breaking news
Sakshi Special
-
2-3 నిమిషాల్లో విరిగిన ఎముకలు అతికితే!!
ఈ గమ్మును మీ విరిగిన ఎముకల మధ్య రాస్తే.. అవి రెండు నుంచి మూడు నిమిషాల్లో అతుక్కుంటాయి అంటూ ఓ వీడియో గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైనాలో ఈ గ్లూ మీద జరిగిన పరిశోధనలు సక్సెస్ అయ్యాయని.. ఇది మార్కెట్లోకి రావడమే ఆలస్యమని.. ఇది గనుక అందుబాటులోకి వస్తే వైద్యరంగంలోనే విప్లవాత్మక మార్పునకు కారణమవుతుందని ఊదరగొడుతున్నారు. ఇంతకీ ఈ ప్రచారంలో నిజమెంత?.. ఓసారి పరిశీలిస్తే.. విరిగిన ఎముకలు అంత ఈజీగా అతుకుతాయా? గంటల తరబడి ఆపరేషన్లు చేస్తే.. నెలలు, సంవత్సరాల తరబడి అవి అతుక్కుంటున్నాయి. అలాంటిది కేవలం సెకన్ల వ్యవధిలో ఓ సూది ద్వారా అతుక్కనేలా చేయొచ్చా?. చైనా పరిశోధకులు కనిపెట్టిన బోన్ గ్లూకు అసలు శాస్త్రీయత ఉందా?.. ఆ ప్రచారంలో ఉన్నట్లు విరిగిన ఎముకలను గంటల పాటు శస్త్రచికిత్స చేసి, స్టీల్ ప్లేట్లు అమర్చే సంప్రదాయ వైద్యం ఇక చరిత్ర అవ్వబోతోందా?.. షెజాంగ్ స్థానిక మీడియా ప్రకారం.. తూర్పు చైనా(China)లోని షెజాంగ్ ప్రావిన్స్లో ‘బోన్ 02’ అనే బోన్ గ్లూ(bone glue)ను పరిశోధకులు ఆవిష్కరించారు. దీంతో విరిగిన ఎముకలను మూడు నిమిషాల్లోనే అతికించవచ్చని ఆ కథనం సారాంశం. సర్ రన్ రన్ షా ఆస్పత్రిలో అసోసియేట్ చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ లిన్ షాన్ఫింగ్ నేతృత్వంలోని బృందం దీనిని డెవలప్ చేసింది. కొత్తగా అభివృద్ధి చేసిన జిగురు కేవలం రెండు, మూడు నిమిషాల్లోనే ఎముకను బాగుచేస్తుందని అంటున్నారాయన. రక్త ప్రవాహం అధికంగా ఉండే వాతావరణంలోనూ దీని పనితీరు మెరుగ్గా ఉందని వెల్లడించారు. సంప్రదాయ వైద్యంలో ఎముకలు అతికించాలంటే శరీరానికి పెద్ద కోతలు వేసి, స్టీల్ ప్లేట్లను అమర్చుతారు. కానీ ఈ ఇంజెక్షన్తో అలాంటి అవసరం రాదని అంటున్నారాయన. పైగా బోన్ 02 శరరీంలో ఈజీగా కలిసిపోతుందని, కాబట్టి మరో సర్జరీ అనే అవసరం లేకుండా చేస్తుందని చెబుతున్నారాయన. ఆపరేషన్ల సక్సెస్ రేటు తక్కువగా ఉంటుండడమే.. తనకు దీనిని రూపొందించాలనే ఆలోచన కలగజేసిందని అంటున్నారాయన.ఇంతకీ ఈ గ్లూను అభివృద్ధికి ప్రేరణ ఏంటో తెలుసా?. నీటి అడుగున వంతెనలకు గట్టిగా అతుక్కునే ఆల్చిప్పలు. వాటి జీవశైలిని పరిశీలించిన లిన్ షాన్ఫింగ్ ఈ పరిశోధనకు శ్రీకారం చుట్టారు.ట్రయల్స్.. సక్సెస్.. ‘బోన్ 02’(Bone-02)ని లాబోరేటరీలో కూడా పరీక్షించారు. అందులో తేలింది ఏంటంటే.. ఇది 400 పౌండ్ల బలాన్ని తట్టుకోగలదు (అంటే చాలా బలంగా అంటుకుంటుంది). 0.5 MPa కోత బలం (shear strength) అంటే పక్కదిశలో ఒత్తిడిని తట్టుకునే శక్తి ప్రదర్శించింది. అలాగే.. 10 MPa సంపీడన బలం (compressive strength) అంటే నేరుగా ఒత్తిడిని తట్టుకునే శక్తి చూపించింది. ఈ లక్షణాలన్నీ సంప్రదాయ మెటల్ ఇంప్లాంట్లను భర్తీ చేయగల సామర్థ్యం దీనికి ఉందని సూచిస్తున్నాయి. అలాగే.. దీని వినియోగంతో ఫారిన్ బాడీ రియాక్షన్లు, ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుముఖం పట్టనున్నాయి. స్టీల్ ప్లేట్లు, స్క్రూలు అవసరం లేకుండా.. ఎముక గాయం నయం కాగానే శరీరంలో కలిసిపోవడం ఈ ‘బోన్ 02’లోని మరో విశిష్ట లక్షణం ఉండనే ఉంది. మొత్తం 150 మంది పేషెంట్లపై క్లినికల్ ట్రయల్స్లో ఇది విజయవంతంగా పని చేసింది. దీంతో.. సెప్టెంబర్ 10వ తేదీన దీనిని ప్రపంచానికి పరిచయం చేశారు. అయితే.. చైనా నేషనల్ మెడికల్ ప్రొడక్ట్స్ అడ్మినిస్ట్రేషన్ (NMPA) నుంచి పూర్తి మార్కెట్ అనుమతి పొందిందా? అనేదానిపై సష్టత కొరవడింది. వైద్య చరిత్రలో మైలురాయే!ఎముకలను అతికించేందుకు ఈ తరహా ప్రయోగాలు గతంలోనూ జరిగాయి. 1940 కాలంలో.. ఎముకలను అతికించే పదార్థాలు అభివృద్ధి చేయాలన్న ఆలోచన మొదలైంది. 1950 నుంచి ముప్పై ఏళ్లపాటు నాన్స్టాప్గా ఈ తరహా పరిశోధనలు జరిగాయి. ఇందుకోసం జంతు మూలాల నుంచి తీసిన ప్రోటీన్ పదార్థం, బలమైన అంటుకునే లక్షణాలున్న ఎపాక్సీ రెసిన్లు (Epoxy Resins) రసాయనాలు, వేగంగా గట్టిపడే ప్లాస్టిక్ తరహా అక్రిలేట్లు (Acrylates)సైనోఎక్రిలేట్లు (super glue తరహా) పదార్థాలు ఉపయోగించారు. అయితే.. ఇవి ఎముకలను అతికించే సామర్థ్యం ప్రదర్శించినా.. బాడీకి పనికి రాకుండా పోయాయి. వీటి వల్ల బయోకంపాటబిలిటీ సమస్యలు ఎదురయ్యేవి. అంటే.. ఇన్ఫెక్షన్, అలర్జీలు వచ్చేవి. పైగా శరీర కణజాలాన్ని దెబ్బ తీశాయి. వాటిని తొలగించేందుకు రెండో సర్జరీ అవసరం అయ్యేవి. ఈ కారణాల వల్ల, వాటిని వైద్యంగా విరమించాల్సి వచ్చింది. సైనోఎక్రిలేట్లు (super glue తరహా) వంటి పదార్థాలతో ప్రయోగాలు జరిగాయి.1990–2010 మధ్యకాలంలో.. బయోకంపాటబుల్ పాలిమర్లు, కోలాజెన్, కెరటిన్, కైటోసన్ వంటి పదార్థాలపై దృష్టి పెట్టారు. ఇవి శరీరంలో కరిగిపోవడం, తక్కువ రిస్క్ ఉండడం వంటి లక్షణాలు కలిగి ఉన్నా, అంత బలంగా అంటుకునే సామర్థ్యం ప్రదర్శించలేకపోయాయి. 2010 తర్వాత.. బయోమిమిటిక్ దిశగా ప్రయోగాలు జరిగాయి. అంటే.. ఆల్చిప్పలు, గవ్వలు, గోరింటాకు వంటి జీవుల నుంచి స్ఫూర్తి పొందిన బయోమిమిటిక్ గ్లూలు అభివృద్ధి చేయడం మొదలైంది. ఇవి నీటి లోపల కూడా బలంగా అంటుకునే లక్షణాలను కలిగి ఉండటంతో, శరీరంలోని రక్త ప్రవాహంలో కూడా పనిచేయడం లాంటి ఫలితాలను ఇచ్చాయి. అలా కొన్ని గ్లూలు మాత్రమే క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకున్నా.. అక్కడ సరైన రిజల్ట్ ఇవ్వలేకపోయాయి. ఇలాంటి టైంలో.. చైనా బోన్ 02 గ్లూలు వాస్తవిక ప్రయోగ దశకు చేరుకోవడం గమనార్హం. సాధారణంగా, ఇలాంటి వైద్య పరికరాలను Class III medical deviceగా పరిగణిస్తారు. కాబట్టి వీటికి క్లినికల్ ట్రయల్స్, టెక్నికల్ సమీక్ష, రెగ్యులేటరీ అనుమతులు అవసరం. ఆ తర్వాతే వాణిజ్య వినియోగానికి అందుబాటులోకి వస్తాయి. అంటే ఇది మార్కెట్లోకి రావడానికి ఎంతో టైం పట్టకపోవచ్చు. సో.. వైరల్ అవుతున్న ఆ వీడియో.. ఆ కథనం రెండూ నిజమే. ‘బోన్ 02’ అనే గ్లూ ఎముకలు అతికించడంలో వేగంగా, బలంగా, సురక్షితంగా పనిచేస్తోందని రుజువైంది. ఇది సంప్రదాయ చికిత్సకు మంచి ప్రత్యామ్నాయం అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. -
నేపాల్ అగ్నిగుండాన్ని చల్లార్చిన యాప్!
కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని నేపాల్ ప్రభుత్వం(గత) 26 సోషల్ మీడియా యాప్లపై విధించిన నిషేధం.. ఆ దేశంలో అలజడిని సృష్టించింది. జెడ్ జనరేషన్ యువత వీధుల్లోకి చేరి నిరసనలు చేపట్టడం.. వాటిని అదుపు చేసే క్రమంలో హింస చెలరేగి 51 మంది మరణించడం.. యాప్ బ్యాన్ ఎత్తివేత.. అయినా శాంతించని యువత.. ప్రధాని రాజీనామా.. ఆపై ఆందోళనకారుల ఛాయిస్ ప్రకారం తాత్కాలిక ప్రధాని ఎంపిక.. ఇదంతా పదిరోజుల వ్యవధిలోనే చకచకా జరిగిపోయింది. అయితే సో.మీ. బ్యాన్ నేపథ్యంలో ఆందోళనకారులు డిస్కార్డ్ Discord అనే చాట్ ప్లాట్ఫారమ్ను భలేగా ఉపయోగించారు. ఒకవేళ ఈ యాప్ గనుక లేకుండా ఉంటే.. నేపాల్ ఇంకా అగ్నిగుండంగా రగిలిపోతూ ఉండేదేమో అనే చర్చా నడుస్తోందక్కడ.పాలన పేరిట ఇన్నేళ్లుగా కొనసాగిన అవినీతికి నేపాల్ యువత ఎలాగైనా చెక్ పెట్టాలనుకుంది. ఆందోళనలను ఉధృతంగా జరిపి ప్రభుత్వం మెడలు వచ్చింది. అయితే ఈ ఆందోళనలను సమన్వయపర్చుకోవడానికి డిస్కార్డ్ యాప్నే Gen Z నిరసనకారులు ఉపయోగించుకున్నారు. అంతేకాదు.. కేపీ శర్మ ఓలీ రాజీనామా తర్వాత.. తమ ఆకాంక్షలకు అనుగుణంగా నాయకుడ్ని ఎన్నుకునే క్రమంలోనూ ఈ వేదికనే ఉపయోగించుకున్నారు. Discord అనే యాప్ గురించి మిలెనియల్స్కు పెద్దగా పరిచయం లేకపోయినా.. Gen Z యువత మాత్రం సౌకర్యవంతమైన, విశ్వసనీయమైన వేదికగా భావిస్తోంది. డిస్కార్డ్(Discord) అనేది 2015లో ప్రారంభమైన డిజిటల్ కమ్యూనికేషన్ ప్లాట్ఫారమ్. ఇది గేమర్ల కోసం ఆటల మధ్యలోనే స్నేహితులతో చాట్ చేయడానికి రూపొందించబడిన ఒక యాప్. అయితే.. 2020లో మహమ్మారి సమయంలో Gen Z యువతలో ఇది విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. Discord ద్వారా వినియోగదారులు సర్వర్లు అనే కమ్యూనిటీలు ఏర్పాటు చేసి.. టెక్స్ట్, ఆడియో, వీడియో చానెల్స్ ద్వారా చర్చలు జరపడం ప్రారంభించారు. స్క్రీన్ షేరింగ్, స్ట్రీమింగ్, మోడరేషన్ టూల్స్ వంటి ఫీచర్లు కూడా వీటిలో అందుబాటులో ఉన్నాయి. ఒక్కో సర్వర్లో గరిష్టంగా 5 లక్షల మంది చేరవచ్చు, కానీ ఒకేసారి 2.5 లక్షల మంది మాత్రమే యాక్టివ్గా ఉండగలరు. అందుకే నేపాల్ యువత ఉద్యమానికి దీన్నొక వేదికగా మల్చుకుంది. వీపీఎన్ సాయంతో.. సాధారణంగా వీపీఎన్లను ఎందుకు ఉపయోగిస్తారు?.. మిగతా వాళ్ల సంగతి ఏమోగానీ.. నేపాల్ యువత మాత్రం ఈమధ్య దీనిని తాజాగా నిరసనలకే ఉపయోగించింది(నేపాల్లో VPNల వినియోగం 3 రోజుల్లోనే 6,000% పెరిగింది.. అలాగే 5వ రోజుకొచ్చేసరికి 8,000% పెరిగింది.). నేపాల్లో సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లపై నిషేధం కొనసాగుతున్న వేళ.. విస్తృత యాప్గా పేరున్న డిస్కార్డ్(Discord) వీపీఎన్ సాయంతో అందుబాటులోకి తెచ్చుకుంది. ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో ఉన్నట్లు ఎండ్లెస్ ఫీడ్లు లేకుండా.. వాట్సాప్ కంటే ఎక్కువ ఫీచర్లతో Discord ఉండడం వల్లే దీనిని రైట్ఛాయిస్గా అక్కడి యువత భావించింది. అలా.. "Youth Against Corruption" అనే Discord సర్వర్లో 145,000 మందికి పైగా సభ్యులుగా చేరారు. ఈ సర్వర్లో చర్చలు, అనౌన్స్మెంట్స్, ఫ్యాక్ట్ చెక్, హెల్ప్లైన్లు వంటివి కొనసాగించింది. వారు ఏర్పాటు చేసిన Discord సర్వర్లలో ఇన్ఫర్మేషన్ సులభంగా పాసయ్యింది. పెద్ద సంఖ్యలో సభ్యులు చర్చలు జరిపేందుకు ఇదొ కీలక వేదికగా నిలిచింది. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు.ఓటింగ్ కూడా.. నేపాల్ తాత్కాలిక నాయకత్వం విషయంలో ఏర్పడిన గందరగోళాన్ని డిస్కార్డే తొలగించింది!. మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కార్కీ, నేపాల్ పవర్ హౌజ్గా పేరున్న కుల్మన్ ఘీసింగ్, రాపర్ బాలేంద్ర షా(బాలెన్), ఇలా పలువురి పేర్లతో ఓ డైలామా ఏర్పడగా.. డిస్కార్డ్ జరిగింది ఓటింగ్ ద్వారా స్పష్టత తెచ్చుకుంది. అంతేకాదు.. ఈ యాప్ ద్వారానే ప్రతిపక్షాన్ని కూడా సమన్వయపర్చుకుని.. రాజకీయ అనిశ్చితిని తొలగించింది. ఈ ఓటింగ్ను పర్యవేక్షించిన శశ్వత్ లామిచ్ఛానే కూడా ఈ విషయాల్ని ధృవీకరించారు. ఇక డిస్కార్డ్లో ఓటింగ్ బుదవారం పూర్తైంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. 50 శాతం ఓట్లు సుశీల్ కార్కీకే పడ్డాయి. ఆ మరుసటి రోజు ఆమె నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్, ఆర్మీచీఫ్ అశోక్ రాజ్ సిగ్దెల్ను కలిశారు. అలా నేపాల్ తాత్కాలిక ప్రధాని ఎపిసోడ్లో ఉత్కంఠ వీడింది. అయితే.. ఇండియా టుడే ఓఎస్ఐఎన్టీ(Open-Source Intelligence) సర్వే ప్రకారం ఈ ఓటింగ్లో పాల్గొన్నవాళ్లంతా నేపాల్ పౌరులేనా? అనే అనుమానాలు వ్యక్తం చేసింది. భారత్లోనూ డిస్కార్డ్Discord ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. అమెరికాలో దాదాపు 25 కోట్లు, బ్రెజిల్లో ఐదున్నర కోట్ల యూజర్లు ఉన్నారు. ఆ తర్వాత భారత్లోనూ ఐదు కోట్ల మంది ఈ యాప్ను ఉపయోగిస్తునన్నారు. ఈ లిస్ట్లో కెనడా, ఫిలిప్పీన్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ ప్లాట్ఫారమ్ విండోస్, మాక్ఓఎస్, ఆండ్రాయిడ్, ఐవోఎస్, లైనక్స్ వెబ్ బ్రౌజర్లలో కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి 30కి పైగా భాషల్లో అందుబాటులో ఉంది, అందులో తెలుగు మాత్రం లేదు. డిస్కార్డులో గేమింగ్ మాత్రమే కాదు.. పౌర ఉద్యమాలు, రాజకీయ చర్చలు నడుస్తున్నాయి. సొంత సర్వర్తో క్రియేటివ్ కమ్యూనిటీలు నిర్మించుకునేందుకు వీలుగా ఉండడంతోనే ఇది సాధ్యమవుతోంది. అంత నిషేధంలోనూ Gen Z యువతకు డిస్కార్డ్ యాప్ ఒక గళం ఇచ్చింది. ఒకవేళ ఈ యాప్ను జెన్ జెడ్ యువత గనుక సమర్థవంతంగా ఉపయోగించుకుని గనుక ఉండి ఉంటే.. నేపాల్ ఉద్యమం అసంఘటితంగా, అస్పష్టంగా, మరింత హింసాత్మకంగా మారిపోయే అవకాశం ఉండేదేమో!. -
భలే మంచి చౌక బేరము
అమాడెయా.. ఓ భారీ విలాసవంతమైన పడవ. దీనిని అమెరికా ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. వాస్తవ ధర సుమారు రూ.3 వేల కోట్లు కాగా, అనేక కారణాలతో దీనిని సుమారు రూ.వెయ్యి కోట్లకే ఇవ్వాలనుకుంటోంది. రష్యాకు చెందిన చమురు వ్యాపారి, అపర కుబేరుడు సులేమాన్ కెరిమోవ్ మోజుపడి తయారు చేయించుకున్న పడవ ఇది. 2017లో నిర్మించిన ఈ పడవలో 6 డెక్కులున్నాయి. ఆధునిక వసతులతో కూడిన ఎనిమిది భారీ గదులు, జిమ్, సినిమా థియేటర్, లాబ్స్టర్ ట్యాంక్, పియానో రూం, స్విమ్మింగ్ పూల్, అత్యాధునిక మసాజ్ సెంటర్తోపాటు హెలిప్యాడ్ కూడా అమాడెయాలో ఉంది. ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర మొదలుపెట్టిన వేళ ఆ దేశంపై అమెరికా మిత్రదేశాలు తీవ్ర ఆంక్షలు విధించాయి. తమ దేశాల్లోని రష్యా ప్రభుత్వ, బడా పారిశ్రామిక వేత్తలు, వ్యాపార ప్రముఖుల వ్యక్తిగత ఆస్తులను స్వాధీనం చేసుకుంటోంది. ఇలా స్వాధీనం చేసుకున్న ఆస్తుల్ని అమ్మేసి, ఆ డబ్బును ఉక్రెయిన్కు అందజేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందులో భాగంగానే అమెరికా ప్రభుత్వం క్లెప్టోక్యాప్చర్ టాస్క్ఫోర్స్ను 2022లో ఏర్పాటు చేసింది. ఈ విషయం తెలిసిన రష్యా చమురు వ్యాపారి సులేమాన్ కెరిమోవ్ తన అమాడెయా అనే భారీ పడవను సుదూరంగా ఉన్న ఫిజీలోని మారుమూల దీవిలో దాచి ఉంచాడు. అమెరికా నిఘా సంస్థలు, క్లెప్టో క్యాప్చర్ టాస్క్ఫోర్స్ దీని జాడను కనిపెట్టాయి. ఫిజీ నుంచి దీనిని అమెరికాకు తీసుకువచ్చాయి. ఇది సుమారు మూడేళ్ల క్రితం ఘటన. అప్పటి నుంచి అమాడెయా శాన్డియాగో తీరంలో ఉంది. ఫిజీ నుంచి తరలింపు, నిర్వహణ తదితరాలకే అమెరికా ప్రభుత్వం దీనిపై 3.2 కోట్ల డాలర్లు ఖర్చుపెట్టింది. స్వాధీనం చేసుకున్న సమయంలో దీని విలువను సుమారు రూ.2,000 కోట్లుగా నిర్థారించారు. అయితే, ప్రస్తుత విలువ రూ.700 కోట్ల నుంచి రూ.వెయ్యి కోట్ల వరకు ఉన్నట్లు నిపుణులు మదింపు చేశారు. ప్రపంచంలోని 50 మంది నుంచి 100 మంది వరకు ఉన్న అత్యంత ధనవంతులకే ఇలాంటి బోట్ను కొనగలిగే సత్తా ఉందని అంచనా వేశారు.న్యాయ వివాదం..అమాడెయా వాస్తవ యజమాని ఎవరనే విషయమై మూడేళ్లుగా న్యాయపోరాటం సాగుతోంది. ఇది తమదేనంటూ అసలు యజమాని, రష్యా బిలియనీర్ అయిన సులేమాన్ కెరిమోవ్తోపాటు రష్యా ఇంధన సంస్థ రోస్నెఫ్ట్ మాజీ అధికారి ఎడ్వర్డ్ ఖుదైనటోవ్, మిల్లిమారిన్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ న్యూయార్క్ కోర్టులో పిటిషన్లు వేశాయి. అయితే, కెరిమోవ్ అమెరికా ఆంక్షలను ఉల్లంఘించినందుకు ఈ పడవ యాజమాన్య హక్కులు అమెరికాకే ఉంటాయని 2023 మార్చిలో న్యూయార్క్ సర్క్యుట్ కోర్టు జడ్జి డేల్ హో ప్రకటించారు. దీంతో, అమెరికా ప్రభుత్వం ఇటీవల దీనిని వేలానికి పెట్టింది. వేలం పాటలో పాల్గొనే వారు కోటి డాలర్లను డిపాజిట్గా చెల్లించాల్సి ఉంటుంది. కాగా, క్లెప్టోక్యాప్చర్ టాస్క్ ఫోర్స్ ద్వారా స్వాధీనం చేసుకున్న అమాడెయా వంటి అనేక పడవలు, విమానాలు, విలాసవంతమైన ఆస్తుల్లో చాలావరకు ప్రస్తుతం న్యాయపోరాటాన్ని ఎదుర్కొంటున్నాయి. ఎడ్వర్డ్ ఖుదైనటోవ్ మాత్రం అమెరికా అన్యాయంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. న్యూయార్క్ సర్క్యూట్ కోర్టు తీర్పుపై అప్పీల్ చేశామని, నవంబర్లో తీర్పు వచ్చే అవకాశముందని చెబుతున్నారు. తీర్పు తమకు అనుకూలమైతే అమాడెయా పూర్తి విలువను అమెరికా ప్రభుత్వం చెల్లించక తప్పదని స్పష్టం చేస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
రామాయపట్నంపై నిర్దయ
చెప్పేదొకటి.. చేసేదొకటి అనే రీతిలో కూటమి ప్రభుత్వ పాలన సాగుతోంది. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి తలపెట్టిన నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు నిర్మాణ తీరే దీనికి చక్కటి ఉదాహరణ. నాడు చకచకా పనులు సాగి, గతేడాది ఏప్రిల్ నాటికి మొదటి దశ పూర్తి కావాల్సిన ఈ నౌకాశ్రయం సర్కార్ నిర్లక్ష్య ధోరణి కారణంగా అతీగతీ లేకుండాపోతోంది. దీనిపై ఏ మాత్రం దృష్టి సారించకుండా.. రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో ప్రతి 50 కిలోమీటర్లకో పోర్టును ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. 70 శాతం పూర్తయిన దీనిపైనే శ్రద్ధ చూపని పాలకులు.. మిగిలిన వాటిని ఎలా నిర్మిస్తారు.. ఇదంతా బూటకమనే విషయం వారి చేష్టలతోనే స్పష్టమవుతోంది. కందుకూరు: రామాయపట్నం పోర్టును కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ హయాంలో దీని నిర్మాణ పనులు చకచకా సాగినా, ప్రస్తుతం అడుగు ముందుకు పడటంలేదు. నూతన ప్రభుత్వం కొలువుదీరాక.. అప్పటికే పనులు చేస్తున్న ఏజెన్సీని తొలగించడంతో ఆర్నెల్ల పాటు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆ తర్వాత చేపట్టినా, పనుల్లో వేగం నేటికీ పుంజుకోలేదు. గతంలో చేసిన వర్కుల మినహా ప్రస్తుతం ఏ మాత్రం పురోగతి లేదు. అసలెప్పటికి పూర్తవుతుందో..? వాస్తవానికి డిసెంబర్, 2023 నాటికే వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించాలని నాటి సీఎం జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. తదనుగుణంగా అన్ని చర్యలు చేపట్టారు. అయితే ప్రస్తుత ప్రభుత్వ వైఖరిని చూస్తుంటే మరో నాలుగేళ్లకైనా నిర్మాణం పూర్తవుతుందాననే అనుమానం తలెత్తుతోంది. ప్రస్తుతం.. గ్రహణం గతేడాది జూన్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతోనే పోర్టు నిర్మాణ పనులకు గ్రహణం పట్టింది. అధికారం చేజిక్కించుకున్న వెంటనే కాంట్రాక్ట్ సంస్థ అరబిందోను తొలగించింది. తదనంతరం దాదాపు ఆర్నెల్ల పాటు పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆపై నవయుగ కంపెనీకి నిర్మాణ బాధ్యతను అప్పగించారు. అయితే అప్పటికే పాత సిబ్బందిని తొలగించడం.. కార్మికులు, భారీ యంత్రాలను సమకూర్చడంలో చోటుచేసుకున్న జాప్యంతో పనులు మరింత ఆలస్యమయ్యాయి. ప్రస్తుతం జరుగుతున్నా, అవి నామమాత్రమే. గతంలో చేపట్టిన బ్రేక్ వాటర్ ఫీడర్ల నిర్మాణ పనులను అరకొరగా జరుపుతున్నారు. కీలకమైన డ్రెడ్జింగ్, బెర్తుల నిర్మాణం ఇంకా ప్రారంభమే కాలేదు.మొదటి దశ ఎప్పుడో..?రామాయపట్నం పోర్టు మొదటి దశలో భాగంగా 34.04 ఎమ్మెమ్టీపీఏ (మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ ఆనమ్) కార్గో సామర్థ్యంతో నాలుగు బెర్తులను నిర్మించాల్సి ఉంది. వీటిలో రెండు జనరల్, ఒకటి కోల్, మరొకటి మల్టీ పర్పస్కు సంబంధించనవి. సముద్రంలో వచ్చే ఆటుపోట్లు, తుఫాన్లను తట్టుకునేలా సౌత్, నార్త్ బ్రేక్ వాటర్ ఫీడర్ల నిర్మాణాన్ని చేపట్టారు. వీటిని నీటి ఉపరితలం నుంచి మూడు మీటర్ల ఎత్తు, 100 మీటర్ల వెడల్పుతో పెద్ద బండరాళ్లతో నిర్మించారు. ఇందులో సౌత్ బ్రేక్ వాటర్ ఫీడర్ 3.7.. నార్త్ బ్రేక్ వాటర్ ఫీడర్ 1.73 కిలోమీటర్ల మేర పనులను పూర్తి చేశారు. వీటి మధ్యలోనే బెర్తులనూ నిర్మిస్తున్నారు. లక్ష టన్నుల సామర్థ్యం గల భారీ నౌకలు నిలిచేందుకు వీలుగా సముద్ర లోతును 16 మీటర్ల వరకు గతంలోనే డ్రెడ్జింగ్ చేశారు. బల్క్ బెర్తును నిర్మించి, 2023 డిసెంబర్ నాటికే మొదటి వాణిజ్య నౌకను నిలపాలనే లక్ష్యంతో పనులు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యే నాటికే మొదటి దశలో కీలకమైనవన్నీ పూర్తయ్యాయి. ఆపై సర్కార్ నిర్లిప్త ధోరణితో ఏ మాత్రం పురోగతి కనిపించడంలేదు. ఉన్నతాశయంతో..తీర ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ఉలవపాడు మండలంలోని రామాయపట్నం వద్ద రూ.3736 కోట్ల అంచనాతో పోర్టు నిర్మాణానికి గత ప్రభుత్వంలో పునాది రాయి పడింది. 850.79 ఎకరాల్లో పనులకు 2022, జూలై 20న నాటి సీఎం జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్మాణ పనులను అరబిందో సంస్థ వాయువేగంతో 70 శాతం మేర చేసింది. 18 నెలల్లోనే వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించాలనే లక్ష్యంతో పనులు సాగాయి. డిసెంబర్, 2023 నాటికి మొదటి వాణిజ్య నౌకను నిలపాలనే లక్ష్యంతో సర్కార్ అడుగులేసింది. అయితే ఆపై 2024 సాధారణ ఎన్నికల హడావుడి, కోడ్ అమల్లోకి రావడంతో అది సాధ్యపడలేదు. ప్రస్తుత పరిస్థితి.. ఒక బెర్తు నిర్మాణం పూర్తి కాగా, మిగిలిన మూడు బెర్తులతో పాటు, సముద్ర లోతును పెంచే డ్రెడ్జింగ్ పనులు జరగాల్సి ఉంది. గతేడాది ఏప్రిల్ నాటికి మొదటి దశ పనులను పూర్తి చేసి అందుబాటులో తీసుకురావాలని నాటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంకల్పించినా, ప్రస్తుత సర్కార్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా రామాయపట్నం పోర్టు ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ అంతుచిక్కడంలేదు. -
నమ్మకంతో నక్షత్రాలై!
‘స్థిరమైన ఉద్యోగం ఉంటే చాలు’ అనుకునే మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రుచి కల్రా డిక్షనరీలో ‘ఇక చాలు’ అనే మాట ఎప్పుడూ లేదు. సక్సెస్ఫుల్ కన్సల్టెంట్ నుంచి సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా మారింది. మొదట 73 మంది ఇన్వెస్టర్ల నుంచి ఆమెకు తిరస్కారం ఎదురైంది. ఒకే ఒక్క ఇన్వెస్టర్ నమ్మాడు. ఆ నమ్మకమే గొప్ప విజయం అయింది.పేషెంట్లు, హాస్పిటల్స్ మధ్య దూరం ఉందని గ్రహించిన గరిమ సానే ‘ప్రిస్టీన్ కేర్’తో హెల్త్కేర్ రంగంలోకి అడుగు పెట్టింది. మొదట్లో ఆమె మాటలను పెద్దగా ఎవరూ విశ్వసించలేదు. అయినా ఆమె ప్రయాణం ఆపలేదు. విశ్వసనీయతే జీవనాడిగా ప్రయాణం ప్రారంభించిన ప్రిస్టీన్కేర్ హెల్త్కేర్ రంగంలో సరికొత్త సంచలనం అయింది.‘సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్’గా పేరు తెచ్చుకోవాలనే ఉత్సాహంతో ఒక స్టార్టప్తో ప్రయాణం మొదలుపెట్టిన వినీతా సింగ్కు అపజయాలు హాయ్ చెప్పాయి. ఎంటర్ప్రెన్యూర్గా రాణించాలంటే ఉత్సాహం ఒక్కటే సరిపోదని వ్యూహం కూడా కావాలని గ్రహించి మేకప్ బ్రాండ్ ‘షుగర్ కాస్మోటిక్స్’తో తిరుగులేని విజయాన్ని సాధించింది.దేశీయ యూనికార్న్ క్లబ్లో కొన్ని స్టార్టప్లు యూనికార్న్ హోదాను కోల్పోయాయి. కొన్ని మాత్రం ఆ హోదాను స్థిరంగా నిలుపుకుంటూనే, ఔత్సాహికులకు స్ఫూర్తినిస్తున్నాయి.‘వైవిధ్యమైన రంగాలలో మహిళా వ్యాపారవేత్తలు అద్భుత విజయాలు సాధించారు’ అంటూ గరిమ సానే (ప్రిస్టీన్ కేర్), రుచి కల్రా (ఆఫ్ బిజినెస్), వినీతా సింగ్ (షుగర్ కాస్మోటిక్స్) పేర్లను ప్రస్తావించింది ఏఎస్కె ప్రైవేట్ వెల్త్ హురున్ ఇండియా యూనికార్న్ అండ్ ఫ్యూచర్ యూనికార్న్–2025 నివేదిక.ఈ ముగ్గురు ఎవర్గ్రీన్ యూనికార్న్ స్టార్ల సక్సెస్ మంత్రా గురించి...పరాజయాల తరువాత ఘన విజయంలక్నోకు చెందిన వినీతాసింగ్ చదువులో ఎప్పుడూ ముందుండేది. స్కూల్, కాలేజి రోజుల్లో బంగారు పతకాలు అందుకుంది. ఐఐటీ, మద్రాస్లో చదువుకున్న వినీత బ్యాడ్మింటన్లో సత్తా చాటేది. ఎన్నో టోర్నమెంట్స్లో విజయం సాధించింది. పరుగు పందేలలో కూడా దూసుకుపోయేది. ఒక్కమాటలో చెప్పాలంటే చురుకుదనానికి కేరాఫ్ అడ్రస్లా ఉండేది.ఇన్వెస్టింగ్ బ్యాంకింగ్లో విలువైన అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని వదులుకొని ‘క్వెజాల్’ వెంచర్ మొదలు పెట్టింది. ఆ స్టార్టప్ విజయం సాధించలేదు. ఆ తరువాత ప్రారంభించిన ‘ఫ్యాబ్–బాగ్’ అంతంతమాత్రమే అనిపించింది. అయిన్పటికీ ‘ఇక చాలు’ అనుకోలేదు. గట్టి విజయం కోసం తపన పోలేదు. ‘షుగర్ కాస్మోటిక్స్’ స్టార్టప్తోతో అసలు సిసలు విజయాన్ని అందుకుంది. ‘రకరకాల స్కిన్ టోన్లను దృష్టిలో పెట్టుకొని అధిక నాణ్యతతో కూడిన, అందుబాటు ధరల్లో ఉండే ప్రాడక్ట్స్ను తీసుకువచ్చాం’ అంటుంది వినీతాసింగ్.‘షుగర్ కాస్మోటిక్స్’లో పనిచేస్తున్న 75 శాతం మంది ఉద్యోగులు మహిళలే కావడం విశేషం. రియాలిటీ షో ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ కార్యక్రమంలో జడ్జీ, ఇన్వెస్టర్గా రెండు బాధ్యతలు నిర్వహిస్తోంది వినీత. ఈ కార్యక్రమం ద్వారా ఎంటర్ప్రెన్యూర్ కావాలనుకునే ప్రతిభావంతులకు విలువైన సలహాలు ఇస్తోంది. వారి కలలు సాకారం చేయడానికి తనవంతు ప్రయత్నం చేస్తోంది. యూనికార్న్ స్టార్గా వినీతాసింగ్ విజయం ఎన్నో విషయాలను చెప్పకనే చెబుతుంది. అందులో ఒకటి.... ‘కష్టపడితే... కాలంతో పాటు నడిస్తే ఏదీ అసాధ్యం కాదు’డెబ్బైమూడు మంది తిరస్కరించారు!పంజాబ్లోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రుచి కల్రా కెమికల్ ఇంజినీరింగ్ చదువుకుంది. అయినప్పటికీ ఆర్థికవిషయాలపై ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తితోనే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో ఎంబీఎ చేసింది. చదువు పూర్తయిన తరువాత మెకెన్జీ అండ్ కంపెనీలో తొమ్మిది సంవత్సరాల పాటు పనిచేసింది. ఆ కంపెనీలో పనిచేసిన అనుభవం తనలోని నైపుణ్యాలను మెరుగు దిద్దుకునేలా చేసింది. ఆ నైపుణ్య బలమే వ్యాపారవేత్తగా తన ప్రయాణానికి ఇంధనం అయింది. మెటల్స్, కెమికల్స్, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన బి2బి కామర్స్ ΄్లాట్ఫామ్ ‘ఆఫ్బిజినెస్’కు శ్రీకారం చుట్టింది. చిన్న, మధ్యతరగతి పరిశ్రమలకు ముడి సరుకును అందించే కంపెనీ ఇది. మొదట్లో 73 మంది ఇన్వెస్టర్ల నుంచి తిరస్కారం ఎదురైంది. ఒకే ఒక్క ఇన్వెస్టర్ నమ్మాడు.‘ఆఫ్బిజినెస్’ను సక్సెస్ఫుల్ వెంచర్గా తీర్చిదిద్దిన రుచి కల్రా ఆ తరువాత ఈ కంపెనీకి అనుబంధంగా ‘ఆక్సీజో’ పేరుతో ఫైనాన్షియల్ సర్సీసెస్ మొదలుపెట్టింది.బలమైన నాయకత్వ సామర్థ్యానికి అంకితభావం తోడైతే ఎంత విజయం సాధించవచ్చో నిరూపించింది రుచి. ‘ఆఫ్బిజినెస్’ విజయంతో ఎంతోమంది ఔత్సాహికులు, వ్యాపార రంగంలోకి రావాలని కలలనే కనే యువతరానికి స్ఫూర్తిగా నిలిచింది.మొదట్లో ఎవరూ విశ్వసించలేదు!గైనకాలజిస్ట్గా మంచి పేరు తెచ్చుకున్న డా. గరిమ సానే ‘ప్రిస్టీన్ కేర్’తో ఎంటర్ప్రెన్యూర్గా మారింది. తన వైద్యవృత్తి ద్వారాఎన్నోరకాల నైపుణ్యాలను సొంతం చేసుకున్న గరిమకు ఓపిక ఎక్కువ. తొందరపాటు లేదు. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది. అధిక పనిభారం, తక్కువమంది సిబ్బంది, పేషెంట్లపై సరిౖయెన శ్రద్ధ చూపకపోవడం... కొన్ని హాస్పిటల్స్లో ఈ పరిస్థితిని చూసిన గరిమ ‘ప్రిస్టీన్ కేర్’తో హెల్త్కేర్ రంగంలోకి అడుగుపెట్టింది. హాస్పిటల్స్కు, పేషెంట్లకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించాలి, పేషెంట్లు కోరుకునే క్వాలిటీ సర్జికల్ కేర్ను అందించాలి అనే లక్ష్యంతో ప్రయాణం మొదలు పెట్టింది.వైద్యుల ఎంపిక, క్లినిక్లో అపాయింట్మెంట్, డయాగ్నోస్టిక్ కేంద్రాలలో టెస్ట్లు బుకింగ్ చేయడం, ఇన్సూరెన్స్ పేపర్ వర్క్, హాస్పిటల్ ఆడ్మిషన్–డిశ్చార్జీ ప్రాసెస్, సర్జరీ తరువాత ఫాలో–అప్ కన్సల్టేషన్, రకరకాల డిపార్ట్మెంట్లతో సమన్వయం... మొదలైన పనులు ప్రిస్టీన్ కేర్ జాబితాలో ఉన్నాయి. అందుకే పేషెంట్ల సర్జరీని సులభతరం చేసే అత్యాధునిక హెల్త్కేర్ కంపెనీగా ‘ప్రిస్టీన్ కేర్’ పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ప్రిస్టీన్ కేర్ 150కి పైగా క్లినిక్స్, 800కి పైగా పార్ట్నర్ హాస్పిటల్స్, 400కి పైగా సూపర్ స్పెషలిస్ట్ సర్జన్లను ఆపరేట్ చేస్తుంది.మొదట్లో చాలామంది వైద్యులు, హాస్పిటల్స్ గరిమ చెప్పే మాటలను పెద్దగా విశ్వసించలేదు. ఆ తరువాత వారికి ప్రిస్టీన్ కేర్ అంకితభావం, కష్టం అర్థమయ్యాయి.‘హెల్త్కేర్ అనేది కేవలం సైన్స్ మాత్రమే కాదు నమ్మకం, భావోద్వేగాలు కూడా అందులో మిళితమై ఉన్నాయి’ అంటున్న గరిమ మార్కెటింగ్ వ్యూహాలను బాగా అర్థం చేసుకుంది. ఆ వ్యూహాలతో కంపెనీని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లింది. ‘సర్జరీ సింప్లిఫైడ్’ అనేది పిస్ట్రీన్ కేర్ ట్యాగ్లైన్. -
కనుమరుగు కానున్న ఈశాన్య రుతుపవనాలు?!
అనూహ్యం.. అసాధారణం.. ఆశ్చర్యం.. నైరుతి రుతుపవనాలు ‘సంప్రదాయ’ గతి తప్పాయి. వాతావరణ మార్పు, భూతాపం నేపథ్యంలో అవి దారి తప్పి ఆధునిక ‘పోకడ’ పోతున్నాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల నడక కొద్దిగా మారింది. భవిష్యత్తులో ఇదే నడత కొనసాగితే మన దేశానికి ముప్పు తప్పదు!!. ఈ నెల తొలి వారంలో భారత వాతావరణ విభాగానికి చెందిన ఓ ఉపగ్రహం తీసిన ఛాయాచిత్రం రుతుపవన గమనంపై వాతావరణ నిపుణుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. హిమాలయ పర్వత శ్రేణుల వరకు వెళ్లి.. గోడకు కొట్టిన బంతిలా వెనక్కు రావాల్సిన రుతుపవనాలు కొంత కట్టు తప్పి టిబెట్ పీఠభూమి ప్రాంతంలోకి ప్రవేశించాయి. హిమాలయాలకు ఆవల ఉండే టిబెట్ పీఠభూమిలో అవపాతం తక్కువ. అందుకే ఈ ప్రదేశం ఎప్పుడూ పొడిగా కనిపిస్తుంది. శీతాకాలంలో హిమపాతం, వసంత రుతువులో పశ్చిమ అలజడుల వల్ల కొద్దిపాటి వర్షపాతం మాత్రమే అక్కడ నమోదవుతాయి. అలాంటి శుష్క టిబెట్ ప్రాంతంలో నైరుతి తేమ గాలులు తాజాగా వానలు కురిపించాయి. నైరుతి రుతుపవనాల తేమగాలులు హిమాలయాల హద్దును దాటేసి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లద్దాఖ్ మీదుగా టిబెట్ ప్రాంతంలోకి ప్రవేశించినట్టు ఉపగ్రహ చిత్రం స్పష్టంగా చూపుతోందని వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీకి చెందిన గ్లేసియాలజిస్ట్ మనీష్ మెహతా చెప్పారు. ఇండియాకు ప్రత్యేక వరం.. రుతుపవనాలు! వేసవిలో సముద్ర జలాలు వేడెక్కి నీరు ఆవిరై బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుంచి బయలుదేరే తేమగాలులు నైరుతి రుతుపవనాల రూపంలో భారతదేశమంతటా విస్తరించి జూన్-సెప్టెంబరు నెలల్లో వర్షాలు కురిపిస్తాయి. వాటి ప్రయాణం ఉత్తరానికి వచ్చేటప్పటికి ఎదురుగా హిమాలయ పర్వత శ్రేణులు ఎత్తుగా, పెట్టని కోటలా అడ్డు నిలుస్తాయి. ఎత్తైన హిమాలయాలను దాటుకుని ముందుకు వెళ్లలేక నైరుతి రుతుపవనాలు తిరోగమిస్తాయి. తమలో మిగిలివుండే తేమతో హిమాలయ పర్వత శ్రేణుల నుంచి అవి వెనక్కు మరలుతాయి. తిరుగుపయనంలో ఈశాన్య రుతుపవనాల పేరిట అక్టోబరు, నవంబరు నెలల్లో వర్షిస్తూ మళ్లీ సముద్రం బాట పడతాయి. ప్రయాణంలో వర్షిస్తూ తేమను కోల్పోతూ ఉంటాయి కనుక... నైరుతితో పోలిస్తే మనకు ఈశాన్య రుతుపవనాల వర్షపాతం తక్కువ. రుతుపవన ప్రక్రియ భారతదేశానికి ప్రత్యేకం. దేశంలో సాగునీరు, తాగునీటికి రుతుపవనాలే ఆధారం. భూతాపం, వాతావరణ మార్పు, పశ్చిమ అలజడులు/కల్లోలాలుగా పిలిచే వాతావరణ ప్రక్రియల వల్ల నైరుతి రుతుపవనాలు టిబెట్ వైపు వెళ్లి ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. హిమాలయ పర్వతశ్రేణుల్లో ఎత్తు తక్కువ ఉండే దారుల గుండా నైరుతి తేమ గాలులు టిబెట్లోకి ప్రవేశించి ఉండొచ్చని అంటున్నారు. అయితే.. నైరుతి రుతుపవనాలు మున్ముందు ఇలాగే టిబెట్ చేరుతూ అక్కడ తరచూ వర్షాలు కురిపించడం ఆరంభిస్తే... హిమనీనదాల (గ్లేసియర్స్)లోని మంచు కరుగుదలలో, నదీ ప్రవాహాల తీరుతెన్నుల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. నైరుతి కాస్తా తుర్రుమని టిబెట్ పారిపోతే మనకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. భారతదేశంలో వర్షపాతం తగ్గుతుంది. వ్యవసాయం, ఆర్థిక రంగాలపై ప్రభావం పడుతుంది. తాగునీటికి కటకట తప్పదు. రుతుపవనాలనే నమ్ముకుని బతుకుతున్న దేశం మనది. ఏదో ఒక సీజన్లో రుతుపవనాలు ముఖం చాటేసినా తర్వాత సంవత్సరంలోనైనా మంచి వానలు పడకపోతాయా అని ఆశగా ఎదురుచూస్తారు రైతన్నలు. నైరుతి రుతుపవనాలు భౌగోళికంగా ‘హిమాలయ కంచె’ దూకి ప్రతి సీజన్లోనూ ఆవలి టిబెట్ వైపునకు పూర్తిగా మరలిపోయేట్టయితే... అవి ఇక తిరిగి వెనక్కు రావు! అప్పుడిక ఈశాన్య రుతుపవనాలు అనేవే ఉండవు!! ఒకవేళ కొంత భాగం తిరిగొచ్చినా ఆ తేమలేని, బలహీన పవనాలతో కురిసే వర్షాలు, కలిగే ప్రయోజనం నామమాత్రమే. భయపెట్టాలని కాదు గానీ... ఆ దుస్థితి రాకూడదనే ఆశిద్దాం. వాతావరణ మార్పు ప్రభావంతో ఎన్నో వింతలు చూస్తున్నాం. నిరుడు కురిసిన వర్షాలకు సహారా ఎడారి ఇసుక తిన్నెలు సరస్సులను తలపించిన సంగతి మరచిపోతే ఎలా?!(Source: Zee News)::జమ్ముల శ్రీకాంత్ -
ఆకాశ వీధిలో ఆర్భాటం చేసి.. పాతాళంలో వదిలేసి!
శ్రీశైలంటెంపుల్: ‘దట్టమైన నల్లమల అటవీ మధ్యలో ప్రవహించే కృష్ణమ్మ పరవళ్లపై ప్లేన్లో ప్రయాణించి మధురానుభూతి పొందే అవకాశం కల్పిస్తున్నాం. ఇందులో భాగంగా విజయవాడ నుంచి శ్రీశైలానికి సీ ప్లేన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా విజయవాడ నుంచి శ్రీశైలానికి తక్కువ సమయంలో వచ్చి స్వామిఅమ్మవార్లను దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నాం. ఏపీని టూరిజం హబ్గా మారుస్తాం’ అంటూ స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శ్రీశైలంలో సీ ప్లేన్ ట్రయరల్ రన్ వేళ అన్న మాటలు. ఇక సీన్ కట్ చేస్తే.. సీప్లేన్ ట్రయల్రన్ చేపట్టి ఇప్పటికి పది నెలలు గడుస్తోంది. ఇంకా సర్వేలు, సమీక్షలకే అధికారులు పరిమితమయ్యారు. ఇప్పటికీ డీపీఆర్ సిద్ధం కాకపోవడంతో సీప్లేన్ ప్రయాణం మరింత ఆలస్యమవుతుందని తెలుస్తోంది. సీఎం ప్రచార ఆర్భాటానికే సీప్లేన్ ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చి ట్రయల్రన్ చేసి వదిలేశారని, ఆచరణ చేసేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మల్లన్న భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం టూరిజం అభివృద్ధిలో భాగంగా శ్రీశైలానికి గతేడాది నవంబరు 9న సీప్లేన్ ట్రయల్రన్ చేపట్టారు. రాష్ట్ర సీఎం చంద్రబాబు, కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కె.రామ్మోహన్నాయుడు, టూరిజం శాఖ మంత్రి దుర్గేశ్ తదితరులు విజయవాడ పున్నమి ఘాట్ నుంచి సీప్లేన్లో శ్రీశైలం పాతాళగంగకు చేరుకున్నారు. సీప్లేన్ ప్రారంభమైతే విజయవాడ నుంచే కాకుండా హైదరాబాద్, బెంగ ళూర్ తదితర రాష్ట్రాల నుంచి సైతం సీప్లేన్ నడిపేందుకు అవకాశం ఉందని అప్పట్లో పాలకులు, పర్యాటక అధికారులు ప్రకటించారు. భక్తులు, పర్యాటకులు, ప్రభుత్వ ఉద్యోగులు, వారాంతపు సెలవులు ఉంటే ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు తమ సమయాన్ని వృథా చేసుకోకుండా సీప్లేన్ ద్వారా త్వరగా వచ్చి స్వామిఅమ్మవార్లను దర్శించుకుని త్వరగా వెళ్లే అవకాశం ఉండేదని భావించారు. అయితే పది నెలలుగా గడుస్తున్నా ట్రయల్ రన్కు పరిమితం కావడంతో కూటమి ప్రభుత్వానికి ప్రారంభంలో హడావుడి చేయడం, ఆ తర్వాత వదిలేయడం సర్వ సాధారణమేనని పలువురు విమర్శిస్తున్నారు. ఇరిగేషన్, అటవీశాఖ అనుమతులు లభించేనా..?సీప్లేన్ నిర్వహించే ప్రదేశంలో శ్రీశైలం పూర్తిగా నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో ఉంది. ఇది పూర్తిగా వన్యప్రాణులు, చిరుతలు, పెద్దపులులు అవాసానికి అనువైన ప్రదేశం. ఇక్కడ సీప్లేన్ సేవలు నిర్వహించాలంటే అటవీశాఖ అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. అలాగే సీప్లేన్ టేక్ ఆఫ్, ల్యాండింగ్కు డ్యామ్ పరిధిలో ఉండటంతో ఇరిగేషన్ శాఖ అధికారుల అనుమతి కూడా తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది. అలాగే ఏవియేషన్, ఇతర శాఖల అనుమతులు తప్పనిసరి. కూటమి ప్రభుత్వం విజయవాడ టూ శ్రీశైలం సీ ప్లేన్ నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించి త్వరితగతిన అనుమతులు అన్ని తీసుకుని సేవలను అందుబాటులోకి తేవాలని పలువురు పర్యాటకులు కోరుతున్నారు. సర్వేలు, సమీక్షలకే పరిమితంవిజయవాడ నుంచి శ్రీశైలానికి వచ్చే సీప్లేన్ ప్రయాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఐడీసీ) అధికారులు డిటేల్డ్ ప్రాజెక్టు రిపొర్టు తయారు చేస్తున్నారు. శ్రీశైలంతో పాటు అరకు, లంబసింగి, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, గండికోట, నర్సాపూర్, తిరుపతి, ప్రకాశం బ్యారేజ్ మొత్తం 10 ప్రదేశాలలో టూరిజం పరంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం డీపీఆర్ సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. ఈ ప్రాజెక్టు రిపోర్టు తయారీకి నాలుగు నెలల క్రితం ఓ ప్రైవేట్ కన్పల్టెన్సీకి నియమించారు. వారు మే నెల నుంచి డీపీఆర్ తయారు చేసేందుకు పనులు ప్రారంభించారు. ఏపీఐడీసీ అధికారులు వారానికి ఒకసారి సర్వేలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. డీపీఆర్లో సీప్లేన్ ల్యాండ్ అయ్యే ప్రదేశం, సీప్లేన్ టేక్ఆఫ్, టేక్ ఆన్కు నీటిలో సుమారు 1.16 కిలోమీటర్ల పోడవు, 120 మీటర్ల వెడల్పు ఉండే ప్రదేశం, పర్యాటకులు సీప్లేన్ ఎక్కేందుకు, దిగేందుకు నీటిపై ప్రత్యేక జెట్టీల ఏర్పాటు, టికెట్టు ధరలు, ఎన్ని ప్లేన్ సర్వీసులను తిప్పాలి, రోజుకు ఎన్ని ట్రిప్పులు, సీప్లేన్ ల్యాండింగ్ వద్ద పర్యాటకులకు విశ్రాంతి తీసుకునేందుకు గదులు, టికెట్టు కౌంటర్, సిబ్బంది తదితర పూర్తి వివరాలను డీపీఆర్లో పొందుపరుచనున్నారు. వచ్చే జనవరి నాటికి డీపీఆర్ పూర్తి చేయాలని కన్సల్టెన్సీకి ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. -
పండ్లు, పూలు.. ఫైను.. జైలు!
డిక్లరేషన్స్ ఇవ్వకుండా.. కొప్పులో మల్లెపూలు పెట్టుకున్నందుకు మెల్బోర్న్ విమానాశ్రయ ఇమిగ్రేషన్స్ అధికారులు నవ్య నాయర్ అనే మలయాళ నటికి రూ.1.14 లక్షల జరిమానా విధించారు. ఈమెకు ఎదురైన చేదు అనుభవం చాలామందిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అవును, విదేశాల్లో ఇలాంటి చిత్రవిచిత్రమైన నిషేధాలు చాలా ఉన్నాయి.ప్రయాణం అంటేనే వెంట తీసుకెళ్లే వస్తువులతో బ్యాగులు నిండాల్సిందే. మౌత్ ఫ్రెషనర్, పెర్ఫ్యూమ్ వంటి రోజూ వాడే వస్తువులు అయినా.. బంధువులు, స్నేహితులకు ఇచ్చే పిండివంటలు, బహుమతులైనా.. బాధ్యత, ప్రేమతో సూట్కేస్ బరువెక్కాల్సిందే. మనతోని అట్లుంటది మరి. మన దేశంలో అయితే ఫర్వాలేదు. పరాయి దేశం వెళితేనే సమస్య. ఎందుకంటే మనదగ్గరిలా ఏదిపడితే అది విదేశాలకు తీసుకెళతామంటే అక్కడి నిబంధనలు ఒప్పుకోవు. ఆస్ట్రేలియాలో ఇటీవలే జరిగిన నటి నవ్య నాయర్ ఘటనే ఇందుకు ఉదాహరణ. న్యూజిలాండ్లోని ఆక్లాండ్ విమానాశ్రయంలో 2002లో జరిగిన సంఘటన సైతం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, హర్భజన్స్ సింగ్ చెరి 200 న్యూజిలాండ్ డాలర్ల జరిమానా కట్టాల్సి వచ్చింది. వాళ్లు బ్యాగుల్లో తీసుకొచ్చిన బూట్లకు మట్టి, గడ్డి ఉండడమే ఇందుకు కారణం. వేడి చేయని పాలను కెనడా, ఆస్ట్రేలియా, అమెరికాలోని కొన్ని ప్రాంతాలకు తీసుకెళ్లకూడదు. గ్రీసులోని ప్రాచీన పర్యాటక ప్రదేశాలకు హైహీల్స్తో వెళ్లడం నిషిద్ధం. ఇలాంటివి మరికొన్ని..ఆస్ట్రేలియా: బయో సెక్యూరిటీ, కస్టమ్ చట్టాల ప్రకారం తాజా పూలు, పండ్లు, కూరగాయలు, మట్టిని తీసుకెళ్లడానికి వీల్లేదు. ఎందుకంటే ఇబ్బడిముబ్బడిగా వీటిని నాటితే అక్కడి పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుందన్నది వారి వాదన. సోన్పాపిడి, మైసూర్ పాక్ వంటి స్వీట్లు, మసాలా దినుసులు, పాల ఉత్పత్తులు కూడా నిషేధమే. ఈ జాబితాలో ఇంకా చాలా ఉన్నాయి.ఆగ్నేయాసియా: ఘాటైన వాసన వచ్చే డ్యూరియన్స్ (పనసలాంటి) పండును ప్రయాణంలో తీసుకెళ్లడాన్ని చాలా విమానయాన సంస్థలు నిషేధించాయి. ముఖ్యంగా కోసిన పండును తీసుకెళ్లరాదు. దీన్ని భారత్కు తీసుకురావాలంటే సరైన పద్ధతిలో ప్యాక్ చేయాలి. సింగపూర్లో చూయింగ్ గమ్ అమ్మకం, దిగుమతి నిషేధం. బహిరంగ ప్రదేశాల్లో గమ్స్ను ఉమ్మితే భారీ జరిమానా విధిస్తారు. మెడికల్ గమ్స్ను మాత్రమే అనుమతిస్తారు.దక్షిణ కొరియా: అమెరికాకు చెందిన ట్రేడర్ జో కంపెనీ తయారీ ‘ఎవిరీథింగ్ బట్ ది బేగల్ సీజనింగ్’ బ్రాండ్ మసాలాలను విమాన ప్రయాణికుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ మసాలాల్లో గసగసాలు ఉండడమే ఇందుకు కారణం. ఆ దేశం గసగసాలను మాదక ద్రవ్యాలుగా పరిగణిస్తుందట. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, సింగపూర్లలోనూ గసగసాలపై బ్యాన్ ఉంది. కరేబియన్స్ దీవులు: సైనికులు ధరించే దుస్తుల (క్యామఫ్లాజ్) వంటివి సాధారణ పౌరులు వేసుకోవడం చట్టవిరుద్ధం. సైన్యం మాత్రమే ధరించాలి. సైనికులుగా పొరపడే ప్రమాదం ఉంది కాబట్టి సాధారణ వ్యక్తులు ఈ దుస్తులతో విమానాశ్రయాల్లో కూడా కనిపించకూడదు. అలా చేస్తే జరిమానా వేస్తారు లేదా జైలుకు పంపుతారు. యూఎస్: ప్రపంచవ్యాప్తంగా పిల్లలు అమితంగా ఇష్టపడే కిండర్ సర్ప్రైజ్ ఎగ్స్ (కిండర్జాయ్)ను విమానంలో తీసుకురావడం నిషేధం. గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది కాబట్టి పిల్లలకు సంబంధించిన ఆహార ఉత్పత్తుల్లో తినడానికి వీలుకాని వస్తువులను ఉంచకూడదు.న్యూజిలాండ్: పచ్చళ్లు, మాంసం, విత్తనాలు, విదేశీ మట్టి నిషేధం. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో భాగంగా సరిహద్దు నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. ఇటలీ: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఫ్లిప్–ఫ్లాప్స్ లేదా శబ్దం వచ్చే బూట్లు వేసుకోకూడదన్న నిబంధన ఉంది. శబ్దం వస్తే స్థానికులకు చికాకు కలుగుతుందట.కెనడా: ఈ దేశంలో బేబీ వాకర్ నిషేధం. పిల్లలకు ఇందులో గాయాలవుతున్నాయని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కెనడా వీటిని తమ దేశంలో నిషేధించింది.ఉత్తర కొరియా : ఎంతో ఇష్టమని ఈ దేశానికి బ్లూజీన్స్తో వెళ్లేరు.. ఫైన్ కట్టాలి లేదా జైలుకు కూడా వెళ్లాల్సి రావొచ్చు. పాశ్చాత్య సంస్కృతికి ఇవి చిహ్నమని, ఇవి తమ సంస్కృతిని పాడుచేస్తాయని వీటిపై బ్యాన్ విధించారట. -
బాల్యమూ.. భారమే!
పిల్లల్లో ఊబకాయ సమస్య ప్రపంచానికి పెద్ద ఆరోగ్య సంక్షోభంలా పరిణమించబోతోందని యునిసెఫ్ తాజా నివేదిక హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా బాలల్లో 10 శాతం మంది ఊబకాయంతో ఉన్నట్లు నివేదిక తెలిపింది. ప్రతి పది మంది పిల్లల్లో ఒకరికి ఊబకాయం ఉంటోందని పేర్కొంది. సాంప్రదాయ ఆహారాలు, ఇతర పోషక పదార్థాలకు బదులుగా పిల్లలు అధిక కేలరీలున్న, ప్రాసెస్డ్ ఫుడ్కు అలవాటు పడటమే ఇందుకు కారణం అని చెబుతూ, ఈ అలవాట్లు పిల్లలకు దీర్ఘకాలిక అనారోగ్యాలను తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.‘తగినంత ఆహారం లేక గతంలో పిల్లలు తరచూ బరువు తక్కువగా ఉండేవారు. అది వారి శారీరక పెరుగుదలను కుంగదీయడమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలకూ దారితీసింది. అయితే, తాజా పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. జంక్ఫుడ్ను తినకుండా ఉండలేక పిల్లలు బరువెక్కుతున్నారు’ అని యునిసెఫ్ తన నివేదికలో వ్యాఖ్యానించింది. ఇదీ పోషకాహార లోపమే!నేటి పిల్లల్లో ఊబకాయం అన్నది, మునుపటి దశాబ్దాల నాటి పోషకాహార లోపం కంటే వేగంగా పెరుగుతోందని, ఊబకాయం ఉన్న పిల్లల సంఖ్య.. బరువు తక్కువగా ఉన్నవారిని మించిపోయిందని నివేదిక తెలిపింది. బాల్యంలోని ఈ ఊబకాయం ఇప్పుడు పోషకాహార ‘లోపానికి’ వేరొక రూపంగా భావించవచ్చని పేర్కొంది.యునిసెఫ్, ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 5 నుంచి 19 సంవత్సరాల వయసు గల పిల్లల్లో 18 కోట్ల 80 లక్షల మంది పిల్లలు ఊబకాయుల కేటగిరీలో ఉన్నారు! ఈ వయసులో బరువు తక్కువగా ఉన్న పిల్లల శాతం 2000లో 13 నుంచి నేడు 9.2 శాతానికి తగ్గింది. అదే సమయంలో ఊబకాయం 3 శాతం నుంచి 9.4 శాతానికి పెరిగింది.ఎక్కడ ఎక్కువగా ఉన్నారు?యునిసెఫ్ నివేదిక ప్రకారం పసిఫిక్ దీవులలోని పిల్లల్లో ఊబకాయం ఎక్కువగా ఉంది. దీవి దేశాలైన నియులో 38 శాతం, కుక్ దీవులలో 37 శాతం, నౌరు దీవులలో 33 శాతం బాల ఊబకాయులు ఉన్నారు. ప్రపంచంలో మొత్తం బాల్య, కౌమార దశల్లో ఉన్న వారిలో 42.7 కోట్ల మంది అధిక బరువు సమస్యతో ఉంటే వారిలో.. దాదాపు సగం మంది తూర్పు ఆసియా, పసిఫిక్, లాటిన్ అమెరికా, కరీబియన్, దక్షిణాసియాలలోనే ఉన్నారు.అలవాటుగా అధిక ఆహారంప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో కనిపిస్తున్న ఈ ఊబకాయానికి ప్రధాన కారణం.. చవకైన, మితిమీరి ప్రాసెస్ చేసిన, దిగుమతి చేసుకుంటున్న అధిక కేలరీల ఆహార పదార్థాల వినియోగం పెరగడమేనని నివేదిక గుర్తించింది. సాంప్రదాయ ఆహారాలు, ఇతర పోషక పదార్థాలకు బదులుగా పిల్లలు అధిక కేలరీలున్న, ప్రాసెస్డ్ ఫుడ్కు అలవాటు పడుతున్నారని తెలిపింది. అల్ట్రా–ప్రాసెస్డ్ ఆహారంలో ఉండే చక్కెర, ఉప్పు, కొవ్వు వంటివి చిన్నారుల ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నాయని పేర్కొంది.పేద దేశాల్లోనూ ఊబకాయంసాధారణంగా అధిక ఆదాయ దేశాలలో పిల్లలు ఊబకాయంతో ఉంటారని ఒకప్పుడు భావించేవారు. అయితే, యునిసెఫ్ తాజా నివేదిక ఈ భావనను పటాపంచలు చేసింది. పాఠశాలకు వెళ్లే పిల్లల్లో చిలీలో 27 శాతం మంది, యూఎస్ఏ, యూఏఈలలో 21 శాతం మంది ఊబకాయంతో ఉండటాన్ని బట్టి పిల్లల్లోని ఈ ఊబకాయం దిగువ, మధ్య ఆదాయ దేశాలకే పరిమితం కాలేదని నివేదిక గుర్తించింది.ప్రకటనలు ప్రేరేపిస్తున్నాయిపిల్లల్లో ఊబకాయం పెరగడంలో వ్యాపార ప్రకటనలు కీలక పాత్ర పోషిస్తున్నాయని నివేదిక తెలిపింది. తాజా సర్వేలో, గతవారం 13 నుంచి 24 సంవత్సరాల వయసు గల 75 శాతం మంది పిల్లలు, యువకులు జంక్ ఫుడ్ ప్రకటనలను చూసినట్లు వెల్లడైంది. వారిలో 60 శాతం మంది ఈ ప్రకటనలు చూశాక తమలో వాటిని తినాలన్న కోరిక కలిగిందని తెలిపారు. ఘర్షణలు, యుద్ధ వాతావరణం ఉండే ప్రాంతాల్లోనూ 68 శాతం యువత ఇప్పటికీ అలాంటి మార్కెటింగ్ వ్యూహాలకు ప్రభావితం అవుతున్నట్లు నివేదిక పేర్కొంది.ఆర్థిక ముప్పు!ఈ ఊబకాయం ముప్పును తప్పించటానికి తక్షణ చర్యలు తీసుకోకపోతే, ప్రభుత్వాలు దీర్ఘకాలిక పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని యునిసెఫ్ హెచ్చరించింది. 2035 నాటికి, ఊబకాయం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడే భారం రూ.353 లక్షల కోట్లకు చేరుతుందని యునిసెఫ్ అంచనా వేసింది. పర్యవసానంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు, ఉత్పాదక రంగం అన్నీ దెబ్బతింటాయని హెచ్చరించింది. -
వెరవని వ్యక్తిత్వం
సంక్షుభిత సమయంలో ఒక జాతి తమను నడిపే నేతగా ఒక స్త్రీ వైపు చూడటం అరుదు. నేపాల్లో ఇప్పుడు అక్కడి యువత అలాంటి ఒక స్త్రీ వైపు చూస్తోంది. అక్కడ ఏర్పడబోతున్న ఆపద్ధర్మ ప్రభుత్వానికి అధినేతగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి ఉంటే బాగుంటుందని ఆశిస్తోంది. ఆమె ఆర్మీ చీఫ్ను కలిశారు కూడా! భారతదేశంలో చదువుకుని, టీచర్ స్థాయి నుంచి సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి వరకూ ఎదిగిన సుశీలా కర్కీది వెరవని వ్యక్తిత్వం. ఆమె రచయిత కూడా. వివరాలు...‘ఇండియా– నేపాల్ దేశాల మధ్య అనుబంధం ఈనాటిది కాదు. దశాబ్దాలది. ప్రభుత్వాలు వాటి వాటి విధానాల వల్ల పని చేస్తుండొచ్చు. కాని ఇరుదేశాల ప్రజలు ఏనాటి నుంచో స్నేహంగా ఉన్నారు. ప్రధాని మోదీపై నాకు మంచి అభి్రపాయం ఉంది. మా స్నేహితులు, బంధువులు ఎందరో ఇండియాలో ఉన్నారు. మావారు ఎక్కువ కాలం ఇండియాలోనే గడిపారు. భారతీయులు నేపాలీలను ఆదరిస్తూనే ఉన్నారు’ అన్నారు సుశీలా కర్కి.73 ఏళ్ల ఈ మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేపాల్లో ఏర్పడనున్న ఆపద్ధర్మ ప్రభుత్వానికి ప్రధాని అయ్యే అవకాశాలు ఖరారయ్యాయి. నేపాల్లో ఉద్యమం కొనసాగిస్తున్న జెన్ జి విద్యార్థుల బృందం తాజా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సుశీలా కర్కి మా ఎంపిక అని తేల్చి చెప్పింది. సుశీలా కర్కి తన సోషల్ మీడియా అకౌంట్లో ‘దేశ పరిస్థితుల రీత్యా నాకు అప్పజెప్పే బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను’ అని తెలియచేశారు.‘నేను బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్నాను. మా హాస్టల్ నుంచి నిత్యం పారే గంగను చూసే దాన్ని. ఎండాకాలం హాస్టల్ టెర్రస్ మీద పడుకునేవారం. ఉదయాన్నే గంగను చూసేవారం. అక్కడ నాతో పాటు చదువుకున్న విద్యార్థులు, పాఠాలు చెప్పిన గురువులు ఇంకా స్పష్టంగా గుర్తున్నారు’ అన్నారామె. ‘మా ఊరు విరాట్నగర్ నుంచి భారత్ సరిహద్దు 25 మైళ్లు ఉంటుంది. మేము తరచూ బోర్డర్ మార్కెట్కు వెళ్లేవాళ్లం. నాకు హిందీ వచ్చు’ అని తెలిపారామె.ప్రభుత్వంలో అవినీతి, మంత్రుల పట్ల వ్యతిరేకత, నయా సంపన్నుల వైఖరి, సోషల్ మీడియాపై నిర్బంధం... వీటన్నింటి దరిమిలా నేపాల్లో యువతరం తెచ్చిన తిరుగుబాటు వల్ల నాయకత్వ మార్పు స్పష్టమైంది. సుశీలా కర్కి ఆపద్ధర్మ ప్రధాని అయితే త్వరలో ఎన్నికలు నిర్వహించి ప్రభుత్వ ఏర్పాటు చేయించి తప్పుకోవడమే ఆమె ప్రధాన బాధ్యత. ఆ బాధ్యతకు ఆమె సమర్థురాలని యువత భావిస్తోంది.టీచర్గా మొదలైసుశీలా కర్కి నేపాల్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని నిర్వహించిన ఏకైక మహిళగా ఆ దేశవాసుల్లో గుర్తింపు, గౌరవం పొందారు. జూన్ 7, 1952న నేపాల్లోని శంకర్పూర్కు చెందిన ఓ కుటుంబంలో పుట్టిన కర్కి ఏడుగురు పిల్లలలో మొదటి సంతానం. 1972లో బిరాట్నగర్లోని మహేంద్ర మొరాంగ్ క్యాంపస్ నుండి బీఏ డిగ్రీ చేసి మన బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి రాజకీయ శాస్త్రం చదివారు. అక్కడ చదువుతున్న సమయంలోనే నేపాలీ కాంగ్రెస్ సభ్యుడు, యువజన విభాగ నాయకుడు దుర్గా ప్రసాద్ సుబేదిని కలుసుకున్నారు. అనంతరం వారిద్దరూ వివాహం చేసుకున్నారు. 1979లో కార్కి బిరాట్నగర్లో లాయర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 1985లో ధరణ్లోని మహేంద్ర మల్టిపుల్ క్యాంపస్లో అసిస్టెంట్ టీచర్గా పనిచేశారు. 2007లో సీనియర్ అడ్వకేట్గా 2009లో ఆ దేశ సుప్రీంకోర్టులో అడ్–హాక్ జస్టిస్గా నియమితులయ్యారు. నవంబర్ 18, 2010న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 ఏప్రిల్ నుండి 2016 జూలై వరకు నేపాల్ సుప్రీంకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, 2017 జూన్ వరకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.రచయితగా...కర్కి 2018లో ‘న్యాయ’ పేరుతో తన ఆత్మకథ రాశారు. 2019 డిసెంబర్లో ‘కారా’ అనే నవల ప్రచురించారు. నేపాల్లో 1960 నుంచి 90ల మధ్యకాలంలో రాజు కనుసన్నల్లో సాగిన ‘పంచాయత్’ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రజల అనుభవాలను ఆమె తన రచనల్లో ఉటంకించారు. ఆపద్ధర్మ అధినేతగా తన ఎంపిక జరిగితే శాంతి నెలకొల్పడం, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు భరోసా ఇవ్వడం తన తొలి ప్రాధాన్యం అని ఆమె అన్నారు.సుశీలా కర్కిది వెరవని వ్యక్తిత్వం అని అందరూ అంటారు. ఆమె న్యాయనిపుణత, అవినీతి రహిత నేపథ్యం చాలా కేసుల్లో కీలకమైన తీర్పులు ఇచ్చేలా చేసింది. ఒక అవినీతి కేసులో మంత్రిని జైలుకు పంపించడానికి సైతం ఆమె వెనుకాడలేదు. ఇవన్నీ ఆమెకు సానుకూలంగా మారాయని చర్చ సాగుతోంది. ఆ పేరు బయటకు వచ్చాక నేపాల్లో ముఖ్యంగా ఖాట్మండులో శాంతి నెలకొనడం ఆమె మాటకు విలువ ఉంటుందనడానికి ఉదాహరణ.గమనిక: ఈ కథనం రాసే సమయానికి సుశీలా కర్కితోపాటు మరికొన్ని పేర్లు కూడా ఆపద్ధర్మ ప్రధాని పదవికి పరిశీలనలోకి వచ్చాయి. -
రోజుకు 54,794 పిడుగులు!
వర్షం పడుతోందంటే మెరుపులు, పిడుగులు పడడం సహజం. పిడుగు శబ్దం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కిలోమీటర్ల దూరంలో పడ్డా మన పక్కనే పడినట్టు ఉంటుంది. 2024–25లో ఇలా మనదేశంలో ఎన్ని పిడుగులు పడ్డాయో తెలుసా? 2 కోట్లకుపైగానే! అంటే రోజుకు సగటున 54,794! 2025–26లో జూలై 30 నాటికి దేశ వ్యాప్తంగా పిడుగుల వల్ల 1,626 మంది మనుషులు, 52,367 మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయి.ఒక డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగితే తేమ 7 శాతం పెరుగుతుంది. ఫలితంగా పిడుగులు 10–12 శాతం పెరుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. భారత్లో వేసవికాలంలో భానుడి ప్రతాపం, అలాగే అరేబియా సముద్రం, బంగాళాఖాతం వేడెక్కడం వంటివి కూడా పిడుగులకు అనువైన పరిస్థితులు సృష్టిస్తున్నాయి. బంగాళాఖాతం సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలు పెరిగిందని, తూర్పు రాష్ట్రాల్లో తుపాన్లకు కారణమయ్యే తేమకు ఆజ్యం పోస్తున్నాయని క్లైమేట్ రెసీలియెంట్ అబ్జర్వింగ్ సిస్టమ్స్ ప్రమోషన్ కౌన్సిల్ (సీఆర్ఓపీసీ) వ్యవస్థాపకులు సంజయ్ శ్రీవాస్తవ వెల్లడించారు. పర్యావరణ విపత్తుల వల్ల కలిగే నష్టాలను తగ్గించేందుకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ ఇది.46 శాతం పిడుగుపాటు మరణాలే!ఈ ఏడాది ఏప్రిల్–జూలై మధ్య వర్షాలు, పిడుగుల కారణంగా దేశవ్యాప్తంగా 1,626 మంది మరణించారని కేంద్ర హోంశాఖ ఇటీవల రాజ్యసభలో వెల్లడించింది. 1967 నుంచి 2020 వరకు పిడుగుపాటుతో భారత్లో 1,01,000 మంది మరణించారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్ సీఆర్బీ) డేటా చెబుతోంది. 2002–24 మధ్య దేశంలో వాతావరణ సంబంధ మరణాలలో దాదాపు 46 శాతం పిడుగుల వల్ల సంభవించాయని ఎన్సీఆర్బీ తెలిపింది. ఐఎండీ, సీఆర్ఓపీసీ ప్రకారం 2019–20లో 51.7 లక్షల పిడుగుపాటు సంఘటనలు నమోదయ్యాయి. 2024–25లో ఈ సంఖ్య 2 కోట్లకుపైగా పెరిగింది.ముందస్తు హెచ్చరికలుఐఎండీ ప్రస్తుతం 86 శాతం కచ్చితత్వంతో పిడుగులను అంచనా వేస్తోంది. పిడుగులు పడే అవకాశం ఉందని అయిదు రోజుల ముందే హెచ్చరిస్తోంది. జిల్లాల పేర్లను రెండు రోజుల ముందుగా వెల్లడిస్తోంది. ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నరోజున ప్రభావిత ప్రాంతాల వివరాలతో ప్రతి మూడు గంటలకు హెచ్చరికలు జారీ చేస్తోంది. ఐఎండీ, ఐఐటీ మద్రాస్ భాగస్వామ్యంతో పిడుగులు అధికంగా పడే ప్రాంతాలను సీఆర్ఓపీసీ గుర్తించింది. ముప్పు నివారణ ప్రణాళికలో భాగంగా దామినీ యాప్, వాట్సాప్ గ్రూప్స్ ద్వారా పంచాయతీ నియమించిన భద్రతా సమన్వయకర్తలకు రియల్–టైమ్ హెచ్చరికలను పంపుతున్నారు. జాతీయ పిడుగుపాటు నష్టనివారణ కార్యక్రమం కింద హెచ్చరికల కోసం మైక్రోఫోన్స్, సీసీటీవీ కెమెరాలు, లౌడ్స్పీకర్లతో కూడిన స్మార్ట్ స్తంభాలను గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. తాటి చెట్లను నాటడం మొదలు అనేక అవగాహన ప్రచారాలు కూడా చేపట్టారు. పట్టణ ప్రాంతాల్లోనూ..నగరవాసులు కమ్యూనికేషన్ సిస్టమ్స్ వంటి విద్యుదయస్కాంత మౌలిక సదుపాయాలను ఎక్కువగా వాడుతున్నారని ఇది పిడుగు ప్రమాదాన్ని పెంచుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహపాత్ర చెబుతున్నారు. కాంక్రీట్, తారు, గాజు వంటివి వేడిని గ్రహించి, ప్రసరింపజేయడం వల్ల కలిగే ఉష్ణ ప్రభావం నగరాలను గ్రామీణ ప్రాంతాల కంటే వేడిగా మారుస్తోందట. ఈ పరిస్థితులు పిడుగుపాట్లకు దారితీస్తున్నాయట.విమానయాన సంస్థలకు..వర్షాకాలంలో పిడుగుపాట్ల వల్ల ఏటా దాదాపు 2,000 విమానాలను దారి మళ్లిస్తున్నారు. దీనివల్ల విమానయాన సంస్థలకు ఏటా సుమారు రూ.300 కోట్ల నష్టం వాటిల్లుతోందట. -
యూత్ కు 'రెస్ట్' రూమ్
సాక్షి, స్పెషల్ డెస్క్: ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు జీవితంలో ప్రతి ఒక్కరికీ వారివారి స్థాయిలను బట్టి ఒత్తిడి అనేది అనివార్యం అయిపోయింది. సాధారణంగా ఒత్తిడిని జయించేందుకు యోగా, క్రీడలు, సంగీతం, నలుగురితో ముచ్చటించడం, షాపింగ్ థెరపీ వంటివి చేస్తుంటారు. కానీ జెన్ –జీ.. అంటే 13–28 ఏళ్ల వయసున్న యువతలో మాత్రం చాలామంది వీటన్నిటికీ భిన్నంగా ‘బాత్రూమ్ క్యాంపింగ్’ని ఆశ్రయిస్తున్నారు.టెంట్, చలి మంటలు, నక్షత్రాలతో మెరిసే ఆకాశం, షాపింగ్.. ఇవేవీ కావు. జస్ట్ తెల్లటి టైల్స్ పరిచిన నాలుగు గోడల మధ్య ‘రెస్ట్రూమ్స్’లో జెన్ –జీ సేదతీరుతోంది. శారీరక అవసరాల కోసం కాకుండా మానసిక ప్రశాంతతకు బాత్రూమ్లో ఎక్కువసేపు గడుపుతున్నారు. శబ్దాలు, జనంతో కిటకిటలాడే ప్రదేశాలకు దూరంగా ప్రశాంతంగా ఉండటానికి, సంగీతం వినడానికి మూసి ఉంచిన కమోడ్పై కూర్చుని మనసుని తేలికపర్చుకుంటున్నారు. ఒత్తిడి, ఆందోళన, బాధ, ఓటమి సమయంలోనే కాదు.. సమస్యల నుంచి బయటపడే మార్గాల అన్వేషణ, కొత్త ఆలోచనల కోసమూ అటువైపే అడుగులు పడుతున్నాయి. ఇల్లు, ఆఫీస్ లేదా ఏదైనా పార్టీలో ఉన్నా.. ఒత్తిడికి గురైనప్పుడు, మనసు బాధగా ఉన్నప్పుడు బాత్రూమ్ను ఆశ్రయిస్తున్నారు. దీన్నే ఇప్పుడు ‘బాత్రూమ్ క్యాంపింగ్’ అంటున్నారు.ప్రపంచానికి దూరంగా..‘నా బాధ, ఒత్తిడి నలుగురికి తెలియాల్సిన అవసరం లేదు. అవి వారికి అక్కరలేదు.అందరికీ కనపడేలా కూర్చుని బాధపడుతుంటే ఈ సమాజం వేలెత్తి చూపుతుంది. అలా కాకుండా బాత్రూమ్లో అయితే ఎవ్వరికీ తెలీదు. ఏకాంతం, నిశ్శబ్దంతో కూడిన ప్రశాంత వాతావరణమూ ఉంటుంది. మనల్ని జడ్జ్ చేసే అవకాశంఇంకొకరికి ఉండదు’అంటోంది జెన్ జీ.బాత్రూమ్ క్యాంపింగ్ ఎందుకంటే?ఒత్తిడిఆందోళనకోపంబాధఓటమిసమస్యకు పరిష్కారంకొత్త ఆలోచనలువీటిని ట్రై చేయండిఒత్తిడి నుంచి ఉపశమనానికి బాత్రూమ్ను ఒక సౌలభ్యమైన స్థలంగాఈ తరం వాళ్లు భావిస్తూ ఉండవచ్చు. కానీ బాత్రూమ్ అంటే రోగకారక క్రిములకు అడ్డా అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆందోళనను నియంత్రించడానికి ఇతర ఆరోగ్యకరమార్గాలూ ఉన్నాయని వారు సూచిస్తున్నారు.ప్రాణాయామం: శ్వాస ఆధారిత ప్రాణాయామ ప్రక్రియలను నిపుణుల ద్వారా తెలుసుకుని రోజూ చేయడం వల్ల ఒత్తిడి తగ్గి, మెదడు చురుగ్గా పనిచేస్తుందనిప్రపంచ వ్యాప్తంగా అనేకఅధ్యయనాలు చెబుతున్నాయి. ప్రకృతి ఒడిలో: ప్రకృతిని మించిన వైద్యుడు లేడు. పార్కులు, మైదానాల్లో గడ్డిని తాకడం, గడ్డిపై పడుకోవడం, సుందర ప్రకృతిదృశ్యాలను ఆస్వాదించడం.. ఇవన్నీ మనసును ఆహ్లాదపరిచేవే. సంగీతం,పజిల్స్: నచ్చిన సంగీతాన్ని వినొచ్చు. మెదడుకు పని కల్పించే పజిల్స్ చేయొచ్చు. ఆఫీసుల్లో: గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోకుండా.. ప్రతీ అరగంట లేదా గంటకు చిన్న విరామం తీసుకోవాలి. ఒత్తిడి అనిపిస్తే.. తేలికపాటి ప్రాణాయామాలు చేయాలి. మీ డెస్క్ వద్ద సరైనభంగిమలో కూర్చునేలా చూసుకోండి.నో సెల్ఫోన్: అలసిపోయినట్టు అనిపించినా.. పని ఎక్కువైనట్టు అనుకున్నా వెంటనే చేతులు ఫోన్ మీదకు వెళ్లిపోతుంటాయి. అలా వెళ్లి.. ఎన్ని ఫేస్బుక్ పోస్టులు చూస్తామో / పెడతారో, ఎన్ని రీల్స్ చూస్తారో తెలీదు. అన్నీ మనకు నచ్చినవే ఉండాలని లేదుగా. నచ్చనివి కనిపిస్తే మరింత కోపం, ఒత్తిడి. అందువల్ల ఆందోళన ఉండే సమయాల్లో సెల్ఫోన్ను (మ్యూజిక్ వినేటప్పుడు తప్ప) పక్కన పెట్టేయండి.సమయానికి తిండి, నిద్ర» సమయానికి ఆహారం తీసుకోవాలి. ఎంత పనిలో ఉన్నా, ఒత్తిడి ఉన్నా.. తినే టైమ్ను మాత్రం వాయిదా వేయొద్దు. అది మరింత ఒత్తిడి,ఆందోళనకు దారితీస్తుంది.» తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషకాలూఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా పోషకాహార నిపుణులు సూచించే.. ఒత్తిడి తగ్గించే ఆహార పదార్థాలు తీసుకోవాలి.» రాత్రుళ్లు సమయానికి, వేగంగా నిద్రపోవడం.. తెల్లవారుజామున లేవడం దినచర్యగా పెట్టుకోండి. రాత్రిపూట ఫోన్ లేదా టీవీల్లో సినిమాలు చూడటం సరదాగానేఉంటుంది గానీ.. దాని ప్రభావం మరుసటి రోజంతా పడుతుంది.పని.. ఒత్తిడి కాదు!జెన్–జీలో చాలామంది పనిని ఒత్తిడిగా భావిస్తుంటారు. ఆ మానసిక స్వభావాన్ని ముందు పూర్తిగా మార్చుకోవాలి. కెరీర్లో ఎదగాలన్న మనస్తత్వాన్ని పెంపొందించుకుంటే పనిపట్ల ప్రేమ, నిబద్ధత వాటంతట అవే పెరుగుతాయి. పనిలో లేదా కెరీర్లో వచ్చే సవాళ్లను భవిష్యత్తుకు మెట్లుగా చూడాలి తప్ప.. వాటిని ఒత్తిడిగా భావించినంత కాలం ఎదుగుదల ఉండదు అని గ్రహించాలి. -
కొనసాగుతున్న యూరియా కష్టాలు
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్క బస్తా యూరియా దొరికినా మహాభాగ్యం అనుకుంటూ రాత్రి, పగలు క్యూలైన్లలో అన్నదాతలు నిరీక్షిస్తున్నారు. కొన్నిచోట్ల ఓపిక నశించి ఆందోళనలకు దిగుతున్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలోని రైతు వేదిక ఎదుట బుధవారం యూరియా టోకెన్ల కోసం రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కొందరు రైతు వేదికలోకి చొచ్చుకెళ్లి ఫరి్నచర్ ధ్వంసం చేశారు.హనుమకొండ జిల్లా పరకాలలో టోకెన్లు ఇచ్చి యూరియా పంపిణీ చేయకపోవడంతో వ్యవసాయ మార్కెట్ ఎదుట ఆందోళన చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా(కె)లో రైతులు బుధవారం యూరియా కోసం భిక్షాటన చేస్తూ ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామంలో బుధవారం సాయంత్రం రైతు సాయిల్ల రాజమల్లు యూరియా బస్తా కోసం లైన్లో నిలబడి సొమ్మసిల్లి పడిపోయాడు. తోటి రైతులు వెంటనే రాజమల్లును ఆసుపత్రికి తరలించారు. కాగా, మంచిర్యాల జిల్లా దండేపల్లి నెల్కి వెంకటాపూర్ పీఏసీఎస్ వద్ద రైతులకు కుర్చీలు వేసి కూర్చోబెట్టి యూరియా పంపిణీ చేశారు. రెండో విడతలో పంటకు యూరియా ఎంత మోతాదులో వేయాలనే దానిపై అధికారులు అవగాహన కూడా కల్పించారు.యూరియా బారులు సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్లోని మన గ్రోమోర్ కేంద్రం వద్ద సుమారు 400 ఫీట్ల వరకు రైతులు పట్టాదారు పాస్పుస్తకాలు, ఆధార్కార్డు జిరాక్స్ ప్రతులు లైన్లో ఉంచి నిరీక్షించారు. ఈ కేంద్రానికి 666 బస్తాల యూరియా రాగా ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. – సాక్షి స్టాఫ్ ఫొటో గ్రాఫర్ సూర్యాపేట -
దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది!
‘‘దేశం ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది’’ నూటొక్క జిల్లాల అందగాడిగా పేరొందిన సినీ నటుడు, దివంగత నూతన్ప్రసాద్ ఒకానొక సినిమాలో చెప్పిన డైలాగ్ ఇది. నిజజీవితంలో ఇలాంటి డైలాగులు వినడం కష్టమే కానీ.. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లోనే ఉందని చెప్పక తప్పదు. ఊహూ.. మనం మాట్లాడుకుంటున్నది రాజకీయాల గురించి కానే కాదు. పాక్తో యుద్ధం.. లేదా అమెరికాతో టారిఫ్ల విషయం అంతకంటే కాదు. దీనికంటే కొంచెం సీరియస్ విషయం. దేశం భవిష్యత్తును నిర్ణయించేది కూడా. ఏమిటంటారా.. తాజా గణాంకాల ప్రకారం మన సంతానోత్పత్తి రేటు తగ్గుతోంది!జనాభా తగ్గితే మంచిదే కదా అంటున్నారా? నిజమే కానీ.. అన్నివేళలా కాదు. ఎందుకంటే.. సంతానోత్పత్తి రేటు తగ్గుతూనే ఉంటే.. దేశం ముసలిదైపోతుంది. వృద్ధుల వైద్యావసరాలు తీర్చడం కష్టమవుతుంది. ఇది కాస్తా ప్రభుత్వాలపై మరింత ఆర్థిక భారాన్ని మోపుతుంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని పోస్టులు గమనిస్తే మీకీ విషయం అర్థమైపోతుంది. ‘‘మా దేశం రండి. ఉచితంగా ఇల్లిస్తాం. ఉద్యోగం వెతుక్కునేంతవరకూ నెలవారీ భృతి కూడా ఇస్తాం’’ అంటూ కొన్ని యూరోపియన్ దేశాలు ఊరిస్తున్నాయి. ఆయా దేశాల్లో సంతానోత్పత్తి రేటు దశాబ్దాలుగా తగ్గిపోతూండటం వల్ల వచ్చిన సమస్య ఇది. ఇంతకీ మన దేశంలో పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉంది? ఒక్కసారి పరిశీలిద్దాం..1950లలో దేశ సగటు సంతానోత్పత్తి రేటు 6.18. అంటే పిల్లల్ని కనగలిగే వయసులో ఉన్న ఒక్కో మహిళ కనీసం ఆరుగురికి జన్మనిచ్చేదన్నమాట. నిజమే మరి.. మన తాత ముత్తాతల కుటుంబాలు చాలా పెద్దవిగానే ఉండేవి. ఉమ్మడి కుటుంబాలు... బోలెడంత మంది చిన్నాన్నలు, అత్తమ్మలు, మేనమామలు ఉండేవారు. అయితే.. దేశ అవసరాల కోసం అనండి.. ఇంకో కారణం చేతనైనా కానివ్వండి ఈ సంతానోత్పత్తి రేటు క్రమేపీ తగ్గుతూ వచ్చింది. 2018లో 2.2 గా ఉన్న సంతానోత్పత్తి రేటు 2021 నాటికి 1.9కి పడిపోయింది. ఏ దేశంలోనైనా జనాభా క్రమేపీ పెరుగుతూ ఉండాలంటే సంతానోత్పత్తి రేటు 2.1 లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి. ఇంకోలా చెప్పాలంటే చనిపోయే వారికంటే పుట్టే వారు ఎక్కువగా ఉండాలంటే ఒక్కో మహిళ 2.1 మందిని కనాలన్నమాట. తాజాగా అంటే 2023ను బేస్ సంవత్సరంగా పరిగణించి చేసిన సర్వే ప్రకారం కూడా దేశ సంతానోత్పత్తి రేటు 1.9కి మించడం లేదు. అంటే... ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్కు ఉన్న రికార్డు చెరిగిపోనుందన్నమాట. ఎప్పుడన్నదే ప్రశ్న. ప్రస్తుత దేశ జనాభా కూర్పు ఎలా ఉందంటే.. పద్నాలుగేళ్ల లోపువారు 24 శాతం మంది ఉంటే పనిచేసే స్థితిలో ఉన్న వారు (15 - 64) వారు 68 శాతం మంది ఉన్నారు. మిగిలిన ఏడు శాతం మంది 65 ఏళ్లపైబడ్డ వృద్ధులు!అయితే ఏంటి?2050 నాటికి దేశంలో 65 ఏళ్లపైబడ్డ వారు మొత్తం జనాభాలో 20 శాతానికి చేరుకుంటారని అంచనా. అంటే.. సుమారు 19 కోట్ల మంది పని చేసే స్థితిలో ఉండరు. వీరందని పోషణ భారం ఇతరులపై పడనుంది. వృద్ధుల ఆరోగ్య అవసరాల కోసం ప్రభుత్వాలు మరింత ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. జర్మనీ, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల్లో ప్రస్తుతం ఇదే పరిస్థితి. ఫలితంగా ఆయా దేశాల గ్రామీణ ప్రాంతాలు దాదాపుగా నిర్మానుష్యమైపోయాయి. యువత ఉపాధివేటలో నగరాలకు మళ్లిపోవడం దీనికి కారణం. మన పల్లెల్లోనూ ఇదే పరిస్థితి. యూరోపియన్ దేశాల మాదిరిగా వృద్ధాప్య సంక్షోభం ఎదుర్కోకుండా ఉండాలంటే మౌలిక సదుపాయాలు (వృద్ధుల కోసం ప్రత్యేక ఆసుపత్రులు, ప్రభుత్వ పథకాలు వంటివి)పై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలి. అలాగే ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలి. ఇందుకు తగినట్టుగా విధానాలు మార్చాలి. పిల్లల పెంపకం ఒక భారం కాకుండా ఉండేలా తగిన ఆర్థిక సంస్కరణలు తీసుకురావాలి.- గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
స్వచ్ఛత పెర'గాలి'
కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ప్రకటించిన ’స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ ర్యాంకులు–2025’లో తెలుగు రాష్ట్రాలకు చెందిన నగరాలు మిశ్రమ ఫలితాలను సాధించాయి. దేశవ్యాప్తంగా గాలి నాణ్యత ఆధారంగా ప్రకటించిన ఈ ర్యాంకుల్లో, 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల కేటగిరీలో ఆంధ్రప్రదేశ్లో విజయవాడ 13వ ర్యాంకు, విశాఖపట్నం 17వ ర్యాంకు సాధించాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ 22వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. ఎప్పటిలాగే మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం దేశంలోనే అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 3 నుంచి 10 లక్షల జనాభా కేటగిరీలో ఏపీలోని గుంటూరు నగరం జాతీయ స్థాయిలో 6వ ర్యాంకు సాధించింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈ ర్యాంకులను ప్రకటించారు. జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం (ఎన్సీఏపీ) కింద దేశంలోని 130 నగరాల్లో గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు చేపట్టిన చర్యల ఆధారంగా ఈ ర్యాంకులను కేటాయించారు. – సాక్షి, న్యూఢిల్లీకేటగిరీల వారీగా తెలుగు రాష్ట్రాల్లోని నగరాలు, పట్టణాల స్థానాలు ఇవీ.. కేటగిరీ–1 (10 లక్షలకు పైగా జనాభా): ఈ విభాగంలో విజయవాడ 13వ ర్యాంకును, విశాఖపట్నం 17వ ర్యాంకును సాధించాయి. తెలంగాణ నుంచి హైదరాబాద్ నగరం 22వ స్థానంలో నిలిచింది.కేటగిరీ–2 (3 నుంచి 10 లక్షల జనాభా): ఈ కేటగిరీలో గుంటూరు 6వ ర్యాంకుతో మెరుగైన ప్రదర్శన కనబరిచింది. రాజమండ్రి 12, నెల్లూరు 18, కడప 23, కర్నూలు 29, అనంతపురం 35 ర్యాంకులు పొందాయి.కేటగిరీ–3 (3 లక్షల లోపు జనాభా): ఈ విభాగంలో ఆంధ్రప్రదేశ్ నుంచి విజయనగరం 8, శ్రీకాకుళం 16, ఒంగోలు 21, చిత్తూరు 29, ఏలూరు 31 ర్యాంకులు సాధించాయి. తెలంగాణ నుంచి నల్గొండ 13వ ర్యాంకులో, సంగారెడ్డి 17వ ర్యాంకులో నిలిచాయి.జాతీయ స్థాయిలో విజేతలు 10 లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాల్లో ఇండోర్ మొదటి స్థానంలో నిలవగా, జబల్పూర్ రెండో ర్యాంకు సాధించింది. ఆ తర్వాత ఆగ్రా, సూరత్ మూడోస్థానంలో నిలిచాయి. 3 నుంచి 10 లక్షల జనాభా కేటగిరీలో అమరావతి (మహారాష్ట్ర) మొదటి ర్యాంకు సాధించగా, 3 లక్షలలోపు జనాభా ఉన్న నగరాల్లో దేవాస్ (మధ్యప్రదేశ్) అగ్రస్థానంలో నిలిచింది. గాలి నాణ్యతను మెరుగుపరచడంలో ఈ నగరాలు తీసుకుంటున్న చర్యలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. -
అంకుర సంస్థలు.. అప్పుడే మూసేస్తున్నారు
ఎన్నో ఆశలతో పెడుతున్న అంకుర కంపెనీలు.. ఇటీవలి కాలంలో మూతపడుతున్నాయి. కృత్రిమ మేధ సృష్టించిన అలజడి.. పోటీ.. నిధుల రాక తగ్గిపోవడం.. ఖర్చులు పెరిగిపోవడం.. ఇలా అనేక కారణాలు. ప్రధానంగా కంటెంట్పైనే ఆధారపడ్డ స్టార్టప్స్పై ఏఐ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలో ఎడ్టెక్, స్టోరీటెల్లింగ్ ప్లాట్ఫామ్స్, మార్కెటింగ్ వంటి రంగాలలో ప్రస్తుతం ఉన్న స్టార్టప్లను నడిపించేందుకు, విస్తరించేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపడం లేదు. ఇంకేముంది 2023, 2024లో ఏకంగా 28,000 పైచిలుకు స్టార్టప్స్ మూతపడ్డాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్వెర్సే ఇన్నోవేషన్.. జోష్, డెయిలీహంట్ సంస్థల మాతృసంస్థ.. ఈ ఏడాది మేలో 350 మంది ఉద్యోగులను తొలగించింది. ప్రధానంగా ఏఐలో పెట్టుబడులు పెడుతున్నట్టు, ఆటోమేషన్ వైపు అడుగులు వేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. కోడ్ ప్యారట్, సటల్.ఏఐ, వూరి, లొకేల్.ఏఐ, అస్త్ర.. ఇలాంటి ఏఐ స్టార్టప్లు ఇటీవలికాలంలో చాలా మూతపడ్డాయి. ఇందుకు.. ఏఐలో వేగంగా వస్తున్న మార్పులు, మారిపోతున్న సాంకేతికత, అధికమవుతున్న పోటీ, నిధుల సమస్య పెరుగుతున్న వ్యయాలు.. ఇలాంటి అనేక కారణాలు. రూ.21,000 కోట్ల నష్టంచాట్జీపీటీ ఎంట్రీ ఇచ్చిన తర్వాతి సంవత్సరం అంటే 2023లో భారత్లో ఏకంగా 15,921 టెక్ స్టార్టప్లు మూతపడ్డాయి. అంతకు ముందు ఏడాదిలో ఈ సంఖ్య 2,101 మాత్రమే. 2024లో 12,717 స్టార్టప్స్ కనుమరుగైపోయాయి. షట్టర్లు దించేసిన కంపెనీల సంఖ్య 2022 వరకు నాలుగు అంకెలకే పరిమితం అయింది. గత రెండేళ్లలో అనూహ్యంగా అయిదు అంకెల స్థాయికి చేరడం ఆందోళన కలిగించే అంశం. కరోనా తదనంతర పరిస్థితులు కూడా కొంతవరకు కారణమయ్యాయి. ముఖ్యంగా ఏఐ వల్ల.. అగ్రిటెక్, ఫిన్టెక్, ఎడ్టెక్, హెల్త్టెక్ రంగాల్లోని స్టార్టప్లు అధికంగా ప్రభావితమయ్యాయి. ‘ఐఎన్సీ42’ వెబ్సైట్ ‘ఇండియన్ స్టార్టప్ లేఆఫ్ ట్రాకర్ 2025’ ప్రకారం.. 2025 సెప్టెంబర్ వరకు స్టార్టప్స్ 5,600లకుపైగా ఉద్యోగులను తొలగించాయి. 2023–24లో 67 స్టార్టప్స్ రూ.21,472 కోట్ల నష్టాన్ని ప్రకటించాయి. ఏఐ కంపెనీల దూకుడుఏఐ రాకతో కంటెంట్ రూపకల్పనలో వ్యయం తగ్గుతోంది. ఈ రంగంలో ప్రవేశానికి అడ్డంకులను తొలగించింది. ఏఐ ఎంట్రీతో టెక్ స్టూడియోల అవసరం తీరిపోయింది. అంతేకాదు ఖరీదైన స్టార్టప్స్ ఏర్పాటు చేయాల్సిన పనికూడా లేదు. కంటెంట్ సులువుగా, చవకగా దొరుకుతోంది. జనానికీ అందుబాటులో ఉంటోంది. ఆదాయం విషయంలో నిర్దిష్ట టర్నోవర్కు చేరుకోవడానికి కంపెనీలకు సంవత్సరాలు పట్టేది. ఇప్పుడు నెలల్లోనే ఏఐ స్టార్టప్స్ అది సాధ్యం చేస్తున్నాయి. ఏర్పాటైన 12–18 నెలల్లోనే 10 మిలియన్ డాలర్ల వార్షికాదాయం స్థాయికి చేరుతున్నాయంటే ఏఐ కంపెనీల ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.సగానికి తగ్గాయిఏఐ దూకుడు.. ఒకప్పుడు ఆశాజనకంగా కనిపించిన స్టార్టప్లను సైతం తుడిచిపెట్టేస్తోంది. పెట్టుబడిదారులు ఇప్పుడు ఏఐ మార్పులను తట్టుకొని దీర్ఘకాలంలో లాభాలను అందించే వ్యాపార విధానాలపై దృష్టిపెడుతున్నారు. ఈ నేపథ్యంలో.. స్టార్టప్స్లోకి రావాల్సిన నిధులూ తగ్గుముఖం పట్టాయి. భారతీయ స్టార్టప్స్ 2021, 2022లో ఏటా 7 బిలియన్ డాలర్ల స్థాయిలో ఫండింగ్ అందుకోగా.. గత రెండేళ్లలో ఈ మొత్తం దాదాపు సగానికి పడిపోవడం గమనార్హం. 2024లో భారత్కు చెందిన అంకుర సంస్థలు 3.7 బిలియన్ డాలర్ల నిధులను దక్కించుకున్నాయి. 2025 ఆగస్ట్ నాటికి ఈ మొత్తం కేవలం 2 బిలియన్ డాలర్లు మాత్రమే. -
వామ్మో.. పాము!
వాతావరణ మార్పులతో విషపూరిత పాముల హాట్స్పాట్లు కూడా మారే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడున్న పాముల హాట్స్పాట్లు త్వరలో ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలకు వ్యాపించే అవకాశాలు పెరుగుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం ఏపీ, ఉత్తరప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర పాముకాటు మరణాలకు హాట్స్పాట్లుగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో పాముకాట్ల తీవ్రత చాలా ఎక్కువ. దేశంలో పాముకాటు వల్ల ఏటా 60 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. ఇప్పుడు వాతావరణ మార్పులతో ఈ ముప్పు ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలకు వ్యాపిస్తోందని పీఎల్ఓస్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనంలో వెల్లడైంది. – సాక్షి, అమరావతిసాధారణంగా వానాకాలంలో పాముకాటు మరణాలు ఎక్కువగా నమోదవుతుంటాయి. వర్షాకాలం అయిపోగానే ఇలాంటి కేసులు తగ్గిపోతాయి. అయితే, రానున్న కాలంలో వాతావరణ మార్పుల కారణంగా భారత్లో పాముకాటు మరణాలు మరింత పెరిగే అవకాశం ఉందని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య భారతాన్ని పాముల బెడద వణికించనుందని ‘పీఎల్ఓ’స్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం హెచ్చరిస్తోంది.భూమి వేడెక్కుతుండటంతో.. వేడెక్కుతున్న భూమి, అస్థిర వర్షాలు, వాతావరణ మార్పులతో భూమి మరింతగా వేడెక్కుతోంది. వర్షాలు అస్థిరంగా కురుస్తున్నాయి. దీంతో పాముల జీవన విధానం గందరగోళంగా మారుతోంది. పాములు చల్లని లేదా వెచ్చని ప్రాంతాల్లో జీవించడానికి ఇష్టపడతాయి. భూమి వేడెక్కడంతో ఇప్పటివరకు చల్లగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలైన హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ తదితర ప్రాంతాలు పాములకు కొత్త ఆవాసాలుగా మారుతున్నాయి. వర్షాలు ఎక్కువైనా, తక్కువైనా పాములు తమకు ఆహారంగా దొరికే ఎలుకలు, చిన్న జంతువులు ఉన్న చోటికి వెళ్తాయి. అస్థిర వర్షాల వల్ల పొలాలు, అడవులు, నీటి వనరులు మారిపోయి అవి గ్రామాలు, పట్టణాలకు వస్తున్నాయి. అడవులు నరికివేత, నగరాలు విస్తరించడం, భూమి ఉపయోగంలో మార్పుల వల్ల పాములు తమ సహజ ఆవాసాలను వదిలి మనుషులు ఉండే ప్రాంతాలకు వస్తున్నాయి. దీనివల్ల పాముకాట్ల బెడద పెరుగుతోంది.‘బిగ్ ఫోర్’ స్నేక్స్తోనే బెడదదేశంలో నాలుగు విషపూరిత పాముల వల్ల మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. వీటిని ‘బిగ్ ఫోర్’ స్నేక్స్గా పిలిచే ఇండియన్ కోబ్రా (నాగుపాము), కామన్ క్రైట్ (కట్లపాము), రస్సెల్స్ వైపర్ (రక్త పింజరి), సా–స్కేల్డ్ వైపర్ (చిన్న పింజరి) వల్లే మన దేశంలో అత్యధిక పాముకాటు మరణాలు సంభవిస్తున్నాయి. వీటి కాటువల్ల విషం వేగంగా శరీరంలో వ్యాపిస్తుంది. సకాలంలో చికిత్స అందకపోతే మరణానికి దారితీస్తుంది. మన రాష్ట్రంలోని కోస్తా ప్రాంతాల్లోని పొలాల్లో నాగు పాములు, రక్త పింజరి, కట్ల పాములు ఎక్కువ. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కింగ్ కోబ్రాలు కనిపిస్తాయి. అయితే.. కోస్తా జిల్లాల్లోనే పాముకాట్ల బెడద తీవ్రంగా ఉంటోంది. కొత్త ఆవాసాలకు పాములు వాతావరణం మార్పులతో పాముల ఆవాసాలు చెదిరిపోయి అవి ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. రాబోయే 50 ఏళ్లలో ఈ పాములు ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలకు మరింతగా విస్తరించే అవకాశాలున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. వేడెక్కుతున్న అక్కడి వాతావరణం ఆ ప్రాంతాలను పాములకు అనుకూలంగా మారుస్తోంది. వాతావరణ మార్పులతో పొలాలు, నీటి వనరులు మారుతుండటంతో అక్కడ ఉండే ఎలుకలు, చిన్న పాములను ఆహారంగా తీసుకునేందుకు విషపూరిత పాములు ఇళ్లు, పొలాల సమీపంలోకి వస్తున్నాయి. అందువల్లే పాముకాట్లు పెరుగుతున్నాయి. ఫలితంగా వ్యవసాయ భూముల వద్ద రైతులు, కూలీలు, పిల్లలు పాముకాట్ల బారినపడుతున్నారు. ఆస్పత్రులపై ఒత్తిడి పాముకాటు చికిత్సకు అవసరమైన యాంటీ వీనం ఔషధాలు గ్రామీణ ఆస్పత్రుల్లో తక్కువగా ఉంటున్నాయి. దీంతో ఆస్పత్రులకు వచ్చినా పాముకాటుకు గురైన వారు చనిపోతున్నారు. గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో యాంటీ వీనం ఇంజెక్షన్లు, శిక్షణ పొందిన వైద్యుల అవసరం ఎక్కువవుతోంది. పాముకాటు గురించి గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు మెరుగైన ఆరోగ్య సౌకర్యాలతో ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందని పీఎల్ఓస్ అధ్యయనం స్పష్టం చేస్తోంది. -
సమాజంలో ఏకాకిగా..
నిత్యం బంధువులు, స్నేహితుల నుంచి వాట్సాప్ను ముంచెత్తుతూ గుడ్మారి్నంగ్ సందేశాలు.. ఆఫీసుకెళ్లగానే హాయ్, హలో పలకరింపులు.. వారాంతాల్లో స్నేహితులతో పారీ్టలు.. ఏడాదంతా పండుగలు, పబ్బాలు, కుటుంబ వేడుకలు.. ఇలా సంఘజీవులుగా దైనందిక జీవితాన్ని గడుపుతున్నప్పటికీ మనోళ్లనుఒంటరితనం వేధిస్తోంది! ప్రపంచంలోకెల్లా అత్యధిక జనాభాగల దేశంగానే కాకుండా.. సాంఘిక, సామాజిక స్థాయిల్లో వివిధ బంధాలతో పెనవేసుకు పోయిన భారతీయుల్లో ఈ సమస్య రోజురోజుకూ పెరుగుతుండటం దేనికి సంకేతం?సాక్షి, హైదరాబాద్: దేశంలోని పట్టణవాసుల్లో ప్రతి ఆరుగురిలో ఒకరు తరచూ ఒంటరితనంతో బాధపడుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. వేగవంతమైన సామాజిక–ఆర్థిక మార్పులు, పాతుకుపోయిన సాంస్కృతిక అంశాల సంక్లిష్ట మిశ్రమం కారణంగా పట్టణ ప్రాంతాల వారు ఎక్కువగా ఒంటరితనంతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపింది. ఉపాధి లేక గ్రామాల నుంచి వలసల పెరుగుదల, పట్టణాల్లో అధికమవుతున్న వృత్తిపరమైన పోటీతత్వం, సుదీర్ఘ పనిగంటలు, సుదూర ప్రయాణాల వంటి అంశాలు ప్రజల్లో భావోద్వేగ అలసటకు దారితీస్తున్నట్లు పేర్కొంది.సంబంధాలన్నీ పైపైనే..ప్రముఖ గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్, పబ్లిక్ ఒపీనియన్ స్పెషలిస్ట్ కంపెనీ ‘ఇప్సోస్’ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం పట్టణవాసులు పరస్పరం సత్సంబంధాలు కలిగి ఉన్నట్లు పైకి కనిపిస్తున్నా భావోద్వేగపరంగా ఒకరికొకరు కలవలేకపోతున్నారు. స్త్రీ, పురుష తేడాలు, పేద, ధనిక అంతరాలు, ప్రాంతాలు, పట్టణీకరణ వంటివి ఈ భావోద్వేగాలను ప్రభావితం చేస్తున్నాయి. అయితే సోషల్ మీడియా ఈ భావాలను కప్పిపుచ్చేందుకు.. బాధ, ఇబ్బందులను పక్కకునెట్టేందుకు దోహదపడుతున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమలోని భయాలను కప్పిపుచ్చుకోవడంతోపాటు వాటిని బయటకు వెల్లడిస్తే ఇతరుల దృష్టిలో చులకన అవుతామనే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ (ఫోమో) భావన కూడా దీనికి తోడ్పడుతోంది.సర్వేలోని ముఖ్యాంశాలు..⇒ పట్టణ ప్రాంతాల్లోని 43% మంది భారతీయులు ఎక్కువ సమయం ఒంటరితనం ఫీలవుతున్నారు. పెద్ద నగరాల్లో ఇది 45 శాతంగా ఉంటోంది.⇒ ప్రతి ఆరుగురిలో ఒకరు తరచూ ఒంటరిననే భావనతో కాలం నెట్టుకొస్తున్నారు.⇒ 45 ఏళ్లకు పైబడిన వారిలో 20 శాతం ఓ మోస్తరుగా,13 శాతం తీవ్రమైన ఏకాకి జీవితాన్ని అనుభవిస్తున్నారు.⇒ పురుషుల్లో ఒంటరితనమనే భావన క్రమక్రమంగా పెరుగుతోంది.⇒ ప్రతి నలుగురు టీనేజర్లలో ఒకరు ఒంటరితనంతో బాధపడుతున్నారు.⇒ పెద్ద వయసు వారిలో ప్రతి ముగ్గురిలో ఒకరు సామాజికంగా దూరంగా ఉన్నామనే భావనతో ఉన్నారు.శారీరక, మానసిక సమస్యలుదీర్ఘకాలిక ఒంటరితనం తీవ్ర శారీరక, మానసిక సమస్యలకు దారితీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల రోగనిరోధక శక్తి బలహీన పడటం, గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. కేన్సర్ వంటి వ్యాధులకు గురయ్యే చాన్స్ ఎక్కువగా ఉంటుందన్నారు. మానసిక సమస్యలను ఎదుర్కొనే విషయంలో భారత్లో తగినంత మంది మానసిక ఆరోగ్య నిపుణులు లేకపోవడం అడ్డంకిగా మారుతోందని అభిప్రాయ పడుతున్నారు.పరిష్కారం ఏమిటి? ⇒ కుంగుబాటుకు గురైనప్పుడు బాధితులు ఫోన్, చాట్ లేదా యాప్ల రూపంలో ‘లిజనింగ్ సరీ్వసెస్’ద్వారా సాంత్వన పొందొచ్చు. కష్టాలను విని నిపుణులు తగిన మద్దతు అందిస్తారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ కిరణ్ హెల్ప్లైన్ (1800–599–0019) 13 భాషల్లో 24/7 మానసిక ఆరోగ్య మద్దతు అందిస్తోంది. ⇒ అభిరుచిగల సమూహాలు, క్లబ్లు లేదా ఆన్లైన్ ఫోరమ్లలో చేరడం ద్వారా స్వచ్ఛంద సేవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఒంటరితనంతో ముడిపడిన ప్రవర్తనలను అధిగమించడంలో దోహదపడుతుంది. ⇒ ధ్యానం, యోగా, మైండ్ఫుల్నెస్ వంటి అభ్యాసాలు బాధితులను ప్రశాంతపరిచి ఆందోళనలు తగ్గిస్తాయి. ఈ అభ్యాసాలు నాడీ వ్యవస్థను ప్రశాంతపరచడంలో సహాయపడతాయి. కారి్టసాల్ వంటి ఒత్తిడి హార్మోన్ల విడుదలను తగ్గిస్తాయి. -
గుండె జబ్బులే.. 'ప్రాణాంతకం'
మనదేశంలో 2021–23 మధ్య సంభవించిన మరణాలకు గుండె జబ్బులే ప్రధాన కారణమని.. ఆ తర్వాతి స్థానంలో శ్వాసకోశ సమస్యలు ఉన్నట్లు ‘రిజిస్ట్రార్ జనరల్ అండ్ సైన్సెస్ కమిషనర్ ఆఫ్ ఇండియా’ తన తాజా నివేదికలో వెల్లడించింది. మొత్తం మరణించిన వారిలో 40 శాతానికిపైగా.. 70 ఏళ్లకుపైబడిన వారే. భారతదేశ ప్రజారోగ్య వ్యూహాలను రూపొందించటానికి, పెరుగుతున్న అసాంక్రమిక వ్యాధుల భారాన్ని ఎదుర్కొనే ప్రణాళికల రూపకల్పనకు ఈ పరిశోధన ఫలితాలు కీలకమైనవని నివేదిక పేర్కొంది.‘మరణ కారణాలు: 2021–2023’ పేరిట రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్జీఐ) సెప్టెంబర్ 3న విడుదల చేసిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే తాజా నివేదిక ప్రకారం దేశంలోని అనారోగ్య సంబంధ మరణాలకు దాదాపు 31 శాతం వరకు గుండె జబ్బులే ప్రధాన కారణం. మొత్తం మరణాల్లో 56.7 శాతం వరకు అసాంక్రమిక వ్యాధులు (గుండె జబ్బులతో సహా) ఉన్నట్లు నివేదిక తెలిపింది. గుండెజబ్బుల తర్వాత శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ వ్యాధులు మరణాలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో ప్రసూతికి సంబంధించిన మరణాలు, పౌష్టికాహార లోపాల మరణాలు 23.4 శాతం వరకు ఉన్నాయి. గుండెపై జీవనశైలి ఒత్తిళ్లు..అన్ని రకాల హృద్రోగాలు కలిపి మరణాలకు ప్రధాన కారణంగా నిలిచాయని, దాదాపు 31 శాతం మంది ప్రాణాలను అవి బలిగొన్నాయని నివేదిక తెలిపింది. యువతలో జీవనశైలి వల్ల తలెత్తుతున్న గుండె జబ్బుల తర్వాత, ఆత్మహత్యలు వారి మరణానికి రెండో ప్రధానం కారణంగా ఉన్నాయని నివేదిక తెలిపింది. 30 ఏళ్లు దాటిన వారిలో మరణాలకు గుండె జబ్బులు ప్రధాన కారణంగా ఉంటుండగా, 15–29 ఏళ్ల యువత పాలిట ఆత్మహత్యలు మరణ శాసనాలుగా మారుతున్నాయి.ప్రాంతాల వారీగా సర్వేఉత్తర, ఈశాన్య, తూర్పు, మధ్య, పశ్చిమ, దక్షిణ.. ఇలా ప్రాంతాల వారీగా రిజిస్ట్రార్ ఆఫ్ ఇండియా ‘మరణ కారణాలు: 2021–2023’ సర్వేను నిర్వహించింది. » దక్షిణాదిన హృద్రోగ మరణాల శాతం 32.8 శాతం ఉండగా, ఉత్తరాదిన 34.5 శాతంగా ఉంది. » శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వల్ల మరణాలు పశ్చిమ ప్రాంతంలో అత్యధికంగా 12.7 శాతం ఉన్నాయి. తరవాతి స్థానంలో (12.3 శాతం) మధ్య భారతం ఉంది. ఇవి అత్యల్పంగా (7.1 శాతం) సంభవించింది ఉత్తరాదిలో.» మధుమేహం వల్ల అత్యధికంగా 4.6 శాతం మరణాలతో దక్షిణాది అగ్రస్థానంలో నిలిచింది. తరువాతి స్థానంలో (4.1 శాతం) ఉత్తరాది ఉంది. -
ఫోన్ వద్దు.. చదువే ముద్దు!
స్మార్ట్ఫోన్ ఎంతగా మన దైనందిన జీవితంలో మమేకం అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర లేదు. కర్ణుడి కవచ కుండలాల్లా.. అది నిరంతరం మనతో ఉండాల్సిందే. కాలేజీ విద్యార్థులకుతోడు బడి ఈడు పిల్లల్లోనూ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగింది. ఈ అలవాటే వారిని క్లాస్ రూముల్లోకి ఫోన్ తీసుకెళ్లేలా చేస్తోంది. తరగతి గదిలోకి ఫోన్ లేకుండా వెళ్లిన విద్యార్థులు విద్యాపరంగా మెరుగ్గా రాణించినట్టు తాజా అధ్యయనంలో తేలింది.భారీ అధ్యయనంపెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని వార్టన్ స్కూల్ ప్రొఫెసర్ డాక్టర్ ఆల్ఫ్ సుంగు తన సహచరులతో కలిసి ఇటీవల భారత్లో ఓ వినూత్న అధ్యయనం చేపట్టారు. 10 ఉన్నత విద్యా సంస్థలలో చదువుతున్న 16,955 మంది విద్యార్థులను స్మార్ట్ ఫోన్ ఎలా ప్రభావితం చేసిందన్నదే ఆ అధ్యయన సారాంశం. తరగతి గదిలోకి ఫోన్ తీసుకుపోని విద్యార్థులు చదువుల్లో బాగా రాణించినట్టు ఆ అధ్యయనంలో తేలింది.తక్కువ పనితీరు కనబరుస్తున్న, అలాగే సైన్స్, గణితం కాకుండా ఇతర సబ్జెక్టులను చదువుతున్న మొదటి సంవత్సరం విద్యార్థులు కూడా ఫోన్ వాడకపోవడం వల్ల ఎక్కువ ప్రతిభ చూపినట్టు డాక్టర్ సుంగు తెలిపారు. ఫోన్ నిషేధించడం వల్ల తరగతి గది ఫలితాలు మెరుగుపడతాయనడానికి బలమైన ఆధారాలను నివేదిక అందిస్తుందని నార్త్ కరోలినా విశ్వవిద్యాలయంలో కౌమార నిపుణులు అన్నే మాహెక్స్ చెప్పారు.20 నిమిషాల సమయం!యునెస్కో చేపట్టిన ‘2023 గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్’ నివేదిక ప్రకారం.. ‘కొన్ని సాంకేతిక పరిజ్ఞానాలు కొన్ని సందర్భాల్లో కొంతవరకు మాత్రమే అభ్యాసానికి తోడ్పడతాయి. తరగతి గదిలో స్మార్ట్ఫోన్ వల్ల చదువుకు అంతరాయం కలుగుతోంది. 14 దేశాల్లో ప్రీ–ప్రైమరీ నుండి ఉన్నత విద్య వరకు చదువుతున్న విద్యార్థులపై జరిపిన ఓ అధ్యయనంలో.. ఫోన్ చేతిలో ఉంటే విద్యార్థుల దృష్టి నేర్చుకోవడం నుండి మరలుతోందని తేలింది.మొబైల్ ఫోన్ లో నోటిఫికేషన్స్ వస్తుంటే విద్యార్థులు తమ ఏకాగ్రతను కోల్పోతున్నారట. ఆ తరువాత.. విద్యార్థులు వారు నేర్చుకుంటున్న దానిపై తిరిగి దృష్టి పెట్టడానికి 20 నిమిషాల వరకు సమయం పడుతోందని మరో అధ్యయనంలో తేలింది. బెల్జియం, స్పెయిన్, యూకేలోని బడుల్లో స్మార్ట్ఫోన్లపై నిషేధం కారణంగా అభ్యాస సామర్థ్యాలు, ఫలితాలు మెరుగుపడినట్టు వెల్లడైంది’.‘వాంఛనీయం కాదు’పాఠశాలల్లో స్మార్ట్ఫోన్లను పూర్తిగా నిషేధించడం ఆచరణాత్మకం, వాంఛనీయం కాదని స్పష్టం చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఈ ఏడాది మార్చిలో మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యా ప్రయోజనాలు, తలెత్తే నష్టాలను దృష్టిలో పెట్టుకుని నియంత్రణ అవసరాన్ని నొక్కి చెప్పింది. ఈ నేపథ్యంలో.. స్కూల్ సమయంలో విద్యార్థులు స్మార్ట్ఫోన్ వాడకంపై స్పష్టమైన విధానాలను రూపొందించాలని ఢిల్లీ విద్యా శాఖ తన పరిధిలోని అన్ని పాఠశాలలను ఏప్రిల్లో ఆదేశించింది. విద్యార్థులు చదువుపై దృష్టి కేంద్రీకరించాలన్న ఏకైక లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా కనీసం 40% జాతీయ విద్యా వ్యవస్థలలో తరగతి గదుల్లో సెల్ఫోన్లపై నిషేధాలు అమలవుతున్నాయి. మనదేశంలో మాత్రం స్మార్ట్ఫోన్ వినియోగానికి సంబంధించి ప్రస్తుతం స్పష్టమైన చట్టం/విధానం లేదు.నో ఫోన్స్.. ఓన్లీ బుక్స్అమెరికా ఫోన్లు నిషేధిస్తున్న రాష్ట్రాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2025 ఆగస్ట్ నాటికి 18 రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు చేస్తుండగా.. ప్రస్తుత విద్యా సంవత్సరంలో మరో 17 రాష్ట్రాలు వచ్చి చేరాయి. చైనా: ప్రైమరీ, సెకండరీ స్కూల్స్లో 2025 మార్చి నుంచి నిషేధం విధించారు. బోధనా కారణాల వల్ల ఫోన్ అవసరమైతే తల్లిదండ్రులు రాతపూర్వకంగా విద్యా మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేయాలి. తజికిస్తాన్: 2009 నుంచి ప్రాథమిక, సెకండరీ, ఉన్నత విద్యా సంస్థలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది మొబైల్ ఫోన్ వాడకూడదు. గీత దాటితే జరిమానా తప్పదు.బంగ్లాదేశ్: దేశవ్యాప్తంగా నిషేధాలు మొదట 2011లో అమలయ్యాయి. 2017లో బలోపేతం చేశారు.రువాండా2018 జూన్ నుంచే ప్రాథమిక, సెకండరీ పాఠశాలల్లో మొబైల్ ఫోన్స్ వాడకానికి అడ్డుకట్ట వేసింది. ఫ్రాన్స్: 15 ఏళ్లలోపు విద్యార్థులు బడుల్లో ఫోన్ వాడకూడదు. 2018–2019 విద్యా సంవత్సరం నుండి నిబంధన అమలు.బ్రెజిల్: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులు స్మార్ట్ఫోన్ వాడకూడదని 2025 జనవరిలో జాతీయ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఉపాధ్యాయుల అనుమతితో విద్యా ప్రయోజనాల కోసం లేదా అత్యవసర పరిస్థితులు ఉంటే ఉపయోగించవచ్చు.ఇటలీ: ప్రైమరీ స్కూల్ విద్యార్థుల మొబైల్ ఫోన్ వాడకంపై నిషేధం ఉంది. 2025 కొత్త విద్యా సంవత్సరం నుండి హైస్కూల్ విద్యార్థులకూ వర్తింపజేశారు.నెదర్లాండ్స్: ప్రాథమిక, సెకండరీ పాఠశాలల్లో మొబైల్ ఫోన్లు, స్మార్ట్వాచ్లు, టాబ్లెట్ పీసీలపై దేశవ్యాప్తంగా 2024 సెప్టెంబర్ నుండి నిషేధం. న్యూజిలాండ్: పాఠశాల సమయంలో సెల్ఫోన్ వాడకూడదన్న నిబంధన దేశవ్యాప్తంగా 2024 ఏప్రిల్ నుంచి అమలైంది. -
మరణాన్ని ఓదార్పు అడగకు
బతుకులో జ్వాలలు ఉన్నాయని శరీరాన్ని అగ్నికి ఆహుతి ఇవ్వడం పరిష్కారం ఎలా అవుతుంది అంటారు విజ్ఞులు. ‘అన్ని కష్టాలకు విముక్తి చావే’ అనే మాటకు మించిన అవివేకం లేదంటారు కౌన్సెలర్లు. బలవన్మరణం ఆ వ్యక్తిని చనిపోయాక కూడా వెంటాడుతుంది. ఒక అపప్రథగా... కుటుంబాన్ని కష్టాల పాలు చేస్తుంది. మనిషి లేని లోటు ఏం చేసినా తిరిగి రాదు. అటువంటి సమయంలో మరణం ఎందుకు? నిరాశ, నిస్పృహ పరిస్థితులు, సవాళ్లు ఎవరికీ కొత్త కాదు. బతకడమే చేయవలసింది. నిపుణుల సలహాలతో కథనం.అంకెలు దుర్మార్గమైనవి. అవి నిజమైన నష్టాన్ని చూపించవు. కావాలంటే ఈ అంకె– 1,80,000 చూడండి. దీనిని చూస్తే ఏమీ అనిపించదు. కాని మన దేశంలో ప్రతి ఏటా ఇంతమంది ఆత్మహత్యల ద్వారా చనిపోతున్నారు. వీరందరి ఫొటోలను సముద్రతీరం వెంబడి ప్రదర్శిస్తే ఎన్ని కిలోమీటర్ల తీరం కావాలి? అలా ప్రదర్శిస్తే తెలుస్తుంది తీవ్రత,,, ఇంత మంది చనిపోతున్నారా అని. వీరిలో కనీసం 1,20,000 మంది పురుషులు. ఇప్పుడు ఆలోచించండి. పితృస్వామ్య ఆధారితమైన మన సమాజంలో పురుషుడు చనిపోతే ఆ ఇంట్లోని ఎంతమంది సభ్యులు దిక్కులేనివారు అవుతారు. జీవితాలు తల్లకిందులు చేసుకుంటారు. మరెన్నో కష్టాల్లో కూరుకుపోతారు. కరోనా అనో మరోటనో మహమ్మారులను చూసి భయపడటం కాదు. ఈ భూగ్రహాన్ని పీడిస్తున్న అతి పెద్ద మహమ్మారి ఆత్మహత్యే. ప్రతి ఏటా అన్ని దేశాలలో కలిపి 8 లక్షల మంది ఆత్మహత్యల ద్వారా మరణిస్తున్నారు. ఇది ఒక రకంగా కాకిలెక్కే. అసలు లెక్క తెలియక పోవడమే మంచిది. మరో విషయం తెలుసా? ప్రతి మరణానికీ ఒకరు చనిపోవడమే కనిపిస్తుంది... కాని ఆ సమయానికి మరో ఇరవై మంది ఆత్మహత్యాయత్నం చేసి బతికి బయటపడ్డ వాళ్లు ఉంటారు.ఆరుకు ఒకరుప్రస్తుతం మన దేశంలో 15 నుంచి 29 మధ్య వయసు లో ఉన్న పురుషులు ఎక్కువ సంఖ్యలో ఆత్మహత్య చేసుకుంటున్నారు. అంటే దేశంలోని ప్రతి ఆరు ఆత్మహత్యల్లో ఒకటి ఈ ఏజ్ గ్రూప్ నుంచే ఉంది. బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన వయసులో ఆత్మహత్యల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. కారణం–∙చదువు ఒత్తిడి ∙పని చోట పీడన∙బంధాలలో దగా ∙ఆర్థిక సమస్యలు ∙అన్ని జీవన పార్శా్వలలో బెస్ట్గా ఉండమని కోరే సాంఘిక నియమంఇదొక జబ్బుఆత్మహత్యను జబ్బుగా ఎవరూ చూడరు. కాని ఇదొక జబ్బు. పట్టలేని ఉద్వేగం వల్ల, క్షణికావేశం వల్ల, నేను చస్తే అవతలివాళ్లు పశ్చాత్తాపంతో బాధ పడాలి అన్నట్టుగా, సమస్యలకు పరిష్కారమే ఉండదన్న నెగెటివ్ స్వభావం వల్ల, పరువు ప్రతిష్టలకు ఎక్కువ విలువివ్వాలనే భావన వల్ల, నోరు తెరిచి సమస్యను బయటపడేయని స్వభావం వల్ల ఆత్మహత్యలు జరుగుతుంటాయి. తరచి చూస్తే ఇవన్నీ మెదడు చేసే విన్యాసాలే. కెమికల్ రియాక్షన్సే. ఉద్వేగాలను, ఆవేశాలను దాటి వస్తే, మనం పోయి మరొకరిని సాధించడమనే భావన ఎంతటి హాస్యాస్పదమో ఎరుకలోకి వస్తే, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందనే నమ్మకం కలిగి ఉంటే, పరువు ప్రతిష్టలు తర్వాత ముందు ప్రాణం ముఖ్యం అనుకుంటే, ఆత్మాభిమానం కంటే సమస్య నుంచి బయటపడటం ముఖ్యం అనుకుంటే ఆత్మహత్యలు జరగవు. మరో విషయం ఏమిటంటే ఒకరికి ప్రపంచ సమస్యగా ఉండేది ఎదుటివారికి అసలు సమస్యే కాకపోవచ్చు. ‘ఇంత చిన్న విషయానికి చనిపోయాడా?’ అని ఆశ్చర్యపోతారు తప్ప జాలి కూడా చూపరు. మరి ఆత్మహత్య చేసుకోవడం ఎందుకు? ఆత్మహత్య ఆలోచనలు వస్తే జ్వరానికి మాత్ర మింగినట్టు ఆ ఆలోచనలు పోయే కౌన్సిలింగ్ తీసుకోవాలి. మిత్రుల సహకారం తీసుకోవాలి. అవసరమైతే వైద్యుల సలహాతో మందులు వాడాలి. అంతే చేయవలసింది. చనిపోవడం కాదు.భళ్లున తెల్లారుతుందిఈ చీకటి రాత్రి విషమ పరీక్షలు ఎన్ని పెట్టినా ప్రాణాలు ఉగ్గబట్టుకుని ఉంటే మరునాడు భళ్లున తెల్లారుతుంది. ఆ వెలుతురు దారి చూపిస్తుంది. కొత్త ఊపిరి వస్తుంది. కాని రాత్రే శాశ్వతం అన్నట్టు ప్రాణాలు తీసుకుంటారు కొంత మంది. గత రాత్రి వ్యక్తి చనిపోయినా మరుసటి రోజు లోకం స్తంభించదు. అందరూ ఎవరి పనుల్లో వారుంటారు. సినిమా లు ఆడుతుంటాయి. కెఫేలు బిజీగా ఉంటాయి. బ్యాంకు లావాదేవీలు జరుగుతుంటాయి. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి నిర్జీవం కావడం తప్ప అంతా మామూలుగా ఉంటుంది. ఆ అంతా మామూలుగా ఉండే జగత్తులో ఉంటూ జీవితాన్ని మిస్ కాకుండా ఉండాలనే భావన కలిగించుకుంటూ ఉండాలి. అందరూ కష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నారని ఎవరిని కదిపినా తెలుస్తుంది. మరి వారంతా చనిపోనప్పుడు మనం ఎందుకు చనిపోవాలి అనుకోవడంలోనే ఉంది విజ్ఞత. ఈ కమ్యూనికేషన్ రోజుల్లో 24 గంటలు ఎన్నో కౌన్సెలింగ్ కేంద్రాలు ఉన్నాయి. కాల్ చేస్తే సాయం చేస్తారు. ఆ సాయం పొందాలి. వ్యక్తులు బలహీనంగా ఉన్నప్పుడు కుటుంబ బలాన్ని, బంధుబలాన్ని, స్నేహబలాన్ని, సమాజ బలాన్ని తోడు తీసుకోవాలి. సోషల్ మీడియాలో సమస్యను పంచుకుని బయటపడినవారు ఉన్నారు. పోలీసులు, న్యాయ వ్యవస్థ, పాలనా వ్యవస్థ, ప్రజాప్రతినిధులు వీరంతా పౌరులకు ఏదో ఒక మార్గం చూపాల్సినవారే. వారి సాయం పొందాలి. అన్నింటికి మించి జీవితాన్ని సరళంగా, సులభం గా నిర్మించుకుంటే, ఆరోగ్యకరమైన జీవన విధానాలు, అలవాట్లు, క్రమశిక్షణ, ఆహారం, స్నేహితులు.. తోడు చేసుకుంటే జీవించడంలో ఆనందం తెలుస్తుంది.చెప్పుకునే మనిషీ కోరుకునే అండమనిషి తనకొచ్చే కష్టాల వల్ల ఆత్మహత్య చేసుకోడు. ఆ కష్టాలను వినే మనిషి లేకపోవడం వల్ల, నేనున్నాననే భరోసా దొరకకపోవడం వల్ల, నిస్సహాయత ఫీలయ్యి ఆత్మహత్య శరణ్యం అనుకుంటాడు. ఆత్మహత్య చేసుకోవడం ఒక నిమిషపు నిర్ణయం కాదు చాలామంది విషయంలో. కొందరు రోజుల తరబడి దీని గురించి ఆలోచిస్తారు. ఆలోచిస్తూ ఉంటారు. చివరకు ప్రయత్నిస్తారు. అందుకు సంబంధించిన మార్పులు వ్యక్తులలో, కుటుంబ సభ్యులలో గుర్తించడం చాలామటుకు సాధ్యం. సమస్య ఏమిటో తెలుసుకుంటే, వారిని కదిలించి రాబట్టగలిగితే వారు ప్రమాదపు అంచుకు వెళ్లరు. దురదృష్టవశాత్తు కుటుంబ సభ్యులే ఒకరిని మరొకరు గమనించలేనంతగా బిజీగా ఉంటూ అంతా అయ్యాక కళ్లు తెరుస్తున్నారు. -
మూరెడు మల్లెపూలే కాదు.. వీటితోనూ తంటాలే!
మల్లెపూలు తీసుకెళ్లినందుకు.. మలయాళ నటి నవ్య నాయర్కి ఆస్ట్రేలియాలో రూ.1.14 లక్షల జరిమానా విధించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మూరెడు మల్లెపూలు.. అదీ బ్యాగులో ఉన్నందుకే ఆమెకు ఆ ఫైన్ పడింది. ఈ చేదు అనుభవంపై ఆమె సైటైర్లు వేసుకుంటోంది కూడా. అయితే.. ఆస్ట్రేలియా మెల్బోర్న్ ఎయిర్పోర్టుకు ప్రపంచంలోని అత్యంత కఠినమైన బయోసెక్యూరిటీ చట్టాలు ఉన్న విమానాశ్రయాంగా పేరుంది. కేవలం మల్లపూలే కాదు.. మరికొన్ని వస్తువులను కూడా అక్కడికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరని మీకు తెలుసా?.. ఓనం ఈవెంట్కు హాజరయ్యేందుకు వెళ్లిన మల్లూ బ్యూటీ నవ్య నాయర్కు చేదు అనుభవం ఎదురైంది. తన తండ్రి తచ్చిన మల్లెపూల మూరను ఆమె బ్యాగులో ఉంచుకుని ఎయిర్పోర్టులో దిగారు. అయితే.. మెల్బోర్న్ ఎయిర్పోర్టులో వాటిని గుర్తించిన సిబ్బంది అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. అక్కడి అధికారులు ఆమెకు రూ.1.14లక్షల జరిమానా వేశారు. 28 రోజుల్లో ఆ జరిమానా కట్టాలని ఆమెకు స్పష్టం చేశారు. మల్లెపూల తరహాలో మూరెడున్న వంద కేటగిరీల వస్తువులపై అక్కడ నిషేధం అమల్లో ఉంది. అందులో.. తాజా, ఎండిన పూలు, తాజా పండ్లు, కూరగాయలు, మూలికలు, మసాలా దినుసులు, గింజలు, పాల సంబంధిత ఉత్పత్తులు, బర్ఫీ.. రసగుల్లా, రసమలై, గులాజ్జామూన్, మైసూర్ పాక్, సోన్పాపిడి ఇలా.. స్వీట్లు, బియ్యం, టీ, ఇంటి భోజనం, తేనే, పెంపుడు జంతువుల ఆహారం.. ఈకలు, ఎముకలు, చర్మం (సంబంధిత వస్తువులు కూడా!), చెట్లు.. జంతువుల నుంచి తయారు చేసిన మందులు, చివరకు.. విమాన, నౌకల ప్రయాణాల నుంచి తెచ్చుకున్న ఆహారాన్ని కూడా అనుమతించరంతే. ప్రయాణికులు వీటిని తీసుకెళ్లడం అక్కడ నిషిద్ధం. వాటివల్ల ప్రయాణికులకు వివిధ రకాల వ్యాధులు, తెగుళ్లు సులభంగా వ్యాపించే అవకాశం ఉండడంతో ఈ నిబంధన పెట్టారు. పైగా వాటి వల్ల పర్యావరణానికి హాని అని భావిస్తున్నారు. చివరకు.. మన పండుగలు పబ్బాలు ఉన్నాయని విజ్ఞప్తులు చేసుకున్నా కూడా వాళ్లు వినరు. అయితే మాపుల్ చెట్ల నుంచి తయారు చేసిన షుగర్ సిరప్కు మాత్రం ఎందుకనో అనుమతిస్తారు!. నవ్య మెల్బోర్న్ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం అక్కడి కస్టమ్స్ అధికారులు ఆమె బ్యాగ్లో మల్లెపూలును తీసుకువచ్చినందుకు జరిమానా విధించారు. అనంతరం మెల్బోర్న్లో జరిగిన ఓనం కార్యక్రమంలో మాట్లాడుతూ.. నటి నవ్య తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పడంతో ఈ విషయం బయటకు వచ్చింది. తాను తీసుకువచ్చిన పూలు లక్ష రూపాయలు ఖరీదైనవని జరిమానా విధించేవరకు తనకు తెలియదని చమత్కరించింది. కానీ, ఆస్ట్రేలియా సరిహద్దుల్లో నిషేధిత వస్తువులపై కఠిన నియమాలు అమలవుతున్నాయి. ఆస్ట్రేలియా బయోసెక్యూరిటీ చట్టాల ప్రకారం.. నిషేధిత/ప్రకటించని వస్తువులు (ఆహారం, మొక్కలు, జంతు ఉత్పత్తులు, ఔషధాలు) సరిహద్దులో పట్టుబడితే.. వెంటనే వాటిని ధ్వంసం చేస్తారు. ప్రయాణికులకు తక్షణ జరిమానాలు విధిస్తారు. విషయం తీవ్రమైందిగా భావిస్తే.. వీసా రద్దు చేస్తారు. మరింత తీవ్రమైందిగా అనుకుంటే.. తీవ్ర ఉల్లంఘనల కింద పరిగణించి జైలు శిక్ష కూడా విధించవచ్చు. అందుకే ప్యాసింజర్ కార్డులో వాటి గురించి తప్పనిసరిగా పేర్కొనాలి. అప్పుడు.. అనుమతించని వస్తువులు తీసేసినా జరిమానా ఉండదు. లేకుంటే.. నవ్య నాయర్లా 15 సెం.మీ. మల్లెపూలకు లక్ష రూపాయల జరిమానా చెల్లించాల్సి వస్తుంది. నవ్యా నాయర్(ధన్య వీణ) 1985 అక్టోబర్ 14న కేరళలోని అలప్పుశా జిల్లాలో జన్మించారు. 2001లో ఇష్టం అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు, ప్రధానంగా మలయాళ సినిమాల్లో.. ఆడపా దడపా తమిళ, కన్నడ చిత్రాల్లో కూడా నటించారు. పృథ్వీరాజ్ సుకుమారన్తో జంటగా నటించిన నందనం అనే సినిమాలో నటనకు కేరళ రాష్ట్ర ఉత్తమ నటి అవార్డు లభించింది. ఆమె క్లాసికల్ డాన్స్లో శిక్షణ పొందిన నర్తకి, పలు స్టేజ్ షోలు కూడా చేశారు. 2010లో వ్యాపారవేత్త సంతోష్ మెనన్ను వివాహం చేసుకున్నారు.. ఈ జంటకు ఓ కుమారుడు. యాక్టింగ్తో పాటు టీవీ షోలు, రచనల ద్వారా కూడా ప్రేక్షకులను ఆమె ఆకట్టుకుంటున్నారు. -
టెక్.. టాక్!
