breaking news
Sakshi Special
-
రిపోర్టింగ్... ఓ వార్!
అల్లికల నుంచి అంతరిక్షం దాకా అన్నిట్లో ఆడవాళ్ల జాడలు కనిపిస్తున్నా ఇదింకా పురుష ప్రపంచమే! అసలు ఆ జాడలు కూడా లేని కాలం ఎలా ఉండిందో! అలాంటి కాలంలో పురుషాధిపత్య రంగాల్లోకి స్త్రీలు ధైర్యంగా అడుగుపెట్టడమే ఓ సమరం! పెట్టాక బాధ్యతల కోసం ఒక పోరాటం! అలా పోరాడి.. పురుషులు సాధించలేని టాస్క్లను ఛేదించి.. తర్వాత తరాల అమ్మాయిలకు ఓ పాత్ను క్రియేట్ చేశారు కొందరు వనితలు! ఆషీరోస్ను పరిచయం చేసే శీర్షికే ‘ పాత్ మేకర్’. ఆక్రమంలో ఈ వారం.. దేశపు తొలి మహిళా వార్ జర్నలిస్ట్ ప్రభాదత్ గురించి...బిల్లా, రంగా పేరు వినే ఉంటారు. గీతా, సంజయ్ చోప్రా అనే ఇద్దరు స్కూల్ పిల్లలను ఎత్తుకెళ్లిపోయి, వాళ్లను హత్యచేసిన హంతకులు. మరణ శిక్షతో జైల్లో ఉన్న ఆ బిల్లా, రంగాలను ఇంటర్వ్యూ చేయడానికి ఒక జర్నలిస్ట్ .. జైల్ అధికారుల అనుమతి కోరారు. ‘నో’ అన్నారు అఫీషియల్స్. ఆ ‘నో’ను సవాలు చేస్తూ కోర్టుకు వెళ్లి, ఇంటర్వ్యూకు పర్మిషన్ తెచ్చుకుని.. ఆ ఇద్దరి మరణ శిక్ష అమలుకు ముందు వాళ్లను ఇంటర్వ్యూ చేశారు ఆ జర్నలిస్ట్. జైన్ శుద్ధ్ వనస్పతి లిమిటెడ్.. పేరు కూడా వినే ఉంటారు. ఈ సంస్థ అమ్మే నేతిలో పందికొవ్వు కలుస్తోందనే ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ చేశారు ఆ జర్నలిస్ట్. అంతేకాదు ఎయిమ్స్లోని మెడికల్ స్కామ్నూ బయటకు తీశారు. ఆ జర్నలిస్ట్ పేరే ప్రభాదత్! 1965లో జరిగిన ఇండియా– పాకిస్తాన్ యుద్ధాన్ని వార్ ఫీల్డ్లోంచి రిపోర్ట్ చేసిన వీరనారి! దేశపు ఫస్ట్ ఉమన్ వార్ కరెస్పాండెంట్గా చరిత్ర సృష్టించారు. బక్కపల్చటి దేహం.. కాటన్ చీర.. తలకు హెల్మెట్తో యుద్ధ ట్యాంక్ల వెనుక నుంచి యుద్ధాన్ని కలంతో కవర్ చేసిన ఆమె ఇమేజ్ తర్వాత తరాల జర్నలిస్ట్లు ఎందరికో ప్రేరణనిచ్చింది. అందుకే ఆమెను చమేలీ దేవీ జైన్ అవార్డ్ వరించింది. ప్రభాదత్ ఏం చేసినా సెన్సేషనే! ఆమె (మగాళ్ల రాజ్యం) జర్నలిజంలోకి అడుగుపెట్టడమే మహా సంచలనం! జర్నలిజం.. వార్ రిపోర్టింగ్ప్రభాదత్ ఇరవైల్లోనే జర్నలిజంలోకి వచ్చారు. ఇంటర్వ్యూలో ఫ్లవర్ ఎగ్జిబిషన్ను కవర్ చేసే డ్యూటీని సూచించాడట ఎడిటర్. అంతకన్నా గొప్ప విషయాలనే మహిళలు రిపోర్ట్ చేయగలరు అని అతనితో వాదించి.. మెప్పించి ఫ్లవర్ ఎగ్జిబిషన్ రిపోర్టింగ్ను తిరస్కరించి.. కీలకమైన అసైన్మెంట్స్కే ‘యెస్’ అనిపించుకున్నారు. అలాంటి ధీర ఇండియా– పాకిస్తాన్ వార్ రిపోర్టింగ్ను వదులుకుంటారా? అప్పుడు ఆమె హిందుస్థాన్ టైమ్స్కి పని చేస్తున్నారు. తనకు వార్ అసైన్మెంట్ ఇవ్వమని రిక్వెస్ట్ చేయలేదు. డిమాండ్ చేశారు. ఎడిటర్ దగ్గర్నుంచి ‘నో’ అనే జవాబే వచ్చింది. అప్పుడు ఆమె స్మార్ట్ స్టెప్ తీసుకున్నారు. పంజాబ్లో ఉన్న తన పేరెంట్స్ను చూడ్డానికి వెళ్తున్నానని సెలవుకు దరఖాస్తు పెట్టుకున్నారు. వెంటనే మంజూరైంది. పెట్టే బేడా సర్దుకుని నేరుగా ఖేమ్ – కరన్కి బయలుదేరారు ప్రభా. యుద్ధ రంగంలో నిలబడి ఏ రోజుకారోజు యుద్ధ విషయాల రిపోర్ట్ను పత్రికా ఆఫీస్కు పంపసాగారు. పట్టుదలకు పోయి మొదట్లో ఆ రిపోర్ట్ను పక్కన పెట్టినా.. తర్వాత తర్వాత ఆమె రిపోర్ట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవాళ్లు పత్రికా ఆఫీస్లో. ప్రభాదత్ కన్విక్షన్, పర్ఫెక్షన్ అలాంటిది మరి. రేడియోల ముందూ చెవులు రిక్కించుకుని మరీ కూర్చునేవారట శ్రోతలు.. ఆమె రిపోర్టింగ్ విషయాలను వినడానికి. మిడిమిడి జ్ఞానం ఆమె డిక్షనరీలోనే లేదు. సంపూర్ణ అవగాహన, స్పష్టతతోనే వెళ్లేవారు ఎక్కడికైనా. పనితోనే గానీ వ్యక్తిగత చరిష్మాకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వలేదు. తన జీవితమే రిస్క్లో పడేంత ప్రమాదకరమైన రిపోర్టింగ్ చేశారు. బెదిరింపులు, భౌతిక దాడులను ఎదుర్కొన్న సందర్భాలూ ఉన్నాయి. అయినా ప్రభాదత్ వెనుకడుగు వేయలేదు. తను నమ్మినదానిపట్ల దృఢచిత్తంతో సాగిన ఆమె బ్రెయిన్ హ్యామరేజ్తో హఠన్మరణానికి గురయ్యారు. జర్నలిజంలో ఆమె చూపిన తెగువ, ధైర్యం మహిళా జర్నలిస్ట్లకే కాదు పురుషులకూ స్ఫూర్తే! ప్రముఖ జర్నలిస్ట్ బర్ఖాదత్ ఆమె కూతురే. -
ఓటీటీ వీక్షకులు @ 60 కోట్లు
సకుటుంబ సపరివార సమేతంగా... టీవీ ముందు కూర్చుంటున్నారు. అది కేబుల్ కనెక్షన్ టీవీ కాదు.. ‘కనెక్టెడ్ టీవీ’. అందులో తమకు నచ్చిన సినిమా లేదా వెబ్ సిరీస్ లేదా షో చూస్తున్నారు. సంప్రదాయ టీవీ చానళ్లలో కాదు.. ఓటీటీ వేదికల్లో. ఇదే ఇప్పుడు ట్రెండ్. ఇది కరోనా తరవాత రికార్డు స్థాయిలో దేశమంతా పాకేసింది. దేశంలో ఓటీటీ చూస్తున్న ప్రేక్షకుల సంఖ్య రికార్డు స్థాయిలో 60 కోట్లకు ఎగబాకిందన్న అంచనాలే ఇందుకు నిదర్శనం. అంటే దేశ జనాభాలో 40 శాతానికిపైగా ఓటీటీలకు అలవాటుపడ్డారన్నమాట.టీవీ కొనాలంటే.. వందసార్లు ఆలోచించడం లేదు. హాల్లోకి సరిపోయే పెద్ద సైజు టీవీని.. అది కూడా స్మార్ట్ టీవీనే కొనేస్తున్నారు. ‘మార్డోర్ ఇంటెలిజెన్స్’ అంచనా ప్రకారం 2025లో దేశీయ స్మార్ట్ టీవీ మార్కెట్ విలువ 22.39 బిలియన్ డాలర్లు. 2023లో ఇది సుమారు 11 బిలియన్ డాలర్లే. స్మార్ట్ టీవీల కొనుగోళ్లు ఎంతలా పెరిగాయో చెప్పడానికి ఈ అంకెలే నిదర్శనం. అంత ఖరీదైన టీవీ కొన్నాక.. సాధారణ కేబుల్ టీవీ ఒక్కటే ఉంటే ఏం బాగుంటుంది? అందుకే, ఏదో ఒకటి లేదా అంతకుమించి ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసేసుకుంటున్నారు. అంతే, ఎంచక్కా ఇక సకుటుంబ సపరివార సమేతంగా సినిమాలు, వెబ్ సిరీస్లు, షోలు చూస్తున్నారు. దేశంలో ఇటీవలి కాలంలో ఈ ధోరణి పెరిగింది.కనెక్టెడ్ టీవీలో..: ఒకప్పుడు కేబుల్ టీవీ ప్రతి ఇంటా సర్వసాధారణంగా ఉండేది. ఇప్పుడు దాని స్థానాన్ని కనెక్టెడ్ టీవీ ఆక్రమిస్తోంది. కనెక్టెడ్ టీవీ అంటే ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యే టీవీ. ఇది మధ్య తరగతి, ఆపై స్థాయి కుటుంబాల్లో సర్వసాధారణం అయిపోయింది. మీడియా కన్సల్టింగ్ సంస్థ ఆర్మాక్స్ మీడియా ‘ఓటీటీ ఆడియన్స్ రిపోర్ట్ 2025’ ప్రకారం.. కనెక్టెడ్ టీవీ వీక్షకుల సంఖ్య 2024లో 6.97 కోట్లు మాత్రమే ఉండేది. 2025లో అది ఏకంగా 12.92 కోట్లకు పెరిగింది. అంటే.. దాదాపు రెట్టింపు అయిందన్నమాట.ఆకట్టుకునే కంటెంట్అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, జియో హాట్స్టార్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో విభిన్నమైన కంటెంట్తో వెబ్సిరీస్లు, సినిమాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కంటెంట్కు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఆర్మాక్స్ అంచనా ప్రకారం.. దేశంలో ఓటీటీ వీక్షకుల (నెలలో కనీసం ఒక్కసారైనా ఓటీటీ వీడియో చూసినవారు) సంఖ్య 60 కోట్లకుపైనే. 2024తో పోలిస్తే ఇది దాదాపు 10 శాతం ఎక్కువ. దేశ జనాభాలో ఇది 40 శాతానికిపైనే. వీక్షకులు పెరగడంతో ఓటీటీల్లో దేశీయ భాషల్లో వచ్చే వెబ్సిరీస్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఓటీటీల్లోనే విడుదల చేసే సినిమాలూ పెరుగుతున్నాయి. సెలవు రోజుల్లోనూ... రాత్రుళ్లు భోజన సమయాల్లోనూ కుటుంబ సభ్యులతో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, ఆహా, జీ5, సోనీ లివ్.. ఇలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో నచ్చిన సినిమా లేదా రియాలిటీ షో లేదా వెబ్సిరీస్ చూడటం సర్వసాధారణం అయిపోయింది.దేశంలో ఓటీటీ చందాదారుల సంఖ్య (సుమారుగా)⇒ జియో హాట్స్టార్ 30 కోట్లు⇒ అమెజాన్ ప్రైమ్ 2.8 కోట్లు⇒ నెట్ఫ్లిక్స్ 1.23 కోట్లుఆర్మాక్స్ మీడియా నివేదిక ప్రకారం.. 2025 జనవరి–జూన్ మధ్య ప్రసారమైన ఒరిజినల్స్లో వీక్షకులు అత్యధికంగా చూసినవి వెబ్ సిరీస్లే. వీక్షకుల పరంగా టాప్–50 ఒరిజినల్స్లో 80 శాతం వాటా వెబ్ సిరీస్లు కైవసం చేసుకోవడం విశేషం. ఆ తరవాతి స్థానంలో సినిమాలు, రియాలిటీ షోలు ఉన్నాయి. -
సంపన్న దేశాల.. ఆహార విధ్వంసం
ప్రపంచంలోని సంపన్న దేశాల ఆహారపుటలవాట్లు మారితే.. చాలావరకు కాలుష్యం తగ్గిపోతుంది! చెప్పాలంటే 30 శాతం సంపన్నుల వల్ల.. 70 శాతం ఆహార సంబంధ పర్యావరణ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి!! ప్రపంచ ప్రసిద్ధ ‘ఈఏటీ – లాన్సెట్ కమిషన్’ వెల్లడించిన వాస్తవమిది. ఇటీవలి కాలంలో ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ ఆహార తయారీలో వాడుతున్న రసాయనాలు, ప్లాస్టిక్స్, పురుగుమందులు.. ఇవన్నీ పెనుముప్పును తెచ్చిపెట్టనున్నాయి అని ఆందోళన వ్యక్తం చేసింది. ఆహార వ్యవస్థలు మారకపోతే భవిష్యత్తులో మానవాళికి ఆరోగ్యకరమైన ఆహారం కలగా మారిపోతుందని హెచ్చరించింది.ఈఏటీ – లాన్సెట్ కమిషన్లో.. 6 ఖండాల్లో ఉన్న అనేక దేశాల్లోని పోషకాహార, వాతావరణ, ఆర్థిక, ఆరోగ్య, సామాజిక శాస్త్రాలకు చెందిన అంతర్జాతీయ నిపుణులు సభ్యులు. ‘ఆహార ఉత్పత్తి, వినియోగం ద్వారా ఉత్పన్నమయ్యే ఉద్గారాలు.. శిలాజ ఇంధనాల కంటే ప్రమాదకరమైనవి’ – వీళ్లంతా ముక్తకంఠంతో చెబుతున్న మాట ఇది. ఇప్పటికిప్పుడు శిలాజ ఇంధనాల వాడకాన్ని పూర్తిగా ఆపేసినా.. ప్రస్తుత ఆహార వ్యవస్థలు ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీల సెల్సియస్కు పెంచగలవని వీరు హెచ్చరిస్తున్నారు. ఆహార వ్యవస్థల వల్ల ఏటా 16 – 17.7 గిగా టన్నుల కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి విడుదల అవుతోంది. ఇవి మొత్తం భౌగోళిక ఉద్గారాల్లో 30 శాతం!5 లక్షల కోట్ల డాలర్లు!ఇప్పుడున్న ఆహార వ్యవస్థలు ఇలాగే కొనసాగితే.. ఏటా 15 లక్షల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లుతుందని.. అనేక దేశాల శాస్త్రవేత్తలు సభ్యులుగా ఉన్న ‘ఫుడ్ సిస్టమ్ ఎకనామిక్స్ కమిషన్’ అంచనా వేసింది. అదే, ఈ ఆహార వ్యవస్థలకు కొత్త రూపు ఇస్తే ఆరోగ్యకరమైన సమాజం, పర్యావరణ వ్యవస్థల పునరుజ్జీవం వంటి పరిణామాల వల్ల ఏటా 5 లక్షల కోట్ల డాలర్లు ఆర్థిక వ్యవస్థలోకి వస్తాయని చెబుతోంది. ఈ మార్పులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా రెడ్ మీట్ ఉత్పత్తి, ప్రాసెసింగ్, పంపిణీ వంటివి 33 శాతం తగ్గాలని తెలిపింది. పండ్లు, కూరగాయలు, గింజల ఉత్పత్తి 63 శాతానికి పెరగాలని సూచించింది. ఇందుకోసం కమిషన్ మరో 8 పరిష్కార మార్గాలనూ ప్రపంచ దేశాల ముందు ఉంచింది. ఇవన్నీ అమలు జరిగితేనే.. 2050 నాటికి క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ భూమిపై ఉండే 960 కోట్ల జనాభాకూ ఆరోగ్యకరమైన ఆహారం అందుతుందని తెలిపింది.అష్ట పరిష్కారాలు⇒ ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో ఉంచడం⇒ సంప్రదాయ వంటకాలు / ఆహారాలను పరిరక్షించడం⇒ సుస్థిర ఉత్పత్తి పద్ధతులు అమలు చేయడం⇒అడవుల వంటి చెక్కుచెదరని పర్యావరణ వ్యవస్థలను కాపాడటం⇒ ఆహార వృథాను అరికట్టడం⇒ గౌరవప్రదమైన వృత్తి లేదా పని, తద్వారా గౌరవప్రదమైన సంపాదన⇒ అణగారిన వర్గాలపై వివక్ష చూపకుండా ఉండటం⇒ అణగారిన వర్గాల వారికి అన్ని అవకాశాలూ కల్పించడంపీహెచ్డీ ఆహారంప్రపంచ ప్రజల ఆరోగ్య సమస్యలకు, వాతావరణ సమస్యలకు పరిష్కారంగా ‘ప్లానెటరీ హెల్త్ డైట్ (పీహెచ్డీ)’ ఆహారాన్ని ఈఏటీ – లాన్సెట్ కమిషన్ సూచించింది. ఇందులో మొక్కల నుంచి వచ్చే ఆహారం పాళ్లు ఎక్కువగా, జంతువుల నుంచి వచ్చే ఆహారం చాలా తక్కువగా ఉంటుంది. చక్కెరలు, సంతృప్త కొవ్వులు, ఉప్పు చాలా మితంగా ఉంటాయి. పీహెచ్డీ ఆహారం వల్ల టైప్ 2 మధుమేహం, హృద్రోగాలు, కేన్సర్ల వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది ఆరోగ్యానికీ, పర్యావరణానికీ మంచిదని రుజువైంది. ఆహార వ్యవస్థల వల్ల వచ్చే ఉద్గారాలు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయంటే..⇒ మూడో వంతు వ్యవసాయం నుంచి⇒ మూడో వంతు భూ వినియోగ మార్పిడి ద్వారా⇒ మూడో వంతు ప్రాసెసింగ్, రవాణా, రిటైల్ వంటి సరఫరా వ్యవస్థల వల్ల -
అతివేగంతోనే.. అత్యధిక ప్రమాదాలు!
దేశంలో 2023లో జరిగిన ప్రమాదాల్లో 4.44 లక్షల మంది మరణించారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, రైల్వే ప్రమాదాలు, రైల్వే క్రాసింగ్ ప్రమాదాల వంటి ‘ట్రాఫిక్ ప్రమాదాల్లో’ 1.98 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 45.8 శాతం ద్విచక్ర వాహనాల వల్లే జరిగాయి. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం.. అతివేగమే. ఇలా మొత్తం 2.81 యాక్సిడెంట్లలో 1.02 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా 20.7 శాతం సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల్లోపే జరిగాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల 2023లో 6,444 మంది ప్రాణాలు కోల్పోయారు.మహారాష్ట్రలో అత్యధికంగా 69,809 మంది ప్రమాదాల్లో మరణించగా, ఆ తరువాతి స్థానాల్లో మధ్యప్రదేశ్ (43,320), ఉత్తరప్రదేశ్ (43,207) ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 19,949 ప్రమాదాల్లో 17,039 మరణించగా, తెలంగాణలో 22,903 ప్రమాదాల్లో 13,374 మంది ప్రాణాలు కోల్పోయారు.ట్రాఫిక్ మరణాలు..: రోడ్డు ప్రమాదాలు, రైల్వే ప్రమాదాలు, రైల్వే క్రాసింగ్ ప్రమాదాలు.. వీటిలో ప్రాణాలు కోల్పోయిన వారిని ‘ట్రాఫిక్ మరణాల’ కింద పరిగణించారు. 2019లో ఇలా 1.81 లక్షల మంది మరణిస్తే.. 2023 నాటికి ఈ సంఖ్య 1.98 లక్షలకు పెరిగింది. తెలంగాణలో 23,673 ట్రాఫిక్ ప్రమాదాల్లో 8,345 మంది మరణించగా.. ఏపీలో 21,078 కేసుల్లో 9,284 మంది ప్రాణాలు కోల్పోయారు.టూ వీలర్లే అత్యధికంమొత్తం రోడ్డు ప్రమాదాల్లో 45.8 శాతం ద్విచక్ర వాహనాల వల్లే జరిగాయి. కారు, జీపు, ఎస్యూవీల వల్ల 14.3 శాతం జరగ్గా.. ఆటోల వంటి త్రీవీలర్ల వల్ల 4.1 శాతం సంభవించాయి.అతివేగం అనర్థదాయకంరోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం పరిమితికి మించిన వేగంతో వెళ్లడమే. ఇలా 58.6 శాతం ప్రమాదాలు జరిగాయి. మొత్తం 2.81 యాక్సిడెంట్లలో 1.02 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్, ఓవర్ టేకింగ్ వంటి వాటివల్ల 23.6 శాతం యాక్సిడెంట్లు సంభవించాయి. మాదక ద్రవ్యాలు, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల 2.1 శాతం ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 60.2 శాతం (2.80 లక్షల కేసులు) గ్రామీణ ప్రాంతాల్లో నమోదు కాగా.. 39.8 శాతం (1.84 లక్షలు) పట్టణాల్లో జరిగాయి.రాత్రిపూటే అధికంమొత్తం రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా 20.7 శాతం (95,984) సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల్లోపే సంభవించాయి. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల్లోపు 17.3 శాతం, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల్లోపు 15 శాతం సంభవించాయి. -
మనకు నచ్చకపోతే వినేదే లేదు
మనకు ఇష్టమైనదే వింటాం. ఏమాత్రం అసౌకర్యంగా అనిపించినా, ప్రతికూలంగా ఉన్నా ఆ సమాచారాన్ని వినడానికి కూడా ఇష్టపడం. కనీసం అటువైపు కూడా చూడం. తెలియనిది తమకు హాని కలిగించదని చాలామంది అనుకుంటారు. ఇది పెద్దవారిలో ఒక సాధారణ ప్రవర్తన అని మనస్తత్వ శాస్త్రవేత్తలు అంటున్నారు. దీన్ని ‘ఆస్ట్రిచ్ ఎఫెక్ట్’ టారు. షికాగో విశ్వవిద్యాలయం చేపట్టిన కొత్త అధ్యయనం ప్రకారం యుక్త వయసుకు రాకముందే ఈ ధోరణి అభివృద్ధి చెందుతోందట.చాలామందికి ఆసుపత్రికి వెళ్లాలంటే భయం. అక్కడ ఏ టెస్టు చేస్తే ఏ సమస్య బయటపడుతుందో అని లోపల ఒక తెలియని ఆందోళన. అందుకే, ‘నువ్వు, ఈ మధ్య టెస్టులు చేయించుకున్నావా’ అని ఎవరైనా అడిగితే.. సంభాషణను వేరే విషయాలవైపు మళ్లిస్తుంటారు. కొన్ని కంపెనీలు లేదా సంస్థలు.. ఉచిత వైద్య శిబిరాలు పెట్టినప్పుడు కొందరు కనీసం అటువైపు కూడా చూడంది అందుకే. ఆస్ట్రిచ్ ఎఫెక్ట్గా పిలిచే ఈ ధోరణి పెద్దలతో పాటు పిల్లల్లోనూ ఉంటోందట.చిన్న పిల్లల్లోనూ..షికాగో విశ్వవిద్యాలయానికి చెందిన రాధిక సంతాన గోపాలన్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం.. పిల్లల్లో వయసు పెరిగే కొద్దీ కొత్త సమాచారాన్ని స్వీకరించని మనస్తత్వ ధోరణి పెరుగుతున్నట్టు గుర్తించింది. ముఖ్యంగా ఇది 7–10 ఏళ్ల పిల్లల్లో ఎక్కువగా ఉందట. అసలు చాలామంది.. కొత్త విషయాన్ని లేదా జ్ఞానాన్ని నేర్చుకునే విషయంలో ఎందుకు విముఖత చూపుతారో 5 కారణాలను ఈ బృందం గుర్తించింది.తప్పించుకునే ధోరణిఐదారేళ్ల పిల్లలు మరింత జ్ఞానం సంపాదించాలని ఉత్సాహంగా ఉన్నారు. 7 నుంచి 10 ఏళ్ల చిన్నారుల్లో కొందరు మాత్రం ఇందుకు కాస్త భిన్నంగా ఉన్నారు. వీళ్లు సమాచారం నుంచి తప్పించుకునే ధోరణులను ప్రదర్శించడం ప్రారంభిస్తున్నారు. ‘ఉదాహరణకు, ప్రతి ఒక్కరినీ తమకు ఇష్టమైన, తక్కువ ఇష్టమైన క్యాండీ ఏంటో చెప్పండని అడిగాం. ఆ క్యాండీ వారి దంతాలకు ఎందుకు చెడ్డదో వివరించే వీడియో చూడాలని అనుకుంటున్నారా అని అడిగాం. ఆసక్తికరంగా.. వారికి నచ్చే దాని గురించి వారు ‘అది ఎందుకు చెడ్డదో’ తెలుసుకోడానికి ఇష్టపడలేదు. కానీ తక్కువ ఇష్టమైన క్యాండీ ఎందుకు చెడ్డదో తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు’ అని వివరించారు రాధిక.అన్ని వేళలా మంచిది కాదు‘కొన్ని సందర్భాల్లో సమాచారం నుంచి తప్పించుకోవడం మంచిదే. అతి సర్వత్రవర్జయేత్ అన్నారు కదా! అయితే ప్రతిసారీ వద్దనుకునే ధోరణి మంచిది కాదు. అప్పటికి మనకు నచ్చనిది లేదా మనసుకు ఇబ్బందిగా అనిపించేది తరవాత విలువైనదని తేలవచ్చు. మనుషులకు అనిశ్చితిని లేదా ఒక సమస్యను పరిష్కరించుకోవాలనే కోరిక ఉంటుంది. కానీ పరిష్కారం, సమాచారం తమకు ఇబ్బందికరంగా లేదా ముప్పుగా ఉన్నప్పుడు తప్పించుకోవడానికే మొగ్గు చూపుతారు. కాస్త చొరవ, ధైర్యం చూపెడితే చాలు.. దీన్నుంచి సులభంగా బయటపడవచ్చు’ అంటారు రాధిక.ఏమిటీ ఆస్ట్రిచ్ ఎఫెక్ట్?యూనివర్సిటీ ఆఫ్ జెరూసలేంలోని ఇద్దరు ప్రొఫెసర్లు డాన్ గలాయ్, ఓర్లీ సేడ్.. మొట్టమొదట ‘ఆస్ట్రిచ్ ఎఫెక్ట్’ అనే పద బంధాన్ని ప్రయోగించారు. ఇజ్రాయెల్లోని క్యాపిటల్ మార్కెట్లలో పెట్టుబడిదారులు.. ఎప్పటికప్పుడు నష్ట సమాచారాన్ని వెల్లడించే మార్గాల కంటే.. తమకు నష్టం వచ్చినా ఫర్వాలేదని ఆ విషయం బయటకు చెప్పని మార్గాల్లోనే పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడుతున్నట్టు గుర్తించారు.ఈ ధోరణిని ఆస్ట్రిచ్ ఎఫెక్ట్గా అభివర్ణించారు. ఆస్ట్రిచ్ పక్షి తనకు ఏదైనా ప్రమాదం వస్తుందనిపిస్తే.. వెంటనే తన తలను ఇసుకలో దాచేస్తుందని దీని అర్థం. నిజానికి ఆస్ట్రిచ్ అలా చేయదు. కానీ, ఇది మాత్రం మానసిక వైద్య శాస్త్రంలో ‘ఆస్ట్రిచ్ ఎఫెక్ట్’గా స్థిరపడిపోయింది.ఎందుకు తప్పించుకుంటారు?⇒ ఆందోళన లేదా నిరాశ వంటి ప్రతికూల భావోద్వేగాలను నివారించడం⇒ ఇతరులు మన ఇష్టాయిష్టాలను, సామర్థ్యాలను ఎలా అర్థం చేసుకుంటారో అనే ఆందోళన, భయం⇒ మన నమ్మకాలను సవాలు చేసే ఆలోచనలు, వాస్తవాల నుంచి తప్పించుకునేందుకు⇒ మన ప్రాధాన్యతలకు ఇబ్బంది కలగకుండా చూసుకునేందుకు⇒ స్వార్థం లేదని నిరూపించుకునే క్రమంలో.. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం -
లైవ్లో అమ్మేస్తున్నారు!
వ్యాపారం చేయాలంటే ఓ భారీ స్థాయి మాల్ కాకపోయినా.. చిన్న దుకాణం అయినా పెట్టుకోవాలి. లేదా రోడ్డుపై తోపుడు బండి అయినా నిర్వహించాలి. అదీ కాదంటే వాహనం ఆసరాగా చేసుకుని విక్రయాలు సాగించాలి. ఇదంతా సంప్రదాయ పోకడ. ఆన్ లైన్ రాకతో ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ మోడల్ పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియా కాస్తా ‘సోషల్ కామర్స్’ అయిపోయింది. అంటే ప్రత్యక్షంగా దుకాణాలు పెట్టాల్సిన అవసరం లేకుండానే సామాజిక మాధ్యమాలను ఆసరాగా చేసుకుని వ్యాపారాలు పుట్టుకొస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు.. కోట్ల మందికి ఇప్పుడీ ప్లాట్ఫామ్స్ బిజినెస్ అడ్డాలుగా అవతరించాయి.ఆన్ లైన్ లో ఉత్పత్తుల తాలూకు వీడియోలు, ఫొటోలు షేర్ చేయడం.. ఓ ఫోన్ నంబర్ ద్వారా వ్యాపారం చేయడం సాధారణం. ఈ–కామర్స్లో ఇప్పుడు లైవ్ స్ట్రీమింగ్ కొత్త ట్రెండ్. విక్రేతలు యూట్యూబ్ లైవ్, ఫేస్బుక్ లైవ్, ఇన్స్టాగ్రామ్ లైవ్ ద్వారా రియల్ టైమ్లో ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్నారు. వీక్షకులు తమ కామెంట్స్ ద్వారా హోస్ట్తో సంభాషించవచ్చు. లైవ్ పోల్స్ నిర్వహించేందుకు హోస్ట్కు వీలవుతుంది.తెలివైన విక్రేతలు తాము తదుపరి వారం/తేదీన పరిచయం చేయబోయే ఉత్పత్తి గురించి ముందుగానే కొన్ని వివరాలను టీజర్ రూపంలో వెల్లడించి వీక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నారు. అంతేగాక 24 గంటల కౌంట్డౌన్ నిర్వహించి తమ ఫాలోవర్లలో ఉత్సాహాన్ని నింపుతున్నారు. తద్వారా ఎక్కువ మంది వీక్షకులను చేరుకుంటున్నారు. సోషల్ కామర్స్ భారత్లో 2025లో సుమారు రూ.1,80,000 కోట్ల వ్యాపారం చేస్తుందని అంచనాలు ఉన్నాయి. దేశంలో 90 కోట్లకుపైగా ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. వీరిలో 25 శాతానికిపైగా ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్నారు.స్మార్ట్ఫోన్ ఉంటే చాలు.. వర్ధిల్లు వ్యాపారాలుతాము సొంతంగా తయారు చేసిన ఉత్పత్తులు, పిండి వంటలు, కళాఖండాలు, అల్లికలు, పెయింటింగ్స్.. ఒకటేమిటి, వ్యాపారానికి ఏదీ అనర్హం కాదు. వ్యాపారం చేయాలంటే ఈ రోజుల్లో ఓ స్మార్ట్ఫోన్ ఉంటే చాలు. ఔత్సాహికులు తక్కువ పెట్టుబడితో తమ కాళ్లమీద తాము నిలబడవచ్చు. చేతిలోని సెల్ఫోన్ తో వీడియోలు, ఫొటోలే కాదు.. లైవ్ స్ట్రీమింగ్ నిర్వహించి తాము విక్రయించే ఉత్పాదనను ప్రపంచానికి పరిచయం చేయవచ్చు. లైవ్ వీడియో చేయాలంటే పెద్దగా సాంకేతికంగా అవగాహన కూడా అవసరం లేదు. ఎడిటింగ్ భారం అసలే లేదు.దశాబ్దాల నుంచి..వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తులు, సేవలను ప్రచారం చేయడానికి, ప్రజల్లో అవగాహన కల్పించడానికి వీడియోలు ఉపయోగిస్తున్నాయి. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వీడియోలు, షార్ట్స్ చూడటం పెరిగింది. ముఖ్యంగా ఉత్పత్తులు, సేవల గురించి తెలుసుకోవడానికి వీడియోలను చూసే ధోరణి ఊపందుకుంది. ఈ నేపథ్యంలో లైవ్ స్ట్రీమింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. లైవ్ స్ట్రీమింగ్తో షాపింగ్ ఎక్స్పీరియెన్స్ మారుతుందని ఈ–కామర్స్ దిగ్గజం అలీ ఎక్స్ప్రెస్ చెబుతోంది.వాయిదాలకు ఫుల్స్టాప్ఈ–కామర్స్ వెబ్సైట్లలో చాలామంది కస్టమర్లు తాము చూసిన ఉత్పాదనను తరువాత కొనొచ్చులే అని కార్ట్లో నిక్షిప్తం చేస్తారు. చాలా సందర్భాల్లో అవి కార్ట్కే పరిమితం అవుతాయి. అదే లైవ్లో అయితే.. నచ్చగానే ఆర్డర్ పెట్టేయొచ్చు. హోస్ట్ మీద, ఉత్పత్తి మీద నమ్మకం ఏర్పడితే.. వెంటనే ఆర్డర్ చేసేలా మనస్సు కూడా వీక్షకులను ప్రేరేపిస్తుంది అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. తరచూ వాయిదాలు వేసే కస్టమర్ల విషయంలో విక్రేతలకు లైవ్ స్ట్రీమింగ్ కలిసి వస్తుందని వారు చెబుతున్నారు.ప్రత్యక్షంగా వీక్షించి..ఆన్ లైన్ వ్యాపారంలో భాగంగా విక్రేతలు ఉత్పత్తుల తాలూకు వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేయడం సర్వసాధారణం. అయితే ప్రత్యక్ష ప్రసారాన్ని నిర్వహించే వ్యక్తి (హోస్ట్) లైవ్ వీడియోలో ఉత్పత్తి గురించి పూర్తి వివరాలు వెల్లడించేందుకు వీలవుతుంది. లైవ్లో వచ్చే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ద్వారా లక్షలాది మంది ఫాలోవర్లకు ప్రత్యక్షంగా అవి చేరతాయి. సందేహాలు ఉంటే నివృత్తి అవుతాయి. హోస్ట్ ఇచ్చే ప్రెజెంటేషన్ ఇక్కడ కీలకం. ప్రసంగం ఆకట్టుకునేలా ఉంటే ఉత్పత్తి పట్ల కస్టమర్లలో సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. ఉత్పత్తి ఎలా పనిచేస్తుంది, ప్రత్యేకతలు, వారంటీ, గ్యారంటీ, ధర, మార్కెట్లో లభించే ఇతర ఉత్పత్తులతో పోలిస్తే తాము విక్రయించే ప్రొడక్ట్ విశేషాలను కస్టమర్లతో నేరుగా పంచుకోవచ్చు. -
ఉత్తమ లక్షణాలతో.. దీర్ఘాయుష్మాన్భవ!
మంచి వ్యక్తిత్వ లక్షణాలు ఉన్నవారు మంచివారు అనిపించుకోవడమే కాదు.. దీర్ఘాయుష్మంతులు అని పిలిపించుకునే అదృష్టం కూడా దక్కుతుందట. చురుగ్గా ఉండటం, నలుగురికీ సాయపడే మనస్తత్వం, సమయపాలన, ఏ పనినైనా ఒక పద్ధతి ప్రకారం చేయడం, కష్టపడే వ్యక్తిత్వం, మనస్సాక్షికి అనుగుణంగా నడుచుకునేవారు..ఈ లక్షణాలు లేనివారితో పోలిస్తే ఎక్కువ కాలం బతుకుతారని జర్నల్ ఆఫ్ సైకోసోమాటిక్ రీసెర్చ్లో ప్రచురించిన ఓ పరిశోధన వెల్లడించింది. తరచుగా ఒత్తిడికి గురికావడం, ఆందోళన చెందడం, అసంతృప్తిగా ఉండటం వల్ల జీవితకాలం తగ్గిపోతుందట.ఆరోగ్యం అనగానే మనకు గుర్తుకొచ్చేవి..మంచి పోషకాహారం, వ్యాయామాలే. ఇవే దీర్ఘాయుష్షుకు చిట్కాలు అనుకుంటాం. కానీ, కొన్ని విశిష్ట వ్యక్తిత్వ లక్షణాలు కూడా మనం సుదీర్ఘకాలంపాటు ఆరోగ్యంగా బతికేలా చేస్తాయని, మరణ భయాన్ని తగ్గిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. చెరపకురా చెడేవు.మంచి లక్షణాలతో..సాధారణంగా రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి వాటి ఆధారంగా వ్యాధులు లేదా రోగాలను అంచనా వేస్తారు. వ్యక్తుల ఆలోచనల తీరు, అనుభూతి చెందుతున్న విధానం, వారి ప్రవ ర్తన వంటివి.. భవిష్యత్తులో రాబోయే రోగా లు లేదా వ్యాధులను అంచనా వేయడానికి వైద్యులు సాధనాలను అభివృద్ధి చేయడంలో సహాయపడతాయని ప్రముఖ మనస్తత్వవేత్త రెనే మోటస్ తెలిపారు. మనుషులు తమ వ్యక్తిత్వ లక్షణాలను మార్చుకోవడం ద్వారా మరింత ఎక్కువ కాలం బతికేందుకు అవకా శం ఉందని అధ్యయన ఫలితాలు సూచిస్తు న్నాయని ఆయన అన్నారు. ఈ నిర్దిష్ట వ్యక్తిత్వ లక్షణాలకు, మరణానికి సంబంధం ఉందని వెల్లడించారు. ‘ఆందోళన, నిరాశ, కోపం వంటి ప్రతికూల భావోద్వేగాలను తరచుగా, తీవ్రంగా అనుభవించే ధోరణిని కలిగి ఉండడ మే న్యూరోటిసిజం. ఈ లక్షణాలను మార్చడం కష్టం. దీనికంటే వ్యక్తిత్వ లక్షణాలు మార్చడం సులభం. తద్వారా న్యూరోటిసిజం కూడా నయమవుతుంది’ అని ఆయన అన్నారు.అవి వద్దు.. ఇవి ముద్దుఆందోళనకర మానసిక స్థితి, ప్రశాంతత లేనివారి ఆయుష్షు రోజురోజుకీ క్షీణి స్తుంటుంది. అలాగే అధిక కొవ్వుతో బాధపడుతున్నవారు, ధూమపానం చేసేవా రికి సైతం ముప్పు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వీరితో పోలిస్తే మనస్సాక్షి ని నమ్మి, దానికి అనుగుణంగా పనిచేసేవారిలో.. మెరుగైన ఆరోగ్య నిర్వహణ, అధిక స్వీయ–క్రమశిక్షణ, బాధ్యత, ఉల్లాసభరితమైన జీవితం వంటి ఆరోగ్యకర మైన అలవాట్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉందని అధ్యయనం తెలిపింది. విశాల దృక్పథం, స్నేహపూర్వకంగా ఉండే మనస్తత్వం, ఎప్పుడూ ఉల్లాసంగా, చురుగ్గా ఉండటం వంటి లక్షణాలు జీవితకాలాన్ని పెంచుతాయని పేర్కొంది.వ్యక్తిత్వమూ కీలకమే‘ఆయుష్షు విషయంలో వ్యక్తిత్వం కీలక పాత్ర పోషిస్తుందని మా పరిశోధనలో తేలింది. కానీ వైద్యరంగం, ప్రపంచం.. ఆరోగ్యం విషయంలో దీనికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు’ అని ఐర్లాండ్లోని లిమెరిక్ విశ్వవిద్యాలయంలో మన స్తత్వశాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్, నివేదిక సహ రచయిత పారిక్ ఓ సూలివా¯Œ వ్యాఖ్యానించారు. ‘సమయపాలన పాటించేవారు, ఏ పనినైనా పద్ధతిగా చేసేవారు జీవితాన్ని చక్కగా ప్లాన్ చేసుకుంటారు. వీరికి క్రమశిక్షణతో కూడిన దినచర్య ఉంటుంది. సమయాన్ని అనవసర విషయాలకు వ్యర్థం చేయడం వీరికి నచ్చదు. అందువల్ల ఆరోగ్య సంబంధ విషయాల్లోనూ వీరు మిగతావారితో పోలిస్తే మరింత జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుంది. తద్వారా వీరు మిగతావారికంటే ఎక్కువ కాలం జీవించడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి’ అని అన్నారు.28 ఏళ్లపాటు అధ్యయనం⇒ పరిశోధనలో 22,000 మంది పాలుపంచుకున్నారు. 6 నుంచి 28 ఏళ్లపాటు వీరిపై అధ్యయనం చేశారు. వ్యక్తిత్వ లక్షణాలను మరణానికి అనుసంధానించిన ఈ అధ్యయనంలో.. పరిశోధకులు ప్రధాన వ్యక్తిత్వ లక్షణాలను పరిశీలించి వీరి మరణ కాలాలను అంచనా వేశారు.⇒ మనస్సాక్షికి విలువ ఇచ్చి, అందుకు అనుగుణమైన విశి ష్ట వ్యక్తిత్వ లక్షణాలు ఉన్నవారు.. ఈ లక్షణాలు లేనివారి తో పోలిస్తే వేగంగా చనిపోయే అవకాశాలు 15శాతం తక్కువ.⇒ సమయపాలన పాటిస్తూ, ఏ పనినైనా ఒక పద్ధతిగా చేసే లక్షణాలున్న వారు.. తొందరగా మరణించే అవకాశం 14 శాతం తక్కువ.⇒ బాధ్యతాయుతంగా ఉండే వ్యక్తులూ ఎక్కువ కాలం బతుకుతారు. బాధ్యతారాహిత్యంతో ఉండేవారితో పోలిస్తే వీరు వేగంగా మరణించే అవకాశాలు 12 శాతం తక్కువ.⇒ కష్టపడి పనిచేసే మనస్తత్వం లేదా లక్షణాలు ఉన్నవారిలో మరణ అవకాశాలు 15 శాతం తక్కువ. -
కోచింగ్ సెంటర్ల వ్యాపారం చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, మెడికల్, సివిల్స్, గ్రూప్స్, టోఫెల్.. ఇలా రంగం ఏదైనా, ఎలాంటి పోటీ పరీక్షకైనా శిక్షణ ఇచ్చేందుకు దేశవ్యాప్తంగా వెలిసిన కోచింగ్ సెంటర్లు ఏటా రూ. వేల కోట్ల వ్యాపారం సాగిస్తున్నట్లు ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఇన్ఫీనియం తాజా నివేదికలో పేర్కొంది. 2022 నాటికి దేశవ్యాప్తంగా రూ. 58 వేల కోట్లుగా ఉన్న కోచింగ్ సెంటర్ల వ్యాపారం.. ఈ ఏడాది నాటికి ఏకంగా రూ. 70 వేల కోట్లకు చేరిందని వెల్లడించింది. అలాగే 2028 నాటికి రూ. 1.38 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది.కోవిడ్ తర్వాత ఆన్లైన్, డిజిటల్ కోచింగ్ (Digital Coaching) విధానం బాగా పెరగడం వల్ల కోచింగ్ కేంద్రాల వ్యాపారం పెరుగుదలకు దోహదపడుతోందని తెలిపింది. వ్యాపార మార్కెట్ను మరింత పెంచుకోవడానికి వీలుగా ప్రచారంపై ఏటా రూ. 150 కోట్లకుపైనే కోచింగ్ సెంటర్లు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొంది. అయితే దేశంలోని 78 శాతం కోచింగ్ కేంద్రాల్లో కనీస నాణ్యతా ప్రమాణాలు లేవని కేంద్ర విద్యాశాఖ గుర్తించింది. ఆయా కేంద్రాల్లో నిపుణులైన అధ్యాపకులు ఉండట్లేదని.. సూక్ష్మ బోధన విధానం తప్ప సబ్జెక్టుపై దృష్టి పెట్టడం లేదని కనుగొంది. ఫలితంగా జేఈఈ, నీట్లో వివిధ రూపాల్లో ప్రశ్నలు వస్తే విద్యార్థులు సమాధానం ఇవ్వలేకపోతున్నారని అభిప్రాయపడింది. విద్యార్థులపై ఒత్తిడి.. దేశవ్యాప్తంగా ఏటా జేఈఈ మెయిన్కు (JEE Main) సుమారు 13 లక్షల మంది, నీట్కు 22 లక్షల మంది పోటీ పడుతుండటంతో కోచింగ్ సెంటర్లు రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. దీనికితోడు మొత్తం విద్యార్థుల్లో మెరిట్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తూ మిగతా వారికి పెద్దగా నాణ్యత లేని ఫ్యాకల్టీతో కోచింగ్ ఇస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో పోటీ పరీక్షల్లో ర్యాంకులు రాని విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ లెక్కల ప్రకారం 2013లో 8,423 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోగా 2022 నాటికి ఈ సంఖ్య 13,044కు పెరిగింది. 2025 చివరి నాటికి ఈ సంఖ్య 13 శాతం పెరగొచ్చని అంచనా వేసింది. ర్యాంకుల కోసం కోచింగ్ కేంద్రాలు, తల్లిదండ్రుల ఒత్తిడి, విద్యార్థుల్లో పెరిగిన ఆందోళన, ఒంటరితనం ఆత్మహత్యలకు కారణమని ఎన్సీఆర్బీ తెలిపింది. కట్టడికి కార్యాచరణ మొదలైనా.. కోచింగ్ సెంటర్ల ఒత్తిడి వల్ల విద్యార్థులకు జరుగుతున్న నష్టాన్ని నివారించాలని నిర్ణయించిన కేంద్ర విద్యాశాఖ.. ఇందుకోసం ఈ ఏడాది మొదట్లో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్ర ఉన్నత విద్యా కార్యదర్శి వినీత్ జోషి చైర్మన్గా ఉన్న ఈ కమిటీలో సీబీఎస్ఈ చైర్మన్, పాఠశాల ఉన్నత విద్య విభాగాల సంయుక్త కార్యదర్శులు, ఐఐటీ మద్రాస్, తిరుచ్చి, కాన్పూర్ ఎన్ఐటీ, ఐఐటీ, ఎన్సీఈఆర్టీ (NCERT) ప్రతినిధులు సహా మరికొందరిని ఇందులో సభ్యులుగా చేర్చింది.కోచింగ్తో పనిలేకుండా విద్యార్థులు పోటీ పరీక్షలకు ఎలా సన్నద్ధమవ్వాలనే కోణంలో పరిశీలించి నివేదిక ఇవ్వడంతోపాటు ప్రైవేటు కోచింగ్ సెంటర్ల ప్రచార, నాణ్యతా ప్రమాణాలను పరిశీలించాలని ఈ కమిటీని కేంద్రం ఆదేశించింది. పాఠశాల విద్యలో లోపాలు, క్రిటికల్ థింకింగ్ విధానాలు, పాఠశాల విద్య నుంచే పోటీ పరీక్షల సన్నద్ధత, కాలేజీల్లో కెరీర్ గైడెన్స్, ఒత్తిడి లేని సిలబస్ తీసుకురావడంపై కమిటీ అధ్యయనం చేయాలని సూచించింది. అయితే ఈ కమిటీ ఇప్పటివరకు సరైన మార్గదర్శకాలను సూచించలేదు. ఉన్నత విద్యామండలి సిఫార్సులివి.. కోచింగ్ కేంద్రాల వల్ల జరిగే నష్టాన్ని కట్టడి చేయడానికి చట్టబద్ధ నియంత్రణ అవసరమని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి ప్రభుత్వానికి ఇటీవల నివేదించారు. ‘సాక్షి’కి ప్రత్యేకంగా అందిన ఈ నివేదికలోని పలు సిఫార్సులు ఇవి.. ⇒ కోచింగ్ సెంటర్లపై బలమైన నియంత్రణ వ్యవస్థ ఉండాలి. ⇒ శిక్షణా కేంద్రాలకు గుర్తింపును తప్పనిసరి చేయాలి. ⇒ డేటా ప్రైవసీ చట్టాల పరిధిలోకి వాటిని తేవాలి. ⇒ ఆయా సెంటర్లపై ఫీజుల నియంత్రణ ఉండాలి. విదేశీ విద్యా కన్సల్టెంట్లు, ఆన్లైన్ విద్యా వేదికలు, సాఫ్ట్వేర్, టెక్నాలజీ ప్రొవైడర్లు నియంత్రణ పరిధిలో ఉండాలి. ⇒ ఉన్నత విద్యా మండలి వద్ద కోచింగ్ కేంద్రాలు అనుమతి పొందేలా ఉండాలి. ఆయా కేంద్రాలను పర్యవేక్షించి ఏటా నాణ్యతను అధికారికంగా నిర్ణయించాలి. ⇒ ఉన్నత విద్యలో తృతీయ పక్షం జోక్యం వల్ల నాణ్యత దెబ్బతింటోంది. ⇒ ఆన్లైన్ వేదికలు, సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అందిస్తున్న కోచింగ్ పారదర్శకంగా ఉండట్లేదు. గుర్తింపు లేని కోర్సులు, అర్హతలేని బోధకులు, పాత సిలబస్ వల్ల విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. కోచింగ్ కేంద్రాలు లాభాలే తప్ప నాణ్యత పట్టించుకోవడం లేదు. అకడమిక్ పాఠాలతో ఒత్తిడి లేకుండానే విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. తల్లిదండ్రులూ కారణమే ర్యాంకులే తప్ప విద్యార్థుల సామర్థ్యాన్ని తల్లిదండ్రులు అంచనా వేయడం లేదు. అత్యున్నత నాణ్యతా ప్రమాణాల ప్రకారమే బోధించాలని పట్టుబడుతున్నారు. దీనివల్ల సగటు విద్యార్థులు మానసిక ఒత్తిడి గురవుతున్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను తీర్చిదిద్దితే కోచింగ్తో పనే లేదు. – ఎంఎన్ రావు (జేఈఈ కోచింగ్ నిపుణుడు) చట్టం తేవాల్సిందే కోచింగ్ కేంద్రాల నియంత్రణకు పకడ్బందీ చట్టం తేవాలి. నాణ్యత లేని, నిపుణులు లేని కేంద్రాలపై చర్యలు తీసుకోవాలి. విద్యార్థులపై ఒత్తిడి పెంచి ర్యాంకులతో ప్రచారం చేసుకొనే కోచింగ్ కేంద్రాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలి. ఈ అంశాన్ని శాసనమండలిలో లేవనెత్తుతా. చట్టం తెచ్చేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా. – పింగిలి శ్రీపాల్రెడ్డి (ఉపాధ్యాయ ఎమ్మెల్సీ) -
ఒక్కో మెట్టు.. ఆరోగ్యం సూపర్ హిట్టు
సాక్షి, స్పెషల్ డెస్క్: ఆరోగ్యంగా ఉండాలంటే శ్రమతో కూడిన పనులో, వ్యాయామమో చేయాలి. ఈ విషయం తెలిసి కూడా చాలామంది విస్మరిస్తుంటారు. ఉరుకుల పరుగుల జీవితం, గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చునే ఉద్యోగాలు, మరోవైపు కుటుంబ బాధ్యతలు.. ఇలా ఎన్నో కారణాలు. మరి దీనికి పరిష్కారం? సింపుల్... వ్యాయామం చేయడం వీలు కాకపోతే, మెట్లు ఎక్కి, దిగండి! సులభమైన, అత్యంత ప్రభావవంతమైన వ్యాయామాల్లో ఇది ఒకటని అధ్యయనాలుచెబుతున్నాయి.క్రమంతప్పకుండా రోజుకు మూడు అంతస్తులు.. అలా ఆడుతూ పాడుతూ ఎక్కి దిగేస్తుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు! దీంతో శారీరక స్థిరత్వం పెరుగుతుంది. హృద్రోగాల ప్రమాదం తగ్గుతుంది. యూఎస్లోని టూలేన్ విశ్వవిద్యాలయం 2023లో జరిపిన ఒక అధ్యయనంలో ప్రతిరోజూ కనీసం 50 అడుగులు మెట్లు ఎక్కడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని తేలింది. ‘కండరాలకు ఆక్సిజన్ ను అందించే సామర్థ్యం పెరుగుతుంది. చెడుకొలెస్ట్రాల్ (ఎల్డీఎల్), ట్రైగ్లిజరైడ్స్ తగ్గి, మంచి కొలెస్ట్రాల్ (హెచ్డీఎల్)పెరిగేందుకు దోహదం చేస్తుంది’ అని ఈ అధ్యయనం వివరించింది.నడకను మించిన కేలరీలు మెట్లు ఎక్కి, దిగడం వల్ల జాగింగ్, బ్రిస్క్ వాకింగ్ చేసేటప్పటికంటే ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. హార్వర్డ్ మెడికల్ స్కూల్ నివేదిక ప్రకారం 70 కిలోల బరువున్న వ్యక్తి 30 నిమిషాల పాటు మెట్లుఎక్కడం వల్ల దాదాపు 223 కేలరీలు బర్న్ అవుతాయి.కాళ్లు పటిష్టంగా.. కాళ్ళు బలంగా మారతాయి. ప్రతి అడుగులో కాళ్ళుగురుత్వాకర్షణకు వ్యతిరేకంగాశరీరాన్ని ఎత్తుతాయి. దీంతో కాళ్ళు, పిరుదులు, ఉదరకండరాలపై ప్రభావం పడుతుంది. వాటి ఆరోగ్యమూ మెరుగుపడుతుంది.మానసిక ఆరోగ్యం.. వ్యాయామం శరీరాన్ని ఫిట్గా ఉంచడమే కాకుండా మానసిక ఆరోగ్యాన్నీ పెంచుతుంది. ఏ రకమైన వ్యాయామం అయినా ఒత్తిడిని తగ్గిస్తుంది. శారీరక శ్రమతో ఎండార్ఫిన్ విడుదలై మానసిక స్థితి మెరుగుపడుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఎముకల ఆరోగ్యం: మెట్లు ఎక్కడం వంటి వ్యాయామాలు ఎముకల ఆరోగ్యానికిఅద్భుతమైనవి. ఎముక బలంగా పెరుగుతుంది. బోలు ఎముకలవ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అయితే ఇది అందరికీ వర్తించకపోవచ్చు. ఇప్పటికే కాళ్ల సమస్యలు ఉన్నవారు, వృద్ధులు వైద్యులనుసంప్రదించి తగు వ్యాయామాలు చేయాలి.ఆ ప్రమాదం తక్కువ.. యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ ఇటీవలిసమావేశంలో సమర్పించిన విశ్లేషణ ప్రకారం.. మెట్లు ఎక్కని వారితో పోలిస్తే మెట్లు ఎక్కేవారు గుండె జబ్బుల వల్ల మరణించే అవకాశం 39% తక్కువగా ఉంది. వారిలో గుండెపోటు, స్ట్రోక్ల ప్రమాదం కూడా తక్కువగా ఉందట.సులభ వ్యాయామం జిమ్ వంటి దినచర్యల మాదిరిగా కాకుండా మెట్ల నడకకు ఎలాంటి పరికరాలు అవసరం లేదు. ఖర్చూ ఉండదు. తీరిక లేనివారికి ఇది సులభమైన వ్యాయామం.రక్తంలో చక్కెర నియంత్రణ..చిన్న మొత్తంలో చేసే శారీరక శ్రమ సైతం ఇన్సులిన్, గ్లూకోజ్ స్థాయులను నియంత్రిస్తుంది. మెట్లు ఎక్కడం.. సమతల నేలపై నడవడంతో పోలిస్తే రక్తంలో చక్కెరను మరింత సమర్థవంతంగా తగ్గించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.ఎన్ని మెట్లు ఎక్కాలి?రోజుకు 3 అంతస్తులు ఎక్కి, దిగడం ద్వారా రోజువారీ దినచర్యలకు సరిపోయే స్థిరమైన ఫిట్నెస్ అందుకోవచ్చు. వ్యక్తుల ఫిట్నెస్ స్థాయినిబట్టి మెట్ల సంఖ్యను పెంచుకోవచ్చు. » బిగినర్ అయితే 1–2 అంతస్తులు.. అంటే 20–40 మెట్లతో ప్రారంభించండి. ∙సీనియర్ అయితే ఫిట్నెస్ను బట్టి 5–10 అంతస్తులు లక్ష్యంగా పెట్టుకోవచ్చు.వైద్యుల సలహాతోనే..మెట్లు ఎక్కడం చాలా మందికి సురక్షితం. కానీ ఈ కింది జాబితాలో ఉన్నవారు, ఇవి కాకుండా ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం వైద్యుల సలహాతో వ్యాయామం చేయాలి.1. ఊబకాయం 2. కీళ్ల వ్యాధి 3. తూలిపడే సమస్య ఉన్నవారు4. వృద్ధులు, బలహీనమైన వ్యక్తులు 5. గుండె, ఊపిరితిత్తుల వ్యాధి6. ఇటీవలి కాలంలో శస్త్రచికిత్సలు చేయించుకున్నవారు. -
పండుగ వేళా.. పంచాయతీ సిబ్బందికి పస్తులేనా?
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎంపీడీఓ కార్యాలయంలో ఇ–పంచాయతీ ఆపరేటర్గా పనిచేసే సోమిరెడ్డి రెండు నెలల కిందటడిప్యుటేషన్పై సూర్యాపేట డీపీవో కార్యాలయానికి వెళ్లాడు. ఇద్దరు కూతుళ్లు, భార్యతో కలిసి నల్లగొండలో ఉంటున్న ఆయన నిత్యం సూర్యాపేటకు వచ్చి పోయేవారు. భార్యాపిల్లలను పోషించుకునేందుకు వచ్చే జీతమే తక్కువకాగా,అదీ రెండు మూడు నెలలపాటురాకపోవడంతో తీవ్ర ఆందోళనకుగురయ్యాడు. దీనికి ఆరు నెలలకిందట జరిగిన ప్రమాదం తర్వాతమరింత కుంగిపోయాడు. ఈ క్రమంలోనే తన బాధను ప్రకటిస్తూ, ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక పోతున్నాననిపేర్కొంటూ తన స్నేహితుల గ్రూపులో మెసేజ్ పెట్టి రైలు కింద పడిఆత్మహత్య చేసుకున్నాడు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ: పంచాయతీరాజ్ శాఖ పరిధిలో పనిచేసే సిబ్బంది వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 55వేల మంది వేతనాల కోసం విజ్ఞప్తులు చేస్తున్నా ఫలితం దక్కడం లేదు. మండల పరిషత్ కార్యాలయాలు, గ్రామ పంచాయతీల్లో పనిచేసే 1,579 మంది ఇ–పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు జూలై నుంచి వేతనాలు లేక ఇబ్బందులు పడుతుండగా, 1,093 మంది ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు (ఓపీఎస్), 52,473 మంది గ్రామాల్లో పనిచేసే మల్టీ పర్పస్ వర్కర్స్కు (ఎంపీడబ్ల్యూ) జూలై నుంచి వేతనాలు అందకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. పండుగ పూట కూడా పస్తులు ఉండాలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు రాక అప్పుల పాలు ప్రతి నెలా వేతనాలు అందకపోవడంతో గ్రామ పంచాయతీల పరిధిలో పనిచేసే సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల స్కూల్ ఫీజులు, ఇంట్లో అవసరాలు, ఏదైనా కొనాలన్నా చేతిలో డబ్బుల్లేక ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రతిసారి అప్పులు చేసేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నామని, చివరకు అప్పు కూడా లభించక, కుటుంబపోషణ భారంగా మారి తీవ్ర మానసిక క్షోభను అనుభవించాల్సి వస్తోందని వాపోతున్నారు. ఉద్యోగ భద్రత లేక..గ్రీన్ చానల్లో వేతనాలు అందక.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరి«ధిలో పనిచేసే ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఎలాగూ లేదని వాపోతున్నారు. 10 ఏళ్ల కిందటి నుంచే తాము పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత కల్పించడం లేదని చెబుతున్నారు. గ్రామంలో, మండలంలో ఏ కార్యక్రమం చేపట్టినా, ఏ సర్వే చేసినా, ఏ అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన వివరాలనైనా ఇ–పంచాయతీ ఆపరేటర్లే ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. తమ ఉద్యోగానికి ఫలానా సమయమంటూ లేదని, ఉదయం నుంచి మొదలుకొని రాత్రి వరకు పనిచేస్తున్నా తమను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఓపీఎస్లు, ఎంపీడబ్ల్యూలు కూడా తాము ఎంత పనిచేసినా ఉద్యోగ భద్రత లేక మానసిక క్షోభను అనుభవించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు గ్రీన్ చానల్లో వేతనాలను ప్రతి నెలా ఇస్తామని మంత్రి సీతక్కతో సహా ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చినా కనీసం దానిని అమలు చేయడం లేదని వాపోతున్నారు. పండుగ వచ్చి నా పస్తులే ఉండాల్సిన పరిస్థితి నెలకొందని, ఇంట్లో పిల్లలకు కనీసం కొత్త బట్టలు కొనలేని దుస్థితిలో మనుగడ సాగించాల్సి వస్తో్తందని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే తమ వేతనాలను విడుదల చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
సందేహం వస్తే.. బ్లాక్ చేయండి
సాక్షి, స్పెషల్ డెస్క్: ఆన్ లైన్ ఆర్థిక మోసాలు రోజురోజుకూ పెరుగుతూ ఉన్నాయి. వీటికి సంబంధించిన వార్తలు పేపర్లు, టీవీలు, సామాజిక మాధ్యమాల్లో నిత్యం కళ్లముందు ప్రత్యక్షం అవుతూనే ఉన్నాయి. ప్రభుత్వం, పోలీసు శాఖ, బ్యాంకులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ప్రజలు చిక్కుకుంటూనే ఉన్నారు. బాధితుల్లో ఉన్నత విద్యనభ్యసించినవారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నవారూ ఉండడం గమనార్హం. ఒకటి కాదు, రెండు కాదు.. కోట్ల రూపాయల కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి ఆన్ లైన్ ఆర్థిక మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పలు సూచనలు చేసింది.» మోసపూరిత లావాదేవీ గుర్తిస్తే.. ఆధార్, పాన్ కార్డు వంటి గుర్తింపు కార్డులతో అనుసంధానమైన అన్ని బ్యాంక్ ఖాతాలను (మ్యూల్) స్తంభింపజేయాలని హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రతిపాదించింది. అలాగే ఐడీ కార్డులను బ్లాక్ లిస్టులో ఉంచాలని, దీంతో మోసగాళ్లు మరో ఖాతా తెరవడానికి వీలు కాదని.. ఆగస్ట్లో పార్లమెంట్కు సమర్పించిన నివేదికలో కమిటీ సూచించింది. తద్వారా సైబర్ నేరగాళ్లు దోచుకున్న సొమ్మును ఇతర ఖాతాలను మళ్లించే దారులు మూసుకుపోతాయని అభిప్రాయపడింది. అధీకృత వ్యక్తులే డిపాజిట్ చేస్తున్నారని నిర్ధారించుకోవడానికి ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ వంటి డిజిటల్ గుర్తింపు తనిఖీలను చేపట్టాలని, తద్వారా నేరస్థులు దోపిడీ చేసే అవకాశాలను పరిమితం చేయవచ్చని కమిటీ తెలిపింది. ఈ ప్రతిపాదనలు కీలక ముందడుగు అని నిపు ణులు చెబుతుంటే... అమలు అంత సులువు కాదని బ్యాంకులు వాదిస్తున్నాయి.ఆర్థిక నేరాలు మూడింతలుడిజిటల్ అరెస్ట్ పేరుతో ఆర్థిక నేరగాళ్లు చేస్తున్న దందా మన దేశంలో కొన్ని నెలలుగా ముప్పుగా పరిణమించింది. ఆన్ లైన్ ఆర్థిక నేరాలు గత ఏడాది మూడింతలు అయ్యాయంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్ సీఆర్పీ) ప్రకారం 2024లో ఆన్ లైన్ ఆర్థిక నేరాల్లో సామాన్యులు రూ.21,181 కోట్లు పోగొట్టుకున్నారు. 2023తో పోలిస్తే ఈ మొత్తం దాదాపు మూడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. 2024లో పోగొట్టుకున్న దాంట్లో సుమారు 12% మాత్రమే.. అంటే రూ.2,530 కోట్లు స్తంభింపజేయడం లేదా రికవరీ జరిగింది. ఆన్ లైన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్కు సంబంధించి గత ఏడాది ఎన్ సీఆర్పీ ఏకంగా 20 లక్షల పైచిలుకు ఫిర్యా దులు స్వీకరించడం.. మోసాల తీవ్రతకు అద్దం పడుతోంది.వెంటనే నివేదిస్తే బహుమతి!నో యువర్ కస్టమర్ (కేవైసీ) నియమాలు అమలవుతున్న ప్పటికీ మ్యూల్ ఖాతాలను సైబర్ నేరగాళ్లు తెరుస్తూనే ఉన్నారు. టైపింగ్ వేగం, మౌస్ కదలికల తీరును విశ్లేషించేందుకు బయోమెట్రిక్ వ్యవస్థను బ్యాంకులు అమలు చేయాలని కమిటీ సూచించింది. మోసాన్ని వెంటనే నివేదించే వినియోగదారులకు బహుమతులు ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలని ఆర్బీఐకి సూచించింది.» అసాధారణ కార్యకలాపాలను గుర్తించి, అనుమానిత డిపాజిట్లను తాత్కాలికంగా నిరోధించాలని (బ్లాక్) తెలిపింది. మోసగాడి బారిన పడటం వల్ల కలిగే పరిణామాలు, కస్టమర్ బాధ్యత అనే అంశాన్ని పునఃపరిశీలించాలని కమిటీ సిఫార్సు చేసింది. » ప్రజలకు కూడా భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత ఉంటుందని.. ఈ విషయంలో వారికి మరింత అవగాహన కల్పించాలని సూచించింది.నియంత్రణ యంత్రాంగంబ్యాంకులు, సంస్థలు, వినియోగదారులు, ఇతర భాగస్వామ్య పక్షాలు అనుసరించాల్సిన చట్ట పరమైన విధానాలను నిర్దేశించే ఒకే నియంత్రణ యంత్రాంగం ఏర్పాటు ప్రతిపాదనతో సహా.. జాతీయ భద్రతా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కమిటీ ప్రతిపాదనలను ఎలా అమలు చేయాలన్న అంశంపై మంత్రిత్వ స్థాయిలో వివిధ దశల్లో చర్చలు జరుగుతున్నాయని డేటా సెక్యూ రిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలిపింది. ప్యానెల్ సిఫార్సుల అమలును ఇండియన్ సైబర్ ఎమర్జెన్సీ రెస్పాన్ ్స టీమ్, ఇండియన్ సైబర్ క్రై మ్ కో–ఆర్డి నేషన్ సెంటర్ పర్యవేక్షించనున్నాయి. పలు బ్యాంకులు ఈ చర్చల్లో పాల్గొన్నట్టు సమాచారం. -
లోకల్ బ్రాండ్స్కు సై!
