Sakshi Special
-
ఇంటర్, ఇంజనీరింగ్ కోర్సుల పేరిట ‘ముందస్తు’ దోపిడీ
హలో సార్... మీ పాప మౌనిక పదవ తరగతి చదవుతున్నది కదా..!. ఇంటర్కు ఏం ప్లాన్ చేస్తున్నారు సార్? మాది ఫలనా కార్పొరేట్ కాలేజీ. ఐఐటీ, ఈపీసెట్ కోచింగ్, ఏసీ, నాన్ ఏసీ స్పెషల్ బ్యాచ్లు ఉన్నాయి. హాస్టల్ సౌకర్యం కూడా ఉంది. ఇప్పుడు జాయిన్ అయితే ఫీజులో కొంత డిస్కౌంట్ ఉంటుంది. పరీక్షల తర్వాత సీట్లు కష్టం. అర్హత పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఫీజులు పెరుగుతాయి. ముందుగా సీటు రిజర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి కాలేజీ క్యాంపస్కు విజిట్ చేసి చూడండి.సార్ గుడ్ ఈవెనింగ్, కార్తీక్ ఫాదరేనా? మీ అబ్బాయి ఇంటర్మీడియట్ (Intermediate) చదువుతున్నాడు కదా. బీటెక్ (BTECH) కోసం ఏం ప్లాన్ చేశారు. తమిళనాడు, కేరళలోని ఫలానా యూనివర్సిటీల్లో బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఏఐఎంల్, డేటాసైన్స్, మెకానికల్ తదితర కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఆసక్తి ఉంటే చెప్పండి.. రాయితీలు ఇప్పిస్తాం... ...టెన్త్, ఇంటర్ చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఇప్పుడు ఇలాంటి ఫోన్ల బెడద రిగింది. కనీసం బోర్డు పరీక్షలు కూడా కంప్లీట్ కాకముందే కార్పొరేట్ కాలేజీలు (Corporate Colleges) బేరసారాలు ప్రారంభించాయి. అడ్డగోలు ఫోన్లు, ఆఫర్లతో తల్లిదండ్రులను అయోమయానికి గురిచేస్తున్నాయి. పరీక్షలు కూడా రాయకుండా అడ్మిషన్లు ఎలా తీసుకోవాలి..తీసుకోకుంటే ఫీజులు ఇంకా పెరుగుతాయేమో అని వారు ఆందోళనకు గురవుతున్నారు. సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాకుండానే.. ముందస్తు అడ్మిషన్లతో కార్పొరేట్ కళాశాలలు హడావుడి చేస్తున్నాయి. అనుమతి లేకుండా విద్యార్థుల డేటాను సంపాదించి వారి తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తూ వల విసురుతున్నారు. ఫోన్లే కాకుండా వాట్సాప్లకు అడ్మిషన్ల మెసేజ్లు పంపుతున్నారు. వీటికి ఎక్కువగా తల్లిదండ్రులు ప్రభావితమవుతున్నారు. ముందుగా మేల్కోకుంటే ఫీజులు ఎక్కడ పెంచుతారోనని వారు ఆందోళన చెందుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని అందిన కాడికి దోచుకునేందుకు కార్పొరేట్ ఇంటర్, ఇంజనీరింగ్ కళాశాలలు గాలం వేస్తున్నాయి. ఆకట్టుకునేలా బ్యాచ్కో పేరు పెట్టి రంగు రంగుల బ్రోచర్లు చూపి మంచి భవిష్యత్తు అంటూ ఆశల పల్లకిలో విహరింపజేస్తూ రూ.లక్షల్లో ఫీజులు బాదేస్తున్నారు. మరోవైపు పీఆర్ఓలు... వచ్చే విద్యా సంవత్సరం అడ్మిషన్ల కోసం పలు విద్యాసంస్థల పీఆర్ఓలు కూడా రంగంలోకి దిగారు. విద్యార్థుల తల్లిదండ్రులు కొద్దిగా ఆసక్తి కనబర్చినా చాలు విద్యార్థుల ఇళ్ల వద్దకు క్యూ కడుతున్నారు. నామినల్ రోల్ ద్వారా విద్యార్థుల వివరాలు ఫోన్ నెంబర్లు, చిరునామా సేకరిస్తున్నారు. వాటి కోసం సంబంధిత విభాగాల ఇన్చార్జిలకు విందులు, నజరానాలు సమకూర్చుతున్నారు. నిబంధనల ప్రకారం విద్యార్థుల వివరాలు ఎవరికి ఇవ్వరాదు. కానీ కాసులకు కక్కుర్తి పడి కింది స్థాయి సిబ్బంది కొందరు విద్యార్థుల సమాచారం అందిస్తున్నారు. దీంతో పీఆర్ఓ ఉదయం నుంచి రాత్రి వరకు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి బ్రోచర్లు ఇవ్వడం.. కళాశాలల గురించి వివరిస్తూ తల్లిదండ్రులను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అడ్మిషన్లు ఎక్కువగా చేసిన వారికి ఇన్సెంటివ్ అవకాశం ఉండటంతో పోటీపడుతున్నారు.నిబంధనలకు విరుద్ధంగా సాధారణంగా పదో తరగతి, ఇంటర్ పరీక్షల ఫలితాలు వెలువడిన తర్వాతనే అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఇక ఈసారి గతేడాది కంటే ఫీజులు అధికంగా చెబుతున్నట్లు తెలుస్తోంది. కనీసం 20 శాతం అధికంగా ఫీజుల దోపిడీకి కళాశాలలు సిద్ధమయ్యాయి. ఇంటర్కు సంబంధించి ‘సూపర్, స్టార్, సీఓ’ బ్రాంచ్ల పేరిట కొన్ని కళాశాలలు ఏడాదికి రెండున్నర నుంచి మూడు లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. ఇక ఇంజనీరింగ్ కోర్సులకు రూ.ఐదు నుంచి రూ.10 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇదీ చదవండి: బడి బయటే బాల్యం -
చారిత్రక దారి.. 300 ఏళ్ల మెట్లబావి
నాటి చారిత్రక కట్టడాలు నేటి తరానికి గొప్ప సంపద. గతాన్ని చూడని ఇప్పటి జనానికి అలనాటి నిర్మాణాలే సజీవ సాక్ష్యాలు. దశాబ్దాల కాలం నాటి నిర్మాణాలు చెక్కుచెదరకుండా ఇప్పటికీ పటిష్టంగానే ఉండటం అప్పటి సాంకేతికతకు నిదర్శనం. యంత్రాలు, ఇతర నిర్మాణ పనిముట్ల గురించి తెలియని సమయంలో కేవలం మానవుల తెలివితో చేపట్టిన నిర్మాణాలు నేటి సాంకేతికత కంటే చాలా పటిష్టంగా ఉన్నా యి. అలాంటి వారసత్వ సంపద ఎక్కడ ఉన్నా గుర్తించి రక్షించుకోవాల్సిన అవసరం ఉంది.రాజధానికి 52 కి.మీ. దూరంలో..హైదరాబాద్కు (Hyderabad) సరిగ్గా 52 కి.మీ. దూరంలో 65వ నెంబరు జాతీయ రహదారిపై విజయవాడ (Vijayawda) మార్గంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ (Choutuppal) మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం (Lingojigudem) గ్రామం ఉంది. ఈ గ్రామంలో జాతీయ రహదారి వెంట ప్రస్తుతం ఉన్న సాయిబాబా దేవాలయాన్ని గతంలో గోసాయిమఠంగా పిలిచేవారు. దశాబ్దాల కిందట ఈ మఠాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. దేవాలయం వెనుక భాగాన దిగుడుబావి (మెట్లబావి) ఉంది. ఆ దిగుడు బావిని 300 ఏళ్ల కిందట అప్పటి రాజులు నిర్మించారు. ఎంతో గొప్ప సాంకేతికతతో నిర్మించిన ఈ బావి ఇప్పటికీ చెక్కు చెదరలేదు. దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉండటంతో కొంత మేరకు నిర్మాణాలు దెబ్బతిన్నాయే తప్పిస్తే మిగతా కట్టడాలన్నీ యథావిధిగా ఉన్నాయి. రాజుల కాలంలో దిగుడుబావి నిర్మాణందిగుడుబావి (మెట్లబావి) గొప్ప చరిత్ర కలిగి ఉంది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు ఇక్కడ విశ్రాంత మందిరాన్ని నిర్మించుకున్నారని, ఆ విశ్రాంత మందిరానికి అనుసంధానంగా అన్ని రకాల సౌకర్యాలతో ఈ దిగుడుబావిని నిర్మించి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. దిగుడుబావి పరిసరాల్లోని రాజు భూములు కాలక్రమేణా స్థానికులకు వచ్చాయి. పూర్తిగా రాళ్లతోనే..ఈ దిగుడుబావిని పూర్తిగా రాళ్లతోనే నిర్మించారు. తూర్పున 6 అడుగుల వెడల్పు, దిగువకు 20 అడుగులు, ఉత్తరంలో 10 అడుగుల వెడల్పు ప్రకారం మొత్తంగా దిగువకు 60 అడుగుల మేర మెట్లు ఏర్పాటు చేశారు. మెట్ల మార్గాన్ని గ్రానైట్ రాళ్లతో అందంగా తీర్చిదిద్దారు. 30 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 80 అడుగుల లోతుతో ఈ బావిని నిర్మించారు. భూమి నుంచి 25 అడుగుల దిగువన బావిలో ప్రత్యేకంగా ఆర్చీలతో మూడు గదులు ఏర్పాటు చేశారు. బావిలో స్నానాలు చేశాక దుస్తులు మార్చుకునేందుకు ఈ గదులను నిర్మించారు. ఆ గదులు ప్రత్యేకంగా మహిళలు (నాటి రాణులు) వినియోగించేవిగా తెలుస్తోంది. పొలాలకు సాగునీరు, స్థానిక ప్రజానీకానికి తాగు నీరు అందించడంతో పాటు ప్రజలు స్నానాలు చేసేందుకు అనువుగా బావిని నిర్మించారు. గోసాయి మఠంగా ప్రత్యేక గుర్తింపుచౌటుప్పల్ పట్టణ కేంద్రానికి తూర్పున 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న లింగోజిగూడెం గ్రామం ఒకప్పుడు గోసాయిమఠంగానే గుర్తింపు పొందింది. కొన్నేళ్ల కిందట గోసాయిదొర అనే వ్యక్తి హైదరాబాద్–విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారికి ఆనుకొని ప్రస్తుతం సాయిబాబా దేవాలయం ప్రాంతంలో మఠాన్ని ఏర్పాటు చేశాడు. పలు ప్రాంతాలకు ప్రయాణాలు చేసే బాటసారులు అలసిపోయిన సందర్భాల్లో విశ్రాంతి తీసుకోవడంతోపాటు అక్కడే విడిది చేసేందుకు అనువుగా అందులో వసతులు ఉండేవని స్థానికులు గుర్తుచేస్తున్నారు. అప్పట్లో ఆర్టీసీ బస్సులు కూడా గోసాయిమఠం స్టేజీ అంటేనే ఆగేవంటే ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆలయానికి ప్రస్తుతం రెండు ఎకరాలకుపైగా స్థలం అందుబాటులో ఉంది.మెట్లబావి పరిరక్షణకు ముందుకొచ్చిన హెచ్ఎండీఏశతాబ్దాల కాలంనాటి మెట్లబావి గురించి సాక్షి దినపత్రిక వెలుగులోకి తెచ్చింది. అందుకు సంబంధించి 2022, ఫిబ్రవరి 14న ప్రత్యేకమైన కథనాన్ని ప్రచురించింది. ఆ కథనానికి అప్పటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్కుమార్ స్పందించారు. వెంటనే మెట్లబావి విషయాన్ని తెలుసుకుని మరమ్మతులు చేయాలని హెచ్ఎండీఏ (HMDA) అధికారులను ఆదేశించారు. అందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. అలా ఈ మెట్లబావిని సుందరీకరించారు. అనంతరం ఏప్రిల్ 14న దీన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఆ మెట్లబావి బాధ్యతలు హెచ్ఎండీఏ చూసుకుంటోంది. అయితే ఆ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటక ప్రాంతంగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు.ఇదీ చదవండి: రాజాబావి.. రాజసం ఏదీ?కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్తాం పురాతన మెట్లబావి అభివృద్ధి అంశాన్ని కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్కుమార్ దృష్టికి తీసుకెళ్తాం. పర్యాటక ప్రాంతంగా మారితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. పురాతన కట్టడాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. మూడొందల ఏళ్ల కిందట నిర్మించిన మెట్లబావి మా గ్రామంలో ఉండటం మాకెంతో గర్వకారణం. ప్రభుత్వం, మున్సిపల్ శాఖ నిరంతరం పర్యవేక్షించాలి. – రమనగోని శంకర్, మాజీ సర్పంచ్, లింగోజిగూడెం -
ఐదు భాషల్లో అనర్గళంగా!
శాంతిపురం: ఒక దీపం అనంత దీపాలను వెలిగించినట్టు.. తపన ఉన్న ఓ ఉపాధ్యాయుడు తలిస్తే వందల, వేల మంది విద్యార్థులను ప్రతిభావంతులుగా ఎలా తీర్చిదిద్దవచ్చన్నది చిత్తూరు జిల్లా (Chittoor District) శాంతిపురం, శెట్టేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల చాటుతోంది. మారుమూల గ్రామంలో ఉన్న ఈ స్కూలు విద్యార్థులు బహుభాషలపై తమ ప్రత్యేకతను చాటుకొంటున్నారు. పాఠ్యాంశాల్లోని తెలుగు (Telugu), ఇంగ్లీషు, హిందీ భాషలతో పాటు కన్నడం, తమిళం, మలయాళీ (Malayalam) భాషలు ఇక్కడి విద్యార్థులు సులువుగా రాయటం, చదవడం, మాట్లాడడం చేస్తున్నారు. ఒక భాషలోని పద్యాలు, రచనలను మరో భాషలోకి అనువాదం చేయగలుగుతున్నారు. ప్రత్యేక పరీక్షల్లో ఉత్తీర్ణత అధికారుల అనుమతితో ఆయా భాషల్లో ప్రావీణ్యులైన ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చి విద్యార్థుల భాషాపరిజ్ఞానంపై ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. గుడుపల్లి ఏపీ మోడల్ స్కూలు ఉపాధ్యాయుడు షిజో మైకెల్ మలయాళంపై, గుడుపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం ఎస్కే.మణి తమిళంపై, కర్ణాటకలోని వేమన విద్యా సంస్థల ఉపాధ్యాయురాలు ఎస్వనజాక్షి కన్నడ భాషపై మొత్తం 94 మంది విద్యార్థుల స్థాయిలను ఇటీవల పరీక్షించారు. వీరిలో కన్నడంలో 93 మంది, మలయాళంలో 45 మంది, తమిళంలో 36 మంది సంతృప్తికర ప్రతిభను చాటుకున్నారు. ప్రధానోపాధ్యాయుని సంకల్పం ఇక్కడ ప్రధానోపాద్యాయుడుగా ఉన్న తీగల వెంకటయ్య భాషల పట్ల ఆసక్తితో రూపకల్పన చేసిన కార్యక్రమం విద్యార్థులను బహుభాషా కోవిదులుగా తయారు చేస్తోంది. తీరిక వేళల్లో హెచ్ఎం ఇస్తున్న తర్ఫీదు, మిగతా ఉపాధ్యాయుల సహకారం అందిపుచ్చుకుని అన్ని బాషల్లోనూ తమ పట్టును పెంచుకొంటున్నారు. మాతృభాష (Mother Tongue) వస్తే మరెన్ని భాషలైనా నేర్వవచ్చనే ఆలోచనతో హెచ్ఎం తీగల వెంకటయ్య ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి తన ప్రత్యేక బోధనా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.చదవండి: సోలో లైఫే సో బెటరూ అంటున్న యువతులు! 6, 7, 8, 9 తరగతుల వారికి భాషల గురించి చెప్పి, కేవలం 26 సరళమైన పదాలతో బోధన ప్రారంభించారు. ఎవరైనా ఉపాధ్యాయులు లేని సమయంలో వారి తరగతులను తీసుకుని విద్యార్థులకు దీనిపై పాఠాలు చెప్పారు. విద్యార్థులు కూడా ఇతర భాషలు నేర్చుకోవటంపై ఆసక్తి చూపడంతో సొంత ఖర్చులతో వారికి మలయాళం, తమిళం, కన్నడ పుస్తకాలను కొనిచ్చారు. ఈ ఆసరాను అందిపుచ్చుకున్న పిల్లలు ఆయా భాషలపై సులువుగా పట్టు సాధిస్తున్నారు. నా విశ్వాసం పెరిగింది ప్రైమరీ స్కూలు రోజుల నుంచి భాషలే నాకు ఇబ్బందిగా ఉండేవి. అక్కడ తెలుగు, ఇంగ్లీషు ఉంటే 6వ తరగతిలో చేరగానే వాటికి హిందీ కూడా తోడయ్యి అంతా అయోమయంగా ఉండేది. కానీ సులువుగా భాషలు నేర్చుకునే టెక్నిక్ తెలుసుకున్న తర్వాత తెలుగు, ఇంగ్లీషు, హిందీతో పాటు కన్నడ, తమిళం కూడా నేర్చుకొంటున్నాను. నాపై నాకు విశ్వాసం పెరిగింది. – బీ.రామాచారి, 8వ తరగతిఎన్ని భాషలైనా నేర్వవచ్చు నేను రూపొందించిన ప్రాజెక్టు నమూనాతో 20–25 రోజుల్లోపు ఏ బాషలైనా నేర్చుకోవచ్చు. అందరు విద్యార్థులకు దక్షిణ భారత భాషలను నేర్పితే వారి నిత్య జీవనంలో అది ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది – తీగల వెంకటయ్య, హెచ్ఎం5 భాషలు నేర్చుకొంటున్నా కొత్త భాషలను సులువుగా నేర్చుకోవటం భలే సరదాగా ఉంది. ఏడాది క్రితం వరకూ తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లోని పాఠ్యాంశాలు నేర్చుకోవటానికే కష్ట పడేదాన్ని. కానీ మా హెడ్మాస్టర్ చెప్పిన విధానం పాటించటంతో ఆ భాషలతో పాటు మలయాళం, తమిళం, కన్నడ కూడా సులువుగా నేర్చుకున్నాను. ఇదే ప్రేరణతో భవిష్యత్తులో నేను భాషా పండిట్ అవుతాను. – కె.ధరణి, 9వ తరగతివిస్తరిస్తే బాగుంటుంది వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుని, విద్యార్థుల మిగతా పాఠ్యాంశాలకు ఇబ్బంది కలగకుండా మా హెచ్ ఎం చేసిన ప్రయోగం సత్ఫలితాలను ఇచ్చింది. విద్యాశాఖ ఉన్నత అధికారులు ఈ నమూనాను పరిశీలించి మిగతా స్కూళ్లకు కూడా విస్తరిస్తే బాగుంటుంది. ఇంగ్లీషు, హిందీలకు అదనంగా పాఠశాలకు ఒక్క ఉపాధ్యాయుడిని కేటాయించినా కనీసం మరో మూడు భాషలు పిల్లలకు నేర్పవచ్చు. పోటీ ప్రపంచంలో కేవలం భాషలపై అవగాహన లేకపోవటం వల్లే చాలా మంది సరైన ఉద్యోగాలు పొందలేక పోతున్నారు. – నాగభూషణం, ఇంగ్లీష్ టీచర్ -
అక్రమ వలసదార్లలో కన్నీటి వరదే
చండీగఢ్: ఏజెంట్ల మాటలు నమ్మి, రూ.లక్షలు సమర్పించుకొని, అందమైన జీవితాన్ని ఊహించుకుంటూ కోటి కలలతో అమెరికా దారిపట్టిన యువతకు చివరకు కన్నీళ్లే మిగిలాయి. ఉత్త చేతులతో, అవమానకర రీతితో స్వదేశానికి చేరుకోవాల్సి వచ్చింది. చట్టబద్ధంగా అమెరికాకు తీసుకెళ్తామంటూ ఏజెంట్లు, సబ్ ఏజెంట్లు చెప్పిన కల్లబొల్లి కబుర్లు నమ్మినందుకు అష్టకష్టాలు ఎదుర్కోన్నామని, ప్రత్యక్ష నరకం చూశామని అమెరికా నుంచి తిరిగివచ్చిన భారతీయ అక్రమవలసదార్లు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. తొలి విడతలో భాగంగా 104 మంది అమెరికా సైనిక విమానంలో ఈ నెల 5వ తేదీన , రెండో విడతలో భాగంగా 116 మంది శనివారం రాత్రి పంజాబ్లోని అమృత్సర్కు చేరుకున్న సంగతి తెలిసిందే. మూడో విడతలో భాగంగా మరో 112 మంది ఆదివారం రాత్రి అమృత్సర్లో అడుగుపెట్టారు. ఇప్పటిదాకా మూడు విడతల్లో 332 మంది ఇండియాకు చేరుకున్నారు. పలువురు యువకులు తమ కన్నీటి గాథను మీడియాతో పంచుకున్నారు. సరైన తిండి లేదు, నిద్ర లేదుమన్దీప్ సింగ్(38) కుటుంబం అమృత్సర్లో నివసిస్తోంది. తన కుటుంబానికి చక్కటి జీవితం అందించడానికి అమెరికా వెళ్లి, ఏదైనా ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇతర యువకుల తరహాలోనే ఏజెంట్ వలలో చిక్కాడు. ఏజెంట్కు రెండు విడతల్లో మొత్తం రూ.40 లక్షలు చెల్లించాడు. ఇంకేముంది అమెరికాకు పయనం కావడమే అని ఏజెంట్ ఊరించాడు. అధికారికంగా కాకుండా అడ్డదారిలో(డంకీ రూట్) తీసుకెళ్లాడు. సబ్ ఏజెంట్లకు మణిదీప్ను అప్పగించాడు. మన్దీప్ను మొదట అమృత్సర్ నుంచి విమానంలో ఢిల్లీకి, అక్కడి నుంచి ముంబైకి, తర్వాత ఆఫ్రికాలోని నైరోబీకి, అనంతరం ఆమ్స్టర్డ్యామ్, సురినామ్కు చేర్చారు. అక్కడ సబ్ ఏజెంట్లు రూ.20 లక్షలు డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యుల ద్వారా ఆ డబ్బు చెల్లించక తప్పలేదు. సిక్కు మతస్థుడైన మన్దీప్ గడ్డాన్ని తొలగించారు. మన్దీప్తోపాటు మరికొందరు వలసదార్లను ఒక వాహనంలో గయనాకు తీసుకెళ్లారు. తర్వాత బొలీవియా, ఈక్వెడార్కు చేర్చారు. తర్వాత పనామా అడవుల్లో అడుగుపెట్టారు. విష సర్పాలు, మొసళ్లతో సావాసం చేస్తూ రోజుల తరబడి దట్టమైన అడవిలో నడిపించారు. 13 రోజులపాటు అడవిలోనే నడక సాగించారు. కాలువలు దాటుకుంటూ ముందుకెళ్లారు. సరైన తిండి కూడా లేదు. సగం కాల్చిన రొట్టెలు, నూడుల్స్తో కడుపు నింపుకున్నారు. కంటి నిండా నిద్రలేదు. రోజుకు 12 గంటలు నడిచారు. పనామా దాటిన తర్వాత కోస్టారికా, తర్వాత హోండూరస్కు చేరుకున్నారు. అక్కడ వారికి వరి అన్నం లభించింది. చివరకు నికరాగ్వా, గ్యాటెమాలా నుంచి మెక్సికో చేరారు. జనవరి 27వ తేదీన మెక్సికోలోని తిజువానా నుంచి అమెరికా భూభాగంలోకి ప్రవేశిస్తుండగా, యూఎస్ సరిహద్దు పెట్రోలింగ్ దళం అదుపులోకి తీసుకుంది. మణిదీప్ను అరెస్టు చేసి, డిటెన్షన్ క్యాంప్లో నిర్బంధించి, విచారణ ప్రారంభించారు. అక్రమ మార్గంలో అమెరికాలో అడుగుపెట్టేందుకు ప్రయత్నించినట్లు అభియోగాలు మోపారు. అక్రమ వలసదార్లను వారి స్వదేశాలకు బలవంతంగా తిప్పి పంపిస్తూ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో మన్దీప్ స్వదేశానికి చేరుకున్నాడు. ప్రాణాలతో బయటపడతానని అనుకోలేదని మణిదీప్ చెప్పాడు. తలపాగాను చెత్తబుట్టలో పడేశారు అమృత్సర్కు తిరిగొచ్చిన 23 ఏళ్ల జతీందర్ సింగ్ది మరో గాధ. ‘‘స్నేహితులు చెప్పడంతో గత నవంబర్లో ఏజెంట్ కలిశా. రూ.50 లక్షలిస్తే అమెరికా పంపిస్తానన్నాడు. మాకున్న 1.3 ఎకరాల భూమి అమ్మి ఏజెంట్కు అడ్వాన్స్గా రూ.22 లక్షలు కట్టా. పెళ్లయిన నా అక్కచెల్లెళ్లు తమ బంగారు నగలమ్మి మరీ చేతికిచ్చిన డబ్బును ఏజెంట్కు ఇచ్చేశా. మూడ్రోజులు పనామా అడువులను దాటాకా మెక్సికోకు విమానంలో తీసుకెళ్తానన్నాడు. మెక్సికో సరిహద్దు నగరం తిజువానా నుంచి అమెరికాలోకి తీసుకెళ్తానన్నాడు. కానీ మధ్యలోనే వదిలేశాడు. పనామా అడవుల్ని దాటడం చాలా కష్టం. మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయిన తోటివారిని చూస్తూనే అతికష్టంమ్మీద అడవుల్ని దాటా. ఎలాగోలా అమెరికా సరిహద్దు దాటితే వెంటనే బోర్డర్ పోలీసులు బంధించి నిర్బంధ కేంద్రంలో పడేశారు. సంప్రదాయ తలపాగాను తీయొద్దని బతిమాలినా వినలేదు. తీసి చెత్తబుట్టలో పడేశారు. సరైన తిండి పెట్టలేదు. ఉదయం, రాత్రి ఒక లేస్ చిప్స్ ప్యాకెట్, ప్రూటీ జ్యూస్ చిన్న బాటిల్ ఇచ్చారు. అదే ఆహారం. గదిలో ఎయిర్ కండీషనర్ ఉష్ణోగ్రత బాగా పెంచి వేడికి చర్మం ఎండిపోయేలాగా చేశారు. భారత్కు తిరిగొచ్చేటప్పుడు సైనిక విమానంలో కాళ్లు కట్టేశారు. తినడానికి, బాత్రూమ్కు పోవడానికి కూడా చాలా కష్టమైంది. ఏకధాటిగా 36 గంటలు చేతులకు బేడీలు వేశారు. అమృత్సర్లో దిగడానికి 10 నిమిషాల ముందు మాత్రమే చేతులకు బేడీలు తీశారు’’అని జతీందర్ సింగ్ చెప్పారు. ఆహారం, నీరు అడిగితే దాడులే పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లాకు చెందిన లవ్ప్రీత్ సింగ్ది మరో దీనగాథ. ఏడాది క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అమెరికా కలతో ఏజెంట్ల చేతికి చిక్కాడు. పనామా అడవుల గుండా ప్రయాణించి, మెక్సికో నుంచి అమెరికా సరిహద్దు దాటేందుకు ప్రయతి్నస్తుండగా, అక్కడి అధికారులు అరెస్టు చేశారు. పనామా అడవులు చాలా ప్రమాదకరంగా ఉంటాయని, అడుగడుగునా పాములు, క్రూరమృగాలు, మొసళ్లు తారసపడుతుంటాయని చెప్పాడు. వాటి నుంచి తప్పించుకొని ముందుకెళ్లడం నిజంగా సాహసం చేయడమేనని అన్నాడు. ఆహారం, మంచినీరు అడిగితే ఏజెంట్లు దారుణంగా కొట్టారని, దూషించారని ఆవేదన వ్యక్తం చేశాడు. అయినప్పటికీ అన్నీ భరించామని పేర్కొన్నాడు. ఆస్తులు అమ్మేయాల్సి వచ్చింది అమృత్సర్ జిల్లాకు చెందిన జసూ్నర్ సింగ్కు అమెరికాలో ఉద్యోగం సంపాదించుకోవాలన్నది ఒక కల. అందుకోసం ఏజెంట్కు రూ.55 లక్షలు చెల్లించాడు. అందుకోసం కొన్ని ఆస్తులు, వాహనాలు, ఇంటి స్థలం అమ్మేయాల్సి వచ్చింది. డంకీ రూట్లో అమెరికాకు చేరుకోగానే అక్కడి అధికారులు అరెస్టు చేసి, వెనక్కి పంపించారు. కపుర్తలా జిల్లాకు చెందిన 20 ఏళ్ల నిశాంత్ సింగ్కు సైతం ఇలాంటి అనుభవమే ఎదురైంది. దట్టమైన అడవిలో 16 రోజులు నడిచానని అన్నాడు. కేవలం నీరు తాగుతూ ప్రాణాలు నిలబెట్టుకున్నానని పేర్కొన్నాడు. తనను అమెరికా పంపించడానికి తన కుటుంబం రూ.40 లక్షలు ఖర్చు చేసిందని వెల్లడించాడు. -
సిరుల చీపురు
సాక్షి, పాడేరు: మనం ఇళ్లలో వాడే చీపురు పంట గిరిబిడ్డలకు జీవనాధారం. ఏజెన్సీలోని హుకుంపేట, డుంబ్రిగుడ, పెదబయలు, మంచంగిపుట్టు, అరకులోయ, జి.మాడుగుల, పాడేరు, సీతంపేట, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, సాలూరు, పార్వతీపురం తదితర ప్రాంతాల్లో వేల కుటుంబాలు చీపురు పంటను సాగుచేస్తూ ఉపాధి పొందుతున్నాయి. పూర్వం దట్టమైన అడవుల్లో మాత్రమే కనిపించే కొండచీపురు మొక్కలు నేడు మన్యం అంతా విస్తరించాయి.కొండపోడు, మెట్ట భూముల్లో గిరిజనులు చీపురు పంటను సాగుచేస్తున్నారు. డిసెంబర్, జనవరి నెలల్లో ఈ పంట చేతికి వస్తుంది. చీపురు గడ్డి (Broom grass) శాస్త్రీయనామం “థైసెలోలెనా మాక్సిమా’ ఈ మొక్కలు హిమాలయాల్లోని ఎత్తయిన ప్రాంతాలు, దేశంలోని తూర్పు, ఈశాన్య ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి. మన ప్రాంతానికి దీన్ని వలస మొక్కగా చెప్పవచ్చు. చీపురుతో స్వయం సమృద్ధి కొండచీపుర్లకు దేశవ్యాప్తంగా ఆదరణ ఉంది. ప్రస్తుతం చీపురు పంట దిగుబడికి రావడంతో పుల్లలను సేకరిస్తున్న గిరిజనులు వాటిని బాగా ఎండబెట్టి, కట్టలు కట్టి మండల కేంద్రాలు, వారపుసంతల్లో అమ్ముతున్నారు. చీపురు కట్టల తయారీలో గిరిజన కుటుంబాలు ఇంటిల్లిపాదీ కష్టపడతాయి. మహిళలు కూడా చీపురు సేకరణ, కట్టలు కట్టడం అలవాటు చేసుకున్నారు.చీపురు కట్టకు మార్కెట్లో రూ.40 నుంచి రూ.50 వరకు ధర పలుకుతోంది. ఎకరానికి కనీసం 2వేల వరకు చీపురు కట్టలు తయారవుతాయి.దీంతో ప్రతి గిరిజన రైతు ఏడాదికి రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు సంపాదిస్తున్నాడు. కొంతమంది గిరిజన రైతులు నేరుగా విశాఖపట్నం,గాజువాక, విజయనగరం, రాజమండ్రి వంటి మైదాన ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఏటా ఏజెన్సీ అంతటా కొండచీపుర్ల అమ్మకాలు భారీగా జరుగుతాయి. ప్రస్తుతం మన్యం (Manyam) సంతల్లో వ్యాపారులంతా పోటాపోటీగా కొనుగోలు చేస్తుండటంతో చీపురు అమ్మకాల ద్వారా గిరిజన రైతులు మంచి ఆదాయం పొందుతున్నారు.అడవిలోకి వెళ్లి పుల్ల, పుల్ల ఏరుకుని ఇంటికి తెచ్చి చీపురు కట్టలుకట్టి సంతల్లో అమ్ముకునేవారు. దట్టమైన అడవుల్లో చీపురు పుల్లల సేకరణ గిరిబిడ్డలకు నిరంతర సవాలే. నిత్యం క్రూర మృగాలు, విషసర్పాలతో పోరాటమే. సేకరణ మరీ కష్టంగా మారుతుండటం, రోజురోజుకూ గిరాకీ పెరుగుతుండటంతో ఆ చీపురు మొక్కల్ని తమ సమీపంలోని కొండవాలుల్లో పెంచడం మొదలు పెట్టారు. అలా ప్రారంభమైన చీపుర్ల సాగు ప్రస్తుతం ఏజెన్సీలో సుమారు వెయ్యి ఎకరాల వరకు విస్తరించింది.చీపురు పంటతో మంచి ఆదాయం కొండచీపురు పంట ద్వారా మా గ్రామంలోని అన్ని గిరిజన కుటుంబాలకు మంచి ఆదాయం లభిస్తోంది. మెట్ట,కొండపోడులో చీపురు సాగు చేస్తున్నాం.ఎకరం పంట ద్వారా సుమారు 2వేల వరకు చీపురు కట్టలు తయారు చేస్తాం. పంట సేకరణ, కట్టలు కట్టడం కష్టం తప్ప చీపురు సాగుకు ఎలాంటి పెట్టుబడి లేదు. – పాంగి అప్పన్న, మేభ గ్రామం సూకురు పంచాయతీ, హుకుంపేటమహిళలకు స్వయం ఉపాధి చీపురుపంట సాగుతో సీజన్లో మహిళలకు స్వయం ఉపాధి లభిస్తోంది. సంక్రాంతి పండుగ దాటిన నాటి నుంచి మే నెల వరకు చీపురు కట్టలను సంతల్లో అమ్మకాలు జరుపుతాం, వీటి అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంలో సగం మహిళలమే తీసుకుని ఆసొమ్ముతో పలు వస్తువులు కొనుక్కుంటాం.గత పదేళ్ల నుంచి కొండచీపురు పంటను సాగుచేసుకుంటున్నాం.చీపురు పంట ఆరి్ధకంగా ఏటా మా కుటుంబాలను ఆదుకుంటోంది. – జన్ని సన్యాసమ్మ, గిరిజన మహిళా రైతు -
జర్మనీ విజేత ఎవరు?.. ఈసారి ఎన్నికలు ఎందుకంత ప్రత్యేకం?
జర్మనీ చాన్స్లర్ ఒలాఫ్ షోల్జ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోవడంతో అనివార్యమైన ఎన్నికలు ఇప్పుడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఫ్రెడరిక్ మెర్జ్ సారథ్యంలోని క్రిస్టియన్ డెమొక్రటిక్ యూనియన్(సీడీయూ), మార్కస్ సోడర్ సారథ్యంలోని క్రిస్టియన్ సోషల్ యూనియన్(సీఎస్యూ) కూటమి ఈసారి హాట్ ఫేవరెట్గా బరిలో దిగుతోంది. ఈసారి ఈ కూటమికే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలొచ్చాయి. మరోవైపు 2010 దశకంలో జర్మనీలోకి వలసలు పోటెత్తడంతో ఉద్యమంగా మొదలై ఇప్పుడు అతివాద పార్టీగా ఎదిగిన ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ(ఏఎఫ్డీ) పార్టీ సైతం మళ్లీ ఎన్నికల బరిలో నిలిచింది. జర్మనీలోకి పోటెత్తుతున్న అక్రమ వలసలకు అడ్డుకట్టవేయడం, ఆర్థికవ్యవస్థను పరుగులెత్తించే సత్తా ఉన్న పార్టీకే ఈసారి ఓటర్లు పట్టంకట్టనున్నారు. ఫిబ్రవరి 23వ తేదీన జరగనున్న ఎన్నికల్లో వలసలు, ఆర్థిక వ్యవస్థ మాత్రమే ప్రధాన అంశాలుగా ఉన్నాయి. బండేస్టాగ్(జర్మనీ పార్లమెంట్)లో అధికార పీఠంపై కూర్చునేది ఎవరనే అంశం ఇప్పుడు జర్మనీ అంతటా తీవ్ర చర్చనీయాంశమైంది. ఎన్నడూలేనంతగా జర్మనీలో జనసమ్మర్థ ప్రదేశాల్లో దాడి ఘటనలు ఎక్కువయ్యాయి. అక్రమ వలసదారులే ఈ దాడులకు పాల్పడుతున్నారన్న ఆగ్రహావేశాలు స్థానికుల్లో పెరిగాయి. దీంతో అక్రమ వలసదారుల కట్టడి, శరణార్థులుగా గుర్తింపునకు సంబంధించిన నిబంధనలు కఠినతరం చేయడం వంటి డిమాండ్లు ఓటర్లలో ఎక్కువయ్యాయి. మాన్హైమ్, జోలింగన్, మాగ్డీబర్గ్, అషాఫన్బర్గ్ నగరాల్లో దాడి ఘటనలతో అక్రమవలస ఇప్పుడు∙కీలకాంశమైంది. ఇటీవల మ్యూనిక్లో అఫ్గాన్ పౌరుడు వేగంగా కారు పోనివ్వడంతో జర్మనీ జాతీయురాలు, ఆమె రెండేళ్ల కూతురు తీవ్రంగా గాయపడిన ఘటనతో అక్రమ వలసదారుల కట్టడి అంశాన్ని ప్రధాన పార్టీలన్నీ ప్రచార అస్త్రాలుగా మార్చుకున్నాయి. ఈసారి ఐదుగురు ఛాన్స్లర్ పదవి కోసం పోటీపడుతున్నారు.ఫ్రిడిష్ మెర్జ్..క్రిస్టియన్ డెమొక్రటిక్ యూనియన్(సీడీయూ) అధినేత ఫ్రిడిష్ మెర్జ్ వైపు ఎక్కువ మంది ఓటర్లు మొగ్గుచూపే వీలుంది. ఆరున్నర అడుగుల ఎత్తు 69 ఏళ్ల వయస్సున్న మెర్జ్ 2002 ఏడాదిలో ఏంజెలా మెర్కల్ ప్రభుత్వంలో పనిచేశారు. తర్వాత రాజకీయాలు వదిలేసి పలు పెట్టుబడుల బ్యాంకుల బోర్డుల్లో సేవలందించారు. తర్వాత మళ్లీ సీడీయూ పార్టీలో చేరి పార్టీ నాయకత్వ పోరులో 2018లో మెర్కెల్, 2021లో ఆర్మిన్ లాషెట్ చేతిలో ఓటమిని చవిచూశారు. ఈసారి ‘‘ జర్మనీలో ఉన్నందుకు మరోసారి గర్వపడదాం’’ నినాదంతో సీడీయూ చీఫ్గా ఎన్నికల బరిలో దిగుతున్నారు. ‘‘దేశ సరిహద్దులను పటిష్టంచేస్తా. వలసలను కట్టడిచేసేలా శరణార్థి నిబంధనలను కఠినతరం చేస్తా. పన్నులు తగ్గిస్తా. సంక్షేమ పథకాల కోసం 50 బిలియన్ యూరోలను ఖర్చుచేస్తా’’ అని హామీలు గుప్పించారు.ఒలాఫ్ షోల్జ్..సోషల్ డెమొక్రటిక్ పార్టీ నేత అయిన ఒలాఫ్ షోల్జ్ ఇప్పటికే మూడేళ్లకు పైగా దేశ చాన్స్లర్గా సేవలందించారు. అయితే కూటమి సర్కార్ను నిలబెట్టుకోలేకపోయారు. రెండు నెలల క్రితం బలపరీక్షలో ఓడిపోయారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రత్యక్షంగా జర్మనీ ఆర్థికవ్యవస్థపై విపరిణామాలు చూపడంతో ఒలాఫ్ షోల్జ్ ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింది. అది చివరకు ప్రభుత్వం కూలడానికి కారణమైంది. గత ఏడాది జరిగిన విశ్వాస పరీక్షలో 733 మంది సభ్యులున్న సభలో కేవలం 207 ఓట్లు సాధించడం తెల్సిందే. దీంతో అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ పార్లమెంట్ను రద్దుచేసి ఎన్నికలకు పిలుపునిచ్చారు.ఎలీస్ వీడెల్..2013లో ఏఎఫ్డీ పార్టీని ఏర్పాటు చేసినప్పటి నుంచి పార్టీ తరఫున చాన్స్లర్ పదవి కోసం 46 ఏళ్ల నాయ కురాలు ఎలీస్ వీడెల్ పోటీపడుతున్నారు. ఈమెకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మద్దతు ఉంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇటీవల మ్యూనిక్కు వచ్చిన ప్పుడు ఈమెతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈమె కు యువతలో పెద్ద క్రేజ్ ఉంది. ‘‘వలసలు.. ఇమ్మిగేషన్కు విరుగుడుగా రిమిగ్రేషన్(తిరిగి పంపేయడం) తీసుకొస్తా. జర్మనీపై రష్యా ఆంక్షలను ఎత్తేసేలా కృషిచేస్తా. ధ్వంసమైన నార్డ్ స్ట్రీమ్ పైప్లైన్ను పునరుద్ధరిస్తా’’ అని ఎలీస్ పలు ఎన్నికల హామీ గుప్పించారు. రాబర్ట్ హబెక్..మూడు దశాబ్దాల క్రితం పర్యావరణ ఉద్యమంగా మొదలైన రాజకీయ పార్టీగా అవతరించిన ‘ది గ్రీన్స్/అలయన్స్ 90’ పార్టీకి సారథ్యం వహిస్తున్న 55 ఏళ్ల రాబర్ట్ హబెక్ సైతం చాన్స్లర్ రేసులో నిలిచారు. షోల్జ్ ప్రభుత్వంలో ఈయన వైస్ ఛాన్స్లర్గా, ఆర్థికశాఖ మంత్రిగా సేవలందించారు. ‘‘పునరుత్పాదక ఇంధన విధానాలకు పట్టం కడతా. అధికారంలోకి వస్తే ఉక్రెయిన్కు సాయం కొనసాగిస్తా. అణువిద్యుత్ శక్తి ఉత్పత్తిని తగ్గిస్తా. పవన విద్యుత్కు పాతరేస్తా’’ అని ఎన్నికల హామీ ఇచ్చారు. సారా వాగెన్ కనెక్ట్రష్యాకు మద్దతు పలుకుతూ తూర్పు జర్మనీలో బలమైన ఓటు బ్యాంక్ను సాధించిన ‘ది సారా వాగెన్ కనెక్ట్ –రీజన్ అండ్ జస్టిస్ పార్టీ(బీఎస్డబ్ల్యూ)’ సైతం చాన్స్లర్ పదవిపై కన్నేసింది. బీఎస్డబ్ల్యూ సహ వ్యవస్థాపకురాలు సారా వాగెన్ కనెక్ట్ తమ పార్టీ.. ఏఎఫ్డీకి అసలైన ప్రత్యామ్నాయ పార్టీ అని చెబుతున్నారు. ఏఎఫ్డీ తరహాలోనే అక్రమ వలసలపై బీఎస్డబ్ల్యూ పార్టీ ఉద్యమిస్తోంది. అయితే ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు అనుకూలంగా మాట్లాడుతుండటంతో ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపు కష్టమని అంచనాలు వెలువడ్డాయి. ఓటింగ్ ఎలా చేపడతారు?18 ఏళ్లు దాటిన వారంతా ఓటేయొచ్చు. అయితే ప్రతి ఒక్కరు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న 299 పార్లమెంట్ నియోజకవర్గాల కోసం ఒక ఓటు వేయాలి. దేశంలో 16 రాష్ట్రాలు ఉండగా ఓటరు తన సొంత రాష్ట్రం కోసం మరో ఓటు వేయాల్సి ఉంటుంది. రెండో ఓటులో కనీసం 5 శాతం ఓట్లను సాధించిన పార్టీ సభ్యులకు నేరుగా పార్లమెంట్లో సభ్యత్వం కోరే అర్హత ఉంటుంది. సంస్కరించిన పోలింగ్ విధానాన్ని తొలిసారిగా ఈ ఏడాది నుంచే అమలుచేయనున్నారు. దీంతో పార్లమెంట్లో ఇన్నాళ్లూ ఉన్న 733 సీట్లు తగ్గిపోయి 630కి చేరుకోనున్నాయి. అత్యధిక సీట్లను సాధించిన పార్టీ లేదా కూటమి నుంచి చాన్స్లర్ను ఎన్నుకుంటారు. ప్రస్తుతం మైనారిటీ సంకీర్ణ ప్రభుత్వం తాత్కాలికంగా అధికారంలో ఉంది. ఈసారి సీడీయూ, సీఎస్యూ కూటమి విజయం సాధించవచ్చని ఎన్నికల పండితులు విశ్లేషిస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
వరి చేలోనే కూరగాయలు, చేపలు!
మాగాణి చేను అనగానే మనకు ఒక్క వరి పంట (Paddy) మాత్రమే మదిలో మెదులుతుంది. అయితే, మాగాణి పొలంలో వరి పంటతో పాటు కూరగాయ పంటలు, చేపల సాగు (aquaculture) కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించుకునే సరికొత్త సమీకృత సేద్య నమూనా ఇది. కాకినాడ జిల్లా (Kakinada District) పిఠాపురం మండలం పి.రాయవరం గ్రామానికి చెందిన యువ రైతు కరుపురెడ్డి వెంకటేష్ నమూనా క్షేత్రం ఇందుకు ఒక ఉదాహరణ. 1.20 ఎకరాల భూమిలో వరితో పాటు అనేక రకాల కూరగాయ పంటలు, కందకంలో చేపల సాగు దర్శనమిస్తాయి. ఏడాదికి ఎకరం వరి సాగులో సాధారణంగా రూ. 40 వేల ఆదాయం వస్తుంది. అయితే, సమీకృత ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వెంకటేష్ రూ. లక్షకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాల ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఈయన వ్యవసాయ క్షేత్రంలో శిక్షణ పొందుతున్నారు. ఇతర రాష్ట్రాల రైతులకు సైతం ఆదర్శంగా నిలిచారు.ఎకరానికి రూ. లక్ష ఆదాయంవెంకటేష్ వ్యవసాయ క్షేత్రం విసీర్ణం ఎకరం 20 సెంట్లు. కాగా, చుట్టూతా విశాలమైన గట్టు 55 సెంట్లలో, గట్టు పక్కనే చుట్టూతా 20 సెంట్లలో తవ్విన కందకంలో చేపల పెంపకం, మధ్యలో మిగిలిన 45 సెంట్ల విస్తీర్ణంలో వరి పంట పండిస్తున్నారు. మాగాణిలో ఒకే పంటగా వరి సాగు చేస్తే ఎకరానికి మహా అయితే రూ.40 వేల ఆదాయం వస్తుంది. దీనికి భిన్నంగా తన పొలంలో గట్టు మీద పండ్ల చెట్లు, కూరగాయ పంటలు, ఆకు కూరలు.. గట్టు పక్కనే తవ్విన కందకం (లేదా కాలువ)లో చేపలు పెంచుతున్నారు. మధ్యలోని పొలంలో వరి సాగు చేస్తున్నారు. ఈ విధంగా సమీకృత ప్రకృతి సేద్యం ద్వారా ఎకరానికి ఏడాదికి రూ.లక్ష ఆదాయం సంపాదిస్తున్నారు. మాగాణి పొలాల్లో కూడా వరి తప్ప వేరే పండదు అనే అపోహను వదిలిపెట్టి పలు రకాల పంటలు పండించుకోవటం ద్వారా ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలో ఈ సమీకృతి ప్రకృతి సేద్య నమూనా తెలియజెప్తోంది. వెంకటేష్ వ్యవసాయ క్షేత్రం రైతులకు, ఇతర సిబ్బందికి రాష్ట్ర స్థాయి శిక్షణ ఇవ్వటానికి కూడా ఉపయోగపడుతుండటం విశేషం. – విఎస్విఎస్ వరప్రసాద్, సాక్షి, పిఠాపురంఇతర రైతులకు ఆదర్శంయువ రైతు వెంకటేష్ సమీకృత ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరితో పాటు చేపలు, కూరగాయ పంటల సాగుపై ఆసక్తి చూపటంతో శిక్షణ ఇచ్చాం. ఆచరణలో పెట్టి, మంచి ఫలితాలు సాదించి ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచారు. ఆయన పొలాన్నే రైతులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రదర్శన క్షేత్రంగా వినియోగిస్తున్నాం. – ఎలియాజర్ (94416 56083), జిల్లా ప్రకృతి వ్యవసాయ శాఖ అధికారి, కాకినాడరెండేళ్లలోనే మంచి ఫలితాలునాకున్న 1.2 ఎకరాల పొలంలో గతంలో వరి మాత్రమే సాగు చేసే వాడిని. ఏడాదికి పెట్టుబడి పోను అతి కష్టం మీద రూ. 40 వేల వరకు ఆదాయం వచ్చేది. ఆ దశలో 2020లో మా జిల్లాలో చేపట్టిన పకృతి వ్యవసాయం చేయాలనిపించి ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లాప్రాజెక్టు మేనేజర్ ఎలియాజర్ను సంప్రదించాను. ఆయన నా ఆసక్తిని గమనించి దుర్గాడ రైతు గుండ్ర శివ చక్రం ద్వారా నాకు సమీకృత సాగుపై శిక్షణ ఇప్పించారు. సార్వా వరి కోసిన తర్వాత, అదేవిధంగా దాళ్వా పంట కోసిన తర్వాత నేలను సారవంతం చేసే 20 రకాల పచ్చిరొట్ట పంటలను పెంచి, కలిదున్నేస్తున్నా. దీని వల్ల భూమి సారవంతమవుతోంది. ఎద్దులతోనే దుక్కి, దమ్ము చేస్తాం. జీవామృతం, ఘనజీవామృతం, కషాయాలు వాడుతున్నాం. రెండేళ్లలోనే మంచి ఫలితాలు వచ్చాయి. మా కుటుంబానికి వాడుకోగా మిగిలిన కూరగాయల ఇతరులకు ఇస్తున్నాం. బొచ్చె, కొర్రమీను వంటి చేపల పెంపకం ద్వారా అదనపు ఆదాయం వస్తోంది. రసాయనాలు వాడకుండా పెంచటం వల్ల మా పంటలకు మంచి డిమాండ్ ఉంటోంది. సంతృప్తికరంగా ఆదాయం పొందటంతో పాటు రైతుల శిక్షణ కేంద్రంగా మా పొలం మారినందుకు చాలా సంతోషంగా ఉంది. – కరుపురెడ్డి వెంకటేష్ (63024 19274),పి.రాయవరం, పిఠాపురం మండలం, కాకినాడ జిల్లా -
కాకతీయుల కాలంలోని అద్భుతమైన నిర్మాణం
జూలూరుపాడు: సుమారు ఏడు శతాబ్దాల క్రితం కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక కట్టడం కనుమరుగవుతోంది. కాకతీయుల కాలంలో తాగునీటి అవసరాలు, శత్రు సైన్యాల నుంచి తమను రక్షించుకోవడానికి దట్టమైన అడవి ఉన్న జూలూరుపాడు (Julurpadu) ప్రాంతంలో రాజాబావిని రాతికట్టడంతో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. సువిశాలమైన రాజాబావికి రెండు వైపులా నివాసం కోసం గదులు నిర్మించి ఉంటారని తెలుస్తోంది. ఈ బావి పైభాగాన తూర్పు, పడమరకు ఎదురెదురుగా 10 గదులు నిర్మించారు. బావిలోకి దిగేందుకు 30 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పుతో రాళ్లతో మెట్లు నిర్మించారు. ఈ బావి చుట్టూ 8 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు గల పైకప్పు ఒకేరాయిలా కనిపిస్తోంది. పూడిక మట్టితో నిండిపోవడంతో బావి లోతు ఎంత అనేది తెలియడం లేదు. సున్నం, రాళ్లతో నిర్మించిన ఈ ప్రాచీన కట్టడం నేటికీ చెక్కుచెదరలేదు. అయితే, గుప్తనిధుల కోసం తవ్వకాలు, చెత్తాచెదారం పేరుకుపోవడం, బావిలో పూడిక పెరగడంతో నానాటికీ వైభవం కోల్పోతున్నా సంరక్షణపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దండయాత్రల నుంచి రక్షణకు.. శత్రువులు దండయాత్ర చేసినప్పుడు రక్షణ కోసం కాకతీయ రాజులు (Kakatiya Kings) పలు ప్రాంతాల్లో సొరంగ మార్గాలు ఏర్పాటు చేసుకునేవారని చరిత్ర చెబుతోంది. ఇందులో భాగంగానే వివిధ ప్రాంతాల మీదుగా సొరంగ మార్గాల ద్వారా ఖమ్మం ఖిలాకు వచ్చేవారని, కాకతీయుల రాజధాని అయిన ఓరుగల్లు (వరంగల్)కోటకు, పాత ఖమ్మం (Khammam) జిల్లాలోని జూలూరుపాడు రాజుల బావి, భేతాళపాడు గుట్టలపై ఉన్న కోట వరకు వచ్చేవారని తెలుస్తోంది. జూలూరుపాడు నుంచి పాపకొల్లులోని పుట్టకోట, చండ్రుగొండ మండలం బెండాలపాడు గుట్టల్లో వెలిసిన శ్రీవీరభద్రస్వామి, కనగిరి గుట్టల్లోని ఆలయాలు, అప్పట్లో సైనికులు తలదాచుకునేందుకు ఏర్పాటు చేసిన కొన్ని స్థావరాలు నేటికీ కనిపిస్తాయి. అక్కడ ఉన్న సొరంగ మార్గాల ద్వారా శత్రువుల నుంచి రక్షణ పొందటంతోపాటు, శత్రువులపై మెరుపు దాడులు నిర్వహించేందుకు ఈ మార్గాలను ఉపయోగించుకునేవారు.గుప్తనిధుల కోసం తవ్వకాలు.. కాకతీయ రాజులు వజ్ర వైఢూర్యాలు, బంగారు అభరణాలను ఈ బావిలో భద్రపరిచే వారని నమ్ముతుంటారు. బావిలో గుప్త నిధులు ఉన్నాయనే ప్రచారంతో ఏడేళ్ల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు బావి పైభాగాన ఉన్న గదుల్లో తవ్వకాలు జరిపారు. ఈ క్రమంలో క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించినా అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో చారిత్రక కట్టడం ధ్వంసానికి గురవడంతో బావి ఆనవాళ్లు భావితరాలకు కన్పించకుండా పోయే పరిస్థితి ఏర్పడనుంది. తగ్గని నీటిమట్టం.. బావి నీటిని గతంలో ఈ ప్రాంత వాసులు తాగునీటిగా ఉపయోగించేవారు. బావిలో నీటిమట్టం తరగకపోవడంతో, బావిలో ఏమైనా గుప్త నిధులు ఉన్నాయా అని తెలుసుకునేందుకు కొన్నేళ్ల క్రితం గ్రామస్తులు ఆయిల్ ఇంజిన్లు పెట్టి నీటిని 15 రోజుల పాటు పంటలకు వినియోగించినా నీటిమట్టం ఎంతమాత్రం తగ్గలేదు. దీంతో గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. బావిలోకి దిగుడు మెట్లు, బావి చుట్టూ తిరగటానికి వీలుగా ప్లాట్ఫామ్ ఉన్నాయి. ఈ తరం ఇంజనీర్లకు సైతం అంతు చిక్కని అద్భుత సాంకేతిక నైపుణ్యంతో రాతిబావిని నిర్మించడం విశేషం. అలాంటి బావి పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి గురవుతూ పూడిక మట్టి, ముళ్ల పొదలతో నిండిపోయింది. బావి చుట్టూ ఉన్న స్థలం కూడా ఆక్రమణకు గురికావడంతో ముళ్ల పొదలు, చెట్లతో కళావిహీనంగా మారింది. చారిత్రక సంపద ధ్వంసం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. రాజాబావి నీళ్లు తాగే వాళ్లం 40 ఏళ్ల క్రితం రాజాబావి నీళ్లు తాగే వాళ్లం. వేసవి కాలంలో కూడా నీళ్లు బాగా ఉండేవి. ఈ నీటిని పంటల సాగుకూ ఉపయోగించేవారు. ప్రస్తుతం పూడికతో నిండిపోవడంతో పాటు ముళ్ల పొదలు, చెట్లు పెరగడంతో అటువైపు ఎవరూ వెళ్లడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మరమ్మతులు చేయాలి. – చిన్నకేశి వెంకటేశ్వర్లు, జూలూరుపాడు చారిత్రక కట్టడాన్ని కాపాడాలి వందల ఏళ్ల నాటి చారిత్రక కట్టడం కనుమరుగు కాకుండా చూడాలి. రాజాబావి ధ్వంసమవుతుండటంతో భావితరాలకు కన్పించకుండాపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి చారిత్రక సంపదను రక్షించేందుకు ప్రభుత్వం, అధికారులు చర్యలు చేపట్టాలి. – తాళ్లూరి వెంకటేశ్వర్లు, జూలూరుపాడు బావి అభివృద్ధికి చర్యలు చేపట్టాలి రాజాబావి అభివృద్ధికి అధికారులు చర్యలు తీసుకోవాలి. కొన్ని దశాబ్దాలుగా అధికారులు పట్టించుకోకపోవడంతో ముళ్ల పొదలు, చెట్లతో నిండి కళావిహీనంగా మారింది. దీన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. – నర్వనేని పుల్లారావు, జూలూరుపాడు చదవండి: వరంగల్ పేరు ఎలా వచ్చిందంటే..పురాతన సంపదను కాపాడతాం కాకతీయుల కాలం నాటి పురాతన కట్టడమైన రాజా బావిని కాపాడుతాం. ఈ సమస్యను ఉన్నతాధికారులు, పర్యాటక శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. స్థానిక గ్రామ పంచాయతీ నుంచి ఏమైనా చేయవచ్చేమో పరిశీలిస్తాం. ముళ్ల పొదలు, చెట్లు తొలిగించి, పూర్వవైభవం వచ్చేలా చర్యలు చేపడతాం. – డి.కరుణాకర్రెడ్డి, ఎంపీడీఓ జూలూరుపాడు -
ఆదిమ బాలుని ఆగమనం
నేటి ఆధునిక ప్రపంచానికి దూరంగా జీవించే ఎన్నో ఆదిమజాతులకు బ్రెజిల్లోని అమెజాన్ నదీ పరివాహక ప్రాంతం ఆవాసంగా ఉంది. ఆ ఆదిమజాతుల కట్టూ»ొట్టూ, ఆచరవ్యవహారాలు, ఆహార నియమాలు ఎవరికీ తెలీదు. బ్రెజిల్ ప్రభుత్వం కూడా ఎవరికీ చెప్పదు. ఆధునిక పోకడల బారిన పడకుండా ఆ జాతులను తమ మానాన వారి బతకనివ్వాలని బ్రెజిల్ ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుంది. అందుకే అలాంటి ఆదిమజాతులు ఆవాసాల వైపు ఎవరినీ వెళ్లనివ్వదు. అయితే అనుకోకుండా ఆ ఆదిమజాతుల్లో ఒక గిరిజనజాతికి చెందిన వ్యక్తి వాళ్ల ప్రపంచం నుంచి బాహ్య ప్రపంచంలోకి వచ్చాడు. వెంట రెండు చిన్న దుంగలను తెచ్చుకున్నాడు. మంట రాజేయడానికి అగ్గి కావాలని అభ్యర్థించాడు. ఈ అరుదైన ఘటన గత బుధవారం నైరుతి అమెజాన్లోని పురూస్ నదీతీరం వెంట బెలారోసా అనే కుగ్రామంలో జరిగింది. బుధవారం రాత్రి ఏడు గంటల సమయంలో ఒక గిరిజన వ్యక్తి ఒంటిపైభాగంపై ఎలాంటి ఆచ్చాదన లేకుండా కాళ్లకు చెప్పులు లాంటివి ఏమీ లేకుండా నడుచుకుంటూ కుగ్రామానికి చేరుకున్నాడు. సంబంధిత వీడియోను అసోసియేటెడ్ ప్రెస్ న్యూస్ఏజెన్సీ సంపాదించింది. ఆ వీడియోలో ఆ గిరిజన వ్యక్తి పూర్తి ఆరోగ్యవంతంగా, నెమ్మదస్తుడిగా కనిపించాడు. గ్రామస్థులను అగ్గి కావాలని అడిగాడు. దీంతో వాళ్లు ఒక లైటర్ను ఇచ్చి దీంతో అగ్గిరాజేసుకోవాలని సూచించారు. అయితే అతనికి లైటర్ను ఎలా వెలిగించాలో అర్థంకాలేదు. దానిని ఎలా వాడాలో స్థానికులు ఎంతలా విడమరిచి, వివరించి చూపినా అతనికి అర్థంకాలేదు. ఈలోపు బ్రెజిల్ దేశ ఆటవిక, ఆదివాసీ, గిరిజన సంబంధ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ‘ఫునాయ్’ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఆ మనిíÙని తమ కార్యాలయానికి తీసుకెళ్లారు. స్థానికులతో ఉండటంతో స్థానికులకు ఉన్న అంటురోగాలు, ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా ఏమైనా సోకాయో లేదో అని నిర్ధారించుకుని గురువారం సాయంత్రం కల్లా తిరిగి ఆ ఆదిమజాతి ఆవాసానికి సురక్షితంగా పంపేశారు. ఆదిమజాతులు శతాబ్దాలుగా బయటి వ్యక్తుతో కలవని కారణంగా వారిలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఆధునిక జీవనశైలికి అలవాటుపడ్డ సాధారణ ప్రజల్లో అన్ని రకాల అంటురోగాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు పోగుబడి ఉంటాయి. ఇవి పొరపాటున ఆదిమజాతులకు సోకినా చాలా ప్రమాదం. గతంలో జరిగిన ఇలాంటి ఉదంతాల్లో కొన్ని జాతులు హఠాత్తుగా రోగాలపాలై సగం జనాభా అంతరించిపోయింది. అందుకే అతడిని ఎవరితోనూ కలవనీయకుండా విడిగా ఉంచి 24 గంటల్లోపు తిరిగి అతని జాతి ఆవాసానికి పంపేశారు. స్థానికులు అతను వచ్చిన మార్గం గుండా వెళ్లి ఆదిమజాతులను కలవకుండా ఉండేందుకు ఫునాయ్ అధికారులు చర్యలు చేపట్టారు. గతంలో ఇలా ఎవరైనా గిరిజనులు బాహ్యప్రపంచంలోకి పొరపాటున వస్తే వారిని మెమోరియా గ్రాండే ఆదిమ,పర్యావరణ పరిరక్షణా స్థావరానికి తీసుకెళ్లి సపర్యలు చేసి పంపేస్తారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తెలుసుకుంటే లాభం...మలుచుకుంటే అ'ధనం'
గిరిజనుల ఆర్థిక పరిస్థితిలో మార్పు తేవాలి, వారి ఆదాయం రెట్టింపుకావాలన్న లక్ష్యంతో పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రం (Krishi Vigyan Kendra) పనిచేస్తోంది. ఇందుకోసం గిరిజనులకు అందుబాటులో ఉండే వనరుల వినియోగం, విలువ ఆధారిత ఉప ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇస్తోంది. దీనిలో భాగంగా జిల్లాలో లభించే పనస పండ్లతో పసందైన వంటకాల తయారీ, మార్కెటింగ్పై శిక్షణ అందిస్తోంది. మార్చి నెలలో రెండో బ్యాచ్కు శిక్షణ ఇవ్వనున్నారు. పసన పండ్ల లాభాలు తెలియజేసి, వాటి నుంచి అదనంగా ఆదాయం సమకూర్చుకునేలా శిక్షణ అందజేయనున్నారు.రంపచోడవరం: అల్లూరి సీతారామరాజు జిల్లాలో విరివిగా లభించే పనసకాయలతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీలో పందరిమామిడి (Pandarimamidi) కృషి విజ్ఞాన కేంద్రం గిరిజనులకు అవగాహన కల్పిస్తోంది. పనస తొనలతో వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేయడంలో ఇప్పటికే ఒక దఫా 30 మందికి శిక్షణ ఇచ్చారు. ఈ ఏడాది మార్చిలో మరో బ్యాచ్కు శిక్షణ ఇచ్చేందుకు కేవీకే ప్రణాళిక సిద్ధం చేసింది. రెండు లక్షల చెట్లు జిల్లాలో రెండు లక్షల వరకు పనస చెట్లు ఉన్నట్టు ఉద్యానవన శాఖాధికారుల అంచనా. మారేడుమిల్లి, వై.రామవరం, రంపచోడవరం, అడ్డతీగల, చింతూరు, పాడేరు, చింతపల్లి, అరకు (Araku) తదితర 19 మండలాల్లో పనస చెట్లు ఎక్కువగా ఉన్నాయి. గిరిజనులు తోటలుగానే కాకుండా ఇళ్ల వద్ద, పంట పొలాల్లో కూడా పనసను పెంచుతారు. పనస కాయల (Jack Fruit) దిగుబడి ఫిబ్రవరిలో ప్రారంభమై మే వరకు లభిస్తాయి. పనస మొదటి దశలో తొనలు, విత్తనాలు(పనస పిక్కలు) తయారు కావు. వీటిని ఎక్కువగా కూరలు, పచ్చళ్ల తయారీకి ఉపయోగిస్తారు. గింజలు అభివృద్ధి చెందే దశలో కూడా కూర పనసగా ఉపయోగిసా్తరు. తొనలు వచ్చినా తీí³, వాసన లేకుండా ఉంటాయి. వీటిని చిప్స్ తయారీలో ఉపయోగిస్తారు. పనస తొక్కు పచ్చడి, బజ్జీలు, పకోడి, బిర్యానీ, హల్వా, చాక్లెట్స్, తాండ్ర, జామ్, జ్యూస్, ఐస్క్రీమ్, పనస పిక్కల పిండితో పూరీలు, అప్పడాలు తయారు చేయవచ్చు. కేవీకే శాస్త్రవేత్తలు వీటి తయారీపై ఇప్పటికే గిరిజన యువతకు శిక్షణ ఇచ్చారు. ఆర్థిక భరోసా జిల్లాలో మేలుజాతి పనస ఉత్పత్తులు సీజన్లో లభిస్తాయి. అనేక పోషక విలువలు ఉన్న పనసను గిరిజనులు వారపు సంతల్లో, గ్రామాలకు వచ్చే వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. కొనుగోలు దారులులేకపోతే పశువులకు ఆహారంగా వేస్తున్నారు. గిరిజన రైతులు గరిష్ట ధర పొందలేకపోతున్నారు. గతంలో కృషి విజ్ఞాన కేంద్రంలో శిక్షణ పొందిన పలువురు ఉప ఉత్పత్తులు తయారు చేసి వారపు సంతల్లో విక్రయిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. పోషక విలువలెన్నో.. పనసలో మెండైన పోషక విలువలు ఉన్నాయి. విటమిన్లు, పీచుపదార్థం, ఖనిజ లవణాలు ఉన్నాయన్నారు. దీంతో పనస ఉప ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ ఉంది. గిరిజన యువత కొద్దిపాటి మెలకువలు పాటిస్తే పనసకాయలతో పచ్చడి, చిప్స్, పనస జ్యూస్, జామ్తోపాటూ పలు రకాల ఉత్పత్తులు తయారు చేయవచ్చని కేవీకే శాస్త్రవేత్తలు తెలిపారు. నోరూరించే చాక్లెట్లు పనస తొనలతో తయారు చేసే చాక్లెట్లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా సులభంగా తయారు చేయవచ్చు. కేజీ పనస తొనలను వేడి నీటిలో ఉడికించి, గుజ్జుగా తయారు చేసుకోవాలి. గిన్నెలో నెయ్యి వేసుకుని పనసగుజ్జు, కరిగించిన పాలపొడి, వేయించిన కోకో పౌడరు, పంచదార వేసి కాసేపు వేయించుకోవాలి. చల్లారిన తరువాత ముక్కలుగా చేసుకోవాలి. అంతే.. పనస చాక్లెట్లు సిద్ధమవుతాయి.చదవండి: వైజాగ్పై చంద్రబాబు సర్కారు శీతకన్ను!కరకరలాడే చిప్స్పచ్చి పనస తొనలతో వీటిని తయారు చేస్తారు. అర కేజీ తొనల నుంచి పిక్కలు వేరు చేయాలి. తరువాత అర ఇంచీ మందంతో పొడవుగా కోయాలి. కోసిన పనస తొనల ముక్కలను గుడ్డలో కట్టి మరిగించిన నీళ్లలో రెండు నిమిషాల పాటు ఉంచి బయటకు తీయాలి.తరువాత వాటిని అరబెట్టుకోవాలి. ఒక పాత్రలో నూనె వేసి తగినంత పసుపు వేసి మరిగించాలి. నూనె బాగా మరిగిన తరువాత అరబెట్టుకొన్న పనస తొనల ముక్కలను వేయించాలి. వాటిపై ఉప్పు,కారం జల్లుకుంటే వేడివేడి చిప్స్ రెడీతాండ్ర తయారీ ఇలా పిక్కలు వేరు చేసిన కేజీ పనస తొనలను వేడినీళ్లలో వేసుకుని మరిగించుకోవాలి. మెత్తబడిన పనస తొనలను మిక్సర్లో వేసుకొని గుజ్జుగా చేసుకోవాలి. ట్రేలలో సమాంతరంగా ఈ గుజ్జును వేసుకోవాలి. తేమ ఆరే వరకు ఎండలోగాని, డ్రయర్ల గాని ఉంచుకోవాలి. తేమ ఆరిపోతే తాండ్ర ట్రేలో నుంచి సులభంగా వస్తుంది. వీటితో పాటు మరికొన్ని విలువ ఆధారిత ఉత్పత్తులపై శిక్షణ ఇవ్వనున్నారు.మార్చిలో మరోదఫా శిక్షణ పందిరిమామిడి కేవీకేలో మార్చి నెలలో మారోమారు పనసతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇవ్వనున్నాం. ఈ ఏడాది ఏజెన్సీలో 25 ఎకరాల్లో పనస మొక్కలు నాటించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. జిల్లాలో అధిక సంఖ్యలో పనసపండ్లు లభిస్తున్నా గిరిజనులు పూర్తిస్థాయిలో ఆదాయం పొందలేకపోతున్నారు. పనసతో విలువ ఆధారిత ఉత్పత్తులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. గిరిజన యువతను ఆ దిశగా ప్రోత్సహించేందుకు కేవీకే కృషి చేస్తోంది. – క్రాంతి, ఉద్యానవన శాస్త్రవేత్త, కేవీకే, పందిరిమామిడి -
సీఈవో... జీతాలు అదరహో
కాలు బయటపెడితే ఖరీదైన కార్లు, చార్టర్డ్ విమానాల్లో ప్రయాణం.. రాత్రి పగలు అన్న తేడా లేకుండా నిత్యం కనిపెట్టుకొని ఉండే సేవకులు.. జీ హుజూర్ అనే యాజమాన్యాలు.. వీటన్నింటికీ మించి వందల కోట్ల రూపాయల వేతనాలు.. ప్రపంచ టాప్ కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ల జీవితమిది. కంపెనీని లాభాల్లో నడిపించగలడు అని నమ్మితే ఎంత వేతనం, ఎన్ని సౌకర్యాలైనా ఇచ్చి సీఈవోగా నియమించుకునేందుకు కంపెనీలు వెనుకాడటంలేదు.అందుకే కొందరు సీఈఓలు కళ్లు చెదిరే వేతనాలు అందుకుంటున్నారు. అందుకు ఉదాహరణ స్టార్బక్స్ సీఈవో బ్రియాన్ నికోల్. ఆయన వారంలో మూడు రోజులే ఆఫీస్కు వస్తారు. అది కూడా 1,600 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆఫీస్కు చేరుకుంటారు. ప్రయాణం, నివాసం.. ఇలా అన్ని ఖర్చులూ కంపెనీయే భరిస్తుంది. ఆయన ఏడాదికి 113 మిలియన్ డాలర్ల (రూ.971 కోట్లు) ప్యాకేజీ అందుకుంటున్నారు. బ్రియాన్ అమెరికాలోని టాప్–20 సీఈఓల్లో ఒకరు. ఎందుకంత అధిక వేతనాలు? భారత కంపెనీలు చాలా వేగంగా వృద్ధి చెందుతూ, అంతర్జాతీయంగా కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ కంపెనీలకు పోటీగా దేశీ సీఈఓలకు సైతం అధికంగా పారితోషికాలు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగుల్లో టాప్ బాస్ అయిన సీఈఓనే కంపెనీ వ్యాపార విజయాలకు సూత్రధారి.కంపెనీలను విజయపథంలో నడపగలిగే సీఈఓలకు అంతర్జాతీయంగా అధికడిమాండ్ ఉంది. వారిని పారితోషికాలతో ప్రసన్నం చేసుకునేందుకు కంపెనీ బోర్డులు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవటంలేదు. సీఈఓల పారితోíÙకం షేర్ల కేటాయింపు రూపంలోనూ ఉంటుంది. షేర్ల ధరలు పెరగడం వారి పారితోíÙకాన్ని మరిన్ని రెట్లు చేయగలదు.భారత్లో సగటు నెల వేతనం 10 కోట్లుభారత్లో సీఈవోల సగటు నెల వేతనం రూ.10 కోట్లుగా ఉంది. అమెరికాలో ఇది 14–15 మిలియన్ డాలర్లు (రూ. 129 కోట్లు) కోట్లు. అమెరికా కంపెనీల్లో సీఈఓ వేతనం సగటు ఉద్యోగి వేతనం కంటే 160–300 రెట్లు ఎక్కువగా ఉంది. మనదేశంలో నిఫ్టీ –50 కంపెనీల్లో సగటు ఉద్యోగి కంటే సీఈవో వేతనం 260 రెట్లు అధికం. -
‘నియర్’ వెరీ డియర్
‘నియర్’ అనుభవంతో దాన్ని అడ్డుకునే పనిలో నాసా సరిగ్గా 24 ఏళ్ల క్రితం భూమి నుంచి ప్రయోగించిన ఒక అంతరిక్ష నౌక అనూహ్యంగా ఒక గ్రహశకలంపై దిగింది. దానికి ఆ సామర్థ్యం ఏమాత్రమూ లేకపోయినా రాతితో కూడిన నేలపై అతి సున్నితంగా లాండైంది. అన్ని ప్రతికూలతలను తట్టుకుంటూ అక్కడి నుంచి రెండు వారాల నిక్షేపంగా పనిచేసింది. సదరు అస్టరాయిడ్కు సంబంధించిన విలువైన డేటాను భూమికి చేరవేసింది. గ్రహంపై కాకుండా ఓ గ్రహశకలంపై కాలుమోపిన తొలి స్పేస్క్రాఫ్ట్గా చరిత్ర సృష్టించింది. ఇదంతా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అప్పట్లో ప్రయోగించిన నియర్ ఎర్త్ అస్టరాయిడ్ రెండీవ్ (నియర్) స్పేస్క్రాఫ్ట్ గురించే. ‘2024 వైఆర్4’ అనే గ్రహశకలం భూమి వైపుగా శరవేగంగా దూసుకొస్తున్న నేపథ్యంలో నాసా సైంటిస్టులు నాటి నియర్ ఘనతను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. వైఆర్4 భూమిని ఢీకొనే అవకాశాలు 2 శాతం దాకా ఉన్నట్టు వారు అంచనా వేస్తున్నారు. ఇది బహుశా 2032లో జరిగే చాన్సుందట. భూమికేసి రాకుండా దాన్ని దారి మళ్లించాలని భావిస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో నాడు ‘నియర్’ అందించిన వివరాలు ఎంతగానో ఉపయోగపడవచ్చని చెబుతున్నారు. అలా జరిగింది... భూమికి 35.5 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘433 ఏరోస్’ అనే ఎస్–క్లాస్ గ్రహశకలం లక్షణాలు, అందులోని ఖనిజాలు, అయస్కాంత క్షేత్రం తదితరాలను అధ్యయనం చేయాలని నాసా భావించింది. దాని చుట్టూ కక్ష్యలో పరిభ్రమించే లక్ష్యంతో నియర్ స్పేస్క్రాఫ్ట్ను 1996 ఫిబ్రవరి 17న ప్రయోగించింది. అంతరిక్షంలో వెళ్లిన ఏడాదికి అది అస్టరాయిడ్ ఉపరితలానికి 1,200 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. అక్కణ్నుంచి మరింత ముందుకెళ్లి ఏరోస్ చుట్టూ కక్షలోకి తిరగాల్సి ఉండగా నియర్ జాతకమే తిరగబడింది. 1998 డిసెంబర్ 20న సాంకేతిక లోపం తలెత్తింది. ఇంజన్ బర్న్ కారణంగా నియర్ అనుకున్నట్లుగా పనిచేయలేని పరిస్థితి! దాంతో బ్యాకప్ ఇంధనం సాయంతో దాన్ని ఏకంగా అస్టరాయిడ్పైనే దించాలని నాసా నిర్ణయించింది. ఆ ఆదేశాలకు అనుగుణంగా నియర్ 2001 ఫిబ్రవరి 12న ఏరోస్కు అత్యంత సమీపానికి చేరుకుంది. చివరికి నెమ్మదిగా ఏరోస్పై దిగి చరిత్ర సృష్టించింది. ఒక అంతరిక్ష నౌక గ్రహశకలాన్ని తాకడం అదే మొదటిసారి. అలా నియర్ కాస్తా సైంటిస్టులకు వెరీ డియర్గా మారిపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇలాగేనా రెస్క్యూ?
