National
-
మోదీ వార్నింగ్తో వణికిన మార్కెట్లు
(సాక్షి, బిజినెస్): ‘ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోండి. పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించుకోవడానికి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి. ఎలక్ట్రిక్ వాహనాలను, ప్రజా రవాణాను మరింతగా ఉపయోగించుకోండి. వంట నూనెలు, ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోండి. విదేశీ వస్తువులు వద్దు... స్వదేశీయే ముద్దు’ అంటూ ప్రధాని మోదీ తాజాగా ఎత్తుకున్న పొదుపు రాగంతో మార్కెట్లు కకావికలం అవుతున్నాయి. ఇరాన్ యుద్ధ ప్రభావంతో చమురు రేట్లు భారీగా ఎగబాకటం.. రూపాయి విలువ పాతాళానికి జారిపోతుండటం.. ద్రవ్యోల్బణం సెగలు రేగటంతో ఇప్పటికే దేశీ స్టాక్ మార్కెట్లలో ‘బేర్’ బాజా మోగుతోంది. అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మోదీ పొదుపు సూచనలతో ప్రజల వినిమయం పడిపోయి జీడీపీ వృద్ధికి చిల్లు పడొచ్చని ఆర్థిక నిపుణుల వార్నింగ్లు మొదలయ్యాయి. ఇవన్నీ కలిసి మార్కెట్లను వణికిస్తుండటంతో గత రెండు రోజుల్లోనే ఏకంగా రూ. 16 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరి కావడం ఇన్వెస్టర్లను దిక్కుతోచని స్థితిలోకి నెట్టింది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ముడిచమురు, బంగారం, ఎరువులతో సహా అనేక కమోడిటీల ధరలు ఇప్పటికే భారీగా ఎగిశాయి. ప్రధానంగా దిగుమతులపైనే ఆధారపడిన భారత్పై దీని ప్రభావం తీవ్రంగా పడింది. ముడి చమురు రేటు 100 డాలర్ల పైకి దూసుకెళ్లడంతో దిగుమతుల బిల్లు భారీగా పెరిగిపోతోంది. డాలర్లను అధికంగా వెచ్చించాల్సి రావడంతో మన చేతి ‘చమురు’ వదులుతోంది. విదేశీ మారక నిల్వలు తరిగిపోతున్నాయి. దీంతో రూపాయి ఇంకా పడిపోతోంది. మన దిగుమతుల్లో దాదాపు మూడో వంతు వాటా క్రూడ్, పసిడి, ఎరువులు, వంటనూనెలదే కావడంతో ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. అందుకే మోదీ వీటి కొనుగోళ్లు, వాడకాన్ని తగ్గించేందుకు పొదుపు మంత్రాన్ని జపించారు. ఎకానమీలో నెలకొన్న బలహీనతలకు ఇది అద్దం పడుతోందన్నది నిపుణుల మాట. మార్కెట్లకు షాక్...: మోదీ సూచనలను జరగబోయే పరిణామాలకు వార్నింగ్గా భావించిన మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. రెండు రోజుల్లో సెన్సెక్స్ దాదాపు 3,000 పాయింట్లు, నిఫ్టీ 800 పాయింట్లకు పైగా కుప్పకూలాయి. సోమవారం రూ.6 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరికాగా, మంగళవారం మరో రూ.10 లక్షల కోట్లు ఎగిరిపోయాయి. మోదీ సూచనల ప్రభావానికి తోడు ఇరాన్తో సీజ్ఫైర్ గాల్లో దీపమంటూ.. ట్రంప్ చేసిన ప్రకటనతో మడిచమురు ధరలు భగ్గుమనడం ఈ మార్కెట్ పతనానికి ప్రధాన కారణం. గోల్డ్ రిటైల్ సంస్థలు, ట్రావెల్, వినియోగ వస్తువుల షేర్లు వరుసగా రెండో రోజూ పడిపోవడం గమనార్హం. పసిడి కొనుగోళ్లపై గందరగోళం... బంగారాన్ని ఏడాది పాటు కొనొద్దంటూ స్వయంగా మోదీయే చెప్పడంతో జనానికి ఏం చేయాలో తోచని పరిస్థితి ఎదురైంది. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలో తులం రూ.1.85 లక్షల ఆల్టైమ్ రికార్డు స్థాయిని తాకిన పుత్తడి. ఇప్పుడు రూ.1.5 లక్షల స్థాయిలో ఉంది. అంతర్జాతీయంగానూ ఔన్స్ 5,600 డాలర్లను తాకి ప్రస్తుతం 4,600 డాలర్ల వద్ద ఉంది. అయితే, రూపాయి మారకం విలువ భారీగా క్షీణించడంతో దేశీయంగా పసిడి రేట్లు పెద్దగా దిగిరాలేదు. భారతదేశ మొత్తం దిగుమతుల్లో బంగారం వాటా దాదాపు 9 శాతం. మనం వినియోగించే బంగారంలో దిగుమతుల వాటా ఏకంగా 90 శాతం. అంటే ఏటా 700–800 టన్నులు. దీనికి భారీగా డాలర్లు వెచ్చించాల్సి రావటంతో మన ఫారెక్స్ నిల్వలకు గండి పడుతోంది. గడిచిన రెండు నెల్లల్లో దాదాపు 38 బిలియన్ డాలర్లు తగ్గి మన నిల్వలు 690.69 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇది రూపాయి పతనాన్ని పెంచుతోంది. దీనికి అడ్డకట్టవేయడానికే మోదీ పొదుపు మంత్రం ఎత్తుకున్నారు. కాకపోతే రేటు మరింత పెరిగితే కొనలేమేమోనన్న ఆందోళనలో ఉన్న సామాన్యుల్లో ప్రధాని ప్రకటన గందరగోళాన్ని పెంచింది. యుద్ధం మళ్లీ తీవ్రమైతే బంగారం దూసుకెళ్లే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అందుకే కొనుగోళ్లకు బ్రేక్ వేసేందుకు అవసరమైతే దిగుమతి సుంకాన్ని (ప్రస్తుతం 6 శాతం) కూడా ప్రభుత్వం పెంచవచ్చన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలా చేస్తే బంగారం రేట్లు దేశీయంగా మరింత భగ్గుమంటాయి. మరోపక్క, పసిడి కొనుగోళ్లను నిరుత్సాహపరిస్తే ఆభరణాల పరిశ్రమపై ప్రభావం పడి, లక్షల మంది ఉపాధి కోల్పోవచ్చన్న ఆందోళనలూ ఉన్నాయి. క్రూడ్ పైపైకి.. త్వరలో పెట్రో వాత! కాల్పుల విరమణ తర్వాత కాస్త శాంతించిన క్రూడ్ రేట్లు మళ్లీ యుద్ధ భయాలతో భగ్గుమన్నాయి. మంగళవారం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 109 డాలర్లను తాకింది. చమురు సెగతో ఎఫ్ఎంసీజీతో సహా ఇప్పటికే దేశీయంగా పలు ఉత్పత్తుల ధరలు ఎగబాకుతున్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు రోజుకు దాదాపు రూ.1,700 కోట్ల ఆదాయ నష్టాల నేపథ్యంలో నేడోరోపో పెట్రో వాత ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి. మోదీ రెండు రోజుల క్రితం జపించిన పొదుపు మంత్రం నేపథ్యంలో బుధవారం జరిగే కేంద్ర కేబినెట్ భేటీలో ఏం నిర్ణయాలు తీసుకుంటారోననే ఉత్కంఠ నెలకొంది. పెట్రో రేట్లను పెంచితే ద్రవ్యోల్బణం మరింత ఎగబాకి, వడ్డీ రేట్ల పెంపునకు దారితీస్తుందని.. ఎకానమీ మరింత మందగమనంలోకి జారిపోతుందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. మోదీ పొదుపు సూచనలు ఆర్థిక వ్యవస్థకు తాత్కాలిక ఉపశమనాన్నే ఇస్తాయని.. క్రూడ్ రేట్లు 100 డాలర్ల పైన ఎక్కువ కాలం ఉంటే జీడీపీ వృద్ధిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్తో సహా పలు రేటింగ్ ఏజెన్సీలు ఈ ఏడాది వృద్ధి రేటుకు కోత వేయటం తెలిసిందే. 6– 6.5 శాతానికే వృద్ధి పరిమితమవుతుందన్న అంచనాల నేపథ్యంలో మోదీ పొదుపు పిలుపు ప్రభావంతో 6 శాతం కిందికి పడిపోవచ్చని విశ్లేషకులు లెక్కలేస్తున్నారు. రూపాయి విలవిల.. ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుంచీ రూపాయి జారుడుబల్లపైనే ఉంది. చమురు రేట్ల దెబ్బతో దిగుమతుల బిల్లు పెరగటం దీనికి ప్రధాన కారణం. మరోపక్క, విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) స్టాక్ మార్కెట్ల నుంచి పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకోవడం కూడా దేశీ కరెన్సీని వణికిస్తోంది. ఈ ఏడాది ఇప్పటిదాకా ఏకంగా రూ.2 లక్షల కోట్ల విలువైన షేర్లను ఎఫ్పీఐలు విక్రయించడం గమనార్హం. 2025 చివర్లో డాలర్తో 90 స్థాయిలో ఉన్న రూపాయి... ఇపుడు 95కి చేరింది. ఏడాది కాలంలో దాదాపు 10 శాతం క్షీణించింది. ఈ ఏడాది ఆసియాలో దారుణంగా పడిపోయిన కరెన్సీ మనదే. కాగా, మంగళవారం మరో 40 పైసలు పడ్డ రూపాయి.. సరికొత్త ఆల్టైమ్ కనిష్టమైన 95.68కి జారిపోయింది. రూపాయి ఇలా పతనమవటం దిగుమతుల బిల్లు మరింత పెరిగేలా చేస్తోంది. ఎందుకంటే దిగుమతుల కోసం డాలర్ల రూపంలో చెల్లించడానికి మనం మరిన్ని రూపాయలు ఖర్చు చేయాలి కదా!!. ఎరువులు, వంట నూనెల మంట! యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధిలో రవాణా ఆగిపోవటంతో దేశంలో ఎరువుల రేట్లకు రెక్కలొస్తున్నాయి. మన యూరియా దిగుమతుల్లో 75 శాతం గల్ఫ్ దేశాల నుంచే వస్తున్నాయి. ఇక డీఏపీ దిగుమతుల్లో సౌదీ వాటా 40 శాతం. 2025–26లో భారత్ ఏకంగా 14.5 బిలియన్ డాలర్ల విలువైన ఎరువులను దిగుమతి చేసుకుంది. ఇప్పుడు సరఫరాపరమైన ఇక్కట్లు.. రూపాయి తీవ్ర పతనంతో ఈ దిగుమతులు మరింత భారమై, దేశీయంగా రేట్లు ఎగబాకుతున్నాయి. ఖరీఫ్ సీజన్కు సమాయత్తమవుతున్న రైతులు రేట్ల పెరుగుదలకు తోడు తగినంత సరఫరా ఉంటుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. మరోపక్క, వంటింట్లో వంటనూనెల మంట మండుతోంది. భారత్ వంటనూనెల అవసరాల్లో 60 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. 2025–26లో 19.5 బిలియన్ డాలర్ల విలువైన వంటనూనెలను దిగుమతి చేసుకుంది. రూపాయి వాతతో దేశీయంగా రేట్లు ఇప్పటికే భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ఎరువులు, వంట నూనెల వాడకాన్ని తగ్గించుకోవాలంటూ మోదీ పిలుపునివ్వడం గమనార్హం. -
వీసీకే అధినేతను సీఎంను చేయడానికి సంప్రదింపులు జరిగాయా?
చెన్నై: కులం-ముఖ్యమంత్రి పదవి గురించి విదుతలై చిరుతైగల్ కచ్చి (వీసీకే) అధినేత తొల్ తిరుమావళవన్ ఇటీవల చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. తమిళనాడు ఎన్నికల్లో 2 స్థానాలు గెలిచి, ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకేకు వీసీకే మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. టీవీకే అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు కూటమి ఏర్పాటు జరిగితే తనను ముఖ్యమంత్రిని చేస్తామంటూ అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు సంప్రదించాయంటూ వచ్చిన వార్తలను తిరుమావళవన్ ఖండించారు. తాను చేసిన వ్యాఖ్యల అర్థాన్ని వక్రీకరించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దని తిరుమావళవన్ మీడియాను కోరారు. “మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయాలని కొందరు ప్రయత్నించారని వార్తలు వస్తున్నాయి. ఆ ప్రయత్నాన్ని కాంగ్రెస్ అడ్డుకుందని అంటున్నారు” అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారని తిరుమావళవన్ తెలిపారు. దానికి తాను స్పందిస్తూ.. “అలాంటి ప్రయత్నం జరిగిందని నాకు కూడా సమాచారం వచ్చింది” అని అన్నారు.ఎవరూ నన్ను సంప్రదించలేదు తనకు పరిచయం ఉన్న కొంతమంది స్నేహితులు వచ్చి తనను ముఖ్యమంత్రిగా చేసే ప్రయత్నాల గురించి మాట్లాడారని తెలిపారు. అంతేగానీ, డీఎంకే, ఏఐఏడీఎంకే నుంచి అధికారికంగా ఎవరూ తనను ముఖ్యమంత్రి విషయంపై సంప్రదించలేదని, తానూ ఈ విషయం గురించి ఎవరితోనూ చర్చించలేదని చెప్పారు. ఆ ప్రశ్నకు తాను వివరణ ఇచ్చానని.. కానీ, దానికి వేరే అర్థం వచ్చేలా శీర్షికలు పెట్టి వార్తలు ప్రచారం చేసి సంచలనం సృష్టించడం మీడియాకు సరికాదని తెలిపారు. నిన్న, ఇవాళ దీని గురించి మీడియాలో నిర్ధారణ కాని వార్తలు వస్తూనే ఉన్నాయని తెలిపారు. తమిళనాడులో దళిత సమాజానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిని చేసేందుకు తమిళ సమాజం ఇంకా సిద్ధంగా లేదన్నది అందరికీ తెలిసిన చేదు నిజమని చెప్పారు.భారతదేశంలో ఉత్తరప్రదేశ్, ఆంధ్ర, మహారాష్ట్ర, బిహార్, పంజాబ్ రాష్ట్రాల్లో దళితులు ముఖ్యమంత్రులుగా పాలనా పీఠంపై నిలిచిన చరిత్ర ఉందని తెలిపారు. కానీ, తమిళనాడులో ఇంకా 100 సంవత్సరాలు గడిచినా అది కలగానే మిగులుతుందని తనకు తెలుసని చెప్పారు. అయినా, నేటి రాజకీయ పరిస్థితుల్లో అలాంటి చర్చ జరిగిందని చెప్పారు. దాన్ని వక్రీకరించి వేరే అర్థం వచ్చే ఉద్దేశంతో కొన్ని మాధ్యమాలు వార్తలు ప్రచారం చేయడం బాధ కలిగిస్తోందని తిరుమావళవన్ చెప్పారు. కాగా, టీవీకేకు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు ఉంది. కాంగ్రెస్కు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. సీపీఐ, సీపీఐ(ఎం), వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలకు తలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎన్నికల్లో టీవీకే 108 అసెంబ్లీ స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలిచింది. -
ఆ ఏరియాలో ల్యాండ్ కొన్నారు.. బ్యూరోక్రాట్స్కి లక్కు లక్కలా అతుక్కుంది
భోపాల్: సుమారు 50 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల లక్కు లక్కలా అతుక్కుంది. కొన్నేళ్ల క్రితం యాభై మంది బ్యూరోక్రాట్లు ఒకే ప్రాంతంలో ఐదు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ భూమి విలువ పెట్టిన పెట్టుబడితో పోలిస్తే 11 రెట్లు పెరిగింది.జాతీయ మీడియా కథనాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్లోని కోలార్ ప్రాంతానికి సమీపంలో గురాడి ఘాట్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి చెందిన ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని 2022 ఏప్రిల్లో ఒకే రోజు 50 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రూ. 5.5 కోట్లకు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన భూమిని భవిష్యత్తులో ప్లాట్లుగా మార్చాలని నిర్ణయించారు.భూమి కొనుగోలు చేసిన వారిలో ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, హర్యానా కేడర్కు చెందిన అధికారులు ఉన్నారు. కొనుగోలు చేసిన 16 నెలల తర్వాత, అంటే 2023 ఆగస్టులో మధ్యప్రదేశ్ కేబినెట్ రూ. 3,200 కోట్లతో వెస్ట్రన్ బైపాస్ ప్రాజెక్ట్ నిర్మాణానికి కీలక నిర్ణయం తీసుకుంది. కొనుగోలు సమయంలో ఆ భూమి వ్యవసాయ భూమి. కానీ బైపాస్ ఆమోదం వచ్చిన 10 నెలల్లోపే ఆ భూమి నివాస ప్రాంతంగా మార్చారు. ఫలితంగా వ్యవసాయ భూమి ధరతో పోలిస్తే నివాస ప్రాంతం ధర అనేక రెట్లు ఎక్కువగా ఉండటంతో ఆ భూమి విలువ దాదాపు 11 రెట్లు పెరిగింది.భూమి నివాస ప్రయోజనాల కోసం విభజించినప్పటికీ, ఇప్పటివరకు అక్కడ ఎలాంటి హౌసింగ్ సొసైటీ అభివృద్ధి కాలేదు. సాధారణ ప్రక్రియ ప్రకారం, మొదట ప్లాట్లు కేటాయించాలి లేదా భూమిని రిజిస్టర్డ్ సొసైటీకి బదిలీ చేయాలి. కానీ ఇలాంటివి చేయకుండా నిబంధనలను ఉల్లంఘించి వ్యవసాయ భూమిని నివాస ప్రాంతంగా మార్చారు. 2022 ఏప్రిల్ 4న ఒకే రిజిస్ట్రేషన్ పత్రం ద్వారా 2.023 హెక్టార్ల వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు తేలింది. ఈ లావాదేవీలో 50 మంది షేర్హోల్డర్లు కలసి ఆస్తిని సొంతం చేసుకున్నారు. భూమి రూ. 5.5 కోట్లకు రిజిస్టర్ చేయబడింది. అయితే ఆ సమయంలో దాని మార్కెట్ విలువ రూ. 7.78 కోట్లుగా ఉందని దైనిక్ భాస్కర్ నివేదించింది.ప్రభుత్వ ఉద్యోగులు తమ సొంత, కుటుంబ సభ్యుల లేదా బినామీ పేర్లలో ఉన్న స్థిర ఆస్తుల (భూమి, ఇల్లు) వివరాలను ప్రతి సంవత్సరం జనవరి 31లోపు ప్రభుత్వానికి సమర్పించాలి. ఈ ప్రక్రియలో (IPR) ఐదు ఎకరాల భూమిని 50 మంది బ్యూరోక్రాట్లు కొనుగోలు చేసినట్లు చూపించినా, ఆ భూమి మొత్తం 41 మంది పేర్లలోనే ఉందని రికార్డులు వెల్లడించాయి. పదహారు నెలల తర్వాత, 2023 ఆగస్టు 31న మధ్యప్రదేశ్ కేబినెట్ రూ. 3,200 కోట్ల వెస్ట్రన్ బైపాస్ ప్రాజెక్టును ఆమోదించింది. ప్రతిపాదిత మార్గం ఆ భూమి నుండి 500 మీటర్ల దూరంలోనే వెళ్లనుందని సమాచారం.2022లో ఈ ఐదు ఎకరాల భూమి చదరపు అడుగుకు దాదాపు రూ. 81.75 రేటుకు కొనుగోలు చేశారు. 2024 జూన్లో భూమి వినియోగం మారిన తర్వాత రేటు చదరపు అడుగుకు రూ. 557కు పెరిగింది. 2026 నాటికి ప్రస్తుత మార్కెట్ రేటు చదరపు అడుగుకు రూ. 2,500 నుండి రూ. 3,000 మధ్య ఉంది. అందువల్ల ఆ భూమి మార్కెట్ విలువ రూ. 55 కోట్ల నుండి రూ. 65 కోట్ల మధ్యగా ఉందని అంచనా. -
రాజకుటుంబం.. డబ్బు కష్టం: జాహ్నవి కుమారి మేవార్
రాజుల గురించి, రాజకుటుంబాల గురించి చాలామంది పుస్తకాల్లో చదువుకుని ఉంటారు. భారతదేశంలో రాజరిక వ్యవస్థ అధికారికంగా అంతరించిపోయినప్పటికీ.. కొన్ని రాజ కుటుంబాలు మాత్రం తమ సంపదను కాపాడుకుంటూ.. కొత్త తరానికి అనుగుణంగా వ్యాపారాలను అభివృద్ధి చేస్తున్నాయి. అలాంటి కుటుంబాల్లో మేవార్ రాజ కుటుంబం ఒకటి.ప్రస్తుతం ఈ కుటుంబం వివిధ వ్యాపారాలు చేస్తూ, పెట్టుబడులు పెడుతూ ముందుకు సాగుతోంది. వీరికి కూడా డబ్బు సమస్య ఉంటుంది. ఈ విషయాన్ని జాహ్నవి కుమారి మేవార్ వెల్లడించారు. ఈమె చదువుకునే రోజుల్లో పలు ఉద్యోగాలు కూడా చేసినట్లు చెప్పారు.వ్యాపార జీవితానికి బలమైన పునాదిజాహ్నవి కుమారి చిన్నప్పటి నుంచే రాజభవన వాతావరణంలో పెరిగింది. ఇతర పిల్లల్లానే ఆమె కూడా సాధారణ బాల్యాన్ని అనుభవించినప్పటికీ, ఆమె చదువు రాజభవనం లోపలే తన బంధువులతో కలిసి సాగింది. చిన్న వయసులోనే ప్రముఖులు, విదేశీ అతిథులను కలవడం వల్ల ఆమెకు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, అనే నైపుణ్యాలు సహజంగానే వచ్చాయి. ఇవే తర్వాత ఆమె వ్యాపార జీవితానికి బలమైన పునాది అయ్యాయి.ఆమె కుటుంబానికి రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ, లాజిస్టిక్స్, వినియోగ వస్తువులు, విద్య వంటి అనేక రంగాల్లో పెట్టుబడులు ఉన్నాయి. చిన్నప్పటి నుంచే తండ్రి ఆఫీస్ పట్ల ఆమెకు ప్రత్యేక ఆసక్తి ఉండేది. తండ్రి కుర్చీలో కూర్చొని ఫైళ్లపై సంతకాలు చేయాలని పట్టుబడే ఆ చిన్నారి, తర్వాత నిజంగా కుటుంబ వ్యాపార బాధ్యతలను చేపట్టింది.మూడు ఉద్యోగాలు చేస్తూ..అయితే.. రాజ కుటుంబానికి చెందిన వారికి కూడా డబ్బు డబ్బు సమస్య ఉంటుందని జాహ్నవి స్పష్టం చేసింది. విదేశాల్లో చదువుతున్న సమయంలో ఆమెకు అవసరమైన ఖర్చులు మాత్రమే కుటుంబం భరించింది. అదనంగా.. ఆమె క్యాటరింగ్, క్లబ్ ప్రమోషన్, టెలిమార్కెటింగ్ వంటి మూడు ఉద్యోగాలు చేస్తూ చదువు కొనసాగించింది. దీని ద్వారా కష్టపడి సంపాదించే విలువ ఆమెకు అర్థమైంది.తన ఇరవై ఏళ్ల ప్రారంభంలోనే.. జాహ్నవి కుటుంబ పెట్టుబడి వ్యవస్థను మార్చడం ప్రారంభించింది. పెట్టుబడుల్లో పారదర్శకత, బాధ్యత, దీర్ఘకాల లాభాలపై ఆమె ఎక్కువ దృష్టి పెట్టింది. ఆమె తీసుకున్న మొదటి నిర్ణయాల్లో ఒకటి.. కుటుంబంతో కలిసి పెట్టుబడులు పెట్టే బంధువులు, స్నేహితులు తమ ఖర్చులను తామే భరించాలి అనేది. మొదట ఆమె తండ్రి దీనికి వ్యతిరేకించినా, తర్వాత అదే నిర్ణయం కుటుంబ ఆర్థిక వ్యవస్థను మరింత క్రమబద్ధం చేసింది.పెట్టుబడి విధానంలో మార్పు!అంతేకాకుండా.. ఆమె పెట్టుబడి విధానాన్ని కూడా పూర్తిగా మార్చింది. మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా పెట్టుబడులు పెట్టడం ప్రారంభించింది. బ్యాంకర్లు, సలహాదారులు, అకౌంటెంట్లు వంటి మధ్యవర్తులు ఖర్చును పెంచుతారని, బాధ్యతను తగ్గిస్తారని ఆమె భావించింది. అందుకే ఆమె కుటుంబాన్ని ప్రపంచవ్యాప్తంగా కొత్త అవకాశాల వైపు మళ్లించింది, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లపై దృష్టి పెట్టింది.ఒక యువతి, అది కూడా రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో, పెద్దవారి మధ్య తనను తాను నిరూపించుకోవడం ఆమెకు సులభం కాలేదు. చాలామంది ఆమె సామర్థ్యాన్ని అనుమానించారు. అయినప్పటికీ, ఆమె ధైర్యంగా ముందుకు సాగింది. ఆమె జీవితంలో మరో ముఖ్యమైన విషయం “సంపదను ముందుగా కాపాడుకోవాలి, తర్వాతే పెద్ద రిస్క్లు తీసుకోవాలి” అనే పాఠం. ఈ విషయాన్ని ఆమె కుటుంబానికి ఎన్నో సంవత్సరాలుగా సేవ చేసిన అనుభవజ్ఞులైన సలహాదారులు నేర్పారు. సంపదను కేవలం ఖర్చు చేయడం కాదు, దాన్ని తరతరాలకు నిలబెట్టడం ముఖ్యం అని అర్థం చేసుకుంది.ఇదీ చదవండి: బంగారం కొనుగోలుపై.. 1967లో ఇదే జరిగిందా? -
రూ. 30 వేల కోట్ల ఆస్తి వివాదం, సుప్రీంకోర్టు అసహనం
గత ఏడాది జూన్లో ఇంగ్లాండ్లో పోలో ఆడుతూ మరణించిన వ్యాపారవేత్త సంజయ్ కాపూర్రూ. 30,000 కోట్ల వారసత్వ సంపద కోసం కపూర్ కుటుంబం మధ్య జరుగుతున్న సుదీర్ఘ పోరాటంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేబీ పార్దివాలా ఘాటుగా స్పందించారు. ఈ వివాదంలో దాఖలవుతున్న పిటిషన్ల వెల్లువను చూసి, "చూస్తుంటే మహాభారతం కూడా చిన్నదిగా కనిపిస్తుంది" అని ఆయన వ్యాఖ్యానించారు.మే 18న జరగాల్సిన 'రఘువంశీ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్' (RIPL) బోర్డు సమావేశాన్ని నిలిపివేయాలని సంజయ్ కపూర్ తల్లి 80 ఏళ్ల రాణి కపూర్ మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశించిన మధ్యవర్తిత్వ ప్రక్రియను పక్కదారి పట్టించేందుకు జరుగుతున్న 'మోసపూరిత ప్రయత్నం'గా ఈ సమావేశాన్ని ఆమె అభివర్ణించారు. ఈ పిటిషన్ను విన్న జస్టిస్ జేబీ పార్దివాలా నేతృత్వంలోని బెంచ్, దేశంలోని అత్యంత ధనిక కుటుంబాల్లో ఒకటైన కపూర్ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ వివాదం మహాభారతం కంటే పెద్దదిగా మారుతోందని వ్యాఖ్యానిస్తూ, ఈ కేసును మే 14న (గురువారం) విచారణకు స్వీకరిస్తామని తెలిపారు.వివాదాస్పద కుటుంబ ఆస్తిలో అధిక భాగం RIPL ఆధీనంలో ఉంది.కాగా గత వారం, ఢిల్లీ హైకోర్టు ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి (CJI) డి.వై. చంద్రచూడ్ను మధ్యవర్తిగా నియమించింది. రాణి కపూర్ తన కుటుంబ ట్రస్ట్ను మోసపూరితమైందిగా ప్రకటించాలని సివిల్ సూట్ దాఖలు చేశారు. మధ్యవర్తిత్వం పూర్తయ్యే వరకు సంజయ్ కపూర్ మూడో భార్య ప్రియా కపూర్ కుటుంబ ట్రస్ట్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా చూడాలని రాణి కపూర్ కోరారు.మరోవైపు సంజయ్ కపూర్ రెండో భార్య, నటి కరిష్మా కపూర్ పిల్లలైన కియాన్, సమీరా కపూర్, ప్రియా కపూర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రియా కపూర్ తన తండ్రి వీలునామాను ఫోర్జరీ చేశారని వారు ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. కాగా ఈ మధ్యవర్తిత్వ ప్రక్రియ సంజయ్ కపూర్ రాసిన వీలునామాకు (Will) వర్తించదు. దానిపై విడిగా న్యాయ పోరాటం జరుగుతోంది. ఇదీ చదవండి: నో వీసా, నో సిటిజన్షిప్ : స్కాట్లాండ్లో సంచలనం ఎవరీ మణివణ్ణన్?గత ఫిబ్రవరిలో ఈ కుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్న బహిరంగ విమర్శలపై ఢిల్లీ హైకోర్టు కూడా అసహనం వ్యక్తం చేసింది. ఒకరిపై ఒకరు పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయవద్దని, "గౌరవంగా ప్రవర్తించాలని" కోర్టు హెచ్చరించింది.దీంతో ఈ వివాదం, రోజుకో కొత్త మలుపు తిరుగుతూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.ఇదీ చదవండి: విజయ్ ఎత్తులు : పళని స్వామికి షాక్, కొత్త నాయకత్వం -
72 గంటల్లోనే అద్భుతమైన ధ్యాన క్షేత్రం తొలి కార్యక్రమం
బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన అద్భుతమైన 'ధ్యాన మందిరం', తన మొట్టమొదటి భారీ కార్యక్రమానికి సిద్ధమైంది. మే 13, 2026న గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గారి నేతృత్వంలో "ప్రపంచ శాంతి కోసం గురుదేవ్తో కలిసి ధ్యానం" అనే అంతర్జాతీయ కార్యక్రమం జరగనుంది.'ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్'లో ప్రతిష్టాత్మక ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన 72 గంటలలోపే, ఆ అద్భుతమైన ధ్యాన క్షేత్రం తన మొదటి కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ధ్యాన కార్యక్రమంలో 182 దేశాల నుండి లక్షలాది మంది ప్రజలు ప్రత్యక్షంగా మరియు లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పాల్గొననున్నారు. చరిత్రలోనే ఇది అతిపెద్ద సామూహిక ధ్యాన కార్యక్రమాల్లో ఒకటిగా నిలవనుంది.ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ ఆధ్యాత్మికత , మానసిక ఆరోగ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆధునిక యుగంలో ఒత్తిడి, అనిశ్చితి ఎదుర్కొంటున్న యువతకు ఇలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలు దిక్సూచిలా పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. "మానసిక ప్రశాంతత, సామాజిక బాధ్యత కలిగిన యువత ద్వారానే అభివృద్ధి చెందిన భారతదేశం నిర్మించబడుతుంది" అని ప్రధాని మోదీ తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యేక ధ్యాన కేంద్రాలలో ఒకటైన దీని వెనుక ఉన్న స్ఫూర్తి గురించి మాట్లాడిన మోదీ సంకల్పం స్పష్టంగా ఉన్నప్పుడు, సేవాభావంతో పని చేసినప్పుడు, ప్రతి ప్రయత్నం సరైన ఫలితాన్ని ఇస్తుందంటూ కొనియాడారు."ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ 45 ఏళ్లుగా ఒక మహావృక్షంలా విస్తరించి, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాల్లో జీవితాలను ప్రభావితం చేస్తోందని ప్రశంసించారు.45 ఏళ్ల వేడుకలుఈ గ్లోబల్ మెడిటేషన్ ఈవెంట్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్థాపించి 45 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న నెల రోజుల వేడుకల్లో భాగంగా జరుగుతోంది. మే 13న జరిగే 'ది వరల్డ్ మెడిటేట్స్ విత్ గురుదేవ్' కార్యక్రమం, 'ది ఆర్ట్ ఆఫ్ లివింగ్' 45 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నెల రోజుల పాటు జరిగే వేడుకలలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ వేడుకలకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంతో మజుందార్; కేంద్ర ఓడరేవులు, నౌకా రవాణా మరియు జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్, మణిపూర్ ముఖ్యమంత్రి యుమ్నం ఖేమ్చంద్ సింగ్, మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా, ఉత్తరాఖండ్ గవర్నర్ నంద్ కిషోర్ యాదవ్, ఉత్తరాఖండ్ గవర్నర్,రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్, హిరానందాని గ్రూప్ ఛైర్మన్ నిరంజన్ హిరానందానిలాంటి ప్రముఖులు హాజరు కానున్నారు.ఈ ప్రపంచ స్థాయి ధ్యాన కార్యక్రమం, వివిధ కాల మండలాలు , ఖండాలలో విస్తరించి ఉన్న లక్షలాది మందిని ఒకే క్షణంలో సామూహిక మౌనం మరియు ఆత్మపరిశీలన కోసం ఏకం చేస్తుందని ఆశిస్తున్నారు. "అంతర్గత శాంతి మాత్రమే బాహ్య ప్రపంచంలో శాంతిని తీసుకురాగలదు" అనే సందేశాన్ని గురుదేవ్ గత నాలుగున్నర దశాబ్దాలుగా చాటుతున్నారు.బెంగళూరులోని ఈ ధ్యాన మందిరం ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది, ఇది శాంతికి మరియు మానసిక వికాసానికి కేంద్ర బిందువుగా మారనుంది. -
ఐఐటీ మద్రాస్లో బీఎస్ డిగ్రీ.. జేఈఈ స్కోరుతో పనిలేదు
సాక్షి, చెన్నై: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) మద్రాస్ తమ బీఎస్ డిగ్రీ ప్రోగ్రామ్ల కోసం 2026 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లను ఆహ్వానించింది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపింది. 12వ తరగతి (ఇంటర్మీడియెట్) పూర్తి చేసిన ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఎటువంటి వయోపరిమితి లేదని ప్రకటించింది.సంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సుల్లా కాకుండా, దీనికి జేఈఈ స్కోరుతో సంబంధం లేదని వివరించింది. అభ్యర్థులు ‘క్వాలిఫైయర్ ప్రాసెస్’ ద్వారా నేరుగా అడ్మిషన్ పొందవచ్చని, ప్రస్తుతం నాలుగు విభాగాల్లో ఈ బీఎస్ డిగ్రీలను అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. బీఎస్ ఇన్ డేటా సైన్స్ అండ్ అప్లికేషన్స్, బీఎస్ ఇన్ ఎల్రక్టానిక్ సిస్టమ్స్, బీఎస్ ఇన్ మేనేజ్మెంట్ అండ్ డేటా సైన్స్, బీఎస్ ఇన్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ కోర్సులు ఉన్నట్టు తెలిపారు.ఈ కోర్సులను రెగ్యులర్ కాలేజీ డిగ్రీ చదువుతూనే సమాంతరంగా పూర్తి చేయవచ్చని వివరించారు. తరగతులు ప్రధానంగా ఆన్లైన్ ద్వారా జరుగుతాయని, పరీక్షలు మాత్రం దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రాల్లో నేరుగా నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు తమ అవసరాన్ని బట్టి సర్టిఫికెట్, డిప్లొమా, లేదా పూర్తి డిగ్రీ పొంది ఏ దశలోనైనా కోర్సు నుంచి వైదొలగవచ్చునని వివరించారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం ఫీజులో 75 శాతం వరకు రాయితీని అందిస్తున్నట్టు ప్రకటించారు. ఆసక్తిగల విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో, మే 31లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డిపార్ట్మెంటల్ టెస్ట్కు దరఖాస్తులు సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులకు మే 2026 సెషన్ డిపార్ట్మెంటల్ టెస్ట్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈనెల 13 నుంచి జూన్ 2 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించాలని సర్వీస్ కమిషన్ విజ్ఞప్తి చేసింది. అలాగే ఇంటర్ విద్యశాఖలో లైబ్రరీ సైన్స్ జూనియర్ లెక్చరర్ (లిమిటెడ్ రిక్రూట్మెంట్) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. వివరాలకు https://psc.ap.gov.in/లో చూడవచ్చు.చదవండి: గుడులు, లాకర్లలో బోలెడంత బంగారం..ఎస్సీ గురుకులాల్లో కాంట్రాక్ట్ టీచర్ల పునరుద్ధరణ సాక్షి, అమరావతి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న 740 మంది కాంట్రాక్ట్ టీచింగ్ ఫ్యాకల్టీలను ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.ఎం.నాయక్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు 11 నెలల వ్యవధికి రెన్యూవల్ చేశారు. 2026–27కి ఒక నెల విరామంతో అవకాశం ఇస్తున్నామని, పనిచేయకపోతే జీతం లేదనే షరతుతో పునరుద్ధరిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
కోట్లాది మందిని ఏలిన పార్టీలు ఇప్పుడు ముక్కలు
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాంలో ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికలు ఆయా రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల్లో తగాదాలు రేపాయి. ఎన్నికలు ముగిసే వరకు తమలో ఉన్న విభేదాలను బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాయి ఆయా పార్టీలు. ఎన్నికల తర్వాత ఒక్కసారిగా అవి గుప్పుమంటున్నాయి. ఎన్నికల ముందు వరకు అధికారంలో ఉన్న పార్టీల ఓటమి (తమిళనాడు, పశ్చిమ బెంగాల్), అసోంలో కాంగ్రెస్ ఘోర ఓటమి ఇప్పుడు అసంతృప్తిని వెలుగులోకి తెచ్చాయి. ఆ మూడు రాష్ట్రాల విపక్షాల్లో ఏం జరుగుతోంది? తృణమూల్ కాంగ్రెస్లో అంతర్గతంగా నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. తమిళనాడులో అన్నాడీఎంకేలో నాయకత్వ మార్పు కోరుతూ బహిరంగంగానే నేతల మధ్య డిమాండ్ మొదలైంది. అస్సాంలో అఖిల్ గోగోయి సొంత కూటమిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.టీఎంసీలో పెరుగుతున్న అసంతృప్తిపశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎదుర్కొన్న ఘోర ఓటమి పార్టీలో అసంతృప్తికి దారితీసింది. పలువురు నేతలు, ప్రతినిధులు బహిరంగంగా మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ నాయకత్వాన్ని ప్రశ్నించారు. అంతర్గత విభేదాలపై ఇప్పటికే టీఎంసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో టీఎంసీ ముగ్గురు పార్టీ ప్రతినిధులను ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసింది.మాజీ టీఎంసీ ప్రతినిధి రిజు దత్తా ఎక్స్లో వీడియో పోస్ట్ చేసి.. సీఎం, బీజేపీ నేత సువేందు అధికారి సహా బీజేపీ నేతలకు క్షమాపణలు చెప్పారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో సువేందు అధికారి మీద దాడి చేయాలని టీఎంసీలోని కొందరు తనపై ఒత్తిడి, బెదిరింపులు తెచ్చారని దత్తా ఆరోపించారు. తనకు మద్దతు, రక్షణ ఇచ్చినందుకు బీజేపీకి కృతజ్ఞతలు తెలిపారు. టీఎంసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరుకావాలని పిలిచినా దత్తా వెళ్లలేదు.అన్నాడీఎంకేలో అలజడితమిళనాడులోని అన్నాడీఎంకేలో ఎన్నికల నిరాశాజనక ఫలితాల తర్వాత అంతర్గత విభేదాలు పెరిగాయి. పార్టీ 167 స్థానాల్లో పోటీ చేసి కేవలం 47 స్థానాలు మాత్రమే గెలిచింది. అధికారంలో ఉన్న టీవీకేకు మద్దతు ఇవ్వాలా? వద్దా? అన్న విషయంపై విభేదాలు వచ్చాయి. పార్టీ అధినేత పళనిస్వామి రాజీనామా చేయాలన్న డిమాండ్లు కూడా వినిపించాయి. చీలిక దిశగా అన్నాడీఎంకే సాగుతోంది. వేర్వేరుగా పళనిస్వామి, సీవీ షణ్ముగం సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. టీవీకే అధినేత, సీఎం విజయ్ను షణ్ముగం మంగళవారం కలిశారు.అస్సాంలోనూ అసంతృప్తిఅస్సాంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష వ్యూహంపై విమర్శలు వచ్చాయి. ప్రాంతీయ పార్టీ రైజోర్ దళ్ ప్రతిపక్షంలో సీటు నిలబెట్టుకున్న పార్టీల్లో ఒకటిగా నిలిచింది. అఖిల్ గోగోయి సిబ్సాగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కుశల్పై 17,272 ఓట్ల తేడాతో గెలిచారు. గోగోయ్కు 86,521 ఓట్లు రాగా, దోవారికి 69,249 ఓట్లు వచ్చాయి.సీటు నిలబెట్టుకున్నప్పటికీ, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమిపై గోగోయ్ బహిరంగ విమర్శలు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా స్పష్టమైన వ్యూహం లేదని అన్నారు. “బీజేపీ వద్ద మంచి ప్రణాళిక ఉంది. మా వైపు చివరి నిమిషంలో ప్రణాళిక లేని, అస్తవ్యస్తమైన, అర్ధహృదయ ప్రచారం జరిగింది” అని గోగోయ్ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. -
విజయ్ ఎత్తులు : పళని స్వామికి షాక్, కొత్త నాయకత్వం
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రతిపక్ష పార్టీ AIADMK (అన్నాడీఎంకే) చీలిక దిశగా వెళ్తుండటంతో, ఆ పార్టీకి చెందిన రెబల్ వర్గం ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ప్రకటించింది. బుధవారం అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించు కోవాల్సి ఉన్న తరుణంలో సీఎం విజయ్ శరవేగంగా పావులు కదుపుతున్నారు. ఆ క్రమంలో CV షణ్ముగం, SP వేలుమణిలతో భేటీ కావడంతో తమిళనాట రాజికీయాలు మరింత వేడెక్కాయి.ముఖ్యమంత్రి విజయ్, టీవీకే కూటమికి మద్దతు ప్రకటించిన అన్నాడీఎంకే కీలక నేతలతో సమావేశ మయ్యారు. ఎడప్పాడి పళనిస్వామి (EPS) ప్రతిపాదనపై వ్యతిరేకత కారణంగా అన్నాడీఎంకేకు చెందిన సుమారు 30 మంది ఎమ్మెల్యేలు ఈ రెబల్ క్యాంపులో ఉన్నట్లు సమాచారం. ఇది తమ ఎమ్మెల్యేలలో అత్యధికుల నిర్ణయమని షణ్ముగం మంగళవారం తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘోర పరాజయాన్ని చవిచూసిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది.కొత్త నాయకత్వంరెబల్ వర్గం తమ సొంత నాయకత్వాన్ని ఎన్నుకుంది:శాసనసభాపక్ష నేతగా ఎస్.పి. వేలుమణిని, డిప్యూటీ లీడర్గా జి. హరిని ఎన్నుకోవడం సంచలనం రేపింది.విజయ్తో అన్నాడీఎంకే రెబల్ నేతల భేటీఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కేవలం 47 స్థానాలకే పరిమితమై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. పార్టీ జనరల్ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామి, బద్ధశత్రువైన DMK (డీఎంకే) మద్దతుతో ముఖ్యమంత్రి కావాలని భావించడం తమను దిగ్భ్రాంతికి గురిచేసిందని షణ్ముగం తెలిపారు.డీఎంకేతో పొత్తు పెట్టుకుంటే అన్నాడీఎంకే మనుగడకే ముప్పు అని మెజారిటీ ఎమ్మెల్యేలు భావించారు. 53 ఏళ్లుగా డీఎంకేకు వ్యతిరేకంగానే తమ రాజకీయం ఉందని, అందుకే విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ప్రకటించారు. అన్నాడీఎంకేలో మరో చీలిక తమకు ఇష్టం లేదని ఎస్.పి. వేలుమణి పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పళనిస్వామిని కోరారు. పార్టీ శ్రేయస్సు కోసమే తాము ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.కాగా తమిళనాడులో ఏప్రిల్ 23న జరిగిన ఎన్నికల్లో టీవీకే (108 సీట్లు) అతిపెద్ద పార్టీగా అవతరించగా, డీఎంకే 59 సీట్లు, అన్నాడీఎంకే 47 సీట్లు గెలుచుకున్నాయి. ఇప్పుడు అన్నాడీఎంకేలోని ఒక వర్గం మద్దతుతో విజయ్ ప్రభుత్వం మరింత బలోపేతం కానుంది. -
డియర్ విజయ్ హ్యాట్సాఫ్ : హీరో విశాల్ ప్రశంసలు
తమిళనాట సంచలన విజయాన్ని నమోదు చేసి, రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ తీసుకున్న తాజా నిర్ణయంపై హీరో విశాల్ స్పందించారు. తన తొలి సంతకంతోనే మరో సంచలనం క్రియేట్ చేసిన సీఎం విజయ్ నిర్ణయంపై విజయ్ చిరకాల మిత్రుడు, విశాల్ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. విజయ్ ప్రభుత్వ ఏర్పాటులో జాప్యంపై కూడా విశాల్ స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు, పాఠశాలలు మరియు బస్టాండ్లకు 500 మీటర్ల లోపు ఉన్న 717 మద్యం దుకాణాలను (TASMAC) మూసివేస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై మరోవైపు సినిమా రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చి, అధికారాన్ని చేపట్టడం, తొలి నిర్ణయంతోనే తనదైన ముద్ర వేయడంతో విజయ్ అభిమానులు, తమిళ ప్రజలు సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు."ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ హ్యాట్సాఫ్. పాఠశాలల సమీపంలోని 717 మద్యం దుకాణాలను మూసివేయడం గొప్ప నిర్ణయం. స్కూళ్ల దగ్గర మద్యం దుకాణాల వల్ల ఎంతోమంది ఆడపిల్లలు వేధింపులకు గురవుతున్నారు. ఈ చర్యతో వారికి ఊరట లభిస్తుంది. వాటిని మూసివేస్తున్నట్లు ప్రకటించినందుకు ధన్యవాదాలు. ఎంత గొప్ప చర్య," అని విజయ్కు పంపిన వీడియో సందేశంలో విశాల్ పేర్కొన్నారు. అంతేకాదు "ప్రియమైన విజయ్, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ రోజు మీకు, మీ ప్రభుత్వానికి నేను సెల్యూట్ చేస్తున్నాను," అంటూ మరో పోస్ట్లో తన సంతోషాన్ని ప్రకటించారు.చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే విజయ్ ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. విద్యాసంస్థలు, ప్రార్థనా స్థలాల వద్ద మద్యం షాపుల కారణంగా సామాన్య ప్రజలు, ముఖ్యంగా విద్యార్థినులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.Kudos to you ,whistles to u. Hats off to u. Dear CM josephvijay avargal. Thank u for the announcement to close 717 wine shops especially the ones near schools. Wat a move. So many girl children hav been facing harassment especially the one I know in rk nagar where a girl… pic.twitter.com/vYria0MIaB— Vishal (@VishalKOfficial) May 12, 2026 కాగా విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ మొత్తం 234 స్థానాల్లో 108 స్థానాలను గెలుచుకుంది. అయితే పూర్తి మెజారిటీకి (118) పది సీట్లు తక్కువ కావడంతో, వారం రోజుల హైడ్రామా తర్వాత కాంగ్రెస్, వామపక్షాలు,వీసీకే మద్దతుతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సీఎంగా ప్రమాణం చేసిన తరవాత మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్, ఇతర కీలక నేతలను గౌరవప్రదంగా కలుసుకోవడం కూడా నెట్టింట ఆకర్షణీయంగా మారింది. -
సుప్రీంకోర్టును ఆశ్రయించిన విజయ్ టీవీకే
ఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో టీవీకే నేత, తిరుపత్తూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్.శ్రీనివాస సేతుపతితో పిటిషన్ దాఖలు చేయించింది. అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ సమయంలో ఓటు వేయకుండా సేతుపతిపై హైకోర్టు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే నేత పెరియకరుప్పన్పై కేవలం ఒక్క ఓటు తేడాతో గెలిచారు సేతుపతి. స్వల్ప మెజారిటీపై ప్రత్యర్థి ఫిర్యాదు చేయడంతో సేతుపతి ఓటు హక్కుపై న్యాయస్థానం ఆంక్షలు విధించింది. దీంతో ప్రజాప్రతినిధిగా తన హక్కులను కాపాడాలని సుప్రీంకోర్టును కోరారు సేతుపతి. సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.కాగా, మంగళవారం జరగనున్న అసెంబ్లీ విశ్వాస పరీక్షలో పాల్గొనకుండా టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతిని మద్రాస్ హైకోర్టు ఆదేశించడంతో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. బ్యాలెట్ ఓటులో మార్పులు జరిగాయని ఆరోపిస్తూ, ఎమ్మెల్యేగా సేతుపతి బాధ్యతలు చేపట్టకుండా ఆపాలని కేఆర్ పెరియకరుప్పన్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరుగుతున్న సమయంలో హైకోర్టు నుంచి ఆంక్షలు విధిస్తూ ఈ ఉత్తర్వులు వచ్చాయి.పిటిషన్ ప్రకారం.. తిరుపత్తూర్ నియోజకవర్గం నం.185లో నమోదు కావాల్సిన ఓటును వెల్లూరు జిల్లాలోని తిరుపత్తూర్ నియోజకవర్గం నం.50కు మార్చినట్టు ఆరోపణలు వచ్చాయి. ఫిర్యాదుపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ పెరియకరుప్పన్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సమయంలో, ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత బ్యాలెట్ వ్యత్యాసాలపై ఫిర్యాదు వస్తే నిబంధనల ప్రకారం చర్యలు అవసరం లేదని ఎన్నికల సంఘం తెలిపింది. ఒక్క ఓటును కూడా మరో నియోజకవర్గానికి మార్చలేదని సంఘం వెల్లడించింది. అయితే, పెరియకరుప్పన్ సమర్పించిన ఫిర్యాదుకు మద్దతుగా సరిపడా ఆధారాలు ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎమ్మెల్యేగా అసెంబ్లీ విశ్వాస పరీక్షలో పాల్గొనకుండా శ్రీనివాస సేతుపతిపై హైకోర్టు ఆంక్షలు విధించింది. -
నీట్ పేపర్ లీకేజీ మాస్టర్మైండ్ అరెస్ట్
సాక్షి,న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నీట్ పేపర్ లీకేజీ మాస్టర్మైండ్ రాజస్థాన్కు చెందిన మనీష్ యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పేపర్ లీకేజీ కేసులో ఇప్పటి వరకు 15మంది అరెస్టయ్యారు. పోలీసుల దర్యాప్తులో నిందితులు నాసిక్లో పేపర్ను ముద్రించినట్లు గుర్తించారు. పరీక్షకు 42గంటల ముందు పేపర్ లీక్ చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మే 3న నిర్వహించిన నీట్ యూజీ-2026 పరీక్షలో ప్రశ్నాపత్రం బయటకు వచ్చినట్లు రాజస్థాన్ పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం (SOG) దర్యాప్తులో బయటపడింది. కోచింగ్ సమయంలో విద్యార్థులు సౌలభ్యం కోసం తయారు చేసే గెస్ పేపర్లోని 120 ప్రశ్నలు.. నీట్ పరీక్షలోని అసలు ప్రశ్నాపత్రంతో సరిపోవడంతో లీకేజీ అంశం వెలుగులోకి వచ్చింది. దీంతో నీట్ యూజీ 2026 పరీక్షలు నిర్వహించే జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) పరీక్షను రద్దు చేసి, రీ-ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.పేపర్ లీకేజీ కేసులో రాజస్థాన్ ఎస్వోజీ ఇద్దరిని మాస్టర్మైండ్స్గా అరెస్టు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు ఆదేశించింది. పలు రాష్ట్రాల్లో (రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర) లీక్ నెట్వర్క్పై విచారణ కొనసాగుతోంది.22 లక్షలకుపైగా విద్యార్థులు ఈ నిర్ణయంతో ప్రభావితమయ్యారు. ఎన్టీఏ తెలిపిన ప్రకారం.. కొత్త రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా రీ-ఎగ్జామ్ త్వరలో నిర్వహించనుంది. ఇప్పటికే చెల్లించిన ఫీజులు రిఫండ్ చేస్తున్నట్లు తెలిపింది. అయితే పేపర్ లీకేజీతో విద్యార్థుల్లో అనిశ్చితి, మానసిక ఒత్తిడి పెరిగింది. -
జ్యోతిష్కుడి జోస్యం నిజమైంది.. సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
సాక్షి,చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ తన పరిపాలనా దక్షతతో దూసుకుపోతున్నారు. ప్రజల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. పాఠశాలల సమీపంలోని 717 వైన్ షాపులను మూసివేయాలని సీఎం విజయ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై ప్రజలు, సామాజిక వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు కోసం తీసుకున్న ఈ చర్యను చాలా మంది స్వాగతిస్తున్నారు. అయితే ఇప్పుడు సీఎం విజయ్ తీసుకున్న మరో నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రికి రాజకీయ వ్యూహాలపై సలహా ఇచ్చే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(OSD)గా ప్రముఖ జ్యోతిష్కుడు రికీ రాధన్ పండిట్ వెట్రివేల్ను నియమించారు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి రీటా హరీష్ ఠాకూర్ ఉత్తర్వులు జారీ చేశారు.రికీ రాధన్ పండిట్ వెట్రివేల్ ఎవరు? గత 40 ఏళ్లుగా ఆయన వేద జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, ధ్యానం ఆధారిత మార్గదర్శకత్వం చేస్తున్నారు. దేశంలో అత్యంత ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్కులు, రాజకీయ జ్యోతిష్కులులో ఒకరిగా గుర్తింపు పొందారు. 2008లో తమిళనాడు నుంచి ముంబైకి మకాం మార్చి రాధన్ పండిట్ అనే పేరుతో జ్యోతిష్యం చెబుతున్నారు. పలు మీడియా నివేదికల ప్రకారం, ఆయనకు దేశవ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్, డీఎంకే, ఏఐడీఎంకే నేతలు క్లయింట్లుగా ఉన్నారు.విజయ్తో సంబంధం ఎన్నికలకు ముందు విజయ్ టీవీకే పార్టీకి బహిరంగంగా మద్దతు పలికిన ప్రముఖుల్లో వెట్రివేల్ ఒకరు. గతంలో విజయ్ జాతక చక్రం బలంగా ఉందని, రాజకీయాల్లో విజయ్ సునామీ వస్తుందని ఆయన జోస్యం చెప్పారు.తమిళనాడులో విజయ్ 150కి పైగా సీట్లు గెలిచి ముఖ్యమంత్రి అవుతారని, ఆయన నాయకత్వంలో దేవాలయాలు ప్రపంచ స్థాయికి ఎదుగుతాయని కూడా పేర్కొన్నారు. 2024లో విజయ్ రాజకీయాల్లో విజయం సాధించే కారణాలను ఆయన తన యూట్యూబ్ వీడియోలో వివరించారు. ఆ తర్వాత విజయ్ ఆయనను టీవీకే అధికారిక ప్రతినిధిగా నియమించుకున్నారు. రాధన్ జోస్యం నిజం కావడంతో తన రాజకీయ సలహాదారుడిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.అయితే, విజయ్ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జోత్యుష్కుడి ప్రభుత్వ పదవి విరిచేవారు లేకపోలేదు. మరి ఈ విమర్శల్ని విజయ్ ఎలా ఎదుర్కొంటారో చూడాల్సి ఉంది. -
ఇంధన నిల్వలున్నాయి, కానీ.. : పెట్రోలియం మంత్రి కీలక సంకేతాలు
కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇంధన కొరత లేదంటూనే పెంపు సంకేతాలిచ్చారు. మే 12ననిర్వహించిన 'CII వార్షిక బిజినెస్ సమ్మిట్-2026'లో దేశంలోని ఇంధన నిల్వలు, ధరల పెరుగుదలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇంధన కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు. అయితేనాలుగేళ్లుగా ఇంధన పెంచలేదు, ధరలు పెరగబోవని చెప్పడం లేదంటూ మెలిక పెట్టడం చర్చకు దారి తీసింది.అయిదు రాష్ట్రాల ఎన్నికల తరువాత వంట గ్యాస్, పెట్రోవాత తప్పదనే వివిధ అంచాలన మధ్య దేశంలో ఎక్కడా ఇంధన కొరత లేదని స్పష్టం చేస్తూ, ప్రభుత్వం LPG ఉత్పత్తిని గతంలో ఉన్న సుమారు 35,000 టన్నుల నుండి 54,000 టన్నులకు పెంచిందని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. పెరిగే అవకాశం లేకపోలేదంటూ సంకేతాలు ఇచ్చారు. మరోవైపు ఇటీవలే ముగిసిన రాష్ట్ర ఎన్నికల కారణంగా ప్రభుత్వం ధరల సవరణను వాయిదా వేసిందన్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు.నాలుగేళ్లుగా పెంచలేదుపెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు ,ప్రపంచ మార్కెట్ అస్థిరత ఉన్నప్పటికీ, గత నాలుగేళ్లుగా రిటైల్ ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయని మంత్రి స్పష్టంగా పేర్కొన్నారు. ప్రపంచంలో అలా చేయని ఏకైక దేశం మనదే అని కూడా ప్రకటించారు. ధరలు 50 నుండి 60 శాతం వరకు పెరిగిన అనేక దేశాల మాదిరిగా కాకుండా, భారతదేశం పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. అయినా పెరగవని తాను చెప్పడంలేదంటూ బాంబు పేల్చారు. దీనికి తోడు ఇటీవల ప్రధాని మోదీ డీజిల్, పెట్రోల్ వాడకాన్ని తగ్గించుకోవాలని, పొదుపుగా వాడాలని సూచించడం ప్రమాద హెచ్చరికగా అందరూ భావిస్తున్నారు.రాష్ట్ర ఎన్నికల కారణంగానే ధరల పెంపును వాయిదా వేస్తున్నారనే వాదనను ఆయన తోసిపుచ్చారు. ధరల నిర్ణయానికి, ఎన్నికలకు సంబంధం లేదని స్పష్టం చేశారు.మన దగ్గర 60 రోజులకు సరిపడా ముడి చమురు, 60 రోజులకు సరిపడా LNG, 45 రోజులకు సరిపడా LPG నిల్వలు ఉన్నాయని కేంద్ర మంత్రి వివరించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందనే సంకేతాలిచ్చారు. ప్రస్తుతం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) రోజుకు రూ. 1,000 కోట్ల నష్టాన్ని చవిచూస్తున్నాయని, వినియోగదారులపై భారం పడకుండా ఉండటానికి కంపెనీలు ఈ నష్టాన్ని భరిస్తున్నాయని తెలిపారు. గతేడాది ఆర్జించిన లాభాలన్నీ ప్రస్తుత పరిస్థితుల వల్ల తుడిచిపెట్టుకుపోతున్నాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: రూ. లక్ష కోట్ల నష్టం, పెట్రోలు పొదుపు : మోదీ విజ్ఞప్తిలోని మర్మం ఇదేనా?సముద్ర మంథన్ స్కీమ్ ద్వారా దేశీయంగా చమురు ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని మంత్రి వెల్లడించారు. చమురు అన్వేషణ మరియు ఉత్పత్తి కోసం నిధుల కేటాయింపుపై ఆర్థిక శాఖతో చర్చలు తుది దశలో ఉన్నాయన్నారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 90 రోజులకు సరిపడా నిల్వలను కలిగి ఉండాలని, ఆ దిశగా అదనపు స్టోరేజ్ సామర్థ్యాన్ని పెంచుతున్నామని ఆయన చెప్పారు. ఇదీ చదవండి : అంబానీ చిన్నకోడలు, వెనిస్ బినాలే లుక్,స్పెషల్ ఏంటంటే?కాగా అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మూడో నెలకు చేరుకుంది. శాంతి ప్రయత్నాల్లో భాగంగా ఇరాన్ ఇచ్చిన ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మే 10న తిరస్కరించడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై పడనుందనే ఆందోళన నెలకొంది. ఇదీ చదవండి: ‘ప్రధాని విమానాన్ని అమ్మేయండి’ -
‘‘తల్లులు నగలు అమ్ముకున్నారు.. తండ్రులు అప్పులు..’’
ఢిల్లీ: నీట్ యూజీ 2026 పరీక్షను రద్దు చేయల్సి రావడం పట్ల లోకసభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. నీట్ 2026 పరీక్షను రద్దు చేసి, 22 లక్షలకు పైగా విద్యార్థుల కష్టాన్ని వృథా చేశారంటూ ఎక్స్లో ఆయన ఓ పోస్ట్ చేశారు.‘‘వారి కలలను బీజేపీ ప్రభుత్వం అణచివేసింది. కొందరు తండ్రులు అప్పులు తీసుకున్నారు, కొందరు తల్లులు తమ నగలు అమ్ముకున్నారు, లక్షలాది మంది పిల్లలు రాత్రంతా మేల్కొని చదువుకున్నారు. దానికి ప్రతిఫలంగా, వారికి పేపర్ లీకులతో షాక్ ఇచ్చారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యారంగంలో వ్యవస్థీకృత అవినీతి నెలకొంది. ఇది కేవలం వైఫల్యం మాత్రమే కాదు.. ఇది యువత భవిష్యత్తుకు వ్యతిరేకంగా జరిగిన నేరం. ప్రతిసారి పేపర్ మాఫియా నిర్దాక్షిణ్యంగా తప్పించుకుంటోంది. నిజాయితీగల విద్యార్థులు శిక్షను అనుభవిస్తున్నారు. ఇప్పుడు, లక్షలాది మంది విద్యార్థులు మరోసారి అదే మానసిక ఒత్తిడి, ఆర్థిక భారం, అనిశ్చితిని భరించాలి. ఒకరి తల రాతను వారి కష్టంతో కాకుండా డబ్బు, పలుకుబడితో నిర్ణయిస్తే ఇక చదువుకు అర్థం ఏముంటుంది? ప్రధానమంత్రి అమృత్ కాలం దేశానికి విష కాలంగా మారింది’’ అని విమర్శించారు.కాగా, మే 3న నిర్వహించిన నీట్-యూజీ 2026 పరీక్షను కేంద్రం రద్దు చేసింది. ప్రశ్నపత్రం లీక్, పరీక్షలో అక్రమాల ఆరోపణల మధ్య ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వైద్య ప్రవేశ పరీక్షను మళ్లీ నిర్వహిస్తామని ప్రకటించింది. ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు సీబీఐకు ఈ కేసును అప్పగించింది.ఓ ప్రకటనలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం.. కేంద్ర సంస్థల నుంచి సమాచారాన్ని పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యవస్థలో పారదర్శకతను కొనసాగించేందుకు భారత ప్రభుత్వం ఆమోదంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ (యూజీ) 2026 పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించింది. సీబీఐకి పూర్తి సహకారం అందిస్తామని ఎన్టీఏ చెప్పింది. విచారణకు అవసరమైన పత్రాలు, రికార్డులు అందజేస్తుందని తెలిపింది.దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర అండర్గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏకైక ప్రవేశ పరీక్ష నీట్-యూజీ. దీన్ని మే 3న పెన్ అండ్ పేపర్ విధానంలో నిర్వహించారు. భారత్లోని 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో 5,400కు పైగా కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. సుమారు 22.79 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. -
సనాతన ధర్మంపై మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు
తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సిందేనని ఆయన అసెంబ్లీలో ప్రసంగించారు. ఈ సందర్భంగా విజయ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మంగళవారం కొత్త అసెంబ్లీలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరిగింది. స్పీకర్గా ఎన్నికైన జేసీడీ ప్రభాకర్కు అభినందనలు తెలిపే క్రమంలో ఉదయనిధి ప్రసంగించారు. ఆ సమయంలో ఉదయనిధి స్టాలిన్ మంగళవారం మరోసారి సనాతన ధర్మం(sanatana dharma)పై విమర్శలు చేశారు. “ప్రజలను విడదీసే సనాతనం నిర్మూలించబడాలి” అని ఉదయనిధి అన్నారు. అలాగే.. సీఎం ప్రమాణ స్వీకార వేడుకలో రాష్ట్ర గేయం తమిళ్ తాయ్ వజ్తు కంటే ముందు వందేమాతరం ప్రదర్శించడంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. మన రాష్ట్ర గీతం ఎప్పుడూ రెండో స్థానంలో ఉండకూడదని ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘రాజకీయ మర్యాద కొనసాగాలి. ప్రభుత్వం–ప్రతిపక్షం వేర్వేరు వరుసల్లో కూర్చున్నా, రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలి. ప్రజల కోరిక కూడా అదే” అని అన్నారు. సీఎం విజయ్ను ఉద్దేశిస్తూ.. “ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఇద్దరం ఒకే కాలేజీలో చదివాం. రాజకీయాల్లో మేము సీనియర్లు. మా అనుభవం, జ్ఞానం పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మా సూచనలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి’’ అని అన్నారు. ఉదయనిధి ప్రసంగం ముగిశాక.. ప్రతిగా సీఎం విజయ్ నమస్కారం చేశారు.Udhayanidhi Stalin again says"SANATANA MUST BE ERADICATED."CM Joseph Vijay in assembly just looks on and even greets with folded hands pic.twitter.com/MNMz7PWmQL— Megh Updates 🚨™ (@MeghUpdates) May 12, 2026ఉదయనిధి వ్యాఖ్యలపై బీజేపీ ఏకైక ఎమ్మెల్యే ఎం. భోజరాజన్ స్పందించేందుకు నిరాకరించారు. “ఈ రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికల గౌరవం మాత్రమే జరగాలి. ఇతర విషయాలపై సమాధానం ఇవ్వడానికి నేను సిద్ధంగా లేను” అని అన్నారు. 2023లో ఉదయనిధి మంత్రి హోదాలో చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. “సనాతన ధర్మం కులం, మతం పేరుతో ప్రజలను విభజించే సిద్ధాంతం. దాన్ని నిర్మూలించడం మానవత్వం, సమానత్వాన్ని కాపాడటమే” అని అన్నారాయన. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో పలు రాజకీయ పార్టీలు, మతపరమైన సంస్థలు తీవ్రంగా స్పందించాయి. దేశంలో పలు చోట్ల ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. మద్రాస్ హైకోర్టు సైతం ఆ వ్యాఖ్యలను తప్పుబట్టింది. బాధ్యత గల పదవిలో ఉండి విద్వేషపూరిత ప్రసంగం చేయడమేంటని మందలించింది. అయినప్పటికీ ఉదయనిధి మాత్రం వెనక్కి తగ్గలేదు. -
‘ప్రధాని విమానాన్ని అమ్మేయండి’
పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా పొదుపు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తిపై ఆధ్యాత్మిక గురువు, జ్యోతిష్ పీఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద ఘాటుగా స్పందించారు. పొదుపు చర్యలు అధికారంలో ఉన్నవారితోనే ప్రారంభం కావాలని హితవు పలికారు.ఉత్తరప్రదేశ్లోని సోన్భద్రలో తన 'గోవిష్ట్ యాత్ర' సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.ప్రజలను ఖర్చులు తగ్గించుకోవాలని కోరేముందు, ప్రభుత్వమే ఆదర్శంగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమెరికన్ డాలర్ విలువ రూ. 100కు చేరువవుతోందన్నారు. పెట్రోల్ డీజిల్ పొదుపుగా వాడాలి, వర్క్ ఫ్రం హోం, బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలపై దేశ ప్రజలకు ప్రధాని మోదీ చెప్పిన పొదుపు మంత్రపై ఆయన గట్టి చురక లేశారు.ముందు రూ. 8,000 కోట్ల విమానాన్ని అమ్మండిధర్మం అనేది ఇంటి నుండే మొదలవ్వాలి (Austerity begins at home)" అన్న అవిముక్తేశ్వరానంద ముందు రూ. 8,000 కోట్ల విలువైన విమానాన్ని అమ్మేసి, తక్కువ ఇంధనం ఖర్చయ్యే విమానాలను వాడాలని బీజేపీ ప్రభుత్వాన్ని కోరారు. అంతేకాదు ఆవుల సంఖ్య తగ్గి పోతోందంటూ యూపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఉత్తరప్రదేశ్లో గోవధను అరికట్టడంలో రాజకీయ పార్టీలు విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. కేరళ (8%), పశ్చిమ బెంగాల్ (15%), జార్ఖండ్ (24%) వంటి రాష్ట్రాల్లో ఆవుల జనాభా పెరగగా, ఉత్తరప్రదేశ్లో మాత్రం గణనీయంగా తగ్గిపోయిందని ప్రభుత్వ గణాంకాలను ఉటంకించారు. గోవధకు పాల్పడే వారి నుంచి డబ్బులు తీసుకుంటూ కొందరు నాయకులురాజకీయం చేస్తున్నారని, అలాంటి వారిని ఓటర్లు నమ్మకూడదని పిలుపునిచ్చారు.ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను ఉద్దేశించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.రాజు కంటే సన్యాసి పదవి చాలా ఉన్నతమైనదని, యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం ద్వారా తన ఉన్నత స్థానం నుండి కిందకు దిగజారారని అన్నారు. ప్రస్తుతం ఆయన ఒక సీఎం మాత్రమే, సన్యాసి(పీఠాధిపతి) కాదంటూ విమర్శించారు. అలాగే యూపీ ప్రభుత్వ గోశాలల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. నాయకులు ,రాజకీయ పార్టీలు గోవధను అరికట్టడంలో విఫలమయ్యారు. అందుకే, తాము గోవులను ప్రేమించే ఓటర్లను సంప్రదించి,వారిలో అవగాహన కల్పిస్తున్నా మన్నారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, గోవుల సంరక్షణ, వాటి గౌరవాన్ని పునరుద్ధరించడంపై ఓటర్లలో అవగాహన కల్పించడమే తన యాత్ర ముఖ్య ఉద్దేశ్యమని శంకరాచార్యులు తెలిపారు.ఇదీ చదవండి: రూ. లక్ష కోట్ల నష్టం, పెట్రోలు పొదుపు : మోదీ విజ్ఞప్తిలోని మర్మం ఇదేనా?కాగా ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్దం, హర్మోజ్ జలసంధి మూసివేత సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలని, ఆ ఏడాదిందా బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ప్రధాని మోదీ ఆదివారం హైదరాబాద్ వేదికగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్వామి అవిముక్తేశ్వరానంద ఘాటుగా స్పందించడం గమనార్హం. ఇదీ చదవండి : అంబానీ చిన్నకోడలు, వెనిస్ బినాలే లుక్,స్పెషల్ ఏంటంటే? -
బెంగాల్ సీఎం సహాయకుని హత్య కేసులో బిగ్ ట్విస్ట్
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) చంద్రనాథ్ రథ్ హత్య దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ కేసులో బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) రంగంలోకి దిగి ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో భారీ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్లో భాగంగా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, ప్రధాన షూటర్గా భావిస్తున్న ఉత్తరప్రదేశ్లోని బల్లియాకు చెందిన ‘రాజ్ సింగ్ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.రాజ్ సింగ్ ఎవరు? బల్లియాలోని ఆనంద్ నగర్కు చెందిన రాజ్ సింగ్ స్థానికంగా రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి. అఖిల భారత క్షత్రియ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చెప్పుకునే ఇతడి పేరు గతంలో ఒక కాల్పుల ఘటనలోనూ వినిపించింది. ప్రొఫెషనల్ షూటర్లతో సహా కనీసం ఎనిమిది మంది ఈ హత్యలో పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. లక్నోలో ఓ పెళ్లికి వెళ్లి వస్తుండగా, అయోధ్యలో రాజ్ సింగ్ను పోలీసులు అదుపులోకి తీసుకోగా, బిహార్లోని బక్సర్లో మయాంక్ మిశ్రా, విక్కీ మౌర్యాలను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాజ్ను తదుపరి విచారణ నిమిత్తం కోల్కతాకు తరలించారు.నా కొడుకు నిర్దోషి.. పోలీసులదే కుట్రతన కొడుకును ఈ కేసులో అకారణంగా ఇరికించారని రాజ్ సింగ్ తల్లి జామవంతి సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. హత్య జరిగిన సమయంలో తాము ఉత్తరప్రదేశ్లోనే ఉన్నామని, 2026 మే 9 ఉదయం అయోధ్యలో గుడికి వెళ్లామని ఆమె ఆజంగఢ్ డీఐజీకి ఫిర్యాదు చేశారు. అయోధ్యలో ఐదుగురు వ్యక్తులు తన కొడుకును బలవంతంగా ఎత్తుకెళ్లి, ఆ తర్వాత బక్సర్లో అరెస్టు చేసినట్లు పోలీసులు కట్టుకథ అల్లారని ఆమె మండిపడ్డారు. తమకు కోల్కతాతో ఎలాంటి సంబంధం లేదని, అక్కడికి ఎన్నడూ వెళ్లలేదని పేర్కొన్నారు.ఫోన్ రికార్డులే సాక్ష్యం.. దర్యాప్తు ముమ్మరంరాజ్ సింగ్ లక్నోలో పెళ్లికి హాజరై, మార్కెట్లో షాపింగ్ చేసినట్లు తన వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని తల్లి జామవంతి చెబుతున్నారు. ‘నా కొడుకుకు న్యాయం జరగాలి, మొబైల్ ఫోన్ టవర్ లొకేషన్ రికార్డులను పరిశీలిస్తే నిజాలు బయటపడతాయి’ అని ఆమె ప్రభుత్వాన్ని వేడుకున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈ దారుణాన్ని ముందస్తు కుట్రగా అభివర్ణించడంతో బెంగాల్ ఎస్టీఎఫ్, సీఐడీ, యూపీ, బీహార్ పోలీసుల సంయుక్త బృందాలు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్యాప్తును ముమ్మరం చేశాయి. -
ఆర్టీసీ బస్సు బోల్తా.. ఐదుగురి మృతి
బీదర్: తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీదర్లో కర్ణాటక ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. బైక్ను ఢీకొట్టిన బస్సు.. పల్టీలు కొట్టింది. ఈ ఘటనలోఐదుగురు ప్రయాణికులు మృతిచెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.. వారిని బీదర్ ఆసుపత్రికి తరలించారు. -
రైల్లోనే డెలివరీ.. 'ఆపరేషన్ మాతృశక్తి' వీడియో వైరల్
కదులుతున్న రైలులో పురిటినొప్పులతో బాధపడుతున్న ఒక మహిళకు తోటి ప్రయాణికులు, రైల్వే రక్షణ దళం (RPF) సిబ్బంది సమయానికి స్పందించడం మాత్రమే కాదు, సమయస్ఫూర్తితో వ్యవహరించి క్షేమంగా ప్రసవంజరిగేలా చూసిన ఘటన మానవీయ కోణాన్ని చాటి చెప్పింది. ఈ ఘటన పుణే-సుపాల్ ఎక్స్ప్రెస్లో చోటుచేసుకుంది.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.ఉత్తరప్రదేశ్కు చెందిన 28 ఏళ్ల రుఖ్సానా ఖాతూన్, ఆమె భర్త జమీల్ బేలవర్ కలిసి పుణే నుండి బీహార్ వెళ్లేందుకు జనరల్ కోచ్లో ప్రయాణిస్తున్నారు. రైలు అహల్యనగర్ స్టేషన్కు సమీపిస్తుండగా, రుఖ్సానాకు అకస్మాత్తుగా పురిటినొప్పులు మొదలయ్యాయి. సమీపంలో లేని ఆసుపత్రి, కిక్కిరిసిన జనరల్ కోచ్, వేగంగా కదులుతున్న రైలు కావడంతో వైద్య సాయం అందడం కష్టంగా మారింది.'ఆపరేషన్ మాతృశక్తి'ఈ అత్యవసర పరిస్థితిపై సమాచారం అందుకున్న సెంట్రల్ రైల్వే వెంటనే 'ఆపరేషన్ మాతృశక్తి'ని యాక్టివేట్ చేసింది. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సోమనాథ్ పాఠాడే, హెడ్ కానిస్టేబుల్ విశ్వజీత్ కాక్డే వెంటనే ఆ మహిళ ఉన్న కోచ్కి చేరుకున్నారు. ఆమె నొప్పి తీవ్రంగా ఉండటంతో ఆ సమయంలో ఆసుపత్రికి తరలించడం అసాధ్యమని గుర్తించారు. అందుకే రైలులోనే సురక్షిత ప్రసవం చేసేలా కీలక నిర్ణయం తీసుకున్నారు.ఆర్పీఎఫ్ సిబ్బంది, కోచ్లోని తోటి మహిళా ప్రయాణికులు కలిసి రుఖ్సానా చుట్టూ దుస్తులు, దుప్పట్లతో ఒక సురక్షితమైన తాత్కాలిక గదిని ఏర్పాటు చేశారు అందరూ కలిసి చేసిన ఈ పనితో రుఖ్సానా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. శిశువు ఏడుపు వినగానే తోటి ప్రయాణికులు సంతోషంతో ఊపిరి పీల్చుకున్నారు.In a heartwarming incident aboard the Pune-Supaul Express, a pregnant woman safely gave birth inside a crowded general coach after experiencing severe labour pain near Ahilyanagar station. With no time to move her to a hospital, RPF personnel swiftly launched “Operation… pic.twitter.com/qnwb8L0e8d— NDTV (@ndtv) May 12, 2026 అనంతరం రైలు అహల్యనగర్ స్టేషన్కు చేరుకోకముందే రైల్వే అధికారులు అక్కడ 108 అంబులెన్స్ను, డాక్టర్లను సిద్ధంగా ఉంచారు. రైలు ఆగగానే తల్లీబిడ్డలను వెంటనే సివిల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు ధృవీకరించారు. సమయానికి స్పందించి ప్రాణాలను కాపాడిన రైల్వే సిబ్బందిని మరియు సహకరించిన ప్రయాణికులను అందరూ అభినందిస్తున్నారు. -
షాకింగ్: నీట్ యూజీ 2026 రద్దు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జరిగిన వైద్యవిద్య ప్రవేశ పరీక్ష ‘నీట్-యూజీ 2026’ రద్దయింది. మే 3న జరిగిన ఈ పరీక్షలో రాజస్థాన్లో ‘గెస్ పేపర్’ లీకైందన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, జాతీయ పరీక్షా వ్యవస్థ పారదర్శకతను కాపాడేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.అసలేం జరిగింది?కేంద్ర దర్యాప్తు సంస్థల ప్రాథమిక సమాచారం మేరకు నీట్ పరీక్ష పేపర్ లీక్ అయినట్లు తేలడంతో ఎన్టీఏ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్లో ‘గెస్ పేపర్’ పరీక్షకు ముందే ఎలా సర్క్యులేట్ అయింది? దీని వెనుక ఏమైనా వ్యవస్థీకృత ముఠా ఉందా? అన్న కోణంలో సమగ్ర విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) చేతికి అప్పగించింది. విచారణకు అవసరమైన అన్ని రికార్డులను సీబీఐకి అందించి పూర్తిగా సహకరిస్తామని ఎన్టీఏ స్పష్టం చేసింది.త్వరలోనే రీ-ఎగ్జామ్.. విద్యార్థులకు ఊరటపరీక్ష రద్దు వల్ల విద్యార్థులు, వారి కుటుంబాలకు అసౌకర్యం కలిగినా, పరీక్షల వ్యవస్థపై నమ్మకం నిలబెట్టేందుకే మళ్లీ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. లీకేజీతో దెబ్బతిన్న ఆశావాహులకు న్యాయం చేయడానికే ఈ రీ-ఎగ్జామ్ జరగనుంది. త్వరలోనే అధికారిక మార్గాల ద్వారా కొత్త తేదీలను ప్రకటించనున్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు వార్తలను నమ్మకుండా, అధికారిక సమాచారం కోసం వేచిచూస్తూ విద్యార్థులు తమ సన్నద్ధతను కొనసాగించాలని సూచించింది.కొత్త రిజిస్ట్రేషన్ అవసరం లేదు.. ఫీజు వాపసుమళ్లీ పరీక్ష రాయబోయే విద్యార్థులు ఎవరూ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. పాత రిజిస్ట్రేషన్ డేటానే పరిగణనలోకి తీసుకుంటారు. గతంలో ఎంచుకున్న పరీక్షా కేంద్రాలే దాదాపు చెల్లుబాటు అవుతాయి. దీనికోసం ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయరు సరికాదు, ఇప్పటికే చెల్లించిన ఫీజును విద్యార్థులకు వాపసు (రీఫండ్) చేయనున్నారు. కొత్త పరీక్ష తేదీకి ముందు ఎన్టీఏ తాజా అడ్మిట్ కార్డులను జారీ చేస్తుంది. -
తమిళనాడు అసెంబ్లీ స్పీకర్గా జేసీడీ ప్రభాకర్
చెన్నై: తమిళనాడు 17వ శాసనసభ సభాపతి (స్పీకర్)గా టీవీకే సీనియర్ నాయకుడు జేసీడీ ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో సీఎం విజయ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. స్పీకర్ పదవికి ప్రభాకర్ మే 11న నామినేషన్ దాఖలు చేయగా.. ఇతర పార్టీల నుంచి ఎవరూ పోటీ పడకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.కాగా, జేసీడీ. ప్రభాకర్కు శాసనసభ నిబంధనలు, సంప్రదాయాలపై అపారమైన అనుభవం ఉంది. 2011లో విల్లివాక్కం నుండి ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఆయనకు ప్లస్ పాయింట్గా మారింది. అన్నాడీఎంకేలో సీనియర్ నేతగా ఇది వరకు ఉన్న జేసీడీ ప్రభాకర్ ప్రస్తుతం టీవీకే తరపున థౌజండ్ లైట్స్ నుంచి గెలిచారు. సీఎం విజయ్ నేతృత్వంలోని అధికార తమిళగ వెట్రి కళగం తరపున సీనియర్ నాయకుడు, థౌజండ్ లైట్స్ ఎమ్మెల్యే జే.సీ.డీ. ప్రభాకర్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. సీఎం విజయ్, మంత్రులతో కలిసి ఆయన ఈ నామినేషన్ను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. ఇవాళ ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
అస్సాం సీఎంగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణం
గౌహతి: అస్సాం రాజకీయాల్లో మరో అధ్యాయం మొదలయ్యింది. గౌహతిలోని ఖానాపరా పశువైద్య కళాశాల ప్రాంగణం ఈ అద్భుత ఘట్టానికి వేదికైంది. భారతీయ జనతా పార్టీ అగ్రనేత హిమంత బిశ్వ శర్మ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, రాష్ట్ర చరిత్రలో సరికొత్త రికార్డును నెలకొల్పారు. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుక యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. మంగళవారం ఉదయం 11:40 గంటలకు గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య సమక్షంలో హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అస్సాం రాజకీయాల్లో కాంగ్రెసేతర నాయకుడెవరూ వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించలేదు. 57 ఏళ్ల శర్మ ఆ రికార్డును తిరగరాశారు. గతంలో ప్రఫుల్ల కుమార్ మహంత రెండుసార్లు సీఎంగా పనిచేసినప్పటికీ, ఆ పదవీకాలాల మధ్య విరామం ఉంది. తద్వారా వరుసగా రెండోసారి పగ్గాలు చేపట్టిన తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా శర్మ రికార్డు సృష్టించారు. #WATCH | Guwahati: BJP's Himanta Biswa Sarma takes oath as the Chief Minister of Assam for the second consecutive term at Veterinary College ground in Khanapara pic.twitter.com/K5sGEN7jVF— ANI (@ANI) May 12, 2026హేమాహేమీల సమక్షంలో..ఈ చారిత్రక ఘట్టానికి ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, ఎన్డీయే పాలిత 22 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. విదేశీ ప్రతినిధులు, ముఖ్యంగా భారతదేశానికి అమెరికా రాయబారి సెర్గియో గోర్ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. అస్సాంలోని 17 వైష్ణవ మఠాల మఠాధిపతుల ఆశీర్వచనాల మధ్య శర్మ ప్రమాణం చేశారు. లక్షలాది మంది ప్రజలు ఈ వేడుకను వీక్షించడానికి తరలిరావడంతో గౌహతి జనసంద్రమైంది. మంత్రుల ప్రమాణంశర్మతో పాటు అజంతా నియోగ్, రామేశ్వర్ తేలి, అతుల్ బోరా (ఏజీపీ), చరణ్ బోరో (బీపీఎఫ్)లు మంత్రులుగా ప్రమాణం చేశారు. రంజిత్ దాస్ను స్పీకర్గా ఎంపిక చేయనున్నారు. 126 స్థానాలున్న అస్సాం అసెంబ్లీలో ఎన్డీయే కూటమి ఏకంగా 102 సీట్లను కైవసం చేసుకుని, తిరుగులేని మెజారిటీని సాధించింది. ప్రతిపక్ష కాంగ్రెస్ కేవలం 19 సీట్లకే పరిమితం కావడంతో, ఈసారి అసెంబ్లీలో అధికారిక ప్రతిపక్ష నేత హోదా పొందే అవకాశం కూడా ఏ పార్టీకి లభించకపోవచ్చు. -
పుచ్చకాయ చావులు: ముంబై ఘటన మరవకముందే..