చాట్బాట్లు చెప్పేవన్నీ నిజాలు కావట.. కొన్ని వాటికవే ఊహించేసుకుని మనకు చెప్పేస్తాయట.. నిజం.. ఎందుకంటే.. దీన్ని చెప్పింది మేం కాదు.. ప్రఖ్యాత చాట్బాట్ సంస్థ చాట్ జీపీటీ నిర్వహణ సంస్థ అయిన ఓపెన్ ఏఐలోని పరిశోధనా బృందం. చాట్జీపీటీ వంటి చాట్బాట్లను లార్జ్ లాంగ్వేజ్ మోడల్(ఎల్ఎల్ఎం) అంటారు. ‘‘c?’’ అనే అంశంపై ఓపెన్ ఏఐ పరిశోధకులు ఆడమ్ టౌమన్ కలాయ్, ఓఫెర్ నచూమ్, ఎడ్విన్ ఝాంగ్ సహా జార్జియా టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ సంతోష్ ఎం.వెంపాల సంయుక్తంగా ఒక నివేదికను రూపొందించి ఇటీవల విడుదల చేశారు. అందులో చెప్పిందే ఈ విషయం. వాళ్లేమంటారంటే.. ‘‘ఉదాహరణకు పాఠశాలల్లో పిల్లాడిని ఉపాధ్యాయుడు ఏదైనా ప్రశ్న అడిగితే.. సమాధానం కింద ఇచ్చే నాలుగు సమాధానాల్లో ఏదో ఒకటి చెబుతాడు. అయితే కరెక్ట్ అవుతుంది లేదంటే తప్పు. నాకు తెలీదు అని కూర్చుంటే ఉన్న ఒక్క మార్కు కూడా పోతుంది. అచ్చం అలాంటి పిల్లల్లాగే కృత్రిమ మేధ చాట్బాట్లు కూడా ప్రవర్తిస్తాయి. గతంలో తమ యూజర్లు ప్రాంమ్ట్ మాదిరిగా అందించిన సమాచారంలో ఈ కొత్త ప్రశ్న తాలూకు సమాచారం లేకపోతే చాట్బాట్ సొంతంగా ఒక తప్పుడు సమాచారాన్ని సృష్టించి యూజర్కు అందజేస్తుంది. ఆ సమాధానంతో యూజర్ సంతృప్తి చెందితే తాను చెప్పిన అంశం వాస్తవానికి దగ్గరగా ఉందని చాట్బాట్ గుర్తుంచుకుంటుంది. లేదంటే మరోసారి మరో సమాధానం ఇస్తుంది. ఇలా చాట్బాట్లు ఎప్పటికప్పుడు కొత్త అంశాలపై సమీక్ష జరుపుకుంటూ తమను తాము మెరుగుపర్చుకుంటాయి. తప్పులను మనం ఆపలేం కానీ ఆ తప్పుల నుంచి పాఠాలను నేర్చుకోగలం అనే సిద్ధాంతంతో చాట్బాట్లు పనిచేస్తాయి’’ అది బ్రో.. చాట్బాట్ నిజం వెనకున్న అసలైన నిజం.. గంటకు రూ.5,000 ఇంతకీ దేనికి?ఇంక దేనికి.. హిందీ చాట్బాట్ను సృష్టించేందుకు.. చాట్బాట్లను మనం తెగ వాడతాం. ఈ విషయం మెటా సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్కు బాగా తెలుసు. అందుకే ఇప్పుడు హిందీ చాట్బాట్ కోసం క్రియేటర్లు, కాంట్రాక్టర్లను నియమించుకుంటున్నారు. ఇందుకోసం గంటకు దాదాపు రూ.5,000 చెల్లిస్తున్నారు. క్రిస్టల్ ఈక్వేషన్, ఆక్వెంట్ టాలెంట్ సంస్థల ద్వారా కొత్త ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. హిందీ, ఇండోనేషియన్, స్పానిష్, పోర్చుగీస్ భాషలు అనర్గళంగా మాట్లాడే వాళ్లకు తొలి ప్రాధాన్యం కలి్పస్తారు. కథలు చెప్పడం, పాత్రల సృష్టి, కృత్రిమమేధ కంటెంట్ తయారీ వంటి సృజనాత్మక రంగంలో ఆరేళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇన్స్ట్రాగామ్, మెసెంజర్, వాట్సాప్ యాప్లలో హిందీ భాషలో చాట్బాట్ను సృష్టించడం ఈ ఉద్యోగుల ప్రధాన విధి. కోడింగ్ మాత్రమే కాదు ఈ మూడు యాప్లలో ఏఐ పాత్రలను సృష్టించే నిపుణులకు కూడా అవకాశాలు మెండుగా ఉన్నాయని కంపెనీ పేర్కొంది. టాలెంట్ ఉందా.. మరి బీ రెడీ. కంటెంట్ ఈజ్ కింగ్.. కంటెంట్ క్రియేటర్లకు మార్కెట్లో డిమాండ్ ఉంది. కృత్రిమమేధ(ఏఐ) బ్రాండ్లు మార్కెట్లో మనుగడలో ఉండాలంటే కంటెంట్ క్రియేటర్లపై ఆధారపడక తప్పని పరిస్థితి. అందుకే కంటెంట్ స్ట్రాటజీ ఉద్యోగికి దాదాపు రూ.3.46 కోట్ల వార్షిక వేతనం ఇస్తామని తాజాగా ఓపెన్ఏఐ ప్రకటించింది. కంటెంట్ స్ట్రాటజీ, కాపీ రైటింగ్, గ్రోత్ మార్కెటింగ్ విభాగాల్లో ఆరేళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులు దీనికి అర్హులని తెలిపింది. అక్షరాలు, ఆలోచనలకు వాస్తవరూపమిచ్చి కోట్లాది వినియోగదారుల మనసుల్ని చూరగొనే ఉద్యోగులే మాకు కావాలని చెప్పింది. ఇంతకీ జాబ్ ఎక్కడంటే.. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నగరంలో.. అందుకే కటౌట్ కాదు.. మన దగ్గరున్న కంటెంట్ ముఖ్యం అనేది.. ఏంటి భయ్యా ఇదీ..మీరీ విషయం విన్నారా? తక్కువ వృత్తి నైపుణ్యాలున్న, కిందిస్థాయి(ఎంట్రీలెవల్) ఉద్యోగాలను కృత్రిమమేధ తుడిచిపెట్టేస్తుందని కృత్రిమమేధ భద్రతా, పరిశోధనా సంస్థ ‘ఆంథ్రోపిక్’ సీఈఓ డేరియో ఆమోడీ చెప్పారు. కన్సల్టింగ్, న్యాయసేవలు, ఫైనాన్స్, అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో ఎంట్రీలెవల్ ఉద్యోగులు ఒకటి నుంచి ఐదేళ్లలోపు కొలువుల్ని కోల్పోవడం ఖాయమని చెప్పారు. బీబీసీ పాడ్కాస్ట్ అయిన ‘‘బీబీసీ ర్యాడికల్ విత్ అమోల్ రాజన్’ ఆడియో ఇంటర్వ్యూలో డేరియో పలు అంశాలపై మాట్లాడారు. ‘‘న్యాయసేవలు అందించే సంస్థలు మొదలు ఫైనాన్స్, అడ్మిని్రస్టేషన్ విభాగాల దాకా కొన్ని సంస్థల్లో డాక్యుమెంట్ల తనిఖీ అనేది మూస పద్ధతిలో సాగుతుంది. ఇలాంటి వైట్కాలర్ ఉద్యోగుల పనిని కృత్రిమమేధ సులభంగా చేయగలదు.అందుకే ఇలాంటి ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు త్వరలో మాయం అవుతాయి. కిందిస్థాయి ఉద్యోగుల్ని ఏఐతో భర్తీచేయాలని ఎన్నో కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఆలోచిస్తున్నారు. క్లరికల్ పనిని ఏఐతో చేయించాలని చూస్తున్నారు. ఎలాంటి సాఫ్ట్వేర్ కోడింగ్ను అయినా ఏఐ అనేది మూడు నుంచి ఆరు నెలల్లోపు నేర్చేసుకుంటుంది. దీంతో అత్యున్నతస్థాయి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మినహా కిందిస్థాయి ఉద్యోగాలు డేంజర్లో పడనున్నాయి’’ అని ఆయన హెచ్చరించారు. -
ఆమెకు అభద్రత!
దేశంలోని ప్రతి 10 మంది మహిళల్లో నలుగురు.. తాము ఏమంత సురక్షితంగా లేరని భావిస్తున్నారట. యువతుల్లో భయాందోళనలు గత ఏడాది కంటే పెరిగాయి. ఫిర్యాదు ఇస్తే న్యాయం జరుగుతుందన్న ఆశ బాధిత మహిళల్లో చాలా తక్కువగా ఉందట. పని చేసే చోట భద్రత గురించి మాత్రం.. సురక్షితమైన వాతావరణం ఉందని అత్యధికులు చెప్పారు. దేశంలోని మహిళల భద్రతా స్థితిగతులపై జాతీయ మహిళా కమిషన్.. ‘నారీ 2025 వార్షిక నివేదిక, భద్రతా సూచిక’ పేరిట విడుదుల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. -సాక్షి, స్పెషల్ డెస్క్వీధి లైట్లు.. ప్రజా రవాణా!⇒ ‘ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్’ గురించి విన్నవారిలో చాలా మంది, ఆఫీసులలో అలాంటి యంత్రాంగం ఒకటి ఉంటుందన్న అవగాహన మహిళలకు భద్రత కల్పిస్తుందని అభిప్రాయపడ్డారు. ⇒ మహిళల భద్రత అంటే కేవలం వారికి భౌతిక రక్షణను మాత్రమే ఇవ్వటం కాదని; వారి మానసిక, ఆర్థిక, డిజిటల్ భద్రతలను కూడా కల్పించాలని నివేదిక సూచించింది. ⇒ స్థలాన్ని, సమయాన్ని బట్టి కూడా భద్రత అర్థం మారుతుందనీ, పగటిపూట సురక్షితమైన వాతావరణాన్ని నైట్ షిఫ్టులలో ఆశించలేమని మహిళలు అన్నారు.⇒ వీధి లైట్లు లేకపోవటం, సరిగా లేని ప్రజా రవాణా వ్యవస్థ కూడా రాత్రివేళ మహిళలకు భద్రత లేకపోవటానికి కారణమని వారు తెలిపారు.దేశంలోని 31 నగరాల్లో 12,770 మంది మహిళల అభిప్రాయాలు సేకరించి జాతీయ మహిళా కమిషన్ ‘నారీ 2025 వార్షిక నివేదిక, భద్రతా సూచిక’ రూపొందించింది. సర్వేలో దాదాపు 60 శాతం మంది మహిళలు తమ నగరాల్లో తాము సురక్షితంగా ఉన్నట్లు చెప్పగా, 40 శాతం మంది అంత సురక్షితంగా లేమని లేదా సురక్షితంగా అస్సలు లేమని భావిస్తున్నట్లు తెలిపారు.యువతులలోని భయాందోళనలు గత ఏడాది కంటే పెరగటాన్ని కూడా నివేదిక గుర్తించింది. 2024లో సర్వేలో పాల్గొన్న మహిళల్లో 7 శాతం మంది బహిరంగ వేధింపులను గురయ్యామని చెప్పగా, 24 ఏళ్లలోపు యువతుల్లో ఇలా చెప్పిన వారి సంఖ్య గరిష్ఠంగా 14 శాతంగా ఉంది. ముఖ్యంగా చదువుకునే అమ్మాయిలు, ఉద్యోగినులైన యువ నిపుణులు, సామాజిక వేడుకల్లో పాలుపంచుకున్న మహిళలు వేధింపులకు గురైనట్లు సర్వే పేర్కొంది.ముగ్గురిలో ఒక్కరే ఫిర్యాదు!ఫిర్యాదు ఇస్తే న్యాయం జరుగుతుందన్న ఆశ బాధిత మహిళల్లో చాలా తక్కువగా ఉందని నివేదిక తెలిపింది. సర్వే ప్రకారం, వేధింపులకు గురైన ముగ్గురిలో ఒకరు మా త్రమే ఫిర్యాదు చేశారు. 75 శాతం మహిళలు.. తమ ఫిర్యాదులను అధికారులు పరిష్కరిస్తారని నమ్మటం లేదు. వేధింపులు, ఇతర ఘటనల్లో 22 శాతం వరకే కేసులు నమోదు కాగా, వాటిల్లో పరిష్కారం అయినవి కేవలం 16 శాతం మాత్రమే. వ్యవస్థపై అపనమ్మకం, బాధితుల మౌనం ఏ స్థాయిలో ఉన్నాయో ఈ లెక్కలు చెబుతున్నాయి. వేధింపు ఘటనల్లో 32 శాతం.. తెలిసిన ప్రాంతాలలో జరుగుతుండగా, 29 శాతం ప్రయాణ సమయాలలో సంభవిస్తున్నాయని నివేదిక తెలిపింది.కోహిమాలో సురక్షితంనగరాల వారీ భద్రతా అసమానతలను కూడా నివేదిక పొందుపరిచింది. కోహిమా, విశాఖపట్నం, భువనేశ్వర్.. భద్రతా సూచికలో అగ్రస్థానంలో ఉన్నాయి, తరువాత ఐజ్వాల్, గ్యాంగ్టక్, ఇటానగర్ ముంబై ఉన్నాయి. ఇందుకు భిన్నంగా పట్నా, జైపుర్, ఫరీదాబాద్, ఢిల్లీ, కోల్కతా, శ్రీనగర్, రాంచీ మరీ దిగువ స్థానాల్లో ఉన్నాయి. రాంచీ అంత సురక్షితమైనది కాదని 44 శాతం మంది మహిళలు భావిస్తుండగా, ఢిల్లీ ఫరీదాబాద్లలో ఈ శాతం దాదాపు 42గా ఉంది. దేశంలోని మహిళల భద్రతను పట్టణ పరిస్థితులు, అక్కడి పాలనా యంత్రాంగం పనితీరు ప్రభావితం చేస్తున్నట్లు ‘నారీ 2025’ తేల్చి చెప్పింది. పనిచేసే చోట భద్రమేపని చేసే చోట భద్రత గురించి 91 శాతం మంది మహిళలు.. కార్యాలయంలోని వాతావరణం సురక్షితంగా ఉందని తెలిపారు. అయితే వారిలో దాదాపు సగం మంది, తమ సంస్థ తప్పనిసరి ‘లైంగిక వేధింపుల నివారణ’ (పి.ఓ.ఎస్.హెచ్. – ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్) యంత్రాంగాన్ని అమలు చేస్తోందో లేదో తమకు తెలియదని చెప్పారు.వేధింపులు⇒ బహిరంగ వేధింపులకు గురయ్యామని చెప్పిన మహిళలు 7 శాతం. 24 ఏళ్లలోపు యువతుల్లో ఇది 14 శాతం.⇒ వేధింపు ఘటనల్లో 32 శాతం తెలిసిన ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి. ⇒ ముఖ్యంగా 38% ఇరుగు పొరుగు వారి వల్లే జరుగుతున్నాయి.⇒ 29 శాతం ప్రయాణాల సమయాలలో సంభవిస్తున్నాయి.⇒ వేధింపుల్లో మాటలతో అత్యధికంగా 58 శాతం చోటు చేసుకుంటున్నాయి.⇒ వేధింపులకు గురైనవారిలో ప్రతి ముగ్గురిలో కేవలం ఒక్కరే ఫిర్యాదు చేస్తున్నారు. -
మహిళా పాఠకులు చదవాల్సిన 20 పుస్తకాలు
స్త్రీలు రాసిన పుస్తకాలు, స్త్రీల గురించిన పుస్తకాలు చదవడం అంటే కొత్త మైదానాల్లోకి అడుగు వేయడమే. సాహిత్యం వికాసాన్ని, వివేచనను ఇస్తుంది. ఇంటిలోని మహిళ పుస్తక పఠనం మొదలెడితే ఇంటిల్లిపాది పాఠకులు అవుతారు. ‘సాక్షి’ పాఠకుల కోసం ప్రత్యేకంగా ప్రతి మహిళ కనీసం చదివి ఉండాల్సిన 20 పుస్తకాలు ఇక్కడ ఇస్తున్నాం. ఇలా ఎంపిక చేయదగ్గవి తెలుగు నుంచి మరో వందైనా ఉన్నాయి. ఈ ఎంపికలో నచ్చినవి తీసుకొని చదవండి.1. సచ్చరిత్ర– బండారు అచ్చమాంబతొలి తెలుగు కథకురాలు బండారు అచ్చమాంబ జీవిత్రచరిత్ర ఇది. గురజాడ అ΄్పారావు కన్నా ముందే ‘ధనత్రయోదశి’ కథ రాసి తెలుగు కథకు బాటలు వేశారు. ‘సచ్చరిత్ర’ తప్పక చదవదగ్గది.2. మావూరి ముచ్చట్లు– పాకాల యశోదారెడ్డితెలంగాణ ప్రాంతం నుంచి మాండలిక సౌందర్యంతో కథలు రాసిన రచయిత్రి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు.3. నా ఇంగ్లండు యాత్ర– పోతం జానకమ్మజానకమ్మ అనే తెలుగింటి ఆడపడుచు 1873లో ఓడలో చేసిన ఇంగ్లండు ప్రయాణ విశేషాలను, ఆనాటి సామాజిక పరిస్థితులను పుస్తక రూపంలో రాశారు. 1876లో ఈ పుస్తకం వెలువడింది.4. శారద లేఖలు– కనుపర్తి వరలక్ష్మమ్మ సాహితీవేత్తగా ప్రసిద్ధి చెందిన వరలక్ష్మమ్మ 1929 నుంచి 1934 వరకు ‘గృహలక్ష్మి’ మాసపత్రికలో రాసిన శారద లేఖలు ప్రసిద్ధి పొందాయి. దురాచారాలను ఖండిస్తూ, స్త్రీల అభ్యున్నతి కాంక్షించేలా నడిచే ఈ లేఖలు అనేక అంశాల గురించి చర్చిస్తాయి.5. స్త్రీ(నవల)– గుడిపాటి వెంకటాచలంస్త్రీవాదాన్ని బలపరుస్తూ ప్రసిద్ధ రచయిత గుడిపాటి వెంకటాచలం 1925లో రాసిన నవల. స్త్రీలు ఏ అడ్డూ లేకుండా స్వేచ్ఛగా జీవించాలన్న తృష్ణకు ఈ నవల నేపథ్యం.6. జానకి విముక్తి (నవల)– రంగనాయకమ్మ స్త్రీలలో రావాల్సిన మార్పులను, వారు సాధించాల్సిన అభ్యున్నతిని కాంక్షిస్తూ రాసిన నవల ఇది. ‘జానకి’ అనే పాత్ర జీవితంలో జరిగిన అనుభవాలను వివరంగా తెలుపుతుంది ఈ పుస్తకం.7. కాలాతీత వ్యక్తులు (నవల) – పి.శ్రీదేవితెలుగు సాహిత్యంలో పేరెన్నికగన్న నవల. పురుషాధిక్యతను నిరసిస్తూ, స్త్రీలు స్వతంత్రంగా ఎదగాలన్న కాంక్షను కనబరుస్తూ సాగే పాత్రలు ఇందులో కనిపిస్తాయి.8. నాలో నేను (ఆత్మకథ) – భానుమతీ నటి, దర్శకురాలు, రచయిత్రి, గాయని, సంగీతకారిణి అయిన భానుమతీ రామకృష్ణ ఆత్మకథ ఈ పుస్తకం. సామాన్య కుటుంబంలో జన్మించిన ఆమె, అంచెలంచెలుగా ఎదిగిన తీరు ఈ పుస్తకంలో చదవొచ్చు.9. గోరాతో నా జీవితం– సరస్వతి గోరాప్రముఖ హేతువాద ఉద్యమకారుడు గోరా సతీమణి సరస్వతి రాసిన ఆత్మకథ ఈ పుస్తకం. సామాన్య గృహిణిగా ఉన్న ఆమె గోరా సాహచర్యంతో హేతువాదిగా ఎదిగిన క్రమాన్ని ఇందులో పొందుపరిచారు.10. రాజకీయ కథలు– ఓల్గాస్త్రీల జీవితాల్లోని విభిన్న పార్శా్వలను, వాటి చుట్టూ అల్లుకున్న రాజకీయాలను పొందుపరిచిన కథలివి. స్త్రీ వాదానికి బలమైన దన్నుగా నిలిచిన కథలు.11. ఇల్లాలి ముచ్చట్లు– పురాణం సుబ్రహ్మణ్య శర్మవారపత్రికలో ప్రచురితమైన ఈ ఇల్లాలి ముచ్చట్లు తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానాన్ని పొందాయి. రోజువారీ సంఘటనలు మొదలుకొని, అంతర్జాతీయ అంశాల దాకా అన్నింటి పట్ల సగటు ఇల్లాలి స్పందన ఇది. హాస్యం, వ్యంగ్యం, సామాజిక అవగాహన కలగలిసిన ముచ్చట్లు.12. రాయక్క మాన్యం (కథలు)– తెలంగాణలోని దళిత జీవన నేపథ్యాన్ని, స్థితిగతులను యథాతథంగా చిత్రించిన కథలివి. దళిత స్త్రీల జీవనపోరాటాన్ని ఈ కథల్లో చూడొచ్చు.13. నల్లపొద్దు– సంపాదకురాలు: దళిత స్త్రీలు రచించిన సాహిత్యాన్ని తొలిసారిగా పుస్తక రూపంలోకి తీసుకొచ్చి అందించిన పుస్తకం. ఈ రచనల్లో అస్తిత్వ ఘర్షణ, నిరంతర పోరాట స్ఫూర్తి కన్పిస్తాయి. 14. నీలి మేఘాలు (స్త్రీవాద కవిత్వం)తెలుగు స్త్రీవాద సాహిత్యంలో కీలకమైన కవిత్వ సంపుటి. స్త్రీల సమస్యలు, వారి అంతరంగాలు, అభ్యంతరాలకు బలమైన వ్యక్తీకరణతో కవిత్వరూపం ఇక్కడ కనిపిస్తుంది.15. నిర్జనవారధి (ఆత్మకథ)– కొండపల్లి కోటేశ్వరమ్మ కమ్యూనిస్టు ఉద్యమకారిణి కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ. 92 ఏళ్ల వయసులో ఆమె రాసిన ఈ పుస్తకం తెలుగు రాష్ట్రాల్లోని అనేక పరిణామాలను వివరిస్తుంది.16. ఆధునిక భారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు: ఫాతిమా షేక్భారతదేశ తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు, సామాజిక సంస్కర్త, జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల సహోద్యోగి ఫాతిమా షేక్. ఆమె జీవిత చరిత్ర తప్పక తెలుసుకోవాల్సినది. రచన: నసీర్ అహ్మద్.17. చదువు తీర్చిన జీవితం (ఆత్మకథ)– కాళ్లకూరి శేషమ్మమెట్టు మెట్టు ఎక్కిన ఒక సామాన్య మహిళ ఆత్మకథ ఈ పుస్తకం. క్రమశిక్షణ, సంయమనంతో తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్న కాళ్లకూరి శేషమ్మ ఏడు దశాబ్దాల అనుభవసారం స్ఫూర్తిదాయకమైనది.18. నా మాటే తుపాకీ తూటా (ఆత్మకథ)తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని, ఆపై ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కమ్యూనిస్టు నేత మల్లు స్వరాజ్యం జీవితాన్ని గ్రంథస్తం చేసిన పుస్తకం ఇది. 19. కుప్పిలి పద్మ కథలుఆధునిక స్త్రీల జీవనంలో వస్తున్న మార్పులు, యువతీయువకుల జీవితపు ఆకాంక్షలను ఒడిసిపట్టిన కథలివి. కథలను కవితాత్మకంగా చిత్రించటం కుప్పిలి పద్మ రచనల ప్రత్యేకత.20. ఎదారి బతుకులు(కథలు)– ఎండపల్లి భారతిబడుగుజీవుల జీవన క్రమాన్ని, వారి సంతోషాలను, సరదాలను, బాధలనూ ఒకచోట చేర్చిన కథలివి. పల్లెవాసుల జీవనాన్ని యథాతథంగా చిత్రించి అందించారు రచయిత్రి ఎండపల్లి భారతి. -
వర్కింగ్ మదర్.. ఎంతో ప్రెజర్!
ఒక భానుతేజ...‘మెటర్నిటీ లీవ్ తర్వాత పాలు తాగే పాపను ఇంట్లో వదిలి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫీస్కి వెళ్తుంటే అనుభవించిన బాధ ఎవరికీ అర్థంకాదు. లిఫ్ట్దాకా పాపను ఎత్తుకుని లిఫ్ట్ లోకి ఎక్కుతున్న ప్పుడు పాపను అత్తయ్య తీసుకుంటుంటే అది నా చున్నీ పట్టుకుని వెళ్లకుండా మొండికేస్తుంటే ఏడుపొ చ్చేది. బలవంతంగా పాపను అత్తయ్య చేతిలో పెట్టి వచ్చేసేదాన్ని’ అంటూ గుర్తుచేసుకుంది భానుతేజ. ఆమె ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఇప్పుడు ఆమె కూతురికి మూడేళ్లు. ఆ పాపను డే కేర్ సెంటర్లో చేర్చింది. అయినా భానుతేజ బాధ, భయం పోలేదు. ఉదయం తొమ్మిదింటికి తాను ఆఫీస్కి వెళ్లేప్పుడు పాపను డే కేర్లో దింపితే.. సాయంత్రం ఏడింటికి తాను ఇంటికి వస్తూ పాపను తీసుకెళ్తుంది. పాపకు కావల్సిన పాలు, భోజనం, స్నాక్స్, డైపర్స్ అన్నీ ఇస్తుంది. అయినా ఏదో తెలియని ఆందోళన. ఆఫీసులో ఉన్నా పాప గురించే ఆలోచన!ఏ ఉద్యోగికైనా నిర్దిష్టమైన పనిగంటలు ఉంటాయి. అలాంటి వెసులుబాటు లేని అలుపెరుగని సేవ అమ్మది! ఆమె ఉద్యోగి కూడా అయితే.. ఆకష్టం మామూలుది కాదు! ఇల్లు, పిల్లలు, కెరీర్.. వీటన్నింటితో వర్కింగ్ మదర్స్ నలిగిపోతుంటారు. మరి, అలాంటి మహిళలకు పరిష్కారం ఏమిటి? కుటుంబం.. ముఖ్యంగా భర్తలు లేదా ఇంట్లోని మగవాళ్లు వాళ్లకు చేదోడుగా ఎలా ఉండొచ్చు?ఎన్నో ఆశలు.. ఆశయాలతో చదువులు చదివి, ఉద్యోగాలు చేసే అతివలు కొందరు. తమకు నచ్చిన లేదా ప్రావీణ్యం ఉన్న పనిని చేయాలన్న లక్ష్యంతో కెరీర్ ఎంచుకునే మహిళామణులు మరికొందరు. రోజురోజుకీ ఖర్చులు పెరిగిపోతున్న నేపథ్యంలో.. వేణ్నీళ్లకు చన్నీల్లలా ఇంటి బండి నడవడానికి సాయపడదామని ఏదో ఒక పనిచేసే పడతులు ఇంకొందరు. వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలు, బ్యాంకు ఉద్యోగులు, టీచర్లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు.. ఇలా విభిన్న రంగాల్లో ఇంటా బయటా రెండు అవతారాలు ఎత్తి పనిచేసే మహిళలు ఎందరో.శత సహస్రావధానంఅమ్మాయిల చదువు, ఉద్యోగాల విషయంలో ఇంటి నుంచి ఎంత ప్రోత్సాహం దొరుకుతున్నా.. పిల్లలు పుట్టగానే ‘పిల్లలా.. కెరీరా?’ అనే డైలమా. రెండిట్లో ఏదో ఒకదాన్నే ఎంచుకోవాల్సిన పరిస్థితి. మొండిగా రెండిటినీ ఎంచుకుంటే.. ఇంటా బయటా చాలా సందర్భాల్లో మద్దతు లేమి లాంటి ఒత్తిళ్లు! ‘కానీ, మగవాళ్ల విషయంలో అలా కాదు. భార్య ఉద్యోగం ఎంత గొప్పదైనా.. ఆమె తనకన్నా రెట్టింపు జీతం తీసుకుంటున్నా సరే.. పిల్లల కోసం కొలువుకి సంబంధించి నో కాంప్రమైజ్. వర్కింగ్ మదర్కి మాత్రం సర్దుబాట్లు తప్పవు’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహిళలు. ఇలా ఇల్లు, పిల్లలు, ఉద్యోగం మధ్య సమన్వయ మనే అష్టావధానం.. కాదు కాదు, శత సహస్రావధానం, ఒక్క భానుతేజదే కాదు.. కడుపులో చల్ల కదలకుండా చేసుకునే టీచర్ ఉద్యోగం నుంచి 24/7 ఆన్టాస్క్ ఉండే ఆంత్రొ ప్రెన్యూర్ వరకు వర్కింగ్ మదర్స్ అందరిదీ!పోనీ పిల్లల్ని వాయిదా వేసుకుంటే..ఇదివరకటిలా పిల్లల కోసం ఇప్పుడు బయ లాజికల్ క్లాక్ను ఫాలో కావాల్సిన అవసరం లేదు. ఎగ్ ఫ్రీజింగ్, ఆంబ్రియో ఫ్రీజింగ్, సరోగసీ లాంటి.. సౌకర్యాలు ఎన్నో ఉన్నాయి. ఆ సహాయంతో కెరీర్లోనే కాదు.. ఆర్థికంగానే స్థిరపడ్డాకే పిల్లల్ని కనే వెసులుబాటు ఉంది. కానీ ఆ ప్రక్రియల్లో సక్సెస్ రేట్ లెక్కేసుకోవాలి. అంతవరకు, జీవనశైలి జబ్బులు రాకుండా జాగ్రత్త పడాలి. ‘ఆ తలనొప్పి కంటే.. వయసులో పిల్లలను కనడమే బెటర్’ అంటున్నారు చాలామంది వర్కింగ్ ఉమన్.మరి పరిష్కారం?వర్కింగ్ మదర్స్కి ఇటు ఉద్యోగం.. అటు పిల్లల పెంపకం మధ్య నలగకుండా.. అపరాధ భావానికి గురవకుండా రెండిటినీ వీలయినంత వరకు సమన్వ యం చేసుకోగల సహకారం కావాలి. ⇒ నెలల వయసు నుంచి స్కూల్ ఈడు వచ్చేవరకు పిల్లల సంరక్షణ కోసం అన్ని సంస్థలు క్రషెస్, డే కేర్ సెంటర్స్ను ఏర్పాటు చేయాలి. దీనివల్ల వర్కింగ్ మదర్స్కు మాన సిక ప్రశాంతత, రిలీఫ్ ఉండటమే కాక పిల్లల కోసం సెలవులు, ముందస్తు అనుమ తులు లాంటి పనివేళల వృథా తగ్గుతుంది అంటున్నారు భిన్నరంగాల్లోని వర్కింగ్ మదర్స్. ⇒ చాలా సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఇలాంటి కన్వీనియెన్స్ ఉన్నప్పటికీ ప్రభుత్వ సంస్థలు సహా మిగిలిన అన్ని రంగాల్లోనూ ఏర్పాటైతే బాగుంటుందనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.‘మగాళ్లూ.. కాస్త ఆలోచించండి’⇒ ‘ఉద్యోగం పురుష లక్షణమే. కానీ, మారుతున్న పరిస్థితుల్లో ఉద్యోగాలు చేస్తున్న మమ్మల్ని కూడా గుర్తించండి, గౌరవించండి’ అని కోరుతున్నారు మహిళలు.⇒ ‘చిన్నచూపు చూడటం, సూటిపోటి మాటలు లేకపోతే మా పని మేం హాయిగా చేసుకుంటాం. కుటుంబంలోనూ సంతోషం వెల్లివిరుస్తుంది’ అంటున్నారు.⇒ ‘పిల్లల చదువులు, ఇంటి పనులు, తమపై ఆధారపడినవారు ఉంటే వారి కష్టసుఖాలు, సింగిల్ మదర్ అయితే అదనపు బాధ్యతలు.. ఇలా పది చేతులున్నా సరిపోనన్ని పనులు. మీరు ఇవన్నీ అర్థం చేసుకుంటే మాకు పదివేలు’ అని కోరుతున్నారు. -
సివిల్స్పై సర్వే తప్పనిసరి!
(మహేశ్వర్ పెరి, ఫౌండర్ చైర్మన్ కెరీర్స్ 360) : దేశంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ పరీక్షలను ‘మదర్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్స్’గా భావిస్తారు. సివిల్ సర్వీస్ పరీక్షల ద్వారానే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్), ఇండియన్ ఫారెన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్), తదితర సర్వీసుల్లో పోస్టులను భర్తీ చేస్తారు. దేశంలోనే అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లక్ష్యంగా ఏటా లక్షలాది మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఏటా దాదాపు వెయ్యి ఖాళీలు మాత్రమే అందుబాటులో ఉంటున్నా సుమారు 11 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అంతటి పోటీపరీక్షలో నెగ్గాలంటే పట్టుదల, అకుంఠిత దీక్ష, కఠోర శ్రమ, జనరల్ స్టడీస్, సంబంధిత సబ్జెక్టులపైన పట్టు తప్పనిసరి. చాలా తక్కువ సక్సెస్ రేటు మాత్రమే ఉన్న ఈ పరీక్షల్లో విజయం కోసం ఏళ్ల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. మొదటి ప్రయత్నంలోనే ఏదో ఒక సర్వీసును దక్కించుకుంటున్నవారు కేవలం 7 శాతం మాత్రమే ఉంటున్నారు. మిగతా 93 శాతం మందికి ఒకటి కంటే ఎక్కువ ప్రయత్నాలు అవసరమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సుదీర్ఘ కాలం కొనసాగే ఈ పరీక్షల ప్రిపరేషన్ యువతపై అధిక భారాన్ని మోపుతూ వారు నేర్చుకునే సామర్థ్యాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ‘యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమయ్యే లక్షలాది మంది యువత కృషి, సమయం వృథా అవుతోంది. వారిపై ఒత్తిడి, వ్యయప్రయాసలు పెరుగుతున్నాయి. ఏళ్ల తరబడి సుదీర్ఘ ప్రిపరేషన్ యువత నేర్చుకునే సామర్థ్యాన్ని, వారి విమర్శనాత్మక ఆలోచనను హరించివేసే ప్రమాదముంది. దరఖాస్తులు పెరుగుతున్నప్పటికీ ఆ మేర పెరగని ఖాళీలు యూపీఎస్సీని ప్రెషర్ కుక్కర్గా మార్చాయి. అంతిమంగా ఈ స్థితి కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు లాభం చేకూర్చుతోంది. యూపీఎస్సీ పరీక్ష విధానంపై దేశవ్యాప్తంగా తప్పనిసరిగా చర్చ జరగాలి. దేశంలో యువతతోపాటు అన్ని వైపుల నుంచి అభిప్రాయాలు స్వీకరించాలి. దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించాలి’ అని నిపుణులు, విద్యావేత్తలు కోరుతున్నారు.ఖాళీలు కొన్నే.. అభ్యర్థులు లక్షల్లో..ఐఏఎస్, ఐపీఎస్ తదితర సర్వీసుల్లో చేరి ప్రజాసేవ చేయాలనుకునే అభ్యర్థులు సివిల్స్ను ఒకప్పుడు కఠినమైన పరీక్షగా భావించేవారు. కానీ ఇప్పుడు ఈ పరీక్షలు యుద్ధాన్ని తలపిస్తున్నాయి. కేవలం కొన్ని ఖాళీల కోసం ఏటా లక్షలాది మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 2000 సంవత్సరంలో ఒక్కో ఖాళీకి 365 మంది పోటీపడేవారు. ఇటీవల ఈ పోటీ మరింత అధికమైంది. 2020–23 మధ్య ఏటా దాదాపు 11.3 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఖాళీలు మాత్రం ఏటా దాదాపు వెయ్యి మాత్రమే ఉన్నాయి. చాలా తక్కువ విజయశాతం అత్యంత కఠినమైన పరీక్ష అయిన యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు విజయం కోసం కొన్నేళ్లపాటు వేచిఉండాల్సి వస్తోంది. 2013కు ముందు ప్రతి 365 మంది అభ్యర్థులకు ఒకరిగా ఉన్న సక్సెస్ రేటు ఆ తర్వాత ప్రతి 1,215 మంది అభ్యర్థులకు ఒకరికి పడిపోయింది. అంటే.. సివిల్స్ సర్వీస్ పరీక్షల్లో విజయ శాతం 0.1%, వైఫల్య శాతం 99.9%. ఇదంతా ఒక దశాబ్దంలో జరిగింది. సుదీర్ఘ ప్రిపరేషన్..సివిల్స్ పరీక్షల్లో ప్రయత్నాల పెంపు అభ్యర్థులకు మేలు చేయడానికి బదులుగా వారిని సుదీర్ఘ కాలం పాటు పరీక్షల ప్రిపరేషన్కే పరిమితమయ్యేలా చేసింది. 2014కు ముందు చాలామంది 2 లేదా 3వ ప్రయత్నంలోనే యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణులయ్యేవారు. ప్రయత్నాల సంఖ్య పెంచాక ఈ సగటు 3–4కు పెరిగింది. సివిల్స్లో విజయం సాధించడానికి 93% మంది విద్యార్థులు ఒకటి కంటే ఎక్కువ ప్రయత్నాలు తీసుకుంటుండటం గమనార్హం. తొలి ప్రయత్నంలో విజయం సాధించేవారు 7 శాతమే ఉంటున్నారు. అభ్యర్థులు తమ తొలి ప్రయత్నానికి ముందు రెండేళ్ల ప్రిపరేషన్ కాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే.. ఈ పరీక్షల కోసం అభ్యర్థులు ఆరేళ్లకు పైగా తమ విలువైన సమయాన్ని కేటాయించాల్సి వస్తోంది. దీంతో సివిల్స్ ప్రతిభ పరీక్షగా కంటే ఓర్పు పరీక్షగా మారిందని చెప్పొచ్చు. అభ్యర్థులు ఎంత ఎక్కువ సమయం, డబ్బు, మానసిక బలాన్ని పెట్టుబడిగా పెట్టగలిగితేనే పరీక్షలో అంతగా అవకాశాలు మెరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. టాప్ ర్యాంకర్లు సైతం..సివిల్స్లో టాప్ ర్యాంకర్లు సైతం 3 నుంచి 5 ప్రయత్నాల్లోనే విజయాన్ని అందుకుంటున్నారు. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించాలనేది చాలామందికి కలగానే మిగులుతోంది. 2024లో టాపర్గా నిలిచిన శక్తి దూబే మొదటి మూడు ప్రయత్నాల్లో ప్రిలిమ్స్ను కూడా దాటలేకపోయింది. నాలుగో ప్రయత్నంలో మెయిన్స్ దాటినా ఇంటర్వూ్యలో విఫలమైంది. 5వ ప్రయత్నంలో ఆమె టాపర్గా నిలిచి సత్తా చాటింది. ఆమె 2018 నుంచి సివిల్స్కు సిద్ధమైతే 2025లో ఐఏఎస్ అధికారిణి అయ్యారు. అంటే.. శక్తి దూబేకు ఐఏఎస్ అధికారిణి కావడానికి ఏకంగా ఏడేళ్లు పట్టింది. అలాగే 2024లో రెండో ర్యాంకు సాధించిన హర్షిత గోయల్ 3 ప్రయత్నాల్లో, మూడో ర్యాంకు సాధించిన డోంగ్రే అర్చిత్ పరాగ్ 2, నాలుగో ర్యాంకు సాధించిన షా మార్గి చిరాగ్ 5, ఐదో ర్యాంకు సాధించిన ఆకాశ్ గార్గ్ 2, ఆరో ర్యాంకు సాధించిన కోమల్ పునియా 3, ఏడో ర్యాంకు సాధించిన ఆయుషి బన్సాల్ 3, ఎనిమిదో ర్యాంకు సాధించిన రాజ్ కృష్ణ ఝా 5, తొమ్మిదో ర్యాంకు సాధించిన ఆదిత్య విక్రమ్ అగర్వాల్ 5, పదో ర్యాంకు సాధించిన మయాంక్ త్రిపాఠి 3 ప్రయత్నాల్లో విజయం సాధించారు. అంటే.. టాప్ పది మందిలో 8 మంది సివిల్స్ సాధించడానికి 3–5 ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. మొత్తం మీద దాదాపు 93% మంది విజయవంతమైన అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువసార్లు సివిల్స్ కోసం ప్రయత్నించారు. తొలిసారి పరీక్షలకు హాజరైనవారిలో దాదాపు 7% మంది మాత్రమే విజయం సాధిస్తున్నారు. పునఃపరిశీలించాల్సిన సమయం ఆసన్నమైందా? ఏమీ నేర్చుకోకుండా పరీక్షకు సిద్ధమవుతున్న వారి ప్రాథమిక సంవత్సరాలను వృథా చేసుకోకుండా ఉండటానికి సివిల్స్ ప్రయత్నాల సంఖ్య, గరిష్ట వయసును పునఃపరిశీలించాల్సిన సమయం ఆసన్నమైందా? 6వ ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థి మొదటి ప్రయత్నంలోనే ఫెయిలైన అభ్యర్థి కంటే మెరుగైనవాడా? మనం మెరిట్ను ఎలా అంచనా వేస్తాం? ప్రయత్నాలు, తీసుకున్న సంవత్సరాల ఆధారంగా విజయానికి వెయిటేజ్ ఇవ్వబడిందా?.. వీటిపైన దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించాలి. పరీక్ష విధానం మార్పుతో మలుపుయూపీఎస్సీ చరిత్రలో 2013 ఒక ప్రధాన మలుపుగా నిలిచింది. ఆ ఏడాది పరీక్షకు కొన్ని నెలల ముందు యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ పరీక్ష విధానాన్ని మార్చింది. జనరల్ స్టడీస్ పేపర్లను పెంచి వెయిటేజీలో మార్పులు తెచ్చింది. దీంతో ఏళ్ల తరబడి పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఆందోళనలు చేశారు. అదనపు ప్రయత్నాలు, వయోపరిమితి సడలింపు రూపంలో ఉపశమనం కోరుతూ దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేశారు. దాంతో ప్రభుత్వం 2014 నుంచి పరీక్షలకు సన్నద్ధమయ్యేవారికి మరో రెండు అటెంప్ట్స్ అదనంగా అవకాశం కల్పించింది. -
యంత్రుడి చేతుల్లోకి మనిషి! డెడ్ ఇంటర్నెట్ థియరీ నిజమే!!
‘‘ఓ మర మనిషి మా లోకి రా..’’ అంటూ పిలిచిన మనిషి.. ఇప్పుడు పూర్తిగా దాని చెప్పుచేతల్లోకి వెళ్లిపోయాడా? ఇంటర్నెట్ అనేది మనిషి చేజారి పోయిందా?.. ఇప్పుడది పూర్తిగా బాట్ల నియంత్రణలో నడుస్తోందా?.. ఈ అర్థం వచ్చేలా ఓపెన్ఏఐ సీఈవో ఆల్ట్మన్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా కలకలం రేగింది. తద్వారా Dead Internet Theory కి బలమైన మద్దతు చేకూరినట్లైంది. ఇంతకీ ఈ థియరీ ఏంటి?.. చాట్జీపీటీ లాంటి ఏఐ చాట్బాట్ను రూపొందించిన వ్యక్తి ఇలా మాట్లాడడం వెనుక ఆంతర్యం ఏంటి? పరిశీలిస్తే.. ఇంటర్నెట్లో మనం చూస్తోంది నిజంగా మనుషులనేనా?.. కొన్ని పోస్టులు చేసేది.. ఇతరుల పోస్ట్లకు కామెంటలు చేసేది.. లైకులు, షేర్లు ఇదంతా మనుషులు చేస్తున్నదేనా?.. లేదంటే అప్పుడెప్పుడో చర్చ జరిగినట్లు.. కృత్రిమ మేధస్సు చేస్తోందా?. ఇప్పటివరకు ఇది కేవలం ఊహగా కనిపించినా.. తాజాగా OpenAI CEO సామ్ ఆల్ట్మన్ చేసిన వ్యాఖ్యలతో ‘Dead Internet Theory’ అనే సిద్ధాంతం వాస్తవానికి దగ్గరగా ఉందేమో అనే అనుమానాలు బలపడ్డాయి. ChatGPT వంటి శక్తివంతమైన AI చాట్బాట్ను రూపొందించిన వ్యక్తి.. సామ్ ఆల్ట్మన్. అలాంటి వ్యక్తి తన ఎక్స్ అకౌంట్లో ఓ ఆసక్తికరమై పోస్ట్ చేశారు.. డెడ్ ఇంటర్నెట్ థియరీని ఇంతకాలం నేను అంతగా నమ్మలేదు. కానీ ఇప్పుడు ఎక్స్(పూర్వపు ట్విటర్)ను చూస్తుంటే చాలా LLM-run అకౌంట్లు ఉన్నట్లు అనిపిస్తోంది అని అన్నారు.i never took the dead internet theory that seriously but it seems like there are really a lot of LLM-run twitter accounts now— Sam Altman (@sama) September 3, 2025ఈ వ్యాఖ్య వైరల్ కావడంతో, పలువురు వినియోగదారులు ఆల్ట్మన్ను వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఆ విషయం తమకు ఎప్పుడో తెలుసని ఒకరు.. డెడ్ఇంటర్నెట్కు పునాది వేసింది మీరే కదా? అని మరొకొరు కామెంట్ చేశారు. బ్రేకింగ్.. LLMల సృష్టికర్త, ఇప్పుడు ఎక్స్లో అన్నీ LLMలే అని బాధపడుతున్నాడు ఇంకొకరు సెటైరిక్గా స్పందించారు. మరొకరైతే ఎలాన్ మస్క్తో ఉన్న వైరంతోనే ఇలా మాట్లాడుతున్నారంటూ కామెంట్ చేశారు.. ఇలా ఆల్ట్మన్ను తమకు తోచిన తెగ ఆడేసుకుంటున్నారు.డెడ్ ఇంటర్నెట్ థియరీ అంటే ఏమిటి?డెడ్ ఇంటర్నెట్ థియరీ అనేది ఒక వివాదాస్పదమైన సిద్ధాంతం, ఇది 2021లో "Dead Internet Theory: Most of the Internet is Fake" అనే బ్లాగ్ ద్వారా ప్రజల్లోకి వచ్చింది. దీని ప్రకారం, ఇంటర్నెట్లో ఎక్కువ భాగం నిజమైన మనుషుల ద్వారా కాకుండా.. AI బాట్స్, ఆటోమేటెడ్ స్క్రిప్ట్స్, మరియు LLM-run అకౌంట్ల ద్వారా నడుస్తోందని అంటోంది. అంటే.. Large Language Model (LLM) ఆధారంగా నడిచే సోషల్ మీడియా లేదంటే ఆన్లైన్ అకౌంట్లు. ఇవి నిజమైన వ్యక్తులు నిర్వహించకపోవచ్చు. అర్టిషీషియల్ ఇంటెలిజెన్సీ(AI) మోడల్స్ ద్వారా ఆటోమేటెడ్గా స్పందించేవి, పోస్టులు చేసేవి.. లేదంటే చాట్ చేసేవి అయి ఉండొచ్చు. ఇంటర్నెట్లో మనం చూస్తున్న చాలా అకౌంట్లు, పోస్టులు, కామెంట్లు.. అన్నీ మనుషులు చేసినవి కాదని.. ఏఐ చాట్బాట్లు చేసినవి అర్థం. అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) మోడల్స్, యాంత్రిక వ్యవస్థలు ఇంటర్నెట్ను పూర్తిగా ఆక్రమించేశాయని.. తద్వారా మనం నిజమైన మనుషులతో కాకుండా, యంత్రాలతో సంభాషిస్తున్నాం అనే ఈ థియరీ చెప్పింది. ఒకరకంగా.. The Matrix సినిమా లాంటి వాస్తవికతను మాయగా చూపించే సిద్ధాంతమన్నమాట. దీనికి ఓ ప్రత్యక్ష ఉదాహరణ పరిశీలిస్తే.. సోషల్ఏఐ SocialAI అనేది డెడ్ ఇంటర్నెట్ థియరీకి ఒక ప్రాక్టికల్ ఉదాహరణ. ఇదొక సోషల్ నెట్వర్క్ యాప్. మైఖేల్ సైమన్ అనే టెక్ ప్రాడిజీ దీనిని రూపొందించాడు. ఈ యాప్లో యూజర్లు చాట్ చేస్తారు.. పోస్టులు పెడతారు.. కామెంట్లు చేస్తారు. కానీ twist ఏంటంటే.. అవతల ఉండేది నిజమైన మనిషి కాకపోవచ్చు. SocialAI లో AI బాట్స్ అచ్చం మనుషుల్లాగే స్పందిస్తాయి. చాలా పోస్టులకు వచ్చిన కామెంట్లు, లైక్స్ అన్నీ కృత్రిమంగా రూపొందించబడినవే. అంటే.. అక్కడ ఉండేది మనిషా? బాట్? అనేదానిపై స్పష్టత లేకుండా పోతుంది.అందుకే అంత రీచ్..సోషల్ మీడియాలో లైకులు, షేర్ల కోసం జరిగే పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ క్రమంలో.. 2016 తర్వాత ఇంటర్నెట్లో నిజమైన యూజర్ యాక్టివిటీ తగ్గిపోయిందన్నది Dead Internet Theory థియరీ చెప్పేది. ఎక్కువ కంటెంట్ బాట్స్, AI, ఆటోమేటెడ్ సిస్టమ్లు తయారు చేస్తున్నాయని, ఫోరమ్లు, సోషల్ మీడియా, కామెంట్స్ అన్నీ నిజమైన మనుషుల నుంచి రావడం తగ్గిపోయిందని చెబుతుందీ సిద్ధాంతం. సపోజ్.. సోషల్ మీడియాలో కొన్ని పోస్టులను గమనించండి. ఆ యూజర్కు పెద్ద ఫాలోయింగ్ ఉండడు. కానీ ఉన్నట్లుండి అతను చేసే ఓ పోస్టుకు విపరీతంగా లైకులు, షేర్లు వస్తాయి. అలాగని అందులోవన్నీ జెన్యూన్గా వచ్చినవి అనుకుంటే పొరపాటే. అదంతా యంత్రుడి మాయాజాలం. యూజర్లు వ్యక్తపర్చాల్సిన అభిప్రాయాలు, ఆన్లైన్ అనుభవాలు.. క్రమంగా కృత్రిమంగా ప్రభావితం అవుతూ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఎలాన్ మస్క్ ట్విటర్ను చేజిక్కించుకున్నాక.. కంటెంట్ క్రియేటర్లకు డబ్బు ఇచ్చే విధానం ప్రారంభమైంది. దీంతో AI బాట్ల వినియోగం విపరీతంగా పెరిగింది. ఏఐ ఆధారిత ఇమేజ్లు, పోస్టులు పెరిగిపోయాయి. తద్వారా ఇష్టానుసారం చేస్తున్న పోస్టులతో రీచ్ దక్కుతోంది. నష్టాలేంటంటే.. నిన్నటి దాకా ఇది ఒక conspiracy theory. కానీ, ఇప్పుడది నిజమై ఉంటుందని ఆల్ట్మన్ పోస్ట్తో స్పష్టమవుతోంది. అయితే ఏఐ బాట్లతో ముప్పు ఉందనే సైబర్ విశ్లేషకులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తూ వస్తున్నారు. వాటి మీద ఆధారపడడం వల్ల మనిషి బుర్రకు పదును పెట్టకపోవడంతో.. స్కిల్స్ మరుగున పడిపోతుంది. మానవ సంబంధాల ప్రామాణికత తగ్గిపోతుంది. ఒక్కోసారి వినియోగదారుల మానసిక స్థితిపై ప్రభావం చూపొచ్చు. అంతేకాదు.. నిజమైన సమాచారాన్ని గుర్తించడం కష్టంగా ఉంటోంది. వెరసి సామాజిక మాధ్యమాలు ఒక యాంత్రిక మాయాజాలంగా మారుతున్నాయి.నిన్ను నీవే మర్చిపోయిన వేళ.. నియంత్రణ నీ చేతుల్లో లేదు. సృష్టి నీదే అయినా, ఆట మాత్రం ఇంకెవరో ఆడుతున్నారు.కొసమెరుపు.. ఏఐ బాట్లు, డీప్ఫేక్లు పెరిగిపోయిన కాలంలో.. నిజమైన వాటిని గుర్తించడం కష్టంగా మారుతోంది. అందుకే ఆన్లైన్లో మనుషులు తమను నిరూపించుకోవడానికి ఒక సాంకేతిక పరిష్కారం అవసరమని సామ్ ఆల్ట్మన్ భావించారు. అలా 2023 జులై 24న పుట్టిందే Worldcoin ప్రాజెక్టు(2019లోనే బీజం పడింది). దీని ద్వారా మనిషి ఐరిస్ ఆధారంగా ఇంటర్నెట్ వినియోగం కోసం ఓ యూనిక్ ఐడీ(Proof of Personhood) ఇస్తారు. అప్పుడు అవతల ఉంది మనిషా? లేకుంటే ఏఐ చాట్బాట్ అనేదానిపై స్పష్టత వస్తుంది. ఇందులో మనుషుల గుర్తింపును రక్షించేందుకు బ్లాక్చెయిన్, బయోమెట్రిక్ వెరిఫికేషన్ వంటివి ఉపయోగిస్తారు. వివిధ దేశాలకు చెందిన కోటి 20 లక్షల మంది ఈ ప్రాజెక్టులో భాగం అయ్యారు. ఈ యాప్ ద్వారా 26 లక్షల అకౌంట్లు క్రియేట్ అయ్యాయి. అయితే ఏఐ కాలంలో.. నిజమైన మనిషిని గుర్తించడానికి ఇది ఒక వినూత్న పరిష్కారమే అయినప్పటికీ సవాళ్లు మాత్రం తప్పడం లేదు. అలా వరల్డ్నెట్వర్క్ ప్రాజెక్టు నత్తనడకన ముందుకు సాగుతోంది.:::వెబ్డెస్క్ ప్రత్యేకం -
మీ ఫోన్లో వైరస్ ఉందా?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నెట్తో అనుసంధామైన స్మార్ట్ఫోన్ చేతిలో ఉంటే అరచేతిలో ప్రపంచం ఉన్నట్టే.. అలాగే మన స్మార్ట్ఫోన్లోకి రహస్య నిఘా (హిడెన్ స్పై) యాప్లు ప్రవేశిస్తే మన కదలికలను ఒక వేగు వెంటాడుతున్నట్టే.. అందుకే ‘మీ ఫోన్లో వైరస్ ఉందా..!’అని చెక్ చేసుకోమని చెబుతున్నారు సైబర్ భద్రత నిపుణులు.స్పైవేర్ యాప్ మీ ఫోన్లోకి చొరబడితే అది మీ పూర్తి డేటాను రహస్యంగా సేకరించి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు. స్పైవేర్ యాప్లను గుర్తించడం కూడా కష్టమేనని అంటున్నారు. అవి చూడడానికి సాధారణ గేమింగ్ యాప్ల మాదిరిగా ఐకాన్తో కొన్ని ఉంటాయని, మరికొన్ని మనకు కనిపించకుండానే తెరవెనుక రన్ అవుతుంటాయని చెబుతున్నారు. ప్రధాన అనర్థాలు ఇవీడేటా ట్రాన్స్మిషన్: మీ ఫోన్లోని కీలక సమాచారాన్ని మీ అనుమతి లేకుండా థర్డ్పార్టీకి (హ్యాకర్లు, ప్రకటనదారులు, హానికరమైన సంస్థలకు) ఎప్పటికప్పుడు పంపుతాయి.ఫోన్ పనితీరులోనూ సమస్యలు: స్పైవేర్ చేరిన తర్వాత అది మీ ఫోన్ వేగాన్ని తగ్గించవచ్చు. తరచూ ఫోన్ వేడెక్కడం.. బ్యాటరీ త్వరగా డిశ్చార్జి అవడం జరుగుతుంది. ప్రైవసీ పోతుంది: ఫోన్లోకి వైరస్ చేరితే ఫొటోలు, కాంటాక్ట్ నంబర్లు, ఇతర ఆర్థిక వివరాలు వంటి వ్యక్తిగత డేటా దొంగిలించబడే ప్రమాదం ఉంది. మన వ్యక్తిగత సమాచారం, వీడియోలు.. ఫొటోలతో ఐడెంటిటీ థెఫ్ట్తోపాటు ఆన్లైన్ బ్యాంకు లావాదేవీల సమాచారం తెలిస్తే ఆర్థిక నష్టానికి దారితీయవచ్చు. అనధికార యాక్సెస్: స్పైవేర్ మీ ఫోన్ను అనధికారికంగా యాక్సెస్ చేసే ప్రమాదం ఉంది. మరిన్ని మాల్వేర్లను ఇన్స్టాల్ చేయడానికి, మీ ఫోన్ కెమెరా, మైక్ను యాక్సెస్ చేయడానికి లేదా యాప్లను మార్చటానికి సైబర్నేరగాళ్లకు వీలు కల్పిస్తుంది.ఫోన్ మన కంట్రోల్ తప్పుతుంది: ఫోన్లో యాప్లు వాటంతట అవే తెరవడం లేదా మూసివేయబడడం. మనకు తెలియకుండానే ఇతర నంబర్లకు టెక్స్ట్ మెసేజ్లు పంపడం. వింత పాప్–అప్లు వస్తుండడం మీరు గమనించవచ్చు. ఫోన్లోకి స్పైవేర్, వైరస్లు ఎలా వస్తాయి? అవగాహన లేకుండా చేసే పనులతో మనమే మన ఫోన్లోకి వైరస్లను ఆహ్వానిస్తున్నామని సైబర్ భద్రత నిపుణులు పేర్కొంటున్నారు. కొన్నిసార్లు మనం అనధికారిక మూలాల నుంచి (థర్డ్పార్టీ లింక్ల నుంచి) అనుమానాస్పద యాప్లను డౌన్లోడ్ చేసుకోవడంతో వైరస్ చేరవచ్చు. ఈ– మెయిల్లు, టెక్స్ట్ మెసేజ్లు, వాట్సాప్ మెసేజ్లలోని అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయడం ద్వారా కూడా హిడెన్ యాప్లు మన ఫోన్లలోకి వచ్చే ప్రమాదం ఉందని సైబర్ భద్రత నిపుణులు పేర్కొంటున్నారు. కొన్నిసార్లు సోషల్ మీడియాలోని హానికరమైన లింకులను క్లిక్ చేసినా వైరస్ వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు.ఫోన్ వైరస్ బారిన పడకుండా ఎలా కాపాడుకోవాలి?» గుర్తింపు పొందిన యాంటీవైరస్ సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేసుకుని ఫోన్ను స్కాన్ చేసుకోవాలి.» ఫోన్ను ఎప్పటికప్పడు అప్డేట్ చేయడంతో సెక్యూరిటీ ప్యాచ్అప్లు, నూతన సెక్యూరిటీ అప్డేట్లు వస్తాయి. దీని వల్ల వైరస్లను అడ్డుకోవచ్చు. » మీరు ఉపయోగించని, అనుమానాస్పద యాప్లను వెంటనే అన్ ఇన్స్టాల్ చేయండి» ఏవైనా యాప్లను డౌన్లోడ్ చేసేటప్పుడు గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ వంటి నమ్మదగిన స్టోర్స్ నుంచే యాప్లు డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ రేటింగ్, రివ్యూలు తప్పక పరిశీలించాలి. » టు ఫ్యాక్టర్ అథెంటికేషన్ను వినియోగించాలి. -
పొదుపు.. చేసి చూపించండి!
ఈ తరం పిల్లలు.. చాలా స్పీడు. వాళ్ల జోరుకు తగ్గట్టు తల్లిదండ్రులు వారికి మంచీ చెడూ చెప్పాలి. చెప్పడం కాదు.. తల్లిదండ్రులు స్వయంగా అలా నడుచుకోవాలి. ఎందుకంటే పిల్లలు ముందు అనుసరించేదీ, అనుకరించేదీ పేరెంట్స్నే. డబ్బుల విషయంలో మరీనూ! అందుకే, తల్లిదండ్రులు ముందు ఆర్థిక పాఠాలు నేర్చుకోవాలి.. ఆచరించాలి..వాటిని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి! ఇంతకీ వాటిని ఎలా చెప్పాలి?మాటలకు.. చేతలకు..విచ్చలవిడిగా ఖర్చు చేయకూడదని మీ పిల్లలకు చెప్పి.. మీరు మాత్రం డిస్కౌంట్ సేల్ ఉందని కొనుగోలు చేశారా? ఆర్థిక అత్యవసర సమయంలో ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఏ లోన్ యాప్లోనో లేదా స్నేహితుల దగ్గరో అప్పు చేసేశారా? మీ ఆదాయం ఎంతో పిల్లలకు తెలిసినప్పుడు.. మీరు చేస్తున్న ఖర్చు ఎక్కువన్న విషయాన్ని మీ పిల్లలు గమనించడం లేదనుకుంటే ఎలా?నిత్యం ‘డబ్బు’ గొడవలుభార్యాభర్తలిద్దరూ సంపాదించే వారైతే.. డబ్బు గురించి గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భార్యాభర్తల్లో ఒకరు ఎక్కువగా ఖర్చు చేస్తూ మరొకరు పొదుపుగా ఉండే కుటుంబాలు కూడా ఎన్నో. ఇలాంటి కారణాల వల్ల ప్రతి ఆర్థిక నిర్ణయం గురించి వాదించుకుంటూ, ఇద్దరూ తరచుగా తగాదాలకు దిగుతుంటారు.ఆర్థిక విషయాల దాటవేతచాలామంది భారతీయులు పిల్లలతో డబ్బు గురించి మాట్లాడటం సరికాదని భావిస్తారు. మరీ ముఖ్యంగా ఆర్థిక సమస్యలను పిల్లలకు చెప్పకుండా దాచేస్తారు.పాకెట్ మనీచాలామంది తల్లిదండ్రులు.. ఒక వయసు దాటాక కూడా పిల్లల ప్రతి ఆర్థిక నిర్ణయంలో తలదూరుస్తుంటారు. వారిపై నమ్మకం ఉంచరు. పిల్లలకు పాకెట్ మనీ ఇవ్వడానికి ఇష్టపడరు. ఒకవేళ ఇచ్చినా.. దాని గురించి సవాలక్ష ప్రశ్నలు, ఎలా ఖర్చు చేశారంటూ విచారణలు!మీ తరం.. ఈ తరం..మీ తల్లిదండ్రుల తరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ భిన్నంగా ఉంది. తరాలు మారుతున్నా.. ఆర్థిక వ్యవస్థ మారుతున్నా.. అది గుర్తించకుండా ఇప్పటికీ చాలామంది తల్లిదండ్రులు పాత పాఠాలే చెప్తుంటారు.పిల్లలపై ప్రభావం ?మీ మాటలకు, చేతలకు పొంతన లేకపోతే ఆర్థిక విషయాల్లో పిల్లలకు గందరగోళం ఏర్పడుతుంది. మీరు ఎక్కువ వడ్డీలకు అప్పులు చేసి, ప్రతినెలా వాటికే మీ జీతంలో ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తున్నారని వారికి తెలిస్తే వారిలో ఆర్థిక క్రమశిక్షణ తప్పిపోతుంది. మీరు చెప్పే మాటలను పిల్లలు నమ్మకపోవచ్చు.⇒ తల్లిదండ్రుల గొడవల వల్ల పిల్లల్లో డబ్బు గురించి ఆందోళన, ఒత్తిడి పెరుగుతాయి. ఆర్థిక విషయాలంటే పిల్లల దృష్టిలో.. గొడవలకు దారితీసేవిగా మారిపోవచ్చు. దీంతో డబ్బు గురించి చర్చ అంటేనే భయపడవచ్చు.⇒ దీనివల్ల పిల్లలకు డబ్బు గురించి అవగాహన లేకుండా పోతుంది. డబ్బు గురించి ఏమీ తెలియకపోవడం వల్ల.. దాని గురించి మాట్లాడాలంటేనే సిగ్గు, ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఆర్థిక లావాదేవీలు చేయాలన్న ఆలోచనలు పెరుగుతాయి.⇒ ఇది మంచి–చెడు గురించి నేర్చుకోకుండా చేయడమే కాకుండా భవిష్యత్తులో వారు తల్లిదండ్రులపై ఆర్థికంగా ఆధారపడేలా చేస్తుంది. ఆ అసంతృప్తి.. తెలిసీ తెలియని వయసులోనే ‘అప్పుల’వైపు వారి మనసును మళ్లేలా చేయవచ్చు.⇒ పాతకాలం నాటి సిద్ధాంతాలతో మీ ఎంపికలను గుడ్డిగా అమలు చేయడం వల్ల పిల్లలు కొత్త ఆర్థిక పాఠాలు నేర్చుకోలేరు. అదే సమయంలో వారి స్నేహితుల్లో కొందరు ఆర్థిక విషయాల్లో చురుగ్గా వ్యవహరిస్తుండటం వీరి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలను మీకు చెప్పాలన్నా సంకోచిస్తారు.ఎలా నివారించాలి ?మీ పిల్లలు తెలివిగా ఖర్చు చేయాలనుకుంటే మీరు బడ్జెట్ను ఎలా తయారు చేస్తారో వారికి ప్రత్యక్షంగా చూపించండి. ముందుగా అత్యవసరమైన వస్తువులకే ప్రాధాన్యత ఇవ్వండి. ఖర్చు చేయదగ్గ డబ్బులు మిగిలితే తక్కువ అవసరం ఉన్న వస్తువులను ఎంచుకోండి. ప్రతినెలా పొదుపు చేయడమూ నేర్పించండి.⇒ ఆర్థిక విషయాల గురించి భార్యాభర్తలు కూర్చుని మాట్లాడుకోవాలి. కుటుంబ సాధారణ లక్ష్యాలు, పిల్లల చదువుకు పొదుపు చేయడం, ఇంటికి కావాల్సిన ముఖ్యమైన వస్తువులు ప్రాధాన్యతగా ఉండాలి. ఇదే విషయాన్ని పిల్లలకు చెప్పడం అవసరం.⇒ పిల్లల వయసుకు తగ్గట్టుగా వారితో ఆర్థిక విషయాలు చర్చించాలి. ఇంట్లో ప్రతినెలా ఎంత ఆదాయం వస్తోంది, ఏయే విషయాలకు ఎంత ఖర్చు చేస్తున్నారు.. ఇవన్నీ చర్చించాలి. డబ్బు జీవితంలో ఎంత ముఖ్యమైనదో వారికి అర్థమైతే.. ఆర్థిక క్రమశిక్షణ దానంతట అదే వస్తుంది.⇒ పాకెట్ మనీ పిల్లలకు కొద్దిగా ఇవ్వండి. దీనిని వారు ఎలా ఖర్చు చేస్తున్నారో.. ఏదో ఇంటరాగేషన్ చేస్తున్నట్టు కాకుండా, సరదా సంభాషణల్లో తెలుసుకోవాలి. దీనివల్ల వారిలో ఆత్మవిశ్వాసం,మీపై నమ్మకం, గౌరవం పెరుగుతాయి. స్వతంత్ర ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటూ డబ్బును బాధ్యతగా ఖర్చు చేస్తారు.⇒ ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ, ఇప్పుడున్న ఆర్థిక సాధనాల గురించి ముందుగా మీరు కొంతైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సొంత నిర్ణయాలు తీసుకోవడానికి వారిని అనుమతించండి. చిన్న చిన్న ఆర్థిక వ్యవహారాల్లో వాళ్లు తప్పులు చేసినా ఫర్వాలేదు. వాటి నుంచి నేర్చుకుంటారు. -
సముద్రాలకు మనుషులే ముప్పు!
భూగోళంపై అన్ని రకాల జీవుల మనుగడకు సముద్రాలు అత్యంత కీలకం. జీవులకు అవసరమైన ప్రాణవాయువును సముద్రాలే అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నాయి. కోట్లాది మంది జీవనోపాధి కల్పిస్తున్నాయి. అంతేకాకుండా ప్రపంచ 90 శాతం వాణిజ్యం సముద్ర మార్గాల ద్వారానే జరుగుతోంది. అయితే, ఆధునిక కాలంలో మానవ కార్యకలాపాల వల్ల అవి పెనుముప్పును ఎదుర్కొంటున్నాయి. మనుషుల వల్ల నానాటికీ పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులు శాపంగా మారుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2050 నాటికి సముద్రాలపై మనుషుల దుష్ప్రభాభావం రెండు రెట్లు పెరుగుతుందని యూరప్లో తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. ఈ వివరాలను ‘సైన్స్’ పత్రికలో ప్రచురించారు. కాలుష్యం, తద్వారా అధిక ఉష్ణోగ్రతల వల్ల సముద్రాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. వాటిలోని జీవజాలం నశించిపోతోంది. మరోవైపు సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. ఆమ్ల ప్రభావంతో సముద్ర జలాలు మరింత ఉప్పుగా మారుతున్నాయి. మొత్తానికి సముద్ర జీవావరణ వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆహ్లాదం పంచే సముద్రాలు ప్రమాదం ముంగిట ఉన్నట్లు అధ్యయనకర్త బెన్ హల్పెర్న్ వెల్లడించారు. భూమిపై మనుషుల కార్యకలాపాల వల్ల సముద్రాలకు ఇప్పటికే చాలా నష్టం జరిగిందని, ఇప్పటికైనా మేల్కొనకపోతే 2050 నాటికి ఈ నష్టం రెండింతలు అవుతుందని తేల్చిచెప్పారు. ఇది నిజంగా ఊహించని పరిణామం అని పేర్కొన్నారు. సముద్రాలపై ప్రతికూల ప్రభావాలు వేగంగా పెరుగుతుండడమే అసలు సమస్య అని వివరించారు. కోలుకోలేని దశకు జీవావరణ వ్యవస్థ సముద్రాలపై వాతావరణ ప్రభావాలే తప్ప మనుషుల ప్రభావం అంతగా ఉండదని ఇన్నాళ్లూ భావించారు. భూమిపై జనవాసాల కంటే సముద్రాల విస్తీర్ణం ఎన్నో రెట్లు ఎక్కువ కాబట్టి ఇలాంటి అంచనాకొచ్చారు. కానీ, మనుషుల ప్రభావం గణనీయంగా ఉంటున్నట్లు తేలింది. ఉష్ణోగ్రతల పెరుగుదలతో సముద్రాలు వేడెక్కుతుండడం ఒక అంశమైతే.. నియంత్రణ లేని చేపల వేట, సముద్ర వాణిజ్యం వంటివి సమస్య తీవ్రతను మరింత పెంచుతున్నట్లు వెల్లడయ్యింది. మానవుల చర్యల వల్ల సముద్రాలు ఒత్తిడికి లోనవుతున్నాయి. ఉష్ణమండల ప్రాంతాలతోపాటు ధ్రువ ప్రాంతాల్లో జీవావరణ వ్యవస్థ ఇప్పటికే కోలుకోలేని దశకు చేరుకుంది. పగడపు దిబ్బలు, మడ అడవులు ధ్వంసం ఆధునిక కాలంలో సముద్ర తీర ప్రాంతాలు సైతం సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. పగడపు దిబ్బలు అంతరించిపోతున్నాయి. మడ అడవులు ధ్వంసమవుతున్నాయి. కాలుష్యం కారణంగా సముద్ర జీవుల వృద్ధికి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. సముద్రాల్లోకి స్వచ్ఛమైన జలం కాకుండా మురికి నీరు చేరుతోంది. స్వచ్ఛమైన జలం, సముద్ర జలం మధ్య సమతూకంలో ప్రతికూల మార్పులు వస్తున్నాయి. ఇవన్నీ సముద్రాలకు నష్టం చేకూర్చడంతోపాటు స్థానికంగా జీవనోపాధి అవకాశాలు తగ్గిపోవడానికి కారణమవుతున్నాయి. ఫలితంగా ఆహారం, ఉపాధి కోసం సముద్రాలపై ఆధారపడే దేశాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. ఈ ముప్పు మరింత పెరుగుతుందే తప్ప తగ్గే అవకాశం లేదని నిపుణులు తేల్చిచెబుతున్నారు. ముప్పు తప్పించుకోవాలంటే వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. ఉష్ణోగ్రతల పెరుగుదలను నియంత్రించాలని, సముద్రాల్లో చేపల వేట నియంత్రణ చర్యలను బలోపేతం చేయాలని, సముద్ర వాణిజ్యంలోనూ నియంత్రణ అవసరమని అంటున్నారు. భవిష్యత్తు వైపు దృష్టిసారిస్తే ఇప్పుడు మనమేం చేయాలో తెలుస్తుందని బెన్ హల్పెర్న్ హితవు పలికారు. భవిష్యత్తును నాశనం చేసుకోవాలా? లేక కాపాడుకోవాలా? అనేది మన చేతుల్లోనే ఉందన్నారు. ముక్కలైన మంచు కొండ ప్రపంచంలోనే అతిపెద్ద మంచు కొండగా రికార్డుకెక్కిన ఏ23ఏ ఐస్బర్గ్ విచ్ఛిన్నమైపోయింది. తన రికార్డును కోల్పోయింది. ఈ ఐస్బర్గ్ ముక్కలుగా విడిపోయింది. మరికొన్ని వారాల్లోనే పూర్తిగా చెదిరిపోయే అవకాశం ఉందని సైంటిస్టులు చెప్పారు. ఏ23ఏ ఐస్బర్గ్ అమెరికాలోని రోడ్ ఐలాండ్ స్టేట్ విస్తీర్ణంతో సమానంగా ఉండేది. దీని బరువు లక్ష కోట్ల టన్నుల పైమాటే. అంటార్కిటికాలో 1986లో ఏర్పడింది. దక్షిణ అట్లాంటిక్ సముద్రంలోని సౌత్ జార్జియా దీవి వైపు ప్రయాణిస్తూ ముక్కలైంది. ప్రస్తుతం ఇది హూస్టన్స్టేట్ విస్తీర్ణానికి తగ్గిపోయింది. ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద మంచు కొండగా డీ15ఏ ఐస్బర్గ్ రికార్డుకెక్కింది. ఏ23ఏ నుంచి విడిపోయిన మంచు ముక్కలకు ఏ23డీ, ఏ23ఈ, ఏ23ఎఫ్ అనే పేర్లు పెట్టారు. కాలుష్యం, వాతావరణ మార్పుల కారణంగా సముద్రం వేడెక్కడం వల్ల ఏ23ఏ ఐస్బర్గ్ విచి్ఛన్నమైనట్లు సైంటిస్టులు స్పష్టంచేశారు. ఇలా మంచు కొండలు ముక్కలై కరిగిపోతే సముద్ర మట్టాలు పెరిగే ప్రమాదం ఉంటుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏసీ, నాన్ ఏసీ కోచ్లలో సదుపాయాల కొరత
సాక్షి, సిటీబ్యూరో: ప్రతిరోజూ సికింద్రాబాద్ నుంచి పాట్నాకు వెళ్లే దానాపూర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (12791) ట్రైన్లో సాధారణ ప్రయాణికులతో పాటు కాశీ, ప్రయాగ తదితర పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు వందలాది మంది భక్తులు సైతం బయలుదేరి వెళ్తారు. ప్రయాణికుల రద్దీ, డిమాండ్ ఎక్కువ.. పరిశుభ్రత తక్కువ.. బోగీలు, మరుగుదొడ్లు సకాలంలో శుభ్రం చేయకపోవడం వల్ల దుర్వాసన వ్యాపిస్తోందని ప్రయాణికుల నుంచి తరచూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సాధారణ బోగీలు కిక్కిరిసిపోవడంతో కొంతమంది రిజర్వేషన్ బోగీల్లోకి అక్రమంగా ప్రవేశిస్తారు. దీంతో బోగీలపై ఒత్తిడి పెరుగుతోంది.మరోవైపు ఆన్బోర్డు సిబ్బంది ఎప్పటికప్పుడు బోగీలను శుభ్రం చేయకపోవడం వల్ల దుర్వాసన ప్రయాణికులను ఠారెత్తిస్తోంది. ఒక్క దానాపూర్ ఎక్స్ప్రెస్ మాత్రమే కాదు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని దూరప్రాంతాల రైళ్లలో అరకొర సదుపాయాల కారణంగా 40 శాతానికి పైగా ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. ‘తిరుగు ప్రయాణంలో పాట్నా నుంచి రాత్రి 9.30గంటల సమయంలో సికింద్రాబాద్కు చేరుకొనే సమయానికి దానాపూర్ ఎక్స్ప్రెస్(12792) మరింత దారుణంగా మారుతుంది. మరుగుదొడ్లు, వాష్బేసిన్లు కంపు కొడతాయి. బోగీల్లోకి బొద్దింకలు వస్తాయి’ అని రామంతాపూర్కు చెందిన ఆనంద్ విస్మయం వ్యక్తం చేశారు.నీటి కొరతే కారణమా..? హైదరాబాద్ నుంచి ప్రతిరోజూ సుమారు 200 రైళ్లు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. వాటిలో 85 ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్ రైళ్లు దూర ప్రాంతాలకు బయలుదేరుతాయి. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే సమయంలో రైళ్లను శుభ్రం చేస్తారు. ఆన్బోర్డ్ సదుపాయాలు కూడా అందజేస్తారు. కానీ రైళ్లు బయలుదేరిన కొన్ని గంటల తర్వాత ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న కొద్దీ సదుపాయాలు లోపిస్తున్నాయి. నీటి లభ్యత లేకపోవడం వల్ల కొన్ని చోట్ల రైళ్లలో నీటిని నింపడం లేదు. బోగీలను శుభ్రం చేయడం లేదు. దీంతో మరుగుదొడ్లు, వాష్బేసిన్లు చెత్తకుప్పలుగా మారుతున్నట్లు ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రయాణికుల సదుపాయాలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.దక్షిణ మధ్య రైల్వేలోని పలు ప్రధాన స్టేషన్ల నుంచి బయలుదేరే దూరప్రాంతాల రైళ్లలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. ముఖ్యంగా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మరే క్రమంలో ఈ నీటి కొరత సవాల్గా మారుతుంది. సికింద్రాబాద్–విజయవాడ, రేణిగుంట, గుంతకల్, సికింద్రాబాద్–గుంటూరు, సికింద్రాబాద్–బల్లార్ష, నాందేడ్–సికింద్రాబాద్ తదితర మార్గాల్లో రాకపోకలు సాగించే దూరప్రాంత రైళ్లలో పరిశుభ్రత లోపిస్తున్నట్లు వెల్లడించింది. సికింద్రాబాద్ డివిజన్ నుంచి బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్ తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలోనూ శుభ్రత ఒక సవాల్గా మారింది.అరకొరగా ఆన్బోర్డు సేవలు.. సాధారణంగా ఏసీ, స్లీపర్ బోగీలను ఎప్పటి కప్పుడు శుభ్రం చేసేందుకు ఆన్బోర్డ్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. కానీ చాలా రైళ్లలో ఈ సిబ్బంది అందుబాటులో ఉండటం లేదు. ఐదారు బోగీలకు కేవలం ఒకరిద్దరు మాత్రమే పనిచేస్తారు. ఆన్బోర్డు సర్వీసులను అందజేసే ప్రైవేట్ సంస్థలు తగినంత మంది సిబ్బందిని నియమించకపోవడం వల్లనే ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. చర్లపల్లి–గోరక్పూర్ తదితర రైళ్లలో ఆన్బోర్డు సర్వీసులు అధ్వాన్నంగా ఉన్నాయని చేవెళ్లకు చెందిన ఫణిరాజ్ తెలిపారు. ‘బళ్లార్షాలో నీళ్లు నింపకుండానే కొన్ని రైళ్లు బయలుదేరుతాయి. ఆ తర్వాత మళ్లీ నాగపూర్లోనే నీళ్లు నింపేందుకు అవకాశం ఉంటుంది. దీంతో మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలు ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది’ అని చెప్పారు.మరోవైపు ఆన్బోర్డు సేవలను అందజేయడంలో విఫలమైన సంస్థలపైన రైల్వే అధికారులు భారీ ఎత్తున పెనాల్టీలు కూడా విధిస్తున్నారు. ఇలాంటి కాంట్రాక్టర్లు, సంస్థలపై సుమారు రూ.22.5 లక్షల పెనాల్టీ విధించినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల నుంచి వచ్చిన 2,265 ఫిర్యాదుల ఆధారంగానే రూ.16.7 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. నగరంలోని చర్లపల్లి, సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లలో వాటరింగ్ సదుపాయం ఉంది. త్వరలో కాచిగూడలోనూ ఏర్పాటు చేయనున్నట్లు ఒక అధికారి చెప్పారు.ఆన్బోర్డ్ సేవలను బలోపేతం చేయాలి సరైన సర్వీసులు అందజేయని సంస్థలు, కాంట్రాక్టర్లపై జరిమానాలు విధించడం ఒక్కటే పరిష్కారం కాదు. అలాంటి వారిని తొలగించి సమర్థవంతమైన సేవలు చేసే వారికి బాధ్యతలను అప్పగించాలి. ఆన్బోర్డ్ సేవల వ్యవస్థను బలోపేతం చేయాలి. – శ్రీనివాస్, ప్రయాణికుడు -
టీచర్స్ డే.. ఆరోజులు మళ్ళీ రావు!
టీచర్ అంటే పాఠాలు చెప్పేవాడు కాదు, జీవితం ఎలా ఉండాలో చూపించే దారిదీపం.. ఇది ఇవాళ విపరీతంగా కనిపిస్తున్న ఓ కొటేషన్. వాట్సాప్లో స్టేటస్గా, ఇన్స్టాగ్రామ్ ఎడిటింగ్లతో తెగ వైరల్ అవుతోంది. డిజిటల్ యుగంలో టీచర్స్ డే సెలబ్రేషన్స్ మారిపోయిందనడానికి ఇదే ఒక రుజువు. కానీ.. నిజమైన టీచర్స్ డే సెలబ్రేషన్స్ ఎలా ఉండేవో మీకు తెలుసా?టీచర్స్ డే అంటే గుర్తొచ్చేది.. ఒకానొక టైంలో స్కూళ్లలో జరిగిన అద్భుతమైన వేడుకలు. టీచర్ల కోసం దాచుకున్న, పేరెంట్స్ను అడుక్కున్న సొమ్ముతో కొనే గిఫ్ట్లు, ఫేవరెట్ టీచర్ల కోసం స్పెషల్గా రాసి.. గీసి తీసుకొచ్చే గ్రీటింగ్స్, వాళ్ల కోసం కొని తెచ్చే గులాబీ పువ్వులు.. బొకేలు, శాలువాలు, చాకెట్లు.. అబ్బో మామూలు హడావిడి నడిచేది కాదు. మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.. బడి పిల్లలే టీచర్ల అవతారం ఎత్తి పాఠాలు బోధించడం గురించి. టీచర్స్ డే.. స్టూడెంట్స్ టీచర్లుగా మారి పాఠాలు చెప్పేవారు. అబ్బాయిలు ప్యాంట్షర్టులు.. పంచెలు, అమ్మాయిలు చీరలు, ప్రిన్సిపాల్ గెటప్కు సూట్ బూట్ స్పెషల్గా వచ్చేవాళ్లు. టీచర్లు హాయిగా విశ్రాంతి తీసుకుని.. నవ్వుతూ, ఆటలాడుతూ సందడిగా గడిపేవారు. విద్యార్థులు టీచర్ల వేషాలు వేసుకుని, బోధనలో తాము నేర్చుకున్నదాన్ని తిరిగి చూపించేవారు. ఆ సమయంలో టీచర్లనూ అనుకరించేవాళ్లు. అలా బడులలో ఒక పండుగ వాతావరణం కనిపించేది. అయితే ఈ ఒక్కరోజు మార్పు.. ఒక ఆట కాదు. గురుపూజోత్సవం ఉద్దేశం వేరు. గురువుల బాధ్యతను అర్థం చేసుకునే ప్రయత్నం. టీచర్ అంటే మనల్ని భయపెట్టే వ్యక్తి కాదు.. మనల్ని అర్థం చేసుకునే వ్యక్తి అని తెలియజేసేది. ఆ అనుభవం విద్యార్థుల్లో గౌరవం, కృతజ్ఞత, నైతికత పెంచేది. నేను చదివిన బడిలో నాలుగేళ్లపాటు టీచర్స్ డే రోజున.. ‘సార్’గా మారిపోయాను నేను. అందులో.. పదో తరగతి చదివే టైంలో మా క్లాస్ వాళ్లకే పాఠాలు చెప్పాల్సి రావడం నన్ను ఎంతో ఎగ్జయిట్ చేసింది. నీట్గా టక్ చేసుకుని.. సోషల్ బుక్ చేతిలో పట్టుకుని.. పైకి గంభీరంగా బిల్డప్ ఇచ్చినా, లోపల మాత్రం ఉప్పొంగే ఆనందంతో తరగతి గదిలో అడుగుపెట్టాను. సీరియస్గా పాఠం చెబుతూ.. మధ్యలో ప్రశ్నలు అడుగుతూ, చాక్పీస్ ముక్కలను వాళ్లపైకి విసురుతూ.. ఆన్సర్ చెప్పనివాళ్లకు పన్మిష్మెంట్ కూడా ఇస్తూ చేసిన ఓవరాక్షన్ అంతా ఇంత కాదు. ‘‘ఆగరా.. రేపు నీ పని చెప్తాం’’ అంటూ నా ఫ్రెండ్స్ నావైపు చూసిన గుర్రుచూపు ఇప్పటికీ నాకు గుర్తు. అరేయ్.. నిజంగా టీచర్లా చేస్తున్నావ్ కదరా అంటూ మా హెడ్ మాస్టర్, టీచర్లు ఇచ్చిన కాంప్లిమెంట్లు, ఆరోజు సాయంత్రం నాకు బెస్ట్ టీచర్గా ఇచ్చిన షీల్డ్.. ఏనాటికి మరిచిపోలేను. నాకే కాదు.. మీలోనూ ఇలాంటి అనుభవాల్లో ఏదో ఒకటి ఉండి ఉండొచ్చు. ఈరోజుల్లో.. అలాంటి వేడుకలు కొంత తగ్గినట్లే అనిపిస్తుంది. టెక్నాలజీ, విద్యావిధానాలు కారణాలు ఏమైనా కావొచ్చు. ఇప్పుడు అలాంటి అనుభవాలు తగ్గిపోయాయి. టీచర్స్ డే అంటే ఏదో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లా.. స్కూల్ ఈవెంట్లా అతికష్టంలా కనిపిస్తోంది. టీచర్స్ డే వేడుకలు సోషల్ మీడియా పోస్టులకే పరిమితమైపోతున్నాయి. ఎంతైనా ఆరోజులే వేరు.. బడిలో మాత్రమే కాదు.. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక గురువు ఉంటారు. వారు చూపిన దారే మన ప్రయాణానికి మార్గదర్శకంగా మారుతుంది. అలాంటి వ్యక్తులకు ఒక చిన్న మెసేజ్, ఒక చిన్న ఫోన్కాల్, ఒక చిన్న “థ్యాంక్యూ” కూడా వాళ్ల హృదయాన్ని తాకొచ్చు. ఇట్లు.. ఓ నిత్యవిద్యార్థి -
A23A: ముక్కలై.. మెగా టైటిల్ను కోల్పోయి!
ఈ భూమ్మీద ఏదీ శాశ్వతం కావన్నాడు ఓ కవి. ప్రభుత్వాలు, పదవులు, ఘనతలు, రికార్డులు.. రోజులు, ఏండ్లు దొర్లే కొద్దీ కొత్తదనానికి అనుగుణంగా మార్పునకు లోనవుతుంటాయి. A23a విషయంలోనూ ఇప్పుడు అదే జరిగింది. ఆరు ముంబై మహానగరాలు కలిస్తే ఎలా ఉంటుందో.. ఆ సైజులో ఉండి అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ఈ ఐస్బర్గ్ హఠాత్తుగా ముక్కలైంది.అంటార్కిటికా ఫ్లిచెనర్ రోన్నె ఐస్ షెల్ఫ్ నుంచి 1986 ఆగష్టులో విడిపోయింది. అప్పటి నుంచి 34 ఏళ్లుగా అక్కడే స్థిరంగా ఉండిపోయింది. అయితే 2020 నుంచి వెడ్డెల్ సముద్రం పశ్చిమం వైపు అది నెమ్మదిగా కదలడం మొదలుపెట్టింది. కిందటి ఏడాది జనవరిలో అది సుడిగుండంలో చిక్కుపోయింది. అయితే అనూహ్యంగా డిసెంబర్ మధ్యలో అది అక్కడి నుంచి బయటపడింది.బలమైన గాలుల ప్రభావమే దాన్ని అక్కడి నుంచి బయటపడేసి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అటుపై యూఎస్ నేషనల్ ఐస్ సెంటర్ దీనిని ఈ భూమ్మీద అతిపెద్ద ఐస్బర్గ్🧊గా ప్రకటించింది. ఒక చిన్న ద్వీపం పరిమాణంలో ఉండి, ట్రిలియన్ టన్నుల బరువుతో.. ప్రపంచంలో నీటిపై తేలియాడుతూ అతిపెద్ద మెగా ఐస్బర్గ్గా గుర్తింపు దక్కించుకుంది.ఆ టైంలో సుమారు 4వేల స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఈ ఐస్బర్గ్.. బ్రిటీష్ సరిహద్దుల వైపు ప్రయాణించడాన్ని శాస్త్రవేత్తలు ఆసక్తిగా గమనించారు. దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఆనుకుని ఉన్న సౌత్ జార్జియాను అది ఢీ కొడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇది ముక్కలైనట్లు సైంటిస్టులు గురువారం ప్రకటించారు. రాబోయే మరికొన్ని వారాల్లో అది మరిన్ని ముక్కలు కావొచ్చని చెబుతున్నారు.మెగా టైటిల్ దానికే..A23A ముక్కలు కావడంతో మెగా ఐస్బర్గ్ టైటిల్ కోల్పోయింది. అమెరికాలోని రోడ్ ఐల్యాండ్ స్టేట్ పరిమాణంలో ఉండేది.. ఇప్పుడు టెక్సాస్ స్టేట్లోని హ్యూస్టన్ పరిమాణానికి పడిపోయింది. దాని ముక్కలకు.. ఏ23డీ, ఏ23ఈ గా నామకరణం చేశారు. దీంతో.. బ్రిటన్ డీ15ఏ ప్రపంచంలోని అతిపెద్ద ఐస్బర్గ్ ఘనతను సొంతం చేసుకుంది.D15A ఐస్బర్గ్ అనేది అంటార్కిటికాలోని అమేరీ ఐస్ సెల్ఫ్ Amery Ice Shelf నుంచి విడిపోయిన భారీ మంచు పర్వతం. ఇది మొదటగా D15 అనే పేరుతో గుర్తించబడింది, కానీ 2016లో ఇది రెండు భాగాలుగా విడిపోయింది. ఇందులో D15A అతిపెద్ద భాగం. D15B అతి చిన్న భాగం. D15A పరిమాణం.. పొడవు: 51 నాటికల్ మైళ్ళు, వెడల్పు: 24 నాటికల్ మైళ్ళు. ఇది సుమారు 3,000 చ.కి.మీ విస్తీర్ణంలో ఉంది. అంటే గోవా రాష్ట్రం అంత పరిమాణం. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం.. D15A స్థిరంగా ఉన్నప్పటికీ, వాతావరణ మార్పులు, సముద్రపు వేడి నీరు, మరియు అలల ప్రభావం వల్ల దీని భవిష్యత్తు కూడా అనిశ్చితంగా ఉంది.A68a గురించి..ఏ68ఏ.. A23a కంటే ముందు ప్రపంచంలో మెగా ఐస్బర్గ్గా రికార్డుల్లో నమోదైంది. పరిమాణంలో లండన్ నగరం కంటే మూడు రెట్లు పెద్దది. బరువు ఒక ట్రిలియన్ టన్నులుగా ఉండేదని అంచనా. ఇది కూడా సౌత్ జార్జియాను ఢీ కొట్టవచ్చని అప్పట్లో ఆందోళన చెందారు. అయితే.. ఐల్యాండ్కు సరిగ్గా వంద మైళ్ల దూరంలో ఉండగానే దానికి భారీగా డ్యామేజ్ అయ్యింది. ఆపై అది సముద్రంలోనే కరిగిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.ఏం జరగొచ్చు?ఏ23ఏ ముక్కలు కావడం అనేది కొత్త విషయం ఏం కాదని.. అదే సమయంలో ఆసక్తికరమైన అంశమేనని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడోకు చెందిన శాస్త్రవేత్త టెడ్ స్కాంబోస్ చెబుతున్నారు. తుపానులు, అలలు A23A అనే భారీ హిమపర్వతాన్ని బలహీనపరిచాయని, దాని లోపల ఉన్న చీలికలను బయటపెడుతూ వచ్చిందని అంటున్నారు. ఇక.. మీజర్స్ అనే మరో శాస్త్రవేత్త అభిప్రాయం ప్రకారం.. త్వరలోనే ఇదిట్రాక్ కూడా చేయలేనంత చిన్న ముక్కలు కావొచ్చని అంటున్నారు. అయితే..వేసవి ముగిసే దాకా ఆ A23A ముక్కలు అలాగే ఉంటే మాత్రం.. ముప్పు తప్పదని స్కాంబోస్ అంటున్నారు. వేడి నీరు కారణంగా ఒక్క రోజులోనే అది మంచు పర్వతం కుప్పకూలినట్లుగా విరిగిపోవచ్చు అని చెప్పారాయన. ఇదిలా ఉంటే.. మంచుపర్వతాలు విరిగిపోవడం వల్ల నేరుగా సముద్ర మట్టం పెరగదు. కానీ ఐస్ షెల్ఫ్లు చిన్నవిగా మారితే.. భూభాగంపై ఉన్న మంచు వేగంగా కరిగి సముద్రంలో కలిసే అవకాశం ఉంటుంది, ఇది సముద్ర మట్టం పెరగడానికి కారణమవుతుంది. -
కెరీర్ లెక్కల్లోనైనా 'మా సారు'...తగ్గేదే లే!
మాస్టారు లెక్కలు చెబితే మనసుకి బాగా ఎక్కింది... అభిమానం అనే లెక్క పెరిగింది. ఆ లెక్క చదువుకే పరిమితం కాలేదు. కెరీర్ లెక్కలు చూసేవరకూ తెచ్చింది. ఓ లెక్కల మాస్టారు ఓ కుర్రాడి జీవితాన్ని అంతగా ప్రభావితం చేశారు. సినిమా ఇండస్ట్రీలో రికార్డు స్థాయి వసూళ్లు లెక్కలు చూస్తున్న డైరెక్టర్ సుకుమార్ తన శిష్యుడు బుచ్చిబాబు సానాకి కాలేజీలో లెక్కల పాఠాలు చెప్పి, డైరెక్టర్ని చేసి, కెరీర్ వసూళ్ల లెక్కలు చూసుకునేవరకూ అండగా ఉన్నారు. ‘ఎప్పటికీ ఉంటారు’ అని శిష్యుడు అంటున్నారు. టీచర్స్ డే సందర్భంగా ‘ఉప్పెన’ ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా తన గురువు సుకుమార్ గురించి ‘సాక్షి’కి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ...→ ముందుగా ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు మీ గురువుకి సంబంధించిన జ్ఞాపకాలను షేర్ చేసుకుంటారా? బుచ్చిబాబు: ఆ రోజుల్లో సుకుమార్ సార్ నాలా బక్క పలచగా ఉండేవారు. తెల్లగా షార్ప్ మీసాలతో హ్యాండ్స్ వరకూ బటన్స్ పెట్టి, ఫుల్ హ్యాండ్స్ చొక్కాలో నీట్గా వచ్చేవారు. ఆయన చిరంజీవిగారి ఫ్యాన్ అని తెలిశాక మా సీనియర్స్ అందరూ ఓ 40, 50 మంది సుకుమార్ సార్ వస్తుంటే ‘మాస్టర్’ సినిమాలో ‘హే జు హే జు’ అని బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టేవారు. ఆయన మురిసి΄ోయేవారు. సుకుమార్ సార్ చిరంజీవిగారి ఫ్యాన్ అయితే మేము సుకుమార్ సార్ ఫ్యాన్స్. → మీరు లెక్కల మాస్టారుకే కనెక్ట్ అవ్వడానికి కారణం? స్టూడెంట్స్ లెక్కలకు కనెక్ట్ అవ్వడం రేర్. అలాంటిది లెక్కల మాస్టార్కి ఎందుకు కనెక్ట్ అవుతాం? అయినా ఆయనకి కనెక్ట్ అయ్యాం. ఎందుకంటే లెక్కలు కూడా సార్ అందంగా చెప్పేవారు. తెలుగు పాఠంలా విడదీసి అర్థమయ్యేలా చెప్పేవారు. సూత్రాల్ని కూడా సులువుగా చెప్పడం మా మాస్టార్ ప్రత్యేకత. అప్పుడు లెక్కలు చెప్పడంలో తగ్గలే. ఇప్పుడు కెరీర్ లెక్కల్లోనూ మా సారు తగ్గేదే లే! → చదువుకునే రోజుల్లో మీ గురువుకి ఏదైనా బహుమతి ఇచ్చారా? నేను ఇవ్వలేదు గానీ, ఆయనే మాకు సినిమాలకి వెళ్ళమని డబ్బులిచ్చేవారు. కానీ ‘నా క్లాస్ వినేసి వెళ్ళండి’ అని కండీషన్ పెట్టేవారు. → ఓ శిష్యుడిగా మీ గురువుకి బహుమతి ఇవాల్సి వస్తే ఏం ఇస్తారు? మా బంధం లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నాను. అందుకే లైఫ్ లాంగ్ నేను చేసే ప్రతీ సినిమాకి ‘సుకుమార్ రైటింగ్స్ బేనర్’ ఉంటుంది. ఓ శిష్యుడిగా నేను ఆయనకిచ్చే గిఫ్ట్ ఇదే అనుకుంటున్నాను. → మీ కెరీర్ మొదలయ్యాక మీ గురువు మీకు ఇచ్చిన బహుమతులేమైనా? ‘ఉప్పెన’ సినిమా అయ్యాక ఆయన ఒక లెటర్ రాశారు. నేను ΄÷ద్దున నిద్ర లేచి చూస్తే సుకుమార్ సార్ లెటర్ రాశారు అని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఫేక్ అనుకుని నమ్మలేదు. అయితే సుకుమార్ సార్ పక్కన ఉన్నవాళ్ళు చెప్తే నమ్మాను. ఆ లెటర్ నా గురువుగారు నా లైఫ్లో నాకు ఇచ్చిన మర్చి΄ోలేని బహుమతి.→ లైఫ్లో కీలక మెట్లు అయిన చదువు, ఆ తర్వాత కెరీర్... ఈ రెండింటిలోనూ సుకుమార్గారితో మీకు కనెక్షన్ ఉంది. మీ ఇద్దరికీ అంత సింక్ కుదరడానికి కారణం? నేను ఇంటర్మీడియట్ అంటే... నా నూనూగు మీసాల వయసు నుండీ ఆయన తెలుసు నాకు. యవ్వనంలో ప్రతి ఒక్కరికీ ఒక రోల్ మోడల్ ఉంటారు కదా. నా రోల్ మోడల్ సుకుమార్ సారే. నాకు టెన్త్ వరకూ రోల్ మోడల్ ఎవరూ లేరు. ఇంటర్మీడియట్కి వెళ్ళిన దగ్గర నుండీ ‘సుకుమార్ సార్ నా రోల్ మోడల్’ అని చెప్పడం మొదలెట్టాను. నేను ఆయన్ని అంత ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. మా ఫ్రెండ్స్ ‘ఒరేయ్ సుకుమార్లా మాట్లాడుతున్నావ్.. ఆలోచిస్తున్నావ్’ అంటారు. నా లోపలకి ఆయన్ని అంత గట్టిగా తీసేసుకున్నాను. → ఓ గురువుగా కెరీర్ గురించి మీకు ఆయన ఎలాంటి సలహాలు ఇస్తుంటారు? ఈ కెరీరే ఆయన సలహా. ఆయన పరిచయం కాక΄ోతే, నా క్లాస్కి ఆయన లెక్కలు మాస్టారు కాక΄ోయి ఉంటే నేను సినిమా వైపు వచ్చి ఉండేవాణ్ణే కాదు. → సుకుమార్గారు కాకుండా మీరు అభిమానించే గురువులు ఎవరైనా ఉన్నారా? గరికిపాటి నరసింహారావుగారు కూడా నా గురువుగారే. కాకినాడ చైతన్య కాలేజ్లో బీఎస్సీ కంప్యూటర్స్ చదువుకునేటప్పుడు సంస్కృతం చెప్పేవారు. ఆయన పాఠాలు చెప్పే విధానం చమత్కారంగా ఉండేది. ఒకసారి రాజు అని నా స్నేహితుడు క్లాస్కి లేట్గా వచ్చి, ‘మే ఐ కమ్ ఇన్ సార్’ అన్నాడు. గరికిపాటిగారు ‘తమరి నామధేయం ఏంటో’ అని అడిగారు. వాడు రాజా అనగానే ‘ఏ రాజ్యానికో’ అని వెంటనే సెటైర్ వేశారు. వాడు క్లాస్ వింటూ నెత్తి మీద టోపీ తీయలేదు. ‘రాజువారు తమరి కిరీటం తియ్యాలి’ అన్నారు. ఆయన అంత చమత్కారంగా ఉండేవారు. పాఠాలను కూడా ప్రవచనాల్లా చెప్పేవారు. ఆయన చెప్పిన సంస్కృతంలోనే నాకు ఎక్కువ మార్కులు వచ్చాయి. ఇలాంటి గురువులు దొరకడం నా అదృష్టం. సినిమాలో ఒకరు, సాహిత్యంలో ఒకరు... నన్ను అమితంగా ప్రభావితం చేసిన ఇద్దరూ గొప్ప వ్యక్తులు. → సుకుమార్ గారు, మీ మధ్య ఏమైనా చిన్ని చిన్ని మనస్పర్థలు వచ్చినప్పుడు ఎవరు ముందుగా మాట్లాడేవాళ్లు? ‘మనం తప్పు చేశాం... ఆయన తిట్టారు. ఫోన్ చేసి మాట్లాడదాం’ అని ఫోన్ తీసేలోపే ఆయన మెసేజ్ ఉండేది. ‘సారీ రా ఏమనుకోకు, ఏదో మాటనేశా’ అని అంటారు. మా గురువుగారు ఎదుటోడు ఎంత పెద్ద తప్పు చేసినా ‘క్షమించడం’లో ముందుంటారు. → మీ జీవితంలో మీ గురువుగారి పాత్ర అంటే... ఏం చెబుతారు? వ్యక్తిగా బుచ్చిబాబు సానాకి అయితే ఏం సంబంధం లేదు గానీ డైరెక్టర్ బుచ్చిబాబు సానా అయితే మాత్రం మొత్తం మా గురువుగారి పాత్రే. → క్లాస్ రూమ్లో మీ మాస్టారు ఎలా ఉండేవారు? బ్లాక్ బోర్డ్ మీద ఒక లెక్క రాసి, అది మాకు ఎక్స్ప్లెయిన్ చేశాక ‘ఎనీ డౌట్స్’ అని చిటికేసి గట్టిగా అరిచి, అడిగేవారు. అలా ఆ మాటతో పక్కకి ΄ోయిన మా బ్రెయిన్స్ని కూడా లోపలికి తీసుకొచ్చేసేవారు (నవ్వుతూ).→ సుకుమార్గారు మిమ్మల్ని ఎలా పిలుస్తారు?నన్ను ఒరేయ్ అనే పిలుస్తారు...అంత క్లోజ్ అయితే తప్ప ఒరేయ్ అని పిలవరు ఎవర్నీ. నాకు ఒరేయ్ అని పిలిపించుకోవడం అమితమైన ఆనందాన్నిస్తుంది.→ గురువుని మించిన శిష్యుడు అనిపించు కోవాలనుకుంటున్నారా? గురువుని మించిన కాదు గానీ గురువు మెచ్చిన శిష్యుడు అవ్వాలనే కోరిక మాత్రం ఎప్పుడూ ఉంటుంది. – డి.జి. భవాని -
భలేగా బ్యాట్మింటన్ ఆడుతున్న రోబో శునకం
కొందరు బ్యాట్మింటన్ ఆడుతుంటే దూరంగా పడిన షటిల్ను వాళ్ల పెంపుడు శునకం పరుగెత్తుకెళ్లి నోటితో కరిచి తెచ్చివ్వడం చూస్తూనే ఉంటా. అయితే ఈ రోబో శునకం మాత్రం షటిల్ను తెచ్చివ్వడానికి బదులు షటిల్బ్యాట్ పట్టుకుని ఆటకు సిద్ధమైంది. రోబోటిక్స్, కృత్రిమ మేథ, క్రీడాంశాల సమ్మేళనంగా రూపుదిద్దుకున్న ఈ కొత్త తరహా రోబో ఇప్పుడు రోబోటిక్ రంగంలో చర్చనీయాంశమైంది. బ్యాడ్మింటన్లో చకాచకా షటిల్తో షాట్స్ కొడుతుంటే టకాటకా తిరిగి షాట్స్ కొడుతున్న చిన్న రోబో శునకానికి ‘ఏఎన్వైఎంఏఎ–ఎనిమల్’అని పేరు పెట్టారు. స్విట్జర్లాండ్లోని ప్రభుత్వరంగ విశ్వవిద్యాలయం అయిన ఈటీహెచ్, జ్యూరిచ్లోని పరిశోధకులు ఈ రోబో శునకాన్ని రూపొందించారు. మెషీన్ లెర్నింగ్, రోబోటిక్స్ల మేలు కలయికగా దీనిని తయారుచేశామని పరిశోధకులు చెప్పారు. మనిషి తరహాలో వేగంగా కదులుతూ షటిల్ గమనాన్ని గుర్తిస్తూ తిరిగి షాట్ కొట్టగలడం ఈ రోబో శునకం ప్రత్యేకత. వర్సిటీలోని రోబోటిక్స్ సిస్టమ్స్ ల్యాబ్లోని ప్రొఫెసర్ మార్కో హట్టర్ సారథ్యంలోని పరిశోధనా బృందం ఈ రోబోను సృష్టించింది. ఇది ఎలా పనిచేస్తుంది? ఈ రోబో శునకం బరువు 50 కేజీలుకాగా ఎత్తు 1.5 అడుగులు మాత్రమే. ఎదురుగా షటిల్కాక్ దూసుకొచ్చే విధానాన్ని విశ్లేషించి, దానికి అనుగుణంగా కాళ్లు కదపాల్సిన విధానాన్ని విశ్లేషించి ఈ రోబోకు ప్రోగ్రామింగ్ చేశారు. ఎదురుగా నిలబడిన ఆటగాడు ఎంత ఎత్తు నుంచి షటిల్కాక్ కొట్టాడు? కాక్ ఎంత ఎత్తు నుంచి దూసుకొస్తోంది? ఎంత వేగంతో వస్తోంది? అది ఏ దిశలో నేలను తాకొచ్చు? అనే పలు అంశాలపై తొలుత పరిశీలనచేసి ఓ అంచనాకొచ్చారు. తర్వాత కాక్ పథానికి తగ్గట్లు ఎనిమల్ రోబో శునకం నాలుగు కాళ్లను ఎటు వైపునకు కదపాలి. పరుగెత్తేలా లేదంటే ఇంకా పైకి లేచి కొడితే సరిపోతుందా? ఒకవేళ పరిగెడితే వెంటనే పడిపోకుండా స్థిరంగా నిలదొక్కుకోవడం ఎలా? అనే అనేక అంశాలపై ముందస్తు అంచనాప్రోగ్రామ్లను రాసుకొని వాటితో తొలుత పరీక్షలు జరిపి విజయవంతమయ్యారు. తర్వాత అన్నింటినీ కలిపి ఆటగాడు కొట్టిన కాక్ను వేగంగా తిరిగికొట్టడం, అది కూడా కోర్ట్కి లోపల పడేలా షాట్ కొట్టడం వంటివి ప్రోగ్రామింగ్కు జతచేశారు. ఆట వేగానికి తగ్గట్లుగా రోబో శునకం నాలుగు కాళ్లు మాత్రమే కాదు ప్రత్యేక ‘చేయి’సైతం చురుకుగా కదిలేలా పలు మార్పులుచేశారు. ఎట్టకేలకు మనిషి ఆటను సైతం ఎదిరించేలా స్థాయికి రోబోను సృష్టించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వయసు పెరుగుతుంటే..ఎత్తు తగ్గుతుంది!
వయసు మీరిన కొద్దీ మన శరీరంలో అనేక మార్పులు వస్తాయి. జుట్టు నెరుస్తుంది. చర్మంపై ముడతలు వస్తాయి. అంతేకాదు ఎత్తు కూడా తగ్గుతారట. 40 ఏళ్ల వయసు వచ్చేనాటికి చాలా మందిలో ఎత్తు తగ్గడం ప్రారంభం అవుతుంది. పురుషుల కంటే మహిళలు ఎక్కువ ఎత్తు తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే వారి ఎముకలు పలుచగా మారడం.. మెనోపాజ్ తర్వాత మరింత త్వరగా జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రచురితమైన అనేక అధ్యయనాలు చెబుతున్న వివరాల ప్రకారం.. – సాక్షి, స్పెషల్ డెస్క్ఎంత ఎత్తు కోల్పోతారు?⇒ 70 ఏళ్ల వయసు వచ్చేసరికి.. మహిళలు దాదాపు 2 అంగుళాలు కోల్పోవచ్చు పురుషులు సగటున ఒక అంగుళం తగ్గవచ్చు⇒ 80 ఏళ్ల వయసు వచ్చేసరికి పురుషులు, స్త్రీలు మరో అంగుళం తగ్గవచ్చుఎందుకు తగ్గుతారు?ఆస్టియోపొరోసిస్: చాలామందిలో.. ప్రధానంగా స్త్రీలలో వెన్నెముక సంకోచించడానికి ఈ వ్యాధి ప్రధాన కారణం. ఆస్టియోపొరోసిస్ బారినపడితే ఎముకలు బరువు తగ్గి పలుచగా, గుల్లబారి పెళుసుగా తయారవుతాయి. తేలికపాటి ఒత్తిడికి కూడా ఎముకలు విరిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.వెన్నెముక మార్పులు..వెన్నెముకలో వెన్నుపూస డిస్క్లు ఉంటాయి. 80% నీరు కలిగిన ఈ డిస్క్లు యవ్వనంలో బలంగా, మృదువుగా ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ ఈ డిస్క్లు క్రమంగా కుంచించుకుపోతాయి.కండరాల బలహీనత..పొట్ట, నడుము కండరాలు బలహీనపడతాయి. ప్రత్యేకించి సార్సోపీనియా అనే పరి స్థితి వల్ల వయసు పెరిగే కొద్దీ కండరాల బరువు, పనిచేసే విధానం, బలం కూడా తగ్గుతాయి. వీటన్నింటి వల్ల వెన్నెముకను నిటారుగా ఉంచడం కష్టమవుతుంది.పాదాల్లో మార్పులు..యవ్వనం వరకు కాస్త ఎగుడు దిగుడుగా ఉన్న పాదాలు.. వయసు పైబడుతున్నకొద్దీ చదునుగా మారవచ్చు. దీనివల్ల మొత్తం ఎత్తు తగ్గొచ్చు.ఈ ప్రక్రియను నెమ్మదించగలరా?⇒ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండాలి. ⇒ ముఖ్యంగా శరీరంలోని కేంద్ర భాగం.. అంటే కటి, తుంటి, వీపు, ఉదర కండరాలను బలోపేతం చేయడానికి, ఎముక పెరుగుదలను ప్రేరేపించడానికి బరువులతో కూడిన వ్యాయామాలు చేయాలి..⇒ఎముకల ఆరోగ్యానికి తోడ్పడటానికి ఆహారంలో తగినంత కాల్షియం, విటమిన్–డి ఉండేలా చూసుకోవాలి. 50 ఏళ్లు పైబడిన మహిళలు, 70 ఏళ్లకు పైబడ్డ పురుషులు ప్రతిరోజూ సుమారు సగటున 1,200 మిల్లీగ్రాముల కాల్షియం, విటమిన్–డి తీసుకోవాలి. స్పష్టమైన మోతాదు, ఆయా వ్యక్తుల శరీరానికి తగ్గ అవసరాల కోసం వైద్య నిపుణులను సంప్రదించడం మేలు.వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి⇒ ఏడాది లేదా రెండేళ్లలో ఒక అంగుళం కంటే ఎక్కువగా ఎత్తు తగ్గితే ఆస్టియోపొరోసిస్ లేదా ఇతర అనారోగ్య సమస్యకు సంకేతం కావచ్చు. ⇒ ఎముకలకు సంబంధించిన ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా నిర్లక్ష్యం చేయవద్దు. -
ప్రకటనల్లోనూ బాద్షా!
సాక్షి, స్పెషల్ డెస్క్: టీవీలో సినిమా అయినా, సీరియల్ అయినా.. నిమిషాల వ్యవధిలో ప్రకటనలు ప్రత్యక్షం అవుతూనే ఉంటాయి. ఏదైనా ఉత్పాదన జనంలోకి సులభంగా చొచ్చుకుపోవాలంటే ప్రముఖులు ఆమోదించాల్సిందే. ప్రముఖ నటుడు, బాలీవుడ్ బాద్షాగా పేరున్న షారూక్ ఖాన్ టీవీ ప్రకటనల్లో ఎక్కువగా కనిపించిన సెలబ్రిటీగా నిలిచారు. ఆ తరువాతి స్థానంలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎం.ఎస్.ధోని ఉన్నారు. టీఏఎం మీడియా రీసెర్చ్కు చెందిన యాడ్ఎక్స్ ఇండియా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. 2025 జనవరి–జూన్ కాలంలో ప్రసారం అయిన టెలివిజన్ ప్రకటనలలో షారూక్ ఖాన్ 8 శాతం వాటాతో అత్యధికంగా కనిపించిన సెలెబ్రిటీగా మొదటి స్థానంలో ఉన్నారు. వివిధ బ్రాండ్లకు సంబంధించి రోజుకు అన్ని చానెళ్లలో కలిపి సగటున ఆయన 27 గంటలు వీక్షకుల ముందు ప్రత్యక్షమయ్యారు. 7 శాతం వాటాతో తరువాతి స్థానంలో పోటీపడుతున్న ఎం.ఎస్.ధోని సగటున రోజుకు 22 గంటలు కనిపించారు. మొదటి పది స్థానాల్లో నిలిచిన ఇతర ప్రముఖులలో అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, అమితాబ్ బచ్చన్, అనన్య పాండే, రణ్బీర్ కపూర్, అనుష్క శర్మ, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ ఉన్నారు.ఎక్కువ బ్రాండ్లతో ధోని2025 మొదటి అర్ధభాగంలో టీవీల్లో ప్రసారం అయిన 43 బ్రాండ్ల ప్రకటనలతో ఎంఎస్ ధోని అగ్రస్థానంలో ఉన్నారు. షారూక్ 35, బిగ్ బి 28 బ్రాండ్స్ యాడ్స్లో దర్శనమిచ్చారు. ఆహారం, పానీయాలుసెలెబ్రిటీల యాడ్స్లో 23 శాతం వాటాతో తొలి స్థానంలో ఆహారం, పానీయాల రంగం ఉంది. వ్యక్తిగత సంరక్షణ, పరిశుభ్రత సంబంధ ఉత్పత్తులు 17 శాతం, గృహ ఉత్పత్తుల విభాగం 8 శాతం వాటాతో తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక ఉత్పత్తులవారీగా చూస్తే టాయిలెట్, ఫ్లోర్ క్లీనర్స్ 8 శాతం, శీతల పానీయాలు 6 శాతం, సబ్బులు 6 శాతం వాటాతో పోటీపడుతున్నాయి. ప్రముఖుల యాడ్స్లో 40 శాతం వాటా కేవలం 10 రకాల ఉత్పత్తులదే. వీటిలో టాయిలెట్–ఫ్లోర్ క్లీనర్స్, శీతల పానీయాలు, వాషింగ్ పౌడర్స్–లిక్విడ్స్, నిర్మాణ సామగ్రి, పెయింట్స్, జీర్ణ సంబంధ ఉత్పత్తులు (డైజెస్టివ్స్), టూత్పేస్టులు, పాల ఆధారిత పానీయాలు ఉన్నాయి.సినీతారలవే అధికంటీవీలో ప్రసారం అయిన ప్రకటనలలో 29 శాతం వాటా సెలెబ్రిటీలది. సెలెబ్రిటీల ప్రకటనల్లో సినీ తారల వాటా ఏకంగా 74 శాతం ఉంది. క్రీడాకారులు 4 శాతం, టీవీ తారలు 3 శాతం ఉన్నారు. 2025 జనవరి–జూన్ లో సెలెబ్రిటీలతో కూడిన ప్రకటనల సంఖ్య 2023 జనవరి–జూన్ తో పోలిస్తే 12 శాతం, గత ఏడాదితో ఇదే కాలంతో పోలిస్తే 20 శాతం తగ్గాయి. ఆన్ లైన్ గేమింగ్లో..ఆహారం, పానీయాల యాడ్స్లో పురుష సెలెబ్రిటీలు ఎక్కువగా కనిపించగా, వ్యక్తిగతసంరక్షణ ప్రకటనల్లో మహిళా సెలెబ్రిటీలు ఆధిపత్యం చెలాయించారు. ఆన్ లైన్ గేమింగ్ విభాగంలో వచ్చిన ప్రకటనల్లో అత్యధిక సంఖ్యలో 38 మంది తారలు తళుక్కుమన్నారు. జంటలతో కూడిన యాడ్స్లో దీపికా పదుకోన్ –రణ్వీర్ సింగ్, అనుష్క శర్మ–విరాట్ కోహ్లీలదే హవా. జంటల ప్రకటనల్లో వీరి వాటా దాదాపు 30 శాతం ఉంది. అక్షయ్ కుమార్–ట్వింకిల్ ఖన్నా, రణ్బీర్ కపూర్–ఆలియా భట్ సైతం యాడ్స్లో ప్రముఖంగా కనిపించారు. -
ఈఎంఐ.. విలాసమే.. విలాపమై!
‘అప్పు’డే తెల్లారిందా.. పాత సినిమాలో ఒక డైలాగ్. మిలేనియల్స్ (1981–96 మధ్య పుట్టినవారు).. జెన్ జీ (1997–2012 మధ్య జన్మించినవారు).. పరిస్థితి ఇలాగే ఉంది. అనవసరా లు, విలాసాల కోసం విపరీతంగా అప్పులు చేసేస్తున్నారు. లోన్యాప్లు.. సులభ వాయిదాలు.. వారిని ‘ఈజీగా’ అప్పుల బాట పట్టేలా చేస్తున్నాయి. ‘అప్పు చేయడం రోగం.. తీర్చకపోవడం ప్రమాదకరం అనేది గుర్తించకపోతే సమస్యలు తప్పవు’ అంటున్నారు నిపుణులు.క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ‘ట్రాన్స్ యూనియన్ సిబిల్’ ప్రకారం.. ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశంలో వ్యక్తిగతంగా రుణాలు తీసుకున్న వారు (యునిక్ ఇండివిడ్యువల్ బారోవర్స్) 28 కోట్ల మంది. ఆర్బీఐ లెక్కల ప్రకారం.. వ్యక్తిగత రుణాలు లేదా వ్యాపారం కోసం లేదా ఇతర అవసరాల కోసం రుణాలు తీసుకునేవారి సంఖ్యతోపాటు, తీసుకునే మొత్తం కూడా పెరిగింది. 2018 మార్చి నాటికి తలసరి రుణం రూ.3.41 లక్షలు ఉంటే 2023 మార్చికి రూ.3.8 లక్షలకు, 2025 మార్చి నాటికి రూ.4.77 లక్షలకు పెరిగింది.కనీసం 3 రుణాలతో..ఫిన్టెక్ సంస్థల వంటి బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ) చిన్నచిన్న మొత్తాల్లో ఇచ్చే రుణాలను జెన్ జీ, మిలేనియల్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. రూ.50వేల కంటే తక్కువ రుణాల్లో.. ఈ సంస్థలు ఇచ్చినవే 84.3 శాతం. ముఖ్యంగా ఇలా రుణం తీసుకుంటున్నవారిలో సుమారు 10 శాతం మంది సమయానికి చెల్లించడం లేదట. మరీ ముఖ్యంగా.. గత త్రైమాసికంలో ఇలా రుణం తీసుకున్నవారిలో 66 శాతానికిపైగా అప్పటికే కనీసం 3 రుణాలు తీసుకుని ఉన్నారని ఆర్బీఐ చెబుతోంది.అనవసర ఖర్చులకు 29 శాతం‘భారత్ ఎలా ఖర్చు చేస్తోంది: వినియోగదారుల వ్యయాల తీరుతెన్నులపై లోతైన అధ్యయనం’ పేరుతో కన్సల్టింగ్, ఫైనాన్షియల్ అడ్వైజరీ సేవల్లో ఉన్న పీడబ్ల్యూసీ ఇండియా సహకారంతో ఫిన్స్ టెక్ సాఫ్ట్వేర్ కంపెనీ పర్ఫియోస్ ఇటీవల ఒక నివేదికను రూపొందించింది. 30 లక్షల మంది టెక్–ఫస్ట్ వినియోగదారుల లావాదేవీల సమాచారాన్ని, వారు చేసే ఖర్చులను పరిశీలించింది.⇒ ప్రజలు చేసే మొత్తం వ్యయంలో హంగులు, ఆర్భాటాలు వంటి అనవసర ఖర్చులకు చేసేది 29 శాతం ఉంటోంది. ఈ ఖర్చుల్లో 62 శాతం కంటే ఎక్కువ ఫ్యాషన్, వ్యక్తిగత సంరక్షణ వస్తువుల షాపింగ్కు చేస్తున్నారు.⇒ తప్పనిసరి ఖర్చులకు చేసే వ్యయం 39% కాగా, అవసరాలకు 32% ఖర్చు చేస్తున్నారు. ⇒ అన్ని నగరాల్లోనూ వ్యక్తులు తమ ఆదాయంలో 33 శాతానికి పైగా నెల వాయిదాల (ఈఎంఐ) చెల్లింపులకు కేటాయిస్తున్నారు.ఈఎంఐ.. ఆదాయాన్ని మింగేస్తూనెల వాయిదాలు (ఈఎంఐలు).. చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కానీ, దీర్ఘకాలంలో ప్రమాదకరమైనవి. ఎప్పుడు ఎంత ఖర్చు పెడుతున్నామో తెలీదు. – ఇందులోని మరో ముఖ్యమైన విషయం. ఈఎంఐల మాటున ఉండే వడ్డీ. ⇒ ఒకేసారి చెల్లించకుండా భవిష్యత్తులో చెల్లించడం వల్ల.. భవిష్యత్తు లక్ష్యాలు, ఖర్చులు, అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు అప్పులు చేయాల్సిన దుస్థితి దాపురిస్తుంది.⇒ ఉద్యోగం పోయినా.. తక్కువ జీతం వచ్చే ఉద్యోగా నికి మారినా.. ఏదైనా అనారోగ్య సమస్యలాంటిది వచ్చి ఆర్థిక అత్యవసర పరిస్థితి వచ్చినా.. ఈఎంఐలు గుదిబండలా మారతాయి. ఒకటికి మించి ఈఎంఐలు ఉంటే ప్రతినెలా తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది.జీరో కాస్ట్ ఈఎంఐచాలామంది ‘జీరో కాస్ట్ ఈఎంఐ’ ఉందిగా అని ఈ మధ్య విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. పేరుకే జీరోకానీ, ఇది కూడా ఖరీదైనదే. ⇒ చాలా సందర్భాల్లో ఆయా కంపెనీలు / వేదికలు ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తాయి.⇒ ఈ లావాదేవీ జరిగిన తరువాత.. ఒకవేళ మనకు ఏదో విధంగా డబ్బు చేతికి అంది ఆ అప్పు తీర్చేద్దామంటే కుదరదు. ముందస్తు చెల్లింపులమీద చార్జీ ఉంటుంది. ⇒ మామూలు ఈఎంఐలానే, ఏదైనా ఒక్క నెలలో చెల్లింపు చేయలేకపోయినా.. ఆలస్యంగా చేసినా.. మొత్తం బకాయిపై వడ్డీ చెల్లించాలి. అలాగే ఆ రుణం తీసుకున్నప్పటి నుంచి జరిపే అలాంటి అన్ని లావాదేవీలపైనా వడ్డీ చెల్లించాలి. ఇలాంటి రకరకాల చార్జీల భారం పడుతుంది.⇒ ఆలస్యంగా చెల్లించడం వల్ల క్రెడిట్ స్కోర్పైనా ప్రభావం పడుతుంది.ఏమిటి పరిష్కారం?ఏది కొనాలని అనిపించినా.. ఒక 10 నిమిషాల పాటు ఆలోచించాలి. మూడు ప్రశ్నలు వేసుకోవాలి.⇒ ఇది అత్యవసరమా? లేక విలాసం కోసం కొంటున్నానా?⇒ దీనిపై చేస్తున్న ఖర్చు నెలవారీ బడ్జెట్ను ఎలా ప్రభావితం చేస్తుంది?⇒ ఇది లేకుండా నేను ఉండలేనా?ఈ ప్రశ్నలకు మీ మనసు చెప్పే సమాధానాలతో మీరు సంతృప్తి చెందాక కొనుగోలు చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకోండి.⇒ వస్తువుల్లో కాకుండా మనుషుల్లో.. అనుబంధాలు, ఆప్యాయతలు, స్నేహాలలో ఆనందాన్ని వెతుక్కోవడం మొదలుపెట్టండి. అంతిమంగా.. అప్పు లేదా ఈఎంఐలు మీ జీవితాన్ని శాసించకుండా చూసుకోండి. ఆనందం, విలాసం కావాల్సిందే.. కానీ, దాని కోసం మీ ఆర్థిక హద్దులు దాటకండి.. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా ఇతరులను చూసి నిర్ణయాలు తీసుకోకండి.ఈఎంఐ.. తత్వం అర్థమై..ఈఎంఐల తత్వం తెలిసిన వాళ్లు వీటికి కొత్త రూపాలు ఇచ్చారు. అవి..⇒ ఎండింగ్ మై ఇన్కమ్ లేదా ఎంప్టీయింగ్ మై ఇన్కమ్ లేదా ⇒ ఈటింగ్ మై ఇన్కమ్ (నా ఆదాయాన్ని తినేస్తోంది)⇒ ఎవ్రీ మంత్ అయామ్ బ్రోక్ (ప్రతినెలా నన్ను ఏడిపిస్తోంది)⇒ ఎక్స్క్యూజ్ మై ఇగ్నోరెన్స్ (నా అజ్ఞానాన్ని మన్నించు)⇒ ఎండ్లెస్ మంత్లీ ఇన్కన్వీనియన్స్ (అంతులేని నెలవారీ అసౌకర్యం)⇒ ఎవ్రీ మంత్ ఇంటరప్టెడ్ (ప్రతినెలా అంతరాయం) ⇒ ఎవ్రీ మంత్ ఇన్ డెటెడ్ (ప్రతినెలా అప్పులు) -
హైదరాబాద్లో ఇక్కడే తరచూ ప్రమాదాలు
హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గించడానికి సన్నాహాలు చేస్తున్న నగర ట్రాఫిక్ విభాగం అధికారులు బ్లాక్స్పాట్స్పై దృష్టి పెట్టారు. తరచూ ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాలను గుర్తించి, కారణాలను అధ్యయనం చేయడంతో పాటు నివారణ చర్యలకు కసరత్తు చేస్తున్నారు. నగరంలోని ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల పరిధిలో నిర్వహించిన స్టడీ ఆధారంగా 54 బ్లాక్స్పాట్స్ ఉన్నట్లు గుర్తించారు. గడిచిన రెండేళ్ల గణాంకాల ఆధారంగా దీన్ని నిర్ధారించారు. – సాక్షి, సిటీబ్యూరోసిటీలో బ్లాక్స్పాట్స్గా పరిగణించే ప్రమాదకరమైన ప్రాంతాలను గుర్తించడానికి ట్రాఫిక్ పోలీసులు శాంతిభద్రతల విభాగం అధికారులతో సమన్వయం ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల నిరోధానికి ట్రాఫిక్ పోలీసులు పని చేస్తారు. అయితే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దానిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసేది మాత్రం లా అండ్ ఆర్డర్ పోలీసులే. ఈ నేపథ్యంలోనే వారితో కలిసి ట్రాఫిక్ పోలీసులు అధ్యయనం చేశారు. 2023–24లో సిటీలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల జాబితాలను సేకరించారు. ఒకే ప్రాంతం లేదా స్టెచ్లో రెండు కంటే ఎక్కువ యాక్సిడెంట్స్ (Accidents) చోటు చేసుకున్న ఏరియాలను గుర్తించారు. వీటిలో యాదృచి్ఛకంగా జరిగిన వాటిని మినహాయించారు. ఇంజినీరింగ్ సహా ఇతర లోపాల వల్ల చోటు చేసుకున్న ప్రమాదాలకు ప్రాధాన్యం ఇస్తూ బ్లాక్స్పాట్స్గా నిర్ధారించారు. అనేకం ‘చావు’రస్తాలే.. నిత్యం ప్రమాదాలు చోటు చేసుకునే ప్రాంతాల్లో అత్యధికం చౌరస్తాలు, జంక్షన్లే ఉంటున్నాయి. రద్దీ వేళలు, సిగ్నల్స్ యాక్టివ్గా ఉండే సమయంలో కంటే మిగిలిన సమయాల్లోనే ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ 54 బ్లాక్స్పాట్స్లో దాదాపు 40 శాతం చౌరస్తాల్లో ఉన్నవే. ఆ ప్రాంతాలు సైతం హైదరాబాద్–సైబరాబాద్–రాచకొండ సరిహద్దుల్లో ఉన్నవి కొన్ని ఉండటం గమనార్హం. వీటిలో చోటుచేసుకుంటున్న ప్రమాదాల్లో మరణించిన/క్షతగాత్రులైన వారిలో 40 శాతం పాదచారులు, మరో 40 శాతం ద్విచక్ర వాహనచోదకులే ఉంటున్నారు. ఇవే ప్రధాన కారణాలు పరిమితికి మించిన వేగం (ప్రదానంగా ఐఆర్ఆర్లో..) ⇒ మద్యం తాగి వాహనాలు నడపటం ⇒ మలుపులు ఉన్న చోట్ల డివైడర్లు, మీడియమ్స్ లేకపోవడం ⇒ అత్యంత సమస్యాత్మకంగా(బ్లైండ్) ఉన్న మలుపులు ⇒ కీలక సూచనలు చేసే సైనేజ్ బోర్డులు లేకపోవడం ⇒ ఇరుకైనా రోడ్లు, ఆపై అక్కడే ఉంటున్న ఆక్రమణలు ⇒ రోడ్డు ఇంజినీరింగ్ను పట్టించుకోకుండా రహదారి నిర్మాణం ⇒ రహదారులపై హఠాత్తుగా చేపడుతున్న మరమ్మతులు ⇒ క్యారేజ్ వేలో తొలగించకుండా వదిలేసిన చెట్లు, కరెంటు స్తంభాలు ⇒ అవసరమైన స్థాయిలో విద్యుత్ దీపాలు లేకపోవడం ⇒ వాహనచోదకులు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం ⇒ నో–ఎంట్రీలోకి వాహనాలతో దూసుకుపోవడం ⇒ రోడ్ మార్కింగ్ పక్కగా లేకపోవడం, శాస్త్రీయత కొరవడటం‘ఇన్నర్’లోనే అత్యధికంగా.. నగర ట్రాఫిక్ కమిషనరేట్ పరిధిలో 28 ట్రాఫిక్ పోలీసుస్టేషన్లు ఉన్నాయి. వీటిలోని కేవలం కొన్నింటిలో మాత్రమే బ్లాక్స్పాట్స్ లేవని తేలింది. అత్యధిక ఠాణాల పరిధిలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకునే బ్లాక్స్పాట్స్ ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. వీటిలోనూ ఒక ఠాణా పరిధిలో ఐదు, మరోదాని పరిధిలో నాలుగు, నాలుగు పోలీసుస్టేషన్ల పరిధిలో మూడేసి, తొమ్మిదింటిలో రెండు చొప్పున యాక్సిడెంట్స్ స్పాట్స్ ఉన్నట్లు ట్రాఫిక్ విభాగం అధికారులు గుర్తించారు. ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్డు(ఐఆర్ఆర్)లో విస్తరించి ఉన్న ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల పరిధుల్లోనే బ్లాక్స్పాట్స్ ఎక్కువగా ఉంటున్నాయని తేలింది.ఏ ఠాణా పరిధిలో ఎన్ని, ఎక్కడ? ⇒ బోయిన్పల్లి: 5 (డెయిరీ ఫాం ఎక్స్ రోడ్, బోయిన్పల్లి చెక్పోస్టు, బోయిన్పల్లి ఎక్స్ రోడ్, సీటీఓ) ⇒ లంగర్హౌస్: 4 (బాపూఘాట్, లక్ష్మీనగర్, మొఘల్ క నాలా, దర్గా) ⇒ గాంధీనగర్: 3 (ట్యాంక్బండ్పైన చిల్డ్రన్ పార్క్, బడేమియా కబాబ్, లేపాక్షి) ⇒ ఎస్సార్నగర్: 3 (ఈఎస్ఐ, ఉమేష్చంద్ర స్టాట్యూ, మైత్రీవనం) ⇒ అఫ్జల్గంజ్: 3 (అఫ్జల్గంజ్ టి జంక్షన్, సీబీఎస్, చాదర్ఘాట్ చౌరస్తా) ⇒ బేగంపేట: 3 (హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, పీఎన్టీ, రసూల్పుర చౌరస్తా) ⇒ చాదర్ఘాట్: 2 (నల్లగొండ చౌరస్తా, మలక్పేట గంజ్) ⇒ మలక్పేట: 2 (మూసరాంబాగ్ చౌరస్తా, వైభవ్ బస్టాప్) ⇒ బహదూర్పుర: 2 (పురానాపూల్ శ్మశానవాటిక, జూపార్క్ చౌరస్తా) ⇒ తిరుమల గిరి: 2 (తిరుమలగిరి చౌరస్తా, లోతుకుంట) ⇒ బంజారాహిల్స్: 2 (కేబీఆర్ పార్క్, రోడ్ నెం.3 జంక్షన్) ⇒ చాంద్రాయణగుట్ట: 2 (బండ్లగూడ చౌరస్తా, ఒమర్ హోటల్) ⇒ గోపాలపురం: 2 (గురుద్వార, రైల్ నిలయం) ⇒ నల్లకుంట: 2 (విద్యానగర్ చౌరస్తా, తిలక్నగర్ చౌరస్తా) ⇒ ఉస్మానియా యూనివర్సిటీ: 2 (హబ్సిగూడ చౌరస్తా, తార్నాక చౌరస్తా) ⇒ జూబ్లీహిల్స్: 1 (జూబ్లీహిల్స్ చెక్పోస్టు) ⇒ చిక్కడపల్లి: 1 (వీఎస్టీ చౌరస్తా) ⇒ గోల్కొండ: 1 (రామ్దేవ్గూడ) ⇒ కార్ఖానా: 1 (బోయిన్పల్లి మార్కెట్ యార్డ్) ⇒ లాలాగూడ: 1 (మెట్టుగూడ చౌరస్తా) ⇒ బొల్లారం: 1 (అల్వాల్ రైతుబజార్) ⇒ సైఫాబాద్: 1 (ఓల్డ్ సైఫాబాద్ ఠాణా) ⇒ బేగంబజార్: 1 (ఎంజే మార్కెట్) ⇒ చాంద్రాయణగుట్ట: 1 (కేశవగిరి టి జంక్షన్) ⇒ హుమాయున్నగర్: 1 (రేతిబౌలి) ⇒ కాచిగూడ: 1 (నిబోలిఅడ్డా వద్ద పాత ఠాణా) ⇒ అంబర్పేట్: 1 (త్రిశూల్ బార్) ⇒ మహంకాళి: 1 (ప్లాజా చౌరస్తా) ⇒ సుల్తాన్బజార్: 1 (కోఠి ఆంధ్రాబ్యాంక్) ⇒ సంతోష్నగర్: 1 (పిసల్బండ చౌరస్తా) చదవండి: హైదరాబాద్కు మరో వందేభారత్ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ సహకారంతో.. నగరంలోని బ్లాక్స్పాట్స్పై అధ్యయనానికి ట్రాఫిక్ విభాగంలో ఇంజినీరింగ్ సెల్ పని చేస్తోంది. మృతులతో కూడిన ప్రమాదాలు చోటు చేసుకున్న ప్రాంతాలను జీహెచ్ఎంసీ (GHMC) అధికారులతో కలిసి అధ్యయనం చేస్తున్నాం. ప్రమాదాలకు కారణాలను గుర్తించి బల్దియా, జాతీయ రహదారుల సంస్థలకు సిఫార్సులు చేస్తున్నాం. ప్రతి మూడు నెలలకు కలెక్టర్ నేతృత్వంలో జరిగే రోడ్ సేఫ్టీ (Road Safety) మీటింగ్స్లో వీటిని ప్రతిపాదించడంతో పాటు పనుల పురోగతినీ సమీక్షిస్తున్నాం. ప్రమాదాలను నియంత్రించేందుకు షార్ట్టర్మ్, లాంగ్టర్మ్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నాం. స్వల్ప మార్పు చేర్పులను ట్రాఫిక్ అధికారులే చేపడతారు. పెద్ద మొత్తంతో ముడిపడిన వాటి విషయంలో స్వచ్ఛంద సంస్థల సహాయం కోరుతున్నాం. ఇప్పటికే ఈ కోణంలో సర్వేజనా ఫౌండేషన్ సహాయం అందిస్తూ కొన్ని చర్యలు తీసుకుంటోంది. బ్లాక్స్పాట్స్ను నిర్మూలించడంతో పాటు నగరంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యల్ని సూచించాల్సిందిగా ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాను కోరాం. ప్రస్తుతం వాళ్లు నగరవ్యాప్తంగా అధ్యయనం చేస్తున్నారు. నివేదిక అందిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటాం. – జోయల్ డెవిస్, హైదరాబాద్ ట్రాఫిక్ చీఫ్ -
ఒత్తిడి.. ఆందోళన ఇవేనయా ప్రపంచాన!
ఆర్థికంగా ఎదగాలన్న ఆశ, సామాజికంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలన్న ఆకాంక్ష, కీర్తి ప్రతిష్టల కోసం పాకులాట.. ఈ పోటీ ప్రపంచంలో మనుషుల్ని మానసిక రోగులుగా మార్చేస్తున్నాయి. పైకి ఆరోగ్యంగా కనిపిస్తున్నా.. మనుషుల్లో ఒత్తిడులు, మనో వైకల్యాలు అధికంగా ఉంటున్నాయి. అనుకోనివి జరగడం ‘ఆందోళన’లోకి, అనుకున్నవి జరగకపోవటం ‘ఒత్తిడి’లోకి మనుషుల్ని నెట్టేస్తున్నాయి.. ప్రాణాల మీదకుతెస్తున్నాయి.. ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక స్పష్టం చేసింది. - సాక్షి, స్పెషల్ డెస్క్ ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న ప్రతి 100 మరణాలలో ఒకటి ఆత్మహత్యేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తాజాగా వెల్లడించింది. 2021లో మొత్తం 7,27,000 మంది వివిధ వయసులలోని వారు ఆత్మహత్య కారణంగా ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. 20 కంటే ఎక్కువ ఆత్మహత్యా యత్నాలలో ఒక ఆత్మహత్య మరణం సంభవిస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. మొత్తం మీద ప్రపంచంలో 100 కోట్ల మందికి పైగా వివిధ మానసిక ఆరోగ్య రుగ్మతలతో జీవిస్తున్నారని నివేదించింది. మెంటల్ హెల్త్ అట్లాస్ 2024 ‘వరల్డ్ మెంటల్ హెల్త్ టుడే’, ‘మెంటల్ హెల్త్ అట్లాస్ 2024’అనే రెండు కొత్త అధ్యయన నివేదికల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వివరాలన్నిటినీ పొందుపరిచింది. రానున్న వారాల్లో, ‘మెంటల్ హెల్త్ అట్లాస్ 2024’నివేదికలో భాగంగా దేశాల వారీగా డేటాను విడుదల చేయనుంది. కోవిడ్ తర్వాత మానసిక అనారోగ్యాలపై డబ్ల్యూహెచ్ఓ చేపట్టిన తొలి కీలకమైన అధ్యయనాలివి. ప్రధాన మానసిక రుగ్మతలుమానవాళిని చుట్టు ముడుతున్న మానసిక రుగ్మతల్లో ‘ఆందోళన’, ‘ఒత్తిడి’లను ప్రధానమైనవిగా డబ్ల్యూహెచ్ఓ గుర్తించింది. 2021లో, అన్ని మానసిక రుగ్మతల్లో ఇవి రెండూ ‘మూడింట రెండు వంతుల’కంటే ఎక్కువగా ఉన్నట్లు కనుగొంది. నివేదిక ప్రకారం – 2011–2021 మధ్య మానసిక రోగుల సంఖ్య ప్రపంచ జనాభా కంటే వేగంగా పెరిగింది! దశాబ్దం క్రితం జనాభాలో 0.9 తొమ్మిది శాతంగా ఉన్న మానసిక రుగ్మతలు 13.6 శాతానికి చేరాయి. లక్ష్యానికి దూరంగా ఐరాస అన్ని దేశాలలో, అన్ని సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో యువతలో సంభవించే మరణాలలో ఆత్మహత్యలే ఎక్కువగా ఉంటున్నాయి. 2030 నాటికి కనీసం మూడింట ఒక వంతు ఆత్మహత్యలను తగ్గించటానికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా ఐక్యరాజ్య సమితి పెట్టుకున్న లక్ష్యం నెరవేరేలా కనిపించటం లేదు. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ఆ గడువు నాటికి 13 శాతం తగ్గుదల మాత్రమే సాధ్యం అయ్యేలా ఉందని డబ్ల్యూహెచ్ఓ అంచనా వేస్తోంది. భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లు » తగినన్ని మానసిక చికిత్స ఆసుపత్రులు లేకపోవటం » ఉన్నవాటిలో కూడా నిర్వహణ పరమైన లోపాలు » రోగుల పట్ల సిబ్బంది క్రూరత్వం, నిర్లక్ష్యం » విధి నిర్వహణలో ఉదాసీనత, నిధుల లేమి » శిక్షణ పొందిన నర్సులు, సోషల్ వర్కర్లు, సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు, కౌన్సెలర్లు, ఇతర ఆరోగ్య కార్యకర్తల తీవ్ర కొరత. 40 దాటితే సమస్యలే» 2021లో ప్రపంచ వ్యాప్తంగా 5 కోట్ల 70 లక్షల మందిలో మానసిక రుగ్మతలు నమోదు అయ్యాయి. (బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్ హెల్త్, న్యూరో సైన్సెస్ నివేదిక ప్రకారం ఇండియాలో 3 కోట్ల మంది తీవ్రమైన మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు) » మొత్తం రుగ్మతల్లో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువగా ఆందోళన, ఒత్తిడి ఉంటున్నాయి. » 2011– 2021 మధ్య, మానసిక రోగుల సంఖ్య ప్రపంచ జనాభా కంటే వేగంగా పెరిగింది. » పురుషులలో ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండటం, బలహీనమైన బంధాలు, (అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ – ఏడీహెచ్డీ, ఆటిజం స్పెక్ట్రమ్) వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. 18 ఏళ్లలోపు వారిలో.. వయసుకు తగ్గ మానసిక ఎదుగుదల, నైపుణ్యాలు లేకపోవడం వంటివి ఎక్కువగా ఉంటున్నాయి. » స్త్రీలలో ప్రధాన సమస్యలు.. ఆందోళన, ఒత్తిడి, ఈటింగ్ డిజార్డర్ (ఎక్కువ లేదా తక్కువ తినడం వంటి రుగ్మతలు). » నలభై ఏళ్లు దాటాక ఒత్తిడి, ఆందోళన పెరిగిపోతున్నాయి. » 50 – 69 సంవత్సరాల మధ్య మనోవైకల్యాలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. -
ఫోన్ చేజారితే....గుండె పగిలినట్టే..
నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు.. చేతిలో ఫోన్ ఉండాల్సిందే. నిద్ర లేకపోయినా, తిండి తినకపోయినా ఫోన్ ఉంటే చాలనుకునే జనమూ ఉన్నారు. అంతలా స్మార్ట్ఫోన్స్ జీవితంలో భాగమయ్యాయి. అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ ఉపకరణం చేజారితే గుండె పగిలినంత పని అవుతుంది. ఈ ఫీలింగ్ ఏ ఒక్కరికో పరిమితం కాదు. దేశంలో అత్యధికులది ఇదే మాట. – సాక్షి, స్పెషల్ డెస్క్టెక్నాలజీ మార్కెట్ రీసెర్చ్ కంపెనీ కౌంటర్పాయింట్ రీసెర్చ్ తాజాగా చేపట్టిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. తమ స్మార్ట్ఫోన్ పగిలిపోయినప్పుడు, కింద పడిపోయినప్పుడు కలత, భయాందోళనకు గురైనట్లు సర్వేలో పాల్గొన్న 95 శాతం మంది తెలిపారు. స్మార్ట్ఫోన్ కొనుగోలు నిర్ణయాలను మన్నిక ప్రభావితం చేస్తోంది. కాబట్టే మన్నిక చాలా ముఖ్యమైన అంశంగా 79 శాతం యూజర్లు భావిస్తున్నారు. తరచూ వాడుతుంటారు కాబట్టి చేతి నుంచి ఫోన్ కింద పడడం సహజం. అలా పడినప్పుడు పాడవకుండా బలమైన స్క్రీన్ ఉండాలని ఎక్కువమంది కోరుకుంటున్నారు. అలాగే బలమైన ఫ్రేమ్, నీట తడిసినా ఏమీకాని వాటర్ రెసిస్టెన్స్ సౌకర్యమూ ఉండాల్సిందేనంటున్నారు. డేటా కోల్పోతామని.. ఫోన్ అంటేనే ఒక ప్రపంచం. ప్రతి ఒక్కరికీ భావోద్వేగాలతో ముడిపడినది. ఫోన్ పాడైతే డేటా నష్టపోతామన్న భయం చాలామందిలో ఉంది. దాదాపు 89 శాతం మంది ఈ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఫొటోలు, వీడియోలు, బ్యాంకింగ్ వివరాలు, కాంటాక్ట్లు, చాట్లు డిలీట్ అవుతాయని ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. అందుకే 90 శాతం మంది కస్టమర్లు తమ ఫోన్లకు కవర్స్, స్క్రీన్ గార్డ్స్తోపాటు బీమా తీసుకుంటున్నారు. ఫోన్ వేడెక్కడం (41 శాతం), బ్యాటరీ సమస్యలు (32), ప్రమాదవశాత్తు నష్టం వాటిల్లడం (32 శాతం) వంటి సమస్యలు సైతం యూజర్లను ఆందోళన కలిగిస్తున్నాయి. గుదిబండగా మరమ్మతు ఫోన్స్ రిపేర్ గుదిబండగా భావిస్తున్నారు. రిపేర్ అంటేనే ఖరీదైన వ్యవహారంగా మారిందని కస్టమర్లు చెబుతున్నారు. 70 శాతం కంటే ఎక్కువ మంది వినియోగదారులు మరమ్మతు ఖర్చుల కోసం రూ.2,000 కంటే ఎక్కువ ఖర్చు చేశారని సర్వేలో తేలింది. దాదాపు 29 శాతం మంది కస్టమర్లు ఫోన్ రిపేర్ కోసం రూ.5,000 కంటే ఎక్కువ వెచ్చించినట్టు తెలిపారు. ‘మన్నిక’పై అధ్యయనం స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఒప్పో ఇండియా తరఫున కౌంటర్పాయింట్ రీసెర్చ్ ఈ సర్వే చేపట్టింది. భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో ‘మన్నిక’అనే అంశం పాత్రను అర్థం చేసుకోవడం లక్ష్యంగా అధ్యయనం జరిగింది. దేశంలోని ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాల్లో 4,564 మంది వినియోగదారుల నుంచి సమాచారం సేకరించి నివేదిక రూపొందించారు. » 78% మంది వినియోగదారులు తమ ఫోన్స్ దెబ్బతింటాయనే భయంతో వర్షం, తీవ్ర ఎండ వంటి కఠిన పరిస్థితుల్లో ఉపయోగించడం లేదు.» 95% మంది యూజర్లు తమ ఫోన్ పగిలిపోయినప్పుడు, పడిపోయినప్పుడు కలత, ఆందోళనకు గురవుతున్నారు.» 79% మంది వినియోగదారులు స్మార్ట్ఫోన్ మన్నిక అత్యంత ముఖ్యమైన అంశంగా భావిస్తున్నారు.» 89% మంది తమ ఫోన్ పాడైతే వ్యక్తిగత డేటాను కోల్పోతామని భయపడుతున్నారు. ఫొటోలు, వీడియోలు, బ్యాంకింగ్ వివరాలు, కాంటాక్ట్లు, చాట్స్ డిలీట్ అవుతాయని ఆందోళన చెందుతున్నారు. -
అంతగా అక్కడ ఏం నచ్చింది జక్కన్న?
ఎస్ఎస్ రాజమౌళి.. లార్జర్ దెన్ లైఫ్ సినిమాలకు కేరాఫ్ దర్శకుడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ప్రతీ చిత్రం.. భావోద్వేగ దృశ్యవిచిత్రమే. భారీ స్థాయిలో నిర్మాణం.. అద్భుతమైన హీరోయిజం.. హైస్టాండర్డ్ విజువల్ ఎఫెక్ట్స్తో ఆయన చెక్కే చిత్రాలు.. ప్రపంచం మొత్తం భారత చలనచిత్ర పరిశ్రమ వైపు చూసేలా చేశాయి. అయితే పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్పై ఇప్పుడు ఆయన దృష్టి పడింది.జక్కన్న ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్బాబుతో (SSMB 29) ఓ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్తో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. తూర్పు ఆఫ్రికా దేశం కెన్యాలో షూటింగ్ చేసుకుంటోందీ చిత్రం. ఆ దేశ మంత్రి ముసాలియా ముదావాదిని మూవీ టీమ్ మర్యాదపూర్వకంగా కలిస్తే.. ఆసక్తికర విషయాన్నే ఆయన తెలియజేశారు.Kenya this past fortnight became the stage for one of the world’s greatest filmmakers, @ssrajamouli, the visionary Indian director, screenwriter, and storyteller whose works have captured the imagination of audiences across continents. Rajamouli, with a career spanning over two… pic.twitter.com/T1xCGVXQ64— Musalia W Mudavadi (@MusaliaMudavadi) September 2, 2025రాజమౌళి రెండు దశాబ్దాలుగా చలన చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. చాలా శక్తివంతమైన కథనాలను, దృశ్యాలను, లోతైన సాంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పడంలో ఆయన ఎంతో ప్రసిద్ధి చెందారు. తూర్పు ఆఫ్రికా అంతటా పర్యటించి 120 మందితో కూడిన రాజమౌళి టీమ్ కెన్యాను ఎంచుకుంది. మసాయి మరా మైదానాల నుంచి మొదలు సుందరమైన నైవాషా, ఐకానిక్ అంబోసెలి వంటి ప్రాంతాలు ఆసియాలోనే అతిపెద్ద చలనచిత్రంగా తెరకెక్కుతున్న మూవీలో భాగం కాబోతున్నాయి.సుమారు 120 దేశాల్లో ఈ మూవీని విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికిపైనే చేరువయ్యే అవకాశం ఉంది. కెన్యాలో షూటింగ్ చేయడం ఒకమైలురాయిగా నిలిచిపోతుంది. ప్రపంచ వేదికపై మా దేశ అందాలను, ఆతిథ్యాన్ని, సుందర దృశ్యాలను చూపడంలో ఈ సినిమా శక్తిమంతంగా పనిచేయనుంది. ఎస్ఎస్ఎంబీ 29 చిత్రంతో కెన్యా తన చరిత్రను ప్రపంచంతో పంచుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ విషయంలో గర్వంగా ఉంది అని ట్వీట్ చేశారాయన. సో.. మహేష్ సినిమాతో సరికొత్త ప్రపంచాన్నే ఆవిష్కరించేందుకు రాజమౌళి సిద్ధమయ్యారన్నమాట. మరి అంతగా ఆయన్ని ఆకర్షించిన విషయాలు అక్కడేం ఉన్నాయి?..కెన్యాలోని మసాయి మరా, లేక్ నైవాషా, అంబోసెలీ నేషనల్ పార్క్.. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రకృతి, వన్యప్రాణి, సఫారీ గమ్యస్థానాలు. వీటిని ఒక్కొక్కటిగా పరిశీలిస్తే..మసాయి మరా నేషనల్ రిజర్వ్ (Masai Mara National Reserve).. బిగ్ ఫైవ్కు ఆవాసం. అంటే.. సింహం, చిరుతపులి, ఏనుగు, గేదె, రైనోలు ఇక్కడ నివసిస్తున్నాయి. ప్రతి సంవత్సరం జూలై-అక్టోబర్ మధ్యలో లక్షలాది వన్యప్రాణులు (విల్డీబీస్ట్, జెబ్రాలు) టాంజానియాలోని సెరెంగెటి నుంచి మసాయి మరాకు వలస వస్తాయి.సుమారు 500కి పైగా పక్షుల జాతులు ఆవాసం ఉన్నట్లు అంచనా. ఉదయం, సాయంత్ర వేళల్లో గేమ్ డ్రైవ్లు ద్వారా వన్యప్రాణులను దగ్గరగా చూడొచ్చు.అంబోసెలీ నేషనల్ పార్క్ (Amboseli National Park).. ఆఫ్రికాకు మాత్రమే కాదు.. ప్రపంచంలోనే అత్యున్నత శిఖరంగా పేరున్న కిలిమంజారో పర్వతశ్రేణి నేపథ్యంగా కనిపిస్తుంది ఈ పార్క్. ఆఫ్రికన్ ఏనుగుల గుంపులకు ఇది ఎంతో ప్రసిద్ధి. సింహాలు, చిరుతలు, జిరాఫీలు, జీబ్రాలు అనేక ఇతర జాతులు కనిపిస్తాయి. పొడి ప్రాంతం అయినప్పటికీ ఇక్కడి నీటి వనరులు వన్యప్రాణులకు ఆకర్షణగా నిలుస్తాయి.లేక్ నైవాషా (Lake Naivasha).. అనేక రకాల పక్షులు, నీటిలో నివసించే వన్యప్రాణులతో ఈ సరస్సు జీవవైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంటుంది. ప్రైవేట్ అభయారణ్యం.. క్రెసెంట్ ఐల్యాండ్లో జిరాఫీ, జీబ్రాలు, ఇతర మృగాలు స్వేచ్ఛగా సంచరిస్తుంటాయి. దీంతో ఫొటోగ్రాఫర్లు, నేచర్ లవర్స్కి ఇదొక స్వర్గధామం. నైవాషా ఐకానిక్ సరస్సులో హిప్పోలు(నీటి ఏనుగులు), పక్షుల రాకపోకలతో కనువిందు చేసే దృశ్యాలను చూడటానికి బోటు ప్రయాణాలు అందుబాటులో ఉన్నాయి.ఈ మూడింటితో పాటు అరుదైన జాతుల వన్యప్రాణుల ఆవాసం సంబురు (Samburu)లోనూ చిత్రీకరణ జరగవచ్చని తెలుస్తోంది. గ్రెవీస్ జెబ్రా (Grevy's Zebra), సోమాలీ ఆస్ట్రిచ్ (Somali Ostrich), రెటిక్యులేటెడ్ జిరాఫీ (Reticulated Giraffe), బేసియా ఒరిక్స్ (Besia Oryx), గెరెనుక్ (Gerenuk) ఈ ఐదు అరుదైన జాతుల వల్ల ఈ ప్రాంతాన్ని ‘సంబురు స్పెషల్ ఫైవ్’ అని పిలుస్తారు. వన్యపప్రాణి పరిశోధకులు, ఫొటోగ్రాఫర్లకు ఇది వరల్డ్ ఫేవరెట్ స్పాట్గా పేరుంది.భారతీయ చిత్ర పరిశ్రమ.. కెన్యా అడవులను ప్రధాన లొకేషన్గా ఎంచుకోవడం ఇదే మొదటిసారి!!. పైగా మసాయి మరా, అంబోసెలీ, లేక్ నైవాషా అద్భుతమైన ప్రకృతి దృశ్యాలతో, వన్యప్రాణులతో నిండి కెన్యా సఫారీకి ఇవి ఒక కంప్లీట్ ప్యాకేజీగా ఉన్నాయి. దీనికి తోడు చిత్రంలో మహేష్ బాబు పాత్ర ఒక రగ్డ్ ఎక్స్ప్లోరర్ రోల్లో కనిపిస్తారని.. అరుదైన ఔషధం కోసం వెతుకుతూ అడవుల్లో ప్రయాణిస్తారనే స్టోరీ లైన్ ఒకటి తెరపైకి వచ్చింది. సో.. ఈ తరహా కథకు పురాతనమైన.. మనిషి నియంత్రణలో లేని అడవులు(అన్టేమ్డ్) అవసరమని రాజమౌళి అనుకుని ఉండొచ్చు. పైగా కెన్యా లాంటి దేశం భారతీయ సినిమాకు కొత్త వేదికగా నిలవడమే కాకుండా పాన్ వరల్డ్ ప్రేక్షకులనూ ఆకట్టుకునే ప్రయత్నం కూడా. మొదట్లోనే చెప్పుకున్నట్లు.. లార్జర్ దెన్ లైఫ్ అనిపించాలంటే విలక్షణమైన కెన్యా దేశపు లొకేషన్లు ఈ విజన్కు సరిపోతాయి అని జక్కన్న ఫిక్స్ అయి ఉండొచ్చు. -
లలితం... అజరామరం ఆయన పాట!
“రమేశ్ నాయుడు ఈ పదం సంగీత ప్రియులకు అమృతంలా తోస్తుంది. తన వేలి చివరల నుంచి సంగీతాన్ని అలలుగా విసిరేసే స్వర బ్రహ్మ ఆయన! గుండెను లాలించి మత్తులో ఓలలాడించే మెలొడీలు సృష్టించాలంటే ఆయన తర్వాతే ఎవరైనా. ఈ తరానికి రమేశ్ నాయుడి పేరు తెలియకపోవచ్చు. కానీ “శివరంజని, ‘మేఘ సందేశం’, ‘ముద్ద మందారం’, “శ్రీవారికి ప్రేమలేఖ, “స్వయంకృషి లాంటి సినిమాల కోసం ఆయన స్వరపరిచిన పాటలు మాత్రం సుపరిచితం. మాధుర్య ప్రధానమైన పాటలే కలకాలం నిలుస్తాయని రమేశ్ నాయుడు గట్టిగా నమ్మేవారు. సాహిత్యానికే బాణీలు కట్టేవారు. అందుకే ఆ పదాల సొగసు చెక్కు చెదరదు, భావం నేరుగా మనసును తాకుతుంది.ఇదీ రమేశ్ నాయుడి స్వర ప్రస్థానం!పసుపులేటి రమేశ్ నాయుడు 1933, నవంబర్ 25న కృష్ణాజిల్లా కొండపల్లిలో జన్మించారు. తెలుగు కంటే హిందీ పాటలే ఆయన్ను ఎక్కువగా ప్రభావితం చేశాయి. హిందీ సినిమాల్లో గాయకుడు కావాలన్న కోరికతో ఇల్లొదిలి బొంబాయి చేరుకున్నారు. కొన్నాళ్ళు ఢక్కాముక్కీలు తిన్నాక బి.ఆర్. చోప్రాను చేరుకోగలిగారు. ఆయన కోరిక మేరకు కొన్ని బాణీలు కట్టారు. అవి చూసి ఆశ్యర్యపోయిన చోప్రా ఆయన్ను AMV కంపెనీకి రికమెండ్ చేశారు. అలా 14 ఏళ్ళ వయసులోనే రమేశ్నాయుడు AMV కంపెనీలో పని చేశారు. 16 ఏళ్ళ వయసులో “బంద్వల్ పహీజ్ఙా అనే మరాఠీ సినిమాకి సంగీతం అందించారు. హిందీలో ఆయన చేసిన ఏకైక సినిమా “హామ్లెట్“. 1954లో విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆడకపోవడం ఆయన్ను నిరాశపరిచింది. ఆ తర్వాత అనారోగ్య కారణాల వల్ల రమేశ్ నాయుడు మద్రాసు వచ్చేశారు. 1957లో ప్రముఖ నటి సి. కృష్ణవేణి నిర్మించిన “దాంపత్యం సినిమాకు సంగీతం అందించారు. అదే ఆయనకు తొలి తెలుగు చిత్రం.1959లో “మనోరమ సినిమా కోసం హిందీ గాయకుడు తలత్ మెహమూద్ తో రమేశ్ నాయుడు ఏకంగా నాలుగు పాటలు పాడించారు. కానీ పేరు వస్తున్న టైంలో కలకత్తాకి మకాం మార్చారు. అక్కడ ఒక బెంగాలీని పెళ్ళి చేసుకున్నారు. అక్కడే పదేళ్ళ పాటు బెంగాలీ, నేపాలీ, ఒరియా సినిమాలకు పని చేశారు.1972లో “అమ్మ మాట సినిమాతో తెలుగులో రమేశ్ నాయు డి ప్రయాణం మళ్ళీ మొదలైంది. ఈ సినిమాలో సినారె రాసి, ఎల్.ఆర్. ఈశ్వరి పాడిన మాయదారి సిన్నోడు అనే మత్తెక్కించే పాటను అంతే గమ్మత్తుగా స్వరపరిచారు. 1973లో హీరో కృష్ణ నిర్మించిన “దేవుడు చేసిన మనుషుల్ఙు సినిమాలో విన్నారా అలనాటి వేణుగానం ఎంత హాయిగా ఉంటుందో ఈశ్వరి పాడిన మసక మసక చీకటిలో ఐటమ్ సాంగ్ అంత కవ్విస్తుంది.రాజశ్రీ పాటల రచయితగానే మనందరికీ తెలుసు. కానీ ఆయన సంగీత దర్శకత్వంతో పాటు సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు. 1975లో ఆయన డైరెక్ట్ చేసిన “చదువుసంస్కారం సినిమాకి రమేశ్ నాయుడు సంగీతం అందించారు. ఇందులోని దీపానికి కిరణం అనే పాట లలితంగా ఉంటుంది.“సీతా ఔర్ గీతాకి రీమేక్ గా నాగిరెడ్డి, చక్రపాణి 1973లో తీసిన “గంగమంగ, అదే ఏడు వచ్చిన “జీవితం సినిమాలు, 1974లో వచ్చిన “చందన నాయుడు గారికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. చందన సినిమా కోసం జానకమ్మ పాడిన పొన్నపూలా ఉయ్యాలా అనే పాట నిజంగా పొన్నపూల పరిమళాన్ని వెదజల్లుతున్నంత గొప్పగా ఉంటుంది. ఇందులో ఆయనే స్వయంగా పాడిన ఓ రామ చక్కని బంగారు బొమ్మ కంట తడి పెట్టిస్తుంది.ఆ ముగ్గురు!రమేశ్ నాయుడు స్వర యాత్రను గొప్ప మలుపు తిప్పింది మాత్రం తెలుగు సినిమాకే మూల స్తంభాల్లాంటి ముగ్గురు దర్శకులు! ఆ ముగ్గురు దర్శకరత్న దాసరి నారాయణరావు, హాస్య బ్రహ్మ జంధ్యాల, విజయ నిర్మల! ఈ ముగ్గురు దర్శకుల మొదటి సినిమాలకు స్వర కల్పన చేసిన ఘనత కూడా ఆయనకే దక్కింది.దాసరి నారాయణరావుతో...దాసరితో రమేశ్ నాయుడి అనుబంధం 1972లో వచ్చిన “తాతమనవడు సినిమాతో మొదలైంది. దర్శకుడిగా దాసరికి ఇది మొదటి సినిమా. ఇందులో రమేశ్ నాయుడు స్వరం కూర్చి, రామకృష్ణ పాడిన అనుబంధం ఆత్మీయత అనే పాట ఇప్పటి తరానికి కూడా బాగా తెలుసు. దాసరి దర్శకత్వం వహించిన “రాధమ్మ పెళ్లి(1974) కోసం రమేశ్ నాయుడు స్వయంగా పాడిన టైటిల్సాంగ్ఆర్ద్రతతో మనసును బరువెక్కిస్తుంది.1976లో బాలచందర్ డైరెక్ట్ చేసిన “అపూర్వ రాగంగళ్ అనే తమిళ సినిమాను దాసరి తెలుగులో “తూర్పు పడమరగా తీశారు. తమిళ పాటల్నేయథాతథంగా వాడకుండా కొత్త బాణీలు కట్టే స్వేచ్ఛనిచ్చారు. స్వరములు ఏడైనా అంటూ సి. నారాయణరెడ్డి గుప్పించిన తాత్వికతను రమేశ్ నాయుడి బాణీలో అంతే చక్కగా పలికించారు సుశీలమ్మ. ఇందులో ‘శివరంజని నవరాగిణి’ అంటూ సినారె రాసిన క్లిష్టమైన సాహిత్యానికి శివరంజని రాగంలో రమేశ్ నాయుడు చేసిన స్వర కల్పన అటు మాస్ ని ఇటు క్లాస్ ని ఆకట్టుకుంది. ఈ పాటకు కొనసాగింపుగానే 1978లో దాసరి “శివరంజని సినిమా తీశారని చెబుతారు. ఈ సినిమా కోసం జోరు మీదున్నావు తుమ్మెదా అంటూ కల్యాణి రాగంలో సుశీలమ్మ పాడిన పాటను ఇప్పటికీ, ఎప్పటికీ మర్చిపోలేం. నవమి నాటి వెన్నెల నీవు వెన్నెలంత మెత్తగా అనిపిస్తుంది. సందమామ వచ్చాడమ్మా అంటూ చందమామలా చల్లగా తాకే పాట, అభినవ తారవో లాంటి పాటలు రమేశ్ నాయుడి పనితనానికి మచ్చుతునకలు.“చిల్లర కొట్టు చిట్టెమ్మ (1977) తెలుగు సినిమా చరిత్రలో ఓ ప్రభంజనం. దాసం గోపాలకృష్ణ రాసిన నాటకాన్ని అంతే అద్భుతంగా తెరకెక్కించారూ దాసరి. ఈ సినిమాలో తల్లి గోదారికే ఆటుపోటుంటే అనే పాటకు రమేశ్ నాయుడికి ఉత్తమ గాయకుడిగా నంది అవార్డు వచ్చింది. ఇక చూడు పిన్నమ్మ అనే కొంటె పాట గొప్ప ట్రెండ్క్రియేట్చేసింది.దాసరి డైరెక్షన్ లో వచ్చిన “కల్యాణి (1979) కోసం దాసం గోపాలకృష్ణ రాసిన గుబులు పుట్టిస్తావు అనే పాటలో నాయుడు గారు ఒకే సాహిత్యాన్ని రెండు బాణీలతో పలికించి గొప్ప ప్రయోగం చేశారు. ఇందులోనే లలిత కళారాధనలో అనే పాట చిరస్థాయిగా నిలిచిపోయింది.1982లో దాసరి, రమేశ్ నాయుడు కాంబినేషన్ లోనే వచ్చిన సినిమా “జయసుధ, నాయుడు గారికి బాగా నచ్చిన రాగాల్లో ఒకటైన కల్యాణిలో కంపోజ్ చేసిన టైటిల్ సాంగ్ లో ప్రణయ కావ్యమున ప్రథమ పంక్తివో అంటూ సినారె చిక్కటి పదాలతో చక్కటి కవితలల్లారు. ఇదే సినిమాలో గోరువెచ్చని సూరీడమ్మా అనే పాట తేలికైన మాటలతో హాయిగా సాగిపోతుంది.1983లో దాసరి, రమేశ్ నాయుడు, అ కాంబినేషన్ లో రెండు గొప్ప సినిమాలు వచ్చాయి. వాటిలో ఒకటి “బహుదూరపు బాటసారి అయితే రెండోది “మేఘ సందేశం! పాటల తేనెపట్టు లాంటి ఈ సినిమాలో ఒక్కో పాట ఒక్కో మకరందపు చుక్క. ఆకులో ఆకునై పాట వినని తెలుగువారుండరేమో! కృష్ణశాస్త్రి కవితను రమేశ్ నాయుడు ఇలా అద్భుతంగా మలిచారు. దేవులపల్లి వారే రాసిన ముందు తెలిసెనా ప్రభూ, సిగలో అవి విరులో, శీతవేళ రానీయకు లాంటి పాటలు, వేటూరి విరచించిన నిన్నటి దాకా శిలనైనా లాంటి స్వర ముత్యాలు, రాధికా కృష్ణా, ప్రియే చారుశీలే వంటి జయదేవుని అష్టపదుల గురించి ఎంత చెప్పినా తక్కువే. పాడనా వాణి కల్యాణిగా అంటూ మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడిన పాట ఆయనకు శాస్త్రీయ సంగీతంతో సమానమైన పేరు తెచ్చి పెట్టింది.ఈ పాటలన్నీ ఒక ఎత్తు అయితే ఆకాశ దేశాన మరో ఎత్తు. జేసుదాస్ పాడిన ఈ పాట నాయుడు గారికి జాతీయ అవార్డు తెచ్చి పెట్టింది. ఈ పాట రాసిన వేటూరి వారు కొన్ని జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆయన రికార్డింగ్ కి వెళ్ళే టైంకి స్టూడియోలో అతి తక్కువ వాయిద్యాలు ఉన్నాయట. ఈ కొన్ని వాయిద్యాలతో నాయుడు గారు సంగీతం ఎలా పుట్టిస్తారో చూద్దాం అనుకున్నారట. కానీ కాసేపటికి జేసుదాస్ గొంతులో నుంచి తను రాసిన సాహిత్యం అత్యద్భుతమైన పాటగా జాలువారడం చూసి పులకించిపోయారట.విజయ నిర్మలతో...1973లో వచ్చిన “మీనా విజయ నిర్మల దర్శకత్వం వహించిన తొలి సినిమా. ఈ సినిమా విజయంలో రమేశ్ నాయుడు స్వరపరిచిన మల్లె తీగ వంటిది ఎంత హాయిగా ఉంటుందో పెళ్ళంటే నూరేళ్ళ పంట అంత విషాదాన్ని పలికిస్తుంది. శ్రీరామ నామాలు శతకోటి అన్న పాట మెత్తగా మనసును మీటుతుంది.విజయ నిర్మల దర్శకత్వం వహించిన “దేవదాసు(1974) కమర్షియల్ హిట్ కాకపోయినా ఆరుద్ర రాసి, రమేశ్ నాయుడు స్వరపరిచిన కల చెదిరింది, పొరుగింటి దొరగారికి పాటలు జనాన్ని బాగా ఆకట్టుకున్నాయి.ఏఎన్నార్, కృష్ణ హీరోలుగా విజయ నిర్మల డైరెక్ట్ చేసిన యాక్షన్ మూవీ “హేమాహేమీలు(1979). ఇందులోని ఏ ఊరు ఏ వాడ, నువ్వంటే నాకెంతో ఇష్టం అనే రెండు క్లబ్ సాంగ్స్బాగా పాపులర్అయ్యాయి.1980లో విజయ నిర్మల డైరెక్ట్చేసిన “సంఘం చెక్కిన శిల్పాలు కోసం రమేశ్ నాయుడి స్వర కల్పన పలికెను ఏదో రాగం అన్నట్లు హాయిగా సాగిపోతుంది. ఈ సినిమా కోసం 20 ఏళ్ళ గ్యాప్ తర్వాత రావు బాల సరస్వతి పోయి రావే అమ్మా అనే పాట పాడారు.ఇక రమేశ్ నాయుడు, విజయ నిర్మల కాంబినేషన్ లోనే వచ్చిన “భోగిమంటలు (1981) సినిమాలలో భోగి మంటల పాట, అరవైలో ఇరవై వచ్చింది అనే పాట కూడా జనానికి బాగా గుర్తుండిపోయాయి.జంధ్యాలతో...జంధ్యాలతో నాయుడి గారి స్వర యాత్ర విలక్షణమైనది. కామెడీ, మెలొడీ కలగలిపిన చక్కటి కలబోత ఈ ఇధ్దరిది. దీనికి వేటూరి కలం తోడైతే ఇక చెప్పేదేముంది? 1981లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా “ముద్ద మందారం. ఇందులోని ముద్దుకే ముద్దొచ్చే, అలివేణీ ఆణిముత్యమా, నీలాలు కారేనా లాంటి పాటలు సినిమాని ఎవర్గ్రీన్గా మార్చాయి.మనసా తుళ్ళిపడకే అమృతం ఒలికే ఈ పాట “శ్రీవారికి ప్రేమలేఖ సినిమాలోనిది. సప్త స్వరాలతో నిండుగా మోగే సరిగమపదని స్వరధార అనే పాట నాయుడు గారి సంగీత జ్ఞానానికి మచ్చుతునక. సాహిత్యానికే బాణీలు కట్టే ఆయన ఈ పాటలో వేటూరి వారు ప్రస్తావించిన అన్ని రాగాలకూ న్యాయం చేస్తూ అద్భుతమైన రాగమాలికను వెలయించారు.కళాతపస్వి ప్రేరణతో జంధ్యాల తీసిన సినిమా “ఆనంద భైరవి. పిలిచిన మురళికి అంటూ మువ్వలా మోగే పాటకు రమేశ్ నాయుడు ఆనంద భైరవి రాగంలో స్వరం కూర్చితే, వేటూరి అందమైన ఆ మాటకు పల్లవిలోనే చోటిచ్చేశారు. నెమ్మదిగా సాగే ఆనంద భైరవి రాగంలో ఇంత వేగంగా పాటను కూర్చడం గొప్ప ప్రయోగమని చెబుతారు.ముళ్ళపూడి వారి రెండు జెళ్ళ సీత పాత్ర పేరుతోనే జంధ్యాల 1983లో “రెండు జెళ్ళ సీత అనే సినిమా తీశారు. ఇందులోని కొబ్బరి నీళ్ళా జలకాలాడి అనే అల్లరి పాటను రమేశ్ నాయుడు ఎంత అందంగా మలిచారో! ఇందులోనే మందారంలో మధురిమలై, రెండు జెళ్ల సీత తీపి గుండె కోత లాంటి పాటలు కూడా శ్రోతలకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.అలక పానుపు ఎక్కనేల అనేది “శ్రీవారి శోభనం సినిమాలోని పాట. ఈ పాటలో పడుచు పిల్లకు, పండు ముసలికి జానకమ్మతోనే పాడించారు రమేశ్ నాయుడు గారు. ఇందులోనే చంద్ర కాంతిలో చందన శిల్పం అన్న పాటలో అటు వేటూరి వారి మాటలు, ఇటు నాయుడు గారి బాణీ వెన్నెల విరజిమ్ముతాయి.నువు కాటుక దిద్దకపోతే మలి సందెకు చీకటి రాదు ఒక ప్రియుడు ప్రియురాలిని పొగడ్డానికి ఇంత కంటే గొప్ప మాటలు కావాలా? 1985లో జంధ్యాల తీసిన “మొగుడు పెళ్ళాలు సినిమా కోసం వేటూరి రాశారీ పాట. అంతే అందంగా స్వరాలు కూర్చారు రమేశ్ నాయుడు.జంధ్యాల, రమేశ్ నాయుడు, వేటూరి వారి కాంబినేషన్ లో వచ్చిన చివరి సినిమా “అహ నా పెళ్ళంట. 1987లో విడుదలైన ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో మైలురాయి లాంటిది. కథలోకి చక్కగా ఇమిడిపోయేలా రమేశ్ నాయుడు కూర్చిన బాణీలు ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.వేటూరి ఏమన్నారంటే...రమేశ్ నాయుడితో ఉన్న ఆత్మిక బంధాన్ని వేటూరివారు తను రచించిన “కొమ్మకొమ్మకో సన్నాయి పుస్తకంలో గుర్తు చేసుకున్నారు. అభూత కల్పనలు అక్షర సత్యంగా మారిన అపురూప సంఘటన పేరే “రమేశ్నాయుడు అంటూ ఆయన పరిచయ వాక్యాలు రాసుకున్నారు. “నేను ఆర్జించుకున్న ఆప్తమిత్రుడు ఆయన. ఆయన భౌతికంగా దూరమయ్యాక నేను ఆయన కోసం రాసిన పడవ పాట ఆయనకు గుర్తుగా మిగిలిపోయింది అంటూ “ఆశాజ్యోతి లోని ఏరెల్లిపోతున్నా నీరుండిపోయింది అన్న పాటను గుర్తు చేసుకున్నారు.మరికొన్ని స్వర ముత్యాలు!పెద్దగా ఆడని కొన్ని సినిమా లు రమేశ్ నాయుడి బాణీల వల్ల గుర్తింపు వచ్చిన సందర్భాలున్నాయి. 1979లో విడుదలైన “మంగళ తోరణాలు అనే సినిమాలో సుశీలమ్మ ఏమయ్యిందంటే నే చెప్పలేను అంటే బాలు ఏమీ కాలేదంటే నేనొప్పుకోను అని బదులిచ్చే తీరు శ్రోతలను సమ్మోహనపరుస్తుంది.70ల్లో సుశీలమ్మ, 80ల్లో జానకమ్మ నాయుడు గారి పాటలకు ఊపిరి పోశారు. ఆయన సంగీత దర్శకత్వంలో శైలజ పాడ్డం తక్కువే. అలా ఆవిడ పాడిన అతి కొన్ని పాటల్లో చిరస్థాయిగా నిలిచిపోయేది “కొత్త నీరు సినిమాలోని ఊగిసలాడకే మనసా అనే పాట.ఇక 1980లో దాసరి సమర్పించిన “సుజాత అనే సినిమాలో ఉంగరం పడిపోయింది. అనే పాటను నాయుడు గారు చాలా సరదాగా కంపోజ్ చేశారు. పాటంతా ‘పోతే పోనీ’ అనే మాట వినిపిస్తూనే ఉంటుంది.1985లో విడుదలైన ‘సువర్ణ సుందరి ఆ కోవలోకే వస్తుంది. ఈ సినిమాలోని ఇది నా జీవితాలాపన పాటకుగాను నాయుడు గారు, బాలు నంది అవార్డులు గెలుచుకున్నారు. ఊహవో ఊపిరివో పాట కూడా మనసును రంజింపజేస్తుంది.కళాతపస్వితో...1987లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన “స్వయంకృష్ఙి రమేశ్ నాయుడి ఆఖరి సినిమా. ఈ సినిమాలో ఆయన పారా హుషార్ అంటూ హుషారెత్తిస్తారు, సిగ్గూ పూబంతి అంటూ సిగ్గుల మొలకలేయిస్తారు. ఇక సిన్నీ సిన్నీ కోరికలడగా అయితే జానకమ్మ గొంతులో హాయిగా సాగిపోతుంది. రమేశ్ నాయుడు, సిరివెన్నెల సీతారామశాస్త్రి కాంబినేషన్ లో వచ్చిన అతి తక్కువ సినిమాల్లో ఇది చెప్పుకోదగ్గది.“స్వయంకృషి సినిమా సాధించిన ఘన విజయం చూడకుండానే రమేశ్ నాయుడు సినిమా రిలీజ్ అయిన రోజునే అంటే 1987 సెప్టెంబరు 3న, 54 ఏళ్ళ వయసులో సుదూర స్వర తీరాలకు తరలిపోయారు. ఆయన మరికొంత కాలమున్నా... మొదటి నుంచి తెలుగు సినిమాలకే పరిమితమైనా, మన పాటల దశ, దిశ మరోలా ఉండేదేమో!మెరుపులా మెరిశావు... వలపులా కురిశావు...కన్నుతెరిచి చూసేలోగా నిన్నలలో నిలిచావు!వేటూరి రాసిన ఈ పదాలు రమేశ్ నాయుడి స్వర యాత్రకు చక్కగా సరిపోతాయి. అద్భుతమైన స్వర నిధులను రాశిగా పోసిన ఆయన శ్రోతలు తేరుకునేలోపే మాయమైపోయారు కదా మరి!- శాంతి ఇశాన్ -
వృద్ధాప్యాన్ని డీ కొట్టొచ్చు!?
టీవీలో సంతూర్ సబ్బు ప్రకటన గుర్తుందా.. ఓ పాప మమ్మీ అంటూ పరుగెత్తుకుంటూ తల్లి దగ్గరకు రావడం.. బిడ్డకు తల్లి అయినా వయసు కనిపించడం లేదన్నట్టు ఆ నటుడు ఆశ్చర్యపోవడం! వయసును ఓడించడం ప్రకటనల్లోనే కాదు, నిజ జీవితంలోనూ సాధ్యమేనట! విటమిన్ డి సప్లిమెంట్లను నిత్యం తీసుకోవడం ద్వారా వృద్ధాప్యం దరిచేరదని తాజా పరిశోధనలో తేలింది.ప్రతిరోజూ 2,000 ఐయూ (ఇంటర్నేషనల్ యూనిట్స్) మోతాదులో విటమిన్ –డీ3 తీసుకుంటే ‘టెలొమియర్స్’ ఆరోగ్యంగా ఉంటాయని తాజా పరిశోధన వెల్లడించింది. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ, మరికొన్ని సంస్థలు సంయుక్తంగా చేపట్టిన అధ్యయనం అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ప్రచురితమైంది. పరిశోధకులు మొత్తం 1,054 మందిపై 5 ఏళ్లపాటు అధ్యయనం చేశారు. వీరిలో 55 ఏళ్లకుపైబడిన మహిళలు, 50–55 ఏళ్ల పురుషులు ఉన్నారు. పరిశోధన ప్రారంభంలో, అలాగే రెండు, నాలుగు సంవత్సరాల తర్వాత వారి టెలొమియర్స్ను కొలిచారు. సగం మందికి రోజుకు 2,000 ఐయూ విటమిన్–డీ3∙ఇచ్చారు. మిగిలిన సగం మందికి ఎలాంటి విటమిన్ ఇవ్వలేదు. విటమిన్–డి గ్రూపులోని వ్యక్తుల్లో టెలొమియర్స్ సురక్షితంగా ఉన్నట్టు ఫలితాలు వచ్చాయి. విటమిన్ –డీ ఎందుకంటే..ఎముకల ఆరోగ్యానికి విటమిన్–డీ చాలా అవసరమని అందరికీ తెలిసిందే. ఇది మన శరీరం కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది. వయసుతో సంబంధం లేకుండా ఎముకలు దృఢంగా తయారు కావడానికి, ఆరోగ్యంగా ఉండేందుకు ఈ విటమిన్ తగినంత స్థాయిలో అవసరం. రోగనిరోధక వ్యవస్థను సైతం ఇది బలంగా చేస్తుంది. విటమిన్–డి సప్లిమెంట్లు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను తగ్గించగలవని అధ్యయనంలో తేలింది. రుమటాయిడ్ ఆర్రై్థటిస్, కణజాలాలు గట్టిపడడం వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులను నివారించడంలో ఇది సహాయపడుతుందని ప్రారంభ పరిశోధనలు సూచిస్తున్నాయి. శరీరంలోని వాపు ఉంటే టెలొమియర్స్ను దెబ్బతీస్తుంది. ఆ వాపును విటమిన్–డి తగ్గిస్తుంది.ఇంతకీ మోతాదు ఎంత?విటమిన్ –డి ఎంత మోతాదులో తీసుకోవాలన్న అంశంపై ఏకాభిప్రాయం లేదు. హార్వర్డ్ పరిశోధకులు రోజుకు 2,000 ఐయూ మోతాదు ఉపయోగించారు. 70 ఏళ్లలోపు వారికి 600 ఐయూ, ఆపైబడి వయసున్న వృద్ధులకు సిఫార్సు చేసిన 800 ఐయూ కంటే ఇది చాలా ఎక్కువ మోతాదు. అయితే ఇతర పరిశోధనలు కేవలం 400 ఐయూ మోతాదులో రోజూ తీసుకుంటే జలుబును నివారించడంలో సహాయపడతాయని సూచిస్తున్నాయి. ఇప్పటికే శరీరంలో ఉన్న విటమిన్–డి స్థాయిలు, మొత్తం పోషకాహారం, ఇతర పోషకాలతో ఈ విటమిన్ ఎలా కలిసిపోతుందో వంటి అంశాలపై ‘సరైన మోతాదు’ ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తొందరపాటు చర్య!తాజా పరిశోధనలు ఉత్తేజకరంగా ఉన్నప్పటికీ.. వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేయాలనే ఆశతో అధిక మోతాదులో విటమిన్–డి తీసుకోవడం తొందరపాటు చర్యగా కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమతుల ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, కంటి నిండా నిద్ర, ధూమపానం చేయకపోవడం, ఒత్తిడిని జయించడం వంటివి ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి దోహదపడతాయన్నది వారి మాట. ఇవన్నీ సహజంగా టెలొమియర్స్ ఆరోగ్యానికీ తోడ్పడతాయి. అయితే విటమిన్–డి లోపం ఉన్నా, ఎముకల ఆరోగ్యం సరిగా లేకున్నా సప్లిమెంట్లు తీసుకోవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. మొక్కల నుంచి వచ్చే ఆహారాల్లో లభించే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ (వాపు తగ్గించే) సమ్మేళనాలు టెలొమియర్స్ను ఆరోగ్యంగా ఉంచుతాయని గతంలో చేపట్టిన పలు అధ్యయనాల్లో తేలింది. అయితే ఆరోగ్యకరమైన బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ), సామాజిక సత్సంబంధాలు కూడా టెలొమియర్స్ను రక్షించడంలో సహాయపడతాయి. సూర్యరశ్మితోనే..: ఎముకల ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, కండరాల పనితీరు, మానసిక ఆరోగ్యానికి అవసరమైన కీలకమైన పోషకం విటమిన్ డి. ఇది సూర్యరశ్మి నుంచే 80 శాతం వరకు లభిస్తుంది. – సాక్షి, స్పెషల్ డెస్క్ -
నిరీక్షించి...నీరసించి
సాక్షి నెట్వర్క్ : యూరియా కష్టాలు రైతులను వెంటాడుతున్నాయి. గంటల తరబడి క్యూలైన్లో నిలబడుతున్న వారు అనారోగ్యం పాలవుతున్నారు. » మహబూబాబాద్ జిల్లా బయ్యారంలోని వ్యవసాయ మార్కెట్ చెక్పోస్ట్ వద్ద ఇల్లెందు–మహబూబాబాద్ ప్రధాన రహదారిపై రైతులు యూరియా కోసం నాలుగు గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. మహబూబాబాద్ పట్టణంలోని పీఏసీఎస్ వద్ద మంగళవారం కూడా రైతులు బారులుతీరారు. కురవి సొసైటీ వద్ద కూపన్ల కోసం క్యూలో నిలబడి రైతులు నానా అవస్థలు పడ్డారు. కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి పీఏసీఎస్ వద్దకు సోమవారం అర్ధరాత్రి సుమారు రెండు వేల మంది రైతులు యూరియా కోసం వచ్చారు. క్యూలో ఉన్న గాంధీనగర్కు చెందిన ఆవుల నారాయణ అనే రైతుకు ఫిట్స్ వచ్చింది. నర్సింహులపేటలో కూపన్లు ఇవ్వకపోవడంతో రైతులు పట్టాపాస్ బుక్కుల జిరాక్స్ కాపీలను తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. » వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో ఖమ్మం–వరంగల్ జాతీయ రహదారిపై ధర్నా చేయడంతో వాహనాలు నిలిచిపోయాయి. » మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఎమ్మెల్యే అనిరు«ధ్రెడ్డి తన కార్యాలయానికి ఎదురుగా ఉన్న ఆగ్రో సేవా కేంద్రం దుకాణం వద్దకు వెళ్లారు. యూరియా కోసం పడిగాపులు పడుతున్న రైతులు ఒక్కసారిగా క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు యూరియా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులను సముదాయించి మాట్లాడిన ఎమ్మెల్యే అనిరు«ధ్రెడ్డి వెంటనే కలెక్టర్ విజయేందిరకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. సాయంత్రంలోగా యూరియాను అందజేస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో రైతులు వెనుదిరిగారు. » దేవరకద్రలో తెల్లవారుజామున 4 గంటలకు వచ్చినా టోకెన్లు ఇచ్చి వెనక్కి పంపుతున్నారని, యూరియా మా త్రం ఇవ్వడం లేదని ఆందోళన చేపట్టారు. ఉదయం 6 గంటలకే రాయచూర్ జాతీయరహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రాయచూర్–మహబూబ్నగర్ వైపు వెళ్లే వందలాది వాహనాలు నిలిచిపోయాయి. » వనపర్తి జిల్లావ్యాప్తంగా యూరియా ఆందోళనలు కొనసాగాయి. ఖిల్లాఘనపురంలో రైతులు రోడ్డెక్కి ధర్నా చేశారు. » నాగర్కర్నూల్ జిల్లాలో యూరియా కోసం రైతులు ఆందోళనలు, ధర్నాలు చేపట్టారు. అచ్చంపేటలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. » గద్వాల సింగిల్విండో కార్యాలయానికి దాదాపు 400 మంది రైతులు మంగళవారం ఉదయం 8 గంటల వరకే చేరుకున్నారు. యూరియా లేదని అధికారులు చెప్పడంతో అంబేడ్కర్ చౌక్లో రోడ్డుపై బైఠాయించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని పీఏసీఎస్ కేంద్రం వద్ద యూరియా లేకపోవడంతో రైతులు రాస్తారోకో చేశారు. » కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ సొసైటీ వద్ద లారీ లోడ్ వచ్చిందని సమాచారం అందుకున్న రైతులు అక్కడకు వెళ్లారు. సోమవారం టోకెన్లు ఇచ్చామని చెప్పడంతో రైతులు రాజీవ్ రహదారిపై ధర్నాకు దిగారు.రైతు సమస్యలపై అదే నిర్లక్ష్యం ఏఐసీసీ సీనియర్ నేత మాణిక్కం ఠాగూర్ సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రైతు సమస్యలపై నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉందని, ప్రధాని మోదీ హామీలు జుమ్లాలుగానే మిగిలిపోతున్నాయని ఏఐసీసీ ఏపీ ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ విమర్శించారు. ఆంధ్ర, తెలంగాణ రైతులకు జుమ్లాలు అవసరం లేదని.. వారికి కావలసింది సమయానికి ఎరువులేనన్నారు. ఏపీ, తెలంగాణకు కలిపి ఏటా సుమారు 24–25 ఎల్ఎంటీ యూరియా అవసరం ఉంటుందని ఠాగూర్ గుర్తు చేశారు. అయినప్పటికీ ప్రతి విత్తన సీజన్లో.. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఎరువు కొరత తలెత్తుతోందని చెప్పారు. రైతులు గంటల తరబడి బారులు తీరాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఎస్సీవో వంటి అంతర్జాతీయ వేదికల్లో ఫొటోలకే పరిమితమవుతున్నారని విమర్శించారు. రైతుల కోసం దీర్ఘకాలిక ఎరువుల సరఫరా ఒప్పందాలు కుదుర్చేందుకు ఈ వేదికలను ఉపయోగించే ఆలోచన ఆయనకు ఉందా? అని ఠాగూర్ ప్రశ్నించారు.ఇబ్బంది లేకుండా యూరియా సరఫరా చేస్తాంమరో వారం రోజుల్లో 27,470 మెట్రిక్ టన్నుల యూరియా: మంత్రి తుమ్మల సాక్షి, హైదరాబాద్: రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎరువుల సరఫరా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రైతులకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచడానికి కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. సోమవారం, 9,000 మెట్రిక్ టన్నులు, మంగళవారం మరో 5,000 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి చేరిందన్నారు. ఈ యూరియా రైల్వే రేక్ పాయింట్లయిన సనత్నగర్, వరంగల్, జడ్చర్ల, నాగిరెడ్డిపల్లి, మిర్యాలగూడ, కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాలకు చేరుకుంటుందని తెలిపారు. వచ్చే వారంరోజుల్లో కరాయికల్, గంగవరం, దామ్ర పోర్టుల ద్వారా మరో 27,470 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి చేరనుందని మంత్రి తుమ్మల తెలిపారు. ఈ ఎరువులను రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా డిమాండ్కు అనుగుణంగా పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.అదేవిధంగా ఇటీవల వర్షాల కారణంగా జరిగిన పంట నష్టానికి పరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. వరదలతో నష్టపోయిన రైతులకు అన్యాయం జరగకుండా, సకాలంలో సహాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అందుకోసం పంట నష్టం సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని, 5 రోజుల్లోపు పంటనష్టంపై పూర్తి నివేదికను పూర్తి చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. -
స్టార్టింగ్ ప్రాబ్లమా?
స్టార్టింగ్ ప్రాబ్లం.. మనం తరచూ వినే డైలాగ్. తలపెట్టిన పనులను తరచూ వాయిదా వేస్తుంటారు కొందరు. వారిని ఆట పట్టించడానికి ‘స్టార్టింగ్ ప్రాబ్లమా’ అని అంటుంటాం. వ్యాయామం, ఇంటి పనుల వంటివి ప్రారంభించడం కష్టంగా అనిపిస్తుందా? యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ హాస్పిటల్స్లో న్యూరాలజీ వైద్యులు, న్యూరో సైంటిస్ట్గా పనిచేస్తున్న డాక్టర్ ఫేయ్ బెగేటి ఓ చక్కటి, సులభ పరిష్కారాన్ని ప్రతిపాదిస్తున్నారు. మెదడు శక్తిని పెంచడానికి, మానసిక అడ్డంకులను తొలగించడానికి నిబద్ధతతో కూడిన ఓ ‘5 నిమిషాలు’ చాలు అంటున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్రేపట్నుంచి వాకింగ్కు వెళ్తా.. డిసెంబర్ 31 నాడు.. ‘జనవరి 1 నుంచి వాకింగ్ లేదా వ్యాయామం చేస్తా’రేపట్నుంచి ఉదయం ఆరింటికే నిద్ర లేస్తా..పోటీ పరీక్షలకు రేపట్నుంచి ప్రిపరేషన్ మొదలుపెడతా.... ఇలాంటి నిర్ణయాలు చాలామంది తీసుకుంటారు. కానీ, బద్ధకం వాటిని అమలు చేయనివ్వదు. అలాంటి కష్టమైన పనులను చేయడంలో మనసు, మెదడు.. రెండూ మొండికేస్తుంటాయి. మరి, దీన్ని అధిగమించడం ఎలా?5 నిమిషాల నియమం.. మనసును సిద్ధం చేసే ఓ చిట్కా. ఇది వాయిదా వేసే మనస్తత్వాన్ని మారుస్తుంది. తద్వారా మానసిక అలసట తగ్గుతుందని బెగేటి అంటున్నారు. ఒక పనిని ప్రారంభించడానికి మనసు సన్నద్ధంగా లేనప్పుడు.. ఆ పనిని కేవలం 5 నిమిషాల సేపు చేసి చూడాలి. సాధారణంగా మన మెదడు పని కష్టాన్ని ఎక్కువగా అంచనా వేస్తుంది. అందువల్ల ఎక్కువ సేపు చేస్తే అలసిపోతానని ముందే ఊహించుకుంటుంది. కాబట్టి 5 నిమిషాల పాటు నిబద్ధతతో పనిచేస్తే మెదడు అలవాటు పడి, తరవాత ఆ పని కొనసాగించేలా ప్రేరేపిస్తుంది. మానసిక అలసటే పెద్ద సమస్యశారీరక అలసట ఉన్నా ఫర్వాలేదుగానీ.. మానసిక అలసట ఉంటే మాత్రం మెదడు పనిచేయనివ్వదు. మెదడు అలసటను.. స్మార్ట్ఫోన్ ‘లో బ్యాటరీ’ మోడ్తో పోల్చారు బెగేటి. లో బ్యాటరీ ఉన్నా మనం పనిచేస్తుంటే.. ‘బ్యాటరీ లో’ అని ప్రతిసారీ అరుస్తున్నట్టే.. ‘నేను చేయను/చేయడానికి సిద్ధంగా లేను’ అని మెదడు కూడా మొరాయిస్తుంది. సోషల్ మీడియా స్క్రోలింగ్ వంటి తక్షణ వినోదాన్ని అందించే సాధారణ కార్యకలాపాలను ఎంచుకోవడం ద్వారా.. మెదడు తక్కువ కష్టమైన పనులవైపు మొగ్గు చూపుతుంది. ‘5 నిమిషాల’ నియమం.. మెదడుకున్న ఈ బద్ధకానికి చక్కటి చిట్కాలా పనిచేస్తుంది. ‘5 నిమిషాలే కదా చేసేద్దాం’ అని చేసేస్తుంది.దినచర్యగా మారుతుందఏదైనా పనిని ప్రారంభించినప్పుడు మెదడు డోపమైన్ ను విడుదల చేస్తుంది. ఇది ప్రేరణతోపాటు ఆనందం ఇచ్చే రసాయనం. ఈ 5 నిమిషాల ప్రక్రియ.. మనలో జోష్ నింపి ఆ సమయం తరవాత కూడా పని చేయడానికి ప్రేరేపిస్తుంది. ఇది ఒక దినచర్యగా అలవాటైతే.. దీర్ఘకాలంలో మెదడు చురుగ్గా, మరింత ప్రభావవంతంగా పనిచేసేందుకు దారితీస్తుందని బెగేటి పేర్కొన్నారు. వ్యాయామం, ఇంటి బాధ్యతలతో సహా ఏదైనా సవాలుతో కూడిన, శక్తిని వినియోగించే పనికి ఈ నియమం రోజువారీ సాధనంగా పనిచేస్తుంది. 5 నిమిషాల నియమం.. వాయిదా వేసే విధానానికి చెక్ పెట్టడంలో సహాయపడుతుంది. అదే సమయంలో నిర్ణయం తీసుకోవడంలోనూ , దృష్టి కేంద్రీకరించిన పని వల్ల వచ్చే అలసటను తగ్గించి మెదడును చురుగ్గా ఉంచుతుంది.చిన్న చిన్న ప్రయత్నాలు» చిన్న చిన్న ప్రయత్నాలతో మెదడును సిద్ధం చేయండి. » అవి నిరంతరం పనిని కొనసాగించేలా ప్రేరేపిస్తాయి.» రోజూ కేటాయించే ఆ 5 నిమిషాలు.. అంటే సంవత్సరానికి సుమారు 30 గంటల అభ్యాసంతో స్థిరంగా చేసే చిన్న పనులు పెద్ద ఫలితాలను ఇస్తాయి. » పనులను మరింత సులువుగా మొదలుపెట్టేందుకు ఈ చిట్కా తోడ్పడుతుంది.» మెదడు.. చేయనని మొండికేసే స్థితి నుంచి నేను చేయగలననే చురుకైన స్థితికి మారడానికి ఈ నియమం దోహద పడుతుంది.ఇలా విజయవంతం చేయండి» చేయాల్సిన పూర్తి పని నుంచి ఒక నిర్దిష్ట చిన్న విభాగాన్ని మీ ప్రారంభ సాధనంగా ఎంచుకోండి» ఇందుకోసం టైమర్లో అయిదు నిమిషాల సమయాన్ని సెట్ చేయండి» మీ దృష్టిని మరల్చే వాటిని గుర్తించి తొలగించండి.» 5 నిమిషాల తర్వాత పురోగతిని చెక్ చేయండి. దీనిని బట్టి ఆ పనిని కొనసాగించాలా వద్దా అని నిర్ణయించుకోండి. -
బుల్లెట్టు రైలెక్కి వచ్చేత్తపా..!
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరోసారి వార్తల్లో నిలిచారు. సుమారు ఆరేళ్ల తర్వాత.. పొరుగుదేశం చైనాలో ఆయన పర్యటిస్తున్నారు. బీజింగ్లో బుధవారం జరగబోయే రెండో ప్రపంచ యుద్ధ వార్షికోత్సవ సైనిక కవాతును ఆయన వీక్షించనున్నారు. ఈ కార్యక్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా 26 దేశాధినేతలు పాల్గొనబోతున్నారు. కిమ్ జోంగ్ ఉన్ రైలు ప్రయాణం గురించి ప్రపంచం ఇప్పుడు ఆసక్తికరంగా చర్చించుకుంటోంది. 2019లో చైనా, 2023లో రష్యాలో పర్యటించిన టైంలోనూ ఆయన రైలు మార్గం గుండానే ప్రయాణించారు. ఉత్తర కొరియా పాలకులకు ఇలా రైలు ప్రయాణం కొన్ని దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది. కాదు కాదు ప్రత్యేక కారణాల దృష్ట్యా తప్పడం లేదు!!.. కిమ్ జోంగ్ ఉన్ ప్రయాణించే రైలు మామూలుది కాదు. సుమారు 90 కోచ్లు ఉండే ఈ రైలులో కాన్ఫరెన్స్ రూమ్, బెడ్రూమ్స్, ఫ్లాట్ స్క్రీన్ టీవీలు, అంతర్జాతీయ వంటకాలు, ఖరీదైన రెడ్ వైన్లు అందుబాటులో ఉంటాయి. రైలు అంతర్గతంగా పింక్ లెదర్ ఆర్మ్చైర్లు, జెబ్రా ప్రింట్ డిజైన్, బోర్డో వైన్లు, లాబ్స్టర్లు, అంతర్జాతీయ వంటకాలు, కాన్ఫరెన్స్ హాళ్లు, బెడ్రూమ్స్తో రాజసంగా ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చెఫ్లు, రెడ్ వైన్లు, నృత్య కళాకారుల బృందం ఆయన వెంట ప్రయాణిస్తారు. అయితే.. అది పూర్తిగా బుల్లెట్ప్రూఫ్, బాంబ్ప్రూఫ్. ఇది కుటుంబ భద్రతా భయాల కారణంగా ఏర్పడిన సంప్రదాయం. ఈ రైలు వేగం గంటకు 50 కిలోమీటర్లు మాత్రమే. భారీ సాయుధ కవచాలతో నిర్మించబడి ఉండడం వల్ల దీని ప్రయాణం కూడా అంతే భద్రంగా సాగుతుంటుంది. భారీ సాయుధ కవచాలతో నిర్మించబడి ఉండడం వల్ల దీని ప్రయాణం కూడా అంతే భద్రంగా సాగుతుంటుంది. అందుకే.. కిమ్ జోంగ్ ఉన్ తన తండ్రి, తాతల మాదిరిగా విమానాలకంటే రైలు ప్రయాణానికే ప్రాధాన్యం ఇస్తున్నారు.ఈ రైలు కేవలం రవాణా సాధనం కాదు, అది ఒక మొబైల్ కమాండ్ సెంటర్గా పనిచేస్తుంది. ఈ రైలు కోసం అంతర్జాతీయ రక్షణ, రైలు నిర్మాణ నిపుణులు పని చేశారు. ఈ స్థాయి సౌకర్యాలు, భద్రతా వ్యవస్థలు కలిగి ఉండే రైలు నిర్మాణం, నిర్వహణకు సుమారుగా 200–300 మిలియన్ డాలర్లు (మన కరెన్సీలో రూ.1,600–రూ.2,400 కోట్లు) వరకు ఖర్చు అయ్యిందనే అంచనా. పర్యటన ఉద్దేశం..ఉత్తర కొరియా–రష్యా–చైనా మైత్రి బలోపేతం ద్వారా.. తద్వారా అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా బలమైన సంకేతాలు పంపే ప్రయత్నంగా కిమ్ పర్యటనను విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో చైనా, ఉత్తర కొరియా మధ్య ఆర్థిక, భద్రతా సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉందనే చర్చా నడుస్తోంది. -
నీటితో కొట్టుకుపోతున్న మట్టి ఎంత?
మనం తినే ఆహారంలో 95% మట్టిలోనే పండుతోంది. వ్యవసాయానికి, ఆహార భద్రతకు నేలపైన ఉండే 6 అంగుళాల మట్టే (టాప్ సాయిల్) మూలాధారం. మానవాళికి ఎంతో విలువైన ఈ వారసత్వ సంపద వర్షాలకు, వరదలకు కొట్టుకుపోతోంది. మేటలు వేసిన ఇసుక ఆ మట్టిలోనిదే. పంట నష్టం, ఆస్తి నష్టం కన్నా మట్టి నష్టం చాలా పెద్దది. మనం ఎవరూ పట్టించుకోని విపత్తు ఇది.ఇలా భూముల్లోనుంచి కొట్టుకెళ్లిన మట్టి, ఇసుకతో రిజర్వాయర్లు, చెరువులు పూడుకుపోతున్నాయి. పైమట్టిని కోల్పోతున్న సాగు భూములు నిస్సారమవుతున్నాయి. ఫలితంగా 1960లో కిలో రసాయనిక ఎరువు వేస్తే 16.5 కిలోల పంట వచ్చేది. ఇప్పుడు 3.5 కిలోలకు తగ్గిపోయింది. మన దేశంలో ప్రతి సంవత్సరం హెక్టారుకు సగటున 21 టన్నుల టాప్ సాయిల్ కొట్టుకుపోతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, వరదలకు కోల్పోతున్న మట్టి ఎంత? మట్టి కొట్టుకుపోకుండా ఏమైనా చెయ్యగలమా? ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకోవాలి? వ్యవసాయ పద్ధతుల్లో ఏం మార్పులు తేవాలి? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? చదవండి.. – సాక్షి సాగుబడిమట్టి.. మనకు పూర్వీకులు ఇచ్చిన వారసత్వ సంపద. మొక్కల పెరుగుదలకు అవసరమైన పోషకాలు, తేమతో కూడి ఉండే నేల పైపొర వ్యవసాయానికి చాలా ముఖ్యమైనది. మట్టి కోతకు గురికావటం వల్ల భూమి ఉత్పాదకశక్తి, పంట దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. భూమి పైపొరలో 6 సెం.మీ. లోతు మట్టిలోనే పంటలు పండించుకొని తిని మనం బతుకుతున్నాం. 95% ఆహారాన్ని ఇస్తున్నది ఈ మట్టే. రాళ్లు రప్పలు, ఆకులు అలముల కారణంగా మట్టి సహజసిద్ధంగా నిరంతరం ఏర్పడుతూనే ఉంటుంది. 6 సెం.మీ. మందాన మట్టి ఏర్పడటానికి 1,000 సంవత్సరాలు పట్టవచ్చని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ లెక్క తేల్చింది. అయితే, అంతకన్నా అతివేగంగా కొట్టుకుపోతున్నది. ఎక్కువగా దున్నే భూములు, కొండ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువ.తెలుగు రాష్ట్రాల్లో కొట్టుకుపోతున్న మట్టి ఎంత?తెలుగు రాష్ట్రాల్లో ఏటా హెక్టారుకు సగటున 14–15 టన్నుల మట్టి కొట్టుకుపోతోంది. తెలంగాణలో సగటున హెక్టారుకు ఏడాదికి 14 టన్నులు, ఆంధ్రప్రదేశ్లో సగటున 15 టన్నుల మట్టి వర్షానికి, వరదలకు కొట్టుకుపోతున్నదని ఐఐటీ ఢిల్లీ అధ్యయనంలో వెల్లడైంది. అయితే, కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా వేల టన్నుల్లోనే మట్టి కోతకు గురై కొట్టుకుపోతోంది.కొండ ప్రాంతాలు, వాలు ఎక్కువగా ఉన్న భూములు, అడవులు నరికివేసిన నేలలు, తవ్వకాలు జరిగే ప్రాంతాలు, ఎక్కువగా దుక్కి లేదా దమ్ము చేసే ఎటువంటి ఆచ్ఛాదనా లేని వ్యవసాయ భూముల్లో నుంచి నమ్మలేనంత ఎక్కువ మొత్తంలో హెక్టారుకు ఏడాదికి వేల టన్నుల్లోనే మట్టి కొట్టుకుపోతోంది. ఆంధ్రప్రదేశ్లో ఇది 4,407 టన్నులైతే, తెలంగాణలో కొంచెం తక్కువగా 3,498 టన్నులు కొట్టుకుపోతోందని ఈ అధ్యయనం వెల్లడించింది.పెద్దపల్లిలో అత్యధికంతెలంగాణ జిల్లాల్లో కోతకు గురై కొట్టుకుపోతున్న మట్టి హెక్టారుకు ఏడాదికి సగటున టన్నుల్లో : పెద్దపల్లి– 22, నల్లగొండ– 20, కుమురంభీం ఆసిఫాబాద్– 18, ములుగు– 18, జయశంకర్ భూపాలపల్లి– 18, ఆదిలాబాద్ – 17, జగిత్యాల– 17, భద్రాద్రి కొత్తగూడెం– 17, మంచిర్యాల– 17, ఖమ్మం– 16, సూర్యాపేట– 16, వరంగల్ రూరల్– 16, మహబూబాబాద్– 13, కరీంనగర్ – 13, వరంగల్ అర్బన్– 13, యాదాద్రి భువనగిరి– 13, వనపర్తి– 12, జనగాం– 12, నిర్మల్– 12, నిజామాబాద్– 12, వికారాబాద్– 12, కామారెడ్డి– 11, రాజన్న సిరిసిల్ల– 11, మహబూబ్నగర్– 11, నాగర్ కర్నూల్– 11, సంగారెడ్డి– 10, నారాయణపేట– 10, సిద్ధిపేట– 9, మెదక్– 9, రంగారెడ్డి– 9, జోగుళాంబ గద్వాల– 8, మేడ్చల్–మల్కాజిగిరి– 6, హైదరాబాద్– 0. జనావాసాలతో కిక్కిరిసి ఉండే హైదరాబాద్ జిల్లా నుంచి వర్షానికి మట్టి పెద్దగా కొట్టుకుపోవట్లేదు! అత్యధికంగా మట్టి కొట్టుకుపోతున్న రాష్ట్రాల్లో తెలంగాణ (Telangana) ఒకటని ఇస్రో అధ్యయనం తెలిపింది.ఆరు వర్గీకరణలుఈశాన్య రాష్ట్రమైన అస్సాంలోని బ్రహ్మపుత్ర నదీ పరీవాహక ప్రాంతం దాదాపు 300 చదరపు కిలోమీటర్లు లేదా దాని ఉపరితల నేలలో 31 శాతం ‘విపత్కర’ స్థాయిలో కోతకు గురవుతోంది. ‘దేశంలో నేల కోతపై సమగ్ర అవగాహన కలిగించేందుకు నేల కోత ఏయే జిల్లాల్లో ఏయే దశల్లో ఉందో అధ్యయనం చేశాం’ అన్నారు సహారియా. ఒక సంవత్సరంలో హెక్టారు భూమి నుంచి టన్నుల కొద్దీ మట్టి కొట్టుకుపోతోంది. ఒక సంవత్సరంలో ఒక హెక్టారులో 100 టన్నులకు పైగా మట్టి కోతకు గురైనట్లు తేలితే, ఆ ప్రాంతాన్ని ‘విపత్తు’ ప్రాంతంగా వర్గీకరిస్తారు.జాతీయ సగటు హెక్టారుకు 21 టన్నులుదేశంలో వానలు, వరదలకు సగటున సంవత్సరానికి హెక్టారు భూమి నుంచి 21 టన్నుల మేరకు మట్టి నీటితో పాటు కొట్టుకుపోతోందని ఢిల్లీ ఐఐటీ అధ్యయనంలో తేలింది. భౌగోళిక స్థితి, జీవవైవిధ్య పరంగా హిమాలయాలు, బ్రహ్మపుత్ర లోయ ప్రాంతాలు నేల కోతకు అతిపెద్ద హాట్స్పాట్. అక్కడితో పోల్చితే భిన్నంగా ఉండే ఒడిశా లో కూడా ‘విపత్కర’ స్థితిలో నేల కోతకు గురవుతోంది.జిల్లాల వారీగా చూస్తే, దేశంలో నేల కోతకు గురయ్యే అవకాశం ఉన్న 20 జిల్లాల్లో తొమ్మిది అస్సాంలోనే ఉన్నాయని అధ్యయనం పేర్కొంది. అడవుల నరికివేత, రసాయనిక/పారిశ్రామిక వ్యవసాయ పద్ధతుల్లో వ్యవసాయం చెయ్యటమే ఇందుకు కారణమని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ‘నేల కోతకు సంబంధించి పాన్–ఇండియా స్థాయిలో రాష్ట్రాలు, జిల్లాల వారీగా అధ్యయనం చేసి గణాంకాలను ఆన్లైన్లో అందరికీ అందుబాటులో ఉంచాం. భవిష్యత్తులో నేల సంరక్షణ ప్రణాళికల అమలుకు ఈ సమగ్ర అవగాహన దోహదపడుతుందని ఆశిస్తున్నాం అన్నారు సహారియా.వర్షపాతం ఇంకా పెరుగుతుంది!వర్షపాతం వచ్చే రోజుల్లో మరింత పెరుగుతుందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. 2050 నాటికి ఖరీఫ్ కాలంలో 5–10 శాతం, రబీ కాలంలో 12–17 శాతం వర్షపాతం పెరుగుతుందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గతంలో పార్లమెంటులో చెప్పారు. అంటే, నివారణ చర్యలకు మనం ఉపక్రమించకపోతే రానున్న రోజుల్లో మరింత మట్టి కొట్టుకుపోతుందన్నమాట. 2050 నాటికి హెక్టారుకు మరో 10 టన్నుల మట్టి కొట్టుకుపోతుందని కూడా మంత్రి హెచ్చరించారు. సుస్థిర వ్యవసాయ పద్ధతుల ద్వారా ఈ సమస్యను కొంత వరకు అధిగమించవచ్చు.100 టన్నుల మట్టి పోతే విపత్తు!మన దేశంలో భూముల ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని ఢిల్లీలోని ఇండియన్ ఇ¯Œ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) అధ్యయనం వెల్లడించింది. దాదాపు 30 శాతం భూభాగం ‘స్వల్పంగా’ కోతకు గురవుతూ ఉంటే, కీలకమైన 3 శాతం భూభాగం ‘విపత్కర’ స్థితిలో మట్టిని వర్షాలు, వరదల వల్ల నష్టపోతోందని ఈ పరిశోధన తెలిపింది. జియోస్పేషియల్ మోడలింగ్ – మ్యాపింగ్’ పేరిట జరిగిన ఈ అధ్యయనం మన దేశం అంతటా నేల కోతను లెక్కగట్టింది. ఢిల్లీ ఐఐటీలో సివిల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, హైడ్రోసెన్స్ ల్యాబ్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డా. మనబేంద్ర సహారియా, రవిరాజ్ అధ్యయనం చేశారు.ఉత్తరాంధ్రలో అత్యధికంఏపీలోని పాత జిల్లాల్లో కోతకు గురై కొట్టుకుపోతున్న మట్టి హెక్టారుకు ఏడాదికి సగటున టన్నుల్లో : శ్రీకాకుళం– 27, విశాఖపట్నం– 27, విజయనగరం– 25, తూర్పు గోదావరి– 16, చిత్తూరు– 16, అనంతపురం– 15, వైఎస్సార్ కడప – 14, పశ్చిమ గోదావరి– 13, కృష్ణా– 13, ప్రకాశం– 13 (782), గుంటూరు– 12, కర్నూలు– 12, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు– 10 .భవిష్యత్తు తరాలు ఏమైపోతాయి?హెక్టారు భూమిలో 1 సెం. మీ. వర్షం కురిస్తే లక్ష లీటర్ల నీరు పడుతుంది. అధిక వర్షాలకు పొలంలోని మెత్తని మట్టి నీట కరిగి వరదతో వెళ్లిపోతుంది. ఆ మట్టి నీటి అడుగుకు చేరాలంటే పది గంటలు పడుతుంది. కాబట్టి, రిజర్వాయర్లు, చెరువుల్లోకి వరద నీటి ద్వారా ఆ మట్టి చేరుతుంది. ఇసుకైతే దగ్గర్లోని పొలాల్లో మేట వేస్తుంది. నేల పైపొర మట్టి వర్షానికి కొట్టుకుపోతే అడుగున మొరం, రాళ్లు, రప్పలు పైకి తేలతాయి. ఒక మోస్తరు వర్షపు నీరు పొలం నుంచి బయటకు పోకుండా భూమిలోకి ఇంకాలంటే పంట పొలాల్లో కందకాలు, కుంటలు తవ్వుకోవాలి. నీరు ఇంకటంతో పాటు మట్టి కూడా పొలం దాటి బయటకు పోకుండా కందకాలు లేదా కుంటల్లో ఆగుతుంది. మట్టిని తర్వాత తీసి మళ్లీ పొలంలో వేసుకోవచ్చు. మట్టిని పరిరక్షించుకునేందుకు అందరూ శ్రద్ధ తీసుకోవాలి. లేకపోతే భవిష్యత్తు తరాలు ఏమైపోతాయి?– డా. అల్లూరి పద్మరాజు, ఆంగ్రూ మాజీ వైస్ఛాన్సలర్మట్టిని జాతి సంపదగా చూడాలిఏటా హెక్టారు భూమిలో 1.5 టన్నుల మట్టి కొత్తగా ఏర్పడుతుంది. 200 ఏళ్లకు గానీ ఒక అంగుళం ఎత్తు మట్టి ఏర్పడదు. అయితే, అంతకు 8 రెట్ల మట్టి ప్రతి ఏటా వాన నీటితో, గాలితో కొట్టుకు పోతోంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. పొలం రైతు సొంతదైనా మట్టిని జాతి సంపదగా చూడాలి. మట్టిని కాపాడుకోవటానికి, భూసారాన్ని పెంపొందించుకోవటానికి ప్రభుత్వం ఈ 4 పనులు చెయ్యాలి: 1. భూమిని వీలైనంత మేరకు ఆచ్ఛాదన పంటలతో, గడ్డితో కప్పి ఉంచటం. 2. అతిగా దున్నటం, దమ్ము చెయ్యటం తగ్గించటం. 3.సాగు పద్ధతి ఏదైనా భూమిలో సేంద్రియ పదార్థం ఎక్కువగా కలిసేలా పచ్చిరొట్ట పంటలు సాగు చేసి కలియదున్నాలి. 4. ప్రతి సీజన్లోనూ దున్నాల్సిన అవసరం ఉన్న వరి వంటి పంటలకు బదులు తోటల సాగుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి.– డా. జీవీ రామాంజనేయులు, ఈడీ, సుస్థిర వ్యవసాయ కేంద్రం వ్యవస్థాపకులు -
హతవిధి.. పాక్ ప్రధానికి ఘోర పరాభవం!
2025లో చైనా తియాంజిన్లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు గురించి ప్రపంచమంతా ఇప్పుడు చర్చించుకుంటోంది. ట్రంప్ టారిఫ్ వార్, ఉక్రెయిన్ శాంతి చర్చల అంశాలతో పాటు పహల్గాం దాడి విషయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా.. భారత దేశానికి మద్దతుగా సదస్సులో పాల్గొన్న దేశాలు తీర్మానం సైతం చేయడం ప్రధానంగా నిలిచాయి. అయితే.. ఈ సదస్సు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు చేదు అనుభవాన్ని మిగిల్చిందన్న చర్చ జోరుగా నడుస్తోంది. అందుకు ఈ సమ్మిట్లో చోటుచేసుకున్న కొన్ని ఘటనలు కారణంగా కాగా.. వాటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ చేస్తూ పాక్ ప్రధానిని నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. షరీఫ్ అంతర్జాతీయంగా అవమానానికి గురయ్యారన్నది ఆ పోస్టుల సారాంశం. అందుకు కారణం లేకపోలేదు.. వేదికపై ఆతిథ్య దేశాధినేత సహా మిగతా ప్రపంచాధినేతలెవరూ ఆయన్ని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. కాదు కాదు.. అసలు పట్టన్నట్లు వ్యవహరించడమే పెద్దగా హైలైట్ అయ్యింది. అవి ఒక్కొక్కటిగా పరిశీలిస్తే.. મોદી અને પુતિનની મુલાકાત દરમિયાન પાકિસ્તાનને નીચે જોવા જેવી સ્થિતિ પેદા થઈRead more at: https://t.co/xr1jIGM2b2#PMModiSCOsummit2025 #NarendraModi #PMModi #ShehbazSharif #VladimirPutin #SCOsummit2025 #SCOsummitinChina #XiJinping #Reels #shorts #newskida #treeshinewskida pic.twitter.com/NxjZc9wc6W— NewsKida (@TreeshiNewsKida) September 1, 2025భారత ప్రధాని నరేంద్ర మోదీ పాక్ ప్రధాని షరీఫ్ను అసలు పట్టించుకోలేదు. మోదీ-పుతిన్ ఇద్దరూ కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా.. షరీఫ్ బిక్కముఖం వేసుకుని పలకరించలేదే అన్నట్లు చూస్తూ ఉండిపోయారు. పైగా మోదీ తన ప్రసంగంలో పహల్గాం దాడి గురించి మాట్లాడిన ఆయన.. కొన్ని దేశాలు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నాయంటూ పాక్నే ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఆ ప్రసంగం సాగినంత సేపు అక్కడే ఉన్న షరీఫ్ ముఖంలో నెత్తురు చుక్క కనిపించలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది!. PM Modi, Putin, Xi Jinping and Shehbaz Sharif meetup in SCO Summit 2025😭🤣#SCOSummit pic.twitter.com/MKnj7TjCO1— Bruce Wayne (@_Bruce__007) September 1, 2025ఇక.. పుతిన్ను కలవాలన్న షరీఫ్ ఉత్సాహం.. అవమానాన్నే మిగిల్చింది. సదస్సు ముగిశాక.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో కరచలనం చేయడానికి షరీఫ్ కంగారుగా పరిగెత్తుతూ కనిపించారు. పుతిన్ షేక్ హ్యాండ్ ఇవ్వడంతో షరీఫ్ మురిసిపోయారు. ఆ సమయంలో పక్కనే ఉన్న చైనా అధ్యక్షుడు జిన్పింగ్.. షరీఫ్ను చూసి పూర్తిగా పట్టన్నట్లు ప్రవర్తించారు. అయితే కాసేపటికే పుతిన్ మరోసారి ఆయన్ని పలకరించారు.आतंक पर बड़ी चोट कर रहे थे PM मोदी, सुन रहे थे पाक पीएम शहबाज शरीफ#PMModi #ShehbazSharif #PMModiInChina #SCOSummit2025 #Pakistan pic.twitter.com/EU2UkhZCq1— One India News (@oneindianewscom) September 1, 2025Shehbaz Sharif after seeing Xi and Putin with Modi while ignoring him 😭 pic.twitter.com/fDlEIEQDor— Fazal Afghan (@fhzadran) September 1, 2025 Pakistan PM Shehbaz Sharif Serving Juice to @narendramodi and #Putin Nice Gesture 🙌 #NarendraModi #ShehbazSharif #SCOSummit #SCOSummit2025 pic.twitter.com/R1eZEni9M7— SATYA ᴿᶜᴮ 🚩 (@sidhufromnaayak) September 1, 2025 ఇక సదస్సు ముగిసిన తర్వాత.. గ్రూప్ ఫొటో సమయంలోనూ షరీఫ్కూ పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. మోదీకి ఎక్కడో ఎనిమిది మంది దేశాధినేతల అవతల నిలబెట్టారు. అంతెందుకు.. చైనా, పాకిస్తాన్కు దశాబ్దాలుగా మిత్ర దేశం అయినప్పటికీ.. ఈ సదస్సులో షరీఫ్ను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కొసమెరుపు. దీంతో.. షాంగై సదస్సు ఏమోగానీ పాక్ ప్రధాని పరిస్థితి దయనీయంగా, దౌర్భాగ్యంగా కనిపించిందని కొందరు నెటిజన్స్ అభివర్ణించారు. ఇంకొందరైతే ఓ అడుగు ముందుకువేసి.. పుతిన్-మోదీ-జిన్పింగ్ భేటీ అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి, ఇటు పాక్ షరీఫ్కు పీడకలను మిగిల్చే అవకాశం ఉందంటూ జోకులు పేలుస్తున్నారు. ట్విటర్, రెడ్డిట్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ లాంటి ఫేమస్ ఫ్లాట్ఫారమ్లలో మీమ్స్, ట్రోలింగ్ ముంచెత్తాయి. మిత్ర హస్తం అవతలి వాళ్లు అందించాలే తప్ప.. అడుక్కోకూడదు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. పుతిన్తో కరచలనం కోసం ఓ బిచ్చగాడిలా ప్రవర్తించారంటూ పాక్ ప్రజలే ఆయన్ని దెప్పి పొడుస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పాక్కు, ఆ దేశ ప్రధానికి ఉన్న ప్రాధాన్యం ఇదేనా? అనే చర్చా జోరుగా నడుస్తోంది. అదే సమయంలో పాక్ మీడియా షరీఫ్ను గ్లోబల్ పవర్హౌజ్ అంటూ కితాబిస్తూ ప్రచారం చేస్తుండడం గమనార్హం. -
ప్రతీ లావాదేవీపై ‘ఐ’టీ!
మల్టీ నేషనల్ బ్యాంక్ ఉద్యోగి ఒకరు తన ఆదాయపన్ను రిటర్నుల్లో వడ్డీ ఆదాయం కింద రూ.25,000 వచ్చినట్టు చూపించాడు. దీంతో ఆదాయపన్ను శాఖ మదింపు అధికారి (అసెసింగ్ ఆఫీసర్)కి సందేహం వచ్చి సంబంధిత ఐటీఆర్ను పరిశీలన కోసం తీసుకున్నారు. పన్ను చెల్లింపుదారు బ్యాంక్ లావాదేవీలను పరిశీలించగా, మరింత విలువైన సమాచారం లభించింది. దీంతో పెనాల్టీ విధించి, చెల్లించాలంటూ నోటీసు జారీ చేశారు. ఒక వ్యాపారి స్థలం విక్రయించగా లాభం వచ్చింది. ఐటీఆర్లో వివరాలు వెల్లడించకుండా గోప్యంగా ఉంచాడు. ఎస్ఎఫ్టీ ద్వారా వచ్చిన సమాచారానికి, వ్యాపారి ఐటీఆర్లో వివరాలకు మధ్య తేడా ఉందని అసెసింగ్ ఆఫీసర్ గుర్తించారు. ఐటీఆర్ మదింపు అనంతరం, స్థలం విక్రయంపై మూలధన లాభాల పన్నుతోపాటు, పెనాల్టీ చెల్లించాలంటూ ఆదేశించారు. అంతేకాదు ఆదాయపన్ను చట్టం కింద చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయడమే కాదు.. చట్టంలోని నిబంధనలను అనుసరించి అన్ని ఆర్థిక వివరాలనూ వెల్లడించడం, పన్ను చెల్లించడం తప్పనిసరి. చెప్పకపోతే పన్ను అధికారులకు తెలియదులే! అన్న నిర్లక్ష్యం పనికిరాదు. అన్ని ముఖ్యమైన ఆర్థిక లావాదేవీల సమాచారం ఐటీ శాఖ గుప్పిట్లో ఉంటుంది. ఖరీదైన కొనుగోళ్లు, క్రెడిట్ కార్డు రుణాలు, ప్రాపర్టీ లావాదేవీలు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడుల సమాచారం ఆదాయపన్ను శాఖకు చేరుతుంది. ఏ చిన్న అంతరం ఉన్నా ఏఐ సాయంతో పన్ను అధికారులు సులభంగా గుర్తిస్తున్నారు. కనుక పన్ను చెల్లించాల్సిన బాధ్యత నుంచి తప్పించుకోవడం కష్టమే..! అన్ని బ్యాంక్లు, ఆర్థిక సంస్థలు, తపాలా శాఖ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ తదితర రిపోర్టింగ్ ఎంటీటీలు (ఆర్ఈలు) ఆదాయపన్ను శాఖ వద్ద ‘స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్’ను (ఎస్ఎఫ్టీ) ఏటా దాఖలు చేయాల్సి ఉంటుంది. ప్రతీ పాన్పై చేసిన నిర్దేశిత ఆర్థిక లావాదేవీల వివరాలను ఎస్ఎఫ్టీలో వెల్లడించాలి. పన్ను ఎగవేతలను నివారించేందుకు ఆదాయపన్ను శాఖ ఎస్ఎఫ్టీలను పరిశీలిస్తుంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి తన వార్షిక ఆదాయం రూ.4.5 లక్షలేనంటూ సెక్షన్ 87ఏ కింద రిబేటును వినియోగించుకుని ఎలాంటి పన్ను లేకుండా రిటర్నులు దాఖలు చేశాడని అనుకుందాం. కానీ, అదే వ్యక్తి రూ.5 లక్షలు విలువ చేసే బంగారం కొనుగోలు చేసి ఉంటే ఆదాయపన్ను శాఖ వద్దనున్న రికార్డులు ఆ విషయాన్ని లేవనెత్తుతాయి. దాంతో వారి ఐటీఆర్లు స్క్రూటినీ (పరిశీలన)కి వెళతాయి. తనకు ఆదాయం రూ.6 లక్షలుగానే చూపించొచ్చు. తీరా చూస్తే బ్యాంక్ నుంచి ఉపసంహరణలు లేకపోవచ్చు. అలాంటప్పుడు ఆ వ్యక్తి జీవన అవసరాలకు కావాల్సిన సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? ఇలాంటివన్నీ ఆదాయపన్ను శాఖ అధికారులు సులభంగా పసిగట్టగలరు. కనుక ఎస్ఎఫ్టీ గురించి, ఏఐఎస్ గురించి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి. ప్రతి సమాచారం రికార్డు అవుతుంది.. స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ (ఎస్ఎఫ్టీ) ద్వారా బ్యాంక్లు, మ్యూచువల్ ఫండ్స్, రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, తదితర సంస్థలు అందించే సమాచారం.. పాన్ నంబర్ వారీగా వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)లో నమోదవుతుంది. అన్ని ముఖ్య ఆర్థిక లావాదేవీల వివరాలు ప్రతీ పన్ను చెల్లింపుదారుడి ఏఐఎస్లో ఆటోమేటిక్గా రికార్డు అవుతాయని సింఘానియా అండ్ కో పార్ట్నర్ రికిత నయ్యర్ వెల్లడించారు. కనుక ఏఐఎస్ను ఒక్కసారి పరిశీలించుకున్న తర్వాత ఐటీఆర్ దాఖలు చేసుకోవాలని సూచించారు. దీనివల్ల కచ్చితమైన సమాచారంతో ఐటీఆర్ నమోదు చేయడం సాధ్యపడుతుందని, తద్వారా ఐటీఆర్ వేగంగా ప్రాసెస్ అవుతుందని చెప్పారు. గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2024–25) పన్ను రిటర్నుల సమర్పణకు పొడిగించిన గడువు సెప్టెంబర్ 15వ తేదీతో ముగియనుంది.ఐటీఆర్లో వెల్లడించకపోతే ఏమవుతుంది? ‘‘పన్ను చెల్లింపుదారు ఆదాయపన్ను రిటర్నుల్లో (ఐటీఆర్) కీలక లావాదేవీల సమాచారాన్ని వెల్లడించనప్పుడు లేదా ఎస్ఎఫ్టీ, ఏఐఎస్లోని సమాచారంతో, ఐటీఆర్లోని వివరాలు సరిపోలనప్పుడు తదుపరి పలు పరిణామాలకు దారితీయవచ్చు’’ అని సంజోలి మహేశ్వరి తెలిపారు. నోటీసులు: ఏఐఎస్లో నమోదైన అధిక విలువ కలిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వివరణ కోరుతూ ఆదాయపన్ను శాఖ నోటీసు జారీ చేస్తుంది. ఐటీఆర్లో వెల్లడించిన లావాదేవీలు సరిగ్గానే ఉన్నాయా? అంటూ ధ్రువీకరించాలని కోరుతుంది. పూర్తి వివరాలు వెల్లడించకపోవడం లేదంటే పాక్షిక వివరాలతో సరిపెట్టినట్టయితే సవరించిన ఐటీఆర్లు దాఖలు చేయాలని కోరుతుంది. పరిశీలన: ఐటీఆర్లో వెల్లడించిన ఆదాయానికి, ఎస్ఎఫ్టీలో లావాదేవీల సమాచారానికి మధ్య పొంతన లేనప్పుడు లేదా అసలు ఐటీఆర్ దాఖలు చేయనప్పుడు లేదంటే నోటీసుకు స్పందించనప్పుడు లేదా నోటీసుకు సరైన సమాధానం ఇవ్వనప్పుడు సంబంధిత పన్ను చెల్లింపుదారుడి ఐటీఆర్ను పూర్తి స్థాయి పరిశీలనను అసెసింగ్ ఆఫీసర్ చేపడతారు. నోటీసు జారీ చేసి సరైన సమాచారంతో రిటర్నులు దాఖలు చేయాలని పన్ను అధికారి కోరొచ్చు. పెనాల్టిలు: నిబంధనల ప్రకారం ఐటీఆర్లు దాఖలు చేయకపోవడం లేదా పన్ను చెల్లించనట్టయితే.. జరిమానాతో సహా చెల్లించాలని ఆదేశాలు జారీ చేస్తారు. ఈ పెనాల్టీ అసలు పన్నుకు 50 శాతం నుంచి 200 శాతం వరకు ఉంటుంది. అంతేకాదు చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు. ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగ్గొట్టినట్టు గుర్తిస్తే జరిమానాకు అదనంగా జైలు శిక్ష కూడా పడుతుందని మహేశ్వరి తెలిపారు. ఎగవేసిన మొత్తం రూ.25 లక్షలకు పైన ఉంటే 6 నెలల నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్షతోపాటు జరిమానా చెల్లించాల్సి వస్తుందని.. తప్పుడు వివరాలతో లేదా వివరాలను రహస్యంగా ఉంచి వెల్లడించని సందర్భాల్లో 3 నెలల నుంచి 2 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించొచ్చని చెప్పారు. అయితే, నోటీసులకు సకాలంలో స్పందించి, వాస్తవ సమాచారంతో ఐటీఆర్లు దాఖలు చేసి, పన్ను చెల్లించడం ద్వారా ఈ ఇబ్బందులను అధిగమించొచ్చు. ఎస్ఎఫ్టీల్లోకి చేరే లావాదేవీలు.. → ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు అంతకుమించిన విలువపై బ్యాంక్ డ్రాఫ్ట్లు/ పే ఆర్డర్లు / బ్యాంకర్ చెక్కులకు నగదు చెల్లింపులు. → బ్యాంక్లు, కోపరేటివ్ బ్యాంకుల నుంచి ప్రీ–పెయిడ్ ఇన్స్ట్రుమెంట్లను రూ.10 లక్షలు అంతకుమించి నగదు చెల్లించి కొనుగోలు చేయడం. → ఒక వ్యక్తి కరెంట్ ఖాతాలో నగదు జమలు రూ.50 లక్షలు అంతకుమించి చేసినప్పుడు. → ఒక వ్యక్తి కరెంట్ ఖాతా నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50 లక్షలు, అంతకుమించి నగదు ఉపసంహరణలు. → కరెంట్, టైమ్ డిపాజిట్ కాకుండా ఇతర బ్యాంక్ ఖాతాల్లో ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు అంతకుమించి నగదు జమ చేయడం. → వస్తువు లేదా సేవా విక్రయంపై ఒక వ్యక్తి రూ.2 లక్షలకు మించి నగదు చెల్లించడం. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 44ఏఈబీ కిందకు ట్యాక్స్ ఆడిట్ అవసరమైన వారికే ఈ నిబంధన → ఒకటి లేదా ఒకటికి మించిన క్రెడిట్ కార్డులకు ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు చెల్లింపులు రూ.లక్ష అంతకుమించి ఉంటే → ఒకటి లేదా అంతకు మించిన క్రెడిట్ కార్డులకు డిజిటల్ చెల్లింపుల మొత్తం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు, అంతకు మించితే. → ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు అంతకుమించిన మొత్తంతో టైమ్ డిపాజిట్ (రెన్యువల్ కాకుండా) చేయడం. → బాండ్లు లేదా డిబెంచర్లపై మొత్తం మీద (ఒకటికి మించిన లావాదేవీలు కూడా) ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు అంతకుమించి ఇన్వెస్ట్ చేయడం. → షేర్ల కొనుగోలు విలువ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు (ఒక్క లావాదేవీ లేదా ఒకటికి మించిన లావాదేవీల మొత్తం), అంతకుమించినప్పుడు ఎస్ఎఫ్టీ ద్వారా బ్రోకర్లు ఐటీ శాఖకు ఫైల్ చేయాల్సిందే. → షేర్ల బైబ్యాక్లో పాల్గొని విక్రయించిన మొత్తం రూ.10 లక్షలు అంతకుమించిన సందర్భాల్లో. → మ్యూచువల్ ఫండ్స్లో యూనిట్లపై పెట్టుబడి రూ.10 లక్షలు అంంతకుమించిన సందర్భాల్లో. → స్థిరాస్తి కొనుగోలు లేదా విక్రయం విలువ (రిజిస్ట్రేషన్ వ్యాల్యూ/ప్రభుత్వ మార్కెట్ విలువ లేదా రికార్డు అయిన అసలు కొనుగోలు/విక్రయం విలువ) రూ.30 లక్షలు అంతకుమించిన సందర్భాల్లో రిజిస్టార్ లేదా సబ్ రిజి్రస్టార్ నివేదించాల్సి ఉంటుంది. → ఫారీన్ కరెన్సీ కోసం రూ.10 లక్షలు అంతకుమించిన చెల్లింపులు చేసినప్పుడు. → క్రెడిట్ లేదా డెబిట్ కార్డు లేదా ట్రావెలర్స్ చెక్కు లేదా డ్రాఫ్ట్ రూపంలో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు అంతకుమించి ఖర్చు చేసిన సందర్భాల్లో సమాచారం ఎస్ఎఫ్టీ రూపంలో ఐటీ శాఖకు వెళుతుంది. రిజిస్ట్రార్ అండ్ షేర్ ట్రాన్స్ఫర్ ఏజెంట్, రిజి్రస్టార్ కార్యాలయాలు తదితర) ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాతి మే 31లోపు ఎస్ఎఫ్టీలను నమోదు చేయాల్సింఇక్కడ చెప్పిన పరిమితులన్నీ ఒక ఆర్థిక సంవత్సరం మొత్తానికి కలిపి అమలవుతాయి. రిపోర్టింగ్ ఎంటీటీలు (బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు, మ్యూచువల్ ఫండ్స్ ట్రస్టీలు లేదా మ్యూచువల్ ఫండ్స్దే.– సంజోలి మహేశ్వరి , నాంజియా అండ్ కో ఎల్ఎల్పీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు.వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్) వేతనాలు, వడ్డీ ఆదాయం, డివిడెండ్లు, ఇల్లు/ప్లాంట్లు/మెíÙనరీలపై అద్దె ఆదాయం తదితర లావాదేవీల వివరాలతోపాటు.. టీడీఎస్, టీసీఎస్, జీఎస్టీ ఇతర పన్ను సంబంధిత వివరాలు, రెమిటెన్స్లు (విదేశీ చెల్లింపులు/స్వీకరణలు), షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్లలో పెట్టుబడులు/ఉపసంహరణలు, ఆఫ్ మార్కెట్ కొనుగోళ్లు/విక్రయాలు, ప్రాపర్టీల క్రయ/విక్రయాలు ఇలా సమగ్ర సమాచార నివేదికగా ఏఐఎస్ ఉంటుంది. అంతేకాదు బంగారం, కార్లు తదితర అధిక విలువ కొనుగోళ్లు, కమీషన్ల ఆదాయం, విదేశీ పర్యటనలపై అధిక వ్యయాలు, జీవిత బీమా పాలసీల నుంచి అందుకున్న మొత్తం, లాటరీ/బెట్టింగ్ల్లో గెలుచుకుంటే, ఆయా వివరాలు కూడా ఇందులోకి చేరతాయి. దీన్ని రిటర్నుల దాఖలుకు ముందు ఒకసారి పరిశీలించుకుని, అందులోని వివరాలు/లావాదేవీలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిపై తమ అభిప్రాయాలను ఆదాయపన్ను శాఖకు నివేదించొచ్చు. ఉదాహరణకు ఏదైనా పెట్టుబడి విషయంలో అసలు కంటే అధిక మొత్తం ఉన్నట్టు గుర్తించినట్టయితే ఇదే విషయాన్ని ఆదాయపన్ను శాఖ దృష్టికి తీసుకెళ్లొచ్చు. దాంతో అది సవరణకు గురవుతుంది. పన్ను చెల్లింపుదారుడికి సంబంధించి సమగ్రమైన ఆర్థిక సమాచార నివేదిక ఇది. పూర్తిగా పరిశీలించుకుని, నిబంధనల ప్రకారం ఆ వివరాలను ఐటీఆర్లో స్వచ్ఛందంగా వెల్లడించే దిశగా పన్ను చెల్లింపుదారులను ప్రోత్సహించడమే దీని ఉద్దేశం. ఫారమ్ 26ఏఎస్ ఫారమ్ 26ఏఎస్ అన్నది పన్ను చెల్లింపుదారుడి ఆదాయంపై మినహాయించిన టీడీఎస్, వ్యయాలపై వసూలు చేసిన టీసీఎస్, ప్రాపర్టీ క్రయ/విక్రయాల వివరాలతో ఉంటుంది. ఏఐఎస్, ఫారమ్ 26ఏఎస్ను ఆదాయపన్ను ఈ–ఫైలింగ్ పోర్టల్ నుంచి పొందొచ్చు. -
స్టార్టింగ్ ప్రాబ్లమా
స్టార్టింగ్ ప్రాబ్లం.. మనం తరచూ వినే డైలాగ్. తలపెట్టిన పనులను తరచూ వాయిదా వేస్తుంటారు కొందరు. వారిని ఆట పట్టించడానికి ‘స్టార్టింగ్ ప్రాబ్లమా’ అని అంటుంటాం. వ్యాయామం, ఇంటి పనుల వంటివి ప్రారంభించడం కష్టంగా అనిపిస్తుందా? యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ హాస్పిటల్స్లో న్యూరాలజీ వైద్యులు, న్యూరో సైంటిస్ట్గా పనిచేస్తున్న డాక్టర్ ఫేయ్ బెగేటి ఓ చక్కటి, సులభ పరిష్కారాన్ని ప్రతిపాదిస్తున్నారు. మెదడు శక్తిని పెంచడానికి, మానసిక అడ్డంకులను తొలగించడానికి నిబద్ధతతో కూడిన ఓ ‘5 నిమిషాలు’ చాలు అంటున్నారు.రేపట్నుంచి వాకింగ్కు వెళ్తా.. డిసెంబర్ 31 నాడు.. ‘జనవరి 1 నుంచి వాకింగ్ లేదా వ్యాయామం చేస్తా’రేపట్నుంచి ఉదయం ఆరింటికే నిద్ర లేస్తా..పోటీ పరీక్షలకు రేపట్నుంచి ప్రిపరేషన్ మొదలుపెడతా.... ఇలాంటి నిర్ణయాలు చాలామంది తీసుకుంటారు. కానీ, బద్ధకం వాటిని అమలు చేయనివ్వదు. అలాంటి కష్టమైన పనులను చేయడంలో మనసు, మెదడు.. రెండూ మొండికేస్తుంటాయి. మరి, దీన్ని అధిగమించడం ఎలా? 5 నిమిషాల నియమం.. మనసును సిద్ధం చేసే ఓ చిట్కా. ఇది వాయిదా వేసే మనస్తత్వాన్ని మారుస్తుంది.తద్వారా మానసిక అలసట తగ్గుతుందని బెగేటి అంటున్నారు. ఒక పనిని ప్రారంభించడానికి మనసు సన్నద్ధంగా లేనప్పుడు.. ఆ పనిని కేవలం 5 నిమిషాల సేపు చేసి చూడాలి. సాధారణంగా మన మెదడు పని కష్టాన్ని ఎక్కువగా అంచనా వేస్తుంది. అందువల్ల ఎక్కువ సేపు చేస్తే అలసిపోతానని ముందే ఊహించుకుంటుంది. కాబట్టి 5 నిమిషాల పాటు నిబద్ధతతో పనిచేస్తే మెదడు అలవాటు పడి, తరవాత ఆ పని కొనసాగించేలా ప్రేరేపిస్తుంది.మానసిక అలసటే పెద్ద సమస్యశారీరక అలసట ఉన్నా ఫర్వాలేదుగానీ.. మానసిక అలసట ఉంటే మాత్రం మెదడు పనిచేయనివ్వదు. మెదడు అలసటను.. స్మార్ట్ఫోన్ ‘లో బ్యాటరీ’ మోడ్తో పోల్చారు బెగేటి. లో బ్యాటరీ ఉన్నా మనం పనిచేస్తుంటే.. ‘బ్యాటరీ లో’ అని ప్రతిసారీ అరుస్తున్నట్టే.. ‘నేను చేయను/చేయడానికి సిద్ధంగా లేను’ అని మెదడు కూడా మొరాయిస్తుంది. సోషల్ మీడియా స్క్రోలింగ్ వంటి తక్షణ వినోదాన్ని అందించే సాధారణ కార్యకలాపాలను ఎంచుకోవడం ద్వారా.. మెదడు తక్కువ కష్టమైన పనులవైపు మొగ్గు చూపుతుంది. ‘5 నిమిషాల’ నియమం.. మెదడుకున్న ఈ బద్ధకానికి చక్కటి చిట్కాలా పనిచేస్తుంది. ‘5 నిమిషాలే కదా చేసేద్దాం’ అని చేసేస్తుంది.దినచర్యగా మారుతుందిఏదైనా పనిని ప్రారంభించినప్పుడు మెదడు డోపమైన్ ను విడుదల చేస్తుంది. ఇది ప్రేరణతోపాటు ఆనందం ఇచ్చే రసాయనం. ఈ 5 నిమిషాల ప్రక్రియ.. మనలో జోష్ నింపి ఆ సమయం తరవాత కూడా పని చేయడానికి ప్రేరేపిస్తుంది. ఇది ఒక దినచర్యగా అలవాటైతే.. దీర్ఘకాలంలో మెదడు చురుగ్గా, మరింత ప్రభావవంతంగా పనిచేసేందుకు దారితీస్తుందని బెగేటి పేర్కొన్నారు. వ్యాయామం, ఇంటి బాధ్యతలతో సహా ఏదైనా సవాలుతో కూడిన, శక్తిని వినియోగించే పనికి ఈ నియమం రోజువారీ సాధనంగా పనిచేస్తుంది. 5 నిమిషాల నియమం.. వాయిదా వేసే విధానానికి చెక్ పెట్టడంలో సహాయపడుతుంది. అదే సమయంలో నిర్ణయం తీసుకోవడంలోనూ , దృష్టి కేంద్రీకరించిన పని వల్ల వచ్చే అలసటను తగ్గించి మెదడును చురుగ్గా ఉంచుతుంది.చిన్న చిన్న ప్రయత్నాలు⇒ చిన్న చిన్న ప్రయత్నాలతో మెదడును సిద్ధం చేయండి. అవి నిరంతరం పనిని కొనసాగించేలా ప్రేరేపిస్తాయి.⇒ రోజూ కేటాయించే ఆ 5 నిమిషాలు.. అంటే సంవత్సరానికి సుమారు 30 గంటల అభ్యాసంతో స్థిరంగా చేసే చిన్న పనులు పెద్ద ఫలితాలను ఇస్తాయి.⇒ పనులను మరింత సులువుగా మొదలుపెట్టేందుకు ఈ చిట్కా తోడ్పడుతుంది.⇒ మెదడు.. చేయనని మొండికేసే స్థితి నుంచి నేను చేయగలననే చురుకైన స్థితికి మారడానికి ఈ నియమం దోహద పడుతుంది.ఇలా విజయవంతం చేయండి⇒ చేయాల్సిన పూర్తి పని నుంచి ఒక నిర్దిష్ట చిన్న విభాగాన్ని మీ ప్రారంభ సాధనంగా ఎంచుకోండి⇒ ఇందుకోసం టైమర్లో అయిదు నిమిషాల సమయాన్ని సెట్ చేయండి⇒ మీ దృష్టిని మరల్చే వాటిని గుర్తించి తొలగించండి.⇒ 5 నిమిషాల తర్వాత పురోగతిని చెక్ చేయండి. దీనిని బట్టి ఆ పనిని కొనసాగించాలా వద్దా అని నిర్ణయించుకోండి. -
‘ప్రొఫైల్ ’ నకిలీ.. ‘సైబర్’ మకిలి
నకిలీ ప్రొఫైల్, సైబర్ వేధింపులు, ప్రొఫైల్ హ్యాకింగ్.. తీరు ఏదైనా సైబర్ నేరాల సంఖ్య భారత్లో ఏటా పెరుగుతూనే ఉంది. జనం డిజిటల్కు పెద్ద ఎత్తున మళ్లుతుండడం, అదే సమయంలో పూర్తిగా అవగాహన ఉండకపోవడం.. సైబర్ నేరగాళ్లకు కలిసి వస్తున్నాయి. ముఖ్యంగా ఆన్ లైన్ , సామాజిక మాధ్యమాల వేదికగా నకిలీ ఆన్ లైన్ ఖాతాలు తెరిచి చేస్తున్న మోసాలే ఎక్కువగా ఉంటున్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్ఇతర వ్యక్తులు, బ్రాండ్, సంస్థలా కనిపించడానికి నకిలీ ఆన్ లైన్ ఖాతా తెరిచి చేస్తున్న మోసాలు దేశంలో అధికంగా ఉంటున్నాయి. అక్రమంగా డబ్బు సంపాదించే లక్ష్యంతో వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వివరాలను ఉపయోగించి సైబర్ నేరస్తులు ఇతరులను మోసం చేస్తున్నారు. గతేడాది ఇలాంటి ఘటనలు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఛిyb్ఛటఛిటజీఝ్ఛ.జౌఠి.జీn) ద్వారా 39,846 నమోదయ్యాయి. నాలుగేళ్లలో ఈ తరహా మోసాలు మూడు రెట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్ సీఆర్పీ వేదిక ద్వారా సైబర్ వేధింపుల ఫిర్యాదులు మూడున్నర రెట్లు పెరిగి 39,077కు చేరాయి. ప్రొఫైల్ హ్యాకింగ్, గుర్తింపు చోరీ ఘటనలు మూడింతలకుపైగా అధికమై 38,295కు పెరిగాయి. ఆన్ లైన్ జాబ్, మ్యాట్రిమోనియల్ మోసాలు కూడా పెరుగుతూ ఉన్నాయి.కేసులు ఎన్నోరెట్లు..అధికారిక లెక్కల ప్రకారం గతేడాది దేశవ్యాప్తంగా 22 లక్షలకుపైగా సైబర్ సెక్యూరిటీ ఘటనలు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. ఆన్ లైన్ , సామాజిక మాధ్యమాల ద్వారా మోసాలు 2020తో పోలిస్తే 2024 నాటికి దాదాపు మూడింతలయ్యాయి. మహిళలు, పిల్లలపై జరుగుతున్న సైబర్ నేరాల సంఖ్య రెండింతలకుపైగా పెరిగి గత ఏడాది 48,475కు చేరాయి. సైబర్ నేరస్తులు ఇతర దేశాల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నట్టు వారు ఉపయోగించిన ఇంటర్నెట్ ప్రొటోకాల్ (ఐపీ) అడ్రస్లను బట్టి తెలుస్తోంది. సైబర్ క్రిమినల్స్ చాలా సందర్భాల్లో తప్పుడు లొకేషన్ , గుర్తింపుతో తప్పుదోవ పట్టిస్తున్నట్టు హోం మంత్రిత్వ శాఖ వర్గాలు గుర్తించాయి.కేటాయింపులు మూడింతలు..పౌరులు, వ్యాపారాలు, ప్రభుత్వానికి సురక్షిత సైబర్స్పేస్ను నిర్మించడానికి నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ (ఎన్ సీఎస్పీ)ని కేంద్రం తీసుకొచ్చింది. అలాగే దేశంలోని సైబర్స్పేస్ను జల్లెడ పట్టేందుకు, సైబర్ భద్రతా ముప్పులను గుర్తించడానికి నేషనల్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ (ఎన్ సీసీసీ) ఏర్పాటు చేసింది. డేటా సంరక్షణ కోసం డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) చట్టం–2023 తీసుకొచ్చింది. ఎలక్ట్రానిక్స్, సమాచార మంత్రిత్వ శాఖ సైబర్ సెక్యూరిటీ మౌలిక వసతుల కోసం కేటాయించిన నిధులు 5 ఏళ్లలో మూడింతలకుపైగా పెరగడం గమనార్హం. -
గంటకు 400 కిలోమీటర్లు!
భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఒకటైన ముంబై–అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయి. గుజరాత్లోని స్టేషన్ ్సలో సివిల్ పనులు పూర్తి అయ్యాయని రైల్వే శాఖ ప్రకటించింది. అత్యాధునిక సాంకేతికతతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో భాగంగా ఈస్ట్ జపాన్ రైల్వే కంపెనీ అభివృద్ధి చేస్తున్న ‘ఈ–10’ షింకన్సెన్ బుల్లెట్ రైలు 2030లో పట్టాలెక్కనుంది. గంటకు 400 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లడం ఈ ట్రైన్ ప్రత్యేకత.జపాన్ పర్యటనలో భాగంగా షింకన్సెన్ బుల్లెట్ రైలులో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణించడం ప్రాధాన్యత సంతరించుకుంది. జపాన్ సహకారంతో ముంబై–అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్టును భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. హై స్పీడ్ రైల్ నడపడం కోసం అక్కడ శిక్షణ పొందుతున్న భారత డ్రైవర్లతోనూ మోదీ ముచ్చటించారు. ఈ నేపథ్యంలో దేశంలోని తొలి హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు మరోసారి వార్తల్లోకెక్కింది.508 కి.మీ. కారిడార్బుల్లెట్ రైలు ప్రాజెక్టు గుజరాత్, మహారాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీల గుండా పోతుంది. మొత్తం కారిడార్ పొడవు 508 కిలోమీటర్లు. ఇందులో 12 స్టేషన్లు ఉంటాయి. వీటిలో మహారాష్ట్రలో నాలుగు, గుజరాత్లో ఎనిమిది రానున్నాయి. మహారాష్ట్రలో ముంబై స్టేషన్ భూగర్భంలో నిర్మిస్తుండగా మిగిలిన థానే, విరార్, బోయిసర్, అలాగే గుజరాత్లోని వాపి, బిలిమోరా, సూరత్, భారుచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి వద్ద ఎలివేటెడ్ స్టేషన్ ్స రానున్నాయి.⇒ మొత్తం 8 స్టేషన్లలో ఫౌండేషన్ పనులు పూర్తయ్యాయి. ⇒ 395 కి.మీ పీయర్ పనులు, 407 కి.మీ. ఫౌండేషన్, 337 కి.మీ. గర్డర్ క్యాస్టింగ్ కూడా పూర్తయ్యాయి. ⇒ 17 రివర్ బ్రిడ్జిల నిర్మాణం పూర్తయింది. మరో 9 రివర్ బ్రిడ్జిల నిర్మాణం పూర్తికావచ్చింది. ⇒ 317 కి.మీ. వయడక్ట్ నిర్మాణం కూడా పూర్తయింది. ⇒ గుజరాత్లో 198 కిలోమీటర్ల ట్రాక్ సిద్ధమైంది.ట్రయల్ రన్ 2027లో..గుజరాత్లో మొదటి 50 కిలోమీటర్ల మార్గంలో 2027లో బుల్లెట్ రైలు పరుగు తీయనుంది. గుజరాత్లోని స్టేషన్ల నిర్మాణం 2027 డిసెంబర్ నాటికి, మొత్తం ప్రాజెక్టు 2029 డిసెంబర్ నాటికి పూర్తవుతుందని రైల్వే శాఖ ప్రకటించింది.రూ.78,839 కోట్ల వ్యయంముంబై–అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,08,000 కోట్లు. ఈ ఏడాది జూన్ 30 నాటికి రూ.78,839 కోట్లు ఖర్చు చేశారు.⇒ ప్రాజెక్టు అంచనా వ్యయంలో 81 శాతం మొత్తాన్ని జపాన్ ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ ఏజెన్సీ (జికా) ద్వారా జపాన్ ప్రభుత్వం సమకూరుస్తోంది. ⇒ ఈ ప్రాజెక్టులో రైల్వే శాఖకు 50 శాతం; మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలకు చెరి 25 శాతం వాటా ఉంది. ఆర్థిక సహాయంతోపాటు భారత్లో సమాచార సేకరణ, పరీక్షల కోసం రెండు షింకన్సన్ రైళ్లను జికా ఉచితంగా సరఫరా చేస్తోంది.స్థల సేకరణ పూర్తిమహారాష్ట్రలో భూసేకరణ, అనుమతుల జాప్యం, కోవిడ్–19 మహమ్మారి.. తదితర కారణాలతో ఈ ప్రాజెక్టు దాదాపు రెండున్నరేళ్లు ఆలస్యం అయింది. ప్రాజెక్టుకు కావాల్సిన 1,389.5 హెక్టార్ల భూ సేకరణ పూర్తి అయినట్టు రైల్వే శాఖ వెల్లడించింది. అన్ని అనుమతులూ పొంది, సివిల్ కాంట్రాక్టులన్నీ నిర్మాణ సంస్థలకు అప్పగించారు.80 నిమిషాల్లో...గంటకు 400 కి.మీ. వేగంతో పరిగెత్తే ఈ–10 బుల్లెట్ ట్రైన్ ముంబై నుంచి సబర్మతికి మధ్య ఉన్న 508 కిలోమీటర్ల దూరాన్ని నాన్ –స్టాప్గా అయితే 80 నిముషాల్లో పూర్తి చేస్తుంది.ఈ–5 కాదు.. ఈ–10 రైళ్లుఒప్పందంలో భాగంగా జపాన్ ప్రభుత్వం ‘ఈ–5’ షింకన్సెన్ బుల్లెట్ రైళ్లు మనదేశానికి పంపాలి. కానీ, ఇప్పుడు అత్యాధునికమైన ‘ఈ–10’ రైళ్లు ఆ దేశం తయారుచేస్తోంది. వాటినే మనకు పంపనుంది. ఇవి జపాన్ తోపాటు భారత్లోనూ 2030 ప్రారంభంలో ఎంట్రీ ఇవ్వనున్నాయి. ‘ఈ–5’ బుల్లెట్ ట్రైన్ వేగం గంటకు గరిష్టంగా 320 కి.మీ. కాగా, ఈ–10 రైలు వేగం 400 కి.మీ. ఈ రైళ్లను భారత్లోనూ తయారు చేసే అవకాశం ఉంది. సముద్రగర్భ రైల్ టన్నెల్ఈ కారిడార్లో 21 కిలోమీటర్ల పొడవైన సముద్రగర్భ రైల్ టన్నెల్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ముంబై–థానే మధ్య నిర్మిస్తున్న ఈ టన్నెల్లో భారత్లో మొట్టమొదటి 7 కి.మీ. పొడవైన సముద్రగర్భ సొరంగం కూడా ఉంది. 13.1 మీటర్ల వ్యాసం కలిగిన ఒకే ట్యూబ్ సొరంగంలో రెండు ట్రాక్లు ఉంటాయి. మహారాష్ట్రలోని 4 కి.మీ. టన్నెల్ పనులు, గుజరాత్లోని ఒకే ఒక్క టన్నెల్ నిర్మాణం పూర్తయ్యాయి.⇒ హైస్పీడ్ రైల్ కారిడార్ మొత్తం పొడవు 508 కి.మీ.⇒ నర్మద, తపతి వంటి నదులపై నిర్మిస్తున్న మొత్తం 25 రివర్ బ్రిడ్జిలలో 17 పూర్తి⇒ మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.1,08,000 కోట్లలో ఇప్పటికే రూ.78,839 కోట్ల వ్యయం⇒ గుజరాత్లో 2027లో 50 కిలోమీటర్లలో పాక్షిక కార్యకలాపాలు⇒ 2030లో పూర్తిస్థాయిలో పరుగులు తీయనున్న బుల్లెట్ రైల్ -
కలలకు మేత.. కడుపే!
ఇంతవరకూ ఎవరు చెప్పినా, ‘‘పగటి పూట ఆలోచనలే రాత్రి పూట కలలు’’ అని చెప్పినవాళ్లే. సిగ్మండ్ ఫ్రాయిడ్ అదే చెప్పారు. మన వేదాలూ, ఉపనిషత్తులూ అదే చెప్పాయి. అయితే ఏం తింటే కలలు, పీడకలలు వస్తాయో ఏ కలల శాస్త్రమూ చెప్పలేదు. ఏ శాస్త్ర పరిశోధనా గుట్టు విప్పలేదు. అయినా తినే ఆహారానికీ, నిద్రలో వచ్చే కలలకు సంబంధం ఉంటుందని అసలు ఎవరు ఊహిస్తారు కనుక?! ఆహారమేమో కడుపులోకి వెళ్లేది. కలలేమో బ్రెయిన్లోంచి వచ్చేవి. లింక్ ఎలా ఉంటుంది? అందుకే ఆ వైపుగా పరిశోధనలు జరగలేదు. తాజాగా ఇప్పుడు, పరిశోధన కాదు కానీ, అధ్యయనం ఒకటి జరిగింది. అందులో ఏం తేలిందంటే.. పడనివి తింటే పీడకలలు మన పీక పట్టుకుంటాయని!!ఏం తింటే వస్తాయి?కలలు ఎందుకొస్తాయో చెప్పే శాస్త్రాలే కానీ, ఏం తింటే కలలు వస్తాయో చెప్పిన శాస్త్రం ఒక్కటీ మనకు లేదు. ‘ఆన్ డ్రీమ్స్’ అని అరిస్టాటిల్ రాసినా, ‘ది ఫిలాసఫీ ఆఫ్ డ్రీమ్స్’ అని స్వామీ శివానంద విశ్లేషించినా.. అవేవీ కూడా ‘కలలకు మేత ఎవరు వేస్తున్నారు?’ అనే కోణం లోంచి దృష్టి సారించినవి కావు. అయితే ఇటీవల కెనడా అధ్యయనవేత్తలు కొందరు కలలకు–ఆహారానికి సంబంధం ఉందని నిర్ధారించటంతో, ‘ఏం తింటే పీడ కలలు వస్తాయి?’ అనే ఆసక్తి అంతటా మొదలైంది.పాలు కలిస్తే పీడ కలలు!తాజా అధ్యయనానికి ముందు కూడా కొన్ని సర్వేలు జరిగాయి. కానీ అవి – ‘కలలకు, కడుపుకు సంబంధం ఉండే అవకాశం లేకపోలేదు’ అన్నంత వరకు మాత్రమే ఫలితాలను అందించాయి. 2005 నుంచి ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న మరొక అధ్యయనం ఈ దిశగా ఒక అడుగు ముందుకు వేసి, ఫాస్ట్ ఫుడ్ తినే వారి కంటే పాల ఉత్పత్తులతో కూడిన ఆహారం తినే వారికే ఎక్కువగా వింతైన కలలు వస్తున్నట్లు కనుగొంది!స్వీట్లు తినేవారిలో ఎక్కువ2021లో జరిగిన సర్వేలో.. పండ్లు, చేపలు ఎక్కువగా తింటే, రాత్రి కన్న కలలు ఉదయానికి బాగా స్పష్టంగా జ్ఞాపకం ఉంటాయని; అలాగే చక్కెరలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల పీడ కలలు వస్తున్నాయనీ వేర్వేరుగా రెండు అంశాలను అధ్యయనవేత్తలు గుర్తించారు. ఇక 2015లో జరిగిన అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు 18 శాతం మంది.. తినే ఆహారం కలలకు కారణం అవుతుందన్న భావనను ఆమోదించారు. సైకాలజీ విద్యార్థులపై సర్వేఇరవై ఏళ్లుగా జరుగుతున్న అధ్యయనాలన్నిటికీ కొనసాగింపుగా, ఇటీవల 1,082 మంది కెనడా మనస్తత్వశాస్త్ర విద్యార్థులతో నీల్సన్, డెనాల్డ్, పావెల్ పరిశోధకులు ఆ¯Œ లైన్ సర్వే నిర్వహించారు. ఆ విద్యార్థుల ఆహార అలవాట్లు, ఆరోగ్యం ఎలా ఉంటున్నదీ, సరిగానే నిద్ర పోతున్నారా, ఎలాంటి కలలు వస్తుంటాయి అనే ప్రశ్నలు అడిగారు. ఆహారం, పడని ఆహారం కలలను ఎలా ప్రభావితం చేస్తోందన్నది కనిపెట్టటమే వారి లక్ష్యం.ఆ ప్రయత్నంలో పీడ కలలు రావటం పైన కూడా ఆహారం ప్రభావం ఉన్నట్లు వారు గుర్తించారు!తాజా అధ్యయన ఫలితాలు⇒ ఫుడ్ అలర్జీలు; గోధుమ, బార్లీలో ఉండే గ్లూటెన్ పడని వారికి పీడకలలు వస్తున్నాయి. ⇒ ఆహారంలోని లాక్టోస్ పడని వారికి నిద్రలేమి ఉంటోంది. ⇒ కడుపు నొప్పి, ఉబ్బరం వంటి జీర్ణాశయ ఇబ్బందులలో కూడా లాక్టోస్ పాత్ర ఉంటోంది.⇒ గట్ మైక్రోబయోమ్ (పెద్ద పేగులో ఉండే బ్యాక్టీరియాలోని సంక్లిష్ట వ్యవస్థ), కేంద్ర నాడీ వ్యవస్థ మధ్య సంబంధం ఉంది. ⇒ పేగుల్లోని ఇబ్బంది నిద్రలో పీడ కలలకు దారి తీస్తోంది.⇒ ‘పోస్ట్–ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్’ ప్రభావంగా కనిపించే పీడ కలలకు, ఆహారానికి లంకె కనిపించింది.⇒ కొన్ని ఆహారాలు కలలపై ఎంతవరకు ప్రభావం చూపుతాయో పరీక్షించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరం.తదుపరి అధ్యయనాలు⇒ లాక్టోస్ ఉన్న జున్ను, లాక్టోస్ లేని జున్ను వంటి కొన్ని ఆహారాలను తిన్నప్పుడు ఏమి జరుగుతుందో పరీక్షించడం.⇒ లాక్టోస్ పడని వారు, తరచుగా పీడకలలు వచ్చేవారు, వివిధ రకాల ఫుడ్ అలర్జీలు ఉన్న వారిని మరింత లోతుగా పరిశీలించడం.విరుగుడు ఉపాయాలుపీడ కలల్ని నిరోధించటానికి అధ్యయనవేత్తలు కొన్ని సూచనలు ఇస్తున్నారు. అవి :⇒ రాత్రి ఆలస్యంగా తినకండి.⇒ తియ్యగా, కారంగా ఉండే ఆహారాలు భారీగా తీసుకోకండి. ⇒ లాక్టోస్ పడకపోతే, పడుకునే ముందు పాల ఉత్పత్తులను తీసుకోకండి. లాక్టోస్ లేని ఆహారాన్ని భుజించండి. ⇒ గట్టిగా ఉన్న, ఎక్కువ కాలం నిల్వ ఉన్న జున్నులో.. మృదువైన, తాజా జున్నులో కంటే లాక్టోస్ తక్కువగా ఉంటుంది.⇒ మీకు ఫుడ్ అలర్జీలు ఉంటే, పడుకునే ముందు అటువంటి ఆహారాలను తీసుకోవడం తగ్గించండి.⇒ మీ నిద్రను లేదా కలల నాణ్యతను ప్రభావితం చేసే ఆహార పదార్థాలేవో మీకు మీరే గుర్తించండి. ⇒ నిజంగా అవి మీ నిద్రను లేదా మీ కలల నాణ్యతను ప్రభావితం చేస్తాయో లేదో చూడటానికి వాటిని అప్పుడప్పుడు తినకుండా, ఏం జరుగుతుందో గమనించండి. ⇒ ఫైబర్ ఉన్న పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లతో కూడిన (కొవ్వులు, కేలరీలు తక్కువగా ఉండేవి) పోషకాలు అధికంగా ఉండే సమతుల ఆహారం తీసుకోండి. చక్కగా నిద్రపడుతుంది.ప్రధాన అధ్యయనాలుబ్రిటిష్ చీజ్ బోర్డ్ (2005) నీల్సన్, పావెల్ (2015) అబ్దుల్ రజాక్ ఎట్ ఆల్ (2021) నీల్సన్, డెనాల్డ్, పావెల్ (2025) -
ఇగో పెంచిన పగ
రెండోసారి అమెరికా గద్దెనెక్కింది మొదలు, అన్ని దేశాలతోనూ గిల్లికజ్జాలతో తంపులమారిగా, ప్రపంచానికే పెను బెడదగా తయారయ్యారు ట్రంప్. మరీ ముఖ్యంగా భారత్ మీదనైతే మితిమీరిన ప్రతీకార ధోరణి ప్రదర్శిస్తున్నారు. పాకిస్తాన్తో సంధి కుదిర్చే యత్నాలను నిర్ద్వంద్వంగా తిరస్కరించిందన్న కోపంతో ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నారు. అందుకోసం ఏకంగా తాను అగ్రరాజ్యానికి అధ్యక్షుడిని అన్న వాస్తవాన్ని కూడా పక్కన పెట్టారు. అహంకార (ఇగో) ధోరణితో వ్యవహరిస్తున్నారు. అమెరికాకు అతి ముఖ్యమైన మిత్ర రాజ్యాల్లో ఏ దేశంపైనా లేనివిధంగా భారత్పై తాజాగా ఏకంగా 50 శాతం సుంకాలు విధించడం వ్యక్తిగత కసి తీర్చుకునే ప్రయత్నాల్లో భాగమే. – అమెరికా ఆర్థిక సేవల సంస్థ జెఫ్రీస్న్యూఢిల్లీ/వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఆ దేశానికే చెందిన ప్రఖ్యాత ఆర్థిక సేవల సంస్థ జెఫ్రీస్ పలుగురాళ్లతో నలుగు పెట్టింది. భారత్ విషయంలో కొద్ది నెలలుగా ఆయన ప్రదర్శిస్తూ వస్తున్న కురచ బుద్ధిని తీవ్రస్థాయిలో తూర్పారబట్టింది. ‘‘ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్తాన్తో తలెత్తిన యుద్ధ పరిస్థితులను చల్లబరిచేందుకు మధ్యవర్తిత్వం చేస్తానంటే ససేమిరా అంటూ భారత్ తిరస్కరించడాన్ని ట్రంప్ నేటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. బతిమాలినా, బెదిరించినా, చివరికి పదేపదే బ్లాక్మెయిలింగ్కు దిగినా మోదీ సర్కారు దిగి రాలేదని, తనకు అణుమాత్రం కూడా అవకాశం ఇవ్వలేదని ఆయనలో కడుపుమంట నానాటికీ పెరిగిపో తోంది. ఇరుదేశాల మధ్య చిరకాలంగా అపరిష్కృతంగా ఉన్న కశ్మీర్ సమస్యను పరిష్కరించి, తనను తాను శాంతిదూతగా చిత్రించుకుని చిరకాల స్వప్నమైన నోబెల్ శాంతి బహుమానం సాధించాలన్న కలలకు అడ్డంగా గండి కొడుతోందన్న ఆగ్రహం పూర్తిస్థాయిలో కట్టలు తెంచుకుంటోంది. ప్రస్తుతం అంతర్జాతీయ వేదికపై భారత్ ఎంత ప్రముఖ దేశంగా వెలిగిపోతోందో తెలిసి కూడా ట్రంప్ ప్రదర్శిస్తున్న ప్రతీకార వైఖరి ఇరుదేశాల నడుమ పూడ్చలేనంతటి అగాధానికి దారి తీస్తోంది. అధ్యక్ష స్థానంలో ఉన్న నాయకుని వ్యక్తిగత ఇగో భారత్, అమెరికా ద్వైపాక్షిక బంధానికే పెను ముప్పుగా పరిణమిస్తోంది’’అంటూ తాజా నివేదికలో నిర్మొహమాటంగా కడిగిపారేసింది.భారత్ ‘తగ్గేదేలే’!ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాల నేపథ్యంలో, తక్షణం కాల్పుల విరమణకు ఒప్పుకోకుంటే భారీగా సుంకాలు బాదుతానంటూ బెదిరించి భారత్, పాక్ నడుమ అణుయుద్ధాన్ని ఆపానంటూ ట్రంప్ కొద్ది నెలలుగా పదేపదే గొప్పలకు పోతుండటం, ఆ వ్యాఖ్యలను మోదీ సర్కారు ఎప్పటికప్పుడు నిర్ద్వంద్వంగా ఖండిస్తూ వస్తుండటం తెలిసిందే. పాక్ పూర్తిగా కాళ్ల బేరానికి వచ్చి, స్వయానా మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారి పదేపదే ప్రాధేయపడ్డ కారణంగానే ఆ దేశంతో కా ల్పుల విరమణకు అంగీకరించినట్టు కేంద్రం విస్పష్టంగా ప్రకటించింది కూడా. అలాగే కశ్మీర్ విషయంలో కూడా మధ్యవర్తిత్వానికి ట్రంప్ ఎంతగానో ఉబలాటపడ్డారు. తన సమక్షంలో చర్చలు జరపండంటూ భారత్, పాక్కు పదేపదే బాహాటంగా పిలుపులు కూడా ఇచ్చారు. ఈ విషయంలో మూడో శక్తి ప్రమేయాన్ని ఎన్నటికీ, ఏ విధంగానూ అంగీకరించేది లేదని భారత్ స్పష్టం చేసింది. అందుకు ఒళ్లు మండి ట్రంప్ సుంకాలు బాదుతున్నా ‘తగ్గేదే లే’దంటోంది.మన ‘సాగు’పైనా గురి!వ్యవసాయ రంగంలో అమెరికా జోక్యానికి మోదీ సర్కారు ససేమిరా అంటుండటం ట్రంప్కు కొరుకుడు పడని మరో విషయమని జెఫ్రీస్ నివేదిక తేల్చింది. భారత వ్యవసాయ, పాడి మార్కెట్లలో పూర్తిస్థాయిలో కాలు పెట్టాలని అగ్ర రాజ్యం చాలాకాలంగా ఉవ్విళ్లూరుతోంది. ఆ ఆకాంక్షలకు కేంద్రం శాశ్వతంగా తలుపులు మూసేసింది. దీనిపై కూడా ట్రంప్ అగ్గి మీద గుగ్గిలంగా ఉన్నట్టు జెఫ్రీస్ వెల్లడించింది. అమెరికాతో భారత్ స్వేచ్ఛా వాణి జ్య చర్చలు మార్చి నుంచీ నానుతుండటం వెనక ఇది కూడా ఒక ప్రధాన కారణమని విశ్లేషకులు కూడా భావిస్తు న్నారు. ‘‘రైతులు, కూలీలు కలిపి భారత్లో 25 కోట్ల మందికి వ్యవసా యమే జీవనాధారం! భారత శ్రామిక శక్తిలో ఇది ఏకంగా దాదాపు 40 శాతం!!’’అని జెఫ్రీస్ నివేదిక చెప్పుకొచ్చింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
మోదీకి జపాన్ కానుకగా ఇచ్చింది మన బోధిధర్మ ప్రతిమే
జపాన్ పర్యటనలో అక్కడి ప్రఖ్యాత షోరిన్జాన్ దారూమేజీ ఆలయ సందర్శన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కానుకగా అందుకున్న దారూమా ప్రతిమ అందరి దృష్టినీ తెగ ఆకర్షిస్తోంది. చివరికి ఇంటర్నెట్లో కూడా అదే ట్రెండింగ్గా మారింది. జపాన్ చరిత్ర, సంస్కృతులతో దారూమాది విడదీయలేని బంధం! జపనీస్ భాషలో దారూమ అంటే బోధిధర్మ అని అర్థం. ఇక జీ అంటే ఆలయం. బోధిధర్ముడు జెన్ బౌద్ధ స్థాపకుడు. రాజధాని టోక్యోకు ఉత్తరాన టకసాకిలో ఉన్న షోరిన్జాన్ దారూమేజీ ఆలయం శతాబ్దాలుగా భక్తులు, పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తూ వస్తోంది. ప్రస్తుత రూపంలోని దారూమా ప్రతిమను రూపొందించింది ఆలయపు తొమ్మిదో పీఠాధిపతి అయిన టొగకు. కొంతకాలంలోనే దారూ మా జపనీయుల ఇంటింటి బొమ్మగా మారి పోయింది. నేటికీ ఏటా దారుమా ప్రతిమోత్సవాన్ని షోరిన్జా న్లో ఘనంగా జరుపుతారు. అలాంటి ప్రతిమను మోదీకి బహూ కరించడం ద్వారా భారత్కు జపాన్ శుభాకాంక్షలతో పాటు ఆ ధ్యాత్మిక ఆశీస్సులు కూడా అందించిందని భావిస్తు న్నారు. జపాన్లో మామూలు కుటుంబాలతో పాటు రాజకీయ నాయకులు మొదలుకుని వ్యాపారవేత్తల దాకా ఆశలకు, ప్రగతికి ప్రతీకగా ఇళ్లు, కార్యాల యాల్లో దారూమా ప్రతిమను ఉంచుకోవడం పరిపాటి. బోధిధర్ముడు మనవాడే!జెన్ బౌద్ధ స్థాపకుడైన బోధిధర్ముడు భారతీ యుడేనని, అందునా దాక్షిణాత్యుడని, క్రీస్తుపూర్వం ఐదో శతాబ్దికి చెందినవాడని చెబుతారు. తమిళ నాడులోని పల్లవ రాజు మూడో కుమారుడైన బోధి« దర్మ సన్యాసం స్వీకరించి జెన్ బౌద్ధాన్ని చైనాకు తీసుకెళ్లాడు. అంతేకాదు, మార్షల్ ఆర్ట్స్లోనూ ఆయన సాటిలేని మేటి. ఆ పోరాట కళను చైనాకు పరిచయం చేసింది కూడా బోధిధర్ముడే. అందుకే చైనీయులు ఆయనను దామో పేరిట దైవంతో సమానంగా కొలుచు కున్నారు. మూలికా వైద్యంలోనూ బోధిధర్ముడు సిద్ధుడు. ఆ విద్యను చైనీయులకు ప్రసాదించింది కూడా ఆయనేనని మనవాళ్లు నమ్ముతారు. ఆ సిద్ధవైద్య కళ శాశ్వతంగా తమకే సొంతం కావాలనే దురాశతో చివరికి దారుమాను విషమిచ్చి అంతం చేశారంటారు. ఈ ఇతివృత్తంతో సూర్య హీరోగా కొన్నేళ్ల క్రితం వచ్చిన సెవెన్త్ సెన్స్ సినిమా ఘనవిజయం సాధించింది.ఎటు తిప్పినా పైకే!చూసేందుకు చిన్నదే అయినా, దారూమా ప్రతిమ తాలూకు ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు...→ తెరుచుకుని ఉండే కన్ను, తిరుగులేని బ్యాలెన్స్ దీని ప్రధాన ఆకర్షణలు.→ ఇది గుండ్రంగా, లోపలంతా బోలుగా, కళ్లు చెదిరే రంగులతో కూడి ఉంటుంది.→ భారీదనం కారణంగా దారూమాను ఎటువైపు పడేలా తట్టినా వెంటనే పైకి లేస్తుంటుంది.→ ఏడుసార్లు కింద పడ్డా, ఎనిమిదోసారి కూడా పట్టు వీడకుండా పైకి లేవాల్సిందే’నన్న ప్రఖ్యాత జపనీస్ సామెతకు ఇది ప్రతీకగా నిలుస్తుంది.→ లక్ష్యాలు నిర్దేశించుకోవడానికి, అహరహం శ్రమించి కలలను నిజం చేసుకోవడానికి దారూమా ప్రతిమను చిహ్నంగా భావిస్తారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
భారత్–రష్యా క్రూడ్ బంధం!