సాక్షి, హైదరాబాద్: ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లాలోకి ఓ అడవిదున్న తప్పిపోయి వచ్చింది. అయితే దాన్ని సజీవంగా పట్టుకునేందుకు చేసిన రెస్క్యూ ఆపరేషన్ విఫలమైంది. పది రోజులపాటు ఈ దున్న కదలికలను ఆ జిల్లా పరిసరాల్లో అటవీశాఖ అధికారులు గుర్తించినా, జీవించి ఉండగా పట్టుకోలేకపోయారనే విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోయే జాతికి చెందిన ఆ అడవిదున్న (ఇండియన్ బైసన్) మృతి చెందడం పట్ల పర్యావరణవేత్తలు, జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తంచేశారు. అరుదైన జంతువులు, వన్య›ప్రాణులను రక్షించాల్సిన అటవీశాఖ సన్నద్ధత, సంసిద్ధత, పరిమితులను ఈ ఘటన స్పష్టం చేస్తోందంటున్నారు. గతంలోనూ ఓ చిరుత, కొన్ని జంతువుల రెస్క్యూలో అటవీ అధికారులు, సిబ్బంది విఫలమైన విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు. రెస్క్యూలో అటవీశాఖకు ఓ స్పష్టమైన విధానం, కార్యాచరణ లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు, ఆపదలో ఉన్న జంతువులు, వన్యప్రాణులను కాపాడేందుకు, వెంటనే స్పందించేందుకు క్విక్ రెస్పాన్స్ టీమ్ (క్యూఆర్టీ) ఏర్పాటు చేస్తున్నామంటూ గతంలో చేసిన ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి. అసలేం జరిగిందంటే..మేత, నీటికోసం వెతుక్కుంటూ దారితప్పిన దున్న చౌటుప్పల్ మండలం చిన్నకోడూరు గ్రామ సరిహద్దుల్లో కొందరికి కనిపించింది. ఎక్కడ జనవాసాల్లోకి వస్తుందోననే భయంతో దాన్ని బైక్లు, ఇతర వాహనాలపై నాలుగు గంటలపాటు వెంబడించారు. అప్పటికే ఆకలి, దప్పికతో ఉన్న దున్న పరిగెడుతూ డీ హైడ్రేషన్కు గురైంది. నోటి నుంచి నురగలు కక్కుతూ దయనీయస్థితికి చేరింది. దాన్ని రక్షించి, వైద్యం అందించి సురక్షిత ప్రాంతానికి తరలించే రెస్క్యూ టీమ్ అక్కడికి ఆలస్యంగా చేరుకుంది. వరంగల్ జూ నుంచి రెస్క్యూ టీమ్, నెహ్రూ జూపార్కు నుంచి వచ్చిన వెటరేరియన్ మత్తుమందు ఇచ్చి దున్నను నిలువరించే ప్రయత్నం చేశారు. వాహనంలోకి ఎక్కించి దానిని చికిత్స కోసం తరలిస్తున్న క్రమంలో అది అప్పటికే చనిపోయినట్టు గుర్తించారు.ఉన్నవి రెండు బృందాలే..రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్లోని నె హ్రూ జూపార్క్, వరంగల్లోని కాకతీయ జూపార్క్లో తాత్కాలిక ఏర్పాట్లతో రెండు బృందాలు పనిచేస్తున్నాయి. వీటికి రెస్క్యూ వెహికిల్స్, వెటరేరియన్లు ఉన్నా రు. రాష్ట్రంలో ఎక్కడ వన్యప్రాణులు, అటవీ జంతువులను కాపాడాల్సి వచ్చి నా.. ఏ ప్రాంతానికి దగ్గరగా ఉంటే అక్కడి నుంచి వాహనం, సిబ్బందిని పంపిస్తున్నారు. అయితే ఈ బృందాలు పాత బడిన వాహనాలు, పరికరాలు, సామగ్రి తోపాటు ఏవో తాత్కాలిక పద్ధతులతో నెట్టుకొస్తున్నాయి. ఇప్పుడేం చేయాలి?» రాష్ట్రంలో వన్యప్రాణులు, జంతువు లకు సంబంధించి ఎక్కడైనా అనుకో ని సంఘటన లేదా ఆపద ఎదురైనా, అడవుల్లో అగ్నిప్రమాదాల వంటి ఘ టనలు జరిగినా త్వరితంగా స్పందించేలా బృందాలను వెంటనే ఏర్పాటు చేయాలి. » పాతబడిన వాహనాలను తొలగించి, కొత్త వాహనాలను అందుబాటులోకి తేవాలి. ట్రాంకిలైజర్ గన్స్, ఇతర సామగ్రిని అందుబాటులో ఉంచాలి. » రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా రెస్క్యూ బృందాలను ఏర్పాటు చేయాలి. » జంతువుల తీరుపై వెటర్నరీ డాక్టర్లకు శిక్షణ ఇచ్చి తగిన సంఖ్యలో సిబ్బందిని నియమించాలి. -
ఆ రోజు ఇల్లు కదలరు.. ముద్ద ముట్టరు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: తెలవారకముందే ఊళ్ల వెంట తిరుగుతూ పాత ఇనుప సామాగ్రి కొనుగోలు చేసి, వాటిని అమ్ముకుని పొట్టపోసుకునే ఆ కుటుంబాలు.. వారంలో ఒక రోజు మాత్రం ఇల్లు వదిలి బయటకు వెళ్లరు. ఆ రోజు ఇల్లు, వాకిలి కూడా ఊడ్చరు. పొయ్యి వెలిగించేది అసలే లేదు. రోజంతా వాళ్లు ఆధ్యాత్మిక చింతనలోనే గడుపుతారు. వాళ్లే లహరి కృష్ణ భక్తులు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రమన్నుకుచ్చ ప్రాంతంలో బుడగ జంగాల కులానికి చెందిన 110 కుటుంబాలున్నాయి. వారు దశాబ్దాలుగా శ్రీ లహరి కృష్ణ ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్నారు. ప్రతి ఇంటి ముందు లహరి కృష్ణకు సంబంధించిన జెండా ఒకటి రెపరెపలాడుతూ ఉంటుంది. ఈ సంప్రదాయంలో కొబ్బరికాయ (Coconut) కొట్టడం, అగరొత్తులు వెలిగించడం ఉండవు. ఏటా అక్టోబర్ 3న జెండా పండుగ నిర్వహిస్తారు. పండుగపూట శాకాహార భోజనం.. అదీ అందరూ ఒకే చోట చేస్తారు. ఆ 24 గంటలు ప్రత్యేకంవీరు శుక్రవారం (Friday) సాయంత్రం 6 గంటల నుంచి శనివారం (Saturday) సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యేక దినచర్యను పాటిస్తారు. ఆ సమయంలో ఇంట్లో పొయ్యి వెలిగించరు. పిల్లల కోసం ముందు రోజు వండిన ఆహారంలో కొంత మిగిలించి శనివారం తినిపిస్తారు. పెద్దవాళ్లయితే ఆ రోజంతా ఏమీ తినరు. సిగరెట్, బీడీలు, మద్యం ముట్టరు. శనివారం కనీసం ఇళ్లు, వాకిళ్లు కూడా ఊడవరు. అందరూ శనివారం ఇంటి వద్దే ఉంటారు. చదవండి: ‘చెప్పు’కోలేని బాధలు.. అన్నదాత అవస్థలుఎంత పని ఉన్నా శనివారం సాయంత్రం 6 గంటల తర్వాతే బయటకు వెళతారు. శనివారం ఎవరైనా చనిపోయినా అంత్యక్రియలు కూడా చేయరు. గ్రామంలోని శ్రీ లహరి కృష్ణ స్తుతి ధ్యాన మందిరంలో శనివారం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాతే బయటకు వెళతారు. భగవద్గీత, బైబిల్, ఖురాన్.. ఇలా అన్నింటినీ పాటిస్తామని వీరు చెబుతున్నారు. అందరం నియమాలు పాటిస్తాంఇక్కడ ఉన్న వాళ్లందరూ పేద, మధ్య తరగతివారే. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు ఇంట్లో పొయ్యి వెలిగించరు. లహరి కృష్ణ సమాజంలోని అన్ని కుటుంబాలు ఈ ఆచారాన్ని పాటిస్తాయి. – దాసరి శ్రీనివాస్, ధ్యానమందిరం నిర్వాహకుడు -
శ్వేతసౌధంలో ట్రంప్ మగ్షాట్
ఏదైనా కేసులో ఒక నేత అరెస్ట్ అయితే ఆ విషయాన్ని పత్రికా సమావేశంలోనో, మరే సందర్భంలోనో ప్రస్తావిస్తే ఆ నేతకు అస్సలు నచ్చదు. అసలు తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని అంతెత్తున లేచి ఖండిస్తారు. అరెస్ట్నాటి ఫొటోలను ఒకవేళ మళ్లీ ఆయన ముందే పెడితే ఉగ్రరూపం దాల్చినా ఆశ్చర్య పోనక్కర్లేదు. అలాంటిది తెంపరితనానికి మారుపేరుగా నిలిచిపోయిన అగ్రరాజ్యానికి అధినేత డొనాల్డ్ ట్రంప్ ఇంకెలా స్పందిస్తారో అని చాలా మంది భావించడం సహజం. కానీ అలాంటి ఆలోచనలకు పటాపంచలు చేస్తూ, విభిన్నంగా ట్రంప్ తన అరెస్ట్ నాటి ఫొటోను పెద్ద సైజులో తీయించి చక్కగా బంగారు రంగు ఫ్రేమ్ కట్టి ఏకంగా అధ్యక్షభవనంలోనే తగిలించారు. అది కూడా ఎక్కడో కనిపించనట్లు ఓ మూలన కాకుండా నేరుగా కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీచేసే ఓవల్ ఆఫీస్ గోడకే తగిలించారు. రెండ్రోజుల క్రితం అమెరికా పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ వైట్హౌస్కు వెళ్లినప్పుడు అక్కడి మీడియా కెమెరామెన్లు ఓవల్ ఆఫీస్ అంతటినీ తమ కెమెరాల్లో బంధించిన వేళ ఈ మగ్షాట్ ఫొటోఫ్రేమ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఏమిటీ మగ్షాట్ ? 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి జార్జియా రాష్ట్రంలో ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై నాటి రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ను అరెస్ట్చేశారు. ఆ సందర్భంగా 2023 ఆగస్ట్లో జార్జియా రాష్ట్రంలోని పుల్టన్ కౌంటీ జైలుకు వచ్చి ట్రంప్ లొంగిపోయారు. కస్టడీలోకి తీసుకునే ముందు అరెస్ట్ అయిన నిందితుడి ముఖం స్పష్టంగా తెలిసేలా దగ్గరి ఫొటో అంటే మగ్ షాట్ను నిబంధనల ప్రకారం తీసుకుంటారు. ట్రంప్ ఫొటో సైతం అలాగే తీశారు. మాజీ అధ్యక్షుడిని ఇలా మగ్షాట్ తీయడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి. దీంతో ట్రంప్ మగ్షాట్ ఆన్లైన్లో విపరీతంగా వైరల్ అయింది. ఆ ఫొటోను ఆనాడు ప్రఖ్యాత న్యూయార్క్ పోస్ట్ సైతం ఫ్రంట్పేజీలో ప్రచురించింది. ఆ ఫ్రంట్పేజీ కటౌట్నే ట్రంప్ ఫ్రేమ్ కట్టించారు. మగ్షాట్పై నాటి అధికార డెమొక్రాట్లు, నాటి అధ్యక్షుడు జో బైడెన్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. అయితే ట్రంప్కు మద్దతుగా ఇదే మగ్షాట్ ఫొటోలను ఆన్లైన్లో ప్రచారానికి రిపబ్లికన్ నేతలు వాడుకున్నారు. తాజాగా మగ్షాట్ను వైట్హౌస్లో ఫ్రేమ్ కట్టిన విషయం అందరికీ తెలియడంతో వైట్హౌస్ డెప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డాన్ స్కావినో ఒక పోస్ట్చేశారు. ‘‘హ్యాపీ వేలంటైన్ డే. అందమైన ఓవల్ ఆఫీస్లోకి మీకందరికీ స్వాగతం’’అని ‘ఎక్స్’లో ఒక పోస్ట్చేశారు. ఈ ఫొటోఫ్రేమ్ను మాజీ అమెరికా అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్, ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ల ఫొటోల సమీపంలో తగిలించారు. ఆనాడు అరెస్ట్ అయిన వెంటనే పూచీకత్తు మీద ట్రంప్ విడుదలయ్యారు. ఎలాగూ ఫొటో వైరల్గా మారడంతో దీనిని వ్యాపారవస్తువుగా ట్రంప్ మార్చేశారు. స్వయంగా ఆయన తన మగ్షాట్ ఫొటోల విక్రయం ద్వారా దాదాపు రూ.61 కోట్లు ఆర్జించారు. టీ–షర్ట్లు మొదలు డిజిటల్ ట్రేడింగ్ కార్డుల దాకా అన్నింటిపైనా ఈ మగ్షాట్నే ముద్రించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆఫ్రికాను చీలుస్తూ... ఆరో మహాసముద్రం
మహాసముద్రాలు ఐదు అని చిన్నప్పుడు చదువుకున్నాం. కానీ ఆరు అని మార్చుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఆఫ్రికా ఖండాన్ని రెండుగా చీలుస్తూ శరవేగంగా ఆరో మహాసముద్రం పుట్టుకొస్తోంది. ఆ క్రమంలో అక్కడి పలు దేశాలను ఆఫ్రికా నుంచి విడదీయనుంది. మరికొన్నింటిని కొత్తగా సముద్ర తీర దేశాలుగా మార్చేయనుంది. ఆఫ్రికా దిగువన జరుగుతున్న టెక్టానిక్ ప్లేట్ల కదలికల వల్ల ఇది తప్పదన్నది తెలిసిన విషయమే అయినా, అందుకు కోట్లాది ఏళ్లు పట్టవచ్చని ఇప్పటిదాకా భావించారు. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే ఆరో మహాసముద్రం ఆవిర్భావానికి మహా అయితే కొన్ని వేల ఏళ్ల కంటే ఎక్కువ సమయం పట్టకపోవచ్చని పరిశోధకులు బల్ల గుద్ది చెబుతున్నారు!టెక్టానిక్ ఫలకాల కదలికల కారణంగా ఆఫ్రికా ఖండం నిలువునా చీలిపోతోంది. వేలాది ఏళ్లుగా స్థిరంగా జరుగుతూ వస్తున్న ఈ పరిణామం కొంతకాలంగా అనూహ్య రీతిలో వేగం పుంజుకుంది. ఆఫ్రికా ఖండం దిగువన నుబియన్, సోమాలీ, ఖండాంతర టెక్టానిక్ ప్లేట్లలో జరుగుతున్న కదలికలే దీనికి ప్రధాన కారణం. అవి ఏటా ఏకంగా దాదాపు ఒక సెంటీమీటర్ మేరకు దూరం జరుగుతున్నాయి! ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ సిస్టం (ఈఏఆర్ఎస్)గా పిలిచే ఈ ప్రాంతం ఇది మొజాంబిక్ నుంచి ఇథియోపియా, కెన్యా, టాంజానియా మీదుగా ఎర్రసముద్రం దాకా వేలాది కిలోమీటర్ల మేర విస్తరించింది. దాని పొడవునా భూగర్భంలో వేలాది ఏళ్లుగా అతి నెమ్మదిగా సాగుతూ వస్తున్న నిరంతర టెక్టానిక్ కదలికల పరిణామం కొన్నాళ్లుగా స్పీడందుకుంది. తూర్పు ఆఫ్రికాను నిలువునా చీలుస్తోంది. ఫలితంగా చివరికి తూర్పు ఆఫ్రికా క్రమంగా మిగతా ఖండం నుంచి పూర్తిగా విడిపోనుంది. వాటి మధ్య ఏర్పడే ఖాళీలో ఏకంగా 10 వేల బిలియన్ గ్యాలన్ల పై చిలుకు అపార జలరాశి నిండిపోయి సరికొత్త మహాసముద్రంగా రూపుదిద్దుకోనుంది. ఇందుకు సంబంధించిన నిదర్శనాలు ఇప్పటికే కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఇథియోపియాలో 2005 నాటికే ఏకంగా 60 మైళ్ల పొడవున లోతైన గుంత ఏర్పడింది. ఇది పలుచోట్ల ఏకంగా 20 మీటర్ల పై చిలుకు లోతుంది! 2018లో కెన్యాలో కూడా ఇలాంటి భారీ పగుళ్లు పుట్టుకొచ్చాయి. కారణాలెన్నో... టెక్టానిక్ కదలికలతో పాటు భూమి లోపలి పొరల్లోని శిలాజ ద్రవం తూర్పు ఆఫ్రికా చీలికను మరింత వేగవంతం చేస్తోంది. క్రమంగా లోపలి పొర పూర్తిగా పగుళ్లిచ్చి భారీ లోయల పుట్టుకకు దారితీస్తుంది. అగి్నప్రమాద కార్యకలాపాలను పెంచుతుంది. 2005లో ఇథియోపియాలో కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే ఏకంగా 420కి పైగా భూకంపాలు నమోదయ్యాయి. ఈ పరిణామం సైంటిస్టులతో పాటు పరిశోధకులను కూడా ఎంతగానో ఆశ్చర్యపరిచింది. ఆఫ్రికా ఖండం దిగువ భూ ఫలకాల్లో మార్పులు శరవేగంగా జరుగుతున్నాయనేందుకు ఇది తిరుగులేని నిదర్శనమని వారంటున్నారు. ఇకపై ఆఫ్రికాలో మరిన్ని భూకంపాలు, అగి్నపర్వతాల పేలుళ్ల వంటి పరిణామాలను చూడనున్నామని తులానే వర్సిటీ జియో సైంటిస్టు సింథియా ఎబింగర్ చెప్పుకొచ్చారు. అట్లాంటిక్ ఇలాగే పుట్టింది... మహాసముద్రాల్లో వయసురీత్యా అట్లాంటిక్ అన్నింటికంటే చిన్నది. ప్రస్తుత ఆఫ్రికా ఖండం తరహా పగుళ్లే లక్షలాది ఏళ్ల క్రితం దాని పుట్టుకకు దారితీసినట్టు సైంటిస్టులు చెబుతారు. తర్వాత మళ్లీ ఇంతకాలానికి మరో మహాసముద్రం పుట్టుకకు దారి తీయగల స్థాయిలో ఓ ఖండం నిలువునా చీలుతోంది. మహాసముద్రాల ఆవిర్భావ క్రమాన్ని అర్థం చేసుకునేందుకు ఇది చాలా అరుదైన అవకాశమని సైంటిస్టులు అంటున్నారు.కొత్త ఖండం కూడా... ఆఫ్రికా చీలిక ఆరో మహాసముద్రంతో పాటు కొత్త ఖండం పుట్టుకకు కూడా దారితీయనుంది. ఎందుకంటే సోమాలియా, కెన్యా, టాంజానియా వంటి దేశాలు ఆఫ్రికా నుంచి పూర్తిగా విడిపోతాయి. ఆరో సముద్రం ఆ మధ్యలో విస్తరిస్తుంది.లక్షల్లో నిర్వాసితులు... వాతావరణ మార్పుల దెబ్బకు ఆఫ్రికా ఖండంలో ఇప్పటికే 1.5 కోట్ల మందికి పైగా నిర్వాసితులయ్యారు. ఆ ఖండంలో ఏర్పడుతున్న చీలిక వల్ల పలు దేశాల్లో జీవజాలం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. దాంతో మొత్తంగా వాటి ఆర్థిక పరిస్థితులే తారుమారు కానున్నాయి. దాంతో పొట్ట చేత పట్టుకుని వలస వెళ్లే వారి సంఖ్య ఊహాతీతంగా పెరిగిపోనుంది. కొత్త మహాసముద్రం ఆఫ్రికా భౌగోళిక స్వరూపాన్నే సమూలంగా మార్చనుంది. పలు దేశాల ఆర్థిక, పర్యావరణ, మౌలిక వ్యవస్థలనే తలకిందులు చేయనుంది. చుట్టూ భూభాగాలతో కూడిన జాంబియా, ఉగాండా వంటి దేశాలు కొత్త సముద్ర తీర ప్రాంతాలు మారిపోతాయి. దాంతో కొత్త వర్తక మార్గాలు, ఆ దేశాల్లో నౌకాశ్రయాల వంటివి పుట్టుకొస్తాయి. అలా ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలే సమూలంగా మారిపోతాయి. సరికొత్త సముద్ర వాతావరణ పరిస్థితులు కొత్త ఆవాస ప్రాంతాలుగా మారతాయి. ఈ పరిణామం జీవవైవిధ్యంలో చెప్పుకోదగ్గ మార్పులకు దారి తీస్తుంది. అదే సమయంలో సముద్రమట్టంలో పెరుగుదల మరింత వేగంపుంజుకుంటుంది. భూభాగాల్లో మార్పుచేర్పులు చోటుచేసుకుంటాయి. అంతేగాక పలుచోట్ల తరచుగా తీవ్ర భూకంపాలు సంభవించవచ్చు. ఇలాంటి పరిణామాల వల్ల వచ్చిపడే తీవ్రమైన రిసు్కలను ఎదుర్కొనేందుకు పలు దేశాలు ఇప్పటినుంచే సిద్ధపడాల్సి ఉంటుంది. కొత్త మహాసముద్రం ఆవిర్భావం వేలాది ఏళ్ల తర్వాత జరిగినా ఆ క్రమంలో తలెత్తే పరిణామాలు ఆఫ్రికా ఖండంపై సమీప భవిష్యత్తు నుంచే కొట్టొచ్చినట్టుగా కన్పించడం మొదలవుతుంది. భూగోళం నిరంతరం పరిణామం చెందుతున్న తీరుకు ఈ పరిణామం మరో తాజా ఉదాహరణ. దీని ప్రభావాలను పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నంలో భూభౌతిక శాస్త్రవేత్తలు ఇప్పటికే తలమునకలయ్యారు. ఎందుకంటే తూర్పు ఆఫ్రికాలో జరుగుతున్నది కేవలం భౌగోళికపరమైన మార్పు మాత్రమే కాదు. సుదూర భవిష్యత్తులో మరిన్ని ఖండాలు విడిపోయి కొత్త మహాసముద్రాల పుట్టుక వంటివి జరిగి చివరికి మనకిప్పుడు తెలిసిన ప్రపంచమే సమూలంగా, శాశ్వతంగా మారిపోతుందనడానికి తిరుగులేని నిదర్శనం. ఆరో మహాసముద్రం ఆవిర్భావంతో ప్రపంచ భౌగోళిక స్వరూపంతో పాటు పర్యావరణ వ్యవస్థలు కూడా సమూల మార్పులకు లోనవడం ఖాయమని భూ¿ౌతిక శాస్త్రవేత్తలు కుండబద్దలు కొడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆహా.. ఏమి టీ!
రోజూ ఇంట్లో పొద్దున్నే చాయ్ చేసి కుటుంబసభ్యులకు అందించే చేతులు.. ఇప్పుడు అదే చాయ్తో, అదే కుటుంబానికి ఆదాయాన్ని అందిస్తున్నాయి. స్వయం ఉపాధితోపాటు మరొకరికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో స్త్రీ టీ క్యాంటీన్లు నడుపుతున్న మహిళల విజయ ప్రస్థానమిది. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ చొరవతో ఏర్పాటైన ఈ క్యాంటీన్లు విజయవంతంగా నడుస్తున్నాయి. దీంతో మరికొన్ని క్యాంటీన్ల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధమవుతోంది. - సాక్షి ప్రతినిధి, ఖమ్మంఉపాధి కల్పనే లక్ష్యం స్వయం సహాయక సంఘాల మహిళలకు స్థిరమైన ఆదాయ మార్గం చూపించాలని భావించిన కలెక్టర్ ముజమ్మిల్ఖాన్.. అందుకోసం వారితో టీ క్యాంటీన్లు ఏర్పాటు చేయించాలని సంకల్పించారు. అందుకోసం అన్ని శాఖల అధికారులతో చర్చించి ముందుడుగు వేశారు. టీ క్యాంటీన్కు ప్రత్యేక లోగో, బ్రాండ్ తయారు చేయించారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మొదటి విడతలో జిల్లాలో 41 షాపులు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. తొలి షాపును కలెక్టరేట్ వద్దే ప్రారంభించారు.కలెక్టరేట్ ఆవరణలోని క్యాంటీన్ ఆదాయంతో పోలిస్తే గేటు బయట ఏర్పాటైన స్త్రీ టీ క్యాంటీన్కు రెట్టింపు ఆదాయం వస్తుండటంతో ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 10, మండలాల్లో మరో 30కి పైగా మంజూరు చేశారు. ప్రస్తుతం 22 టీ క్యాంటీన్లను నడుస్తున్నాయి. మొత్తం 300 వరకు స్త్రీ టీ క్యాంటీన్లు ఏర్పాటుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటి ఏర్పాటుకు బ్యాంకు లింకేజీతో సంఘం తరఫున రూ.1.5 లక్షల వరకు రుణం అందిస్తున్నారు. సంఘంలోని మహిళలందరికీ ఒకటే కాకుండా అర్హత, ఆసక్తిని బట్టి ఒక్కొక్కరికి ఒక క్యాంటీన్ కేటాయిస్తున్నారు. నిరంతరం పర్యవేక్షణ... స్త్రీ టీ క్యాంటీన్ మంజూరు చేసే సమయంలో లబ్ధిదారులు గతంలో ఏదైనా వ్యాపారం చేశారా లేదా? అన్నది పరిగణనలోకి తీసుకున్నారు. యూనిట్ కేటాయించాక ఏ మేరకు లాభాలుంటాయనే అంశంపై రెండు నెలలపాటు మండల, జిల్లా సమాఖ్యల్లో చర్చించారు. చట్టాలు, పన్నుల చెల్లింపు, వ్యాపార నిర్వహణపై 400 మంది మహిళలకు హైదరాబాద్కు చెందిన నిపుణులతో శిక్షణ ఇప్పించారు. ఆపై రద్దీ ప్రాంతాలను గుర్తించి క్యాంటీన్లు ఏర్పాటుచేయించారు.అంతటితో వదిలేయకుండా మూడు నెలల పాటు వాటి నిర్వహణ, లాభాలను పరిశీలిస్తున్నారు. కలెక్టర్ ముజమ్మిల్ఖాన్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఈ అంశాలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. యూనిట్లలో దివ్యాంగులకు 25 శాతం కేటాయించారు. టీతోపాటు కూల్డ్రింక్స్, ఇతరత్రా కలిపి కాస్త పెద్ద యూనిట్లు కూడా ఏర్పాటుచేయించాలని నిర్ణయించారు. ఇవి ఖమ్మం కార్పొరేషన్లో మూడు, మండలాల్లో 10 వరకు ఏర్పాటు కానున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక ఇవి గ్రౌండ్ అవుతాయి. పదేళ్ల తర్వాత కూడా కొనసాగాలనే సంకల్పంతో ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నారు.ఇంకొకరికి ఉపాధి గ్రామంలో మాకు టీ స్టాల్ ఉన్నా పెద్దగా ఆదాయం ఉండేది కాదు. కలెక్టర్ ఇచ్చిన అవకాశంతో కలెక్టరేట్ వద్ద టీ స్టాల్ పెట్టాను. ఇప్పుడు మరొకరికి ఉపాధి కల్పిస్తున్నా. నెలకు రూ.30 వేల వరకు ఆదాయం వస్తుండగా, రూ.10 వేలు మిగులుతున్నాయి. – పోతగాని రాజేశ్వరి, స్త్రీ టీ క్యాంటీన్ ఓనర్, కలెక్టరేట్ బస్టాప్, ఖమ్మం. స్వయం ఉపాధి లభించింది.. మా స్త్రీ టీ క్యాంటీన్ గతనెల 4న ప్రారంభమైంది. ప్రస్తుతం టీ, కాఫీ, అల్లం టీ అమ్ముతున్నాం. కరెంట్ సౌకర్యం రాగానే పాలు, పెరుగు కూడా అమ్ముతాం. రోజురోజుకు వ్యాపారం పుంజుకుంటోంది. మొదటి నెల రూ.50 వేలు వచి్చంది. రుణ కిస్తీ చెల్లించగా.. కొంత మిగులుతోంది. – శ్రీరంగం గీత, జలగం నగర్, నవ్య గ్రామసమాఖ్య. మహిళల ఆర్థిక ఎదుగుదల కోసమే.. మహిళలు స్వయం ఉపాధి పొందాలనే ఉద్దేశంతో స్త్రీ టీ క్యాంటీన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టాం. ప్రభుత్వం తరఫున యూనిట్ గ్రౌండింగ్ చేశాం కదా అని వదిలేయకుండా స్థల గుర్తింపు, ఏమేం అమ్మాలి, నాణ్యతపై క్షుణ్ణంగా చర్చించి, శిక్షణ ఇప్పించాకే ముందడుగు వేశాం. యూనిట్ ఏర్పాటయ్యాక నిత్యం పరిశీలిస్తూ ఏళ్ల తరబడి కొనసాగేలా చూస్తున్నాం. – ముజమ్మిల్ఖాన్, కలెక్టర్, ఖమ్మం. -
శాటిలైట్ టెలికం.. మన దేశంలోకి వెల్కం!
మనం ఇప్పుడు జేబులో సెల్ఫోన్ పెట్టుకుని గడిపేస్తున్నాం. ఎక్కడున్నా కాల్స్, మెసేజీలు పంపడం, అందుకోవడం దగ్గరి నుంచి ఇంటర్నెట్ దాకా యథాలాపంగా వాడేస్తున్నాం. కానీ అడవులు, ఎడారులు, మారుమూల ప్రాంతాల్లో మొబైల్ సేవలు సరిగా అందవు. అలాంటి చోట మంచి పరిష్కారం శాటిలైట్ టెలికం సేవలు. ఇక్కడా, అక్కడా అని లేకుండా ఎక్కడైనా సరే... సిగ్నల్స్ అందుకోగలగడం దాని ప్రత్యేకత.త్వరలోనే ఈ శాటిలైట్ టెలికం సేవలు మన దేశంలో అందుబాటులోకి రానున్నాయి. భారత టెలికం రంగం మరో మెట్టు ఎక్కబోతోంది. అయితే శాటిలైట్ ఆధారిత టెలికం సేవలు సామాన్యుడికి చేరడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ప్రారంభదశలోనే ఉండటం, వీటి ధరలు, ఈ సాంకేతికతను వినియోగించగల హ్యాండ్ సెట్ల ధరలు ఎక్కువగా ఉండటం దీనికి కారణమని పేర్కొంటున్నారు. – నూగూరి మహేందర్, సాక్షి ప్రతినిధికాస్త ఖరీదైనవే.. శాట్కామ్ సేవలు ఖరీదైనవే. దేశంలో టెల్కోల హోమ్ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లు నెలకు కనీసం రూ.400 నుంచి రూ.4,000 వరకు ఉంటాయి. అవసరాన్ని, తాహతును బట్టి ఎంచుకోవచ్చు. కానీ ఉపగ్రహ టెలికం, ఇంటర్నెట్ వ్యయాలు అంతకు 7 నుంచి 18 రెట్లు ఖరీదైనవని జేఎం ఫైనాన్షియల్స్ సంస్థ వెల్లడించింది. సైన్యం, నావికా దళం, మారుమూల ప్రాంతాల్లో వ్యాపార కార్యకలాపాలు సాగించే సంస్థలకు శాటిలైట్ కమ్యూనికేషన్స్ ఉపయోగకరం. ఆతిథ్య రంగంలో లగ్జరీ హోటళ్లు, కొండ ప్రాంతాల్లో రిసార్టులు ఏర్పాటు చేసే సంస్థలు తమ వినియోగదారుల కోసం శాటిలైట్ సేవలను వినియోగించుకునే అవకాశం ఉంది.ఈ క్రమంలో తొలుత బిజినెస్ టు బిజినెస్ విభాగంలో శాటిలైట్ టెలికం సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ప్రముఖ టెలికం కంపెనీ ప్రతినిధి ఒకరు ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు. ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ కంపెనీ కెన్యాలో ఒక్కో యాంటెన్నాకు నెలకు 30 డాలర్లు వసూలు చేస్తోందని.. ఇతర దేశాల్లో అది 100 డాలర్లు, అంతకంటే అధికంగా ఉందని చెప్పారు. మన దేశంలో ప్రవేశపెడితే ధర ఎంతనేది తెలుస్తుందని పేర్కొన్నారు. ఇక ఇండియా మొబైల్ కాంగ్రెస్ వేదికగా యూటెల్శాట్ వన్వెబ్ తన సత్తాను ప్రదర్శించిందని.. ఆ సంస్థతో చేతులు కలిపేందుకు భారత సైన్యం ముందుకు వచ్చిందని వెల్లడించారు.రెండు సంస్థలకు లైసెన్స్.. మరొకటి వెయిటింగ్.. శాట్కామ్ సేవలు భారత్లో అందించాలంటే కంపెనీలకు ‘గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ (జీఎంపీసీఎస్)’లైసెన్స్, ‘ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్–ఆథరైజేషన్ సెంటర్ (ఇన్స్పేస్)’లైసెన్స్ ఉండటం తప్పనిసరి. ప్రస్తుతం కేంద్రం నుంచి వన్వెబ్ ఇండియా కమ్యూనికేషన్స్, జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థలు శాటిలైట్ కమ్యూనికేషన్స్ లైసెన్స్ దక్కించుకున్నాయి. వన్వెబ్ ఇండియా.. యూటెల్శాట్ భాగస్వామ్యంతో భారతీ ఎయిర్టెల్ ప్రమోట్ చేయగా... లక్సెంబర్గ్కు చెందిన ఎస్ఈఎస్ సంస్థతో రిలయన్స్ జియో చేతులు కలిపి.. జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్ను ప్రమోట్ చేస్తోంది.ఇప్పటికే పలు దేశాల్లో సేవలు అందిస్తున్న యూటెల్శాట్ వన్వెబ్ గుజరాత్, తమిళనాడులో బేస్ స్టేషన్లను ఏర్పాటు చేసిందని, అనుమతులు రాగానే సేవలు ప్రారంభిస్తామని భారతీ ఎంటర్ప్రైజెస్ వైస్ చైర్మన్ రాజన్ భారతీ మిత్తల్ ఇటీవలే ప్రకటించారు. ఇక జియో–ఎస్ఈఎస్కు సైతం భారత్లో రెండు ప్రాంతాల్లో బేస్ స్టేషన్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో టాప్లో ఉన్న స్టార్లింక్ సంస్థ 100కుపైగా దేశాల్లో ఇప్పటికే సర్విసులు ప్రారంభించింది. భారత్లో లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంది. అమెజాన్కు చెందిన కైపర్ కూడా ఇక్కడ అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి.ఎవరి సామర్థ్యం వారిదే.. తమకు భూమిచుట్టూ కక్ష్యలో 6,900కుపైగా ఇంటర్నెట్ ఉపగ్రహాలు ఉన్నాయని స్టార్లింక్ చెబుతోంది. యూటెల్శాట్ వన్వెబ్ ఖాతాలోని ఉపగ్రహాల సంఖ్య 635కుపై మాటే. ఇక ప్రపంచ జనాభాలో 99 శాతం మందికి వీడియో, డేటా సేవలను అందించగలిగేలా రెండు వేర్వేరు కక్ష్యలలో పనిచేస్తున్న దాదాపు 70 ఉపగ్రహాలను కలిగి ఉన్నట్టు ఎస్ఈఎస్ సంస్థ తెలిపింది. 100 కోట్లకుపైగా టీవీ వ్యూయర్స్, టాప్–10 గ్లోబల్ టెలికం కంపెనీల్లో ఏడింటికి, ప్రపంచంలోని ఆరు ప్రధాన క్రూజ్ లైన్స్లో ఐదింటికి తాము సేవలు అందిస్తున్నట్టు వెల్లడించింది.వైఫై తరహాలో సేవలు.. శాటిలైట్ నుంచి సిగ్నల్స్ అందుకోవడానికి చిన్న యాంటెన్నా ఏర్పాటు చేస్తారు. ఆ యాంటెన్నా వైఫై జోన్ మాదిరిగా పనిచేస్తుంది. దాని ద్వారా కాల్స్, ఎస్సెమ్మెస్లు చేసుకోవచ్చు. సాధారణ ఫోన్లు వాడేవారి నుంచి కాల్స్ అందుకోవాలంటే.. సంబంధిత సంస్థకు బేస్స్టేషన్ ఉండాలి. సాధారణ కస్టమర్ కాల్ చేస్తే ఆ బేస్స్టేషన్ ద్వారా శాటిలైట్కు, అక్కడి నుంచి యాంటెన్నా పరిధిలో ఉన్న వినియోగదారులకు కనెక్ట్ అవుతుంది. సాధారణ కాల్స్, సందేశాలకు మాత్రమే శాటిలైట్ ఆధారిత టెలికం సేవలు ఉపయుక్తం. 4జీ, కేబుల్ బ్రాడ్బ్యాండ్ మాదిరి వేగంగా డేటాను అందుకునే అవకాశం తక్కువ.ప్రభుత్వమే స్పెక్ట్రమ్ కేటాయించి.. శాటిలైట్ టెలికం బేస్స్టేషన్ పనిచేయాలంటే ప్రత్యేక స్పెక్ట్రమ్ (తరంగ దైర్ఘ్యం) కేటాయింపులు అవసరం. లైసెన్స్ పొందిన కంపెనీలకు ప్రభుత్వం ఇంకా దీనిని కేటాయించలేదు. శాటిలైట్ సేవల కోసం ప్రభుత్వం స్పెక్ట్రమ్ కేటాయిస్తుంది (అడ్మినిస్ట్రేటివ్ అలకేషన్). దీనిని అన్ని కంపెనీలు పంచుకోవాల్సి ఉంటుంది. అలాకాకుండా రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు స్పెక్ట్రమ్ వేలం వేయాలని ప్రతిపాదించాయి. విదేశీ సంస్థలు స్టార్లింక్, ప్రాజెక్ట్ కైపర్లు మాత్రం అడ్మినిస్ట్రేటివ్ కేటాయింపుల విధానం అమలు చేయాలని కోరాయి. బ్రెజిల్ గతంలో స్పెక్ట్రమ్ వేలం వేసి విఫలమై ప్రస్తుతం అడ్మినిస్ట్రేటివ్ మార్గాన్ని ఎంచుకుందని వివరిస్తున్నాయి. దీనితో మన దేశం కూడా అడ్మినిస్ట్రేటివ్ మార్గం అనుసరించాలని నిర్ణయించింది.కొన్ని ఫోన్ మోడల్స్లోనే అందుబాటులో.. శాటిలైట్ ఆధారిత టెలికం సేవలు అందుకోవాలంటే మొబైల్ ఫోన్లో ప్రత్యేక ఏర్పాటు తప్పనిసరి. యాపి ల్ తయారీ ఐఫోన్–14, ఆ తర్వాతి మోడళ్లు శాటిలైట్ కనెక్టివిటీని సపోర్ట్ చేస్తాయి. గూగుల్ పిక్సెల్ 9 సిరీస్, సామ్సంగ్ గెలాక్సీ ఎస్25 ఈ వరుసలో ఉన్నాయి. ఇవేగాక ప్రత్యేక శాటిలైట్ ఫోన్స్ కూడా లభిస్తాయి. ఇరీడియం 9555, ఇన్మాశాట్ ఐశా ట్ ఫోన్ 2, థురాయో ఎక్స్టీ–లైట్, గ్లోబల్ స్టార్ జీఎస్పీ–1700 మోడళ్లను ఎయిర్టెల్ విక్రయిస్తోంది. వీటి ధరలు రూ.70 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు ఉన్నాయి. పోస్ట్ పెయిడ్ ప్లాన్ల ధర రూ.1,500 నుంచి ప్రారంభమవుతుంది. పరిమితి దాటితే ప్రతి నిమిషానికి అదనంగా చార్జీ చెల్లించాల్సి ఉంటుంది.శాట్కామ్ అంటే.. శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థలు (శాట్కామ్) డేటా, వాయిస్ను ప్రసారానికి, స్వీకరణకు ఉపగ్రహాలపై ఆధారపడతాయి. అదే మామూలు టెలికం సేవలు ఫైబర్ ఆప్టిక్స్, ఇతర కేబుళ్లపై ఆధారపడతాయి. శాట్కామ్ సేవలకు ఇటువంటి మౌలిక సదుపాయాల అవసరం లేదు. భారత్లో సాధారణ నెట్వర్క్ 98 శాతం భూ భాగంలో విస్తరించి ఉంది. అయితే ఈ సంప్రదాయ నెట్వర్క్లను ఏర్పా టు చేయడం ఆర్థికంగా, లాభపరంగా సాధ్యంకాని కొండలు, గుట్టలు, అడవులు, మారుమూల ప్రాంతాల్లో శాట్కామ్ సేవలు ప్రయోజనకరంగా ఉంటాయి. అత్యవసర పరిస్థితులు, తీవ్ర వాతావరణ పరిస్థితులలో కూడా ఇవి పనిచేయగలవు. -
కట్టుబడినందుకు కట్టడి చేశారు
అమెరికాలో దాదాపు వందకు పైగా సంచలనాత్మక కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీచేసిన డొనాల్డ్ ట్రంప్ అక్కడి అసోసియేటెడ్ ప్రెస్ వార్తాసంస్థపై కత్తిగట్టారు. అమెరికా తీరప్రాంతమైన ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’పేరును ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా మారుస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అయినాసరే పాత పేరునే తమ రోజువారీ వార్తల్లో, కథనాల్లో వినియోగిస్తామని అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) కరాఖండీగా చెప్పింది. దీంతో అధ్యక్షుడి నిర్ణయాన్నే బేఖాతరు చేస్తారా అన్న ఆగ్రహంతో ట్రంప్ పాలనాయంత్రాంగం శుక్రవారం నుంచి ఏపీ పాత్రికేయులకు అధ్యక్షభవనం, ఎయిర్ఫోర్స్ వన్ అధ్యక్ష విమానంలో రిపోర్టింగ్ కోసం అనుమతి నిరాకరించింది. అన్ని దేశాల్లో దినపత్రికలు, మేగజైన్లు, ఇతర వార్తాసంస్థలకు రోజువారీ వార్తలు, కథనాలు అందించే ప్రపంచంలో అతిపెద్ద న్యూస్ఏజెన్సీల్లో ఏపీ కూడా ఒకటి. ఇంతటి కీలకమైన బాధ్యతలు నిర్వర్తించే తమ ప్రతినిధులను అధ్యక్షభవనం వంటి ముఖ్యమైన చోటుకు రానివ్వకపోవడంపై ‘ఏపీ’తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఇది వార్తాస్వేచ్ఛను అడ్డుకోవడమేనని వ్యాఖ్యానించింది. దీనిపై ట్రంప్ ప్రభుత్వం స్పందించింది. ‘‘అధ్యక్షుని నిర్ణయాన్ని బేఖాతరు చేయడమంటే వార్తల్లో విభజన తెచ్చే సాహసం చేయడమే. పైగా తప్పుడు విషయాన్ని అందరికీ చేరవేయడమే. అధ్యక్షుని నిర్ణయానికి గౌరవం ఇవ్వని వ్యక్తులకు వైట్హౌస్లో, ఎయిర్ఫోర్స్ వన్ విమానంలో తగు స్థానం లేదు. ఆ స్థానాన్ని ఇన్నాళ్లూ వైట్హౌస్లోకి రాలేక రిపోర్టింగ్ చేయలేకపోయినా ఇతర మీడియా ప్రతినిధులకు కల్పిస్తాం’’అని వైట్హౌస్ డెప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ టేలర్ బుడోవిచ్ వాదించారు. దీనిపై ఏపీ మళ్లీ స్పందించింది. ‘‘అమెరికన్ వినియోగదారులను మినహాయిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా వినియోగదారులకు ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’అనే పేరు వాస్తవం. ఆ దృక్కోణంలో పాత పేరుకే కట్టుబడి ఉన్నాం. ఈ విషయంలో అధ్యక్షుడు కార్యనిర్వాహక ఉత్తర్వును ధిక్కరించినట్లుగా భావించకూడదు’’అని ఏపీ స్పష్టంచేసింది. దశాబ్దాలుగా పూల్ రిపోర్టర్గా.. ప్రముఖ మీడియా సంస్థల కొద్దిపాటి మీడియా ప్రతినిధులు, కెమెరామెన్లకు మాత్రమే వైట్హౌస్, ఎయిర్ఫోర్స్ వన్ వంటి కీలక ప్రదేశాల్లోకి అనుమతిస్తారు. ఇది దశాబ్దాలుగా కొనసాగుతోంది. నాటి అమెరికా అధ్యక్షుడు జేమ్స్ ఏ గార్ఫీల్డ్ హత్యోదంతం తర్వాత కొద్దిమంది మీడియా వాళ్లనే అనుమతించడం మొదలెట్టారు. ఇది 1881 ఏడాదినుంచి మొదలైంది. ఈ మీడియా బృంద సభ్యులను పూల్ రిపోర్టర్ అంటారు. ‘ఏపీ’ప్రతినిధి చాన్నాళ్లుగా ఇలా పూల్ రిపోర్టర్గా కొనసాగుతున్నారు. తమను లోపలికి అనుమతించకపోవడం పూర్తి వివక్షాపూరిత నిర్ణయం అని ఏపీ ప్రతినిధి ఒకరు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేయాలని ‘ఏపీ’భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్క ఏపీనే బయటకు గెంటేయడంపై వైట్హౌస్లోని ‘ది వైట్హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్(డబ్ల్యూహెచ్సీఏ)’తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ‘‘ప్రస్తుతానికైతే ఏపీకి బదులు రొటేషన్లో భాగంగా వేరే ప్రతినిధికి అవకాశం కల్పిస్తాం. సాధారణంగా ప్రతి రోజూ రొటేషన్లో ఏపీకి అవకాశం ఉంటుంది. కానీ ఇలా ఏకపక్షంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అమెరికా రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే. భావప్రకటనా స్వేచ్ఛకు భంగం వాటిల్లజేస్తూ ప్రభుత్వం సెన్సార్షిప్కు తెరలేపుతోంది’’అని డబ్ల్యూహెచ్సీఏ ఒక ప్రకటనలో తెలిపింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వరంగల్ పేరు ఎలా వచ్చిందంటే..?
ఖిలా వరంగల్: రాజులు పోయారు.. రాజ్యాలు అంతరించాయి. రాచరికపు వైభోగాలు కనుమరుగయ్యాయి. కానీ నాటి కట్టడాలు, జ్ఞాపకాలు నేటికీ చెక్కు చెదరలేదు. శతాబ్దాల చరిత్ర.. శత్రు దుర్బేధ్య నగరం.. శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది ఏకశిల కొండ. నాడు ఏకశిల నగరం, ఓరుగల్లుగా పలు పేర్లతో ప్రఖ్యాతిగాంచింది. కాలక్రమేణా దీనికి వరంగల్ (Warangal) పేరు స్థిరపడింది. వారసత్వ నగరంగా.. భారతదేశంలోని ఉత్తమ వారతస్వ నగరాల్లో ఒకటిగా ఓరుగల్లు (Orugallu) గుర్తింపు పొందింది. ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాద్ (Hyderabad) నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద నగరం. ఓరు.. అంటే ఒకటి, గల్లు.. అనే పదానికి రాయి అని అర్థాలున్నాయి. 11వ శతాబ్ధంలో ఈ అందమైన నగరాన్ని నిర్మించారు. ఈ ప్రాంతాన్ని 300 ఏళ్లు కాకతీయులు పాలించారు. ఈ కాలాన్ని స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. రాజధానిగా చెప్పుకుంటున్న ఖిలా వరంగల్ కోట అద్భుతమైన పురాతన కట్టడాలు, అనేక స్మారక చిహ్నాలు, వాస్తు శిల్ప కళా సంపదకు నిలయం. వరంగల్ పేరు ఎలా వచ్చిందంటే.. కాకతీయుల రాజధానిగా చెప్పుకునే ఖిలా వరంగల్ కోటలో ఏకశిల గుట్ట (ఎత్తయిన రాతి కొండ)గా ఉంది. ఏక (ఒక) శిల (రాయి) ఏకశిలా నగరం.. దీన్నే ఓరు (ఒకటి) గల్లు (రాయి) అని.. ఈ ఎత్తయిన కొండ పేరుతోనే ఓరుగల్లు నగరంగా పిలుస్తుంటారు. శతాబ్దాల కాలం నుంచి ఏకశిల, ఓరుగల్లు నగరం కనుమరుగై.. ప్రస్తుతం వరంగల్గా పేరొందింది. అందాల కొండ ఏకశిల గుట్టను ఎక్కి చూస్తే.. నగరంతోపాటు చుట్టు పక్క గ్రామాలు, కొండలు, గుట్టలు, కనువిందు చేస్తాయి. ఈకొండపై ఆలయం, బురుజు, సైనిక స్థావరం, విశ్రాంతి గదులు, ఆనవాళ్లు నేటికీ ఉన్నాయి. ఈ కొండపై ఉన్న ఎత్తయిన బురుజుపై ఫిరంగి, భారీ తోపులు ఏర్పాటు చేశారు. శత్రు సైన్యం రాకను పసిగట్టినప్పుడు ఫిరంగులు, తోపుల్ని పేల్చడం వల్ల.. కోట చుట్టూ ఉన్న సైన్యం అప్రమత్తమయ్యేదని చరిత్రకారులు చెబుతున్నారు. కొండపై సైనిక స్థావరం హనుమకొండ పద్మాక్షి దేవాలయం కేంద్రంగా మూడు కొండలను ఏకం చేసి కాకతీయుల తొలి రాజధానిని ఏర్పాటు చేశారు. కాకతీమాత అనుగ్రహంతో గణపతి దేవ చక్రవర్తి 1199 నుంచి 1262 మధ్యకాలంలో రాజధానిని ఓరుగల్లుకు మార్చేసి 300 ఏళ్ల పాటు సుస్థిర పాలన అందించారు. తొలుత 3వేల ఆడుగుల ఎత్తయిన ఏకశిల కొండపై సైనిక స్థావరం ఏర్పాటు చేశారు. ఇందుకు కొండపై ఎత్తయిన బురుజే సాక్ష్యం. బురుజు ఎక్కేందుకు అంతర్భాగంలోనే వేర్వేరుగా మెట్ల మార్గాలు ఏర్పాటు చేశారు. మెట్ల మార్గం ఎక్కి చూస్తే నగరంతోపాటు చుట్టూ ఉన్న కొండలు గుట్టలు, అందమైన నగరం కనువిందు చేస్తాయి. బురుజుపై తోపులు పెట్టి పేల్చిన ఆనవాళ్లు నేటికీ ఉన్నాయి. సైనికులు గాయపడకుండా.. నిలువెత్తు పటిష్టమైన నాలుగు రాళ్లు నాలుగు వైపులా నిలబెట్టి ఉంటాయి. దీనిపైకి పర్యాటకులు ఎక్కి.. రాతి కట్టడాలు.. ఆహ్లాదకర వాతావరణాన్ని తిలకించి ఆస్వాదిస్తున్నారు. సైనికులకు విశ్రాంతి గదులు ఆనాడు కొండపై సైనికులకు విశ్రాంతి గదులు నిర్మించారు. ఫిరంగుల్లో మందు నింపేందుకు ప్రత్యేక గదులు వేర్వేరుగా ఉండేవని చెబుతారు. ఈ నిర్మాణాలన్నీ 20 ఏళ్ల క్రితం వరకు బాగానే ఉన్నప్పటికీ.. ఆదరణ లేక శిథిలమై కూలిపోయాయి. ఈగుట్టపైకి రహస్య సొరంగ మార్గాలు ఉండేవని.. వాటి ద్వారా చేరుకుని సైనికులకు మార్గనిర్ధేశం చేసేవారని చరిత్రకారులు చెబుతున్నారు. చదవండి: ఇజ్రాయెల్లో తెలుగువారి ఇక్కట్లు అభివృద్ధికి దూరంగా.. ఏకశిల గుట్ట నేటికీ అభివృద్ధికి దూరంగా ఉంది. గుట్టపై విశాలమైన ప్రాంగణం కనిపిస్తుంది. కనీసం ఐదువేల మంది ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. గుట్టపై పర్యాటకులు చల్లని వాతావరణం, ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తూ.. నగర అందాలను వీక్షిస్తూ సేదదీరుతుంటారు. కానీ గుట్టపై దాహార్తి తీరేందుకు మంచినీటి సౌకర్యం లేదు. మెట్ల మార్గం ద్వారా పర్యాటకులు ఎంతో కష్టపడి ఎక్కినా.. తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలు లేక అవస్థలు పడుతుంటారు. ఒకే రాయితో ఏర్పడిన సుందరమైన చారిత్రక గుట్టను ఆధునికీకరిస్తే.. పర్యాటకుల రాక మరింత పెరుగుతుందని, తద్వారా స్థానిక యువతకు స్వయం ఉపాధి మెరుగుపడుతుందని స్థానికులు భావిస్తున్నారు.కొండపై ఆలయంఏకశిల కొండపై అద్భుతమైన శిల్ప కళా సౌందర్యంతో కూడిన ఓ ఆలయం ఉంది. ఆలయంలో 28 స్తంభాలతో గర్భగుడి, విశాలమైన కల్యాణ మండపం ఉంది. శిల్ప కళా సౌందర్యంతో కనిపించే ఈ ఆలయ గర్భగుడి దేవతా విగ్రహాలు లేక బోసిపోయి కనిపిస్తోంది. ఆనాడు సైనికులు సైతం ఇక్కడ శివారాధన చేసిన తర్వాతే విధుల్లో చేరేవారని చారిత్రక నిపుణులు చెబుతున్నారు. -
అసలు కథ చెప్పని ‘తండేల్’
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పద్నాలుగు నెలలు పాకిస్తాన్ జైలులో మగ్గిపోయిన 22 మంది మత్స్యకారులను విడుదల చేయించింది ఎవరు? వారిని వాఘా సరిహద్దుల నుంచి ఇంటి వరకు తీసుకొచ్చింది ఎవరు? వారి కష్టాలకు చలించిపోయి ఇచ్చిన మాట ప్రకారం రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేసిందెవ్వరు? ఇంకెవరూ వలస పోకుండా, ఎవరికీ అలాంటి దుస్థితి రాకుండా శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో పోర్టు, హార్బర్, జెట్టీల నిర్మాణం మొదలుపెట్టింది ఎవరు? వలస బతుకులకు ఫుల్స్టాప్ పెట్టాలని ప్రయత్నించిందెవరు?... మత్స్యకారుల వలస జీవితం ఇతివృత్తంగా తెరకెక్కించిన ‘తండేల్’ సినిమా ఈ ప్రశ్నలన్నింటినీ మరోసారి తెర ముందు ఉంచింది. సినిమాలో సగం నిజమే చెప్పినా.., చూపించని కోణాలు ఎన్నో ఉన్నాయి. బాధితులు మాత్రం మీడియా ముందుకు వచ్చి గుండె తెరిచి వాస్తవాలు వివరించారు. తమను విడిపించి తీసుకువచ్చింది, రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేసింది వైఎస్ జగన్మోహన్రెడ్డి అని విస్పష్టంగా చెప్పారు. తరాల తరబడి శ్రీకాకుళం జిల్లాను పాలిస్తున్న రాజకీయ కుటుంబాలు కలలో కూడా ఊహించని విధంగా జిల్లాలో పోర్టు పనులు ప్రారంభించడం, ఫిషింగ్ హార్బర్, జెట్టీ పనులు ప్రారంభించడం వైఎస్ జగన్ (YS Jagan) చలవేనని సోషల్ మీడియా మోతమోగిపోయేలా చెబుతున్నారు. ఇదీ జరిగింది.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశంకు చెందిన 10 మంది, బడివానిపేటకు చెందిన ముగ్గురు, ముద్దాడకు చెందిన ఒకరు, విజయనగరం జిల్లా తిప్పలవలసకు చెందిన ఆరుగురు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు ఇలా మొత్తం 22 మంది మత్స్యకారులు చేపల వేట కోసం 2018 జూలైలో గుజరాత్ రాష్ట్రం వీరావల్కు వెళ్లారు. వీరంతా ఒక బృందంగా ఏర్పడి నాలుగు పడవల్లో అరేబియా సముద్రంలోకి వెళ్లారు. పడవలు సముద్రంలో తీవ్ర ఆటుపోట్లకు గురవడంతో పొరపాటుగా పాకిస్తాన్ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారు. 2018 నవంబర్ 28న అక్కడి కోస్టు గార్డు అధికారులకు దొరికిపోయారు. పాకిస్తాన్ అధికారులు వారందరినీ కరాచీ సబ్ జైలులో పెట్టారు. అక్కడ సరైన తిండి, దుస్తులు లేక అక్కడ వారు పడ్డ అవస్థలు వర్ణనాతీతం. జైలు అధికారులు ఉదయం ఒక్క రొట్టె ఇచ్చేవారు. మధ్యాహ్నం, రాత్రి రెండేసి రొట్టెలు ఇచ్చేవారు. వాటితోనే సరిపెట్టుకోమని చెప్పేవారు. రొట్టెలు వద్దంటే అన్నం ఇచ్చేవారు. ఆదివారం మాత్రం కొంచెం మాంసాహారం పెట్టేవారు. ఈద్ అనే స్వచ్ఛంద సంస్థ దుస్తులతో పాటు రూ.5 వేల నగదు ఇచ్చింది. అక్కడ కూలి పనులు చేస్తే కొంత డబ్బు వచ్చేది. ఆ డబ్బుతో జైల్లోనే విక్రయించే కిరాణా సరుకులు కొనుక్కొని వంట చేసుకునేవారు. అదీ అరకొర భోజనమే. ఇలా కష్టాలు అనుభవిస్తూ క్షణమొక యుగంలా గడిపారు. మరోపక్క వేటకు వెళ్లిన వీరి ఆచూకీ తెలియకపోవడంతో ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. చివరకు వారితో పాటు వేటకు వెళ్లిన మరో మత్స్యకారుడి ద్వారా వారంతా పాకిస్తాన్ అదుపులో ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆ మత్స్యకారుల కుటుంబాలు తమ వాళ్ల కోసం గ్రామ సర్పంచ్ నుంచి ప్రభుత్వ పెద్దల వరకు అందరినీ ఆశ్రయించాయి. ఎవరూ పరిష్కారం చూపలేదు. పాకిస్తాన్లో మత్స్యకారులు తిండికి కూడా ఇబ్బంది పడుతున్నారని తెలిసి వారి కుటుంబీకులు తల్లడిల్లిపోయేవారు. ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్ హామీ ఆ సమయంలో నిండు గర్భిణిగా ఉన్న రామారావు అలియాస్ రాజు సతీమణి నూకమ్మ, బందీగా ఉన్న మరో మత్స్యకారుడు ఎర్రయ్య సతీమణి శిరీష మిగిలిన మత్స్యకారుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. గ్రామానికి చెందిన న్యాయవాది గురుమూర్తి సాయంతో జిల్లా యంత్రాంగానికి, నాయకులకు, ప్రభుత్వానికి విన్నపాలు అందజేశారు. అయినా ఫలితం లేదు. అదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారు. 2018 డిసెంబర్ 2న రాజాం నియోజకవర్గం లచ్చయ్యపేట గ్రామం వద్దకు వచ్చిన వైఎస్ జగన్ను బాధిత మత్స్యకార కుటుంబాలు కలిశాయి. పాకిస్తాన్ జైల్లో బందీలుగా ఉన్న తమ వాళ్లను విడిపించాలని కోరాయి. అప్పటి రాష్ట్ర మంత్రి, ఎచ్చెర్ల ఎమ్మెల్యే కళా వెంకటరావును కలిసినా పట్టించుకోలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ వెంటనే స్పందించారు. పాక్ చెరలో ఉన్న మత్స్యకారుల సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. తమ ఎంపీలను పంపిస్తానని, మత్స్యకార కుటుంబ సభ్యులు విదేశాంగ శాఖ మంత్రిని కలిసేలా చేస్తానని చెప్పారు. అధికారంలోకి వస్తే వెంటనే విడిపిస్తానని భరోసా ఇచ్చారు. జగన్ పునర్జన్మనిచ్చారు తండేల్ సినిమా హీరో పాత్రకు మూలమైన రామారావు సోదరి ముగతమ్మ. ఈమె భర్త అప్పారావు, కొడుకులు కళ్యాణ్, కిషోర్ కూడా అప్పట్లో పాక్ జైల్లో బందీ అయ్యారు. ‘తండేల్’ సినిమాలో జగన్ ప్రస్తావన లేకపోవడాన్ని చూసి ముగతమ్మ తట్టుకోలేకపోయారు. సినిమా చూసి వచ్చిన వెంటనే హాల్ బయట తన మనసులో మాటను మీడియా ముందు స్పష్టంగా చెప్పారు. తమ వారిని విడిపించి తీసుకువస్తానని చేతిలో చేయి వేసి జగన్ చెప్పారని, చెప్పినట్టుగానే తీసుకుని వచ్చారని తెలిపారు. అంతేకాకుండా ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేశారని గుర్తు చేశారు. జగనన్నతో పాటు అప్పటి విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్, గ్రామ సర్పంచ్, సర్పంచ్ కుమార్తె, న్యాయవాది గురుమూర్తి కృషి కూడా ఉందని తెలిపారు. సినిమాలో అవేవీ లేకపోయినా బయట చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని, అందుకే అన్ని విషయాలు వివరంగా చెబుతున్నానని అన్నారు.వైఎస్ జగన్ ప్రభుత్వం చొరవతో విడుదల పాదయాత్రలో ఉన్నప్పటికీ, వైఎస్ జగన్ మత్స్యకారుల సమస్య పరిష్కారానికి కృషి చేశారు. దీంతో 2019 ఫిబ్రవరిలో మత్స్యకారుల నుంచి కుటుంబ సభ్యులకు ఉత్తరాలు రావడం మొదలైంది. ఇది కుటుంబ సభ్యులకు కొంత ఉపశమనం కలిగించినా, తిరిగి ఇంటికి వస్తారో, లేదో అన్న భయం వెంటాడుతూనే ఉండేది. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారుల విడుదలకు కేంద్రంపై ఒత్తిడి మరింతగా పెంచారు.ఆ తర్వాత కేంద్రం 370వ అధికరణం ఎత్తివేయడం, 35 (ఎ)తొలగింపు వంటి పరిణామాలతో వీరి విడుదలపై ఆశలు సన్నగిల్లాయి. అయినా వైఎస్ జగన్ పట్టువిడవకుండా ఎంపీల ద్వారా విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరిపారు. దీంతో మత్స్యకారుల విడుదలకు పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరించింది. 2020 జనవరి 6న మత్స్యకారులను విడుదల చేసింది. ఆరోజు సాయంత్రం 7 గంటల సమయంలో వాఘాలోని భారత్–పాక్ సరిహద్దు వద్ద 20 మంది మత్స్యకారులను అప్పగించింది. వారికి అప్పటి వైఎస్సార్సీపీ (YSRCP) మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు. మిగతా ఇద్దరు డాక్యుమెంట్లు, ఇతర సాంకేతిక కారణాల వల్ల తర్వాత విడుదలయ్యారు. విడుదలైన వారందరినీ వైఎస్సార్సీపీ నేతలు, అధికారులు ఢిల్లీ తీసుకొచ్చి అక్కడి నుంచి విమానంలో రాష్ట్రానికి తెచ్చారు. వారంతా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. జగన్ వారందరికీ స్వీట్లు తినిపించి, ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేశారు. ఇకపై మత్స్యకారులు ఇలా వలసలు వెళ్లే అవసరం లేకుండా రాష్ట్రంలోనే పోర్టు, జెట్టీ, ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామని భరోసా ఇచ్చారు.చెప్పినట్టుగానే హామీలు అమలు 194 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న శ్రీకాకుళం జిల్లాలో మౌలిక సదుపాయాలు లేక మత్స్యకారులు వలసపోయేవారు. దీన్ని నివారించేందుకు జిల్లాలోని మూలపేటలోనే ల్యాండ్ లార్డ్ మోడల్ విధానంలో రూ.2,949.70 కోట్లతో సీ పోర్టు తొలి దశ, బుడగట్లపాలెంలో రూ.366 కోట్లతో ఫిషింగ్ హార్బర్, మంచినీళ్లపేటలో జెట్టీ పనులకూ శ్రీకారం చుట్టారు. అధికారంలో ఉండగానే చాలా వరకు పనులు పూర్తి చేశారు. చదవండి: బాబు డేంజర్ గేమ్.. కంట్రోల్ తప్పిన లోకేష్!వేట నిషేధ కాలంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పేరిట 17,136 మందికి రూ.10 వేలు చొప్పున సాయం అందజేశారు. మత్స్యకారుల సంక్షేమం క్షేత్రస్థాయిలో అందుతుందో తెలుసుకునేందుకు 66 మంది సాగర మిత్ర ఉద్యోగులను నియమించారు. గ్రామ సచివాలయాల్లో ఫిషరీస్ అసిస్టెంట్లను నియమించారు. ఫిష్ ఆంధ్రా షాపులను ఏర్పాటు చేశారు. కరోనా సమయంలో రూ. 3 కోట్లు ఖర్చు పెట్టి గుజరాత్ తదితర రాష్ట్రాల నుంచి 3,064 మంది మత్స్యకారులను 46 బస్సుల ద్వారా తీసుకు వచ్చారు. ఇదంతా కళ్లెదుటే జరిగింది. అయినా ఇందులో ప్రధాన ఘట్టాలను సినిమాలో చూపించలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘అనాబ్ – ఎ–షాహి’ ఎక్కడోయి ?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ముచ్చట గొలిపే పచ్చని పందిళ్లు.. పంట బాగా వస్తే ఆకుల్ని మించి గుత్తులుగా వేలాడుతూ కన్పించే పండ్లు. ఏళ్ల క్రితం హైదరాబాద్ (Hyderabad) శివారు ప్రాంతాల్లో కనువిందు చేసిన ద్రాక్ష(Grape) తోటలు ఇప్పుడు దాదాపుగా కనుమరుగయ్యాయి. ధనికుల పంటగా ప్రాచుర్యం పొందిన ద్రాక్ష పది హేనేళ్ల క్రితం మేడ్చల్, కీసర, శామీర్పేట్, మహేశ్వరం, మన్సాన్పల్లి, గట్టుపల్లి, బాసగూడతండా, రావిర్యాల, మంకాల్, కోళ్లపడకల్, ఆకాన్పల్లి, డబిల్గూడ, పెండ్యాల్, నాగారం (Nagaram) తదితర ప్రాంతాల్లో విరివిగా సాగయ్యేది. ఒక్కో గ్రామం పరిధిలో 350 నుంచి 400 ఎకరాల్లో ఈ తోటలు వేసే వారు.సీజన్లో శివారు ప్రాంతాల్లో వెలిసే తాత్కాలిక దుకాణాల్లో చవకగా లభించే పండ్లను నగరవాసులు ఆస్వాదించేవారు. జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు బస్సుల్ని నిలిపి మరీ కిలోల కొద్దీ కొనుగోలు చేసి తీసుకెళ్లేవారు. తదనంతర కాలంలో భూగర్భ జలాలు అడుగంటి నీటి కొరత ఏర్పడటం, పెట్టుబడి ఖర్చులు రెట్టింపవడం, చీడపీడల బెడద ఎక్కవవడం, అంచనాలకు మించి నష్టాలు వస్తుండటంతో క్రమేణా ద్రాక్ష సాగు తగ్గిపోయింది.ముఖ్యంగా జాతీయ, అంతర్జాతీయ ఐటీ, అనుబంధ కంపెనీలు నగరానికి క్యూకట్టడం, నగరం విస్తరిస్తూ శివారు ప్రాంతాలు రియల్ వెంచర్లుగా మారడం, భూముల ధరలకు రెక్కలు రావడం కూడా ద్రాక్ష తోటలు కన్పించకుండా పోయేందుకు కారణమయ్యింది. అప్పట్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పదివేల ఎకరాల్లో సాగైన ద్రాక్ష తోటలు..ప్రస్తుతం కేవలం 115 ఎకరాలకే పరిమితమైపోయాయి. ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటక నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.నవాబుల కాలంలో..స్వాతంత్య్రానికి ముందు నిజాం నవాబుల భవంతుల వెనుక భాగం (బ్యాక్యార్డ్)లో ద్రాక్ష సాగు చేసేవారు. అయితే చాలాచోట్ల ఒకటి రెండు చెట్లే కన్పించేవి. హైదరాబాద్లో తెల్ల ద్రాక్ష పంటకు ‘అనాబ్–ఎ–షాహి’గా నామకరణం చేశారు. టోలిచౌకిలో గద్దె రామకోటేశ్వరరావు తొలిసారిగా ద్రాక్ష పంటను సాగు చేసినట్లు చరిత్ర చెబుతోంది. సాధారణంగా సమశీతోష్ణ మండలంలో పండే పంటను హైదరాబాద్ పరిసరాల్లో పండించి ఆయన ఒకరకంగా చరిత్ర సృష్టించారు.దీంతో అప్పటి ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అప్పట్లో ఎకరానికి ఆరు నుంచి ఏడు టన్నుల వరకు దిగుబడి సాధించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అప్పటివరకు ఉగాండా, కెన్యా, దక్షిణాఫ్రికా దేశాల్లో స్థిరపడిన వారు అక్కడి అలజడుల కారణంగా హైదరాబాద్కు వలస వచ్చారు. పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేసి ’అనబిషాయి’ సాగు చేశారు. ఆంధ్ర నుంచి హైదరాబాద్కు వలస వచ్చిన కొందరు కూడా ద్రాక్షను సాగు చేశారు. ఇలా పలువురు ధనవంతులు ఈ పంటపై దృష్టి సారించారు. దీంతో ఆ పంటకు ’రిచ్మెన్ క్రాప్ (ధనికుల పంట)’గా పేరొచ్చింది.‘అనాబ్–ఎ–షాహి’ అంటే ద్రాక్షలో రారాజు అని అర్థం. నిజాం కాలంలో దీనికి నామకరణం చేశారు. 2005 నుంచి తగ్గుముఖందిగుబడితో పాటు లాభాలు అధికంగా ఉండటంతో 1990 తర్వాత స్థానిక రైతులు కూడా ఈ పంట సాగు మొదలు పెట్టారు. 1991లో హైదరాబాద్ వేదికగా గ్రేప్స్ పంటపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించడం గమనార్హం. కాగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ద్రాక్ష పంటకు రాజధానిగా గుర్తింపు పొందింది. ఇక్కడి రైతులను ఆదర్శంగా తీసుకుని మహారాష్ట్రలో కూడా సాగు ప్రారంభించారు. 2005 వరకు ఇక్కడి వైభవం కొనసాగింది. ఆ తర్వాత అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకప్పటి ఈ పంట భూములన్నీ రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారాయి. దీంతో ఒకప్పుడు నగర వాసులకు తీపిని పంచిన స్థానిక ద్రాక్ష.. ప్రస్తుతం అందుబాటులో లేకుండా పోయింది. ప్రస్తుతం మహా రాష్ట్ర నుంచి పెద్ద మొత్తంలో ద్రాక్ష దిగుమతి అవుతోంది. స్థానిక రైతులు పోటీలోనే లేని పరిస్థితి ఉంది. మెజార్టీ ఆదాయం సాగు ఖర్చుకేనేను గత 15 ఏళ్లుగా ద్రాక్ష పంటను సాగు చేస్తున్నా. ఒకసారి మొక్కను నాటితే 20 ఏళ్లపాటు దిగుమతి వస్తుంది. మొదట్లో ’థాంసన్’ వెరైటీని సాగు చేశా. తర్వాత ’మాణిక్ చమాన్’ వెరైటీని ఎంచుకున్నా. ఎకరాకు వెయ్యి మొక్కలు చొప్పున నాలుగు ఎకరాల్లో నాటా. మొక్కల ఎంపిక సహా సస్యరక్షణలో చిన్నచిన్న మెళుకువలు పాటించి నాటిన రెండేళ్లకే అనూహ్యంగా మంచి దిగుబడిని సాధించా. ప్రస్తుతం ఒక్కో చెట్టు నుంచి 20 కేజీల వరకు దిగుమతి వస్తోంది. ఎకరా పంటకు కనీసం నాలుగు నుంచి ఐదు లక్షల ఆదాయం వస్తుంది. అయితే కూలీ రేట్లు, ఎరువుల ధరలు పెరగడంతో మెజార్టీ ఆదాయం పంట సాగుకే ఖర్చవుతోంది. – కొమ్మిరెడ్డి అంజిరెడ్డి, రైతు, తుక్కుగూడఇప్పుడు పరిస్థితి మునుపటిలా లేదుఇప్పుడు పరిస్థితి మునుపటిలా లేదు. భూములూ అందుబాటులో లేవు. దీంతో ద్రాక్ష సాగు తగ్గిపోయింది. కూలీల ఖర్చులు పెరగడం, దిగుబడి సమయంలో ఈదురుగాలులు, వడగళ్ల వర్షం లాంటి వాటితో పంట నష్టపోవాల్సి వస్తోంది. మాలాంటి అనుభవం ఉన్న పాత రైతులే ద్రాక్షను సాగు చేయలేని పరిస్థితి ఉంది. ఇక కొత్తగా ఎవరైనా ప్రయత్నించినా భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. – చింతల వెంకట్రెడ్డి, ఒకప్పటి ద్రాక్ష రైతు, పద్మశ్రీ అవార్డు గ్రహీత -
అన్నదాత మెచ్చిన రైతుబిడ్డ
పొలాలే బడులుగా రైతులకు సరికొత్త వ్యవసాయ పాఠాలు చెబుతుంది సిద్దిపేట జిల్లా అక్కన్నపేట (Akkannapet) మండలంలోని రామవరం క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిణి (ఏఈవో) కరంటోతు శ్రీలత. ఆమె పాఠాలు వృథా పోలేదు. సేంద్రియ ఎరువుల ప్రాధాన్యత నుంచి మల్చింగ్ (mulching) పద్ధతిలో కూరగాయల సాగు వరకు ఎన్నో విషయాలను అవగాహన చేసుకొని కొత్తదారిలో ప్రయాణిస్తున్నారు అన్నదాతలు...అక్కన్నపేట మండలం పంతులు తండాకు చెందిన శ్రీలతకు ఏఈవో ఉద్యోగం వచ్చినప్పుడు ‘నాకు ఉద్యోగం వచ్చింది’ అనే సంతోషం కంటే ‘ఈ ఉద్యోగం వల్ల ఎంతోమంది రైతులకు సహాయంగా నిలబడవచ్చు’ అనే సంతోషమే ఎక్కువ. రైతు కుటుంబంలో పుట్టిన శ్రీలతకు రైతుల కష్టాలు, నష్టాలు తెలియనివేమీ కాదు. సాగులో మెలకువలు పాటించకపోవడం వల్ల పంట దిగుబడి రాక రైతులు నష్టపోతున్నారు. అయితే మెలకువలు పాటించకపోవడం నిర్లక్ష్యం వల్ల కాదు... అవగాహన లేకపోవడం వల్లే జరుగుతోందని గ్రహించిన శ్రీలత రంగంలోకి దిగింది.ఆమె పొలం దగ్గరికి వస్తే ఎక్కడి నుంచో అగ్రికల్చరల్ ఆఫీసర్ (Agriculture Officer) వచ్చినట్లు ఉండదు. తెలిసిన వ్యక్తో, చుట్టాలమ్మాయో వచ్చినట్లుగా ఉంటుంది. ఎలాంటి బేషజాలు లేకుండా అందరితో కలిసిపోయి వారి సమస్యలు తెలుసుకుంటుంది. పొలం దగ్గరికి వచ్చినప్పుడు శ్రీలత కూడా రైతుగా మారిపోతుంది. తానే స్వయంగా ట్రాక్టర్తో వరి పొలం దున్నుతుంది. వరిలో కాలిబాటల ప్రయోజనాల గురించి చెబుతుంది. ఎరువులు ఎంత మోతాదులో చల్లాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రత్యక్షంగా చేసి చూపిస్తోంది. వ్యవసాయ శాస్త్రవేత్తలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ నూతన సాగు పద్ధతులను తెలుసుకుంటూ, వాటిని తన క్లస్టర్ పరిధిలోని రామవరం, గండిపల్లి, కుందన్వానిపల్లి, మైసమ్మవాగు తండా రైతులకు చెబుతుంటుంది. రసాయనిక మందుల వినియోగం లేకుండా సేంద్రియ పద్దతిలో సాగు చేసే విధంగా రైతులనుప్రోత్సహిస్తోంది. గిరిజన గ్రామాల్లో సైతం మల్చింగ్ పద్ధతిలో కూరగాయలు ఎక్కువగా సాగు చేసేలా చేస్తోంది. చదవండి: చేనేతను ఫ్యాషైన్ చేద్దాం!పంటల్లో అధిక దిగుబడులు సాధించడానికి రసాయన ఎరువులు మోతాదుకు మించి వాడటం వల్ల భూసారం దెబ్బతింటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సేంద్రియ ఎరువులప్రాధాన్యత గురించి ఒకటికి పదిసార్లు చెప్పడమే కాదు సేంద్రియ ఎరువులను ఎలా తయారు చేసుకోవాలని అనే అంశంపై ప్రత్యేక వీడియోను తయారు చేసింది. జీవ ఎరువుల వినియోగంపై కూడా ప్రత్యేక వీడియోను తయారు చేసి రైతులకు అవగాహన కలిగిస్తోంది.క్షేత్రస్థాయిలోకి...రైతు అంటే నా దృష్టిలో ఒక పొలానికి యజమాని మాత్రమే కాదు... మన ఇంటి వ్యక్తి. మనకు అన్నం పెట్టే అన్నదాత. రైతుకు మంచి జరిగితే లోకానికి మంచి జరిగనట్లే. నా ఉద్యోగం ద్వారా రైతులకు ఏదో రకంగా మేలు చేసే సలహాలు, సూచనలు ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. – శ్రీలత – గజవెల్లి షణ్ముఖరాజు, సాక్షి, సిద్దిపేట– మాలోతు శ్రీనివాస్, సాక్షి, అక్కన్నపేట -
చేనేతను ఫ్యాషైన్ చేద్దాం!