జాంజ్గిర్-చంపా: వేసవి తాపం నుండి ఉపశమనం పొందాలని పుచ్చకాయ తింటే, అది కాస్తా ప్రాణాలు తీసే యమపాశంలా మారుతోంది. గత నెలలో ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పుచ్చకాయ తిని మృత్యువాత పడిన ఘటన మరువక ముందే ఛత్తీస్గఢ్లో ఇదే తరహాలో మరో విషాదం చోటుచేసుకుంది. వేసవిలో అమృతంలా భావించే ఈ పండు, ఇప్పుడు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది.సరదాగా తిన్నారు.. శవమై తేలాడుఛత్తీస్గఢ్లోని జాంజ్గిర్-చంపా జిల్లా ఘుర్కోట్ గ్రామంలో ఈ హృదయ విదారక ఘటన జరిగింది. మేనమామ ఇంటికి వచ్చిన పిల్లలు ఆదివారం సాయంత్రం పుచ్చకాయ తిన్నారు. తిన్న కొద్దిసేపటికే 15 ఏళ్ల అఖిలేష్ ధివర్కు వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. అఖిలేష్తో పాటు పండు తిన్న శ్రీ(4), పింటూ(12), హితేష్(13) అనే ముగ్గురు పిల్లలు ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.బలితీసుకుంటున్న ‘జింక్ ఫాస్ఫైడ్’గత ఏప్రిల్ 25న ముంబైలోని పైధోనీ ప్రాంతంలోనూ అబ్దుల్లా దొకాడియా కుటుంబంలోని నలుగురు సభ్యులు పుచ్చకాయ తిని మృత్యువాత పడ్డారు. అయితే వీరి ఫోరెన్సిక్ పరీక్షల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. వారి శరీర నమూనాల్లో ‘జింక్ ఫాస్ఫైడ్’ అనే ప్రమాదకరమైన రసాయనం ఉన్నట్లు తేలింది. సాధారణంగా ఎలుకల నివారణకు వాడే ఈ రసాయనం పండ్ల ద్వారా మనిషి శరీరంలోకి చేరి ప్రమాదకరంగా పరిణమిస్తోందిఅజాగ్రత్తే ప్రాణసంకటమా?ఛత్తీస్గఢ్ ఘటనలో ప్రాథమికంగా ‘ఫుడ్ పాయిజనింగ్’ కారణమని వైద్యులు అనుమానిస్తున్నారు. ఉదయం కోసిన పుచ్చకాయను చాలా గంటల పాటు గాలికి వదిలేసి, సాయంత్రం తినడమే విషంగా మారి ఉండొచ్చని డాక్టర్ ఎస్.కుజుర్ తెలిపారు. పండ్లపై రసాయనాల వాడకం లేదా నిల్వ ఉంచడంలో చేసే చిన్న అజాగ్రత్తే నిండు ప్రాణాలను బలితీసుకుంటోంది. అందుకే పండ్లు కొనేటప్పుడు, తినేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
తమిళనాడులో బీజేపీకి బిగ్ షాక్!
తమిళనాడులో బీజేపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మిత్రపక్షం అన్నాడీఎంకేలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. టీవీకే విజయ్ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆ వెంటనే టీవీవీ దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకే కూడా అదే ప్రకటన చేసింది. ‘‘డీఎంకేతో చేతులు కలిపి సీఎం కావాలని పళనిస్వామి కుట్ర చేశారు. పార్టీ సిద్దాంతాలకు విరుద్ధంగా ఆయన వ్యవహరించారు. అందుకే ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతున్నాం. ఇకపై ఎన్డీయే కూటమికి.. మాకు సంబంధం లేదు. మాదే అసలైన అన్నాడీఎంకే. విజయ్ ప్రజల సీఎం. అందుకే మా మద్దతు ప్రకటిస్తున్నాం’’ అని అన్నాడీఎంకే రెబల్ వర్గ ఎమ్మెల్యే సీవీ షణ్ముగం ప్రకటించారు. ఆ వెంటనే.. మంగళవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం(AMMK) ఏకైక ఎమ్మెల్యే కామరాజ్ టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. అయితే ఈ విషయంలో ఆ పార్టీ అధినేత టీవీవీ దినకరన్ హైడ్రామా నడిపించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్న టీవీకేకు తొలుత కామరాజ్ మద్దతుగా సంతకం చేశారు. అయితే తమ ఎమ్మెల్యే సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ దినకరన్ సంచలన ఆరోపణలకు దిగారు. ఈ విషయంపై గవర్నర్కు, పోలీసులు ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. తమ మిత్రపక్షం అన్నాడీఎంకే ప్రభుత్వ ఏర్పాటునకు సిద్ధంగా ఉందని.. కాబట్టి ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరారు. అయితే.. టీవీకే ఆ ఆరోపణలను తోసిపుచ్చుతూ కామరాజ్ సంతకం చేసిన వీడియోను రిలీజ్ చేసింది. అయినా కూడా దినకరన్ తన ఆరోపణలను కొనసాగించారు. ఈ తరుణంలో.. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు ప్రకటన చేయడం గమనార్హం. అయితే తన ఎమ్మెల్యే కామరాజ్ దినకరన్ సూచన మేరకే విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటన చేశారా?.. లేదంటే రెబల్గా సంతకం చేశారా? ఎన్డీయే కూటమి నుంచి దినకరన్ పార్టీ కూడా బయటకు వచ్చేసినట్లేనా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీయే (NDA) కూటమి మొత్తం 234 స్థానాలకుగానూ.. 223 స్థానాల్లో పోటీ చేసింది. వీటిలో అన్నాడీఎంకే 178 స్థానాల్లో పోటీ చేసి 47 గెల్చుకుంది. బీజేపీ 27 స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటు నెగ్గింది. ఏఎంఎంకే 11 స్థానాల్లో పోటీ చేసి ఒక్క స్థానంలో గెలిచింది. పట్టాలి మక్కల్ కట్చి(PMK) 18 స్థానాల్లో పోటీ చేసి 4 సీట్లు గెలిచింది. ఫలితంగా, ఈ కూటమి మొత్తం 53 స్థానాలు గెలుచుకుంది.ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని ఎన్డీయే కూటమిలో.. లుకలుకలు బయటపడ్డాయి. మెజారిటీ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు (24-30) మంది కూటమి నుంచి బయటకు వచ్చి విజయ్కు మద్దతు ప్రకటించారు. ఇటు దినకరన్ ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే కూడా మద్దతు ప్రకటించారు. దీంతో ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో పళని వర్గ ఎమ్మెల్యేలు, పీఎంకే 4 ఎమ్మెల్యేలు, బీజేపీ ఏకైక ఎమ్మెల్యే మాత్రమే మిగిలినట్లైంది!. -
సుప్రీం ఆదేశంతో ఎన్నికల ఫలితం రివర్స్!
నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలపై పశ్చిమ బెంగాల్లో రభస కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో మే 11 అంటే సోమవారం సుప్రీంకోర్టులోనూ ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటకలోని శృంగేరి అసెంబ్లీ స్థానాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ మళ్లీ దక్కించుకుంది. తీర్పు ఇస్తున్న సందర్భంగా ‘‘ప్రజాస్వామ్యం హైజాక్ అయ్యేందుకు అనుమతించం’’ అంటూ సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అలాగే ఈ వ్యవహారంలో కర్ణాటక హైకోర్టు తీరును దేశ అత్యున్నత న్యాయస్థానం తప్పు పట్టింది కూడా.. వివరాలు ఇలా ఉన్నాయి..2023లో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లో శృంగేరి అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున టీటీ రాజేగౌడ, బీజేపీ తరఫున జీవరాజ్లు పోటీ చేశారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల కౌంటింగ్ తరువాత 201 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి టీటీ రాజేగౌడ గెలుపొందినట్టుగా ఎన్నికల అధికారి ప్రకటించారు. అయితే.. జీవరాజ్ ఈ ఫలితాన్ని సవాలు చేశారు. విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు రీకౌంటింగ్కు ఆదేశించింది.రిటర్నింగ్ అధికారి 562 ఓట్లను పునః పరిశీలించి బీజేపీ అభ్యర్థి జీవరాజ్ గెలుపొందినట్టుగా ప్రకటించారు. స్టోరీ ఇక్కడితో అయిపోలేదు. విషయం కాస్తా సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. కేసు పూర్వాపరాలను పరిశీలించిన జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్లతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ హైకోర్టు తీరును తప్పుపట్టింది. ఫలితాలను మార్చేసి కాంగ్రెస్ అభ్యర్థే శృంగేరి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించే ఎమ్మెల్యే అని స్పష్టం చేసింది.క్రిమినల్ కేసును విస్మరించారు...హైకోర్టు తీర్పు ఒకలా.. సుప్రీంకోర్టు తీర్పు ఇంకోలా ఉండేందుకు కారణాలు లేకపోలేదు. ఎందుకంటే.. రీకౌంటింగ్ సందర్భంలో జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి హైకోర్టు ఆదేశాలను మించి 562 ఓట్లను రీకౌంట్ చేయడం సమస్యకు కారణంగా మారింది. ఈ నెల రెండు మూడు తేదీల్లో రీకౌంటింగ్ జరగ్గా 279 ఓట్లకు బదులు 562 ఓట్లు రీకౌంట్ చేశారు. ఫలితంగా టీటీ రాజేగౌడకు పడ్డ ఓట్లు 248- 255 వరకూ తగ్గిపోయి జీవరాజ్ ఓట్లు స్వల్పంగా పెరిగాయి. సుమారు 52 - 66 ఓట్ల తేడాతో జీవరాజ్ గెలిచినట్టుగా రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.అంతకు ముందు అంటే 2023 ఎన్నికల కౌంటింగ్ సందర్భంలోనూ తమకు పడ్డ బ్యాలెట్లను ఉద్దేశపూర్వకంగా చెల్లనివిగా చేశారని టీటీ రాజేగౌడ ఆరోపిస్తున్నారు. బ్యాలెట్ కాగితాలపై గీతలు పెట్టి, ఇంకు గుర్తులు పెట్టి చెల్లకుండా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. స్ట్రాంగ్ రూమ్ తలుపుల తాళాలు, సీళ్లు చెదిరిపోయి ఉన్నాయని కూడా గుర్తించారు. కౌంటింగ్కు ముందే బ్యాలెట్ బాక్సులు తెరిచి ఉన్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారాలపై అప్పట్లోనే కలెక్టర్ కె.ఎన్.రమేశ్, రిటర్నింగ్ అధికారి వేదమూర్తి, బీజేపీ అభ్యర్థి జీవరాజ్లపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఈ కేసులన్నింటిపై హైకోర్టు స్టే విధించడం గమనార్హం. చివరకు సుప్రీంకోర్టు చొరవతో శృంగేరి అసెంబ్లీ స్థానం కాంగ్రెస్ వశమైంది.పెద్ద ఎత్తున జరిగి ఉంటే...శృంగేరి అసెంబ్లీ స్థానంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రముఖ జర్నలిస్ట్ రవీశ్ కుమార్ స్పందించారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారి అక్రమాలకు పాల్పడుతూ కెమెరాకు చిక్కడం, హర్యానా పంచాయితీ ఎన్నికల్లోనూ సుప్రీంకోర్టు ఆదేశాలతో జరిగిన ఈవీఎం రీకౌంటింగ్తో ఫలితాలు తారుమారైన విషయాన్ని, బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియపే ప్రస్తావిస్తూ.... కర్ణాటక మాదిరిగానే దేశంలోని ఇతర నియోజకవర్గాల్లోనూ రిటర్నింగ్ అధికారులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడి ఉంటే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో 2024 సాధారణ ఎన్నికల విషయంలోనూ సుప్రీంకోర్టు సమీక్ష జరపాలని కోరారు. రిటర్నింగ్ అధికారులు తప్పు చేసి ఉంటే న్యాయస్థానం ఎలాంటి శిక్ష విధిస్తుందని ప్రశ్నించారు. ఎన్నికల అక్రమాల విషయంలో హెచ్చరించడం, లేదా ఖండించడం శిక్ష కిందకు రాదని వ్యాఖ్యానించారు.:::గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
బల పరీక్షకు ముందు టీవీకేకు షాక్
సాక్షి, చెన్నై: తమిళనాడులో బల నిరూపణకు ముందు తమిళగ వెట్రి కగళం పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీనివాస్ సేతుపతి ఓటింగ్లో పాల్గొనడానికి వీల్లేదని మద్రాస్ హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. శ్రీనివాస్ సేతుపతి ఈ ఎన్నికల్లో టీవీకే తరఫున తిరుప్పత్తూరు నియోజకవర్గంలో పోటీ చేశారు. డీఎంకే అభ్యర్థి, మాజీ మంత్రి పెరియా కరుప్పన్పై ఒక్క ఓటుతో గెలిచారు. కౌంటింగ్ సమయంలో ఆ టైంలో హైడ్రామా నడిచింది. అయితే.. ఈ ఎన్నికను సవాల్ చేస్తూ పెరియకరుప్పన్ హైకోర్టును ఆశ్రయించారు. తిరుపత్తూరు నియోజకవర్గం నం.185లో నమోదు కావలసిన ఓటు, పొరపాటున వెల్లూరు జిల్లా తిరుపత్తూరు నియోజకవర్గం నం.50కి బదిలీ చేయబడిందని.. ఈ విషయంపై తాను ఈసీకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని కరుప్పన్ కోర్టులో వాదించారు. ఈసీ మాత్రం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత వచ్చిన పోస్టల్ బ్యాలెట్ ఫిర్యాదులపై చర్య అవసరం లేదని పేర్కొంది. అలాగే, ఒక్క పోస్టల్ ఓటు కూడా ఇతర నియోజకవర్గానికి బదిలీ కాలేదని స్పష్టం చేసింది. అయితే.. కోర్టు పెరియా కరుప్పన్ సమర్పించిన ఫిర్యాదుకు తగిన ఆధారాలు ఉన్నాయని గమనించింది. ఈ నేపథ్యంలోనే తదుపరి ఉత్తర్వులు ఇచ్చే దాకా ఓటు వేయడానికి వీల్లేదని శ్రీనివాస్కు తేల్చి చెప్పింది. అదే సమయంలో.. అన్ని పోస్టల్ బ్యాలెట్లను సురక్షితంగా భద్రపరచాలని, సంబంధిత వీడియో ఫుటేజ్ను కూడా కాపాడాలని కోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. దీంతో ఓటింగ్కు శ్రీనివాస్ సేతుపతి దూరం అయ్యే అవకాశం కనిపిస్తోంది. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటునకు మ్యాజిక్ ఫిగర్ 118. గవర్నర్కు విజయ్ సమర్పించిన మద్దతుదారు ఎమ్మెల్యేల సంఖ్య 118. ఇందులో టీవీకే 107, కాంగ్రెస్ 5, వీసీకే 2, లెఫ్ట్ పార్టీలు 4 ఉన్నాయి. బల నిరూపణకు ఒక్క ఎమ్మెల్యే దూరం అయితే ఆ ఫిగర్ 117కి పడిపోనుంది. అయితే ఏఎంఎంకే, అన్నాడీఎంకే చీలిక వర్గ ఎమ్మెల్యేల మద్దతు ప్రకటనతో గండం నుంచి విజయ్ గట్టెక్కే చాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. -
‘నాన్నని వద్దంటున్న అమ్మ’.. కలెక్టర్ను కలిసిన చిన్నారులు
పాలక్కడ్: కుటుంబ కలహాలు ఆ పసిమొగ్గల పాలిట శాపంగా మారుతున్నాయి. ‘అమ్మకు మేం కావాలి, కానీ నాన్న వద్దు.. మాకు మాత్రం ఇద్దరూ కావాలి’ అంటూ కేరళలోని పాలక్కాడ్ జిల్లా కలెక్టరేట్ మెట్లెక్కిన ఇద్దరు చిన్నారుల ఆవేదన అందరి హృదయాలను కలచివేస్తోంది. విడిపోతున్న తమ తల్లిదండ్రులను ఎలాగైనా కలపాలని వారు చేసిన వేడికోలు ఇప్పుడు సంచలనంగా మారింది.విదేశీ పర్యటనలో మొదలైన దూరంత్రిథాలలోని అనక్కరకు చెందిన 10, 8 ఏళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు.. తమ మేనత్త కూతురైన 12 ఏళ్ల సోదరితో కలిసి సోమవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ ఎం.ఎస్. మాధవికుట్టిని కలిశారు. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న తమ తల్లి వద్దకు విషు పండుగ సందర్భంగా నాన్నతో కలిసి వెళ్లామని పిల్లలు తెలిపారు. అయితే, అక్కడ రెండు నెలలు ఉన్నప్పటికీ తల్లి తమను పెద్దగా పట్టించుకోలేదని, కనీసం తమతో సరిగా గడపలేదని వారు కలెక్టర్కు వివరించారు. ఆ విదేశీ పర్యటన వారిని తీవ్ర మానసిక ఆవేదనకు గురిచేసింది.విడిపోదామన్న తల్లి.. వ్యసనంలో తండ్రికేరళకు తిరిగి వచ్చిన తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. తండ్రి మద్యానికి బానిస కావడం, ఇంట్లో నిత్యం గొడవలు, పోలీసు కేసులు ఆ పసివాళ్లను తీవ్ర మానసిక క్షోభకు గురిచేశాయి. ఈ క్రమంలో గత బుధవారం కేరళకు తిరిగొచ్చిన తల్లి.. తండ్రి లేకుండా తనతోనే వచ్చేయాలని పిల్లలకు తేల్చిచెప్పింది. అయితే, ‘ఇద్దరూ కలిసి ఉంటేనే వస్తాం’ అంటూ ఆ చిన్నారులు తెగేసి చెప్పారు.రంగంలోకి కలెక్టర్.. కౌన్సెలింగ్ ఏర్పాటుతమ తాతయ్య, సోదరి మద్దతుతో కలెక్టర్ వద్దకు రాకముందే ఈ చిన్నారులు బాలల సంక్షేమ సమితిని (సీడబ్ల్యూసీ) కూడా ఆశ్రయించారు. కలెక్టర్తో జరిగిన సమావేశంలో 12 ఏళ్ల సోదరి వారికి ప్రతినిధిగా వ్యవహరించి, కుటుంబంలో నెలకొన్న కలహాలను పూసగుచ్చినట్లు వివరించింది. పిల్లల పరిస్థితికి చలించిపోయిన కలెక్టర్ మాధవికుట్టి తక్షణమే జోక్యం చేసుకుని, మహిళా శిశు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ద్వారా ఆ చిన్నారులకు కౌన్సెలింగ్ ఏర్పాటు చేశారు. వారికి పూర్తి భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చి అధికారుల సాయంతో సురక్షితంగా ఇంటికి పంపించారు. ఇది కూడా చదవండి: మంత్రి అరోరాకు ఈడీ షాక్: వెలుగులోకి డమ్మీ అకౌంట్లు -
ఎన్డీయేకు ఝలక్.. విజయ్కు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు
అన్నాడీఎంకే పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యే వర్గం సంచలన ప్రకటన చేసింది. ఎన్టీయే కూటమి నుంచి బయటకు వచ్చి.. విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఈ క్రమంలో పార్టీ అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ ఈ పళనిస్వామిపై తీవ్ర విమర్శలు గుప్పించింది. అలాగని ఇది పార్టీని చీల్చే ప్రయత్నం ఏమాత్రం కాదని ఆ వర్గ ఎమ్మెల్యే సీవీ షణ్ముగం తేల్చి చెప్పారు. సీవీ షణ్ముగంలో నేతృత్వంలో దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు(24 మంది అని కొన్ని తమిళ మీడియా సంస్థలు చెబుతున్నాయ్) విజయ్కు మద్దతు ప్రకటించారు. తాము ఏ పదవులనూ ఆశించబోవడం లేదని.. బయటి నుంచే విజయ్ సర్కార్కు సపోర్ట్ ఇస్తామని అన్నారు. చెన్నైలో మంగళవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకేలో అంతర్గత పోరు నిజమేనని ఆయన అంగీకరించారు. ‘‘విజయ్ ప్రజల సీఎం. ఆయన ఆ కుర్చీలో కూర్చోవాలని తమిళ ప్రజలు కోరుకున్నారు. ప్రజా నిర్ణయమే మాకు శిరోధార్యం. అందుకే ఆయనకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించాం’’ అని షణ్ముగం ప్రకటించారు. అదే సమయంలో.. పార్టీ లుకలుకలను ఆయన మీడియాకు వివరించారు. డీఎంకేతో చేతులు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పళని స్వామి కుట్ర చేశారు. ఎలాగైనా ఆయన సీఎం కావాలని అనుకున్నారు. ఆ ప్రతిపాదనను మేం ఒప్పుకోలేదు. అన్నాడీఎంకే స్థాపన లక్ష్యం డీఎంకేను ఎదుర్కోవడం. అలాంటి పార్టీతో చేతులు కలపడం పార్టీ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమే కాదు.. అత్యంత ప్రమాదకరం కూడా. ఈ విషయంలో పళనిస్వామి మాకు విరుద్ధంగా వ్యవహరించారు. అందుకే ఎన్డీయే కూటమికి గుడ్బై చెప్పాం అని షణ్ముగం వివరించారు. వరుస ఓటములకు పళనినే కారణమన్న షణ్ముగం.. ఆయన అన్ని పదవుల నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. ఇక నుంచి మాదే అసలైన అన్నాడీఎంకే కూటమి.. ఎన్డీయేతో మాకు సంబంధం లేదు.. మేం బయటకు వచ్చేశాం. ఎన్నికల ఫలితాలపై, భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే సమీక్షా సమావేశం నిర్వహిస్తాం అని స్పష్టం చేశారాయన. దీంతో పళనిస్వామి ఎలా స్పందిస్తారు? ఆయన నిర్ణయం ఎలా ఉండబోతుంది?. కూటమి విచ్ఛిన్నంపై బీజేపీ ఎలా స్పందిస్తుందో? అనే ఉత్కంఠ నెలకొంది.ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 53 సీట్లు నెగ్గింది. అన్నాడీఎంకే 47 స్థానాల్లో.. పీఎంకే 4, ఏఎంకే, బీజేపీలు చెరో సీటు చొప్పున నెగ్గాయి. అయితే ఫలితాల తర్వాత విజయ్కు మద్దతు విషయంలో అన్నాడీఎంకేలో చీలిక మొదలైంది. బీజేపీ మద్దతు నేపథ్యంతో పళనిస్వామి అందుకు ఒప్పుకోలేదు. రెబల్ ఎమ్మెల్యేలు మాత్రం బీజేపీ కంటే విజయ్కు మద్దతు పార్టీకి ప్రజల్లో సింపథీ క్రియేట్ చేస్తుందని.. రాబోయే రోజుల్లో అది పనికి వస్తుందని వాదించింది. అంతేకాదు.. ఆ పార్టీ తరఫున శాసనసభా పక్షనేత, ఉప నేత ఎంపికలోనూ ఈ వర్గపోరు మరింత ఉధృతంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. తనకు, తన అనుచర గణానికి ఆ పదవులు దక్కాలని పళనిస్వామి భావిస్తున్నారు. అయితే షణ్ముగం వర్గం మాత్రం సీనియర్ నేత ఎస్పీ వేలుమణికి శాసనసభా పక్ష నేత, డిప్యూటీ పదవిని జీ హరి, సీ భాస్కర్లలో ఎవరికో ఒకరికి ఇవ్వాలని పట్టుబడుతోంది. ఈ క్రమంలోనే పోరు ముదిరి బయటకు వచ్చి ప్రకటన చేసింది. రేపు తమిళనాడు అసెంబ్లీలో విజయ్ సంకీర్ణ ప్రభుత్వం బల పరీక్ష ఎదుర్కొనుంది. ఈ తరుణంలో అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేల ప్రకటన బూస్ట్ కానుంది. -
విజయ్ ప్రమాణస్వీకారోత్సవం చూస్తూ..
తిరువొత్తియూరు: తిరుచ్చి నవ్లూర్ కుట్టపట్టు, వన్నంకోవై ప్రాంతానికి చెందిన జార్జ్ విలియం సేతురాజ్ (33) పెట్రోల్ బంక్ ఉద్యోగి. ఇతను నటుడు విజయ్కు వీరాభిమాని. విజయ్ రాజకీయ పార్టీ ప్రారంభించినప్పటి నుండి తమిళగ వెట్రి కళగం లో తీవ్రంగా పనిచేశాడు.గత అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీరంగం నియోజకవర్గ అభ్యర్థి విజయం కోసం తీవ్రంగా శ్రమించాడు. ఎన్నికల్లో విజయ్ నాయకత్వంలోని పార్టీ మెజారిటీ స్థానాలను గెలుచుకోవడంతో అతను ఎంతో సంతోషించాడు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో జరిగిన ఆలస్యం అతడిని కొంత ఆందోళనకు గురిచేసింది. దీంతో ఫలితాల కోసం 24 గంటలూ టీవీ చూస్తూనే ఉన్నాడు. ఆదివారం అన్ని అడ్డంకులను అధిగమించి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న దశ్యాలను టీవీలో చూస్తుండగా, జార్జ్ విలియమ్కు ఒక్కసారిగా తీవ్రమైన గుండెనొప్పి వచ్చింది. వెంటనే తన బైక్ మీద భార్యను కూర్చోబెట్టుకుని 3 కి.మీ దూరంలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తనే స్వయంగా నడుపుకుంటూ వెళ్లాడు. మార్గమధ్యంలో నొప్పి ఎక్కువవడంతో, అక్కడి నుంచి కారులో మరో ఆసుపత్రికి తరలించారు. కానీ ఆసుపత్రికి చేరుకునేలోపే జార్జ్ విలియం ప్రాణాలు విడిచాడు. అతిగా కలిగిన ఆనందంతో వచ్చిన గుండెపోటు మరణానికి కారణమని చెబుతు న్నారు. మరణించిన జార్జ్ విలియం కుటుంబం చాలా పేదరికంలో ఉంది. అతనికి 4 ఏళ్ల కవల పిల్ల లు ఉన్నారు. అందులో జోస్వ అనే బాబు మూగవాడు (దివ్యాంగుడు). జార్జ్ తల్లిదండ్రులు కూడా వద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇంటి పెద్దను కోల్పోయిన ఆ కుటుంబం ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉంది. ఆ కుటుంబానికి ముఖ్యమంత్రి విజయ్ అండగా నిలవాలని బంధువులు, స్థానికులు కన్నీళ్లతో కోరుతున్నారు. -
మంత్రి అరోరాకు ఈడీ షాక్: వెలుగులోకి డమ్మీ అకౌంట్లు
చండీగఢ్: పంజాబ్ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. అవినీతి ఆరోపణలతో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంత్రి సంజీవ్ అరోరా చుట్టూ ఉచ్చు మరింతగా బిగుసుకుంటోంది. ఆయన విషయంలో వచ్చిన ఆరోపణలపై తాజాగా జరిగిన దర్యాప్తులో ఏకంగా రూ. 157 కోట్ల విలువైన నకిలీ మొబైల్ ఫోన్ల విక్రయాల కుంభకోణం వెలుగుచూడటం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చేస్తున్న మనీలాండరింగ్ దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెలుగు చూశాయి.అక్రమ లావాదేవీల గుట్టు రట్టుమే 9వ తేదీన చండీగఢ్లోని ఆయన అధికారిక నివాసంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈడీ అధికారులు సంజీవ్ అరోరాను అరెస్టు చేశారు. అనంతరం గురుగ్రామ్లోని ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు వారం రోజుల పాటు ఈడీ కస్టడీ విధించింది. తాజా దర్యాప్తు ప్రకారం నకిలీ మొబైల్ ఫోన్ల వ్యాపారం పేరుతో జరిగిన భారీ ఆర్థిక లావాదేవీలపై ఏజెన్సీలు దృష్టి సారించాయి. షెల్ కంపెనీల (నకిలీ సంస్థల) ద్వారా, బ్యాంకు ఖాతాలను పదేపదే మార్చుతూ, నిధులను ఎలా మళ్లించారన్న దానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు.కూలీ ఖాతాలోకి కోట్ల రూపాయలుఈ కుంభకోణానికి సంబంధించి ఈడీ కీలక ఆధారాలను న్యాయస్థానానికి సమర్పించింది. అరోరాతో సంబంధం ఉన్న హాంప్టన్ స్కై రియాల్టీ లిమిటెడ్ (హెచ్ఎస్ఆర్ఎల్) అనే సంస్థ 2023 ఆగస్టు నుండి 2024 జనవరి మధ్యకాలంలో ‘ఎస్కె ఎంటర్ప్రైజెస్’కు 41 ఆర్టీజీఎస్ లావాదేవీల ద్వారా ఏకంగా రూ. 27.73 కోట్లను బదిలీ చేసినట్లు వెల్లడించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ఎస్కె ఎంటర్ప్రైజెస్ ఒక దినసరి కూలీ పేరు మీద రిజిస్టర్ అయి ఉండటం గమనార్హం. ఎలాంటి వాస్తవిక వాణిజ్య కార్యకలాపాలు లేని ఈ డమ్మీ ఖాతాల ద్వారా, అసలు డబ్బు మూలాలు దాచివుంచుతూ నిధులను దశలవారీగా మళ్లించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.పంజాబ్ కేబినెట్లో కీలక మార్పులుసంజీవ్ అరోరా అరెస్టు నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ఆయన నిర్వహిస్తున్న శాఖలను ఇతర మంత్రులకు బదలాయిస్తూ, కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలు, పెట్టుబడుల ప్రోత్సాహక శాఖను అమన్ అరోరాకు, స్థానిక సంస్థల శాఖను హర్జోత్ బైన్స్కు, విద్యుత్ శాఖను తరుణ్ప్రీత్ సోండ్కు అప్పగించింది. ఈ మార్పులను గవర్నర్ గులాబ్ చంద్ కటారియా సోమవారం సాయంత్రం ఆమోదించారు. కాగా అరోరాను ప్రస్తుతానికి శాఖలు లేని మంత్రిగా కొనసాగించవచ్చని పార్టీ వర్గాలు భావిస్తుండగా.. ఈ అరెస్టు రాజకీయ కక్ష సాధింపు చర్యగా ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.ఇది కూడా చదవండి: సోఫాలో గుట్టల కొద్దీ కరెన్సీ.. సౌతాఫ్రికా అధ్యక్షుడి పదవికే ఎసరు? -
గేమ్ఛేంజర్.. కీర్తన
సాక్షి, చెన్నై : సీఎం విజయ్ కేబినెట్లో అత్యంత పిన్న వయస్కురాలైన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎస్. కీర్తన గురించిన చర్చ తమిళనాట ప్రధాన అంశంగా మారింది. 29 ఏళ్ల ఈ ’యువ తుపాన్’.. 5 భాషల్లో ప్రావీణ్యం..సాధించి ఉండడంతో ఆమె గురించిన ఆసక్తికర అంశాలను తెలుసుకునే వారు పెరిగారు. ఆదివారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆమె సోమవారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి అవసరమైన ధృవీకరణ పత్రాన్ని మరచి పోవడంతో ఆమెపై చర్చ మరింత ఊపందుకుంది. రాజకీయ వ్యూహకర్త నుండి మంత్రి వరకు.. విరుదునగర్ జిల్లా శివకాశి నియోజకవర్గం నుండి విజయం సాధించిన కీర్తన, కేవలం రాజకీయ నాయకురాలు మాత్రమే కాదు, ఒక సమర్థవంతమైన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ (రాజకీయ వ్యూహకర్త). ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందు ఆమె ప్రఖ్యాత రాజకీయ సలహా సంస్థలైన ఐప్యాక్, షోటైమ్ కన్సల్టింగ్లో డిజిటల్ క్యాంపెయిన్ స్ట్రాటజిస్ట్గా పనిచేశారు. కీర్తన తన వృత్తిపరమైన ప్రయాణంలో దేశంలోని హేమాహేమీలైన రాజకీయ నాయకుల వద్ద పనిచేశారు. చదువు ..భాషా నైపుణ్యం విరుదునగర్ ప్రభుత్వ పాఠశాలలో తమిళ మీడియంలో ప్రాథమిక విద్యను అభ్యసించిన కీర్తన, మదురై కామరాజ్ యూనివర్సిటీలో బీఎస్సీ మ్యాథ్స్, పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ పూర్తి చేశారు. ఈమెకు తమిళం, తెలుగు, ఇంగ్లీష్ హిందీ, మలయాళం వంటి 5 భాషల్లో అనర్గళంగా మాట్లాడే సామర్థ్యం ఉంది. ముఖ్యంగా విజయ్ సిద్ధాంతాలను దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆమె హిందీ నేర్చుకోవడం విశేషం.శివకాశిలో సరికొత్త రికార్డు 2026 ఎన్నికల్లో శివకాశి నియోజకవర్గం నుండి పోటీ చేసిన కీర్తన, తన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి అశోకన్ను 11,670 ఓట్ల మెజారిటీతో ఓడించారు. గత 70 ఏళ్లలో శివకాశి నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టిన మొదటి మహిళా ఎమ్మెల్యేగా ఆమె చరిత్ర సృష్టించారు. రాజకీయ నేపథ్యం గానీ, ధన బలం గానీ లేకపోయినా.. ప్రజలకు సేవ చేయాలనే తపన ఉంటే విజయ్ పార్టీలో తగిన గుర్తింపు లభిస్తుంది అనడానికి తానే ∙నిదర్శనం అని కీర్తన వ్యాఖ్యానిస్తున్నారు. సామాన్య కుటుంబం నుండి వచ్చి, రాజకీయ వ్యూహకర్తగా అనుభవం గడించి, నేడు ఏకంగా రాష్ట్ర మంత్రివర్గంలో చోటు సంపాదించిన కీర్తన ప్రయాణం తమిళనాడులోని ఎంతో మంది యువతకు స్ఫూర్తిదాయకంగా మారినట్లయ్యింది. -
ఇంటి అద్దె రూ.56 వేలు.. ఖర్చు రూ.1.3 లక్షలు
బనశంకరి: బెంగళూరు జీవన వ్యయం పెరిగింది. ఇక్కడ ఇంటి అద్దె, ఖర్చులు ఆకాశానికి అంటుతున్నాయి. ప్రతి నెలా ఇంటి అద్దె రూ.56 వేలు, రూ.1.3 లక్షలకు పైగా ఇతర ఖర్చులకు వ్యయం చేయాల్సి వస్తోందని ఇన్స్ట్రాగాంలో దంపతులు తమగోడు వెల్లబోసుకున్న వీడియో వైరల్గా మారింది. దంపతులు ఇద్దరికి మంచి ఉద్యోగం ఉంది. కానీ నెలవారీ ఖర్చులు గురించి ఆందోళన వ్యక్తం చేశారు. విలాసవంతంగా జీవించడం సాధ్యం కాదని.. సాధారణ ఖర్చులు బెంగళూరులో భారీగా పెరిగాయని చెబుతున్నారు. నిత్యావసరాలు, ఇంటి సామాగ్రి, ఇంటర్నెట్, విద్యుత్, షాపింగ్, బయట ఆహారం తినడం, ప్రయాణం, ఆన్లైన్ చందాలతో పాటు ఖర్చు ఇంకా పెరిగిందన్నారు. కంపెనీ పని ఒత్తిడితో ఇంట్లో పని మనుషులను పెట్టుకుంటే ఈ ఖర్చులన్నీ కలిపి నెలకు రూ.1.3 లక్షలు అవుతున్నాయని తెలిపారు. బెంగళూరులో కొన్ని ప్రాంతాల్లో ఇంటి అద్దెలు అధికంగా ఉండగా.. కొన్ని చోట్ల పరిమితంగా ఉన్నాయి. అయితే ఇటీవల సంవత్సరాల్లో బెంగళూరులో జీవించడం కష్టంగా ఉందని నెటిజన్ ఒకరు కామెంట్ పెట్టారు. View this post on Instagram A post shared by Radhika and Ekansh (@radhi.and.ekansh) -
లిక్కర్ షాపులపై విజయ్ సంచలన నిర్ణయం
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ పాలనలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే కీలక హామీల ఫైల్స్పై ఆయన సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే మహిళల భద్రతకు సంబంధించిన టీం పర్యవేక్షణ తన ఆధీనంలో ఉంచుకోవాలని ఆయన నిర్ణయించారు. తాజాగా మద్యం దుకాణాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది విజయ్ సర్కార్.టాస్మాక్(Tamil Nadu State Marketing Corporation Limited) పరిధిలోని 717 మద్యం దుకాణాలు మూసేయాలని టీవీకే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకుగానూ రెండు వారాల గడువు విధించింది. ఇవి ఆలయాలు, మసీదులు, చర్చిలు, పాఠశాలలు, కళాశాలలు, బస్స్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఉండడమే కారణమని తెలుస్తోంది. మూసివేయబడే దుకాణాలు: 717276 – ఆధ్యాత్మిక స్థలాల దగ్గర186 – విద్యాసంస్థల దగ్గర255 – బస్స్టాండ్ల దగ్గరకాలపరిమితి: రెండు వారాల్లో ఈ దుకాణాలను మూసివేయాలని ఆదేశం.Tamil Nadu Chief Minister C. Joseph Vijay has ordered the closure of 717 government-run TASMAC liquor retail outlets located within a 500-meter radius of places of worship, educational institutions, and bus stations, within two weeks. pic.twitter.com/1eSSG18V2k— ANI (@ANI) May 12, 2026టాస్మాక్ అనేది తమిళనాడు ప్రభుత్వం 1983లో ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని మద్యం దుకాణాల నిర్వహణను ఇదే చూసుకుంటోంది. అంటే అక్కడ ప్రైవేట్ షాపులు ఉండవన్నమాట. ప్రస్తుతం దీని పరిధిలో 4,765 దుకాణాలు (-717) ఉన్నాయి. విజయ్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రజల దృష్టిని ఆకర్షించేలా ఉందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ నిర్ణయంపై మహిళలు, తల్లిదండ్రుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం కావొచ్చంటున్నారు. అయితే, TASMAC ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయంపై ప్రభావం పడనుంది.తమిళనాడు ఎన్నికల్లో 108 స్థానాలు నెగ్గి విజయ్ టీవీకే పార్టీ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ మెజారిటీ లేకపోవడంతో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీ, వీసీకే మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారాయన. -
విజయ్ ఎఫెక్ట్తో పళని విలవిల
ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా తమిళనాట రాజకీయాలు ఆసక్తికరంగానే సాగుతున్నాయి. తప్పు చేయను, తప్పు చేయనివ్వను అంటూ సీఎంగా ప్రమాణం చేసేటప్పుడు విజయ్ ప్రకటించారు. మరోవైపు.. ప్రధాన ప్రతిపక్షంగా తమ బాధ్యతను నిర్వర్తిస్తామని డీఎంకే ఎంకే స్టాలిన్ హుందాగా ప్రకటించుకున్నారు. ఇంకోవైపు.. విజయ్ దెబ్బకు మరో విపక్షం అన్నాడీఎంకే మాత్రం వర్గపోరుతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. టీవీకేకు తగిన సంఖ్యా బలం లేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటునకు నాలుగు రోజుల హైడ్రామా నడిచిన సంగతి తెలిసిందే. ఈ గ్యాప్లో విజయ్ను దెబ్బ తీయాలని పళనిస్వామి తీవ్రంగా ప్రయత్నించినట్లు ఊహాగానాలు వినిపించాయి. కేవలం 47 మంది స్థానాలు నెగ్గిన అన్నాడీఎంకే ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు చేస్తోందని.. ఇందుకోసం బద్ధశత్రువు డీఎంకే మద్దతు తీసుకోనుందనే ప్రచారం ఉవ్వెత్తున సాగింది. చివరకు ఆ ఎపిసోడ్ తుస్సుమంది. గ్రూపు రాజకీయాలతో.. అదీ విజయ్కు మద్దతు ఇచ్చే విషయంలోనే మొదలైన సంక్షోభంతో అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ ఈ పళనిస్వామి తల పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అన్నాడీఎంకేలో వర్గపోరు మునుపెన్నడూ లేనంత తారాస్థాయికి చేరుకుంది. ఎన్నికల్లో వరుస పరాజయాల కారణంగా పళనిస్వామి నాయకత్వంపై ఆ పార్టీలో అసంతృప్తి పెరిగింది. ఆయన డీఎంకేతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించారని.. మరో సీనియర్ నేత సీవీ షణ్ముగం నేతృత్వంలోని వర్గం దీనిని వ్యతిరేకించిందని.. అదే సమయంలో టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని చర్చలు జరిపిందని జోరుగా ప్రచారం నడిచింది. పళనిస్వామి ఎమ్మెల్యేల మద్దతు కోసం వారిని పుదుచ్చేరి రిసార్ట్కి తరలించినా ఈ విభేదాలు చల్లారలేదు. చివరకు తన నివాసంలో కూర్చోబెట్టి బుజ్జగించినా ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో తీవ్ర అసహనానికి గురైన ఆయన ‘‘మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి..’’ అని తెగేసి చెప్పినట్లు సమాచారం. అటుపై మే 10 రాత్రి జరిగిన మరో సమావేశం తీవ్ర వాగ్వాదాలతో ముగియడంతో.. షణ్ముగం వర్గం విడిగానే ముందుకు సాగాలని నిర్ణయించుకుంది.తాజాగా.. సోమవారం తమిళనాడు కొత్త అసెంబ్లీ సమావేశమైంది. దీనికి పళనిస్వామి నేతృత్వంలో 17 మంది ఎమ్మెల్యేలు, అలాగే షణ్ముగం నేతృత్వంలోని 30 మంది ఎమ్మెల్యేలు విడివిడిగా శాసనసభకు వచ్చి ప్రమాణం చేసి వెళ్లిపోయారు. పళని స్వామిని శాసనసభా పక్ష నేతగా గుర్తించాలని ఆయన మద్దతుదారులు.. లేదు ఎస్పీ వేలుమణిని గుర్తించాలని షణ్ముగం వర్గం ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శికి విడిగా లేఖలు ఇచ్చారు. దీంతో అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేత ఎంపికపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. విజయ్ టీవీకే ప్రభుత్వ ఏర్పాటుతో అన్నాడీఎంకేలో మొదలైన విభేదాలు.. మరింత ముదిరి ఇంకో మలుపు తీసుకునే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా ఇవాళ జరగబోయే స్పీకర్ ఎన్నికలో షణ్ముగం వర్గం టీవీకేకు మద్దతు ఇవ్వవచ్చన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఇది జరిగితే, పళనిస్వామికి సొంత పార్టీలోనే షాక్ తప్పదు.విజయ్ ప్రభావం అన్నాడీఎంకేలోని అంతర్గత సమీకరణాలను గణనీయంగా మార్చేస్తోంది. పళనిస్వామి తన నాయకత్వాన్ని నిలబెట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ, మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడం ఆయనను విలవిలాడే స్థితిలోకి నెట్టింది. మొత్తం మీద, అన్నాడీఎంకేలోని ఈ చీలిక పార్టీ భవిష్యత్తుపై పెద్ద ప్రశ్నార్థకాన్ని మిగిల్చింది. అయితే.. ఈ పరిణామాలతో సైలెంట్గా లాభపడేది టీవీకే, బీజేపీ అనే విశ్లేషణ నడుస్తోంది. అసెంబ్లీలో విజయ్ టీవీకే బలనిరూపణ ఎదుర్కొనుంది. అన్నాడీఎంకేలోని చీలిక వర్గం ఆ సమయంలో టీవీకేకు మద్దతు ప్రకటిస్తే పెనుసంచలనమే కానుంది. అయితే.. బయట మద్దతు తీసుకోవచ్చని.. మంత్రివర్గంలో స్థానం ఇవ్వకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు.. ఈ విబేధాలను అన్నాడీఎంకే కూటమి పార్టీ బీజేపీ తమ వ్యూహంలో భాగంగా ఉపయోగించుకునే అవకాశం లేకపోలేదు. బలహీనమైన అన్నాడీఎంకే ద్వారా టీవీకేపై ప్రభావం చూపించే ప్రయత్నం చేయొచ్చని విశ్లేషకులు అంటున్నారు.షణ్ముగం వర్గం బలపడితే, పళనిస్వామి నాయకత్వం కూలిపోవడం ఖాయం. ఇక స్పీకర్ ఎన్నికలో టీవీకే పార్టీ అన్నాడీఎంకే చీలిక వర్గం మద్దతు పొందితే, ఆ ప్రభావం తమిళనాడు రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. -
కేరళ ఉత్కంఠ.. ఇరకాటంలో కాంగ్రెస్!
కేరళలో కాంగ్రెస్ కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై సంక్షోభం కొనసాగుతోంది. పార్టీలో తీవ్ర అంతర్గత పోరు నడుమ.. హస్తినలో కీలక సమావేశం జరగబోతోంది. దీంతో ఇవాళ సాయంత్రం లోపు కీలక నిర్ణయం వెలువడవచ్చనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే.. ఇరకాటంలో పడేసేందుకు బీజేపీ రెడీగా ఉన్నట్లు కనిపిస్తోంది.కాంగ్రెస్లో ప్రస్తుతం సీఎం రేసులో సీనియర్ నేత కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత వీ.డి. సతీశన్ ఇద్దరూ ప్రధాన అభ్యర్థులుగా ఉన్నారు. అదనంగా రమేశ్ చెన్నితాల కూడా చేరడంతో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. పార్టీ కేంద్ర పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్లు క్షేత్రస్థాయి నుంచి అభిప్రాయసేకరణ చేపట్టినట్లు తెలుస్తోంది. అందులో కేంద్ర నాయకత్వానికి దగ్గరగా ఉన్న కేసీ వేణుగోపాల్కు 63 మంది ఎమ్మెల్యేల్లో 47 మంది మద్దతు ఇస్తున్నారు. ఈ పోరులో రెండో ఎంపికగా రమేష్ చెన్నితల పేరును కొందరు ఎమ్మెల్యేలు సూచించినట్లు సమాచారం. అయితే వీడీ సతీశన్కు ప్రజల్లో విస్తృత ఆదరణ కనిపిస్తోంది. దీంతో టాప్ ప్రయారిటీగా వేణుగోపాల్ వైపే అధిష్టానం మొగ్గు చూపిస్తోంది. ఈ తరుణంలో..ఈ పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది యూడీఎఫ్ మిత్రపక్షం ఐయూఎంఎల్ (ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్). సీఎం ఎంపికలో జాప్యంపై అసంతృప్తితో ఉన్న ఐయూఎంఎల్.. అనూహ్యంగా సతీశన్కు మద్దతు ప్రకటించింది. అయితే కాంగ్రెస్లోని ఒక వర్గం ఈ నిర్ణయంతో విబేధిస్తోంది. ఇప్పటికే బీజేపీ తరచూ కాంగ్రెస్ను ఓ మతానికి అనుకూల పార్టీ అని విమర్శిస్తోంది. ఈ దశలో ఐయూఎంఎల్ ఒత్తిడికి లొంగితే.. ఆ ఆరోపణలకు మరింత బలం చేకూర్చినట్లే అవుతుందని కొందరు కేరళ కాంగ్రెస్ సీనియర్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.ఇదిలా ఉండగానే.. సతీశన్ తన వైఖరిని మరింత కఠినతరం చేశారు. కేవలం ఐదారుగురు ఎమ్మెల్యేల సపోర్ట్ ఉన్న ఆయన.. ముఖ్యమంత్రి పదవి తప్ప మరేమీ అంగీకరించబోనని హైకమాండ్కు స్పష్టం చేసినట్లు సమాచారం. సతీశన్ను ఎంపిక చేస్తే మరో సమస్య ఏమిటంటే.. ఆయనకు పరిపాలనా అనుభవం లేదు. వేణుగోపాల్ మాత్రం రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ మంత్రిగా పనిచేసిన అనుభవం కలిగిన నాయకుడు. రాష్ట్రవ్యాప్తంగా సతీశన్ను సీఎం చేయాలని పోస్టర్లు కనిపించడం, ఆయన పార్టీని ఒత్తిడికి గురి చేస్తున్నారని కొందరు భావిస్తున్నారు. రాహుల్ గాంధీ ఇప్పటికే వర్గపోరు, బహిరంగ శక్తి ప్రదర్శనలు ఆపాలని సూచించారు.మరోవైపు.. అనుభవజ్ఞుడైన వేణుగోపాల్ను సీఎం చేస్తే.. ఆయన లోక్సభ సభ్యత్వం వదులుకోవాల్సి ఉంటుంది. దీంతో ఒక అసెంబ్లీ సీటు, ఒక లోక్సభ సీటుకు ఆరు నెలల్లో ఉపఎన్నికలు జరగాలి. అదనంగా, కాంగ్రెస్ కేంద్ర స్థాయిలో కొత్త ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీని నియమించాల్సి ఉంటుంది. అయితే.. కేసీ వేణుగోపాల్ ఛాయిస్ పైనా బీజేపీ సెటైర్లు వేస్తోంది.సోషల్ మీడియాలో కాంగ్రెస్ సీఎం ఎంపిక విషయంలో కేరళ బీజేపీకి.. జాతీయ బీజేపీకి మధ్య పోరు నడుస్తోంది. ఆయన కేరళలో ఉండాలని కేరళ బీజేపీ, లేదు ఢిల్లీలో ఉండాలని జాతీయ బీజేపీ కోరుకుంటోంది అని కాంగ్రెస్ సంక్షోభాన్ని ఎగతాళి చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అయ్యింది. దానికి బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ వెటకారంగా స్పందించారు. ఇది నిజమని నేను ధృవీకరించను.. అలాగే ఖండించను కూడా అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య కాంగ్రెస్ లోపల జరుగుతున్న నాయకత్వ పోరును ఎగతాళి చేస్తూ, బీజేపీకి రాజకీయ వ్యంగ్యంగా మారింది.అసెంబ్లీ గడువు ఈ నెల 23వ తేదీ వరకు ఉంది. ఎంతకంత కంగారు?. పార్టీ హైకమాండ్ తీసుకునే ఎలాంటి నిర్ణయమైనా పార్టీ శ్రేణులకే కాదు.. యూడీఎఫ్ భాగస్వామ్య పక్షాలకు కూడా సంతృప్తికలిగించేదిగా ఉండాలి. ఇదొక ప్రజాస్వామిక ప్రక్రియ అని రమేశ్ చెన్నితాల మీడియా ముందు వ్యాఖ్యానించడం గమనార్హం.ఈ గందరగోళం నడుమ.. సందిగ్ధానికి చెక్ పెట్టేందుకు ఢిల్లీ హైకమాండ్ నాయకత్వం నడుం బిగించింది. కేరళ మాజీ పీసీసీ అధ్యక్షులతోపాటు సీనియర్ నేతలతో చివరిగా చర్చలు చేపట్టాలని నిర్ణయించింది. మంగళవారం ఢిల్లీలో జరిగే చర్చలకు అధిష్టానం కబురందుకున్న వారిలో ఎంఎం హస్సన్, వీఎం సుధీరన్, ఎం. రామచంద్రన్, కె.మురళీధరన్, కన్నూర్ ఎంపీ కె.సుధాకరన్ ఉన్నారు. వీరితో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ముఖ్యనేత రాహుల్ గాంధీ చర్చలు జరుపుతారు. ఈ సమావేశాలతో.. ఇవాళ సాయంత్రానికో.. లేదంటో రేపటికల్లా కేరళ సీఎం అభ్యర్థి ఎవరన్న దానిపై స్పష్టత రానుందని స్పష్టమవుతోంది. కాంగ్రెస్ నిర్ణయం ఏదైనా సరే కేరళ రాజకీయ సమీకరణాలను మాత్రమే కాదు, జాతీయ స్థాయిలోనూ ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది. -
అన్నాడీఎంకేలో చీలిక!
సాక్షి, చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ సాక్షిగా అన్నాడీఎంకే పార్టీలో విభేదాలు వెలుగుచూశాయి. తాజా ఎన్నికల్లో పార్టీ ఘోర వైఫల్యం చెందడంతో పార్టీ అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి ఎడపాడి కె.పళనిస్వామి నాయకత్వంలో ముందుకు సాగేది లేదని మెజార్టీ ఎమ్మెల్యేలు తెగేసి చెప్పారు. దీంతో పార్టీలో చీలిక అనివార్యమని స్పష్టమవుతోంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు పార్టీ సీనియర్ నేతలు ఎస్పీ వేలుమణి, సీవీ షణ్ముగం సారథ్యం వహిస్తున్నారు. మెజార్టీ ఎమ్మెల్యేలు వీళ్లిద్దరికే మద్దతు తెలపడంతో తాజాగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా చీలిపోయినట్లు తమిళ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. పార్టీ ఘోర పరాభవానికి పళనిస్వామే కారణమని, అలాంటి వ్యక్తి అసెంబ్లీలో పార్టీ తరపున శాసనసభాపక్ష నేతగా కొనసాగే అర్హత కోల్పోయారని వేలుమణి, షణ్ముగం వర్గం ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. షణ్ముగంను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవాలని తిరుగుబాటు వర్గం నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా ప్రొటెం స్పీకర్ కరుప్పయ్యను కలిసి వినతి పత్రం అందజేసింది. అయితే పళనిస్వామినే పార్టీ తరఫున శాసనసభాపక్ష నేతగా అనుమతించాలంటూ థలవై సుందరం సారథ్యంలోని ఎమ్మెల్యేల బృందం మరో వినతి పత్రాన్ని ప్రొటెం స్పీకర్కు అందజేసింది. శాసన సభాపక్ష నేత పదవి కోసం.. 17వ శాసనసభ తొలి సమావేశానికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండు బృందాలుగా రావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. పళనిస్వామితోపాటు కొద్ది మంది ఎమ్మెల్యేలే సభకు వచ్చారు. షణ్ముగం, వేలుమణి వెంట మిగతా ఎమ్మెల్యేంతా నడిచారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాలంటూ షణ్ముగం పేరును తాత్కాలిక స్పీకర్ పిలిచినప్పటికీ ఆయన ముందుకురాలేదు. వేలుమణి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు అన్నాడీఎంకేలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు బల్లలు చరిచి మద్దతు తెలిపి తాము తిరుగుబాటు జెండా ఎగరేశామని అసెంబ్లీ సాక్షిగా పరోక్షంగా ప్రకటించారు. ఎమ్మెల్యేగా పళనిస్వామి ప్రమాణం చేస్తున్నప్పుడు కొద్దిమంది ఎమ్మెల్యేలు మాత్రమే మద్దతుగా బల్లలు చరిచారు. దీంతో పార్టీలో విబేధాలు పొడచూపాయని అసెంబ్లీలో అందరికీ అర్థమైపోయింది. మరోవైపు మాజీ మంత్రి, ప్రస్తుతం డీఎంకేలో ఉన్న సెంథిల్ బాలాజీతో వేలుమణి భేటీ కావడం రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. ఈ భేటీ వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎవరికెంత బలం? ప్రస్తుత పార్టీ చీఫ్ పళనిస్వామి వెంట కేవలం 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. షణ్ముగం, వేలుమణి వర్గంలో ఏకంగా 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. శాసనసభాపక్ష నేత ఎన్నిక వ్యవహారం చినికిచినికి గాలివానగా చివరకు పార్టీ చీలికకు ప్రధాన కారణంగా నిలుస్తుందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. విజయ్కి మద్దతు విషయంలో.. ప్రభంజనంలా వచ్చి సీఎం పదవిని ఒడిసిపట్టిన టీవీకే చీఫ్ విజయ్కు బయటి నుంచి మద్దతు ఇవ్వాలని మొదట్నుంచీ షణ్ముగం, వేలుమణి బృందం పట్టుబడుతోంది. ఈ ధోరణిని పళనిస్వామి తప్పుబట్టారు. దీంతో బేధాభిప్రాయాలు మరింత ముదిరి పార్టీలో అంతర్గత చీలికలు పెద్దవైపోయి ఇప్పుడు బహిర్గతమయ్యాయి. పళనిస్వామి గనక పార్టీ ఎమ్మెల్యేలందరినీ సమావేశపరిచి శాంతపరచకపోతే పార్టీ శాశ్వతంగా చీలిపోయే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు సత్యాలయ రామకృష్ణన్ అభిప్రాయపడ్డారు. షణ్ముగం వర్గంతో కలిసి కూర్చుని మాట్లాడుకోవాలని, పార్టీ ఐక్యతకు అది అత్యంత కీలకమని పళనిస్వామి భావించకపోతే పార్టీ మరింత బలహీనపడి ద్రవిడ పార్టీల్లో ఏకైక బలమైన పార్టీగా డీఎంకే మాత్రమే కొనసాగుతుందని ఆయన విశ్లేషించారు. అవస్థల కడలిలో అన్నాడీఎంకే అన్నాడీఎంకేలో చీలికలు ఉంటే ఐదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి రావడం కలగానే మిగిలిపోతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు తేల్చేశారు. గత కొంతకాలంగా పార్టీ తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. 2019 లోక్సభ ఎన్నికల్లో తక్కువ చోట్ల పార్టీ గెలిచింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో, 2024 లోక్సభ ఎన్నికల్లోనూ పార్టీ ప్రదర్శన పేలవంగా ఉంది. తాజా ఎన్నికల్లోనూ పార్టీ 47 స్థానాలకే పరిమితమైంది. -
ప్రధాని ప్రయాణించే మార్గంలో జిలెటిన్ స్టిక్స్
శివాజీనగర: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం బెంగళూరు పర్యటన సందర్భంగా ఆయన ప్రయాణించే రోడ్డు సమీపంలో జిలెటిన్ స్టిక్స్ బాక్స్ లభించడంతో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ), నేషనల్ సెక్యూరిటీ గ్రూప్ (ఎన్ఎస్జీ) రంగంలోకి దిగాయి. లోహిత్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద పోలీస్ శాఖ, పలు దర్యాప్తు సంస్థల ఫోన్ నంబర్లు ఉండటం గమనార్హం. ఇతడు ఉత్తుత్తి బాంబు బెదిరింపు కాల్స్ చేసేవాడని తెలిసింది. అతన్ని పోలీసులు విచారించగా.. ‘నాకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తెలుసు. ఎన్ఐఏ డైరెక్టర్ తెలుసు. సీబీఐ డైరెక్టర్ కూడా తెలుసు.డీజీపీతో మాట్లాడతా’ అంటూ విచిత్రమైన సమాధానాలు చెప్పినట్టు తెలిసింది. అతడు ఏదైనా ఉద్దేశంతో పేలుడు పదార్థాలను తెచ్చాడా లేక సంచలనం సృష్టించడానికా? అనేది పోలీసులు, ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. 3 కేంద్ర బృందాలు బెంగళూరు దక్షిణ జిల్లా (రామనగర) కగ్గలీపుర సమీపంలో జిలెటిన్ స్టిక్స్ పెట్టె లభ్యమైన ఒడేరహళ్లి గేట్ రోడ్డును పరిశీలించాయి. పోలీసులు సీజ్ చేసిన జిలెటిన్ స్టిక్స్ బాక్స్ను పరిశీలించి వివరాలు తీసుకున్నారు. అవి తయారైన చోటు, అమ్మిన డీలరు తదితరుల సమాచారం సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. పోలీసు అధికారులపై చర్యలు? ప్రధాని పర్యటనలో పేలుడు పదార్థాలు లభ్యం కావడం కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యం వహించారని పలువురు పోలీసు ఉన్నతాధికారులపై చర్యలకు సిద్ధమైనట్టు సమాచారం. రాష్ట్ర నిఘా విభాగం ఐజీ లాభు రామ్, బెంగళూరు దక్షిణ జిల్లా ఎస్పీ శ్రీనివాస్గౌడ సహా పలువురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేసే అవకాశముందని తెలుస్తోంది. -
పెట్రోల్ రేట్ల పెంపు తప్పదా?
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలు (ఓఎంసీలు) రోజుకు రూ.1,600–1,700 కోట్ల చొప్పున నష్టపోతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత నుంచి 10 వారాల్లో వీటి నష్టం రూ.లక్ష కోట్లకుపైనే ఉంటుందని అంచనా. అంతర్జాతీయంగా చమురు, గ్యాస్ ధరలు గణనీయంగా పెరిగిపోయినప్పటికీ.. దేశీయంగా వాటి ధరలను సవరించకుండా ఓఎంసీలు (బీపీసీఎల్, ఇండియన్ ఆయిల్, హెచ్పీసీఎల్) విక్రయిస్తుండడంతో వాటిపై మోయలేనంత భారం పడుతోంది. ఒకవైపు అధిక ధరలు కొనుగోలు చేసి, తక్కువ ధరలకు విక్రయించాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని కొంత మేర తగ్గించడం తెలిసిందే. తద్వారా నెలకు రూ. 14,000 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతోంది. లేదంటే ఓఎంసీలపై ఈ నష్టం మరింతగా ఉండేది. అయితే, ఇలా ఎంత కాలం పాటు అవి ఈ స్థాయిలో భారాన్ని మోస్తాయన్న ప్రశ్న ప్రధానంగా వినిపిస్తోంది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత పెట్రోలియం ఉత్పత్తుల విక్రయ ధరలను పెంచొచ్చన్న వార్తలు వినిపించాయి. అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రం స్పష్టం చేసింది. కానీ, పరిస్థితి చూస్తుంటే ఎంతో కొంత ధరలు పెంచక తప్పనిసరి అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిత్యం వేల కోట్ల నష్టం ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో జపాన్, యూకే తదితర దేశాల్లో పెట్రోల్ ధరలను 30 శాతం వరకు పెంచడం గమనార్హం. అయినప్పటికీ సామాన్యులపై ధరల భారం పడరాదన్న కేంద్రం విధానం మేరకు.. ఇక్కడ ఓఎంసీలు గతం నుంచి ఉన్న ధరలకే ఇంధనాన్ని విక్రయిస్తున్నాయి. గ్యాస్ ధరలను అవి కొంత వరకు సవరించినప్పటికీ.. వాటి కొనుగోలు కంటే వసూలు తక్కువగానే ఉంది. ఫలితంగా ఈ సంస్థలకు రోజుకు సుమారు రూ. 1,600 నుండి 1,700 కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఓఎంసీలు సొంత ఆదాయంతోనే ముడి చమురు కొనుగోలు, శుద్ధి చేపడుతుంటాయి. రోజురోజుకూ నష్టాలు పెరుగుతుండడంతో ముడి చమురు కొనుగోలు కోసం అవి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన ధరల పెంపు అనివార్యమని నిపుణులు భావిస్తున్నారు. అయితే, ఎంత మేరకు పెంచాలి, ఎప్పుడు పెంచాలి? అనేది ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉందంటున్నారు. -
కేరళ సీఎం ఎంపికలో అదే అనిశ్చితి
న్యూఢిల్లీ/తిరువనంతపురం: కేరళ తదుపరి సీఎం ఎవరన్న దానిపై సోమవారం కూడా ఊహాగానాలు, సస్పెన్స్ కొనసాగుతోంది. కాగా, ఈ సందిగ్ధానికి చెక్ పెట్టేందుకు అత్యున్నత నాయకత్వం నడుం బిగించింది. కేరళ మాజీ పీసీసీ అధ్యక్షులతోపాటు సీనియర్ నేతలతో చివరిగా చర్చలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ సమావేశాలతో సీఎం అభ్యర్థి ఎవరన్న దానిపై స్పష్టత రానుందని చెబుతున్నారు. మంగళవారం ఢిల్లీలో జరిగే చర్చలకు అధిష్టానం కబురందుకున్న వారిలో ఎంఎం హస్సన్, వీఎం సుధీరన్, ఎం. రామచంద్రన్, కె.మురళీధరన్, కన్నూర్ ఎంపీ కె.సుధాకరన్ ఉన్నారు. వీరితో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ముఖ్యనేత రాహుల్ గాంధీ చర్చలు జరుపుతారు. ఒకట్రెండు రోజుల్లోనే వ్యవహారం కొలిక్కి వస్తుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. 48 గంటల్లోనే దీనిపై స్పష్టత రానుందని ఓ నేత తెలిపారు. సీఎం రేసులో ఉన్న రమేశ్ చెన్నితాల, ఏఐసీపీ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) కేసీ వేణుగోపాల్, గత అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న వీడీ సతీశన్లతో రాహుల్, ఖర్గేలు చర్చలు జరిపిన తర్వాత కూడా కాంగ్రెస్ అంతిమ నిర్ణయం తీసుకోలేకపోవడం గమనార్హం. ఈ జాప్యంపై యూడీఎఫ్లోని కీలక పక్షమైన ఐయూఎంఎల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అనిశ్చితి ఇలాగే కొనసాగితే పరిణామాలు వేరుగా ఉంటాయని హెచ్చరిస్తోంది. ఆలస్యం కారణంగా ప్రజలతోపాటు తమ కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందని ఐయూఎంల్ మలప్పురం జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ హమీద్ తెలిపారు. ఎంపికలో కాలయాపనపై రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు బదులిచ్చారు. ‘అసెంబ్లీ గడువు ఈ నెల 23వ తేదీ వరకు ఉంది. ఎంతకంత కంగారు?’అని ప్రశ్నించారు. ‘పార్టీ హైకమాండ్ తీసుకునే ఎలాంటి నిర్ణయమైనా పార్టీ శ్రేణులకే కాదు, యూడీఎఫ్ భాగస్వామ్య పక్షాలకు కూడా సంతృప్తికలిగించేదిగా ఉండాలి. ఇదొక ప్రజాస్వామిక ప్రక్రియ’అని రమేశ్ చెన్నితాల పేర్కొన్నారు. -
జూలై 1 నుంచి జీ రామ్ జీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో అమలవుతున్న గ్రామీణ ఉపాధి పథకం రూపురేఖలు మారనున్నాయి ప్రస్తుతం అమల్లో ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (నరేగా) స్థానంలో ‘వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ)’(వీబీ జీ రామ్ జీ) చట్టం జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నేరుగా ఖాతాల్లోకి వేతనాలు వీబీ జీ రామ్ జీ చట్టం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబానికి ఏడాదికి 125 రోజులపాటు ఉపాధి కల్పించనున్నారు. ప్రస్తుతం ఉన్న 100 రోజుల ఉపాధి దినాల సంఖ్య మరో 25 రోజులకు పెరగనుంది. పని కోరిన వారికి నిరీ్ణత సమయంలో ఉపాధి కల్పించాల్సి ఉంటుంది. పని ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంటుందని చట్టం చెబుతోంది. కూలీల వేతనాలను ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా నేరుగా బ్యాంకు, పోస్టాఫీస్ ఖాతాల్లో జమ చేస్తారు. మస్టర్ రోల్ ముగిసిన 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించాలి. ఆలస్యమైతే అందుకు పరిహారం సైతం ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే జీ రామ్ జీ కోసం 2026–27 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రూ.95,692.31 కోట్లను కేటాయించింది. గ్రామీణ ఉపాధి పథకాల చరిత్రలో ఇదే అత్యధిక బడ్జెట్ కేటాయింపు అని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రాల వాటా కలిపి మొత్తం వ్యయం రూ.1.51 లక్షల కోట్లకు మించనుందని వివరణ ఇచ్చింది. పాత పనులకు ఆటంకం లేదు ఇప్పటికే చేపట్టిన నరేగా పనులు వచ్చే నెల జూన్ 30వ తేదీ వరకు యథావిధిగా కొనసాగుతాయని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న పనులను కొత్త చట్టంలోకి మార్చనున్నారు. కార్మికులకు ఉపాధి, వేతనాల విషయంలో ఎలాంటి అంతరాయం ఉండదని కేంద్రం వివరణ ఇచ్చింది. ఇప్పటికే ఉన్న ఈ–కేవైసీ ధ్రువీకరించిన నరేగా జాబ్ కార్డులు కొత్త పథకంలో కూడా కొనసాగుతాయి. కొత్త గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ కార్డులు జారీ చేసే వరకు వీటిని ఉపయోగించుకోవచ్చు. ఈ–కేవైసీ పెండింగ్లో ఉన్న కారణంగా ఎవరినీ ఉపాధి నుంచి నిరాకరించబోమని తెలిపింది. -
దుబాయ్ విడిచి.. విజయ్ వెంట నడిచి..
