన్లాల్ పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల నెట్వర్క్ను సమూలంగా పాతరవేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ పోరాటంలో తాను భాగం కావడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని తుడిచిపెట్టేందుకు కేరళ హోంమంత్రి రమేష్ చెన్నితలతో మోహన్లాల్ ప్రత్యేకంగా సమావేశమై, ఈ పోరాటం కేరళ భవిష్యత్తుకు ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు.హోంమంత్రితో భేటీ.. ఈ భేటీ సందర్భంగా మోహన్లాల్ మాట్లాడుతూ.. డ్రగ్స్కు వ్యతిరేకంగా ఇలాంటి చర్యలు చేపట్టాలని తాను ఎన్నేళ్లుగానో కోరుకుంటున్నానని హోంమంత్రి రమేష్ చెన్నితలకు వివరించారు. ఈ ప్రచారాన్ని నిరంతరాయంగా కొనసాగించాలని, దీనివల్ల వేలాది కుటుంబాలు, విద్యార్థుల జీవితాలు నిలబడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్ నిజంగానే ఒక ‘తుఫాన్’లాగా మారి డ్రగ్స్ మాఫియాను తుడిచిపెట్టేయాలని ఆయన కోరుకున్నారు. ఇదే సమయంలో విశ్వశాంతి ఫౌండేషన్ తరపున తాము రూపొందించిన 'బీ ఏ హీరో, సే నో టు డ్రగ్స్' ప్రాజెక్ట్ వివరాలను హోంమంత్రికి తెలియజేస్తూ, పోలీసులకు ఎలాంటి సహాయం చేయడానికైనా తాను సిద్ధమని ప్రకటించారు.ఇది కూడా చదవండి: ధరలు తగ్గించడం కుదరదు: సురేష్ గోపి -
ధరలు తగ్గించడం కుదరదు: సురేష్ గోపి
త్రిస్సూర్: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు తగ్గినప్పటికీ, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించడం సాధ్యం కాదని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి స్పష్టం చేశారు. విదేశాల నుండి చౌకగా లభించే చమురు భారతదేశానికి చేరుకోవడానికి అనేక సాంకేతిక, రవాణా పరమైన అంశాలు ముడిపడి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. గురువారం త్రిస్సూర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఇటీవల పెరిగిన ఇంధన ధరలు, పశ్చిమాసియా సంక్షోభం వల్ల ఏర్పడిన నష్టాలు, కేరళలో ఎయిమ్స్ ఏర్పాటు వంటి పలు కీలక అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తక్షణమే ధరలు తగ్గకపోవడానికి కారణాలివేఅంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు పడిపోయిన వెంటనే ఇక్కడి మార్కెట్లో ధరలను తగ్గించడం కుదరదని కేంద్ర మంత్రి సురేష్ గోపి తేల్చి చెప్పారు. విదేశాల నుండి తక్కువ ధరకే ముడి చమురు లభించినప్పటికీ, అది హార్ముజ్ జలసంధి గుండా భారీ నౌకల రద్దీని దాటుకుని భారతదేశానికి చేరుకోవడానికి గణనీయమైన సమయం పడుతుందని వివరించారు. ఈ రవాణా వ్యవస్థ అంతా సాధారణ స్థితికి రావాల్సి ఉందన్నారు. ఇటీవల పెరిగిన ఇంధన ధరలలో కేవలం లీటరుకు రూ. 3.94 మేర పెరిగిన ప్రభావం మాత్రమే ప్రజలపై పడిందని, అయితే ప్రపంచవ్యాప్తంగా రేట్లు తగ్గాయనే కారణంతో దీనిని వెంటనే వెనక్కి తీసుకోలేమని ఆయన స్పష్టం చేశారు.చమురు కంపెనీల మనుగడ - కేంద్రంపై భారంఈ ఏడాది ఫిబ్రవరిలో పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి అంతర్జాతీయ చమురు కంపెనీలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని మంత్రి గుర్తుచేశారు. ఆ సమయంలో సామాన్యులపై భారం పడకుండా కేంద్ర ప్రభుత్వమే ఆ నష్టాన్ని చాలా వరకు భరించిందని చెప్పారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం సుమారు రూ. 12,000 కోట్ల మేర నష్టపోయిందని వెల్లడించారు. ఇంధన ధరలు భారీగా పెరిగినప్పటికీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించుకుని, ఆదాయాన్ని వదులుకోలేదని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం సజావుగా సాగాలన్నా, చమురు కంపెనీలు మనుగడ సాగించాలన్నా ఇవన్నీ తప్పవని ఆయన అభిప్రాయపడ్డారు.