ఇకత్ చీరతో వేడుకలో వెలిగిపోతాం. నారాయణపేట మెటీరియల్తో డిజైనర్ బ్లవుజ్ కుట్టించుకుంటాం. మన సంప్రదాయ వస్త్రధారణ మనల్ని ఫ్యాషన్ పెరేడ్లో తళుక్కుమని తారల్లా మెరిపిస్తోంది. ఇవి ఇంత అందంగా ఎలా తయారవుతాయి. ఒక డిజైన్ని విజువలైజ్ చేసి వస్త్రం మీద ఆవిష్కరించే చేనేతకారులు ఏం చదువుతారు... ఈ ప్రశ్నలకు జవాబులు వెతికే ప్రయత్నం చేశారు మిసెస్ ఇండియా (Mrs India) విజేత సుష్మ. ఈ వస్త్రాలను నేసే చేతులను, ఆ వేళ్ల మధ్య జాలువారుతున్న కళాత్మకతను దగ్గరగా చూడాలనిపించింది. పోచంపల్లి బాట పట్టారామె. కళాత్మకత అంతా చేనేతకారుల చేతల్లోనే తప్ప వారి జీవితాల్లో కనిపించలేదు. నూటికి రెండు–మూడు కుటుంబాలు ఆర్థికంగా బాగున్నాయి. మిగిలిన వాళ్లంతా ఈ కళను తమ తరంతో స్వస్తి పలకాలనుకుంటున్న వాళ్లే. మరి... ఇంత అందమైన కళ తర్వాతి తరాలకు కొనసాగకపోతే? ఒక ప్రశ్నార్థకం. దానికి సమాధానంగా ఆమె తనను తాను చేనేతలకు ప్రమోటర్గా మార్చుకున్నారు. చేనేతకారుల జీవితాలకు దర్పణంగా నిలిచే డాక్యుమెంటరీలు చిత్రీకరించారు. తాను పాల్గొనే ఫ్యాషన్ పెరేడ్లు, బ్యూటీ కాంటెస్ట్లలో మన చేనేతలను ప్రదర్శిస్తున్నారు. ఆ చేనేతలతోనే విజయాలు సొంతం చేసుకుంటున్నారు. స్వతహాగా ఎంటర్ప్రెన్యూర్ అయిన సుష్మా ముప్పిడి (Sushma Muppidi) మన హస్తకళలు, చేనేతలను ప్రపంచవేదిక మీదకు తీసుకెళ్లడానికి మార్గం సుగమం చేశారు.వైఫల్యమూ అర్థవంతమే! చీరాలకు చెందిన సుష్మ ముప్పిడి బీటెక్, ఎంబీఏ చేశారు. కొంతకాలం గుంటూరులో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం, పెళ్లి తర్వాత హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగంతోపాటు మరో ప్రైవేట్ కాలేజ్లో పార్ట్టైమ్ జాబ్ చేశారు. ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఉద్యోగం... ఈ జర్నీలో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్. ఉద్యోగం కోసం తన హండ్రెడ్పర్సెంట్ ఇస్తోంది. పిల్లల కోసం గడిపే సమయం తగ్గిపోతోంది. వెనక్కి చూస్తే తనకు మిగిలిందేమిటి? సివిల్ సర్వీసెస్ ప్రయత్నం సఫలం కాలేదు. ఉనికి లేని సాధారణ ఉద్యోగంతో తనకు వచ్చే సంతృప్తి ఏమిటి? సమాజానికి పని చేయడంలో సంతృప్తి ఉంటుంది, తనకో గుర్తింపునిచ్చే పనిలో సంతోషం ఉంటుంది. ఇలా అనుకున్న తర్వాత యూత్లో సోషల్ అవేర్నెస్ కోసం కార్యక్రమాలు నిర్వహించారు. ఆ ప్రయాణంలో అనుకోకుండా బ్యూటీ కాంపిటీషన్లో పాల్గొనవడం విజేతగా నిలవడం జరిగింది. సోషల్ ఇనిషియేటివ్, వెల్ స్పోకెన్, బెస్ట్ కల్చరల్ డ్రెస్, మిసెస్ ఫ్యాషనిష్టా వంటి గుర్తింపులతోపాటు ‘యూఎమ్బీ ఎలైట్ మిసెస్ ఇండియా 2024’ విజేతగా నిలిచారు. ఈ ఏడాది మార్చి ఒకటిన ఇటలీలోని మిలన్ నగరంలో, ఎనిమిదవ తేదీన ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో జరిగే ఫ్యాషన్ షోలలో భారత చేనేతలు అసోం సిల్క్, మల్బరీ సిల్క్లను ప్రదర్శించనున్నారు. జూన్లో యూఎస్, ఫ్లోరిడాలో జరిగే మిసెస్ యూనివర్సల్ వేదిక మీద మనదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు సుష్మ. ఇవన్నీ ఆత్మసంతృప్తినిచ్చే పనులు. ఇక తనకు రాబడి కోసం ఎంటర్ప్రెన్యూర్గా మారారు. హైదరాబాద్లోని కార్పొరేట్ ఆఫీస్ నుంచి యూఎస్, దుబాయ్, సింగపూర్లలో డైమండ్ బిజినెస్ (Diamond Business) నిర్వహిస్తున్నారు. ‘‘జీవితంలో గెలవాలి, నా కోసం కొన్ని సంతోషాలను పూస గుచ్చుకోవాలి. నన్ను నేను ప్రశంసించుకోవడానికి సమాజానికి నా వంతు సర్వీస్ ఇవ్వాలి’’ అన్నారు సుష్మ. ‘‘వయసు దేనికీ అడ్డంకి కాదు. అంతా మన అభిరుచి మీద ఆధారపడి ఉంటుంది. మీ కలలను నిజం చేసుకోవాలంటే ఒక ముందడుగు వేయండి. సక్సెస్ అవుతామా, విఫలమవుతామా అనే సందేహాలు వద్దు. ఏ ప్రయత్నమూ చేయకపోవడం కంటే ప్రయత్నించి విఫలమైనా కూడా అది అర్థవంతమయిన వైఫల్యమే. కాబట్టి మిమ్మల్ని మీరు తగ్గించుకోకూడదు’’ అని మహిళలకు సందేశమిచ్చారు. ఇది నా చేయూత పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, సిరిసిల్లలకు వెళ్లి స్వయంగా పరిశీలించాను. మన చేనేత కుటుంబాలు కళకు దూరం కాకుండా ఉండాలన్నా, ఇతరులు ఈ కళాత్మక వృత్తిని చేపట్టాలన్నా ఇది ఉపాధికి సోపానంగా ఉండాలి. అందుకోసం చేనేతలను కార్పొరేట్ స్థాయికి చేరుస్తాను. సమావేశాలకు ఉపయోగించే ఫైల్ ఫోల్డర్స్, ఇంట్లో ఉపయోగించే సోఫా కవర్స్, వేడుకల్లో ధరించే బ్లేజర్స్ వంటి ప్రయోగాలు చేసి మన చేనేతలను ప్రపంచవేదికలకు తీసుకెళ్లాలనేదే నా ప్రయత్నం. నేను ఎంటర్ప్రెన్యూర్గా ఎల్లలు దాటి విదేశాలకు విస్తరించాను. చదవండి: అన్నదాత మెచ్చిన రైతుబిడ్డకాబట్టి నాకున్న ప్లాట్ఫామ్లను ఉపయోగించుకుని మన చేనేతలను ప్రమోట్ చేయగలుగుతున్నాను. కలంకారీ కళ కోసం అయితే ప్రత్యేకంగా వర్క్షాప్ నిర్వహించి కలంకారీ కళాకారులకు ఉచితంగా స్టాల్స్ ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేశాను. పారిస్, యూఎస్ కార్యక్రమాల తర్వాత ఆ పని. సివిల్స్ సాధించినా కూడా ప్రత్యేకంగా ఒక అంశం మీద సమగ్రంగా పని చేయడం సాధ్యం కాకపోవచ్చు. ఇప్పుడు నేను ఒక కళాత్మక సమాజానికి ఇస్తున్న సర్వీస్ నాకు అత్యంత సంతృప్తినిస్తోంది. ప్రపంచ ఫ్యాషన్ వేదిక మీద మన భారతీయ చేనేతకు ప్రాతినిధ్యం వహించాలి. మన నేతలకు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించాలనేది నా లక్ష్యం. – సుష్మ ముప్పిడి, మిసెస్ ఇండియా– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ప్రతినిధి -
వలపు వల.. చిక్కారో విలవిల
ఆన్లైన్లో ప్రేమ పేరిట వల వేస్తున్న సైబర్ మోసగాళ్లు.. అవతలి వ్యక్తి తమ అదీనంలోకి వచ్చినట్టు గుర్తించిన తర్వాత అసలు మోసానికి తెరతీస్తున్నారు. పలు వెబ్సైట్లు, డేటింగ్ యాప్లు, మ్యాట్రిమోని వెబ్సైట్లలోని సమాచారాన్ని సేకరిస్తున్న సైబర్ కేటుగాళ్లు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడి ఎదుటి వారికి వలపు వల వేస్తున్నారు.ఇందుకోసం వారి అభిరుచులకు తగ్గట్టుగా వ్యవహరించి మోసాలకు తెరతీస్తున్నారు. నగరంలోని ఒక సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థ పరిశోధనలో ఇవే అంశాలు వెల్లడయ్యాయి. ఇలాంటి మోసాలకు పాల్పడే వారంతా విదేశాల్లో ఉంటూ మోసాలు చేస్తున్నారు. ఒంటరిగా ఉండే వృద్ధులు, మిలిటరీ ఉద్యోగులు, యువత ఇలా పలువర్గాలను ఈ తరహా మోసాలకు టార్గెట్గా ఎంచుకుంటున్నారని వారు పేర్కొంటున్నారు. - సాక్షి, హైదరాబాద్39 % సైబర్ నేరగాళ్లే..ఆన్లైన్లో ప్రేమ కోసం పరితపిస్తూ కొందరు డేటింగ్ వెబ్సైట్లు, యాప్లలో తమ వివరాలు నమోదు చేసుకుంటున్నారు. ఇలాంటి వారికి ఆన్లైన్లో జత కూడుతున్న వారిలో 39 శాతం మంది అవతలి వ్యక్తులు సైబర్ నేరగాళ్లే అన్న విషయం ఓ పరిశోధనలో వెల్లడైంది.అదేవిధంగా ఆన్లైన్ ప్రేమ పేరిట స్పామ్ ఫోన్కాల్స్, ఈ–మెయిల్స్లో దేశవ్యాప్తంగా ఇటీవల 400% పెరుగుదల ఉన్నట్టు తేలింది. ఇలా ఆన్లైన్లో ప్రేమ పేరుతో మోసగించేందుకు సైబర్ కేటుగాళ్లు మాటువేసి సిద్ధంగా ఉంటున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మ్యాట్రిమోని వెబ్సైట్లు, డేటింగ్యాప్ల నుంచి ఫొటోలు, వీడియోలు, ఇతర వివరాలు సేకరిస్తున్న సైబర్ నేరగాళ్లు.. ఏఐ టూల్స్ను వాడి తప్పుడు గుర్తింపులు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు. చిక్కకపోతే వారాలు.. నెలలు కూడా..ముందస్తుగానే ఎదుటి వారి వివరాలు, వారి అభిరుచులు, బలహీనతలు తెలుసుకుంటున్న సైబర్ నేరగాళ్లు ఏఐ టూల్స్ను వాడి అందుకు తగిన విధంగా మెసేజ్లు తయారు చేస్తున్నారు. ఇలాంటి మెసేజ్లతో ఎదుటి వ్యక్తుల్లో నమ్మకాన్ని పెంచేందుకు అవసరమైతే వారాలు, నెలలు కూడా ఓపికగా చాటింగ్ చేస్తున్నారు. ఇలా ఒకసారి నమ్మకం కుదిరిన తర్వాత అసలు మోసానికి తెరతీస్తున్నారు.‘నా ఆరోగ్యం బాగా లేదు..ఆసుపత్రికి వెళ్లేందుకు డబ్బు కావాలి, మా కుటుంబ సభ్యుడు ఒకరు ఆసుపత్రిలో ఉన్నారు..కొంచెం డబ్బులు సర్దు..తిరిగి ఇచ్చేస్తా..’ అని సెంటిమెంట్ డైలాగ్లతో ఎదుటి వారి నుంచి డబ్బులు దండుకుంటున్నారు. మరికొందరు సైబర్ నేరగాళ్లుఅతి ప్రేమలు నటిస్తూ..నాకు తెలిసిన ఆన్లైన్ ట్రేడింగ్ యాప్లో పెట్టుబడి పెట్టు..నీకు మంచి లాభాలు వస్తాయని ఊదరగొడుతూ..డబ్బులు దండుకుంటున్నారు.ఇలా వారు చెప్పిన బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు పడగానే..దాన్ని క్రిప్టోకరెన్సీగా మార్చుకుంటున్నారు. ‘మీకు ఖరీదైన గిఫ్ట్ పంపుతున్నాను..కస్టమ్స్ క్లియరెన్స్ ఫీజులు చెల్లించి ఆ బహుమతులు తీసుకో’ అంటూ కూడా మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి మోసాలు డేటింగ్ యాప్లకే పరిమితం కావడం లేదు. మ్యాట్రిమోని వెబ్సైట్లలోనూ 78 శాతం వరకు మహిళల పేరిట ఫేక్ ప్రొఫైల్స్ను తయారు చేస్తున్నట్టు అధ్యయనం వెల్లడించింది. అపరిచితులను ఆన్లైన్లో నమ్మొద్దు.. ఆన్లైన్లో పరిచయం అయి.. తర్వాత ఆర్థిక అవసరాలను చూపుతూ డబ్బు డిమాండ్ చేసే వారిని నమ్మవద్దని సైబర్ భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. ఆన్లైన్ స్నేహాల్లో చాలావరకు మోసపూరితమైనవేనని గ్రహించాలని వారు గుర్తు చేస్తున్నారు. వ్యక్తిగత వివరాలు, బ్యాంకు వివరాలు తీసుకునేందుకు ప్రయత్నించినా..ట్రేడింగ్ యాప్లలో పెట్టుబడుల పేరిట ఒత్తిడి తెచ్చినా అది మోసమని గుర్తించాలని హెచ్చరిస్తున్నారు. -
భయాన్ని మెదడు ఎలా అధిగమిస్తుందంటే..
ప్రయోగం వివరాలను సెయిన్స్బరీ వెల్కమ్ సెంటర్లోని హాఫర్ ల్యాబ్లో పరిశోధకులు డాక్టర్ సారా మెడిరోస్, ప్రొఫెసర్ సోంజా హాఫర్ వివరించారు. ‘‘మనిషికి పుట్టుకతోనే కొన్ని భయాలుంటాయి. పెద్ద శబ్దాలు, హఠాత్తుగా తమ వైపు దూసుకొచ్చే వస్తువులను చూసి భయపడతాడు. అయితే కొన్నాళ్లకు కొన్ని భయాలు పోతాయి. చిన్నప్పుడు టపాసుల పేలుళ్లు భయపడిన వ్యక్తే ఆ తర్వాత తెగ టపాసులు కాలుస్తాడు. ఇదే తరహాలో ఎలుకలపైకి పక్షుల లాంటి వస్తువులు దూసుకొస్తున్నట్లు ప్రయోగం చేశాం. ఎగిరొచ్చే వాటి నీడ పెద్దదయ్యే కొద్దీ ఎలుకలు భయపడ్డాయి. ప్రాణభయంతో పారిపోయాయి. అయితే నీడను ఇలా పదే పదే పెద్దగా చేశాక కేవలం నీడ పరిమాణం మాత్రమే పెరగడం ఎలుకలు గమనించి, ఆ తర్వాత భయపడటం మానేశాయి. పారిపోకుండా అలాగే చూశాయి. ఇలాంటి దృగ్విషయంలో ఎలుక మెదడులోని వెంట్రో లేటరల్ జెనిక్యూలేట్ న్యూక్లియస్(వీఎల్జీఎన్) అనే ప్రాంతం క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. మెదడులోని సెరిబ్రల్ కార్టెక్స్ ప్రాంతంలో నిక్షిప్తమయ్యే దృశ్యసంబంధ సమాచారం అత్యధికంగా వీఎల్జీఎన్కు భటా్వడా అవుతోంది. ఈ సమాచారాన్ని పదేపదే విశ్లేషించాక ఫలానా అంశంలో భయపడాల్సిన పనిలేదని వీఎల్జీఎన్ నిర్ధారిస్తోందని మేం ఓ అంచనాకొచ్చాం. దృశ్యసంబంధ కార్టెక్స్ అనేది ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకునేందుకు దోహపడుతోంది. ఇలాంటి అభ్యసన జ్ఞాపకాలు వీఎల్జీఎన్లో నిక్షిప్తమవుతున్నాయి. నేర్చుకోవడం, గుర్తుంచుకోవడం, ప్రవర్తనకు సంబంధించిన అంశాల్లో సెరబ్రల్ కార్టెక్స్దే కీలకపాత్ర అని ఇన్నాళ్లూ భావించాం. కానీ అది తప్పు అని తేలింది. ఈ జ్ఞాపకాలన్నింటినీ వీఎల్జీఎన్ మాత్రమే భద్రపరుస్తోంది. దీంతో శ్వాస, గుండెలయ, స్పృహ, నిద్ర వంటి జ్ఞప్తియేతర విధులకు, అభ్యసన, ఆలోచన వంటి జ్ఞాపకశక్తి సంబంధ అంశాలకు మధ్య సంబంధం తెల్సుకునేందుకు అవకాశం చిక్కింది. వీఎల్జీఎన్ సర్క్యూట్లలో మార్పులు చేయడం ద్వారా రోగిని భయపడకుండా చేయొచ్చు. ఇందుకు సంబంధించి ఇంకా విస్తృతమైన పరిశోధనలు చేయాల్సి ఉంది’’అని శాస్త్రవేత్తలు చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆన్లైన్ నుంచి అక్షింతల దాకా
ప్రేమను.. పెళ్లితో స్థిరపరచేది అదే! అయితే దానికి బాటలు వేసేవి మాత్రం పరస్పర నమ్మకం, గౌరవాలే! అలాంటి లవ్ స్టోరే ఇది! దాదాపు ఏడేళ్లపాటు ఒకరినొకరు చూసుకోకుండా పెళ్లితో ప్రేమను గెలిపించుకున్న ఆ జంటలోని అమ్మాయి.. రైతా, ఫిన్లండ్. అబ్బాయి .. ప్రదీప్, హైదరాబాద్. ప్రేమకథా కాలం.. 1997.. స్కూలింగ్ పూర్తి చేసుకున్న రైతా ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరీలో ఇంగ్లిష్ భాషను నేర్చుకుంటోంది. ఫ్లూయెన్సీ కోసం యాహూ చాట్లో చాటింగ్ స్టార్ట్ చేసింది. ఆన్లైన్లో ఒకరోజు ప్రదీప్ పరిచయం అయ్యాడు. సంభాషణలో ఆధ్యాత్మికం, తాత్వికం, మతపరమైన అంశాల నుంచి సామాజిక, రాజకీయ, పర్యావరణ విషయాలు, ప్రపంచ పౌరుల బాధ్యతలు వంటి వాటి మీద ప్రదీప్కున్న అవగాహనకు రైతా ముచ్చటపడింది. ప్రదీప్కూ రైతా పట్ల అదే భావన. నెమ్మదిగా స్నేహం పెరిగింది. వ్యక్తిగత వివరాలను పంచుకున్నారు. ప్రదీప్కి రైతా మీద ప్రేమ మొదలైంది. అప్పటికీ ఆ ఆన్లైన్ స్నేహం వయసు నాలుగేళ్లు. అప్పట్లో వెబ్కామ్స్ లేవు.. కాబట్టి ఒరినొకరు చూసుకోలేదు. కనీసం ఫొటోలు కూడా ఎక్సే ్చంజ్ చేసుకోలేదు. ఒక రోజు ప్రదీప్ మెయిల్ పెట్టాడు ‘రకస్తాన్ సినువా (నువ్వంటే ఇష్టం).. నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని. సంభ్రమాశ్చర్యాలు రైతాకు. ఎందుకంటే ఫిన్లండ్ లో అంత త్వరగా ఎవరూ పెళ్లి ప్రపోజల్ తీసుకురారు. అలాంటిది అబ్బాయి కనీసం తనను చూడనైనా చూడకుండా పెళ్లికి ప్రపోజ్ చేశాడు అని! ఓకే చెప్పింది. ఇద్దరిళ్లల్లో విషయం చెప్పేశారు. ప్రదీప్ జాతకంలో విదేశీ పిల్లే రాసి ఉందని, అదే జరగబోతోందని అతని తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పలేదు. కానీ రైతా వాళ్లింట్లోనే ఒప్పుకోలేదు. కారణం అక్కడ మీడియా లో ఇండియా గురించి ఉన్న వ్యతిరేక ప్రచారమే! వాళ్లను ఒప్పించే ప్రయత్నంలో.. ప్రదీప్ను చూస్తే ఒప్పుకుంటారు అన్న ఆశతో‘ఫిన్లండ్ రండి’ అంది రైతా. వెంటనే వీసాకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే వీసా‘రిజెక్టయ్యింది. దాంతో‘నేనే హైదరాబాద్ వస్తాను’ అంటూ అభయమిచ్చింది రైతా! ‘ఎయ్ (.. వద్దు)’ అన్నారు ఆమె తల్లిదండ్రులు. ‘మిక్సీ (ఎందుకు)?’ అడిగింది అమ్మాయి. ‘ఇండియా సేఫ్ కాదు’ స్పష్టం చేశారు. వాదించింది రైతా. అయినా ఒప్పుకోలేదు తల్లిదండ్రులు. ఈసారి ప్రదీప్ యూకేలో చదువును బహానా (సాకు)గా మలచుకున్నాడు. వీసా ఓకే అయింది. యూకే నుంచి తేలిగ్గానే ఫిన్లండ్కి వీసా దొరికింది. రైతా ఆనందానికి అవధుల్లేవు. పరిచయం అయిన ఏడేళ్లకు ఒకరినొకరు చూసుకోబోతున్నారు. ఆ క్షణం రానేవచ్చింది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నాక ఇంకా నచ్చారు! రైతా తల్లిదండ్రులకూ నచ్చాడు ప్రదీప్! కానీ అమ్మాయి అక్కడికి వెళ్లి ఉండగలదా? అప్పటికీ ఇండియా మీద ఇంకా సానుకూలమైన అభి్రపాయానికి రాలేదు వాళ్లు. ‘ఉంటాను’ ధైర్యం చెప్పింది. ట్రయల్ గా హైదరాబాద్ను విజిట్ చేసింది కూడా! ఇక్కడి సోషల్ లైఫ్ను ఇష్టపడింది. ప్రదీప్ తల్లిదండ్రులకూ రైతా చాలా నచ్చింది. రైతా కుటుంబం కూడా హైదరాబాద్ వచ్చి, ప్రదీప్ కుటుంబాన్ని కలిసింది. అలా ఏడేళ్ల వాళ్ల ప్రేమ ఇరు కుటుంబ సభ్యుల ఆమోదం, ఆశీర్వాదంతో ఏడడుగుల బంధమైంది. వాళ్ల పెళ్లికిప్పుడు ఇరవై ఏళ్లు. నలుగురు పిల్లలు. ప్రదీప్ కోసం రైతా శాకాహారిగా మారింది. తెలుగు నేర్చుకుంది. ప్రదీప్ జీవితంలోనే కాదు బిజినెస్లోనూ భాగస్వామైంది. ప్రదీప్ ఫీనిష్ నేర్చుకున్నాడు. తన కోసం ఆమె చేసుకున్న, చేసుకుంటున్న సర్దుబాట్లను అతను గుర్తిస్తాడు. అమె అభి్రపాయాలను గౌరవిస్తాడు. రైతా తల్లిదండ్రులు తన కూతురు చాలా అదృష్టవంతురాలని పొంగిపోతారు. ‘‘మేమొక మాట అనుకున్నాం.. పెళ్లనే గొప్ప బంధంలోకి అడుగుపెడుతున్నాం. మనమధ్య వచ్చే ఏ తగవైనా మన రిలేషన్షిప్ని మరింత స్ట్రాంగ్ చేయాలి తప్ప వీక్ చేయకూడదు అని. దాన్నే ఆచరిస్తున్నాం!’ అని చెబుతోంది రైతా. – సరస్వతి రమ -
నగరాన్ని తలదన్నేలా మునిపల్లి..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నగరాలు, పెద్ద పట్టణాల్లో గేటెడ్ కమ్యూనిటీ సంస్కృతి ఎక్కువగా కనిపిస్తోంది. కానీ నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్ పల్లి మండలం (Jakranpally Mandal) మునిపల్లి (Munipally) గ్రామం గేటెడ్ కమ్యూనిటీ వాతావరణాన్ని తలపిస్తోంది. గ్రామంలోని ప్రధానమైన ప్రాంతంలో వెళ్తున్నప్పుడు.. నగరంలో ఉన్నామన్న భావన కలుగుతుంది. ఇక్కడ ప్రతి వీధికి నంబర్లు కేటాయించి బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రధాన, అంతర్గత రోడ్లన్నీ తారురోడ్లుగా వేశారు. రోడ్లన్నిటినీ పరిశుభ్రంగా ఉంచుతున్నారు. మొక్కలు, చెట్ల పెంపకం, నిర్వహణ ఆకట్టుకుంటోంది. గ్రామంలో భవనాలను నగరాల మాదిరిగా మంచి ఆర్కిటెక్చర్తో నిర్మించడం విశేషం. చాలా ఇళ్లకు సౌర విద్యుత్ (Solar Power) కంచెను ఏర్పాటు చేసుకు న్నారు. రైతులు సొంతంగా తమ సంఘం కోసం భారీ భవనం నిర్మించుకున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో షాపింగ్ కాంప్లెక్స్ (Shopping Complex) నిర్మించి అద్దెలకు ఇచ్చారు. గ్రామంలో అన్నీ రైతు కుటుంబాలే అయినప్పటికీ.. పిల్లలను ఉన్నత విద్య చదివిస్తున్నారు. ప్రధాన రహదారి నుంచి బాగా లోపలికి ఉన్న ఈ గ్రామం ఆద్యంతం గేటెడ్ కమ్యూనిటీని తలపిస్తూ ఆకట్టుకుంటోంది. -
కొత్త తరం ప్రేమలు.. జెన్జెడ్ ప్రేమలు
జమానా మారినా ప్రేమకు అర్థం మారదు! కానీ ఇప్పుడు ప్రేమ కూడా ఆన్లైన్కి చేరి.. ఆ బంధం కూడా ట్రెండింగ్ అయ్యి.. సాఫ్ట్వేర్ అప్డేట్స్లాగా రోజుకో కొత్త రిలేషన్షిప్ లాంచ్ అవుతోంది! బ్రెడ్క్రంబింగ్.. అవతలి వ్యక్తి పట్ల ఇంట్రెస్ట్.. ఫీలింగ్స్ ఉన్నట్లు, ఆ రిలేషన్షిప్ కోసం ఎంతో సమయం వెచ్చిస్తున్నట్లు నటించడమే బ్రెడ్క్రంబింగ్. అటెన్షన్ కోసం, అవతలి వాళ్ల మీద నియంత్రణ కోసం ఈ డ్రామా ఆడతారు. రోచింగ్.. ఒకరికి తెలియకుండా మరొకరితో ఏకకాలంలో అనేకమందితో రిలేషన్లో ఉండటం. అయితే దీన్ని జెన్ జీ చీటింగ్గా భావించడం లేదు. సీక్రసీ అంటోందంతే!బెంచింగ్.. అవతలి వ్యక్తిని మరోవైపు కదలనివ్వకుండా.. అలాగని తమ నుంచి కమిట్మెంట్ ఇవ్వకుండా, సీరియస్నెస్ చూపించకుండా అప్పడప్పుడు ఫోన్లు, మెసేజ్లు చేస్తూ అవతలివాళ్లను కట్టిపడేయడమే బెంచింగ్.కాన్షస్ డేటింగ్.. చుట్టూ తిరిగే వాళ్లలో ఒకరిని ఎంచుకోకుండా.. నీ వ్యక్తిత్వాన్ని గౌరవించి, నిన్ను నిన్నుగా ఇష్టపడుతూ జీవితాంతం తోడుగా, నమ్మకంగా ఉండే వ్యక్తిని వెదుక్కోవడమే కాన్షస్ డేటింగ్!కఫింగ్.. చలికాలం, సెలవులు, వాలంటైన్ వీక్.. ఇలా ప్రత్యేక సమయం, సందర్భాల్లో డేటింగ్ చేయడాన్ని కఫింగ్ అంటున్నారు. ïడ్రై డేటింగ్ .. ఆల్కహాల్ ఫ్రీ డేట్ అన్నమాట. అంటే డేటింగ్కి వెళ్లినప్పుడు ఆల్కహాల్ తీసుకోరు. సింగిల్స్, రిలేషన్షిప్లో ఉన్నవాళ్లు.. అందరూ ఈ డ్రై డేట్స్కి ప్రాధాన్యమిస్తున్నారు. సింగిల్స్ అయితే తమకు కాబోయే పార్టనర్ మందు ప్రభావానికి లోనుకాకుండా సహజంగా ఎలా ప్రవర్తిస్తాడు/ ప్రవర్తిస్తుంది అని తెలుసుకోవడానికి, అదివరకే రిలేషన్షిప్ లో ఉన్నవాళ్లయితే తమ అనుభవాలు, మంచి చెడులను చర్చించుకోవడానికి ఈ డ్రై డేట్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. కిటెన్ఫిషింగ్ .. వ్యక్తిగత విషయాలకు సంబంధించి అబద్ధాలాడుతూ అవతలి వాళ్లను నమ్మించడం లేదా వశపరచుకోవడం. ఉదాహరణకు వయసును తగ్గించి, జీతాన్ని పెంచి చెప్పడం, సన్నగా ఉన్నప్పటి ఫొటోలు అప్లోడ్ చేయడం, ఇంజినీరింగ్ డిప్లమా చేసి, డిగ్రీ చేశానని నమ్మించడం లాంటివన్నమాట.లవ్ బాంబింగ్.. వ్యక్తిత్వంతో కాకుండా మాటలు, కానుకలు, అటెన్షన్తో అవతలి వ్యక్తిని గుక్క తిప్పుకోనివ్వకుండా చేయడం సిట్యుయేషన్షిప్.. ఇది ఫ్రెండ్షిప్కి ఎక్కువ.. రిలేషన్షిప్కి తక్కువ! అటాచ్మెంట్ ఉంటుంది. కానీ కమిట్మెంట్ ఉండదు.నానోషిప్.. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, క్లబ్లు, పబ్లలో చూపులు కలిసి.. నవ్వులు విరిసి.. ఫ్లర్టింగ్ మొదలై.. అక్కడే ముగిసి అదొక తీయటి జ్ఞాపకంలా మిగిలిపోయేది!ఇంకా..ఒక బంధంలో ఉంటూనే మరొకరితో రిలేషన్ మెయిన్టెయిన్ చేసే ‘ఓపెన్ కాస్టింగ్’, సరిహద్దులకతీతంగా చేసే డిజిటల్ డేటింగ్ ‘వండర్ లవ్’ లేదా ‘డేటింగ్ నోమాడ్’, వాట్సాప్ మెసేజెస్ తో మాత్రమే రిలేషన్షిప్లో ఉండే ‘టెక్స్టేషన్షిప్’లాంటి బంధాలు, ఫోన్కాల్స్.. మెసేజెలను మెల్లగా తగ్గిస్తూ బంధం నుంచి వైదొలిగే ‘ఫేడింగ్’, ఏ సమాచారం లేకుండా హఠాత్తుగా భాగస్వామితో కమ్యూనికేషన్ను కట్ చేసుకోవడం, వాళ్ల జీవితంలోంచి అదృశ్యమైపోయే ‘ఘోస్టింగ్’ లాంటి అప్రకటిత బ్రేకప్లు, జీవితంలోంచి వెళ్లిపోయినా.. సోషల్ మీడియాలో పార్టనర్ చేసే పోస్ట్లను వెదుకుతూ లైక్స్ కొట్టే ‘హంటింగ్’ లాంటి గూఢచర్యాలూ ఉన్నాయి. ఇవన్నీ ఈ తరం ఫాలో అవుతున్న ‘లవ్షిప్స్!’పారదర్శకంగా ఉండాలిప్రేమించే వాళ్ల స్థాయిని కాకుండా మనస్తత్వాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని, అన్ని విషయాలలో పారదర్శకంగా ఉండాలి. కుటుంబాలకు, కనీసం స్నేహితులకు కూడా చెప్పుకోలేని ప్రేమ బంధాలు చాలావరకు అబద్ధాల మీదే నిర్మితమై ఉంటాయి. నిజాయితీపరులైన ప్రేమికులను కులం, మతం వంటి కట్టుబాట్ల నుంచి రక్షించడానికి వివిధ చట్టాలు ఉన్నాయి. అలాగే ప్రేమ పేరుతో మోసం చేసే వారికీ కఠినమైన శిక్షలు ఉన్నాయి. ఆకర్షణకు లోనవకుండా భాగస్వామిని క్షుణ్ణంగా అర్థం చేసుకొని కమిట్ అవడం మంచిది. – సుధేష్ణ మామిడి, హైకోర్టు న్యాయవాది -
ప్రేమకు శ్వాస విశ్వాసమే- రకుల్
‘‘ఒక బంధం బలంగా సాగాలంటే ప్రేమ మాత్రమే సరిపోదు.. నమ్మకమూ ఉండాలి. ప్రేమకు శ్వాస విశ్వాసమే’’ అంటున్నారు రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh). జీవితంలో తాను అద్భుతమైన ‘ఫేజ్’లో ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఆ ఆనందానికి కారణం జీవిత భాగస్వామి జాకీ భగ్నానీ. బాలీవుడ్ నటుడు–నిర్మాత జాకీ భగ్నానీ(Jackky Bhagnani), రకుల్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2021లో ఈ ఇద్దరూ తమ ప్రేమ గురించి బయటపెట్టారు. 2024 ఫిబ్రవరి 21న పెళ్లి చేసుకున్నారు. నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’తో రకుల్ స్పెషల్ చిట్ చాట్ ... → మీరు, జాకీ ప్రేమలో ఉన్నప్పుడు జరుపుకున్న వాటిలో మరచిపోలేని ‘ప్రేమికుల దినోత్సవం’ గురించి చెబుతారా? మా ఇద్దరి కాంబినేషన్ (జాకీ నిర్మాత–రకుల్ హీరోయిన్)లో వచ్చిన మొదటి సినిమా ‘కఠ్ పుతలీ’ (2022). ఆ సినిమా అప్పుడే మేం ఫస్ట్ వేలంటైన్స్ డే జరుపుకున్నాం. మా డేటింగ్ మొదలైంది అప్పుడప్పుడే. ఓ హోటల్లోని గ్రీన్హౌస్ ఏరియాని జాకీ క్యాండిల్ లైట్ డిన్నర్కి తగ్గట్టుగా మార్పించాడు. ఒకవైపు గిటారిస్ట్లు పాడుతుంటే ఆ పాటలు వింటూ, ఆరోగ్యకరమైన విందుని ఆస్వాదించాం. జాకీ నా కోసం గులాబీ పువ్వులు, పుష్పగుచ్ఛాలు ఇచ్చాడు. అదొక అందమైన, ఆహ్లాదకరమైన రోజు. సో.. నాకెప్పటికీ ఆ వాలంటైన్స్ డే గుర్తుండి పోతుంది. → ఓ జంట మధ్య బలమైన బంధం ఉండాలంటే మీరు ఇచ్చే సలహాలు? పెద్ద టిప్ ఏంటంటే ‘నమ్మకం’. ఒకరి పట్ల మరొకరికి పూర్తి నమ్మకం ఉండాలి. ఆ నమ్మకమే బలమైన బంధానికి పునాది వేస్తుంది. రిలేష్న్షిప్లో మంచి ష్రెండ్షిప్ ఉండటం చాలా ముఖ్యం. ఎప్పుడైతే భాగస్వామిలో మంచి ఫ్రెండ్ని చూస్తామో, అప్పుడు ఆ బంధం బలంగా ఉంటుంది. ఎవరికైనా జీవితం చాలా సునాయాసంగా సాగాలి... ఒత్తిడిగా కాదు. హ్యాపీగా సాగాలంటే నమ్మకం, విశ్వాసం, స్నేహం ముఖ్యం. → మీ ‘బెటర్హాఫ్’ జాకీ భగ్నానీ గురించి కొన్ని మాటలు... జాకీ నా జీవిత భాగస్వామి కావడం నిజంగా నా అదృష్టం.. తను నా సోల్మేట్ కావడం ఆనందం. మా ఇద్దరి ఆలోచనలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. మా ఇద్దరికీ ఉన్న పెద్ద తేడా ఏంటంటే నేను చాలా ‘హైపర్’, తను చాలా ‘కూల్’. నా హైపర్ని జాకీ ఎప్పుడూ విమర్శించింది లేదు సరికదా... పొగుడుతుంటాడు. అయినా ఒకరు హైపర్... మరొకరు కూల్... ఇలా ఉండటం కూడా బాగుంటుంది. బ్యాలెన్స్ అవుతుంది (నవ్వుతూ). నా పార్ట్నర్లో నేను బెస్ట్ ఫ్రెండ్ని చూశాను. మేం ఇద్దరం ఏ విషయం గురించైనా చాలా ఓపెన్గా మాట్లాడుకుంటాం. ఏం చేయాలన్నా చేస్తాం. ఇక మేం ఒకరికొకరం ఇచ్చుకునే సపోర్ట్ చాలా గొప్పగా ఉంటుంది. అలాగే మేం మా పార్ట్నర్ కోసం మారాల్సిన అవసరం రాలేదు. పెళ్లికి ముందెలా ఉన్నామో ఆ తర్వాతా అలానే ఉన్నాం. అందుకే మేం ఇద్దరం అదృష్టవంతులం అంటాను.→ అయితే పెళ్లి తర్వాత మీరు మారాల్సిన అవసరం రాలేదంటారా? ఏ మార్పూ లేదు. అసలు ఒకరి జీవితం పెళ్లి కారణంగా ఎందుకు మారాలి? పెళ్లి తర్వాత జీవితం మెరుగవ్వాలి. నా లైఫ్ బెటర్ అయింది. పెళ్లికి ముందు నాకు నచ్చిన పనులు చేసినట్లే ఇప్పుడూ చేస్తున్నాను. ఫీలింగ్స్ని దాచేయకుండా షేర్ చేసుకునేంత స్వేచ్ఛ నా సోల్మేట్తో ఉంది. అందుకే జీవితం అందంగా, ఆనందంగా ఉంది. అర్థం చేసుకునే జీవిత భాగస్వామి లభించడం ఓ అదృష్టం. అర్థం చేసుకునే వ్యక్తి పక్కన ఉన్నప్పుడు జీవితంలోని ఆ దశ అద్భుతంగా ఉంటుంది.– డి.జి. భవాని -
క్విక్ కామర్స్ ఏఐ రైడ్!
పదే పది నిమిషాల్లో డెలివరీతో రప్పా రప్పా దూసుకుపోతున్న క్విక్ కామర్స్ దిగ్గజాలు... దీని కోసం అధునాతన టెక్నాలజీని విరివిగా వాడేసుకుంటున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా ఎనలిటిక్స్ వంటి సాంకేతికతల దన్నుతో కస్టమర్ల ఆర్డర్ ధోరణులు, ప్రోడక్ట్ ప్రాధాన్యతలు, ఏ సమయంలో ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారనే అంశాలను అధ్యయనం చేయడం, డార్క్ స్టోర్ నుంచి గమ్యస్థానికి అత్యంత వేగవంతమైన రూట్ను ఎంచుకోవడం వంటివన్నీ చకచకా చక్కబెట్టేస్తున్నాయి.క్విక్ కామర్స్ దిగ్గజాలైన బ్లింకిట్, బిగ్బాస్కెట్ నౌ, జెప్టో లేదంటే స్విగ్గీ ఇన్స్టామార్ట్... చెప్పింది చెప్పినట్లుగా పది నిమిషాలలోపే ఆర్డర్లను అంతవేగంగా ఎలా డెలివరీ చేసేస్తున్నాయో తెలుసా? ఇప్పటికే తమ వద్దనున్న వినియోగదారుల డేటాను ఏఐతో సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ద్వారానే ఇదంతా సాధ్యమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. తగినంత కన్జూమర్ సమాచారం ఉన్న క్విక్ కామ్ కంపెనీలకు ఏఐ వరప్రదాయినిగా మారుతోంది. వినియోగదారుల కొనుగోలు స్వభావం నుంచి వారు ఎంత విరివిగా ఆర్డర్ చేస్తున్నారు, ఏయే ఉత్పత్తులను ఎక్కువగా కొంటున్నారు వంటివన్నీ ఏఐ టూల్స్ రియల్ టైమ్లో విశ్లేషించి అందిస్తున్నాయి. అంతేకాదు దగ్గరలో ఉన్న డార్క్ స్టోర్ (క్విక్ కామ్ కంపెనీలు ప్రోడక్టులను నిల్వ ఉంచుకునే చిన్నపాటి గిడ్డంగులు) నుంచి ట్రాఫిక్ రద్దీగా ఉన్న సమయంలో, అలాగే పెద్దగా రద్దీ లేనప్పుడు గమ్యస్థానానికి అత్యంత వేగంగా చేరుకునే రూట్ను కూడా అధ్యయనం చేసి ఈ ఏఐ టూల్స్ నేరుగా డెలివరీ బాయ్కు చేరవేస్తున్నాయి.అంతా క్షణాల్లో... జెప్టో వంటి కీలక క్విక్ కామ్ సంస్థలు ఉపయోగిస్తున్న తెరవెనుక (బ్యాకెండ్) టెక్నాలజీ... ఏకకాలంలో పికర్స్, ప్యాకర్స్, ఇంకా రైడర్లను రియల్టైమ్లో కనెక్ట్ చేస్తోంది. ఒకసారి యాప్లో ఆర్డర్ కన్ఫర్మ్ అవ్వగానే, ఈ సిస్టమ్లోని అందరూ అనుసంధానమైపోతారు. ఆర్డర్ను పిక్ చేయడం, డిస్పాచ్ చేయడం 2 నిమిషాల్లోపే జరిగిపోతుంది. ఆపై ట్రాఫిక్, ఇంధన మైలేజీ, వాహన టెలీమెట్రీ, ప్రయాణ సమాయాల చరిత్ర, దూరం వంటి డేటాను ఉపయోగించుకుని రియల్ టైమ్ రూటింగ్ తగిన రూట్లను సూచిస్తుంది. దీనివల్ల ఆర్డర్ను డెలివరీ పార్టనర్ ఎంత సమయంలో కస్టమర్ చెంతకు చేర్చగలరనే అంచనా ట్రావెల్ టైమ్ (ఈటీఏ)ను పక్కాగా పేర్కొంటుంది. దీని ప్రకారం సగటున 8 నిమిషాల్లోపే ఆర్డర్ డెలివరీ జరిగేందుకు వీలవుతోందని నిపుణులు చెబుతున్నారు. 340కి పైగా డార్క్ స్టోర్లున్న జెప్టో గతేడాది డెలివరీ దూరం 1.7 కిలోమీటర్లు కాగా, ఇప్పుడిది 1.5 కిలోమీటర్లకు తగ్గించుకుంది. అంతేకాదు, 3–4 సెకెన్లలో చెకవుట్ అయ్యే విధంగా అధునాతన టెక్నాలజీలు వినియోగించే పేమెంట్ గేట్వే సరీ్వసులను కంపెనీ వాడుకుంటోంది. ఇక బీబీనౌ విషయానికొస్తే, ఆర్డర్ ఏ డార్క్ స్టోర్కు వెళ్తుందో నిర్ణయించడానికి ముందే టెక్నాలజీ రంగంలోకి దిగుతుంది. ఉదాహరణకు సదరు ప్రాంతంలో ఉన్న రైల్వే ట్రాక్లు, పీక్, నాన్–పీక్ టైమ్లో ట్రాఫిక్, రోడ్డు స్థితిగతులు, ఇప్పటిదాకా కస్టమర్ షాపింగ్ ధోరణులు, వయస్సు, ఇంటర్నెట్ కనెక్టివిటీ వంటి పలు డేటా పాయింట్లను పరిగణనలోకి తీసుకుంటామని బిగ్బాస్కెట్ సీఓఓ టీకే బాలకుమార్ చెప్పారు. ఈ ప్లాట్ఫామ్ ద్వారా బీబీనౌ రోజుకు 5 లక్షల పైగా ఆర్డర్లను ప్రాసెస్ చేస్తోంది.→ జెప్టో డార్క్ స్టోర్ నుంచి ప్రస్తుత డెలివరీ దూరం 1.5 కిలోమీటర్లు; యాప్లో ఆర్డర్ చెకవుట్ సమయం 3–4 సెకన్లు. → ఆర్డర్లను తగిన డార్క్ స్టోర్లకు కేటాయించేందుకు బీబీనౌ జియో స్పేషియల్ డేటాను వినియోగిస్తోంది. → పికర్లు, ప్యాకర్లు, రైడర్లను అత్యంత వేగంగా కనెక్ట్ చేయడానికి జెప్టో ఏఐ ఆల్గోరిథమ్స్ దోహదం చేస్తున్నాయి.→ యూజర్ల అభిరుచులను బట్టి ఉత్పత్తులను సిఫార్సు చేయడంలో స్విగ్గీ ఇన్స్టామార్ట్ డేటా ఎనలిటిక్స్ది కీలక పాత్ర. వృథాకు చెక్.. డిమాండ్ను అంచనా వేయడానికి దాదాపు అన్ని క్విక్ కామ్ సంస్థలూ ఏఐ ఆల్గోరిథమ్స్, మెషీన్ లెర్నింగ్ మోడల్స్ ప్రయోజనాన్ని వాడుకుంటున్నాయి. దీనివల్ల ప్రోడక్ట్ నిల్వలను సరిగ్గా నిర్వహించేందుకు, వృథాను అరికట్టేందుకు వాటికి వీలు చిక్కుతోంది. అంతేగాకుండా, డార్క్ స్టోర్లలో ఉత్పత్తుల నిల్వలను నిరంతరం పర్యవేక్షించేందుకు క్విక్ కామ్ సంస్థలు రియల్ టైమ్ డేటాను కూడా ఎఫ్ఎంసీజీ కంపెనీలతో పంచుకుంటున్నాయి. పలు ఈ–కామర్స్ సంస్థల వృద్ధిలో కీలకంగా నిలుస్తున్న డేటా ఎనలిటిక్స్ క్విక్ కామ్లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఉదాహరణకు, స్విగ్గీ ఇన్స్టామార్ట్ షాపింగ్ అభిరుచులు, ప్రాధాన్యతల ఆధారంగా ఒక్కో కస్టమర్కు ఒక్కోలాంటి యూజర్ అనుభూతిని అందించేందుకు డేటా ఎనలిటిక్స్ను సద్వినియోగం చేసుకుంటోంది. ‘ఇలాంటి నిర్దిష్ట (టార్గెటెడ్) విధానం వల్ల వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను సిఫార్సు చేయడానికి వీలువుతుంది. అలాగే కస్టమర్లు ఏదైనా ఉత్పత్తిని కొనుగోలు చేసే అవకాశాలను పెంచుతుంది’ అని ఈ–కామర్స్ నిపుణులు సోమ్దత్తా సింగ్ అభిప్రాయపడ్డారు.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
పెళ్లికి వెనుకాడుతున్న పడతులు!
‘పెళ్లిపై నమ్మకం లేదు.పెళ్లి చేసుకోవడమంటే స్వేచ్ఛను కోల్పోవడమే. అలా బతకడం నాకే మాత్రం ఇష్టం లేదు. ఒక్కసారి వైవాహిక జీవితంలోకి ప్రవేశించిన తర్వాత సొంత ఆలోచనలకు, అభిప్రాయాలకు, ఆకాంక్షలకు, చివరకు అభిరుచులకూ అవకాశం ఉండదు. ఇలా ఎంతోమందిని చూశాను. అందుకే పెళ్లికి దూరంగా ఉన్నాను..’ ఇది 35 ఏళ్ల విజయ (పేరు మార్చాం) బలమైన అభిప్రాయం. ఆమె ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ (Moinabad) సమీపంలోని ఓ కళాశాలలో లెక్చరర్గా పని చేస్తున్నారు. అక్కడే ఒక మహిళల హాస్టల్లో ఉంటున్నారు.చాలామంది మహిళలు ఇటీవలి కాలంలో వివాహ బంధం, దాంపత్య జీవితంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పాతికేళ్ల వయసు దాటినా పెళ్లి (Marriage) ఊసు ఎత్తేందుకు కూడా ఇష్టపడని వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. విజయలా స్వతంత్రంగా జీవించాలనుకునే వారితో పాటు వృత్తిపరమైన బాధ్యతల వల్ల కొందరు, మంచి కెరీర్ (Career) కోసం ప్రయత్నించే క్రమంలో ఒత్తిడికి గురవుతూ మరికొందరు వివాహం విషయంలో నిరాసక్తతను ప్రదర్శిస్తున్నట్లు మోర్గాన్ స్టాన్లీ అధ్యయనం వెల్లడించింది. తమ జీవితాన్ని తమకు ఇష్టమైన విధంగా గడపడానికి వీలవుతుందనే భావనే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంది.ఒకవేళ పెళ్లి చేసుకున్నా పిల్లల్ని కనేందుకు ఇష్టపడటం లేదని తెలిపింది. భారత్ (India) సహా ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థ సర్వే నిర్వహించింది. 2030 నాటికి ఒంటరి మహిళల సంఖ్య 45 శాతానికి పెరగవచ్చునని అంచనా వేసింది. వీరిలో 25–44 ఏళ్ల లోపు వయసున్న వారే అత్యధిక సంఖ్యలో ఉంటారని పేర్కొంది. వ్యక్తిగత అభివృద్ధి, తాము ఎంచుకున్న రంగాల్లో పురోగతికే యువతులు ప్రాధాన్యం ఇస్తున్నారని వివరించింది. మరోవైపు కుటుంబ బాధ్యతలూ ఇందుకు కారణమవుతున్నాయి.బాధ్యతలు పంచుకుంటూ.. కెరీర్ కోసంకష్టపడుతూ.. సాధారణంగా అమ్మాయిలు 25 ఏళ్లలోపే పెళ్లిళ్లు చేసుకుంటారు. కానీ ఇటీవలి కాలంలో అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు కూడా కుటుంబ బాధ్యతలను పంచుకుంటున్నారు. తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటున్నారు. తోబుట్టువుల కెరీర్ కోసం కష్టపడుతున్నారు. అదే సమయంలో జీవితంలో స్వేచ్చను కోరుకుంటున్నారు. అల్వాల్కు చెందిన సుజాత (పేరు మార్చాం.) ఒక ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నారు. ‘పదేళ్ల క్రితమే నాన్న చనిపోయారు. అప్పటి నుంచి తమ్ముడు, చెల్లి, అమ్మను చూసుకోవడం నా వంతైంది. చూస్తూండగానే 40 ఏళ్లు వచ్చేశాయి..’అంటూ నవ్వేశారు ఆమె.సుజాత లాగానే చాలామంది అమ్మాయిలు కుటుంబ బాధ్యతల నేపథ్యంలో వయసు దాటి పోయిందనే భావనతో వివాహ బంధానికి దూరమవుతున్నారు. కానీ కొంతమంది యువతుల్లో స్వేచ్ఛాయుత జీవితంపై ఆసక్తి పెరుగుతోంది. వారి ఆలోచనలు, అభిప్రాయాలు వైవాహిక జీవితానికి వ్యతిరేకంగా ఉంటున్నాయి. ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన శైలజ.. ‘పెళ్లి కంటే ఆర్ధిక స్వాతంత్య్రం ఎంతో ముఖ్యం. అది లేకుండా పెళ్లి చేసుకోవడం ఆత్మహత్యాసదృశం..’అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. ఆమె ప్రస్తుతం ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పని చేస్తున్నారు. ఇప్పటికే 28 ఏళ్లు దాటాయి. అయినా ఒంటరిగానే ఉండిపోవాలని కోరుకుంటున్నారు. పిల్లలూ భారమేనా..! పెళ్లి చేసుకున్నప్పటికీ మరికొంతమంది మహిళలు పిల్లల్ని కనేందుకు వెనుకాడుతున్నారు. ‘ఈ రోజుల్లో పిల్లల్ని కనడం. పెంచడం ఎంతో ఖరీదైన విషయం. ఆ విషయంలో ఆచి తూచి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది..’ అని ఒక యువతి వ్యాఖ్యానించారు. నేను, నా స్వేచ్ఛ అనే భావన బలపడుతోంది దేశంలో అలాగే హైదరాబాద్లోనూ ఇలాంటి ట్రెండ్ కనిపిస్తోంది. మా అమ్మాయి పెళ్లిచేసుకోవడం లేదంటూ ఇటీవల కొందరు తల్లిదండ్రులు మా దగ్గరకు వచ్చినపుడు.. పెళ్లి ఎందుకు, ఆ అవసరం ఏమిటీ, పిల్లలు ఇతర బాదరాబందీ అంతా ఎందుకంటూ అమ్మాయిలు ప్రశ్నిస్తున్నారు. పెళ్లితో తమ స్వేచ్ఛ, కెరీర్ దెబ్బతింటుందని, ఒకవేళ వివాహానికి ఒప్పుకున్నా పిల్లలు వద్దనుకునే వాళ్లనే చేసుకోడానికి సిద్ధమని చెబుతున్నారు. కొంతమంది చదువు, ఉద్యోగాల రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉంటూ స్వేచ్ఛా జీవితం గడిపాక.. ఇక కుటుంబం, సంతానం వంటివి వద్దనుకుంటున్నారు. మనం అనే ఉమ్మడి భావన పోయి నేను, నా స్వేచ్ఛ, నా కెరీర్ అనే భావన బలపడుతోంది. తల్లిదండ్రుల కోరిక మేరకు ఇలాంటి వారికి మేం కౌన్సెలింగ్ ఇస్తున్నాం. – పి.జ్యోతిరాజా, సైకాలజిస్ట్, శ్రీదీప్తి కౌన్సెలింగ్ సెంటర్నచ్చిన వరుడు, మెచ్చిన ఉద్యోగం కోసంఎదురుచూస్తూ.. మరోవైపు నచ్చిన వరుడు లభించకపోవడం కూడా కొంతమంది అమ్మాయిలకు శాపంగా మారుతోంది. ప్రత్యేకంగా కొన్ని సామాజిక వర్గాలకు చెందిన యవతులు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మంచి విద్యార్హతలు, ఉద్యోగం, కెరీర్ అవకాశాలు, వ్యక్తిత్వం, అభిరుచులు తమకు నచ్చినట్లు ఉంటేనే పెళ్లికి అంగీకరిస్తున్నారు. అలాంటి అబ్బాయి లభించే వరకు నిరీక్షిస్తున్నారు. మరోవైపు విదేశీ సంబంధాల కోసం ఎదురుచూసే కుటుంబాల్లోనూ అమ్మాయిలకు పెళ్లిళ్లు ఆలస్యంగా జరుగుతున్నాయి. కొంతమంది సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు ఏళ్ల తరబడి చదువుతున్నారు. లక్ష్యాన్ని సాధించేవరకు పెళ్లికి దూరంగా ఉండాలనే భావనతో ఐదారేళ్లకు పైగా గడిపేస్తున్నారు.అప్పటికే పెళ్లి వయసు దాటిపోతోంది.చదవండి: ఏం చేయాలో అర్థం కావడం లేదు.. పారిపోవాలనిపిస్తోంది!భవిష్యత్తులో మరిన్ని సవాళ్లు!వచ్చే 10, 15 ఏళ్లలో వివాహ బంధానికి సంబంధించి మరింత ఎక్కువగా సవాళ్లు ఎదురుకావొచ్చు. ప్రస్తుతం 20 నుంచి 25 ఏళ్లు పైబడిన యువతుల్లో కొంతమంది పెళ్లి అంటే విముఖత వ్యక్తం చేస్తున్నారు. క్రమంగా ఈ ఆలోచన విధానం అమ్మాయిల్లో పెరుగుతోంది. వివాహం అనగానే బాధ్యతల్లో చిక్కుకుపోవడం, పిల్లల్ని కని వారి సంరక్షణలో, సంసార బాధ్యతల్లో మునిగిపోవడం అని అనుకుంటున్నారు. తమ స్వేచ్ఛకు, స్వతంత్రతకు భంగం వాటిల్లుతుందని భయపడుతున్నారు. ఉన్నత చదువులు చదివి, సమాజంలో మంచి ఉద్యోగం చేస్తున్నా.. మళ్లీ కుటుంబపరంగా ఎన్నో బరువు బాధ్యతలు మోయాల్సి రావడం కూడా ఇందుకు కారణమవుతోంది. అమ్మాయిల్లో పెళ్లి, పిల్లల పట్ల విముఖత పెరగడానికి పురుషుల మనస్తత్వాల్లో మార్పు రాకపోవడం కూడా ఒక కారణంగా భావించవచ్చు. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్, యూ అండ్ మీ కౌన్సెలింగ్ సెంటర్ -
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ, హీరో రాగ్ మయూర్తో వాలెంటైన్స్ డే స్పెషల్
‘ప్రేమంటే ఏమిటంటే ...’’ యుగయుగాలుగా ఈ ప్రశ్నకు సమాధానం కోసం వెదుకులాట నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఎవరి అర్థాలు వారివి. ఎవరి అనుభూతులు, అనుభవాలు వారివి. ఎవరి భావోద్వేగాలు వారివి. అందుకే రెండు హృదయాల మధ్య ప్రేమ సరికొత్తగా కొంగొత్తగా చిగురుస్తూనే ఉంది. చిక్కావే ప్రేమ.. అంటూ కూని రాగాలు కాదు...కాదు..కోటి రాగాలు పలికిస్తుంది. అదే ప్రేమ అనే రెండక్షరాల్లోని గమ్మత్తు... మత్తు. ఈ మత్తులోకి ఎవరికి వారు ఎపుడో ఒకపుడు జారిపోవాల్సిందే. ప్రేమికుల దినోత్సవం సందర్బంగా సివరపల్లి (పంచాయత్ సిరీస్ తెలుగు రీమేక్) హీరో రాగ్ మయూర్తో సాక్షి.కామ్ స్పెషల్గా ముచ్చటించింది.సినిమాబండి సినిమాతో పాపులారిటీ తెచ్చుకున్న విలక్షణ నటుడు రాగ్ మయూర్. ముఖ్యంగా వాలెంటైన్స్ డే వీక్ మొదలైందంటే చాలు ‘స్వర మంజరీ’ అంటూ చెప్పే ఆయన డైలాగ్ గత మూడు నాలుగేళ్లుగా ట్రెండింగ్లో నిలుస్తోంది అంటే రాగ్ యాక్టింగ్ స్కిల్స్ను అర్థం చేసుకోవచ్చు. అలాగే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి ప్రధాన పాత్రలో నటించిన గాంధీ తాత చెట్టు సినిమాలో ఇండస్ట్రియలిస్ట్ ఏజెంట్ సతీష్ అనే పాత్రలో రాగ్ మయూర్ నటించడమే కాదు, అటు విలన్ కూడా తన ప్రతిభను చాటుకున్నాడు.ఇదీ చదవండి: MahaKumbh : బ్రహ్మాండమైన వ్యాపారం నెలకు లక్షన్నర!ఇపుడు తన కరియర్లో మైలురాయిలాంటి సివరపల్లిలో పంచాయతీ సెక్రటరీగా తన నటనతో ప్రేక్షక నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇప్పటికే ఓటీటీలో జనాలను ఒప్పించి, మెప్పించిన హిందీ ‘పంచాయత్’ వెబ్ సిరీస్ను తెలుగులోకి రీమేక్ కూడా అదే స్థాయిలో దూసుకుపోవడం విశేషమే మరి. తెలుగు ఫ్లేవర్ మిస్ కాకుండా తెలంగాణలోని పల్లె వాతావరణంలో సాగే ఈ సిరీస్ పిల్లా, పెద్దా అందర్నీ ఆకట్టుకుంటోంది.సినిమాపై ఆయనకు ప్రేమ ఎలాపుట్టింది లాంటి వివరాలతో పాటు, నిజజీవితంలో ప్రేమ, ప్రేక్షకులతో ఆయన ప్రేమ, రాగ్ కిష్టమైన నటీ నటులు ఇలాంటి మరిన్ని విశేషాలు ఆయన సాక్షితో పంచుకున్నారు. ఈ మొత్తం చిట్చాట్ను రెండు భాగాలుగా వీడియో రూపంలో మీకు అందిస్తున్నాం. రాగ్ అందించిన ప్రేమ కబుర్లలో ఏ ఒక్కటీ మిస్ కాకుండా దీన్ని సంపూర్ణంగా వీక్షించి, మీ అభిప్రాయాలను పంచుకోండి. సాక్షి.కామ్ ప్రేమికులకు ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు. -
లంకమల అరణ్యం.. వర్థిల్లిన శైవం
బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లాలోని సిద్దవటం అటవీ ప్రాంతమైన లంకమల అభయారణ్యంలో 4వ శతాబ్ది నాటి మానవుల ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాక.. ఈ ప్రాంతంలో ఇంకా ఎలాంటి విశేషాలు, చరిత్ర దాగున్నాయన్న ఉత్సుకత పెరుగుతోంది. దీనికి తగ్గట్టుగా రోజుకో కొత్త విషయం బయటికి వస్తోంది. కొత్తగా సిద్దవటం అటవీశాఖ క్షేత్రాధికారిణి బి.కళావతి.. వెలుగులోకి తెచ్చిన ఫొటోల ఆధారంగా మరిన్ని విషయాలు బాహ్య ప్రపంచంలోకి వచ్చాయి. సాక్షిలో ‘ఆధ్యాత్మిక క్షేత్రం.. లంకమల’ కథనం ద్వారా పలు ఆసక్తికర అంశాలను వెలుగులోకి తేవడం తెలిసింది. ప్రస్తుతం ఆ కథనానికి మరింత బలం చేకూర్చే మరిన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. ఒకే చోట గుహ, బండపై శాసనం, శిథిలమైన శివాలయాల ఆనవాళ్లు, శివుని పాద ముద్రలు, అక్కడే పైనుంచి కిందికి దూమికే జలపాతం.. ఇలా అన్నీ ఆధారాలు వెలుగులోకి వచ్చిన ఈ ప్రాంతానికి కైలాసకోనగా ప్రాచుర్యం ఉంది. అంటే శివుడు నివసించిన ప్రాంతమని అర్థం. కాబట్టి శైవం ఏ స్థాయిలో ఇక్కడ వర్దిల్లిందో దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. అందిన ఆధారాలను పురావస్తుశాఖ క్షుణ్ణంగాపరిశీలిస్తోంది. బండలపై ఆధారాలు ఈ ప్రాంతంలో శైవ క్షేత్రం వర్థిల్లిందని.. ఆనాటి శైవులు బండలపై శాసనాలు, ఇతర గీతల ద్వారా వెల్లడవుతోంది. శాసనాలను బట్టి 4వ శతాబ్దినాటి శైవులు ఇక్కడ ఉన్నట్టు నిర్ధారిస్తున్నారు. అప్పట్లో ఎలాంటి ఆయుధాలు వినియోగించారో.. తెలిపేలా బండలపై వాటి ఆకృతి తెలిపేలా చెక్కారు. మరోచోట శాసనం, పక్కనే శివలింగ ఆకారం ఉన్నాయి. ఇక్కడి శిథిల ఆలయాల నిర్మాణం కోసం చుతురస్రాకారంలో ఉండే బండలను వినియోగించారని, వాటిని బట్టి స్పష్టం అవుతోంది.పై కైలాసం.. జారే జలపాతం శైవ క్షేత్రాలున్నట్టు గుర్తించిన ప్రాంతానికి సమీపంలోనే పై కైలాసకోన ఉంది. ఇది అద్భుతమైన జలపాతం. పై నుంచి జలపాతం కిందకు దూకే ప్రాంతం అత్యంత భయంకరంగా కనిపిస్తుంది. కొండనడుమ దూకే జలపాత ప్రాంతం ప్రకృతి సౌందర్యాన్ని తలపిస్తుంది. ఈ జలపాతంపై నుంచి కిందకు జారితే కైలాసానికి చేరినట్టే. అందుకనే దీన్ని పై కైలాసంగా ప్రాచుర్యంలో ఉంది. జలపాతం దిగువన గుహలు, ఆలయాలతో కూడిన ప్రదేశమే దిగువ కైలాసకోన. అక్కడే గుహ.. ఆలయాలులంకమల మొత్తం 36 వేల హెక్టార్ల మేర విస్తరించి ఉండగా.. అందులో సిద్దవటం రేంజి పరిధిలో 26 వేల హెక్టార్ల అభయారణ్యం ఉంది. అడవిలోని కొండూరు బీటులో శైవ క్షేత్ర ఆనవాళ్లు విస్తృతంగా లభ్యమయ్యాయి. దిగువ కైలాసకోనగా పిలువబడే.. ఈ ప్రదేశంలో అర ఎకరం విస్తీర్ణంలో పదికిపైగా శివాలయాల శిథిలాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన పునాదుల బండరాళ్లు, వాటి నిర్మాణం కనిపిస్తున్నాయి. పడిపోయిన గోడలు, వాటి శిథిలాలు ఉన్నాయి. దీన్ని ఆధారంగా చేసుకుంటే వాటిని ఆలయాలుగా భావిస్తున్నారు. ఈ చోటనే గుహను కూడా గుర్తించారు. ఆలయాల వద్ద పూజల నిర్వహణ, గుహలో సిద్దులు, యోగులు తపస్సు చేసుకునే వారు. ఇక్కడే శివుడ్ని ఆరాధిస్తున్న వీరుడి విగ్రహం లభ్యమైంది. ఈ ప్రాంతం దిగువ కైలాసకోనగా ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉంది. ఈ అడవికి సమీపంలో సిద్దవటం గ్రామం ఉంది. అంటే సిద్దులకు ఈ ప్రాంతం నివాసమని భావిస్తున్నారు. దీనివల్లె సిద్దవటం అని పేరొచ్చిందని చెబుతారు. -
ఊరంతా ఉద్యోగులే
మరిపెడ రూరల్: ఒకప్పుడు మారుమూల గిరిజన తండా.. ఆపై సౌకర్యాల లేమి. అయితేనేం సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని ఉన్నత చదువులు చదివారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఇంటికొకరు ప్రభుత్వ కొలువుల్లో ఉన్నారంటే ఆశ్చ ర్యం కలుగక మానదు. అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు అన్ని హోదాల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఆ గ్రామంలో ఉన్నారు. చిన్న, సన్నకారు రైతులు కష్టపడి తమ బిడ్డలను ఉన్నత చదువులు చదివించి ప్ర భుత్వ కొలువుల్లో స్థిరపడేలా చేశారు. మరికొందరు ప్రైవేట్ రంగాల్లోనూ రాణిస్తున్నారు. ఇంతకీ ఆ గ్రామం ఏంటి అనుకుంటున్నారా.. అదే మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తండధర్మారం. పట్టణాన్ని తలపించేలా.. మారుమూల తండా అయిన తండధర్మారం.. నేడు పట్టణాన్ని తలపిస్తోంది. అన్నీ డాబాలు, రెండు, మూడు బహుళ అంతస్తుల భవనాలున్నాయి. తాతముత్తాతల నుంచి గ్రామంలో వ్యవసాయమే ప్రధాన ఆధారంగా కుటుంబాలు జీవిస్తుండేవి. ఊరి పేరులో తండా అని ఉన్నప్పటికీ అక్కడ అన్ని వర్గాల కుటుంబాలు నివసిస్తున్నారు. గ్రామంలో 267 గృహాలు, 1,160 మంది జనాభా ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో ప్రభుత్వ కొలువుతో ఆ పల్లె విలసిల్లుతోంది. తామేమీ తక్కువ కాదంటూ ఒకరికంటే ఒకరు పోటీ పడి ఉన్నత చదువులు చదువుతూ ప్రభుత్వ కొలువులు సాధిస్తున్నారు. పూర్వ కాలంలోనే ఈ గ్రామంలో బడి పంతుళ్లు, పోలీస్ పటేల్గా కొలువు దీరారు. వివిధ ప్రాంతాల్లో కొలువు దీరిన ఉద్యోగులంతా సంక్రాంతి పండుగకు స్వగ్రామంలో కలుసుకొని గ్రామంలోని మహిళలు, యువతకు వివిధ పోటీలు నిర్వహిస్తుంటారు. 100 మందికిపైగా ప్రభుత్వోద్యోగులు గ్రామంలో 10, 15 ప్రభుత్వ కొలువులు ఉంటేనే గొప్ప. అలాంటిది తండధర్మారంలో 100 మందికిపైగా ప్రభుత్వ కొలువుల్లో స్థిరపడ్డారంటే మామూలు విషయం కాదు. గ్రామానికి చెందిన గుగులోతు రవినాయక్ (ఐఏఎస్) తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) మెంబర్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. గత సంవత్సరం మహబూబ్నగర్ కలెక్టర్గా కొనసాగారు. అలాగే గుగులోతు వసంత్నాయక్ ఆర్ అండ్ బీ ఎస్సీగా విధులు నిర్వహిస్తున్నారు. గుగులోతు సుమలత ఇటీవల ఆర్టీఏ కొలువు సాధించి ఖమ్మం జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులు, ఫారెస్ట్, ఎక్సైజ్, పోలీస్ ఇలా అన్ని శాఖల్లోనూ కొలువై ఉన్నారు. స్వాతంత్య్రం రాకముందే.. స్వాతంత్య్రం రాక ముందే గ్రామంలో పదుల సంఖ్యలో విద్యావంతులున్నారు. ఈ క్రమంలోనే గ్రామంలోని గుగులోతు సక్రునాయక్ మొదటి బడిపంతులుగా కొలువుదీరినట్లు గ్రామస్తులు తెలిపారు. అలాగే హన్మంతునాయక్, స్వాతంత్య్ర సమరయోధుడు వెంకన్ననాయక్, గుగులోతు భగ్గునాయక్ తర్వాత బడిపంతులుగా నియమితులయ్యారు. గుగులోతు సిరినాయక్ అనే వ్యక్తి పోలీస్ పటేల్గా విధులు నిర్వహించారు. వీరిని ఆదర్శంగా తీసుకునే గ్రామంలోని రైతులు, కూలీలు కష్టపడి పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. -
కార్పొరేట్లకు రెడ్ కార్పెట్
ప్రపంచంలోనే అతి పెద్ద విమానయాన మార్కెట్లలో భారత్ది మూడో స్థానం. పదేళ్ల వ్యవధిలో (2024 ఏప్రిల్ నాటికి) సీటింగ్ సామర్థ్యం 79 లక్షల నుంచి 1.55 కోట్లకు పెరిగింది. విమానయానం మరింతగా వృద్ధి చెందుతున్న అంచనాల మధ్య వేల కొద్దీ విమానాలకు ఆర్డర్లిచ్చిన ఎయిరిండియా, ఇండిగో లాంటి దిగ్గజాలు.. గణనీయంగా పెరుగుతున్న కార్పొరేట్ ప్రయాణికులపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ నివేదిక ప్రకారం 2023 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా కార్పొరేట్ ట్రావెల్ మార్కెట్ (హోటళ్లు, విమానయాన సంస్థలు, రైళ్లు, క్యాబ్లు కలిపి) దాదాపు 10.6 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇందులో ఎయిర్లైన్స్ మార్కెట్ వాటా 53 శాతంగా (5.6 బిలియన్ డాలర్లు) ఉంది. కార్పొరేట్ల ప్రయాణాలు మరింతగా పెరుగుతాయన్న అంచనాల నేపథ్యంలో విమానయాన సంస్థలు కూడా ఈ విభాగంపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. ప్రత్యేక ఆఫర్లతో కార్పొరేట్, సంపన్న ప్రయాణికులను ఆకట్టుకునేందుకు దేశ విదేశ ఎయిర్లైన్స్ పోటీపడుతున్నాయి. ఈ క్రమంలోనే చిన్న, మధ్య తరహా సంస్థలపై (ఎస్ఎంఈ) ఎయిరిండియా దృష్టి సారించింది. సాధారణంగా మార్కెటింగ్పరంగా వాటిని చేరుకోవడం కొంత కష్టతరం కావడంతో, అవే నేరుగా బుకింగ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తూ విడిగా పోర్టల్ ఏర్పాటు చేసింది. దీని ద్వారా బుక్ చేసుకుంటే ఆకర్షణీయమైన చార్జీలను కూడా ఆఫర్ చేస్తోంది. దీంతో పాటు విస్తారా ను విలీనం చేసుకున్న తర్వాత సేల్స్ టీమ్ పటిష్టం కావడం, నెట్వర్క్ విస్తరించడం వంటి అంశాలు కార్పొరేట్ బిజినెస్ పెంచుకునేందుకు ఎయిరిండియాకు ఉపయోగపడుతున్నాయి. గత కొన్నాళ్లుగా కంపెనీ సుమారు 1,700 పైచిలుకు కార్పొరేట్ క్లయింట్లను దక్కించుకుంది. మరోవైపు బడ్జెట్ విమానయా న సంస్థగా పేరొందిన ఇండిగో కూడా కార్పొరేట్ క్లయింట్లను ఆకట్టుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కొన్ని కీలక రూట్లలో బిజినెస్ క్లాస్ను ప్రవేశపెడుతోంది. గతేడాది నవంబర్లో ప్రారంభించిన ఈ కొత్త సర్వీసులకు మంచి స్పందన రావడంతో ఢిల్లీ–చెన్నై రూట్లో కూడా ఈ కేటగిరీని ప్రవేశపెట్టడంపై కసరత్తు చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. 2025 ఆఖరు నాటికి 45 విమానాల్లో బిజినెస్ క్లాస్ సీట్లు ఉంటాయని కంపెనీ సీఈవో పీటర్స్ ఎల్బర్స్ పేర్కొన్నారు. 2025 జూన్ నాటికే ఇలాంటి 94 విమానాలను సమకూర్చుకోవాలని ఎయిరిండియా లక్ష్యంగా పెట్టుకుంది. ప్రత్యేక సదుపాయాలు.. బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు లగ్జరీ అనుభూతిని అందించేందుకు విమానయాన సంస్థలు పోటీపడుతున్నాయి. ఇండిగోలో సీట్ల వరుసల మధ్య స్థలం 38 అంగుళాలుగా ఉంటే, ఎయిరిండియాకు 40 అంగుళాల స్థాయిలో ఉంటోంది. ఇండిగో సీట్లు అయిదు అంగుళాల మేర రిక్లైన్ అయితే, ఎయిరిండియావి 7 అంగుళాల వరకు రిక్లైన్ అవుతాయి. ఇక రెండు ఎయిర్లైన్స్ చెకిన్, బోర్డింగ్, బ్యాగేజ్ హ్యాండ్లింగ్ విషయాల్లో బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నాయి.అంతర్జాతీయ ఎయిర్లైన్స్ కూడా.. ఆర్థిక పరిస్థితులపై సానుకూల దృక్పథంతో ప్రయాణాలు మరింతగా పుంజుకుంటాయన్న అంచనాల నేపథ్యంలో బిజినెస్ క్లాస్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అంతర్జాతీయ ఎయిర్లైన్స్ కూడా పోటీపడుతున్నాయి. మలేసియా ఎయిర్లైన్స్ కొన్నాళ్ల క్రితమే తమ కార్పొరేట్ ట్రావెల్ ప్రోడక్ట్ను సరికొత్తగా తీర్చిదిద్దింది. అప్గ్రెడేషన్, అదనపు బ్యాగేజ్ అలవెన్స్ మొదలైన వాటికి రివార్డు పాయింట్లను అందించడంతో పాటు వాటిని రిడీమ్ కూడా చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. అలాగే ఎస్ఎంఈలకు ప్రత్యేక చార్జీలు, వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన తోడ్పాటు అందిస్తోంది. తమ దేశంలో సమావేశాలు, కాన్ఫరెన్సులు, ఈవెంట్లను నిర్వహించుకునేందుకు క్లయింట్లను ప్రోత్సహించేలా ట్రావెల్ ఏజెంట్లకు ఎయిర్ మారిషస్ ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఈ స్కీము కింద గ్రూప్ సైజు, ప్రయాణించిన ప్యాసింజర్లను బట్టి ఒక్కొక్కరి మీద రూ. 500–1,000 వరకు కమీషన్లు ఇస్తోంది. అజర్బైజాన్, జార్జియా, కజక్స్తాన్, ఉజ్బెకిస్తాన్ తదితర ప్రాంతాలకు డైరెక్ట్ కనెక్టివిటీ పెరగడంతో, ఆయా దేశాలకు ప్రయాణం చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోందని థామస్ కుక్ ఇండియా వర్గాలు తెలిపాయి. థామస్ కుక్ ఇండియాకి సంబంధించి బిజినెస్ ట్రావెల్ సెగ్మెంట్ వార్షికంగా సుమారు 13 శాతం పెరిగింది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ప్రేమానుగ్రహం రాశిపెట్టుందా?