వెండితెరపై ‘దళపతి’గా వెలిగిన విజయ్, ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి. అయితే ‘తమిళక వెట్రి కజగం’ (టీవీకే) సారథిగా రాజకీయ క్షేత్రంలో కదం తొక్కిన విజయ్ ఎక్కడికి వెళ్లినా, ఏ బహిరంగ సభలో పాల్గొన్నా ఆయన పక్కనే నలుపు రంగు దుస్తుల్లో నిశితంగా గమనిస్తూ కనిపించే ఒక ‘మిస్టరీ మ్యాన్’ ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్. ఆయనే నయీమ్ మూసా. దుబాయ్లో భారీ వ్యాపార సామ్రాజ్యం ఉన్నప్పటికీ, కేవలం స్నేహం కోసం విజయ్ రక్షణ వలయాన్ని పర్యవేక్షిస్తున్న ఈ మలయాళీ పారిశ్రామికవేత్త ప్రయాణం ఒక సినిమా కథను తలపిస్తోంది.మాహే నుంచి దుబాయ్ వరకు..పుదుచ్చేరి పరిధిలోని మాహేలో జన్మించిన నయీమ్ మూసాకు చిన్నప్పటి నుంచే ఫిట్నెస్, బాడీబిల్డింగ్పై మక్కువ ఎక్కువ. ఉపాధి కోసం దుబాయ్కు వెళ్లిన ఆయన, అక్కడ కఠిన శ్రమతో తన శరీరాకృతిని మలచుకున్నారు. ఒక చిన్న సెక్యూరిటీ అసైన్మెంట్తో ప్రారంభమైన ఆయన ప్రస్థానం, నేడు గల్ఫ్ దేశాల్లోనే ప్రముఖ భద్రతా సంస్థ అయిన ‘జెండర్ సెక్యూరిటీ’ స్థాపనకు దారితీసింది.గ్లోబల్ స్టార్లకు రక్షణ కవచంనయీమ్ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. పాప్ సింగర్ జస్టిన్ బీబర్, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వంటి హేమాహేమీలు దుబాయ్ వెళ్తే వారి భద్రత బాధ్యత నయీమ్దే. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ వంటి భారీ క్రీడా వేడుకలకు యూఏఈ ప్రభుత్వం అధికారికంగా నయీమ్ ఏజెన్సీకే భద్రతా ఏర్పాట్లు అప్పగిస్తుంటుంది. ప్రస్తుతం తన వ్యాపారాన్ని భారత్కు విస్తరించి, చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఆయన వ్యాపారం కోట్లలో విస్తరించి ఉన్నప్పటికీ, దాని ఖచ్చితమైన విలువ వివరాలు తెలియవు.రాజకీయాల్లోనూ విజయ్ ‘రైట్ హ్యాండ్’విజయ్ సినిమాల్లో ఉన్నప్పుడు కేవలం షూటింగ్లకే పరిమితమైన నయీమ్, టీవీకే స్థాపన తర్వాత విజయ్కు అనివార్య వ్యక్తిగా మారారు. ‘నయీమ్ నా వెంట ఉన్నంత కాలం నా భద్రత గురించి నాకు చింత లేదు’ అని విజయ్ స్వయంగా పేర్కొనడం వారి మధ్య ఉన్న అనుబంధానికి నిదర్శనం.ముఖ్యమంత్రి కాకముందు ప్రభుత్వం విజయ్కు 'వై' కేటగిరీ భద్రత కల్పించిప్పటికీ, వ్యక్తిగతంగా నయీమ్ ఏర్పాటు చేసే రక్షణ వలయంపైనే దళపతికి గురి. తమిళనాడు రాజకీయ సభల కోసం కేరళ నుంచి ప్రత్యేకంగా శిక్షణ పొందిన నిపుణులను నయీమ్ రప్పిస్తుంటారు. ఆధునిక సాంకేతికతను, కట్టుదిట్టమైన క్రమశిక్షణను కలగలిపి ఆయన రూపొందించే భద్రతా వ్యూహాలు అజేయమైనవి. ఆడంబరాలకు దూరంగా, మీడియా వెలుగులోకి రాకుండా కేవలం తన క్లయింట్ భద్రత, గోప్యతకే నయీమ్ ప్రథమ ప్రాధాన్యం ఇస్తారు. -
భారత్ ఎవరికీ తలవంచదు
సోమనాథ్(గుజరాత్): అమెరికా వంటి అగ్రరాజ్యాలకు సైతం ఏమాత్రం బెదరక భారత్ తన లక్ష్యసాధనలో సఫలీకృతమైందని ప్రధాని మోదీ శ్లాఘించారు. 1998లో పోఖ్రాన్ అణుపరీక్షలపై అమెరికా ఒత్తిళ్లు ఉన్నప్పటికీ భారత్ ఏమాత్రం తన సంకల్పాన్ని సడలనివ్వలేదని మోదీ గుర్తుచేశారు. గుజరాత్లోని ప్రభాస్ పాటన్లో అరేబియా సముద్రతీరంలో ఆధునిక సోమనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా చేపట్టిన అమృత్మహోత్సవ్ కార్యక్రమాల్లో ప్రధాని మోదీ సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సద్భావన మైదాన్లో నిర్వహించిన ‘సోమనాథ్ పునర్వైభవానికి 75 ఏళ్లు’సభలో మోదీ ప్రసంగించారు. ‘‘1947లో భారత్ విదేశీపాలకుల నుంచి స్వాతంత్య్రంపొందినప్పటికీ 1951లో సోమనాథ్లో ఆధునిక ఆలయంలో ప్రాణప్రతిష్ట జరిగిన క్షణంలోనే నిజమైన స్వేచ్ఛా స్ఫూర్తి దేశం నలుచెరుగులకూ వ్యాపించింది. సోమనాథ్లో జరుగుతున్న అమృత్ మహోత్సవం కేవలం ఒక స్మరణీయ కార్యక్రమం కాదు ఇది వచ్చే వెయ్యేళ్లపాటు మనకందించే స్ఫూర్తి సంబరం. మే 11 అనగానే కేవలం ఆధునిక సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం గుర్తుకురాదు నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ నాయకత్వంలో 1998లో భారత్ చేపట్టిన అణుపరీక్షలూ ఇదే తేదీన జరిగాయి. ఇదే రోజున మన శాస్త్రవేత్తలు దేశ అణుశక్తి సామర్థ్యాలు, సత్తాను యావత్ ప్రపంచానికి చాటిచెప్పారు. అణుపరీక్షల భూప్రకంపనలు ప్రపంచదేశాల్లో వణుకుపుట్టించాయి. కొన్ని దేశాల్లో ఆగ్రహజ్వాలలను రగిల్చాయి. అణుపరీక్షలు చేసే హక్కు భారత్కు ఎక్కడి నుంచి వచ్చింది? అంటూ పలు దేశాలు హూంకరించాయి. ఆర్థిక ఆంక్షల మాటున భారత్ను ఏకాకిని చేసే కుట్రలుచేశాయి. భారత్ను అణగదొక్కేందుకు ప్రపంచశక్తులు ఏకమయ్యాయి. కఠిన ఆంక్షలనూ ఇండియాపై మోపారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఇంకేదైనా దేశమైతే కూలబడేదే. కానీ భారత్ విభిన్నం. అన్నింటినీ తట్టుకుని భారత్ సగర్వంగా నిలబడింది. అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిళ్లున్నా 13న మరోసారి అణుపరీక్షలుచేసింది. మే 11న శాస్త్రవేత్తలు తమ ఆరంభకార్యాలను పూర్తిచేయగా 13న మరోరెండు అణుపరీక్షలుచేసి వాజ్పేయీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వ రాజకీయ సంకల్పాన్ని రుజువుచేశారు’’అని మోదీ అన్నారు. మూలాలు మర్చిపోవద్దు ‘‘మూలాలను మర్చిపోయిన దేశం పటిష్టంగా ఉండలేదన్న సత్యాన్ని సోమనాథ్ మనకు ప్రబోధిస్తోంది. అద్భుత సోమనాథ్ను నాశనంచేసేందుకు చరిత్రలో పలుమార్లు విదేశీ పాలకులు, చొరబాటుదారులు ఎంతగానో ప్రయత్నించారు. పునర్నిర్మించినా మళ్లీ కూల్చేశారు. అయినాసరే ఆలయం పునర్నిర్మితమైంది. ఇది నిరంతరంగా కొనసాగింది. ఆలయాన్ని నాశనంచేసినట్లే దేశాన్ని సైతం కొన్ని శక్తులు బుజ్జగింపు రాజకీయాలతో భ్రష్టుపట్టించాయి. అలాంటి ఆలోచన ధోరణితోనే కొన్ని శక్తులు అయోధ్య రామమందిర నిర్మాణాన్ని అడ్డుకోవాలనిచూశాయి. జాతి ప్రతిష్ట, గుర్తింపునకు సంబంధించిన ఇలాంటి అంశాల్లోకి ఒక్కోసారి రాజకీయాలు చొరబడుతుంటాయి’’అని అన్నారు. నెహ్రూ వద్దన్నా పటేల్ పట్టుబట్టారు ‘‘ఆలయ నిర్మాణంపై నెహ్రూ అభ్యంతరాలు వ్యక్తంచేశారు. అయినాసరే ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్భాయ్పటేల్, తొలి రాష్ట్రపతి డాక్టర్రాజేంద్ర ప్రసాద్ ఆధునిక సాంస్కృతిక సౌధం సోమనాథ్ పునర్నిర్మాణానికి పట్టుబట్టి సాధించారు. అయోధ్యలో భవ్యమందిర నిర్మాణానికి పూనుకున్నప్పుడూ ఇలాంటి శక్తులు అడ్డుతగిలాయి. అయినాసరే మనం అభివృద్ధి, వారసత్వ పరంపరను ముందుకు తీసుకెళ్లాల్సిందే. గతంలో ఇలాంటి సాంస్కృతిక కేంద్రాలను నిర్లక్ష్యంచేసిన ఫలితాలను నేటికీ అనుభవిస్తున్నాం. నేటి భారతంలో సాంస్కృతిక వారసత్వం, అభివృద్ధి అవిభాజ్యాలు. జంటగా పురోభివృద్ధి సాధించాల్సిందే’’అని అన్నారు. ఈ సందర్భంగా మోదీ సోమనాథ్ ఆలయానికి సంబంధించిన స్మారక తపాళాబిళ్లను ఆవిష్కరించారు. దారిపొడవునా జనసందోహం అంతకుముందు జామ్నగర్ నుంచి గిర్ సోమనాథ్ జిల్లాకు మోదీ హెలికాప్టర్లో చేరుకున్నారు. హెలిప్యాడ్ నుంచి వీర్ హమీర్జీ కూడలి దాకా కిలోమీటర్ దూరానికిపైగా పొడవున మార్గంలో మోదీ రోడ్షోలో పాల్గొన్నారు. దారి పొడవునా సోమనాథ్ వాసులు మోదీకి పూలవర్షం కురిపిస్తూ ఆహ్వానం పలికారు. జెండాలు చేతబట్టుకుని మోదీకి అనుకూలంగా నినాదాలుచేశారు. మార్గమధ్యంలో పలు చోట్ల పశ్చిమబెంగాల్ నుంచి వచ్చిన సంప్రదాయ కళాకారులు సంప్రదాయ నృత్యాలుచేసి స్థానికులను అలరించారు. సోమనాథ్ అనేది దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా ప్రఖ్యాతిగాంచింది. ఆలయంలో మోదీ ప్రత్యేక పూజ అంతకుముందు మోదీ సోమనాథ్ పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోకి రాగానే పండితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ నరేంద్ర మోదీ గర్భగుడిలో సోమలింగానికి జలాభిషేకం చేశారు. తర్వాత మహాపూజ క్రతువును పూర్తిచేశారు. ఇదే సందర్భంలో దేశంలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రాల నుంచి తెప్పించిన పవిత్ర జలాలతో పండితులు ఆలయ శిఖరంపై ఉన్న కలశాలకు మహాభిషేకంచేశారు. ఈ సందర్భంగా హెలికాప్టర్లు గులాబీ పూరేకులతో ఆలయంపై పూలవాన కురిపించారు. ధ్వజపూజ సైతం చేశారు. తర్వాత అక్కడి సందర్శకుల పుస్తకంలో రాశారు. ఓంకార మంత్ర జపించే కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి పండితులు చెప్పిన సోమనాథ్ అనుబంధ గాథలను మోదీ సైతం విన్నారు. తర్వాత భారతవాయుసేనకు చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందం ఒళ్లు జలదరించేలా చేసిన వైమానిక విన్యాసాలను మోదీ తిలకించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భుపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సింఘ్వీ సైతం పాల్గొన్నారు. -
మోదీ పొదుపు మంత్రం.. ఎకానమీకి శుభసూచకం!
సాక్షి, బిజినెస్ డెస్క్: పశ్చిమాసియా యుద్ధం దెబ్బతో క్రూడ్ రేట్లు భగ్గుమనడంతో మన ఆర్థిక వ్యవస్థకు బాగానే సెగ తగులుతోంది. ముడిచమురు ధరలు 100 డాలర్ల పైకి దూసుకెళ్లడంతో దిగుమతుల బిల్లు తడిసిమోపెడవుతోంది. మరోపక్క, బంగారం రేట్లు కూడా దూసుకెళ్లడంతో విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు దిగుజారుతున్నాయి. దీని ప్రభావంతో రూపాయి రోజుకో కొత్త కనిష్టానికి దిగజారి నేల చూపులు చూస్తోంది. తాజాగా 95.28 ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చేసిన సూచన దేశవ్యాప్తంగా అటు పరిశ్రమ వర్గాల్లో ఇటు ప్రజల్లో సంచనలం రేపుతోంది. ఎకానమీకి దన్నుగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం కోసం పొదుపు చర్యలు పాటించాలంటూ మోదీ పిలుపునిచ్చారు. ముఖ్యంగా బంగారం కొనుగోళ్లను ఏడాది పాటు వాయిదా వేసుకోవాలని.. పెట్రోలు, డీజిల్ వాడకాన్ని తగ్గించేందుకు సాధ్యమైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని... ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలన్నారు. అలాగే విదేశీ ప్రయా ణాలను వాయిదా వేసుకోవడం, వంటనూనెలు, ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవాలని కూడా పేర్కొన్నారు. ఈ చర్యలతో ఆర్థిక వ్యవస్థకు లాభంతో పాటు నష్టాలు కూడా ఉంటాయని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. దిగుమతుల భారం తగ్గడంతో కాస్త కరెంట్ ఖాతా లోటు దిగొచ్చి.. రూపాయికి దన్నుగా నిలిచినప్పటికీ, దేశీ యంగా వినిమయం తగ్గడంతో ఎకానమీ మందగించే ప్రమాదం కూడా ఉంటుందని వారు విశ్లేషిస్తున్నారు.బంగారం గుదిబండ...భారతీయులు సహజంగానే పసిడి ప్రియులు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు ఆభరణాల కొనుగోళ్లకు తోడు ఇటీవల పెరిగిన పుత్తడి రేట్లతో పెట్టుబడులకు కూడా మనోళ్లు సై అంటున్నారు. దీంతో బంగారం దిగుమతులు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఏటా దేశంలోకి 700–800 టన్నుల బంగారం దిగుమతి అవుతోంది. దేశంలో ఉత్పత్తి అవుతున్నది కేవలం 1–2 టన్ను లు మాత్రమే. 90% పైగా దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. దేశ దిగుమతుల్లో ఇది దాదాపు 10% మరోపక్క, ఆపదలో ఆదుకునే సాధనంగా పసిడికి ప్రాముఖ్యత పెరగడంతో సెంట్రల్ బ్యాంకులు కూడా పొలోమంటూ గోల్డ్ నిల్వలు పెంచుకుంటున్నాయి. మన ఆర్బీఐ కూడా టన్ను ల కొద్దీ పోగేసుకుంటోంది. ప్రస్తుతం నిల్వలు 880 టన్నులకు చేరాయి. 2005–26లో 72 బిలియన్ డాలర్లు విలువైన బంగారం దిగుమతైంది. దీనివల్ల భారీమొత్తంలో ఫారెక్స్ నిల్వలు వెచ్చించాల్సి వస్తోంది. అయితే, రేట్లు భారీగా పెరగడంతో ఇటీవల బంగారం దిగుమతులు బాగానే తగ్గుముఖం పట్టాయి. అయితే, రేటు (అంతర్జాతీయంగా ఔన్స్ ప్రస్తుతం 4700 డాలర్లు) అధిక స్థాయిలోనే కొనసాగుతుండటంతో భారీగా డాలర్లు వెచ్చించాల్సి వస్తోంది. మోదీ చెప్పినట్లుగా బంగారం కొనుగోళ్లు తగ్గించుకుంటే, దిగుమతులు దిగొచ్చి.. ఫారెక్స్ నిల్వలకు దన్నుగా నిలుస్తుంది. దీనివల్ల రూపాయి పతనానికి కూడా అడ్డుకట్టపడుతుంది. బంగారం దిగుమతులు 30–40% తగ్గితే 20–25 బిలియన్ డాలర్లు ఆదా అవుతాయి. 50% తగ్గితే 36 బిలియన్ డాలర్లు సేవ్ అవుతాయి. అంటే ప్రజలు బంగారం కొనడం తగ్గిస్తే దేశం నుంచి బయటకు వెళ్లే డాలర్ల ప్రవాహం భారీగా తగ్గుతుంది. అయితే, దేశీయంగా కొనుగోళ్లు మందగించడం వల్ల ఆభరణాల విక్రేతలపై ప్రభావం పడుతుందని పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే, ఫిజికల్ గోల్డ్కు బదులు ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్లు, ఈ–గోల్డ్ రిసీట్స్ వంటి పేపర్ గోల్డ్ రూపంలో కొనుగోలు చేయడం వల్ల అటు దిగుమతుల భారం తగ్గడంతో పాటు పెట్టుబడులకు కూడా కొలిసొచ్చే అంశమని నిపుణులు సూచిస్తున్నారు. ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత ఒక్కసారిగా క్రూడ్ ధరలు భగ్గుమనడం తెలిసిందే. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ రేటు 119 డాలర్లకు దూసుకెళ్లింది. రెండు నెలలుగా సగటున 100 డాలర్ల పైనే కదలాడుతోంది. దీంతో క్రూడ్ దిగుమతుల భారం భారీగా పెరిగిపోతోంది. భారత్ చమురు అవసరాల్లో దాదాపు 90 శాతం మేర దిగుమతి చేసుకోవాల్సి రావడం.. హార్మూజ్ జలసంధిలో అడ్డంకులతో సరఫరా తగ్గడంతో రేట్లు పైపైకి చేరి దిగుమతులు గుదిబండగా మారుతున్నాయి. 2025–26లో మనం 134.7 బిలియన్ డాలర్ల విలువైన క్రూడాయిల్ దిగుమతి చేసుకోవడం గమానార్హం. మన మొత్తం దిగుమతులు 775 బిలియన్ డాలర్లు కాగా, ఇందులో అత్యధిక వాటా క్రూడ్దే. అయితే, ప్రభుత్వం మాత్రం పెట్రోలు, డీజిల్ ధరలు పెంచకుండా ప్రజలపై భారం పడకుండా చూస్తోంది. మరోపక్క, ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించుకుని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీలు) కు కొంచెం ఊరటనిచ్చింది. దీనివల్ల కేంద్ర ఖాజానాకు నెలకు రూ.14,000 కోట్ల చిల్లు పడుతోంది. ఇక రేట్లు పెంచకపోవడం వల్ల ఓఎంసీలు రోజుకు సుమారు రూ.1,700 కోట్ల ఆదాయాన్ని నష్టపోతున్నట్లు అంచనా. అంటే గత పది వారాల్లో వాటిపై ఏకంగా రూ. లక్ష కోట్లకు పైగానే భారం పడినట్లు లెక్క. ఈ నేపథ్యంలోనే మోదీ పెట్రోలు, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవడం కోసం ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించుకోవాలని, కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించాలని, కార్ పూలింగ్తో పాటు, మెట్రో రైళ్లు ఇతరత్రా ప్రభుత్వ రవాణా సదుపాయాలను వాడాలంటూ సూచించారు. దీనివల్ల అటు క్రూడ్ దిగుమతులకు కాస్త అడ్డుకట్టపడి.. ఫారెక్స్ నిల్వలపై ఒత్తిడి తగ్గుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. మోదీ పెట్రో పొదుపు మంత్రంతో సోమవారం ఎలక్ట్రిక్ వాహన కంపెనీ షేర్లు రివ్వుమనడం విశేషం. కాగా, క్రూడ్ ధరలు ఇప్పట్లో శాంతించే అవకాశాలు కనిపించకపోవడం.. మోదీ తాజా సూచనలు చూస్తుంటే, సమీప భవిష్యత్తులో పెట్రో ధరలు పెరిగే అవకాశం కూడా లేకపోలేదనేది కొంత మంది పరిశీలకుల మాట! ట్రావెల్ రంగంపై ప్రభావం.. విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలంటూ మోదీ సూచించడం కూడా ఫారెక్స్ నిల్వలు కరిగిపోకుండా చూసుకోవడం కోసమే.. ఎందుకంటే, విదేశాలకు వెళ్లాలంటే డాలర్లను కొనుగోలు చేయాల్సి వస్తుంది. హోటళ్లను బుక్ చేసుకోవాలన్నా డాలర్లు వెచ్చించాల్సిందే. 2025లో 3.27 కోట్ల మంది భారతీయులు విదేశీ ప్రయాణాలకు వెళ్లినట్లు అంచనా. 2024–25 ఆర్థిక సంవత్సరంలో మనోళ్లు విదేశీ ట్రిప్పుల కోసం వెచ్చించిన మొత్తం 31.7 బిలియన్ డాలర్లు. అంటే ఆ మేరకు దేశం నుంచి డాలర్లు బయటికి వెళ్లిపోయాయి. మోదీ సూచన పాటిస్తే, ఈ భారం తగ్గుతుంది. అయితే, విదేశీ ప్రయాణాలు, డెస్టినేషన్ వెడ్డింగ్స్ తగ్గడంతో ట్రావెల్, ఏవియేషన్ కంపెనీలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది. మార్కెట్లో ఇప్పటికే దీని సెగ తగిలింది. యాత్రా, థామస్ కుక్ వంటి ట్రావెల్ సంస్థల షేర్లతో పాటు ఇండిగో షేరు కూడా 5 శాతం పైగా పడిపోయాయి. ఫారెక్స్ నిల్వలు తగ్గుముఖం... క్యాడ్ పైపైకి పశ్చిమాసియా యుద్ధం ప్రారంభానికి ముందు అంటే ఫిబ్రవరి చివరల్లో భారత విదేశీ మారక నిల్వలు 728.5 బిలియన్ డాలర్లకు చేరి ఆల్టైమ్ రికార్డును నమోదు చేశాయి. క్రూడ్ ధరలు భగ్గమనడం.. దిగుమతుల బిల్లు పెరిగిపోవడంతో ఆ తర్వాత నుంచి తగ్గుముఖం పడుతూ ప్రస్తుతం సుమారు 690.69 బిలియన్ డాలర్లకు చేరాయి. మరోవైపు ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం 2026లో భారత కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్– దేశంలోకి వచ్చి, పోయే విదేశీ మారక ద్రవ్యం (ప్రధానంగా డాలర్లు) మధ్య వ్యత్యాసం) 84.5 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది. ఇది మన జీడీపీలో 2 శాతానికి సమానం. అంటే దేశంలోకి వచ్చే డాలర్ల కంటే బయటికి వెళ్లే మొత్తం భారీగా పెరిగిపోతుందన్నమాట! దీనివల్ల రూపాయి మరింత క్షీణించే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. -
ఒకప్పుడు ఫ్రెండ్స్.. కానీ ఇప్పుడు మారిపోయిన సీన్
సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కొత్త తరం నాయకుల యుగం ప్రారంభమైంది. సినీ నటుడు విజయ్ తొలిసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఆయనకు రాజకీయ అనుభవం లేకపోయినా ప్రజల మద్దతుతో సీఎం కుర్చీని అధిరోహించారు. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్, ప్రధాన ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. స్టాలిన్ ఎన్నికల్లో ఓడిపోవడంతో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ వ్యవహరించనున్నారు. తొలుత సీఎం విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం చెపాక్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఉదయనిధి స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు. అయిదేళ్ళ క్రితం వరకూ చూస్తే సీఎంగా స్టాలిన్ ఉంటే ప్రధాన ప్రతిపక్ష నేతగా పళని స్వామి వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే ఈసారి ఆ చాన్స్ పళనిస్వామికి లేకుండా పోయింది.ఎన్నికల్లో ఓడిపోయిన స్టాలిన్ స్థానంలో ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించారు. 74 సీట్లు గెలుచుకున్న డీఎంకే కూటమికి ఆయన నాయకత్వం వహించనున్నారు. ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు అదనపు బలం. విజయ్ 52 ఏళ్ల వయసులో సీఎం అయ్యారు. ఉదయనిధి 49 ఏళ్ల వయసులోనే ప్రతిపక్ష నేతగా అవతరించారు. ఇద్దరూ యువకులే కావడంతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త తరాన్ని ప్రజలు చూడబోతున్నారు. కాగా ఉదయనిధి పలు సినిమాలకు నిర్మాతగా, హీరోగా సినీ రంగంలో గుర్తింపు పొందారు. 2008లో ఆయన నిర్మించిన 'కురువి' చిత్రంలో విజయ్ హీరోగా నటించారు. ఆ చిత్రంలో త్రిష కథానాయిక. ఆ రకంగా విజయ్, ఉదయనిధి మధ్య రెండు దశాబ్దాల క్రితమే స్నేహం ఉంది. అయితే ఇప్పుడు ఆ స్నేహం రాజకీయ వేదికపై ప్రత్యర్థిత్వంగా మారింది. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం సమయంలో ఇద్దరి మధ్య విభేదాలు స్పష్టంగా కనిపించాయి. విజయ్ ప్రమాణం చేస్తున్నప్పుడు ఉదయనిధి ఆయన వైపు చూడలేదు. కానీ ఉదయనిధి ప్రమాణం చేస్తుండగా విజయ్ మాత్రం ఆయనను చూసి ఓ చిరునవ్వు నవ్వారు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, విజయ్కు రాజకీయ అనుభవం లేకపోవడం ఒక సవాల్గా మారవచ్చు. కానీ ఉదయనిధి ఇప్పటికే ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవంతో ప్రతిపక్షాన్ని బలంగా నడిపే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇకపై అసెంబ్లీలో సీఎం విజయ్, ప్రతిపక్ష నేత ఉదయనిధి మధ్య ఢీ తప్పదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. -
సీఎం విజయ్ కోసం 650కిలో మీటర్ల కాలినడక .. సోషల్ మీడియాలో వైరల్!
సాక్షి,చెన్నై: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్దండ పార్టీలను మట్టికరిపించిన టీవీకే అధినేత విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, ఆయనను కలిసేందుకు ఓ యువజంట చేసిన ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాకు చెందిన రఫీ, షహానా భార్యాభర్తలు. రఫీ డ్రైవర్గా పనిచేస్తూనే డైలీ వ్లాగ్స్ చేస్తుంటారు. ఈ దంపతులకు హీరో విజయ్ అంటే ఎనలేని అభిమానం. ఆ అభిమానం ఇప్పుడు హద్దులు దాటి, కేరళ నుంచి సుమారు 650 కిలోమీటర్ల దూరంలో చెన్నైలో సీఎం విజయ్ను కలుసుకోవడానికి కాలినడకన ప్రయాణం ప్రారంభించారు.ఆకలేసినప్పుడు హోటల్లో తినడం, లేకపోతే రోడ్డు పక్కనే వండుకోవడం చేస్తున్నారు. ఇందుకోసం కావాల్సిన సామాగ్రిని వెంట తీసుకెళ్లారు. రాత్రివేళల్లో పెట్రోల్ బంకులు, షాపుల వద్ద టెంట్ వేసుకుని నిద్రిస్తున్నారు. మే 7న ప్రారంభమైన వారి ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది.ఈ ప్రయాణంలో అనుభవాలను వీడియోల రూపంలో ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేస్తున్నారు. నెటిజన్లు వారికి మద్దతు తెలుపుతుండగా, మరికొందరు అభిమానం వెర్రి తలలు అంటే ఇదేనేమో.. బస్సు, ట్రైన్లో వెళ్లొచ్చు కదా, కాలినడకన రావాల్సిన అవసరమా? అంటూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.రఫీ దంపతులు మాట్లాడుతూ.. మాకు విజయ్, ఆయన సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన రాజకీయ పార్టీని ప్రారంభించి, ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి కావడానికి సిద్ధమవుతున్నప్పుడు ఆయన్ని ప్రత్యక్షంగా చూడాలనే కోరిక మరింత బలపడింది. అందుకే చెన్నై వరకు నడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నాం’ అని తెలిపారు.కేరళ జంట 650 కి.మీ నడిచి చెన్నై చేరుకోవడం, తలపతి విజయ్ను కలవాలని ప్రయత్నించడం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అభిమానులు ‘పీక్ తలపతి క్రేజ్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యమంత్రిని కలవడానికి ఖచ్చితమైన అపాయింట్మెంట్ లేదా అధికారిక ఏర్పాట్లు లేకపోయినా, చెన్నై చేరుకున్న తర్వాత ఆ అవకాశం తప్పకుండా లభిస్తుందని వారు ఆశాభావంతో ఉన్నారు.రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వేలాది మంది మద్దతుదారుల సమక్షంలో చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పార్టీ టీవీకే, సంకీర్ణ భాగస్వాముల మద్దతుతో అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు గెలిచి మెజారిటీ సాధించింది. -
ఎస్ఐఆర్పై సుప్రీంకోర్టుకు మమత : షాకింగ్ రియాక్షన్
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు , ఓటర్ల జాబితా నుండి భారీగా పేర్ల తొలగింపుపై రేగిన వివాదం సోమవారం సుప్రీంకోర్టుకు చేరింది. ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా 90.8 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించడంపై తృణమూల్ కాంగ్రెస్ (TMC) అభ్యంతరం వ్యక్తం చేస్తూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ పిటిషన్ల పరిష్కారంపై సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.2021లో తమ పార్టీ గెలుచుకుని, ఇపుడు (2026 అసెంబ్లీ ఎన్నికల్లో) బీజేపీకి ఖాతాలో చేరిన 31 స్థానాల్లో ఈ తొలగింపు వల్ల ఓట్ల లెక్కింపుపై తీవ్ర ప్రభావం పడిందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. ఈ 31 స్థానాల్లో ప్రతి దానిలోనూ తొలగించిన ఓటర్ల సంఖ్య, గత ఎన్నికల్లో తృణమూల్ అభ్యర్థుల గెలుపు మార్జిన్ కంటే ఎక్కువగా ఉందని పార్టీ ఎంపీ, సీనియర్ న్యాయవాది ల్ కళ్యాణ్ బెనర్జీ ఎత్తి చూపారు. చాలా సందర్భాల్లో ఈ సంఖ్యలు దాదాపు ఒకేలా ఉన్నాయని కోర్టుకు వివరించారు. ఉదాహరణకు, ఒకచోట టీఎంసీ అభ్యర్థి 862 ఓట్లతో ఓడిపోగా, అక్కడ 5,000 మంది పేర్లను తొలగించారని పేర్కొన్నారు.ఓటర్ల జాబితా నుండి తొలగింపుపై అప్పీళ్లు పెండింగ్లో ఉన్న సమయంలో, తక్కువ మెజారిటీతో ఫలితాలు ప్రభావితమై ఉంటే.. బాధితులు 'ఎలక్షన్ పిటిషన్' దాఖలు చేయవచ్చని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 207 స్థానాలను గెలుచుకుని బెంగాల్లో తొలిసారి అధికారాన్ని దక్కించుకుంది. ఘుస్పైథియా' లేదా అక్రమ చొరబాటుదారులు అంశాన్ని బీజేపీ ప్రచారాస్త్రంగా మార్చుకోగా, అట్టడుగు వర్గాల ఓట్లను తొలగించడానికి బీజేపీ, ఈసీ కుమ్మక్కయ్యాయని మమతా బెనర్జీ ప్రభుత్వం ఆరోపించింది.ఇదీ చదవండి: ఇప్పటికీ ఇండియన్స్ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడనుఈ పిటిషన్ల పరిష్కారంపై ప్రస్తుత రేటు ప్రకారం, పెండింగ్లో ఉన్న లక్షలాది దరఖాస్తులను పరిష్కరించడానికి మరో నాలుగేళ్లు పట్టే అవకాశం ఉందని న్యాయవాది మేనకా గురుస్వామి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. టీఎంసీ , బీజేపీ మధ్య ఓట్ల తేడా సుమారు 32 లక్షలు కాగా, ఓటర్ల జాబితా నుండి తొలగించినందుకు వ్యతిరేకంగా దాఖలైన 35 లక్షల దరఖాస్తులు ఇంకా పెండింగ్లో ఉన్నాయన్నారు.ఇదీ చదవండి: అంబానీ చిన్నకోడలు, వెనిస్ బినాలే లుక్, స్పెషల్ ఏంటంటే?ఎన్నికల సంఘం (EC) వాదనఅయితే ఓటర్ల తొలగింపు వల్ల టీఎంసీ నష్టపోయిందన్న వాదనను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఈ ఐదు స్థానాలనూ తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకుందని ఈసీ వాదించింది.అత్యధికంగా ఓటర్ల తొలగింపు జరిగిన మాల్దా, ముర్షిదాబాద్ ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో (సుజాపూర్, రఘునాథ్గంజ్ వంటివి) టీఎంసీయే విజయం సాధించిందని ఈసీ గణాంకాలతో వివరించింది. కాగా తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్ రాష్ట్రంలోని 294 స్థానాలకు గాను బీజేపీ 207 స్థానాలను గెలుచుకుంది. దాదాపు 15 ఏళ్ల మమతా బెనర్జీకోటను దెబ్బ కొట్టి, ఘన విజయాన్ని నమోదు చేసింది. బెంగాల్లో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదీ చదవండి: రూ. లక్ష కోట్ల నష్టం, పెట్రోలు పొదుపు : మోదీ విజ్ఞప్తిలోని మర్మం ఇదేనా? -
పెట్రోల్, గ్యాస్ కొరత వచ్చేసిందా? మోదీ వ్యాఖ్యలపై కేంద్రం క్లారిటీ
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, ముడి చమురు కొరత లేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం తెలిపింది. ప్రపంచంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇంధనం ఆదా చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెప్పింది.పశ్చిమాసియాలో పరిస్థితులపై సోమవారం ఢిల్లీలో ప్రభుత్వ అధికారులు మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని చెప్పారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణ ప్రభావం మనపై పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భయంతో అధికంగా కొనుగోలు చేయొద్దు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి (మార్కెటింగ్, ఆయిల్ రిఫైనరీ) శర్మ మాట్లాడుతూ.. దేశంలో ముడి చమురు, ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయని తెలిపారు. భారత్కు వచ్చే ఇంధన దిగుమతుల్లో దాదాపు 90 శాతం గల్ఫ్ ప్రాంతం నుంచే వస్తున్నాయని, అయినా అంతరాయాన్ని తగ్గించే చర్యలు వేగంగా చేపట్టామని చెప్పారు.దేశంలో అన్ని రకాల ఇంధన సరఫరాలు తగినంత ఉన్నాయని, భయంతో అధికంగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని శర్మ తెలిపారు. ప్రపంచ అనిశ్చితి సమయంలో దేశంపై ఆర్థిక భారం తగ్గించడం, ఇంధన పొదుపు లక్ష్యంతోనే ప్రధానమంత్రి వాటిపై ఆదివారం ఆ పిలుపును ఇచ్చారని చెప్పారు. సరఫరాలపై ప్రభావం అత్యల్పంగా ఉండేలా తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు.ఇంధన పొదుపు లక్ష్యంతోనే..అవసరంలేని ప్రయాణాలు తగ్గించి ఇంధనాన్ని ఆదా చేయాలని ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన సందేశాన్ని, సరఫరా కొరతకు ప్రతిస్పందనగా కాకుండా ఇంధన పొదుపు దృష్టితో చూడాలని అధికారులు తెలిపారు. ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపుతున్న సమయంలో బాధ్యతాయుతంగా ఇంధనం వినియోగించాలనే ఉద్దేశంతో ఈ పిలుపు ఇచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.అనేక దేశాల నుంచి దిగుమతులువిదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఇంధన సంరక్షణ, సరఫరా చర్యల్లో భాగంగా భారత్ అనేక దేశాల నుంచి ఇంధనం కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఇరాన్ విదేశాంగ మంత్రి భారత్ పర్యటనపై అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. బ్రిక్స్ దేశాలు, భాగస్వామ్య దేశాల విదేశాంగ మంత్రులు భారత్కు వచ్చే అవకాశం ఉందని, ప్రణాళికలు ఖరారైన తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.పశ్చిమాసియా పరిస్థితులపై భారత్ వైఖరిని కూడా ఆయన మరోసారి వెల్లడించారు. మొదటి నుంచే శాంతి, చర్చలకు భారత్ మద్దతు ఇస్తోందని తెలిపారు. భారత నౌకలు సురక్షితంగా తిరుగు ప్రయాణం చేస్తున్నాయని పోర్టులు, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ అధికారి ఒపేష్ శర్మ తెలిపారు. భారత జెండా ఉన్న 10 నౌకలు ఇప్పటివరకు అదనపు రుసుములు చెల్లించకుండా హార్మూజ్ జలసంధి దాటి సురక్షితంగా బయటకు వచ్చాయని చెప్పారు. ఇంకా 13 భారత జెండా నౌకలు ఆ ప్రాంతంలోనే ఉన్నాయని, వాటిని సురక్షితంగా తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. నౌక సిబ్బంది సంక్షేమం, వారి అవసరాలను కూడా ప్రతిరోజూ పరిశీలిస్తున్నామని తెలిపారు. కాగా, పెట్రో ధరల పెంపుపై మాత్రం కేంద్ర సర్కారు క్లారిటీ ఇవ్వలేదు. -
వాహన, వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్రం బిగ్షాక్?
సాక్షి,న్యూఢిల్లీ: వంటగ్యాస్, పెట్రోల్,డీజిల్ వినియోగదారులకు బిగ్షాక్ తగలనుంది. వచ్చే వారంలో కేంద్రం లీటర్ పెట్రోల్కు రూ.2 నుంచి రూ.4వరకు.. వంట గ్యాస్ సిలిండర్పై రూ.40 నుంచి రూ.50వరకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇరాన్-అమెరికా యుద్ధంలో ఆయిల్ కంపెనీలకు లక్ష కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. అయితే, పెట్రోల్,డీజిల్ ధరలు పెంచకపోతే ఆ భారం భరించలేమని కంపెనీలు చెబుతున్నాయి. ఒక్కసారిగా రేట్లు పెంచితే ద్రవ్యోల్బణం పెరిగిపోతుందని కేంద్రం ఆందోళనలో ఉంది.ఈ క్రమంలో దశలవారీగా పెట్రోల్,డీజిల్, గ్యాస్ ధరలను పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. హర్మూజ్ను మూసివేయడంతో భారత్కు ముడిచమురు సరఫరా నిలిచిపోయింది. దీంతో కంపెనీలు రష్యా,పశ్చిమ ఆఫ్రికా దేశాల నుంచి ఎక్కువ రేట్లకు ముడిచమురును కొనుగోలు చేస్తున్నాయి. -
అంబానీ చిన్నకోడలు, వెనిస్ బినాలే లుక్, స్పెషల్ ఏంటంటే?
వెనిస్ బినాలే (Venice Biennale) ప్రారంభోత్సవ వేడుకల్లో అంబానీ చిన్న కోడలు రాధికా మర్చంట్ స్టైలిష్ లుక్ విశేష ఆకర్షణగా నిలిస్తోంది. ఆడ్రీ హెప్బర్న్ - జాక్వెలిన్ కెన్నెడీల శైలిని అనుకరిస్తూ, గివెన్చీ రూపొందించిన టాగో చీర గౌనులో మెరిసారు రాధికా మర్చంట్వెనిస్ బినాలే ప్రారంభోత్సవ గాలాలో రిలయన్స్ అధినేత అంబానీ కోడలు, రిలయన్స్ వారసుడు వ్యాపారవేత్త అనంత్ అంబానీ భార్య రాధికా మర్చంట్ పాత-హాలీవుడ్ గ్లామర్ మేళవింపుతో ప్రత్యేకమైన గివెన్చీ కౌచర్ దుస్తుల్లో స్పెషల్ లుక్లో ఆకట్టుకున్నారు. ఒపెరా గ్లోవ్స్, వజ్రాలు, సున్నితమైన రెట్రో బ్యూటీ స్టైలింగ్తో కూడిన ఈ లేత నీలి రంగు దుస్తులు, ఐకానిక్ ఆడ్రీ హెప్బర్న్ సిల్హౌట్లను గుర్తుచేస్తూ, అతిపెద్ద ఫ్యాషన్ హైలైట్లలో ఒకటిగా నిలిచాయి. View this post on Instagram A post shared by Rhea Kapoor (@rheakapoor)stify"> ఇదీ చదవండి: ఇప్పటికీ ఇండియన్స్ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడను రాధికా మర్చంట్ 'ఆడ్రీ హెప్బర్న్' ఇన్స్పైర్డ్ లుక్ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ గివెంచి (Givenchy) రూపొందించిన ప్రత్యేకమైన గౌన్లో ఆమె మెరిశారు. ఇది పౌడర్ బ్లూ (Powder blue) రంగులో భారతీయ చీర కట్టును (Saree drape) పోలి ఉండేలా ఆధునిక హొయలతో రూపొందించారు. ఒకప్పుడు దిగ్గజ ఫ్యాషన్ డిజైనర్ హ్యూబర్ట్ డి గివెన్చీ, లెజెండరీ నటి ఆడ్రీ హెప్బర్న్ కోసం రూపొందించిన ఐకానిక్ చీర తరహా గౌన్ల నుండి స్పూర్తితో దీన్ని డిజైన్ చేశారు. ఈ గౌన్కు మ్యాచింగ్గా 'ఒపెరా గ్లోవ్స్' ధరించారు. ఇది పాతకాలపు హాలీవుడ్ గ్లామర్ను గుర్తుకు తెచ్చింది. ఇక ఆభరణాల విషయానికి వస్తే డైమండ్ రింగ్, మెరిసే ఆర్మ్ యాక్సెసరీతో తన లుక్ను మరింత రిచ్గా మార్చుకున్నారు.ఇదీ చదవండి: బిగ్ బాస్ మనీషా రాణి డ్రీమ్ హౌస్ : ధర తెలిస్తే ఫిదానేమేకప్ , హెయిర్ స్టైల్వింగ్డ్ ఐలైనర్, గ్లోసీ న్యూడ్ లిప్స్,సున్నితమైన గ్లోయింగ్ స్కిన్తో 'సాఫ్ట్ గ్లామ్' మేకప్ను ఎంచుకున్నారు. రెట్రో స్టైల్లో ఉండే సాఫ్ట్ వేవ్స్ (Polished waves) ఆమె వింటేజ్ మూడ్కు సంపూర్ణంగా సరిపోయింది. పారిసియన్ ఎలిగెన్స్ మరియు భారతీయ సంప్రదాయ కట్టు కలబోతగా ఉన్న ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాతకాలపు హాలీవుడ్ స్టైల్ను ఆధునిక పద్ధతిలో ప్రదర్శించి రాధికా అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇదీ చదవండి: రూ. లక్ష కోట్ల నష్టం, పెట్రోలు పొదుపు : మోదీ విజ్ఞప్తిలోని మర్మం ఇదేనా? -
రూ. లక్ష కోట్ల నష్టం, పెట్రోలు పొదుపు : మోదీ విజ్ఞప్తిలోని మర్మం ఇదేనా?
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలని, వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ , కార్ పూలింగ్ను ఉపయోగించాలని కోరడం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఇంధన దిగుమతుల భారాన్ని తగ్గించేందుకు , దేశీయంగా ఇంధనాన్ని పొదుపు చేయాలని ప్రధాని మోదీ కోరారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో భారత్లో ఇంధన ధరల పెంపు అనివార్యంగా కనిపిస్తోంది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలని పౌరులకు చేసిన విజ్ఞప్తి చేశారా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి.ఆర్థిక, పెట్రోలియం మంత్రిత్వ శాఖలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (OMCలు) మధ్య చర్చలు కొనసాగుతున్నందున, ప్రపంచ ముడి చమురు పోకడలు, ద్రవ్యోల్బణం, ఆర్థిక ఒత్తిళ్లు, ఇంధన ధరలను సమతుల్యం చేయడంలో ప్రభుత్వ వైఖరి ఉండబోతోంది అంటున్నారు విశ్లేషకులు.ఇదీ చదవండి: బిగ్ బాస్ మనీషా రాణి డ్రీమ్ హౌస్ : ధర తెలిస్తే ఫిదానేఅమెరికా-ఇరాన్ ప్రతిష్టంభన మధ్య ముడి చమురు ధరలు పెరగడంతో, చాలాకాలంగా వాయిదా పడుతున్న ఇంధన ధరల పెంపునకు ఇక నాంది పలకవచ్చని అంచనా. ముఖ్యంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ, వినియోగదారులపై భారం పడకుండా చమురు సంస్థలు తక్కువ ధరకే ఇంధనాన్ని విక్రయిస్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు రోజుకు సుమారు రూ. 1,000 కోట్ల వరకు నష్టం వాటిల్లుతోందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు.ఈ త్రైమాసికంలో రూ. 2 లక్షల కోట్ల వరకు వసూళ్లలో లోటు ఉంటుందని, సుమారు రూ. 1 లక్ష కోట్ల నష్టాలు నమోదవుతాయని అంచనా వేయడంతో OMC (చమురు కంపెనీ)లపై ఒత్తిడి పెరుగుతోందని, పౌరులకు మోదీ విజ్ఞప్తి చేసిన కొన్ని గంటల తర్వాత మే 10న పెట్రోలియం మరియు సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఒక లింక్డ్ఇన్ పోస్ట్లో రాశారు.ప్రతిరోజూ రిటైల్ స్టేషన్లకు వచ్చే 6 కోట్ల మందికి పైగా వినియోగదారులకు భారం పడకుండా చూసుకోగలిగామన్నారు.. అంతేకాకుండా, మోదీ ప్రభుత్వం రిటైల్ ఇంధనంపై ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం వల్ల ఒక నెలలో రూ. 14,000 కోట్ల ఆదాయ నష్టాలను చవిచూసిందని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ఫిబ్రవరిలో 69.01 డాలర్లుగా ఉన్న రిఫైనరీలు చమురును దిగుమతి చేసుకునే సగటు ధర, మే నెలలో 104.68 డాలర్లకు పెరిగిందని పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ డేటా వెల్లడించింది. చమురు సంస్థలు ఈ త్రైమాసికంలో సుమారు రూ. 2 లక్షల కోట్ల మేర అండర్-రికవరీలను (నష్టాలను) ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రస్తుతమున్న ధరలతో చమురు విక్రయాలు ఆర్థికంగా భారమని, కాబట్టి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం తప్పనిసరి అని విశ్లేషకులు భావిస్తున్నారు. దేశంలో ప్రస్తుతం దాదాపు 74 రోజులకు సరిపడా చమురు నిల్వలు (స్ట్రాటజిక్ మరియు కమర్షియల్) ఉన్నాయి. డిమాండ్ను తగ్గించడం ద్వారా ఈ సంక్షోభాన్ని అధిగమించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇదీ చదవండి: ఇప్పటికీ ఇండియన్స్ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడనుఫిబ్రవరిలో బ్యారెల్ ముడి చమురు ధర 69.01 డాలర్లు ఉండగా, మే నెల నాటికి అది 104.68 డాలర్లకు చేరుకుంది. యుద్ధ ఉద్రిక్తతల సమయంలో ఇది ఒకానొక దశలో 120 డాలర్లస్థాయిని కూడా దాటేసింది. ముఖ్యంగా ఫిబ్రవరి 28 నుండి హోర్ముజ్ జలసంధి మూతపడటంతో చమురు దిగుమతులు భారత్కు సవాలుగా మారిపోయింది. -
మమతా వారసత్వాన్ని కొనసాగిస్తున్న బీజేపీ ప్రభుత్వం
కోల్కతా: సాధారణంగా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారితే.. గత పాలన తాలూకు ఆనవాళ్లు చెరిపేయడం, లేదంటే ఆ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు పేర్లు మార్చి క్రెడిట్ కొట్టేసి తామే చేశామని చెప్పుకునే ఈ రోజుల్లో పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మాజీ సీఎం మమతా బెనర్జీ తన పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాల్ని కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు.దీదీ ప్రభుత్వం 2021లో మహిళా సాధికారత పథకం లక్ష్మీర్ బండార్ అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకం కింద అర్హులైన 25 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలకు, ముఖ్యంగా ఎస్సీ/ఎస్టీలకు నెలకు రూ.1200, సాధారణ వర్గాలకు రూ.1000 ఆర్థిక సహాయం నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేసేవారు.ఇటీవల ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగించింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి బీజేపీ అధికారంలోకి రాగా.. ఆ రాష్ట్రానికి తొమ్మదవ సీఎంగా సువేందు ప్రమాణ స్వీకారం చేపట్టారు. పాలనలో తనదైన మార్క్తో నిర్ణయాలు తీసుకుంటున్నారు.సోమవారం పశ్చిమ బెంగాల్ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆరు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో లక్ష్మీర్ బండార్ పథకాన్ని కొనసాగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గత టీఎంసీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ అమలు చేసిన లక్ష్మీర్ బండార్లాంటి సంక్షేమ పథకాల్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు.దీంతో పాటు ఎన్నికల్ని సజావుగా నిర్వహించిన ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో ప్రాణాలు కోల్పోయిన ఓ బీజేపీ కార్యకర్తకు నివాళులర్పించారు. -
భారత్కు ఇరాన్ మంత్రి..! ఇంధన కొరత వేళ మనకెన్ని లాభాలంటే?
న్యూఢిల్లీ: ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ మే 14-15 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరయ్యే అవకాశమున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అమెరికా-ఇరాన్ యుద్ధం, భౌగోళిక-రాజకీయ ప్రాధాన్యం పెరిగిన సమయంలో ఆయన పర్యటన జరుగుతుంది. బ్రిక్స్ వేదికలో భారత్-ఇరాన్ మధ్య పెరుగుతున్న అనుబంధానికి దీన్ని సంకేతంగా భావిస్తున్నారు.ఇరాన్ 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలతో కలిసి బ్రిక్స్లో చేరింది. ఇరాన్ న్యాయ, అంతర్జాతీయ వ్యవహారాల ఉప విదేశాంగ మంత్రి కాజెం ఘరీబాబాదీ కూడా ఈ వారం జరిగే బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యే అవకాశమున్నట్లు ఇరానియన్ వర్గాలను ఉటంకిస్తూ గతంలో కథనాలు వచ్చాయి. భారత్ ఈ ఏడాది జనవరి 1న అధికారికంగా బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించింది. బ్రెజిల్ నుంచి ఈ బాధ్యతలు భారత్ తీసుకుంది. 2012, 2016, 2021 తర్వాత భారత్ బ్రిక్స్కు నాలుగోసారి అధ్యక్షత వహిస్తోంది.రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ కూడా బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొంటారని రష్యా విదేశాంగ శాఖ ఏప్రిల్ 29న తెలిపింది. మే 14-15 తేదీల్లో లావ్రోవ్ భారత్లో పర్యటిస్తారని విదేశాంగ శాఖ ఎక్స్లో వెల్లడించింది. టాస్ వార్తా సంస్థ కథనం ప్రకారం.. ప్రస్తుత అంతర్జాతీయ అంశాలు, ప్రపంచ పాలన బలోపేతం వంటి అవకాశాలపై చర్చలకు ఈ సమావేశం ఉపయోగపడుతుందని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మారియా జఖరోవా తెలిపారు.“మే 14-15 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగే పూర్తి స్థాయి బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ హాజరవుతారు” అని ఆమె చెప్పారు. భారత్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశం, ప్రస్తుత అంతర్జాతీయ అంశాలు, ప్రపంచ పాలన బలోపేత అవకాశాలపై చర్చలకు కీలక వేదికగా నిలుస్తుందని టాస్, జఖరోవాను ఉటంకిస్తూ తెలిపింది.ముఖ్యంగా ప్రపంచ మెజారిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాల అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు పేర్కొంది. “ఈ ఏడాది సెప్టెంబర్లో న్యూఢిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్ సదస్సు సన్నాహకాలలో వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతంపై ప్రత్యేక దృష్టి ఉంటుంది” అని ఆమె అన్నారు.ఇదిలా ఉండగా, బ్రిక్స్ మధ్యప్రాచ్యం-ఉత్తర ఆఫ్రికా ఉప విదేశాంగ మంత్రులు, ప్రత్యేక ప్రతినిధుల సమావేశం ఏప్రిల్ 23-24 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగింది. ప్రస్తుత ప్రాంతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. బ్రిక్స్లో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, భారత్, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సభ్య దేశాలుగా ఉన్నాయి. ప్రపంచ, ప్రాంతీయ ప్రాధాన్య అంశాలు, రాజకీయ-ఆర్థిక పాలన అంశాలపై సంప్రదింపులు, సహకారానికి ఇది కీలక వేదికగా ఉంది. 2026 బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన భారత్ “బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ” అనే అంశాన్ని మార్గదర్శకంగా తీసుకుంది. 2025లో రియో డీ జనీరోలో జరిగిన 17వ బ్రిక్స్ సదస్సులో ప్రధాని ప్రస్తావించిన ప్రజాకేంద్ర, మానవతా ప్రథమ విధానాన్ని ఇది ప్రతిబింబిస్తోంది.భారత్కు ఇది ఎందుకు కీలకం?ఈ ఏడాది బ్రిక్స్ అధ్యక్ష దేశంగా ఉన్న భారత్.. సభ్య దేశాల భిన్న అభిప్రాయాల మధ్య సమతుల్యత పాటించే అవకాశం ఉంది. సున్నితమైన భౌగోళిక-రాజకీయ అంశాలపై విభేదాలు తలెత్తకుండా చూడాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా పశ్చిమ ఆసియా అంశాలపై సభ్య దేశాల మధ్య గతంలో ఏకాభిప్రాయం కుదరని సందర్భాలు ఉన్నాయి. ఇరాన్తో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా గల్ఫ్ భాగస్వామ్య దేశాలతో కూడా భారత్కు బలమైన సంబంధాలు ఉన్నాయి. దీంతో బ్రిక్స్లో ఏకాభిప్రాయం సాధించడం దౌత్యపరంగా సున్నిత అంశంగా మారింది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ అబుదాబీ పర్యటనకు వెళ్లే అవకాశముంది. హార్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతల కారణంగా ఇంధన సరఫరా అంతరాయాలపై చర్చలు కొనసాగుతున్న సమయంలో అరాఘ్చీ పర్యటన సానుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఇటీవల ఇరాన్, భారత్ నిరంతర సంప్రదింపులు కొనసాగిస్తున్నాయి. విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్తో కూడా ఇరాన్ పలుమార్లు చర్చలు జరిపింది. గల్ఫ్ ఉద్రిక్తతల్లో ఏ సైనిక కూటమికీ మద్దతుగా నిలవకుండా భారత్ దౌత్య సంబంధాలను కొనసాగిస్తోంది. ప్రాంతీయ స్థిరత్వం, ఇంధన సరఫరా భద్రతపై భారత్ ప్రధాన దృష్టి పెట్టింది. -
బిగ్ బాస్ మనీషా రాణి డ్రీమ్ హౌస్ : ధర తెలిస్తే ఫిదానే
బిగ్ బాస్ ఫేమ్ మనీషా రాణి ముంబైలోని లగ్జరీ హౌస్ నెట్టింట సందడిగా మారింది. భారీ వార్డ్రోబ్తో కూడిన గ్లామ్ రూం , విశాలమైన బాల్కనీతో ఉండే మనీషా రాణి "డ్రీమ్ హౌస్" విశేషాలపై ఫ్యాన్స్ అబ్బురపడుతున్నారు. మే 1వ తేదీన మనీషా రాణి తన కొత్త ఇంట్లో గృహప్రవేశం చేశారు. సన్నిహితులు, కుటుంబ సభ్యులతో సహా తన ప్రియమైన వారి సమక్షంలో, సాంప్రదాయ దుస్తుల్లో పూజ కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా కొన్ని ఫోటోలను ఇనష్టాలో షేర్ చేశారు. పదండి ఆ వివరాలేంటో తెలుసు కుందాం.బిగ్ బాస్ OTT 2లో సెకండ్ రన్నరప్గా నిలిచిన మనీషా రాణి తన చలాకీతనం, మాట్లాడే శైలితో బాగా పాపులర్ అయింది. ఆమెకు ఇన్స్టా మిలియన్ల కొద్దీ ఫాలోవర్లున్నారు. ఝలక్ దిఖ్లా జా 11 విజేతగా గుర్తింపు పొందిన మనీషా రాణి, ముంబైలో తన కలల ఇల్లును కొనుగోలు చేశారు. దీని విలువ సుమారు రూ. 5 కోట్లు.ఇంటీరియర్, డిజైన్ఈ ఇల్లు ఆధునిక శైలిలో, విశాలమైన గదులతో ఉంటుంది. గోడలకు పాస్టెల్ రంగులు (Muted tones) ఉపయోగించారు, అక్కడక్కడా వైబ్రెంట్ రంగులతో ఇంటికి కొత్త లుక్తో ఆకర్షణీయంగా ఉంటుంది.లివింగ్ రూమ్ చాలా విశాలంగా, వెలుతురు వచ్చేలా ఉంటుంది. స్టైలిష్గా కనిపించడమే కాకుండా సౌకర్య వంతంగా కూడా ఉంటుంది. ఈ గది ఆధునిక ఇంటీరియర్ డిజైన్లు,ట్రెండీ లైటింగ్ , గాలి ధారాళంగా వచ్చేలా క్రాస్-వెంటిలేషన్ సౌకర్యం ఉంది.వార్డ్ రోబ్ అది పెద్ద కిచెన్ దీని మరో ప్రత్యేకత. ప్యారలల్ లేఅవుట్తో మార్బుల్ ఫినిషింగ్ కౌంటర్లు , స్టైలిష్ క్యాబినెట్లతో వంటగదిని చాలా అందంగా తీర్చిదిద్దారు. అంతేకాదు తన దుస్తుల కోసం ప్రత్యేకంగా ఒక పెద్ద వార్డ్రోబ్తో కూడిన గ్లామ్ రూమ్ను సిద్ధం చేసుకోవడం విశేషం. అందంగా, స్టైల్గా డిజైన్ చేయబడిన ఈ విశాలమైన వార్డ్రోబ్లో, బట్టలు, బూట్లు, యాక్సెసరీల కోసం చక్కగా అమర్చిన అరలు, చక్కటి స్టోరేజ్ ప్లేస్, విలాసవంతమైన ఏర్పాటు ఉన్నాయి. ఇది ఫ్యాషన్పై ఆమెకున్న ప్రేమను సంపూర్ణంగా ప్రతిబింబిస్తుంది అంటున్నారు ఫ్యాషన్ ప్రియులు. ముంబై నగరాన్ని వీక్షించేలా పెద్ద బాల్కనీ, దానికి ఫ్లోర్-టు-సీలింగ్ కిటికీలు ఉండటంతో ఇల్లు మరింత లగ్జరీగా కనిపిస్తుంది ఫైనల్లీ తన కలనెరవేరింది అంటూ తన ఇంటిగృహప్రవేశ ఫోటోలను, వీడియోలను ఇన్స్టాలో తన ఫ్యాన్స్ కోసం షేర్ చేసిందీ ఈ బీహారీ చిన్నది. ఇదీ చదవండి: ఇప్పటికీ ఇండియన్స్ని ‘కూలీ’ అంటారు : నేనేమి సిగ్గుపడను View this post on Instagram A post shared by Manisha Rani (@manisharani002) -
తమిళనాడు సీఎం విజయ్ బిగ్ సర్ప్రైజ్
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాలు కీలక మలుపులు తీసుకుంటున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అగ్రనటుడు విజయ్ ఆదివారం ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. అదే ఊపులో మేనిఫెస్టోలో కీలక మూడు హామీల అమలును ప్రకటించారు. తొలి సంతకాన్ని గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఫైలుపై చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు భద్రత, మాదక ద్రవ్యాల నిర్మూలన దస్త్రాలపైనా సంతకాలు పెట్టారు. ఇక.. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసే టీంను తన పర్యవేక్షణలోనే ఉంచుకోనున్నట్లు విజయ్ ఇవాళ చెప్పారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణం చేసిన కాసేపటికే వరుస సమావేశాలకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా.. రాజకీయ వర్గాలను ఆశ్చర్యరుస్తూ ప్రతిపక్ష నేతల ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ముందుగా డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్తో భేటీ అయ్యారు. స్టాలిన్ ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. మర్యాదపూర్వకంగానే స్టాలిన్తో విజయ్ భేటీ అయ్యారని టీవీకే వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం మూడు గంటల సమయంలోస్టాలిన్తో విజయ్ సమావేశమయ్యారు. అక్కడి నుంచి ఎండీఎంకే నేత వైకో నివాసానికి వెళ్తారని సమాచారం. డీఎంకే కూటమిలో ఉన్న ఎండీఎంకే నాలుగు స్థానాల్లో పోటీ చేసినా ఒక్క సీటు నెగ్గలేకపోయింది. వీళ్లతో పాటు పలువురు నేతలను కలుస్తారని తెలుస్తోంది. అయితే.. ఇది మర్యాదపూర్వక భేటీనేనని టీవీకే వర్గాలు చెబుతున్నాయి. అయితే అన్నాడీఎంకే నేతలను కలుస్తారా? ఆ పార్టీ జనరల్ సెక్రటరీ పళని ఇంటికి వెళ్తారా? అనే ఉత్కంఠ నెలకొంది. టీవీకే మద్దతు విషయంలో అన్నాడీఎంకేలో చీలిక ఏర్పడిన సంగతి తెలిసిందే.ఇక.. తమిళనాడులో కొత్త అసెంబ్లీ ఇవాళ కొలువు దీరింది. నూతనంగా ఎన్నికైన 234 మంది ఎమ్మెల్యేలు ప్రొటెం స్పీకర్ సమక్షంలో శాసన సభ్యులుగా ప్రమాణం చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్ని డీఎంకే ప్రకటించింది. రేపు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. ఈ నెల 13న టీవీకే సంకీర్ణ ప్రభుత్వం బలనిరూపణ ఎదుర్కొనుంది. అన్నీ సజావుగా సాగితే.. 17న అసెంబ్లీ తొలి సమావేశం జరగనుంది. -
‘కృష్ణావతారం’పై సీఎం యోగి సంచలన ప్రకటన
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సనాతన ధర్మం, కృష్ణ తత్వంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'కృష్ణావతారం పార్ట్ 1: ది హార్ట్ (హృదయం)' చిత్రానికి రాష్ట్రవ్యాప్తంగా పన్ను మినహాయింపు (ట్యాక్స్ ఫ్రీ) ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల లోక్ భవన్ ఆడిటోరియంలో జరిగిన ప్రత్యేక ప్రదర్శనను వీక్షించిన అనంతరం ఆయన ఈ నిర్ణయాన్ని వెలువరించారు.ఆధ్యాత్మికతతో మారుమోగిన లోక్ భవన్ఆదివారం రాష్ట్ర కేబినెట్ విస్తరణ అనంతరం ఈ ప్రత్యేక షోను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. సినిమా ప్రదర్శన సమయంలో ఆడిటోరియం మొత్తం ‘కృష్ణ-కృష్ణ’, ‘రాధే-రాధే’ నామస్మరణతో మార్మోగిపోయింది. ఈ అద్భుతమైన చిత్రాన్ని రూపొందించిన నటీనటులను, సాంకేతిక నిపుణులను సీఎం యోగి ఆదిత్యనాథ్ వేదికపై ప్రత్యేకంగా అభినందించారు.మానవ కోణంలో శ్రీకృష్ణుడి జననంశ్రీకృష్ణుడి జీవితాన్ని ఒక అద్భుతమైన మానవ కోణంలో ఈ సినిమా ఆవిష్కరించిందని సీఎం యోగి కొనియాడారు. ద్వాపర యుగ పరిస్థితులను, సనాతన సంస్కృతిని, భారతీయ సంప్రదాయాలను ఈ చిత్రంలో అత్యంత భారీ స్థాయిలో చూపించారని ప్రశంసించారు. రాధ, రుక్మిణి, సత్యభామల కథలను కూడా ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారని, పిల్లలు, యువతకు మన వారసత్వం తెలిసేలా ప్రతి జిల్లాలో ప్రత్యేక షోలు ప్రదర్శించాలని సమాచార శాఖను ఆయన ఆదేశించారు.గవర్నర్ మనవరాలి సందడిఈ సినిమాలో సత్యభామ పాత్రలో నటించిన నటి సంస్కృతి మరెవరో కాదు.. స్వయానా యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ మనవరాలే.. ఈ విషయం గవర్నర్కు ఎంతో గర్వకారణమని సీఎం యోగి పేర్కొన్నారు. హార్దిక్ గజ్జర్ దర్శకత్వంలో సిద్ధార్థ్ గుప్తా, సంస్కృతి, జాకీ ష్రాఫ్, అశుతోష్ రాణా తదితర ఉద్దండులు నటించిన ఈ చిత్రం మే 7న హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదలైంది. మన సంస్కృతిని ప్రతిబింబించే ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలని గవర్నర్ ఆనందీబెన్ ఆకాంక్షించారు. -
భారత బోర్డర్.. బెంగాల్ సీఎం సంచలన నిర్ణయం
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కీలక నిర్ణయం తీసుకున్నారు. మన దేశ బోర్డర్లో రక్షణ కోసం బీఎస్ఎఫ్కు ల్యాండ్ బదిలీ చేసే దిశగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో దాదాపు 127 కిలోమీటర్ల మేర బీఎస్ఎఫ్ కోసం కేంద్ర హోంశాఖ ఫెన్సింగ్ వేయనుంది. రానున్న 45 రోజుల్లో బీఎస్ఎఫ్కు తగిన భూమిని అప్పగించనున్నట్టు సీఎం సువేందు తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు.పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బీఎస్ఎఫ్ (BSF) కోసం సరిహద్దు భద్రతను బలోపేతం చేయడానికి భూమి కేటాయింపులు ప్రారంభించింది. తాజాగా సీఎం సువేందు అధికారి బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద ఫెన్సింగ్ కోసం భూమి బదిలీకి ఆమోదం తెలిపారు. అయితే, కలకత్తా హైకోర్టు ఇప్పటివరకు కేటాయింపులు ఆలస్యం కావడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది. కాగా, గతంలో మమతా బెనర్జీ ప్రభుత్వం బీఎస్ఎఫ్కు భూమి ఇవ్వడంలో నిర్లక్ష్యం చూపించారని ఆరోపణలు ఉన్నాయి. 127 కిలోమీటర్లకు గాను.. కేవలం 8 కిలోమీటర్లే మమత సర్కార్ కేటాయింపులు చేసింది. ప్రభావం ఇలా.. సరిహద్దు భద్రత: బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద అక్రమ రవాణా, చొరబాటు తగ్గించడానికి ఫెన్సింగ్ కీలకం.బీఎస్ఎఫ్ బలోపేతం: కొత్త అవుట్పోస్టులు, ఫెన్సింగ్ వల్ల BSFకు పర్యవేక్షణ సులభం అవుతుంది.రాజకీయ ప్రభావం: సువేందు అధికారి ప్రభుత్వం బీఎస్ఎఫ్కు మద్దతు ఇస్తూ, కేంద్రంతో సంబంధాలను బలోపేతం చేస్తోంది.Suvendu government's first big move!▶️Suvendu transfers land for border fencing to BSF. #SuvenduAdhikari #WestBengal pic.twitter.com/xL3gHjmN83— IndiaToday (@IndiaToday) May 11, 2026 -
భర్తను చంపిన కేసులో భార్య, ప్రియునికి ఉరిశిక్ష..14 లక్షల జరిమానా..!
బెంగళూరు: అనైతిక బంధానికి ఒడిగట్టిన భార్య చివరకు హత్యకూ వెనుకాడలేదు, ఫలితంగా కఠిన శిక్షకు గురైంది. అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కోపంతో హత్య చేసిన కేసులో భార్య, ఆమె ప్రియునికి శివమొగ్గ జిల్లా భద్రావతి కోర్టు మరణశిక్షతో పాటు రూ. 14 లక్షల జరిమానా విధించింది. మత్తు మందు ఇచ్చి.. వివరాలు... 2020 జనవరి 15న, భద్రావతిలోని పేపర్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సురగీ టాప్కు చెందిన ఫ్లోరా నాన్సీ అనే మహిళ, తన ప్రియుడు రాజశేఖరయ్యతో కలిసి భర్త ప్రకాష బాబుకు మత్తుమందు ఇచ్చి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అప్పటి కేసు దర్యాప్తు అధికారి, సీఐ మంజునాథ్.. దర్యాప్తును పూర్తి చేసి కోర్టుకు ఛార్జిషిట్ సమర్పించారు. భద్రావతిలోని 4వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ సాగింది. ప్రభుత్వ ప్రాసిక్యూటర్ రత్నమ్మ వాదనలు వినిపించారు. ఫ్లోరా నాన్సీ, ప్రియునికి ఉరే సరైన శిక్ష అని వాదిస్తూ ఆధారాలను సమర్పించారు. నేరం రుజువు కావడంతో జడ్జి ఇందిరా మైలస్వామి చెట్టియార్.. ఇద్దరు దోషులకు ఉరిశిక్ష విధించాలని తీర్పు చెప్పడంతో పాటు రూ.14 లక్షల జరిమానా విధించారు. మృతుని తల్లిదండ్రులకు రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు. -
నేడు ఏ క్షణంలోనైనా సీబీఎస్ఈ 12 ఫలితాలు?