భారత్ పాలిట వరంలా మారిన రష్యా చమురు అంతర్జాతీయంగా సెగలు పుట్టిస్తోంది. రష్యా చమురుతో ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ పరోక్షంగా ఆజ్యం పోస్తోందంటూ అమెరికా అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ఈ సాకుతో మరో 25 శాతం అదనపు సుంకాలను కూడా వడ్డించింది. మరి నిజంగా ఈ చౌక క్రూడ్తో భారతీయ వినియోగదారులు లాభపడుతున్నారా? అంటే సమాధానం కాదనే వస్తోంది. ప్రైవేటు రిఫైనరీ కంపెనీలకు మాత్రం లాభాల పంట పండుతోంది. ఇదే అమెరికా, భారత్ మధ్య ఇప్పుడు ‘క్రూడ్’ యుద్ధానికి దారితీస్తోంది!! రష్యా చౌక చమురు దిగుమతి లాభాల్లో అధిక వాటా దేశీయ ప్రవేటు రంగ రీఫైనలరీ దక్కించుకుంటున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో యూరప్తో సహా అనేక దేశాలు ఆంక్షలు, నిషేధం విధించడంతో రష్యా చమురుపై ’మాస్కో రాయితీ’ ప్రకటించింది. ఈ క్రమంలో చమురు దిగుమతి బిల్లు తగ్గించుకునేందుకు భారత్ రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేస్తోంది. 2002 వరకు కేవలం 1 శాతంగా ఉన్న రష్యా చమురు దిగుమతులు 2025 ఆగస్టు చివరి నాటికి గణనీయంగా 37 శాతానికి చేరుకుంది. గత నాలుగేళ్లుగా భారత్ సగటున రోజుకు 1.5 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురు దిగుమతి చేసుకుంటోది. ఇందులో 40 శాతానికి పైగా ప్రయివేటు రంగ రిఫైనరీలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, నయరా ఎనర్జీల సొంతం కావడం విశేషం! మిగులు లాభాలన్నీ ప్రయివేటు రిఫైనరీలకే.... రష్యా దిగుమతుల్లో అధిక వాటా పొందుతున్న ప్రయివేటు రిఫైనరీలు చమురు శుద్ధి చేసి ఉత్పత్తులను యూరప్, ఆసియా దేశాలకు భారీగా ఎగుమతి చేసి గణనీయంగా లాభాలు గడించాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మూడో ఏడాదిలో జీ7+ దేశాలు భారత్, టరీ్కలోని ఆరు రిఫైనరీలు నుంచి 18 బిలియన్ డాలర్లు (21 బిలియన్ డాలర్ల) విలువైన చమురు ఉత్పత్తులు దిగుమతి చేసుకున్నాయని ఫిన్లాండ్కు చెందిన సీఆర్ఈఏ థింక్ట్యాంక్ నివేదిక తెలిపింది. ఇందులో దాదాపు 9 బిలియన్ యూరో ఉత్పత్తులు రష్యా ముడి చమురుతో శుద్ధి చేసినవేనని సీఆర్ఆఏ పేర్కొంది. ఈ ఆరు రిఫైనరీలలో రిలయన్స్ చెందిన జామ్నగర్ శుద్ధి కార్మాగారం అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడి నుంచి జీ7+ దేశాలకు ఎగుమతి అయిన 12 బిలియన్ యూరోల్లో 4 బిలియన్ యూరోలకు పైగా రష్యా చమురుతోనే ఉత్పత్తి చేసినవని సీఆర్ఈఏ వివరించింది. ఈ జాబితాలో ప్రభుత్వరంగ ఓఎన్జీసీ మంగళూరు రిఫైనరీ నాలుగో స్థానంలో, నయరా ఎనర్జీ వడినార్ రిఫైనరీ ఆరోస్థానంలో ఉన్నాయి. దీనికి తోడు ‘భారత్లో వ్యాపార కంపెనీలు రష్యా ఆయిల్ను రీసెల్లింగ్ చేసుకుంటున్నాయి. తద్వారా.. 16 బిలియన్ డాలర్ల అదనపు లాభాలను (దాదాపు రూ.1.35 లక్షల కోట్లు) పొందాయి’ అంటూ అమెరికా ఆరి్థక మంత్రి స్కాట్ బెసెంట్ చేసిన వ్యాఖ్యలు ’రష్యా చౌక చమురు దిగుమతి లాభాల్లో అధిక వాటా ప్రైవేటు కంపెనీలు దక్కించుకుంటున్నాయి’ అనే వాదనలను మరింత బలపరిచాయి. ఇంధన ఎగుమతులతో వేల కోట్ల ఆదాయంభారత్కు ఇంధన ఎగుమతులతో వేల కోట్ల ఆదాయం సమకూరుతోందని కస్టమ్స్ గణాంకాలు చెబుతున్నాయి. 2023–24లో 84.1 బిలియన్ డాలర్లు, 2024–25లో 63.3 బిలియన్ల డాలర్లు పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు జరిగాయి. ఇదే ఆరి్థక సంవత్సరంలో 24 బిలియన్ డాలర్లు డిజిల్ ఎగుమతులు, 15 బిలియన్ డాలర్ల జెట్ ఫ్యూయల్ ఎగుమతులు జరిగాయి. రష్యా ఉరల్స్ క్రూడ్ నుంచి నాణ్యమైన డీజిల్, జెట్ ఫ్యూయెల్ వంటి రవాణా ఇంధనాలు ఎక్కువగా తయారవుతున్నాయి. 2024–25లో 15.5 బిలియన్ డాలర్ల గ్యాసోలిన్, ఇతర చమురు ఉత్పతుల ఎగుమతులు జరగడం గమనార్హం.ఎగుమతుల్లో రిలయన్స్ టాప్ ఈ ఏడాది భారత ఇంధన దిగుమతుల్లో వాల్యూమ్ పరంగా రిలయన్స్, నయారా ఎనర్జీలు రెండింటి వాటా 81 శాతంగా ఉన్నాయి. ఎగుమతుల్లో అధిక భాగం డిజిల్, జెట్ ఫ్యూయెల్ ఉన్నాయి. రోజుకు 9.14 లక్షల బ్యారెళ్ల ఎగుమతితో 71 శాతం వాటా రిలయన్స్దే. రిలయన్స్ జామ్నగర్ రిఫైనరీ జూన్లో రోజుకు 7.46 లక్షల బ్యారెళ్ల రష్యా చమురు దిగుమతి చేసుకుంది. ఇక్కడి నుంచి తన మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 1.36 మిలియర్ల బీపీడీలో 67 శాతం ఎగుమతి చేసింది. మిగిలిన ఇంధన ఎగుమతుల్లో రోజుకు 1.18 లక్షల బ్యారెళ్లతో నయరా ఎనర్జీ, ఓఎన్జీసీకి చెందిన మంగళూరు రిఫైనరీ రోజుకు 1.14 లక్షల బ్యారెళ్లతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.పరోక్ష సబ్సీడీలతో పీఎస్యూల లాభాలకు గండి ప్రభుత్వరంగ రిఫైనరీ రష్యా చౌక చమురు మిగులు లాభాలకు కేంద్ర ప్రభుత్వ ‘స్థిర ఇంధన ధరల విధానం’ చిల్లుపెడుతోంది. రష్యా ఆయిల్ ఇప్పటికీ బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ కంటే 2–3 డాలర్లు, యూఈఏ బ్యారెల్ క్రూడాయిల్ కంటే 5–6 డాలర్ల డిస్కౌంట్ ధరకే లభిస్తుంది. సాధారణంగా ఇది రీఫైనరీ సంస్థలకు దండిగా లాభాలను తెచ్చిపెడుతోంది. అయితే ప్రభుత్వ సంస్థలైన ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్లు రష్యా చమురు కొనుగోలు మిగులు లాభాలను పెట్రోల్, డిజిల్, ఎల్పీజీ తదితర పరోక్ష సబ్సీడీలకు వినియోగిస్తున్నాయి. గల్ఫ్, అమెరికా క్రూడాయిల్ ధరలతో పోలిస్తే, 2022 జనవరి నుండి 2025 జూన్ వరకు రష్యా డిస్కౌంట్ ధరలతో ముడి చమురు కొనుగోలు చేయడం ద్వారా భారత్ దాదాపు 15 బిలియన్ డాలర్లు ఆదా చేసిందని పరిశ్రమ గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 2023లో రష్యా రికార్డు స్థాయి డిస్కౌంట్తో భారత్ దాదాపు 7 బిలియన్ డాలర్ల వరకు ఆదా చేసింది. ఈ మొత్తంలో సింహభాగం రిలయన్స్, నయారా కంపెనీలకే దక్కింది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
సంచార జాతుల్లో వెలుగులు నింపిన జగన్
సాక్షి, అమరావతి: ఉదర పోషణకు ఊరూరా సంచారం.. రోడ్డు పక్కన, మురికి కాల్వల గట్టున జీవనం.. ఆధార్, ఓటరు గుర్తింపు కార్డులకు కూడా నోచుకోని దుర్భరం.. ఇది రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాక ముందు సంచార జాతుల జీవన చిత్రం. అటువంటి సంచార జాతుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుంది. అయితే కూటమి పాలనలో ఇచ్చిన హామీలు కూడా అమలుకు నోచుకోని దారుణ పరిస్థితికి జారిపోయారు. ఈ నెల 31న విముక్త సంచార జాతుల స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వారి జీవన చిత్రానికి సంబంధించిన కథనం ఇది. దుర్భర జీవనం... భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను కళారూపాల ద్వారా పరిరక్షిస్తూ ధర్మప్రచారకులుగా ఊరూర తిరుగుతూ జీవనోపాధి పొందేవారిని సంచార జాతులుగా పరిగణించారు. కనీసం సొంత ఊరు, ఇల్లు, చిరునామా, కుల «ధృవీకరణ, రేషన్కార్డు, ఆధార్కార్డు లేక దశాబ్దాల తరబడి ప్రభుత్వ పథకాలకు కూడా నోచుకోని దుర్భర బతుకులు వారివి. పూసలు, దండలు, వనమూలికలు అమ్ముతూ, తలవెంట్రుకలు వంటివి కొంటూ, గొడుగులు బాగుచేస్తూ, సవరాలు అమ్ముతూ, చిత్తుకాగితాలు ఏరుకుంటూ, చిన్న చిన్న సర్కస్లు చేస్తూ, ఖాళీ సమయంలో భిక్షాటన చేస్తూ బతుకులు వెళ్లదీసే పరిస్థితి వారిది. సంచార జాతుల స్వాతంత్య్రం– 1952బ్రిటిష్ ప్రభుత్వం క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్, 1871 ద్వారా దాదాపు 500 కులాల వారికి ‘జన్మతః నేరస్తులు’ అనే ముద్ర వేసింది. ఈ చట్టం వల్ల వారు ఎక్కడ కనిపించినా అరెస్ట్ చేసి జైలులో పెట్టేవారు. ఫలితంగా గౌరవంగా బ్రతకలేక, చాలా మంది రహస్యంగా సంచార జీవితం గడుపుతూ భిక్షాటనపై ఆధారపడ్డారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఈ చట్టం రద్దు కాలేదు. నిరంతర పోరాటాల తరువాత 1952 ఆగస్టు 31న ఈ కులాలను విముక్త జాతులుగా ప్రకటించారు. అందుకే సంచార జాతులు ఆ రోజును తమ నిజమైన స్వాతంత్య్ర దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అయితే, వారి జీవనస్థితి మెరుగుపడేందుకు చేసిన కమిటీలు, కమిషన్ల సిఫార్సులు పరిమిత స్థాయిలో మాత్రమే అమలయ్యాయి.సంక్షేమ ఫలాలు అందించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వంరాష్ట్రంలో 52 సంచార జాతులకు చెందిన సుమారు రెండు లక్షల మంది ఉన్నారు. వారికి కుల ధృవీకరణ పత్రాలు, చిరునామా (నెటివిటి సర్టిఫికెట్)లు, ఆధార్, రేషన్కార్డులు జారీకి వైఎస్ జగన్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. వారిలో అనేకమందికి ఇళ్ల స్థలాలు కేటాయించారు. సంచార జాతుల పిల్లలకు చదువులను చేరువ చేసేలా అమ్మ ఒడిని వర్తింపజేశారు. చేయూతతోపాటు నవరత్నాలతో అనేక సంక్షేమ పథకాల ద్వారా సంచార జాతులకు రూ.1,288.44కోట్లకుపైగా లబ్ది చేకూర్చడం విశేషం. వారిలో 32 సంచార జాతుల కోసం ప్రత్యేకంగా అత్యంత వెనుకబడిన తరగతుల (ఎంబీసీ) కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. గుర్తింపు లేని తోలుబొమ్మలాటల కులస్తులను గుర్తించి బీసీ–బీ సీరియల్ నంబర్ 25లో చేర్పించారు. హామీలను నెరవేర్చని కూటమి సర్కార్కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చని పరిస్థితి. ఎంబీసీలకు స్థానిక సంస్థల్లో ఐదు శాతం రిజర్వేషన్లు, దేవాలయాల పాలక మండలిలో సభ్యత్వం, మున్సిపల్ కార్పొరేషన్లలో ఎస్సీ, మైనార్టీల మాదిరిగానే కో–అప్షన్ మెంబర్గా ఎంబీసీలకు అవకాశం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సంచార జాతుల గుర్తింపు కార్డుల మంజూరు... ఇలా ఏ ఒక్క హామీనీ అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం దగా చేస్తోంది.జగన్ పాలనలో గుర్తింపుజగన్ పాలనలోనే సంచార జాతులకు గుర్తింపు దక్కింది. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర కావస్తున్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ దిశలో చర్యలు తీసుకోవాలి. –పెండ్ర వీరన్న, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ -
కనెక్ట్.. యూకే
భారత్పై అమెరికా అనూహ్యమైన సుంకాలు విధిస్తోంది. ఇప్పటికే కొన్ని అమల్లోకి వచ్చాయి. మరి ప్రత్యామ్నాయం? అమెరికాతో దౌత్యపరమైన చర్చలు కొనసాగిస్తూనే.. భారత్ కొత్త మార్కెట్లను అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల యూకేతో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్టీఏ) ఒక మైలురాయిగా చెప్పాలి. ఎందుకంటే భారత్ నుంచి ఈ దేశానికి జరుగుతున్న ఎగుమతుల్లో 99 శాతం ఎఫ్టీఏ పరిధిలోకి రాబోతున్నాయి. బ్రిటన్ నుంచి వస్తున్న దిగుమతుల్లో 94 శాతాన్ని ఎఫ్టీఏలోకి తెస్తామని భారత్ హామీ ఇచ్చింది. మరి ఈ ఎఫ్టీఏతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఏమైనా లాభం ఉంటుందా? ఏయే రంగాలకు లాభం? యూకే నుంచి ఏ రంగాల్లోకి పెట్టుబడులొచ్చే అవకాశం ఉంది? వాటన్నిటిపై యూకే డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్తో ‘సాక్షి’ ప్రతినిధి మంథా రమణమూర్తి ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ...ఎఫ్టీఏతో తెలుగు రాష్ట్రాలకు లాభమేంటి? యూకేతో విద్య, వ్యాపార, సాంస్కృతిక సంబంధాల్లో పెరుగుతున్న సానుకూలతను మూడేళ్లుగా చూస్తున్నా. ఈ దేశాల ప్రధానులు ఇటీవలే కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో ఈ పరిధి రక్షణ, టెక్నాలజీ, విద్య, వాతావరణ మార్పులన్నిటికీ విస్తరించనుంది. టెక్నాలజీ, ఫార్మా రంగంలో గట్టి పునాదులున్న హైదరాబాద్కు ఎఫ్టీఏతో చాలా లాభాలుంటాయి. ఏపీలో కొన్నేళ్లుగా పోర్టులు అభివృద్ధి చేస్తున్నారు. లాజిస్టిక్స్, వ్యవసాయ రంగాల్లో అవకాశాలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ ఎప్పట్నుంచో ఐటీ, ఫార్మా రంగాల్లో అగ్రగామిగా ఉంది కదా. మరి ఎఫ్టీఏతో కొత్తగా ఏం జరుగుతుంది? నిజమే. రాష్ట్రాన్ని బట్టి అవకాశాలు మారుతాయి. ఏపీ విషయానికొస్తే ఎగుమతులపై దృష్టి పెట్టాలి. ఈ మధ్యే నేను విశాఖలో సీఐఐ సదస్సుకు వెళ్లా. సీఫుడ్, టెక్స్టైల్స్, కాఫీ, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్ని పెంచడంపై చర్చించాం. ఎఫ్టీఏతో టారిఫ్లు తగ్గుతాయి. సర్టిఫికేషన్ ప్రక్రియ తేలికవుతుంది. దీనివల్ల ఏపీ ఉత్పత్తులు యూకే మార్కెట్లోకి ప్రవేశించడం సులువవుతుంది. ఫుడ్ ప్రాసెసింగ్ కీలకంగా మారనుంది. వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించాల్సి ఉంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్ ఉత్పత్తుల్ని ఎగుమతి చేసే కంపెనీలకు ఎఫ్టీఏ బాసటగా నిలుస్తుంది. ఇది ఏపీ వ్యవసాయ ఎకానమీని మారుస్తుంది. తెలంగాణ విషయానికొస్తే ఎఫ్టీఏ వల్ల సర్టిఫికేషన్ ప్రాసెస్ సులువవుతుంది. టారిఫ్లు తగ్గుతాయి. ఇది ఫార్మా, టెక్నాలజీ రంగాలకు కీలకం. టెక్నాలజీ నిపుణుల రాకపోకలు తేలికవుతాయి. ఈ ఒప్పందం దీర్ఘకాలంలో తెలుగు రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపించొచ్చు? దీర్ఘకాలంలో ప్రత్యేకించి ఫార్మా, టెక్నాలజీ రంగాల్లో వాణిజ్య పరిమాణం పెరుగుతుంది. యూకే ఫార్మా మార్కెట్ ప్రస్తుతం 30 బిలియన్ డాలర్లు. కానీ అందులో భారత్ వాటా 3 శాతమే. దీన్ని పెంచే అవకాశం తెలంగాణకు ఎక్కువ. ఒప్పందం వల్ల ఆర్ అండ్ డీతోపాటు ఏఐ వంటి కొత్త రంగాల్లో భాగస్వామ్యాలు ఏర్పడతాయి. ఏపీకి సంబంధించినంత వరకూ ప్రాసెస్డ్ ఫుడ్ ఎగుమతులదే అగ్రస్థానమవుతుంది. నిపుణుల రాకపోకలకు నిబంధనలు సడలిస్తున్నారా? అవును. స్వల్ప కాలానికి సంబంధించి ప్రత్యేకంగా కంపెనీల మధ్య రాకపోకలు తేలికవుతాయి. ఎందుకంటే ఇరుదేశాల్లోనూ సోషల్ సెక్యూరిటీ చెల్లించాలనే నిబంధనను ఉండదు. కంపెనీలకిది చాలా పెద్ద ఊరట. యూకే నిపుణుల్ని ఇక్కడికి రప్పించాలన్నా, ఇక్కడి వారిని అక్కడికి పంపాలన్నా ఆయా కంపెనీలకు ఖర్చు తగ్గుతుంది. కాబట్టి రాకపోకలు పెరుగుతాయి.మరి యూకే నుంచి చౌక ఉత్పత్తులొచ్చి ముంచేయకుండా ఇక్కడి వ్యాపారాలను ప్రత్యేకించి ఎంఎస్ఎంఈలను దెబ్బతీయకుండా ఒప్పందంలో తగిన జాగ్రత్తలుంటాయా?భారత్కే కాదు. యూకేకు కూడా ఎంఎస్ఎంఈ రంగమే వెన్నెముక. ఏ ఒప్పందంలోనైనా సున్నితమైన రంగాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తప్పనిసరిగా ఉంటాయి. డెయిరీ, చేనేత లాంటి రంగాలకు భద్రత ఉంటుంది. ఉదాహరణకు యూకే నుంచి డెయిరీ ఉత్పత్తులను తీసుకుంటే భారత్లో తయారుకాని స్పెషాలిటీ చీజ్ (పనీర్) వంటి వాటికే అనుమతి ఉంటుంది. చేనేతకు యూకే నుంచి పోటీ ఉండదు. ఎందుకంటే యూకేలో చేనేత లేదు. ఈ ఒప్పందంతో భారత చేనేతకు యూకే ఫ్యాషన్ మార్కెట్లో అవకాశాలు పెరుగుతాయి. మరి ఫుడ్ ప్రాసెసింగ్లో కొత్త టెక్నాలజీలు కావాలి కదా? యూకే కంపెనీలు అందిస్తాయా? కచ్చితంగా. యంత్రాలు, టెక్నాలజీపై పెట్టుబడులు పెట్టడం తప్పనిసరి. ఇక్కడి కంపెనీలు ఇప్పటికే ఈ మార్గాలను అన్వేషిస్తున్నాయి. అలాంటి పెట్టుబడుల్ని ప్రోత్సహించే వేదికను ఎఫ్టీఏ అందిస్తుంది. దీనివల్ల భారత కంపెనీలు యూకేతోపాటు ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే సామర్థ్యాన్ని పెంచుకుంటాయి. ఒప్పందం వల్ల ద్వైపాక్షిక వాణిజ్యం 25% పెరుగుతుందని యూకే అంచనా వేస్తోంది. వాటిలో తెలుగు రాష్ట్రాల వాటా ఎంత ఉండొచ్చు?రాష్ట్రాలవారీగా చెప్పడం కష్టం. కానీ బాగా లబ్ధి పొందే రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ ఉంటాయి. ఉదాహరణకు ప్రస్తుతం భారత్ నుంచి యూకేకు ఎగుమతవుతున్న సీఫుడ్లో ఏపీ వాటా 2.25 శాతమే. ఎఫ్టీఏ వల్ల సర్టిఫికేషన్ ప్రక్రియ తేలికవుతుంది కనుక ఏపీకి విస్తృత అవకాశాలుంటాయి. నిజానికి ఎఫ్టీఏ వల్ల సుంకాలు తగ్గటమే కాదు. సరి్టఫికేషన్ కూడా తేలికవుతుంది. త్వరగా పాడైపోయే సీఫుడ్ లాంటి వాటికిది ఆక్సిజన్. అందుకే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) కూడా చాలా ఆశాభావంతో ఉంది.ఫుడ్ ప్రాసెసింగ్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్లున్నారు? ఇది కీలక రంగం. ఎందుకంటే భారత్ ప్రస్తుతం తన ఆహార దిగుబడిలో 10 శాతాన్నే ప్రాసెస్ చేస్తోంది. తగినన్ని పెట్టుబడులతో విలువను జోడిస్తే కాఫీ, సీఫుడ్తోపాటు పలు వ్యవసాయ ఉత్పత్తుల్ని ప్రాసెస్ చేయొచ్చు. యూకేతోపాటు ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయొచ్చు. ఏపీ ఇప్పటికే యూఎస్, చైనాకు ఎగుమతి చేస్తోంది. సర్టిఫికేషన్ ప్రక్రియను సరళం చేయడం ద్వారా యూకే మార్కెట్ను వేగంగా అందుకోవచ్చు.సంప్రదాయేతర ఇంధనాలు, ఏరోస్పేస్, హైదరాబాద్ స్టార్టప్లలోకి ఎక్కువ పెట్టుబడులొస్తాయా? గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటుతోపాటు ఏరోస్పేస్, ఇంజనీరింగ్ రంగాల్లో భాగస్వామ్యాలను ఇప్పటికే చాలా యూకే కంపెనీలు అన్వేషిస్తున్నాయి. ఎఫ్టీఏతో భాగస్వామ్యాలు పెరుగుతాయి. యూకే ఎక్స్పోర్ట్ ఫైనాన్స్ అనేది యూకే–ఇండియా ప్రాజెక్టులకు మద్దతిచ్చే ప్రధాన వనరుగా ఉంటుంది. మరి కార్మికులు, పర్యావరణం, ప్రజారోగ్యానికి సంబంధించి ప్రతికూలతలేమైనా ఉంటాయా? ఈ ఒప్పందంలో అవినీతి నిరోధక, వినియోగదారుల రక్షణ, పర్యావరణం, లింగబేధంపై ప్రత్యేక చాప్టర్లున్నాయి. వాటన్నిటినీ చేర్చి భారత్ చేసుకున్న తొలి ఎఫ్టీఏ ఇది. కార్మికుల్ని, పర్యారణాన్ని పణంగాపెట్టి వాణిజ్య విస్తరణ జరగదనడానికి ఇదే నిదర్శనం. మరి ఈ ఒప్పందంతో రానున్న అవకాశాలపై చిన్నచిన్న వ్యాపారవేత్తలకు అవగాహన ఎలా? భారత ఎగుమతిదారులకు బాసటగా డీజీఎఫ్టీతోపాటు సీఐఐ, ఎఫ్టీసీసీఐ, కామర్స్ చాంబర్ వంటి పారిశ్రామిక సమాఖ్యలు సదస్సులు నిర్వహిస్తున్నాయి. ఇరుదేశాల వ్యాపార బృందాలు అవకాశాలపై అవగాహన కల్పిస్తాయి. ఇది పూర్తిగా అమల్లోకి రావడానికి ఒక ఏడాది పడుతుంది. -
కొమ్ములగొండి
ఎకిలీస్. గ్రీకు రచయిత హోమర్ సృష్టించిన అజరామర ఇతిహాస ద్వయంలో మొదటిదైన ఇలియాడ్లో కథానాయకుడు. ప్రపంచ ఇతిహాస చరిత్రలోనే వీరత్వానికి తిరుగులేని ప్రతీకలనదగ్గ పాత్రల్లో సాటిలేనివాడు. గ్రీకు యోధులందరిలోనూ అగ్రగణ్యుడు. ‘ఎకలీస్ షీల్డ్’గా పిలిచే అతని దివ్య కవచం కూడా అంతటి ప్రసిద్ధమైనదే. కర్ణుని కవచాన్ని తలపించే ఆ షీల్డ్ కారణంగా ఎకిలీస్ జీవితపర్యంతమూ ఎవరి చేతుల్లోనూ ఓటమి కాదు కదా, కనీసం ఎదురన్నది కూడా ఎరగని మహావీరునిగా నిలిచాడు.ఇదంతా క్రీస్తుపూర్వం 12వ శతాబ్దం, అంటే నేటికి సుమారు 3,200 ఏళ్ల క్రితం నాటి గాథ. అయితే అంతకు చాలాకాలం క్రితమే, సరిగ్గా చెప్పాలంటే ఏకంగా 16.5 కోట్ల ఏళ్లకు పూర్వమే ఎకిలీస్ షీల్డ్ను కూడా తలదన్నేంతటి సహచ కవచంతో రొమ్ము విరుచుకు సంచరించిన, సకల జీవజాలానికీ సింహస్వప్నమై నిలిచిన జీవి ఒకటుంది! అదే స్పైకోమెల్లస్ అనే రాక్షసబల్లి. బహుశా మానవాళికి ఇప్పటిదాకా తెలిసిన డైనోసార్లలోకెల్లా అత్యంత భీకరమైనది, బలిష్టమైనది, భయానకమైనది, అజేయమైనది అదేనంటే అతిశయోక్తి కాదు!! ‘కత్తుల’రత్తయ్య!2,500 కి.మీ పై చిలుకు విస్తరించిన దట్టమైన అట్లాస్ పర్వత శ్రేణుల్లో నేటి మొరాకో తీరంలోని బులెమేన్ అనే చిన్నపాటి పట్టణ సమీపంలో 16.5 కోట్ల ఏళ్ల క్రితం ఈ స్పైకోమెల్లస్ సంచరించినట్టు సైంటిస్టులు బుధవారం వెల్లడించారు. అక్కడ దొరికిన శిలాజాలను లోతుగా పరిశీలించిన మీదట వారు ఈ మేరకు నిర్ధారణకు వచ్చారు. దీన్ని ఒకరకంగా ఆ కాలపు కత్తుల రత్తయ్య అని చెప్పొచ్చు. ఎందుకంటే ముళ్లపందిని తలపించే రీతిలో దాని ఒంటిపై పక్కటెముకల నిండా పొలుసులను తలపించే కొమ్ములే.అయితే అవి సాదాసీదా కొమ్ములు కావు! అత్యంత పదునైన కత్తులు కూడా వాటిముందు దిగదుడుపే. కొన్నైతే ఏకంగా మీటర్ పొడవుతో, చూస్తేనే పై ప్రాణాలు పైకే పోయేలా ఉంటాయి! ‘‘కానీ మెడ, వీపు భాగంలో అంత పెద్ద కొమ్ములతో స్వీయరక్షణ ఎలా సాధ్యమన్నది అర్థం కాని విషయం’’అంటూ ఈ అధ్యయనానికి సారథ్యం వహించిన లండన్లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం సకశేరుక శిలాజ శాస్త్రవేత్త సూజన్ మెయిడ్మెంట్ ఆశ్చర్యం వెలిబుచ్చారు.‘‘ఇప్పటిదాకా మనకు తెలిసిన సకల జీవజాతుల్లోనూ ఇంతటి విచిత్ర, బలిష్ట ప్రాణి మరోటి లేదు’’అని ఇంగ్లండ్లోని బర్మింగ్హాం యూనివర్సిటీకి చెందిన శిలాజ శాస్త్రవేత్త, అధ్యయన సహ సారథి రిచర్డ్ బట్లర్ విస్మయం వ్యక్తం చేశారు. దీని వివరాలను నేచర్ జర్నల్ తాజా సంచికలో ప్రచురించారు. శాకాహార ‘రాకాసి’!⇒ 13 అడుగుల పొడవు, దాదాపు 2,000 కిలోల బరువైన శరీరం స్పైకోమెల్లస్ సొంతం.⇒ యాంకిలోసార్స్గా పిలిచే కవచ రాక్షసబల్లుల్లో అత్యంతపురాతన జీవి ఇదేనట.⇒ ఇంతా చేస్తే ఇది పక్కా శాకాహారి! భారంగా అడుగులేసేదట.⇒ మాంసాహార డైనోసార్ల బారినుంచి కాపాడుకోవడంతో పాటు ఆడ డైనోసార్లను ఆకర్షించేందుకు కూడా ఈ పొలుసులు వాటికి బ్రహ్మాండంగా పనికొచ్చేవట.⇒ జత కోసం స్పైకోమెల్లస్ల నడుమ పోటీలో గెలుపోటములు దాదాపుగా ఈ కొమ్ముల తాలూకు బలం మీదే ఆధారపడేవట.⇒ మెడ నుంచి మొదలై వీపు పొడవునా ఒకదాని పక్కన ఒకటిగా వ్యాపించిన అనేక వెన్నెముకలు దీని ప్రత్యేకత!⇒ దీని తోక భాగంలో ఉండే పొడవైన కొమ్ము వెనక నుంచి వచ్చే శత్రువులను కాచుకునేదట.⇒ స్పైకోమెల్లస్లు యాంకిలోసార్స్ కుటుంబానికి చెందిన డైనోసార్లు. వీటికి తోక భాగంలో కొమ్ములు పుట్టుకొచ్చింది ఇప్పటిదాకా భావిస్తున్న దానికంటే 3 కోట్ల ఏళ్లముందేనని స్పైకోమెల్లస్ శిలాజాన్ని పరీక్షించిన మీదట సైంటిస్టులు తేల్చారు.⇒ స్టేగోసార్స్ అనే మరో శాకాహార డైనోసార్లకు యాంకిలోసార్స్ సమకాలీకులు. అంటే జురాసిక్ యుగం నాటివి.⇒ అవి అంతరించాక కూడా ఇవి చాలాకాలం పాటు మనుగడ సాగించాయి.⇒ 6.6 కోట్ల ఏళ్ల క్రితం భూమిని ఢీకొన్న గ్రహశకలం దెబ్బకు డైనోసార్ల యుగంతో పాటు యాంకిలోసార్స్ కూడా సమూలంగా అంతరించిపోయాయి.⇒ యాంకిలోసార్స్ కుటుంబంలోకెల్లా ఇప్పటి దాకా తెలిసిన అతి పెద్ద స్పైకోమెల్లస్ ఏకంగా 8 మీటర్ల పొడవున్నట్టు తేలింది! అది నేటి ఉత్తర అమెరికా పశ్చిమ ప్రాంతంలో సంచరించినట్టు అక్కడ దొరికిన శిలాజాన్ని బట్టి నిర్ధారణ అయింది.⇒ 2021లో స్పైకోమెల్లస్ తాలూకు పక్కటెముక భాగపు శిలాజం దొరికింది. 2023లో దొరికిన ప్రస్తుత శిలాజంలో పూర్తి అస్థిపంజరం లేదు. ముఖ్యంగా తల భాగం మిస్సయింది. అయినా దీనికి సంబంధించి చాలా వివరాలు, విశేషాలను అది బయట పెట్టిందంటూ సైంటిస్టులు సంబరపడుతున్నారు. -
65 అడుగుల ఎత్తులో అద్భుతమైన కట్టడం
జడ్చర్ల: ఎంతో విశిష్టత గల ఆ ప్రాచీన ఆలయ చరిత్రను తెలుసుకుంటే గర్వంగా ఉంటుంది. ఆలయ ప్రాంగణంలోని శిథిలాలను చూస్తే అయ్యో అనిపిస్తుంది. ఇటుక మీద ఇటుకను పేర్చి నిర్మించిన ఆ అద్భుతమైన కట్టడం.. ఇప్పుడు గత వైభవానికి సాక్ష్యంగా నిలిచింది. తల తెగిన శిల్పాలు, గుప్త నిధుల వేటలో మిగిలిన శిథిలాలు.. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన గొల్లత్త గుడిపై కథనమిది.రాష్ట్ర కూటుల కాలం నాటి నిర్మాణం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్–ఆల్వాన్పల్లి గ్రామాల మధ్య 167 నంబర్ జాతీయ రహదారిని ఆనుకుని.. దాదాపు 6 ఎకరాల విస్తీర్ణంలో గొల్లత్త గుడి ఆలయాన్ని నిర్మించారు. దీన్ని 8వ శతాబ్దంలో రాష్ట్రకూటులు నిర్మించినట్లు పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు చెబుతున్నారు. దాదాపు 65 అడుగుల ఎత్తులో.. నాలుగు అడుగుల మందంతో.. కేవలం ఇటుకపై ఇటుకను పేర్చి నిర్మించారు. మధ్యలో ఎలాంటి బంకమట్టి లేకుండా అంత ఎత్తు వరకు.. అత్యంత కళాత్మకంగా గుడి నిర్మాణం చేపట్టారు. ఈ తరహాలో నిర్మించిన గుడి దక్షిణ భారతంలోనే ఒకటి.. ఇలాంటిదే మరొకటి ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ భీతర్గావ్ శివారులో ఉంది.జైనుల ఆలయంగా ప్రసిద్ధి.. ఒకప్పుడు ఈ ప్రాంతంలో జైన మతం బాగా ప్రాచుర్యంలో ఉండేది. ఎంతో మంది జైన తీర్థంకరులు నడయాడిన నేలగా ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. జైనీయుల స్థిర నివాసంగా, ధాన్య భాండాగారంగా గొల్లత్త గుడి పేరు గాంచింది. ఈ గుడిలో బంగారు కుండలు (Gold Pots) ఉండేవన్న ప్రచారం ఉంది. ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతానికి కాలి నడకన తరలివచ్చే జైన గురువులు.. దీన్ని సందర్శించేవారని అప్పటి శాసనాల ద్వారా గుర్తించారు. ఆలయం లోపల వర్ధమాన మహావీరుడు, పార్శ్వనాథుడి విగ్రహాలు ఉండేవి. భద్రత దృష్ట్యా ఇక్కడి నుంచి ఒకటి హైదరాబాద్లోని గోల్కొండకు, మరొకటి పాలమూరు పిల్లలమర్రిలోని మ్యూజియాలకు తరలించారు.శిథిలావస్థలో గుడి.. గొల్లత్త గుడి కాలక్రమేనా శిథిలావస్థకు చేరుకుంది. గుడి పైకప్పు కూలిపోయింది. వర్షాల కారణంగా చుట్టూ ఉన్న కొన్ని ఇటుకలు పట్టు తప్పిపోగా, కరిగిపోయాయి. దీంతో గుడి పటిష్టానికి పురావస్తుశాఖ అధికారులు.. కింద నుంచి దాదాపు 7 అడుగుల వరకు తాత్కాలికంగా సిమెంట్ పనులు చేయించారు. ఊడిన ఇటుకల స్థానంలో కొత్తగా చేర్చిన ఇటుకలు కరిగిపోగా.. శతాబ్దాల కిందటి ఇటుకలు చెక్కుచెదరక పోవడం గమనార్హం. ప్రస్తుత గుడి మాదిరిగానే.. చుట్టూ మరో ఐదు గుళ్లు ఉండగా.. కాలక్రమేణా కనుమరుగయ్యాయి. గుడి వెనుక దిబ్బలు గొల్లత్త గుడి (Gollatha temple) వెనుక భాగంలో రెండు ప్రధాన దిబ్బలు ఉన్నాయి. వీటిలో ఒక దిబ్బ కనుమరుగవగా.. ఈ దిబ్బ చుట్టూ పండుగల సందర్భంగా ఎడ్ల బళ్లతో వచ్చి జనం తిరిగేవారని చెబుతుంటారు. మరో దిబ్బ ఇప్పటికీ కనిపిస్తుంది. ఈ దిబ్బలో అప్పటి నిర్మాణాల ఆనవాళ్లు కనిపిస్తాయి. పాదాల గుట్టలో శిథిలావస్థలో ఎన్నో విగ్రహాలు కనిపిస్తాయి. ధ్వంసమైన నంది విగ్రహాలు చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తాయి. నాలుగు అడుగుల పొడవు, మూడు అడుగుల వెడల్పుతో మహిళల పాదముద్రలు చెక్కిన రాతి గుర్తులు ఉన్నాయి. గజ్జెలు, గొలుసులు, నాలుగు వేళ్లకు మెట్టెలతో చెక్కి ఉన్నాయి. అత్యంత సుందరంగా చెక్కిన ఈ పాదాలు అప్పటి శిల్పకళా నైపుణ్యానికి ప్రతీకగా పేర్కొనవచ్చు.గుప్త నిధుల కోసం తవ్వకాలు ఈ ప్రాంతంలో గుప్త నిధుల కోసం కొందరు విచ్చలవిడిగా తవ్వకాలు చేపట్టారు. వారి చేతుల్లో ఆలయ ప్రాంగణం చాలా వరకు ధ్వంసమైంది. గుడి పైకప్పులో సైతం తవ్వకాలు జరపడంతో కూలిపోయింది. గుడి దక్షిణ భాగంలో సైతం తవ్వకాలు జరిపారు. ప్రస్తుతం గుడి చుట్టూ ముళ్ల పొదలు, కంపచెట్లు ఏపుగా పెరగడంతో.. గుడి ఉనికికి ప్రమాదం ఏర్పడింది.పేరు వెనుక కథ ఈ గుళ్ల నిర్మాణం వెనుక స్థానికంగా ఓ కథ ప్రచారంలో ఉంది. పాలు, పెరుగు అమ్ముకునే ఈ ప్రాంతానికి చెందిన ఓ గొల్ల పడుచు.. తన ఆస్తినంతా వెచ్చించి ఈ గుళ్లని నిర్మించిందని.. అందుకే ఈ గుళ్లకు గొల్లత్త గుళ్లు అనే పేరు వచ్చిందని ఒక కథనం ప్రచారంలో ఉంది.చదవండి: మధ్యయుగ వైద్య చరిత్రలో మేటి.. అగ్గలయ్యరూ.2 కోట్లతో ప్రతిపాదనలు గొల్లత్త గుడిని పరిరక్షించేందుకు రాష్ట్ర పురావస్తు శాఖ మేనేజింగ్ డైరెక్టర్ విశాలాక్షి హయాంలో రూ.2 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి కేంద్రానికి నివేదించారు. ఇప్పటికే కేంద్ర పురావస్తుశాఖ ఆధ్వర్యంలో రూ.54 లక్షల వ్యయంతో గుడి స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించారు.అమలుకాని ప్రతిపాదనలు గొల్లత్త గుడి అభివృద్ధికి కలెక్టర్ రొనాల్డ్రోస్ హయాంలో పురావస్తుశాఖ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. తదుపరి ఎలాంటి చొరవ లేకపోవడంతో ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి గొల్లత్త గుడి అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలి. – రాములు, మాజీ మండల ఉపాధ్యక్షుడు, గంగాపూర్పర్యాటకంగా అభివృద్ధి చేయాలి గొల్లత్త గుడిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ గుడిని కాపాడాలి. ఇప్పటికే గుప్త నిధుల కోసం వేటగాళ్లు ఈ ప్రాంతమంతా తవ్వేశారు. నాటి చరిత్రకు సంబంధించిన విగ్రహాలు, తదితర కట్టడాలు ధ్వంసమయ్యాయి. – శ్రీనివాసులు, గంగాపూర్ -
బాటిల్ నెక్.. ట్రా‘ఫికర్’కు ఏదీ చెక్..?
ప్రమాణాలకు అనుగుణంలేని రహదారులు.. ప్రయాణాలు సవ్యంగా లేక ఇబ్బందులకు గురవుతున్న వాహనదారులు.. పలుచోట్ల బాటిల్ నెక్.. అక్కడ ట్రాఫిక్ పీక్.. అధికారుల ఫ్లై‘ఓవర్ లుక్’.. రహదారుల విస్తీర్ణం తక్కువ.. వాహనాల సంఖ్య ఎక్కువ.. కరెంటు స్తంభాల రాస్తారోకో.. ట్రాఫిక్ విభాగం, జీహెచ్ఎంసీ మధ్య కొరవడిన సమన్వయం.. వెరసి హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా ట్రాఫిక్ సమస్య (Traffic Problem) నిత్యకృత్యంగా మారింది. అవకాశమున్నా అవసరమైన మేర రహదారులు విస్తరించకపోవడం వాహనదారులకు శాపంగా మారిన వైనంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనమిది.. – సాక్షి, సిటీబ్యూరో‘పెత్తనం ఒకరి చేతిలో... బెత్తం మరొకరి చేతిలో...’రాజధానిలోని ట్రాఫిక్కు ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. రోడ్లపై ఉండి స్థితిగతులను పర్యవేక్షించేది ట్రాఫిక్ పోలీసులైతే... వాహన శ్రేణులు సవ్యంగా సాగడానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించే బాధ్యత మాత్రం జీహెచ్ఎంసీది. ఈ రెండింటి మధ్య సమన్వయలేమి కారణంగా ట్రాఫిక్ సమస్యలు తీరడం మిథ్యగా మారిపోయింది. నగరంలోని రోడ్ల విస్తీర్ణం, కనిష్టం కంటే తక్కువగా ఉన్న వైనం. పెంచే అవకాశం ఉన్నా పట్టించుకోని యంత్రాంగం వెరసి నగరవాసికి మాత్రం నిత్యం నరకమే కనిపిస్తోంది.కనిష్ట స్థాయిలోనూ లేని రోడ్లు... అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం నగర విస్తీర్ణంలో కనిష్టంగా 12 శాతం రహదారులు ఉండాలి. హైదరాబాద్ పురాతన నగరం కావడంతోపాటు అనేక కారణాల వల్ల ఇక్కడ కేవలం 9 శాతం రోడ్లు ఉన్నాయి. ఫలితంగా ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా ట్రాఫిక్ జామ్లే. అడ్డంకులు తొలగిస్తే ఈ విస్తీర్ణాన్ని 15.5 శాతానికి పెంచుకునే అవకాశం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంటే.. కనిష్టం కంటే 3.5 శాతం ఎక్కువన్నమాట. అయితే దీనికి సంబంధించి ట్రాఫిక్ పోలీసులు ఏళ్లుగా పంపిస్తున్న ప్రతిపాదనల్లో సగం వాటిని కూడా జీహెచ్ఎంసీ (GHMC) సహా అనే శాఖలు అమలు చేయకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటున్నాయి. 60 లక్షల వాహనాలు... 40 ఫ్లైఓవర్లు.. ముంబై మహానగరంలో ఉన్న వాహనాల సంఖ్య 52 లక్షలైనా అక్కడున్న ఫ్లైఓవర్ల సంఖ్య మాత్రం 55. హైదరాబాద్లో వాహనాల సంఖ్య 60 లక్షలకు చేరుతున్నా ఫ్లైఓవర్లు 40 మాత్రమే ఉన్నాయి. మరో పురాతన నగరమైన కోల్కతా (Kolkata) సైతం గతంలో అస్తవ్యస్త ట్రాఫిక్తో ఎన్నో ఇబ్బందులు పడేది. అక్కడి రోడ్ల విస్తీర్ణం కేవలం ఆరు శాతం ఉండటమే అందుకు కారణం. ఆ తర్వాత అక్కడ ఫ్లైఓవర్లను అవసరమైన స్థాయిలో నిర్మించడం ద్వారా రోడ్ల విస్తీర్ణం 12 శాతానికి పెరిగింది. నగర ట్రాఫిక్ విభాగం అధికారులు 2007లో సర్వే నిర్వహించి జీహెచ్ఎంసీకి నివేదిక పంపారు. దీని ప్రకారం నగరంలోని 30 ప్రాంతాల్లో 17.83 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్లు నిర్మిస్తే రోడ్ల విస్తీర్ణాన్ని పెంచవచ్చని తేల్చారు. ఈ ఫ్లైఓవర్లు జంక్షన్స్ జామ్ కాకుండా కూడా ఉపకరిస్తాయని నివేదించారు. అయితే ఇప్పటికీ వీటిలో కనీసం సగం ప్రతిపాదనలు కూడా అమలుకాలేదు. బాటిల్ నెక్.. ట్రా‘ఫికర్’కు ఏదీ చెక్.. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న నేచురల్ బాటిల్ నెక్స్తో ఇబ్బందులు అనేకం. భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో ఏర్పడిన వీటి వల్లా ఎన్నో ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. రాణిగంజ్లోని సయిదానిమ సమాధి సమీపంలో, ఎస్సార్ నగర్–ఈఎస్ఐ, చాదర్ఘాట్–మలక్పేట్ మార్గాల్లో ఇలాంటివి అనేకం ఉన్నాయి. నగర వ్యాప్తంగా ఇలాంటి బాటిల్నెక్స్ (bottlenecks) సంఖ్య 26 ఉండగా... చాలా తక్కువ మాత్రమే పరిష్కారానికి నోచుకున్నాయి. ట్రాఫిక్ విభాగం అధికారులు, జీహెచ్ఎంసీ కలిసి పనిచేయడంతో శ్యామ్లాల్ నాలా సహా అనేక సమస్యలు పరిష్కారమయ్యాయి. మిగిలిన ప్రాంతాల్లోనూ ఇలాంటి ఫలితాలు రావాలంటే ప్రభుత్వ విభాగాలు సమష్టిగా ముందుకు వెళ్లాలి. నేచురల్ బాటిల్నెక్ సమస్యలను పరిష్కరించడం ద్వారా అదనంగా 2 శాతం రోడ్లను విస్తరించవచ్చు.సమన్వయం లేక కరెంట్ ‘షాక్’... రాజధానిలోని అనేక ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ పూర్తయినా ఫలితం లేకుండా పోయింది. ఆయా చోట్ల రోడ్ల విస్తీర్ణం పూర్తి అయినా ఒకప్పుడు రోడ్డు పక్కన ఉండి, విస్తర్ణం కారణంగా రోడ్లపైకి వచ్చిన కరెంట్ స్తంభాలతో ఈ పరిస్థితి తలెత్తింది. కొత్తగా రోడ్లు వేసిన చోట, పాత రహదారుల్లోనూ అనేక చోట్ల ఈ సమస్య ఉంది. విద్యుత్, జీహెచ్ఎంసీ విభాగాలు సమన్వయంతో పని చేయకపోవడమే దీనికి కారణం. వీటితోపాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో కరెంట్ ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు అడ్డదిడ్డంగా ఉండటంతో దాదాపు 50 మార్గాలు కుంచించుకుపోయాయి. జీహెచ్ఎంసీతోపాటు ఆయా విభాగాలు స్పందిస్తే మరికొంత రోడ్డును అదనంగా విస్తరించుకోవచ్చు.‘అవసరమైనప్పుడే’ స్పందన... ఇలాంటి సమస్యలపై జీహెచ్ఎంసీ సహా ఇతర విభాగాలు ప్రజల ఇబ్బందులు తీర్చడం కంటే ‘అవసరమైనప్పుడు’మాత్రమే అప్రమత్తమై ఎక్కువగా స్పందిస్తాయి. 2012లో జరిగిన ఇంటర్నేషనల్ బయో డైవర్సిటీ కాన్ఫరెన్స్, 2017లో ఇవాంక ట్రంప్ టూర్, ఇటీవల జరిగిన మిస్ వరల్డ్ (Miss World 2025) పోటీలు వంటి సందర్భాల్లో మాత్రం హడావుడి చేశాయి. అతిథులకు ఇక్కడి రోడ్లకు లేని ‘అందాలను’ చూపాలని ప్రయత్నిస్తుంటాయి. చదవండి: ‘మా మేడమ్ మాకే కావాలి.. మేడమ్ మీరు వెళ్లొద్దు’డెలిగేట్స్ బస చేసే హోటళ్లు, కార్యక్రమాలు జరిగే ప్రాంతాల మధ్య ఉన్న రోడ్లను కూడా అభివృద్ధి చేసేస్తాయి. దీనికోసం బాటిల్నెక్స్, ఇతర అడ్డంకులను తొలగించేస్తాయి. అవసరమైతే మ్యాన్హోల్స్ సమాచారం సైతం సేకరించి అభివృద్ధి చేసేస్తాయి. దేశ, విదేశాల అతిథుల కోసం చూపించిన ‘ప్రేమ’ను కొనసాగిస్తూ తమకు ఈ చిక్కుల నుంచి విముక్తి ప్రసాదించాల్సిన అవసరాన్ని అధికారులు గుర్తించాలని నగరవాసులు, వాహనదారులు కోరుతున్నారు. -
చైనా-భారత్-పాక్.. కనివినీ ఎరుగని రీతిలో విధ్వంసం!
దక్షిణాసియా దేశాలైన భారత్, పాకిస్తాన్, చైనాలను ఈ మధ్యకాలంలో తీవ్రమైన ప్రకృతి విపత్తులు కుదిపేస్తున్నాయి. మునుపెన్నడూలేని విధంగా క్లౌడ్ బరస్ట్, మెరుపు వరదలు మూడు దేశాల్లోనూ తీవ్ర నష్టం కలిగించాయి. ఈ సీజన్లో వర్షాలు మామూలే అయినా.. ఈ ఏడాది మాత్రం అసాధారణంగా నమోదు అవుతోంది. అందుకు కారణాలను పరిశీలిస్తే.. భారీ వర్షాలు భారత్, పాకిస్తాన్, చైనా దేశాలను పెను విపత్తులుగా ముంచెత్తాయి. క్లౌడ్ బరస్ట్, మెరుపు/ఆకస్మిక వరద(Flash Floods) ఎక్కువగా వినాల్సి వస్తోంది. ఇవే ఈ మూడు దేశాల్లో విపరీతమైన ఆస్తి, ప్రాణ నష్టాల్ని కలిగించాయి. జమ్ము కశ్మీర్ ఈ ప్రభావంతో ఈ మధ్యకాలంలో ఎంతో మంది మరణించడం చూస్తున్నదే. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రహదారులు దారుణంగా దెబ్బ తిన్నాయి. దక్షిణ రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ఇదే పరిస్థితి.ఇక.. పాకిస్తాన్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా, గిల్గిట్-బాల్టిస్తాన్, పంజాబ్ ప్రాంతాలు వర్షాలు, వరదలతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. రెండు నెలల కాలంలో వర్షాలు, వరదలతో పాక్లో 700 మంది మరణించినట్లు పలు గణాంకాలు చెబుతున్నాయి. వీళ్లలో చిన్నారులే అధికంగా ఉన్నారు. చైనాలో రెండు నెలల వర్షాల వల్ల ₹1.84 లక్షల కోట్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లింది. ప్రాణ నష్టాన్ని చైనా అధికారికంగా ప్రకటించలేదు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల మాన్సూన్ ట్రఫ్ దక్షిణ దిశగా కదిలిపోతోంది. ఈ ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతం.. దానికి వ్యతిరేకంగా ఇంకొన్ని చోట్ల తగ్గుదల కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో వర్షపాతం తగ్గుముఖం పట్టింది. మాన్సూన్ ట్రఫ్ అంటే..మాన్సూన్ ట్రఫ్ అనేది దక్షిణాసియా దేశాల్లో వర్షాకాలంలో వర్షాల పంపిణీకి దిశానిర్దేశం చేసే వాతావరణ రేఖ. ఇది సాధారణంగా పాకిస్తాన్ నుంచి బెంగాల్ ఖాతీ వరకు విస్తరించి ఉంటుంది. ఈ ట్రఫ్ చుట్టూ తక్కువ ఒత్తిడి ఏర్పడిన ప్రాంతాల(Low Pressure Formation) వల్ల వర్షాలు కురుస్తుంటాయి. చైనా, పాక్, భారత్లో ఈ సీజన్లో వర్షాలకు కారణం ఇదే. (తక్కువ ఒత్తడి ప్రాంతాల్లోకి చుట్టుపక్కల నుంచి గాలి ప్రవహిస్తుంది. ఆ గాలి ఆవిరితో నిండిన మేఘాలను తీసుకువస్తుంది. ఇది వర్షాలు కురవడానికి అనుకూల పరిస్థితిని కలిగిస్తుంది. అందుకే మాన్సూన్ కాలంలో తక్కువ ఒత్తడి ప్రాంతాలు భారీ వర్షాలకు కారణమవుతాయి). అయితే..వాతావరణ మార్పు, నగరీకరణ, అటవీ నాశనం వంటి మానవ చర్యలు ఈ ట్రఫ్ మార్గాన్ని అస్థిరంగా మార్చి వర్షాల తీవ్రతను పెంచుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల కొండ ప్రాంతాలు, నదుల నుంచి నీటి ఆవిరి ఎక్కువగా ఉంటోంది. ఈ ఆవిరి మేఘాల్లో చేరి, ఒక స్థాయికి చేరుకున్న తర్వాత తక్కువ సమయంలో భారీ వర్షంగా కురుస్తుంది. ఇది వర్షపాతం తీవ్రతను పెంచుతూ, ఆకస్మిక వరదలకు దారితీస్తోంది. పైపెచ్చు ఉదయం వేళల్లో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఆవిరి పెరిగి, తక్కువ సమయంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ✅ పరిష్కార మార్గాలు• ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు: ప్రజలకు సమయానికి సమాచారం అందించాలి. అయితే అది కష్టతరంగా మారుతోంది• వరద మైదానాల పునరుద్ధరణ: సహజ జల ప్రవాహ మార్గాలను తిరిగి స్థాపించాలి.• స్థిరమైన నగరీకరణ ప్రణాళికలు: పర్యావరణాన్ని దెబ్బతీయకుండా అభివృద్ధి.• అటవీ విస్తరణ: వర్షపు నీటిని శోషించే వనరుల పెంపు.• ప్రజల అవగాహన: వాతావరణ మార్పు, ప్రకృతి విపత్తులపై ప్రజలలో చైతన్యం కలిగించాలి.దక్షిణాసియాలో వర్ష విపత్తులు మామూలు ప్రకృతి ధోరణుల కంటే ఎక్కువగా మానవ చర్యల ప్రభావంతో ఏర్పడుతున్నాయి. వాతావరణ మార్పును అర్థం చేసుకుని, దీన్ని ఎదుర్కొనే విధానాలను అభివృద్ధి చేయడం అత్యవసరమనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. -
అమెరికాలో కొత్తరకం వ్యాధి!
మానవ శరీరంలో మాంసాన్ని తినేసే ప్రమాదకరమైన పరాన్నజీవికి సంబంధించిన తొలి కేసు అమెరికాలో నమోదైంది. మేరీలాండ్లో ఓ వ్యక్తి ఈ నెల 4వ తేదీన దీనిబారిన పడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ వ్యాధిని న్యూవరల్డ్ స్రూ్కవార్మ్(ఎన్డబ్ల్యూఎస్) మియాసిస్ అని పిలుస్తున్నారు. ఒక జాతికి చెందిన ఈగ(మగ్గోట్స్) లార్వా మనిషి శరీరంలోని కణజాలంలో తిష్టవేసి, క్రమంగా మాంసాన్ని భక్షిస్తుందని అంటున్నారు. ఎల్సాల్వెడార్ దేశం నుంచి వ్యక్తికి వ్యాధి సోకినట్లు డాక్టర్లు పేర్కొన్నారు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ప్రివెన్షన్(సీడీసీ) సహకారంతో తొలి కేసును నిర్ధారించినట్లు యూఎస్ డిపార్టుమెంట్ ఆఫ్ హెల్త్, హ్యూమన్ సర్విసెస్(హెచ్హెచ్ఎస్) తెలియజేసింది. → ఎన్డబ్ల్యూఎస్ మియాసిస్ అనేది సాధారణంగా పాడి పశువులు, ఇతర జంతువుల్లో కనిపిస్తుంది. దక్షిణ అమెరికాతోపాటు కరీబియన్ దీవుల్లో దీని ఉనికి ఉంటుంది. కానీ, ఇటీవల సెంట్రల్ అమెరికా, మెక్సికోతోపాటు అమెరికాకు సైతం విస్తరించినట్లు నిపుణులు గుర్తించారు. → ప్రధానంగా శరీరంపై పుండ్లు, గాయాలు ఉన్నవారికి ఎన్డబ్ల్యూఎస్ మియాసిస్ సోకే అవకాశాలు అధికంగా ఉంటాయి. దీని ప్రభావానికి గురైన పశువులకు, ప్రాంతాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. → కొక్లియోమియా హోమినివోరక్స్ ఈగ లార్వాలే ఈ స్రూ్కవారŠమ్స్. జంతువుల పుండ్లు, గాయాలపై వాలుతుంటాయి. పుండు భాగంలో లేదా సున్నితమైన కణజాలంపై ఒక ఆడ ఈగ ఒకేసారి 300 వరకు గుడ్లు పెట్టగలదు. → గుడ్ల నుంచి బయటకు వచ్చే లార్వాలు పుండ్ల లోపలికి చొచ్చుకెళ్తాయి. క్రమంగా మాంసాన్ని తినేస్తాయి. తీవ్రమైన నొప్పి కలుగుతుంది. సరైన చికిత్స తీసుకోకపోతే ప్రాణాపాయం సంభవిస్తుంది. → లార్వాలు మూడు నుంచి ఐదు రోజుల్లో పుండు నుంచి బయటకు వచ్చి కిందపడిపోతాయి. భూమి కిందిభాగంలోకి చేరుకుంటాయి. ఈగలుగా మారి బయటకు వస్తాయి. గుడ్లు పెట్టడానికి పుండ్లు, గాయాలు ఉన్న జంతువులను వెతుక్కుంటాయి. → కొక్లియోమియా హోమినివోరక్స్ ఈగ జీవితకాలం దాదాపు 30 రోజులు. మొత్తం జీవితకాలంలో 3,000కుపైగా గుడ్లు పెడతాయి. → న్యూవరల్డ్ స్రూ్కవార్మ్ మియాసిస్ వల్ల మనుషులకు ముప్పు తక్కువేనని అమెరికా వైద్యులు చెబుతున్నారు. దేశంలో ఈ ఏడాది జంతువులకు ఈ పరాన్నజీవి సోకలేదు. → ఒకసారి సోకితే ఆ ఉధృతి తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకే ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థతో కలిసి పని చేస్తున్నారు. → ఈగలకు సంతాన నిరోధక ఆపరేషన్లు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. టెక్సాస్లో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్లుగా ఈగల్లో సంతానాన్ని అరికట్టడానికి ఈగలనే ప్రయోగిస్తారు. స్టెరిలైజ్ చేసిన మగ ఈగలు ఆడ ఈగలతో కలిస్తే.. ఆ ఆడ ఈగల్లో సంతాన సామర్థ్యం క్షీణిస్తుంది. → మనుషులు గాయాలు, పుండ్లు బయటకు కనిపించకుండా జాగ్రత్తపడితే ఈగల బారినపడే అవకాశాలు ఉండవు. గాయాలకు సాధ్యమైనంత త్వరగా చికిత్స తీసుకోవాలి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మధ్యయుగ వైద్య చరిత్రలో మేటి.. అగ్గలయ్య
యాదగిరిగుట్ట రూరల్: తెలంగాణ ప్రాంతంలో మధ్యయుగ కాలంలో వైద్య చరిత్రకు ఒక మూలస్తంభంగా, వైద్య వారసత్వానికి శక్తిమంతమైన చిహ్నంగా నిలిచిన ప్రముఖ జైన ఆయుర్వేద, శస్త్ర వైద్యుడు అగ్గలయ్య. ఈయనకు సంబంధించిన శాసనాలు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని సైదాపురం గ్రామంలో ఉన్నాయి. ఈ శాసనాలు దక్షిణ, మధ్య భారతదేశంలో 6 నుంచి 12 శతాబ్దాల మధ్య పరిపాలించిన చాళుక్య రాజుల కాలం నాటివని ఆర్కియాలజీ అధికారులు గుర్తించారు. చాళుక్యుల రాజుల్లోని రెండవ జయసింహుడుతో పాటు మరి కొంతమంది రాజుల కాలంలో సామంతుడుగా ఉన్న జైన శస్త్ర వైద్యుడు అగ్గలయ్య (Aggalayya) గురించి ఈ శాసనంలో వివరించారు. అప్పట్లో అగ్గలయ్య చేసిన సేవలకు రెండవ జయసింహుడు అతని పేరు మీద కొన్ని మాన్యాలను ఈ సైదాపురం ప్రాంతంలో ఇచ్చారని ఈ శాసనంలో పొందుపరిచారు. ఆయుర్వేదం, శస్త్ర చికిత్సలో మాంత్రికుడు ఆయుర్వేదం, శస్త్ర చికిత్సలో అగ్గలయ్య మాంత్రికుడు. శస్త్ర వైద్యంలో జబ్బు నయం కానటువంటి వారిని, ఈ అగ్గలయ్య వద్దకు పంపించేవారని, ఈ శాసనం తెలుపుతుంది. భారత దేశంలోనే 11వ శతాబ్దం నాటికి ఒక సర్జన్ ఉన్నాడని ప్రాథమిక వనరుగా ఈ శిలాశాసనం తీసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. దక్షిణ భారతదేశంలో ఆయుర్వేద చరిత్రను తెలిపే అతి విలువైన శాసనం ఈ సైదాపురం శాసనం. మధ్యయుగం కాలంలో కొందరు వైద్యులు శస్త్ర చికిత్సలు చేసేవారు అని అనడానికి రుజువు ఈ శాసనం. అగ్గలయ్య చరిత్ర అగ్గలయ్య జైన మతానికి చెందిన శస్త్రచికిత్స వైద్యుడు. ఈయన దక్షిణ భారతదేశంలోని తెలంగాణ (Telangana) ప్రాంతానికి చెందిన గొప్ప వైద్యుడు. ఇతను సుమారుగా 1000 ఏడీలో జన్మించి, 1080 ఏడీలో మరణించాడు. ఈయన భార్య పేరు వల్లికాంభే. తెలంగాణలోని ఆలేరు సమీపంలోని ఇక్కురికే (ప్రస్తుతం ఇక్కుర్తి) గ్రామం ఈయన స్వస్థలం. ఈయన స్థాపించిన వైద్య రత్నాకర జినాలయాలు, అనేక చారిత్రక నిర్మాణాలు ఈ ఇక్కుర్తి ప్రాంతంలో ఉండేవని పురావస్తుశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఇక్కుర్తి ప్రాంతంలోనే ఈయన సమాధి గత కొన్ని సంవత్సరాల కిందట వరకు ఉందని, కాలానుగుణంగా ఆ సమాధిని తవ్వకాల్లో తీసేశారని అధికారులు చెబుతున్నారు. శస్త్ర విద్యలో ప్రావీణ్యుడు చాళుక్యుల కాలంలో అగ్గలయ్య శస్త్ర చికిత్సలో ఓ వెలుగు వెలిగిన వైద్యుడు. ఇతర వైద్యులు నయం చేయని వ్యాధులను నయం చేసేవాడు. ఈయనకు నరవైద్యవర, ప్రాణాచార్య, వైద్యరత్నాకర, వైద్యశిఖామణి అనే బిరుదులు ఉన్నాయి. అగ్గలయ్యను రాజ వైద్యుడుగా పిలిచేవారు. జైనులకు శస్త్రచికిత్స, ఆయుర్వేద కళను బోధించేవాడు. విదేశాల నుంచి వచ్చే ఇతర వైద్యుల సందేహాలను నివృత్తి చేసేవాడు.సామంత రాజుగా అగ్గలయ్య అగ్గలయ్య చేసిన వైద్య సేవలకు ప్రత్యేక గుర్తింపు కల్పిస్తూ, ఆనాటి చాళుక్య రాజులు ఈయన్ను సామంత రాజుగా చేసుకున్నారు. నలుగురు రాజులు మారినా ఈయననే ఆస్థాన వైద్యుడిగా, సామంత రాజుగా కొనసాగించారు. జైన మతం అయినప్పటికీ.. అగ్గలయ్య జైన మతానికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ, వైద్య శాస్త్రంలో ఆయన అభివృద్ధిని అడ్డుకోలేదని శాసనాలు చెబుతున్నాయి. అహింస జైన సూత్రం అయినా, శస్త్ర చికిత్సలో వైద్య విద్య కోసం, అభ్యాస కేంద్రాలను ఏర్పాటు చేసి, 9వ శతాబ్దంలో ఉగ్రాదిత్య వంటి జైన పండితులు వైద్య గ్రంథాలను ఏర్పాటు చేయడంలో అగ్గలయ్య తమ వంతు పాత్ర పోషించాడని చరిత్ర చెబుతుంది.సైదాపురంలో రెండు శాసనాలు సైదాపురం గ్రామంలో అగ్గలయ్యకు సంబంధించిన రెండు శాసనాలు ఉన్నాయి. ఈ శాసనాలు రాతి స్తంభాలపై మూడువైపులా చెక్కబడి ఉన్నాయి. మొదట రెండు భాగాలు తెలుగు, కన్నడ లిపిలో ఉండగా, మూడో వైపు సంస్కృత భాషలో ఉన్నాయి.శాసనంలో మొదటి భాగం అగ్గలయ్య జైనుడని, ఆయనకు వైద్యరత్నాకరుడని, ప్రాణాచార్యుడని, నరవైద్యుడని బిరుదులు ఉన్నట్లు ఈ శాసనం తెలుపుతుంది. పూర్వ కాలంలో కొలిపాక, (నేడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక) పరిధిలో ఉన్న ముప్పనపల్లి గ్రామాన్ని అగ్గలయ్య నిర్మించిన జైన వసతులు (జైన సంప్రదాయాన్ని పాటించే సన్యాసులు, గురువులు, శిష్యులు నివసించే మఠాలు) వీటి నిర్వహణకు అప్పటి గ్రామ పెద్ద గవుండ బహుమానంగా ఇచ్చినట్లు ఈ శాసనం తెలుపుతుంది. శక సంత్సరం 956 నుంచి క్రీ.శ. 1034 జూన్ 4 గురువారం నాడు సంభవించిన చంద్ర గ్రహణాన్ని పురస్కరించుకుని మహారాజు హైదరాబాద్కు ఉత్తరాన 20 మైళ్ల దూరంలో ఉన్న పొట్లకేరి (నేటి పఠాన్ చెరువు) విడిది చేసిన సందర్భంగా ఈ దానం చేశారు.శాసనంలో రెండవ భాగం శాసనంలో రెండవ భాగంలో బహుమానంగా ఇచ్చిన భూమి, దానిపై వచ్చే రాబడి అంశాల వివరాల గురించి ఉంది.మూడవ భాగం అగ్గలయ్య జైనమత వాలంభి, మంచివారికి ఎల్లప్పుడూ సహాయం చేయాలని అనుకునే వాడు. తోటి వైద్యుల సందేహాలను నివృత్తి చేస్తూ, జయసింహుని ఆస్థానంలో వర్ధిల్లిన ఇతర ఆయుర్వేద పండితులకు, బ్రహ్మస్వరూపమని, చికిత్సా విధానంలో పాండిత్యుడని, మందులకు లొంగని మొండి వ్యాధులకు ఉపశమనం లభించినా, ప్రాణాపాయ స్థితి నుంచి తప్పినా, అది అగ్గలయ్య చేతి చలవేనని చెబుతుంది. స్వయంగా జయసింహుని ముదిరిన వ్యాధి (ప్రకర్ష) దశలో ఉన్నప్పుడు ఎందరో వైద్యులు కాపాడాలని యత్నించి విఫలం కాగా, తన చేతి వాటంతో చికిత్స చేసి, వ్యాధిని తగ్గించిన ఘనుడు అగ్గలయ్య. తంత్ర శాస్త్రంలోని ఉమా తంత్రం, సంగ్రహ పరిచ్ఛేదాలో కూడా అగ్గలయ్య నిపుణుడని ఈ శాసనం తెలుపుతుంది.సిరూర్ శాసనాలు అగ్గలయ్య గురించి మరి కొన్ని విషయాలు సంగారెడ్డి జిల్లాలోని సిరూర్ గ్రామంలో వెలువడిన మరో రెండు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ శాసనాలు పశ్చిమ చాళుక్య రాజైన భువనైకమల్లదేవ (సోమేశ్వర–2) క్రీ.శ 1069లో వేసిందిగా గుర్తించారు. ఈ శాసనంలో అగ్గలయ్య ప్రశంసలను, జైనమత దేవత పద్మావతితో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తుంది. అదేవిధంగా 1074లో వేసిన మరో శాసనంలో ఆయనను వైద్య శిఖామణి అని స్పష్టంగా సూచిస్తుంది. అలాగే మహాసామంత రాజుగా ఆయన హోదాను నిర్ధారిస్తుంది. అగ్గలయ్య పండితులకు, రుషులకు వారి జీవనోపాధి కోసం, భూములు, ఇళ్ల స్థలాలను బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ శాసనం ఆయన భార్య లక్షణాలను, సమాజం, సంక్షేమ పట్ల నిబద్ధతను చూపిస్తుంది. ప్రస్తుతం ఈ శాసనాలు పురావస్తు శాఖ అధికారులు మ్యూజియంలో భద్రపరిచారు.అగ్గలయ్య పేరు మీద గుట్ట అగ్గలయ్యకు ఉన్న విస్తృత గుర్తింపు శాసనాలకే పరిమితం కాకుండా, ప్రదేశాలకు కూడా విస్తరించి ఉన్నాయి. వరంగల్లోని హనుమకొండ సమీపంలో ఉన్న ఒక కొండకు అగ్గలయ్య గుట్ట (అగ్గలయ్య దిబ్బ) అనే పేరును ఆ కాలంలోని రాజులు పెట్టారు. ఈ ప్రాంతం 9, 10 శతాబ్దాల్లో అనేక జైన శిల్పాలకు నిలయంగా ఉంది. ఈ కొండపైన ఒక పెద్ద విగ్రహం ఉంది, అది అగ్గలయ్య విగ్రహమేనని చరిత్రకారులు చెబుతున్నారు. ప్రముఖ చరిత్ర కారుడు శ్రీ రామోజీ హరగోపాల్ అగ్గలయ్య గురించి పలు పరిశోధనలు చేసి వెలుగులోకి తీసుకొచ్చారు. ఎన్ఐఎమ్హెచ్ బృందం పరిశోధనలు హైదరాబాద్లోని ఎన్ఐఎమ్హెచ్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్) బృందం, డాక్టర్ జీపీ ప్రసాద్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్చార్జి, డాక్టర్ పి.సాకేత్ రామ్ రీసెర్చ్ ఆఫీస్ (ఆయుర్వేద), పి.మురళీ మనోహర్ అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ (క్యురేటర్) తెలంగాణలో ప్రముఖ పరిశోధన, చరిత్ర కారుడు, కవి రామోజు హరగోపాల్ సహాయ సహాకారాలతో ఈ సైదాపురం అగ్గలయ్య శాసనాల్లో పరిశోధనలు జరిపి, వైద్య శాసనాలను గుర్తించారు. ఈ శాసనాల వివరాలను ఫ్రేమ్ రూపంలో ఎన్ఐఎమ్హెచ్లో పొందుపరిచారు.చదవండి: అర్థం చేసుకోవాలి.. అనర్థాలు నివారించుకోవాలి!చాళుక్యుల కాలంలో గొప్ప వైద్యుడు గొప్ప వైద్యుడు అగ్గలయ్య. వివిధ దేశాల నుంచి వైద్యులు అగ్గలయ్య వద్దకు సర్జరీలో మెళకువలను నేర్చుకునేవారు. కొన ఊపిరితో ఉన్న వారిని కూడా అగ్గలయ్య బతికించేవాడు. క్రీస్తు పూర్వం సుశ్రుతుడు వైద్య సేవలందించగా, క్రీస్తు శకంలో అగ్గలయ్య వైద్య సేవలు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం వారసత్వ సంపదను కాపాడాలి. – డాక్టర్ జీపీ ప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్చార్జి, ఎన్ఐఎమ్హెచ్, హైదరాబాద్ -
అర్థం చేసుకోవాలి... అనర్థాలు నివారించుకోవాలి
పెళ్లి మంత్రాల్లో ఏ అర్థం ఉందో తెలుసుకోరు చాలామంది. పెళ్లిలో ఎలాంటి విధానంతో మెలగాలో తెలుసుకోరు ఎంతకాలమైనా. బడిలో ఒకటో తరగతి నుంచి పాఠాలు చదువుతారుగాని పెళ్లిలో ఏ అవగాహన పాఠాలు చదవకుండానే నెట్టుకొచ్చేయాలనుకుంటారు. వర్తమానంలో దంపతుల మధ్య జరుగుతున్న అనర్థాలు ప్రతి ఒక్కరినీ ఆగి, తమ వైవాహిక జీవనాన్ని తరచి చూసుకోమని కోరుతున్నాయి. సరి చేసుకుని ఆనందమయం చేసుకోమంటున్నాయి.న్యూస్పేపర్లు తెరిస్తే భార్యాభర్తల విడాకులు, హత్యోదంతాలు, ఆత్మహత్యలు... సోషల్ మీడియాలో చూస్తే వీధికెక్కి రచ్చ చేసుకోవడం, ఇంటి గుట్టు బయటపడేయడం... వివాహం వార్తగా మారడం... వివాహ గొడవలే ప్రధాన వార్తలుగా చలామణి కావడం చూస్తుంటే మనం ఎటువంటి సమాజం నుంచి ఎటువంటి సమాజానికి చేరుకుంటున్నామనేది పరిశీలించుకోవాలి.గతంలో ఎలా ఉండేది?నలభై, యాభై ఏళ్ల క్రితం వివాహ వ్యవస్థలో ఘోరమైన ఉదంతాలు ఇంత విస్తృతంగా కనిపించేవి కాదు. దంపతులు, పిల్లలు, అవ్వా తాతలు... కుటుంబ వ్యవస్థ కొనసాగుతూ ఉండేది. భార్యాభర్తల కీచులాటలు టీకప్పులో తుఫానులా ఉండేవి. చెప్పాలంటే కొందరు భార్యాభర్తల గొడవలు వీధిలో ఉన్నవారికి నవ్వులాటగా ఉండేవి. అంటే భార్యాభర్తలు చీటికి మాటికి కీచులాడుకోవడం నవ్వదగ్గ విషయంగా, వారి చేతగాని విషయంగా ఉండేది. విడాకులు అనే మాట చాలా అరుదుగా వినవచ్చేది. విడాకుల నిర్ణయానికి ఇటువైపు వర్గం, అటువైపు వర్గం వ్యతిరేకంగా నిలిచేది. యాక్సెప్టెన్స్ ఉండేది కాదు. వివాహాన్ని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నం విడిపోవడానికి పట్టుపట్టడంలో ఉండేది కాదు.ఇవాళ ఎలా ఉంది?వివాహ వ్యవస్థను గౌరవించకపోవడం, ఒకరి పట్ల ఒకరు చూపాల్సిన నిజాయితీ లోపించడం, పిల్లల మీద కక్ష తీర్చుకోవడం, సమస్యకు బదులుగా భార్యనో భర్తనో నిర్మూలించడమే ఏకైక పరిష్కారం అనుకోవడం, వివాహం జీవితానికి ఒక గుదిబండగా మారిందని దాని నుంచి ఎలాగైనా బయటపడాలని చెడు మార్గాలు వెతకడం, హాయిగా ఉన్న ఇంటి నుంచి దూరంగా వెళ్లి ఆ నునుపైన కొండలపై మరింత హాయిగా గడపాలనుకోవడం... ఇవన్నీ అందమైన జీవితాలను ఆగమాగం చేస్తున్నాయి. పరేషానీలోకి నెట్టేస్తున్నాయి. మానసిక, శారీరక కష్టాలు తెచ్చి భవిష్యత్తును చావు దెబ్బ తీస్తున్నాయి.మీ వివాహం సమస్యల్లో ఉంటే–మీ వివాహం సమస్యల్లో ఉంటే మీ వివాహ బంధంలో ఈ విషయాలను చెక్ చేసుకోండి.1. నిజాయితీ: మీరు మీ జీవిత భాగస్వామి పట్ల నిజాయితీతో ఉన్నారా? నిజమైన ప్రేమతో ఉన్నారా? నిజమైన ప్రేమ పొందేలా మీ చర్యలు ఉన్నాయా? ప్రేమను ప్రదర్శిస్తున్నారా? నువ్వంటే నాకు చాలా ప్రేమ అని ఒకసారైనా చెప్పగలుగుతున్నారా. ప్రేమ వివాహానికి మూలం. ప్రేమను వ్యక్తం చేయనప్పుడు ప్రేమ పొందలేరు.2. కమ్యూనికేషన్: మీ మనసులో ఉన్నది స్పష్టంగా మీ జీవిత భాగస్వామికి చెబుతున్నారా? చెప్పి వారికి అది అర్థం చేసుకోవడానికి సమయం ఇస్తున్నారా? అన్నీ మనసులో పెట్టుకుని మౌనంగా ఉంటే అది హింస కిందకు వస్తుంది. మౌనంతో హింసించే విధానం మానుకుంటే వివాహంలో మాట, మంచి మాట మెల్లగా వస్తాయి.3. వింటున్నారా?: వినడం తెలిస్తే సగం సమస్యలు పోతాయి. మీ జీవితభాగస్వామి ఏదైనా చెప్పబోతే మధ్యలోనే తుంచేస్తే, ఎదురు చెప్తే ఇక ఏమీ ముందుకు వెళ్లదు. ఎదుటి వారు చెప్తున్నది పూర్తిగా విని, సమయం తీసుకొని అందులోని మంచి చెడు పట్ల మీ అభిప్రాయం మెత్తగా, స్పష్టంగా చెప్పగలిగితే, అరవడాలు కరవడాలు లేకుండా మాట్లాడుకోగలిగితే చాలు. వివాహం వర్థిల్లుతుంది.4. గౌరవం ఉండాలి: ఒక మనిషి మరో మనిషిని ఎప్పుడు ఇష్టపడతాడంటే ఆ మనిషి తనను గౌరవిస్తున్నాడని తెలిసినప్పుడే. మనం వెళితే గౌరవించి టీ ఇచ్చే ఇంటికే మనం వెళ్తాం తప్ప ముఖాన తలుపు వేసే వారింటికి వెళతామా? భార్యాభర్తల విషయం కూడా అంతే. చులకన భావం వివాహానికి ప్రథమ విరోధి. భార్య/భర్త ఒకరినొకరు చులకన భావంతో చూస్తే వివాహం చులకనకు లోనవుతుంది. ఆ తర్వాత హేళన, ఆపైన తిట్టు, అటుపై కొట్లాట, తదుపరి నువ్వెంతంటే నువ్వెంత అనే మాటలు వచ్చేస్తాయి. చులకన వద్దు.5. సహానుభూతి: పని చేసి అలసిపోయి ఉంటాడేమో, వంటపని, ఇంటి పనితో డస్సిపోయిందేమో అని ఒక నిమిషం పరస్పరం ఆలోచిస్తే... సానుభూతి అందిస్తే ఎంతో ఓదార్పుగా ఉంటుంది. అలసిపోయి ఉన్న జీవిత భాగస్వామిని ‘ఆ.. పెద్ద చేశావులే’ అనే ఒక్క మాటతో శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు. సహానుభూతి చూపితే అది పెద్ద సహాయం చేస్తుంది. ఎమోషనల్ ఇంటిమసీ చాలా ముఖ్యం.6. హద్దులు: మీరు వివాహం చేసుకున్నారు కాని ΄÷లంలో పని చేసే ఎద్దును తెచ్చుకోలేదు. వివాహంలో హద్దులు ఉంటాయి. భార్య/భర్తల పర్సనల్ స్పేస్లో ఎంతవరకు వెళ్లాలో తెలుసుకొని ఉండాలి. ఉమ్మడి ఇష్టాలను కలిసి నిర్వహించుకోవాలి.7. ఆర్థికం: ఆర్థిక విషయాలలో భార్యాభర్తల మధ్య అవగాహన అన్నింటి కంటే ముఖ్యం. అప్పులు, అధిక ఖర్చులు ఇద్దరిలో ఎవరు చేసినా ఆ వివాహం ప్రమాదంలో ఉన్నట్టు. అలాగే ప్రతి పైసా గీచిగీచి లెక్క అడిగినా ప్రమాదమే. ఇంటి ఖర్చు, ΄÷దుపు, బాధ్యతలకు అవసరమైన సహాయం... వీటిని జాగ్రత్తగా చూసుకుంటే అంతటా అనుకూలమే.ఈ ఏడు సలహాలు వివాహం ముందుకెళ్లడానికి ఏడడుగులు.పెళ్లి అర్థం కాకుండా పెళ్లెందుకు చేసుకున్నారు?పెళ్లి బొమ్మలాట కాదు. అది పెద్ద బాధ్యత. జీవితాన్ని ఫలవంతం చేసే దశ. ఒంటరి మనిషికి కుటుంబం అనే అందమైన బాంధవ్యాన్ని ఇచ్చే వరం. సంతానాన్ని ఇచ్చి ఎనలేని తృప్తినిచ్చే మార్గం. వివాహంలో అడుగుపెట్టాలంటే మానసికంగా, శారీరకంగా సిద్ధమయ్యి అన్నీ ఆలోచించుకుని ఉండాలి. కాని గతంతో పోలిస్తే ఇంత ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు లేదు. అమ్మాయి, అబ్బాయిల ఇష్టాయిష్టాలు తమకు తాము పట్టించుకోకపోవడం, కుటుంబాలు నిర్లక్ష్యం చేయడం, పొంతన కుదురుతుందో లేదో చూడకపోవడం, అబ్బాయికి అమ్మాయికి ఉన్న ఉపాధి మార్గాలు వారిని కలిపి ఉంచుతాయా... ఎక్కువ పని గంటల వల్ల గాని, ఇతర ఊర్లకు వెళ్లి పని చేయడం వల్లగాని గ్యాప్ తెస్తాయా చూడకపోవడం... డబ్బు పట్ల ఎవరికి ఎంత ఆశ, అత్యాశ ఉంది... అబ్బాయి/అమ్మాయి గురించి ఆరా తీస్తే వారు పెద్దలకు, సంప్రదాయాలకు ఇచ్చే విలువ ఏ మాత్రం ఉంటుంది... ఇవన్నీ చూడకుండానే చేసేస్తున్నారు. దాని వల్ల సమస్యలు వెంటనే బయల్దేరుతున్నాయి. -
డాక్టర్ రోబో.. సర్జన్ అవతారం!
రజనీకాంత్ నటించిన రోబో సినిమాలో ఆపరేషన్ థియేటర్లో డెలివరీ చేస్తున్న హ్యూమనాయిడ్ రోబో సన్నివేశం ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పించింది. సినిమాల్లోనే కాదు.. వాస్తవ ప్రపంచంలోనూ రోబోలు సర్జరీలను చకచకా చేస్తున్నాయి. అన్నింటా మనం అన్నట్టు ఈ విషయంలో భారత్ సైతంతగ్గేదేలే అంటోంది.వైద్య పరిశ్రమ అంచనాల ప్రకారం భారత్లో ఇప్పటివరకు రోబోలు సహాయకులుగా 1,50,000 కంటే ఎక్కువ శస్త్రచికిత్సలు జరిగాయి. అంతేగాక పూర్తిగా రోబోటిక్ శస్త్రచికిత్సలు సైతం విజయవంతంగా నిర్వహిస్తున్నారు మన వైద్యులు. ప్రస్తుతం మన దేశంలో 1,000 మంది సర్జన్లు ఏటా 12,000 కంటే ఎక్కువ రోబోటిక్ శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారంటే ఆశ్చర్యంవేయక మానదు.విదేశీ రోగులకూ సేవలు..ఫలితాలను అంచనావేసే ప్రిడిక్టివ్ అనలిటిక్స్, వ్యక్తులనుబట్టి చికిత్సా మార్గాల ద్వారా ఆరోగ్యాన్ని, ఆరోగ్య సంరక్షణ నిర్ణయాలను మెరుగుపర్చడం, రోగనిర్ధారణ కచ్చితత్వం ద్వారా శస్త్రచికిత్సా విధానాల సామర్థ్యాన్ని కృత్రిమ మేధ పెంచుతోందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. శస్త్రచికిత్స సమయాలను ఏఐ దాదాపు 15 శాతం తగ్గించగలదని అంటున్నారు. రోబోటిక్ శస్త్రచికిత్సల కోసం వచ్చే విదేశీ రోగులకు గమ్యస్థానంగా భారత్ అవతరిస్తోంది.యూఎస్, యూరప్ వంటి దేశాలతో పోలిస్తే వైద్య ఖర్చులు మనదగ్గర కనీసం 50 శాతం తక్కువ. అమెరికా, యూకే, నైజీరియా, కెన్యా, సౌదీ అరేబియా, ఉజ్బెకిస్తాన్, ఒమన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా నుండి ఎక్కువ మంది రోగులు భారత్కు వస్తున్నారు. భారతదేశ సర్జికల్ రోబోటిక్స్ మార్కెట్ ప్రస్తుతం రూ.7,830 కోట్లకుపైగా ఉంది. 2030–31 నాటికి దాదాపు రూ.34,800 కోట్లకు చేరుతుందని అంచనా.సంక్లిష్ట విధానాల్లో సౌలభ్యంగుండెకు సంబంధించినవి, క్యాన్సర్ (ఆంకాలజీ), ఆర్థోపెడిక్స్, వెన్నెముక, నరాల సంబంధమైనవి, జీర్ణాశయం, గైనకాలజీ, యూరాలజీ, జనరల్ సర్జరీ వంటి సంక్లిష్టమైన ప్రక్రియల కోసం రోబోటిక్ శస్త్రచికిత్సలను ఆసుపత్రులు నిర్వహిస్తున్నాయి. వివిధ రకాల సంక్లిష్ట విధానాలను నిర్వహించడానికి సంప్రదాయ పద్ధతులకు మించిన సౌలభ్యం, కచ్చితత్వం, నియంత్రణను రోబోటిక్స్ అందిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు.ఇలా చేస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక శస్త్రచికిత్సా వ్యవస్థలలో.. భారత్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నది ‘డా వించీ సర్జరీ విధానం’. ప్రపంచ వ్యాప్తంగా ఈ విధానం ద్వారా సుమారు 8 లక్షల సర్జరీలు జరిగాయట. మనదేశంలో నిర్వహించే అత్యంత సాధారణ క్లినికల్ రోబోటిక్ సర్జికల్ వ్యవస్థలో కెమెరా ఆర్మ్, శస్త్రచికిత్సా పరికరాలతో కూడిన యాంత్రిక చేతులు (మెకానికల్ ఆర్మ్) ఉంటాయి. శస్త్రచికిత్స చేసే టేబుల్ పక్కన కంప్యూటర్ కన్సోల్లో కూర్చుని ఈ యాంత్రిక చేతులను సర్జన్ నియంత్రిస్తారు. త్రీడీ వ్యూలో పెద్దగా, అధిక స్పష్టతతో శస్త్రచికిత్స చేపట్టే భాగాన్ని ఈ కన్సోల్ చూపుతుంది.మెరుగైన ఫలితాలు..అత్యవసరం కాని శస్త్రచికిత్సలకు రోబోటిక్స్ విభిన్న ప్రయోజనాలను అందించగలవని వైద్యులు అంటున్నారు. గాయం చుట్టుపక్కల కణజాలాలకు నష్టం తగ్గించేలా శస్త్రచికిత్సను కచ్చితంగా నిర్వహించడం ఇందులోని ప్రత్యేకత. రోబోటిక్స్తో మరో ప్రయోజనం ఏమిటంటే మరింత నియంత్రణ, స్పష్టంగా చూసే వీలు ఉండడంతో సంక్లిష్ట, వీలుకాని భాగాలనూ చేరుకోవచ్చు. అధిక సామర్థ్యం, శస్త్రచికిత్స తదనంతరం ఖర్చులు తగ్గడం, ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉండటం, ఔషధ మోతాదు తగ్గడం తదితర ప్రయోజనాలు ఉండడంతో ఈ ప్రక్రియ దేశంలో క్రమంగా ప్రాచుర్యం పొందుతోంది.ఖరీదైన వ్యవహారమేరోబోటిక్ సర్జరీలకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ.. ఈ సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి చేయాల్సిన ముందస్తు పెట్టుబడి ఆసుపత్రులకు ఆందోళన కలిగిస్తోంది. రోబోటిక్ సర్జరీలలో చార్జీలు కేసును బట్టి.. ప్రధానంగా శస్త్రచికిత్స రకాన్ని బట్టి మారతాయి. డా వించీ రోబోటిక్ సర్జరీకి అవసరమైన యంత్ర పరికరాల విలువ సుమారు రూ.14 కోట్ల నుంచి గరిష్ఠంగా 20 కోట్ల వరకు ఉంటుందట.వార్షిక నిర్వహణ వ్యయాలు రూ.87 లక్షల నుంచి రూ.1.3 కోట్ల వరకు ఉంటాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఖరీదైన వ్యవహారం కాబట్టి చిన్న ఆసుపత్రులు, గ్రామీణ ప్రాంతాల్లో వీటి వినియోగం ప్రశ్నార్థకమేనని చెబుతున్నాయి. ఎస్ఎస్ ఇన్నోవేషన్ ్స ఇంటర్నేషనల్, మెరిల్ లైఫ్ సైన్సెస్, రిలయన్ ్స ప్రమోట్ చేస్తున్న యాడ్వర్బ్ టెక్నాలజీస్, మెడ్ట్రానిక్ వంటి కంపెనీలు ఈ అడ్డంకిని తొలగించడానికి భారీ అడుగులు వేస్తున్నాయి.అయితే రోబోటిక్ సర్జరీలపట్ల ప్రజల్లో అవగాహన పరిమితంగా ఉండడం, సమగ్ర బీమా కవరేజ్ లేకపోవడం వల్ల రోగులకు అధిక భారం పడుతోంది. సుమారు 70 శాతం తక్కువ ఖర్చుతో సంప్రదాయ పద్ధతుల్లో శస్త్ర చికిత్సలకు వీలుండడం ఈ రంగం వృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయన్నది నిపుణుల మాట. ఇన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ రోబోటిక్ సర్జరీలు పెరుగుతుండడం గమనార్హం.రెండో స్థానంలో దక్షిణాది..దేశంలో సర్జికల్ రోబోల వినియోగంలో ఉత్తర భారతదేశంలోని ఆసుపత్రుల వాటా 35 శాతంగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. ప్రధానంగా ఢిల్లీ–ఎన్ సీఆర్ ఈ విషయంలో ముందుంది. ఆ తర్వాతి స్థానంలో 30 శాతం వాటాతో దక్షిణ భారతం నిలిచింది. -
రుణం భారమా...‘రాజీ’ ఉందిగా!
ఎన్నో అవసరాలకు నేడు అరువు ఆధారంగా మారుతోంది. రుణంపై ఖరీదైన కొనుగోళ్లకు సైతం వెనుకాడడం లేదు. ఈఎంఐతో చిన్నగా తీర్చేయొచ్చులే అన్న ధీమా కనిపిస్తోంది. కానీ, ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోతే..? లేదంటే ప్రమాదం/వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల కారణంగా ఆర్థిక పరిస్థితులు తలకిందులై.. రుణం తీర్చడం కష్టంగా మారితే? ఈ రిస్క్ ను రుణం తీసుకునే ముందు ఎవరూ ఆలోచించడం లేదు. ఒకవేళ రుణం చెల్లించలేని క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్లినప్పుడు ఉన్న ఏకైక మార్గం.. రాజీ (సెటిల్మెంట్) చేసుకోవడమే. ఇది ఎలా పనిచేస్తుంది..? రుణ చరిత్రపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? తదితర విషయాలతో కూడిన కథనమిది.రుణ వాయిదాలను సకాలంలో చెల్లించకపోవడం వల్ల అసలుకు వడ్డీ తోడవుతుంది. దీనిపై పెనాల్టీ తదితర చార్జీలు కూడా పడతాయి. సకాలంలో రుణాన్ని చెల్లించాల్సిన బాధ్యత రుణ గ్రహీతలపై, దీన్ని చట్టబద్ధంగా వసూలు చేసుకునే హక్కు రుణదాతలకు ఉంటుంది. అసాధారణ పరిస్థితులు ఎదురై రుణాన్ని సకాలంలో చెల్లించలేని పరిస్థితుల్లో వన్టైమ్ లోన్ సెటిల్మెంట్ (రుణ పరిష్కారం) కోసం అభ్యర్థించొచ్చు. రుణం ఇచ్చిన బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ ఇందుకు అనుమతిస్తే.. చెల్లించాల్సిన మొత్తం చాలా వరకు తగ్గిపోతుంది. కానీ, దీని కారణంగా తర్వాతి కాలంలో రుణం పొందడం కష్టంగా మారొచ్చు. ‘‘వ్యక్తిగత రుణం, వాహన రుణం, గృహ రుణం, విద్యా రుణం, వ్యాపార రుణం, క్రెడిట్ కార్డు రుణం తదితర రుణాల్లో సెటిల్మెంట్కు వెళ్లొచ్చు. రుణాన్ని పరిష్కరించుకునే ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు కొన్ని ఉన్నాయి. ఇది క్రెడిట్ స్కోరుపై, ఆర్థిక భవిష్యత్పై గణనీయమైన ప్రభావం చూపిస్తుంది’’ అని ఎంపాకెట్ (ఇన్స్టంట్ లోన్ ప్లాట్ఫామ్) వ్యవస్థాపకుడు, సీఈవో గౌరవ్ జలాన్ వివరించారు. రుణ పరిష్కారం అన్నది అంతిమ ఆప్షన్గానే ఉండాలన్నది నిపుణుల సూచన. నెలవారీ చెల్లింపులు చేయలేక రుణ ఎగవేత పరిస్థితుల్లోకి వెళ్లినప్పుడే లోన్ సెటిల్మెంట్ను పరిగణనలోకి తీసుకోవాలని ‘బేసిక్ హోమ్ లోన్’ సంస్థ సీఈవో అతుల్ మోంగా సూచించారు. దీనివల్ల చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సిన అవసరం తప్పుతుందన్నారు.ప్రధానంగా.. ‘‘అన్ సెక్యూర్డ్ రుణాలైన వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డు, వ్యాపార రుణాల విషయంలో రుణ పరిష్కారాన్ని పరిశీలించొచ్చు. అదే సమయంలో సెక్యూర్డ్ కిందకు వచ్చే గృహ రుణాలు, ఆటో రుణాలు లేదా ప్రాపర్టీపై రుణాలు, బంగారంపై రుణాల పరిష్కారానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే తనఖాలో ఉన్న వాటిని రుణదాతలు స్వా«దీనం చేసుకుంటారు’’ అని మైమనీ మంత్ర డాట్ కామ్ వ్యవస్థాపకుడు, ఎండీ రాజ్ ఖోస్లా పేర్కొన్నారు.తగ్గే భారం ఎంత? రుణం తీర్చే అవకాశం లేనప్పుడు పరిష్కారం మాత్రం ఎందుకు? అని సందేహించొచ్చు. చట్టపరమైన చర్యలకు దూరంగా ఎంతో కొంత చెల్లించి భయపడే మార్గం దీంతో లభిస్తుంది. దీనివల్ల మానసిక నిశి్చంత లభిస్తుంది. సెటిల్మెంట్తో తగ్గే భారం ఎంత? అన్న దానికి ఇతమిద్ధమైన సూత్రం ఏమీ లేదు. రుణం ఇచ్చిన సంస్థతో బేరసారాలు.. నియమ, నిబంధనలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రుణగ్రహీత చెల్లింపుల సామర్థ్యాలపైనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా అధిక వడ్డీ భారం ఉండే క్రెడిట్ కార్డు, వ్యక్తిగత రుణాల విషయంలో సెటిల్మెంట్తో చెప్పుకోతగ్గ భారం తగ్గుతుంది. రుణగ్రహీత తన ఇబ్బందికర పరిస్థితుల గురించి రుణదాతకు సమర్థవంతంగా వివరించగలిగితే.. పాక్షిక చెల్లింపులకు బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ అంగీకరించొచ్చు. అవకాశం ఉంటే పూర్తి మొత్తంతో పరిష్కరించుకోవడం మెరుగైన ఆప్షన్ అవుతుందని నిపుణుల సూచన. మొత్తం బకాయి ఎంత? దానిపై వడ్డీ భారం ఎంత? చర్చల సామర్థ్యంపైనే తుదకు ఎంత మొత్తం చెల్లించాలన్నది ఆధారపడి ఉంటుందని అతుల్ మోంగా తెలిపారు. అసలు రుణం కంటే కొంచెం ఎక్కువగాను.. అసలు, వడ్డీ అన్ని చార్జీలు మొత్తం కంటే తక్కువ చెల్లించే పరిష్కారానికి వీలుంటుంది. ‘‘ఏక మొత్తంలో చెల్లిస్తారు గనుక మొత్తం బకాయిలో తక్కువకే రుణ దాతలు అంగీకరిస్తారు. ఒకవేళ పాక్షిక చెల్లింపులకు సైతం కటకట ఎదుర్కొంటుంటే.. మొత్తం బకాయిలో 25 శాతం లేదా 30 శాతం చెల్లించే ప్రతిపాదన చేయొచ్చు. మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి రుణదాతకు వివరించాలి. దీంతో చెల్లించాల్సిన మొత్తం 30–50 శాతానికి పరిమితం అవుతుంది’’ అని విద్యా రుణాల పంపిణీ సంస్థ ‘ప్రాపెల్డ్’ వైస్ ప్రెసిడెంట్ రవికిషోర్ గోయల్ తెలిపారు. చెల్లించాల్సిన మొత్తం భారీగా ఉండి, చెల్లించే సామర్థ్యం చాలా తక్కువగా ఉంటే మరింత తక్కువ మొత్తానికి లోన్ సెటిల్ చేసుకునేందుకు అభ్యర్థించొచ్చని ఖోస్లా సూచించారు. బకాయిలో 10 నుంచి 50 శాతం మధ్య చెల్లింపులు చేసేందుకు సిద్ధం కావాలన్నారు. సాధారణంగా రుణదాతలు బకాయిలో 50 శాతానికి పైన చెల్లించే పరిష్కారానికి అంగీకరిస్తుంటారని.. అయినప్పటికీ, సాధ్యమైనంత తక్కువకు పరిష్కారం కుదుర్చుకునేందుకు ప్రయత్నం చేయొచ్చని సూచించారు. సమీప కాలంలో ఆర్థిక పరిస్థితులు కుదుటపడే అవకాశం లేని పరిస్థితుల్లోనే లోన్ సెటిల్మెంట్ను పరిశీలించాలన్నారు. కొన్ని సందర్భాల్లో ఒకే విడత కాకుండా నిర్ణీత కాల వ్యవధిలోపు ఒకటికి మించిన వాయిదాల్లో చెల్లించే పరిష్కారం సైతం కుదుర్చుకునేందుకు అవకాశం ఉంటుంది. మధ్యవర్తుల సాయం.. రుణ గ్రహీతల తరఫున రుణ పరిష్కారం కోసం బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలతో చర్చలు నిర్వహించేందుకు డెట్ కౌన్సిలర్ లేదా డెట్ సెటిల్మెంట్ ఏజెన్సీ సేవలు సైతం అందుబాటులో ఉన్నాయి. రుణ పరిష్కారం గురించి ఎలాంటి అవగాహన లేని వారు, ఎలా మాట్లాడాలో తెలియని వారు ఈ తరహా సేవలను పొందొచ్చు. ‘‘నిపుణుల సాయం తీసుకోవడం వల్ల స్పష్టమైన ప్రయోజనాలు లభిస్తాయి. సంప్రదింపుల్లో డెట్ సెటిల్మెంట్ కంపెనీలు ఎంతో అనుభవం కలిగి ఉంటాయి. రుణగ్రహీత తరఫున మెరుగైన ప్రయోజనాలతో కూడిన పరిష్కారాన్ని చూడగలవు’’ అని గౌరవ్ జలాన్ తెలిపారు. అంగీకార పత్రాలు సంబంధిత డాక్యుమెంట్ల పని కూడా సులభతరం అవుతుందన్నారు. ఇలాంటి సేవలు అందించే కంపెనీల చార్జీలు ఎక్కువగా ఉంటాయి. కనుక అందుబాటు ధరలపై అందించే సంస్థలను చూసుకోవడం ముఖ్యం. కొన్ని సంస్థలు ఫ్లాట్ ఫీజు వసూలు చేస్తుంటే, కొన్ని బకాయిలో 15–25% వరకు తీసుకుంటాయని మోంగా తెలిపారు. ఇలాంటి సంస్థల సేవలను పొందే ముందు వాటి విశ్వసనీయతను ధ్రువీకరించుకోవాలి.క్రెడిట్ స్కోరుపై ప్రభావంరుణాన్ని సెటిల్ చేసుకున్న తర్వాత ఆ సమాచారాన్ని బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ క్రెడిట్ బ్యూరోలకు అందిస్తాయి. ‘సెటిల్డ్’ లేదా ‘సెటిల్డ్ ఫర్ లెస్ దెన్ ద ఫుల్ అమౌంట్’ (అసలు కంటే తక్కువ మొత్తంతో పరిష్కారం) అంటూ బ్యాంక్లు తెలియజేస్తాయి. రుణ గ్రహీత క్రెడిట్ రిపోర్ట్లోకి ఇదే సమాచారం చేరుతుంది. సెటిల్డ్ అకౌంట్కు సంబంధించిన సమాచారం ఏడేళ్ల వరకు క్రెడిట్ రిపోర్ట్లో కొనసాగుతుంది. సెటిల్డ్ అని ఉంటే రుణం తిరిగి చెల్లించే సామర్థ్యం లేమిని సూచిస్తుంది. కనుక క్రెడిట్ స్కోరుపై గణనీయమైన ప్రభావమే పడుతుంది. దీంతో భవిష్యత్తులో అవసరానికి రుణం లభించదు. ఒకవేళ రుణం లభించినా ఇతరులతో పోలి్చతే చెల్లించాల్సిన వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. రుణ బకాయిని పూర్తిగా చెల్లించినట్టయితే క్రెడిట్ రిపోర్ట్లో అది క్లోజ్డ్ (ముగిసినట్టు) అని ఉంటుంది. మరో రుణం పుడుతుందా? రుణాన్ని పరిష్కరించుకున్నాక చేయాల్సిన మొదటి పని, తిరిగి తమ క్రెడిట్ స్కోర్ను పునర్నిర్మించుకోవడం. తిరిగి మరో రుణం తీసుకునేందుకు కనీసం రెండేళ్లయినా విరామం ఇవ్వాలన్నది నిపుణుల సూచన. అప్పటి వరకు ఏ రుణం కోసం విచారణ చేయొద్దు. రుణ విచారణలు సైతం క్రెడిట్ స్కోర్పై ప్రభావం చూపిస్తాయి. రుణ పరిష్కారం చేసుకున్న వారు సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు తీసుకోవడం మంచి ఆలోచన. అంటే ఫిక్స్డ్ డిపాజిట్పై జారీ చేసే క్రెడిట్ కార్డు. ఈ కార్డుపై 30–50 రోజుల కాలానికి వడ్డీ లేని రుణ సదుపాయం లభిస్తుంది. ఈ కార్డు మొత్తం లిమిట్లో 50 శాతం మించకుండా క్రమశిక్షణతో వినియోగిస్తూ, సకాలంలో చెల్లింపులు చేస్తూ వెళ్లాలి. దీనివల్ల రెండేళ్ల కాలంలో క్రెడిట్ స్కోరు బలపడుతుంది. తద్వారా గతంలో చేసుకున్న రుణ పరిష్కారం తాలూకు ప్రభావాన్ని అధిగమించొచ్చు. చివరి ఎంపికే.. క్రెడిట్ స్కోరుపై ప్రభావం చూపిస్తుంది కనుక లోన్ సెటిల్మెంట్ అన్నది చివరి ఎంపికగానే ఉండాలి. దీనికంటే ముందు రుణ బకాయి మొత్తాన్ని చెల్లించే మార్గాలను పరిశీలించాలి. రుణదాతతో చర్చించుకుని, కొంత కాలం పాటు మారటోరియం (విరామం/6–12 నెలలు) కోరొచ్చు. ఈ లోపు ఆర్థిక పరిస్థితులను గాడిన పెట్టుకుని రుణ బకాయిని వడ్డీ సహా చెల్లించే వెసులుబాటును పరిశీలించాలి. లేదంటే దీర్ఘకాలానికి రుణాన్ని పునర్వ్యవస్థీకరించి, తక్కువ నెలసరి వాయిదాలతో చెల్లించే పరిష్కారం కుదుర్చుకోవచ్చు. ఏవైనా ఆస్తులు ఉంటే విక్రయించి చెల్లించడం మెరుగైన మార్గం అవుతుంది. అవసరమైతే కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల సాయంతో గట్టెక్కే మార్గం చూడొచ్చు. ఏ విధంగా చూసినా అవకాశం లేనప్పుడు రుణ పరిష్కారానికి వెళ్లొచ్చు. ఇవి గుర్తుంచుకోండి... కొన్ని వేల రూపాయిల బకాయి కోసం లోన్ సెటిల్మెంట్ కోరడం అస్సలు సూచనీయం కాదు. ఎంత కష్టమైనా సరే చెల్లించడమే మెరుగైన ఆప్షన్ అవుతుంది. రుణ బకాయి వ్యక్తి వార్షిక ఆదాయంలో 20–30 శాతం ఉన్నప్పుడు లోన్ సెటిల్మెంట్ ఆప్షన్ ఎంపిక చేసుకుని క్రెడిట్ స్కోరులో రాజీ పడవద్దని ఖోస్లా సూచించారు. → లోన్ సెటిల్మెంట్లో భాగంగా అంగీకారం మేర చెల్లింపులు చేసిన తర్వాత మిగిలిన మొత్తాన్ని రుణ దాత మాఫీ చేస్తారు. దాంతో చట్టపరంగా ఇకమీదట చెల్లించాల్సిన బాధ్యత ఉండదు. → రుణ పరిష్కారం కంటే దివాలా పిటిషన్ దాఖలు చేయడమే తేలిక కదా అని అనుకోవద్దు. దివాలాతో రుణాలకు శాత్వతంగా దారులు మూసుకుపోయినట్టు అవుతుంది. దీనికంటే సెటిల్మెంట్ నయం. → కొన్ని బ్యాంక్లు లేదా ఎన్బీఎఫ్సీలు తక్కువ మొత్తం చెల్లింపులకు అంగీకరించకపోవచ్చు. → రుణం చెల్లించకుండా లేదా పరిష్కారం కుదుర్చుకోకుండా కాలయాపన చేస్తే బ్యాంక్లు/ఎన్బీఎఫ్సీలు చట్టపరమైన చర్యలు మొదలు పెడతాయి. రుణగ్రహీతలపై కోర్టులో సివిల్ కేసు దాఖలు చేస్తాయి. కొన్ని సందర్భాల్లో క్రిమినల్ కేసు దాఖలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దీనివల్ల లేనిపోని చార్జీల భారం నెత్తిన పడుతుంది. → సకాలంలో వసూలు కాని రుణ ఖాతాలను బ్యాంక్లు/ఎన్బీఎఫ్సీలు థర్డ్ పార్టీ సంస్థలకు అప్పగించొచ్చు. దీనివల్ల వారి నుంచి కఠిన వసూళ్ల చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
చెరుగుతున్న చేతిరాత
ప్రస్తుతం అంతా డిజిటల్ యుగం. చేతిరాత దాదాపుగా చచ్చిపోతోంది. డిజిటల్ అవకాశాలు చేతిరాత అవసరాన్నే దాదాపుగా తగ్గించేశాయి. రాత అవసరమైన కెరీర్ను పక్కకు పెట్టే అవకాశం వచ్చింది. ఒకప్పుడు చొక్కా జేబులకు హుందాగా వేలాడిన పెన్ను ఇప్పుడు అలంకారప్రాయంగా కూడా మిగలని పరిస్థితి! కాలేజీ విద్యార్థులు టైపింగ్, టెక్స్టింగ్ చేయడం లేదా వాయిస్ నోట్స్ పంపడం చేస్తున్నారు. స్క్రీన్లపై, వ్యాకరణ స్లిప్లు, అక్షర దోషాలు కూడా ఆటోకరెక్ట్ అవుతున్నాయి. ఇలాంటి డిజిటల్ యుగంలో ఇంకా విద్యార్థులకు ‘చేతిరాత’శిక్షలు అవసరమా? ఇది ఇప్పుడు పాఠశాలలు ఆలోచించాలంటున్నారు నిపుణులు. ‘పేలవమైన చేతివ్రాతను శిక్షించడం మానేయాలి. విద్యార్థి పనిని ప్రదర్శన కోసం కాకుండా కంటెంట్ కోసం అంచనా వేయాలి. ప్రత్యామ్నాయ మూల్యాంకన పద్ధతులను అన్వేషించాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇద్దరూ పిల్లలకు వ్యక్తిగత రచన కోసం ప్రైవేట్ స్థలాన్ని ఇవ్వాలి. యువతకు రాయడానికి, విఫలమవడానికి, నేర్చుకోవడానికి అవకాశం ఇవ్వండి. వారిని శిక్షించే పద్ధతులను మార్చండి’అని సూచిస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న ఎత్తుగడలు చేతిరాత భయం యొక్క మూల కారణాలను తొలగిస్తాయి. రాయడం ముఖ్యమైన జీవిత నైపుణ్యమే. అలాంటి చోట పెన్ను ఒక సాధనంగా ఉండాలే తప్ప.. బెదిరింపు ఆయుధంగా మారకూడదని హెచ్చరిస్తున్నారు. గ్రాఫో ఫోబియా ‘ముత్యాల్లాంటి అక్షరాలు.. రాత చూస్తేనే మార్కులు పడిపోతాయి’అందమైన చేతిరాత ఉన్న విద్యార్థులకు ఉపాధ్యాయులిచ్చే కితాబు. ‘ఏంట్రా ఈ కొంగలు తొక్కిన రాత.. ఇట్లా రాస్తే ఏం అర్థమవుతుంది?’... ఇవి రాత బాగలేని వారికి పడే చివాట్లు. ఇప్పటికీ మన దేశంలోని తరగతి గదుల్లో టీచర్స్ నోట వినబడే ముచ్చట్లు. అవును చేతిరాతలు ఒకప్పుడు తలరాతలను మార్చాయి. కొందరికి మాత్రం ఫోబియాను మిగిల్చాయి. ప్రస్తుత డిజిటల్ యుగంలో.. చేతిరాత కళపై చర్చ జరుగుతోంది. చేతిరాత అనగానే గుర్తొచ్చేది కాపీరైటింగ్ నోట్స్. తెలుగుకోసం డబల్ రూల్.. ఇంగ్లిష్ కోసం ఫోర్ రూల్ బుక్స్. రాత బాగుపడటం కోసం పదేపదే రాయించే టీచర్స్. రాత బాగోకపోతే టీచర్లతో పడే తిట్లు. బాగున్నందుకు అందే మెచ్చుకోళ్లు. పాఠశాలలో ఉండగా డైరీ ఎంట్రీలు.. యవ్వనంలో ప్రేమ లేఖలు. అవి కొందరిని సృజనాత్మక రచనలోకి మారేలా చేస్తే.. రాత సరిగ్గా లేని కొందరినీ భయంలోకి నెట్టేశాయి. అందుకే.. చిన్న దరఖాస్తు.. అందులో రాయాల్సిందల్లా పేరు, చిరునామా, తేదీ మాత్రమే. అయినా సరే.. పెన్ను, పేపర్ తాకగానే ఓ బెరుకు.. అక్షరం ముందుకు కదలదు. అబ్బా ఆన్లైన్ ఫామ్ పెట్టొచ్చు కదా.. ఎంత వయసొచ్చినా సరే.. ఇప్పటికీ కొంతమందికి ఉండే ఫోబియా ఇది. చేతిరాత సరిగా లేక.. బాల్యంలో టీచర్ చేత తిన్న తిట్లు గుర్తుకు వచ్చి కలిగే భయం. దీనిని గ్రాఫోఫోబియా (చేతివ్రాత భయం), స్క్రిప్టోఫోబియా (బహిరంగంగా రాయడానికి భయం) అని పిలుస్తారు. బాల్యంలో చేతిరాత సరిగా లేకపోవడం వల్ల ఎంతో మందికి మిగిల్చిన చేదు జ్ఞాపకాలు.. ఆ తరువాత ఉన్నత విద్యను, ఆపైన కెరీర్ను కూడా ప్రభావితం చేశాయంటే అతిశయోక్తి కాదు.శిక్షగా రాత! భారత విద్యా వ్యవస్థలో నేటికీ చేతిరాతే ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇటీవల ముంబైలోని ఒక ట్యూషన్ టీచర్ చేతి రాత సరిగా లేదని ఎనిమిదేళ్ల బాలుడి చేతిని కొవ్వొత్తితో కాల్చిన విషయం తెలిసిందే. క్లాస్రూమ్లో చేసిన తప్పులకు శిక్షగా కూడా ఈ చేతిరాతనే ప్రయోగిస్తుంటారు ఉపాధ్యాయులు. క్లాసు జరుగుతుండగా మాట్లాడిన విద్యారి్థతో ‘నేను మళ్ళీ తరగతిలో మాట్లాడను’అని 200 సార్లు రాయమని సూచించడం అందుకో ఉదాహరణ. చేతిరాతలో జెండర్ పాత్ర కూడా ఉంది. అమ్మాయివై ఉండి ఇట్లా రాస్తే ఎట్లా.. అని టీచర్లతో తిట్లుతిన్న అమ్మాయిలనేకం. ఆ ఒత్తిడి కొందరికి కాలిగ్రఫీ, స్టెనోగ్రఫీ లాంటివాటిపై ప్రేమను పెంచితే.. పదేపదే విమర్శలు మరికొందరికి అవమాన భారాన్ని మిగిల్చాయి. ఈ శిక్షలు రాయడాన్ని శిక్ష, అవమానంగా అలవాటు చేశాయి. పేలవమైన చేతిరాత భయంతో రాయడం మానేశామని 36.3% మంది విద్యార్థులు 2012 జరిగిన ఓ అధ్యయనంలో చెప్పారంటే.. తీవ్రత ఏపాటిదో అర్థమవుతుంది. ఇప్పుడంటే వాట్సప్, మెసెంజర్, ఈమెయిల్.. వీటన్నింటికీ ఫోన్ లేదా ల్యాప్టాప్లో పాస్వర్డ్తో సంరక్షణ ఉంది కాబట్టి ఎవరో చూస్తారనే భయం లేదు. కానీ.. యువతకు గోప్యత అంటూ లేని కాలంలో.. తమ డైరీనో లేఖనో దొరికితే.. కలిగే అవమానం, శిక్ష.. చేతిరాతను జీవితాంతం ట్రామాగా మిగిల్చిన సందర్భాలూ ఉన్నాయి. ఇవన్నీ.. మెదడులోని హిప్పోకాంపస్, లింబిక్ వ్యవస్థలను ప్రభావితం చేస్తాయి. ఇది శ్రద్ధ, జ్ఞాపకశక్తి, భావోద్వేగాల నియంత్రణను దెబ్బతీస్తుంది. అందుకే రాయడానికి పెన్ను పట్టుకోగానే వారికి చేతిలో వణుకు, అరచేతులకు చెమటలు రావడం, గుండె వేగంగా కొట్టుకోవడం, వికారం, తిమ్మిర్లు రావడం, మణికట్టు నొప్పి వస్తాయి. ఇవన్నీ ఒకప్పుడు వారు ఎదుర్కొన్న అవమానాల తాలూకు మానసిక సంకేతాలు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భారత్ ఎకానమీకి 'పర్యాటకం' దన్ను
దేశీయ పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి అనంతరం పర్యాటకం తిరిగి పూర్వ స్థాయిని మించి పుంజుకుంది. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకం రెండూ బలంగా విస్తరిస్తున్నప్పటికీ, వసతి మౌలిక సదుపాయాలలో గణనీయమైన కొరత ఉందని నీతిఆయోగ్ తాజా నివేదికలో స్పష్టం చేసింది. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం పీక్ సీజన్లలో దేశవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా హోటల్ గదుల కొరత ఉంటుందని నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో హోమ్ స్టేలు కీలక ప్రత్యామ్నాయంగా మారుతున్నాయని, వాటి విస్తరణకు మరిన్ని మార్గాలను అనుసరించాల్సిన అవసరం ఉందని నివేదిక సూచించింది. –సాక్షి, అమరావతిప్రత్యామ్నాయ వసతి రంగం పురోగతిపర్యాటక రంగం విస్తృతంగా పెరుగుతున్న తరుణంలో వసతి మౌలిక సదుపాయాల లోటును భర్తీ చేయడానికి ప్రత్యామ్నాయ వసతి కీలక పరిష్కారంగా నిలుస్తోంది. కొత్త హోటళ్ల నిర్మాణానికి అధిక పెట్టుబడి, నియంత్రణ ఆమోదాలు, భూమి లభ్యత అవసరం. అయితే, హోమ్ స్టేలు తక్కువ ఖర్చుతోనే చక్కటి వసతి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ప్రత్యేకించి మారుమూల ప్రాంతాలు, ద్వితీయ–తృతీయ శ్రేణి నగరాలకు ఇవి ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి. పర్యావరణ స్పృహ, కమ్యూనిటీ ఆధారిత పర్యాటకంతో వీటిని అనుసంధానం చేయాలని నివేదిక సూచించింది. హోమ్ స్టేల కోసం కేంద్రం, రాష్ట్రాలు ఒక నమూనా విధానం రూపొందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. నివేదిక సిఫారసు చేసిన అంశాల్లో.. కొత్త ఆపరేటర్లకు సాంకేతిక సహాయం, ప్రాజెక్టు నిర్వహణ నైపుణ్యం, ఉత్తమ పద్ధతులపై మార్గదర్శకం, ఆర్థిక, ఆర్థికేతర రాయితీలు, గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు ప్రత్యేక మద్దతు, నీరు, విద్యుత్, ఆస్తి పన్నులలో నివాస రేట్ల రాయితీలు, హోమ్ స్టే రిజి్రస్టేషన్ కోసం సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థ ఏర్పాటు వంటివి ఉన్నాయి. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు.. » 2024లో ప్రయాణ–పర్యాటక రంగం దేశ ఆర్థిక వ్యవస్థకు రూ.21.15 లక్షల కోట్లు అందించింది. ఇది 2019తో పోలిస్తే 21 శాతం పెరుగుదల. » వచ్చే దశాబ్దంలో ఈ రంగం రూ.43.25 లక్షల కోట్లు ఆర్థిక వ్యవస్థకు అందజేస్తుంది. ఇది దేశ జీడీపీలో 7.6 శాతంగా ఉంటుంది. » 2024లో దేశీయ పర్యాటకులు రూ.16 లక్షల కోట్లు ఖర్చు చేశారు. ఇది 2019తో పోలిస్తే దాదాపు 25 శాతం అధికం. 2034 నాటికి ఈ ఖర్చు రూ.28.70 లక్షల కోట్లు చేరనుంది. » అంతర్జాతీయ పర్యాటకులు 2024లో రూ.2.85 లక్షల కోట్లు ఖర్చు చేయగా, 2034 నాటికి అది రూ.4.07 లక్షల కోట్లు దాటుతుందని అంచనా. » ప్రస్తుతం పర్యాటక రంగంలో 4.32 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. అంటే, ప్రతి 11 ఉద్యోగాలలో ఒకటి ఈ రంగానిదే. 2034 నాటికి ఈ రంగంలో ఉపాధి 6.3 కోట్లకు పెరుగుతుంది. » పర్యాటకుల అభిరుచులు కూడా మారుతున్నాయి. సుదీర్ఘమైన, ప్రయోజనకరమైన ప్రయాణాలపై వారు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. » 87 శాతం మంది పర్యాటకులు కొత్త గమ్యస్థానాల్లో పర్యటించి, ఆ అనుభూతులను పదిలపరచుకోడానికి దీర్ఘకాల పర్యటనలను కోరుకుంటున్నారు. » వర్కేషన్స్ (విహార ప్రదేశంలో ఉంటూ పని చేయడం), డిజిటల్ నోమాడ్ (స్థిర నివాసం లేకుండా, ప్రపంచంలోని ఏ ప్రదేశం నుంచైనా ఆన్లైన్లో పని చేసేవాడు) సంస్కృతి పెరుగుతున్నందున దీర్ఘకాల వసతిపై డిమాండ్ పెరిగింది. » హోమ్ స్టేలు, ఆఫ్బీట్ అలాగే గ్రామీణ పర్యాటకం వేగంగా విస్తరిస్తున్నాయి. దేశీయ హోమ్ స్టే మార్కెట్ 2024లో రూ.4,722 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. » ఈ మారుతున్న ధోరణులు పర్యావరణ హిత, వెల్నెస్ టూరిజం, గ్రామీణ హోమ్ స్టేల వంటి ప్రత్యామ్నాయ పర్యాటక నమూనాలకు దారి తీస్తున్నాయి. -
పేరెంట్స్.. ముందు మీరు పాటించండి
పిల్లల్ని ఎంత ముద్దు చేసినా, వారికి బుద్ధుల్ని నేర్పించే వయసొకటైతే వచ్చేస్తుంది. అప్పుడిక క్రమశిక్షణ అలవాటు చేయాల్సిందే. అయితే ఆ శిక్షణ.. శిక్షలా ఉండకూడదు. ముద్దార నేర్పించినట్లుగా ఉండాలి. పిల్లలు మెత్తటి మట్టి ముద్దల్లాంటి వారు. వారిని చక్కగా మలచటం పెద్దల చేతుల్లోనే ఉంటుంది. ‘మొక్కై వంగనిది మానై వంగునా?’ అనే సామెత ఎలాగూ ఉన్నదే! వాళ్లు మొక్కలుగా ఉన్నప్పుడే.. వాళ్లు మంచి అలవాట్లు, బాధ్యతలు నేర్చుకోవాలంటే.. అవి చేసి చూపించాల్సింది, పాటించాల్సింది మొదట తల్లిదండ్రులే.స్కూల్లో టీచర్లు చదువు నేర్పటానికి ఒక సిలబస్ ఉన్నట్లే, ఇంట్లో తల్లిదండ్రులు మంచి అలవాట్లు నేర్పటానికి కూడా 6 సబ్జెక్టుల సిలబస్ ఒకటి ఉంది : ఆహారం, ఆటలు, నిద్రవేళలు, సమయపాలన, నియంత్రణ, సంభాషణ. ఈ ఆరు సబ్జెక్టుల్లో పరీక్షలు రాయవలసింది పిల్లలు కాదు. తల్లిదండ్రులు! ఆ ఆరు సబ్జెక్టులు, ఆరు సిలబస్లు ఏమిటో చూద్దామా..– సాక్షి, స్పెషల్ డెస్క్సబ్జెక్ట్ 1 ఆహారం పిల్లలు అడిగినా అడగకున్నా ఏదో ఒకటి తినిపిస్తూ, తినేందుకు ఇస్తూ పేరెంట్స్ తమ ప్రేమను వెలిబుచ్చుతుంటారు. స్కూలుకు వెళ్లడానికి మారాం చేస్తే ఏదో ఒకటి షాపులో కొని ఇస్తుంటారు. చిన్నపిల్లలు వాళ్లకేం తెలుసు.. జంక్ఫుడ్ ఎంత ప్రమాదకరమో! వారంలో ఎక్కువ రోజులు హోటళ్ల నుంచో లేదా ఆన్లైన్ ద్వారానో ఆహారం తెప్పించుకుని ఇంట్లో తినడం చేస్తే.. పిల్లలకు ఇక ఏం చెప్తాం?ఎలా నేర్పించాలి?చాక్లెట్లు, జంక్ఫుడ్, బయటి ఆహారం వంటివి ఎంత ప్రమాదకరమో వీడియోల ద్వారా వారికి అర్థమయ్యేలా చూపించాలి. కాస్త పెద్ద పిల్లలైతే పత్రికల్లో కథనాలు చూపించాలి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వంటి వెబ్సైట్లలో సమాచారం చూపించాలి. తాజా పండ్లు, కూరగాయల వల్ల ప్రయోజనాలు తెలియజెప్పాలి. మీరు చెప్పే వాటిలో.. మీమీ ఆరోగ్య పరిస్థితులను బట్టి.. వీలైనంతవరకు పిల్లలతో కలిసి తినాలి.సబ్జెక్ట్ 2ఆటలు పిల్లలకు కూడా వయసుకు తగిన శారీరక శ్రమ అవసరం. అవి లేకనే పిల్లల్లో స్థూలకాయం, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇలా నేర్పించండి: పిల్లలతో కలిసి మీరూ ఇంటి పనులు చేయండి. కలిసి తోట పని చేయండి. వాకింగ్ చేయండి. వాటి ప్రయోజనాలు వాళ్లకు వీడియోలు లేదా పత్రికల్లో కథనాల ద్వారా తెలియజేయండి. సబ్జెక్ట్ 3నిద్ర వేళలు వేళకు నిద్రపోవటం, నిద్ర లేవటం మంచి అలవాటు. కానీ, చాలామంది పిల్లలు ఉదయాన్నే లేవరు. దాంతో వాళ్లను లేపి, రెడీచేసి, టిఫిన్ తినిపించేసరికి తల్లులకు తలప్రాణం తోకకి వస్తుంది. మీరే ముందు లేవండిసూర్యోదయానికంటే ముందే లేవడం మొదట తల్లిదండ్రులే ప్రారంభించాలి. ఇందుకోసం ముందు చేయాల్సిన రెండు విషయాలు.. రాత్రి వీలైనంత త్వరగా నిద్రపోవడం, బద్ధకాన్ని వదిలించుకోవడం. ఉదయాన్నే లేవడం వల్ల కలిగే ప్రయోజనాలు పిల్లలకు చెప్పండి. విజయవంతమైన వ్యక్తులంతా.. సూర్యోదయానికంటే ముందే నిద్రలేచినవాళ్లేనని వాళ్ల జీవిత చరిత్రలు వివరించండి. పిల్లలను.. వాకింగ్ చేద్దామనో, అలా మేడమీదకు ఎండలోకి వెళ్లివద్దామనో నిద్రలేపండి. మొదట్లో లేవరు. కానీ, లేపడం మానొద్దు. నెమ్మదిగా అలవాటు అవుతుంది. మీరు వాకింగ్కో లేదా మేడమీదకో వాళ్లను తీసుకెళ్లినప్పుడు వాళ్లకు నచ్చిన విషయాలు జరిగితే వాళ్లే రోజూ మిమ్మల్ని లేపుతారు.సబ్జెక్ట్ 4సమయపాలనఅందరికీ ఉండేవి ఆ 24 గంటలే. అందులోనే మన నిత్య కృత్యాలకు, ఇతర పనులకు ఎంత సమయం కేటాయిస్తాం అన్నదానిపై మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. మీరు ఫాలో అవ్వండిమీరు ఒక టైమ్ టేబుల్ వేసుకుని దాన్ని మీ ఇంట్లో ఒక గోడమీదనో మరోచోటో అంటించండి. దాన్ని చూసుకుని మరీ ఫాలో అవ్వండి. ప్రతిసారీ టిక్కులు పెట్టండి. మీరు చూస్తున్న, చేస్తున్న విషయం పిల్లలకు తెలియాలి. నెమ్మదిగా వాళ్ల బెడ్రూమ్లో కలర్ఫుల్గా వాళ్లతోనే ఒక టైమ్ టేబుల్ తయారుచేయించండి. లేదా వాళ్లే తయారుచేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వాళ్లు కూడా మీలాగే చేసేందుకు ప్రయత్నిస్తారు. మొదట్లో.. వాళ్లు విజయవంతంగా దాన్ని ఫాలో అయిన ప్రతిరోజూ ఒక ప్రశంస లేదా బహుమతి ఏదో ఒకటి ఇవ్వండి. తరువాత వాళ్లకు మీరేమీ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే అన్నీ చేసేస్తారు.సబ్జెక్ట్ 5నియంత్రణ సోషల్ మీడియా వచ్చాక పెద్దలకు, పిల్లలకు కూడా స్మార్ట్ ఫోనే లోకం అయిపోయింది. టీవీలు చూస్తూ తినడం చేస్తున్నారు. చాలామంది పెద్దలు పిల్లలు చదువుకుంటుంటేనో, వాళ్లు చూస్తుండగానో లేదా వాళ్లతోనో.. గంటల తరబడి రీళ్లూ, వీడియోలూ, టీవీలో సినిమాలూ / వెబ్సిరీస్లూ చూస్తుంటారు. మీకు మీరే నియంత్రించుకోండిసోషల్ మీడియా, టీవీ ఉచ్చులోంచి ముందు మీరు బయటపడండి. పిల్లల ముందు, వాళ్లు చదువుకుంటున్నప్పుడు ఫోన్లో వీడియోలు చూడటం తగ్గించండి. అలాగే భోజన సమయంలో టీవీ ఆఫ్ చేయడం మీరు అలవాటు చేసుకోండి. ముఖ్యంగా రాత్రుళ్లు టీవీలూ ఫోన్లూ తగ్గించండి. ఉదయాన్నే త్వరగా లేవగలుగుతారు.సబ్జెక్ట్ 6సంభాషణ ఈ రోజుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలాంటి వారినైనా ఎక్కడైనా బతికేలా చేయగలవు. ఇందుకు ప్రధానమైనవి.. సంభాషణా చాతుర్యం, మాటల్లో స్పష్టత, అవసరమైన చోట మృదుత్వం, ధైర్యంగా భావవ్యక్తీకరణ. ఇవి పిల్లలు.. బడిలో టీచర్లు, ఇంట్లో మిమ్మల్నే చూసి నేర్చుకుంటారని మర్చిపోవద్దు.పిల్లలతో మాట్లాడండి.. వినండితల్లిదండ్రులు తరచూ పిల్లలతో మాట్లాడుతూ ఉండాలి. ఉద్యోగాల్లో ఎంత తీరిక లేకుండా ఉన్నా, పిల్లల కోసం తీరిక చేసుకోవాలి. వారి స్కూలు విషయాలను అడిగి తెలుసుకుంటుండాలి. వాళ్లు చెప్పేది శ్రద్ధగా వినాలి. ఆ నమ్మకం వారికి కలగకపోతే వారు మనసువిప్పి మీతో మాట్లాడటం మానేస్తారు. సెలవు రోజుల్లో వారిని మీతోపాటు మార్కెట్కో, షాపుకో తీసుకెళ్లండి.. బయట ఎలా మాట్లాడాలో వాళ్లే నేర్చుకుంటారు.ఓపిక పట్టండిపిల్లలకు మంచి అలవాట్లు నేర్పటానికి పెద్దలకు ఓర్పు అవసరం. » పిల్లలు అలవాటు పడేంత వరకు వారికి గుర్తు చేస్తూనే ఉండాలి. » మంచి అలవాట్లు నేర్చుకునే విషయంలో పిల్లల ప్రయత్నాలను గుర్తించి, ప్రశంసించాలి. » పిల్లలకు మీరు కొన్ని అలవాట్లను ఏర్పరచలేకపోతుంటే వారి ఉపాధ్యాయులు, పిల్లల వైద్యులు లేదా ఇతర నిపుణుల సలహా తీసుకోవడానికి వెనుకాడకండి. -
ఐపీవో నిధుల సమీకరణకు కోత..!
ఇటీవల తిరిగి ప్రైమరీ మార్కెట్లు జోరందుకున్నప్పటికీ పలు కంపెనీలు ఐపీవో నిధుల సమీకరణకు కోత పెడుతున్నాయి. సెకండరీ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, పెట్టుబడులకు పలు అవకాశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు సైతం అంతగా ఆసక్తి చూపకపోవడం వంటి అంశాలు ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. నిజానికి ప్రస్తుత కేలండర్ ఏడాది (2025)లో పలు అన్లిస్టెడ్ కంపెనీలు పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు క్యూ కడుతున్నాయి. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్ను దాఖలు చేస్తున్నాయి. అనుమతులు సైతం పొందుతున్నాయి. అయితే జనవరి మొదలు ప్రపంచ దేశాలపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అదనపు సుంకాలను విధిస్తుండటంతో సెంటిమెంటు బలహీనపడినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ప్రధానంగా భారత్ ఎగుమతులపై ఇటీవల 50 శాతంవరకూ టారిఫ్లను ప్రకటించడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలియజేశారు. యూఎస్ టారిఫ్ల కారణంగా సముద్ర ఉత్పత్తులు, టెక్స్టైల్స్, లెదర్, జ్యువెలరీ, కెమికల్స్ తదితర పలు రంగాలు ప్రభావితంకావచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫార్మాపై సైతం సుంకాలు విధించే వీలున్నట్లు ట్రంప్ హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఫలితంగా కొద్ది నెలలుగా దేశీ స్టాక్ మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలోనే సాగుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. వీటికితోడు దేశీ కంపెనీల ఏప్రిల్–జూన్(క్యూ1) ఫలితాలు ఆకట్టుకోకపోవడంతో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు సైతం దేశీ స్టాక్స్ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో పలు అన్లిస్టెడ్ కంపెనీలు ఐపీవో ద్వారా సమీకరించదలచిన నిధుల పరిమాణాన్ని తగ్గించుకుంటున్నాయి. పునరాలోచనలో.. ఈ ఏడాది జనవరి నుంచి పలు కంపెనీలు లిస్టింగ్కు ఆసక్తి చూపుతున్నప్పటికీ సమీకరించతలపెట్టిన నిధుల పరిమాణంలో కోత పెట్టుకుంటున్నట్లు మార్కెట్ నిపుణులు తెలియజేశారు. వెరసి 2025లో ఇప్పటివరకూ సుమారు 15 కంపెనీలు ఇష్యూల పరిమాణాన్ని తగ్గించుకున్నాయి. ఈ జాబితాలో ఇటీవల లిస్టయిన దిగ్గజాలు ఎన్ఎస్డీఎల్, జేఎస్డబ్ల్యూ సిమెంట్సహా.. ఏథర్ ఎనర్జీ, ఎస్కే ఫైనాన్స్, బ్లూస్టోన్, మొబిక్విక్, ష్లాస్ బెంగళూరు(లీలా హోటల్స్), ఇండిక్యూబ్, అర్బన్ కంపెనీ, స్మార్ట్ వర్క్స్, స్వస్తికా ఇన్ఫ్రా తదితరాలు చేరాయి. 48 కంపెనీల లిస్టింగ్ ఈ కేలండర్ ఏడాదిలో ఇప్పటివరకూ 48 కంపెనీలు ఐపీవోలు చేపట్టి స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యాయి. తద్వారా రూ. 64,135 కోట్లు సమకూర్చుకున్నాయి. అంతక్రితం ఏడాది అంటే 2024లో 90 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వచ్చాయి. తద్వారా ఏకంగా రూ. 1,67,535 కోట్లు(19.5 బిలియన్ డాలర్లు) సమీకరించాయి. ఇది రికార్డుకాగా.. ఈ ఏడాది ద్వితీయార్థంలోనూ పలు దిగ్గజాలు లిస్టింగ్ బాటలో సాగనున్నాయి. పలు అవకాశాలు ప్రైమరీ మార్కెట్లలో కొన్ని నెలలుగా చిన్న, మధ్యతరహా సంస్థలు(ఎస్ఎంఈ) సైతం సందడి చేస్తున్నాయి. దీంతో ఎన్ఎస్ఈ ఎమర్జ్, బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్స్ ద్వారా పలు చిన్న కంపెనీలు సైతం భారీ స్థాయిలో ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు మర్చంట్ బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. మరో వైపు కొద్ది నెలలుగా బంగారం, వెండి వంటి విలువైన లోహాలు ఆకర్షణీయ రిటర్నులు ఇవ్వడం, రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ల ఐపీవోలు, మ్యూచువల్ ఫండ్ల సిప్ పథకాలు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీంతో మెయిన్ బోర్డ్ ప్రైమరీ మార్కెట్లో కొన్ని ఇష్యూలు మాత్రమే లిస్టింగ్లోనూ విజయవంతమవుతున్నట్లు వివరించారు. వెనకడుగు తీరిదీ... వివిధ ప్రతికూలతల కారణంగా తొలుత వేసిన ప్రణాళికలను సవరిస్తూ కొన్ని కంపెనీలు ఐపీవో నిధుల సమీకరణ పరిమాణంలో కోత పెడుతున్నాయి. జేఎస్డబ్ల్యూ సిమెంట్ రూ. 4,000 కోట్ల విలువను రూ. 3,600 కోట్లకు సవరించగా.. ఏథర్ ఎనర్జీ రూ. 3,100 కోట్ల నుంచి రూ. 2,626 కోట్లకు తగ్గించుకుంది. ఈ బాటలో ఎస్కే ఫైనాన్స్ రూ. 2,200 కోట్లస్థానే రూ. 1,600 కోట్లు మాత్రమే సమీకరించగా.. బ్లూస్టోన్ రూ. 1,000 కోట్ల నుంచి రూ. 820 కోట్లకు వెనకడుగు వేసింది. లీలా హోటల్స్ రూ. 5,000 కోట్ల ప్రణాళికను రూ. 3,000 కోట్లకు కుదిస్తే.. మొబిక్విక్ రూ. 1,900 కోట్ల నుంచి రూ. 700 కోట్లకు భారీగా కోత పెట్టుకుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
అంతరాలు!
డైనింగ్ టేబుల్పై నోరూరించే వంటకాలు ఘుమఘుమలాడుతున్నాయి. ఓ తాత, ఆయన మనవడు.. నిశ్శబ్దంగా సాగుతోంది వారి భోజనం. తనతో ఈరోజైనా ఏమైనా మాట్లాడతాడేమోనని ఆ పెద్దాయన ఎదురు చూపులు. 21 ఏళ్ల ఆ కుర్రాడు మాత్రం తన ప్రపంచంలో తాను ఫోన్ లో ఎప్పటిలాగే నిమగ్నమయ్యాడు. ఇద్దరిదీ ఒకేగూడు.. అయినా ఇరువురి మధ్య దూరం. ఇలాంటి దృశ్యాలు.. ఏ ఒక్క కుటుంబానికో పరిమితం కాలేదు. దేశంలోని లక్షలాది ఇళ్లల్లో ఇదే పరిస్థితి.దేశ జనాభాలో 15–29 సంవత్సరాల మధ్య వయసు గల యువత దాదాపు 29% ఉన్నారని అంచనా. అంటే దాదాపు 42 కోట్ల మంది! ఈ ఏడాది చివరినాటికి దేశ జనాభాలో 60 ఏళ్లు, ఆపై వయసుగలవారు 12 శాతం వరకు ఉంటారు. 2050 నాటికి ఇది 19 శాతానికి చేరుతుంది. వీరి జనాభా 25 ఏళ్లలో రెండింతలవుతుందని అంచనా. ఇది మనదేశంలో రెండు ప్రధాన తరాల ముఖ చిత్రం.మనసుల మధ్య ఎడంసాధారణంగా తరాల మధ్య అంతరం ఉంటుంది. కానీ, ఇటీవల వ్యక్తుల మధ్యే కాదు.. మనసుల మధ్య కూడా ఎడం ఉంటోంది. జనరేష¯Œ –జడ్.. పెద్దలను గౌరవిస్తారు. కానీ ఒంటరి వారని, తమపై ఆధారపడతారన్న చులకన భావమూ ఉంటోందని సుప్రసిద్ధ ఎన్జీవో ‘హెల్పేజ్ ఇండియా’ దేశవ్యాప్తంగా చేపట్టిన అధ్యయనం చెబుతోంది. పెద్దలతో యువతరానికి ఉన్న పరిమిత బంధాలు, కుటుంబాల్లో మూస పద్ధతులు.. వెరసి అభిమానం ఉన్నా ఇరువురి మధ్య దూరం ఉంటోందని వివరించింది. తరాలున్న కుటుంబాల్లో 18–24 ఏళ్ల వయసున్న యువతకు.. తాతయ్య, అమ్మమ్మ, నానమ్మలతో ఆత్మీయ అనుబంధం ఎక్కువ.వృద్ధులతో యువత ఎలా మమేకం అవుతున్నారంటే.. -
శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద
దోమలపెంట/నాగార్జునసాగర్: ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది. శనివారం రాత్రి 7 గంటల సమయంలో జూరాల ప్రాజెక్టు నుంచి స్పిల్వే, విద్యుదుత్పత్తి ద్వారా 4,16,629, సుంకేసుల నుంచి 53,313, హంద్రీ నుంచి 250 మొత్తం 4,70,192 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలంకు వస్తోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు పది గేట్లు ఒక్కొక్కటి 18 అడుగుల మేర ఎత్తి.. స్పిల్వే ద్వారా 4,19,314 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. మరోవైపు ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 26,087.. మొత్తం 61,402 క్యూసెక్కుల నీటిని అదనంగా నాగార్జునసాగర్కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 881.7 అడుగుల వద్ద 197.4617 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 24 గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 30,000, హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2,818, ఎంజీకేఎల్ఐ ద్వారా 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో 16.480 మిలియన్ యూనిట్లు, కుడిగట్టు కేంద్రంలో 13.750 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేశారు. కాగా, నాగార్జున సాగర్ ప్రాజెక్టు 26 క్రస్ట్గేట్ల ద్వారా స్పిల్వే మీదుగా 3,61,322 క్యూసెక్కులు, విద్యుదుత్పాదనతో 33,414 క్యూసెక్కులు మొత్తం 3,94,736 క్యూసెక్కుల వరద నీటిని అధికారులు దిగువ కృష్ణా నదిలోకి విడుదల చేస్తున్నారు. -
అతి వేడి.. ఆరోగ్యానికి హానికరం
వేడివేడి టీలో మనం రంగు, రుచి, వాసనల్ని ఆస్వాదిస్తాం. పొగలు కక్కే కాఫీ ఘుమఘుమలకు మైమరిచిపోతాం. అందుకు కారణం, వేడి కూడా ఒక రుచిలా మనకు అలవాటై ఉండటం! అయితే ఈ పానీయాల వేడి.. పరిమితికి మించితే దీర్ఘకాలంలో కేన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీ తాజాగాహెచ్చరించింది! – సాక్షి, స్పెషల్ డెస్క్వేడి పానీయాలు వేడిగానే కదా ఉండాలి! వాటిని వేడిగానే కదా తాగాలి! కాకపోతే, ఎవరి ఇష్టాన్ని బట్టి వారు కాస్త వేడి తక్కువగానో, కొంచెం వేడి ఎక్కువగానో తాగుతారు. మరి వేడి వల్ల కేన్సర్ రావటం ఏంటి? వస్తే ఏ రకం వస్తుంది? గొంతుకు వస్తుందా? ఉదరానికి వస్తుందా? నిజానికి వేడి పానీయాలకు, గొంతు కేన్సర్కు సంబంధం ఉన్నట్లు ఇంతవరకు ఏ ఆధారాలూ లేవు. అలాగే వేడి పానీయాలకు కడుపు కేన్సర్కు మధ్య సంబంధం కూడా అస్పష్టంగానే ఉంది. ఇదంతా నిజమే కానీ, మితి మీరిన వేడి ఉన్న పానీయాలను సేవించటం వల్ల అన్నవాహిక కేన్సర్ వచ్చే అవకాశం ఉన్నట్లు తాము గుర్తించామని వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.65 డిగ్రీలు దాటితే డౌటే!2016లో ‘ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కేన్సర్’ జంతువులపై చేసిన ప్రయోగాల్లో.. వేడి పానీయాలను అతి వేడిగా తాగటం వల్ల కేన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నట్లు గుర్తించింది. 70 డిగ్రీల వేడి వద్ద ఎలుకలకు పట్టించిన నీరు, అలా వేడి నీటిని పట్టించని ఎలుకలతో పోల్చి చూస్తే, అధిక వేడి నీటిని పట్టించిన ఎలుకల అన్నవాహికలో ముందస్తుగా కేన్సర్ సంకేతాలు కనిపించాయి.వేడికి ఆమ్లాలు తోడౌతాయి!పానీయాల వేడికి, ‘గ్యాస్ట్రిక్ ఆసిడ్ రిఫ్లెక్స్’ (కడుపులో ఉత్పత్తి అయ్యే ఆమ్లాలు తిరిగి అన్నవాహికలోకి వెనక్కి తన్ని, వాపును కలుగజేసే పరిస్థితి) తోడై అన్నవాహిక కేన్సర్ అవకాశాలు పెరగడాన్ని కూడా తాజా అధ్యయనంలో పరిశోధకులు గమనించారు. అలా బయటి ద్రవాల వేడి, లోపలి ఆమ్లాలు కలిసి కేన్సర్ వృద్ధికి కారకాలు అవుతున్నట్లు వారు భావిస్తున్నారు. ‘గుటక’ మోతాదూ విలనే!ఒకేసారి ఎంత వేడిగా తాగుతారు, ఎంత త్వరగా తాగుతారు అనే దానిపైనే కేన్సర్ ప్రమాదం ప్రధానంగా ఆధారపడి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. వారి అధ్యయనం ప్రకారం.. వేడివేడి పానీయాలను ఒకేసారి ఎక్కువగా తాగితే ఆ వేడి తీవ్రత వల్ల అన్నవాహికకు పుండ్లు పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మరొక అధ్యయనంలో.. వేర్వేరు ఉష్ణోగ్రతలలో వేడి వేడి కాఫీ, టీలు తాగే వ్యక్తుల అన్నవాహిక లోపల ఉష్ణోగ్రతను కొలిచినప్పుడు వారు తీసుకున్న ‘గుటక’ మోతాదు, వేడి కంటే కూడా ఎక్కువ దుష్ప్రభావం చూపుతున్నట్లు కనుగొన్నారు. 65 డిగ్రీల వేడి ఉండే కాఫీలో ఒక పెద్ద గుటక (20 మిల్లీ లీటర్లు) అన్నవాహిక లోపల ఉష్ణోగ్రతను 12 డిగ్రీల వరకు పెంచటాన్ని వారు గుర్తించారు. అందువల్ల టీ, కాఫీల వంటి వేడి పానీయాలను త్వరత్వరగా కాకుండా.. కాస్త వేడి చల్లారే వరకు ఉండి, నింపాదిగా తాగాలని సూచిస్తున్నారు.సుఖోష్ణం ఆహ్లాదకరంటీ, కాఫీ వంటి వేడి పానీయాలను అందరూ వేడివేడిగానే తాగుతారు. వీటిలో ఉండే కెఫినన్, థియోఫిలిన్ అనే రసాయనిక పదార్థాల వల్ల కేన్సర్ రాదు. బాగా వేడివేడిగా తాగడం వ్యాధికారకమని కొందరు అంటున్నారు. ఇక్కడో విషయం గమనించాలి. మన నాలుక, నోరు భరించలేని వేడిని మనం తాగలేం. టీగానీ, కాఫీగానీ నోటిలోని లాలాజలంతో కలిసినప్పుడు మనం తట్టుకోగలిగే వేడి మాత్రమే ఉంటుంది. ఆ మార్పు యాంత్రికంగా జరిగిపోతుంది. జంతువుల మీద ప్రయోగాలు చేసేటప్పుడు ‘గొట్టాల ద్వారా’ వాటి కడుపులోకి వేడి పానీయాలు పంపుతారు. కాబట్టి అధిక వేడి సాధ్యపడవచ్చు. ఇక రెండో విషయం.. ఎంత ప్రమాణంలో తాగాలి, రోజుకి ఎన్నిసార్లు తాగవచ్చు? అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లు అతిగా ఏదైనా ప్రమాదకరమే. అతివేడి, అతి చలవ పదార్థాలు వెంటవెంటనే శరీరానికి తగిలినా, నోటిలోకి వెళ్లినా.. మన కణజాలాలు కాలిపోయి చర్మరోగాలు కలుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది. ఆ వ్యాధులు ముదిరితే కేన్సర్కు దారితీసే అవకాశం ఉంటుంది. పేపర్ కప్పుల్లో కాఫీ, టీలు తాగటం చాలా ప్రమాదకరం. ఆ పేపరు పొర కెమికల్స్తో కూడినది. దానికి ఏమాత్రం వేడితగిలినా.. రసాయనిక చర్య సంభవించి, అవి మన నోట్లోంచి కడుపులోకి వెళ్లి కేన్సర్ వంటి అనేక రోగాలకు దారితీయవచ్చు. - డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహ శాస్త్రి, విశ్రాంత అదనపు సంచాలకులు, ప్రిన్సిపాల్, ఆయుష్ విభాగం -
భారత్ – బ్రిటన్ మధ్య స్నేహ వారధి.. పాల్
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం స్వరాజ్ పాల్ పంజాబ్లోని జలంధర్లో 1931 ఫిబ్రవరి 18న జన్మించారు. ఆయన తండ్రి ప్యారేలాల్ స్థానికంగా చిన్నపాటి ఉక్కు ఫౌండ్రీని నడిపేవారు. స్వరాజ్ పాల్ 1949లో పంజాబ్ యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేశాక అమెరికాలోని ప్రతిష్టాత్మక మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆప్ టెక్నాలజీలో (ఎంఐటీ) మెకానికల్ ఇంజినీరింగ్లో బ్యాచిలర్స్, మాస్టర్స్ చేశారు. స్వదేశానికి తిరిగొచ్చాక కుటుంబ వ్యాపారమైన ఏపీజే సురేంద్ర గ్రూప్లో చేరారు. అయితే, ల్యూకేమియాతో బాధపడుతున్న కుమార్తె అంబికాకు మెరుగైన వైద్యచికిత్స కోసం 1966లో ఆయన బ్రిటన్కి వెళ్లారు. కానీ, దురదృష్టవశాత్తూ నాలుగేళ్లకే కుమార్తె కన్ను మూయడంతో విషాదంలో మునిగిపోయిన పాల్.. ఆ తర్వాత ఆమె పేరిట అంబికా పాల్ ఫౌండేషన్ అనే చారిటబుల్ ట్రస్టును ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా బాలల విద్య, ఆరోగ్యానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల కోసం మిలియన్ల కొద్దీ పౌండ్లను విరాళంగా ఇచ్చారు. 1968లో లండన్ ప్రధాన కేంద్రంగా కపారో గ్రూప్నకు స్వరాజ్ పాల్ శ్రీకారం చుట్టారు. తర్వాత రోజుల్లో అది బ్రిటన్లోనే అతి పెద్ద స్టీల్ కన్వర్షన్, డిస్ట్రిబ్యూషన్ వ్యాపార దిగజాల్లో ఒకటిగా ఎదిగింది. ప్రస్తుతం బ్రిటన్, భారత్, అమెరికా, కెనడా తదితర దేశాల్లో ఏటా 1 బిలియన్ డాలర్ల ఆదాయంతో కార్యకలాపాలు సాగిస్తోంది. లెజెండ్.. లార్డ్ స్వరాజ్ పాల్ (Lord Swraj Paul) మృతిపై ఇరు దేశాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. బ్రిటన్–భారత్ మధ్య వారధిగా వ్యవహరించిన పాల్ తనకు స్ఫూర్తిప్రదాత అని కోబ్రా బీర్ వ్యవస్థాపకుడు లార్డ్ కరణ్ బిలిమోరియా తెలిపారు. విద్య, వ్యాపారం, రాజకీయాలు ఇలా అన్ని రంగాల్లోనూ ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు కృషి చేశారని పేర్కొన్నారు. వోల్వర్హ్యాంప్టన్ యూనివర్సిటీ చాన్సలర్గా వర్సిటీ అభివృద్ధిలో ఆయన ఎంతో కీలక పాత్ర పోషించారని విశ్వవిద్యాలయం బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చెయిర్ ఏంజెలా స్పెన్స్ పేర్కొన్నారు. బ్రిటన్లోని అనేక మంది భారతీయులకు మార్గదర్శిగా నిల్చిన ‘లెజెండ్’ అని పాల్ను సన్ మార్క్ వ్యవస్థాపకుడు లార్డ్ రామీ రేంజర్ అభివర్ణించారు. భారత్–బ్రిటన్ను మరింత చేరువ చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను పటిష్టం చేయడంలో ఆయన చెరగని ముద్ర వేశారని లండన్లోని భారత హైకమిషన్ ప్రధాని మోదీ సోషల్ మీడియా వ్యాఖ్యలను రీపోస్ట్ చేసింది. ఆయన విదేశాల్లో భారత్కి గొంతుకగా నిల్చారని హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామి పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషి.. భారత్–బ్రిటన్ మధ్య సంబంధాలను పటిష్టం చేసే దిశగా 1975లో ఇండో–బ్రిటీష్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన లార్డ్ పాల్ దానికి సుదీర్ఘకాలం చైర్మన్గా వ్యవహరించారు. పాల్ సేవలకు గుర్తింపుగా 1978లో బ్రిటన్ రాణి ఆయనకు నైట్హుడ్ ప్రదానం చేశారు. 1983లో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ భూషణ్ (Padma Bhushan) పురస్కారంతో ఆయన్ను సత్కరించింది. పలు సంవత్సరాలుగా బ్రిటన్లో అత్యంత సంపన్నుల జాబితాలో ఆయన పేరు క్రమం తప్పకుండా ఉంటోంది. 2 బిలియన్ పౌండ్ల సంపదతో ఈ ఏడాది సండే టైమ్స్ రిచ్ లిస్ట్లో ఆయన 81వ స్థానంలో నిల్చారు. ఆరోగ్యం అంతగా సహకరించకపోతున్నప్పటికీ ఇటీవలి వరకు ఆయన హౌస్ ఆఫ్ లార్డ్స్కి తప్పకుండా హాజరయ్యారు. 2008లో హౌస్ ఆఫ్ లార్డ్స్ డిప్యుటీ స్పీకర్గా పాల్ వ్యవహరించారు. తద్వారా భారత నేపథ్యంతో, ఆ బాధ్యత చేపట్టిన తొలి వ్యక్తిగా ఘనత సాధించారు. 2000 నుంచి 2005 వరకు ఇండియా–యూకే రౌండ్ టేబుల్కి కో–చెయిర్గా వ్యవహరించారు. 2009లో బ్రిటన్ మోనార్క్కి సలహా మండలి అయిన ప్రీవీ కౌన్సిల్ సభ్యుడిగా కూడా ఆయన నియమితులయ్యారు. మరోవైపు, వ్యక్తిగత జీవితంలో ఆయన్ను విషాదాలు వెన్నాడాయి. 2015లో కపారో గ్రూప్ సీఈవోగా వ్యవహరిస్తున్న కుమారుడు అంగద్ పాల్, 2022లో ఆయన భార్య అరుణ మరణించారు. దీనితో వారి స్మారకార్థం తలపెట్టిన పలు సంక్షేమ కార్యక్రమాలకు ఆయన మరింత సంపద, సమయం వెచ్చించారు. భార్య మరణానంతరం అంబికా పాల్ ఫౌండేషన్ పేరును అరుణ అండ్ అంబికా పాల్ ఫౌండేషన్గా మార్చారు. 2023 ఫిబ్రవరిలో లండన్లోని చారిత్రక ఇండియన్ జింఖానా క్లబ్లో లేడీ అరుణ స్వరాజ్ పాల్ హాల్ని ప్రారంభించారు. -
ఉద్యోగం పోతే.. మీరు భద్రమేనా?