జన్మ జాతకం ఎలా ఉన్నా ప్రేమ జాతకం బాగుంటే మంచి ఆత్మిక భాగస్వామి దొరుకుతారు. సవాళ్లు విసిరే జీవితంలో ప్రేమ నిండిన బంధం చాలా అవసరం. స్త్రీ, పురుషుల మధ్య ప్రేమ వారిని ఉత్సాహంగా ముందుకు నడవడానికి కారకం అవుతుంది. జీవితాన్ని అర్థవంతం చేస్తుంది. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే. సౌరమానం ప్రకారం ఆ రోజు దిన ఫలితాలు ఇక్కడ ఇస్తున్నాం. ఈ ఫలితాలు సంవత్సరమంతా ప్రభావం చూపిస్తాయి...మేషం (21 మార్చి–19 ఏప్రిల్)ఈ రాశి వారికిప్రాకృతిక శక్తి సహకరిస్తుంది. అంగారక గ్రహ ప్రభావం వలన ప్రేమ వృద్ధి చెందుతుంది. వీరు తాము ప్రేమించినవారి కోసం ఏదైనా ప్రత్యేకమైన ఫంక్షన్ ఏర్పాటు చేసి వారి మన్ననలు అందుకుంటారు. చాలా రొమాంటిక్ గా కాలం గడుస్తుంది. ఈ రాశి ప్రేమికులు ఈ సంవత్సరం దంపతులవుతారు. దంపతులుగా ఉన్నవారు తల్లిదండ్రులవుతారు.వృషభం (20 ఏప్రిల్– 20 మే)శుక్ర గ్రహ ప్రభావం వల్ల రొమాంటిక్ భావాలు పెరుగుతాయి. ప్రేమించిన వారి పట్ల ప్రేమ ఆప్యాయతలు అధికమవుతాయి. స్థిరపడుతాయి. ప్రేమ విషయంలో కొత్త విధానాలు అవలంబిస్తారు. ఆ కొత్త విధానాల వలన ప్రేమ సఫలీకృతం అవుతుంది. పెద్దలు మీ ప్రేమను అంగీకరిస్తారు. ఈ సంవత్సరం మంచి జీవితాన్ని గడుపుతారు.మిథునం (21 మే– 20 జూన్)బుధ గ్రహ ప్రభావం వల్ల మీరు ప్రేమించిన వారి పట్ల ప్రేమను సూటిగా చక్కగా అర్థవంతంగా తెలుపగలుగుతారు. మీ మాటలకు మీరు ఇష్టపడినవారు ప్రభావితులవుతారు. మిథునం అంటేనే జంట, ఈ సంవత్సరం ప్రేమికుల జంట పంట పండినట్టే. ఆదర్శమైన జంటగా పేరు పొందుతారు.కర్కాటకం (21 జూన్– 22 జూలై):చంద్ర గ్రహప్రభావం వల్ల మీలో ప్రేమాభిమానాలు ఉప్పొంగి మీ ప్రేమికుల పట్ల సుహృద్భావం కలిగిస్తుంది. వ్యక్తిగత సంబంధాలు మెరుగుపడతాయి. చిన్న నాటి స్నేహితులను కలుసుకుంటారు. గతంలో తెగిన బంధాలు ఇప్పుడు అతుకుతాయి.సింహం (23 జూలై– 22 ఆగస్టు)సూర్యగ్రహ ప్రభావం వల్ల మీ ఆకర్షణ శక్తి పెరుగుతుంది. మీరు ప్రేమించినవారికి ఆకర్షించగలుగుతారు. అందరూ మిమ్మల్ని అభిమానిస్తారు. మీ ప్రేమను స్పష్టంగా తెలియజేయగలుగుతారు. ఈ సంవత్సరం మీకు తిరుగు ఉండదు. అన్నిటిలో విజయమే లభిస్తుంది. మీ ప్రేమ ఫలిస్తుంది.కన్య (23 ఆగస్టు– 22 సెప్టెంబర్)ఆత్మ పరిశీలన చేసుకొని సంబంధ బాంధవ్యాలను విశ్లేషిస్తారు. మీ భావాలను బాగా తెలియజేస్తారు. ప్రేమికుల మధ్య బంధాలు బలపడతాయి. ఈ సంవత్సరం మీకు మహోన్నతంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు చేస్తారు. చేతిలో ధనం బాగా నిలుస్తుంది. దైవబలం మీకు తోడుగా ఉంది.తుల ( 23 సెప్టెంబర్- 22 అక్టోబర్)శుక్ర గ్రహ ప్రభావం వల్ల ప్రేమికుల మధ్య సంబంధ బాంధవ్యాల సమతుల్యత పెరిగి ప్రేమ వికసిస్తుంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, డిమాండ్లు తగ్గుతాయి. ప్రేమికులు సామరస్యంగా ఉంటారు. ప్రేమలోను, వ్యాపార రంగంలోను మీదే పైచేయి అవుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. నూతన వ్యాపారాలు ఈ సంవత్సరంప్రారంభించి లాభాలు పొందుతారు.వృశ్చిక (23 అక్టోబర్– 21 నవంబర్)అంగారక ప్రభావం వల్ల ప్రేమాభిమానాలు వృద్ధి చెందుతాయి. మీరు ప్రేమించిన వారిని ఈ రోజు మీరు అయస్కాంతంలా ఆకర్షిస్తారు. లోతైన ప్రేమ గొప్ప అనుభవాలను తీసుకొస్తుంది. ఈ సంవత్సరం మీ కష్టాలు తొలగిపోయి, ఆనందం ఐశ్వర్యం లభిస్తాయి. మీరు చాలా సంతోషంగా ఉంటారు.ధనుస్సు (22 నవంబర్- 21 డిసెంబర్)గురు గ్రహ ప్రభావం వల్ల మీలో ఆశావాదం పెరుగుతుంది. దాంతో సాహస ప్రవృత్తి పెరిగి అది ప్రేమించినవారిని ఆకర్షించి కట్టిపడేసేలా చేస్తుంది.. ఆనందం వెల్లివిరుస్తుంది. సింగిల్గా ఉన్నవారికి ఈ సంవత్సరం మంచి ప్రేమైక భాగస్వామి తారసపడతారు. ఈ సంవత్సరం గొప్ప అభివృద్ధిని సాధిస్తారు. ప్రేమించిన వారి వల్ల మంచి జరుగుతుంది.మకరం (22 డిసెంబర్–19 జనవరి)శనిగ్రహ ప్రభావం వల్ల మీ ప్రేమ వ్యవహారం బలపడుతుంది. ప్రేమలో మీరు గతంలో ఇచ్చిన మాట, హామీలు నెరవేరుస్తారు. సింగిల్గా ఉన్నవారికి తగిన జోడు లభిస్తుంది. స్త్రీ వల్ల పురుషులు, పురుషుల వల్ల స్త్రీలు లాభం పొందుతారు. ఈ సంవత్సరం ఏలిననాటి శని తొలగి గొప్ప ఉన్నతిని సాధిస్తారు.కుంభం (20 జనవరి– 18 ఫిబ్రవరి)శుక్ర, యురేనస్ గ్రహ ప్రభావం వల్ల రొమాంటిక్ భావాలు ఉద్దీప్తమవుతాయి. మీలోని అసాధారణ శక్తి బంధాలను బలపరుస్తుంది. ప్రేమ విషయంలో కొత్త ఆలోచనలు కలిగిస్తుంది. సింగిల్గా ఉన్నవారు సంప్రదాయేతర స్థలాలలో వింత పరిచయాలను ఎదుర్కొంటారు. ప్రేమికుల వల్ల ఈ సంవత్సరం మీకు వృత్తి పరంగా మంచి అవకాశాలు వచ్చి రాణిస్తారు.చదవండి: నీకోసం ఈ లోకం బహుమానం చేసేస్తామీనం (19 ఫిబ్రవరి– 20 మార్చి)నెప్ట్యూన్ ప్రభావం వల్ల అసాధారణ భావోద్వేగం మీ హృదయానికి సరైన దారి చూపిస్తుంది. ఈరోజు మీలో సున్నితమైన ప్రేమ సానుకూల వాతావరణాన్ని కలిగిస్తుంది. ప్రేమికుల మధ్య బంధం పెరిగి కలలు సాకారమవుతాయి. సింగిల్గా ఉన్నవారు అనుకోకుండా సోల్మేట్ను కలుసుకుంటారు. ఎంతో కాలంగా ఉన్న అభిలాషలు ఈ సంవత్సరం తీరుతాయి. పది సంవత్సరాల వరకు మీకు తిరుగు ఉండదు.– డా. మహమ్మద్దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
గుండె గొంతుక లోన క్రియేటివిటీ
గు... డ్మా... ర్నిం... గ్ అంటూ... కనపడకుండా వినిపించే వారి గొంతులోని హుషారు మన మదిలో ఉత్సాహాన్ని నింపుతుంది. అప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న కాలం కూడా పరుగులు పెడుతుందా అనిపిస్తుంది. వారు నోరారా పలకరిస్తుంటే క్షణాలలో ఆత్మీయ నేస్తాలైపోతారు. గలగలా మాట్లాడేస్తూ మనలో ఒకరిగా చేరిపోతారు. ‘ప్రతిరోజూ మా వాయిస్ని కొత్తగా వినిపించాల్సిందే, అందుకు కొత్త కొత్త కాన్సెప్ట్తో మమ్మల్ని మేం సిద్ధం చేసుకోవాల్సిందే...’ అని చెబుతున్నారు రేడియో ఎఫ్.ఎమ్.లతో తమ గళంతో రాణిస్తున్న మహిళా రేడియో జాకీలు... వారితో మాటా మంతీ...– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిక్రియేటివిటీ అనుకున్నంత సులువు కాదునచ్చిన సినిమా పాటలు (Movie Songs) ఇంట్లో పాడుకుంటూ ఉండే నా గొంతు విని మాకు తెలిసినవారు రేడియోలో ట్రై చేయచ్చు కదా! అన్నారు. అంతే, ఆడిషన్స్కు వెళ్లి ఆఫర్ తెచ్చుకున్నాను. అయితే, అది అనుకున్నంత సులువు కాదు. ఇది చాలా క్రియేటివ్ ఫీల్డ్. చాలామందితో డీల్ చేయాల్సి ఉంటుంది. చాలా స్మార్ట్గా ఉండాలి. ఏ రంగంలోనైనా మంచి, చెడు అనుభవాలు ఉంటాయి. కానీ, వాటిని మోసుకుంటూ వెళితే నిరూపించుకోలేం. ఒక వైపు ఉద్యోగం చేస్తూ, మరోవైపు రేడియో జాకీగా మార్నింగ్ షో (Morning Show) చేస్తుంటాను. డబ్బింగ్ ఆర్టిస్ట్గా కొనసాగుతూనే నటిగానూ పన్నెండు తెలుగు సినిమాల్లోనూ నటించాను. ఎక్కడ నా క్రియేటివిటీని చూపించగలనో అక్కడ నా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ, నన్ను నేను మలుచుకుంటూ నా శ్రోతలను అలరిస్తున్నాను. నా ఫ్రెండ్స్ ద్వారా థియేటర్ ఆర్టిస్ట్గానూ వేదికల మీద ప్రదర్శనలలో పాల్గొంటున్నాను. ఏ వర్క్ చేసినా నా సోల్ రేడియోలో ఉంటుంది. అందుకని, ఎన్ని పనులు ఉన్నా రేడియో లైఫ్ను వదలకుండా నా క్రియేటివిటీకి పదును పెడుతుంటాను. – ఆర్జె ప్రవళిక చుక్కల, ఆకాశవాణినవరసాలు గొంతులో పలికించాలిరేడియో (Radio) అనగానే క్యాజువల్గా మాట్లాడేస్తున్నారు అనుకుంటారు. కానీ, ఇందులో సృజనాత్మకత, ఉచ్చారణ, భావ ప్రకటనతో పాటు నవరసాలు పలికించాలి. కొన్ని సందర్భాలలో ఇంటి వాతావరణం సరిగా లేకపోయినా, ఎక్కడ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నా ఆ ప్రభావం వర్క్పై పడకూడదు. నా గొంతు వేల మంది వింటున్నారు అనే ఆలోచనతో అలెర్ట్గా ఉండాలి. హైదరాబాద్ బి కేంద్రంలో యువవాణి ప్రోగ్రామ్ నుంచి నేటి వరకు పద్దెనిమిదేళ్లుగా ఆకాశవాణిలో పని చేస్తున్నాను. ఇన్నేళ్ల నా అనుభవంలో సినిమాతారలు, సాహిత్యకారులు, విద్యావేత్తలు, న్యాయవాదులు, వైద్యులు... ఇలా ఇంచుమించు అన్ని రంగాలలో ఉన్న ప్రముఖుల అంతరంగాలను ఆవిష్కరించాను. చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు అందిరినీ నా వాయిస్తో అలంరించాను అని గర్వంగా ఉంది. ఆర్మీడే, ప్రధానమంత్రి యోజన పథకాలు, బ్యాంకు, వైద్యం, సమాజంలో బర్నింగ్ ఇష్యూస్... లాంటి వాటిని లైవ్ కవరేజ్లుగా ఇచ్చాను. బెస్ట్ ఆర్.జె. అవార్డులూ అందుకున్నాను. రేడియో అంటే గలగల మాట్లాడటమే కాదు సాంకేతిక సామర్థ్యంతో పాటు అన్ని స్థాయుల వారిని కలుపుకుంటూ పనిచేయాలి. – ఆర్జె దీప నిదాన కవి, ఆల్ ఇండియా రేడియోనన్ను నేను మార్చుకున్నానుఈ రంగంలోకి రాకముందు ఎప్పుడూ రేడియో వినలేదు. ఆడిషన్స్ జరుగుతున్నాయనే విషయం తెలిసి, ట్రై చేద్దామని వెళ్లాను. పదకొండేళ్లుగా రేడియోకి అంకితమైపోయాను. గుడ్ ఈవెనింగ్ ట్విన్సిటీస్ అని రెయిన్బోలో వర్క్ చేశాను. ఇప్పుడు వివిధ భారతిలో సాయంకాలం 5 గంటల నుంచి షో చేస్తున్నాను. సినిమా, వైరల్ న్యూస్, ట్రాఫిక్ అప్డేట్స్, యూత్ ట్రెండ్స్, గాసిపింగ్, కరెంట్ టాపిక్స్ .. ఇలా అన్నింటి గురించి చెబుతుంటాను. ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎదుటివారిని మెప్పించేలా నన్ను నేను ఎలా మార్చుకోవాలనే విషయాలు రేడియోకి వచ్చాకే తెలుసుకున్నాను. ఏ చిన్న విషయమైనా తక్కువ సమయంలో క్రియేటివ్గా, ఆసక్తికరంగా అనిపించేలా చెప్పగలగడం రేడియో ఇచ్చిన వరంగా భావిస్తున్నాను. – ఆర్జె కృష్ణ కీర్తి, వివిధభారతిఉన్నతంగా తీర్చిదిద్దిందిప్రసారభారతిలో పద్దెనిమిదేళ్లుగా పని చేస్తున్నాను. రేడియో జాకీలు అనగానే నోటికివచ్చిందేదో వాగేస్తుంటారు అనుకుంటారు. కానీ, మేం ప్రతిరోజూ కొత్తదనంతో శ్రోతలకు పరిచయం అవుతాం. కంటెంట్ను సొంతంగా తయారు చేసుకోవడం, సృజనాత్మకతను జోడించడం, గొంతుతోనే కళ్లకు కట్టినట్టుగా వివరించడాన్ని ఓ యజ్ఞంలా చేస్తుంటాం. స్టూడియోలో కూర్చొనే కాకుండా అనాథశ్రమాలు, వృద్ధాశ్రమాలు, దివ్యాంగులు... ఇలా 52 వివిధ రకాల స్వచ్ఛందసేవా సంస్థలతో కలిసి కార్యక్రమాలు చేశాను. సినిమా కథ పేరుతో తెరవెనుక జరిగే ప్రతి కష్టాన్నీ వినిపించాను. రేడియో నన్ను ఉన్నతంగా మార్చింది. డబ్బింగ్ ఆర్టిస్ట్ని చేసింది. యాంకర్గా వేదికలపైనా, వివిధ కార్యక్రమాలను చేసే అవకాశాన్ని ఇచ్చింది. ఇన్ని అవకాశాలు ఇచ్చిన రేడియో నాకు దేవాలయంలాంటిది. – ఆర్జె స్వాతి బొలిశెట్టి, ఆల్ ఇండియా రేడియోప్రతిరోజూ హుషారే! నాకు నచ్చిన పనిని డబ్బులు ఇచ్చి మరీ చేయమంటుంటే ఎంత ఆనందంగా ఉంటుంది? ఆ ఆనందంతోనే పదేళ్లుగా రేడియో మిర్చిలో ఆర్.జె.గా చేస్తున్నాను. రోజూ చూసేవీ, వినేవీ.. నా ఫ్రెండ్స్కి ఎలాగైతే చెబుతానో... శ్రోతలతో కూడా అలాగే మాట్లాడుతుంటాను. కొన్నాళ్ల వరకు నా మాటలను మాత్రమే విన్నవారికి ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కనిపిస్తున్నాను కూడా. ఆర్జె అంటే మాట్లాడటం ఒకటేనా.. నవ్వించడానికి ఏం చేయచ్చు నన్ను నేను ప్రూవ్ చేసుకుంటున్నాను. క్రియేటివిటీ ఉన్నవారే ఈ రంగంలో ఉండగలరు. ఎంత హ్యాపీగా మాట్లాడినా పర్సనల్ ఎమోషన్స్ అడ్డు పడుతుంటాయి.అలాంటప్పుడు ఆ విషయాన్ని కూడా శ్రోతలతో పంచుకుంటాను. ‘ఈ రోజు అస్సలు బాగోలేదు, ఇంట్లో డిష్యూ డిష్యూం.. కానీ ఏం చేస్తాం, ముందుగా ఓ రెండుపాటలు వినేసి లైట్ తీసుకుందాం...’ ఇలా రోజువారి అంశాలకు హ్యాపీనెస్ను జతచేసి శ్రోతలకు ఇవ్వడానికి తపిస్తూనే ఉంటాను. నవరాత్రుల టైమ్లో తొమ్మిది మంది విభిన్నరంగాలలో విజయాలు సాధించిన మహిళలతో షో చేశాను. శ్రోతల్లో కొందరిని స్టూడియోకి పిలిచి, ట్రైనింగ్ ఇచ్చి మరీ వారి చేత మాట్లాడించాం. ఆర్జె స్వాతి...తో... అని షోలో మొదలుపెట్టే మాటలు, మిర్చి శకుంతల డ్రామా.. చాలా పేరు తెచ్చాయి. కళ్లతో చూసినదాన్ని గొంతులో పలికిస్తా. అదే అందరినీ కనెక్ట్ చేస్తుంది. – ఆర్జె స్వాతి, రేడియో మిర్చిరేడియోతో ప్రేమలో పడిపోయా! ‘సిరివెన్నెల’ నైట్ షోతో నా రేడియో జర్నీప్రారంభించాను. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవెనింగ్ షోస్ అన్నీ చేస్తూ వచ్చాను. పదిహేనేళ్లుగా నేర్చుకుంటూ, పని ద్వారా ఆనందాన్ని పొందుతున్నాను. ముఖ్యమైన రోజుల్లో ప్రముఖులతో మాట్లాడుతూ షో చేస్తుంటాం. మారుతున్న ప్రేమల గురించి చర్చిస్తుంటాను. ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుతుంటాను. ఈ రోజు ఇంత ఆనందంగా ఉన్నానంటే అది రేడియో. ఒక వ్యక్తి గొంతు మాత్రమే విని, అభిమానించడం అనేది మామూలు విషయం కాదు. ఒకమ్మాయి కొన్నేళ్లుగా నా షోస్ వింటూ ఉంది. కుటుంబపరిస్థితుల కారణంగా చనిపోవాలనుకున్న ఆ అమ్మాయి, నాతో చివరిసారిగా మాట్లాడుదామని ఫోన్ చేసింది. షో మధ్యలో ఆపేసి, ఆమెతో మాట్లాడి, ఇచ్చిన భరోసాతో ఇప్పుడు వారి కుటుంబ సభ్యురాలిగా మారిపోయాను. రేడియో సిటీలో నా జీవితాన్ని మలుపుతిప్పిన ఇలాంటి సంఘటనలు ఎన్నో. – ఆర్జె సునీత, రేడియో సిటీచదవండి: ప్రేమానుగ్రహం రాశిపెట్టుందా?క్రమశిక్షణ నేర్పించిందిచిన్నప్పుడు రేడియో వింటూ మా అమ్మను ‘ఆ రేడియోలోకి ఎలా వెళ్లాలమ్మా!’ అని అడిగేదాన్ని. కానీ, నిజంగానే రేడియో స్టేషన్కి వెళ్లడం, అక్కడ నుంచి నా వాయిస్ను శ్రోతలకు వినిపించేలా మార్చుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ అవకాశాలు రావు. వచ్చినప్పుడు మాత్రం నిలబెట్టుకోవడానికి చాలా కృషి చేయాలి. రేడియో స్టేషన్లో అడుగుపెడుతూనే బయట ప్రపంచాన్ని మరచిపోతాను. అంతగా నన్ను ఆకట్టుకుంది రేడియో. ఎఐఆర్ పరి«ధులను దాటకుండా మేం పనిచేయాల్సి ఉంటుంది. కరోనా టైమ్లో అయితే ఎక్కువ షోస్ చేసేవాళ్లం. ప్రజలను చైతన్యవంతం చేయడానికి, భరోసా ఇవ్వడానికి భయాలను పక్కనపెట్టేశాం. ప్రముఖులను ఇంటర్వ్యూ చేయడం, మల్టీటాలెంట్ ఉన్నవారితో పరిచయాలు ఏర్పడటం.. ఇలాంటివెన్నో రేడియో ద్వారానే సాధ్యమయ్యాయి. కాన్సెప్ట్ రాసుకోవడం, తడబాటు లేకుండా మాట్లాడటం, టైమ్ ప్రకారం షోలో పాల్గొనడం.. ఒక క్రమశిక్షణను నేర్పించింది రేడియో. – ఆర్జె లక్ష్మీ పెండ్యాల, ఆల్ ఇండియా రేడియో -
పట్టు చీరల వనం.. ధర్మవరం
సాక్షి, పుట్టపర్తి : మగువలు మెచ్చే పట్టు చీరలు.. వివాహం కోసం ప్రత్యేకంగా చీరలు, ఫంక్షన్లలో స్పెషల్ లుక్కుతో ఆకట్టుకునే డిజైన్లు తయారీలో ధర్మవరం నేతన్నలు ఆరితేరిపోయారు. తరతరాలుగా మగ్గాల పైనే తమ నైపుణ్యాన్ని రంగరించి రకరకాల పట్టుచీరలు తయారు చేస్తున్నారు. సింగిల్ త్రెడ్, డబుల్ త్రెడ్, వెండి జరీ, బంగారు జరీ చీరలు, జాకాడీ డిజైన్లతో అత్యద్భుతంగా నేసి వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. ధర్మవరంలో తయారయ్యే పట్టుచీరలు హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నైతో పాటు విదేశాలకు సైతం ఎగుమతి అవుతున్నాయి. రాష్ట్రంలో 28 వేల మగ్గాలు ఉన్న ఏకైక ప్రాంతంగా ధర్మవరం పట్టణం ప్రథమ స్థానంలో నిలుస్తోంది. ఇక్కడి పట్టు మార్కెట్లో సగటున వారానికి రూ.100 కోట్ల వరకు పట్టుచీరల వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. ధర్మవరం పట్టణ విశిష్టతను గుర్తించి భారత ప్రభుత్వం ధర్మవరం పట్టుచీరకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్)ను ఇవ్వడం నేతన్నల ప్రతిభకు గర్వ కారణంగా చెప్పవచ్చు. శ్రీసత్యసాయి జిల్లాలో ధర్మవరంతో పాటు కొత్తచెరువు, గోరంట్ల, బుక్కపట్నం, సోమందేపల్లి, పెనుకొండ, హిందూపురం ప్రాంతాల్లోనూ మగ్గాలు ఉన్నాయి. ధర్మవరంలో మగ్గాలతో పాటు 18 చేనేత అనుబంధ రంగాల ద్వారా సుమారు లక్ష మంది ఉపాధి పొందుతున్నారు. ఫ్యాషన్ ప్రపంచానికి దీటుగా డిజైన్లు మారుతున్న ఫ్యాషన్ ప్రపంచానికి దీటుగా ధర్మవరంలోని డిజైనర్లు ఎప్పటికప్పుడు కొత్తరకాల డిజైన్లు రూపొందిస్తున్నారు. ధర్మవరంలో పట్టుచీరల డిజైన్లు రూపొందించడంలో సుమారు వందమంది మంచి నైపుణ్యం సంపాదించారు. వివాహాలు, ఇతర శుభకార్యాల దగ్గర నుంచి సినీ మోడళ్లు, సెలబ్రిటీల వరకు వినూత్న డిజైన్లను తయారు చేస్తున్నారు. ఒక్కో పట్టు చీర రూ.5 వేల నుంచి రూ.10 లక్షల వరకు ధర ఉంటుంది. బంగారం తాపడంతో పట్టుచీరలు తయారు చేయడం ధర్మవరం నేతన్నల ప్రత్యేకం. విదేశాలకు ఎగుమతులు ధర్మవరంలో తయారైన పట్టుచీరలు ఇతర రాష్ట్రాలతో పాటు అమెరికా, సౌదీ అరేబియా, న్యూజిలాండ్ తదితర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. రాష్ట్రంలో తయారైన పట్టుచీరలకు ధర్మవరం పట్టుమార్కెట్ ప్రధానం. ధర్మవరం పట్టణంలో సుమారు రెండు వేల పట్టుచీరల దుకాణాలు ఉన్నాయి. ఈ సిల్క్ షాపుల ద్వారా నేతన్నల వద్ద పట్టుచీరలను కొనుగోలు చేసి, ఆపై షోరూంలకు హోల్సేల్గా ఎగుమతి చేస్తారు. వారానికి రూ.వంద కోట్ల వ్యాపారం సగటున ధర్మవరం నేసేపేటలోని మార్కెట్లో వారానికి రూ.100కోట్ల వరకు వ్యాపార లావాదేవీలు జరుగుతాయని అంచనా. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ధర్మవరం పట్టణాన్ని, చేనేత రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని నేతన్నలు కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆదరణ కరువైందని.. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఏటా నేతన్న నేస్తం పథకం కింద ఏటా రూ.24వేల లబ్ధి చేకూరేదని వివరించారు. ధర్మవరం పట్టుచీరకు భౌగోళిక గుర్తింపు ధర్మవరం నేతన్న ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం గత 2014లో ధర్మవరం పట్టుచీరలు, పావుడాలకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ఇచి్చంది. దీని ద్వారా ధర్మవరం పట్టుచీర డిజైన్లు ఎక్కడా తయారు చేయకూడదు. ఒక వేళ ఇతరప్రాంతాల్లో ధర్మవరం నేతన్నల డిజైన్లు నేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.విమానాశ్రయం వస్తే బాగుంటుంది శ్రీసత్యసాయి జిల్లా ఏర్పాటు తర్వాత ధర్మవరంలో చేనేత రంగం మరింత వృద్ధి చెందింది. అయితే పుట్టపర్తిలో విమానాశ్రయం ఆధునీకరించి.. ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తే.. వివిధ దేశాలకు పట్టుచీరల ఎగుమతులు సులభమవుతాయి. మన దేశ పట్టును ప్రపంచ స్థాయికి తీసుకెళ్లవచ్చు. ఫలితంగా వ్యాపారం మరింత ఊపందుకుంటుంది. – రంగన శ్రీనివాసులు, పట్టుచీరల వ్యాపారి, ధర్మవరం ఆధునిక ఫ్యాషన్కు అనుగుణంగా డిజైన్లు ప్రస్తుత ఫ్యాషన్ పోటీ ప్రపంచంలో మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త డిజైన్లు ఎప్పటికప్పుడు రూపొందిస్తున్నాం. మేము తయారు చేసే చీరలు దేశంలోని ఇతర రాష్ట్రాలకే కాక, ఎక్కువగా అమెరికా, సౌదీ దేశాలకు పంపుతుంటాం. పట్టుచీరల్లో నేను తయారు చేసిన డిజైన్లకు రాష్ట్ర స్థాయిలో రెండు, జాతీయ స్థాయిలో ఒక అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. – నాగరాజు, క్లస్టర్ డిజైనర్, ధర్మవరంగణాంకాలు ఇలా... చేతి మగ్గాలు : 28 వేలు పట్టుచీరల దుకాణాలు : 2వేలు మగ్గాలపై ఆధారపడ్డ కుటుంబాలు : 30 వేలు మగ్గాల ద్వారా లబ్ధి పొందుతున్న వారు : లక్ష మంది అనుబంధ రంగాల ద్వారా : మరో 20 వేల మందికి ఉపాధి రోజుకు పట్టుమార్కెట్ సగటు టర్నోవర్ : రూ.7 కోట్లు శుభకార్యాల సీజన్లో వారంలో పట్టుచీరల లావాదేవీలు : రూ.100 కోట్లు -
టెక్నాలజీ ఊబిలో భారతీయులు
భారతీయులు ఉదయం లేచించి మొదలు రాత్రి పడుకునేదాకా ఎల్రక్టానిక్ డివైజ్లతో గడుపుతున్నారు. డెస్క్ టాప్తో మమేకమవుతారు. డెస్క్ టాప్ నుంచి తల పక్కకు తిప్పితే నేరుగా ల్యాప్టాప్లో తలదూర్చేస్తారు. ఒకవేళ ల్యాప్టాప్ పక్కనబెడితే స్మార్ట్ఫోన్ లేదంటే ట్యాబ్ లేదంటే ఇంకో డివైజ్కు దాసోహం అవుతున్నారు. దీంతో ఎన్నో సమస్యలు. తక్కువ నిజాలు, ఎక్కువ అబద్ధాలతో కూడిన సమాచారాన్ని మాత్రమే నమ్మడం, సోషల్మీడియా లో ప్రతికూల వార్తలనే ఎక్కువగా ఫాలో అవడం, ఫోన్ రింగ్ కాకపోయినా వచ్చినట్లు, మెసేజ్ రాకపోయినా వచ్చినట్లు భావించడం, అతి డివైజ్ల వాడకంతో సాధారణ విషయగ్రహణ సామర్థ్యం సన్నగిల్లడం, ఒంటరిగా ఉంటేనే బాగుందని అనిపించడం, వెంటనే స్పందించే గుణం కోల్పోవడం, అతి ఉద్రేకం లేదంటే నిస్సత్తువ ఆవహించడం, ఏకాగ్రత లోపం.. ఇలా ఎన్నో సమస్యలకు ఎల్రక్టానిక్ డివైజ్లు హేతువులుగా మారాయి. వాటి అదుపాజ్ఞల్లోకి వెళ్లకుండా వాటినే తమ అదుపాజ్ఞల్లో పెట్టుకున్న భారతీయులు కేవలం మూడు శాతమేనని తాజా సర్వే కుండబద్దలు కొట్టింది. దాదాపు 83,000 కౌన్సిలింగ్ సెషన్లు, 12,000 స్క్రీనింగ్లు, 42,0000 అంచనాలను పరిశీలించి చేసిన సర్వేలో ఇలాంటి ఎన్నో విస్మయకర అంశాలు వెలుగుచూశాయి. డిజిటల్ డివైజ్లతో సహవాసం చేస్తూ భారతీయులు ఏపాటి మానసిక ఆరోగ్యంతో ఉన్నారనే అంశాలతో వన్టూవన్హెల్ప్ అనే సంస్థ ‘ది స్టేట్ ఆఫ్ ఎమోషనల్ వెల్బీయింగ్,2024’అనే సర్వే చేసి సంబంధిత నివేదికను వెల్లడించింది. సగం మంది డివైజ్లను వదల్లేక పోతున్నారు సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది తమ ఎల్రక్టానిక్ డివైజ్లను వదిలి ఉండలేకపోతున్నారు. మరో పది శాతం మందికి డిజిటల్ జీవితాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలో తెలీక సతమతమవుతున్నారు. మానసిక ఆరోగ్యానికి సంబంధించి కౌన్సిలింగ్ తీసుకుంటున్న వారి సంఖ్య 15 శాతం పెరిగింది. ఆదుర్తా, కుంగుబాటు, పనిచేసే చోట ఒత్తిడి వంటి ప్రధాన కారణాలతో ప్రజలు మానసిక ఆరోగ్యం బాగు కోసం నిపుణులను సంప్రతించడం పెరిగింది. వృత్తిసంబంధ అంశాల్లో సమస్యలను ఎదుర్కొంటున్న వారిలో 23 శాతం మంది తాము పనిచేసేచోట ప్రతికూల వాతావరణంలో పనిచేస్తున్నట్లు తేలింది. ఇది ఆరోగ్యవంతమైన పని వాతావరణం ఆవశ్యకతను గుర్తుచేస్తోంది. కౌన్సిలింగ్ కోసం పురుషుల్లో పెరిగిన ఆసక్తి గతంలో ఏదైనా థెరపీ చేయించుకోవాలన్నా, మానసికంగా ఒక సాంత్వన కావాలంటే ఒకరి తోడు అవసరమని మహిళలు భావిస్తుంటారు. మగాడై ఉండి థెరపీ చేయించుకోవడమేంటనే ఆలోచనాధోరణి ఇన్నాళ్లూ పురుషుల్లో ఉండేది. ఇప్పుడు ఆ ధోరణిలో కాస్తంత మార్పు వచ్చింది. గతంతో పోలిస్తే 7 శాతం మంది ఎక్కువగా పురుషులు థెరపీలు సిద్ధపడుతున్నారు. ఆర్థికసంబంధ కన్సల్టేషన్లు పొందిన వారిలో 70 శాతం మంది పురుషులే ఉన్నాయి. ఇక మానవీయ సంబంధాలకు సంబంధించిన కౌన్సిలింగ్ సెషన్లలో 60 శాతం దాకా మహిళలే కనిపించారు. యువతలో పెరిగిన మానసిక సమస్యలు ఉత్సాహంతో ఉరకలెత్తాల్సిన యువతలో నైరాశ్యం పెరుగుతోంది. 30 ఏళ్లలోపు వయసు యువతలో అత్యధికంగా ఆదుర్దా, కుంగుబాటు సమస్యలు ఎక్కువయ్యాయి. ఉద్యోగం మారాల్సి రావడం, జీవితభాగస్వామితో సత్సంబంధం కొనసాగించడం వంటి అంశాలకొచ్చేసరికి యువత ఆత్రుత, కుంగుబాటుకు గురవుతోంది. పాతికేళ్లలోపు యువతలో 92 శాతం మందిలో ఆత్రుత, 91% మందిలో కుంగుబాటు కనిపిస్తున్నాయి. ఆత్మహత్య భయాలూ ఎక్కువే ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తున్న వారి సంఖ్య గతంతో పోలిస్తే 22 శాతం పెరిగింది. తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని చెప్పిన వాళ్ల సంఖ్య 2023తో పోలిస్తే 17 శాతం పెరగడం ఆందోళనకరం. తమకు కౌన్సిలింగ్ అవసరమని భావిస్తున్న వారిలో సగం మంది ఇప్పటికే తీవ్రమైన భావోద్వేగ సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో ఎక్కువ మందికి తక్షణం మానసిక సంబంధ తోడ్పాటు అవసరమని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే భారతీయుల్లో మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన బాగా పెరిగింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రాష్ట్రపతి భవన్కు పెళ్లి కళ
సాక్షి, న్యూఢిల్లీ: చరిత్రలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్రపతి భవన్లో పెళ్లి వేడుక జరగనుంది. ఈ నెల 12న జరిగే ఈ వేడుక కోసం యంత్రాంగం రాష్ట్రపతి భవన్ను ముస్తాబు చేసింది. భారీగా భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఇంతకీ పెళ్లెవరిది? అని కదా మీ సందేహం! రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కుటుంబసభ్యులదీ, సంబంధీకులదీ మాత్రం కాదు! రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వ్యక్తిగత భద్రతా అధికారి(పీఎస్వో) పూనమ్ గుప్తా పెళ్లి. పూనమ్ వినతి మేరకు ఈ వేడుకకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అనుమతినిచ్చారు. జమ్మూకశ్మీర్కు చెందిన సీఆర్పీఎప్ అసిస్టెంట్ కమాండెంట్ అవ్నీశ్ కుమార్, పూనమ్ గుప్తా ఓ ఇంటి వారు కానున్నారు. రాష్ట్రపతి ముర్ము సారథ్యంలో అంగరంగ వైభవంగా జరిగే ఈ కార్యక్రమానికి హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ తదితర ప్రముఖులు హాజరుకానున్నారు. జీవితాంతం గుర్తుండిపోయే కానుక మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చెందిన పూనమ్గుప్తా 2018 యూపీఎస్సీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్(సీఆర్ఎఫ్) విభాగంలో 81వ ర్యాంకు సాధించారు. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్గా బిహార్లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో పని చేశారు. ఆ తర్వాత ఆమె రాష్ట్రపతి పీఎస్ఓగా నియమితులయ్యారు. జమ్మూకశ్మీర్లో సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్గా ఉన్న అవ్నీశ్ కుమార్తో ఈమె వివాహం నిశ్చయమైంది. కుటుంబ సభ్యులు మధ్యప్రదేశ్ లేదా కశ్మీర్లో వివాహం చేయాలని యోచిస్తుండగా కాబోయే వధువు పూనమ్ మాత్రం సరికొత్తగా ఆలోచించారు. ‘మీకు పీఎస్ఓగా పనిచేయడం నాకెంతో ఆనందంగా ఉంది. దీనిని నేను ఒక బాధ్యతగా స్వీకరిస్తున్నాను. నాకు వివాహం నిశ్చయమైంది. రాష్ట్రపతి భవన్లో పెళ్లి చేసుకోవాలనేది నా చిరకాల కోరిక. నా కోరికను మీరు తీరుస్తారని ప్రారి్థస్తున్నాను’అంటూ రెండు నెలల క్రితం రాష్ట్రపతికి లేఖ రాశారు. ఈ లేఖపై రాష్ట్రపతి ముర్ము సానుకూలంగా స్పందించారు. ‘డియర్, పూనమ్ గుప్తా(పీఎస్వో) మీకు వివాహ శుభాకాంక్షలు. విధుల్లో మీరు కనబరుస్తున్న శ్రద్ద, బాధ్యత నాకెంతో నచ్చాయి. మీ వివాహ వేడుకను రాష్ట్రపతి భవన్లో జరిపేందుకు అనుమతి ఇస్తున్నాను’అంటూ బదులిచ్చారు. దీంతో పూనమ్గుప్తాకు రాష్ట్రపతి జీవితాంతం గుర్తుండిపోయే కానుకను ఇచ్చారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ముస్తాబవుతున్న రాష్ట్రపతి కార్యాలయం పూనమ్ అవ్నీశ్ల పెళ్లి వేడుకకు రాష్ట్రపతి కార్యాలయంలోని మదర్ థెరిస్సా క్రౌన్కాంప్లెక్స్ సిద్దమైంది. భారతీయ, సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా వేదికను అలంకరించారు. వేడుక అతి కొద్ది మంది సమక్షంలో జరగనుంది. వధూవరుల కుటుంబ సభ్యులు వంద మంది, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, సీఆర్పీఎఫ్ డీజీ, ఢిల్లీ పోలీస్ ఉన్నత అధికారులు హాజరు కానున్నట్లు తెలిసింది. చారిత్రక కట్టడం రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రాష్ట్రపతి భవన్ చరిత్రల సమ్మేళనంతో కూడిన ఓ కళాఖండమే. మొత్తం నాలుగు అంతస్తుల్లో 340 గదులు ఉంటాయి. గదులు, కారిడార్లు, కోర్టులు, గ్యాలరీలు, సెలూన్లు, వంటశాలలు, ప్రింటింగ్ ప్రెస్, థియేటర్లు... ఇలా వీటన్నింటినీ కాలినడకన తిరుగుతూ చూడాలంటే కనీసం మూడు గంటల సమయం పడుతుంది. ఇటలీలోని క్విరినల్ ప్యాలస్ తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశాధినేత భవనంగా రాష్ట్రపతి భవనం నిలుస్తుంది. ప్రఖాత్య అమృత ఉద్యాన్, ఒక మ్యూజియం, గణతంత్ర, అశోక మండపాలు, రాగి ముఖం గల గోపురాలు ఉన్నాయి. ఈ భవన్లో మొట్టమొదటిగా 1948లో స్వతంత్ర భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్ సి.రాజగోపాలాచారి నివసించారు. రాష్ట్రపతి భవన్లో నివసించిన మొదటి భారతీయుడిగా చరిత్రలో నిలిచారు. -
అసమానతల అంతు చూస్తారా?
విశ్వంలో ఇప్పటికీ ఎన్నో రహస్యాలు. శతాబ్దాల కాలంలో భిన్న దేశాల విభిన్న రంగాల దిగ్గజ శాస్త్రవేత్తలు ఇప్పటికి ఎన్నో సిద్ధాంతాలను రూపొందించారు. న్యూటన్ సిద్ధాంతాలు, ఐన్స్టీన్ సిద్ధాంతాలు ఇలా భౌతిక, రసాయన శా్రస్తాలు, గతిశక్తి, స్థితిశక్తి ఇలా ఎన్నో రకాల అంశాలకు సంబంధించి ఎన్నో పరిశోధనలు నేటి ఆధునిక ప్రపంచ అవసరాలను తీరుస్తున్నాయి. అయితే ఇప్పటికీ భౌతిక, రసాయన, ఇంజనీరింగ్ శాస్త్రవేత్తలకు కొరుకుడుపడని టర్బులెన్స్ దృగ్విషయం అన్ని రంగాలకు పెద్ద సమస్యగా మారింది. ద్రవ ప్రవాహాల్లో హఠాత్తుగా సంభవించే అసాధారణ హెచ్చుతగ్గులు, సముద్రజలాల కదలికల్లో అనూహ్య మార్పులు, రసాయనాల్లో ఊహించని ప్రతిచర్యలు, రక్తప్రవాహాల్లో హెచ్చుతగ్గులు వంటివి ఎందుకు సంభవిస్తాయో ఇప్పటికీ ఎవరికీ తెలీదు. టర్బులెన్స్ సమస్య చాలా రంగాలకు పెద్ద గుదిబండగా తయారైంది. గాల్లో ఎగిరే విమానాలు ఒక్కసారిగా టర్బులెన్స్కు గురై హఠాత్తుగా కిందకు పడిపోవడమో ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పడమో జరుగుతున్నాయి. వెదర్ శాటిలైట్లతో ఖచ్చితత్వంతో వాతావరణ పరిస్థితులపై ప్రభుత్వాలను వాతావరణ కేంద్రాలు హెచ్చరిస్తున్నా ఇప్పటికీ కొన్ని చోట్ల ఊహంచని తుపాన్లు అప్పటికప్పుడు ఏర్పడి భారీ ఆస్తి, ప్రాణ నష్టానికి కారణమవుతున్నాయి. సువిశాల విశ్వంలో నక్షత్రాల్లోని అయనీకరణ చెందిన అత్యంత వేడి వాయువుల్లో హఠాత్తుగా ఎందుకు మార్పులు జరుగుతున్నాయో ఖగోళ శాస్త్రవేత్తలు కూడా చెప్పలేకపోతున్నారు. మానవ కణంలో అణువుల మధ్య బంధంలోనూ హఠాత్తుగా మార్పులను చూస్తున్నాం. చివరకు కృత్రిమ గుండె పనితీరును రక్తప్రవాహంలోని టర్బులెన్స్ ప్రభావితం చేస్తూ అత్యంత సమర్థవంతమైన ఆర్టిఫీషియల్ హార్ట్ ఆవిష్కరణ అవసరమని గుర్తుచేస్తోంది. ఇలాంటి దృగ్విషయాలకు ఏకైక కారణమైన టర్బులెన్స్పై మరింత అవగాహనే లక్ష్యంగా శాస్త్రవేత్తలు నడుం బిగించారు. ఈ టర్బులెన్స్పై స్పష్టమైన అవగాహన ఉంటే సైన్స్, ఇంజనీరింగ్ పరిశ్రమల్లో మరింత మెరుగైన డిజైన్తో విమానాలు, కార్లు, ప్రొపెలర్లు, కృత్రిమ గుండెలు తయారుచేయడానికి, అత్యంత ఖచ్చితత్వంతో వర్షాలు, వాతావరణం, పర్యావరణ సంబంధ హెచ్చరికలు చేయడానికి వీలు చిక్కుతుంది. వేగంగా చర్యలు జరిపి.. ప్రపంచంలో ఎక్కడ ఏ ద్రవాల్లో ఈ టర్బులెన్స్ తలెత్తుతుందో తెల్సుకోవాలంటే ఆ ద్రవాల పనితీరు, కదలికలపై నిరంతర నిఘా అవసరం. వాటి చర్యను వేగవంతం చేస్తేనే టర్బులెన్స్ ఎప్పుడెప్పుడు వస్తుందో గుర్తించగలం. అందుకోసం ద్రవాల్లో రెండు సార్లు టర్బులెన్స్ సంభవిస్తే ఈ రెండు టర్బులెన్స్ మధ్య కాలంలో జరిగే మార్పులను అత్యంత ఖచ్చితత్వంతో రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఇంతకాలం సంప్రదాయక పద్ధతిలో మాత్రమే డేటాను రికార్డ్చేసేవాళ్లు. ఇకపై తొలిసారిగా అత్యంత అధునాతన క్వాంటమ్ కంప్యూటర్స్ విధానంలో అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్లలో ఈ డేటాను నమోదుచేసి విశ్లేషించనున్నారు. దీంతో సెకన్ కంటే కొన్ని కోట్ల రెట్లు తక్కువ కాలంలోనూ జరిగే మార్పులను నమోదు చేసి విశ్లేషించడం సాధ్యమవుతుంది. సంబంధిత పరిశోధన వివరాలు జనవరి 29వ తేదీన ప్రఖ్యాత సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్, ఫిజికల్ రివ్యూ రీసెర్చ్ జర్నల్లలో ప్రచురితమయ్యాయి. ‘‘సంప్రదాయక విధానాల్లో ప్రయోగాలు చేస్తే ఎప్పుడూ ఒక్కటే ఫలితం వస్తోంది. ఈసారి సంభావ్యత సిద్ధాంతాన్ని ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అల్గారిథమ్ను వాడి మరింత మెరుగైన ఫలితాలను రాబట్టేందుకు ప్రయతి్నస్తున్నాం. రెండు విభిన్న రసాయన మిశ్రమాలను సిములేట్ చేసి వాటిల్లో సంభవించే టర్బులెన్స్లను నమోదుచేయదలిచాం. సాధారణ కంప్యూటర్స్లో 0, 1 అనే బిట్స్ మాత్రమే వాడతారు. క్వాంటమ్ కంప్యూటింగ్లో క్వాంటమ్ బిట్(క్వాబిట్స్) వాడతాం. దీంతో ఒకేసారి ఒకేసమయంలో వేర్వేరు చోట్ల జరిగే మార్పులను క్వాబిట్స్ నమోదుచేస్తాయి’’అని ఆక్స్ఫర్ట్ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్రవేత్త నిక్ గోరియనోవ్ చెప్పారు. కొత్త విధానంతో కంప్యూటేషన్ అత్యంత వేగవంతంగా జరుగుతుంది. ఇది మా పరిశోధనకు ఎంతో దోహదపడుతుంది’’అని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో పోస్ట్ డాక్టోరల్ పరిశోధకుడు జేమ్స్ బీటెల్ చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సంపూర్ణ సేంద్రియ గ్రామాలు!