ఒక్కో ప్రాంతం, తరం, స్త్రీ, పురుషులను బట్టి కొనుగోలు తీరుతెన్నులు మారుతున్నాయి. మహిళల నేతృత్వంలోని బ్రాండ్స్కు ఉత్తర భారతంలో ఆదరణ ఎక్కువ. దక్షిణాది కస్టమర్లు సంప్రదాయానికి పెద్దపీట వేస్తున్నారు. అంతేకాదు ఆఫ్లైన్ షాపింగ్కు మొగ్గుచూపుతున్నారు. భారతీయ వినియోగదారుల కొనుగోలు తీరును, ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి.. అంతర్జాతీయ మార్కెట్ పరిశోధన సంస్థ ‘యూగోవ్’ సహకారంతో 18 రాష్ట్రాల్లోని 5,000 మంది వినియోగదారులతో వెంచర్ క్యాపిటల్ సంస్థ ‘రుకమ్ క్యాపిటల్’ నిర్వహించిన ఆన్ లైన్ సర్వేలో అనేక ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్ప్రాంతం బట్టి ప్రాధాన్యతలుపశ్చిమ భారతం: స్వదేశీ బ్రాండ్స్ అంటే మక్కువ. పండుగ సమయంలో కార్డ్ ఆధారిత చెల్లింపులు అధికం. ఏఐ/వర్చువల్ ట్రై–ఆన్ ్స ప్రయత్నించడం అంటే విపరీతమైన ఆసక్తి. సంస్కృతి, స్థానిక ఉత్పత్తులు, పర్యావరణ అనుకూల ఉత్పత్తులను ఇష్టపడుతున్నారు.తూర్పు భారతం: పర్యావరణ అనుకూల, మన్నికగల ఉత్పత్తులకు మొగ్గు చూపుతారు. కూపన్ ్స, సేల్ డేస్, బహుమతులను కోరుకునే కస్టమర్లు. సాంస్కృతిక విలువలు, ప్రత్యేకత కలిగిన ఉత్పత్తులను ఇష్టపడతారు.ఉత్తర భారతం: మహిళల నేతృత్వంలోని బ్రాండ్స్కు ఆదరణ ఎక్కువ. కంపెనీలతో భావోద్వేగ బంధం ఉంది.. ఇన్ ఫ్లుయెన్సర్ల ప్రభావం అధికం. ప్రకటనలను ఇట్టే గ్రహిస్తారు.దక్షిణ భారతం: సంప్రదాయానికి పెద్దపీట వేస్తారు. దుకాణాలకు వెళ్లి షాపింగ్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఉత్పత్తులపట్ల వ్యామోహంతోనే కొనుగోళ్లు అధికం. సెలబ్రిటీలు చేశారు కదా అని ఆ ప్రకటనల ఆధారంగా కొనుగోళ్లు చేయడం తక్కువ. అత్యధిక శాతం మంది పర్యావరణ అనుకూలమైన ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నారు.ఆరోగ్యమే మహాభాగ్యం» ఆరోగ్యం, సంరక్షణ విభాగంలో పూర్తిగా సహజ పదార్థాలతో తయారు చేసిన ఉత్పత్తులను అందించే బ్రాండ్స్నే ఇష్టపడతామని 100% మంది చెప్పడం విశేషం. పర్యావరణ అనుకూల ఉత్పత్తులకే ప్రాధాన్యత అని 76% మంది స్పష్టం చేశారు.» 50% కంటే ఎక్కువ మంది.. పండుగల సమయంలో ఆరోగ్యకరమైన స్నాక్స్ కొనాలని భావిస్తున్నారు. 40% మంది చక్కెర రహిత ప్రత్యామ్నాయాలను ఎంచుకున్నారు. » ప్రథమ శ్రేణి నగరాల్లోని వినియోగదారుల్లో 57% మంది ఆరోగ్యకరమైన స్నాక్స్, 41% మంది చక్కెర రహిత స్వీట్లను ఎంచుకున్నారు. తృతీయ శ్రేణి నగరవాసుల్లో 65% మంది సంప్రదాయ స్వీట్లను తింటామని తెలిపారు.మహిళలను ప్రోత్సహించేలా..» 58% మంది స్థానిక/స్వదేశీ బ్రాండ్స్ను ఇష్టపడుతున్నారు. » కార్పొరేట్ సామాజిక బాధ్యత పట్ల నిబద్ధత ఉండే, అధిక వ్యయం చేసే కంపెనీల ఉత్పత్తులు కొనేందుకు 56% మంది ఆసక్తి చూపారు.» కొత్త స్టార్టప్స్ను ప్రోత్సహించేందుకు చాలామంది ముందుకు వచ్చారు. వారి నుంచి ఉత్పత్తులు కొనేందుకు తాము సిద్ధమని 43% మంది వెల్లడించారు. » మహిళలు నడిపే వ్యాపారాల నుంచి మాత్రమే షాపింగ్ చేస్తామని 68% మంది మిలీనియల్స్, జెన్–జీ తరం వాళ్లు చెప్పడం విశేషం.» 14% మంది 20–30% అధిక ధర చెల్లించడానికి సిద్ధం. » పండుగ షాపింగ్ విషయానికి వస్తే ప్రథమ శ్రేణి నగరాల్లో స్వదేశీ బ్రాండ్స్ వైపు 61% మొగ్గు చూపుతున్నారు. » స్థానిక బ్రాండ్లు రోజువారీ సమస్యలకు వినూత్న పరిష్కారాలను అందిస్తున్నాయి. నిజాయితీగా ఈ కంపెనీలిచ్చే ప్రామాణిక సమాచారాన్ని అభినందిస్తున్నట్లు 76% మంది తెలిపారు.» ఇతర దేశాల్లో లేదా సంస్కృతిలో ప్రసిద్ధి చెందిన ఉత్పత్తులను విక్రయించే బ్రాండ్స్ నుంచి కొనుగోలు చేసినట్టు 59% మంది చెప్పారు.వీటి ఆధారంగా.. బ్రాండ్ ఎంపిక, కొనుగోలును ఏయే అంశాలు ప్రభావితం చేస్తున్నాయంటే..48% ఈ–కామర్స్ పోర్టల్స్లో సేల్ డేస్47% ఫెస్టివ్ సేల్ / ఎండ్ ఆఫ్ సీజన్ సేల్47% ఆఫర్లు, డిస్కౌంట్లకు గూగు ల్/ఆన్ లైన్ లో సెర్చ్42% బ్రాండ్ వెబ్సైట్లలో ఆఫర్లుఅందుకే కొనడంలేదుబ్రాండ్ ఉత్పాదన కొనుగోలుకు నిరోధకాలుకాలక్రమేణా ఉత్పత్తి నాణ్యత మారుతోంది 29%తక్కువ ధరకు ఇలాంటి ఉత్పత్తి దొరికింది 28%కస్టమర్ కేర్ నుంచి కరువైన ప్రతిస్పందన 26%షిప్పింగ్ ఆలస్యం / అధిక చార్జీలు 25%ఈ బ్రాండ్ ఉత్పత్తులు ఆరోగ్యానికి మంచివి కావు 25% -
మహిళల్లోనే మహాశక్తి
‘‘మనందరిలో ఓ దుర్గా మాత ఉంది. ఆ శక్తిని మనం గ్రహించగలిగితే మనం ఏదైనా సాధించగలం. స్త్రీలు అనుకుంటే ఎలాంటి సవాల్ని అయినా అద్భుతంగా ఎదుర్కొంటారని నా నమ్మకం’’ అంటున్నారు పూజా హెగ్డే(Pooja Hegde). సౌత్–నార్త్లో స్టార్ హీరోయిన్గా దూసుకెళుతున్న ఆమె ‘దసరా’ సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్న విశేషాలు...ఈ నవరాత్రి రోజుల్లో మా కుటుంబం మొత్తం శాకాహారులుగా మారిపోతాం. ఈ పండగ అప్పుడు కుదిరితే గుడికి వెళతాను. లేకపోయినా నాకు తరచూ గుడికి వెళ్లడం అలవాటు. మన ఎనర్జీ లెవల్స్ బాగుండటానికి మనం గుడికి వెళ్లడం మంచిది అని నా అభిప్రాయం. గుడిలో కాలు పెట్టగానే తెలియకుండా ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. మనం క్షేమంగా ఉండటానికి ఆ ఎనర్జీ పనికొస్తుంది. అందుకే గుడికి వెళ్లడాన్ని నేను బాగా నమ్ముతాను. → నవరాత్రి టైమ్లో ఉపవాసం ఉండను కానీ నాకు ఫాస్టింగ్ అంటే నమ్మకం. ఫాస్టింగ్లో ఉన్నప్పుడు దేవుడికి దగ్గరగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. నా చిన్నప్పుడు మా నాన్నగారు ఉపవాసం ఉండేవారు. తొమ్మిది రోజులు కేవలం నీరు మాత్రమే తీసుకునేవారు. అంత కఠినమైన ఉపవాసం ఆచరించేవారు. కానీ నేనెప్పుడూ అలా చేయలేదు. నేను ఏడాదికి రెండుసార్లు ఉపవాసం ఉంటాను. ‘అంగారిక సంకష్ట చతుర్ది’ నాడు, మహా శివరాత్రికి తప్పకుండా ఫాస్టింగ్ చేస్తాను. → చాలా సంవత్సరాలుగా నేను దాండియా ఆడలేదు. ఓ పదేళ్ల క్రితం నా స్నేహితులతో కలిసి దాండియా ఆడటానికి వెళ్లాను. గర్బా డ్యాన్స్ పోటీ జరుగుతోందని అక్కడికి వెళ్లాక తెలిసింది. ఈ కాంపిటీషన్ కోసం కొన్నిగ్రూప్స్ సభ్యులు ఏళ్ల తరబడి ప్రాక్టీస్ చేసి మరీ పాల్గొంటారని తెలిసి, ఆశ్చర్యపోయాను. వాళ్ల డ్యాన్స్ నిజంగా అద్భుతం. నేను కూడా ఒక గ్రూపులోకి వెళ్లి, డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాను. కానీ అది అంత తేలికైన విషయం కాదని అర్థమైంది. → ప్రతి మహిళలోనూ ఓ శక్తి ఉంది. మనలో ఆ శక్తి స్వరూపిణి దుర్గా మాత ఉందని గ్రహించాలి. నవరాత్రి అంటే మనలో ఉన్న ఆ దేవిలోని పలు షేడ్స్ని సెలబ్రేట్ చేయడమే. మన లోపల ఉన్న దైవిక స్త్రీత్వాన్ని గుర్తించడమే. అయితే నేనిప్పటివరకూ గమనించినంతవరకూ స్త్రీలకు ఏదైనా సవాల్ ఎదురైతే అద్భుతంగా అధిగమించే నేర్పు వారికి ఉందని తెలుసుకున్నాను. కానీ మనకు మనంగా పరిష్కరించుకోగలుగుతాం అనే విషయం మనకు అర్థం కావాలి. లోపల దాగి ఉన్న ఆ శక్తిని గుర్తించి ముందుకెళితే మన వల్ల కానిది ఏదీ లేదు.→ నవరాత్రి సమయంలో నాకు బాగా నచ్చినది ‘హవన్’ (హోమం). హవన్లో బియ్యం, నువ్వులు, ధాన్యాలు, నెయ్యి వంటివి సమర్పించి, ఆ దుర్గా మాత ఆశీర్వాదాన్ని కోరతాం. హవన్ చుట్టూ తిరుగుతున్నప్పుడు వెచ్చగా ఉంటుంది. అది చాలా బాగుంటుంది. చాలా పవిత్రంగా అనిపిస్తుంది. మామూలుగా నవరాత్రి అప్పుడు బంధువులు ఇంటికి వస్తుంటారు. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా ‘హవన్’కి మాత్రం అందరూ హాజరవుతారు. అలాగే పసుపు ఆకు తింటాం. ఆ ఆకు నుంచి వచ్చే సువాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. నా చిన్నప్పటి తీపి గుర్తుల్లో ఇదొకటి.→ మా ఇంట్లో తొమ్మిది రోజులు పండగను చాలా శ్రద్ధగా చేస్తాం. ఇందాక నవరాత్రి సమయంలో ఆచరించేవాటిలో నాకు ‘హవన్’ ఇష్టం అని చె΄్పాను కదా. అష్టమి రోజున అది చేస్తాం. మేం లక్ష్మీ పూజ కూడా బాగా చేస్తాం. అలాగే ‘మాంజో లిరెట్టా గట్టి’ అని వంటకం చేస్తాం. కొబ్బరి తురుము, బెల్లం కలిపి ముద్దలా కలిపి, పసుపు ఆకులో పెట్టి ఉడికిస్తాం. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఓ పట్టు పడుతుంటాను. → దసరా అనగానే మనకు చెడుపై మంచి గెలుపు అనేది గుర్తొస్తుంది. నా వరకూ నా చుట్టూ ఉన్న చెడు గురించి, చెడు చేసేవాళ్ల గురించి అస్సలు పట్టించుకోను. ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేయడంపైనే దృష్టి పెడతాను. వందకు వంద శాతం పని చేయడం... మంచి ఆలోచనలతో ముందుకు వెళ్లడం... ఈ రెంటినీ ఫాలో అవుతాను. అప్పుడు ఎన్నో రెట్లు రూపంలో మంచి మన వద్దకు వస్తుందని నమ్ముతాను. ఇక చెడు చేసిన వారి గురించి ఆలోచించకుండా... మానవులకు అతీతమైన ‘ఉన్నత శక్తి’కి వదిలేస్తాను.నవరాత్రి సమయంలో మా ఇంట్లో బాగా భజనలు చేస్తాం. నా చిన్నప్పట్నుంచి ఇప్పటివరకూ ఒకే పద్ధతిలోనే పండగ జరుపుకుంటూ వస్తున్నాం. ప్రపంచంలో ఏదైనా మారొచ్చు. కానీ మన ఆచారాలను మనం ఎప్పుడూ ఒకేలా పాటించాలి. ఇప్పుడు వర్క్ షెడ్యూల్స్ వల్ల నేను చాలా పండగలను మిస్సవుతున్నాను. అయితే ఏ మాత్రం వీలు కుదిరినా పండగలప్పుడు ఇంట్లోనే ఉండటానికి ప్రయత్నిస్తాను.– డి.జి. భవాని -
అన్నీ అమ్మ ఆకృతులే
‘అమ్మవారి తొమ్మిది అలంకారాలు, కృతులు స్త్రీ శక్తి గురించి తెలియజేసేవే. మనలోని శక్తిని ఎలా జాగృతం చేస్తామో అదే మనం’ అంటూ నవరాత్రుల సందర్భంగా చేస్తున్న సాధన, అమ్మవారి కృపతో మొదలైన తన ప్రయాణం గురించి తెలియజేశారు గాయని భమిడి పాటి శ్రీలలిత (Bhamidipati Srilalitha). విజయవాడ వాసి, గాయని, అమ్మవారి పాటలకు ప్రత్యేకంగా నిలిచిన శ్రీలలిత చెప్పిన విశేషాలు నవశక్తిలో.‘‘నవరాత్రి సిరీస్ ఆరేళ్లుగా చేస్తున్నాను. బెజవాడ కనకదుర్గమ్మ అలంకరణ ఎలా ఉంటుందో అలాంటి అలంకరణల సెట్ వేసి, షూట్ చేసి, వీడియో ద్వారా చూపించాం. ఈ నవరాత్రుల్లో కనకదుర్గమ్మను నేరుగా దర్శించుకోలేనివారు సోషల్ మీడియాలో తొమ్మిది పాటలుగా విడుదల చేసిన వీడియోలు చూడవచ్చు. అమ్మవారి ప్రతి అలంకరణకు తగ్గట్టుగా పాట ఎంపిక, విజువల్స్ డిజైన్ చేశాం. ప్రతియేటా కొత్తదనం ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాం. అమ్మవారి కృతులు అందరిళ్లలో పాడుకునే విధంగా ఆడియోను తీసుకువచ్చాం. పరంపరంగా వచ్చిన కృతులనే తీసుకున్నాం. ఈసారి మాత్రం రెండు భజనలు కూడా వీడియోలో ఉండేలా ప్లాన్ చేశాం. ఈ నవరాత్రి వీడియోకు నెల రోజుల టైమ్ పట్టింది. రోజుకు మూడు అలంకారాల చొప్పున షూట్ చేశాం.కృతులను నేర్చుకుంటూ ..చిన్నప్పటి నుంచి ఇంట్లో భక్తి గీతాలు వింటూ ఉండేదాన్ని. మా ఇంట్లో అందరూ అమ్మవారి ఆరాధకులే. అమ్మవారి దీక్ష చేసేవారు. ఇంట్లో అందరూ ఆమె కృతులను పాడుతుంటారు. ఆ విధంగా అమ్మవారి కృతులు వినడం, నేర్చుకోవడం ప్రారంభించాను. మా అత్తింట్లోనూ అమ్మవారి ఆరాధకులే. మా మామగారు నలభై ఏళ్లుగా దుర్గమ్మవారి ఉత్సవాలు జరుపుతున్నారు. దీంతో నేనూ ఆ ఉత్సవాల్లో పాల్గొంటూ, ప్రదర్శన ఇస్తూ వస్తున్నాను. అన్ని పుణ్యక్షేత్రాలూ దర్శించి, అక్కడ ప్రదర్శనలో పాడే అవకాశమూ లభించింది.చదవండి: సెంటర్స్టోన్ డైమండ్రింగ్, లగ్జరీ గౌనులో ఇషా అంబానీ : ధర ఎంతో తెలుసా? పరీక్షలను తట్టుకుంటూ...అమ్మవారి ఉత్సవాలు, గ్రామదేవతా ఉత్సవాలు, మొన్న జరిగిన తిరుపతి బ్రహ్మోత్సవాల్లోనూ పాల్గొన్నాను. పాట ఎంపిక నుంచి అమ్మవారే ఈ కార్యక్రమం నా చేత చేయిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ కృతులు పాడుతున్నా, వింటున్నా ఒక ఆధ్యాత్మిక భావనకు లోనవుతుంటాను. ఉదాహరణకు.. ఒక కృతిలో 13 చరణాలు ఉంటే.. 9 లేదా 11 చరణాలు పాడుదాం, అంత సమయం ఉండడదు కదా అని ముందు అనుకుంటాను. కానీ, ప్రదర్శనలో నాకు తెలియకుండానే 13 చరణాలనూ పూర్తి చేస్తాను. ఇటువంటి అనుభూతులెన్నో.సినిమాలోనూ...ఇటీవలే ఒక సినిమాకు పాటలు పాడాను. ఆరేళ్ల వయసు నుంచి 20 వరకు రియాలిటీ షోలలో పాల్గొన్నాను. బయట మూడు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చాను. మన దేశంలోనే కాకుండా విదేశాలలోనూ ప్రదర్శనలు ఇవ్వడం నిజంగా అదృష్టం. సంగీత కళానిధులైన బాలసుబ్రహ్మమణ్యం, చిత్ర, కోటి, ఉషా ఉతుప్.. వంటి పెద్దవారిని కలిశాను. వారితో కలిసి పాడుతూ, ప్రయాణించాను. ఒకసారి రియాలిటీ షో ఫైనల్స్లో పాడుతున్నప్పుడు బాలు గారు ‘నీ వెనక ఏదో దైవశక్తి ఉంది...’ అన్నారు. అదంతా అమ్మవారి ఆశీర్వాదంగా భావిస్తుంటాను.వదలని సాధన...ఈ సీరీస్లో నాకు చాలా ఇష్టమైనది మహాకవి కాళిదాసు ‘దేవీ అశ్వధాటి’ స్తోత్రం. ప్రవాహంలా సాగే ఆ స్తోత్రాన్ని అమ్మవారి మీద రాశారు. అశ్వధాటి అంటే.. ఒక గుర్రం పరుగెడుతూ ఉంటే ఆ వేగం, శబ్దం ఎలా ఉంటుందో .. ఆ స్తోత్రం కూడా అలాగే ఉంటుంది. 13 చరణాలు ఉండే ఆ స్తోత్రం పాడటం చాలా కష్టం. కానీ, నాకు అది చాలా ఇష్టమైనది. ఏదైనా స్తోత్రం మొదలుపెట్టినప్పుడు దోషాలు లేకుండా జాగ్రత్త పడుతూ, ప్రజల ముందుకు తీసుకువస్తాను. కరెక్ట్గా వచ్చేంతవరకు సాధన చేస్తూ ఉంటాను. ఇదీ చదవండి: పారిస్ ఫ్యాషన్ వీక్ : ఐశ్వర్యా డాజ్లింగ్ లుక్ వెనుకున్న సీక్రెట్ ఇదే!మహిళలు జన్మతః శక్తిమంతుఉ కాబటి వారు ఎక్కడినుంచో స్ఫూర్తి పొందడం ఏమీ ఉండదు. మనలోని శక్తి ఏ రూపంలో ఉందో దానిని వెలికి తీసి, ప్రయత్నించడమే. నా కార్యక్రమాలన్నింటా మా అమ్మానాన్నలు, అన్నయ్య, అత్తమామలు, మా వారు.. ఇలా అందరి సపోర్ట్ ఉంది. ఆడియో, వీడియో టీమ్ సంగతి సరే సరి! ’ అంటూ వివరించారు ఈ శాస్త్రీయ సంగీతకారిణి.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ప్రభుత్వానికి మెట్రో బదిలీ ఈజీ కాదు
మెట్రో మొదటిదశ ప్రాజెక్టు నుంచి ఎల్అండ్టీ వైదొలగనున్న నేపథ్యంలో కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. అసలు ప్రభుత్వ అధీనంలోకి వెళ్తే నిర్వహణ ఎలా ఉంటుంది..? సౌకర్యాలు ఎలా ఉంటాయనే చర్చ మొదలైంది. అలాగే మెట్రో మొదటి దశ ప్రాజెక్టు ఎల్అండ్టీ నుంచి ప్రభుత్వానికి బదిలీచేసే ప్రక్రియ కూడా అంత ఈజీ కాదు. వివిధ అంశాలపైన స్పష్టమైన అవగాహన, ఒప్పందం ఏర్పడిన తరువాత మాత్రమే ఎల్అండ్టీ నుంచి ప్రభుత్వానికి బదిలీ కానుంది. ఇందుకోసం ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో వివిధ అంశాలపైన సమావేశాలు నిర్వహించి ఒప్పందాలు చేసుకోవలసి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. – సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్ (Hyderabad) మహానగరంలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో నిర్మించి నిర్వహిస్తోన్న 69.2 కి.మీల మెట్రో మొదటిదశ ప్రాజెక్టు నుంచి ఎల్అండ్టీ వైదొలగనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఎల్అండ్టీ సంస్థకు ఏకమొత్తంగా రూ.2000 కోట్లు చెల్లించి ప్రభుత్వం ప్రాజెక్టును స్వాదీనం చేసుకోనుంది. అలాగే రూ.13000 కోట్ల రుణాలను కూడా ప్రభుత్వమే భరించనుంది. ఈ ఆర్థిక అంశాలపైన ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకోవడంతోపాటు నిర్వహణపరమైన అంశాలపైన కూడా ఎల్అండ్టీ నుంచి ప్రభుత్వానికి బదిలీ ఒప్పందాలు జరగాల్సివుంది. ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేసేందుకు ఏడాది కంటే ఎక్కువ కాలమే పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.కేంద్రం అనుమతి తప్పనిసరి పీపీపీ పద్ధతిలో చేపట్టిన మొదటి దశ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం కూడా ఒక భాగస్వామ్య సంస్థగానే ఉంది. ఈ ప్రాజెక్టు నుంచి ఎల్అండ్టీ వైదొలగాలన్నా, ఆర్థిక లావాదేవాలపైన ఎలాంటి ఒప్పందాలు ఏర్పాటు చేసుకోవాలనుకున్నాకేంద్ర ప్రభుత్వం కూడా తప్పనిసరిగా అనుమతించవలసి ఉంటుంది. ఎల్అండ్టీకి, ప్రభుత్వానికి మధ్య కుదిరే ప్రతి ఒప్పందం వివరాలను కేంద్రానికి అందజేయాలి. అలాగే బ్యాంకు రుణాలను (Bank Loan) రాష్ట్రం భరించనున్న దృష్ట్యా అందుకు కూడా కేంద్రం నుంచి అనుమతి లభించవలసి ఉంటుంది. రెండోదశ నిర్మాణానికి కేంద్రం అనుమతి ఎలా ముఖ్యమో, మొదటి దశ బదిలీకి కూడా అంతే ముఖ్యం అని అధికారులు తెలిపారు. కేంద్ర రాష్ట్రాలతో పాటు ఎల్అండ్టీ (L&T) సంయుక్త ప్రాజెక్టుగా 2011లో మెట్రో మొదటిదశ చేపట్టిన సంగతి తెలిసిందే. 2017 నవంబర్ నుంచి మొదటి దశ రైళ్లు అందుబాటులోకి వచ్చా యి. ప్రస్తుతం నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్ల మధ్య ప్రతి రోజు సుమారు 1000 ట్రిప్పులకు పైగా తిరుగుతున్నాయి. రోజుకు 4.8 లక్షల మందికి పైగా పయనిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో ఎల్అండ్టీ తన వాటాను రాష్ట్రానికి విక్రయించనున్న దృష్ట్యా నిర్వహణపరమైన సాంకేతిక అంశాలపై న కూడా ఒప్పందాలు తప్పనిసరి.కియోలిస్కు ఇంకా గడువు ఉంది ఫ్రాన్స్కు చెందిన కియోలిస్ (Keolis) సంస్థ హైదరాబాద్లో మెట్రో రైళ్లను నడుపుతోంది. సీబీటీసీ (కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ సిస్టమ్) సాంకేతిక పరిజ్ఞానంతో ఈ రైళ్లు నడుస్తున్నాయి. కియోలిస్ సంస్థ హైదరాబాద్తో పాటు దుబాయ్, లండన్, పూణే నగరాల్లో కూడా మెట్రోలను నడుపుతోంది. నగరంలో ఈ సంస్థతో 2026 నవంబర్ వరకు ఒప్పందం ఉంది. ఈ మేరకు ఈ ఒప్పందాన్ని ఎల్అండ్టీ నుంచి ప్రభుత్వానికి బదిలీ చేసుకొని పునరుద్ధరించవలసి ఉంది. ఒకవేళ కియోలిస్ను కాకుండా మరో సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవాలనుకున్నా 2026 నవంబర్ వరకు ఆగాల్సిందే. కానీ హైదరాబాద్తో మెట్రో రైళ్ల నిర్వహణలో కియోలిస్కు ఉన్న అనుభవం దృష్ట్యా ప్రభుత్వం మరో సంస్థను సంప్రదించకపోవచ్చునని అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు కియోలిస్తోనే ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవలసి ఉంటుంది.ఆస్తులు–అప్పలు తేలాల్సిందే.. మెట్రో రైళ్లను నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వం నగరంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 270 ఎకరాల భూములను ఎల్అండ్టీకి లీజుకు ఇచ్చింది. ఈ స్థలాల్లో మాల్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకొనేందుకు అనుమతినిచ్చారు. కానీ ఎల్అండ్టీకి ఇచ్చిన మొత్తం 18.5 లక్షల చదరపు అడుగుల్లో ఇప్పటి వరకు కేవలం 6.5 లక్షల చదరపు అడుగుల స్థలాలను మాత్రమే ఆ సంస్థ వినియోగించుకుంది. ఇందులో కొంత భూమిని సబ్లీజ్కు ఇచ్చారు. ప్రస్తుతం ఈ భూములన్నింటినీ ప్రభుత్వం తిరిగి తీసుకోవలసి ఉంది. ఇందుకోసం కొంతసమయం పట్టే అవకాశం ఉంది.చదవండి: ప్రైవేటు వెంచర్కు ప్రభుత్వ భూమిలో రోడ్డుఅలాగే సబ్లీజుకు సంబంధించిన అంశాల్లో కూడా స్పష్టత రావలసి ఉంది. మరోవైపు రూ.13000 కోట్ల బ్యాంకు రుణాలు ఎల్అండ్టీ నుంచి ప్రభుత్వానికి బదలాయించాలి. ఎస్బీఐ (SBI) నేతృత్వంలో 12 బ్యాంకులు ఈ రుణాలను అందజేశాయి. ప్రస్తుతం ఈ 12 బ్యాంకుల నుంచి రుణాలను ప్రభుత్వానికి బదిలీ అయ్యేందుకు కూడా కొంత గడువు అవసరం. ఇలా అనేక అంశాలతో ముడిపడి ఉన్న మెట్రో మొదటి దశ ప్రాజెక్టు యాజమాన్య బదిలీకి ఏడాది కంటే ఎక్కువ సమయమే పట్టవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. -
బ్రిటిషర్లను భయపెట్టిన...చెడీ తాలింఖానా
సాక్షి, అమలాపురం/అమలాపురం టౌన్: కోనసీమ అనగానే ప్రకృతి అందాలు, పర్యాటక కేంద్రాలకే కాదు.. సంస్కృతీ సంప్రదాయాలకు.. ఆధ్యాత్మికతకు పెట్టింది పేరు. సంక్రాంతి వస్తే పల్లె ముస్తాబవుతుంది. నింగిలోని ఇంద్ర ధనస్సులు ‘ప్రభ’లుగా మారి నేలన నడయాడతాయి. తీర్థాలతో ఈ ప్రాంతం హోరెత్తుతుంది. ఇక దసరా వస్తే చెడీ తాలింఖానా ప్రదర్శన.. అమ్మవార్ల వాహనాల ఊరేగింపులతో జనజాతరగా మారిపోతుంది. ఒకప్పుడు స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో నేర్చుకున్న ఈ చెడీ తాలింఖానా వీర విద్య రానురానూ ప్రజల సంప్రదాయ కళలలో ఒక భాగమైంది. శతాబ్దాల చరిత్ర అజ్ఞాతం ముగిసిన తరువాత జమ్మి చెట్టు మీద ఉన్న పాండవుల ఆయుధాలు చేతులకు వచ్చినట్టుగా ఇక్కడ దసరాకు ముందు దాచి ఉంచిన కత్తులు కొత్తగా పదునెక్కుతాయి. బరిసెలు బయటకు వస్తాయి. రాత్రి వేళల్లో అగ్గిబరాటాలు నిప్పులు కక్కుతాయి. లేడి కొమ్ములు, పొడవాటి కర్రలు కళాత్మకంగా తిరుగుతుంటాయి. ఆపై అమ్మవారి ఊరేగింపులతో కోనసీమలో దసరా కొత్త పుంతలు తొక్కుతుంది.దసరా ఉత్సవాలు కర్ణాటకలోని మైసూరు తరువాత కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో ఇంచుమించు రెండు శతాబ్దాల నుంచి జరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రాచీన యుద్ధాలను తలపించే చెడీ తాలింఖానా వీరత్వానికి మారుపేరుగా నిలుస్తోంది. శతాబ్దాల చరిత్ర ఉన్న తాలింఖానాకు నేటికీ ఆదరణ చెక్కు చెదరలేదు. కర్రలు, కత్తులు, లేడి కొమ్ములతో వారు చేసే ప్రదర్శన ప్రేక్షకులను గగుర్పాటుకు గురి చేస్తాయి. యువకుల నుంచి వృద్ధుల వరకూ వయోభేదం మరచి చేసే తాలింఖానా విన్యాసాలు వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయి. అన్ని వీధులు ఈ ప్రదర్శనలతో నిండిపోతాయి. ఇంచుమించు నెల రోజుల ముందు నుంచే ఈ ప్రదర్శనకు అవసరమైన శిక్షణ పొందుతారు. కొత్త తరం కూడా ఈ విద్యా ప్రదర్శనకు ఉత్సాహంగా ముందుకు రావడం విశేషం.మంత్రముగ్ధులను చేసేలా..దసరా ఉత్సవాలలో భాగంగా పురవీధుల్లో చెడీతాలింఖానా ప్రదర్శన జరుగుతుంది. ఈ ఏడాది అక్టోబరు 2వ తేదీ రాత్రి అంతా ఈ కార్యక్రమం జరుగనుంది. వీధుల్లో యువకులు, పెద్దలు ప్రాచీన యుద్ధవిన్యాసాలను తలపించేలా ప్రదర్శించే చెడీ తాలింఖానా విద్య ఉద్విగ్నభరితంగా సాగుతుంది. కళ్లకు గంతలు కట్టుకుని మనిషి మీద, కంఠం, నుదిటిపై, పొత్తి కడుపుల మీద కొబ్బరి కాయలు, కూరగాయలు పెట్టి నరకడం వంటి విన్యాసాలు తాలింఖానాలో ముఖ్య ఘట్టాలు. అగ్గిబరాటాలు, లేడికొమ్ములు, పట్టాకత్తులు వేగంగా.. చురుగ్గా కదుపుతూ యువకులు చేసే విన్యాసాలు రాచరిక యుద్ధ సన్నాహాలను తలపిస్తాయి. ఈ ప్రదర్శనలో ఏమాత్రం ఏమరు పాటు జరిగినా ప్రాణాలకు ప్రమాదం. అయినా కూడా అత్యంత ధైర్య సాహసాలతో శిక్షణ పొందిన ఆరేళ్ల చిన్నారుల నుంచి అరవై ఏళ్ల వృద్ధుల వరకు చేసే ప్రదర్శన మంత్రముగ్ధులను చేస్తుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగులైనా, ఎన్ఆర్ఐలైనా ఈ ప్రదర్శనలో పాల్గొనేందుకు రెక్కలు కట్టుకుని వాలిపోతుంటారు.అమలాపురంలో చెడీ తాలింఖానా విద్య ప్రదర్శన వెనుక స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి ఉందని స్థానికులు చెబుతుంటారు. బ్రిటిష్ సేనలతో పోరాడే భారతీయుల్లో ఐక్యత కోసం బాలగంగాధర్ తిలక్ దసరా, వినాయక చవితి ఉత్సవాలను ప్రోత్సహించారు. ఈ విద్య స్థానికంగా 1835 కొంకాపల్లిలో మొదలైంది. అయితే దసరా వేడుకలలో 1856లో మహిపాల వీధిలో రైతుబిడ్డ, స్వాతంత్య్ర సమరయోధుడు అబ్బిరెడ్డి రామదాసు ఈ విద్యకు అంకురార్పణ చేశారు. ఇది ఇక్కడ ప్రారంభమై 190 సంవత్సరాలు అవుతోంది. అప్పటి నుంచి ఈ ప్రదర్శన నిర్విఘ్నంగా సాగుతోంది. వీటితో పాటు గండువీధి మైనర్స్ పార్టీ, నల్లా వీధి, శ్రీరామపురం మైనర్స్ పార్టీ, రవణం మల్లయ్య వీధి తాలింఖానా ప్రదర్శనలకు దశాబ్దాల చరిత్ర ఉంది. చెడీ తాలింఖానా ప్రదర్శనతో పాటు పట్టణానికి చెందిన ఏడు వీధులలో కొలువు తీరిన వాహనాలను ఊరేగింపులో ప్రదర్శిస్తారు. బాజాభజంత్రీలు, డప్పు వాయిద్యాలు, శక్తి వేషధారణలు, కోయడ్యాన్సులు, బుట్టబొమ్మలు, మ్యూజికల్, తీన్మార్ బ్యాండ్లు, విద్యుత్ దీపాలంకరణలతో వాహనాలు ముందుకు సాగుతాయి.కొంకాపల్లి ఏనుగు అంబారీ వాహనం, ఆంజనేయస్వామి వాహనం, మహిపాలవీధి రాజహంస, గండువీధి శేషశయన, రవణం వీధి మహిషాసుర మర్దిని, రవణం మల్లయ్యవీధి గరుడ విష్ణు, నల్లా వీధి శ్రీవిజయ దుర్గమ్మవారు వాహనం, శ్రీరామపురం హంస, శ్రీకృష్ణుడు, వినాయక వాహనాలు పురవీధుల్లో ఊరేగింపుగా వెళతాయి. జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి, తెలంగాణా ప్రాంతం నుంచి కూడా ఈ ఉత్సవాలను తిలకించేందుకు అమలాపురానికి తరలివస్తారు. తరతరాలుగా నిర్వహిస్తున్నాం దశాబ్దాల కాలం నుంచి అమలాపురంలో ఈ ప్రదర్శన జరుగుతోంది. మా తాతలు మాకు వారసత్వంగా అందించారు. మేము మా వారసులకు ఈ విద్యను అందిస్తాం. ఈ ప్రాచీన విద్యను ప్రభుత్వాలు గుర్తించాల్సి ఉంది. – పనస బుజ్జి, నిర్వహకుడు, కొంకాపల్లి, అమలాపురం రోజుకు ఎనిమిది గంటల శిక్షణదసరాకు ముందు ఆయుధ పూజ చేసిన తరువాత సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు శిక్షణ ఇస్తాం. రోజుకు 150 నుంచి 250 మంది వరకు గురువుల వద్ద శిక్షణ పొందుతారు. ఎక్కువగా చిన్నారులు, యువత రావడం వల్ల భవిష్యత్లో కూడా ఈ ప్రదర్శన నిరి్వఘ్నంగా సాగుతుందనే ఆశ మాకుంది. – అబ్బిరెడ్డి మల్లేష్, నిర్వాహకుడు, మహిపాల వీధి, ఎన్ఆర్ఐ (అమెరికా) -
ఐసీయూలో భూమి!
భూమికి బాగా సుస్తీ చేసింది. అవనికి ఆధారంగా నిలుస్తున్న 9 పర్యావరణ వ్యవస్థల్లో ఏడింటి ఆరోగ్యం క్షీణించింది. శాస్త్రవేత్తల పరిభాషలో వీటిని ‘ప్లానెటరీ బౌండరీస్’ అంటారు. తాజాగా.. భూగ్రహంపై 70% భూభాగాన్ని ఆక్రమించటమే కాకుండా జీవావరణాన్ని కంటికి రెప్పలా కాపాడే సముద్రం కూడా అనారోగ్యం పాలైంది. సముద్ర జలాల ఆమ్లీకరణ హద్దుమీరి ప్రమాద ఘంటికలు మోగించటం ఇదే మొదటిసారి! అయినప్పటికీ, ఇంకా ఆశ మిగిలి ఉందని, ఇప్పటికైనా మానవాళి మేలుకోవాలని ‘ప్లానెటరీ హెల్త్ చెక్ 2025’ తాజా నివేదిక హెచ్చరిస్తోంది. – సాక్షి, సాగుబడిభూమి ఒక రోగి అయితే, అది ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పడి ఉండేదని పోట్స్డ్యామ్ ఇన్ స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్ (పీఐకే) వెలువరించిన ‘ప్లానెట్ హెల్త్ చెక్ 2025’ నివేదిక చెబుతోంది. జర్మనీ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ.. భూ ఆరోగ్య స్థితిగతులపై అధ్యయనంలో చురుగ్గా పనిచేస్తోంది. పరిశోధకులు గుర్తించిన తొమ్మిది పర్యావరణ సరిహద్దుల్లో మూడు ప్రమాదకర హద్దును దాటాయని 2009లో తొలుత గుర్తించారు. వీటి సంఖ్య 2023 నాటికి ఆరుకు, ప్రస్తుతం 9కి పెరిగింది. శాస్త్రవేత్తలు భూమి ఆరోగ్యాన్ని.. దాని ఉత్పాదకత, మానవులు వాడుకున్న తర్వాత మిగిలిన శక్తి అనే 2 సూచికలను ఉపయోగించి కొలుస్తారు.1 వాతావరణ మార్పువాతావరణంలో కార్బన్డయాక్సైడ్ (సీఓ2) 350 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్) స్థాయిలో ఉంటే మంచిది. కానీ ఇది 423కి పెరిగింది. 450కి చేరితే మరింత ప్రమాదకరం. ఈ కారణంగానే ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగి, విపత్తులు తీవ్రమవుతున్నాయి.2 జీవావరణ సమగ్రతలో మార్పుమనం చేసే పనులు జీవావరణ సమగ్రతపై ఒత్తిడి పెంచుతున్నాయి. ప్రకృతిలో ఉన్న శక్తిలో 10 శాతాన్ని మనుషులు వాడుకుంటే ప్రకృతి తిరిగి దాన్ని పూడ్చుకొని తెప్పరిల్లుతుంది. కానీ, మనం 30% వాడేసుకుంటున్నాం. వ్యవసాయం, పశువుల పెంపకం, నగరీకరణ, పరిశ్రమల కోసం భూమి సహజ స్థితిని విపరీతంగా మార్చటం వల్ల.. జీవవైవిధ్యం ప్రమాదకర స్థాయిలో అంతరిస్తోంది.3 భూ వ్యవస్థ మార్పుఅడవులు భూగోళంపై వాతావరణాన్ని స్థిరంగా ఉంచటంలో కీలకపాత్ర పోషిస్తాయి. అసాధారణంగా అడవులు నరికివేసి భూమిని చిన్నాభిన్నం చేస్తున్నాం. వ్యవసాయం, నగరీకరణ, పశుపోషణ కోసం తీవ్రస్థాయిలో భూ వినియోగ సహజ స్థితిని మార్చటం సమస్యగా మారింది. 2000–2018 మధ్యలో 90% అడవుల నరికివేత వ్యవసాయం (52%), పశుపోషణ (38%) కోసమే జరిగింది. ప్రపంచ భూభాగంలో అడవులు 75% ఉంటే మేలు. అయితే, ఇప్పుడు 59 శాతానికి తగ్గిపోయాయి. 4 మంచినీటి మార్పుపరిమితి దాటిని మంచి నీటి వినియోగం జల చక్రాన్ని దెబ్బతీస్తోంది. నదుల్లో పారే నీటిని 12.9% వాడుకుంటే పర్వాలేదు. కానీ, ఇప్పుడు 22.6% వాడుతున్నాం. భూగర్భ జలాలను 12.4% వాడుకుంటే పర్వాలేదు.మనం 22% వినియోగిస్తున్నాం.5 జీవ భౌతిక రసాయన మార్పులురసాయనిక ఎరువులను పంటలు ఉపయోగించుకునేది తక్కువ.. నీటిని, భూమిని కలుషితం చేసేదే ఎక్కువ. ఇవి చివరికి సముద్ర జలాల్లోకీ చేరి పర్యావరణ వ్యవస్థలను కూడా అస్తవ్యస్తం చేస్తున్నాయి. భాస్వరం ఎరువులను ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 62 లక్షల టన్నులు వాడితే పర్వాలేదు. కానీ, 11 కోట్ల టన్నులు వాడుతున్నాం. నత్రజని ఎరువును ఏటా 6.2 కోట్ల టన్నులు వాడితే పర్వాలేదు. కానీ, 8.2 కోట్ల టన్నులు వాడుతున్నాం. ఇతర ఆరు రకాల సరిహద్దులను కూడా ఈ ఎరువులు ప్రభావితం చేస్తున్నాయి. 6 సముద్రాల ఆమ్లీకరణవాతావరణంలోకి విడుదలయ్యే కార్బన్డయాక్సైడ్లో చాలా వరకు సముద్రాలే పీల్చుకుంటాయి. దీనివల్ల సముద్ర జలాల్లో ఆమ్లగుణం పెరిగిపోతుంది. ఇది ఒక స్థాయికి మించితే సముద్ర జీవ వ్యవస్థలకు ప్రమాదం. ఫలితంగా సీఓ2ను పీల్చుకునే శక్తి సముద్రాలకు తగ్గిపోతుంది. దీంతో భూగోళం మరింత వేడెక్కుతుంది. 7 వాయు కాలుష్యంగత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు చర్యలు తీసుకోవటం వల్ల ఈ కాలుష్యం తగ్గుముఖం పట్టింది. 9 సరిహద్దుల్లో సురక్షిత స్థాయిలో ఉన్న రెండింటిలో ఇదొకటి.8 ఓజోన్ పొరసౌర వ్యవస్థ నుంచి అతినీలలోహిత కిరణాలను భూమిపైకి రాకుండా వడకట్టేది ఆకాశంలోని ఓజోన్ పొర. గతంలో ఇది క్షీణించడంతో ప్రపంచ దేశాలు చర్యలు తీసుకున్నాయి. దీంతో ఓజోన్ పొర మందం ఇటీవల పెరుగుతోంది. తొమ్మిదింటిలో సురక్షిత స్థాయిలో ఉన్న రెండోది ఇదే.9 నావల్ ఎంటిటీస్మనుషులు తయారుచేసిన రసాయనాలు, ప్లాస్టిక్లు.. వీటి కిందికి వస్తాయి. సూక్ష్మ ప్లాస్టిక్ పదార్థాలు సముద్ర జంతువుల్లోకి, మన దేహాల్లోకి చేరి చేటు చేస్తున్నాయి. అయితే, వీటి ముప్పు ఎంత అనేది అంచనా వేయాల్సి ఉంది. -
శతాబ్దాల చరిత్ర.. పాన్గల్ ఖిల్లా
వనపర్తి: శతాబ్దాల చరిత్ర, ఎన్నో వీరగాథల ఘనతకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన పాన్గల్ ఖిల్లాలో వెలుగులోకి రాని ఎన్నో రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయి. సుమారు 11వ శతాబ్దానికి ముందే కల్యాణి చాళుక్యుల కాలంలో ఈ దుర్గం నిర్మించినట్లు ఖిల్లాపై ఉన్న శాసనాలతో చరిత్రకారులు వెల్లడిస్తున్నారు. వనపర్తి జిల్లాకేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలోని పాన్గల్ ఖిల్లా ప్రస్తుత నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో ఉంది. శత్రువుల దాడుల నుంచి కాపాడుకునేందుకు నాటి రాజులు సముద్రమట్టానికి సుమారు 1600 అడుగుల ఎత్తయిన గుట్టపై కోట నిర్మించారు. గుర్రపునాడా ఆకారంలో తూర్పున ప్రధాన ముఖద్వారంతో చుట్టూ శుత్రుదుర్భేద్యమైన రాతికట్టడం, బురుజులతో దుర్గం నిర్మించారు. ప్రస్తుతం చాలా వరకు శిథిలావస్థకు చేరినా.. ఏటా తొలి ఏకాదశినాడు ప్రజలు గుట్టపైకి చేరుకొని అక్కడి అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేస్తారు. శిల్పకళా సంపద.. పాన్గల్ ఖిల్లా శిఖరాగ్రానికి, కోట ప్రాంతానికి వెళ్లేందుకు తూర్పు దిక్కున ప్రస్తుతం ఉన్న బాలపీర్ల సమీపంలో దారి ఉంది. గుట్టపైకి ఎక్కుతున్న సమయంలో ఏడు ప్రధాన ముఖద్వారాలను దాటాల్సి ఉంటుంది. ప్రతి ముఖద్వారం భారీ ఆకారంలో రాతి కట్టడంతో దర్శనమిస్తుంది. కట్టడంపై సింహాలను వేటాడుతున్న శిల్పాలు, ఎత్తయిన జంతువుల శిల్పాలను చూడవచ్చు. శిథిలావస్థలో మసీదు, ఆలయ నిర్మాణాలు.. ఎంతో ఎత్తయిన పాన్గల్ ఖిల్లాపై పురాతన గణపతి, అమ్మవారి ఆలయాలతోపాటు మినార్లతో కనిపించే మసీదు నిర్మాణాలు శిథిలావస్థలో కనిపిస్తాయి. కల్యాణి చాళుక్యుల తర్వాత మసునూరి నాయకులు, బహుమనీ సుల్తానులు, కుతుబ్షాహీలు, బరాద్ షాహీలు, మొఘలులు, అసఫ్ జహీల్ ఈ దుర్గాన్ని యుద్ధంలో సొంతం చేసుకుని పాలన సాగించినట్లు చరిత్ర చెబుతోంది. 1600 అడుగుల ఎత్తులో.. సముద్రమట్టానికి సుమారు 1600 అడుగుల ఎత్తులోని పాన్గల్ గుట్టపై రామగుండం బావిలో ఏడాది పొడవునా నీరు ఉంటుంది. గత 30, 40 ఏళ్ల క్రితం ఏటా తొలి ఏకాదశినాడు గుట్టపైకి వెళ్లే భక్తులు ఈ గుండంలో ఈత కొడుతూ.. స్నానాలు ఆచరించేవారు. ఇది ప్రస్తుతం ఉపయోగంలో లేదు. దేవిగుట్ట అనే ప్రాంతంలో కొలువైన అమ్మవారి పురాతన శిలా విగ్రహానికి భక్తులు నేటికీ ఏటా ఒకసారి గుట్టపైకి వెళ్లి పూజలు చేస్తారు. చెక్కుచెదరని యుద్ధ ఫిరంగులు శతాబ్దాల నాటి యుద్ధ ఫిరంగులు పాన్గల్ ఖిల్లాపై ఇప్పటికీ చెక్కు చెదరకుండా, కనీసం తుప్పు కూడా పట్టకుండా ఉన్నాయి. ఖిల్లాలో ఎత్తయిన ప్రాంతంలో ఒకటి, తూర్పు ద్వారం వైపు మరో ఫిరంగి ఉన్నాయి. పాన్గల్ గుట్టపై ముక్తరామేశ్వర ఆలయం ఉన్నట్లు శాసనాలు ఉన్నాయి. కుతుబ్షాల కాలంలో నిర్మించిన బావిని ఇటీవల కాలం వరకు పాన్గల్ గ్రామంలో కుమ్మరి వీధి ప్రాంత ప్రజలు ఉపయోగించిట్లు స్థానికులు చెబుతారు. పులివేట వీరగల్లు ప్రతిమలు వీరగల్లులో పులివేట, పందివేట శిల్పాలు ప్రసిద్ధం. పులు లు, అడవి పందుల నుంచి ప్రజలను రక్షించడానికి గ్రామా ల్లోని వీరులు పోరాడి, అమరులైనప్పుడు.. ప్రజలు వీరుల జ్ఞాపకంగా వీరశిలలను పొలిమేరలలో ఏర్పాటు చేసేవారు. ఈ శిల్పాలను చూసినవారు ఆ ఊరివీరుల శౌర్యాన్ని గుర్తు చేసుకొని కీర్తించేవారు. కోటలో అనేక కట్టడాలు, ఫిరంగులతోపాటు ఎన్నో శిల్పాలు, వీరగల్లు విగ్రహాలున్నాయి. కోటలోకి వెళ్తుంటే ముళ్లగవిని అనే ప్రదేశం దగ్గర దాదాపు నాలుగు అడుగులున్న పులివేట వీరగల్లును కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకులు కనుగొన్నారు. కుడివైపు సిగ, తలపై పాగా, మెడలో కంటె, వీరకాసెతో కనిపిస్తున్న వీరుడు రెండు చేతుల బల్లెంతో పులిని చంపుతున్న దృశ్యం ఒక రాతిపలక మీద ఉల్బణ శిల్పంగా చెక్కి ఉంది. ఈ వీరగల్లును క్రీ.శ.13, 14వ శతాబ్దాల నాటి శైలిలో చెక్కారు. అరుదుగా కనిపించే, ప్రతిష్టించే ఈ పులివేట వీరగల్లు ప్రతిమ ఇదే మండలం బుసిరెడ్డిపల్లిలో కూడా ఉంది. ఇది అరుదైన వీరగల్లు అని.. ఇలాంటివి తెలంగాణలో నిజామాబాద్, భువనగిరి, ఖమ్మం, వరంగల్, నిర్మల్ జిల్లాల్లోనూ ఉన్నట్లు గుర్తించారు. ఈ శిల్పాలను భద్రపరచడమో.. లేదా ఏదేని మ్యూజియానికి చేర్చాలని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వినర్ రామోజు హరగోపాల్, సభ్యులు బైరోజు చంద్రశేఖర్, శ్యాంసుందర్, స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి చారిత్రక ప్రాధాన్యమున్న పాన్గల్ ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు, అధికారులు కృషి చేయాలి. కోటపై ఉన్న అనేక చారిత్రక కట్టడాలు ధ్వంసం అవుతున్నాయి. వనపర్తి జిల్లాకు తలమానికంగా నిలిచే కోటను భావితరాల వారికి తెలిసేందుకు పర్యాటక కేంద్రంగా మారిస్తే.. ఈ ప్రాంతం అభివృద్ది చెందుతుంది. – కుమ్మరి చంద్రయ్య, పాన్గల్ అభివృద్ధి చేస్తాం ఎంతో చారిత్రక ప్రాధాన్యమున్న పాన్గల్ ఖిల్లాను మంత్రి జూపల్లి సహకారంతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం. ఇప్పటికే ఖిల్లాకు సంబంధించిన నివేదికలను పంపించాం. పర్యాటక శాఖ అధికారులు ఖిల్లాను సందర్శించి వివరాలను సేకరించారు. మరోమారు ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లి చారిత్రక కట్టడాలు కనుమరుగవకుండా కాపాడుతూ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. – హైమావతి, మాజీ ఎంపీటీసీ, పాన్గల్ -
కారులో టచ్ స్క్రీన్.. కాకూడదు పరేషాన్!
బ్రాండ్, కారు పనితీరు, ఎక్స్టీరియర్, ఇంటీరియర్ డిజైన్ మాత్రమే కాదు.. కారు లోపల ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ కూడా కారు కొనుగోలు సమయంలో కీలక పాత్ర పోషిస్తోంది. కొత్త మోడళ్లు హైటెక్, ఫ్యూచరిస్టిక్ స్క్రీన్ తో వస్తున్నాయి. ఖుషీఖుషీగా కారులో ప్రయాణిస్తూ.. ఈ టచ్ స్క్రీన్ల వాడకంలో కొందరు బిజీ అయిపోతున్నారు. అదిగో, అదే మంచిది కాదు, అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఒక్క మనదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ‘టచ్స్క్రీన్’ చర్చనీయాంశంగా మారింది.ఫోన్ కాల్స్, ఏసీ, నావిగేషన్, సంగీతం, 360 డిగ్రీ వ్యూ.. ఇలా ఎన్నో ఫీచర్లను డ్రైవర్ ముందున్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ నియంత్రిస్తోంది. ఫ్యాక్టరీ ఫిట్టింగ్ లేనప్పటికీ కొందరు తమ కార్లలో వీడియోలు ప్లే అయ్యేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ వాడటం ప్రమాదకరం. అలాగే, కారులో కూడా టచ్ స్క్రీన్ వాడకం.. డ్రైవింగ్ మీద దృష్టిని మరల్చే పెద్ద సమస్యగా పరిణమిస్తోందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. సులభమేమీ కాదుసాధారణంగా డ్రైవర్లు.. దృష్టి మరల్చకుండానే స్టీరింగ్కు, డ్రైవింగ్ సీటుకు సమీపంలో ఉన్న బటన్లను సులభంగా ఉపయోగిస్తారు. ఇటీవలి కాలంలో ముఖ్యమైన బటన్లను కంపెనీలు స్టీరింగ్ వీల్పై అమర్చుతున్నాయి. కానీ, టచ్స్క్రీన్ ఉపయోగించడం అంత సులభం కాదు. ఒక నిర్దిష్ట సెట్టింగ్ను కనుక్కోవాలంటే ఒక విండో నుంచి మరొక విండోకు వెళ్లాల్సి ఉంటుంది. ఏ ఫీచర్ను వినియోగించాలన్నా సమయం తీసుకుంటుంది. ‘వీ బుల్గరీ’ అధ్యయనంలో..2022లో స్వీడిష్ మోటరింగ్ మ్యాగజైన్ ‘వీ బుల్గరీ’ ఓ అధ్యయనం చేపట్టింది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రేడియో స్టేషన్ మార్చడం, ఉష్ణోగ్రతను అడ్జస్ట్ చేయడం వంటి పనులకు డ్రైవర్లకు ఎంత సమయం పట్టిందో పరిశీలించారు. ఇందులో వినియోగించిన 12 కార్లలో 11 కార్లకు టచ్స్క్రీన్స్ ఉన్నాయి. బటన్లతో కూడిన ఒకే ఒక పాత కారు ఉపయోగించారు. పాత కారులో డ్రైవర్లు నిర్దేశించిన పనులను 10 సెకన్లలోపు చేయగలిగారు. కానీ ఆధునిక మోడళ్లలో అవే పనులకు సుమారు 45 సెకన్లు పట్టింది. డ్రైవర్ల దృష్టిని టచ్స్క్రీన్లు ఎంతలా మరల్చుతున్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మరో రెండు అధ్యయనాల్లో..ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్పై వేర్వేరు పనులు చేస్తున్నప్పుడు డ్రైవర్లు ఎంతసేపు పరధ్యానంగా ఉన్నారో తెలుసుకోవడానికి నార్వేకు చెందిన కాంట్రాక్ట్ పరిశోధన సంస్థ ‘సింటెఫ్’ 2024లో ఓ అధ్యయనం నిర్వహించింది. ఇందుకోసం కంటి చూపును పసిగట్టే ట్రాకింగ్ కెమెరాలను ఉపయోగించారు. రోడ్డు వైపు చూడకుండా ఉష్ణోగ్రతను మార్చడానికి డ్రైవర్లకు సగటున మూడున్నర సెకన్లు పట్టింది. రేడియో స్టేషన్ మార్చడానికి 11 సెకన్లు, నావిగేషన్ టూల్లో కొత్త చిరునామాను చేర్చడానికి 16 సెకన్ల సమయం తీసుకున్నారు. 2020లో బ్రిటిష్ సంస్థ ‘ట్రాన్స్పోర్ట్ రీసెర్చ్ ల్యాబొరేటరీ’ ప్రచురించిన ఒక విశ్లేషణ ప్రకారం.. పరిమితికి మించి ఆల్కహాల్ సేవించి నడిపే డ్రైవర్లలో డ్రైవింగ్ కంటే టచ్ స్క్రీన్లే రియాక్షన్ టైమ్ని ఎక్కువ ప్రభావితం చేస్తున్నాయి. దేనికైనా స్పందించే రేటు.. డ్రైవింగ్ వల్ల కంటే టచ్స్క్రీన్ ఆపరేట్ చేయడం వల్లే తక్కువగా ఉంటోందన్నమాట.స్విచ్ల ద్వారా..‘యూరో ఎన్ సీఏపీ’,, యూరప్లో కార్లకు భద్రతా రేటింగ్స్ ఇచ్చే సంస్థ. నిజానికి ఇది చట్టబద్ధమైన సంస్థ కాదుగానీ, ఇది ఇచ్చే రేటింగ్స్ని కార్ల కంపెనీల ప్రామాణికంగా భావిస్తాయి. వచ్చే జనవరి నుండి విక్రయించే కార్లకు ఈ సంస్థ కొత్త నియమాలు నిర్దేశించింది. దీని ప్రకారం విండ్స్క్రీన్ వైపర్ల వంటి ముఖ్యమైన ఫంక్షన్లు టచ్స్క్రీన్ల ద్వారా కాకుండా ఫిజికల్ స్విచ్ల ద్వారా నియంత్రించేలా ఏర్పాటు చేయకపోతే ఏ కారుకూ ఫైవ్ స్టార్ స్కోర్ ఇవ్వరు. మన దేశంలో కార్లను విక్రయించే కంపెనీలు స్టీరింగ్పై అనువుగా కొన్ని బటన్స్ను పొందుపరుస్తున్నాయి. ఎందుకంటే.. టచ్స్క్రీన్లతో పోలిస్తే ఫిజికల్ బటన్లు వాడటమే డ్రైవర్లకు సులభంగా ఉంటుంది. అయితే ఈ బటన్లు కూడా వాడటం కష్టమనుకునే వారికోసం చాలా వాహన తయారీ సంస్థలు వాయిస్ కంట్రోల్తో పనిచేసేలా ఫీచర్లను జోడిస్తున్నాయి. ఎంత గొప్ప కారు అయినా.. ముందు భద్రత ప్రధానం.. తరవాతే ఎన్ని హంగులైనా!ఇలా చేయండి..» డ్రైవ్ చేసే ముందు లేదా సురక్షితమైన స్థలంలో వాహనం ఆపి రేడియో, జీపీఎస్, ఏసీ వంటి సర్దుబాట్లు చేసుకోండి.» ఇన్ కమింగ్ కాల్స్, నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు దృష్టి మరలుతుంది. కాబట్టి మీ ఫోన్ ను వాహనం బ్లూటూత్కు అనుసంధానించవద్దు.» వాహనంలో ప్రత్యామ్నాయ బటన్లు ఉంటే వాటిని ఉపయోగించండి.» మీ పక్క సీటులో ఎవరైనా ఉంటే.. వారికి టచ్స్క్రీన్ బాధ్యతలు అప్పగించండి.– సాక్షి, స్పెషల్ డెస్క్ -
లేటు వయసులో.. పెళ్లి, పిల్లలా?
‘నాకు పిల్లలు కావాలని అనిపిస్తోంది. దత్తత తీసుకునే ఆలోచన లేదు. కచ్చితంగా ఒక బిడ్డ అయితే ఉంటుంది. అది ఎప్పుడైనా జరగొచ్చు. నాకు పిల్లలు పుడితే వారి ఆలనాపాలనా చూసుకునేందుకు నా కుటుంబం ఉంది’ అని 59 ఏళ్ల బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. సరే, పిల్లలు ఎప్పుడు పుట్టినా సల్మాన్కు వచ్చిన ఇబ్బందేమీ లేదు. కానీ, సామాన్యుల విషయంలో అలా కాదు. పిల్లలు తప్పనిసరిగా కావాలనుకున్నవాళ్లకి మాత్రం.. ఒక వయసు దాటాక పిల్లలు పుడితే వాళ్ల పెంపకం, భవిష్యత్తు పెద్ద సమస్యగా మారతాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్ ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని పెద్దలు అంటుంటారు. చదవాల్సిన వయసులో చదవకపోతే.. ఉద్యోగం రావాల్సిన వయసులో రాదు. ఉద్యోగం రానంతవరకు.. జరగాల్సిన వయసులో ఆ మూడు ముళ్ల తంతు కూడా కాదు. పెళ్లయిన వెంటనే పిల్లలు పుట్టేస్తారన్న గ్యారంటీ ఈ రోజుల్లో లేదు.ఒకప్పుడు అలా..: ఓ రెండు దశాబ్దాల కిందటి వరకూ.. అబ్బాయిలకు 25–26 ఏళ్లు వచ్చేటప్పటికి.. పెళ్లిళ్లు అయిపోయేవి. 30 ఏళ్లలోపు.. పిల్లలు పుట్టేసేవారు. పిల్లల కోసం, తమకోసం ఆర్థిక ప్రణాళికలు కూడా వేసుకునే అవకాశం ఉండేది. 50 ఏళ్లలోపే.. పుట్టిన పిల్లలకు ఉద్యోగాలు రావడం, పెళ్లిళ్లు కూడా అయిపోయేవి. అక్కడి నుంచి ఒక రకంగా ఫ్రీబర్డ్లా ఉండేవారు. రిటైర్మెంట్ కూడా సాఫీగా జరిగిపోయేది. కానీ, అదే పెళ్లి ఏ 30 ఏళ్లకో, 35 ఏళ్లకో జరిగితే ఏంటి పరిస్థితి? పిల్లలు పుడతారో పుట్టరో!సాధారణంగా మహిళల్లో 30 ఏళ్లు దాటాక.. పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గిపోతుంటాయి. ప్రస్తుత జీవనశైలి సమస్యలు, ఒత్తిడి, పర్యావరణ కాలుష్యం ఇవన్నీ.. అగ్నికి ఆజ్యం పోసినట్టు పిల్లలు పుట్టే అవకాశాలను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. అందువల్ల మూడు పదుల దాటాక మూడుముళ్లు వేస్తే.. వాళ్ల మధ్యలోకి ముచ్చటగా మూడోవ్యక్తి రావడం అంత సులభం కాదు. ఒకవేళ పుట్టినా.. తరవాత అనేక సమస్యలు సిద్ధంగా ఉంటాయి.పిల్లల పెంపకం30–35 ఏళ్ల తరవాత పిల్లలు పుడితే.. 45 దాటిన తరవాత నుంచీ వాళ్ల చదువు కోసం టెన్షన్ మొదలవుతుంది. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో బిజీగా ఉండేవాళ్లు పిల్లలను చూసుకోవడం కాస్త ఇబ్బందవుతుంది. ఇద్దరూ ఉద్యోగులైతే.. ఇక చెప్పనక్కర్లేదు. 25–30లలో ఉండే ఓపిక, సహనం.. 40లలో ఉండవు. ప్రతి చిన్న విషయానికీ చిర్రుబుర్రులాడుతుంటే ఆ చిన్నారుల మనసుల మీద ప్రభావం పడుతుంది.ఆలోచనల్లో అంతరాలులేటు వయసులో పుట్టే పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య ఆలోచనల్లో చాలా అంతరం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పిల్లల స్పీడును వీళ్లు అందుకోలేరు.శారీరక, మానసిక ఆరోగ్యం35 దాటాక.. అనేక శారీరక, మానసిక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఒకవైపు వీటితో సతమతమవుతూనే పిల్లల పెంపకమూ చూడటం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. సౌత్ ఈస్ట్ ఏషియన్ జర్నల్ ఆఫ్ హెల్త్ ప్రొఫెషనల్లో ఇటీవల ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం.. 35 ఏళ్ల వరకు పెళ్లికాని వాళ్లలో హైపర్టెన్షన్, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఉందట. సినిమాల్లో వ్యంగ్యంగా చెప్పినట్టు.. పెళ్లయ్యాక ఇవి రావడం కాదు, వీటితోనే పెళ్లి మండపం మీదకు అడుగుపెట్టాల్సి రావచ్చన్నమాట.వాళ్ల సెటిల్మెంట్.. మీ రిటైర్మెంట్పిల్లలు ఒక ఉద్యోగం లేదా వ్యాపారంలో స్థిర పడేసరికి తండ్రి వయసు 55 దాటిపోతుంది. దాదాపు రిటైర్మెంట్ దగ్గరకు వచ్చేస్తారు లేదా రిటైరయ్యాక వాళ్లు స్థిరపడవచ్చు. మీరు రిటైరైపోయిన తరవాత కూడా పిల్లలు సెటిల్ కాకపోతే అదో పెద్ద సమస్య. శారీరక, మానసిక ఆరోగ్యాలు సహకరించకపోయినా అయిష్టంగా, అవిశ్రాంతంగా పనిచేయాల్సి వస్తుంది. ఈ మధ్యలో ‘మీవాడు ఇంకా సెటిల్ కాలేదా?’ అంటూ బంధుమిత్రుల విచారణలు మరింత చికాకు తెప్పిస్తాయి.వైవాహిక జీవితంలోనూ..ఆలస్యంగా పెళ్లి చేసుకునే సందర్భంలో.. భార్యాభర్తల మధ్య వయసు అంతరం ఎక్కువ ఉంటే భాగస్వామి మనసును అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. వారి ఆశలు, ఆకాంక్షలు ఒకలా ఉంటాయి.. వీరి ఆలోచనలూ, నిర్ణయాలూ మరోలా ఉంటాయి. ఇది దీర్ఘకాలంలో ఇద్దరి మధ్యా అగాథాన్ని పెద్దది చేస్తుంది. కలసి ఉంటున్నా భాగస్వామిలో అశాంతి రాజ్యమేలుతుంటుంది. ఆర్థిక సమస్యలుపిల్లల భవిష్యత్తు, సొంతిల్లు కొనుగోలు.. ఇలాంటి ప్రణాళికలపైనా ప్రభావం పడుతుంది. ద్రవ్యోల్బణం పెరగడం వల్ల ఖర్చులు పెరిగిపోతుంటాయి. భవిష్యత్ ప్రణాళికల వ్యయమూ తడిసిమోపెడవుతుంది. ఆ సంపాదన కోసం అదనంగా కష్టపడాల్సి వస్తుంది.పెళ్లికాని ప్రసాదులు 39 శాతంజాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2019–2021) ప్రకారం.. మనదేశంలో 45–49 ఏళ్లున్న స్త్రీలలో ఒక శాతం.. పురుషుల్లో 3 శాతం పెళ్లికాకుండా ఉన్నారు.15–49 ఏళ్ల పురుషుల్లో పెళ్లయిన వారు 60 శాతం మందే. మహిళల విషయంలో ఇది 72 శాతం. మహిళల్లో పెళ్లికాని వారు 24 శాతం కాగా.. పురుషుల్లో ఇది 39 శాతం. -
అమెరికాకు వెళ్లాలా?
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక.. ‘డాలర్ డ్రీమ్స్’కి బ్రేకులు పడటం మొదలయ్యాయి. కొత్తగా పెట్టిన హెచ్–1బీ వీసా ‘లక్ష డాలర్ల’ నిబంధన.. పెద్ద స్పీడ్ బ్రేకర్ అంటున్నారు నిపుణులు. ఇప్పటికే అమెరికాకు వెళ్లే భారతీయుల సంఖ్య ఈ ఏడాది గణనీయంగా తగ్గింది. 2024 మొదటి 8 నెలలతో పోలిస్తే.. 2025లో ఆగస్టు వరకు అమెరికా వెళ్లిన వారి సంఖ్య 4.3 శాతం తగ్గింది. ప్రత్యేకించి ఆగస్టులో ఇది ఏకంగా 14.8 శాతం తగ్గింది. గతంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా ఈ సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉంది.అమెరికా అంతర్జాతీయ వాణిజ్య విభాగం (యూఎస్ ఐటీఏ) గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది మొదటి 8 నెలల్లో... విద్యార్థి వీసాపై అమెరికా వెళ్లిన భారతీయులు 1,77,435. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 26.1 శాతం తక్కువ. ఇక పర్యాటక వీసాల మీద వెళ్లినవారు 9.98 లక్షలు. గతేడాది మొదటి 8 నెలలతో పోలిస్తే ఇది 2.7 శాతం తక్కువ.ఏయే వీసా మీద ఎంతమంది?ప్రత్యేకించి విద్యార్థి వీసా మీద అమెరికా వెళ్లే వారి సంఖ్య.. 2024 ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో 44.5 శాతం తగ్గిపోయింది. పర్యాటక, విద్యార్థి వీసాలపై వెళ్లినవాళ్లు తగ్గడంతో మొత్తం సంఖ్యలోనూ భారీ తగ్గుదల నమోదయింది. యూకే తరవాత మనమేయూఎస్ ఐటీఏ గణాంకాల ప్రకారం.. గత రెండేళ్లలో ఆగస్టు నెలలో అమెరికాకు వచ్చిన విదేశీ విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే.. ఈ ఏడాది ఆగస్టులో వీరి సంఖ్య భారీగా తగ్గిపోయింది. 2025లో ఆగస్టు వరకు చూస్తే.. యూకే తరవాత అమెరికాను అత్యధికంగా సందర్శించింది భారతీయులే. ఈ ఏడాది మొదటి 8 నెలల్లోమొత్తం 14.87 లక్షల మంది అమెరికాకు వెళ్లారు. 2024 జనవరి – ఆగస్టుతో పోలిస్తే ఇది 4.3 శాతం తక్కువ.ఈ ఏడాది తగ్గుతుందా?భారత ప్రభుత్వ బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ గణాంకాల ప్రకారం.. అమెరికాకు వెళ్తున్న భారతీయుల సంఖ్య 2022 నుంచి భారీగా పెరుగుతోంది. కానీ, ఈ ఏడాది గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయి. అమెరికా ఆర్థిక సంవత్సరం అక్టోబరు 1న ప్రారంభమై సెప్టెంబరు 30న ముగుస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరం 11 నెలల్లో యూఎస్ వెళ్లిన మొత్తం భారతీయులు సుమారు 19.4 లక్షలు. గతేడాది సెప్టెంబర్లో 1.81 లక్షల మంది వెళ్లారు. ఈసారి సెప్టెంబరులో ఈ సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం సంఖ్య 21 లక్షలు దాటకపోవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. -
నాటి మెరుపులే తప్ప..కొత్త వెలుగులేవీ..?
సాక్షి, విశాఖపట్నం: ‘పర్యాటక రాజధానిగా’ విశాఖను మారుస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా టూరిజం రంగాన్ని గాలికొదిలేసింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తయి పర్యాటకులకు కొత్త అనుభూతిని పంచుతున్నాయే తప్ప, కూటమి వచ్చాక ఒక్క కొత్త టూరిజం ప్రాజెక్టు అయినా పట్టాలెక్కకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. కొత్త మెరుపులు లేకుండానే మరో పర్యాటక దినోత్సవం ముగిసిపోయిందని పర్యాటక ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీఐఎస్–2023 సదస్సులో రూ. 8,806 కోట్ల విలువైన 66 టూరిజం ప్రాజెక్టులకు సంబంధించిన ఎంవోయూలను ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. సింగపూర్, టర్కీ, ఫ్రాన్స్ వంటి దేశాలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించిన ఈ ప్రాజెక్టులు పడకేయడంతో విశాఖకు ప్రపంచ పర్యాటక పటంలో లభించాల్సిన స్థానం చేజారిపోయే ప్రమాదం ఉంది. మరోవైపు కూటమి నాయకులు ఉన్న భూములను కొల్లగొట్టేందుకు పీపీపీ పేరుతో స్కెచ్లు వేస్తున్నారే తప్ప, కొత్తగా అభివృద్ధి చేయడం లేదన్న విమర్శలున్నాయి. 2024 ఏప్రిల్లోనే గ్లాస్ బ్రిడ్జికి ఎల్వోఏ కైలాసగిరిపై నిర్మాణం పూర్తయిన గ్లాస్ బ్రిడ్జ్ ప్రాజెక్టు తమ ఘనతేనని కూటమి నేతలు ప్రచారం చేస్తుండగా, వాస్తవానికి ఈ ప్రతిపాదన 2022లో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే వచ్చిందే. 2024 జనవరిలో పీపీపీ పద్ధతిలో ఈ ప్రాజెక్టుకు ఎల్వోఏ ఇచ్చారని, ఇప్పుడు పనులు పూర్తవడంతో ఆ క్రెడిట్ కూటమి తన ఖాతాలో వేసుకుంటోంది. రూ. వేల కోట్ల భూములపై నేతల కన్ను మరోవైపు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే ఆలోచనలు చేయకుండా, ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని రూ. వేల కోట్ల విలువైన పర్యాటక భూములను తమ అనుచరులకు కట్టబెట్టేందుకు కూటమి నాయకులు వ్యూహరచన చేస్తున్నారు. యాత్రినివాస్ వంటి భవనాలను ఇప్పటికే పీపీపీ పేరుతో ప్రైవేట్కు అప్పగించింది. తమ నియోజకవర్గాల పరిధిలోని విలువైన పర్యాటక భూములను అనుచరులకు కట్టబెట్టడానికి కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారు. విశాఖ జిల్లాలో 176.15 ఎకరాలు, అనకాపల్లి జిల్లాలో 22.67 ఎకరాలు, అల్లూరి జిల్లాలో 43.10 ఎకరాలు చొప్పున మొత్తం 241.92 ఎకరాల్ని కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారు. త్వరలోనే కూటమి నేతల అనుచరులకు టూరిజం ప్రాజెక్టుల పేరుతో భూపందేరం జరగనుంది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచే మార్గా లను అన్వేషించకుండా.. ఉన్న భూములను కూటమి నాయకులకు ధారాదత్తం చేసేందుకు.. ప్రభుత్వ పెద్దలు ఎవరికి చెబితే.. వారికి భూ కేటాయింపులు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని సమాచారం. గత ప్రభుత్వ హయాంలో కుదిరిన రూ. వేల కోట్ల ఒప్పందాలను పక్కన పెట్టి, భూములను కూటమి నేతల అనుచరులకు ధారాదత్తం చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని సమాచారం. అవకాశాలున్నా.. ఆలోచన సున్నా.! మాటల్లోనే విశాఖను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని చెబుతున్నారే తప్ప.. వాస్తవ రూపం దాల్చేలా ఒక్క అడుగు కూడా కూటమి ప్రభుత్వం వెయ్యడం లేదు. గత ప్రభుత్వం హయాంలో ఒప్పందం ప్రకారం అన్నవరంలో ఒబెరాయ్, మై ఫెయిర్ హోటల్స్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ తరహా ఒప్పందం ఒక్కటి కూడా కూటమి ప్రభుత్వం చెయ్యలేదు. విశాఖ నగరంలో పర్యాటక వనరులు కోకొల్లలుగా ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా.. పీపీపీ పద్ధతిలో భూములు కట్టబెట్టేందుకు ప్రభుత్వం యత్నిస్తుందే తప్ప.. కొత్త ఆలోచనల్ని అమలు చెయ్యడంలో పూర్తిగా విఫలమయ్యింది. రూ. వేల కోట్ల భూములపై నేతల కన్ను మరోవైపు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే ఆలోచనలు చేయకుండా, ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని రూ. వేల కోట్ల విలువైన పర్యాటక భూములను తమ అనుచరులకు కట్టబెట్టేందుకు కూటమి నాయకులు వ్యూహరచన చేస్తున్నారు. యాత్రినివాస్ వంటి భవనాలను ఇప్పటికే పీపీపీ పేరుతో ప్రైవేట్కు అప్పగించింది. తమ నియోజకవర్గాల పరిధిలోని విలువైన పర్యాటక భూములను అనుచరులకు కట్టబెట్టడానికి కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారు. విశాఖ జిల్లాలో 176.15 ఎకరాలు, అనకాపల్లి జిల్లాలో 22.67 ఎకరాలు, అల్లూరి జిల్లాలో 43.10 ఎకరాలు చొప్పున మొత్తం 241.92 ఎకరాల్ని కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారు. త్వరలోనే కూటమి నేతల అనుచరులకు టూరిజం ప్రాజెక్టుల పేరుతో భూపందేరం జరగనుంది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచే మార్గా లను అన్వేషించకుండా.. ఉన్న భూములను కూటమి నాయకులకు ధారాదత్తం చేసేందుకు.. ప్రభుత్వ పెద్దలు ఎవరికి చెబితే.. వారికి భూ కేటాయింపులు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని సమాచారం. గత ప్రభుత్వ హయాంలో కుదిరిన రూ. వేల కోట్ల ఒప్పందాలను పక్కన పెట్టి, భూములను కూటమి నేతల అనుచరులకు ధారాదత్తం చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని సమాచారం. త్వరలో మరో హిప్హాప్ బస్సు ఉమ్మడి విశాఖలో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇప్పటికే బీచ్రోడ్డులో రూ.5 కోట్లతో రెండు హిప్హాప్ బస్సులు నడుపుతున్నాం. త్వరలోనే మరో హిప్హాప్ బస్సు పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నాం. రుషికొండ, జోడుగుళ్ల పాలెం, భీమిలి బ్యాక్ వాటర్లో వాటర్స్పోర్ట్స్, కయాకింగ్, స్కూబాడైవింగ్ మొదలైనవి అందుబాటులోకి రాబోతున్నాయి. విశాఖ, అరకు క్యారవాన్స్ తీసుకొస్తున్నాం. టూరిజం హోటల్స్కు టెండర్లు వేశాం. త్వరలోనే వైజాగ్లో 2 వేల రూమ్స్ అందుబాటులోకి వస్తున్నాయి. స్పోర్ట్స్ టూరిజం, ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం ప్రణాళికలు తయారు చేస్తున్నాం. – జీవీబీ జగదీష్, ఏపీటీడీసీ డీవీఎంప్రపంచ స్థాయి హోటల్స్తో పర్యాటకుల తాకిడి ఈ ఏడాది టూరిజం డేని పర్యాటకంలో స్థిరమైన, సమగ్రాభివృద్ధి అనే థీమ్తో నిర్వహిస్తున్నాం. పర్యాటక రంగంలో హాస్పిటాలిటీ ప్రధాన పాత్రపోషిస్తోంది. ప్రపంచస్థాయి హోటల్స్ రాబోతుండటంతో.. విశాఖకు సందర్శకుల తాకిడి రెట్టింపయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. విశాఖకు వచ్చే పర్యాటకుల సంఖ్య ప్రస్తుతం కోటికి పైగా ఉంది. ఇది రెట్టింపు చేసుకునే అవకాశాలు బోలెడు ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి. భవిష్యత్తులో విశాఖకు విమానాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ విమానాల సంఖ్య పెరిగితే మెడికల్ టూరిజం, స్పిరిచ్యువల్ టూరిజం అభివృద్ధి చెందనున్నాయి. – పవన్ కార్తీక్, ఏపీ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ -
గూగుల్కి అసలు అర్థమేంటో తెలుసా?
ఇవాళ గూగుల్ ఓపెన్ చేశారా?.. దాని ఫాంట్ వేరే రకంగా కనిస్తోందా?.. అదేదో అప్డేట్ అనుకుని కంగారుపడేరు. ఇవాళ గూగుల్ 27వ పుట్టినరోజు. అందుకే డూడుల్ అలా దానికి విషెష్ తెలిపిందంతే. అయితే గూగుల్ ప్రారంభమైంది సెప్టెంబర్ 4వ తేదీన. అలాంటప్పుడు ఇవాళ బర్త్డే జరుపడానికి ఓ ప్రత్యేక కారణం ఉందని మీకు తెలుసా?.. అసలు గూగుల్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా??..గూగుల్ను లారీ పేజ్(Larry Page), సెర్గీ బ్రిన్(Sergey Brin) ప్రారంభించారు. 1998లో సెప్టెంబర్ 4న అధికారిక కంపెనీ గుర్తింపు దక్కించుకుంది. అయితే.. 2003 నుంచి గూగుల్ బర్త్డే మారిపోయింది. 2003లో సెప్టెంబర్ 8న, 2004లో సెప్టెంబర్ 7న, 2005లో సెప్టెంబర్ 26 నిర్వహించుకుంది. అయితే 2006 నుంచి సెప్టెంబర్ 27ను క్రమం తప్పకుండా తన పుట్టినరోజుగా మార్చేసుకుంది. ఇందుకు కారణం లేకపోలేదు!.సెప్టెంబర్ 27, 2006లో గూగుల్ అరుదైన మైలురాయి దాటింది. అత్యధిక వెబ్పేజీలను ఇండెక్స్ చేసిన ఘనత గూగుల్ సొంతం చేసుకుంది. అంటే.. ఒక నిర్దిష్ట సమయంలో తన సెర్చ్ ఇంజిన్ ద్వారా అప్పటిదాకా ఎవరూ సాధించని ఫీట్ సాధించింది. అలా.. ఆ అరుదైన ఘనత సాధించిన సందర్భాన్ని బర్త్డేగా మార్చుకుంది. అప్పటి నుంచి మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగానే తన పుట్టినరోజున డూడుల్స్, ప్రమోషన్స్, తన ఉత్పత్తులపై డిస్కౌంట్లను ప్రకటిస్తుంటుంది. ఇంతకీ గూగుల్ అర్థమేంటంటే.. Google అనే పదానికి అర్థం ఏ డిక్షనరీలోనూ కనిపించదు. అసలు ఆ పదానికి ఓ అర్థమంటూ లేదు కూడా. వాస్తవానికి.. గూగుల్ వ్యవస్థాపకులు లారీ పేజ్ మరియు సెర్గీ బ్రిన్ 1997లో తాము రూపొందించిన ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్కు గూగోల్(Googol) అనే పేరు పెట్టాలనుకున్నారు. గూగోల్ అంటే.. 1 పక్కన 100 సున్నాలు ఉండే సంఖ్య. అపారమైన సమాచారాన్ని అందిస్తుంది అనే అర్థం వచ్చేలా ఆ పదం అనుకున్నారు. అయితే.. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో వీళ్లద్దరి సహచరి విద్యార్థి సీన్ అండర్సన్.. Googol.com అనే డొమెయిన్కు బదులు Google.com అని టైప్ చేశాడు. అయితే లారీ పేజ్ ఆ పేరు నచ్చి.. అప్పటికప్పుడు ఆ డొమెయిన్ను ఫిక్స్ చేశారు. అలా ఆ తప్పిదమే చివరికి ఇప్పుడు ప్రపంచమంతా వెతుక్కునే ప్రముఖ బ్రాండ్గా మారింది.ఇది తెలుసా?.. గూగుల్ ప్రధాన కార్యాలయం గూగుల్ఫ్లెక్స్(Googleplex) అమెరికా కాలిఫోర్నియా స్టేట్ మౌంటెన్ వ్యూలో ఉంది. ఈ హెడ్ ఆఫీస్లో స్టాన్(Stan) అనే డైనోసార్ బొమ్మ ఉంటుంది. గూగుల్ అనేది ఎంత పెద్ద సెర్చ్ ఇంజిన్ అయినా సరే.. డైనోసార్లా అంతం అయిపోకుండా, కొత్త ఆలోచనలో ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారట. అంతేకాదు.. 2010లో తమ ఆవరణలో ఉన్న గడ్డిని కత్తిరించేందుకు మెషీన్లు, పరికరాల సాయంతో కాకుండా అద్దెకు గొర్రెలను తెచ్చి ఇకోఫ్రెండ్లీ ఐడియాతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది కూడా. ఇంకో ఆసక్తికరమైన ముచ్చట ఏంటంటే.. గూగుల్కు నెట్ ఆగిపోతే వచ్చే డైనోసార్ గేమ్ తెలుసు కదా. 2014లో ఈ ఆఫ్లైన్ గేమ్(T-Rex Runner-Chrome Dino) ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. ఇంటర్నెట్ లేకపోతే మనం డైనోసార్ యుగంలో ఉన్నాం అనే ఫన్తో యూజర్ల దృష్టి మరలకుండా ఉండేందుకే ఈ గేమ్ను క్రియేట్ చేశారట!. -
విదేశీ గడ్డపై అడ్డంకులు
హెచ్–1బీ వీసా దరఖాస్తు రుసుమును భారీగా పెంచుతూ అమెరికా తీసుకున్న నిర్ణయం ముఖ్యంగా భారతీయులను షాక్కు గురి చేసింది. ఒక్క యూఎస్ మాత్రమే కాదు.. భారతీయులు సంప్రదాయకంగా ఉద్యోగాల కోసం తరలివెళ్లే అనేక పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి అవరోధాలు ఉన్నాయి. ఈ దేశాలు చరిత్రాత్మకంగా నిపుణుల కొరతను పూడ్చుకోవడానికి, ఆర్థిక వృద్ధిని నడిపించడానికి భారత్, చైనా వంటి దేశాలపై ఆధారపడి ఉన్నాయి. అయితే ఇటీవలి కాలంలో ఆయా పాశ్చాత్య దేశాల్లోని ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చింది. విదేశీ కార్మికుల కంటే సొంత పౌరులకు ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నైపుణ్యం కల విదేశీ కార్మికులను ప్రోత్సహించకుండా ఉండటానికి తమ వలస విధానాలకు అనుగుణంగా ఆయా దేశాలు మార్పులు చేసుకుంటున్నాయి. అదే సమయంలో అక్రమ, తక్కువ నైపుణ్యమున్న కార్మికులను నిలువరిస్తున్నాయి.మనవాళ్ల ఆదాయం ఎక్కువకొన్ని ప్రధాన దేశాల్లో నివసిస్తున్న భారతీయుల ఆదాయం స్థానికుల ఆదాయం కంటే అధికంగా ఉంటోంది. తమ దేశంలో ఉంటూ తమ కంటే ఎక్కువ ఆర్జించడం ఆయా దేశాల స్థానికులకు, ముఖ్యంగా యువతకు మింగుడు పడడం లేదన్నది నిపుణుల మాట. యూఎస్ సిటిజన్స్ తో పోలిస్తే.. అక్కడ ఉంటున్న భారతీయుల ఆదాయం రెండింతలకుపైగా ఉంది. ఆస్ట్రేలియా, జర్మనీల విషయంలో ఇది సుమారు 50 శాతం ఎక్కువ. భారతీయుల వల్ల తమ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయనే కోపం ఒకవైపు.. తమకంటే ఎక్కువ సంపాదిస్తున్నారన్న అసూయ మరోవైపు.. వెరసి ఆస్ట్రేలియా, యూకే వంటి అనేక దేశాల్లో స్థానిక యువత అక్కడున్న భారతీయులపై దాడులు చేస్తున్నారు. ‘గో బ్యాక్ టు ఇండియా’ అంటూ బహిరంగంగానే మనవాళ్లను హెచ్చరిస్తున్న సంఘటనలు సైతం పెరుగుతూనే ఉన్నాయి.వలసలు తగ్గించాలని..గడిచిన రెండు సంవత్సరాలలో వలసలను తగ్గించేందుకు పాశ్చాత్య దేశాలు అనేక నిర్ణయాలు తీసుకున్నాయి.యూఎస్: కొత్త హెచ్–1బీ వీసా దరఖాస్తుకు 1,00,000 డాలర్ల వన్–టైమ్ ఫీజు అమలులోకి తెచ్చింది.యూకే: వర్క్ పర్మిట్ కోసం కనీస వేతన పరిమితిని 38,700 పౌండ్స్ నుంచి 2025 జూలైలో 41,700 పౌండ్స్కు పెంచింది.స్వీడన్: వర్క్ పర్మిట్ కోసం కనీస జీతం పరిమితి 2023 అక్టోబర్ నుంచి రెండింతలకుపైగా అధికమై 29,680 క్రోనర్లకు (ఆ దేశ కరెన్సీ. ఒక క్రోనా సుమారు రూ.9.37) చేరింది.కెనడా: 2025లో విద్యార్థులు, కార్మికుల దరఖాస్తుల అనుమతిని 10–16% తగ్గించాలన్నది ప్రణాళిక.ఆస్ట్రేలియా: 2025 నాటికి నికర వలసలను సగానికి తగ్గించే ప్రయత్నంలో భాగంగా 2023–24లో విద్యార్థి వీసాల జారీని 34% తగ్గించారు. -
విలాస గృహాలు
ఇల్లే కదా స్వర్గసీమ. అందుకే ఇంటి కోసం ఎంతైనా ఖర్చు చేసేవారు పెరుగుతున్నారు మనదేశంలో. దీంతో లగ్జరీ రియల్ ఎస్టేట్ దూసుకెళుతోంది. ఇల్లు ఒక్కటే కొంటే సరిపోదు.. అందుకు తగ్గట్టుగా ప్రీమియం బ్రాండ్స్ నుంచి కిచెన్వేర్, బాత్ ఫిట్టింగ్స్, టైల్స్, ఫర్నీచర్, ఇంటీరియర్స్నూ కొనేస్తున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్ప్రాపర్టీ కన్సల్టింగ్ కంపెనీ ‘అనరాక్’ గణాంకాల ప్రకారం భారత్లో విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలు 2021 నుండి పెరుగుతున్నాయి. ఈ విభాగంలో 2021లో 22,054 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2024 వచ్చేసరికి విక్రయాలు అయిదురెట్లు దాటి 1,17,000 యూనిట్లకు చేరుకున్నాయి. మెట్రోల నుండి మాత్రమే కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచీ ఖరీదైన గృహాలకు డిమాండ్ పెరుగుతోంది. లగ్జరీ హౌసింగ్ పెరుగుదలతో ప్రీమియం ఫర్నీచర్కు కూడా డిమాండ్ అధికమైంది. సొంత ఇంటి కోసం రూ.3 కోట్లకుపైగా పెట్టుబడి పెట్టే కస్టమర్లు వారి జీవనశైలికి సరిపోయే ఫర్నీచర్ను కూడా కోరుకుంటున్నారు. కొత్త రికార్డులుఏటా విదేశీ టూర్లకు వెళ్లే సంపన్నులు.. కోవిడ్ సమయంలో మాత్రం దేశంలోనే ఉండిపోయారనీ, టూర్ల కోసం దాచుకున్న మొత్తంతో ఈ కుటుంబాలు ఖరీదైన కార్లు, ఇళ్లు కొనుగోలు చేశారనీ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ట్రెండ్ కొనసాగుతోందని, ఇందుకు ఈ ఇళ్ల అమ్మకాల తీరే నిదర్శనమని అంటున్నారు. 2021తో పోలిస్తే 2022లో ఈ విక్రయాలు దాదాపు రెండున్నర రెట్లు దూసుకెళ్లాయి. 2023 నుంచి ఏకంగా 1,00,000 యూనిట్ల మార్కును దాటిపోయాయి. ప్రస్తుత సంవత్సరం తొలి అర్ధ భాగంలో నమోదైన అమ్మకాలను బట్టి చూస్తుంటే ఈ ఏడాది సైతం మార్కెట్ జోరు కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. రీసేల్ వాల్యూ జంప్‘మ్యాజిక్బ్రిక్స్’ నివేదిక ప్రకారం లగ్జరీ గృహాల్లో వినియోగిస్తున్న ఇంటీరియర్ మార్కెట్ విలువ 12.33 బిలియన్ డాలర్లు. ఏటా 12 శాతం వార్షిక వృద్ధిరేటుతో ఈ విభాగం 2030 నాటికి రెండింతలై 24.52 బిలియన్ డాలర్లను తాకుతుందని అంచనా. అద్భుతంగా రూపొందించిన ఇంటీరియర్ కారణంగా ఇంటి రీసేల్ వాల్యూ 70 శాతం వరకు పెంచుతుంది. అలాగే అద్దె 45 శాతం వరకు అధికంగా పొందవచ్చని నివేదిక పేర్కొంది.ఫర్నిచర్పై మోజుఇటీవలి కాలంలో.. ఆదాయాలు పెరుగుతున్నాయి. మరోవైపు పట్టణీకరణ వేగంగా జరుగుతోంది. తమకు నచ్చిన ఇంటిని కొనుక్కోవాలని.. అందులోని ఇంటీరియర్ను తమకు నచ్చినట్టు మలుచుకోవాలన్న అభిరుచులు కూడా పెరుగుతున్నాయి. దీంతో సులభంగా వినియోగించగలిగే మల్టీ ఫంక్షనల్ ఫర్నీచర్ కోరుకుంటున్నారు. అంతేకాదు, ఖరీదైనా సరే, విదేశీ ఫర్నీచర్కు కూడా సై అంటున్నారు. భారత్లో ఇంటి యజమానులు ఇంటీరియర్స్ను వ్యూహాత్మక పెట్టుబడిగా చూస్తున్నారని ‘మ్యాజిక్బ్రిక్స్’ చెబుతోంది.101 బిలియన్ డాలర్లకు..దేశంలో గత ఏడాది 38 బిలియన్ డాలర్ల విలువైన లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. 2029 నాటికి ఇది 101 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. లగ్జరీ హౌసింగ్ మార్కెట్లో డిమాండ్ ప్రధానంగా 2, 3 బెడ్రూమ్, హాల్, కిచెన్ (బీహెచ్కే) విభాగంలో కేంద్రీకృతమై ఉంది. మొత్తం మార్కెట్లో వీటి వాటా ఏకంగా 95 శాతం. 750 నుంచి 2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే రూ.2–5 కోట్లు పలికే మిడ్ సైజ్ ఇళ్లకు కూడా మార్కెట్ డిమాండ్లో 49 శాతం వాటా ఉంది. రూ.1.5 కోట్లకుపైగానే..2025 మొదటి ఆరు నెలల్లో దేశంలోని 14 ప్రధాన నగరాల్లో నిర్వహించిన ‘అనరాక్ గృహ కొనుగోలుదారుల సెంటిమెంట్ సర్వే ప్రకారం’.. రూ.1.5 కోట్లకుపైగా విలువైన ఇంటిని కొనాలనుకుంటున్నవారు 22 శాతం. 2024 మొదటి 6 నెలల్లో ఇది 17 శాతమే. ముఖ్యంగా రూ.2.5 కోట్లకుపైగా బడ్జెట్ పెట్టేందుకు సిద్ధమైనవారు 10 శాతం. రూ.90 లక్షలు – రూ.1.5 కోట్ల విలువైన ఇల్లు కొనాలనుకున్నవారు ఏకంగా 36 శాతం ఉన్నారు.దేశ వ్యాప్తంగా 7 ప్రధాన నగరాల్లో.. దాదాపు 45 శాతం మంది 3 బెడ్రూమ్ హౌస్ల మీద ఆసక్తి చూపుతుంటే.. హైదరాబాద్లో ఇది 55 శాతం కావడం విశేషం. అహ్మదాబాద్ (60) తరవాత ఇదే అత్యధికం. -
అమ్మ స్ఫూర్తి..