ప్రపంచవ్యాప్తంగా 2023లో 1,193 టెక్ కంపెనీలు 2,64,220 మంది ఉద్యోగులను.. గతేడాది 551 టెక్ సంస్థలు 1,52,922 మందిని తొలగించాయి. ఈ ఏడాది ఇప్పటికే 186 కంపెనీలు 81,567 మందిని ఇంటికి సాగనంపాయి. ఒక్క టెక్ ఇండస్ట్రీలోనే ఇలా ఉంటే ఇతర రంగాల్లో పరిస్థితి? ఇదంతా ఎందుకంటే.. ఉద్యోగం కోల్పోయినప్పుడు ఉండే మానసిక వేదన అంతా ఇంతా కాదు. ఆర్థికంగా బలంగా ఉన్నవారైతే ఏ ఇబ్బందీ లేదు. నెల జీతం మీద బతికేవారికే సమస్యల్లా. నిత్యావసరాలు, ఇంటి అద్దె, నెల వాయిదాలు, పిల్లల ఫీజులు, వైద్యం.. ఇలా తప్పించుకోలేని ఖర్చుల జాబితా పెద్దదిగానే ఉంటుంది. అనుకోని కష్టం ఎదురైతే ఎదుర్కొనే ప్రణాళిక లేకపోతే చాలామంది ఆర్థికంగా చితికిపోతారు. అప్పుల ఊబిలో కూరుకుపోతారు. జాబ్ మార్కెట్లో ప్రస్తుత తరుణంలో ఉన్న అనిశ్చితి పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కొన్ని సూత్రాలు పాటించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్అత్యవసర నిధిసగటు ఉద్యోగికి.. అలాగే కుటుంబానికి ఇదే పెద్ద ధీమా. కనీసం 6–12 నెలల ఇంటి ఖర్చులకు సమానమైన మొత్తంలో అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోండి. తద్వారా ఆర్థిక భద్రత పెరుగుతుంది. అకస్మాత్తుగా ఉద్యోగం పోతే.. ఊహించని, అత్యవసర ఖర్చులను తీర్చడానికి ఈ ఫండ్ సమయానికి ఆదుకుంటుంది. » ఈ నిధి లేకపోతే అధిక వడ్డీతో అప్పులు, లేదా ఇతర ప్రత్యామ్నాయాలపై ఆధారపడవలసి వస్తుంది. ఇదే జరిగితే ఆర్థిక సమస్యలు మరింత తీవ్రమవుతాయి.» ఆర్థికంగా బలంగా ఉంటే మనశ్శాంతి ఉంటుంది. అన్నింటికీ మించి ఒత్తిడి తగ్గుతుంది. » ఆహారం, వైద్య బిల్లులు, బీమా ప్రీమియం వంటి ముఖ్యమైన ఖర్చుల కోసం మాత్రమే ఈ అత్యవసర ఫండ్ను ఉపయోగించండి. » జాబ్ కోల్పోయిన తర్వాత కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవడానికి ఈ నిధుల నుంచి కొంత మొత్తాన్ని కేటాయించండి. కొత్త కోర్సు, శిక్షణ పూర్తి అయితే ఉద్యోగావకాశాలు పెరుగుతాయి.అదనపు ఆదాయ మార్గాలుప్రతి ఒక్కరిలో ఏదో ఒక నైపుణ్యం, అభిరుచి, ఆసక్తి దాగి ఉంటుంది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంతో పాటు వీటి ద్వారా అదనపు ఆదాయాన్ని సంపాదించడానికి ప్రయత్నించండి. ఆదాయ నష్టాలను అధిగమించడంలో ఇవి మీకు సహాయపడతాయి. ఇదే సమయంలో వీలైనంత పొదుపు చేయడం, పెట్టుబడి పెట్టడం కూడా మర్చిపోవద్దు. ఆరోగ్య బీమాచాలా మంది ఉద్యోగులు సంస్థ అందించే గ్రూప్ హెల్త్ కవరేజీపైనే ఆధారపడతారు. సొంతంగా బీమా పాలసీ తీసుకోరు. కంపెనీ నుంచి ఉంది కదా అన్న ధీమా, నిర్లక్ష్యపు ధోరణి ఉంటుంది. ఉద్యోగం కోల్పోయినప్పుడు ఈ బీమా వర్తించదు. అందుకే కుటుంబం అంతటికీ వర్తించే సమగ్ర వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేయడం ఉత్తమం. వ్యక్తిగత బీమా ఉంటే జాబ్ పోయినా, మానేసినా చింత ఉండదు. కుటుంబంలోని వారందరికీ నిరంతర ఆరోగ్య బీమా రక్షణ ఉంటుంది.తక్కువ అప్పుఉద్యోగం కోల్పోతామన్న అభద్రతకు లోనైతే.. అప్పులు / రుణాలను కనిష్ట స్థాయిలో ఉంచడానికి ప్రయత్నించండి. కొత్త రుణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. వీలైతే ముందస్తుగా ఈఎంఐలు చెల్లించండి.» బ్యాంకులకు చెల్లించాల్సిన వాయిదాల క్రమం తప్పితే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. ఇదే జరిగితే భవిష్యత్తులో రుణం పొందడంలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. » ఉద్యోగాన్ని కోల్పోయినట్టయితే రుణదాతకు ఈ విషయాన్ని తెలియజేయడంతోపాటు మారటోరియం, నెల వాయిదాల (ఈఎంఐ) గడువు పెంచడం (రీషెడ్యూల్) గురించి విన్నవించండి. » బంధువులు, స్నేహితులు, తెలిసిన వారి నుంచి అప్పు తీసుకున్నట్టయితే పరిస్థితిని నిజాయితీగా వివరించండి.బడ్జెట్లో మార్పులుఅనిశ్చితి సమయాల్లో విచ్చలవిడి ఖర్చులను తగ్గించుకోండి. అత్యవసరమైతే తప్ప ఖర్చు చేయండి. » అనవసర ఖర్చులు తగ్గిస్తే చేతిలో డబ్బులు మిగులుతాయి. ఉద్యోగ నష్టానికి సంబంధించిన ఒత్తిడి తగ్గుతుంది. » ఉద్యోగం కోల్పోవడం వల్ల తలెత్తే ఆర్థిక పరిణామాలు, తదుపరి ఉద్యోగ అన్వేషణ, జాబ్ మార్కెట్ గురించి మీ ఆలోచనలు, భావాలు, ప్రణాళికలను కుటుంబంతో పంచుకోండి. » కుటుంబ సభ్యులు తమ భావాలను వ్యక్తీకరించడానికి, నిర్ణయం తీసుకునే ప్రక్రియకు దోహదపడే సుహృద్భావ వాతావరణాన్ని కల్పించండి. ఈ విధానం కుటుంబ బంధాలను బలోపేతం చేస్తుంది. » మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, రిటైర్మెంట్ ఇన్వెస్ట్మెంట్స్ వంటి వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ కదిలించొద్దు. -
ఈ స్పేస్ మాది..!
‘ఆకాశంలో సగం’ అనే మాట మనకు సుపరిచితం. అయితే ఆరోజుల్లో ‘స్పేస్ సైన్స్’కు సంబంధించి మహిళా శాస్త్రవేత్తల సంఖ్య చాలా తక్కువ. గతంతో పోల్చితే ఇప్పుడు ఉమెన్ స్పేస్ సైంటిస్ట్ల సంఖ్య బాగా పెరిగింది. ‘ఇస్రో’ మంగళ్యాన్ మిషన్ నుంచి చంద్రయాన్ మిషన్ వరకు ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్లలో కీలక పాత్ర పోషించారు. శాస్త్ర సాంకేతిక రంగంలో అడుగు పెట్టడానికి ఈతరం అమ్మాయిలకు స్ఫూర్తిని ఇస్తున్నారు...ఆకాశమే అపూర్వ పాఠశాలఉత్తర్ప్రదేశ్లోని లక్నోకు చెందిన రీతూ కరిధాల్కు ఆకాశం ఎప్పుడూ వింతగా అనిపించేది. అంత పెద్దగా కనిపించిన చంద్రుడు ఎందుకు తగ్గుకుంటూ వెళతాడు? పగటి పూట చుక్కలు ఎందుకు కనిపించవు? ఇలాంటి సందేహాలెన్నో ఆ చిట్టి బుర్రకు వచ్చేవి. ఆకాశంపై అమితమైన ఆసక్తే రీతూను సైన్స్ వైపు నడిపించింది. స్కూల్ రోజుల్లో నాసా, ఇస్రోకు సంబంధించిన ప్రాజెక్ట్ల సమాచారం గురించి దినపత్రికలలో వెదికేది. కనిపిస్తే వాటిని కట్ చేసి దాచుకునేది.పోస్ట్గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత ఇస్రోలో స్పేస్ సైంటిస్ట్గా ప్రస్థానం ప్రారంభించింది. ప్రతిష్ఠాత్మకమైన మంగళ్యాన్ మిషన్తో పాటు ఇస్రోలోని ఎన్నో ప్రాజెక్ట్లలో కీలక బాధ్యతలు నిర్వహించింది రీతూ కరిధాల్.‘మంగళ్యాన్ మిషన్ కోసం పనిచేయడం అపూర్వ అనుభవం. నిరంతర మేధోమథనం జరుగుతుండేది. సెలవు అంటూ లేకుండా పనిచేశాం. వృత్తి, కుటుంబ జీవితాన్ని సమన్వయం చేసుకోవడం అంత తేలిక కాదు. అయితే నా భర్త, కుటుంబ సభ్యుల సహకారం వల్ల అది సాధ్యం అయింది’ అంటుంది రీతూ కరిధాల్.రీతూ కరిధాల్వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ఇస్రోఒకప్పుడు ఇస్రోలో పనిచేసిన మహిళలు రిటైర్ అయిన తరువాత ఇంటికే పరిమితం కావచ్చుగాక, అయితే వారు ఎక్కడ ఉంటే అక్కడ ఇస్రో కొలువుదీరుతుంది. ఆనాటి శాస్త్రసాంకేతిక విషయాల గురించి చందమామ కథల్లా ఈతరం పిల్లలకు చెబుతుంటారు. అలాంటి వారిలో ఇస్రోలో తొలి మహిళా కెమికల్ ఇంజనీర్ లలితా రామచంద్రన్ ఒకరు. 1969లో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (విఎస్ఎస్సి)లో టెక్నికల్ అసిస్టెంట్గా చేరినప్పుడు ఆమె వయసు 22 సంవత్సరాలు. తిరువనంతపురంలో క్రయోజనిక్ అప్పర్ స్టేజ్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఆమె రిటైర్ అయ్యారు. ‘ఆరోజుల్లో పెద్దగా సౌకర్యాలు లేకపోవచ్చు. అయితే ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో కలిసి పనిచేసే అదృష్టం దక్కింది’ అంటారు లలిత.1972లో ఇస్రోలో చేరారు జె.గీత. ‘ఆరోజుల్లో నెట్ లేదు. డేటా సేకరణ అనేది ప్రధాన సవాలుగా ఉండేది. రిసెర్చ్, రిఫరెన్స్ కోసం లైబ్రరీలకు వెళ్లి గంటల కొద్ది సమయం గడిపేవాళ్లం’ అంటున్న గీత... సతీష్ధావన్, వసంత్ ఆర్ గోవరికర్లాంటి స్టాల్వాల్ట్స్ మార్శదర్శకత్వంలో పనిచేశారు.ప్రాజెక్ట్లకు సంబంధించిన చర్చల్లో చురుగ్గా పాల్గొనేవాళ్లం. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా తమ అభిప్రాయలను నిస్సంకోచంగా చెప్పే స్చేచ్ఛ ఉండేది. జూనియర్ చెప్పినా సరే, ఆ అభిప్రాయం నచ్చితే ఆమోదించేవారు’ అంటున్న రాధిక రామచంద్రన్ ‘కేరళ యూనివర్శిటీ’లో పోస్ట్ గ్రాడ్య్రుయేషన్ పూర్తయిన తరువాత 1984లో ఇస్రోలో చేరారు.లలితా రామచంద్రన్సైన్స్ ఫిక్షన్టుఇస్రో సైంటిస్ట్తన చిన్నప్పుడు టెలివిజన్లో వచ్చే స్టార్ ట్రెక్, సైన్స్ ఫిక్షన్ అంటే నందిని హరినాథ్కు చాలా ఇష్టం. టీవిలో వచ్చే సైన్స్ ప్రోగ్రామ్స్పై అమిత ఆసక్తి ప్రదర్శించే నందిని తాను స్పేస్ సైంటిస్ట్ అవుతానని అనుకోలేదు. ‘జస్ట్ అలా జరిగింది అంతే!’ అని స్పేస్ సైంటిస్ట్ గా తన ప్రయాణం గురించి నవ్వుతూ చెబుతుంది నందిని. ఉద్యోగంలో చేరిన కొత్తలో రోజుకు పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు పనిచేసిన రోజులు ఉన్నాయి. భోజనం చేయడం కూడా మరిచి పనిచేసిన రోజులు ఉన్నాయి.‘ఇస్రో సైంటిస్ట్ అని పరిచయం చేసినప్పుడు ప్రజలు గౌరవించే తీరు వృత్తిపట్ల బాధ్యతను మరింత పెంచుతుంది. మంగళ్యాన్ ప్రాజెక్ట్లో భాగం కావడం గర్వంగా భావిస్తున్నాను. ఆ ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నప్పుడు నిద్ర, తిండి గురించి పట్టించుకునేవాళ్లం కాదు. ఇంట్లో తక్కువ సమయం మాత్రమే గడిపేవాళ్లం. ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం’ అంటుంది నందిని హరినాథ్.నందిని హరినాద్వివక్ష లేదు... ప్రతిభే ప్రమాణం‘నేను ఇస్రోలో 1982లో చేరినప్పుడు అక్కడ కొద్ది మంది మహిళా ఉద్యోగులు మాత్రమే కనిపించేవారు. ఊహకు అందని రీతిలో ఇప్పుడు ఎంతోమంది పనిచేస్తున్నారు’ అంటుంది అనురాధ టికె. ఇస్రో శాటిలైట్ సెంటర్లో జియోశాట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ అయిన అనురాధ ఎంతోమంది అమ్మాయిలకు రోల్ మోడల్. ‘తొమ్మిది సంవత్సరాల వయసులోనే ఆకాశంపై ఆసక్తి మొదలైంది’ అని తన బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటుంది అనురాధ. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగు పెట్టడం గురించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ద్వారా విన్న అనురాధ సంభ్రమాశ్చర్యాలకు గురైంది. ‘చంద్రుడిపై మానవుడు’ అనే అంశంపై తన మాతృభాష కన్నడంలో కవిత రాసింది.‘ఇస్రోలో స్త్రీ, పురుషులు అనే భేదం ఉండదు. ప్రతిభ, అంకితభావం మాత్రమే ప్రమాణం. స్పేస్ ప్రోగ్రామ్స్లో ఎంతమంది మహిళలు పనిచేస్తే అంత మంచిది. అది ఎంతో అమ్మాయిలకు స్ఫూర్తినిస్తుంది. వారు చేస్తున్నారు. మేము కూడా చేయగలం అనే ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది’ అంటుంది అనురాధ.అనురాధ టికెభూదేవి అంత ఓపిక... ఆకాశమంత ప్రతిభప్రతిష్ఠాత్మకమైన మంగళ్యాన్ మిషన్ ప్రతిభావంతులైన మహిళా శాస్త్రవేత్తలను లోకానికి పరిచయం చేసింది. ఆ మహిళా శాస్త్రవేత్తలపై ‘ఇస్రో’స్ మాగ్నిఫిసియెంట్ ఉమెన్ అండ్ దెయిర్ ఫ్లైయింగ్ మెషిన్స్’ పేరుతో పుస్తకం రాసింది మిన్నీ వేద్. నందిని, రీతూ కరిధాల్, మౌమిత దత్తా, మినై సంపత్... మొదలైనవారి గురించి ఈ పుస్తకంలో రాసింది. ‘స్పేస్’ను కెరీర్గా ఎంచుకోవడానికి కారణం ఏమిటి? రకరకాల ఒత్తిళ్లను తట్టుకొని ఎలా ముందుకు వెళ్లారు? వృత్తి, కుటుంబ జీవితాన్ని ఎలా సమన్వయం చేసుకున్నారు?.... ఇలాంటి ప్రశ్నలకు ఈ పుస్తకం సమాధానం చెబుతుంది. మన దేశంలో ఫస్ట్ ఇండిజినస్ రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ రిసాట్–1 ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేసిన వలర్మతి వ్యక్తిగత, ఉద్యోగ జీవిత అనుభవాలు కూడా ఈ పుస్తకంలో కనిపిస్తాయి. మంగళ్యాన్ మిషన్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ ఇన్చార్జిగా పనిచేసిన మినాల్ సంపత్ స్పేస్క్రాఫ్ట్ టెస్టింగ్ పనుల్లో భాగంగా బెంగళూరు, అహ్మదాబాద్ల మధ్య తరచు ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఆ సమయంలో మూడు సంవత్సరాల తన కుమారుడు గుర్తుకు వచ్చేవాడు. ‘మా బాబు గుర్తుకు వచ్చిన సమయంలో పేలోడ్స్ కూడా నా బిడ్డలే కదా అనుకునేదాన్ని’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది మినాల్ సంపత్. ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఈ పుస్తకంలో కనిపిస్తాయి. -
కింగ్.. ‘అనలిటికల్ థింకింగ్’!
రోజురోజుకు కృత్రిమమేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ వినియోగం విస్తృతం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోప్రపంచవ్యాప్తంగా డిమాండ్కు అనుగుణంగా ఉద్యోగాల సాధన ఉద్యోగార్థులకు కష్టసాధ్యంగా మారుతోంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కార్పొరేట్ సంస్థలు కోరుకున్న విధంగా వివిధ నైపుణ్యాలున్న వారు ఉద్యోగాలు పొందడం సులభమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే... విమర్శనాత్మక ఆలోచన, విశ్లేషణాత్మక నైపుణ్యాలు, భావోద్వేగ మేధస్సు వంటివి కీలక ఉద్యోగ నైపుణ్యాలుగా పరిగణిస్తున్నారు. ఏఐ, మెషీన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా విశ్లేషణ వంటి సాంకేతిక నైపుణ్యాలకూ అధిక డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో అత్యంత ముఖ్యమైన ఉద్యోగ నైపుణ్యాలపై ‘గ్లోబల్ సర్వే ఆఫ్ ఎంప్లాయర్స్’నివేదిక రూపొందించింది. అలాగే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆయా నైపుణ్యాలకు ర్యాంకింగ్స్ ఇస్తూ ‘ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ 2025’నివేదికను వెలువరించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా 1.41 కోట్లకు పైగా ఉద్యోగులున్న 1,043 కంపెనీల ప్రతినిధుల అభిప్రాయాల ఆధారంగా రిపోర్ట్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ర్యాంకింగ్స్లో అనలిటికల్ థింకింగ్ (విశ్లేషణాత్మక ఆలోచన) 69 శాతంతో అగ్రస్థానంలో నిలుస్తోంది. – సాక్షి, హైదరాబాద్ఇక భారత్ విషయానికొస్తే... వివిధ అధ్యయనాలు, సర్వేలు, నిపుణుల అభిప్రాయాలు సూచనలను బట్టి చూస్తే దేశంలో ముఖ్యమైన ఉద్యోగ నైపుణ్యాలు... కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్, డేటా అనాలిసిస్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ చుట్టూ కేంద్రీకృతం అవుతున్నాయి. భారత్లో కంపెనీలు కోరుకుంటున్న ముఖ్య సాంకేతికత ఇలా ఉన్నాయి.కృత్రిమ మేథ,మెషీన్ లెర్నింగ్:ఏఐ అల్గోరిథంలు, న్యూరల్ నెట్వర్క్ అప్లికేషన్లలో నైపుణ్యం కలిగిన నిపుణులకు డిమాండ్. డేటా విశ్లేషణ: డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం ఒక ప్రమాణంగా మారుతోంది. అందువల్ల డేటా మానిప్యులేషన్, గణాంక విశ్లేషణ, విజువలైజేషన్లో నైపుణ్యాల ఆవశ్యకత పెరిగింది. సైబర్ భద్రత: రోజురోజుకు సైబర్ ముప్పు పెరుగుతుండటంతో నెట్వర్క్ల రక్షణలో నైపుణ్యాలు, సాంకేతికంగా ఎదురయ్యే ముప్పును అర్థం చేసుకోవడం, భద్రతా ప్రోటోకాల్ అమలుకు అత్యంత ప్రాధాన్యత క్లౌడ్ కంప్యూటింగ్: వ్యాపారాలు క్లౌడ్లోకి మార్పిడి జరుగుతుండటంతో, క్లౌడ్ సేవలు, ఆర్కిటెక్చర్ డిజైన్, డిప్లాయ్మెంట్ వ్యూహాల పరిజ్ఞానం వంటి వాటికి అధిక డిమాండ్సాఫ్ట్వేర్ అభివృద్ధి: సాఫ్ట్వేర్ డెవలపర్ల కోసం ముఖ్యంగా ఏఐ–ఆధారిత అప్లికేషన్లు, క్లౌడ్ టెక్నాలజీలలో అనుభవం ఉన్నవారి కోసం డిమాండ్.బ్లాక్చైన్ టెక్నాలజీ: ఫైనాన్స్, సప్లయ్ చైన్ పరిశ్రమల్లో పరివర్తనాత్మక ప్రభావంతో బ్లాక్చెయిన్ నిపుణులకు డిమాండ్ పెరిగింది. సాఫ్ట్ స్కిల్స్, అనుకూలతలు:కొత్త వ్యవస్థలను త్వరగా నేర్చుకోవడం, మారుతున్న పని వాతావరణాలకు అనుగుణంగా మారడం, కొత్త సాంకేతికతలను స్వీకరించే సామర్థ్యం చాలా ముఖ్యం. సమస్య పరిష్కారం: దినచర్యలనూ ఆటోమేట్ చేస్తున్నందున సంక్లిష్ట సమస్యల పరిష్కారం, విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యాలకు డిమాండ్ పెరిగింది.భావోద్వేగ మేధస్సు: ఆటోమేటెడ్ ప్రపంచంలో సానుభూతి, భావోద్వేగ మేధస్సు వంటి మానవ నైపుణ్యాలకు డిమాండ్. నాయకత్వం, సామాజిక ప్రభావం: టీమ్లకు మార్గనిర్దేశం చేయడానికి, సంక్లిష్ట పరిస్థితులను అధిగమించడానికి సమర్థ నాయకత్వం, సామాజిక ప్రభావ నైపుణ్యాలు ముఖ్యం. కస్టమర్ సర్వీస్: వ్యాపార విజయానికి బలమైన కస్టమర్ సంబంధాలను పెంపొందించుకోవడం ముఖ్యం. డిజిటల్ మార్కెటింగ్: వ్యాపారాలు తమ నిర్దేశిత, టార్గెటెడ్ కస్టమర్లను చేరుకునేందుకు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమేషన్ స్కిల్స్, కంటెంట్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్లో నైపుణ్యాలు చాలా అవసరం వ్యాపారాలు తమ నిర్దేశిత, టార్గెటెడ్ కస్టమర్లను చేరుకునేందుకు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమేషన్ స్కిల్స్, కంటెంట్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్లో నైపుణ్యాలు చాలా అవసరం ప్రాజెక్ట్ నిర్వహణ: వనరుల నిర్వహణ, సాంకేతిక ప్రాజెక్ట్ నాయకత్వంతో సహా ప్రాజెక్ట్ నిర్వహణ నైపుణ్యాలకు డిమాండ్ ఉంది. -
స్పేస్ వార్.. ఇదే ఫ్యూచర్!
2025 మే 9.. టీవీలకు అతుక్కుపోయిన ఉక్రెయిన్ ప్రజలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వారు చూస్తున్న కార్యక్రమాలు అర్ధంతరంగా నిలిచిపోయాయి. అంతరాయం కలిగితే షాక్కు గురికావడం ఏంటి? ఇది సహజమే కదా అన్నదే మీ ప్రశ్న కదూ. అక్కడికే వస్తున్నాం.. మాస్కో వేదికగా రష్యా తన యుద్ధ ట్యాంకులు, ఆయుధ సంపత్తిని ప్రదర్శిస్తూ సైనికులతో నిర్వహించిన విక్టరీ డే కవాతు తమ దేశంలో ప్రత్యక్ష ప్రసారం కావడం ఉక్రెయిన్లను ఆశ్చర్యానికి లోను చేసింది. ఉక్రెయిన్ కు టెలివిజన్ సేవలను అందించే కక్ష్యలో తిరుగుతున్న ఉపగ్రహాన్ని రష్యాకు మద్దతుగా ఉన్న హ్యాకర్లు హైజాక్ చేశారు. ఇదంతా ఉక్రెయిన్ వాసులను భయపెట్టడానికి రష్యా చేసిందన్నమాట! – సాక్షి, స్పెషల్ డెస్క్పెద్ద పెద్ద దేశాలన్నింటికీ అంతరిక్షంలో ఎన్నో శాటిలైట్లు ఉన్నాయి. వాటిలో ఒక్క ప్రధానమైన ఉపగ్రహాన్ని నిలిపేసినా చాలు.. ఒక్క బుల్లెట్ కూడా కాల్చకుండానే భారీ నష్టమే కలిగించవచ్చు! ఊహించుకుంటేనే భయంగానూ, విచిత్రంగానూ అనిపిస్తోంది కదూ. భవిష్యత్తులో అంతరిక్షం కూడా ‘ప్రధాన యుద్ధభూమి’ కానుంది. మామూలు దెబ్బ కాదు.. కక్ష్యలో ఉన్న ఉపగ్రహాల్లో 12,000 పైచిలుకు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ప్రసార సమాచార మార్పిడిలో మాత్రమే కాకుండా సైనిక కార్యకలాపాలు, జీపీఎస్, నిఘా సేకరణ వంటి నావిగేషన్ వ్యవస్థ సహా అనేక అంశాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవి.. దేశం మీదకు వస్తున్న శత్రు క్షిపణులు సమీపిస్తున్నాయని హెచ్చరించగలవు. శత్రు దేశాల జాతీయ భద్రతను విఫలమయ్యేలా చేసేందుకు; శత్రువు ఆర్థిక వ్యవస్థను, సైనిక సంసిద్ధతను దెబ్బతీసేందుకు కూడా ఉపయోగపడగలవు. రష్యాకు మద్దతు ఇస్తున్న హ్యాకర్లు టెలివిజన్ సిగ్నల్స్ను హైజాక్ చేసి ఉక్రెయిన్ కు చేసినట్టుగా మానసికంగానూ దెబ్బకొట్టగలవు.బలహీనమైన లింక్ కోసం..హ్యాకర్లు సాధారణంగా ఉపగ్రహానికి సపోర్ట్ చేసే లేదా భూమిపై సమాచారాన్ని నియంత్రించే సాఫ్ట్వేర్, హార్డ్వేర్లలో బలహీనమైన లింక్ కోసం చూస్తుంటారు. కక్ష్యలో తిరిగే ఉపగ్రహం సాఫ్ట్వేర్లో ఏ చిన్న లోపం పసిగట్టినా.. ఇంతే సంగతులు! దాన్ని సులభంగా దెబ్బతీయవచ్చని నిపుణులు అంటున్నారు. 2022లో రష్యన్ దళాలు ఉక్రెయిన్ ను ఆక్రమించినప్పుడు.. ఉక్రెయిన్ ప్రభుత్వం, సైన్యం ఉపయోగించే అమెరికాకు చెందిన ఉపగ్రహ సంస్థ వయాశాట్ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. వేలాది మోడెమ్లను ప్రభావితం చేయడానికి మాల్వేర్ను ఉపయోగించడంతో యూరప్లోని చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి.సూపర్ పవర్స్గా..చంద్రుడిపైకి ఒక చిన్న అణు రియాక్టర్ను పంపే ప్రణాళికల్లో నాసా ఉంది. చైనా లేదా రష్యా కంటే ముందుగా ఈ పని పూర్తి చేయాలన్నదే అమెరికా లక్ష్యంగా కనిపిస్తోంది. చంద్రుడిపై ముందుగా స్థావరం ఏర్పాటు చేసుకుని, కొన్ని కీలక ప్రాంతాలను తమవే అని ప్రకటించుకోవాలని భావిస్తోంది. చంద్రుడిపై హీలియం–3 సమృద్ధిగా ఉంది.హీలియం కేంద్రక సంలీనం (రెండు హీలియం కేంద్రకాలు కలిసి ఒక పెద్ద కేంద్రకంగా ఏర్పడే రసాయన ప్రక్రియ) ద్వారా భారీ మొత్తంలో శక్తి ఉత్పన్నమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సాంకేతికత ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదు. కానీ, చంద్రుడిపై నియంత్రణ.. ఏ దేశాలు సూపర్ పవర్స్గా ఉద్భవిస్తాయో నిర్ణయించగలదని శాస్త్రవేత్తలు అంటున్నారు.అంతరిక్షంలో అణ్వాయుధం!యూఎస్ జాతీయ భద్రతా అధికారుల ప్రకారం.. భూమి దిగువ కక్ష్యలో ఉన్న దాదాపు ప్రతి ఉపగ్రహాన్ని ఒకేసారి నాశనం చేయడానికి అణు, అంతరిక్ష ఆధారిత ఆయుధాన్ని రష్యా అభివృద్ధి చేస్తోంది. ఈ ఆయుధం భూమి దిగువన ఉన్న కక్ష్యను ఉపగ్రహాలకు ఒక సంవత్సరం పాటు ఉపయోగించలేని విధంగా చేయగలదని సమాచారం. దీనిని ఉపయోగిస్తే అమెరికా, దాని మిత్రదేశాలు ఆర్థిక సంక్షోభానికి, అణు దాడికి కూడా గురయ్యే అవకాశం కూడా ఉంది. రష్యా, చైనా సైతం ఉపగ్రహాలను కోల్పోతాయి.అయితే యూఎస్ మాదిరిగా కాకుండా విభిన్న శాటిలైట్లను రష్యా, చైనాలు ఉపయోగిస్తున్నాయి. ఉపగ్రహ వ్యతిరేక అణు ఆయుధాన్ని అంతరిక్షంలో ఉంచితే.. అది ఎలాంటి ముప్పు తెస్తుందో ఊహకు కూడా అందదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశాలు కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను, ఇంధన వనరులను ఉపయోగించుకోవాలని చూస్తున్నందున.. చంద్రుడిపై, గ్రహశకలాలలో లభించే విలువైన ఖనిజాలు, ఇతర పదార్థాలు భవిష్యత్తులో సంఘర్షణలకు దారితీయవచ్చని అభిప్రాయపడుతున్నారు. శాటిలైట్..: ఉపగ్రహ భద్రతా సాఫ్ట్వేర్ను లక్ష్యంగా చేసుకుని.. భూమి నుండి సంకేతాలను పంపే, లేదా స్వీకరించే దాని సామర్థ్యాన్ని దెబ్బతీస్తే.. ఉపగ్రహం కమ్యూనికేట్ చేయగల సామర్థ్యాన్ని అడ్డుకోగలిగితే.. గణనీయమైన స్థాయిలో నష్టం వాటిల్లుతుంది. ఉపగ్రహ ఆధారిత సేవలన్నీ నిలిచిపోతాయి. శత్రుదేశం ఏం చేయాలనుకుంటే చేయొచ్చు. జీపీఎస్..: ఇక జీపీఎస్.. ఇప్పుడు మన నిత్య జీవితంలో ఇదో భాగమైపోయింది. జీపీఎస్ సేవల్లో ఒక్కసారిగా అంతరాయం కలిగితే.. అంతా గందరగోళం అవుతుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు.ఏం చేయొచ్చు?దాడులు, నిఘా, పనిచేయకుండా నిర్వీర్యం చేయడం.ఎలా చేయొచ్చు?» భూమి నుంచి.. అంతరిక్ష ఉపగ్రహాల వంటివాటిపై. » అంతరిక్షంలో ఉన్న వాటిపై అంతరిక్షంలో నుంచి.» అంతరిక్షం నుంచి భూమిపై ఉన్నవాటిపై. -
బ్యాంకులపై.. భారీగా ఫిర్యాదులు!
భారతీయ బ్యాంకులకు కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఫిర్యాదులు అందుకోవడంలోనూ ముందుంది. ఈ విషయంలో ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో యాక్సిస్ బ్యాంక్ మొదటి స్థానంలో నిలిచింది. సేవల విషయంలో కొన్ని బ్యాంకులు స్వల్ప మెరుగుదలను చూపించినప్పటికీ మొత్తం ఫిర్యాదుల సంఖ్య గణనీయంగా ఉంది. ఖాతాదారుల తమ సమస్యలను నివేదించేందుకు బ్యాంకులు అందుబాటులోకి తెచ్చిన వేదికలపైనే కాదు.. సేవల్లో విఫలమైతే సామాజిక మాధ్యమాల్లోనూ బ్యాంకులను ఎండగట్టేందుకు వెనకాడటం లేదు.డిజిటల్ ఎకానమీ మారుమూల పల్లెలకూ విస్తరిస్తుండడంతో బ్యాంకింగ్ సామాన్యులకూ చేరువైంది. బ్యాంకింగ్ విస్తృతితోపాటు అదే స్థాయిలో కస్టమర్లు సమస్యలనూ ఎదుర్కొంటున్నారు దీంతో బ్యాంకులకు అందుతున్న ఫిర్యాదులూ పెరుగుతున్నాయి. 2024–25 సంవత్సరానికిగాను బ్యాంకుల బిజినెస్ రెస్పాన్సిబిలిటీ, సస్టేనబిలిటీ రిపోర్ట్స్ (బీఆర్ఎస్ఆర్) ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్ఎస్బీఐలో 29.8 లక్షలుఅనధికారిక ఎలక్ట్రానిక్ డెబిట్ లావాదేవీలకు సంబంధించి వినియోగదారుల నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 6.87 లక్షలకు పైగా ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో మార్చి చివరి నాటికి 1.05 లక్షలు పెండింగ్లో ఉన్నాయి. ఖాతాదారుడి అనుమతి లేకుండా మోసపూరితంగా బ్యాంక్ ఖాతా, డెబిట్/క్రెడిట్ కార్డు నుండి డబ్బు తీసుకోవడం, ఆన్ లైన్ కొనుగోళ్లు, ఇతర అనుమానాస్పద కార్యకలాపాలను అనధికార ఎలక్ట్రానిక్ డెబిట్ లావాదేవీలుగా పరిగణిస్తారు. ఇక రుణాల మంజూరుతో సహా ముఖ్యమైన సేవలను అందించడంలో జాప్యంపై 12,502; సైబర్ భద్రత, ముఖ్యమైన సేవల పంపిణీ మినహా ఇతర ఫిర్యాదుల విభాగం కింద 21.50 లక్షల కంప్లెయింట్లను బ్యాంకు అందుకుంది. అంత క్రితం ఏడాదిలో ‘ఇతర’ విభాగం కింద బ్యాంకుకి 24.02 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. మొత్తంగా అన్ని విభాగాల్లో కలిపి 29.8 లక్షల కంప్లెయింట్లు వస్తే పెండింగులో 1.2 లక్షలు ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకుకి 11.39 లక్షలు, బ్యాంక్ ఆఫ్ బరోడాకు 5.34 లక్షల ఫిర్యాదులు వచ్చాయి.ప్రైవేటు బ్యాంకుల్లోనూ..2024–25లో యాక్సిస్ బ్యాంకు 5.90 లక్షల ఫిర్యాదులను అందుకుంది. వీటిలో మార్చి చివరి నాటికి 11,143 పెండింగ్లో ఉన్నాయి. ‘ఇతర’ విభాగంలో 76,111, ప్రకటనలకు సంబంధించి 12,744, అన్యాయమైన వాణిజ్య పద్ధతులను అవలంబించిందన్న ఆరోపణలపై 4,438 కంప్లెయింట్లు అందాయి. » ఐసీఐసీఐ బ్యాంకుకి మొత్తం 5.34 లక్షల కంప్లెయింట్లు వచ్చాయి. వీటిలో మార్చి చివరి నాటికి 45,151 పరిష్కారానికి నోచుకోవాల్సి ఉంది. అంత క్రితం ఏడాది 3.46 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. అన్ని మార్గాలలో కస్టమర్ ఫిర్యాదులను స్వీకరించే విధానం మెరుగుపడిందని, ఫలితంగా సంఖ్య పెరిగిందని బ్యాంకు తెలిపింది. » హెచ్డీఎఫ్సీ బ్యాంకు 4.57 లక్షల ఫిర్యాదులను స్వీకరించింది. వీటిలో 16,306 పెండింగ్లో ఉన్నాయి. ఏడాది క్రితం 4.85 లక్షల కంప్లెయింట్లు వచ్చాయి. అంబుడ్స్మన్కూ..రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు (ఆర్బీఐ) చెందిన అంబుడ్స్మన్ కార్యాలయాలకు 2024–25లో వివిధ బ్యాంకుల ఖాతాదారుల నుంచి 2.96 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. అంత క్రితం ఆర్థిక సంవత్సరంలో వీటి సంఖ్య 2.93 లక్షలు. రుణాలు, అడ్వాన్సులు, డిజిటల్ బ్యాంకింగ్ ఉత్పత్తులకు సంబంధించిన కస్టమర్లు లేవనెత్తిన సాధారణ సమస్యలు వీటిలో ప్రధానంగా ఉన్నాయి. ఈ కంప్లెయింట్లలో ఎక్కువ భాగం బ్యాంకులపైనే ఉన్నాయి. ఆ తరువాతి స్థానంలో బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు), నాన్–బ్యాంక్ సిస్టమ్ పార్టిసిపెంట్స్, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలు ఉన్నాయి.సోషల్ మీడియాలో చురుగ్గా..సామాజిక మధ్యమాల్లో కస్టమర్ ఫిర్యాదులు, ప్రశ్నలకు పరిష్కారం, స్పందించడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అత్యంత చురుగ్గా ఉన్నాయని సోషల్ మీడియా రిసెర్చ్ సంస్థ ‘సింప్లిఫై360’ ఇటీవలి నివేదిక వెల్లడించింది. జూన్ 13–28 మధ్య తొమ్మిది ప్రముఖ బ్యాంకుల సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది.» ఫేస్బుక్లో రోజుకు 3 పోస్టులతో ఎస్బీఐ అత్యంత చురుకైన బ్యాంకుగా నిలిచిందని ఈ నివేదిక వివరించింది.» ఫేస్బుక్, ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 45 శాతం, ఎస్బీఐ 41 శాతం ప్రశ్నలకు సమాధానం ఇచ్చాయి.» యాక్సిస్, ఐసీఐసీఐ, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ 80 శాతం ప్రశ్నలను పరిష్కరించడంలో విఫలమయ్యాయి. » ఫేస్బుక్లో ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకులు ఉత్తమ ప్రదర్శన కనబరిచాయి. కానీ ఇవి ఎక్స్లో పెద్దగా రాణించలేదు. » హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎక్స్లో చాలా చురుకుగా ఉన్నప్పటికీ బ్యాంక్ తన ప్రయత్నాలకు పెద్దగా గుర్తింపు పొందలేదని నివేదిక వివరించింది. -
ఆ 3 రోజులే ట్రాఫిక్ ఎక్కువ.. ఎందుకంటే!
ఊరికి పశ్చిమాన ఉన్నవి ఆ ప్రాంతాలు.. ఐటీ కారిడార్లు.. హైదరాబాద్కు తలమానికం.. నగరానికి మణిహారం.. ఐటీకి ఆలవాలం.. లక్షలాది ఉద్యోగులు.. దాదాపు అంతకు రెట్టింపు వాహనాలు.. వీఐపీల రాకపోకలతో బీజీ బీజీ.. ఇంతేనా! ఆ ప్రాంతాలు ఐటీ కారి‘డర్’కు.. ట్రా‘ఫికర్’కు కేరాఫ్ కూడా. వానొచ్చినప్పుడు చూడాలి వాటి సొగసు.. చినుకు పడితే వణుకే.. ప్రయాణమంటే ప్రయాసే.. అడుగుడుగునా అవస్థలే.. రహదారులన్నీ వాహనాల బారులే.. ఫ్లై ఓవర్లు ఉన్నా.. అండర్ పాస్లున్నా.. చాలా వెడల్పాటి రోడ్లున్నా.. తప్పని ట్రా‘ఫికర్’. నగరవాసికి నరకం చూపుతున్న ట్రాఫిక్ సమస్యపై ‘సాక్షి’ ప్రత్యేక కథనమిదీ.. సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్లో ప్రయాణం నరకప్రాయంగా మారింది. ముఖ్యంగా ఐటీ సంస్థలు ఉండే పశ్చిమ హైదరాబాద్లో అయితే వాహన విస్ఫోటంతో నగరవాసికి పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. ఐటీ కారిడార్లలోని రహదారులపై రోజుకు 10 లక్షల వాహనాలు చక్కర్లు కొడుతుంటాయి. ఇలాంటి బిజీ రోడ్లపై తేలికపాటి వర్షాలకే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది.హైదరాబాద్లో ఉన్న సుమారు 15 వేల ఐటీ, ఐటీఈఎస్ కంపెనీల్లో 9,05,715 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. చాలా ఐటీ సంస్థలు ఉద్యోగుల కోసం హైబ్రిడ్ విధానాన్ని అవలంబిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు వారంలో 2–3 రోజులు ఆఫీసు నుంచి, మిగిలిన రోజుల్లో ఇంటి నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే చాలా మంది ఐటీ ఉద్యోగులు వీకెండ్స్కు ముందు, తర్వాత రోజులైన శుక్ర, సోమవారాల్లో ఇంటి నుంచి పనిచేసేందుకే ఇష్టపడుతున్నారు. మంగళ, బుధ, గురువారాల్లో మాత్రం ఆఫీసులకు వస్తున్నారు. దీంతో సోమ, శుక్రవారాలతో పోలిస్తే మిగిలిన రోజుల్లో ఐటీ కారిడార్లలోని రహదారులపై వాహనాలు కిక్కిరిసిపోతున్నాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల అధ్యయనంలో వెల్లడైంది.ఏ ఏ రోజుల్లో ట్రాఫిక్ జాం ఎక్కువంటేసోమ, శుక్ర వారాలతో పోలిస్తే మంగళ, బుధ, గురువారాల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇందులోనూ మంగళ, బుధవారాల్లో 20–25 శాతం, గురువారాల్లో 10–15 శాతం రోడ్లు వాహనాలతో బిజీగా ఉంటాయి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య, సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల మధ్య రోడ్ల మీద వాహనాలు కిక్కిరిసిపోతున్నాయి. ఈ నాలుగు గంటలు నరకమే.. ఐటీ కారిడార్లలో రోజుకు 10 లక్షల ఆటోలు, బస్సులు, కార్లు, బైక్లు తిరుగుతుంటాయి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఇక్కడ ప్రయాణించాలంటే వణుకే. ఈ నాలుగు గంటల్లో సుమారు లక్ష వాహనాల్లో ఐటీ ఉద్యోగులు ప్రయాణిస్తుంటారు. వారం మధ్య దినాల్లో ట్రాఫి క్ రద్దీ విపరీతంగా ఉంటుంది. సోమ, శుక్ర వారాల్లో ఐటీ ఉద్యోగులు హైబ్రిడ్ విధానంలో ఇంటి నుంచే పని చేస్తుండగా.. మంగళ, బుధ, గురువారాల్లో మాత్రం ఆఫీసులకు వెళుతున్నారు. దీంతో నివాస ప్రాంతాలతో అనుసంధానమై ఉండే ఐటీ కారిడార్లలో ట్రాఫిక్ రద్దీ 25 శాతం అధికం.ప్రధానంగా ఈ రోడ్లు జాంజాం.. ⇒ గచ్చిబౌలి–మియాపూర్ రోడ్ ⇒ లింగంపల్లి వయా గచ్చిబౌలి రోడ్ ⇒ హైటెక్ సిటీ–జేఎన్టీయూ వయా హఫీజ్పేట, కేపీహెచ్బీ ⇒ బొటానికల్ గార్డెన్ అండ్ కొత్తగూడ ⇒ టోలిచౌకి–రాయదుర్గం రోడ్ (షేక్పేట ఫ్లై ఓవర్)కొత్తగా మరో 25 లక్షల గృహాలు.. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఏటా ఇచ్చే అనుమతుల్లో 60 శాతానికి పైగా భవన నిర్మాణ అనుమతులు ఐటీ కారిడార్లలోనే ఉంటాయి. అయితే ఆ మేరకు ఆయా రహదారుల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి జరగడం లేదు. భవిష్యత్తు అవసరాలను ఏమాత్రం దృష్టిలో పెట్టుకోకుండా ఇబ్బడిముబ్బడిగా అనుమతులు ఇస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వెస్ట్ హైదరాబాద్లో 30 అంతస్తులకుపైగా హైరైజ్ భవనాలు వందల సంఖ్యలో నిర్మాణమవుతున్నాయి. వచ్చే 4–5 ఏళ్లలో ఐటీ కారిడార్లలో కొత్తగా 25 లక్షల గృహాలు అందుబాటులోకి వస్తాయని అంచనా. ఈ కారిడార్లలో నివాసముండే కుటుంబాల్లో ఇంటికి 2–3 కార్లు ఉంటున్నాయి. ఈ లెక్కన లక్షల వాహనాలు కొత్తగా రోడ్ల మీదికి వస్తాయి. ఇప్పుడున్న రద్దీనే తట్టుకోలేక చేతులెత్తేస్తున్న ప్రభుత్వ విభాగాలు భవిష్యత్తు పరిణామాల గురించి కూడా ముందస్తుగా ఆలోచిస్తే బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.ఏం చేయాలంటే.. ⇒ ఎడతెరిపిగా వర్షాలు కురిసే రోజుల్లో ఐటీ సంస్థలు వేర్వేరు లాగిన్, లాగ్ అవుట్ వేళలను అవలంబించాలి. ⇒ సాధ్యమైనంత వరకు మెట్రో, ఎంఎంటీఎస్, బస్సులు వంటి ప్రజా రవాణాను ఉద్యోగులు వినియోగించేలా సంస్థలు ఆదేశించాలి. ⇒ ఒకే ప్రాంతం, ఒకే సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఎవరికివారు సొంత వాహనాల్లో ఆఫీసులకు వెళ్లే బదులుగా ముగ్గురు, నలుగురు కలిసి ఒకే కారులో ప్రయాణించేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ⇒ కార్ పూలింగ్, బైక్ ట్యాక్సీ వంటి ప్రత్యామ్నాయ వాహన ఏర్పాట్లు చేసుకోవడం ఉత్తమం ⇒ యాజమాన్యాలు ఉద్యోగులకు ప్రతి రోజు ఆఫీసులో విధిగా నిర్వహించే మీటింగ్స్ను ఆన్లైన్ లేదా వర్చువల్ విధానంలో చేయడం ఉత్తమం. ⇒ ఐటీ కారిడార్లలో రోడ్లు, డ్రైనేజీల్లో చెత్తాచెదారం, సిమెంట్ కాంక్రీట్ వంటి వాటితో నిండిపోయి వర్షపు నీటి ప్రవాహ మార్గాలను అడ్డుకోకుండా మున్సిపల్, హైడ్రా, పోలీసులు సమన్వయంగా పనిచేయాలి. ⇒ హైబ్రిడ్ విధానంలో ఉద్యోగులు వారంలో తప్పనిసరిగా మూడు రోజులు ఆఫీసుకు రావాలనేది యాజమాన్యాల నిబంధన. వానాకాలం, ఇతరత్రా అత్యవసర రోజుల్లో ఈ నిబంధనల్లో సడలింపులు ఇచ్చేలా సంస్థలను అధికారులు ఆదేశించాలి. ⇒ ఆఫీసు నుంచైనా, ఇంటి నుంచైనా ఉద్యోగుల పని వేళలు, ఉత్పాదకతలో ఎలాంటి మార్పులు లేనప్పుడు సాధ్యమైనంత వరకు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వడమే మేలు. దీంతో రహదారులపై ట్రాఫిక్ రద్దీ తగ్గడమేకాకుండా యాజమాన్యాలకూ ఉద్యోగుల రవాణా ఖర్చులు తగ్గుతాయి.‘వీఐపీ’ల రాకపోకలు కూడా కారణమే..గతంలో రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార ప్రముఖులు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో నివాసం ఉండేందుకు ఇష్టపడేవారు. అయితే ఇప్పుడు ఆయా ప్రాంతాలు వాణిజ్య ప్రాంతాలుగా మారడంతో వారంతా కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ, మాదాపూర్ (Madapur) వంటి పశ్చిమ హైదరాబాద్కు వలస వెళుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో నిరంతరం వీఐపీల కదలికల కారణంగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. గతంలో సినిమా ఫంక్షన్లు ఎల్బీ స్టేడియంలో జరిగేవి. కానీ, ఇప్పుడు హైటెక్స్, హెచ్ఐసీసీ (HICC) వంటి ఐటీ కారిడార్లలోని ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. ఫలితంగా అభిమానుల తాకిడితో రోడ్లన్నీ స్తంభించిపోతున్నాయి. హెచ్ఐసీసీ, హైటెక్స్, నోవాటెల్, జేఆర్సీ, సంధ్య వంటి కన్వెన్షన్లలో నిత్యం ఏదో ఒక భారీ కార్యక్రమంఉంటుండటంతో ఐటీ కారిడార్లు బిజీ బిజీగా మారుతున్నాయి. కుండపోతగా కురిసినప్పుడే సమస్య వాన నీరు వెళ్లే మార్గాల పరిమాణం కంటే అధికంగా కుండపోత వర్షపునీరు వచ్చినప్పుడు రోడ్లన్నీ వరదతో నిండి ట్రాఫిక్ జాం అవుతున్నాయి. దీంతో వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద హైడ్రా (Hydraa), పోలీసులు సమన్వయంగా పనిచేస్తూ మోటార్లతో వరద నీటిని ఎత్తిపోస్తున్నాం. దీంతో కనీసం రెండు లైన్లు ట్రాఫిక్ క్లియర్ అవుతుంది. – చంద్రశేఖర్ రెడ్డి, ఏసీపీ, మాదాపూర్మల్టీమోడల్ ట్రాన్స్పోర్టే పరిష్కారం బహుళ అంతస్తుల్లో నివాసం ఉండేందుకు కస్టమర్లు ఆసక్తి చూపుతున్నందున డెవలపర్లు కూడా హైరైజ్ ప్రాజెక్ట్లు ఎక్కువగా చేపడుతున్నారు. అయితే ఐటీ కారిడార్లలో ట్రాఫిక్ రద్దీకి సరైన పరిష్కారం మెట్రో, ఎంఎంటీఎస్ల విస్తరణ, మల్టీమోడల్ ట్రాన్స్పోర్ట్ వినియోగమే. ఆఫీసులు, విద్యాసంస్థలు వేర్వేరు పనివేళలను అమలు చేయాలి. – జైదీప్ రెడ్డి, ప్రెసిడెంట్, క్రెడాయ్ హైదరాబాద్ -
డాక్టర్ ఏఐ.. మీ హెల్త్ కోచ్..!
మీరు స్మార్ట్ వాచ్ లేదా స్మార్ట్ రింగ్ వంటి వేరబుల్స్ పెట్టుకుంటే.. ప్రతిరోజూ మీ వాచ్లో లేదా స్మార్ట్ ఫోన్లో ఓ లిస్ట్ కనిపిస్తుంది. ఎన్ని స్టెప్స్ నడిచారు? ఎంత సమయం నిద్రపోయారు? హార్ట్ రేట్ ఎలా ఉంది? స్లీప్ స్కోర్ ఎంత?.. ఇవన్నీ తెలుసుకోవచ్చు. ఇవన్నీ చూడడానికి కేవలం నంబర్లు. మనం నిత్యం అవి చెక్ చేసుకుంటూ లైఫ్ స్టైల్లో చేయాల్సిన మార్పుల గురించి ఆలోచిస్తాం. అప్పుడప్పుడు అనేక సందేహాలు కూడా వస్తుంటాయి. ఆ ట్రాకింగ్ డేటాలో నిజానిజాలేంటి? ఆ గణాంకాల గుట్టు ఎంత వరకూ శాస్త్రీయం అని మనమే గూగుల్ తల్లిని అడుగుతుంటాం. ఇకపై, మీకు ఆ శ్రమ అక్కర్లేదు. అన్నీ ‘ఏఐ’ చూసుకుంటుంది. స్మార్ట్ వాచ్లు, రింగ్లు, ఇతర వేరబుల్ ట్రాకర్లు సేకరించిన డేటాని విశ్లేషిస్తుంది. లైఫ్ స్టైల్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలో చెబుతుంది. అంటే జిమ్లో ఫిట్నెస్ కోచ్లా, ఇంట్లో ఫ్యామిలీ డాక్టర్లా అన్నమాట! –సాక్షి, స్పెషల్ డెస్క్దిగ్గజ ఐటీ కంపెనీలన్నీ ఇప్పుడు ‘ఏఐ’ అప్డేట్స్పైనే వర్క్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే గూగుల్ గూటి నుంచి వచ్చిన జెమినై కూడా నిత్య నూతనంగా అప్డేట్ అవుతోంది. ఇప్పుడు కొత్తగా ఓ ఏఐ సిస్టమ్ని అడాప్ట్ చేసుకుంది. అదే ’పర్సనల్ హెల్త్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్’ (పీహెచ్ఎల్ఎల్ఎమ్). ఇదో హెల్త్ కోచ్ మాదిరిగా పని చేస్తుంది. అంటే.. మనం వాడే యాపిల్ వాచ్, ఫిట్ బిట్ వంటి ఫిట్నెస్ ట్రాకర్ల నుంచి వచ్చే డేటాని తీసుకుంటుంది. విశ్లేషిస్తుంది. తగిన సలహాలు ఇస్తుంది. ఉదాహరణకి.. మీ నిద్ర క్వాలిటీ తగ్గిందా? వెంటనే అలర్ట్ అవుతుంది. తన నిఘా వ్యవస్థని అడుగుతుంది. మీరెంత సమయం సిస్టమ్పై వర్క్ చేస్తున్నారు, టైమ్కి తింటున్నారా లేదా.. ఇలా అన్నింటినీ ట్రాకర్స్ నుంచి తీసుకుని ‘స్క్రీన్ టైమ్ తగ్గించాలి.. డైట్లో ఇలాంటి మార్పులు చేయాలి.. రాత్రి పడుకునే ముందు లైట్ ఫుడ్ తీసుకోవాలి‘ వంటి పలు సూచనలు చేస్తుంది. సో.. మన హెల్త్ ట్రాకర్లు.. కేవలం డేటా మెషీన్లు కాదు, పర్సనల్ హెల్త్ కోచ్లుగా కూడా సరికొత్త అవతారం ఎత్తనున్నాయన్నమాట.850 కేసులను పరిశీలించి..దేన్నయినా వెంటనే నిజం అని ఎలా నమ్ముతాం? శాస్త్రీయంగా ఓ నిర్ధారణకి రావాలి. అందుకే గూగుల్ కూడా ఈ ఏఐ లాంగ్వేజ్ మోడల్పై ప్రయోగాత్మకంగా పరిశీలన చేసింది. ‘నేచర్’ మెడిసిన్ జర్నల్లో వచ్చిన రిపోర్ట్ ప్రకారం.. పలు ఫిట్నెస్ ట్రాకర్ల నుంచి సేకరించిన 850 కేసులను గూగుల్ సేకరించింది.రియల్ టైమ్లో తీసుకున్న మొత్తం డేటాని ఏఐతో కంపైల్ చేస్తే.. 79% నిద్రకి సంబంధించిన ప్రశ్నలకు.. 88% ఫిట్నెస్ డేటాపై సరైన సమాధానాలు ఇచ్చిందట.హార్ట్ బీట్ డేటాపై సగటున 76% సరైన విశ్లేషణ చేసిందని గూగుల్ పరిశోధకులు ప్రకటించారు.ఎంత వరకు సురక్షితం?‘ఆహా!! ఏఐ ఓ అద్భుతమే’ అని మనం ప్రశంసించినా.. కచ్చితంగా దానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. అందుకే దీనికి కూడా పరిధిని నిర్దేశించుకోవాలని ఆరోగ్య రంగ నిపుణులు చెబుతున్నారు. ‘ఏఐ హెల్త్ కోచ్లు చెప్పేవి కేవలం సూచనలుగానే పరిగణించాలి. దాన్నే వైద్యుడిగా భావించకూడదు’ అంటున్నారు. ఎందుకంటే కొన్నిసార్లు ఏఐ తప్పు అంచనాలు వేయొచ్చని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. పిల్లల కోసం వాడుతున్నట్లయితే కచ్చితంగా పేరెంటల్ కంట్రోల్స్ తప్పనిసరి. ఎప్పటికప్పుడు ప్రైవసీ సెట్టింగ్స్ను తప్పనిసరిగా చెక్ చేయాలి.» ఎంత స్మార్ట్ అవుతున్నాయో అంతే సున్నితమైన డేటాను కూడా వేరబుల్స్ రికార్డ్ చేస్తున్నాయి.» హార్ట్ రేట్, స్లీప్ ప్యాటర్న్స్, మానసిక స్థితికి సంబంధించిన సమాచారం లీక్ అయితే.. చాలా పెద్ద సమస్యే. » సైబర్ సెక్యూరిటీ కట్టుదిట్టంగా లేకపోతే.. హెల్త్ డేటా వ్యాపార వస్తువైపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. » ‘పటిష్టమైన డేటా ప్రైవసీ రక్షణ, వాడేవారిలో డిజిటల్ అక్షరాస్యత.. రెండూ తోడైతే హెల్త్ ట్రాకర్స్, ఏఐ మనిషి లైఫ్కి చక్కని రక్షణ కవచాలుగా మారతాయి. కచ్చితంగా ఆరోగ్య రంగంలో విప్లవమే అవుతుంద’ని టెక్ నిపుణులు చెబుతున్నారు. » యాపిల్ సంస్థ కూడా ఈ తరహా ఏఐ ఫీచర్స్ అందించేందుకు సిద్ధమవుతోంది. ఐఓఎస్ 18లో ఆరోగ్య సంబంధిత టూల్స్, ఏఐ ఆధారిత న్యూట్రిషన్ ట్రాకింగ్ను అందించేందుకు ప్రయోగాలు చేస్తోంది.మన గత చరిత్రనూ తవ్వి..ఏఐ అందించిన ఈ ఫలితాల ఆధారంగా చూస్తే.. ఇది హెల్త్ ఎక్స్పర్ట్లు ఇచ్చిన సమాధానాలతో దాదాపు సమానమే. అంతేకాదు.. గూగుల్ పరిశోధకులు చెబుతున్న ప్రకారం.. పీహెచ్ఎల్ఎల్ఎమ్ వినియోగదారుల హెల్త్ రికార్డ్స్పై మరింత లోతైన విశ్లేషణ చేస్తుందట. రియల్ టైమ్ డేటానే కాకుండా ట్రాకర్ల నుంచి యూజర్ల హిస్టరీని కూడా ఏఐతో కంపైల్ చేస్తున్నారు గూగుల్ పరిశోధకులు. దీంతో మరింత నమ్మకమైన సూచనలు చేసేందుకు వీలవుతుందట. వినియోగదారులకు ఓ ఫ్యామిలీ డాక్టర్ లా సేవలు అందించేలా సిద్ధం చేస్తున్నామని ఏఐ రూపకర్తలు చెబుతున్నారు. -
మరో అద్భుతం భారతీయ రైల్వే ఖాతాలో..
ఈ మధ్యకాలంలో ఇండియన్ రైల్వేస్ ఎన్నో అద్భుత ఘట్టాలను సాధించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆర్చ్ బ్రిడ్జ్, పొడవైన రైల్వే టన్నెల్, చారిత్రక పాంబన్ బ్రిడ్జ్.. ఇలాంటి నిర్మాణాల తర్వాత ఇప్పుడు మరో ‘వావ్’ ఫీట్ను సాధించింది. అదే.. దేశంలోనే అత్యంత పొడవైన గ్రేడ్ సెపరేటర్ బ్రిడ్జ్ పూర్తి చేయడం. కట్నీ జంక్షన్లో ఇంజినీరింగ్ అద్భుతం.. మధ్యప్రదేశ్లోని కట్నీ జంక్షన్ వద్ద ఈ గ్రేడ్ సెపరేటర్ బ్రిడ్జి ఉంది. ఈ బ్రిడ్జ్ మొత్తం 33.40 కిలోమీటర్లు పొడవు. ఇందులో ఒకటి "అప్" ట్రైన్ల కోసం (ఇప్పటికే పూర్తయింది). మరొకటి "డౌన్" ట్రైన్ల కోసం.. ఇది 17.52 కిలోమీటర్ల పొడవుతో ఇంకా నిర్మాణంలో ఉంది. అప్ బ్రిడ్జ్ను రైల్వే భద్రతా కమిషనర్ (CRS) ఆమోదించారు. దీంతో అతిత్వరలోనే ఇది ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తోంది. మొత్తం.. 15.85 కిలోమీటర్ల పొడవుతో, ఫిల్లర్లపైనే నిర్మించిన ఈ ఎలివేటెడ్ ట్రాక్ నగరాన్ని పూర్తిగా మళ్లించి ట్రాఫిక్ను గణనీయంగా తగ్గిస్తుంది.గ్రేడ్ సెపరేటర్ బ్రిడ్జ్ అంటే.. రవాణా మార్గాలు (రోడ్లు, రైల్వేలు) ఒకే స్థాయిలో కాకుండా, వేర్వేరు ఎత్తుల్లో నిర్మించడమన్నమాట. తద్వారా వాటి మధ్య రాకపోకలలో అంతరాయం లేకుండా చేయొచ్చు. అంటే.. సిగ్నల్స్ లేకుండా ప్రయాణించగలవు. తద్వారా ప్రమాదాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అధిక ట్రాఫిక్ ఉన్న ప్రాంతాల్లో ఇది అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది.2020లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాదిలో పూర్తి కావాలనే టార్గెట్ ఉంది. గతి శక్తి పథకంలో భాగంగా.. ఈ ప్రాజెక్ట్ ప్రధానమంత్రి గతి శక్తి పథకంలో భాగంగా చేపట్టబడింది. "అప్ లైన్" సెపరేటర్ నిర్మాణ ఖర్చు ₹580 కోట్లు కాగా, రెండు సెపరేటర్ల మొత్తం ఖర్చు రూ.1,247.68 కోట్లుగా అంచనా.ట్రాఫిక్ తగ్గింపు, సమయపాలన మెరుగుదల.. దేశంలోనే అతిపెద్ద రైల్వే జెంక్షన్ యార్డ్గా న్యూ కట్నీకి పేరుంది. గూడ్స్ & ప్యాసింజర్ ట్రైన్ల అధిక రాకపోకల వల్ల నిత్యం ఇక్కడ తీవ్ర రద్దీ నెలకొంటోంది. తద్వారా రైళ్ల రాకపోకలపై ఇది తీవ్ర ప్రభావం చూపెడుతోంది. అయితే.. తాజా గ్రేడ్ సెపరేటర్ బ్రిడ్జ్ వాడకంలోకి వస్తే ఈ సమస్య తొలిగిపోనుంది. అదెలాగంటే.. సింగ్రౌలి, బిలాస్పూర్ నుంచి వచ్చే ట్రైన్లు ఇక న్యూ కట్నీ జంక్షన్(కట్నీ ముద్వారా) వద్ద ఆగాల్సిన అవసరం లేదు. కోటా, బీనా వైపు వెళ్లే ట్రైన్లకు ఇది ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. అంటే.. వెస్ట్ సెంట్రల్, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేజోన్ల నుంచి వచ్చే రైళ్ల రాకపోకలు సునాయసంగా కొనసాగే అవకాశం ఉంటుంది. ప్రయాణ సౌలభ్యం, సరుకు రవాణా మెరుగుదల.. కట్నీని మళ్లించే ట్రైన్లు ఇక నాన్ స్టాప్గా ప్రయాణించగలవు. ధన్బాద్, గయా, ముజఫర్పూర్ వంటి నగరాలకు వెళ్లే ప్రత్యేక ట్రైన్లు కూడా హాల్టింగ్ లేకుండా ముందుకు వెళ్తాయి. అదనంగా.. పవర్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా కూడా సకాలంలో జరిగేందుకు వీలు కల్పించనుంది. నిర్మాణంలో వినియోగించిన వనరులు15,000 టన్నుల స్టీల్1.50 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్1.90 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టినాలుగు Rail Over Rail (ROR) బ్రిడ్జ్లు, వాటిలో పొడవైనది 91.40 మీటర్లుఈ అద్భుతమైన నిర్మాణం భారత రైల్వేలు సాధించిన మరో ఘనతగా నిలిచింది. దేశ రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చే దిశగా ఇది కీలక అడుగుగా నిపుణులు భావిస్తున్నారు. -
దక్షిణ ‘మహిళా’ రైల్వే
సాక్షి, హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వే ఓ అరుదైన ఘనతను సాధించింది. జోన్ పరిధిలో 11 ప్రధాన విభాగాలుండగా, వాటిల్లో ఐదు విభాగాలకు మహిళలే అధిపతులయ్యారు. ఇటీవలి వరకు మూడు విభాగాలకు వారు నేతృత్వం వహిస్తూ రాగా, తాజాగా జరిగిన బదిలీల్లో మరో రెండు విభాగాలను కూడా వారికే అప్పగించారు. కీలక ఐదు విభాగాలను మహిళలే పర్యవేక్షిస్తుండటం పట్ల దక్షిణ మధ్య రైల్వే జనరల్మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాస్తవ ఆనందం వ్యక్తం చేశారు. ఎలాంటి కీలక లక్ష్యాలనైనా సాధించే సత్తా మహిళలకుందని, జోన్ పరిధిలో కీలక విభాగాలను సమర్థంగా పర్యవేక్షిస్తున్నారన్నారు. ఆపరేషన్స్: కె. పద్మజ రైళ్ల రాకపోకలు, వాటి సమయపాలన, ట్రాఫిక్ నిర్వహణ, ఇతర విభాగాలతో సమన్వయం, రోలింగ్ స్టాక్ నిర్వహణ వంటి కీలక అంశాలు రైల్వేలో ఆపరేషన్స్ విభాగ పరి«ధిలోకే వస్తాయి. ఈ విభాగ నిర్వహణ కత్తిమీద సామే. ఈ సంవత్సరం జూలై వరకు సరుకు రవాణా ద్వారా దక్షిణ మధ్య రైల్వే రూ.4,601 కోట్ల ఆదాయం సాధించింది. 49 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసి కొత్త రికార్డు సృష్టించింది. పండుగలు లాంటి ప్రత్యేక సందర్భాల్లో 1,117 ప్రత్యేక రైళ్లు నడిపింది. దీనికి ప్రస్తుతం 1991 బ్యాచ్ ఐఆర్టీఎస్ అధికారి కే.పద్మజ అధిపతిగా వ్యవహరిస్తున్నారు. 2025 జనవరిలో ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్గా ఆమె బాధ్యతలు స్వీకరించారు. వాణిజ్య విభాగం: ఇటీ పాండే ఆపరేషన్స్ తర్వాతఅంత ప్రాధాన్యం ఉన్న విభాగమిది.టికెట్ అమ్మకాలు, రిజర్వేషన్,స్టేషన్ నిర్వహణ, సరుకు రవాణా,మార్కెటింగ్, ఆదాయ వనరుల పెంపువంటివి దీని పరిధిలో ఉంటాయి. ఈ విభాగానికి ఈ నెల రెండో తేదీన 1998 బ్యాచ్ ఐఆర్టీఎస్ అధికారి ఇటీ పాండే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్గా బాధ్యతలు చేపట్టారు. ఆమె ‘రైల్ మంత్రి రాజభాష రజత్ పథక్ (2025), మంత్రిత్వ శాఖ పురస్కారం (2007), జీఎం అవార్డులు (రెండుసార్లు), విమెన్ ఎచీవర్స్ (2016) లాంటి అనేక పురస్కారాలు పొందారు. ‘రైడింగ్ ది ఫ్రైట్ ట్రైన్’అనే పుస్తకం రాశారు. అంతర్జాతీయస్థాయిలో కామ్ రోడ్స్ మారథాన్ (88 కి.మీ.)ను పూర్తి చేసిన ఏకైక మహిళా సివిల్ సర్వెంట్గానూ గుర్తింపు పొందారు. భద్రతా విభాగం: అరోమా సింగ్ ఠాకూర్ రైల్వే ఆస్తులు, ప్రయాణికుల భద్రత చాలా కీలకం. అసాంఘిక శక్తులు, ఆకతాయిలు మొదలు ఉగ్రవాదుల వరకు రైల్వేపై దాడులు చేయటం సహజం. ట్రాక్పై అడ్డుగా ఇనుప చువ్వలను ఉంచి రైళ్లు పట్టాలు తప్పేలా చేసే కుట్రలు తరచూ జరుగుతున్నాయి. ఇలాంటి వాటినినిర్వీర్యం చేయటం సహా స్టేషన్లు, రైళ్లలో ప్రయాణికులు క్షేమంగా ఉండేలా, భద్రంగా గమ్యంచేరేలా ఆర్పీఎఫ్ సిబ్బంది పహారాలో ఉంటారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షించే కీలక బాధ్యతనుప్రస్తుతం 1993 బ్యాచ్ ఐఆర్పీఎఫ్ఎస్ అధికారి అరోమాసింగ్ ఠాకూర్ పర్యవేక్షిస్తున్నారు. 2023 జూలైలో ఆమె ఐజీ కమ్ చీఫ్ ప్రిన్సిపల్ సెక్యూరిటీ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. ఆమె నేతృత్వంలో ‘ఆపరేషన్ యాత్రి సురక్ష‘, ‘ఆపరేషన్ అమానత్‘, ‘ఆపరేషన్ నన్హే ఫరిస్తే్త‘, ‘ఆపరేషన్ సతర్క్‘వంటి ప్రత్యేక కార్యక్రమాలు విజయవంతంగా అమలయ్యాయి. మహిళల భద్రతకు ‘ఉమన్ శక్తి టీమ్లు‘, ‘మెరి సాహిలీ‘, ‘యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు‘ప్రారంభించారు. వైద్య విభాగం: డా. నిర్మలానరసింహన్రైల్వేలో ప్రత్యేక ఆస్పత్రులు ఉంటాయి. సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు ఇవి వైద్య సేవలందిస్తాయి. ఇవి కాకుండా ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే ప్రత్యేక మొబైల్ ఆస్పత్రులు ఆయా ప్రాంతాలకు చేరుకుని వైద్యం అందిస్తాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 8 ప్రధాన ఆస్పత్రులు, 40 హెల్త్ యూనిట్లు ఉన్నాయి. లాలాగూడలోని 380 పడకల కేంద్ర రైల్వే ఆస్పత్రి ఉంది. ఈ విభాగానికి 1989 బ్యాచ్ ఐఆర్హెచ్ఎస్ అధికారి డా.నిర్మలానరసింహన్ డిసెంబర్లో ప్రిన్సిపల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఆర్థిక విభాగం: హేమ సునీత అతి పెద్ద నెట్వర్క్ అయిన రైల్వేలో ఆర్థిక అంశాల పర్యవేక్షణ కూడా చాలా కీలకం. ఆర్థికపరమైన పొరపాట్లు, అక్రమాలకు తావు లేకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ఈ విభాగానికి 1993 ఐఆర్ఏఎస్ అధికారి హేమసునీత గత ఏప్రిల్ నుంచి ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వైజర్గా వ్యవహరిస్తున్నారు. లండన్, పారిస్, మలేíÙయా, సింగపూర్లలో ఆర్థిక అంశాలçపై అంతర్జాతీయ స్థాయిలో కోర్సులు చేసి, శిక్షణ పొందారు. ఆమె పీపీపీ, ఇంటర్నేషనల్ టాక్స్, అక్రూవల్ అకౌంటింగ్లలో ప్రావీణ్యం పొందారు. -
టీవీనో ఫ్రిజ్జో.. కరెంటు బిల్లు కడుతుంది!
మీ ఇంట్లోని ఫ్రిజ్.. మీ ఇంటి కరెంటు బిల్లు కట్టేస్తే! మీ వాషింగ్ మెషీన్ మీ ఇంటి అద్దె చెల్లించేస్తే!!మీ స్మార్ట్ వాచ్, మీ స్మార్ట్ టీవీ.. మీ ఫోన్ బిల్లు లేదా ఓటీటీ ప్లాట్ఫామ్ రెన్యువల్ చేయడం వంటివి చేసేస్తే!!!నమ్మబుద్ధి కావడం లేదు కదూ... కానీ, త్వరలో సాధ్యం కానున్నాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) యూపీఐ అప్డేటెడ్ వర్షన్ ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ పీసీఐ) తీసుకొస్తోంది. ఇది కార్యరూపం దాలిస్తే స్మార్ట్ ఉపకరణాలే ఆటోమేటెడ్ పేమెంట్స్ను పూర్తి చేసేస్తాయి. అంటే యూపీఐ చెల్లింపులకు స్మార్ట్ఫోన్ పై పూర్తిగా ఆధారపడాల్సిన అవసరం లేదు. యూపీఐ ఆటోపే, యూపీఐ సర్కిల్ మాదిరిగా కొత్త ఫీచర్ పనిచేస్తుందన్న మాట. - సాక్షి, స్పెషల్ డెస్క్ఒకప్పుడు కరెంటు బిల్లు కట్టాలన్నా.. ఇంటి అద్దె కట్టాలన్నా పర్సు తీసేవాళ్లు. ఇప్పుడు ఫోన్ తీస్తున్నారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) రాక చెల్లింపుల తీరునే మార్చింది. ఇప్పుడు ఇది మరో సంచలనానికి సిద్ధమైంది. స్మార్ట్ గాడ్జెట్స్తో చెల్లింపులు జరిపే కొత్త యూపీఐ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అభివృద్ధి చేస్తోంది. అంటే ఇంటర్నెట్తో కనెక్ట్ అయిన టీవీలు, ఫ్రిజ్లు, వాషింగ్ మెషీన్లు, కార్లు, స్మార్ట్వాచ్ల వంటి పరికరాల ద్వారా మన ప్రమేయం లేకుండా యూపీఐ ఆటోమేటెడ్ పేమెంట్స్ చేయవచ్చు. ఈ వ్యవస్థ నెలవారీ సబ్స్క్రిప్షన్ ్స వంటి చెల్లింపులను స్మార్ట్ పరికరాల నుండి నేరుగా ఆటో పేమెంట్ చేయడానికి వినియోగదారులకు అనుమతిస్తుంది. అంటే పార్కింగ్ ఫీజును కనెక్టెడ్ కారు నుండి నేరుగా చెల్లించవచ్చు. ఇంట్లోని స్మార్ట్ టీవీ ద్వారా ఓటీటీల చందాను, నెలవారీ అద్దె, విద్యుత్ బిల్లులు కట్టేయొచ్చు. ఇవన్నీ థర్డ్ పార్టీ యూపీఐ యాప్ను తెరవకుండానే జరిగిపోతాయన్నమాట.అక్టోబరులోగా..ఎన్ పీసీఐ ఈ ఐఓటీ–రెడీ యూపీఐని అక్టోబర్ 7–9 తేదీల్లో ముంబైలో జరిగే గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్ట్ 2025 వేదికగా ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. అయితే నియంత్రణ సంబంధ అనుమతులు ఇంకా రావాల్సి ఉంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే వినియోగదారుల యూజర్ ఎక్స్పీరియెన్ ్స మరింత మెరుగుపడుతుంది. ఈ కొత్త వ్యవస్థ కోసం నియంత్రణ సంబంధ, డేటా భద్రతపై కూడా ఎన్ పీసీఐ పనిచేస్తోంది. అనధికార లావాదేవీల కట్టడితోపాటు గోప్యతకు పెద్దపీట వేసే దిశగా అడుగులేస్తోంది. » 2024–25లో యూపీఐ వేదికగా 18,587 కోట్ల లావాదేవీలకుగాను రూ.261 లక్షల కోట్లు చేతులు మారాయి.» దేశవ్యాప్తంగా జూలైలో రికార్డు స్థాయిలో రూ.25 లక్షల కోట్ల విలువ చేసే 1,946.79 కోట్ల లావాదేవీలు జరిగాయి. » యూపీఐ చరిత్రలో అత్యధికంగా జూలై 1న రూ.1.10 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు నమోదయ్యాయి.ఆదేశిస్తే చాలు..» వినియోగదారుడు ప్రాథమిక యూపీఐ ఐడీకి ప్రత్యేక వర్చువల్ పేమెంట్ అడ్రస్ అనుసంధానం అవుతుంది. తద్వారా చెల్లింపులను ఆటోమేటిగ్గా పూర్తి చేయడానికి ఉపకరణాలకు వీలవుతుంది. » ప్రధాన యూపీఐ డివైస్ అయిన మొబైల్ ఫోన్ నుంచి సంబంధిత స్మార్ట్ ఉపకరణానికి ఆటోమేటిగ్గా చెల్లింపులు జరిపేలా ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుంది. » నిర్దేశిత పరిమితులతో సెకండరీ యూజర్లు చెల్లింపులను జరిపేలా వీలు కల్పించే యూపీఐ సర్కిల్ మాదిరిగా స్మార్ట్ పరికరాలు సైతం నిర్దేశించిన మొత్తాన్ని సురక్షితంగా పేమెంట్స్ పూర్తి చేస్తాయి. » యూజర్ల ప్రధాన అకౌంట్కు అనుసంధానమై సెకండరీ యూపీఐ ఐడీ క్రియేట్ అవుతుంది. » ఎన్ని ఉపకరణాలు జోడిస్తే అన్ని ఐడీలు ఉంటాయి. ఈ ఫీచర్ కోసం వన్–టైమ్ పాస్వర్డ్ తప్పనిసరి. -
అలా పుట్టిందే చిట్టి చిలకమ్మ పాట
అమ్మమ్మ తన చిట్టి మనవరాలిని బుజ్జగిస్తూ ... ‘చిట్టి చిలకమ్మా / అమ్మ కొట్టిందా..! ’అని చెబుతుంటే మనవరాలు కళ్లు విప్పార్చి వింటున్న అందమైన దృశ్యం మన కళ్ల ముందు నిలుస్తుంది. అమ్మ తన కూతురితో ‘పండు తెచ్చావా.. గూట్లో పెట్టావా.. గుటుక్కున మింగావా..’ అనగానే చిన్నారి కూతురు కిల కిల నవ్వే నవ్వులు తలపునకు వస్తాయి. చిలకమ్మ వచ్చేసింది.. పండు తెచ్చింది అని చిన్నారులంతా సంబరపడిపోయి పాడుకునే ఆ పాట అరవై ఏళ్లుగా తెలుగు ముంగిళ్లలో పిల్లలున్న ప్రతి ఇంట్లో వినపడుతూనే ఉంది. ఈ గేయం ఎనిమిది పదుల బల్ల సరస్వతి నోట పుట్టింది అనగానే ఆశ్చర్యంగా అందరి చూపులూ ఆమె వైపుకు మరలకుండా ఉండవు. ఎనిమిది పదుల వయసున్న బల్ల సరస్వతి స్వస్థలం జనగాం జిల్లా, బచ్చన్నపేట్ మండలం, కట్కూరు గ్రామం. ఈ పాట ఆమె నోట ఎలా పుట్టింది?! ఇదే విషయం అడిగితే ... ఆమె తన ఏడుతరాల ముచ్చటను మన ముందుంచారు.‘‘ఏడు తరాల ముచ్చట్లు చెప్పాలంటే ఒక్కజాములో అయ్యేది కాదు. నెక్కొండ బ్లాక్లో గురజాల అనే గ్రామం కింద గుంటూరుపల్లె అని ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరుకు ప్రైమరీ స్కూల్కి సింగిల్ టీచర్గా 1962లో వెళ్లాను. ఆ స్కూల్ ఒక గుడిసె. అందులోకి 50 మంది పిల్లలు వచ్చేవారు. ఆ పిల్లలకు చదువు చెప్పడానికి ఏ పుస్తకాలూ లేవు. అక్షరాలు దిద్దించడం, అంకెలు చెప్పడం.. ఎంతసేపూ ఇవే చెబితే పిల్లలు వినరు. రోజంతా వారిని ఎంగేజ్ చేయాలంటే ఎట్లా అని ఆలోచించేదాన్ని. నా చిన్ననాటి నుంచి విన్న పాటలు, కథలు చెప్పాలనుకున్నా. మా అమ్మ నా చిన్నతనంలో చెప్పిన గేయాలు, పద్యాలు, కథలు మాత్రమే కాదు అప్పటికప్పుడు నేనే స్వయంగా పాటలు అల్లి పిల్లలకు చెబుతుండేదాన్ని. అన్నీ పిల్లల మెదళ్లకు చేరేవి కావు. ఇంకా వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నా. ఆ ప్రాంతమంతా చుట్టూ చెట్లు, చేమలు. నేను ఇలా చటుక్కున చెబితే పిల్లలు లటుక్కున అందుకునేలా ఉండాలి. చిన్నారులు తాము రోజూ చూసేవాటి మీద పాట గట్టి చెప్పాలి. అలా అప్పటికప్పుడు చిలుకల మీద అల్లిన పాటే ఇది... అని చెబితే.. పిల్లలు ఆ పదాలను సులువుగా పట్టేసుకున్నారు. ఆ పాట ఆ నోటా ఈ నోటా.. అలా అలా ఎగురుతూ చాలాకాలం కిందటే ఎల్లలు దాటి అమెరికా దాకా పోయింది. ఇప్పటికీ ఎగురుతూనే ఉంది. సముద్రాలు, పర్వతాల గురించి చెబితే వారికి అర్థమయ్యేది కాదు. సరైన దృష్టి పెట్టేవారు కాదు. అందుకని ఏది చెప్పినా గేయాల రూపంలోనే. టీచర్గా రావడానికి ముందు మాకు బేసిక్ ట్రైనింగ్ ఇచ్చారు. అది కూడా నాకు ఉపయోగపడింది. వినోదంగా, అర్థమయ్యే విధంగా, ఆసక్తి కలిగే ప్రయత్నాలు అన్నీ చేసేదాన్ని. ఊరూరూ ప్రయాణం..1957లో అప్పటి 7వ తరగతి పాసయ్యాను. 14 ఏళ్ల వయసులో పెళ్లయ్యింది. మా వారు పీయూసీ చదివారు. ఇద్దరం బేసిక్ టీచర్ ట్రైనింగ్ చేశాం. మా ఇద్దరికీ నెల రోజుల తేడాతో టీచర్ ఉద్యోగాలు వచ్చాయి. నాకు, మావారికి పక్క పక్క ఊళ్లకు పోస్టింగులు. మూడేళ్లు చేశాక మా సొంత ఊరు కట్కూరుకి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇక్కడ ఐదేళ్లు చేశాక, ఆలిన్పుర్లో రెండేళ్లు, ఆ తర్వాత మా పుట్టిన ఊరు లద్దునూరుకు ఇద్దరికీ ట్రాన్స్ఫర్ అయ్యింది. అక్కడ 17 సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత మళ్లీ కట్కూరుకు.. ఇలా మొత్తం 37 ఏళ్లపాటు టీచర్గా చేసి, హెచ్.ఎం.గా రిటైరయ్యాను. ఏడుతరాల తలపోత... ఎనిమిది పదుల జీవితంలో ఎన్నో అనుభవాలు. ఏడుతరాలు చూసిన అనుభవం. నేత కార్మికుల ఇంట పుట్టి పెరిగాను. పెద్ద కుటుంబం. ఐదుగురు అక్కచెల్లెళ్లు, ముగ్గురు అన్నదమ్ములు. మా వారి తోడబుట్టినవాళ్లు ఏడుగురు. పెళ్లికి ముందు మా అక్కాబావ హైదరాబాద్లో ఉంటే కొన్నాళ్లు అక్కడే ఉండి, హిందీ నేర్చుకున్నా. మా బంధువు, మామ సుద్దాల హన్మంతు. పెళ్లి తర్వాతే డిగ్రీ చేశాను. నాకు ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. ఎంతోమంది జీవితాలు అతి దగ్గరగా ఉండి చూసిన, ఎన్నో వెతలు విన్నా. ఏ కష్టమైనా, ఆనందమైనా అంతా ఒకే కుటుంబంగా కలిసి పంచుకున్నాం. అవన్నీ కలిపి ‘కలెనేత’ అని ఏడుతరాల తలపోతగా ఆత్మకథ రాస్తే.. పిల్లలు దానిని పుసక్తంగా తీసుకువచ్చారు.శిశిర ధ్వనిపుట్టిల్లు, అత్తిల్లు.. పిల్లల పనులు, స్కూల్ పనులు.. ఎక్కడా తీరిక ఉండేది కాదు. సమావేశం అయినా, సంబరం అయినా అప్పటికప్పుడు ఓ గేయం రాయడం, పాడటం, వదిలేయడం.. అలా రోజులు వెళ్లిపోయాయి. ఆ గేయాలను భద్రపరుచుకోవాలి అనే అలోచన అప్పట్లో లేదు. 2001లో మా వారు చనిపోయారు. ఊళ్లో ఒంటరిగా ఉండలేక పిల్లల దగ్గరకు హైదరాబాద్కు వచ్చిన. మలిదశ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు అవన్నీ వింటూ.. చూస్తూ చలించిపోయి, నాకు కలిగిన ఆవేశాన్ని, భావాలను రాసుకుంటూ ఉండేదాన్ని.‘ఒట్టు పెట్టి చెపుతున్నా ఒస్తది మన తెలంగాణ.. అదరకురా తమ్ముడా తెలంగాణ మనదేరా..’ అని తెలంగాణ గురించి.. ‘రంగు రంగులు నింపి ఇంద్రధనుస్సును మైమరపిస్తవు / అచ్చులతికి అతికి అతికి, నేత నేసి నేసి, పడగు పేకల కలయిక నీవు, కష్ట సుఖాల వారధి నీవు...’ అని నేతన్నల కష్టాల గురించి.. ‘అవిశ్రాంతంగా పోరు బాటలో పయనిస్తూ, జీవనసమరాన్నీ ఛేదిస్తూ సాగిపోతాను ముందుకు, మున్ముందుకు... ’ అంటూ విశ్రాంత ఉపాధ్యాయుల కోసం.. రాశాను. ఇలాంటివి దాదాపు ఓ యాభై కవితలను కలిపి ‘శిశిరధ్వని’ పుస్తక రూపంగా మీ ముందుకు తీసుకువచ్చాం’’ అంటూ తన గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు ఈ అనుభవాల విజ్ఞానగని. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఫొటోలు: మోహనాచారి(రచయిత్రి 1962లో తన విద్యార్థుల కోసం అల్లిన పాట... ఆమె చేతివ్రాతతో..)కుటుంబ సభ్యులతో బల్ల సరస్వతి -
పాపికొండల్లో వైల్డ్ డాగ్స్
బుట్టాయగూడెం: అరుదైన జంతు జాలానికి నిలయమైన పాపికొండల అభయారణ్యంలో క్రూర జంతువులైన అడవి కుక్కలు (వైల్డ్ డాగ్స్) గుంపులుగా సంచరిస్తున్నాయి. ఇవి అటవీ ప్రాంతంలోని అనేక జంతువులను వేటాడుతుంటాయి. పులిని సైతం అడవి కుక్కలు భయపెట్టగలవని చెబుతుంటారు. అడవి కుక్కలు సంచరించే ప్రదేశాల్లో పులులు కూడా సంచరించవని.. వాటి ఉనికిని కనిపెట్టి తప్పించుకుని తిరుగుతాయని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. పరిమాణంలో ఊరకుక్కల కంటే కొంచెం పెద్దవిగా ఉండే వైల్డ్డాగ్స్ వాటి కంటే బరువు, శక్తి కలిగిన పెద్ద పులులను సైతం సమూహ శక్తితో తరిమికొట్టగలవు. అడవిలో సంచరించే అడవి పందిని ఈ వైల్డ్డాగ్స్ చిటికెలో వేటాడి ఆహారంగా మార్చుకుంటాయి. వాటి బరువుతో పోల్చుకుంటే ఎన్నో రెట్లు పెద్దవైన కణితి(సాంబార్ డీర్), మనిమేగం లాంటి పెద్ద జింక జాతి జంతువులను కూడా ఈ అడవి కుక్కల సమూహం వెంటాడి వేటాడతాయి. ఈ వైల్డ్డాగ్ గుంపులు ఒకే ప్రదేశంలో స్థిరంగా ఉండకుండా నిరంతరం వేర్వేరు ప్రాంతాలకు తిరుగుతూనే ఉంటాయి. ఇవి ఊర కుక్కల కంటే కాస్త పెద్దవిగా ఉంటాయి. వీటి తోకకు వెంట్రుకలు కుచ్చుగా ఉంటాయి. ఇవి యూరప్ దేశాల్లో నల్ల మచ్చలతో కనిపిస్తాయి. అభయారణ్యాల్లో అధికంగా సంచారం అభయారణ్యాలుగా ఉన్న పాపికొండలు, నాగార్జున సాగర్, శ్రీశైలం అభయారణ్యం, గుండ్ల బ్రహ్మేశ్వరం అభయారణ్యంలో అడవి కుక్కల సంచారం ఎక్కువగా ఉందని వైల్డ్లైఫ్ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో కూడా అడవి కుక్కల సంచారం అధికంగా ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. పాపికొండల అభయారణ్యంలో సుమారు 200 కుక్కలకు పైగా గుంపులుగా సంచరిస్తున్నట్లు గుర్తించామని ప్రస్తుతం వాటి జాడ అల్లూరి సీతారామరాజు అటవీ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో గ్రామాలు ఖాళీ అవుతున్న నేపద్యంలో ఇవి స్వేచ్ఛగా సంచరించడానికి మరింత అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సమతుల్యతకు ప్రధాన భూమిక వైల్డ్ డాగ్స్ జీవావరణ సమతుల్యతలో ప్రధాన భూమిక పోషిస్తుంటాయి. మాంసాహార జంతువులైన చిరుత పులి, పెద్దపులి, అడవి కుక్కల సంఖ్య తగ్గిపోతే వాటి ఆహార జంతువులైన వివిధ జంతువులు, జింకల సంఖ్య అమాంతంగా పెరిగి అడవిలోని వృక్షాలు తగ్గిపోతాయి. రైతులకు ఇబ్బంది కలిగించే అడవి పందులు, జింకల సంఖ్య పెరుగుదల ప్రమాదకరంగా మారకుండా నియంత్రణలో ఈ అడవి కుక్కలు ప్రధాన భూమిక పోషిస్తాయని అధికారులు అంటున్నారు. -
ప్రాకృతిక ఉత్పాతాలా... మన పాపాలా?
ప్రకృతి ఏదీ అట్టిపెట్టుకోదు. మనం ఏదిస్తే దాన్నే అంతకుమించి తిరిగిచ్చేస్తుంది. పర్వతాలకు ఇది మరింతగా వర్తిస్తుంది. అభివృద్ధి పేరుతో చేస్తున్న విధ్వంసానికి ప్రకృతి ప్రతిస్పందనగా తాజాగా దేశవ్యాప్తంగా సంభవిస్తున్న విపత్తులే ఇందుకు నిదర్శనం. వాతావరణ మార్పులకు మానవవ తప్పిదాలు తోడై హిమాలయాలను ఆకస్మిక వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఆగస్టు 5న ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్ ధరాలీ గ్రామాన్ని నామరూపాల్లేకుండా చేసింది. హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో ఇటీవల భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. జమ్మూకశ్మీర్లోని కిష్త్వాడ్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ బీభత్సానికి ఏకంగా 65 మందికి పైగా బలయ్యారు. తాజాగా కశ్మీర్లోని కథువాలోనూ అదే పరిస్థితి! భారీ పరిమాణం, నిటారుగా ఉండే స్వరూపం హిమాలయాల్లో ఆకస్మిక, తీవ్ర వరదలకు దారి తీస్తుంటుంది. వీటికి గ్లోబల్ వార్మింగ్ తోడైంది. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో తరచూ వరదలొస్తున్నాయి. అటవీ నిర్మూలన, భూ వినియోగంలో మార్పులు సమస్య తీవ్రతను పెంచుతున్నట్టు సైంటిఫిక్ రిపోర్ట్స్ అధ్య యనం తేల్చింది. ధరాలి వరదలకు హిమనీ సరస్సు విరుచుకుపడటమే కారణమని నిపుణులు అంటున్నారు. 2013లో కేదార్నాథ్లో వేలాది మంది బలైన వరదలకు హిమనీ సరస్సు ఉప్పొంగడమే కారణం. 2023లో న్యూకాజిల్ వర్సిటీ అధ్యయనం ప్రకారం 2006 నుంచి 2016 మధ్య ప్రపంచంలో ఏటా ఏకంగా 332 గిగాటన్నుల మంచు కరిగిపోయింది. దీనివల్ల 1990 నుంచి ప్రపంచవ్యాప్తంగా హిమానీ సరస్సుల సంఖ్య 50 శాతం పెరిగింది. ఇది దిగువ ఉండేవారికి పెను ముప్పేనని అధ్యయనం వెల్లడించింది. డేటాకే దిక్కు లేదు: భారత్లో వర్షపాతం, ఉష్ణోగ్రత, తేమ తదితరాలపై డేటా సేకరణ ఉంది. కానీ హిమాలయాలపై లేదు. ప్రత్యేకించి హిమనీనదాల ఔట్ బరస్ట్కు సంబంధించి అసలే లేదు. అక్కడ 28,000 సరస్సులున్నాయని హిమనీనద సరస్సులపై ఇస్రో జాబితా చెబుతోంది. 25 హెక్టార్లకంటే ఎక్కువ విస్తీర్ణమున్న సరస్సులనే ఇస్రో పర్యవేక్షిస్తోంది. ముప్పుకు కారణంగా మారుతున్న చిన్న సరస్సులెన్నో ఉన్నాయి. అభివృద్ధి పనులు, రోడ్లు, వంతెనల నిర్మాణం, ఆవాసాల విస్తరణ. ఇళ్ళు, హోటళ్ళు, లాడ్జీల వంటివి ప్రమాదాన్ని పెంచుతున్నాయి. ఇటీవల ప్రమాదం జరిగిన ధరాలిలో 1996లో నాలుగు భవనాలే ఉన్నాయి. ఇప్పుడక్కడ ఎటు చూసినా ఇళ్లు, లాడ్జీలు, దుకాణాలు, హోటళ్లు, రిసార్టులే! పైగా వాటన్నింటినీ వాలు ప్రాంతాల్లో నిర్మించారు! ఇది అత్యంత ప్రమాదకరమని హిమాలయాల్లో ప్రాకృతిక విపత్తులను అధ్యయనం చేస్తున్న జర్మనీ శాస్త్రవేత్త వోల్ఫ్గ్యాంగ్ ష్వాంగ్హార్ట్ తెలిపారు. అటవీ నిర్మూలన 2013లో కేదార్నాథ్ వరదల తర్వాత ఉత్తరాఖండ్ల నదీతీరాల వెంబడి నిర్మాణాలను నిషేధించారు. తర్వాత దాన్ని బేఖాతరు చేస్తూ భవనాలు, హోటళ్లను పునరి్నర్మించారు. పైగా జలవిద్యుత్ ప్రాజెక్టులు, జాతీయ రహదారుల ప్రాజెక్టుల కోసం పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఝాలా–జంగ్లా మార్గంలో ‘చార్ ధామ్ పరియోజన’లో భాగంగా ఏకంగా 6 వేల హిమాలయ దేవదారు వృక్షాలను నరికేశారు. ఇందులో 10 కి.మీ. పరిధిలో నిషేధాలు నిషిద్ధం! దేవదారు వృక్షాల నరికివేత వల్ల వాలు ప్రాంతాలు అస్థిరమవుతాయని నిపుణులు హెచ్చరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫోన్ల రిక'వర్రీస్'
వేలు కాదు.. లక్షలు పోసి ఫోన్ కొంటున్నాం. ఎడాపెడా వాడేస్తున్నాం. అంతేనా? అన్ని సెక్యూరిటీ ఫీచర్స్ ఎనేబుల్ చేస్తాం. డేటాని బ్యాకప్ పెట్టేస్తున్నాం. కానీ, అనుకోకుండా ఫోన్ పోతే? ఏముందీ.. రికవర్ చేసేయొచ్చులే అనుకుంటే మీది ఓవర్ కాన్ఫిడెన్సే. ఎందుకంటే.. పోయిన ఫోన్ల రికవరీ రేట్ మీరు అనుకునేంత స్థాయిలో లేదు. దేశ రాజధాని ఢిల్లీనే అందుకు సాక్ష్యం. అక్కడ పోగొట్టుకున్న ఫోన్ల రికవరీ రేటు ఎంతో తెలుసా? 1.87%. అంటే.. వంద ఫోన్లు పోతే.. ఒకటో రెండో రికవర్ చేస్తున్నారట. దేశ రాజధానిలో పరిస్థితి సరే, మరి మన దగ్గర ఎలా ఉంది?– సాక్షి, స్పెషల్ డెస్క్ఫోన్ పోగానే ముందుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇస్తాం. ట్రాక్ చేస్తారులే అని భరోసాతో ఎదురు చూస్తాం. కానీ, పోయిన ఫోన్లు దొరికే అవకాశం చాలా తక్కువ అని గణాంకాలు చెబుతున్నాయి. జాతీయ స్థాయిలో సగటున 100 ఫోన్లు పోతే 25 ఫోన్లనే తిరిగి తీసుకురాగలుగుతున్నారట. టెలికమ్యూనికేషన్ల శాఖకు చెందిన సంచార్ సాథీ పోర్టల్ చెబుతున్న వాస్తవాలివి. ఢిల్లీలో మొత్తంగా 8.22 లక్షలకు పైగా ఫోన్లను బ్లాక్ చేశారు. కానీ, వాటిలో తిరిగి దొరికినవి కేవలం 9,871 మాత్రమే. ఈ తక్కువ రికవరీ జాబితాలో పంజాబ్, బిహార్ ఉన్నాయి. జాతీయ స్థాయిలో 36.35 లక్షలకుపైగా ఫోన్లను బ్లాక్ చేస్తే.. ట్రేస్ చేసినవి 22.14 లక్షలు. రికవరీ చేసినవి 5.45 లక్షలు. రికవరీ రేటు 24.5 శాతం. అంటే 100లో 25 ఫోన్లు మాత్రమే రికవరీ అవుతున్నాయన్నమాట. ఈ గణాంకాల విషయంలో యూజర్లు కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా ఎందుకీ అలసత్వం అంటూ సోషల్ మీడియా వేదికలపై అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.మన పరిస్థితేంటి?తెలంగాణలో 3.76 లక్షల ఫోన్లు బ్లాక్ చేస్తే.. ట్రేస్ చేసినవి 2.13 లక్షలు. వాటిలో 91,306 ఫోన్లు రికవరీ అయ్యాయి. అంటే, రికవరీ రేటు 42.8%. ఆంధ్రప్రదేశ్లో 1.26 ఫోన్లు బ్లాక్ చేస్తే.. 79వేలకుపైగా ట్రేస్ చేయగలిగారు. తిరిగి తీసుకొచ్చినవి 31,478. రికవరీ రేటు 39.66% శాతం. మరోవైపు సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్న ప్రకారం.. రికవరీ ఫోన్లను పోలీసులు రాబట్టే క్రమంలో కొందరు అమాయకులు బయటపడుతున్నారు. ఎవరా అమాయకులు అంటే.. దొంగిలించిన ఫోన్ ని కొన్నవాళ్లు. చాలా తక్కువ ధరకే దొరుకుతుందని ఆన్ లైన్, ఆఫ్లైన్ మార్కెట్లలో అనధికారికంగా ఇలాంటి ఫోన్లు కొంటున్నారు. పోలీస్ స్టేషన్లకు పార్సిళ్లుపోలీసు స్టేషన్లు అంటే ఫిర్యాదులు, విచారణలు, కేసులు. కానీ, కొన్ని స్టేషన్లకు ఇటీవల విచిత్రమైన పార్సిళ్లు వస్తున్నాయి. అవేంటో తెలుసా..దొంగిలించిన మొబైల్ ఫోన్లు. వాటిని కొనుక్కున్న కొత్త యజమానులు వాటిని తిరిగి పోగొట్టుకున్న వారికి పంపేందుకు పోలీస్ స్టేషన్లకు కొరియర్ చేస్తున్నారట. అంతలా స్వచ్ఛందంగా ఎందుకు పంపుతున్నారనేగా మీ సందేహం? ఎందుకంటే.. ఈ చిత్రమైన ట్రెండ్ వెనుక ఒక కొత్త టెక్నాలజీ ఉంది. దానిపేరే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్). ఫోన్ల దొంగతనాల్ని కట్టడి చేసేందుకు టెలికమ్యూనికేషన్స్ విభాగం సీఈఐఆర్ పోర్టల్ను ప్రారంభించింది. ఫోన్ పోగొట్టుకున్నవారు ఐఎంఈఐ నంబర్ సాయంతో.. ఈ పోర్టల్ ద్వారా ఆ ఫోన్ని బ్లాక్ చేయొచ్చు. దీంతో ఆ ఫోన్ దేశంలో ఎక్కడున్నా.. ఏ నెట్వర్క్పైనా పనిచేయకుండా పోతుంది. అంటే అది దొంగల చేతిలో ఉన్నా పనికిరాదన్నమాట. అందుకే అలాంటి ఫోన్లు పోలీస్ స్టేషన్లకు పార్సిళ్లుగా వెళ్తున్నాయి.స్వచ్ఛందంగా డిస్కనెక్ట్ కావాల్సిన ప్రూఫ్లతో విచ్చలవిడిగా సిమ్ కార్డులు తీసుకుని వాడేసిన రోజులు దాటుకుని.. నా పేరు మీద ఏదైనా నంబర్లు ఇంకా యాక్టివ్గా ఉన్నాయా? అని మనమే వెతుక్కునే రోజులకి వచ్చాం. అందుకు కారణం లేకపోలేదు. ఫేక్ ప్రూఫ్లు, దొంగిలించిన సిమ్లతో సైబర్ క్రై మ్లకు పాల్పడుతున్న సంఘటనలు అనేకం. ఈ నేపథ్యంలో చాలా మంది యూజర్లు స్వచ్ఛందంగానే వారి పేరు, అడ్రస్ ప్రూఫ్తో ఉన్న ఫోన్ నంబర్లను వెతికి ‘సంచార్ సాథీ’ పోర్టల్ ద్వారా బ్లాక్ / డిస్కనెక్ట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి మొబైల్ కనెక్షన్ల సంఖ్య 1.07 కోట్లు. -
హ్యూమనాయిడ్ రోబోలు ఆటగాళ్లు.. అమ్మలు..
హ్యూమనాయిడ్ రోబోలు.. అచ్చం మనలానే ఉండే, ఆలోచించగలిగే రోబోలు. ఇవి మన జీవితంలో భాగమైపోయే రోజులు మరెంతో దూరంలో లేవు. చైనాలో జరుగుతున్న రోబో గేమ్స్.. ఏకంగా గర్భం దాలుస్తున్న రోబో.. రోబోల షాపింగ్ మాల్లే ఇందుకు నిదర్శనం.రోబోల గేమ్స్చైనాలోని బీజింగ్లో ప్రపంచంలోనే మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబో గేమ్స్.. శుక్రవారం నుంచి 3 రోజులపాటు జరిగాయి. అమెరికా, జర్మనీ, జపాన్ వంటి 16 దేశాలకు చెందిన హ్యూమనాయిడ్ రోబో క్రీడాకారులు పాల్గొన్నారు.⇒ ఏయే క్రీడలు: ఫుట్బాల్, పరుగు పందేలు, మార్షల్ ఆర్ట్స్, డ్యాన్స్, టేబుల్ టెన్నిస్, బాస్కెట్ బాల్, ఔషధాలు వేరు చేయడం, వస్తువులను జాగ్రత్తగా తీసుకోవడం, క్లీనింగ్ సేవలు వగైరా⇒ ఎన్ని టీములు: 280⇒ మొత్తం ఎన్ని రోబోలు: సుమారు 500కుపైగా⇒ టికెట్ ధర: సుమారు రూ.1,600 నుంచి రూ.7,000 వరకు⇒ విశేషాలు: ఒక ఫుట్బాల్ మ్యాచ్లో నాలుగు రోబోలు ఒకరినొకరు ఢీకొట్టి పడిపోయాయట. లేవలేకపోతుంటే.. వాటిని నిర్వాహకులు లేపుతుంటే చూసిన వాళ్లంతా తెగ నవ్వుకున్నారట. 1500 మీటర్ల పరుగు పందెంలో మరో రోబో పరిగెడుతూ పరిగెడుతూ హఠాత్తుగా పడిపోయిందట. ‘చార్జింగ్ అయిపోయిందేమో’ అని తెగ జోకులు వేసుకున్నారట. విజేత సుమారు 6.29 నిమిషాల్లోనే గమ్యం చేరుకుందట. ఈ విభాగంలో మనుషుల వరల్డ్ రికార్డు 3.26 నిమిషాలట.⇒ ముక్తాయింపు: ఏతావాతా తేలిందేంటంటే.. ఈ హ్యూమనాయిడ్లు పూర్తిస్థాయిలో తమంతట తాము పనిచేయలేకపోయాయట. మనుషుల సాయం కావాల్సి వచ్చిందట.ఏ పనైనా చేసిపెడతాయ్!రోబోలు బాబూ.. రోబోలు.. ఇళ్లు తుడిచి, బట్టలు ఉతికే రోబోలు.. మీ దుకాణంలో నమ్మకంగా, సమర్థంగా పనిచేసే రోబోలు.. ఇలాగే అమ్ముతూ ఉంటారేమో అక్కడ.⇒ ఎక్కడ: బీజింగ్లో.. ప్రపంచంలోనే మొట్టమొదటి రోబో షాపింగ్ మాల్ తెరిచారట. అక్కడి హైటెక్ ఈ–టౌన్ డిస్ట్రిక్ట్లో ఈ మాల్లో 100 రకాల రోబోలు అమ్మకానికి పెట్టారట.⇒ కనీస ధర: సుమారు రూ.25వేలు. గరిష్టంగా లక్షల నుంచి కోట్ల వరకు ఉందట. ⇒ ఆకర్షణ: అల్బర్ట్ ఐన్స్టీన్ను పోలిన హ్యూమనాయిడ్. దీని ధర 97,000 డాలర్లు... అంటే రూ.85 లక్షలే. ⇒ ఏం చేస్తాయి?: వంట, కాఫీ తయారీ, పెయింటింగ్, ఆటలు వగైరా.రోబో గర్భిణిఇక భవిష్యత్తులో ఆడవాళ్లే గర్భం దాల్చాలన్న అవసరం ఉండకపోవచ్చు. దానికీ మేమున్నాం అంటూ హ్యూమనాయిడ్ రోబోలు వచ్చేస్తున్నాయి.⇒ ఎవరు?: సింగపూర్లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ జాంగ్ కిఫెంగ్ ప్రపంచంలోని మొట్టమొదటి గర్భిణి రోబోను రూపొందించారు.⇒ ఎలా?: మహిళలు ఎలాగైతే 9 నెలలూ గర్భం మోసి బిడ్డలను కంటారో ఈ రోబో కూడా అలాగే చేస్తుంది. ⇒ ఏంటిది?: ఇదంతా పూర్తిగా కృత్రిమ గర్భ సాంకేతికత. రోబో కడుపులో దీన్ని ఏర్పాటుచేస్తారు. ఇందులో బిడ్డ ఎదగడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేశారట. మహిళల్లో ఉమ్మనీరు ఎలా ఉంటుందో.. ఇందులోని అలాంటి ద్రవాన్నీ ఉంచారట. ఈ సాంకేతికత ఇప్పటికే పరిణత దశలో ఉంది. దీన్ని రోబో గర్భంలో ప్రవేశపెట్టడమే మిగిలి ఉందట.కొత్తదా? అయితే ఇదేమీ కొత్తది కాదని జాంగ్ అంటున్నారట. గతంలో అపరిపక్వ దశలో ఉన్న గొర్రె పిల్లను ఇలాంటి కృత్రిమ గర్భంలోనే పెట్టి, ఒక పిల్లను సృష్టించారట. అది బతికే ఉందనీ.. ఇదీ అలాంటి ప్రక్రియే అంటున్నారాయన.⇒ ఎప్పటికి?: వచ్చే ఏడాదికి సిద్ధమైపోతుందట. ⇒ ధర: సుమారు రూ.12.96 లక్షలు⇒ భవిష్యత్తు: ఇదే నిజమైతే.. ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఊహించడం కష్టం. ఎందుకంటే.. మహిళలకు ఇక, గర్భధారణ కష్టమే ఉండదు. ఇక, ఎంతమంది పిల్లలనైనా రోబోలు కనొచ్చు. ఎవరి అండం, వీర్య కణాలతోనైనా రోబోల్లో ప్రవేశపెట్టి పిల్లలను పుట్టించవచ్చు. ఏమో.. ఏం జరుగుతుందో.. వేచి చూడాల్సిందే. -
నా దేశం.. శత్రుదుర్భేద్యం!
శ్రీకృష్ణుడి ఆయుధమైన సుదర్శన చక్రం స్ఫూర్తితో.. దేశానికి భద్రతా కవచాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 15న ప్రకటించారు. దీంతో ప్రపంచదేశాల దృష్టి ఒక్కసారిగా మనపై పడింది. నిజమే.. రక్షణ రంగంలో ఇప్పుడున్నది ఒకప్పటి భారత్ కాదు. గత పదేళ్లలోనే రక్షణ రంగంలో ఉత్పత్తుల విలువ పెరగడం.. దిగుబడులు తగ్గడమే ఇందుకు నిదర్శనం. అప్పట్లో మన ఆయుధాల్లో 65 శాతం దిగుమతులే. అది ఇప్పుడు 35 శాతానికి పరిమితం చేయగలిగాం. ‘మేడిన్ ఇండియా’ ఆయుధాలతో మన సత్తా ఏంటో ఇటీవలే ‘ఆపరేషన్ సిందూర్’తో ప్రపంచానికి చాటాం. – సాక్షి, స్పెషల్ డెస్క్త్వరలో దేశానికి సుదర్శన చక్ర రక్షణ వ్యవస్థ రానుంది. ఇందులో భాగంగా దేశంలోని కీలక ప్రాంతాలను గగనతల దాడుల నుంచి రక్షించేలా బహుళ అంచెల కవచాన్ని ఏర్పాటు చేయనున్నారట. అంతేకాదు, ప్రతిదాడి వ్యవస్థను కూడా రూపొందిస్తారు. యాంటీ బాలిస్టిక్ మిసైల్ సిస్టం వంటి వాటితో ఇది ఇజ్రాయెల్ ఐరన్డోమ్ తరహాలో పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది రక్షణ ఉత్పత్తుల్లో మన దేశం స్వయం సమృద్ధి దిశగా పయనిస్తోందనడానికి ప్ర‘బల’ నిదర్శనం. ఉత్పత్తుల్లో రికార్డు2013–14లో దేశ రక్షణ రంగ బడ్జెట్ రూ.2.53 లక్షల కోట్లు. 2025–26లో అది 2.6 రెట్లు పెరిగి రూ.6.81 లక్షల కోట్లకు చేరింది. 2024–25లో మనదేశం రికార్డు స్థాయిలో రూ.2.09 లక్షల కోట్ల విలువైన 193 డిఫెన్స్ కాంట్రాక్టులు కుదుర్చుకుంది. ఇందులో రూ. 1.69 లక్షల కోట్ల విలువైన 177 కాంట్రాక్టులు దేశీయ సంస్థలవే కావడం గమనార్హం. 2014–15లో దేశ రక్షణ ఉత్పత్తుల విలువ రూ.46,429 కోట్లు. 2024–25లో ఇది రికార్డు స్థాయిలో రూ.1.50 లక్షల కోట్లకు చేరిందని ఇటీవల కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. అంటే మూడు రెట్లకుపైగా పెరిగింది! 2019–20లో ఇది కేవలం రూ.79,071 కోట్లే. అంటే 5 ఏళ్లలోనే దాదాపు రెట్టింపయిందన్నమాట. ఎగుమతుల జోరు» 2013–14లో రూ.686 కోట్లుగా ఉన్న మన రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు.. 2024–25 నాటికి ఏకంగా 34 రెట్లు పెరిగి రూ.23,622 కోట్లకు చేరాయి. ఈ ఎగుమతుల్లో రక్షణ రంగ సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థల వాటా 77 శాతం కాగా.. ప్రైవేటు రంగ వాటా 23 శాతం కావడం విశేషం. వీలైనంత త్వరలో రక్షణ పరికరాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. మనదేశ రక్షణ ఉత్పత్తులు అమెరికా, ఫ్రాన్స్ వంటి 100 దేశాలకు వెళ్తున్నాయి. అమెరికా వాటా 10% లోపే!గత దశాబ్దకాలంలో మనదేశ రక్షణ దిగుమతులు తగ్గుతూ వస్తున్నాయి. మనకు ప్రధాన ఎగుమతిదారులు రష్యా, ఫ్రాన్స్. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిప్రి) గణాంకాల ప్రకారం.. » మన మొత్తం దిగుమతుల్లో సుమారు 40 శాతం రష్యా నుంచే వస్తున్నాయి. » 2020లో ఫ్రాన్స్ నుంచి దిగుమతులు 25 శాతానికిపైగా ఉంటే.. 2021లో ఏకంగా 50 శాతానికి పెరిగాయి. ఆతరవాత తగ్గుతూ 2024లో సుమారు 15 శాతానికి పరిమితమయ్యాయి.» మొత్తం దిగుమతుల్లో ఇజ్రాయెల్ నుంచి 2022 వరకు 10 శాతంగానే ఉన్న వాటా.. 2023లో ఒక్కసారిగా 40 శాతానికి చేరింది. 2024లో అది సుమారు 28 శాతానికి చేరింది. » 2020 నుంచి చూస్తే అమెరికా వాటా ఎప్పుడూ 20 శాతం కూడా దాటలేదు. ప్రస్తుతం 10 శాతంలోపే ఉంది.ఆ మూడు దేశాలే..మనదేశానికి యుద్ధ విమానాల సరఫరాలో ఫ్రాన్స్ కీలకపాత్ర పోషిస్తోంది. 2020–25 మధ్య రికార్డు స్థాయిలో 2,543 సరఫరా చేయగా, రష్యా నుంచి 1,280 దిగుమతి చేసుకున్నాం. ఇక మిసైళ్ల విషయానికొస్తే రష్యా నుంచి 1,149, ఇజ్రాయెల్ నుంచి 802 వచ్చాయి. శత్రువుల దాడులను తట్టుకోగలిగే దుర్భేద్యమైన రక్షణ వాహనాలు రష్యా నుంచి మాత్రమే 963 వచ్చాయి. గగన తల భద్రతా వ్యవస్థలు రష్యా నుంచి 390, ఇజ్రాయెల్ నుంచి 376 వచ్చాయి. ఫ్రాన్స్ నుంచి 899, రష్యా నుంచి 304 షిప్స్ దిగుమతి చేసుకున్నాం. ఏయే ఆయుధాల కోసం ప్రధానంగా ఏయే దేశాలపై ఆధారపడుతున్నామంటే..విమానాలు: ఫ్రాన్స్, రష్యా, అమెరికాగగనతల రక్షణ వ్యవస్థలు: రష్యా, ఇజ్రాయెల్దుర్భేద్యమైన రక్షణ వాహనాలు: రష్యామిసైళ్లు: రష్యా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్సెన్సర్లు: ఇజ్రాయెల్, జర్మనీ, ఫ్రాన్స్షిప్స్ : ఫ్రాన్స్, రష్యా -
పుతిన్ పైచేయి!
ఉక్రెయిన్పై దురాక్రమణ దండయాత్ర మొదలెట్టాక రష్యా అధ్యక్షుడు పుతిన్కు అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అమెరికాసహా పలు దేశాల నుంచి అంతర్జాతీయ ఆంక్షలు, యుద్ధ నేరాలకు పాల్పడ్డారంటూ అరెస్ట్ వారెంట్లు, సైబర్ దాడులతో శత్రుదేశాలు చుట్టుముట్టినా ఏమాత్రం బెదరక పుతిన్ తన తిరుగులేని ఆధిపత్యాన్ని ట్రంప్ సమక్షంలోనే ప్రదర్శించి రష్యాకు ఎదురులేదని నిరూపించారు. సంయుక్త ప్రకటన సమయంలోనూ ట్రంప్ కంటే ముందే మాట్లాడి తన వాదనను మొదటే గట్టిగా వినిపించారు. దాదాపు 13 నిమిషాలపాటు సంయుక్త ప్రకటన చేస్తే అందులో అగ్రభాగం 8 నిమిషాలు పుతినే మాట్లాడాడు. దాంతో ట్రంప్ చివర్లో మమ అనిపించి ప్రసంగాన్ని ముగించారు. ట్రంప్తో భేటీ పర్వంలో అడుగడుగునా పుతిన్ తన పైచేయిని ప్రదర్శించడం విశేషం.ఎర్రతివాచీ స్వాగతంలో తొలి గెలుపు ఉక్రెయిన్తో శాంతి ఒప్పందం కుదుర్చు కోకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలను స్వీకరించిన ట్రంప్ నుంచే స్వయంగా రెడ్కార్పెట్ సాదర స్వాగతాన్ని పొంది పుతిన్ తన రష్యాకు అంతర్జాతీయంగా ప్రభ ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు. ఉక్రెయిన్ యుద్ధంలో లక్షలాది మంది అమాయక ఉక్రెయిన్ పౌరుల ప్రాణాలను బలితీసుకున్నారన్న అపవాదు ఉన్న దేశాధ్యక్షునికి అలస్కా ఎయిర్పోర్ట్లో సాధారణ స్వాగతంతో ట్రంప్ ముగిస్తే సరిపోయేది. కానీ అత్యంత ఆప్తుడైన మిత్రుడు తరలివస్తే ఎంతగా ప్రేమతో ఆహా్వనం పలుకుతామో అదేతరహాలో పుతిన్కు ట్రంప్ ఎర్రతివాచీ పరిచి మరీ సాదరంగా ఆహా్వనించారు. ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించినప్పుడు కూడా సమహోదా ఉన్న ట్రంప్ స్వయంగా వెళ్లి ఎయిర్పోర్ట్లో స్వాగతం పలకలేదు. కానీ యుద్ధనేరారోపణలు ఎదుర్కొ ంటున్నాసరే స్వయంగా ట్రంప్ వెళ్లి పుతిన్కు స్వాగతం పలకడం ద్వారా అగ్రరాజ్యాధినేతకు తాను ఏమాత్రం తీసిపోనని పుతిన్ బహిరంగంగా నిరూపించారు. ఉక్రెయిన్ మొదలయ్యాక దౌత్యపరంగా, ఆర్థికంగా, ఆంక్షల పరంగా రష్యా ఏకాకిగా తయారైందని పశి్చమదేశాల మీడియా చెబుతున్నదంతా ఒట్టిమాటలేనని, అమెరికా దృష్టిలో పుతిన్ ఇప్పటికీ అత్యంత ప్రభావవంతమైన, శక్తివంతమైన ప్రపంచనేత అని రుజువైంది. ట్రంప్తో సోదరభావంతో మెలగడం, కరచాలనం, ఒకే కారులో ప్రయాణించడం ద్వారా తానూ ట్రంప్ ఒకేస్థాయి అని పుతిన్ అందరికీ స్పష్టంగా అర్థమయ్యేలా చేశారు.కాల్పుల విరమణ.. గప్చుప్ ఉక్రెయిన్తో దాడులు ఆపి కాల్పుల విరమణను అమల్లోకి తేవడమే ఈ భేటీ ప్రధాన లక్ష్యం. అలాంటి కీలక ‘కాల్పుల విరమణ’పదాన్ని మాటవరసకైనా ట్రంప్ ప్రస్తావించకుండా పుతిన్ విజయవంతంగా కట్టడిచేశారు. మేమే ‘ఆ మార్గం’లో ఇంకా పయనించలేదు. అక్కడి దాకా వెళ్లేందుకు ఇంకొన్ని అవరోధాలను అధిగమించాల్సి ఉంది అని మాత్రమే ట్రంప్ వ్యాఖ్యానించారుగానీ ‘కాల్పుల విరమణ’అనే పదం పలకడానికి కూడా ఆయన సాహసించలేదు. తద్వారా పుతిన్ తన కనుసన్నల్లో, తాను అనుకున్నదే భేటీలో జరిగేలా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. పాక్షిక విజయం కూడా సాధించని ట్రంప్ ఈ భేటీలో మా ప్రతిపాదనలకు పుతిన్ ఒప్పుకోకపోతే రష్యాపై మరోదఫా ఆంక్షలు విధిస్తానని రెండ్రోజుల ముందు ట్రంప్ చేసిన భీష్మప్రతిజ్ఞ ఉత్తిదేనని తేలిపోయింది. ఎలాంటి తుది నిర్ణయాలు తీసుకోకుండానే భేటీ ముగిసినా సరే ట్రంప్లో ఎలాంటి నిరసన, ఆందోళన కనిపించలేదు. పైగా పుతిన్ చేసిన మాస్కో పర్యటన ప్రతిపాదనకు ట్రంప్ సంతోషం వ్యక్తంచేయడం విచిత్రం. పైగా తాము అనుకున్న ఫలితాలు రాకపోయినా ట్రంప్.. పుతిన్తో చర్చలు సానుకూలంగా సాగాయని విరుద్ధమైన ప్రకటన చేయడం గమనార్హం. దీంతో భేటీపై ట్రంప్కు ఎలాంటి పట్టు సాధించలేకపోయారని అర్థమవుతోంది. భేటీ జరుగుతున్నాసరే రష్యా దాడులుచేసేలా పుతిన్ ఆదేశాలిచ్చి తన మొండి వైఖరిని మరోసారి చూపించారు. శాంతి చర్చలను వాణిజ్య చర్చలుగా మార్చిన పుతిన్ యుద్ధం ఆపాలన్న డిమాండ్తో ముందుకొచి్చన అమెరికాను వాణిజ్యచర్చలకు బలవంతంగా పుతిన్ కూర్చోబెట్టినట్లు ఈ భేటీ తర్వాత ప్రసంగాన్ని చూస్తే అర్థమవుతోంది. ‘‘వాణిజ్యం, డిజిటల్, హై–టెక్, స్పేస్ వంటి రంగాల్లో అమెరికా–రష్యా పెట్టుబడులు, వాణిజ్య సహకారం మరింతగా బలపడనుంది. ఆర్కిటిక్లోనూ సహకారం బాగుంది’’అని సంబంధంలేని విషయాలనూ పుతిన్ చెప్పుకొస్తున్నా ఆయనను అడ్డుకోవాల్సిందిపోయి ట్రంప్ ఆయనకు వంతపాడటం విచిత్రం. పుతిన్తోపాటు ట్రంప్ ఆ తర్వాత గొంతు కలుపుతూ.. ‘‘రష్యా వ్యాపార భాగస్వాములు మాతో వాణిజ్యానికి ఉవి్వళ్లూరుతున్నారు’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. తద్వారా శాంతి చర్చలను పుతిన్ విజయవంతంగా వాణిజ్యచర్చలుగా మార్చేశారు. పదికి పది.. కానీ సున్నా సమావేశం ముగిశాక ఈ భేటీలో పూర్తి సత్ఫలితాలను సాధించామని, 10/10 మార్కులు కొట్టేశానని ట్రంప్ చేసిన వ్యాఖ్యానాల్లో పిసరంతైనా నిజం లేదని తేలిపోయింది. వాస్తవానికి ఆ పది మార్కులు పుతిన్ దోచేశారు. శాంతి ఒప్పందం దిశగా కనీసం ఒక్క షరతు విషయంలో పుతిన్ను ట్రంప్ ఒప్పించలేకపోయారు. ఎయిర్పోర్ట్లో ట్రంప్తో కరచాలనం, రెడ్కార్పెట్ స్వాగతం, ట్రంప్ కలిసి మీడియాకు ఫొటోలకు పోజులు, కలిసి కారులో ప్రయాణం, దారి పొడవునా కారులో నవ్వులు, భేటీ సందర్భంగా తమ వాదనను గట్టిగా వినిపించడం, సంయుక్త ప్రకటన వేళ తొలుత మాట్లాడం సహా ప్రతి సందర్భంలోనూ పుతిన్ పైచేయి సాధించారు. సాధారణంగా ఇతర దేశాల నేతలు మాట్లాడేటప్పుడు హఠాత్తుగా కల్గజేసుకుని, వెటకారంగా మాట్లాడి వారిని అవమానించే ట్రంప్.. ఈసారి మాత్రం పుతిన్ మాట్లాడేటప్పుడు మౌనంగా ఉండటం గమనార్హం. యుద్ధం, శాంతి, ఉక్రెయిన్ ప్రాంతాల దురాక్రమణ, కాల్పుల విరమణ వంటి కీలక పదాలను కనీసం ట్రంప్ ప్రస్తావించేందుకు సైతం సాహసించకపోవడం పుతిన్ దౌత్యవిజయంగా చెప్పొచ్చు. సొంత గడ్డపై జరిగిన భేటీలోనే నోరుమెదపని ట్రంప్ ఇక రష్యాలో జరగబోయే రెండో రౌండ్ భేటీలో ఏపాటి మాట్లాడతారనే అనుమానాలు బలపడుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గూగుల్ని అడిగేస్తూ..చెప్పింది చేసేస్తూ..
ఒకప్పుడు.. తేలికపాటి అనారోగ్య సమస్య వచ్చినా వైద్యుడి దగ్గరికో దగ్గరిలోని మెడికల్ షాపుకో వెళ్లేవాళ్లం. డాక్టర్ రాసినవో, మెడికల్ షాపువాళ్లు ఇచ్చినవో మందులు తెచ్చుకునేవాళ్లం. దగ్గరివాళ్లు ఇచ్చే ఆరోగ్య సలహా పాటించేవాళ్లం. ఇప్పుడు ఇంటర్నెట్ కాలం నడుస్తోంది. ఆరోగ్యం, శరీర సంరక్షణకు సంబంధించి ప్రజల ప్రవర్తన, ప్రాధాన్యతలు ఎంతలా మారాయంటే సమస్య వచ్చినప్పుడే కాదు ఆర్యోగంగా ఉండేందుకూ ఏం చేయాలో సింపుల్గా గూగుల్ను అడిగేస్తున్నారు! – సాక్షి, స్పెషల్ డెస్క్ఆరోగ్యానికి సంబంధించి కొన్ని సమస్యలు, అనుమానాలను.. ఇతరులతో చర్చించడానికి చాలామంది ఇష్టపడరు. అంతేకాదు, హాస్పిటల్కు వెళితే ఖర్చు అని వెనకడుగు వేసేవారూ ఉన్నారు. ఇంటర్నెట్ రాక, గూగుల్ సెర్చ్ ఇంజిన్ దైనందిన జీవితంలో భాగమయ్యాక ఇలాంటి వాళ్లందరికీ పెద్ద ఉపశమనం లభించినట్టు అయింది. చిన్న సమస్య తలెత్తినా, అనుమానం ఉన్నా, వేరొకరికి చెప్పలేనిదైనా.. ఒకరిపై ఆధారపడకుండా సింపుల్గా గూగుల్ని అడిగేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెటింగ్ డేటా, అనలిటిక్స్ కంపెనీ ‘కాంటార్’ రూపొందించిన ‘హెల్త్ అండ్ వెల్నెస్ ఇన్ ఇండియా’ నివేదికే ఇందుకు నిదర్శనం. హెల్త్, వెల్నెస్కు సంబంధించి 2024లో నెటిజన్లు గూగుల్లో వెతికిన 110 రకాలకుపైగా అంశాలను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించారు. ‘మన’ గూగుల్‘ఫలానా ఉత్పత్తి వాడాను, చాలా బాగా పనిచేసింది’. ‘ఫలానా పద్ధతి పాటించడం వల్ల పరిష్కారం దొరికింది’ అంటూ మన అనుకున్నవారిచ్చే సలహా పాటిస్తాం. మరి మన అని అనుకున్నవారు లేకపోతే? గూగుల్ను ఆశ్రయిస్తున్నారు! ప్రపంచవ్యాప్తంగా రోజుకు 850 కోట్ల వరకు గూగుల్ సెర్చెస్ నమోదవుతున్నాయంటే ఏ స్థాయిలో ఈ సెర్చ్ ఇంజిన్ ‘మన’ అయిందో అర్థం చేసుకోవచ్చు. భారత్ నుంచి గూగుల్లో నెలకు 1,200 కోట్ల విజిట్స్ నమోదవుతున్నట్టు సమాచారం. ఈ విషయంలో యూఎస్ తర్వాత రెండో స్థానం మనదే. అయితే సెర్చ్ ఇంజిన్ చూపించే ఉత్పాదనను ఎంత మంది కొన్నారు, రేటింగ్స్ ఏంటి, రివ్యూలు ఏం చెబుతున్నాయో తెలుసుకున్నాకనే యూజర్లు అడుగు ముందుకేస్తున్నారు. జాగ్రత్త అవసరంగూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్లను నమ్మి ఔషధాలు కొని, వాడేయటం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వైద్యుడు.. పేషెంట్ శరీర తత్వాన్ని పూర్తిగా తెలుసుకుని మందులు సిఫార్సు చేస్తాడు. కానీ గూగుల్ అలాకాదు.. సాధారణీకరించి మందులు చెప్పేస్తుంది. అందువల్ల గూగుల్ సలహాల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు.ఎక్కువగా సెర్చ్ చేసిన అంశాలు పోషకాలు–సప్లిమెంట్లు, ప్రత్యామ్నాయ వైద్యం, చర్మ సంరక్షణ, శారీరక దృఢత్వం, శరీర బరువు నిర్వహణ, మానసిక ఆరోగ్యం, మహిళల ఆరోగ్యం, నిద్ర, రోగనిరోధక శక్తి, అధునాతన వైద్యం, డీటాక్సిఫికేషన్ , దీర్ఘాయువు, బీ12 అధికంగా ఉండే ఆహారం, నడకకు ఉత్తమమైన షూ, సున్నిత చర్మానికి సౌందర్య సాధనాలు, చక్కెర లేని ఆహార పదార్థాలు.. వగైరా.టాప్–5 పోకడలునమ్మదగిన ఆరోగ్య పరిష్కారాలుప్రత్యక్షంగా కనిపించే, నమ్మకమైన ఫలితాలను వినియోగదారులు కోరుకుంటున్నారు. చర్మ సంరక్షణ, శరీర బరువు నిర్వహణ, వ్యాయామంపై 2.66 కోట్ల సెర్చులు నమోదయ్యాయి. 2023తో పోలిస్తే ఇవి 39% పెరిగాయి. చర్మ ఆరోగ్యానికి కొల్లాజెన్, మెరుగైన నిద్ర కోసం మెలటోనిన్, శక్తి కోసం ప్రీ–వర్కౌట్ సప్లిమెంట్స్ కోసం జనంలో ఆసక్తి పెరిగింది.క్లినికల్, స్వీయ–సంరక్షణసైన్ ్స ఆధారిత వెల్నెస్ ఎక్కువగా కోరుకుంటున్నారు. బరువు తగ్గించే జీఎల్పీ–1 మందులు, జ్ఞాపకశక్తి పెంచే సప్లిమెంట్లు, హార్మోన్ల ట్రాకింగ్ కోసం 1.46 కోట్ల శోధనలు జరిగాయి. 2023తో పోలిస్తే ఇవి 13 శాతం ఎక్కువ. అంతర్గత ఆరోగ్యం–బాహ్య శక్తిఅందం, మానసిక స్థితి, శరీర బరువు నిర్వహణ, వృద్ధాప్యం వంటి సమస్యలు.. పోషకాహారం, పేగు (గట్) ఆరోగ్యం, రోగనిరోధక శక్తితో ముడిపడి ఉన్నాయని చాలామంది భావిస్తున్నారు. ఈ తరహా సెర్చ్లు 1.45 కోట్ల వరకు జరిగాయి. చర్మం, జుట్టు ఆరోగ్యానికి సహకరించే ఔషధాలు, మల్టీవిటమిన్ లపై జనంలో ఆసక్తి పెరిగింది.ఆరోగ్యకర దినచర్యలురోజువారీ దినచర్యలు, ఆరోగ్య నిర్వహణలపై ప్రజల శ్రద్ధ పెరిగింది. 9% పెరుగుదలతో ఈ విభాగంలో 99 లక్షల శోధనలు నమోదయ్యాయి. హైడ్రేషన్, ఋతు చక్రం, ధ్యానం, యోగా వంటివి ట్రాక్ చేయడానికి సాంకేతికతను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మహిళలు నెలసరి సమస్యలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రత్యామ్నాయ వైద్యంఆయుర్వేదం, హోమియోపతి, ఆక్యుపంక్చర్, డిటాక్స్ టీ, బయోహ్యాకింగ్ వంటి వాటి గురించి 17% వృద్ధితో 87 లక్షల సెర్చ్లు జరిగాయి. (శాస్త్ర, సాంకేతికతల సాయంతో మన శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచుకోవడం లేదా ఆరోగ్యాన్ని మరింత మెరుగుపర్చుకోవడాన్ని బయో హ్యాకింగ్ అంటారు.)పోషకాలు–సప్లిమెంట్లువిటమిన్ బీ12 కోసం 27 లక్షల శోధనలు నమోదయ్యాయి. 2023తో పోలిస్తే ఇవి 54 శాతం ఎక్కువ కావడం గమనార్హం.చర్మ ఆరోగ్యంసున్నితమైన చర్మం కోసం సెర్చులు 30% పెరిగాయి.బరువు నిర్వహణజీఎల్పీ1 ఔషధాలైన ఓజెంపిక్ కోసం 216%, జెప్బౌండ్కు 943% అధికంగా సెర్చులు నమోదయ్యాయి.ఒత్తిడి తగ్గేందుకు కార్టిసాల్ కోసం శోధనలు 59% పెరిగాయి.మహిళల ఆరోగ్యంగతంతో పోలిస్తే.. రుతుచక్రంలోని దశల గురించి వెతకడం 100 శాతానికిపైగా పెరిగింది.నిద్రమెలటోనిన్ సంబంధిత స్ప్రే, గమ్మీలు, ట్యాబ్లెట్ల కోసం సెర్చులు 27% పెరిగి 45 లక్షలకు చేరుకున్నాయి. చక్కెరచక్కెర రహిత, చక్కెరకు ప్రత్యామ్నాయాల కోసం.. గతంలో కంటే 14 శాతం ఎక్కువగా 74 లక్షల శోధనలు జరిగాయి. -
‘రంగు’ భళా.. ఆరోగ్యం డీలా!