ఛత్తీస్ఘడ్లోని దంతెవాడ జిల్లాలో 110 గిరిజన గ్రామాలు పిజిఎస్ సేంద్రియ సర్టిఫికేషన్ పొందాయి. సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సుస్థిర వ్యవసాయ కేంద్రాని(సిఎస్ఎ)కి చెందిన రీజినల్ కౌన్సెల్ ఈ సర్టిఫికేషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇటీవల సిఎస్ఎకు ప్రతిష్టాత్మక ‘జైవిక్ ఇండియా’ పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా సిఎస్ఎ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. జీ వీ రామాంజనేయులుతో ‘సాక్షి సాగుబడి’ ముచ్చటించింది. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందుల వాడకం పూర్తిగా మానుకొని ప్రకృతి /సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ ఆరోగ్యదాయకంగా ఆహారోత్పత్తి చేసే రైతులకు ప్రత్యేక గుర్తింపునిచ్చేదే సేంద్రియ సర్టిఫికేషన్. ఈ సర్టిఫికేషన్ ద్వారా మెరుగైన ధరకు పంట దిగుబడులను అమ్ముకునే అవకాశం కలుగుతుంది. రైతు వ్యక్తిగతంగా సర్టిఫికెట్ పొందొచ్చు. నలుగురితో కలసి సహకార సంఘంగా లేదా రైతు ఉత్పత్తిదారుల సంఘంగా ఏర్పడి సమష్టిగా సేంద్రియ సర్టిఫికేషన్ పొందవచ్చు. ఒంటరిగా సర్టిఫికేషన్ పొందే కంటే సంఘంగా పొందటం సులభం. ఇంకా చెప్పాలంటే, గ్రామంలో రైతులందరూ కలసి సేంద్రియ / ప్రకృతి వ్యవసాయం దిశగా నడిస్తే పరివర్తన దశలో ఎదురయ్యే సమస్యలను సులువుగా ఎదుర్కోవచ్చు. అంతేకాదు, మార్కెటింగ్కు అవసరమైన సేంద్రియ సర్టిఫికేషన్ను ఒక గ్రామంలో రైతులంతా కలసి ఊరుమ్మడిగా అయితే తొందరగానే పొందవచ్చు. విడిగా అయితే మూడేళ్ల ప్రక్రియ. ఊళ్లో రైతులంతా కలిస్తే ఆర్నెల్లు చాలు. దీన్నే ‘లార్జ్ ఏరియా సర్టిఫికేషన్’ అని పిలుస్తున్నారు. ఈ విషయంలో ఛత్తీస్ఘడ్ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉంది. ఛత్తీస్ఘడ్లోని దంతెవాడ జిల్లాలో గత ఐదేళ్లుగా రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం ఐదేళ్ల క్రితమే మానేసిన 110 గ్రామాలు సేంద్రియ సర్టిఫికేషన్ గుర్తింపు పొందాయి. ఈ గ్రామాల్లోని మొత్తం 10,264 మంది రైతులు 65,279 హెక్టార్లలో సేంద్రియ పంటలు పండిస్తున్నారు. సుస్థిర వ్యవసాయ కేంద్రం (సిఎస్ఎ) రీజినల్ కౌన్సెల్ ఈ సర్టిఫికేషన్ ఇచ్చింది. చదవండి: Safer Internet Day 2025 భద్రత... బాధ్యత... గౌరవం!మరో 121 గ్రామాలకు సర్టిఫికేషన్ప్రాసెస్ వివిధ దశల్లో ఉందని సిఎస్ఎ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. రామాంజనేయులు తెలిపారు. శిక్షణ, తనిఖీలకు హెక్టారుకు రూ. 700ల చొప్పున పిజిఎస్ సర్టిఫికేషన్కు ఖర్చవుతుందన్నారు. గ్రామం మొత్తం సేంద్రియ సర్టిఫికేషన్ పొందటం అంత సులువేమీ కాదు. దశలవారీ పరీక్షల్లో రసాయనిక అవశేషాలు లేవని తేలితేనే సర్టిఫికేషన్ ఇస్తారు. లార్జ్ ఏరియా సర్టిఫికేషన్ రావాలంటే మొదట రైతులు గత ఐదేళ్లుగా పూర్తిగా సేంద్రియంగానే పంటలు పండిస్తున్నామని ప్రతిజ్ఞ చేయాలి. సర్పంచ్ కూడా బాధ్యత తీసుకొని డిక్లరేషన్ ఇవ్వాలి. ఆ వూళ్లో రసాయనిక ఎరువులు, పురుగు/కలుపు మందులు అమ్మే దుకాణం లేదని జిల్లా వ్యవసాయ అధికారి సర్టిఫై చెయ్యాలి. ఇవన్నీ అయ్యాక రీజినల్ కౌన్సెల్ పరీక్షలు చేసి సర్టిఫై చేస్తుంది.ప్రతిష్టాత్మక జైవిక్ ఇండియా పురస్కారంసుస్థిర వ్యవసాయ కేంద్రాని(సిఎస్ఎ)కి ఇటీవల ప్రతిష్టాత్మక జైవిక్ ఇండియా రీజినల్ కౌన్సెల్ పురస్కారం లభించింది. ఇంటర్నేషనల్ కాంపిటెన్స్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అగ్రికల్చర్ (ఐసీసీఓఏ) గత ఐదేళ్లుగా ‘జైవిక్ ఇండియా’ పురస్కారాలను సేంద్రియ రైతులతో పాటు సర్టిఫికేషన్ సేవలందిస్తున్న రీజినల్ కౌన్సెళ్లకు కూడా ఏటేటా పురస్కారాలను ప్రదానం చేస్తోంది. బెంగళూరులో ఇటీవల జరిగిన అంతర్జాతీయ సేంద్రియ, చిరుధాన్యాల ప్రదర్శనలో జాతీయ స్థాయిలో ఉత్తమ రీజినల్ కౌన్సెల్గా సిఎస్ఎ ఎంపికైంది. సిఎస్ఎ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. జీవీ రామాంజనేయులు, సిఎస్ఎ ప్రోగ్రామ్ డైరెక్టర్ (సర్టిఫికేషన్) చంద్రకళ సంయుక్తంగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.క్లైమెట్ ఛేంజ్ నేపథ్యంలో సుస్థిర సేద్యం అనివార్యంఛత్తీస్ఘడ్ దంతెవాడ జిల్లాలో ఐదేళ్లుగా రసాయనాల జోలికి పోని 110 గ్రామాల్లో రైతులందరికీ పిజిఎస్ సేంద్రియ సర్టిఫికేషన్ ఇచ్చాం. వారు ఎక్కువగా వరి ధాన్యమే పండిస్తున్నారు. ప్రభుత్వం రూ. 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేసి, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తోంది. దేశవ్యాప్తంగా వ్యవసాయంలో రసాయనాల వాడకం విపరీతం కావటం.. భూసారం క్షీణిస్తుండటం, నీటి వనరుల లభ్యత తగ్గిపోవటం, పెచ్చుమీరిన పర్యావరణ సమస్యలు వ్యవసాయాన్ని మరింత జఠిలంగా మార్చాయి. క్లైమెట్ ఛేంజ్ నేపథ్యంలో సుస్థిర సేద్యం వైపు మారాల్సిన అనివార్యతను ఇప్పుడు అందరూ గుర్తిస్తున్నారు. అది ఏ పద్ధతిలో అన్నదే ఇప్పుడు జరుగుతున్న చర్చంతా. ఆంధ్రప్రదేశ్లో డా. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం(2007–08) నుంచే వ్యవసాయ రసాయనాల వాడకం తగ్గుతుండగా, గత పదేళ్లలో తెలంగాణలో 5 రెట్లు పెరిగింది. లక్ష ఎకరాల్లో సేంద్రియ సేద్యం చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదించాం. – డా. జీవీ రామాంజనేయులుఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సుస్థిర వ్యవసాయ కేంద్రం, సికింద్రాబాద్https://csa-india.org/ https://krishnasudhaacademy.org 20 ఏళ్ల క్రితం ఐఆర్ఎస్ వద్దనుకొని.. వ్యవసాయ శాస్త్రంలో పిహెచ్డి పూర్తిచేసిన డా. రామాంజనేయులు ఐసిఎఆర్లోని అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీస్ (ఎఆర్ఎస్)లో 8 ఏళ్లు సీనియర్ శాస్త్రవేత్తగా పని చేశారు. ఆ తర్వాత ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్)కు ఎంపికయ్యారు. శిక్షణా కాలంలోనే ఆ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి సేంద్రియ/ ప్రకృతి వ్యవసాయ వ్యాప్తి కోసం సుస్థిర వ్యవసాయ కేంద్రం అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. ఈ దిశగా గత 20 ఏళ్లుగా విశేష కృషి చేస్తున్నారు. సేంద్రియ పద్ధతులపై పరిశోధన చేస్తూ శిక్షణ ఇచ్చే కృష్ణసుధ అకాడమీ ఫర్ ఆగ్రోఎకాలజీ (కొండపర్వ)ని స్థాపించటంలో కూడా ఆయన కీలకపాత్ర పోషించారు. ‘ఏపీ, తెలంగాణలో 66 సహకార సంఘాలు, ఎఫ్పిఓలకు చెందిన 50 వేల మంది రైతులను సేంద్రియ సాగు వైపు మళ్లించే కృషి చేస్తున్నాం. ఇప్పటికే 30 వేల మందికి సేంద్రియ సర్టిఫికేషన్ ఇచ్చాం. వారి నుంచి సేకరించిన ఉత్పత్తులను టీటీడీకి అందిస్తున్నామ’ని డా.రామాంజనేయులు తెలిపారు. ఇదీ చదవండి: బిలియనీర్తో పెళ్లి అని చెప్పి, రూ.14 కోట్లకు ముంచేసింది : చివరికి! సేంద్రియ సర్టిఫికేషన్ ఎవరిస్తారు?సేంద్రియ / ప్రకృతి వ్యవసాయం చేపట్టిన రైతులకు, సహకార సంఘాలకు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు, గ్రామాలకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ గుర్తింపు పొందిన సంస్థలు సేంద్రియ సర్టిఫికేషన్ ఇస్తాయి. ఈ సంస్థలను రీజినల్ కౌన్సెళ్లు అంటారు. ఇలాంటి కౌన్సెళ్లు దేశంలో 76 ఉన్నాయి. రీజినల్ కౌన్సెల్ ఎన్ని రాష్ట్రాల్లో అయినా సర్టిఫికేషన్ సేవలు అందించవచ్చు. చురుగ్గా పనిచేస్తున్న రీజినల్ కౌన్సెళ్లలో సికింద్రాబాద్లోని సుస్థిర వ్యవసాయ కేంద్రం రీజినల్ కౌన్సెల్ ఒకటి. వ్యక్తిగతంగా ఒక రైతు గానీ, 10–15 మంది రైతుల బృందాలు / సహకార సంఘాలు / రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్పిఓల)కు పిజిఎస్ సేంద్రియ సర్టిఫికేషన్ ఇస్తారు. అందరి రైతులూ పరస్పరం బాధ్యత తీసుకోవాలి. బృందంలో ఒక్క రైతు దారితప్పినా గ్రూప్ మొత్తానికీ గుర్తింపు రద్దవుతుంది. పూర్తిగా గ్రామంలో రైతులందరికీ కలిపి కూడా సర్టిఫికేషన్ ఇస్తారు. దీన్నే లార్జ్ ఏరియా సర్టిఫికేషన్ అంటారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల మేరకు అనేక దఫాలు పరీక్షలు నిర్వహించిన తర్వాత సర్టిఫికేషన్ ఏ యేటికాయేడు ప్రదానం చేస్తారు.సర్టిఫికేషన్ రెండు రకాలుఆరోగ్యదాకమైన ఆహారోత్పత్తులను పండించే రైతులు / సంస్థలు తమ ఉత్పత్తులకు సేంద్రియ సర్టిఫికేషన్ పొందడానికి ప్రధానంగా రెండు సర్టిఫికేషన్లు ఉన్నాయి. మొదటిది.. పిజిఎస్, రెండోది.. ఎన్పిఓపి. ఎక్కడ అమ్మాలనుకునే దాన్ని బట్టి ఏ సర్టిఫికేషన్ అవసరమో చూసుకోవాలి. దేశంలోనే విక్రయించాలనుకుంటే పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టం (పిజిఎస్) ఇండియా సర్టిఫికేషన్ తీసుకుంటే సరిపోతుంది. కొందరు రైతులు బృందంగా ఏర్పడి, పరస్పర బాధ్యతతో తీసుకునే సర్టిఫికేషన్ ఇది. దీనికి అయ్యే ఖర్చు కొంచెం తక్కువ. విదేశాలకు ఎగుమతి చేయాలనుకుంటే నేషనల్ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ (ఎన్పిఓపి) థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ పొందాల్సి ఉంటుంది. వీటిల్లో ఏ సర్టిఫికేషన్ అయినా పూర్తిగా సేంద్రియ సర్టిఫికెట్ పొందటానికి మూడేళ్ల కాలం పడుతుంది. పరివర్తన దశలో తొలి రెండేళ్లకు ‘గ్రీన్’ సర్టిఫికేట్ ఇస్తారు. మూడో ఏడాది అన్ని పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చిన తర్వాత ‘ఆర్గానిక్’ సర్టిఫికేట్ ఇస్తారు. నిపుణులు, అధికారుల సమన్వయంతో రీజినల్ కౌన్సెళ్లే ఈ సర్టిఫికేషన్ సేవలు అందిస్తున్నాయి.నేరుగా అమ్మితే సర్టిఫికేషన్ అక్కర్లేదు!రసాయన రహితంగా వ్యవసాయం చేస్తూ, తాము పండించే ఉత్పత్తులను, ఎటువంటి బ్రాండ్ పేరు పెట్టకుండా, నేరుగా వినియోగదారులకు అమ్ముకునే సేంద్రియ రైతులు ఎటువంటి సేంద్రియ సర్టిఫికేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే, వారి వ్యాపారం ఏడాదికి రూ. 12 లక్షలు లోపు ఉండాలి. ఆ పరిమితి దాటితే సర్టిఫికేషన్ తీసుకోవాలి. అదేవిధంగా.. రైతు బృందాలు, కోఆపరేటివ్లు, ఎఫ్పిఓలు, వారి వద్ద నుంచి సేంద్రియ ఆహారోత్పత్తులను సేకరించే ప్రైమరీ అగ్రిగేటర్లు, స్టార్టప్లు కూడా వార్షిక వ్యాపారం రూ. 50 లక్షలకు లోపు ఉంటే సేంద్రియ సర్టిఫికేషన్ పొందాల్సిన అవసరం లేదు. ఈ వ్యవహారాలను ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఎఐ) అధికారులు పర్యవేక్షిస్తుంటారు. -
మన విద్యా రంగమే భేష్
‘మన విద్యా విధానం మరింత బలపడాలి. స్కూల్ స్థాయి నుంచే ఉన్నత అవకాశాలు కల్పించే విధంగా బోధన ఉండాలి. యువతకు కళాశాల స్థాయిలోనే విస్తృత బోధన సదుపాయాలు కల్పించాలి’ – మన విద్యా రంగంపై నిరంతరం వ్యక్తమవుతున్న అభిప్రాయం ఇది.అయితే దీనికి భిన్నంగా.. మన విద్యా వ్యవస్థ.. కెరీర్ అవకాశాల విషయంలో నేటి తరం యువత స్పందించడం గమనార్హం. ప్రపంచ దేశాలతో పోల్చితే మన దేశ విద్యా విధానమే బాగుంటుందనే ఆశాభావాన్ని యువత వ్యక్తం చేసింది. అదే విధంగా కెరీర్ అవకాశాల కోణంలోనూ భవిష్యత్.. బ్రహ్మాండంగానే ఉంటుందనే రీతిలో స్పందించింది.ఈ వివరాలు.. టోఫెల్, జీఆర్ఈ వంటి పరీక్షలు నిర్వహించే ప్రముఖ టెస్టింగ్ సంస్థ.. ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్)(ETS survey) నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యాయి. ఈ మేరకు మొత్తం 18 దేశాల్లో 18 వేల మంది యువత అభిప్రాయాల ఆధారంగా మానవాభివృద్ధి నివేదికను ఈటీఎస్ విడుదల చేసింది. ఇందులో పలు అంశాలను స్పృశించింది.మన విద్యా వ్యవస్థ బాగుంటుంది..మన దేశ విద్యా వ్యవస్థ బాగుంటుందని 70 శాతం యువత సర్వేలో ఆశాభావం వ్యక్తం చేసింది. అలాగే భవిష్యత్తులోనూ ప్రగతి ఉంటుందని 76 శాతం మంది పేర్కొన్నారు. ఇదే సమయంలో అంతర్జాతీయంగా మాత్రం 30 శాతం మంది మాత్రమే తమ విద్యా వ్యవస్థ బాగుంటుందని అభిప్రాయపడ్డారు. 64 శాతం మంది ప్రగతిశీలత ఉంటుందని చెప్పారు.నాణ్యతతో కూడిన విద్య కష్టమే..ఒకవైపు.. మన విద్యా వ్యవస్థ బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేసిన యువత.. నాణ్యమైన విద్యను అందుకోవడం మాత్రం కష్టంగా మారిందని అభిప్రాయం వ్యక్తం చేసింది. కొన్ని వర్గాల వారే ప్రయోజనం పొందేలా విద్యావకాశాలు ఉన్నాయని ఏకంగా 78 శాతం మంది పేర్కొన్నారు. అదే విధంగా ఉపాధ్యాయుల కొరత ఉందని 74 శాతం మంది స్పష్టం చేశారు. అలాగే అత్యున్నత నాణ్యమైన కోర్సులు, విద్యా సంస్థల విషయంలో ఇప్పటికీ కొరత ఉందన్నారు.ముందంజలో నిలిచే అవకాశం..ప్రస్తుత అవకాశాలతో కెరీర్లో ముందంజలో నిలవడానికి అవకాశం ఉంటుందని 69% మంది భారత యువత అభిప్రాయం వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా ఈ సంఖ్య 59% మాత్రమే కావడం గమనార్హం. అదే విధంగా 2035 నాటికి తమ రంగాల్లో అభివృద్ధి ఉంటుందని 72% మంది ఆశాభావం వ్యక్తం చేశారు.ఉద్యోగాల కొరత..ఉద్యోగాల కొరత ఉంటుందని 40 శాతం మంది భారతీయ యువత పేర్కొనగా.. అంతర్జాతీయంగా ఇది 34 శాతంగా నమోదైంది. అదే విధంగా చదువుకోవడం ఖరీదైన విషయంగా మారిందని 33 శాతం మంది వెల్లడించారు. నూతన నైపుణ్యాలవైపు పరుగులు..మన దేశ విద్యార్థులు, ఉద్యోగార్థులు నూతన నైపుణ్యాలు అందిపుచ్చుకోవడంలో పరుగులు పెడుతున్నారని ఈటీఎస్ సర్వే వెల్లడించింది. లైఫ్ లాంగ్ లెర్నింగ్ అనేది కెరీర్ సుస్థిరతకు తోడ్పడుతుందని 91 శాతం మంది పేర్కొనడం విశేషం. అదే విధంగా యూనివర్సిటీల డిగ్రీలకంటే ఆయా విభాగాల్లో క్రెడెన్షియల్స్, సర్టిఫికేషన్స్కు ఎంతో ప్రాధాన్యత ఉందని 88 శాతం మంది పేర్కొన్నారు.ఏఐ.. అవకాశాల వేదిక..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుందనే అభిప్రాయాలు వెల్లడవుతున్న పరిస్థితుల్లో.. తాజా సర్వేలో మాత్రం ఇందుకు భిన్నంగా యువత స్పందించింది. ఏఐని ముప్పుగా భావించట్లేదని, తమకు లభించిన అవకాశంగా భావిస్తున్నామని 88 శాతం మంది స్పష్టం చేయడం విశేషం. అదే విధంగా.. అంతర్జాతీయ స్థాయిలో ప్రతి పది మంది ఉద్యోగుల్లో నలుగురు.. ఏఐ లిటరసీ, మానవ సామర్థ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడంలో ఆసక్తి చూపుతున్నారు.లాభాపేక్ష లేని సంస్థలు కూడా..దేశంలో అత్యున్నత విద్యను అందించడంలో లాభాపేక్ష లేని సంస్థలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ సంస్థలకు మన దేశం అత్యంత అనుకూల దేశంగా ఉందని.. సర్వేలో పాల్గొన్న వారిలో 26 శాతం మంది తెలిపారు. అంతర్జాతీయంగా ఈ సంఖ్య 19 శాతంగానే ఉంది.ఆ 3 స్కిల్స్ ప్రధానంగా..జాబ్ మార్కెట్లో ముందంజలో నిలవడానికి ఏఐ/డిజిటల్ లిటరసీ, సృజనాత్మకత, కమ్యూనికేషన్లు కీలకంగా నిలుస్తున్నాయని నివేదిక స్పష్టం చేసింది. ఇందుకోసం అవసరమైతే సంస్థలు శిక్షణ సదుపాయాలు కల్పించాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.బోధన, మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడాలినేటి యువత వాస్తవ పరిస్థితులపై అవగాహన ఏర్పరచుకుంటున్నారు. అందుకే అప్ స్కిల్లింగ్, రీ–స్కిల్లింగ్ అవసరమని భావిస్తున్నారు. ఇందుకోసం కళాశాల స్థాయి నుంచే కృషి చేస్తున్నారు. అయితే దీనికి తగినట్లుగా మౌలిక సదుపాయాలు, బోధన అవకాశాలు మరింత మెరుగు పడాలి. అంతర్జాతీయంగా పోలిస్తే మన విద్యార్థులు ఏ దేశంలోనైనా.. ఉన్నత విద్య, ఉద్యోగ రంగాల్లో మెరుగ్గా రాణిస్తున్నారు.– రమేశ్ లోగనాథన్, ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్, కో–ఇన్నోవేషన్స్, ట్రిపుల్ఐటీ–హైదరాబాద్ -
కుంకీలతో కట్టడి సాధ్యమేనా
పలమనేరు: చిత్తూరు జిల్లాలోని కౌండిన్య అభయారణ్యంలో ఏనుగుల సమస్య(elephant problem) దశాబ్దాలుగా ఉంది. అడవిదాటి వచ్చి ఏనుగులు రైతుల పంటలను నాశనం చేస్తున్నాయి. మరోవైపు ఏనుగుల దాడుల్లో(elephant attack) జనాలు మృత్యువాత పడుతున్నారు. ఏనుగులు సైతం వివిధ కారణాలతో మరణిస్తున్నాయి. అడవిలోంచి ఏనుగులు బయటకు రాకుండా కట్టడి చేసేందుకు ఇప్పటివరకు అటవీశాఖ చేపట్టిన సోలార్ ఫెన్సింగ్, కందకాల తవ్వకం వల్ల ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది.కర్ణాటక టైప్ పేరిట గతంలో చేపట్టిన హ్యాంగింగ్ సోలార్ సిస్టం సైతం ప్రయోగాత్మకంగానే ముగిసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కుంకీ ఏనుగుల ద్వారా ఇక్కడి ఏనుగులను కట్టడి చేసేందుకు పలమనేరు మండలంలోని ముసలిమొడుగు వద్ద కుంకీ ఎలిఫెంట్(Kunki Elephant) ప్రాజెక్టు పనులు చేపడుతోంది. ఇదే తరహాలో రామకుప్పం మండలంలో ననియాల క్యాంపును గతంలో ఏర్పాటు చేసినా ఈ ఏనుగులు కనీసం అడవిలోని ఓ ఏనుగును సైతం అదుపు చేయలేదు. ఈ నేపథ్యంలో ఇక్కడికి రానున్న కుంకీ ఏనుగులు అడవి ఏనుగులను కట్టడి చేస్తాయా? అనే అనుమానం ఇక్కడి రైతుల్లో నెలకొంది. కౌండిన్యలో ఏనుగుల పరిస్థితి ఇదీ పలమనేరు, కుప్పం పరిధిలోని కౌండిన్య అభయారణ్యం 250 కి.మీ మేర మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని అడవులకు ఆనుకొని ఉంది. కౌండిన్య అభయారణ్యంలో స్థిరంగా ఉన్న గుంపులు, వలస వచ్చిన గుంపులు కలిపి మొత్తం 120 వరకు ఏనుగులు సంచరిస్తున్నాయి. 1984లో ప్రభుత్వం ముసలిమొడుగు వద్ద కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చురీని ఏర్పాటు చేసింది. ఇందులోకి తమిళనాడులోని మోర్థన ఫారెస్ట్నుంచి, ననియాల, కర్ణాటకలోని బన్నేరుగట్ట, బంగారుపేట, కేజీఎఫ్, తమిళనాడులోని క్రిష్ణగిరి, హొసూరు, కావేరిపట్నం తదితర ప్రాంతాల నుంచి ఏనుగులు వస్తున్నాయి. ఏనుగులు అడవిని దాటి బయటకు రాకుండా ఉండేందుకు గతంలో రూ. 2.61 కోట్లతో బంగారుపాళ్యం మండలం నుంచి కుప్పం వరకు 142 కి.మీ మేర సోలార్ఫెన్సింగ్ను 40 కి.మీ మేర ట్రెంచ్లను ఏర్పాటుచేశారు. అయితే సోలార్ఫెన్సింగ్ను ఏనుగులు తొక్కి అడవిలోంచి బయటకువస్తున్నాయి. ఫెన్సింగ్ కోసం ఏర్పాటు చేసిన కమ్మీలు నాశిరకంగా ఉండటంతో వీటిని సులభంగా విరిచేస్తున్నాయి. ఇక ఎలిఫెంట్ ట్రెంచ్లను సైతం ఏనుగులు మట్టిని తోసి,రాళ్లున్న చోట సులభంగా అడవిని దాటి బయటికొస్తున్నాయి. ఈరెండూ విఫలమవడంతో గతేడాది కర్ణాటక మోడల్ పేరిట హ్యాంగింగ్ సోలార్ను పదికిలోమీటర్ల మేర ప్రయోగాత్మకంగా చేపట్టి ఆపై దీన్నీ వదిలేశారు.కుంకీల కోసం కర్ణాటకతో ఎంవోయూ ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కర్ణాటకతో ఎంవోయూ చేసుకొని అక్కడ శిక్షణపొందిన నాలుగు కుంకీ ఏనుగులను ఇక్కడికి తెప్పిస్తోంది. ఇందుకోసం రేంజి పరిధిలోని 20 మంది ఎలిఫెంట్ ట్రాకర్లను దుభారే ఎలిఫెంట్ క్యాంపునకు పంపి నెలరోజుల పాటు శిక్షణ ఇప్పించారు. దీనికోసం ముసలిమొడుగు వద్ద రూ.12లక్షల వ్యయంతో కుంకీ ఎలిఫెంట్ క్యాంపును 50 ఎకరాల్లో ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా ఏనుగుల కోసం కర్రలకంచెతో విడిది, మేతను సిద్దం చేసుకునే గదులు, చిన్నపాటి చెరువు, శిక్షణాస్థలం. క్రాల్స్( మదపుటేనుగులను మచ్చిక చేసుకొనే చెక్క గది) పనులు జరుగుతున్నాయి.మరో రూ.27 లక్షలతో హ్యాంగింగ్ సోలార్ను ఏర్పాటు చేయనున్నారు. ఇలా ఉండగా గతంతో రామకుప్పం వద్ద నినియాలో ఏర్పాటు చేసిన ఇలాంటి క్యాంపులో రెండు ఏనుగులున్నాయి. వీటిని చూసేందుకు పర్యాటకులు వెళుతున్నారేగానీ ఇవి అడవిలోని ఏనుగును కట్టడి చేసిన దాఖలాలు ఇప్పటిదాకా లేవు. అదే రీతిలో ఇక్కడ కుంకీలతో సమస్య తెగుతుందా? లేదా అనే సందేహం మాత్రం ఇక్కడి రైతులకు పట్టుకుంది. అసలే ఇక్కడున్న మదపుటేనుగులు (రౌడీ ఏనుగులు,పుష్పా) కుంకీ ఏనుగులపై దాడులు చేసే అవకాశం లేకపోలేదు.గుబులు రేపుతున్న ఒంటరి ఏనుగు.... పలమనేరు కౌండిన్య అభయారణ్యంలో వందకు పైగా ఏనుగులు సంచరిస్తున్నా కేవలం ఓ ఒంటరి ఏనుగు రెండునెలలుగా జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కేవలం వ్యవసాయపొలాల వద్ద ఉన్న ఇళ్ళను టార్గెట్ చేసి వాటిని ధ్వంసం చేస్తోంది. ఆ ఇళ్ళలోని ధాన్యం, రాగులు హాయిగా ఆరగించి వెళుతోంది. దీంతోపాటు ఆఇళ్ల వద్ద ఉన్న మనుషులపై దాడులు చేస్తోంది.వారు దొరక్కపోతే ఆ ఇళ్ల వద్ద కట్టేసి ఉన్న ఆవులు, దూడలను చంపుతోంది. దీంతో అటవీ సమీప ప్రాంతాల్లో పొలాలవద్ద కాపురాలుంటున్న వారు ఈ ఏనుగు భారినుంచి ఎలా తప్పించుకోవాలో అర్థంగాక హడలిపోతున్నారు. కాగా గత పదేళ్లలో కరెంట్ షాక్లు, నీటిదొనల్లో పడి, మదపుటేనుగుల రభస కారణంగా 16 ఏనుగులు చనిపోయాయి. ఏనుగుల కారణంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14మంది మృతి చెందగా 26 మందివరకు గాయపడ్డారు. అడవిని విడిచి ఎందుకొస్తున్నాయంటే... కౌండిన్య అభయారణ్యంలో ఏనుగులకు అవరసమైన ఆహారం, నీటిలభ్యత తక్కువ. ఓ ఏనుగుకు రోజుకి 900లీటర్ల నీరు, 10 హెక్టార్లలో ఫీడింగ్ అవసరం. ఆహారం తిన్నాక ఇవి రోజుకు 5మైళ్లదాకా సంచరిస్తుంటాయి. అడవిలోని దట్టమైన మోర్ధనా అభయారణ్యంలోకి ఏనుగులు వెళితే తమిళనాడు అటవీశాఖ తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపి వీటిని మళ్లీ కౌండిన్య వైపుకు మళ్లిస్తోంది. దీంతో ఏనుగులు దట్టమైన అడవిలో ఉండటంలేదు. పొలాల్లోని చెరుకు, కొబ్బరి, మామిడి లాంటి ఆహారం కోసం ఒక్కసారి వచ్చే ఏనుగు తరచూ అదే మార్గంలో వస్తూనే ఉంటుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.క్యాంప్ పనులు సాగుతున్నాయి పలమనేరులో కుంకీ ఎలిఫెంట్ క్యాంపుకోసం ఇప్పటికే పనులు సాగుతున్నాయి. మైసూరు సమీపంలోని దుబరే నుంచి నాలుగు కుంకీ ఏనుగులు త్వరలో రానున్నాయి. ఎలిఫెంట్ ట్రాకర్లకు ఇప్పటికే కుంకీ ట్రైనింగ్ ఇప్పించాం. ముఖ్యంగా మదపుటేనుగులు దాడులు చేయకుండా వాటికి శిక్షణనిస్తాం. దీంతో ఏనుగులను కట్టడి చేసే అవకాశం ఉంటుంది. – భరణి, డీఎఫ్వో, చిత్తూరుకుంకీలతోనైనా సమస్య తీరితే చాలు.. గతంలో ఏనుగులను కట్టడి చేసేందుకు చేసిన పనులన్నీ లాభం లేకుండా పోయాయి. ఇప్పుడు కుంకీ ఏనుగులంటున్నారు. వీటితోనైనా ఇక్కడ ఏనుగుల సమస్య పరిష్కారమైతే అదే పదివేలు. అయినా జనంపై దాడులు చేస్తూ యథేచ్ఛగా పంటపొలాలపై పడుతున్న మదపుటేనుగులను ఈ కుంకీ ఏనుగులు ఎంతవరకు అదుపు చేస్తాయనే విషయంపై అనుమానంగానే ఉంది. – ఉమాపతి, రైతుసంఘ నాయకులు, పలమనేరు -
రక్తపుటేరు
అర్జెంటీనాలో ఓ కాలువ ఏకంగా ఎరుపు రంగులోకి మారింది. రాజధాని బ్యూనస్ ఎయిర్ష్ సమీపంలో ఉన్న అవెల్లెనెడా మున్సిపాలిటీలోని సరండ్ కాల్వ ఒక్కసారిగా రంగు మారడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అసలేం జరిగిందంటే అర్జెంటీనా, ఉరుగ్వే మధ్య రియో డి లా ప్లాటాలోకి ప్రవహించే జలమార్గంలో స్థానిక తోలు, వస్త్ర పరిశ్రమలు విపరీతంగా రంగులు, రసాయన వ్యర్థాలను వదులుతున్నాయి. దాంతో కాల్వ ఎప్పుడూ పసుపు రంగులో కనిపిస్తూ యాసిడ్ వాసనలు వస్తుంటుంది. అలాంటిది గురువారం అవెల్లెనెడా వాసులు నిద్రలేచే సరికి అది ఉన్నట్టుండి రక్త వర్ణంలోకి మారి భయంకరంగా కనిపించడమే గాక తీవ్ర దుర్గంధం వెదజల్లింది. ఆ విపరీతమైన దుర్వాసనకే ఉలిక్కిపడి లేచామని చాలామంది వాపోయారు. కాలుష్యంపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని వారంటున్నారు. అర్జెంటీనా పర్యావరణ శాఖ దీనిపై స్పందించింది. రంగు మార్పుకు కారణాలను గుర్తించడానికి కాల్వ నుంచి నీటి నమూనాలను సేకరించింది. సమీప ఫ్యాక్టరీ నుంచి రంగు లీకవడం వల్లే కాల్వ నీళ్లు ఎర్నగా మారాయని అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బాబూ.. బయటకు దయచెయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమెరికా టెక్ కంపెనీల్లో(US tech companies) ఉద్యోగుల కోత(Layoffs) కొనసాగుతోంది. ఆ దేశ టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్, సేల్స్ఫోర్స్, వాల్మార్ట్, స్ట్రైప్ తదితర సంస్థలు లేఆఫ్స్ ప్రకటించాయి. 2025లో మరిన్ని ఉద్యోగాల కోతలకు తాము సిద్ధంగా ఉన్నామని కంపెనీలు ముందస్తు సంకేతాలను చూపడంతో, యూఎస్ జాబ్ మార్కెట్ ఈ ఏడాది బలహీనపడవచ్చని నివేదికలు చెబుతున్నాయి. యూఎస్కు చెందిన కోచింగ్ కంపెనీ చాలెంజర్, గ్రే అండ్ క్రిస్మస్ తాజా నివేదిక ప్రకారం డిసెంబర్తో పోలిస్తే జనవరిలో యూఎస్లోని కంపెనీలు అధికంగా ఉద్యోగులను తగ్గించాయి.జనవరిలో 49,795 ఉద్యోగాల కోత పడింది. డిసెంబర్లో ప్రకటించిన 38,792తో పోలిస్తే ఇది 28 శాతం అధికం. 2024 జనవరిలో ప్రకటించిన 82,307 లేఆఫ్స్ కంటే ఈ సంఖ్య 40 శాతం తక్కువ. లాభాలు పెంచుకునేందుకు కంపెనీలు ఇన్వెస్టర్ల ఒత్తిడికి గురవుతున్నాయి. ఈ అంశమే తొలగింపునకు దారితీస్తోంది. ముఖ్యంగా కొవిడ్ సమయంలో కంజ్యూమర్ టెక్పై వ్యయాలు పెరగడంతో అందుకు తగ్గ సిబ్బందిని కంపెనీలు నియమించుకున్నాయి. వారిపైనే ఇప్పుడు కత్తి వేలాడుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సర్వే ప్రకారం 41 శాతం అంతర్జాతీయ కంపెనీలు ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్(artificial intelligence) కారణంగా వచ్చే ఐదేళ్లలో శ్రామిక శక్తిని తగ్గించుకోవాలని భావిస్తున్నాయి. కనీసం 25 కంపెనీలు.. అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నప్పటికీ కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. జనవరిలో యూఎస్ ఆర్థిక వ్యవస్థ 3,53,000 కొత్త ఉద్యోగాలను జోడించింది. మరోవైపు మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటా వంటి పెద్ద కంపెనీలు జనవరిలో తమ ఉద్యోగులకు పింక్ స్లిప్లు అందజేశాయి. యూఎస్లో కనీసం 25కు పైగా సంస్థల్లో వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని నివేదికలు చెబుతున్నాయి. పనితీరు సంతృప్తికరంగా లేని 3,600 మందిని ఈ ఏడాది తొలగిస్తున్నట్లు ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ ప్రకటించారు. ఏఐ ఆధారిత సేవలు, పరికరాలను రూపొందించడంలో కంపెనీ ముందుకు సాగుతోందని తెలిపారు. వరుస కట్టిన సంస్థలు.. సాఫ్ట్వేర్ కంపెనీ వర్క్డే 1,750 మందికి ఉద్వాసన పలుకుతోంది. ఏఐ ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది. వాల్మార్ట్ తాజాగా కాలిఫోర్నియా, ఆకన్సవ్లలోని కన్సాలిడేషన్లో భాగంగా వందలాది మందిని తొలగిస్తోంది. నార్త్ కరోలినాలో ఒక కార్యాలయాన్ని మూసివేస్తోంది. అమెజాన్ తన కమ్యూనికేషన్స్ యూనిట్లో డజన్ల కొద్దీ ఉద్యోగాలను కుదించింది. పనితీరు ప్రమాణాలకు అనుగుణంగా లేనందున ఉద్వాసన పలుకుతున్నట్టు మైక్రోసాఫ్ట్ తన సిబ్బందికి పంపిన నోటీసులో తెలిపింది. ఈ టెరి్మనేషన్ లెటర్స్ ప్రకారం బాధిత ఉద్యోగులు తక్షణమే ఉద్యోగాలను కోల్పోతారు. అంతేగాక వారికి ఎటువంటి ప్యాకేజీ ఉండదు. గూగుల్లో స్వచ్ఛందంగా.. ఆండ్రాయిడ్, పిక్సెల్, క్రోమ్, నెస్ట్ వంటి కీలక ఉత్పత్తులకు బాధ్యత వహిస్తున్న తన ప్లాట్ఫామ్స్, డివైజెస్ ఆర్గనైజేషన్లోని యూఎస్ ఆధారిత ఉద్యోగులకు గూగుల్ స్వచ్ఛంద నిష్క్రమణ ప్రోగ్రామ్ను ఆఫర్ చేసింది. వీరికి పరిహారం అందించనుంది. 1,000 మందిని తగ్గించాలని సేల్స్ఫోర్స్ యోచిస్తోంది. అలాగే ఏఐ ఆధారిత ఉత్పత్తుల్లోకి విస్తరణకు మద్దతుగా కొత్త సిబ్బందిని ఏకకాలంలో నియమిస్తోంది. జనవరి 20 నాటి అంతర్గత మెమో ప్రకారం ప్రొడక్ట్, ఇంజనీరింగ్, ఆపరేషన్స్ విభాగాల్లో 300 మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు స్ట్రైప్ ప్రకటించింది. అయితే, కంపెనీ తన మొత్తం ఉద్యోగుల సంఖ్యను 2025 చివరినాటికి 10 వేలకు పెంచాలని నిర్ణయించింది. ఖర్చులను తగ్గించుకునేందుకు వాషింగ్టన్ పోస్ట్ తన సిబ్బందిలో 4 శాతం లేదా 100 కంటే తక్కువ మందిని తొలగిస్తున్నట్టు జనవరిలో పేర్కొంది. -
పరశురామ ప్రతిష్ఠిత.. జడల రామలింగేశ్వరుడు
తెలంగాణలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ప్రత్యేకమైనది నల్లగొండ జిల్లా చెరువుగట్టులోని పార్వతీ సమేత జడల రామలింగేశ్వరాలయం. పరమ పవిత్ర క్షేత్రంగా భక్తుల నీరాజనాలందుకుంటోంది. ఇక్కడి శివుడికి మొక్కితే ఎలాంటి బాధలైనా పోయి, ఆరోగ్యంప్రాప్తిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ క్షేత్రాన్ని ఆరోగ్యక్షేత్రంగా పిలుస్తారు. 3, 5, 7, 9, 11 అమావాస్య రాత్రులు ఈ క్షేత్రంలో స్వామివారి సన్నిధిలో నిద్రిస్తే చీడపీడలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడ అమావాస్య సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాంటి క్షేత్రం ఇటీవలే బ్రహ్మోత్సవాలను పూర్తి చేసుకుంది. ప్రతి ఏటా మాఘ శుద్ధ పంచమి నాటి నుంచి ఆరు రోజులపాటు ఇక్కడ జాతర నిర్వహిస్తారు. ఆ సమయంలో పెద్ద సంఖ్యలో శివసత్తులు ఇక్కడకు చేరుకుంటారు. అగ్ని గుండాలు ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణ. రథ సప్తమి శివ కళ్యాణానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. లోక కల్యాణార్థం పరశురాముడు 108 క్షేత్రాల్లో స్వయంగా ప్రతిష్టించిన శివలింగాలలో ఇది చివరిదిగా ప్రతీతి. పశ్చిమాభిముఖంతో శివుడు కొలువై ఉండడం ఈ క్షేత్రం ప్రత్యేకత.పూర్వం హైహయ వంశ మూల పురుషుడు, కార్తవీర్జార్జునుడు వేటకోసం దండకారణ్యానికి వెళతాడు. అవిశ్రాంతంగా వేటాడిన పిదప బడలికకు గురైన చక్రవర్తి సపరివారంగా సమీపంలోని జమదగ్ని ఆశ్రమానికి వెళతాడు. అప్పుడు జమదగ్ని మహర్షి తన దగ్గరున్న కామధేనువు సహాయంతో అందరికి భోజనాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ ధేనువు మహత్తును మహర్షి దగ్గర అడిగి తెలుసుకున్న కార్తవీర్యార్జునుడు తనకు ఆ ధేనువును ఇవ్వాలని అడుగుతాడు. అందుకు మహర్షి తిరస్కరించడంతో కోపోద్రిక్తుడైన కార్తవీర్యార్జునుడు, జమదగ్నిని సంహరించి కామధేనువును తీసుకువెళతాడు. ఆ సమయంలో బయటకు వెళ్లి వచ్చిన పరశురాముడు జరిగిన విషయం తెలుసుకొని తన తండ్రిని చంపిన కార్తవీర్యార్జునుని పరశువు (గొడ్డలి) తో సంహరిస్తాడు. అంతేకాదు రాజులపై కోపంతో భూప్రదక్షిణం చేసి క్షత్రియ సంహారం చేస్తాడు. అనంతరం పాప పరిహారార్థం దేశం నలుమూలలా 108 శివలింగాలను ప్రతిష్టించి, ఒక్కొక్క లింగం చెంత వేల సంవత్సరాలు తపస్సు చేసి, ఆ తపోఫలాన్ని ఆ క్షేత్రానికి ధారపోసి మానవ కల్యాణానికి పాటుపడతాడు. అలా చివరగా ప్రతిష్టించిన 108వ శివ లింగం వద్ద ఎంత తపస్సు చేసినా శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో, కోపగించుకున్న పరశురాముడు తన గడ్డలితో శివలింగం ఊర్ధ్వభాగంపై ఒక దెబ్బ వేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, ఇంతకాలం నువ్వు తపస్సు చేసిన ప్రాంతం, ప్రముఖ శైవక్షేత్రంగా వెలుగొందుతుందని, కలియుగాంతం వరకు తానిక్కడే ఉండి భక్తులను అనుగ్రహి స్తుంటానని చెబుతారు. అనంతరం పరశురాముడు కూడా ఇక్కడే లింగాకృతి పొంది శివైక్యం పొందారని స్థల పురాణం చెబుతోంది. మూడు గుండ్ల ఆకర్షణఆలయం పక్కనే మూడు గుండ్లు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. వాటిల్లో మొదటి రెండింటినీ ఎక్కి మూడో దాన్ని చేరితే అక్కడ ఓ శివలింగం దర్శనమిస్తుంది. అయితే ఈ రాళ్లను ఎక్కేదారి క్లిష్టంగా ఉంటుంది. రాయి నుంచి రాయిని చేరే మధ్యలో ఉండే సందు చాలా ఇరుకుగా ఒక బక్కపల్చటి మనిషి అతి కష్టం మీద దాటే దారిలా కనిపిస్తుంది. ఎంత శరీరం ఉన్నవారైనా శివ నామస్మరణచేస్తూ వెళితే అందులోనుంచి అవతలికి సులభంగా చేరగలగటం శివుని మహిమకు తార్కాణంగా చెబుతారు. అయితే ప్రసుత్తం మూడు గుండ్లపైకి అందరూ వెళ్లి దర్శనం చేసుకునేందుకు ఇనప మెట్లను ఇరువైపులా ఏర్పాటు చేశారు. ఎల్లమ్మకు బోనాలుకొండపైకి కాలినడకన వెళ్లవచ్చు. మెట్లదారిలో వెళ్లే భక్తులు కాలబైరవుని దర్శనం చేసుకుంటారు. అనంతరం కోనేరుకు చేరుకొని స్నానం చేసి భక్తులు ముడుపుల గట్టు వద్దకు వెళ్లి అక్కడి చెట్టుకింద చెక్కతో చేసిన స్వామి పాదుకలను తమ శరీరం మీద ఉంచుకుని మొక్కుతారు. అనంతరం రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని ఆంజనేయుడు, ఎల్లమ్మ, పరశురాములని దర్శించుకుంటారు. ఇక్కడ ఎల్లమ్మ దేవతకు బోనం తయారు చేసి నైవేద్యం సమర్పిస్తారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. శివశక్తులు నాట్యాలు చేస్తుంటారు.అనంతరం భక్తులు గట్టు కింద ఉన్న పార్వతీ అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. కోరికలు నెరవేరిన వారు పల్లకి సేవ, వాహన సేవ, కోడెలు కడతారు. త్వరలో శివరాత్రికి ఇక్కడ జరగనున్న విశేష పూజలకు ముస్తాబవుతోంది ఆలయం. ఆ పేరెలా వచ్చిందంటే...రామలింగేశ్వరుని ఊర్ధ్వభాగాన పరశురాముడు గండ్ర గొడ్డలితో దెబ్బవేసిన చోట జడల వంటి రేఖలు ఉండటం వల్ల స్వామిని జడల రామలింగేశ్వరస్వామి అంటారు. చెరువు గట్టున ఉండటంతో చెరువుగట్టు జడల రామలింగేశ్వరాలయం అంటారు. కొండ దిగువన పార్వతీదేవి కొలువై ఉండటంతో పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంగా ప్రసిద్ధి కెక్కింది. కొండపై జడల రామలింగేశ్వరునికి 12వ శతాబ్దానికి చెందిన కాకతీయ గణపతిదేవ చక్రవర్తి గుహాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయంలో తొలి ఏకాదశినాడు, కార్తీక సోమవారాల్లో, పౌర్ణమి, మహాశివరాత్రి పర్వదినాలలో కడువైభవంగా ఉత్సవాలు జరుగుతుంటాయి. అలాగే ప్రతి ఏటా అమావాస్యనాడు అన్నదానం చేస్తాం. – పోతలపాటి రామలింగేశ్వర శర్మ, ప్రధాన అర్చకులు – చింతకింది గణేష్, సాక్షి ప్రతినిధి, నల్లగొండ -
మీమ్స్ వరద...
న్యూఢిల్లీ: కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ గత రెండు పర్యాయాలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన సందర్భాల్లో బీజేపీని విమర్శిస్తూ మీమ్స్ వెల్తువెత్తగా ఈసారి మీమ్స్ సృష్టికర్తల దృష్టంతా ఆప్ మీదనే పడింది. దీనికి తగ్గట్లు ఆప్ను, కేజ్రీవాల్ నేతగణాన్ని విమర్శల జడివానలో ముంచేస్తూ కుప్పలు తెప్పలుగా మీమ్స్.. సామాజిక మాధ్యమ సంద్రంలోకి కొట్టుకొచ్చాయి. ముఖ్యంగా 2023లో ఆప్ చీఫ్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దానికి కాస్తంత హాస్యం జోడించి వాట్సాప్, ఇన్స్టా గ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్లో జనం షేర్ చేసి ఆనందాన్ని పంచుకుంటున్నారు. ‘‘ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు బీజేపీ పలు రకాల కుట్రలు పన్నుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ రాష్ట్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తెగ కలలు కంటున్నారు. ఎన్ని కుట్రలు పన్నినా దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆప్ను ఓడించలేరని బీజేపీ నేతలకు సైతం తెలుసు. ప్రధాని మోదీకి నేను ఒక విషయం చెప్పదల్చుకున్నా. ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల్లో ఆయన మా పార్టీని ఈ జన్మలో ఓడించలేరు. దానికోసం ప్రధాని మోదీ మరో జన్మ ఎత్తాల్సి ఉంటుంది’’అని కేజ్రీవాల్ అన్నారు. 2017లోనూ కేజ్రీవాల్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘‘ఢిల్లీ రాష్ట్రానికి రాజకీయ పెద్దలం అంటే మేమే. మీమిచ్చే ఆదేశాలనే ఇక్కడి ప్రజలు పాటిస్తారు. ఢిల్లీని మేమే పరిపాలిస్తాం’’అని కేజ్రీవాల్ ఆనాడు అన్నారు. ఇంత బీరాలు పోయిన కేజ్రీవాల్నే బీజేపీ మట్టికరిపించిందంటూ కొత్త మీమ్స్ పుట్టుకొచ్చాయి. ఆప్ అటు, కాంగ్రెస్ ఇటు పరుగు పోటీలో అభ్యర్థులకు బీజేపీ, ఆప్, కాంగ్రెస్ ఎన్నికల గుర్తులు తగిలించి కొందరు నెటిజన్లు కొత్త మీమ్ సృష్టించారు. అందులో బీజేపీ, ఆప్ ముందుకు దూసుకుపోయేందుకు సిద్ధమైతే కాంగ్రెస్ వెనక్కు దూసుకుపోయేందుకు రెడీ అవుతున్నట్లు సరదా ఫొటోను సిద్ధంచేసి సామాజిక మాధ్యమాల్లోకి వదిలారు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాలు సున్నాగా నమోదవడం తెల్సిందే. దీనిని గుర్తుతెచ్చేలా పెట్రోల్ బంక్ వద్ద వాహనదారునికి సిబ్బంది ‘‘పెట్రోల్ కొడుతున్నా. ముందు మీటర్ రీడింగ్ సున్నా వద్దే ఉంది. చెక్చేసుకోండి సర్’’అన్నట్లు ఒక ఫొటోను రూపొందించారు. అయితే ఆ పెట్రోల్లో రాహుల్గాంధీ పనిచేస్తున్నట్లు సరదా మీమ్ను సృష్టించారు. ఆప్ వైఫల్యాలకు తగు కారణాలను పేర్కొంటూ ఇంకెన్నో మీమ్స్ వచ్చాయి. ఆప్ మాజీ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ను కేజ్రీవాల్ సహాయకుడు చితకబాదగా ఓటర్లు ఆప్ను చావుదెబ్బ తీశారని మరో మీమ్ వచి్చంది. ఐక్యత సున్నా విపక్షాల ‘ఇండియా’కూటమి అంటూ ఘనంగా ప్రకటించిన కాంగ్రెస్, ఆప్ తదితర పార్టీలు తీరా ఢిల్లీ ఎన్నికల్లో బాహాబాహీగా విమర్శలు చేసుకోవడంపైనా మీమ్స్ వచ్చాయి. రెజ్లింగ్ రింగ్లోకి కేజ్రీవాల్ యమా హుషారుగా దూసుకొచ్చి తొడ కొడుతుంటే ఒక్క దెబ్బతో మోదీ ఆయనను మట్టి కరిపించి బరి ఆవలికి విసిరేసినట్లు చూపే మరో మీమ్ వీడియో ఇప్పుడు తెగ వైరల్గా మారింది. బీజేపీ గెలుపు సంబరాలు చేసుకుంటుంటే అక్కడే ఉన్న తనను ఎవరూ మెచ్చుకోవట్లేదని స్వాతి మలివాల్ బాధపడుతుంటే దూరంగా నిల్చుని చూస్తున్న మోదీ వెంటనే అభినందనలు తెలుపుతున్నట్లు ఒక మీమ్ వీడియోను సృష్టించారు. ఎన్నికల క్రీడలో బీజేపీ, ఆప్సహా అన్ని పారీ్టలు గెలుపు కోసం ఆడుతుంటుంటే కాంగ్రెస్ మాత్రం తనకేం అక్కర్లేదన్నట్లు ఒక బెంచీపై కూర్చుని సరదాగా చూస్తున్నట్లు మరో మీమ్ను సృష్టించారు. మాకే ఎక్కువ ఆనందం ఈసారి గెలిచినందుకు మాకు ఆనందంగా ఉందని మోదీ, అమిత్ షా ఇద్దరూ నవ్వుకుంటుంటే.. మీ కంటే ఎక్కువ ఆనందం మాకే ఉందని అన్నా హజారే, స్వాతి మలివాల్, మరో మాజీ ఆప్ నేత కుమార్ విశ్వాస్ శర్మ చెబుతున్నట్లు ఉన్న మరో మీమ్ సైతం బాగా షేర్ అవుతోంది. ఇప్పటికే వేర్వేరు ఎన్నికల్లో ఓడిన ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్, శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, ఆప్ నేత సంజయ్ సింగ్లు బాధతో బనియన్, టవల్ మీద ఉన్న కేజ్రీవాల్కు పర్లేదులే అంటూ ఆనందంగా తీసుకొస్తున్న మీమ్ తెగ నవి్వంచేలా ఉంది. అనార్కలీలాగా ఆప్ నాయకురాలు అతిశీ సింగ్ నేలపై పడిపోతే సలీమ్లాగా కేజ్రీవాల్ వచ్చి లేపుతూ.. ‘‘లే అనార్కలీ. ఇప్పుడు మనం మన ఓటమికి ఈవీఎంలో అక్రమాలే కారణం అని కొత్త పల్లవి అందుకోవాలి’’అని ఆమెను తట్టిలేపుతున్నట్లు మరో మీమ్ ఇప్పుడు బాగా నవ్వు తెప్పిస్తోంది. గతంలో జనాన్ని కేజ్రీవాల్ తన చీపురుతో తరిమికొడితే, ఇప్పుడు జనం చీపురుకు నిప్పు పెట్టి కేజ్రీవాల్ను కొడుతున్నట్లు రూపొందించిన మరో మీమ్ ఇప్పుడు సోషల్మీడియాలో ఎక్కువగా షేర్ అవుతోంది. పార్టీ ఓటమితోపాటు ఆప్ అగ్రనేతలూ ఓటమిని చవిచూశారంటూ.. ‘‘గుడిలో ప్రసాదంగా ఏమైనా పెడతారని లోపలికి వెళితే అప్పటికే పొంగళి అయిపోయింది. సర్లే అని బయటికొస్తే అప్పటికే చెప్పులూ పోయాయి’’అంటూ ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ చెబుతున్నట్లు మరో వ్యంగ్య వీడియోను నెటిజన్లు సృష్టించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్చేశారు. -
స్వయంకృతాపరాధమే..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మట్టికరిచింది. హ్యాట్రిక్ కొట్టలేక చతికిలపడింది. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పరాజయం పాలయ్యారు. సీనియర్ నేతలకు సైతం ఓటమి తప్పలేదు. గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు రావడం, ముఖ్యమంత్రి ఆతిశీ నెగ్గడం కొంతలో కొంత ఊరట కలిగించిందనే చెప్పాలి. ఆప్ ఓటమికి దారితీసిన కారణాలు ఏమిటన్న దానిపై చర్చ మొదలైంది. ఆ పార్టీలోనూ అంతర్మథనం సాగుతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఢిల్లీలో సంక్షేమ పథకాలు గొప్పగా అమలు చేశామని చెప్పుకున్నప్పటికీ ఓటర్లు కనికరించలేదు. ఆప్ ఓటమికి స్వయం కృతాపరాధమే కారణమన్న వాదన వినిపిస్తోంది. అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన పార్టీ స్వయంగా అవినీతిలో కూరుకుపోవడం ప్రజల్లో వెగటు కలిగించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసు కేజ్రీవాల్ పార్టీ కొంపముంచినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కేసులో కేజ్రీవాల్జైలుకు వెళ్లినప్పటికీ జనంలో ఏమాత్రం సానుభూతి లభించలేదు. ఫలించిన బీజేపీ ప్రచారం మద్యం కుంభకోణం వ్యవహారంలో కేజ్రీవాల్తోపాటు ఆప్ సీనియర్ నేతలపై కేసులు నమోదయ్యాయి. కొందరు మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది. మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ జైలుకెళ్లారు. ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టయ్యారు. ఆప్ నేతల్లో చాలామందిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. తమ నాయకులపై కేసులన్నీ బీజేపీ కుట్రేనని ఆప్ పెద్దలు గగ్గోలు పెట్టినప్పటికీ జనం పట్టించుకోలేదు. ఇక కేజ్రీవాల్ నిర్మించుకున్న అద్దాల మేడ(శీష్ మహల్) దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ అంశాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లడంలో బీజేపీ విజయవంతమైంది. అద్దాల మేడ వ్యవహారం ఎన్నికల్లో కీలక ప్రచారాంశంగా మారిపోయింది. అవినీతి రహిత, స్వచ్ఛమైన పాలన అందిస్తానంటూ అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ ఆ మాట నిలబెట్టుకోలేకపోయారు. పైకి నిరాడంబరంగా కనిపించే కేజ్రీవాల్ భారీగా ఆస్తులు పోగేసుకొని విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని బీజేపీ నేతలు చేసిన ఆరోపణలు ప్రజలను ఆలోచింపజేశాయి. ‘డబుల్ ఇంజన్’కు ఆమోదం! ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్తో ఆప్ ప్రభుత్వం తరచుగా ఘర్షణకు దిగింది. పరిపాలనా సంబంధిత అంశాల్లో ఆయనను వ్యతిరేకించడం, కేంద్ర ప్రభుత్వాన్ని ధిక్కరిస్తున్నట్లు వ్యవహరించడం జనానికి నచ్చలేదు. పరిపాలనకు అడ్డంకులు సృష్టిస్తున్నారని లెఫ్టినెంట్ గవర్నర్పై, కేంద్రంపై నిందలు వేసినప్పటికీ ఓటర్లు విశ్వసించలేదు. ఆప్ అంటే ఆపద అని ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనేతలు ప్రచారం చేశారు. పచ్చి అవినీతి పార్టీ అంటూ విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రచారాన్ని ఆప్ నేతలు గట్టిగా తిప్పికొట్టలేకపోయారు. అద్దాల మేడపై ఏం సమాధానం చెప్పాలో వారికి తోచలేదు. ఢిల్లీ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలని బీజేపీ నేతలు పదేపదే చెప్పడం ఓటర్లపై ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం ఉంటే మేలు జరుగుతుందన్న అభిప్రాయం జనంలో నెలకొంది. బీజేపీకి ఒక్క అవకాశం ఇచ్చిచూద్దామన్న నిర్ణయానికి వారు వచ్చారు. ఢిల్లీ ఓటర్లకు ఆప్ పలు ఉచిత హామీల్చింది. అవి కూడా గట్టెక్కించలేదు. బీజేపీకి లాభించిన విపక్షాల అనైక్యత జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటైన ‘ఇండియా’ కూటమిలో కాంగ్రెస్, ఆప్ భాగస్వామ్య పక్షాలు. ఢిల్లీ ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేయాల్సిన ఈ రెండు పార్టీలు విడివిడిగా బరిలోకి దిగాయి. గత ఏడాది లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసిన కాంగ్రెస్, ఆప్ ఈ ఎన్నికల్లో పరస్పరం కత్తులు దూసుకున్నాయి. ఆప్ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆప్ను చిత్తుచిత్తుగా ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. రెండు పార్టీలు మొత్తం 70 స్థానాల్లో తమ అభ్యర్థులను రంగంలోకి దింపాయి. బీఎస్పీ, వామపక్షాలు, ఎంఐఎం, ఆజాద్ సమాజ్ పార్టీ, ఎన్సీపీ వంటివి తమకు బలం ఉన్న చోట పోటీ పడ్డాయి. ఫలితంగా బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోయాయి. చాలాచోట్ల ఆమ్ ఆద్మీ పార్టీకి రావాల్సిన ఓట్లను కాంగ్రెస్ కొల్లగొట్టినట్లు తెలు స్తోంది. ఇండియా కూటమి పార్టీలన్నీ కలిసికట్టుగా పోటీ చేస్తే ఫలితం మరోలా ఉండేదని విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనప్పటికీ ప్రతిపక్షాల అనైక్యత కారణంగా చివరకు బీజేపీ లబ్ధి పొందింది. మార్పు కోరుకున్న జనంఆప్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టలేదన్న విమర్శలు ఉన్నాయి. పదేళ్లు పాలనలో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చలేదు. నగరంలో అస్తవ్యస్తమైన మారిన డ్రైనేజీ వ్యవస్థ, పెరిగిపోయిన కాలుష్యం, మురికికూపంగా మారిన యమునా నది, స్వచ్ఛమైన తాగునీరు, గాలి లభించకపోవడం ఓటర్లు మనసు మార్చేసింది. అంతేకాకుండా పదేళ్లుగా అధికారంలోకి కొనసాగుతున్న ఆప్పై సహజంగానే కొంత ప్రజావ్యతిరేకత ఏర్పడింది. జనం మార్పును కోరుకున్నారు. అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడం, అభివృద్ధి లేకపోవడం కేజ్రీవాల్ విశ్వసనీయతను దిగజార్చాయి. ఈ పరిణామాలను బీజేపీ ఎంచక్కా సొమ్ము చేసుకుంది.స్తంభించిన పాలన కేజ్రీవాల్ అరెస్టు కావడం, జైలుకెళ్లడం, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం ఆప్ ప్రతిష్టను దారుణంగా దిగజార్చింది. ఆయన తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆతిశీ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కేజ్రీవాల్ తర్వాత బీజేపీని ఢీకొట్టే స్థాయి కలిగిన బలమైన నాయకులు లేకపోవడం ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రతికూలంగా మారింది. చాలామంది సీనియర్లు ఓడిపోవడంతో ఈ ఎన్నికల్లో నైతిక విజయం తమదేనని చెప్పుకొనే పరిస్థితి లేకుండాపోయింది. కేజ్రీవాల్ అరెస్టు కావడంతో పరిపాలన చాలావరకు స్తంభించింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో గత ఏడాది మార్చి నెలలో ఆయన అరెస్టయ్యారు. వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయలేదు. కేంద్రం ఎదుట తలవంచబోనని తేల్చిచెప్పారు. ఈ కేసులో బెయిల్ వచ్చి జైలు నుంచి విడుదలైన తర్వాత ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. ప్రజలు ఇచ్చే నిజాయితీ సర్టిఫికెట్తో మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని కేజ్రీవాల్ చెప్పినప్పటికీ అది నెరవేరలేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఐఐటీల ప్లేస్మెంట్స్.. వివరాలు గప్ చుప్
సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్: దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)(IIT)లు. ఇంజనీరింగ్ విద్య అనగానే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మొదట గుర్తుకొచ్చేవి ఇవే. జేఈఈ అడ్వాన్స్డ్లో విజయం సాధించి ఐఐటీలో సీటు సాధిస్తే జాక్పాట్ కొట్టినట్టేనని విద్యార్థులు భావిస్తారు. బహుళజాతి సంస్థల్లో మంచి ఉద్యోగాలు పొందాలన్నా, అత్యుత్తమ వార్షిక వేతన ప్యాకేజీలు దక్కాలన్నా అది ఐఐటీలతో మాత్రమే సాధ్యమనే అభిప్రాయం సర్వత్రా ఉంది.ఈ నేపథ్యంలో ఏటా జరిగే ఆయా ఐఐటీల క్యాంపస్ ప్లేస్మెంట్స్(Placements)పై అంతా ఆసక్తి కనబరుస్తుంటారు. కేవలం ఇంజనీరింగ్ ఔత్సాహికులే కాకుండా మిగతా వారు కూడా ఏ స్థాయిలో ఐఐటీల విద్యార్థులు వేతన ప్యాకేజీలు దక్కించుకున్నారో తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. అయితే ఈసారి ఎక్కువ ఐఐటీలు క్యాంపస్ ప్లేస్మెంట్స్ విషయంలో గోప్యత పాటిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. వివరాలు వెల్లడించింది కొన్ని ఐఐటీలే ఈ ఏడాది క్యాంపస్ ప్లేస్మెంట్స్కు సంబంధించి గతేడాది డిసెంబర్ 1నే ఆయా ఐఐటీల్లో ఆన్ క్యాంపస్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే విద్యార్థులకు ఏ స్థాయిలో వేతన ప్యాకేజీలు లభించాయో ఇప్పటివరకు కొన్ని ఐఐటీలు మాత్రమే బయటకు సమాచారాన్ని వెల్లడించాయి. ఐఐటీ కాన్పూర్, ఐఐటీ రూరీ్క, ఐఐటీ ఖరగ్పూర్, ఐఐటీ–బీహెచ్యూ ఈ కోవలో ఉన్నాయి. ఇవి కాకుండా మిగతా ఐఐటీలన్నీ నిశ్శబ్దాన్ని పాటిస్తున్నాయి. కారణాలు ఇవేనా? క్యాంపస్ ప్లేస్మెంట్స్ గురించి బయటకు సమాచారాన్ని వెల్లడించకపోవడానికి కారణం ఉందని ఐఐటీల ప్రొఫెసర్లు చెబుతున్నారు. విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడానికి, వారి సంక్షేమం కోసమే తాము ప్లేస్మెంట్స్ సమాచారాన్ని వెల్లడించడం లేదని అంటున్నారు. వేతన ప్యాకేజీల గురించి ఒకరితో మరొకరు పోల్చుకోవడం వల్ల విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం çపడుతోందని.. అందుకే ఇలా చేస్తున్నామని పేర్కొంటున్నారు. ఈ మేరకు ఇటీవల జరిగిన అన్న ఐఐటీల ప్లేస్మెంట్స్ కమిటీ (ఏఐపీసీ) సమావేశంలో ఉద్యోగ నియామక వివరాలు, వేతన ప్యాకేజీల వివరాలు వెల్లడించవద్దని ప్రాథమికంగా ఒక నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నాయి. వారం లేదా పక్షం రోజులకోసారి.. సాధారణంగా దేశంలో ఉన్న మొత్తం 23 ఐఐటీల్లో రెండు దశల్లో క్యాంపస్ ప్లేస్మెంట్లు ఉంటాయి. డిసెంబర్లో మొదటి దశ, జనవరి – జూన్ మధ్య రెండో దశ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఉద్యోగాలు సాధించినవారి సమాచారాన్ని రోజువారీ కాకుండా వారానికోసారి లేదా 15 రోజులకోసారి విడుదల చేయాలని ఐఐటీల ప్లేస్మెంట్స్ కమిటీల సమావేశంలో ఆయా సంస్థలు ప్రతిపాదించాయి. ప్లేస్మెంట్స్ గురించి మీడియాలో వచ్చే వార్తలు విద్యార్థులపై ఒత్తిడి పెంచకుండా, వారి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయకుండా చూడాలన్నదే తమ ఏఐపీసీ కన్వీనర్ ప్రొఫెసర్ కౌశిక్ పాల్ తెలిపారు. కొత్త ఐఐటీల ప్లేస్మెంట్స్ నివేదికలు అప్పుడే.. చాలా ఐఐటీలు క్యాంపస్ ప్లేస్మెంట్స్ సమయంలో విద్యార్థులు ఉద్యోగాలు సాధించిన కంపెనీల పేర్లు, అత్యధిక, మధ్యస్థ ప్యాకేజీలు, ఆఫర్ను పొందిన మొత్తం విద్యార్థుల సంఖ్య, వాటిలో అంతర్జాతీయ ఆఫర్ల సంఖ్య వంటివాటి గురించి రోజూ సమాచారమిచ్చేవి. అయితే ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ ధార్వాడ్, మరికొన్ని కొత్త ఐఐటీలు 2024–25 సెషన్లో ప్లేస్మెంట్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆగస్టు, సెప్టెంబర్ల్లో ఒకేసారి తుది ప్లేస్మెంట్ నివేదికను విడుదల చేయాలని నిర్ణయించుకున్నాయి. ఐఐటీల నిర్ణయానికి మద్దతు విద్యార్థుల క్యాంపస్ ప్లేస్మెంట్స్, అత్యధిక వార్షిక వేతన ప్యాకేజీల వివరాలను బహిర్గతం చేయకూడదనే నిర్ణయానికి పలువురు ఐఐటీ ప్రొఫెసర్లు సైతం మద్దతు తెలుపుతున్నారు. ప్లేస్మెంట్లు, మంచి ప్యాకేజీలు పొందిన విద్యార్థుల వివరాలను బహిరంగంగా వెల్లడిస్తే ఇవి.. ప్లేస్మెంట్ దక్కనివారు, మంచి పే ప్యాకేజీలు పొందనివారిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఐఐటీ ధన్బాద్లో కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ హెడ్ ప్రొఫెసర్ సౌమ్యా సింగ్ అన్నారు. విద్యార్థులు ఏమంటున్నారంటే.. మొదటి ప్రయత్నంలో మంచి ప్లేస్మెంట్ దక్కకపోతే నిరుత్సాహం చెందాల్సిన అవసరంలేదని ఐఐటీ మద్రాస్లో సివిల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థి రిత్విక్రెడ్డి అభిప్రాయపడ్డారు. ఐఐటీయన్లపై మీడియా నివేదికలు ఒత్తిడి పెంచలేవన్నాడు. ఆందోళన చెందకుండా ఇతర పరీక్షలు, ఇంటర్వ్యూలపై దృష్టి సారిస్తానని స్పష్టం చేశారు.ప్రొఫెసర్లు, విద్యార్థుల మద్దతు.. ఏది ఏమైనప్పటికీ విద్యార్థుల ప్లేస్మెంట్లు, ప్యాకేజీల గురించి ఏ ఐఐటీ మీడియాకు వెల్లడించకూడదని ఏఐపీసీ అధికారికంగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని ఐఐటీల ప్రతినిధులకు ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ నిర్ణయానికి ప్రొఫెసర్లు, విద్యార్థులు కూడా మద్దతు తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఐఐటీల నిర్ణయం ఆందోళన తగ్గిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్లేస్మెంట్లు, ప్యాకేజీల వివరాలు మీడియాలో రాకపోవడం మంచిదని ఐఐటీ ఢిల్లీ విద్యార్థి ఒకరు అభిప్రాయపడ్డారు.లేదంటే తమ ఇంటి ఇరుగుపొరుగువారు తన గురించి తన తల్లిదండ్రులను ఆరా తీస్తారని.. ఇది వారిపై అనవసర ఆందోళన పెంచుతుందన్నారు. అంతేకాకుండా ఇతర విద్యార్థులతో తనను పోల్చుతారని.. ఇది కూడా తన తల్లిదండ్రులను ఒత్తిడిలోకి నెడుతుందన్నారు. ఈ నేపథ్యంలో ప్లేస్మెంట్లు, ప్యాకేజీ వివరాలను బహిరంగంగా వెల్లడించవద్దని ఐఐటీలు మంచి నిర్ణయమే తీసుకున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. -
ఐటీ ఊరటే.. గేమ్ ఛేంజర్
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంలో మోదీ సర్కారు తాజా బడ్జెట్లో ప్రకటించిన ఐటీ ఊరట ప్రధాన పాత్ర పోషించింది. ఈ నిర్ణయంతో రాజధాని నగరంలో ఏకంగా మూడింట రెండొంతుల దాకా ఉండే ప్రభుత్వోద్యోగులు, వేతన జీవుల్లో అత్యధికులు ఆ పార్టీవైపు మొగ్గారు. మధ్య తరగతి, పూర్వాంచల్ ఓటర్ల మద్దతు దానికి తోడైంది. వీటికి తోడు 2015, 2020ల్లో ఆప్కు అండగా నిలిచిన పలు వర్గాల ఓటర్లు కూడా ఈసారి కమలం పార్టీ వైపు మొగ్గారు. సాధారణంగా కేజ్రీవాల్ పార్టీకి మద్దతుదార్లయిన మహిళలు సైతం ఈసారి బీజేపీకి జైకొట్టారు. వారికి నెలకు రూ.2,500 అందిస్తామన్న హామీ బాగా పేలింది. పంజాబ్లో మహిళలకు నెలకు రూ.1,000 ఇస్తామన్న హామీని గెలిచాక నిలబెట్టుకోకపోవడం ఆప్కు ప్రతికూలంగా మారింది. ఢిల్లీలో మధ్య తరగతి ప్రజలు అధికం. ఉద్యోగాలు, చిన్నపాటి వ్యాపారాలతో వారు ఉపాధి పొందుతుంటారు. రూ.12 లక్షల వార్షిక ఆదాయానికి ఆదాయ పన్ను పూర్తిగా మినహాయిస్తూ ఢిల్లీ పోలింగ్ కేవలం నాలుగు రోజుల ముందు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో మోదీ సర్కారు ప్రకటించడం తెలిసిందే. పన్ను భారం తొలగిపోవడం ఆ ఎంతగానో ఊరటనివ్వడంతో వేతన జీవులు ఓటు రూపంలో బీజేపీ పట్ల కృతజ్ఞత చూపినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్ నుంచి వచ్చి ఢిల్లీలో స్థిరపడిన పూర్వాంచల్ ఓటర్లు మొత్తం ఓటర్లలో ఏకంగా 30 శాతం దాకా ఉంటారు. వారి ప్రగతిపై ప్రత్యేకంగా దృష్టి పెడతామన్న బీజేపీ హామీ ఆకట్టుకుంది. దీనికి తోడు యూపీ, బిహార్ల నుంచి పెద్ద సంఖ్యలో జనాన్ని తెచ్చి ఢిల్లీలో ఓటర్లుగా చేరి్పస్తున్నారన్న కేజ్రీవాల్ ఆరోపణలు, వారంతా ఫేక్ ఓటర్లన్న విమర్శలు పూర్వాంచల్ ప్రజలకు ఆగ్రహానికి కారణమయ్యాయి. దాంతో వారంతా బీజేపీకే ఓటేశారు. పదేళ్ల ఆప్ పాలనలో తమకు ఒరిగిందేమీ లేదంటూ ప్రజల్లో నెలకొన్న భావన కూడా కేజ్రీవాల్కు ప్రతికూలంగా మారింది. ఆరెస్సెస్ నిశ్శబ్ద ప్రచారం ఢిల్లీ ఎన్నికల్లో రా్ష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) బీజేపీ విజయం కోసం నిశ్శబ్దంగా పని చేసుకుంటూ వెళ్లింది. అవినీతి రహిత, పారదర్శకమైన పాలన కావాలంటే బీజేపీని గెలపించాలని సంఘ్ కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేశారు. వారు ఇంటింటా తిరిగారు. బీజేపీ గెలుపులో సంఘ్ పాత్ర తక్కువేమీ కాదు. చిన్నచిన్న సభలు వందల సంఖ్యలో నిర్వహించారు. ఆప్ ప్రభుత్వ వైఫల్యాలను సమర్థవంతంగా ఎండగట్టారు. ఢిల్లీ మోడల్ అంటూ ఆప్ నేతలు చేస్తున్న ప్రచారంలోని డొల్లతనాన్ని బయటపెట్టారు. ఇక ఆప్ ప్రభుత్వ పెద్దల అవినీతి గురించి ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పగలిగారు. రాజకీయ పార్టీల కంటే ముందే సంఘ్ కార్యకర్తలు ప్రచారం ప్రారంభించారు. మురికివాడలు, అనధికారిక కాలనీల్లోకి వేగంగా చొచ్చుకెళ్లారు. అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు. ప్రచారం చేసి పేరు ప్రతిష్టలు కోరుకోవడం, నిత్యం ప్రసార మాధ్యమాల్లో కనిపించడం సంఘ్ కార్యకర్తలకు ఇష్టం ఉండదు. తెరవెనుక నిశ్శబ్దంగా పని చేయడానికే వారు ఆసక్తి చూపుతారు. 8వ వేతన సంఘంతో లబ్ధి సరిగ్గా ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఎనిమిదో వేతన సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం బీజేపీకి లబ్ధి చేకూర్చింది. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఎనిమిదో వేతన సంఘంతో వారి వేతనాలు పెరుగనున్నాయి. నిజానికి ఉచిత పథకాలకు బీజేపీ బద్ధ వ్యతిరేకి. అయినప్పటికీ ఢిల్లీ ఎన్నికల్లో ఉచిత పథకాలకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఆప్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ యథాతథంగా అమలు చేస్తామని ప్రకటించింది. దాంతో మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలు బీజేపీని ఆదరించారు. ఉచిత విద్యుత్, ఉచిత బస్సు వంటి పథకాలు ఎప్పటిలాగే అమలవుతాయి కాబట్టి బీజేపీకి ఓట్లు వేశారు. యమునా నదిని ఎగువన ఉన్న హరియాణా ప్రభుత్వం కలుషితం చేస్తోందంటూ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించడం వివాదాస్పదంగా మారింది. హరియాణా ప్రజలు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని హరియాణా ఓటర్లు కేజ్రీవాల్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
శాస్త్రీయ శక్తి
శాస్త్ర సాంకేతిక రంగాల్లో చాలాకాలం పురుషాధిక్యమే కొనసాగింది. ప్రఖ్యాత శాస్త్రవేత్తల పేర్లు చెప్పమంటే, ఎవరైనా అల్బర్ట్ ఐన్స్టీన్, థామస్ ఎడిసన్ వంటి పురుష శాస్త్రవేత్తల పేర్లే చెబుతారు కాని, ఎందరో మహిళా శాస్త్రవేత్తలు తమ తమ ఆవిష్కరణలో శాస్త్ర సాంకేతిక రంగాలను సుసంపన్నం చేసిన సంగతి మీకు తెలుసా? శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఘన విజయాలను సాధించిన మహిళా శాస్త్రవేత్తల ఆవిష్కరణలు ఎందరో యువతులను ఈ రంగాలవైపు ఆకట్టుకుంటున్నాయి, పెద్ద కలలు కనేలా చేస్తున్నాయి. బాలికలు, మహిళలకు విద్యలో, అభిరుచికి తగిన రంగాల్లో సరైన అవకాశాలు అందక వారి శక్తి సామర్థ్యాలు వృథాగా పోతున్నాయి. వారికి తగిన అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తే, విభిన్నమైన ఆలోచనలతో నవీన సాంకేతికతలను సృష్టించడానికి, అభివృద్ధి చేయడానికి వీలవుతుందనేది నిపుణుల మాట.ఇందుకోసం విద్యారంగంలో బాలికలకు సమాన అవకాశాలు దక్కేలా చూడాలని; శాస్త్ర, సాంకేతిక, పరిశోధన రంగాల్లో వారి శక్తి సామర్థ్యాలను వెలికితీయాలనే ఉద్దేశంతో ప్రారంభమైన రోజే ఫిబ్రవరి 11 ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్’.. ఈ సందర్భంగా శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆదర్శప్రాయులుగా చెప్పుకునే మహిళా శాస్త్రవేత్తల విజయాలు, వారి గురించిన విశేషాలతో ఈ ప్రత్యేక కథనం..అలా మొదలైంది...ప్రపంచ ప్రఖ్యాత కి నివాళిగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు, తగిన ప్రోత్సాహం కోసం ‘ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక విభాగం (యునెస్కో)’, ‘మహిళలకు సైన్స్ కావాలి.. సైన్సుకు మహిళలు కావాలి’ అని నినాదం ఇచ్చింది. ఫిబ్రవరి 11వ తేదీని ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్’గా 2015లో ప్రకటించింది. దశాబ్దాల ఎదురుచూపు తర్వాత శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళలకు ప్రోత్సాహం లభించింది. ఇందుకోసం, ‘యునెస్కో’ ఏటా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇప్పటికీ రేడియేషన్.. నోబెల్ బహుమతి అందుకున్న మొదటి మహిళ మేరీ క్యూరీ. రెండు వేర్వేరు రంగాల్లో నోబెల్ పొందిన ఏకైక శాస్త్రవేత్త ఆమె. రేడియో ధార్మిక మూలకాలైన రేడియం, పోలోనియంలను క్యూరీ గుర్తించారు. ఆమె కనుగొన్న రేడియం పేరు మీదుగానే రేడియేషన్ పదం పుట్టింది. ఈ పరిశోధనకుగాను 1903లో ‘ఫిజిక్స్ నోబెల్’ అందుకున్నారు. తర్వాత కెమిస్ట్రీలో పరిశోధనకు 1911లో ’కెమిస్ట్రీ నోబెల్’ పొందారు. తన పరిశోధనల సమయంలో క్యూరీ ఎంతగా రేడియేషన్కు గురయ్యారంటే, ఆమె రాసిన నోటు పుస్తకాల నుంచి ఇప్పటికీ రేడియేషన్ వెలువడుతోంది.నోబెల్ కుటుంబం ప్రపంచంలోనే అత్యధిక నోబెల్ బహుమతులు కూడా మేరీ క్యూరీ కుటుంబం సాధించి చరిత్ర సృష్టించింది. ఆమె భర్త పియరీ క్యూరీ, కుమార్తె ఐరీన్ జోలియట్ క్యూరీ, అల్లుడు ఫ్రెడరిక్ జోలియట్, మేరీ రెండుసార్లు గెలుపొందడంతో మొత్తం కుటుంబం ఐదు నోబెల్ బహుమతులను అందుకుంది.కంప్యూటరుకు భాష నేర్పిందితొలి ఎలక్ట్రానిక్–డిజిటల్ కంప్యూటర్ ‘యూనివాక్’ను రూపొందించిన బృందంలో కీలక పాత్ర పోషించిన అమెరికన్ శాస్త్రవేత్త గ్రేస్ హెూపర్. ‘బైనరీ’ భాషలోకి మార్చే తొలి కంపైలర్ ప్రోగ్రామును ఆమె రూపొందించారు. ‘కోబాల్’ ప్రోగ్రామ్ రూపకల్పనలోనూ ఆమెది కీలకపాత్ర. అణుశక్తిచైనాలో పుట్టి, అమెరికాలో స్థిరపడి అణుశక్తి తయారీకి మార్గం చూపిన శాస్త్రవేత్త చీన్ షుంగ్ వు. అణుబాంబుల తయారీ కోసం ‘మాన్ హట్టన్ ప్రాజెక్టు’లో ఆమె కీలకపాత్ర పోషించారు. రసాయనిక ప్రక్రియల ద్వారా యురేనియం ఉత్పత్తి చేసే విధానాన్ని తొలిసారి ఆమె కనుగొన్నారు.తెలివైన సీతాకోక చిలుకమరియా సిబిల్లా కీటక శాస్త్రవేత్త. గొంగళి పురుగులు రూపాంతరం చెంది సీతాకోక చిలుకలుగా మారుతాయని నిరూపించింది. అంతేకాదు, కుళ్లిన పదార్థాలు వివిధ రకమైన పురుగులు, కీటకాలను ఉత్పత్తి చేస్తాయని కనుగొన్నది కూడా తనే! ఇలా కీటకాలపై తను చేసిన పరిశోధనలు ఎన్నో విషయాలను ప్రపంచానికి నేర్పించాయి.కోపిష్టి దేవుళ్లు కాదు వాంగ్ జెనీ ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. అమ్మాయిలను సైన్స్ చదవడానికి అనుమతించని కాలంలోనే జెనీ, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల గురించి తెలుసుకోవడానికి ఇష్టపడింది. అప్పటి వరకు చంద్రగ్రహణాన్ని కోపిష్టి దేవుడిగా భావించడాన్ని తను నమ్మలేదు. అందుకే, తాళ్లతో ఒక భూగోళం, అద్దం, దీపాన్ని పట్టుకొని, చంద్రుడు భూమి నీడలో అదృశ్యమవుతాడని నిరూపించింది. అదే ఎంతోమంది శాస్త్రవేత్తలు, సూర్య, చంద్రగ్రహణాలపై అధ్యయనాలు చేసేలా చేసింది.వైద్యరంగానికి చికిత్స అమెరికాలో వైద్య పట్టా సంపాదించిన మొదటి మహిళ ఎలిజబెత్ బ్లాక్వెల్. డాక్టర్గా వైద్యరంగంలో విశేషమైన కృషి చేసింది. ఒక ప్రమాదంలో తన కంటిచూపు కోల్పోయి, సర్జన్ను కావాలనే తన కలను వదులుకుంది. కాని, ఆశయాన్ని కాదు. తర్వాత ఒక వైద్య కళాశాల ప్రారంభించి, ఎంతోమంది బాలికలు వైద్యులుగా మారడానికి సహాయం చేసింది.జంపింగ్ జీన్స్వారసత్వ నిర్ధారణ కోసం చేసే డీఎన్ఏ పరీక్షకు మూలమైన జన్యువులను కనుగొన్న శాస్త్రవేత్త బార్బరా మెక్క్లింటాక్. జన్యువుల్లో ఉత్పరివర్తనలకు, డీఎన్ఏ పరిమాణంలో మార్పులకు కారణమయ్యే ‘జంపింగ్ జీన్స్’ను కనుగొన్నందుకు వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్నారు. సైన్స్ టీచర్ స్కూల్సైన్స్ టీచర్గా సాలీ రైడ్– ఎందరో బాలికలను సైన్స్ దిశగా ప్రోత్సాహించారు. తర్వాత వ్యోమగామిగా మారి, అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి అమెరికన్ మహిళగా చరిత్ర సృష్టించారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఆమె బోధించిన ఉపగ్రహాల సిద్ధాంతాలను తర్వాతి కాలంలో చేపట్టిన అంతరిక్ష పరిశోధనల్లో ఉపయోగించారు. సాలీ ముఖ్యంగా బాలికలు అంతరిక్ష శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి దోహదపడే కార్యక్రమాలను రూపొందించారు.డైనోసార్ మేడంశిలాజ శాస్త్రవేత్త మేరీ అన్నింగ్. ఇంగ్లాండ్ సముద్రతీరంలో కొండలను అన్వేషించి, ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి ప్లెసియోసారస్ అస్థిపంజరం ‘డగ్ ది డైనోసార్’ను కనుగొన్నారు. డైనోసార్ల గురించి మరింత తెలుసుకోవడానికి ఇది ఇతర శాస్త్రవేత్తలకు చాలా ఉపయోగపడింది.మరెందరో..సూర్యుడు సహా విశ్వంలోని నక్షత్రాలన్నీ ఎక్కువభాగం హైడ్రోజన్, హీలియంతోనే నిండి ఉన్నాయని తొలిసారిగా వెల్లడించిన అంతరిక్ష శాస్త్రవేత్త సెసిలియా పేన్ గాపోష్కిన్. అమెరికన్ అంతరిక్ష సంస్థ ‘నాసా’ కంప్యూటర్లను వినియోగించడానికి ముందు అంతరిక్ష ప్రయోగాల సమయాన్ని, కచ్చితంగా గణించి చెప్పిన ’హ్యూమన్ కంప్యూటర్’ కేథరిన్ జాన్సన్.. ఇన్సులిన్, పెన్సిలిన్, విటమిన్ బీ12 వంటి జీవరసాయనాల అణు నిర్మాణాన్ని ఎక్స్–రే క్రిస్టలోగ్రఫీ సాయంతో గుర్తించే విధానాన్ని రూపొందించిన శాస్త్రవేత్త డొరోతీ హాడ్కిన్.. ఇలా మరెందరో మహిళా శాస్త్రవేత్తలు..భారతీయుల్లోనూ..అమ్మాయిలను ఇంటి గడప కూడా దాటనివ్వని రోజుల్లోనే చాలామంది మహిళలు ఈ రంగంలో ఎన్నో విజయాలను సాధించారు. అలా ఒకసారి వెనక్కి వెళితే, పాశ్చాత్య వైద్యవిద్యను అభ్యసించిన తొలి భారతీయ మహిళ ఆనందీ బాయి, 1883లో ‘భారతదేశంలోనే వైద్యశాస్త్రంలో తొలి పట్టభద్రురాలిగా కాదంబినీ గంగూలీ చరిత్ర సృష్టించారు. రాయల్ సొసైటీకి ఎంపికైన తొలి మహిళగా గగన్ దీప్ ఎంతోమంది యువతులకు స్ఫూర్తినిచ్చారు.అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన కల్పనా చావ్లా; ఇటీవలి కాలంలో కోవిడ్ వైరస్ ధాటిని ముందే గుర్తించి హెచ్చరించిన భారత శాస్త్రవేత్త, డబ్ల్యూహెచ్వో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్యా స్వామినాథన్; మొక్కల కణాల్లో శక్తి ఉత్పాదనకు కీలకమైన ‘సైటోక్రోమ్ సీ’ అనే ఎంజైమును గుర్తించిన కమలా సొహెూనీ; క్యాన్సర్ను నిరోధించే ‘వింకా ఆల్కలాయిడ్స్’, మలేరియా చికిత్స కోసం వాడే ఔషధాలపై పరిశోధన చేసిన రసాయన శాస్త్రవేత్త అసీమా ఛటర్జీ; మైక్రోవేవ్ పరికరాలపై పరిశోధన చేసి, మన దేశంలో తొలి మైక్రోవేవ్ రీసెర్చ్ ల్యాబ్ నెలకొల్పిన శాస్త్రవేత్త రాజేశ్వరీ ఛటర్జీ; పుణె వైరాలజీ ల్యాబ్లో కోవిడ్ వైరస్ను వేరు చేసి, ‘కోవాక్సిన్’ రూపకల్పనకు మార్గం వేసిన ల్యాబ్ డైరెక్టర్ ప్రియా అబ్రహాం; అగ్ని–4, 5 క్షిపణుల రూపకల్పన ప్రాజెక్టుకు నాయకత్వం వహించిన శాస్త్రవేత్త టెస్సీ థామస్.. ఇలా ఎందరో మహిళా శాస్త్రవేత్తలు ఈ రంగంలో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.రోజువారీ ఆవిష్కరణలు..1 పేపర్ బ్యాగ్ యంత్రం మార్గరెట్ ఎలోయిస్ నైట్పర్యావరణ రక్షణలో భాగంగా ఉపయోగించే పేపర్ బ్యాగులను ఉత్పత్తి చేసే యంత్రాన్ని రూపొందించింది శాస్త్రవేత్త మార్గరెట్ ఎలోయిస్ నైట్ 1870లో ఈస్టర్న్ పేపర్ బ్యాగ్ కంపెనీని స్థాపించి, ఎంతోమంది మహిళలకు ఉపాధి కల్పించారు.2 కాఫీ ఫిల్టర్ మెలిట్టా బెండ్జ్ఉదయాన్నే లేచి కాఫీ తాగితే వచ్చే ఆనందం కంటే, చివర్లో మిగిలిన పొడితో కాఫీ తాగడం ఇబ్బందికరమే! మొదటిసారి పలుచటి కాగితంతో మెలిట్టా బెండ్జ్ కాఫీ ఫిల్టర్ను తయారుచేశారు. ఇది మరెన్నో కాఫీ ఫిల్టర్స్ తయారీకి ఆధారంగా నిలిచింది.3 విండ్ షీల్డ్ వైపర్స్ మేరీ ఆండర్సన్దుమ్ము, ధూళి, మంచు, నీరు, ఇతర పదార్థాలను వెంటనే తొలగించి, ప్రయాణం సాఫీగా సాగించే విండ్ షీల్డ్ వైపర్స్ను 1903లో, మేరీ ఆండర్సన్ రూపొందించారు.4 జీపీఎస్ గ్లాడిస్ వెస్ట్తెలియని ప్రాంతాలకు వెళ్లాలన్నా, వాటి గురించి తెలుసుకోవాలన్నా ఉపయోగపడే జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) ప్రోగ్రామింగ్ రూపకల్పనలో గ్లాడిస్ వెస్ట్ కీలక పాత్ర పోషించారు.5 గ్యాస్ హీటర్ అలిస్ ఎ పార్కర్శీతకాలంలో ఇంట్లో వెచ్చదనాన్ని అందించే గ్యాస్ హీటర్ను అలిస్ ఏ పార్కర్ రూపొందించారు. ఈ గ్యాస్ హీటర్ మరెన్నో ఎలక్ట్రికల్ హీటర్స్కు స్ఫూర్తినిచ్చింది.6 డిష్ వాషింగ్ మెషిన్ జోసెఫిన్ కోక్రాన్వంట సామాన్లను శుభ్రం చేసే, మొదటి డిష్ వాషింగ్ మెషిన్ను 1839లో జోసెఫిన్ కోక్రాన్ రూపొందించారు.7 వీఐఓపీ టెక్నాలజీ (వీడియో కాల్స్) మెరియన్ క్రోక్ప్రస్తుతం వీడియో కాల్స్ మాట్లాడుకోగలుగుతున్నామంటే కారణం మెరియన్ క్రోక్ .. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో కృషి చేశారు.8 ఫ్రీక్వెన్సీ హోపింగ్ హెడీ లామర్హెడీ లామర్ గొప్ప ఆమెరికన్ నటి మాత్రమే కాదు, ఫ్రీక్వెన్సీ హోపింగ్ టెక్నాలజీని 1941లో కనుగొన్నారు. ఈ టెక్నాలజీనీ వైఫై, బ్లూటూత్లలో ఉపయోగిస్తున్నారు.మీకు తెలుసా?(యునెస్కో గణాంకాల ప్రకారం.. )⇒ ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలలో మహిళల శాతం 33.3%⇒ మహిళా శాస్త్రవేత్తలకు సమాన అవకాశాలిస్తున్న దేశాలు 30⇒ ‘స్టెమ్’ విభాగాల్లోని విద్యార్థుల్లో మహిళలు 35%⇒ ఇప్పటివరకు నోబెల్ పొందిన మహిళలు 22⇒ జాతీయ సైన్స్ అకాడమీలలో మహిళల శాతం 12%⇒ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక రంగాలలో మహిళల శాతం 22%సైన్స్లో లింగ వివక్ష మహిళలను అభివృద్ధినే కాకుండా, దేశ అభివృద్ధిని కూడా నిరోధిస్తుంది. మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండటానికి గల కారణాలలో లింగ వివక్ష, సామాజిక ఒత్తిడి, ఆర్థిక పరిమితులు, పరిశోధనలకు నిధుల కొరత. గుర్తింపులో అసమానతలు వంటి సమస్యలను మహిళా శాస్త్రవేత్తలు ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారు. పురుషులతో పోల్చుకుంటే మహిళా శాస్త్రవేత్తలు చేపట్టే పరిశోధనలకు నామమాత్రంగా నిధులు మంజూరవుతుంటాయి.ఇలాంటి పరిస్థితుల్లోనూ శాస్త్ర సాంకేతిక పరిశోధకుల మొత్తం సంఖ్యలో మహిళలు 33.3% ప్రాతినిధ్యం వహిస్తుండటం విశేషం. అయితే, శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందుతున్న వేగంగా, ఈ రంగాల్లో మహిళలకు లభించాల్సిన ప్రోత్సాహంలో వేగం కనిపించడం లేదు. అందుకే, శాస్త్ర సాంకేతిక రంగాలలో మహిళలకు, బాలికలకు సమాన అవకాశాలను కల్పించి, లింగ వివక్షను, వ్యత్యాసాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవడం ఎంతైనా అవసరం. -
బందరు బ్యాంక్ @ 219 ఏళ్లు
సాక్షి, మచిలీపట్నం: ఒకవైపు సముద్రతీరం మరోవైపు కృష్ణమ్మ ఒడి.. ఒడ్డున వెలిసిన ప్రాచీన పట్టణం మచిలీపట్నం. ఇక్కడ ఏర్పాటు చేసిన బ్యాంక్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని పొందింది.ఈ బ్యాంక్ ఏకంగా 218 వసంతాలు పూర్తి చేసుకొని 219వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. బ్రిటీష్ పాలనలో ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు చెల్లించేందుకు ఏర్పాటు చేసిన ఈ బ్యాంక్ నేడు సామాన్య ప్రజలకు వివిధ రకాల సేవలందిస్తోంది.అప్పట్లో ఇది బ్యాంక్ ఆఫ్ మద్రాస్గా ఆవిర్భవించి.. అనంతరం ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది. గుంటూరు బ్యాంక్కు సబ్ బ్రాంచ్గా ఉన్న ఈ బ్యాంక్ 1908లో ప్రత్యేక బ్రాంచ్గా ఆవిర్భవించింది. జనవరి 1వ తేదీతో ప్రత్యేక బ్రాంచ్ ఏర్పడి 117 ఏళ్లు పూర్తయ్యాయి. బ్రిటిష్ కాలంలో ఓ వెలుగు వెలిగిన పట్టణం బ్రిటీష్వారు తమ పాలనకు ఎంతో అనువైన పట్టణంగా మచిలీపటా్నన్ని గుర్తించి తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ రోజుల్లో మచిలీపట్నం దేశంలో మూడో మున్సిపాలిటీగా గుర్తింపు పొందింది. ఇక్కడి నుంచి ఎందరో స్వాతంత్య్రం కోసం సాగిన పోరులో పాల్గొనడంతో పాటు రాజకీయ, సినీ, సామాజిక రంగాల్లో రాణించారు. మచిలీపట్నంలోని లక్ష్మీ టాకీస్ సెంటర్లో ఉన్న స్టేట్ బ్యాంక్కు ఎంతో చరిత్ర ఉంది. రిటైర్డ్ ఉద్యోగులు, చరిత్రకారుల వివరాల మేరకు.. 1806లో దీన్ని బ్యాంక్ ఆఫ్ మద్రాస్గా 14 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేశారు. దీనికి అనుబంధంగా ఉద్యోగులు శిక్షణ కేంద్రం కూడా నెలకొల్పారు. 1905 నుంచి గుంటూరు బ్యాంక్కు అనుబంధంగా సబ్ బ్రాంచ్గా నిర్వహించి, 1908 జనవరి 1 నుంచి ప్రత్యేక బ్రాంచ్గా ఏర్పాటు చేశారు.1923లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఏర్పడి, 1955 జూన్ 30 వరకు సేవలందించింది. అదే ఏట జూలై 1 నుంచి ఆర్బీఐలో విలీనమై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది. మచిలీపట్నం పేరు ఆర్బీఐలో మసులీపట్నంగా నమోదు కాగా నేటికీ అదే పేరు ఉంది. ఉద్యోగులు, పెన్షనర్ల కోసం.. బ్రిటిష్ కాలంలో ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ఇక్కడ బ్యాంక్ ఏర్పాటు చేశారు. నాడు పదిమంది లోపు మాత్రమే ఉద్యోగులు ఉండేవారు. 1955లో స్టేట్ బ్యాంక్గా ఏర్పడిన తరువాత ఉద్యోగుల సంఖ్య 20కి చేరింది. అప్పట్లో బ్యాంకింగ్ సేవలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే ఉండేవి. ఆ రోజుల్లో వందల్లోనే ఖాతాదారులు, పదుల్లో లావాదేవీలు జరిగేవి. నేడు 50 వేలకు పైగా ఖాతాదారులు ఉండగా రోజూ వెయ్యికి పైగా లావాదేవీలు జరుగుతున్నాయి. 1905లో ఏర్పాటు చేసిన బ్యాంక్ ఆంగ్లేయులకు అన్ని విధాలా ఉపయోగపడింది. రెండో ప్రపంచయుద్ధం (1913–1945) సమయంలో ఆంగ్లేయులు పెద్ద మొత్తంలో డబ్బు, బంగారం ఈ బ్యాంక్లో భద్రపరచినట్లు పెద్దలు చెబుతున్నారు. -
అతి పే.....ద్ద రేడియో జెట్
ఇదేమిటో తెలుసా? ఇప్పటిదాకా మనిషి కంటికి చిక్కిన అతి పెద్ద రేడియో జెట్. కాంతివేగంతో దూసుకెళ్లే ఎలక్ట్రో మ్యాగ్నటిక్ రేడియేషన్, అంతరిక్ష ధూళితో కూడిన ప్రవాహాలు. క్వాజార్గా పిలిచే కృష్ణబిలాల సమూహాలు నుంచి ఇవి పుట్టుకొస్తుంటాయి. వీటి ఉనికి ఇంత స్పష్టంగా చిక్కడం ఇదే తొలిసారి. ఈ రేడియో జెట్ ఏకంగా 2 లక్షల కాంతి సంవత్సరాల పొడవున పరుచుకుని ఉన్నట్టు తేలడం సైంటిస్టులనే విస్మయపరుస్తోంది. అంటే పాతపుంత కంటే రెట్టింపు పరిమాణంలో ఉంది! డర్హాంకు చెందిన పరిశోధకుల బృందం ఇంటర్నేషనల్ లో ఫ్రీక్వెన్సీ అర్రే (లోఫర్) టెలిస్కోప్ ద్వారా దీన్ని ఉనికిని కనిపెట్టింది. ఇది విశ్వం ఆవిర్భవించిన తొలినాళ్లలో ఏర్పడ్డ జే1601+3102 అనే క్వాజార్ నుంచి పుట్టుకొచ్చిన రేడియో జెట్ అని నిర్ధారణయింది. దీని పుట్టుకకు కారణమైన కృష్ణబిలం పరిమాణంలో మరీ పెద్దదేమీ కాకపోవడం సైంటిస్టులను మరింత ఆశ్చ ర్యపరుస్తోంది. అతి భారీ కృష్ణబిలాలు మా త్రమే భారీ రేడియో జెట్లకు జన్మనిస్తాయని భావించేవారు. దీనిద్వారా అతి భారీ కృష్ణబిలాల ఆవిర్భావంపై కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హైరిస్క్ జోన్లో వందేభారత్!