న్యూఢిల్లీ: లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు నేడు వెలువడే అవకాశం ఉంది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి 12వ తరగతి ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్సీ)CBSE) మే 11న విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. డిజీలాకర్ నుంచి అందిన తాజా సంకేతాలు విద్యార్థుల్లో ఉత్కంఠను రెట్టింపు చేస్తున్నాయి. ఫలితాల ప్రకటనకు సంబంధించి బోర్డు తుది ఏర్పాట్లను పూర్తి చేసింది.ఫలితాల వెల్లడి.. అధికారిక వేదికలు ఇవేసీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు వెలువడగానే విద్యార్థులు అధికారిక వెబ్సైట్ల ద్వారా తమ మార్కులను వేగంగా తెలుసుకోవచ్చు. ప్రధానంగా cbse.gov.in, results.cbse.nic.in వెబ్సైట్లలో ఫలితాలు అందుబాటులో ఉంటాయి. వెబ్సైట్లతో పాటు, విద్యార్థుల సౌకర్యార్థం Digilocker, UMANG App ద్వారా కూడా స్కోర్కార్డులను డౌన్లోడ్ చేసుకునే వీలు కల్పించారు. ఫలితాల విడుదల సమయంలో వెబ్సైట్లపై ట్రాఫిక్ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ప్రత్యామ్నాయ యాప్లను ముందే ఇన్స్టాల్ చేసుకోవడం ఉత్తమం.స్కోర్కార్డ్ని డౌన్లోడ్ చేసుకోండి ఇలా..ఫలితాలను చెక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సులభం. మొదట అధికారిక వెబ్సైట్ను సందర్శించి, హోమ్ పేజీలో కనిపించే 'CBSE Class 12 Result 2026' లింక్పై క్లిక్ చేయాలి. అక్కడ అడిగిన వివరాలైన రిజిస్ట్రేషన్ నంబర్, రోల్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలను సమర్పించిన వెంటనే మీ స్కోర్కార్డ్ పిడిఎఫ్ రూపంలో స్క్రీన్పై ప్రత్యక్షమవుతుంది. భవిష్యత్తు ఉన్నత విద్యా ప్రవేశాల కోసం దాన్ని సేవ్ చేసుకోవడంతో పాటు ఒక ప్రింటౌట్ తీసుకోవడం మర్చిపోవద్దు.డిజీలాకర్ అప్డేట్.. తుది దశలో ప్రక్రియఈ ఏడాది ఫలితాల ప్రకటనపై డిజీలాకర్ సోషల్ మీడియా వేదికగా కీలక సూచనలు అందించింది. ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయని అధికారికంగా పేర్కొనడంతో, మే 11నే ప్రకటన ఉంటుందని సర్వత్రా చర్చ జరుగుతోంది. -
సోమనాథుని చెంతకు ప్రధాని: వెల్లువలా భక్తజనం
గిర్ సోమనాథ్: భారతదేశ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచిన సోమనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం నేడు సరికొత్త చరిత్రకు వేదికైంది. ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ‘సోమనాథ్ అమృత్ మహోత్సవం’లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పాల్గొన్నారు. భక్తిప్రపత్తులు, వేద మంత్రోచ్ఛారణల మధ్య జరుగుతున్న ఈ ఉత్సవం భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. #WATCH | Gir Somnath, Gujarat: Prime Minister Narendra Modi participates in the Somnath Amrut Mahotsav at the Somnath Temple, one of the twelve Jyotirlingas. Somnath Amrut Mahotsav marks 75 years since the inauguration of the restored Temple.(Source: ANI/DD) pic.twitter.com/diN7UgesFv— ANI (@ANI) May 11, 202675 ఏళ్ల ఘన చరిత్ర.. అరుదైన కుంభాభిషేకంసరిగ్గా 75 ఏళ్ల క్రితం మే 11వ తేదీన సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం జరిగింది. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా దేశంలోని 11 పుణ్యక్షేత్రాల నుంచి సేకరించిన పవిత్ర జలాలతో ‘కుంభాభిషేకం’ నిర్వహించడం విశేషం. ఆలయ చరిత్రలో ఇలాంటి అరుదైన ఘట్టం చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. ప్రధానమంత్రి ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొని, స్వామివారిని దర్శించుకోవడంతో పాటు ఆలయ శిఖరానికి జలాభిషేకం చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలతో సోమనాథ తీరం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతోంది. #WATCH | Gir Somnath, Gujarat: Prime Minister Narendra Modi holds a roadshow PM Modi will participate in the Somnath Amrut Mahotsav at Somnath Temple today (Source: ANI/DD) pic.twitter.com/HSp8wJL8BD— ANI (@ANI) May 11, 2026రోడ్ షోలో జననీరాజనం.. ప్రత్యేక నాణెం విడుదలప్రధానమంత్రి రాకను పురస్కరించుకుని సోమనాథ్ పరిసర ప్రాంతాలు పండగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. కార్యక్రమానికి ముందు మోదీ భారీ రోడ్ షో నిర్వహించగా, జనం పెద్ద ఎత్తున తరలివచ్చి స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో సంప్రదాయ పద్ధతిలో ధ్వజారోహణ నిర్వహించిన ప్రధాని, సోమనాథ్ చారిత్రక వారసత్వాన్ని గుర్తుచేస్తూ ప్రత్యేక తపాలా బిళ్ళను, స్మారక నాణేన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. భద్రతా పరంగా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. వడోదరలో సర్దార్ ధామ్ హాస్టల్ ప్రారంభంసోమనాథ్లో ఆధ్యాత్మిక వేడుకల అనంతరం ప్రధాని వడోదర పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ విద్యార్థుల కోసం నిర్మించిన ‘సర్దార్ ధామ్’ హాస్టల్ను ఆయన ప్రారంభించనున్నారు. వెయ్యి మంది బాలురు, మరో వెయ్యి మంది బాలికలకు అత్యాధునిక వసతులతో కూడిన ఈ హాస్టల్, విద్యా రంగంలో ఒక ముందడుగుగా నిలవనుంది. ఆధ్యాత్మికతతో పాటు సామాజిక అభివృద్ధి లక్ష్యంగా ప్రధాని పర్యటన కొనసాగుతోంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ, రాష్ట్ర యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. -
విజయ్కు భారీ గుడ్న్యూస్..
చెన్నై: తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటు తర్వాత రాజకీయం ఆసక్తికరంగా మారింది. అన్నాడీఎంకేలో విజయ్కి మద్దతు భారీగా పెరుగుతోంది. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం తర్వాత ఏఐఏడీఎంకేలో అశాంతి సంకేతాలు తీవ్రమైనట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎంతగా అంటే.. పార్టీ ఓటమికి పళనిస్వామిని బాధ్యుడిని చేసి అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. దీంతో, అన్నాడీఎంకేలో అంతర్గత పోరు పీక్ స్టేజ్కు చేరుకుంది.కాగా, అన్నాడీఎంకేలో మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు వేలుమణి వర్గం బలంగా ఎదుగుతోంది. పార్టీలో పళనిస్వామి నాయకత్వంపై తిరుగుబాటు పెరుగుతుండగా వేలుమణి–శణ్ముగం వర్గానికి మద్దతు భారీగా పెరిగింది. ఎన్నికల్లో గెలిచిన 47 మందిలో 36 మంది ఎమ్మెల్యేలు వీరితోనే ఉన్నారు. కాగా, వీరంతా టీవీకే విజయ్కి మద్దతు ఇవ్వాలని, ప్రభుత్వానికి అండగా నిలవాలని ముందు నుంచే అనుకూలంగా ఉన్నారు. ఈ వర్గం ఫ్లోర్ టెస్ట్లో కూడా టీవీకే ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.మరోవైపు.. పళనిస్వామి నాయకత్వాన్ని సవాలు చేస్తూ అన్నాడీఎంకే లెజిస్లేచర్ పార్టీ కొత్త నేతగా వేలుమణిని ఎన్నుకోవాలని చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఇది పార్టీ విభజనకు దారితీసే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా వేర్వేరుగా వచ్చి అసెంబ్లీలో ప్రమాణం చేయడం గమనార్హం. A split in AIADMK again..🔥🔥🔥- Edappadi Palaniswami resigns as AIADMK General Secretary.- SP Velumani takes over AIADMK.- CV Shanmugam directly alleges that Edappadi is not even qualified to form an alliance.. pic.twitter.com/8Kvop8IGBj— Muthukumar Subbaiah (@smkumarlakshmi) May 9, 2026ఇదిలా ఉండగా.. అన్నాడీఎంకే ఉన్నత వర్గాల సమాచారం ప్రకారం సీవీ షణ్ముగంతో పొత్తులో ఉన్న ఎమ్మెల్యేలు, పలువురు మాజీ మంత్రులు కలిసి.. ఆయన నాయకత్వాన్ని ఇకపై అంగీకరించడానికి సిద్ధంగా లేమని ఈపీఎస్కు తెలియజేశారు. వరుసగా నాలుగు ఎన్నికల ఓటముల తర్వాత ఈపీఎస్ వర్గానికి, షణ్ముగంతో ఉన్న నాయకులకు మధ్య విభేదాలు పెరిగాయి. ఓటములు అన్నాడీఎంకేలో నైతిక స్థైర్యాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. నాయకత్వం రాజకీయ వ్యూహంపై అంతర్గత ఆగ్రహాన్ని తీవ్రతరం చేశాయని వర్గాలు తెలిపాయి.అన్నాడీఎంకే పరిస్థితి ఇలా..అన్నాడీఎంకే వరుసగా ఎదుర్కొన్న ఓటములు పార్టీ భవిష్యత్తుపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.నాయకత్వ సంక్షోభం: ఈపీఎస్ నాయకత్వంపై తిరుగుబాటు పెరుగుతుండగా, వేలుమణి–శణ్ముగం వర్గం బలపడుతోంది.పార్టీ విభజన: రెండు వర్గాల మధ్య విభేదాలు పెరిగితే, పార్టీ విభజనకు దారితీసే అవకాశం ఉంది.డీఎంకేతో చర్చలు: డీఎంకేతో బ్యాక్చానల్ చర్చలు జరుగుతున్నాయన్న వార్తలు, పార్టీ అంతర్గత అసంతృప్తిని మరింత పెంచాయి.టీవీకే ప్రభావం..విజయ్ నేతృత్వంలోని టీవీకే తమిళనాడు రాజకీయాల్లో కొత్త శక్తిగా ఎదుగుతోంది.విజయం: 108 స్థానాలు గెలిచి భారీ మెజారిటీ సాధించింది.పొత్తు: అన్నాడీఎంకే తిరుగుబాటు వర్గం టీవీకేకు మద్దతు ఇస్తే, టీవీకే బలం మరింత పెరుగుతుంది. ఇది డీఎంకేకు సైతం ఎదురుదెబ్బ. -
‘యూపీఐ పేమెంట్’తో సువేందు పీఏ హంతకుల పట్టివేత
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) చంద్రనాథ్ రథ్ దారుణ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు అనూహ్యమైన పురోగతి సాధించారు. నిందితులు చేసిన ఒకే ఒక్క చిన్న పొరపాటు వారిని పోలీసులకు చిక్కేలా చేసింది. టోల్ ప్లాజా వద్ద చేసిన ఆన్లైన్ పేమెంట్ ఆధారంగా, ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు చెందిన ముగ్గురు అనుమానితులను బెంగాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.టోల్ ప్లాజా వద్ద పట్టించిన ‘యూపీఐ’హత్య అనంతరం పరారైన దుండగుల కోసం గాలిస్తున్న పోలీసులకు టోల్ ప్లాజా వద్ద ఓ ‘యూపీఐ’ ద్వారా జరిగిన ఆన్లైన్ పేమెంట్ దర్యాప్తులో కీలకంగా మారింది. దీని ఆధారంగా నిందితుల కదలికలను పసిగట్టిన పోలీసులు బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు బిహార్లోని బక్సర్కు చెందినవారు కాగా, మరొకరు యూపీలోని బల్లియాకు చెందిన వ్యక్తి. సోమవారం రాత్రి వీరందరినీ పశ్చిమ బెంగాల్కు తరలించిన పోలీసులు ముమ్మర విచారణ చేపట్టారు.సినిమాను తలపించేలా ఛేజింగ్, కాల్పులుమే 6వ తేదీ రాత్రి కోల్కతా శివార్లలోని నార్త్ 24 పరగణాల జిల్లా దొహారియా ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. కారులో ముందు సీటులో ప్రయాణిస్తున్న చంద్రనాథ్ను బైక్లపై వెంబడించిన దుండగులు అడ్డగించారు. అనంతరం కారు అద్దం గుండా అత్యంత సమీపం నుంచి (పాయింట్ బ్లాంక్ రేంజ్) కాల్పులు జరిపి, క్షణాల్లో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ భయానక దాడిలో చంద్రనాథ్ రథ్ ప్రాణాలు కోల్పోగా, బుల్లెట్ గాయాలపాలైన కారు డ్రైవర్ కోల్కతా ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు.కుట్ర వెనుక మాస్టర్ మైండ్ ఎవరు?అత్యంత ప్రణాళికాబద్ధంగా జరిగిన ఈ హత్యలో పట్టుబడిన నిందితుల పాత్ర ఏమిటనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎన్నికల అనంతర హింసను ప్రేరేపించే కుట్రలో భాగంగానే ఈ హత్య జరిగిందా అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. ఈ ఘాతుకానికి గల ప్రధాన కారణాలు, దీని వెనుక ఉన్న అసలు కుట్రదారుల వివరాలతో బెంగాల్ పోలీసులు త్వరలో అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.ఇది కూడా చదవండి: థాయ్లాండ్ పాలిటిక్స్: జైలు నుంచి ‘కింగ్ మేకర్’ విడుదల -
మోదీవి సూచనలు కావు.. ప్రభుత్వ వైఫల్యాలు
వనరులను ఆదా చేయాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇవ్వడంపై ప్రతిపక్ష నేత రాహల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంధన వినియోగం తగ్గించుకోవాలని, విదేశీ ప్రయాణాలు మానుకోవాలని, బంగారం కొనకూడదని, మెట్రోలో ప్రయాణించాలని, ఇంటి నుంచే పని చేయాలని ప్రజలకు మోదీ చేసిన పిలుపు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన అన్నారు.మోదీ జవాబుదారీతనం కోల్పోయారని పేర్కొంటూ సోమవారం ఎక్స్ ఖాతాలో రాహుల్ గాంధీ ఓ పోస్ట్ చేశారు. ‘‘దేశ ప్రయోజనాల విషయంలో ప్రధాని మోదీ రాజీ పడ్డారు #CompromisedPM. 12 ఏళ్లు దేశాన్ని పాలించాక.. ఏం కొనాలి, ఏం కొనకూడదు, ఎక్కడికి వెళ్లాలి, ఎక్కడికి వెళ్లకూడదు అనే స్థితికి వచ్చారా?. ఆయన చేసినవి ఉప దేశాలు కావు.. ప్రభుత్వ వైఫల్యాలు. రాజీన పడిన ప్రధాని దేశాన్ని నడపడం కష్టం’’ అని రాహుల్ తన పోస్టులో రాసుకొచ్చారు. मोदी जी ने कल जनता से त्याग मांगे - सोना मत ख़रीदो, विदेश मत जाओ, पेट्रोल कम जलाओ, खाद और खाने का तेल कम करो, मेट्रो में चलो, घर से काम करो।ये उपदेश नहीं - ये नाकामी के सबूत हैं।12 साल में देश को इस मुक़ाम पर ला दिया है कि जनता को बताना पड़ रहा है - क्या ख़रीदे, क्या न…— Rahul Gandhi (@RahulGandhi) May 11, 2026ఆర్థిక సంక్షోభ భారం ప్రజలపై మోపి.. ప్రధాని మోదీ బాధ్యత వహించకుండా తప్పించుకుంటున్నారని రాహుల్ ఆరోపించారు. మరోవైపు మోదీ సలహాలపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. మోదీ అలా ఎందుకు అనాల్సి వచ్చిందో చెప్పాలని అంటోంది. ఆయన వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయని.. దేశంలో వాస్తవ పరిస్థితులను ప్రజలను వివరించాలని కోరుతోంది. ఇరాన్–అమెరికా యుద్ధం మూడు నెలలు గడిచినా.. దేశ ఇంధన భద్రతను రక్షించడంలో మోదీ విఫలమయ్యారు. ప్రజలపై భారాన్ని మోపడం అనైతికం. ఎన్నికలు, రాజకీయాలు మాత్రమే ప్రధాని ప్రాధాన్యం అవుతున్నాయని.. ఆయన వ్యాఖ్యలతో ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమవుతుందని సంకేతాలిచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ అన్నారు. మరో కాంగ్రెస్ నేత ఎంపీ కార్తి చిదంబరం మాట్లాడుతూ.. మోదీ చేసినవి అప్పీల్గా లేవని.. తీవ్రమైన ఆదేశాలుగా ఉన్నాయని.. వాటి వెనక కారణాలు చెప్పేందుకు పార్లెమంట్ను ప్రత్యేకంగా సమావేశపర్చాల్సిన అవసరం ఉందని అన్నారు. తమిళనాడు ప్రతిపక్షం డీఎంకే సైతం మోదీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. -
ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన సీఎం విజయ్
సాక్షి, చెన్నై: తమిళనాడులో కొత్త అసెంబ్లీ కొలువుదీరింది. నూతనంగా ఎన్నికైన సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి విజయ్తో పాటు పళనిస్వామి, ఉదయ్నిధి స్టాలిన్ తదితరుంతా ప్రమాణం చేశారు. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి విజయ్ నెగ్గిన సంగతి తెలిసిందే. అయితే ఏదో ఒకస్థానం వదులుకోవాల్సిన పరిస్థితుల్లో.. ఆయన తిరుచ్చికి రాజీనామా చేశారు. ముందుగా పెరంబూర్ ఎమ్మెల్యేగా విజయ్, ఆ తర్వాత టీవీకే సభ్యులు.. ఆ తర్వాత మిగతా పార్టీల సభ్యులు ఒక్కొక్కరిగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ సభ్యులతో ప్రమాణం చేయించారు. #WATCH | Chennai: Tamil Nadu Chief Minister C Joseph Vijay takes oath as Member of the Legislative Assembly (MLA) of the Perambur constituency(Source: TNDIPR) pic.twitter.com/nJR6RyIcUA— ANI (@ANI) May 11, 2026రేపు తమిళనాడు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. అలాగే ఈ నెల 13న అసెంబ్లీలో టీవీకే బలనిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది.కూటమిలో లుకలుకలు?టీవీకే సంకీర్ణ ప్రభుత్వంలో అప్పుడే లుకలుకలు మొదలైనట్లు సమాచారం అందుతోంది. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వందేమాతరం పూర్తిగా ఆలపించడంపైనా వీసీకే అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. గవర్నర్ మెప్పు పొందేందుకు టీవీకే ప్రయత్నించిందని.. ఈ తీరు సరికాదని మండిపడింది.డీఎంకే ఫైర్సీఎం విజయ్పై ప్రతిపక్ష డీఎంకే భగ్గుమంది. గత డీఎంకే సర్కార్ అడ్డగోలుగా అప్పులు చేసిందని.. శ్వేత పత్రం విడుదల చేస్తామని విజయ్ ప్రకటించారు. అయితే అబద్ధ ప్రచారాలు ఆపాలంటూ తమిళనాడు కొత్త సీఎంకు డీఎంకే చురకలంటించింది. తమిళనాడు రాజకీయ చరిత్ర నేర్చుకోవాలంటూ సూచించింది.ప్రతిపక్ష నేతగా ఉదయ్నిధిప్రతిపక్ష పార్టీ నేతగా మాజీ మంత్రి, చెపాక్ ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ను డీఎంకే పార్టీ ఎన్నుకుంది. ఇందుకుగానూ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్కు ఉదయనిధి కృతజ్ఞతలు తెలియజేశారు. అసెంబ్లీకి వెళ్లే ముందు నూతన ఎమ్మెల్యేలతో స్టాలిన్ కార్యాలయానికి వెళ్లిన ఉదయనిధి.. శాలువా కప్పి పుష్పగుచ్చం సమర్పించారు.#WATCH | Chennai, Tamil Nadu: DMK MLA Udhayanidhi Stalin met party chief MK Stalin, earlier today Udhayanidhi Stalin tweeted, "This morning, before heading to the Assembly, we met DMK President MK Stalin—who has given us the opportunity to serve as the Leader of the Opposition… pic.twitter.com/iudaT3h67J— ANI (@ANI) May 11, 2026 -
ఎస్ఐఆర్తో మాకూ లాభం జరిగిందేమో!: శశిథరూర్
ఎస్ఐఆర్పై దేశంలో ఒకపక్క దుమారం చెలరేగుతుండగా.. ఇంకోపక్క తిరువనంతపురం ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ ఈ అంశంపై ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. బెంగళూరు (దక్షిణ) నియోజకవర్గ ఎంపీ తేజస్వీ సూర్యతో కలిసి ఆయన అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జరిగిన చర్చలో శశిథరూర్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ పేరుతో వివిధ రాష్ట్రాల్లో లక్షలాది ఓట్లను తొలగించిన ఎస్ఐఆర్ ప్రక్రియ కేరళలో తమకు లాభం చేకూర్చి ఉండవచ్చునని అన్నారు. బెంగాల్ ఎన్నికల ఫలితాలు ఇటీవలే వెల్లడై ఓట్ల చోరీ అంశం మరోసారి చర్చనీయాంశమైన ప్రస్తుత తరుణంలో శశిథరూర్ వ్యాఖ్యలకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. బెంగాల్ ఎన్నికల ఫలితాలపై కూడా శశిథరూర్ వ్యాఖ్యానిస్తూ.. ‘అక్కడ సుమారు 91 లక్షల మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. వీరిలో 34 లక్షల మంది తాము ఓటింగ్కు అర్హులమని, జాబితాలో తమ పేర్లు చేర్చాలని అప్పీల్ చేశారు కూడా. అయితే ఒకొక్కరి వివరాలను పరిశీలించి చేర్చాల్సి ఉన్నందున వీరిలో కొన్ని వందల మందికి మాత్రమే మళ్లీ అవకాశం దక్కింది. ఫలితంగా సుమారు 31 నుంచి 32 లక్షల మంది అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. బెంగాల్లో టీఎంసీ కంటే బీజేపీకి మధ్య ఓట్ల వ్యత్యాసం కూడా కొంచెం అటు ఇటుగా 30 లక్షలు కావడం’ అని ఆయన వ్యాఖ్యానించారు.#WATCH | San Francisco, USA: Speaking at the roundtable on 'India, That is Bharat: Growth Governance and Identity' at Stanford India Conference, Congress MP Shashi Tharoor says, "About the SIR... there are legitimate questions to answer. Look at the Bengal case. 91 lakh names… pic.twitter.com/QpysPZcVV1— ANI (@ANI) May 10, 2026ఓటర్ల జాబితాలో అవకతవకలను సవరించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ అభ్యంతరం పెట్టలేదని, డూప్లికేట్ ఓటర్లు, మరణించిన, వలస వెళ్లిన వారి పేర్లు తొలగించడం అవసరం కూడా అని ఆయన అన్నారు ఈ క్రమంలోనే కేరళలో ఎస్ఐఆర్ ప్రక్రియ తమకు ఎలా ఉపయోగపడిందో వివరిస్తూ శశిథరూర్ ఏమన్నారంటే.. ‘వాస్తవానికి ఎస్ఐఆర్ అన్నది కేరళలో కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చి ఉండవచ్చు. ఎందుకంటే లెఫ్ట్ ప్రభుత్వం చాలాకాలంగా ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతోంది. ఒకే ఓటరు మూడు నాలుగు చోట్ల నమోదు చేసకోవడం, డూప్లికేట్ ఓటర్లు చాలామంది ఉన్నారు. వీరందరి తొలగింపు ఫలితంగా కాంగ్రెస్కు మెజార్టీ లాభించి ఉండవచ్చు’ అని అన్నారు.కొందరిని ఒంటరి వాళ్లను చేశారు..దేశంలో మైనార్టీ వర్గాలను ఒంటరులను చేయడం గత దశాబ్ద కాలంలో ఎక్కువైందని, బీజేపీ అగ్రనేతలు మొదలుకొని సామాన్యుల వరకూ మైనార్టీలను ఉగ్రవాదుల మాదిరిగా చూస్తూండటం దీనికి కారణమని శశిథరూర్ వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యతో తనకు వ్యక్తిగతంగా స్నేహం ఉన్నప్పటికీ బీజేపీ మార్కు రాజకీయాల విషయంలో మాత్రం తన వైఖరి నిక్కచ్చిగానే ఉంటుందని స్పష్టం చేశారు. గత దశాబ్ద కాలంలో ఈ దేశంలోని మైనార్టీలు తమ పట్ల ఎందుకింత వివక్ష ఏర్పడిందో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. ‘మా పూర్వీకులు ఈ మట్టిలోనే కలిసిపోయారు. అయినా మమల్ని వేరుగా ఎందుకు చూస్తున్నారు’ అని వారు భావిస్తున్నారని, విభజన గాయాలను రెచ్చగొడుతూ మైనార్టీలను అణచివేసే ప్రయత్నం చేయడం ద్వారా బీజేపీ తప్పు చేస్తోందని వ్యాఖ్యానించారు. -
మోదీ చెప్పినవి.. మనతో అయ్యే పనేనా??
ఏడాది పాటు బంగారం కొనొద్దు.. పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించండి.. వర్క్ ఫ్రమ్ హోంకు ప్రాధాన్యం ఇవ్వండి.. కూరల్లో వంటనూనెకు తగ్గించి వాడండి.. విదేశీ ప్రయాణాలు చేయొద్దని.. ఇలా దేశ ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ నడుస్తోంది. పశ్చిమాసియా యుద్ధ సంక్షోభ నేపథ్యంలోనే ఆయన చేసిన సూచనలపై మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో ఇవి అసలు ఆచరణ సాధ్యమేనా? అనేదానిపై ఆర్థిక నిపుణులు స్పందించారు. హైదరాబాద్ సభలో మోదీ ఏం మాట్లాడారు?.. కరోనా టైంలో అలవాటు అయిన వర్క్ ఫ్రమ్ హోం, ఆన్లైన్ మీటింగ్ విధానాలను మళ్లీ ఆచరించడం ద్వారా పెట్రోల్ వినియోగం తగ్గించవచ్చు. ఈవీలను ప్రొత్సహిస్తే మరీ మంచిది. బంగారం కొనుగోలు ఒక సంవత్సరం పాటు ఆపితే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చు. ప్రతి కుటుంబం వంటనూనె వినియోగాన్ని తగ్గిస్తే ఆరోగ్యానికి, ఆర్థిక వ్యవస్థకు లాభం. రసాయన ఎరువుల వినియోగం తగ్గించి.. రైతులు సహజ వ్యవసాయానికి మారితే దిగుమతులపై ఆధారపడకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుంది అని అన్నారు. మోదీ సూచనలు దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా సరైనవని ఆర్థిక నిపుణులు అంగీకరిస్తున్నారు. అదే సమయంలో అవి ఆచరణ సాధ్యమా? అంటే కష్టమేనని అంటున్నారు. మరీ ముఖ్యంగా బంగారం భారతీయ కుటుంబాల్లో ఆర్థిక భద్రతకు ప్రతీక. అలాంటి దానిని ఏడాదిపాటు కొనుగోలు నిలిపివేయడం అనేది భారతీయ సాంప్రదాయాలకు విరుద్ధమని.. ఆచరణలో సాధ్యమయ్యేది కాదని అంటున్నారు. ఎనర్జీ నిపుణులు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా పెట్రోల్ వినియోగం తగ్గడం సాధ్యమే. ఇది కొంత వరకు సాధ్యమే. కానీ ఇది ప్రధానంగా ఐటీ రంగం ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. తయారీ, రవాణా రంగాల్లో ఇది అసాధ్యమంటున్నారు. అలాగే రైతులు సహజ వ్యవసాయం వైపు మారడం మంచి ఆలోచనే అయినప్పటికీ.. వాళ్లకు ప్రోత్సాహకాలు, మరింత శిక్షణ అవసరమని.. ప్రభుత్వాలు ఆ భారం భరించే స్థితిలో ఉందా? అని వ్యవసాయ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఇక వంటనూనె వినియోగం తగ్గించడంపైనా ఇటు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇది ఆచరణ సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. మోదీ పిలుపు దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా సరైనదే. కానీ ప్రజల జీవనశైలిలో మార్పులు తేవడం సులభం కాదు. దీని కోసం ప్రభుత్వ ప్రోత్సాహకాలు, అవగాహన కార్యక్రమాలు అవసరం. ఇంధన సంక్షోభం వంటి జాతీయ సమస్యలను ఎదుర్కోవడానికి ప్రజల సహకారం కీలకమని నిపుణులు గుర్తు చేస్తున్నారు. పొలిటికల్ రియాక్షన్స్మోదీ పొదుపు వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు ఎక్కు పెట్టింది. మోదీ అలా ఎందుకు అనాల్సి వచ్చిందో చెప్పాలని అంటోంది. ఆయన వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయని.. దేశంలో వాస్తవ పరిస్థితులను ప్రజలను వివరించాలని కోరుతోంది. ఇందుకోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించాలని డిమాండ్ చేస్తోంది. దేశ ఇంధన భద్రతను రక్షించడంలో మోదీ విఫలమయ్యారని విమర్శిస్తోంది. ఈ విమర్శలకు బీజేపీ కౌంటర్ ఇస్తోంది. మోదీ వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసలు గుప్పించారు. అది దూరదృష్టితో కూడిన నిర్ణయమని అన్నారాయన. -
సీఎం విజయ్ మాస్టర్ ప్లాన్: చక్రం తిప్పనున్న ఇద్దరు ఐఏఎస్ అధికారులు!
తిరువనంతపురం: తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సి జోసెఫ్ విజయ్ అప్పుడే పాలనపై తనదైన ముద్ర వేస్తున్నారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు, తన ‘కొత్త శకం’ అజెండాను అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కార్యాలయంలో (సీఎంఓ) కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను తన అధికారిక కార్యదర్శులుగా నియమించుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.ముఖ్యమంత్రి కార్యదర్శులుగా..ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య, ఆరోగ్య శాఖలో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ పి.సెంథిల్ కుమార్ను బదిలీ చేసి, ముఖ్యమంత్రికి అదనపు ప్రధాన కార్యదర్శి-కార్యదర్శి వన్గా నియమించారు. అలాగే మరో సీనియర్ అధికారిణి జి.లక్ష్మీప్రియను ముఖ్యమంత్రి కార్యాలయానికి కార్యదర్శి టుగా బదిలీ చేశారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు తర్వాత సీఎం ఆఫీస్ కార్యకలాపాలను పటిష్టం చేయడంలో ఇవే తొలి అడుగులు.120 సీట్లతో బలం.. సంక్షేమంపై గురిఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కజగం (టీవీకే)పార్టీకి పూర్తి మెజారిటీ రానప్పటికీ.. కాంగ్రెస్, వీసీకే, సీపీఐ, సీపీఐ(ఎం), ఐయూఎంఎల్ మద్దతుతో 120 మంది ఎమ్మెల్యేల బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బాధ్యతలు చేపట్టిన వెంటనే, సీఎం విజయ్ తన తొలి ప్రాధాన్యతలను స్పష్టం చేశారు. నిరంతర విద్యుత్ సరఫరా, మహిళల భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలన అనే మూడు ప్రధాన ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై కీలక నిర్ణయాలు ప్రకటించారు.ఖజానా ఖాళీ.. పాలనలో పారదర్శకత‘నేను రాజ కుటుంబం నుంచి రాలేదు. నేను మీ ఇంట్లో కొడుకుని, తమ్ముడిని, అన్నను’ అంటూ విజయ్ తన ప్రసంగంతో ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. ప్రజల రుణం తీర్చుకునేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, నిజమైన సామాజిక న్యాయంతో కొత్త శకానికి నాంది పలుకుతున్నానని ఉద్ఘాటించారు. గత డీఎంకే ప్రభుత్వం రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి నెట్టి, ఖజానాను ఖాళీ చేసిందని ఆరోపించిన ఆయన.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని, ప్రభుత్వ నిర్ణయాలన్నీ అత్యంత పారదర్శకంగా ఉంటాయని పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: ఇవేం బదిలీలు సామీ?.. కొత్త ప్రభుత్వం రాకముందే షాక్! -
విజయ్-రాహుల్ రీల్స్.. ఎందుకు బ్లాక్ చేశారు?
కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలకు దిగింది. విజయ్-రాహుల్ గాంధీ దిగిన ఫొటోలను, రీల్స్ను సోషల్ మీడియాలో బ్లాక్ చేశారని అంటోంది. ఈ మేరకు కొన్ని స్క్రీన్షాట్లను ఆ పార్టీ అధికార ప్రతినిధులు ఆధారాలుగా చూపించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైలైట్గా నిలిచిన సంగతి తెలిసిందే. విజయ్ ఆదివారం తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అనంతరం.. ప్రమాణ స్వీకార వేదిక, అక్కడికి వచ్చిన అతిథులు.. పార్టీ శ్రేణులు.. అభిమానులను సెల్ఫీ వీడియోలు తీస్తూ సందడి చేశారు. నెట్టింట ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. అయితే.. ఈ వేడుకలో రాహుల్ గాంధీతో విజయ్ తీసిన ఫొటోలు, రీల్స్ను ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేసిందని.. దీని వెనుక కేంద్రం ప్రమేయం ఉందని ఆరోపించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రీవత్సా ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. ‘‘విజయ్తో రాహుల్ గాంధీ రీల్ గంట వ్యవధిలోనే కోటి లక్ష మంది చూశారు. ఇద్దరు కలిసి దిగిన ఫొటో నాలుగున్నర కోట్ల మందికి రీచ్ అయ్యింది. కానీ, హఠాత్తుగా అవి కనిపించకుండా పోయాయి. ఈ బ్లాకింగ్ వ్యవహారంపై ఇన్స్టా మాతృక సంస్థ మెటా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రొద్భలంతోనే ఇది జరిగి ఉంటుంది’’ అని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ఈ చర్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. బహుశా ఇన్స్టాగ్రామ్ అంతర్గత వ్యవస్థలో పొరపాటు వల్ల అలా జరిగి ఉండొచ్చని.. కాసేపటికే అవి పునరుద్ధరించబడ్డాయని ఒక ప్రకటన ఇచ్చింది. రాహుల్ గాంధీ-విజయ్ రీల్ తాత్కాలికంగా బ్లాక్ అయిన ఘటనపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరిగింది. మరోవైపు కేంద్రం ప్రకటనపై ఇన్స్టాగ్రామ్ ఇంకా స్పందించలేదు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ప్రతిపక్షాలకు సంబంధించిన పోస్టులపై కేంద్రం అణచివేత ధోరణి ప్రదర్శిస్తోందని కాంగ్రెస్ చాలాకాలంగా ఆరోపిస్తోంది. ‘‘సోషల్ మీడియాలో విపక్ష ముఖ్యనేతల అకౌంట్లపై కేంద్రం నిఘా పెడుతోంది. ఎక్స్(ట్విటర్), యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో రీచ్ తగ్గేలా చేస్తోంది. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా స్వరాన్ని అణచివేస్తోంది. ఆయన ఫాలోవర్స్, సబ్స్క్రయిబర్ల సంఖ్య తగ్గడం ఈ కుట్రలో భాగమేనని అంటోంది” అని ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలపై మాత్రం కేంద్రం ఇప్పటిదాకా స్పందించలేదు. ఏం జరిగింది?.. తమిళనాడు సీఎం విజయ్-కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రీల్స్కు, ఫొటోలకు విపరీతమైన రియాక్షన్ వచ్చింది. ఆ వెంటనే అవి కాసేపు కనిపించకుండా పోయాయి. ఈ ఎపిసోడ్పై ఎవరేం అన్నారంటే.. 👇కాంగ్రెస్ ఆరోపణ: ఇది కేంద్రం కుట్ర.. జనాల్లో ప్రతిపక్ష నాయకుడి క్రేజ్ను తగ్గించే ప్రయత్నమే!విజయ్ ఫ్యాన్స్: బీజేపీ ప్రభుత్వం కావాలనే ఇలా చేసిందిబీజేపీ స్పందన: బహుశా.. అల్గారిథమ్స్, ఇన్స్టాగ్రామ్లో టెక్నికల్ ఎర్రర్ వల్ల జరిగి ఉండొచ్చు ఐటీ మంత్రిత్వ శాఖ వివరణ: కేంద్రానికి సంబంధం లేదు.. ఇన్స్టాగ్రామ్ దీనిపై వివరణ ఇస్తుందిఇన్స్టాగ్రామ్: ఇప్పటిదాకా ఇంకా స్పందించలేదుట్రెండింగ్ హ్యాష్ట్యాగ్స్: #RahulGandhi, #ThalapathyVijay, #InstagramBlock వంటి హ్యాష్ట్యాగ్స్ ట్రెండ్ అయ్యాయి.మీమ్స్: ఈ ఘటనను హాస్యాత్మకంగా చూపిస్తూ మీమ్స్ సందడి చేశాయి -
ఇవేం బదిలీలు సామీ?.. కొత్త ప్రభుత్వం రాకముందే షాక్!
తిరువనంతపురం: కేరళ రాష్ట్ర పరిపాలనా విభాగంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కొత్త ప్రభుత్వం అధికారికంగా ఇంకా పగ్గాలు చేపట్టకముందే, ఏకంగా 350కి పైగా ప్రభుత్వ అధికారులను మూకుమ్మడిగా బదిలీ చేయడం కలకలం రేపుతోంది. ఒకవైపు ఉన్నతాధికారులు ఇవి కేవలం ‘పరిపాలనా సౌలభ్యం’ కోసమే అని సమర్థిస్తుండగా, మరోవైపు ఇందులో విపరీతమైన రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్నాయి.వివిధ శాఖల్లో ప్రక్షాళనరాష్ట్రవ్యాప్తంగా పలు కీలక శాఖల్లో ఈ బదిలీల ప్రక్రియ అత్యంత వేగంగా జరిగింది. ముఖ్యంగా సహకార, రిజిస్ట్రేషన్ శాఖలో 52 మందిని, రెవెన్యూ విభాగంలో 50 మంది అధికారులను మార్చేశారు. వీటితో పాటు ఆడిట్ (31), నీటిపారుదల (35), సాంకేతిక విద్య (34), గణాంకాల శాఖ (22), భూ కమతాల కమిషనరేట్ (20), జీఎస్టీ (14), అలాగే వైద్య, ఆరోగ్య, స్థానిక స్వపరిపాలనా శాఖల్లోనూ భారీ ఎత్తున స్థానచలనాలు జరిగాయి. ఆన్లైన్ బదిలీలు కచ్చితంగా అమలు చేయాల్సిన శాఖల్లో సైతం, నేరుగా ఉన్నతాధికారుల నుంచే ఉత్తర్వులు రావడం గమనార్హం.రాజకీయ జోక్యం ఉందా?కొత్త మంత్రులు ఇంకా బాధ్యతలు స్వీకరించకముందే ఈ స్థాయిలో మార్పులు జరగడం వెనుక ప్రభుత్వ అనుకూల ఉద్యోగ సంఘాల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమకు అనుకూలమైన పోస్టింగులు దక్కించుకునేందుకే పక్కా ప్రణాళికతో ఈ బదిలీల పర్వానికి తెరతీశారని ‘సెటో’ చైర్మన్ చవర జయకుమార్, ఎన్జీఓ యూనియన్ నేత ఎం.వి. శశిధరన్ తీవ్రంగా మండిపడ్డారు. అయితే, ఎన్జీఓ అసోసియేషన్ ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. పదేళ్లుగా ఒకేచోట పాతుకుపోయిన వారినే బదిలీ చేస్తున్నామని, ఇది కేవలం సాధారణ పరిపాలనా ప్రక్రియ మాత్రమేనని స్పష్టం చేసింది.భగ్గుమంటున్న ఉద్యోగ సంఘాలుఈ మూకుమ్మడి బదిలీలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పలు ఉద్యోగ సంఘాలు ప్రత్యక్ష ఆందోళనలకు సిద్ధమయ్యాయి. సోమవారం అలప్పుజ కలెక్టరేట్తో పాటు పలు కీలక ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని జాయింట్ కౌన్సిల్ వంటి వామపక్ష అనుబంధ సంఘాలు నిర్ణయించాయి. తాము సాధారణ బదిలీలకు వ్యతిరేకం కాదని, కానీ రాజకీయ ప్రేరేపిత, అక్రమ బదిలీలను మాత్రమే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని జాయింట్ కౌన్సిల్ నేత హరిదాస్ స్పష్టం చేశారు. ఈ అనూహ్య పరిణామాలు రాబోయే రోజుల్లో ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య మరింత ఘర్షణకు దారితీసే అవకాశం ఉంది.ఇది కూడా చదవండి: మత్తు వల్లకాడుగా మారుతున్న కేరళ -
10 ప్లేట్ల చికెన్ బిర్యానీ.. ఉచితంగా అందించాలి
చెన్నై: పుదుచ్చేరిలోని లాస్పేట్, శంకర దాస్ స్వామిగళ్ ఠాకర్లో నివసించే సుందరకుమా ర మణికందన్, తన స్నేహితునితో కలిసి ముత్తియల్పేట్లోని మహాత్మా గాంధీ రోడ్డులో ఉన్న ’బిర్యానీ – కో’ అనే రెస్టారెంట్కు భోజనానికి వెళ్లాడు. అక్కడ అతను బిర్యానీ, ఒక సైడ్ డిష్ ఆర్డర్ చేసి, డబ్బు చెల్లించాడు. అయితే, తాను ఆర్డర్ చేసిన ఆహారంలో చనిపోయిన ఒక కీటకాన్ని (ఈగను) చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు.దీని తరువాత, అతను ఈ విషయం గురించి రెస్టారెంట్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. యాజమాన్యం సరిగ్గా స్పందించలేదు. ఫలితంగా, అతను పుదుచ్చే రి జిల్లా వినియోగదారుల కమిషన్లో కేసు దాఖలు చేశాడు. కమిషన్ ఆ కంపెనీకి ఒక నోటీసు పంపింది. అది అందుకున్నప్పటికీ, వారు కమిషన్ ముందు హాజరు కాలేదు , ఎటువంటి వివరణ ఇవ్వ లేదు. పుదుచ్చేరి జిల్లా వినియోగదారుల వ్యవహారాల అధ్యక్షుడు ముత్తు వేల్ , సభ్యులు సువిత, అరుముగంతో కూడిన ధర్మాసనం ఈ కేసును తిరిగి విచారించింది. పత్రాలను సమీక్షించగా, బిర్యానీ – కో అందించిన ఆహారంలో పురుగులు ఉన్నట్లు నిర్ధారించబడింది. అంతేకాకుండా, పరిశుభ్రమైన, సురక్షితమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించనందుకు బిర్యానీ అండ్ కో సంస్థపై చర్య తీసుకోవాల ని ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ఆహారంలోని లోపం, నాణ్యత తక్కువగా ఉన్నందున, ఫిర్యాదుదారు సుందర కుమార మణికందన్ నష్టపరిహారంగా రూ. 10,000 , న్యాయ ఖర్చుల నిమిత్తం అదనంగా రూ. 3,000 చెల్లించాలని వినియోగదారుల కోర్టు ఆదేశించింది.అంతేకాకుండా, భవిష్యత్తులో బిర్యానీ అండ్ కో లో ఎలాంటి సేవ, ఆహార నాణ్యత సమస్యలు తలెత్తకుండా నివారించడానికి, ఫిర్యాదుదారుడు మర్యాదపూర్వకంగా 5 వారాల పాటు ప్రతి ఆదివారం 2 ప్లేట్ల చికెన్ బిర్యానీని (మొత్తం 10 ప్లేట్ల బిర్యానీ) ఉచితంగా అందించాలని ఆదేశించింది. ఈ తీర్పు ఇప్పుడు పుదుచ్చేరిలో చర్చనీయాంశంగా మారింది. -
మత్తు వల్లకాడుగా మారుతున్న కేరళ
తిరువనంతపురం: దేవుని సొంత దేశంగా పేరొందిన ‘కేరళ’ ఇప్పుడు డ్రగ్స్ మత్తులో తూగుతోంది. ఒకప్పుడు వీధుల్లో మాత్రమే గంజాయి కనిపించేది. ఇప్పుడైతే ఏకంగా ఫైవ్ స్టార్ హోటళ్లలో విలాసవంతమైన ‘ఎండీఎంఏ’ డ్రగ్ పార్టీలు దర్శనమిస్తున్నాయి. 590 కిలోమీటర్ల భారీ తీరప్రాంతం, మారుమూల రైల్వే నెట్వర్క్ను వాడుకుంటూ కొకైన్, హెరాయిన్ వంటి సింథటిక్ డ్రగ్స్ కేరళకు వెల్లువలా పోటెత్తుతున్నాయని ‘మాతృభూమి’ తన కథనంలో పేర్కొంది. వలస కార్మికులను పావులుగా వాడుకుంటూ, ఎలైట్ క్లాస్ ప్రజలే లక్ష్యంగా సాగుతున్న ఈ హైటెక్ డ్రగ్ మాఫియా వ్యవహారం ఇప్పుడు పోలీసులకు, కేంద్ర దర్యాప్తు సంస్థలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కేవలం డ్రగ్స్ రవాణా కేంద్రంగానే కాకుండా.. భారీ మాదకద్రవ్యాల వినియోగ మార్కెట్గా కేరళ ఎలా మారిందో దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి.గంజాయి నుంచి సింథటిక్ డ్రగ్స్ వైపు.. కేరళలో డ్రగ్స్ వినియోగం మరింతగా పెరిగిపోయింది. గంజాయి కన్నా తక్కువ స్థలం ఆక్రమించే, దాచడానికి సులభంగా ఉండే హెరాయిన్, ఎండీఎంఏ, ఎక్స్టసీ వంటి హై-ఎండ్ సింథటిక్ డ్రగ్స్ వైపు స్మగ్లర్లు మొగ్గుచూపుతున్నారు. హెరాయిన్కు వాసన లేకపోవడం, స్మగ్లర్లకు భారీగా లాభాలు రావడం దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా కొచ్చి వంటి నగరాల్లో విలాసవంతమైన ఫైవ్ స్టార్ హోటళ్లలో ప్రైవేట్ పార్టీల ముసుగులో డాక్టర్లు, న్యాయవాదులు, వ్యాపారవేత్తలు డ్రగ్స్ మత్తులో మునిగితేలుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్లో కొచ్చిలో ఏకంగా 183.55 గ్రాముల ఎండీఎంఏ, 93.51 గ్రాముల ఎక్స్టసీ పిల్స్తో కెవిన్ బి. మాథ్యూ అనే వ్యక్తి పట్టుబడటం కలకలం రేపింది. ఆ తర్వాత మార్చి 28న కడవంత్రలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో పోలీసులు జరిపిన దాడుల్లో భారీగా కొకైన్, మెథాంఫెటమైన్ పట్టుబడటం ఈ హై-ప్రొఫైల్ నెట్వర్క్ తీవ్రతను కళ్లకుకట్టింది.డ్రగ్ కొరియర్లుగా వలస కూలీలు.. ఎలైట్ పార్టీల సంగతి పక్కన పెడితే.. ఈ డ్రగ్ నెట్వర్క్లో వలస కార్మికులను పావులుగా వాడుతుండటం దర్యాప్తు సంస్థలను మరింత కలవరపెడుతోంది. అస్సాం, ఇతర ఈశాన్య రాష్ట్రాల నుంచి కేరళకు పనుల కోసం వచ్చే అమాయక కూలీలను ఏజెంట్లు బెదిరిస్తున్నారు. తాము చెప్పినట్లు వినకపోతే ఉద్యోగాలు పీకేస్తామని, సొంతూళ్లకు పంపేస్తామని భయపెట్టి, వారిని డ్రగ్స్ కొరియర్లుగా మారుస్తున్నారు. గత 18 నెలల కాలంలోనే డ్రగ్స్ కేసుల్లో దాదాపు 103 మంది వలస కార్మికులు అరెస్ట్ కావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. మాదకద్రవ్యాల పంపిణీ కోసం వీరు ‘డెడ్ డ్రాప్స్’ అనే సరికొత్త, అత్యంత పకడ్బందీ వ్యూహాన్ని వాడుతున్నారు. కొరియర్లు డ్రగ్స్ ఉన్న బ్యాగులను తమ వద్ద ఉంచుకోకుండా, రైల్వే స్టేషన్లలో ముందుగా మాట్లాడుకున్న రహస్య ప్రదేశాల్లో వదిలేసి వెళ్లిపోతారు. ఆ తర్వాత స్థానిక డిస్ట్రిబ్యూటర్లు వచ్చి వాటిని తీసుకెళ్తారు. దీనివల్ల అసలు స్మగ్లర్ల మూలాలను పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారింది.అంతర్రాష్ట్ర ముఠాల వలయం.. ఈ డ్రగ్ మాఫియా మూలాలు కేవలం కేరళకే పరిమితం కాలేదు. జాతీయ, అంతర్జాతీయ ముఠాలతో వీరికి లోతైన సంబంధాలున్నాయి. కొచ్చిలోకి ప్రవేశిస్తున్న ఎండీఎంఏ, మెథాంఫెటమైన్లో ఎక్కువ భాగం బెంగళూరు, కర్ణాటకలోని ఇతర ప్రాంతాల నుంచి వస్తుండగా.. హెరాయిన్ సరఫరా ఢిల్లీ, ఉత్తరాది రాష్ట్రాలతో ముడిపడి ఉంది. గోల్డెన్ క్రెసెంట్ (ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్), గోల్డెన్ ట్రయాంగిల్ (మయన్మార్, థాయ్లాండ్) లాంటి అంతర్జాతీయ మార్గాల నుంచి వచ్చే కార్టెల్స్ కేరళను ఒక ప్రధాన లాంచ్ప్యాడ్గా ఎంచుకున్నాయి. ఇక్కడికి చేరిన డ్రగ్స్ను చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి, పొరుగున ఉన్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్తో పాటు ఈశాన్య రాష్ట్రాలకు సైతం తరలిస్తున్నారు. యువతలో పెరుగుతున్న ఆదాయం, గ్లోబల్ నైట్లైఫ్ సంస్కృతిపై ఆకర్షణ ఈ మార్కెట్ విస్తరణకు ఆజ్యం పోస్తున్నాయి. నిఘా పెంచినా, రైల్వే స్టేషన్లలో తనిఖీలు ముమ్మరం చేసినా, ఈ భారీ డిమాండ్ ముందు భద్రతా సంస్థల ప్రయత్నాలు సరిపోవడం లేదని ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు చెబుతున్నారు.ఇది కూడా చదవండి: Watermelon Death: 70 శాతంతో పాస్ .. చూసేందుకే లేవు చిట్టి తల్లీ..! -
విజయ్కు స్టాలిన్ తొలి కౌంటర్
చెన్నై: తమిళనాడులో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు విజయ్ను మాజీ సీఎం స్టాలిన్ అభినందించిన వెంటనే కౌంటర్ ఇచ్చారు. సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత విజయ్ తన ప్రసంగంలో చేసిన కొన్ని వ్యాఖ్యలపై స్టాలిన్ ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ అప్పులపై విజయ్ శ్వేతపత్రం విడుదల చేస్తామని కామెంట్స్ చేశారు.ఈ నేపథ్యంలో తమిళనాడు అప్పులపై స్టాలిన్ స్పందిస్తూ..ప్రభుత్వానికి రూ.10 లక్షల కోట్ల అప్పుంది, ఖజానా ఖాళీగా ఉందని చెప్పడాన్ని తప్పుపట్టారు. అప్పులు పరిమితికి లోబడే ఉన్నాయన్నారు. కోవిడ్ లాంటి విపత్తును ఎదుర్కొని, నిధులకు సహకరించని బీజేపీని తట్టుకుని దీటుగా నిలబడ్డామని బదులిచ్చారు. డబ్బు పుష్కలంగా ఉందని, ప్రస్తుతం కావాల్సింది సంక్షేమ పథకాల అమలు చేయడమేనని చెప్పుకొచ్చారు. ఇవ్వాలనే సంకల్పం, పాలించే సామర్థ్యం అవసరం అంటూ కౌంటరిచ్చారు.ఇదిలా ఉండగా.. ఈ పరిణామం తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలను తెరపైకి తెస్తోంది. అప్పు రూ.10 లక్షల కోట్లకు చేరుకోవడం వల్ల కొత్త ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణను పాటించడం పెద్ద సవాలు అవుతుంది. ఇది డీఎంకే చేసిన ఖర్చులపై ప్రజా చర్చను మరింత పెంచుతుంది. మరోవైపు.. డీఎంకే పాలనలో అమలు చేసిన పథకాల వల్ల అప్పు పెరిగిందని స్టాలిన్ చెబుతున్నారు. ప్రజలకు లభించిన ప్రయోజనాలను కూడా ఆయన గుర్తు చేస్తున్నారు.విజయ్ తొలి పాలనలో ప్రాధాన్యతలుఉచిత విద్యుత్: 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, ఇది మధ్యతరగతి మరియు రైతులకు ఉపశమనం.మహిళల భద్రత: ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు, ఇది కొత్త ప్రభుత్వానికి ప్రజా విశ్వాసాన్ని పెంచే అంశం.డ్రగ్ నియంత్రణ: యువతలో మత్తు పదార్థాల సమస్యను ఎదుర్కోవడానికి ప్రత్యేక చర్యలు.విద్య, ఆరోగ్యం, నీరు: ప్రాథమిక సమస్యలపై దృష్టి పెట్టడం ద్వారా ప్రజల అంచనాలను తీర్చే ప్రయత్నం.రైతులు, మత్స్యకారులు: సంక్షేమ పథకాల ద్వారా గ్రామీణ వర్గాలను ఆకర్షించడం. -
విజయ్కు ప్రముఖుల అభినందనలు
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన టీవీకే చీఫ్ జోసెఫ్ విజయ్కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులతోపాటు శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిస్సనాయకే కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్లో ప్రధాని మోదీ..‘తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తిరు సి.జోసెఫ్కు అభినందనలు. మీ పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రజల జీవితాలను మెరుగుపర్చేందుకు కలిసి ముందుకు సాగుదాం’అని పేర్కొన్నారు. అనంతరం ప్రధాని మోదీ విజయ్తో ఫోన్లో మాట్లాడి, అభినందనలు తెలిపారు. ‘టీవీకే చీఫ్ విజయ్కు అభినందనలు. తమిళనాడు కొత్త తరాన్ని, కొత్త గళాన్ని ఎంపిక చేసుకుంది. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కోరుకుంటున్నాను’అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎక్స్లో తెలిపారు. శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిస్సనాయకే ఆదివారం విజయ్కు అభినందనలు తెలిపారు. శ్రీలంక, తమిళనాడు నడుమ బలమైన చారిత్రక, సాంస్కృతిక సంబంధాలున్న విషయాన్ని ఆయన ఎక్స్లో గుర్తు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా విజయ్ను అభినందించారు. ‘టీవీకే అధినేత నాయకత్వంలో రాష్ట్ర రాజకీయ, సామాజికంగా విజయవంతంగా ముందుకు సాగుతుందన్న విశ్వాసం ఉంది’అని పేర్కొన్నారు. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్యాదవ్,, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్లతోపాటు సినీనటులు కమల్ హాసన్, ఆర్.మాధవన్, సత్యరాజ్, ప్రకాశ్ రాజ్ టీవీకే చీఫ్, తమిళనాడు సీఎం విజయ్కు అభినందనలు తెలిపారు. -
నేడు సోమ్నాథ్ ఆలయంపై ఎయిర్ షో
గిర్ సోమ్నాథ్: గుజరాత్లోని ప్రఖ్యాత సోమ్నాథ్ ఆలయంపై భారత వైమానిక దళం సోమవారం సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీం ఎయిర్ షో చేపట్టనుంది. 15 నిమిషాలపాటు కొనసాగే ఈ షోలో ఎంకే–132 విమానాలతో పైలట్లు ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలను ప్రదర్శిస్తారు. గగనతలంలో కాషాయం, తెలుపు, పచ్చని రంగులతో కూడిన జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. చేతక్ హెలికాప్టర్తో ఆలయంపై పూలవాన కురిపిస్తారు. సోమ్నాథ్ ఆలయ పునర్నిర్మాణానికి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా అమృత్ మహోత్సవాలు జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ ఉత్సవాలకు సోమవారం ప్రధాని మోదీ హాజరు కానున్నారు. -
ప్రభుత్వం ఏర్పాటు చేయండి
గువాహటి: అస్సాంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా హిమంత బిశ్వ శర్మను గవర్నర్ లక్ష్మణ్ ఆచార్య ఆదివారం ఆహ్వానించారు. దీంతో రాష్ట్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి ఎన్డీయేకు మార్గం సుగమమైంది. అంతకుముందు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే శాసనసభాపక్ష నాయకుడిగా హిమంత ఎన్నికయ్యారు. 12న హిమంత, కొందరు మంత్రులతో గవర్నర్ ఆచార్య ప్రమాణం చేయిస్తారని లోక్భవన్ తెలిపింది. ఖానాపారాలోని కళాశాల మైదానంలో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా తదితరులు హాజరు కానున్నారు. -
పంజాబ్ మంత్రికి 7 రోజుల ఈడీ కస్టడీ
గురుగ్రామ్: పంజాబ్ మంత్రి సంజీవ్ అరోరాను గురుగ్రామ్లోని ప్రత్యేక కోర్టు ఆదివారం ఏడు రోజుల ఈడీ కస్టడీకి అనుమతించింది. రూ.100 కోట్ల జీఎస్టీ కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలతో శనివారం ఈడీ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు. గురుగ్రామ్ కేంద్రంగా పనిచేసే హాంప్టన్ స్కై రియాల్టీ లిమిటెడ్ (హెచ్ఎస్ ఆర్ఎల్) కంపెనీకి సంబంధించిన సంస్థలపై పూర్తి యజమానిగా, నియంత్రణాధికారిగా అరోరా వ్యవహరిస్తున్నారని ఈడీ పేర్కొంది. అవకతవకల వ్యవహారంలో అరోరా పాత్ర కీలకంగా ఉందని పేర్కొంది. నేరారోపణల్లో ఈయనతోపాటు, సహాయకుల ప్రమేయం ఎంతో తేల్చేందుకు ఈడీ కస్టడీ కోరడం సబబేనని జడ్జి తన ఉత్తర్వులో అభిప్రాయపడ్డారు. -
తమిళ సీఎంగా విజయ్ ప్రమాణం
సాక్షి, చెన్నై: తమిళనాడులో ద్రవిడ పార్టీల పరిపాలనా పర్వానికి తెరదించుతూ తమిళగ వెట్రి కళగం(టీవీకే) చీఫ్ సి.జోసెఫ్ విజయ్ ఆదివారం నూతన ప్రభుత్వాన్ని కొలువుతీర్చారు. ఆత్మీయులు, కుటుంబసభ్యులు, వేలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో టీవీకే అధ్యక్షుడు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గత 60 ఏళ్ల తమిళనాడు చరిత్రలో డీఎంకే, అన్నాడీఎంకే ప్రమేయం లేని ప్రభుత్వం అధికారంలోకి రావడం ఇదే తొలిసారి. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఉదయం 10.15 గంటలకు అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవం ఆరంభమైంది. విజయ్తో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ముఖ్యమంత్రిగా ప్రమాణంచేయించారు. టీవీకేలోని 9 మంది నేతలు మంత్రులుగా ప్రమాణంచేశారు. టీవీకే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ సైతం భాగస్వామిగా చేరిన నేపథ్యంలో ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేకంగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి విజయ్ తల్లిదండ్రులు ఎస్.ఎ.చంద్రశేఖర్, శోభ, తమిళనాడులో బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్, సినీ నటి త్రిష, వామపక్ష పార్టీల రాష్ట్ర ముఖ్యనేతలు ముందువరసలో కూర్చుని ప్రమాణస్వీకారాన్ని చూశారు. పలువురు ప్రముఖులు, తమిళ సినీతారలు, టీవీకే నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అభిమానుల ‘విజిల్’ మోతలు, ‘సీఎం విజయ్’, ‘దళపతి’ నినాదాలతో ఇండోర్ స్టేడియం మార్మోగిపోయింది. విజయ్ తన మంత్రివర్గంలో యువత, అనుభవజ్ఞులకు ప్రాధాన్యమిచ్చారు. సీఎంగా ప్రమాణంచేశాక విజయ్ ఉద్వేగంగా ప్రసంగించారు. నిజమైన లౌకికవాదం, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండే పాలనకు సంబంధించిన నూతన శకం ఇప్పుడే ప్రారంభమైందని స్పష్టంచేశారు. తనదైన శైలిలో ప్రమాణం చేయబోయి.. విజయ్తో సీఎంగా ప్రమాణం చేయించేందుకు ఆయనను పోడియం వద్దకు గవర్నర్ ఆహ్వానించారు. ‘నేను’ అని గవర్నర్ అందివ్వగా అధికారికంగా ఇచ్చిన ప్రమాణపత్రాన్ని కాదని సొంతంగా తనదైన శైలిలో ప్రమాణంచేసేందుకు విజయ్ ప్రయ తి్నంచారు. వెంటనే గమనించిన గవర్నర్ సున్నితంగా అడ్డుకుని రాజ్యాంగంలో పేర్కొన్న శైలిలోనే ప్రమాణం చేయాలని సూచించారు. తొలి రోజే వివాదం ప్రమాణ స్వీకారోత్సవంలో గాయకులు వందేమాతరంలోని మొత్తం ఆరు చరణాలను ఆలపించడం విశేషం. సాధారణంగా అధికారిక కార్యక్రమంలో మొదటి రెండు చరణాలను ఆలపిస్తారు. అయితే, మొత్తం ఆరు చరణాలను ఆలపించాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ప్రమాణ స్వీకార వేడుకలో తమిళ తల్లి గీతం.. తమిళ్ తాయ్ వాళ్తుకు మూడో స్థానం కల్పించడాన్ని సీపీఐ, డీఎంకేలు తీవ్రంగా పరిగణించాయి. వందేమాతరం, జనగణమన అనంతరం తమిళ్ తాయ్ వాళ్తు గీతాన్ని ఆలపించారు. ప్రాధాన్యతా క్రమంలో తమిళ గీతానికి మూడోస్థానం కల్పించడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.వీర పాండియన్, వీసీకే అధినేత థోల్ తిరుమావళవన్తోపాటు సీపీఎం, ఐయూఎంఎల్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. అసెంబ్లీలో ఇది పునరావృతం కాకుండా చూసుకోవాలని, తమిళ తల్లి గీతానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్చేశారు. అధికారిక కార్యక్రమాల్లో తమిళ తల్లి గీతాన్ని మొదట ఆలపించడం సంప్రదాయమని పీఎంకే వ్యవస్థాపకుడు ఎస్.రాందాస్ గుర్తుచేశారు.వేదికపై 3 సంతకాలు ప్రజలకు ఇచ్చిన 3 వాగ్దానాల అమలుకు ప్రమాణ స్వీకార వేదికపైనే విజయ్ శ్రీకారం చుట్టారు. గృహ వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్కు సంబంధించిన ఫైల్పై తొలి సంతకం చేశారు. మహిళల భద్రత కల్పించడానికి మహిళలతో ‘సింగా పెన్’ పేరిట ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేస్తూ మరో ఫైల్పై సంతకం చేశారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల మహమ్మారిని అరికట్టడమే లక్ష్యంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా దళం ఏర్పాటు కోసం మరో ఫైల్పై సంతకం చేశారు. తమకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్, వామపక్షాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. యువత, టీనేజర్లు, చిన్నారులకు విజయ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అత్యంత సీనియర్ నేత కె.ఎ.సెంగోట్టయన్, యువనేత డాక్టర్ కె.టి.ప్రభు, మహిళా నాయకురాలు ఎస్.కీర్తన, ఆధవ్ అర్జున, ఎన్.ఆనంద్, ఆర్.నిర్మల్ కుమార్, కె.జి.అరుణ్రాజ్, ఎ.రాజ్ మోహన్, పి.వెంకటరమణన్లు ప్రమాణంచేసి మంత్రివర్గంలో చేరారు.నేనొక్కడినే పవర్ సెంటర్ముఖ్యమంత్రిగా ప్రమాణంచేసిన విజయ్ వేదికపై తనదైన శైలిలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘నా గుండెల్లో నివసించే అభిమానులందరికీ వందనాలు. నేను రాజరిక కుటుంబం నుంచి రాలేదు., సినిమాల్లో రాణించాలని కష్టపడిన ఒక సాధారణ అసిస్టెంట్ డైరెక్టర్ కుమారుడిని. ఆకలి, పేదరికం అంటే నాకు బాగా తెలుసు. అందుకే ప్రజలను నా సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తా. తమిళప్రజలు నన్ను సొంత బిడ్డలా, అన్నగా, తమ్ముడిగా ఆదరించి సినిమాల్లో గొప్ప స్థానాన్ని ఇచ్చారు. ఆ రుణం తీర్చుకోవడానికే రాజకీయాల్లోకి వచ్చా. ప్రజల ఆశీస్సులతో ఈ పదవిలోకి వచ్చా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారింది. తమిళనాడు ప్రస్తుతం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి, మోయలేని భారాన్ని మనపై వదిలివెళ్లింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తాం. మా ప్రభుత్వం చీకటి ఒప్పందాలు చేయదు. రహస్యంగా ఎవర్నీ కలవదు. ఏది చేసినా ప్రజల సాక్షిగా బహిరంగంగానే చేస్తాం. ప్రజల సొమ్ము నుంచి ఒక్క రూపాయి కూడా ముట్టుకోను. నేను తప్పు చేయను. ఎవరినీ చేయనివ్వను. నా ప్రభుత్వంలో అధికారులైనా, మంత్రులైనా ఎవరైనా ఒకే మాట మీద నడవాలి. ఇక్కడ పవర్ సెంటర్లు ఉండవు. అంతా నా నాయకత్వంలోనే నడుస్తుంది. నేనే ఏకైక పవర్ సెంటర్. గెలవగానే ఆటలు ఆడదాం అనుకునే ఆలోచన ఎవరికైనా ఉంటే ఇప్పుడే ఆ ఆలోచన మానుకోండి. హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులందరి కోసం సమప్రాధాన్యంతో పరిపాలిస్తా. హామీల అమలుకు కొంత సమయం ఇవ్వండి. నేను దేవదూతను కాదు. సాధారణమైన వ్యక్తిని. విద్యార్థుల కోసం విజయ్ మామ మంచి పనులు చేస్తాడు. భవిష్యత్తులో నాకు అడ్డంకులు సృష్టించేవారు కూడా నాకు శ్రేయోభిలాషులే’’ అని విజయ్ వ్యాఖ్యానించారు. దేవుడి పేరిట ప్రమాణం ప్రమాణ స్వీకారంలో దళపతి విజయ్ సరికొత్త ఆహార్యంతో ఆకట్టుకున్నారు. సాధారణంగా నిత్యం ధరించే తెల్లచొక్కా, ఖాకీ రంగు ప్యాంటు కాకుండా ముదురు రంగు ప్యాంటు, తెల్లచొక్కా, దానిపై నలుపురంగు సూట్ ధరించారు. విజయ్ సహా మంత్రులందరూ దేవుడి పేరిట ప్రమాణం చేయడం విశేషం. రాహుల్ గాం«దీతోపాటు కేబినెట్ సహచరులతో, పార్టీ నాయకులతో విజయ్ సెలీ్ఫలు దిగారు. గవర్నర్తో గ్రూప్ ఫొటో సందర్భంగా వేదికపై అడ్డుగా ఉన్న పెద్ద బల్లను పక్కకు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ సందర్భంగా విజయ్ సైతం బల్లను పట్టుకుని పక్కకు తీసుకెళ్లారు. శాసనసభ తొలి సమావేశం సోమవారం ఉదయం ప్రారంభం కానుంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సభలో ప్రమాణం చేస్తారు. టీవీకే ఎమ్మెల్యే కరుప్పయ్య ప్రొటెం స్పీకర్గా ఆదివారం లోక్భవన్లో ప్రమాణం చేశారు. తిరుచ్చి ఈస్ట్ ఎమ్మెల్యేగా రాజీనామా అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్తోపాటు తిరుచ్చి ఈస్ట్ నుంచి విజయ్ ఎమ్మెల్యేగా గెలిచారు. నిబంధనల ప్రకారం ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉండగా, తిరుచ్చి ఈస్ట్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇకపై పెరంబూర్ ఎమ్మెల్యేగానే ఆయన కొనసాగుతారు. ఈ మేరకు అసెంబ్లీ ప్రిన్సిపల్ సెక్రెటరీకి లేఖ పంపించారు. తిరుచ్చి ఈస్ట్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాకే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మొదటిసారిగా సచివాలయానికి రాక ప్రమాణ స్వీకారం తర్వాత సీఎం విజయ్ సచివాలయానికి చేరుకున్నారు. అనంతరం సీఎం చాంబర్లో విజయ్ ఆసీనులయ్యారు. కొన్ని అధికారిక పత్రాలపై సంతకాలు చేశారు. సీఎం హోదాలో తొలి సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళ భద్రతకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. డ్రగ్స్ కేసుల్లో దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
అబ్కే బార్ తెలంగాణ
బెంగాల్లో బీజేపీ విజయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అక్కడ రాజకీయ పార్టీల ఓటమి జరగలేదు.. ఒక రాజకీయ నీతి పరాజయం పాలైంది. కాంగ్రెస్ పార్టీ దేశంలో విభజన రాజకీయ శక్తులకు కేంద్రంగా మారింది. ముస్లిం లీగ్ కంటే కూడా కఠిన వైఖరితో ముందుకు వెళ్తోంది. దేశంలో ఎక్కడైనా కాంగ్రెస్ మోడల్ ఒకటే. ముందు అబద్ధపు హామీలిస్తారు. ఆ తర్వాత అంతే సులభంగా వాటిని మరిచిపోతారు.సాక్షి, హైదరాబాద్: రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని అఖండ మెజారిటీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. పశ్చిమబెంగాల్లో బీజేపీ చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్నాక తెలంగాణలోనూ ఆ గెలుపు ప్రకంపనలు కనిపిస్తున్నాయన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ విశ్వాసఘాతుకం, హామీల అమల్లో వైఫల్యం, కుటుంబ రాజకీయాల పట్ల విసిగిపోయిన తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్స్లో రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. ‘నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా... మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణలో బీజేపీవైపు గాలిమార్పు స్పష్టంగా గోచరిస్తోందన్నారు. ‘అబ్కీ బార్ తెలంగాణ’ (ఇక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం) అంటూ సభికులతో మోదీ నినాదాలు చేయించారు. దశాబ్దాల కింద బీజేపీకి ఎన్నో రాష్ట్రాల్లో ఆదరణ లభించలేదని, అయితే దేశవ్యాప్తంగా బీజేపీకి రెండుసీట్లు ఉన్నప్పుడు ఒకటి తెలంగాణలో వచ్చిందని గుర్తుచేశారు. ఆ విధంగా బీజేపీ చరిత్రలో తెలంగాణకు ప్రత్యేకస్థానం ఉందన్నారు. ఇప్పుడు దేశం నలుమూలలా బీజేపీపై ప్రజల ఆశీర్వాదం పెరుగుతోందని, బీజేపీ గుడ్గవర్నెన్స్ మోడల్పై ఎన్నికల్లో ప్రజలు ఓటు ముద్రవేశారన్నారు. తెలంగాణ అలాంటి ప్రదేశమైనందున ఇప్పుడు 8 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలున్నారని, ఇక అధికారానికి రావడమే తరువాయి అని చెప్పారు. బీజేపీ అభివృద్ధి మోడల్పై విశ్వాసం దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ధి మోడల్, సుపరిపాలనపై మళ్లీ మళ్లీ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని మోదీ చెప్పారు. అస్సాంలో బీజేపీ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధించిందని, పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా అదే విషయం స్పష్టంగా చెబుతున్నారన్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం కేవలం రాజకీయ గెలుపు మాత్రమే కాదని, ప్రజలను ఏళ్ల పాటు బంధించిన కుటుంబ, నియంతృత్వ రాజకీయాలపై ప్రజలు ఇచ్చిన తీర్పు అని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ అవినీతి, కుటుంబవాదం, రాజ్యాంగ సంస్థలను బలహీనపరిచే రాజకీయాలకు మారుపేరుగా మారిందని ధ్వజమెత్తారు. అదే మార్గంలో తృణమూల్ కాంగ్రెస్ కూడా నడిచిందని, ఇప్పుడు ప్రజలు అలాంటి రాజకీయాలను తిరస్కరిస్తున్నారని అన్నారు. అయితే బెంగాల్లో బీజేపీ విజయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, అక్కడ రాజకీయ పార్టీల ఓటమి జరగలేదని, ఒక రాజకీయ నీతి పరాజయం పాలైందని మోదీ చెప్పారు. ప్రధాని మోదీకి జ్ఞాపికను అందజేస్తున్న సీఎం రేవంత్రెడ్డి. చిత్రంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా కాంగ్రెస్ది విభజన రాజకీయం కాంగ్రెస్ పార్టీ దేశంలో విభజన రాజకీయ శక్తులకు కేంద్రంగా మారిందని ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మావోయిస్టు భావజాలాన్ని ప్రోత్సహించే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని, ముస్లిం లీగ్ కంటే కూడా కఠిన వైఖరితో ముందుకెళ్తోందని ఆరోపించారు. అందుకే ప్రజలు కాంగ్రెస్ను ‘ముస్లిం లీగ్ మావోయిస్టు కాంగ్రెస్’ (ఎంఎంసీ)గా అభివరి్ణస్తున్నారని ఎద్దేవా చేశారు. మావోయిస్టు ఉగ్రవాదం కారణంగా దేశం ఎన్నో నష్టాలు చవిచూసిందని, తెలంగాణ కూడా దశాబ్దాల పాటు బాధలు అనుభవించిందన్నారు. కాంగ్రెస్, వామపక్షాలు మావోయిస్టులకు భావజాల పరంగా మద్దతు ఇవ్వడం వల్లే ఈ సమస్య ఇంతకాలం కొనసాగిందని చెప్పారు. తెలంగాణ పోలీసులకు పూర్తిస్థాయి స్వేచ్ఛ ఇచ్చి ఉంటే మావోయిస్టు ఉగ్రవాదాన్ని చాలాకాలం క్రితమే అంతం చేసేవారన్నారు. ‘మావోయిస్టు తీవ్రవాదంతో దేశానికి ఎంతో నష్టం జరిగింది. తెలంగాణలోనూ వారి తీవ్రవాద చర్యలతో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. మావోవాది అంతిమ ఘడియలు సమీపించినా నక్సల్వాదిని రక్షించే పనిలో పడ్డారు. కాంగ్రెస్ గత 12 ఏళ్లు కేంద్రంతోపాటు కలిసి పనిచేసే ఉంటే ఎప్పుడో మావోయిస్టుల నుంచి విముక్తి లభించి ఉండేది. ఎన్డీఏ ప్రభుత్వ కృషితో ఇప్పుడు తెలంగాణ మావోయిస్టుల నుంచి విముక్తి దిశగా వెళ్తోందని చెప్పారు. ముందుచూపుతో, వికసిత్ తెలంగాణ సాధన దిశగా కృషిచేస్తోందన్నారు. బీజేపీ అభివృద్ధి, ఉపాధి కల్పనపై దృష్టి పెడుతుంటే కాంగ్రెస్ మాత్రం ప్రజలను మోసం చేసే రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ‘ప్రస్తుతం దేశంలో కేవలం మూడు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ సీఎంలు ఉన్నారు. దేశంలో ఎక్కడైనా కాంగ్రెస్ మోడల్ ఒకటే. ముందుగా అబద్ధపు హామీలు ఇస్తారు.. ఆకాశం నుంచి చుక్కలు తెంచి ఇస్తామని చెబుతారు. ఆ తర్వాత అంతే సులభంగా వాటిని మరిచిపోతారు’ అని మండిపడ్డారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో కాంగ్రెస్ తన హామీలను అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేసిందని, తెలంగాణలో కూడా అదే జరుగుతోందని దుయ్యబట్టారు. -
ఐఐటీ భువనేశ్వర్లో ఏపీ విద్యార్థి మృతి
భువనేశ్వర్: ఐఐటీ భువనేశ్వర్ క్యాంపస్లో ప్రమాదవశాత్తు బాల్కనీ నుంచి జారి పడి పీహెచ్డీ విద్యార్థి మృతి చెందాడు. ఈ దుర్ఘటనతో క్యాంపస్లో విషాదం అలముకుంది. మృతుడు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన తనికొండ నిశాంత్ కుమార్గా గుర్తించారు. ఈయన ఆంధ్రప్రదేశ్లోని గూడూరు ప్రాంతానికి చెందిన వాడు. నిశాంత్ హాస్టల్ బ్రహ్మపుత్ర హాల్ ఏ బ్లాక్ 6వ అంతస్తు బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తు జారి కింద పడడంతో అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు. విధి నిర్వహణలో ఉన్న సెక్యూరిటీ గార్డు గమనించి అధికారులకు తెలియజేయడంతో తక్షణమే క్యాంపస్లోని సంజీవన్ ఆస్పత్రికి తరలించారు.అత్యవసర వైద్యం చేసి ఉన్నత చికిత్స కోసం ఐఐటీ అంబులెన్స్ ద్వారా మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్య బృందం పరీక్షించి విద్యార్థి అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించింది. క్యాంపస్ అధికార వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు జట్నీ ఠాణా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి కుటుంబీకులకు సమాచారం అందజేశారు. కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత పంచనామా ప్రక్రియ చేపట్టనున్నట్లు వివరించారు. -
చంద్రబాబు 30వ సారి హస్తినబాట
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సోమవారం మరోసారి ఢిల్లీకి రానున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ఆయన హస్తినబాట పట్టడం ఇది 30వ సారి. చంద్రబాబు సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి నేరుగా ఢిల్లీకి రానున్నారు. ఆయన తొలుత కేంద్ర హోంమంత్రి అమిత్షాతో భేటీ కానున్నారు. అనంతరం జల్శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ను కలవనున్నారు. ఆ తర్వాత కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సమ్మిట్కు హాజరుకానున్నారు. అయితే, సీఎం తరచూ ఢిల్లీ పర్యటనకు వచ్చి కేంద్ర మంత్రులను కలుస్తున్నా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో సాధించింది శూన్యమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు పరపతితో తెచ్చిందేమీ లేదు! చంద్రబాబు 2024లో సీఎం అయిన తర్వాత ఢిల్లీకి వచ్చి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం ఇది 13వ సారి. ఆయన ఢిల్లీకి వచి్చన ప్రతిసారి ‘రాష్ట్రం కోసం అది తెస్తాం.. ఇది తెస్తాం’ అని లీకులు ఇవ్వడం, పెద్ద ఎత్తున ప్రచారం చేయడం... కేంద్ర మంత్రులతో భేటీ ముగిశాక మాత్రం ‘కేంద్రం సహకరిస్తోంది. లేఖలు ఇచ్చాం’ అనే పాత పాటే పాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేసే సాధారణ స్కీములు మినహా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా చంద్రబాబు తెచ్చిందేమీ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.కేంద్రం ఇచ్చే నిధులే తప్ప, తనకున్న పరపతితో రాష్ట్రానికి అదనపు బడ్జెట్ కేటాయింపులు సాధించడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పోలవరం జాతీయ ప్రాజెక్టుకు ఇప్పటికీ నిధుల కేటాయింపులు, సాంకేతిక అనుమతుల విషయంలో జాప్యం జరుగుతుండటం దీనికి నిదర్శనమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ‘అయినను పోయిరావలె హస్తినకు‘ అన్న చందంగా చంద్రబాబు 30వ సారి ఢిల్లీ పర్యటనకు వస్తున్నారు. ఈసారి అయినా రాష్ట్ర ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తారా? లేక రాజకీయ అవసరాలే అజెండాగా ఈ పర్యటన ఉంటుందా? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
ఆర్థిక నేరాలకు అడ్డాగా..!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఆర్థిక నేరాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజాగా విడుదల చేసిన 2024 క్రైం ఇన్ ఇండియా నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా నమోదైన ఆర్థిక నేరాల కేసుల్లో తెలంగాణ తొలి స్థానంలో నిలిచింది. ఒకవైపు కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతుండగా.. దర్యాప్తు చేసి నేరస్తులపై చార్జిషిట్లు దాఖలు చేయడంలో రాష్ట్ర పోలీసుల పనితీరు జాతీయ సగటు కంటే చాలా తక్కువగా ఉన్నట్లు నమోదైంది. దేశంలోనే ఫస్ట్.. 45.5 శాతం జంప్ ఈ నివేదిక ప్రకారం 2024కుగాను దేశవ్యాప్తంగా 2,14,379 ఆర్థిక నేరాలు నమోదవగా అందులో అత్యధికంగా తెలంగాణలో 39,127 కేసులు నమోదయ్యాయి. అంటే దేశంలోని మొత్తం ఆర్థిక నేరాల్లో 18.2 శాతానికిపైగా కేసులు ఇక్కడే రికార్డయ్యాయి. 2023లో రాష్ట్రంలో 26,881 కేసులు నమోదవగా 2024 నాటికి ఈ సంఖ్య 39,127కు చేరింది. కేవలం ఏడాది వ్యవధిలోనే ఏకంగా 45.5 శాతం మేర కేసులు పెరిగాయి. చీటింగ్, ఫోర్జరీ కేసులే అధికం రాష్ట్రంలో నమోదైన మొత్తం 39,127 ఆర్థిక నేరాల్లో 38,312 కేసులు ఫోర్జరీ, చీటింగ్, ఫ్రాడ్కు సంబంధించినవే. ఆ తర్వాతి స్థానంలో నేరపూరిత నమ్మకద్రోహం కింద 801 కేసులు, నకిలీ కరెన్సీ కింద 14 కేసులు నమోదయ్యాయి. నేరాల రేటును (లక్ష జనాభాకు నమోదయ్యే కేసులు) పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. దేశవ్యాప్తంగా ఆర్థిక నేరాల సగటు రేటు లక్ష జనాభాకు 15.3 శాతంగా ఉంటే.. తెలంగాణలో ఇది ఏకంగా 102.1 శాతంగా నమోదైంది. మెట్రో నగరాల్లోకెల్లా హైదరాబాద్లోనే అధిక కేసులు.. దేశంలో ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై తదితర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో ఆర్థిక నేరాల సంఖ్య ఆందోళనకర స్థాయికి చేరింది. 2024కు సంబంధించి కేవలం హైదరాబాద్ మెట్రో నగర పరిధిలోనే ఏకంగా 61,007 కేసులు విచారణ దశలో ఉన్నట్లు పోలీసులు రికార్డులు సమరి్పంచారు. వాటిలో 95 శాతానికిపైగా నకిలీ పత్రాల సృష్టి, రియల్ ఎస్టేట్ మోసాలు, బ్యాంకింగ్ ఫ్రాడ్స్కు సంబంధించినవే ఉన్నాయి.దర్యాప్తులో నత్తనడక.. దేశవ్యాప్తంగా ఆర్థిక నేరాలకు సంబంధించి పోలీసులు దాఖలు చేసే చార్జిషిట్ రేటు సగటున 53.3 శాతంగా ఉంటే తెలంగాణలో అది కేవలం 39.8 శాతంగానే ఉంది. హైదరాబాద్లోనూ పరిస్థితి దాదాపు ఇదే విధంగా ఉంది. దర్యాప్తులో జాప్యం, సరైన ఆధారాలు సేకరించడంలో వెనుకబాటు వల్ల రాష్ట్రంలో చార్జిషీట్ల దాఖలు రేటు తక్కువగా ఉందని.. సకాలంలో శిక్షలు పడకపోవడం వల్లే ఇలాంటి నేరాలు భారీగా పెరుగుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
యూపీ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ ‘బెంగాల్’ వ్యూహం.. అదుర్స్..