‘మనలో శక్తి ఎంత ఉందో నడిచి వచ్చిన మన మార్గమే చూపుతుంది’ అంటారు డాక్టర్ సాయిలత. కర్ణాటకలోని హోస్పేట్లో డాక్టర్గా పని చేస్తున్న సాయిలత కర్నూలు వాసి. ఒంటరిగా తల్లి పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకుంటూ, ఆర్థిక స్థోమత లేక పోయినా పెద్ద కలను నెరవేర్చుకునే ప్రయత్నంలో పట్టుదలతో కృషి చేసి డాక్టర్గా ఎదిగారు. సేవామార్గాన్నీ వదలకుండా అమ్మాయిల ఆరోగ్య జీవన విధానానికి, విద్యార్థులకు చెప్పాల్సిన విషయాల్లో బోధకురాలిగా తన జీవన ప్రయాణాన్ని మెరుగ్గా మలుచుకున్నారు. ఆ వివరాలు సాయిలత మాటల్లోనే...‘‘ఈ రోజు గైనకాలజిస్ట్గా సేవలందించే స్థాయికి రావడం అంత సులువుగా కాలేదు. నేను పుట్టి పెరిగింది కర్నూలులో. సింగిల్ మదర్గా మా అమ్మ నన్నూ చెల్లెలిని పోషించడానికి చాలా కష్టపడేది. రిసెప్షనిస్ట్గా, గోడౌన్ ఇన్చార్జిగా.... చిన్న చిన్న ప్రైవేట్ జాబులు చేస్తూ ఉండేది. అమ్మ కష్టం చూస్తుంటే చాలా బాధ అనిపించేది. కానీ, నాకేమో డాక్టర్ అవాలని కల. అమ్మ నా ఆలోచనను నిరుత్సాహపరచలేదు. ‘అభయం’తో...టెన్త్లో మంచి మార్కులు వచ్చాయి. మేం పెద్దవుతుంటే ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. కాలేజీ ఫీజులు కట్టే స్థోమత లేదు. ఇప్పుడెలా... అనుకుంటున్నప్పుడు హైదరాబాద్లో ఉన్న ‘అభయ’ స్వచ్ఛంద సంస్థ గురించి తెలిసింది. వాళ్లను కలిస్తే, ఫీజులకు సాయం చేశారు. ఆ తర్వాత ఎమ్సెట్ రాస్తే వచ్చిన ర్యాంకుకు రిజర్వేషన్లు లేక పోవడం వల్ల సీటు రాలేదు. దాంతో లాంగ్టర్మ్ కోచింగ్కి సాయం కోసం వెతుకుతుండగా ఈ విషయం తెలిసి, అభయ ఫౌండేషన్ వాళ్లే పిలిపించి మరీ లాంగ్ టర్మ్ కోచింగ్కు సాయం చేశారు. ఆ యేడాది మంచి ర్యాంకు తెచ్చుకున్నాను. అనంతపూర్ మెడికల్ కాలేజీలో ఫ్రీ సీటు వచ్చింది. ఎంబీబీఎస్ పూర్తి చేశాను. ఆ తర్వాత పీజీ కోర్సుకు ఏడాది కోచింగ్ తీసుకున్నాను. ఆలిండియా నీట్లో ర్యాంకు వచ్చింది. మహారాష్ట్ర అకోలా మెడికల్ కాలేజీలో పీజీ పూర్తి చేశాను. స్కాలర్షిప్స్ వచ్చాయి. సంస్థ నుంచి సాయం అందింది. నా క్లాస్మేట్, పీడియాట్రిషియన్ డాక్టర్ తిరుమలేశ్తో నా పెళ్లి జరిగింది. మా అత్తగారిది కర్ణాటకలోని హోస్పేట్. దాంతో మేమిద్దరం కలిసి, అక్కడే క్లినిక్ నడుపుతున్నాం. పండక్కి హైదరాబాద్లో ఉంటున్న అమ్మ లక్ష్మి, చెల్లెలు ధరణిల వద్దకు వచ్చాను. మాకోసం ఎంతో కష్టపడిన అమ్మకు విశ్రాంతి కల్పించాను.సేవా మార్గం...ఉంటున్న చోటనే డాక్టర్గా వృత్తిని కొనసాగిస్తూ, గర్ల్ సేఫ్టీ గురించి అవగాహనా తరగతులు తీసుకుంటున్నాను. నెలసరి సమయంలో ఎలా ఉండాలి, రక్తహీనత, థైరాయిడ్, అధికబరువు, గర్భధారణ.. ఇలా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు మహిళల్లో ఉండే ఆరోగ్య సమస్యలు, వాటి పైన సెషన్స్ చెబుతూనే ఆన్లైన్ ద్వారా స్టూడెంట్స్కు ఆరోగ్యం, పరిశుభ్రత, ఆహారం మొదలైన విషయాలపైనా గైడెన్స్ ఇస్తుంటాను. ప్రైమరీ, ప్రాథమిక పాఠశాలలకు వెళ్లి, అమ్మాయిలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి వివరిస్తుంటాను. ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలి, అమ్మాయిల రక్షణకు సంబంధించిన విషయాలు నృత్య, నాటకాల ద్వారా చెబుతుంటాను ‘అభయ’ వల్ల నా జీవితానికి మార్గం ఏర్పడింది. అందుకు నా వంతుగా తిరిగి ఆ సంస్థకు ఉన్న 30 సెంటర్లలోని టీచర్లకు గైడెన్స్ ఇస్తుంటాను. హెల్త్ క్యాంపుల్లో ఉచిత సేవలు అందిస్తుంటాను.నాలుగు గోడల మధ్య ఏమీ తెలియని ప్రపంచం నుంచి బయల్దేరిన నాకు ఈ రోజు కొన్ని వందలమందికి అవగాహన కలిగించే స్థాయి లభించింది. ఈ ప్రయాణంలో అమ్మ కష్టం, అభయ అందించిన సాయం నన్ను నిలబెట్టాయి. అవకాశాలు వచ్చినప్పుడు అందిపుచ్చుకోవడంతో పాటు, వాటిని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలన్నది నా జీవన ప్రయాణం నేర్పిన పాఠం. శక్తి మనలో ఉందని గుర్తిస్తే ఎదగడానికి మద్దతు కూడా లభిస్తుంది. ప్రయాణంలో మనకు శక్తిగా నిలిచినవారికి తిరిగి మన శక్తిని అందించినప్పడు ఆ ఆనందం గొప్పగా ఉంటుంది’’ అని వివరించారు ఈ డాక్టర్. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఆమె దాండియాకి ఇండియా నర్తిస్తుంది
దసరా నవరాత్రులు వస్తే దేశం తలిచే పేరు ఫాల్గుణి పాఠక్. ‘దాండియా క్వీన్ ఆఫ్ ఇండియా’గా పేరు గడించిన ఈ 56 సంవత్సరాల గాయని తన పాటలతో, నృత్యాలతో పండగ శోభను తీసుకువస్తుంది. 25 రూ పాయల పారితోషికంతో జీవితాన్ని ప్రారంభించి నేడు కోట్ల రూ పాయలను డిమాండ్ చేయగల స్థితికి చేరిన ఫాల్గుణి స్ఫూర్తి పై పండుగ కథనం.దేశంలో దసరా నవరాత్రులు జరుపుకుంటారు. కాని అమెరికాలో, దుబాయ్లో, గుజరాతీలు ఉండే అనేక దేశాల్లో వీలును బట్టి ప్రీ దసరా, పోస్ట్ దసరా వేడుకలు కూడా జరుపుకుంటారు. ఫాల్గుణి పాఠక్ వీలును బట్టి ఇవి ప్లాన్ అవుతాయి. ఆమె దసరా నవరాత్రుల్లో ఇండియాలో ఉంటే దసరా అయ్యాక కొన్ని దేశాల్లో దాండియా డాన్స్షోలు నిర్వహిస్తారు. లేదా దసరాకు ముందే కొన్ని దేశాల్లో డాన్స్ షోలు నిర్వహిస్తారు. ఆమె దసరాకు ముందు వచ్చినా, తర్వాత వచ్చినా కూడా ప్రేక్షకులకు ఇష్టమే. ఆమె పాటకు పాదం కలపడం కోసం అలా లక్షలాది మంది ఎదురు చూస్తూ ఉంటారు. అంతటి డిమాంట్ ఉన్న గాయని ఫాల్గుణి పాఠక్ మాత్రమే.తండ్రిని ఎదిరించి...ఫాల్గుణి పాఠక్ది తన రెక్కలు తాను సాచగల ధైర్యం. నలుగురు కూతుళ్ల తర్వాత ఐదవ కూతురుగా ముంబైలోని ఒక గుజరాతి కుటుంబంలో జన్మించింది ఫాల్గుణి. నలుగురు కూతుళ్ల తర్వాత ఐదవ సంతానమైనా అబ్బాయి పుడతాడని భావిస్తే ఫాల్గుణి పుట్టింది. అందుకే తల్లి, నలుగురు అక్కలు ఆమెకు ΄్యాంటు, షర్టు తొడిగి అబ్బాయిలా భావించి ముచ్చటపడేవారు. రాను రాను ఆ బట్టలే ఆమెకు కంఫర్ట్గా మారాయి. వయసు వచ్చే సమయంలో తల్లి హితవు చెప్పి, అమ్మాయిలా ఉండమని చెప్పినా ఫాల్గుణి మారలేదు. ఆ ఆహార్యం ఒక తిరుగుబాటైతే పాట కోసం తండ్రిని ఎదిరించడం మరో తిరుగుబాటు. తల్లి దగ్గరా, రేడియో వింటూ పాట నేర్చుకున్న ఫాల్గుణి పాఠక్ స్కూల్లో పాడుతూ ఎనిమిదో తరగతిలో ఉండగా మ్యూజిక్ టీచర్తో కలిసి ముంబైలోని వాయుసేన వేడుకలో పాడింది. ఆమె పాడిన పాట ‘ఖుర్బానీ’ సినిమాలోని ‘లైలా ఓ లైలా’. అది అందరినీ అలరించిందిగానీ ఇంటికి వచ్చాక తండ్రి చావబాదాడు.. పాటలేంటి అని. కాని అప్పటికే పాటలో ఉండే మజా ఆమె తలకు ఎక్కింది. ఆ తర్వాత తరచూ ప్రదర్శనలు ఇవ్వడం ఇంటికి వచ్చి తండ్రి చేత దెబ్బలు తినడం... చివరకు విసిగి తండ్రి వదిలేశాడుగాని ఫాల్గుణి మాత్రం పాట మానలేదు.త–థయ్యా బ్యాండ్తన ప్రదర్శనలతో పాపులర్ అయ్యాక సొంత బ్యాండ్ స్థాపించింది ఫాల్గుణి. దాని పేరు ‘త–థయ్యా’. ఆ బ్యాండ్తో దేశంలోని అన్నిచోట్లా నవరాత్రి షోస్ మొదలెట్టింది. నవరాత్రి ఉత్సవాల్లో దాండియా, గర్భా డాన్స్ చేసే ఆనవాయితీ ఉత్తరాదిలో ఉంది. ఫాల్గుణికి ముందు ప్రదర్శనలిచ్చేవారు కేవలం ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ను మాత్రమే వినిపిస్తూ డాన్స్ చేసేవారు. ఫాల్గుణి తనే దాండియా, గర్భా నృత్యాలకు వీలైన పాటలు పాడుతూ ప్రదర్శనకు హుషారు తేసాగింది. దాండియా సమయంలో ఎలాంటి పాటలు పాడాలో, జనంలో ఎలా జోష్ నింపాలో ఆమెకు తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు. అందుకే ఆమె షోస్ అంటే జనం విరగబడేవారు. 2010లో మొదటిసారి నవరాత్రి సమయాల్లో ఆమె గుజరాత్ టూర్ చేసినప్పుడు ప్రతిరోజూ 60 వేల మంది గుజరాత్ నలుమూలల నుంచి ఆమె షోస్కు హాజరయ్యేవారు.ప్రయివేట్ ఆల్బమ్స్స్టేజ్ షోలతో పాపులర్ అయిన ఫాల్గుణి తొలిసారి 1998లో తెచ్చి ‘యాద్ పియాకీ ఆనె లగీ’... పేరుతో విడుదల చేసిన ప్రయివేట్ ఆల్బమ్ సంచలనం సృష్టించింది. ఊరు, వాడ ‘యాద్ పియాకీ ఆనె లగీ’ పాట మార్మోగి పోయింది. యువతరం హాట్ ఫేవరెట్గా మారింది. 1999లో విడుదల చేసిన ‘మైనె పాయల్ హై ఛన్కాయ్’... కూడా పెద్ద హిట్. ఈ అల్బమ్స్లో పాటలు కూడా ఆమె తన నవరాత్రుల షోస్లో పాడటం వల్ల ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.రోజుకు 70 లక్షలు2013 సమయానికి ఫాల్గుణి పాఠక్ నవరాత్రి డిమాండ్ ఎంత పెరిగిందంటే రోజుకు 70 లక్షలు ఆఫర్ చేసే వరకూ వెళ్లింది. నవరాత్రుల మొత్తానికి 2కోట్ల ఆఫర్ కూడా ఇవ్వసాగారు. ఆశ్చర్యం ఏమిటంటే నవరాత్రుల్లో అందరూ సంప్రదాయ దుస్తులు ధరించి దాండియా, గర్భా నృత్యాలు చేస్తారు. కాని ఫాల్గుణి ఆ దుస్తులు ఏవీ ధరించదు. ΄్యాంట్ షర్ట్ మీదే ప్రదర్శనలు ఇస్తుంది. ‘ఒకసారి ఘాగ్రా చోళీ వేసుకొని షో చేశాను. జనం కింద నుంచి ఇలా వద్దు నీలాగే బాగుంటావు అని కేకలు వేశారు. ఇక మానేశాను’ అంటుందామె.వెలుగులు చిమ్మాలిఫాల్గుణి ప్రదర్శన అంటే స్టేజ్ మాత్రమే కాదు గ్రౌండ్ అంతా వెలుగులు చిమ్మాలి. గ్రౌండ్లోని ఆఖరు వ్యక్తి కూడా వెలుతురులో పరవశించి ఆడాలని భావిస్తుంది ఫాల్గుణి. ప్రతి నవరాత్రి ప్రదర్శన సమయంలో నిష్ఠను పాటించి పాడుతుందామె. ‘నేను ఇందుకోసమే పుట్టాను. నాకు ఇది మాత్రమే వచ్చు’ అంటుంది. ఆమెకు విమాన ప్రయాణం అంటే చాలా భయం. ‘విమానం ఎక్కినప్పటి నుంచి హనుమాన్ చాలీసా చదువుతూ కూచుంటాను. అస్సలు నిద్ర పోను’ అంటుందామె. హనుమాన్ చాలీసా ఇచ్చే ధైర్యంతో ప్రపంచంలోని అన్ని మూలలకు ఆమె ఎగురుతూ భారతీయ గాన, నృత్యాలకు ప్రచారం కల్పిస్తోంది. తండ్రితోనేఏ తండ్రైతే ఆమెను పాడవద్దన్నాడో ఆ తండ్రికి తనే ఆధారమైంది ఫాల్గుణి. ఆమెకు 15 ఏళ్ల వయసులోనే తల్లి హార్ట్ ఎటాక్తో మరణించడంతో కుటుంబ భారం తనే మోసి ఇద్దరు అక్కల పెళ్లిళ్లు తనే చేసింది. తండ్రిని చూసుకుంది. వివాహం చేసుకోవడానికి ఇష్టపడని ఫాల్గుణి ‘నేను నాలాగే హాయిగా ఉన్నాను’ అంటుంది. గత 25 ఏళ్లుగా 30 మంది సభ్యుల బృందం స్థిరంగా ఆమె వెంట ఉంది. ప్రతి ప్రదర్శనలో వీరు ఉంటారు. వీరే నా కుటుంబం అంటుందామె. -
హైడ్రా అద్భుతం.. 6 చెరువులకు విముక్తి!
ఆక్రమణలు, పూడికలతో కుంచించుకుపోయిన చెరువులకు పునరై్వభవం వస్తోంది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) అధికారులు వాటిని రక్షించి పునరుజ్జీవం పోస్తున్నారు. దీంతో చెరువుల విస్తీర్ణం పెరిగింది. చెర వీడిన చెరువులు కళకళలాడుతున్నాయి. తొలిదశలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆరింటిని కబ్జాల బారి నుంచి రక్షించి అభివృద్ధి చేస్తున్నారు. జనావాసాలను మినహాయిస్తూ వీటిలోని మిగతా ఆక్రమణలు తొలగించగా విస్తీర్ణం ఏకంగా 75 ఎకరాల మేర పెరిగింది. ఇదే పంథాలో నగరంలో ఉన్న అన్ని చెరువులకు విముక్తి కల్పిస్తే వందల ఎకరాల జలవనరులుగా విస్తరిస్తాయని హైడ్రా అధికారులు చెప్తున్నారు. పునరుజ్జీవంతో అభివృద్ధి చేసిన బతుకమ్మకుంటను ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి (Revanth Reddy) శుక్రవారం ప్రారంభించనున్నారు. – సాక్షి, సిటీబ్యూరోహైడ్రా (Hydraa) ఏర్పాటైన తర్వాత మాదాపూర్లోని తమ్మిడికుంటతోనే జలవనరుల పరిరక్షణ ప్రారంభమైంది. చుట్టూ ఉన్న అనేక నిర్మాణాలను కూల్చేసిన అధికారులు దాని పరిధిని పూర్వస్థితికి తేవడంపై దృష్టి పెట్టారు. ఇలా ఇప్పటి వరకు హైడ్రా అధికారులు వివిధ చెరువుల ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) పరిధిలో ఉన్న దాదాపు 233 ఎకరాల్లోని ఆక్రమణల్ని తొలగించారు. తొలినాళ్లల్లో కేవలం కూల్చివేతలపైనే దృష్టి పెట్టిన అధికారులు ‘హైడ్రా 2.0’విధానాలతో చెరువులకు పునరుజ్జీవం కల్పించాలని నిర్ణయించుకున్నారు. ఫైనల్ నోటిఫికేషన్ పూర్తి అయిన 130 చెరువుల్లోని ఆక్రమణల కూల్చివేతలతో సరిపెట్టకుండా వాటిని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. పూర్తి పర్యావరణ హితంగా అభివృద్ధి...ఈ చెరువుల్ని అభివృద్ధి చేసే విషయంలో హైడ్రా ఆద్యంతం పర్యావరణహిత విధానం అమలు చేయాలని విమోస్ సంస్థకు స్పష్టం చేసింది. దీంతో ఆ సంస్థ తొలుత ఆ చెరువుల నుంచి గరిష్టంగా మూడు మీటర్ల మేర పూడిక తొలగిస్తోంది. ఇందులో ప్లాస్టిక్ సహా అనేక వ్యర్థాలు ఉన్నాయి. చెరువు అడుగుభాగం అలుగు వైపునకు ఏటవాలుగా ఉండేలా చేస్తున్నారు. చెరువు చుట్టూ ఫుట్పాత్తోపాటు పార్కులు అభివృద్ధి చేస్తున్నారు. చెరువులోకి మురుగునీరు ప్రవేశించకుండా నీటి వనరును మూడు భాగాలుగా విభజిస్తున్నారు. వరదతో కలిసి మురుగు తొలుత మొదటి భాగంలోకి చేరుతుంది. అక్కడ ఆ నీటిని వడగట్టే గడ్డి, మొక్కలు ఉంటాయి. ఇలా రెండు చోట్ల వడపోత తర్వాత మూడో కుంటలోకి చేరుతుంది. ప్రతి చెరువుకు ప్రత్యేక ఇన్లెట్, ఔట్లెట్ ఏర్పాటు చేస్తున్నారు.తొలిదశలోఆరు చెరువుల ఎంపిక... హైడ్రా తొలిదశలో ఆరు చెరువుల్ని ఎంపిక చేసుకుంది. తమ్మిడికుంటతోపాటు అంబర్పేటలోని బతుకమ్మకుంట, (Bathukamma Kunta) సున్నం చెరువు, ఉప్పల్ నల్లచెరువు, కూకట్పల్లి నల్లచెరువు, బమ్రుఖ్ నుద్దౌలా చెరువులపై దృష్టి పెట్టింది. వీటి అభివృద్ధికి ప్రభుత్వం రూ.58.4 కోట్లు మంజూరు చేసింది. దీంతో ఒక్కో చెరువు కోసం దాదాపు రూ.10 కోట్ల చొప్పున వెచ్చిస్తున్న హైడ్రా బెంగళూరు నమూనాతో ముందుకు వెళ్తోంది. ఈ చెరువుల్లో పునరుజ్జీవం కల్పించే బాధ్యతల్ని ఆ నగరానికే చెందిన విమోస్ టెక్నాలజీస్ సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ అక్కడ దాదాపు 130 చెరువులను అభివృద్ధి చేసింది. అక్కడ పర్యటించి వచ్చిన హైడ్రా అధికారులు వాటి పనితీరుపై పూర్తి సంతృప్తి చెందారు.ఎన్నారెస్సీ డేటా సాయంతో నిర్ధారణలు... హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్ఆర్) వరకు విస్తరించి ఉంది. జీహెచ్ఎంసీ విస్తరించి ఉన్న 650 చదరపు కిలోమీటర్ల పరిధిలో 185 చెరువులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 7,257 చదరపు కిలోమీటర్ల పరిధిలోని హెచ్ఎండీఏలో మొత్తం 58 వేల ఎకరాల్లో 2,912 చెరువులు ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. ఈ చెరువులు ఏడు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్నాయి. ఓ చెరువుకు సంబంధించిన ఫుల్ ట్యాంక్ లెవల్(ఎఫ్టీఎల్), బఫర్ జోన్లను గుర్తించడానికి వివిధ మ్యాపులతోపాటు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్నారెస్సీ) నుంచి తీసుకున్న డేటాను వినియోగిస్తున్నారు. ఏదైనా ఓ చెరువులోని ఆక్రమణలు తొలగించాలంటే దాని పరిధికి సంబంధించి ప్రిలిమినరీ, ఫైనల్ నోటిఫికేషన్లు జారీ కావాలి. ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఫైనల్ నోటిఫికేషన్లు పూర్తి కానున్నాయి. ఇప్పటికీ హెచ్ఎండీఏ (HMDA) పరిధిలో 962, జీహెచ్ఎంసీలో 130 చెరువులకు మాత్రమే తుది నోటిఫికేషన్ వెలువడింది. రెండో దశలో 14 చెరువులు.. తొలిదశలో ఆరు చెరువుల్ని ఎంపిక చేసుకున్నాం. వీటిలో బతుకమ్మకుంటను శుక్రవారం ముఖ్యమంత్రి ప్రజలకు అంకితం చేయనున్నారు. ఈ ఆరు చెరువుల విస్తీర్ణం తొలుత 105 ఎకరాల్లో ఉండగా అభివృద్ధి చేసిన తర్వాత అది 180 ఎకరాలకు చేరింది. మిగిలిన చెరువుల అభివృద్ధి, పునరుజ్జీవం డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. రెండోదశలో మరో 14 చెరువులను అభివృద్ధి చేయనున్నాం. ఈ మేరకు ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి పంపించాం. ఈ ఏడాది అక్టోబర్ నుంచి చెరువులకు సంబంధించిన ఫైనల్ నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది. – ఏవీ రంగనాథ్, హైడ్రా కమిషనర్సర్వాంగ సుందరంగా బతుకమ్మకుంట ఫొటోలు.. ఇక్కడ క్లిక్ చేయండి -
అమ్మాయిల ఆశలపై 'నీళ్లు'
కొత్త హెచ్–1బీ వీసా దరఖాస్తులపై ఒకేసారి లక్ష డాలర్ల రుసుము విధిస్తున్న అమెరికా ప్రభుత్వ తాజా నిర్ణయం భారతీయ యువ మహిళా ఔత్సాహికుల ను దెబ్బతీసే అవకాశం ఉంది. నిజానికి హెచ్–1బీ వీసా అందుకుంటున్న భారతీయుల్లో అత్యధికులు పురుషులే. 2023–24లో తమ ఉద్యోగాలను కొనసాగించడానికి (రెన్యువల్) ఆమోదం పొందిన నిపుణుల్లో 74% మంది పురుషులు, 26% మంది మహిళలు ఉన్నారు. హెచ్–1బీ కొత్త దరఖాస్తులకు (ప్రారంభ ఉపాధికి) ఆమోదం లభించిన నిపుణుల్లో మహిళల వాటా 37%. కొత్త ‘వన్ టైమ్ రుసుము’ ప్రభావంతో నూతన దరఖాస్తుదారులు.. ముఖ్యంగా, పురుషులతో పోలిస్తే తక్కువ వేతనాలు ఉండే మహిళల అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఉద్యోగుల లేదా కార్మికుల వార్షిక జీతంలో అధిక భాగం లేదా అంతకు మించి కొత్త హెచ్–1 బీ వీసా ఫీజు ఉంది. అందువల్ల, ప్రారంభ ఉపాధి లబ్ధిదారులను స్పాన్సర్ చేయడం కంపెనీలకు ఆర్థికంగా లాభదాయకం కాకపోవచ్చు.ఈ అంశం హెచ్–1బీ వీసాలు ఆశిస్తున్న ఔత్సాహికుల భవిష్యత్తు గురించి ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఉదాహరణకు ఒక కంపెనీ కొత్త లబ్ధిదారునికి నూతన వీసా ఫీజు ప్రకారం స్పాన్సర్ చేస్తే.. మొదటి సంవత్సరంలో మొత్తం ఖర్చు.. రెన్యువల్ కోరుకునే అనుభవజ్ఞుడైన ఉద్యోగికి అయ్యే వ్యయం కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రభావం ముఖ్యంగా మహిళా లబ్ధిదారులపై ఉంటుందన్నది నిపుణుల మాట. ఎందుకంటే వారు సాధారణంగా హెచ్–1బీ హోల్డర్లలో పురుషుల కంటే తక్కువ సంపాదిస్తున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్విద్యార్హతలు ఉన్నప్పటికీ..అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ సేవల విభాగం గణాంకాల ప్రకారం.. 2023–24లో హెచ్–1బీ ద్వారా కొత్త ఉద్యోగాలకు ఆమోదం పొందిన మహిళల్లో 35 సంవత్సరాల కంటే తక్కువ వయసు గలవారు 75% మంది ఉన్నారు. పురుషుల విషయంలో ఇది 65%గా ఉంది. దీని అర్థం.. కెరీర్ను ప్రారంభించే వయసులో ఉన్న మహిళల్లో ఎక్కువ మందిని హెచ్–1బీ వీసా కొత్త ఫీజు ప్రభావితం చేయనుందని పరిశీలకులు అంటున్నారు. 2023–24లో కొత్త ఉద్యోగాలకు ఆమోదం పొందిన మహిళల్లో 44% మంది మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. పురుషుల విషయంలో ఇది కేవలం 39% మాత్రమే. డాక్టరేట్, ప్రొఫెషనల్ డిగ్రీ స్థాయిల్లో సైతం మహిళలదే ఆధిపత్యం. కొత్త రుసుము నూతన దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుంది కాబట్టి పురుషులతో పోలిస్తే ఉన్నత విద్యార్హతలు ఉన్నప్పటికీ ఇది మహిళలపై ప్రభావం చూపనుందని నిపుణులు చెబుతున్నారు.2023-24లో హెచ్-1బీ దరఖాస్తుల ఆమోదంప్రారంభ ఉపాధి దరఖాస్తుపురుషులు 63%మహిళలు 37%రెన్యువల్ దరఖాస్తుపురుషులు 74%మహిళలు 26% -
స్టాక్ మార్కెట్లే ఇప్పుడు దిక్కు
అమెరికా నుంచి ప్రతికూలతలు ఎదురవుతున్నా... విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగిస్తున్నా... భారత మార్కెట్లు అంతకంతకూ పెరుగుతుండటానికి కారణం దేశీ ఇన్వెస్టర్లకు మార్కెట్లపై ఉన్న నమ్మకమేనని, కొన్నేళ్లుగా వారు కళ్లజూస్తున్న లాభాలే వారిని ఇన్వెస్ట్మెంట్కు ప్రేరేపిస్తున్నాయని ఎడిల్వీజ్ ఏఎంసీ ఎండీ– సీఈఓ రాధికా గుప్తా అభిప్రాయపడ్డారు. వినూత్న ఉత్పత్తులతో ఎడిల్వీజ్ను దేశవ్యాప్తంగా విస్తరించి... దేశంలోని అగ్రశ్రేణి మ్యూచువల్ఫండ్ కంపెనీల్లో ఒకటిగా మార్చిన రాధికా గుప్తా... నిరంజన్ అవస్థితో కలిసి ‘మ్యాంగో మిలియనీర్’ అనే పర్సనల్ ఫైనాన్స్ పుస్తకాన్ని రాశారు. దానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొంటూ ‘సాక్షి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. వచ్చే ఐదేళ్లలో ఎంఎఫ్ పరిశ్రమ 200 లక్షల కోట్లకు చేరుతుందంటున్న రాధికాతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ ఇది...(సాక్షి, ప్రత్యేక ప్రతినిధి) → అంతర్జాతీయంగా ఇబ్బందులెదురవుతున్నా భారత మార్కెట్లు కొత్త శిఖరాలను చేరుకోవటానికి కారణం? యువత ఆకాంక్షలు పెరుగుతున్నాయి. మరోవంక ఇన్వెస్ట్మెంట్కు మరీ ఎక్కువ ప్రత్యామ్నాయాలేవీ లేవు. ఎందుకంటే బ్యాంకు డిపాజిట్లు చేశారనుకుందాం. పన్నులు పోతే మిగిలేది తక్కువే. పెరుగుతున్న జీవన ప్రమాణాలకిది సరిపోదు. అందుకని సహజంగానే జనం ఈక్విటీ మార్కెట్ల వైపు చూస్తున్నారు. నేను ఎంఎఫ్ పరిశ్రమలో అడుగుపెట్టినపుడు ‘సిప్’ ద్వారా వచ్చే మొత్తం 4 వేల కోట్లుగా ఉండేది. ఇపుడది 28వేల కోట్లకు చేరింది. ఇందులో అత్యధిక భాగం దీర్ఘకాలికం. అదే ఇక్కడ కీలకం. ప్రత్యేకించి గడిచిన రెండేళ్లుగా మార్కెట్లోకి వస్తున్న కొత్త ఇన్వెస్టర్లకు మంచి లాభాలొస్తున్నాయి. → అయితే ఈ ర్యాలీ చల్లారిపోయేది కాదని, బుడగలేవీ లేవని అంటున్నారా? స్మాల్క్యాప్ కంపెనీలు... కొన్ని థీమ్స్..., కొన్ని కంపెనీల రూపంలో ఈ బబుల్స్ ఉండొచ్చు. పాలపై నురుగు ఓ 20 శాతం తప్పదు. ఏ బుల్ ర్యాలీకైనా ఇది వర్తిస్తుంది. దానర్థం మొత్తం మార్కెట్ ఇలానే ఉందని కాదుకదా? పునాదులు గట్టిగా ఉన్నాయన్నదే నా పాయింట్. → మరి ఇలాంటి సమయంలో రిటైల్ ఇన్వెస్టర్లకు మీరేం చెబుతారు? అన్నిటికన్నా ముఖ్యం... అతిగా ఆశించకపోవటం. నా పుస్తకంలో కూడా అదే చెప్పాను. చాలామంది ఇన్వెస్టర్లు గత సంవత్సరాన్ని బేరీజు వేసుకుంటూ 30–40 శాతం రాబడి వస్తుందనే అంచనాలతో ఉన్నారు. అది సరికాదు. రెండోది... హైబ్రిడ్ ఫండ్లు, మల్టీ అసెట్ ఫండ్లు, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ల వంటి మధ్యస్త ఆదాయాన్నిచ్చే ఉత్పత్తులను ఎంచుకోండి. ఇవి మరీ సంప్రదాయకంగా కాకుండా... మరీ దూకుడుగా కాకుండా మధ్యస్తంగా ఇన్వెస్ట్చేస్తాయి. స్థిరంగా నిలకడైన రాబడులనిస్తాయి. సంపద సృష్టించాలంటే అలానే సాధ్యం. → డిఫెన్స్ థీమ్, ప్రభుత్వ బ్యాంకుల థీమ్ అంటూ రకరకాల స్టోరీలను ఈ మధ్య చూస్తున్నాం. చాలామంది రిటైల్ ఇన్వెస్టర్లు వీటిని నమ్ముతున్నారు కదా? నిజమే!. రిటైలర్లు ఇలాంటి స్టోరీల వెంటనే పరిగెడతారు. చివరకు దురదృష్టకరంగా ఎగ్జిట్ అవుతారు. నేనైతే ఈ థీమ్లను నమ్మను. ఏ ఒక్క రంగం వల్లనో దేశం ముందుకెళ్లదు. హోటల్స్, హాస్పిటల్స్, డేటా సెంటర్స్, క్యాపిటల్ మార్కెట్స్, టెక్నాలజీ.. ఇలాంటి రంగాలన్నీ దేశాభివృద్ధితో ముడిపడి ముందుకెళతాయి. → మార్కెట్లో ఏ ఒక్క రంగమైనా మరీ అతిగా పెరిగినట్లు భావిస్తున్నారా? అలాగని చెప్పలేం. అయితే కొన్ని అన్లిస్టెడ్ కంపెనీలు, ఎస్ఎంఈ ఐపీవోల విషయంలో మాత్రం ఆందోళన ఉంది. లిస్టింగ్లోనే లాభాలొస్తాయి కదా అని చాలామంది రిటైల్ ఇన్వెస్టర్లు కంపెనీ పూర్వాపరాలేవీ పట్టించుకోకుండా అన్లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నారు. పేరు చెప్పలేను కానీ... ఈ మధ్య ఒక ఐపీవోలో దెబ్బతిన్నారు. కొన్ని ఎస్ఎంఈ కంపెనీలూ అంతే. వీటిలో పెద్ద లిక్విడిటీ ఉండదు. పరిస్థితులు అనుకూలించకపోతే ఇరుక్కుపోయే ప్రమాదమే ఎక్కువ. అందుకే నేనెప్పుడూ రిటైల్ ఇన్వెస్టర్లను ఇండెక్స్ ఫండ్లలో గానీ, ఏవైనా ఇతర మ్యూచువల్ ఫండ్లలో గానీ పెట్టుబడి పెట్టమని చెబుతాను. → కానీ కొన్ని కంపెనీలు ఏడాదిలో 50 శాతం... రెండుమూడు రెట్లు పెరగటం చూస్తున్నారు కదా? ఇవి రిటైలర్లను ఆకర్షిస్తాయి కదా? ఇలా పెరిగిన రెండుమూడు గురించే అంతా చెబుతారు. కానీ కుదేలైన షేర్ల గురించి చెప్పరు. స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జించిన వారిని తప్ప నష్టపోయిన వారి స్టోరీలు బయటకు రావు. ఇలా ఒక షేర్లో పెట్టి లాభపడ్డ వారు కూడా మిగిలిన షేర్లలో రాబడి గురించి చెప్పరు. ఆ షేర్ను ఎంచుకోవటం వెనక వారి శ్రమ, సమయం కూడా ఉంటాయి కదా? ఏడాదికి 10–12 శాతం రాబడినిచ్చే మ్యూచువల్ ఫండ్లు బోరింగ్గా అనిపించవచ్చు. కానీ ఆ రాబడి స్థిరంగా ఉంటుంది. సురక్షితం కూడా. → చిన్న పట్టణాల్లో ఇన్వెస్ట్మెంట్ సంస్కృతి పెరుగుతోందా? చాలా. ఎడిల్వీజ్ను 5 నగరాల్లో ఆరంభించాం. ఇపుడు 60 పట్టణాల్లో ఉన్నాం. త్వరలో 200 పట్టణాలకు విస్తరిస్తాం. స్థానిక భాషల్లో ఆర్థిక పాఠాల లభ్యత.. వారికి సలహాదారులు, డిస్ట్రిబ్యూటర్లు అందుబాటులో ఉండటమన్నదే ప్రధానం. → పాసివ్ (ఇండెక్స్) ఫండ్లకు ఆదరణ పెరుగుతోంది కదా.. మరి యాక్టివ్ ఫండ్లకు వీటితో పోటీ ఉంటుందా? అలాంటిదేమీ లేదు. చాలామంది ఇన్వెస్టర్లు రెండింట్లోనూ పెట్టుబడి పెడుతున్నారు. బాగా రాబడులనిచి్చన యాక్టివ్ ఫండ్లలోకి పెట్టుబడులొస్తాయి. లేదంటే పాసివ్ ఫండ్లలోకి వెళతాయి. రెండూ పెరుగుతున్నాయనేది మనం గమనించాలి. → ఇపుడు చాలామంది ఇన్వెస్టర్లు అమెరికా సహా అంతర్జాతీయ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారు. ఎడిల్వీజ్ ప్రణాళికలేంటి? టెక్నాలజీ, చైనా సహా కొన్ని గ్లోబల్ ఫండ్లను మేం నడిపిస్తున్నాం. కాకుంటే వీటికి ఆర్బీఐ పరిమితులున్నాయి. వీటిని గిఫ్ట్ సిటీ ద్వారా అధిగమించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే గిఫ్ట్సిటీలో కార్యాలయాన్ని ఆరంభించాం. → ఐదు పదేళ్లలో ఎంఎఫ్ పరిశ్రమ ఎలా ఉండొచ్చు? 2030 నాటికి ఇది 200 లక్షల కోట్లకు చేరుతుందన్నది నా అంచనా. దీన్లో 130–140 లక్షల కోట్లు ఈక్విటీలోనే ఉంటాయి. సిప్ పెట్టుబడులు నెలకు రూ. లక్ష కోట్లను చేరుతాయి. దేశంలో 30–40 శాతం మంది మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయటమే వికసిత భారత్కు అర్థమన్నది నా భావన.→ యువత చాలామంది ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ చేస్తున్నారు. మీరేమంటారు? అదో దుర్మార్గం. ఎఫ్ అండ్ ఓ అనేది సంస్థలు రిస్్కను తగ్గించుకోవటానికి ఉపయోగించుకోవాల్సిన సాధనం. అంతేతప్ప అప్పులు తెచ్చి ట్రేడింగ్ చేసే యువత కోసం కాదు. విద్యార్థులు, చిన్నచిన్న వర్కర్లు, డ్రైవర్లు రుణాలు తీసుకుని ట్రేడింగ్ చేస్తున్న వ్యవహారాన్ని నేనూ విన్నా. ఇది గ్యాంబ్లింగ్. ప్రమాదకరం. రిటైల్ ఇన్వెస్టర్లు సిప్, మ్యూచువల్ ఫండ్ల ద్వారా తేలిగ్గా సంపద సృష్టించుకోవచ్చు. గ్యాంబ్లింగ్ అవసరం లేదు. → భారత్ బాండ్ ఫండ్ మాదిరి ఎడిల్వీజ్ నుంచి కొత్త ఉత్పత్తులేమైనా వస్తున్నాయా? అక్టోబర్ 1న మేం దేశంలో మొట్టమొదటి హైబ్రిడ్ స్పెషల్ ఇన్వెస్ట్మెండ్ ఫండ్ను (ఎస్ఐఎఫ్) ఆరంభించబోతున్నాం. సెబీ ఇటీవలే దీనికి అనుమతిచి్చంది. దీన్లో కనీస పెట్టుబడి సైజు రూ.10 లక్షలు. దీన్లో రిస్క్ తక్కువ ఉంటుంది. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్ని బ్యాలెన్స్ చేసుకోవటానికి ఈ ఫండ్ ఉపయోగపడుతుంది. -
వస్త్రం.. వ్యర్థం కారాదు
మనదేశంలో దుస్తుల వినియోగంతోపాటు.. వ్యర్థాలూ పెరిగిపోయాయి. సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ (సీఎస్టీఈపీ) నివేదిక ప్రకారం.. ప్రపంచ వాణిజ్యంలో కీలకపాత్ర పోషిస్తున్న వస్త్ర పరిశ్రమ కాలుష్యకారక పరిశ్రమల్లోనూ ఒకటిగానూ ఎదిగింది! ఏటా ప్రపంచ వ్యాప్తంగా 9.2 కోట్ల టన్నుల టెక్స్టైల్ వ్యర్థాలు పోగుపడుతున్నాయి. వీటిలో కేవలం 12–15 శాతం మాత్రమే రీసైక్లింగ్కు వెళ్తున్నాయి. వాటిలో కూడా ఒక శాతమే కొత్త దుస్తులుగా రీసైకిల్ అవుతున్నాయి. మనదేశంలోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు.ఓ 15–20 ఏళ్ల కిందటి మాట...ఒక కుటుంబం సంక్రాంతి లేదా దసరాకి కొత్త బట్టలు కొనేవారు లేదా కుట్టించుకునేవారు. మళ్లీ కొత్త బట్టలు అంటే పుట్టినరోజుకే. వాటిని కూడా ఎంతో అపురూపంగా వాడేవారు. కానీ ఇప్పుడు...ప్రతి పండుగకూ షాపింగ్. వారాంతాల్లో షాపింగ్. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటివి బిగ్ సేల్ పెడితే షాపింగ్. బోరు కొడితే షాపింగ్. ఫాస్ట్ ఫ్యాషన్, అల్ట్రా ఫాస్ట్ ఫ్యాషన్ వంటి ధోరణుల వల్ల.. తక్కువ ధరలో లేటెస్ట్ ఫ్యాషన్లు, వాటి నకళ్లు ఉన్న దుస్తులు మార్కెట్లోకి వెల్లువెత్తుతున్నాయి. సహజంగానే ఇవి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. సమస్య కొనడంతోకాదు.. ఎక్కువగా కొనడం, ఎక్కువ కాలం వాటిని వాడకపోవడం వల్ల వస్తోంది!వస్త్ర వ్యర్థాలుసెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ (సీఎస్టీఈపీ) అధ్యయనం ప్రకారం.. దేశంలో పొడి మునిసిపల్ ఘన వ్యర్థాల్లో ప్లాస్టిక్, నిర్మాణ వ్యర్థాల తరవాత మూడో స్థానాన్ని ఆక్రమించింది టెక్స్టైల్ రంగమే. ఏటా దీని ద్వారా ఉత్పత్తవుతున్న వ్యర్థాలు సుమారు 7,800 కిలో టన్నులు.⇒ ప్రపంచ కర్బన ఉద్గారాల్లో ఫ్యాషన్ ఉత్పత్తుల వాటా దాదాపు 10 శాతం. యూరోపియన్ యూనియన్ మొత్తం ఉద్గారాల కంటే ఇది ఎక్కువ.⇒ మనదేశంలో సగటున ఒక వ్యక్తి వల్ల ఏటా 5 కిలోల వస్త్ర వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయి.కాటన్ టీషర్టు.. జీన్స్ ప్యాంటుఒక కాటన్ టీ షర్ట్ మన ఒంటిమీదకు రావాలంటే.. సుమారు 2,700 లీటర్ల నీరు ఖర్చవుతుంది. అంటే సగటు మనిషి సుమారు 90 సార్లు స్నానం చేయొచ్చన్నమాట. ఒక జీన్స్ ప్యాంట్ తయారీకి 7,600 లీటర్ల నీళ్లు కావాలి.4.5 కోట్ల మందిదేశంలో టెక్స్టైల్ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నవారు సుమారు 4.5 కోట్లమంది. పరోక్షంగా మరో 10 కోట్లకు పైగా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. జీడీపీలో ఈ రంగ వాటా 2.3 శాతం.వినిమయం తర్వాతే ఎక్కువఫ్యాషన్ రంగంలో వినూత్న ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు పనిచేసే ‘ఫ్యాషన్ ఫర్ గుడ్’ 2022 నివేదిక ప్రకారం.. టెక్స్టైల్ వ్యర్థాలు 3 రకాలు.⇒ తయారీ సమయంలో వచ్చేది 42%⇒ వినిమయం తరవాత వచ్చేది 51%⇒ దిగుమతులు7%రీసైక్లింగ్ తక్కువేప్రస్తుతం మనదేశంలోని టెక్స్టైల్ వ్యర్థాల్లో 59 శాతం పునర్వినియోగం, రీసైక్లింగ్ వంటి ప్రక్రియల ద్వారా మళ్లీ పరిశ్రమకు చేరుతున్నాయి. ఇందులో 34 శాతాన్ని మరమ్మతులు చేసి, కొత్త ఉత్పత్తులుగా మారుస్తున్నారు. కేవలం 25 శాతమే దారాలుగా రీసైకిల్ అవుతోంది. మిగతా 41 శాతంలో.. 5 శాతాన్ని ఇటుక బట్టీలు, బాయిలర్లలో కాల్చేందుకు వినియోగిస్తున్నారు. 17 శాతం వ్యర్థాల్లో చేరుతోంది. 19 శాతం.. తక్కువ విలువ, నాణ్యత గల వస్తువులుగా రూపాంతరం చెందుతోంది.‘మ్యాన్ మేడ్’ ప్రమాదకరంటెక్స్టైల్ ఫైబర్లు రెండు రకాలు. ఒకటి.. సిల్కు, కాటన్ వంటి సహజ ఫైబర్లు, రెండోది పాలిస్టర్, నైలాన్ వంటి మ్యాన్ మేడ్ ఫైబర్లు (ఎమ్ఎమ్ఎఫ్). ఇంటర్నేషనల్ కాటన్ అడ్వైజరీ కమిటీ (ఐసీఏసీ) నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 100లో 72 పాళ్లు ఎమ్ఎమ్ఎఫ్లే. వీటి ఉత్పత్తిలో చైనా, భారత్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. మన్నిక; మరకలు, ముడతలు పడకుండా ఉండటం, తయారీ వేగంగా, తక్కువ ధరతో చేయడం వంటి కారణాల వల్ల సింథటిక్ ఫైబర్ల వాడకం పెరుగుతోంది. కానీ ఇవి పర్యావరణానికి మంచివి కావు. మైక్రోప్లాస్టిక్స్ను విడుదల చేస్తాయి. దుస్తుల తయారీలో డైయింగ్ ప్రక్రియ, రంగురంగుల దుస్తుల నుంచి వచ్చే రసాయనాలు.. కాలుష్యానికి కారణమవుతాయి.ఏం చేయొచ్చు⇒ దుస్తులు కొనేటప్పుడు.. ముఖ్యంగా పండుగ సీజన్లో ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ఎక్కువ కొనేసి తక్కువసార్లు వాడేసి పారేయకండి.⇒ పాతవీ, చిరిగిపోయిన దుస్తులతో పాత సామాన్లు కొనొచ్చు. లేదంటే ఇంట్లోని పనివాళ్లకు లేదా చుట్టుపక్కల పేదలకు లేదా వాటిని సేకరించే ఎన్జీఓలకు ఇవ్వొచ్చు.⇒ వాడేసిన, చిరిగిపోయిన జీన్స్ ప్యాంట్లు, టీషర్టులతో ఇంట్లోకి బొమ్మల్లాంటి రకరకాల అలంకరణ వస్తువులు తయారుచేయవచ్చు.⇒ యూట్యూబ్, సోషల్ మీడియాలో ఇలాంటి విభిన్న డిజైన్లకు సంబంధించి బోలెడన్ని వీడియోలు ఉంటాయి. వాటిని చూసి సరికొత్త వస్తువులు రూపొందించవచ్చు.⇒ చెప్పాలంటే.. ఇలా విభిన్నంగా వాడకాన్ని చెప్పేవి కూడా సరికొత్త వ్యాపార ఆలోచనలే. వీటితోనూ డబ్బు సంపాదించవచ్చు. -
వీక్షణల కోసం.. వేలంవెర్రి
రీల్స్ చేస్తున్నవాళ్లు, రీల్స్ చూస్తున్నవాళ్లు.. సమాజంలో ఉన్నది ఇప్పుడు ఈ రెండే వర్గాలు అన్నంతగా సోషల్ మీడియా మార్చేసింది. ఉన్నవారు–లేనివారు.. స్త్రీలు–పురుషులు.. రాత్రి–పగలు.. ఇంట–బయట.. ఇవేవీలేవు, ప్రతి ఒక్కరూ రీల్స్కి అతుక్కుపోతున్నారు. వాళ్లు అలా అతుక్కుపోయేలా కంటెంట్ క్రియేటర్లు రీల్స్ చేసి సోషల్ మీడియాలోకి వదిలిపెడుతున్నారు. అయితే ఎంతోమందికి ఆనందాన్నిస్తున్న రీల్సే.. ఆ రీల్స్ చేస్తున్న వ్యక్తులు ముఖ్యంగా మహిళల జీవితాల్లో కల్లోలం సృష్టిస్తున్నాయి. పరువు కోసం కుటుంబ సభ్యులే వారి ఉసురు తీసేందుకు ప్రేరేపిస్తున్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్నిక్కీ భాటీ.. గ్రేటర్ నోయిడాకు చెందిన 26 ఏళ్ల ఈమెను ఇటీవల ఆమె భర్త, అత్తమామలు చిత్రహింసలు పెట్టి నిప్పంటించటంతో మరణించింది. మొదట దీన్ని వరకట్న హత్య అని పోలీసులు భావించారు. అయితే నిక్కీ రీల్స్ చేయటంపై అభ్యంతరం తెలిపిన ఆమె మెట్టినింటివారు.. ఆమె తమ మాట వినకపోవటంతో ఆమెపై తీవ్రంగా దాడి చేసి, నిప్పంటించారని తర్వాత వెల్లడించారు!వద్దని చెప్పినందుకు.. నిక్కీ మరణానికి కొన్ని నెలల ముందు ఇలాంటి ఘటనే హరియాణాని గురుగావ్లో జరిగింది. 25 ఏళ్ల రాధిక యాదవ్ను ఆమె తండ్రి కాల్చి చంపాడు. రాధిక సోషల్ మీడియా రీల్స్ చేయడంపై ఆయన తీవ్రంగా కలత చెందారని, ఆ మనోవ్యథ ఆగ్రహంగా మారి కూతుర్ని చంపేశాడని వార్తలు వచ్చాయి. ఇక ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఒక మహిళ తను రీల్స్ చేయటానికి అడ్డు చెప్పినందుకు భర్తపై కత్తితో దాడి చేసింది. ఆ రీల్స్ రెచ్చగొట్టేలా ఉంటున్నాయని ఆ భర్త మనో వేదన. దేశమంతా ఇదే గొడవదేశంలోని చాలాచోట్ల కొందరు చేస్తున్న రీల్స్, షార్ట్స్ కుటుంబాలలో అశాంతికి, ఆవేదనకు, ఆగ్రహానికి కారణం అవుతున్నాయి. లైక్లు, కామెంట్లు, వాటి ద్వారా వచ్చే పేరు, డబ్బు కోసం కొందరు అశ్లీలత, అసభ్యత నిండిన కంటెంట్తో వీక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో ఎలా ఉన్నా, భారతీయ సమాజం మాత్రం ఈ రీళ్ల సుడిగాలిని తట్టుకోలేక సతమతం అవుతోంది. పల్లెల నుంచి మహా నగరాలకు వలస వచ్చిన వారు అక్కడి వెలుగు జిలుగుల నవ నాగరికతలకు ఎలాగైతే ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతారో.. కంటెంట్ క్రియేటర్ల జీవితాల్లోకి రీల్స్, షార్ట్స్ అంతటి థ్రిల్ తెచ్చిపెట్టాయి. వీక్షకులు చూస్తున్నకొద్దీ వారు ఇంకా ఇంకా చూసేలా కంటెంట్ మోతాదును పెంచుకుంటూ పోతున్నారు.‘మిస్టేకెన్ మోడర్నిటీ’?!తాత్కాలికమైన ఆనందంతో చురుకు పుట్టించే ‘డోపమైన్–బూస్టింగ్’ కంటెంట్ను ఆస్వాదించటంలో వీక్షకులు, అలాంటి కంటెంట్ను సృష్టించటంలో కంటెంట్ క్రియేటర్లు.. అదే లోకంగా ఉండటంతో సమాజంలో ప్రమాదకరమైన ఘర్షణలకు ఆజ్యం పోసినట్లవుతోంది! కంటెంట్ క్రియేటర్లలో కనిపించే ఈ దూకుడును ‘మిస్టేకెన్ మోడర్నిటీ’ (ఆధునికతను వేరేలా అర్థం చేసుకోవటం) అని సామాజిక నిపుణులు అంటున్నారుఉపయోగపడేవీ ఉన్నాయిరీల్స్, షార్ట్స్.. అసభ్యత లేనంతవరకూ ఎవరికీ ఇబ్బంది కావు. అశ్లీలత కానంతవరకూ ఎవరికీ హాని చేయవు. ఒక వర్గాన్ని, మతాన్ని, ఒకరి శరీరాన్ని, వైకల్యాన్ని వెక్కిరిస్తూ, వెకిలిచేష్టలతో చేసే వీడియోలు సమాజానికి ప్రమాదకరం. యువతను పెడదారిపట్టించే కంటెంట్ ఉన్న షార్ట్స్.. ఏ జనరేషన్కీ మంచివికావు. మరి, ఉపయోగపడే రీల్స్, షార్ట్స్ లేవా అంటే ఎందుకు లేవూ, చాలా ఉన్నాయి. సరదాగా, నవ్వించేవి.. విజ్ఞానాన్ని పంచేవి.. సరికొత్త విషయాలు తెలియజేసేవి.. వంటలవీ, ఆధ్యాత్మికతవీ.. ఇలాంటి ఎన్నో సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి.వీక్షకులే తిరస్కరించాలిలైకుల కోసం, ఆర్థిక ప్రయోజనం కోసం కంటెంట్ క్రియేటర్లు అశ్లీలమైన, అసభ్యకరమైన రీల్స్కి అడ్డుకట్ట వేసేదెలా? చాలా సింపుల్ అంటున్నారు మానసిక నిపుణులు. ‘అలాంటి కంటెంట్ను ఆదరించకపోవటం లేదా వారిని బ్లాక్ చేయడం ద్వారా వారికి అడ్డుకట్ట వేయవచ్చు. ఇలాంటి వీడియోలు చేయడం ఒక మానసిక సమస్య కూడా కావచ్చు’ అంటున్నారు మానసిక నిపుణులు.రీల్సే లోకం!» ఫేస్బుక్ మాతృసంస్థ ‘మెటా’, గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ ‘ఇప్సోస్’ సంయుక్తంగా దేశవ్యాప్తంగా 33 పట్టణాల్లో ఇటీవల నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.» షార్ట్స్, రీల్స్ భారతీయుల దైనందిన జీవితంలో భాగమైపోయాయి.» ముఖ్యంగా దేశంలో అత్యధికులు చూసే షార్ట్ ఫామ్ వీడియో ఫార్మాట్గా రీల్స్ అవతరించాయి.» 97 శాతం మంది రోజులో కనీసం ఒక్కసారైనా తక్కువ నిడివిగల వీడియోలు చూస్తున్నారు. ఇందులో సింహభాగం రీల్సే.» ఈ ట్రెండ్ జెన్ జెడ్ యూజర్లలో ఎక్కువగా ఉంది.వీటిని చూడటం ఎంటర్టైన్మెంట్ స్థాయిని దాటి.. దైనందిన కార్యకలాపంలా మారిపోయింది. -
మీరు ఆట్రోవర్టా?
అంతర్ముఖత్వం.. బహిర్ముఖత్వం.. ఈ రెండూ ఉండే ఉభయముఖత్వం.. మొత్తం ఈ మూడింటి గురించీ, ఈ తరహా వ్యక్తుల గురించీ అందరూ వినే ఉంటారు. సమాజంలో ఉండే వాళ్లంతా ఈ మూడు కేటగిరీల్లో ఏదో ఒక దాన్లో ఉంటారు అని అందరూ అనుకుంటారు. కానీ, కాదట. కొత్త తరహా వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారట. ఈ వ్యక్తులకు ‘ఆట్రోవర్ట్’ అనే పేరును ఖరారు చేశారు అమెరికాకు చెందిన ప్రముఖ సైకియాట్రిస్ట్ రామి కమిన్స్కి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ వంటి మేధావులు ఈ కోవకు చెందుతారట. – సాక్షి, స్పెషల్ డెస్క్లండన్కు చెందిన ప్రసిద్ధ సైన్స్ మ్యాగజైన్ ‘న్యూ సైంటిస్ట్’లో ప్రముఖ సైకియాట్రిస్ట్ రామి కమిన్స్కి ‘ఆట్రోవర్ట్’ గురించి ప్రస్తావించారు. అంతేకాదు, దీనిపై ఏకంగా ‘ద గిఫ్ట్ ఆఫ్ నాట్ బిలాంగింగ్’ అనే పుస్తకమే రాశారు. ‘మనలో కొంతమంది అంతర్ముఖులు ఉంటే, మరికొందరు బహిర్ముఖత్వంతో ఉంటారు. ఈ రెండు వ్యక్తిత్వ లక్షణాలూ ఉన్నవాళ్లూ ఉంటారు. కానీ, ఆట్రోవర్ట్లు అలా కాదు, వీరు చాలా ప్రత్యేకం’ అంటారు కమిన్స్కి.భావోద్వేగాల నియంత్రణఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇతరుల మీద ఆధారపడరు. తమ సమస్యను నలుగురిలో పెట్టరు. అలాగని ఒక్కళ్లూ కూర్చుని మథనమూ చేయరు. వ్యక్తిగతంగా తాము నమ్మినవాళ్లతో లోతుగా చర్చించి విశ్లేషణ చేయడానికి, సమస్య పరిష్కారానికి ఎక్కువగా ఆలోచిస్తుంటారు.ఈ మూడూ తెలిసినవేఇంట్రావర్టులు లేదా అంతర్ముఖులు.. నలుగురితో కలవడానికి ఇష్టపడరు. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే చాలాసేపు ఆలోచిస్తారు. బయటి వ్యక్తుల నుంచి ప్రేరణ పొందరు. తమకు తామే ప్రేరణ. ఎక్స్ట్రావర్టులు లేదా బహిర్ముఖులు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటారు. నలుగురితో కలివిడిగా ఉంటారు. ఎక్కువగా మాట్లాడతారు. త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు. యాంబివర్ట్ లేదా ఉభయముఖత్వం ఉన్నవాళ్లు. ఈ రెండు లక్షణాలూ కలిసి ఉంటాయి. కొన్నిసార్లు ఒంటరితనాన్ని, మరికొన్నిసార్లు నలుగురితో కలవడాన్ని ఇష్టపడతారు.భిన్నమైన ఆలోచనా విధానం‘నలుగురికీ నచ్చినది.. నాకసలే ఇక నచ్చదులే’ అనే టైపు ఈ ఆట్రోవర్ట్లు. వీరు నలుగురూ ఆలోచించే పద్ధతికి భిన్నంగా, స్వతంత్రంగా ఆలోచిస్తారు. ఏంటి తేడా?యాంబివర్ట్కీ ఆట్రోవర్ట్కీ ఏంటి తేడా అని చాలామందికి అనిపించవచ్చు. చాలా తేడా ఉంది. సమయం, సందర్భాన్ని బట్టి యాంబివర్ట్లు అంతర్ముఖులుగానో, బహిర్ముఖులుగానో ప్రవర్తిస్తుంటారు. కొన్నిసార్లు నలుగురితో కలిసినప్పుడు చురుగ్గా ఉంటే.. కొన్నిసార్లు ఎవ్వరూ లేకపోయినా ఉత్సాహంగా పనిచేసుకుపోతారు. కానీ ఆట్రోవర్ట్లు అలాకాదు. సమయం, సందర్భం బట్టి మారిపోయే వ్యక్తిత్వం కాదు వీళ్లది.సామాజిక సంబంధాలువీళ్లు పార్టీల వంటి వేడుకలకు హాజరవుతారు. కానీ, అందరి దగ్గరకూ వెళ్లిపోరు. వచ్చిన ప్రతి ఒక్కరితోనూ అంత వేగంగా కలిసిపోరు. వ్యక్తులను అంచనావేసి, కొద్దిమందితోనే మాట్లాడతారు.» ఏదో ఒక సమూహానికి చెందిన వ్యక్తులుగా ముద్ర వేయించుకోవడానికంటే వ్యక్తిగత సంబంధాలు, పనితీరును ఇష్టపడతారు.» వ్యక్తులతో సంభాషణల్లో పాలుపంచుకోవడానికంటే వాటిని పరిశీలించడానికి ఆసక్తి చూపుతారు.» సమూహంలో ఉంటేనే మెదడు యాక్టివ్గా పనిచేయడం, శక్తిని పొందడం ఉండదు.నాయకత్వ లక్షణాలుస్థిరత్వం, ధైర్యానికి వీరు ప్రతీకలు. ఎలాంటి దెబ్బ తగిలినా లేదా సమస్య వచ్చి కిందపడినా తమంతట తామే తొందరగా పైకి లేవగలరు.» వీళ్ల దృష్టిలో నాయకత్వం అంటే అజమాయిషీ కాదు. ఎదుటివాళ్లు చెప్పేది శ్రద్ధగా వింటారు. ఎదుటివారి పరిస్థితినీ అర్థం చేసుకుంటారు.బలమైన,నమ్మకమైన బంధాలుప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్, రచయిత్రి వర్జీనియా ఉల్ఫ్ వంటి వాళ్లు ఈ ఆట్రోవర్ట్ వ్యక్తిత్వం ఉన్నవాళ్లు. వీళ్లు స్వతంత్ర భావాలతో ఉంటారు. సృజనాత్మకత వీరి సొంతం. సంప్రదాయ ధోరణిలో పోరు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోగలరు. నా దగ్గరకు వచ్చే వారిలో ఇంట్రావర్ట్లు, ఎక్స్ట్రావర్ట్లు, యాంబివర్ట్లు.. ఈ మూడు రకాల వ్యక్తిత్వాలూ కానివారిని నేను గమనించాను. వీళ్ల దృష్టిలో ఎక్కువమందితో సంబంధాలు ముఖ్యం కాదు. ఉన్నవి కొన్నయినా.. అవి బలంగా, నమ్మకంగా ఉండేలా చూసుకుంటారు. సామాజిక సంబంధాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. ఎలాంటి పరిస్థితులనైనా ఇట్టే ఆకళింపు చేసుకుంటారు. తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడమే కాదు, ఎదుటివారి భావోద్వేగాలనూ అర్థం చేసుకోవడం వీరి ప్రత్యేకత. – రామి కమిన్స్కి, సైకియాట్రిస్ట్ -
వంద పూలై విరిసే జ్ఞాపకాలు!
జ్ఞాపకాలు గతం ఇనప్పెట్టెలో భద్రంగా ఉంటాయి. దాని మూత తీయాలని అనుకున్నప్పటి నుండి మానసిక వైబ్రేషన్కు గురవుతాం. చిన్ననాటి స్మృతులు ముసురుకుంటాయి. సాధారణంగా పదేళ్ళ వరకు బాల్యదశ ఉంటుంది. ఈ స్లాట్ మనిషికి స్వర్ణయుగం. ప్రతిక్షణం కుటుంబంలో, సమాజంలో, వీధిలో, ఊరిలో, బడిలో, పక్కింట్లో ప్రతిచోట ప్రతి అనుభవం గుండె గోడలమీద బొమ్మ కడుతుంది. నలుపు తెలుపు రంగుల్లో సినిమా రీల్లాగా గర్గర్ మని ఒక్కో సంఘటన మనసు తెర మీద కదలాడుతుంది.ఒక పండగని జ్ఞాపకం అయితే మరింత సంబరం. పూలదొంతర అల్లాలంటే ఒళ్ళంతా పులకరింతే. గత పరిమళాల జల్లుల్లో తడిసి ముద్దవడమే. బతుకమ్మ పండుగ రంగుల హరివిల్లుల్ని తెంపి వెన్నెల్లో ఆరేసి, వర్షంలో తడిసిన మట్టి సుగంధాలలో నానబెట్టి, కొత్త రంగురంగుల కాంతి తరంగాలని వాటికి పట్టించి నూటొక్క మొగ్గల్ని, పూలని, ఆకుల్ని తొడిగిన పూగుత్తుల్ని పేర్చాలంటే అంత సులభం కాదు. ఇలాంటప్పుడే గత అవిస్మృత ఖజానా విలువ తెలుస్తుంది. పూలను పరిరక్షించే ఇనప్పెట్టె తయారు కానందుకు బాధ. పుప్పొడిలా రాలిన కనబడని కన్నీటి తుంపరల్ని ఎలా, ఎక్కడని దాచగలం.మాది ఊరు కాని ఊరు. పట్టణంలో ఒదిగి ఉన్న ఊరు. వరంగల్ జిల్లాలోని హనుమకొండ. మా ఇంటి చుట్టూరా అనేకానేక చిన్నా పెద్దా ప్రాచీన గుళ్ళు, చారిత్రక ప్రదేశాలు. ఇంటికి కాస్త దూరంలో మూడు పెద్ద గుట్టల మధ్య పద్మాక్షి గుడి. గుడి కింద నీటి గుండం. అందులో బంగారు జింక ఆకర్షణలా తామరాకులు, పూలు! గుట్టల మీద సీతా ఫలాలే కాదు, ఎన్నో రకాల పూలు, గునుగు పూలు, తంగేడు, గన్నేరు పూలు... ఎన్నెన్నో.మా ఇంట్లో నాకన్నా చిన్నది చెల్లెలు. ఇంటిపక్కన పాటకుల ఇంట్లో ఓ చిట్టెమ్మ. ఇంటి పక్కల చుట్టాలు, పరిచయస్తుల ఇళ్ళల్లో ఆడపిల్లలు. వీళ్లు బొడ్డెమ్మ ఆడేవాళ్లు.భాద్రపదం ప్రకృతి పచ్చదనానికి గర్భ శిశువు. ఈ మాసం ప్రకృతి పరవశించే నిండు చూలాలు. బొడ్డెమ్మ వస్తుందంటేనే పూలవేట షురువయ్యేది. ఆడపిల్లల్ని బొడ్డి అంటారు. బొడ్డి అంటే చిన్నది అని అర్థం. ఈ ఆడపిల్లలు ఆడే బొడ్డెమ్మ ఒక ప్రత్యేక పండగ. ఎవరి ఇంట్లోనూ పదిమంది ఆడే ఆట స్థలం ఉండేది కాదు. గుడిలోనో, ఏదో ఓక బహిరంగ ప్రదేశంలోనో వాళ్ళు వెదురుతో చేసిన చిన్న చిన్న సిబ్బుల్లో పూలు పట్టుకుని అక్కడికి చేరేవారు. అక్కడ కుమ్మరాయన మట్టితో బొడ్డెమ్మ గద్దె తయారు చేసేవాడు. కిందివైపు పెద్దగా పైవైపు చిన్న ఆకారంతో మట్టితో చతురస్రాకారంతో గద్దె కట్టేవాడు. దానికి నాలుగు దిక్కులా ప్రమిదలు పెట్టేవాడు. దానిలో రోజుకొక్కరు 9 రోజులు 9 ఇళ్ళలోంచి నూనె తెచ్చేవారు. దాని చుట్టూ రోజూ కొత్తగా ముగ్గులు వేసేవారు.ఈ పనంతా బాలికలే చేసేవారు. ఊరి వడ్రంగి కర్రతో బొడ్డెమ్మ గద్దె చేసి ఇచ్చేవాడు. దానికి పసుపు, తెలుపు రంగులు వేసేవారు. దానిమీద కూడా ప్రమిదలు ఉండేవి. మధ్యలో పిల్ల బతుకమ్మని చెక్కేవాడు. దాన్ని జ్ఞాపకం పెట్టుకుని డెబ్బై ఐదేళ్ల తర్వాత అలాంటి కర్ర బొడ్డెమ్మ వస్తువుని ఆద్యకళ మ్యూజియం కోసం సేకరించాను. మగపిల్లల టీం మహాలయ అమావాస్య నాడు ప్రారంభమయ్యే బతుకమ్మ కోసం సంచులు పట్టుకుని పూలవేటకు వెళ్ళేవారం. గునుగు పూలు తెచ్చి రకరకాల రంగులద్దేవాళ్ళం. తంగేడు పూలు, ఆకులు, కొమ్మలతో తెంపేవాళ్ళం. ఇంటికి వచ్చి పూలను వేరు చేసేవాళ్ళం. జలాశయాల్లోంచి తెచ్చిన తామర ఆకుల్ని సిబ్బుల కింద ఉంచేవాళ్ళు. కొంతమంది ఎర్రని తామరపూవుని పైన అలంకరించేవాళ్ళు. పై భాగాన పసుపు ముద్ద పెట్టి గౌరమ్మ తల్లిగా సంభావించేవారు. మరికొందరు గుమ్మడి ఆకుల్ని సిబ్బులో పరిచి బతుకమ్మ పైన గుమ్మడిపూవుని ఉంచేవారు. పూవు మధ్య భాగం కేసరాలు ఉండేచోట పసుపు రంగు ఉండేది. దాన్నే గౌరమ్మగా భావించేవారు. మేం ఇంత కష్టపడితే మాకు దక్కేది ఆట పాటల తర్వాత అక్కలు, అమ్మలు పెట్టే ప్రసాదం. రోజుకో తీరొక్క ప్రసాదం. ఇంటికోరకం ప్రసాదం తెచ్చి అన్నీ ఒక్కో గంపలో వేసి వాళ్లు తిని మాకు పెట్టేవారు. ఆ రుచే వేరు. తలుచుకుంటేనే నోరూరుతుంది. బొడ్డెమ్మ, బతుకమ్మలను తలకెక్కించుకునే సందర్భంలో ఆకులతో చేసిన పీకలు ఊదేవాళ్ళం. మరికొందరి దగ్గర కర్రతో చేసిన గొట్టం ఉండేది. ఎండిన గింజల్నో, కాగితం తుంచి దాన్ని నమిలి చేసిన ముద్దనో కర్ర బర్మారులో పెట్టి బాగా ఊదేవాళ్లం. అది పిస్తోలు పేల్చినట్లు శబ్దం అయ్యేది. ఎవరి శబ్దం పెద్దగా ఉంటే వారిపై ప్రశంసల పూల జల్లు పడేది. అలా తొమ్మిది రోజులు ఈ కార్యక్రమం కొనసాగేది. ఆరో రోజు అరెం. అంటే ఆరోజు బతుకమ్మ పేర్చరు. సెలవుదినం. ఆట ఉండదు. మాకు కూడా కాస్త తీరిక దొరికేది. కాకపోతే బతుకమ్మ ప్రసాదం దొరికేది కాదు. పండుగ తొమ్మిది రోజులు చాలా ఇండ్లల్లో శాకాహారమే ఉండేది. కొత్త ధాన్యంతో, పప్పులతో తయారు చేసిన రుచి ఈనాటికీ గుర్తు చేసుకుంటే నోరూరుతుంది. బతుకమ్మ తొమ్మిది రోజులు ఆట పాటలతో గడిచేది. అక్కలు, చెల్లెల్లు, కోడళ్ళు, మరదళ్లతో సందడిగా గడిపిన క్షణాలు ఈ తరాలకు దక్కని మహోత్కృష్ట గడియలు.బతుకమ్మలనే కాదు ఇంటిని, ఇంటి పరిసరాల్ని శుభ్రపరిచి అలంకరించేవారు. ఇళ్ళు ముందు భాగం ముగ్గులు రంగులతో మెరిసిపోయేవి. వివిధ రకాల పూలు ఒక్కచోట ఉంచడం వల్ల చక్కని సువాసనలతో ఆ ప్రదేశం ఎంతో బాగుండేది. బతుకమ్మలపై కొందరు అగరుబత్తీలు పెట్టేవారు. చాలా కాలం దాచిపెట్టి పండుగ రోజున కట్టుకునే పీతాంబరం, పాత చీరల ప్రత్యేక వాసన ఇంకా పీల్చుతున్నట్లే ఉంటుంది. రోజూ అలికిన తాజా వాసన సైతం పండగ ప్రత్యేకతని చెప్పకనే చెప్పేది.బాలికల గుంపు చిన్న మగపిల్లగాళ్ల గుంపు, యువతుల గుంపు, తల్లుల గుంపు, అమ్మమ్మ నానమ్మల గుంపు ఇలా ఎవరి గుంపు వారిదే. ఎవరి స్నేహితులతో వారు కలిసిమెలసి ఉండేవారు. హాస్యం వందపూలై పూసేది. సామెతలతో సంభాషణ నవరసాలతో ఆకట్టుకునేది. వరసలను బట్టి హాస్యం, చతురోక్తులు ఉండేవి. ఇది పండుగ సంబరాన్ని మరింత పెంచేది. ఊరు ఊరంతా గాన ప్రవాహంలో ఈదేది. చెరువు గట్టో, నీటి గుండాల పక్కనో వాళ్ల నృత్యంతో భూమి పులకరించేది. సంధ్యాసమయంలో ప్రకృతిని చూసి మా ఒడలు పులకరించేది. నాడు బతుకమ్మ ప్రకృతి పండుగ. నా జ్ఞాపకాలలో ఆనాటి ప్రాకృతిక సౌందర్యం చూడడం కోసం ఊరూ, వాడా, అడవీ, పల్లె తిరుగుతూనే ఉన్నాను. ఏదో తెలియని శూన్యం. నా జీవితకాలం అంతా పద్మాక్షి గుట్ట కింద నీటి గుండంలోని తామర పూవుల సువాసన ఇంకా వెన్నాడుతోంది. కొండమీది గోగుపూలు రమ్మని చేతులు చాస్తున్నాయి. పండిన సీతాఫలాల సువాసన, రుచి, బతుకమ్మ ప్రసాదాలు తిన్నాక చాలా గంటల వరకు చేతికంటిన కమ్మని సువాసన కోసం మళ్లీ బతుకమ్మ పండుగ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూపు! స్త్రీలు పాడే పాటలు చెవుల్లో ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. బతుకమ్మ పేర్పులోని నేర్పు ఆశ్చర్యం కలిగిస్తుంది. వాళ్ళ కళాత్మక భావనల్నిచూసి వారిపై ఎనలేని ప్రేమ, గౌరవం కలిగేది. ఊరు ఊరంతా ఒక్కటై చేసుకునే పండుగ పట్ల గౌరవం ఇనుమడించేది. పండుగ కాలంలో స్త్రీలు మిగతా వాళ్ళని గౌరవంగా చూసేవాళ్ళు. అందరూ సమానమే. ఎందుకంటే అందరూ సుమంగళులే. అంటే గర్భం ధరించి పిల్లల్ని కనగలిగే అర్హత ఉన్నవాళ్ళే. వాళ్లే బతుకమ్మ ఆడాలి. వాయనాలు పెట్టుకోవాలి.– జయధీర్ తిరుమలరావు -
టూర్కు ముందే.. ఓ టూర్ వేయండి!