కుదుపులు లేని వేగవంతమైన ప్రయాణం, ఆధునిక కప్లింగ్ సిస్టం వల్ల కోచ్ల మధ్య సమన్వయం, ‘కవచ్’(Kavach)ఏర్పాటుతో ప్రమాదాలకు అతి తక్కువ ఆస్కారం.. వందేభారత్ రైళ్ల(Vande Bharat) గురించి రైల్వే శాఖ చెప్పే విశేషాలివి. నిజానికి ఈ రైళ్లు హై రిస్క్ జోన్లో పరుగు పెడుతున్నాయి. ఒక్క ప్రాంతంలో తప్ప మరెక్కడా రైలు ప్రమాదాలు నివారించే కవచ్ వ్యవస్థ ఈ రైళ్లలో లేదు. ఢిల్లీ–ఆగ్రా, మధుర–పల్వాల్ సెక్షన్ల మధ్య 86 కి.మీ. నిడివిలో మాత్రమే వందేభారత్ రైళ్లు సురక్షితంగా ప్రయాణిస్తాయి.మిగతా ప్రాంతాల్లో సాధారణ రైళ్లకు ఉన్న ప్రమాద భయం వీటినీ వెంటాడుతోంది. గంటకు 50 – 70 కి.మీ. సగటు వేగంతో ప్రయాణించే సాధారణ రైళ్లు నిరంతరం ‘రిస్క్’లో ఉంటే.. 100 కి.మీ. సగటు వేగం (గరిష్టం 130 కి.మీ.)తో దూసుకెళ్లే వందేభారత్ రైళ్లు హై రిస్కులో ఉన్నాయని స్పష్టమవుతోంది. తెలంగాణ మీదుగా నడుస్తున్న ఐదు వందేభారత్ రైళ్లు ప్రమాదకరంగానే పరుగు పెడుతున్నాయి. పట్టాలపై రైళ్ల అధిక సాంద్రత, సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునీకరించకపోవటం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి. – సాక్షి, హైదరాబాద్ఆ పరికరం నిరుపయోగమే.. ప్రస్తుతం వందేభారత్ రైళ్లలో కవచ్ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. లోకో పైలట్ నిర్లక్ష్యంగా ఉన్నా, తప్పుడు సిగ్నల్తో వేరే రైళ్లకు చేరువగా దూసుకెళ్లినా రైలు తనంతట తానుగా బ్రేక్ వేసుకుంటుందనే భావన చాలా మందిలో ఉంది. కానీ, రైళ్ల లోకోమోటివ్లలో మాత్రమే కవచ్ యంత్రం ఉంటే నిరుపయోగమే. కవచ్ వ్యవస్థ పనిచేయాలంటే, రైలు ఇంజిన్లలో కవచ్ పరికరం ఉండటంతో పాటు, ప్రతి స్టేషన్లో కవచ్ వ్యవస్థ ఉండాలి.అక్కడి ట్రాక్ వెంట ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్స్ ఏర్పాటు చేయాలి. ట్రాక్ వెంట ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ఉండాలి. వీటిని అనుసంధానిస్తూ ఆ మార్గంలో నిర్ధారిత నిడివిలో టెలికం టవర్లు ఏర్పాటు చేయాలి. ఇవన్నీ అనుసంధానమై పనిచేసినప్పుడే రైళ్లు వాటంతట అవి ప్రమాదాన్ని నివారించుకోగలవు. లోకో పైలట్లను కవచ్ వ్యవస్థ అప్రమత్తం చేస్తుంది. మిగతావి ఏవీ లేకుండా కేవలం ఇంజిన్లలో కవచ్ పరికరంతో పరుగుపెట్టే వందేభారత్లు ప్రమాదాన్ని నివారించుకోలేవని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఒకే మార్గంలో.. ఢిల్లీ–ఆగ్రా మధ్య దేశంలోనే అత్యంత వేగవంతమైన రైలు గతిమాన్ ఎక్స్ప్రెస్ పరుగు పెడుతోంది. దీని వేగం గంటకు 160 కి.మీ.. ఈ వేగాన్ని సాధారణ ట్రాక్ తట్టుకోలేదన్న ఉద్దేశంతో ఆ మార్గంలో 125 కి.మీ. ప్రత్యేక ట్రాక్ నిర్మించారు. అదే మార్గంలోని మధుర–పల్వాల్ సెక్షన్ల మధ్య 86 కి.మీ. మేర పూర్తిస్థాయి కవచ్ వ్యవస్థ ఏర్పాటైంది. ఆ మార్గంలో మాత్రమే రైళ్లు కవచ్ రక్షణతో ఉన్నట్టు. ఆ మార్గంలో ఒకే ఒక వందేభారత్ రైలు నడుస్తోంది.దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని లింగంపల్లి–వికారాబాద్–వాడీ సెక్షన్ల మధ్య 245 కి.మీ. మేర కవచ్ ఏర్పాటైంది. కానీ ఆ మార్గంలో వందేభారత్ రైలు తిరగటం లేదు. మన్మాడ్–ముధ్ఖేడ్–డోన్ మధ్య 959 కి.మీ... బీదర్–పర్బణి మధ్య 241 కి.మీ. మేర కవచ్ వ్యవస్థ ఏర్పాటైంది. నార్తర్న్ రైల్వే పరిధిలో కూడా కొంతమేర ఉంది. మొత్తంగా 1,548 రూట్ కి.మీ. మేర మాత్రమే ఇది ఏర్పడింది. మరో 3 వేల కి.మీ.లో పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వం వందేభారత్ రైళ్లను పెంచటంపై ప్రదర్శిస్తున్న వేగం.. కవచ్ వ్యవస్థ ఏర్పాటులో చూపటం లేదు. -
‘గోల్డెన్’ హీరోనా రాబరీ విలనా?
సినిమాల్లో, కథల్లో రాజుల కాలం నాటి గుప్త నిధుల కోసం అన్వేషిస్తుంటారు. ఎన్నో కష్టాలు అనుభవించి నిధిని కనుగొంటారు. ఆ సంపదతో గొప్పవాళ్లుగా మారిపోతుంటారు. ఇదీ అలాంటిదే. కానీ నిజంగా జరిగిన కథ. సముద్రంలో టన్నులకొద్దీ బంగారంతో మునిగిపోయిన ఓడను కనిపెట్టినా.. జైలులో మగ్గుతున్న ఓ ఆధునిక ‘ట్రెజర్ హంటర్’వ్యథ. చివరికి ఓ న్యాయమూర్తి తీర్పుతో త్వరలో విడుదల కాబోతున్న బంగారం నిధి వేటగాడు, శాస్త్రవేత్త ‘టామీ గ్రగరీ థాంప్సన్’గాథ. – సాక్షి సెంట్రల్ డెస్క్ ఓ నిధి వేటగాడి నిజమైన కథ..అది 1857వ సంవత్సరం.. సుమారు 21 టన్నుల బంగారం తీసుకుని ఎస్ఎస్ సెంట్రల్ అమెరికా అనే ఓడ అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి న్యూయార్క్కు బయలుదేరింది. ఒక్కసారిగా విరుచుకుపడ్డ తుఫానుతో సముద్రం మధ్యలోనే ఓడ మునిగిపోయింది. ‘షిప్ ఆఫ్ గోల్డ్’గా పేరుపొందిన ఆ ఓడ, దానిలోని బంగారం కోసం ఎందరో అన్వేషిoచినా జాడ దొరకలేదు. అలా బంగారం వేటకు దిగినవారిలో శాస్త్రవేత్త టామీ గ్రెగరీ థాంప్సన్ నేతృత్వంలోని బృందం ఒకటి. అప్పటికే కొన్నేళ్లుగా పరిశోధన చేస్తున్న థాంప్సన్.. 1988లో సోనార్ సాయంతో సముద్రం అడుగున జల్లెడ పడుతుండగా ‘షిప్ ఆఫ్ గోల్డ్’జాడ పట్టేసుకున్నాడు. బంగారం కరిగించి నాణాలుగా మార్చి..అమెరికాలోని కొందరు ధనికులు థాంప్సన్ పరిశోధనకు స్పాన్సర్ చేశారు. నిధి దొరికితే ఎవరి వాటా ఎంతెంత అని ముందే ఓ మాట అనుకున్నారు. 1988లో ఓడ జాడ దొరికినా.. బంగారం నిధిని రూఢీ చేసుకుని, వెలికి తీయడానికి కొన్నేళ్లు పట్టింది. బయటికి తీసిన బంగారాన్ని కరిగించి నాణాలుగా మార్చారు. అలా మార్చిన బంగారు నాణాల్లో 500 నాణాలు మాయమయ్యాయి. అది చేసినది థాంప్సన్. వాటిని ఏం చేశాడు? తీసుకెళ్లి.. రెండు అమెరికా ఖండాల మధ్య ఉండే ‘బెలిజ్’అనే చిన్న దేశంలో ఓ ట్రస్టుకు దానమిచ్చాడు. అంతే అంతకన్నా ఒక్కముక్క కూడా బయటపెట్టలేదు. పదేళ్లుగా జైల్లోనే.. త్వరలోనే విడుదల.. అధికారులు 2015లో థాంప్సన్ను జైల్లో పెట్టారు. నాణాల జాడ చెప్పనంత కాలం.. రోజుకు వెయ్యి డాలర్లు (సుమారు రూ.87 వేలు) జరిమానా చెల్లించాలని ఆదేశించారు. సుమారు పదేళ్లుగా థాంప్సన్ జైల్లోనే ఉన్నారు. ఆయన చెల్లించాల్సిన జరిమానా.. 33,35,000 డాలర్లకు (మన కరెన్సీలో రూ.29 కోట్లకు) చేరింది. ఆయన మాయం చేసిన బంగారు కాయిన్ల విలువ 2.5 మిలియన్ డాలర్లు (మన కరెన్సీలో రూ.22 కోట్లు)గా అంచనా వేశారు. థాంప్సన్ పదేళ్లుగా జైల్లోనే ఉన్నారు. వయసు ఇప్పుడు 72 ఏళ్లు. ఆయన మాయం చేసిన బంగారం విలువ కంటే.. చెల్లించాలన్న జరిమానానే చాలా ఎక్కువైపోయింది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న ఓ న్యాయమూర్తి థాంప్సన్ను విడుదల చేయాలని తాజాగా తీర్పు ఇచ్చారు. కానీ తన పరిశోధనకు స్పాన్సర్ చేసిన ధనికులు పెట్టిన ఓ క్రిమినల్ కేసులో థాంప్సన్ రెండేళ్ల జైలుశిక్ష అనుభవించాల్సి ఉంది. ఆ తర్వాతే బయటికొస్తాడన్నమాట. ఆ బంగారం ఎవరికి ఇచ్చినదీ ఇప్పటికీ థాంప్సన్ బయటపెట్టలేదు. ట్రస్టు ద్వారా పేదలకు సాయం కోసం ఇచ్చిన ‘గోల్డెన్’ హీరోనా? సొమ్ము దోచేసుకున్న విలనా? -
కళంకారి వెలుగు దారి
కలంకారి అనే మాట ఎంతో సుపరిచితం. అయితే ఈ సుప్రసిద్ధ కళ చరిత్ర చాలామందికి అపరిచితం. ఆ ఘనచరిత్రను ఈ తరానికి పరిచయం చేయడానికి, కలంకారీని మరింత వైభవంగా వెలిగించడానికి పూనుకుంది లీలావతి. కలంకారి అద్దకపు పనికి బోలెడంత ఓపిక కావాలి అంటారు. పరిశోధకులకు కూడా అంతే ఓపిక కావాలి. పెద్ద వస్తువు నుంచి చిన్నవాక్యం వరకు ఎన్నో ఎన్నెన్నో పరిశోధనకు ఇరుసుగా పనిచేస్తాయి. ఈ ఎరుకతో కలంకారిపై లోతైన పరిశోధన చేసిన లీలావతి.. ఆ కళపై పీహెచ్డీ పట్టా పొందిన తొలి మహిళగా ప్రశంసలు అందుకుంటోంది..కలంకారి అంటే గుర్తుకు వచ్చేది పెడన. కృష్ణాజిల్లా పెడన పట్టణంలో కలంకారి వస్త్రాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. 2,500 సంవత్సరాల క్రితమే ప్రారంభమైన ఈ కళపై చరిత్ర అధ్యాపకురాలు గుడివాడకు చెందిన పామర్తి లీలావతి పరిశోధన చేసింది. ఈ పరిశోధనకు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ నుంచి ఇటీవల పీహెచ్డీ పట్టా అందుకుంది. కలంకారిపై తొలిసారిగా పరిశోధన చేసి పీహెచ్డీ పట్టా పొందిన మహిళగా ప్రశంసలు అందుకుంటోంది.పెడనలోని బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చరిత్ర అధ్యాపకురాలిగా విధుల్లో చేరిన లీలావతికి సహజంగానే అక్కడి వాతావరణం వల్ల కలంకారి కళపై ఆసక్తి పెరిగింది. కళాశాలకు వెళ్లే సమయంలో కలంకారి వస్త్రాలపై ముద్రణ నుంచి కలంకారి కళాకారుల జీవన శైలి వరకు ఎన్నో విషయాలు గమనించేది. నాగార్జున యూనివర్శిటీలో కలంకారి పరిశ్రమలపైన, ఆయా కుటుంబాల సామాజిక పరిస్థితులపై ఒకసారి పరిశోధన ప్రసంగం చేసింది.ఆ ప్రసంగానికి మంచి స్పందన లభించింది. ఆ సమయంలోనే ‘కలంకారి కళ’పై పీహెచ్డీ చేయాలనే ఆలోచన వచ్చింది. నాగార్జున విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ స్టూడెంట్గా ప్రవేశం పొందింది. ‘కలంకారి కళకు సుదీర్ఘ చరిత్ర ఉంది. దేశవిదేశాల్లో గుర్తింపు ఉన్న కలంకారిపై ఇప్పటి వరకు ఎవరూ పరిశోధన చేయక పోవడంతో నేనే ఎందుకు చేయకూడదని నిర్ణయించుకుని ఆ దిశగా అడుగులు వేశాను’ అంటుంది లీలావతి. విజయవాడలోని పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చరిత్ర అధ్యాపకురాలిగా పనిచేస్తున్న లీలావతి కలంకారిపై మరిన్ని పరిశోధనలు చేయాలని ఆశిద్దాం. ఎన్నో దారులలో...కలంకారిపై పరిశోధనలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా పొందడం సంతోషంగా ఉంది. కలంకారి పరిశ్రమ చరిత్ర, సంస్కృతి, దేశ విదేశాల్లో ఉన్నప్రాధాన్యం, ఆదరణ, కార్మికుల జీవన స్థితిగతులపై నా పరిశోధనలో సమగ్రంగా తెలుసుకున్నాను. పరిశోధనలో ఉన్న విశేషం ఏమిటంటే ఒక దారి అనేక దారులకు దారి చూపుతుంది. ఇలా కలంకారి గురించి అనేక కోణాలలో అనేక విషయాలు తెలుసుకోగలిగాను.– పామర్తి లీలావతి– నారగాని గంగాధర్ సాక్షి, పెడన -
రాయల నాటి రాజసానికి చిహ్నం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: చట్టూరా ప్రకృతి సోయగాలు.. కనువిందు చేసే జలపాతాలు, ప్రాచీన పుణ్యక్షేత్రాలు, కళ్లు తిప్పుకోనివ్వని శిల్పాలతో నిర్మాణాలు, తిరుమల గిరులను పోలిన ఎత్తయిన పర్వత శ్రేణులు.. అడుగడుగున కనిపించే అలనాటి రాచ మందిరాలు.. ఒకటేమిటి ఎన్నో విశిష్టతలతో నిండిన ఉదయగిరి ప్రాంతం పర్యాటక శోభకోసం ఎదురుచూస్తోంది. గత ప్రభుత్వంలో సిద్దేశ్వరం, దుర్గంపల్లి ప్రాంతాలను అటవీశాఖ ఎకో టూరిజం స్పాట్స్గా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు పంపింది .. ఈ లోపే ప్రభుత్వం మారడంతో ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉదయగిరి దుర్గానికి ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉంది. చోళులు, పల్లవులు, రెడ్డి రాజులు, గజపతులు, విజయనగర రాజులు, గోల్కోండ నవాబులు ఏలిన ఈ ప్రాంతం ఒకప్పుడు వైభవోపేతంగా విలసిల్లింది. కాలక్రమేణా తన ప్రాభవాన్ని పూర్తిగా కోల్పోయింది. ప్రస్తుతం అలనాటి రాచరిక పాలనకు గుర్తులుగా కనిపించే మొండి గోడలు, శిథిల రాజభవనాలు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. జిల్లా కేంద్రానికి వందకిలోమీటర్ల దూరంలో, నీటి వసతిలేని మెట్ట ప్రాంతంగా ఉదయగిరి అభివృద్ధికి దూరంగా ఉండిపోయింది. తొలి సూర్యకిరణాల పడే గిరి.. ఉదయగిరి కోట సముద్ర మట్టానికి 755 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ ఉష్ణోగ్రత గరిష్టంగా 20 డిగ్రీలు మాత్రమే ఉంటుంది. ఉదయగిరి కోట 5 కి.మీ వ్యాసార్ధంతో తిరుమల కొండను పోలి ఉంది. పచ్చని పచ్చిక బయళ్లతో, వన్యప్రాణులతో ఇక్కడ ప్రకృతి సౌందర్యం విరాజిల్లుతూ ఉంటుంది. ఉదయ సూర్యుని తొలికిరణాలు ఈ కొండపైనే ముందుగా పడుతుండటంతో దీన్ని ఉదయగిరిగా విజయనగరం రాజలు పేరుపెట్టారు. ఈ ఉదయగిరి కోటలో శ్రీకృష్ణదేవరాయలు 18 నెలలు ఉండి పాలన సాగించారు.చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి విజయనగర రాజులు ఉదయగిరి ప్రాంతంలో దేవాలయాలు, కోనేరులు నిరి్మంచారు. శ్రీకృష్ణ దేవరాయలు నిరి్మంచిన ఆలయాలు, నవాబులు నిర్మించిన మసీదులు, రాణీ మందిరాలు, ధాన్యాగారాలు, గుర్రపు శాలలు, ఫిరంగి కోటలు, కోనేరులు, సొరంగ మార్గం నేటికీ ఉన్నాయి. ఉదయగిరి దుర్గం కింద పట్టణంలో తల్పగిరి రంగనాయకులస్వామి దేవాలయం, కృష్ణాలయం, కల్యాణమండపం నేటికీ చూపరులను ఆకర్షిస్తున్నాయి. నెల్లూరులో ఉన్న రంగనాయకుల స్వామి విగ్రహం ఉదయగిరి నుంచి తరలించిందే కావటం విశేషం. శ్రీకృష్ణ దేవరాయల పాలనకు గుర్తుగా ఉదయగిరి ట్యాంక్బండ్ సమీపంలో కల్యాణ మండపం, కోనేరు అలనాటి శిల్పకళా వైభవాన్ని చాటిచెబుతాయి. ఉదయగిరి నుంచి బండకిందపల్లికి వెళ్లే ఘాట్రోడ్డులో పాదచారుల కోసం రాతిలో తవ్విన బావి నేటికీ తానాబావిగా ప్రసిద్ధి చెందింది. అనంతరం బ్రిటిష్ పాలనలో స్టేట్ దొర నిరి్మంచిన ప్రార్థనా మందిరం, తహసీల్దారు కార్యాలయ భవనాలు నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. చూడదగిన ప్రదేశాలు ఉదయగిరికి 33 కి.మీ దూరంలో అత్యంత ప్రాచీనమైన, అతి శక్తివంతమైన ఘటిక సిద్ధేశ్వరం శైవక్షేత్రం ఉంది. అగస్త్య మహాముని తపోపీఠమైన ఈ క్షేత్రం శ్రీకృష్ణ దేవరాయలకు యుద్ధకాలంలో దుర్గంకు దారి చూపించింది. సిద్ధేశ్వరానికి అతి సమీపంలో ఉన్న బూసానాయుడు కోటను అభివృద్ధి చేయవచ్చు. సిద్ధేశ్వరం నుంచి మరో 30 కి.మీ దూరంలో ప్రకృతి సోయగాల నడుమ పయనిస్తూ ముందుకు వెళితే 7, 8 శతాబ్దాల్లో పల్లవుల కాలంలో అద్భుతమైన శిల్పాకళా నైపుణ్యంతో రూపుదిద్దుకున్న ఒకే రాతిపై దేవాలయం, ద్వారపాలకులు, శివలింగాలు, నందీశ్వరుడు కొలువైన భైరవకోన ఉంది. ఇక్కడ ఏడాది పొడవునా జాలువారే జలపాతాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి.. అక్కడి నుంచి మరో 24. కి.మీ ముందుకు వెళితే నారాయణస్వామి ఆలయం ఉంది. అక్కడి నుంచి మరో పది కి.మీ దూరంలో హనుముని కొండ ఉంది. అక్కడి నుంచి మరో 25 కి.మీ ముందుకు వెళితే వెంగమాంబ దేవాలయాన్ని సందర్శించవచ్చు. అభివృద్ధిని మరచిన పాలకులు ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందితే ఎంతో మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించే అవకాశముంది. గత ఐదు దశాబ్దాలుగా ఈ ప్రాంతం అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయి. ఉదయగిరి ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని చెబుతున్న పాలకులు ఆచరణలో విఫలమయ్యారు. ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా ఉన్న సమయంలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆనాటి కేంద్ర మంత్రులు అనంతకుమార్, సుష్మాస్వరాజ్ను ఉదయగిరి పిలిపించి హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. అప్పట్లో ఉదయగిరి ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని అంతా భావించారు. కానీ ఎందుకో ఆ హామీలు నెరవేరలేదు.ప్రతిపాదనలు చేసి.. తిరుమల కొండలను మరిపించే పర్వతశ్రేణులు, పచ్చని ప్రకృతి రమణీయతను పుణికి పుచ్చుకున్న సిద్దేశ్వరం, దుర్గంపల్లి ప్రాంతాలను టూరిజం స్పాట్గా అభివృద్ధి చేసేందుకు గత ప్రభుత్వం అటవీశాఖ ద్వారా ప్రణాళిక సిద్ధం చేయించింది. చిన్నపిల్లల ఆటలకు అనువుగా పార్కులు, తాగునీటి వసతి, సేదతీరేందుకు గదులు, గార్డెన్స్, జిమ్లు, ఫిట్నెస్ సెంటర్లు, యోగా కేంద్రాలు, ప్రకృతి అందాలు వీక్షించేందుకు వాచ్ టవర్లు, సోలార్ షెడ్స్, లైట్లు ఇలా ఒక్కో ప్రాంతంలో 45 రకాల పనులకు రూ.2.78 కోట్ల చొప్పున అంచనాలతో గత ప్రభుత్వంలో ప్రతిపాదనలు పంపించారు. ఆసమయంలో ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో ఆ ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే మనసుపెట్టి పనులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.వెయ్యేళ్ల చరిత్ర ఉదయగిరి దుర్గానికి వెయ్యేళ్ల చరిత్ర ఉంది. గత ఐదు దశాబ్దాలుగా ఉదయగిరి దుర్గాన్ని పర్యాటక కేంద్రంగా చేయాలని ఈప్రాంత ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వాలు పంపిన ప్రతిపాదనలు కాగితాలకేపరిమితమవుతున్నాయి. ఉదయగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్దిచేస్తే ఈ ప్రాంతం ఎంతో అభివృద్దిచెందుతుంది.– ఎస్కె.ఎండి.ఖాజా, చరిత్ర కారుడు, ఉదయగిరి -
రాబందు.. కనువిందు
పర్యావరణ బంధువైన నల్ల రాబందు (సినేరియన్, ఇండియన్ వల్చర్) కృష్ణా జిల్లా చినగొల్లపాలెం ఏటిపొగరులో లభ్యమైంది. వేటాడే అతిపెద్ద పక్షుల్లో ఒకటైన నల్ల రాబందు అంతరించిపోతున్న జాబితాలో ఉంది. ఈ అరుదైన పక్షి గంధం సూర్యారావు అనే మత్స్యకారుడి వద్ద అటవీ శాఖ అధికారులు గురువారం గుర్తించారు. మూడు రోజుల క్రితం నీటిలో తడిసిపోవడంతో ఎగరలేక సముద్రపు ఒడ్డున పడి ఉన్న ఈ భారీ పక్షిని సూర్యారావు ఇంటికి తీసుకొచ్చి పంజరంలో పెంచుతున్నాడు. సమాచారం అందుకున్న ఏలూరు జిల్లా అటవీశాఖ అధికారి బి.విజయ కైకలూరు అటవీశాఖ డెప్యూటీ రేంజ్ ఆఫీసర్ రంజిత్కుమార్, సిబ్బందిని ఘటనా స్థలానికి పంపించి దానిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పంచనామా జరిపించి నల్ల రాబందును సంరక్షణ నిమిత్తం విశాఖ జూకు తరలించారు. – కైకలూరు/కృత్తివెన్నుఅంతరించి పోవడానికి ఇదీ కారణంజంతు కళేబరాలను ఆహారంగా తీసుకుంటూ ప్రకృతి సవాళ్లను సమతుల్యం చేయడంలో రాబందుల పాత్ర కీలకం. వెటర్నరీ వైద్యుడు సుశాంత్ ఈ జాతి కనుమరుగైపోవడానికి కారణాలను వివరిస్తూ.. ‘పశువులకు గతంలో డైక్లోఫినాక్ అనే మందును ఇచ్చేవారు. ఆ పశువు చనిపోయిన తరువాత కూడా వాటి శరీర భాగాల్లో ఆ మందు నిక్షిప్తమై ఉండేది. ఆ కళేబరాన్ని తిన్న రాబందుల మూత్రపిండాలపై అది తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ కారణంగా రాబందులు అధిక సంఖ్యలో మృత్యువాత పడి అంతరించేపోయే దశకు చేరుకున్నాయి’ అని వివరించారు. తరువాత కాలంలో ఆ మందును నిషేధించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్నారు.ప్రత్యేకతలివీ..ఈ రాబందు శరీర పొడవు 3 అడుగుల 11 అంగుళాలు ఉండగా.. రెక్కల పొడవు ఒక్కొక్కటి 5 అడుగులు చొప్పున ఉన్నాయి. బరువు దాదాపు 14 కిలోలు ఉంది. ఇవి జనవరి, ఫిబ్రవరి నెలల్లో గూడు కట్టుకుని గుడ్లు పెడతాయి. వీటి జీవిత కాలం 39 ఏళ్లు. అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరంపై కూడా దీని జాడను గుర్తించారు. స్పెయిన్, పోర్చుగల్, దక్షిణ ఫ్రాన్స్, గ్రీస్, టర్కీలలో నల్ల రాబందులు ఎక్కువగా సంచరిస్తాయి. ఆఫ్ఘని స్థాన్ మీదుగా ఉత్తర భారతదేశంలోకి ఇవి ప్రవేశిస్తాయి. మంచూరియా, మంగోలియా, కొరియాలలో సంతానోత్పత్తి చేస్తాయి. నదీతీర ఆవాసాలు, పర్వత ప్రాంతాలు, కొండల్లో మృత కళేబరాలను తింటూ జీవిస్తాయి. మెడ ఈకలు బట్టతలగా ఉండటంతో దీనిని సన్యాసి రాబందు అని కూడా పిలుస్తారు.ఆశ్చర్యంగా ఉందిఈ జాతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి పైనా ఉంది. ఈ ప్రాంతంలో అరుదైన రాబందు దొరకడం ఆశ్చర్యంగా ఉంది. ఇది చిన్న వయసున్న పక్షి. దీనిని బట్టి ఈ ప్రాంతంలో ఇంకా దీనికి సంబంధించిన పక్షులు ఉండే అవకాశం ఉంది. ఇటువంటివి ఎవరికైనా కనిపిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలి. – ఎం.రంజిత్, ఫారెస్ట్ డీఆర్వోహాని కలిగించవద్దుప్రకృతిలో ఎన్నో అరుదైన జీవులు సంచరిస్తాయి. వాటిని గుర్తించినప్పుడు హాని చేయకుండా అటవీశాఖ అధికారులకు సమాచారం అందించండి. కొల్లేరు పరిసర ప్రాంతాల్లో కొండ చిలువలు కనిపిస్తున్నప్పుడు గ్రామస్తులు భయంతో వాటిపై దాడి చేస్తున్నారు. అవి విషపూరితం కావు. సమాచారం అందిస్తే సంరక్షిస్తాం. – బి.విజయ, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్, ఏలూరు -
సహజత్వం కోల్పోతున్న నీరు
సాక్షి, సిద్దిపేట: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను తెలంగాణ కుంభమేళాగా అభివర్ణిస్తారు. జాతర జరిగే నాలుగు రోజుల్లో కోటికి పైగా భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి అమ్మవార్లను దర్శించుకుంటారు. అయితే భక్తులు ఉపయోగించే షాంపూలు, సబ్బుల ఇతర కెమికల్స్ వల్ల వాగులో నీరు సహజత్వాన్ని కోల్పోతోందని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల సూక్ష్మ జీవశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ మదన్మోహన్ పరిశోధనల ద్వారా తేల్చారు. వాగులో పుణ్యస్నానాలు చేశాకే... మేడారం జాతరకు జంపన్నవాగుకు విడదీయలేని బంధం ఉంది. కాకతీయులతో యుద్ధం జరిగిన సమయంలో రోజుల తరబడి పోరాటం చేసిన సమ్మక్క కుమారుడు జంపన్న.. మేడారం పొలిమేరలో ఉన్న సంపెంగ వాగులో దూకి ఆత్మార్పణ చేసుకున్నారని చరిత్ర చెబుతోంది. ఆనాటి నుంచి ప్రజలు ఆ వాగును జంపన్నవాగుగా పిలుస్తున్నారు. భక్తజనులు జంపన్నవాగులో పుణ్యస్నానమాచరించి ఆ తర్వాత తల్లుల దర్శనానికి వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. వాగుకు ఇరువైపులా2 కిలోమీటర్ల మేర స్నానఘట్టాలు మేడారంలోని జంపన్నవాగుకు ఇరువైపులా రెండు కిలోమీటర్ల పొడవులో స్నానఘట్టాలు ఉన్నాయి. భక్తులు ఈ వాగులో స్నానం చేసేందుకు వీలుగా లక్నవరం జలాశయం నుంచి జాతర సమయాల్లో నీటిని వదులుతారు. ఈ నీరు స్నానఘట్టాల దగ్గర నిల్వ ఉండేలా ఇసుక బస్తాలతో తాత్కాలిక చెక్డ్యామ్లు నిర్మిస్తారు. మరోవైపు వాగులో ఉన్న ఇన్ఫిల్టరేషన్ వెల్స్ ద్వారా నీటిని తోడి స్నానఘట్టాల దగ్గర ఏర్పాటు చేసిన బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్కు పంపిస్తారు. భక్తులు జంపన్నవాగులో మునక వేసిన తర్వాత బ్యాటరీ ట్యాప్స్ దగ్గర స్నానాలు చేస్తారు. ఇలా కేవలం రెండు కిలోమీటర్ల పరిధిలోనే లక్షలాది మంది భక్తులు జాతర జరిగే నాలుగు రోజుల పాటు నిర్విరామంగా స్నానాలు చేస్తారు. ఈ సమయంలో ఉపయోగించే షాంపులు, సబ్బుల కారణంగా జంపన్న వాగులోని నీరు సహజత్వానికి కోల్పోతోందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీనికి తోడు సహజమైన కుంకుమ స్థానాన్ని చాలా చోట్ల కెమికల్ కుంకుమలు ఆక్రమించడం ఈ సమస్యను మరింత తీవ్రం చేసింది. 18 శాంపిల్స్ సేకరణ గతేడాది ఫిబ్రవరి 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మేడారం జాతర జరిగింది. ఈ సందర్భంగా జాతరకు వారం రోజుల ముందు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల సూక్ష్మజీవశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జంపన్న వాగులో ఆరు చోట్ల, జాతర సమయంలో ఆరు చోట్ల, జాతర ముగిసిన వారం రోజులకు ఆరుచోట్ల ఇలా 18 శాంపిల్స్ సేకరించారు.వీటిని ప్రత్యేక బాటిళ్లలో తీసుకొచ్చి కళాశాలలో టెస్ట్ చేశారు. వాటి ఫలితాలు ఇలా ఉన్నాయి. సాధారణంగా అయితే పీహెచ్ 6.5 నుంచి 8.5, డిజాల్వడ్ ఆక్సిజన్(డీవో) 6 ఎంజీ కంటే ఎక్కువ (లీటరు నీటిలో), బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్(బీవోడీ) 2ఎంజీ అంతకంటే తక్కువ (లీటరు నీటిలో), బాక్టీరియా అసలు ఉండొద్దు. 24, 25 తేæదీల్లో నేపాల్లో ప్రజెంటేషన్ బయోటెక్నాలజీ సొసైటీ ఆఫ్ నేపాల్ ఆధ్వర్యంలో కాఠ్మాండ్లో ఈ నెల 24,25 తేదీల్లో జరిగే 3వ అంతర్జాతీ య బయోటెక్నాలజీ సదస్సుకు జంపన్న వాగులో సాముహిక పుణ్యస్నానాలతో నీటి కాలుష్యంపై చేసిన పరిశోధన పత్రం ఎంపికైంది. దీనిపై పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు డాక్టర్ మదన్మోహన్కు ఆహ్వానం అందింది.నివారణ మార్గాలుసహజత్వాన్ని కోల్పోయిన నీటిలోబ్యాక్టీరియాలు పెరుగుతాయి. ఇలాంటి నీటిలో ఎక్కువ సేపు ఉండటం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. » వాగులో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు దిగువకు వెళ్లేలా నీటి ప్రవాహం కొంచెం ఎక్కువ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. » క్లోరినేషన్ ఎక్కువగా చేయాలి. » సబ్బు, షాంపుల వినియోగం, బట్టలు ఊతకడం, కుంకుమ వేయడాన్నినియంత్రించాలి. » జాతర నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత మళ్లీ స్నానం చేయడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లు రావు అని పరిశోధన ద్వారా నిర్థారణ అయ్యింది. జాగ్రత్తలు పాటించాలి పుణ్యస్నానాలు చేయడం మంచిదే. తగు జాగ్రత్తలు పాటించాలి. పుణ్యస్నానాలు చేసే సమయంలో పూజా ద్రవ్యాలు అందులో వేయొద్దు. షాంపూలు, సబ్బులు వినియోగించడం వలన నీరు సహజత్వం కోల్పోయి కాలుష్యం అవుతుంది. దీంతో చర్మ వ్యాధులు, ఇతర ఇన్ఫెక్షన్లు వస్తాయి. – డాక్టర్ మదన్ మోహన్, సిద్దిపేట ప్రభుత్వడిగ్రీ కళాశాల సూక్ష్మజీవశాస్త్ర విభాగాధిపతి -
బిష్ణోయి స్త్రీలు..: చెట్ల కోసం తలలు ఇచ్చారు
‘పచ్చటి చెట్టు నరకకూడదు’ అని బిష్ణోయ్ తెగ మొదటి నియమం. మన దేశంలో పర్యావరణానికి మొదటి యోధులు బిష్ణోయ్ స్త్రీలే. కరువు నుంచి రక్షించే‘ఖేజ్రీ’ చెట్లను 1730లో రాజభటులు నరకడానికి వస్తే అమృతాదేవి అనే మహిళ తన తల అర్పించి కాపాడుకుంది. ఆమెతో పాటు 363 మంది బిష్ణోయిలు ఆరోజు బలిదానం ఇచ్చారు. బిష్ణోయిల పర్యావరణ స్పృహ గురించి బ్రిటిష్ రచయిత మార్టిన్ గుడ్మాన్ ‘మై హెడ్ ఫర్ ఏ ట్రీ’ పుస్తకం రాశాడు. ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో దాని గురించి మాట్లాడాడు. వివరాలు...అందరూ ఎండు కట్టెలు వంట కోసం నేరుగా పొయ్యిలో పెడతారు. కాని బిష్ణోయి స్త్రీలు ఆ ఎండు కట్టెలను పరీక్షించి వాటి మీద క్రిమి కీటకాలు, బెరడును ఆశ్రయించి ఉండే పురుగులు... వీటన్నింటిని విదిలించి కొట్టి అప్పుడు పొయ్యిలో పెడతారు. ప్రాణం ఉన్న ఏ జీవజాలాన్నీ చంపే హక్కు మనిషికి లేదు’ అని బిష్ణోయిలు గట్టిగా విశ్వసించడమే దీనికి కారణం. బిస్ అంటే 20. నొయి అంటే 9. బిష్ణోయిల ఆది గురువు జంభోజి వారి కోసం 29 నియమాలను ఖరారు చేశారు. వాటిని పాటిస్తారు కాబట్టి వీరిని బిష్ణోయిలు అంటారు. మరో విధంగా వీరు వైష్ణవ పథానికి చెందిన వారు కాబట్టి కూడా విష్ణోయి లేదా బిష్ణోయి అని అంటారు.కరువు నుంచి బయటపడేందుకుపశ్చిమ రాజస్థాన్లో జోద్పూర్, బికనిర్లు బిష్ణోయిల ఆవాసం. 15వ శతాబ్దంలో ఇక్కడ తీవ్రమైన కరువు వచ్చింది. అందుకు కారణం చెట్లు, అడవులు నాశనం కావడమేనని ఆ సమయానికి జీవించి ఉన్న గురు జంభోజి గ్రహించారు. అందుకే చెట్టును కాపాడుకుంటే మనిషి తనను తాను కాపాడుకోవచ్చునని కచ్చితమైన నియమాలను విధించారు. వాటిని శిరోధార్యంగా చేసుకున్న బిష్ణోయిలు నాటి నుంచి నేటి వరకూ గొప్ప పర్యావరణ రక్షకులుగా ఉన్నారు. వీరి ప్రాంతంలో ఉన్న ఖేజ్రీ చెట్లను, కృష్ణ జింకలను వీరుప్రాణప్రదంగా చూసుకుంటారు. జింక పిల్లలను వీరు సాకుతారు. అవసరమైతే చనుబాలు ఇస్తారు.1730 స్త్రీల ఊచకోత1730లో జోద్పూర్ రాజు అభయ్ సింగ్ కొత్త ΄్యాలస్ నిర్మాణానికి కలప కోసం సైనికులను ఖేజర్లీ అనే పల్లెకు పంపాడు. అక్కడ ఖేజ్రీ చెట్లు విస్తారం. ఆ సమయానికి మగవారంతా పశువుల మందను మేపడానికి వెళ్లి ఉన్నారు. ఊళ్లో స్త్రీలు మాత్రమే ఉన్నారు. సైనికులు చెట్లు కొట్టబోతుంటే అమృతాదేవి అనే స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చి అడ్డుపడింది. పచ్చని చెట్టును నరకకూడదు అంది. ఆమెకు ముగ్గురు కూతుళ్లు. వారంతా వచ్చి చెట్లను చుట్టుకుని నిలబడ్డారు. చాలామంది స్త్రీలు అలాగే చేశారు. సైనికులు వెర్రెత్తి పోయారు. గొడ్డలి ఎత్తారు. ‘చెట్టుకు బదులు నా తల ఇస్తాను తీసుకో’ అని గర్జించింది అమృతాదేవి. సైనికులు నిర్దాక్షిణ్యంగా ఆమెను, ఆమె కూతుళ్లను, ఆ తర్వాత మొత్తం స్త్రీ, పురుషులను కలిపి మొత్తం 363 మందిని నరికారు. ఇప్పటికీ ఆ ఊళ్లో ఆ జ్ఞాపకంగా స్మారక స్థూపం ఉంది.చలించిన రచయిత‘2020లో జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్కు వచ్చినపుడు ఈ ఊచకోత గురించి తెలిసింది. పర్యావరణం కోసం ఇలాప్రాణత్యాగం చేసిన స్త్రీలు లేరు. నేను ఇది పుస్తకంగా రాయాలనుకున్నాను’ అన్నాడు బ్రిటిష్ రచయిత మార్టిన్ గుడ్మాన్. 2022లో అతను లండన్ నుంచి వచ్చి ఆరు నెలల పాటు బిష్ణోయి సమూహంతో ఉండి ‘మై హెడ్ ఫర్ ఏ ట్రీ’ పుస్తకం రాశాడు. ‘నేను బిష్ణోయి గురువు జంభోజి ఏ చెట్టు కిందైతే మరణించాడో ఆ చెట్టు కిందకు వెళ్లాను. ఆ రోజు రాజస్థాన్లో 36 డిగ్రీల ఎండ ఉంటే లండన్లో 40 డిగ్రీల ఎండ వుంది. బిష్ణోయిల నుంచి ఈ ప్రపంచం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. బిష్ణోయిలు చెట్లు పెంచుతూ, కుంటలు తవ్వుతూ తమ భూమిని సస్యశ్యామలం చేసుకుంటూనే ఉన్నారు. ఇందులో స్త్రీల కృషి అసామాన్యం. వీరి వల్లే చి΄్కో ఉద్యమ ఆలోచన వచ్చిందని కూడా మనం గ్రహించాలి’ అన్నాడు మార్టిన్ గుడ్మాన్.వేటాడితే జైల్లో వేస్తాంపుస్తకం ఆవిష్కరణ వేడుకలో బిష్ణోయి ఉద్యమకర్త నరేంద్ర బిష్ణోయి కూడా పాల్గొన్నాడు. ‘రాజస్థాన్లో 1972, 1980 చట్టాల ప్రకారం చెట్టు కొడితే 100 రూపాయల ఫైను. ఆ రోజుల్లో 100 పెద్దమొత్తం కావచ్చు. ఇవాళ్టికీ వంద కట్టి తప్పించుపోతున్నారు. ఈ చట్టంలో మార్పు కోసం పోరాడుతున్నాం. మేము పెద్దఎత్తున చెట్లు పెంచుతుంటే అభివృద్ధి పేరుతో సోలార్ ΄్లాంట్ల కోసం ప్రభుత్వం చెట్లు కొట్టేస్తోంది. ఇంతకు మించిన అన్యాయం లేదు. గత రెండు దశాబ్దాలుగా మాప్రాంతంలో కృష్ణ జింకలను చంపిన వారు కోర్టుల్లో ఏదో చేసి తప్పించుకున్నారు. అందుకే మా కుర్రాళ్లే లా చదివి అడ్వకేట్లు అవుతున్నారు. ఇక ఎవరు వేటాడినా వారిని జైళ్లల్లో మేమే వేయిస్తాం’ అన్నాడు నరేంద్ర బిష్ణోయి. ఈ గొప్ప పర్యావరణప్రేమికులు దేశం మొత్తానికి స్ఫూర్తినివ్వాలి. – సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
మార్కెట్కు దేశీ ఇంధనం!