కేరళ ఎయిమ్స్ వివాదంపై వివరణకేరళలో ఎయిమ్స్ ఆస్పత్రిపై ఏర్పాటుపై వస్తున్న వార్తలపై కూడా సురేష్ గోపి స్పందించారు. మార్కెట్కు వెళ్లి షాపింగ్ చేసినంత సులువుగా ఎయిమ్స్ ఏర్పాటు జరగదని, దీనికి కొన్ని నిర్దిష్టమైన నిబంధనలు, విధానాలు ఉంటాయని పేర్కొన్నారు. కేరళలో ఎక్కడైనా ఎయిమ్స్ ఏర్పాటు చేయవచ్చని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి కె. మురళీధరన్ చేసిన వ్యాఖ్యల్లో కొంత అసమగ్రత ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఎయిమ్స్ కోసం గుర్తించిన స్థలాల వివరాలను సంబంధిత కమిటీకి తెలియజేయాలని, ఆ తర్వాతే తుది లొకేషన్ ఎంపికపై చర్చలు జరుగుతాయని స్పష్టం చేశారు. మురళీధరన్ తనతో మాట్లాడతానని చెప్పినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఆహ్వానం అందలేదని ఆయన తెలిపారు.ఇది కూడా చదవండి: డాక్టర్.. ఎక్స్రే తిప్పి చూశారా? కళ్లకు ప్లాస్టర్ వేసుకున్నారా? -
డాక్టర్.. ఎక్స్రే తిప్పి చూశారా? కళ్లకు ప్లాస్టర్ వేసుకున్నారా?
దేవరియా: ఉత్తరప్రదేశ్లోని దేవరియా జిల్లాలో ఘోర వైద్య నిర్లక్ష్యం వెలుగుచూసింది. మహర్షి దేవరహా బాబా మెడికల్ కాలేజీ వైద్యుల నిర్లక్ష్యానికి ఓ ఆరేళ్ల చిన్నారి ఇక్కట్ల పాలయ్యింది. ఆడుకుంటూ కిందపడి కుడిచేయి విరగ్గొట్టుకున్న బాలికకు, అక్కడి సిబ్బంది బాగున్న ఎడమచేతికి ప్లాస్టర్ కట్టడం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.కుడిచేయి విరిగితే.. ఎడమచేతికి కట్టుదేవరియాలోని భుజౌలీ కాలనీకి చెందిన అల్పనా ఉపాధ్యాయ కుమార్తె (6)ఆడుకుంటూ కిందపడటంతో ఆమె కుడిచేతికి తీవ్ర గాయమైంది. కంగారుపడిన తల్లి వెంటనే ఓ ప్రైవేట్ డాక్టర్ వద్దకు తీసుకెళ్లి ఎక్స్రే తీయించింది. అందులో కుడిచేయి ఫ్రాక్చర్ (ఎముక విరగడం) అయినట్లు తేలింది. ఆ రిపోర్టు పట్టుకుని ఆమె నేరుగా మహర్షి దేవరహా బాబా ప్రభుత్వ మెడికల్ కాలేజీకి వెళ్లింది. అక్కడ ఓపీ విభాగంలోని ఆర్థోపెడిక్ (ఎముకల) వైద్యుడు ప్రిస్క్రిప్షన్ రాసి, పక్కనే ఉన్న ప్లాస్టర్ రూమ్కు వెళ్లమన్నాడు.ఎక్స్రే చూసినా కూడా..బాధిత తల్లి ప్లాస్టర్ గదికి వెళ్లి ప్రభుత్వ రుసుము చెల్లించింది. అక్కడ ఉన్న సిబ్బందికి డాక్టర్ రాసిన పత్రాలు, కుడిచేతి ఎక్స్రే రిపోర్టును కూడా చూపించింది. అయితే కనీస బాధ్యత లేకుండా ప్రవర్తించిన ఆ ఉద్యోగి, రిపోర్టును సరిగ్గా గమనించకుండానే బాలిక యొక్క బాగున్న ఎడమచేతికి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కట్టు వేశారు. ఇంటికి వెళ్లాక కూడా చిన్నారి కుడిచేతి నొప్పితో విలవిలలాడటంతో గమనించిన తల్లి, ఆసుపత్రి సిబ్బంది చేసిన ఘోర తప్పిదాన్ని చూసి షాక్కు గురైంది.సోషల్ మీడియాలో వీడియో వైరల్ఈ ఘోర నిర్లక్ష్యంపై సదరు తల్లి సోషల్ మీడియా వేదికగా కన్నీరు పెట్టుకుంటూ ఆసుపత్రి తీరును ఎండగట్టింది. ఈ వీడియో కాస్తా ఇంటర్నెట్లో దావానలంలా వ్యాపించడంతో ఉన్నతాధికారులు దిగివచ్చారు. దీనిపై మెడికల్ కాలేజీ సీఎంఎస్ (చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్) డాక్టర్ హెచ్.కె. మిశ్రా స్పందిస్తూ.. ఈ ఘటనపై సమగ్ర విచారణకు కమిటీని ఏర్పాటు చేశామని, నివేదిక ఆధారంగా తప్పు చేసిన డాక్టర్ లేదా ప్లాస్టర్ రూమ్ సిబ్బందిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.ఇది కూడా చదవండి: ఏఐ తెచ్చిన పెళ్లి సంబంధం.. జేబుకు పెట్టింది పెద్ద కన్నం! -
టీఎంసీకి ఎదురుదెబ్బ.. ప్రతిపక్ష హోదా వివాదంలో ట్విస్ట్!