ఆ ప్రదేశం గురించి లోతుగా తెలుసుకోండిఆచార వ్యవహారాలపై అవగాహన తప్పనిసరి తీర్థయాత్రలు, అడ్వెంచర్ టూరిజంలో కీలకంప్రయాణం తీపి జ్ఞాపకాలు అందించేలా జాగ్రత్తలున్యూయార్క్ సిటీ, ప్యారిస్, కశ్మీర్, ఆగ్రా.. ప్లేస్ ఏదైనా ట్రిప్కు వెళ్లే ముందు ఆ ప్రదేశంలోని వింతలు, విశేషాల గురించి తెలుసుకుంటాం. వీడియోలు చూస్తాం. అక్కడి భద్రత, సంస్కృతి, రవాణా సౌకర్యాలు ఎలా ఉన్నాయో కూడా కచ్చితంగా అవగాహన తెచ్చుకోవాలి. ఇందుకోసం వెబ్సైట్లలో వీడియోలు చూడటం.. కావాల్సిన వారితో ఫోన్లో మాట్లాడటం ద్వారా ‘టూర్కి ముందే ఓ టూర్’ వేయాల్సిందే. తద్వారా టూర్ని పక్కాగా ప్లాన్ చేసుకోవడానికి వీలవుతుంది. ఫలితంగా జీవితాంతం గుర్తుండిపోయే ఒక టూర్.. మీ జ్ఞాపకాల బీరువాలో చేరుతుంది. – సాక్షి, స్పెషల్ డెస్క్సెలవులు వస్తున్నాయంటే చాలు.. టూర్లు ప్లాన్ చేస్తుంటాం. మనం ఏ ప్రదేశానికి టూర్కి వెళ్లాలి అనుకుంటున్నామో అక్కడి ప్రసిద్ధ ఆకర్షణలు, చారిత్రక ప్రదేశాలు, సహజ అద్భుతాల గురించి నెట్లోనూ, అక్కడికి అప్పటికే వెళ్లి వచ్చిన వారి దగ్గరా ఆరాలు తీస్తాం. అయితే మనం వెళ్లాల్సిన చోట భద్రతా పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు వంటి వాటిని మాత్రం తెలుసుకోం. సముద్రం, నదులు, జలపాతాలు, లోయలు, కొండ ప్రాంతాలకు వెళ్లడానికి యువత ఆసక్తి చూపుతారు. కానీ, అక్కడ పొంచి ఉండే ప్రమాదాల గురించి మాత్రం ఆరా తీయరు.ఆచారాలు తెలిస్తే..పర్యాటక ప్రాంత స్థానిక సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలు, కళలు, ఆహారపుటలవాట్ల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. తద్వారా వాటికి విభిన్నంగా లేదా వ్యతిరేకంగా మనం నడుచుకోకుండా.. అక్కడి ప్రజలను గౌరవించి, వారి మన్ననలు పొందవచ్చు. సామాజిక మర్యాదలు, దుస్తుల నియమావళి, మతపరమైన లేదా సాంస్కృతిక ప్రదేశాలలో ఎలా ప్రవర్తించాలో ముందే అవగాహన పెంచుకోవాలి. ఉదాహరణకు కొన్ని ఆలయాల్లోకి ప్రవేశించే ముందు.. కొన్ని రకాల దుస్తులు ధరించాలి. అలాగే, అక్కడ గుడిలో సమర్పించే ప్రసాదాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. తీర్థయాత్రలుతీర్థయాత్రలకు ‘టూర్కి ముందే టూర్’ అత్యంత కీలకం. ఉదాహరణకు శ్రీశైలం వెళ్లేవారు ముందుగా, తప్పనిసరిగా సాక్షి గణపతి దర్శనం చేసుకోవాలి. ఇది మనందరికీ తెలిసిందే. కానీ, ఇతర రాష్ట్రాల్లోనూ, నేపాల్ వంటి దేశాల్లోనూ ఇలాంటి నిబంధనలు చాలా ఉంటాయి. వాటిని ముందుగా తెలుసుకుంటే.. ‘అయ్యో, ముందు తెలుసుకోలేకపోయామే’ అని బాధపడాల్సిన అవసరం ఉండదు. అలాగే చార్ధామ్ యాత్ర వంటి ఎత్తైన ప్రదేశాలకు వెళ్లేటప్పుడు ఆక్సిజన్ స్థాయులు తక్కువగా ఉంటాయి. దానికి తగ్గట్టుగా మనం సంసిద్ధం ఎలా కావాలో ముందే చూసి, తెలుసుకోవాలి. వైల్డ్ లైఫ్, ఎకో టూరిజంప్రకృతి సంపదకు నిలయమైన ప్రాంతాలకు; అడవులు, జాతీయ పార్కులకు వెళ్లేటప్పుడు అక్కడి వాతావరణాన్ని మనం పాడుచేయకుండా ఉండటం చాలా ప్రధానం. మనవల్ల పర్యావరణ కాలుష్యం, అక్కడి సంస్కృతి సాంప్రదాయాలు దెబ్బతినకుండా నడుచుకోవాలంటే.. ‘టూర్కి ముందే టూర్’ చాలా అవసరం. అడ్వెంచర్ టూరిజంట్రెక్కింగ్, స్కీయింగ్, వైట్వాటర్ రాఫ్టింగ్ వంటివి చేసేముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందే తెలుసుకోవాలి. అవి ఎలా చేస్తారో, అందులో వాడే వస్తువుల గురించీ కూడా ముందే చూసి తెలుసుకోవాలి. పర్యటనకు ముందు నుంచే మానసికంగా, శారీరంగా దృఢంగా ఉండటం అవసరం. దుస్తుల నుంచి అవసరమైన మందుల వరకు ప్రతి విషయంలోనూ పూర్తి సంసిద్ధంగా ఉండాలి. అదనపు జాగ్రత్తలువ్యాపారులు, స్థానికుల నుంచి తలెత్తే మోసాలు, గమ్యస్థానానికి సంబంధించిన ఏవైనా నిర్దిష్ట భద్రతా సమస్యల గురించి అవగాహన తెచ్చుకోవాలి. ఉదాహరణకు అధిక నేరాల రేటు ఉన్న ప్రదేశానికి ప్రయాణిస్తుంటే.. రాత్రిపూట సంబంధిత ప్రాంతాలకు వెళ్లకపోవడం, విలువైన వస్తువుల గురించి మరింత అప్రమత్తంగా ఉండటం వంటి అదనపు జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇందుకోసం ట్రావెల్ బ్లాగ్స్, టూరిజం, ప్రభుత్వ వెబ్సైట్లను పరిశీలించాలి. స్నేహితులు, బంధువుల నుంచీ సమాచారాన్ని సేకరించాలి. వీటిలో ముఖ్యం» తీర్థయాత్రలు » అడ్వెంచర్ టూరిజం » ఎకో టూరిజం » క్రూయిజ్ టూరిజం » వైల్డ్లైఫ్ టూరిజం » రూరల్ టూరిజం -
స్టూడెంట్స్ మీకోసం 'ఏఐ టూల్స్'!
కృత్రిమ మేధ (ఏఐ).. ఇప్పుడు ప్రపంచాన్ని శాసించే సాంకేతికత. ఇది ఉద్యోగులకే కాదు.. అన్ని తరగతుల విద్యార్థులకు కూడా గొప్ప ఆయుధంగా అవతరించింది. వివిధ అంశాలను నేర్చుకునే విషయంలో సౌలభ్యమేకాదు.. క్రమశిక్షణా అలవాట్లను ఏర్పరచుకోవడం, సమయ పాలనా నిర్వహణ, సృజనాత్మకతను పెంపొందించుకోవడం వంటి ఎన్నో అంశాల్లో ఏఐ సాధనాలు విద్యార్థులకు దోహదపడుతున్నాయి. చాట్జీపీటీ, జెమినైతోపాటు అత్యంత ఉపయోగకరమైన ఏఐ టూల్స్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్సమయ పాలనరీక్లెయిమ్.ఏఐ: క్యాలెండర్ను ఆటోమేటిక్గా నిర్వహించే షెడ్యూలింగ్ సాధనం. అసైన్మెంట్స్ను ఎప్పుడు సవరించాలి, రాయాలో మాన్యువల్గా ప్లాన్ చేయడానికి బదులుగా.. విద్యార్థి ప్రస్తుత తరగతులు, క్రీడలు, అభిరుచులు, వ్యక్తిగత కార్యక్రమాలను స్కాన్ చేసి, అందుబాటులో ఉన్న ఖాళీ సమయంలో అధ్యయన సెషన్్సను నిర్ణయిస్తుంది. నోషన్ ఏఐ: నోట్స్, టాస్క్లు, ప్రాజెక్ట్లు, విజ్ఞానాన్ని ఒకే చోటకు తీసుకొస్తుంది. డాక్యుమెంట్లలో ఉన్న సమాచారాన్ని క్యాప్చర్ చేయడానికి, వాటిని సారాంశాలుగా మార్చడానికి, అసైన్మెంట్స్ను ట్రాక్ చేయడానికి, సమాచారాన్ని శోధించడానికి , నవీకరణకు సులభంగా అర్థమయ్యేలా స్టడీ డాష్బోర్డ్ను ఉంచడంలో సహాయపడుతుంది. పరిశోధన, రచనలుపర్ప్లెక్సిటీ.ఏఐ: విశ్వసనీయమైన వేదికలు (సోర్సులు), సంక్షిప్త సూచనలతో.. మన ప్రశ్నలకు సమాధానమిచ్చే పరిశోధన ఇంజిన్. గూగుల్లో స్క్రోల్ చేయడానికి బదులుగా వ్యాసాలు, నివేదికలు, ప్రాజెక్ట్లలో ఉదహరించగల ప్రత్యక్ష, విశ్వసనీయ విషయాలను నేరుగా పొందవచ్చు. నోట్బుక్ ఎల్ఎమ్ (గూగుల్): క్లాస్ నోట్స్, పాఠ్యపుస్తకాలు, పీడీఎఫ్లను అప్లోడ్ చేసి ఈ మెటీరియల్కు సంబంధించిన ప్రశ్నలను అడగవచ్చు. విద్యార్థులు ఇచ్చే సిలబస్ను ఆధారం చేసుకుని శిక్షణ పొందిన ట్యూటర్ పాత్రనూ పోషిస్తుంది. అధ్యయనం– అభ్యాసంక్విజ్లెట్: నోట్స్ను సంక్షిప్త సమాచార ఫ్లాష్కార్డ్స్, ప్రాక్టీస్ పరీక్షలు, స్టడీ గేమ్స్గా మారుస్తుంది. విద్యార్థులు మెటీరియల్ను ఎంత బాగా గుర్తుంచుకుంటున్నారో దానికి అనుగుణంగా తనను తాను మార్చుకుంటుంది. తద్వారా పాఠాలు తిరిగి చదవడం ఒక పనిలాగా, ఆసక్తి లేని విషయంగా కాకుండా ఆసక్తికరంగా మారుతుంది.వూల్ఫ్రమ్ ఆల్ఫా: ఇది కేవలం కాలిక్యులేటర్ మాత్రమే కాదు.. సమాధానాలను గణిస్తుంది. ఫంక్షన్్సను గ్రాఫ్ చేస్తుంది. దశలవారీ గణిత, సైన్్స పరిష్కారాల ద్వారా ముందుకు నడిపిస్తుంది. చేసిన పనిని ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయడానికి, భావనలను మరింత లోతుగా అన్వేషించడానికి ఉపయోగపడుతుంది.ఆటర్.ఏఐ (ఓటీటీఈఆర్): ఆడియో, వీడియోల కంటెంట్ను టెక్ట్స్గా మార్చే ట్రాన్స్క్రిప్షన్ సాధనం. ఉపన్యాసాలు, సమావేశాలు, గ్రూప్ డిస్కషన్్సను రికార్డ్ చేసి వాటిని సర్చ్ చేయదగిన టెక్ట్స్గా మారుస్తుంది. నోట్స్ రాసే వ్యక్తిగత సహాయకుడిగా ఉంటుంది.కంటెంట్ సృష్టి – ప్రజెంటేషన్కాన్వా: డ్రాగ్–అండ్–డ్రాప్ టెంప్లేట్స్తో పోస్టర్లు, స్లైడ్లు, ఇన్ఫోగ్రాఫిక్స్, వీడియోలను సులభంగా రూపొందించవచ్చు. ఇతర ఏఐ సాధనాలు కేవలం టెక్ట్స్ వివరణ నుంచి ప్రారంభ స్థాయి డిజైన్్సను మాత్రమే రూపొందించగలవు. కానీ ఇది లే–అవుట్, స్టైలింగ్ను వేగవంతం చేస్తుంది. కిండర్గార్టెన్ నుంచి ఇంటర్ వరకు అందరి విద్యార్థులకూ ఉపయోగపడుతుంది.గామా.యాప్: ప్రాంప్ట్ల నుంచి పూర్తి స్లైడ్ డెక్లు, సులభంగా అర్థమయ్యేలా ఒక పేజీలో డాక్యుమెంట్, సాధారణ సైట్స్ను కూడా రూపొందిస్తుంది. వాటికి తుదిమెరుగులు దిద్ది పీపీటీ, గూగుల్ స్లైడ్స్, పీడీఎఫ్లోకి మార్చడానికి వీలు కల్పిస్తుంది. కస్టమైజబుల్ ఏఐ సాధనాలుజెమినై జెమ్స్: సొంత, తేలికైన ఏఐ సాధనాలను సృష్టించడానికి అనుమతిస్తుంది. కథనాలను సంక్షిప్తంగా రూపొందించడం, కేస్ స్టడీస్ విశ్లేషణ, అధ్యయన అంశాలను తయారు చేయడం వంటి నిర్దిష్ట పనులు చేసిపెడుతుంది.చాట్జీపీటీ స్టడీ మోడ్: చాట్జీపీటీ కేవలం ప్రశ్నోత్తరాలకే పరిమితమైన సాధనం కాదు. స్టడీ మోడ్ సాయంతో ప్రాజెక్ట్స్, వ్యక్తిగత, ప్రత్యేక జెనరేటివ్ ప్రీ–ట్రెయిన్్డ ట్రాన్్సఫార్మర్స్తో (జీపీటీ) విద్యార్థులకు నిర్మాణాత్మక అధ్యయన సహాయకుడిగా కూడా సాయపడుతుంది. -
పానీపూరీ కోసం మన జెన్ జెడ్ ఆందోళనలు!
జెన్ జెడ్.. నేపాల్ ఉద్యమం తర్వాత ఎక్కువగా వార్తల్లో కనిపించిన పదం. ఇదొక తరం. 1997 నుంచి 2012 మధ్య జన్మించినవాళ్లు ఈ తరం కిందకు వస్తారు. జెడ్ జనరేషన్వాళ్లను జూమర్లు (Zoomers), డిజిటల్ నేటివ్స్(Digital Natives) అని కూడా ముద్దుగా పిలుస్తుంటారు. ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్, సోషల్ మీడియా వంటి డిజిటల్ టెక్నాలజీతో పెరిగిన మొదటి తరం ఇదే. అయితే.. టెక్నాలజీతో మమేకమైన ఈ తరం.. సామాజిక చైతన్యం, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం.. వ్యక్తిత్వం విషయంలో ఎంతో మెరుగ్గానే ఉండేదే. కానీ, రాను రాను పరిస్థితి దిగజారిపోతూ వస్తోంది. సోషల్ మీడియాకు బానిసలవ్వడం, మానసిక ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించకపోవడంతో భారత్లో జెడ్ జెనరేషన్ పరిస్థితి దారుణంగా తయారవుతోందట. ఎంతలా అంటే.. గుజరాత్ వడోదరలో తాజాగా ఓ యువతి పానీపూరీ కోసం సత్యాగ్రహం చేపట్టింది. రూ.20 చెల్లించిన ఆమె ప్లేట్కు 6 పానీపూరీలు రావాల్సి ఉండగా.. ఆ పానీపూరి భయ్యా 4 ఇవ్వడంతో హర్టయ్యింది. నా రెండు పానీ పూరీలు నా కావాల్సిందేనని రోడ్డుపై బైఠాయించింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పోలీసులు బతిమాలి చివరకు ఆమెతో ధర్నా విరమింపజేశారు. ఈ క్రమంలో.. ఈ ఘటనపై సోషల్ మీడియాలో జోకులు పేలాయి. పానీపూరీ ప్రొటెస్టర్ అంటూ అనే హ్యాష్ట్యాగ్లు ట్రెండ్ అయ్యాయి. ‘‘జెన్ జెడ్ తరం.. చిన్న విషయాన్ని కూడా పెద్ద ఉద్యమంగా మార్చగలదు. చుట్టు పక్కల దేశాల్లో అది వేరే పోరాటం.. మన దేశంలో పానీపూరీ కోసం ఆరాటం. ఆమెది న్యాయమైన డీల్!’’ అంటూ వెటకారమూ ప్రదర్శించారు. కానీ, పానీపూరి కోసం వెక్కి వెక్కి ఏడ్చిన ఆమె మానసిక ఆరోగ్యం గురించి చర్చించేవాళ్లే కరువయ్యారు. న్యాయం కోసం పోరాటం చిన్నదైనా పెద్దదైనా ముఖ్యం అని అనేవాళ్లు కనిపించలేదు.A woman went to have panipuri but was served 4 instead of 6 for ₹20.She objected, sat down on the road in protest, and even broke into tears.The twist? Kudos to Vadodara Police for stepping in and resolving this pani-filled crisis swiftly!pic.twitter.com/37DYZAOMkd— Kumar Manish (@kumarmanish9) September 19, 2025ఆమె జెన్ జెడ్ తరానికి చెందినదే. తీవ్ర మానసిక ఒత్తిళ్లకు గురైందని కుటుంబ సభ్యులు, స్నేహితులు, తోటి ఉద్యోగులు చెప్పినట్లుగా అక్కడి లోకల్ మీడియా కథనాలు ఇచ్చింది. ఆ మానసిక స్థితిని ఆధారంగా చేసుకుని ఆమె కొట్టిందంటూ ఆ పానీపూరీ బండివాడు పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశాడు కూడా. కానీ, ఆమె ఈ స్థితికి కారణం.. తీవ్ర పని ఒత్తిడి, సోషల్ మీడియా అడిక్షన్తో నిద్రకు దూరం కావడం!. భారత్లో జెన్జీ ఆందోళనలు చేయడం మాట అటుండి.. జెన్జీ గురించే ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ఫార్చ్యూన్ తాజాగా ఓ సర్వే వివరాలను వెల్లడించింది. సెప్టెంబర్ 2025 ఎడిషన్లో జెన్ జీ గురించి ఓ ఆందోళనకరమైన అంశాలను పంచుకుంది. ఈ తరం ఇప్పుడు నిద్రలేమితో తీవ్రంగా బాధపడుతోందట. ముఖ్యంగా ఆర్థిక ఒత్తిడి, సోషల్ మీడియా వినియోగం, డూమ్ స్క్రోలింగ్ (Doomscrolling) లాంటి అలవాట్లు నిద్రను దూరం చేస్తున్నాయట. డూమ్ స్క్రోలింగ్ అంటే.. నిరంతరంగా నెగటివ్ వార్తలు, భయానక సమాచారం, ఆందోళన కలిగించే కంటెంట్ను ఆన్లైన్లో చదవడం, ఆపకుండా రీల్స్, పోస్టుల రూపంలో ఫోన్లో స్క్రోల్ చేసి చూడడం అన్నమాట. ఇప్పుడున్న జెడ్ జనరేషన్లో 70 శాతం.. ఉద్యోగం గురించి, ఇళ్ల అద్దెల లాంటి ఆర్థిక అంశాలను తీవ్రంగా ఆలోచిస్తూ మానసిక ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటోంది. అయితే ఆర్థిక ప్రణాళిక గురించి కాకుండా బెడ్ రాటింగ్ (బెడ్లో గంటల తరబడి ఉండటం), టీవీ చూడటం, సోషల్ మీడియా స్క్రోలింగ్ ద్వారా తాత్కాలిక ఉపశమనం పొందుతున్నారు. దీని ప్రభావం.. బ్రెయిన్ హెల్త్, మానసిక స్థితి, శారీరక శక్తి మీద తీవ్రంగా పడుతోంది. ఇది నిద్ర రిథమ్ను పూర్తిగా దెబ్బతీస్తోంది. రాత్రిళ్లు మధ్యలో మెలకువ రావడం వంటి సమస్యలూ పెరుగుతున్నాయి. ఇకోసోషియోస్పేర్ కథనం ప్రకారం.. Gen Z తరానికి చెందిన 100 మందిలో 93 మంది తమ నిద్ర సమయాన్ని సోషల్ మీడియా వల్ల కోల్పోతున్నారని అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ చెబుతోంది. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల వల్ల నిద్రకు అవసరమైన మెలటోనిన్ ఉత్పత్తి తగ్గిపోతుందన్నది అసలు ముచ్చట. ఫోమో (Fear of Missing Out) వల్ల Gen Z ఆన్లైన్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. అంటే ఏదైనా మంచి విషయం, అనుభవం, లేదంటే అవకాశాన్ని కోల్పోతున్నానేమో అనే భయం. ఉదాహరణకు.. మీ ఫ్రెండ్స్ ట్రిప్కు వెళ్లి ఫోటోలు పోస్ట్ చేస్తే, మీరు వెళ్లలేకపోయినందుకు బాధపడటం. ఎవరో కొత్త ఫోన్ కొనుగోలు చేస్తే, మీ ఫోన్ పాతదిగా అనిపించడం. ట్రెండింగ్ వీడియోలు, ఫ్యాషన్, ఈవెంట్స్.. అన్నింటిని మిస్ అవుతున్నానేమో అనే భావన ఇలాగన్నమాట. ఇది నిద్రలేమి, ఆత్మవిశ్వాస లోపం, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలకు దారి తీస్తోందివీటి నుంచి బయటపడాలంటే.. వరీ విండో అనే పద్ధతిని పాటించాలని మానసిక ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంటే.. రాత్రి దాకా కాకుండా రోజు మధ్యలోనే ఆ ఆందోళనలపై ఆలోచించేందుకు సమయం కేటాయించాలంటున్నారు. తద్వారా నిద్ర చెడిపోదని చెబుతున్నారు. అలాగే.. డిజిటల్ డిటాక్స్, స్క్రీన్-ఫ్రీ బెడ్రూమ్, మెడిటేషన్ వంటి అలవాట్లు నిద్రను మెరుగుపరుస్తాయి కూడా.::వెబ్డెస్క్ ప్రత్యేకం -
సరదా ఈత.. కాకూడదు గుండె కోత
విశాఖపట్నం నాయుడుతోట సమీపంలోని మేహాద్రిగెడ్డ రిజర్వాయర్లో ఇటీవల ఇద్దరు యువకులు నీట మునిగి మృతి చెందారు. పెందుర్తికి చెందిన బల్లంకి శేఖర్(18), ఇతని సోదరుడు వాసు, చినముషిడివాడకు చెందిన యాడాడ లక్ష్మణ్కుమార్ (18) సరదాగా రిజర్వాయర్ ఒడ్డున కూర్చొని ఉండగా శేఖర్ చెప్పు నీటిలో పడిపోయింది. రిజర్వాయర్ అంచు పట్టుకుని దానిని బయటకు తీసే క్రమంలో నాచు కారణంగా నీటిలో పడిపోయాడు. పైకి, కిందికి మునకలేస్తుండగా ఒడ్డు నుంచి లక్ష్మణ్ కుమార్ చేయి అందించబోయాడు. అయితే శేఖర్ అమాంతం.. లక్ష్మణ్ చేయిని లాగేయడంతో ఇద్దరూ నీట మునిగి పోయారు. వీరిద్దరికీ ఈత రాదు. ఒడ్డునే ఉన్న వాసు (ఇతనికి ఈత వచ్చు) నీటిలోకి దూకి వారిని రక్షించబోగా.. ఇతన్ని గట్టిగా పట్టేసుకున్నారు. దీంతో ముగ్గురూ నీటిలో మునిగి పోతుండగా ఒడ్డున ఉన్న మరో వ్యక్తి గమనించి నీటిలోకి దూకి.. ఒక్క వాసును మాత్రమే కాపాడగలిగాడు. మొన్నామధ్య అన్నమయ్య జిల్లా రాజంపేటలో ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు, మచిలీపట్నం సమీపంలో నలుగురు విద్యార్థులు ఇలానే మృత్యువాత పడ్డారు. ఇలాంటి సంఘటనలు ప్రతి రోజూ రాష్ట్రంలో ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. చాలా మంది విద్యార్థులు ఈత రాక, మరికొందరు ఈత వచ్చినా కూడా ఇలాంటి ఘటనల్లో మృతి చెందుతున్నారు. చాలా మందికి ఈత వచ్చినా ‘రెస్క్యూ’ (కాపాడటం) ఎలా చేయాలో తెలియక పోవడం విచారకరం.» చాలా దేశాల్లో స్విమ్మింగ్, సైక్లింగ్, కుకింగ్.. అనేవి విద్యార్థి దశలోనే మాండటరీ. ప్రతి వ్యక్తికి ఏదో ఒక దశలో ఇవి చాలా ముఖ్యం. ఇవి వస్తేనే ఉన్నత విద్యలో ప్రవేశం ఉంటుంది. మన దేశంలో మాత్రం అంత ముఖ్యం కాదు. ఇవన్నీ ఐచ్ఛికం. కుకింగ్ (వంట చేయడం) ఎంత ఇంపార్టెంటో మొన్న కరోనాలో మనకు బాగా తెలిసొచ్చింది. ఈత అనేది ఎంత ఉపయోగకరమో పైన చెప్పుకున్న ఘటనల్లాంటివి మనకు తారస పడినప్పుడు తెలుస్తుంది. » చాలా మందికి.. ప్రత్యేకించి యువతకు నీటి గురించి అవగాహన ఉండదు. ఆ.. ఏమవుతుంది అనుకుని నీటిలో దిగేస్తుంటారు. ఫ్రెండ్స్తో కలిసి బీచ్లకు, నది ఒడ్డుకు పిక్నిక్లకు వెళ్లినప్పుడు లోతు గమనించకుండానే ముందుకెళుతూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటుంటారు. మరికొంత మంది స్విమ్మింగ్ పూల్లో పట్టుమని 10 మీటర్లు కూడా ఈదలేని విధంగా ఉదరాబదరా ఈత నేర్చుకుని ‘మాకూ ఈత బాగా వచ్చు’ అని భ్రమ పడుతుంటారు. » పై ఈత (ఫ్రీ స్టైల్), లో ఈత (అండర్ వాటర్), వెనకీత (బ్యాక్ స్ట్రోక్), పక్కీత (సైడ్ స్ట్రోక్), నిలువీత (స్టాండింగ్ పొజిషన్), ఏటీత (బటర్ఫ్లై స్ట్రోక్), కప్పీత (బ్రెస్ట్ స్ట్రోక్) అని ఈతలో చాలా రకాలున్నాయి. చాలా మంది ఇవన్నీ నేర్చుకున్నప్పటికీ ఎప్పుడు ఏ ఈత అవసరమో తెలుసుకోరు. నేర్పించే వారు కూడా చెప్పరు. భారీ పరిమాణంలో నీరు నిల్వ ఉన్న చోట వెనకీత (బ్యాక్ స్ట్రోక్), కొద్దిపాటి ప్రవాహాలకు ఎదురీదాల్సి వచ్చినప్పుడు, సుడిగుండాల్లో చిక్కుకున్నప్పుడు ఏటీత (బటర్ఫ్లై స్ట్రోక్), చిన్నపాటి కాలువలు దాటాల్సి వచ్చినప్పుడు పై ఈత (ఫ్రీ స్టైల్), నీటిపైన చెత్తా చెదారాలు, పరిశ్రమల వ్యర్థాలు తేలుతున్నప్పుడు అండర్ వాటర్ ఈత అవసరం. అన్నింటికంటే బ్యాక్ స్ట్రోక్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఎక్కువగా అలుపు రాదు. మధ్య మధ్యలో నీటిపై తేలియాడుతూ రిలాక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎంత దూరమైనా ఇలా నెమ్మదిగా వెనక్కు వెళ్లిపోవచ్చు. » చాలా మంది యువతకు కొద్దో గొప్పో ఈత వచ్చి కూడా చనిపోవడం చూస్తున్నాం. ఇలాంటి చాలా ఘటనల్లో బయటకు చెప్పలేని నిజం ఏమిటంటే వారు మద్యం మత్తులో ఉండటం. సరదాగా స్నేహితులతో కలిసి పిక్నిక్లకు వెళ్లినప్పుడు మందు (లిక్కర్) తాగుతుంటారు. అలా మద్యం మత్తులో నీటిలోకి దిగినప్పుడు ఎంత దూరం లోపలికి పోతున్నారో గమనించరు. తిరిగి వెనక్కు వచ్చే క్రమంలో ఆయాసం ఎక్కువై.. బాడీ బ్యాలెన్స్ చేసుకోలేక.. ఆలోచించే కెపాసిటీ కోల్పోయి నీట మునిగి చనిపోతున్నారు. అందువల్ల మద్యం తీసుకున్నప్పుడు పొరపాటున కూడా ఈతకు దిగరాదని యువతకు గట్టిగా చెప్పాలి. మన పిల్లలకు మనం నీరంటే భయమన్నా నేర్పాలి. లేదా ఈత అయినా నేర్పించాలి. – సాక్షి స్పెషల్ డెస్క్ రెస్క్యూ చాలా కీలకం ఇకపోతే చాలా మందికి ఈత బాగా వచ్చినప్పటికీ రెస్క్యూ చేయడం తెలియదు. ఆపదలో ఉన్న వారిని కాపాడబోయి వీరూ మృత్యువాత పడుతుంటారు. ఎందుకంటే నీట మునిగి పోతున్న వారి దగ్గరకు మనం వెళ్లగానే వారు మనల్ని గట్టిగా పట్టేసుకుని ముంచేస్తారు. అందువల్ల ఎవరినైనా కాపాడాలనుకుంటే నేరుగా వారి ముందుకు వెళ్లకూడదు. ఒకవేళ వారు పట్టుకోజూసినా గట్టిగా తోసేసి విదిలించుకోవాలి. వారి వెనక్కు వెళ్లి సంకల కింద ఒక చేయి వేసి పట్టుకోవాలి. అంటే వారి తలను మన భుజం వద్ద పెట్టుకోవాలి. అప్పుడు వారికి శ్వాస తీసుకోవడానికి వీలవ్వడంతో మనకు సహకరిస్తారు. మరో చేత్తో నెమ్మదిగా రివర్స్ స్ట్రోక్లో ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకోవాలి. అనంతరం ప్రథమ చికిత్స చేయాలి. ఈతలో మరింత ప్రొఫెషనల్గా తయారవ్వడం కోసం రాష్ట్రీయ లైఫ్ సేవింగ్ సొసైటీ శిక్షణ ఇస్తోంది. మరిన్ని వివరాలకు ‘లైఫ్ సేవింగ్ ఇండియా డాట్ ఆర్గ్’ వెబ్సైట్లో సంప్రదించవచ్చు. కొత్త ప్రాంతాల్లో జాగ్రత్తలు తప్పనిసరిచాలా మందికి అంతో ఇంతో ఈత వచ్చినా కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు ప్రమాదాలబారిన పడుతుంటారు. ప్రధానంగా పరిసరాలు, లోతు గమనించకుండా డైవ్ చేస్తుంటారు. ఇది సరికాదు. తొలుత నీటిలోకి దూకే ముందు ఎంత లోతులో ఉందో అంచనా వేయాలి. సుడిగుండాలున్నాయేమో గమనించాలి. కింద బురద మట్టి, పదునైన రాళ్లు ఏమైనా ఉన్నాయా అని కూడా పరిశీలించాలి. ఇవన్నీ తెలుసుకోకుండా అమాంతం దూకేయడం సరికాదు. స్విమ్మింగ్ పూల్లో ఈదినట్లు అన్నిచోట్లా సాధ్యం కాదు. ఇంకో విషయం.. ‘నాకు ఈత బాగా వచ్చు.. మీకు ఏమీ కాదు.. నేనున్నాగా.. మీరు దిగండి..’ అంటూ కొంత మంది పిక్నిక్లకు వెళ్లినప్పుడు స్నేహితులను బలవంతం చేస్తుంటారు. తీరా లోపలకు దిగి.. కొంత దూరం వెళ్లాక బురదలో కాళ్లు ఇరుక్కుపోతే.. లేక కింద గుంత లోతుగా ఉంటే రెస్క్యూ చేయడం చాలా కష్టం. అందుకే అన్నీ గమనించాలి. ఈత గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అందరికీ చాలా అవసరం. ప్రత్యేకించి ఎన్నో అనారోగ్యాలకు చక్కటి మందు. ఒత్తిడిని సహజంగా తగ్గిస్తుంది. భారీ వర్క్ అవుట్స్ చేయలేని, జాగింగ్, వాకింగ్కు వెళ్లలేని వారికి అత్యద్భుతమైన ఎక్సర్సైజ్ స్విమ్మింగ్. – కీర్తన సుందరమూర్తి, స్విమ్మింగ్ కోచ్, విజయవాడ -
మిలియనీర్ కుటుంబాలు 8,71,700
దేశంలో మిలియనీర్ కుటుంబాల (ఒక మిలియన్ డాలర్లు లేదా రూ.8.5 కోట్ల నికర విలువ ఉన్నవి) సంఖ్య కేవలం 4 ఏళ్లలో 90 శాతం పెరిగింది. 2021లో వీటి సంఖ్య 4,58,000 లక్షల నుంచి 2025లో ఏకంగా 8,71,700కు ఎగబాకింది. 2017– 2025 మధ్య మిలియనీర్ కుటుంబాల సంఖ్య ఏకంగా 445 శాతం పెరగడం విశేషం. దేశంలోని మొత్తం కుటుంబాల్లో.. ఇవి 0.31 శాతం. రాష్ట్రాల్లో మహారాష్ట్ర అత్యధిక మిలియనీర్ కుటుంబాలతో నంబర్ వన్ స్థానంలో ఉంటే.. నగరాల్లో ముంబై టాప్లో నిలిచింది. ఇలాంటి ఆసక్తికర విషయాలు ‘మెర్సిడెజ్ బెంజ్ హురున్ ఇండియా వెల్త్ రిపోర్ట్ 2025’లో వెల్లడయ్యాయి.- సాక్షి, స్పెషల్ డెస్క్ప్రధాన కారణాలుపట్టణ ఆర్థిక వృద్ధి, వ్యాపార ఆలోచనలు పెరగడం, బలమైన ఈక్విటీ మార్కెట్లు, టెక్నాలజీ, వివిధ రకాల పెట్టుబడి మార్గాలు వంటి అనేక కారణాలు మిలియనీర్ కుటుంబాలు పెరగడానికి దోహదం చేశాయి.మరింత ధనికులుగా..2017 నాటి మిలియనీర్లలో 2025 నాటికి రూ.100 కోట్ల క్లబ్లోకి చేరినవారు 5 శాతం అంటే 66,800 కుటుంబాలు. రూ.200 కోట్ల క్లబ్లోకి చేరింది 1.3 శాతం. రూ.1,000 కోట్ల క్లబ్లోకి చేరింది 0.07 శాతం. రూ.8,500 కోట్ల క్లబ్ అంటే బిలియనీర్ల జాబితాలోకి చేరింది 0.01 శాతం.. అంటే 360 కుటుంబాలు.ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ..మిలియనీర్ కుటుంబాలు అంటే గతంలో ముంబై, ఢిల్లీ వంటి ప్రథమ శ్రేణి నగరాల్లోనే ఉండేవి. కానీ, ఇప్పుడు అహ్మదాబాద్, సూరత్, విశాఖపట్నం, జైపూర్, లక్నో వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఈ సంఖ్య పెరుగుతోంది.ఆర్థిక స్వేచ్ఛ‘మెర్సిడెజ్ బెంజ్ హురున్ ఇండియా లగ్జరీ కంజ్యూమర్ సర్వే’ ప్రకారం.. ఏటా పర్యటనలు, చదువు, వినోదం కోసం 60 శాతం మిలియనీర్ కుటుంబాలు రూ.కోటి వరకు ఖర్చు చేస్తున్నాయి.⇒ ‘ఎంత సంపద ఉంటే ఆర్థిక స్వేచ్ఛ’ ఉన్నట్టు భావిస్తారు అని అడిగితే.. 27 శాతం మంది రూ.50 కోట్లు చాలు అని చెప్పారు. రూ.200 కోట్లు ఉండాల్సిందే అని 20 శాతం మంది స్పష్టం చేశారు.⇒ 40 శాతం మంది ఒక కారును 6 ఏళ్లకుపైనే వాడుతున్నారు.⇒ 27 శాతం మంది.. యోగా తమకు ఇష్టమైన ఫిట్నెస్ కార్యక్రమం అని చెప్పారు.⇒ విదేశాల్లో చదువుల విషయానికొస్తే.. అమెరికా (19 శాతం మంది), యూకే (14 శాతం) మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.⇒ ఆసక్తికరంగా 42 శాతం మంది తమ పిల్లలను భారతదేశంలోనే చదివిస్తామని వెల్లడించారు. -
బీహార్లో నువ్వా-నేనా?? పీపుల్ పల్స్ ఏమో ఇలా..
జాతీయ స్థాయిలో బీహార్ రాష్ట్ర రాజకీయాలకు ప్రత్యేకత ఉంటుంది. దశాబ్దాలుగా సంకీర్ణ ప్రభుత్వాలకు కేంద్రంగా ఉన్న బీహార్ రాష్ట్రంలో ఏయే పార్టీలు ఎప్పుడు ఏ కూటమిలో ఉంటాయో..? ఎప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో అంచనా వేయడం తేలిక కాదు. నిత్యం అనిశ్చిత రాజకీయాలకు కేరాఫ్గా ఉండే బీహార్లో త్వరలో జరగబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే, ‘ఇండియా’ కూటముల మధ్య తీవ్ర పోటాపోటీ నెలకొని ఉందని క్షేత్రస్థాయిలో పరిస్థితులు వెల్లడిస్తున్నాయి. 2025 అక్టోబర్/నవంబర్లో జరిగే శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 41 నుండి 44 శాతం, ‘ఇండియా’ కూటమికి 40 నుండి 42.5 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని మూడ్ సర్వేలో తేలింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ 30 నుండి 31 శాతం ఓట్లతో, బీజేపీ 28 నుండి 29 శాతం ఓట్లతో ఆధిపత్యం కనబరుస్తూ వారి కూటముల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. రెండు కూటముల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటాపోటీగా ఉండబోతున్న బీహార్ ఎన్నికల్లో.. ప్రశాంత్ కిశోర్ స్థాపించిన జన్ సురాజ్ పార్టీ (జేఎస్పీ) 6 నుండి 8 శాతం ఓట్లతో నిర్ణయాత్మక పాత్ర పోషించనుంది. ఇతరులు 7.5 నుండి 9 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నాయి. ఈ గణాంకాల్లో 3 శాతం ప్లస్/మైనస్ ఉండే అవకాశాలున్నాయి. కుల రాజకీయాలకు పెట్టింది పేరైన బీహార్లో స్థానిక సమస్యలు, సంక్షేమ హామీలు, పార్టీలలో అసంతృప్తులు ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ-సౌత్ ఫస్ట్ మీడియా సంస్థ సంయుక్తంగా బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాభిప్రాయం కోసం మూడ్ సర్వే నిర్వహించగా ప్రస్తుతం ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని అధికార ఎన్డీయే ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిపై స్వలంగా కేవలం ఒక్క శాతం ఓట్ల ఆధిపత్యం కనబరుస్తుందని వెల్లడయ్యింది. ఎన్నికల సమయానికి ఫలితం ఎటైనా మారవచ్చు.బీహార్లో 2020 శాసనసభ ఎన్నికల్లోనూ ఎన్డీయే, మహాఘట్ బంధన్ కూటములు పోటాపోటీగా తలపడి చెరో 37 శాతం ఓట్లు సాధించాయి. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా రెండు కూటముల మధ్య ఓట్ల వ్యత్యాసం సుమారు 11 వేలు మాత్రమే. ఆర్జేడీ 75 స్థానాలతో మొదటి స్థానంలో నిలవగా, బీజేపీ 74 స్థానాలతో ఒక్క సీటు తేడాతో రెండో స్థానంలో నిలిచింది. సంక్లిష్ట రాజకీయాలకు నెలవైన బీహార్ లో గతంలో వలే మరోసారి ఎన్డీయే, మహాఘట్ బంధన్ కూటముల మధ్యనే ప్రధాన పోటీ ఉండనుంది. బీజేపీ, జేడీ (యూ), హెచ్ఏఎమ్, ఎల్జేపి (ఆర్వీ), ఆర్ఎల్ఎమ్ పార్టీలతో కూడిన అధికార ఎన్డీయే కూటమి రాష్ట్రంలోని అగ్రవర్ణాలు, ఈబీసీ, దళిత వర్గాల ఓట్లపై భారీ ఆశలు పెట్టుకుంది. జాతీయ స్థాయిలో ‘ఇండియా’ కూటమిగా చెలామణి అవుతూ బీహార్లో మహాఘట్ బంధన్ పేరుతో ప్రతిపక్షాలు గట్టి పోటీ ఇస్తున్నాయి. కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు, వికశీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) పార్టీలతో కూడిన ‘ఇండియా’ (మహాఘట్ బంధన్) కూటమి రాష్ట్రంలోని యాదవ, ముస్లిం సామాజిక వర్గాల్లో పటిష్టంగా ఉంది. వీరితో పాటు ఓబీసీ వర్గాల్లో పట్టు కోసం ప్రయత్నిస్తోంది. గతంలో ‘మార్పు’ (2005), ‘సుశాసన్’ (2010),ఉద్యోగాలు (2020) నినాదాలతో రాష్ట్రంలో ఎన్నికలు జరగ్గా, ఈ సారి ఎలాంటి ప్రత్యేక నినాదం లేకుండా ప్రభుత్వ వ్యతిరేకత, సంక్షేమ పథకాలు, కుల సమీకరణాలతో పాటు నూతన పార్టీ జేఎస్పీ ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. రాష్ట్రంలో ధరల పెరుగుదల, వలసలు, నిరుద్యోగం అంశాలపై ఉన్న వ్యతిరేకతను సంక్షేమం, అభివృద్ధి అంశాలు తగ్గించడం ఎన్డీయేకు కలిసివస్తోంది. ‘జీవికా’ పథకంలో భాగస్వాములైన మహిళలు మద్యనిషేధం, విడో పింఛన్లు, సబ్సీడీలతో నితీశ్ కుమార్ పట్ల ఆకర్షితులవుతున్నారు. ఆశించిన ఉద్యోగాలు రాలేదని యువత విమర్శిస్తున్నా గత ‘జంగిల్ రాజ్’ కంటే నితీశ్ ప్రభుత్వంలో స్థిరత్వం ఉందని అంగీకరిస్తున్నారు. రైతులు కులాల ఆధారంగా చీలిపోయారు. ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) వంటి జాతీయ అంశాల కన్నా స్థానిక అంశాలే ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయని మూడ్ సర్వేలో వెల్లడైంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా స్థానిక అంశాలకే పెద్దపీట దక్కనుంది. తమ ఎమ్మెల్యేల పనితీరుతో పాటు స్థానిక సమస్యల ఆధారంగానే ఓటు వేస్తామని చాలా మంది మూడ్ సర్వేలో చెప్పారు. బీహార్ ఎన్నికల్లో ఎప్పటిలా ఈ సారి కూడా సామాజిక కులాలే కీలకం కానున్నాయి. రెండు ప్రధాన కూటముల్లో పార్టీల మధ్య సీట్ల కేటాయింపులు, పార్టీల అభ్యర్థుల ఎంపికలో సామాజిక అంశాలకే ప్రాధాన్యత ఉండనుంది. అభ్యర్థుల ఎంపిక తర్వాతే ఎవరికి ఓటు వేయాలో నిర్ణయిస్తామని ఓటర్లు చెప్పారు. ఎన్డీయేకు మద్దతుగా ఉన్న ఈబీసీ ఓటర్లు తమ సామాజిక వర్గం వారికి మహాఘట్ బంధన్ టికెట్లిస్తే వారికి ఓటు వేయడానికి వెనుకాడమని చెప్పారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్లో అఖిలేశ్ యాదవ్ పీడీఏ (పిచ్చడ్, దళిత్, అల్పసంఖ్యాక్) వ్యూహం విజయవంతమైనా, బీహార్లో తేజస్వీ యాదవ్ ఎమ్-వై (ముస్లిం, యాదవ్) వ్యూహం విఫలమైంది. టికెట్ల కేటాయింపులో కీలకమైన సామాజిక సమీకరణలను విజయవంతంగా నిర్వహించలేకపోతే పార్టీల్లో అసంతృప్తి పెరిగే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బీహార్ లో చేపట్టిన ‘ఓట్ అధికార్ యాత్ర’ ప్రజాకర్షణగా నిలిచింది. అయితే ఈ యాత్ర ద్వారా రాష్ట్రంలో రెండు కూటములకు మద్దతిచ్చే సామాజిక సమీకరణాల్లో పెద్ద మార్పు కనిపించలేదు. సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే రాష్ట్రంలో 15.5 శాతం ఉన్న అగ్రవర్ణాల్లో 3 శాతం బ్రాహ్మణులు, 3.4 శాతం రాజ్పుత్లు, 2.8 శాతం భూమిహార్లు, 0.6 శాతం కాయస్తులు బీజేపీకి మద్దతిస్తున్నారు. బీహార్ లో 14.2 శాతం ఉన్న యాదవ్లు ఆర్జేడీ వెంట ఉన్నా మతం ఆధారంగా మిథిలా, సీమంచల్ లో బీజేపీకి కొంత యాదవ్ల మద్దతు లభిస్తోంది. 2.8 శాతం ఉన్న కుర్మీలు, 4.2 శాతం ఉన్న కుష్వాహాలు దక్షిణాన నితీశ్ వెంట ఉన్నా, ఉత్తరాదిన చీలిక కనిపిస్తోంది. రాష్ట్రంలో కీలకమైన 36 శాతం ఉన్న ఈబీసీలు జేడీ(యూ), బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. వీరిలో నిశాద్ సామాజికవర్గం ఉప కులాలు ప్రాంతాలవారీగా ఎన్డీయే, వీఐపీ వైపు ఉన్నారు. 19.65 శాతం ఉన్న షెడ్యుల్ కులాలు, 5 శాతం ఉన్న చమార్లు ఆర్జేడీ,కాంగ్రెస్,వామపక్షాల వైపు, 5 శాతమున్న పాశ్వాన్ లు ఎల్జీపీ (ఆర్వీ) వైపు ఉండగా 3 శాతం ఉన్న ముషార్లు ప్రాంతాల వారీగా చీలిపోయారు. 1.68 శాతం ఉన్న షెడ్యూల్ తెగల ఓట్లు రెండు కూటముల మధ్య చీలిపోతున్నాయి. బీహార్ లో 17.7 శాతం ఉన్న ముస్లింలు మహాఘట్ బంధన్ కు పటిష్టమైన ఓటు బ్యాంకుగా నిలుస్తున్నారని పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది. సీమాంచల్ ప్రాంతంలో ఏఐఎంఐఎం పార్టీకి కొంత ముస్లింల మద్దతు లభిస్తోంది. బీహార్లో ఏఐఎంఐఎం కీలక పాత్ర పోషిస్తోంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఆరు స్థానాల్లో గెలిచినా కిషన్గంజ్ లోక్ సభ నియోజవర్గంతో పాటు సమీపంలో ఉన్న అరారియాకే పరిమితమైంది. గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలలో ఐదుగురు ఆర్జేడీలో చేరడంతో ఏఐఎంఐఎం బలహీనపడింది. అయితే వక్ఫ్ సవరణ బిల్లుపై ఆ పార్టీ ఉద్యమంతో ఆ పార్టీ కొన్ని ప్రాంతాల్లో పట్టు సాధించింది. వక్ఫ్ చట్టంపై ఓవైసీ పోరాడుతున్నారనే అభిప్రాయం సీమంచల్ లో ముస్లిం యువత భావిస్తోంది. అయితే రాహుల్ గాంధీ యాత్రతో ఏఐఎంఐఎంకు ముస్లింలలో మద్దతు తగ్గుతోందని సర్వేలో తేలింది. ‘ఇండియా’ గ్రూపులో చేర్చుకోవాలని ఏఐఎంఐఎం కోరుతున్నా కాంగ్రెస్, ఆర్జేడీ నుండి ఆశించన స్పందన రాలేదు. కిషన్గంజ్తో పాటు పూర్ణియా, అరారియా వంటి ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో మద్దతు లభిస్తుండడంతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసినా ఏఐఎంఐఎం 1 నుండి 3 స్థానాల్లో గెలవవచ్చని మూడ్ సర్వేలో తేలింది.రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎన్నికల్లో కీలకంగా మారి ప్రభుత్వ వ్యతిరేకత బయటపడకుండా చేస్తున్నాయి. ఎన్డీయే, మహాఘట్ బంధన్ కూటములు బీహార్లో పోటాపోటీగా హామీలిస్తున్నాయి. నితీశ్ ప్రభుత్వం 1.67 కోట్ల కుటుంబాలకు 125 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ ఇవ్వడంతో గ్రామీణ ప్రాతాల్లో ఒక్కో కుటుంబానికి నెలకు రూ.200 నుండి 300 మేర విద్యుత్ బిల్లులు తగ్గుతాయి. మహిళల కోసం ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన’ పథకం కింద రూ.10 వేలు ఉపాధి ప్రోత్సాహకం, మహిళా స్వయం సహాయక సంఘాలకు తక్కువ వడ్డీకి రూ.2 లక్షల రుణాలిస్తామని ఎన్డీయే హామీ ఇచ్చింది. బీహార్ రాష్ట్రంలో 12 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న ఎన్డీయే మరో కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలో ట్రైబెల్స్ కు భూమి హక్కులు కల్పిస్తామని ఎన్డీయే హామీ ఇచ్చింది. ఎన్డీయే హామీలకు పోటీగా మహాఘట్ బంధన్ కూటమి కూడా బీహార్ ప్రజలకు భారీ హామీలిచ్చింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ప్రతి మహిళకు నెలకు రూ.2,500, రాష్ట్రంలో వలసల నివారణకు స్థానికులకు 100 శాతం ఉద్యోగాలు, ప్రతి పంచాయతీలో ఐటీఐ ఏర్పాటు చేస్తామని ఆర్జేడీ హామీలిచ్చింది. అన్ని రంగాల్లో మహిళా కోటా కల్పించి, వారికి భద్రత ఇస్తామని మహాఘట్ బంధన్ హామీ ఇచ్చింది. ఈ రెండు కూటములకు పోటీగా జేఎస్పీ పంచాయత్ స్కూల్స్, యువతకు ఉద్యోగాలు, వృద్ధులకు రూ.2000 పింఛన్, మహిళలకు రుణాలు హామీలిస్తూ, రాష్ట్రంలో అవినీతి నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటామని చెబుతోంది. శాంతి భద్రతల అంశానికి సంబంధించి బీహార్ లో ఆర్జేడీ గెలిస్తే రాష్ట్రంలో మళ్లీ ‘జంగిల్ రాజ్’ వస్తుందని ఎన్డీయే మద్దతుదారులు ప్రచారం చేస్తుండగా, నితీశ్ పాలనలో రాష్ట్రంలో అవినీతి, నేరాలు పెరిగిపోయాయని మహాఘట్ బంధన్ మద్దతుదారులు విమర్శిస్తున్నారు. చిన్నపార్టీలైన హెచ్ ఏఎమ్, ఆర్ ఎల్ ఎమ్ ఎన్డీయే కూటమిలో, వీఐపీ, వామపక్షాలు మహాఘట్ బంధన్ కూటమిలో కీలకపాత్ర పోషించనున్నాయి.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్, క్షేత్రస్థాయిలో సంస్థగతంగా బలంగా ఉండడం, డిజిటల్ రంగంలో దూసుకుపోవడం అంశాలతో రాష్ట్రంలో బీజేపీ 28 నుండి 29 శాతం ఓట్లతో పటిష్టంగా కనిపిస్తున్నా, ఆ పార్టీ నుండి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిపేరు వినిపించకపోవడం పెద్ద లోపంగా కనిపిస్తుందని క్షేత్రస్థాయిలో పర్యటించిన పీపుల్స్ పల్స్ బృందం పరిశీలనలో తేలింది. 30 నుండి 31 శాతం ఓట్లతో బలంగా ఉన్న ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పలు హామీలతో ముందుకెళ్తున్నా అగ్రవర్ణాల్లో ఆ పార్టీపై వ్యతిరేకత ఉండడం వారికి అడ్డుగా మారుతోంది. కాంగ్రెస్ యాత్రలతో బలపడుతున్నట్టు కనిపిస్తున్నా, ఆ పార్టీ సంస్థాగతంగా బలహీనంగా ఉంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జేడీ (యు) ఈబీసీ సామాజికవర్గంలో బలంగా ఉండి, మహిళల మద్దతు పొందుతోంది. అయితే 74 ఏండ్ల వయస్సు గల ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆరోగ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్జేపీ(ఆర్వీ) నేత చిరాగ్ పాశ్వాన్ కు దళిత సామాజిక వర్గంలో మంచి చరిష్మా ఉన్నా, ఎన్డీయేలో చీలిక భయాలున్నాయి. జేఎస్పీ పాదయాత్రలతో రాష్ట్ర వ్యాప్తంగా పలు హామీలతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నా ఆ పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంక్ లేకపోవడం బలహీనత.బహుముఖ పోటీలో కూటముల మధ్య సీట్ల కేటాయింపులు, ఓటర్లను ఆకర్షించడం, చివరి నిమిషం వరకు చేసే ప్రచారంపై ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఈబీసీలకు సరైన ప్రాధాన్యతిస్తూ టికెట్లు కేటాయిస్తే ప్రయోజనం ఉండే అవకాశాలున్నాయి. ఎన్డీయేలో బీజేపీ, నితీశ్, చిరాగ్ మధ్య విభేదాలొస్తే ఫలితంపై ప్రభావం చూపిస్తాయి. జేఎస్పీ ఎన్నికల్లో కింగ్మేకర్ పాత్ర పోషించనుంది. మొత్తం మీద బీహార్ ప్రజలు ఓటేస్తుంది కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం కోసమే కాదు. పార్టీలు హామీలిస్తున్న సంక్షేమాలు కుల రాజకీయాలను దాటగలవా? యువత ఆశలు విధేయతలను అధిగమించగలదా? ప్రశ్నలకు సమాధానం పోటా పోటీ ఎన్నికల ఫలితాలే తేలుస్తాయి. మరోవైపు ఎన్నికల వ్యూహకర్తగా జాతీయ స్థాయిలో పేరుగాంచిన ప్రశాంత కిశోర్ సొంత రాష్ట్రంలో ఎలాంటి ప్రభావం చూపిస్తారో అని దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. బీహార్ అసెంబీ ఎన్నికలు కేవలం రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఆసక్తి రేపుతున్నాయి. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజార్టీ సాధించకపోవడంతో ఇతర పార్టీలపై ఆధారపడి కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మద్దతిస్తున్న ఇతర పార్టీల్లో బీహార్ కు చెందిన జేడీ (యు), ఎల్జేపీ పార్టీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ శాసనసభ ఎన్నికల ఫలితాలు జాతీయ స్థాయి రాజకీయాలను ప్రభావితం చేయడం ఖాయం. బీహార్ లో ఎన్డీయే మెజార్టీ సాధిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండకవపోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ కూటమికి మెజార్టీ రాకపోయినా లేదా ఏ కూటమిలోనైనా ముఖ్యమంత్రి పీఠంపై చిక్కుముడి పడినా జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశాలున్నాయి. :::ఆర్.దిలీప్ రెడ్డి, డైరెక్టర్, పీపుల్స్ పల్స్ -
సెమీకండక్టర్.. ‘డబుల్’ జోరు!
భారత సెమీకండక్టర్ మార్కెట్ విలువ ప్రస్తుత సంవత్సరంలో 54.3 బిలియన్ డాలర్లకు చేరవచ్చని.. 2030 నాటికి 13.8 శాతం వార్షిక వృద్ధి రేటుతో 103.5 బిలియన్ డాలర్లకు చేరుతుందని స్టాఫింగ్ కంపెనీ ‘క్వెస్ కార్ప్’ నివేదిక తెలిపింది. ‘ది చిప్ క్యాటలిస్ట్: ఇండియాస్ ఎమర్జింగ్ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్’ పేరుతో రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. భారీ స్థాయిలో వినియోగ మార్కెట్గా ఉన్న భారత్, ప్రపంచ సామర్థ్య కేంద్రంగా అవతరిస్తోంది.అయితే ఈ రంగం నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సెమీకండక్టర్ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 80 శాతం మందికి.. 10 సంవత్సరాల కంటే తక్కువ అనుభవం ఉంది. మధ్య స్థాయి, సీనియర్ రోల్స్లో నిపుణుల కొరత ఉంది. 55కుపైగా ఉన్న సెమీకండక్టర్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్లో (జీసీసీ) 60 వేల పైచిలుకు ఇంజనీర్లు పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ పరిశ్రమలో 2030 నాటికి నిపుణుల సంఖ్య 4,00,000లకు చేరనుంది. తద్వారా నిపుణుల సంఖ్య విషయంలో ప్రపంచంలో యూఎస్ తర్వాత భారత్ రెండో స్థానాన్ని ఆక్రమించనుంది. – సాక్షి, స్పెషల్ డెస్క్ -
బిగ్ రిలీఫ్
దసరా, దీపావళి పండగ ఆనందాలు రెట్టింపు కానున్నాయి. ఇటీవల కేంద్రం సవరించిన వస్తు సేవల పన్ను(జీఎస్టీ) శ్లాబులు ఈ నెల 22వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. గృహోపకరణాలు, ఆటో మొబైల్స్, ఎలక్ట్రానిక్ వంటి చాలా వరకు ఉత్పత్తుల ధరలు 10 శాతం మేర తగ్గనున్నాయి. గృహ నిర్మాణ భారం నుంచి ఉపశమనం కలగనుంది. దీంతో వాహనాలు, కార్లు, టీవీలు, సెల్ఫోన్లు వంటి ఉత్పత్తుల కొనుగోలుదారులు ఈనెల22 వరకు వాయిదా వేసుకుంటున్నారు. ఈ కామర్స్ సంస్థలు సైతం ఈనెల 22 తర్వాతే ఆఫర్లు అందించేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లు, ఆన్లైన్ సంస్థల్లో అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. – విశాఖ సిటీతగ్గనున్న నిత్యావసర ధరలు ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. ఉప్పు నుంచి పప్పు వరకు రేట్లు విపరీతంగా పెరిగాయి. ఈ క్రమంలో జీఎస్టీ సవరణలతో మరో వారం రోజుల్లో ఈ ధరలు దిగిరానున్నాయి. సాధారణ ప్రజలు నిత్యం వినియోగించే వస్తువులపై కేవలం 5 శాతం మాత్రమే జీఎస్టీ విధించారు. దీంతో పేస్ట్ నుంచి డ్రై ఫ్రూట్స్ వరకు ధరలు తగ్గనున్నాయి. వీటితో పాటు పన్నీర్, బ్రెడ్, వెన్న, నెయ్యి, పాస్తా, నూడుల్స్, కార్న్ఫ్లేక్స్, బిస్కెట్లు, కేకులు, స్వీట్లు వంటి ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల ధరలు అందుబాటులోకి రానున్నాయి. ఖరీదైన బాదం, జీడిపప్పు, పిస్తా, ఖర్జూరం వంటి వాటిపై కూడా జీఎస్టీ 12 నుంచి 5 శాతానికి తగ్గనుంది. ఇది సాధారణ ప్రజలకు భారీ ఉపశమనాన్ని అందించనుంది. వాహనాలపై 28 నుంచి 18 శాతానికి.. వాహనాల ధరలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి కేంద్రం కుదించింది. దీంతో వీటి ధరలు తగ్గనున్నాయి. సాధారణంగా దసరా, దీపావళి పండగ సీజన్లలో వాహనాలను కొనుగోలు చేయడం సెంటిమెంట్గా భావిస్తుంటారు. ఈ నెల 22వ తేదీ నుంచి బైక్లు, కార్లపై 10 శాతం వరకు ధరలు తగ్గే అవకాశాలు ఉండడంతో భారీగా వాహనకొనుగోళ్లు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బైక్, కార్ల కంపెనీలు తగ్గించిన ధరలను ప్రకటించాయి. బైక్లపై రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు, మధ్యస్థాయి కారుపై రూ.1.5 లక్షల వరకు తగ్గింపు ఉండనుంది. దీంతో కొనుగోలుదారులు ఈనెల 22 తర్వాతే వాహనాలను కొనుగోలు చేసేందుకు వాయిదా వేస్తున్నారు. అయితే కొన్ని షోరూమ్లు ప్రీ బుకింగ్లకు కూడా డిస్కౌంట్ ధరలు ప్రకటించాయి. లగ్జరీ కార్లపై 40శాతం జీఎస్టీ విధించారు. 350 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ ఉన్న బైక్లు, ఇతర లగ్జరీ వస్తువులపై ప్రత్యేక, అధిక స్లాబ్ వడ్డించారు. గృహ నిర్మాణ భారం నుంచి ఉపశమనం జీఎస్టీ సంస్కరణలతో రియల్ ఎస్టేట్ రంగానికి మంచి రోజులు కనిపిస్తున్నాయి. బిల్డర్లతో పాటు సొంతింటి నిర్మాణాలు చేపట్టే ప్రజలకు నిర్మాణ వ్యయం భారీగా తగ్గనుంది. దీంతో ఫ్లాట్లు, ఇళ్ల ధరలు తగ్గనున్నాయి. నిర్మాణ రంగంలో కీలకమైన సిమెంట్, ఇసుక, ఇటుకలు, గ్రానైట్, మార్బుల్స్, టైల్స్, రంగుల ధరలపై కేంద్రం జీఎస్టీని తగ్గించింది. సాధారణంగా ఇంటి నిర్మాణంలో అయ్యే ఖర్చులో 40–45 శాతం వ్యయం నిర్మాణ సామగ్రిదే ఉంటుంది. తాజా జీఎస్టీ సవరణతో నిర్మాణ సామగ్రిపై అయ్యే ఖర్చులో డెవలపర్కు 10–15 శాతం వరకు ఆదా అవుతుంది. ఫలితంగా మొత్తం ఇంటి నిర్మాణ వ్యయం 4–6 శాతం వరకు ఖర్చు తగ్గుతుంది. ఈ–కామర్స్లో ఆఫర్ల వెల్లువ ఈ–కామర్స్ సంస్థల్లో కూడా డిస్కౌంట్ల సందడి మొదలైంది. ఈ నెల 22వ తేదీ నుంచి అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’, ఫ్లిప్కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్’ పేర్లతో భారీ సేల్కు సిద్ధమవుతున్నాయి. ఇక మింత్రా, మీషో, షాపి వంటివి ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి. జీఎస్టీ సవరణలతో ఈ నెల 22వ తేదీ నుంచి అన్ని రకాల వస్తువులపై డిస్కౌంట్ల వర్షం కురిపించనున్నాయి. ఎల్రక్టానిక్ వస్తువుల ధరలు సైతం.. జీఎస్టీ సవరణతో ఎల్రక్టానిక్ ఉపకరణాలు ధరలు కూడా భారీగా తగ్గనున్నాయి. ఇప్పటి కంటే 10 నుంచి 13 శాతం మేర ధరలు దిగివచ్చే అవకాశాలు ఉన్నాయి. టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు ఇలా అన్ని రకాల ఎల్రక్టానిక్ వస్తువుల ధరల్లో వ్యత్యాసం భారీగా ఉండే అవకాశం ఉంది. వీటితో పాటు సెల్ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు కూడా అందుబాటు ధరల్లోకి రానున్నాయి. టీవీలపై రూ.5 వేలు నుంచి రూ.15 వేలు వరకు, మొబైల్ ఫోన్లపై రూ.2 వేలు నుంచి రూ.5 వేలు, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్లపై రూ.7 వేలు నుంచి రూ.10 వేలు వరకు తగ్గింపు ఉండే అవకాశం ఉంది. సాధారణంగా దసరా, దీపావళి సమయాల్లో ఎల్రక్టానిక్, వస్తువులపై వ్యాపారులు ప్రత్యేక డిస్కౌంట్లు, బహుమతులు ఇస్తుంటారు. ఈ ఏడాది మాత్రం వ్యాపారుల ఆఫర్లతో పాటు కేంద్రం జీఎస్టీ రూపంలో కొనుగోలుదారులకు శుభవార్త చెప్పింది. దీంతో ప్రజలు ఈ నెల 22వ తేదీ తర్వాతే గృహోపకరణాలు, మొబైల్స్ను కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యారు. -
సరికొత్త ఆయుధం ఐరన్బీమ్
సైన్స్ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే సాధ్యమయ్యే కొత్తశకం ఆయుధాలను ఇజ్రాయెల్ ఈ తరంలోనే తీసుకొచ్చి మరోసారి ప్రపంచ రక్షణరంగాన్ని ఔరా అనిపించింది. శత్రు దేశాల యుద్ధ విమానాలపై క్షిపణులను ప్రయోగించకుండా నేరుగా లేజర్ కాంతిపుంజాన్ని ప్రయోగించి విమానాలను నేలకూల్చే వ్యవస్థను ఇజ్రాయెల్ రంగంలోకి దింపింది. అత్యంత ప్రభావవంతంగా ఇది పనిచేస్తోందని, సమరక్షేత్రంలోనూ దీని సత్తాను పరీక్షించామని ఇజ్రాయెల్ తాజాగా ప్రకటించింది. దీనిని ఐరన్బీమ్ అని పేరు పెట్టింది. శత్రుసేనల డ్రోన్ల దండును ఒకేసారి వందలాది చిన్నపాటి క్షిపణులతో నేలమట్టంచేసే ఐరన్డోమ్ గగనతల రక్షణ వ్యవస్థతో ఇజ్రాయెల్ ఇప్పటికే ఆధునిక తరం ఎయిర్డిఫెన్స్ సిస్టమ్ల మోహరింపులో తన పైచేయి సాధించింది. వందలాది హమాస్ రాకెట్లను గాల్లోనే తుత్తునియలు చేసి ఈ ఐరమ్డోమ్ ఇప్పటికే తన సత్తా చాటింది. దీనికి తోడుగా ఇప్పుడు లేజర్కాంతిపుంజ సహిత ఐరన్బీమ్ వ్యవస్థను సంసిద్ధం చేశామని ఇజ్రాయెల్ రక్షణవర్గాలు ప్రకటించాయి. ఎప్పటికప్పుడు కొత్త రకం ఆయుధాలతో దేశ సైనికరక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్ పటిష్టంచేసుకుంటూ దూసుకుపోతోంది. ఈ ఐరన్బీమ్ ను రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ సంస్థ తయారుచేసింది. కేవలం రెండు డాలర్లతో మటాష్విధ్వంసం సృష్టించేందుకు నేలమీదకు దూసుకొచ్చే శత్రువుల డ్రోన్లు, క్షిపణులు, రాకెట్లు, మానవరహిత విహంగాలు, మోర్టార్లను గాల్లోనే అడ్డుకునేందుకు ఉపయోగించే సంప్రదాయక క్షిపణి నిరోధక వ్యవస్థను ఒక సందర్భంలో ఉపయోగిస్తే ఏకంగా 60,000 డాలర్లు అంటే రూ.53 లక్షలు ఖర్చవుతుంది. శత్రువుల రాకెట్లను అడ్డుకునేందుకు చిన్నపాటి రాకెట్లు, ఇతరత్రా ఆయుధాలను ప్రయోగించాల్సి రావడం వల్లే ఇంతటి ఖర్చు అవుతుంది. కానీ కొత్తగా రణరంగంలోకి దిగిన ఈ ఐరన్బీమ్ను ఒకసారి ఉపయోగిస్తే కేవలం 2 డాలర్లు మాత్రమే ఖర్చవుతుంది. మెరుపువేగంతో అమితమైన విద్యుత్ను ఉపయోగించుకుని కొత్త కాంతిపుంజాన్ని వదులుతుంది. అందుకే అత్యల్ప ఖర్చుతోనే అత్యధిక ప్రయోజనాన్ని పొందొచ్చు. సంప్రదాయక గగనతల రక్షణవ్యవస్థలో ప్రయోగించే కొన్ని చిన్నపాటి రాకెట్లు గురితప్పొచ్చు. వృథా ఖాయం. కానీ ఐరన్బీమ్ కాంతిపుంజాన్ని గురిచూసి ప్రయోగిస్తారు. కాంతిమాదిరిగా అత్యంత కచ్చితత్వంతో సరళరేఖ మాదిరి ఈ కాంతిపుంజం దూసుకుపోతుంది. దీంతో దిశ మారే అవకాశమే లేదు. ఏ పాయింట్ వద్ద కొడతామో అక్కడే విమానం, డ్రోన్, క్షిపణి ముక్కలుచెక్కలుకావడం ఖాయం. బీమ్ ప్రయోగానికి అది లక్ష్యాన్ని ఛేదించడానికి మధ్య సెకన్ల వ్యవధి కూడా పెద్దగాఉండదని ఇజ్రాయెల్ మాజీ ప్రధానమంత్రి నాఫ్తాలీ బెన్నెట్ చెప్పారు. ఉన్న వాటితో కలుపుకుని పోతూ..ఐరన్బీమ్ను అందుబాటులోకి తెచ్చినంత మాత్రాన ఐరన్డోమ్, డేవిడ్ స్లింగ్, యారో సిస్టమ్ వంటి ఇతర గగనతల రక్షణ వ్యవస్థలను ఇజ్రాయెల్ పక్కనబెట్టబోదు. యుద్ధ రీతి, అవసరానికి అనుగుణంగా వీటినీ మోహరిస్తుంది. అవసరమైతే ఐరన్డోమ్కు తోడుగా ఐరన్బీమ్ కదనరంగంలో రణానికి సిద్ధంకానున్నాయి. ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖలోని పరిశోధనా భివృద్ధి విభాగం, ఇజ్రాయెల్ వాయుసేన, రఫేల్, ఎల్బిట్ సిస్టమ్స్ సంయుక్తంగా నెలల తరబడి కష్టపడి ఐరన్బీమ్ను సాకారంచేశాయి. దీనిని ఇప్పటికే దక్షిణ ఇజ్రాయెల్లో పలుమార్లు విజయవంతంగా పరీక్షించారు. రఫేల్ అడ్వాన్స్డ్ సంస్థలోని అడాప్టివ్ ఆప్టిక్స్ సాంకేతికతను సైతం ఐరన్బీమ్కు జోడించారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
గతి తప్పిన జలచక్రం!
ప్రపంచ జలచక్రం గతి తప్పింది. 2024లో ఇది మరింత అస్తవ్యస్తమైంది. గత 175 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 1.55 డిగ్రీల సెల్సియస్ మేరకు పెరగటంతో వాతావరణంలో అసమతుల్యత పెరిగిపోయింది. ఇటు కుంభవృష్టి, అటు కరువులు విరుచుకుపడటంతో మూడింట రెండొంతుల నదులు చుక్క నీరు లేకుండా ఎండిపోయాయి లేదా విపరీతమైన వరదలతో సతమతమయ్యాయి. అతివృష్టి, అనావృష్టి వల్ల వల్ల ప్రజలు గతంలో ఎన్నడూ లేని విధంగా 2024లో తీవ్రస్థాయిలో కష్టాలపాలయ్యారని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) తాజా నివేదికలో వెల్లడించింది. – సాక్షి, సాగుబడిఅసాధారణ నీటి కష్టాల వల్ల.. ఆహార కొరత, ధరల పెరుగుదల, సంఘర్షణలు, వలసలు పెరిగాయని 41 దేశాల సమాచారాన్ని క్రోడీకరించిన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) తాజా నివేదిక వివరించింది. ఐక్యరాజ్యసమితికి అనుబంధ సంస్థ అయిన డబ్ల్యూఎంఓ ఏటా ప్రపంచ జల వనరులపై నివేదికను వెలువరిస్తుంటుంది. నీటి వనరులపై ప్రజలు, పాలకులు, శాస్త్రవేత్తలకు దిశానిర్దేశం చేస్తుంది.కరువు కరాళ నృత్యంఅతి తీవ్రమైన నీటి సమస్యలతో ప్రపంచ జల చక్రం పూర్తిగా గతి తప్పింది. నదులు, రిజర్వాయర్లు, సరస్సులు, భూగర్భ జలాలు, హిమానీ నదాలన్నిటిలోనూ ఈ అసాధారణ స్థితిగతులు కనిపించాయి. ఆఫ్రికా, యూరప్, ఆసియా దేశాల్లో వరదలు పొటెత్తగా.. దక్షిణ అమెరికా, ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో తీవ్ర కరువు కరాళ నృత్యం చేసింది. హిమానీ నదాల్లో మంచు నిల్వలు 450 గిగా టన్నుల (ఒక గిగా టన్ను అంటే లక్ష కోట్ల కిలోలు) మేరకు అత్యధికంగా కరగటం వరుసగా ఇది మూడో సంవత్సరం. ఆకస్మిక వరదలతో పాటు దీర్ఘకాలిక నీటి అభద్రతకు ఇది దారితీస్తుంది. ఈ నీటితో 1.2 మిల్లీమీటర్ల మేరకు సముద్రాల నీటి మట్టాలు పెరిగాయి. వరుసగా ఆరో ఏడాదినీటి చక్రం అస్తవ్యస్తం కావటం ఇదే మొదటిసారి కాదు. ఇలా జరగడం వరుసగా ఆరో ఏడాది. ప్రకృతి వైపరీత్యాల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు, ప్రభుత్వాలకు వేల కోట్ల డాలర్ల మేరకు నష్టం జరిగింది. పంట దిగుబడులు నష్టపోయారు. ధరలు పెరిగిపోయాయి. ఆహార కొరత పెరిగింది. ఉద్రిక్తతలు పెరిగాయి. పొట్ట కూటికోసం వలస పోవాల్సిన దుస్థితి మరింతగా పెరిగింది. గత ఏడాది 40 శాతం నదుల్లో మాత్రమే.. నీటి లభ్యత ఉండాల్సినంత సాధారణంగా ఉంది. మిగతా 60 శాతం నదుల్లో అతి కరువు లేదా అతి వరద పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ రెండు తీవ్ర పరిస్థితులు నెలకొన్న విచిత్ర స్థితి ఏర్పడింది. మనదేశంలోనూ..ఉత్తర భారతంలో అతివృష్టి కారణంగా భూగర్భ జలాల్లో 2023తో పోల్చితే వృద్ధి కనిపించింది. అయితే, వాయవ్య ప్రాంతాల్లో కొన్ని చోట్ల మాత్రం కరువు నెలకొంది. భారత్, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో రిజర్వాయర్లలోకి చాలా ఎక్కువ నీరు చేరింది. గంగ, గోదావరి, కృష్ణా తదితర నదులు సాధారణం కన్నా ఎక్కువగా ఉప్పొంగాయి. జూలై 30న కేరళలో ఆకస్మిక వరదలు విరుచుకుపడ్డాయి. ఇందులో 385 మంది భారతీయులు చనిపోయారు. 40 లక్షల మంది నిరాశ్రయులుఅమెజాన్ నదీ పరివాహక ప్రాంతంలో తీవ్ర కరువు వచ్చింది. దక్షిణ అమెరికాలో, ముఖ్యంగా అమెజాన్ బేసిన్లలో మట్టిలో తేమ బాగా తగ్గింది. సెంట్రల్ యూరప్లో అందుకు భిన్నంగా నేలలు అతి తేమగా మారాయి.» సెంట్రల్ యూరప్, రష్యా, పాకిస్తాన్లలో పెను వరదలు ముంచెత్తాయి. » ఆఫ్రికా ట్రాపికల్ జోన్లో వరదలకు 2,500 మంది చనిపోగా, 40 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. » దుబాయ్లో 75 ఏళ్లలో ఎన్నడూ ఎరుగనంత వర్షపాతం నమోదైంది. అస్తవ్యస్తం జలచక్రం నీరే జీవకోటికి ప్రాణాధారం. ఆర్థిక వ్యవస్థలకు నీరే ఇంధనం. పర్యావరణానికీ నీరే ప్రాణం. అయితే, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఈ జలచక్రం అస్తవ్యస్తమైంది. జలవనరులు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఒత్తిడికి గురై విపత్తులకు కారణమవుతున్నాయి. ప్రాణాధారమైన ఆ నీరే ఉపద్రవాలకు కారణమై ప్రజల ప్రాణాలను, ఆస్తులను, జీవనోపాధులను కబళిస్తోంది. ఇది మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, ఇంధనం, ఆరోగ్యం, ఆర్థిక రంగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. జలచక్రం ఎంత అస్తవ్యస్తంగా మారిపోయిందో 2024 నివేదిక మనకు తెలియజñ ప్తోంది. దీనిపై మరింత శ్రద్ధగా గణాంకాలు సేకరించాలి. జరుగుతున్నదేమిటో సరిగ్గా అంచనా వెయ్యలేకపోతే దాన్ని మార్చలేం కదా! – సెలెస్టె సాలో, ప్రధాన కార్యదర్శి, ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) -
నో ఆల్కహాల్ ప్లీజ్!