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అద్భుతమైన వ్యూహంతో గెలుపొందిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు వచ్చే ఏడాది జరిగే అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై దృష్టి సారిస్తోంది. యూపీలో వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చిలో 403 స్థానాలకుగానూ ఎన్నికలు జరగాల్సి ఉంది. భవిష్యత్తులో కేంద్రంలో విజయం సాధించాలంటే యూపీలో గెలుపు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. యూపీలో 80 లోక్సభ స్థానాలు ఉంటాయి మరి. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు మరో 10 నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో బీజేపీ ఇప్పటి నుంచే ఎలాంటి వ్యూహాల్ని అమలు చేస్తోందంటే?పశ్చిమ బెంగాల్ వ్యూహాలనే ఆదర్శంగా తీసుకున్న బీజేపీ యూపీ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా మహిళలు, అత్యంత వెనుకబడిన వర్గాల ఓటు బ్యాంకులను బలోపేతం చేసుకునే పనిలో పడింది. బ్రాహ్మణ, జాట్, గుజ్జర్, లోధ్, పాస్వాన్, అత్యంత వెనుకబడిన కులాలకు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం ఇచ్చేలా ఆదివారం మంత్రివర్గ విస్తరణ చేసింది.అసెంబ్లీ ఎన్నికల ముందు చివరిసారి చేసిన మంత్రివర్గ విస్తరణగా దీన్ని చెప్పుకోవచ్చు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం భూపేంద్ర చౌదరి, సమాజ్వాదీ పార్టీ తిరుగుబాటు నేత మనోజ్ పాండేలకు మంత్రివర్గంలో చోటు ఇచ్చింది. రాష్ట్ర మంత్రులు అజిత్పాల్ సింగ్, సోమేంద్ర తోమర్లకు స్వతంత్ర హోదాతో రాష్ట్ర మంత్రులుగా పదోన్నతి ఇచ్చింది. కొత్తగా కృష్ణ పాస్వాన్, సురేంద్ర దిలేర్, హన్సరాజ్ విశ్వకర్మ, కైలాశ్ రాజ్పుత్ ప్రమాణ స్వీకారం చేశారు.ఈ విస్తరణ ద్వారా అసంతృప్త కులాలు, పార్టీ మారిన నేతలను సమతుల్యం చేయడంతో పాటు ప్రాంతీయ సమీకరణ సాధించే ప్రయత్నం చేసింది బీజేపీ. మంత్రివర్గ విస్తరణ చాలా కాలంగా వాయిదా పడటంతో యూపీ బీజేపీ నేతలు, ఢిల్లీలోని అగ్రనేతల మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. అయితే పార్టీ వర్గాలు అంతర్గత విభేదాలున్నాయన్న వార్తలను ఖండించాయి. పశ్చిమ బెంగాల్, అస్సాం ఎన్నికలపైనే పార్టీ దృష్టి ఉండటంతో ఆలస్యం జరిగిందని తెలిపాయి.భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే ఎన్నికల సమయంలోనే విస్తరణకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేశారు. వచ్చే ఎన్నికల దృష్ట్యా సంస్థాగత మార్పుల కోసం ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడు పంకజ్ చౌదరి ఆధ్వర్యంలో త్వరలో టీమ్ను ఏర్పాటు చేస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు.సామాజిక సమీకరణాలుమంత్రివర్గ విస్తరణ ద్వారా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పలు ఓటు బ్యాంకులకు సంకేతాలు పంపింది. మనోజ్ పాండేకు మంత్రివర్గంలో చోటు ఇచ్చి బ్రాహ్మణ వర్గాన్ని ఆకర్షించే ప్రయత్నం చేసింది.మనోజ్ పాండే, బృజేశ్ పాఠక్ల వంటి నేతలను మంత్రివర్గంలో కొనసాగించడం ద్వారా పెద్ద ఎత్తున ఉన్న బ్రాహ్మణ సమాజానికి సరైన సందేశం వెళ్తుందని పార్టీ భావిస్తోంది. యూజీసీ మార్గదర్శకాల వంటి అంశాల వల్ల ఆ వర్గం, భారతీయ జనతా పార్టీ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని పార్టీ అంచనా వేస్తోంది.అలాగే భూపేంద్ర చౌదరిని పశ్చిమ ఉత్తరప్రదేశ్ జాట్ ప్రతినిధిగా, సోమేంద్ర తోమర్ను గుజ్జర్ల ప్రతినిధిగా, కృష్ణ పస్వాన్ను దళిత-పాసీ వర్గ ప్రతినిధిగా, సురేంద్ర దిలేర్ను వాల్మీకి వర్గ ప్రతినిధిగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. లోధ్, విశ్వకర్మ వంటి వెనుకబడిన, అత్యంత వెనుకబడిన వర్గాలపైనా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ విస్తరణ ద్వారా యాదవేతర ఇతర వెనుకబడిన వర్గాల రాజకీయాలకు మించి సూక్ష్మ సామాజిక వర్గాలపై భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టిందనే సంకేతం ఇస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో లోతుపాట్లు పూడ్చే ప్రయత్నం చేస్తోంది. పశ్చిమ ఉత్తరప్రదేశ్లో జాట్ సమీకరణలు 2024లో స్థిరంగా లేవు. దళిత ఓట్లలో పెద్ద భాగం ప్రతిపక్షాలవైపు వెళ్లింది. అత్యంత వెనుకబడిన వర్గాలను ఆకర్షించే పీడీఏ నినాదం కూడా ప్రభావం చూపింది. ఈ సమస్యలను సరిచేయడమే విస్తరణ లక్ష్యంగా చెబుతున్నారు.మిషన్ 2027ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి అతిపెద్ద బలం యోగి ఆదిత్యనాథ్. రాష్ట్రంలో శాంతిభద్రతలు బలోపేతం చేసిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. అయితే ఉత్తరప్రదేశ్లో పరిపాలన ఒక్కటే విజయానికి సరిపోదని పార్టీ భావిస్తోంది. సామాజిక ప్రాతినిధ్యానికీ సమాన ప్రాధాన్యం ఇస్తోంది.పశ్చిమ బెంగాల్లో ఘన విజయం తర్వాత మహిళలు, అత్యంత వెనుకబడిన వర్గాలు, దళితులు, ప్రాంతీయ ఆకాంక్షలకు బలమైన ప్రాతినిధ్యం ఇచ్చే మోడల్ మరింత బాగా పనిచేస్తుందని పార్టీ అంచనా వేసింది. ఉత్తరప్రదేశ్లోని అన్ని ప్రధాన ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా ప్రాంతీయ సమతుల్యత సాధించే ప్రయత్నం కూడా చేస్తోంది.ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, పలువురు సీనియర్ మంత్రులు పూర్వాంచల్ ప్రాంతానికి చెందినవారు. ఈ సారి అవధ్, పశ్చిమ ప్రాంతాలకు ప్రాతినిధ్యం పెంచారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్ నుంచి జాట్, గుజ్జర్, పూర్వాంచల్ నుంచి రాజ్భర్, నిషాద్, మధ్య ఉత్తరప్రదేశ్ నుంచి కుర్మీ, పాల్ వర్గాల నేతలకు చోటు ఇచ్చి ప్రాంతాల వారీగా ఓటు బ్యాంకులను బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.ప్రభత్వ వ్యతిరేకతపై పోరుభారతీయ జనతా పార్టీ 2017 నుంచి అధికారంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకత సమస్యగా మారే అవకాశం ఉంది. 2024 సాధారణ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ ఊహించని విధంగా బీజేపీకి షాక్ ఇచ్చింది. ఎస్పీ భారీగా సీట్లు గెలుచుకుంది. 2027 ఎన్నికలపై ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో పంచాయతీ ఎన్నికలను బీజేపీ వాయిదా వేసింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు చోటు ఇవ్వడం ద్వారా పార్టీ మారాలని భావిస్తున్న నేతలకు కూడా సంకేతం పంపింది. ఈ విస్తరణ కేవలం మంత్రుల సంఖ్యను పెంచుకోవడానికి మాత్రమే కాదు. 2027 అధికార పోరాటానికి కీలక వ్యూహంగా కూడా భావిస్తున్నారు. -
సువేందు అలా చేయకుంటే.. మారణహోమం: టీఎంసీ బహిష్కృత నేత
కోల్కతా: టీఎంసీ బహిష్కృత నేత రిజుదత్తా బెంగాల్ ముఖ్యమంత్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం సువేందు అధికారి సంయమనంతో దాదాపు ఐదువేల మంది తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తల ప్రాణాలు కాపాడారన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం సువేందు తన వ్యక్తిగత సహాయకుడు దారుణ హత్యకు గురైనప్పటికీ, ప్రతీకారానికి పిలుపునివ్వకుండా శాంతిని పాటించారని లేదంటే భారీ హింస జరిగేదన్నారు.పశ్చిమబెంగాల్కు మమతా బెనర్జీ తర్వాత సువేందు అధికారే సీఎంగా అర్హుడైన వ్యక్తి అని కొనియాడారు. మమతా బెనర్జీని నందిగ్రామ్లో ఓడించిన రికార్డు ఆయనకు ఉందని, ఆయన రాజకీయ ప్రస్థానం అద్వితీయమని ప్రశంసల వర్షం కురిపించారు.ప్రైవేట్ సంస్థైన ఐ-ప్యాక్ చేతుల్లోకి టీఎంసీ వెళ్లిపోయిందని దీనికి మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ బాధ్యత వహించాలని దత్తా విమర్శించారు.పార్టీ ఓటమికి అభిషేక్ బెనర్జీ ఒంటెత్తు పోకడలే కారణమని కృష్ణేందు నారాయణ్ చౌదరి, అటిన్ ఘోష్ వంటి సీనియర్ నేతలు సైతం తృణముల్ కాంగ్రెస్ ఓటమికి కారణమన్నారు.అయితే రిజూదత్తా వ్యాఖ్యలపై టీఎంసీ స్పందించింది. ఇవన్నీ సదరు వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాలని, పార్టీకి వీటికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. పార్టీ అధికారికంగా ప్రకటించే అంశాలనే ప్రామాణికంగా తీసుకోవాలని కోరింది. కాగా రిజుదత్తా టీఎంసీ ప్రతినిధి క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డారనే నెపంతో ఆయనను పార్టీ ఆరేళ్లపాటు సస్పెండ్ చేసింది. కాగా ఎన్నికల ఫలితాల అనంతరం సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ రథ్ దారుణ హత్యకు గురయ్యారు. కారులో వెళుతున్న ఆయనను అడ్డగించిన దుండగులు పాయింట్ బ్లాక్ రేంజ్లో కాల్చిచంపారు. దీనిపై కన్నీటీ పర్యంతమైన సువేందు అధికారి నిందితులను ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టాది లేదని తేల్చిచెప్పారు. -
తిరుచిరాపల్లి ఈస్ట్ ఎమ్మెల్యే పదవికి విజయ్ రాజీనామా
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ ఆదివారం తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. శాసనసభ కార్యదర్శి డాక్టర్ కె.శ్రీనివాసన్ను మంత్రులు కేఏ సెంగొట్టైయన్, పి వెంకటరామణన్ కలిసి విజయ్కు సంబంధించిన రాజీనామా పత్రాన్ని అందజేశారు. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పెరంబూర్, తిరుచిరాపల్లి ఈస్ట్ అసెంబ్లీ స్థానాల నుంచి గెలిచారు. ఒక అభ్యర్థి రెండు స్థానాల్లో గెలిస్తే ఒక స్థానంలో కొనసాగాలని 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం పేర్కొంటోంది. దీంతో పెరంబూర్ నుంచి కొనసాగాలని విజయ్ నిర్ణయం తీసుకున్నారు.అంతకుముందు, విజయ్ తమిళనాడు 13వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం చెన్నైలోని చరిత్రాత్మక ఫోర్ట్ జార్జ్ సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. ప్రమాణ స్వీకారం అనంతరం విజయ్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం కొత్త ప్రారంభానికి, నిజమైన లౌకిక, సామాజిక న్యాయ యుగానికి నాంది అవుతుందని చెప్పారు. సినీ జీవితాన్ని వదిలి ప్రజల రుణం తీర్చుకునేందుకు రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తాను రాజ కుటుంబం నుంచి రాలేదని తెలిపారు.సీఎం విజయ్ సమీక్షా సమావేశంతమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతకుముందు విజయ్ చెన్నైలోని సలై రోడ్డులో ఉన్న పెరియార్ స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించారు. మరోవైపు, తమిళనాడు అసెంబ్లీ తాత్కాలిక స్పీకర్గా టీవీకే నాయకుడు ఎంవీ కరుప్పయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్, ముఖ్యమంత్రి విజయ్ పాల్గొన్నారు. త్వరలోనే విజయ్ శాసనసభలో బలాన్ని నిరూపించుకోనున్నారు. -
కేరళం సీఎం అభ్యర్థి ఫిక్స్.. రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్..?
తిరువనంతపురం: కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఫలితాలు వెలువడి దాదాపు వారం రోజులు గడుస్తోన్నా ఇంకా ముఖ్యమంత్రి ఎవరనే విషయం తేలలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళం ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేసీ వేణుగోపాల్ వైపు మెుగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో జరిగిన అధికారిక భేటీకి ముందే రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్తో విడిగా సమావేశమైనట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవి అంశమై ఇరు నేతలు సుధీర్గంగా చర్చలు జరపునున్నట్లు సమాచారం. కాగా కేరళం ముఖ్యమంత్రి విషయంలో కాంగ్రెస్ నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. వీడీ సతీశన్, రమేష్ చెన్నితల, కేసీ వేణుగోపాల్, శశిథరూర్లు సీఎం అభ్యర్థులుగా ప్రచారం జరిగింది.కాగా ఇటీవల వేణుగోపాల్కు వ్యతిరేకంగా కేరళలో పోస్టర్లు వెలిశాయి. దీని వెనుక సతీశన్ హస్తం ఉందనే ఆరోపణలు రావడంతో రాహుల్ గాంధీ ఆయనను నేరుగా ప్రశ్నించారు. వేణుగోపాల్ సీఎం కావడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు సతీశన్ అంగీకరించారు. మెుదటి నుంచి వేణుగోపాల్ ఎంపికను మరో కీలక నేత వీడీ సతీశన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వేణుగోపాల్ తన పదవిని ఉపయోగించి గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని అధిష్టానం వద్ద సైతం ఫిర్యాదు చేశారు.కాగా సతీషన్, రమేష్ చెన్నితల వంటి స్థానిక నేతలకు కేరళలో మంచి పట్టు ఉంది. ముఖ్యంగా ముస్లిం లీగ్ మద్దతు సైతం సతీశన్కు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇంత బలంగా సతీశన్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్ కేసీ వేణుగోపాల్ వైపే మెుగ్గు చూపుతున్నట్లు సమాచారం. రాబోయే రెండు రోజుల్లో పార్టీ శ్రేణులను ఒప్పించి కేసీ వేణుగోపాల్ను ముఖ్యమంత్రిగా ప్రకటించే దిశగా హైకమాండ్ ప్రయత్నాలు సైతం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే స్థానిక నేతల వ్యతిరేకతను కాంగ్రెస్ ఎలా అధిగమిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కాగా 140 స్థానాలు ఉన్న కేరళ అసెంబ్లీలో యూడీఎఫ్ కూటమి 102 సీట్లు గెలుచుకుంది. ఇందులో కాంగ్రెస్ 63, ఐయూఎమ్ఎల్ 22 సీట్లు సాధించిన సంగతి తెలిసిందే. -
Bengaluru : ప్రధాని మోదీ కాన్వాయ్ మార్గంలో పేలుడు పదార్ధాల కలకలం
సాక్షి,బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం బెంగళూరు శివార్లలో జరగనున్న బీజేపీ సభకు హాజరుకానున్నారు. ఈ సభకు మోదీ కాన్వాయ్ వచ్చే మార్గంలో జెలటిన్ స్టిక్స్ లభ్యమవ్వడం కలకలం రేపింది. అప్రమత్తమైన పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న బాంబు స్క్వాడ్ అక్కడికి చేరుకుని జెలటిన్ స్టిక్ను నిర్వీర్యం చేసింది.ఈ ఘటనతో సభ ప్రాంగణం చుట్టూ భద్రతా ఏర్పాట్లు మరింత కఠినతరం చేశారు పోలీసులు. అదనపు చెక్పోస్టులు ఏర్పాటు చేసి, ప్రతి వాహనం, వ్యక్తిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతని నేపథ్యంతో పాటు ఈ ఘటనకు సంబంధం ఉన్న ఇతర వ్యక్తులపై కూడా విచారణ కొనసాగుతోంది. అధికారులు ఈ ఘటనను భద్రతా లోపంగా కాకుండా, ముందస్తు జాగ్రత్తలతో గుర్తించిన ప్రయత్నంగా పేర్కొన్నారు.ప్రధాని సభకు భారీ జనసందోహం హాజరయ్యే అవకాశం ఉండటంతో, పోలీసులు, ఇంటెలిజెన్స్ సంస్థలు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టాయి. భద్రతా సంస్థలు ఇప్పటికే సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నాయి. ఈ ఘటన కుట్రలో భాగమా లేదా స్థానిక స్థాయిలో జరిగినదా అన్నది తెలుసుకోవడానికి అధికారులు పరిశీలిస్తున్నారు. -
విజయ్ ప్రభుత్వం ఎన్నాళ్లు ఉంటుందో చెప్పేసిన మంత్రి కీర్తన
చెన్నై: తమిళనాడులో అతి పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా నిలిచిన టీవీకే నాయకురాలు ఎస్.కీర్తన (29) ఆదివారం కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ క్యాబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తొమ్మిది మంది మంత్రుల్లో ఆమె ఒకరిగా నిలిచారు. కీర్తన తెలుగు యువతి. 1996లో విరుదునగర్లో జన్మించారు. విజయ్ క్యాబినెట్లో ఏకైక మహిళా మంత్రి ఆమె.మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కీర్తన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ప్రభుత్వం 35-50 ఏళ్లు కొనసాగుతుందని అన్నారు. విజయ్ టీవీకే ప్రభుత్వం మార్పు తీసుకొచ్చిందని చెప్పారు. దళపతి ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ వచ్చేశారని, ఇక అన్నీ మారిపోతాయని ఆమె ఉత్సాహంగా చెప్పారు.ప్రతిభకు విజయ్ ఇచ్చే ప్రాధాన్యాన్ని ఆమె ప్రస్తావించారు. తనకు మంత్రి పదవి రావడం టీవీకే పార్టీ విధానాన్ని చూపుతోందని చెప్పారు.“మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం పొందడం, క్యాబినెట్ మంత్రి కావడం ఏ రాష్ట్రంలోనైనా సులభమా? కాదు. విజయ్ ప్రతిభను చూస్తారు, నైపుణ్యాన్ని చూస్తారు. మార్పులన్నీ తీసుకురావడానికే మేము వచ్చాం. ఈ ప్రభుత్వం 35-50 ఏళ్లు కొనసాగుతుంది. మాది అత్యంత దీర్ఘకాలం కొనసాగిన ప్రభుత్వం అవుతుంది’’ అని ఆమె అన్నారు.కీర్తన మదురై కామరాజ్ విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలలో గణితంలో బీఎస్సీ పూర్తి చేశారు. తర్వాత 2019లో పుదుచ్చేరి విశ్వవిద్యాలయంలో స్టాటిస్టిక్స్లో ఎమ్మెస్సీ చేశారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కీర్తన శివకాశి స్థానం నుంచి 11,697 ఓట్ల మెజార్టీతో గెలిచారు.గతంలో కీర్తన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... “నేను హిందీలో మాట్లాడుతున్నాను. మా పార్టీ ప్రాతినిధ్యాన్ని భారత్ అంతటా, ఇతర దేశాల్లో కూడా విస్తరించాలనుకుంటున్నాను. అందుకే హిందీలో మాట్లాడుతున్నాను. నా నాయకుడి గురించి అందరికీ తెలియాలి. మా పార్టీ గురించి అందరికీ తెలియాలి. రాజకీయాలకు భయపడకూడదు. అందరూ రాజకీయాల్లోకి రావాలి. నేను ఒక ఉదాహరణ మాత్రమే. అందరూ రాజకీయాల్లో చేరాలి అనేదే నా కోరిక” అని చెప్పారు.ఇదిలా ఉండగా, కీర్తనతో పాటు ఎన్ ఆనంద్, ఆధవ్ అర్జున, కేఏ సెంగొట్టైయన్, కేజీ అరుణ్రాజ్, పి.వెంకటరామనన్, ఆర్.నిర్మల్కుమార్, రాజ్మోహన్, టీకే ప్రభు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడు గవర్నర్ ఆర్లేకర్ శనివారం విజయ్తో రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.. మే 13లోపు అసెంబ్లీలో మెజార్టీ నిరూపించాలని ఆదేశించారు. -
Watermelon Death: 70 శాతంతో పాస్ .. చూసేందుకే లేవు చిట్టి తల్లీ..!
ముంబై: మహానగరం ముంబైలో సంచలనం సృష్టించిన ‘పుచ్చకాయ మరణాల’ కేసులో ఒక హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులతో సహా సహా అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయిన 16 ఏళ్ల ఆయేషా డొకాడియా, తాజాగా విడుదలైన మహారాష్ట్ర ఎస్ఎస్సీ ఫలితాల్లో 70 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఆమె సాధించిన ఈ విజయం ఇప్పుడు అందరినీ కలిచివేస్తోంది.మరణం తర్వాత వచ్చిన విజయంముంబైలోని పైధోనీ ప్రాంతానికి చెందిన ఆయేషా డొకాడియా ఫ్యాషన్ డిజైనింగ్ కెరీర్పై కలులుగనేది. అయితే విధి ఆ కలను కల్లలు చేసింది. మే 8న విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఆమె 70 శాతం మార్కులు సాధించింది. అయితే ఈ వార్త వినడానికి ఆయేషా మాత్రం మన మధ్య లేదు. ఏప్రిల్ 26న తన తల్లిదండ్రులు, సోదరితో కలిసి ఆమె మృతి చెందింది. పరీక్షల ఫలితాలు రావడానికి సరిగ్గా రెండు వారాల ముందే ఈ ఘోరం జరగడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.పుచ్చకాయలో విషపు ఛాయలుఈ కేసు దర్యాప్తులో పోలీసులు సంచలన విషయాలను గుర్తించారు. కుటుంబ సభ్యుల మృతదేహాలతో పాటు వారు తిన్న పుచ్చకాయ నమూనాలలో ‘జింక్ ఫాస్ఫైడ్’ అనే విష రసాయనాన్ని ల్యాబ్ నిపుణులు గుర్తించారు. సాధారణంగా ఎలుకల మందులో వాడే ఈ రసాయనం వల్లనే వారు ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఏప్రిల్ 25 రాత్రి పుచ్చకాయ తిన్న వెంటనే కుటుంబం మొత్తానికి వాంతులు, కడుపునొప్పి, తలతిరగడం వంటి లక్షణాలు మొదలయ్యాయి. ఆ మరుసటి రోజే ఆ నలుగురు జేజే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, తుది శ్వాస విడిచారు.మిస్టరీగా మారిన మరణాలుఇది ఆత్మహత్యా లేక ఎవరైనా పథకం ప్రకారం విషం కలిపారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోస్ట్ మార్టం నివేదికలు, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) నివేదికలను సర్ జేజే ఆసుపత్రి వైద్య బృందం క్షుణ్ణంగా విశ్లేషిస్తోంది. మరణానికి దారితీసిన ఖచ్చితమైన కారణాలను, బాధితుల శరీరంలో విషం ఏ విధంగా ప్రభావం చూపిందో తెలుసుకునేందుకు వైద్య నిపుణులు ప్రయత్నిస్తున్నారు. ఈ విషాద ఘటన వెనుక ఉన్న అసలు రహస్యం త్వరలోనే బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. -
బరితెగింపులో కొత్త తరం..
భారత్లో మహిళలపై వేధింపులు కొత్త రూపం దాలుస్తున్నాయి.. పబ్లిక్ ప్రాంతాల్లో ఉన్నామనే స్పృహ కోల్పోయిన కొందరు ఆకతాయిలు.. ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఆ సమయంతో తమపై జరుగుతున్న వేధింపులు బాధితులు వీడియోలు తీసి.. ఫిర్యాదు చేస్తున్నప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోతోంది.అయితే, ప్రజలు వీడియోలు తీస్తున్నారు కానీ.. నేరాన్ని అడ్డుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. పోలీసులు కూడా తీరా నష్టం జరిగిన తర్వాత అరెస్ట్లు చేస్తున్నారు తప్ప.. ముందస్తుగా భద్రత కల్పించడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీస్ సిబ్బందికి మహిళల సమస్యలపై ప్రత్యేక శిక్షణ అవసరమని.. ఇది ఫిర్యాదులను సీరియస్గా తీసుకోవడంలో సహాయపడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. సామాజిక బాధ్యతగా ఇలాంటి తప్పులు చేస్తున్న సమయంలోనే ప్రజలే వీటిని అడ్డుకోవాలని సూచిస్తున్నారు.The youth committed a shameful act with a girl sitting on a taxi bike.#viralvideos #trending #harassment #news #viral pic.twitter.com/TiW4QLB8Xn— bhavdip (@bhavdip2149) April 9, 2026ముఖ్య ఘటనలు (2024–2026)రాజస్థాన్ బైక్ టాక్సీ ఘటన: మహిళ దుస్తులు లాగిన ఘటన వీడియోలో రికార్డ్ అయింది. వీడియో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే అరెస్టులు చేశారు.జైపూర్ గర్భిణీ మహిళ కేసు: సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా రాహుల్ గుర్జర్ను అరెస్టు చేశారు.ఢిల్లీ బస్సు ఘటన: ఒక వ్యక్తి బహిరంగంగా అసభ్యకరంగా ప్రవర్తించాడు. వీడియో వైరల్ అయిన తర్వాతే చర్యలు తీసుకున్నారు.ముంబై లోకల్ ట్రైన్ ఘటన: మహిళ వీడియో తీసి బయటపెట్టిన తర్వాతే పోలీసులు స్పందించారు.పుణే బస్సు ఘటన: మహిళను తాకిన వ్యక్తిని ఆమె బహిరంగంగా చెంపదెబ్బలు కొట్టింది.యూపీ: ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఓ యువతి నడుచుకుంటూ వెళ్తుండగా ఓ వ్యక్తి వేధింపులకు గురిచేశాడు. ఈ వీడియో సీసీ టీవీ ఫుటేజీతో బయటకు వచ్చింది.ఎయిర్ ఇండియా విమాన ఘటన: 2023లో ఒక ప్రయాణికుడు మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించాడు.(ఒక వ్యక్తి మహిళపై మూత్రవిసర్జన చేశాడన్న కేసు)జైరా వసీమ్ కేసు: inappropriate touching విమానంలో జరిగింది.(అనుచితంగా తాకిన వ్యక్తి) 👉మే 2026లో హైదరాబాద్లో మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి అర్ధరాత్రి బస్స్టాప్ వద్ద అండర్ కవర్గా నిలబడగా, మూడు గంటల్లో 40 మంది పురుషులు ఆమెను వేధించారు. ఇది మహిళలు రాత్రి సమయంలో పబ్లిక్ స్పేస్లలో ఎదుర్కొనే ప్రమాదాలను స్పష్టంగా చూపించింది.👉ఏప్రిల్ 2026లో హైదరాబాద్లోని నానక్రామ్గూడ/గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డు సోలార్ సైకిల్ ట్రాక్పై వాకింగ్ చేస్తున్న మహిళకు వేధింపులు. ఒక దుండగుడు అసభ్యకరంగా ప్రవర్తించి వేధింపులకు గురిచేశాడు. ఈ వీడియోను ఆమె షేర్ చేయడంతో వైరల్గా మారింది.👉ఈ ఘటనలు జరుగుతున్న సమయంలో వీడియోలు తీశారు తప్ప.. నిందితుడిని అడ్డుకోలేదు. ఎక్కువ సందర్భాల్లో ప్రజలు నేరాన్ని అడ్డుకోవడానికి ముందుకు రావడం అరుదు. కోర్టులు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నాయి. అన్యాయం జరిగిన తర్వాత ముందుకు రావడం కన్నా.. అది జరుగుతున్న సమయంలోనే అడ్డుకోవాలని సూచించాయి. View this post on Instagram A post shared by India Today (@indiatoday) పోలీసింగ్ సంస్కరణలుపార్కుల్లో ఉన్న జంటలను ప్రశ్నించే మోరల్ పోలీసింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. జంటలను పార్కుల్లో ప్రశ్నించడం కంటే, అసభ్యకర ప్రవర్తనను అడ్డుకోవడంపై దృష్టి పెట్టాలి.మహిళలపై జరిగే అసభ్యకర ప్రవర్తనను అడ్డుకోవడంలో ఆలస్యం, నిర్లక్ష్యం కనిపిస్తుంది.ప్రాక్టివ్ పోలీసింగ్: వీడియోలు బయటపడిన తర్వాత కాకుండా, ఫిర్యాదు వచ్చిన వెంటనే చర్యలు తీసుకోవాలి.జెండర్ సెన్సిటైజేషన్: పోలీసులకు మహిళల సమస్యలపై ప్రత్యేక శిక్షణ అవసరం.అకౌంటబిలిటీ మెకానిజం: ఫిర్యాదులను నిర్లక్ష్యం చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.వైరల్ వీడియోలపై ఆధారపడటం: ఫిర్యాదు వచ్చిన వెంటనే కాకుండా, వీడియోలు బయటపడితేనే పోలీసులు వేగంగా స్పందిస్తున్నారు.తక్షణ శిక్ష లేకపోవడం: నేరస్థులు వెంటనే శిక్షించబడక పోవడం వల్ల, వారు మళ్లీ అదే ప్రవర్తనకు వెళ్తారు.సామాజిక దృక్పథం:మహిళల దుస్తులు, ప్రవర్తనను ప్రశ్నించే బదులు, వేధింపులను అడ్డుకోవడం ముఖ్యం.పాఠశాలలు, కళాశాలల్లో లైంగిక వేధింపులపై అవగాహన కార్యక్రమాలు అవసరం.శిక్షణ: ప్రజలకు వేధింపులను చూసినప్పుడు ఎలా స్పందించాలో శిక్షణ ఇవ్వాలి.సేఫ్టీ నెట్వర్క్స్: బస్సులు, ట్రైన్లలో ప్రయాణికులు కలిసి స్పందించే విధానాలు ఏర్పరచాలి.లీగల్ ప్రొటెక్షన్: జోక్యం చేసుకున్న వారిని చట్టపరంగా రక్షించే నిబంధనలు ఉండాలి.కమ్యూనిటీ పోలీసింగ్: ప్రజలతో కలిసి పనిచేసే విధానం ద్వారా నేరాలను ముందుగానే అడ్డుకోవచ్చు.టెక్నాలజీ వినియోగం: సీసీటీవీ, బాడీ కెమెరాలు, డిజిటల్ ఫిర్యాదు వ్యవస్థలు ఉండాలి. View this post on Instagram A post shared by alisa (@alliissss__) ప్రత్యేక బోగీలుమహిళల ప్రత్యేక బోగీలు: ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో మహిళల కోసం ప్రత్యేక బోగీలు ఉన్నాయి.ప్రయోజనం: మహిళలు ఒంటరిగా ప్రయాణించే సమయంలో భద్రతా భావన పెరుగుతుంది.సమస్యలు: కొన్ని సందర్భాల్లో ఈ బోగీల్లో కూడా వేధింపులు జరుగుతున్నాయి. రాత్రి వేళల్లో భద్రతా సిబ్బంది లేకపోవడం సమస్య.అవసరమైన మార్పులు: ప్రత్యేక బోగీల్లో సీసీటీవీ కెమెరాలు, భద్రతా సిబ్బంది, panic buttons ఏర్పాటు చేయాలి.కెమెరాలు: బస్సులు, ట్రైన్లు, విమానాల్లో కెమెరాలు అమర్చడం ద్వారా నేరాలను రికార్డ్ చేయవచ్చు.భారత్లో ప్రస్తుతం శాసనపరమైన మహిళల ప్రాతినిధ్యం గురించి చర్చ నడుస్తోంది. కానీ ఉన్నత స్థాయిలో ప్రాతినిధ్యం అనేది క్షేత్రస్థాయిలో భద్రతకు ప్రత్యామ్నాయం కాలేదు. ఒక మహిళ ప్రమాదాన్ని ఎదుర్కోకుండా ఇంటికి నడిచి వెళ్లగలదా, బస్సు ఎక్కగలదా, రైలు ఎక్కగలదా లేదా నగరం గుండా ప్రయాణించగలదా? ప్రస్తుతానికి, ఆ ప్రశ్నకు సమాధానం షరతులతో కూడుకుని ఉంది. ఇలాంటి కేసులు పెరగడం ఒక నిరంతర ప్రక్రియను సూచిస్తుంది. ఇది మహిళలు, ప్రజల స్వేచ్ఛను హరిస్తోంది. #SHAMEFUL : Another shocking case has raised serious concerns about women’s safety in Jaipur. A pregnant woman was allegedly targeted by a man in Malviya Nagar while she was walking alone.#Jaipur #Rajasthan #WomenSafety #MalviyaNagar #CCTV @RajCMO @BhajanlalBjp @PoliceRajasthan… pic.twitter.com/fLiWkKdcuj— upuknews (@upuknews1) April 13, 2026 -
విజయ్ కేబినెట్లో ‘బుస్సీ’ పవర్
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో నూతన శకం మొదలైంది. సూపర్ స్టార్ విజయ్ ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిరోహించగా, ఆయనకు అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తుడైన బుస్సీ ఎన్ ఆనంద్ ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఒకప్పుడు విజయ్ అభిమాన సంఘాల నాయకునిగా ప్రత్యర్థుల ఎగతాళికి గురైన ఆనంద్, నేడు చెన్నై గుండెకాయ లాంటి త్యాగరాయ నగర్ (టీ నగర్) నియోజకవర్గం నుంచి గెలిచి, మంత్రిగా బాధ్యతలు చేపట్టడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.పుదుచ్చేరి నుంచి ‘బుస్సీ’ ప్రస్థానంబుస్సీ ఆనంద్ రాజకీయ ప్రస్థానం పుదుచ్చేరిలో అట్టడుగు స్థాయి నుంచి మొదలైంది. 2006లో పుదుచ్చేరి మున్నేట్ర కాంగ్రెస్ తరపున ‘బుస్సీ’ నుంచి పోటీ చేసి, డీఎంకే అభ్యర్థిని ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ నియోజకవర్గం పేరే ఆయన ఇంటి పేరుగా మారి, చివరకు ఆయన పేరు ‘బుస్సీ ఆనంద్’గా స్థిరపడిపోయింది. ఆ తర్వాత విజయ్ మీద ఉన్న అభిమానం, ఆయనపై ఉన్న నమ్మకంతో ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీకి మొదటి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. పార్టీ స్థాపన నాటి నుండి క్షేత్రస్థాయిలో కార్యకర్తలను ఏకం చేయడంలో కీలక పాత్ర పోషించారు.టీ నగర్ కోటలో అద్భుత విజయంచెన్నైలో అత్యంత రద్దీగా ఉండే, వాణిజ్య పరంగా అత్యంత కీలకమైన టీ నగర్ నియోజకవర్గంలో ఆనంద్ విజయం సాధించడం సామాన్యమైన విషయం కాదు. దశాబ్దాలుగా డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి దిగ్గజ పార్టీలకు కంచుకోటగా ఉన్న ఈ స్థానాన్ని ఆయన తన వశం చేసుకున్నారు. డీఎంకే అభ్యర్థి రాజా అన్బళగన్ను ఢీకొట్టి, 51,632 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘విజిల్’ గుర్తుపై పోటీ చేసిన ఆనంద్, స్టార్ క్యాండిడేట్లను సైతం పక్కకు నెట్టి తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. గతంలో ఆయన్ని తక్కువ చేసి మాట్లాడిన వారు సైతం ఈ గెలుపు చూసి ఇప్పుడు నోరెళ్లబెడుతున్నారు. -
కాంగ్రెస్ది నమ్మక ద్రోహం
సాక్షి బెంగళూరు: కాంగ్రెస్ ఒక విశ్వాస ఘాతుక పార్టీ అని ప్రధాని మోదీ మండిపడ్డారు. అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ను అధికారం నుంచి దూరం చేయాలని పేర్కొన్నారు. వెన్నుపోటు పొడిచే బుద్ధి ఆ పార్టీకి పుట్టుకతోనే వచ్చిందని, అధికారం కోసం ఏమైనా చేసేందుకు సిద్ధపడుతోందని నిప్పులు చెరిగారు. 2014 కంటే ముందు కేంద్రంలో పదేళ్లు డీఎంకే మద్దతుతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే అధికారం కోల్పోవడంతో వెంటనే వెన్నుపోటు పొడిచి కొత్త పార్టీని ఆశ్రయించిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కేవలం మిత్రపక్షాలను మాత్రమే వెన్నుపోటు పొడవలేదని, మహిళా రిజర్వేషన్ బిల్లును ఓడించడం ద్వారా దేశ మహిళలకు ద్రోహం చేసిందని విమర్శించారు. నమ్మక ద్రోహి కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం తర్వాత తొలిసారిగా ఆదివారం కర్ణాటక రాజధాని బెంగళూరుకు వచ్చిన మోదీని బీజేపీ నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎన్ని రోజులు అధికారంలో ఉంటారో తెలియదని ఎద్దేవా చేశారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం ఖజానాను లూటీ చేసే పనిలో పడ్డారని ఆరోపించారు. హిమాచల్ ప్రదేశ్లో సఫాయి కారి్మకులకు వేతనాలు ఇవ్వడం లేదని, తెలంగాణలో రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని, కేరళ ఎన్నికల్లో మెజారిటీ సాధించినప్పటికీ ఇంకా ముఖ్యమంత్రి ఎంపిక చేయడం సాధ్యపడడం లేదని వ్యాఖ్యానించారు. కేరళలో అధికారం తథ్యం బీజేపీ ఒక్కసారి అధికారంలోకి వస్తే రెండు, మూడుసార్లు ప్రజలు అధికారం అప్పగించేలా తమ పార్టీ పాలన ఉంటుందని ప్రధానమంత్రి తెలిపారు. అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో పదేళ్ల క్రితం కేవలం ముగ్గురు ఎమ్మెల్యేల బలం ఉన్న బీజేపీ ఇప్పుడు ఏకంగా 203 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిందని వెల్లడించారు. కేరళలో ప్రస్తుతం ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారని, అక్కడ పూర్తి మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే రోజు ఎంతో దూరంలో లేదని ధీమా వ్యక్తంచేశారు. సమాజం క్రియాశీలం అయినప్పుడే.. దేశ నిర్మాణంలో సమాజం క్రియాశీలకంగా పాలుపంచుకుంటే అప్పుడే ప్రభుత్వం విజయం సాధించినట్లు అని ప్రధానమంత్రి మోదీ తెలిపారు. దేశ ప్రజలు, సమాజం క్రియాశీలం అయినప్పుడే అతిపెద్ద సవాళ్లకు సామూహికంగా పరిష్కారం లభిస్తుందని చెప్పారు. బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ 45వ వార్షికోత్సవంతోపాటు శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ 70వ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భవ్య ధ్యాన మందిరాన్ని ప్రధాని ప్రారంభించారు. బెంగళూరు కేవలం సాంకేతిక నగరం కాదని, ఇదొక అధ్యాత్మిక నగరమని పేర్కొన్నారు. యోగా, ధ్యానం, ప్రాణాయామం దేశ సంస్కృతిలో అంతర్భాగాలని చెప్పారు. వీటిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. #WATCH | Bengaluru | Prime Minister Narendra Modi says, "I have arrived in Bengaluru today at a time when discussions regarding election results are underway across the country. The formation of an NDA government in Puducherry for the second consecutive time, the formation of an… pic.twitter.com/lFNbQ429aS— ANI (@ANI) May 10, 2026 -
బ్లాక్ బ్లేజర్లో సీఎం విజయ్... బ్లూ కాంజీవరంలో త్రిష
చెన్నై: ఆరు దశాబ్దాల ద్రవిడ రాజకీయాల ఆధిపత్యానికి తెరదించుతూ, చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. వెండితెర ‘దళపతి’ విజయ్ అధికారికంగా తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఈ చారిత్రక ఘట్టం కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదు. విజయ్ సరికొత్త ప్రొఫెషనల్ లుక్, ప్రముఖ నటి త్రిష సంప్రదాయ చీరకట్టుతో ఈ కార్యక్రమం ఒక అద్భుతమైన ఫ్యాషన్ వేడుకగా మారి, నెట్టింట వైరల్గా అవుతోంది.ప్రొఫెషనల్ లుక్లో ముఖ్యమంత్రి విజయ్తన సాధారణ దుస్తులకు భిన్నంగా, విజయ్ పర్ఫెక్ట్ వైట్ షర్ట్, దానికి నప్పే క్లాసిక్ బ్లాక్ బ్లేజర్, ప్యాంట్తో అత్యంత హుందాగా కనిపించారు. ఈ మోనోక్రోమ్ స్టైల్ తమిళనాడు రాజకీయ రంగానికి పర్ఫెక్ట్ కార్పొరేట్ పొలిటికల్ టచ్ ఇచ్చింది. తన సిగ్నేచర్ హెయిర్ స్టైల్, సాల్ట్ అండ్ పెప్పర్ గడ్డంతో విజయ్ అచ్చమైన కొత్త ముఖ్యమంత్రిగా అదరగొట్టారు.బ్లూ కాంజీవరం చీరలో మెరిసిన త్రిషవిజయ్ చిరకాల స్నేహితురాలు, సహనటి త్రిష ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులలో ఒకరు. సముద్రపు నీలం రంగు (టర్కోయిజ్) కాంజీవరం చీరలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సన్నని బంగారు అంచు ఉన్న ఆ చీరకు మ్యాచింగ్గా గోల్డ్-బీజ్ బ్రోకేడ్ బ్లౌజ్ ధరించారు. మధ్యలో కెంపు ఉన్న డైమండ్ చోకర్, దానికి తగ్గ కమ్మలు ఆమె అందాన్ని పదింతలు చేశాయి. దక్షిణ భారత సంప్రదాయం ఉట్టిపడేలా జుట్టును ముడివేసి, మల్లెపూలు పెట్టుకుని త్రిష అద్భుతంగా ముస్తాబయ్యారు.నెట్టింట ట్రెండ్ అవుతున్న ‘గిల్లీ’ జోడీఈ ప్రమాణస్వీకారోత్సవంలో త్రిష ఉత్సాహంగా పాల్గొనడం, ఆమె చిరునవ్వు సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆన్-స్క్రీన్లో సూపర్ హిట్టయిన ‘గిల్లీ’ జోడీ, ఇప్పుడు రియల్ లైఫ్లో ఇలా కలిసి కనిపించడంతో అభిమానులు ఉప్పొంగిపోతున్నారు. ఇది కూడా చదవండి: విజయ్ నమ్మకం.. కీర్తన బాధ్యత -
తొలి సంతకంతోనే విజయ్ సంచలనం..
చెన్నై: తమిళనాడు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విజయ్.. ఉచిత విద్యుత్పై తొలి సంతకం చేశారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు. మహిళా భద్రతపై విజయ్ రెండో సంతకం చేశారు. మహిళల భద్రత కోసం షీటీమ్ తరహాలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా ఈగల్ తరహా వ్యవస్థపై సీఎం సంతకం పెట్టారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం విజయ్ సంతకం చేశారు.ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. ‘తమిళనాడు రాజకీయాల్లో కొత్త శకం మొదలైంది. నేను మీ ఇంట్లో కుటుంబసభ్యుడిని. మీకు అన్నగా తమ్ముడి ఉంటా. నాకు ఆకలి తెలుసు.. పేదరికం తెలుసు. ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చా. నాతో ప్రయాణం చేస్తున్న మీకు మంచి చేస్తా. ఇది అస్థిర ప్రభుత్వం కాదు....నా ప్రభుత్వంలో ఒకటే పవర్ సెంటర్ ఉంటుంది. ఏది సాధ్యమే అది మాత్రమే చేస్తా. విద్యార్థుల భవిష్యత్కు విజయ్ మామ అండగా ఉంటాడు. మైనార్టీలకు అండగా ఉంటా ప్రజాధనం వృథా చేయను. గత ప్రభుత్వం ఖజానా మొత్తం ఖాళీ చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి త్వరలో శ్వేత పత్రం విడుదలచేస్తా. తమిళ ప్రజలకు రుణపడి ఉంటాను’’ అని ఆయన పేర్కొన్నారు. -
విజయ్ కేబినెట్ మంత్రులు వీరే
చెన్నై: తమిళనాడు విజయ్ శకం ప్రారంభమైంది. ముఖ్యమంత్రిగా సి.జోసెఫ్ విజయ్ ప్రమాణస్వీకారం చేశారు. విజయ్తో పాటు మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. విజయ్ కేబినెట్లో మంత్రులుగా ఎన్ ఆనంద్, అదవ అర్జున, కేజీ అరుణ్రాజ్, కేఏ సెంగొట్టియన్, పి.వెంకటరమణన్, ఆర్ నిర్మల్కుమార్, రాజ్మోహన్, టీకే ప్రభుత్వ, కీర్తన ప్రమాణస్వీకారం చేశారు.తెలుగు అమ్మాయి కీర్తన..శివకాశి నుంచి ఎమ్మెల్యేగా కీర్తన గెలుపొందిన తెలుగు అమ్మాయి కీర్తన మంత్రిగా ప్రమాణం చేశారు. విజయ్ కేబినెట్లో ఏకైక మహిళా ప్రతినిధి కాగా, మహిళా సాధికారత లక్ష్యంగా కీర్తనకు ప్రాధాన్యత ఇచ్చారుఎన్ ఆనంద్..మంత్రిగా ప్రమాణం చేసిన ఎన్ ఆనంద్.. టి.నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.. ఈయన విజయ్కి అత్యంత నమ్మకస్తుడిగా పేరొంది. విజయ్ పార్టీ నిర్మాణంలో ఆనంద్ కీలక పాత్ర పోషించారు.అదవ్ అర్జున..విల్లివాక్కం నుంచి గెలిచిన అదవ్ అర్జునకు గతంలో ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన అనుభవం ఉంది. పార్టీ విధానాల రూపకల్పనలో అదవ్ అర్జున కీలక పాత్ర పోషించారు కేఏ సెంగొట్టియన్..గోబిచెట్టిపాళయం నుంచి గెలిపిన కేఏ సెంగొట్టియన్.. ఈయన సీనియర్ రాజకీయ వేత్త. అన్నాడీఎంకే ప్రభుత్వంలో సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు. విజయ్ ప్రభుత్వానికి వెన్నెముకగా నిలవనున్నారు.నిర్మల్ కుమార్..తిరుప్పరంకుండ్రం నుంచి గెలిచిన నిర్మల్ కుమార్.. ఐటీ, సోషల్ మీడియా రంగంలో పట్టున్న నేతగా పేరొంది. గతంలో బీజేపీ ఐటీ వింగ్లో నిర్మల్కుమార్ కీలక బాధ్యతలు చేపట్టారుకేజీ అరుణరాజ్..తిరుచెంగోడు నుంచి గెలిచిన కేజీ అరుణరాజ్కు షెడ్యూల్ కులాల(ఎస్సీ) ప్రతినిధిగా మంత్రివర్గంలో చోటు లభించింది. సామాజిక న్యాయం దిశగా అరుణ్రాజ్ అవకాశం లభించింది.పి.వెంకటరమణన్..మంత్రిగా ప్రమాణం చేసిన పి.వెంకటరమణన్ మైలాపూర్ నుంచి గెలిచారు. చెన్నై నగర రాజకీయాల్లో ఆయన చురుకైన నేతగా గుర్తింపు పొందారుఎ.రాజమోహన్..ఎ.రాజమోహన్ ఎగ్మోర్ నుంచి గెలిచారు. సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా రాజమోహన్ గుర్తింపుపొందారు టీకే ప్రభు..మంత్రిగా ప్రమాణం చేసిన టీకే ప్రభు.. కారైకుడి నుంచి గెలిచారు పార్టీ బలోపేతంలో క్రీయశీలకంగా పనిచేశారు. -
విజయ్ నమ్మకం.. కీర్తన బాధ్యత
చెన్నై: తమిళనాడు రాజకీయాలంటేనే ఎంతో ఉత్కంఠగొలుపుతాయి. అలాంటి గడ్డపై, అనుభవజ్ఞులైన ఉద్దండులు ఉన్న సభలో, కేవలం 29 ఏళ్ల వయసులోనే మంత్రి పదవిని అలంకరించబోతున్నారు సెల్వి ఎస్. కీర్తన. ఒక సామాన్య నేపథ్యం నుండి వచ్చి, విద్యనే ఆయుధంగా మలచుకుని, నేడు రాష్ట్ర కేబినెట్లో అత్యంత పిన్న వయస్కురాలైన మంత్రిగా ఆమె బాధ్యతలు స్వీకరించడం ఒక చారిత్రక ఘట్టంగా నిలవనుంది.చదువులో మేటి.. లక్ష్యంలో స్పష్టతసెల్వి ఎస్. కీర్తన విద్యావంతురాలైన యువనేత. ఆమె ఎమ్మెస్సీ పట్టభద్రురాలు. చదువుకునే రోజుల నుంచే ఆమెకు సమాజం పట్ల, రాజకీయాల పట్ల స్పష్టమైన అవగాహన ఉంది. కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడానికి ఆమె ప్రయత్నించారు. రాజకీయాలంటే కేవలం అధికారం మాత్రమే కాదు, అదొక బాధ్యత అని నమ్మిన అతి కొద్దిమంది యువతలో ఆమె ఒకరు. "సింగపెణ్" (సింహపుత్రి)పొలిటికల్ కన్సల్టెంట్గా అనుభవంరాజకీయాల్లోకి రాకముందు కీర్తన పొలిటికల్ కన్సల్టెంట్గా పనిచేశారు. సాధారణంగా తెరవెనుక ఉండి వ్యూహాలు రచించే బాధ్యత నుంచి, నేరుగా ప్రజల మధ్యకు వచ్చి ప్రజాప్రతినిధిగా మారడం ఆమె జీవితంలో ఒక పెద్ద మలుపు. ఎన్నికల వ్యూహాలు, ప్రజాభిప్రాయ సేకరణ, సామాజిక సమస్యల విశ్లేషణలో ఆమెకు ఉన్న అనుభవం టీవీకే (టీవీకే) పార్టీలో ఆమె ఎదుగుదలకు తోడ్పడింది. ఈ వృత్తిపరమైన నేపథ్యమే ఆమెను ఒక పరిణతి చెందిన నాయకురాలిగా తీర్చిదిద్దింది.శివకాశి గడ్డపై విజయ కేతనంటపాసుల తయారీకి, కష్టపడే తత్వానికి మారుపేరైన శివకాశి నియోజకవర్గం నుంచి కీర్తన పోటీ చేశారు. ఆమెను ‘శివకాశి సింగపెణ్’ అని అంటుంటారు. సింగపెణ్ అంట్ సింహపుత్రి అని అర్థం. ఎన్నికల ప్రచారంలో ఆమె చూపిన తెగువ, మాట్లాడే తీరు అక్కడి ఓటర్లను, ముఖ్యంగా మహిళలను మరియు యువతను విశేషంగా ఆకర్షించింది. పార్టీ అధినేత విజయ్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ప్రత్యర్థులకు గట్టి పోటీనిస్తూ ఆమె భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ విజయంతో ఆమె టీవీకే పార్టీలో అత్యంత పిన్న వయస్కురాలైన మహిళా ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు.మహిళా సాధికారతకు నిలువెత్తు రూపంవిజయ్ తన తొలి కేబినెట్లోనే ఆమెకు చోటు కల్పించడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. కేవలం మహిళా కోటాలో కాకుండా, ఆమెకున్న మేధస్సు, విద్యార్హత, పనితీరును చూసి ఈ బాధ్యతను అప్పగించారు. ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్న ఏకైక మహిళా మంత్రి కూడా ఆమే కావడం విశేషం. ‘ఒక విద్యావంతురాలైన యువతి రాజకీయాల్లోకి వస్తే మార్పు ఎలా ఉంటుందో కీర్తన నిరూపిస్తున్నారు’ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.విజయ్ నమ్మకం.. కీర్తన బాధ్యతముఖ్యమంత్రి విజయ్ తన కేబినెట్లో అనుభవజ్ఞులైన సెంగోట్టయ్యన్, ఆనంద్ వంటి వారితో పాటు కీర్తన వంటి యువ రక్తానికి ప్రాధాన్యత ఇచ్చారు. పాలనలో ఆధునికతను, సాంకేతికతను జోడించడంలో కీర్తన పాత్ర కీలకం కానుంది. ఎటువంటి రాజకీయ వారసత్వం లేకుండా, స్వయంకృషితో ఈ స్థాయికి ఎదిగిన ఆమె ప్రయాణం తమిళనాడులోని కోట్లాది మంది యువతులకు స్ఫూర్తిదాయకం. -
క్షణం క్షణం ఉత్కంఠ నడుమ స్నేహపూర్వక బ్రేక్ఫాస్ట్..!
తమిళనాడు రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని తలపించాయి. ఎట్టకేలకు ఆ ట్విస్ట్ల మధ్య చివరికి విజయ్ విజిల్ గట్టిగా మోగింది. రోజుల తరబడి సాగిన రాజకీయ ప్రతిష్టంభన తమిళనాడు గవర్నర్ ఆర్ వి అర్లేకర్తో జరిగి వరుస సమావేశాల అనంతరం మొత్తం 120 ఎమ్మెల్యేల మద్దతు లేఖలతో లోక్ భవన్కు చేరుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి..అధికారిక ఆహ్వానాన్ని స్వీకరించి బయటకు వచ్చారు. ఇంత భారీ ఉత్కంఠ నడుమ గవర్నర్ నివాసం లోపల సహృద్భావ పూర్వక స్నేహ వాతావరణం ఉండటం విశేషం. ఆ నివాసం లోప కూటమికి సంబంధించి..సంఖ్యాబల లెక్కలు, రాజ్యంగపరమైన చర్చల తోపాటు చక్కటి రుచికరమైన అల్పాహార విందు, కుటుంబ సభ్యులతో వీడియో కాల్స్ వంటి సందర్భాలు కూడా చోటు చేసుకున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..లోక్భవన్ జరిగిన సమావేశం సందర్భంగా విజయ్, ఆయన మిత్రపక్ష నాయకులకు తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు కె. సెల్వపెరుంతగై కూడా ఉన్నారు. అక్కడ వడ, హల్వా, కాఫీ వడ్డించారు. గత కొన్ని రోజులగా ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియపై తీవ్రమైన అనిశ్చితి ఉన్నప్పటికీ లోపల వాతావరణం మాత్రం ఎంతో స్నేహపూర్వకం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. కాగా, అధికారిక చర్చలు ముగిసిన తర్వాత కూడా, విజయ్ లోక్ భవన్ లోపలే దాదాపు ఒక గంట పాటు గడిపినట్లు సమాచారం. గవర్నర్ నుంచి అధికారిక నియమాక పత్రాన్ని స్వయంగా స్వీకరించిన తర్వాత ఆయన ఆ ప్రాంగణం నుంచి బయలుదేరారని ఆ వర్గాలు తెలిపాయి. పైగా గత నాలుగు రోజుల్లో గవర్నర్తో విజయ్ జరిపిన నాల్గొవ సమావేశం ఇది. అంతేగాదు ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ ఖరారైన తర్వాత, సమావేశంలో కొన్ని సరదా సందర్భాలు కూడా చోటుచేసుకున్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల ప్రకారం, కూటమిలోని కొందరు నాయకులు తమ కుటుంబ సభ్యులకు వీడియో కాల్స్ చేసి, తమ పిల్లలతో కాసేపు మాట్లాడమని విజయ్ని కోరారు. ఏదీఏమైతేనేం రీల్స్ హీరో కాస్తా రియల్ హీరోలా తమిళనాడు ముఖ్యమంత్రిగా నేడు(ఆదివారం మే 10, 2026) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేవలం రెండేళ్ల క్రితం స్థాపించబడి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించే స్థాయికి చేరుకున్న 'తమిళగ వెట్రి కజగం' (TVK) పార్టీకి ఈ పరిణామం ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుంది.(చదవండి: సంచలనాల టీవీకే విజయ్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే! ర్యాలీలో సైతం..) -
శోకసంద్రంలో కర్ణాటక.. మంత్రి సుధాకర్ కన్నుమూత
బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రణాళిక, గణాంక శాఖ మంత్రిగా సేవలందిస్తున్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు డీ సుధాకర్ (66) ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో సుదీర్ఘ కాలంగా బాధపడుతూ, ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాలను, పార్టీ శ్రేణులను, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.ప్రాణాలు తీసిన తీవ్రమైన ఇన్ఫెక్షన్గత మార్చి నెలాఖరు నుంచి మంత్రి డీ సుధాకర్ తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. బెంగళూరులోని ఎలక్ట్రానిక్స్ సిటీలో ఉన్న ప్రముఖ కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) ఆసుపత్రిలో ఆయన ఇంటెన్సివ్ కేర్లో చేరి, గత కొన్ని వారాలుగా చికిత్స పొందుతున్నారు. గత వారం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో ఎక్మో సహా అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్పై ఉంచి చికిత్స అందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండటంతో ఊపిరితిత్తుల మార్పిడి (లంగ్ ట్రాన్స్ప్లాంట్) చేసే అవకాశాలను కూడా వైద్యులు పరిశీలించారు.తెల్లవారుజామున ఆగిన శ్వాసఅత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్నప్పటికీ, సుధాకర్ శరీరం చికిత్సకు సహకరించలేదు. కిమ్స్ ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఆర్. చిన్నదురై విడుదల చేసిన అధికారిక హెల్త్ బులిటెన్ ప్రకారం.. ‘66 ఏళ్ల గౌరవ మంత్రి సుధాకర్ డీ, ఆదివారం తెల్లవారుజామున 3:15 గంటలకు కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో మరణించారు’ అని ప్రకటించారు. ఈ వార్త బయటకు రాగానే ఆయన అనుచరులు, అభిమానులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.అంచెలంచెలుగా ఎదిగి..చిత్రదుర్గ జిల్లాకు చెందిన డీ సుధాకర్.. ప్రస్తుతం హిరియూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన 2004లో చల్లకెరె నియోజకవర్గం నుంచి తొలిసారి ఎన్నిక కాగా, ఆ తర్వాత 2008, 2013లో హిరియూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో సామాజిక సంక్షేమం, యువజన వ్యవహారాలు వంటి అనేక కీలక మంత్రిత్వ శాఖలకు ఆయన బాధ్యతలు వహించారు. ప్రజలతో ఎంతో మమేకమై పనిచేసే నాయకునిగా పేరొందిన సుధాకర్ మృతి పట్ల అన్ని పార్టీల రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.ఇది కూడా చదవండి: తీవ్ర గాయాలతో అజ్ఞాతంలో ఇరాన్ సుప్రీం లీడర్? -
లోక కళ్యాణమే వీరి వివాహ బంధం..
సాక్షి, స్పెషల్ డెస్క్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సువేందు అధికారి బ్రహ్మచారి కావడంతో దేశంలో బ్రహ్మచారులు పాలకులుగా ఉన్నత పదవులు చేపట్టి ప్రజాసేవలో రాణిస్తుండడం ఆసక్తి గొలుపుతోంది. బ్రహ్మచర్యం అనేది కేవలం పెళ్లి చేసుకోకపోవడం మాత్రమే కాదు.. అది అంతకంటే లోతైన అర్థం కలిగిన ఒక జీవన విధానం. తన ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని ఉన్నతమైన లక్ష్యం కోసం తన శక్తిని మళ్లించడమే బ్రహ్మచర్యం.శాస్త్రీయంగా చూస్తే ‘బ్రహ్మ’అంటే పరమాత్మ లేదా సత్యం. ‘చర్యం’అంటే నడుచుకోవడం. అంటే సత్య మార్గంలో పయనించడం అని అర్థం. ఆధ్యాత్మిక కోణంలో దీనికి మూడు ప్రధాన పునాదులు ఉన్నాయి. అవి క్రమశిక్షణ (శారీరక, మానసిక కోరికలపై నియంత్రణ కలిగి ఉండటం), ఏకాగ్రత (ప్రాపంచిక సుఖాల కంటే సమాజ హితం లేదా ఆధ్యాత్మిక ఉన్నతిపై దృష్టి పెట్టడం), నిస్వార్థం (వ్యక్తిగత కుటుంబ పరిధిని దాటి లోకాన్నే తన కుటుంబంగా భావించడం).కలాం, వాజ్పేయిల సందేశం.. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి బ్రహ్మచర్య దీక్షతో ఉన్నత పదవులను అధిరోహించి సమాజానికి పలు సందేశాలు అందించారు.దేశమే ప్రథమ ప్రాధాన్యత: వారికి సొంత కుటుంబం, వారసులనే బంధాలు లేవు. తీసుకునే నిర్ణయాల్లో పక్షపాతం లేదా ‘నా వారు’అనే స్వార్థం ఉండదు. సమాజాన్నే కుటుంబంగా భావిస్తారు.అంకితభావం: కుటుంబ బాధ్యతలు లేకపోవడంతో పూర్తి సమయాన్ని, శక్తిని ప్రజాసేవకే కేటాయించగలరు. అబ్దుల్ కలాం శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా రాత్రింబవళ్లు శ్రమించడమే దీనికి నిదర్శనం.నిరాడంబరత: అత్యున్నత పదవుల్లో ఉన్నా సాదాసీదాగా జీవిస్తారు. పదవి అనుభవించడానికి కాదు.. బాధ్యతను నెరవేర్చడానికని వీరు నిరూపించారు.నైతిక బలం: బ్రహ్మచర్యం ఇచ్చే ఆత్మనిగ్రహం వల్ల ఒత్తిళ్లకు లొంగరు. అవినీతికి ఆస్కారంలేని పాలనను అందించడానికి ఈ మానసిక స్థితి ఎంతో దోహదపడుతుంది. బ్రహ్మచారిగా ఉండటం అంటే బాధ్యతల నుంచి పారిపోవడం కాదు.. మరింత పెద్ద బాధ్యతను (దేశాన్ని/సమాజాన్ని) భుజాన వేసుకోవడం. అబ్దుల్ కలాం, వాజ్పేయి ల జీవితాలే ఇందుకు నిదర్శనం. దేశం కోసం జీవితాలను అంకితం చేసి నిస్వార్థంగా పనిచేస్తే చరిత్రలో నిలిచిపోతామని నిరూపించారు.వీరంతా బ్రహ్మచారులే.. దేశంలో బ్రహ్మచారులుగా ఉండి ఉన్నత పదవుల్లో రాణించినవారు చాలా మంది ఉన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హిందుత్వవాది. గోరఖ్నాథ్ మఠానికి మహంత్. దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పశ్చిమ బెంగాల్కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ (దీదీ) కూడా అవివాహితురాలే. 24 ఏళ్లపాటు ఒడిశా ముఖ్యమంత్రిగా సేవలు అందించిన నవీన్ పట్నాయక్ సైతం బ్రహ్మచారే. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉత్తరప్రదేశ్కు నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పెళ్లి చేసుకోకుండానే తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా అవివాహితుడే. ప్రధాని నరేంద్ర మోదీ పెళ్లి చేసుకున్నప్పటికీ గృహస్థ జీవితానికి దూరంగా బ్రహ్మచారిగానే ఉంటూ దేశ సేవకు అంకితమయ్యారు. -
‘2026 తీర్పు’: పీఠం కదిలింది.. చరిత్ర మారింది!