స్వీట్ షాపునకు వెళ్తే ప్రకృతిలోని అన్ని రంగులూ అక్కడే ఉన్నాయా అన్నట్టు ఉంటుందా దృశ్యం. రెస్టారెంట్ల విందు భోజనమూ ఇందుకు ఏమీ తీసిపోదు. పుత్తడిని తలదన్నేలా మెరిసే జిలేబీలు మొదలు.. కుంకుమ పువ్వు దట్టించినట్టు కనిపించే బిర్యానీల వరకు.. భోజన ప్రియుల జిహ్వకు నువ్వా నేనా అంటూ పోటీపడుతూ నోరూరించే రంగు రంగుల ఆహార పదార్థాల వెనుక ఉన్న రసాయనాలు ఇప్పుడు ప్రజల ఆరోగ్యానికి సవాల్ విసురుతున్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్ఇంటి వంటకాలైతే రోజులో కొన్ని రకాలే చేయగలం. అదే బయటి ఫుడ్ అయితే మనకు నచ్చినన్ని కొనుక్కోవచ్చు. ఇంటి పట్టున ఉండే ఆర్డర్ చేస్తే నిమిషాల్లోనే ఫుడ్ చేతికందుతోంది. జనంలో ఆహారపుటలవాట్లు మారడం, ఆదాయాలు పెరగడం బయటి ఫుడ్ వినియోగానికి ఆజ్యం పోస్తున్నాయి. రెస్టారెంట్, వీధి బండ్లపై విక్రయించే ఫుడ్కు జనం అలవాటు పడుతున్నారు కూడా. ఈ నేపథ్యంలో కస్టమర్లను ఆకట్టుకునేలా సింథటిక్ ఫుడ్ కలరెంట్స్ (ఎస్ఎఫ్సీ) వినియోగం అంతకంతకూ పెరుగుతోంది.పరిమితి మించితే ముప్పేసింథటిక్ ఫుడ్ కలరెంట్స్ వాడకం పరిమితికి మించితే ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఎనిమిది సింథటిక్ ఆహార రంగులను అనుమతిస్తోంది. ఆహార ఉత్పత్తిని బట్టి వీటి వినియోగ పరిమితులు ఉంటాయి. ఇవి నిర్దేశించిన పరిమితుల్లో ఉపయోగిస్తే ఎటువంటి సమస్యా లేదు. పరిమితికి మించి లేదా దీర్ఘకాలిక వినియోగమే ముప్పుగా పరిణమిస్తోంది. ముఖ్యంగా నియంత్రణ లేని అనధికారిక ఆహార విక్రేతల నుంచి కొనుగోలు చేసిన ఆహారమే ప్రమాదాలకు కారణం అవుతోందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, సున్నితత్వం ఉన్న వ్యక్తులు వీటికి దూరంగా ఉండడమే మేలని వారు సూచిస్తున్నారు.అవయవాలపైనా ప్రభావంఈ సింథటిక్ రంగులు వాడితే ఆహార పదార్థాలు ఆకట్టుకునేలా ఉంటాయి. వేడి, వెలుతురులోనూ రంగు స్థిరంగా ఉంటుంది. ధర కూడా తక్కువ. అందుకే ఆహార పదార్థాల విక్రేతలు వీటిని విరివిగా, పరిమితికి మించి ఈ రసాయన రంగులను వాడుతున్నారు. ఎంత పరిమాణంలో రంగులు వాడారన్న విషయమూ వినియోగదార్లకు తెలియదు. కొన్ని సింథటిక్ ఫుడ్ కలరెంట్స్ను దీర్ఘకాలం, అధికంగా తీసుకోవడం వల్ల పిల్లల్లో అధిక చురుకు వంటి ప్రవర్తనా సమస్యలు, అలర్జీ, లేదా అవయవాలు చెడిపోయే ప్రమాదమూ ఉందని అధ్యయనాలు చెబుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మెరుగైన పర్యవేక్షణకుతోడు ఈ రంగుల పట్ల ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరమూ ఉందని సూచిస్తున్నారు.అస్పష్టమైన సమాచారంప్యాక్ చేసిన ఆహార పదార్థాలలో వినియోగించిన సింథటిక్ రంగుల వివరాలను కంపెనీలు వెల్లడించిన తీరే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఐఎన్ ఎస్ 110, ఈ 129, అనుమతి పొందిన రంగు.. ఇలాంటి పేర్లతో కంపెనీలు రంగుల వివరాలను ప్యాక్లపై ముద్రిస్తాయి. సగటు భారతీయ వినియోగదారునికి ఇటువంటి సమాచారం అర్థం చేసుకోవడం కష్టం. వీధుల్లో, రోడ్లపై విక్రయించే స్నాక్స్, మిఠాయిలు, లేదా రెస్టారెంట్లలో విక్రయించే ఆహార పదార్థాల్లో వినియోగించే కృత్రిమ రంగుల వివరాలను తెలిపే విధానమే లేదు. దుకాణాల్లో అమ్మే వస్తువులన్నీ సురక్షితమన్న భావన చాలా మంది వినియోగదారుల్లో ఉంది. అయితే కొన్ని బ్రాండ్లు, రెస్టారెంట్లు శుభ్రమైన, మొక్కల ఆధారిత రంగులతో ఆహార పదార్థాలు రూపొందించడం శుభపరిణామం.రంగుల మాయకృత్రిమ రంగులు, వినియోగించే వస్తువులు, అధిక వాడకం వల్ల వచ్చే సమస్యలు1 టార్ట్రాజిన్ (ఈ 102/ఐఎన్ ఎస్ 102) వినియోగం: పసుపు వర్ణంలో ఉండే స్వీట్స్, చిప్స్, శీతల పానీయాలుసమస్యలు: పిల్లల్లో అధిక చురుకు, ఆస్తమా, చర్మ సమస్యలు2 సన్ సెట్ యెల్లో ఎఫ్సీఎఫ్ (ఈ 110/ఐఎన్ ఎస్ 110)వినియోగం: పచ్చళ్లు, పళ్లరసాలు, సాసెస్, బేకరీ ఉత్పత్తులుసమస్యలు: అలర్జీ, అధిక చురుకు, జీర్ణ సమస్యలు3 కార్మోయిసిన్ (ఈ 122/ఐఎన్ ఎస్ 122)వినియోగం: జెల్లీస్, జామ్స్, సిరప్స్, స్వీట్స్సమస్యలు: చర్మ సమస్యలు, అధిక చురుకు4 ఇండిగో కార్మిన్ (ఈ 132/ఐఎన్ ఎస్ 132) వినియోగం: ఐస్క్రీమ్స్, క్యాండీస్సమస్యలు: అలర్జీ, వికారం, అధిక రక్తపోటు5 పాన్సో 4ఆర్ (ఈ 124/ఐఎన్ ఎస్ 124) వినియోగం: కేక్స్, బిస్కట్స్లో కోటింగ్, డిజర్ట్స్, సాసులుసమస్యలు: ఆస్తమా, దద్దుర్లు6 బ్రిలియంట్ బ్లూ (ఈ 133/ఐఎన్ ఎస్ 133)వినియోగం: శీతల పానీయాలు, పాల పదార్థాలు, స్వీట్స్సమస్యలు: దద్దుర్లు, అలర్జీ, శ్వాస సమస్యలు7 ఎరిథ్రోసిన్ (ఈ 127/ఐఎన్ ఎస్ 127) వినియోగం: కాండీడ్ ఫ్రూట్స్, కేక్ టాపింగ్స్, చెర్రీస్సమస్యలు: థైరాయిడ్ సమస్యలు, డీఎన్ ఏకు నష్టం, అలర్జీఎఫ్ఎస్ఎస్ఏఐ తనిఖీలుసంవత్సరం పరిశీలించిన శాంపిళ్లు నాణ్యతా ప్రమాణాలు లేనివి పెట్టిన కేసులు 2024-25 1,94,116 34,388 31,407 -
శివుడిపైనే పరీక్షించి.. అలా విష్ణువు చేతికి చేరిన దివ్యాయుధం
వచ్చే పదేళ్లనాటికి దేశంలోని అన్ని ప్రధాన వ్యవస్థలకు రక్షణ కల్పించే సాంకేతిక ఆధారిత భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు పంద్రాగస్టు ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆ మిషన్కు శ్రీకృష్ణుడి స్ఫూర్తితో సుదర్శన చక్రగా పేరు పెడుతున్నట్లు చెప్పారు. హిందూ పురాణాల్లో అత్యంత శక్తివంతంగా భావించబడే.. పరమ పవిత్రమైనదిగా పూజలు అందుకునే సుదర్శన చక్రం శ్రీకృష్ణుడి చేతికి ఎలా చేరిందో తెలుసా?.. వామన, లింగ పురాణాల్లో సుదర్శన చక్రం కథ భాగాన్ని చూడొచ్చు. శ్రీదాముడు అనే రాక్షసుడు అహంకారంతో విర్రవీగుతూ దైవ శక్తులను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ ప్రయత్నంలో.. ధర్మ విరుద్ధంగా లక్ష్మీదేవిని వశపరచుకోవాలనుకుంటాడు. ఈ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు.. శ్రీమహావిష్ణువు పరమశివుడి శరణు వేడుతాడు. అయితే అప్పటికే కైలాసగిరిలో శివుడు యోగ తపస్సులో ఉంటాడు. దీంతో కార్తీక శుక్ల చతుర్దశి నాడు శివుడిని పూజించేందుకు విష్ణువు కాశీకి వెళ్తాడు. వెయ్యి బంగారు పద్మాలతో శివుడిని పూజించాలనుకుంటాడు విష్ణువు. అయితే విష్ణువుకు భక్తి పరీక్ష పెట్టాలని.. అందులో ఓ పద్మాన్ని శివుడు మాయం చేస్తాడు. దీంతో.. కమల నయనుడిగా పేరున్న నారాయణుడు తన కంటినే తామర పువ్వుగా శివుడికి సమర్పించేందుకు సిద్ధమవుతాడు.విష్ణువు భక్తిని చూసి శివుడు ఆనందించి.. శక్తివంతమైన ఆయుధం సుదర్శన చక్రాన్ని విష్ణువుకు బహుమతిగా ఇస్తాడు. ఆ సమయంలో.. ‘‘ధర్మ రక్షణ కోసం ఈ చక్రం రాక్షసులను నాశనం చేస్తుంది. మూడు లోకాల్లో దీనికి సాటి ఆయుధం లేదు’’ అని శివుడు చెబుతాడు. అయితే ఆ చక్రం శక్తిని పరీక్షించదలిచి.. తొలుత శివుడిపైనే ప్రయోగించే వరం కోరతాడు విష్ణువు. అందుకు శివుడు సంతోషంగా అంగీకరిస్తాడు. మహా విష్ణువు సంధించిన సుదర్శన చక్రం శివుని మూడు భాగాలుగా ఖండిస్తుంది. వెంటనే శివుడు ప్రత్యక్షమై.. ఈ చక్రం తన రూపాలను ఖండించగలిగింది గానీ తత్వాన్ని కాదని చెబుతాడు. సుదర్శన చక్రాన్ని శ్రీదాముడిని సంహరించేందుకు ఉపయోగించమని సూచిస్తాడు. మహావిష్ణువు అలాగే చేసి ధర్మాన్ని పరిరక్షిస్తాడు. మహావిష్ణువు అవతారం కాబట్టే ద్వాపర యుగంలో దుష్ట శిక్షణ కోసం సుదర్శన చక్రం శ్రీకృష్ణుడి చేతికి చేరింది.ఒక్కసారి సంధిస్తే..సూర్య భగవానుడి తేజస్సు కలిగిన సుదర్శన చక్రం హిందూ పురాణాలలో మహావిష్ణువు చేతిలోని అత్యంత శక్తివంతమైన ఆయుధం. ఇది అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానకాంతిని ప్రసరింపజేస్తుంది. అందుకే దీనిని సుదర్శనం అంటారు. రెండు వరుసల్లో పదునైన పళ్లతో గుండ్రటి ఆకారంలో ఉంటుంది. భక్తుల కంటిని ఇది ఆభరణమే. కానీ, ధర్మాన్ని రక్షించేందుకు దుష్టసంహారంలో శిక్షాయుధంగా ఇది ప్రయోగించబడింది. ఒక్కసారి సంధిస్తే.. లక్ష్యాన్ని పూర్తి చేసుకునేంత వరకు వెనక్కి రాదు. చక్రానికి ఉన్న ఆ ముళ్లు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో కదలడం వల్ల వేగంగా తిరుగుతూ వెళ్తుంది. ప్రపంచంలోని ఏవైనా పదార్థాలను అతి పదునైన అంచులతో తేలికగా కత్తిరించగలదని ప్రశస్తి. అయితే.. ఇది కేవలం ఆయుధం మాత్రమే కాదు.. భక్తి, ధర్మం, జ్ఞానానికి ప్రతీకగా నిలుస్తుంది. సుదర్శన చక్రాన్ని ధ్యానించడం వల్ల శాంతి, సౌఖ్యాలు చేకూరతాయని పురాణోక్తి.సుదర్శనోపనిషత్తు ప్రకారం.. సుదర్శన చక్రాన్ని దేవశిల్పి అయిన విశ్వకర్మ తయారుచేశాడు. విశ్వకర్మ తన కూతురు సంజనాను సూర్యునికిచ్చి వివాహం చేస్తాడు. అయితే సూర్యుని తేజస్సు మూలంగా ఆమె ఆయన్ని చేరలేకపోతుంది. ఇది గమనించిన విశ్వకర్మ.. సూర్యుని తేజస్సును తగ్గించడానికి సానపడతాడు. అప్పుడు రాలిన పొడితో.. పుష్పక విమానం, త్రిశూలం, సుదర్శన చక్రం తయారు చేశాడు.సుదర్శన చక్రం సంహారాలుశ్రీదాముడితో పాటు హిరణ్యాక్షుడు, సువర్ణాక్షుడు, విరూపాక్షుడు(శివుని మూడు ఖండాలు) అనే రాక్షసులను సుదర్శన చక్రం ద్వారా మహావిష్ణువు సంహరించినట్లు వామన పురాణంలో పేర్కొనబడింది. మహాభారత ఇతిహాసంలో.. శ్రీకృష్ణుడు నూరు పాపాలు చేసిన శిశుపాలుడిని సుదర్శన చక్రంతోనే సంహరించాడు. జరాసంధుడు, కంసుడు, నరకాసురుడు కూడా సుదర్శన చక్రంతోనే మరణించారు. ఇవేకాదు.. పురాణా ఇతిహాసాల్లో సుదర్శన చక్రం చుట్టూ అల్లుకున్న సందర్భాలు ఇంకెన్నో. అయితే.. సుదర్శన చక్రం భౌతికంగా ఇప్పుడు ఎక్కడ ఉంది?.. శ్రీకృష్ణుడు తన అవతారాన్ని ముగించిన తర్వాత సుదర్శన చక్రం తిరిగి విష్ణువుకు చేరిందని విశ్వాసం. ఇది భౌతికంగా కనిపించదుగానీ కాదు.. ఆధ్యాత్మికంగా విశ్వంలో ధర్మాన్ని కాపాడే శక్తిగా భావించబడుతోంది.అన్నమయ్య నోట.. తిరుమల బ్రహ్మోత్సవాల్లో చివరిరోజున సుదర్శన చక్రానికి చక్రస్నానంలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. ప్రముఖ వాగ్గేయకారుడు అన్నమయ్య సుదర్శన చక్రంపై ప్రత్యేకంగా కీర్తనలు రచించారు. అందులో “చక్రమా హరిచక్రమా” అనే పద్యం ప్రసిద్ధి పొందింది. విశాఖపట్నం శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో సుదర్శన చక్రానికి అంకితంగా “సుదర్శన హోమం” నిర్వహించబడుతుంటుంది. తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో కూడా సుదర్శన చక్రానికి ప్రత్యేకంగా ఆలయం ఉంది. -
గ్రేడ్ పేరెంట్స్ కాదు.. గ్రేట్ పేరెంట్స్!
పిల్లలు చక్కగా చదువుకుని, మంచి మార్కులు తెచ్చుకుని, పెద్ద ఉద్యోగం సంపాదిస్తే తల్లిదండ్రులకు ఎంత సంతోషం! నిజమే కానీ, కొన్నిసార్లు రేయింబవళ్లు కష్టపడి చదివినా కూడా పిల్లలు మంచి మార్కులు సాధించలేరు. అప్పుడు చూడాలి తల్లిదండ్రుల బాధ! ఆ బాధలో పిల్లల్ని కోప్పడతారు, అరుస్తారు. మాట్లాడ్డం మానేస్తారు. ఇతర పిల్లలతో పోల్చి మాట్లాడతారు. ఆ మాటకు పిల్లలు ఎంత బాధపడతారో ఆలోచించరు. కానీ ఇప్పుడీ పరిస్థితి క్రమంగా మారుతోంది! -సాక్షి, స్పెషల్ డెస్క్మార్కులు తగ్గినందుకో, పరీక్ష తప్పినందుకో తల్లిదండ్రులు కోపంతో ఊగిపోవటం అన్నది ప్రతి ఇంట్లోనూ ఉండేదే. అయితే ఇప్పుడిప్పుడు కొందరు పేరెంట్స్ పిల్లల తరఫున ఆలోచిస్తున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో పిల్లలు విస్తృతంగా షేర్ చేస్తున్న తమ అనుభవాలను బట్టి తెలుస్తోంది. కర్ణాటకలోని ఒక కుటుంబం.. బోర్డు పరీక్షల్లో ఆరు సబ్జెక్టుల్లోనూ ఫెయిల్ అయిన తమ కుమారుడుని ప్రోత్సహించడానికి నలుగుర్నీ పిలిచి ‘కేక్ కటింగ్’ చేశారు. కొడుకుని అక్కున చేర్చుకున్నారు. ‘ఈసారి వస్తాయిలే..!’తక్కువ మార్కులు వచ్చినందుకు అమ్మానాన్న తమని కొట్టకుండా, తిట్టకుండా ఎంత ప్రేమగా చూసుకున్నారో వెల్లడిస్తూ పిల్లలు సోషల్ మీడియాలో షేర్ చేసే కథనాలు స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయి. ఎన్ని మార్కులు వచ్చాయో తల్లిదండ్రులు పట్టించుకోవటం లేదు.. పిల్లల కష్టాన్ని అర్థం చేసుకుంటున్నారు. ‘ఈసారి మంచి మార్కులు వస్తాయిలే’ అని తల నిమురుతున్నారు. వారిలో ధైర్యం నింపుతున్నారు. పిల్లలు అప్పటికీ అదేపనిగా బాధపడుతుంటే వారి ధ్యాసను మళ్లించటానికి బయటికి తీసుకెళుతున్నారు. ఇది మంచి పరిణామంబోర్డు పరీక్ష ఫలితాల సమయంలో తమ తల్లిదండ్రులు తమకు ఎంతలా మద్దతు ఇచ్చారో చెబుతూ విద్యార్థులు సోషల్ మీడియాలో పంచుకుంటున్న అనుభవాలు బాగా వైరల్ అవుతున్నాయి. పరీక్షల సమయంలో తల్లిదండ్రులు వహించవలసిన పాత్ర ఏమిటన్న దాని గురించి సంభాషణలు కూడా మొదలయ్యాయి. అవి మిగతా తల్లిదండ్రులకు ఉపయోగకరంగా ఉంటున్నాయి. ఆ సంభాషణల్లో సైకాలజిస్టులు కూడా ఉత్సాహంగా పాలు పంచుకుంటున్నారు. ‘ఇది చాలా మంచి పరిణామం’ అంటున్నారు మనో వైజ్ఞానిక నిపుణులు.‘కేక్, పిజ్జా తెప్పించారు’ఇటీవల, పరీక్షల్లో 83 శాతం మార్కులు స్కోర్ చేసిన సీబీఎస్సీ 10వ తరగతి విద్యార్థిని సోషల్ మీడియాలో తన పేరెంట్స్ గురించి ఇలా షేర్ చేసుకుంది. ‘‘ఇంకొంచెం ఎక్కువ మార్కులు వచ్చి ఉంటే బాగుండేదని.. మా అమ్మ మొదట నిరాశపడింది. ఆ వెంటనే, బాగా స్కోర్ చేశావ్ అని సంతోషపడింది. నాన్న నన్ను దగ్గరకు తీసుకుని, ‘మార్కులకు, నిజ జీవితానికి సంబంధం ఉండదు. తక్కువ స్కోర్ చేసిన వారు కూడా గొప్ప జీవితాలను గడపొచ్చు’’ అని చెప్పారు. ఆ రోజు అమ్మానాన్న కేక్, నాకెంతో ఇష్టమైన పిజ్జా ఆర్డర్ చేశారు. నాకు తక్కువ మార్కులు వచ్చినప్పటికీ వారు నన్ను మనస్ఫూర్తిగా దగ్గరకు తీసుకున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను..’’ అని రాసింది. ‘ఇలాంటి చర్యలు పిల్లల్లో కాన్ఫిడెన్స్ను పెంచుతాయి’ అని ఆమె పోస్ట్ కింద ఒక సైకాలజిస్టు కామెంట్ పెట్టారు. ‘ముందే చెప్పేశా..’మరొక విద్యార్థిని, తక్కువ మార్కులు వచ్చినప్పుడు తన తల్లిదండ్రులు తనను ఎలా ఓదార్చారో గుర్తుచేసుకుంది. ‘‘కోప్పడితే పడనివ్వమని నా పేరెంట్స్కి మొదటే చెప్పేశాను. క్వొశ్చన్ పేపర్స్ అన్నీ కష్టంగా వచ్చాయి, సరిగా రాయలేదు, ఫెయిల్ అవుతాను అని చెప్పాను. ఆ క్షణం నుంచి, ఫలితాలు వచ్చే వరకు వాళ్లు అనుక్షణం నన్ను గమనిస్తూనే ఉన్నారు. ‘పోతే పోయిందిలే’ అని ధైర్యం చెబుతూ వచ్చారు. మొత్తానికి 62 శాతంతో పాసయ్యాను. అప్పుడు నాన్న నిరాశగా చూస్తూ అన్న మాట నాకు భలే నవ్వు తెప్పించింది. ‘అదేంట్రా ఫెయిల్ అవుతావని ఎన్నో ఆశలు పెట్టుకుంటే, ఇలా చేసేవేంటి!’ అన్నారు. అమ్మ కూడా నవ్వి నన్ను దగ్గరకు తీసుకుంది’ అని ఆ అమ్మాయి షేర్ చేసింది. ‘ఆంటీ, అంకుల్ సూపర్’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్ మీద కామెంట్లు!వెల్డన్ పేరెంట్స్» తల్లిదండ్రులలోని ఈ సానుకూల వైఖరిని విద్యావేత్తలు, మానసిక ఆరోగ్య నిపుణులు స్వాగతిస్తున్నారు. వాళ్లు ఇంకా ఏమంటున్నారంటే..» పిల్లలు మంచి మార్కులు తెచ్చుకున్నా, తెచ్చుకోలేకపోయినా వారు తమ శక్తి మేరకు కష్టపడ్డారని తల్లి దండ్రులు గుర్తించటం, వారిలో నిరుత్సాహం తలెత్తకుండా దగ్గరకు తీసుకోవటం మంచి విషయం.» పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమే.. పరీక్షలే జీవితం కాదు. ఒకసారి విఫలమైపోతే జీవితం అక్కడితో ఆగిపోదు. మార్చి పోతే సెప్టెంబర్ ఎప్పుడూ ఉంటుంది. మళ్లీ రాయొచ్చు.. ఉత్తీర్ణులు కావచ్చు. కానీ, జీవితం పోతే.. మళ్లీ రాదు.» పిల్లల్లో ఆత్మవిశ్వాసం పోతే మళ్లీ అంకురించడం అంత సులభం కాదు. తల్లిదండ్రులు పిల్లలను తిట్టేశాక.. గాయపడిన లేత మనసు కోలుకోవడం చిటికెలో జరిగిపోదు. అది ఈ తరం తల్లిదండ్రులు గ్రహిస్తున్నారు.» తల్లిదండ్రులు కూడా ఒకప్పుడు విద్యార్థులే. వాళ్లూ.. ఈ మార్కులు తక్కువ రావడాలు, ఫెయిలవడాలు.. అన్నీ చూసే ఉంటారు. కానీ, వాళ్లు చదివేటప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు పిల్లలకు తాము అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా, అంతంత డబ్బు వాళ్ల కోసం ఖర్చు చేస్తున్నా వారు రాణించకపోవడాన్ని చాలామంది తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది మారాలి.» కొంతమంది మాత్రం.. ఫెయిల్యూర్ జీవితాలను ఎలా మార్చిందో ప్రముఖుల జీవితాలను ఉదాహరణలుగా తమ పిల్లలకు చెబుతున్నారు. తద్వారా వారిలో ఆత్మవిశ్వాసం తగ్గిపోకుండా కాపాడుకుంటున్నారు.» తిట్టినంత మాత్రాన మార్కులు పెరగవు, ఫెయిలైనవారు పాసైపోరు అని తెలుసుకుంటున్నారు.» ఇతరులతో పోల్చినంత మాత్రాన.. ఉన్నపళంగా తమ బిడ్డలో మార్పు వచ్చేయదు. పిల్లలను మనమే నలుగురిలో చులకన చేస్తే వారు రేపు తలెత్తుకుని ఎలా తిరగగలరు అని ఆలోచిస్తున్నారు. -
కృష్ణం వందే జగద్గురుమ్
చాలామంది కృష్ణుడంటే అల్లరి, చిలిపితనం, మాయలు, మహిమలు... అనే అనుకుంటారు. కానీ కృష్ణుడంటే ఒక చైతన్యం. ఒక స్ఫూర్తి. ఎందుకంటే తానో రాజు కొడుకైనా సామాన్య గోపబాలురతో చెలిమి చేశాడు. అల్లరి పనులతో బాల్యాన్ని ఎలా ఆస్వాదించాలో చెప్పాడు. అంతేకాదు, యవ్వనంలో ఉండే చిన్న చిన్న సరదాలనూ చూపించాడు. బంధాలను నిలుపుకోవడంలో అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి, స్నేహం... ఏదైనా సరే పది కాలాల పాటు సరిగ్గా ఉండాలంటే ఏం చేయాలో వివరించాడు. భగవద్గీత ద్వారా ఈ సారాన్ని ప్రపంచానికి అందించాడు. నేడు కృష్ణాష్టమి సందర్భంగా ఆయన చెప్పిన ఆ పాఠాలను అర్థం చేసుకుందాం...స్నేహానికి ప్రాణంచిన్నప్పుడు గోపబాలురతో అరమరికలు లేకుండా హాయిగా ఆడుకున్న శ్రీ కృష్ణుడు స్నేహితులకు, శరణార్థులకూ మాట ఇచ్చాడంటే తప్పడం అన్నది లేదు. ‘కురుక్షేత్రంలో ఆయుధం పట్టను’ అని చెప్పాడు. ఆ మాట మీదే నిలబడ్డాడు. అంతేకాదు. అర్జునుడితో చుట్టరికం ఉన్నప్పటికీ అంతకు మించి ఆప్యాయతను చూపించాడు. శ్రీ కృష్ణుడు, కుచేలుడి గురించి ఎలా చెప్పుకుంటారో అదే విధంగా శ్రీకృష్ణుడు, అర్జునుడి బంధం గురించి కూడా మాట్లాడతారు. పాండవులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే అండగా నిలిచాడు. వారికి దిక్కుతోచనప్పుడు మార్గదర్శిగా మారాడు. యుద్ధంలో అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు. ఇవన్నీ కేవలం స్నేహం కోసం చేసినవే.ఒక భరోసా... ఒక నమ్మకంనమ్మకం అనేది ఏ బంధంలో అయినా ముఖ్యం. నమ్మకం పోగొట్టుకోడానికి ఎంతోసేపు పట్టదు. కానీ సంపాదించుకోడానికి మాత్రం చాలా సమయం పడుతుంది. కృష్ణుడు చెప్పింది కూడా ఇదే. ‘నన్ను పూర్తిగా నమ్ము.. అంతా నేను చూసుకుంటాను’ అనే భరోసా ఇచ్చాడందరికీ. అందరికన్నా ముందుగా అర్జునుడికి. ఆ నమ్మకంతోనే యుద్ధంలో పోరాడాడు అర్జునుడు. అంగబలం, అర్థబలం, అధికార బలం, సైనిక బలం ఉన్న కౌరవులపై యుద్ధంలో పాండవులు పైచేయి సాధించగలిగారంటే అందుకు కృష్ణుడే కారణం.స్థాయీ భేదాలు చూపలేదు...అవతలి వాళ్ల స్థాయి ఏంటి... వారు ఎలాంటి హోదాలో ఉన్నారు అన్నది పక్కన పెట్టి అందరినీ సమానంగా చూడాలని బోధించాడు కృష్ణుడు. అందుకే సాయం కోసం వచ్చిన కుచేలుడి మనసు అర్థం చేసుకుని ఆనందాన్ని అందించాడు. అదే సమయంలో గౌరవం చూపించాడు. కేవలం స్నేహితులు అనే కాదు. ప్రేమికులు, భార్యా భర్తలు...ఇలా ఏ బంధంలో అయినా సరే అందరినీ సమానంగా చూస్తే ఎలాంటి చిక్కులూ రావని, పరస్పరం గౌరవించుకుంటే సమస్యలే ఉండవని నిరూపించాడు.క్షమాగుణంతప్పులు అందరూ చేస్తారు. కొన్నిసార్లు తెలియక, కొన్ని సార్లు తెలిసి అవి జరుగుతుంటాయి. అంత మాత్రాన ఆ వ్యక్తి పూర్తిగా చెడ్డవాడు అయిపోడు. వాళ్లపై ద్వేషం పెంచుకోవాల్సిన అవసరమూ లేదు. మిత్రులనే కాదు. శత్రువులను కూడా ఒకే రకంగా ఆదరించడంలో కృష్ణుడు ముందుండే వాడు. ఆ మాత్రం క్షమాగుణం లేకపోతే బంధం ఎలా నిలబడుతుంది? మేనత్తకు ఇచ్చిన మాట కోసం శిశుపాలుడు చేసిన వంద తప్పులను మన్నించాడు. ఎవరినైనా ఇష్టపడితే వాళ్ల నుంచి ఏవేవో ఆశించకుండా పూర్తిగా డిటాచ్డ్గా ఉండాలని బోధించాడు కృష్ణుడు.పరిపూర్ణ జీవితంకృష్ణుడంటే అన్ని బంధాలనూ ఆస్వాదించిన వాడని మరచిపోరాదు. బాల్యంలోనే కన్న తల్లిదండ్రులకు దూరమైనా, పెంచిన తల్లిదండ్రులను పరిపూర్ణంగా ప్రేమించాడు. ఆ తర్వాత కన్న తల్లిదండ్రులకూ సాంత్వన నిచ్చాడు. పదహారు వేలమంది గోపికలకూ తన ప్రేమను పంచాడు. అష్టమహిషులనూ అదేవిధంగా ఆదరించాడు. తనను నమ్మి వచ్చిన ఎవ్వరికీ ఏ లోటూ రానివ్వలేదు. తాను సంతోషంగా ఉన్నాడు. తనతో ఉన్న వారిని అదేరీతిలో ఉంచాడు.వ్యక్తిత్వ వికాస గురువుఇప్పుడు వస్తున్న వ్యక్తిత్వ వికాస పుస్తకాలన్నింటికీ మూలాధారం రణరంగంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన గీతే! వ్యక్తిత్వ వికాస బోధకులకు కృష్ణుడే గాడ్ ఫాదర్. అందుకే కృష్ణుడు పరమాత్ముడే కాదు.. అందరికీ పరమ ఆప్తుడు... జగద్గురువు కూడా!– డి.వి.ఆర్. -
పాట వచ్చి 28 ఏళ్లైనా పవర్ ఏమాత్రం తగ్గలేదు
ఆ పాట.. మన దేశాన్ని ప్రేమించమని చెప్పే పాట. అందులోని సంగీతం.. దేశాన్ని చూపే చూపును మార్చేసిన ఒక భావోద్వేగం. అది వింటున్నప్పుడు ప్రతీ భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. దేశం పట్ల ప్రేమను పదే పదే గుర్తు చేస్తుంది. అందుకే అదొక కాలాతీత గీతమై.. కోట్లాది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. రెహమాన్ Vande Mataram ఆల్బమ్.. 28 ఏళ్ల తర్వాత కూడా నేటికి అదే ఉత్సాహంతో, అదే గర్వంతో దేశమంతటా మార్మోగుతోంది.అప్పటికే సినీ పరిశ్రమలోకి వచ్చిన ఏఆర్ రెహమాన్కు ఐదేళ్లు అయి ఉంటుంది. కానీ, ఆ తక్కువ కాలంలోనే అతని సంగీతానికి దేశం చికుబుక్ రైలే అంటూ చిందులేస్తోంది. సరిగ్గా.. అదే సమయంలో సోనీ మ్యూజిక్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. లోకల్ టాలెంట్ను ఇంటర్నేషనల్గా ప్రమోట్ చేసే ప్రయత్నంలో.. తొలిగా రెహమాన్తో మూడు ఆల్బమ్స్ కోసం ఒప్పందం చేసుకుంది. అలా పుట్టిందే.. వందేమాతరం ఆల్బమ్. స్నేహితుడి ఆలోచనతో.. ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న ఆత్మలు.. యాడ్ ఫిల్మ్మేకర్లు భారత్ బాలా, కనికా. రెహమాన్కు బాలా బాల్యమిత్రుడు. అతని సలహా మేరకే సోనీ కంపెనీ తొలి అల్బమ్గా దేశభక్తి నేపథ్యాన్ని ఎంచుకున్నాడు రెహమాన్. పైగా బాలా తండ్రి స్వాతంత్ర్య సమరయోధుడు కావడం వల్ల, ఈ పాటకు ఆయన ఎమోషనల్గా ఎంతో కనెక్ట్ అయ్యారు. బాలా, కనికలు తల్చుకుంటే స్టైలిష్ ఆల్బమ్ అయ్యి ఉండేది. కానీ, 50 ఏళ్ల స్వతంత్ర భారతావని ఆత్మను చూపించాలని నిర్ణయించుకున్నారు వాళ్లు. అలా ఈ వీడియో కోసం దేశం నలుమూలలకు తిరిగారు. హిమాలయాల శిఖరాల నుంచి.. తమిళనాడులోని గ్రామాల వరకు.. భారతదేశం యొక్క అసలైన రూపాన్ని చూపించే ప్రయత్నం చేశారు. దేశం నలుమూలల అందాలను, ప్రజల జీవనశైలిని, సంస్కృతిని చూపిస్తూ ఈ పాటకు రూపం ఇచ్చారు. లండన్కు చెందిన యాక్ బోండీ ఈ పాటకు సహ నిర్మాతగా వ్యవహరించాడు. పాకిస్తానీ సూఫీ సింగర్ నుస్రాత్ ఫతేహ్ అలీ ఖాన్ కూడా ఈ ప్రాజెక్టులో భాగం అయ్యాడు. ఇప్పుడు రాజకీయ పరిస్థితులు ఆనాడు లేవు కాబట్టి రెహమాన్కు ఎలాంటి ఆటంకాలు.. విమర్శలు ఎదురు కాలేదు. ఈ ఆల్బమ్కు కాన్సెప్ట్ అందించడంతో పాటు దర్శకులుగా భారత్ బాలా, కనికాలు వ్యవహరించారు. రెహమాన్ సహదర్శకత్వం వహించాడు. పాటకు హిందీలో సాహిత్యాన్ని అప్పటికే తనతో రంగీలా, దావూద్ చిత్రాలకు పని చేసిన గేయ రచయిత మెహబూబ్కు అప్పగించాడు. అలాగే.. తమిళ్ వెర్షన్ థాయి మన్నే వణ్ణక్కంకు సీనియర్ గేయరచయిత వైరముత్తు సాహిత్యం అందించారు. పాటలో వినిపించే ప్రతి పదం.. సంగీతంలోని ప్రతి నోటు.. భారతదేశం పట్ల గౌరవాన్ని, ప్రేమను, గర్వాన్ని వ్యక్తపరిచేలా ఉండేలా చూడాలని రెహమాన్ ఆ ఇద్దరికి విజ్ఞప్తి చేశాడు. అలా ఆ పాట సిద్దమైంది.. కర్లీ జుట్టుతో ఆ పాటలో స్వయంగా రెహమానే నటించారు. కనిక, భరత్ బాలా(ఫైల్ ఫొటోలు) 1997 ఆగస్టు.. భారతదేశం స్వాతంత్ర్యం పొందిన 50 ఏళ్ల సందర్భం. స్వాతంత్ర దినోత్సవానికి మూడు రోజుల ముందు.. మా తుజే సలాం అనే పాట క్యాసెట్ల రూపంలో విడుదలైంది. దేశభక్తికి ఒక శక్తివంతమైన ప్రతీకగా మారడానికి ఈ పాటకు ఎంతో సమయం పట్టలేదు. రోజుల వ్యవధిలోనే దేశంలోనే బెస్ట్ సెల్లర్గా నిలిచింది. ఇంకోవైపు.. విజువల్స్ ఆల్బమ్ ఆరోజుల్లో తక్కువ టైంలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. అదే సమయంలో.. దేశభక్తిని కమర్షియల్గా మార్చారనే విమర్శలు వచ్చాయి. పాటకాపీ రైట్పైనా కొన్ని వివాదాలు నడిచాయి. కానీ, వాటంటిన్ని దాటుకుని ‘మా తుజే సలాం’.. దేశ ప్రజల గుండెను తాకింది. అప్పటి నుంచి గణతంత్ర, స్వాతంత్ర దినోత్సవాలప్పుడు టీవీ చానెల్స్ల్లో, విద్యాసంస్థల్లో, మైక్సెట్లలో, రేడియో..ఎఫ్ఎం స్టేషన్లలో, ఆఖరికి ఇప్పుడు రీల్స్ రూపంలో పిల్లల వాయిస్తో వినిపిస్తున్న రీమిక్స్గానూ మారుమోగుతోంది. విడుదలై 28 ఏళ్లు అవుతున్నా.. రెహమాన్ ‘వందేమాతరం’ పవర్ ఏమాత్రం తగ్గలేదు. ఇది కేవలం పాట, సంగీతం కాదు.. ఇది భారతీయతకు అద్దం.:::వెబ్ డెస్క్ స్పెషల్VIDEO Credits: SonyMusicIndiaVEVO -
షోలే... అప్పుడది... తుపాన్ ఇండియా
సినిమా మొత్తం రెండు జతలకు మించి వాడని హీరోలు.. హీరోయిన్ ఏమో టాంగేవాలీ.. ఇంకో హీరోయిన్ వితంతువు.. ముఖ్య క్యారెక్టర్ ఆర్టిస్టుకు రెండు చేతులూ ఉండవు.. విలన్కు గట్టిగా చూస్తే 20 మందికి మించి గ్యాంగ్ లేదు.. లొకేషన్ ఉత్త రాళ్లదిబ్బలు.. ఇవాళ్టి పాన్ ఇండియా సినిమాలతో పోల్చి చూస్తే ఈ లక్షణాలతో ఏదైనా సినిమా సూపర్ హిట్ అవుతుందా? అవుతుంది.. అయ్యింది.. అవుతూనే ఉంది.. ‘షోలే’ – ఒక ప్రెజెంట్ కంటిన్యుయెస్ టెన్స్ 50 ఏళ్లుగా ‘షోలే’ లిఖించిన రికార్డులు ఎన్నో. చెప్పిన కొటేషన్లు మరెన్నో. ‘జో డర్ గయా.. సమ్ఝో మర్గయా’.. మరణమే లేని షోలేతో ప్రేక్షకుల వీడని దోస్తీ గురించి ప్రత్యేక కథనం..‘పుష్ప’ సినిమా రెండు పార్ట్లుగా వచ్చి కోట్లు సంపాదించింది. ఒక గంధపు చెక్కల స్మగ్లర్ హీరోనా అని ఒకరిద్దరు క్వశ్చన్ చేశారు. కాని సగటు జనం జానేదో అని సూపర్హిట్ చేశారు. ఈ సగటు జనం ఇక్కడి వరకూ చేయడానికి చాలా మెట్లు పడ్డాయి. వాటిలో ‘షోలే’ (Sholay Movie) ఒకటి.సలీమ్–జావేద్ హిందీలో యాంగ్రీ యంగ్మేన్ను తెచ్చారు. అంటే స్వాతంత్య్రం వచ్చాక జన్మించి, యుక్త వయసు వచ్చేనాటికి అంటే 1970ల నాటికి దేశ స్థితి చూస్తే ఆకలి, దరిద్రం, నిరుద్యోగం, బ్లాక్ మార్కెట్. రోజులు ఇలా ఉంటే అమ్మాయి వెంట పరిగెత్తి విరహగీతాలు పాడే హీరో చెల్లుబాటు కాడు అని వాళ్లు కోపంగా ఉండే హీరోని తెచ్చారు. ‘జంజీర్’లో అమితాబ్ అలాంటి హీరో. ఇతను ఇన్స్పెక్టర్గా ఉంటూ కూడా తన తల్లితండ్రులను చంపినవాణ్ణి చట్టప్రకారం శిక్షించలేకపోతాడు. యూనిఫామ్ను వదిలాకే పగ సాధిస్తాడు. చట్టానికి ఆవల కొన్ని పనులు చేసే హీరోలు అలా పుట్టుకొచ్చారు. ఆ తర్వాత ‘దీవార్’ వచ్చింది. కష్టపడి పని చేసే హీరోకు బదులు అడ్డదారిలో స్మగ్లర్గా మారే హీరోగా కనిపిస్తాడు అమితాబ్. సినిమాలో నిజాయతీపరుడైన శశికపూర్ (Shashi Kapoor) ఉన్నా అందలానికి ఎదిగిన అమితాబ్ను ఆరాధిస్తాడు ప్రేక్షకుడు. ఈ వరుసలోనే వచ్చింది ‘షోలే’. ఇక్కడ అత్యంత దుర్మార్గుడైన గబ్బర్ సింగ్ను సంహరించడానికి ఇద్దరు చిల్లర దొంగలను కాంట్రాక్ట్ మీద పట్టుకొస్తాడు ఊరి పెద్ద ఠాకూర్. చిల్లర దొంగల్లో వీరత్వం ఉండటం, కొంచెం మానవత్వం ఉండటంతో మేలు చేయని పోలీసుల కంటే కొద్దిగా కీడు చేసే చిల్లర దొంగలే నయం అనుకుంటారు రామ్గఢ్ వాసులు, తద్వారా ప్రేక్షకులు. ఆ విధంగా సకల సద్గుణ శోభితుడైన హీరోకు నూకలు చెల్లుతూ వచ్చి ‘పుష్ప’ వరకూ అతడు రూపాంతరం చెందాడు.‘షోలే’ కథ అంతా రెండు లైన్లలో చె ప్పొచ్చు. గొప్ప కథలు ఏవంటే కట్టె కొట్టె తెచ్చె అన్నట్టుగా చెప్పగలిగేవే. పోలీస్ ఆఫీసర్ ఠాకూర్ కుటుంబాన్ని గబ్బర్ సింగ్ చంపేశాడు. ఆ ప్రాంతానికి పీడగా మారాడు. వాణ్ణి చంపడానికి ఠాకూర్ ఇద్దరు దొంగలను కిరాయికి తెచ్చాడు. అంతే కథ. ఈ కథను మూడున్నర గంటల పాటు 70 ఎం.ఎం స్క్రీన్ మీద దర్శకుడు, నటీనటులు, రచయితలు, కెమెరామేన్, సంగీత దర్శకుడు ఎలా చూపారనేదే అసలు సంగతి. వాళ్లు ఎలా చూపారంటే అలా మరెవరూ, మరెప్పుడూ చూపలేకపోయారు. అందుకే షోలే అంటే షోలే. ఇలాంటి సినిమాలు సర్పాల తలలపై మణుల వంటివి. రీమేక్లని ప్రయత్నిస్తే మణులు రాళ్లయిపోతాయి. లేదా పాము కాటు తప్పదు. అందుకే ‘షోలే’ను మళ్లీ మళ్లీ ముస్తాబు చేసి వదిలారు తప్ప రీమేక్ అంటే జనం తుపాకులు తీశారు.‘షోలే’ యాక్షన్ సినిమా అనుకుంటారు. ఫక్తు కుటుంబ కథా చిత్రం. కుటుంబమే దీనికి ఆధారం. ఠాకూర్ కుటుంబాన్ని గబ్బర్ గాడు కాల్చి చంపాడు. కుటుంబం కోల్పోతే మనిషికి ఉండే బాధతో ప్రేక్షకుడు ఐడెంటిఫై అవుతాడు. ఆ రోజుల్లో మగవారి ఎర్లీ డెత్స్ వల్ల ప్రతి ఇంటా ఒక వితంతువు ఉండేది. జయభాదురి (Jaya Bhaduri) వేసిన రాధ పాత్రను ప్రేక్షకులు పోల్చుకున్నారు. భర్త పోయిన ఎన్నో ఏళ్లకు ఆమె ‘జయ్’ అనే అమితాబ్ను చూసి మళ్లీ అతనితో కుటుంబాన్ని నిర్మించుకోవచ్చేమో అని ఆశ పడుతుంది. ఆ ఆశ ప్రేక్షకులకు తెలుసు. ఆమెకో కుటుంబం ఏర్పడాలని వారూ అనుకుంటారు. జరగదు. జయ్ చనిపోతాడు. ప్రేక్షకులు అక్కడా కనెక్ట్ అవుతారు. ఏ తాడూ బొంగరం లేని వీరూ అను ధర్మేంద్ర టాంగేవాలీతో సరసం చేసి సాధించుకుంది మౌసీతో పాటు ఒక కుటుంబాన్నే కదా! ఇక కథలో ఇమామ్ గారి కుటుంబానికి వచ్చిన బాధ ఎవరు మరుస్తారు. చేతికి ఎదిగొచ్చిన కొడుకు పట్నం పోయి సంపాదిస్తాడనుకుంటే తండ్రిని ఏకాకిని చేసి గబ్బర్ చేతుల్లో ప్రాణాలు కోల్పోతాడు. కుటుంబం ఉనికే భారతదేశ సమాజపు ఉనికి. ఇన్ని కుటుంబాల ఉద్వేగాల అల్లిక కాబట్టే ‘షోలే’ ఆడింది. ఆడుకుంది.‘షోలే’ ప్రివ్యూ కోసం థియేటర్లో కూచున్న రాజ్కపూర్ (Raj Kapoor) సినిమా మొదలైన పది నిమిషాల్లోనే మొదలయ్యే ట్రైన్ రాబరీ సీక్వెన్స్ చూసి చకితుడయ్యాడు. ‘ఇదేంటి... క్లయిమాక్స్ను ముందే పెట్టేశారు’ అన్నాడట పక్కనున్న వారితో. అవును ‘షోలే’ క్లయిమాక్స్ ముందే వచ్చేస్తుంది... అంత భారీగా. ఆ తర్వాత ‘షోలే’ను కేవలం సన్నివేశాల బలం మీద నడుపుతారుగాని యాక్షన్ మీద కాదు. ‘షోలే’ క్లయిమాక్స్ కేవలం ఠాకూర్, గబ్బర్ సింగ్ల మీదే! చేతుల్లేని ఠాకూర్ చేతులు తెగ్గొట్టే గబ్బర్తో తలపడతాడు. ఇలా స్క్రీన్ప్లే రాసిన ‘షోలే’ ఆడిందంటే ఏమిటి మర్మం! అదేమిటో ఎవరూ చెప్పలేరు. చెప్పినా కొంతే. రొంతే. అంతంతే. షోలేకు వ్యాఖ్యానం లేదు.1973లో మొదలెట్టి రెండేళ్ల పాటు తీశారు ‘షోలే’. కార్పెట్లు అమ్మి, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ చేసి సంపాదించిన డబ్బును కొడుక్కు ఇచ్చి సినిమా చేయమన్నాడు నిర్మాత జి.పి.సిప్పీ. కోటి రూపాయల సినిమా! వస్తే చాలా డబ్బులు రావాలి పోతే కోటి అన్నాడు. అందుకు తగ్గ కథ రమేష్ సిప్పీ రాయించుకున్నాడు సలీమ్ జావేద్లతో! అతని వేడి చూసి – వాళ్లు కూడా రంగంలో దిగారు. ‘లోహా గరమ్ హై... మార్ దో హథోడా’ (ఇనుము వేడి మీద ఉన్నప్పుడే సమ్మెట పోటు పడాలి) అనుకున్నారు. ఠాకూర్, గబ్బర్ సింగ్ల మధ్య ఇద్దరు దొంగలను ప్రవేశపెట్టి కథ అల్లారు. దీనికి ప్రేరణ అకిరా కురసావా ‘సెవన్ సమురాయ్’, మనం తీసిన ‘మేరా గావ్ మేరా దేశ్’... ఇంకొన్ని సినిమాలు ఉన్నాయి. అన్నీ తీసుకుని మనది ఇవ్వడం కూడా విద్యే. ఆ విద్యతో తయారైన ఈ కథకు ద్వారకా దివేచా కెమెరా, రామ్ యెదేకర్ ఆర్ట్ డైరెక్షన్, ఎం.ఎస్.షిండే ఎడిటింగ్, ఆర్.డి.బర్మన్ సంగీతం... గంధపు చేతులకు మల్లెలు చుట్టాయి. మరి రమేష్ సిప్పీ ఇంత మంచి టేకింగ్ను ఎలా సాధించాడో అతనికే తెలియాలి. ధర్మేంద్ర, అమితాబ్, అంజాద్ ఖాన్, సంజీవ్ కుమార్, హేమ మాలిని, జయభాదురి... ఎవరికి ఎవరు తక్కువ. సత్తువ చూపడం వారికి మక్కువ.‘షోలే’లో ప్రతి సన్నివేశానికి, ప్రతి ఫ్రేమ్కు అభిమానులున్నారు. అందులోని ప్రతి చిన్న పాత్రకూ అభిమానులున్నారు. జైల్లో గూఢచారిగా పని చేసే బార్బర్ హరిరామ్, పిరిమిగా కట్టెలు అమ్మే సూర్మా భూపాలి, నమక్ తినే కాలియా, గబ్బర్కు బదులు పలికే సాంబా, హిట్లర్ జైలర్, ఠాకూర్ నమ్మినబంటు రామ్లాల్, పిల్లనిచ్చేందుకు ధర్మేంద్ర గుణగణాలు ఆరాతీసే మౌసీ, ‘మెహబూబా’ పాటలో మెరిసిన జలాల్ ఆగా... ప్రతి ఒక్కరూ... సినిమాను ధన్యం చేశారు... ధన్యులయ్యారు. ప్రేమ నాటకం కోసం వాటర్ ట్యాంకర్ ఎక్కిన ధర్మేంద్ర ‘చక్కీ పీసింగ్’ (తిరగలి తిప్పింగ్) అంటాడు. ప్రేక్షకులు నవ్వుతారు. ‘సూసైడ్’ అంటే ఆత్మహత్య అని ధర్మేంద్ర వల్లే జనానికి ఇంగ్లిష్లో తెలిసింది.‘షోలే’ తన శబ్దాలతో కూడా మనకు కనెక్ట్ అవుతుంది. రైలు కూతా, గుర్రపు డెక్కల చప్పుడు, జట్కా మువ్వలు, అజాన్, దూది ఏకే కవాను, కమ్మరి మోత... ఇక ఈ సినిమాకు ముందు రివాల్వరు, రైఫిలు పేలితే అలాంటి సౌండ్ వస్తుందని ప్రేక్షకులకు తెలియదు. బ్రిటిష్ స్టంట్మెన్ ఈ సినిమాకు స్టంట్ కొరియోగ్రాఫర్లుగా పని చేశారు. ట్రైన్ రాబరీలో ఒక బుల్లెట్ తగిలి గూడ్సు పెట్టెకు అంటించిన సర్కారు కాగితం చిట్లుతుంది. అలాంటి ఒక్క షాటు తర్వాతి కాలంలో తీయలేకపోయారు.‘షోలే’ గొప్పతనం తెల్లార్లు చెప్పుకోవాలి. గబ్బర్ సింగ్ (Gabbar Singh) పేరు వాడుకుని ఒక హిట్ సినిమా తీసుకున్న మనం ‘షోలే’ యాభై ఏళ్ల సందర్భంగా ఉత్సవం తప్పక చేసుకోవాలి. ఈ సినిమాను తిరగేసి గుహనాథన్ కథ చెప్తే బాగుందని రామానాయుడు గారు ‘కక్ష’ తీశారు. ఇందులోని కొన్ని సీన్లు దర్శకేంద్రుడి ‘అడవి రాముడు’కు పనికి వచ్చాయి. ‘షోలే’ ఎందరినో డైరెక్టర్లు అయ్యేలా చేసింది. రైలుతో మొదలయ్యి రైలుతో ముగిసే ఈ సినిమా భారతీయ ప్రేక్షకులతో యాభై ఏళ్ల ప్రయాణం చేసింది. ఇంకో యాభై ఏళ్లు ఇకపై చేస్తుంది.ఏ దోస్తీ హమ్ నహీ తోడెంగే తోడెంగే దమ్ మగర్ తేరా సాథ్ న ఛోడెంగె...న ఛోడెంగె...పంచ్ డైలాగ్స్ ఫలానా దర్శకుడు వచ్చాక, ఫలానా రచయిత వచ్చాక ట్రెండ్లోకి వచ్చాయి అని ఎవరైనా అంటే నోటితోనే నవ్వబుద్ధవుతుంది. సకల పంచ్ డైలాగ్లకు బాప్ ‘షోలే’. అందులో ప్రతి మాటా ఒక పంచ్ డైలాగే. పైగా అవి నిత్య జీవితంలోకి వచ్చేసిన డైలాగులు. కొటేషన్లు. సూక్తులు.→ ఇజ్జత్ కీ మౌత్ జిల్లత్ కీ జిందగీ సే కయీ అచ్ఛీ హై (పరాభవాలతో బతికే కన్నా పరువుతో చావడం మేలు)→ ముఝేతో సబ్ పోలీస్ వాలోంకీ సూరతే ఏక్ జైసీ లగ్ తీ హై(నాకు అందరు పోలీసోళ్ల ముఖం ఒకలాగే కనిపిస్తుంది)→ తేరా క్యా హోగా కాలియా (నీ గతేంది కాలియా)→ తుమ్హారా నామ్ క్యా హై బసంతి? (నీ పేరేంటి బసంతి)→ దామ్ జో తుమ్ చాహో... ఔర్ కామ్ జో మై చాహూ (సొమ్ము మీరు కోరినంత... పని నేను చెప్పినంత) – కె. -
ఒలుపులో వెరైటీలెన్నో !
సాక్షి, భీమవరం: కొబ్బరి కాయ ఒలవడం తేలికేనని తీసి పారేయకండి. దానికీ ఓ పద్ధతుంది. బొండాం, ముప్పేట, ముదర కాయ, కురిడీ అంటూ కాయల్లో రకాలున్నట్టే.. పిలక, బొంబాయి సీలు, కసింగలు, పోర్పట్టా, బోరాలు, మూడు నామాలు.. అంటూ ఒలుపుల్లోనూ పదికి పైనే వెరైటీలు ఉన్నాయి. ప్రాంతాన్ని బట్టి ఒలుపులు మారుతుంటాయి. ప్రస్తుతం రికార్డు ధరతో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రోజుకు దాదాపు వంద లారీల కొబ్బరి కాయలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. అక్కడి అవసరాలకు తగ్గట్టు ఇక్కడి ఒలుపు కార్మికులు వడివడిగా కాయలను వలుస్తున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని సుమారు 50 వేల ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. ఆచంట, పాలకొల్లు, నరసాపురంలోని వశిష్ట గోదావరి, సముద్ర తీరం వెంబడి, భీమవరం, ఉండి, ఆకివీడు ప్రాంతాల్లోని ఆక్వా చెరువు గట్లు, తాడేపల్లిగూడెం, ఏలూరు, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, తణుకు ప్రాంతాల్లో తోటలు సాగు చేస్తున్నారు. జిల్లా నుంచి రాజస్తాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, పశ్చిమబెంగాల్, బీహార్, పంజాబ్, ఢిల్లీ తదితర రాష్ట్రాలకు కొబ్బరి ఎగుమతి అవుతున్నాయి. తమిళనాడు, కేరళ తర్వాత మన కొబ్బరికి దేశ వ్యాప్తంగా గిరాకీ ఉన్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. తమిళనాడులో దిగుబడి తగ్గడంతో నెలన్నర రోజులుగా జిల్లా నుంచి ఎగుమతులకు డిమాండ్ ఏర్పడింది. మునుపెన్నడూ లేనివిధంగా రైతు ధర కాయకు రూ.18 నుంచి రూ.20 మధ్య నిలకడగా ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజుకు వంద లారీల వరకు కాయలు ఎగుమతి అవుతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఒలుపులో రకాలెన్నో.. హిందూ సంప్రదాయంలో కొబ్బరి కాయకు ఎంతో విశిష్టత ఉంది. పూజల్లో కొట్టడం నుంచి హోమాల్లో కాయ పళంగా వేయడం, దిష్టి, దిగదుడుపు తీయడం తదితర ప్రతి పనిలోనూ కొబ్బరికాయ ఉండాల్సిందే. మన ప్రాంతంలో ముచ్చిక, పిలకతో ఒలిచిన వాటిని వినియోగించినట్టే ఇతర ప్రాంతాల్లో వివిధ రూపాల్లో ఒలిచిన కాయలను వాడుతుంటారు. ఈ మేరకు జిల్లా నుంచి ఎగుమతులు జరిగే రాష్ట్రాల్లోని అవసరాలకు తగ్గట్టు కాయలను ఒలుస్తుంటారు. వీటిలో పిలక, బొంబాయి సీలు, రాయపూర్ సీలు, మూడు నామాలు, కసింగలు, బోరాలు, బెల్ట్ పోర్ పట్టా, బెల్ట్ లెస్ పోర్పట్టా, ఐదు పేళ్లు, ఆరు పేళ్లు, ఎనిమిది పేళ్లు తదితర పదికి పైనే ఒలుపుల్లో రకాలున్నాయి. ఎగుమతి అయ్యే ప్రాంతంలో ఆయా ఒలుపులకు ఏ పేర్లున్నా కానీ స్థానికంగా తాము ఈ విధంగా పిలుచుకుంటామని వ్యాపారులు, ఒలుపు కార్మికులు అంటున్నారు. రాయపూర్ సీలును కాయ వెనుక నుంచి మూడు పేళ్లుగా ఒలిస్తే, కసింగలను ముందు నుంచి మూడు, వెనుక నుంచి మూడు పేడులుగా కాయపైన పీచు ఉంచి డొక్కను ఒలుస్తారు. బెల్టు పోర్పట్టా కోసం కాయకు నాలుగు వైపులా మధ్యలో అరంగుల డొక్క ఉంచి మిగిలిన దానిని తీసివేస్తారు. బెల్టు లెస్ కోసం నాలుగు వైపులా స్క్వేర్ ఆకారంలో పీచు ఉండేలా డొక్కను ఒలుస్తారు. అదేమాదిరి ఐదు పేళ్లు, ఆరు పేళ్లు, ఎనిమిది పేళ్లు సంఖ్యను బట్టి అన్ని పేళ్లుగా పైడొక్కను తొలగిస్తారు. మూడు నామాల కోసం కాయకు మూడు వైపులా అంగుళం వెడల్పున పీచు ఉంచి మిగిలిన డొక్కను పీచు సహా తీసేస్తారు. బొంబాయి సీలు కోసం కాయకు సగభాగం పూర్తిగా పీచును ఒలిచేసి మిగిలిన సగభాగం ఉంచేస్తారు. ఇలా వివిధ రకాలుగా కాయలను ఒలుస్తుంటారు. అవసరాన్ని బట్టి ఒలుపు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఒలిచిన కాయలను వినియోగిస్తుంటారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్డరు మేరకు వారికి అవసరమైన రీతిలో ఒలిపించి ఎగుమతి చేస్తుంటాం. తమిళనాడులో దిగుబడులు తగ్గడంతో ప్రస్తుతం జిల్లా నుంచి ఎగుమతులు బాగున్నాయి. రైతులకు రికార్డు ధర వస్తోంది. – కాసా సత్యనారాయణ, వ్యాపారి, యలమంచిలి, పశ్చిమగోదావరి జిల్లాఏ ఒలుపు ఎక్కడికి.. బెల్ట్లెస్ పోర్పట్టా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు ఎక్కువగా ఎగుమతి జరిగితే బోరాలు యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు, ఆరు పేళ్లు యూపీ, కర్ణాటక, రాయపూర్ సీలు, ఐదు పేళ్లు మహారాష్ట్రకు, పిలకలు ముంబయి, బిహార్కు, మూడు నామాలు మహారాష్ట్రకు, కసింగలు అన్ని ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటాయని వ్యాపారులు చెబుతున్నారు. ఆయా ప్రాంతాల్లో చాలా వరకు కొట్టకుండా వీటిని నేరుగా హోమాల్లో వేస్తారన్నారు. కాయపళంగా కన్నా ఒలిపించడం వల్ల బరువు తగ్గి ఎక్కువ కాయలు తీసుకువెళ్లే వీలుంటుందని అక్కడి అవసరాలకు తగ్గట్టు ఇక్కడే ఒలిపించుకుని తీసుకువెళతారని అంటున్నారు. కావాల్సిన ఆకారంలో వేగంగా కాయలు ఒలవడం అనుభవంతో కూడిన పని. ఒక్కో కాయ ఒలుపునకు రూ.1.50 చొప్పున ఇస్తారు. రోజుకు ఒక్కో కార్మికుడు 800 నుంచి 1000 కాయలను ఒలుస్తుంటారు. గండీర.. గటగట ఉత్తరాది రాష్ట్రాల్లో కురిడీ కొబ్బరి ఆహారంలోనూ భాగంగా ఉంటుంది. ఇవి ఎక్కువగా రాజస్తాన్, మధ్యప్రదేశ్కు వెళుతుంటాయి. బాగా తయారైన కాయలను ఎంపిక చేసి ఎనిమిది పేళ్లుగా ఒలుస్తారు. గోదాముల్లో గాలి తగిలేలా అరలు కట్టి కాయలను నిల్వ చేస్తారు. ఆరు నెలలకు లోపలి నీరు పూర్తిగా ఇంకిపోయి గుడ్డు మాత్రమే ఉంటుంది. మొదట్లో 600 గ్రాముల నుంచి 700 గ్రాములు ఉన్న కాయ బరువు కురిడీ అయ్యేసరికి 80 గ్రా. నుంచి 100 గ్రా.కు తగ్గిపోతుంది. నాణ్యమైన గండీర, సెకండ్ క్వాలిటీని గటగటగా పిలుస్తుంటారు. గండీరకు రూ.30 ఉండగా గటగటకు రూ.28 ధర ఉన్నట్టు చెబుతున్నారు. నాలుగు దశాబ్దాల అనుభవం నలభై ఏళ్లుగా ఒలుపు పని చేస్తున్నాను. ఒక్కో ప్రాంతం నుంచి వచ్చిన వారు ఒక్కో విధంగా ఒలవమని చెబుతుంటారు. ఏ రకంగా ఒలవాలన్నా దాదాపు ఒకే సమయం పడుతుంటుంది. ప్రస్తుతం సీజన్ కావడం వల్ల పని ఎక్కువగా ఉంది. – కొడవటి ఎర్రియ్య, ఒలుపు కార్మికుడు, పాలకొల్లు, పశ్చిమగోదావరి జిల్లా -
ఒత్తిడి తగ్గించే ఓపెన్బుక్ పరీక్ష
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 2026–27 సంవత్సరం నుంచి ఓపెన్ బుక్ పరీక్ష విధానాన్ని అందుబాటులోకి తెస్తోంది. తొలుత దీన్ని 9వ తరగతికే పరిమితం చేయాలని నిర్ణయించింది. సీబీఎస్ఈ గవర్నింగ్ బాడీ ఇటీవల ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ స్కూళ్లలో చదివే 9వ తరగతి విద్యార్థులు 18 లక్షల వరకు ఉంటారు. వీళ్లంతా 2026లో జరిగే వార్షిక పరీక్షలను బోర్డ్ సూచించిన పుస్తకాలు చూసి రాయవచ్చు. కోవిడ్ తర్వాత వచ్చిన మార్పుల్లో భాగంగా ఈ విధానం అవసరమని బోర్డ్ భావించింది. జాతీయ విద్యావిధానం–2020లో కూడా పరోక్షంగా దీన్ని సూచించింది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు కూడా ఓపెన్ బుక్ విధానంపై మంచి ఫలితాలు సాధిస్తున్నాయని సీబీఎస్ఈ బోర్డ్ అధ్యయనం ద్వారా వెల్లడించింది. - సాక్షి, హైదరాబాద్ఎందుకీ విధానం?ఓపెన్ బుక్ విధానం ఉపయోగాలపై సీబీఎస్ఈ స్పష్టత ఇచ్చింది. దీనివల్ల విద్యార్థుల్లో పరీక్షల భయం పోతుంది. సమాధానం తెలిసినా పరీక్ష సమయంలో మర్చిపోతుంటారు. పరీక్ష కేంద్రంలో ఓసారి రీకాల్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. పరీక్షలో సమాధానాలు పాఠ్యపుస్తకాల నుంచే రాయాలి. కాబట్టి విద్యార్థి ముందు నుంచే పుస్తకం చదివే అలవాటు చేసుకుంటాడు. దీనివల్ల బట్టీ పట్టే విధానం కాకుండా, సబ్జెక్టుపై పట్టు పెరుగుతుంది. ఈ అలవాటుతో విద్యార్థి పోటీ పరీక్షల్లో చురుకుగా పాల్గొనే అవకాశం ఉంటుంది. విద్యార్థిలో సృజనాత్మకత పెరుగుతుందని బోర్డ్ భావిస్తోంది. పరీక్ష ఎలా ఉంటుంది?ఈ పరీక్ష కోసం బోర్డ్ ప్రత్యేక ప్రశ్నపత్రాన్ని రూ పొందిస్తుంది. సాధారణంగా ఉండే పరీక్ష సమ యాన్ని గంటకు కుదిస్తారు. పరీక్షకు బోర్డ్ సూచించిన పుస్తకాలను అనుమతిస్తారు. పాఠ్యపుస్త కాలు, క్లాస్ నోట్స్, కొన్ని రకాల మెటీరియల్స్ను తీసుకెళ్లే అవకాశం కల్పిస్తారు. అయితే, పరీక్షలో ఇచ్చే ప్రశ్న లు నేరుగా కాకుండా, ట్విస్ట్ చేసి ఇస్తా రు. ఏ కోణం నుంచి ప్రశ్నలు వచ్చినా సమాధానం ఇచ్చే నేర్పు విద్యార్థుల్లో ఉండాలి. చాప్టర్ పూర్తిగా చదవడం, దా న్ని విశ్లేషణాత్మకంగా ముందు నుంచి అధ్య యనం చేస్తేనే ఓపెన్ బుక్ విధానంలో తేలికగా పరీక్ష రాయగలుగుతారని నిపుణులు చెబుతున్నారు. ఓ రకంగా క్రిటికల్ థింకింగ్ ఉంటేనే పరీక్ష సులువు అవుతుంది. 2014 నుంచి కసరత్తుసీబీఎస్ఈ ఈ విధానంపై 2014 నుంచి కసరత్తు చేస్తోంది. దీనికోసం కొన్ని స్కూళ్లను ఎంపిక చేసింది. ఆ సూళ్ల విద్యా ర్థులకు 9వ తరగతిలో హిందీ, ఇంగ్లిష్, గణితం, సైన్స్, సోషల్ సైన్స్.. 11వ క్లాస్ విద్యార్థులకు ఎకనమిక్స్, బయా లజీ, జాగ్రఫీ సబ్జెక్టుల్లో ఓపెన్ బుక్ పరీక్షలు నిర్వహించింది. దీనివల్ల 85% మంది విద్యార్థుల్లో పరీక్షలపై భయం పోయి, పఠన సామర్థ్యం పెరిగిందని గుర్తించారు. 2023లో అన్ని పరీక్షలపై బోర్డ్ అధ్యయనం చేసింది. ఎక్కడ ఎలా ఉంది?» అమెరికా, బ్రిటన్లో పలు విశ్వవిద్యాలయాలు ఓపెన్ బుక్ విధానంపై అధ్యయనం చేశాయి. చదువులో వెనుకబడ్డ విద్యార్థి ఈ విధానం వల్ల మంచి ఫలితాలు సాధించినట్టు ఎక్స్లెన్స్ జర్నల్లో రచయితలు మమత, నితిన్ పిళ్లై పేర్కొన్నారు. » ఢిల్లీ యూనివర్సిటీ 2020 ఆగస్టు, 2022 మార్చిలో ఈ తరహా పరీక్షలు నిర్వహించింది. ఈ వర్సిటీ దీనిపై ఇంకా అధ్యయనం చేస్తోంది. తాజాగా కేరళ ఉన్నత విద్య విభాగం కూడా ఇంటర్నల్స్, ప్రాక్టికల్స్కు ఓపెన్ బుక్ విధానాన్ని సూచించింది.» ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, భువ నేశ్వర్ 98 మంది వైద్య విద్యార్థులకు ఈ విధానంలో పరీక్షలు నిర్వహించింది. వీరిలో 78.6% ఉత్తీర్ణులయ్యా రు. వీరిలో మానసిక ఒత్తిడి దూరమైందని ఎయిమ్స్ పేర్కొంది. -
వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?
వాట్సాప్.. మన దైనందిన జీవితంలో కీలక భాగమైంది. వ్యక్తులు ఎవరైనా.. సౌకర్యవంతమైన ఈ మెసేజింగ్ యాప్ రాకతో సమాచారం ఇచ్చిపుచ్చుకునే విధానాన్నే మార్చింది. ప్రపంచంలో యూజర్ల పరంగా అతిపెద్ద మెసేజింగ్ యాప్గా అవతరించి అత్యంత ప్రజాదరణ పొందుతోంది. అయితే సౌలభ్యం కోసం ఉద్యోగులు చాలామంది వాట్సాప్ వెబ్ను ఆఫీస్ డెస్క్ టాప్/ల్యాప్టాప్లలో వాడుతుంటారు. తద్వారా సున్నిత సమాచారం బహిర్గతమయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఈ చిన్న అలవాటు తీవ్రమైన భద్రతా ముప్పకు దారి తీయవచ్చని స్పష్టం చేస్తోంది. -సాక్షి, స్పెషల్ డెస్క్ప్రజలు తమ కార్యాలయంలోని కంప్యూటర్లు, ల్యాప్టాప్లలో వాట్సాప్ వెబ్ను ఉపయోగించడం మానేయాలని భారత ప్రభుత్వ ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై) కోరింది. పని ప్రదేశంలో వేగంగా కమ్యూనికేట్ చేయడం కోసం ఉపకరణాల్లో వ్యక్తిగత చాటింగ్ చేయడం, ఫైల్స్ను ఉపయోగించడం సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ.. అలా చేయడం వల్ల సంస్థ యజమానికి సున్నిత సమాచారం బహిర్గతమవుతుందని ప్రభుత్వం వివరించింది. అంతేగాక కార్పొరేట్ నెట్వర్క్స్ను అడ్మినిస్ట్రేటర్స్, ఐటీ బృందాలు పర్యవేక్షిస్తుంటాయి. స్క్రీన్–మానిటరింగ్ సాఫ్ట్వేర్, మాల్వేర్, బ్రౌజర్ హైజాక్లతో సహా వివిధ మార్గాల ద్వారా వీరు ప్రైవేట్ సంభాషణలు, వ్యక్తిగత ఫైల్స్ను చూసే అవకాశం ఉందని ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అవేర్నెస్ (ఐఎస్ఈఏ) వెల్లడించింది. ప్రమాదంలో డేటా.. కార్పొరేట్ కంపెనీల ఉపకరణాల్లో మెసేజింగ్ ప్లాట్ఫామ్ను ఉపయోగించ డం వల్ల కలిగే నష్టాల గురించి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అవేర్నెస్ (ఐఎస్ఈఏ) బృందం ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. సైబర్ భద్రతపై కార్యాలయాల్లో పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఎంఈఐటీవై నుంచి ఈ హెచ్చరిక తాజాగా జారీ అయింది. అనేక సంస్థలు ఇప్పుడు వాట్సాప్ వెబ్ను భద్రతా ముప్పుగా పరిణమించే వేదికగా చూస్తున్నాయని ఐఎస్ఈఏ చెబుతోంది. ‘మాల్వేర్, ఫిషింగ్ దాడులకు వాట్సాప్ వెబ్ ఒక గేట్వే. ఇది వారి మొత్తం నెట్వర్క్ను పణంగా పెడుతుంది. వ్యక్తిగత ఫోన్కు ఆఫీస్ వై–ఫైని ఉపయోగించడం కూడా శ్రేయస్కరం కాదు. నెట్వర్క్ సురక్షితంగా లేకున్నా, పర్యవేక్షణ వ్యవస్థలు ఉన్నా ప్రైవేట్ డేటా ప్రమాదంలో పడుతుంది’అని సూచించింది. యూజర్లు 200 కోట్లు.. ప్రపంచంలో ఎక్కడున్నా టెక్స్ట్ సందేశాలు, ఫొటోలు, వీడియోలు, పత్రాలు పంపడానికి, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ చేయడానికి వాట్సాప్ వీలు కల్పిస్తోంది. ఫోన్ కాల్స్, ఈ–మెయిల్స్ వంటి సంప్రదాయ కమ్యూనికేషన్ సాధనాల కంటే సౌలభ్యంగా ఉండడంతో వాట్సాప్ను మరింత నమ్మదగిన వేదికగా మార్చింది. వాట్సాప్ నెలవారీ యాక్టివ్ వినియోగదార్ల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల పైచిలుకు ఉందంటే ఏ స్థాయిలో జనంలో మమేకమైందో అర్థం చేసుకోవచ్చు. 85.4 కోట్ల యూజర్లతో భారత్ తొలి స్థానంలో దూసుకుపోతోంది. ఇంట్లో, బయట ఉన్పప్పుడు ఫోన్లో వాట్సాప్ వాడేవారు కార్యాలయానికి చేరుకోగానే వాట్సాప్ వెబ్ను ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ వెబ్ను ఆఫీసులో తప్పనిసరిగా ఉపయోగించాల్సి వస్తే.. » డెస్క్ నుండి బయటకు వెళ్లే ముందు వాట్సాప్ వెబ్ నుండి లాగ్ అవుట్ అవ్వండి. » లింక్లపై క్లిక్ చేసేటప్పుడు లేదా అపరిచితుల నుండి వచ్చిన అటాచ్మెంట్స్ను తెరిచేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. » పని కోసం వ్యక్తిగత అప్లికేషన్స్, ఉపకరణాలను ఉపయోగించే విషయమై కంపెనీ డిజిటల్ పాలసీలను తెలుసుకోండి. పొంచి ఉన్న ప్రమాదాలు..ప్రైవసీకి ముప్పు: ఉపకరణాలను పర్యవేక్షించే వ్యవస్థ ఉన్నట్టయితే వ్యక్తిగత సంభాషణలు, పత్రాలు ఐటీ నిర్వాహకులకు కనిపించవచ్చు. హానికర సాఫ్ట్వేర్: కార్యాలయంలోని కంప్యూటర్లు లక్ష్యంగా వాట్సాప్ వెబ్ ద్వారా హానికర ఫైల్స్ (మాల్వేర్) చేరవచ్చు. ఇదే జరిగితే మొత్తం నెట్వర్క్ సైబర్ నేరస్తుల చేతుల్లోకి వెళ్తుంది. నెట్వర్క్ ఆధారిత స్నూపింగ్: వాట్సాప్ ఉపయోగిస్తున్నప్పుడు ఫోన్ను ఆఫీస్ వైఫైకి కనెక్ట్ చేయడం వలన వ్యక్తిగత డేటా కార్పొరేట్ నిఘా సాధనాలకు బహిర్గతమవుతుంది. -
ఎవరి పంతం నెగ్గుతుందో!
ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముగింపు పలికి, శాంతి దూతగా పేరు సంపాదించాలన్నదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పంతం. యుద్ధంలో ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాలను తమదేశంలో సంపూర్ణంగా విలీనం చేసుకొని, చట్టబద్ధత కల్పించుకోవాలన్నదే రష్యా అధినేత పుతిన్ ఆశయం. రెండు భిన్నమైన లక్ష్యాల సాధన కోసం ట్రంప్, పుతిన్ శుక్రవారం అలస్కాలో సమావేశం కాబోతున్నారు. ఇరువురు నేతల భేటీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధానంగా ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని ముగించడంపైనే చర్చలు జరుగుతాయని పైకి చెబుతున్నా.. తెరవెనుక ఇతర అంశాలూ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తమ అధీనంలో ఉన్న ఉక్రెయిన్ భూభాగాల విషయంలో పుతిన్ పట్టుదలతో వ్యవహరిస్తున్నారు. అలస్కా భేటీతో ఇరువురు నేతలు ఆశిస్తున్నదేమిటో చూద్దాం.. అందుకే అలస్కా వేదిక ఉక్రెయిన్పై దండయాత్ర కొనసాగిస్తున్న పుతిన్ను ప్రపంచంలో ఏకాకిగా మార్చేందుకు పశ్చిమ దేశాలు చేసిన ప్రయత్నాలు చాలావరకు విఫలమయ్యాయి. అమెరికా నుంచి రష్యాను దూరం చేసేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయి. అమెరికా వద్ద తన ప్రతిష్ట స్థిరంగా చెక్కుచెదరకుండా ఉందని నిరూపించుకోవాలని పుతిన్ భావిస్తున్నారు. ఇందుకోసం అలస్కా సమావేశాన్ని అవకాశంగా వాడుకోవాలని నిర్ణయించారు. అంతర్జాతీయ రాజకీయాల్లో తన పట్టు ఏమాత్రం సడలలేదని ట్రంప్తో భేటీ ద్వారా పుతిన్ సంకేతం ఇవ్వబోతున్నారు. సమావేశానికి వేదికగా అలస్కాను ఎంచుకోవడం వెనుక ఒక వ్యూహం ఉంది. అలస్కాకు చేరుకోవాలంటే ఇతర దేశాల గగనతలం గుండా ప్రయాణించాల్సిన అసవరం లేదు. ఎవరినో అనుమతి కోరాల్సిన పనిలేదు. రష్యా నుంచి నేరుగా అలస్కాకు చేరుకోగలరు. అలస్కాను 19వ శతాబ్దంలో రష్యా పాలకులు అమెరికాకు విక్రయించారు. 21వ శతాబ్దంలో కొన్ని సరిహద్దుల్లో బలవంతంగా చేసిన మార్పులను సమర్థించుకోవడానికి అలస్కాను వేదికగా పుతిన్ ఎంచుకున్నారు. దేశాల సరిహద్దులు మార్చడం, భూభాగాల యజమానులు మారడం సాధారణ విషయమేనని ఆయన చెప్పదలిచారు. అలాగైతేనే కాల్పుల విరమణ ఉక్రెయిన్తోపాటు యూరోపియన్ దేశాల అధినేతలను పుతిన్ పక్కనపెట్టారు. ప్రత్యక్షంగా అమెరికాతోనే చర్చలకు సిద్ధమయ్యారు. ఇతర దేశాల పరిగణనలోకి తీసుకోవడం లేదు. చర్చలైనా, ఒప్పందమైనా అమెరికాతోనే అంటున్నారు. ఈ విషయంలో ఉక్రెయిన్ అభ్యంతరాలు వ్యక్తం చేసినా పుతిన్ పట్టించుకోలేదు. తాము ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాలను రష్యాలో అంతర్భాగంగా అంతర్జాతీయ సమాజం గుర్తించాలని పుతిన్ డిమాండ్ చేస్తున్నారు. అలాగైతేనే ఉక్రెయిన్తో కాల్పుల విరమణకు సిద్ధమని చెబుతున్నారు. అయితే, పుతిన్ డిమాండ్ను ఉక్రెయిన్ వ్యతిరేకిస్తోంది. కబ్జాదారులకు తమ భూమి ఇవ్వబోమని ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ తెగేసి చెప్పారు. ఆక్రమిత ప్రాంతాలను రష్యాలో భాగంగా అధికారికంగా గుర్తించేలా ట్రంప్పై ఒత్తిడి పెంచాలన్నదే పుతిన్ వ్యూహంగా కనిపిస్తోంది. మొదట అమెరికా గుర్తిస్తే తర్వాత ఇతర దేశాలపైనా ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుంది. ఆక్రమిత ప్రాంతాలను వదులుకోకుంటే ఆర్థిక సాయం నిలిపివేస్తామంటూ అమెరికా బెదిరిస్తే ఉక్రెయిన్ దారికి రావడం ఖాయమని పుతిన్ వాదిస్తున్నారు. ఆర్థిక బంధం బలపడుతుందా? అమెరికా–రష్యా మధ్య ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాలపైనా ట్రంప్, పుతిన్ చర్చించబోతున్నారు. ఉక్రెయిన్పై యుద్ధం ప్రారంభించిన రష్యాపై అమెరికా కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ ఆంక్షలను సడలించి, ఆర్థిక బంధాన్ని బలోపేతం చేసుకొనే దిశగా ఇరువురు నేతలు ఏదైనా ఒప్పందానికి వచ్చే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం రష్యా ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటోంది. అమెరికా సాయంతో గట్టెక్కాలన్న ఆలోచనలో పుతిన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్పై యుద్ధాన్ని ఆపడానికి పుతిన్ అంగీకరిస్తే రష్యాకు ఆర్థికంగా అండగా ఉండడానికి ట్రంప్ ముందుకు రావొచ్చు. యుద్ధానికి ఫుల్స్టాప్ పెట్టకపోతే తీవ్ర పరిణామాల ఉంటాయని ట్రంప్ తాజాగా రష్యాను హెచ్చరించడం గమనార్హం. అంటే ఈ విషయంలో ట్రంప్ గట్టి పట్టుదలతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. శుక్రవారం జరిగే భేటీలో పుతిన్ను ఆయన ఒప్పించడం ఖాయమని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. యుద్ధాన్ని ఆపేసి శాంతి దూతగా నోబెల్ శాంతి బహుమతి స్వీకరించాలని ట్రంప్ ఆరాపడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఒక్కొక్కరం ఒక్కో రంగు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నటి పూర్ణ, హీరో శివ కందుకూరి పంచుకున్న విశేషాలు– పూర్ణ→ స్కూల్ డేస్లో ఇండిపెండెన్స్ డే ప్రోగ్రామ్స్లో పాల్గొనేదాన్ని. దేశభక్తి పాటలకు డ్యాన్స్ చేయడం ఓ మంచి గుర్తుగా మిగిలిపోయింది. ఇప్పుడు కూడా నా స్కూల్ డేస్ని గుర్తు చేసుకుంటున్నాను. దానికి కారణం దుబాయ్లో నేను ఆరంభించిన ‘డ్యాన్స్ స్కూల్’. ఈ స్కూల్ స్టార్ట్ చేశాక వచ్చిన తొలి ఇండిపెండెన్స్ డే ఇది. ఈ సందర్భంగా మా స్కూల్ స్టూడెంట్స్తో దేశభక్తికి సంబంధించిన రీల్ చేయించాం. సోషల్ మీడియా ద్వారా ఇవాళ రిలీజ్ చేయనున్నాం. రిపబ్లిక్ డే అప్పుడు ఇలాంటిదే చేశాం. అప్పుడు నేను కూడా పాల్గొన్నాను. ఈసారి షూటింగ్స్ ఉండటంతో హైదరాబాద్లో ఉన్నాను.→ స్కూల్లో ‘ఏ మేరా ఇండియా’ అని డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఒళ్లు పులకరించిపోయేది. ఇప్పటికీ ఆ పాట పాడుతుంటే ఓ రకమైన ఎమోషన్ కలుగుతుంది. నేను ఫార్మల్గా డ్యాన్స్ నేర్చుకున్నాను. అందుకే దేశం పట్ల నాకు ఉన్న భక్తిని దేశభక్తి పాటలకు డ్యాన్స్ చేయడం ద్వారా వ్యక్తపరుస్తుంటాను. అసలు ‘ఇండియా’ అని పలుకుతుంటేనే ఎంతో బాగుంటుంది.→ చిన్నప్పుడు స్కూల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు బాగా పర్ఫార్మ్ చేయాలనే దాని మీదే ఎక్కువ ఫోకస్ ఉండేది. అలాగే జెండా రంగులు వచ్చేలా ఒక్కొక్కరం ఒక్కో రంగు డ్రెస్ వేసుకోవడం అనేది ఓ తీపి గుర్తు. తర్వాత తర్వాత మనకు ఇండిపెండెన్స్ రావడానికి ఎందరి త్యాగం ఉందో తెలుసుకుని, వాళ్లందరి మీద గౌరవం పెరిగింది. అలాగే మనం ఇక్కడ క్షేమంగా ఉంటున్నామంటే సరిహద్దుల్లో ఉంటున్న సైనికుల వల్లే. అందుకే ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘సైనికా... సెల్యూట్’ అంటున్నాను.→ సైనికుల త్యాగాల గురించి చెబుతుంటే నాకు యాంకర్ రష్మీ గుర్తొస్తున్నారు. ఆమె సోదరుడు ఆర్మీలో ఉన్నారు. యుద్ధం జరిగినప్పుడు అక్కడ ఉన్న తన సోదరుడి గురించి ఇక్కడ వీరి కుటుంబం ఫీలింగ్స్ని స్వయంగా చూశాను. సోల్జర్స్ కుటుంబాలు పడే ఆవేదన, దేశ రక్షణలో తమ కుటుంబం నుంచి ఒక వ్యక్తి ఉన్నారనే ఆనందం... ఇలా రెండు ఫీలింగ్స్ కనబడుతుంటాయి.→ భవిష్యత్తులో మన పిల్లలు ఏ ఉద్యోగంలో స్థిరపడతారో చెప్పలేం. కానీ మా అబ్బాయితో మాత్రం ‘నిన్ను ఆర్మీలో చేర్పిస్తా’ అంటుంటాను. ఎందుకంటే వాడికి ఏ బొమ్మలూ నచ్చవు. అవి ఎంత పెద్దవైనా. వాటి పక్కన చిన్న గన్ ఉంటే చాలు... దాంతోనే ఆడుకుంటాడు. ఎక్కువగా అవే కొనుక్కుంటాడు. అందుకే మా అబ్బాయిలో నాకో సోల్జర్ కనబడుతుంటాడు.అప్పుడు నేను నెహ్రూ – శివ కందుకూరి→ స్వాతంత్య్ర దినోత్సవం రోజున తప్పనిసరిగా స్కూల్కి హాజరవ్వాలనే నియమం ఉంటుంది. రూల్ ఉందని కాదు... ఇష్టంగా వెళ్లేవాణ్ణి. ఆ రోజు జరిగే కార్యక్రమాల్లో పాల్గొనడం ఎప్పుడూ గుర్తుండిపోయే చిన్ననాటి జ్ఞాపకం. జెండా ఎగరేస్తుంటే సెల్యూట్ చేస్తూ, చూడటం నాకు చాలా హ్యాపీగా ఉండేది. అందుకే మిస్ కాకుండా స్కూల్కి వెళ్లేవాణ్ణి. నా చిన్నప్పుడు స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కోసం నెహ్రూజీలా డ్రెసప్ అయ్యాను. అలా రెడీ అయి, వెళ్లడం నాకు గుర్తుంది. అప్పుడు దేశభక్తి పూర్తి అర్థం తెలియదు. అయితే ఇప్పుడు ఒక హీరోగా ఏదైనా ఫ్రీడమ్ ఫైటర్ రోల్ చేసే అవకాశం వస్తే... తప్పకుండా చేయాలని ఉంది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన పోరాట యోధుల గురించి మరోసారి గుర్తు చేసే అవకాశం ఉంటుంది కదా.→ మామూలుగా మనం చదువుకుంటున్నప్పుడు దేశ, విదేశీయులు కూడా ఆ ఇన్స్టిట్యూషన్స్లో చేరుతుంటారు. అలా నేను అమెరికాలో చదువుకున్న యూనివర్సిటీలో పలు దేశాలవారిని కలిశాను. వాళ్ల దేశాల్లో ఉండే నియమ నిబంధనలు విన్నప్పుడు ‘నా దేశం ఎంతో మెరుగ్గా ఉంది కదా’ అనిపించింది. ఒక ఫ్రీ కంట్రీలో బతుకుతున్నప్పుడు ఆ దేశానికి మనం విలువ ఇవ్వాలి. ఆ దేశం గురించి మనం గర్వపడాలి. ముఖ్యంగా ఆడవాళ్ల విషయంలో కొన్ని దేశాల్లో హద్దులు హారిబుల్. అమ్మాయిలు బయటకు వెళ్లకూడదు... డ్రైవ్ చేయకూడదు వంటి నియమాలు చూసి, మగవాళ్ల ఆధిపత్య పోరు ఎంతలా ఉందీ అనిపించింది. అఫ్కోర్స్ ఇప్పుడు ఆ నియమాల్లో కాస్త వెసులుబాటు వచ్చిందనుకోండి. → నేను యూఎస్లో ఓ పదేళ్ల పాటు ఉన్నాను. ట్రాన్సిల్వేనియాలో ఉన్న ‘ఇండియన్ అసోసియేషన్’ వారు 2013లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఆరంభించారు. ఆ వేడుకల్లో రెండుసార్లు జెండా ఎగరేసే అదృష్టం నాకు దక్కింది. విదేశీ గడ్డ మీద మన మాతృదేశం జెండా ఎగరేయడం అనే ఫీలింగ్ మాటలకు అందనిది. పైగా మన భారతీయులు విదేశీ గడ్డపై ఐకమత్యంతో స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోవడం అనేది నాకు బాగా అనిపించింది. నా మూలాల మీద నాకు మరింత ప్రేమ పెరిగేలా చేసింది. -
జాబిలిపై అణువిద్యుత్ సాధ్యమా?
వ్యోమగాములు తమ అంతరిక్ష పరిశో ధనలకు మజిలీగా చందమామను మార్చుకోవాలని భావిస్తున్న తరుణంలో చంద్రునిపై ఏకంగా అణువిద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పాలని నాసా భావిస్తోంది. అయితే 2030కల్లా అక్కడ న్యూక్లియర్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యమా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎక్కువకాలంపాటు వ్యోమగాములు చంద్రునిపైనే స్థిరనివాసం ఏర్పర్చుకుని జీవించాలన్నా, ఎలాంటి విద్యుత్ అవాంతరాల లేకుండా శాస్త్రసాంకేతిక పరిశోధనలు కొనసా గించాలన్నా అనుక్షణం విద్యుత్ సరఫరా తప్పనిసరి. ప్రాణాధార ఉపకరణాలకూ విద్యుత్ ఖచ్చితంగా అవసరం. అందుకే ఐదేళ్ల లోపే అణువిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటుచేయా లని నాసా భావిస్తోంది. కేంద్రక విచ్చిత్తి (న్యూక్లియర్ ఫిజన్) సూత్రంపై పనిచేసే అణుప్లాంట్ను అక్కడ నెలకొల్పనున్నారు. అయితే నాసాకు పోటీగా సొంత అణువిద్యుత్ కేంద్రాలను ఏర్పాటుచేస్తామని చైనా, రష్యాలు సైతం ప్రకటించాయి. మరో పదేళ్లలో ఈ ప్లాంట్లను ఏర్పాటుచేస్తామని ఇప్పటికే వెల్లడించాయి. అణు విద్యుతే ఎందుకు?చందమామపై స్థిరనివాసం ఏర్పర్చుకునే వ్యోమగాముల నిరంతర విద్యుత్ అవసరా లను సౌరవిద్యుత్ ఏమాత్రం తీర్చలేదు. ఎందుకంటే చంద్రునిపై ప్రతిరోజూ సూర్యకాంతి ప్రసారం కాదు. 14 రోజులపాటు ఏకధాటి గా ఎండకాచి తర్వాత 14 రోజులపాటు మైనస్ డిగ్రీ సెల్సియస్ స్థాయిలో చిమ్మచీకటి నెలకొంటుంది. ఈ చీకటిమయ రోజుల్లో విద్యుత్ అవసరాలు తీర్చే ఏకైక ప్రత్యామ్నా యంగా అణువిద్యుత్కేంద్రం నిలుస్తోంది. అందుకే ఎంత ఖర్చయినాసరే వ్యయప్రయా సల కోర్చి చంద్రునిపై న్యూక్లియర్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని నాసా కృతనిశ్చయంతో ఉంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన లకు సైతం పచ్చజెండా ఊపింది. మరో ఐదేళ్లలో అక్కడ అణువిద్యుత్ ప్లాంట్ కలను సాకారంచేయాలని కంకణం కట్టుకుంది. చిన్నస్థాయిలో మొదలెట్టిఅణువిద్యుత్ కేంద్రంలో ఏవైనా ప్రమాదాలు సంభవించినా అక్కడ శూన్యం ఉంటుందికనుక రేడియోధార్మికత అంతటా వ్యాపిస్తుందన్న భయం అక్కర్లేదు. థర్మల్, జల, పవన విద్యుత్లతో పోలిస్తే చందమామపై అణువిద్యుత్ మాత్రమే ఆచరణ సాధ్యమవుతుంది. సౌరఫలకాలతో సూర్యకాంతిని ఒడిసిపట్టి సౌర విద్యుత్ను తయారుచేసినా అది అక్కడి వ్యోమగాముల అవసరాలను ఏమాత్రం తీర్చలేదు. వీటిని పరిగణనలోకి తీసుకుని న్యూక్లియర్ ప్లాంట్ వైపు శాస్త్రవేత్తలు మొగ్గుచూపుతున్నారు. తొలుత కేవలం 100 కిలోవాట్ల విద్యుత్ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ను నెలకొల్పనున్నారు. భూమి మీద అయితే ఇదే 100 కిలోవాట్ల విద్యుత్తో 80 గృహాల విద్యుత్అవసరాలు తీర్చొచ్చు. దశలవారీగా ప్లాంట్ను విస్తరించి గణనీయమైన స్థాయిలో విద్యుత్ను ఉత్పత్తిచేస్తారు.– సాక్షి, నేషనల్ డెస్క్సమస్యలెన్నో...జల, థర్మల్ విద్యుత్ ప్లాంట్లతో పోలిస్తే అణువిద్యుత్ ప్లాంట్కు పెద్దగా భూవిస్తీర్ణంతో పనిలేదు. కానీ చంద్రుని మీదకు ఈ మొత్తం అణువిద్యుత్ వ్యవస్థ ఉపకరణాలను మోసుకెళ్లాలంటే చాలా చాలా కష్టం. పైగా ఇవి రాకెట్లో తరలించేంత తేలికగా ఉండాలి. అత్యధిక బరువులను ఇప్పుడున్న రాకెట్లు అస్సలుమోయలేవు. ఒకవేళ అధిక బరువులను మోసుకెళ్లేలా వ్యోమనౌకలను డిజైన్చేసి రూపొందించినా అవి అంత బరువును మోస్తూకూడా జాగ్రత్తగా చంద్రునిపై ల్యాండ్ కావాల్సి ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చి అది క్రాష్ ల్యాండ్ అయినా వేలకోట్ల రూపాయల నష్టం ఖాయం. భూమిపై అయితే అణువిద్యుత్ కేంద్రాన్ని ఎంతో మంది సాంకేతిక నిపుణులు తీరిగ్గా, నిశితంగా తనిఖీచేసి నిర్మిస్తారు. చంద్రునిపై ఈ ప్లాంట్ను నిర్మించాలంటే కార్మిక సిబ్బంది దొరకరు. ఉన్న ఆ కొద్దిపాటి వ్యోమగాములే అణుప్లాంట్ ఉన్నతాధికారుల అవతారమెత్తి ప్లాంట్ను బిగించాల్సి ఉంటుంది. అణువిద్యుత్ ప్లాంట్ నుంచి అత్యధిక స్థాయిలో వేడిమి వెలువడుతుంది. దానికి చల్లబరిచే కూలింగ్ వ్యవస్థలను ఏర్పాటుచేయాలి. వాటిని కూడా భూమి మీద నుంచే ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఎంతో శ్రమ, వ్యయంతో కూడిన వ్యవహారం. శూన్యస్థితిని తట్టుకునేలా వినూత్న రీతిలో ప్లాంట్ను డిజైన్ చేయాల్సి ఉంటుంది. రేడియోధార్మిక వ్యర్థ్యాల పారబోత, ప్లాంట్ పాడైతే రిపేర్లు వంటి ఎన్నో అవరోధాలు అక్కడి హఠాత్తుగా స్వాగతం పలుకుతాయి.వీటిని తట్టుకుంటూనే ప్లాంట్ను నిర్వహించాల్సి ఉంటుంది. ట్రంప్ హయాంలో నాసాకు అంతరిక్ష పరిశోధనా బడ్జెట్లో భారీ కోత పెట్టిన నేపథ్యంలో ఇతర మార్గాల్లో ఆదాయం సమకూర్చి ఈ ప్రాజెక్ట్ను సఫలీకృతం చేయాల్సి ఉంది. ఇన్ని బాలారిష్టాలను దాటుకుని ప్లాంట్ ఏర్పాటు సుసాధ్యమైతే జాబిలిపై మానవనివాసం ఎలాంటి జంజాటాలు లేకుండా హాయిగా సాగుతుంది. -
‘షేరెంటింగ్’...
సోషల్ మీడియా రాక ముందు, పిల్లల గారాలు ఇంటి గడప దాటేవి కావు. మహా అయితే స్నేహితులకు, ఇరుగు పొరుగువారికి, బంధువులకు.. పిల్లల ఘనకార్యాల గురించి చెప్పుకొని మురిసిపోయేవారు తల్లిదండ్రులు. పుట్టినరోజు వేడుకల వంటివి చేసినప్పుడు ఆ ఫొటోలు ఉన్న ఆల్బమ్ను ఇంటికి వచ్చిన వారికి చూపించేవారు. సాధారణంగా ప్రతి ఇంట్లోనూ ఇలానే ఉండేది. కానీ ఇప్పుడు ఆ మురిపాలు ఖండాలు దాటుతున్నాయి! పిల్లల ఫొటోలను ఆన్లైన్లో పంచుకోవాలనే సంతోషం సహజమే అయినప్పటికీ, అందువల్ల రాబోయే ప్రమాదాల గురించి కూడా తల్లిదండ్రులు తెలుసుకుని ఉండాలి.ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, ఎక్స్, యూట్యూబ్, టెలిగ్రామ్, స్నాప్ చాట్ వంటి విస్తృతి కలిగిన సోషల్ మీడియా వేదికలు అందుబాటులోకి వచ్చాక.. పిల్లలకు సంబంధించిన ప్రతి సంతోషాన్ని తల్లిదండ్రులు ప్రపంచంతో షేర్ చేసుకుంటున్నారు. అయితే అలా షేర్ చేయటం ఆ చిన్నారుల గోప్యతకు భంగం కలుగుతుందని ఆన్లైన్లో కొన్ని సంఘటనలు జరిగే వరకు తల్లిదండ్రులు గ్రహించలేకపోతున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్మార్ఫింగ్తో మహా ప్రమాదంపిల్లల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయటా న్ని ‘షేరెంటింగ్’ అంటున్నారు. దీనివల్ల పిల్లల గురించిన పూర్తి సమాచారం ఇంటర్నెట్లోకి వెళ్లిపోతుంది. కొందరు తల్లిదండ్రులు పిల్లల ఫొటోలపై ఎమోజీలు పెట్టి.. ముఖం కనిపించలేదు, ఇక సేఫ్ అనుకుంటున్నారు. అంతకంటే మూర్ఖత్వం మరోటి లేదు. ఇది ఏఐ యుగం అని మరిచిపోతే ఎలా? వారి ఫొటోలను మార్ఫింగ్ చేసేవాళ్లు, వారి వివ రాలను తమ స్వార్థానికి ఉపయోగించుకునే వాళ్లు ఉంటారు. పిల్లలపై ఆన్లైన్ వేధింపులూ జరగొచ్చు. తమకసలు సంబంధమే లేకుండా పిల్లలు నలుగురు నోళ్లలోనూ నానుతారు. దీనికంతటికీ కారణం తల్లిదండ్రుల అత్యుత్సాహమే.అన్నీ చెప్పేసుకుంటే ముప్పుపిల్లల ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సైబర్ క్రైమ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తమ పిల్లల ప్రైవసీని కాపాడటం తల్లిదండ్రుల బాధ్యతేనని సోషల్ మీడియా ధోరణుల అధ్యయన నిపుణులు కూడా స్పష్టం చేస్తున్నారు. పిల్లల వివరాలన్నీ బయటికి వెళ్లిపోతే, ఏ వైపు నుంచైనా హాని, లేదా నష్టం సంభవించవచ్చని చెబుతున్నారు. దొంగచేతికి తాళం ఇచ్చినట్లే!» పిల్లల ఫొటోలు.. ముఖ్యంగా వారి పేర్లు, పుట్టిన తేదీలు లేదా వారి లొకేషన్ను బహిర్గతం చేసే వివరాలతో ఉన్న పోస్టులను సైబర్ నేరస్థులు ఊహించని విధంగా వాడుకునే ప్రమాదం ఉంటుంది. » తల్లిదండ్రులు షేర్ చేసిన పోస్టుల ఆధారంగా దొంగిలించిన సమాచారాన్ని తప్పుడు బ్యాంకు ఖాతాలను తెరవడానికి, అప్పుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి, లేదా ఈ పిల్లల్ని వేరే పిల్లలుగా నమ్మించి ఎవరినైనా మోసం చేయటానికి వాడుకో వచ్చు. ఇటీవల ఇలాంటి కేసులు ఎక్కువవుతున్నాయి.పేరెంట్స్.. పారాహుషార్» కడుపున పుట్టిన పిల్లలే అయినా వారి సమ్మతి లేకుండా వారి ఫొటోలను, వీడియోలను తల్లిదండ్రులు షేర్ చేయటానికి లేదు. ఒకవేళ పిల్లలు తెలియక సమ్మతించినా పెద్దలు ఆలోచించాలి. పిల్లల గోప్యతకు గౌరవం ఇవ్వాలి. » పిల్లలు పెద్దయ్యాక, తమ తల్లిదండ్రులు షేర్ చేసిన తమ చిన్ననాటి ఫొటోల గురించి తెలిసి ఇబ్బంది పడవచ్చు. బాల్యంలోని ఫొటోలను స్నేహితులు చూసి.. లావుగా ఉన్నారనో, నల్లగా ఉన్నారనో వ్యాఖ్యలు చేయవచ్చు. అవి వారిని చాలా బాధిస్తాయి. ఎప్పటివో ఫొటోలు సోషల్ మీడియా సముద్రంలో పడి.. ఇప్పుడు సమస్యల సుడిగుండాలు సృష్టిస్తాయి.భవిష్యత్తుపై ప్రభావం» కాలేజ్ అడ్మిషన్లు, ఉద్యోగ దరఖాస్తుల సమయంలో వారి భవిష్యత్ అవకాశాలను ఏ రూపంలోనైనా అవి ప్రభావితం చేయవచ్చు. » మామూలు ఫొటోకు కథనం అల్లి, ఇంటర్నెట్లో తిప్పేవారు ఉంటారు. చదువు, ఉద్యోగాలలోనే కాదు, పెళ్లి సంబంధాల విషయంలోనూ అవాంతరాలు రావచ్చు.వేటాడే కళ్లకు చిక్కినట్లే!పిల్లలు స్నానం చేస్తున్నప్పటి ఫొటోలు, బట్టలు మార్చుకుంటున్నప్పటి ఫొటోలు కూడా కొన్ని సార్లు షేర్ అవుతుంటాయి. సైబర్ క్రిమినల్స్లోని వేటగాళ్ల కంట్లో ఆ ఫొ టోలు పడితే.. ఇక వాటిని వాళ్లు అసభ్య కరమైన వెబ్సైట్లకు షేర్ చేసే ప్రమాదం ఉంటుంది. » ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీతో పిల్లల ఫొటోలను చూడలేని విధంగా మా ర్చి, నకిలీ ప్రొఫై ల్ను సృష్టించి అన్లైన్లో మోసపూరి తమైన లావా దేవీలను కొన సాగించే వారికి కూడా కొదవ లేదు. వేధింపులు – బెదిరింపులు! » ఆన్ లైన్ లో షేర్ చేసిన ఫొటోలను ఎవరు ఎలా దుర్వినియోగం చేస్తారో చెప్ప లేం. మార్ఫింగ్ చేయవచ్చు. మరెవరికైనా షేర్ చేయవచ్చు. ఏడిపించటానికి, బెదిరించ టానికి, వేధించటానికి ఆ వివరాలు తోడ్పడ వచ్చు.» అమాయకంగా కనిపించే పిల్లల ఫొటోలపై అసభ్యకరమైన కామెంట్లు చేసేవా రుంటారు. కొందరు మీమ్స్ కూడా సృష్టించి వైరల్ చేస్తుంటారు. ఆ సంగతి అటు తిరిగి ఇటు తిరిగి ఈ పిల్లల్ని చేరిందంటే.. వారు ఆ దారుణాలను తల్లిదండ్రులకు చెప్పటానికి భయపడి, లోలోపలే మానసిక వ్యథను అనుభవిస్తారు. ఇది పిల్లలకు కాకుండా తల్లిదండ్రులకు తెలిసినా వారిదీ ఇదే పరిస్థితి.» పోస్ట్లోని వివరాలను బట్టి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని బ్లాక్మెయిల్ చేసేవారూ ఉంటారు. -
ఈ బుల్లిరాయి భూమికే పెద్దన్న
ఇంటికి అతిథిగా చిన్ననాటి స్నేహితులు, ఆప్తులు వస్తే ఎంతో ఆత్మీయంగా, సాదరంగా ఆహ్వానిస్తాం. మళ్లీ ఎప్పుడొస్తారా అని ఎదురుచూస్తాం. అలాంటి ఎదురుచూపులకు తావివ్వకుండా ఒక అతిథి ఒక అమెరికన్ ఇంట్లోకి ప్రవేశించింది. తలుపు గడియ కొట్టి సింహద్వారం గుండా రాకుండా నేరుగా ఇంటి పైకప్పుకు కన్నం వేసి ఇంట్లోకి దూరింది. మెరుపువేగంతో దూసుకొచ్చిన ఆ అతిథిని చూసి ఆ ఇంటాయన అవాక్కయ్యారు. ఎందుకంటే అది చిన్న రాయి. అది కూడా నిన్న మొన్న నేల తవ్వి తీసిన రాయి కాదు. గట్టిగా మాట్లాడితే అది అసలు భూమి మీది రాయే కాదు. ఆ రాయి ఉద్భవించినప్పుడు మన పుడమి కూడా పుట్టలేదు. మరి ఆ రాయి ఎక్కడిది? అంటే అంతరిక్షంలో అంగారకుడు, బృహస్పతి గ్రహాల మధ్యలోని గ్రహశకలాల కూటమి నుంచి భూమి వైపు ఇలా దూసుకొచ్చింది. భూమి ఏర్పడకముందు ఆస్ట్రరాయిడ్ బెల్ట్లోనే చక్కర్లు కొట్టిన ఈ రాయి జూన్ 26వ తేదీన భూవాతావరణంలోకి చొరబడి చివరకు అమెరికాలో నేలను తాకింది. ఈ బుల్లి గ్రహశకలానికి ‘ది మెక్డోనా’ అని పేరు పెట్టారు. జార్జియా రాష్ట్రంలోని ఒక ఇంటి పైకప్పుకు రంధ్రం చేసి మరీ లోపల పడిన ఈ రాయిని జార్జియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అంతరిక్ష వస్తువుగా గుర్తించారు. అట్లాంటా ఆకాశంలో తోకచుక్కలా..భూమి మీద పడటానికి కొద్దిసేపటి ముందు పట్టపగలే ఇది తోకచుక్కలా అత్యంత ప్రకాశవంతంగా మెరుస్తూ దూసుకొచ్చింది. చిన్నపాటి అగ్నిగోళంగా మండుతున్న దీనిని అమెరికాలోని వేర్వేరు రాష్ట్రాల ప్రజలు వీక్షించి తమ కెమెరాల్లో బంధించారు. ఎట్టకేలకు ఇది హెన్రీ కౌంటీనిలోని మెక్డోనా ప్రాంతంలోని ఇంట్లో ఇది పడింది. ఇది పడినప్పుడు పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్తో షూట్చేస్తే ఎలాంటి శబ్దం వస్తుందో అచ్చం అలాంటి శబ్దం వచ్చిందని ఇంటి యజమాని చెప్పారు. విషయం తెల్సుకున్న జార్జియా వర్సిటీలోని భూవిజ్ఞాన శాస్త్రవేత్త స్కాట్ హారిస్ వెంటనే రంగంలోకి దిగి ఆ ఇంట్లోని చెల్లాచెదురుగా పడిన 50 గ్రాముల ఖగోళదూళిని సేకరించారు. అందులో 23 గ్రాముల నాణ్యమైన ధూళిని అత్యంత శక్తివంతమైన ఆప్టికల్, ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లతో పరిశీలించారు. అది ఏకంగా 456 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన లో మెటల్(ఎల్) ఆర్డినరీ ఖోన్డ్రైట్ మూలకంతో ఏర్పడిందని తేల్చారు. ఈ లెక్కన ఈ రాయి భూమి కంటే ముందే ఏర్పడింది. ఇన్నాళ్లూ ఇది తన భారీ గ్రహశకలాలలో భాగంగా ఉండేది. అయితే దాదాపు 47 కోట్ల సంవత్సరాల క్రితం గ్రహశకలం మరింత చిన్నపాటి ముక్కలుగా ఛిద్రమైంది. అలా ఏర్పడిన చిన్నపాటి రాళ్లలో అమెరికాలో పడిన రాయి కూడా ఒకటి అని జార్జియా వర్సిటీ పరిశోధకులు తేల్చి చెప్పారు. ‘‘ ఈ బుల్లి రాయి 0.50 క్యాలిబర్ బుల్లెట్ కంటే రెట్టింపు పెద్దదిగా ఉంది. కాంతి వేగంతో ఇది భూ వాతావరణంలోకి ప్రవేశించింది. భూ వాతావరణంలోకి వచ్చాక అధిక గాఢత ఉన్న గాలి దీని వేగాన్ని ఒక్కసారిగా తగ్గించింది. దీంతో ఘర్షణ ఏర్పడి మండింది. వేగం సెకన్కు కిలోమీటర్కు తగ్గి చివరకు పైకప్పును చీల్చుకుంటూ నేలపై పడింది. దీనికి అధికారికంగా పేరు పెట్టేందుకు గ్రహశకలాల సంఘం కమిటీకి పంపించారు. పేరు పెట్టాక గ్రహశకలాల సంబంధ బులె టిన్లో ముద్రి స్తారు. పురాతన ఖగోళ ఖజా నాగా దీనిని అభి వర్ణిస్తున్నారు. దీని నిర్మాణం ద్వారా ఆనాటి అంతరిక్ష వాతావరణ పరిస్థితులను అంచనావే సేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్ని స్తున్నారు. విశ్వం ఇప్పటికీ తన రహస్యాలను ఒక్కొక్క టిగా మనకు తెలియ జేప్పేందుకు ఇలా ఖగోళ దూతలను భూమి మీదకు పంపిస్తోందని ఖగోళ శాస్త్రవేత్తలు వ్యాఖ్యానించారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్రంప్, పుతిన్ ఏకాంత చర్చలే!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత పుతిన్ ఈ నెల 15న అలస్కాలో భేటీ కాబోతున్నారు. ఈ భేటీ అత్యంత గోప్యంగా జరుగబోతోందని వైట్హౌస్ వర్గాలు వెల్లడించాయి. సమావేశం జరిగే గదిలో ట్రంప్, పుతిన్తోపాటు ఇద్దరు అనువాదకులు మాత్రమే ఉంటారని తెలిపాయి. ఇంకెవరికీ ప్రవేశం ఉండదని పేర్కొన్నాయి. ఇరువురు నేతలు దాదాపు నాలుగేళ్ల తర్వాత ముఖాముఖి చర్చలు జరుపబోతున్నారు. ఈ చర్చలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. 2018 జూలై 16న ఫిన్లాండ్ రాజధాని హెల్సింకీలో ట్రంప్, పుతిన్ మధ్య రెండు గంటలపాటు గోప్యమైన భేటీ జరిగింది. అప్పటి చర్చల్లో పెద్దగా ఏదీ సాధించలేకపోయారు. ఫల వంతం కాలేదు. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. భేటీ తర్వాత ఇరువురు నేతలు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పుడు కూడా అదే తరహాలో గోప్యంగా మాట్లాడుకోవాలని నిర్ణయించుకోవడం పట్ల భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అప్పటిలాగే విఫలమయ్యే అవకాశం లేకపోలేదని విమర్శకులు అంటున్నారు. ట్రంప్, పుతిన్ తోపాటు ఇరుపక్షాల నుంచి ప్రతినిధులు కూడా సమావేశంలో పాల్గొంటే ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందని సూచిస్తున్నారు. కాల్పుల విరమణ, శాంతి ఒప్పందం పుతిన్తో ఏకాంత చర్చలకే ట్రంప్ మొగ్గు చూపడం వెనుక స్పష్టమైన కారణం ఉన్న ట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్తో యుద్ధాన్ని ముగించేలా పుతిన్తో గట్టిగా వాదించి, ఒప్పించడానికి ఏకాంత భేటీ దోహదపడు తుందని ఆయన భావిస్తున్నట్లు సమా చారం. ఎందుకంటే చర్చల గదిలో ఇతరు లు కూడా ఉంటే వారు అప్పటికప్పుడు పుతిన్ మనసు మార్చేసి, వెనక్కి లాగే ప్రమాదం లేకపోలేదు. అలాంటి పరిస్థితి లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే ట్రంప్ ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. మధ్యవర్తులతో పని కాదన్న అంచనాతో స్వయంగా తానే రంగంలోకి దిగాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు. ఉక్రెయిన్తో మొదట కాల్పుల విరమణకు, ఆ తర్వాత శాంతి ఒప్పందానికి రష్యా అధినేతను ఎలాగైనా ఒప్పించాలన్నదే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. పుతిన్ విజయమే: బోల్టన్ అలస్కాలో జరిగే భేటీని పుతిన్ విజయంగా డొనాల్డ్ ట్రంప్ మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ అభివర్ణించారు. సమావేశానికి ట్రంప్ను స్వయంగా రప్పిస్తుండడం ద్వారా పుతిన్ ఇప్పటికే పైచేయి సాధించారని అన్నారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ఆపేస్తుందన్న నమ్మకం తనకు లేదని తేల్చిచెప్పారు. అయితే, జాన్ బోల్టన్ వ్యాఖ్యలను ట్రంప్ కొట్టిపారేశారు. అమెరికాకు అపజయం ఉండదని పేర్కొన్నారు. -
మనసు దోచే మయూరి గార్డెన్
మహబూబ్నగర్ న్యూటౌన్: పర్యాటక పరంగా మహబూబ్నగర్ జిల్లా దూసుకెళ్తోంది. మయూరి నర్సరీ నుంచి మయూరి ఎకో అర్బన్ పార్క్గా రూపాంతరం చెందిన మహా వనమే ఇందుకు నిదర్శనం. 2,087 ఎకరాల విస్తీర్ణంలో పచ్చదనాన్ని పరుచుకుని ఆహ్లాదం పంచుతోంది. చిన్నపిల్లల నుంచి మహిళలు, పురుషులు తేడా లేకుండా వృద్ధులు.. ఇలా అన్నివర్గాల వారికి వినోదం, విజ్ఞానం, ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. సాహస క్రీడలకు వేదికగా పర్యాటకులను ఆకట్టుకుంటోంది. పట్టణ ప్రాంతంలో అద్భుతమైన పిక్నిక్ స్పాట్గా విరాజిల్లుతున్న సహజసిద్ధ వనక్షేత్రంపై ‘సాక్షి’ప్రత్యేక కథనం. » మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అప్పనపల్లి సమీపంలో మయూరి ఎకో అర్బన్ పార్క్కు 2015 జూన్ 3న శంకుస్థాపన చేశారు. 2017 ఏప్రిల్ 17న ప్రారంభించిన ఈ పార్క్ పర్యాటకులతో నిత్యం సందడి చేస్తోంది. సెలవు, వారాంతపు రోజుల్లో మరీ ఎక్కువగా పర్యాటకుల తాకిడితో కళకళలాడుతోంది. రాష్ట్రంలోని పెద్ద నగరాలతో పాటు కర్ణాటక, ఏపీ నుంచి పర్యాటకులు.. మయూరి అర్బన్ ఎకో పార్కును సందర్శిస్తూ ఆహ్లాదాన్ని పొందుతున్నారు. » పర్యాటకులు సేదదీరేందుకు ఏర్పాటు చేసిన పచ్చదనం.. తివాచీని తలపిస్తూ సందర్శకులను ఆకట్టుకుంటోంది. కుటుంబ సమేతంగా వచ్చే పర్యాటకులు గార్డెన్లో కూర్చొని సేదదీరుతున్నారు. యోగా చేసుకునే వారికి పార్క్లో ప్రత్యేక షెడ్డును ఏర్పాటు చేశారు. రోజూ ఇక్కడికి వందలాది మంది వచ్చి యోగ సాధన చేసుకునేందు కు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పార్క్లో చిన్నారు లు, పెద్దలకు ప్రత్యేకంగా ఓపెన్ ఎయిర్ జిమ్ ఏ ర్పాటు చేశారు. వివిధ రకాల వ్యాయామాలకు ఆరు పరికరాలను సమకూర్చారు. వెయిస్ట్ టర్న్ ట్విస్టర్, సిట్ అప్ బెంచ్, రోవర్, బాక్ పుల్ డౌన్, రైడర్, హెల్త్ వాకర్ ఉన్నాయి. సీతాకోకచిలుకల గార్డెన్ ప్రవేశద్వారం ఎదుట మొదట కనిపించేది బట్టర్ఫ్లై గార్డెన్. ఇందులో ఎన్నో రకాల మొక్కలు నాటారు. గతంలో నాటినవి.. ఇప్పుడు ఏపుగా పెరిగి ఆకట్టుకుంటున్నాయి. సీతాకోకచిలుకలను ఆకట్టుకునేలా స్వర్ణ గన్నేరు, పారిజాతం, విష్ణుశంఖం, మందారం వంటి 45 రకాల మొక్కలు ఉన్నాయి. 12 రాశులు.. 12 మొక్కలు తెలుగు రాశులు 12 ఉంటాయి. ఈ మేరకు పార్క్లో రాశి నవగ్రహ వనం ఏర్పాటు చేశారు. రాశుల పేర్లతోపాటు మొక్కలు వాటి సాంస్కృతిక నామాలను బోర్డుపై కనిపించేలా రాశారు. ఏడాకుల పాలు (వృషభం), అశోక/వెదురు (మిథునం), ఎర్రచందనం (మేషం), మర్రి (మీనం), జమ్మి (కుంభం), సిస్సు (మకరం), రావి (ధనస్సు), సండ్ల (వృశి్చకం), పొగడ (తుల), మామిడి (కన్య), రేగు (సింహం), మోదుగల (కర్కాటకం) నాటారు. అడల్ట్ వాటర్ బోటింగ్ పార్క్ చివరి భాగంలో చెక్డ్యాం నిర్మించి అందులో వాటర్ బోటింగ్ ఏర్పాటు చేశారు. బోటింగ్కు పర్యాటకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇద్దరు కూర్చుని సైకిల్లా తొక్కుతూ ముందుకు సాగవచ్చు. పచ్చని అందాల మధ్య నీటిలో విహారం ప్రత్యేక అనుభూతి మిగులుస్తోందని పర్యాటకులు చెబుతున్నారు. పది నిమిషాలకు ఒక్కొక్కరికి పది నిమిషాలకు రూ.100 వసూలు చేస్తున్నారు. పల్లె వాతావరణం ఆధునిక కాలంలో పిల్లలు ఎక్కువగా పట్టణాలు, నగరాల్లో నే విద్యనభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల పై వారికి అవగాహన కరువవుతోంది. ఈ నేపథ్యంలో పల్లె వాతావరణం ప్రతిబింబించేలా పార్క్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్టింగ్ పర్యాటకులకు ఆకట్టుకుంటోంది. మనిషి ఎద్దులబండిని నడిపేలా చిత్రం, వీటి వెనుక గుడిసె, చేదు డుబావి ఏర్పాటు చేశారు. వెదురు ఉత్పత్తులతో తయారు చేసిన వన కుటీరం అమితంగా ఆకట్టుకుంటోంది. రెయిన్ ఫారెస్ట్, వాటర్ ఫాల్స్ అద్భుతం పార్క్లో రెయిన్ ఫారెస్ట్ ప్రత్యేక అనుభూతిని మిగులుస్తోంది. సహజసిద్ధ వాతావరణంలో వర్షం పడుతున్నట్లు కృత్రిమంగా ఏర్పాటు చేశారు. చెరువు నుంచి పైపుల ద్వారా నీటిని పంపింగ్ చేసేలా ప్రత్యేకమైన సెట్టింగ్ ఏర్పాటు చేయడం ఆకర్షిస్తోంది. గుట్టపై జాలువారుతున్న జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చెరువు నుంచి పైకి నీళ్లు పంపింగ్ చేసి.. అక్కడ నిల్వ చేసి.. వదిలిపెడుతున్నారు. ఇలా ఏర్పడిన వాటర్ ఫాల్స్ సందర్శకులను మైమరిపింపజేస్తోంది. సాహస విన్యాసాలకు వేదిక మయూరి ఎకో అర్బన్ పార్క్ సాహస విన్యాసాలకు వేదికగా నిలుస్తోంది. రూ.50తో టైర్ బ్రిడ్జి, బాంబో బ్రిడ్జి, వాల్ క్లైంబింగ్ చేయవచ్చు. రూ.200తో సైక్లింగ్, రూ.100తో జిప్లైన్, వర్షాకాలం తర్వాత ఫారెస్ట్ ట్రెక్కింగ్ చేసే అవకాశం కల్పిస్తారు. యువకులు, విద్యార్థులు, పిల్లలు ఎక్కువగా ఈ ఈవెంట్లలో పాల్గొంటున్నారు. కరెన్సీ పార్క్ వివిధ దేశాలకు సంబంధించిన కరెన్సీ నోట్లను వృత్తాకారంలో ఏర్పాటు చేశారు. ఒక్కో కరెన్సీ నోటు వద్ద సంబంధిత దేశం పేరు, ఏమని పలకాలో వివరంగా రాశారు. భారతదేశం, ఉత్తర కొరియా, ఆస్ట్రేలియా, అమెరికా, జర్మనీ, ఫిన్లాండ్, సింగపూర్, దక్షిణాఫ్రికా, క్యూబా, వెనిజులా దేశాలకు చెందిన కరెన్సీ నోట్ల వివరాలు పిల్లలు గుర్తుంచుకునేలా ఏర్పాటు చేశారు. క్రీడాభిమానుల వేదిక ఆర్చరీ జోన్ పార్క్లో ఏర్పాటు చేసిన ఆర్చరీ జోన్ క్రీడాకారులతోపాటు క్రీడాభిమానులను ఆకర్షిస్తోంది. సెలవుల్లో మినహా రోజూ ఇది అందుబాటులో ఉంటోంది. ఈ ఆర్చరీ జోన్లో ఐదు విల్లులు కొట్టడానికి రూ.50 వసూలు చేస్తారు. ఏటా వేసవిలో ఇక్కడ ప్రత్యేకంగా ఆర్చరీ శిక్షణ ఇస్తున్నారు. జంగిల్ సఫారీ మయూరి అటవీ ప్రాంతంలో జంగిల్ సఫారీకి అవకాశముంది. అందుకు అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒక ట్రిప్కు రూ.2వేల చార్జితో ఎనిమిది మంది వరకు వాహనంలో అడవి మొత్తం చుట్టి రావొచ్చు. అడవి జంతువులతోపాటు రకరకాల చెట్లను చూడవచ్చు. నైట్ క్యాంపింగ్కు ప్రత్యేక ప్యాకేజీ ఎకో పార్క్లో ఒకరోజు, రాత్రివేళలో ప్రత్యేక నైట్ క్యాంపింగ్కు ఏర్పాట్లు చేశారు. ఒక్కొక్కరికి రూ.1,500 ప్యాకేజీతో డిన్నర్, భోజనంతో పాటు హైకింగ్ ఫారెస్ట్, జిప్లైన్ అండ్ రోప్ విన్యాసాలు, రెయిన్ ఫారెస్ట్, వాటర్ఫాల్, జిప్ సైక్లింగ్కు అవకాశం కల్పించారు. కొంతకాలంగా ఈ ప్యాకేజీ కొనసాగడం లేదు. త్వరలో పునఃప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. పిల్లలు కేరింతలు కొట్టాల్సిందే.. మయూరి ఎకో అర్బన్ పార్క్లో ఆడుకోవడానికి వీలుగా చిల్డ్రన్ పార్క్కు అన్ని హంగులు అద్దారు. చూడగానే ఆకట్టుకునేలా పార్క్ ముఖద్వారాన్ని తీర్చిదిద్దారు. లోపలికి ప్రవేశించారో.. లేదో.. పిల్లలు కేరింతలు కొట్టాల్సిందే. జారుబండలు, ఊయలలు, రోలింగ్, టైర్ స్వింగ్, అప్ అండ్ డౌన్ బల్లలు, అంబరిల్లా ఆటలు ఆడుకునేలా ఏర్పాట్లు ఉన్నాయి. కోతులు, చింపాంజీల బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి. చిన్నారుల వాటర్ బోటింగ్కు విశేష స్పందన వస్తోంది. వాటర్ బోటింగ్కు 10 నిమిషాలకు రూ.50 చార్జి వసూలు చేస్తున్నారు.‘మకావ్’అదరహో.. పార్క్లో ఏర్పాటు చేసిన చిలుక జాతికి చెందిన గ్రీన్వింగ్డ్ మకావ్ పక్షి సందర్శకులను ఆకట్టుకుంటోంది. దక్షిణ అమెరికా అడవుల్లో గుంపులుగా నివసించే ఈ పక్షిని ఎన్క్లోజర్లో పెట్టారు. ఈ పక్షి జీవితకాలం 60 నుంచి 80 ఏళ్లు అంటూ వివరాలు తెలిపేలా బోర్డు ఏర్పాటు చేయడంతో.. పిల్లలకు వినోదంతోపాటు విజ్ఞానం అందుతోంది. బ్లాక్ అండ్ వైట్ స్వాన్ పార్క్లో ఏర్పాటు చేసిన కొలనులో నలుపు, తెలుపు రంగుల హంసల సందడి ఆకట్టుకుంటోంది. ఆ్రస్టేలియా ఖండానికి చెందిన ఈ హంసలు ఎక్కువ సేపు నీటిమీద విహరిస్తూ గడుపుతాయి. ఆకులు, గింజలు వీటి ఆహారం. జీవిత కాలం 30 నుంచి 40 ఏళ్లు అన్న వివరాలను బోర్డుపై రాసి పెట్టారు. చెట్ల మధ్య నడక వంతెన పార్క్ మధ్యభాగంలో ఏర్పాటు చేసిన నడక వంతెన విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒక పక్క నడక వంతెన ఎక్కి.. మరోచోట దిగేలా ఏర్పాటు చేశారు. ఈ నడక వంతెనపై చిన్నారులతోపాటు పెద్దలు వాకింగ్ చేస్తున్నారు. వంతెన వద్ద ఏర్పాటు చేసిన డైనోసర్ల ప్రతిమలు అలరిస్తున్నాయి. పార్క్లో భారీ పరిమాణంలో ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటెన్ ఆకట్టుకుంటోంది. చుట్టూ నాటిన వివిధ రకాల మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఎంత పెద్ద ఆ్రస్టిచ్ పక్షులో.. అర్బన్ పార్క్కే హైలెట్గా ఆ్రస్టిచ్ పక్షులు నిలుస్తున్నాయి. పొడవైన కాళ్లు, భారీ ఆకారంతో కూడిన ఆ్రస్టిచ్ పక్షులు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఆఫ్రికా, ఆస్ట్రేలియా అడవుల్లో ఈ పక్షులు ఎక్కువగా కనిపిస్తాయి. వీటి గుడ్డు 32 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. బరువు కిలో 400 గ్రాములు ఉంటుంది.. అన్న వివరాలు ఉన్నాయి. మూడు వ్యూ పాయింట్లు పార్క్లో మూడు వ్యూ పాయింట్లు ఉన్నా యి. హిల్ వ్యూపాయింట్, ఫ్లాగ్ పాయింట్తో పాటు మరో సాధారణ వ్యూ పాయింట్ను ఏర్పాటు చేశారు. హిల్ వ్యూపాయింట్ నుంచి చూస్తే ఇటు పక్క జడ్చర్ల, మరోపక్క మహబూబ్నగర్ రహదారి అద్భుతంగా కనిపిస్తోంది. వ్యూ పాయింట్లో పార్క్ అందాలు ఆకట్టుకుంటున్నాయి. ఫొటో షూట్లకు క్రేజీ మయూరి ఎకో అర్బన్ పార్క్ ఫొటో షూట్కు వేదికగా నిలుస్తోంది. కొత్తగా పెళ్లి చేసుకునేవారు, చేసుకున్న జంటలు ఇక్కడికి వచ్చి ప్రకృతి అందాల మధ్య ఫొటోలు తీసుకుంటుండడంతో సందడి నెలకొంటోంది.ఆహ్లాదంగా ఉంది సెలవు రోజుల్లో కుటుంబంతో కలిసి పార్క్కు వస్తుంటాం. పార్క్ రోజురో జుకూ అభివృద్ధి చెందుతోంది. పా ర్క్లో కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతాం. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. పెద్దలు సంతోషంగా గడిపేందుకు అవకాశముంది. – రాజేశ్వర్, ఉపాధ్యాయుడుపిల్లలకు చూపాలి చి్రల్డన్ పార్కులో ఏర్పాటు చేసిన సెట్టింగ్లు, బొమ్మలు కచి్చతంగా పిల్లలకు చూపాలి. సీతాకోక చిలుకల గార్డెన్లో రకరకాల మొక్కలు, వాటి పేర్లు తెలియడంతో విజ్ఞానం పెరుగుతుంది. సెలవులు ఉంటే తప్పకుండా మా పిల్లలతో ఇక్కడికొస్తాం. – శంకర్, మహమ్మదాబాద్ హైదరాబాద్ తరహాలో.. హైదరాబాద్లోని పార్క్ల తరహాలో ఇక్కడే పలు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. పచ్చదనంతో కూడిన పార్క్ అందాలు చాలా బాగున్నాయి. జీవితంలో గుర్తుండిపోయేలా ఉంది. పిల్లలకు ఆడుకునేందుకు, విజ్ఞానం పొందేందుకు ఇక్కడి ఏర్పాట్లు బాగున్నాయి. – దీపిక, మహబూబ్నగర్ రాబోయే రోజుల్లో మరిన్ని ఏర్పాట్లు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సెంటర్ ఏర్పాటుతోపాటు రాక్ గార్డెన్, కాక్టస్ గార్డెన్ వంటివి ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించాం. త్వరలో ఏర్పాటు చేసి పర్యావరణ విద్యపై శిక్షకుడిని ఏర్పాటు చేసి పార్కుకు వచ్చే సందర్శకులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోబోతున్నాం. – వాసవి, అటవీ సెక్షన్ ఆఫీసర్ -
’ఓట్ల‘ ఫైట్
‘ఓట్ల చోరీ’ అనేది దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన నేపథ్యంలో... పూనమ్ అగర్వాల్ పేరు ప్రస్తావనకు వస్తోంది. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయిన పూనమ్ అగర్వాల్ గత కొన్ని సంవత్సరాలుగా ఓటింగ్ ప్రక్రియలో జరుగుతున్న అవకతవకల గురించి గొంతెత్తుతోంది. ‘ఎన్నికల ప్రక్రియలో నిజాయితీ, పారదర్శకత ఉండాలి’ అంటున్న పూనమ్ అగర్వాల్ ‘ఇండియా ఇంక్డ్: ఎలక్షన్స్ ఇన్ ది వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ’ పేరుతో పుస్తకం రాసింది....మూడు దశాబ్దాలుగా ఎలక్షన్ కమిషన్కు సంబంధించిన వార్తలు రాస్తున్న ఒక జర్నలిస్ట్తో ఇటీవల పూనమ్ అగర్వాల్ మాట్లాడినప్పుడు ఆమె నోటి నుంచి వినిపించిన మాట...‘ఆ రోజుల్లో ఆఫీసులలోకి వెళ్లి అధికారులతో మాట్లాడడం, సమాచారం తీసుకోవడం చాలా సులభంగా ఉండేది. ఇప్పుడు చాలా కష్టమైపోయింది’ ఆ జర్నలిస్ట్ మాట పూనమ్ అగర్వాల్ను అంతగా ఆశ్చర్యపరచకపోయి ఉండవచ్చు. ఎందుకంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా పూనమ్ ఎంతోకాలంగా మన దేశ ఎన్నికల ప్రక్రియ... అందులో జరుగుతున్న అవకతవకలపై ప్రత్యేక దృష్టిసారించింది.జర్నలిజంలో రెండు దశాబ్దాల అనుభవం ఉన్న పూనమ్ మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ వరకు ఎన్నో రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియలో జరిగిన అవకతవకలను వెలికితీసింది. ఈ అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘం మౌనాన్ని విమర్శించింది. పారదర్శకత లేకపోవడాన్ని గురించి ప్రశ్నించింది. పూనమ్ అగర్వాల్ తాజా పుస్తకం ‘ఇండియా ఇంక్డ్–ఎలక్షన్స్ ఇన్ ది వరల్డ్స్ లార్జెస్ట్ డెమొక్రసీ’ విస్తృత చర్చకు దారితీసింది.‘జర్నలిస్ట్గా నా అనుభవాలు, ప్రయాణానికి ఈ పుస్తకం అద్దం పడుతుంది. విస్తృత సబ్జెక్ట్ అయిన ఎన్నికల ప్రక్రియపై సమాచారాన్ని అందించడం మంచి అవకాశంగా భావిస్తున్నాను. ఈ సబ్జెక్ట్పై రాయడం అంత సులువైన విషయం ఏమీ కాదు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన విషయాలతో పాటు నా వ్యక్తిగత విషయాలను కూడా ఈ పుస్తకంలో రాశాను. ఎలక్టోరల్ బాండ్స్, ఎలక్షన్ కమిషన్పై ఓటర్లకు ఉన్న భ్రమ...ఈ పుస్తకం రాయడానికి ప్రధాన కారణాలు’ అని ‘ఇండియా ఇంక్డ్’ పుస్తకం గురించి చెప్పింది పూనమ్.‘ఇండియా ఇంక్డ్’ పుస్తకం కోసం పూనమ్ ఎంతో కసరత్తు చేసింది. మారుమూల పల్లెలో జరిగే ఎన్నికల ప్రక్రియ నుంచి మొదటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుకుమార్ సేన్ ఆధ్వరంలో జరిగిన ఎన్నికల వరకు ఎన్నో విషయాలను అధ్యయనం చేసింది. ఆనాటి ఎన్నికల ప్రక్రియను జాగ్రత్తగా ΄్లాన్ చేసిన సుకుమార్ సేన్ దూరదృష్టి గురించి, ఆయన రూపొందించిన విధానాలను ఇప్పటికీ ఎన్నికల కమిషన్ అనుసరించడం గురించి తన పుస్తకంలో ప్రస్తావించింది పూనమ్. అకాడమిక్గా కాకుండా ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సమస్త విషయాలను సామాన్య పాఠకులకు కూడా సులభంగా అర్థమయ్యేలా రీతిలో రాయడంలో పూనమ్ అగర్వాల్ నేర్పరి. ఔట్స్టాండింగ్ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం విభాగంలో రామ్నాథ్ గోయెంకా అవార్డ్, సీఎన్ఎన్ యంగ్ జర్నలిస్ట్ అవార్డ్, ఔట్స్టాండింగ్ ఒరిజినల్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం విభాగంలో బీబీసి న్యూస్ అవార్డ్లాంటివి అందుకుంది పూనమ్ అగర్వాల్. లోన్ యాప్ స్కామ్పై పూనమ్ చేసిన ఇన్వెస్టిగేటివ్ డాక్యుమెంటరీ ‘ది ట్రాప్: ఇండియాస్ డెడ్లీయెస్ట్ స్కామ్’కు ఎంతో పేరు వచ్చింది. లండన్లోని ప్రతిష్ఠాత్మకమైన ‘సెంటర్ ఫర్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం’లో గావిన్ మెక్ఫెడియన్ స్మారక ఉపన్యాసం ఇచ్చింది పూనమ్ అగర్వాల్.మరిన్ని పుస్తకాలుమన ఎన్నికల ప్రక్రియ గురించి కొన్ని పుస్తకాలు వచ్చాయి. ‘పారదర్శకంగా, నిజాయితీగా జరిగే ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యానికి వెన్నెముక’ అనేది భావితరాలు అర్థం చేసుకోవడానికి నా పుస్తకం ఉపయోగపడాలని ఆశిస్తున్నాను. ‘ఇది విలువైన పుస్తకం’ అనుకున్నప్పుడు పాఠకులు తాము చదవడమే కాదు తాము చదివిన విషయాలను ఇతరులతో పంచుకుంటారు. పుస్తక రచనకు సంబంధించి నా అభిప్రాయం విషయానికి వస్తే...అందుకు ఎంతో ఓపిక కావాలి. మనం సేకరించిన సమాచారంలోని నిజానిజాల గురించి లోతుగా తెలుసుకోవాలి. పుస్తకం రాయాలనుకున్నప్పుడు మన ఎన్నికల కమిషన్ గురించి ఆన్లైన్, ఆఫ్లైన్లో నాకు తగినంత సమాచారం లభించలేదు. దీంతో ఎంతో మంది నిపుణులతో మాట్లాడాను. భవిష్యత్లో కూడా మరెన్నో పుస్తకాలు రాయాలనుకుంటున్నాను.– పూనమ్ అగర్వాల్ -
భౌ.. భౌ..!
వీధి కుక్కల దాడిలో బాలుడి మృతి.. పిచ్చి కుక్క కరిచి పది మందికి గాయాలు.. ఇలాంటి వార్తలు నిత్యం మనకు కనిపిస్తుంటాయి, వినిపిస్తుంటాయి. వీధి కుక్కల ముప్పు ఒక్క ప్రాంతానికో, నగరానికో పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. కుక్కకాటు సంఘటనలు మూడేళ్లలో 70 శాతం పెరిగాయంటే సమస్య తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్ సీఆర్) పరిధిలోని అన్ని కుక్కలను ఎనిమిది వారాల్లోగా షెల్టర్లకు తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో దేశవ్యాప్తంగా ఈ అంశం చర్చకు వచ్చింది. – సాక్షి, స్పెషల్ డెస్క్చాలామంది రాత్రుళ్లు వీధుల్లో నడవడానికి, బైక్మీద వెళ్లడానికి భయపడతారు. ఉదయం మార్నింగ్ చేసేటప్పుడు చాలామంది కర్రలు పట్టుకుంటారు. వీటన్నింటికీ కారణం.. గ్రామ సింహాలు. బైక్ మీద వేగంగా వెళ్తుంటే కుక్కలు వెంటపడి, కరిచి లేదా వారు కిందపడి ఎంతో మంది గాయపడిన సంఘటనలు ఉన్నాయి. మనదేశంలో కుక్కల ప్రతాపం చవిచూడని ఊరు ఉండదంటే అతిశయోక్తి కాదు. సుమారు 70 శాతం పెరిగాయికుక్కకాటు సంఘటనలు 2024లో దేశంలో 37 లక్షలకుపైగా నమోదయ్యాయి. మూడేళ్లలో ఈ ఘటనలు 69.6 శాతం పెరిగాయి. ఈ ఏడాది జనవరిలోనే 4.29 లక్షల కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దేశవ్యాప్తంగా రేబీస్ అనుమానిత కేసులు భారీగా తగ్గుతూ వచ్చాయి. 2022తో పోలిస్తే గత ఏడాది ఈ కేసులు 78 శాతం క్షీణించాయి. కానీ మరణాలు మాత్రం ఊహించని స్థాయిలో అధికం అయ్యాయి. రెండేళ్లలో ఎనిమిది రెట్లకుపైగా పెరిగి జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. గత ఏడాది వీధి కుక్కల దాడి కారణంగా రేబీస్తో భారత్లో 180 మంది మరణించగా.. వీరిలో అత్యధికంగా మూడింట రెండొంతులు దక్షిణాది రాష్ట్రాల నుంచే ఉండడం గమనార్హం. 11 సెకన్లకు ఒకటి..భారతదేశంలో 6 కోట్లకు పైగా వీధి కుక్కలు ఉన్నాయని అంచనా. వీటిలో చాలా తక్కువ మాత్రమే సహజ మరణాలకు గురవుతాయని నిపుణులు చెబుతున్నారు. అంటే వ్యాధులతో మరణించేవే అధికం అన్నమాట. దేశంలో ప్రతి 11 సెకన్లకు ఒకరిని కుక్క కరిచిన సంఘటనలు నమోదవుతున్నాయి. దాదాపు 5,000 ఘటనలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. కుక్కల ద్వారా ప్రజలకు 60కి పైగా వ్యాధులు వ్యాపిస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం కుక్కల దాడి వల్ల రేబీస్ సోకి గత ఏడాది 180 మంది ప్రాణాలను బలిగొంది. ఈ వీధి కుక్కలు భారతీయ రోడ్లు, పొలాల్లో రోజూ 15,000 టన్నులకు పైగా మలం, 8 మిలియన్ గ్యాలన్ల మూత్రం విడుదల చేస్తున్నాయి. ఇది ఒక ప్రధాన ఆరోగ్య, పర్యావరణ సమస్య అన్నది వైద్యుల మాట. ఇక, పెంపుడు కుక్కలు దేశంలో 3 కోట్లకుపైచిలుకు ఉంటాయని నివేదికలు చెబుతున్నాయి.» భారతదేశంలో 6 కోట్లకు పైగా వీధి కుక్కలు ఉన్నాయని అంచనా.» దేశంలో ప్రతి 11 సెకన్లకు ఒకరిని కుక్క కరిచిన సంఘటనలు నమోదవుతున్నాయి.» దాదాపు 5,000 ఘటనలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. » కుక్కల ద్వారా ప్రజలకు 60కి పైగా వ్యాధులు వ్యాపిస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా కుక్క కాటు సంఘటనలు2022 21,89,909 2023 30,52,5212024 37,15,713 -
నా ప్రజలను, నా కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నా..
గాజా: గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో ఐదుగురు అల్ జజీరా జర్నలిస్టులు మృతిచెందారు వారిలో అనాస్ జమాల్ అల్–షరీఫ్ కూడా ఉన్నారు. ఈ దాడిలో మరణించడానికి ముందు అనాస్ రాసిన మెసేజ్ను అతడి మిత్రుడు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ సందేశం ప్రజల హృదయాలను కదలిస్తోంది. అది చదివితే గుండె బరువెక్కడం ఖాయం. అన్సార్ సందేశం ఏమిటంటే... వారిని అల్లా క్షమించడు ‘‘ఇది నా వీలునామా. నా చివరి సందేశం. నా మాటలు మీకు చేరాయంటే దాని అర్థం నన్ను చంపడంలో, నా గొంతు మూగబోయేలా చేయడంలో ఇజ్రాయెల్ సైన్యం విజయవంతమైనట్లే. మీకు శాంతి సౌఖ్యాలు కలగాలని కోరుకుంటున్నా. అల్లా దయ, ఆశీస్సులు మీకు లభించాలి. నా ప్రజలకు మద్దతుగా, వారి గొంతుకగా ఉండడానికి నా బలం మొత్తం ఉపయోగించానని, చేయగలిగినదంతా చేశానని అల్లాకు తెలుసు. జబాలియా శరణార్థి శిబిరంలోని ఇరుకు సందుల్లో కళ్లు తెరిచినప్పటికీ నా ప్రజల కోసం ఆరాటపడుతున్నా. నా జీవిత కాలాన్ని అల్లా పొడిగిస్తాడని ఆశపడుతున్నా. దానివల్ల నా స్వస్థలం ఆక్రమిత అస్కెలాన్(అల్–మజ్దాల్)కు చేరుకొని, కుటుంబంతో, ప్రియమైనవారితో గడపగలను. కానీ, అల్లా ఆదేశమే ఫైనల్. దానికి తిరుగులేదు. ఇన్నాళ్లూ ఎన్నో బాధలు అనుభవించా. కష్టాలు నష్టాలు నాకు కొత్త కాదు. ఎంతో కోల్పోయా. ఉన్నది ఉన్నట్లుగా చెప్పడంలో నాకు ఎలాంటి సంకోచం లేదు. మా చావులకు కళ్లారా చూస్తున్నవారిని, మా మారణాలను ఆమోదిస్తున్నవారిని, ఇన్ని దారుణాలు జరుగుతున్నా మౌనంగా ఉండిపోయినవారిని, గత ఏడాదిన్నరగా మా గడ్డపై మా పిల్లలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను, హింసాకాండను, మారణహోమాన్ని ఆడ్డుకోనివారిని అల్లా క్షమిస్తాడని నేను అనుకోవడం లేదు. నా బిడ్డ నా కంటి వెలుగు పాలస్తీనా అంటే మాకెంతో ప్రేమ. ముస్లిం ప్రపంచం అనే కిరీటలో విలువైన రత్నం పాలస్తీనా. ప్రపంచంలో ప్రతి స్వేచ్ఛా జీవి గుండె చప్పుడు పాలస్తీనా. మా ప్రజలను మీకు అప్పగిస్తున్నా. కలలు కనడానికి సమయం లేని, స్వేచ్ఛగా, శాంతితో జీవించే అవకాశం లేని మా అమాయక చిన్నారులను అప్పగిస్తున్నా. మా ప్రజల దేహాలు వేలాది టన్నుల బరువు కింద ఛిద్రమైపోయాయి. ఇజ్రాయెల్ బాంబులు, క్షిపణులు వారి శరీరాలను ముక్కలు చేశాయి. ఆ ముక్కలన్నీ వెదజల్లినట్లుగా దూరంగా పడిపోయాయి. నిర్బంధాలు, హెచ్చరికలు మిమ్మల్ని ఆపకూడదు. సరిహద్దులు మీకు అడ్డంకి కాకూడదు. మీరంతా గొంతు విప్పండి. మా కోసం మాట్లాడండి. మా భూమి విముక్తికి, మా ప్రజలకు మధ్య వారధిగా మారండి. ఆక్రమణకు గురైన మా భూభాగంపై గౌరవం, స్వేచ్ఛ పరిఢవిల్లేదాకా గొంతు విప్పుతూనే ఉండండి. మా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వారిని మీకు అప్పగిస్తున్నా. నా ముద్దుల కూతురు షామ్ జాగ్రత్త. ఆమె నా కంటి వెలుగు. ఆమె ఎదుగుదలను కళ్లారా చూసే అదృష్టం నాకు దక్కలేదు. అది కలగానే మిగిలిపోయింది. నా కుమారుడు సలాహ్ను కూడా అప్పగిస్తున్నా. నా భారాన్ని మోసే, ఆశయాన్ని నెరవేర్చే బలవంతుడిగా మారేదాకా అతడికి అండగా ఉండాలనుకున్నా. ఇక నా తల్లి బాధ్యత కూడా మీదే. ఆమె ఆశీస్సులు, ప్రార్థనలే నన్ను ఇక్కడిదాకా తీసుకొచ్చాయి. ఆమె ఇచి్చన వెలుగే నాకు దారిగా మారింది. నా తల్లికి బలాన్ని ఇవ్వాలని అల్లాను ప్రారి్థస్తున్నా. అల్లా ఆమెను కరుణించాలి. నా జీవన సహచారి ఉమ్ సలాహ్ బాధ్యతను సైతం మీ చేతుల్లో పెడుతున్నా. ఈ యుద్ధం నన్ను నా భార్య నుంచి దూరం చేసింది. అయినప్పటికీ మా బంధానికి ఆమె కట్టుబడి ఉంది. ఆమె తన బలం, విశ్వాసంతో నా బాధ్యతలను స్వీకరించి, భుజాన వేసుకొని మోసింది. అల్లా తర్వాత మీరే రక్షణ నా కుటుంబానికి అల్లా తర్వాత మీరే రక్షణగా నిలవాలి. ఒకవేళ నేను మరణిస్తే, నా ఆశయాలకు కట్టుబడి ప్రాణాలు పోగొట్టుకుంటే.. అల్లా ముందుకు వెళ్లి, మీ ఆదేశాలు శిరసావహించానని చెబుతా. శాశ్వతంగా అల్లా సన్నిధికి చేరడం సంతోషకరమే కదా. అమర వీరుల్లో ఒకడిగా నన్ను చేర్చుకో అని అల్లాను వేడుకుంటున్నా. నా పాపాలన్నింటినీ క్షమించాలని విజ్ఞప్తి చేస్తున్నా. నా ప్రజలకు, నా కుటుంబానికి కలి్పంచే స్వేచ్ఛా మార్గాన్ని మెరిపించడానికి నా రక్తాన్ని ఒక కాంతిగా మార్చాలని ప్రారి్థస్తున్నా. మీ ప్రార్ధనల్లో గాజాను మర్చిపోవద్దు... నన్నూ మర్చిపోవద్దు.’’ – అనాస్ జమాల్ అల్–షరీఫ్ -
పదిలో ముగ్గురే గ్రాడ్యుయేట్లు!