సుమారు 15 ఏళ్ల తదుపరి తొలిసారి దేశీ స్టాక్ మార్కెట్లలో సరికొత్త ట్రెండ్కు తెరలేవనుంది. ఇటీవల దేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (డీఐఐలు) పెట్టుబడులు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐలు) అమ్మకాలను మించుతున్నాయి. దీంతో ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీలలో డీఐఐల వాటా ఎఫ్పీఐలకున్న పెట్టుబడుల విలువను అధిగమించనుంది! ఫలితంగా తొలిసారి లిస్టెడ్ కంపెనీలలో ప్రమోటర్ల తదుపరి అతిపెద్ద వాటాదారులుగా డీఐఐలు నిలవనున్నాయి. వెరసి రేసులో ఎఫ్పీఐలను వెనక్కి నెట్టనున్నాయి.దేశీ లిస్టెడ్ కంపెనీలలో ఈ ఏడాది ప్రమోటర్లేతర ఓనర్íÙప్లో ఆధిపత్యం చేతులు మారనుంది. 1992లో దేశీ స్టాక్ మార్కెట్లలో ఎఫ్పీఐలను అనుమతించాక భారీ పెట్టుబడులతో దూకుడు చూపుతున్నారు. డీఐఐల పెట్టుబడులకంటే అధికంగా ఇన్వెస్ట్ చేస్తూ దేశీ స్టాక్స్లో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల ట్రెండ్ మారుతోంది. గత నాలుగేళ్లుగా బుల్ ట్రెండ్తో దేశీ మార్కెట్లు సరికొత్త గరిష్టాలను తాకుతూ వచ్చాయి. ఇందుకు ప్రధానంగా దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లుగా పిలిచే మ్యూచువల్ ఫండ్స్, బీమా కంపెనీలు, పెన్షన్ ఫండ్స్ పెట్టుబడులు ప్రభావం చూపుతున్నాయి. అయితే గతేడాది అక్టోబర్ నుంచి ఎఫ్పీఐలు యూటర్న్ తీసుకున్నారు. ఇదే సమయంలో డీఐఐలు మరిన్ని పెట్టుబడులు కుమ్మరిస్తున్నారు. వెరసి ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో ఎఫ్పీఐల వాటా తగ్గుతుంటే.. డీఐఐల వాటా పెరుగుతోంది.2015తో పోలిస్తే 2025లో ఎఫ్పీఐలు, డీఐఐల పెట్టుబడుల విలువ మధ్య అంతరం 2009 తదుపరి అత్యంత కనిష్టానికి చేరింది. ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీలలో 2024 డిసెంబర్కల్లా ఎఫ్పీఐల వాటా 17.23 శాతానికి దిగిరాగా.. డీఐఐల వాటా 16.90 శాతానికి బలపడింది. అంటే అంతరం 33 బేసిస్ పాయింట్లు(0.33 శాతం) మాత్రమే. నిజానికి 2015లో ఎఫ్పీఐ, డీఐఐ వాటాల మధ్య అంతరం 1032 బేసిస్ పాయింట్లు(10.32 శాతం)గా నమోదైంది. జనవరిలోనూ ఎఫ్పీఐల అమ్మకాలు కొనసాగడం, పెట్టుబడుల బాటలో డీఐఐలు కొనసాగుతుండటంతో త్వరలో ఎఫ్పీఐలపై డీఐఐలు ఆధిపత్యం వహించనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఫండ్స్ ఆధిపత్యం డీఐఐలలో మ్యూచువల్ ఫండ్స్దే అగ్రస్థానంకాగా.. వీటికి రిటైల్ ఇన్వెస్టర్ల నుంచే అధిక బలం సమకూరుతోంది. గత నెల(జనవరి)లో ఎఫ్పీఐలు నికరంగా రూ. 78,000 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయిస్తే.. డీఐఐలు రూ. 86,000 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. ఇక 2024 అక్టోబర్–డిసెంబర్లో ఎఫ్పీఐలు రూ. లక్ష కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ.1.86 లక్షల కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. విలువపరంగా డీఐఐల వద్ద గల ఈక్విటీలు రూ. 73.5 లక్షల కోట్లు! ఎఫ్పీఐల వాటాల విలువకంటే 1.9 శాతమే తక్కువ! దశాబ్దంక్రితం ఎఫ్పీఐల పెట్టుబడులలో దేశీ ఫండ్స్ ఈక్విటీల విలువ సగమేకావడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం! ఈ బాటలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువలో మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్లు) పెట్టుబడులు 10వ వంతుకు చేరడం విశేషం!రిటైలర్ల బలమిది ఇటీవల కొన్నేళ్లుగా రిటైల్ ఇన్వెస్టర్లు దేశీ మార్కెట్లకు తరలి వస్తున్నారు. ఎంఎఫ్లలో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫలితంగా 2019లో రూ. 7.7 లక్షల కోట్లుగా నమోదైన ఫండ్స్ నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) 2024 డిసెంబర్కల్లా రూ. 31 లక్షల కోట్లను తాకింది! ఇదే కాలంలో సిప్ ద్వారా పెట్టుబడులు రూ. 8,518 కోట్ల నుంచి రూ. 26,549 కోట్లకు జంప్ చేశాయి. 2024 చివరి క్వార్టర్లో రిటైలర్లు స్టాక్స్లో రూ. 57,524 కోట్లు ఇన్వెస్ట్ చేశారు! ఈ జోష్తో గతేడాది 91 కంపెనీలు ఐపీఓలతో రూ.1.6 లక్షల కోట్లకుపైగా సమకూర్చుకోవడం కొసమెరుపు!!జనవరిలో ఎఫ్పీఐల అమ్మకాలు రూ. 78,000 కోట్లుదేశీ ఫండ్స్ పెట్టుబడుల విలువ రూ. 86,000 కోట్లు అక్టోబర్–డిసెంబర్లో ఎఫ్పీఐల అమ్మకాలు రూ. లక్ష కోట్లు ఇదే కాలంలో డీఐఐల కొనుగోళ్లు రూ. 1.86 లక్షల కోట్లు –సాక్షి, బిజినెస్ డెస్క్ -
ప్రేమ పరీక్షకు వేళాయే
మనసు ముసిముసిగా నవ్వితే..ఊహ ఉప్పొంగితే..గుండె ఆనందంతో గంతులేస్తే..ఆ సందడి పేరే ప్రేమ. చిరునవ్వుతో వరమిస్తావా.. చితి నుంచి నడిచొస్తాను.. మరు జన్మకు కరుణిస్తావా.. ఈ క్షణమే మరణిస్తానంటూ ప్రేమికుల మనసు పలికే మాటల్ని ఓ సినీ కవి అద్భుతంగా చెప్పారు. నిజమే.. ప్రేమిస్తే.. ప్రపంచమంతా మనసిచ్చిన మనిషిలోనే కనిపిస్తుంది. ప్రేమిస్తే..నీడ కూడా జంట హృదయం వెన్నంటే ఉంటుంది.ఎందుకంటే.. అది ప్రేమంట అంటున్నారు ప్రేమికులు. అందుకే.. ప్రేమ పండుగను వారం రోజుల పాటు చేసుకునేలా వాలెంటైన్ వీక్ రానే వచ్చింది. గుప్పెడంత గుండెలో ఉప్పెనంత ఊహల్ని నింపేలా..అనిర్వచనీయమైన మధురానుభూతిగా చెప్పుకునే ప్రేమకు వారాల పండగ చేసుకునేందుకు కొత్తతరం లవ్బర్డ్స్ సిద్ధమవుతున్నారు. వారం పాటు ప్రేమానందాల్ని మూటకట్టి నచ్చిన మనసుల ముందు పెడితే..గుండె ఆనందంతో గంతులేస్తుంది..గొంతు సంబరంతో గోల చేస్తుంది.మనసు ఊహల్లో తేలే మధుమాసపు పండగను తీసుకొచ్చిందని ప్రేమ పక్షులు వలపు గూటికి చేరుకొని ఊసులాడుకుంటున్నాయి. వాలెంటైన్స్ డే రోజునే ప్రేమికులు నిజమైన పండగలా చేసుకుంటారు. కానీ..ఆ పండగనూ వారం రోజుల పాటు విభిన్నతలతో వలపు హృదయాలు విహరించేలా చేసుకోవాలనే తపన ఉన్న వారికీ ఓ వీక్ ఉంది. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజని అందరికీ తెలుసు. కానీ ఆ అసలైన పండగను వారం రోజుల పాటు జరుపుతారని కొంతమంది ప్రేమికులకే తెలుసు. ఎదలోతులో ఏ మూలనో దాగి ఉన్న ప్రేమను ఎదుటి వారికి చెప్పేందుకు ఒకటి కాదు.. ఏకంగా వారం పాటు ఒక్కో విధంగా వ్యక్తపరచవచ్చు. కానుకలు, పుష్పగుచ్ఛాలతో ఎదుటి వారి మనసుల్ని కొల్లగొట్టేందుకు ప్రేమికులు ఉవ్విళ్లూరుతుంటారు. ఆ కానుకల్ని ఒక్కో స్పెషల్ రోజున ఒక్కో విధంగా ఇస్తూ వారి ప్రేమను పొందేందుకు వచ్చిందే వాలెంటైన్ వీక్. ప్రేమికుల రోజు ముందు వారం రోజుల పాటు అంటే ఈ నెల 7 నుంచి వాలెంటైన్ వీక్ను ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చూద్దాం.వాలెంటైన్ డే (ఫిబ్రవరి 14)ఇక చివరి రోజైన వాలెంటైన్ డే గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో కొత్త రకాల ప్లాన్లతో మనసులు ఉరకలేస్తుంటాయి. తన భాగస్వామి ఊహించని రీతిలో బహుమతి అందించాలని, సమ్థింగ్ స్పెషల్గా ప్రేమను వ్యక్తం చేయాలని ఉవ్విళ్లూరుతుంటారు. నచ్చిన స్టైల్లో.. ఎదుటి వారి మనసు దోచేలా ప్రేమను వ్యక్తం చేయండి. ఇందుకోసం విశాఖలో ప్రధాన హోటల్స్ అన్నీ ఇప్పటికే ప్రత్యేక ప్యాకేజీలనూ ప్రకటిస్తున్నాయ్. చుట్టూ గులాబీ పూల మధ్య క్యాండిల్ లైట్ డిన్నర్లు, ప్లెజెంట్ మ్యూజిక్తో మైమరపించేలా ఏర్పాట్లకు సిద్ధమవుతున్నాయి. హ్యాపీ వాలెంటైన్స్ వీక్!!రోజ్ డే (ఫిబ్రవరి 7)ఎదుటి వారికి ప్రేమను వ్యక్తం చెయ్యాలంటే 90 శాతం మంది ఎంచుకునే ప్రధాన మార్గం గులాబీ. ఎర్ర గులాబీని ఇచ్చి కళ్లల్లోకి చూస్తూ ఐ లవ్ యూ చెబితే ఎదుటి వారి మనసు లోతుల్ని తాకుతుందంటారు. అందుకే ఈ వాలెంటైన్ వీక్ తొలి రోజుని రోజ్ డేగా పండగ చేసుకుంటారు. ఈ రోజున మొదటిసారిగా మీకు చాలా ఇష్టమైన వారితో కలవాలన్నా, పలకరించాలన్నా ఈ రోజ్డే రోజున మంచి గులాబీ ఇచ్చి ప్రపోజ్ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. విశాఖ నగరంలో చాలా మంది యువత బుధవారం రోజ్ డే సంబరాల్ని చేసుకున్నారు. వైజాగ్లోని రామాటాకీస్లోని ఓ ఫ్లోరిస్ట్ దుకాణంలో రోజుకి 200 నుంచి గులాబీలు అమ్ముడవుతుంటాయి. కానీ.. రోజ్ డే రోజు మాత్రం 1000 వరకూ గులాబీలు అమ్ముడు పోతాయని దుకాణ యజమాని రాజు తెలిపారు. ఇక దేశంలో ప్రతి రోజూ రూ.68.4 కోట్ల గులాబీ వ్యాపారం జరుగుతుంటుంది. వాలెంటైన్స్డే, రోజ్డే రోజు మాత్రం రూ.100 కోట్లకు చేరుకుంటుంది.ప్రపోజ్ డే (ఫిబ్రవరి 8) ప్రేమను వ్యక్తపరచాలంటే చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం లేకపోవడం వల్లే చాలా మంది ప్రేమలు మనసు లోతుల నుంచి బయటకు వచ్చి పెదాల వద్దే నిలిచిపోతున్నాయి. ఆ రెండు మాటలు చెప్పేందుకు తటపటాయించే ప్రేమికులకు ఈ ప్రపోజ్ డే కొత్త ఉత్సాహాన్నిస్తుంది. నచ్చిన వ్యక్తిని తనకు నచ్చిన ప్రాంతానికి తీసుకెళ్లి చిన్న బహుమతి ఇచ్చి ప్రేమను వ్యక్తీకరిస్తే చాలు మనసులు పెనవేసుకునే మధుమాసం వచ్చేస్తుంది. అందుకే ఈ రోజుకి చాలా ప్రాముఖ్యమిస్తుంటారు.చాక్లెట్ డే (ఫిబ్రవరి 9) చాక్లెట్ అంటే ఇష్టంలేని వారు ఎవరుంటారు. అమ్మాయిలకు చాక్లెట్ ఇస్తే చాలు ప్రపంచాన్ని తమ చేతిలో పెట్టినట్లుగా ఎగిరి గంతేస్తారు. అందుకే చాలా మంది ప్రేమికులు తన ప్రేయసికి ప్రపోజ్ చెయ్యాలంటే ఓ ఎర్రగులాబీతో పాటు చాక్లెట్ ఇస్తుంటారు. అలాంటి వారికోసం ఈ చాక్లెట్ డే. ప్రేమ ఓకే అయితే ఓ తియ్యని వేడుక చేసుకుందాం.. మన ప్రేమకు ఇదో తీపి గుర్తుగా భావిద్దాం.. అంటూ చిన్న భావుకవితను చెబుతూ చాక్లెట్ ఇచ్చి ప్రపోజ్ చేస్తే సరి.. ఆ సంబరమంతా జీవితాంతం తీపి గురుతుగా ఉండిపోతుంది. సాధారణంగా దేశంలో ప్రతి రోజూ 3.87 లక్షల కిలోల చాక్లెట్లు అమ్ముడుపోతుంటాయి. చాక్లెట్డే రోజున మాత్రం 5 లక్షల కిలోల అమ్మకాలు పక్కా అని మార్కెట్దారులు అంచనా వేస్తున్నారు.టెడ్డీ డే (ఫిబ్రవరి 10) ముద్దు ముద్దుగా ఉండే టెడ్డీ బేర్ను చూసి ఇష్టపడని వారంటూ ఉండరు. మనసుకు హత్తుకునేలా ఉండే టెడ్డీలను ఇష్టపడే ప్రేయసి ఉంటే ఈ రోజున ఓ బొమ్మను బహుమతిగా ఇచ్చి ఆనందపరచండి. నచ్చిన రంగుని ఎంపిక చేసి మరీ కొంటే వారు పొందే ఆనందం వెలకట్టలేనిది. అర చేతిలో పట్టే టెడ్డీ నుంచి ఆరడుగులుంటే టెడ్డీ బేర్ వరకూ మార్కెట్లో వివిధ సైజుల్లో లభిస్తున్నాయి. జగదాంబా సెంటర్లోని దావూద్ టెడ్డీబేర్ దుకాణంలో గతేడాది ఇదే రోజున సుమారు 250 బొమ్మలు అమ్ముడు పోయాయంట. ఇక నగరం మొత్తం చూస్తే ఈరోజున ఎన్ని టెడ్డీబేర్లు ప్రేమికుల గుండెలపై వాలిపోతాయో అర్థం చేసుకోవచ్చు. దేశంలో సగటున ప్రతి రోజూ సగటున రూ.14.67 కోట్ల సాఫ్ట్టాయ్స్ వ్యాపారం జరుగుతుంది. టెడ్డీడే, వాలెంటైన్స్డే రోజున మాత్రం ఏకంగా రూ.25 లక్షలకు పైగా విక్రయాలు జరుగుతుంటాయని సాఫ్ట్టాయ్స్ కంపెనీలు చెబుతున్నాయి.ప్రామిస్ డే (ఫిబ్రవరి 11) రెండు హృదయాల మధ్య చిగురించిన ప్రేమకు నమ్మకం పునాది. చిలిపి ఉదాహరణగా చెప్పుకుంటే రెండు బిస్కెట్లను క్రీమ్ అంటిపెట్టుకొని ఉంటేనే క్రీమ్ బిస్కట్ అన్నట్లుగానే రెండు మనసుల్ని జీవితాంతం కలిపి ఉంచేది నమ్మకమే. అలాంటి నమ్మకాన్ని ఎదుటివారిలో కలిగించడానికి ఈ రోజు గొప్పదనే చెప్పుకోవాలి. నచ్చిన వ్యక్తికి దగ్గర కావడానికి, వారిలో తనపై ఉన్న ప్రేమను కలకాలం ఉంచేందుకు వాగ్దానాలు చేస్తుంటారు. ప్రేయసి మీద మీకున్న ప్రేమను ఈ రోజున వాగ్దానం చేసి తెలిపితే.. ఎదుటి వారు మీకు మరింత చేరువవుతారు.హగ్ డే (ఫిబ్రవరి 12)ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమానురాగాలు, కష్ట సుఖాలకు చిహ్నం హగ్. ఒక కౌగిలి.. కష్టాల్లో ఉన్న ఎదుటి మనసుకు సాంత్వననిస్తుంది. బాధలను దూరం చేస్తుంది. ఒత్తిడిని తగ్గించేస్తుంది. అందుకే ఈ కౌగిలింత మంత్రాన్నే యువతరం ప్రేమ మంత్రంగా పాటిస్తున్నారు. చిన్న కౌగిలింతతో వలచిన మనసు పరవశంలో ముంచేస్తూ మెప్పించేస్తున్నారు. ప్రశాంతతను కలిగించేలా ప్రేమికుడికి, ప్రేయసికి ఒక హగ్ ఇస్తే చాలు.. అందులోనే మన ప్రేమలోతుల్ని అన్వేషించగలరు. 10 నిమిషాల పాటు హగ్ చేసుకుంటే హైబీపీ కూడా అదుపులోకి వచ్చేస్తుందంట. ఆనందం కలిగినప్పుడు ఎలానో.. హగ్ చేసుకున్నప్పుడు కూడా ఆక్సిటోసిన్ అనే రసాయనం విడుదలై మనసుకి సంతోషాన్ని కలిగిస్తుంటుంది. ఒక సమస్యలో ఉన్న లవర్కు రోజుకు 8 హగ్లు ఇస్తే చాలంట. రోజుకు 12 సార్లు హగ్ చేసుకుంటే..లైఫ్ సాఫీగా సాగిపోతుందంటూ అధ్యయనాలు ప్రేమ పాఠాలు చెబుతున్నాయండోయ్. అందుకే..ఈ రోజున ఒక హగ్తో మీరెంతగా ప్రేమిస్తున్నారో చెప్పేసుకోవచ్చు.కిస్ డే (ఫిబ్రవరి 13) వేయి మాటలు చెప్పలేని ఓ భావాన్ని చిన్న ముద్దు చెబుతుంది. ఎదుటివారి మీద అంతులేని ప్రేమ ఉన్నా చెప్పలేని వారు చాలా మంది ఉంటారు. అలాంటి వారు ఓ తియ్యని ముద్దుతో తన ప్రేమను వ్యక్తపరిచే రోజు ఇది. అందుకే కిస్ డే రోజున మీ భాగస్వామికి జీవితాంతం గుర్తుండిపోయేలా ఓ ముద్దు ఇస్తే చాలు.. మీ ప్రేమ అలా.. నిలబడిపోతుంది. అన్నట్లు ముద్దు కూడా ఒక దివ్యౌషధమేనంట. ముద్దు పెట్టుకోవడం వల్ల మీ శరీరంలో ఎపినెర్ఫిన్ విడుదలై రక్తనాళాలు వెడల్పుగా మారి రక్త ప్రసరణ సజావుగా సాగేందుకు దోహదపడి మానసిక విశ్రాంతిని అందిస్తుంది. గుండె రేటుని పెంచడం వల్ల శరీరంలోని అన్ని భాగాలకు రక్తప్రవాహం సక్రమంగా సాగుతుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు నచ్చిన వ్యక్తికి ముద్దు పెడితే.. రక్తపోటు తగ్గుతుంది. ముద్దు వల్ల రెండు మనసుల మధ్య ప్రేమ బదిలీ అవ్వడమే కాదు.. బ్యాక్టీరియా కూడా బదిలీ అవుతుంది. ఈ బ్యాక్టీరియా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇద్దరు వ్యక్తులు చుంబించుకునే సమయంలో ఉత్పత్తయ్యే సెరోటోనిన్ డోపమైన్, ఆక్సిటోసిన్ వంటి సంతోష రసాయనాలు..ఆ ఇద్దరి వ్యక్తుల మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది.హ్యాపీ వాలెంటైన్స్ వీక్!! -
గుడ్ల దొంగలొచ్చారు
పాత తెలుగు సినిమాల్లో కామెడీ దొంగలుంటారు. వాళ్ల పని ఊళ్లో కోళ్లు పట్టడమే. ఎత్తుకొచ్చిన, కొట్టుకొచ్చిన కోళ్లను చక్కగా వండుకు తినే వాళ్లు కొందరైతే వాటిని ఎంతకో కొంతకు అమ్ముకుని సొమ్ము చేసుకునే వాళ్లు ఇంకొదరు. అలాంటి దొంగలు ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాలో పడ్డారు. అయితే వాళ్లు దొంగకోళ్లు పట్టేవాళ్లు కాదు. కోడిగుడ్లు కొట్టేసేవాళ్లు. పెరుగుతున్న కోడి గుడ్డు ధరను సొమ్ము చేసుకునేందుకు కొందరు ఈ ‘గుడ్ల గుటకాయస్వాహ’పథకానికి వ్యూహ రచన చేశారు. అనుకున్నదే తడవుగా ఒకే దెబ్బకు 1,00,000కుపైగా గుడ్లను కొట్టేశారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని గ్రీన్క్యాసెల్ నగరంలో పీట్ అండ్ గ్యారీస్ ఆర్గానిక్స్ ఎల్ఎల్సీ సంస్థకు చెందిన లారీ నుంచి దొంగలు ఈ గుడ్లను దొంగతనం చేశారు. వీటి విలువ దాదాపు రూ.35 లక్షలు. కొండెక్కుతున్న గుడ్డు ధర ఎవరైనా కోళ్లను దొంగతనం చేస్తారు. వీళ్లేంటి కోడిగుడ్ల వెంట పడ్డారని అనుమానం రావొచ్చు. ఇందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి బర్డ్ఫ్లూ. రెండోది పెరుగుతున్న గుడ్ల ధర. అమెరికాలో గత రెండేళ్లుగా పలు ప్రాంతాల్లో బర్డ్ఫ్లూ ప్రభావం నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ వస్తోంది. గత దశాబ్దకాలంలో ఇంతటి విస్తృత స్థాయిలో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో బర్డ్ఫ్లూ వ్యాపించడం ఇదే తొలిసారి. గతనెల లూసియానాలో మనుషులకు సైతం ప్రాణాంతకరమైన స్థాయి వేరియంట్ బర్డ్ఫ్లూను కనుగొన్నారు. దీంతో పౌల్ట్రీ యజమానులు ప్రతి నెలా లక్షలాది కోళ్లను చంపేస్తున్నారు. ఈ దొంగలు నిజంగానే కోళ్లను కొట్టేసి అమ్మినా జనం ‘బర్డ్ఫ్లూ సోకిన కోళ్లు’అని భావించి ఎవరూ కొనక పోవచ్చు. బర్డ్ఫ్లూ భయంతో జనం చికెన్లాంటి పక్షి మాంసం వాడకం తగ్గించి చాలా మటుకు గుడ్లను తింటున్నారని తెలుస్తోంది. ఇందుకు పెరుగుతున్న కోడి గుడ్ల ధరలే ప్రబల తార్కాణం. మొత్తంగా చూస్తే కోడి గుడ్డు ధర రెట్టింపు అయినట్లు వార్తలొచ్చాయి. ఈ వార్తే దొంగలను గుడ్ల చోరీకి ఉసిగొల్పింది. దుకాణాల్లో పంపిణీ కోసం లారీలో సిద్ధంగా ఉంచిన గుడ్లను శనివారం రాత్రి ఆగంతకులు ఎత్తుకెళ్లిపోయారని పోలీసులు ప్రకటించారు. కేసు నమోదుచేసి గుడ్ల దొంగల కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చేపడుతున్నారు. అయితే దొంగలు ఈపాటికి గుడ్లను ఇష్టమొచ్చిన అధిక రేటుకు అమ్ముకుని మరో గుడ్ల షాపుపై రెక్కీ నిర్వహిస్తూ ఉంటారని కొందరు నెటిజన్లు సరదా వ్యాఖ్యల పోస్ట్లు పెట్టారు. గుడ్ల కొరత ఏర్పడటంతో గుడ్లతో చేసే వంటకాల ధరలూ రెస్టారెంట్లు, హోటళ్లలో పెరుగుతున్నాయి. అమెరికాలో 25 రాష్ట్రాల్లో దాదాపు 2,000 చోట్ల వ్యాపారం చేస్తున్న ప్రఖ్యాత వేఫుల్ హౌస్ రెస్టారెంట్ తమ గుడ్ల వంటకాల ధరను కాస్తంత పెంచింది. ‘‘మార్కెట్లో గుడ్లు దొరకట్లేవు. ఎక్కువ ఖరీదు పెట్టి కొంటున్నాం. అందుకే ఎక్కువ ధరకు అమ్ముతున్నాం’’అని రెస్టారెంట్ తాపీగా చెబుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
స్వచ్ఛమైన తేనెకు చిరునామా చిల్లకొండయ్యపల్లి
ఒక్కో ఊరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఇది కూడా అలాంటి ఊరే. ఈ ఊరు పేరు చెబితే చాలు నోరూరుతుంది. తియ్యని పిలుపు రారమ్మంటుంది. అదే తాడిమర్రి మండలంలోని చిల్లకొండయ్యపల్లి (Chillakondaiahpalli). వర్షాభావ పరిస్థితుల్లో వ్యవసాయంతో నష్టపోయిన రైతులు (Farmers) ఉపాధి కోసం అడవి బాట పట్టారు. కొండ, గుట్టలెక్కుతూ తేనె (Honey) సేకరించి కుటుంబాలను పోషించుకుంటున్నారు.ఉదయమే సద్దిమూట కట్టుకుని అందరూ పొలం బాట పడితే సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం (Tadimarri Mandal) చిల్లకొండయ్యపల్లి యువకులు మాత్రం అడవిబాట పడతారు. కొండ, గుట్ట, చెట్టు, చేమ చుట్టేస్తూ సేకరించిన స్వచ్ఛమైన తేనెను విక్రయించి కుటుంబాలను పోషించుకుంటున్నారు. గ్రామంలోని 25 కుటుంబాలు తేనె సేకరణను ఉపాధిగా మలచుకున్నాయి. 15 ఏళ్లుగా... తేనె సేకరణే వృత్తిగాదాదాపు 15 సంవత్సరాలుగా తేనె సేకరణనే వృత్తిగా పెట్టుకుని చిల్లకొండయ్యపల్లి యువత జీవనం సాగిస్తోంది. అప్పట్లో వ్యవసాయ పనులు లేక పోవడంతో కుటుంబాన్ని పోషించుకునేందుకు కాటమయ్య అనే వ్యక్తి తొలిసారిగా తేనె సేకరణను ఉపాధిగా మార్చుకున్నాడు. అనంతరం అదే బాటలో కొందరు యువకులు పయనించారు. అయితే వీరు సేకరించిన తేనెకు సరైన మార్కెటింగ్ లేక ఇబ్బంది పడుతుండడంతో అప్పట్లో మహాత్మాగాంధీ యువజన సంఘం మండల అధ్యక్షుడిగా ఉన్న రామలింగప్ప స్పందించి, గిట్టుబాటు ధరతో తేనె కొనుగోలు చేసేలా చెన్నకొత్తపల్లిలోని ధరణి స్వచ్చంద సంస్థతో ఒప్పందం కుదిర్చాడు. ప్రస్తుతం సంస్థ కిలో తేనెను రూ.400 చొప్పున కొనుగోలు చేస్తుండగా... స్థానికంగానే ఇతరులకు రూ.500తో విక్రయిస్తూ ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కు తున్నారు. ఉమ్మడి జిల్లాలో చిల్లకొండయ్యపల్లి తేనెకు మంచి గిరాకీ ఉంది.అన్నం పెడుతున్న అడవి.. మండలంలోని దాడితోట బీట్ పరిధిలో కునుకుంట్ల, చిల్లవారిపల్లి, దాడితోట గ్రామాలతో పాటు పుట్లూరు మండలం ఎల్లుట్ల పరిధిలో సుమారు 3,534 హెక్టార్లలో రిజర్వు ఫారెస్టు విస్తరించి ఉంది. రిజర్వు ఫారెస్టులో అటవీ అధికారులు నారేపి, ఎర్రచందనం, తవసీ తదితర మొక్కలు భారీగా నాటారు. ఇప్పుడా మొక్కలు పెద్ద వృక్షాలై తేనెపట్టులకు ఆవాసాలుగా మారాయి. ఫలితంగా రిజర్వు ఫారెస్టు ఎందరికో ఉపాధి వనరుగా మారి అన్నం పెడుతోంది. ముంగార్ల కాలం అనువైనది.. తేనె సేకరణకు ముంగార్ల కాలం అనువైనది. జూన్ ప్రారంభంతో వర్షాలు కురుస్తాయి. ఈ సమయంలో అడవులు, తోటలు పచ్చదనం సంతరించుని పుష్పాలు వికసిస్తాయి. ఆ పుష్పాల్లోని మకరందం కోసం వచ్చే తేనెటీగలు సమీపంలోనే తేనెపట్టులను ఏర్పాటు చేసుకుంటాయి. ఏడాదిలో 9 నెలల పాటు తేనె సేకరణలో ఇక్కడి యువకులు నిమగ్నమవుతారు. నెలకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఆదాయం వస్తోందని చెబుతున్నారు.చదవండి: పెళ్లి మంటపాల్లో ‘డబ్బు’ వాద్యాలుతేనె సేకరణలో కష్టాలు ఎన్నో.. తేనె ఎంత రుచిగా ఉంటుందో దానిని సేకరించడమంటే అంతకు రెట్టింపు కష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది. అయినా చిల్లకొండయ్యపల్లి యువకులు కష్టాలను లెక్కచేయడం లేదు. కళ్లముందు తేనె పట్టు కనిపిస్తే చాలు వెంటనే సేకరణలో నిమగ్నమవుతారు. ఈ క్రమంలో ముళ్లకంపలు గుచ్చుకున్నా, తేనెటీగలు కుట్టినా తమ పట్టు మాత్రం వదలరు. ఎన్ని రక్షణ చర్యలు తీసుకున్నా... తేనెటీగలు కుట్టి తీవ్ర అస్వస్థతకు లోనైన సందర్భాలు ఎన్నో ఉన్నాయని యువత తెలుపుతోంది. -
తాపం తీర్చే అమృతభాండం
సాక్షి, అమలాపురం: మండు వేసవిలో దాహం తీర్చాలన్నా, వేడెక్కిన శరీరాన్ని చల్లబరచాలన్నా, అనారోగ్యం బారిన పడితే త్వరగా కోలుకోవాలన్నా వెంటనే గుర్తుకు వచ్చేది కొబ్బరి బొండాం. కొనుగోలుచేసేవారికే కాదు.. ఉత్పత్తి చేసే రైతులకు కూడా ఇది అమృత బాండమే. మార్కెట్ ఒడిదొడుకులతో సంబంధం లేకుండా ధరలు నిలకడగా ఉండటం, కాయ సేకరణ భారం లేకపోవడంతో కొబ్బరి రైతులు (Coconut Farmers) ఇదే తమకు మేలని భావిస్తుంటారు. వేసవి సమీపిస్తుండటంతో బొండాల ధరలపైన, ఎగుమతులపైన రైతులు భారీగా ఆశలు పెట్టుకుంటున్నారు. కొబ్బరి నీళ్లలో పోషకాలు, ఎలక్ట్రోలైట్లు అధికంగా ఉంటాయి. ఒక కొబ్బరి బొండాం (Coconut) ఒక సెలైన్తో సమానం. బొండాంలో దాదాపు 300 మిల్లీ గ్రాముల సోడియం ఉంటుంది. శరీరానికి రోజుకు సరిపడా సోడియంను ఇది అందిస్తుంది. దీనిలో పొటాషియం, కాల్షియం, పాస్పరస్ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇది తక్షణం శక్తిని ఇస్తుంది. ఇటీవలి కాలంలో బొండాం తాగేవారి సంఖ్య పెరిగింది. దీంతో ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి కొబ్బరి బొండాల ఎగుమతులు పెరిగాయి.మన రాష్ట్రంతో పాటు పొరుగునే ఉన్న తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు ఇక్కడి నుంచి కొబ్బరి బొండాలు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. కొబ్బరి బొండాలకు ఒకప్పుడు వేసవి (Summer) మాత్రమే సీజన్గా ఉండేది. ఇప్పుడు ఏడాది పొడవునా ఎగుమతులు జరుగుతున్నాయి. ఏలూరు జిల్లాలో దెందులూరు, చింతలపూడి, జంగారెడ్డి గూడెం, తూర్పు గోదావరి జిల్లా పరిధిలో చాగల్లు, కొవ్వూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు, తాడేపల్లిగూడెం, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, కాకినాడ జిల్లాలో ఏలేశ్వరం, తుని పరిసర ప్రాంతాల నుంచి బొండాల ఎగుమతి ఎక్కువగా జరుగుతుంది. ప్రస్తుతం రోజుకు 50 లారీలకు పైగా ఎగుమతి అవుతుండగా, వేసవి సీజన్లో రోజుకు 100 లారీల వరకు కొబ్బరి బొండాల ఎగుమతి జరుగుతుంది. ప్రస్తుతం రైతుల వద్ద ఒక్కో కొబ్బరి బొండాం ధర రూ. 12 పలుకుతోంది. కొబ్బరి కాయ ధర రూ. 14 నుంచి రూ. 15 పలుకుతోంది. దీని వల్ల బొండాం అమ్మకాలకన్నా రైతులు కాయపై దృష్టి పెట్టారు. సాధారణంగా కొబ్బరి కాయ కన్నా బొండాం ధర రూ.4 నుంచి రూ. 5 ఎక్కువ ఉంటుంది. చదవండి: పల్లె పిల్లలూ ‘స్మార్టే’! » మార్చి నుంచి కొబ్బరి బొండాలకు వేసవి సీజన్ మొదలవుతుంది. కొబ్బరి కాయకు ఇప్పుడున్న ధర మరికొద్దిరోజులు ఉంటే బొండాం ధర రూ.18 నుంచి రూ.20 వరకు చేరుతుంది. కాని దిగుబడి అధికంగా ఉండటం వల్ల బొండానికి ధర తగ్గే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. » కాయతో పోల్చుకుంటే బొండాం అమ్మకాలే రైతులకు లాభసాటిగా ఉంటాయి. బొండాం ఆరు నుంచి ఎనిమిది నెలలకు తయారవుతుంది. అదే కొబ్బరికాయ పక్వానికి రావడానికి సుమారు 12 నెలలు పడుతుంది. కాయతో పోల్చితే బొండాల వల్ల రైతులు త్వరితగతిన ఉత్పత్తి అందుకుంటారు. » కొబ్బరి కాయ రైతులే సేకరించాలి. దింపు, పోగువేత, రాశులు పోయడం ఇలా కాయకు రెండు రూపాయల వరకు ఖర్చవుతుంది. అదే బొండాలను వ్యాపారులే సొంత ఖర్చులు పెట్టుకుని దింపించుకుంటారు. దీంతో రైతులకు సేకరణ ఖర్చు తగ్గుతుంది. -
పల్లె పిల్లలూ ‘స్మార్టే’!
సాక్షి, అమరావతి: గ్రామీణ భారతంలో పిల్లలు కూడా ‘స్మార్ట్’గా తయారవుతున్నారు. స్మార్ట్ ఫోన్లు ఉపయోగించడంలో ఆరితేరిపోతున్నారని యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్(ఏఎస్ఈఆర్) వెల్లడించింది. గ్రామీణ గృహాల సర్వేలో భాగంగా ఇటీవల నిర్వహించిన ఏఎస్ఈఆర్లో పిల్లలకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను గుర్తించారు. దేశంలోని 605 జిల్లాల్లో 17,997 గ్రామాల్లోని 14 నుంచి 16 ఏళ్ల మధ్య వయసు ఉన్న 6,49,491 మంది నుంచి వివరాలు సేకరించారు. అందుబాటులో స్మార్ట్ ఫోన్లు, సొంతంగా స్మార్ట్ ఫోను కలిగి ఉండటం, వాటి ఉపయోగం, డిజిటల్ పరిజ్ఞానం తదితర అంశాలపై ప్రశ్నావళితో ఈ సర్వే నిర్వహించారు. ఏఎస్ఈఆర్ సర్వేలోని ప్రధాన అంశాలు» గ్రామీణ ప్రాంతాల్లో 14 నుంచి 16ఏళ్ల వయసులో ఉన్నవారిలో 90 శాతం మందికి స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వారిలో 82 శాతం మందికి స్మార్ట్ ఫోన్లను ఎలా వాడాలో పూర్తిగా తెలుసు. » ఇక 14ఏళ్ల వయసు వారిలో 27 శాతం మందికి, 16ఏళ్ల వయసు వారిలో 37.8 శాతం మందికి సొంతంగా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. మిగిలిన వారు తమ కుటుంబ సభ్యుల స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. » అమ్మాయిల కంటే అబ్బాయిలకు కాస్త ఎక్కువగా సొంతంగా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. 36.2 శాతం మంది అబ్బాయిలకు సొంతంగా స్మార్ట్ ఫోన్లు ఉండగా... 26.9% అమ్మాయిలకే సొంత స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. » సోషల్ మీడియా ఖాతాలను ఫాలో కావడానికి 78.8% మంది అబ్బాయిలు, 73.4శాతం మంది అమ్మాయిలు స్మార్ట్ఫోన్లను వాడుతున్నారు. » విద్యా సంబంధమైన విషయాల కోసం 57 శాతం మంది స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. ఈ విషయంలో కేరళ రాష్ట్రం మెరుగ్గా ఉంది. ఆ రాష్ట్రంలో 90 శాతం మంది సోషల్ మీడియా ఖాతాల కోసం స్మార్ట్ ఫోన్లను వాడుతుండగా... 80 శాతం మంది విద్యా సంబంధమైన విషయాలు తెలుసుకునేందుకు ఉపయోగిస్తున్నారు. » డిజిటల్ భద్రతపై కూడా గ్రామీణ పిల్లలకు సరైన అవగాహన ఉంది. 62 శాతం మంది పిల్లలకు ఖాతాలను బ్లాక్ చేయడం, ఫేక్ ప్రొఫైల్లను రిపోర్ట్ కొట్టడం తెలుసు. ఇక 55.2 శాతం మందికి తమ ప్రొఫైల్ను ప్రైవేటుగా ఉంచడం గురించి పూర్తి అవగాహన ఉంది. 57.7 శాతం మందికి పాస్వర్డ్లను మార్చడం తెలుసు. » పూర్తి డిజిటల్ టాస్్కల గురించి కూడా గ్రామీణ విద్యార్థులకు సరైన అవగాహన ఉంది. అలార్మ్ సెట్ చేయడం, సమాచారం కోసం అన్వేషించడం, యూ ట్యూబ్ చానళ్లను లొకేట్ చేయడం గురించి 70.2 శాతం మంది అబ్బాయిలకు, 62.2% మంది అమ్మాయిలకు పూర్తి పరిజ్ఞానం ఉంది. » స్మార్ట్ ఫోన్ల పరిజ్ఞానంలో అబ్బాయిల కంటే అమ్మాయిలు కాస్త వెనుకబడి ఉన్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో మాత్రం అబ్బాయిలతో సమానంగా, కొన్ని అంశాల్లో ఎక్కువగానే అమ్మాయిలకు స్మార్ట్ ఫోన్ల పరిజ్ఞానం ఉండటం విశేషం. గణనీయంగా పెరిగిన చదువుకున్న తల్లిదండ్రులు» ఏఎస్ఈఆర్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 నుంచి 8 ఏళ్ల పిల్లల తల్లిదండ్రులపై చేసిన అధ్యయనంలోనూ పలు ఆసక్తికర అంశాలు గుర్తించారు. » చదువుకున్న తల్లిదండ్రుల శాతం పదేళ్లలో గణనీయంగా పెరిగింది. » కనీసం ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన తల్లుల శాతం 2014లో 43 శాతం ఉండగా... 2024 నాటికి 64 శాతానికి పెరిగింది. ఇక ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన తండ్రులు 2014లో 61 శాతం ఉండగా, 2024 నాటికి 72శాతానికి పెరిగింది. » గ్రామీణ ప్రాంతాల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరుశాతం కూడా మెరుగుపడుతోంది. 2018లో విద్యార్థుల హాజరుశాతం 72.4శాతం ఉండగా, 2024 నాటికి 75.9 శాతానికి పెరిగింది. » ఉపాధ్యాయుల హాజరు శాతం 2018లో 85.1 శాతం ఉండగా, అది 2024 నాటికి 87.5 శాతానికి పెరిగింది. చదవండి: అప్పులే సరి.. సంపద ఎక్కడమరి?90% గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్న పిల్లలు74% సోషల్ మీడియా కోసమే స్మార్ట్ ఫోన్లు వాడుతున్నవారు75% చదువు కోసం స్మార్ట్ ఫోన్ వాడుతున్నవారు82% గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం తెలిసిన పిల్లలు -
అంతటా కడుపు ‘కోతే’!
సాధారణ ప్రసవాల సంఖ్య తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తగ్గుతోంది. కాసుల కోసం ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆపరేషన్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉండగా, ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ సిజేరియన్లే ఎక్కువగా నమోదవుతున్నాయి. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంత ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిజేరియన్లు (Cesarean) పెరిగాయి. సాధారణ ప్రసవాలపై వైద్యారోగ్య శాఖ అధికారులు అవగాహన కల్పించాల్సి ఉన్నా, ఆ దిశగా చర్యలు లేవు. గత ప్రభుత్వ హయాంలో సాధారణ ప్రసవాల పెంపునకు మొదలుపెట్టిన మిడ్వైవ్స్ (Midwife) సేవలు ఇప్పుడు నామమాత్రమయ్యాయి.అమ్మో సాధారణ ప్రసవమా?సాధారణ ప్రసవాల విషయంలో నొప్పులు అనుభవించాల్సి వస్తుందనే ఉద్దేశంతో కొందరు గర్భిణులు విముఖత చూపుతున్నారు. కొందరు వైద్యులు సిజేరియన్లతో భవిష్యత్లో సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నా పట్టించుకోవడం లేదు. శిశువు తలకిందులుగా ఉన్నప్పుడు, పెద్దగా ఉన్నప్పుడు శస్త్రచికిత్స అవసరమవుతుంది. అయితే, సాధారణ ప్రసవంతో త్వరగా దినచర్యలో భాగం కావొచ్చని, సిజేరియన్లతో దీర్ఘకాలంలో ఇబ్బందులు తలెత్తుతాయని చెబుతున్నా, గర్భిణులు, వారి కుటుంబసభ్యులు ఆపరేషన్కే ప్రాధాన్యం ఇస్తున్నారు. మిడ్వైవ్స్ అంతంతేప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలను పెంచేందుకు గత ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే 2019లో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మిడ్వైవ్స్ సేవలను ప్రారంభించి 30 మందికి శిక్షణ ఇవ్వగా, వీరు గర్భిణులకు సాధారణ ప్రసవంతో లాభాలను వివరించి వ్యాయామాల ద్వారా ప్రసవాలకు సిద్ధం చేసేవారు. ప్రస్తుతం పలు ఆస్పత్రుల్లో సిబ్బంది కొరతతో ఇప్పుడా సేవలు అందుబాటులో లేవు. అవగాహన కల్పించక..గర్భిణిగా నమోదైనప్పటి నుంచి కాన్పు అయ్యే వరకు ప్రభుత్వ ఆస్ప త్రిలో వైద్య సేవలు పొందితే వారి ఆరోగ్యంపై డాక్టర్లకు అవగాహన ఉంటుంది. అలా కాకుండా డెలివరీ సమయంలోనే వస్తుండడంతో ఏదో ఒక సమస్య తలెత్తగానే ఆపరేషన్ చేస్తున్నారు. వైద్యారోగ్య శాఖ అధికారులు కూడా సాధారణ ప్రసవాలతో కలిగే లాభాలపై అవగాహన కల్పిస్తే ప్రయోజనం ఉంటుందని తెలిసినా, ఆ దిశగా ప్రయత్నించడం లేదు. » భద్రాచలం ఏరియా ఆస్పత్రిని పరిశీలిస్తే షిఫ్ట్కు ఎనిమిది మంది చొప్పున మూడు షిఫ్ట్ల్లో 24 మంది సిబ్బంది ఉండాలి. కానీ ఐదుగురే ఉన్నారు.» ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఏరియా ఆస్పత్రిలోనూ 8 నెలలుగా మిడ్వైవ్స్ సేవలు నామమాత్రమయ్యాయి. ఇక్కడ నలుగురు సిబ్బంది చేయాల్సిన మిడ్వైవ్స్ సేవలు ఇద్దరే చేస్తున్నారు. కుటుంబ సభ్యుల సహకారంఉండటం లేదు.. ప్రసవం కోసం భద్రాచలం ఏరియా ఆస్పత్రిలోచేరిన గర్భిణులకు సాధారణ ప్రసవం చేసేందుకే ప్రయత్నిస్తున్నాం, కానీ వారి కుటుంబసభ్యులనుంచి సహకారం ఉండటం లేదు. గర్భిణి కొద్దిసేపు నొప్పులు తట్టుకోలేకపోవడంతో కుటుంబ సభ్యులు మాపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో సాధారణ ప్రసవాల సంఖ్య తగ్గుతోంది. - డాక్టర్ రామకృష్ణ, సూపరింటెండెంట్, ఏరియా ఆస్పత్రి, భద్రాచలం.బిడ్డకు హార్ట్బీట్ ఎక్కువగా ఉందని.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన సత్యవతికి గతనెల 31న పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకొస్తే పరీక్షలు చేసిన వైద్యులు బిడ్డ హార్ట్బీట్ ఎక్కువగా ఉందని చెప్పారు. ఆ వెంటనే ఆపరేషన్కు నిర్ణయించి సత్యవతికి సిజేరియన్ చేయగా మగ బిడ్డకు జన్మనిచ్చింది.- సత్యవతి,మణుగూరు,భద్రాద్రికొత్తగూడెం జిల్లా -
అదీనమా?.. పరాధీనమా?
సాక్షి ప్రతినిధి, వరంగల్: భూములను గుర్తించడంలో అధికారుల కాలయాపన వల్ల అటవీ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. పర్యావరణం, జీవవైవిధ్యానికి దోహదపడాల్సిన సామాజిక అడవుల పెంపకం ఆగిపోగా.. ఆ భూములు సైతం ఆక్రమణలకు గురయ్యాయి. రెవెన్యూ, అటవీశాఖల్లోని కొందరు అధికారుల ఉదాసీనత వల్ల అడవులు (Forest) పెరిగిన భూములు సైతం ఆక్రమణదారుల పేరిట రిజిస్ట్రేషన్ కాగా.. వారు ‘రైతుబంధు’ను సైతం పొందుతున్నారు. ఉమ్మడి వరంగల్లో పలుచోట్ల ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోగా, తెలంగాణ (Telangana) వ్యాప్తంగా అటవీ భూముల ఆక్రమణల వివాదాలున్నాయి. చాలాచోట్ల కోర్టుల ద్వారా పరిష్కారమయ్యాయి. భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలో 106.34 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులది కాదని.. అది అటవీ భూమేనని సుప్రీంకోర్టు సుమారు ఆరు నెలల కిందట తీర్పు ఇచ్చింది. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో ఇనుపరాతి గుట్టల చుట్టూ ఆక్రమణలకు గురైన అటవీ భూములపై రెవెన్యూ, అటవీశాఖలు ఎటూ తేల్చడం లేదు. సర్వేల పేరిట సాగదీత నేపథ్యంలో రూ.కోట్ల విలువైన అటవీ భూములు స్వాదీనం చేసుకుంటారా? పరాదీనమవుతాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల సాయంతోనే యథేచ్ఛగా ఆక్రమణలు.. హనుమకొండ జిల్లా ధర్మసాగర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, వేలేరు మండలాల శివార్లలోని ఇనుపరాతి గుట్టల చుట్టూ అటవీశాఖ లెక్కల ప్రకారం 3,952 ఎకరాలు ఉంది. నిజాంకాలంలో మొత్తం 4 వేల ఎకరాలకుపైగా భూమిని అటవీశాఖకు అప్పగించినట్టు రికార్డుల్లో ఉంది. కొత్తపల్లి బ్లాక్లో 594 ఎకరాలు, దామెరలో 560, ఎర్రబెల్లిలో 820, దేవనూరులో 1,095, ముప్పారం బ్లాక్లో 906 ఎకరాలుగా ఉంది. కాలక్రమంలో రెవెన్యూ అధికారుల తీరు వల్ల అటవీ భూమికి చుట్టుపక్కల పట్టాలు పుట్టుకొచ్చాయి. ఈ వ్యవహారంపై కొన్నేళ్లుగా రెవెన్యూ, అటవీశాఖలు కలిసి సర్వే పేరుతో కాలయాపన చేస్తుండటంతో ఇంకా ప్రైవేటు వ్యక్తులు యథేచ్ఛగా ఆక్రమిస్తూ పట్టాలు చేసుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు కొందరు సర్వేనంబర్లకు బై నంబర్లు వేసి పట్టాదారు పాసుపుస్తకాలు కూడా అందజేస్తున్నారు. గతంలో పనిచేసిన ఓ రెవెన్యూ అధికారి ఏకంగా 40 ఎకరాలకు పట్టాలు ఇచ్చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. 30 ఎకరాల వరకు ధర్మారం మండలంలోని అటవీ శివారుల్లోని భూములు కూడా కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయి. పల్లగుట్ట, చాకలిగుట్ట, ఎదురుగుట్ట, పందిఅడుగుగుట్ట పరిధిలోని భూములు కొందరి కబ్జాలో ఉన్నాయి. ఏడాది క్రితం 102 ఎకరాలు కొందరికి పట్టా చేసేందుకు ప్రయత్నాలు జరగ్గా.. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో ఉన్నతాధికారులు చెక్ పెట్టారు. అయినా 40 ఎకరాల వరకు పట్టా అయ్యిందని చెబుతున్నారు. కాగా కొన్నేళ్లుగా ఈ భూములను పట్టాలు చేసుకుంటున్నవారిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులే ఎక్కువగా ఉండగా.. కొందరు ఫారెస్టు, రెవెన్యూ అధికారుల ప్రమేయంతోనే వారి రంగప్రవేశం జరిగిందన్న చర్చ సాగుతోంది. ఇదిలా వుండగా ఈ స్థలాల్లోని కొన్ని సర్వే నంబర్లలో దశాబ్దాల కిందట కొందరు చిన్న సన్నకారు రైతులకు ప్రభుత్వం భూములను అసైన్డ్ చేయగా, వారికి సైతం రెవెన్యూ అధికారులు సాగు చేసుకునేందుకు హద్దులు నిర్ణయించి ఇవ్వడం లేదు. కబ్జాదారులకు మాత్రం ముడుపులు తీసుకుని చకచకా పట్టాలు చేసేయడం వల్ల పట్టాదారులు ఇబ్బంది పడాల్సి వస్తుందంటున్నారు.తెలంగాణలో తగ్గిన అటవీ విస్తీర్ణం.. ‘ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టు– 2023’ప్రకారం తెలంగాణలో 2021–23 మధ్యకాలంలో 100.42 చదరపు కిలోమీటర్లు అటవీ విస్తీర్ణం తగ్గింది. 2021లో 21,279.46 చ.కి.మీ.లు ఉన్న రాష్ట్ర అటవీ విస్తీర్ణం.. 2023 నాటికి 21,179.04కు తగ్గింది. ఈ తరుగుదలలో మధ్యప్రదేశ్ (371.54 చ.కి.మీ.లు), ఆంధ్రప్రదేశ్ (138.66 చ.కి.మీ.లు) తర్వాత స్థానంలో తెలంగాణ ఉంది. రాష్ట్రంలోని 33 జిల్లాలకుగాను 13 జిల్లాల్లో అటవీ విస్తీర్ణం తగ్గగా 20 జిల్లాల్లో పెరిగినట్లు నివేదిక పేర్కొంది. తగ్గిన 13 జిల్లాలలో మహబూబాబాద్లో 26.98 చ.కి.మీ.లు, ములుగులో 25.91 చ.కి.మీ.లు, జయశంకర్ భూపాలపల్లిలో 15.43 చ.కి.మీ.లు, వరంగల్లో 2.51 చ.కి.మీ.లు, జనగామలో 2.13 చ.కి.మీ.లు తగ్గింది.‘ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టు– 2023’ప్రకారం తెలంగాణలో 2021–23 మధ్యకాలంలో 100.42 చదరపు కిలోమీటర్లు అటవీ విస్తీర్ణం తగ్గింది. 2021లో 21,279.46 చ.కి.మీ.లు ఉన్న రాష్ట్ర అటవీ విస్తీర్ణం.. 2023 నాటికి 21,179.04కు తగ్గింది. ఈ తరుగుదలలో మధ్యప్రదేశ్ (371.54 చ.కి.మీ.లు), ఆంధ్రప్రదేశ్ (138.66 చ.కి.మీ.లు) తర్వాత స్థానంలో తెలంగాణ ఉంది. రాష్ట్రంలోని 33 జిల్లాలకుగాను 13 జిల్లాల్లో అటవీ విస్తీర్ణం తగ్గగా 20 జిల్లాల్లో పెరిగినట్లు నివేదిక పేర్కొంది. తగ్గిన 13 జిల్లాలలో మహబూబాబాద్లో 26.98 చ.కి.మీ.లు, ములుగులో 25.91 చ.కి.మీ.లు, జయశంకర్ భూపాలపల్లిలో 15.43 చ.కి.మీ.లు, వరంగల్లో 2.51 చ.కి.మీ.లు, జనగామలో 2.13 చ.కి.మీ.లు తగ్గింది.ధర్మసాగర్ మండలం దేవునూర్ శివారులోని ప్రభుత్వ నోటిఫికేషన్లో ఉన్న భూములు, నోటిఫికేషన్లో లేని భూములు గుర్తించాం. ఆ భూముల్లో సాగు చేస్తున్న రైతుల వివరాలు సేకరించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. దీనిపై ఉన్నతాధికారుల ఆదేశానుసారం నిర్ణయం తీసుకుంటాం. దేవునూర్, ముప్పారం గ్రామాల శివారులోని ఇనుపరాతి గుట్టల్లో ఫారెస్ట్ అధికారులకు– రైతులకు మధ్య జరుగుతున్న వివాదం పరిష్కారమయ్యేలా ఫారెస్ట్ భూములు, రైతుల పట్టా భూములు సర్వే చేశాం. – బి.సదానందం, తహసీల్దార్, ధర్మసాగర్, హనుమకొండ జిల్లా సర్వే వివరాలు అందాల్సి ఉంది.. ఇనుపరాతి గుట్టలు, నాలుగు మండలాల పరిధిలో ఉన్న సర్వే ఇంకా కొంతమేర మిగిలి ఉంది. ధర్మసాగర్ మండలంలోని ముప్పారం, దేవనూరు, వేలేరు మండలంలోని ఎర్రబెల్లి, భీమదేవరపల్లి మండలంలోని కొత్తపల్లి, ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామాల శివారులో ఇనుపరాతి గుట్టలు ఉన్నాయి. మొత్తం ఫారెస్ట్ భూమి 3,750 ఎకరాలకుపైన ఉండాలి. ఈ భూమికి రెవెన్యూ అధికారులు హద్దులు ఏర్పాటు చేసి ఇస్తే ఫారెస్ట్ అధికారులు ఆ భూముల చుట్టూ ఫెన్సింగ్ చేస్తారు. జిల్లా ఉన్నతాధికారులు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. – భిక్షపతి, ఫారెస్ట్ రేంజ్ అధికారి, ధర్మసాగర్, హనుమకొండ జిల్లా -
పెళ్లి మంటపాల్లో ‘డబ్బు’ వాద్యాలు
‘మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్’ అన్నమాట ఎంతవరకు నిజమో కానీ పెళ్లి వేడుకకు ఆకాశమే హద్దుగా మారిందన్నది మాత్రం వంద శాతం నిజం! కిందటేడు అంటే 2024లో ఒక్క నవంబర్, డిసెంబర్ నెలల్లోనే 4.8 లక్షల పెళ్లిళ్లయ్యాయి. అవి ఆరు లక్షల కోట్ల వ్యాపారం చేశాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ నివేదిక! దీని ప్రకారం ఈ మొత్తం 4.8 లక్షల్లో రూ. 3 లక్షల నుంచి రూ. కోటి వరకు ఖర్చు పెట్టిన వివాహాలున్నాయి. ఈ లెక్క చూశాక తెలిసింది కదా.. పెళ్లి ఖర్చుకు ఆకాశమే హద్దు అని! ఆచార సంప్రదాయాలు, వ్యవహారాలు, పెట్టుపోతలు ఇవన్నీ ఆడంబరాలుగా మారి పెళ్లిఖర్చును పెంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెళ్లి అనేది ఒక పెద్ద పరిశ్రమగా మారిపోయింది. జనవరి 30 నుంచి పెళ్లి ముహూర్తాలు మొదలయ్యాయి. మార్చి 10 వరకు సందడే సందడి! ఆ సందర్భంగా మ్యారేజ్ ఇండస్ట్రీ, మధ్యతరగతి (Middle Class) మీద ప్రభావం వంటివి స్పృశిస్తూ ఒక కథనం..మన దేశంలో సగటు వివాహ ఖర్చు.. ఒక ఇంటి ఏడాది ఆదాయం కంటే మూడు రెట్లు ఎక్కువ! అది మన దేశ వెడ్డింగ్ ఇండస్ట్రీని (Wedding Industry) దాదాపు రూ. లక్షాపదమూడు కోట్లతో ప్రపంచంలోని అతిపెద్ద పరిశ్రమల్లో ఒకటిగా చేర్చింది. ఇది అమెరికా వెడ్డింగ్ మార్కెట్ (US Wedding Market) కన్నా రెండింతలు పెద్దది. కోవిడ్ తర్వాత పెళ్లి వ్యయం మరింత ప్రియం అయింది. అతిథుల సంఖ్య తగ్గింది. కానీ ఖర్చు నయా పైసా కూడా తగ్గలేదు. ఇదివరకు ఆడపిల్ల పెళ్లంటే బంధువులు, స్నేహితులు అన్నిరకాలుగా అండగా నిలిచి ఉన్నదాంట్లో ఆ వేడుకను సంప్రదాయబద్ధంగా జరిపించి తల్లిదండ్రులు తేలికపడేలా చేసేవారు. మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వారైతే ఇల్లు వాకిలి, పొలమూ పుట్రా అమ్మడమో, తాకట్టు పెట్టడమో చేసి పెళ్లి జరిపించేవారు.అప్పుడు వరకట్నాలు లాంఛనాలు, బంగారం కిందే జమయ్యేవి. ఇప్పుడా సీన్ మారిపోయింది. అమ్మాయిలూ ఉద్యోగాలు చేస్తున్నారు. పర్ఫెక్ట్ ప్లాన్తో ఉంటున్నారు. ఆ ప్రణాళికలో పెళ్లికీ ప్రయారిటీ ఇస్తున్నారు. హల్దీ, మెహందీ, సంగీత్, పెళ్లి కూతురు– పెళ్లికొడుకు సహా పెళ్లిని అయిదు రోజుల ఈవెంట్స్తో ఘనంగా జరిపించుకోవాలనుకుంటున్నారు. ఫొటోలు, వీడియోలే కాదు సోషల్ మీడియా షాట్స్, రీల్స్గానూ ప్రెజెంట్ చేయాలనుకుంటున్నారు.వీటన్నిటి ఖర్చు కోసం కొలువు తొలిరోజు నుంచే ఆదా చేయడం మొదలు పెడ్తున్నారు. అలా పెళ్లి ఖర్చును అమ్మాయిలు తమ ఖాతాలో వేసుకుంటున్నారు. కట్నకానుకలను మాత్రం తల్లిదండ్రులు తమ బాధ్యతగా భావిస్తున్నారు. అవి స్థిర, చరాస్తులుగా రూపాంతరం చెందాయి. అమ్మాయి పేరు మీదే ఉంటున్నాయి. అవీ పెళ్లి ఖర్చులో భాగమయ్యి, తల్లిదండ్రులు పెట్టే ఖర్చుల జాబితాలో చేరుతున్నాయి. అయితే ఇవి మ్యారేజ్ ఇండస్ట్రీలో కలవని అదనపు ఖర్చన్నమాట. బ్యాచిలర్.. బ్యాచిలరేట్ పార్టీలు కూడా.. దేశంలో సగటు మధ్యతరగతి కుటుంబం కూడా పెళ్లి మీద భారీగా ఖర్చుపెడుతోందంటోంది సీఏఐటీ సర్వే! తెలుగు రాష్ట్రాల్లో అయితే అది కనిష్టంగా రూ. 30 లక్షలు. పెళ్లి వేదిక, వచ్చే అతిథుల సంఖ్య, వంటకాల సంఖ్య, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సోషల్ మీడియా రీల్స్, షాట్స్ వగైరాలను బట్టి ఈ బడ్జెట్ పెరుగుతుంది. డెస్టినేషన్ వెడ్డింగ్ (Destination Wedding) అయితే అది రూ. కోటి దాటుతోంది. ఈ ΄్యాకేజ్లో బ్యాచ్లర్, బ్యాచ్లరెట్ ట్రిప్స్ కూడా ఉన్నాయి.ఇప్పుడు పెళ్లి ఖర్చును వధూవరులిద్దరూ సమంగా పెట్టుకునే ఆనవాయితీ మొదలైంది. ఇది ఒకందుకు మంచి పరిణామంగానే భావించినా.. అసలు పెళ్లనేది వ్యక్తిగత లేదా రెండు కుటుంబాలకు చెందిన వ్యవహారం. దానికి అంతంత ఖర్చుపెట్టాల్సిన అవసరం ఏముందని అబీప్రాయపడుతున్నారు సోషల్ ఇంజినీర్స్. ఫలానా వాళ్ల పిల్లల పెళ్లి కన్నా గొప్పగా తమ పిల్లల పెళ్లి చేయాలని తల్లిదండ్రులు, తమ స్నేహితులు.. కొలీగ్స్ కన్నా ఘనమనిపించుకోవాలని వధూవరులు.. పోటీలకు పోతూ, ఉన్న సేవింగ్స్ అన్నీ ఊడ్చేసుకుని.. అప్పులు కూడా తెచ్చుకుని మరీ పెళ్లి చేస్తున్నారు.. చేసుకుంటున్నారు.ఎస్బీఐ సహా పేరున్న ప్రైవేట్ బ్యాంకులన్నీ పెళ్లిళ్లకు లోన్స్ ఇస్తున్నాయి. పర్సనల్ లోన్ ఖాతాను పెంచడంలో వీటి పాత్ర గణనీయం. కస్టమ్ వెడ్డింగ్ లోన్ప్రోడక్ట్స్ బ్యాంకుల డిమాండ్నూ పెంచుతున్నాయి. ఈ అప్పులను తీర్చడానికి ఉన్న ఆస్తులను అమ్ముకుంటున్నారు. తల్లిదండ్రులు ప్రభుత్వోద్యోగులైతే ఆ అప్పులు తీర్చడానికి అవినీతికి పాల్పడిన దాఖలాలూ ఉన్నాయంటున్నారు సోషల్ ఇంజినీర్స్. ఈ అప్పులతో కొత్త పెళ్లిజంట మధ్యలో కూడా స్పర్థలు వచ్చి విడాకుల దాకా వెళ్లిన సంఘటనలూ ఉన్నాయని చెబుతున్నారు.ఇవీ ఉన్నాయి.. ఈ ఘనమైన మాయకు ఇరుగు పొరుగు, బంధుగణం, తోటివాళ్లే కాదు సినిమాలు, సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లూ బాధ్యులు. ‘మురారి’ సినిమా వచ్చిన కొత్తలో మాట.. ఒక ప్రోగ్రెసివ్ కుటుంబంలోని అమ్మాయి ‘మురారీ’ సినిమాలో పెళ్లి సీన్స్కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి.. తన పెళ్లి ఆ సినిమాలో చూపించినట్టే జరగాలని పట్టుబట్టి మరీ ఆ తరహాలోనే పెళ్లి చేసుకుంది. తల్లిదండ్రులు తమ అమ్మాయి పెళ్లికోసం అప్పట్లోనే అయిదు లక్షల రూపాయలు అప్పు చేయాల్సి వచ్చింది. ఇందులో బాలీవుడ్ పాత్రా ఉంది. ఈ మెహందీ, హల్దీ, సంగీత్, డిజైనర్ వేర్ వంటివన్నీ దాని పుణ్యమే! వెడ్డింగ్ ప్లానర్స్, డెస్టినేషన్ వెడ్డింగ్స్, థీమ్ థింగ్స్, ప్రీ వెడ్డింగ్ షూట్, రీల్స్, షాట్స్ లాంటి వాటన్నిటికీ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ఓటీటీ సిరీస్ల ప్రభావం కారణమంటున్నారు ట్రెండ్ ఎనలిస్ట్లు.వృథా కూడా అదే స్థాయిలో!ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.7 బిలియన్ టన్నులు అంటే మనిషి పండించే పంటలో మూడొంతులు వృథా అవుతోందట. ఈ వృథాలో అధిక వాటా పెళ్లిళ్లు లాంటి వేడుకలదే! అందులో మనమేం తక్కువలేం! ఈ వృథా వల్ల ఇంకొకరి ఆహారపు హక్కును మనం హరించినట్టే! అంతేకాదు.. ఈ ట్రెండ్ ధరలనూ ప్రభావితం చేసి నిత్యవసరాలను అందుకోలేనంత ఎత్తులో పెట్టేస్తోంది. ఇకో ఫ్రెండ్లీ యువత అంతా లగ్జరీ వైపే చూస్తోందని ఆందోళన చెందక్కర్లేదు. పెళ్లనేది పూర్తి వ్యక్తిగత వ్యవహారంగా భావించి రిజిస్టర్ మ్యారేజ్తో ఒక్కటవుతున్న జంటలూ ఉన్నాయి. తమ పెళ్లికి ఆత్మీయులు, సన్నిహితుల ఆశీస్సులు అవసరమనుకునేవారు దాన్ని కుటుంబ వేడుకకే పరిమితం చేసుకుంటున్నారు. అనవసర ఖర్చు లేకుండా, స్థానికంగా దొరికే వస్తువులతోనే పర్యావరణహితంగా మలచుకుంటున్నారు. ఈ జంటలే భవిష్యత్ జంటలకు మార్గదర్శకంగా నిలవాలని ఆశిద్దాం! ఈ మెహందీ, హల్దీ, సంగీత్, డిజైనర్ వేర్ వంటివన్నీ సినిమాల పుణ్యమే! వెడ్డింగ్ ప్లానర్స్, డెస్టినేషన్ వెడ్డింగ్స్, థీమ్ థింగ్స్, ప్రీ వెడ్డింగ్ షూట్, రీల్స్, షాట్స్ లాంటి వాటన్నిటికీ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ఓటీటీ సిరీస్ల ప్రభావం కారణమంటున్నారు ట్రెండ్ ఎనలిస్ట్లు. – సరస్వతి రమ⇒ పెరుగుతున్న పెళ్లి ఖర్చును అదుపు చేయాల్సిందిగా 2017లో రంజిత్ రంజన్ అనే కాంగ్రెస్ ఎంపీ పార్లమెంట్లో ‘ప్రివెన్షన్ ఆఫ్ వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ ఆన్ స్పెషల్ అకేషన్స్’ అనే ప్రైవేట్ బిల్ను ప్రవేశపెట్టాడు. దీనిప్రకారం పెళ్లికి అతిథుల సంఖ్య వందకు, పదిరకాల వంటకాలు, కానుకల విలువ రూ. 2,500కు మించరాదు. ఎవరైనా పెళ్లి మీద రూ. 5 లక్షలకు మించి ఖర్చు పెడితే పది శాతం డబ్బును ప్రభుత్వ సంక్షేమ నిధికి ఇవ్వాలి. అలా జమ అయిన మొత్తాన్ని ప్రభుత్వం ఏటా పేదింటి ఆడపిల్లల పెళ్లికి ఖర్చుపెట్టాలి. కానీ ఈ బిల్లు ఆమోదం పొందలేదు. చదవండి: పుస్తకాలు మా ఇంటి సభ్యులు⇒ 1993లో నాటి ఒడిశా ముఖ్యమంత్రి బిజు పట్నాయక్.. పెళ్లికి ముందు పెళ్లిలో రూ. 25 వేలకు మించి ఖర్చు చేయకూడదంటూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాడు. కానీ అదీ పాస్ అవలేదు.కన్స్ట్రక్టివ్గా ఇన్వెస్ట్ చేసుకోవాలిసంపాదించుకుంటున్నాం కదాని ఉన్న సేవింగ్స్ అన్నిటినీ పెళ్లి అట్టహాసాలకే ఖర్చు చేయడం కరెక్ట్ కాదు. ఉన్న వాళ్లు ఎంత ఖర్చుపెట్టుకున్నా పర్లేదు. కాని వాళ్లను మిడిల్క్లాస్ పీపుల్ ఫాలో అయితేనే తర్వాత ఆర్థికంగా, ఎమోషనల్గా చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పులు చేసి మరీ మన చుట్టూ ఉన్నవాళ్లను మెప్పించడం వల్ల మన ఇల్లు గుల్లవడం తప్ప పైసా ప్రయోజనం ఉండదు. పెళ్లి తర్వాత ఇల్లు, పిల్లలు .. వాళ్ల చదువులు లాంటి ఎన్నో బాధ్యతలుంటాయి. వాటి కోసం సేవింగ్స్ని ప్లాన్ చేసుకోవాలి. కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఆచితూచి మదుపు చేసుకోవాలి. దానివల్ల మనం సంతోషంగా ఉండటమే కాదు ప్రకృతి వనరులను, శ్రమను గౌరవించిన వాళ్లమవుతాం! – డాక్టర్ కస్తూరి అలివేలు, అసోసియేట్ప్రోఫెసర్, డీన్, డీజీఎస్ సెస్, హైదరాబాద్.డిమాండ్ పెరిగిందిపెళ్లి ఫొటో, వీడియోగ్రఫీలు తక్కువలో తక్కువ రెండు లక్షల నుంచి మొదలు ఈవెంట్స్ కవరేజ్ను బట్టి బడ్జెట్ పెరుగుతుంది. ప్రీ వెడ్డింగ్ షూట్స్ కోసం స్టూడియోస్ కూడా ఉన్నాయి. డబ్బుండి, టైమ్ లేని వాళ్లు ఆ స్టూడియోస్లో షూట్స్ని ప్రిఫర్ చేస్తుంటే.. డబ్బు, టైమ్ రెండూ ఉన్నవాళ్లు విదేశాలకూ వెళ్లి షూట్ చేయించుకుంటున్నారు. మొత్తం మీద ఫొటో, వీడియోగ్రాఫర్స్తోపాటు ఈ స్టూడియోస్కీ డిమాండ్ బాగా పెరిగింది. – వీఎన్ రాజు, వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్కాంప్రమైజ్ అవ్వట్లేదువెడ్డింగ్ సెలబ్రేషన్స్ విషయంలో ఎవరూ కాంప్రమైజ్ అవట్లేదు. కోవిడ్ తర్వాత ఈ ట్రెండ్ మరీ ఎక్కువైంది. పెళ్లికి వచ్చే అతిథులు తగ్గారు కానీ.. వేడుకల విషయంలో మాత్రం ఎవరూ వెనకడుగు వేయట్లేదు. మధ్యతరగతి వాళ్లు కూడా వెడ్డింగ్ ప్లానర్ని పెట్టుకుంటున్నారు. ఎంత తక్కువనుకున్నా 30 లక్షల నుంచి మొదలవుతోంది వెడ్డింగ్ బడ్జెట్. డెస్టినేషన్ వెడ్డింగ్స్ అయితే 50.. 60 లక్షలు ఇంకా ఆపై కూడా ఉంటోంది. ఇదివరకు ఈవెంట్స్ అన్నీ ఫొటోలు, వీడియోలకే పరిమితమై ఉండేవి. ఇప్పుడు రీల్స్, షాట్స్లో సోషల్ మీడియాలోనూ ప్రెజెంట్ చేయాలనుకుంటున్నారు.బ్రైడ్ అండ్ గ్రూమ్ కొత్త కొత్త ఐడియాలతో వచ్చి వాటిని అమలు చేయడానికి ప్లాన్లు అడుగుతున్నారు. పీర్స్ కన్నా డిఫరెంట్గా ఉండాలనీ, తామే ఒక కొత్త ట్రెండ్ సెట్ చేయాలనే ఆలోచనతో వస్తున్నారు. ఎంతైనా ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నారు. దీంతో వెడ్డింగ్ ప్లానర్స్కి డిమాండ్ పెరుగుతోంది. వాళ్లమధ్య పోటీ కూడా ఎక్కువే ఉంటోంది. కొంచెం క్రియేటివిటీ ఉంటే చాలు వెడ్డింగ్ ప్లానర్ అనే బోర్డ్ పెట్టేసుకుంటున్నారు. – వర్ధమాన్ జైన్, వెడ్డింగ్ ప్లానర్ -
ప్రత్యక్ష దైవమా.. ప్రణామం
రామవరప్పాడు: సమస్త జీవరాశి మనుగడకూ సూర్యుడే మూలాధారం. ఉదయభానుని అరుణ కిరణ స్పర్శతోనే ప్రకృతి మేల్కొంటుంది. ప్రాణికోటికి ప్రాణప్రదాత, ఆరోగ్యదాత భాస్కరుడే. ఆటవికుల నుంచి ఆధునికుల వరకూ జాతిమతాలకు అతీతంగా ఇనబాంధవుని ఆరాధిస్తూనే ఉంటారు. భారతీయ సంస్కృతిలో కశ్యప పుత్రుని స్థానం సమున్నతం. మాఘమాసంలో శుక్లపక్షం సప్తమి తిథినాడు రథసప్తమి (Ratha Saptami) పేరుతో సూర్యజయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున సూర్యుడు సప్తాశ్వాలు పూన్చిన రథాన్ని అధిరోహించి దక్షిణాయనాన్ని ముగించుకుని పూర్వోత్త దిశగా ప్రయాణం ఆరంభిస్తాడని భక్తుల విశ్వాసం. మాఘ సప్తమి (Magha Saptami) నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. సూర్యోపాసన చేస్తే రుణ, రోగ, శత్రుబాధలు నశిస్తాయని భారతీయుల నమ్మకం. సూర్యకిరణాలు (Sun Rays) తప్పనిసరిగా శరీరంపై ప్రసరించాలి. ఇందులో భాగంగానే వైదిక సంస్కృతిలో సంధ్యావందనం, సూర్యనమస్కారాలు వంటి పలు ప్రక్రియలు ఆచరణలోకి వచ్చాయి.సూర్యనమస్కారాల విశిష్టత సూర్యనమస్కారములు ఒక అద్భుతమైన వ్యాయామ పద్దతి. సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా పన్నెండు భంగిమలతో కూడిన సూర్యనమస్కారాలలో ఒక సంక్షిష్టమైన ప్రాణాయామం, ధ్యానం, సమ్మిళితమైన వ్యాయామం ఇమిడి ఉంది. ఇందులో ఒక విశిష్టమైన ఆసన సరళి, ఒక మహోన్నతమైన శ్వాస నియంత్రణ ఒక పరమోత్కృష్ట ధ్యాన విధానం ఉన్నాయి. సూర్యనమస్కారాలు చూడటానికి సాధారణ వ్యాయామంలాగే కనిపించినా ఆచరించి చూస్తే ఒక అవ్యక్తానుభూతి కలుగుతుందని యోగ గురువులు చెబుతున్నారు. సూర్య నమస్కారాలతో మంచి ఆరోగ్యం నిత్యం సూర్య నమస్కారాలు చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగి ఆరోగ్యవంతులవుతారు. శరీరంలోని ప్రతి అంగాన్నీ ఉత్తేజపరచే ప్రక్రియలు సూర్యనమస్కారాలు. ఈ పన్నెండు ఆసనాలు వేయడం వల్ల శరీరంలోని బిగువులు తొలగడం, విషపదార్థాలు కరిగిపోవడం, దేహ కదలికలు సులువు కావడం, కీళ్లు వదులవడంతో నరాలు, కండరాల వ్యవస్థ సమతుల్యంగా పని చేస్తుంది. దృష్టి, వినికిడి, వాసన, రుచి శక్తులు పెరుగుతాయి. సూర్య నమస్కారాలతో ఎముకలు, కండరాలు బలోపేతమై మనిషి ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని శాస్త్రవేత్తలు స్వష్టం చేస్తున్నారు. వీటివల్ల బరువు తగ్గడంతోపాటు జీర్ణక్రియ మెరుగుపడటం, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. సూర్యనమస్కారాలు శరీర భాగాలపైనే కాకుండా గ్రంధులపైనా పని చేస్తాయి. థైరాయిడ్, పారా థైరాయిడ్, పిట్యూటరీ వంటి గ్రంథులు సాధారణ స్థాయిలో పనిచేయడానికి ఇవి ఎంతో ఉపకరిస్తాయి. ఏ ఆసనంతో ఎలాంటి లబ్ధి 1,12 ఆసనాలతో శరీర సమతుల్యత సాధించవచ్చు. శ్వాసకోశ వ్యవస్థ మెరుగుపడుతుంది. వెన్నెముక, మెడ, భుజాల దగ్గర ఉన్న కండరాలు బలోపేతం అవుతాయి. 2,11 ఆసనాలతో... జీర్ణవ్యవస్థను మెరుగు పడుతుంది. వెన్నుముక, పిరుదులు బలోపేతమవుతాయి. 3,10 ఆసనాలు.. రక్తప్రసరణ పెంచుతాయి, కాలి కండరాలను బలోపేతం చేస్తాయి, గ్రంథులపై కూడా ప్రభావం చూపుతాయి. 4,9 ఆసనాలు... వెన్నెముక, చేతి మణికట్టు కండరాలను బలోపేతం చేస్తాయి. 5,8 ఆసనాలు.. గుండెను బలోపేతం చేస్తాయి. మెడ, భుజాల దగ్గర ఉండే ఒత్తిడిని తగ్గిస్తాయి. 6వ ఆసనం. మెడ, భుజాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది. 7వ ఆసనం... జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. వెన్నుముక బలంగా మారడానికి ఉపకరిస్తుంది. యువతను చైతన్య పరుస్తున్నాం.. సూర్యనమస్కారాలు, యోగ ఆసనాలపై యువతకు ఉచితంగా అవగాహన కల్పిస్తున్నాం. యోగ, సూర్యనమస్కారాల విశిష్టత అందరికీ తెలియాలనే ఉద్ధేశ్యంతో యోగపై ప్రత్యేకంగా పుస్తకం రాశాను. ప్రత్యక్షంగా ఆసనాలు నేర్చుకోలేని వారి కోసం పరోక్షంగా అవగాహన కల్పించడం కోసం హై క్వాలిటీ రికార్డింగ్తో పర్ఫెక్ట్ టైమింగ్తో ఆడియో కూడా రూపొందించాను. పాఠశాలలు, కళాశాలల్లో యువత, విద్యార్థుల కోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఈ ఆడియో సాయంతో విజయవాడ, హైదరాబాద్తో పాటు అమెరికా, లండన్లో కూడా సెంటర్లు నడుస్తున్నాయి. వయస్సుతో నిమిత్తం లేకుండా అందరూ ఆసనాలపై ఆశక్తి పెంపొందించుకుని ఆరోగ్యంగా ఉండటమే మా లక్ష్యం. 1. నమస్కారాసనం (ఓం మిత్రాయనమః )చాతీని ముందుకు చాచి భుజాలను విశ్రాంతిగా ఉంచాలి. శ్వాస తీసుకుంటూ రెండు చేతులనూ ప్రక్కల నుంచి ఎత్తి శ్వాస వదులుతూ రెండు చేతులనూ కలుపుతూ నమస్కార ముద్రలో ఛాతీని ముందుకు తీసుకురావాలి. సూర్యునికి అభిముఖంగా నమస్కారం చేస్తున్నట్లు నిలబడి సూర్యుని నామాన్ని ఉచ్చరించాలి.2. హస్త ఉత్తానాసనం ( ఓం రవయేనమః )కొద్దిగా శ్వాస పీల్చి రెండు చేతులను పైకెత్తి వెనుకకు తీసుకురావాలి. భుజాలను చెవులకు దగ్గరగా తీసుకురావాలి. తలను, నడుమును వెనుకకు వంచాలి. ఈ ఆసనంలో మడమల నుంచి చేతివేళ్ల వరకు మొత్తం శరీరాన్ని సాగదీయాలి.3. పాదహస్తాసనం (ఓం సూర్యాయనమః)శ్వాస వదలి, వెన్నుపూసను నిటారుగా ఉంచి నడుము నుంచి ముందుకు వంగాలి. శ్వాసను పూర్తిగా వదిలేసి చేతులను పాదాల పక్కకు భూమిమీదకి తీసుకురావాలి. తలను మెకాలుకు ఆనించాలి. కాళ్లు వంచకూడదు.4. అశ్వసంచలనాసనం (ఓం భానవే నమః )ఎడమ మెకాలును వంచి పాదాన్ని నేలపై ఉంచి, కుడి పాదాన్ని వెనుకగా వేళ్లపై ఆనించి, రెండు చేతులను పైకి చాపి, నడుము పై భాగాన్నంతా వెనుకకు వంచాలి. ఈ స్థితిలో శ్వాసను పీల్చి లోపలే ఆపాలి.5. దండాసనం (ఓం ఖగాయనమః)శ్వాస తీసుకుంటూ ఎడమకాలును కూడా వెనుకకు చాచి మొత్తం శరీరాన్ని భూమికి సమాంతరంగా ఒకే లైన్లో ఉంచాలి6. సాష్టాంగ నమస్కారం (ఓం పుష్ణేనమః)ఎనిమిది అంగాలు నేలకు ఆనటం వలన దీనికి అష్టాంగ నమస్కారం అని కూడా అంటారు. రెండు కాళ్లు రెండు మోకాళ్లు, రెండు చేతులు, రొమ్ము, గడ్డం ఈ ఎనిమిది అంగాలు నేలమీద ఉంచి నడుమును కొద్దిగా పైకి లేపాలి. శ్వాసను పూర్తిగా బయటకు వదలి ఆపాలి.7. భుజంగాసనం (ఓం హిరణ్యగర్భాయనమః)ముందుకు సాగి ఛాతీని పైకిలేపి త్రాచుపాము ఆకారంలోకి తీసుకురావాలి. ఈ ఆకారంలో మోచేతులను వంచవచ్చు. భుజాలు మాత్రం చెవులకు దూరంగా ఉంచాలి. శ్వాసను పీల్చి తల వెనుకకు వంచాలి.8. పర్వతాసనం (ఓం మరీచయేనమః)ఐదవ స్థితివలెనే కాళ్లు చేతులను నేలమీద ఆనించి నడుమును పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి.9. అశ్వసంచలనాసనం (ఓం ఆదిత్యాయనమః)శ్వాస తీసుకుంటూ కుడి పాదాన్ని రెండు చేతుల మధ్యలోకి తీసుకురావాలి. ఎడమ మోకాలు నేలమీద ఉంచి తుంటి భాగాన్ని కిందికి నొక్కుతూ పైకి చూడాలి.చదవండి: ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యారాధన!10. పాదహస్తాసనం (ఓం సవిత్రేనమః)శ్వాస వదులుతూ ఎడమపాదాన్ని ముందుకు తేవాలి. అరచేతులు భూమిమీద ఉంచాలి. అవసరమైతే మోకాలు వంచవచ్చు.11.హస్త ఉత్తానాసనం (ఓం అర్కాయనమః) శ్వాస తీసుకుంటూ ఉన్నప్పుడు వెన్నుపూసను నిటారుగా చేసి, చేతులు పైకిలేపి కొంచెం వెనుకకు వంగి తుంటి భాగాన్ని కొద్దిగా బయటకు తోయాలి.12. నమస్కారాసనం (ఓం భాస్కరాయ నమః)నిటారుగా నిలబడి ఊపిరి పీల్చుకునేటప్పుడు అరచేతులను ఒకచోటచేర్చి నమస్కారం చేయాలి. -
వలసదార్లకు దిన దిన గండం
అమెరికా.. ప్రపంచంలోని చాలా దేశాల ప్రజల్లాగే భారతీయులకూ ఓ కలల ప్రపంచం. ఆ డాలర్ డ్రీమ్స్ను సాకారం చేసుకోవడానికి, కుటుంబం, పిల్లలకు అందమైన భవిష్యత్ ఇవ్వడానికి ఎంతటి రిస్క్ అయినా తీసుకుంటున్నారు. ఒక్కోసారి ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నా అమెరికాకు వెళ్లే విషయంలో మాత్రం వెనుకడుగువేయట్లేరు. ఇలా ఎలాగోలా చట్టవిరుద్ధంగా వెళ్లి అక్కడ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఎలాంటి అవమానాలు పడుతున్నారు?డాక్యుమెంట్లు లేకుండా అక్రమంగా అమెరికా గడ్డపై అడుగుపెట్టిన వలసదారులు అమెరికాలో అనధికారిక పనులు చేసేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలేవీ రికార్డుల్లో ఉండవు. రికార్డులో ఉండాలంటే.. వీసాలు, వర్క్ పర్మిట్లు కావాలి. ఉదాహరణకు అమెరికన్లు చేయడానికి ఇష్టపడని ఉద్యోగాలన్నమాట. దక్షిణ కాలిఫోర్నియాలోని పొలాల్లో పని ఇందులో ఒకటి. ఎక్కువ సమయం, శ్రమతో కూడుకున్న పని అయినప్పటికీ వేరే పని దొరక్క దక్షిణ అమెరికా దేశాల నుంచి వచ్చిన అక్రమ వలసదారులు ఇలాంటి పనులు చేస్తున్నారు. చట్టవిరుద్ధంగా వెళ్లిన మన భారతీయులు ఎక్కువగా గ్యాస్ స్టేషన్లు, రెస్టారెంట్లు, కిరాణా దుకాణాల్లో పనిచేస్తున్నారు. నిర్మాణ రంగంలో కార్మికులుగా, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులుగా ఉద్యోగాలు చేస్తున్నారు. అనుక్షణం భయం.. భయం ఒహాయోలోని క్లీవ్ల్యాండ్కు అక్రమంగా వలస వచ్చిన ఒక భారతీయుడు ఉదయం 6 గంటలకే గ్యాస్స్టేషన్లో పనిలో నిమగ్నమవుతాడు. రాత్రిదాకా ఒళ్లు హూనమయ్యేలా పనిచేసి బయటి తిండి తిని తన బంధువుల ఇంట్లో బేస్మెంట్లో నిద్రపోతాడు. ఇందులో కష్టమేముందని దూరం నుంచి చూసిన వాళ్లకు అనిపించొచ్చు. కానీ పని చేసినంత సేపు ఇలాంటి వారి జీవితాల్లో అంతకుమించిన నరకయాతన ఉంటుంది. రిజిస్టర్డ్ వర్క్ప్లేస్లో పనిచేయలేరు. ఎలాంటి అధికారిక శిక్షణ పొందే అర్హత ఉండదు. డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పటికీ రాదు. డ్రైవింగ్ చేయలేరు. సైకిల్ తొక్కుతూ వెళ్లాల్సిందే. అది కూడా అక్కడి అధికారులకు అనుమానం వస్తే పట్టుబడతానేమోనని భయం వెంటాడుతుంది. నిరంతరం మనసులో ఏదో భయం. ఏ క్షణంలోనైనా ఏం జరుగుతుందోనన్న ఆందోళన. వస్తువులు పోయినా, ఎవరితోనైనా గొడవ జరిగినా, తననెవరైనా కొట్టినా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకూ వెళ్లలేరు. పట్టుబడితే వారికే రిస్క్. అందుకే ఏం జరిగినా భరించాల్సిందే. ఇంత శ్రమ ఎందుకూ అంటే.. స్వదేశంలో మధ్య తరగతి జీవితం గడుపుతున్న తన కుటుంబానికి మంచి జీవితం ఇవ్వాలనే తపన. కుటుంబాన్ని అమెరికాకు తీసుకురావాలి. అందుకు సరిపడా సంపాదించాలి. లీగల్ రెసిడెంట్గా అనుమతి పొందేందుకు లాయర్కు పెట్టుకునేంత సంపాదించాలి. ఇలా ఎన్నో ఆశలు. అమెరికన్ అధికారుల నుంచి తప్పించుకోవడం కత్తిమీద సాము. అలాంటిది ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి రోజూ ఏదో ఒక విధంగా తప్పించుకోవడం వారికి సర్వసాధారణమైపోతుంది. తోటి భారతీయుల సాయంతో.. అక్రమ వలసదారుల జీవితాల్లో అక్కడి తమలాంటి వాళ్ల సమూహం పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అక్రమ వలసదారులు కనీసం సిమ్ కార్డు పొందలేరు. బంధువులు ఇచ్చిన సిమ్ కార్డులను ఉపయోగించి స్వదేశంలోని కుటుంబంతో మాట్లాడతారు. బ్యాంకు ఖాతా పొందే అవకాశమే లేదు. సెప్టెంబర్ 11న 9/11 వైమానిక దాడుల తర్వాత అమెరికాలో అన్ని నిబంధనలు కఠినం చేశారు. అందులోభాగంగా బ్యాంకింగ్ నియమాలూ మారాయి. అందుకే స్థానిక యజమానులు అక్రమ వలసదారులకు పనికి వేతనాన్ని కేవలం నగదు రూపంలోనే చెల్లిస్తారు. అదనపు ఆదాయం కోసం, తెలిసినవారి తోటల్లో పనిచేయడం, ఇళ్ల గోడలకు పెయింటింగ్ వేయడం, ఇతర పనులలో సహాయం చేస్తూ ఇంకాస్త డబ్బు సంపాదిస్తారు. అక్రమవలసదారులు అనారోగ్య సమయాల్లో ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. సాధారణంగా అమెరికా ఆసుపత్రులు చట్టవిరుద్ధమైన నివాసితులకు చికిత్సను నిరాకరించవు. కానీ డాక్యుమెంట్లు లేకపోవడం వల్ల ఆస్పత్రుల వద్ద వైద్యం కాస్త కష్టంగా ఉంటుంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా అక్కడి చట్టబద్ధ భారతీయ వైద్యులను వీళ్లంతా ఆశ్రయిస్తారు. చవకగా వైద్య చికిత్సలు పొందుతారు. హెచ్–1బీ వీసాలు, గ్రీన్కార్డు సంపాదించిన భారతీయుల సహాయంతో ఆన్లైన్ ద్వారా స్వదేశానికి డబ్బులు పంపుతున్నారు. జీవితాలనే పణంగా పెట్టి... చాలా మంది డాక్టర్లు, నర్సులు, లాయర్లు ఇక్కడికి వచ్చి కూలీలుగా పనిచేసి డాక్యుమెంట్లు తయారు చేయించుకున్నారు. ఇలా రకరకాల పనులు చేసి.. డబ్బు సంపాదించి అనుమతి పొందిన వారు చాలా మంది తమ కుటుంబాలను కూడా అమెరికాకు తీసుకొచ్చారు. అమెరికాలోని ప్రభుత్వ పాఠశాలలు డాక్యుమెంటేషన్ అడగవు. దీంతో ఇప్పటివరకు వారి పిల్లలను తీసుకురావడం సులభమైంది. కొందరు అమెరికా వచ్చాక పిల్లలకు జన్మనివ్వడంతో వారు అమెరికా పౌరులుగా మారిపోయారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తొలిరోజే జన్మతః పౌరసత్వాన్ని రద్దుచేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకంచేయడం తెల్సిందే. ఈ ఉత్తర్వులపై సియాటెల్ ఫెడరల్ కోర్టు స్టే విధించింది. ట్రంప్ ప్రభుత్వ బెదిరింపులు డాక్యుమెంట్లు లేని వలసదారులను అమెరికా చేరుకోకుండా ఆపలేకపోతున్నాయి. ఎన్ని భయాలున్నప్పటికీ అమెరికన్ డ్రీమ్ ప్రయత్నాలను ఆపడం లేదు. కలను నిజం చేసుకోవడానికి జీవితాలనే పణంగా పెడుతున్నారు. డాక్యుమెంట్లు లేకుండా ఎట్లా వెళ్తున్నారు? కొందరు భారతీయులు చట్టవిరుద్ధంగా అమెరికాకు వలస వెళ్లడానికి కొన్ని అక్రమ విధానాలను అవలంభిస్తున్నారు. పర్యాటక లేదా తాత్కాలిక వీసాలపై అమెరికాకు వస్తారు. ఆ వీసా గడువు ముగిసినా భారత్కు తిరిగిరారు. తప్పించుకు తిరుగుతారు. ఇక భూమార్గంలో వేర్వేరు దేశాలు దాటి వస్తూ చిట్టచివరకు అమెరికా గడ్డపై కాలుమోపుతారు. ‘డంకీ’రూట్గా దీనికి పేరు. సరిహద్దులు దాటించేసే ఏజెన్సీలకు దాదాపు 1 లక్ష డాలర్లకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. సరైన విద్యార్హతలు, ఇంగ్లిష్ ప్రావీణ్యం లేని కారణంగా అమెరికా వీసా పొందలేని భారతీయులు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇంకొందరు తొలుత అమెరికా పొరుగున్న ఉన్న కెనడాకు వచ్చి అక్కడ 76 రోజుల విజిటర్ వీసా సంపాదించి అలా అమెరికాకు వచ్చి ఇక అక్కడే తిష్టవేస్తారు. వలసదారులు సాల్వడార్, నికరాగ్వాల గుండా కూడా అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు. ఇలా వేర్వేరు అక్రమ విధానాలను అవలంభించి ఇప్పటిదాకా 7,25,000 మంది అమెరికాకు చేరుకున్నట్లు తెలుస్తోంది. 2024 ప్యూ రీసెర్చ్ నివేదిక ప్రకారం అమెరికాలో డాక్యుమెంట్లు లేకుండా వచ్చిన అక్రమ వలసదారుల్లో భారతీయులు మూడో స్థానంలో ఉన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
టూర్కీ ఉంది ఓ ట్యాక్స్!