భారతదేశ రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికలు ఒక కీలక మలుపుగా నిలిచాయి. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో వెలువడిన ఫలితాలు దేశ రాజకీయ గమనాన్ని మార్చేలా ఉన్నాయి. అస్సాం, పుదుచ్చేరిల్లో యథాతథ స్థితి కొనసాగినప్పటికీ, మిగిలిన మూడు రాష్ట్రాల్లో వచ్చిన మార్పులు సామాన్యులను సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి. ఒకవైపు ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం, మరోవైపు జాతీయ పార్టీల వ్యూహాలు, ఇంకోవైపు సరికొత్త రాజకీయ శక్తుల ఉద్భవం వెరసి.. భారతదేశ సమాఖ్య వ్యవస్థ, ప్రజాస్వామ్య భవిష్యత్తుపై కొత్త చర్చకు తెరలేపాయి.కేరళలో కాంగ్రెస్ పునరుజ్జీవంకేరళ రాజకీయ చరిత్రలో ఎల్డిఎఫ్ , యూడిఎఫ్ కూటములు దశాబ్దాలుగా మారుతూ అధికారంలోకి వస్తున్నాయి. అయితే 2021లో పినరయి విజయన్ నాయకత్వంలోని ఎల్డిఎఫ్ వరుసగా రెండోసారి విజయం సాధించి, ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేసింది. అయితే గడిచిన ఐదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ సరికొత్త నాయకత్వంతో, రెట్టింపు ఉత్సాహంతో ప్రజల్లోకి దూసుకు వెళ్ళింది. ఫలితం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. లౌకికవాదాన్ని, ఆర్థిక పురోగతిని, సమాఖ్య స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు కేరళలో బలపడిన యూడిఎఫ్ భాగస్వామ్య పక్షాలపై ఉంది.తమిళనాట ‘విజయ్’ మేజిక్తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. కానీ ఈసారి ఫలితాలు అత్యంత సంక్లిష్టంగా ఉన్నాయి. 2021లో ఘనవిజయం సాధించిన ఎంకె స్టాలిన్ ప్రభుత్వం ఆర్థిక వృద్ధి, సంక్షేమ పథకాల్లో అద్భుతంగా రాణించినప్పటికీ, ఇతర అంశాలు ఓటర్లను ప్రభావితం చేశాయి. ముఖ్యంగా సినీ హీరో విజయ్ రాజకీయ అరంగేట్రం ఒక పెను తుఫానులా మారింది. రెండేళ్ల క్రితం పెట్టిన టీవీకే పార్టీ.. ఎన్నికలకు పది రోజుల ముందు పుంజుకుని ఏకంగా 108 నియోజకవర్గాల్లో జయకేతనం ఎగురవేసింది. ఎటువంటి భారీ ప్రచారాలు లేకుండా, కేవలం సోషల్ మీడియా మీమ్స్, పాటలు, విజయ్ ప్రసంగాలతోనే ఈ విజయం సాధించడం విశేషం. మేజిక్ ఫిగర్కు 11 సీట్ల దూరంలో నిలిచిన టీవీకేకు కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు తెలపడంతో నూతన ప్రభుత్వానికి మార్గం సుగమం అయ్యింది.బెంగాల్లో తృణమూల్ వెనుకంజదేశ రాజకీయ దిశను మార్చగల సత్తా ఉన్న పశ్చిమ బెంగాల్ ఫలితాలు ఈసారి దిగ్భ్రాంతిని కలిగించాయి. పదేళ్లుగా పాగా వేయాలని చూస్తున్న బీజేపీ, అక్కడ బలమైన శక్తిగా ఎదిగింది. గత మూడు పర్యాయాలుగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్పై వ్యతిరేకత ఒక కారణమైతే, ఓటర్ల జాబితాలో జరిగిన భారీ మార్పులు మరో ప్రధాన కారణం. అనేక కుటుంబాల్లో తలిదండ్రులకు ఓటు హక్కు ఉంటే పిల్లలకు లేకపోవడం, కొన్నిచోట్ల వైరుధ్యాలు తలెత్తడం వంటి అంశాలు ప్రజాస్వామ్యంపై మచ్చగా నిలిచాయి. న్యాయవ్యవస్థ కూడా ఈ విషయంలో ఓటర్లను ఆదుకోలేకపోయింది. వరుస విజయాలతో ఉన్న దీదీకి ఈ ఓటమి గట్టి ఎదురుదెబ్బగా మారింది.ఈశాన్యంలోనూ కమలనాథుల హవా పశ్చిమ బెంగాల్ విజయం తర్వాత బీజేపీ ఆధిపత్యం దేశవ్యాప్తంగా దాదాపు పూర్తయింది. మహారాష్ట్ర, గుజరాత్ వంటి పశ్చిమ రాష్ట్రాల నుండి హిందీ బెల్ట్ వరకు, ఇప్పుడు తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోనూ కమలనాథుల హవా నడుస్తోంది. అయితే, దక్షిణాది ఐదు రాష్ట్రాలు మాత్రం బీజేపీకి ఇప్పటికీ ఇనుప కోటలుగానే మిగిలాయి. కేరళ, తమిళనాడులో పాగా వేయడానికి ఆ పార్టీ చేసిన ప్రయత్నాలను అక్కడి ఓటర్లు తిప్పికొట్టారు. కేరళలో 3, తమిళనాడులో 1 సీటుకు మాత్రమే బీజేపీ పరిమితమైంది. ఉత్తరాదిని శాసిస్తున్నా, దక్షిణాది మాత్రం బీజేపీని సుదూరంగానే ఉంచింది.సమాఖ్య వ్యవస్థకు పొంచి ఉన్న ముప్పు?బీజేపీ వరుస విజయాలు సాధిస్తే భవిష్యత్తులో ఏకపార్టీ పాలన వైపు, హిందూత్వ భావజాలం వైపు రాజ్యాంగ సవరణలు జరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇది సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే అవకాశం ఉందంటున్నారు. దేశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా, లౌకిక రాజ్యంగా ఉంచాలంటే ప్రతిపక్షాల ఐక్యత అనివార్యం. 2024లో కొంత విజయం సాధించిన ఇండియా కూటమి ఆ తర్వాత నెమ్మదించినట్లు కనిపిస్తోంది. అయితే పశ్చిమ బెంగాల్ ఓటమి తర్వాత మమతా బెనర్జీ కూటమిని బలోపేతం చేస్తానని ప్రకటించారు. అటు స్టాలిన్ కూడా బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా పరిగణిస్తున్నారు. కొత్తగా పుంజుకున్న విజయ్ (టీవీకే) కూడా ఈ కూటమిలోకి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రాల స్థాయిలో విభేదాలు ఉన్నప్పటికీ, జాతీయ స్థాయిలో దేశ భవిష్యత్తు కోసం ఈ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావడం ఇప్పుడు చారిత్రక అవసరం అని విశ్లేషకులు అంటున్నారు.ఇది కూడా చదవండి: కేబినెట్లో ఏకైక మగువ.. ఎవరీ అగ్నిమిత్ర పాల్? -
విజయ్ గెలుపు వెనుక అసలు సిక్రెట్ ఏంటి?
సాక్షి, చెన్నై: తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడిగా వెలుగొందుతున్న విజయ్ తాజాగా తమిళగ వెట్రి కళగం ద్వారా తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య శక్తిగా ఎదిగారు. ఈ అసాధారణ ఎదుగుదల వెనుక తెర వెనుక ఉండి చక్రం తిప్పిన వ్యూహకర్త, విజయ్ మేనేజర్ జగదీష్ పళనిస్వామి అన్నది తాజాగా వెలుగులోకి వచ్చింది. గత పదేళ్లుగా సినిమాలో విజయ్ బ్రాండ్ వాల్యూను పెంచడం నుండి, టీవీకే పార్టీ డిజిటల్ సామ్రాజ్యాన్ని నిర్మించడం వరకు జగదీష్ , ఆయన సంస్థ ది రూట్ పోషించిన పాత్ర ఇప్పుడు ఇతర రాజకీయ పారీ్టల దృష్టిని తమిళనాడులో ఆకర్షిస్తోంది.విజయ్ రాజకీయ రంగప్రవేశం అనేది అనుకోకుండా జరిగింది కాదు. దీని కోసం జగదీష్ బృందం గత ఐదేళ్లుగా ఒక పక్కా ప్రణాళికతో పనిచేసిందన్నది టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి. ’ది రూట్’ కేవలం సినిమా మేనేజ్మెంట్ సంస్థగా కాకుండా, ఒక భారీ డేటా అనలిటిక్స్ సెంటర్గా పనిచేసిందంటున్నారు. ఇన్స్ట్రాగామ్, వాట్సాప్ వంటి ప్లాట్ఫారమ్లలో యువతను ఆకర్షించడానికి జగదీష్ ప్రత్యేక వ్యూహాలు రచించారని చెబుతున్నారు.ఓ సాధారణ యువకుడు విజయ్కి సంబంధించిన చిన్న వీడియో చూసినా, మరుసటి నిమిషం నుండి అతని ఫీడ్ అంతా విజయ్ వార్తలతో నిండిపోయేలా అల్గారిథమ్ టెక్నిక్స్ను ఉపయోగించారని పేర్కొటున్నారు. సున్నా నుండి లక్షల వరకు ఫాలోవర్లు ఉన్న వేలకొద్దీ షాడో ఐడీల ద్వారా విజయ్ రాజకీయ భావజాలాన్ని నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్లారని చెప్పవచ్చు.. ఇది ఒక కృత్రిమ డిజైన్డ్ వేవ్ ను సృషించి, విజయ్ను ఒక తిరుగులేని నాయకుడిగా ప్రొజెక్ట్ చేసిందన్నది జగమెరిగిన సత్యం.మిగతా రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో మాత్రమే వాట్సాప్ గ్రూపులను యాక్టివేట్ చేస్తాయి. కానీ, జగదీష్ బృందం గత ఐదేళ్లుగా ప్రతి నియోజకవర్గంలోని అభిమాన సంఘాలను సమన్వయం చేస్తూ బలమైన వాట్సాప్ నెట్వర్క్ను నిర్మించి ఉండడం విశేషం. ఏదైనా ఒక వార్త బయటకు వస్తే, అది కేవలం ఐదు నిమిషాల్లో తమిళనాడులోని లక్షలాది మంది యువత మొబైల్లకు చేరుకునేలా ఈ వ్యవస్థను తీర్చిదిద్ది ఉన్నారు. మొదట్లో సినిమా కంటెంట్కు పరిమితమైన ఈ గ్రూపులు, మెల్లమెల్లగా విజయ్ను ఒక కుటుంబ సభ్యుడిగా భావించేలా మార్చేశాయి.రాజకీయాలంటే ఆసక్తి లేని యువతను సైతం ఆకర్షించేలా విజయ్ వేదికల మీద ఇచ్చే ప్రసంగాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, సినిమా ఎడిటింగ్ టెక్నిక్స్తో, మాస్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్తో రీల్స్గా మార్చి వైరల్ చేశారు. ఇది టీవీకే పార్టీని ఒక గ్లామరస్ , స్టైలిష్ పొలిటికల్ ఫోర్స్గా మార్చింది. విజయ్పై ఏవైనా విమర్శలు వస్తే వాటిని లాజికల్గా కాకుండా, భారీ డిజిటల్ అటాక్ ద్వారా అణిచివేసే పద్ధతిని వీరు అనుసరించడం ప్రత్యేకం.ప్రత్యర్థి నటులు లేదా పార్టీల ప్రతిష్టను తగ్గించేలా హ్యాష్ట్యాగ్లను ట్రెండ్ చేయడంలోనూ ఈ రూట్ టీమ్ సిద్ధహస్తులని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మొత్తానికి, ఎంజీఆర్ కాలం నాటి ఇమేజ్ను నేటి డిజిటల్ యుగానికి అనుగుణంగా మార్చి, విజయ్ను ఒక సూపర్ పవర్ పొలిటికల్ లీడర్గా నిలబెట్టడంలో జగదీష్ పళనిస్వామి ’మాస్టర్ మైండ్’గా నిలిచారన్నది ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్గా మారింది. -
సూపర్ ఎల్నినో వస్తోందా?
పది సంవత్సరాల కాలంలో మొదటిసారిగా బహుశా ‘సూపర్ ఎల్నినో’ అనే వాతావరణ సన్నివేశం వస్తున్నదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. గత కొంతకాలంగా వాతావరణం గురించి పరిశోధనలు జరుగుతున్న చోట్ల చాలా బలమైన ఎల్ నినో పరిస్థితి ఈ ఏడాది రెండవ అర్ధభాగంలో రావచ్చు అన్న సూచనలు అందుతున్నాయి.అది మరి ముందు ఎప్పుడూ లేనంతగా బలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు పరిశోధకులు. ఈ పరిస్థితిని కొందరు ‘గాడ్జిల్లా ఎల్ నినో’ అని కూడా అంటున్నారు. దాని కారణంగా ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో కరవులు, మరికొన్ని చోట్ల వరదలు పెద్ద ఎత్తున వచ్చి మొత్తం మీద ఈ సంవ త్సరాన్ని ముందెన్నడూ లేనంత వేడి సంవత్సరంగా మార్చనున్నట్టు వారి అంచనా. అసాధారణమైన వాతా వరణ పరిస్థితులు రాబోతున్నాయని ఈ విషయం గురించి వ్యాఖ్యానించిన యునైటెడ్ కింగ్డమ్ వారి నేషనల్ వెదర్ సర్వీసెస్ పరిశోధకులు ఆడం స్కైఫే అంటున్నారు. ఎల్నినో అన్నది ప్రపంచ వాతావరణంలో మామూలుగా వచ్చే పరిస్థితి. దాని కారణంగా ప్రపంచమంతా వాతావరణంలో వింత పరిస్థితులు కనబడతాయి. ఎల్నినో అనే పరిస్థితి తరచుగా వస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు వస్తుంది అనుకుంటున్న సూపర్ ఎల్నినో పరిస్థితి అప్పుడపుడూ వస్తూ ఉంటుంది. 1982–83, 1997–98 ఆ తరువాత 2015–16లలో వచ్చింది ఇందుకు ఉదాహరణగా చెప్ప వచ్చు. ప్రపంచ ఉష్ణోగ్రత రెండు డిగ్రీల సెంటీగ్రేడ్కు పెరిగితే దానిని సూపర్ ఎల్నినోగా భావిస్తారు. మార్చి నెలలోనూ, ఏప్రిల్ మొదటి భాగంలోనూ పడమటి దిక్కుగా వీస్తున్న గాలుల కారణంగా పెద్ద ఎత్తున వెచ్చని నీరు మధ్య, తూర్పు పసిఫిక్ ప్రాంతాలకు బలంగా కదులుతున్నది. బలమైన ఎల్నినో రావడానికి ఇది ప్రాతిపదికగా చెప్పుకోవచ్చు.సెప్టెంబర్ మాసం కల్లా ఉష్ణోగ్రతలో తేడా రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నట్టు పరిశోధకులు గమనించారు. ‘యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్క్యాస్ట్’ వారు బలమైన ఎల్ నినో వచ్చే పరిస్థితి 50 శాతం వరకు ఉండవచ్చు అని అనుమానిస్తున్నారు. యూఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ వారు ఆ అవకాశం 25 శాతం మాత్రమే అంటున్నారు. యూరప్లోని గ్రూపులు మరింత తీవ్రమైన ఉష్ణోగ్రతా మార్పులు వస్తాయనీ, వేడి మూడు డిగ్రీల సెంటీగ్రేడ్కు చేరుతుందనీ అంటున్నారు. ఇదే గనక నిజమైతే ఈసారి ఎల్నినో తీరు ఎన్నడూ లేనంత బలంగా ఉంటుంది. జూన్ మాసం సగం గడిచిన తరువాత ఈ విషయం గురించి కచ్చితంగా చెప్పే వీలు ఉంటుంది.ప్రభావం ఎలా ఉంటుంది?ప్రపంచమంతా శీతోష్ణ స్థితులు బాగా మారిపోతాయి. ఫలితంగా పంటలు సరిగా పండకపోవడం, సముద్ర తీరాలలోని పగడపు కొండలు బ్లీచ్ కావడం మొదలు... ఆ యా ప్రాంతాలలో ప్రజలలో వ్యాధులు ప్రబలడం వరకు ప్రభావాలు రకరకాలుగా ఉంటాయి. ‘పరిస్థితి కొంచెం గందరగోళంగా ఉంది. మామూలుగా మాత్రం లేదు అని చెప్పవచ్చు’ అంటారు పరిశోధకులు టిమ్ స్టాక్డేల్. ‘పెద్ద ఎత్తున తుపానులు, వర్షాలు రావాలని లేదు. అయితే ఇటువంటి పరిస్థితులు అంతకు ముందు లేని చోట్ల ఏర్పడితే ఆశ్చర్యం లేదు’ అంటారాయన.ఉత్తర, దక్షిణ అమెరికాలలో, అటు ఆఫ్రికా, చైనా లలో వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే సమ యంలో ఆస్ట్రేలియా, ఆగ్నేయ ఆసియా, ఆఫ్రికాలోని మధ్య, దక్షిణ ప్రాంతాలు, భారతదేశం, అమెజాన్ ప్రాంతాల్లో పొడి వాతావరణం బాగా పెరిగి కరవులు, హీట్ వేవ్లు, అడవులు తగలబడటం లాంటివెన్నో జరగవచ్చు. యూకే, ఇతర యూరప్ దేశాలలో ప్రభావాలు మరింత బలంగా ఉంటాయి. అక్కడ వేసవి వేడి మరింత తీవ్రంగా ఉండే వీలుంది. చలికాలంలో తేమ ఎక్కువయ్యి అననుకూల పరిస్థితులు ఎదురు కావచ్చు. వాతావరణం మారుతున్నది, ప్రపంచం వేడెక్కుతున్నది అన్న సంగతి ఇప్పటికే తెలుసు. ఈ పరిస్థితి సముద్రంలో తీరానికి తోసుకువస్తున్న ఒక అల లాంటిది అయితే, ఈ ఎల్ నినో అన్నది ఉవ్వెత్తున వచ్చి ముంచెత్తే చాలా పెద్ద అల అని చెప్పవచ్చు.వ్యాసకర్త సైన్స్ అంశాల రచయిత. -
సీఎంగా విజయ్.. తొలి రోజే సంచలన ప్రకటన
Tamil Nadu CM Oath Live.. విజయ్ ప్రమాణ స్వీకారం అప్డేట్స్.. ఇక అన్నీ మారిపోతాయి: మంత్రి కీర్తనకొత్త మంత్రి, టీవీకే నాయకురాలు ఎస్.కీర్తన (29) కీలక వ్యాఖ్యలువిజయ్ ప్రభుత్వం 35-50 ఏళ్లు కొనసాగుతుందివిజయ్ టీవీకే మార్పు తీసుకొచ్చిందిముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ వచ్చేరురాష్ట్రంలో ఇక అన్నీ మారిపోతాయిప్రతిభకు విజయ్ ఇచ్చే ప్రాధాన్యాన్నిస్తారునాకు మంత్రి పదవి రావడం పార్టీ విధానాన్ని చూపుతోందిమధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానుఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం పొందానునాలాంటివాళ్లు క్యాబినెట్ మంత్రి కావడం ఏ రాష్ట్రంలోనైనా సులభమా?విజయ్ సంచలన నిర్ణయాలు.. ఉచిత కరెంట్పై సీఎం విజయ్ తొలి సంతకం.మహిళల భద్రతపై రెండో సంతకం.తమిళనాడులో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.మహిళల భద్రత కోసం షీటీమ్స్ తరహాలో ప్రత్యేక విభాగం.డ్రగ్స్కు వ్యతిరేకంగా ఈగల్ తరహా వ్యవస్థపై సీఎం సంతకం.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం విజయ్ సంతకం. సీఎం విజయ్ కామెంట్స్..నేను మీ ఇంట్లో కుటుంబ సభ్యుడినే.మీ అన్నగా, తమ్ముడిగా ఉంటాను.నాకు ఆకలి తెలుసు.. పేదరికం తెలుసు.రాజకీయాల్లోకి వస్తే మేము చూసుకుంటామని మీరంతా ప్రేమగా పిలిచారు.నేను మీకు హామీ ఇస్తున్నాను.అది చేస్తాం.. ఇది చేస్తాం అని అబద్ధాలు చెప్పను.ఏదీ సాధ్యమో అది మాత్రమే చేస్తాను.నాతో ప్రయాణం చేస్తున్న మిమ్మల్ని మోసం చేయను.తమిళనాడులో ఇప్పుడు కొత్త శకం ప్రారంభమైంది.నా ప్రభుత్వంలో ఒక్కటే పవర్ సెంటర్ ఉంటుంది.సాధ్యమైనది మాత్రమే చేస్తాను.చిన్నారులకు మామగా అండగా ఉంటా.ఇది అస్థిర ప్రభుత్వం కాదు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తా.వెన్నంటి ఉన్న యువతకు ధన్యవాదాలు.. మీ కలల్ని మీ విజయ్ మామ తీరుస్తాడు.నన్ను అవమానించేవారున్నారు.. ఇబ్బంది పెట్టేవారు వస్తారు.వాళ్లంతా నాకు శ్రేయోభిలాషులే.. విజయ్కు ప్రధాని విషెస్.. విజయ్ ప్రభుత్వానికి పూర్తి సహకారం.సీఎం విజయ్కు ప్రధాని అభినందనలుసీఎంగా ప్రమాణం చేసిన విజయ్కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు.తమిళనాడు అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది: మోదీ కమల్ హాసన్ శుభాకాంక్షలు..తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కు ఎంపీ కమల్ హాసన్ శుభాకాంక్షలు.సీఎం విజయ్కు కమల్ హాసన్ అభినందనలు తెలిపారు.విజయ్ నాయకత్వంలో తమిళనాడు రాష్ట్రం వెలుగొందాలని ఎక్స్లో పోస్ట్.విజయ్ సరికొత్త శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విజయ్కు సీఎం రేవంత్ శుభాకాంక్షలు..తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి..రాహుల్ గాంధీ సమక్షంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను.తమిళనాడు ముఖ్యమంత్రిగా, మీరు పేదలకు సంక్షేమం, అందరికీ న్యాయం చేస్తారని, మీ రాష్ట్రాన్ని అభివృద్ధిలో మరింత ఎత్తుకు తీసుకెళ్తారని నేను బలంగా నమ్ముతున్నాను.హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు. 👉తమిళనాట విజయ్ శకం ప్రారంభంతమిళనాడు సీఎంగా విజయ్మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్విజయ్ కేబినెట్లో ఎన్ ఆనంద్, అదవ అర్జున, కేజీ అరుణ్రాజ్, కేఏ సెంగొట్టియన్, పి.వెంకట్రామన్..ఆర్ నిర్మల్కుమార్, రాజ్మోహన్, టీకే ప్రభుత్వ, కీర్తన👉తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం#WATCH | Chennai: Tamilaga Vettri Kazhagam (TVK) Chief C Joseph Vijay takes oath as the Chief Minister of Tamil Nadu. pic.twitter.com/8yGuYEAkfj— ANI (@ANI) May 10, 2026👉విజయ్తో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ ఆర్లేకర్👉విజయ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా దద్దిరిల్లిన స్టేడియం #WATCH | Chennai | Tamilaga Vettri Kazhagam (TVK) Chief C Joseph Vijay and Lok Sabha LoP and Congress MP Rahul Gandhi at the Jawaharlal Nehru Stadium in Chennai.Vijay will take oath as the Chief Minister of Tamil Nadu, shortly. pic.twitter.com/9J8R7Zrq3H— ANI (@ANI) May 10, 2026 సీఎం ప్రమాణ స్వీకారంలో బీజేపీ నేతలు..విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బీజేపీ నేతలుకార్యక్రమానికి హాజరైన బీజేపీ చీఫ్ నాగేంద్రన్, తమిళిసై, అన్నామలై#WATCH | Tamil Nadu BJP president Nainar Nagenthran, and BJP leader K Annamalai at the Jawaharlal Nehru Stadium in Chennai, where TVK chief Vijay will take oath as the Chief Minister of Tamil Nadu, shortly. pic.twitter.com/HuzvvWCesA— ANI (@ANI) May 10, 2026👉నెహ్రు స్టేడియం చేరుకున్న గవర్నర్👉కాసేపట్లో విజయ్ ప్రమాణ స్వీకారం.. నెహ్రు స్టేడియంకు బయలుదేరిన గవర్నర్సీఎం ప్రమాణ స్వీకారం నేపథ్యంలో నెహ్రు స్టేడియంకు బయలుదేరిన గవర్నర్ ఆర్లేకర్నెహ్రు స్టేడియంకు చేరుకున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీరాహుల్కు కాంగ్రెస్ శ్రేణుల స్వాగతం. #WATCH | Tamil Nadu | Lok Sabha LoP and Congress MP Rahul Gandhi arrives at the Jawaharlal Nehru Stadium in Chennai, where TVK Chief C Joseph Vijay will take oath as the Chief Minister of Tamil Nadu, shortly. pic.twitter.com/xgXEyzAnNs— ANI (@ANI) May 10, 2026 #WATCH | Chennai | Tamil Nadu Governor Rajendra Vishwanath Arlekar leaves from Lok Bhavan. He will administer the oath of office to TVK Chief C Joseph Vijay as the Tamil Nadu Chief Minister shortly pic.twitter.com/Y9wpi6ol9r— ANI (@ANI) May 10, 2026నెహ్రు స్టేడియం చేరుకున్న త్రిష.. విజయ్ ప్రమాణ స్వీకారానికి వచ్చిన త్రిష. స్టేడియం వద్ద త్రిషకు స్వాగతం. #WATCH | Tamil Nadu: Actor Trisha Krishnan at the Jawaharlal Nehru Stadium in Chennai, where TVK Chief C Joseph Vijay will take oath as the Chief Minister of Tamil Nadu, shortly. pic.twitter.com/oCevs6N1Wx— ANI (@ANI) May 10, 2026విజయ్ మంత్రివర్గంలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేవిజయ్ మంత్రివర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే విశ్వనాథ్కు చోటు.మెలూరు నుంచి గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే విశ్వనాథ్అయితే, నేడు చెన్నైలో జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొనడం లేదు. తొమ్మిది మంత్రులు వీరే.. నేడు సీఎం సహా తొమ్మది మంది మంత్రుల ప్రమాణ స్వీకారంమంత్రి వర్గంలో కీర్తనకు చోటు. మంత్రి వర్గంలో అత్యంత పిన్న వయస్కురాలిగా కీర్తన రికార్డు C. Joseph Vijay, the Chief Minister-designate, has recommended a list of nine persons to be appointed as Ministers for the State of Tamil Nadu.1. N. Anand2. Aadhav Arjuna3. Dr. K.G. Arunraj,4. K.A. Sengottaiyan5. P. Venkataramanan6. R. Nirmalkumar7. Rajmohan8. Dr TK.… pic.twitter.com/0tU5Gox6zM— ANI (@ANI) May 10, 2026 స్టేడియం వద్దకు చేరుకున్న విజయ్నెహ్రుకు స్టేడియం వద్దకు చేరుకున్న విజయ్.విజయ్కి అధికారులు స్వాగతంకాసేపట్లో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం. స్టేడియం వద్ద సందడి.. భారీగా తరలి వచ్చిన అభిమానులు. #WATCH | TVK Chief C Joseph Vijay arrives at the Jawaharlal Nehru Stadium in Chennai, where he will take oath as the Chief Minister of Tamil Nadu shortly. (Source: TN DIPR) pic.twitter.com/4UvuSfAGxj— ANI (@ANI) May 10, 2026చెన్నై చేరుకున్న రాహుల్విజయ్ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ.తమిళనాడు చేరుకున్న రాహుల్కాంగ్రెస్ శ్రేణుల ఆహ్వానం. #WATCH | Tamil Nadu | Lok Sabha LoP and Congress MP Rahul Gandhi arrives in Chennai to attend the swearing-in ceremony of TVK Chief Vijay as the Chief Minister of Tamil Nadu. pic.twitter.com/XOgPYpftwI— ANI (@ANI) May 10, 2026స్టేడియంకు బయలుదేరిన త్రిష..చెన్నైలోని తన నివాసం నుండి బయలుదేరిన నటి త్రిష కృష్ణన్విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్న త్రిష.ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యే అవకాశం. #WATCH | Tamil Nadu: Actor Trisha Krishnan leaves from her residence in Chennai. pic.twitter.com/vUbZ5TpLE9— ANI (@ANI) May 10, 2026 #WATCH | Tamil Nadu: Actor Trisha Krishnan leaves from her residence in Chennai. pic.twitter.com/M7XFTKyKSt— ANI (@ANI) May 10, 2026 విజయ్ కుటుంబ సభ్యుల ఆనందం..విజయ్ సోదరి వ్యాఖ్యలు..విజయ్ ముఖ్యమంత్రి కావడం ఎంతో ఆనందంగా ఉంది.దేవుడి దయ, అభిమానులు, ప్రజల మద్దతే విజయ్ విజయానికి కారణం. మదర్స్ డే రోజున ఇది మాకు ఎంతో ఆనందమని విజయ్ తల్లి శోభ కామెంట్స్.. #WATCH | Chennai, Tamil Nadu: Shoba Chandrasekhar, mother of TVK Chief and CM-designate, Vijay, says, "I am so happy. It is Mother's Day today, I am very happy..." pic.twitter.com/Ti4DM4iCVl— ANI (@ANI) May 10, 2026 #WATCH | Chennai, Tamil Nadu: Cousin of TVK Chief and CM-designate, Vijay, says, "We are very proud. All credits to God and the people of Tamil Nadu." pic.twitter.com/oDu8OiYlqP— ANI (@ANI) May 10, 2026 స్టేడియంకు బయలుదేరిన విజయ్..నెహ్రు స్టేడియంకు బయలుదేరిన విజయ్..కాసేపట్లో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం..భారీ కాన్వాయ్, అభిమానులతో స్టేడియంకు బయలుదేరిన దళపతి.. ఆనందంలో విజయ్ పేరెంట్స్. #WATCH | Tamil Nadu: TVK Chief and CM-designate Vijay leaves from his residence. He will take oath as the Chief Minister of Tamil Nadu today at Jawaharlal Nehru Stadium in Chennai.(Source: TN DIPR) pic.twitter.com/Cydz5VkjfC— ANI (@ANI) May 10, 2026 కీర్తన సరికొత్త రికార్డు..టీవీకే ఎమ్మెల్యే కీర్తన(29) మంత్రివర్గంలో అత్యంత పిన్న వయస్కురాలైన మంత్రిగా బాధ్యతలుశివకాశి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన కీర్తనముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని మంత్రివర్గంలో మంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం #WATCH | Chennai, Tamil Nadu | S Keerthana, TVK MLA-elect from the Sivakasi constituency, says, "Today is a big day for Tamil Nadu and the public of the state...This is the moment everybody has been waiting for..." https://t.co/Ndr3C8C0VK pic.twitter.com/wbw05LZjQs— ANI (@ANI) May 10, 2026పదవుల జాబితా సిద్దం!ముఖ్య నేతలకు పదవులు ఇవ్వడానికి విజయ్ ఇప్పటికే ఒక జాబితా సిద్దం.ప్రజా పరిపాలన, హోంశాఖ తన వద్దే పెట్టుకోనున్న విజయ్. టీవీకే పార్టీ కన్వీనర్ సెంగొట్టయన్కు ప్రజా పనులు.పార్టీ ప్రధాన కార్యదర్శి బస్సీ ఆనంద్కు మున్సిపల్ శాఖ.పార్టీ ప్రచార డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జునకు క్రీడలు, ఎక్సైజ్ శాఖ.పార్టీ సంయుక్త కార్యదర్శి సీటీఆర్ నిర్మల్ కుమార్కు విద్యుత్ శాఖ.అరుణ్ రాజ్కు రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నుల శాఖ.రాజమోహన్కు ఆది ద్రావిడ సంక్షేమం.ముస్తఫాకు మైనార్టీ సంక్షేమ శాఖ. తమిళనాడు బయలుదేరిన రాహుల్ గాంధీ.. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీఢిల్లీకి తమిళనాడుకు బయలుదేరిన రాహుల్ టీవీకేకు కాంగ్రెస్ మద్దుతు. #WATCH | Delhi | Leader of Opposition (LoP) Rahul Gandhi arrives at IGI Airport as he heads to Tamil Nadu He will be attending the swearing-in ceremony of Tamil Nadu CM-designate Vijay in Chennai, today. pic.twitter.com/Z5yNaTr0vw— ANI (@ANI) May 10, 2026విజయ్ ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక ఏర్పాట్లు..నేడు సీఎంగా విజయ్ ప్రమాణం.. విజయ్తో పాటు 9 మంది మంత్రుల ప్రమాణంప్రమాణ స్వీకారోత్సవానికి మాజీ ముఖ్యమంత్రులకు ఆహ్వానం.చెన్నైలో ఉన్న అని దేశాల రాయబారులకు ఆహ్వానం.చెన్నైలో ప్రమాణ స్వీకారం కోసం 20 చోట్ల ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం.ప్రమాణ స్వీకారోత్సవానికి కోలీవుడ్ ప్రముఖులకు ఆహ్వానం. అసెంబ్లీలో బల నిరూపణలకు టీవీకే మూడు రోజులు సమయం ఇచ్చిన గవర్నర్ ఆర్లేకర్. ఈనెల 13న బలనిరూపణకు అవకాశం. నేడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం..నేడు తమిళనాడు నూతన సీఎంగా జోసెఫ్ విజయ్ ప్రమాణస్వీకారంచెన్నై నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా గొప్ప సంబరంకాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీల మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ దాటిన విజయ్రాష్ట్రవ్యాప్తంగా సంబరాల్లో టీవీకే నేతలు, విజయ్ అభిమానులుప్రమాణ స్వీకారానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశంహాజరు కానున్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ.నాలుగు పార్టీల మద్దతు.. ఉదయం 10 గంటలకు నెహ్రూ స్టేడియంలో తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారంనాలుగు రోజుల ఉత్కంఠ తర్వాత టీవీకేకు మద్దతు ప్రకటిస్తూ వీసీకే లేఖకాసేపటికే ఐఎంయూఎల్ కూడా విజయ్కు మద్దతు ప్రకటనకాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐఎంయూఎల్ మద్దతుతో టీవీకే బలం 120కి చేరింది.ఈ నేపథ్యంలో గవర్నర్ను కలిసిన విజయ్ మద్దతు లేఖలు సమర్పించారు.ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన గవర్నర్, తమిళనాడు సీఎంగా విజయ్ను నియమిస్తూ లేఖ విడుదల. -
మీ వంటింట్లోని ప్లాస్టిక్ ప్రాణాంతకమా
మనం రోజూ వాడే వాటర్ బాటిల్స్ నుంచి లంచ్ బాక్సుల వరకు ప్రతి ప్లాస్టిక్ వస్తువు అడుగున ఒక చిన్న త్రిభుజం.. అందులో ఒక నంబర్ ఉండటం మీరెప్పుడైనా గమనించారా? అసలు ఆ నంబర్లు దేనిని సూచిస్తాయి? అవి మన ఆరోగ్యానికి ఎంతవరకు సురక్షితం? ఎంత వరకు ప్రమాదకరం? ఈ ఆసక్తికర వివరాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్లాస్టిక్ వర్గీకరణ.. సొసైటీ ఆఫ్ ది ప్లాస్టిక్స్ ఇండస్ట్రీ (ఎస్పీఐ) అనే సంస్థ 1988లో ప్లాస్టిక్ను ఏడు రకాలుగా వర్గీకరించింది. ఈ వర్గీకరణ వ్యవస్థను రెసిన్ ఐడెంటిఫికేషన్ కోడ్ (ఆర్ఐసీ) అని పిలుస్తారు. ప్లాస్టిక్ రకాలను గుర్తించి వాటికున్న రీసైక్లింగ్ సామర్థాన్ని బట్టి వాటికి 1 నుంచి 7 నంబర్లను కేటాయించారు.1 పీఈటీ: సాఫ్ట్ డ్రింక్ సీసాలు, వాటర్ బాటిళ్ల తయారీకి ఈ రకం ప్లాస్టిక్ని వాడతారు. వాటిని పదేపదే ఉపయోగిస్తే యాంటిమోనీ అనే హానికర రసాయనాలు వెలువడవచ్చు. అత్యధికంగా రీసైకిల్ అవుతున్న ప్లాస్టిక్ ఇది. 2హెచ్డీపీఈ: పాల డబ్బాలు, షాంపూ బాటిళ్లు, డిటర్జెంట్ డబ్బాలకు ఉపయోగిస్తారు. ఇది అత్యంత సురక్షితమైన ప్లాస్టిక్. రసాయనాల విడుదల తక్కువ. సులభంగా రీసైకిల్ చేయవచ్చు. 3 పీవీసీ (వినైల్): పైపులు, పిల్లల బొమ్మలు, క్లింగ్ ఫిల్ములు (గాలి చొరబడకుండా గిన్నెలపై మూతలుగా వాడే ప్లాస్టిక్ షీట్స్) తయారు చేసేందుకు వాడతారు. అయితే దీన్ని ‘పాయిజన్ ప్లాస్టిక్’అంటారు. ఇందులో కేన్సర్ కారక డయాక్సిన్లు, థాలేట్లు ఉంటాయి. వాటిని రీసైక్లింగ్ చేయడం చాలా కష్టం. 4 ఎల్డీపీఈ: ప్లాస్టిక్ కవర్లు, బ్రెడ్ ప్యాకెట్లకు వాడతారు. ఇది కూడా కొంతవరకు సురక్షితమైనదే. కొన్ని అవసరాలకు మాత్రమే రీసైకిల్ చేస్తారు. 5 పీపీ: పెరుగు కప్పులు, సిరప్ బాటిళ్లు, వేడి ఆహార కంటెయినర్లకు వాడతారు. వేడిని తట్టుకుంటుంది. దీనిని కూడా సురక్షితమైన రకంగానే పరిగణిస్తారు. రీసైక్లింగ్ సాధ్యమే. 6 పీఎస్ (పాలీస్టెరీన్): ప్లాస్టిక్ కప్పులు, ప్లేట్లు, టీ–కప్పులు, ప్యాకింగ్ మెటీరియల్, ఎగ్ కార్టన్స్, ధర్మోకోల్ తయారీకి వాడతారు. వేడి తగిలితే స్టెరీన్ అనే విష పదార్థం విడుదల అవుతుంది. మెదడుపై ప్రభావం చూపుతుంది. సాధారణంగా దీనిని రీసైకిల్ చేయరు. చేయడం కూడా కష్టం. 7 ఇతర ప్లాస్టిక్లు: నైలాన్, సన్ గ్లాసెస్, బేబీ బాటిల్స్ (కొన్ని రకాలు) తయారు చేస్తారు. ఇది మిశ్రమ ప్లాస్టిక్. రీసైక్లింగ్ దాదాపు అసాధ్యం.పర్యావరణ నిపుణుల సూచనల ప్రకారం 2, 4, 5 నంబర్లు ఉన్న ప్లాస్టిక్ వస్తువులను వాడటం కొంత వరకు సురక్షితం. కానీ 3, 6, 7 నంబర్లు ఉన్న ప్లాస్టిక్ వస్తువులకు దూరంగా ఉండటం ఆరోగ్యానికి, పర్యావరణానికి మంచిది. ముఖ్యంగా ప్లాస్టిక్ వస్తువుల్లో ఆహారాన్ని ఓవెన్లో వేడి చేయడం లేదా వేడి పదార్థాలను ఉంచడం మానుకోవాలి. ఈసారి మీరు కొనే ప్లాస్టిక్ బాటిల్ అడుగున నంబర్ చూడటం మర్చిపోకండి! -
అన్నాడీఎంకేలో చీలిక!?
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో తాజా అసెంబ్లీ ఎన్నికల ఓటమి పరిస్థితులు మళ్లీ చీలికకు దారి తీస్తాయా అన్న చర్చ ఊపందుకుంది. శనివారం పరిణామాలు ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. 36 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణి స్వామితో సమావేశానంతరం ప్రత్యేక శిబిరంగా ఏర్పాటై సమాలోచనలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అన్నాడీఎంకే సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి, విజయ భాస్కర్, మహిళా ఎమ్మెల్యే లీమా రోజ్ సహా 36 మంది చెన్నై ఎంఆర్సీ నగర్లో సమావేశం కావడంతో అన్నాడీఎంకేలో చీలిక వస్తోందన్న చర్చ జోరందుకుంది. వీరంతా సీవీ షణ్ముగం కార్యాలయంలో సమావేశమయ్యారు.ఆయన ఆది నుంచి టీవీకేకు మద్దుతిద్దామని, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని చెబుతున్నట్లు తెలుస్తోంది. కీలక నిర్ణయం తీసుకునేందుకే ఈ సమావేశమైనట్టుగా చర్చ ఊపందుకుంది. పళణి స్వామికి వ్యతిరేకంగా వ్యవహరించినా, తమపై ఎలాంటి క్రమ శిక్షణ చర్య తీసుకునేందుకు వీల్లేని విధంగా ఇంత పెద్ద సంఖ్యలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఒక చోట చేరినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. అదే సమయంలో వీరంతా టీవీకేకు మద్దతు ఇవ్వొచ్చని, రానున్న కాలంలో విజయ్కు ఏదేని గడ్డు పరిస్థితులు ఎదురైనా అండగా నిలవొచ్చన్న చర్చ సాగుతోంది. అదే సమయంలో అన్నాడీఎంకే నుంచి ఎవరు వచ్చినా పదవికి రాజీనామా చేసే టీవీకేలోకి ఆహ్వానించాలన్న స్పష్టమైన ఆదేశాలను టీవీకే ముఖ్య నేతలకు విజయ్ జారీ చేసినట్టు తెలుస్తోంది. కాగా, విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా పళణిస్వామి శుభాకాంక్షలు తెలిపారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటాం: స్టాలిన్నూతన ప్రభుత్వానికి డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలని, అందుకే కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తాము ఎలాంటి అడ్డంకులు సృష్టించబోమని స్పష్టం చేశారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని చెప్పారు. -
నూతన సీడీఎస్గా సుబ్రమణి
న్యూఢిల్లీ: నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్)గా లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి(రిటైర్డ్)ని కేంద్ర ప్రభుత్వం నియమించింది. త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే బాధ్యతను ఆయనకు కట్టబెట్టింది. ప్రస్తుత సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ ఈ నెలలో పదవీ విరమణ చేయబోతున్నారు. ఆయన స్థానంలో రాజా సుబ్రమణి బాధ్యతలు స్వీకరిస్తారు. సీనియర్ మిలిటరీ అధికారి అయిన రాజా సుబ్రమణికి పాకిస్తాన్, చైనా సైనిక వ్యవహారాలపై అపారమైన పరిజ్ఞానం ఉంది. ఆయన గత ఏడాది జూలై 31న వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రెటేరియట్(ఎన్ఎస్సీఎస్)కు సైనిక సలహాదారుగా సేవలందిస్తున్నారు. కొత్త సీడీఎస్గా ఈ నెల 30న బాధ్యతలు చేపట్టబోతున్నారు. అంతేకాకుండా సైనిక వ్యవహారాల విభాగం కార్యదర్శిగా కూడా ఆయన పనిచేస్తారని రక్షణ శాఖ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. మూడో సీడీఎస్గా రికార్డు లెఫ్టినెంట్ జనరల్ రాజా సుబ్రమణి 40 సంవత్సరాలకు పైగా సైన్యంలో పని చేస్తున్నారు. సుదీర్ఘమైన ఉద్యోగ జీవితంలో సంక్లిష్టమైన, సంఘర్షణలతో కూడిన వేర్వేరు భౌగోళిక పరిస్థితుల్లో సేవలందించారు. అనేక కమాండ్, స్టాఫ్, బోధనా పదవులను నిర్వర్తించారు. రాజా సుబ్రమణి 1965 జూలై 21న ముంబైలో జని్మంచారు. కళాశాల విద్య పూర్తయిన తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ మిలటరీ అకాడమీలో శిక్షణ పొందారు. యునైటెడ్ కింగ్డమ్లోని జాయింట్ సరీ్వసెస్ కమాండ్ స్టాఫ్ కాలేజీలోనూ చదువుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ మద్రాసులో డిఫెన్స్ స్టడీస్లో ఎంఫిల్ పూర్తిచేశారు. 1985 డిసెంబర్ 14న గర్వాల్ రైఫిల్స్ ఎనిమిదో బెటాలియన్లో చేరారు. అస్సాం, జమ్మూకశీ్మర్లో కీలకమైన సైనిక ఆపరేషన్లలో పాల్గొన్నారు. పశ్చిమ, ఉత్తర సరిహద్దులు, అక్కడి పరిస్థితులపై ఆయనకు గట్టి పట్టుంది. 2024 జూలై 1న వైస్ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్గా నియమితులయ్యారు. 2025 జూలై 31 దాకా పనిచేశారు. విశిష్ట సేవా పతకం, పరమ విశిష్ట సేవా పతకంతో సహా ఎన్నో పతకాలు, పురస్కారాలు అందుకున్నారు. దేశంలో మొట్టమొదటి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ 2021 డిసెంబర్ 8న తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. తర్వాత జనరల్ అనిల్ చౌహాన్ 2022 సెపె్టంబర్లో రెండో సీడీఎస్గా నియమితులయ్యా రు. లెఫ్టినెంట్ జనరల్ రాజా సుబ్రమణి భారత మూడో సీడీఎస్గా రికార్డుకెక్కబోతున్నారు. -
బెంగాల్ సీఎంగా సువేందు ప్రమాణం
కోల్కతా: పోరాటాల గడ్డ పశ్చిమబెంగాల్లో కమలనాథుల పరిపాలనా శకానికి నాందిపలుకుతూ ప్రధాని మోదీ సమక్షంలో రాష్ట్ర అగ్రనేత సువేందు అధికారి శనివారం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. తద్వారా రాష్ట్రంలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తొలి బీజేపీ నాయకునిగా సువేందు చరిత్ర సృష్టించారు. ప్రధాని, కేంద్ర మంత్రులు, పలువురు బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ కూటమి పార్టీల అగ్రనేతల సమక్షంలో అత్యంత అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు. గవర్నర్ ఆర్ఎన్ రవి అధికారి చేత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. తర్వాత ఉప్పొంగిపోయిన ప్రధాని తమకు అపూర్వ విజయాన్ని అందించిన బెంగాల్ ఓటర్లకు మోకాళ్లపై ఒంగి నేలకు తల ఆన్చి నమస్కారంచేశారు. ఈ సందర్భంగా బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లోని ప్రమాణస్వీకార ప్రాంగణం జైశ్రీరాం, భారత్ మాతాకీ జై నినాదాలతో మార్మోగిపోయింది. భవానీపూర్లో మమతా బెనర్జీని మట్టికరిపించి, నందిగ్రామ్లో విజయాన్ని సాధించిన సువేందుకు ప్రధాని ప్రమాణ స్వీకారం తర్వాత శుభాకాంక్షలు తెలిపారు. సువేందు తర్వాత సీనియర్ బీజేపీ నేత దిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పాల్, అశోక్ కీర్తనీయ, క్షుదిరాం టుడు, నితీశ్ ప్రామాణిక్లు కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. బ్రాహ్మణ, ఓబీసీ, గిరిజన, కాయస్థ, మథువా, రాజ్వంశీ ఇలా ఆరు సామాజిక వర్గాలకు చెందిన నేతలను కేబినెట్లోకి తీసుకుని బీజేపీ తమ సామాజిక సమానత్వాన్ని చాటింది. రాష్ట్రంలో ఉత్తర, దక్షిణ ప్రాంతాల నేతలకు సమప్రాధాన్యతనిచ్చింది. సోమవారం రాజ్భవన్లో మరికొందరు నేతలు మంత్రులుగా ప్రమాణంచేయనున్నారు. ప్రమాణంచేసిన మంత్రులకు ఇంకా శాఖలను కేటాయించలేదు. సోమవారం శాఖలను కేటాయించి తొలి కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. పెద్దసంఖ్యలో హాజరైన కమలదళ సభ్యులు తొలిసారిగా రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్న క్షణాలను చిరస్మరణీయంగా మార్చాలని బీజేపీ నిర్ణయించింది. ఇందుకోసం భారీసంఖ్యలో అభిమానులు, కార్యకర్తలను తరలించారు. ప్రాంగణమంతా భారీ ఎల్ఈడీ తెరలను ఏర్పాటుచేసి సువేందు, మోదీల పాత ప్రసంగాలను ప్రసారంచేశారు. ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారంచేశారు. పార్టీ జెండాల రెపరెపలతో ప్రాంగణం కాషాయమయమైంది. ‘‘ఈరోజు కోసం ఎన్నాళ్ల నుంచో వేచిచూస్తున్నా. ఎట్టకేలకు మా ప్రభుత్వం వచ్చింది. ఇక టీఎంసీ అరాచకాలకు చెట్లుచీటీ పడుతుంది. సరిహద్దు ఆవలినుంచి చొరబాట్లు ఆగిపోతాయి. అరాచకాలను తట్టుకోలేక నా కుమారుడు సొంత రాష్ట్రం నుంచి వలసపోయాడు. ఇప్పుడు తిరిగొస్తాడు’’అని 80 ఏళ్ల భగవతీదేవి చెప్పారు. హిందు ప్రభుత్వపాలన ఆరంభాన్ని కళ్లారా చూసేందుకు వచ్చానని 70ఏళ్ల నవదీ్వప్ మఠ్లో ప్రజ్ఞాన్ మహరాజ్అనే సాధువు చెప్పారు. బీజేపీ ప్రభుత్వం కొలువుతీరే క్షణాలను కళ్లారా చూడాలని కెనడానుంచి వచ్చానని 50 ఏళ్ల వ్యక్తి చెప్పారు. ప్రత్యేక ఆకర్షణగా ఝాల్మురీ.. ప్రచారంవేళ ప్రధాని రుచిచూసిన బెంగాలీ చిరుతిండి ఝాల్మురీ శనివారం ప్రమాణస్వీకార ప్రాంగణంలో అందర్నీ నోరూరించింది. బీజేపీ నేతలు ప్రత్యేకంగా ఈ స్టాళ్లను ప్రాంగణంలో ఏర్పాటుచేశారు. మరవరాలు, పచ్చి మిరప, మసాలా దినుసులతో ఝాల్మురీ చేస్తారు. దీనిని తినేందుకు పెద్దసంఖ్యలో జనం ఎగబడ్డారు. 20 స్టాళ్లు సరిపోక సొంతంగా కొందరు వ్యాపారులు సైతం స్టాళ్లు పెట్టుకున్నారు. ‘‘ఝాల్మురీ కాస్తంత ఘాటుగాఉంటుంది. కానీ బీజేపీ విజయానికి గుర్తుగా తీపి జోడించాం. అయినా వేగంగా సరుకు అమ్ముడపోయింది’’అని 24 నార్త్పరగణాల జిల్లా నుంచి స్టాల్ పెట్టిన మనీశ్ యాదవ్ చెప్పారు. బీజేపీ జెండా రంగుల్లో తయారుచేసిన రసగుల్లా అయితే హాట్కేకులా అమ్ముడుపోయింది. ‘‘మామూలుగా దొరికే ఝాల్మురీ కంటే ఇక్కడి ఝాల్మురీ నిజంగా బాగుంది’’అని కోల్కతాలోని గోలీగంజ్ వాసి మంజరి బసు అన్నారు.కదలివచ్చిన తారాలోకం ప్రమాణ స్వీకారోత్సవంలో బెంగాలీ సినీలోకం తరలివచ్చింది. ఫిల్మ్, ఎంటర్టైన్మెంట్ రంగం నుంచి పలువురు ప్రముఖులు కార్యక్రమానికి విచ్చేశారు. ప్రసేన్జీత్ ఛట్జీ, జీషు సేన్గుప్తాలతోపాటు శాస్త్రీయ కళాకారులు పండిత్ అజయ్ చక్రవర్తి, డ్యాన్సర్ మమతా శంకర్, నటుడు రిషి కౌశిక్, పాయల్ సర్కార్సహా బెంగాలీ టెలివిజన్ రంగ ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు.వాళ్లకు న్యాయం చేయాలి: సీఎం తల్లి సువేందు సీఎంగా ప్రమాణం చేశాక ఆయన తల్లిదండ్రులు గాయత్రి, సిసిర్ అధికారులు అమితానందం వ్యక్తంచేశారు. తూర్పు మేదినీపూర్లోని కాంతి పట్టణంలో సొంతింట్లో వాళ్లు మాట్లాడారు. ‘‘మాకొడుకు సీఎం అయ్యాడని మాకంటే ఎక్కువగా బెంగాలీ ప్రజలే సంతోషిస్తున్నారు. సువేందు హయాంలో ఇకనైనా ఆర్జీకర్ వైద్యురాలి హత్యోదంతంలో బాధితులకు న్యాయం జరగాలి. ఇలాంటి అకృత్యాల్లో నిందితులకు కఠినంగా శిక్షలుపడేలా చేయాలని కోరుకుంటున్నా’’అని తల్లి గాయత్రి అన్నారు. సువేందు తండ్రి సిసిర్ గతంలో మూడుసార్లు ఎంపీగా గెలిచారు.బీజేపీ అమరులకు మోదీ నివాళులు గత 15 ఏళ్లలో మమతాబెనర్జీ ప్రభుత్వ హయాంలో టీఎంసీ దాడుల్లో మృతిచెందిన బీజేపీ నేతలు,కార్యకర్తలకు నివాళిగా ఏర్పాటుచేసిన తాత్కాలిక స్మారకం వద్ద ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా అంజలి ఘటించారు. ప్రమాణస్వీకార ప్రాంగణంలో ఈ స్మారకం ఏర్పాటుచేశారు. ‘‘కోల్కతాలో ఓవైపు బీజేపీ తొలి సర్కార్ కొలువుతీరుతుంటే మేం మాత్రం తొలుత టీఎంసీ అరాచకపాలనలో అమరులైన బీజేపీ కార్యకర్తలకు నివాళులరి్పంచాం. వీళ్ల త్యాగం సదా మాకు స్ఫూర్తిదాయకం’’అని తర్వాత మోదీ తన ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్చేశారు. వృద్ధ నేతకు మోదీ పాదాభివందనం 98 ఏళ్ల బీజేపీ నేత మఖన్లాల్ సర్కార్ను బీజేపీ ప్రత్యేకంగా వేదిక మీదకు ఆహ్వానించింది. శాలువా కప్పి ఆయన కాళ్లను ప్రధాని మోదీ మొక్కారు. తర్వాత ఆప్యాయంగా హత్తుకున్నారు. యోగక్షేమాలు అడిగి తెల్సుకున్నారు. జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామప్రసాద ముఖర్జీతో కలిసి 1952లో కశ్మీర్లో త్రివర్ణపతాకాన్ని ఎగరేసిన బృందంలో మఖన్లాల్ ఉన్నారు. ఈ సందర్భంగా ఈయననూ అరెస్ట్చేశారు. ‘‘స్వాతం్రత్యానంతరం జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొని ఇప్పటికీ సజీవ స్ఫూర్తిగా ఉన్న అతికొద్ది మందిలో మఖన్లాల్ ఒకరు’’అని బీజేపీ కొనియాడింది. 1980లో బీజేపీ ఏర్పడ్డాక పశ్చిమబెంగాల్లోని వెస్ట్ దినాజ్పూర్, జల్పాయ్గురి, డార్జిలింగ్ జిల్లాలకు మఖన్లాల్ సమన్వయకర్తగా సేవలందించారు. 1981 నుంచి ఏడేళ్లపాటు జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు. -
దివ్యాస్త్రం దిగ్విజయం
న్యూఢిల్లీ: ఆధునిక సాంకేతికతను జోడించిన అగ్ని–5 క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఇందుకు ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం వేదిౖకైంది. ఎంఐఆర్వీ సాంకేతికతను జతచేసి అగ్ని క్షిపణికి శుక్రవారం పరీక్షించామని రక్షణశాఖ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రాజెక్ట్కు ‘మిషన్ దివ్యాస్త్ర’అని పేరుపెట్టారు. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ–ఎంట్రీ వెహికల్(ఎంఐఆర్వీ) సాంకేతికత సాయంతో ఒకే క్షిపణి ద్వారా పలు వార్హెడ్లను ఏకకాలంలో ప్రయోగించవచ్చు. క్షిపణి కోసం శుక్రవారం తొలుత హిందూ మహాసముద్రజలాల్లో, భూతలంపై సుదూరాల్లోని వేర్వేరు ప్రాంతాలను లక్ష్యాలుగా నిర్దేశించారు. ‘‘కలాం ప్రయోగకేంద్రంలోని లాంచర్ నుంచి దూసుకెళ్లిన అగ్ని–5 క్షిపణి నింగిలోకి అత్యంత ఎత్తుకు చేరాక కిందకు తిరిగొస్తూ వేర్వేరు ప్రాంతాల్లోని లక్షిత ప్రదేశాలను ఢీకొట్టేలా పేలోడ్లను జారవిడిచింది. ఇవన్నీ నిర్దేశిత లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించాయి. పేలోడ్ల వేగం, పథం నిర్దేశిత ప్రమాణాలను అందుకున్నాయి. దీంతో ఎంఐఆర్వీ సాంకేతికతను పరీక్షించేందుకు చేపట్టిన ప్రయోగం విజయవంతమైంది’’అని రక్షణశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. భూతలంపై, నౌకలపై మోహరించిన ట్రాకింగ్ వ్యవస్థల సాయంతో ఈ ప్రయోగం ఫలితాలను విశ్లేషించి పరీక్ష విజయవంతమైందని నిర్ధారించుకున్నారు. 5,000 కిలోమీటర్ల పరిధిలో... అగ్ని–1 క్షిపణి మొదలు అగ్ని–4 క్షిపణి దాకా అగ్నిరకం మిస్సైళ్లు 700 నుంచి గరిష్టంగా 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తాయి. అగ్ని–5 ఏకంగా 5,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలనూ తుత్తునియలు చేయగలదు. ఈ క్షిపణిని రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) అభివృద్ధిచేసింది. దేశంలోని పలు ప్రాంతాల్లోని రక్షణరంగ తయారీసంస్థల సహకారంతో ఈ క్షిపణిని తయారుచేశారు. ఎంఐఆర్వీ టెక్నాలజీని జోడించిన అగ్ని–5ను గత ఏడాది మార్చినెలలో తొలిసారిగా పరీక్షించిన విషయం తెల్సిందే. తాజా ప్రయోగం విజయవంతంకావడంపై రక్షణమంత్రి రాజ్నాథ్ ఆనందం వ్యక్తంచేశారు. పరిశోధన, ప్రయోగంలో పాలుపంచుకున్న డీఆర్డీవో, భారత సైన్యం, సంబంధిత పరిశ్రమ భాగస్వాములను ఆయన అభినందించారు. 100 కిలోమీటర్ల కంటే తక్కువ ఎత్తులోంచి దూసుకొచ్చే శత్రు క్షిపణులను మార్గమధ్యంలోనే అడ్డుకునేందుకు 2024 ఏప్రిల్లో భారత్ తొలిసారి ఎండో–అటా్మస్ఫిరిక్ ఇంటర్సెప్టార్ మిస్సైల్ను తొలిసారిగా పరీక్షించింది. తర్వాత ప్రతిష్టాత్మక బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తాజాగా మరోసారి అగ్ని–5 ఎంఐఆర్వీ సాంకేతికత సఫలంతో భారత వ్యూహాత్మక రక్షణ సామర్థ్యం మరింత పటిష్టంకానుంది. ఎంఐఆర్వీ టెక్నాలజీని అందిపుచ్చుకున్న అతికొద్ది ప్రపంచదేశాల సరసన భారత్ చేరింది. గతంలో అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ల వద్దే ఈ టెక్నాలజీ ఉండేది. డీఆర్డీవో శాస్త్రవేత్తల కృషితో ఇప్పుడీ టెక్నాలజీ భారతపరమైంది. -
ఎట్టకేలకు 'విజిల్' మోత
సాక్షి, చెన్నై: తమిళనాడులో నూతన ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న సందిగ్ధ నిశ్శబ్ద వాతావరణంలో విజయ్ విజిల్ ఎట్టకేలకు గట్టిగా మోగింది. ఐదు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ ఐదు పార్టీలు అందించిన మద్దతుతో చివరకు విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ తొలిసారిగా తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. దీంతో నేటి(ఆదివారం) ఉదయం 10 గంటలకు చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ సమక్షంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. 234 మంది సభ్యులున్న శాసనసభలో కనీస మెజారిటీ(118)ని మించి ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టడంలో సఫలీ కృతుడుకావడంతో విజయ్ను ముఖ్యమంత్రిగా నియమిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారని శనివారం తమిళనాడు లోక్భవన్ ఒక అధికారిక ప్రకటన విడుదలచేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని విజయ్ను గవర్నర్ ఆహ్వానించారు. మే 13వ తేదీ లేదా అంతకన్నాముందే బలనిరూపణకు సిద్ధంగా ఉండాలని అధికారిక ఉత్తర్వులో విజయ్ పార్టీకి గవర్నర్ సూచించారు. అధికారిక ఉత్తర్వు వార్త తెలిసి తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్నంటాయి. తమిళనాడు వ్యాప్తంగా టీవీకే మద్దతుదారులు పెద్దమొత్తంలో బాణసంచా కాల్చారు. మిఠాయిలు పంచి ఆనందాన్నీ పంచుకున్నారు. మద్దతుతో ముందుకు... తొలుత ఐదుగురు సభ్యులున్న కాంగ్రెస్ మాత్రమే టీవీకే పార్టీకి మద్దతు పలకగా తర్వాత సీపీ(2)ఎం, సీపీఐ(2) వెంట నడిచాయి. శనివారం విదుథలై చిరుౖథెగల్ కట్చి(వీసీకే), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) సైతం కలిసివస్తామని హామీ ఇవ్వడంతో 107 ఎమ్మెల్యేలున్న టీవీకే పార్టీకి మొత్తం బలం ఒకేసారి 120కి పెరిగింది. వెనువెంటనే గవర్నర్కు మేజిక్ ఫిగర్ అంశాన్ని తెలియజేసేందుకు విజయ్ లోక్భవన్కు బయల్దేరగా అపాయింట్మెంట్ చివరినిమిషంలోనూ ఖరారుకాకపోవడంతో మార్గమధ్యంలోనే నిరాశగా వెనుతిరిగారు. పదేపదే తిప్పుతూ గవర్నర్ ఉద్దేశపూర్వకంగా విజయ్ను వేధిస్తున్నారని వెంటనే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.వీరపాండియన్ అన్నారు. నిష్క్రమించిన కొద్దిసేపటికే సాయంత్రం ఆరుగంటల తర్వాత గవర్నర్ నుంచి విజయ్కు పిలుపు వచ్చింది. ఈసారి కాంగ్రెస్ తమిళనాడు రాష్ట్ర చీఫ్ కె.సెల్వపెరుంథగై, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.షణ్ముగం, సీపీఎం ముఖ్య నేత బాలకృష్ణన్, వీసీకే ముఖ్యనేతలతో కలిసి గవర్నర్తో సమావేశమయ్యారు. 120 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకుందని స్పష్టంచేస్తూ జాబితాను గవర్నర్కు విజయ్ బృందం అందజేసింది. గంటకుపైగా సుదీర్ఘ భేటీ తర్వాత విజయ్ మెజార్టీని అంగీకరిస్తూ తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులను గవర్నర్ తొలగించారు. తమిళనాడు తదుపరి సీఎంగా మీరే ఉండాలంటూ సంబంధిత లేఖను విజయ్కు గవర్నర్ అందజేశారు. దీంతో సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారానికి శ్రీకారం చుట్టినట్లయింది. విజయ్ సారథ్యంలోని ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు తెలుపుతున్నట్లు వీసీకే, ఐఎంయూఎల్ తెలిపాయి. కానీ తాము ఇంకా డీఎంకే సారథ్యంలోని కూటమిలోని కొనసాగుతామని, టీవీకే సర్కార్కు బయటి నుంచి మద్దతు ఇస్తామని వీసీకే ప్రకటించడం గమనార్హం. వీసీకేతో మారిన పరిణామాలు సీపీఎం, సీపీఐలు అధికారికంగా మద్దతు ఇచ్చినా, వీసీకే నేత థోల్ తిరుమావళవన్ నుంచి ఎలాంటి సమాచారం లేక పోవడంతో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది. కేరళకు గవర్నర్ వెళ్లిపోతున్నట్లు సమాచారం రావడంతో మెజార్టీ నిరూపణ, ఆదివారం ప్రమాణస్వీకారంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే హఠాత్తుగా వీసీకే చీఫ్ వైఖరిలో మార్పువచ్చింది. రాష్ట్రపతిపాలన వంటి ప్రమాదంలేకుండా రాష్ట్రంలో స్థిరప్రభుత్వం ఏర్పడాలనే సుదుద్దేశంతో విజయ్కు మద్దతు ఇస్తానని తిరుమావళవన్ ప్రకటించడంతో పరిణామాలువేగంగా మారాయి. రెండు స్థానాలున్న వీసీకే మద్దతుతో టీవీకే బలం మరింత పెరిగింది. తర్వాత చిట్టచివరకు ఐయూఎంఎల్ సైతం తమ ఇద్దరు ఎమ్మెల్యేలు మీతోనడుస్తారని మాట ఇవ్వడంతో టీవీకే కీలక మేజిక్ ఫిగర్ను దాటింది. తర్వాత గవర్నర్ దగ్గరకు వెళ్లడం, ఇప్పటికే టీవీకే శాసనసభాపక్షనేతగా ఎన్నికయ్యానని విజయ్ చెప్పడం, గవర్నర్ ఆమోదం చకచకా జరిగిపోయాయి. అయితే మంత్రివర్గ కేటాయింపులో వీసీకే గట్టిగా పట్టుబట్టవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఐదు పార్టీల మద్దతుతో ఏర్పడుతున్న ప్రభుత్వంలో సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని ఏ పార్టీ నేతలకు కీలక శాఖలు అప్పగిస్తారనే ఇంకా చిక్కుముడిగానే ఉంది. ప్రమాణస్వీకారానికి రాహుల్గాంధీ రాక నేడు చెన్నైలో జరిగే ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ హాజరవుతారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సీఎంగా ప్రమాణంచేయబోతున్న విజయ్కు రాష్ట్ర కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాకూర్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్య నేతలకు మంత్రి పదవులు! టీవీకే ముఖ్య నేతలకు పదవులు ఇవ్వడానికి విజయ్ ఇప్పటికే ఒక జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రజా పరిపాలన, హోంశాఖ తన వద్ద అట్టిపెట్టుకుని పార్టీ కచ్చినర్ సెంగొట్టయన్కు ప్రజా పనులు, పార్టీ ప్రధాన కార్యదర్శి బస్సీ ఆనంద్కు మునిసిపల్ శాఖ, పార్టీ ప్రచార డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జునకు క్రీడలు, ఎక్సైజ్ శాఖ, పార్టీ సంయుక్త కార్యదర్శి సీటీఆర్ నిర్మల్ కుమార్కు విద్యుత్, పార్టీ ముఖ్య నేత అరుణ్ రాజ్కు రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నులు శాఖ, పార్టీ కోశాధికారి వెంకటరామన్కు పాఠశాల విద్యాశాఖ, రాజ మోహన్కు ఆది ద్రావిడ సంక్షేమం, ముస్తఫాకు మైనారిటీ సంక్షేమ శాఖ అప్పగించే విధంగా తొలి జాబితా సిద్ధమైనట్టుగా తమిళనాడు మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాంగ్రెస్కు ఒక మంత్రి పదవి అప్పగిస్తున్నట్టు పేర్కొంటున్నాయి. సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం ప్రోటెం స్పీకర్ నియామకం తర్వాత బల నిరూపణకు విజయ్ వ్యూహ రచన చేస్తున్నట్టు తెలిసింది. అంతకుముందు అమ్మ మక్కల్మున్నేట్ర కళగం(ఏఎంఎంకే) ఏకైక ఎమ్మెల్యే ఎస్.కామరాజ్ సైతం తమకు మద్దతిస్తున్నారని టీవీకే తెలిపింది. ఆయన మద్దతిచ్చే లేఖ ఫోర్జరీది అని ఏఎంఎంకే చీఫ్ టీటీవీ దినకరన్ ఆరోపించారు. ఈ మేరకు గుండీ పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేశారు. దినకరన్ ఆరోపణలను టీవీకే కొట్టిపారేసింది. కామరాజ్ స్వయంగా రాసిన మద్దతు లేఖ వీడియోను టీవీకే బహిర్గతంచేసింది. -
పంజాబ్ మంత్రి అరోరా అరెస్ట్
న్యూఢిల్లీ: రూ.100 కోట్ల జీఎస్టీ కుంభకోణం మనీలాండరింగ్ కేసులో పంజాబ్ మంత్రి సంజీవ్ అరోరా(62)ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. అంతకుముందు, ఆయనకు సంబంధించిన సంస్థల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. గురుగ్రామ్లో ఉన్న హాంప్టన్ స్కై రియాలిటీ లిమిటెడ్తోపాటు ఢిల్లీలోని రెండు చోట్ల సోదాలు జరిపారు. అయితే, అరోరా విచారణలో తమకు సహకరించడం లేదని ఈడీ అధికారులు అంటున్నారు. ఢిల్లీలో కేసు నమోదైనందున ఆయన్ను ఢిల్లీకి తీసుకొచ్చి కోర్టులో హాజరు పరుస్తామన్నారు. అరోరాపై ఫెమా కేసు కూడా ఉంది. ఈ కేసులో ఏప్రిల్ 19వ తేదీన ఆరోరా ఆస్తులను అటాచ్ చేసింది. రాజ్యసభ ఎంపీగా ఉన్న అరోరా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే ఆప్ ప్రభుత్వంలో కీలకంగా మారారు. సీఎం మాన్ ఆయనకు పరిశ్రమలు, వాణిజ్యం, పెట్టుబడులు, విద్యుత్, వంటి ముఖ్యమైన శాఖలను కేటాయించింది. రూ.100 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసినట్లు తప్పుడు జీఎస్టీ బిల్లులు పెట్టారని, దుబాయ్ నుంచి నిధులను అక్రమంగా దేశంలోకి తీసుకువచ్చేందుకు అరోరా ఈ పథకం వేశారని ఈడీ ఆరోపిస్తోంది. తమ మంత్రి అరోరాను ఈడీ అరెస్ట్ చేయడంపై సీఎం భగవంత్ సింగ్ మాన్ స్పందించారు. ఈడీ–బీజేపీ అనైతిక సంబంధం పతనం ఇక్కడి నుంచి మొదలుకానుందంటూ వ్యాఖ్యానించారు. ఔరంగజేబ్లా మోదీ వ్యవహరిస్తున్నారు: కేజ్రీవాల్ పంజాబ్ మంత్రి అరోరా అరెస్ట్పై ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోదీని ఆయన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుతో పోల్చారు. ‘ఇప్పటికే అక్రమంగా దేశంలోని అనేక ప్రాంతాలను ఆక్రమించుకున్న మోదీ జీ ఇప్పుడు పంజాబ్కు చేరుకున్నారు’అంటూ వ్యాఖ్యానించారు. ఆప్ నేతలను భయపెట్టి బీజేపీలోకి రప్పించుకునేందుకు దర్యాప్తు విభాగాలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది. బెంగాల్ ఎన్నికలు ముగిసిన దగ్గర్నుంచి ప్రతిరోజూ మోదీ జీ పంజాబ్లో ఈడీ దాడులు చేయిస్తున్నారు. గత కొన్నేళ్లుగా మోదీ పంజాబ్ను, పంజాబీలను తక్కువ చేసి చూస్తున్నారు’అంటూ ఆరోపించారు. పంజాబ్లో రోజులు దగ్గరపడ్డాయనే తెలిసి..: బీజేపీ ఆప్ విమర్శలకు బీజేపీ దీటుగా బదులిచ్చింది. ‘ఆప్ అవినీతిలో కూరుకుపోయింది. అవినీతి నేతలను అరెస్ట్ చేసినప్పుడల్లా ఆప్ నానా హంగామా చేస్తోంది’అని పేర్కొంది. ‘పంజాబ్లో ఔరంగజేబ్లా వ్యవహరిస్తున్నది కేజ్రీవాల్ తప్ప, మోదీ కాదు. రాష్ట్రంలో పార్టీ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని తెలిసే ఇలాంటి ఆరోపణలకు దిగుతున్నారు’అంటూ ఆ పార్టీ నేత ఆర్పీ సింగ్ మండిపడ్డారు. పంజాబ్ పోలీసు శాఖ హత్యలు, డ్రగ్స్ మాఫియా, ఇసుక మాఫియా లాంటి వాటిపై చర్యలు తీసుకోవడం మాని రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై ఈడీ చర్యలు తీసుకోవడంలో ఎలాంటి తప్పూ లేదన్నారు. -
ఉగ్రదాడుల హెచ్చరికలు.. ఢిల్లీలో హైఅలర్ట్.. !