అసలే యూత్.. ఆపై ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యత. ఇంకేముంది భారతీయ మిలీనియల్స్ (29–44 సంవత్సరాల వయసు), జెన్–జీ తరం (13–28 ఏళ్లు) ఆల్కహాల్ లేని లేదా తక్కువ ఆల్కహాల్ ఉన్న పానీయాలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఈ ధోరణి ముఖ్యంగా మెట్రో నగరాల్లో బాగా కనిపిస్తోంది. సరదాగా గడిపేందుకు ఆల్కహాల్ మాత్రమే పరిష్కారం కాదన్నది యువతరం మాట.సోషల్ డ్రింకింగ్ కల్చర్ భారత్లో క్రమంగా మారుతోంది. నీల్సన్ఐక్యూ తాజా అధ్యయనం ప్రకారం.. సర్వేలో పాలుపంచుకున్న భారతీయ వినియోగదారుల్లో 24% మంది ఆల్కహాల్ రహిత లేదా తక్కువ ఆల్కహాల్ ప్రత్యామ్నాయాలను ఆస్వాదిస్తున్నారు. ఈ విషయంలో ప్రపంచ సగటు 17% ఉంది. ఆల్కహాల్ రహిత లేదా తక్కువ ఆల్కహాల్ ఉన్న పానీయాలను తీసుకుంటున్నవారిలో సగానికి పైగా జెన్–జీ, మిలీనియల్స్ ఉన్నారు. ఫిలిప్పీన్్స తర్వాత ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో ఇలాంటి మాక్టెయిల్స్కు (ఆల్కహాల్ రహిత పానీయాలు) భారత్ రెండో అతిపెద్ద మార్కెట్గా అవతరించింది. మనదేశంలో ఉత్తరాదిలో దాదాపు 54% మంది, తూర్పు భారతంలో 50%, పశ్చిమాన 43%, దక్షిణాన 37% మంది ఆల్కహాల్ పానీయాలను ఇష్టపడుతున్నారని నివేదిక తెలిపింది.ట్రెండ్గా మారుతోందిసాంస్కృతిక, సామాజిక వైఖరుల్లో వస్తున్న మార్పులు దేశంలో మద్యపాన రహిత జీవనశైలికి మార్గం సుగమం చేస్తు న్నాయి. మద్యపానానికి దూరంగా ఉండటం అనేది గతంలో మతపరమైన లేదా ఆరోగ్య కారణాలతో ముడిపడి ఉండేది. ప్రస్తుతం ట్రెండ్గా మారుతోంది. ఏం తీసుకుంటు న్నాం, వాటి ప్రభావం ఏమిటో తెలుసుకుని మరీ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మిలీనియల్స్, నిపుణులు, పట్టణ వినియోగదారుల నుంచి ఆల్కహాల్ రహిత పానీయాలకు డిమాండ్ పెరుగుతోంది. సంప్రదాయ బీర్ అనుభవాన్ని రాజీ పడకుండా మెట్రోలలో ఈ డిమాండ్ను తీర్చడానికి కంపెనీలు కూడా నూతన ఆవిష్కరణలు చేస్తున్నాయి.జీబ్రా స్ట్రిప్పింగ్ ట్రెండ్జెన్–జీ అంటేనే సరికొత్త కోరికలు, ఆవి ష్కరణలకు పెట్టింది పేరు. వారు ఇటీవలి కాలంలో జీబ్రా స్ట్రిప్పింగ్ ట్రెండ్ను ఎక్కువ గా అనుసరిస్తున్నారు. అంటే ప్రతి ఆల్కహా లిక్ డ్రింక్ తర్వాత ఆల్కహాల్ రహిత పానీ యాలను తీసుకుంటున్నారు. యూత్ ఎక్కు వగా కాక్టెయిల్స్, ప్రీమియం డ్రింక్స్ తాగు తున్నారు. విలువ పరంగా చూస్తే వీటి విలు వ ఎక్కువే కావడం గమనార్హం. అందుకే, కొన్ని కంపెనీలు ఆల్కహాల్ లేని పానీయా ల్లో పెట్టుబడులు కూడా పెడుతున్నాయి.ఆల్కహాల్ రహితంవైపు..నీల్సన్ఐక్యూ అధ్యయనం ప్రకారం భారతదేశంలో 53% మంది పూర్తిగా తాగనివారు లేదా చాలా తక్కువ తాగేవారు.. చట్టబద్ధంగా తాగే వయస్సు కలిగి ఉన్నారు. అంటే.. వీళ్లంతా 18–34 ఏళ్ల లోపు వారన్నమాట. ఇక, ఈ కేటగిరీలో ఉన్న 35–54 ఏళ్లవారు 35 శాతం కాగా, 55 ఏళ్లకుపైబడిన వారు 13 శాతం. ఆల్కహాల్ రహిత పానీయాల వైపు యువత ఆకర్షితులవుతుండటంతో ఈ మార్కెట్ దేశంలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది.ప్రధానంగా ఈ ట్రెండ్ మెట్రోల్లో ఎక్కువగా కనిపిస్తోంది. నాన్ ఆల్కహాలిక్ స్పిరిట్స్ లభ్యత గతంలో చాలా పరిమితంగా ఉండేది. ప్రస్తుతం ఇవి విరివిగా లభిస్తుండడం సైతం డిమాండ్కు ఆజ్యం పోస్తోంది. పైగా క్విక్ కామర్స్ కంపెనీలు వీటిని నేరుగా కస్టమర్లకు 10 నిమిషాల్లో డెలివరీ చేస్తున్నాయి. హైదరాబాద్, గోవా, బెంగళూరు, పుణే, ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్లోని బార్లు సరికొత్త మాక్టెయిల్స్ను తమ కస్టమర్లకు అందిస్తున్నాయి. కోలా పానీయాలు, తాజా లైమ్ సోడా, మొహిటో వంటి ఆల్కహాల్ రహిత పానీ యాలు మెనూలో వెనుక భాగంలో ఉండే రోజులు పోయాయన్నది మార్కెట్ వర్గాల మాట. -
గ్లోబల్ అయ్యప్ప కాన్క్లేవ్.. ఇదే ప్రధాన లక్ష్యం
మహిషి సంహారం కోసం ఈ లోకంలో ఉద్భవించిన హరిహర పుత్రుడు అయ్యప్పకు కేరళ సర్కారు ప్రపంచ వ్యాప్త పండగ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. గల్ఫ్లోని అబుధాబి సహా.. వేర్వేరు దేశాల్లో ఇప్పటికే అయ్యప్ప స్వామి ఆలయాలున్నా.. అమెరికా నుంచి ఆచంట వరకు అయ్యప్ప భక్తులు ఏటా శబరిగిరీశుడిని దర్శించుకుంటున్నా.. కేరళలోని శబరి కొండపై కొలువుదీరిన అయ్యప్పను విశ్వవ్యాప్తం చేయాలని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ)తో కలిసి సంకల్పించింది. ప్రభుత్వాలు శబరిమలను ఓ ఆదాయ వనరుగా మాత్రమే చూస్తున్నారంటూ ఇంతకాలం కొనసాగుతున్న అపవాదులను తుడిచిపెట్టేందుకు కేరళ సర్కారు ప్రపంచ అయ్యప్ప భక్తులను ఏకం చేస్తోంది. ఏటా మండల, మకరవిళక్కు సీజన్లలో శబరిమలకు వచ్చే భక్తుల సాధకబాధకాలను వినేందుకు తొలిసారి ‘గ్లోబల్ అయ్యప్ప కాన్క్లేవ్’ (global ayyappa conclave) పేరుతో భారీ సభను ఏర్పాటు చేస్తోంది. దేవుడు అంటే నమ్మకం లేని, కరడుగట్టిన కమ్యూనిస్టుగా పేరున్న కేరళ సీఎం పినరయి విజయన్ ముందుండి ఈ కార్యక్రమాన్ని నడపడం గమనార్హం..!ఎన్నారైలు మొదలు.. సామాన్యులకూ ఆహ్వానం3 వేల మంది అయ్యప్ప భక్తులకు సరిపడేలా పంపానది తీరంలో టీడీబీ, కేరళ సర్కారు భారీ కాన్క్లేవ్కు ఏర్పాట్లు చేశాయి. భారతీయులు స్థిరపడ్డ దాదాపు అన్ని దేశాలకు చెందిన అయ్యప్ప భక్తులను ఈ వేడుకకు ఆహ్వానించాయి. ఇక సామాన్య భక్తులకు కూడా చాలా సులభంగా అవకాశం కల్పించి, పాసులను జారీ చేశాయి. శబరిమల వర్చువల్ క్యూ వెబ్సైట్ ద్వారా ఏటా ఏదో ఒక సీజన్లో అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులకైతే.. సెల్ఫోన్లకు సందేశాలు పంపి మరీ ఆహ్వానించాయి. ఆన్లైన్లో సులభంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించి, ఐడీకార్డులను జారీ చేశాయి. అలా ఐడీకార్డులు డౌన్లోడ్ చేసుకున్న వారికి పేరుపేరునా ఫోన్ చేసి.. ‘‘మీరు తప్పకుండా వస్తున్నారు కదా? సెప్టెంబరు 20వ తేదీన మీరు ఉండాల్సిందే.. ఉదయం 8 గంటలకే రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. మరిచిపోవొద్దు’’ అని కాన్క్లేవ్ తేదీని గుర్తుచేస్తున్నాయి. అయ్యప్ప ముందు అందరూ సమానమే అన్నట్లుగా.. సామాన్య భక్తులకు కూడా సభాస్థలి వద్ద ముందు వరసలో చోటు కల్పించాయి.ఇప్పుడే ఎందుకు?ఇప్పుడే ప్రభుత్వం, టీడీబీ ఎందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి? అనే ప్రశ్నపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయ్యప్ప భక్తులను కేటగిరీలుగా విభజించి, ఆదాయమార్గంగా మలచుకోవాలనేదే పినరయి సర్కారు ప్లాన్ అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే.. ప్రభుత్వం మాత్రం.. ‘‘ఇది ఆరంభమే. సెక్యూలరిజాన్ని మీరే అర్థం చేసుకోవాలి. మాకు అంతా సమానమే. త్వరలో మైనారిటీలకూ గ్లోబల్ కాన్క్లేవ్ ఏర్పాటు చేస్తాం’’ అని చెబుతోంది.ఇదే ప్రధాన లక్ష్యంశబరిమల అయ్యప్ప స్వామి కీర్తిని ప్రపంచానికి చాటడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు టీడీబీ, ప్రభుత్వం చెబుతున్నాయి. అదే సమయంలో ఏటా మాసపూజలు, ఓనం, మండల, మకరవిళక్కు(మకరజ్యోతి) సీజన్లో అయ్యప్ప కొండకు వచ్చే భక్తుల సమస్యలను తెలుసుకుని, వాటిని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించడమే ధ్యేయమని వివరిస్తున్నాయి. అయ్యప్ప భక్త సంఘాల ప్రతినిధులు చెప్పే సమస్యలను శ్రద్ధగా విని, రాబోయే సీజన్ నుంచే వాటిని పరిష్కరించనున్నట్లు పేర్కొంటున్నాయి. శబరిమల అభివృద్ధికి ఇటీవలి బడ్జెట్లో రూ.1,300 కోట్ల కేటాయింపు మొదలు.. కేంద్రం ఆమోదించిన రోప్వే ప్రాజెక్టు, పథనంతిట్టలో కొత్త విమానాశ్రయానికి, రైల్వే మార్గానికి చేస్తున్న ఏర్పాట్లు, త్వరలో పరిచయం చేయనున్న హెలిట్యాక్సీలకు సంబంధించిన సమాచారాన్ని భక్తులకు వివరించనున్నట్లు కేరళ పర్యాటక శాఖ చెబుతోంది.స్వాగతం ఇలా..ఈ కార్యక్రమానికి వచ్చే అయ్యప్ప భక్తులకు పథనంతిట్ట జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని అధికారుల బృందం స్వాగతం పలుకుతుంది. శబరిమలకు దారితీసే మార్గాలు- సీతాథోడ్, పెరునాడ్, పంపా ప్రాంతాల్లో స్వాగత వేదికలను ఏర్పాటు చేసింది. కేఎస్ఆర్టీసీ ద్వారా ప్రత్యేక బస్సులను, జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో భక్తులకు వసతి సదుపాయాలను సిద్ధం చేసింది. ఆహూతులందరికీ సెప్టెంబరు 20, 21 తేదీల్లో ప్రత్యేకంగా అయ్యప్ప దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. వ్యక్తిగత వాహనాల్లో వచ్చేవారికి హిల్ టాప్ వద్ద పార్కింగ్ సదుపాయం ఉంటుంది. పంపా వద్ద ప్రత్యేక ఆస్పత్రిని ప్రారంభించింది. ఇక పారిశుద్ధ్యం మొదలు.. తాగునీటి సదుపాయం, భోజనాలు వంటి ఏర్పాట్లు, శాంతిభద్రతల పరిరక్షణకు భారీ బందోబస్తును సిద్ధం చేసింది.బాలారిష్టాలెన్నెన్నో..గ్లోబల్ అయ్యప్ప కాన్క్లేవ్ అనే భావన తెరపైకి వచ్చినప్పటి నుంచి ఈ కార్యక్రమానికి బాలారిష్టాలు మొదలయ్యాయి. ఈ కార్యక్రమానికి రాజకీయ నాయకులను ఆహ్వానించలేదు. అయితే.. ప్రధాని, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల సీఎంలు, మంత్రులకు ఆహ్వానాలు పంపినట్లు సమాచారం. ఈ కార్యక్రమం రాజకీయాలకు దూరంగా ఉంటుందని కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సుకుమారన్ నాయర్ స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో పలువురు ఈ కార్యక్రమాన్ని నిర్వహించకూడదంటూ కోర్టు మెట్లెక్కారు. దీని వల్ల రాణి ఫారెస్ట్, పెరియార్ రిజర్వ్ ఫారెస్ట్లలో పర్యావరణానికి ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. పిటిషనర్ల వాదనలతో కేరళ హైకోర్టు ఏకీభవించడంతో.. ఓ దశలో కార్యక్రమంపై నీలినీడలు అలుముకున్నాయి. కేరళ సర్కారు చేసిన అప్పీల్పై సుప్రీంకోర్టు బుధవారం సానుకూలంగా స్పందించింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చంటూ అనుమతి ఇవ్వడంతో.. ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.చదవండి: రూ.కోటి వ్యయంతో అతి పురాతన వైష్ణవాలయానికి పూర్వవైభవంపందళ రాజకుటుంబం దూరంగ్లోబల్ అయ్యప్ప కాన్క్లేవ్కు తాము దూరంగా ఉంటున్నట్లు పందళం రాజకుటుంబం ప్రకటించింది. గత ఏడాది సెప్టెంబరులో పందళ రాజమాత మృతి చెందిన నేపథ్యంలో.. ఈ నెల 27 వరకు తాము దైవదర్శనానికి రాకూడదని పందళం ప్యాలెస్ మేనేజ్మెంట్ కమిటీ వెల్లడించింది. తాము కార్యక్రమాన్ని వారం రోజులు వాయిదా వేయాలని కోరినా, ప్రభుత్వం పట్టించుకోలేదని వివరించింది. దీంతో.. నీలక్కల్ను దాటి తాము పంపావైపు రాలేమని తెలిపింది.శబరిమల అభివృద్ధికి దోహదం: ఎస్.శ్రీజిత్, అదనపు డీజీపీ''గ్లోబల్ కాన్క్లేవ్ ద్వారా శబరిమల అభివృద్ధికి కీలక ముందడుగు పడుతుంది. ఇది భవిష్యత్ని ఉద్దేశించి చేపట్టిన ఓ ప్రాజెక్టు. భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై సమగ్రంగా చర్చిస్తాం. మున్ముందు అయ్యప్ప కీర్తిని ప్రపంచానికి చాటేలా కృషి చేస్తున్నాం.''అయ్యప్ప అందరివాడు: నాగ మల్లారెడ్డి, గురుస్వామి''అయ్యప్ప ముందు అందరూ సమానమే. స్వామి దగ్గర తరతమబేధభావాలుండవు. ఆయన అందరివాడు. ఇప్పుడు ప్రపంచ దేశాలవాడు అవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.''స్వామి మహిమలెన్నెన్నో: వైవి సుబ్బారెడ్డి, గురుస్వామి(కడప)''అయ్యప్ప మహిమలు ఎన్నో.. ఎన్నెన్నో..! నమ్మినవారి కొంగు బంగారం ఆ మణికంఠుడు. ఉదాహరణకు ఎరుమేలి నుంచి పంపాకు పెద్దపాదం మార్గం(45 కిలోమీటర్లు) ఎత్తైన కొండల మీదుగా ఉంటుంది. కఠిన దీక్షలు చేసి, భక్తిప్రపత్తులతో వస్తున్న వారికి ఈ దూరం ఒక లెక్కే కాదు. అలాంటి వారు ఏ మాత్రం అలసట లేకుండా వనయాత్రను పూర్తిచేసుకుంటారు. భక్తితో కాకుండా.. బలముందనే అహంకారంతో వచ్చేవారు 2 కిలోమీటర్లు నడిచినా.. 15 కిలోమీటర్ల దూరం నడిచామా? అనే భావన కలుగుతుంది. భక్తులకు కరిమల కొండ కఠిన పరీక్షలు పెడుతుంది. వాటిని అధిగమించి, స్వామిని చేరేవారి జన్మ ధన్యం.'' -
'ఏఐ' ముద్ర..పడాల్సిందే
డీప్ఫేక్ వీడియోలు, చిత్రాలు ప్రపంచాన్ని కలవర పెడుతున్న అతిపెద్ద సమస్య. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఉపయోగించి రూపొందించే ఈ కంటెంట్ విషయంలో మన దేశం కఠిన నియమాలు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది. నకిలీ సమాచార వ్యాప్తిని అరికట్టే లక్ష్యంతో పార్లమెంటరీ కమిటీ కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. వీడియోలను రూపొందించే కంటెంట్ క్రియేటర్లకు లైసెన్స్ తోపాటు.. వీడియోలు, చిత్రాలను ఏఐతో రూపొందించినట్టు వెల్లడించే లేబులింగ్ వంటి అంశాలు వీటిలో ఉన్నాయి. -సాక్షి, స్పెషల్ డెస్క్కమ్యూనికేషన్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి.. లోక్సభ సభ్యుడు నిషికాంత్ దూబే నేతృత్వంలో ఏర్పాటుచేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇటీవలే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఒక ముసాయిదా నివేదికను సమర్పించింది. నకిలీ వార్తలను వ్యాప్తి చేయడానికి ఏఐని ఉపయోగించే వ్యక్తులు లేదా కంపెనీలను గుర్తించి, విచారించడానికి కఠినమైన సాంకేతిక, చట్టపరమైన నియ మాలను అమలు చేయాలని కమిటీ తన నివేదికలో వెల్లడించింది. ఈ ప్రతిపాదనలు కార్యరూపంలోకి వస్తే.. భారత్లో కంటెంట్ క్రియేటర్స్ ఏఐని ఉపయోగించే విధా నం పెద్ద ఎత్తున మారుతుందని, అలాగే పారదర్శకత, జవాబుదారీతనం ఉంటుందన్నది నిపుణుల మాట.బాధ్యులను పట్టుకోవచ్చుఏఐతో రూపొందిన తప్పుడు సమాచారం విషయంలో శిక్షా నిబంధనలను సవరించాలని, జరిమానాలను పెంచాలని కమిటీ తన నివేదికలో కోరింది. ‘ఏఐతో అభివృద్ధి చేసినట్టు తెలిపే సమాచారంతో వీడియోలు, చిత్రాలు, ఇతర అంశాలను ప్రజలు సులభంగా గుర్తించగలుగుతారు. అంతేకాకుండా నకిలీ వార్తలను వ్యాప్తి చేసిన బాధ్యులను సులభంగా పట్టుకోవచ్చు’ అని కమిటీ తెలిపింది. మీడియాకు విన్నపంనకిలీ వార్తలను కట్టడి చేసేందుకు బలమైన అంతర్గత రక్షణ చర్యలను చేపట్టాలని మీడియా సంస్థలను కూడా పార్లమెంటరీ కమిటీ కోరింది. సమాచారం నిజమేనా కాదా అన్నది తెలుసుకునే కఠిన తనిఖీ వ్యవస్థ, వార్తా ప్రసారంలో నాణ్యత, కచ్చితత్వం ప్రమాణాలను కాపాడే అంబుడ్స్మన్ ను నియమించాలని సూచించింది. మోసపూరిత కంటెంట్ సులభంగా వైరల్ అయ్యే యుగంలో ప్రజల విశ్వాసాన్ని కొనసాగించడానికి ఇలాంటి చర్యలు చాలా అవసరమని అభిప్రాయపడింది.ఇప్పటికే కొన్ని..డీప్ఫేక్ సంబంధిత సవాళ్లను ఎదుర్కోవడానికి ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. నకిలీ ప్రసంగాలను అడ్డుకోగల; డీప్ఫేక్ వీడియోలు, చిత్రాలను గుర్తించగల సాధనాలను అభివృద్ధి చేయడానికి రెండు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. నమ్మదగినవిగా మారతాయికంటెంట్ అభివృద్ధి విషయానికొస్తే ప్రతిపాదిత నిబంధనలు.. క్రియేటర్లను అడ్డుకునే ప్రయత్నం ఎంత మాత్రమూ కాదనీ, వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నది నిపుణుల మాట. క్రియేటర్లు చేయాల్సిందల్లా తమ వీడియోలు, చిత్రాలను ఏఐతో రూపొందించినట్టు వీక్షకులకు కనిపించేలా వెల్లడించాలి. ఏఐతో రూపొందిన కంటెంట్తో నకిలీ వార్తలను వ్యాప్తి చేసే, పెట్టుబడి పెట్టే సృష్టికర్తలు, కంపెనీలను అడ్డుకోవడమే ఈ నిబంధనల లక్ష్యం. ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు అందరికీ మరింత పారదర్శకంగా, నమ్మదగినవిగా మారతాయి. 10 కోట్లకు పైగా చానళ్లుభారత్లో 10 కోట్లకు పైచిలుకు యూట్యూబ్ చానళ్లు ఉన్నట్టు సమాచారం. అయితే ఇందులో 7 లక్షల మంది క్రియేటర్లు మాత్రమే ఆదాయార్జన చేస్తున్నారు. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్.. ఈ సామాజిక మాధ్యమాలను వేదికలుగా చేసుకుని కోట్లాది మంది కంటెంట్ క్రియేటర్లు ఉన్నారు. రోజూ కోట్లాది వీడియోలు, చిత్రాలు పోస్ట్ చేస్తుంటారు. ఇంతటి విశాలమైన సామాజిక మాధ్యమాల ప్రపంచంలో తప్పుడు సమాచారం కట్టడి ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ పార్లమెంటరీ కమిటీ నిబంధనలు కఠినంగా అమలైతే కొంతైనా మార్పు రావడం ఖాయం అన్నది నిపుణుల మాట. భారత్లో కట్టడి చేస్తాం సరే.. అంతర్జాతీయంగా వచ్చి పడే కంటెంట్ను ఎలా నియంత్రిస్తారన్నది ముందున్న సవాల్. » సాధారణంగా సినిమా ప్రారంభంలో ‘చిత్ర నిర్మాణంలో జంతువులకు, పక్షులకు ఎలాంటి హానీ చేయలేదని, గ్రాఫిక్స్ ఉపయోగించాం’ అని ఓ ప్రకటన ఇస్తారు. అదే తరహాలో ఇప్పుడు.. కంటెంట్ ఏఐతో సృష్టించినట్టు వెల్లడించాల్సి ఉంటుంది. » ఏఐతో కంటెంట్ సృష్టించినట్టుగా వెల్లడించాలన్న తప్పనిసరి నిబంధన చైనాలో ఉంది.» యూరోపియన్ యూనియన్ గతేడాది ఏఐ యాక్ట్ను అందుబాటులోకి తెచ్చి దశలవారీగా అమలు చేస్తోంది. -
అసంతృప్త యువతరం
యువతరం అనగానే ఉరిమే ఉత్సాహం, నిత్య చైతన్యం నిండిన ముఖాలే గుర్తుకొస్తాయి. సాధారణంగా జీవితంలో అసంతృప్తి దశ అంటే మధ్య వయసు అని ఎన్నాళ్లుగానో ఒక నమ్మకం బలపడిపోయింది. కానీ, ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని తాజా అధ్యయనంలో తేలింది. మధ్య వయస్కులకంటే జనరేషన్–జెడ్ (1996–2010 మధ్య పుట్టిన వారు)గా పిలుస్తున్న యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వెల్లడైంది. భవిష్యత్తుపై అనిశ్చితి, సోషల్ మీడియా ప్రభావం, కోవిడ్–19 తర్వాత వచ్చిన మార్పులు తదితర పరిణామాలతో యువతలో అసంతృప్తి అధికంగా ఉందని 44 దేశాల్లో దీర్ఘకాలంపాటు నిర్వహించిన గ్లోబల్ సర్వేలో తేలింది. డేవిడ్ జి.బ్లాంచ్ఫ్లవర్, అలెక్స్ బ్రైసన్, జియావోయ్ జు అనే శాస్త్రవేత్తల బృందం ఈ అధ్యయన నిర్వహించింది. 2024 వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ వంటి పరిశోధనలను బట్టి చూస్తే మధ్య వయస్కులలోనే అసంతృప్తి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. కానీ, ఈ సంప్రదాయ సూత్రీకరణ ప్రస్తుత పరిస్థితుల్లో తప్పు అని ఈ శాస్త్రవేత్తులు చెబుతున్నారు. ఐక్యరాజ్య సమితి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) నిర్వహించిన సర్వేలోనూ దాదాపు ఇవే ఫలితాలు వచ్చాయి. దశాబ్దాలుగా పరిశోధకులు ‘మిడ్ లైఫ్ అన్హ్యాపినెస్ హంప్’ను ప్రామాణికంగా తీసుకుంటూ వచ్చారు. కానీ, ఇప్పుడు యువతలో.. అదీ కూడా 15 నుంచి 28 ఏళ్ల మధ్య వయసులో ఉన్న వారిలో ఈ ధోరణి అధికంగా ఉందని గుర్తించారు. ఇందుకు సోషల్ మీడియా, ఆర్థిక అస్థిరత, కోవిడ్–19 దీర్ఘకాలిక ప్రభావాలు, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అస్థిర పరిస్థితులు, వాతావరణ మార్పుల ప్రభావం వంటివి కారణమని తేల్చారు. స్కీ స్లోప్లోకిజెన్ జెడ్అధిక ఆదాయ దేశాల్లోని (హై ఇన్కమ్ కంట్రీస్)యువతలో అసంతృప్తి స్థాయి అధికంగా ఉంది. విభిన్న నేపథ్యాలున్న దేశాల్లోనూ ఈ పరిస్థితి పెరుగుతోంది.జెన్– జెడ్ అసంతృప్తిలో ‘స్కీ స్లోప్’ను అంటే.. పల్లంలోకి జారుకునే స్థితిని ఎదుర్కొంటున్నారు. ఇతర అధ్యయనాల్లోని డేటా కూడా ఈ ధోరణిని సమరి్థస్తోంది. మానసికఆందోళన, ఒత్తిళ్లు, కుంగుబాటు అనేవి 16–19 ఏళ్ల మధ్యనున్న టీనేజర్లు, 20–24 ఏళ్ల మధ్య వయసులోని యువతలో అధికంగా ఉన్నట్టు తేలింది. గత పదేళ్లుగా యువతరం మానసిక ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని ఈ బృందం ప్రచురించిన అధ్యయనంలో పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి సీడీసీ నివేదికలోని అంశాలు..» యువకుల్లో మానసిక ఆరోగ్య సమస్యలు 1993లో 2.5% ఉండగా, 2024లో 6.6%కి పెరిగాయి. » యువతుల్లో ఇదే కాలంలో 3.2% నుంచి 9.3%కి చేరింది. » 2023 గ్యాలప్ సర్వేలో జెన్ జెడ్లో 15% మంది తమ మానసిక ఆరోగ్యం బాగా ఉందని తెలిపారు. » 1981–1996ల మధ్య జని్మంచిన 52% మిలీనియల్స్ (మధ్య వయసువారు) మానసిక ఆరోగ్యం మాత్రం అద్భుతంగా ఉందని పేర్కొన్నారు.సమస్యలకు కారణాలు.. » సోషల్ మీడియా అధిక వినియోగంతో అవాస్తవిక సామాజిక పోలికలు ఏర్పడి ఆందోళన, అసంతప్తి పెరుగుతోంది. జెన్ జెడ్ ఎక్కువగా ఆర్థిక ఆందోళన, అస్థిరతను ఎదుర్కొంటున్నారు. » కోవిడ్–19 వల్ల సామాజిక, విద్యా జీవితానికి ఏర్పడిన అంతరాయాలు యువత మానసిక ఆరోగ్యంపై శాశ్వత ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. » రాజకీయ అనిశ్చితి, వాతావరణ మార్పులపై అవగాహన పెరగడం యువతలో నిరాశ, భవిష్యత్తుపై అనిశ్చితి భావాలకు దారితీస్తోంది.పరిష్కారాలు..» యువతలో సంతోషాలు నింపేందుకు వ్యక్తిగత, సామాజిక జీవితాన్ని మెరుగుపర్చాలి. పాఠశాలల్లో ఫోన్ వాడకాన్ని నిషేధించాలి. » మెంటల్ హెల్త్ సర్వీసెస్ను పెంచాలి. » కౌమార దశ నుంచి వయోజనులుగా మారుతున్న క్రమంలో యువతకు సంబంధించి స్కూళ్ల విధానాలను నవీకరించడంతోపాటు డిజిటల్–సేఫ్టీ చర్యలు చేపట్టాలి. » సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించి, చుట్టూ ఉన్నవారితో ప్రత్యక్ష సంబంధాలను ప్రోత్సహించాలి. » స్నేహితులతో అధిక సమయం గడపడం ద్వారా యువతలో ఆనందాన్ని మెరుగుపర్చవచ్చు అని నిపుణులు పేర్కొంటున్నారు.- సాక్షి, హైదరాబాద్ -
మార్పు అవసరమే..అసాధ్యమేమీ కాదు..
దేశ రాజకీయ వ్యవస్థలో మార్పులు అవసరమని భారతీయులు భావిస్తున్నట్లు ‘ప్యూ రిసెర్చ్ సెంటర్’ తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. మొత్తం 25 దేశాల్లో ఒక్క భారతీయులు మాత్రమే రాజకీయ వ్యవస్థలో మార్పును కోరుకుంటూనే.. ఆ మార్పులు జరుగుతాయన్న నమ్మకాన్ని కూడా ప్రబలంగా వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. ప్రజలు రాజకీయ వ్యవస్థలో ప్రక్షాళనను కోరుకుంటున్నారని, అయితే ప్రక్షాళన జరగటంపై సందేహాలు వ్యక్తం చేశారని ‘ప్యూ’ తెలిపింది. – సాక్షి, స్పెషల్ డెస్క్ప్రపంచ వ్యాప్తంగా భారత్, అమెరికా, కెనడా, గ్రీస్, ఫ్రాన్స్, స్పెయిన్, యూకే, జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్ వంటి 25 దేశాలలో ‘ప్యూ’ నిర్వహించిన ఈ సర్వేలో 50 శాతానికిపైగా ప్రజలు తమ దేశ రాజకీయ వ్యవస్థలో మార్పులు లేదా పూర్తి సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఇదే అభిప్రాయాన్ని సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో 70 శాతానికిపైగా వ్యక్తం చేశారు. 2025 జనవరి 8 – ఏప్రిల్ 26 మధ్య ‘ప్యూ’ ఈ సర్వేను నిర్వహించింది. సర్వే కోసం 28,333 మంది అభిప్రాయాలు సేకరించింది.మార్పుపై మనవాళ్లుభారీ మార్పు అవసరం అన్న భారతీయులు 37 శాతం మంది కాగా, మొత్తం అంతా మారిపోవాలి అన్నవాళ్లు 34 శాతం మంది. అసలు మార్పే అవసరం లేదన్నవారు 9 శాతం మంది, చిన్నచిన్న మార్పులు అవసరం అన్నవారు 16 శాతం మంది. రాజకీయ వ్యవస్థ మారుతుందని 59 శాతం మంది భారతీయులు నమ్ముతుండగా, 10 శాతం మంది తమకు అలాంటి నమ్మకం లేదని తెలిపారు. 25 శాతం మంది కొద్దిపాటి మార్పులు చేస్తే బాగుంటుందని / అసలు మార్పులే అవసరం లేదని అన్నారు.కొన్ని దేశాల్లో పెదవి విరుపు రాజకీయ వ్యవస్థలో మార్పులు జరిగే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు వివిధ దేశాల ప్రజలు వేర్వేరుగా సమాధానాలు ఇచ్చారు. ఉదాహరణకు, దక్షిణ కొరియా వాసుల్లో 87 శాతం మంది రాజకీయ సంస్కరణలు అవసరమని చెప్పినప్పటికీ, అవి జరుగుతాయన్న నమ్మకం తమకు లేదని అన్నారు. మొత్తం 25 దేశాల్లో ఒక్క భారతీయులు మాత్రమే రాజకీయ వ్యవస్థలో మార్పును కోరుకుంటూనే, ఆ మార్పులు జరుగుతాయన్న నమ్మకాన్ని కూడా ప్రబలంగా వ్యక్తం చేశారు. నాయకులపై సానుకూలతప్రపంచ దేశాలన్నిటిలోనూ నాయకులపై సానుకూల భావనే కనిపించింది. భారతీయులు కూడా – తమ దేశ రాజకీయాల్లో వ్యవస్థాగత మార్పులు అవసరం అంటూనే, తాము ఎన్నుకున్న నాయకుల వ్యక్తిత్వాల పట్ల ఎక్కువగా సదభిప్రాయాలనే వ్యక్తం చేశారు. ఎంపిక చేసిన ఐదు రకాల గుణగణాలు (నిజాయితీ, ప్రజావసరాలను అర్థం చేసుకోవటం, సమస్యలపై దృష్టి పెట్టటం, నైతిక ప్రవర్తన, యోగ్యతలు).. తమ నాయకులలో అవి ఉన్నదీ లేనిదీ గుర్తించమని ‘ప్యూ’ సర్వే అడిగినప్పుడు ఎక్కువమంది సానుకూలంగా స్పందించారు. భారతీయులదీ అదే తీరుభారతీయులు తాము ఎన్నుకున్న నాయకుల వ్యక్తిత్వంపై పూర్తి వ్యతిరేకంగా లేరు. 33 శాతం మంది తమ నాయకులు నిజాయితీకి, 31 శాతం మంది ప్రజావసరాలను అర్థం చేసుకునే నైజానికి, 27 శాతం మంది ప్రజా సమస్యలపై పెడుతున్న దృష్టికి, 27 శాతం మంది నైతికతకు, 23 శాతం మంది యోగ్యతలకు పాజిటివ్ రేటింగ్ ఇచ్చారు. మనకు నమ్మకం ఎక్కువేరాజకీయ వ్యవస్థలో సమూల మార్పులు అవసరమని చెప్పిన దేశాల్లో నైజీరియా మొదటి స్థానంలో (51 శాతం)లో ఉండగా, దక్షిణ కొరియా రెండో స్థానంలో (43 శాతం), ఇండియా మూడో స్థానంలో (34) ఉన్నాయి. 7 శాతంతో స్వీడన్ చివరి స్థానంలో ఉంది. ఎప్పటికైనా మార్పులు జరుగుతాయన్న నమ్మకం ఉన్న దేశాల్లో ఇండియా, కెన్యా రెండూ సమానంగా (59 శాతం) ప్రథమ స్థానంలో ఉండగా; మార్పులు జరుగుతాయన్న నమ్మకం లేని దేశాల్లో ఇండియా (10 శాతం) ఆఖర్న, గ్రీసు మొదట (68 శాతం) ఉన్నాయి. ఇక నేతల వ్యక్తిత్వాలు, సామర్థ్యాలపై నమ్మకం ఉన్న ఆసియా–పసిఫిక్ దేశాలలో 28 సగటు శాతంతో ఇండియా నాలుగో స్థానంలో ఉంది. మొదటి మూడు స్థానాల్లో వరుసగా ఆస్ట్రేలియా (41 శాతం), దక్షిణ కొరియా (34 శాతం), ఇండోనేషియా (31 శాతం) ఉన్నాయి. -
రేటే 'బంగార'మాయెనే..
సాక్షి, విశాఖపట్నం : పసిడితో భారతీయులకు ఉన్న అనుబంధం మరే దేశంలోనూ కనిపించదు. చేతిలో కొద్దిగా డబ్బులు కనిపిస్తే.. వెంటనే కొనుగోలు చేసేది బంగారాన్నే. ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా.. పుత్తడి కొంటే.. శుభసూచకమని అంటుంటారు. అందుకే స్వర్ణం.. సమస్తమయమైపోయింది. ప్రపంచ మార్కెట్ పరిస్థితులు, డిమాండ్ నేపథ్యంలో రోజురోజుకీ పసిడి ధర పైపైకి ఎగబాకుతూ.. ఆల్టైమ్ హై రేట్ని నమోదు చేస్తోంది. ఒకప్పుడు 10 గ్రాముల ధరతో ఇప్పుడు గ్రాము కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి. వారం రోజులుగా ఎగబాకుతున్న బంగారాన్ని చూసి.. వెండి కూడా అదే బాటలో దూసుకుపోతోంది. లక్ష రూపాయల కంటే దిగువకు బంగారం ధర దిగే రోజులు ఇప్పట్లో కనిపించడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. తగ్గేదేలే అంటున్న పుత్తడి గత వారం రోజులుగా బంగారం ధర తగ్గేదేలే అన్నట్లుగా దూసుకుపోతోంది. ఈ నెల 8వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,08, 380 ఉండగా.. 9వ తేదీన రూ.1,10,290కి చేరుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ రూ.1.10 లక్షలకు తక్కువ కాలేదు. వెండి కూడా ధగధగ మెరిసిపోతోంది. ఈ నెల 8న కిలో వెండి ధర రూ.1.37 లక్షలు ఉండగా.. 15వ తేదీ నాటికి రూ.6 వేలు పెరిగి రూ.1.43 లక్షలకు చేరుకుంది. అంటే రోజుకు దాదాపు రూ.1000 చొప్పున పెరుగుతూ వస్తోంది. పెట్టుబడి విషయంలోనూ బంగారమే..! రోజు రోజుకీ ధర పెరుగుతూ వస్తున్నా బంగారం కొనుగోలు విషయంలో మాత్రం ప్రజలు అస్సలు తగ్గేదే..లే అంటున్నారు. ఎందుకంటే ఇంట్లో పసిడి ఎంత ఉంటే అంత ఎక్కువ సొమ్ము ఉన్నట్లుగా భావిస్తారు. వాస్తవానికి బంగారం నిరర్థక ఆస్తి. ఎంతో కష్టించి సంపాదించిన సొమ్ము బంగారంగా మార్చితే బీరువాల్లోనూ, బ్యాంకు లాకర్లలోనూ భద్రంగా ఉంచడం తప్ప... మరో ప్రయోజనం ఏంటి..? భవిష్యత్తులో ధర పెరిగి, పెరిగిన ధరకు దాన్ని విక్రయిస్తేనే లాభం. మనకు తెలిసినంత వరకూ బంగారం కొనడమే కానీ.. విక్రయించడమన్నది అరుదు. దీని బదులు వాటిని ఉత్పత్తి కార్యకలాపాలకు వెచ్చిస్తే సంపద సృష్టి జరుగుతుంది. మన దేశంలో విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేయడంలో బంగారం మూడో స్థానాన్ని ఆక్రమించింది. ముడిచమురు, క్యాపిటల్ గూడ్స్ తర్వాత అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న సరకు బంగారమేనన్నది విస్మయపరిచే అంశం. ఇటీవల కాలంలో మనదేశంలో బంగారం కొనుగోళ్లు అధికమై.. నగదు పొదుపు మొత్తాలు తగ్గిపోతున్నాయి. గృహస్తులు ఇతర వాటిపై ఒక్క శాతం పెట్టుబడులు పెడుతుండగా బంగారంపై మాత్రం ఆరున్నర రెట్లు ఎక్కువ మొగ్గు చూపుతుండటం విశేషం. బంగారానికి ఇంత వన్నె ఎందుకో..? పుత్తడి ఎంత ఉన్నా సగటు వ్యక్తికి మోజు తీరడం లేదు. తన శక్తి మేరకు బంగారాన్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అసలు బంగారానికి ఇంత వన్నె ఉండటానికి కారణం అంతర్జాతీయ కరెన్సీకి ప్రత్యామ్నాయం కావడమే. ఒక దేశం జారీ చేసిన నోట్లు చెల్లకపోవడం. వాటి విలువ క్షీణించడం ఉంటుంది. కానీ బంగారానికి అలాంటి బేధాలేమీ లేవు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎంతో కొంత ధరకు చెలామణి అవుతుంది. అందుకే స్వర్ణానికి అంత కళ. ధర తగ్గినా పెరిగినా కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు. ప్రపంచ స్వర్ణమండలి(డబ్ల్యూజీసీ) అంచనాల ప్రకారం ప్రస్తుతం దేశంలోని సంస్థలు, గృహస్తులు, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా వద్ద 25 వేల టన్నుల బంగారం ఉంది. భారత్లో మొత్తం ఇళ్లల్లోనూ, ఇతర అవసరాలకు ఈ బంగారం వివిధ రూపాల్లో నిల్వ ఉంది. ఇందులో విశాఖ నగర జనాభా ప్రకారం 80 నుంచి 100 టన్నుల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం సగటున విశాఖ నగరంలో ప్రతి ఇంటిలోనూ 15 నుంచి 25 గ్రాములు వరకూ బంగారం ఉంటుదని నివేదికలు చెబుతున్నాయి. కొనుగోళ్లు తగ్గినా.. మార్కెట్ దూసుకుపోతోంది టెక్స్టైల్స్ మార్కెట్ 15 నుంచి 20 శాతం పడిపోయింది. బంగారం మార్కెట్ కూడా 15 నుంచి 20 శాతం పడిపోయింది. మార్కెట్ విలువ మాత్రం బంగారం విషయంలో ఏమాత్రం తగ్గలేదు. చైనా, భారత్ వంటి దేశాలు బంగారాన్ని కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నాయి. గతంలో పసిడి ధర మూడు నాలుగు రోజులకోసారి మారేది. ఇప్పుడు ఒక పూట ఉన్న రేటు మరో పూటకు ఉండటం లేదు. బులియన్ మార్కెట్ కూడా అంచనా వేయలేకపోతోంది. పెట్టుబడుల విషయంలోనూ బంగారానికి మంచి డిమాండ్ ఉంది. బంగారంతో వెండి పోటీ పడుతోంది. బ్యాటరీ కార్లలో వెండి వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ధరల పెరుగుదలకు ఓ కారణమని చెప్పవచ్చు. – కంకటాల మల్లికార్జునరావు, ఫ్యాప్సీ పాస్ట్ ప్రెసిడెంట్ -
అతివకు.. 'పాష్ప'తాస్త్రం!
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్లో టాప్–30 సంస్థలలో.. గతేడాది లైంగిక వేధింపుల ఫిర్యాదుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. మహిళా ఉద్యోగులు తమ సమస్యల గురించి గొంతు విప్పేందుకు ధైర్యంగా ముందుకు వస్తున్నారనడానికి ఇది సంకేతం అని నిపుణులు చెబుతున్నారు. మరోపక్క సంస్థలు కూడా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తున్నాయి. 2023–24లో వచ్చిన ఫిర్యాదుల్లో 88 శాతం పరిష్కారం కావడమే ఇందుకు నిదర్శనం. – సాక్షి, స్పెషల్ డెస్క్బీఎస్ఈలోని టాప్–30 కంపెనీలకు.. తమ మహిళా ఉద్యోగుల నుంచి గత ఆర్థిక సంవత్సరంలో లైంగిక వేధింపులకు సంబంధించి మొత్తం 958 ఫిర్యాదులు అందాయి. 2023–24లో వీటి సంఖ్య 902. అంటే ఏడాదిలో ఫిర్యాదుల సంఖ్య 6.2 శాతం పెరిగింది. ఫిర్యాదుల్లో పెరుగుదలకు ‘పాష్’ చట్టమే ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు.ఏమిటీ పాష్ చట్టం?ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్ (పాష్) యాక్ట్ను అధికారికంగా ‘పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం మరియు పరిష్కారం) చట్టం–2013’ అని పిలుస్తారు. మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి ఫిర్యాదుల స్వీకారానికి వ్యవస్థలను ఏర్పాటుచేసి కంపెనీలు ఊరుకోవడం లేదు. ఫిర్యాదుల పట్ల కూడా సీరియస్గానే వ్యవహరిస్తున్నాయి. వాటి పరిష్కారం కోసమూ చర్యలు చేపడుతున్నాయి. 2023–24లో టాప్–30 బీఎస్ఈ కంపెనీలలో పాష్ కింద నమోదైన 902 కేసుల్లో 88% పరిష్కారం అయ్యాయని లైంగిక వేధింపుల నివారణపై కంపెనీలకు సలహాలు ఇస్తున్న ‘కంప్లైకరో’ అనే సంస్థ తెలిపింది. ‘ఇది గొప్ప మార్పునకు సూచిక’ అని మహిళా ఉద్యోగులు చెబుతున్నారు.ప్రభుత్వ పర్యవేక్షణభారత ప్రభుత్వ షీ–బాక్స్ పోర్టల్లో అన్ని కంపెనీలు (పెద్దవి లేదా చిన్నవి) తమ అంతర్గత ఫిర్యాదుల కమిటీలను నమోదు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పనిసరి చేసింది. అలాగే నిబంధనల అమలును పర్యవేక్షించడానికి ప్రతి జిల్లాలో కార్మిక కమిషనర్లు సర్వేలు చేయాలని ఆదేశించింది. అన్ని కంపెనీలు ఒకేచోట నమోదు కావడంతో షీ–బాక్స్ పోర్టల్లో బాధితులు తమ పాష్ ఫిర్యాదును దాఖలు చేయడం సులభతరమైంది. విచారణ ప్రక్రియను ప్రభుత్వం పర్యవేక్షిస్తుందనే విషయం ఉద్యోగికి మరింత ధైర్యం, ఊరటనిస్తుందని నిపుణులు అంటున్నారు. పాష్ ఫిర్యాదులు, నిబంధనల అమలులో ప్రస్తుత సంవత్సరం ఒక విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతుందని విశ్వసిస్తున్నట్టు కంప్లైకరో వెల్లడించింది. పాష్ చట్టాన్ని పాటించడానికి పెద్ద కంపెనీలే కాదు, ఎంఎస్ఎంఈలు కూడా ముందుకు వచ్చాయి. ఈ కంపెనీల నుంచి రోజుకు సగటున 7–8 ఫిర్యాదులు వస్తున్నాయని వివరించింది.అవగాహన పెరిగిందిపాష్ ఫిర్యాదులు పెరగడం అంటే.. పని ప్రదేశాల్లో సమస్యల పట్ల బాధితులు తమ గొంతు వినిపించడానికి ధైర్యంగా ముందుకు రావడమేనని హెచ్ఆర్ నిపుణులు అంటున్నారు. ‘సంవత్సరాలుగా బాధితులు నిశ్శబ్దంగానే ఉన్నారు. పాష్ పట్ల మహిళల్లో అవగాహన పెరిగింది. తాము ఎదుర్కొంటున్న వేధింపులకు పరిష్కారం దొరుకుతుందన్న విశ్వాసం పెరుగుతోంది. అందుకే ధైర్యంగా ఎక్కువ మంది ఈ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారు’ అని వారు చెబుతున్నారు. బ్యాంకుల నుంచే ఎక్కువఆసక్తికర విషయం ఏమంటే బీఎస్ఈ టాప్–30 కంపెనీల్లో గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఫిర్యాదులలో బ్యాంకు ఉద్యోగుల నుంచి 34% ఫిర్యాదులు వస్తే, ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న సిబ్బంది నుంచి 31.5% వచ్చాయి. మూడింట రెండు వంతులు లేదా 627 ఫిర్యాదులు ఈ రెండు రంగాల నుంచే అందాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) గరిష్టంగా 125 ఫిర్యాదులను అందుకుంది. 2023–24లో ఈ సంస్థలో 110 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్ 117 కేసులతో రెండో స్థానంలో ఉంది. ఫిర్యాదుల పరంగా ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
నిజాం రాజు.. తలొగ్గిన రోజు
సాక్షి, హైదరాబాద్ : అదిగో సుశిక్షితులైన సైనికుల కవాతు.. వినీలాకాశంలో సమున్నతంగా రెపరెపలాడిన త్రివర్ణ పతాక దృశ్యం అదిగో.. హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించిన భారత సైనికులకు నీరాజనాలు పలుకుతున్న జనుల జయజయ ధ్వానాలవిగో.. 1948 సెప్టెంబరు 17న భాగ్యనగరంలో కనువిందు చేసిన దృశ్యం ఇది. నిజాం నిరంకుశ, రాచరిక పాలనకు చరమగీతం పాడిన రోజు ఇది. రజాకారుల అకృత్యాలతో నలిగిపోయిన ప్రజలు ఈ రో జు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. ఆనందోత్సాహాలతో వేడుకలు చేసుకున్నారు. భారత యూనియన్ బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ పోలో’ విజయవంతమై నిజాం నిరంకుశ పాలన అంతమైన ఆ రోజుపై భిన్నాభిప్రాయాలు, విభిన్న దృక్పథాలు ఉన్నప్పటికీ హైదరాబాద్ సంస్థానం సువిశాలమైన భారత యూనియన్లో భాగమైంది. ఒక నవ శకం ప్రారంభమైంది. ఆ రోజు ఏం జరిగిందంటే.. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిణామాలు వేగంగా జరిగాయి. భారత సైన్యం అన్ని వైపుల నుంచి నగరానికి చేరువైంది. హైదరాబాద్ ప్రధాని లియాఖత్ ఉదయమే తన పదవికి రాజీనామా చేశారు. ఓటమి అనివార్యమని నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్కు తెలిసిపోయింది. కేఎం మున్షీని కింగ్కోఠికి పిలిపించాడు. ‘పోలీసు చర్యను ఆహ్వానిస్తూ భద్రతా సమితికి ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని’ మున్షీ సూచించారు. ఈ మేరకు రేడియోలో ప్రసంగించాలని కోరారు. అందుకు నిజాం అంగీకరించాడు. కానీ.. అప్పటి వరకు రేడియోలో ప్రసంగించిన అనుభవం లేని నిజాం నవాబు దక్కన్ రేడియో స్టేషన్కు వెళ్లి తన లొంగుబాటును ప్రకటించాడు. అదే రోజు నిజాం సైన్యాధ్యక్షుడు ఇద్రూస్, భారత సైనిక బలగాల కమాండర్ జేఎన్ చౌధురి ఒక నిర్ణీత ప్రదేశంలో కలుసుకున్నారు. ‘బేషరతుగా లొంగిపోతున్నట్లు’ ఇద్రూస్ ప్రకటించాడు. ఆ తర్వాత ఇద్దరూ పరస్పరం కరచాలనం చేసుకున్నారు. చౌధురి జట్కా బండి నగరంలోకి పరుగులు తీసింది. జనం జేజేలు.. నిజాం నవాబు భారత ప్రభుత్వానికి లొంగిపోతున్నట్లు ఉదయం నుంచే వార్తలు వెలువడ్డాయి. అప్పటి వరకు ఏ క్షణంలో ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియని భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ ఇళ్లలో గడిపిన నగరవాసులు.. నెమ్మదిగా వీధుల్లోకి వచ్చారు. సికింద్రాబాద్తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లోని రహదారులన్నీ జనంతో నిండిపోయాయి. భారత సైనికులకు స్వాగతం పలుకుతూ జేజేలు పలికారు. వేలాదిగా తరలి వచ్చిన జనంతో పరేడ్ గ్రౌండ్స్ జనసంద్రమైంది. త్రివర్ణ పతాకలు రెపరెపలాడాయి. ‘మహాత్మా గాందీకి జై’, పండిట్ నెహ్రూ జిందాబాద్, సర్దార్ పటేల్ జిందాబాద్, భారత్మాతాకీ జై’ అంటూ జనం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘రజాకార్ ముర్దాబాద్’ అనే నినాదాలు ప్రతిధ్వనించాయి. బొల్లారం నుంచి భారత సైనిక బలగాలు పరేడ్ గ్రౌండ్స్కు చేరుకున్నాయి. మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాచరిక పాలన 1948 సెప్టెంబరు 17వ తేదీతో అంతమైంది. ఐదు రోజుల పోలీసుచర్య... హైదరాబాద్ సంస్థానంపై భారత ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్య సెప్టెంబరు 13వ తేదీ సోమవారం తెల్లవారుజామున ప్రారంభమైంది. లెఫ్ట్నెంట్ జనరల్ మేజర్ రాజేంద్రసింగ్ నేతత్వంలో మేజర్ జనల్ జె.ఎన్.చౌధురి దీనికి సారథ్యం వహించారు. భారత సైన్యం నలు వైపుల నుంచి హైదరాబాద్ భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. షోలాపూర్ నుంచి బయలుదేరిన సైన్యం నల్దుర్గ్ కోటను స్వాదీనం చేసుకొని తల్ముడి, తుల్జాపూర్ మీదుగా హైదరాబాద్ వైపునకు వచ్చింది. మేజర్ జనరల్ డీఎస్ బ్రార్ ముంబై నుంచి, ఆపరేషన్ కమాండర్ మేజర్ జనరల్ ఎ.ఎ. రుద్ర విజయవాడ వైపు నుంచి బ్రిగేడియర్ శివదత్త బేరార్ నుంచి బయలుదేరారు. అన్ని వైపుల నుంచి భారత సైన్యం హైదరాబాద్ను ముట్టడించింది. భారత వైమానిక ఎయిర్ మార్షల్ ముఖర్జీ సైతం తన సేవలను అందజేసేందుకు సన్నద్ధమయ్యారు. దీంతో నిజాం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. 1948 సెప్టెంబరు 14న దౌలతాబాద్, జల్నా, ఔరంగాబాద్, ఉస్మానాబాద్, నిర్మల్, సూర్యాపేట్, వరంగల్, ఖమ్మం ప్రాంతాలను సైన్యం తన స్వాదీనంలోకి తీసుకుంది. లాతూర్, జహీరాబాద్ ప్రాంతాల్లో నిజాం సైనికులపై భారత సేనలు బాంబుల వర్షం కురిపించాయి. సెప్టెంబరు 16న రాంసింగ్ నేతృత్వంలోని సైనికులు జహీరాబాద్ను ఆక్రమించుకున్నారు. షోలాపూర్ నుంచి హైదరాబాద్ వరకు యూనియన్ సైనికుల పాదాక్రాంతమైంది. నిజాం సైనికులు బీబీనగర్, పటాన్చెరు, గచ్చిబౌలి, లింగంపల్లి, మల్కాపూర్ తదితర ప్రాంతాల్లో మందుపాతరలు పేల్చి సైన్యాన్ని అడ్డుకొనేందుకు విఫలయత్నం చేశారు. సైన్యం మరింత ముందుకు చొచ్చుకొని వచ్చింది. నిజాం సైన్యాధికారి ఎల్ ఇద్రూస్ చేతులెత్తేశారు. సెప్టెంబరు 17 సాయంత్రం 5 గంటలకు భారత సైనికులు హైదరాబాద్లోకి ప్రవేశించారు. ఇదీ హైదరాబాద్ సంస్థానం..» ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంతో పాటు, మహారాష్ట్ర, కర్ణాటకలోని హైదరాబాద్ సంస్థానం విస్తీర్ణం సుమారు 1,41,133 చదరపు కిలోమీటర్లు. » చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్. ఆయన కింద 975 మంది జాగీర్దార్లు ఉండేవారు. వీరి అ«దీనంలో సాగుకు అనుకూలమైన 53,106 చదరపు కిలోమీటర్ల భూమి ఉండేది. » 1921 నవంబర్లో ఆంధ్ర మహాసభ ఏర్పాటైంది. రాజకీయ సంబంధమైన ఒక సంస్థ నిజాం సంస్థానంలో ఏర్పడడం ఇదే మొదటిసారి. 1923లో ఆర్య సమాజ్ హైదరాబాద్ శాఖ ఏర్పాటు చేశారు. » గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రకారం 1937లో అనేక ప్రావిన్స్లలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ప్రభావం హైదరాబాద్ సంస్థానంపై పడింది. ‘బాధ్యతాయుతమైన ప్రభుత్వం కావాలని’ ఆంధ్ర మహాసభ మొదటిసారిగా రాజకీయ డిమాండ్ను బాహాటంగా ప్రకటించింది. ఆంధ్ర మహాసభ స్ఫూర్తితో కన్నడ పరిషత్, మహారాష్ట్ర పరిషత్ కూడా ఏర్పడ్డాయి. హైదరాబాద్ సంస్థానంలో కాంగ్రెస్ ప్రారంభమైంది. -
ఒకటి కాదు.. మల్టిపుల్ రిటైర్మెంట్స్ కావాలి
ఉద్యోగ విరమణ అనేది సాధారణంగా రిటైర్మెంట్ వయసు వచ్చినపుడు చేస్తారన్న విషయం తెలిసిందే. అయితే, రిటైర్మెంట్ అనేది ఉద్యోగ, వృత్తిగత జీవితానికి ముగింపు కాదని ఓ విరామం మాత్రమేనని నవ యువతరం బలంగా వినిపిస్తోంది. ఇప్పుడు వివిధ రకాల ఉద్యోగాల్లో, పని ప్రదేశాల్లో, ఇతరత్రా పరిస్థితులు వేగంగా మారిపోతున్న నేపథ్యంలో భారతీయులు మల్టీ రిటైర్మెంట్లకు మొగ్గుచూపుతున్న ధోరణి క్రమంగా పెరుగుతోంది. – సాక్షి, హైదరాబాద్బహుళ–పదవీ విరమణలు తీసుకోవాలనే ధోరణి వివిధ తరాలకు చెందిన వారిలో పెరుగుతుండగా.. యువ, మధ్య వయసు్కల్లో అధికంగా ఉంటోంది. హెచ్ఎస్బీసీ సంస్థ తాజాగా నిర్వహించిన ‘క్వాలిటీ ఆఫ్ లైఫ్–అఫ్లూయెన్స్ ఇన్వెస్టర్ స్నాప్షాట్–2025’అధ్యయనంలో ఇలాంటి ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. భారత్ సహా 12 దేశాల్లో 10 వేల మందికి పైగా సంపన్న వయోజనుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా నివేదికను రూపొందించారు. ఇందులో జెన్జెడ్–మిల్లీనియల్స్ తరానికి చెందిన వారు రిటైర్మెంట్ను ఉద్యోగ అంతం లేదా విరమణగా చూడకుండా... విరామాలతో మళ్లీ కొనసాగించే పనిగా సూత్రీకరిస్తుండటం గమనార్హం. ఇలా తీసుకునే రిటైర్మెంట్లు మూడునెలల నుంచి ఏడాది దాకా ఉంటున్నాయి. ముందు వరుసలో భారతీయులుప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఈ ధోరణిలో భారతీయులు ముందువరుసలో ఉండటం విశేషం. అయితే సంపన్న వర్గాల వారే మల్టీ–రిటైర్మెంట్స్ను ఎక్కువగా తీసుకుంటున్నారు. ఏదైనా ఉద్యోగం, వ్యాపారం లేదా పని చేసేవారు 55–60 ఏళ్ల వయసు వచ్చే దాకా ఆగకుండా నలభైల్లోనే ఈ రిటైర్మెంట్లు తీసుకుంటున్నారు. వర్క్–రిటైర్మెంట్–వర్క్ కల్చర్కే జెన్–జెడ్ (1997–2012 మధ్య జన్మించిన వారు), మిల్లీనియల్స్ (1981–96 మధ్య పుట్టిన వారు) ఓటు వేస్తున్నారు. డిజిటల్ మాధ్యమాల ప్రభావాల మధ్య పుట్టి పెరిగిన వారు కాబట్టి జెన్–జెడ్ను డిజిటల్ నేటివ్స్గానూ పరిగణిస్తున్నారు. జీవనశైలి, అభిరుచులు, అలవాట్లకు తగ్గట్టుగా మూడు నెలల నుంచి ఏడాది దాకా మినీ రిటైర్మెంట్ తీసుకుంటున్న వారే అధికంగా ఉంటున్నారు. ఇలా కెరీర్లో బ్రేక్ తీసుకోవడం ద్వారా తమ జీవనశైలిని మెరుగుపరుచుకునేలా రీచార్జ్ కావడంతోపాటు తమ అభిరుచులను మరింత గాఢంగా ఆస్వాదించేందుకు అవకాశం దొరుకుతుందని వీరు భావిస్తున్నారు. ఇలాంటి బ్రేక్ల వల్ల తమ వృత్తిగత జీవితం, కెరీర్, లైఫ్స్టైల్ మరింత మెరుగవుతుందనే భావనలో వారున్నారు. వర్క్–రిటైర్మెంట్–వర్క్ అంటే... మొదట కొన్నేళ్లపాటు ఉద్యోగం, వ్యాపారం ఇతర వ్యాపకాలు చేసి 40–45 ఏళ్ల మధ్యవయసులో రిటైర్మెంట్ తీసుకుంటారు. విరామం అనేది అది కొన్ని నెలల నుంచి సంవత్సరం దాకా ఉండొచ్చు. తర్వాత మళ్లీ తిరిగి మరేదైనా ఉద్యోగం, వ్యాపారం వంటి దాన్ని ఎంచుకుంటారు. కొత్త బాటలో.. బహుళ పదవీ విరమణలను జీవనశైలి మెరుగు కోసం తీసుకుంటున్న వాటిగానే భావించాలి తప్ప సంప్రదాయ కెరీర్ విరామంగా కాదు. బహుళ–పదవీ విరమణలతో కొంతమంది తమ సంపదను కూడబెట్టుకునేందుకు సమయాన్ని వెచ్చిస్తున్నారు. తమ కుటుంబాల అవసరాలకు అనుగుణంగా కొత్త దిశలను ఎంచుకుంటున్నారు. –హెచ్ఎస్బీసీ అధ్యయనకర్తలు సర్వేలోని ముఖ్యాంశాలు..» సగటున 44 ఏళ్ల వయసులో తొలి మినీ రిటైర్మెంట్ తీసుకోవాలనే భావనలో భారతీయులు ఉంటే.. ప్రపంచస్థాయి సగటు 47 ఏళ్లుగా ఉంది. » తమ జీవిత కాలంలో ఇలాంటి రిటైర్మెంట్ కనీసం ఒకటి తీసుకోవాలని భావిస్తున్న సంపన్న భారతీయులు 48శాతం. » ఇలాంటి విరామాలు 2, 3 తీసుకోవాలనే ఆలోచనతో ఉన్న భారతీయులు 44 శాతం. వీరిలో కొందరు ఆరేళ్లకోసారి బ్రేక్ తీసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. » మొత్తంగా 85 శాతం మంది మల్టీ రిటైర్మెంట్లకు సై అంటున్నారు. మల్టీ రిటైర్మెంట్తో తమ జీవనశైలిలో మంచి మార్పును గమనించినట్టు చెబుతున్నారు.» కనీసం ఒక చిన్న పదవీ విరమణ తీసుకున్న వారిలో 87% మంది తమ జీవితాన్ని సానుకూలంగా ప్రభావితం చేసిందన్నారు. » పిల్లలు, వృద్ధ తల్లిదండ్రులతో కూడిన కుటుంబసభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి 34 శాతం ఈ పద్ధతిని ఎంచుకుంటున్నారు. » బహుళ రిటైర్మెంట్లతో శారీరక, మానసిక, భావోద్వేగ పరమైన అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నవారు 31 శాతం. నిర్దేశిత సెలవుల పరిమితులు లేకుండా ప్రయాణించడం, కొత్త ప్రదేశాలు, సంస్కృతులను అన్వేíÙంచేందుకు ఈ మార్గాన్ని ఎంచుకుంటామన్న వారు 30 శాతం. » ఇది తమ దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు, వ్యక్తిగత అభివృద్ధికి దోహదం చేస్తుందన్న వారు 28 శాతం. » కెరీర్ లక్ష్యాలను తిరిగి అంచనా వేయడానికి పని నుంచి విరామం తీసుకోవడం కొత్త అవకాశాలకు దారితీస్తుందని అంచనా వేస్తున్న వారు 25 శాతం. -
గోడు వింటున్నారు.. పరిష్కారం చూపుతున్నారు
మోర్తాడ్ (బాల్కొండ): కరీంనగర్కు చెందిన రాహుల్రావు ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లాడు. దురదృష్టవశాత్తు అతను అక్కడ బ్లడ్ కేన్సర్కు గురయ్యాడు. అతనికి బోన్మ్యారో చికిత్స చేయాల్సి ఉంది. అతని రక్తం పంచుకుని పుట్టిన వారే తమ వారి శరీరంలో నుంచి ఎముకను ఇస్తేనే రాహుల్ బతికి బట్టకట్టగలడని వైద్యులు స్పష్టం చేశారు. రాహుల్ సోదరుడు రుతిక్రావు అందుకు సిద్ధం కావడంతో అతను లండన్ వెళ్లడానికి, వైద్య ఖర్చుల కోసం ప్రవాసీ ప్రజావాణిలో రాహుల్ తల్లి మంగ అభ్యర్థన పత్రం అందించింది. వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం రాహుల్రావు సోదరుడు లండన్ వెళ్లడానికి అవసరమైన ఏర్పాట్లు చేయించడంతో పాటు ఖర్చు కోసం రూ.10 లక్షలను మంజూరు చేసింది. ప్రవాసీ ప్రజావాణి వినతికి స్పందించిన జిల్లా కలెక్టర్ కూడా తన విచక్షణాధికారాలను ఉపయోగించి రూ.లక్ష సాయం మంజూరు చేశారు. ప్రవాసీ ప్రజావాణి (Pravasi Prajavani) ద్వారానే తమ కుటుంబానికి రూ.11 లక్షల సాయం అందిందని రాహుల్ కుటుంబ సభ్యులు వెల్లడించారు.గంగయ్యకూ విముక్తి నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం కొడిచెర్లకు చెందిన కంచు గంగయ్య 18 ఏళ్లుగా బహ్రెయిన్లో ఉండిపోయాడు. అతను ఇంటికి రావడానికి పాస్పోర్టు లేకపోవడం, పరాయి దేశంలో సాయం చేసేవారు లేకపోవడంతో గంగయ్య భార్య లక్ష్మి ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విదేశాంగ శాఖతో, బహ్రెయిన్లోని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో మాట్లాడటంతో గంగయ్య ఇటీవల ఇంటికి చేరుకున్నాడు. తాము చూస్తామో చూడమో అనుకున్న వ్యక్తి 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఇంటికి చేరడానికి ప్రవాసీ ప్రజావాణి మార్గం చూపిందని గంగయ్య కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలా రాహుల్, గంగయ్యలకే కాదు గల్ఫ్ దేశాలతో పాటు ఇతర దేశాల్లో ఉన్న తెలంగాణ వాసులు ఎలాంటి కష్టాల్లో ఉన్నా ప్రవాసీ ప్రజావాణి పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తోంది.2024, సెప్టెంబర్ 16న హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిబా ఫూలే భవన్లో ప్రారంభించిన ప్రవాసీ ప్రజావాణితో ప్రవాసులైన తెలంగాణ వాసులకు వరంగా మారిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రవాసీ ప్రజావాణి నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని ఏ మూలన ఉన్న వారైనా తమవారు విదేశాల్లో ఏమైనా ఇబ్బంది పడితే వారి సమస్యను ప్రవాసీ ప్రజావాణి దృష్టికి తీసుకెళ్తే పరిష్కారం లభిస్తుండటం విశేషం. ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ దివ్యా దేవరాజన్ ప్రవాసీ ప్రజావాణిని పర్యవేక్షిస్తున్నారు. వీరితో పాటు ఎన్నారై అడ్వైజరీ బోర్డు చైర్మన్ బీఎం వినోద్కుమార్, వైస్చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర సభ్యులు ప్రవాసీ ప్రజావాణిలో పాల్గొంటూ వలస కార్మికుల కుటుంబ సభ్యులు ఇచ్చే వినతులను స్వీకరిస్తున్నారు.ఇప్పటి వరకు వందకు పైగా కుటుంబాల వినతులకు ప్రవాసీ ప్రజావాణి పరిష్కారం చూపడం ఎంతో ఊరటనిచ్చే విషయం. గతంలో గల్ఫ్ దేశాల్లో ఎవరైనా మరణిస్తే వారి మృతదేహాలు ఇంటికి చేరడానికి నెలల సమయం పట్టేది. ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పిస్తే అధికార యంత్రాంగం స్పందించి వారం, పది రోజుల వ్యవధిలోనే కడసారి చూపు దక్కేలా చేస్తోంది. ఆర్థిక అంశాలకు సంబంధించిన కార్యక్రమాలతో పాటు సామాజిక దృక్పథంతో ప్రజావాసీ ప్రజావాణిని కొనసాగిస్తుండటం వలసదారుల కుటుంబాలకు ఎంతో ధీమా ఇచ్చే కార్యక్రమం అని భీంరెడ్డి ఈ సందర్భంగా ‘సాక్షి’తో చెప్పారు. వలసదారుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని చెప్పడానికి ప్రవాసీ ప్రజావాణి గొప్ప నిదర్శనమని తెలిపారు. వలసదారుల జీవితాల్లో వెలుగులు వలసదారుల జీవితాల్లో ప్రవాసీ ప్రజావాణి వెలుగులు నింపుతోంది. ప్రతి వారంలో రెండు రోజుల పాటు ప్రవాసీ ప్రజావాణిని నిర్వహించి వినతులను స్వీకరిస్తుండటం ఎంతో గొప్ప విషయం. వలస కార్మికులకు మేమున్నాం అనే ధీమాను ప్రభుత్వం ఇవ్వడం ఇదే మొదటిసారి. – రంగు సుధాకర్గౌడ్, ఎన్నారై, లండన్ -
కిమ్.. ‘క్రీమ్’.. బంద్
సంచలనాలకు నెలవైన ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరో నిర్ణయం తీసుకున్నారు. ఐస్ క్రీం అనేది ఇక ఆ దేశంలో వినిపించకూడదని నిర్ణయించారు. ఈ తరహా నిర్ణయాలు కిమ్ గతంలోనూ తీసుకున్నాడని చదివే ఉంటారు. వాటిని ఉల్లంఘిస్తే ఎంతటి భయంకరమైన శిక్షలు ఉంటాయో కూడా తెలిసే ఉండొచ్చు. మరి ఐస్ క్రీంపై కిమ్కు ఎందుకు కోపమొచ్చింది? ఆ వివరాల్లోకి వెళ్తే.. ప్రపంచవ్యాప్తంగా ఐస్క్రీం అనేది ప్రపంచవ్యాప్తంగా సాధారణంగా వినిపించే పదమే. కానీ, ఇప్పుడది కొరియా రాజకీయాల్లో కీలకంగా మారింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్కు ఆ పదం కోపం తెప్పించింది. దీంతో ఆ పదమే ఇక దేశంలో ఏమూల కూడా వినిపించకూడదని ఆయన నిర్ణయించారు. బదులుగా.. ఎసుకిమో లేదంటే ఒరుంబోసూంగీ అని పిలవాలని ఆదేశాలు జారీ చేశారు. నార్త్ కొరియన్ భాషలో ఈ పదాలకు అర్థం మంచు లాలీపాప్ లేదంటే మంచు ఐస్ బార్.డెయిలీ నార్త్ కొరియా కథనం ప్రకారం.. ఉత్తర కొరియాలో.. మరీ ముఖ్యంగా పర్యాటక రంగంలో పాశ్చాత్య (Western) పదాల వాడకం ఎక్కువగా ఉంటోంది. వాటిని కట్టడి చేసే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా దక్షిణ కొరియాలా.. తమ దేశమూ కట్టుదాటి ఆ తరహా భాషకు బానిస అవ్వకూడదనే కిమ్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారట. ఈ మేరకు టూర్ గైడ్లకు స్థానిక పదాలను ఉపయోగించేలా శిక్షణ ఇస్తున్నట్లు ఆ కథనం పేర్కొంది. సాధారణంగా.. ఏ దేశంలో అయినా టూర్ గైడ్లు పర్యాటకులకు దగ్గరయ్యేందుకు ‘భాష’ను ఉపయోగిస్తుంటారు. అయితే కిమ్ నిర్ణయాలను బహిరంగంగా విమర్శిస్తే ఏం జరుగుతుందో అక్కడి ప్రజలకు తెలుసు. అందుకే ఈ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తూనే.. టూర్ గైడ్లు శిక్షణ పొందుతున్నారు. మూడు నెలల కాలపరిమితో కొనసాగే ఈ ట్రైనింగ్ ప్రొగ్రాం ఆగస్టు 21వ తేదీనే ప్రారంభమైంది. అయితే ఈ విధంగా భాషను నియంత్రించడం ద్వారా తన ప్రజలను, పర్యాటకులను విదేశీ ప్రభావాల నుండి దూరంగా కిమ్ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.అయితే ఈ నిర్ణయం కేవలం ఐస్ క్రీమ్కు మాత్రమే పరిమితం కాలేదు. హ్యామ్బర్గ్ ఇలా మరికొన్ని పదాలను కూడా లోకల్ భాషలోనే పిలవాలనే హుకుం జారీ అయ్యింది. పూర్తిగా ఉత్తర కొరియా సంస్కృతితో కొనసాగుతూ.. విదేశీ పదాలను, మరీ ముఖ్యంగా దక్షిణ కొరియా కల్చర్ ప్రభావం ఇక్కడి పర్యాటకంలో ఉండకూడదనే కిమ్ ఈ నిర్ణయం తీసుకున్నారని అక్కడి పర్యాటక కంపెనీలు చెబుతున్నాయి. ఉల్లంఘిస్తే.. ఉత్తర కొరియాలో పాశ్చాత్య.. దక్షిణ కొరియా పదజాలాలంపై నిషేధం కొనసాగుతోంది. ఒకవేళ దీనిని గనుక ఉల్లంఘిస్తే శిక్షలు చాలా తీవ్రంగా ఉంటాయి. మూడు నుంచి ఐదేళ్లపాటు నిర్బంధ కూలీగా కిమ్ ప్రభుత్వం కోసం పని చేయాలనే శిక్ష విధిస్తారు. ఆ సమయంలో సరైన భోజనం, వైద్య వసతులు అందవు. లేదంటే కుటుంబాలను వెలివేస్తారు. భారీగా జరిమానాలతో పాటు ఆస్తులనూ జప్తు చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఇది కేవలం భాష ఉల్లంఘన మాత్రమే కాదు.. ఆన్టీ-సోషలిస్టు చర్యగా పరిగణించే అవకాశం లేకపోలేదు. అలాంటి సందర్భాల్లో.. మరణశిక్ష కూడా విధించొచ్చు. కొసమెరుపు..ఎస్కిమోలు.. ఈ పదం ఎక్కడైనా విన్నట్లు ఉందా?.. అలస్కా, కెనడా, గ్రీన్లాండ్, సైబీరియా.. అర్కిటిక్ రీజియన్లోని మంచు ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజలు. అయితే.. ఇప్పుడా పదం అవుట్డేటెడ్ అయ్యింది. కొన్ని తెగలు ఆ పదాన్ని అభ్యంతరకరంగా కూడా భావిస్తున్నాయి. అందుకే ఈ పదం పెద్దగా వినియోగంలో కనిపించడం లేదు. అలాంటిది ఈ పదం ఇప్పుడు నార్త్ కొరియాలో ప్రముఖంగా వినిపిస్తుండడం ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. ఇంగ్లీష్ నుంచి నేరుగా పదాన్ని తీసుకోవద్దనే ప్రయత్నంగా కనిపిస్తోంది. కిమ్.. కొన్ని సంచలన నిర్ణయాలువిదేశీ వినోదం.. మీడియాపై నిషేధం: ఉత్తర కొరియాలో విదేశీ సినిమాలు, సంగీతం, టీవీ షోలు చూడటం నేరంగా ప్రకటించారు. దీన్ని "ఆన్టీ-సోషలిస్టు" చర్యగా పరిగణించి కఠిన శిక్షలు విధించారు.మొబైల్ ఫోన్లపై నియంత్రణ: విదేశీ నెట్వర్క్లను ఉపయోగించే మొబైల్ ఫోన్లు కలిగి ఉండటం నేరం. ప్రజలు గోప్యంగా మాట్లాడటం, సమాచారం పంచుకోవడం నిషేధంహాట్డాగ్లపై నిషేధం: పాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబించే హాట్డాగ్ వంటి ఆహారాలను తినడం, తయారు చేయడం నిషేధించారు. ఇది "దేశద్రోహం"గా పరిగణించబడుతోంది.బుదాయ్-జిగే (Korean-American fusion dish) నిషేధం: దక్షిణ కొరియా నుండి వచ్చిన మాంసం, బీన్స్, సాసేజ్లతో తయారయ్యే ఈ వంటకం మార్కెట్లలో అమ్మకాన్ని నిలిపివేశారు.వివాహ విభజనపై శిక్షలు: విడాకులు తీసుకునే దంపతులను కారాగార శిక్షలకు గురిచేశారు. ఇది "ఆన్టీ-సోషలిస్టు" చర్యగా పరిగణించబడుతోంది.ఆధ్యాత్మిక స్వేచ్ఛపై.. మత స్వేచ్ఛ, కార్యక్రమాలు, సంఘాలు ఏర్పరచడం వంటి పౌర హక్కులను పూర్తిగా నిషేధించారు.జూలై 8, డిసెంబర్ 17 తేదీల్లో పుట్టినరోజులపై నిషేధం: ఈ తేదీలు కిమ్ గత పాలకులు కిమ్ ఇల్-సంగ్ , కిమ్ జోంగ్-ఇల్ చనిపోయిన తేదీలు. దీంతో.. ఆరోజుల్లో ఉ.కొ. పౌరులు పుట్టినరోజు చేసుకోకూడదుహెయిర్స్టైల్, లెదర్జాకెట్లపై నిషేధం: కిమ్ ప్రభుత్వానికి నచ్చని హెయిర్స్టైల్లు వేసుకోవడం నేరంగా మారింది. ప్రత్యేకంగా నిర్దేశించిన స్టైల్లే అనుమతించబడ్డాయి. అలాగే కిమ్ వేసుకునే జాకెట్లు, డ్రెస్సింగ్ స్టయిల్ను ఫాలో అయినా సరే అది నేరమే. అలాగే.. యువత ఆలోచనా స్వేచ్ఛను కట్టడి చేసేందుకు, విదేశీ సమాచారం పొందకుండా ఉండేందుకు ప్రత్యేక నిబంధనలు తీసుకొచ్చారు. పైనే చెప్పుకున్న నేరాలన్నీ శిక్షార్హమైన నేరాలే. వీటికి పాల్పడినవారిని శ్రమ శిబిరాలకు పంపించడం సాధారణంగా మారింది. అక్కడ వారు జీతం లేకుండా, భద్రత లేకుండా పనిచేయాల్సి ఉంటుంది.ఒకవేళ అదే నేరాన్ని కిమ్ తీవ్రంగా భావిస్తే మాత్రం.. అక్కడి ప్రజలు ప్రాణాలు వదులుకోవాల్సిందే!. -
విదేశీ విద్య: కొత్త కోర్సులు.. సరికొత్త దేశాలు
విదేశాల్లో చదువుకోవాలని ఎవరికి ఉండదు? అక్కడే చదువుకుని, స్థిరపడాలన్నదీ కోట్లాదిమంది భారతీయుల కల. యూఎస్, కెనడా, యూకే, ఆస్ట్రేలియాలోని పేరొందిన యూనివర్సిటీలకు వెళ్లడం అనేది గతం. ఇప్పుడు ట్రెండ్ క్రమంగా మారుతోంది. సంప్రదాయ దేశాలకు బదులుగా భారతీయ విద్యార్థులు నూతన గమ్యస్థానాలను ఎంచుకుంటున్నారు.ఎంబీబీఎస్ విద్య కోసం మధ్య ఆసియాలోని కిర్గిస్తాన్ ఇంజనీరింగ్ కోసం కంబోడియా, సప్లై చైన్ మేనేజ్మెంట్ చదివేందుకు మాల్టా, సాంస్కృతిక అధ్యయనాల కోసం ఉత్తర కొరియాకు చలో అంటున్నారు మన విద్యార్థులు. దేశీయంగా తీవ్రమైన పోటీ, అమెరికాలో రోజుకో రకంగా మారుతున్న విధానాలు; ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాల్లో వలసలపై పెరుగుతున్న వ్యతిరేకత, వీసాల లభ్యత కఠినతరం కావడం; పలు ఇతర దేశాల్లో విద్యా వ్యయాలు పెరుగుతుండడం.. వీటన్నింటి కారణంగా నూతన కోర్సుల కోసం కొత్త దేశాల బాట పడుతున్నారు.సరికొత్త గమ్యస్థానాలుమాల్టా, పోలాండ్, లాత్వియా, సైప్రస్ వంటిచిన్న యూరోపియన్ దేశాలు వివిధ ప్రోగ్రామ్స్లో భారతీయులు సహా విదేశీయులకు సులభంగా ప్రవేశం కల్పిస్తున్నాయి. అలా అక్కడ చదివిన గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు, అధునాతన డిగ్రీల కోసం ఫ్రాన్ ్స, జర్మనీ, యూకే, మధ్యప్రాచ్యాలకు వెళ్తున్నారు. రొమేనియా, బల్గేరియా, హంగేరీలలోని భారతీయ ఇంజనీరింగ్ విద్యార్థులు చౌకైన స్థానిక ప్రోగ్రామ్స్లో చేరుతున్నారు. కానీ చాలామంది అధిక జీతాలు, అంతర్జాతీయ ఎక్స్పోజర్ కోసం జర్మనీ, నెదర్లాండ్స్, స్కాండినేవియాకు మారుతున్నారు. అలాగే బంగ్లాదేశ్, ఉజ్బెకిస్తాన్లలో ఎంబీబీఎస్ చేసినవాళ్లు.. ఎక్కువ జీతాల కోసం మధ్య ప్రాచ్యదేశాలకు మరలుతున్నారు.లైటింగ్, లైట్ డిజైన్ఆర్కిటెక్చరల్, వేడుకల కోసం వేదికలు, నగరాల్లోని భవంతుల్లో లైటింగ్ కోసం కళాత్మకతను సాంకేతికతతో జోడించేలా శిక్షణ పొందడం. కేంద్రాలు: మిలాన్ (ఇటలీ), బిల్బావ్ (స్పెయిన్ ), స్టాక్హోం (స్వీడన్ ).మ్యూజిక్ థెరపీ భావోద్వేగ,ఆలోచన, శారీరక స్వస్థత కోసంసంగీతాన్ని వైద్యసాధనంగాఉపయోగించడం.కేంద్రాలు: లిమెరిక్(ఐర్లాండ్), నెదర్లాండ్స్.క్రూజ్ లైన్ నిర్వహణ ప్రపంచ క్రూజ్ పరిశ్రమ కోసం రూపొందించినప్రత్యేక ఆతిథ్య, కార్యకలాపాలకు సంబంధించిన విద్యా కార్యక్రమాలు. కేంద్రాలు: స్పెయిన్,స్విట్జర్లాండ్మాలిక్యులర్ గ్యాస్ట్రోనమీ నురగ (ఫోమ్), జెల్స్తదితరాలతో రుచులు, భోజన అనుభవాలను మార్చడానికి శాస్త్రాన్ని ఉపయోగించడం.కేంద్రాలు:స్పెయిన్, జపాన్,నెదర్లాండ్స్గేమ్ డిజైనింగ్గ్రీన్ సప్లై చైన్ పర్యావరణ అనుకూల, సమర్థవంతమైన, తక్కువ కర్బన ఉద్గారాలున్న రవాణా వ్యవస్థల రూపకల్పనకేంద్రాలు: స్వీడన్,డెన్మార్క్, నెదర్లాండ్స్వీడియో గేమ్స్ను సృష్టించడం, అభివృద్ధి, తయారీ; కేంద్రాలు: ఫిన్లాండ్హ్యుమానిటేరియన్ లాజిస్టిక్స్ విపత్తుల నుంచి ఉపశమనం, సహాయం, పంపిణీ, సంక్షోభ సమయంలో ప్రతిస్పందన కోసం సరఫరా వ్యవస్థల నిర్వహణకేంద్రాలు: ఫిన్లాండ్, బెల్జియం,స్విట్జర్లాండ్, దక్షిణాఫ్రికాసరఫరాను మించిన డిమాండ్ఈ ఏడాది 22 లక్షలకు పైగా నీట్ అభ్యర్థులు.. భారత్లో కేవలం 1.18 లక్షల ఎంబీబీఎస్ సీట్ల కోసం పోటీ పడ్డారు. అంటే అంతరం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే విద్యార్థులు సంప్రదాయేతర దేశాలవైపు చూస్తున్నారు.చౌకైన ఎంపికభారత్లోని ప్రైవేట్ కళాశాలలతో పోలిస్తే ‘చాలా తక్కువ ఖర్చు’తో.. ఎంబీబీఎస్విద్యార్థులను తూర్పు యూరప్, మధ్య ఆసియా దేశాలు ఆకర్షిస్తున్నాయి. ఉజ్బెకిస్తాన్ ఒక్కటే 6వేలకుపైగా విద్యార్థులకు ఆతిథ్యం ఇస్తోంది. విజయవాడ, వరంగల్, తిరుపతి వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి ఇప్పుడు విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని ఏజెన్సీలు చెబుతున్నాయి.ఖర్చు ఎంతంటే?భారత్ (ప్రైవేట్లో ఎంబీబీఎస్):పూర్తి డిగ్రీకి రూ.1 కోటికిపైగాఉజ్బెకిస్తాన్/రష్యా/ఫిలిప్పీన్పూర్తి ఎంబీబీఎస్కు రూ.15–35 లక్షలుపోలండ్/చెక్ రిపబ్లిక్: ఏడాదికి రూ.9.5–17.5 లక్షలు (ట్యూషన్+జీవన వ్యయం)జర్మనీ (ప్రభుత్వ విశ్వవిద్యాలయం):సంవత్సరానికి రూ.30,000-సాక్షి, స్పెషల్ డెస్క్ -
నలుగురిలో ఒకరు ట్యూషన్కు!