పదిలో ముగ్గురే.. అవును మీరు చదువుతున్నది నిజమే. దేశంలో పది మంది యువతలో ముగ్గురు మాత్రమే డిగ్రీ, ఆపై వరకు చదువుకున్నారు. మిగిలిన వారంతా ఇంటర్/డిప్లొమాకే పరిమితమవుతున్నారు. దేశంలో 15–29 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత సుమారు 42 కోట్ల మంది ఉన్నారు. మొత్తం జనాభాలో వీరి వాటా దాదాపు 29%. వీరిలో సుమారు కోటికిపైగా నిరక్షరాస్యులు ఉన్నారు.ఒక వ్యక్తి ఆలోచనలను తీర్చిదిద్దడంలో సహాయపడే కీలక అంశాల్లో విద్య ఒకటి. ముఖ్యంగా యువత.. దేశంలో ఉత్పాదక శక్తులుగా, విలువైన మానవ వనరులుగా, వినూత్న పౌరులుగా మారడానికి వీలు కల్పించే ఆయుధం కూడా అదే. అలాంటి విద్య.. ప్రత్యేకించి ఉన్నత విద్య మనదేశంలో ఇప్పటికీ గ్రామీణులకు అందని ద్రాక్షలానే ఉంది.అక్షరాస్యత స్థాయులు స్థిరంగా పెరుగుతున్నప్పటికీ దేశవ్యాప్తంగా సమాజంలోని అన్ని వర్గాలకు అందుబాటులో ఉన్న విద్య నాణ్యత ఇప్పటికీ ఆశించిన స్థాయిలో లేదని ‘పీపుల్ రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కంజ్యూమర్ ఎకానమీ’ (పీఆర్ఐసీఈ) విడుదల చేసిన ‘నావిగేటింగ్ ది యూత్ ఫ్రాంటియర్’ అనే పరిశోధనా పత్రం వెల్లడించింది. ఈ విషయంలో పట్టణాలకు, పల్లెలకు మధ్య అసమానత స్పష్టంగా కనిపిస్తోందని తెలిపింది.ఉన్నత చదువులు పట్టణాలకే..దేశవ్యాప్తంగా 2024–25 నాటికి మొత్తం యువతలో 24% మంది.. అంటే సుమారు 9.9 కోట్ల మంది డిగ్రీ పూర్తి చేశారు. వీరిలో గ్రామీణ ప్రాంతాల వారి వాటా 52 శాతం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా దాదాపు 3 కోట్ల మంది అందుకున్నారు. వీరిలో 66 శాతం పట్టణవాసులే కావడం గమనార్హం. ఇతర ఉన్నత చదువులు చదివిన 20 లక్షల మంది యువతలో పట్టణ ప్రాంతాలవారు ఏకంగా 85 శాతం ఉన్నారు.అంటే ఉన్నత చదువులు పట్టణాలకే పరిమితం అవుతున్నట్టు స్పష్టం అవుతోంది. మొత్తం యువతలో ప్రాథమిక విద్య అభ్యసించిన వారు 7.3 కోట్లు (17%), మెట్రిక్ 7.6 కోట్లు (18%), ఇంటర్ 9.3 కోట్లు (22%), టెక్నికల్/డిప్లొమా చేసినవారు 3.6 కోట్లు (9%) ఉన్నారు. యూత్లో 3% అంటే 1.3 కోట్ల మంది నిరక్షరాస్యులుగా మిగిలిపోయారు. ప్రాంతాలవారీగా చూస్తే డిగ్రీ, ఆపై చదువులు చదివిన వారు దక్షిణాది రాష్ట్రాల్లో అధికంగా ఉన్నారు. -
కొట్టుకునేది మీరు.. దెబ్బలు పిల్లలకా!
పిల్లలు వాళ్లంతట వాళ్లు తమ తల్లిదండ్రులను ఎంపిక చేసుకుని ఈ భూమి మీదకు రారు. మరి తల్లిదండ్రుల మధ్య కోపతాపాలకు, మనస్పర్థలకు, తగాదాలకు, బాధ్యతలేనితనాలకు, భావోద్వేగాలకు, అనాలోచిత నిర్ణయాలకు పిల్లలెందుకు బలైపోవాలి? చక్కగా ఆడుతూ, పాడుతూ, చదువుకుంటూ, స్వేచ్ఛగా, నిర్భీతిగా ఎదగాల్సిన వయసులో – ‘అమ్మానాన్న కొట్టుకుని చచ్చే హింసాత్మక సినిమా’ పిల్లలకెందుకు చూపించటం? వాళ్లకీ శిక్షేంటి?! అసలీ అంతులేని కర్మేంటి?!శుక్రవారం రాత్రి ఢిల్లీలోని కరావాల్ నగర్లో ఒక వ్యక్తి తన భార్యను (28)ను, ఇద్దరు కూతుళ్లను (7, 5) వారు నిద్రపోతుండగా గొంతు నులిమి చంపటం యావద్దేశాన్నీ కలచివేసింది. పేకాటకు అలవాటుపడి అతడు అప్పులపాలయ్యాడు. దీంతో భార్యాభర్తలు తరచు గొడవ పడేవారట. ఆ గొడవలు ఆ చిన్నారుల మనసులపై చాలా ప్రభావం చూపాయట. భర్త అప్పులు చేసి తీర్చలేక ఆ నిస్పృహలో భార్యా, కూతుళ్లను చంపేశాడని తెలుస్తోంది. అమాయకులైన ఆ ఇద్దరు బిడ్డలు ఆ తల్లిదండ్రుల కడుపున పుట్టటమే పాపమన్నట్లుగా నిద్రలోనే ప్రాణాలను కోల్పోయారు.విచక్షణ కోల్పోతున్న తల్లిదండ్రులు..: క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి పిల్లల్ని పొట్టన పెట్టుకునే తల్లిదండ్రులు కొందరైతే, నిత్యం పిల్లల కళ్ల ముందే తిట్టుకుంటూ, కొట్టుకుంటూ ఉండే అమ్మానాన్నలు ఎంతోమంది! తమ ప్రవర్తనే తమ పిల్లలను మంచివాళ్లుగానో లేదా చెడ్డవాళ్లుగానో చేస్తుందన్న గ్రహింపు చాలామంది తల్లిదండ్రులకు ఉండటం లేదు. ఆ గ్రహింపు లేని తల్లిదండ్రులు.. ఘర్షణలతో పిల్లల మనసులనే కాదు, భవిష్యత్తు ఆశల్ని, కలల్ని కూడా ఛిద్రం చేస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఎన్నో ఆశలతో ఎదురుచూస్తారు..: చిన్నపిల్లలంటే తల్లిదండ్రులు ప్రేమాభిమానాలతో వెలిగే చిరు దివ్వెల లాంటివాళ్లు. ఉదయం వెళ్లిన నాన్న.. సాయంత్రానికి ఏం కబుర్లు, బహుమతులు మోసుకొస్తారో అని ఎదురుచూసే చిన్నారులు కొందరు. నాన్నకు తాను కబుర్లు, కథలు చెప్పాలని ఉబలాటపడే బుజ్జాయిలు మరికొందరు. కానీ, ఇవేవీ పట్టించుకోకుండా ఇంటికి రాగానే.. భార్యతో గొడవపడే మగాళ్లు కొందరైతే, భర్తలను సతాయించే భార్యలు మరికొందరు. పోనీ, గదుల్లో పోట్లాడుకుంటారా అంటే అదీ కాదు.. ఆ పసిహృదయాల ముందే!అపరాధ భావనభార్యాభర్తల మధ్య గొడవలకు చాలామంది చిన్నారులు భయంతో గజగజలాడిపోతారు. ఘర్షణ కొనసాగుతున్నంతసేపూ వీళ్లు భయానికి, ఆందోళనకు గురవుతూనే ఉంటారు. అమ్మానాన్న ఎక్కడ విడిపోతారోనని కలవరపడతారు. తల్లిదండ్రుల పోట్లాటలో వాటి నోటి వచ్చే మాటల్ని బట్టి ఘర్షణకు కారణం తామేనన్న అపరాధ భావన కూడా పిల్లల్ని కుంగదీస్తుంది. విచారం, నిరాశ అలుముకుంటాయి. కొందరు లోలోపల దుఃఖపడుతుంటారు. కొందరు నిద్రకు దూరమౌతారు. ఇవన్నీ పిల్లల మనసులను తీవ్రంగా గాయపరుస్తాయి, వాళ్ల వ్యక్తిత్వాన్నీ ప్రభావితం చేస్తాయని మానసిక వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.చెప్పండి.. ఇవ్వండి.. తీర్చండి..తల్లిదండ్రుల తగాదాలు వారి పిల్లల మానసిక అనారోగ్యాన్ని ఎన్ని విధాలుగా ప్రభావితం చేస్తాయో అనేక అధ్యయనాలలో వెల్లడయింది. అన్ని అధ్యయనాలు కూడా ప్రధానంగా చెప్పేదేంటంటే.. ఈ గొడవల వల్ల పిల్లల్లో నిరాశ, ఆందోళన, అభద్రతాభావం కలుగుతున్నాయట. అలాగే ఆ అధ్యయన ఫలితాలు తల్లిదండ్రులకు కొన్ని సూచనలు చేశాయి. అవి :గొడవ కారణం చెప్పండి..: మీ మధ్య ఏం జరిగిందో పిల్లలకు పైపైన అయినా చెప్పండి. ‘ఒక ముఖ్యమైన విషయం మీద మా ఇద్దరికీ అభిప్రాయ భేదాలున్నాయి. అంతే తప్ప ఇంకేం లేదు’ అని తెలియజేయండి. గొడవ పడటం తప్పేనని అంగీకరించండి.వాళ్ల తప్పులేదని చెప్పండి..: గొడవలకు తామే కారణం అని పిల్లలు అనుకుంటుంటారు. అందువల్ల, వాదన జరగటంలో పిల్లల తప్పేమీ లేదని స్పష్టంగా చెప్పండి.అనుమానాలను తీర్చండి..: మీ వాగ్వాదంపై పిల్లలకు అనేక సందేహాలు ఉంటాయి. వాటిని అడిగేందుకు జంకుతుంటారు. కనుక వారికి వచ్చే అనుమానాలను మీరే కనిపెట్టి, వారి సందేహాలు తీర్చండి. మనమంతా ఎప్పటికీ ఒక కుటుంబం అని పిల్లల్ని దగ్గరకు తీసుకోండి.ఏం కాదని భరోసా ఇవ్వండి..: మీ భార్యాభర్తల మధ్య జరిగిన వాదన అప్పటి వరకేనని, దాని వల్ల ముందు ముందు ఏ సమస్యలూ రావని పిల్లలకు నమ్మకం కల్పించండి. మీ ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు ఉన్నాయని వారికి భరోసా ఇవ్వండి.ఒక బాలిక ఉత్తరం!పిల్లలకు బయటనుంచి ఏదైనా కష్టం వస్తే అమ్మానాన్నకు చెప్పుకొంటారు. కానీ, ఆ అమ్మానాన్నే తమకు వచ్చిన కష్టం అయితే.. ఇంకెవరికి చెప్పుకుంటారు? ఎలా చెప్పుకుంటారు? కొంచెం పెద్దపిల్లలైతే పత్రికల్లో వచ్చే కౌనె్సలింగ్ కాలమ్కి గోప్యంగా తమ ఆవేదనను రాసి పంపుతుంటారు. అలా రాసిన ఒక ఉత్తరంలో ఎంత బాధ దాగి ఉందో చూడండి :‘నా చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రుల మధ్య గొడవలు చూస్తున్నాను. కొన్నిసార్లు డబ్బు గురించి, మరి కొన్నిసార్లు కుటుంబ సమస్యల గురించి ఆ గొడవలు ఉంటాయి. వాటిని ఎలా ఆపాలో నాకు తెలియదు. వాళ్లూ ఆపాలని అనుకోరు. నేనంటూ ఒకదాన్ని ఉన్నానన్న గ్రహింపు వాళ్లకు ఉండదు. ఒక్కోసారి నాకు ఇంటి నుంచి పారిపోవాలని అనిపిస్తుంది. దాని వల్ల అమ్మానాన్నకు చెడ్డపేరు వస్తుంది.అది ఆలోచించి ఆగిపోతాను. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి కష్టపడి చదువుతున్నాను. కానీ పరీక్షల్లో మంచి మార్కులు రావటం లేదు. పరీక్షల టైమ్లో కూడా.. నేను చదువుకుంటున్నానన్న ఆలోచన కూడా లేకుండా అమ్మానాన్న ఏదో ఒక కారణంతో తగాదా పడుతూనే ఉంటారు. నా కళ్లముందే.. కొన్నిసార్లు నాన్న అమ్మను కొడుతుంటారు కూడా. అప్పుడు నాకు ఏడుపొస్తుంది. చచ్చిపోవాలనిపిస్తుంది. కానీ నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. వాడంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మానాన్న గొడవల్లో నేను, నా తమ్ముడు నలిగిపోతున్నాం’ అని ఆ అమ్మాయి ఉత్తరం ముగించింది. ఇలాంటి చిన్నారులు మనదేశంలో ఎంతోమంది ఉన్నారు. వాళ్లంతా చెప్పేది ఒక్కటే..‘ఆలోచించండి.. ఓ అమ్మానాన్నా.. ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా..’ -
అక్షరంపై ఆంక్షలుకశ్మీర్లో 25 పుస్తకాలపై నిషేధం
అక్షరంపై అంక్షలు... పుస్తకాలపై నిషేధం అంటే.. చరిత్రను సమాధి చేయడం. ప్రజల జ్ఞాపకాలను కప్పేట్టేయాలని ప్రయతి్నంచడం. అధికారాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేయడం. ఇటీవల జమ్మూ కశ్మీర్లో జరిగిందదే. 25 పుస్తకాలపై రాష్ట్రంలోని కేంద్రపాలిత ప్రభుత్వం నిషేధం విధించింది. బుకర్ ప్రైజ్ విజేత అరుంధతీ రాయ్, ప్రముఖ రచయితలు ఏజీ నూరానీ, విక్టోరియా స్కోఫీల్డ్, సుమంత్ర బోస్, డేవిడ్ దేవదాస్, అనురాధ భాసిన్, అయేషా జలాల్తోపాటు పలువురి పుస్తకాలపై నిషేధాన్ని ప్రకటించింది. తప్పుడు కథనాలు, వేర్పాటువాదం, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయనే కారణంతో ఆయా పుస్తకాలను నిషేధిస్తున్నట్టు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నేతృత్వంలోని ప్రభుత్వం తెలిపింది. ‘విశ్వసనీయ నిఘా వర్గాల సమాచారం ఆధారంగా హింస, ఉగ్రవాదంలో యువత పాల్గొనేలా తప్పుడు కథనాలు, వేర్పాటువాద సాహిత్యం ఉసిగొల్పుతున్నాయి. ఇవి ఉగ్రవాదాన్ని కీర్తించి భారత్పై హింసను ప్రేరేపించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటివల్లే యువత తప్పుదారి పడుతోందని నిఘా వర్గాల నుంచి సమాచారం అందిన తరువాతే ఈ పుస్తకాలను నిషేధిస్తున్నాం’అని జమ్మూ కశ్మీర్ హోం శాఖ గత బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ప్రభుత్వ ఉత్తర్వులో పుస్తకాలు ఏ విధంగా హింసను కీర్తించాయో ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. కేవలం విశేషణాలను మాత్రమే ఉపయోగించింది. హోంశాఖ ఆదేశాలకు అనుగుణంగా 48 గంటల్లో, జమ్మూ కశ్మీర్ పోలీసులు పుస్తకాల దుకాణాల్లో సోదాలు నిర్వహించి పుస్తకాలను జప్తు చేశారు. వేసవి రాజధాని శ్రీనగర్తో పాటు, మధ్య కశ్మీర్లోని గండర్బాల్, ఉత్తర కశ్మీర్లోని హంద్వారా, దక్షిణ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాల్లోని పుస్తక దుకాణాల్లో దాడులు చేశారు. శ్రీనగర్లో చినార్ పుస్తక ఉత్సవం జరుగుతున్న సమయంలో ఈ నిషేధం విధించడం గమనార్హం. ఈ నిషేధం ప్రజల్లో సెన్సార్షిప్ భయాలను పెంచుతోంది. నిషేధిత జాబితాలో ఉన్న ప్రముఖ పుస్తకాలు.. ప్రభుత్వ నిషేధ జాబితాలో బుకర్ ప్రైజ్ విజేత అరుంధతీ రాయ్ రాసిన ‘ఆజాదీ’, రాజ్యాంగ నిపుణుడైన ఏజీ నూరానీ రాసిన ‘ది కశ్మీర్ డిస్ప్యూట్: 1947–2012’, బ్రిటిష్ రచయిత్రి, చిత్రకారిణి విక్టోరియా స్కోఫీల్డ్ రాసిన ‘కశ్మీర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ – ఇండియా, పాకిస్తాన్ అండ్ ది అన్ఎండింగ్ వార్’, జర్నలిస్ట్, కశ్మీర్ టైమ్స్ ఎడిటర్ అనురాధ భాసిన్ రాసిన ‘ది డిస్మాంటిల్డ్ స్టేట్: ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ కశ్మీర్ ఆఫ్టర్ 370’, ‘కంటెస్టెడ్ ల్యాండ్స్’, డేవిడ్ దేవదాస్ రాసిన ‘ఇన్ సెర్చ్ ఆఫ్ ఏ ఫ్యూచర్ – ది స్టోరీ ఆఫ్ కశ్మీర్’, తారిక్ అలీ, హిలాల్ భట్, హబ్బా ఖాతున్, పంకజ్ మిశ్రా, అరుంధతీ రాయ్లతో కలిసి ఆంత్రోపాలజిస్ట్ అంగనా ఛటర్జీ రాసిన ‘కాశ్మీర్: ఎ కేస్ ఫర్ ఫ్రీడమ్’, మొహమ్మద్ యూసఫ్ సరాఫ్ రాసిన ‘కశ్మీరీస్ ఫైట్ ఫర్ ఫ్రీడం’, అబ్దుల్ గోక్హౌమి జబ్బార్ రాసిన ‘కశ్మీర్ పాలిటిక్స్ అండ్ ప్లెబిసైట్’, ఎస్సార్ బటూల్ రాసిన ‘డు యూ రిమెంబర్ కునాన్ పోషో్పరా?’, రాజకీయ శాస్త్రవేత్త, చరిత్రకారుడు సుమంత్ర బోస్ రాసిన ‘కశ్మీర్ ఎట్ ది క్రాస్రోడ్స్’, హఫ్సా కంజ్వాల్ రాసిన ‘కాలనైజింగ్ కశ్మీర్: స్టేట్–బిల్డింగ్ అండర్ ఇండియన్ ఆక్యుపేషన్’, మరో ఇద్దరు విదేశీ రచయితలు కలిసి రచించిన ‘హ్యూమన్ రైట్స్ వయొలేషన్స్ ఇన్ కశ్మీర్’తో పాటు పలు పుస్తకాలు ఉన్నాయి. పుస్తకాల్లో ఏముంది? అరుంధతీ రాయస్ రాసిన ఆజాదీ.. 2018 నుంచి 2020 మధ్య కాలంలో ఆమె రాసిన వ్యాసాలు, చేసిన ఉపన్యాసాల సంకలనం. ఇది భారత ప్రజాస్వామ్యానికి చీకటి కాలమని, మెజారిటీవాదం, మతోన్మాదం పెరుగుదల దేశానికి అత్యంత ప్రమాదకరమని చెబుతుంది. దేశం ఎలా స్వేచ్ఛను కోల్పోయిందో వివరిస్తుంది. ఏజీ నూరానీ ది కశ్మీర్ డిస్ప్యూట్.. దీర్ఘకాల కశ్మీర్ సమస్య సంక్లిష్ట చరిత్రను, దాని చుట్టూ ఉన్న రాజకీయ అసంతృప్తి, అసమ్మతిని వివరిస్తుంది. ముఖ్యంగా జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్ర పాలితంగా మార్చడంపై ప్రశ్నలను సంధిస్తుంది. అనురాధా భసిన్ రాసిన పుస్తకం ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్లోని ప్రజల జీవితాలు, స్థానిక రాజకీయాలు, సామాజిక రంగాలపై ఆ చర్యల ప్రభావం గురించి చర్చిస్తుంది. మొత్తంగా పుస్తకాలన్ని.. కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలు, మారణహోమాలు, ఈ ప్రాంతపు దశాబ్దాల రాజకీయ ప్రస్థానాన్ని, చరిత్రను ప్రతిబింబిస్తాయి. విమర్శల వెల్లువ... పుస్తకాల నిషేధంపై జమ్మూకశ్మీర్తోపాటు దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిషేధాన్ని ప్రజల జ్ఞాపకాలపై దాడిగా పౌర హక్కుల ఉద్యమకారులు, రాజకీయ పార్టీలు, రచయితలు అభివరి్ణస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు. ప్రభుత్వంపై అసమ్మతిని అణచివేయడానికి సెన్సార్షిప్ ఒక ఉదాహరణని, ఇది దేశమంతటా ఉండగా.. 2019 తరువాత జమ్మూ కశ్మీర్లో అత్యంత దారుణంగా మారిందని పేర్కొన్నారు. నిషేధాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని లెఫ్టినెంటర్ గవర్నర్ను డిమాండ్ చేస్తున్నారు. ‘ఈ నిషేధం ఇప్పుడు కశ్మీర్లో జరుగుతోంది. రేపు మరోచోట జరగొచ్చు. అధికారం రాతలను అణచివేయొచ్చు. కానీ కశ్మీర్ చరిత్ర పుస్తకాలలో మాత్రమే లేదు. అది మౌఖిక సంప్రదాయంలో ఉంది. ప్రజల జ్ఞాపకాలలో ఉంది. ఆ జ్ఞాపకాలు చెరిపేస్తే చెరిగిపోవు. అవి ఒక తరం నుంచి మరో తరానికి అందజేస్తాయి’అని రచయితలు చెబుతున్నారు. ప్రమాదకర ధోరణి : అనురాధ భాసిన్ ‘మొదట వారు జర్నలిస్టుల కోసం వచ్చారు, మా గొంతులు నొక్కేయడంలో విజయం సాధించామని గ్రహించి, ఇప్పుడు విద్యారంగంపై దృష్టి సారించారు’అని ప్రముఖ ఎడిటర్ అనురాధ భాసిన్ విమర్శించారు. తన పుస్తకం హింసను ప్రోత్సహిస్తుందనే ఆరోపణలను భాసిన్ ఖండించారు. ‘నా పుస్తకం ఎక్కడా ఉగ్రవాదాన్ని కీర్తించలేదు. ప్రభుత్వాలను విమర్శించింది. ఈ రెండింటికీ తేడా ఉందనే విషయాన్ని అధికారులు గమనించడం లేదు. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి’అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పుస్తకాలను నిషేధించడం వల్ల చరిత్ర చెరిగిపోదని జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అన్నారు. ‘పుస్తకాలను నిషేధించడం వల్ల చరిత్ర చెరిగిపోదు. అది విభజనను మాత్రమే పెంచుతుంది. కశ్మీర్లో, ప్రజాస్వామ్య గొంతులను నొక్కేయడం, ప్రాథమిక హక్కులను అణచివేయడం అపనమ్మకాన్ని, పరాయి పాలనలో ఉన్నామనే భావనను పెంచుతుంది’అని ఆమె ఎక్స్లో పోస్ట్ చేశారు. నియంత్రణకు సుదీర్ఘ చరిత్ర... సెన్సార్షిప్ చరిత్ర ప్రపంచానికి కొత్త కాదు. కశ్మీర్కు అసలే కాదు. పుస్తకాలను నిషేధించడం ద్వారా ఆలోచనను అణచివేయాలనుకోవడం చాలా పాత వ్యూహమే. మానవ చరిత్ర అంతటా ఇది ఉంది. 1910లో, బ్రిటిష్ వారు మహాత్మా గాంధీ రాసిన హింద్ స్వరాజ్ పుస్తకం గుజరాతీ ఎడిషన్ను నిషేధించారు. దీనిని రాజద్రోహంగా అభివరి్ణంచారు. 1933లో మే నాజీ విద్యార్థులు జర్మన్ కానివిగా భావించిన వేలాది పుస్తకాలను తగలబెట్టారు. 1904లో, మున్షీ ముహమ్మద్ దిన్ ఫౌక్ శ్రీనగర్ నుంచి ఒక వార్తాపత్రికను ప్రచురించడానికి అప్పటి డోగ్రా పాలకుడు మహారాజా ప్రతాప్ సింగ్ అనుమతి కోరారు. ఫౌక్ అనుమతి నిరాకరించడమే కాకుండా, భవిష్యత్తులో అలాంటి అభ్యర్థనలను స్వీకరించకుండా నియమాలను రూపొందించాలని ఆయన తన ప్రధానమంత్రిని ఆదేశించారు. 2010లో 17 ఏళ్ల విద్యార్థి తుఫైల్ మట్టూ హత్య తర్వాత పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగడంతో ప్రభుత్వం ఎస్ఎమ్ఎస్ సేవలను నిషేధించింది. మూడేళ్ల తరువాత పునరుద్ధరించింది. 2016లో తిరుగుబాటు తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు శ్రీనగర్లోని ఇండిపెండెంట్ పత్రిక అయిన ‘కశ్మీర్ రీడర్’ను ప్రభుత్వం నిషేధించింది. హింసను ప్రేరేపించే ధోరణిలో ఉందంటూ నిలిపేసింది. కశ్మీర్లో నిత్య నిర్బంధాన్ని ఎదుర్కొన్నవారు జర్నలిస్టులే. ఆ నమూనా 2019 నుంచి మరింత పెరిగింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మన ఆదాయం పెరిగింది!
కాలం వేగంగా పరుగెడుతోంది. అందుకు తగ్గట్టుగా సాంకేతికంగానే కాదు, ఆర్థికంగానూ మార్పులను చూస్తున్నాం. ప్రజల జీవన ప్రమాణాలు చాలా మెరుగయ్యాయి. సగటు ఆదాయాలూ పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 1987లో అల్పాదాయ దేశాలు 49 ఉంటే.. 2024 నాటికి ఈ సంఖ్య దాదాపు సగానికి వచ్చిందంటే అభివృద్ధి దిశగా ఏ స్థాయిలో మార్పులొచ్చాయో అర్థం చేసుకోవచ్చు. మనదేశం గత 20 ఏళ్ల కాలంలో విశేష పురోగతి సాధించింది. ప్రపంచ బ్యాంకు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఒకప్పుడు అల్పాదాయ దేశాల జాబితాలో ఉన్న మనదేశం.. 2007లోనే దిగువ మధ్య ఆదాయ దేశంగా అవతరించడం విశేషం. 1987లో అల్పాదాయ దేశాల జాబితాలో ఉన్న దక్షిణాసియాలోని ఆరు దేశాల్లో 2024 నాటికి అయిదు దేశాలు దిగువ మధ్య దేశాల జాబితాలోకీ, ఒకటి ఎగువ మధ్య దేశాల జాబితాలోకీ చేరాయి. 37 ఏళ్లలో అల్పాదాయ దేశాల సంఖ్య సగానికి పడిపోవడం ప్రజల ఆదాయాల పెరుగుదల తీరుతెన్నులకు అద్దం పడుతోంది. ఇక ఎగువ మ ధ్య తరగతి దేశాలు 28 నుంచి 54కు చేరాయి. అధిక ఆదాయ దేశాల సంఖ్య 41 నుంచి రెండింతలకుపైగా దూసుకెళ్లి 87 అయ్యాయి. తగ్గిన పేదలు..: 2004–24 మధ్య ఎగువ మధ్య ఆదాయ గ్రూప్ దేశాల జనాభా 8.9 నుంచి 34.7%కి ఎగబాకడం గమనార్హం. 2004లో అల్పాదాయ గ్రూప్ దేశాల్లో నివసించిన జనాభా 37.4% ఉండగా.. రెండు దశాబ్దాల్లో ఇది 7.6%కి దిగొచ్చింది. అయితే యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు ఆదాయాల్లో ఒక మెట్టు దిగేలా చేస్తాయనడానికి సిరియా, యెమెన్ ఉదాహరణ. 2017లో తక్కువ–మధ్య ఆదాయ గ్రూప్ నుంచి ఇవి అల్పాదాయ గ్రూప్నకు వచ్చాయి. నాలుగు గ్రూపులుగా..: ప్రపంచంలోని దేశాలను.. ప్రపంచ బ్యాంకు ఏటా తలసరి స్థూల జాతీయ ఆదాయం (జీఎన్ఐ) ఆధారంగా అల్ప, దిగువ–మధ్య, ఎగువ–మధ్య, అధిక–ఆదాయ దేశాలుగా వర్గీకరిస్తోంది. 2025–26 (2025 జూలై–2026 జూన్) సంవత్సరానికిగాను ప్రపంచవ్యాప్తంగా 216 దేశాల జాబితా విడుదల చేసింది. తలసరి జీఎ న్ ఐ అనేది విదేశీ సంపాదనతో సహా ఏదైనా దేశంలోని జనాభా సగటు ఆదాయానికి కొలమానం. రాయితీ రుణాలకు ఏ దేశాలు అర్హమైనవో నిర్ణయించడానికి సగటు ఆదాయాలను ప్రపంచ బ్యాంకు పరిగణనలోకి తీసుకుంటోంది. యూరప్, మధ్య ఆసియా: 1987–2024 మధ్య తక్కువ ఆదాయ దేశం ఒక్కటీ లేదు. అధిక ఆదాయ దేశాల శాతం 71 నుంచి 69కి తగ్గింది.తూర్పు ఆసియా, పసిఫిక్: 1987లో 26% దేశాలు తక్కువ ఆదాయ గ్రూప్లో ఉండగా.. 2024 నాటికి కేవలం 3%కి తగ్గాయి.లాటిన్ అమెరికా, కరేబియన్: తక్కువ ఆదాయ దేశాలు 2 నుండి సున్నాకి వచ్చాయి. అధిక ఆదాయ దేశాలు 9% నుంచి 46%కి పెరిగాయి.మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా: తక్కువ ఆదాయ దేశాలు 2 నుండి 3కి పెరిగాయి. అధిక ఆదాయ దేశాలు 35%కి చేరాయి.సబ్–సహారన్ ఆఫ్రికా: తక్కువ ఆదాయ దేశాలు 75% నుండి 45%కి తగ్గాయి. ఒక దేశం అధిక ఆదాయ గ్రూప్లో చేరింది. -
పదేపదే యాడ్స్.. విసిగిస్తున్నాయ్..!
టీవీ చూస్తున్నప్పుడు ప్రకటనలు రావడం సహజం. మనం చూస్తున్న ఛానల్లో కొన్ని యాడ్స్ పదేపదే ప్రత్యక్షం అవుతుంటాయి. ఇలా ఒకే ఛానల్లో ఎక్కువసార్లు ప్రసారం కావడంతో ప్రేక్షకులు విసిగిపోతారు. సింపుల్గా ఛానల్ మారుస్తారు. ప్రకటన ప్రభావమేకాదు యాడ్స్పట్ల వీక్షకుడికి శ్రద్ధ కూడా తగ్గిపోతుంది. ఒక అధ్యయనం ప్రకారం పదేపదే వచ్చే ప్రకటనల కారణంగా 70% మంది భారతీయ వినియోగదారులు విసిగిపోతున్నారట. ఇలా యాడ్స్తో విసుగుచెందుతున్న వారి సంఖ్య శాతం పరంగా భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో నిలిచింది.చూస్తున్న ఛానల్లో పదేపదే ఒకే యాడ్ వస్తే సహజంగానే ఎవరికైనా విసుగొస్తుంది. ఇలా విసుగుచెందుతున్న వారి అంతర్జాతీయ సగటు 68 శాతం ఉందని యాడ్స్ టెక్నాలజీ కంపెనీ ‘ది ట్రేడ్ డెస్క్’ ఇటీవల నిర్వహించిన సర్వే వెల్లడించింది. ఇలా అత్యధికంగా విసుగు చెందినవారితో ప్రపంచంలో యూఎస్, ఆస్ట్రేలియా ముందు వరుసలో ఉన్నాయి. ప్రకటనలపట్ల నిరాసక్తత పెరుగుతున్న నేపథ్యంలో బ్రాండ్స్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని వ్యూహాలు అమలు చేయాల్సిన ఆవశ్యకతను నివేదిక వివరించింది. ఐదుకుపైగా ఛానళ్ల వీక్షణంకేబుల్ టీవీ, ఓటీటీ.. వేదిక ఏదైనా సినిమాలు, వెబ్ సిరీస్, సంగీతం, వార్తలు, గేమింగ్.. ఇలా విభిన్న మాధ్యమాల కోసం సగటున ఒక్కో వ్యక్తి రోజుకు 5.4 మీడియా ఛానళ్లను వీక్షిస్తున్నారట. ఇందుకు 9 గంటలు సమయం వెచ్చిస్తున్నారు. ఆడియోతో స్వల్వ, దీర్ఘకాలంలో ప్రకటనలు గుర్తుండిపోతున్నాయి. వినియోగదారులకు మరింత ప్రభావశీలమైన అనుభవాన్ని అందించగలిగితే.. ప్రకటన పట్ల ఉన్న విసుగును 2.2 రెట్లు తగ్గించడంతోపాటు ఉత్పాదన కొనుగోలు చేసేలా ఒప్పించే ప్రభావం 1.5 రెట్లు పెరుగుతుందని నివేదిక తెలిపింది.కేబుల్ టీవీ, ఓటీటీలతో..» బ్రాండ్స్ గురించి తెలుసుకోవడానికి కేబుల్ టీవీ, ఓటీటీలు ప్రధాన మాధ్యమాలుగా నిలిచాయి. వీటిద్వారా బ్రాండ్స్ను తెలుసుకున్నామని 73 శాతం భారతీయులు చెప్పారు. ఈ విషయంలో ప్రపంచ సగటు 51 శాతం మాత్రమే.» ప్రకటనలతో కూడిన స్ట్రీమింగ్ సేవలను మనదేశంలో 72% మంది సబ్స్క్రైబ్ చేశారు. ఈ విషయంలో ప్రపంచ సగటు 42%.» భారత్లో 18–34 ఏళ్ల వయసువారిలో 55% మంది ఒకే ప్లాట్ఫామ్పై కాకుండా ప్రీమియంగా భావించి కేబుల్ టీవీ, ఓటీటీల్లో ప్రకటనలు చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.ప్రకటనలు గుర్తుపెట్టుకుంటున్నారు» వీక్షిస్తున్నప్పుడు కొత్త బ్రాండ్స్, సేవలు, ఉత్పత్తులను 73% మంది గుర్తించారు.» ఇతర మాధ్యమాలతో పోలిస్తే 66% మంది కేబుల్ టీవీ, ఓటీటీ ప్రకటనలను విశ్వసిస్తున్నారు.» కేబుల్ టీవీ, ఓటీటీల్లో ప్రకటనల్లో కనపడిన ఉత్పత్తులను 69% మంది గుర్తు చేసుకుంటున్నారు.» 47% మంది.. పోస్టర్లు, బిల్బోర్డులు లాంటి డిజిటల్ అవుట్ ఆఫ్ హోమ్ (డీఓఓహెచ్) మీడియాను గుర్తిస్తున్నట్టు, అవి తమకు గుర్తుంటున్నాయని చెప్పారు.» ప్రకటనలు వింటున్న 86% సందర్భాలలో కస్టమర్లు మమేకం అవుతున్నారు. » జెన్ జీ (1997–2012 మధ్య పుట్టినవారు)లో 75% మ్యూజిక్ స్ట్రీమింగ్ ఇష్టపడుతున్నారు. -
నష్టాల్లో 81 విమానాశ్రయాలు!
భారతీయ విమానాశ్రయాల నుంచి ఏటా కోట్ల మంది దేశ, విదేశాలకు విమానయానం చేస్తున్నారు. ఎయిర్పోర్టులూ పెరిగాయి. ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. విమానాశ్రయాల్లో రెస్టారెంట్లు, షాపింగ్ కేంద్రాలు విస్తరించాయి. వీటి వ్యాపారం, ప్రయాణికుల రాకపోకలు, వాహనాల పార్కింగ్ ఫీజు, ఇతర ఆదాయాలతో విమానాశ్రయాలు లాభాల జడివానలో తడిసిపోతున్నాయి అనుకుంటే పొరపాటే. భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా–ఏఏఐ) నిర్వహణలో ఉన్న 81 విమానాశ్రయాలు నష్టాల్లో ఉన్నాయి.దశాబ్ద కాలంలో ఇవి రూ.10 వేల కోట్లకుపైగా నష్టాన్ని మూటగట్టుకోవడం గమనార్హం. వీటిలో 22 విమానాశ్రయాల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. నష్టాల జాబితాలో ఉన్న ఏఏఐ ఎయిర్పోర్టుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఏడు ఉన్నాయి.ఇటీవల కేంద్ర పౌర విమానయాన శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2015–2016 నుంచి 2024–2025 మధ్య దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధీనంలో ఉన్న 81 విమానాశ్రయాలు మొత్తం రూ.10,852.9 కోట్ల నష్టాన్ని చవిచూశాయి. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ విమానాశ్రయం అత్యధికంగా రూ.673.91 కోట్లు నష్టపోయింది. ఆ తర్వాతి స్థానాల్లో అగర్తల, బేగంపేట (హైదరాబాద్), డెహ్రాడూన్, విజయవాడ విమానాశ్రయాలు ఉన్నాయి.రూ.363 కోట్ల నష్టంతో తిరుపతి 8వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి రూ.339.16 కోట్లు, కడప రూ.103.39 కోట్లు, ప్రకాశం జిల్లాలోని దొనకొండ రూ.1.84 కోట్లు, తెలంగాణలోని వరంగల్ రూ.5.76 కోట్ల నష్టాన్ని నమోదుచేశాయి. సఫ్దర్జంగ్ విమానాశ్రయం నుంచి ప్రస్తుతం వాణిజ్య విమానాలు కార్యకలాపాలు సాగించడం లేదు. ఇక్కడి నుంచి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వీవీఐపీలను తీసుకెళ్లడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు.13 కోట్లకు పైచిలుకు..ఏఏఐ ఖాతాలో దేశవ్యాప్తంగా మొత్తం 133 ఎయిర్పోర్టులు ఉన్నాయి. ఇందులో 35 విమానాశ్రయాల నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. రెండు జాయింట్ వెంచర్, ఆరు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) విమానాశ్రయాలు మినహా.. మిగిలిన ఎయిర్పోర్టుల నుంచి 2023–24లో 13 కోట్లకుపైచిలుకు ప్రయా ణికులు దేశ, విదేశాలకు రాకపోకలు సాగించారు. 6.88 లక్షల మెట్రిక్ టన్నుల సరుకు రవాణా అయింది.బేగంపేటలో ఇలా..ఇక బేగంపేట విమానాశ్రయం నుంచి వాణిజ్య విమానాలు నడపడం లేదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ గానూ ఈ ఎయిర్పోర్ట్ సేవలు అందిస్తోంది. అలాగే ప్రైవేట్ విమాన సర్వీసులు ఇక్కడి నుంచి విరివిగా నడుస్తున్నాయి. 2008 మార్చి 23న శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైన తర్వాత బేగంపేట ఎయిర్పోర్టు అన్ని వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేసింది. అతిపెద్ద పౌర విమానయాన ప్రదర్శనకు రెండేళ్లకోసారి బేగంపేట విమానాశ్రయం వేదిక అవుతోంది.రూ.96 వేల కోట్ల వ్యయంప్రయాణికుల సంఖ్య ఏటా పెరుగుతున్న నేపథ్యంలో కొత్త ఎయిర్పోర్టులు, ఉన్న వాటి విస్తరణ, కొత్త టెర్మినళ్లు, ఇతర సౌకర్యాల కల్పన వంటి వాటికోసం 2019–20 నుంచి 2024–25 మధ్య ఏఏఐ, పీపీపీ భాగస్వాములు కలిపి రూ.96,000 కోట్ల మూలధన వ్యయం చేశాయి. ఇందులో ఏఏఐ వాటా రూ.25,000 కోట్లు.తెలుగు రాష్ట్రాల్లో మూడు..మూతపడ్డ విమానాశ్రయాల్లో తెలంగాణ నుంచి నాదర్గుల్, వరంగల్; ఏపీ నుంచి దొనకొండ ఉన్నాయి.ఉడాన్ పథకంతో..దేశంలోని సేవలు లేని, తక్కువ సేవలు అందిస్తున్న విమానాశ్రయాల నుంచి ప్రాంతీయ విమాన కనెక్టివిటీని పెంచడానికి 2016 అక్టోబర్ 21న ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ (ఆర్సీఎస్–ఉడాన్ ) పథకం ప్రారంభమైంది. నిర్వహణ ఖర్చులు, అంచనా ఆదాయాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి విమానయాన సంస్థలకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ను ఈ పథకం కింద ప్రభుత్వం అందిస్తోంది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, విమానాశ్రయ నిర్వాహకుల నుంచి విమానయాన సంస్థలకు ఆర్థిక ప్రోత్సాహకాలు, రాయితీలు లభిస్తాయి. తద్వారా నిర్వహణ ఖర్చులను తగ్గించి వారి కార్యకలాపాలను ప్రోత్సహించవచ్చన్నది ప్రభుత్వ భావన. 2025–2026 ఆర్థిక సంవత్సరానికి ఆర్సీఎస్–ఉడాన్ కోసం కేంద్రం రూ.300 కోట్ల బడ్జెట్ కేటాయించింది. 15 హెలిపోర్ట్లు, రెండు వాటర్ ఏరోడ్రోమ్స్ సహా మొత్తం 92 సేవలు లేని, తక్కువ సేవలు అందించే విమానాశ్రయాలను ఉడాన్ కింద పూర్తి స్థాయి వినియోగంలోకి తీసుకొచ్చారు. -
హాలీడే ట్రిప్.. జాలీగా సాగాలంటే!
కొత్త జంట హనీమూన్ కోసమని యూరప్ దేశాలకు ప్రయాణమైంది. రెండో రోజు వారి లగేజీ బ్యాగ్ కనిపించకుండా పోయింది. అందులో విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు ఉండడంతో ఆందోళన చెందిన ఆ జంట పర్యటనను కుదించుకుని వెంటనే వెనక్కి వచ్చేసింది. ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంది. కానీ, తక్కువ ప్రీమియంకు వస్తుందని చెప్పి చౌక ప్లాన్ తీసుకోవడంతో అది అక్కరకు రాలేదు. ఫలితంగా పర్యటనను ఆస్వాదించకుండానే, ఆర్థిక నష్టంతో వెనుదిరగాల్సి వచ్చింది. అన్ని విధాలుగా ఆదుకునే ట్రావెల్ ఇన్సూరెన్స్ అవసరంపై అవగాహన కల్పించే కథనమిది... నేడు విదేశీ విహార యాత్రలకు ఎక్కువ మంది ఉత్సాహం చూపిస్తున్నారు. దుబాయ్, శ్రీలంక, థాయ్లాండ్, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్ తదితర పర్యాటక ప్రదేశాలను తక్కువ సమయంలోనే చూసి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. విద్య, వ్యాపార అవకాశాల కోసం.. దూరంగా ఉన్న పిల్లలను చూసి వచ్చేందుకు ఎంతో మంది విదేశాలకు వెళ్లివస్తున్నారు. కానీ, ఈ సమయంలో తప్పకుండా ఉండాల్సిన ట్రావెల్ ఇన్సూరెన్స్ పట్ల అశ్రద్ధ కనిపిస్తోంది. బీమా అన్నది వీసా కోసం తీసుకునేది ఎంత మాత్రం కాదు. ఊహించనివి జరిగితే ఆదుకునే మొదటి సాధనమే ఇది. వైద్యపరంగా అత్యవసర పరిస్థితి ఎదురుకావొచ్చు. విమానం ఆలస్యం కావొచ్చు. పాస్పోర్ట్ కనిపించకుండా పోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ట్రావెల్ ఇన్సూరెన్స్ చేదోడుగా నిలుస్తుంది. ముఖ్యంగా కొన్ని దేశాల్లో అడుగు పెట్టాలంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటేనే సాధ్యం. కనుక దీని ప్రాధాన్యాన్ని పూర్తిగా అర్థం చేసుకుని, సమగ్ర బీమా రక్షణతో పర్యటనకు ప్లాన్ చేసుకోవడం మంచిది. వైద్య రక్షణ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీల్లో ఉండే అత్యంత ముఖ్యమైన సదుపాయం మెడికల్ కవరేజీ. యూఎస్, కెనడా లేదా యూకే వంటి దేశాల్లో వైద్య చికిత్సల వ్యయాలు భారీగా ఉంటాయి. ఆయా దేశాల్లో పర్యటించే వారు అనారోగ్యంతో లేదా ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చేరాల్సి వస్తే ఇన్సూరెన్స్ కంపెనీయే చెల్లింపులు చేస్తుంది. అంతేకాదు సర్జరీ చేయాల్సి వచ్చినా లేదా వైద్య పరంగా అత్యవసరంగా ఉన్న చోట నుంచి ఆస్పత్రికి తరలించడానికి అయ్యే వ్యయాలను సైతం బీమా కంపెనీయే భరిస్తుంది. అనారోగ్యం కారణంగా విదేశాల్లోనే నిర్ణీత కాలానికి మించి ఉండాల్సిన సందర్భాల్లో అయ్యే ఖర్చులను సైతం దీని కింద పొందొచ్చు. తిరుగు ప్రయాణానికి ఆరోగ్యం సహకరిస్తుందని వైద్యులు ధ్రువీకరించేంత వరకు సాయం తీసుకోవచ్చు. కుటుంబంతో కలసి వెళుతుంటే అందరికీ కలిపి (60 ఏళ్లలోపు ఇద్దరు పెద్దలు, 21 ఏళ్లలోపు పిల్లలు) ఒకటే పాలసీ తీసుకోవచ్చు. 60 ఏళ్లు నిండిన వృద్ధుల కోసం విడిగా తీసుకోవాలి. కేవలం 2–3 రోజుల పర్యటనకు ట్రావెల్ ఇన్సూరెన్స్ వృథా అని భావించొద్దు. లగేజీ కోల్పోతే.. మీకు సంబంధించిన లగేజీని ఎవరైనా చోరీ చేసినా లేదా కనిపించకుండా పోయిన సందర్భాల్లోనూ ఈ పాలసీలో రక్షణ ఉంటుంది. ఎయిర్లైన్స్ నిర్వహణ సరిగ్గా లేని కారణంగా బ్రీఫ్ కేసులోని విలువైన వస్తులకు నష్టం వాటిల్లినట్టయితే.. క్రెడిట్/డెబిట్ కార్డు/పాస్పోర్ట్లను కోల్పోయిన సందర్భాల్లోనూ ఆర్థిక నష్టాలను భర్తీ చేస్తుంది. కోల్పోయిన వాటిని తిరిగి పొందేందుకు అయ్యే ఖర్చులను బీమా కంపెనీ నుంచి పొందొచ్చు. మనవల్ల ఇతరులకు నష్టం జరిగితే.. పర్యటన సమయంలో మన తప్పిదం లేదా మన పిల్లల కారణంగా ఎవరికైనా గాయం కావడం లేదంటే ఇతరుల ప్రాపర్టీకి నష్టం వాటిల్లడం వంటి సంఘటనల్లో చెల్లింపుల మేర బీమా కంపెనీ నుంచి పరిహారం పొందొచ్చు. పాలసీ నియమ నిబంధనలపై ఈ మొత్తం ఆధారపడి ఉంటుంది. ఇంటికి రక్షణ కొన్ని రకాల ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో ఇంటికి సైతం రక్షణ ఉంటోంది. పర్యటన సమయంలో ఇంట్లో చోరీ.. లేదంటే అగ్ని ప్రమాదం కారణంగా ఆస్తి నష్టం వాటిల్లితే ఆ మేరకు పరిహారం పొందొచ్చు. ఫ్లయిట్ రద్దయితే..విమానం అనుకున్న సమయానికి కాకుండా, షెడ్యూలింగ్ మారిపోతే లేదా వాతావరణం అనుకూలించక ఏకంగా సర్వీసు రద్దు అయితే, దీనివల్ల పర్యటన ప్రణాళిక దెబ్బతింటుంది. ఇలాంటివి చోటు చేసుకుంటే వేరొక విమాన సర్వీసులో బుక్ చేసుకునేందుకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. హోటల్ బుకింగ్లపైనా నష్టపోవాల్సి వస్తుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటే ఇలాంటి ఖర్చులను బీమా కంపెనీ భరిస్తుంది. ప్రయాణానికి చివరి ఘడియల్లో కుటుంబంలో అత్యవసర పరిస్థితి కారణంగా ట్రిప్ రద్దు చేసుకోవాల్సి రావచ్చు. అలాంటప్పుడు నష్టాన్ని ఈ పాలసీ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. విదేశీ పర్యటనలో అనారోగ్యం లేదా ఇతర కారణాల దృష్ట్యా పర్యటనను కుదించుకోవాల్సి వచ్చిన సందర్భంలోనూ బీమా కంపెనీలు కవరేజీని ఆఫర్ చేస్తున్నాయి. వీటికి మినహాయింపులు.. ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ ఏదైనా సరే, కొన్ని మినహాయింపులు ఉంటాయి. ముఖ్యంగా ముందస్తు వ్యాధుల కారణంగా పర్యటన సమయంలో వైద్య చికిత్సలు అవసరం పడితే కవరేజీ ఉండదు. కావాలని గాయం చేసుకున్నా లేదా యుద్ధం, ఉగ్రవాదం, అల్లర్ల కారణంగా ఏర్పడే నష్టానికి పరిహారం రాదు. అధిక రిస్క్ ఉండే సాహస క్రీడలకు సంబంధించి మినహాయింపులు ఉంటాయి. ప్రీమియం ఎంత ఉండొచ్చు? అంతర్జాతీయ పర్యటన 3–5 రోజుల కోసం అయితే ఒక్కొక్కరికీ రూ.200–700 మధ్య ఉంటుంది (60 ఏళ్ల లోపు వారికి). ఎంపిక చేసుకున్న ప్రాంతం, వయసు, సమ్ ఇన్సూర్డ్ (బీమా రక్షణ)పై బీమా ప్రీమియం ఆధారపడి ఉంటుంది. యూరప్ ట్రిప్ కోసం 50వేల నుంచి లక్ష డాలర్ల సమ్ ఇన్సూర్డ్ తీసుకునేట్టు అయితే.. ప్రీమియం రూ.500 వరకు ఉంటుంది. దేశీ పర్యటనలు అయితే ప్రీమియం రోజువారీ రూ.20–50 మధ్య ఉంటుంది.తీసుకునే ముందు చూడాల్సినవి.. → పాలసీ నియమ, నిబంధనలను పూర్తిగా చదివి వేటికి కవరేజీ ఉంటుంది? వేటికి ఉండదన్న విషయాలను స్పష్టంగా తెలుసుకోవాలి. కొన్ని పాలసీల్లో ఖరీదైన ఎల్రక్టానిక్స్ వస్తువులకు కవరేజీ ఉండడం లేదు. ప్రీమియం ఎక్కువైనా సరే అన్నింటికీ రక్షణనిచ్చే పాలసీని తీసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. → కొన్ని దేశాల వీసా నిబంధనలు ప్రత్యేకంగా ఉంటున్నాయి. ఉదాహరణకు యూరప్ టూరిస్ట్ వీసా కోసం కనీసం 30,000 పౌండ్ల మెడికల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. కనుక వెళుతున్న దేశానికి సంబంధించిన నిబంధనలు తెలుసుకోవాలి. వీసా కోసం తప్పనిసరి కాకపోయినప్పటికీ.. పర్యటించే దేశాల్లో వైద్య సేవల ఖర్చులను తెలుసుకుని, అందుకు అనుగుణంగా మెరుగైన బీమా రక్షణతో పాలసీ తీసుకోవాలి. → ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్లు అన్నీ ఒకే రకమైనవి కావు. వ్యాపార పర్యటన, చదువు కోసం వెళ్లేవారు, కుటుంబంతో కలసి సెలవుల్లో విహరించేందుకు వెళ్లే వారు, సాహస క్రీడల కోసం వెళ్లేవారు తమకు అనుకూలమైన ప్లాన్లపై దృష్టి సారించాలి. → కేవలం విదేశీ పర్యటనల కోసమే అని కాదు. దేశీయంగానూ విహార యాత్రల కోసం వెళ్లేవారు సైతం ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. → దేశీయంగా రోడ్డు లేదా ట్రెయిన్ మార్గంలో టూర్కు ప్లాన్ చేసుకున్న వారు.. అప్పటికే తమ కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ప్లాన్తోపాటు, వ్యక్తిగత ప్రమాద బీమా కలిగి ఉంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ అవసరం ఉండదు. ఆస్పత్రిలో చేరాల్సి వస్తే అప్పటికే ఉన్న బీమా ప్లాన్ ద్వారా నగదు రహిత సేవలు పొందొచ్చు. బస్సు, రైలు, హోటల్ బుకింగ్లు రద్దు చేసుకున్నా, పూర్తి మొత్తం వెనక్కి వచ్చే విధంగా జాగ్రత్త పడితే సరిపోతుంది. → కేవలం 24 గంటల ప్రయాణమే అయి, హోటల్ లేదా ఫ్లయిట్ బుకింగ్లు లేకుండా వెళ్లే వారికీ ట్రావెల్ ఇన్సూరెన్స్ అవసరపడదు. → దేశీ పర్యటనలు, అవి కూడా సమీప ప్రాంతాల్లోని వాటికి ట్రావెల్ ఇన్సూరెన్స్ అంత లాభదాయం కాదు. దేశంలోనే పర్వత ప్రాంతాలు, సున్నితమైన మారుమూల పర్యాటక ప్రదేశాలు, విదేశీ పర్యటనలకు ఇది ఉపయోకరంగా ఉంటుంది. → ప్రీమియం తక్కువే ఉంటుంది. కనుక, అనవసర ఖర్చు కింద చూడడం సరికాదు. → హెల్త్ లేదా వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ లేని వారు మాత్రం దగ్గర, దూర పర్యటనంతో సంబంధం లేకుండా ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి.ఈ తప్పులు చేయొద్దు.. → కొన్ని దేశాల వీసా ప్రాసెసింగ్కు బీమా తప్పనిసరి అని చెప్పి, చౌక పాలసీ తీసుకోవద్దు. అత్యవసర పరిస్థితుల్లో ఆదుకోనప్పుడు పాలసీ ఉన్నా నిష్ప్రయోజనమే. → పర్యటనలో ఏ ఇబ్బందీ రాదులే లేదా కొన్ని రోజులే కదా అని భావించి బీమాను పక్కన పెట్టొద్దు. → పాలసీ తీసుకునే నాటికి ఉన్న ఆరోగ్య సమస్యలను తప్పకుండా వెల్లడించాలి. → రూ.100–200 ఆదా కోసం తక్కువ కవరేజీకి పరిమితం కావొద్దు. → కొన్ని క్రెడిట్ కార్డులు ఆఫర్ చేసే ట్రావెల్ ఇన్సూరెన్స్పై ఆధారపడొద్దు. వాటి కవరేజీ ఎన్నో షరతులు, పరిమితులతో ఉంటుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఆదర్శం అంటే...
‘‘ఇది చేయాలనుకొంటున్నాను, అది చేయాలను కొంటున్నాను.’’ అని అంటూ ఉంటారు చాలా మంది. ఒక సారి చేసిన తరవాత చేయాలి అనుకోటానికి అవకాశం కానీ, అవసరం కాని ఏముంది? జీవితంలో ఫలానాది సాధించటం నా ఆదర్శం, ఎప్పటికైనా నేను ఆ విధంగా అవాలి అనుకుంటున్నాను – ఇటువంటి మాటలు యువత నుండి తరచుగా వినపడుతూ ఉంటాయి. అంటే, ఆ విధంగా ఉండటం వారికి ఇష్టం. కాని, ఉండే ప్రయత్నం మాత్రం చేయరు. వారికి ఏదైనా కావాలి అంటే మాత్రం వెంటనే వచ్చేయాలి. దానికి శ్రమ పడేది తాము కాదు కదా! అమ్మనో, నాన్ననో సతాయించి సాధించుకుంటారు. తాము చేయవలసిన వాటిని ఆదర్శం పేరిట గోడ మీద రాస్తారు ‘‘రేపు’’ అని. ఆ రేపు ఎప్పటికీ రాదు. వెళ్ళిపోయింది నిన్న. వచ్చి మనకి అందుబాటులో ఉన్నది ఈ రోజు. ఆచరించాలి, లేదా ప్రయత్నం చేయాలి, లేదా మొదలు పెట్టాలి అంటే – ఇప్పుడే, ఈ క్షణమే సరి అయింది. పరిస్థితులు అనుకూలించినప్పుడు, నాకు వీలైనప్పుడు అనుకుంటే కుదరదు. ఎందుకంటే బద్ధకించే వారికి వాయిదా వేయటానికి ఏదో ఒక వంక దొరుకుతుంది. అలలు తగ్గాక సముద్రంలో స్నానం చేస్తాను అని ఒడ్డున కూర్చొన్నట్టు ఉంటుంది. అంటే ఆదర్శాలు ఉండకూడదా? అనే ప్రశ్న వస్తుంది. ఉండాలి. చిన్న పిల్లవాడికి ఐఏఎస్ అవాలన్నది ఆదర్శం. ఈ క్షణాన అవలేడు కదా! దానికి ఒక సమయాన్ని నిర్దేశించుకోవాలి. దాని కోసం ఇప్పటి నుండి ప్రయత్నం చేయాలి. ఆ దిశగా శిక్షణ తీసుకోవాలి. ఇప్పటినుండి ఎందుకు? డిగ్రీ అయినాక చూద్దాం, అనుకుంటే కుదరదు కదా! ఆదర్శం వాస్తవంగా మారటానికి తగిన కృషి చేయాలి. ఉన్నతమైన ఆదర్శాలు ఉండటం మంచిదే. నిజానికి ఉండాలి కూడా. ఆదర్శాలు వల్లెవేయటానికి బాగుంటాయి కాని, అవి ఆకాశ హర్మ్యాలు కాకూడదు. తన శక్తి సామర్థ్యాలకు తగినట్టు ఉండాలి. మృత్యువును జయించటం, బొందితో స్వర్గానికి వెళ్ళటం వంటి అసాధ్యమైనవి సాధించటం నా ఆదర్శం అనటం హాస్యాస్పదం. అవి సాధించటం కుదరదు కనుక ప్రయత్నం చేయటం వృథా అని మానేయటానికి ఒక వంక చెప్పే ప్రబుద్ధులు కూడా ఉన్నారు. అద్దాన్ని ఆదర్శం అంటారు. ఆదర్శాలు అద్దం లాంటివి. దానిలో ప్రతి బింబాలు మాత్రమే కనపడతాయి. బింబం కాదు. అయితే, ప్రతిబింబం బింబాన్ని సరిచేయటానికి పనికి వస్తుంది. చెదిరిన బొట్టు దిద్దుకోటానికో, చెరిగిన జుట్టుని సద్దుకోటానికో అద్దంలోని ప్రతి బింబం సహాయం చేస్తుంది. అందులో చూసి ముఖాన్ని సరి చేసుకోవచ్చు. ప్రతిబింబంలో సరి చేయటం కుదరదు. అద్దంలో ప్రతిబింబానికి బొట్టు పెడితే ముఖం మీదకి రాదు కదా! రాసి పెట్టుకున్న ఆదర్శాలు అద్దంలో ప్రతిబింబాల వంటివి. ఆచరణ ముఖం లాంటిది. అక్కడ చూస్తూ ఇక్కడ తగిన మార్పులు చేసుకుంటూ ఉండాలి. ఆదర్శాలని గుర్తు చేసుకుంటూ ప్రేరణ పొందాలి. ఆదర్శం వ్యక్తులు అయితే వారి వలె ఉండటం అలవాటు చేసుకోవాలి. ఆ స్థాయికి రావటానికి వారు ఏవిధంగా శ్రమించారో దానిని ఆదర్శంగా తీసుకోవాలి కాని, ఇప్పుడు వారు అనుభవిస్తున్న సుఖాన్ని, వైభవాన్ని కాదు. దురదృష్టవశాత్తు చాలామంది రెండవ దానినే ఆదర్శంగా తీసుకోవటం జరుగుతోంది. ఆదర్శం ఆచరణగా పరిణమించాలి. ఆదర్శాలను వాస్తవాలుగా పరిణమింప చేసుకోటానికి శక్తి మేరకు కృషి చేయాలి. ఒకవేళ అది ఫలించక పోయినా పరవాలేదు. ప్రయత్నం ప్రధానం. తన ఆదర్శాన్ని సాకారం చేయటానికి జీవిత మంతా వెచ్చించారనే ఖ్యాతి మిగులుతుంది. – డా.ఎన్. అనంతలక్ష్మి -
నానోక్రాఫ్ట్తో కృష్ణ బిళాల రహస్యాల ఛేదన
సువిశాలమైన అంతరిక్షంలో కృష్ణ బిళాలు(బ్లాక్ హోల్స్) అంతుచిక్కని మిస్టరీయే. వాటి గురించి సంపూర్ణంగా తెలుసుకోవడానికి సైంటిస్టులు దశాబ్దాలుగా పరిశోధనల్లో నిమగ్నమయ్యారు. బ్లాక్హోల్స్ పుట్టుక, పరిణామం గురించి తెలిస్తే విశ్వం ఎలా ఆవిర్భవించిందో, గ్రహాలు ఎలా ఏర్పడ్డాయో చాలావరకు నిర్ధారణకు రావొ చ్చని భావిస్తున్నారు. భూగ్రహం నుంచి కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉండే కృష్ణ బిళాల వద్దకు చేరుకొనే సదుపాయం ఇప్పటికైతే లేదు. అలాంటి వ్యోమనౌకను ఎవరూ అభివృద్ధి చేయలేకపోయారు. కానీ, అది సాధ్యమేనని ప్రముఖ అస్ట్రో ఫిజిసిస్ట్ కాసిమో బాంబీ ధీమాగా చెబుతున్నారు. మరో 100 ఏళ్లలో కృష్ణ బిళం వద్దకు వ్యోమనౌకను పంపించగలమని అంటున్నారు. ఈ స్పేస్క్రాఫ్ట్ బ రువు ఎంత ఉంటుందో తెలుసా? కేవలం ఒక పేప ర్ క్లిప్ బరువు కంటే తక్కువే. ఇదొక నానోక్రాఫ్ట్ అని చెప్పొచ్చు. దీంతో కృష్ణబిళాల మిస్టరీలను ఛేదించవచ్చని కాసిమో బాంబీ అంచనా. దీనిపై ‘జర్నల్ ఐసైన్స్’లో వివరాలు ప్రచురితమయ్యాయి. కాంతి వేగంలో మూడో వంతు వేగం బ్లాక్హోల్ వద్దకు పంపించే నానోక్రాఫ్ట్ శక్తివంతమైన లేజర్తో పనిచేస్తుంది. భూమిపైనుంచే దీనిని ఆపరేట్ చేయొచ్చు. కాంతి వేగంలో మూడో వంతు వేగంతో అంతరిక్షంలోకి దూసుకెళ్తుంది. బ్లాక్ హోల్ సమీపంలోకి వెళ్లడానికి వందేళ్లు పడుతుంది. ఇదంతా వినడానికి సైన్స్ ఫిక్షన్లాగా అనిపిస్తున్నా.. అది కచి్చతంగా వాస్తవ రూపం దాల్చుతుందని కాసిమో బాంబీ అంటున్నారు. మరో 20 నుంచి 30 ఏళ్లలో ఈ ప్రయోగం పట్టాలకెక్కుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. లేజర్, అంతరిక్ష ప్రయోగాల్లో మరింత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటలోకి వస్తుందని, ప్రయోగాల ఖర్చు కూడా తగ్గుతుందని ఆయన వెల్లడించారు. కేవలం కొన్ని గ్రాముల బరువుండే నానోక్రాఫ్ట్లో మైక్రోచిప్, ఫోటాన్ బీమ్స్తో పనిచేసే లైట్ సెయిల్ ఉంటాయి. ఈ బుల్లి వ్యోమనౌక 20 నుంచి 25 కాంతి సంవత్సరాల దూరంలోని కృష్ణబిళాలను పరిశోధిస్తుంది. భౌతికశాస్త్రంలో విప్లవాత్మకం బ్లాక్స్ హోల్స్ అనేవి అంత సులువుగా కంటికి కనిపించవు. ఎందుకంటే వాటి నుంచి కాంతి ఉద్గారం జరగదు. సంప్రదాయ టెలిస్కోప్లతో గుర్తించలేం. పరిశోధనకు అనువైన బ్లాక్ హోల్ను ఎంచుకోవడం ఒక సవాలే. సమీపంలోని నక్షత్రాలపై చూపే గురుత్వాకర్షణ ప్రభావం ఆధారంగా కృష్ణ బిళాలను సైంటిస్టులు గుర్తిస్తుంటారు. భూమి నుంచి 25 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న బ్లాక్ హోల్స్ను మరో పదేళ్లలోపు కనిపెట్టగలమని చెబుతున్నారు. వీటిపై నానోక్రాఫ్ట్ చేసే పరిశోధనలు భౌతికశాస్త్రంలో విప్లవాత్మకం అవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం సహా ఫిజిక్స్లో ప్రాథమిక సూత్రాలను సంక్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో పరీక్షించేందుకు ఇది దోహదపడుతుందని అంటున్నారు. అతి తేలికైన వ్యోమనౌకలను అంతరిక్షంలోకి పంపించగల పరిజ్ఞానమే అందుబాటులోకి వస్తే అది మరిన్ని కీలక పరిశోధనలకు, అంతరిక్షంలోని రహస్యాలను కనిపెట్టడానికి తోడ్పడుతుందని చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కోట్ల విలువైన.. కొమ్ము గుర్రాలు
పేటీఎం, ఫోన్పే, జొమాటో, ఓలా, స్విగ్గీ.. ఇలాంటి ఎన్నో కంపెనీలు మనకు సుపరిచితమైనవే. వివిధ రూపాల్లో మన నిత్య జీవితంలోనూ భాగమైపోయాయి. ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయిగా అనొచ్చు. కానీ.. అవి వీటిలా ఒక ప్రత్యేక హోదా పొందలేదు. అదే యూనికార్న్. ఒక బిలియన్ డాలర్ల మార్కెట్ విలువున్న స్టార్టప్లను యూనికార్న్లుగా పిలుస్తారు. ఇవేకాదు.. ఇందులో ఇంకా డెకాకార్న్, హెక్టాకార్న్ వంటివీ ఉన్నాయి. యూనికార్న్ స్థాయికి చేరడానికి సిద్ధంగా ఉన్న ‘జింక’లూ, ‘చిరుత’లూ కూడా ఉన్నాయి.‘స్టార్టప్’.. మనం తరచూ వింటున్న రు. ఒక వినూత్న ఆలోచన, ధైర్యే సాహసే లక్ష్మీ అన్న స్ఫూర్తితో ఎంతోమంది ఇలాంటివి ఏర్పాటుచేశారు. అలా మార్కెట్లోకి అడుగుపెట్టిన కంపెనీల్లో.. వినూత్న ఆలోచనలు, సాంకేతికత వినియోగం వంటి వాటితో నిలదొక్కుకున్నవి కొన్నే. అలా సుమారు రూ.8,700 కోట్ల మార్కెట్ విలువ కలిగిన కంపెనీగా ఎదిగిన స్టార్టప్ను యూనికార్న్ అని పిలుస్తారు. ఈ పదాన్ని 2013లో వెంచర్ క్యాపిటలిస్ట్ ఐలీన్ లీ మొట్టమొదట ఉపయోగించారు.121 యూనికార్న్లుప్రముఖ మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ ట్రాక్సన్ అంచనా ప్రకారం.. మనదేశంలో ప్రస్తుతం 121 యూనికార్న్ కంపెనీలు ఉన్నాయి. 2025 జనవరి–ఆగస్టు మధ్య కొత్తగా 4 స్టార్టప్లు యూనికార్న్లుగా అవతరించాయి. గతేడాది ఈ జాబితాలోకి 6 కంపెనీలు వచ్చి చేరడం విశేషం. ప్రపంచంలో అత్యధిక యూనికార్న్లు ఉన్న దేశం అమెరికా. అక్కడ 1,048 ఉన్నాయి. ఆ తరవాతి స్థానంలో చైనా (245) ఉంది. భారత్ మూడో స్థానంలో నిలిచింది. దేశంలో అత్యధిక యూనికార్న్లు ఉన్న నగరం బెంగళూరు. అక్కడ 52 ఉంటే గురుగ్రామ్లో 19, ముంబైలో 19 ఉన్నాయి. కొన్ని ప్రధాన యూనికార్న్ కంపెనీలు⇒ ఆన్లైన్లో ఆహారం స్విగ్గీ, జొమాటో, లీషియస్⇒ ఎడ్టెక్ అన్అకాడమీ, బైజూస్, వేదాంతు, ఫిజిక్స్వాలా, లీడ్ స్కూల్⇒ ఆన్లైన్ ట్రేడింగ్ జెరోధా, గ్రో, అప్స్టాక్స్⇒ ఆన్లైన్ పేమెంట్, ఇతర సేవలు ఫోన్పే, పేటీఎం⇒ ఆన్లైన్ ఫార్మసీ టాటా 1 ఎంజీ, ఫార్మ్ఈజీ⇒ బైక్, ట్యాక్సీ, ఆటో, క్యాబ్ రైడ్స్ ర్యాపిడో, ఓలా⇒ క్విక్ కామర్స్ బ్లింకిట్, జెప్టో⇒ ఆన్లైన్ గేమింగ్ మొబైల్ ప్రీమియర్ లీగ్, డ్రీమ్ 11, గేమ్స్ 24 బై 7⇒ ఆన్లైన్ ట్రేడింగ్ జెరోధా, గ్రో, అప్స్టాక్స్⇒ ఆన్లైన్ పేమెంట్ గేట్వే రేజర్ పే, బిల్డెస్క్⇒ సౌందర్య ఉత్పత్తులు, కాస్మెటిక్స్: నైకా, పర్పుల్⇒ ఆన్లైన్ షాపింగ్ స్నాప్డీల్, ఫ్లిప్కార్ట్యూనికార్న్1 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీ.డెకాకార్న్ఇది యూనికార్న్ కంటే ఒక మెట్టు ఎక్కువ. 10 బిలియన్ డాలర్ల విలువైన సంస్థ. హెక్టాకార్న్100 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీ.మినికార్న్1 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువ ఉండే కంపెనీ. ఇలాంటివి భవిష్యత్తులో యూనికార్న్లు అవతరించే అవకాశం ఉంటుంది.సూనికార్న్సమీప భవిష్యత్తులో యూనికార్న్గా ఎదిగేందుకు అవకాశం ఉన్న కంపెనీని ఈ పేరుతో పిలుస్తారు.గజెల్ ఇది ఒక రకమైన జింక జాతి. ఇవి గరిష్ఠంగా గంటకు 100 కి.మీ. వేగంతో పరుగెత్తగలవు. వచ్చే మూడేళ్లలో యూనికార్న్ హోదా పొందే అవకాశం ఉన్న కంపెనీలను గజెల్ అంటారు.చిరుత వచ్చే ఐదేళ్లలో యూనికార్న్ హోదా పొందే అవకాశం ఉన్న కంపెనీలను చీతా అని పిలుస్తారు. ఆస్క్ ప్రైవేట్ వెల్త్ హురున్ ఇండియా ఫ్యూచర్ యూనికార్న్ ఇండెక్స్ – 2024 ప్రకారం మనదేశంలో 46 గజెల్స్, 106 చిరుతలు ఉన్నాయి.స్టార్టప్ ఇండియాకేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించిన స్టార్టప్ ఇండియా కార్యక్రమం, ప్రోత్సాహకర కార్యక్రమాలు ఈ పదేళ్లలో స్టార్టప్లు రికార్డు స్థాయిలో పెరగడానికి దోహదపడ్డాయి. మనదేశంలో యూనికార్న్ హోదా పొందిన మొట్టమొదటి స్టార్టప్ కంపెనీ ఇన్మొబి. ఈ మొబైల్ అడ్వర్టయింజింగ్ కంపెనీ 2011లో యూనికార్న్ హోదా పొందింది. దేశంలో జూన్ 30 నాటికి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ, ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) లెక్కల ప్రకారం ఉన్న స్టార్టప్లు 1,80,683. యూనికార్న్.. వీటి రూటే వేరుయూనికార్న్ కంపెనీలేవీ రాత్రికిరాత్రే కోట్ల రూపాయల ఆదాయాలు గడించలేదు. దాని వెనుక ఎన్నో సృజనాత్మక ఆలోచనలు ఉన్నాయి. యూనికార్న్లలో దాదాపు అన్ని కంపెనీలూ.. ఆయా రంగాల్లో మొట్టమొదటివి. ఈ కంపెనీలన్నీ దాదాపుగా టెక్నాలజీని సద్వినియోగం చేసుకున్నవే. వినియోగదారులకు వస్తువులు, సేవల సౌలభ్యాన్ని పెంచినవే. ఇవి ఏం చేస్తున్నాయంటే...⇒ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నాయి⇒ అత్యాధునిక సాంకేతికతలు వినియోగిస్తున్నాయి⇒ సరికొత్త బిజినెస్ మోడళ్లను ప్రజలకు పరిచయం చేస్తున్నాయి⇒ వినూత్న వ్యాపార అవకాశాలను సృష్టిస్తున్నాయి⇒ ఎంతోమంది యువతకు స్టార్టప్లు ఏర్పాటుచేయాలన్న స్ఫూర్తిని ఇస్తున్నాయి.మరికొన్ని ప్రముఖ యూనికార్న్లుబిగ్ బాస్కెట్, కల్ట్ ఫిట్, బోట్, ఫస్ట్ క్రై, లెన్స్కార్ట్, డెల్హివరీ, పోర్టర్, పాలసీ బజార్, క్రెడ్, అర్బన్ కంపెనీ, ప్రిస్టీన్ కేర్, ఏథర్, భారత్పే, జెటా, మనీవ్యూ, ఏకో -
దుర్గం గట్లు.. అభివృద్ధి చేస్తే ఒట్టు
దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గుర్వాయిగూడెం గ్రామ శివారులోని దుర్గం గట్టుపై కాకతీయుల కాలంలో నిర్మించిన పలు కట్టడాలు, శ్రీ శంకరగిరి దుర్గేశ్వర స్వామి ఆలయం చరిత్రకు ఆనవాళ్లుగా ఉన్నాయి. కాకతీయుల చరిత్రను ఇనుమడింపజేసేలా ఉన్న ఈ కట్టడాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. కాకతీయ రాజుల్లో చివరివాడైన ప్రతాపరుద్రుడు దుర్గం గట్టుపై పలు చారిత్రక కట్టడాలు, ఆలయాలు నిర్మించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. దాదాపు 20 ఎకరాలకు పైగా విస్తీర్ణం ఉన్న ఈ గట్టుపై.. క్రీ.శ.1289 – 1323 మధ్య కాలంలో శ్రీ శంకరగిరి దుర్గేశ్వర స్వామి ఆలయంతో పాటు గట్టు చుట్టూ శత్రుదుర్భేద్యమైన రాతికోట నిర్మించారు. నీటి సౌలభ్యం కోసం గట్టుపై ఆరు బావులు తవ్వి, వాటి లోపల రాతి కట్టడాలు నిర్మించారు. ఆ బావి నీటితోనే కాకతీయులు దుర్గేశ్వర స్వామికి అభిషేకం, అర్చన చేసేవారంటారు. గుట్టపై నిర్మించిన ధ్యాన మందిరాలు నేటికీ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఈ మందిరాల్లో ఆనాడు కాకతీయ వంశీయులు ధ్యానం చేసేవారని తెలుస్తోంది. అక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ముప్పయ్ సంవత్సరాల క్రితం వరకు కూడా దుర్గం గట్టుపై ఉన్న శివయ్యకు విశేష పూజలు చేసి, దీపధూప నైవేద్యాలు సమరి్పంచేవారు. మహా శివరాత్రి సందర్భంగా ఐదు రోజులపాటు ఇక్కడ జాతర నిర్వహించేవారు. కాకతీయుల చరిత్రకు తార్కాణంగా నిలిచే, ఈ గట్టును పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.సరైన మార్గం లేక.. దుర్గం గట్టు పైకి వెళ్లడానికి సరైన రవాణా మార్గం లేకపోవడంతో.. కాలక్రమేణా ఆలయ ప్రాభవం తగ్గిపోయింది. ఆలయానికి వెళ్లే భక్తుల సంఖ్య క్రమేపీ తగ్గిపోగా, నేటితరం వారికి దుర్గం గట్టు అంటే కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆలయం, కాకతీయుల చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇదే అదనుగా భావించిన కొందరు దుండగులు గట్టుపై.. గుప్త నిధుల కోసం పలుచోట్ల తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాలతో ఆలయంతో పాటు పలు రాతి కట్టడాలు ధ్వంసం కావడంతో.. పది సంవత్సరాల క్రితం మండల వాసులు తాత్కాలికంగా శివయ్యకు ఆలయం నిర్మించారు. అమలుకాని ఎమ్మెల్యే హామీ దుర్గం గట్టుపై ఆలయ పునర్నిర్మాణంతో పాటు కాకతీయుల కాలం నాటి చారిత్రక కట్టడాల ఆనవాళ్లను మెరుగుపరిచి, గట్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని.. ఈ ఏడాది జనవరిలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హామీ ఇచ్చారు. గత జనవరిలో దుర్గమ్మ గట్టును సందర్శించిన ఎమ్మెల్యే.. గట్టుపై చారిత్రక ఆనవాళ్లను పరిశీలించారు. ఎన్నికల కోడ్ పూర్తి కాగానే సౌర విద్యుత్ సౌకర్యంతో పాటు, తాగునీటి కోసం బోరు కూడా ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. నెలలు గడుస్తున్నా.. అభివృద్ధి పనులు మాత్రం ప్రారంభం కాలేదు. రవాణా సౌకర్యం లేదు దుర్గమ్మ గట్టు పైకి వెళ్లడానికి సరైన రవాణా మార్గం లేకపోవడంతో ఆలయ ప్రాధాన్యం మసకబారిపోతోంది. గట్టు పైకి వెళ్లడానికి సరైన మార్గం ఏర్పాటు చేస్తే, తిరిగి ఆలయానికి సందర్శకులు పెరుగుతారు. కాకతీయుల కాలం నాటి చారిత్రక కట్టడాలను కాపాడుకోవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం స్పందించి, ఆలయ అభివృద్ధికి పూనుకోవాలి. – పాశం ప్రసాద్, గోపాలపురం, దమ్మపేట మండలం చరిత్రను కాపాడుకోవాలి ఓరుగల్లును పరిపాలించిన కాకతీయులు నిర్మించిన శ్రీ శంకరగిరి దుర్గేశ్వరస్వామి ఆలయ చరిత్ర, విశిష్టతను కాపాడుకోవలసిన అవసరం ఉంది. గట్టుపై ఉన్న ఆలయాన్ని గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి చేయడం వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. దేవాదాయ, పర్యాటక శాఖల సహకారంతో దుర్గం గట్టును అభివృద్ధి చేసి, విద్యుత్, రవాణా, తాగు నీటి సౌకర్యాలను కల్పించాలి. – విజయ మారుతి శర్మ, దమ్మపేట -
సూపర్ ఏజర్.. వీళ్ల జ్ఞాపకశక్తీ సూపర్
మనిషి మెదడు వృద్ధాప్యంలో కుచించుకుపోతుంది. జ్ఞాపకశక్తి సన్నగిల్లుతుంది. అయినప్పటికీ, ‘సూపర్ ఏజర్స్’ అని శాస్త్ర పరిశోధకులు పేర్కొంటున్న కొందరిలో అలా జరగటం లేదు! ఎనభై ఏళ్ల వయసు దాటినా, వారి మెదడు చురుగ్గా పనిచేస్తుంటుంది. మనుషుల్ని చక్కగా గుర్తు పడతారు. 30 ఏళ్ల క్రితం నాటి జ్ఞాపకాలు సైతం చెరిగిపోకుండా ఉంటాయి. అల్జీమర్స్తో వచ్చే మతిమరుపు, విశ్లేషణాత్మక శక్తి తగ్గడం వంటివి వారిలో లేవు. అసలు ఇదెలా సాధ్యం?! ఈ ప్రశ్నకు సమాధానంగా చికాగోలోని నార్త్వెస్టర్న్ యూనివర్సిటీ పరిశోధకురాలు టామర్ గెఫెన్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అల్జీమర్స్ అసోసియేషన్ జర్నల్. ‘అల్జీమర్స్ – డిమెన్షియా’ తన తాజా సంచికలో ఆ వివరాలను ప్రచురించింది. – సాక్షి, స్పెషల్ డెస్క్టామర్ గెఫెన్.. చికాగోలోని నార్త్వెస్టర్న్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ‘మెసులమ్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాగ్నిటివ్ న్యూరాలజీ అండ్ అల్జీమర్స్ డిసీజ్’ విభాగంలోని ‘సైకియాట్రి అండ్ బిహేవియరల్ సైన్సెస్’లో అసోసియేట్ ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. నార్త్వెస్టర్న్ యూనివర్సిటీ ‘సూపర్ ఏజింగ్ ప్రోగ్రామ్’లో ఆమె బృందం పరిశోధనలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఆ ప్రోగ్రామ్లో 113 సూపర్ ఏజర్లపై అధ్యయనం జరుగుతోంది. వీరిలో 80 మంది సూపర్ ఏజర్లు.. గత 25 ఏళ్లలో ఈ కార్యక్రమానికి తమ మెదడు కణజాలాన్ని విరాళంగా ఇచ్చారు. ఆ కణజాలాలపై జరిగిన పరిశోధనలు తాజాగా మెదడు గురించి కొన్ని అద్భుతమైన ఆవిష్కరణలు చేశాయి. విశేషం ఏమిటంటే ఈ సూపర్ ఏజర్లలో గుండె జబ్బులు, మధుమేహం ఉన్నవారు కూడా ఉండటం!300 మందిపై పరిశోధననార్త్వెస్టర్న్ కార్యక్రమంలో సూపర్ ఏజర్గా ఉండటానికి, ఒక వ్యక్తి 80 ఏళ్లు పైబడి ఉండాలి. మంచి గ్రాహకశక్తి కలిగి ఉండాలి. రోజువారీ సంఘటనలను, వ్యక్తిగత చరిత్రను గుర్తుంచుకునే సామర్థ్యం ఉండాలి. 50 లేదా 60 ఏళ్ల వయసులోని సాధారణ వ్యక్తుల కంటే కూడా మెరుగైన ధారణ శక్తి ఉండాలి. అలాంటి వారిలో గత 25 ఏళ్లలో 300 సూపర్ ఏజర్లపై గెఫెన్ బృందం అధ్యయనం జరిపింది. అదృష్టమా? జన్యువులా?!జన్యువులు.. దీర్ఘాయుషు, వృద్ధాప్యం, కణాల మరమ్మతు, జ్ఞాపకశక్తి వంటి అనేక అంశాలలో కీలకమైన పాత్ర పోషిస్తాయి. కానీ, సూపర్ ఏజర్లలో వారి అద్భుత జ్ఞాపకశక్తికి కారణం జన్యువులో, అదృష్టమో తేల్చుకోలేకపోయింది గెఫెత్ బృందం. ఇది తేల్చడానికి మరికొన్ని పరిశోధనలు, మరికొంత సమయం అవసరం కావచ్చు. సూపర్ ఏజర్ల ప్రత్యేకతలుటామర్ గెఫెన్ బృందం సూపర్ ఏజర్లలో ప్రధానంగా ఈ కింది లక్షణాలను, స్వభావాలను గుర్తించింది. » సామాజిక సంబంధాలలో మెరుగ్గా ఉన్నారు.» కమ్యూనిటీ పనులలో చురుగ్గా పాల్గొంటున్నారు.» స్నేహాలకు, బంధాలకు విలువిస్తున్నారు» స్వేచ్ఛ, స్వతంత్ర భావన కనిపించాయి.» సలహాలు అడగరు. తామే నిర్ణయాలు తీసుకుంటారు.» తమకు ఇష్టమైనట్లు జీవిస్తున్నారు.పెద్దవిగా... ఎంటోర్హినల్ కార్టెక్స్!సూపర్ ఏజర్ మెదడులోని ‘ఎంటోర్హినల్ కార్టెక్స్’లోని కణాలు పెద్దవిగా, ఆరోగ్యకరంగా ఉన్నాయి. జ్ఞాపకశక్తి, అభ్యాసానికి శక్తి జనింపజేసే ప్రాంతమే ఈ ఎంటోర్హినల్ కార్టెక్స్. ఇవి హిప్పోక్యాంపస్తో ప్రత్యక్ష సంబంధాలను కలిగి ఉంటాయి. అల్జీమర్స్ వ్యాధి ప్రభావం మెదడులో మొదట ఎంటోర్హినల్ కార్టెక్స్ పైనే పడుతుంది. అయితే ఆ కార్టెక్స్ సూపర్ ఏజర్లలో బలంగా ఉంది. కార్టెక్స్లోని కణాల ప్రతి పొర కూడా భారీగా, బొద్దుగా, చెక్కుచెదరకుండా ఉంది. తక్కువగా... మైక్రోగ్లియా కణాలు!గెఫెన్ బృందం సూపర్ ఏజర్స్ మెదడులోని నొప్పి, వాపునకు ప్రభావితం అయ్యే కణ వ్యవస్థను కూడా పరిశీలించింది. వారిలో మెదడు పని చేయటానికి అవసరమైన మైక్రోగ్లియా కణాలు తక్కువ క్రియాశీలకంగా ఉన్నాయి. అంటే మైక్రోగ్లియా స్థాయిలు సూపర్ ఏజర్లలో 30, 40, 50 ఏళ్ల వ్యక్తులలో ఉన్నట్లే తక్కువగా ఉన్నాయి. దీనర్థం సూపర్ ఏజర్ల మెదడులో వ్యాధికారకాలు తక్కువగా ఉన్నాయని.మందంగా.. సింగ్యులేట్ కార్టెక్స్!యాభై, అరవై ఏళ్ల వారితో పోల్చి చూసినప్పుడు ఏకాగ్రతకు, ప్రేరణకు, గ్రాహ్యతకు కారణమైన ‘సింగ్యులేట్ కార్టెక్స్’ అనే మెదడు నిర్మాణం సూపర్ ఏజర్లలో మందంగా ఉండటాన్ని పరిశోధకులు గమనించారు. అలాగే, మెదడులో జ్ఞాపకశక్తికి కేంద్రమైన హిప్పోక్యాంపస్లోని ‘టౌ టాంగిల్స్’, తక్కిన వారితో పోల్చినప్పుడు సూపర్ ఏజర్లలో మూడు రెట్లు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. టౌ అనేది ఒక ప్రొటీన్. ఆ ప్రోటీన్ల అసాధారణ నిర్మాణం అల్జీమర్స్ ముఖ్య సంకేతాలలో ఒకటి. సూపర్ ఏజర్లలో టౌ టాంగిల్స్ తక్కువగా ఉన్నాయి కనుక వారి జ్ఞాపకశక్తి క్షీణించకుండా స్థిరంగా ఉంది. -
10లో నలుగురే!
మనదేశం మొత్తం జనాభాలో 15–29 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత సుమారు 29% ఉన్నారు. అంటే దాదాపు 42 కోట్ల మంది! యువత జనాభా పరంగా భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా అవతరించింది. ఆర్థిక వృద్ధి, అభివృద్ధిని నడిపించే సామర్థ్యం వీరికి ఉంది. ఇదంతా నాణేనికి ఒకవైపు. వాస్తవానికి మన దేశంలోని యువతలో ఆర్జించే వారి సంఖ్య 40 శాతం లోపే ఉంది. అంతేకాదు, ప్రతి పది మందిలో ఒకరే ఉద్యోగం చేస్తున్నారు. పీపుల్ రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్జ్యూమర్ ఎకానమీ (పీఆర్ఐసీఈ) విడుదల చేసిన ‘నావిగేటింగ్ ది యూత్ ఫ్రాంటియర్’ అనే పరిశోధనా పత్రంలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఐదుగురు యువకుల్లో ఒకరు భారత్కు చెందిన వారు ఉంటారని ఈ అధ్యయనం తెలిపింది. 2024–25లో మొత్తం యువతలో 2.4 శాతం అంటే.. ఒక కోటి మంది మాత్రమే వ్యవసాయ సంబంధిత కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారని వివరించింది. ‘యువతలో అత్యధికంగా 26.8 శాతం మంది విద్యార్థులు ఉన్నారు. వ్యాపారం, స్వయం ఉపాధి 14.1 శాతం; వేతన జీవులు 9.9 శాతం, రోజువారీ కూలీలు 12.3 శాతం ఉన్నారు’ అని వెల్లడించింది. నాలుగింట మూడొంతులు ప్రైవేట్ జాబ్స్మూడింట ఒక వంతు..: సంపాదించే యువతలో మూడింట ఒక వంతు.. అంటే 34.2 శాతం మంది ఆదాయం నెలకు రూ.10,000 లోపే ఉండడం ఆందోళన కలిగించే అంశం. ఇక 69.3 శాతం మంది ఆదాయం నెలకు రూ.25,000 లోపే ఉంది. దిగువ, దిగువ మధ్య ఆదాయ విభాగంలో ఎక్కువ మంది స్త్రీలు ఉండగా; ఎగువ మధ్య, అధిక ఆదాయ విభాగంలో పురుషులు అధికంగా ఉన్నారు. ప్రైవేటు రంగంలో ఏకంగా 3 కోట్లపైచిలుకు మంది విధులు నిర్వర్తిస్తున్నారు.గ్రామాల్లోనే ఎక్కువ..: యువతలో 70 శాతం కంటే ఎక్కువ మంది కార్మికులు, 90 శాతం మంది వ్యవసాయదారులు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. నిరుద్యోగుల్లో 68 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నారు. మెట్రో నగరాల్లోని యువతలో అత్యధికంగా 22 శాతం మంది ఉద్యోగాలు చేస్తున్నారు. అలాగే వ్యవసాయేతర కార్యకలాపాలలో 17 శాతం మంది స్వయం ఉపాధి పొందుతున్నారు. సాంకేతికత, కళలు, సంస్కృతి పరంగా ప్రత్యేకత ఉన్న నగరాల్లో 19 శాతం, ఆర్థికంగా వేగంగా వృద్ధి చెందుతున్న పట్టణాల్లో 16 శాతం యువత స్వయం ఉపాధి పొందుతున్నారు.2024–25లో భారతీయ యువత ఆదాయాలు ఇలా..సగటు ఆదాయం రూ.1,59,000మొత్తంగా భారత్లోని యువతలో 38.7 శాతం మంది మాత్రమే సంపాదనపరులు ఉన్నారు. యూత్ సగటు ఆదాయం దేశంలో రూ.1,59,000 మాత్రమే. ఇది పట్టణాల్లో రూ.2,19,000 కాగా, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,28,000. -
రోజులో సంతోషమే ఎక్కువ
సంతోషం, బాధ, ఆందోళన, ఆశ్చర్యం, కోపం.. ఇలాంటి భావోద్వేగాల సమాహారమే మన జీవితం. ఆ క్షణానికే చిన్న పిల్లల్లా మారిపోతాం.. మరుక్షణమే రాక్షసుల్లా ప్రవర్తిస్తాం.. ఇంకో క్షణంలో తీవ్ర ఒత్తిడికి గురవుతాం.. ఏ ఎమోషన్ కూడా మనలో ఎక్కువ సేపు ఉండదు. చాలామంది దీన్ని అంగీకరించరు కానీ ఇదే వాస్తవం. సరే, ఇన్ని భావోద్వేగాల్లో మనతో ఎక్కువ సేపు ఉండేది ఏది? చాలామంది అనుకుంటున్నట్టు బాధ / ఆవేదన / ఆందోళన ఇవేనా మన రోజువారీ జీవితంలో రాజ్యమేలుతున్నాయి? అంటే కాదు.. అంటున్నారు మానసిక నిపుణులు.సాక్షి, స్పెషల్ డెస్క్: ఏ మనిషీ రోజూ ఏడుస్తూ కూర్చోడు.. ఆవేదన, ఆందోళనలతో ఉక్కిరిబిక్కిరైపోడు. అలాగని రోజంతా సంతోషం, ఆనందం కూడా ఉండవు. కానీ, ఒక రోజులో ఒక మనిషిలో ఎక్కువ సేపు ఉండే ఎమోషన్ ఏదో తెలుసా.. సంతోషం. నెదర్లాండ్స్, స్పెయిన్, అమెరికాకు చెందిన వేర్వేరు విభాగాలకు చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. చాలామంది కోపిష్టులు మన చుట్టూ ఉంటారు. వాళ్లు కూడా రోజంతా ఎవరు దొరుకుతారా తిడదామా, కొడదామా అని రోజంతా ఉండరు. రోజు మొత్తం భావోద్వేగాల్లో ఇది 10 శాతం కూడా ఉండదు. కానీ, స్త్రీలలో మాత్రం పురుషుల కంటే ఎక్కువ సమయం కోపం ఉంటోందట. భయం కూడా రోజులో చాలా తక్కువ సేపే.. కేవలం 5 శాతమే ఉంటోంది.రోజుకు ఒకలా.. ఇకపోతే అన్ని రోజులూ అన్ని ఎమోషన్లూ ఒకేలా ఉండవు. సాధారణంగా వారం ప్రారంభంలో విచారం, ఆందోళన, కోపం వంటి ప్రతి కూల భావోద్వేగాల శాతం ఎక్కువగా ఉంటోంది. వారాంతంలో అనుకూల భావోద్వేగాలైన ఆనందం, ప్రేమ, సంతృప్తి ఎక్కువ శాతంలో ఉంటున్నాయి.పురుషుల్లో ఒకలా.. మహిళల్లో మరోలా..⇒ రోజువారీ జీవితంలో 45 శాతం సమయంలో పూర్తిగా పాజిటివ్ ఎమోషన్స్ ఉంటున్నాయని మగాళ్లు చెప్పారు. అలాగే 14 శాతం నెగెటివ్, 31 శాతం మిశ్రమ భావోద్వేగాలు ఉంటున్నాయని చెప్పారు. ⇒ ఈ విషయంలో మహిళలు.. 39 శాతం పాజిటివ్, 17 శాతం నెగెటివ్, 34 శాతం మిశ్రమ భావోద్వేగాలు ఉంటున్నాయని చెప్పారట. ⇒ స్త్రీలతో పోలిస్తే పురుషులు సానుకూల భావోద్వేగాలను ఎక్కువ సార్లు అనుభవిస్తున్నారట. ఇందులో కూడా ప్రత్యేకించి.. ఆనందం, సంతృప్తి, అప్రమత్తత, ఉల్లాసం, గర్వం వంటివి స్త్రీలలో కంటే పురుషుల్లో ఎక్కువసార్లు కలుగుతున్నాయట.ప్రామాణిక పరిశోధననెదర్లాండ్స్, స్పెయిన్, అమెరికాకు చెందిన వేర్వేరు విభాగాలకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. మొత్తంగా 11,572 మంది పాల్గొన్నారు. సగటు వయసు 33 సంవత్సరాలు. ఇందులో ఫ్రెంచి, స్విస్, బెల్జియం దేశాల వారు ఉన్నారు. మొత్తం అభ్యర్థుల్లో సగానికిపైగా మహిళలే. ఈ అధ్యయనం కోసం ‘58 సెకెన్లు’ అనే మొబైల్ యాప్ని తయారుచేశారు.రోజులో ఏ సమయంలో ఏ భావోద్వేగం ఉంటుందో చెప్పాలని వీరికి ఒక ప్రశ్నపత్రం ఇచ్చారు. 2013 ఫిబ్రవరి నుంచి 2014 ఏప్రిల్ వరకు డేటా సేకరణ చేశారు. ఈ యాప్ ఇప్పటికీ కూడా పనిచేస్తోంది. ఇది ప్రపంచ ప్రసిద్ధ ప్లస్ వన్ సైన్స్ జర్నల్ సహా అనేక జర్నళ్లలో ప్రచురితమైంది. దీన్ని ఇప్పటికీ భావోద్వేగాలకు సంబంధించి ప్రామాణిక పరిశోధనల్లో ఒకటిగా పరిగణిస్తారు.ఒక రోజులో ఏ ఎమోషన్ మనలో ఎక్కువ శాతం ఉంటుందంటే.. టాప్ 10 ఎమోషన్లు⇒ ఆనందం ⇒ ప్రేమ⇒ ఆందోళన⇒ సంతృప్తి ⇒ అప్రమత్తత⇒ ఆశ ⇒ విచారం⇒ ఉల్లాసం ⇒ గర్వం⇒ అసహ్యం / చిరాకు⇒ రోజులో రాత్రి 8 నుంచి 9 గంటల సమయంలో ఆనందం, ఉల్లాసం, ప్రేమ వంటి భావోద్వేగాలు ఎక్కువగా కనిపించాయి.⇒ రోజులో ఎక్కువ సార్లు కలిగే అనుభూతి ఆనందం. ఆ తరవాతి స్థానాల్లో ప్రేమ, ఆందోళన ఉన్నాయి. ప్రతికూల భావోద్వేగాల కంటే అనుకూలమైనవి 2.5 రెట్లు ఎక్కువ సార్లు రోజులో కలుగుతున్నాయట. రోజులో 90 శాతం సమయంలో ప్రతి కూల లేదా అనుకూల లేదా మిశ్రమ.. ఇలా ఏదో ఒక భావోద్వేగం కలుగుతోందట. -
కుంకీ ఆ'పరేషాన్'
పలమనేరు : చిత్తూరు జిల్లాలోని కౌండిన్య అభయారణ్యంలో ఏనుగుల సమస్య దశాబ్దాలుగా తీరని సమస్యగా మారింది. అడవిని దాటుతున్న ఏనుగులు రైతుల పంటలను నాశనం చేస్తున్నాయి. ఏనుగుల దాడుల్లో రైతుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. అడవిని దాటి బయటకొచ్చిన ఏనుగులు సైతం వివిధ కారణాలతో మృతి చెందుతున్నాయి. అడవిలోంచి ఏనుగులు బయటకు రాకుండా కట్టడి చేసేందుకు ఇప్పటి దాకా అటవీశాఖ చేపట్టిన సోలార్ ఫెన్సింగ్, కందకాలు ప్రయోజనం లేకుండా పోయాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కుంకీ ఏనుగుల ద్వారా ఇక్కడి ఏనుగులను కట్టడి చేసేందుకు పలమనేరు మండలంలోని మొసలిమడుగు వద్ద కుంకీ ఎలిఫెంట్ ప్రాజెక్టు చేపట్టింది. ఇటీవలే టేకుమంద ఫారెస్ట్లో కుంకీ ఏనుగుల ట్రయల్ రన్ చేపట్టి అది విజయవంతమైందని అధికారులు చెబుతున్నారు. కానీ ఆడ ఏనుగులతో సమస్యలేదు గాని మదపుటేనుల కారణంగానే ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతోంది. వీటిని అదుపు చేయడమే కుంకీ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశ్యం. ఇందుకోసం అత్యంత కీలకమైన ప్రక్రియ క్యాప్చరింగ్ మాత్రమే. మదపు టేనుగుల క్యాప్చరింగ్ త్వరలో చేపడతామని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. కానీ ఈ ప్రక్రియ జరిగి ఇక్కడి గుంపుల్లోని, ఒంటరిగా సంచరిస్తున్న మదపు టేనుగులను బంధిస్తేనే ఏనుగుల సమస్యకు చెక్ పెట్టినట్లు అవుతుంది. ఇప్పటి వరకు 34 మంది ప్రాణాలు కోల్పోయారు 2012 నుంచి గతనెల 26న సోమలలో మృతి చెందిన క్రిష్ణంరాజు దాకా మొత్తం 34 మంది ప్రాణాలను కోల్పోయారు. ఏనుగుల దాడుల్లో 24 మందికి పైగా గాయపడ్డారు. ఏనుగుల బారిన పడి 63 పశువులు మృతి చెందాయి. ఈ దాడులను ఎక్కువగా చేసింది మదపుటేనుగులే. ఇక ఏనుగుల కారణంగా 8602 ఎకరాల పంటలు నాశనమయ్యాయి. లక్ష్యం ఇదీ... కుంకీ ఏనుగుల ద్వారా ఏనుగుల సమస్యను పరిష్కరించేందుకు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కుంకీ ఆపరేషన్లు కొన్నేళ్లుగా జరుగుతున్నాయి. అక్కడ విజయవంతం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం పలమనేరు ఎలిఫెంట్ క్యాంపునకు దుబేరా బేస్ క్యాంపు నుంచి నాలుగు, రామ కుప్పం ననియాల నుంచి రెండు ఏనుగులను తెప్పించారు. వీటికి ఈ ప్రాంతాన్ని అలవాటు చేసి ఆపై అడవిలోని ఏనుగులకు కట్టడి చేయాలి. ఇందులో అత్యంత ముఖ్యమైన పని క్యాప్చరింగ్. అంటే మదపు టేనుగులను గుర్తించి వాటికి మత్తుచ్చి కుంకీల సాయంతో క్యాంపునకు తీసుకొచ్చి ఎలిఫెంట్ క్రాల్స్లో బంధించాలి. ఆపై ఆరు నెలలపాటు శిక్షణ ఇస్తే ఇవి కుంకీల మాదిరి దాడులు చేయకుండా పోతాయి. ప్రస్తుతం జరుగుతున్నది ఏంటి? ఇక్కడి క్యాంపులో అభిమన్యు, క్రిష్ణ, జయంత్, వినాయక, దేవా, రంజన్లున్నాయి. ఇటీవల సోమలలో రైతును ఏనుగులు చంపడంతో రైతులు రోడ్డెక్కారు. దీంతో ప్రభుత్వంపై వ్యతిరేఖత వస్తుందని ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా అటవీశాఖ హుటాహుటిన కుంకీ ట్రయల్ రన్ చేసి ప్రజల దృష్టిని మళ్లించిదనే మాట వినిపిస్తోంది. ఆ మేరకు టేకుమంద అడవిలో ఏనుగుల మళ్లింపునకు పూర్తి ఫిట్నెస్ కలిగిన క్రిష్ణ, జయంత్, వినాయక్లను మాత్రం మావటిల ద్వారా పంపారు. అడవిలోని ఏనుగుల గుంపును అక్కడి నుంచి కౌండిన్య ఫారెస్ట్లోకి మళ్లించారు. ఇది కేవలం ట్రయల్ రన్ మాత్రమే. దీంతోనే ఏనుగులను పూర్తి స్థాయిలో కట్టడి చేయలేరు.మదపుటేనుగులు అదుపులోకి తెస్తేనే.. ప్రజల ప్రాణాలు తీస్తున్న వాటిలో 90 శాతం మదపుటేనుగులే. ప్రస్తుతానికి కొన్ని ఒంటరిగా సంచరిస్తుండగా మరికొన్ని గుంపుల్లో ఉన్నాయి. ఇక్కడి ఎలిఫెంట్ క్యాంపులోని దేవా, రంజన్ సైతం కుంకీలుగా మారాలి. అప్పుడు కుంకీలు నాలుగు దిశల్లో వెళ్లి గుంపులోని మదపు టేనుగులను అదుపుచేయాలి. ఆ సమయంలో మావటీలు మత్తు సూదిచ్చి దాన్ని బంధించి క్యాంపునకు తీసుకురావాలి. ఈ ప్రక్రియలో కుంకీల పని ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వాహనం ఎక్కించడం చేస్తాయి. ఇలా తీసుకొచ్చిన మదపు టేనుగులను క్యాంపులోని క్రాల్స్లో బంధించి మూడు నుంచి ఆరు నెలలపాటు శిక్షణ ఇచ్చాకే ఇవి కుంకీలుగా మారుతాయి. ఇలా మదపు టేనుగులన్నింటిని కట్టడి చేస్తేగాని సమస్య పరిష్కారం కాదు.జిల్లాలో ఏనుగుల పరిస్థితి .. పలమనేరు, కుప్పం, పూతలపట్టు, పుంగనూరు పరిధిల్లోని కౌండిన్య అభయారణ్యం 250 కి.మీపైగా మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని అడవులకు ఆనుకొని ఏనుగుల సంచరిస్తున్నాయి. ఈ ప్రాంతంలో మొత్తం 105 దాకా ఏనుగులుండగా ఇందులో కౌండిన్య ఎలిఫెంట్ శాంచురీలోనే 56 దాకా గుంపులుగా ఉన్నాయి. ఇవిగాక పక్కరాష్ట్రాల నుంచి వలస ఏనుగులు ఇక్కడికి వస్తుంటాయి.వచ్చిన చోటుకే మళ్లీ వస్తున్నాయి మేం పొలం వద్ద కాపురం ఉంటున్నాం. ఓ మదపు టేనుగు మా పొలం వద్దకు ఇప్పటికే నాలుగైదు సార్లు వచ్చి పంటను తొక్కినాశనం చేసింది. మొన్న వచ్చినప్పుడు ఇంటిని మొత్తం కూల్చేసింది. దీంతో మేము ఎలాగో తప్పించుకొని ప్రాణాలతో భయటపడ్డాం. కుంకీలో ఏమోగాని ఏనుగులు అడవిలోంచి బయటకు రాకుండా చేయాలి. – చంద్రయ్య, బాధిత రైతు, ఇందిరానగర్ -
ఫార్మాపైనా.. టారిఫ్ పిడుగు
భారతదేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నామని ప్రకటించిన అమెరికా... రష్యా నుంచి భారత్ భారీగా చమురు కొంటున్నదన్న కారణంతో మరో 25 శాతం పెనాల్టీ సుంకాలు కూడా విధించింది. వెరసి ఈ 50 శాతం సుంకాలూ ఈ నెల్లోనే అమల్లోకి రానున్నాయి. దీనివల్ల చాలా భారత కంపెనీలు తమ ఉత్పత్తుల ధరల్ని పెంచాలి. ఇలా పెంచితే మిగతా దేశాల నుంచి ఎదురయ్యే పోటీలో వెనకబడిపోవచ్చు. ఇవన్నీ పలు కంపెనీల ఆదాయాలకు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. సెక్షన్ 232 ప్రకారం దిగుమతి సుంకాల నుంచి ఫార్మా సహా కొన్ని ఉత్పత్తులకు మినహాయింపు ఉండటంతో ఫార్మా కంపెనీలు ప్రస్తుతానికి ధీమాగానే ఉన్నాయి. కానీ ఫార్మాను కూడా సుంకాల్లో చేరుస్తామని, 250 శాతం టారిఫ్లు వేస్తామని ట్రంప్ వార్నింగ్లు ఇస్తున్నారు. ఇదే జరిగితే అమెరికాయే ప్రధాన ఆదాయ వనరుగా సాగుతున్న పలు భారత ఫార్మా కంపెనీలకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. అమెరికా జనరిక్ డ్రగ్ మార్కెట్లో భారత్ది ఏకంగా 33 శాతం వాటా. టారిఫ్లు గనక వర్తిస్తే మన కంపెనీలకు ఎదురయ్యే ఇబ్బందులపై ‘సాక్షి బిజినెస్’ ప్రత్యేక కథనమిది... – సాక్షి బిజినెస్ డెస్క్ఇవీ.. మన సానుకూలతలు» మన దేశంలో కార్మికుల వ్యయాలు తక్కువ. నిపుణుల లభ్యత ఎక్కువ. టెక్నాలజీ కూడా ఉంది. అందుకనే యూఎస్ ఎఫ్డీఏ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన ఉత్పత్తులను భారత ఫార్మా సంస్థలు తయారు చేయగలుగుతున్నాయి. అమెరికా మార్కెట్లో ధరలపరమైన ఒత్తిళ్లు ఉన్నప్పటికీ మన కంపెనీలు గట్టి పోటీనివ్వగలుగుతున్నాయి.» అమెరికా మార్కెట్లో అమ్ముడుపోయే ప్రతి మూడు జనరిక్ ఔషధాల్లో ఒకటి భారత కంపెనీలు సరఫరా చేస్తున్నదేనంటే... కారణమిదే » మన ఫార్మా రంగం గనక 25– 50 శాతం టారిఫ్లను ఎదుర్కోవాల్సి వస్తే అప్పుడు మన ఔషధాలు అమెరికా మార్కెట్లో ప్రియమవుతాయి. ధరల పరంగా ఉన్న వెసులుబాటు తగ్గిపోతుంది. » తక్కువ ధరలకే ఉత్పత్తులు విక్రయించే అవకాశం పోయినట్లయితే... పోటీలో వెనకబడే ప్రమాదం ఉంటుంది. తక్కువ మార్జిన్ ఉండే జనరిక్స్లో ఇది మరింత సుస్పష్టం.ఆదాయం, లాభాలకు గండి» చాలా ఫార్మా సంస్థల ఆదాయాల్లో అమెరికా మార్కెట్ వాటా 30–55 శాతం వరకు ఉంటోంది. » అరబిందో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, సన్ఫార్మా, లుపిన్, సిప్లా, గ్లాండ్ ఫార్మా తదితర సంస్థలపై అధిక ప్రభావం పడుతుంది.» కనీసం 17 శాతం వరకు ఆదాయాలు తగ్గిపోతాయన్నది విశ్లేషకుల అంచనా.ఏ దేశం నుంచి పోటీ ఉండొచ్చు?చైనా» యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రేడియెంట్స్ (ఏపీఐ) మార్కెట్లో బలంగా ఉంది. » భారత ఫార్మా సంస్థలు ఫార్ములేషన్లపై ప్రధానంగా దృష్టి సారించడంతో ఏపీఐ మార్కెట్లో చైనా వాటా పెరిగింది.» చైనా మందులపై అమెరికాలో నమ్మకం తక్కువ. కోవిడ్ తరవాత ఇది మరింత పెరిగింది కూడా.» నాణ్యత, నమ్మకం, నియంత్రణల పరమైన అంశాల కారణంగా ఫార్మా విషయంలో భారత్ స్థానాన్ని చైనా భర్తీ చేయలేదు. మెక్సికో» అమెరికా మార్కెట్లోకి పన్నుల్లేకుండా వెళ్లగలగటం మెక్సికోకు ఉన్న సానుకూలత.» మెక్సికోలో జనరిక్స్ తయారీ సదుపాయాలు తక్కువే. గణనీయంగా ఎగుమతులు చేసే స్థాయిలో లేదు. దగ్గర్లో ఉండడం వల్ల, వాణిజ్య ఒప్పందాల వల్ల భవిష్యత్తులో మార్కెట్ను పెంచుకోగలదు.పోలాండ్, తూర్పు యూరప్» కాంట్రాక్టు తయారీ పరంగా పోటీనిస్తున్నాయి. ఈయూ నియంత్రణపరమైన నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయి.» భారత్తో పోల్చి చూస్తే తయారీ వ్యయాలు బాగా ఎక్కువ. కాకపోతే భౌగోళికంగా చూస్తే అమెరికా, ఈయూకు దగ్గర.» డిమాండ్లో మార్పులతో కొంత లాభపడొచ్చు.బంగ్లాదేశ్» తక్కువ ఖర్చుకే జనరిక్స్ ఔషధాలు తయారు చేయడంలో బంగ్లాదేశ్ ముందుంది.» వెనకబడిన దేశాలకు కల్పించిన ‘ట్రిప్స్ వైవర్’ కారణంగా ప్రయోజనం పొందగలదు.» అయితే భారత్లో మాదిరి ఎఫ్డీఏ ఆమోదం పొందిన ప్లాంట్లు ఇక్కడ చెప్పుకోతగ్గ స్థాయిలో లేవు.» కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేసి ఎఫ్డీఏ ప్రమాణాలను అందుకోవటం అంత తేలిక కాదు. బ్రెజిల్» ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఫార్మా మార్కెట్. ఎగుమతి సదుపాయాలు తక్కువే. దేశీయంగా ఉన్న డిమాండ్ను అందుకోవటమే ఇక్కడి కంపెనీలకు కష్టం. కనుక భారత ఎగుమతులకు ముప్పు కాదు.వ్యూహాత్మక అడుగులు» ఫార్మా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తే... అమెరికాలో తయారీ యూనిట్లు ఏర్పాటు చేయటం.. అక్కడి కంపెనీలను కొనుగోలు చేయటం వంటి ప్రత్యామ్నాయాలను మన కంపెనీలు పరిశీలించే అవకాశం ఉంటుందన్నది నిపుణుల మాట. అరబిందో ఫార్మా ఇటీవలే యూఎస్కు చెందిన లానెట్ ఫార్మాను 250 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడాన్ని ఈ కోణంలో చూడొచ్చు. » ప్రత్యామ్నాయ మార్కెట్లలో... అంటే యూరప్, లాటిన్ అమెరికా, ఆఫ్రికా మార్కెట్లో అవకాశాలపై ఫార్మా కంపెనీలు దృష్టి పెట్టొచ్చు. » అమెరికా మార్కెట్పై ఆధారపడడాన్ని తగ్గించేందుకు కొత్త ఆవిష్కరణలు, బయోసిమిలర్స్, స్పెషాలిటీ డ్రగ్స్ దిశగా కంపెనీలు అడుగులు వేయొచ్చు. » ప్రభుత్వాల మధ్య ఫార్మా డీల్స్ కోసం లాబీయింగ్ చేయొచ్చు.అమెరికా వినియోగదారులపైనే భారం..భారత ఫార్మా రంగంపై టారిఫ్లు విధించడం ప్రతికూల పరిణామాలకు దారి తీస్తుంది. అంతిమంగా అమెరికా వినియోగదారులపైనే భారం పడుతుంది. భారతీయ కంపెనీలు ఎక్కువగా మార్జిన్ లభించని అత్యంత చౌకైన జనరిక్స్ను తయారు చేస్తాయి. కాబట్టి, టారిఫ్లపరంగా భారం మోపితే అది అమెరికన్ వినియోగదారుల మీదే పడుతుంది. ఉత్పత్తి పరిమాణం, ఖరీదు తదితర అంశాలపరంగా భారత్ తరహా సామర్థ్యాలను సాధించాలంటే కనీసం 3–5 ఏళ్లు పట్టేస్తుంది. దేశీ సంస్థలకు 700 పైగా అమెరికా ఎఫ్డీఏ ఆమోదం పొందిన ప్లాంట్లు ఉండగా, 12 శాతం ఆదాయాలను నిబంధనలను పాటించడంపై వెచ్చిస్తున్నాయి. –నమిత్ జోషి, చైర్మన్, ఫార్మా ఎగుమతుల ప్రోత్సాహక మండలి ఫార్మెక్సిల్టారిఫ్లు తీవ్రంగా ఉండకపోవచ్చు..గత నాలుగు దశాబ్దాలుగా, భారత ఫార్మా రంగం బాగా పెరిగి అంతర్జాతీయ హెల్త్కేర్ సరఫరా వ్యవస్థల్లో కీలకంగా మారింది. మన సంస్థలు ఏపీఐలు, ఇంటర్మీడియట్స్, స్పెషలైజ్డ్ ఫార్ములేషన్లను విస్తృత స్థాయిలో తయారు చేస్తాయి. విశేషమైన నైపుణ్యాలు, తక్కువ ధరకే అందించగలిగే సామర్థ్యాలతో పాటు అమెరికా హెల్త్కేర్ వ్యవస్థతో గణనీయంగా అనుసంధానమయ్యాయి. ఒకరిపై ఒకరు ఆధారపడటం వల్లే ప్రస్తుత టారిఫ్ వ్యవస్థలో ఫార్మాకు మినహాయిపు ఉంటోంది. ఈ నేపథ్యంలో మన ఫార్మా మీద మిగతా పరిశ్రమల్లాగా అమెరికా తీవ్ర స్థాయి టారిఫ్లు వేయకపోవచ్చు. – డి. శ్రీనివాస రెడ్డి, చైర్మన్, ఆప్టిమస్ ఫార్మామన బలాన్ని మనమూ ఉపయోగించుకోవాలి..మన ఫార్మాపై టారిఫ్లు విధిస్తే ఇవి అమెరికా ప్రయోజనాలకే విఘాతం కలిగిస్తాయి. 2013– 2022 మధ్య పదేళ్లలో మన జనరిక్స్ కారణంగా అమెరికా ఎకానమీకి 1.3 లక్షల కోట్ల డాలర్లు ఆదా అయ్యాయి. 200–250 శాతం స్థాయిలో టారిఫ్లు వేయకపోవచ్చు కానీ, మిగతా వాటిలా 50 శాతం వేసినా మన ఫార్మాకు ఇబ్బందికరమైన పరిస్థితే ఉంటుంది. ప్రస్తుతానికైతే జనరిక్స్కి సంబంధించి భారత్కి ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి మనం కూడా మన బలాన్ని ఉపయోగించుకుని, గట్టిగా మాట్లాడాలి. – రావి ఉదయ భాస్కర్, డైరెక్టర్ జనరల్, అఖిల భారత ఔషధ నియంత్రణ అధికారుల సమాఖ్య (ఏఐడీసీవోసీ)సింహ భాగం అమెరికా నుంచే..2024–25 ఆర్థిక సంవత్సరంలో భారత ఫార్మా మొత్తం ఎగుమతులు 30.47 బిలియన్ డాలర్లయితే... అందులో 9.8 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలు అమెరికాకే వెళ్లాయి. అంటే.. మూడో వంతు ఔషధాలు అమెరికాకే వెళ్లాయి. ఈ సమయంలో అమెరికా మార్కెట్ నుంచే అత్యధిక ఆదాయాన్ని పొందిన కొన్ని భారత ఫార్మా కంపెనీలను చూస్తే...ఫార్మా ఉత్పత్తులపైనా టారిఫ్లు బాదేస్తే.. అమెరికా మార్కెట్లో కీలకంగా పనిచేస్తున్న ఈ కంపెనీల ఆదాయాలపై గణనీయమైన ప్రభావం పడనుంది. సన్ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, బయోకాన్ సంస్థలకు 17 శాతం వరకు ఆదాయం తగ్గొచ్చన్నది విశ్లేషకుల మాట. దివీస్ ల్యాబొరేటరీస్ ఇటీవలే ప్రకటించిన జూన్ త్రైమాసికం ఫలితాలు నిరుత్సాహకరంగా ఉన్నాయి. అమెరికా మార్కెట్లో తలెత్తిన ధరలపరమైన ఒత్తిళ్ల వల్లే ఇలా జరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. -
రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపేస్తే పెనుభారమే!
భారత్ తన చమురు అవసరాల కోసం ప్రధానంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. దేశంలో ఉపయోగిస్తున్న చమురులో ఏకంగా 80 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నదే. ఇందులో ప్రధాన వాటా రష్యాదే. రష్యా నుంచి చౌకగా ముడిచమురు లభిస్తోంది. ఇండియాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్నెర్ర చేయడానికి, 50 శాతం సుంకాలు విధించడానికి రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండడమే కారణం. ఒకవేళ రష్యా నుంచి ముడిచమురు కొనడం ఆపేస్తే భారత్పై మోయలేని భారం పడడం ఖాయం. అది దేశ ఆర్థిక వ్యవస్థనే ప్రతికూలంగా మార్చేయగలదు. రష్యా చమురును వద్దనుకుంటే ఇండియా ఆయిల్ దిగుమతుల బిల్లు భారీగా పెరిగిపోతుందని ఎస్బీఐ ఒక నివేదికలో తేల్చిచెప్పింది. 2026లో 9 బిలియన్ డాలర్లకు, 2027లో 12 బిలియన్ డాలర్లకు చేరుతుందని వెల్లడించింది. చమురు కోసం పూర్తిగా అరబ్ దేశాలపైనే ఆధారపడితే విపరీతంగా ఖర్చు చేయాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. అంతిమంగా ఆ భారం మోయాల్సింది ప్రజలేనన్న సంగతి తెలిసిందే. 1.7 శాతం నుంచి 35.1 శాతానికి.. భారత్ 2022 నుంచి రష్యా నుంచి ముడిచమురును చౌక ధరకే కొంటోంది. ఉక్రెయిన్పై యుద్ధం ప్రారంభించిన రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. రష్యా చమురు ధరపై పరిమితిని నిర్దేశించాయి. దాంతో రష్యా తన చమురును ఇండియాకు విక్రయిస్తోంది. దీనివల్ల ఇండియాకు ఎనలేని మేలు జరుగుతోంది. చమురు బిల్లుల భారం చాలావరకు తగ్గిపోయింది. మన దేశానికి చమురు ఎగుమతి చేస్తున్న దేశాల్లో తొలి స్థానం రష్యాదే. 2020లో ఇండియా చమురు అవసరాల్లో రష్యా వాటా కేవలం 1.7 శాతం ఉండేది. ప్రస్తుతం అది ఏకంగా 35.1 శాతానికి చేరడం గమనార్హం. 2025లో 245 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు దిగుమతి చేసుకోగా, ఇందులో రష్యా వాటా 88 మిలియన్ మెట్రిక్ టన్నులు. ధరలు 10 శాతం పెరిగే అవకాశం అమెరికా ఒత్తిడికి తలొగ్గి రష్యా ఆయిల్ను ఇండియాతోపాటు ఇతర దేశాలు కొనడం ఆపేస్తే ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు పెరిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే ప్రపంచమంతటా ఉపయోగిస్తున్న ఆయిల్లో 10 శాతం రష్యా నుంచే వస్తోంది. ఈ ఆయిల్ సరఫరాను హఠాత్తుగా నిలిపివేస్తే.. కొరత వల్ల చమురుకు డిమాండ్ పెరిగి ధరలు కనీసం 10 శాతం పెరుగుతాయి. ఇండియాతోపాటు అన్ని దేశాలపైనా భారం పడుతుంది. ఇండియాకు ఉన్న సానుకూలత ఏమిటంటే.. రష్యా నుంచే కాకుండా మరో 40 దేశాల నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోంది. ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. రష్యా నుంచి సరఫరా ఆగిపోయినా ఇప్పటికిప్పుడు ఇబ్బంది ఉండకపోవచ్చు. ధరల భారం మాత్రం తప్పదు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
‘కోర్’ వదిలి.. కల చెదిరి..
సాక్షి, హైదరాబాద్: అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు పెద్దలు. ఇప్పుడు కంప్యూటర్ ఇంజనీర్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆకర్షణీయమైన జీతం, జీవితం దక్కుతుందన్న ఆశతో కోర్ గ్రూపులు వదిలేసి, కంప్యూటర్ ఇంజనీరింగ్ వైపు పరుగులు పెట్టినవారు.. ఇప్పుడు చిన్నపాటి ప్యాకేజీలకు కూడా ఉద్యోగాలు లభించక, ఇప్పటికే ఫీల్డులో ఉన్నవారు అత్యాధునిక ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) దెబ్బకు నిలబడలేక తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఐటీ పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది.కొన్ని నెలలుగా ఉద్యోగుల తొలగింపు (లే ఆఫ్స్)లు పెరుగుతున్నాయి. సరైన నైపుణ్యాలు లేవని చెబుతూ సీనియర్లను కూడా తొలగిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలతో భారత సర్విస్ సెక్టార్ వణికిపోతోంది. కరోనా తర్వాత ఏఐ వేగం పెరిగి అతిపెద్ద డేటా కేంద్రాలు వస్తున్నాయి. ఐటీ దిగ్గజాలన్నీ వీటికే కనెక్ట్ అవుతున్నాయి. ఫలితంగా మానవ వనరుల అవసరం తగ్గింది. టెక్నాలజీతో సమానంగా ఉద్యోగులు పరుగులు పెట్టలేకపోతున్నారు. అందుకు కార ణం ఇంజనీరింగ్లో కోర్ గ్రూపులను నిర్లక్ష్యం చేయడమేనని నిపుణులు చెబుతున్నారు. 2024 చివరి నుంచి మారిన పరిస్థితిప్రముఖ ఐటీ కంపెనీలన్నీ ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగిస్తున్నాయి. టీసీఎస్ 12 వేల మందికి లే ఆఫ్ అనేసింది. ఇన్ఫోసిస్లోనూ ఇదే పరిస్థితి ఉంది. విప్రో, కాగ్నిజెంట్, యాక్సెంచర్ సంస్థలదీ ఇదే బాట. 2010 నుంచి 2025 వరకు ఐటీ కంపెనీలు ఉద్యోగ నియామకాలు భారీగా పెంచాయి. ఇన్ఫోసిస్ 153%, టీసీఎస్ 278%, విప్రో 116 శాతం, కాగి్నజెంట్ 223%, యాక్సెంచర్ 291% ఉద్యోగ నియామకాలు పెంచుకున్నాయి.కరోనా (2020–21) కాలంలోనూ ఉద్యోగ నియామకాలు ఎక్కువే. ఇదే సమయంలో యాంత్రీకరణ వైపు కంపెనీలు మళ్లాయి. దీంతో 2024 వరకు ఉద్యోగుల అవసరం ఉండేది. 2024 చివరి నుంచి ఏఐ వేగం పెరగడంతో ఉద్యోగుల అవసరం తగ్గుతూ వచ్చింది. దీంతో ఒక్కో కంపెనీ 20 నుంచి 40 శాతం వరకు ఉద్యోగులను తగ్గించుకునే ఆలోచనలో ఉన్నాయి. 2025లో ఇప్పటివరకు ప్రధాన కంపెనీల్లో కనీసం 15 శాతం ఉద్యోగులను తొలగించారు. వేతనాలు అంతంతే.. పదేళ్ల క్రితం ఐటీ ఉద్యోగం హాట్కేక్. భారీ ప్యాకేజీలు.. కంపెనీ మారితే రూ.లక్షల్లో పెరుగుదల. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కాలేజీల్లో క్యాంపస్ నియామకాలు అరకొరగా ఉన్నాయి. ఆఫ్ క్యాంపస్లో అనేక దశల్లో పరీక్షలు పెడుతున్నారు. ఆఫర్ లెటర్ ఇచ్చినా అపాయింట్మెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. వేతనాల్లోనూ నిరాశే. 2010లో ఇన్ఫోసిస్ ఫ్రెషర్స్కు రూ.3.25 లక్షల వార్షిక వేతనం ఆఫర్ చేసింది. ఈ 15 ఏళ్లలో 49 శాతం ద్రవ్యోల్బణం పెరిగింది. ఈ లెక్క ప్రకారం ఈ సంవత్సరం రూ.6.40 లక్షల వేతనం ఇవ్వాలి.కానీ రూ.3.60 లక్షలు మాత్రమే ఇస్తోంది. ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఇప్పుడిచ్చే వేతనం రూ.3.15 లక్షలు మాత్రమే. టీసీఎస్లో 2007లో రూ.3.15 లక్షల వార్షిక వేతనం ఉంది. అప్పటి నుంచి 60 శాతం ద్రవ్యోల్బణం పెరిగింది. దీని ప్రకారం ఇవ్వాల్సింది రూ.4.73 లక్షలు. కానీ, ఆఫర్ చేస్తున్నది రూ.3.36 లక్షలే. దీన్నిబట్టి ఫ్రెషర్స్ వార్షిక ప్యాకేజీ దారుణంగా తగ్గిపోయిందని అర్థమవుతోంది. ఇది అనారోగ్య పరిస్థితి కంప్యూటర్ కోర్సుల వైపు పరుగులు పెట్టడం ఆనారోగ్యకరమైన పరిస్థితి. కోర్ గ్రూపులకు భవిష్యత్లో ఉద్యోగ అవకాశాలు భారీ పెరిగే వీలుంది. దీన్ని విద్యార్థులు గుర్తించడం లేదు. కోర్ గ్రూపుల విలువ తెలియజెప్పేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. ఆ దిశగా మండలి ముందండుగు వేస్తోంది. తల్లిదండ్రులు, విద్యార్థులు కంప్యూటర్ కోర్సులే భవిష్యత్ కాదని గుర్తించాలి. – ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ స్కిల్ లేకుంటే కష్టమే యాంత్రీకరణ, ఏఐ వచి్చన తర్వాత సాధారణ కోడింగ్తో పని ఉండదు. ఏఐతో సమానంగా ఉద్యోగి అప్డేట్ అవ్వాలి. అలా ఎదగలేనివారిని కంపెనీలు తొలగిస్తున్నాయి. ఇప్పుడు కంప్యూటర్ కోర్సులు చేశామని ధీమాగా ఉండే పరిస్థితి పోయింది. కోర్ గ్రూపు చేసిన వాళ్లు కూడా అప్గ్రేడ్ అయితే ఐటీలో రాణించే అవకాశాలు ఉన్నాయి. – భటా్నకర్ త్రిపాఠి, ఎంఎన్సీ కంపెనీ హెచ్ఆర్ మేనేజర్కంప్యూటర్ కోర్సులపై మోజే కారణం..ఐటీ ఉద్యోగంపై మోజు దశాబ్ద కాలంగా ఇంజనీరింగ్ విద్యలో మార్పులు తెచ్చింది. విద్యార్థులు కంప్యూటర్ కోర్సులు తప్ప వేటికీ భవిష్యత్ లేదని భావిస్తున్నారు. దీంతో ఈ కోర్సులు చేసిన వారి సంఖ్య భారీగా పెరిగిం ది. 2010–11లో దేశవ్యాప్తంగా కంప్యూ టర్ కోర్సులు చదివినవారు 4,75,870 మంది ఉంటే, 2023–24 నాటికి ఈ సంఖ్య 21,62,266కు చేరింది. 14 ఏళ్లలోనే 354 శాతం పెరిగింది. సివిల్, మెకానికల్, ఈఈఈ వంటి కోర్ గ్రూపులకు డిమాండ్ తగ్గుతోంది. ఆయా సెక్టార్లలో ఉపాధి అవకాశాలున్నా విద్యార్థులు వెళ్లడం లేదు. మరోవైపు ఐటీ సెక్టార్లో యాంత్రీకరణ, ఏఐ పాత్ర పెరగటంతో ఉద్యోగి కోసం కంపెనీలు వెతుక్కునే పరిస్థితి లేదు. కోర్ గ్రూప్లను నిర్లక్ష్యం చేయడమే ఈ దుస్థితికి ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. -
AI తో హోమ్వర్క్ సిద్ధం! పరీక్షకు సన్నద్ధం!!
సాక్షి, స్పెషల్ డెస్క్: హోమ్వర్క్లో సాయం చేసే ఓ స్నేహితుడు.. పరీక్షకు ఎలా సన్నద్ధం కావాలో మార్గదర్శనం చేసే టీచర్.. ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్ గురించే. ఓపెన్ ఏఐకి చెందిన చాట్జీపీటీ స్టడీ మోడ్ను, గూగుల్ జెమినై గైడెడ్ లెర్నింగ్ టూల్ను ప్రారంభించి చాట్బాట్ను వ్యక్తిగత ట్యూటర్గా మార్చేశాయి. ప్రతిష్టాత్మక కంపెనీల్లో ఉద్యోగాలు, అగ్రశ్రేణి ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలు, ఇంజనీరింగ్, మెడికల్ ఎంట్రన్స్ వంటి భారత్లో అత్యంత ప్రజాదరణ పొందిన పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వి ద్యార్థులకు కృత్రిమ మేధ ఆధారిత చాట్బాట్స్ మంచి అధ్యయన సహాయకులుగా అవతరిస్తున్నాయి. దీంతో భారత్లోని ఎడ్టెక్ సంస్థలు, సంప్రదాయ కోచింగ్ కేంద్రాలు ఏఐ నుంచి తీవ్ర పోటీని ఎదుర్కోనున్నాయని నిపుణులుఅంటున్నారు.గైడెడ్ లెర్నింగ్ ఇలా..అర్థవంతమైన అభ్యాసానికి కేవలం ప్రాంప్టింగ్ను (ఆదేశాలు) మెరుగుపరచడం సరిపోదని గూగుల్ అంటోంది. విద్యార్థుల ముందున్న సందేహాలు, సమస్యలను దశలవారీగా గైడెడ్ లెర్నింగ్ విభజిస్తుంది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా వివరణలను మారుస్తుంది. చిత్రాలు, రేఖాచిత్రాలు, వీడియోలు, ఇంటరాక్టివ్ క్విజ్లను ఉపయోగించి స్పందిస్తుంది. సమాధానం ఇవ్వడం కంటే జ్ఞానాన్ని పెంచుకోవడానికి, పరీక్షించుకోవడానికి యూజర్లకు సహాయపడుతుంది. చురుకైన, నిర్మాణాత్మక ప్రక్రియ అనే ప్రధాన సూత్రంపై ఆధారపడి బోధనలో భాగస్వామిగా ఉండేలా విద్యావేత్తలతో కలిసి గైడెడ్ లెర్నింగ్ను రూపొందించినట్టు గూగుల్ తెలిపింది.» ‘హోమ్వర్క్ హెల్ప్’ ద్వారా విద్యార్థుల హోమ్వర్క్లను.. స్టెప్ బై స్టెప్ మార్గదర్శనం ద్వారా చేసి పెడుతుంది. ఇందుకోసం చేయాల్సిందల్లా దానికి సంబంధించిన చిత్రాలు లేదా డాక్యుమెంట్లను అప్లోడ్ చేయడమే.» అలాగే పరీక్షలకు సిద్ధమయ్యేటప్పుడు కూడా ఎలా చదవాలా అనిఆలోచించాల్సిన పనిలేదు. మన దగ్గర ఉన్న నోట్స్, ఇతర డాక్యుమెంట్లుఅప్లోడ్ చేస్తే చాలు, వాటిని ఒక స్టడీ గైడ్గా, ఒక ప్రాక్టీస్ టెస్ట్గా,పాడ్కాస్ట్గా కూడా చేసి మన ముందు పెడుతుంది.» విమర్శనాత్మక ఆలోచనను పెంపొందించే ప్రశ్నలతో విద్యార్థులకుమార్గనిర్దేశం చేయడం ద్వారా వారి సొంత ఆలోచనను అభివృద్ధి చేసుకోవడానికి, మెదడుకు పదును పెట్టడానికి ప్రోత్సహిస్తుందని గూగుల్ వివరించింది.» ఈ విధానాన్ని చేరువ చేయడానికి విద్యావేత్తలు నేరుగా గూగుల్క్లాస్రూమ్లో పోస్ట్ చేయగల, విద్యార్థులతో పంచుకోగల ప్రత్యేక లింక్ను అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొంది.ఇంటర్నెట్ వచ్చాక సంప్రదాయ గైడ్స్కు కాలం చెల్లింది. సాంకేతికతను ఉపయోగించి ఎడ్టెక్ కంపెనీలు విద్యావ్యవస్థ స్వరూపాన్నే మార్చేశాయి. పాఠ్యాంశాలను అర్థం చేసుకోవడం, లోతుగా అధ్యయనం చేయడానికి అభ్యాస విధానంలో కొత్తదనం తీసుకొచ్చాయి. ఇప్పుడు ఏఐ రాకతో తరగతి గదికి మించి నేర్చుకోవడంలో గూగుల్ గైడెడ్ లెర్నింగ్, ఓపెన్ ఏఐ స్టడీ మోడ్ కొత్త రకం అనుభవం అందిస్తాయని టెక్ నిపుణులు చెబుతున్నారు.‘విద్యార్థులకు లాభదాయకమే’నిజానికి ఏఐ చాట్బాట్లు విద్యార్థులకు నేరుగా ప్రత్యక్ష సమాధానాలను ఇచ్చేస్తాయని.. దానివల్ల వారి మెదడుకు పని ఉండదని, దాంతో అభ్యాస ప్రక్రియ దెబ్బతినే అవకాశం ఉందని చాలామంది విద్యావేత్తలు చెబుతున్నారు. కానీ, అది నిజం కాదంటున్నాయి గూగుల్, ఓపెన్ ఏఐ సంస్థలు. ఈ సంస్థలు స్టడీ మోడ్, గైడెడ్ లెర్నింగ్ పేరుతో వ్యక్తిగత ట్యూటర్లను ప్రవేశపెట్టాయి. ఈ సరికొత్త సాధనాలు చాట్బాట్లను సాధారణ సమాధాన వేదికలుగా కాకుండా.. అభ్యాస సాధనాలుగా మలచడం ద్వారా విద్యా విధానం కొత్త పుంతలు తొక్కడం ఖాయంగా కనపడుతోంది.ఇదీ ‘స్టడీ మోడ్’దీన్ని కాలేజీ విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని రూపొందించామని ఓపెన్ ఏఐ చెబుతోంది. ఇది కూడా హోమ్వర్క్, పరీక్షలకు సిద్ధమయ్యే విషయంలో విద్యార్థులకు సాయం చేస్తుంది. యూజర్లు అడిగే ప్రశ్నలకు స్టడీ మోడ్లో చాట్ జీపీటీ ప్రత్యక్ష సమాధానాలను అందించదు. విద్యార్థులు వారి లక్ష్యం, జ్ఞాన స్థాయిని బాట్కు వివరించాల్సి ఉంటుంది. విద్యార్థులు తమంత తాముగా, చురుకుగా నేర్చుకునేలా, పాఠ్యాంశాలపట్ల లోతైన అవగాహన కలిగేలా హింట్స్, క్విజ్ ద్వారా ప్రోత్సహించడం ఇందులోని ప్రత్యేకత. ఏదైనా టాపిక్ కొత్తదైతే లేదా ఇప్పటికే మెటీరియల్పై పట్టు ఉండి తాజా సమాచారం కోరితే.. చాట్బాట్ వ్యక్తిగతీకరించిన పాఠాన్ని అందిస్తుంది. – విద్యార్థుల కోసం స్టడీ మోడ్ సిద్ధం చేయడంలో భాగంగా ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల (ఐఐటీ) ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాలు, పాఠ్యాంశాలను కంపెనీ ఉపయోగించింది. » ఐఐటీల వంటి ముఖ్య పరీక్షలతో పాటు భారత్లో జరుగుతున్న ఇతర పరీక్షల్లో కూడా పనితీరునుఅంచనా వేయడానికి స్టడీ మోడ్ పరీక్షించినట్టు ఓపెన్ ఏఐ తెలిపింది. » వాయిస్, ఇమేజ్, టెక్స్›్టను సపోర్ట్ చేస్తూ 11 భారతీయ భాషల్లో స్టడీ మోడ్ అందుబాటులో ఉంది.కొన్ని సందేహాలుతమ ఏఐ సేవలను పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలకు మరింత అందుబాటులో, చవకైన మార్గాల ద్వారా అందించడానికి కృషి చేస్తున్నామని గూగుల్, ఓపెన్ ఏఐ చెబుతున్నాయి. అయితే వీటిపై విద్యా, వైద్య రంగ నిపుణులు కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.» విద్యార్థులు చాట్బాట్లపై ఎక్కువగా ఆధారపడినప్పుడు వారి విద్యా పరిశోధన నైపుణ్యాలు, పఠన గ్రహణశక్తి, కమ్యూనికేషన్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడంలో విఫలమయ్యే అవకాశం ఉంటుందని విద్యావేత్తలు, పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. » ఫోన్ లేదా కంప్యూటర్ స్క్రీన్ను గంటల తరబడి చూడటం.. కంటి ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. అలాగే చూసే విధానం వల్ల మెడ, వెన్ను వంటి వాటిపై కూడా ప్రభావం ఉండొచ్చు అని వైద్య నిపుణులు అంటున్నారు. -
మూడు దేశాలు ఒక్కటైతే..!