ఢిల్లీ: దేశ రాజధానిలోని కీలకమైన ప్రదేశాల్లో ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ల (IEDలు)తో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం అందడంతో హైఅలర్ట్ ప్రకటించారు. జాతీయ వార్త సంస్థ ఇండియా టుడేకు నిఘా వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం ఉగ్రవాదులు ఢిల్లీలోని ముఖ్యమైన ప్రదేశాలను IEDలతో లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దాంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. అత్యంత సున్నితమైన రద్దగా ఉండే ప్రాంతాల్లో భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. హెచ్చరిక నేపథ్యంలో, నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ బీజేపీ రాష్ట్ర కార్యాలయం, బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయం బయట కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. మరొకవైపు పోలీసు సిబ్బంది తనిఖీలు నిర్వహించి, అదనపు బారికేడ్లను ఏర్పాటు చేశారు.కీలక ప్రదేశాలలో మోహరించిన భద్రతా దళాలు కూడా లక్ష్యంగా మారే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఆదేశాల మేరకు పనిచేస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తానీ గ్యాంగ్స్టర్-ఉగ్రవాది షాజాద్ భట్టికి సంబంధించిన ఒక ముఠాను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఛేదించిన కొన్ని వారాల తర్వాత ఈ తాజా హెచ్చరిక వెలువడింది. ఈ కేసులో తొమ్మిది మందిని అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా, ఈ ముఠా సభ్యులు ఢిల్లీలో హత్యలకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం. -
గేమ్చేంజర్ తిరుమావళవన్.. జీవితగాధ వింటే గూస్బంప్స్
చెన్నై: కొందరు నేతలు దళితుల కోసం పనిచేస్తున్నామని చెప్పుకుంటారు. కానీ, దళితుల కోసం చేసేది ఏమీ ఉండదు. కొందరు నేతలు మాత్రం దళితుల కోసం అహర్నిశలు కష్టపడతారు. వారి జీవితాల్లో వెలుగులు నింపుతారు. రాజకీయాల్లోకీ వారిని తీసుకొస్తారు. వారి వెనక ఉండి గెలిపిస్తారు. దళితులు ఏ ప్రాంతంలో సమస్యలు ఎదుర్కొంటున్నా, ఏ ప్రాంతంలో మోసాలకు, అణచివేతలకు గురవుతున్నా అక్కడికి వెళ్లి మరీ వారి సమస్యలను పరిష్కరిస్తుంటారు. అటువంటి నేతే తిరుమావళవన్.తిరుమావళవన్ దళితుల హక్కుల కోసం తమిళనాడులో దీర్ఘకాలంగా ఉద్యమాలు చేపట్టిన నాయకుడిగా గుర్తింపు పొందారు. 1990లలో తమిళనాడులో దళితులపై జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా తిరుమావళవన్ నిర్వహించిన సభలు, నిరసనలు పెద్ద ఎత్తున దళిత యువతను రాజకీయంగా చైతన్యపరిచాయి. కుల వివక్ష నిర్మూలన, సామాజిక న్యాయం, రాజకీయ ప్రాతినిధ్యం అంశాలను ఆయన నిరంతరం ముందుకు తెచ్చారు. హిందుత్వ రాజకీయాలు దళితులపై ప్రభావం చూపుతున్నాయని విమర్శిస్తూ, దళితుల రాజకీయ ఐక్యత అవసరమని పిలుపునిచ్చారు. కుల హింస ఘటనల్లో బాధితులకు మద్దతుగా నిలుస్తూ ప్రభుత్వ చర్యలు కోరారు. శ్రీలంక తమిళ శరణార్థుల సమస్యపైనా తిరుమావళవన్ గళం విప్పారు. ఎన్నికల్లో పోటీ చేసి, 2001లో ఎమ్మెల్యేగా అయ్యారు. 2009, 2019, 2024లో చిదంబరం లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు.రిజర్వ్ స్థానాలకే దళిత రాజకీయ నాయకులు, పార్టీలను పరిమితం చేసే రాజకీయ వ్యవస్థలో.. ప్రభుత్వాలకు బయట నుంచి మద్దతు ఇవ్వడమే కాదు, అధికార భాగస్వామ్యంలో కూడా దళిత పార్టీలకు స్థానం ఉండాలన్న తిరుమావళవన్ దీర్ఘకాల డిమాండ్ ఇప్పుడు నెరవేరుతోంది.తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటు వేళ టీవీకే విజయ్కు మద్దతు ఇచ్చి ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది విదుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే) పార్టీ. ఈ పార్టీ మొదట “దళిత్ పాంథర్స్ ఆఫ్ ఇండియా” పేరుతో 1982లో ఉద్యమంగా ప్రారంభమై, తర్వాత “విదుతలై చిరుతైగళ్ కచ్చి”గా రాజకీయ పార్టీగా మారింది. తమిళనాడు రాజకీయాలను మార్చిన దళిత పార్టీగా వీసీకే నిలిచింది. ఈ పార్టీని స్థాపించిన వారు ఎం.మలల్చామి, డి.అముకురాజా. ప్రస్తుత వీసీకే ఛైర్పర్సన్గా తోల్ తిరుమావళవన్ , ప్రధాన కార్యదర్శిగా డి.రవికుమార్ ఉన్నారు.దళితుల ఆశాజ్యోతి తమిళనాడులో దళితుల కోసం తిరుమావళవన్ చేసిన కృషి అంతాఇంతా కాదు. ఇప్పటిది కాదు. 1996లో చిదంబరం దక్షిణ కార్ వీధిలో నిలబడి తిరుమావళవన్ నినాదాలు చేస్తూ దళితుల్లో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అణచివేతను మౌనంగా భరించేందుకు అలవాటు పడ్డ అనేక మంది దళిత యువతలో అది రాజకీయ చైతన్యానికి నాంది పలికింది.వీసీకే రాజకీయాల్లోకి 1999లో అధికారికంగా అడుగుపెట్టింది. 2024లో వీసీకే తమిళనాడులో అతిపెద్ద దళిత పార్టీగా ఎదిగింది. తాజా ఎన్నికల్లో రెండు స్థానాలు మాత్రమే గెలుచుకున్నా.. వీసీకే ఇప్పుడు కూటమిలో కీలక భాగస్వామిగా మారింది. 2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు వేళ విజయ్ టీవీకేకు మద్దతు ఇచ్చి, తమిళనాడు రాజకీయాల్లో కింగ్మేకర్గా ఎదిగింది. వీసీకే ప్రస్తుత అవకాశాలు, భవిష్యత్ దిశ ఇప్పటికీ ప్రధానంగా తిరుమావళవన్ వ్యక్తిత్వం, రాజకీయాలపైనే ఆధారపడి ఉన్నాయి.దళితుల సామాజిక న్యాయం, సాధికారతపై అంబేద్కర్ భావజాలం, హేతువాదం, సామాజిక సంస్కరణ, కుల వ్యతిరేక ఉద్యమంపై పెరియార్ భావజాలం, పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకత, కార్మిక విముక్తిపై మార్క్స్ భావజాలం.. వీటన్నింటినీ సమ్మిళితం చేశారు తిరుమావళవన్. అణచివేత, అసమానతల అనేక పార్శ్వాలను ఎదుర్కొన్నప్పుడే విముక్తి సాధ్యమని ఆయన నమ్ముతా. వాటినే తిరుమావళవన్ ముందుకు తీసుకువెళ్తూ దళితుల జీవితాల్లో మార్పులు తీసుకువస్తున్నారు.దళితులు, అట్టడుగు వర్గాల ప్రజలు తిరుమావళవన్ను తమ ఏకైక ఆశగా భావిస్తున్నారు. హిందుత్వ శక్తులకు వ్యతిరేకంగా చురుకుగా పోరాడుతున్న తమిళనాడులోని ఏకైక కుల వ్యతిరేక పార్టీ వీసీకేనని వారు చెబుతున్నారు.ఇటీవల ముగిసిన 2026 అసెంబ్లీ ఎన్నికల్లో వీసీకే ఎనిమిది స్థానాల్లో పోటీ చేసి రెండు స్థానాల్లో గెలుచుకుంది. 2026 అసెంబ్లీ ఎన్నికలు తిరుమావళవన్ నేతృత్వంలోని వీసీకే రాజకీయ ప్రయాణంలో కొత్త దశకు నాంది పలికాయి. తిరుమావళవన్ కృషి ఎన్నికల తర్వాత దాని ప్రాధాన్యం మరింత పెరిగింది. తమిళనాడులో హంగ్ రావడంతో ప్రభుత్వం ఏర్పాటు వేళ వీసీకే కీలక పాత్ర పోషిస్తోంది. -
మమతా బెనర్జీ కొత్త లాజిక్.. !
పశ్చిమ బెంగాల్లో టీఎంసీ 15 ఏళ్ల పాలన ముగిసిపోయింది.. బీజేపీ నుంచి సువేందు అధికారి ప్రమాణ స్వీకారం కూడా జరిగిపోయింది. అంటే మమతా బెనర్జీ మాజీ సీఎం అయినట్లే కదా. కానీ తాను సీఎం పదవికి రాజీనామా చేయనంటూ పట్టుబట్టుకుని కూర్చున్న మమతకు మాజీ అనిపించుకోవడం ఇష్టం లేనట్లు ఉంది. అందుకే తన సోషల్ మీడియా ప్రొఫైల్స్లో ‘మాజీ సీఎం’ అని కాకుండా కొత్త భాష్యం చెప్పారు. 15,16,17 విధాన సభలకు ముఖ్యమంత్రి అంటూ కొత్తగా ట్యాగ్ చేసుకున్నారు మమతా. దీనివల్ల కలిసొచ్చేది ఏమీ లేకపోయినా, ఇలా చేయడం మాత్రం చర్చనీయాంశమైంది. ఆది నుంచి తాము నైతికంగా ఓడిపోలేదని, బీజేపీనే కుట్ర చేసి ఓడించిందని వాదిస్తూ వస్తున్నారు మమతా. దానిలో భాగంగా సీఎం పదవికి రాజీనామా కూడా చేయనని కూడా చెప్పేశారు. ఈ క్రమంలోనే శనివారం(మే 9వ తేదీ) ఉదయం 11 గంటల వరకూ తన రాజీనామా లేఖను గవర్నర్కు సమర్పించలేదు. కాకపోతే ఆపై తన ‘ఎక్స్’ అకౌంట్లో మాత్రం స్వల్ప మార్పులు చేసుకున్నారు. మస్క్ జోక్యం చేసుకోవాలి..దీనిపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ అంశానికి సంబంధించి ‘ఎక్స్’ ప్రధాన యజమాని ఎలాన్ మస్క్ జోక్యం చేసుకోవాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆమె ప్రొఫైల్ బయోను మస్క్ మార్చాలని కోరుతున్నారు. ఆమె అకౌంట్ను సస్పెండ్ చేయాలని మరికొందరు అంటున్నారు. -
కొత్త సర్కార్కు రిక్వెస్ట్.. ఎంకే స్టాలిన్ కీలక పోస్ట్
చెన్నై: కూటమి నుండి వైదొలిగిన కాంగ్రెస్పై డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు చేశారు. మరో వైపు, రాబోయే కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ.. డీఎంకే పథకాలను భవిష్యత్తులోనూ కొనసాగించాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. తమిళనాడు ప్రజల కోసం డీఎంకే ఎంతో చేసిందన్నారు. విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కజగం' (TVK) పార్టీకి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ తమ కూటమి నుంచి బయటకు రావడాన్ని ఆయన తప్పుపట్టారు. ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.కూటమి తరఫున పోటీ చేసి గెలిచినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు కనీసం కృతజ్ఞతలు చెప్పడానికి కూడా డీఎంకే ప్రధాన కార్యాలయానికి రాలేదని.. ఆ రోజే డీఎంకేతో సంబంధాలను తెంచుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ను అవకాశవాదిగా అంటూ విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉండగా, తమిళనాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకేకు మద్దతు ఇచ్చినప్పటికీ, వీసీకేతో పాటు సీపీఐ, సీపీఐ(ఎం) వంటి వామపక్ష పార్టీలు కూటమిలోనే కొనసాగుతాయని ఆయన అన్నారు.కమ్యూనిస్ట్ నేతలు కామ్రేడ్ షణ్ముగం, కామ్రేడ్ వీరపాండియన్లతో పాటు విడుదల చిరుతైగల్ కట్చి (VCK) పార్టీ నాయకుడు తిరుమావళవన్.. తమిళనాడు హక్కులు, ప్రజల సంక్షేమం కోసం డీఎంకేతో చేతులు కలిపి పోరాడుతూనే ఉంటామని ప్రకటించారు. తద్వారా వారు తమ మధ్య ఉన్న స్నేహభావాన్ని చాటుకోవడమే కాకుండా, బలమైన సిద్ధాంతాలు కలిగిన డీఎంకేపై తమకున్న నమ్మకాన్ని నిరూపించుకున్నారు," అని ఆయన కొనియాడారు."డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ స్థానాలను సాధించలేకపోయినప్పటికీ.. తమకు భారీ సంఖ్యలో ఓట్లు వచ్చాయని.. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తాము ఎలాంటి ఆటంకాలు సృష్టించబోమని.. డీఎంకే ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పనిచేస్తుందని తాను ఇప్పటికే ప్రకటించానని స్టాలిన్ గుర్తు చేశారు. తమ మిత్రపక్షాలు తీసుకునే ఏ నిర్ణయాన్ని అయినా డీఎంకే.. గౌరవిస్తుందని, మళ్లీ ఎన్నికలు వచ్చే పరిస్థితి లేకుండా స్థిరమైన ప్రభుత్వం ఏర్పడేలా సమన్వయంతో వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు. என் உயிரோடு கலந்திருக்கும் தலைவர் கலைஞரின் அன்பு உடன்பிறப்புகளுக்கும், என் உயிர்நிகர் தமிழ் மக்களுக்கும் என் அன்பு வணக்கம்.தேர்தல் முடிவுகள் அறிவிக்கப்பட்ட பின்பு, நடக்கும் நிகழ்வுகளை நீங்கள் பார்க்கிறீர்கள். எந்தக் கட்சிக்கும் ஆட்சி அமைக்கும் பெரும்பான்மை கிடைக்காத வகையில்…— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) May 9, 2026 -
‘మనందరి తొలి శత్రువు బీజేపీనే’
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పగ్గాలు చేపట్టిన బీజేపీని ఎదుర్కోవడానికి అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలని టీఎంసీ అధినేత్రి, మాజీ సీఎం మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. 15 ఏళ్ల టీఎంసీ పాలనకు ముగింపు పలుకుతూ బీజేపీకి ప్రజలు అధికారం కట్టబెట్టి, సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేసిన తరుణంలో మమతా ఈ వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీల శత్రవు బీజేపీనేనని, అందుకోసం అంతా ఏకం కావాలన్నారు మమతా. పశ్చిమ బెంగాల్లోని అన్ని ప్రతిపక్ష పార్టీలు ఒక ఉమ్మడి వేదిక కింద ఏకం కావాలని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ‘ వామపక్ష, అతివాద వామపక్షాలతో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి ఒక ఉమ్మడి వేదికను ఏర్పాటు చేయాలని నేను పిలుపునిస్తున్నా.బీజేపీని వ్యతిరేకిస్తున్న విద్యార్థి సంఘాలు, ఎన్జీవోలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఏకం కావాలి’ అని అన్నారు. బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి బీజేపీ నాయకుడిగా సువేందు అధికారి నిలిచిన తరుణంలోనే మమతా ఈ సందేశం ఇచ్చారు. మే 4న జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించడంతో మమతా పార్టీ ఘోర పరాజయం తప్పలేదు. ఆ సమయంలో బీజేపీపై మమత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది బీజేపీ గెలుపు కాదని, కుట్ర చేసి గెలిచారని ధ్వజమెత్తారు. నైతికంగా గెలుపు మాత్రం తమదేనని మమతా పేర్కొన్నారు. -
తమిళనాడు రాజకీయాల్లో వరుస ట్విస్ట్లు
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో వరుస ట్విస్ట్లు చోటుచేసుకుంటున్నాయి. కేరళం పర్యటనను గవర్నర్ రద్దు చేసుకున్నారు. సాయంత్రం 6.30 గంటలకు విజయ్కు గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. అయితే, విజయ్కు గవర్నర్ తొలుత.. అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో లోక్భవన్కు వచ్చిన విజయ్.. వెనుదిరిగారు. కేరళంకు వెళ్లడానికి సిద్ధమైన గవర్నర్ రాజేంద్ర అర్లేకర్కు ముందస్తు అపాయింట్మెంట్ ఉండటంతో విజయ్కు సమయం ఇవ్వలేదు.విజయ్ కంటే ముందుగా లోక్భవన్కు సీపీఎం నేతలు చేరుకోగా.. వారిని కూడా లోక్భవన్ సిబ్బంది వెనక్కి పంపించారు. అయితే, చివరి క్షణంలో గవర్నర్ తన మనస్సు మార్చుకున్నారు. కేరళం పర్యటనను రద్దు చేసుకున్నారు. విజయ్కు అపాయింట్మెంట్ ఇచ్చారు. టీవీకేకు వీసీకే సంపూర్ణ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీసీకే నుంచి మద్దతు లేఖ కూడా టీవీకే బృందం అందుకుంది. దీంతో వీసీకే మద్దతుతో టీవీకే బలం 118కి చేరింది.ఐయూఎంఎల్ కూడా మద్దతు ఇవ్వడంతో విజయ్కు ఎమ్మెల్యేల మద్దతు 121కి చేరింది. ఇప్పటికే టీవీకేకు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు మద్దతు ఇచ్చాయి. వీసీకే, ఐయూఎంఎల్ ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్కు అందజేయడానికి.. మరోసారి గవర్నర్ అపాయింట్మెంట్ను విజయ్ కోరారు. ఇవాళ(శనివారం) సాయంత్రం గవర్నర్ను కలిసిన విజయ్.. తనకు మద్దతు ఇస్తున్న వారి పేర్లతో లేఖను అందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు.రేపు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారంటీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. రేపు(మే 10, ఆదివారం) నెహ్రూ ఇండోర్ స్టేడియంలో తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరిన విజయ్.. ఎమ్మెల్యేల మద్దతు జాబితా గవర్నర్కు అందజేశారు. -
సినిమాకు కూడా ఇన్ని టేకులు తీసుకుని ఉండడు..!
విజయ్.. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో సంచలనం. అంటే ఇప్పుడు రియల్ హీరో. అంతుకుముందు రీల్ హీరో. సినిమాలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న నటుడు. ఇప్పుడు అదే ఆయన్ను సీఎం పీఠంవైపు నడిపించింది. రజినీకాంత్ లాంటి వారే రిస్క్ చేయలేని చోట.. విజయ్ ఒక అడుగు ముందుకేసి మరీ సక్సెస్ కొట్టాడు. ధైర్యమే సక్సెస్కు పునాది అనే విషయాన్ని విజయ్ నిరూపించారు. అలాంటి ఇలాంటి సక్సెస్ కాదు. తమిళనాడులో డీఎంకే, అన్నా డీఎంకేలు మాత్రమే ఎప్పట్నుంచో రాజ్యమేలుతున్న చోట. ఒక గట్టిదెబ్బ కొట్టాడు. కొత్త పార్టీతో తొలి అడుగు వేసేటప్పుడు ప్రభుత్వ ఏర్పాటు వరకూ వెళ్లడం అంత చిన్న విషయం కాదు. అలాంటిది విజయ్ చేసి చూపించాడు. ఏదో 60 నుంచి 70 సీట్లు అని అంచనా వేసిన చోట విజయ్.. ఏకంగా వందకు పైగా సీట్లు సాధించాడు. మొత్తం 108 స్థానాల్లో విజయ్ భేరీ మోగించి తన సత్తా చూపెట్టాడు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్య్యే మ్యాజిక్ ఫిగర్కు 10 సీట్ల దూరంలో విజయ్ ఆగిపోవడంతో తీవ్ర అనిశ్చిత నెలకొంది. ఫలితంగా రెండు, మూడు సీట్లు సాధించిన పార్టీలకు డిమాండ్ పెరిగిపోయింది. దీనిపై వరుసగా ఫలితాలు వచ్చిన దగ్గర్నుంచీ హైడ్రామా నడుస్తూనే ఉంది. ఒకసారి చిన్న పార్టీల మద్దతు అని, కాసేపు కాదనే డ్రామానే నడిచింది. దాంతో వరుసగా గవర్నర్ అపాయింట్మెంట్ కోరడం, అక్కడ పూర్తి సభ్యుల మద్దతు లేదనడం జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పటివరకూ మూడుసార్లు గవర్నర్ను విజయ్ కలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి ఇక్కడితో ఎండ్ కార్డ్ పడలేదు. ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఎట్టకేలకు వీసీకే, ఐయూఎంలు తాము మద్దతు ఇస్తున్నట్లు లేఖలు ఇవ్వడంతో మరొకసారి గవర్నర్ను కలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎట్టకేలకు గవర్నర్ అపాయింట్మెంట్..అయితే నాల్గోసారి అపాయింట్మెంట్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. కాసేపు గవర్నర్ అపాయింట్ ఇవ్వలేదన్నారు. ఆయన కేరళ పర్యటనకు వెళుతున్నారనేది మొదటి సారాంశం. దాంతో విజయ్ సీఎం ప్రమాణ స్వీకారానికి మరింత సమయం పడుతుందా? అని అభిమానుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఈ నడుమ గవర్నర్ తన కేరళ పర్యటనను చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. విజయ్కు అపాయింట్మెంట్ ఖరారు అయ్యింది. దాంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. గవర్నర్ మనసు మార్చుకుని అపాయింట్మెంట్ ఇవ్వడంతో విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అయినట్లే. ఇన్ని టేకులు సినిమాల్లో కూడా తీసుకుని ఉండడు..తమిళనాడులో ప్రముఖ హీరోల్లో ఒకరైన విజయ్.. సినిమా చేసేటప్పుడు కూడా ఇన్ని టేకులు తీసుకుని ఉండడు అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. సినిమా మనిషి కదా.. ఓపిక ఎక్కువే ఉంటుంది. టేకులు తీసుకోవడం విజయ్కు అలవాటే. అదే ఇప్పుడు జరుగుతుందని అనేవారు కూడా ఉన్నారు. రియల్ లైఫ్లో టేక్లు ఇలానే ఉంటాయని, ఇంత హైడ్రామా నడుమ విజయ్ కూడా మనసులో ఇదే అనుకుని ఉంటాడని అంటున్నారు. టేకాఫ్ అయ్యే ముందు ఈ టేకులను పెద్దగా పట్టించకోవాల్సిన అవసరం లేదనేది విశ్లేషకుల అభిప్రాయం.సినిమా పరంగా టేకులు అంటే ఒకే సందర్భాన్ని పదే పదే చేయడం. ఇప్పుడు అదే విజయ్ నిజ జీవితంలో కూడా జరుగుతూ ఉంది. విజయ్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించిన నాటి నుండి ఇదే జరుగుతూ వస్తోంది. ఒకే సందర్భం.. గవర్నర్ను విజయ్ మళ్లీ మళ్లీ కలవడం. దీనికి ఎప్పటికి ఫుల్స్టాప్ పడుతుందో చూడాలి. ఈరోజు(శనివారం, మే 9వ తేదీ) ముగింపు పడే అవకాశం కనిపిస్తోంది. గవర్నర్ కేరళ పర్యటన రద్దు నేపథ్యంలో ఆ టేక్కు కాస్త క్లియరెన్స్ వచ్చింది. ఫలితంగా విజయ్ సీఎం టేక్ రేపో, మాపో ఓకే అవ్చొచ్చు. -
తమిళనాడు రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. విజయ్కు గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో లోక్భవన్కు వచ్చిన విజయ్.. మళ్లీ వెనుదిరిగారు. కేరళకు వెళ్తున్న గవర్నర్ రాజేంద్ర అర్లేకర్.. విజయ్కు సమయం ఇవ్వలేదు. గవర్నర్కు ముందస్తు అపాయింట్మెంట్ ఉండటంతో విజయ్కు సమయం ఇవ్వలేదు. విజయ్ కంటే ముందుగా లోక్భవన్కు సీపీఎం నేతలు చేరుకోగా.. వారిని కూడా లోక్భవన్ సిబ్బంది వెనక్కి పంపించారు.టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలిగాయన్న సంబరపడిన లోపే గవర్నర్.. విజయ్కు మరో షాక్ ఇచ్చారు. ఈ ట్విస్టులు కొనసాగుతుండగా.. గవర్నర్ తన మనసు మార్చకున్నారు. తన కేరళం పర్యటనను రద్దు చేసుకున్నారు. సాయంత్రం 6.30 గంటలకు విజయ్కు గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. గవర్నర్కు కలిసిన విజయ్.. 121 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందించారు.టీవీకేకు వీసీకే సంపూర్ణ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీసీకే నుంచి మద్దతు లేఖ కూడా టీవీకే బృందం అందుకుంది. దీంతో వీసీకే మద్దతుతో టీవీకే బలం 118కి చేరింది. ఐయూఎంఎల్ కూడా మద్దతు ఇవ్వడంతో విజయ్కు ఎమ్మెల్యేల మద్దతు 121కి చేరింది. ఇప్పటికే టీవీకేకు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు మద్దతు ఇచ్చాయి. -
కేరళ సీఎం ఆయనేనా? ఢిల్లీలో భేటీ.. తీవ్ర ఉత్కంఠ
ఢిల్లీ: కేరళ సీఎం ఎవరన్న విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో సీఎం ఎవరన్న విషయం గురించి ప్రతిసారి ఇటువంటివే రిపీట్ అవుతుంటాయి. ఈ సారి కూడా అదే జరుగుతుంది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో కేరళ కాంగ్రెస్ నేతల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ సన్నీ జోసెఫ్, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దీపా దాస్ మున్షి, ఏఐసీసీ పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్ పాల్గొన్నారు. కేరళ సీఎం రేసులో వీడీ సతీశన్, రమేశ్ చెన్నితాల, కేసీ వేణుగోపాల్ ఉన్నారు. వీరు ముగ్గురు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.ఇటీవల కేరళలో గెలిచిన ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని కాంగ్రెస్ పరిశీలకులు సేకరించారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలపై అధిష్ఠానానికి నివేదిక ఇచ్చారు. కేరళలో కీలకమైన ముగ్గురు నేతలతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకోనుంది ఏఐసీసీ. ఆ తర్వాత కేరళ సీఎం ఎవరనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.కేసీ వేణుగోపాల్కు అధిక మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రచారం జరుగుతోంది. బలమైన నాయకత్వం, అందర్నీ కలుపుకొని పాలన చేయగల సామర్థ్యం ఉన్న నాయకుడికి కేరళ ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. కేరళలో దశాబ్దం తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ విజయంతో దక్షిణాది ఐదు రాష్ట్రాల్లో మూడింటిలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉంటున్నారు.కేసీ వేణుగోపాల్, వీడీ సతీశన్, రమేశ్ చెన్నితల ముగ్గురూ నాయర్ సమాజానికి చెందినవారే. నాయర్లు కేరళ జనాభాలో సుమారు 12 శాతం మాత్రమే. వేణుగోపాల్ (63 ), సతీశన్ (62), చెన్నితల (70) ఈ ముగ్గురిలో చెన్నితల సీనియర్.. అనుభవం ఎక్కువ. కేసీ వేణుగోపాల్.. రాహుల్ గాంధీకి అత్యంత విశ్వాసపాత్రుడు, సన్నిహితుడు. ఎన్నికల సమయంలో అసంతృప్త నాయకులకు సర్దిచెప్పి, పార్టీని ఐక్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించారుఅయితే, గత ఏడేళ్లుగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన పనితీరుపై విమర్శలు కూడా ఉన్నాయి. విద్యార్థి రాజకీయాల్లో ప్రారంభించి, రాష్ట్ర-కేంద్ర మంత్రిగా పనిచేశారు. కేరళకు తిరిగి వస్తే ఢిల్లీలో కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణంలో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉంది. -
ఎండలో వడదెబ్బ ఉండదిక..!
న్యూఢిల్లీ: ఎండా కాలంలో మిట్టమధ్యాహ్నం వేళ బయటకు వెళ్లినప్పుడు సేద తీరేందుకు కాసింత నీడ దొరికితే చాలు అనుకుంటాం. ఎక్కడైనా చలివేంద్రాలు కనబడితే దాహం తీర్చుకుని ఊరట పొందుతాం. బతుకుతెరువు కోసం, అత్యవసర పనుల నిమిత్తం ఎండలో బయటకు వెళ్లాల్సిన అవసరం ఉన్నప్పుడు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి ఎండదెబ్బ తప్పదు. అలాంటి వారి కోసం ప్రభుత్వమే శీతల కేంద్రాలు ఏర్పాటు చేస్తే..?ఢిల్లీ ప్రభుత్వం అలాంటి ఏర్పాటే చేసింది. అధిక ఉష్ణోగ్రతల నుంచి హస్తిన పౌరులకు ఊరట కల్పించేందుకు 'కూలింగ్ జోన్' ఏర్పాటు చేసింది. జామా మెట్రో స్టేషన్ వెలుపల దీన్ని అందుబాటులోకి తెచ్చింది. పగటిపూట ఎండలో శ్రమించే వారికి ఉపశమం కల్పించే ఉద్దేశంతో దీన్ని నిర్మించారు. వేడి నుండి ఉపశమనం పొందడానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరైనా ఈ కూలింగ్ జోన్ సందర్శించవచ్చు. ఇందులో సుమారు 100 కుర్చీలు, 10 పెద్ద కూలర్లు, ఓఆర్ఎస్, ప్రథమ చికిత్స సామాగ్రి ఉంటాయి. ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ (DDMA) సిబ్బంది ఇక్కడ సేవలు అందిస్తారు.హీట్ యాక్షన్ ప్లాన్ కింద ఢిల్లీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా కూలింగ్ జోన్ ఏర్పాటు చేశారు. ఢిల్లీలొ మరిన్ని ప్రాంతాల్లో వీటిని అందుబాటులో తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఢిల్లీ వ్యాప్తంగా ప్రధాన మెట్రో స్టేషన్లు, బస్ స్టాప్ల వద్ద మరిన్ని కూలింగ్ కేంద్రాలను అందుబాటులోకి తేనున్నట్టు అధికారులు చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కలిగించేందుకు ఏర్పాటు చేసిన శీతల కేంద్రాల్లో అందిస్తున్న సేవలపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. వీటిని వార్డు స్థాయికి విస్తరించాలని ఢిల్లీ ప్రజలు కోరుకుంటున్నారు.చదవండి: ఐపీఎల్లో పరుగుల వరద.. కారణం ఇదే!ఎండలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు కూలింగ్ కేంద్రాలు ఎక్కువగా ఉపయోగపడతాయని ఇంటిగ్రేటెడ్ రీసెర్చ్ అండ్ యాక్షన్ ఫర్ డెవలప్మెంట్ (IRADE) డిప్యూటీ డైరెక్టర్ రోహిత్ మగోత్రా అన్నారు. వీటిని జిల్లా స్థాయికే పరిమితం చేయకుండా వార్డు స్థాయికి విస్తరిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని సలహాయిచ్చారు. అలాగే వడగాల్పులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శీతలీకరణ వాహనాలను మొహరించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని కోరారు.రోజు రోజుకు ఎండలు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో బహిరంగ ప్రదేశాలలో పనిచేసే కార్మికులను తీవ్రమైన వేడి, వడగాల్పుల నుంచి కాపాడటానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ (CEEW) ఫెలో డాక్టర్ విశ్వాస్ చితాలే అన్నారు. కూల్ రూఫ్లు, నెట్-జీరో కూలింగ్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. Delhi Government’s ‘Cooling Zone’ gift for the public amid scorching heat pic.twitter.com/VmHaImfihs— ANI (@ANI) May 9, 2026 -
టీవీకే పార్టీకి వీసీకే సంపూర్ణ మద్దతు
చెన్నై: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలిగాయి. టీవీకేకు వీసీకే సంపూర్ణ మద్దతు ప్రకటించింది. వీసీకే నుంచి మద్దతు లేఖ టీవీకే బృందం అందుకుంది. వీసీకే మద్దతుతో టీవీకే బలం 118కి చేరింది. ఐయూఎంఎల్ కూడా మద్దతు ఇవ్వడంతో విజయ్కు ఎమ్మెల్యేల మద్దతు పెరిగింది. 121కి టీవీకే బలం చేరింది. ఇప్పటికే టీవీకేకు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు మద్దతు ఇచ్చాయి.మరోసారి గవర్నర్ అపాయింట్మెంట్ను విజయ్ కోరారు. ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్కు అందజేశారు. వీసీకే చీఫ్కు డిప్యూటీ సీఎం పదవి, పార్టీ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వనున్నట్లు సమాచారం.కాగా, తమిళనాడు రాజకీయాలు గత నాలుగు రోజులుగా సస్పెన్స్ థ్రిల్లర్ని తలపించాయి. నరాలు తెగే ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ప్రమాణ స్వీకారానికి విజయ్ సిద్ధమయ్యారన్న సంకేతాలు టీవీకే వర్గాల్లో జోష్ను నింపి సంబరాల్లో ముంచెత్తాయి. అదే సమయంలో మద్దతు ఇచ్చామని చెప్పి, తర్వాత యూ టర్న్ తీసుకున్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్), విడుదలై చిరుతైగళ్ కట్చి(వీసీకే) రూపంలో దళపతి విజయ్కు పెద్ద షాక్ తప్పలేదు.సీపీఎం, సీపీఐలు బయటి నుంచి మద్దతు ఇస్తూ అధికారికంగా లేఖలు ఇవ్వగా, ఐయూఎంఎల్, వీసీకే మాత్రం ఇంకా లేఖలు ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారాయి. తెరవెనుక బేరసారాల కోసమే మద్దతు విషయంలో వీసీకే తన అభిప్రాయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇవాళ(శనివారం) వీసీకేతో పాటు ఐయూఎంఎల్ కూడా మద్దతు ఇచ్చింది. దీంతో టీవీకే విజయ్కు ఎమ్మెల్యేల మద్దతు పెరిగింది. 121కి టీవీకే బలం చేరింది. -
అప్పుడు లంచం తీసుకుంటూ దొరికి.. ఇప్పుడు సీఎంగా ప్రమాణం
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయడంతో పలువురు ఆయన పాత వీడియోలను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నారు. గతంలో సువేందు అధికారి టీఎంసీలో ఉన్న సమయంలో నోట్ల కట్టలను లంచంగా తీసుకుంటూ కెమెరాకు చిక్కిన ఘటనను గుర్తు చేస్తున్నారు. అప్పట్లో ఆయనపై అవినీతిపరుడంటూ తీవ్ర విమర్శలు చేసిన ప్రధాని మోదీ ఇప్పుడేమో ఆయనను ఆశీర్వదిస్తూ సీఎం కుర్చిలో కూర్చోబెట్టారని పలువురు నేతలు, నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.‘‘మ్యాథ్యూ శామ్యుయేల్ అనే పాత్రికేయుడు 2014లో తహల్కా పత్రిక తరఫున నారదా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు. సువేందు అధికారి ఓ గదిలో ఏం చేస్తున్నారన్న విషయాన్ని రహస్యంగా చిత్రీకరించి బయటపెట్టింది ఆ స్టింగ్ ఆపరేషన్. అందులో టీఎంసీ నేతల్లో పలువురు లంచాలు తీసుకుంటూ కనిపించారు. వారిలో సువేందు అధికారి కూడా ఉన్నారు. 2016 ఎన్నికల వేళ బీజేపీ ఈ వీడియోను బాగా ప్రచారం చేసింది. తర్వాత సువేందు అధికారి బీజేపీలో చేరిన తర్వాత తమ అధికారిక ఛానల్ నుంచి ఆ వీడియోను ఆ పార్టీ తొలగించింది. ఇప్పుడు బీజేపీకి చెందిన ఈ గొప్ప వ్యక్తి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మొత్తం బీజేపీ శ్రేణులు సువేందును పొగడటానికి ఒక్కటయ్యారు. నైతికత ఏమైంది? నైతిక సూత్రాలు ఏమయ్యాయి?’’ అంటూ ఎంపీ సంజయ్ రౌత్ విమర్శలు గుప్పించారు. సువేందు అధికారి లంచం తీసుకున్న వేళ తీసిన వీడియోను కూడా సంజయ్ రౌత్ పోస్ట్ చేశారు.२०१४ मध्ये तहलका मॅगझिनच्या पत्रकार मॅथ्यू सॅम्युअल यांनी नारदा स्टिंग ऑपरेशन केले.TMC चे अनेक मोठे नेते लाच घेताना पकडले गेले, त्यात सुवेंदु अधिकारी देखील होते.२०१६ च्या निवडणुकीत BJP ने या व्हिडिओला प्रचंड प्रमोट केले,पुढे जेव्हा सुवेंदु भाजपात आले, तेव्हा BJP ने आपल्या… pic.twitter.com/YQGvYYkbTC— Sanjay Raut (@rautsanjay61) May 9, 2026మీడియా సమావేశంలోనూ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు ప్రమాణ స్వీకారం చేశారని, కొన్ని సంవత్సరాల క్రితం ఆయనపై బీజేపీ పెద్ద ఎత్తున ఓ ప్రచారం చేసిందని చెప్పారు. ఆయన అవినీతిని బయటపెట్టిందని, కెమెరా ముందు లంచాలు తీసుకుంటున్న దృశ్యాలు కూడా చూపించిందని అన్నారు. సువేందు అవినీతిపరుడంటూ సామాజిక మాధ్యమాలు పోస్టులతో నిండిపోయాయని, ఈడీ దాడులు కూడా జరిగాయని తెలిపారు. అయినప్పటికీ ఇప్పుడు అదే వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు.కాగా, సువేందు అధికారి లంచాలు తీసుకుంటూ కెమెరా ముందు అడ్డంగా దొరికిపోయారంటూ గతంలో ప్రధాని మోదీ విమర్శించిన వీడియో కూడా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ‘‘2016లో కెమెరా ముందు లంచం తీసుకున్నారని సువేందు అధికారిపై మోదీ విమర్శలు చేశారు. 2021లో సువేందు బీజేపీలో చేరారు. ఆయనను బీజేపీ వాషింగ్ మెషీన్లో శుభ్రం చేయటానికి మోదీకి ఐదు సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆయనను మోదీ ఆశీర్వాదిస్తున్నారు. అవినీతిపై మోదీ పోరాటాన్ని ఎవరూ సందేహించకూడదు’’ అంటూ మరొకరు చురకలు అంటించారు. In 2016, Modi attacked Suvendu Adhikari for taking bribe on camera.In 2021, Suvendu joined the BJP and Modi took 5 years to wash him in the BJP washing machine.Now, Modi blesses him as he takes oath as a CM. No one should doubt Modi’s fight against corruption. pic.twitter.com/ldkTi6qvp5— Shantanu (@shaandelhite) May 9, 2026यह मोदीजी अपने ही बनाए हुए मुख्यमंत्री सुवेनदू अधिकारी की बात कर रहे हैं! pic.twitter.com/RcfS0JXASQ— Prashant Bhushan (@pbhushan1) May 9, 2026 -
టీవీకే సర్కార్ ఏర్పాటుపై ట్విస్ట్.. పళనిస్వామి సంచలన పోస్ట్
చెన్నై: తమిళనాడు రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్ని తలపిస్తున్నాయి. ఇప్పటికి మద్దతు లెక్కలు తేలలేదు. విజయ్ ప్రమాణ స్వీకారంపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే నేత పళనిస్వామి పోస్ట్ వైరల్గా మారింది. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ.. పళనిస్వామి కీలక పోస్ట్తో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీకి అభినందనలు అంటూ ఎడప్పాడి పళనిస్వామి ట్వీట్ చేశారు. దీంతో విజయ్తో వీసీకే పొత్తు ఖాయమైందంటూ ప్రచారం జరుగుతోంది.తమిళనాడు ఎన్నికల తర్వాత ప్రతిష్టంభన ఒక కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తున్న తరుణంలో పళనిస్వామి వ్యూహాత్మక పోస్ట్ కొత్త చర్చకు దారితీసింది. తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విజయ్కు అవసరమైన మద్దతు లభించిందా? అనే కోణంలో రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. ఏ పార్టీ పేరునూ నేరుగా ప్రస్తావించకుండానే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న పార్టీకి పళనిస్వామి అభినందనలు తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తమిళ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారాయి.మొత్తం 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో మెజారిటీ మార్కు 118. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 107 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, స్పష్టమైన మెజారిటీకి కొద్దిగా దూరంలో నిలిచింది. ఈ ఉత్కంఠభరిత వాతావరణంలో ఈపీఎస్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను నివారించడానికి.. అలాగే బీజేపీ పరోక్ష జోక్యాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్, సీపీఐ, CPI(M) పార్టీలు ఇప్పటికే విజయ్కు మద్దతు ప్రకటించాయి. ఇప్పుడు అందరి దృష్టి తోల్ తిరుమావళవన్ నేతృత్వంలోని వీసీకే (విడుతలై చిరుతైగల్ కట్చి) పార్టీపై పడింది. ఆ పార్టీ తీసుకునే నిర్ణయమే విజయ్ మెజారిటీ మార్కును దాటడానికి అత్యంత కీలకం కానుంది.తెరవెనుక విజయ్కు అవసరమైన పూర్తి మద్దతు లభించిందనే బలమైన నమ్మకం విపక్ష కూటమిలో వ్యక్తమవుతోందని.. అందుకే పళనిస్వామి ఈ తరహా వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత రెండు రోజులుగా తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటుపై తీవ్ర సస్పెన్స్ కొనసాగుతోంది. వీసీకే పార్టీ తన తుది నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. -
విజయ్ వీరాభిమానుల ఆత్మహత్యాయత్నం
చెన్నై: తమిళనాడులో విజయ్ టీవీకే వందకు పైగా స్థానాలు గెలిచినా ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరుగుతూనే ఉండటంతో ఆ పార్టీకి చెందిన కార్యకర్తల్లో అసంతృప్తి జ్వాలలు రగులుకున్నాయి. తమ నాయకుడు విజయ్ను సీఎం కాకుండా అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని పార్టీ కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. విజయ్ సీఎం కావడంపై ఇంకా అనిశ్చిత నెలకొన్న సందర్భంలో ఇద్దరు టీవీకే కార్యకర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు. ఇందులో నిన్న ఒక కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేయగా, నేడు(శనివారం, మే 9వ తేదీ) ఇసక్కియప్పన్ అనే పార్టీ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.ప్రభుత్వ ఏర్పాటు అంశంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉండటం, విజయ్ సీఎం కాలేడేమోనని మనస్తాపానికి గురై తిరునెల్వేలిలో ఇసక్కియప్పన్ ఆత్మాహుతికి ప్రయత్నించాడు. ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇసక్కియప్పన్ 4 నెలల క్రితం కూడా విజయ్ సీఎం కావాలంటూ తన చెంపలను ఇనుప చువ్వతో పొడుచుకున్నాడు. ఇదిలా ఉంచితే. నిన్న(శుక్రవారం, మే 8వ తేదీ) టీవీకే చెందిన వీరాభిమాని ఒకరు ఆత్మహత్యాయత్నం చేశాడు. విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలపై స్నేహితులతో వాగ్వాదం అనంతరం ఆత్మహత్యాయత్నం చేశాడు 42 ఏళ్ల పార్టీ కార్యకర్త. ప్రస్తుతం చెన్నైలోని రాజీవ్ గాంధీ జనరల్ ఆసుపత్రి(ఆర్జీజీజీహెచ్)ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు సదరు అభిమానుం. ఈ ఘటన తాంబరం సమీపంలోని సెలైర్-సెంబక్కం ప్రాంతంలో జరిగింది. మృతుడిని మారిముత్తుగా గుర్తించారు, అతను మేస్త్రీగా పనిచేస్తాడని, విజయ్కు వీరాభిమాని అని చెబుతున్నారు. -
తమిళనాడు రాజకీయాల్లో మరో భారీ ట్విస్ట్
చెన్నై: తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆ రాష్ట్ర రాజకీయాల్లో మరో భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది. డీఎంకే-అన్నాడీఎంకే ప్రత్యామ్నాయాలపై తీవ్ర స్ధాయిలో చర్చలు జరుపుతున్నాయి. డీఎంకే-అన్నాడీఎంకే కూటమి అభ్యర్థిగా తిరుమావళవన్ తెరపైకి రాగా.. ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, డీఎంకే ప్రతిపాదను అన్నాడీఎంకే వ్యతిరేకిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.సాయంత్రం 4 గంటలకు వీసీకే చీఫ్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. వీకేసీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. టీవీకేకు వీసీకే మద్దతుపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు ఒక స్థానంలో దూరంలో టీవీకే ఉండగా.. వీసీకే మద్దతు కోసం విజయ్ ఎదురుచూస్తున్నారు. వీసీకే పార్టీ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పళనిస్వామి నివాసానికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు చేరుకున్నారు. ఆరుగురు ముఖ్య నేతలతో పళనిస్వామి కీలక చర్చలు జరుపుతున్నారు. -
తమిళనాడులో మళ్లీ ఎన్నికలు సరికాదు: ముకుల్ రోహత్గీ
న్యూఢిల్లీ: తమిళనాడులో నెలకొన్నది రాజ్యాంగ సంక్షోభ పరిస్థితి కాదని, ఇది కృత్రిమ సంక్షోభమని సీనియర్ న్యాయవాది, భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ తెలిపారు. అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీ నాయకుడిగా విజయ్ను గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ మొదటి రోజే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరాల్సిందని ఆయన చెప్పారు. ఆయన పార్టీకి పూర్తి మెజారిటీ లేకపోయినా అది అడ్డంకి కాదని అన్నారు.“మ్యాజిక్ నంబర్కు 10 స్థానాలు తక్కువ ఉన్నా సమస్య కాదు. రాజ్యాంగ సంప్రదాయాల ద్వారా స్థిరపడిన చట్టం ప్రకారం అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీ నాయకుడినే ఆహ్వానిస్తారు. మద్దతు కూడగట్టుకొని ఒకటి లేదా రెండు వారాల్లో స్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం ఇస్తారు” అని రోహత్గీ అన్నారు.భారతదేశంలో ఎప్పటి నుంచో.. అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీకి సభలో మెజారిటీ నిరూపించుకునే అవకాశం ఇస్తున్నారని ఆయన తెలిపారు. మొదట్లో తగిన మెజార్టీ లేకపోయినా ఆ తర్వాత మద్దతు కూడగట్టి అధికారంలో కొనసాగిన సందర్భాలు ఉన్నాయని కూడా చెప్పారు.మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావును ఉదాహరణగా చూపిస్తూ.. విశ్వాస పరీక్ష సమయంలో ఇతర పార్టీలు ఓటింగ్కు దూరంగా ఉంటే మైనార్జీలోనూ ప్రభుత్వాలు కొనసాగగలవని రోహత్గీ అన్నారు.“ఇప్పుడు సమస్య ఏమిటంటే, గవర్నర్ సభ పాత్రను తానే తీసుకొని 118 లేదా ఆ సంఖ్య ఎంతైనా సరే నిరూపించాలని అడుగుతూ సంక్షోభం సృష్టిస్తున్నారు. అది పూర్తిగా తప్పు. అంత పెద్ద ఎన్నికల ప్రక్రియ తర్వాత మళ్లీ ఎన్నికలు నిర్వహించడం గానీ, రాష్ట్రపతి పాలన విధించడం గానీ సరైనది కాదు. ఎన్నికలపై వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. చాలా మంది సిబ్బంది, ఎన్నో గంటల శ్రమ వెచ్చిస్తారు’’ అని అన్నారు.తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో కొనసాగుతున్న ప్రతిష్టంభన మధ్య రోహత్గీ ఈ వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ అర్లేకర్ను శుక్రవారం వరుసగా మూడోసారి కలసిన విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి విజ్ఞప్తి చేశారు. 234 సభ్యుల అసెంబ్లీలో మెజారిటీకి అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు నిరూపించలేదనే కారణంతో విజయ్ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానిఇ గవర్నర్ ఇంకా ఆహ్వానించలేదని సమాచారం. -
‘దండుపాళ్యం’కు ఏమాత్రం తీసిపోకుండా..
ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్నా కొద్దీ.. నేరాల తీరు కూడా మారిపోతోంది. ఏ తరహాలో క్రైమ్ చేయాలి?.. చేతులకు మట్టి అంటకుండా ఎలా చూసుకోవాలి.. ఎలా తప్పించుకుని తిరగాలి.. ఒకవేళ దొరికితే అందులోంచి ఎలా బయటపడాలి.. లాంటి విషయాలను కూడా ఆన్లైన్లోనే వెతికేస్తున్నారు. ఈ క్రమంలో.. పొరుగు రాష్ట్రంలో ఓ షాకింగ్ వెలుగు చూసింది. దండుపాళ్యం బ్యాచ్కు ఏమాత్రం తీసిపోని రీతిలో ఓ ముఠా కర్ణాటక రాజధాని బెంగళూరులో అఘాయిత్యానికి పాల్పడింది. ఒంటరి మహిళపై సుదీర్ఘకాలం నిఘా ఉంచి.. డబ్బు కోసం పథకం ప్రకారం ఆమెను మట్టుపెట్టింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఏప్రిల్ 20వ తేదీన కురుబరహల్లి ప్రాంతాలో ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఓ బైక్ వేగంగా దూసుకొచ్చి ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలపాలైందామె. దీంతో అక్కడే ఉన్న కొందరు యువకులు ఆమెను హుటాహుటిన ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్లారు. రెండ్రోజుల తర్వాత.. ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది. అయితే..అది ప్రమాదవశాత్తూ జరిగింది కాదని.. పైగా ఆమెను ఆస్పత్రిలో చేర్పించే టైంలో ఘోరం జరిగిందని పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. ఈ యాక్సిడెంట్ చేసినోడే.. ఆమెను ఆస్పత్రిలో చేర్పించానంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఈ ఎపిసోడ్లో మరో కొసమెరుపు.మహాలక్ష్మి లేఅవుట్ పీఎస్ పరిధిలో మహాలక్ష్మి అనే మహిళ ఒంటరిగా ఓ అద్దె ఇంట్లో ఉంటోంది. తెలిసినవాళ్ల ద్వారా చేతన్ అనే వ్యక్తి ఆమె దగ్గర కొంత డబ్బు అప్పు తీసుకున్నాడు. అయితే ఆమె దగ్గర మరింత డబ్బు, నగలు ఉన్నట్లు భావించాడు. ఈ క్రమంలో.. స్నేహితులు రాకేష్, మంజునాథ్, చిప్స్ ప్రదీప్, యోహాన్ జాన్తో కలిసి ఓ పథకం వేశాడు.ప్లాన్ ప్రకారం.. రాకేష్ తన బైక్తో నడుచుకుంటూ వెళ్తున్న మహాలక్ష్మిని ఢీ కొట్టాడు. ఆ వెంటనే మిగతా నిందితులు ఆటోతో పాటు అక్కడికి చేరుకుని ఆమెను రక్షించడానికి ప్రయత్నించినట్లు నటించారు. ఆస్పత్రికి తీసుకెళ్లే వంకతో ఆమె పర్సులోని ఇంటి తాళం కొట్టేశాడు మంజునాథ్. ఆపై ఆమె అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లి తాళం తెరవబోయాడు. అయితే అది చూసిన ఇంటి యాజమాని అతన్ని నిలదీశాడు. మహాలక్ష్మికి యాక్సిడెంట్ అయ్యిందని.. ఆస్పత్రిలో చేర్పించామని.. ఆస్పత్రివాళ్లు ఆధార్ కార్డు అడుగుతున్నారని చెప్పాడు. దీంతో యాజమాని హుటాహుటిన మంజునాథ్తో ఆస్పత్రికి బయల్దేరాడు. ఈలోపు.. మంజునాథ్ మిగతా వాళ్లకు సమాచారం ఇవ్వడంతో తమ పథకం విఫలమైందని భావించి ఆమెను విక్టోరియా ఆస్పత్రిలో చేర్పించారు.అయితే.. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. రెండ్రోజుల తర్వాత మంజునాథ్ ఇంటి తాళం తెరవబోయిన విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు ఆ ఇంటి ఓనర్. దీంతో సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా మంజునాథ్ను.. అతనిచ్చిన సమాచారంతో మిగతా వాళ్లనూ అరెస్ట్ చేశారు. మహాలక్ష్మికి బైక్తో ఢీ కొట్టాక.. సరాసరి ట్రాఫిక్ పీఎస్కు వెళ్లిన రాకేష్ ‘‘గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిందని.. తాను ఆస్పత్రిలో చేర్పించానని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’’ అని ఫిర్యాదు చేశాడు. చివరకు పోలీసులు అసలు విషయం తేల్చేయడంతో.. దొంగతనం చేయడానికి ఆమెకు యాక్సిడెంట్ చేశామని, ప్రాణం పోతుందని అనుకోలేదని ఆ యువకులు ఒప్పుకున్నారు. దీంతో హత్య కేసు నమోదు చేసుకుని నిందితుల్ని రిమాండ్కు తరలించారు.Accident Turned Murder: Bengaluru Woman Killed in Chilling Extortion PlotA shocking and well-planned crime has come to light in Bengaluru, where a woman was deliberately killed under the guise of a road accident for financial gain.The incident occurred on April 21 on Pipe Lane… pic.twitter.com/FAJd9SOUZw— Karnataka Portfolio (@karnatakaportf) May 8, 2026 -
సముద్రాన్ని ఈదిన ఐటీ దంపతులు
సాక్షి, చెన్నై : పాక్ జలసంధిని ఈది ఐటీ దంపతులు రికార్డు సృష్టించారు. బెంగళూరుకు చెందిన డానిష్ అబ్ది, విశాలి ప్రసిద్ధ్ దంపతులు సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. బుధవారం వేకువజామున 4.30 గంటలకు శ్రీలంకలోని తలైమన్నార్లో ఈత ప్రారంభించి, మధ్యాహ్నం 3.15 గంటలకు తమిళనాడులోని ధనుష్కోటి చేరుకున్నారు. కేవలం 10.45 గంటల్లో సము్రదాన్ని దాటి పాక్ జలసంధిని ఈదిన మొదటి దంపతులుగా చరిత్ర సృష్టించారు. -
మమతా, అభిషేక్లకు పోలీసుల షాక్!
కోల్కతా: కాలం మారుతుంటుంది.. దీనితోపాటు ప్రజలు, అధికార యంత్రాంగాలు కూడా మారుతుంటాయి. పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామ క్రమంలో కోల్కతా పోలీసులు కూడా మారిపోయారు. వారు తమ అధికారిక ఎక్స్ ఖాతా నుంచి మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ, పలువురు ఇతర తృణమూల్ కాంగ్రెస్ నాయకులను అన్ఫాలో చేశారు. ఇదే సమయంలో పోలీసులు ఇప్పుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పీఎంఓ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల ఖాతాలను ఫాలో కావడం మొదలుపెట్టారు. దీనికితోడు టీఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు పలువురు నేతల నివాసాల వద్ద ఉన్న అదనపు భద్రతను కూడా తొలగించారు.బెంగాల్లో భారీ రాజకీయ మార్పుపశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ నేత సువేందు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, ఇతర ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. 55 ఏళ్ల సువేందు అధికారి.. ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహిత రాజకీయ అనుచరునిగా మెలిగారు. పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కీలక నేతగా వ్యవహరించారు. కాగా సువేందు అధికారి స్థిరమైన పరిపాలనను అందిస్తారని, బెంగాల్ ప్రజల అంచనాలను అందుకుంటారని అమిత్ షా నమ్మకం వ్యక్తం చేశారు.ఇది కూడా చదవండి: కేబినెట్లో ఏకైక మగువ.. ఎవరీ అగ్నిమిత్ర పాల్? -
కేబినెట్లో ఏకైక మగువ.. ఎవరీ అగ్నిమిత్ర పాల్?
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా, ఆయన కేబినెట్లో అందరి దృష్టిని ఆకర్షించిన ఏకైక మహిళా నేత 51 ఏళ్ల అగ్నిమిత్ర పాల్. బాలీవుడ్ గ్లామర్ ప్రపంచం నుంచి బెంగాల్ గల్లీ రాజకీయాల వరకు ఆమె సాగించిన ప్రస్థానం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచింది.అలనాటి హీరోయిన్లకు దుస్తుల తయారీ..ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో జరిగిన ఈ వేడుకలో దిలీప్ ఘోష్, నిశిత్ ప్రమాణిక్ వంటి ఉద్దండులతో పాటు అగ్నిమిత్ర పాల్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం కేబినెట్లో ఉన్న ఏకైక మహిళా ప్రతినిధి ఈమె కావటం విశేషం. రాజకీయాల్లోకి రాకముందు అగ్నిమిత్ర పాల్ కోల్కతా ఫ్యాషన్ రంగంలో తిరుగులేని సెలబ్రిటీగా వెలుగొందారు. ‘ఇంగా’ అనే ఫ్యాషన్ లేబుల్తో శ్రీదేవి, హేమమాలిని వంటి దిగ్గజ నటీమణులకు ఆమె దుస్తులను డిజైన్ చేశారు.2019లో రాజకీయ అరంగేట్రం పశ్చిమ బెంగాల్ సంప్రదాయ ‘కాంతా’ ఎంబ్రాయిడరీని అంతర్జాతీయ వేదికలపైకి అగ్నిమిత్ర పాల్ తీసుకువచ్చారు. 2019లో రాజకీయ అరంగేట్రం చేసిన ఆమె, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అసన్సోల్ దక్షిణ నియోజకవర్గం నుండి టీఎంసీ అభ్యర్థిపై 40,000 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి, పార్టీలో తన పట్టును నిరూపించుకున్నారు. బీజేపీలో చేరిన అతి తక్కువ కాలంలోనే మహిళా మోర్చా అధ్యక్షురాలిగా, పార్టీ ఉపాధ్యక్షురాలిగా అగ్నిమిత్ర కీలక బాధ్యతలు చేపట్టారు.ముఖ్యమంత్రి రేసులో..ఒకానొక దశలో ముఖ్యమంత్రి రేసులో కూడా ఆమె పేరు వినిపించడం విశేషం. అయితే ఆమె రాజకీయ ప్రయాణం అంత సాఫీగా ఏమీ సాగలేదు. తన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం, నిరసనలు, ఆందోళనలకు సంబంధించి ఆమెపై 23 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఏ కేసులోనూ శిక్ష పడకపోయినప్పటికీ, బెంగాల్ మట్టి బిడ్డగా పోరాట పటిమను ప్రదర్శిస్తూ, ఆమె కేబినెట్లో కీలక స్థానాన్ని దక్కించుకున్నారు. -
మఖన్లాల్ పాదాలకు మొక్కిన మోదీ
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్రానికి తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి శనివారం ఉదయం ప్రమాణం చేశారు. బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సహా ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, కేంద్ర మంత్రులు ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఓ పెద్దాయన్ని శాలువాతో సత్కరించి ఆలింగనం చేసుకున్నారు. అంతటితో ఆగకుండా పాదాభివందనం చేశారు. ‘‘బెంగాల్లో మన ప్రభుత్వం వస్తుందని చెప్పా కదా.. వచ్చింది’’ అంటూ మోదీ ఆ పెద్దాయనతో అన్నారు. ఆయన పేరు మఖన్లాల్ సర్కార్. పశ్చిమ బెంగాల్లోనే అత్యంత సీనియర్ బీజేపీ కార్యకర్త. ఆయన నేపథ్యం కూడా ఆసక్తికరంగానే ఉంది.బెంగాల్కు చెందిన మఖన్లాల్ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. ఆరెస్సెస్ రాజకీయ విభాగంగా.. 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ (BJS) స్థాపించిన సంగతి తెలిసిందే. దీంతో మఖన్లాల్ అందులో చేరారు. "ఒక దేశం, ఒక జెండా" అనే నినాదంతో 1952లో కశ్మీర్లో జాతీయ జెండా ఎగరేయడానికి ముఖర్జీ ప్రయత్నించారు. ఆ సమయంలో మఖన్లాల్ కూడా ఉన్నారు. ఈ ఉద్యమంలో ఆయన అరెస్టై జైలుకు కూడా వెళ్లారు.ఆ తర్వాత.. 1977లో బీజేఎస్ జనతా పార్టీలో విలీనమై తర్వాత భారతీయ జనతా పార్టీ (BJP)గా రూపాంతరం చెందింది. టెక్నికల్గా మఖన్లాల్ బీజేపీలో కొనసాగుతూ వచ్చారు. ప్రస్తుతం ఆయన వయసు 98 ఏళ్లు. బెంగాల్లో తొలిసారి బీజేపీ అధికారం చేపట్టింది. ఈ నేపథ్యంలో గౌరవసూచీకంగా ప్రధాని మోదీ ఆయన్ని సత్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. Kolkata, West Bengal: Prime Minister Narendra Modi took blessings and felicitated Makhanlal Sarkar, one of the most senior BJP workers in West Bengal, as he attended the swearing-in ceremony of the new government pic.twitter.com/Yc1FDdlG09— IANS (@ians_india) May 9, 2026 -
15 ఏళ్ల బాలుడు.. 26 ఏళ్ల యువతితో ప్రేమ..!
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): 26 ఏళ్ల యువతితో ప్రేమలో పడిన 15 ఏళ్ల బాలుడు పెద్దలు మందలించడంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన చెన్నపట్టణలోని రాజా కెంపేగౌడ కాలనీలో జరిగింది. పసి వయసులో దారి తప్పి జీవితాన్ని అంతం చేసుకున్నాడు. బిడదికి చెందిన బాలుడు స్థానిక యువతితో పరిచయం పెరిగి ప్రేమలో పడ్డాడు.ఇది పెద్దలకు తెలిసి ఇలా చేయరాదని అతన్ని మందలించారు. యువతి చెన్నపట్టణకు వెళ్లిపోయింది. 2వ తేదీన అక్కడకు వెళ్లిన బాలుడు ఆమెతో గొడవపడి పురుగుల మందును తాగాడు. బాలున్ని ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స ఫలించక మృతిచెందాడు. తమ కుమారుని మృతికి యువతి కారణమని తల్లిదండ్రులు చెన్నపట్టణ గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
తదుపరి సీడీఎస్గా లెఫ్టినెంట్ జనరల్ రాజా సుబ్రమణి
ఢిల్లీ: భారత తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి (రిటైర్డ్)ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆయన రక్షణ వ్యవహారాల విభాగం (డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్) కార్యదర్శిగానూ వ్యవహరించనున్నారు.మరోవైపు చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్గా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ నియమితులయ్యారు. ఈ నెల 31న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. కాగా, ప్రస్తుత ప్రస్తుత సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ మే 30న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆయన స్థానంలో రాజా సుబ్రమణి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఎన్ఎస్ రాజా సుబ్రమణి జాతీయ భద్రతా మండలి కార్యదర్శిత్వంలో (ఎన్ఎస్సీఎస్) సైనిక సలహాదారుగా విధులు నిర్వర్తిస్తున్నారు. అంతకుముందు 2024 జూలై 1 నుంచి 2025 జూలై 31 వరకు భారత సైన్య ఉప ప్రధానాధికారిగా (వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్) పనిచేశారు. అలాగే 2023 మార్చి నుంచి 2024 జూన్ వరకు సెంట్రల్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్గా సేవలందించారు. -
సువేందు అధికారి అనే నేను..
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ల సమక్షంలో ఈ ఘట్టం జరిగింది. సువెందు అధికారి క్యాబినెట్లో మంత్రులుగా ఎమ్మెల్యేలు దిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పాల్, అశోక్ కీర్తానియా, క్షుదీరం తుడు, నిషిత్ ప్రమాణిక్లు కూడా ప్రమాణస్వీకారం చేశారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి ముఖ్యమంత్రి సువేందు, ఇతర మంత్రుల చేత ప్రమాణం చేయించారు. దీనికి ముందు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో అమిత్ షా సమక్షంలో జరిగిన సమావేశంలో సువేందు అధికారి బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీనితో ఆయన బెంగాల్ తొమ్మిదవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో సువేందు అధికారి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరుగుతోంది. #WATCH | Kolkata | Prime Minister Narendra Modi and CM-designate Suvendu Adhikari pay tribute to Gurudev Rabindranath Tagore on his birth anniversary pic.twitter.com/0f2FiHRAWJ— ANI (@ANI) May 9, 2026సువేందు అధికారి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా కోల్కతా చేరుకున్న ప్రధాని స్థానిక బీజేపీ సీనియర్ కార్యకర్తలలో ఒకరైన మఖన్ లాల్ సర్కార్ను సన్మానించి, ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. 1952లో కశ్మీర్లో భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే ఉద్యమంలో శ్యామా ప్రసాద్ ముఖర్జీతో కలిసి వెళుతున్న సందర్భంలో మఖన్ లాల్ సర్కార్ అరెస్టయ్యారు. ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ వద్ద మిఠాయిలు, కుంకుమ రంగు ‘రసగుల్లాలు’ విక్రయానికి అందుబాటులో ఉంచారు. దీనికి ముందు ప్రధాని మోదీ,సువేందు అధికారి తదితరులు రవీంద్రనాథ్ ఠాగూర్కు నివాళులర్పించారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు సీనియర్ ఎన్డీఏ నేతలు హాజరయ్యారు. కాగా పశ్చిమ బెంగాల్కు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. ప్రధాని అక్కడికి చేరుకోగానే ‘మోదీ, మోదీ’ అనే నినాదాలు ఆ ప్రాంగణమంతటా మార్మోగిపోయాయి. #WATCH | BJP leader Suvendu Adhikari arrives at Kolkata’s iconic Brigade Parade Grounds to take oath as the Chief Minister of West Bengal pic.twitter.com/bDFzrPZzZI— ANI (@ANI) May 9, 2026పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. ఎన్నికల సంగ్రామంలో సంచలన విజయంతో రాష్ట్రంలో కమలం వికసించింది. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీపై భవానీపూర్లో అద్భుత విజయం సాధించిన బీజేపీ నేత సువేందు అధికారి, ఈరోజు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఉత్కంఠభరితమైన రాజకీయ పరిణామాల మధ్య జరుగుతున్న ఈ ఘట్టాన్ని యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు ఎన్డీఏ అగ్రనేతలు హాజరయ్యారు. క్యాబినెట్ రేసులో సీనియర్లుసువేందు అధికారి నేతృత్వంలో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వంలో కీలక మంత్రి పదవుల కోసం బీజేపీలోని పలువురు ప్రముఖ నేతలు బలమైన పోటీదారులుగా ఉన్నారు. వారిలో మాజీ కేంద్ర మంత్రి నిశిత్ ప్రమాణిక్, బారక్పూర్ ఎమ్మెల్యే అర్జున్ సింగ్, ముర్షిదాబాద్ నుంచి రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యే గౌరీ శంకర్ ఘోష్ వంటి కీలక నేతల పేర్లు మంత్రివర్గ కూర్పులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి.మంత్రివర్గంలో ఆశావహుల జాబితావీరితో పాటు మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న వారిలో మరికొన్ని ప్రముఖ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ వీహెచ్పీ మాజీ అధ్యక్షుడు శృతి శేఖర్ గోస్వామి, మాజీ ఎంపీ రూపా గంగూలీ, న్యాయవాది కౌస్తవ్ బాగ్చీతో పాటు దీపక్ బర్మన్, సజల్ ఘోష్, ఇంద్రనీల్ ఖాన్, జాయెల్ ముర్ము లాంటి నాయకులు కొత్త ప్రభుత్వంలో క్యాబినెట్ బెర్తుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. #WATCH | Kolkata | Senior NDA leaders, including Union HM Amit Shah, Uttar Pradesh Chief Minister Yogi Adityanath, Andhra Pradesh CM Chandrababu Naidu and others at Kolkata’s iconic Brigade Parade Grounds, where the swearing-in ceremony of the BJP government in West Bengal is… pic.twitter.com/TlThluxqvd— ANI (@ANI) May 9, 2026 -
పుదుచ్చేరి రిసార్ట్ ఖాళీ.. చెన్నైకి అన్నాడీఎంకే ఎమ్మెల్యేల పరుగు!
చెన్నై: తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఎమ్మెల్యేల కొనుగోళ్ల భయం పట్టుకోవడంతో అన్నాడీఎంకే అప్రమత్తమైంది. ఎవరూ చేజారిపోకుండా ఉండేందుకు క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. ఇందులో భాగంగా పుదుచ్చేరిలోని ఓ విలాసవంతమైన రిసార్ట్లో 40 మందికి పైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు బస ఏర్పాట్లుచేసింది. అయితే శనివారం ఉదయం వారిని హుటాహుటిన అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించడం తీవ్ర ఉత్కంఠ కలిగిస్తోంది.ఉత్కంఠ రేపుతున్న తరలింపుపుదుచ్చేరిలోని ఒక లగ్జరీ రిసార్ట్లో గత కొద్ది రోజులుగా బస చేస్తున్న 40 మందికి పైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఆకస్మికంగా అక్కడి నుంచి బయలుదేరారు. ఎమ్మెల్యేలంతా ఒకేసారి గ్రూపులుగా రిసార్ట్ నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు తమిళ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో ముందుస్తు జాగ్రత్తగా, కట్టుదిట్టమైన భద్రత నడుమ వారిని అక్కడి నుంచి తరలించినట్లు సమాచారం.గమ్యంపై గోప్యతరిసార్ట్ నుంచి బయటకు వస్తున్న సమయంలో మీడియా ప్రతినిధులు ఎమ్మెల్యేలను పలకరించే ప్రయత్నం చేశారు. ‘మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు?' అని ప్రశ్నించగా.. చాలా మంది నేతలు సమాధానం దాటవేశారు. తమకు ఏమీ తెలియదంటూ చేతులతో సైగ చేస్తూ వేగంగా వెళ్లిపోయారు. అన్నాడీఎంకే అగ్రనేతలు ఎమ్మెల్యేల కదలికలపై డేగకన్ను వేశారు. సమాచారం బయటకు పొక్కకుండా పూర్తి గోప్యత పాటిస్తూ ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.చెన్నైకే మకాం మార్పు?ప్రత్యర్థి పార్టీలు తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తమవైపు తిప్పుకుంటాయన్న భయమే ఈ తాజా పరిణామాలకు ప్రధాన కారణమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. క్రాస్ ఓటింగ్ లేదా పార్టీ ఫిరాయింపులు జరగకుండా ఎమ్మెల్యేలందరినీ ఒకే గొడుగు కింద ఉంచేందుకే ఈ వ్యూహం పన్నారు. శనివారం మధ్యాహ్నానికి వీరందరినీ చెన్నైలోని మరో సురక్షిత ప్రాంతానికి తరలించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. -
త్రిష ఆశలు గల్లంతేనా?
తమిళనాడు ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెల్చుకుని సంచలనానికి తెర తీసినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం టీవీకే అధినేత విజయ్కు పూటకో తలనొప్పి ఎదురవుతోంది. ఫలితాలు వెల్లడై ఐదు రోజులు గడుస్తున్నా.. సీఎంగా ప్రమాణం చేయకపోవడంతో ఆయన అభిమానులు నిరాశ చెందుతున్నారు. పూర్తి బలం(118)తో రావాలంటూ గవర్నర్ తేల్చి చెప్పేయడంతో మద్దతు కూడగట్టే పనిలో మునిగిపోయారు. ఈలోపు.. మరో ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. విజయ్కు గతంలో పలువురు నటీమణులతో సంబంధాలు ఉన్నట్లు ఉధృతంగా ప్రచారం జరిగింది. అయితే వాటిని ఆయనో, అవతలి తారలో కొట్టిపారేస్తూ వచ్చారు. ఎన్నికలకు కొద్దిరోజులు ముందు.. నటి త్రిషతో ఆయన ప్రైవేట్ టిప్కు వెళ్లడం.. చిన్న ‘క్లూ’తో ఆ విషయం బయటకు రావడంతో తమిళనాట సంచలన చర్చ నడిచింది. ఈలోపు ఎన్నికలకు కొద్దిరోజుల ముందు విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టుకెక్కడంతో ఆ బంధం అఫీషియల్గానే బయటపడింది. ఆపై..విజయ్తో కలిసి ఓ వివాహ వేడుకకు త్రిష హాజరు కావడం, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నాడే ఆమె పుట్టినరోజు కావడం.. ఫలితాల్లో విజయ్ విక్టరీ.. ఆమె స్వయంగా ఇంటికి వెళ్లి విజయ్ను అభినందించడం.. ఇటు త్రిషకు బర్త్డే విషెస్ చెప్పే క్రమంలో తారాలోకం విజయ్ ప్రస్తావన తేవడం.. వెనువెంట చర్చనీయాంశాలుగా మారాయి. ఒకవైపు వీళ్ల వ్యక్తిగత జీవితం గురించి చర్చ నడుస్తున్న వేళ.. అనూహ్యంగా త్రిష రాజకీయ అరంగేట్రం టాపిక్ తెరపైకి వచ్చింది.విజయ్ అత్యధిక మెజారిటీతో పెరంబూర్లో గెలిచారు. అదే సమయంలో తిరుచ్చి ఈస్ట్లోనూ విజయం సాధించారు. రెండింటిలో తిరుచ్చి ఈస్ట్కే ఆయన రాజీనామా చేస్తారని టీవీకే వర్గాలు వెల్లడించాయి. అయితే త్రిష టీవీకేలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని.. విజయ్ ఖాళీ చేసే స్థానంలో నటి త్రిషను పోటీ చేయిస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రతిపాదన టీవీకే పార్టీ సమావేశంలోనూ జరిగిందని.. ఆమెకు ఏకంగా డిప్యూటీ సీఎం చేయబోతున్నారనే మరో గాలి వార్త చక్కర్లు కొట్టింది.అయితే త్రిషకు రాజకీయాలంటే ఇష్టమే. గతంలో ఏకంగా సీఎం అవ్వాలని ఉందంటూ ఓ ఇంటర్వ్యూలో ఆమె ప్రకటించారు. అందుకు సంబంధించిన క్లిప్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. అంతేకాదు.. విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రత్యక్షంగా.. పరోక్షంగా.. ఆయనకు మద్దతు ఇస్తూ వస్తున్నారు. వీటికి తోడు నాలుగు పదుల వయసులో ఉన్న త్రిషకు సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఆమె దాదాపుగా రాజకీయాల వైపు వెళ్లవచ్చని అంతా భావించారు.కానీ, ఆమెకు నిరాశే ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ పార్టీకి సంఖ్యా బలం తక్కువగా ఉంది. దీంతో.. చిన్న పార్టీల మద్దతు కోరారు. దళిత వాదంతో పుట్టికొచ్చిన విడుదల చిరుతైగళ్ కట్చి పార్టీ ఈ ఎన్నికల్లో రెండు సీట్లు నెగ్గింది. వామపక్షాలకు దగ్గరగా ఉండడంతో.. ఈ పార్టీ కూడా విజయ్కు షరతుల్లేకుండా బయటి నుంచి మద్దతు ఇవ్వొచ్చని అంతా భావించారు. కానీ, ఆఖరి నిమిషంలో వీసీకే పార్టీ అధ్యక్షుడు తిరుమావళవన్ పెద్ద మెలికే పెట్టారు.తనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని, తన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని, దళిత సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తోంది వీసీకే. వీటితో పాటు విజయ్ వదిలేసే తిరుచ్చి ఈస్ట్ను కూడా తమకే వదిలేయాలని టీవీకే ముందు మొత్తం నాలుగు డిమాండ్లు ఉంచింది. వీటిలో మంత్రి పదవితో పాటు ప్రత్యేక చట్టం డిమాండ్లకు విజయ్ ఇప్పటికిప్పుడు సుముఖంగానే ఉన్నట్లు.. మిగతా రెండింటి విషయంలోనే ఆయన తటపటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీసీకే మద్దతు టీవీకేకు ఎంతో కీలకం. ఒకవేళ.. మిగతా రెండు డిమాండ్లకు గనుక విజయ్ అంగీకరిస్తే త్రిష ఆశలు గల్లంతైనట్లేనన్న చర్చ ఇటు తమిళ రాజకీయాలు, అటు సినీ రంగంలోనూ జోరుగా నడుస్తోంది. -
కాంగ్రెస్ ఒక్కటే సరిపోదు.. డీఎంకే నేత కీలక వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడు పొలిటికల్ యూటర్న్లు పీక్స్టేజ్కు చేరుకున్న వేళ డీఎంకే నాయకుడు ఇళంగోవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకేతో కలిసి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుకోవడం లేదన్నారు. డీఎంకే ఒంటరిగానే ఉందన్నారు. విజయ్.. తగిన బలంతో వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ను సంప్రదించాలన్నారు.డీఎంకే నాయకుడు టీకేఎస్ ఎలాంగోవన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘టీవీకే అధినేత విజయ్ ముందుగా ఇతర రాజకీయ పార్టీలతో ప్రయత్నించి ఆ తర్వాతే గవర్నర్ను సంప్రదించాలి. ఒకే అతిపెద్ద పార్టీగా టీవీకేకు చెందిన 107 మంది ఎమ్మెల్యేలతో విజయ్ ఒంటరిగా వెళ్ళి ఉంటే, ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం తెలిపి ఉండేవారు. కానీ వారు కాంగ్రెస్తో కలిసి వెళ్ళి, మెజారిటీని నిరూపించుకోవాలని చూస్తున్నారు. తగిన బలం లేకుంటే గవర్నర్ ఎలా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తారు. తమిళనాడులో డీఎంకే ఒంటరిగానే ఉంది. ప్రభుత్వ ఏర్పాటు ఆలోచన మాకు లేదు. ఏఎంఎంకే ఎమ్మెల్యే టీవీకేకు మద్దతు ఇవ్వనప్పుడు ఆయన మద్దతు లేఖ ఎందుకు ఇవ్వాలి? ఫిర్యాదుపై పోలీసులు విచారణ జరిపినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఫోర్జరీ కేసులో పోలీసులు ఏం తేల్చారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. అలాగే, ఏఎంఎంకే సపోర్టు లెటర్ లేకుండా ఎందుకు డ్రామా చేస్తోంది. అన్నాడీఎంకే ఎందుకు ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచింది. టీటీవీ దినకర్ అర్ధరాత్రి హైడ్రామా క్రియేట్ చేశారు. ఎమ్మెల్యేల సంఖ్యా బలం చెప్పకుండా అన్నాడీఎంకేను ఎందుకు ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచిందని మండిపడ్డారు. #WATCH | Chennai | DMK leader TKS Elangovan says, "He (TVK chief Vijay) should first try with other political parties and then approach the Governor. If AMMK MLAs are not supporting TVK, then why should he give a letter of support? Let us see what happens when the police… pic.twitter.com/IPIfw54koq— ANI (@ANI) May 9, 2026అంతకుముందు కూడా ఇళంగోవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకేకు బీజేపీ ఎలాంటి సూచనలు చేసిందో తనకు తెలియదన్నారు. ఒకవేళ అన్నాడీంఎకే గనక టీవీకేకు మద్దతు ఇవ్వకపోతే.. ఏ పార్టీకీ సరైన మద్దతు రాకపోవడంతో హంగ్ వస్తే.. మళ్లీ కొత్తగా ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తవచ్చని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ డీఎంకే ఓటమిపైనా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏదో పొరపాటు జరిగిందని.. అదేమిటో తాము పరిశీలిస్తున్నామన్నారు. కేవలం అధికారంలోకి రావడం మాత్రమే డీఎంకే అజెండా కాదని, కొన్ని దశాబ్దాలుగా తమ పార్టీ అధికారంలో ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ మద్దతు మాత్రమే సరిపోదని వ్యాఖ్యానించారు. ఆ పార్టీకి కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలే ఉన్నారని, అందువల్ల ఆ పార్టీ మద్దతుతో సర్కార్ ఏర్పాటు సాధ్యం కాదన్నారు. -
వైద్యుడి బలవన్మరణం.. నర్స్ ఆత్మహత్య
బెంగళూరు: ఒకే ఆస్పత్రిలో పని చేస్తున్న డాక్టర్, నర్స్ రెండు రోజుల తేడాలో ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన కనకపుర పట్టణంలోని మహదేశ్వర కాలనీలో చోటు చేసుకుంది. స్థానిక నవోదయ ఆస్పత్రిలో వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ చేతన్ కుటుంబ కలహాల నేపథ్యంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే ఆస్పత్రిలో నర్స్గా పని చేస్తున్న సరస్వతి(45) గురువారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరూ ఈ ఆస్పత్రిలో చాలా ఏళ్లుగా పని చేస్తున్నారు. డాక్టర్ మృతిని తట్టుకోలేక సరస్వతి మనోవేదనకు గురై తానూ ఆత్మహత్య చేసుకుందన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఘటనపై కనకపుర పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
అప్పుల కొండపై ‘బిగిల్’ వేస్తున్న విజయ్..