ఏపీ సెంట్రల్ డెస్క్: ఒత్తిడితో కూడుకున్న జీవితం నుంచి కాస్తంత సేద తీరడానికి ప్రస్తుతం దాదాపు ప్రతి ఒక్కరూ వివిధ పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తున్నారు. కొత్త ప్రదేశాలను చూడాలని.. చిల్ కావాలని కోరుకోనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎవరి ఆర్థిక స్థోమతలను బట్టి వారు దేశీయ, విదేశీ పర్యటనలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా విదేశాలకు అత్యధిక సంఖ్యలో వెళ్తున్నవారిలో భారతీయులు కూడా ఉంటున్నారు. ప్రపంచ పర్యాటకులు అత్యధికంగా సందర్శిస్తున్న వాటిలో బాలి (ఇండోనేషియా), బ్యాంకాక్ (థాయ్లాండ్), వెనిస్ (ఇటలీ), బార్సిలోనా (స్పెయిన్), యునైటెడ్ కింగ్డమ్ (యూకే) తదితర ప్రాంతాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు వెళ్లాలనుకుంటున్నవారిని పర్యాటక పన్నులు (టూరిస్టు ట్యాక్సెస్) కలవరపెడుతున్నాయి. విదేశాల్లోనే కాకుండా మనదేశంలోని ప్రముఖ వేసవి విడిది కేంద్రం.. కొడైకెనాల్లోనూ పర్యాటకులపై గ్రీన్ ట్యాక్స్ విధిస్తుండటం గమనార్హం.పర్యాటక పన్ను ఎందుకంటే.. పర్యాటక పన్నులనేవి కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ కాదు. గత కొన్నేళ్లుగా, ఆమ్స్టర్డామ్, వెనిస్, బాలి తదితర నగరాలు పర్యాటక పన్నును వసూలు చేస్తున్నాయి. అక్కడ పర్యాటకుల తాకిడికి తగ్గట్టుగా మౌలిక సదుపాయాలను కల్పించడానికి, ఆయా నగరాల్లో ఇతర వసతుల కల్పనకు, పరిశుభ్రంగా ఉంచడానికి పర్యాటక పన్ను విధిస్తున్నాయి. అలాగే పర్యాటకులను ఆకట్టుకోవడానికి ఆయా కార్యక్రమాలను నిర్వహించడానికి నిధులు అవసరం కాబట్టే తాము పర్యాటక పన్నును వసూలు చేస్తున్నామని ఆయా నగరాలు చెబుతున్నాయి. ఓవర్ టూరిజంతో వచ్చే ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికే తాము టూరిస్టు ట్యాక్స్ వసూలు చేస్తున్నామని పేర్కొంటున్నాయి. ఇప్పటికే యునైటెడ్ కింగ్డమ్లోని ఎడిన్బర్గ్ నగరం వచ్చే ఏడాది జూలై నుంచి పర్యాటక పన్నును వసూలు చేస్తామని ప్రకటించింది. ఎడిన్బర్గ్ బాటలోనే మరికొన్ని నగరాలు కూడా నడవడానికి సిద్ధమవుతున్నాయి. కలవరపెడుతున్న ఓవర్ టూరిజం.. కొన్ని దేశాలు పర్యాటకుల రాకపై ఆందోళన చెందుతుంటే మరికొన్ని దేశాలు ఓవర్ టూరిజం సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఆయా పర్యాటక ప్రాంతాల్లో ఉన్న మొత్తం జనాభా కంటే కొన్ని రెట్ల సంఖ్యలో పర్యాటకులు ఆయా ప్రాంతాలకు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా బాలి (ఇండోనేషియా), బ్యాంకాక్ (థాయ్లాండ్), వెనిస్ (ఇటలీ), బార్సిలోనా (స్పెయిన్), ఆమ్స్టర్డామ్ (నెదర్లాండ్స్) వంటివి ఓవర్ టూరిజం సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఆ నగరాల్లో ఉన్న జనాభాను మించి సంవత్సరం పొడవునా పర్యాటకులు ఈ నగరాలకు పోటెత్తుతుండటంతో వారికి మౌలిక సదుపాయాలు కల్పించడం పెద్ద సమస్యగా మారింది. డిమాండ్కు తగ్గట్టు నివాస, ఆహార సదుపాయాలు కల్పించడానికి, హోటళ్ల నిర్మాణానికి పెద్ద ఎత్తున స్థలాలు అవసరం పడుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో స్థానికులకు ఇళ్ల స్థలాలు దొరకడం లేదు. ఒకవేళ దొరికినా అత్యధికంగా ధర చెల్లించాల్సి వస్తోంది.అదేవిధంగా నిత్యం పర్యాటకులతో ట్రాఫిక్ సమస్యలు సైతం తలెత్తుతున్నాయి. దీంతో స్థానికులు తమ దైనందిన పనులు చేసుకోవడానికి, ఆఫీసులకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరప్ దేశం స్పెయిన్లోని బార్సిలోనాలో ఇటీవల ఓవర్ టూరిజం సమస్యను అరికట్టాలని స్థానికులు నిరసనలకు దిగడం ఇందుకు నిదర్శనం. ఇళ్ల స్థలాల కొరత, ట్రాఫిక్ సమస్యలే కాకుండా తమ ప్రాంతాలకు భారీ ఎత్తున తరలివస్తున్న పర్యాటకులతో పర్యావరణ కాలుష్యం కూడా పెరుగుతోందని స్థానికులు వాపోతున్నారు. ఆయా దేశాల పర్యాటకులు పర్యాటక ప్రాంతాలను ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర అపరిశుభ్రమైన చర్యలతో చెత్తకుప్పల్లా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యల వల్ల తమకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని.. ఓవర్ టూరిజం సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. పర్యాటకులకు మరింత భారమేనా? అయితే ఆయా దేశాల్లోని పర్యాటక ప్రాంతాల్లో టూరిస్టు ట్యాక్స్ విధించడం పర్యాటకులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని కొందరు ట్రావెల్ ఆపరేటర్లు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల పర్యాటకులపై మరింత అదనపు ఖర్చు పడుతుందంటున్నారు. పర్యాటకులపై పన్ను విధించడం వల్ల వారు పన్ను లేని వేరే కొత్త గమ్యస్థానాలపై దృష్టి సారిస్తారని అంటున్నారు. దీనివల్ల పన్ను విధిస్తున్న దేశాలకు పర్యాటకుల ద్వారా వచ్చే ఆదాయం పడిపోతుందని పేర్కొంటున్నారు. మరికొందరు ట్రావెల్ ఆపరేటర్లు మాత్రం పర్యాటక పన్ను విధించడం మంచి విషయమేనని చెబుతున్నారు. పర్యాటకులకు వసతులు కల్పించడానికి, ఓవర్ టూరిజం సమస్యను ఎదుర్కోవడానికి టూరిస్టు ట్యాక్స్ ఉండాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని పర్యాటక పన్నులు... ⇒ ఇటలీలోని వెనిస్ పర్యాటకుల తాకిడిని నియంత్రించడానికి ‘డే–ట్రిప్పర్ ట్యాక్స్’ పేరుతో ఒక్కో పర్యాటకుడి నుంచి రోజుకు 5 యూరోలు వసూలు చేస్తోంది. ⇒ నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్లో పర్యాటకులు తమ హోటల్ బిల్లుపై 7% అదనంగా చెల్లించాల్సిందే. అంతేకాకుండా రాత్రి అక్కడే ఉంటే సిటీ ట్యాక్స్ కింద మరో 3 యూరోలు సమరి్పంచుకోవాల్సిందే. ⇒ భారత్ పొరుగు దేశం భూటాన్ సైతం పర్యాటకుల నుంచి రోజువారీ రుసుమును వసూలు చేస్తోంది. వసతి, భోజనం, సాంస్కృతిక పర్యటనలను కవర్ చేయడానికి రోజుకు 200 నుంచి 250 డాలర్లను రోజువారీ సందర్శకుల రుసుము కింద తీసుకుంటోంది. ⇒ ఓడ లేదా విమానం ద్వారా వెళ్లే అంతర్జాతీయ పర్యాటకుల నుంచి ’సయోనారా ట్యాక్స్’ కింద జపాన్ 1,000 యెన్లు వసూలు చేస్తోంది. ⇒ యూకేలోని మాంచెస్టర్లోని హోటళ్లలో ఒక రాత్రి నివాసం ఉంటే ప్రతి పర్యాటకుడు ఒక పౌండ్.. నైట్ ట్యాక్స్ కింద చెల్లించాల్సిందే. ⇒ స్పెయిన్లోని బార్సిలోనాలో వసతి రకాన్ని, ప్రదేశాన్ని బట్టి ఒక్కో రాత్రికి 4 యూరోల వరకు టూరిస్టు ట్యాక్స్ చెల్లించాలి. ⇒ గతేడాది అక్టోబర్ 1 నుంచి న్యూజిలాండ్ టూరిస్టు ట్యాక్స్ను ఏకంగా మూడురెట్లు పెంచింది. అంతర్జాతీయ పర్యాటకులు ఆ దేశంలో అడుగుపెడితే 135 న్యూజిలాండ్ డాలర్లను చెల్లించాల్సిందే. ⇒ భారతీయ పర్యాటకులు అత్యధికంగా వెళ్లే దేశాల జాబితాలో ఉన్న మలేషియా, ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్, గ్రీస్, క్రొయేషియా, ఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, చెక్ రిపబ్లిక్, పోర్చుగల్ తదితర దేశాల్లోనూ టూరిస్టు ట్యాక్స్లు అమల్లో ఉన్నాయి. ⇒ గతేడాది యూకే.. ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (ఈటీఏ)ను ప్రవేశపెట్టింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, కొన్ని యూరప్ దేశాల నుంచి యూకేకు రావాలనుకునేవారు ముందుగా ఈటీఏకి దరఖాస్తు చేసుకోవాలి.. అలాగే నిర్దేశిత రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానాన్ని ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అన్ని దేశాలకు యూకే వర్తింపజేయనుంది. ⇒ ఈ ఏడాది జనవరి 1 నుంచి రష్యా పర్యాటక పన్నును ప్రవేశపెట్టింది. ⇒ ఈ ఏడాది మధ్య నుంచి థాయ్లాండ్ పర్యాటక పన్నును విధించడానికి సిద్ధమవుతోంది. విమానం ద్వారా తమ దేశంలో ప్రవేశించే పర్యాటకులు 300 బాత్లు చెల్లించాల్సి ఉంటుంది. అదే భూ లేదా సముద్ర మార్గం ద్వారా థాయ్లాండ్లో ప్రవేశిస్తే టూరిస్టు ట్యాక్స్ కొంత తక్కువ ఉంటుంది. ⇒ మనదేశంలో ప్రముఖ వేసవి విడిది కేంద్రం.. కొడైకెనాల్లో ప్లాస్టిక్ బాటిళ్లను నియంత్రించడానికి పర్యాటకుల నుంచి రూ.20 గ్రీన్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు.పర్యాటకులు ఏం చేయాలి? విదేశాల్లో ఏదైనా పర్యాటక ప్రాంతానికి వెళ్లాలనుకుంటే, ముందు ఆయా దేశాల్లో పర్యాటకులపై ఎలాంటి పన్నులు ఉన్నాయో తెలుసుకోవడం ఉత్తమమని ట్రావెల్ ఆపరేటర్లు చెబుతున్నారు. కొన్ని దేశాలు పర్యాటకులు విమానాశ్రయంలో దిగినప్పటి నుంచే పర్యాటక పన్నును వసూలు చేస్తున్నాయి. ఆ దేశంలో ఎన్ని రోజులు ఉంటారనేదాని ఆధారంగా ఈ రుసుములు ఉంటున్నాయి. మరికొన్ని దేశాలు పర్యాటకులు టూర్ని ముగించుకుని వెళ్లిపోతున్నప్పుడు పన్నును (డిపార్చర్ ట్యాక్స్) వసూలు చేస్తున్నాయి. కాబట్టి పర్యాటకులు తమ పర్యటనలకు ముందే ఈ ట్యాక్సుల గురించి తెలుసుకోవాలని ట్రావెల్ ఆపరేటర్లు చెబుతున్నారు. -
ఢిల్లీ గద్దె ఎవరిది?
ఢిల్లీ రాష్ట్ర శాసనసభ ఎన్నికల సమరంలో ఓటరు మనసు గెలిచేందుకు విస్తృత ప్రచారంచేసిన ప్రధాన పార్టీలన్నీ ఇప్పుడు ఓటింగ్ సరళి ఎలా ఉండబోతోందనే ఆలోచనలో తలము నకలయ్యాయి. మూడోసారి అధికార పీఠంపై ఆమ్ ఆద్మీ పార్టీ కన్నేసింది. 23 ఏళ్లుగా అధికారానికి దూరమైన బీజేపీ ఈసారి ఎలాగైనా ఢిల్లీ ఉట్టికొట్టాలని నిశ్చయించుకుంది. అందుకే కమలనాథులంతా ఏకమై మునుపెన్నడూ లేనంతగా ఎన్నికల ప్రచారం చేశారు. ఉనికి కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ సైతం ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాసహా ముఖ్యనేతలతో బాగా ప్రచారం చేయించింది. ఈసారి ఓటరు మహాశయుడు ఆప్ చీపురును పైకెత్తుతాడా? బీజేపీ కమలంను అందుకుంటాడా? కాంగ్రెస్ ‘చేయి’ పట్టుకుని నడుస్తాడా? అనేది రేపు జరగబోయే పోలింగ్తో తేలనుంది. ఉచిత విద్యుత్, మహిళా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలోకి నేరుగా నగదు జమ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, విద్యార్థులకు ఉపకార వేతనం, పెన్షన్లు, వృద్ధులకు ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు ఇస్తామని ప్రధాన పార్టీలన్నీ ఊదరగొట్టాయి. అయితే రూ.12 లక్షల వార్షిక ఆదాయానికి ఎలాంటి ట్యాక్స్ చెల్లించనక్కర్లేదని సాధారణ బడ్జెట్లో ప్రకటించి బీజేపీ పార్టీ ఢిల్లీ మధ్య తరగతి ఓటర్లను దాదాపు తనవైపునకు తిప్పుకున్నంత పనిచేసింది. ఈ ప్రకటన ఫలితాలు పోలింగ్ సరళిలో ఏమేరకు ప్రతిఫ లిస్తాయో చూడాలి మరి. రూ.10 లక్షల వార్షికా దాయంపై ఎలాంటి ట్యాక్స్ ఉండకూడదని ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఇన్నాళ్లూ డిమాండ్ చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంతకుమించి లబ్ధి చేకూ రేలా చేసి ఓటర్లు కమలం వైపు తల తిప్పేలా చేసింది. ఈ నేపథ్యంలో అసలు ఏఏ అంశాలు ఢిల్లీ ఎన్నికల్లో ఈసారి ప్రధాన పాత్ర పోషించే వీలుందనే చర్చ మొదలైంది.మధ్య తరగతి కుటుంబాలుఢిల్లీలోని కుటుంబాల్లో 67 శాతం కుటుంబాలు మధ్య తరగతికి చెందినవే. ఇంతటి పెద్ద సంఖ్యలో ఉన్న మధ్య తరగతిని పార్టీలు ప్రధానంగా ఆకట్టుకునే ప్రయత్నంచేశాయి. సాధారణ బడ్జెట్లో ప్రకటించినట్లు రూ.12 లక్షల వార్షికాదాయంపై ట్యాక్స్ను తొలగిస్తే మిగతా వర్గాల కంటే ముందుగా లబ్ధి చేకూరేది ఈ మధ్య తరగతి వాళ్లకే. ఈ లెక్కన బడ్జెట్ ప్రకటన తర్వాత ఈసారి మధ్య తరగతి వర్గాలు బీజేపీకే జై కొట్టే అవకాశాలు ఒక్కసారిగా పెరిగాయి. రెండుసార్లు అధికారంలో ఉన్న ఆప్ ప్రస్తుతం కొంతమేర ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. దీనికి ఆప్ నేతలపై వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలు ప్రధాన కారణం. ఢిల్లీ పరిధిలో మద్యం విధానంలో అక్రమాలు చేసి వందల కోట్లు కూడబెట్టారని ఆప్ నేతలపై ఈడీ అభియోగాలు మోపడం తెల్సిందే. ఈ అవినీతి మరకలను వెంటనే తొలగించుకోవడంలో ఆప్ నేతలు విఫలమయ్యారు. దిగజారిన ప్రతిష్ట ఇప్పుడు పోలింగ్లో పార్టీకి వచ్చే ఓట్ల సంఖ్యను దిగజారుస్తుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి.ముస్లింలు, దళితులుఢిల్లీ రాష్ట్రంలో ముస్లింల జనాభా 12.68 కాగా దళితుల జనాభా 16.92 శాతం. దళితులు ఎక్కువగా ఢిల్లీలోని జుగ్గీలుగా పిలిచి మురికివాడల్లో నివసిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మురికివాడలను తొలగిస్తుందన్న భయాలతో వీళ్లంతా తమకు ఆదుకుంటుందని అధికార ఆప్ పార్టీకే జై కొట్టారు. అయితే మురికివాడల జోలికి మేం రాబోమని ఇటీవల ప్రధాని మోదీ ప్రకటించడంతో వీళ్లంతా ఈసారి బీజేపీ వైపు నడవొచ్చనే మాట వినిపిస్తోంది. రాష్ట్రంలో దశాబ్దకాలంగా అధికారంలో లేని కాంగ్రెస్తో పోలిస్తే ముస్లింలు ఈసారి కూడా ఆప్ వెంటే ఉండే అవకాశాలున్నాయి. ప్రధానంగా ఆరు నియోజకవర్గాల్లో ముస్లింల జనాభా ఎక్కువ. సీలాంపూర్ నియోజకవర్గంలో అయితే ఏకంగా సగం మంది ఓటర్లు ముస్లింలే. మాటియా మహల్ నియోజకవర్గంలో 48 శాతం మంది, ఓఖ్లాలో 43 శాతం మంది, ముస్తఫాబాద్లో 36 శాతం మంది, బలీమరాన్లో 38 శాతం మంది, బబర్పూర్లో 35 శాతం మంది ముస్లిం ఓటర్లే ఉన్నారు. 2020 ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఈ ఆరు స్థానాలను ఆప్ గెల్చుకుంది.ఉచితాలుఉచితంగా ఇస్తామంటూ బీజేపీ, ఆప్లు ఎన్నికల ప్రచారం చేపట్టాయి. ఉచితంగా విద్యుత్, ఉచితంగా నీటి సరఫరా, మహిళల ఖాతాకు నగదు బదిలీ చేస్తామని ఆప్ ఉచిత హామీలు గుప్పించింది. ఆప్తో పోలిస్తే బీజేపీ కాస్త తక్కువ హామీలనే ఇచ్చింది. అయితే రూ.12 లక్షల వార్షికాదాయంపై ట్యాక్స్ మిన హాయింపుతో ఆమేరకు జనానికి లబ్ది చేకూరు తుందని, అది కూడా ఓ రకంగా ఉచిత హామీయేనని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.మహిళలుఢిల్లీ ఓటర్లలో 48% మంది మహిళలు ఉన్నా రు. దీంతో గెలుపు అవకాశాలను మహిళ లనూ నిర్ణయించనున్నారు. మొత్తంగా 71.7 లక్షల మంది మహిళా ఓటర్లు న్నారు. ముఖ్య మంత్రి మహిళా సమ్మాన్ యోజన పథకం కింద ఇస్తున్న నగదును రెట్టింపు చేస్తామని, నేరుగా బ్యాంక్ ఖాతాలో వేస్తామని మహిళలకు ఆమ్ ఆద్మీ పార్టీ హామీ ఇచ్చింది. నెలకు రూ.2,100 ఇస్తామని ప్రకటించింది. మేం అధికారంలోకి వస్తే నెలకు రూ.2,500 బదిలీచేస్తామని బీజేపీ ప్రకటించింది.ముఖ్యమంత్రి అభ్యర్థిఆమ్ ఆద్మీ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఢిల్లీ అంతటికీ తెలుసు. కేజ్రీవాల్ తప్ప ఇంకెవరు ఆ పదవికి పోటీపడట్లేరు. గతంలో బెయిల్ లభించక జైలులో ఉన్న కారణంగా ఆతిశీని సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. ఈసారి గెలిస్తే కేజ్రీవాల్ మళ్లీ సీఎం కుర్చీపై ఆసీనులవుతారు. బీజేపీలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఓటరుకు తెలీదు. ప్రధాని మోదీ పేరు, ఛరిష్మా మీదనే బీజేపీ ఓట్లు అడుగుతోంది. సీఎం అభ్యర్థిని ప్రకటించే దమ్ము కూడా బీజేపీకి లేదని తరచూ కేజ్రీవాల్ వెక్కిరించడం తెల్సిందే.ఫలోదీ సత్తా బజార్ ఏం చెబుతోంది?ఈసారి ఎన్నికల్లో ఆప్ పార్టీయే ఫేవరెట్గా నిలుస్తోందని ‘ది ఫలోదీ సత్తా బజార్’ తన అంచనాల్లో పేర్కొంది. 2015, 2020 ఎన్నికల కంటే ఈసారి ఆప్ మరింత బలంగా ఎన్నికల బరిలో దూకిందని వ్యాఖ్యానించింది. 70 సీట్లున్న అసెంబ్లీలో దాదాపు 38 నుంచి 40 చోట్ల ఆప్ గెలుస్తుందని ఈ సంస్థ అంచనావేసింది. ఆప్ తర్వాత బీజేపీ దాదాపు 30 నుంచి 32 నియోజకవర్గాల్లో జయకేతనం ఎగరేయొచ్చని సంస్థ చెబుతోంది. కాంగ్రెస్ ఏమేరకు రాణిస్తుందనే వివరాలను సంస్థ వెల్లడించలేదు. ఉనికి కోసం పోరాడుతున్న పార్టీపై సర్వే చేపట్టలేదని తెలుస్తోంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
అంతా.. ఏఐమయం
‘బూన్ గైడ్ ఉండగా.. పరీక్షల భయం దండగ’.. ఈ మాట ఎప్పుడైనా విన్నారా? దేశంలో పర్సనల్ కంప్యూటర్లు (పీసీ) సామాన్యులకు అందుబాటులోకి రాని 1980లలో కాలేజీ కుర్రాళ్లు తమను పరీక్షల గండం గట్టెక్కించే గైడ్ గురించి గొప్పగా చెప్పుకొనే మాట అన్నమాట. అయితే కాలంతోపాటు కంప్యూటర్ల పనితీరు, సామర్థ్యాలు అనూహ్యంగా పెరగడంతో ఇప్పుడు విద్యార్థులు మొదలు ఉద్యోగుల దాకా ఏ రంగానికి చెందిన వారికి కావాల్సిన సమాచారమైనా చిటికెలో అందించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్(Artificial intelligence)(ఏఐ) సాంకేతికత యావత్ ప్రపంచాన్ని అబ్బురపరుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏఐ అప్లికేషన్లు, వాటి ఉపయోగాలపై కథనం. – సాక్షి, హైదరాబాద్కృత్రిమ మేధ (ఏఐ) రంగం కేవలం ఐదంటే ఐదేళ్లలో ప్రపంచ గమనాన్ని మార్చేసింది. అదెలాగో తెలియాలంటే జనరేటివ్ ఏఐ ఎదుగుదలను చూడాలి. ఓపెన్ ఏఐ అనే సంస్థ 2019లో తొలిసారి ‘జీపీటీ–2’ను అందుబాటులోకి తెచ్చింది. ఎలాంటి ప్రశ్నలడిగినా తడుముకోకుండా అక్షరాల్లో బదులివ్వడం దీని ప్రత్యేకత. అయితే ఓపెన్సోర్స్ కోడ్ అందరికీ అందుబాటులో ఉండటంతో ఏఐ వేగంగా అభివృద్ధి చెందింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఏఐ అప్లికేషన్ల శకం మొదలైంది.అందరికీ చిరపరిచితం సిరి, అలెక్సా..మనలో చాలామందికి చిరపరిచితమైన చాట్జీపీటీ వర్చువల్ అసిస్టెంట్ అప్లికేషన్. సిరి, అలెక్సా, ‘ఓకే గూగుల్’ లాంటివన్నీ ఈ కోవకు చెందిన జనరేటివ్ ఏఐ అప్లికేషన్లే. మీరేదైన ప్రశ్న అడిగితే.. ఇంటర్నెట్ మొత్తాన్ని వెతికి సమాధానాలు చెబుతాయి. స్క్రీన్లపై అయితే పదాల రూపంలో.. మొబైల్ఫోన్లు ఇతర గాడ్జెట్ల ద్వారానైతే మాటల్లో బదులిస్తాయి. ఇవి కాకుండా ఫొటోలు, వీడియోలను గుర్తుపట్టేందుకు, వాటిని వర్గీకరించేందుకు గూగుల్ ఫొటోస్, డీప్ఆర్ట్ వంటివి అందుబాటులో ఉన్నాయి. మీకు ఇంగ్లిష్ అంత బాగా రాకపోయినా...తప్పుల తడకలా ఉండే వాక్యాలను కూడా సరి చేయాలంటే ‘గ్రామర్లీ’, ‘క్విల్బోట్’ వంటి ఏఐ అప్లికేషన్లు వాడుకోవచ్చు. అంకెల్లోని సమాచారాన్ని (ఎక్సెల్ షీట్లు) చదివేసి విశ్లేషించేందుకు ‘జూలియస్.ఏఐ’ ఉపయోగపడుతుంది. ఆఫీసుల్లో ఉద్యోగులకు నిత్యం ప్రాణ సంకటంగా మారే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లకు ‘కాన్వా’తోపాటు బోలెడన్ని అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. అంచనాలకూ ఏఐ యాప్స్..ఇప్పటివరకు మనం చూసిన అప్లికేషన్లన్నీ నెట్లో ఉన్న సమాచారం ఆధారంగా పనిచేస్తాయి. కానీ ప్రిడిక్టివ్ అనలటిక్స్ రకం ఏఐ అప్లికేషన్లు ఉన్న సమాచారం ఆధారంగా అంచనాలు కట్టేందుకు వాడతారు. ప్రముఖ ఐటీ కంపెనీ ‘ఐబీఎం’ వాట్సన్ పేరుతో సిద్ధం చేసిన జనరేటివ్ ఏఐ అప్లికేషనే అందుకు ఉదాహరణ. ఆరోగ్య రంగంలో కొత్త సంచలనం ఇది. ఇమేజ్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ద్వారా ఇది ఎక్స్–రేలను చదివేస్తుంది. వైద్య నివేదికలు, వైద్య పరిశోధనలకు సంబంధించిన సమాచారాన్ని (సైంటిఫిక్ జర్నళ్ల ద్వారా) ఔపోసన పట్టేస్తుంది. ఈ సమాచారం ఆధారంగా వైద్యుల కంటే ముందే కేన్సర్ వంటి ప్రాణాంతక జబ్బులను కూడా కచి్చతంగా గుర్తించేలా దీన్ని సిద్ధం చేశారు. ‘అడా’, ‘బాబిలోన్ హెల్త్’ వంటివి కూడా మన ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించి సలహా సూచనలు ఇవ్వగలిగే ఏఐ అప్లికేషన్లు.సొంతంగా సృష్టిస్తాయి కూడా... మనిషిని, యంత్రాన్ని వేరు చేసేదేమిటని ఎవరిని అడిగినా చెప్పే సమాధానం యంత్రం సొంతంగా ఏదీ సృష్టించలేదని చెబుతారు. అది నిజం కూడా. కానీ జనరేటివ్ ఏఐ అప్లికేషన్లతో ఈ పరిస్థితి కూడా మారిపోయింది. ‘డాల్–ఈ’, ‘మిడీజరీ్న’ వంటి అప్లికేషన్లు సొంతంగా బొమ్మలు గీయగలవు. సంగీతాన్ని సృష్టించగలవు. కర్ణాటక సంగీతాన్ని నేర్చుకొని తమదైన రాగాలు తయారు చేయగలవు కూడా..! అంతెందుకు.. ఒక సినిమా స్టోరీ రాయాలనుకోండి.. కథ తాలూకూ ప్రధాన ఇతివృత్తాన్ని చెబితే చాలు.. ఏఐ అప్లికేషనే స్క్రీన్ ప్లేతో కలిపి కథ మొత్తాన్ని రాసిచ్చేస్తుంది!డబ్బు లెక్కలకూ యాప్లు..స్టాక్మార్కెట్లో పెట్టుబడులంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఫలానా కంపెనీ షేర్ కొన్నేళ్లుగా ఎలాంటి లాభాలు తెచి్చపెడుతోందో? లేదా ఇబ్బందులు ఎదుర్కొంటోందో తెలియాలి. అయితే ‘మింట్’, ‘రాబిన్హుడ్’ వంటి అప్లికేషన్లు ఈ పనులన్నీ చిటికెలో చక్కబెట్టేస్తాయి. లార్జ్ లాంగ్వేజ్ మాడ్యూల్స్ (ఎల్ఎల్ఎం) ఆధారంగా కంపెనీల ఆర్థిక పరిస్థితులన్నింటినీ మదించి పెట్టుబడుల సలహాలిస్తాయి.డీప్సీక్ రాకతో విప్లవం..తాజాగా ‘డీప్సీక్’ సృష్టించిన ప్రభంజనం అంతాఇంత కాదు. లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం) ఏఐ అభివృద్ధికి భారీ స్థాయిలో నిధులు ఖర్చవుతాయన్న ఊహలను పటాపంచలుచేస్తూ చైనా సంస్థ డీప్సీక్ అభివృద్ధి చేసిన ఓపెన్ సోర్స్ ఆధారిత ఎల్ఎల్ఎం మోడల్ ‘ఆర్1’ను చూసి ఎని్వడియా వంటి దిగ్గజ సంస్థలే నోరెళ్లబెట్టాయి. ఇప్పుడున్న ఏఐ మోడల్స్కన్నా ఎంతో మెరుగైన తార్కిక విశ్లేషణ సామర్థ్యం డీప్సీక్ ఆర్1కు ఉండటమే దాన్ని మరో మెట్టుపై నిలబెడుతోంది. దీని రాకతో ఏఐ రంగంలో విప్లవాత్మక మార్పులు ఖాయం. -
తొలి కల నెరవేరింది
క్రికెట్ బ్యాట్ పట్టుకున్నప్పటి నుంచి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనే ఏకైక లక్ష్యం పెట్టుకున్నానని... అలాంటిది అండర్–19 స్థాయిలోనే రెండుసార్లు టి20 ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టులో భాగం కావడం చాలా సంతోషంగా ఉందని రైజింగ్ స్టార్ గొంగడి త్రిష పేర్కొంది. మలేసియా వేదికగా జరిగిన మహళల అండర్–19 టి20 వరల్డ్కప్లో అద్వితీయ ప్రదర్శన కనబర్చి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన 19 ఏళ్ల త్రిష తన తొలి కల నెరవేరిందని పేర్కొంది. సీనియర్ జట్టులోనూ అవకాశం దక్కితే నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నానంటున్న తెలుగమ్మాయి త్రిషతో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ...రెండు సార్లు ప్రపంచకప్ గెలవడం ఎలా అనిపిస్తోంది? ఈ ఆనందం మాటల్లో వర్ణించలేను. సాధారణంగా అండర్–19 ప్రపంచకప్లో ఒక్కసారి పాల్గొనే అవకాశం రావడమే కష్టం. అలాంటిది నాకు రెండుసార్లు ఆ చాన్స్ వచ్చింది. చిన్న వయసు నుంచే రాణిస్తుండటంతో రెండుసార్లు వరల్డ్కప్ ఆడగలిగా. జట్టు విజయాల్లో నావంతు పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉన్నాను. ‘ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్’గా నిలవడంపై స్పందన? 2023లో జరిగిన ప్రపంచకప్లో బ్యాటింగ్ చేసేందుకు ఎక్కువ అవకాశాలు రాలేదు. ఈసారి ఓపెనర్గా బరిలోకి దిగడం కలిసొచ్చింది. నా ప్రదర్శన జట్టు విజయానికి దోహదపడితే అంతకుమించి ఇంకేం కావాలి. టోర్నీ టాప్ స్కోరర్గా నిలవడంతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డులు గెలుచుకోవడం చాలా ఆనందంగా ఉంది. వరల్డ్కప్నకు ముందు ఎలాంటి సాధన చేశారు? కెరీర్లో అత్యధికంగా హైదరాబాద్లోనే ప్రాక్టీస్ చేశా. మిథాలీ రాజ్ ఆట అంటే నాకు చాలా ఇష్టం. ఆమె అడుగు జాడల్లోనే సుదీర్ఘ కాలం భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని అనుకుంటున్నా. హైదరాబాద్కే చెందిన నౌషీన్ అల్ ఖదీర్ భారత అండర్–19 జట్టు హెడ్ కోచ్గా ఉండటం కూడా కలిసొచ్చింది. ఆమెకు నా ఆటతీరు బాగా తెలియడంతో మెరుగయ్యేందుకు తగిన సూచనలు ఇస్తూ ప్రోత్సహించింది. జట్టు సభ్యులతో మీ అనుబంధం? చాన్నాళ్లుగా అండర్–19 జట్టు తరఫున ఆడుతున్నాను. ప్లేయర్ల మధ్య మంచి అనుబంధం ఉంది. అండర్–19 ఆసియా కప్లోనూ దాదాపు ఇదే జట్టుతో ఆడాం. అక్కడా విజేతగా నిలవగలిగాం. ఇప్పుడు అదే టీమ్ స్పిరిట్ ఇక్కడ కూడా కొనసాగించాం. ప్లేయర్లంతా ఒక కుటుంబంలా ఉంటాం. ఈ వరల్డ్కప్లో మీకు అప్పగించిన బాధ్యతలు? ప్రపంచకప్ ప్రారంభం కావడానికి ముందే జట్టు యాజమాన్యం నా బాధ్యతలను స్పష్టంగా వివరించింది. ఓపెనర్గా బరిలోకి దిగుతుండటంతో బ్యాటింగ్ భారంమోయాల్సి ఉంటుందని ముందే తెలుసు. కేవలం వ్యక్తిగత ప్రదర్శనే కాకుండా... జట్టుగానూ అంతా కలిసి కట్టుగా కదంతొక్కడంతోనే రెండోసారి ప్రపంచకప్ గెలవగలిగాం. గత ప్రపంచకప్నకు, ఈ వరల్డ్కప్నకు మధ్య మీ ప్రదర్శనలో వచ్చిన తేడా ఏంటి? 2023లో జరిగిన ప్రపంచకప్లో మిడిలార్డర్లో బ్యాటింగ్ చేశా. ఆ సమయంలో అంతర్జాతీయ అనుభవం ఉన్న షఫాలీ వర్మ, రిచా ఘోష్లతో పాటు మరికొంత మంది సీనియర్ ప్లేయర్లు జట్టులో ఉండటంతో ఎక్కువ బ్యాటింగ్ చేసే అవకాశం దక్కలేడు. 2023 ఫైనల్లోనూ టాప్ స్కోరర్గా నిలిచినా... చివరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించలేక పోయా. దీంతో ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని ముందే అనుకున్నాను. నా ప్రణాళికలు ఫలించాయి. మీ ఆటతీరు వెనుక కుటుంబ సభ్యుల పాత్ర ఎంత ఉంది? కేవలం ఈ ప్రపంచకప్లో నా ప్రదర్శన అనే కాదు... నేనీస్థాయికి రావడం వెనక మా నాన్న రామిరెడ్డి కృషి ఎంతో ఉంది. ఆయన చేసిన త్యాగాలే ఈ రోజు నా బ్యాట్ నుంచి పరుగుల రూపంలో వస్తున్నాయనుకుంటా. ప్రతి దశలో మా నాన్న నాకు అండగా నిలవడంతోనే నిలకడైన ప్రదర్శన కనబర్చగలిగాను. ఎక్కడ మ్యాచ్ జరిగినా నా వెంట నాన్న ఉంటారు. వరల్డ్కప్ మొత్తం నా వెన్నంట నిలిచి... ఎప్పటికప్పుడు నాలో స్ఫూర్తినింపారు. అందుకే ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డును మా నాన్నకు అంకితమిస్తున్నాను. భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి? అవకాశం వచ్చిన ప్రతిసారి రాణించాలని చిన్నప్పటి నుంచే కలలు కన్నాను. వ్యక్తిగతంగా ఇప్పటికి నా మొదటి కల నెరవేరింది. అవకాశం వస్తే సీనియర్ జట్టు తరఫున కూడా ఇదే ప్రదర్శన కొనసాగించాలనుకుంటున్నా. టోర్నీలో త్రిష గణాంకాలు మ్యాచ్లు 7 ఇన్నింగ్స్లు 7 పరుగులు 309 అత్యధిక స్కోరు 110 సగటు 77. 25 సెంచరీలు 1 ఫోర్లు 45సిక్స్లు 5 అభినందనల వెల్లువఅండర్–19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు అభినందనలు. ఇది భారత నారీ శక్తికి నిదర్శనం. సమష్టి కృషి, సడలని సంకల్పానికి దక్కిన ఫలితం ఇది. ఈ విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుంది. –నరేంద్ర మోదీ, ప్రధానమంత్రివరుసగా రెండోసారి అండర్–19 ప్రపంచకప్ గెలిచిన యువ భారత జట్టుకు అభినందనలు. ఈ విజయం చాలా మందికి స్ఫూర్తి. భవిష్యత్తు కోసం కొత్త ప్రమాణాలు నిర్దేశించింది. –సచిన్ టెండూల్కర్ ఐసీసీ మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన యువ భారత జట్టుకు ప్రత్యేక అభినందనలు. రెండోసారి ఈ ట్రోఫీ చేజిక్కించుకోవడంలో తెలుగు అమ్మాయిలు గొంగడి త్రిష, షబ్నమ్ కీలకపాత్ర పోషించడం ఈ ఆనందాన్ని రెట్టింపు చేసింది. –వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వరుసగా రెండోసారి మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు అభినందనలు. ట్రోఫీ చేజిక్కించుకోవడంలో తెలంగాణ ప్లేయర్ త్రిష కీలకపాత్ర పోషించింది. త్రిష లాంటి క్రీడాకారులు రాష్ట్రానికి గర్వకారణం. త్రిష భవిష్యత్తులో భారత సీనియర్ జట్టు తరఫునా రాణించాలి. –రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రిఅండర్–19 ప్రపంచకప్లో అజేయంగా నిలిచి భారత్ తమ ఆధిపత్యం చాటుకుంది. ఇది అదిరిపోయే ప్రదర్శన, దీనికి సాటి ఏది లేదు. యావత్ దేశం గరి్వస్తోంది. –మిథాలీరాజ్, భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ -
జన్యులోపాల వల్లే కాఫీ చేదు
కాఫీ చుక్క గొంతులోకి దిగనిదే రోజు గడవని వారెందరో! కొందరేమో కాఫీ అంటేనే ముఖం చిట్లిస్తారు. అలాంటి వారికి కాఫీ నచ్చకపోవడానికి ప్రత్యేక కారణమే ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. కాల్చిన అరబికా కాఫీ చేదును నిర్ణయించడంలో ఆయా వ్యక్తుల జన్యువులు కీలక పాత్ర పోషిస్తున్నట్టు కనుగొన్నారు. కాఫీ గింజలను కాల్చడం వల్ల రుచి ప్రభావితం అవుతుందా, లేదా అన్న అంశంపై జర్మనీలోని మ్యూనిచ్ టెక్నికల్ వర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేశారు. ‘కోఫియా అరబికా’ మొక్కకు చెందిన గింజలను కాల్చి పొడి చేస్తారు. కెఫీన్ సాధారణంగానే చేదుగా ఉన్నప్పటికీ కెఫీన్ తీసేసిన కాఫీ కూడా చేదుగానే ఉంటుంది. అరబికా బీన్స్లో ఉండే ‘మొజాంబియోసైడ్’ అనే పదార్థమే దీనికి కారణం. ఇది కెఫీన్ కంటే ఏకంగా 10 రెట్లు ఎక్కువ చేదుంటుంది! కాఫీ తాగినప్పుడు మనుషుల్లో ఉన్న 25 చేదు రుచి గ్రాహకాల్లో రెండింటిని అది యాక్టివేట్ చేస్తుంది. గింజలను కాల్చిన ఉష్ణోగ్రత, సమయాన్ని బట్టి అవి ఏడు రకాలుగా మారతాయి. ఒక్కో దశలో ఒక్కో రుచి కలిగి ఉంటాయి. ఈ ఏడు దశల్లోని కాఫీ కూడా రుచి గ్రాహకాలపై ప్రభావం చూపుతుంది. ఇలా కాల్చిన కాఫీ పొడి పదకొండు మందిలో ఎనిమిది మందికి చేదుగా అనిపించింది. వారిలో ఒక గ్రాహక జన్యువు లోపభూయిష్టంగా ఉండటమే అందుకు ప్రధాన కారణం. రెండు జన్యువులు చెక్కు చెదరకుండా ఉన్న ఇద్దరికి మాత్రం కాఫీ చేదుగా అనిపించలేదు. దీనిపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందని శాస్త్రవేత్త లాంగ్ చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
'వెటకార' పురస్కారాలు
ప్రతిభా పాటవాలకు గుర్తింపుగా పురస్కారాలు, బిరుదులు, ఘన సత్కారాలు దక్కుతాయి. వివిధ రంగాలలోని ప్రతిభావంతులను సత్కరించే పద్ధతి పురాతన రాచరికాల కాలం నుంచే ఉండేది. అయితే రాజుల కాలంలో పురస్కారాలు, సత్కారాలు మాత్రమే ఉండేవి. వెటకారాలు ఉండేవి కావు. ప్రపంచంలో ప్రజాస్వామ్యం విస్తరించాక, వెటకార పురస్కారాలు కూడా మొదలయ్యాయి.ఆధునిక ప్రపంచంలో ‘నోబెల్’ పురస్కారాలను అత్యున్నత పురస్కారాలుగా పరిగణిస్తాం. బుకర్ ప్రైజ్, పులిట్జర్ అవార్డు, ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ వంటి వాటికి కూడా ప్రతిష్ఠాత్మక పురస్కారాలుగా ప్రపంచంలో గౌరవాదరణలు ఉన్నాయి. వివిధ రంగాల్లో కొంత పేరు గడించినా, పరమ చెత్త ప్రదర్శనలు చేసేవారిని బహిరంగంగా వెటకారం చేయడానికి కూడా అవార్డులు ఉన్నాయి. ఇవి ఆధునిక కాలంలో పుట్టుకొచ్చిన అవార్డులు. నోబెల్ బహుమతికి బదులుగా ఇగ్ నోబెల్ బహుమతి, పులిట్జర్ బహుమతికి బదులుగా ఫూలిట్జర్ బహుమతి ఇలాంటి అవార్డులే! వివిధ రంగాలకు సంబంధించి ఇలాంటి వెటకార పురస్కారాలు మరిన్ని కూడా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. ∙పన్యాల జగన్నాథదాసుఇగ్ నోబెల్శాస్త్ర సాంకేతిక సాహితీ రంగాలతో పాటు ప్రపంచశాంతి కోసం పాటుపడే వారికి ఏటా ఇచ్చే నోబెల్ బహుమతులు ఎంతటి ప్రతిష్ఠాత్మకమైనవో అందరికీ తెలుసు. పనికిమాలిన పరిశోధనలు సాగించేవారికి ‘ఇగ్ నోబెల్’ బహుమతుల గురించి ఎక్కువమందికి తెలీదు. ‘ఇగ్ నోబెల్’ బహుమతులు ఇవ్వడాన్ని 1991లో మొదలుపెట్టారు. వెటకార పురస్కారాల్లో ఇగ్ నోబెల్ తీరే వేరు! ‘ఆనల్స్ ఆఫ్ ఇంప్రొబాబుల్ రీసెర్చ్ (ఏఐఆర్) అనే శాస్త్రీయ హాస్య పత్రిక 1991 నుంచి ఏటా ‘ఇగ్ నోబెల్’ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది. ఈ పత్రిక సంపాదకుడు మార్క్ అబ్రహాం వినూత్న ఆలోచనకు ఫలితమే ‘ఇగ్ నోబెల్’ పురస్కారాలు. అట్టహాసంగా నిర్వహించే కార్యక్రమంలో నోబెల్ బహుమతి గ్రహీతల చేతుల మీదుగా ‘ఇగ్ నోబెల్’ పురస్కారాల ప్రదానం జరుగుతుంది. ‘ఇగ్ నోబెల్’ గ్రహీతలు వేదిక మీద ప్రసంగాలు చేస్తారు. ఈ కార్యక్రమం అసలు నోబెల్ పురస్కారాల ప్రదానోత్సవాన్ని తలపిస్తుంది. ‘ఇగ్ నోబెల్’ పురస్కారానికి ఎంపికైన వారికి ‘ఘనం’గా నగదు బహుమతి కూడా ఇస్తారు. ఎంతనుకున్నారు? అక్షరాలా వంద లక్షల కోట్ల డాలర్లు. అమెరికన్ డాలర్లు కాదు లెండి, జింబాబ్వే డాలర్లు. అమెరికన్ డాలర్లలో ఈ మొత్తం విలువ 0.40 డాలర్లు (రూ.33.73) మాత్రమే! ఈ పురస్కారంలోని వెటకారం అర్థమైంది కదా!అసలు నోబెల్ను మించినన్ని విభాగాలు ఇగ్ నోబెల్లో ఉన్నాయి. బోటనీ, అనాటమీ, మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, పీస్, డెమోగ్రఫీ, ప్రొబాబిలిటీ, ఫిజియాలజీ విభాగాల్లో ‘ఇగ్’ నోబెల్ పురస్కారాలు ఇస్తారు. ఈసారి ‘ఇగ్’నోబెల్ విజేతలు, వారి ఘనతలు ఒకసారి చూద్దాం:⇒ బోటనీ విభాగంలో ఈసారి ఇగ్ నోబెల్ పొందినవారు అమెరికన్ శాస్త్రవేత్త జాకబ్ వైట్, జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ బాన్లో పరిశోధనలు సాగిస్తున్న జపానీస్ శాస్త్రవేత్త ఫిలిపె యమషిటా. వీరిద్దరూ కనుగొన్న అద్భుతం ఏమిటంటే– కృత్రిమ మొక్కల కుండీలు ఉన్న పరిసరాల్లో నిజమైన మొక్కలను కూడా పెంచుతున్నట్లయితే, కృత్రిమ మొక్కల ఆకారాలను నిజమైన మొక్కలు అనుకరిస్తాయట! ప్రపంచానికి ఏ రకంగానూ పనికిరాని ఈ అద్భుతాన్ని కనుగొన్నందుకే వీళ్లకు ఈ పురస్కారం.⇒ అనాటమీ విభాగంలో ఈసారి ఏకంగా పదిమంది ఇగ్ నోబెల్ను పొందారు. వివిధ దేశాలకు చెందిన ఈ పరిశోధకులు మూకుమ్మడిగా ఒకే అంశంపై పరిశోధనలు సాగించారు. వీరి పరిశోధనాంశం నెత్తి మీద మొలిచే జుట్టు. భూమ్మీద ఉత్తరార్ధ గోళంలో ఫ్రాన్స్కు చెందిన 25 మంది పిల్లలను, దక్షిణార్ధ గోళంలో చిలీకి చెందిన 25 మంది పిల్లలను నమూనాగా తీసుకున్నారు. ఉత్తరార్ధ గోళంలోని పిల్లలతో పోల్చుకుంటే, దక్షిణార్ధ గోళానికి చెందిన పిల్లల్లో నెత్తి మీద జుట్టు అపసవ్య దిశలో రింగులు తిరిగిన వారు ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు.⇒ ఫిజిక్స్ విభాగంలో హార్వర్డ్ వర్సిటీ శాస్త్రవేత్త జేమ్స్ సి. లియావో ఈసారి ఇగ్ నోబెల్ పొందారు. చనిపోయిన చేప కళేబరానికి బోలు గొట్టాన్ని కడితే, అది ప్రవాహానికి ఎదురీదగలదని తన పరిశోధనలో తేల్చారు. నిర్ణీత పరిస్థితుల్లో ఒక వస్తువు తన శక్తిని ఏమాత్రం ఉపయోగించుకోకుండానే ప్రవాహానికి ఎదురీదడం సాధ్యమవుతుందని కనుగొన్నారు.⇒ మెడిసిన్ విభాగంలో జర్మనీలోని హాంబర్గ్ వర్సిటీకి చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఇగ్ నోబెల్ దక్కింది. తీవ్రమైన దుష్ప్రభావాలు కలిగించని నకిలీ మందుల కంటే తీవ్రమైన దుష్ప్రభావాలు కలిగించే నకిలీ మందులే ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తాయని వీరు కనుగొన్నారు.⇒ కెమిస్ట్రీ విభాగంలో ఆమ్స్టర్డామ్ వర్సిటీకి చెందిన టెస్ హీరమన్స్, ఆంటోనీ డెబ్లాస్, డేనియల్ బాన్, శాండర్ వూటర్సన్ ఈసారి ఇగ్ నోబెల్ పొందారు. ఆల్కహాల్ ప్రభావంతో మత్తెక్కి ఉన్న క్రిములను, మత్తు లేకుండా పూర్తి చలనశీలంగా ఉన్న క్రిములను క్రోమాటోగ్రఫీ పరిజ్ఞానంతో వేరుచేయవచ్చని వీరు కనుగొన్నారు.⇒ బయాలజీ విభాగంలో మినెసోటా వర్సిటీకి చెందిన ఫోరై్డస్ ఎలీ, విలియమ్ పీటర్సన్ ఈసారి ఇగ్ నోబెల్ దక్కించుకున్నారు. ఆవులు పాలు చేపడంపై నాడీ వ్యవస్థ పరోక్షంగా ప్రభావం చూపుతుందని వీరు కనుగొన్నారు. దీని కోసం వారు ఒక విచిత్రమైన ప్రయోగం చేశారు. ఒక ఆవు వెనుక నిలుచున్న పిల్లి దగ్గర ఒక కాగితం సంచిని పేల్చారు. అధాటుగా జరిగిన ఈ పరిణామంతో ఆవు పొదుగు నుంచి పాల చుక్కలు నేలరాలాయి.⇒ ఇగ్ నోబెల్ శాంతి బహుమతి అమెరికన్ మానసిక శాస్త్రవేత్త బి.ఎఫ్.స్కిన్నర్కు మరణానంతరం లభించింది. తన జీవిత కాలంలో ఆయన ఒక విచిత్రమైన అంశంపై ప్రయోగాలు సాగించాడు. యుద్ధాలు జరిగేటప్పుడు సైనిక బలగాలు ప్రయోగించే క్షిపణుల్లో సజీవంగా ఉన్న పావురాలకు గూళ్లు ఏర్పాటు చేసి, వాటిని కూడా క్షిపణులతో పంపినట్లయితే, ఆ శాంతి కపోతాలు క్షిపణులకు మార్గనిర్దేశనం చేయగలవని ఆశించాడు.⇒ ప్రొబాబిలిటీ విభాగంలో ఫ్రాంటిసెక్ బార్టోస్ నేతృత్వంలోని చెక్ శాస్త్రవేత్తల బృందానికి ఈసారి ఇగ్ నోబెల్ లభించింది. ఒక నాణేన్ని బొమ్మ బొరుసు వేసేటప్పుడు దానిని ఏవైపు పైకి ఉంచి పట్టుకుంటామో, ఎక్కువ సార్లు అదేవైపు తిరిగి నేల మీదకు పడుతుందని వీరు కనుగొన్నారు. ఈ సంగతిని కనుగొనడానికి ఏకంగా 3,50,757 సార్లు నాణెంతో బొమ్మ బొరుసు వేశారు.⇒ డెమోగ్రఫీ విభాగంలో ఇగ్ నోబెల్ ఈసారి ఆక్స్ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్త సాల్ జస్టిన్ న్యూమన్కు దక్కింది. జనన మరణాల రికార్డులను నమోదు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రాంతాల్లో నివసించే ప్రజల్లోనే ఎక్కువమంది దీర్ఘాయుష్కులు ఉంటున్నట్లు ఆయన ఒక రహస్య పరిశోధన ద్వారా కనుగొన్నాడు.⇒ ఫిజియాలజీ విభాగంలో ఇగ్ నోబెల్ను జపానీస్ శాస్త్రవేత్త ర్యో ఒకాబే నేతృత్వంలోని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం దక్కించుకుంది. ఈ బృందంలోని శాస్త్రవేత్తలు వివిధ రకాల స్తన్యజీవులపై పరిశోధనలు జరిపి, స్తన్యజీవులు ఆసనం ద్వారా కూడా శ్వాసక్రియ సాగించగలవని తేల్చారు.మరికొన్ని వెటకారాలుగోల్డెన్ కేలా: అంతర్జాతీయ సినిమా రంగంలో ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డులకు ఉన్న పేరు ప్రతిష్ఠలు అందరికీ తెలిసిన సంగతే! ఏటా అత్యుత్తమ సినిమాలకు, వాటిలో నటించిన నటీ నటులకు, దర్శకులు సహా ఇతర సాంకేతిక నిపుణులకు ఈ అవార్డులు ఇస్తారు. ‘గోల్డెన్ గ్లోబ్’ రీతిలోనే బాలీవుడ్లో అతి చెత్త సినిమాలకు వివిధ విభాగాల్లో కొన్నేళ్లుగా ‘గోల్డెన్ కేలా’ అవార్డులు ఇస్తున్నారు. ‘ర్యాండమ్ మ్యాగజీన్’ అనే హాస్యపత్రిక ఈ అవార్డులను బహూకరిస్తోంది. ఈసారి ‘బచ్చన్ పాండే’ చిత్రం అతిచెత్త చిత్రంగా ‘గోల్డెన్ కేలా’ పొందింది. ఈ చిత్ర దర్శకుడు ఫర్హద్ సమ్జీ, ఇందులో నటించిన అక్షయ్ కుమార్, కృతి సనోన్ ‘గోల్డెన్ కేలా’ పొందారు.గోల్డెన్ రాస్బరీ: ‘గోల్డెన్ గ్లోబ్’ రీతిలోనే అతిచెత్త హాలీవుడ్ చిత్రాలకు కొన్నాళ్లుగా ‘గోల్డెన్ రాస్బరీ’ అవార్డులు ఇస్తున్నారు. అమెరికన్ ప్రచారకర్త జాన్ జె.బి. విల్సన్ నెలకొల్పిన ‘గోల్డెన్ రాస్బరీ ఫౌండేషన్’ ద్వారా ఏటా ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమం అట్టహాసంగా నిర్వహిస్తుంటారు. ఈ అవార్డులు తీసుకోవడానికి పలువురు ప్రముఖులు ముఖం చాటేసినా, కొందరు మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి, వీటిని అందుకోవడం విశేషం. ఈ అవార్డును స్వయంగా అందుకున్న వారిలో టామ్ గ్రీన్, సాండ్రా బులక్ వంటి ప్రముఖులు ఉన్నారు.బిగ్ బ్రదర్ అవార్డు: పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ఏటా ఈ అవార్డు ఇస్తారు. జార్జ్ ఆర్వెల్ నవల ‘1984’లోని ‘బిగ్ బ్రదర్’ పాత్ర స్ఫూర్తితో ఈ అవార్డును నెలకొల్పారు. గోప్యతకు భంగం కలిగించే అంశాలపై ప్రజల దృష్టిని ఆకట్టుకునేందుకు, ఈ అంశాలపై చర్చను రేకెత్తించేందుకు లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ‘ప్రైవసీ ఇంటర్నేషనల్’ ఈ అవార్డులను ఇస్తోంది. ఆర్వెల్ ‘1984’ నవలకు యాభయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా 1999 నుంచి ఈ అవార్డులను ఇవ్వడం ప్రారంభించారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బల్గేరియా, చెక్ రిపబ్లిక్, ఫిన్లండ్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశాలు ‘బిగ్ బ్రదర్’ అవార్డులు ఇస్తున్నాయి.పిగాసస్ అవార్డు: ఇదొక విచిత్రమైన అవార్డు. అతీంద్రియ, మానవాతీత మాయలకు ఏటా ఈ అవార్డు ఇస్తారు. కెనడియన్–అమెరికన్ రచయిత, ఐంద్రజాలికుడు జేమ్స్ రాండీ 1982లో ఈ అవార్డును నెలకొల్పారు. ఇజ్రాయెలీ–బ్రిటిష్ ఐంద్రజాలికుడు యూరీ గెల్లర్ పేరుతో ఈ అవార్డును ‘యూరీ ట్రోఫీ’ అని కూడా అంటారు. ఈ అవార్డు లోగో ‘రెక్కల పంది’ కావడంతో ఇది ‘పిగాసస్’ అవార్డుగా పేరు పొందింది. మానవాతీత మానసిక శక్తులతో అత్యధిక సంఖ్యలో జనాలను మభ్యపెట్టిన వ్యక్తులకు, అతీంద్రియ కథనాలను వాస్తవ కథనాల్లా ప్రచురించే మీడియా సంస్థలకు, అతీంద్రియ అంశాలపై అధ్యయనాల కోసం నిధులు సమకూర్చే సంస్థలకు, ఒక వెర్రిబాగుల అంశాన్ని అతీంద్రియ ప్రభావంగా ప్రకటించే శాస్త్రవేత్తలకు ఈ అవార్డులు ఇస్తారు.ఘంటా అవార్డు: బాలీవుడ్లోని అతిచెత్త సినిమాలకు వివిధ విభాగాల్లో ఇచ్చే అవార్డు ఇది. బాలీవుడ్ దర్శక నిర్మాత, రచయిత కరణ్ అంశుమాన్, ఆయన మిత్రుడు ప్రశాంత్ రాజ్ఖోవా 2011లో ఈ అవార్డును నెలకొల్పారు. అట్టహాసంగా జరిగే ఈ అవార్డుల కార్యక్రమానికి స్వయంగా హాజరై, అవార్డులు తీసుకోవడానికి చాలామంది ముఖం చాటేస్తారు. అయితే, బాలీవుడ్ హీరోలలో రితేశ్ దేశ్ముఖ్, హీరోయిన్లలో సోనాక్షి సిన్హా ఈ అవార్డుల వేడుకకు హాజరై, స్వయంగా అవార్డులు అందుకోవడం విశేషం.పురస్కారాల చరిత్రపురస్కార సత్కారాల గురించి చెప్పుకోవాలంటే చాలా చరిత్రే ఉంది. ప్రపంచంలో తొలి పురస్కారం ఎవరు పొందారో, దానిని ఎవరు ఇచ్చారో స్పష్టమైన ఆధారాలేవీ చరిత్రలో నమోదు కాలేదు. ఏదో ఒక రంగంలో విశేషమైన కృషి చేసిన వారికి, గొప్ప ఘనత సాధించిన వారికి పురస్కారాలు అందజేసే పద్ధతి శతాబ్దాలుగా ప్రపంచమంతటా ఉంది. ప్రాచీన కాలంలో రోమన్ పాలకులు పురస్కారాలు ఇచ్చే పద్ధతిని మొదలుపెట్టి ఉంటారనడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. క్రీస్తుశకం ఐదో శతాబ్ది నాటికే రోమన్ పాలకులు తమ పౌరులకు పురస్కారాలను బహూకరించేవారు. సైనిక విజయాలలో కీలక పాత్ర పోషించిన సైనికులకు, సామాజిక పురోగతికి కృషి చేసినవారికి, రాజ్యం పట్ల విధేయత కలిగిన వారికి పురస్కారాలను ప్రకటించి, వారిని బహిరంగ వేదికపై ఘనంగా సత్కరించేవారు. మధ్యయుగాల నాటికి పురస్కార సత్కారాదులు ఆనాటి రాజ్యాలన్నింటికీ వ్యాపించాయి. ఆనాటి యూరోపియన్ రాజ్యాల్లో వివిధ రకాల క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి కార్ల్సిల్ బెల్స్, ఆర్నేట్ కప్పులు, కిప్ కప్పులు వంటివి బహూకరించేవారు. వీటిని బంగారం, వెండి వంటి విలువైన లోహాలతో తయారు చేసేవారు. ఇప్పటికీ చాలా క్రీడా పోటీల్లో బహూకరిస్తున్న కప్పులు ఆనాటి కిప్ కప్పుల నమూనానే అనుసరిస్తుండటం విశేషం. పదహారో శతాబ్దిలో బ్రిటిష్ రాజ్యంలో కింగ్ హెన్రీ–VIII హయాంలో వివిధ రకాల క్రీడా పోటీలకు ఆదరణ బాగా ఉండేది. కింగ్ హెన్రీ–VIII కాలంలో ఏటా రకరకాల క్రీడల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులను అందజేసేవారు. ఆ కాలంలో విలువిద్య పోటీలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేవారు. ఈ పోటీల్లో విజేతలకు ‘స్కార్టన్ సిల్వర్ యారో’ అనే వెండి బాణాన్ని ప్రత్యేకమైన కర్రపెట్టెలో భద్రపరచి బహిరంగ వేదికపై బహూకరించేవారు. క్రీడాకారులతో పాటు కవులను, పండితులను, కళాకారులను కూడా ఆనాటి రాజులు ఘనంగా సత్కరించేవారు. బహుమానాలుగా విలువైన భూములను, భవంతులను, వెండి బంగారాలను ఇచ్చేవారు. కాళ్లకు గండపెండేరాలను, చేతులకు కంకణాలను తొడిగేవారు. వివిధ విద్యలలో అసాధారణ ప్రతిభా పాటవాలు ప్రదర్శించిన వారికి కనకాభిషేకాలు, గజారోహణలు వంటి సత్కారాలను కూడా ఘనంగా చేసేవారు.ఇలాంటివి మరిన్ని అవార్డులు ఉన్నాయి. వివిధ రంగాల్లో వెటకారంగా ఇచ్చే ఈ పురస్కారాలను స్వయంగా స్వీకరించే వారి సంఖ్య మాత్రం ఎప్పుడూ తక్కువే! పాత్రికేయ రంగంలో పులిట్జర్ అవార్డు అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది. తప్పుడు కథనాలతో ఊదరగొట్టే పాత్రికేయులు, మీడియా సంస్థల కోసం కొందరు ఔత్సాహికులు ‘ఫూలిట్జర్ అవార్డు’ నెలకొల్పారు. గందరగోళంగా ఇంగ్లిష్ రాసేవారికి ‘గోల్డెన్ బుల్’ అవార్డు ఇస్తారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా సంస్థల మీద కోపంతో కొన్నేళ్ల కిందట ‘ఫేక్ న్యూస్ అవార్డు’ నెలకొల్పారు. క్రీడా పోటీల్లో అతిచెత్త ఆటతీరు కనబరచిన క్రీడాకారులకు ‘వుడెన్ స్పూన్’ అవార్డు ఇస్తున్నారు. అతీంద్రియ పరిశోధకులకు ‘బెంట్ స్పూన్’ అవార్డు ఇస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా చెత్త ఆధునిక కళాఖండాలను సృష్టించేవారికి ‘టర్నిప్ ప్రైజ్’ ఇస్తున్నారు. వెటకారంగా ఇచ్చే ఇలాంటి పురస్కారాలు ఇంకా చాలానే ఉన్నాయి. జనాలకు ఇదో రకం వినోదం. -
అన్నదాత ఆశలపై నీళ్లు
సాక్షి, అమరావతి: వ్యవసాయ, అనుబంధ రంగాలకు కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై మిశ్రమ స్పందన లభిస్తోంది. వ్యవసాయ రంగంలో పలు మిషన్ల ఏర్పాటు చేయడం ఒకింత మేలు చేస్తుందంటున్న నిపుణులు.. పీఎం కిసాన్ యోజన వంటి కొన్ని పథకాల సాయాన్ని పెంచకపోవడం రైతుల ఆశలపై నీళ్లు చల్లడమేనని చెబుతున్నారు. పీఏం కిసాన్ యోజన సాయం పెంచుతారని రైతులు ఎంతగానో ఎదురు చూశారు.ఈ పథకం కింద ఏటా మూడు విడతల్లో రూ.6 వేల చొప్పున అందించే పెట్టుబడి సాయాన్ని కనీసం రూ.10 వేలకి పెంచాలన్న డిమాండ్ను కేంద్రం ఆమోదిస్తుందని ఆశించారు. అయితే ఈ డిమాండ్ను కేంద్రం పట్టించుకోకపోవడం పట్ల రైతు సంఘాలు మండిపడుతున్నాయి. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఏటా ఇచ్చినట్టే ఈ ఏడాది కూడా బడ్జెట్లో రూ.186 కోట్లు కేటాయించారు. ఆక్వా, మత్స్య రంగాలకు ఎలాంటి కేటాయింపులు జరపకపోవడం పట్ల ఆ రంగాల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రొయ్యలు, చేపల ఫీడ్పై ఇంపోర్ట్ డ్యూటీని రద్దు చేయాలన్న విజ్ఞప్తిని కేంద్రం ఏమాత్రం పరిగణనలోకి తీసుకపోవడం పట్ల జాతీయ రొయ్య రైతుల సమాఖ్య నిరసన తెలిపింది.మిషన్లతో కొంత మేలుబడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు లేకపోయినప్పటికీ కేంద్రం ప్రకటించిన పలు మిషన్ల ద్వారా రాష్ట్రానికి కొంత మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కొత్త వంగడాలు, పత్తి ఉత్పాదకత పెంచేందుకు జాతీయ స్థాయిలో ప్రత్యేక మిషన్లను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయాల నుంచి ఏటా పదుల సంఖ్యలో కొత్త వంగడాలు విడుదలవుతున్నాయి.కొత్తగా ఏర్పాటు చేసిన హైబ్రిడ్ విత్తన మిషన్ రాష్ట్రంలో పరిశోధనలకు మరింత ఊతమిస్తుందని, మరిన్ని కొత్త వంగడాల అభివృద్ధికి నిధులు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఏటా 15 నుంచి 16 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది. 18.78 లక్షల టన్నుల దిగుబడులొస్తాయి. సాధారణంగా బోర్ల కింద 15 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఈ ఏడాది మాత్రం 7 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. గడిచిన ఐదేళ్లలో క్వింటా రూ.10వేలకు పైగా పలికిన పత్తి ప్రస్తుతం ఐదారు వేలకు మించి పలకక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఏర్పాటు చేస్తున్న పత్తి మిషన్ రాష్ట్రంలో పత్తి సాగు విస్తరణకు, ఉత్పాదకత పెంచేందుకు దోహదపడుతుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పప్పు దినుసుల కోసం ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేయడం రాష్ట్రంలో అపరాల సాగుకు కొంత మేర ప్రోత్సాహకరంగా ఉంటుందని చెబుతున్నారు. రాష్ట్రంలో ఖరీఫ్లో 7.50 లక్షల ఎకరాల్లో, రబీలో 23 లక్షల ఎకరాల్లో అపరాలు సాగవుతుంటాయి. రెండు సీజన్లకు కలిపి 62 లక్షల టన్నుల దిగుబడులొస్తాయి. ప్రత్యేక మిషన్ ద్వారా సాగు విస్తీర్ణం, ఉత్పాదకత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.రుణ పరపతి పెంపుతో 55 లక్షల మందికి లబ్ధికిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా వడ్డీ రాయితీ రుణ పరపతిని రూ.5 లక్షలకు పెంచడం ద్వారా రాష్ట్రంలో రైతులతో పాటు ఆక్వా, పాడి రైతులకు కూడా మేలు జరగనుంది. సుమారు 55 లక్షల మంది రైతులకు లబ్ధి కలుగుతుందని అంచనా వేస్తున్నారు. స్వల్ప కాలిక వ్యవసాయ రుణాలకు కూడా ఈ వడ్డీ రాయితీ వర్తిస్తుంది.సాధారణంగా ఇలా పొందిన రుణాలకు రూ.లక్ష వరకు సున్నా వడ్డీ రాయితీ ఇస్తుండగా, రూ. 3 లక్షల వరకు ఇంట్రస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ కింద 3 శాతం వడ్డీ రాయితీ పొందే అవకాశం ఉండేది. ఇక నుంచి రూ.5 లక్షల వరకు ఈ రాయితీ పొందే వెసులుబాటు కల్పించారు.