పశ్చిమ బెంగాల్ పొలిటికల్ ట్విస్టుల పర్వం కొనసాగుతోంది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి, మాజీ సీఎం మమతా బెనర్జీకి ఇంకో ఎదురుదెబ్బ తగిలింది. తిరుగుబాటు ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని ప్రస్తుతానికి ప్రతిపక్ష నేతగా కొనసాగేందుకు గురువారం కలకత్తా హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో స్పీకర్ నిర్ణయంపై తాత్కాలిక స్టే ఇవ్వాలన్న టీఎంసీ విజ్ఞప్తికి నిరాకరించింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. టీఎంసీ చీలిక దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నాయకత్వంపై అసంతృప్తితో 59 మంది ఎమ్మెల్యేలు(మొత్తం 80 మంది గెలిచారు) రెబల్ గ్రూప్ను ఏర్పాటు చేశారు. వాళ్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న రితబ్రత బెనర్జీ.. తనను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించాలని అసెంబ్లీ స్పీకర్ను ఆశ్రయించారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉండడంతో స్పీకర్ కూడా దానిని ఆమోదించారు. అయితే.. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దీదీ టీఎంసీ వర్గం హైకోర్టును ఆశ్రయించింది. ఇవాళ వాదనల సందర్భంగా.. పార్టీ సస్పెండ్ చేసిన ఓ వ్యక్తిని ప్రతిపక్ష నేతగా ఎలా నిర్ణయిస్తారని? ప్రశ్నించింది. అసెంబ్లీ లోపల ప్రతిపక్ష నేత (Leader of Opposition)గా గుర్తించిన స్పీకర్ రతిన్ బసు నిర్ణయం సరికాదని.. ఆయన ఎలాంటి విచారణ జరపకుండానే ఆ పని చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఒక పార్టీ తీసుకున్న నిర్ణయం కాకుండా.. సంఖ్యా బలం ఆధారంగా ప్రతిపక్ష నేతను నిర్ణయించడం రాజ్యాంగానికి విరుద్దమని వాదించింది.టీఎంసీ ప్రతిపాదన పెండింగ్లో ఉండగా.. మరో వ్యక్తిని.. అందునా సస్పెండ్ అయిన వ్యక్తిని ఎలా నిర్ణయించారని స్పీకర్ను జస్టిస్ కృష్ణారావు వివరణ కోరారు. అయితే.. స్పష్టమైన సంఖ్యా బలం ఉండడంతో స్పీకర్ ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అసెంబ్లీ కార్యదర్శి వివరణ ఇచ్చారు. అయితే.. ఆ సమయంలో టీఎంసీ తరఫున అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ అంశంలో మరింత విచారణ అవసరమని తదుపరి విచారణను జస్టిస్ కృష్ణారావు జులై 28కి వాయిదా వేశారు. స్టే విధించాలన్న పిటిషనర్ అభ్యర్థనను తోసిపుచ్చారు. అలాగే తదుపరి విచారణ లోపు అన్ని పక్షాలు తమ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో స్పీకర్ నిర్ణయం ప్రస్తుతానికి అమల్లోనే కొనసాగనుంది.ఇదిలా ఉండగా.. మమతా బెనర్జీతో సహా టీఎంసీకి చెందిన కీలక నేతలంతా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడారు. దీంతో సీనియర్ నేత శోభనదేవ్ చటర్జీని లెజిస్లేటివ్ పార్టీ నేతగా ఆమె వర్గం ప్రతిపాదించింది. ఈలోపు టీఎంసీలో ముసలం మొదలైంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంతో జూన్ 1వ తేదీన రితబ్రత బెనర్జీని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే.. 58 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండడంతో ఆయనకే ప్రతిపక్ష నేత గుర్తింపు దక్కింది. మొత్తం మీద, హైకోర్టు తాజా నిర్ణయంతో పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త ఉత్కంఠ నెలకొంది.