చెన్నై: తమిళ రాజకీయాల్లోకి సినిమాటిక్ ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ విజయ్.. తన భారీ హామీలతో ప్రజలను అమితంగా ఆకర్షించారు. అయితే ఆయన ఇచ్చిన ‘బంగారం, పట్టుచీరలు’, ఉచిత పథకాల వాగ్దానాలను నెరవేర్చాలంటే రాష్ట్ర ఖజానాకు ఏటా సుమారు రూ. లక్ష కోట్లు అవసరం అవుతాయని తాజా గణాంకాలు చెబుతున్నాయి.ఇప్పటికే రూ.10.71 లక్షల కోట్ల అప్పుల పర్వతం కింద ఉన్న తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న విజయ్కు తాను ఇచ్చిన హామీలే సవాల్గా మారనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అంచనాల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి తమిళనాడు మొత్తం ఆదాయం రూ.3.31 లక్షల కోట్లు. అయితే, విజయ్ తన ‘తమిళగ వెట్రి కజగం’(టీవీకే) పార్టీ తరఫున ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే, రాష్ట్ర మొత్తం ఆదాయంలో దాదాపు మూడో వంతు (సుమారు లక్ష కోట్లు) ఏటా కేటాయించక తప్పదు.గత ఆర్థిక సంవత్సరంలో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం రూ.65,000 కోట్లు ఖర్చు చేయగా, మేనిఫెస్టోలోని హామీలన్నింటినీ నెరవేర్చాలంటే విజయ్ సర్కార్ ఆ బడ్జెట్ను ఏకంగా మరో 50 శాతానికి పైగా పెంచాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నికల్లో టీవీకేను అతిపెద్ద పార్టీగా నిలబెట్టడంలో విజయ్ మేనిఫెస్టోనే కీలక పాత్ర పోషించింది. ఇందులో ప్రధానంగా.. గృహిణులకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, ఏటా ఆరు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు, ప్రతి ఇంటికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి ఆకర్షణీయమైన పథకాలున్నాయి. వీటికి తోడు, వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్న కుటుంబాల యువతుల వివాహాలకు బంగారంతో పాటు పట్టుచీరలు ఇవ్వడం, నిరుద్యోగ పట్టభద్రులకు నెలకు రూ.4,000 ఆర్థిక సాయం వంటి భారీ హామీలను విజయ్ ప్రకటించారు.అప్పుల కుప్పలో మేజిక్ సాధ్యమేనా?ప్రజలకిచ్చిన ఈ భారీ వాగ్దానాలు నెరవేర్చడం విజయ్కు కత్తిమీద సామే. వచ్చే ఏడాది మార్చి నాటికి రాష్ట్ర అప్పుల భారం రూ.10.71 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. రాష్ట్ర వార్షిక ఆదాయం కేవలం రూ.2.1 లక్షల కోట్లుగా ఉండగా, అందులో సగం కేవలం సంక్షేమ పథకాలకే ఖర్చు చేయాల్సి వస్తుంది. సంపాదనలో ప్రతి మూడో రూపాయి ఎన్నికల హామీలకే పోయే బడ్జెట్తో ప్రభుత్వాన్ని నడపడం సాధ్యమేనా? కుంచించుకుపోతున్న ఖజానాకు, ఆకాశాన్నంటే హామీలకు మధ్య ‘దళపతి’ సమతుల్యత సాధిస్తే .. అది ఆయన బ్లాక్ బస్టర్ సినిమాల కంటే గొప్పగా నిలిచిపోతుందంటున్నారు విశ్లేషకులు.ఇది కూడా చదవండి: పినరయి కారుపై మోజు.. కుంజుమోన్ సీటుకు ‘క్లోజు’! -
మరో వివాదంలో విజయ్.. అతడికేం పని?
చెన్నై: టీవీకే అధినేత విజయ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. గవర్నర్తో భేటీకి జగనాయగన్ సినిమా ప్రొడ్యుసర్ను తీసుకెళ్లడం వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారంపై రాజకీయ ప్రత్యర్థులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటులో సినిమా ప్రొడ్యూసర్కి ఏం పని అని అంటూ ప్రశ్నిస్తున్నారు.కాగా, టీవీకే విజయ్.. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో గవర్నర్ ఆర్లేకర్తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి జగనాయగన్ ప్రొడ్యూసర్ వెంకట్ కే నారాయణ కూడా వచ్చారు. దీంతో, కొత్త వివాదం తెరపైకి వచ్చింది. రాజకీయాలకు సంబంధంలేని వ్యక్తి.. ప్రభుత్వ ఏర్పాటులో విషయంలో ఎందుకు భాగమయ్యారని ప్రతిపక్ష నేతలు ప్రశ్నించారు. ఇదే సమయంలో విజయ్, నారాయణపై తీవ్ర విమర్శలు గుప్పించారు.ప్రొడ్యూసర్ వెంకట్ కే నారాయణ.. ప్రభుత్వ ఏర్పాటు కోసం వామపక్షాలకు డబ్బులు ఇచ్చారని ఆరోపించారు. ఇతర పార్టీలకు కూడా ఆయన ద్వారానే డబ్బు చేరుతోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రోట్కాల్కి విరుద్దంగా విజయ్.. ప్రొడ్యూసర్ను గవర్నర్ వద్దకు తీసుకెళ్లారని విమర్శించారు. చివరగా.. నారాయణపై హార్స్ ట్రేడింగ్ ఆరోపణలు చేశారు. ఇదే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రత్యర్థులు సిద్దమైనట్టు సమాచారం. -
పినరయి కారుపై మోజు.. కుంజుమోన్ సీటుకు ‘క్లోజు’!
కన్నత్తూర్: పాతికేళ్ల పాటు ఒకే నియోజకవర్గానికి రారాజుగా వెలుగొందిన ఓ సీనియర్ రాజకీయ నేత తన తొలి ఓటమిని తట్టుకోలేకపోతున్నారు. కన్నత్తూర్ నియోజకవర్గంపై తన ముద్ర తొలిసారి చెరిగిపోవడంతో ఆర్ఎస్పీ(ఎల్) నేత కోవూరు కుంజుమోన్ మీడియా సమక్షంలో కన్నీరుమున్నీరయ్యారు. 2001 నుంచి వరుస విజయాలు సాధించిన ఆయన, తాజా ఎన్నికల్లో ఆర్ఎస్పీ అభ్యర్థి ఉల్లాస్ కోవూరు చేతిలో ఏకంగా 25 వేల భారీ ఓట్ల తేడాతో ఘోర పరాజయం పాలవ్వడం కేరళ రాజకీయాల్లో సంచలనంగా మారింది.రాజకీయ ప్రస్థానం.. ఊహించని షాక్ కుంజుమోన్ రాజకీయ ప్రస్థానంలో 2016లో కీలక మార్పు చోటుచేసుకుంది. అప్పటివరకు ఉన్న మాతృసంస్థ (ఆర్ఎస్పీ) యూడీఎఫ్లో చేరడంతో, ఆయన విడిపోయి లెనినిస్ట్-మార్క్సిస్ట్ వర్గాన్ని స్థాపించి ఎల్డీఎఫ్తో జతకట్టారు. అప్పటినుంచి కన్నత్తూర్ను తన కంచుకోటగా నిలుపుకున్నారు. అయితే తాజా అనూహ్య ఓటమిపై ఆయన స్పందిస్తూ.. ‘నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వ నిధులన్నీ తీసుకొచ్చాను, ప్రజల మధ్యే ఉన్నాను, ఓటమిని అంగీకరిస్తున్నాను’ అని అన్నారు.ప్రచార లోపమే కొంపముంచిందా?తన ఓటమికి ప్రజల్లో వ్యతిరేకత కంటే, తాను చేసిన పనులను ప్రచారం చేసుకోకపోవడమే ప్రధాన కారణమని కుంజుమోన్ విశ్లేషించారు. ‘కిఫ్బీ’ తదితర నిధులతో ఏకంగా రూ. 1,010 కోట్ల అభివృద్ధి పనులు చేశానని ఆయన గుర్తుచేశారు. ‘నేను ప్రచార ఆర్భాటాలకు పోయే వ్యక్తిని కాను. కానీ రోడ్లు, పాఠశాలల నిర్మాణం వంటి పనులను ప్లెక్సీలు, ప్రకటనల ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సింది’ అని ఆయన పేర్కొన్నారు. తాను చేసిన అభివృద్ధిని చాటుకోవడంలో విఫలమవ్వడమే ఈ పరాజయానికి దారితీసిందని కుంజుమోన్ అభిప్రాయపడ్డారు.కారు కొంటే తప్పా..? కన్నీటి పర్యంతం మీడియా సమావేశంలో ఆయన వ్యక్తిగత జీవితం, ఇటీవల కొన్న కొత్త కారు గురించి ప్రస్తావన రాగానే కుంజుమోన్ తీవ్ర భావోద్వేగానికి గురై, వెక్కి వెక్కి ఏడ్చారు. ‘కామ్రేడ్ పినరయి విజయన్ నల్ల కారులో ప్రయాణిస్తుంటే చూసి, నాకూ అలాంటి కారు కొనుక్కోవాలనిపించింది. నా పొదుపు మొత్తాన్ని చిట్ ఫండ్స్ లో దాచుకుని, ఆ 27 లక్షలతో కారు కొన్నాను. అందులో తప్పేముంది?’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓటమి బాధ ఉన్నప్పటికీ, ప్రజాసేవలో కొనసాగుతానని, నియోజకవర్గంలో మిగిలిపోయిన ప్రాజెక్టుల కోసం పోరాడతానని ఆయన తెలిపారు.ఇది కూడా చదవండి: ఓటింగ్లో సునామీ.. థర్డ్ జెండర్లకు ఒరిగిందేమీ.. -
నిజంగానే వచ్చేస్తున్నాయా?
ఈసారైనా వర్షాలు టైంకి పడతాయా? అనే కోట్లాది దేశ ప్రజలకు మదిలో మెదిలే ప్రశ్న. ప్రతీసారి అంచనాలు వేయడం.. అవి తప్పడం.. గత కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా చూస్తున్నది. అయితే ఈసారి కచ్చితమైన సమాచారం ఉందని.. ఆన్ టైంకే వర్షాలు పడతాయని బల్ల గుద్ది మరీ చెబుతోంది భారత వాతావరణ శాఖ. మునుపెన్నంతగా.. ఈ మే నెలలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో తీర రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ.. పుదుచ్చేరిలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతోంది. అయితే దీనిని రుతుపవనాల రాకకు సంకేతంగానే భావిస్తున్నారు వాతావరణ నిపుణులు. వాళ్ల అంచనా ప్రకారం.. మరో రెండు వారాల్లోనే అండమాన్, నికోబార్ దీవులకు వర్షాలు మొదలవుతాయి. కాబట్టి.. జూన్ 1వ తేదీనాటికి కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకుతాయన్నమాట. ఇందుకు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని చెబుతున్నారు. తాజాగా.. తమ దేశంలో వర్షాకాలం ముగిసిందని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణ ప్రజలకు అది మరో దేశపు వెదర్ బులిటెన్ మాత్రమే కావొచ్చు. భారత రుతుపవనాల కదలికలను గమనించే వాతావరణ శాస్త్రజ్ఞులకు మాత్రం ఈ ప్రకటన ఎంతో కీలకం. ఈ ప్రకటన ఆధారంగానే భారత్కు రుతుపవనాల రాకను అంచనా వేస్తారు.భారత మాన్సూన్ను అర్థం చేసుకోవాలంటే.. భూమధ్యరేఖ చుట్టూ తిరుగుతూ ఉండే ఒక అజ్ఞాత మేఘాల బెల్ట్ను ఊహించుకోవాలి. భూమధ్యరేఖ వద్ద ఉన్న ఈ మేఘాల బెల్ట్ ప్రతి సంవత్సరం సూర్యుడి కదలికను అనుసరిస్తూ దిశ మార్చుకుంటుంది. అంటే.. ఉత్తరార్థగోళం వేసవిలో ఉత్తర దిశగా, దక్షిణార్థగోళం వేసవిలో దక్షిణ దిశగా కదులుతూ ఎక్కడికి వెళ్తే అక్కడికి వర్షాలను మోసుకెళ్తుంది. ఆస్ట్రేలియాలో రుతుపవనాల ప్రభావం తగ్గిపోవడంతో దక్షిణ భాగం తన ప్రభావాన్ని కోల్పోతుంది. అప్పుడది కచ్చితంగా ఉత్తర దిశగా కదిలి, సముద్రం నుంచి తేమతో నిండిన గాలులను దక్షిణ ఆసియాకు లాగి వర్షాలు కురిపిస్తుంది. తద్వారా ఆ ప్రాంతంలో రుతుపవనాలు సమయానికి రావడానికి మార్గం సుగమం చేస్తుంది. ఆస్ట్రేలియాలో వర్షాకాలం ముగిసిన వెంటనే ఈ బెల్ట్ ఉత్తర దిశగా భూమధ్యరేఖ దాటి మాల్దీవులు, శ్రీలంక వైపు కదిలి, భారతదేశంలోని అండమాన్–నికోబార్ దీవులకు చేరుకుంటుంది. అక్కడి నుంచి ఇది కేరళ తీరానికి చేరి, దేశమంతా వర్షాలను విస్తరింపజేస్తుంది. అందువల్ల ఆస్ట్రేలియా వాతావరణ శాఖ ప్రకటన.. భారత్కు రుతుపవనాలు సకాలంలో వస్తాయన్న స్పష్టమైన సంకేతంగా భావించబడుతోంది. ఈ సహజ చక్రం వల్ల.. మే–సెప్టెంబర్ మధ్య నైరుతి రుతుపవనాల రాకతో భారత్లో వర్షాలు పడతాయి. సెప్టెంబర్ చివరికి ఈ బెల్ట్ తిరిగి దక్షిణ దిశగా కదిలి, ఆస్ట్రేలియాలో వర్షాకాలం మొదలవుతుంది. ప్రస్తుతం ఈ పరిస్థితులు కనిపిస్తుండడం.. సరైన దిశలో మేఘాల బెల్ట్ కదలికలు ఉండడంతో.. రుతుపవనాల రాక సమీపిస్తోందని వాతావరణ శాఖ ధీమాగా చెబుతోంది. అయితే.. ఈసారైనా ఆ అంచనా ఫలిస్తుందో చూడాలి. -
ఇంధన మంట షురూ!
కొంతకాలంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నప్పటికీ స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు ఇకపై పెరిగే అవకాశం కనిపిస్తోంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధి వద్ద ఏర్పడిన అంతరాయాల కారణంగా ముడి చమురు ధర ఇటీవల బ్యారెల్కు 70 డాలర్ల నుంచి 110 డాలర్లకుపైగా పెరిగింది. ఈ నేపథ్యంలో మే 15 లోపు చమురు కంపెనీలు ధరల పెంపునకు మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.ప్రపంచం అతలాకుతలం.. భారత్ పరిస్థితి ఏంటి?ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. ప్రపంచ చమురు సరఫరాలో 20% వాటా కలిగిన హార్మూజ్ జలసంధిలో వారాల తరబడి నెలకొన్న అంతరాయం గ్లోబల్ ఎనర్జీ షాక్కు దారితీసింది. పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ ఇంధన రేషనింగ్ను ప్రవేశపెట్టగా, శ్రీలంక, పాకిస్థాన్ పనిదినాలను తగ్గించి ఇంధనాన్ని ఆదా చేసే ప్రయత్నం చేస్తున్నాయి. దక్షిణ కొరియా దశాబ్దాల తర్వాత ధరలపై పరిమితులు విధించింది. అయితే, భారత్ మాత్రం ఇప్పటివరకు ఎక్కడా కొరత లేకుండా పరిస్థితిని అదుపు చేయగలిగింది.చమురు కంపెనీల నష్టాలుప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ధరలు పెరగకపోవడంతో ఇవి నెలకు సుమారు రూ.30,000 కోట్ల మేర నష్టాన్ని భరిస్తున్నాయి. ముడి చమురు ధరలు గరిష్ట స్థాయికి చేరినప్పుడు ప్రభుత్వం, ఈ సంస్థలు కలిసి పెట్రోల్పై రూ.24, డీజిల్పై రూ.30 భారాన్ని వినియోగదారులపై పడకుండా తామే భరించాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటికీ అంతర్జాతీయ ఒత్తిడి దృష్ట్యా ధరల పెంపు అనివార్యంగా కనిపిస్తోంది. సంక్షోభాన్ని తట్టుకొని..ఇలాంటి పరిస్థితుల్లోనూ భారత్ ఇంధన భద్రతను కాపాడుకోగలగడానికి కారణం ప్రభుత్వ వ్యూహాత్మక చర్యలే.దేశీయగా ఎల్పీజీ ఉత్పత్తిని రోజుకు 36,000 టన్నుల నుంచి 54,000 టన్నులకు యుద్ధ ప్రాతిపదికన పెంచారు.రష్యా, యూఎస్, పశ్చిమ ఆఫ్రికా వంటి దేశాల నుంచి దిగుమతులు పెంచి సరఫరాను స్థిరీకరించారు. ముడి చమురు సోర్సింగ్(మన దేశానికి ఎగుమతులు చేసేవి) దేశాల సంఖ్య 27 నుంచి 40కి పెరిగింది.గత దశాబ్ద కాలంలో ఎల్పీజీ టెర్మినల్స్ రెట్టింపు అవ్వడం, ఇథనాల్ మిశ్రమం 1.5% నుంచి 20%కి పెరగడం భారత్కు రక్షణ కవచంగా నిలిచింది.దేశీయ రిఫైనరీలు ప్రస్తుతం 100% మించిన సామర్థ్యంతో పనిచేస్తూ నిరంతరాయంగా ఇంధనాన్ని అందిస్తున్నాయి.అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగిన ప్రతిసారీ సామాన్యుడిపై భారం పడకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. అయితే చమురు కంపెనీల ఆర్థిక స్థిరత్వం దెబ్బతినకుండా ఉండాలంటే రాబోయే వారం రోజుల్లో ధరల సర్దుబాటు తప్పకపోవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. పశ్చిమాసియాలో శాంతి నెలకొంటే తప్ప చమురు సెగ తగ్గేలా లేదు.ఇదీ చదవండి: భయం వద్దు.. నైపుణ్యమే హద్దు -
తమిళ రాజకీయం.. కాంగ్రెస్ హైడ్రామా
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు రాజకీయం తెలంగాణకు చేరుకుంది. తమిళనాడు పొలిటికల్ ట్విస్టులు కొనసాగుతున్న వేళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకున్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు శుక్రవారం రాత్రి చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చారు. రిసార్టు రాజకీయాల్లో భాగంగా వారు ఇక్కడికి చేరుకున్నారు.తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. మొదట కర్ణాటకలోని బెంగళూరుకు చేరుకున్నారు. అనంతరం, హైకమాండ్ ఆదేశాలకు మేరకు శుక్రవారం రాత్రి శంషాబాద్ చేరుకుని ఎయిర్పోర్టు సమీపంలోని ఓ హోటల్లో బస చేశారు. ఎమ్మెల్యేలతో తెలంగాణ ఏఐసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శి విశ్వనాథన్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా తాజాగా నవోటెల్లో బస చేస్తున్నట్టు సమాచారం. తమిళనాడు పరిస్థితులు చక్కబడే వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఐదుగురు ఇక్కడే ఉండే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా.. నిన్న విజయ్ ప్రమాణ స్వీకారం అవకాశంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారు. అయితే, వీరంతా రోడ్డు మార్గంలో చెన్నై చేరుకునేలా ఎమ్మెల్యేలకు సూచనలు అందినట్టు సమాచారం. ఈ క్రమంలో తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కదలికలపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. -
ఓటింగ్లో సునామీ.. థర్డ్ జెండర్లకు ఒరిగిందేమీ..
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో థర్డ్ జెండర్లకు సంబంధించిన ఒక ఆసక్తికర అంశం చోటుచేసుకుంది. మరోవైపు అది దేశంలో ఆందోళన కలిగించే అంశంగానూ కనిపిస్తోంది. థర్డ్ జెండర్ వర్గం నుంచి ఎన్నికల బరిలో కేవలం ఇద్దరు అభ్యర్థులు మాత్రమే నిలుచున్నారు. అయితే ఆ ఇద్దరూ దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఇది ప్రజాస్వామ్య వేదికపై వారి రాజకీయ ప్రాతినిధ్యం ఇంకా ఎంత వెనుకబడి ఉందనేది తెలియజేస్తోంది. ఓటింగ్ శాతంలో ఉత్సాహం చూపించిన ఈ వర్గం చట్టసభల మెట్లు ఎక్కడంలో తీవ్ర నిరాశనే ఎదుర్కొంటోంది.బరిలో నిలిచింది ఇద్దరేఎన్నికల సంఘం (ఈసీ) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఇటీవల ముగిసిన 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఇద్దరు థర్డ్ జెండర్ అభ్యర్థులు మాత్రమే తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కేరళ నుంచి ఒకరు, తమిళనాడు నుంచి మరొకరు మాత్రమే ఎన్నికల బరిలో నిలిచేందుకు ధైర్యం చేశారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ ఎన్నికల్లో మిగిలిన ఏ రాష్ట్రం నుంచి కూడా ఈ వర్గానికి కనీస ప్రాతినిధ్యం దక్కలేదు.డిపాజిట్లు కూడా దక్కలేదుపోటీ చేసిన ఆ ఇద్దరు అభ్యర్థులు కూడా ఓటర్ల నుంచి కనీస మద్దతును సాధించలేకపోయారు. ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఇద్దరు అభ్యర్థులు ఓటర్లలో ఏమాత్రం ప్రభావం చూపలేక, తమ డిపాజిట్లను సైతం కోల్పోయారు. ఎన్నికల బరిలో నిలబడటమే ఒక పెద్ద సవాలుగా మారిన ప్రస్తుత తరుణంలో, వారికి ప్రజల ఆదరణ కూడా ఆశించిన స్థాయిలో లభించకపోవడం గమనార్హం.గత ఎన్నికల్లోనూ ఇదే తీరుథర్డ్ జెండర్ అభ్యర్థులకు ఇలాంటి చేదు అనుభవం ఎదురుకావడం ఇదే తొలిసారి కాదు. 2021లో జరిగిన కేరళ, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ సరిగ్గా ఇదే తరహా ఫలితాలు వచ్చాయి. అప్పట్లో కేరళలో ఒక థర్డ్ జెండర్ అభ్యర్థి పోటీ చేయగా, తమిళనాడులో ఇద్దరు బరిలో నిలిచారు. అయితే, ఆ ఎన్నికల్లోనూ వీరెవరూ విజయం సాధించలేకపోయారు, పైగా వీరు తమ డిపాజిట్లను సైతం కోల్పోయారు.ఓటింగ్ కు క్యూ కట్టిన బెంగాల్గత నెలలో అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. మే 4న ఫలితాలు వెలువడ్డాయి. పోటీలో వెనుకబడినప్పటికీ, ఓట్లు వేయడంలో మాత్రం థర్డ్ జెండర్ ఓటర్లు విశేషంగా స్పందించారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లోని రెండో విడత పోలింగ్లో ఏకంగా 91.28 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 1,257 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉండగా, తొలి దశలో 465 మంది (56.79 శాతం), రెండో దశలో 792 మంది (91.28 శాతం) ఓటేశారు.పుదుచ్చేరి రికార్డ్.. ఇతర రాష్ట్రాల పరిస్థితి?కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య 139 మాత్రమే అయినప్పటికీ, ఏకంగా 91.81 శాతం మంది పోలింగ్ బూత్లకు వెళ్లి అద్భుతమైన రికార్డు సృష్టించారు. ఇక 7,728 మంది థర్డ్ జెండర్ ఓటర్లతో అత్యధిక సంఖ్య కలిగిన తమిళనాడులో ఏప్రిల్ 23న జరిగిన పోలింగ్ లో కేవలం 60.49 శాతం ఓటింగ్ నమోదైంది. అస్సాంలో 343 మంది ఓటర్లకు గాను 36.84 శాతం పోలింగ్ జరగ్గా, కేరళలో 277 మంది ఓటర్లలో 57.04 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఈసీ వెల్లడించింది.నవీన్ చావ్లా చొరవతోనే గుర్తింపుఒకప్పుడు ఓటరు జాబితాలో తమ ఉనికిని చాటుకోవడానికి కూడా ఇబ్బంది పడిన థర్డ్ జెండర్ వర్గానికి.. మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) నవీన్ చావ్లా తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకంగా నిలిచింది. ఆయన చొరవతోనే ఓటర్ల నమోదు ప్రక్రియలో ‘ఇతరులు’ (Others) లేదా ‘ఓ’ (O) కేటగిరీ అందుబాటులోకి వచ్చింది. ఫలితంగానే ప్రస్తుతం ఎన్నికల సంఘం ఓటర్లను ‘పురుషులు’, ‘మహిళలు’, ‘ఇతరులు’ లేదా ‘థర్డ్ జెండర్’గా అధికారికంగా గుర్తిస్తూ, వారికి ఓటు హక్కును కల్పిస్తోంది.ఇది కూడా చదవండి: కాషాయ భారతం: 21 రాష్ట్రాలు.. రాజ్యసభలో 113 సీట్లు -
రాష్ట్రాలకు గవర్నర్ అవసరం లేదు
చెన్నై: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి నేపథ్యంలో గవర్నర్ పదవిపై వ్యతిరేకతను డీఎంకే నాయకురాలు కనిమొళి పునరుద్ఘటించారు. ప్రస్తుతం రాజ్యాంగబద్ధతపై ప్రశ్నలు తలెత్తుతున్నందున, గవర్నర్ పదవిని రద్దు చేయాలన్న డీఎంకే డిమాండ్ మారలేదని ఆమె నొక్కి చెప్పారు. ‘అసలు గవర్నర్ అవసరం లేదనే మా వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుత పరిస్థితి చాలా ప్రశ్నలను లేవనెత్తుతోంది. రాజ్యాంగ ప్రక్రియలపై ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది’అని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే బయటి నుంచి ఏఐఏడీఎంకేకు మద్దతు ఇస్తుందన్న వదంతులను ఆమె కొట్టిపారేశారు. అవన్నీ వట్టి ఊహాగానాలేనని, ప్రతి వదంతికి స్పందించలేమని అన్నారు. -
రేపు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం
పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేసే చాన్స్ఎనిమిది మంత్రుల పేర్ల జాబితాను గవర్నర్కు అందజేసిన విజయ్ విజయ్తో పాటు ఎనిమిది మంది మంత్రులు ప్రమాణం చేసే అవకాశంరేపు తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారంనెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు విజయ్ ప్రమాణంప్రమాణ స్వీకారానికి గవర్నర్ అనుమతి కోరిన విజయ్ఎమ్మెల్యేల మద్దతు జాబితా గవర్నర్కు అందజేతప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరిన విజయ్అందుకు గవర్నర్ సమ్మతిప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగుమంఈ నెల 13లోగా బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశం తమిళనాడు రాజకీయాల్లో వరుస ట్విస్ట్లుకేరళం పర్యటన రద్దు చేసుకున్న గవర్నర్సాయంత్రం 6.30 గంటలకు విజయ్కు గవర్నర్ అపాయింట్మెంట్తమిళనాడు రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్విజయ్కు అపాయింట్మెంట్ ఇవ్వని గవర్నర్లోక్భవన్కు వచ్చిన విజయ్ మళ్లీ వెనుదిరిగారు.కేరళంకు వెళ్తున్న గవర్నర్ రాజేంద్ర అర్లేకర్విజయ్కు సమయం ఇవ్వని గవర్నర్ రాజేంద్ర అర్లేకర్గవర్నర్కు ముందస్తు అపాయింట్మెంట్ ఉండటంతో విజయ్కు సమయం ఇవ్వలేదు అన్నాడీఎంకేలో చీలిక సంకేతాలు?పీవీ షణ్ముగం నేతృత్వంలో రెబల్ ఎమ్మెల్యేలుఈపీఎస్ అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సమావేశానికి ఆరుగురు ఎమ్మెల్యేల డుమ్మాసస్పెన్స్ థ్రిల్లర్ని తలపిస్తున్న తమిళనాడు రాజకీయాలురాత్రి 7.10 గంటలకు కేరళ వెళ్లనున్న గవర్నర్ రాజేంద్రగవర్నర్ వెళ్లిపోతే విజయ్ ప్రమాణ స్వీకారం మరింత ఆలస్యంసస్పెన్స్ థ్రిల్లర్ని తలపిస్తున్న తమిళనాడు రాజకీయాలుఇప్పటికి తేలని మద్దతు లెక్కలువిజయ్ ప్రమాణ స్వీకారంపై కొనసాగుతున్న సస్పెన్స్టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు తొలగిన అడ్డంకులుటీవీకేకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన వీసీకేకాసేపట్లో వీసీకే మీడియా సమావేశంవీసీకే అధికారిక ప్రకటన తర్వాత గవర్నర్ను కలవనున్న విజయ్తమిళనాడు రాజకీయాల్లో మరో భారీ ట్విస్ట్వీసీకే చీఫ్ తిరుమావళవన్కు ముఖ్యమంత్రి పదవి?డీఎంకే-అన్నాడీఎంకే కూటమి అభ్యర్థిగా తిరుమావళవన్డీఎంకే ప్రతిపాదన అన్నాడీఎంకే వ్యతిరేకిస్తున్నట్లు వార్తలుసాయంత్రం 4 గంటలకు వీసీకే చీఫ్ ప్రెస్మీట్తమిళనాడు సంక్షోభంపై సుప్రీం కోర్టులో పిటిషన్టీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్కు ఆదేశించాలని సుప్రీం కోర్టులో పిటిషన్విజయ్ను ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ ఆహ్వానించాల్సి ఉందికానీ, అలా చేయలేదుసుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన మాజీ ఐపీఎస్ అధికారివిచారణకు స్వీకరిస్తుందా? లేదా? అనే ఉత్కంఠమ్యాజిక్ ఫిగర్ దగ్గరే ఆగి.. తమిళనాట అధికారానికి మ్యాజిక్ ఫిగర్ 118విజయ్ టీవీకే ప్రస్తుత బలం 108-1=107 (ఒక్క స్థానంలో విజయ్ తప్పుకోవాల్సిందే)కాంగ్రెస్ 5వామపక్షాలు 4ఏఎంఎంకే 1లోక్భవన్కు నిన్న సమర్పించిన మద్దతు ఎమ్మెల్యేల సంఖ్య 117ఏఎంఎంకే ఎమ్మెల్యే విత్డ్రా అయితే 116వీసీకే కలిస్తే .. 118 మ్యాజిక్ ఫిగర్ పూర్తిసాయంత్రం దాకా ఆగాల్సిందే!తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో కొనసాగుతున్న సస్పెన్స్ఎటూ తేల్చని విడుదలై చిరుతైగల్ కట్చి(2 సీట్లు)విజయ్ను వెయిటింగ్లో పెట్టిన వీసీకేమద్దతు ఇస్తే తమిళనాడు పొలిటికల్ థ్రిల్లర్కు ఎండ్ కార్డ్కొనసాగుతున్న వీసీకే హైలెవల్ మీటింగ్సాయంత్రం దాకా జరగనున్న చర్చలుసాయంత్రం వీసీకే చీఫ్ తిరుమావళవన్ మీడియా సమావేశంకీలక ప్రకటన చేసే అవకాశం తమిళనాడు సంక్షోభంపై లెఫ్ట్ పార్టీల కీలక ప్రకటనవామపక్ష ఎమ్మెల్యేల కొనుగోలు జరిగిందని తమిళనాట ఆరోపణలుహార్స్ ట్రేడింగ్కు మేం వ్యతిరేకం: సీసీఐ,సీపీఎంబేరసారాలకు గవర్నరే అవకాశం ఇచ్చారు: సీసీఐ,సీపీఎంఢిల్లీ పెద్దల సూచనతోనే తమిళనాడు స్క్రీన్ప్లే నడుస్తోంది: సీసీఐ,సీపీఎంబీజేపీ బ్యాక్డోర్ పాలిటిక్స్ నడిపిస్తోంది: సీసీఐ,సీపీఎంఅతిపెద్ద పార్టీని గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి : సీసీఐ,సీపీఎంకానీ, ప్రజా తీర్పునకు వ్యతిరేకంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారు : సీసీఐ,సీపీఎంఅందుకే టీవీకేకు మద్దతు ఇచ్చాం: సీసీఐ,సీపీఎంమా రెండు పార్టీలు కలిసే ఈ నిర్ణయం తీసుకున్నాయి : సీసీఐ,సీపీఎంఇదే విషయాన్ని డీఎంకేకు సమాచారం అందించాం : సీసీఐ,సీపీఎంఏ పరిస్థితుల్లో మద్దతు ఇవ్వాల్సి వచ్చిందో వివరించాం: సీసీఐ,సీపీఎంఆ తర్వాతే మేం మా మద్దతు లేఖను గవర్నర్కు పంపాం: సీసీఐ,సీపీఎంవీసీకే పార్టీ కొన్ని కారణాలతో ఇంకా లేఖ పంపలేదు: సీసీఐ,సీపీఎంసాయంత్రంకల్లా ఆ పార్టీ నుంచి స్పష్టత రావొచ్చు: సీసీఐ,సీపీఎంప్రభుత్వ ఏర్పాటునకు మద్దతు ఇస్తారనే ఆశిస్తున్నాం: సీసీఐ,సీపీఎంమద్దతిస్తారా? ప్రతిపక్షంలో కూర్చుంటారా?వీసీకే పార్టీ నిర్ణయంపై దేశవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠవిజయ్ టీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు మద్దతు ఇస్తుందా? లేదా? అనే చర్చచెన్నైలోని కార్యాలయంలో వీసీకే హైలెవల్ మీటింగ్ప్రతిపక్షంలో కొనసాగుతారా? అధికార పార్టీతో కలుస్తారా?బయటి నుంచి మద్దతు ఇచ్చే అవకాశమూ!ఏ నిర్ణయం అనేది స్వేచ్ఛగా తీసుకోవాలని వీసీకే అధిష్టానానికి డీఎంకే అధినేత స్టాలిన్ సూచనడీఎంకే నేతృత్వం సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్లో భాగంగా పోటీ చేసి రెండు సీట్లు నెగ్గిన వీసీకేమరికాసేపట్లో స్పష్టమైన ప్రకటన వెలువడే చాన్స్వీసీకే చీఫ్ తిరుమావళవన్ నిర్ణయం ఎలా ఉండనుందో?గవర్నర్ తీరు వల్లే గందరగోళం: ముకుల్ రోహత్గీతమిళనాడు సంక్షోభంపై మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కీలక వ్యాఖ్యలుదేశం మొత్తం తమిళనాడు వైపే చూస్తోందిఇది కృత్రిమంగా సృష్టించిన సంక్షోభంవారంరోజులైనా ఏ విషయం తేల్చలేకపోవడం దారుణంగవర్నర్ తీరు వల్లే ఈ గందరగోళంసింగిల్ లార్జెస్ట్ పార్టీకి గవర్నర్ అవకాశం ఇవ్వాలిఅత్యధిక సీట్లు నెగ్గిన టీవీకేను ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాల్సిందిఅసెంబ్లీలో బలనిరూపణకు అవకాశం ఇవ్వాల్సిందిబలనిరూపణ లోక్భవన్లో కాదు.. అసెంబ్లీలో జరిగాలిపీపీ నరసింహారావు ప్రభుత్వం చాన్నాళ్లు మైనారిటీలో నడిచిందిగవర్నర్ ఏదీ తేల్చకపోతే.. విజయ్ కోర్టును ఆశ్రయించొచ్చుగతంలో ఇలాంటి కేసులు చాలా కోర్టుకు వచ్చాయి.. నేనూ వాదించారాష్టపతి పాలన, మరోసారి ఎన్నికలు నిర్వహించాలనడం సరికాదు.. ఇది అప్రాజాస్వామికంఅది ఏఐ వీడియోనేమో!: దినకరన్టీవీకేపై ఏఎఎంకే చీఫ్ దినకరన్ ఆగ్రహంతమ ఎమ్మెల్యే మద్దతు ఇవ్వనేలేదని మరోసారి వ్యాఖ్యఏఎంఎంకే ఎమ్మెల్యే కామరాజ్ సంతకం చేసిన వీడియోను రిలీజ్ చేసిన టీవీకేఆ వీడియోపై దినకరన్ అనుమానాలుఅది అసలు వీడియో కాదు : దినకరన్అందులో లేఖ.. మా పార్టీ నోట్ప్యాడ్ వేర్వేరుగా ఉన్నాయి : దినకరన్అది ఫేక్ లెటర్ : దినకరన్మా పార్టీ లేఖను ఫోర్జరీ చేశారు: దినకరన్పూర్తి వీడియోను టీవీకే ఎందుకు రిలీజ్ చేయడం లేదు?: దినకరన్అది ఏఐ వీడియో అయ్యి ఉండొచ్చు: దినకరన్ వీసీకే ఆఫీస్ వద్ద కోలాహలంచెన్నైలోని విడుదలై చిరుతైగల్ కట్చి ఆఫీస్ వద్దకు భారీగా చేరుకుంటున్న జనంకాసేపట్లో మీడియా ముందుకు వీసీకే అధినేత తోల్ తిరుమావళవన్ టీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు మద్దతు ఇస్తారా? ఇవ్వరా? అనేదానిపై ఉత్కంఠమద్దతు ప్రకటిస్తే.. అనిశ్చితికి తెరపడే అవకాశంస్వయంగా వీకేసీ ఆఫీస్కు వెళ్లి కృతజ్ఞతలు తెలియజేయనున్న విజయ్దాదాపుగా మద్దతు ఇవ్వొచ్చనే ఊహాగానాలుఇవ్వకుంటే.. కొనసాగనున్న సస్పెన్స్వీకేసీ మద్దతు ఇస్తే.. 119కి చేరనున్న టీవీకే బలంఏఎంఎంకే మద్దతు ఉపసంహరించుకున్నా.. టీవీకే మెజారిటీ 118మ్యాజిక్ ఫిగర్ (118) కావడంతో ప్రభుత్వ ఏర్పాటునకు లైన్ క్లియర్ అన్నాడీఎంకే కీలక భేటీపళనిస్వామి ఇంట్లో సమావేశమైన అన్నాడీఎంకే నేతలుప్రభుత్వ ఏర్పాటుపై చర్చ?టీవీకే మెజారిటీ చూపించుకోలేకపోతే.. ఏం చేయాలన్నదానిపై సీనియర్లతో పళని మంతనలుఅన్నాడీఎంకు ప్రభుత్వ ఏర్పాటు అవకాశం ఇవ్వాలని గవర్నర్కు ఏఎంఎంకే చీఫ్ దినకరన్ లేఖమొన్నటిదాకా విజయ్కు మద్దతు ఇస్తారని ప్రచారంనిన్ననేమో బద్ధశత్రువు డీఎంకేతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని ప్రచారంఇవాళ.. తగిన సంఖ్యా బలం లేకున్నా అన్నాడీఎంకేనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రచారం మరికాసేపట్లో కీలక ప్రకటనవిడుదలై చిరుతైగల్ కట్చి(వీసీకే) మద్దతుపై ఉత్కంఠమరికాసేపట్లో మీడియా ముందుకు వీసీకే చీఫ్ తిరుమావళవన్విజయ్ టీవీకేకు మద్దతు ఇస్తారా? ఇవ్వరా? అనేది స్పష్టీకరణమద్దతు ఇస్తే.. టీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు లైన్ క్లియర్ ఇవాళే సీఎంగా విజయ్ ప్రమాణం చేసే చాన్స్ఇవ్వకపోతే.. కొనసాగనున్న సస్పెన్స్దినకరన్పై డీఎంకే ఫైర్ఏఎంఎంకే అధినేత దినకరన్పై డీఎంకే ఆగ్రహంమిత్రపక్షం అన్నాడీఎంకే తరఫున ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వాన విజ్ఞప్తి గవర్నర్కు అందించిన దినకరన్ఏ ప్రతిపాదికన గవర్నర్కు ప్రభుత్వ ఏర్పాటు లేఖ అందించారని ప్రశ్నించిన డీఎంకే సీనియర్ నేత టీకేఎస్ ఇళంగోవన్అన్నాడీఎంకేకు సంఖ్యా బలం ఎక్కడ ఉంది?: ఇళంగోవన్ఎమ్మెల్యేల సంఖ్యా బలం చెప్పకుండా.. సపోర్ట్ లెటర్ లేకుండా దినకనర్ డ్రామాలు చేస్తున్నారా?: ఇళంగోవన్త్రిషకు నిరాశ తప్పదా?తిరుచ్చి ఈస్ట్కు రాజీనామా చేయనున్న విజయ్ఆ స్థానంలో త్రిష పోటీ చేస్తుందని ప్రచారండిప్యూటీ సీఎం చేస్తారనే ఊహాగానాలుతిరుచ్చి ఈస్ట్తో పాటు డిప్యూటీ సీఎం పోస్ట్ కావాలంటున్న విడుదలై చిరుతైగల్ కట్చిఅలాగైతేనే విజయ్కు మద్దతు ఇస్తామని స్పష్టీకరణసంబంధిత కథనం: త్రిష ఆశలు గల్లంతు!116 కాదు.. 117!విజయ్ మద్దతుపై తమిళనాడు లోక్భవన్ క్లారిటీ117 ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్కు లేఖ సమర్పించిన విజయ్తమిళనాడు ఎన్నికల్లో 108 స్థానాలు నెగ్గిన టీవీకేవిజయ్ రెండు చోట్ల పోటీ చేసిన నెగ్గడంతోనే ఆ ఫిగర్ఒక సీటు మైనస్ చేసి 107 బలంగానే చూపించిన టీవీకేకాంగ్రెస్ సపోర్ట్తో 112బయటి నుంచి మద్దతు ఇచ్చిన లెఫ్ట్ పార్టీలు 4ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే కామరాజ్ మద్దతు కూడా చూపించిన విజయ్మొత్తం 117 మంది ఎమ్మెల్యేల సంతకాలుమెజారిటీకి తక్కువైన ఒక్క స్థానంవీసీకే పార్టీ(2) మద్దతుపై టీవీకేకు అందని లేఖఅది అంది ఉంటే.. 119కి పెరగనున్న బలంఏఎంఎంకే ఎమ్మెల్యే విషయంలో ఆ పార్టీ అధినేత దినకరన్ కిరికిరివీసీకే మద్దుతు ఇస్తే.. ఏఎంఎంకే ఎమ్మెల్యే వైదొలగినా 118 పూర్తి మెజారిటీనేడు వీసీకే ఆఫీస్కు విజయ్మద్దతుపై సాయంత్రంలోగా రానున్న స్పష్టతతమిళనాట జోరుగా క్యాంపు పాలిటిక్స్తమిళనాడులో మొదలైన నెంబర్ గేమ్మ్యాజిక్ ఫిగర్ 2 తక్కువైన టీవీకే విజయ్ సీఎం ప్రమాణ స్వీకారంపై కొనసాగుతున్న అనిశ్చితిటీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు ససేమీరా అంటున్న గవర్నర్ ఆర్వీ ఆర్లేకర్రేపటితో టీవీకేకు గవర్నర్ ఇచ్చిన గడువు పూర్తి?!పొత్తు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న టీవీకేమహాబలిపురం రిసార్ట్కే పరిమితమైన టీవీకే ఎమ్మెల్యేలుచెన్నైలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల క్యాంపునేడు ఎమ్మెల్యేలతో భేటీ కానున్న అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామిఅన్నాడీఎంకేకు ప్రభుత్వ ఏర్పాటు అవకాశం ఇవ్వాలని గవర్నర్కు ఏఎంఎంకే లేఖఅన్నాడీఎంకే తరఫున లేఖ సమర్పించిన ఏఎంఎంకే చీఫ్ దినకరన్పళనిస్వామి గవర్నర్ను కలిస్తే మారనున్న నెంబర్లుకాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అన్నాడీఎంకే దృష్టికాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్న ఏఐసీసీ ఇంచార్జీ గిరీష్ చోడంకర్కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కేసులతో బెదిరింపులు.. డబ్బు ఆశ చూపిస్తున్నారని ఆరోపణలుఎమ్మెల్యేలు చేజారిపోకుండా క్యాంప్ రాజకీయం మొదలుపెట్టిన కాంగ్రెస్రాత్రికి రాత్రే బెంగళూరు.. అక్కడి నుంచి హైదరాబాద్కు తరలింపుహైదరాబాద్లోనే తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల శిబిరం మరో వివాదంలో టీవీకే అధినేత విజయ్నిన్న విజయ్తో జన నాయగన్ ప్రొడ్యూసర్ భేటీఅనంతరం లోక్భవన్కు విజయ్, మద్దతుదారు పార్టీల నేతలతో వెళ్లిన నిర్మాత లేఖ సమర్పించే సమయంలో గవర్నర్ పక్కనే నిల్చున్న నిర్మాత వెంకట్ కే నారాయణప్రొటోకాల్కు విరుద్ధంగా తీసుకెళ్లారని విజయ్పై రాజకీయ ప్రత్యర్థుల విమర్శలుప్రభుత్వ ఏర్పాటులో ప్రొడ్యూసర్కు ఏం పని అంటూ మండిపాటుప్రొడ్యూసర్ ద్వారా వామపక్షాలకు డబ్బులు పంచి ఉంటారని ఆరోపణలువిజయ్ హార్స్ట్రేడింగ్కు పాల్పడుతున్నారంటూ గవర్నర్కు ఫిర్యాదు చేసే అవకాశంగవర్నర్కు(శాలువా కప్పుకున్న వ్యక్తి) ఎడమ వైపు ఉంది జన నాయగన్ నిర్మాత వెంకట్ కే నారాయణఆ ఇద్దరు ముందుకు వస్తే.. తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో సస్పెన్స్ కంటిన్యూవిజయ్కు మద్దతిచ్చే విషయంలో పార్టీల హైడ్రామావీసీకే తరఫున ఎమ్మెల్యేలుగా నెగ్గిన జ్యోతిమణి, వన్నీరసు పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ రెండు చోట్ల నెగ్గిన విజయ్ఏదో ఒకటి వదులుకోవాల్సిన పరిస్థితిడిప్యూటీ సీఎం పోస్టుతో పాటు విజయ్ వదులుకునే తిరుచ్చి ఈస్ట్ సీటును డిమాండ్ చేస్తున్న వీసీకేవీటితో పాటు మరో రెండు డిమాండ్లుచివరి నిమిషంలో మద్దతు లేఖ ఇవ్వకుండా హ్యాండిచ్చిన వీసీకేటీవీకే మద్దతు అంశం పక్కన పెట్టి.. డీఎంకే అధినేత స్టాలిన్తో వీసీకే చీఫ్ తిరుమావళవన్ భేటీఇవాళ స్పష్టమైన నిర్ణయం ప్రకటించే చాన్స్మద్దతు ఇస్తే సీఎంగా విజయ్కు లైన్ క్లియర్ఇవ్వకుంటే.. కొనసాగనున్న ఉత్కంఠ ఆ మిస్టేక్ చేయకుండా ఉండాల్సింది.. చిన్నతప్పిదంతో గవర్నర్ దగ్గర బుక్కైన టీవీకే అధినేత విజయ్6న గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను తొలిసారి కలిసిన విజయ్గవర్నర్కు సమర్పించిన జాబితాలో కాంగ్రెస్ మద్దతు ఎమ్మెల్యేల పేర్లు కూడాకూటమిగా.. టీవీకేను అతిపెద్ద పార్టీగా ప్రొజెక్ట్ చేసుకోలేకపోయిన విజయ్అక్కడే గవర్నర్కు దొరికిపోయిన విజయ్ఆ మరుసటి రోజే.. మరోసారి గవర్నర్ను కలిసి విజ్ఞప్తినిన్న.. 116 ఎమ్మెల్యేల సంతకాలతో మూడోసారి గవర్నర్ను కలిసి విజ్ఞప్తి118 ఎమ్మెల్యేల సంతకాలే కావాలని పట్టుబడుతున్న గవర్నర్మొదటిసారి..రెండో‘సారీ’..మూడోసారి 116 వర్సెస్ 116తమిళనాడు రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులుక్షణక్షణానికి మారిపోతున్న లెక్కలునెంబర్ గేమ్తో టీవీకే చీఫ్ విజయ్ సతమతంతమిళనాడు మ్యాజిక్ ఫిగర్ 118విజయ్ టీవీకేకు ప్రస్తుత బలం 116ప్రభుత్వ ఏర్పాటునకు విజయ్కు అవకాశం ఇవ్వాలంటున్న డీఎంకే అధినేత స్టాలిన్ఇవాళ పళనిస్వామి నేతృత్వంలో అన్నాడీఎంకే కీలక భేటీవిజయ్ చేతులెత్తేస్తే.. డీఎంకే అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయంటూ ఊహాగానాలు అన్నాడీఎంకేకు బయటి నుంచి డీఎంకే మద్దతు ఇస్తుందంటూ జోరుగా ప్రచారండీఎంకే-అన్నాడీఎంకే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన బలం 116ఇరు వైపులా.. ఇద్దరు ఎమ్మెల్యే మద్దతు అవసరంవీసీకే పార్టీ మద్దతు ఇస్తేనే విజయ్ పార్టీకి సంపూర్ణ బలంఇదే అదనుగా టీవీకేకు డిమాండ్లు చేస్తున్న వీసీకేకీలకమైన మంత్రిత్వ శాఖ, విజయ్ ఖాళీ చేసే స్థానంలో పోటీ, మరో రెండు డిమాండ్లు చేస్తున్న వీసీకేఇవాళ తమ నిర్ణయం ప్రకటిస్తామన్న వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్ఇవాళ వీసీకే మద్దతు ఇస్తే విజయ్ సీఎంగా ప్రమాణం చేసే చాన్స్ఈరోజు ఏం జరగబోతోందన్న దానిపై ఉత్కంఠటీవీకేను టెన్షన్ పెడుతున్న పళనిస్వామిమరోవైపు.. టీవీకేకు గుబులు పుట్టిస్తున్న అన్నాడీఎంకేడీఎంకేతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటూ ప్రచారంమరోవైపు.. అన్నాడీఎంకేకు అవకాశం ఇవ్వాలని గవర్నర్కు లేఖ ఇచ్చిన మిత్రపక్షం ఏఎంఎంకేగవర్నర్ ఆర్వీ ఆర్లేకర్ను శుక్రవారం సాయంత్రం కలిసిన ఏఎంఎంకే చీఫ్ దినకరన్నేడు అన్నాడీఎంకే కీలక సమావేశంసీనియర్ నేతలతో భేటీ కానున్న అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామిగవర్నర్ను కలిసి టీవీకేపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్న పళని!విజయ్కు మద్దతు విషయంలో అన్నాడీఎంకేలో చీలిక ఏర్పడిందని మొన్నటిదాకా ప్రచారంతమ కూటమి ఎమ్మెల్యేలను విజయ్ కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ దినకరన్ ఆరోపణ.. గవర్నర్కు ఫిర్యాదుస్టాలిన్ పరోక్ష సాయం!తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో తమ జోక్యం ఉండబోదన్న డీఎంకే చీఫ్ స్టాలిన్టీవీకే పార్టీకి ఎలాంటి అవాంతరం కలిగించబోమని వ్యాఖ్యప్రజా తీర్పును గౌరవిస్తామని ఇప్పటికే స్పష్టీకరణవిజయ్ పాలనను ఆరు నెలలపాటు గమనిస్తామని.. ఆ తర్వాతే ప్రధాన ప్రతిపక్షంగా నిలదీస్తామని ప్రకటనఅన్నాడీఎంకేతో కూటమి ప్రభుత్వం ఉండబోదన్న సంకేతాలిచ్చిన స్టాలిన్ విజయ్కు మద్దతు ఇచ్చే విషయంలో తన ఒత్తిడి ఏం ఉండదని.. స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలని మిత్రపక్షాలకు సూచనఆ సూచన తర్వాతే విజయ్కు మద్దతు విషయంలో ముందుకు వచ్చిన వామపక్షాలువిజయ్ కేబినెట్లో కాంగ్రెస్కు చోటుతమకు చోటు అక్కర్లేదని.. బయటి నుంచే మద్దతు(డీఎంకేలో కొనసాగుతూ) ఇస్తామని స్పష్టం చేసిన లెఫ్ట్ పార్టీలువీసీకే కూడా తమ నిర్ణయాన్ని గౌరవించిందన్న సీపీఐ, సీపీఎంలుఅయితే.. కేబినెట్ బెర్త్తో పాటు విజయ్ వదులుకునే సీటు తమకు ఇవ్వాలంటున్న వీసీకే!ఈ క్రమంలోనే మద్దతుపై ఇంకా ఏదీ తేల్చని వీసీకే చీఫ్ తిరుమావళవన్తిరుమావళవన్ ఎక్కడ?క్షణక్షణానికి మారుతున్న తమిళనాడు రాజకీయంటీవీకేను టెన్షన్ పెడుతున్న వీసీకే అధినేత తిరుమావళవన్చివరి నిమిషంలో మద్దతుపై ట్విస్ట్ ఇచ్చిన విడుదలై చిరుతైగల్ కట్చి(వీసీకే)డీఎంకే సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్ కూటమిలో ఉన్న వీసీకేమొన్నటిదాకా విజయ్కు మద్దతు ఇవ్వమంటు వ్యాఖ్యవిజయ్ విజ్ఞప్తి మేరకు ఆలోచన చేస్తామని ప్రకటనసాయంత్రానికి సానుకూలంగా స్పందించినట్లు ప్రచారంస్టాలిన్తో భేటీ తర్వాత ఎవరికీ అందుబాటులో లేకుండా పోయిన తిరుమావళవన్అర్ధరాత్రి వరకు నిరీక్షించిన టీవీకేవీసీకే మద్దతు లేఖపై ఉత్కంఠనేడు అధికారిక ప్రకటన వెలువడే చాన్స్విజయ్ ఉక్కిరి బిక్కిరితమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారంపై కొనసాగుతున్న ఉత్కంఠటీవీకేకు ఇంకా పూర్తిగా దక్కని మద్దతుప్రస్తుత బలం 116గా ఉందన్న గవర్నర్ కార్యాలయంఇంకా ఇద్దరు తక్కువడీఎంకే కూటమిలోని పార్టీలకు విజ్ఞప్తి చేసిన విజయ్టీవీకే విజయ్ పార్టీ బలం (108.. ఇందులో విజయ్ రెండు చోట్ల నెగ్గడంతో ఒక చోట రాజీనామా చేయాల్సిన పరిస్థితి.. దీంతో 107కి పడిపోనున్న సంఖ్యడీఎంకేతో కటీఫ్ చెప్పి విజయ్కు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్(5)డీఎంకే కూటమిలోనే ఉంటూ బయటి నుంచి విజయ్కు మద్దతు ప్రకటించిన లెఫ్ట్ పార్టీ(4)మద్దతు ఇవ్వబోమని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) ((2))అన్నాడీఎంకే కూటమిలోని ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే మద్దతు కూడా!దినకరన్కు టీవీకే కౌంటర్మా ఎమ్మెల్యే విజయ్కు మద్దతు ఇవ్వలేదు: దినకరన్తమ ఏకైక ఎమ్మెల్యే సంతకం టీవీకే ఫోర్జరీ చేసిందంటూ ఏఎంఎంకే చీఫ్ దినకరన్ ఆరోపణచెన్నై కమిషనర్కు ఫోర్జరీ కంప్లయింట్దినకరన్కు టీవీకే స్ట్రాంగ్ కౌంటర్ఏఎంఎంకే ఎమ్మెల్యే కామరాజ్ స్వయంగా సంతకం చేస్తున్న వీడియోను విడుదల చేసిన టీవీకే గవర్నర్కు విజయ్ సమర్పించిన ఎమ్మెల్యేల సంతకాల్లో.. కామరాజ్ సంతకం కూడా!దినకరన్ ఎంట్రీతో మారిన సీన్తెరపైకి అమ్మ మక్కల్ మున్నేట్ర కగళం(AMMK) చీఫ్ దినకరన్జయలలిత నెచ్చెలి శశికళ మేనల్లుడు దినకరన్సొంత పార్టీతో అన్నాడీఎంకే కూటమి తరఫున పోటీ చేసిన దినకరన్ఒక్క స్థానంలో నెగ్గిన ఏఎంఎంకే అభ్యర్థిమన్నార్గుడి నుంచి నెగ్గిన ఏఎంఎంకే అభ్యర్థి కామరాజ్మొదటి నుంచి టీవీకే విజయ్కు మద్దతు ఇస్తారనే ప్రచారంఅందుకు తగ్గట్లే గవర్నర్కు సమర్పించిన ఎమ్మెల్యేల మద్దతులో కామరాజ్ సంతకం కూడాదినకరన్ సంచలన ఆరోపణలుతమ ఏకైక ఎమ్మెల్యే సంతకం ఫోర్జరీ చేశారంటూ ఆరోపణనిన్న సాయంత్రం గవర్నర్ను కలిసిన దినకరన్అన్నాడీఎంకేను ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలంటూ గవర్నర్కు విజ్ఞప్తితమిళ రాజకీయం.. హైదరాబాద్కు షిఫ్ట్తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠహైదరాబాద్కు మారిన తమిళనాడు రాజకీయంహైదరాబాద్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుతమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటయ్యే దాకా హైదరాబాద్లోనే ఐదుగురు ఎమ్మెల్యేల మకాంఏర్పాట్లు చూసుకోనున్న టీపీసీసీ చీఫ్తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మళ్లీ అవాంతరంగవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను ముచ్చటగా మూడోసారి కలిసిన టీవీకే అధినేత విజయ్మ్యాజిక్ ఫిగర్ 118టీవీకే గెలిచిన స్థానాలు 108కాంగ్రెస్ 5, సీపీఐ 2, సీపీఎం 2, వీసీకే 2.. మొత్తం మ్యాజిక్ ఫిగర్ గవర్నర్కు చూపించిన విజయ్ప్రమాణ స్వీకారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారంవిజయ్కు సీఎం స్థాయి భద్రతను పునరుద్దరించాలని పోలీస్ శాఖను గవర్నర్ ఆదేశించినట్లు ప్రచారందీంతో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసిన టీవీకేఅయితే వీసీకే ఇద్దరు ఎమ్మెల్యేల సంతకం మిస్సింగ్!116 మంది మద్దతే ఉందని ప్రకటించిన లోక్భవన్వీసీకే నిర్ణయం వెలువడేది ఇవాళేనేటి విజయ్ ప్రమాణ స్వీకారంపై సందిగ్దత -
టీవీకేకు కొత్త కష్టం.. ఫోర్జరీ కేసు నమోదు?
చెన్నై: తమిళనాడులో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయితున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న రాజకీయ వాతావరణం నెలకొంది. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఇంకా సస్పెన్స్ నెలకొంది. ఈ క్రమంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏఎంఎంకే చీఫ్ టీటీవీ దినకరన్.. టీవీకేపై సంచలన ఆరోపణలు చేశారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సంతకాన్ని ఫోర్జరీ చేసినట్టు చెప్పుకొచ్చింది. దీంతో, టీవీకే విజయ్ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..టీవీకే చీఫ్ విజయ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరినా.. ఈ అంశంపై లోక్భవన్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇంతలో తమ ఎమ్మెల్యే కామరాజు మద్దతు ఇచ్చినట్లు టీవీకే నకిలీ పత్రాన్ని ఫోర్జరీ చేసి గవర్నర్కు ఇచ్చిందని దినకరన్ షాకింగ్ ఆరోపణలు చేశారు. తమిళనాడు గవర్నర్కు ఒరిజినల్ కాపీ చూపించామన్న ఆయన, టీవీకేపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం, దినకరన్కు టీవీకే కూడా కౌంటర్ ఇచ్చింది. ఎమ్మెల్యే కామరాజు మద్దతు లేఖపై సైన్ చేస్తున్న వీడియో రిలీజ్ చేసింది. తొలుత దీనిని దినకరన్ ఆమోదించారని.. కానీ అంతలోనే ఆయన యూటర్న్ తీసుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.#WATCH | Chennai, Tamil Nadu | AMMK Party General Secretary TTV Dhinakaran visited the office of Assistant Commissioner of Police, Guindy RangeThis comes amid Dhinakaran's claim that TVK shared 'forged copy' of MLA Kamaraj's letter with the Governor and that he is filing a… pic.twitter.com/GgF0T6Eaz8— ANI (@ANI) May 8, 2026ఇదిలా ఉండగా.. ఏఎంఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి దినకరన్ గవర్నర్కు లేఖ రాయడం సంచలనంగా మారింది. తమిళనాడులో అన్నాడీఎంకేకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని లేఖలో కోరారు. ప్రభుత్వ ఏర్పాటుకు మాజీ సీఎం పళనిస్వామిని ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల వెలువడిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏఎంఎంకే ఒక స్థానంలో గెలిచిన విషయం తెలిసిందే.కాగా, ఆ వీడియోలో దినకరన్ ఆమోదంతోనే తాను టీవీకేకి మద్దతు ఇస్తున్నట్లు చెబుతూ కామరాజ్ లేఖను రాయడం కనిపిస్తుంది. విజయ్ పార్టీకి తాము అధికారికంగా ఎటువంటి మద్దతు ఇవ్వలేదని దినకరన్ ఖండించడంతో ఆయన తప్పుడు వార్తలు, అవాస్తవ సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని టీవీకే ఆరోపించింది. వాస్తవాలను దాచిపెడుతున్నారని టీవీకే మండిపడింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే తమ ప్రయత్నంలో ఎవరితోనూ బేరసారాలు లేదా చర్చలు జరపాల్సిన అవసరం తమకు లేదని కూడా ఆ పార్టీ స్పష్టం చేసింది. #WATCH | TVK shares a video of AMMK MLA Kamaraj, saying "These are the video visuals of AMMK MLA Kamaraj voluntarily and happily writing a letter expressing his support for the Tamilaga Vettri Kazhagam. He had stated that he was extending support to the Tamilaga Vettri Kazhagam… pic.twitter.com/sM3xtyXx12— ANI (@ANI) May 8, 2026విజయ్ను అడ్డుకునే ప్రయత్నాలు :కాంగ్రెస్ ఎంపీఇదిలా ఉండగా, తమిళనాడులో విజయ్ను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న కాంగ్రెస్ ఆరోపించింది. ప్రజల మద్దతు కోల్పోయిన రాజకీయ శక్తులు ఇప్పుడు విజయ్ను తమిళనాడు ముఖ్యమంత్రిగా అవ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ విమర్శించారు. టీవీకేకు ఇంకా మెజారిటీకి అవసరమైన 118 స్థానాల సంఖ్య చేరేందుకు చిన్న పార్టీల మద్దతు ఆలస్యమవుతోందని అంగీకరించిన ఆయన, అధికారం ప్రజల తీర్పును ఆలస్యం చేయగలదు కానీ శాశ్వతంగా అణచలేదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య తీర్పుకు ఇంకా ఎన్ని అడ్డంకులు సృష్టిస్తారంటూ ఎక్స్లో ప్రశ్నించారు. ప్రజల హక్కులు, న్యాయం కోసం ఈ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.టీవీకేకు మద్దతు లేఖ పంపాం: వీసీకేఇదిలా ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతిస్తున్నట్లు వీసీకే వెల్లడించింది. ఈ- మెయిల్ ద్వారా తమ లేఖను పంపినట్లు తెలిపింది. ఈ మేరకు వీసీకే పార్టీ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. తమ మద్దతుకు సంబంధించి అధికారిక ప్రకటన శనివారం చేస్తామని మరో ట్వీట్లో పేర్కొంది. వీసీకే, టీవీకే శ్రేణులంతా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది. -
కేరళ సీఎంగా ఆయనే?
న్యూఢిల్లీ: కేరళ ముఖ్యమంత్రి ఎంపిక ఘట్టం తుది దశకు చేరుకుంది. ముఖ్య మంత్రి కుర్చీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత)కేసీ వేణుగోపాల్ కూర్చునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అధిష్టానం పంపిన పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్ బుధ, గురువారాల్లో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో వేర్వేరుగా మాట్లాడి అభిప్రాయాలు సేకరించారు.పార్టీకి చెందిన ఎంపీలు, మాజీ ఎంపీలతో కూడా మాట్లాడి, అభిప్రాయాలను సేకరించారు. ఇందుకు సంబంధించిన తుది నివేదికను వారు శుక్రవారం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అందజేశారు. అంతిమ నిర్ణయం ఇప్పుడు ఖర్గే చేతుల్లో ఉంది. దీనిపై త్వరలోనే ఆయన నిర్ణయం ప్రకటిస్తారని భావిస్తున్నారు. కాగా, ఎమ్మెల్యేల్లో అత్యధికులు కేసీ వేణుగోపాల్ వైపే మొగ్గు చూపినట్లు విశ్వసనీయ వర్గాలంటున్నాయి.సీఎం పదవిని చేపట్టేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీ స్థాయిలో ఉన్న పలుకుబడితోపాటు అగ్ర నేత రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ముఖ్యమంత్రి పదవి ఆయన్ని వరించే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ సీనియర్ నేత, గత అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న వీడీ సతీశన్ వైపు కూడా మొగ్గు చూపినట్లు సమాచారం. మరో సీనియర్ నేత రమేశ్ చెన్నితాల కూడా సీఎం రేసులో ఉన్నారు. -
ఏపీ సెంట్రల్ జైళ్లలో కిక్కిరిసిన ఖైదీలు
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజాగా విడుదల చేసిన ‘ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఇండియా–2024’ నివేదిక ఆంధ్రప్రదేశ్ జైళ్ల పరిస్థితిపై పలు ఆందోళనకర అంశాలను వెల్లడించింది. రాష్ట్ర జైళ్ల సగటు ఆక్యుపెన్సీ రేటు సామర్థ్యానికి లోపే ఉన్నప్పటికీ.. కీలకమైన సెంట్రల్ జైళ్లు మాత్రం ఖైదీలతో కిక్కిరిసిపోతున్నాయి. మరోవైపు తీవ్ర సిబ్బంది కొరత వేధిస్తోంది. మంజూరైన పోస్టుల్లో 30 శాతం ఖాళీగానే ఉండటం, ఖైదీల ప్రవర్తనలో మార్పులు తెచ్చే ‘కరెక్షనల్’ సిబ్బంది రాష్ట్రంలో ఒక్కరు కూడా లేకపోవడం, యువ నేరస్థులను మంచి మార్గంలోపెట్టే ’బోస్టల్ స్కూల్స్’ లేమి ఏపీ జైళ్ల శాఖలోని డొల్లతనానికి అద్దం పడుతున్నాయి. ఎన్సీఆర్బీ గణాంకాల్లో ‘ఏపీ’ ముఖ్యాంశాలు...⇒ ఏపీ జైళ్ల శాఖలో 2,637 పోస్టులు మంజూరు కాగా.. 1,840 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఏకంగా 797 పోస్టులు (దాదాపు 30 శాతం) ఖాళీగా ఉన్నాయి. ⇒ జైలు శిక్ష అనుభవిస్తున్న వారిలో పరివర్తన తీసుకువచ్చే కరెక్షనల్ సిబ్బంది (ప్రొబేషన్ లేదా వెల్ఫేర్ ఆఫీసర్లు, సైకాలజిస్టులు తదితరులు) ఏపీ జైళ్లలో ఒక్కరు కూడా లేకపోవడం తీవ్ర ప్రతికూల అంశం. ⇒ యువ నేరస్థులను సన్మార్గంలో పెట్టే ‘బోస్టల్ స్కూల్స్’, ‘స్పెషల్ జైళ్లు’ రాష్ట్రంలో ఒక్కటి కూడా లేవు. ⇒ రాష్ట్రంలో 260 మంది ఖైదీలు (156 మంది శిక్ష పడినవారు, 103 మంది విచారణ ఖైదీలు, ఒక డిటెన్యూ) మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. ⇒ జైళ్లలో ఉన్న మొత్తం 7,861 మందిలో అత్యధికులు విచారణ ఖైదీలే (అండర్ట్రయల్స్) కావడం మరో ఆందోళనకర అంశం. ⇒ ఏకంగా 5,705 మంది (72.5 శాతం) కోర్టు తీర్పుల కోసం ఎదురుచూస్తున్నారు. ⇒ విచారణ నిమిత్తం 2024లో ఖైదీలను 81,205 సార్లు కోర్టులకు తరలించారు. వైద్య సహాయం కోసం 10,191 సార్లు ఆస్పత్రులకు తీసుకెళ్లారు.⇒ జైళ్ల బడ్జెట్ వినియోగానికి సంబంధించి రాష్ట్రాల జాబితాలో (లక్షదీ్వప్ మినహాయించి) ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. -
బడుల పగ్గాలు పేరెంట్స్కే!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 15 లక్షల ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ, బడ్జెట్ బాధ్యతలను ఇకపై నేరుగా విద్యార్థుల తల్లిదండ్రులకే అప్పగించనుంది. బడులను కేవలం ప్రభుత్వ సంస్థలుగానే కాకుండా సామాజిక ఆస్తులుగా అభివృద్ధి చేయడమే ఈ విధానం లక్ష్యం. జాతీయ విద్యా విధానం(ఈఎన్సీ)–2020, విద్యా హక్కు చట్టం(ఆర్టీఈ)–2009 ఆధారంగా విద్యాశాఖ రూపొందించిన కొత్త మార్గదర్శకాలు మే 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. చెక్బుక్ పవర్ కొత్తగా తీసుకొచ్చిన అతిపెద్ద మార్పు చెక్బుక్ పవర్. ఇకపై ప్రధానోపాధ్యాయుడు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) అధ్యక్షుడు (తల్లిదండ్రుల్లో ఒకరు) పేరిట స్కూలుకు ఉమ్మడి బ్యాంకు ఖాతా ఉంటుంది. తల్లిదండ్రుల అనుమతి లేకుండా నిధులను వాడటం సాధ్యం కాదు. పాఠశాలలో రూ.30 లక్షల లోపు నిర్మాణ పనులను పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పీడబ్ల్యూడీ) అనుమతి లేకుండానే ఎస్ఎంసీలు నేరుగా చేపట్టవచ్చు. ప్రైవేట్ కంపెనీల నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను సేకరించేందుకు కూడా అనుమతి కల్పించారు. ప్రతి పైసాకు లెక్క చెప్పాల్సిందే నిధుల వినియోగంలో పారదర్శకత సాధించేందుకు ప్రభుత్వ ఆడిట్తో పాటు వార్షిక సోషల్ ఆడిట్ను తప్పనిసరి చేశారు. స్కూల్కు వచ్చే ప్రతి పైసా ఖర్చుల వివరాలను పబ్లిక్ నోటీస్ బోర్డుపై బహిరంగంగా ప్రదర్శించాలి. జీరో టాలరెన్స్ విధానాన్ని పాటిస్తూ, ఏవైనా అవకతవకలు జరిగితే పోలీస్, ఆరోగ్య శాఖలతో కలిసి నేరుగా చర్యలు తీసుకునే అధికారం ఎస్ఎంసీకి ఇచ్చారు.కమిటీ స్వరూపం ఇదీ → 75% తల్లిదండ్రులే: కమిటీలోని మొత్తం సభ్యులలో మూడు వంతుల మంది విద్యార్థుల తల్లిదండ్రులే ఉంటారు. → 50% మహిళలు: కమిటీలో సగం మంది సభ్యులు తప్పనిసరిగా మహిళలే అయి ఉండాలి.→ 25% ఇతర సభ్యులు: పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక కౌన్సిలర్ లేదా పంచాయతీ సభ్యులు, పూర్వ విద్యార్థులు, స్థానిక విద్యావేత్తలు మిగతా పావు శాతం ఉంటారు. → పదవీకాలం: ఈ కమిటీని రెండేళ్ల కాలవ్యవధికి ఎన్నుకుంటారు. ప్రతి నెలా విధిగా ఒకసారి సమావేశమవ్వాలి.