అగ్రరాజ్యమన్న దురహంకారం, ఆధిపత్యధోరణితో ట్రంప్ టారిఫ్ల బాంబులు విసిరితే బాధిత దేశాలు జట్టుకట్టి పోరుసల్పే ప్రయత్నాలు మొదలెట్టాయా? అంటే తాజా అంతర్జాతీయ పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. వినిమయ ప్రపంచంగా పేరొందిన అమెరికాకు అన్ని దేశాల వస్తూత్పత్తులు పోటెత్తుతాయి. చాలా దేశాల ఖజానా నిండటానికి అమెరికా కొనుగోళ్లే కారణం. దీనిని అలుసుగా తీసుకుని, ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని కారణంగా చూపి తమతో వాణిజ్యంచేసే దేశాలపై ట్రంప్ టారిఫ్ల గుదిబండలు పడేస్తుండటంతో ఆయా దేశాల్లో ఆగ్రహజ్వాలలు పెల్లుబికాయి. భారత్, చైనా వంటి దేశాలు అంతటితో ఆగకుండా రష్యాతో జట్టుకట్టి అగ్రరాజ్య దుందుడుకు చర్యలకు ముకుతాడు వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలు ఈ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. ఇప్పటికే భారత జాతీయ భద్రతా సలహదారు అజిత్ దోవల్ రష్యాలో పర్యటిస్తున్నారు. రష్యా జాతీయ భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షోయిగుతో గురువారం ఎన్ఎస్ఏ ధోవల్ సమావేశమయ్యారు. ఇంధన, రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారంపై చర్చలు జరిపానని ధోవల్ చెబుతున్నప్పటికీ వాస్తవానికి ట్రంప్ను ఎలా నిలువరించాలనే దానిపైనే ప్రధానంగా చర్చ జరిగిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ట్రంప్ దూకుడుకు ఎలా కళ్లెం వేయాలని అంశంపై చర్చించేందుకు త్వరలో భారతవిదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సైతం రష్యాకు వెళ్లి పుతిన్ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడనున్నారు. గల్వాన్ లోయలో ఇరుదేశాల జవాన్ల ముష్టిఘాతం, ఘర్షణలు, 20కిపైగా భారత జవాన్ల వీరమరణంతో ఎగసిపడిన కోపాన్ని సైతం కాసేపు పక్కనబెట్టి ప్రధాని మోదీ త్వరలో చైనాలో పర్యటించనున్నారు. చైనాకు బద్దశత్రువైన అమెరికాను ఆర్థికాంశాల్లో ఎలా ఎదుర్కోవాలనే దానిపై చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో మోదీ చర్చించనున్నట్లు వార్తలొచ్చాయి. మారుతున్న భారత్ వ్యూహం చైనాతో మైత్రీ విషయంలో ఇన్నాళ్లూ సమదూరం పాటించిన భారత్ ఇకపై అమెరికా కారణంగా స్నేహబంధాన్ని బలపర్చుకునే అవకాశముంది. చైనా, భారత్, రష్యా కూటమిలో తానూ చేరతానని ఇప్పటికే బ్రెజిల్ సూచనప్రాయంగా తెలిపింది. వ్యవసాయం, డైయిరీ రంగంలో అమెరికన్ కంపెనీల రాకను భారత్ అడ్డుకుంటుండటంతో ఒక దెబ్బకు రెండు పిట్టలు తరహాలో అటు సుంకాలతో, ఇటు వాణిజ్య ఒప్పందంలో తనకు అనుకూల షరతులతో భారత్ మెడలు వంచాలని ట్రంప్ చూస్తున్నారు. ఇందుకు భారత్ ససేమిరా అనడంతో ఆగ్రహంతో ట్రంప్ మోపిన టారిఫ్ ఇప్పుడు భారత్ను చైనాకు దగ్గరచేస్తోందని తెలుస్తోంది. ఏడేళ్ల తర్వాత మోదీ చైనా పర్యటన ఖరారుకావడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనాను నిలువరించేందుకు ఇన్నాళ్లూ భారత్ను మచి్చకచేసుకునేందుకు గత అమెరికా ప్రభుత్వాలు చేసిన సఫలయత్నాలను ట్రంప్ ఒక్క టారిఫ్ దెబ్బతో నాశనంచేస్తున్నారు. 25 శాతం టారిఫ్ అమల్లోకి వచి్చనరోజు మాస్కోలో దోవల్ పర్యటించడం యాదృచి్ఛకం కాదని తెలుస్తోంది. ఉక్రెయిన్తో శాంతి ఒప్పందం చేసుకోవాలంటూ ట్రంప్ పంపిన దూత, అమెరికా ఉన్నతాధికారి స్టీవ్ విట్కాఫ్.. వ్లాదిమిర్ పుతిన్తో భేటీ అయిన కొద్దిగంటల తేడాతోనే ధోవల్ సైతం మాస్కోలో కీలక చర్చలు జరపడం గమనార్హం. షాంఘై శిఖరాగ్ర సదస్సు వేదికగా.. త్వరలో చైనాలో జరగబోయే షాంఘై సహకార సంఘం శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు మోదీ చైనాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ను కలిసి ట్రంప్ ప్రభుత్వ వ్యతిరేక వ్యూహాలను రచించనున్నట్లు వార్తలొచ్చాయి. ఇటీవలికాలంలో చైనా, భారత్ మధ్య సారూప్యతలు కనిపిస్తున్నాయి. రష్యా ముడిచమురును చైనా, భారత్లు అత్యధికంగా కొనుగోలుచేస్తున్నాయి. ట్రంప్ బెదిరింపులను భారత్, చైనా రెండూ చవిచూశాయి. దేశ స్వప్రయోజనాలు, జాతీయ భద్రతకే తాము పెద్దపీట వేస్తామని చైనా, భారత్ ఒకే తరహాలో తమ వాణిని గట్టిగా వినిపించాయి. యురేనియం, ఎరువులు, ఇతర కీలక మిశ్రమ ధాతువులను రష్యా నుంచి కొంటూ మాకు సుద్దులు నేర్పుతావా? అని రెండు దేశాలు అమెరికాపై ఆగ్రహం వ్యక్తంచేశాయి. శత్రువుకు శత్రువు మిత్రువు అన్న సూత్రాన్ని భారత్, చైనాలు తూ.చ. తప్పకుండా పాటిస్తాయని తెలుస్తోంది. కలిసి నడుస్తానన్న బ్రెజిల్ తమపై ఏకంగా 50 శాతం టారిఫ్ విధించడంపై అమెరికాపై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డసిల్వా గుర్రుగా ఉన్నారు. ‘‘ ఇంతటి భారం మోపిన ట్రంప్కు అస్సలు ఫోన్ చేయను. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, భారత ప్రధాని మోదీకి ఫోన్చేస్తా. ప్రపంచ వాణిజ్య సంస్థలో ఈ టారిఫ్లపై తేల్చుకుంటాం. ఈ దేశాలతో కలిసి నడుస్తా’’ అని డసిల్వా అన్నారు. రష్యా, ఇండియా, చైనా త్రయం మళ్లీ క్రియాశీలకం కావాల్సిన తరుణం వచి్చందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మృత్యు మేఘం..‘విస్ఫోట’ విలయం
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశి జిల్లాలోని ధరలీ గ్రామం ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది. పర్వతం నుంచి కిందికి వచ్చిన వినాశకర వరద నీరు, బురద, రాళ్లు.. ఆ గ్రామం నామరూపాలు లేకుండా చేశాయి. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, 50 మందికిపైగా జాడ కానరావడం లేదు. దీనంతటికీ కారణం.. మేఘ విస్ఫోటం. ఆకాశంలో అపార జలరాశిని నింపుకొన్న మేఘాలు.. కేవలం స్వల్ప వ్యవధిలో కుంభవృష్టిగా విజృంభించడం. ఆ విస్ఫోటంతో విలయం సంభవించింది. దీన్నే క్లౌడ్ బరస్ట్.. మేఘ విస్ఫోటం అంటారు. ఉత్తరాఖండ్ వీటికి ప్రసిద్ధి. – సాక్షి, స్పెషల్ డెస్క్మేఘ విస్ఫోటం.. సాధారణంగా పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా సంభవిస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చెబుతోంది. గాలి పయనించే తీరు, ఎతై ్తన పర్వతాలు, గాలిలోని తేమ ఇందుకు ప్రధాన కారణాలు. వేడిగాలి పర్వత ప్రాంతాలపైకి వెళ్లి అక్కడ అల్పపీడనం వల్ల చల్లబడి తేమను విడుదల చేస్తుంది. వేడిగాలి ఎంత ఎక్కువగా పైకి వెళితే తేమ అంత అధికమై.. అదే ఒక్కసారిగా క్లౌడ్బరస్ట్ రూపంలో వర్షిస్తుంది. చాలా తక్కువ వ్యవధిలో భారీ వర్షం నమోదు కావడంతో ఆకస్మిక వరదలకు దారితీస్తుంది. క్లౌడ్ బరస్ట్ కాకున్నా దాదాపు అలాంటి పరిస్థితిని ఇటీవల హైదరాబాద్లోనూ చూశాం.ముందే చెప్పలేరా?వాతావరణ శాఖ.. వర్షం పడుతుందని చెప్పగలదు. సాధారణ, భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పగలదు. కానీ ఎంత మొత్తంలో వర్షపాతం నమోదవుతుందనేది మాత్రం చెప్పలేదు. 10 సెం.మీ. వర్షపాతంఒక నిర్దిష్ట ప్రాంతంలో ఒక గంట సమయంలో 10 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైతే దాన్ని క్లౌడ్ బరస్ట్గా పరిగణిస్తామని ఐఎండీ చెబుతోంది. దీన్ని ముందే పసిగట్టాలంటే ఆ నిర్దిష్ట ప్రాంతంలో పటిష్ట రాడార్ నెట్వర్క్ లేదా వాతావరణాన్ని అంచనావేసే అధునాతన సాంకేతిక వ్యవస్థ ఉండాలని స్పష్టం చేసింది. కేదార్నాథ్ విలయంక్లౌడ్బరస్ట్ అనగానే అందరికీ గుర్తుకొచ్చే సంఘటన 2013లో ఉత్తరాఖండ్ విలయం. ఈ ఘటనలో 6,074 మంది చనిపోగా 70 వేలకుపైగా చార్ధామ్ యాత్రికులు వరదల్లో చిక్కుకుపోయారు. 2004 సునామీ తర్వాత ఇదే అతిపెద్ద ప్రకృతి విపత్తు. అక్రమ, అశాస్త్రీయ నిర్మాణాలు..: హిమాలయాలలో అక్రమంగా, అశాస్త్రీయంగా చేపట్టిన నిర్మాణాల వల్ల ఇలాంటి విపత్తుల సమయంలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిమాలయ భూభాగంలో లోయ వైపున ఉన్న చాలా కాలువలు బలహీన ప్రాంతం, విరిగిన రాతిపై ఏర్పాటై ఉన్నాయి. అందుకే ఏదైనా షెల్టర్, హోటళ్ళు, భవనాలు, తాత్కాలిక దుకాణాల నిర్మాణం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. హిమాలయాల పెరుగుదల స్వభావానికి తోడు, అధికం అవుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలు రుతుపవనాల నమూనాలను మార్చాయి. దీని వలన వాటి ఆగమనాన్ని అంచనా వేయడం కష్టమవుతోంది. అటవీ నిర్మూలన, భూ వినియోగ విధానాలలో మార్పు నేల స్థిరత్వాన్ని క్షీణింపజేసి, వర్షపు నీటిని పీల్చుకునే ప్రకృతి సహజ సామర్థ్యాన్ని తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ‘చార్ధామ్’లోనూ..: హోటళ్ళు, హోమ్స్టేస్, ఇతర పౌర నిర్మాణాలు.. నదులు, వాగుల మార్గాన్ని ఆక్రమించకుండా చూసుకోవడానికి ఎటువంటి వ్యవస్థ లేదన్నది నిపుణుల మాట. 2023లో 56 లక్షలకు పైగా ప్రజలు చార్ ధామ్ను సందర్శించారని మీడియా నివేదికలు చెబుతున్నాయి. పెరుగుతున్న యాత్రికులు, పర్యాటకులకు వసతి కల్పించడానికి హోటళ్ళు, లాడ్జీలు, రోడ్లు, దుకాణాలను అస్థిరమైన వాలులు, వరదలకు గురయ్యే నదీ తీరాలలో నిర్మిస్తున్నారు. చార్ ధామ్ హైవే ప్రాజెక్ట్ కింద రోడ్ల విస్తరణ సున్నితమైన భూభాగాన్ని మరింత అస్థిరపరిచిందని, ఈ మార్గాల్లో తరచుగా కొండచరియలు విరిగిపడటానికి దారితీస్తోందని నిపుణులు భావిస్తున్నారు.ఎన్నో ‘మేఘ విస్ఫోటనాలు’» 2025 జూలై 26న రుద్రప్రయాగ్ జిల్లాలో పర్వత ప్రాంతంలో కుంభవృష్టి కురిసింది. వరదల్లో చిక్కుకున్న 1,600 మంది చార్దామ్ యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.» 2025 జూన్ 29న ఉత్తరాఖండ్లోని బార్కోట్–యమునోత్రి మార్గంలో నిర్మాణంలో ఉన్న భవనం దెబ్బతిని 9 మంది కార్మికులు గల్లంతయ్యారు. » పర్వత ప్రాంతాల్లో ఏర్పడిన ఓ సరస్సు.. 2023 అక్టోబర్లో కుండపోత వర్షం కారణంగా సిక్కింలో వినాశకర వరదలకు దారితీసింది. ఫలితంగా కనీసం 179 మంది మరణించారు.» 2021 అక్టోబర్లో అకాల భారీ వర్షం కారణంగా ఉత్తరాఖండ్లో రోడ్లు మునిగిపోయాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. కనీసం 46 మంది మరణించారు.» 2021 ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్లో సంభవించిన ఆకస్మిక వరదలతో రెండు జలవిద్యుత్ ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. ధౌలిగంగా నది లోయలో నీరు, రాళ్ళు, శిథిలాలు ఉప్పొంగడంతో 200 మందికి పైగా మరణించారు.» భారత్–పాకిస్తాన్ మధ్య ప్రవహించే జీలం నది 2014 సెప్టెంబర్లో అసాధారణంగా కురిసిన భారీ వర్షం కారణంగా ఉప్పొంగి ప్రవహించడంతో కాశ్మీర్.. గత 50 సంవత్సరాలలో అత్యంత దారుణమైన వరదలను చవిచూసింది. ఈ ఘటనలో దాదాపు 200 మంది భారతీయులు, 264 మంది పాకిస్తానీయులు మరణించారు.‘నదులకు వాటి సొంతదైన, సహజ మార్గం ఉంది. కానీ మనం దాని మార్గంలో భవనాలను నిర్మించి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాం, మార్చేస్తున్నాం. మేఘ విస్ఫోటం అంచనా వేయలేం. ప్రభుత్వం ప్రమాదకర మండలాలను గుర్తించాలి’ అని శాస్త్రవేత్తలు అంటున్నారు. -
వేయి శుభముల వరము మీకు...
భక్తితో పూజిస్తే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి కఠినమైన నిష్ఠలు, నియమాలు, మడులకన్నా నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తాలే ముఖ్యం. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాచరణ వల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుందని, సకల సంపదలూ కలుగుతాయని ప్రతీతి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, ఆరోగ్య సంపద, జ్ఞానసంపద మొదలైనవి ఎన్నో.పూజను చక్కగా... భక్తి శ్రద్ధలతో చేసుకోవాలంటే ముందుగా పూజాద్రవ్యాలను సిద్ధం చేసుకోవాలి. అలా సిద్ధం చేసి పెట్టుకోవడం వల్ల మధ్య మధ్యలో లేవాల్సిన అవసరం ఉండదు. పూజకు కావలసినవి: పసుపు, కుంకుమ, గంధం, విడిపూలు, పూలమాలలు, తమలపాకులు, వక్కలు, ఖర్జూరాలు, అగరొత్తులు, కర్పూరం, చిల్లరనాణేలు, తెల్లని వస్త్రం, రవికల గుడ్డ, మామిడాకులు, పండ్లు, అమ్మవారి పటం లేదా ప్రతిమ, కలశం, కొబ్బరి కాయలు, తెల్ల దారం లేదా పసుపు రాసిన కంకణం, ఇంటిలో శుచిగా తయారు చేసిన నైవేద్యాలు (శక్తి కొలదీ చేసుకోవచ్చు) బియ్యం, పంచామృతాలు, దీపపు కుందులు, ఒత్తులు, ఆవునెయ్యి.శ్రావణమాసంలో ΄పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. ఒకవేళ ఆ రోజున వీలు కాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు.వ్రత విధానంవ్రతాన్ని ఆచరించే రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. పూజామందిరంలో మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన ముగ్గువేసి, కలశం పెట్టాలి. అమ్మవారి ఫొటో లేదా రూపును అమర్చుకోవాలి. పూజాసామగ్రి, తోరాలు, అక్షతలు, పసుపు గణపతిని సిద్ధం చేసుకుని ఉంచాలి.తోరం ఇలా తయారు చేసుకోవాలితెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాయాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. ఇలా తయారు చేసుకున్న తోరాలను పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలతో పూజించి పూజకు సిద్ధం కావాలి.గణపతి పూజఅదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరష్యే .. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా! ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక అని స్తుతిస్తూ గణపతిపై అక్షతలుంచాలి. యధాశక్తి షోడశోపచార పూజ చేయాలి. స్వామివారి ముందు పళ్ళు లేదా బెల్లాన్ని నివేదించి తాంబూలం సమర్పించాలి. అనంతరం నీరాజనం సమర్పించాలి. వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు శిరస్సు మీద ఉంచుకోవాలి. తర్వాత వరలక్ష్మీ వ్రతాన్నిప్రారంభించాలి.కలశపూజకలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితాఃమూలేతత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణః స్థితాఃకుక్షౌతు సాగరస్సర్వే సప్తద్వీపా వసుంధరాఋగ్వేదోధ యజుర్వేదో స్సామవేదో అధర్వణఃఅంగైశ్చ స్సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాఃఆయాంతు గణపతి పూజార్థం దురితక్షయకారకాః గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధూ కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ కలశంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపై, పూజాద్రవ్యాలపై చిలకరించాలి. పూజ చేస్తున్న వారు తమపైన చల్లుకోవాలి.అనంతరం పువ్వులు లేదా అక్షతలతో కలశానికి పూజ చేయాలి. ఆ తరువాత పుష్పాలతో అమ్మవారిని అష్టోత్తర శతనామాలతో పూజించాలి. ఇంతకుముందు సిద్ధం చేసుకున్న తోరాన్ని అమ్మవారి వద్ద ఉంచి పూజించి కుడిచేతికి తోరం కట్టుకోవాలి.వ్రత కథాప్రారంభంపూర్వం శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ‘‘మునులారా! స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమ శివుడు పార్వతికి చెప్పాడు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను. శ్రద్ధగా వినండి’’ అన్నారు. అది వరలక్ష్మీవ్రతం. దానిని శ్రావణమాసం రెండో శుక్రవారం నాడు ఆచరించాలని చెబుతూ శివుడు పార్వతికి చెప్పిన ఆ వ్రత కథను ఇలా చెప్పసాగాడు. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి. వినయ విధేయతలు, భక్తిగౌరవాలు గల యోగ్యురాలు. రోజూప్రాతఃకాలాన నిద్రలేచి ప్రాతఃకాల గృహకృత్యాలను పూర్తిచేసుకుని భర్త, అత్తమామల సేవలో తరించేది.వరలక్ష్మీ సాక్షాత్కారంవరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి చారుమతికి కలలో కనిపించి ‘ఓ చారుమతీ! ఈ శ్రావణ ΄పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు... నీవు కోరిన వరాలు, కానుకలను ఇస్తాను’ అంటూ పూజా విధానాన్ని చెప్పి అంతర్థానమైంది. అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. పురంలోని మహిళలు చారుమతి కలను గురించి విని వారు కూడా ΄పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూడసాగారు.శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటుచేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమాంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే! అంటూ ఆహ్వానించి ప్రతిష్టించింది.అనంతరం అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి, భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకుని, ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలు ఘల్లుఘల్లున మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్నఖచిత కంకణాలు ధగధగా మెరవసాగాయి. మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు, ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి. వారి వారి ఇళ్ల నుంచి రథ గజ తురగ వాహనాలతో వచ్చి ఇళ్లకు తీసుకెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేనోళ్ళ పొగుడుతూ వారంతా ఏటా వరలక్ష్మీవ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరిసంపదలు కలిగి, సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు.ఈ కథ విని అక్షతలు శిరసుపై ధరించాలి. ఆ తరువాత ముతై ్తదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి, పూజ చేసినవారు కూడా వాటిని తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించాలి. పూజ చేస్తున్నంతసేపూ ప్రశాంత చిత్తంతో ఉండాలి. – డి.వి.ఆర్. -
ఇంట్రెస్ట్ పోయింది!
అమెరికాలో ఇది ‘ఆటమ్ / ఫాల్’ అడ్మిషన్ల సీజన్. యూనివర్సిటీల ప్రాంగణాలన్నీ అంతర్జాతీయ విద్యార్థులతో కళకళలాడాల్సిన సమయం. కానీ ఈ సెమిస్టర్లో (సెప్టెంబర్–అక్టోబర్–నవంబర్) తరగతి గదులు వెలవెలబోనున్నాయి. అందుకు కారణం.. మారిన నిబంధనలు, నిరంతర అంతరాయాలు! విద్యార్థులకు ఇచ్చే ఎఫ్–1 వీసాల ప్రాసెసింగ్ తీరుబడిగా సాగుతోంది. చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేయటానికి అనుమతి ఇచ్చే ‘ఓపీటీ’ మార్పులపై అమెరికన్ కాంగ్రెస్ ఇంకా ఏమీ తేల్చలేదు. దీంతో విద్యార్థులు.. ముఖ్యంగా భారతీయ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఏం చేయాలో తోచడం లేదట. వీసా వస్తే వచ్చింది.. పోతే పోయింది.. ఏదైతే అది జరగనీ అనుకుంటున్నారట. పర్యవసానమే.. ఖాళీగా ఉన్న కాలేజీ సీట్లు. వీసాల జారీలో జాప్యం, ‘ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్’ (ఓపీటీ) పై అనిశ్చితి కార ణంగా 2025 సెప్టెంబర్–అక్టోబర్–నవంబర్ సెమిస్టర్కు గాను, అమెరికన్ విశ్వ విద్యాలయాలలో భారతీయ విద్యార్థుల ప్రవేశాలు 20–25% వరకు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు నెల రోజుల పాటు స్తంభించిపోయిన యూఎస్ స్టూడెంట్ వీసా నియామకాలు, ఓపీటీల భవిష్యత్తుపై కొనసాగుతున్న అస్పష్టత భారతీయ విద్యా ర్థులను సందిగ్ధంలో ఉంచి, అమెరికన్ విశ్వవిద్యాలయాలలో భారతీయ విద్యార్థుల ప్రవేశాల శాతం పడిపోటానికి దారి తీశాయని ఇండియాలోని ‘స్టడీ–అబ్రాడ్’ కేంద్రాలు చెబుతున్నాయి.విరామం తొలగినా..!అమెరికన్ ప్రభుత్వం ఈ ఏడాది మే 27 నుంచి జూన్ 18 వరకు కీలకమైన కాల వ్యవధిలో విద్యార్థి వీసా నియామకాలపై విరామం ఇచ్చింది. వీసా సేవలపై విరామం తొలగి తిరిగి అవి ప్రారంభమైన ప్పటికీ, స్లాట్ లభ్యత పరిమితంగానే ఉంటోంది. దీంతో తమ దరఖాస్తులకు ఎప్పటికి విముక్తి లభిస్తుందో తెలియక భారతీయ విద్యార్థులు అయోమయంలో పడ్డారు. 27 శాతం తగ్గుదల2025 మార్చి–మే మధ్య జారీ అయిన ఎఫ్–1 విద్యార్థి వీసాలు.. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 27% క్షీణించాయి. ఈ సంవత్సరం మార్చి–మే మధ్య భారతీయ విద్యార్థులు 9,906 ఎఫ్–1 (విద్యా) వీసాలను పొందారు. గత ఏడాది ఇదే కాలంలో 13,478 వీసాలను అందుకున్నారు. అమెరికాలోని ప్రధాన విశ్వవిద్యాలయాల్లో ఆటమ్ సెమిస్టర్ ప్రవేశాలకు అంతర్జాతీయ విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటారు కనుక సాధారణంగా మే–జూలై మధ్య అత్యధిక సంఖ్యలో ఎఫ్–1 వీసాల ప్రాసెస్ జరుగుతుంది. దాదాపు 70 శాతం అంతర్జాతీయ విద్యార్థి వీసాలు ఈ వ్యవధిలో జారీ అవుతాయి. కానీ ఈ సంఖ్య భారీగా తగ్గిందని సమాచారం. లేఖ రాయాల్సి వచ్చింది2025 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో.. అంటే అక్టోబరు 2024 నుంచి మార్చి 2025 వరకు చూస్తే.. సోషల్ మీడియా వెట్టింగ్, స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలు నిలుపుదల వంటి చర్యల ఫలితంగా అమెరికా జారీ చేసే మొత్తం ఎఫ్1 వీసాలు భారీగా తగ్గాయి. అంతకుముందు ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 15 శాతం తగ్గి, 89,000 వీసాలే జారీ వచ్చాయి. ఇక మనదేశం విషయానికొస్తే. ఏకంగా 44 శాతం తగ్గి, 14,700 జారీ అయ్యా యి. అయినా విదేశీ విద్యార్థుల సంఖ్యలో మనమే మొదటి స్థానంలో ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జులై 24న అమెరికన్ కాంగ్రెస్ సభ్యుల బృందం ఒకటి వీసా అపా యింట్మెంట్లలో జాప్యాన్ని నివారించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరిందట. ఫాల్ సెమిస్టర్లో భారత విద్యా ర్థులు క్లాసులకు హాజరవ్వడానికి.. వారికి వీసా ప్రాసెసింగ్లో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందో ఆగస్టు 8 లోగా తెలియజేయాల్సిందిగా వారు కోరారట.ఎటూ తేలని ఓపీటీ విద్యానంతరం అంతర్జాతీయ విద్యార్థులు ఉద్యోగాల కోసం అమెరికాలో తాత్కాలికంగా ఉండేందుకు వీలు కల్పించే, అత్యంత ప్రజాదరణ కలిగిన ఆప్షన్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ)కి సంబంధించి యూఎస్ కాంగ్రెస్ ప్రతిపాదనలు నిలిచిపోవటంతో అస్పష్టత ఏర్పడింది. మరోవైపు గత ఏప్రిల్లో ప్రతినిధుల సభలో హెచ్.ఆర్. 2315 అనే కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. దీని లక్ష్యం ఎఫ్–1 వీసాలపై అంతర్జాతీయ విద్యార్థుల ఓపీటీని తొలగించడం. అదీగాక, గత నెలలోనే కాంగ్రెస్ సభ్యులు 2025 డిగ్నిటీ చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఈ చట్టం ఓపీటీ ద్వారా విదేశీ ఉద్యోగులు పొందే ఆదాయాలను అదనపు పన్నుల విధింపు పరిధిలోకి తెస్తుంది. యూనివర్సిటీలకు నష్టంఓపీటీ కీలకమైన ఉద్యోగ అనుభవంగా పనికొస్తుందన్న ఆశతో, చదువు కోసం తీసుకున్న రుణాలను తీర్చుకునే ఏకైక మార్గంగా ఓపీటీపై ఆధారపడి పడిన భారతీయ విద్యార్థులకు.. అమెరికా చట్ట సభల ప్రతిపాదనలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. చాలామంది తమ యూఎస్ ప్రణాళికలను వాయిదా వేయడానికి లేదా రద్దు చేసుకోటానికి మొగ్గు చూపుతున్నారు. దీంతో అమెరికన్ విశ్వవిద్యాలయాలలో చేరవలసిన భారతీయ విద్యార్థుల శాతం గణనీయంగా తగ్గింది. అంతర్జాతీయ విద్యార్థులపై అమలవుతున్న ట్రంప్ పరిపాలనా నిర్బంధ విధానాలు అనేక యూఎస్ ఉన్నత విద్యా సంస్థలకు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయని, తద్వారా విద్యార్థులు నమోదు తగ్గుతుందని ఇటీవలే మూడీస్ రేటింగ్స్ వెల్లడించటం గమనార్హం. చైనాను దాటేసిన భారత్.. ప్రస్తుతం ఇండియానే యూఎస్ విశ్వవిద్యాలయాలకు అతిపెద్ద మార్కెట్. భారత్ తర్వాతి స్థానాలలో చైనా, దక్షిణ కొరియా ఉన్నాయి. 2024లో భారతదేశం 3,31,602 మంది విద్యార్థులను యూఎస్కు పంపింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 23 శాతం ఎక్కువ. -
ఉల్టా చోర్..
‘రష్యా యుద్ధ యంత్రాంగం మొత్తానికీ ఆర్థిక ఇంధనాన్ని భారతే సరఫరా చేస్తోంది’ – తెంపరి ట్రంప్ ఇటీవల చేసిన తలతిక్క వ్యాఖ్యలివి. అంతేగాక, రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై టారిఫ్లను భారీగా పెంచేస్తానంటూ బాధ్యతారహిత వ్యాఖ్యలకు దిగిన అమెరికా అధ్యక్షుడు బుధవారం అన్నంత పనీ చేశారు. టారిఫ్ను 50 శాతానికి పెంచేస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. కానీ వాస్తవాల ఆధారంగా ఒకసారి పరిశీలన చేస్తే ఇలాంటి విషయాల్లో వర్ధమాన దేశాలకు నిత్యం సుద్దులు చెప్పే పెద్ద దేశాలు తమవరకూ వచ్చేసరికి మాత్రం ఎంతటి కొద్ది బుద్ధులు ప్రదర్శిస్తాయో తెలుస్తుంది. ట్రంప్ అనే కాదు, ఇలాంటి విషయాల్లో సంపన్న దేశాల స్వార్థపూరిత వైఖరి ఇట్టే కళ్లకు కడుతుంది... ఉక్రెయిన్పై ఏళ్లుగా సాగిస్తున్న మతిలేని యుద్ధానికి రష్యాకు అవసరమైన ఆర్థిక సాయం మొత్తాన్నీ ఒకరకంగా భారతే సమకూరుస్తూ వస్తోందన్నది అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలన్నీ కొద్దికాలంగా పాడుతూ వస్తున్న పాట. రష్యా నుంచి నానాటికీ పెరిగిపోతున్న భారత చమురు దిగుమతులనే ఇందుకు తార్కాణంగా అవి చూపిస్తున్నాయి. కానీ నిజానికి రష్యా నుంచి స్వీయ చమురు కొనుగోళ్లను నేటికీ ఆపని తెంపరితనం ఆ దేశాలది! ఇందుకు సంబంధించిన అన్ని విషయాలనూ ఒకసారి అంశాలవారీగా విశ్లేషిస్తే... ఉల్టా చోర్ కొత్వాల్కు డాంటే (దొంగే... దొం దొంగ అన్నట్టు) నానుడి ఈ దేశాల వైఖరికి అతికినట్టుగా సరిపోతుంది. రష్యా చమురే ముద్దు! ఉక్రెయిన్పై పాశ్చాత్య రష్యా యుద్ధానికి దిగిన వెంటనే అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలన్నీ పొలోమంటూ దానిపై నానారకాల ఆర్థిక తదితర ఆంక్షలు విధించాయి. కానీ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రష్యా చమురుపై మాత్రం అవి ఎలాంటి ఆంక్షలూ విధించలేదు. అంతేకాదు, స్వయంగా అమెరికాతోపాటు ఆ దేశాలన్నీ నేటికీ రష్యా చమురును చంకలు గుద్దుకుంటూ కొనుక్కుంటున్నాయి. స్వీయ అవసరాలు తీర్చుకుంటూ వస్తున్నాయి. భారత్ వంటి దేశాలకు మాత్రం రష్యా చమురు కొనొద్దంటూ సుద్దులు చెబుతున్నాయి. ‘అలా ఎలా కొంటుం’దంటూ సన్నాయినొక్కులూ నొక్కుతున్నాయి. తెంపరితనానికి మారుపేరుగా మారిన ట్రంప్ అయితే ఆంక్షల రంకెలు వేస్తున్నారు. ధరపై పరిమితి మాత్రమేఇరాన్, వెనెజువెలా చమురు మాదిరిగా రష్యా చమురుపై అంతర్జాతీయంగా నేటికీ పూర్తిస్థాయి నిషేధం లేదు. అలా చేస్తే పెద్ద దేశాల్లో ఒక్కదానికీ పూట గడవని పరిస్థితి! అందుకే తెలివిగా ప్రపంచంలోని ఏడు అతి సంపన్న, శక్తిమంతమైన దేశాల కూటమి అయిన జీ7, యూరోపియన్ రష్యా చమురుపై ‘ప్రైస్ క్యాప్’విధానంతో సరిపెట్టాయి. దాంతో రష్యా దర్జాగా తన చమురును అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించుకుంటూ వస్తోంది. భారత్ కూడా జీ7, ఈయూ విధించిన ‘ప్రైస్ క్యాప్’కు లోబడే, వాటి మాదిరిగానే రష్యా నుంచి చమురు కొనుగోళ్లు జరుపుతూ వస్తోంది. అది కూడా పూర్తి చట్టబద్ధంగా, అత్యంత పారదర్శకంగా! ఈ విషయంలో ఒక్క అంతర్జాతీయ నిబంధనను గానీ, చట్టాన్ని గానీ ఉల్లంఘించడం లేదు. మరి మనపై ఏడుపెందుకు? ఒక్కముక్కలో చెప్పాలంటే స్వీయ వంచన, పరవంచన! అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో నానాటికీ పెరిగిపోతున్న భారత ప్రాభవాన్ని చూసి ఓర్వలేనితనం!! స్వార్థ రాజకీయాలకు పరాకాష్ట. కేవలం ఆ ఒక్క కారణంగానే సంపన్న దేశాలన్నీ ఇలా ఏడ్పులు, పెడబొబ్బలు పెడుతున్నాయి. అదే సమయంలో తాము మాత్రం చడీచప్పుడూ లేకుండా అదే రష్యా నుంచి ‘ఓపెన్ మార్కెట్’ముసుగులో నిరి్నరోధంగా చమురు కొనుగోలు చేస్తూనే ఉన్నాయి. ట్రంప్ అయితే శాపనార్థాలతో పాటు బెదిరింపులకు కూడా దిగుతున్నారు.పాశ్చాత్య దేశాల ‘గ్యాస్’ రష్యా నుంచి భారత చమురు కొనుగోళ్లపై గుండెలు బాదుకుంటున్న పాశ్చాత్య దేశాలు నిజానికి సహజ వాయువు కొనుగోళ్లలో నంబర్వన్ స్థానంలో ఉన్నాయి! గత జూన్లో ఈయూ దేశాలన్నీ కలిసి రష్యా సహజ వాయువు కొనుగోళ్ల నిమిత్తం వెచ్చించింది ఏకంగా 120 కోట్ల డాలర్లంటే నమ్మక తప్పదు! ఈ జాబితాలో ఫ్రాన్స్, హంగరీ, నెదర్లాండ్స్, స్లొవేకియా వంటి యూరప్ దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. అంతేకాదు, రష్యా నుంచి రిఫైన్డ్ పెట్రో ఉత్పత్తుల కొనుగోళ్లలో కూడా నాటో దేశాలదే అగ్ర స్థానం. స్వార్థానికి మారుపేరైన తుర్కియే అయితే రష్యా రిఫైన్డ్ పెట్రో ఎగుమతుల్లో ఏకంగా 26 శాతాన్ని సొంతం చేసుకుంటోంది! ఈ విషయంలో భారత్ వాటా అక్షరాలా సున్నా! వీటన్నింటినీ బేరీజు వేసుకుని చూస్తే నిజానికి రష్యా యుద్ధ తంత్రానికి పూర్తిస్థాయిలో ఆర్థిక సాయం చేస్తూ వస్తున్నది అమెరికా, పాశ్చాత్య దేశాలు మాత్రమేనన్నది అక్షరసత్యం. ఆ లెక్కన ఈ విషయంలో భారత్పై వాటి ఏడుపు దొంగే, ‘దొంగా’అంటూ దొంగ అరుపులు అరిచిన చందమన్నది అంతర్జాతీయ నిపుణుల మాట. చైనా కంటే తక్కువే భారత్ తన చమురు అవసరాల్లో ఏకంగా 38 శాతం రష్యా నుంచే కొనుగోలు చేస్తోంది. కానీ ఈ విషయంలో అగ్రతాంబూలం మాత్రం చైనాదే. అది ఏకంగా 47 శాతం చమురు కొంటోంది. పాశ్చాత్య దేశాలతో పాటు వాటి మిత్ర దేశాలు కూడా రష్యా చమురును నమ్ముకునే మనుగడ సాగిస్తున్నాయి.మనం తప్పుకుంటే..గగ్గోలు పుడుతుంది. అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్నంటుతాయి. బ్యారెల్ ఏకంగా 200 డాలర్లు దాటేస్తుంది. అది మొత్తం ప్రపంచ దేశాలన్నింటికీ కోలుకోలేని దెబ్బేనని అంతర్జాతీయ చమురు రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చేయి తిరుగుతోంది!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో పేకాట దందా మూడు షోలు.. ఆరు ఫుల్లులుగా సాగుతోంది. డ్రాప్కు రూ.20 వేలు, మిడిల్ డ్రాప్కు రూ.40 వేలు, ఫుల్ కౌంట్కు రూ.1.60 లక్షలు.. ఇదీ జిల్లా ప్రధాన కేంద్రమైన భీమవరంలో సాగుతున్న ప్రత్యేక పేకాట శిబిరంలోని ప్రధాన గేమ్. టీడీపీ నేతలే నిర్వాహకులు. స్థానిక ప్రజాప్రతిని«ధులు, పోలీసులకు వారం మామూళ్లు ఫిక్స్చేసి ఉ.10 గంటలకు ప్రారంభమయ్యే పేకాట జాతర మరుసటి రోజు తెల్లవారుజామున మూడు గంటల వరకు నిర్విరామంగా సాగుతోంది. భీమవరం సహా పశ్చిమ గోదావరిలోని ప్రధాన పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కాకపోతే నిర్వాహకుల స్థాయిని బట్టి సభ్యులు, ఆట స్థాయి మారడం మినహా మిగతాదంతా సేమ్ టూ సేమ్.టీడీపీ కూటమి సర్కారు రాగానే..పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, తణుకు, తాడేపల్లిగూడెంలలో పదుల సంఖ్యలో అనధికారిక శిబిరాలు.. అనుమతుల పేరిట పాలకొల్లు, భీమవరంలో క్లబ్బుల్లో పేకాట నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో పేకాటపై ఉక్కుపాదం మోపి క్లబ్లను మూసివేశారు. దీంతోపాటు జూద క్రీడలను పూర్తిగా నిషేధించి వందల కేసులు నమోదు చేసిన పరిస్థితి ఉంది. అయితే, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ నేతలే పేకాట శిబిరాల నిర్వాహకులుగా అవతారమెత్తి మూడు ముక్కలాట మొదలుకుని కనిష్టా వరకు భారీగా నిర్వహిస్తున్నారు. అంతేకాక.. ఉమ్మడి పశ్చిమ గోదావరితో పాటు కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల నుంచి కూడా పేకాటరాయుళ్లను పెద్దఎత్తున ఆహ్వానించి నిత్యం రూ.5 కోట్లకు పైగా టర్నోవర్ చేస్తూ నిర్వాహకులే నిత్యం లక్షల్లో గడిస్తున్నారు.ఒక్కొక్కచోట ఒక్కోలా..తణుకు మండలంలో అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ఒకరోజు పైడిపర్రులో, మరోరోజు తేతలి, ఇంకోరోజు వేల్పూరులో.. ఇలా ప్రతిరోజూ ఒక్కో ప్రాంతంలో పెట్టి ఎప్పుడూ వచ్చే వంద మంది జూదరులకు మెసేజ్ల ద్వారా సమాచారం ఇస్తున్నారు. ఉండి, ఆకివీడు, పాలకొల్లులో అయితే ఎంపిక చేసిన రొయ్యల చెరువుల వద్ద నిత్యం పెద్దఎత్తున జూదక్రీడ కొనసాగుతోంది. అలాగే, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పెదతాడేపల్లి, పెంటపాడు, రూరల్లో వారానికి రెండు ప్రాంతాల్లో శిబిరాలు నిర్వహిస్తున్నారు. ప్రతిచోటా ప్రజాప్రతినిధుల అండదండలు ఉండటంతో పోలీసుల దాడులు, కేసుల ఊసు లేకపోవడం గమనార్హం.భీమవరంలో భారీస్థాయిలో స్పెషల్ శిబిరం..భీమవరంలోని మురుగు కాల్వగట్టు సమీపంలో ఓ శిబిరం భారీస్థాయిలో సాగుతోంది. పట్టణంలోని ఓ ప్రముఖ క్లబ్లో సభ్యుడిగా ఉన్న వ్యక్తి నిర్వాహకుడుగా మారి ప్రత్యేక ఏర్పాట్లుచేశాడు. ఎలా అంటే.. ఉ.10 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు క్రీడ నిర్వహణ. 11 మంది సభ్యులతో మూడు కట్టలతో కనిష్టా బోర్డు.. ఏడుగురితో మరో బోర్డును ఏర్పాటుచేసి గంటకు 7–10 ఆటలు ఆడిస్తున్నారు. ఓకుకు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు జరిగే బోర్డు అందుబాటులో పెట్టారు.ప్రధానంగా ఓకుకు రూ.20 వేలు చొప్పున.. ఫుల్ కౌంట్ పడితే రూ.1.60 లక్షలు చెల్లించే గేమ్కు రూ.5 లక్షలు డిపాజిట్.. మరో రూ.4.80 లక్షలు అంటే మూడు ఫుల్గేమ్ల మొత్తం వెరసి రూ.9.80 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇక డిపాజిట్ మొత్తం కిలోమీటరు దూరంలో ఉండే మరో వ్యక్తి ప్రత్యేకంగా లాకర్లు, ఇతర జాగ్రత్తలతో నగదును సేకరించి టోకెన్లు ఇచ్చి శిబిరానికి పంపుతారు. మరో ప్రత్యేక అంశమేమిటంటే.. సదరు నిర్వాహకుడు సభ్యుడుగా ఉన్న క్లబ్లో గెస్ట్ల పేరుతో కొందరిని అక్కడి ఆటకు పంపించడం, గెలుపోటములు పూర్తయ్యాక వెళ్లే సమయంలో స్లిప్ ద్వారా వసూళ్లు, చెల్లింపులు చేస్తున్నారు.భీమవరంలోని పేకాట నిర్వహణలో సుదీర్ఘ అనుభవం ఉన్న సదరు వ్యక్తి ఒక్కో ఆటకు రూ.4 వేలు చొప్పున నిర్వహణ ఖర్చులు వసూలుచేస్తున్నాడు. ఈ క్రమంలో రోజుకు సగటున రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలు శిబిరం నిర్వాహకులకే దక్కుతోంది. వీటిల్లో పోలీసులకు, స్థానిక ప్రజాప్రతిని«ధికి వారం, నెలవారీలు మామూళ్లను ఖరారుచేసి ఠంఛనుగా పంపుతూ జోరుగా శిబిరం నిర్వహిస్తున్నారు.మరో విషయమేమంటే.. ఇక్కడ పేకాట కోసం వచ్చేవారికి త్రీస్టార్ హోటల్ సౌకర్యాలన్నీ కల్పిస్తున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సన్నిహితులే పైఎత్తున చూస్తుండటంతో ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణాజిల్లా నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారు. స్థానిక ఎస్ఐ మొదలుకుని ఉన్నతాధికారుల వరకు ఈ విషయం తెలిసినా పొలిటికల్ గేమ్ పేరుతో పట్టించుకోకపోవడం గమనార్హం. -
సెల'వంటే' పండగ!
సెలవొచ్చిందంటే సువెన్ చక్ర ఇల్లు సందడిగా ఉంటుంది. బంధువులో, స్నేహితులో వస్తారని కాదు. సెల‘వంటే’ ఆ ఇంట పండగ. అవును.. వంటల పండగ. ఆ రోజు వంటకు కావాల్సిన కూరగాయలు, సరుకులు పొద్దున్నే తెచ్చుకోవడం మొదలు.. భోజనం అయ్యేదాకా ఇంటిల్లిపాది చేయిపడాల్సిందే. ‘అమ్మ చేతి వంట. భార్య చేతి వంట ఎప్పుడూ ఉండేదే.. రెస్టారెంట్కు వెళ్లి విందు ఆరగించడం, నిమిషాల్లో ఇంటికొచ్చే ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్లూ కొత్త కాదు. వారంలో ఒక్కరోజే అందరూ కలిసి ఉండేది. కాబట్టి సెల‘వంటే’ పండగ అని అంటారు చక్ర. – సాక్షి, స్పెషల్ డెస్క్సెలవు రోజును ఎలాగైనా ప్రత్యేకంగా మలుచుకోవాలి. ఆ మధుర క్షణాలు వారమంతా గుర్తుండాలి. సెలవు మళ్లీ ఎప్పుడొస్తుందా అని కుటుంబ సభ్యులు అందరూ ఎదురు చూడాలి. ఇదంతా సాధ్యం చేయడానికి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇల్లు దాటాల్సిన అవసరం అంతకన్నా లేదు. సింపుల్.. అందరూ కలిసి ‘వంట’ చేయడమే. యస్.. ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. పైగా వారం వారం కొత్త రుచులను ఆస్వాదించే చాన్ ్స వస్తే ఎవరు కాదనుకుంటారు? ఇంటర్నెట్ వచ్చాక వంట చేయడం చాలా సులభం అయింది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో విహరించి కొత్త వంటకం నిర్ణయిస్తాం. ఉద్యోగం చేసే మగవాళ్లు సెలవు రోజు వంట చేయడం పాత కాన్సెప్ట్. ఇంటిల్లిపాదీ కలిసి వంట చేయడంలో కొత్త ట్రెండ్. అందరూ కలిసి..ఆడవాళ్లే వంట చేయాలన్న మూస పద్ధతికి స్వస్తి పలకాల్సిందే. కుటుంబం అంటేనే సమిష్టి బాధ్యత. కనీసం సెలవు రోజైనా కుటుంబ సభ్యులంతా కలిసి సరదాగా కబుర్లు చెప్పుకొంటూ వంట చేస్తే? ఒక్కసారి చేసి చూడండి. ఆదివారం, సెలవు రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడడం మీ వంతు అవుతుంది. ఇలా అందరూ కలిసి వంట చేస్తే బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు వైద్యులు, మానసిక నిపుణులు.తినేది తెలుస్తుందిబంధువులు, స్నేహితులు ఇంటికి వచ్చిన సందర్భాల్లోనూ, వారాంతాలు, పండుగలప్పుడు రెస్టారెంట్లకు వెళ్లడం పరిపాటి అయింది. వంట చేసే సమయం లేకపోతే ఆన్ లైన్ లో ఆర్డర్ చేసేస్తున్నారు. మనకు నచ్చినవి తింటున్నాం సరే.. ఆ ఆహారం ద్వారా చక్కెరలు, నూనెలనూ పరిమితికి మించి తీసుకుంటున్నాం. అలాకాకుండా మనమే వంట చేస్తే ఈ పదార్థాలను మితంగా వాడొచ్చు. ఇంట్లోని పిల్లలు, పెద్దలను అందరినీ దృష్టిలో పెట్టుకుని వంట చేస్తాం. అవసరమైతే ఉప్పూ, కారం తక్కువగా ఉన్నవి ముందు తీసిపెడతాం. ప్రాసెస్డ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఆహార పదార్థాల వాడకం మన చేతుల్లో ఉంటుంది. మితంగానూ వాడొచ్చు.. పూర్తిగా వాడకుండానూ ఉండొచ్చు. ఇంటిల్లిపాదికీ ఎంత ఆరోగ్యం!ఖర్చు తగ్గుతుందిరెస్టారెంట్లు గల్లీకి ఒకటి పుట్టుకొచ్చాయి. వినూత్న వంటకాలు, రుచులతో ఒకదాన్ని మించి ఒకటి పోటీపడుతున్నాయి. ఖర్చూ అలాగే ఉంటోంది. నలుగురున్న కుటుంబానికి ఓ మోస్తరు రెస్టారెంట్లో భోజనానికి కనీసం రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు వెచ్చించాల్సిందే. కానీ, కాస్త మనసు పెట్టి.. ఇంట్లోని అందరూ తలో చేయి వేసి వండిన భోజనం.. అంతకు మించిన రుచి అందిస్తుంది. పైగా రెస్టారెంట్లో అయిన ఖర్చులో సగం కూడా కాదు. ప్రతీవారం రెస్టారెంట్కు వెళ్లే కుటుంబం నెలకు ఎంతకాదన్నా ఓ రూ.10 వేలు ఆదా చేసుకోవచ్చన్న మాట.ఆరోగ్య ప్రయోజనాలుబయట ఎక్కువగా తిన్నా, ఫుడ్ డెలివరీ యాప్ నుంచి ఆర్డర్ చేసినా.. ఆ ఆహారం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందనేది జగమెరిగిన సత్యం. ఆ ఫుడ్లో రుచి కోసం ఏం కలిపారో తెలియదు. తాజాగా చేసిందో.. వేడి చేసి పంపిందో తెలీదు. ఏ నూనెలు వాడారో తెలియదు. అదే, ఇంట్లో అందరూ కలిసి చేసుకుంటే.. ఇంట్లో బీపీ, షుగర్, ఇతర సమస్యలు ఉన్నవారికి తగినట్టుగా.. పిల్లలకు కూడా నచ్చినట్టుగా.. మనమే జాగ్రత్తగా ‘స్వయంపాకం’ చేసుకోవచ్చు. ఇంట్లోని అందరూ నిర్భయంగా ఇంటి ఫుడ్ని తీసుకోవచ్చు. అందరితో ఎంజాయ్ చేస్తూ రుచులు ఆస్వాదించొచ్చు.పరిమితాహారంఎంత రుచికరంగా ఉన్నా మితంగా తినాలన్నది పెద్దల మాట. మనం రెస్టారెంట్కి వెళ్లేటప్పుడు తెలియకుండానే అపరిమితంగా తినేస్తాం. డబ్బులు పెట్టాం కదా అని టేబుల్ మీద మిగిలిన ఆహారాన్ని, లేదా స్విగ్గీ /జొమాటో ద్వారా ఇంటికి వచ్చిన ఫుడ్ను పాడేయకుండా ఆ కాస్తా మనమే లాగించేస్తాం. అంటే మన స్థాయికి మించి అతిగా తింటాం అన్నమాట. దాంతో అనారోగ్య సమస్యలూ మనమే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. అదే ఇంట్లో వంట అయితే ఎంత తినాలనేది మనమే నిర్ణయించుకుని అందుకు తగ్గట్టుగా వండుకుంటాం. వృథా పోదు.. అపరిమితంగా మన పొట్టలోకీ పోదు.బంధాలు బలంగాఈ సెల‘వంట’ద్వారా అందే అతి ముఖ్యమైన రహస్య పోషకాహారం.. బంధాలు మరింత బలపడటం. భార్య, తల్లిదండ్రులు, పిల్లలు, బంధువులతో ముచ్చట్లు పెట్టుకుంటూ ఇంట్లో వంట చేయడం, కలిసి తినడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు మరింత బలపడతాయి. ఒకవేళ అప్పటివరకూ నామమాత్రంగా ఉంటే.. బలంగా అతుక్కోవడం మొదలవుతుంది. పని ఒత్తిడితో అలసిపోయిన వారికి ఇదో మంచి స్ట్రెస్ బస్టర్ అవుతుంది. పిల్లలకు పనులు అలవాటవుతాయి. కూరగాయలు, సరుకులపై అవగాహన ఏర్పడుతుంది. ఇచ్చిపుచ్చుకోవడం అలవడుతుంది. ప్రేమ, ఆప్యాయతలు కరువవుతున్న నేటి రోజుల్లో.. ప్రతివారం వంటతో పండగ చేసుకుంటే.. కుటుంబ బలం పెరుగుతుంది.ఎన్నో ప్రయోజనాలు» వృథా ఉండదు, మితంగా తింటాం, ఖర్చూ తగ్గుతుంది » అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ప్రత్యేకంగా వండుకోవచ్చు» ఒత్తిడి నుంచి ఉపశమనం» వారంలో 6 రోజులూ వండిపెట్టిన శ్రీమతికి మీ చేత్తో వండి పెట్టారన్న సంతృప్తిషరతు: వంట చేస్తున్నంతసేపూ.. దాన్ని తృప్తిగా ఆస్వాదిస్తున్నంతసేపూ.. స్మార్ట్ ఫోన్ని (వంటల కోసం చూడాల్సి వస్తే తప్ప) దూరంగా పెడితే.. ఈ వంటకి మరింత ప్రేమానుభూతుల ‘రుచి’ చేకూర్చినవాళ్లవుతారు. -
సాగర గర్భంలో.. రహస్యాల అన్వేషణ
చంద్రుడు, అంగారకుడి గురించి తెలిసినంతగా మనకు సముద్రాల గురించి అవగాహన లేదు. అత్యంత స్వచ్ఛమైన, మనిషి నీడ కూడా తాకని వాతావరణాలే కాదు.. మనకు తెలియకుండా దాగి ఉన్న విలువైన వనరులు సైతం విశాలమైన సముద్రాల్లో నిక్షిప్తమై ఉండొచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. సముద్రం లోపల ఉన్న ఈ విస్తారమైన ప్రాంతాలను అన్వేషించే ప్రయత్నంలో మనదేశం సాహసోపేత ‘డీప్ ఓషన్ మిషన్ ’కు శ్రీకారం చుట్టింది. ఇటీవలే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి శుభాన్షు శుక్లాను పంపినట్టే.. సముద్ర గర్భంలోకి మనుషులను పంపే దిశగా సముద్రయాన్ ప్రాజెక్టుతో అడుగు ముందుకేసింది. – సాక్షి, స్పెషల్ డెస్క్భారత సముద్ర జలాల పరిధిలో విలువైన ఖనిజాలు, ఇంధన వనరులు, ప్రత్యేక జీవవైవిధ్యం వెలికితీయడం లక్ష్యంగా సముద్రయాన్ ప్రాజెక్టు ప్రారంభం అయింది. లోతైన సముద్ర అన్వేషణకు సంబంధించి సముద్రయాన్ ప్రాజెక్టులో భాగంగా నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్ ఐఓటీ), భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు మత్స్య–6000 వాహనం అభివృద్ధి చేశారు. ఇటీవలే ఈ వాహనానికి కీలక వెల్డింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేశారు. లక్ష్యాన్ని సాధించడానికి..: ‘ప్రస్తుతం మహాసముద్రాల గురించి మనం అర్థం చేసుకున్నది కేవలం 5 శాతమే. 95 శాతం ఇప్పటికీ రహస్యంగానే ఉంది. విశాలమైన సముద్రపు అడుగుభాగాన్ని అర్థం చేసుకోవడానికి మరిన్ని అన్వేషణలు అవసరం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి భారత్కు సముద్రయాన్ మిషన్ తోడ్పడుతుంది’ అని మిషన్ ను చేపట్టిన భారత ప్రభుత్వ భూ విజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఈ మిషన్ లో భాగంగా మనుషులను సముద్రమట్టానికి 6,000 మీటర్ల లోతుకు పంపుతారు. గుండ్రని సబ్మెర్సిబుల్ నౌక అయిన మత్స్య–6000 ద్వారా సముద్రపు లోతుల్లోకి వెళ్లి పరిశోధనలు సాగిస్తారు. నౌక వ్యాసం 2,260 మిల్లీ మీటర్లు. 80 మిల్లీ మీటర్ల మందంతో నౌక గోడ తయారైంది. టైటానియం–మిశ్రమంతో రూపొందిన గోడలు తీవ్రమైన బాహ్య ఒత్తిళ్లను, –3 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలను తట్టుకోగలవు. ఇప్పటికే పలు పరీక్షలు..: సముద్రంలో జీవ, నిర్జీవ వ్యవస్థలను అంచనా వేయడానికి, లోతైన సముద్ర పర్యాటకానికి గల అవకాశాలకు కొత్త దారులు తెరుస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రయోగం దశలవారీగా చేపట్టేలా ప్రణాళిక రచించారు. సిబ్బందితో, అలాగే సిబ్బంది లేకుండా ఈ వాహనంతో 2025 జనవరి, ఫిబ్రవరిలో పలు పరీక్షలు పూర్తి చేశారు. 500 మీటర్ల లోతుకు వెళ్లే కీలక పరీక్ష 2025 చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ పరిధిలో మత్స్య–6000 వాహనం వెళ్లి రావడానికి 8 గంటల సమయం పడుతుంది. ముఖ్యమైన ఇంధన, ఖనిజ వనరులు అయిన మీథేన్ , కోబాల్ట్ అన్వేషణ సైతం సాగిస్తారు.రూ.4,077 కోట్ల నిధులు..డీప్ సీ మైనింగ్ మెషీన్ డిజైన్ సైతం పూర్తి అయింది. గత ఏడాది అండమాన్ సమీపంలో 1,173 మీటర్ల లోతుకు వెళ్లి 100 కిలోలకుపైగా కోబాల్ట్ ఆధారిత పాలీమెటాలిక్ నోడ్యూల్స్ను (లోహపు రాళ్లు) ఈ మెషీన్ సేకరించింది. ఈ ప్రాంతంలో 47 లక్షల టన్నుల నికెల్, 42.9 లక్షల టన్నుల కాపర్, 5.5 లక్షల టన్నుల కోబాల్ట్, 9.25 కోట్ల టన్నుల మాంగనీస్ నిల్వలు ఉన్నట్టు అంచనా వేశారు. ఇక సర్వే, అన్వేషణ కోసం పరిశోధన నౌక నిర్మించేందుకు ప్రభుత్వం ఆర్డర్ చేసింది. కేవలం ఈ నౌక కోసం రూ.1,277 కోట్లు ఖర్చు చేస్తున్నారు. సముద్ర జీవశాస్త్ర అధ్యయనం కోసం అధునాతన మెరైన్ సెంటర్ రూ.692 కోట్లతో తమిళనాడులో ఏర్పాటుచేస్తున్నారు. కేంద్రం డీప్ ఓషన్ మిషన్ కు 2021–2026 మధ్య రూ.4,077 కోట్లు వెచ్చించనున్నట్టు ప్రకటించింది. ఈ ఏడాది మార్చి నాటికి సుమారు రూ.1,000 కోట్లు ఖర్చు చేశారు. హిందూ మహాసముద్రంలో 75,000 చదరపు కిలోమీటర్లు, పశ్చిమ హిందూ మహాసముద్రంలో 10,000 చ.కి.మీ. పరిధిలో సర్వే, అన్వేషణ కొనసాగిస్తారు. » మత్స్య–6000 వాహనం 6,000 మీటర్ల లోతులో 12 గంటల వరకు నిరంతర కార్యకలాపాలు సాగించేలా రూపొందుతోంది.» హిందూ మహాసముద్రంలో 75,000 చదరపు కిలోమీటర్లు, పశ్చిమ హిందూ మహాసముద్రంలో 10,000 చదరపు కిలోమీటర్ల పరిధిలో సర్వే, అన్వేషణ చేపడతారు.» సిబ్బందితో, అలాగే సిబ్బంది లేకుండా ఈ వాహనంతో 2025 జనవరి 22 నుంచి ఫిబ్రవరి 14 వరకు పలు పరీక్షలు పూర్తి చేశారు.» అండమాన్ సమీపంలో 47 లక్షల టన్నుల నికెల్, 42.9 లక్షల టన్నుల కాపర్, 5.5 లక్షల టన్నుల కోబాల్ట్, 9.25 కోట్ల టన్నుల మాంగనీస్ నిల్వలు ఉన్నట్టు ప్రాథమికంగా అంచనా వేశారు.» దశలవారీగా పరీక్షలు పూర్తి చేసుకుని 2026 చివరినాటికి మిషన్ కార్యరూపంలోకి రానుంది.2026 చివరినాటికి..మత్స్య–6000 వాహనం 6,000 మీటర్ల లోతులో 12 గంటల వరకు నిరంతర కార్యకలాపాలు సాగించేలా రూపొందుతోంది. అలాగే లోతైన నీటి పరిశీలన, అన్వేషణను నిర్వహించడానికి అత్యవసర సమయాల్లో 96 గంటల వరకు పనిచేయగలిగే సామర్థ్యమూ దీని ప్రత్యేకత. దేశీయంగా అభివృద్ధి చేసిన వెయ్యికి పైగా విడి భాగాలు, వందలాది సాంకేతికతలు వాహన తయారీలో వినియోగించారు. 25 టన్నుల బరువుండే ఈ అత్యాధునిక వాహనంలో ముగ్గురు ప్రయాణించొచ్చు. దశలవారీగా పరీక్షలు పూర్తి చేసుకుని 2026 చివరినాటికి మిషన్ కార్యరూపంలోకి రానుంది. డీఆర్డీఓ, ఐఐటీలు, భారత నావికా దళం, మిశ్ర ధాతు నిగమ్ తదితర సంస్థలు కూడా ఈ మిషన్ లో పాలుపంచుకున్నాయి. -
అరకు విహారం.. ఘుమ ఘుమల కాపీ సేవనం..!
అరకు టూర్ అంటే అరకొరగా ఉండదు. జీఐ ట్యాగ్ సొంతమైన కాఫీ రుచిలా ఉంటుంది. చక్కటి పచ్చదనం మధ్య కాఫీ తోటల్లో విహారం. చిక్కటి కాఫీ ఘుమఘుమల మధ్య ప్రకృతి వీక్షణం. గాలికొండ నుంచి నేలమ్మకు వందనం చేయడం. బొర్రా గుహల రాతి శిలల శిల్పచాతుర్యం. ఆదివాసీ మ్యూజియం చెప్తున్న నాటి జీవనశైలి...అందుకే దీనిని తూర్పు కనుమల రత్నం అన్నారు. వీటన్నింటినీ చూపిస్తుంది అరకులోయ పర్యటన.విశాఖపట్నం నుంచి అరకుకు సాగే ప్రయాణమే ఓ అద్భుతం. కేరళలోని వయనాడు ప్రయాణం పశ్చిమ కనుమల సౌందర్యానికి అద్దం పడుతుంది. తూర్పు కనుమల లాలిత్యానికి అరకు ప్రయాణం దర్పణమవుతుంది. ఈ కాఫీ రుచి కొలమానం ప్రపంచస్థాయి అవార్డే. జీఐ ట్యాగ్ అందుకున్న కాఫీ ఇది. కాఫీ గింజలు ఓ రకమైన కమ్మదనాన్ని గాల్లో మోసుకొస్తుంటాయి. తోటల్లో విహరిస్తున్నప్పుడు చెట్ల ఆకులు ఒంటిని తాకుతూ కలిగించే గిలిగింతను మాటల్లో వర్ణించలేం. కాఫీ చెట్ల లేత ఆకులు ముదరు కాఫీ గింజ రంగులో ఉంటాయి. లేత కాఫీ గింజలు పచ్చగా ఉంటుంది. ముదిరే కొద్దీ చిక్కటి ఎరుపుదనం సంతరించుకుంటాయి. ఎండిన తర్వాత నల్లగా మారుతాయి. కాఫీ తోటల విహారం తర్వాత ముందుకు సాగే కొద్దీ ఒక్కొక్క ప్రదేశమూ మినిమమ్ గ్యారంటీ ఆహ్లాదాన్నిస్తాయి.ట్రైబల్ మ్యూజియంఅరకు బస్ స్టేషన్ నుంచి కేవలం పావుకిలోమీటరు లోపే ఉంటుంది మ్యూజియం. తూర్పు కనుమల ప్రకృతి సౌందర్యం ఈ విజిట్లో ప్రత్యేక ఆకర్షణ. అరకు, విశాఖపట్నం పరిసరాల్లో 19 రకాల ఆదివాసీ జాతుల వాళ్లు నివసించేవారు. ట్రైబల్ కల్చర్, అందులోని వైవిధ్యతను పరిరక్షించే ఉద్దేశంతో దీనిని 1996లో ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో ఆదివాసీలు ప్రాచీన కాలం నుంచి ఉపయోగించిన వస్తువులు, ధరించిన ఆభరణాలు, దుస్తులు, వేటాడే సాధనాలు, వంట సామగ్రి, వారి పెళ్లి వేడుక ఫొటోలు ఉన్నాయి. ఆదివాసీలు రూపొందించిన చిత్రలేఖనాలు, కళారూపాలను కూడా చూడవచ్చు. వారి మయూర నృత్యం, ధింసా నృత్యం (dhimsa dance) శిల్పాలు ఆకర్షణీయంగా ఉంటాయి. ఎర్రమట్టితో నిర్మించి తెల్లటి అంచులతో ఈ భవనం ఆర్కిటెక్చర్ బాగుంటుంది. ఈ మ్యూజియం ఉదయం పది గంల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న మ్యూజియం కావడంతో టికెట్ నామమాత్రమే. పెద్దవాళ్లకు పది రూపాయలు, పిల్లలకు ఐదు రూపాయలు.పద్మపురం గార్డెన్స్ఇది అరకు బస్ స్టేషన్ (Araku Bus Station) నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరాన ఉంది. చాలా ప్రసిద్ధి చెందిన గార్డెన్ ఇది. పాతిక ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ గార్డెన్ని స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్ పాలన కాలంలో 1942లో ఏర్పాటు చేశారు. ఇక్కడ పండిన కూరగాయలు రెండవ ప్రపంచ యుద్ధంలో పోరాడిన సైనికుల కోసం వెళ్లేవని చెబుతారు. యుద్ధం ముగిసిన తర్వాత ఈ గార్డెన్ని హార్టికల్చర్ నర్పరీ, మొక్కల పెంపకంలో శిక్షణ కేంద్రంగా మార్చారు. ఇక్కడి వృక్ష శిల్పాలు కనువిందు చేస్తాయి. చెట్టుని శిల్పం ఆకారంలో మలిచి పెంచడానికి కొన్నింటికి దశాబ్దాలు పడుతుంది. ఈ గార్డెన్ మొత్తం తిరిగి చూడడానికి టాయ్ ట్రైన్ ఎక్కాలి. ఈ గార్డెన్లో ట్రీ టాప్ హట్స్ ఉన్నాయి. అంటే చెట్టు మీద గుడిసెలన్నమాట. టూరిస్టులు రాత్రి బస కోసం బుక్ చేసుకోవచ్చు. వీటిని హ్యాంగింగ్ కాటేజ్ అంటారు. ఈ గార్డెన్స్లో రోజ్ గార్డెన్ ఉంది. పద్మపురం గార్డెన్స్కి ఎంట్రీ టికెట్ పది రూపాయలు, ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అనుమతి.కుర్సురా మ్యూజియంఇది దేశ భద్రత కోసం 31 సంవత్సరాల΄ాటు నిర్విరామంగా సేవలందించి విశ్రాంతి తీసుకుంటున్న సబ్ మెరైన్. ఇండో– పాక్ యుద్ధంలో ఈ సబ్మెరైన్ అరేబియా సముద్రంలో గస్తీ కాసింది. ఆ తర్వాత అండమాన్ దీవులలో సేవలందించి తన సర్వీస్ కాలంలో 73,500 నాటికల్ మైళ్లు ప్రయాణించిన ఈ సబ్మెరైన్ 2001 నుంచి విశ్రాంతిలో ఉంది. ఇంతటి సమగ్రమైన సబ్మెరైన్ను ప్రభుత్వం 2002 లో ప్రదర్శనశాలగా మార్చింది. ఇది పిల్లలకు, పెద్దవాళ్లకు కూడా వినోదభరితంగా జ్ఞానాన్ని పంచే అధ్యయన కేంద్రం. దీని నిర్వహణకు ప్రభుత్వానికి సుమారుగా ఎనభై లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయి. అయితే ఈ సబ్మెరైన్ వీక్షణానికి వచ్చే పర్యాటకుల ఎంట్రీ టికెట్ల మీద ఏడాదికి కోటి రూపాయలను సంపాదిస్తోందీ సబ్మెరైన్. రోజుకు ఐదారు వందల మంది పర్యాటకులు వస్తుంటారు. సెలవు రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపవుతుంటుంది. విశాఖపట్నానికి వచ్చిన వాళ్ల రామకృష్ణ బీచ్ని, అందులో ఉన్న సబ్మెరైన్ మ్యూజియాన్ని చూడకుండా రారంటే అతిశయోక్తి కాదు.కైలాసగిరిఇది విశాఖపట్నం నగరానికి సమీపంలో ఆరువందల అడుగుల ఎత్తున్న కొండ. సుమారు నాలుగు వందల ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఎకోపార్కు ఇది. రోప్వేలో కొండమీదకు వెళ్లడం పిల్లలకే కాదు పెద్దవాళ్లకు కూడా జాయ్ఫుల్గా ఉంటుంది. బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అవార్డు అందుకున్న పర్యాటక ప్రదేశం ఇది. స్థానికులు, బయటి వాళ్లు అంతా కలిసి కైలాసగిరిని రోజుకు మూడు వేల మందికి పైగా సందర్శిస్తారు.గాలికొండ వ్యూపాయింట్ఈ టూర్లో తూర్పు కనుమల ప్రకృతి సౌందర్యాన్ని అనంతంగా ఆస్వాదించవచ్చు. విశాఖపట్నం– అరకు రీజియన్లో ఎత్తైన ప్రదేశం గాలికొండ. 4,320 అడుగుల ఎత్తు ఉంటుంది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పచ్చదనంలో షేడ్స్ను లెక్కపెట్టాలంటే ఈ రోడ్డు వెంట ప్రయాణిస్తున్నంత సేపూ కనురెప్ప వేయకుండా చూడాలి. ఇక బొర్రా గుహలు (Borra Caves) ఓ ప్రకృతి అద్భుతం. గుహల పై కప్పు నుంచి స్టాలగ్మైట్ ధారలు ధారలుగా కారుతూ వాతావరణంలో మార్పులతో గడ్డకట్టి΄ోయి ఉంటుంది. అమరనాథ్ లో మంచు శివలింగం రూపం సంతరించుకున్నట్లు ఇక్కడ స్టాలగ్మైట్తో ఏర్పడిన శివలింగం రూపానికి పూజలు చేస్తారు. అమర్నాథ్ మంచులింగం ఏటా కరిగిపోతూ కొత్తగా రూపుదిద్దుకుంటుంది. బొర్రా గుహల్లోని స్టాలగ్మైట్ శివలింగం స్థిరంగా ఉంటూ ఉంటుంది.చందనోత్సవ సింహాచలంశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఏడాదంతా చందనలేపనంతో ఉంటాడు. ఏడాదికోసారి చందనోత్సవం జరుగుతుంది. ఈసందర్భంగా పాత చందన లేపనాన్ని తొలగించి కొత్తగా చందనలేపనం చేస్తారు. స్వామి దేహం నుంచి తీసిన చందనాన్ని భక్తులకు ప్రసాదంగా పంచుతారు. ఈ ఆలయంలో కప్పస్తంభం అని ఉంటుంది. అది కప్పం అనే పదం నుంచి వచ్చింది. రాజుకు కప్పం కట్టని ఉద్యోగులను ఆ స్తంభానికి కట్టేసి శిక్షించేవారని స్థానిక కథనం. ఇప్పుడు భక్తులను ఆ స్తంభానికి కట్టేసి, తాడుతో సున్నితంగా రెండు దెబ్బలు వేస్తారు. ఆ స్తంభాన్ని కౌగలించుకుని కోరికలు కోరుకుంటే అవి తీరుతాయని ఒక విశ్వాసం. సంతానాన్ని కోరుకునే వారు. పుట్టిన సంతానాన్ని దేవుని దర్శనానికి తీసుకువచ్చి మొక్కు తీర్చుకునే వారు. దాంతో కప్పస్తంభాన్ని కౌగలించుకుని కోరుకుంటే సంతానం కలుగుతుందనే అభిప్రాయం వాడుకలోకి వచ్చింది. సింహాచలంలో సంపెంగ పూలు ప్రసిద్ధి. చందనం రంగులో పొడవుగా ఉండే ఈ పూలను అటవీ ప్రదేశం నుంచి ఆదివాసీలు సేకరించి తెస్తారు. వాటిని మాలలుగా కట్టి అమ్ముతారు. ఈ టూర్ గుర్తుగా ఓ దండ కొనుక్కుని తలకు అలంకరించుకోవచ్చు లేదా మెడలో మాలగా వేసుకుని పరిమళాన్ని ఆస్వాదించవచ్చు.అన్నవరంశ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం ఎంతటి ప్రసిద్ధి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అంతటి ప్రాశస్త్యం కలిగిన ఆలయం. పురాణాల్లో ఉదహరించిన రత్నాచలం అనే ప్రదేశం ఇదేనని చెబుతారు. ఈ ఆలయం ఉన్న కొండ పేరు రత్నగిరి. ఈ ఆలయంలో సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి భక్తులు ఆసక్తి చూపుతుంటారు. అరకు టూర్లో రైలు, రోడ్డు రవాణా సంస్థలు నిర్వహిస్తున్న ఈ రెండు ప్యాకేజ్లలో ఉన్న ప్రధానమైన తేడా అన్నవరం, సింహాచలం ఆలయాల విషయంలోనే. తెలంగాణ టూరిజమ్ బస్సు టూర్లో అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకోవచ్చు. ఐఆర్సీటీసీ టూర్లో వెళ్తే సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి స్వామి దర్శనం చేసుకోవచ్చు. మిగిలిన పర్యాటక ప్రదేశాలు రెండు టూర్లలోనూ ఒకే విధంగా ఉంటాయి. బస్ టూర్లో థింసా నృత్యం అదనం.జ్యూవెల్ ఆఫ్ ఈస్ట్కోస్ట్ ఐదు రోజుల టూర్లో విశాఖపట్నం, అరకు కవర్ అవుతాయి. అరకులో పర్యటించడానికి సెప్టెంబర్ నుంచి అనువైన సమయం. దసరా సెలవులకు ప్లాన్ చేసుకుంటే కాఫీ తోటల సౌందర్యాన్ని ఆస్వాదించడంతోపాటు పిల్లలకు సబ్ మెరైన్ నేవీ యుద్ధ నౌకను చూపించవచ్చు.ఐఆర్సీటీసీ టూర్ ఇలా ఉంది!మొదటి రోజు: గురువారం సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాలకు 12728 నంబర్ గోదావరి ఎక్స్ప్రెస్ హైదరాబాద్ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరుతుంది.రెండవ రోజు: శుక్రవారం ఉదయం 5.55 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. ఐఆర్సీటీసీ టూర్ నిర్వహకులు పర్యాటకులను రిసీవ్ చేసుకుని హోటల్కు తీసుకెళ్తారు. చెక్ ఇన్, రిఫ్రెష్మెంట్, బ్రేక్ఫాస్ట్ తర్వాత సిటీ టూర్. కాళీమాత ఆలయం, సబ్మెరైన్ మ్యూజియం వీక్షణం తర్వాత హోటల్కు వచ్చి లంచ్ చేయడం. మధ్యాహ్నం తర్వాత కైలాసగిరి సందర్శనం, రిషికొండ బీచ్ విహారం. రాత్రి బస విశాఖపట్నం హోటల్లో.మూడవ రోజు: బ్రేక్ఫాస్ట్ తర్వాత రోడ్డు మార్గాన అరకుకు ప్రయాణం. టైడా జంగిల్ బెల్స్ ఎకో టూరిజమ్ రిసార్ట్లో సేదదీరడం, పద్మపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం విజిట్ తర్వాత లంచ్ విరామం. మధ్యాహ్నం తర్వాత గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహల విహారం తర్వాత సాయంత్రానికి తిరిగి విశాఖపట్నంలోని హోటల్కు చేరడం, రాత్రి బస.నాలుగవ రోజు: బ్రేక్ఫాస్ట్ తరవాత హోటల్ గది చెక్ అవుట్ చేసి బయలుదేరాలి. దారిలో సింహాచలం దేవస్థానం, రామకృష్ణ బీచ్లో విహారం తర్వాత నాలుగు గంటలకు విశాఖపట్నంలో స్టేషన్లో డ్రాప్ చేస్తారు. సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు ట్రైన్ నంబర్ 12727 గోదావరి ఎక్స్ప్రెస్ బయలుదేరుతుంది. రాత్రంతా ప్రయాణం.ఐదవ రోజు: ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు హైదరాబాద్కు చేరడంతో టూర్ పూర్తవుతుంది.ఐఆర్సీటీసీ ప్యాకేజ్ ధరలివి: కంపర్ట్ కేటగిరీ (థర్డ్ ఏసీ), సింగిల్ షేరింగ్లో ఒక్కొక్కరికి దాదాపుగా 28 వేల రూపాయలవుతాయి. ట్విన్ షేరింగ్లో ఒక్కొక్కరికి 17 వేలవుతాయి. ట్రిపుల్ షేరింగ్లో 13 వేలకు పైగా ఉంటుంది.స్టాండర్డ్ కేటగిరీ (స్లీపర్) సింగిల్ షేరింగ్లో 26 వేలకు పైగా అవుతుంది. ట్విన్ షేరింగ్లో 15 వేలకు పైగా, ట్రిపుల్ షేరింగ్లో 11 వేలకు పైగా అవుతుంది.ప్యాకేజ్లో మూడు బ్రేక్ఫాస్ట్లు, ఒక లంచ్, రెండు డిన్నర్లుంటాయి.ఇది వీక్లీ టూర్. గురువారం మాత్రమే ఉంటుంది. ఇవి వర్తించవు: ప్యాకేజ్లో సూచించిన భోజనాలు తప్ప ఇతర భోజనాలు పర్యాటకులు సొంతంగా భరించాలి. రైల్లో కొనుక్కున్న తినుబండారాలు, పర్యాటక ప్రదేశాల ఎంట్రీ టికెట్లు, బోటింగ్, హార్స్రైడింగ్ వంటి ఇతర టికెట్లు వగైరాలు ప్యాకేజ్లో వర్తించవు.టూర్ కోడ్: https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR027తెలంగాణ టూరిజమ్ నిర్వహిస్తున్నరోడ్ ప్యాకేజ్ ఇలా ఉంది!మొదటి రోజు: సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్లోని పర్యాటక భవన్ (బేగంపేట, గ్రీన్ల్యాండ్స్) నుంచి తెలంగాణ టూరిజమ్ బస్ బయలుదేరుతుంది. అదే బస్సు ఆరున్నరకు బషీర్బాగ్ సీఆర్వో ఆఫీసు చేరుతుంది. ఆ స్టాప్కు సమీపంలో ఉన్న వాళ్లు అక్కడే ఎక్కవచ్చు. రాత్రంతా ప్రయాణం కొనసాగుతుంది.రెండవ రోజు: ఉదయం ఆరు గంటలకు బస్సు విశాఖపట్నం చేరుతుంది. హోటల్ గదిలో చెక్ ఇన్, రిఫ్రెష్మెంట్, బ్రేక్ఫాస్ట్ తర్వాత సిటీటూర్. కైలాసగిరి, సింహాచలం, రుషికొండ, సబ్మెరైన్ మ్యూజియం విజిట్, బీచ్ విహారం తర్వాత హోటల్కు చేరడం, రాత్రి బస.మూడవ రోజు: ఉదయం ఆరు గంటలకు అరకుకు ప్రయాణం. ట్రైబల్ మ్యూజియం విజట్, అనంతగిరి కాఫీ ప్లాంటేషన్లో విహారం, బొర్రా గుహల వీక్షణం, ధింసా నాట్యాన్ని ఆస్వాదించడం ఆ రాత్రికి అరకులో బస.నాలుగవ రోజు: అరకు నుంచి అన్నవరానికి ప్రయాణం. అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న తర్వాత బస్సు ప్రయాణం హైదరాబాద్కు సాగుతుంది.ఐదవ రోజు: ఉదయం ఏడు గంటలకు బస్సు హైదరాబాద్కు చేరడంతో టూర్ పూర్తవుతుంది.బస్ ప్యాకేజ్ ఇలా...తెలంగాణ టూరిజమ్ నిర్వహిస్తున్న అరకు టూర్ ప్యాకేజ్లో పెద్దవాళ్లకు ఒక్కొక్కరికి 6,999 రూపాయలు, పిల్లలకు 5,599 రూపాయలు.ప్యాకేజ్లో నాన్ ఏసీ బస్సు ప్రయాణం, వైజాగ్లో ఏసీ బస, అరకులో నాన్ ఏసీ బస ఉంటాయి.ఆహారం, పర్యాటక ప్రదేశాల్లో ఎంట్రీ టికెట్లు, దర్శనం టికెట్లు, బోటింగ్ వంటివేవీ వర్తించవు.– వాకా మంజులారెడ్డి, సాక్షి, ఫీచర్స్ ప్రతినిధి చదవండి: వైష్ణోదేవి దర్శనం.. హిమాలయాల వీక్షణం..! -
ఎంఎస్ఎంఈల్లో.. మహిళా శక్తి
భారతీయ మహిళా వ్యాపారులు పారిశ్రామిక రంగంలోనూ గణనీయమైన పురోగతి సాధిస్తున్నారు. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ఏర్పాటు, నిర్వహణలో వారు కీలకపాత్ర పోషిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎంఎస్ఎంఈల్లో సుమారు 40 శాతం కంపెనీలకు యజమానులు మహిళలే కావడం విశేషం. అత్యధికంగా 30 లక్షలపైచిలుకు మహిళా పారిశ్రామికవేత్తలతో దేశంలో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉంది. టాప్ – 10 రాష్ట్రాల జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలూ ఉన్నాయి.భారత్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగం ముఖ్య భూమిక పోషిస్తోంది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో 45%, మొత్తం ఎగుమతుల్లో 45% వాటా ఎంఎస్ఎంఈలదే అంటే ఇవి ఏ స్థాయిలో పురోగతి సాధించాయో అర్థం చేసుకోవచ్చు. జీడీపీలో ఎంఎస్ఎంఈల వాటా 37.54%కి చేరింది. దేశవ్యాప్తంగా 2025 జూలై 24 నాటికి 6,57,97,647 ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. వీటిలో 39.59 శాతం కంపెనీలకు యజమానులు మహిళలే. దేశంలోని మొత్తం ఎంఎస్ఎంఈల్లో సూక్ష్మ, చిన్న తరహావే 99.99%. సూక్ష్మ కంపెనీల్లో 39.79 శాతం, చిన్న తరహా కంపెనీల్లో 11.63 శాతం మహిళలు నెలకొల్పినవి ఉన్నాయి.ప్రభుత్వ ప్రోత్సాహంతో..ప్రధాన మంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (పీఎంఈజీపీ) సూక్ష్మ సంస్థల ఏర్పాటుకు మద్దతు ఇవ్వడం ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తోంది. 2008లో ప్రారంభమైన నాటి నుండి ఇది 9.87 లక్షలకు పైగా యూనిట్లకు సహాయం అందింది. 2023 సెప్టెంబర్లో రూ.13,000 కోట్ల వ్యయంతో ప్రారంభించిన పీఎం విశ్వకర్మ పథకం సంప్రదాయ చేతివృత్తుల వారి నైపుణ్యాలను, మార్కెట్తో అనుసంధానించడంలో కీలకపాత్ర పోషిస్తోంది. 2025 జూన్ 26 నాటికి ఈ పథకం లబ్ధిదారుల సంఖ్య 30 లక్షలు దాటింది.2020లో ప్రవేశపెట్టిన ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఎంఎస్ఎంఈలకు ఉచిత, పేపర్ రహిత రిజిస్ట్రేష¯Œ కు వీలు కల్పిస్తోంది. అనధికారిక వ్యాపారాలకు అధికారిక ప్రయోజనాలను విస్తరించడానికి ఉద్యమ్ అసిస్ట్ ప్లాట్ఫామ్ 2023లో అందుబాటులోకి వచ్చింది. ఎంఎస్ఎంఈ రంగంలో మహిళలను ప్రోత్సహించేందుకు, వారికి మార్గదర్శనం చేసేందుకు ‘యశస్విని’ అనే కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించింది.మార్కెట్ అనుసంధానాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు వినియోగించే వస్తు, సేవల్లో 25 శాతం సూక్ష్మ, చిన్న సంస్థల నుండి సేకరించాలని ప్రభుత్వ సేకరణ విధానం నిర్దేశించింది. దీనికింద ఇందులో 3 శాతం మహిళల యాజమాన్యంలోని వ్యాపారాల నుండి కొనుగోలు చేయాలి. ఇలాంటి అనేక కార్యక్రమాలతో మహిళలు ఈ రంగంలో దూసుకుపోతున్నారు.ఉద్యోగాల్లో 18.73%ఉపాధి: ఎంఎస్ఎంఈలకు సంబంధించిన ఉద్యమ్ పోర్టల్లో నమోదిత మహిళా వ్యాపారులు ఏర్పాటు చేసిన యూనిట్ల ద్వారా సృష్టించిన ఉద్యోగాలు.. మొత్తం ఉద్యోగాల్లో సుమారు 18.73%పెట్టుబడి: మొత్తం పెట్టుబడిలో మహిళల యాజమాన్యంలోని ఎంఎస్ఎంఈల వాటా 11.15%టర్నోవర్: మొత్తం టర్నోవర్లో వాటా 10.22%కేంద్రం విడుదల చేసిన ‘ఎమ్ఎస్ఎమ్ఈ వార్షిక నివేదిక 2024–25’ ప్రకారం..⇒ ఎమ్ఎస్ఎమ్ఈలు.. వ్యవసాయం తరవాత అతిపెద్ద ఉద్యోగ కల్పనా రంగం.⇒ మొత్తం సృష్టించిన ఉద్యోగాలు 24.4 కోట్లు⇒ మొత్తం ఎమ్ఎస్ఎమ్ఈల్లో సూక్ష్మ పరిశ్రమలు 98.6 శాతం.⇒ 2024 డిసెంబరు 31 నాటికి.. మొత్తం ఎమ్ఎస్ఎమ్ఈల్లో మహిళలు యజమానులుగా ఉన్న వాటి శాతం 28.8. -
చిరుత 'పల్లె' కరింపు
ఆత్మకూరురూరల్: చిరుత పులి ఎలాంటి ప్రాంతంలోనైనా ఉండగలదు. దట్టమైన నల్లమలలలోను, చిట్టడవులు మాత్రమే ఉన్న ఎర్రమలలోను, కంప చెట్లు, రాతి కొండలు ఉండే ఉమ్మడి కర్నూలు జిల్లా పశి్చమ ప్రాంలో హాయిగా బతికేస్తున్నాయి. అలాగే హైదరాబాదు, బెంగళూరు, ముంబయ్ లాంటి నగరాల శివార్లలోనూ జీవించ గలుగుతున్నాయి. ఇక గ్రామాల సంగతి చెప్పనవసరం లేదు. ఇటీవల ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలు చోట్ల చిరుతల సంచారం కనిపించడం, ప్రజల్లో కొంత ఆందోళన కలగడం జరుగుతోంది ఆహారం కోసమే..గ్రామాల పరిసరాల్లో చిరుతలు సంచరించడం సహజమైనదే. చిన్నపాటి దాక్కునే ప్రదేశం ఉన్నా చిరుతలు తమనుతాము దాచుకుని ఎవరికి కనిపించకుండా మనుగడ సాగించగలవు. పంట పొలాల్లో ఉండే కుందేళ్ళు, అడవి పందుల పిల్లల వంటి వన్యప్రాణులతో పాటు గ్రామాల్లోని కుక్కలను ఆహారంగా తీసుకుంటాయి. ఇటీవలి కాలంలో రాళ్ల కొండల్లో, పొదల్లో చిరుతల ఆహారం తగ్గి పోవడంతో అనివార్యంగా గ్రామాల వైపు చిరుతలు వస్తూ జనం కంట పడుతున్నాయి. గొర్ల మందల వద్ద ఉన్న కుక్కలను, ఆవుల మందల్లో ఉండే దూడలను లక్ష్యంగా చేసుకుని చిరుతలు ఆహార సేకరణ చేస్తుంటాయి.ఇదీ కారణం.. శ్రీశైలం మహాక్షేత్రంలో ఇటీవల చిరుత పులులు కాలనీల్లోని ఇళ్లలోకి కూడా వచ్చాయి. దీన్ని సునిశితంగా పరిశీలించిన అటవీ శాఖ అధికారులకు దీనికి ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ అనే వైరస్ సంబంధిత వ్యాధి కారణమని తేల్చారు. ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ వైరస్ పందులలో సంక్రమిస్తుంది. సున్నిపెంటలో కొందరు నడుపుతున్న పందుల ఫాంలోకి బెంగళూరు నుంచి తెచ్చిన పందుల వల్ల ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ చేరింది. ఈ పందులనుంచి ఆ వైరస్ అడవి పందులపై ప్రభావం చూపడంతో పెద్ద సంఖ్యలో అడవి పందులు మరణించాయి.పంది పిల్లలే ముఖ్య ఆహారంగా తీసుకునే చిరుతలకు దీనివల్ల ఆహారం కొరత ఏర్పడింది. దీంతో చిరుతలు అనివార్యంగా కుక్కలను ప్రత్యామ్నాయంగా ఎంచుకుని శ్రీశైలంలోకి తరుచూ వచ్చేవి. శ్రీశైలం దేవస్థానం వారు చిరుత ఆహారపు కొరతను గమనించకుండా పుణ్యక్షేత్రంలో సంచరించే కుక్కలను పట్టి వేరే ప్రాంతంలో వదిలారు. దీంతో చిరుతలు సున్నిపెంటల్లో ఇళ్లలో పెంచుకునే పెట్ డాగ్స్, ఇతర పెంపుడు జంతువులకోసం ఏకంగా ఇళ్ళలో ప్రవేశించ సాగాయి. రైతులకు ఎంతో మేలుచిరుత పులులు అడవి పందులను తిని రైతులకు ఎంతో మేలు చేస్తాయి. అడవి పందులు తమ సంతతిని విపరీతంగా పెంచుకుని మైదాన ప్రాంతాలకు విస్తరించిన సంగతి తెలిసిందే. ఇవి రైతుల పంటలను సర్వ నాశనం చేస్తూ తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. అయితే అడవి పంది పిల్లలను అమిత ఇష్టంగా వేటాడి తినడం చిరుత ప్రత్యేకత. అందుకే చిరుత పులులు రైతుల పొలాల వెంట సంచరిస్తూ పంది పిల్లల కోసం మాటు వేస్తుంటాయి. అలా పందులసంఖ్యను నియత్రించడం ద్వారా చిరుతలు రైతులకు మేలు చేస్తుంటాయి. కాగా.. చిరుత పులి తన ఆహార జంతువుల జాబితాలో మనిíÙని ఎంచుకోలేదు. రెండు కాళ్ల జంతువులు పులుల ఆహారపు మెనూలోనే లేవు. కోసిగి ప్రాంతంలో ఇటీవల ఒక చిరుత పంట పొలాల్లో మత్తుగా పడి ఉండడం స్థానికులు గమనించారు. దాన్ని వెంటాడి బంధించే ప్రయత్నం చేశారు. ఆ చిరుత పులి ఆ తరువాత మరణించింది. దాన్ని పోస్ట్మార్టం చేసిన వైద్యులు తేలి్చన సత్యం ఏమిటంటే అది ఏదో జంతువును వేటాడినపుడు ఎముక ఒకటి దాని పేగులకు పొడుచుకుని ఇన్ఫెక్షన్కు గురైంది. అది పడుకుని ఉండగా బంధించే యత్నం చేయడంతో ఆ జంతువు ఆందోళనకు గురై హృదయ స్పందన ఆగి మృతిచెందింది. ఇటీవల ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కొన్ని గ్రామాల్లో చిరుతలు సంచరిస్తున్నాయి. అడవిలో ఆహారపు కొరతతోనే అవి గ్రామాలవైపు వస్తున్నాయి.కర్నూలు జిల్లా కౌతాళం మండలం తిప్పలదొడ్డి గ్రామ శివారులో ఒక చిరుత కొబ్బరి చెట్టు ఎక్కడం ఇటీవల సంచలనం రేపింది. తాను వేటాడిన ఆహారాన్ని దాచుకునేందుకు చిరుతలు చెట్లు ఎక్కుతుంటాయి. అలాగే ఇతర జంతువుల నుంచి ప్రాణ భయం ఉన్నప్పుడు కూడా చెట్లు ఎక్కుతుంటాయి. అయితే తిప్పలదొడ్డి వద్ద ప్రజల సందడికి భయపడి రక్షణ కోసం చిరుత కొబ్బరి చెట్టు ఎక్కింది. -
చందమామపై ఎంచక్కా బతికేయొచ్చు!
చిన్నతనంలో గోరు ముద్దలు తినిపించేందుకు అమ్మ చందమామను చూపిస్తుంది. అన్నం తినేందుకు పరోక్షంగా అక్కరకొచ్చే చందమామ మన శాశ్వత స్థిరనివాసానికి ఆమోదయోగ్యంగా లేదని ఇన్నాళ్లూ అంతా భావించారు. భూమి మాదిరి అక్కడ వాతావరణం, గాలి, నీరు వంటివేమీ అక్కడ లేకపోవడమే ఇందుకు ప్రధానకారణం. జీవన మనుగడకు కీలకమైన ఆక్సిజన్, నీటి కొరతల సమస్యను తీర్చేలా చంద్రుని మట్టి నుంచే ఆ రెండింటినీ తయారుచేసి చూపి చైనా శాస్త్రవేత్తలు మానవాళి చంద్రునిపై స్థిరనివాస కలలకు కొత్త రెక్కలు తొడిగారు. నీటి తయారీకి పనికొచ్చే కీలక మూలకాలు చంద్రుని మట్టిలో పుష్కలంగా ఉన్నాయని చైనా శాస్త్రవేత్తలు తాజాగా ప్రకటించారు. చాంగ్–ఈ–5 మిషన్ ద్వారా తీసుకొచి్చన చంద్రశిలలు, చంద్రుని మట్టిని సమగ్ర స్థాయిలో విశ్లేíÙంచడం ద్వారా చంద్రునిపైనే ఉదజని, జీవజలం పునర్సృష్టి సాధ్యమని చైనా శాస్త్రవేత్తలు వెల్లడించారు. కొత్త సాంకేతికత సాయంతో చంద్రుని నేల నుంచి నీరు, ఆక్సిజన్ను తయారుచేసి చూపడం విశేషం. సంబంధిత పరిశోధనా తాలూకు వివరాలు సెల్ ప్రెస్ వారి ‘జూలీ’ జర్నల్లో ప్రచురితమయ్యాయి. లీటర్ నీటికి రూ.19 లక్షలు !! అంతరిక్ష పరిశోధనలో భాగంగా వ్యోమగాములు భవిష్యత్తులో చంద్రునిపై ఎక్కువ కాలం గడపాల్సి రావొచ్చు.ఆ సమయంలో ఆక్సిజన్, నీరువంటి ప్రాణాధార వ్యవస్థలను అక్కడ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. భూమి మీద నుంచి వ్యోమనౌక ద్వారా వందల లీటర్ల నీటిని, భారీ స్థాయిలో ఆక్సిజన్ సిలిండర్లను తరలించడం ఎంతో శ్రమతో, అంతకుమించిన ఖర్చుతో కూడిన వ్యవహారం. కేవలం 3.785 లీటర్ల( ఒక గ్యాలన్) నీటిని భూమి మీద నుంచి చంద్రుడి వద్దకు వ్యోమనౌకలో చేర్చాలంటే కనీసం రూ.72 లక్షలు ఖర్చు అవుతుంది. అంటే ఒక లీటర్ నీటిని ఇక్కడి నుంచి అక్కడికి పంపాలంటే అక్షరాలా పంతొమ్మిది లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంతటి వ్యయప్రయాసలకోర్చి పంపేకంటే అక్కడే నీటిని తయారుచేస్తే ఉత్తమం అన్న నిర్ణయానికొచ్చి ఆమేరకు చైనా శాస్త్రవేత్తలు కొత్త సాంకేతికతను విజయవంతంగా అభివృద్ధిచేశారు. చందమామ మట్టి నుంచి నీటిని సంగ్రహించి ఆ నీటి సాయంతో కార్భన్డయాక్సైడ్ను ఆక్సిజన్గా, ఇతర ఇంధన సంబంధిత రసాయనాలుగా మార్చే సాంకేతికతను చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. ఏమిటీ టెక్నాలజీ? ఈ టెక్నాలజీ సాయంతో చంద్రుని మట్టి నుంచి నీటిని సంగ్రహించవచ్చు. ప్రయోగాల కోసం అక్కడే ఉన్న వ్యోమగామని ఉచ్చా్వస నుంచి వెలువడిన కార్భన్డయాక్సడ్ను ఇదే నీటి సాయంతో కార్భన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ వాయువుగా మార్చొచ్చు. ఇలా అందుబాటులోకి వచి్చన కార్భన్మోనాక్సైడ్, హైడ్రోజన్ ఇంధనం, ఆక్సీజన్ తయారీ కోసం ఉపయోగించుకోవచ్చు. ఇలా తయారైన ఆక్సిజన్ను మళ్లీ అక్కడి వ్యోమగాముల కోసం సిలిండర్లలో భద్రపరుస్తారు. ఈ టెక్నాలజీ పనిచేయడానికి అవసరమయ్యే వేడిని తీక్షణమైన సూర్యరశ్మి నుంచి సంగ్రహించనున్నారు. టైటానియం ఐరన్ ఆక్సైడ్ ధాతువులున్న చంద్రుని ‘ఇన్మెనైట్’ మట్టితో నీటిని సృష్టించడం సాధ్యమేనని శాస్త్రవేత్తలు చెప్పారు. ల్యాబ్లో సూక్ష్మస్థాయిలో నీటిని, ఆక్సిజన్ను సృష్టించగలిగామని, చంద్రునిపై వ్యోమగామలు నిరంతరం శ్వాసించి, ఉపయోగించుకునే స్థాయిలో ఆక్సిజన్ తయారీకి మరికొంత కాలం ఆగకతప్పదని పరిశోధకులు తెలిపారు. ఆ రోజు కోసం మేం కూడా ఎదురుచూస్తున్నామని వారు వ్యాఖ్యానించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రూ.10 లక్షలున్నా ప్రాపర్టీ కింగ్..!
ఓ ఇల్లు లేదా వాణిజ్య భవనానికి యజమాని అయితే ఆ దర్జాయే వేరు! స్థిరమైన ఆదాయంతో ఆర్థికంగా అండగా నిలిచే ప్రాపర్టీ ఉంటే చెప్పలేనంత నిశి్చంత. ప్రాపర్టీపై పెట్టుబడి ఎన్నో తరాలను ధనవంతులను చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, నేడు ఇళ్లు, వాణిజ్య స్థలాల ధరలు అందుబాటులో లేనంతగా పెరిగిపోయాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా స్థలాల లభ్యత పెరగదన్నది వాస్తవం. కనుక ప్రాపర్టీ ఇక ముందూ పెట్టుబడుల పరంగా మెరుగైన సాధనమే అవుతుంది. భారీ పెట్టుబడి పెట్టలేని వారు సైతం ప్రాపర్టీకి సహ యజమాని అయ్యే అవకాశం కల్పిస్తున్నవే ‘ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ ప్లాట్ఫామ్’లు. ‘ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్’కు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. తక్కువ బడ్జెట్తోనే ప్రాపర్టీపై పెట్టుబడికి లభిస్తున్న అవకాశాన్ని సొంతం చేసుకునేందుకు ఎక్కువ మంది (గతంతో పోల్చితే) ముందుకు వస్తున్నారు. తక్కువ పెట్టుబడికి వీలు కల్పించడం ఇందులో ఉన్న సౌలభ్యం. ఇదే ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. అసలు ఈ సాధనం ఎలా పనిచేస్తుంది? ప్రయోజనాలు, పన్ను తదితర అంశాల గురించి తెలుసుకుందాం. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడికి ఇదొక వినూత్న సాధనం. అధిక విలువ కలిగిన ప్రాపర్టీకి ఏ ఒక్కరో యజమానిగా కాకుండా.. ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఉమ్మడిగా వాటా కలిగి ఉండడం. దీనివల్ల ప్రయోజనం ఏంటి? అంటే.. తమ వాటా మేరకు రాబడి అందుకోవచ్చు. ఇల్లు కొనుగోలుకు రూ.50 లక్షలు, ఇంకా ఎక్కువే పెట్టుబడి అవసరం. ఇక్కడ మాత్రం రూ.10 లక్షలు ఉన్నా సరే ఆ మేరకు వాటా లభిస్తుంది. ముఖ్యంగా ధరలు భారీగా పెరిగిపోయిన ప్రాంతాల్లో పెట్టుబడికి ఎంతో అనుకూలం. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ నిబంధనలు (సవరణ), 2014కు మార్పులు చేయడం ద్వారా సెబీ కొత్తగా స్మాల్ అండ్ మీడియం రీట్ (ఎస్ఎం రీట్) విభాగాన్ని ప్రవేశపెట్టింది. ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ను నియంత్రణల పరిధిలో మరింత మందికి చేరువ చేసేందుకు, పారదర్శకత, సౌలభ్యం కోసం తీసుకొచ్చింది. ఫ్రాక్షనల్ ఓనర్షిప్ (పాక్షిక యాజమాన్యం)ను ఆఫర్ చేసే ప్రతి ప్లాట్ఫామ్ కూడా స్మాల్ అండ్ మీడియం రీట్ (ఎస్ఎం రీట్)గా సెబీ వద్ద నమోదు చేసుకోవాలి. ఇవి ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన నిధులను స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)కు బదిలీ చేస్తాయి. ఆఫీస్ వసతులు, గోదాములు, డేటా సెంటర్లు తదితర వాటిపై ఎస్పీవీ పెట్టుబడులు పెడతాయి. ప్రతి పెట్టుబడిదారుడికి వారి వాటా మేరకు డిజిటల్ సర్టిఫికెట్ జారీ అవుతుంది. రాబడులను వారి వాటాకు అనుగుణంగా పంపిణీ చేస్తారు. సెబీ నియంత్రణ ఎస్ఎం రీట్ సాధనాలు సెబీ పర్యవేక్షణ కింద పనిచేస్తుంటాయి కనుక రక్షణ ఉంటుంది. ‘‘ఈ ప్లాట్ఫామ్లు తమ నిర్వహణలోని ఆస్తుల విలువను రెండేళ్లకోసారి స్వతంత్రంగా మదింపు వేయించి, ఆ వివరాలను బహిరంగంగా ప్రకటించాలి. పనితీరు, ఆస్తుల వివరాలు, రిస్్కలు, ప్రయోజన వైరుధ్యం తదితర సమాచారాన్ని వెల్లడించాలి’’ అని ట్రైలీగల్కు చెందిన కునాల్షా తెలిపారు. వీటిలో రకాలు.. నివాస భవనాలు: ఇందులో పెట్టుబడిపై అద్దె ఆదాయం మోస్తరుగా ఉంటుంది. దీర్ఘకాలంలో పెట్టుబడి విలువ సైతం వృద్ధి చెందుతుంది. వాణిజ్య ప్రాపర్టీలు: అధిక అద్దె ఆదాయం లభిస్తుంది. పెట్టుబడి విలువ వేగంగా వృద్ధి చెందుతుంది. ప్రాపర్టీ కొంత కాలం పాటు ఖాళీగా ఉండడం వంటి కొన్ని రిస్్కలు ఇందులో ఉంటాయి. ఎమర్జింగ్ అస్సెట్ క్లాసెస్: గోదాములు, డేటా సెంటర్లు, కో–వర్కింగ్ స్పేస్లకు ఇవి వేదికగా ఉంటాయి. వీటిల్లో పెట్టుబడిపై అద్దె రాబడి స్థిరంగా ఉంటుంది. డిమాండ్ ఎక్కువ. కనుక వసతులు ఖాళీగా ఉండకుండా అద్దె ఆదాయం స్థిరంగా లభిస్తుంది. పెట్టుబడులకు వైవిధ్యం రియల్ ఎస్టేట్లో పెట్టుబడుల పరంగా వైవిధ్యం ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్తో సాధ్యపడుతుంది. భారీ పెట్టుబడి ఒకే ప్రాపర్టీకి పరిమితం కాకుండా చూసుకోవచ్చు. ఒకటికి మించిన ప్రాపర్టీలపై ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా ఆదాయంలో వైవిధ్యాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకే ప్రాంతం కాకుండా భిన్న ప్రాంతాల్లోని, భిన్న రకాల ప్రాపర్టీలపై (ఆఫీసులు, గోదాములు, ఇళ్లు) పెట్టుబడి పెట్టుకోవడం ఇందులో ఉన్న సౌలభ్యం. అయితే అన్ని ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ప్లాట్ఫామ్లు ఎస్ఎం రీట్లుగా నమోదై లేవు. పెట్టుబడి వృద్ధితోపాటు రాబడి స్థిరమైన ఆదాయానికితోడు పెట్టుబడి విలువ కూడా నిరీ్ణత కాలంలో ఎంతో కొంత వృద్ధి చెందుతుంది. ఆస్తులను నిపుణులైన మేనేజర్లు నిర్వహిస్తుంటారు. ప్రాపర్టీల నిర్వహణ, కిరాయిదారుల నుంచి అద్దెలు వసూలు, చట్టపరమైన ప్రక్రియలను అనుసరించడం తదితర బాధ్యతలన్నింటినీ వారు చూసుకుంటారు. కనుక పెట్టుబడిదారులకు ఈ తలనొప్పులేవీ ఉండవు. ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రస్తుతం 500–600 మిలియన్ డాలర్లుగా (దాదాపు రూ.5,160 కోట్లు) ఉంటుందని ఖైతాన్ అండ్ కో పార్ట్నర్ హర్ష్ పారిఖ్ తెలిపారు. వచ్చే 8–10 ఏళ్లలో 5 నుంచి 5.5 బిలియన్ డాలర్ల స్థాయికి (రూ.47,300 కోట్లు) చేరుకుంటుందని అంచనా వేశారు.పెట్టుబడికి ముందు చూడాల్సినవి.. → ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ప్లాట్ఫామ్లు సెబీ వద్ద నమోదయ్యాయా? లేవా అన్నది తప్పకుండా చూడాలి. అంతేకాదు ప్రాపర్టీ సైతం రెరా రిజిస్టర్డ్ అయి ఉండాలి. లీజు డాక్యుమెంట్లు, యాజమాన్యం వివరాలను సరి చూసుకోవాలి. → కొన్ని ప్లాట్ఫామ్లపై పెట్టుబడికి లాకిన్ పీరియడ్ ఉంటోంది. దీన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. → సొంతంగా ప్రాపర్టీ కొనుగోలుకు భారీ పెట్టుబడి అవసరం. కావాలనుకున్నప్పుడు వేగంగా విక్రయించడ అన్ని వేళలా సాధ్యపడదు. ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ అయినా లేదా ఎస్ఎం రీట్లు అయినా కొంచెం వేగంగా విక్రయించుకోవచ్చు. → కొన్ని ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ప్లాట్ఫామ్లు (సెబీ వద్ద నమోదు కాని) రూ.5 లక్షల నుంచి పెట్టుబడికి వీలు కల్పిస్తున్నాయి. వీటి రిజిస్ట్రేషన్, వాస్తవికత తెలుసుకున్న తర్వాతే పెట్టుబడిపై నిర్ణయం తీసుకోవాలి. సెబీ రిజిస్టర్డ్ ఎస్ఎం రీట్ లేదా రీట్ల్లో ఈ తరహా రిస్క్ ఉండదు. కానీ సెబీ రిజిస్టర్డ్ ఎస్ఎం రీట్లు పెద్ద సంఖ్యలో అందుబాటులో లేవు. అదే ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ప్లాట్ఫామ్లు చాలా ఉన్నాయి. → కనీస పెట్టుబడి అన్నది ప్లాట్ఫామ్ ఆధారంగా వేర్వేరుగా ఉంటుంది. ప్రతీ ప్లాట్ఫామ్లోనూ రూ.10 లక్షలే ఉండాలని లేదు. → ఎంపిక చేసుకునే ప్రాపర్టీ ఏ ప్రాంతంలో ఉంది? అక్కడ లీజుకు ఉన్న డిమాండ్ ఏ పాటిది? భవిష్యత్తులో బలమైన వృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతమేనా? తదితర అంశాలను పరిశీలించాలి.ఎవరికి అనుకూలం? స్థిరమైన ఆదాయం కోరుకునే విశ్రాంత జీవులు, ఇతరులు ఎవరికైనా ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ లేదా ఎస్ఎం రీట్లు అనుకూలమే. సంప్రదాయ ఈక్విటీలు, డెట్ సాధనాలకు అదనంగా వైవిధ్యం కోసం అనుకూలిస్తాయి. ‘‘అద్దె రూపంలో 8–9 శాతం రాబడులు ఎంతో మెరుగైనవి. పైగా ఈ రాబడి ద్రవ్యోల్బణంతో ముడిపడి ఉంటుంది. ఏటా 5 శాతం మేర పెరుగుతూ ఉంటుంది’’ అని ‘ప్రాపర్టీ షేర్’ సహ వ్యవస్థాపకుడు కునాల్ మోక్తాన్ వివరించారు. ఏడాది మించిన పెట్టుబడి దీర్ఘకాల మూలధన లాభం కిందకు వస్తుంది. లాభంపై 12.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎస్ఎం రీట్లు పంపిణీ చేసే డివిడెండ్లపై పన్ను లేదు. వడ్డీ ఆదాయం మాత్రం వార్షిక ఆదాయానికి కలిపి చూపించి పన్ను చెల్లించాలి. ఎస్ఎం రీట్ – రీట్ → రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్) అన్నది ఒక కంపెనీ. ఆదాయాన్నిచ్చే వాణిజ్య ఆస్తులను నిర్వహిస్తుంటుంది. షేర్ల మాదిరే స్టాక్ ఎక్సే్ఛంజ్ల్లో లిస్ట్ అయిన రీట్లను ఒక్క యూనిట్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. సిప్ మాదిరే ప్రతి నెలా కొద్ది మొత్తం పెట్టుబడులకు లిస్టెడ్ రీట్లకు అనుకూలమైన సాధనం. ఇవి పెద్ద స్థాయి ఆస్తులపై పెట్టుబడులు పెడుతుంటాయి. నేరుగా కాకుండా పరోక్షంగా అన్ని ప్రాపర్టీల కలయికతో పెట్టుబడి ఉంటుంది. → ఎస్ఎం రీట్లు మధ్య, చిన్నస్థాయి ఆస్తులపై పెట్టుబడులు పెడుతుంటాయి. వీటిల్లో ఇన్వెస్టర్ ఎంపిక మేరకు ఒక ప్రాపర్టీ లేదా ఒకటికి మించిన ప్రాపర్టీల్లో పెట్టుబడులకు వీలుంటుంది. ఒక విధంగా ఇది ప్రత్యక్ష పెట్టుబడి. ఒకటికి మించిన ప్రాపర్టీల కలయికతో పెట్టుబడి ఉండదు. ప్రతీ ప్రాపర్టీకి విడిగా సర్టిఫికెట్ జారీ చేయాల్సిందే. → ఎస్ఎం రీట్లు రూ.50 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు ఆస్తులపై పెట్టుబడులు పెడుతుంటాయి. రెగ్యులర్ రీట్లు రూ.500 కోట్లకు పైగా విలువైన వాటిపై ఇన్వెస్ట్ చేస్తుంటాయి. → ఎస్ఎం రీట్లలో తమకు ఇష్టమైన ప్రాపర్టీని ఎంపిక చేసుకోవచ్చు. పెట్టుబడి ప్రాపర్టీ వారీగా విడివిడిగా ఉంటుంది. రీట్లో ఇందుకు అవకాశం లేదు. → ఎస్ఎం రీట్లలో కనీస పెట్టుబడి రూ.10 లక్షలు. రెగ్యులర్ రీట్లలో కనీసం ఒక యూనిట్ను కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. → ఎస్ఎం రీట్లు కనీసం 5–6 ఏళ్లు, అదే రెగ్యులర్ రీట్లు అయితే మరింత దీర్ఘకాలం కోసం ఎంపిక చేసుకోవచ్చు. పెట్టుబడి ఎందుకు? అసలు ప్రాపర్టీపై ఎందుకు పెట్టుబడి పెడుతున్నారు? రాబడి కోసమా, సంపద సృష్టి కోసమా అన్నది తేల్చుకోవాలి. ఎందుకంటే రాబడి, పెట్టుబడి విలువ వృద్ధి కోరుకునే వారికి ఈ తరహా డిజిటల్ రియల్ ఎస్టేట్ సాధనాలే అనుకూలం. ఒకవేళ సొంత వినియోగం కోసం అయితే నేరుగా ప్రాపర్టీని కొనుగోలు చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. ఒక ప్రాపర్టీని సొంతంగా కొనుగోలు చేసుకోవడానికి పెద్ద మొత్తం పెట్టుబడి కావాలి. అంత స్తోమత లేని వారికి ఈ తరహా సాధనాలు అనుకూలం. పైగా పెట్టుబడులు అన్నీ ఒకే విభాగంలో ఉండరాదు. ఈక్విటీ, డెట్, బంగారం, రియల్ ఎస్టేట్ సాధనాల మధ్య వైవిధ్యం చేసుకోవడం చక్కని సమతూకంతో, రిస్క్ పరంగా మెరుగైన ప్రణాళిక అవుతుంది. రియల్ ఎస్టేట్పై పెట్టుబడికి ఫ్రాక్షనల్ ఓనర్షిప్ లేదా రీట్లను తప్పకుండా పరిగణనలోకి తీసుకోవచ్చు. దీనికంటే ముందు రిస్క్లు, సానుకూలతలు, ప్రతికూలతలను సమగ్రంగా తెలుసుకోవాలి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
‘టెస్ట్ ట్యూబ్’లో.. మీ ‘బేబీ’యేనా?
పిల్లలు పుట్టలేదని సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్లిన మహిళకు భర్త శుక్రకణాలతో కాకుండా వేరే వ్యక్తి శుక్రకణాలతో సంతానం కలిగించిన ఘటన సికింద్రాబాద్లో వెలుగులోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం ‘సృష్టి’ంచింది. ఇటీవలి కాలంలో జంటల్లో సంతాన సాఫల్యత తగ్గడమే.. ఇలాంటి కేంద్రాలు పెరగడానికి కారణం. ఈ సమస్య తీవ్రత ఎంత ఎక్కువంటే... ప్రతి ఆరు వివాహిత జంటల్లో ఒకరు సంతానలేమితో బాధపడుతున్నారని అంచనా. దీంతో పలువురు దంపతులు కృత్రిమ గర్భధారణకు మొగ్గుచూపుతున్నారు. ఈ డిమాండ్ను ఆసరా చేసుకున్న కొన్ని ఫెర్టిలిటీ సెంటర్లు దంపతుల పట్ల అనైతికంగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కృత్రిమ గర్భధారణలో ఐవీఎఫ్ (టెస్ట్ట్యూబ్ బేబీ) ప్రాధాన్యమేమిటి? అది ఎప్పుడు, ఎందుకు చేస్తారు? దంపతులు ఎక్కడ మోసపోయే అవకాశం ఉంటుంది? ప్రభుత్వం నియమ నిబంధనలూ, మార్గదర్శకాలు ఏమిటి?సాక్షి, ఫీచర్స్ – హెల్త్ డెస్క్ .ఇటీవల మనదేశంలో సంతానలేమితో బాధపడుతున్నవారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీనికి ప్రధానంగా రెండు రకాల కారణాలున్నాయి. మొదటిది.. సామాజిక కారణాలు. యువత పై చదువుల కోసం, మంచి ఉద్యోగాలంటూ తమ కెరీర్ కోసం ఎక్కువ సమయం కేటాయించడం; ఉద్యోగాల్లో తీవ్రమైన ఒత్తిడి, వేళాపాళా లేని పనివేళలు, మారుతున్న ఆహారపు అలవాట్లు, వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవడం; అధిక బరువు (స్థూలకాయం), మద్యపానం, పొగతాగడం, డ్రగ్స్ వంటి అనారోగ్యకర అలవాట్లు. ఇక రెండోది ఆరోగ్యపరమైనవి.. మహిళల్లోని హార్మోన్లలో అసమతౌల్యత, ఇన్ఫెక్షన్లు, స్త్రీలలో పుట్టుకతోనే అండాల సంఖ్య తక్కువగా ఉండటం; మగవారిలో వీర్యకణాల సంఖ్య, కదలిక తక్కువగా ఉండటం, నాణ్యతలేమి.ఐవీఎఫ్ : ‘ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్’కు సంక్షిప్త రూపమే ఐవీఎఫ్. జనసామాన్యంలో దీనికి ‘టెస్ట్ట్యూబ్ బేబీ’ అని పేరు. స్త్రీ, పురుషులిద్దరిలోనూ ఫలదీకరణ విషయంలో సమస్యలు ఉన్నప్పుడు ఈ మార్గాన్ని సూచిస్తారు. ఇందులో ముందుగా మహిళలో అండాలు పెద్దమొత్తంలో పెరిగేందుకు మందులిస్తారు. అలా పెరిగిన అండాల్లోంచి ఆరోగ్యంగా ఉన్న కొన్నింటిని సేకరించి, పురుషుడి నుంచి సేకరించిన వీర్యకణాలతో ల్యాబ్లోని ‘టెస్ట్ట్యూబ్’లో ఫలదీకరణం చేస్తారు. ఇందులో కొన్నిసార్లు ఒకటి కంటే ఎక్కువ పిండాలు పెరగవచ్చు (అందుకే ఈ పద్ధతిలో చాలామందిలో కవలలు పుడుతుంటారు). ఇలా రూపొందించిన వాటిల్లో ఆరోగ్యకరమైన పిండాలను మళ్లీ మహిళ గర్భంలోకి ప్రవేశపెడతారు. రెండువారాలకు నిర్ధారణ పరీక్షలు చేస్తారు. నాలుగు వారాల తర్వాత అల్ట్రాసౌండ్ పరీక్ష చేసి, గర్భం నిలిచిందా లేదా అన్నది నిర్ధారణ చేసుకుంటారు. గర్భం నిలవకపోతే కారణాలను విశ్లేషించి, మళ్లీ కొన్ని నెలలు ఆగి ప్లాన్ చేస్తారు. ఇలా రెండుమూడు సార్లు ప్రయత్నిస్తారు.ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ (ఐసీఎస్ఐ): పురుషుల్లో సమస్య ఉంటే అనుసరించే మార్గమిది. మగవారి నుంచి ఎంపిక చేసుకున్న ఆరోగ్యంగా ఉన్న శుక్రకణాన్ని నేరుగా అండంలోకి ప్రవేశపెడతారు.పిండాలను భద్రపరిచి..: ఐవీఎఫ్ ప్రక్రియలో రూపొందిన పిండాల సంఖ్యను బట్టి, ఒకసారి ఒకటి లేదా రెండు పిండాలను గర్భాశయంలోకి పంపి, మిగతా వాటిని ‘విట్రిఫికేషన్’ అనే పద్ధతి ద్వారా ఫ్రీజ్ చేసి భద్రపరుస్తారు. ఐవీఎఫ్ ప్రక్రియ మొదటిసారి సఫలం కానప్పుడు, అలా భద్రపరచిన పిండాలను తీసుకొని మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు. లేదా ఇంకొకసారి గర్భం దాల్చాలనుకున్నప్పుడు కూడా వాడుకోవచ్చు. పరిశోధనలకు ఇవ్వవచ్చు. లేదా వాటిని నిర్జీవపరచమని కోరవచ్చు. క్లినిక్లు వీటిలో ఏది చేయాలన్నా దంపతుల అనుమతితోనే చేయాలి. ఈ విషయంపై కూడా దంపతులకు పూర్తి అవగాహన లేకపోవడం వల్ల మోసాలు జరిగే అవకాశం ఉంది.ఐవీఎఫ్ ఎవరి కోసమంటే..సాధారణ చికిత్సలతో గర్భం రాక.. ఇంకా వేచిచూసేంత ఓపిక లేనివాళ్లకి. వయసు 38 – 40 ఏళ్లు దాటిన వారికి అండాల సంఖ్య, నాణ్యత బాగా తగ్గిపోతున్నవారికివీర్యకణాల సంఖ్య, కదలిక, నాణ్యత బాగా తక్కువగా ఉన్నప్పుడు. భార్య లేదా భర్తలో ఏవైనా జన్యుపరమైన సమస్య ఉండి, అది పిల్లలకూ వచ్చే అవకాశం ఉన్నప్పుడు, ఐవీఎఫ్ ద్వారా తయారైన పిండాలనుంచి ఒక దాన్ని తీసి, ప్రీ–ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నసిస్ (పీజీడీ) ద్వారా పరీక్ష చేసి, జన్యు సమస్య లేని పిండాలను వేరుపరచి, తల్లి గర్భాశయంలోకి పంపిస్తారు.కొందరు కెరీర్ కోసమో లేదా వ్యక్తిగత కారణాల వల్లో గర్భధారణను వాయిదా వేస్తారు. వాళ్లలో కొందరు ముందుగానే ఐవీఎఫ్ పద్ధతి ద్వారా తయారైన పిండాలను భద్రపరచుకొని, ఆ తర్వాత వీలైనప్పుడు ఫ్రోజెన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ద్వారా గర్భాశయంలోకి ప్రవేశింపచేయడం ద్వారా గర్భం ధరిస్తారు. ఈ సందర్భంలో కూడా దంపతులు అప్రమత్తంగా ఉండాలి. పిండాలు మారిపోయే అవకాశం ఇక్కడ కూడా ఉంటుంది.ఇవీ నియమ నిబంధనలుకృత్రిమ గర్భధారణ విషయంలో ఇన్ఫెర్టిలిటీ కేంద్రాలకూ, అలాగే ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ‘ద ఏఆర్టీ (అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్) యాక్ట్ ఆఫ్ 2021’, అలాగే ‘సరోగసీ యాక్ట్ ఆఫ్ 2021’ వంటి చట్టాలు చేసింది. ఇన్ఫెర్టిలిటీ క్లినిక్లు ఈ నియమ నిబంధనలను పాటించాలి. దంపతులు కూడా ఈ చట్టాలపై కొంత అవగాహన కలిగి ఉంటే మంచిది.దేశంలోని ప్రతి ఐవీఎఫ్ సెంటర్.. కేంద్ర, రాష్ట్ర ఏఆర్టీ బోర్డు కింద నమోదు చేసుకుని ఉండాలి. ఐవీఎఫ్ చికిత్సకు తాము అంగీకరిస్తున్నట్టుగా దంపతులు ఆమోదపత్రం ఇవ్వాలి. ఈ ప్రక్రియ నిర్వహిస్తున్న నిపుణులు.. ఐవీఎఫ్ ప్రక్రియ గురించి పూర్తి వివరాలు దంపతులకు తెలియజేయాలి. తమ దగ్గర చికిత్స తీసుకుంటున్న దంపతుల వివరాలను, వారి మెడికల్ రికార్డులను క్లినిక్లు గోప్యంగా ఉంచాలి. తమకు జరుగుతున్న చికిత్స, వైద్యపరీక్షల వంటి పూర్తి వివరాలు పేషెంట్లు తెలుసుకోవచ్చు. క్లినిక్ నిర్వాహకులు / డాక్టర్లు అన్ని వివరాలనూ పేషెంట్లకు వివరించాలి. చికిత్సకు సంబంధించిన అన్ని రికార్డులూ పేషెంట్లకు ఇవ్వాలి. తమకు కలిగే అసౌకర్యాల విషయంలో ఫిర్యాదు చేసేందుకు ప్రతి క్లినిక్ తమ దగ్గర ఓ ఫిర్యాదుల కేంద్రాన్ని (గ్రీవెన్స్ సెల్) ఏర్పాటు చేయాలి.దాతలకు నియమ నిబంధనలివి..కేంద్ర / రాష్ట్ర ఏఆర్టీ బోర్డు ఆధ్వర్యంలో నమోదు చేసుకున్న ఏఆర్టీ బ్యాంకుల నుంచే క్లినిక్లు అండాలను / శుక్రకణాలను స్వీకరించాలి.ఇటీవల ఎవరో బిచ్చగాళ్లు, ఆరోగ్యం సరిగా లేనివారిని దాతలుగా కొన్ని సంస్థలు శాంపిళ్లు సేకరించినట్లు వార్తలొచ్చాయి. ఇది కఠిన శిక్షార్హమైన నేరం. దాతల ఎంపికకూ, అండాలు ఇచ్చే మహిళా దాతలుగానీ లేదా శుక్రకణాలను ఇచ్చే పురుషుల అర్హతల గురించీ స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. దాతల నుంచి అండాలు లేదా శుక్రకణాలను స్వీకరించే సమయంలో స్వీకర్తలకు దాతల గురించి, ఈ విషయంపై ఉన్న నియమ నిబంధనలూ తెలుపుతూ కౌన్సెలింగ్ చేయాలి.– డాక్టర్ ప్రీతీ రెడ్డి, సంతాన సాఫల్య నిపుణురాలు, హైదరాబాద్ఐవీఎఫ్ పేరిట క్లినిక్ల నయా మోసాలుదాతల విషయంలో అప్రమత్తత అవసరంచట్టాలపై అవగాహనతో అక్రమాలకు అడ్డుకట్టవివరాలన్నీ క్లినిక్లు దంపతులకు చెప్పాల్సిందేపేషెంట్ల వివరాలు గోప్యంగా ఉంచాల్సిందేఐవీఎఫ్ విజయావకాశాలుఇవి ప్రధానంగా మహిళ వయసు మీద ఆధారపడి ఉంటాయి. 40 ఏళ్లు దాటాక.. వయసు పెరిగే కొద్దీ సక్సెస్ రేటు తగ్గుతుంది. అండాలు, పిండం నాణ్యత తక్కువగా ఉంటే ఆ మేరకు సక్సెస్ రేటూ తగ్గిపోతుంది. దంపతుల జీవనశైలి కూడా ప్రభావం చూపుతుంది. ధూమపానం, మద్యపానం అలవాటున్నవారు, ఊబకాయం ఉన్నవారిలో అండాల సంఖ్య, నాణ్యత సహజంగా తక్కువగా ఉండవచ్చు. దాంతో సక్సెస్రేటూ తగ్గుతుంది. -
ఏజెంటిక్ ఏఐ.. ఉద్యోగ విప్లవం.. ఏమిటి దీని ప్రత్యేకత?
సాధారణంగా ఏఐ అంటే.. మనం ఏదైనా అడిగితే జవాబు చెప్పే చాట్బాట్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే.. ఒక పాట ప్లే చేయమనగానే చటుక్కున ప్లే చేసే స్మార్ట్ స్పీకర్ లాంటిది. కానీ, ‘ఏజెంటిక్ ఏఐ’ దీనికి భిన్నమైనది. – సాక్షి, స్పెషల్ డెస్క్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో మార్పులు, ఏయే ఉద్యోగాలకు ముప్పు రావచ్చు అంటూ ఈ మధ్య మనం చాలా వింటున్నాం. అయితే, అందరూ ఊహిస్తున్న దానికంటే చాలా పెద్ద మార్పు మన ముందుకు రాబోతోంది. వచ్చే ఐదేళ్లలో దేశంలో ఏకంగా కోటికి పైగా ఉద్యోగాలను ఓ కొత్త రకం ఏఐ పూర్తిగా మార్చనుంది. అదే ’ఏజెంటిక్ ఏఐ’. అయితే ఈ మార్పు వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం అక్కర్లేదు. ఎందుకంటే.. ఇది యువతకు కొత్త అవకాశాలు, దారుల్ని తెరుస్తోంది. ఈ ఏఐతో పని వేగం పెరిగి, పనులన్నీ సులభంగా మారిపోనున్నాయి.రిటైల్ రంగంవ్యాపారాలు ఎదుర్కొనే అతి పెద్ద సవాళ్ళలో ఒకటి.. మార్కెట్ ట్రెండ్లు, వినియోగదారుల నుంచి వచ్చే సమాచారాన్ని వేగంగా విశ్లేషించడం. ఏజెంటిక్ ఏఐ ఈ సమస్యను తీరుస్తుంది. ఈ రంగంలో 76 లక్షల ఉద్యోగాలు మార్పునకు గురవుతాయట. ఏఐ ఏజెంట్లు కస్టమర్ల ఇష్టాలను బట్టి వారికి నచ్చే వస్తువులను చూపించడం, ఎప్పుడు ఏ వస్తువు స్టాక్లో ఉందో తెలుసుకోవడం, కస్టమర్ సర్వీస్కు జవాబులు చెప్పడం వంటివి చేస్తాయి. ఈ ఏఐ వల్ల ఉద్యోగులకు విలువైన సమయం ఆదా అవుతుంది. వారు మార్కెట్ మార్పులకు స్పందించడంపై దృష్టి పెట్టొచ్చు. అయితే, ఈ ఏఐ నిర్ణయాలకు మనుషుల పర్యవేక్షణ చాలా ముఖ్యం. ఆటోమేషన్, మానవ నిర్ణయాల మధ్య సమతుల్యత సాధించొచ్చు.విప్లవాత్మక మార్పులు!ఈ ఏజెంటిక్ ఏఐ మన రోజువారీ జీవితాన్ని, ముఖ్యంగా పనిచేసే విధానాన్ని పూర్తిగా మార్చేయనుంది అంటున్నారు టెక్ నిపుణులు.పని విధానంలో మార్పులు: మనం చేసే కొన్ని పనులు బోరింగ్గా, రోజూ ఒకే రకంగా ఉంటాయి. ఈ ఏఐ ఆ రొటీన్ పనులను పూర్తిగా తన చెప్పుచేతల్లోకి తీసుకుంటుంది. దీంతో మనుషులు క్రియేటివ్గా ఆలోచించడం, కొత్త వ్యూహాలు రూపొందించడం లాంటి కీలకమైన పనులపై దృష్టి పెట్టొచ్చు.కొత్త ఉద్యోగాలు, కొత్త నైపుణ్యాలు: ఏఐ వల్ల కొన్ని ఉద్యోగాలు మారినా, కొత్త ఉద్యోగాలూ పుట్టుకొస్తాయి. ఉదాహరణకు, డేటా ఎంట్రీ చేసేవాళ్లు ఏఐని ఎలా ఉపయోగించాలి అని గైడ్ చేసే ‘ఏఐ సూపర్ వైజర్’గా మారొచ్చు. ఈ మార్పును ఎదుర్కోవడానికి మనం ఏఐ టూల్స్ వాడటం, సృజనాత్మకంగా ఆలోచించడం వంటి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి.ఏయే రంగాల్లో..‘సర్వీస్నౌ ఏఐ స్కిల్స్ రీసెర్చ్ 2025’ ప్రకారం, కొన్ని కీలక రంగాల్లో ఈ ఏఐ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఈ రంగంలో ఏకంగా 80 లక్షల ఉద్యోగాలు మారబోతున్నాయి. ఏఐ ఏజెంట్లు ఒక వస్తువు తయారీకి కావాల్సిన ముడి పదార్థాలను మేనేజ్ చేయడం, యంత్రాలు ఎప్పుడు పాడైపోతాయో ముందే చెప్పడం, ఉత్పత్తి వేగాన్ని పెంచడం వంటివి చేస్తాయి. దీంతో మనుషులు యంత్రాల పర్యవేక్షణ, మరమ్మతులు వంటి పనులు చేయాల్సి రావొచ్చు.విద్యారంగంఈ రంగంలో 25 లక్షల ఉద్యోగాలు మారనున్నాయి. ఏఐ ఏజెంట్లు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా చదువుకునే ప్రణాళికలు తయారు చేయడం, అసై¯Œ మెంట్లను కరెక్ట్ చేయడం, వెంటనే ఫీడ్బ్యాక్ ఇవ్వడం వంటివి చేస్తాయి. దీంతో టీచర్లు క్లాస్రూమ్లో విద్యార్థులపై మరింత శ్రద్ధ పెట్టడం, వారికి మార్గదర్శకత్వం చేయడం వంటి వాటిపై ఫోకస్ చేయవచ్చు.ఏఐతో కలిసి పనిచేయాలిఇది కేవలం ఆటోమేషన్ మాత్రమే కాదు. పని అంటే ఏంటో తిరిగి నిర్వచించుకునే సమయం. ఈ ఏఐ విప్లవం వల్ల దేశ యువతకు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి, కొత్త రకాల ఉద్యోగాలు చేయడానికి అపారౖమెన అవకాశాలు లభిస్తాయి. ఏఐతో కలిసి పనిచేయడం ఎలాగో నేర్చుకోవాలి. అప్పుడే భవిష్యత్తులో మనం మరింత మెరుగ్గా రాణించగలుగుతాం. ఏజెంటిక్ ఏఐ అనేది మన శత్రువు కాదు, మన పనిని సులభతరం చేసే ఒక స్మార్ట్ పార్ట్నర్.– సుమీత్ మాథుర్, ఎస్వీపీ–ఎండీ, సర్వీస్నౌ ఇండియాడేటా సెక్యూరిటీ సమస్యఏజెంటిక్ ఏఐ వల్ల డేటా సెక్యూరిటీ విషయంలో కంపెనీలకు ఇంకా పూర్తి స్పష్టత రాలేదని సర్వీస్నౌ నివేదిక చెబుతోంది. ఇందుకోసం ఎలాంటి నైపుణ్యాలు అవసరమవుతాయో తమకు తెలియడం లేదని 26 శాతం కంపెనీలు చెప్పాయట. -
అమెరికా పొమ్మంటోంది... జర్మనీ రమ్మంటోంది!
సాక్షి ఎడ్యుకేషన్ డెస్క్: ఏటా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రెండు లక్షలకుపైగా విద్యార్థులు అమెరికాలో చదువుకోవడానికి వెళ్తున్నారు. అయితే, డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక అమెరికాలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులతో భారత విద్యార్థులు ఇతర దేశాలవైపు చూస్తున్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ఆయా దేశాలు ముందుకొస్తున్నాయి. మనదేశంలో ప్రముఖ యూనివర్సిటీలతో ఒప్పందాలు చేసుకుని కోర్సులను అందిస్తున్నాయి.ఈ క్రమంలో జర్మన్ యూనివర్సిటీలు, జర్మనీ ప్రభుత్వం భారతదేశ విద్యార్థులకు ఆహా్వనం పలుకుతున్నాయి. జర్మన్ యూనివర్సిటీల్లో చేరేందుకు విద్యార్హతలు, వీసా ప్రాసెస్ను సులభతరం చేశాయి. ఇప్పటివరకు జర్మనీలో విద్యాభ్యాసం చేయాలంటే జర్మన్ రావడం తప్పనిసరిగా ఉండేది. అయితే ఇప్పుడు ఈ నిబంధనను పక్కనపెట్టి ఆంగ్ల మాధ్యమంలోనూ కోర్సులను అందిస్తున్నాయి, తద్వారా జర్మన్ భాష వస్తేనే అక్కడ విద్య, ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోగలమనే భావనను చెరిపివేస్తున్నాయి. మెకానికల్, ఆటోమొబైల్ నుంచి ఏఐ వైపు..ఇప్పటివరకు జర్మనీ అంటే మెకానికల్, ఆటోమొబైల్ రంగాలకు మంచి పేరుండేది. ప్రస్తుతం ప్రపంచమంతా ఏఐ, ఎంఎల్ డిజిటలైజేషన్ వైపు దూసుకుపోతుండటంతో జర్మనీలో ప్రముఖ కంపెనీలు కూడా వీటివైపు మొగ్గుచూపుతున్నాయి. ఈ తరుణంలో భారతీయ విద్యార్థులు, కంప్యూటర్ రంగ నిపుణులకు జర్మనీలో మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ఒకవైపు అమెరికా, కెనడా వంటి దేశాల్లో భారత విద్యార్థులకు ప్రతికూల పరిస్థితులు తలెత్తుతున్న వేళ మరోవైపు జర్మనీలో అవకాశాలు కనిపిస్తున్నాయి. యూరప్ ఖండంలోనే అతి పెద్ద ఆరి్థక వ్యవస్థ అయిన జర్మనీలో 65ఏళ్లు పైబడినవారు పెరుగుతున్నారు. దీంతో నిపుణులైన యువత అవసరం ఆ దేశానికి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అమెరికాలో అవకాశాలు సన్నగిల్లుతున్నవేళ మన విద్యార్థులకి జర్మనీ ఒక సువర్ణ అవకాశంగా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.జర్మన్ వర్సిటీతో కలిసి జేఎన్టీయూ–హెచ్ కొత్త కోర్సు⇒ జర్మనీలో విద్య, ఉపాధి అవకాశాలను తెలుగు విద్యార్థులు అందిపుచ్చుకునేలా జేఎన్టీయూ–హైదరాబాద్ ముందడుగు వేసింది. ఇటీవల రెండు ప్రముఖ జర్మన్ యూనివర్సిటీలతో జేఎన్టీయూ–హెచ్ ఒప్పందం కుదుర్చుకుంది. వాటిలో ఒకటి ప్రపంచంలో మూడో అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా నిలిచిన జర్మనీకి చెందిన రాయుట్లింగ్ యూనివర్సిటీ నాలెడ్జ్ ఫౌండేషన్ (కేఎఫ్ఆర్యూ). ఈ విద్యా సంస్థతో కలిసి జేఎన్టీయూ–హెచ్ కంప్యూటర్ సైన్స్ (సీఎస్ఈ) విభాగంలో ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ అండ్ మాస్టర్స్ ప్రోగ్రామ్(ఐఐబీఎంపీ) కోర్సును ప్రారంభించింది. ⇒ 2025–26 విద్యా సంవత్సరానికి ఈ కోర్సులో చేరడానికి తెలుగు రాష్ట్రాల విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించి మొదటి విడత కౌన్సెలింగ్ కూడా నిర్వహించింది. ⇒ రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థుల డిమాండ్తో ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సుకు రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించాలని జేఎన్టీయూ–హెచ్, కేఎఫ్ఆర్యూ నిర్ణయించాయి. ⇒ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇంటరీ్మడియెట్ లేదా సీబీఎస్ఈ/ఐసీఎస్ఈ బోర్డుల ద్వారా ఎంపీసీ గ్రూపులో కనీసం 60 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు ఐఐబీఎంపీ కోర్సుకు అర్హులు. ⇒ జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ మెయిన్(జేఈఈ మెయిన్)–2025 లేదా తెలంగాణ, ఏపీ ఎంసెట్–2025 ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ⇒ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: ఆగస్టు 11. ⇒ రెండో విడత కౌన్సెలింగ్ను ఆగస్టు 12న హైదరాబాద్ కూకట్పల్లిలోని జేఎన్టీయూ–హెచ్ క్యాంపస్లో నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం 9044112999, 9044117999 నంబర్లలో సంప్రదించాలి. ⇒ దరఖాస్తులు, కోర్సు కరిక్యులమ్, ఇతర సమగ్ర వివరాల కోసం జ్టి్టpట://్జn్టuజి.్చఛి.జీn/, ఠీఠీఠీ.జ ౌb్చ pటౌజట్చఝట.జీnలో చూడొచ్చు. -
లో కార్బ్.. హై ఫ్యాట్!
రోజూ మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం ఉండేది పిండి పదార్థాలే. వీటివల్ల మనం రోగాల బారిన పడుతున్నాం. కడుపులోకి వెళ్లిన పిండి పదార్థాన్ని పచనం చేసి, గ్లూకోజ్గా మార్చి, శరీరానికి శక్తినిచ్చే పని ఇన్సులిన్ అనే హార్మోన్ ద్వారా జరుగుతుంది. అవసరానికి మించి పిండి పదార్థాలు, హానికరమైన కొవ్వు పదార్థాలను మనం రోజూ తినడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వాన్ని కోల్పోతుంది. అందువల్ల శరీరంలో అధికంగా ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ ఫలితం లేని స్థితికి చేరినప్పుడు ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ ఏర్పడుతోంది. అధిక బరువు దగ్గరి నుంచి క్యాన్సర్ వరకు 64 రకాల జబ్బులకు ఇదే కారణమవుతోందన్న అవగాహన ఇటీవల కాలంలో పెరిగింది. అందువల్ల పిండిపదార్థాలను తక్కువగా తీసుకుంటూ.. మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే అనారోగ్యాలు దరిచేరవు అంటున్నారు వైద్య నిపుణులు. దీన్నే ‘లో కార్బ్ హై ఫ్యాట్’ – ఎల్సీహెచ్ఎఫ్ ఆహార పద్ధతిగా చెబుతున్నారు. – సాక్షి, సాగుబడిపిండి పదార్థాలను ఎక్కువగా తింటే..మనం తినే ఆహారం జీర్ణమై గ్లూకోజ్గా మారి, శరీర భాగాలు నిర్విరామంగా పనిచేయటానికి శక్తిగా ఉపయోగపడుతుంది. ఆహారంలో పిండి పదార్థాలు పెరిగితే రక్తంలో చక్కెర శాతాలూ పెరుగుతాయి. శరీరం ఈ చక్కెరలను కరిగించడానికి, శక్తి ఉత్పత్తి చేయటానికి కనీసం 2 నుంచి 3 గంటల సమయం తీసుకుంటుంది. ఈ ప్రక్రియను నిర్వహించే ఇన్సులిన్ చాలినంత లేకపోయినా, సరిగ్గా పనిచేయకపోయినా రక్తంలో చక్కెర శాతం నియంత్రణలో ఉండదు.» ఆహారం ద్వారా అందే గ్లూకోజ్లో అవసరమైనప్పుడు వెంటనే వాడుకోవటానికి వీలుగా కొంత మేరకు గ్లైకోజెన్గా మారుతుంది. మిగిలిపోయిన అదనపు శక్తిని కొవ్వుగా మార్చి నిల్వ చేసుకునే సామర్థ్యం శరీరానికి ఉంది» గ్లైకోజెన్.. బ్యాంకు ఖాతాలో ఎప్పుడైనా వాడుకోవటానికి సిద్ధంగా ఉండే సొమ్ములాంటిది. కొవ్వుగా మారిన గ్లూకోజ్ను.. ఫిక్స్డ్ డిపాజిట్గా చెప్పుకోవచ్చు.» గ్లూకోజ్ ఒకసారి కొవ్వుగా మారితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప, తిరిగి దానికదే గ్లూకోజ్గా మారదు. ఈ కొవ్వును జీవన క్రియ ద్వారానే కరిగించి శక్తిగా మార్చగలం.» పిండి పదార్థాలు తక్కువగా, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండే లో కార్బ్ హై ఫ్యాట్ (ఎల్సీహెచ్ఎఫ్) ఆహారం తీసుకుంటే శరీరంలో అధిక కొవ్వును సులువుగా కరిగించవచ్చు.కొవ్వు పదార్థాలు ఎక్కువగా తింటే..ఊబకాయులు ఆహారం పరిమితం చేసినా, ఉపవాసం ఉన్నా కూడా బరువు తగ్గటం కంటే పెరుగుతారు. ఈ విచిత్రమైన పరిస్థితి ఎందుకంటే, మనకు ఎక్కువ ఆకలి వేసినప్పుడు ఇన్సులిన్ ప్రభావం అధికమై ఆహారంలోని పిండి పదార్థాలను కొవ్వుగా మార్చి నిల్వ చేస్తుంది. ఈ పరిస్థితి మారాలంటే మన ఆహారంలో అధిక సంతృప్త కొవ్వులు ఉన్న నూనె వాడాలి. తద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గి, బరువు పెరుగుదలను నివారించవచ్చు. దీనికి తక్కువ పిండి పదార్థాలు ఉండే ఆహారాన్ని కలిపితే శరీరంలో ఉన్న నిల్వ కొవ్వు కూడా కరగటం మొదలవుతుంది.ఏ నిష్పత్తిలో తీసుకోవాలి?ప్రధానంగా మనం తీసుకునే ఆహారంలోని స్థూల పోషకాలు మూడు.. పిండి పదార్థాలు(కార్బోహైడ్రేట్లు), మాంసకృత్తులు (ప్రొటీన్లు), కొవ్వు పదార్థాలు (ఫ్యాట్స్). ఎల్సిహెచ్ఎఫ్ పద్ధతి ప్రకారం.. ఉదాహరణకు.. 172 సెం.మీ. ఎత్తు, 82 కిలోల బరువు ఉన్న వ్యక్తి.. 10 కిలోల బరువు తగ్గాలనుకుంటే.. రోజువారీ తీసుకోవాల్సినవి..» నికర పిండి పదార్థాలు – 20 గ్రా. (పిండి పదార్థం నుంచి పీచును మినహాయిస్తే మిగిలేవి)» మాంసకృత్తులు – 70 గ్రా.» ఆరోగ్యకరమైన కొవ్వులు – 100–150 గ్రా.ఈ మూడూ కలిపి కనిష్ఠంగా 1200 నుంచి గరిష్ఠంగా 1500 క్యాలరీల వరకు ఉండాలి.» ఈ ఆహార విధానం అందరికీ ఒకేలా ఉండదు. అందువల్ల దీనిపై అవగాహన ఉన్న వైద్యులను సంప్రదించి, వారి పర్యవేక్షణలోనే ఈ ఆహారం, జాగ్రత్తలు తీసుకోవాలి.» ప్రతి మనిషికి.. వారివారి అనారోగ్య సమస్యలు, ఆరోగ్య లక్ష్యాలు.. వీటన్నింటి ఆధారంగా వైద్యులు అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తారు. ఈ ఆహార నియమావళికి అలవాటు పడటానికి కొన్ని రోజుల నుంచి కొన్ని వారాల సమయం పట్టవచ్చు.నేనూ వాడి.. లబ్ధి పొందానునేను గత 47 సంవత్సరాలుగా వేలాది గుండె శస్త్రచికిత్సలు, ముఖ్యంగా బైపాస్ సర్జరీలు చేశాను. తక్కువ పిండి పదార్థాలు, ఎక్కువ ‘ఆరోగ్యకరమైన కొవ్వులు’ ఉండే ఆహారం వాడకం ప్రపం^è వ్యాప్తంగా చాలా మందికి సహాయకారిగా నిలిచింది. నేనూ ఇది పాటించి లబ్ధి పొందాను. 17 ఏళ్ల క్రితం మధుమేహం, రక్తపోటుకు ఇన్సులిన్ ఇంజక్షన్లు వాడేవాడిని. మొదట్లో ఈ ఆహార పద్ధతిని నేనూ నమ్మలేదు. రెండేళ్లు పరిశోధన చేసి ఈ నియమావళిని నమ్మి ప్రారంభించాను. ఇందులో గానుగ నుంచి తీసిన కొబ్బరి నూనె వాడకం చాలా ప్రధానం. 6 వారాల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. ఇన్సులిన్ ఇంజక్షన్, రక్తపోటుకు మందులు వాడటం ఆపేశాను. ‘లో కార్బ్ స్కూల్’ అనే యూట్యూబ్ చానల్లో.. అనేక ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఎలాంటి ఆహార పద్ధతులు పాటించారో చాలా వీడియోలు కూడా చేశాను. - డా. పి.వి. సత్యనారాయణ, ప్రముఖ కార్డియో థొరాసిక్ సర్జన్, ఎస్సీహెచ్ఎఫ్ ఆహార పద్ధతి నిపుణులు, హైదరాబాద్