పాఠశాల విద్యార్థుల్లో దాదాపు నలుగురిలో ఒకరు ఇప్పుడు ట్యూషన్లు లేదా ప్రైవేట్ కోచింగ్ మీద ఆధారపడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఈ ధోరణి మరింత ఎక్కువగా ఉంది. ట్యూషన్ల కోసం ఏటా ప్రతి విద్యార్థిపై చేస్తున్న సగటు వ్యయం గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో దాదాపు రెండింతలు అధికంగా ఉండడం గమనార్హం. – సాక్షి, స్పెషల్ డెస్క్జాతీయ నమూనా సర్వే (ఎన్స్ ఎస్ఎస్) 80వ రౌండ్ కింద కేంద్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్–జూన్ మధ్య విద్యపై సమగ్ర సర్వే చేపట్టింది. అడ్మిషన్ల విషయంలో గ్రామీణ భారతంలో ప్రభుత్వ పాఠశాలలదే పైచేయిగా ఉందని సర్వే తేల్చింది. పట్టణ ప్రాంత కుటుంబాలు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చేర్పించేందుకే మొగ్గు చూపుతున్నాయి అంతేకాదు మార్కుల వేటలో భాగంగా తమ పిల్లలను ట్యూషన్లకూ పంపిస్తున్నాయి.ట్యూషన్ల కోసం వ్యయంప్రస్తుత విద్యా సంవత్సరంలో దేశంలో 27 శాతం మంది విద్యార్థులు ప్రైవేట్ కోచింగ్ తీసుకుంటున్నారు. ప్రాంతాలవారీగా చూస్తే పట్టణాల్లో 30.7%, గ్రామీణ భారత్లో 25.5% మంది ప్రైవేట్ కోచింగ్పై ఆధారపడ్డారు. దేశంలో సగటున ఒక్కో విద్యార్థి ట్యూషన్స్ కోసం రూ.2,409 వెచ్చిస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో కోచింగ్ కోసం సగటు ఖర్చు రూ.1,793 కాగా, పట్టణాల్లో రూ.3,988 అవుతున్నట్టు అంచనా. ఇంటర్ స్థాయిలో పట్టణ కుటుంబాలు కోచింగ్ కోసం ఒక్కో విద్యార్థికి రూ.9,950 ఖర్చు చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇది రూ.4,548.పట్టణాల్లో ప్రైవేట్ విద్యకు..గ్రామీణ ప్రాంతాల్లో మూడింట రెండొంతుల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. 33.9% మంది ప్రైవేట్, ఇతర సంస్థలలో చదువుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో కేవలం 30.1% మంది విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. దాదాపు 70% మంది ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుకుంటున్నారు. మొత్తంగా దేశ సగటు చూ స్తే.. అడ్మిషన్లలో 55.9% వాటా ప్రభుత్వ పాఠశాలలదేనని సర్వే పేర్కొంది.పట్టణ ప్రాంతాల్లో అధికంప్రభుత్వ పాఠశాలల్లో ఫీజులు ఉండవు. కానీ, ట్యూషన్లు, ర వాణా, స్టేషనరీ, ఇతర ఖర్చులు పెరిగాయి. ప్రైవేటులో అయితే వీటికి ఫీజు, యూనిఫాం వంటివి అదనంగా చేరతాయి. దీంతో ప్రతి విద్యా ర్థికి అవుతున్న వార్షిక వ్యయం రూ.23,470గా సర్వే అంచనా వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది రూ.8,382గా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో అయితే.. పట్టణ ప్రాంత విద్యార్థికి రూ.4,128, గ్రామీణ ప్రాంతాల్లో రూ.2,639 ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వేతర పాఠశాలల విషయంలో ఇది.. పట్టణప్రాంతాల్లో రూ.31,782, గ్రామీణ ప్రాంతాల్లో 19,554గా ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఫీజుల కోసం చేస్తున్న సగటు వార్షిక వ్యయం రూ.15,143 కాగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇది రూ.3,979.⇒ ఇంటర్మీడియెట్ చదువుతున్న విద్యార్థుల విషయంలో దేశంలో 37% మంది ప్రైవేట్ కోచింగ్కు సై అంటున్నారు. పట్టణాల్లోని ఇంటర్ స్టూడెంట్స్లో 44.6 మంది ట్యూషన్లకు వెళ్తున్నారు.⇒ ప్రైవేట్ ట్యూషన్స్ కోసం దేశంలో ఇంటర్మీడియెట్ విద్యార్థులు సగటున ఏటా రూ.6,384 ఖర్చు పెడుతున్నారు. ⇒ కోచింగ్ సంస్థలు చెల్లించిన వస్తు, సేవల పన్ను 2019–20లో రూ.2,240 కోట్లు. 2023–24కి వచ్చేసరికి ఇది రూ.5,517 కోట్లకు చేరింది.⇒ కోచింగ్ కోసం అమ్మాయిల కంటే అబ్బాయిలు కొంచెం ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. సగటున ఏటా అమ్మాయిలు రూ.2,227, అబ్బాయిలు రూ.2,572 వ్యయం చేస్తున్నట్టు సర్వే పేర్కొంది. -
హారన్ మోగించరు.. గీత దాటరు
ఆ ప్రాంతం పేరు జొకోసంగ్.. నగరంలోని అతి ప్రధాన రోడ్డు.. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు అధికంగా ఉండటంతో సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఒకవైపు వెళ్లే ట్రాఫిక్ అధికంగా ఉంది.. ఆ వైపు వాహనాలు నిలిచి పెద్ద వరస ఏర్పడింది.. మరోవైపు మాత్రం రోడ్డు ఖాళీగా ఉంది.. కానీ రోడ్డు మధ్యలో డివైడర్ లేకున్నా.. ఒక్క వాహనం కూడా గీత దాటలేదు. ఆ నగర పర్యటనకు వచ్చిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థుల బృందం ఈ దృశ్యాన్ని చూసి అశ్చర్యపోయింది. ప్రజల్లో ఆ పరిణతికి అభినందనలు అంటూ నగర మేయర్కు లేఖ రాసింది. ఆ సిటీని చూసి నేర్చుకోండి అంటూ ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులకు సచిత్ర లేఖ పంపింది. ఆ నగరమే ఈశాన్య రాష్ట్రమైన మిజోరం రాజధానిఐజోల్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఐజోల్ నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు.. కానీ, కూడళ్లలో వాహనాలు అదుపు తప్పవు. రాత్రి వేళ ట్రాఫిక్ పోలీసులు లేనప్పటికీ వాహనాలు నియంత్రణ కోల్పోవు. రోడ్డు మీద వందల సంఖ్యలో వాహనాలు ముందుకు సాగుతున్నా.. ఎక్కడా హారన్లు వినపడవు, వాహనాలు ఒకదాని వెనక ఒకటి వరస కట్టి వెళ్తాయే తప్ప ఓవర్టేక్ చేయవు.. డ్రైవర్లు పరస్పరం అరుచుకోవటం, తిట్టుకోవటం మచ్చుకు కూడా కనిపించవు.. పాదచారులు ఫుట్పాత్ల మీదుగా మాత్రమే నడుస్తారు, అర్ధరాత్రి వేళ రోడ్డు ఖాళీగా ఉన్నప్పుడు కూడా రోడ్లమీదుగా నడవరు. ఇవన్నీ నమ్మశక్యం కాని నిజాలు. ఐజోల్ నగరంలో ఏ మూలకెళ్లినా ఇవే దృశ్యాలు కనిపిస్తాయి. ప్రకృతి ఒడిలో కొలువై.. కొండలు, లోయలు, దట్టమైన అడవులు, నదులు, వాగులు వంకలు.. స్వచ్ఛమైన ప్రకృతిలో కొలువైన ఆ నగరంలో వాతావరణం స్వచ్ఛంగా ఉంటుంది. దాదాపు 2.20 లక్షల వాహనాలున్నప్పటికీ హారన్ల మోతలు లేకపోవటంతో శబ్ద కాలుష్యం ఉండదు. ఇది స్థానికుల క్రమశిక్షణ ఫలితం. అందుకే ఐజోల్ నగరాన్ని ‘ది సైలెంట్ సిటీ ఆఫ్ ఇండియా’అంటారు. ఇక్కడి ప్రజల్లో స్వీయ క్రమశిక్షణ పుట్టుకతో వస్తుందని అంటున్నారు. 4.21 లక్షల జనాభా ఉన్న నగరంలో నేరాలు అతి తక్కువ. మద్య నిషేధం కట్టుదిట్టంగా అమలవుతుండటంతో ప్రశాంతత రాజ్యమేలుతోంది. ప్రభుత్వ నిబంధనలు తు.చ.తప్పకుండా పాటిస్తున్న ప్రజలు, ఎలాంటి ఉల్లంఘనలకు ఆసక్తి చూపరు. దీంతో ఆ నగరంలో ప్రజల క్రమశిక్షణపై అధ్యయనానికి దేశంలోని చాలా నగరాలు ఆసక్తి చూపుతున్నాయి. ఇంతకాలం విమానయానంతోనే.. ఐజోల్కు వెళ్లాలంటే ఇంతకాలం విమానయానమే అవకాశంగా ఉంది. అది ఖర్చుతో కూడుకున్నది కావటంతో చాలామంది అక్కడికి వెళ్లలేకపోయారు. ఇప్పుడు దేశంలోని ఇతర ప్రాంతాలతో శనివారం నుంచి రైల్వే అనుసంధానం అందుబాటులోకి రావడంతో అధ్యయనాల కోసం నగరానికి వచ్చే వారి సంఖ్య భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కొండలతో కూడుకున్న ప్రాంతం కావటంతో విశాలమైన రోడ్ల నిర్మాణానికి వీలులేదు. కొండ అంచుల్లో వెనకవైపు లోయల్లోకి పిల్లర్లు ఏర్పాటు చేసి వాటి ఆధారంగా ఇళ్లను నిర్మిస్తుంటారు. ఉన్న కాస్త స్థలంలో 30 అడుగుల వెడల్పు రోడ్లు మాత్రమే ఉంటాయి. దీంతో ప్రజలు ఎలాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడకుండా క్రమశిక్షణతో రోడ్లను వాడుకుంటున్నారు. రోడ్లపై డివైడర్లు ఉండవు, కేవలం ట్రాఫిక్ లైన్స్మాత్రమే గీసి ఉంటాయి. అయినా.. ఓ వైపు ఉన్న వాహనం ఎట్టి పరిస్థితిలో గీత దాటి మరోవైపు వెళ్లదు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు మాన్యువల్గా మాత్రమే ట్రాఫిక్ నియంత్రిస్తుంటారు. వారు చేయి ఎత్తగానే ఠక్కున వాహనాలు నిలిచిపోతాయి. ముందు వాహనాలు మందగమనంతో సాగినా వెనక వాహనదారులు పొరపాటున కూడా హారన్ మోగించరు. సారీ చెప్పి ఓవర్టేకింగ్..» ఎవరైనా అత్యవసరంగా ముందుకు సాగాల్సి ఉంటే, వాహనాలను ఓవర్టేక్ చేసి పక్క వాహనదారుకు సారీ చెప్పి మరీ వెళ్లటం అక్కడి ప్రత్యేకత. రాత్రి వేళ ట్రాఫిక్ పోలీసులు లేని సమయంలో కూడా కూడళ్లలో వాహనదారులు నియంత్రణ కోల్పోరు. » ఘాట్ రోడ్లు కావటంతో అన్నీ మలుపులు తిరిగిన రోడ్లే ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా హారన్ల మోత వినిపించదు. మరీ షార్ప్ కర్వ్ ఉండి, భారీ వాహనాలు వచ్చే రోడ్డయితే స్వల్పంగా ఒకసారి హారన్ మోగిస్తారు.» తక్కువ వెడల్పు రోడ్లే అయినా, అన్ని చోట్లా ఫుట్పాత్లు ఏర్పాటు చేశారు. పాదచారులు కచి్చతంగా ఫుట్పాత్పైనే నడుస్తారు. అర్ధరాత్రి వేళ రోడ్లు ఖాళీగా ఉన్నా.. ఫుట్పాత్ల గుండానే ముందుకు సాగుతారు.» టాక్సీలకు రోడ్ల మీదే పార్కింగ్ కల్పించారు. వాటికి 20 శాతం స్థలం ఉంటుంది. అవి వరసగా ఆగి ఉన్నా.. పక్కనుంచి మిగతా వాహనాలు ప్రశాంతంగా ముందుకు సాగిపోతుంటాయి. » ఫుట్పాత్ల వినియోగం, ట్రాఫిక్ నిబంధనలు, పార్కింగ్, హారన్లు మోగించకపోవటం, అక్రమ నిర్మాణాలు రాకుండా నియంత్రించటం.. తదితర అంశాలపై పాఠశాలల స్థాయిలోనే విద్యార్థులకు అవగాహన కల్పించటం అక్కడి ప్రభుత్వాలు నిరంతరం కొనసాగిస్తున్నాయి. -
దక్షిణాదిన తొలి ‘హంటర్హుడ్’ ఫెస్టివల్!
డుగ్గు డుగ్గు బండిపై ‘బుల్లెట్’లా దూసుకెళ్తున్న కుర్రకారు స్ట్రీట్ కల్చర్లోనూ దుమ్మురేపుతున్నారు. అందుకే, బుల్లెట్ బండి అంటే ఠక్కున గుర్తొచ్చే రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడు ఈ లోకల్ ఆర్టిస్టులకు దన్నుగా నిలుస్తోంది. అర్బన్ రైడర్ల కోసం ప్రత్యేకంగా మలిచిన ‘హంటర్ 350’ బైక్ స్ఫూర్తితో ‘హంటర్హుడ్’ వేడుకలకు తెరతీసింది. దక్షిణాదిన ఈ తొలి ఫెస్టివల్ను తాజాగా చెన్నైలో నిర్వహించింది. బెంగళూరుకు చెందిన ప్రముఖ డీజే బెంకీ బేకు... క్రేజీ రీమిక్స్లతో ఈవెంట్ను ఆరంభించారు. స్ట్రీట్ ఆర్టిస్ట్లు వేసిన బైకింగ్ పెయింటింగ్లు అబ్బురపరిచాయి. మరోపక్క, స్కేట్బోర్డింగ్ మ్యూజిక్ కలగలిపి సాగిన ఈవెంట్ మరో హైలైట్. స్థానిక తీన్మార్ డప్పుల దరువుకు సింగర్లు పాడిన లోకల్ పాటలు వేరే లెవెల్. లోకల్ హిప్హాప్ సింగర్స్ ఇక్కీ బెర్రీ, అసల్ కోలార్, ఆరీవు తదితరుల తమిళం, ఇంగ్లీష్ ర్యాప్ సాంగ్స్తో ఇక్కడి ఐలాండ్ గ్రౌండ్ మొత్తం దద్దరిల్లింది. ఇక డ్యాన్సర్లు కూడా బీట్కు అనుగుణంగా క్రేజీ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. విభిన్న ఆర్టిస్టులు ఈవెంట్ ఆసాంతం స్ట్రీట్ కల్చర్ వైబ్తో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఏప్రిల్లో తొలిసారి... ఈ ఏడాది ఏప్రిల్లో తొలిసారిగా రాయల్ ఎన్ఫీల్డ్ ‘హంటర్హుడ్’ ఫెస్టివల్ను ఒకేసారి ఢిల్లీ, ముంబై నగరాల్లో నిర్వహించింది. ఈ సందర్బంగా ‘హంటర్ 350’ 2025 ఎడిషన్ను రియో వైట్, టోక్యో బ్లాక్, లండన్ రెడ్ తదితర రంగుల వేరియంట్లలో ఆవిష్కరించింది. ఆధునిక రెట్రో లైఫ్స్టయిల్ కోరుకునే నవతరం యువతను ఆకట్టుకునేలా స్టయిల్, వినోదం, దూకుడును కలగలిపి హంటర్ 350 బైక్ను మలిచామని రాయల్డ్ ఎన్ఫీల్డ్ చెబుతోంది. మరోపక్క, హిప్హాప్, ర్యాప్, స్ట్రీట్ డ్యాన్స్, స్కేట్బోర్డింగ్లలో లోకల్ టాలెంట్ను ప్రోత్సహిస్తూ... స్ట్రీట్ కల్చర్కు దన్నుగా నిలవడమే ‘హంటర్హుడ్’ ఫెస్టివల్ ప్రధాన లక్ష్యంగా పేర్కొంది. క్రమంగా మరిన్ని నగరాల్లోనూ ఈ వేడుకలను నిర్వహించే ప్రణాళికల్లో కంపెనీ ఉంది.గ్రాఫైట్ గ్రే.. సూపర్బ్ హంటర్ 350లో కొత్తగా ప్రవేశపెట్టిన గ్రాఫైట్ గ్రే వేరియంట్ను చెన్నై హంటర్హుడ్ ఫెస్టివల్లో ఎన్ఫీల్డ్ ప్రత్యేకంగా ప్రదర్శించింది. ఇప్పటికే యూత్కు బాగా కనెక్ట్ అవుతున్న హంటర్ బైక్.. ఈ సరికొత్త షేడ్తో మరింత ఆకట్టుకుంటోంది. బైకింగ్ యాక్సెసరీలు, లైఫ్స్టయిల్ గేర్తో పాటు ట్రెండింగ్లో ఉన్న స్ట్రీట్ వేర్ ఉత్పత్తులను కూడా ఈ సందర్భంగా వివిధ బ్రాండ్లు తమ స్టాల్స్లో ప్రదర్శించాయి. కాగా, 350సీసీ లోపు బైక్లపై జీఎస్టీ రేటును ఇప్పుడున్న 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించిన నేపథ్యంలో (ఈ నెల 22 నుంచి అమలు) ఎన్ఫీల్డ్ హంటర్పై గరిష్టంగా రూ.22,000 తగ్గింపును ప్రకటించిన సంగతి తెలిసిందే.శివరామకృష్ణ మిర్తిపాటి (చెన్నై నుంచి సాక్షి బిజినెస్ ప్రతినిధి) -
60 తర్వాత.. ఆచితూచి..!
మనలో చాలా మంది పదవీ విరమణ ప్రణాళిక గురించి పెద్దగా పట్టించుకోరు. ఎప్పుడో వృద్ధాప్యంలో పలకరించే రిటైర్మెంట్ గురించి యవ్వనంలో ఉన్నప్పుడు చర్చించడం వారికి నచ్చదు! మధ్య వయసు వచ్చే వరకు అభిరుచులు, ఆకాంక్షలు, కోరికల చుట్టూ సాగిపోతుంటారు. దీంతో రిటైర్మెంట్కు ప్రాధాన్యం పక్కకు వెళ్లిపోతుంది. తీరా రిటైర్మెంట్ పలకరించిన తర్వాత, అప్పటి వరకు తాము వెనకేసింది అవసరాలకు ఎంత మాత్రం సరిపోదని తెలుసుకుని ఆందోళన చెందాల్సి వస్తుంది. అనారోగ్యంతో ఒక్కసారి ఆస్పత్రిపాలైతే పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి రావచ్చు. లిక్విడిటీ తగినంత లేని సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల.. క్లిష్ట సమయాల్లో రోజువారీ ఖర్చులకు సైతం కటకట ఎదుర్కోవాల్సి రావచ్చు. మెరుగైన రాబడి లేని సాధనాలను నమ్ముకోవడం వల్ల రిటైర్మెంట్ ఫండ్ దీర్ఘకాలం పాటు అవసరాలను తీర్చలేకపోవచ్చు. అందుకే పదవీ విరమణ తర్వాత.. ముఖ్యంగా 60 ఏళ్ల తర్వాత వేసే ప్రతి అడుగు ఆర్థికంగా ఆచితూచి ఉండాలి. ఉద్యోగంలో మాదిరే పదవీ విరమణ తర్వాత కూడా క్రమం తప్పకుండా ఆదాయం వచ్చే ప్రణాళిక ఉండాలి. లేదంటే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పటి వరకు సమకూర్చుకున్న ఫండ్ (పొదుపు నిధి)ను వివిధ సాధనాల్లో పెట్టుబడి పెట్టి.. ప్రతి నెలా నిర్ణిత మొత్తాన్ని ఉపసంహరించుకునే ఏర్పాటు చేసుకోవాలి. ‘‘పెట్టుబడి నుంచి మొదటి ఏడాది 3–4 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు. రెండో ఏడాది నుంచి ద్రవ్యోల్బణం సూచీ స్థాయిలో ఉపసంహరణకు పరిమితం కావాలి’’ అని నెర్డిబర్డ్ వెల్త్ అడ్వైజరీ ప్రిన్సిపల్ ఆఫీసర్ శిల్పా భాస్కర్ గోలే సూచించారు. ఉపసంహరణలో చిన్న తేడా వచ్చినా రిటైర్మెంట్ నిధిని ఎక్కువ కాలం పాటు కాపాడుకోలేరు. ఉదాహరణకు రూ.2 కోట్ల నిధి ఉందనుకోండి. ఏటా 8 శాతం వృద్ధి చెందుతూ, ప్రతి నెలా రూ.లక్ష ఉపసంహరించుకుంటే తమవద్దనున్న నిధి 6 శాతం ద్రవ్యల్బోణం అంచనా ఆధారంగా 21 ఏళ్ల అవసరాలకు సరిపోతుంది. అలా కాకుండా ప్రతి నెలా రూ.1.5 లక్షల చొప్పున ఉపసంహరించుకుంటూ వెళితే అదే నిధి 13 ఏళ్ల అవసరాలనే తీర్చగలదు. ఎంత ఉపసంహరించుకోవాలన్న స్పష్టత కొరవడితే, తొలినాళ్లలో అధికంగా ఖర్చు చేయొచ్చు. ఖర్చులకు అనుగుణంగా ఉపసంహరణలు కొనసాగితే, తర్వాతి సంవత్సరాలకు పెద్దగా మిగిలి ఉండదని 5నాన్స్ డాట్ కామ్ వ్యవస్థాపకుడు దినేష్ రోహిరా హెచ్చరించారు. పేరుకే రిటైర్మెంట్. కానీ, నేడు చాలా మంది ఆ తర్వాత కూడా ఏదో ఒక పని చేస్తున్నారు. అలాంటి మార్గాలను గుర్తించాలి. దీనివల్ల రిటైర్మెంట్ ఫండ్ నుంచి తక్కువ ఉపసంహరణకు పరిమితం కావొచ్చు. ఫలితంగా రిటైర్మెంట్ నిధిని ఎక్కువ కాలం కాపాడుకోవచ్చు.ఈక్విటీ పెట్టుబడులపై అప్రమత్తత... పదవీ విరమణ తర్వాత ఈక్విటీ పెట్టుబడులకు పూర్తిగా దూరం కావాల్సిన అవసరం లేదు. ఫిక్స్డ్ ఇన్కమ్/డెట్ సెక్యూరిటీల రాబడిపై ద్రవ్యోల్బణం క్షీణత ప్రభావాన్ని చాలా మంది అర్థం చేసుకోరు. పదవీ విరమణ తర్వాత పెట్టుబడుల్లో వృద్ధి భాగం లేకపోతే, పొదుపు నిధి విలువ వేగంగా తగ్గిపోతుంది. కనుక 70 ఏళ్లు దాటిన వారు సైతం తమ మొత్తం పెట్టుబడుల్లో 10–15 శాతాన్ని అధిక నాణ్యతతో కూడిన డివిడెండ్ ఇచ్చే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలని దినేష్ రోహిరా సూచించారు. దీనివల్ల పెట్టుబడి ద్రవ్యోల్బణాన్ని మించి వృద్ధి చెందుతుంది. అదే సమయంలో ఈక్విటీలపై ఎక్కువగా ఆధారపడడం కూడా మంచిది కాదు. ఎందుకంటే రిటైర్మెంట్ ఆరంభంలో ఎక్కువ మొత్తం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే.. సరిగ్గా అప్పుడే ఈక్విటీల్లో బేర్ దశ (పతనకాలం) ఆరంభమై కొన్నేళ్ల పాటు కొనసాగితే.. అవసరాల కోసం ఈలోపు చేసే ఉపసంహరణలతో పెట్టుబడి విలువ గణనీయంగా పడిపోతుంది. కనుక 5–7 ఏళ్ల అవసరాలకు సరిపడా మొత్తాన్ని సురక్షిత డెట్ సాధనాల్లో తప్పకుండా ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల అంతకాలం పాటు ఈక్విటీ పెట్టుబడులను కదిలించకుండా ఉంటే ఆ మొత్తం మెరుగ్గా వృద్ధి చెందేందుకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది.యాన్యుటీ ప్లాన్లు యాన్యుటీ ప్లాన్లు.. హామీతో కూడిన రాబడిని ఇస్తాయి. కానీ, రిటైర్మెంట్ నిధి మొత్తాన్ని యాన్యుటీ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేయడం మంచి నిర్ణయం అనిపించుకోదు. ఒక్కసారి యాన్యూటీ ప్లాన్ కొనుగోలు చేసిన తర్వాత చివరి వరకు ఒకే విధమైన రాబడికి లాక్ అయినట్టే. వ్యయాలు, వైద్య అత్యవసరాలు లేదా పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా రాబడి పెరగదు. యాన్యుటీలకు పన్ను ప్రయోజనాలు కూడా లేవు. కనుక కొంత వరకు యాన్యుటీకి కేటాయించుకుని, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, డెట్ ఫండ్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో కొంత చొప్పున ఇన్వెస్ట్ చేసుకోవాలి. సిస్టమ్యాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ (ఎస్డబ్ల్యూపీ) రూపంలో ఆదాయ మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి.వైద్యపరంగా సన్నద్ధత.. వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు సర్వ సాధారణం. వైద్యపరమైన ద్రవ్యోల్బణం 12–14%గా ఉంటోంది. కనుక ఈ సమయంలో హెల్త్ ఇన్సూరెన్స్ తప్పకుండా ఉండాలి. ఇది లేకపోతే పొదుపు నిధిపై ఆధారపడాల్సి వస్తుంది. ఆర్థిక కోణం నుంచి చూస్తే ఇది పెద్ద తప్పిదం అవుతుంది. రిటైర్మెంట్ ఫండ్ అన్నది జీవితాంతం అవసరాలను తీర్చడం కోసం. వైద్యం కోసం దాన్ని వాడటం మొదలు పెడితే తక్కువ కాలంలోనే ఖాళీ అయిపోతుంది. కనుక రిటైర్మెంట్ తర్వాత ప్రీమియం భారమైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ను కొనసాగించాలి. ప్రీమియం భారమనిపిస్తే రూ.5 లక్షలకు బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని, రూ.5 లక్షల డిడక్టబుల్తో రూ.50 లక్షలకు సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవచ్చు. ఉద్యోగ సమయంలో కంపెనీ గ్రూప్ హెల్త్ పాలసీ ఉందని, వ్యక్తిగత హెల్త్ పాలసీ లేదా ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ను చాలా మంది తీసుకోరు. ఉద్యోగ విరమణ తర్వాత తీసుకుంటే అప్పుడు భారీ ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. కనుక గ్రూప్ హెల్త్ ప్లాన్పై ఆధారపడకుండా వ్యక్తిగతంగా కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండేలా చూసుకోవాలి.ఎస్టేట్ ప్లానింగ్ 60 తర్వాత తప్పకుండా పట్టించుకోవాల్సిన అంశం ఎస్టేట్ ప్లానింగ్. స్థిర, చరాస్తులు, ఆర్థిక ఆస్తులను ఎలా నిర్వహించాలి? ఎలా పంపిణీ చేయాలన్నది ఇది నిర్దేశిస్తుంది. కేవలం ధనవంతుల కోసమే ఇదని భావిస్తుంటారు. కానీ, ఆస్తులున్న ప్రతి కుటుంబానికి అవసరమే. కనీసం వీలునామా రూపంలో అయినా ఎవరికి ఏ మేరకు పంపిణీ చేయాలో సూచించాలి. తద్వారా భవిష్యత్తులో వారసుల మధ్య వివాదాలు లేకుండా జాగ్రత్తపడొచ్చు. ఇక్కడ వీలునామా అన్నది తమ మరణానంతరం తమ వారసులకు ఏవేవి, ఎలా చెందాలో సూచించే పత్రం. అదే ఎస్టేట్ ప్లానింగ్ అయితే జీవించి ఉన్న సమయంలోనూ ఆయా ఆస్తుల రక్షణ, వాటిని తమ అభీష్టం మేరకు నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. ఒకవేళ ఏదైనా అనారోగ్యం కారణంగా కుటుంబ యజమాని అశక్తుడిగా మారిన సందర్భంలో అప్పటికే ఎస్టేట్ ప్లానింగ్ ఉంటే, అందులో పేర్కొన్న విధంగా ఆస్తుల నిర్వహణను కుటుంబ సభ్యులు లేదా ట్రస్టీలు చూసుకుంటారు. ఎస్టేట్ ప్లానింగ్ లేదా వీలునామా ఉన్నప్పటికీ.. పెట్టుబడులకు నామినీని నమోదు చేయడం కూడా అవసరమే. దీనివల్ల వీటి క్లెయిమ్ సులభతరం అవుతుంది. పన్ను ప్రయోజనం ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీలు) పన్ను పరంగా మెరుగైన సాధనాలు కావు. వీటి రాబడి వార్షిక ఆదాయానికి కలుస్తుంది. తమకు వర్తించే శ్లాబు రేటు ప్రకారమే ఎఫ్డీ రాబడిపైనా పన్ను చెల్లించాల్సి వస్తుంది. గతంలో మాదిరి డెట్ మ్యూచువల్ ఫండ్స్లో స్వల్పకాల/దీర్ఘకాల పెట్టుబడుల ప్రయోజనాలు ఇప్పుడు లేవు. ఎప్పుడు విక్రయించినా ఎఫ్డీల మాదిరే ఆదాయం వార్షిక ఆదాయానికి కలిపి చూపించాల్సిందే. వీటికి బదులు పన్ను ఆదా కోసం అయితే ఆర్బిట్రేజ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వీటిలో రాబడికి ఈక్విటీ పెట్టుబడులకు మాదిరే స్వల్ప, దీర్ఘకాల మూలధన పన్ను నిబంధనలు అమలవుతాయి. రిస్క్ దాదాపు ఉండదు. లిక్విడ్ ఆస్తులకు చోటు ఉండాలి కొంత మంది రిటైర్మెంట్ తర్వాతి అవసరాల కోసం ప్రాపర్టీని (ఇల్లు/ఫ్లాట్) సమకూర్చుకుంటుంటారు. స్థిరాస్తి రూపంలో ఉండడం వల్ల లిక్విడిటీ (నగదు లభ్యత) సమస్య ఎదురుకావొచ్చు. అవసరమైనప్పుడు ప్రాపర్టీని వెంటనే నగదుగా మార్చుకోవడం సాధ్యపడదు. ఇక నిర్వహణ వ్యయాలు, పన్నులు, న్యాయ వివాదాల రిస్్కలు ఎలానూ ఉంటాయ్. రిటైర్మెంట్ కోసమని ప్రాపర్టీలను సమకూర్చుకున్నప్పటికీ.. పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయానికి ప్రణాళిక ఉండాలి. ఇందుకు ప్రాపర్టీని విక్రయించడం లేదంటే రివర్స్ మార్ట్గేజ్కు వెళ్లడం మంచి ఆప్షన్ అవుతుంది. రివర్స్ మార్ట్గేజ్లో ప్రాపర్టీని బ్యాంక్ తనఖా పెట్టుకుని, నెలవారీ కోరుకున్నంత ఆదాయాన్ని నిర్ణిత కాలం పాటు చెల్లిస్తుంది. ఇంటిని విక్రయించనక్కర్లేదు. అదే ఇంట్లో నివాసం ఉండొచ్చు. మీ తదనంతరం వారసులు అప్పటి వరకు ఉన్న బకాయిని చెల్లించి అదే ఇంటిని స్వా«దీనం చేసుకోవచ్చు. లేదంటే బ్యాంక్ వేలం వేసి, బకాయి పోను మిగిలినది వారసులకు చెల్లిస్తుంది. ఇంటి కోసం రుణం తీసుకుని మనం ఎలా అయితే నిర్ణిత కాలం పాటు ఈఎంఐ చెల్లిస్తామో.. రివర్స్ మార్ట్గేజ్లో బ్యాంక్ అలా మనకు చెల్లిస్తుంది. ఏకమొత్తంలో చెల్లింపులకూ కొన్ని బ్యాంక్లు అవకాశం కల్పిస్తున్నాయి. రుణ భారం రిటైర్మెంట్ నాటికి ఎలాంటి రుణం మిగిలి ఉండకూడదు. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డు బకాయిలు, గృహ రుణాలు ఏవైనా సరే గుడ్బై చెప్పేయాలి. లేదంటే రిటైర్మెంట్ కోసం ఉద్దేశించిన పొదుపు నిధిని రుణ చెల్లింపుల కోసం వినియోగించాల్సి వస్తుంది. దీనివల్ల ఆర్థిక స్వేచ్ఛను కోల్పోవాల్సి వస్తుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
జాలీగా ‘జోలోఫ్ రైస్’
గిన్నిస్ ప్రపంచ రికార్డ్ సృష్టించాలంటే అద్వితీయ, అసాధారణ ఫీట్ చేయాల్సిందే. అతిభారీ వంటకంతో గిన్నిస్ పుస్తకంలోకి నేరుగా ఎక్కేయాలని నైజీరియా పాకశాస్త్ర ప్రవీణురాలు హిల్దా బకీ సిద్ధమయ్యారు. అనుకున్నదే తడవుగా జోలోఫ్ రైస్వంటకానికి కావాల్సి దినుసులన్నీ సమకూర్చుకుని అతి భారీ వంటకాన్ని తయారుచేశారు. ఇప్పటికే నమోదైన రికార్డ్తో పోలిస్తే ఇది పెద్దది కావడంతో అనధికారికంగా ఈ రికార్డ్ను బద్దలుకొట్టినట్టేలెక్క. ఇక ఈ రికార్డ్ను గిన్నిస్ పుస్తకం ప్రతినిధులు అధికారికంగా ధృవీకరించడమే తరువాయి. ఈ రికార్డ్ ఫీట్కు నైజీరియాలోని విక్టోరియా ద్వీపంలోని ఎకో హోటల్స్ అండ్ సూట్స్ వేదికైంది. ఈ భారీ వంటకాన్ని కళ్లారా చూసేందుకు, నోరారా రుచి చూసేందుకు వందలాది మంది భోజనప్రియులు బారులుతీరారు. శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. సమన్వయంతో.. సమపాళ్లలో.. హిల్దా బకీ గతంలోనే ఏకధాటిగా 93 గంటలకుపైగా వంటచేసి గిన్నిస్ ప్రపంచ రికార్డును సృష్టించారు. కానీ అవన్నీ వేర్వేరు చిన్నపాటి వంటకాలు. కానీ ఇది వేలకేజీల ఒకే వంటకం. అదికూడా నైజీరియా దేశ సంప్రదాయ ‘జోలోఫ్ రైస్’వంటకం. మేకమాంసం, బియ్యం, టమాటా పేస్ట్తో చేసే స్థానిక వంటకం. ఫుడ్ ఇన్ఫ్లూయెన్సర్గా, సెలబ్రిటీగా హిల్దా ఇప్పటికే మహా క్రేజ్ సంపాదించుకున్నారు. దీంతో ఈమె చేసే వంటకంపై స్థానికంగా అంచనాలు భారీగా పెరిగాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఆమె ఏకంగా 300 మంది సహాయకులు పేద్ద బృందాన్ని ఏర్పాటుచేసుకున్నారు. కనీసం ఏడాది క్రితమే ఈ భారీ వంటకం కోసం ప్రణాళికలు సిద్ధంచేశారు. కనీసం రెండు నెలలుగా ఈమె బృందం అహరి్నశలు కష్టపడి అన్ని రకాల మేలుజాతి సరకులను తెప్పించి వంటకోసం సిద్ధంచేసుకుంది. 4,000 కేజీల బియ్యం, 1,200 కేజీల టమాట పేస్ట్, 600 కేజీల ఉల్లిగడ్డలు, 6,000 లీటర్ల మంచినీరు, 168 కేజీల మేకమాంసం, 700 కేజీల వంటనూనెలతో వంటకాన్ని సిద్ధంచేశారు. ఇంతపెద్ద వంట వండేందకు అదే స్థాయి అతిపెద్ద స్టీల్ పాత్ర అవసరం. అందుకే 23,000 లీటర్ల సామర్థ్యముండే స్టీల్ పాత్రనూ ప్రత్యేకంగా తయారుచేయించారు. ‘‘వంటకోసం అన్ని సిద్ధమైనా అంతటి దినుసులు, బియ్యాన్ని తిప్పే గరిటెలు లేవు. అందుకే భారీ దుంగలను గరిటెల్లాగా తయారుచేశాం’’అని పాకశాస్త్ర ప్రవీణురాలు హిల్దా బకీ చెప్పారు. ‘‘నాలుగేళ్ల క్రితం ఒక వంటల పోటీలో ఇదే జోలోఫ్ రైస్ వంటకం అద్భుతంగా వండి ఫస్ట్ ప్రైజ్ గెల్చుకున్నా. ఆ తర్వాత 2023 ఏడాదిలో ఏకబిగిన 93 గంటల 11 నిమిషాలు ఆగకుండా పలురకాల వంటటుచేసి గిన్నిస్ ప్రపంచ రికార్డ్ బద్దలుకొట్టా’’అని ఆమె చెప్పారు. ‘‘ఎకో హోటల్స్ అండ్ సూట్స్లో వంటకం వండట్లేరు. రికార్డ్ను వండుతున్నారు. చూసొద్దాం. కుదిరితే మన ఫేవరెట్ జోలోఫ్ రైస్ తినొద్దాం’’అంటూ పలువురు నెటిజన్లు ఈమెకు ఆన్లైన్లో తెగ మద్దతు ప్రకటించారు. అన్ని దినుసులు సిద్ధంచేసుకుని వంట మొదలెట్టాక కేవలం 9 గంటల్లోనే వంట పూర్తిచేయడం విశేషమని పలువురు పొగిడారు. ‘‘ఈమె క్రమశిక్షణ, సృజనాత్మకత నుంచి యువత ఎంతో నేర్చుకోవాలి. దేశ సంప్రదాయ వంటకానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెస్తున్న ఈమెకు నా ఆశీస్సులు’’అని నైజీరియా సమాచార శాఖ మంత్రి మొహమ్మెద్ ఇద్రీస్ అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చదువుకొనాల్సిందే!
స్కూల్ ఫీజు అనగానే సగటు జీవి బెంబేలెత్తిపోతున్నాడు. ప్రభుత్వ పాఠశాలలు అయితే పెద్దగా భారం అనిపించదు. సమస్యల్లా ప్రైవేటు స్కూళ్లతోనే. ఎందుకంటే అక్కడ చదువు‘కొనాల్సిందే’. ఇది జగమెరిగిన సత్యం. దేశవ్యాప్తంగా ప్రభుత్వ బడులతో పోలిస్తే ప్రైవేటు పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి ఏటా అవుతున్న సగటు ఖర్చుల్లో తేడా ఎన్నో రెట్లు ఉంటోంది. పట్టణాలే కాదు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. దేశంలో కిండర్గార్టెన్ (కేజీ) విద్య.. అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చదువుకు ఏటా అయ్యే ఖర్చు ప్రైవేటు పాఠశాలల్లో అధికంగా ఉంది. ప్రీ–ప్రైమరీ స్థాయిలో ప్రభుత్వ బడులతో పోలిస్తే ప్రైవేటు స్కూళ్లలో ఒక్కో విద్యార్థికి ఏటా అయ్యే వ్యయం.. గ్రామీణ ప్రాంతాల్లో 21.8 రెట్లు, పట్టణ ప్రాంతాల్లో 16.1 రెట్లు అధికంగా ఉంది. 9, 10వ తరగతులు (సెకండరీ), 11, 12 తరగతుల (హయ్యర్ సెకండరీ) విషయంలో ఈ వ్యత్యాసం తక్కువగా ఉంది.కేంద్ర గణాంక శాఖ 2025 ఏప్రిల్–జూన్ మధ్య చేపట్టిన సర్వే ఆధారంగా రూపొందించిన ‘కాంప్రహెన్సివ్ మాడ్యులర్ సర్వే: ఎడ్యుకేషన్ 2025’ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వ్యయం అంటే.. స్కూల్లో అడ్మిషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు, పరీక్ష ఫీజు, డెవలప్మెంట్ ఫీజు, ఇతరత్రా కార్యక్రమాలకోసం చేసే ఖర్చు; రవాణా, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, స్టేషనరీ.. ఇలా విద్యార్థి చదువు కోసం చేసిన మొత్తం ఖర్చు. -
డిజిటల్ 'డోపీ'లు
ఎంతగా అంటే.. తాము సోషల్ మీడియాలో పెట్టే పోస్టుకు లైకులు, కామెంట్లు రావటానికి ఒక్క సెకను ఆలస్యమైనా పిచ్చిగా ప్రవర్తించేంతగా. ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలను అధికంగా వినియోగించే యువత సమయాన్ని వృథా చేసుకోవటంతోపాటు అనేక ఆరోగ్య సమస్యలు కూడా కొని తెచ్చుకుంటోంది. అందులో తాజాగా ‘డిజిటల్ డోపమిన్’వచ్చి చేరింది. – సాక్షి, హైదరాబాద్ఏమిటీ డోపమిన్? డోపమిన్ అనేది మన శరీరంలో ఉత్పత్తి అయ్యే ఒక హార్మోన్. దీనిని ‘సంతోష హార్మోన్’అని పిలుస్తారు. ఇది మన మెదడు బహుమతి వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తుంది. రుచికరమైన ఆహారం తినడం, ప్రశంసలు స్వీకరించడం, లక్ష్యాన్ని సాధించడం వంటి ఆహ్లాదకరమైన అనుభూతిని పొందినప్పుడు ఈ హార్మోన్ విడుదలవుతుంది. ఈ న్యూరోట్రాన్స్మీటర్ మెదడుకు కార్యాచరణ ఫలవంతమైందని సంకేతమిస్తుంది. మరింత ఉత్సాహంతో పనిచేసేలా ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు సమస్య ఏంటి? మనసుకు సంతోషాన్ని కలిగించే పనులు చేసినప్పుడు విడుదలై మనల్ని మరింత ప్రోత్సహించే ఈ డోపమిన్ హార్మోనే ఇప్పుడు సోషల్ మీడియాను నడిపిస్తోందని మానసిక శాస్త్రవేత్తలు అంటున్నారు. మనం సోషల్ మీడియాలో పెట్టే పోస్టు లు, వీడియోలకు లైకులు, షేర్లు వచ్చినప్పుడు సంతోషం కలుగుతుంది. అప్పుడు మన మెదడులో ఈ డోపమిన్ హార్మో న్ విడుదలవుతుంది. అయితే, అది ఇప్పుడు శ్రుతిమించింది. మనం పెట్టే ప్రతి పోస్టుకు లైకులు, షేర్ల కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూసేలా ఈ హార్మోన్ ప్రేరేపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల యువత నిత్యం సోషల్మీడియా యాప్లను అంటిపెట్టుకొని ఉంటున్నారని అంటున్నారు. అలా మన మెదడు ఈ తక్షణ బహుమతులను కోరుకునేలా కండిషన్కు గురవుతుంది. ఇది స్వల్పకాలిక ఆనందం ఇచ్చినా.. తరువాత దీర్ఘకాలిక అసంతృప్తికి దారితీస్తుందని పేర్కొంటున్నారు. డిజిటల్ డోపమిన్ సంకేతాలు» సామాజిక మాధ్యమాల్లో నిరంతరం నోటిఫికేషన్లను తనిఖీ చేయడం » సోషల్ ప్లాట్ఫామ్లలో యాక్టివ్గా లేనప్పుడు ఆందోళన చెందడం» సమయం తెలియకుండా సోషల్ మీడియాలో స్క్రోలింగ్ చేస్తూ ఉండిపోవటం» ఒకరి జీవితాన్ని ఇతరుల హైలైట్ రీల్స్తో పోల్చడం » ప్రతికూల కంటెంట్తో మానసిక స్థితిలో మార్పులు రావడం డోపమిన్ విరమణ (క్రాష్) తర్వాత భావోద్వేగ ప్రతిస్పందనలు.. » డోపమిన్ హార్మోన్ ప్రభావం తొలగిపోయి మెదడు సాధారణ స్థితికి రావటాన్ని డోపమిన్ క్రాష్ అంటారు. » ఈ స్థితిలో విసుగు, అశాంతి కలుగుతాయి. » చిరాకు, నిరాశ, ౖఅపరాధ భావన, సిగ్గు, నిస్పృహ ఆవరించడం, ఆందోళనకు గురవుతారు. »ఉదాహరణకు ఓటీటీలో ఒక వెబ్సిరీస్ను గంటల తరబడి చూసిన తర్వాత సమయం అంతా వృథా అయ్యిందని బాధపడటం. » డోపమిన్ వ్యసనానికి అతిపెద్ద కారణాలలో సోషల్ మీడియా ఒకటి. ఇన్స్ట్రాగామ్, టిక్టాక్, ఫేస్బుక్ వంటి వాటిని వినియోగదారులను ఆకర్షించేలా రూపొందించారు. ప్రతి లైక్, కామెంట్, షేర్ చిన్నస్థాయిలో డోపమిన్ విడుదలను ప్రేరేపిస్తాయి. ఏదో సాధించామనే భావనను కలిగిస్తాయి. ఈ వర్చువల్ బహుమతులను ఎంత ఎక్కువగా వెంబడిస్తే, నిజ జీవిత అనుభవాలతో మనం అంతగా అసంతృప్తి చెందాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. » ఇది మన జీవితంలోని ఇతర అంశాలైన అతిగా తినడం, ఇంపల్స్ షాపింగ్, మితిమీరిన గేమింగ్ వంటి వాటికి కూడా విస్తరించింది. » డిజిటల్ డోపమిన్ సమస్య ఇప్పటికే అమెరికన్లలో తీవ్రంగా ఉంది. భారత్లోని సోషల్, డిజిటల్ మీడి యా వినియోగదారులు సైతం దీనికి ఎక్కువగానే ప్రభావితమవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.‘డిజిటల్’ వాడకం తగ్గించుకోవటమే మార్గం డ్రగ్స్, ఆల్కహాల్ వంటివి తీసుకున్నపుడు వచ్చే ప్రభావం మాదిరిగా ‘డిజిటల్ డోపమిన్’ప్రభావితం చేస్తోంది. మెదడు రివార్డ్స్ సిస్టమ్లో భాగంగా క్విక్ గ్రాటిఫికేషన్ను కోరుకుంటోంది. మెదడులోని సహజ రివార్డ్ సర్క్యూట్ను సోషల్మీడియా అధిక వినియోగం హైజాక్ చేసి చురుకుదనాన్ని తగ్గిస్తుంది. పుస్తకాలు చదివే అభిరుచి, రోజువారీ వ్యాయామం వంటివాటికి దూరం చేస్తోంది. స్వీయ నియంత్రణ తగ్గిపోవడం, ఏ అంశంపైనా దృష్టి నిలపలేకపోవటం, చేయాల్సిన పనులను వాయిదా వేయడం నిత్యకృత్యమవుతున్నాయి. దీనిని అధిగమించాలంటే మొబైల్స్, ఇతర డిజిటల్ సాధనాల వినియోగ సమయాన్ని కచ్చితంగా తగ్గించుకోవాలి. – డా. నిషాంత్ వేమన, కన్సల్టింగ్ సైకియాట్రిస్ట్.సామాజిక మాధ్యమాలు నిత్యావసరాలు కాకపోయినా.. అవే సర్వస్వం, అవి లేకపోతే అంతా శూన్యం అన్నట్టుగా యువత ప్రవరిస్తుండడం ఆందోళనకరం. వ్యాయామ విద్య, క్రీడలు, కళలు వంటి వాటిని పట్టించుకోకపోవడం వల్లనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఇప్పటికైనా సామాజిక మాధ్యమాల అతి వినియోగాన్ని అదుపుచేసే చర్యలు తీసుకోకపోతే దేశం అనేక దుర్గుణాలకు, మానసిక అనారోగ్యాలకు కేంద్రంగా మారుతుంది. వ్యాయామం, శారీరక శ్రమ తగ్గిపోయి ఇప్పటికే డయాబెటిస్, ఒబేసిటీ వంటివి తీవ్రస్థాయికి చేరుకున్నాయి. డిజిటల్ డోపమిన్ మనిషి ఉత్పాదకతపై తీవ్ర ప్రభావం చూపుతుంది. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ -
గుర్తుంచుకోండి
సుప్రసిద్ధ శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్స్టీన్ తరచూ ఫోన్ నంబర్లు మర్చిపోతూ ఉండేవారు. ఈ విషయంపై ఆయన ఒకసారి.. ‘టెలిఫోన్ డైరెక్టరీ చూస్తే తెలుస్తుందిగా’ అని కూల్గా అన్నారట! అలాంటి జ్ఞానులు సాధారణ సమాచారాన్ని గుర్తుపెట్టుకోవాలని ఏమీలేదని దీని సారాంశం. అయితే, మామూలు వ్యక్తులు మతిమరుపును అలా తీసేయడానికి వీల్లేదు. దానికి కారణాలేంటో గమనించి.. ఏ వయసులో ఎలాంటి సమస్యలు రావచ్చు.. వాటిని ఎలా పరిష్కరించుకోవచ్చో తెలుసుకోవాలి.20లలో..25 ఏళ్లు వచ్చేసరికి మెదడు పూర్తిగా వికసిస్తుంది. నేర్చుకోవడం, గుర్తుపెట్టుకోవటం, గుర్తుతెచ్చుకోవడంలో అత్యుత్తమంగా పనిచేస్తుంది. వయసు పెరిగేకొద్దీ మెదడు సామర్థ్యం కొద్దిగా తగ్గుతుంది. ఈ తగ్గుదల దశాబ్దానికి స్వల్పంగా 5% వరకు ఉంటుందని మిచిగాన్ విశ్వవిద్యాలయ పరిశోధన వెల్లడించింది. 30లలో..మెదడు కణాల మధ్య సంకేతాలను ప్రసారం చేసే న్యూరో ట్రాన్స్మీటర్లు ముప్పైలలో తగ్గటం ప్రారంభిస్తాయి. జ్ఞాపకాల నిక్షిప్తానికి సాయపడే రసాయనమైన డోపమైన్.. వయసు పెరిగే కొద్దీ దశాబ్దానికి 10% మేర తగ్గుతుంది. చేతి రాతే జ్ఞాపక మంత్రం!ఎక్కువ కాలం గుర్తుండాలంటే టైప్ చేయడానికి బదులుగా చేతితో రాయండి. దీనివల్ల మెదడులో జ్ఞాపకశక్తికి, అవగాహనకు అనుసంధానమై ఉండే భాగాలు బాగా పనిచేస్తాయని ‘సైకలాజికల్ సైన్స్ జర్నల్’లో ప్రచురితమైన పరిశోధన వెల్లడించింది.40లలో..మధ్య వయసు నుంచి జ్ఞాపకశక్తి క్షీణించడం ప్రారంభమవుతుందని బ్రిటిష్ మెడికల్ జర్నల్ (2012)లో ప్రచురితమైన అధ్యయనంలో తేలింది. అధిక ఒత్తిడి సమయాల్లో అధికంగా విడుదలయ్యే కార్టిసాల్ హార్మోన్ మెదడులో కొత్త జ్ఞాపకాలను నిక్షిప్తం చేసే భాగాలను, ప్రక్రియను దెబ్బతీస్తుంది. ప్రాసెస్డ్ మీట్ వద్దు40 ఏళ్ల వయసులో రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసం ఉత్పత్తులను అతిగా తీసుకుంటే భవిష్యత్తులో జ్ఞాపకశక్తి తగ్గుతోందని ‘న్యూరాలజీ జర్నల్’లో ప్రచురితమైన ఓ పరిశోధన సూచిస్తోంది. శాకాహారం ఎక్కువగా, మాంసాహారం తక్కువగా తీసుకునే వారి జ్ఞాపకశక్తి, ఏకాగ్రతల స్కోర్ ఎక్కువగా ఉందట. మాంసానికి బదులు నట్స్, బీన్స్ తీసుకుంటే ఈ ప్రమాదాన్ని 19% వరకు తగ్గించుకోవచ్చట.50లలో..మీరు ఎప్పుడైనా ఒక గదిలోకి వెళ్లి, మీరు దేనికోసం వెతుకుతున్నదీ మర్చిపోయారా? 50 ఏళ్లు దాటిన వారిలో ఇది సర్వసాధారణమే. ఇందుకు కారణం మెదడులోని ‘రిఫ్రంటల్ కార్టెక్స్’ కుంచించుకుపోవడమే. సాధారణ జ్ఞాపకాలను గుర్తుచేసుకునే సామర్థ్యం 45–55 ఏళ్ల మధ్య గరిష్ట స్థాయికి చేరుతుంది. మెనోపాజ్ కారణంగా ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్లలో వచ్చే హెచ్చుతగ్గుల వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రతలు ప్రభావితమవుతాయి. ఈ దశకు ‘బ్రెయిన్ ఫాగ్’ అని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘క్రాకింగ్ ది మెనోపాజ్’ పుస్తక రచయిత్రి ఆలిస్ స్మెల్లీ పేరుపెట్టారు.సానుకూల భావనతాళాలను ఎప్పుడూ ఒకే చోట పెట్టడం, ఫోన్ లో రిమైండర్లు పెట్టుకోవటం వంటి జాగ్రత్తలు తీసుకోండి. సానుకూల భావనతో ఉండే వారిలో జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని అధ్యయనాల సారాంశం. మెనోపాజ్ దశలో ఉన్న మహిళలు.. పౌష్టికాహారం తీసుకుంటూ, ఒత్తిడికి దూరంగా ఉంటే జ్ఞాపకశక్తి బాగుంటుంది.60లలో..ఈ వయసులో తరచుగా.. వ్యక్తుల పేర్లు, పదాలు గుర్తుకురాక సతమతమవుతుంటారు. అంతమాత్రాన వీరు బాధపడాల్సిన పనిలేదు. ఎందుకంటే, కిక్కిరిసిన గ్రంథాలయంలో ఒక పుస్తకాన్ని దొరకపుచ్చుకోవటానికి సమయం పడుతుంది కదా.. అలాగే ఇదీనూ! శారీరక శ్రమక్రమం తప్పకుండా బ్రిస్క్ వాకింగ్ వంటి ఏరోబిక్ ఎక్సర్సైజులు చేయాలి. వారంలో మూడు రోజులు ఇలా చేసే వృద్ధుల మెదడులోని జ్ఞాపకశక్తికి కేంద్రమైన హిప్పోక్యాంపస్ సైజు ఏడాదికి 2% పెరిగినట్లు యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా (2011) అధ్యయనంలో వెల్లడైంది. 70లలో..కొన్ని పేర్ల జాబితా చదివిన కొద్ది నిమిషాల తర్వాత ఆ పేర్లు గుర్తుచేసుకునే సామర్థ్యం 20 ఏళ్ల వారితో పోల్చితే 70 ఏళ్ల వారిలో సగానికి తగ్గుతుంది. చిన్ననాటి సంఘటనలను జ్ఞాపకం చేసుకోగలిగే వీరు.. నిన్న రాత్రి ఏం తిన్నారో మర్చిపోవచ్చు. దీనికి కారణం మెదడులో భావోద్వేగాల కేంద్రమైన ‘అమిగ్డలా’. యుక్తవయసు నాటి అనుభవాలు ఉద్వేగంతో కూడి ఉంటాయి కాబట్టి అమిగ్డలా సాయంతో వాటిని గుర్తు తెచ్చుకోగలుగుతారు. కొత్త పనులు చేయండి‘ద జర్నల్స్ ఆఫ్ జెరంటాలజీ’లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. రోజూ ఒకే రకం కాకుండా, కొత్త పనులు ప్రయత్నించే, ఉత్సాహంగా ఉండే వృద్ధుల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి ఇనుమడించాయి.80లలో..జ్ఞాపకశక్తి వేగంగా తగ్గుతుంది. మెదడుకు రక్తాన్ని అందించే ధమనుల సామర్థ్యం తగ్గిపోవటం వల్ల మెదడుకు రక్తప్రవాహం, ప్రాణవాయువు సరఫరా మందగించటమే ఇందుకు కారణం. వినికిడి సమస్య వల్ల కూడా జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఇతరులు చెప్పేది వినటానికి అధిక శక్తిని మెదడు వినియోగించాల్సి రావటంతో, ఆ విషయాలను గుర్తుపెట్టుకోలేరు. ఒంటరితనం, కుంగుబాటు కూడా జ్ఞాపకశక్తిని క్షీణింపజేస్తాయి.నలుగురితో కలవండిఇతరులతో ఎక్కువగా కలుస్తూ, కలివిడిగా ఉంటే యాక్టివ్గా ఉంటారు. బలమైన సాంఘిక సంబంధాలుండే వృద్ధుల జ్ఞాపకశక్తి అమోఘంగా ఉందని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యయనం (2015). వినికిడి పరికరాలు వాడని వృద్ధులతో పోలిస్తే, వాడే వారిలో జ్ఞాపకశక్తి 50%కి పైగా మెరుగ్గా ఉందని ‘లాన్సెట్’ అధ్యయనం (2023). -
చంద్రుడిపైకి మీ పేరు!
చందమామ రావే.. జాబిల్లి రావే అని పాడుతుంటాం. జాబిల్లి ఎలాగూ మన దగ్గరకు రాదు. పోనీ చంద్రమండలం మీద అడుగుపెడదామన్నా అందరికీ సాధ్యం కాదు. భూమిని వదిలి వెళ్ళకుండానే చంద్రుని చుట్టూ ప్రయాణించాలనుకుంటున్నారా? అంతరిక్ష పరిశోధనలో తదుపరి పెద్ద ముందడుగు వేయడానికి సిద్ధమవుతున్న అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా.. సామాన్యులనూ భాగస్వాములను చేసేందుకు మరోసారి ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. 2026 ఏప్రిల్లోగా ప్రారంభం కానున్న ఆర్టెమిస్–2 మిషన్ లో భాగంగా ఓరియన్ అంతరిక్ష పరిశోధన నౌకలో వ్యోమగాములు రీడ్ వైజ్మన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సెన్ చంద్రుని చుట్టూ ప్రదక్షిణ చేయనున్నారు. వారితోపాటు ఓ మెమరీ కార్డు సైతం జాబిల్లిని చుట్టి రానుంది. ఈ మెమరీ కార్డ్లో చేర్చడానికి తమ పేర్లను సమర్పించాల్సిందిగా ప్రజలను నాసా ఆహ్వానిస్తోంది. చంద్రుడికో నూలుపోగు మాదిరిగా చంద్రుడి మీదకో ‘పేరు’ అన్నమాట. చరిత్రలో భాగం కావడానికి ఇది ఒక గొప్ప అవకాశం. – సాక్షి, స్పెషల్ డెస్క్డిజిటల్ బోర్డింగ్ పాస్ఆసక్తిగలవారు ఉచితంగా తమ పేరును జోడించి తక్షణమే డిజిటల్ ‘బోర్డింగ్ పాస్’ పొందగలిగేలా నాసా ఒక ప్రత్యేక పేజీని ఏర్పాటు చేసింది. సేకరించిన పేర్లన్నీ ఓరియన్ లోపల ఇన్ స్టాల్ చేసే ఎస్డీ కార్డ్లో నిక్షిప్తం చేస్తారు. మొదటిసారిగా సిబ్బందితో కూడిన ఆర్టెమిస్ మిషన్ లో వ్యోమగాములతోపాటు మీ పేరూ జాబిల్లిని చుట్టి వస్తుందన్నమాట. సో, సరదాగా గుర్తిండిపోయేలా మీ పేరుతో డిజిటల్ బోర్డింగ్ పాస్ చేజిక్కించుకునేందుకు మీరూ దరఖాస్తు చేసుకోండి. చివరి తేదీ 2026 జనవరి 21. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టినప్పుడు సామాన్యులనూ భాగస్వాములను చేయడం నాసా ప్రత్యేకత.కీలకమైన అడుగు10 రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో నాసా కొత్త స్పేస్ లాంచ్ సిస్టమ్, ఓరియన్ అంతరిక్ష నౌక పనితీరును అధ్యయనం చేస్తారు. వ్యోమగాములు భూమి నుండి 2,30,000 మైళ్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించి.. తిరుగు ప్రయాణంలో చంద్రుని అవతలి వైపు చుట్టూ తిరుగుతారు. ఈ దశాబ్దం చివర్లో చంద్రుని ఉపరితలంపై వ్యోమగాములను దింపడం, అలాగే మానవులను అంగారక గ్రహానికి పంపాలన్న నాసా ప్రయత్నంలో ఇది ఒక కీలకమైన అడుగు. -
2-3 నిమిషాల్లో విరిగిన ఎముకలు అతికితే!!
ఈ గమ్మును మీ విరిగిన ఎముకల మధ్య రాస్తే.. అవి రెండు నుంచి మూడు నిమిషాల్లో అతుక్కుంటాయి అంటూ ఓ వీడియో గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైనాలో ఈ గ్లూ మీద జరిగిన పరిశోధనలు సక్సెస్ అయ్యాయని.. ఇది మార్కెట్లోకి రావడమే ఆలస్యమని.. ఇది గనుక అందుబాటులోకి వస్తే వైద్యరంగంలోనే విప్లవాత్మక మార్పునకు కారణమవుతుందని ఊదరగొడుతున్నారు. ఇంతకీ ఈ ప్రచారంలో నిజమెంత?.. ఓసారి పరిశీలిస్తే.. విరిగిన ఎముకలు అంత ఈజీగా అతుకుతాయా? గంటల తరబడి ఆపరేషన్లు చేస్తే.. నెలలు, సంవత్సరాల తరబడి అవి అతుక్కుంటున్నాయి. అలాంటిది కేవలం సెకన్ల వ్యవధిలో ఓ సూది ద్వారా అతుక్కనేలా చేయొచ్చా?. చైనా పరిశోధకులు కనిపెట్టిన బోన్ గ్లూకు అసలు శాస్త్రీయత ఉందా?.. ఆ ప్రచారంలో ఉన్నట్లు విరిగిన ఎముకలను గంటల పాటు శస్త్రచికిత్స చేసి, స్టీల్ ప్లేట్లు అమర్చే సంప్రదాయ వైద్యం ఇక చరిత్ర అవ్వబోతోందా?.. షెజాంగ్ స్థానిక మీడియా ప్రకారం.. తూర్పు చైనా(China)లోని షెజాంగ్ ప్రావిన్స్లో ‘బోన్ 02’ అనే బోన్ గ్లూ(bone glue)ను పరిశోధకులు ఆవిష్కరించారు. దీంతో విరిగిన ఎముకలను మూడు నిమిషాల్లోనే అతికించవచ్చని ఆ కథనం సారాంశం. సర్ రన్ రన్ షా ఆస్పత్రిలో అసోసియేట్ చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ లిన్ షాన్ఫింగ్ నేతృత్వంలోని బృందం దీనిని డెవలప్ చేసింది. కొత్తగా అభివృద్ధి చేసిన జిగురు కేవలం రెండు, మూడు నిమిషాల్లోనే ఎముకను బాగుచేస్తుందని అంటున్నారాయన. రక్త ప్రవాహం అధికంగా ఉండే వాతావరణంలోనూ దీని పనితీరు మెరుగ్గా ఉందని వెల్లడించారు. సంప్రదాయ వైద్యంలో ఎముకలు అతికించాలంటే శరీరానికి పెద్ద కోతలు వేసి, స్టీల్ ప్లేట్లను అమర్చుతారు. కానీ ఈ ఇంజెక్షన్తో అలాంటి అవసరం రాదని అంటున్నారాయన. పైగా బోన్ 02 శరరీంలో ఈజీగా కలిసిపోతుందని, కాబట్టి మరో సర్జరీ అనే అవసరం లేకుండా చేస్తుందని చెబుతున్నారాయన. ఆపరేషన్ల సక్సెస్ రేటు తక్కువగా ఉంటుండడమే.. తనకు దీనిని రూపొందించాలనే ఆలోచన కలగజేసిందని అంటున్నారాయన.ఇంతకీ ఈ గ్లూను అభివృద్ధికి ప్రేరణ ఏంటో తెలుసా?. నీటి అడుగున వంతెనలకు గట్టిగా అతుక్కునే ఆల్చిప్పలు. వాటి జీవశైలిని పరిశీలించిన లిన్ షాన్ఫింగ్ ఈ పరిశోధనకు శ్రీకారం చుట్టారు.ట్రయల్స్.. సక్సెస్.. ‘బోన్ 02’(Bone-02)ని లాబోరేటరీలో కూడా పరీక్షించారు. అందులో తేలింది ఏంటంటే.. ఇది 400 పౌండ్ల బలాన్ని తట్టుకోగలదు (అంటే చాలా బలంగా అంటుకుంటుంది). 0.5 MPa కోత బలం (shear strength) అంటే పక్కదిశలో ఒత్తిడిని తట్టుకునే శక్తి ప్రదర్శించింది. అలాగే.. 10 MPa సంపీడన బలం (compressive strength) అంటే నేరుగా ఒత్తిడిని తట్టుకునే శక్తి చూపించింది. ఈ లక్షణాలన్నీ సంప్రదాయ మెటల్ ఇంప్లాంట్లను భర్తీ చేయగల సామర్థ్యం దీనికి ఉందని సూచిస్తున్నాయి. అలాగే.. దీని వినియోగంతో ఫారిన్ బాడీ రియాక్షన్లు, ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుముఖం పట్టనున్నాయి. స్టీల్ ప్లేట్లు, స్క్రూలు అవసరం లేకుండా.. ఎముక గాయం నయం కాగానే శరీరంలో కలిసిపోవడం ఈ ‘బోన్ 02’లోని మరో విశిష్ట లక్షణం ఉండనే ఉంది. మొత్తం 150 మంది పేషెంట్లపై క్లినికల్ ట్రయల్స్లో ఇది విజయవంతంగా పని చేసింది. దీంతో.. సెప్టెంబర్ 10వ తేదీన దీనిని ప్రపంచానికి పరిచయం చేశారు. అయితే.. చైనా నేషనల్ మెడికల్ ప్రొడక్ట్స్ అడ్మినిస్ట్రేషన్ (NMPA) నుంచి పూర్తి మార్కెట్ అనుమతి పొందిందా? అనేదానిపై సష్టత కొరవడింది. వైద్య చరిత్రలో మైలురాయే!ఎముకలను అతికించేందుకు ఈ తరహా ప్రయోగాలు గతంలోనూ జరిగాయి. 1940 కాలంలో.. ఎముకలను అతికించే పదార్థాలు అభివృద్ధి చేయాలన్న ఆలోచన మొదలైంది. 1950 నుంచి ముప్పై ఏళ్లపాటు నాన్స్టాప్గా ఈ తరహా పరిశోధనలు జరిగాయి. ఇందుకోసం జంతు మూలాల నుంచి తీసిన ప్రోటీన్ పదార్థం, బలమైన అంటుకునే లక్షణాలున్న ఎపాక్సీ రెసిన్లు (Epoxy Resins) రసాయనాలు, వేగంగా గట్టిపడే ప్లాస్టిక్ తరహా అక్రిలేట్లు (Acrylates)సైనోఎక్రిలేట్లు (super glue తరహా) పదార్థాలు ఉపయోగించారు. అయితే.. ఇవి ఎముకలను అతికించే సామర్థ్యం ప్రదర్శించినా.. బాడీకి పనికి రాకుండా పోయాయి. వీటి వల్ల బయోకంపాటబిలిటీ సమస్యలు ఎదురయ్యేవి. అంటే.. ఇన్ఫెక్షన్, అలర్జీలు వచ్చేవి. పైగా శరీర కణజాలాన్ని దెబ్బ తీశాయి. వాటిని తొలగించేందుకు రెండో సర్జరీ అవసరం అయ్యేవి. ఈ కారణాల వల్ల, వాటిని వైద్యంగా విరమించాల్సి వచ్చింది. సైనోఎక్రిలేట్లు (super glue తరహా) వంటి పదార్థాలతో ప్రయోగాలు జరిగాయి.1990–2010 మధ్యకాలంలో.. బయోకంపాటబుల్ పాలిమర్లు, కోలాజెన్, కెరటిన్, కైటోసన్ వంటి పదార్థాలపై దృష్టి పెట్టారు. ఇవి శరీరంలో కరిగిపోవడం, తక్కువ రిస్క్ ఉండడం వంటి లక్షణాలు కలిగి ఉన్నా, అంత బలంగా అంటుకునే సామర్థ్యం ప్రదర్శించలేకపోయాయి. 2010 తర్వాత.. బయోమిమిటిక్ దిశగా ప్రయోగాలు జరిగాయి. అంటే.. ఆల్చిప్పలు, గవ్వలు, గోరింటాకు వంటి జీవుల నుంచి స్ఫూర్తి పొందిన బయోమిమిటిక్ గ్లూలు అభివృద్ధి చేయడం మొదలైంది. ఇవి నీటి లోపల కూడా బలంగా అంటుకునే లక్షణాలను కలిగి ఉండటంతో, శరీరంలోని రక్త ప్రవాహంలో కూడా పనిచేయడం లాంటి ఫలితాలను ఇచ్చాయి. అలా కొన్ని గ్లూలు మాత్రమే క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకున్నా.. అక్కడ సరైన రిజల్ట్ ఇవ్వలేకపోయాయి. ఇలాంటి టైంలో.. చైనా బోన్ 02 గ్లూలు వాస్తవిక ప్రయోగ దశకు చేరుకోవడం గమనార్హం. సాధారణంగా, ఇలాంటి వైద్య పరికరాలను Class III medical deviceగా పరిగణిస్తారు. కాబట్టి వీటికి క్లినికల్ ట్రయల్స్, టెక్నికల్ సమీక్ష, రెగ్యులేటరీ అనుమతులు అవసరం. ఆ తర్వాతే వాణిజ్య వినియోగానికి అందుబాటులోకి వస్తాయి. అంటే ఇది మార్కెట్లోకి రావడానికి ఎంతో టైం పట్టకపోవచ్చు. సో.. వైరల్ అవుతున్న ఆ వీడియో.. ఆ కథనం రెండూ నిజమే. ‘బోన్ 02’ అనే గ్లూ ఎముకలు అతికించడంలో వేగంగా, బలంగా, సురక్షితంగా పనిచేస్తోందని రుజువైంది. ఇది సంప్రదాయ చికిత్సకు మంచి ప్రత్యామ్నాయం అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. -
నేపాల్ అగ్నిగుండాన్ని చల్లార్చిన యాప్!
కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని నేపాల్ ప్రభుత్వం(గత) 26 సోషల్ మీడియా యాప్లపై విధించిన నిషేధం.. ఆ దేశంలో అలజడిని సృష్టించింది. జెడ్ జనరేషన్ యువత వీధుల్లోకి చేరి నిరసనలు చేపట్టడం.. వాటిని అదుపు చేసే క్రమంలో హింస చెలరేగి 51 మంది మరణించడం.. యాప్ బ్యాన్ ఎత్తివేత.. అయినా శాంతించని యువత.. ప్రధాని రాజీనామా.. ఆపై ఆందోళనకారుల ఛాయిస్ ప్రకారం తాత్కాలిక ప్రధాని ఎంపిక.. ఇదంతా పదిరోజుల వ్యవధిలోనే చకచకా జరిగిపోయింది. అయితే సో.మీ. బ్యాన్ నేపథ్యంలో ఆందోళనకారులు డిస్కార్డ్ Discord అనే చాట్ ప్లాట్ఫారమ్ను భలేగా ఉపయోగించారు. ఒకవేళ ఈ యాప్ గనుక లేకుండా ఉంటే.. నేపాల్ ఇంకా అగ్నిగుండంగా రగిలిపోతూ ఉండేదేమో అనే చర్చా నడుస్తోందక్కడ.పాలన పేరిట ఇన్నేళ్లుగా కొనసాగిన అవినీతికి నేపాల్ యువత ఎలాగైనా చెక్ పెట్టాలనుకుంది. ఆందోళనలను ఉధృతంగా జరిపి ప్రభుత్వం మెడలు వచ్చింది. అయితే ఈ ఆందోళనలను సమన్వయపర్చుకోవడానికి డిస్కార్డ్ యాప్నే Gen Z నిరసనకారులు ఉపయోగించుకున్నారు. అంతేకాదు.. కేపీ శర్మ ఓలీ రాజీనామా తర్వాత.. తమ ఆకాంక్షలకు అనుగుణంగా నాయకుడ్ని ఎన్నుకునే క్రమంలోనూ ఈ వేదికనే ఉపయోగించుకున్నారు. Discord అనే యాప్ గురించి మిలెనియల్స్కు పెద్దగా పరిచయం లేకపోయినా.. Gen Z యువత మాత్రం సౌకర్యవంతమైన, విశ్వసనీయమైన వేదికగా భావిస్తోంది. డిస్కార్డ్(Discord) అనేది 2015లో ప్రారంభమైన డిజిటల్ కమ్యూనికేషన్ ప్లాట్ఫారమ్. ఇది గేమర్ల కోసం ఆటల మధ్యలోనే స్నేహితులతో చాట్ చేయడానికి రూపొందించబడిన ఒక యాప్. అయితే.. 2020లో మహమ్మారి సమయంలో Gen Z యువతలో ఇది విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. Discord ద్వారా వినియోగదారులు సర్వర్లు అనే కమ్యూనిటీలు ఏర్పాటు చేసి.. టెక్స్ట్, ఆడియో, వీడియో చానెల్స్ ద్వారా చర్చలు జరపడం ప్రారంభించారు. స్క్రీన్ షేరింగ్, స్ట్రీమింగ్, మోడరేషన్ టూల్స్ వంటి ఫీచర్లు కూడా వీటిలో అందుబాటులో ఉన్నాయి. ఒక్కో సర్వర్లో గరిష్టంగా 5 లక్షల మంది చేరవచ్చు, కానీ ఒకేసారి 2.5 లక్షల మంది మాత్రమే యాక్టివ్గా ఉండగలరు. అందుకే నేపాల్ యువత ఉద్యమానికి దీన్నొక వేదికగా మల్చుకుంది. వీపీఎన్ సాయంతో.. సాధారణంగా వీపీఎన్లను ఎందుకు ఉపయోగిస్తారు?.. మిగతా వాళ్ల సంగతి ఏమోగానీ.. నేపాల్ యువత మాత్రం ఈమధ్య దీనిని తాజాగా నిరసనలకే ఉపయోగించింది(నేపాల్లో VPNల వినియోగం 3 రోజుల్లోనే 6,000% పెరిగింది.. అలాగే 5వ రోజుకొచ్చేసరికి 8,000% పెరిగింది.). నేపాల్లో సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లపై నిషేధం కొనసాగుతున్న వేళ.. విస్తృత యాప్గా పేరున్న డిస్కార్డ్(Discord) వీపీఎన్ సాయంతో అందుబాటులోకి తెచ్చుకుంది. ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో ఉన్నట్లు ఎండ్లెస్ ఫీడ్లు లేకుండా.. వాట్సాప్ కంటే ఎక్కువ ఫీచర్లతో Discord ఉండడం వల్లే దీనిని రైట్ఛాయిస్గా అక్కడి యువత భావించింది. అలా.. "Youth Against Corruption" అనే Discord సర్వర్లో 145,000 మందికి పైగా సభ్యులుగా చేరారు. ఈ సర్వర్లో చర్చలు, అనౌన్స్మెంట్స్, ఫ్యాక్ట్ చెక్, హెల్ప్లైన్లు వంటివి కొనసాగించింది. వారు ఏర్పాటు చేసిన Discord సర్వర్లలో ఇన్ఫర్మేషన్ సులభంగా పాసయ్యింది. పెద్ద సంఖ్యలో సభ్యులు చర్చలు జరిపేందుకు ఇదొ కీలక వేదికగా నిలిచింది. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు.ఓటింగ్ కూడా.. నేపాల్ తాత్కాలిక నాయకత్వం విషయంలో ఏర్పడిన గందరగోళాన్ని డిస్కార్డే తొలగించింది!. మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కార్కీ, నేపాల్ పవర్ హౌజ్గా పేరున్న కుల్మన్ ఘీసింగ్, రాపర్ బాలేంద్ర షా(బాలెన్), ఇలా పలువురి పేర్లతో ఓ డైలామా ఏర్పడగా.. డిస్కార్డ్ జరిగింది ఓటింగ్ ద్వారా స్పష్టత తెచ్చుకుంది. అంతేకాదు.. ఈ యాప్ ద్వారానే ప్రతిపక్షాన్ని కూడా సమన్వయపర్చుకుని.. రాజకీయ అనిశ్చితిని తొలగించింది. ఈ ఓటింగ్ను పర్యవేక్షించిన శశ్వత్ లామిచ్ఛానే కూడా ఈ విషయాల్ని ధృవీకరించారు. ఇక డిస్కార్డ్లో ఓటింగ్ బుదవారం పూర్తైంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. 50 శాతం ఓట్లు సుశీల్ కార్కీకే పడ్డాయి. ఆ మరుసటి రోజు ఆమె నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్, ఆర్మీచీఫ్ అశోక్ రాజ్ సిగ్దెల్ను కలిశారు. అలా నేపాల్ తాత్కాలిక ప్రధాని ఎపిసోడ్లో ఉత్కంఠ వీడింది. అయితే.. ఇండియా టుడే ఓఎస్ఐఎన్టీ(Open-Source Intelligence) సర్వే ప్రకారం ఈ ఓటింగ్లో పాల్గొన్నవాళ్లంతా నేపాల్ పౌరులేనా? అనే అనుమానాలు వ్యక్తం చేసింది. భారత్లోనూ డిస్కార్డ్Discord ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. అమెరికాలో దాదాపు 25 కోట్లు, బ్రెజిల్లో ఐదున్నర కోట్ల యూజర్లు ఉన్నారు. ఆ తర్వాత భారత్లోనూ ఐదు కోట్ల మంది ఈ యాప్ను ఉపయోగిస్తునన్నారు. ఈ లిస్ట్లో కెనడా, ఫిలిప్పీన్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ ప్లాట్ఫారమ్ విండోస్, మాక్ఓఎస్, ఆండ్రాయిడ్, ఐవోఎస్, లైనక్స్ వెబ్ బ్రౌజర్లలో కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి 30కి పైగా భాషల్లో అందుబాటులో ఉంది, అందులో తెలుగు మాత్రం లేదు. డిస్కార్డులో గేమింగ్ మాత్రమే కాదు.. పౌర ఉద్యమాలు, రాజకీయ చర్చలు నడుస్తున్నాయి. సొంత సర్వర్తో క్రియేటివ్ కమ్యూనిటీలు నిర్మించుకునేందుకు వీలుగా ఉండడంతోనే ఇది సాధ్యమవుతోంది. అంత నిషేధంలోనూ Gen Z యువతకు డిస్కార్డ్ యాప్ ఒక గళం ఇచ్చింది. ఒకవేళ ఈ యాప్ను జెన్ జెడ్ యువత గనుక సమర్థవంతంగా ఉపయోగించుకుని గనుక ఉండి ఉంటే.. నేపాల్ ఉద్యమం అసంఘటితంగా, అస్పష్టంగా, మరింత హింసాత్మకంగా మారిపోయే అవకాశం ఉండేదేమో!. -
భలే మంచి చౌక బేరము
అమాడెయా.. ఓ భారీ విలాసవంతమైన పడవ. దీనిని అమెరికా ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. వాస్తవ ధర సుమారు రూ.3 వేల కోట్లు కాగా, అనేక కారణాలతో దీనిని సుమారు రూ.వెయ్యి కోట్లకే ఇవ్వాలనుకుంటోంది. రష్యాకు చెందిన చమురు వ్యాపారి, అపర కుబేరుడు సులేమాన్ కెరిమోవ్ మోజుపడి తయారు చేయించుకున్న పడవ ఇది. 2017లో నిర్మించిన ఈ పడవలో 6 డెక్కులున్నాయి. ఆధునిక వసతులతో కూడిన ఎనిమిది భారీ గదులు, జిమ్, సినిమా థియేటర్, లాబ్స్టర్ ట్యాంక్, పియానో రూం, స్విమ్మింగ్ పూల్, అత్యాధునిక మసాజ్ సెంటర్తోపాటు హెలిప్యాడ్ కూడా అమాడెయాలో ఉంది. ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర మొదలుపెట్టిన వేళ ఆ దేశంపై అమెరికా మిత్రదేశాలు తీవ్ర ఆంక్షలు విధించాయి. తమ దేశాల్లోని రష్యా ప్రభుత్వ, బడా పారిశ్రామిక వేత్తలు, వ్యాపార ప్రముఖుల వ్యక్తిగత ఆస్తులను స్వాధీనం చేసుకుంటోంది. ఇలా స్వాధీనం చేసుకున్న ఆస్తుల్ని అమ్మేసి, ఆ డబ్బును ఉక్రెయిన్కు అందజేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందులో భాగంగానే అమెరికా ప్రభుత్వం క్లెప్టోక్యాప్చర్ టాస్క్ఫోర్స్ను 2022లో ఏర్పాటు చేసింది. ఈ విషయం తెలిసిన రష్యా చమురు వ్యాపారి సులేమాన్ కెరిమోవ్ తన అమాడెయా అనే భారీ పడవను సుదూరంగా ఉన్న ఫిజీలోని మారుమూల దీవిలో దాచి ఉంచాడు. అమెరికా నిఘా సంస్థలు, క్లెప్టో క్యాప్చర్ టాస్క్ఫోర్స్ దీని జాడను కనిపెట్టాయి. ఫిజీ నుంచి దీనిని అమెరికాకు తీసుకువచ్చాయి. ఇది సుమారు మూడేళ్ల క్రితం ఘటన. అప్పటి నుంచి అమాడెయా శాన్డియాగో తీరంలో ఉంది. ఫిజీ నుంచి తరలింపు, నిర్వహణ తదితరాలకే అమెరికా ప్రభుత్వం దీనిపై 3.2 కోట్ల డాలర్లు ఖర్చుపెట్టింది. స్వాధీనం చేసుకున్న సమయంలో దీని విలువను సుమారు రూ.2,000 కోట్లుగా నిర్థారించారు. అయితే, ప్రస్తుత విలువ రూ.700 కోట్ల నుంచి రూ.వెయ్యి కోట్ల వరకు ఉన్నట్లు నిపుణులు మదింపు చేశారు. ప్రపంచంలోని 50 మంది నుంచి 100 మంది వరకు ఉన్న అత్యంత ధనవంతులకే ఇలాంటి బోట్ను కొనగలిగే సత్తా ఉందని అంచనా వేశారు.న్యాయ వివాదం..అమాడెయా వాస్తవ యజమాని ఎవరనే విషయమై మూడేళ్లుగా న్యాయపోరాటం సాగుతోంది. ఇది తమదేనంటూ అసలు యజమాని, రష్యా బిలియనీర్ అయిన సులేమాన్ కెరిమోవ్తోపాటు రష్యా ఇంధన సంస్థ రోస్నెఫ్ట్ మాజీ అధికారి ఎడ్వర్డ్ ఖుదైనటోవ్, మిల్లిమారిన్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ న్యూయార్క్ కోర్టులో పిటిషన్లు వేశాయి. అయితే, కెరిమోవ్ అమెరికా ఆంక్షలను ఉల్లంఘించినందుకు ఈ పడవ యాజమాన్య హక్కులు అమెరికాకే ఉంటాయని 2023 మార్చిలో న్యూయార్క్ సర్క్యుట్ కోర్టు జడ్జి డేల్ హో ప్రకటించారు. దీంతో, అమెరికా ప్రభుత్వం ఇటీవల దీనిని వేలానికి పెట్టింది. వేలం పాటలో పాల్గొనే వారు కోటి డాలర్లను డిపాజిట్గా చెల్లించాల్సి ఉంటుంది. కాగా, క్లెప్టోక్యాప్చర్ టాస్క్ ఫోర్స్ ద్వారా స్వాధీనం చేసుకున్న అమాడెయా వంటి అనేక పడవలు, విమానాలు, విలాసవంతమైన ఆస్తుల్లో చాలావరకు ప్రస్తుతం న్యాయపోరాటాన్ని ఎదుర్కొంటున్నాయి. ఎడ్వర్డ్ ఖుదైనటోవ్ మాత్రం అమెరికా అన్యాయంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. న్యూయార్క్ సర్క్యూట్ కోర్టు తీర్పుపై అప్పీల్ చేశామని, నవంబర్లో తీర్పు వచ్చే అవకాశముందని చెబుతున్నారు. తీర్పు తమకు అనుకూలమైతే అమాడెయా పూర్తి విలువను అమెరికా ప్రభుత్వం చెల్లించక తప్పదని స్పష్టం చేస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
రామాయపట్నంపై నిర్దయ
చెప్పేదొకటి.. చేసేదొకటి అనే రీతిలో కూటమి ప్రభుత్వ పాలన సాగుతోంది. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి తలపెట్టిన నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు నిర్మాణ తీరే దీనికి చక్కటి ఉదాహరణ. నాడు చకచకా పనులు సాగి, గతేడాది ఏప్రిల్ నాటికి మొదటి దశ పూర్తి కావాల్సిన ఈ నౌకాశ్రయం సర్కార్ నిర్లక్ష్య ధోరణి కారణంగా అతీగతీ లేకుండాపోతోంది. దీనిపై ఏ మాత్రం దృష్టి సారించకుండా.. రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో ప్రతి 50 కిలోమీటర్లకో పోర్టును ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. 70 శాతం పూర్తయిన దీనిపైనే శ్రద్ధ చూపని పాలకులు.. మిగిలిన వాటిని ఎలా నిర్మిస్తారు.. ఇదంతా బూటకమనే విషయం వారి చేష్టలతోనే స్పష్టమవుతోంది. కందుకూరు: రామాయపట్నం పోర్టును కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ హయాంలో దీని నిర్మాణ పనులు చకచకా సాగినా, ప్రస్తుతం అడుగు ముందుకు పడటంలేదు. నూతన ప్రభుత్వం కొలువుదీరాక.. అప్పటికే పనులు చేస్తున్న ఏజెన్సీని తొలగించడంతో ఆర్నెల్ల పాటు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆ తర్వాత చేపట్టినా, పనుల్లో వేగం నేటికీ పుంజుకోలేదు. గతంలో చేసిన వర్కుల మినహా ప్రస్తుతం ఏ మాత్రం పురోగతి లేదు. అసలెప్పటికి పూర్తవుతుందో..? వాస్తవానికి డిసెంబర్, 2023 నాటికే వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించాలని నాటి సీఎం జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. తదనుగుణంగా అన్ని చర్యలు చేపట్టారు. అయితే ప్రస్తుత ప్రభుత్వ వైఖరిని చూస్తుంటే మరో నాలుగేళ్లకైనా నిర్మాణం పూర్తవుతుందాననే అనుమానం తలెత్తుతోంది. ప్రస్తుతం.. గ్రహణం గతేడాది జూన్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతోనే పోర్టు నిర్మాణ పనులకు గ్రహణం పట్టింది. అధికారం చేజిక్కించుకున్న వెంటనే కాంట్రాక్ట్ సంస్థ అరబిందోను తొలగించింది. తదనంతరం దాదాపు ఆర్నెల్ల పాటు పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆపై నవయుగ కంపెనీకి నిర్మాణ బాధ్యతను అప్పగించారు. అయితే అప్పటికే పాత సిబ్బందిని తొలగించడం.. కార్మికులు, భారీ యంత్రాలను సమకూర్చడంలో చోటుచేసుకున్న జాప్యంతో పనులు మరింత ఆలస్యమయ్యాయి. ప్రస్తుతం జరుగుతున్నా, అవి నామమాత్రమే. గతంలో చేపట్టిన బ్రేక్ వాటర్ ఫీడర్ల నిర్మాణ పనులను అరకొరగా జరుపుతున్నారు. కీలకమైన డ్రెడ్జింగ్, బెర్తుల నిర్మాణం ఇంకా ప్రారంభమే కాలేదు.మొదటి దశ ఎప్పుడో..?రామాయపట్నం పోర్టు మొదటి దశలో భాగంగా 34.04 ఎమ్మెమ్టీపీఏ (మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ ఆనమ్) కార్గో సామర్థ్యంతో నాలుగు బెర్తులను నిర్మించాల్సి ఉంది. వీటిలో రెండు జనరల్, ఒకటి కోల్, మరొకటి మల్టీ పర్పస్కు సంబంధించనవి. సముద్రంలో వచ్చే ఆటుపోట్లు, తుఫాన్లను తట్టుకునేలా సౌత్, నార్త్ బ్రేక్ వాటర్ ఫీడర్ల నిర్మాణాన్ని చేపట్టారు. వీటిని నీటి ఉపరితలం నుంచి మూడు మీటర్ల ఎత్తు, 100 మీటర్ల వెడల్పుతో పెద్ద బండరాళ్లతో నిర్మించారు. ఇందులో సౌత్ బ్రేక్ వాటర్ ఫీడర్ 3.7.. నార్త్ బ్రేక్ వాటర్ ఫీడర్ 1.73 కిలోమీటర్ల మేర పనులను పూర్తి చేశారు. వీటి మధ్యలోనే బెర్తులనూ నిర్మిస్తున్నారు. లక్ష టన్నుల సామర్థ్యం గల భారీ నౌకలు నిలిచేందుకు వీలుగా సముద్ర లోతును 16 మీటర్ల వరకు గతంలోనే డ్రెడ్జింగ్ చేశారు. బల్క్ బెర్తును నిర్మించి, 2023 డిసెంబర్ నాటికే మొదటి వాణిజ్య నౌకను నిలపాలనే లక్ష్యంతో పనులు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యే నాటికే మొదటి దశలో కీలకమైనవన్నీ పూర్తయ్యాయి. ఆపై సర్కార్ నిర్లిప్త ధోరణితో ఏ మాత్రం పురోగతి కనిపించడంలేదు. ఉన్నతాశయంతో..తీర ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ఉలవపాడు మండలంలోని రామాయపట్నం వద్ద రూ.3736 కోట్ల అంచనాతో పోర్టు నిర్మాణానికి గత ప్రభుత్వంలో పునాది రాయి పడింది. 850.79 ఎకరాల్లో పనులకు 2022, జూలై 20న నాటి సీఎం జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్మాణ పనులను అరబిందో సంస్థ వాయువేగంతో 70 శాతం మేర చేసింది. 18 నెలల్లోనే వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించాలనే లక్ష్యంతో పనులు సాగాయి. డిసెంబర్, 2023 నాటికి మొదటి వాణిజ్య నౌకను నిలపాలనే లక్ష్యంతో సర్కార్ అడుగులేసింది. అయితే ఆపై 2024 సాధారణ ఎన్నికల హడావుడి, కోడ్ అమల్లోకి రావడంతో అది సాధ్యపడలేదు. ప్రస్తుత పరిస్థితి.. ఒక బెర్తు నిర్మాణం పూర్తి కాగా, మిగిలిన మూడు బెర్తులతో పాటు, సముద్ర లోతును పెంచే డ్రెడ్జింగ్ పనులు జరగాల్సి ఉంది. గతేడాది ఏప్రిల్ నాటికి మొదటి దశ పనులను పూర్తి చేసి అందుబాటులో తీసుకురావాలని నాటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంకల్పించినా, ప్రస్తుత సర్కార్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా రామాయపట్నం పోర్టు ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ అంతుచిక్కడంలేదు. -
నమ్మకంతో నక్షత్రాలై!
‘స్థిరమైన ఉద్యోగం ఉంటే చాలు’ అనుకునే మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రుచి కల్రా డిక్షనరీలో ‘ఇక చాలు’ అనే మాట ఎప్పుడూ లేదు. సక్సెస్ఫుల్ కన్సల్టెంట్ నుంచి సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా మారింది. మొదట 73 మంది ఇన్వెస్టర్ల నుంచి ఆమెకు తిరస్కారం ఎదురైంది. ఒకే ఒక్క ఇన్వెస్టర్ నమ్మాడు. ఆ నమ్మకమే గొప్ప విజయం అయింది.పేషెంట్లు, హాస్పిటల్స్ మధ్య దూరం ఉందని గ్రహించిన గరిమ సానే ‘ప్రిస్టీన్ కేర్’తో హెల్త్కేర్ రంగంలోకి అడుగు పెట్టింది. మొదట్లో ఆమె మాటలను పెద్దగా ఎవరూ విశ్వసించలేదు. అయినా ఆమె ప్రయాణం ఆపలేదు. విశ్వసనీయతే జీవనాడిగా ప్రయాణం ప్రారంభించిన ప్రిస్టీన్కేర్ హెల్త్కేర్ రంగంలో సరికొత్త సంచలనం అయింది.‘సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్’గా పేరు తెచ్చుకోవాలనే ఉత్సాహంతో ఒక స్టార్టప్తో ప్రయాణం మొదలుపెట్టిన వినీతా సింగ్కు అపజయాలు హాయ్ చెప్పాయి. ఎంటర్ప్రెన్యూర్గా రాణించాలంటే ఉత్సాహం ఒక్కటే సరిపోదని వ్యూహం కూడా కావాలని గ్రహించి మేకప్ బ్రాండ్ ‘షుగర్ కాస్మోటిక్స్’తో తిరుగులేని విజయాన్ని సాధించింది.దేశీయ యూనికార్న్ క్లబ్లో కొన్ని స్టార్టప్లు యూనికార్న్ హోదాను కోల్పోయాయి. కొన్ని మాత్రం ఆ హోదాను స్థిరంగా నిలుపుకుంటూనే, ఔత్సాహికులకు స్ఫూర్తినిస్తున్నాయి.‘వైవిధ్యమైన రంగాలలో మహిళా వ్యాపారవేత్తలు అద్భుత విజయాలు సాధించారు’ అంటూ గరిమ సానే (ప్రిస్టీన్ కేర్), రుచి కల్రా (ఆఫ్ బిజినెస్), వినీతా సింగ్ (షుగర్ కాస్మోటిక్స్) పేర్లను ప్రస్తావించింది ఏఎస్కె ప్రైవేట్ వెల్త్ హురున్ ఇండియా యూనికార్న్ అండ్ ఫ్యూచర్ యూనికార్న్–2025 నివేదిక.ఈ ముగ్గురు ఎవర్గ్రీన్ యూనికార్న్ స్టార్ల సక్సెస్ మంత్రా గురించి...పరాజయాల తరువాత ఘన విజయంలక్నోకు చెందిన వినీతాసింగ్ చదువులో ఎప్పుడూ ముందుండేది. స్కూల్, కాలేజి రోజుల్లో బంగారు పతకాలు అందుకుంది. ఐఐటీ, మద్రాస్లో చదువుకున్న వినీత బ్యాడ్మింటన్లో సత్తా చాటేది. ఎన్నో టోర్నమెంట్స్లో విజయం సాధించింది. పరుగు పందేలలో కూడా దూసుకుపోయేది. ఒక్కమాటలో చెప్పాలంటే చురుకుదనానికి కేరాఫ్ అడ్రస్లా ఉండేది.ఇన్వెస్టింగ్ బ్యాంకింగ్లో విలువైన అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని వదులుకొని ‘క్వెజాల్’ వెంచర్ మొదలు పెట్టింది. ఆ స్టార్టప్ విజయం సాధించలేదు. ఆ తరువాత ప్రారంభించిన ‘ఫ్యాబ్–బాగ్’ అంతంతమాత్రమే అనిపించింది. అయిన్పటికీ ‘ఇక చాలు’ అనుకోలేదు. గట్టి విజయం కోసం తపన పోలేదు. ‘షుగర్ కాస్మోటిక్స్’ స్టార్టప్తోతో అసలు సిసలు విజయాన్ని అందుకుంది. ‘రకరకాల స్కిన్ టోన్లను దృష్టిలో పెట్టుకొని అధిక నాణ్యతతో కూడిన, అందుబాటు ధరల్లో ఉండే ప్రాడక్ట్స్ను తీసుకువచ్చాం’ అంటుంది వినీతాసింగ్.‘షుగర్ కాస్మోటిక్స్’లో పనిచేస్తున్న 75 శాతం మంది ఉద్యోగులు మహిళలే కావడం విశేషం. రియాలిటీ షో ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ కార్యక్రమంలో జడ్జీ, ఇన్వెస్టర్గా రెండు బాధ్యతలు నిర్వహిస్తోంది వినీత. ఈ కార్యక్రమం ద్వారా ఎంటర్ప్రెన్యూర్ కావాలనుకునే ప్రతిభావంతులకు విలువైన సలహాలు ఇస్తోంది. వారి కలలు సాకారం చేయడానికి తనవంతు ప్రయత్నం చేస్తోంది. యూనికార్న్ స్టార్గా వినీతాసింగ్ విజయం ఎన్నో విషయాలను చెప్పకనే చెబుతుంది. అందులో ఒకటి.... ‘కష్టపడితే... కాలంతో పాటు నడిస్తే ఏదీ అసాధ్యం కాదు’డెబ్బైమూడు మంది తిరస్కరించారు!పంజాబ్లోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రుచి కల్రా కెమికల్ ఇంజినీరింగ్ చదువుకుంది. అయినప్పటికీ ఆర్థికవిషయాలపై ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తితోనే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో ఎంబీఎ చేసింది. చదువు పూర్తయిన తరువాత మెకెన్జీ అండ్ కంపెనీలో తొమ్మిది సంవత్సరాల పాటు పనిచేసింది. ఆ కంపెనీలో పనిచేసిన అనుభవం తనలోని నైపుణ్యాలను మెరుగు దిద్దుకునేలా చేసింది. ఆ నైపుణ్య బలమే వ్యాపారవేత్తగా తన ప్రయాణానికి ఇంధనం అయింది. మెటల్స్, కెమికల్స్, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన బి2బి కామర్స్ ΄్లాట్ఫామ్ ‘ఆఫ్బిజినెస్’కు శ్రీకారం చుట్టింది. చిన్న, మధ్యతరగతి పరిశ్రమలకు ముడి సరుకును అందించే కంపెనీ ఇది. మొదట్లో 73 మంది ఇన్వెస్టర్ల నుంచి తిరస్కారం ఎదురైంది. ఒకే ఒక్క ఇన్వెస్టర్ నమ్మాడు.‘ఆఫ్బిజినెస్’ను సక్సెస్ఫుల్ వెంచర్గా తీర్చిదిద్దిన రుచి కల్రా ఆ తరువాత ఈ కంపెనీకి అనుబంధంగా ‘ఆక్సీజో’ పేరుతో ఫైనాన్షియల్ సర్సీసెస్ మొదలుపెట్టింది.బలమైన నాయకత్వ సామర్థ్యానికి అంకితభావం తోడైతే ఎంత విజయం సాధించవచ్చో నిరూపించింది రుచి. ‘ఆఫ్బిజినెస్’ విజయంతో ఎంతోమంది ఔత్సాహికులు, వ్యాపార రంగంలోకి రావాలని కలలనే కనే యువతరానికి స్ఫూర్తిగా నిలిచింది.మొదట్లో ఎవరూ విశ్వసించలేదు!గైనకాలజిస్ట్గా మంచి పేరు తెచ్చుకున్న డా. గరిమ సానే ‘ప్రిస్టీన్ కేర్’తో ఎంటర్ప్రెన్యూర్గా మారింది. తన వైద్యవృత్తి ద్వారాఎన్నోరకాల నైపుణ్యాలను సొంతం చేసుకున్న గరిమకు ఓపిక ఎక్కువ. తొందరపాటు లేదు. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది. అధిక పనిభారం, తక్కువమంది సిబ్బంది, పేషెంట్లపై సరిౖయెన శ్రద్ధ చూపకపోవడం... కొన్ని హాస్పిటల్స్లో ఈ పరిస్థితిని చూసిన గరిమ ‘ప్రిస్టీన్ కేర్’తో హెల్త్కేర్ రంగంలోకి అడుగుపెట్టింది. హాస్పిటల్స్కు, పేషెంట్లకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించాలి, పేషెంట్లు కోరుకునే క్వాలిటీ సర్జికల్ కేర్ను అందించాలి అనే లక్ష్యంతో ప్రయాణం మొదలు పెట్టింది.వైద్యుల ఎంపిక, క్లినిక్లో అపాయింట్మెంట్, డయాగ్నోస్టిక్ కేంద్రాలలో టెస్ట్లు బుకింగ్ చేయడం, ఇన్సూరెన్స్ పేపర్ వర్క్, హాస్పిటల్ ఆడ్మిషన్–డిశ్చార్జీ ప్రాసెస్, సర్జరీ తరువాత ఫాలో–అప్ కన్సల్టేషన్, రకరకాల డిపార్ట్మెంట్లతో సమన్వయం... మొదలైన పనులు ప్రిస్టీన్ కేర్ జాబితాలో ఉన్నాయి. అందుకే పేషెంట్ల సర్జరీని సులభతరం చేసే అత్యాధునిక హెల్త్కేర్ కంపెనీగా ‘ప్రిస్టీన్ కేర్’ పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ప్రిస్టీన్ కేర్ 150కి పైగా క్లినిక్స్, 800కి పైగా పార్ట్నర్ హాస్పిటల్స్, 400కి పైగా సూపర్ స్పెషలిస్ట్ సర్జన్లను ఆపరేట్ చేస్తుంది.మొదట్లో చాలామంది వైద్యులు, హాస్పిటల్స్ గరిమ చెప్పే మాటలను పెద్దగా విశ్వసించలేదు. ఆ తరువాత వారికి ప్రిస్టీన్ కేర్ అంకితభావం, కష్టం అర్థమయ్యాయి.‘హెల్త్కేర్ అనేది కేవలం సైన్స్ మాత్రమే కాదు నమ్మకం, భావోద్వేగాలు కూడా అందులో మిళితమై ఉన్నాయి’ అంటున్న గరిమ మార్కెటింగ్ వ్యూహాలను బాగా అర్థం చేసుకుంది. ఆ వ్యూహాలతో కంపెనీని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లింది. ‘సర్జరీ సింప్లిఫైడ్’ అనేది పిస్ట్రీన్ కేర్ ట్యాగ్లైన్. -
కనుమరుగు కానున్న ఈశాన్య రుతుపవనాలు?!
అనూహ్యం.. అసాధారణం.. ఆశ్చర్యం.. నైరుతి రుతుపవనాలు ‘సంప్రదాయ’ గతి తప్పాయి. వాతావరణ మార్పు, భూతాపం నేపథ్యంలో అవి దారి తప్పి ఆధునిక ‘పోకడ’ పోతున్నాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల నడక కొద్దిగా మారింది. భవిష్యత్తులో ఇదే నడత కొనసాగితే మన దేశానికి ముప్పు తప్పదు!!. ఈ నెల తొలి వారంలో భారత వాతావరణ విభాగానికి చెందిన ఓ ఉపగ్రహం తీసిన ఛాయాచిత్రం రుతుపవన గమనంపై వాతావరణ నిపుణుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. హిమాలయ పర్వత శ్రేణుల వరకు వెళ్లి.. గోడకు కొట్టిన బంతిలా వెనక్కు రావాల్సిన రుతుపవనాలు కొంత కట్టు తప్పి టిబెట్ పీఠభూమి ప్రాంతంలోకి ప్రవేశించాయి. హిమాలయాలకు ఆవల ఉండే టిబెట్ పీఠభూమిలో అవపాతం తక్కువ. అందుకే ఈ ప్రదేశం ఎప్పుడూ పొడిగా కనిపిస్తుంది. శీతాకాలంలో హిమపాతం, వసంత రుతువులో పశ్చిమ అలజడుల వల్ల కొద్దిపాటి వర్షపాతం మాత్రమే అక్కడ నమోదవుతాయి. అలాంటి శుష్క టిబెట్ ప్రాంతంలో నైరుతి తేమ గాలులు తాజాగా వానలు కురిపించాయి. నైరుతి రుతుపవనాల తేమగాలులు హిమాలయాల హద్దును దాటేసి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లద్దాఖ్ మీదుగా టిబెట్ ప్రాంతంలోకి ప్రవేశించినట్టు ఉపగ్రహ చిత్రం స్పష్టంగా చూపుతోందని వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీకి చెందిన గ్లేసియాలజిస్ట్ మనీష్ మెహతా చెప్పారు. ఇండియాకు ప్రత్యేక వరం.. రుతుపవనాలు! వేసవిలో సముద్ర జలాలు వేడెక్కి నీరు ఆవిరై బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుంచి బయలుదేరే తేమగాలులు నైరుతి రుతుపవనాల రూపంలో భారతదేశమంతటా విస్తరించి జూన్-సెప్టెంబరు నెలల్లో వర్షాలు కురిపిస్తాయి. వాటి ప్రయాణం ఉత్తరానికి వచ్చేటప్పటికి ఎదురుగా హిమాలయ పర్వత శ్రేణులు ఎత్తుగా, పెట్టని కోటలా అడ్డు నిలుస్తాయి. ఎత్తైన హిమాలయాలను దాటుకుని ముందుకు వెళ్లలేక నైరుతి రుతుపవనాలు తిరోగమిస్తాయి. తమలో మిగిలివుండే తేమతో హిమాలయ పర్వత శ్రేణుల నుంచి అవి వెనక్కు మరలుతాయి. తిరుగుపయనంలో ఈశాన్య రుతుపవనాల పేరిట అక్టోబరు, నవంబరు నెలల్లో వర్షిస్తూ మళ్లీ సముద్రం బాట పడతాయి. ప్రయాణంలో వర్షిస్తూ తేమను కోల్పోతూ ఉంటాయి కనుక... నైరుతితో పోలిస్తే మనకు ఈశాన్య రుతుపవనాల వర్షపాతం తక్కువ. రుతుపవన ప్రక్రియ భారతదేశానికి ప్రత్యేకం. దేశంలో సాగునీరు, తాగునీటికి రుతుపవనాలే ఆధారం. భూతాపం, వాతావరణ మార్పు, పశ్చిమ అలజడులు/కల్లోలాలుగా పిలిచే వాతావరణ ప్రక్రియల వల్ల నైరుతి రుతుపవనాలు టిబెట్ వైపు వెళ్లి ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. హిమాలయ పర్వతశ్రేణుల్లో ఎత్తు తక్కువ ఉండే దారుల గుండా నైరుతి తేమ గాలులు టిబెట్లోకి ప్రవేశించి ఉండొచ్చని అంటున్నారు. అయితే.. నైరుతి రుతుపవనాలు మున్ముందు ఇలాగే టిబెట్ చేరుతూ అక్కడ తరచూ వర్షాలు కురిపించడం ఆరంభిస్తే... హిమనీనదాల (గ్లేసియర్స్)లోని మంచు కరుగుదలలో, నదీ ప్రవాహాల తీరుతెన్నుల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. నైరుతి కాస్తా తుర్రుమని టిబెట్ పారిపోతే మనకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. భారతదేశంలో వర్షపాతం తగ్గుతుంది. వ్యవసాయం, ఆర్థిక రంగాలపై ప్రభావం పడుతుంది. తాగునీటికి కటకట తప్పదు. రుతుపవనాలనే నమ్ముకుని బతుకుతున్న దేశం మనది. ఏదో ఒక సీజన్లో రుతుపవనాలు ముఖం చాటేసినా తర్వాత సంవత్సరంలోనైనా మంచి వానలు పడకపోతాయా అని ఆశగా ఎదురుచూస్తారు రైతన్నలు. నైరుతి రుతుపవనాలు భౌగోళికంగా ‘హిమాలయ కంచె’ దూకి ప్రతి సీజన్లోనూ ఆవలి టిబెట్ వైపునకు పూర్తిగా మరలిపోయేట్టయితే... అవి ఇక తిరిగి వెనక్కు రావు! అప్పుడిక ఈశాన్య రుతుపవనాలు అనేవే ఉండవు!! ఒకవేళ కొంత భాగం తిరిగొచ్చినా ఆ తేమలేని, బలహీన పవనాలతో కురిసే వర్షాలు, కలిగే ప్రయోజనం నామమాత్రమే. భయపెట్టాలని కాదు గానీ... ఆ దుస్థితి రాకూడదనే ఆశిద్దాం. వాతావరణ మార్పు ప్రభావంతో ఎన్నో వింతలు చూస్తున్నాం. నిరుడు కురిసిన వర్షాలకు సహారా ఎడారి ఇసుక తిన్నెలు సరస్సులను తలపించిన సంగతి మరచిపోతే ఎలా?!(Source: Zee News)::జమ్ముల శ్రీకాంత్ -
ఆకాశ వీధిలో ఆర్భాటం చేసి.. పాతాళంలో వదిలేసి!
శ్రీశైలంటెంపుల్: ‘దట్టమైన నల్లమల అటవీ మధ్యలో ప్రవహించే కృష్ణమ్మ పరవళ్లపై ప్లేన్లో ప్రయాణించి మధురానుభూతి పొందే అవకాశం కల్పిస్తున్నాం. ఇందులో భాగంగా విజయవాడ నుంచి శ్రీశైలానికి సీ ప్లేన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా విజయవాడ నుంచి శ్రీశైలానికి తక్కువ సమయంలో వచ్చి స్వామిఅమ్మవార్లను దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నాం. ఏపీని టూరిజం హబ్గా మారుస్తాం’ అంటూ స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శ్రీశైలంలో సీ ప్లేన్ ట్రయరల్ రన్ వేళ అన్న మాటలు. ఇక సీన్ కట్ చేస్తే.. సీప్లేన్ ట్రయల్రన్ చేపట్టి ఇప్పటికి పది నెలలు గడుస్తోంది. ఇంకా సర్వేలు, సమీక్షలకే అధికారులు పరిమితమయ్యారు. ఇప్పటికీ డీపీఆర్ సిద్ధం కాకపోవడంతో సీప్లేన్ ప్రయాణం మరింత ఆలస్యమవుతుందని తెలుస్తోంది. సీఎం ప్రచార ఆర్భాటానికే సీప్లేన్ ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చి ట్రయల్రన్ చేసి వదిలేశారని, ఆచరణ చేసేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మల్లన్న భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం టూరిజం అభివృద్ధిలో భాగంగా శ్రీశైలానికి గతేడాది నవంబరు 9న సీప్లేన్ ట్రయల్రన్ చేపట్టారు. రాష్ట్ర సీఎం చంద్రబాబు, కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కె.రామ్మోహన్నాయుడు, టూరిజం శాఖ మంత్రి దుర్గేశ్ తదితరులు విజయవాడ పున్నమి ఘాట్ నుంచి సీప్లేన్లో శ్రీశైలం పాతాళగంగకు చేరుకున్నారు. సీప్లేన్ ప్రారంభమైతే విజయవాడ నుంచే కాకుండా హైదరాబాద్, బెంగ ళూర్ తదితర రాష్ట్రాల నుంచి సైతం సీప్లేన్ నడిపేందుకు అవకాశం ఉందని అప్పట్లో పాలకులు, పర్యాటక అధికారులు ప్రకటించారు. భక్తులు, పర్యాటకులు, ప్రభుత్వ ఉద్యోగులు, వారాంతపు సెలవులు ఉంటే ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు తమ సమయాన్ని వృథా చేసుకోకుండా సీప్లేన్ ద్వారా త్వరగా వచ్చి స్వామిఅమ్మవార్లను దర్శించుకుని త్వరగా వెళ్లే అవకాశం ఉండేదని భావించారు. అయితే పది నెలలుగా గడుస్తున్నా ట్రయల్ రన్కు పరిమితం కావడంతో కూటమి ప్రభుత్వానికి ప్రారంభంలో హడావుడి చేయడం, ఆ తర్వాత వదిలేయడం సర్వ సాధారణమేనని పలువురు విమర్శిస్తున్నారు. ఇరిగేషన్, అటవీశాఖ అనుమతులు లభించేనా..?సీప్లేన్ నిర్వహించే ప్రదేశంలో శ్రీశైలం పూర్తిగా నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో ఉంది. ఇది పూర్తిగా వన్యప్రాణులు, చిరుతలు, పెద్దపులులు అవాసానికి అనువైన ప్రదేశం. ఇక్కడ సీప్లేన్ సేవలు నిర్వహించాలంటే అటవీశాఖ అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. అలాగే సీప్లేన్ టేక్ ఆఫ్, ల్యాండింగ్కు డ్యామ్ పరిధిలో ఉండటంతో ఇరిగేషన్ శాఖ అధికారుల అనుమతి కూడా తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది. అలాగే ఏవియేషన్, ఇతర శాఖల అనుమతులు తప్పనిసరి. కూటమి ప్రభుత్వం విజయవాడ టూ శ్రీశైలం సీ ప్లేన్ నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించి త్వరితగతిన అనుమతులు అన్ని తీసుకుని సేవలను అందుబాటులోకి తేవాలని పలువురు పర్యాటకులు కోరుతున్నారు. సర్వేలు, సమీక్షలకే పరిమితంవిజయవాడ నుంచి శ్రీశైలానికి వచ్చే సీప్లేన్ ప్రయాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఐడీసీ) అధికారులు డిటేల్డ్ ప్రాజెక్టు రిపొర్టు తయారు చేస్తున్నారు. శ్రీశైలంతో పాటు అరకు, లంబసింగి, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, గండికోట, నర్సాపూర్, తిరుపతి, ప్రకాశం బ్యారేజ్ మొత్తం 10 ప్రదేశాలలో టూరిజం పరంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం డీపీఆర్ సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. ఈ ప్రాజెక్టు రిపోర్టు తయారీకి నాలుగు నెలల క్రితం ఓ ప్రైవేట్ కన్పల్టెన్సీకి నియమించారు. వారు మే నెల నుంచి డీపీఆర్ తయారు చేసేందుకు పనులు ప్రారంభించారు. ఏపీఐడీసీ అధికారులు వారానికి ఒకసారి సర్వేలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. డీపీఆర్లో సీప్లేన్ ల్యాండ్ అయ్యే ప్రదేశం, సీప్లేన్ టేక్ఆఫ్, టేక్ ఆన్కు నీటిలో సుమారు 1.16 కిలోమీటర్ల పోడవు, 120 మీటర్ల వెడల్పు ఉండే ప్రదేశం, పర్యాటకులు సీప్లేన్ ఎక్కేందుకు, దిగేందుకు నీటిపై ప్రత్యేక జెట్టీల ఏర్పాటు, టికెట్టు ధరలు, ఎన్ని ప్లేన్ సర్వీసులను తిప్పాలి, రోజుకు ఎన్ని ట్రిప్పులు, సీప్లేన్ ల్యాండింగ్ వద్ద పర్యాటకులకు విశ్రాంతి తీసుకునేందుకు గదులు, టికెట్టు కౌంటర్, సిబ్బంది తదితర పూర్తి వివరాలను డీపీఆర్లో పొందుపరుచనున్నారు. వచ్చే జనవరి నాటికి డీపీఆర్ పూర్తి చేయాలని కన్సల్టెన్సీకి ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. -
పండ్లు, పూలు.. ఫైను.. జైలు!
డిక్లరేషన్స్ ఇవ్వకుండా.. కొప్పులో మల్లెపూలు పెట్టుకున్నందుకు మెల్బోర్న్ విమానాశ్రయ ఇమిగ్రేషన్స్ అధికారులు నవ్య నాయర్ అనే మలయాళ నటికి రూ.1.14 లక్షల జరిమానా విధించారు. ఈమెకు ఎదురైన చేదు అనుభవం చాలామందిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అవును, విదేశాల్లో ఇలాంటి చిత్రవిచిత్రమైన నిషేధాలు చాలా ఉన్నాయి.ప్రయాణం అంటేనే వెంట తీసుకెళ్లే వస్తువులతో బ్యాగులు నిండాల్సిందే. మౌత్ ఫ్రెషనర్, పెర్ఫ్యూమ్ వంటి రోజూ వాడే వస్తువులు అయినా.. బంధువులు, స్నేహితులకు ఇచ్చే పిండివంటలు, బహుమతులైనా.. బాధ్యత, ప్రేమతో సూట్కేస్ బరువెక్కాల్సిందే. మనతోని అట్లుంటది మరి. మన దేశంలో అయితే ఫర్వాలేదు. పరాయి దేశం వెళితేనే సమస్య. ఎందుకంటే మనదగ్గరిలా ఏదిపడితే అది విదేశాలకు తీసుకెళతామంటే అక్కడి నిబంధనలు ఒప్పుకోవు. ఆస్ట్రేలియాలో ఇటీవలే జరిగిన నటి నవ్య నాయర్ ఘటనే ఇందుకు ఉదాహరణ. న్యూజిలాండ్లోని ఆక్లాండ్ విమానాశ్రయంలో 2002లో జరిగిన సంఘటన సైతం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, హర్భజన్స్ సింగ్ చెరి 200 న్యూజిలాండ్ డాలర్ల జరిమానా కట్టాల్సి వచ్చింది. వాళ్లు బ్యాగుల్లో తీసుకొచ్చిన బూట్లకు మట్టి, గడ్డి ఉండడమే ఇందుకు కారణం. వేడి చేయని పాలను కెనడా, ఆస్ట్రేలియా, అమెరికాలోని కొన్ని ప్రాంతాలకు తీసుకెళ్లకూడదు. గ్రీసులోని ప్రాచీన పర్యాటక ప్రదేశాలకు హైహీల్స్తో వెళ్లడం నిషిద్ధం. ఇలాంటివి మరికొన్ని..ఆస్ట్రేలియా: బయో సెక్యూరిటీ, కస్టమ్ చట్టాల ప్రకారం తాజా పూలు, పండ్లు, కూరగాయలు, మట్టిని తీసుకెళ్లడానికి వీల్లేదు. ఎందుకంటే ఇబ్బడిముబ్బడిగా వీటిని నాటితే అక్కడి పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుందన్నది వారి వాదన. సోన్పాపిడి, మైసూర్ పాక్ వంటి స్వీట్లు, మసాలా దినుసులు, పాల ఉత్పత్తులు కూడా నిషేధమే. ఈ జాబితాలో ఇంకా చాలా ఉన్నాయి.ఆగ్నేయాసియా: ఘాటైన వాసన వచ్చే డ్యూరియన్స్ (పనసలాంటి) పండును ప్రయాణంలో తీసుకెళ్లడాన్ని చాలా విమానయాన సంస్థలు నిషేధించాయి. ముఖ్యంగా కోసిన పండును తీసుకెళ్లరాదు. దీన్ని భారత్కు తీసుకురావాలంటే సరైన పద్ధతిలో ప్యాక్ చేయాలి. సింగపూర్లో చూయింగ్ గమ్ అమ్మకం, దిగుమతి నిషేధం. బహిరంగ ప్రదేశాల్లో గమ్స్ను ఉమ్మితే భారీ జరిమానా విధిస్తారు. మెడికల్ గమ్స్ను మాత్రమే అనుమతిస్తారు.దక్షిణ కొరియా: అమెరికాకు చెందిన ట్రేడర్ జో కంపెనీ తయారీ ‘ఎవిరీథింగ్ బట్ ది బేగల్ సీజనింగ్’ బ్రాండ్ మసాలాలను విమాన ప్రయాణికుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ మసాలాల్లో గసగసాలు ఉండడమే ఇందుకు కారణం. ఆ దేశం గసగసాలను మాదక ద్రవ్యాలుగా పరిగణిస్తుందట. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, సింగపూర్లలోనూ గసగసాలపై బ్యాన్ ఉంది. కరేబియన్స్ దీవులు: సైనికులు ధరించే దుస్తుల (క్యామఫ్లాజ్) వంటివి సాధారణ పౌరులు వేసుకోవడం చట్టవిరుద్ధం. సైన్యం మాత్రమే ధరించాలి. సైనికులుగా పొరపడే ప్రమాదం ఉంది కాబట్టి సాధారణ వ్యక్తులు ఈ దుస్తులతో విమానాశ్రయాల్లో కూడా కనిపించకూడదు. అలా చేస్తే జరిమానా వేస్తారు లేదా జైలుకు పంపుతారు. యూఎస్: ప్రపంచవ్యాప్తంగా పిల్లలు అమితంగా ఇష్టపడే కిండర్ సర్ప్రైజ్ ఎగ్స్ (కిండర్జాయ్)ను విమానంలో తీసుకురావడం నిషేధం. గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది కాబట్టి పిల్లలకు సంబంధించిన ఆహార ఉత్పత్తుల్లో తినడానికి వీలుకాని వస్తువులను ఉంచకూడదు.న్యూజిలాండ్: పచ్చళ్లు, మాంసం, విత్తనాలు, విదేశీ మట్టి నిషేధం. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో భాగంగా సరిహద్దు నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. ఇటలీ: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఫ్లిప్–ఫ్లాప్స్ లేదా శబ్దం వచ్చే బూట్లు వేసుకోకూడదన్న నిబంధన ఉంది. శబ్దం వస్తే స్థానికులకు చికాకు కలుగుతుందట.కెనడా: ఈ దేశంలో బేబీ వాకర్ నిషేధం. పిల్లలకు ఇందులో గాయాలవుతున్నాయని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కెనడా వీటిని తమ దేశంలో నిషేధించింది.ఉత్తర కొరియా : ఎంతో ఇష్టమని ఈ దేశానికి బ్లూజీన్స్తో వెళ్లేరు.. ఫైన్ కట్టాలి లేదా జైలుకు కూడా వెళ్లాల్సి రావొచ్చు. పాశ్చాత్య సంస్కృతికి ఇవి చిహ్నమని, ఇవి తమ సంస్కృతిని పాడుచేస్తాయని వీటిపై బ్యాన్ విధించారట. -
బాల్యమూ.. భారమే!
పిల్లల్లో ఊబకాయ సమస్య ప్రపంచానికి పెద్ద ఆరోగ్య సంక్షోభంలా పరిణమించబోతోందని యునిసెఫ్ తాజా నివేదిక హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా బాలల్లో 10 శాతం మంది ఊబకాయంతో ఉన్నట్లు నివేదిక తెలిపింది. ప్రతి పది మంది పిల్లల్లో ఒకరికి ఊబకాయం ఉంటోందని పేర్కొంది. సాంప్రదాయ ఆహారాలు, ఇతర పోషక పదార్థాలకు బదులుగా పిల్లలు అధిక కేలరీలున్న, ప్రాసెస్డ్ ఫుడ్కు అలవాటు పడటమే ఇందుకు కారణం అని చెబుతూ, ఈ అలవాట్లు పిల్లలకు దీర్ఘకాలిక అనారోగ్యాలను తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.‘తగినంత ఆహారం లేక గతంలో పిల్లలు తరచూ బరువు తక్కువగా ఉండేవారు. అది వారి శారీరక పెరుగుదలను కుంగదీయడమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలకూ దారితీసింది. అయితే, తాజా పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. జంక్ఫుడ్ను తినకుండా ఉండలేక పిల్లలు బరువెక్కుతున్నారు’ అని యునిసెఫ్ తన నివేదికలో వ్యాఖ్యానించింది. ఇదీ పోషకాహార లోపమే!నేటి పిల్లల్లో ఊబకాయం అన్నది, మునుపటి దశాబ్దాల నాటి పోషకాహార లోపం కంటే వేగంగా పెరుగుతోందని, ఊబకాయం ఉన్న పిల్లల సంఖ్య.. బరువు తక్కువగా ఉన్నవారిని మించిపోయిందని నివేదిక తెలిపింది. బాల్యంలోని ఈ ఊబకాయం ఇప్పుడు పోషకాహార ‘లోపానికి’ వేరొక రూపంగా భావించవచ్చని పేర్కొంది.యునిసెఫ్, ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 5 నుంచి 19 సంవత్సరాల వయసు గల పిల్లల్లో 18 కోట్ల 80 లక్షల మంది పిల్లలు ఊబకాయుల కేటగిరీలో ఉన్నారు! ఈ వయసులో బరువు తక్కువగా ఉన్న పిల్లల శాతం 2000లో 13 నుంచి నేడు 9.2 శాతానికి తగ్గింది. అదే సమయంలో ఊబకాయం 3 శాతం నుంచి 9.4 శాతానికి పెరిగింది.ఎక్కడ ఎక్కువగా ఉన్నారు?యునిసెఫ్ నివేదిక ప్రకారం పసిఫిక్ దీవులలోని పిల్లల్లో ఊబకాయం ఎక్కువగా ఉంది. దీవి దేశాలైన నియులో 38 శాతం, కుక్ దీవులలో 37 శాతం, నౌరు దీవులలో 33 శాతం బాల ఊబకాయులు ఉన్నారు. ప్రపంచంలో మొత్తం బాల్య, కౌమార దశల్లో ఉన్న వారిలో 42.7 కోట్ల మంది అధిక బరువు సమస్యతో ఉంటే వారిలో.. దాదాపు సగం మంది తూర్పు ఆసియా, పసిఫిక్, లాటిన్ అమెరికా, కరీబియన్, దక్షిణాసియాలలోనే ఉన్నారు.అలవాటుగా అధిక ఆహారంప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో కనిపిస్తున్న ఈ ఊబకాయానికి ప్రధాన కారణం.. చవకైన, మితిమీరి ప్రాసెస్ చేసిన, దిగుమతి చేసుకుంటున్న అధిక కేలరీల ఆహార పదార్థాల వినియోగం పెరగడమేనని నివేదిక గుర్తించింది. సాంప్రదాయ ఆహారాలు, ఇతర పోషక పదార్థాలకు బదులుగా పిల్లలు అధిక కేలరీలున్న, ప్రాసెస్డ్ ఫుడ్కు అలవాటు పడుతున్నారని తెలిపింది. అల్ట్రా–ప్రాసెస్డ్ ఆహారంలో ఉండే చక్కెర, ఉప్పు, కొవ్వు వంటివి చిన్నారుల ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నాయని పేర్కొంది.పేద దేశాల్లోనూ ఊబకాయంసాధారణంగా అధిక ఆదాయ దేశాలలో పిల్లలు ఊబకాయంతో ఉంటారని ఒకప్పుడు భావించేవారు. అయితే, యునిసెఫ్ తాజా నివేదిక ఈ భావనను పటాపంచలు చేసింది. పాఠశాలకు వెళ్లే పిల్లల్లో చిలీలో 27 శాతం మంది, యూఎస్ఏ, యూఏఈలలో 21 శాతం మంది ఊబకాయంతో ఉండటాన్ని బట్టి పిల్లల్లోని ఈ ఊబకాయం దిగువ, మధ్య ఆదాయ దేశాలకే పరిమితం కాలేదని నివేదిక గుర్తించింది.ప్రకటనలు ప్రేరేపిస్తున్నాయిపిల్లల్లో ఊబకాయం పెరగడంలో వ్యాపార ప్రకటనలు కీలక పాత్ర పోషిస్తున్నాయని నివేదిక తెలిపింది. తాజా సర్వేలో, గతవారం 13 నుంచి 24 సంవత్సరాల వయసు గల 75 శాతం మంది పిల్లలు, యువకులు జంక్ ఫుడ్ ప్రకటనలను చూసినట్లు వెల్లడైంది. వారిలో 60 శాతం మంది ఈ ప్రకటనలు చూశాక తమలో వాటిని తినాలన్న కోరిక కలిగిందని తెలిపారు. ఘర్షణలు, యుద్ధ వాతావరణం ఉండే ప్రాంతాల్లోనూ 68 శాతం యువత ఇప్పటికీ అలాంటి మార్కెటింగ్ వ్యూహాలకు ప్రభావితం అవుతున్నట్లు నివేదిక పేర్కొంది.ఆర్థిక ముప్పు!ఈ ఊబకాయం ముప్పును తప్పించటానికి తక్షణ చర్యలు తీసుకోకపోతే, ప్రభుత్వాలు దీర్ఘకాలిక పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని యునిసెఫ్ హెచ్చరించింది. 2035 నాటికి, ఊబకాయం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడే భారం రూ.353 లక్షల కోట్లకు చేరుతుందని యునిసెఫ్ అంచనా వేసింది. పర్యవసానంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు, ఉత్పాదక రంగం అన్నీ దెబ్బతింటాయని హెచ్చరించింది. -
వెరవని వ్యక్తిత్వం
సంక్షుభిత సమయంలో ఒక జాతి తమను నడిపే నేతగా ఒక స్త్రీ వైపు చూడటం అరుదు. నేపాల్లో ఇప్పుడు అక్కడి యువత అలాంటి ఒక స్త్రీ వైపు చూస్తోంది. అక్కడ ఏర్పడబోతున్న ఆపద్ధర్మ ప్రభుత్వానికి అధినేతగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి ఉంటే బాగుంటుందని ఆశిస్తోంది. ఆమె ఆర్మీ చీఫ్ను కలిశారు కూడా! భారతదేశంలో చదువుకుని, టీచర్ స్థాయి నుంచి సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి వరకూ ఎదిగిన సుశీలా కర్కీది వెరవని వ్యక్తిత్వం. ఆమె రచయిత కూడా. వివరాలు...‘ఇండియా– నేపాల్ దేశాల మధ్య అనుబంధం ఈనాటిది కాదు. దశాబ్దాలది. ప్రభుత్వాలు వాటి వాటి విధానాల వల్ల పని చేస్తుండొచ్చు. కాని ఇరుదేశాల ప్రజలు ఏనాటి నుంచో స్నేహంగా ఉన్నారు. ప్రధాని మోదీపై నాకు మంచి అభి్రపాయం ఉంది. మా స్నేహితులు, బంధువులు ఎందరో ఇండియాలో ఉన్నారు. మావారు ఎక్కువ కాలం ఇండియాలోనే గడిపారు. భారతీయులు నేపాలీలను ఆదరిస్తూనే ఉన్నారు’ అన్నారు సుశీలా కర్కి.73 ఏళ్ల ఈ మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేపాల్లో ఏర్పడనున్న ఆపద్ధర్మ ప్రభుత్వానికి ప్రధాని అయ్యే అవకాశాలు ఖరారయ్యాయి. నేపాల్లో ఉద్యమం కొనసాగిస్తున్న జెన్ జి విద్యార్థుల బృందం తాజా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సుశీలా కర్కి మా ఎంపిక అని తేల్చి చెప్పింది. సుశీలా కర్కి తన సోషల్ మీడియా అకౌంట్లో ‘దేశ పరిస్థితుల రీత్యా నాకు అప్పజెప్పే బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను’ అని తెలియచేశారు.‘నేను బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్నాను. మా హాస్టల్ నుంచి నిత్యం పారే గంగను చూసే దాన్ని. ఎండాకాలం హాస్టల్ టెర్రస్ మీద పడుకునేవారం. ఉదయాన్నే గంగను చూసేవారం. అక్కడ నాతో పాటు చదువుకున్న విద్యార్థులు, పాఠాలు చెప్పిన గురువులు ఇంకా స్పష్టంగా గుర్తున్నారు’ అన్నారామె. ‘మా ఊరు విరాట్నగర్ నుంచి భారత్ సరిహద్దు 25 మైళ్లు ఉంటుంది. మేము తరచూ బోర్డర్ మార్కెట్కు వెళ్లేవాళ్లం. నాకు హిందీ వచ్చు’ అని తెలిపారామె.ప్రభుత్వంలో అవినీతి, మంత్రుల పట్ల వ్యతిరేకత, నయా సంపన్నుల వైఖరి, సోషల్ మీడియాపై నిర్బంధం... వీటన్నింటి దరిమిలా నేపాల్లో యువతరం తెచ్చిన తిరుగుబాటు వల్ల నాయకత్వ మార్పు స్పష్టమైంది. సుశీలా కర్కి ఆపద్ధర్మ ప్రధాని అయితే త్వరలో ఎన్నికలు నిర్వహించి ప్రభుత్వ ఏర్పాటు చేయించి తప్పుకోవడమే ఆమె ప్రధాన బాధ్యత. ఆ బాధ్యతకు ఆమె సమర్థురాలని యువత భావిస్తోంది.టీచర్గా మొదలైసుశీలా కర్కి నేపాల్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని నిర్వహించిన ఏకైక మహిళగా ఆ దేశవాసుల్లో గుర్తింపు, గౌరవం పొందారు. జూన్ 7, 1952న నేపాల్లోని శంకర్పూర్కు చెందిన ఓ కుటుంబంలో పుట్టిన కర్కి ఏడుగురు పిల్లలలో మొదటి సంతానం. 1972లో బిరాట్నగర్లోని మహేంద్ర మొరాంగ్ క్యాంపస్ నుండి బీఏ డిగ్రీ చేసి మన బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి రాజకీయ శాస్త్రం చదివారు. అక్కడ చదువుతున్న సమయంలోనే నేపాలీ కాంగ్రెస్ సభ్యుడు, యువజన విభాగ నాయకుడు దుర్గా ప్రసాద్ సుబేదిని కలుసుకున్నారు. అనంతరం వారిద్దరూ వివాహం చేసుకున్నారు. 1979లో కార్కి బిరాట్నగర్లో లాయర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 1985లో ధరణ్లోని మహేంద్ర మల్టిపుల్ క్యాంపస్లో అసిస్టెంట్ టీచర్గా పనిచేశారు. 2007లో సీనియర్ అడ్వకేట్గా 2009లో ఆ దేశ సుప్రీంకోర్టులో అడ్–హాక్ జస్టిస్గా నియమితులయ్యారు. నవంబర్ 18, 2010న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 ఏప్రిల్ నుండి 2016 జూలై వరకు నేపాల్ సుప్రీంకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, 2017 జూన్ వరకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.రచయితగా...కర్కి 2018లో ‘న్యాయ’ పేరుతో తన ఆత్మకథ రాశారు. 2019 డిసెంబర్లో ‘కారా’ అనే నవల ప్రచురించారు. నేపాల్లో 1960 నుంచి 90ల మధ్యకాలంలో రాజు కనుసన్నల్లో సాగిన ‘పంచాయత్’ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రజల అనుభవాలను ఆమె తన రచనల్లో ఉటంకించారు. ఆపద్ధర్మ అధినేతగా తన ఎంపిక జరిగితే శాంతి నెలకొల్పడం, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు భరోసా ఇవ్వడం తన తొలి ప్రాధాన్యం అని ఆమె అన్నారు.సుశీలా కర్కిది వెరవని వ్యక్తిత్వం అని అందరూ అంటారు. ఆమె న్యాయనిపుణత, అవినీతి రహిత నేపథ్యం చాలా కేసుల్లో కీలకమైన తీర్పులు ఇచ్చేలా చేసింది. ఒక అవినీతి కేసులో మంత్రిని జైలుకు పంపించడానికి సైతం ఆమె వెనుకాడలేదు. ఇవన్నీ ఆమెకు సానుకూలంగా మారాయని చర్చ సాగుతోంది. ఆ పేరు బయటకు వచ్చాక నేపాల్లో ముఖ్యంగా ఖాట్మండులో శాంతి నెలకొనడం ఆమె మాటకు విలువ ఉంటుందనడానికి ఉదాహరణ.గమనిక: ఈ కథనం రాసే సమయానికి సుశీలా కర్కితోపాటు మరికొన్ని పేర్లు కూడా ఆపద్ధర్మ ప్రధాని పదవికి పరిశీలనలోకి వచ్చాయి. -
రోజుకు 54,794 పిడుగులు!
వర్షం పడుతోందంటే మెరుపులు, పిడుగులు పడడం సహజం. పిడుగు శబ్దం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కిలోమీటర్ల దూరంలో పడ్డా మన పక్కనే పడినట్టు ఉంటుంది. 2024–25లో ఇలా మనదేశంలో ఎన్ని పిడుగులు పడ్డాయో తెలుసా? 2 కోట్లకుపైగానే! అంటే రోజుకు సగటున 54,794! 2025–26లో జూలై 30 నాటికి దేశ వ్యాప్తంగా పిడుగుల వల్ల 1,626 మంది మనుషులు, 52,367 మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయి.ఒక డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగితే తేమ 7 శాతం పెరుగుతుంది. ఫలితంగా పిడుగులు 10–12 శాతం పెరుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. భారత్లో వేసవికాలంలో భానుడి ప్రతాపం, అలాగే అరేబియా సముద్రం, బంగాళాఖాతం వేడెక్కడం వంటివి కూడా పిడుగులకు అనువైన పరిస్థితులు సృష్టిస్తున్నాయి. బంగాళాఖాతం సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలు పెరిగిందని, తూర్పు రాష్ట్రాల్లో తుపాన్లకు కారణమయ్యే తేమకు ఆజ్యం పోస్తున్నాయని క్లైమేట్ రెసీలియెంట్ అబ్జర్వింగ్ సిస్టమ్స్ ప్రమోషన్ కౌన్సిల్ (సీఆర్ఓపీసీ) వ్యవస్థాపకులు సంజయ్ శ్రీవాస్తవ వెల్లడించారు. పర్యావరణ విపత్తుల వల్ల కలిగే నష్టాలను తగ్గించేందుకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ ఇది.46 శాతం పిడుగుపాటు మరణాలే!ఈ ఏడాది ఏప్రిల్–జూలై మధ్య వర్షాలు, పిడుగుల కారణంగా దేశవ్యాప్తంగా 1,626 మంది మరణించారని కేంద్ర హోంశాఖ ఇటీవల రాజ్యసభలో వెల్లడించింది. 1967 నుంచి 2020 వరకు పిడుగుపాటుతో భారత్లో 1,01,000 మంది మరణించారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్ సీఆర్బీ) డేటా చెబుతోంది. 2002–24 మధ్య దేశంలో వాతావరణ సంబంధ మరణాలలో దాదాపు 46 శాతం పిడుగుల వల్ల సంభవించాయని ఎన్సీఆర్బీ తెలిపింది. ఐఎండీ, సీఆర్ఓపీసీ ప్రకారం 2019–20లో 51.7 లక్షల పిడుగుపాటు సంఘటనలు నమోదయ్యాయి. 2024–25లో ఈ సంఖ్య 2 కోట్లకుపైగా పెరిగింది.ముందస్తు హెచ్చరికలుఐఎండీ ప్రస్తుతం 86 శాతం కచ్చితత్వంతో పిడుగులను అంచనా వేస్తోంది. పిడుగులు పడే అవకాశం ఉందని అయిదు రోజుల ముందే హెచ్చరిస్తోంది. జిల్లాల పేర్లను రెండు రోజుల ముందుగా వెల్లడిస్తోంది. ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నరోజున ప్రభావిత ప్రాంతాల వివరాలతో ప్రతి మూడు గంటలకు హెచ్చరికలు జారీ చేస్తోంది. ఐఎండీ, ఐఐటీ మద్రాస్ భాగస్వామ్యంతో పిడుగులు అధికంగా పడే ప్రాంతాలను సీఆర్ఓపీసీ గుర్తించింది. ముప్పు నివారణ ప్రణాళికలో భాగంగా దామినీ యాప్, వాట్సాప్ గ్రూప్స్ ద్వారా పంచాయతీ నియమించిన భద్రతా సమన్వయకర్తలకు రియల్–టైమ్ హెచ్చరికలను పంపుతున్నారు. జాతీయ పిడుగుపాటు నష్టనివారణ కార్యక్రమం కింద హెచ్చరికల కోసం మైక్రోఫోన్స్, సీసీటీవీ కెమెరాలు, లౌడ్స్పీకర్లతో కూడిన స్మార్ట్ స్తంభాలను గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. తాటి చెట్లను నాటడం మొదలు అనేక అవగాహన ప్రచారాలు కూడా చేపట్టారు. పట్టణ ప్రాంతాల్లోనూ..నగరవాసులు కమ్యూనికేషన్ సిస్టమ్స్ వంటి విద్యుదయస్కాంత మౌలిక సదుపాయాలను ఎక్కువగా వాడుతున్నారని ఇది పిడుగు ప్రమాదాన్ని పెంచుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహపాత్ర చెబుతున్నారు. కాంక్రీట్, తారు, గాజు వంటివి వేడిని గ్రహించి, ప్రసరింపజేయడం వల్ల కలిగే ఉష్ణ ప్రభావం నగరాలను గ్రామీణ ప్రాంతాల కంటే వేడిగా మారుస్తోందట. ఈ పరిస్థితులు పిడుగుపాట్లకు దారితీస్తున్నాయట.విమానయాన సంస్థలకు..వర్షాకాలంలో పిడుగుపాట్ల వల్ల ఏటా దాదాపు 2,000 విమానాలను దారి మళ్లిస్తున్నారు. దీనివల్ల విమానయాన సంస్థలకు ఏటా సుమారు రూ.300 కోట్ల నష్టం వాటిల్లుతోందట. -
యూత్ కు 'రెస్ట్' రూమ్
సాక్షి, స్పెషల్ డెస్క్: ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు జీవితంలో ప్రతి ఒక్కరికీ వారివారి స్థాయిలను బట్టి ఒత్తిడి అనేది అనివార్యం అయిపోయింది. సాధారణంగా ఒత్తిడిని జయించేందుకు యోగా, క్రీడలు, సంగీతం, నలుగురితో ముచ్చటించడం, షాపింగ్ థెరపీ వంటివి చేస్తుంటారు. కానీ జెన్ –జీ.. అంటే 13–28 ఏళ్ల వయసున్న యువతలో మాత్రం చాలామంది వీటన్నిటికీ భిన్నంగా ‘బాత్రూమ్ క్యాంపింగ్’ని ఆశ్రయిస్తున్నారు.టెంట్, చలి మంటలు, నక్షత్రాలతో మెరిసే ఆకాశం, షాపింగ్.. ఇవేవీ కావు. జస్ట్ తెల్లటి టైల్స్ పరిచిన నాలుగు గోడల మధ్య ‘రెస్ట్రూమ్స్’లో జెన్ –జీ సేదతీరుతోంది. శారీరక అవసరాల కోసం కాకుండా మానసిక ప్రశాంతతకు బాత్రూమ్లో ఎక్కువసేపు గడుపుతున్నారు. శబ్దాలు, జనంతో కిటకిటలాడే ప్రదేశాలకు దూరంగా ప్రశాంతంగా ఉండటానికి, సంగీతం వినడానికి మూసి ఉంచిన కమోడ్పై కూర్చుని మనసుని తేలికపర్చుకుంటున్నారు. ఒత్తిడి, ఆందోళన, బాధ, ఓటమి సమయంలోనే కాదు.. సమస్యల నుంచి బయటపడే మార్గాల అన్వేషణ, కొత్త ఆలోచనల కోసమూ అటువైపే అడుగులు పడుతున్నాయి. ఇల్లు, ఆఫీస్ లేదా ఏదైనా పార్టీలో ఉన్నా.. ఒత్తిడికి గురైనప్పుడు, మనసు బాధగా ఉన్నప్పుడు బాత్రూమ్ను ఆశ్రయిస్తున్నారు. దీన్నే ఇప్పుడు ‘బాత్రూమ్ క్యాంపింగ్’ అంటున్నారు.ప్రపంచానికి దూరంగా..‘నా బాధ, ఒత్తిడి నలుగురికి తెలియాల్సిన అవసరం లేదు. అవి వారికి అక్కరలేదు.అందరికీ కనపడేలా కూర్చుని బాధపడుతుంటే ఈ సమాజం వేలెత్తి చూపుతుంది. అలా కాకుండా బాత్రూమ్లో అయితే ఎవ్వరికీ తెలీదు. ఏకాంతం, నిశ్శబ్దంతో కూడిన ప్రశాంత వాతావరణమూ ఉంటుంది. మనల్ని జడ్జ్ చేసే అవకాశంఇంకొకరికి ఉండదు’అంటోంది జెన్ జీ.బాత్రూమ్ క్యాంపింగ్ ఎందుకంటే?ఒత్తిడిఆందోళనకోపంబాధఓటమిసమస్యకు పరిష్కారంకొత్త ఆలోచనలువీటిని ట్రై చేయండిఒత్తిడి నుంచి ఉపశమనానికి బాత్రూమ్ను ఒక సౌలభ్యమైన స్థలంగాఈ తరం వాళ్లు భావిస్తూ ఉండవచ్చు. కానీ బాత్రూమ్ అంటే రోగకారక క్రిములకు అడ్డా అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆందోళనను నియంత్రించడానికి ఇతర ఆరోగ్యకరమార్గాలూ ఉన్నాయని వారు సూచిస్తున్నారు.ప్రాణాయామం: శ్వాస ఆధారిత ప్రాణాయామ ప్రక్రియలను నిపుణుల ద్వారా తెలుసుకుని రోజూ చేయడం వల్ల ఒత్తిడి తగ్గి, మెదడు చురుగ్గా పనిచేస్తుందనిప్రపంచ వ్యాప్తంగా అనేకఅధ్యయనాలు చెబుతున్నాయి. ప్రకృతి ఒడిలో: ప్రకృతిని మించిన వైద్యుడు లేడు. పార్కులు, మైదానాల్లో గడ్డిని తాకడం, గడ్డిపై పడుకోవడం, సుందర ప్రకృతిదృశ్యాలను ఆస్వాదించడం.. ఇవన్నీ మనసును ఆహ్లాదపరిచేవే. సంగీతం,పజిల్స్: నచ్చిన సంగీతాన్ని వినొచ్చు. మెదడుకు పని కల్పించే పజిల్స్ చేయొచ్చు. ఆఫీసుల్లో: గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోకుండా.. ప్రతీ అరగంట లేదా గంటకు చిన్న విరామం తీసుకోవాలి. ఒత్తిడి అనిపిస్తే.. తేలికపాటి ప్రాణాయామాలు చేయాలి. మీ డెస్క్ వద్ద సరైనభంగిమలో కూర్చునేలా చూసుకోండి.నో సెల్ఫోన్: అలసిపోయినట్టు అనిపించినా.. పని ఎక్కువైనట్టు అనుకున్నా వెంటనే చేతులు ఫోన్ మీదకు వెళ్లిపోతుంటాయి. అలా వెళ్లి.. ఎన్ని ఫేస్బుక్ పోస్టులు చూస్తామో / పెడతారో, ఎన్ని రీల్స్ చూస్తారో తెలీదు. అన్నీ మనకు నచ్చినవే ఉండాలని లేదుగా. నచ్చనివి కనిపిస్తే మరింత కోపం, ఒత్తిడి. అందువల్ల ఆందోళన ఉండే సమయాల్లో సెల్ఫోన్ను (మ్యూజిక్ వినేటప్పుడు తప్ప) పక్కన పెట్టేయండి.సమయానికి తిండి, నిద్ర» సమయానికి ఆహారం తీసుకోవాలి. ఎంత పనిలో ఉన్నా, ఒత్తిడి ఉన్నా.. తినే టైమ్ను మాత్రం వాయిదా వేయొద్దు. అది మరింత ఒత్తిడి,ఆందోళనకు దారితీస్తుంది.» తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషకాలూఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా పోషకాహార నిపుణులు సూచించే.. ఒత్తిడి తగ్గించే ఆహార పదార్థాలు తీసుకోవాలి.» రాత్రుళ్లు సమయానికి, వేగంగా నిద్రపోవడం.. తెల్లవారుజామున లేవడం దినచర్యగా పెట్టుకోండి. రాత్రిపూట ఫోన్ లేదా టీవీల్లో సినిమాలు చూడటం సరదాగానేఉంటుంది గానీ.. దాని ప్రభావం మరుసటి రోజంతా పడుతుంది.పని.. ఒత్తిడి కాదు!జెన్–జీలో చాలామంది పనిని ఒత్తిడిగా భావిస్తుంటారు. ఆ మానసిక స్వభావాన్ని ముందు పూర్తిగా మార్చుకోవాలి. కెరీర్లో ఎదగాలన్న మనస్తత్వాన్ని పెంపొందించుకుంటే పనిపట్ల ప్రేమ, నిబద్ధత వాటంతట అవే పెరుగుతాయి. పనిలో లేదా కెరీర్లో వచ్చే సవాళ్లను భవిష్యత్తుకు మెట్లుగా చూడాలి తప్ప.. వాటిని ఒత్తిడిగా భావించినంత కాలం ఎదుగుదల ఉండదు అని గ్రహించాలి. -
కొనసాగుతున్న యూరియా కష్టాలు
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్క బస్తా యూరియా దొరికినా మహాభాగ్యం అనుకుంటూ రాత్రి, పగలు క్యూలైన్లలో అన్నదాతలు నిరీక్షిస్తున్నారు. కొన్నిచోట్ల ఓపిక నశించి ఆందోళనలకు దిగుతున్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలోని రైతు వేదిక ఎదుట బుధవారం యూరియా టోకెన్ల కోసం రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కొందరు రైతు వేదికలోకి చొచ్చుకెళ్లి ఫరి్నచర్ ధ్వంసం చేశారు.హనుమకొండ జిల్లా పరకాలలో టోకెన్లు ఇచ్చి యూరియా పంపిణీ చేయకపోవడంతో వ్యవసాయ మార్కెట్ ఎదుట ఆందోళన చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా(కె)లో రైతులు బుధవారం యూరియా కోసం భిక్షాటన చేస్తూ ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామంలో బుధవారం సాయంత్రం రైతు సాయిల్ల రాజమల్లు యూరియా బస్తా కోసం లైన్లో నిలబడి సొమ్మసిల్లి పడిపోయాడు. తోటి రైతులు వెంటనే రాజమల్లును ఆసుపత్రికి తరలించారు. కాగా, మంచిర్యాల జిల్లా దండేపల్లి నెల్కి వెంకటాపూర్ పీఏసీఎస్ వద్ద రైతులకు కుర్చీలు వేసి కూర్చోబెట్టి యూరియా పంపిణీ చేశారు. రెండో విడతలో పంటకు యూరియా ఎంత మోతాదులో వేయాలనే దానిపై అధికారులు అవగాహన కూడా కల్పించారు.యూరియా బారులు సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్లోని మన గ్రోమోర్ కేంద్రం వద్ద సుమారు 400 ఫీట్ల వరకు రైతులు పట్టాదారు పాస్పుస్తకాలు, ఆధార్కార్డు జిరాక్స్ ప్రతులు లైన్లో ఉంచి నిరీక్షించారు. ఈ కేంద్రానికి 666 బస్తాల యూరియా రాగా ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. – సాక్షి స్టాఫ్ ఫొటో గ్రాఫర్ సూర్యాపేట -
దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది!
‘‘దేశం ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది’’ నూటొక్క జిల్లాల అందగాడిగా పేరొందిన సినీ నటుడు, దివంగత నూతన్ప్రసాద్ ఒకానొక సినిమాలో చెప్పిన డైలాగ్ ఇది. నిజజీవితంలో ఇలాంటి డైలాగులు వినడం కష్టమే కానీ.. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లోనే ఉందని చెప్పక తప్పదు. ఊహూ.. మనం మాట్లాడుకుంటున్నది రాజకీయాల గురించి కానే కాదు. పాక్తో యుద్ధం.. లేదా అమెరికాతో టారిఫ్ల విషయం అంతకంటే కాదు. దీనికంటే కొంచెం సీరియస్ విషయం. దేశం భవిష్యత్తును నిర్ణయించేది కూడా. ఏమిటంటారా.. తాజా గణాంకాల ప్రకారం మన సంతానోత్పత్తి రేటు తగ్గుతోంది!జనాభా తగ్గితే మంచిదే కదా అంటున్నారా? నిజమే కానీ.. అన్నివేళలా కాదు. ఎందుకంటే.. సంతానోత్పత్తి రేటు తగ్గుతూనే ఉంటే.. దేశం ముసలిదైపోతుంది. వృద్ధుల వైద్యావసరాలు తీర్చడం కష్టమవుతుంది. ఇది కాస్తా ప్రభుత్వాలపై మరింత ఆర్థిక భారాన్ని మోపుతుంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని పోస్టులు గమనిస్తే మీకీ విషయం అర్థమైపోతుంది. ‘‘మా దేశం రండి. ఉచితంగా ఇల్లిస్తాం. ఉద్యోగం వెతుక్కునేంతవరకూ నెలవారీ భృతి కూడా ఇస్తాం’’ అంటూ కొన్ని యూరోపియన్ దేశాలు ఊరిస్తున్నాయి. ఆయా దేశాల్లో సంతానోత్పత్తి రేటు దశాబ్దాలుగా తగ్గిపోతూండటం వల్ల వచ్చిన సమస్య ఇది. ఇంతకీ మన దేశంలో పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉంది? ఒక్కసారి పరిశీలిద్దాం..1950లలో దేశ సగటు సంతానోత్పత్తి రేటు 6.18. అంటే పిల్లల్ని కనగలిగే వయసులో ఉన్న ఒక్కో మహిళ కనీసం ఆరుగురికి జన్మనిచ్చేదన్నమాట. నిజమే మరి.. మన తాత ముత్తాతల కుటుంబాలు చాలా పెద్దవిగానే ఉండేవి. ఉమ్మడి కుటుంబాలు... బోలెడంత మంది చిన్నాన్నలు, అత్తమ్మలు, మేనమామలు ఉండేవారు. అయితే.. దేశ అవసరాల కోసం అనండి.. ఇంకో కారణం చేతనైనా కానివ్వండి ఈ సంతానోత్పత్తి రేటు క్రమేపీ తగ్గుతూ వచ్చింది. 2018లో 2.2 గా ఉన్న సంతానోత్పత్తి రేటు 2021 నాటికి 1.9కి పడిపోయింది. ఏ దేశంలోనైనా జనాభా క్రమేపీ పెరుగుతూ ఉండాలంటే సంతానోత్పత్తి రేటు 2.1 లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి. ఇంకోలా చెప్పాలంటే చనిపోయే వారికంటే పుట్టే వారు ఎక్కువగా ఉండాలంటే ఒక్కో మహిళ 2.1 మందిని కనాలన్నమాట. తాజాగా అంటే 2023ను బేస్ సంవత్సరంగా పరిగణించి చేసిన సర్వే ప్రకారం కూడా దేశ సంతానోత్పత్తి రేటు 1.9కి మించడం లేదు. అంటే... ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్కు ఉన్న రికార్డు చెరిగిపోనుందన్నమాట. ఎప్పుడన్నదే ప్రశ్న. ప్రస్తుత దేశ జనాభా కూర్పు ఎలా ఉందంటే.. పద్నాలుగేళ్ల లోపువారు 24 శాతం మంది ఉంటే పనిచేసే స్థితిలో ఉన్న వారు (15 - 64) వారు 68 శాతం మంది ఉన్నారు. మిగిలిన ఏడు శాతం మంది 65 ఏళ్లపైబడ్డ వృద్ధులు!అయితే ఏంటి?2050 నాటికి దేశంలో 65 ఏళ్లపైబడ్డ వారు మొత్తం జనాభాలో 20 శాతానికి చేరుకుంటారని అంచనా. అంటే.. సుమారు 19 కోట్ల మంది పని చేసే స్థితిలో ఉండరు. వీరందని పోషణ భారం ఇతరులపై పడనుంది. వృద్ధుల ఆరోగ్య అవసరాల కోసం ప్రభుత్వాలు మరింత ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. జర్మనీ, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల్లో ప్రస్తుతం ఇదే పరిస్థితి. ఫలితంగా ఆయా దేశాల గ్రామీణ ప్రాంతాలు దాదాపుగా నిర్మానుష్యమైపోయాయి. యువత ఉపాధివేటలో నగరాలకు మళ్లిపోవడం దీనికి కారణం. మన పల్లెల్లోనూ ఇదే పరిస్థితి. యూరోపియన్ దేశాల మాదిరిగా వృద్ధాప్య సంక్షోభం ఎదుర్కోకుండా ఉండాలంటే మౌలిక సదుపాయాలు (వృద్ధుల కోసం ప్రత్యేక ఆసుపత్రులు, ప్రభుత్వ పథకాలు వంటివి)పై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలి. అలాగే ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలి. ఇందుకు తగినట్టుగా విధానాలు మార్చాలి. పిల్లల పెంపకం ఒక భారం కాకుండా ఉండేలా తగిన ఆర్థిక సంస్కరణలు తీసుకురావాలి.- గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
స్వచ్ఛత పెర'గాలి'
కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ప్రకటించిన ’స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ ర్యాంకులు–2025’లో తెలుగు రాష్ట్రాలకు చెందిన నగరాలు మిశ్రమ ఫలితాలను సాధించాయి. దేశవ్యాప్తంగా గాలి నాణ్యత ఆధారంగా ప్రకటించిన ఈ ర్యాంకుల్లో, 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల కేటగిరీలో ఆంధ్రప్రదేశ్లో విజయవాడ 13వ ర్యాంకు, విశాఖపట్నం 17వ ర్యాంకు సాధించాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ 22వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. ఎప్పటిలాగే మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం దేశంలోనే అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 3 నుంచి 10 లక్షల జనాభా కేటగిరీలో ఏపీలోని గుంటూరు నగరం జాతీయ స్థాయిలో 6వ ర్యాంకు సాధించింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈ ర్యాంకులను ప్రకటించారు. జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం (ఎన్సీఏపీ) కింద దేశంలోని 130 నగరాల్లో గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు చేపట్టిన చర్యల ఆధారంగా ఈ ర్యాంకులను కేటాయించారు. – సాక్షి, న్యూఢిల్లీకేటగిరీల వారీగా తెలుగు రాష్ట్రాల్లోని నగరాలు, పట్టణాల స్థానాలు ఇవీ.. కేటగిరీ–1 (10 లక్షలకు పైగా జనాభా): ఈ విభాగంలో విజయవాడ 13వ ర్యాంకును, విశాఖపట్నం 17వ ర్యాంకును సాధించాయి. తెలంగాణ నుంచి హైదరాబాద్ నగరం 22వ స్థానంలో నిలిచింది.కేటగిరీ–2 (3 నుంచి 10 లక్షల జనాభా): ఈ కేటగిరీలో గుంటూరు 6వ ర్యాంకుతో మెరుగైన ప్రదర్శన కనబరిచింది. రాజమండ్రి 12, నెల్లూరు 18, కడప 23, కర్నూలు 29, అనంతపురం 35 ర్యాంకులు పొందాయి.కేటగిరీ–3 (3 లక్షల లోపు జనాభా): ఈ విభాగంలో ఆంధ్రప్రదేశ్ నుంచి విజయనగరం 8, శ్రీకాకుళం 16, ఒంగోలు 21, చిత్తూరు 29, ఏలూరు 31 ర్యాంకులు సాధించాయి. తెలంగాణ నుంచి నల్గొండ 13వ ర్యాంకులో, సంగారెడ్డి 17వ ర్యాంకులో నిలిచాయి.జాతీయ స్థాయిలో విజేతలు 10 లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాల్లో ఇండోర్ మొదటి స్థానంలో నిలవగా, జబల్పూర్ రెండో ర్యాంకు సాధించింది. ఆ తర్వాత ఆగ్రా, సూరత్ మూడోస్థానంలో నిలిచాయి. 3 నుంచి 10 లక్షల జనాభా కేటగిరీలో అమరావతి (మహారాష్ట్ర) మొదటి ర్యాంకు సాధించగా, 3 లక్షలలోపు జనాభా ఉన్న నగరాల్లో దేవాస్ (మధ్యప్రదేశ్) అగ్రస్థానంలో నిలిచింది. గాలి నాణ్యతను మెరుగుపరచడంలో ఈ నగరాలు తీసుకుంటున్న చర్యలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. -
అంకుర సంస్థలు.. అప్పుడే మూసేస్తున్నారు
ఎన్నో ఆశలతో పెడుతున్న అంకుర కంపెనీలు.. ఇటీవలి కాలంలో మూతపడుతున్నాయి. కృత్రిమ మేధ సృష్టించిన అలజడి.. పోటీ.. నిధుల రాక తగ్గిపోవడం.. ఖర్చులు పెరిగిపోవడం.. ఇలా అనేక కారణాలు. ప్రధానంగా కంటెంట్పైనే ఆధారపడ్డ స్టార్టప్స్పై ఏఐ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలో ఎడ్టెక్, స్టోరీటెల్లింగ్ ప్లాట్ఫామ్స్, మార్కెటింగ్ వంటి రంగాలలో ప్రస్తుతం ఉన్న స్టార్టప్లను నడిపించేందుకు, విస్తరించేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపడం లేదు. ఇంకేముంది 2023, 2024లో ఏకంగా 28,000 పైచిలుకు స్టార్టప్స్ మూతపడ్డాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్వెర్సే ఇన్నోవేషన్.. జోష్, డెయిలీహంట్ సంస్థల మాతృసంస్థ.. ఈ ఏడాది మేలో 350 మంది ఉద్యోగులను తొలగించింది. ప్రధానంగా ఏఐలో పెట్టుబడులు పెడుతున్నట్టు, ఆటోమేషన్ వైపు అడుగులు వేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. కోడ్ ప్యారట్, సటల్.ఏఐ, వూరి, లొకేల్.ఏఐ, అస్త్ర.. ఇలాంటి ఏఐ స్టార్టప్లు ఇటీవలికాలంలో చాలా మూతపడ్డాయి. ఇందుకు.. ఏఐలో వేగంగా వస్తున్న మార్పులు, మారిపోతున్న సాంకేతికత, అధికమవుతున్న పోటీ, నిధుల సమస్య పెరుగుతున్న వ్యయాలు.. ఇలాంటి అనేక కారణాలు. రూ.21,000 కోట్ల నష్టంచాట్జీపీటీ ఎంట్రీ ఇచ్చిన తర్వాతి సంవత్సరం అంటే 2023లో భారత్లో ఏకంగా 15,921 టెక్ స్టార్టప్లు మూతపడ్డాయి. అంతకు ముందు ఏడాదిలో ఈ సంఖ్య 2,101 మాత్రమే. 2024లో 12,717 స్టార్టప్స్ కనుమరుగైపోయాయి. షట్టర్లు దించేసిన కంపెనీల సంఖ్య 2022 వరకు నాలుగు అంకెలకే పరిమితం అయింది. గత రెండేళ్లలో అనూహ్యంగా అయిదు అంకెల స్థాయికి చేరడం ఆందోళన కలిగించే అంశం. కరోనా తదనంతర పరిస్థితులు కూడా కొంతవరకు కారణమయ్యాయి. ముఖ్యంగా ఏఐ వల్ల.. అగ్రిటెక్, ఫిన్టెక్, ఎడ్టెక్, హెల్త్టెక్ రంగాల్లోని స్టార్టప్లు అధికంగా ప్రభావితమయ్యాయి. ‘ఐఎన్సీ42’ వెబ్సైట్ ‘ఇండియన్ స్టార్టప్ లేఆఫ్ ట్రాకర్ 2025’ ప్రకారం.. 2025 సెప్టెంబర్ వరకు స్టార్టప్స్ 5,600లకుపైగా ఉద్యోగులను తొలగించాయి. 2023–24లో 67 స్టార్టప్స్ రూ.21,472 కోట్ల నష్టాన్ని ప్రకటించాయి. ఏఐ కంపెనీల దూకుడుఏఐ రాకతో కంటెంట్ రూపకల్పనలో వ్యయం తగ్గుతోంది. ఈ రంగంలో ప్రవేశానికి అడ్డంకులను తొలగించింది. ఏఐ ఎంట్రీతో టెక్ స్టూడియోల అవసరం తీరిపోయింది. అంతేకాదు ఖరీదైన స్టార్టప్స్ ఏర్పాటు చేయాల్సిన పనికూడా లేదు. కంటెంట్ సులువుగా, చవకగా దొరుకుతోంది. జనానికీ అందుబాటులో ఉంటోంది. ఆదాయం విషయంలో నిర్దిష్ట టర్నోవర్కు చేరుకోవడానికి కంపెనీలకు సంవత్సరాలు పట్టేది. ఇప్పుడు నెలల్లోనే ఏఐ స్టార్టప్స్ అది సాధ్యం చేస్తున్నాయి. ఏర్పాటైన 12–18 నెలల్లోనే 10 మిలియన్ డాలర్ల వార్షికాదాయం స్థాయికి చేరుతున్నాయంటే ఏఐ కంపెనీల ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.సగానికి తగ్గాయిఏఐ దూకుడు.. ఒకప్పుడు ఆశాజనకంగా కనిపించిన స్టార్టప్లను సైతం తుడిచిపెట్టేస్తోంది. పెట్టుబడిదారులు ఇప్పుడు ఏఐ మార్పులను తట్టుకొని దీర్ఘకాలంలో లాభాలను అందించే వ్యాపార విధానాలపై దృష్టిపెడుతున్నారు. ఈ నేపథ్యంలో.. స్టార్టప్స్లోకి రావాల్సిన నిధులూ తగ్గుముఖం పట్టాయి. భారతీయ స్టార్టప్స్ 2021, 2022లో ఏటా 7 బిలియన్ డాలర్ల స్థాయిలో ఫండింగ్ అందుకోగా.. గత రెండేళ్లలో ఈ మొత్తం దాదాపు సగానికి పడిపోవడం గమనార్హం. 2024లో భారత్కు చెందిన అంకుర సంస్థలు 3.7 బిలియన్ డాలర్ల నిధులను దక్కించుకున్నాయి. 2025 ఆగస్ట్ నాటికి ఈ మొత్తం కేవలం 2 బిలియన్ డాలర్లు మాత్రమే. -
వామ్మో.. పాము!
వాతావరణ మార్పులతో విషపూరిత పాముల హాట్స్పాట్లు కూడా మారే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడున్న పాముల హాట్స్పాట్లు త్వరలో ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలకు వ్యాపించే అవకాశాలు పెరుగుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం ఏపీ, ఉత్తరప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర పాముకాటు మరణాలకు హాట్స్పాట్లుగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో పాముకాట్ల తీవ్రత చాలా ఎక్కువ. దేశంలో పాముకాటు వల్ల ఏటా 60 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. ఇప్పుడు వాతావరణ మార్పులతో ఈ ముప్పు ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలకు వ్యాపిస్తోందని పీఎల్ఓస్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనంలో వెల్లడైంది. – సాక్షి, అమరావతిసాధారణంగా వానాకాలంలో పాముకాటు మరణాలు ఎక్కువగా నమోదవుతుంటాయి. వర్షాకాలం అయిపోగానే ఇలాంటి కేసులు తగ్గిపోతాయి. అయితే, రానున్న కాలంలో వాతావరణ మార్పుల కారణంగా భారత్లో పాముకాటు మరణాలు మరింత పెరిగే అవకాశం ఉందని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య భారతాన్ని పాముల బెడద వణికించనుందని ‘పీఎల్ఓ’స్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం హెచ్చరిస్తోంది.భూమి వేడెక్కుతుండటంతో.. వేడెక్కుతున్న భూమి, అస్థిర వర్షాలు, వాతావరణ మార్పులతో భూమి మరింతగా వేడెక్కుతోంది. వర్షాలు అస్థిరంగా కురుస్తున్నాయి. దీంతో పాముల జీవన విధానం గందరగోళంగా మారుతోంది. పాములు చల్లని లేదా వెచ్చని ప్రాంతాల్లో జీవించడానికి ఇష్టపడతాయి. భూమి వేడెక్కడంతో ఇప్పటివరకు చల్లగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలైన హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ తదితర ప్రాంతాలు పాములకు కొత్త ఆవాసాలుగా మారుతున్నాయి. వర్షాలు ఎక్కువైనా, తక్కువైనా పాములు తమకు ఆహారంగా దొరికే ఎలుకలు, చిన్న జంతువులు ఉన్న చోటికి వెళ్తాయి. అస్థిర వర్షాల వల్ల పొలాలు, అడవులు, నీటి వనరులు మారిపోయి అవి గ్రామాలు, పట్టణాలకు వస్తున్నాయి. అడవులు నరికివేత, నగరాలు విస్తరించడం, భూమి ఉపయోగంలో మార్పుల వల్ల పాములు తమ సహజ ఆవాసాలను వదిలి మనుషులు ఉండే ప్రాంతాలకు వస్తున్నాయి. దీనివల్ల పాముకాట్ల బెడద పెరుగుతోంది.‘బిగ్ ఫోర్’ స్నేక్స్తోనే బెడదదేశంలో నాలుగు విషపూరిత పాముల వల్ల మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. వీటిని ‘బిగ్ ఫోర్’ స్నేక్స్గా పిలిచే ఇండియన్ కోబ్రా (నాగుపాము), కామన్ క్రైట్ (కట్లపాము), రస్సెల్స్ వైపర్ (రక్త పింజరి), సా–స్కేల్డ్ వైపర్ (చిన్న పింజరి) వల్లే మన దేశంలో అత్యధిక పాముకాటు మరణాలు సంభవిస్తున్నాయి. వీటి కాటువల్ల విషం వేగంగా శరీరంలో వ్యాపిస్తుంది. సకాలంలో చికిత్స అందకపోతే మరణానికి దారితీస్తుంది. మన రాష్ట్రంలోని కోస్తా ప్రాంతాల్లోని పొలాల్లో నాగు పాములు, రక్త పింజరి, కట్ల పాములు ఎక్కువ. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కింగ్ కోబ్రాలు కనిపిస్తాయి. అయితే.. కోస్తా జిల్లాల్లోనే పాముకాట్ల బెడద తీవ్రంగా ఉంటోంది. కొత్త ఆవాసాలకు పాములు వాతావరణం మార్పులతో పాముల ఆవాసాలు చెదిరిపోయి అవి ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. రాబోయే 50 ఏళ్లలో ఈ పాములు ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలకు మరింతగా విస్తరించే అవకాశాలున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. వేడెక్కుతున్న అక్కడి వాతావరణం ఆ ప్రాంతాలను పాములకు అనుకూలంగా మారుస్తోంది. వాతావరణ మార్పులతో పొలాలు, నీటి వనరులు మారుతుండటంతో అక్కడ ఉండే ఎలుకలు, చిన్న పాములను ఆహారంగా తీసుకునేందుకు విషపూరిత పాములు ఇళ్లు, పొలాల సమీపంలోకి వస్తున్నాయి. అందువల్లే పాముకాట్లు పెరుగుతున్నాయి. ఫలితంగా వ్యవసాయ భూముల వద్ద రైతులు, కూలీలు, పిల్లలు పాముకాట్ల బారినపడుతున్నారు. ఆస్పత్రులపై ఒత్తిడి పాముకాటు చికిత్సకు అవసరమైన యాంటీ వీనం ఔషధాలు గ్రామీణ ఆస్పత్రుల్లో తక్కువగా ఉంటున్నాయి. దీంతో ఆస్పత్రులకు వచ్చినా పాముకాటుకు గురైన వారు చనిపోతున్నారు. గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో యాంటీ వీనం ఇంజెక్షన్లు, శిక్షణ పొందిన వైద్యుల అవసరం ఎక్కువవుతోంది. పాముకాటు గురించి గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు మెరుగైన ఆరోగ్య సౌకర్యాలతో ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందని పీఎల్ఓస్ అధ్యయనం స్పష్టం చేస్తోంది. -
సమాజంలో ఏకాకిగా..
నిత్యం బంధువులు, స్నేహితుల నుంచి వాట్సాప్ను ముంచెత్తుతూ గుడ్మారి్నంగ్ సందేశాలు.. ఆఫీసుకెళ్లగానే హాయ్, హలో పలకరింపులు.. వారాంతాల్లో స్నేహితులతో పారీ్టలు.. ఏడాదంతా పండుగలు, పబ్బాలు, కుటుంబ వేడుకలు.. ఇలా సంఘజీవులుగా దైనందిక జీవితాన్ని గడుపుతున్నప్పటికీ మనోళ్లనుఒంటరితనం వేధిస్తోంది! ప్రపంచంలోకెల్లా అత్యధిక జనాభాగల దేశంగానే కాకుండా.. సాంఘిక, సామాజిక స్థాయిల్లో వివిధ బంధాలతో పెనవేసుకు పోయిన భారతీయుల్లో ఈ సమస్య రోజురోజుకూ పెరుగుతుండటం దేనికి సంకేతం?సాక్షి, హైదరాబాద్: దేశంలోని పట్టణవాసుల్లో ప్రతి ఆరుగురిలో ఒకరు తరచూ ఒంటరితనంతో బాధపడుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. వేగవంతమైన సామాజిక–ఆర్థిక మార్పులు, పాతుకుపోయిన సాంస్కృతిక అంశాల సంక్లిష్ట మిశ్రమం కారణంగా పట్టణ ప్రాంతాల వారు ఎక్కువగా ఒంటరితనంతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపింది. ఉపాధి లేక గ్రామాల నుంచి వలసల పెరుగుదల, పట్టణాల్లో అధికమవుతున్న వృత్తిపరమైన పోటీతత్వం, సుదీర్ఘ పనిగంటలు, సుదూర ప్రయాణాల వంటి అంశాలు ప్రజల్లో భావోద్వేగ అలసటకు దారితీస్తున్నట్లు పేర్కొంది.సంబంధాలన్నీ పైపైనే..ప్రముఖ గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్, పబ్లిక్ ఒపీనియన్ స్పెషలిస్ట్ కంపెనీ ‘ఇప్సోస్’ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం పట్టణవాసులు పరస్పరం సత్సంబంధాలు కలిగి ఉన్నట్లు పైకి కనిపిస్తున్నా భావోద్వేగపరంగా ఒకరికొకరు కలవలేకపోతున్నారు. స్త్రీ, పురుష తేడాలు, పేద, ధనిక అంతరాలు, ప్రాంతాలు, పట్టణీకరణ వంటివి ఈ భావోద్వేగాలను ప్రభావితం చేస్తున్నాయి. అయితే సోషల్ మీడియా ఈ భావాలను కప్పిపుచ్చేందుకు.. బాధ, ఇబ్బందులను పక్కకునెట్టేందుకు దోహదపడుతున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమలోని భయాలను కప్పిపుచ్చుకోవడంతోపాటు వాటిని బయటకు వెల్లడిస్తే ఇతరుల దృష్టిలో చులకన అవుతామనే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ (ఫోమో) భావన కూడా దీనికి తోడ్పడుతోంది.సర్వేలోని ముఖ్యాంశాలు..⇒ పట్టణ ప్రాంతాల్లోని 43% మంది భారతీయులు ఎక్కువ సమయం ఒంటరితనం ఫీలవుతున్నారు. పెద్ద నగరాల్లో ఇది 45 శాతంగా ఉంటోంది.⇒ ప్రతి ఆరుగురిలో ఒకరు తరచూ ఒంటరిననే భావనతో కాలం నెట్టుకొస్తున్నారు.⇒ 45 ఏళ్లకు పైబడిన వారిలో 20 శాతం ఓ మోస్తరుగా,13 శాతం తీవ్రమైన ఏకాకి జీవితాన్ని అనుభవిస్తున్నారు.⇒ పురుషుల్లో ఒంటరితనమనే భావన క్రమక్రమంగా పెరుగుతోంది.⇒ ప్రతి నలుగురు టీనేజర్లలో ఒకరు ఒంటరితనంతో బాధపడుతున్నారు.⇒ పెద్ద వయసు వారిలో ప్రతి ముగ్గురిలో ఒకరు సామాజికంగా దూరంగా ఉన్నామనే భావనతో ఉన్నారు.శారీరక, మానసిక సమస్యలుదీర్ఘకాలిక ఒంటరితనం తీవ్ర శారీరక, మానసిక సమస్యలకు దారితీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల రోగనిరోధక శక్తి బలహీన పడటం, గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. కేన్సర్ వంటి వ్యాధులకు గురయ్యే చాన్స్ ఎక్కువగా ఉంటుందన్నారు. మానసిక సమస్యలను ఎదుర్కొనే విషయంలో భారత్లో తగినంత మంది మానసిక ఆరోగ్య నిపుణులు లేకపోవడం అడ్డంకిగా మారుతోందని అభిప్రాయ పడుతున్నారు.పరిష్కారం ఏమిటి? ⇒ కుంగుబాటుకు గురైనప్పుడు బాధితులు ఫోన్, చాట్ లేదా యాప్ల రూపంలో ‘లిజనింగ్ సరీ్వసెస్’ద్వారా సాంత్వన పొందొచ్చు. కష్టాలను విని నిపుణులు తగిన మద్దతు అందిస్తారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ కిరణ్ హెల్ప్లైన్ (1800–599–0019) 13 భాషల్లో 24/7 మానసిక ఆరోగ్య మద్దతు అందిస్తోంది. ⇒ అభిరుచిగల సమూహాలు, క్లబ్లు లేదా ఆన్లైన్ ఫోరమ్లలో చేరడం ద్వారా స్వచ్ఛంద సేవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఒంటరితనంతో ముడిపడిన ప్రవర్తనలను అధిగమించడంలో దోహదపడుతుంది. ⇒ ధ్యానం, యోగా, మైండ్ఫుల్నెస్ వంటి అభ్యాసాలు బాధితులను ప్రశాంతపరిచి ఆందోళనలు తగ్గిస్తాయి. ఈ అభ్యాసాలు నాడీ వ్యవస్థను ప్రశాంతపరచడంలో సహాయపడతాయి. కారి్టసాల్ వంటి ఒత్తిడి హార్మోన్ల విడుదలను తగ్గిస్తాయి. -
గుండె జబ్బులే.. 'ప్రాణాంతకం'
మనదేశంలో 2021–23 మధ్య సంభవించిన మరణాలకు గుండె జబ్బులే ప్రధాన కారణమని.. ఆ తర్వాతి స్థానంలో శ్వాసకోశ సమస్యలు ఉన్నట్లు ‘రిజిస్ట్రార్ జనరల్ అండ్ సైన్సెస్ కమిషనర్ ఆఫ్ ఇండియా’ తన తాజా నివేదికలో వెల్లడించింది. మొత్తం మరణించిన వారిలో 40 శాతానికిపైగా.. 70 ఏళ్లకుపైబడిన వారే. భారతదేశ ప్రజారోగ్య వ్యూహాలను రూపొందించటానికి, పెరుగుతున్న అసాంక్రమిక వ్యాధుల భారాన్ని ఎదుర్కొనే ప్రణాళికల రూపకల్పనకు ఈ పరిశోధన ఫలితాలు కీలకమైనవని నివేదిక పేర్కొంది.‘మరణ కారణాలు: 2021–2023’ పేరిట రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్జీఐ) సెప్టెంబర్ 3న విడుదల చేసిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే తాజా నివేదిక ప్రకారం దేశంలోని అనారోగ్య సంబంధ మరణాలకు దాదాపు 31 శాతం వరకు గుండె జబ్బులే ప్రధాన కారణం. మొత్తం మరణాల్లో 56.7 శాతం వరకు అసాంక్రమిక వ్యాధులు (గుండె జబ్బులతో సహా) ఉన్నట్లు నివేదిక తెలిపింది. గుండెజబ్బుల తర్వాత శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ వ్యాధులు మరణాలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో ప్రసూతికి సంబంధించిన మరణాలు, పౌష్టికాహార లోపాల మరణాలు 23.4 శాతం వరకు ఉన్నాయి. గుండెపై జీవనశైలి ఒత్తిళ్లు..అన్ని రకాల హృద్రోగాలు కలిపి మరణాలకు ప్రధాన కారణంగా నిలిచాయని, దాదాపు 31 శాతం మంది ప్రాణాలను అవి బలిగొన్నాయని నివేదిక తెలిపింది. యువతలో జీవనశైలి వల్ల తలెత్తుతున్న గుండె జబ్బుల తర్వాత, ఆత్మహత్యలు వారి మరణానికి రెండో ప్రధానం కారణంగా ఉన్నాయని నివేదిక తెలిపింది. 30 ఏళ్లు దాటిన వారిలో మరణాలకు గుండె జబ్బులు ప్రధాన కారణంగా ఉంటుండగా, 15–29 ఏళ్ల యువత పాలిట ఆత్మహత్యలు మరణ శాసనాలుగా మారుతున్నాయి.ప్రాంతాల వారీగా సర్వేఉత్తర, ఈశాన్య, తూర్పు, మధ్య, పశ్చిమ, దక్షిణ.. ఇలా ప్రాంతాల వారీగా రిజిస్ట్రార్ ఆఫ్ ఇండియా ‘మరణ కారణాలు: 2021–2023’ సర్వేను నిర్వహించింది. » దక్షిణాదిన హృద్రోగ మరణాల శాతం 32.8 శాతం ఉండగా, ఉత్తరాదిన 34.5 శాతంగా ఉంది. » శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వల్ల మరణాలు పశ్చిమ ప్రాంతంలో అత్యధికంగా 12.7 శాతం ఉన్నాయి. తరవాతి స్థానంలో (12.3 శాతం) మధ్య భారతం ఉంది. ఇవి అత్యల్పంగా (7.1 శాతం) సంభవించింది ఉత్తరాదిలో.» మధుమేహం వల్ల అత్యధికంగా 4.6 శాతం మరణాలతో దక్షిణాది అగ్రస్థానంలో నిలిచింది. తరువాతి స్థానంలో (4.1 శాతం) ఉత్తరాది ఉంది. -
ఫోన్ వద్దు.. చదువే ముద్దు!
స్మార్ట్ఫోన్ ఎంతగా మన దైనందిన జీవితంలో మమేకం అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర లేదు. కర్ణుడి కవచ కుండలాల్లా.. అది నిరంతరం మనతో ఉండాల్సిందే. కాలేజీ విద్యార్థులకుతోడు బడి ఈడు పిల్లల్లోనూ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగింది. ఈ అలవాటే వారిని క్లాస్ రూముల్లోకి ఫోన్ తీసుకెళ్లేలా చేస్తోంది. తరగతి గదిలోకి ఫోన్ లేకుండా వెళ్లిన విద్యార్థులు విద్యాపరంగా మెరుగ్గా రాణించినట్టు తాజా అధ్యయనంలో తేలింది.భారీ అధ్యయనంపెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని వార్టన్ స్కూల్ ప్రొఫెసర్ డాక్టర్ ఆల్ఫ్ సుంగు తన సహచరులతో కలిసి ఇటీవల భారత్లో ఓ వినూత్న అధ్యయనం చేపట్టారు. 10 ఉన్నత విద్యా సంస్థలలో చదువుతున్న 16,955 మంది విద్యార్థులను స్మార్ట్ ఫోన్ ఎలా ప్రభావితం చేసిందన్నదే ఆ అధ్యయన సారాంశం. తరగతి గదిలోకి ఫోన్ తీసుకుపోని విద్యార్థులు చదువుల్లో బాగా రాణించినట్టు ఆ అధ్యయనంలో తేలింది.తక్కువ పనితీరు కనబరుస్తున్న, అలాగే సైన్స్, గణితం కాకుండా ఇతర సబ్జెక్టులను చదువుతున్న మొదటి సంవత్సరం విద్యార్థులు కూడా ఫోన్ వాడకపోవడం వల్ల ఎక్కువ ప్రతిభ చూపినట్టు డాక్టర్ సుంగు తెలిపారు. ఫోన్ నిషేధించడం వల్ల తరగతి గది ఫలితాలు మెరుగుపడతాయనడానికి బలమైన ఆధారాలను నివేదిక అందిస్తుందని నార్త్ కరోలినా విశ్వవిద్యాలయంలో కౌమార నిపుణులు అన్నే మాహెక్స్ చెప్పారు.20 నిమిషాల సమయం!యునెస్కో చేపట్టిన ‘2023 గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్’ నివేదిక ప్రకారం.. ‘కొన్ని సాంకేతిక పరిజ్ఞానాలు కొన్ని సందర్భాల్లో కొంతవరకు మాత్రమే అభ్యాసానికి తోడ్పడతాయి. తరగతి గదిలో స్మార్ట్ఫోన్ వల్ల చదువుకు అంతరాయం కలుగుతోంది. 14 దేశాల్లో ప్రీ–ప్రైమరీ నుండి ఉన్నత విద్య వరకు చదువుతున్న విద్యార్థులపై జరిపిన ఓ అధ్యయనంలో.. ఫోన్ చేతిలో ఉంటే విద్యార్థుల దృష్టి నేర్చుకోవడం నుండి మరలుతోందని తేలింది.మొబైల్ ఫోన్ లో నోటిఫికేషన్స్ వస్తుంటే విద్యార్థులు తమ ఏకాగ్రతను కోల్పోతున్నారట. ఆ తరువాత.. విద్యార్థులు వారు నేర్చుకుంటున్న దానిపై తిరిగి దృష్టి పెట్టడానికి 20 నిమిషాల వరకు సమయం పడుతోందని మరో అధ్యయనంలో తేలింది. బెల్జియం, స్పెయిన్, యూకేలోని బడుల్లో స్మార్ట్ఫోన్లపై నిషేధం కారణంగా అభ్యాస సామర్థ్యాలు, ఫలితాలు మెరుగుపడినట్టు వెల్లడైంది’.‘వాంఛనీయం కాదు’పాఠశాలల్లో స్మార్ట్ఫోన్లను పూర్తిగా నిషేధించడం ఆచరణాత్మకం, వాంఛనీయం కాదని స్పష్టం చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఈ ఏడాది మార్చిలో మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యా ప్రయోజనాలు, తలెత్తే నష్టాలను దృష్టిలో పెట్టుకుని నియంత్రణ అవసరాన్ని నొక్కి చెప్పింది. ఈ నేపథ్యంలో.. స్కూల్ సమయంలో విద్యార్థులు స్మార్ట్ఫోన్ వాడకంపై స్పష్టమైన విధానాలను రూపొందించాలని ఢిల్లీ విద్యా శాఖ తన పరిధిలోని అన్ని పాఠశాలలను ఏప్రిల్లో ఆదేశించింది. విద్యార్థులు చదువుపై దృష్టి కేంద్రీకరించాలన్న ఏకైక లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా కనీసం 40% జాతీయ విద్యా వ్యవస్థలలో తరగతి గదుల్లో సెల్ఫోన్లపై నిషేధాలు అమలవుతున్నాయి. మనదేశంలో మాత్రం స్మార్ట్ఫోన్ వినియోగానికి సంబంధించి ప్రస్తుతం స్పష్టమైన చట్టం/విధానం లేదు.నో ఫోన్స్.. ఓన్లీ బుక్స్అమెరికా ఫోన్లు నిషేధిస్తున్న రాష్ట్రాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2025 ఆగస్ట్ నాటికి 18 రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు చేస్తుండగా.. ప్రస్తుత విద్యా సంవత్సరంలో మరో 17 రాష్ట్రాలు వచ్చి చేరాయి. చైనా: ప్రైమరీ, సెకండరీ స్కూల్స్లో 2025 మార్చి నుంచి నిషేధం విధించారు. బోధనా కారణాల వల్ల ఫోన్ అవసరమైతే తల్లిదండ్రులు రాతపూర్వకంగా విద్యా మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేయాలి. తజికిస్తాన్: 2009 నుంచి ప్రాథమిక, సెకండరీ, ఉన్నత విద్యా సంస్థలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది మొబైల్ ఫోన్ వాడకూడదు. గీత దాటితే జరిమానా తప్పదు.బంగ్లాదేశ్: దేశవ్యాప్తంగా నిషేధాలు మొదట 2011లో అమలయ్యాయి. 2017లో బలోపేతం చేశారు.రువాండా2018 జూన్ నుంచే ప్రాథమిక, సెకండరీ పాఠశాలల్లో మొబైల్ ఫోన్స్ వాడకానికి అడ్డుకట్ట వేసింది. ఫ్రాన్స్: 15 ఏళ్లలోపు విద్యార్థులు బడుల్లో ఫోన్ వాడకూడదు. 2018–2019 విద్యా సంవత్సరం నుండి నిబంధన అమలు.బ్రెజిల్: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులు స్మార్ట్ఫోన్ వాడకూడదని 2025 జనవరిలో జాతీయ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఉపాధ్యాయుల అనుమతితో విద్యా ప్రయోజనాల కోసం లేదా అత్యవసర పరిస్థితులు ఉంటే ఉపయోగించవచ్చు.ఇటలీ: ప్రైమరీ స్కూల్ విద్యార్థుల మొబైల్ ఫోన్ వాడకంపై నిషేధం ఉంది. 2025 కొత్త విద్యా సంవత్సరం నుండి హైస్కూల్ విద్యార్థులకూ వర్తింపజేశారు.నెదర్లాండ్స్: ప్రాథమిక, సెకండరీ పాఠశాలల్లో మొబైల్ ఫోన్లు, స్మార్ట్వాచ్లు, టాబ్లెట్ పీసీలపై దేశవ్యాప్తంగా 2024 సెప్టెంబర్ నుండి నిషేధం. న్యూజిలాండ్: పాఠశాల సమయంలో సెల్ఫోన్ వాడకూడదన్న నిబంధన దేశవ్యాప్తంగా 2024 ఏప్రిల్ నుంచి అమలైంది. -
మరణాన్ని ఓదార్పు అడగకు
బతుకులో జ్వాలలు ఉన్నాయని శరీరాన్ని అగ్నికి ఆహుతి ఇవ్వడం పరిష్కారం ఎలా అవుతుంది అంటారు విజ్ఞులు. ‘అన్ని కష్టాలకు విముక్తి చావే’ అనే మాటకు మించిన అవివేకం లేదంటారు కౌన్సెలర్లు. బలవన్మరణం ఆ వ్యక్తిని చనిపోయాక కూడా వెంటాడుతుంది. ఒక అపప్రథగా... కుటుంబాన్ని కష్టాల పాలు చేస్తుంది. మనిషి లేని లోటు ఏం చేసినా తిరిగి రాదు. అటువంటి సమయంలో మరణం ఎందుకు? నిరాశ, నిస్పృహ పరిస్థితులు, సవాళ్లు ఎవరికీ కొత్త కాదు. బతకడమే చేయవలసింది. నిపుణుల సలహాలతో కథనం.అంకెలు దుర్మార్గమైనవి. అవి నిజమైన నష్టాన్ని చూపించవు. కావాలంటే ఈ అంకె– 1,80,000 చూడండి. దీనిని చూస్తే ఏమీ అనిపించదు. కాని మన దేశంలో ప్రతి ఏటా ఇంతమంది ఆత్మహత్యల ద్వారా చనిపోతున్నారు. వీరందరి ఫొటోలను సముద్రతీరం వెంబడి ప్రదర్శిస్తే ఎన్ని కిలోమీటర్ల తీరం కావాలి? అలా ప్రదర్శిస్తే తెలుస్తుంది తీవ్రత,,, ఇంత మంది చనిపోతున్నారా అని. వీరిలో కనీసం 1,20,000 మంది పురుషులు. ఇప్పుడు ఆలోచించండి. పితృస్వామ్య ఆధారితమైన మన సమాజంలో పురుషుడు చనిపోతే ఆ ఇంట్లోని ఎంతమంది సభ్యులు దిక్కులేనివారు అవుతారు. జీవితాలు తల్లకిందులు చేసుకుంటారు. మరెన్నో కష్టాల్లో కూరుకుపోతారు. కరోనా అనో మరోటనో మహమ్మారులను చూసి భయపడటం కాదు. ఈ భూగ్రహాన్ని పీడిస్తున్న అతి పెద్ద మహమ్మారి ఆత్మహత్యే. ప్రతి ఏటా అన్ని దేశాలలో కలిపి 8 లక్షల మంది ఆత్మహత్యల ద్వారా మరణిస్తున్నారు. ఇది ఒక రకంగా కాకిలెక్కే. అసలు లెక్క తెలియక పోవడమే మంచిది. మరో విషయం తెలుసా? ప్రతి మరణానికీ ఒకరు చనిపోవడమే కనిపిస్తుంది... కాని ఆ సమయానికి మరో ఇరవై మంది ఆత్మహత్యాయత్నం చేసి బతికి బయటపడ్డ వాళ్లు ఉంటారు.ఆరుకు ఒకరుప్రస్తుతం మన దేశంలో 15 నుంచి 29 మధ్య వయసు లో ఉన్న పురుషులు ఎక్కువ సంఖ్యలో ఆత్మహత్య చేసుకుంటున్నారు. అంటే దేశంలోని ప్రతి ఆరు ఆత్మహత్యల్లో ఒకటి ఈ ఏజ్ గ్రూప్ నుంచే ఉంది. బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన వయసులో ఆత్మహత్యల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. కారణం–∙చదువు ఒత్తిడి ∙పని చోట పీడన∙బంధాలలో దగా ∙ఆర్థిక సమస్యలు ∙అన్ని జీవన పార్శా్వలలో బెస్ట్గా ఉండమని కోరే సాంఘిక నియమంఇదొక జబ్బుఆత్మహత్యను జబ్బుగా ఎవరూ చూడరు. కాని ఇదొక జబ్బు. పట్టలేని ఉద్వేగం వల్ల, క్షణికావేశం వల్ల, నేను చస్తే అవతలివాళ్లు పశ్చాత్తాపంతో బాధ పడాలి అన్నట్టుగా, సమస్యలకు పరిష్కారమే ఉండదన్న నెగెటివ్ స్వభావం వల్ల, పరువు ప్రతిష్టలకు ఎక్కువ విలువివ్వాలనే భావన వల్ల, నోరు తెరిచి సమస్యను బయటపడేయని స్వభావం వల్ల ఆత్మహత్యలు జరుగుతుంటాయి. తరచి చూస్తే ఇవన్నీ మెదడు చేసే విన్యాసాలే. కెమికల్ రియాక్షన్సే. ఉద్వేగాలను, ఆవేశాలను దాటి వస్తే, మనం పోయి మరొకరిని సాధించడమనే భావన ఎంతటి హాస్యాస్పదమో ఎరుకలోకి వస్తే, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందనే నమ్మకం కలిగి ఉంటే, పరువు ప్రతిష్టలు తర్వాత ముందు ప్రాణం ముఖ్యం అనుకుంటే, ఆత్మాభిమానం కంటే సమస్య నుంచి బయటపడటం ముఖ్యం అనుకుంటే ఆత్మహత్యలు జరగవు. మరో విషయం ఏమిటంటే ఒకరికి ప్రపంచ సమస్యగా ఉండేది ఎదుటివారికి అసలు సమస్యే కాకపోవచ్చు. ‘ఇంత చిన్న విషయానికి చనిపోయాడా?’ అని ఆశ్చర్యపోతారు తప్ప జాలి కూడా చూపరు. మరి ఆత్మహత్య చేసుకోవడం ఎందుకు? ఆత్మహత్య ఆలోచనలు వస్తే జ్వరానికి మాత్ర మింగినట్టు ఆ ఆలోచనలు పోయే కౌన్సిలింగ్ తీసుకోవాలి. మిత్రుల సహకారం తీసుకోవాలి. అవసరమైతే వైద్యుల సలహాతో మందులు వాడాలి. అంతే చేయవలసింది. చనిపోవడం కాదు.భళ్లున తెల్లారుతుందిఈ చీకటి రాత్రి విషమ పరీక్షలు ఎన్ని పెట్టినా ప్రాణాలు ఉగ్గబట్టుకుని ఉంటే మరునాడు భళ్లున తెల్లారుతుంది. ఆ వెలుతురు దారి చూపిస్తుంది. కొత్త ఊపిరి వస్తుంది. కాని రాత్రే శాశ్వతం అన్నట్టు ప్రాణాలు తీసుకుంటారు కొంత మంది. గత రాత్రి వ్యక్తి చనిపోయినా మరుసటి రోజు లోకం స్తంభించదు. అందరూ ఎవరి పనుల్లో వారుంటారు. సినిమా లు ఆడుతుంటాయి. కెఫేలు బిజీగా ఉంటాయి. బ్యాంకు లావాదేవీలు జరుగుతుంటాయి. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి నిర్జీవం కావడం తప్ప అంతా మామూలుగా ఉంటుంది. ఆ అంతా మామూలుగా ఉండే జగత్తులో ఉంటూ జీవితాన్ని మిస్ కాకుండా ఉండాలనే భావన కలిగించుకుంటూ ఉండాలి. అందరూ కష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నారని ఎవరిని కదిపినా తెలుస్తుంది. మరి వారంతా చనిపోనప్పుడు మనం ఎందుకు చనిపోవాలి అనుకోవడంలోనే ఉంది విజ్ఞత. ఈ కమ్యూనికేషన్ రోజుల్లో 24 గంటలు ఎన్నో కౌన్సెలింగ్ కేంద్రాలు ఉన్నాయి. కాల్ చేస్తే సాయం చేస్తారు. ఆ సాయం పొందాలి. వ్యక్తులు బలహీనంగా ఉన్నప్పుడు కుటుంబ బలాన్ని, బంధుబలాన్ని, స్నేహబలాన్ని, సమాజ బలాన్ని తోడు తీసుకోవాలి. సోషల్ మీడియాలో సమస్యను పంచుకుని బయటపడినవారు ఉన్నారు. పోలీసులు, న్యాయ వ్యవస్థ, పాలనా వ్యవస్థ, ప్రజాప్రతినిధులు వీరంతా పౌరులకు ఏదో ఒక మార్గం చూపాల్సినవారే. వారి సాయం పొందాలి. అన్నింటికి మించి జీవితాన్ని సరళంగా, సులభం గా నిర్మించుకుంటే, ఆరోగ్యకరమైన జీవన విధానాలు, అలవాట్లు, క్రమశిక్షణ, ఆహారం, స్నేహితులు.. తోడు చేసుకుంటే జీవించడంలో ఆనందం తెలుస్తుంది.చెప్పుకునే మనిషీ కోరుకునే అండమనిషి తనకొచ్చే కష్టాల వల్ల ఆత్మహత్య చేసుకోడు. ఆ కష్టాలను వినే మనిషి లేకపోవడం వల్ల, నేనున్నాననే భరోసా దొరకకపోవడం వల్ల, నిస్సహాయత ఫీలయ్యి ఆత్మహత్య శరణ్యం అనుకుంటాడు. ఆత్మహత్య చేసుకోవడం ఒక నిమిషపు నిర్ణయం కాదు చాలామంది విషయంలో. కొందరు రోజుల తరబడి దీని గురించి ఆలోచిస్తారు. ఆలోచిస్తూ ఉంటారు. చివరకు ప్రయత్నిస్తారు. అందుకు సంబంధించిన మార్పులు వ్యక్తులలో, కుటుంబ సభ్యులలో గుర్తించడం చాలామటుకు సాధ్యం. సమస్య ఏమిటో తెలుసుకుంటే, వారిని కదిలించి రాబట్టగలిగితే వారు ప్రమాదపు అంచుకు వెళ్లరు. దురదృష్టవశాత్తు కుటుంబ సభ్యులే ఒకరిని మరొకరు గమనించలేనంతగా బిజీగా ఉంటూ అంతా అయ్యాక కళ్లు తెరుస్తున్నారు. -
మూరెడు మల్లెపూలే కాదు.. వీటితోనూ తంటాలే!
మల్లెపూలు తీసుకెళ్లినందుకు.. మలయాళ నటి నవ్య నాయర్కి ఆస్ట్రేలియాలో రూ.1.14 లక్షల జరిమానా విధించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మూరెడు మల్లెపూలు.. అదీ బ్యాగులో ఉన్నందుకే ఆమెకు ఆ ఫైన్ పడింది. ఈ చేదు అనుభవంపై ఆమె సైటైర్లు వేసుకుంటోంది కూడా. అయితే.. ఆస్ట్రేలియా మెల్బోర్న్ ఎయిర్పోర్టుకు ప్రపంచంలోని అత్యంత కఠినమైన బయోసెక్యూరిటీ చట్టాలు ఉన్న విమానాశ్రయాంగా పేరుంది. కేవలం మల్లపూలే కాదు.. మరికొన్ని వస్తువులను కూడా అక్కడికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరని మీకు తెలుసా?.. ఓనం ఈవెంట్కు హాజరయ్యేందుకు వెళ్లిన మల్లూ బ్యూటీ నవ్య నాయర్కు చేదు అనుభవం ఎదురైంది. తన తండ్రి తచ్చిన మల్లెపూల మూరను ఆమె బ్యాగులో ఉంచుకుని ఎయిర్పోర్టులో దిగారు. అయితే.. మెల్బోర్న్ ఎయిర్పోర్టులో వాటిని గుర్తించిన సిబ్బంది అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. అక్కడి అధికారులు ఆమెకు రూ.1.14లక్షల జరిమానా వేశారు. 28 రోజుల్లో ఆ జరిమానా కట్టాలని ఆమెకు స్పష్టం చేశారు. మల్లెపూల తరహాలో మూరెడున్న వంద కేటగిరీల వస్తువులపై అక్కడ నిషేధం అమల్లో ఉంది. అందులో.. తాజా, ఎండిన పూలు, తాజా పండ్లు, కూరగాయలు, మూలికలు, మసాలా దినుసులు, గింజలు, పాల సంబంధిత ఉత్పత్తులు, బర్ఫీ.. రసగుల్లా, రసమలై, గులాజ్జామూన్, మైసూర్ పాక్, సోన్పాపిడి ఇలా.. స్వీట్లు, బియ్యం, టీ, ఇంటి భోజనం, తేనే, పెంపుడు జంతువుల ఆహారం.. ఈకలు, ఎముకలు, చర్మం (సంబంధిత వస్తువులు కూడా!), చెట్లు.. జంతువుల నుంచి తయారు చేసిన మందులు, చివరకు.. విమాన, నౌకల ప్రయాణాల నుంచి తెచ్చుకున్న ఆహారాన్ని కూడా అనుమతించరంతే. ప్రయాణికులు వీటిని తీసుకెళ్లడం అక్కడ నిషిద్ధం. వాటివల్ల ప్రయాణికులకు వివిధ రకాల వ్యాధులు, తెగుళ్లు సులభంగా వ్యాపించే అవకాశం ఉండడంతో ఈ నిబంధన పెట్టారు. పైగా వాటి వల్ల పర్యావరణానికి హాని అని భావిస్తున్నారు. చివరకు.. మన పండుగలు పబ్బాలు ఉన్నాయని విజ్ఞప్తులు చేసుకున్నా కూడా వాళ్లు వినరు. అయితే మాపుల్ చెట్ల నుంచి తయారు చేసిన షుగర్ సిరప్కు మాత్రం ఎందుకనో అనుమతిస్తారు!. నవ్య మెల్బోర్న్ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం అక్కడి కస్టమ్స్ అధికారులు ఆమె బ్యాగ్లో మల్లెపూలును తీసుకువచ్చినందుకు జరిమానా విధించారు. అనంతరం మెల్బోర్న్లో జరిగిన ఓనం కార్యక్రమంలో మాట్లాడుతూ.. నటి నవ్య తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పడంతో ఈ విషయం బయటకు వచ్చింది. తాను తీసుకువచ్చిన పూలు లక్ష రూపాయలు ఖరీదైనవని జరిమానా విధించేవరకు తనకు తెలియదని చమత్కరించింది. కానీ, ఆస్ట్రేలియా సరిహద్దుల్లో నిషేధిత వస్తువులపై కఠిన నియమాలు అమలవుతున్నాయి. ఆస్ట్రేలియా బయోసెక్యూరిటీ చట్టాల ప్రకారం.. నిషేధిత/ప్రకటించని వస్తువులు (ఆహారం, మొక్కలు, జంతు ఉత్పత్తులు, ఔషధాలు) సరిహద్దులో పట్టుబడితే.. వెంటనే వాటిని ధ్వంసం చేస్తారు. ప్రయాణికులకు తక్షణ జరిమానాలు విధిస్తారు. విషయం తీవ్రమైందిగా భావిస్తే.. వీసా రద్దు చేస్తారు. మరింత తీవ్రమైందిగా అనుకుంటే.. తీవ్ర ఉల్లంఘనల కింద పరిగణించి జైలు శిక్ష కూడా విధించవచ్చు. అందుకే ప్యాసింజర్ కార్డులో వాటి గురించి తప్పనిసరిగా పేర్కొనాలి. అప్పుడు.. అనుమతించని వస్తువులు తీసేసినా జరిమానా ఉండదు. లేకుంటే.. నవ్య నాయర్లా 15 సెం.మీ. మల్లెపూలకు లక్ష రూపాయల జరిమానా చెల్లించాల్సి వస్తుంది. నవ్యా నాయర్(ధన్య వీణ) 1985 అక్టోబర్ 14న కేరళలోని అలప్పుశా జిల్లాలో జన్మించారు. 2001లో ఇష్టం అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు, ప్రధానంగా మలయాళ సినిమాల్లో.. ఆడపా దడపా తమిళ, కన్నడ చిత్రాల్లో కూడా నటించారు. పృథ్వీరాజ్ సుకుమారన్తో జంటగా నటించిన నందనం అనే సినిమాలో నటనకు కేరళ రాష్ట్ర ఉత్తమ నటి అవార్డు లభించింది. ఆమె క్లాసికల్ డాన్స్లో శిక్షణ పొందిన నర్తకి, పలు స్టేజ్ షోలు కూడా చేశారు. 2010లో వ్యాపారవేత్త సంతోష్ మెనన్ను వివాహం చేసుకున్నారు.. ఈ జంటకు ఓ కుమారుడు. యాక్టింగ్తో పాటు టీవీ షోలు, రచనల ద్వారా కూడా ప్రేక్షకులను ఆమె ఆకట్టుకుంటున్నారు. -
టెక్.. టాక్!
చాట్బాట్లు చెప్పేవన్నీ నిజాలు కావట.. కొన్ని వాటికవే ఊహించేసుకుని మనకు చెప్పేస్తాయట.. నిజం.. ఎందుకంటే.. దీన్ని చెప్పింది మేం కాదు.. ప్రఖ్యాత చాట్బాట్ సంస్థ చాట్ జీపీటీ నిర్వహణ సంస్థ అయిన ఓపెన్ ఏఐలోని పరిశోధనా బృందం. చాట్జీపీటీ వంటి చాట్బాట్లను లార్జ్ లాంగ్వేజ్ మోడల్(ఎల్ఎల్ఎం) అంటారు. ‘‘c?’’ అనే అంశంపై ఓపెన్ ఏఐ పరిశోధకులు ఆడమ్ టౌమన్ కలాయ్, ఓఫెర్ నచూమ్, ఎడ్విన్ ఝాంగ్ సహా జార్జియా టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ సంతోష్ ఎం.వెంపాల సంయుక్తంగా ఒక నివేదికను రూపొందించి ఇటీవల విడుదల చేశారు. అందులో చెప్పిందే ఈ విషయం. వాళ్లేమంటారంటే.. ‘‘ఉదాహరణకు పాఠశాలల్లో పిల్లాడిని ఉపాధ్యాయుడు ఏదైనా ప్రశ్న అడిగితే.. సమాధానం కింద ఇచ్చే నాలుగు సమాధానాల్లో ఏదో ఒకటి చెబుతాడు. అయితే కరెక్ట్ అవుతుంది లేదంటే తప్పు. నాకు తెలీదు అని కూర్చుంటే ఉన్న ఒక్క మార్కు కూడా పోతుంది. అచ్చం అలాంటి పిల్లల్లాగే కృత్రిమ మేధ చాట్బాట్లు కూడా ప్రవర్తిస్తాయి. గతంలో తమ యూజర్లు ప్రాంమ్ట్ మాదిరిగా అందించిన సమాచారంలో ఈ కొత్త ప్రశ్న తాలూకు సమాచారం లేకపోతే చాట్బాట్ సొంతంగా ఒక తప్పుడు సమాచారాన్ని సృష్టించి యూజర్కు అందజేస్తుంది. ఆ సమాధానంతో యూజర్ సంతృప్తి చెందితే తాను చెప్పిన అంశం వాస్తవానికి దగ్గరగా ఉందని చాట్బాట్ గుర్తుంచుకుంటుంది. లేదంటే మరోసారి మరో సమాధానం ఇస్తుంది. ఇలా చాట్బాట్లు ఎప్పటికప్పుడు కొత్త అంశాలపై సమీక్ష జరుపుకుంటూ తమను తాము మెరుగుపర్చుకుంటాయి. తప్పులను మనం ఆపలేం కానీ ఆ తప్పుల నుంచి పాఠాలను నేర్చుకోగలం అనే సిద్ధాంతంతో చాట్బాట్లు పనిచేస్తాయి’’ అది బ్రో.. చాట్బాట్ నిజం వెనకున్న అసలైన నిజం.. గంటకు రూ.5,000 ఇంతకీ దేనికి?ఇంక దేనికి.. హిందీ చాట్బాట్ను సృష్టించేందుకు.. చాట్బాట్లను మనం తెగ వాడతాం. ఈ విషయం మెటా సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్కు బాగా తెలుసు. అందుకే ఇప్పుడు హిందీ చాట్బాట్ కోసం క్రియేటర్లు, కాంట్రాక్టర్లను నియమించుకుంటున్నారు. ఇందుకోసం గంటకు దాదాపు రూ.5,000 చెల్లిస్తున్నారు. క్రిస్టల్ ఈక్వేషన్, ఆక్వెంట్ టాలెంట్ సంస్థల ద్వారా కొత్త ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. హిందీ, ఇండోనేషియన్, స్పానిష్, పోర్చుగీస్ భాషలు అనర్గళంగా మాట్లాడే వాళ్లకు తొలి ప్రాధాన్యం కలి్పస్తారు. కథలు చెప్పడం, పాత్రల సృష్టి, కృత్రిమమేధ కంటెంట్ తయారీ వంటి సృజనాత్మక రంగంలో ఆరేళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇన్స్ట్రాగామ్, మెసెంజర్, వాట్సాప్ యాప్లలో హిందీ భాషలో చాట్బాట్ను సృష్టించడం ఈ ఉద్యోగుల ప్రధాన విధి. కోడింగ్ మాత్రమే కాదు ఈ మూడు యాప్లలో ఏఐ పాత్రలను సృష్టించే నిపుణులకు కూడా అవకాశాలు మెండుగా ఉన్నాయని కంపెనీ పేర్కొంది. టాలెంట్ ఉందా.. మరి బీ రెడీ. కంటెంట్ ఈజ్ కింగ్.. కంటెంట్ క్రియేటర్లకు మార్కెట్లో డిమాండ్ ఉంది. కృత్రిమమేధ(ఏఐ) బ్రాండ్లు మార్కెట్లో మనుగడలో ఉండాలంటే కంటెంట్ క్రియేటర్లపై ఆధారపడక తప్పని పరిస్థితి. అందుకే కంటెంట్ స్ట్రాటజీ ఉద్యోగికి దాదాపు రూ.3.46 కోట్ల వార్షిక వేతనం ఇస్తామని తాజాగా ఓపెన్ఏఐ ప్రకటించింది. కంటెంట్ స్ట్రాటజీ, కాపీ రైటింగ్, గ్రోత్ మార్కెటింగ్ విభాగాల్లో ఆరేళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులు దీనికి అర్హులని తెలిపింది. అక్షరాలు, ఆలోచనలకు వాస్తవరూపమిచ్చి కోట్లాది వినియోగదారుల మనసుల్ని చూరగొనే ఉద్యోగులే మాకు కావాలని చెప్పింది. ఇంతకీ జాబ్ ఎక్కడంటే.. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నగరంలో.. అందుకే కటౌట్ కాదు.. మన దగ్గరున్న కంటెంట్ ముఖ్యం అనేది.. ఏంటి భయ్యా ఇదీ..మీరీ విషయం విన్నారా? తక్కువ వృత్తి నైపుణ్యాలున్న, కిందిస్థాయి(ఎంట్రీలెవల్) ఉద్యోగాలను కృత్రిమమేధ తుడిచిపెట్టేస్తుందని కృత్రిమమేధ భద్రతా, పరిశోధనా సంస్థ ‘ఆంథ్రోపిక్’ సీఈఓ డేరియో ఆమోడీ చెప్పారు. కన్సల్టింగ్, న్యాయసేవలు, ఫైనాన్స్, అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో ఎంట్రీలెవల్ ఉద్యోగులు ఒకటి నుంచి ఐదేళ్లలోపు కొలువుల్ని కోల్పోవడం ఖాయమని చెప్పారు. బీబీసీ పాడ్కాస్ట్ అయిన ‘‘బీబీసీ ర్యాడికల్ విత్ అమోల్ రాజన్’ ఆడియో ఇంటర్వ్యూలో డేరియో పలు అంశాలపై మాట్లాడారు. ‘‘న్యాయసేవలు అందించే సంస్థలు మొదలు ఫైనాన్స్, అడ్మిని్రస్టేషన్ విభాగాల దాకా కొన్ని సంస్థల్లో డాక్యుమెంట్ల తనిఖీ అనేది మూస పద్ధతిలో సాగుతుంది. ఇలాంటి వైట్కాలర్ ఉద్యోగుల పనిని కృత్రిమమేధ సులభంగా చేయగలదు.అందుకే ఇలాంటి ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు త్వరలో మాయం అవుతాయి. కిందిస్థాయి ఉద్యోగుల్ని ఏఐతో భర్తీచేయాలని ఎన్నో కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఆలోచిస్తున్నారు. క్లరికల్ పనిని ఏఐతో చేయించాలని చూస్తున్నారు. ఎలాంటి సాఫ్ట్వేర్ కోడింగ్ను అయినా ఏఐ అనేది మూడు నుంచి ఆరు నెలల్లోపు నేర్చేసుకుంటుంది. దీంతో అత్యున్నతస్థాయి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మినహా కిందిస్థాయి ఉద్యోగాలు డేంజర్లో పడనున్నాయి’’ అని ఆయన హెచ్చరించారు. -
ఆమెకు అభద్రత!
దేశంలోని ప్రతి 10 మంది మహిళల్లో నలుగురు.. తాము ఏమంత సురక్షితంగా లేరని భావిస్తున్నారట. యువతుల్లో భయాందోళనలు గత ఏడాది కంటే పెరిగాయి. ఫిర్యాదు ఇస్తే న్యాయం జరుగుతుందన్న ఆశ బాధిత మహిళల్లో చాలా తక్కువగా ఉందట. పని చేసే చోట భద్రత గురించి మాత్రం.. సురక్షితమైన వాతావరణం ఉందని అత్యధికులు చెప్పారు. దేశంలోని మహిళల భద్రతా స్థితిగతులపై జాతీయ మహిళా కమిషన్.. ‘నారీ 2025 వార్షిక నివేదిక, భద్రతా సూచిక’ పేరిట విడుదుల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. -సాక్షి, స్పెషల్ డెస్క్వీధి లైట్లు.. ప్రజా రవాణా!⇒ ‘ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్’ గురించి విన్నవారిలో చాలా మంది, ఆఫీసులలో అలాంటి యంత్రాంగం ఒకటి ఉంటుందన్న అవగాహన మహిళలకు భద్రత కల్పిస్తుందని అభిప్రాయపడ్డారు. ⇒ మహిళల భద్రత అంటే కేవలం వారికి భౌతిక రక్షణను మాత్రమే ఇవ్వటం కాదని; వారి మానసిక, ఆర్థిక, డిజిటల్ భద్రతలను కూడా కల్పించాలని నివేదిక సూచించింది. ⇒ స్థలాన్ని, సమయాన్ని బట్టి కూడా భద్రత అర్థం మారుతుందనీ, పగటిపూట సురక్షితమైన వాతావరణాన్ని నైట్ షిఫ్టులలో ఆశించలేమని మహిళలు అన్నారు.⇒ వీధి లైట్లు లేకపోవటం, సరిగా లేని ప్రజా రవాణా వ్యవస్థ కూడా రాత్రివేళ మహిళలకు భద్రత లేకపోవటానికి కారణమని వారు తెలిపారు.దేశంలోని 31 నగరాల్లో 12,770 మంది మహిళల అభిప్రాయాలు సేకరించి జాతీయ మహిళా కమిషన్ ‘నారీ 2025 వార్షిక నివేదిక, భద్రతా సూచిక’ రూపొందించింది. సర్వేలో దాదాపు 60 శాతం మంది మహిళలు తమ నగరాల్లో తాము సురక్షితంగా ఉన్నట్లు చెప్పగా, 40 శాతం మంది అంత సురక్షితంగా లేమని లేదా సురక్షితంగా అస్సలు లేమని భావిస్తున్నట్లు తెలిపారు.యువతులలోని భయాందోళనలు గత ఏడాది కంటే పెరగటాన్ని కూడా నివేదిక గుర్తించింది. 2024లో సర్వేలో పాల్గొన్న మహిళల్లో 7 శాతం మంది బహిరంగ వేధింపులను గురయ్యామని చెప్పగా, 24 ఏళ్లలోపు యువతుల్లో ఇలా చెప్పిన వారి సంఖ్య గరిష్ఠంగా 14 శాతంగా ఉంది. ముఖ్యంగా చదువుకునే అమ్మాయిలు, ఉద్యోగినులైన యువ నిపుణులు, సామాజిక వేడుకల్లో పాలుపంచుకున్న మహిళలు వేధింపులకు గురైనట్లు సర్వే పేర్కొంది.ముగ్గురిలో ఒక్కరే ఫిర్యాదు!ఫిర్యాదు ఇస్తే న్యాయం జరుగుతుందన్న ఆశ బాధిత మహిళల్లో చాలా తక్కువగా ఉందని నివేదిక తెలిపింది. సర్వే ప్రకారం, వేధింపులకు గురైన ముగ్గురిలో ఒకరు మా త్రమే ఫిర్యాదు చేశారు. 75 శాతం మహిళలు.. తమ ఫిర్యాదులను అధికారులు పరిష్కరిస్తారని నమ్మటం లేదు. వేధింపులు, ఇతర ఘటనల్లో 22 శాతం వరకే కేసులు నమోదు కాగా, వాటిల్లో పరిష్కారం అయినవి కేవలం 16 శాతం మాత్రమే. వ్యవస్థపై అపనమ్మకం, బాధితుల మౌనం ఏ స్థాయిలో ఉన్నాయో ఈ లెక్కలు చెబుతున్నాయి. వేధింపు ఘటనల్లో 32 శాతం.. తెలిసిన ప్రాంతాలలో జరుగుతుండగా, 29 శాతం ప్రయాణ సమయాలలో సంభవిస్తున్నాయని నివేదిక తెలిపింది.కోహిమాలో సురక్షితంనగరాల వారీ భద్రతా అసమానతలను కూడా నివేదిక పొందుపరిచింది. కోహిమా, విశాఖపట్నం, భువనేశ్వర్.. భద్రతా సూచికలో అగ్రస్థానంలో ఉన్నాయి, తరువాత ఐజ్వాల్, గ్యాంగ్టక్, ఇటానగర్ ముంబై ఉన్నాయి. ఇందుకు భిన్నంగా పట్నా, జైపుర్, ఫరీదాబాద్, ఢిల్లీ, కోల్కతా, శ్రీనగర్, రాంచీ మరీ దిగువ స్థానాల్లో ఉన్నాయి. రాంచీ అంత సురక్షితమైనది కాదని 44 శాతం మంది మహిళలు భావిస్తుండగా, ఢిల్లీ ఫరీదాబాద్లలో ఈ శాతం దాదాపు 42గా ఉంది. దేశంలోని మహిళల భద్రతను పట్టణ పరిస్థితులు, అక్కడి పాలనా యంత్రాంగం పనితీరు ప్రభావితం చేస్తున్నట్లు ‘నారీ 2025’ తేల్చి చెప్పింది. పనిచేసే చోట భద్రమేపని చేసే చోట భద్రత గురించి 91 శాతం మంది మహిళలు.. కార్యాలయంలోని వాతావరణం సురక్షితంగా ఉందని తెలిపారు. అయితే వారిలో దాదాపు సగం మంది, తమ సంస్థ తప్పనిసరి ‘లైంగిక వేధింపుల నివారణ’ (పి.ఓ.ఎస్.హెచ్. – ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్) యంత్రాంగాన్ని అమలు చేస్తోందో లేదో తమకు తెలియదని చెప్పారు.వేధింపులు⇒ బహిరంగ వేధింపులకు గురయ్యామని చెప్పిన మహిళలు 7 శాతం. 24 ఏళ్లలోపు యువతుల్లో ఇది 14 శాతం.⇒ వేధింపు ఘటనల్లో 32 శాతం తెలిసిన ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి. ⇒ ముఖ్యంగా 38% ఇరుగు పొరుగు వారి వల్లే జరుగుతున్నాయి.⇒ 29 శాతం ప్రయాణాల సమయాలలో సంభవిస్తున్నాయి.⇒ వేధింపుల్లో మాటలతో అత్యధికంగా 58 శాతం చోటు చేసుకుంటున్నాయి.⇒ వేధింపులకు గురైనవారిలో ప్రతి ముగ్గురిలో కేవలం ఒక్కరే ఫిర్యాదు చేస్తున్నారు. -
మహిళా పాఠకులు చదవాల్సిన 20 పుస్తకాలు
స్త్రీలు రాసిన పుస్తకాలు, స్త్రీల గురించిన పుస్తకాలు చదవడం అంటే కొత్త మైదానాల్లోకి అడుగు వేయడమే. సాహిత్యం వికాసాన్ని, వివేచనను ఇస్తుంది. ఇంటిలోని మహిళ పుస్తక పఠనం మొదలెడితే ఇంటిల్లిపాది పాఠకులు అవుతారు. ‘సాక్షి’ పాఠకుల కోసం ప్రత్యేకంగా ప్రతి మహిళ కనీసం చదివి ఉండాల్సిన 20 పుస్తకాలు ఇక్కడ ఇస్తున్నాం. ఇలా ఎంపిక చేయదగ్గవి తెలుగు నుంచి మరో వందైనా ఉన్నాయి. ఈ ఎంపికలో నచ్చినవి తీసుకొని చదవండి.1. సచ్చరిత్ర– బండారు అచ్చమాంబతొలి తెలుగు కథకురాలు బండారు అచ్చమాంబ జీవిత్రచరిత్ర ఇది. గురజాడ అ΄్పారావు కన్నా ముందే ‘ధనత్రయోదశి’ కథ రాసి తెలుగు కథకు బాటలు వేశారు. ‘సచ్చరిత్ర’ తప్పక చదవదగ్గది.2. మావూరి ముచ్చట్లు– పాకాల యశోదారెడ్డితెలంగాణ ప్రాంతం నుంచి మాండలిక సౌందర్యంతో కథలు రాసిన రచయిత్రి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు.3. నా ఇంగ్లండు యాత్ర– పోతం జానకమ్మజానకమ్మ అనే తెలుగింటి ఆడపడుచు 1873లో ఓడలో చేసిన ఇంగ్లండు ప్రయాణ విశేషాలను, ఆనాటి సామాజిక పరిస్థితులను పుస్తక రూపంలో రాశారు. 1876లో ఈ పుస్తకం వెలువడింది.4. శారద లేఖలు– కనుపర్తి వరలక్ష్మమ్మ సాహితీవేత్తగా ప్రసిద్ధి చెందిన వరలక్ష్మమ్మ 1929 నుంచి 1934 వరకు ‘గృహలక్ష్మి’ మాసపత్రికలో రాసిన శారద లేఖలు ప్రసిద్ధి పొందాయి. దురాచారాలను ఖండిస్తూ, స్త్రీల అభ్యున్నతి కాంక్షించేలా నడిచే ఈ లేఖలు అనేక అంశాల గురించి చర్చిస్తాయి.5. స్త్రీ(నవల)– గుడిపాటి వెంకటాచలంస్త్రీవాదాన్ని బలపరుస్తూ ప్రసిద్ధ రచయిత గుడిపాటి వెంకటాచలం 1925లో రాసిన నవల. స్త్రీలు ఏ అడ్డూ లేకుండా స్వేచ్ఛగా జీవించాలన్న తృష్ణకు ఈ నవల నేపథ్యం.6. జానకి విముక్తి (నవల)– రంగనాయకమ్మ స్త్రీలలో రావాల్సిన మార్పులను, వారు సాధించాల్సిన అభ్యున్నతిని కాంక్షిస్తూ రాసిన నవల ఇది. ‘జానకి’ అనే పాత్ర జీవితంలో జరిగిన అనుభవాలను వివరంగా తెలుపుతుంది ఈ పుస్తకం.7. కాలాతీత వ్యక్తులు (నవల) – పి.శ్రీదేవితెలుగు సాహిత్యంలో పేరెన్నికగన్న నవల. పురుషాధిక్యతను నిరసిస్తూ, స్త్రీలు స్వతంత్రంగా ఎదగాలన్న కాంక్షను కనబరుస్తూ సాగే పాత్రలు ఇందులో కనిపిస్తాయి.8. నాలో నేను (ఆత్మకథ) – భానుమతీ నటి, దర్శకురాలు, రచయిత్రి, గాయని, సంగీతకారిణి అయిన భానుమతీ రామకృష్ణ ఆత్మకథ ఈ పుస్తకం. సామాన్య కుటుంబంలో జన్మించిన ఆమె, అంచెలంచెలుగా ఎదిగిన తీరు ఈ పుస్తకంలో చదవొచ్చు.9. గోరాతో నా జీవితం– సరస్వతి గోరాప్రముఖ హేతువాద ఉద్యమకారుడు గోరా సతీమణి సరస్వతి రాసిన ఆత్మకథ ఈ పుస్తకం. సామాన్య గృహిణిగా ఉన్న ఆమె గోరా సాహచర్యంతో హేతువాదిగా ఎదిగిన క్రమాన్ని ఇందులో పొందుపరిచారు.10. రాజకీయ కథలు– ఓల్గాస్త్రీల జీవితాల్లోని విభిన్న పార్శా్వలను, వాటి చుట్టూ అల్లుకున్న రాజకీయాలను పొందుపరిచిన కథలివి. స్త్రీ వాదానికి బలమైన దన్నుగా నిలిచిన కథలు.11. ఇల్లాలి ముచ్చట్లు– పురాణం సుబ్రహ్మణ్య శర్మవారపత్రికలో ప్రచురితమైన ఈ ఇల్లాలి ముచ్చట్లు తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానాన్ని పొందాయి. రోజువారీ సంఘటనలు మొదలుకొని, అంతర్జాతీయ అంశాల దాకా అన్నింటి పట్ల సగటు ఇల్లాలి స్పందన ఇది. హాస్యం, వ్యంగ్యం, సామాజిక అవగాహన కలగలిసిన ముచ్చట్లు.12. రాయక్క మాన్యం (కథలు)– తెలంగాణలోని దళిత జీవన నేపథ్యాన్ని, స్థితిగతులను యథాతథంగా చిత్రించిన కథలివి. దళిత స్త్రీల జీవనపోరాటాన్ని ఈ కథల్లో చూడొచ్చు.13. నల్లపొద్దు– సంపాదకురాలు: దళిత స్త్రీలు రచించిన సాహిత్యాన్ని తొలిసారిగా పుస్తక రూపంలోకి తీసుకొచ్చి అందించిన పుస్తకం. ఈ రచనల్లో అస్తిత్వ ఘర్షణ, నిరంతర పోరాట స్ఫూర్తి కన్పిస్తాయి. 14. నీలి మేఘాలు (స్త్రీవాద కవిత్వం)తెలుగు స్త్రీవాద సాహిత్యంలో కీలకమైన కవిత్వ సంపుటి. స్త్రీల సమస్యలు, వారి అంతరంగాలు, అభ్యంతరాలకు బలమైన వ్యక్తీకరణతో కవిత్వరూపం ఇక్కడ కనిపిస్తుంది.15. నిర్జనవారధి (ఆత్మకథ)– కొండపల్లి కోటేశ్వరమ్మ కమ్యూనిస్టు ఉద్యమకారిణి కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ. 92 ఏళ్ల వయసులో ఆమె రాసిన ఈ పుస్తకం తెలుగు రాష్ట్రాల్లోని అనేక పరిణామాలను వివరిస్తుంది.16. ఆధునిక భారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు: ఫాతిమా షేక్భారతదేశ తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు, సామాజిక సంస్కర్త, జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల సహోద్యోగి ఫాతిమా షేక్. ఆమె జీవిత చరిత్ర తప్పక తెలుసుకోవాల్సినది. రచన: నసీర్ అహ్మద్.17. చదువు తీర్చిన జీవితం (ఆత్మకథ)– కాళ్లకూరి శేషమ్మమెట్టు మెట్టు ఎక్కిన ఒక సామాన్య మహిళ ఆత్మకథ ఈ పుస్తకం. క్రమశిక్షణ, సంయమనంతో తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్న కాళ్లకూరి శేషమ్మ ఏడు దశాబ్దాల అనుభవసారం స్ఫూర్తిదాయకమైనది.18. నా మాటే తుపాకీ తూటా (ఆత్మకథ)తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని, ఆపై ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కమ్యూనిస్టు నేత మల్లు స్వరాజ్యం జీవితాన్ని గ్రంథస్తం చేసిన పుస్తకం ఇది. 19. కుప్పిలి పద్మ కథలుఆధునిక స్త్రీల జీవనంలో వస్తున్న మార్పులు, యువతీయువకుల జీవితపు ఆకాంక్షలను ఒడిసిపట్టిన కథలివి. కథలను కవితాత్మకంగా చిత్రించటం కుప్పిలి పద్మ రచనల ప్రత్యేకత.20. ఎదారి బతుకులు(కథలు)– ఎండపల్లి భారతిబడుగుజీవుల జీవన క్రమాన్ని, వారి సంతోషాలను, సరదాలను, బాధలనూ ఒకచోట చేర్చిన కథలివి. పల్లెవాసుల జీవనాన్ని యథాతథంగా చిత్రించి అందించారు రచయిత్రి ఎండపల్లి భారతి. -
వర్కింగ్ మదర్.. ఎంతో ప్రెజర్!
ఒక భానుతేజ...‘మెటర్నిటీ లీవ్ తర్వాత పాలు తాగే పాపను ఇంట్లో వదిలి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫీస్కి వెళ్తుంటే అనుభవించిన బాధ ఎవరికీ అర్థంకాదు. లిఫ్ట్దాకా పాపను ఎత్తుకుని లిఫ్ట్ లోకి ఎక్కుతున్న ప్పుడు పాపను అత్తయ్య తీసుకుంటుంటే అది నా చున్నీ పట్టుకుని వెళ్లకుండా మొండికేస్తుంటే ఏడుపొ చ్చేది. బలవంతంగా పాపను అత్తయ్య చేతిలో పెట్టి వచ్చేసేదాన్ని’ అంటూ గుర్తుచేసుకుంది భానుతేజ. ఆమె ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఇప్పుడు ఆమె కూతురికి మూడేళ్లు. ఆ పాపను డే కేర్ సెంటర్లో చేర్చింది. అయినా భానుతేజ బాధ, భయం పోలేదు. ఉదయం తొమ్మిదింటికి తాను ఆఫీస్కి వెళ్లేప్పుడు పాపను డే కేర్లో దింపితే.. సాయంత్రం ఏడింటికి తాను ఇంటికి వస్తూ పాపను తీసుకెళ్తుంది. పాపకు కావల్సిన పాలు, భోజనం, స్నాక్స్, డైపర్స్ అన్నీ ఇస్తుంది. అయినా ఏదో తెలియని ఆందోళన. ఆఫీసులో ఉన్నా పాప గురించే ఆలోచన!ఏ ఉద్యోగికైనా నిర్దిష్టమైన పనిగంటలు ఉంటాయి. అలాంటి వెసులుబాటు లేని అలుపెరుగని సేవ అమ్మది! ఆమె ఉద్యోగి కూడా అయితే.. ఆకష్టం మామూలుది కాదు! ఇల్లు, పిల్లలు, కెరీర్.. వీటన్నింటితో వర్కింగ్ మదర్స్ నలిగిపోతుంటారు. మరి, అలాంటి మహిళలకు పరిష్కారం ఏమిటి? కుటుంబం.. ముఖ్యంగా భర్తలు లేదా ఇంట్లోని మగవాళ్లు వాళ్లకు చేదోడుగా ఎలా ఉండొచ్చు?ఎన్నో ఆశలు.. ఆశయాలతో చదువులు చదివి, ఉద్యోగాలు చేసే అతివలు కొందరు. తమకు నచ్చిన లేదా ప్రావీణ్యం ఉన్న పనిని చేయాలన్న లక్ష్యంతో కెరీర్ ఎంచుకునే మహిళామణులు మరికొందరు. రోజురోజుకీ ఖర్చులు పెరిగిపోతున్న నేపథ్యంలో.. వేణ్నీళ్లకు చన్నీల్లలా ఇంటి బండి నడవడానికి సాయపడదామని ఏదో ఒక పనిచేసే పడతులు ఇంకొందరు. వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలు, బ్యాంకు ఉద్యోగులు, టీచర్లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు.. ఇలా విభిన్న రంగాల్లో ఇంటా బయటా రెండు అవతారాలు ఎత్తి పనిచేసే మహిళలు ఎందరో.శత సహస్రావధానంఅమ్మాయిల చదువు, ఉద్యోగాల విషయంలో ఇంటి నుంచి ఎంత ప్రోత్సాహం దొరుకుతున్నా.. పిల్లలు పుట్టగానే ‘పిల్లలా.. కెరీరా?’ అనే డైలమా. రెండిట్లో ఏదో ఒకదాన్నే ఎంచుకోవాల్సిన పరిస్థితి. మొండిగా రెండిటినీ ఎంచుకుంటే.. ఇంటా బయటా చాలా సందర్భాల్లో మద్దతు లేమి లాంటి ఒత్తిళ్లు! ‘కానీ, మగవాళ్ల విషయంలో అలా కాదు. భార్య ఉద్యోగం ఎంత గొప్పదైనా.. ఆమె తనకన్నా రెట్టింపు జీతం తీసుకుంటున్నా సరే.. పిల్లల కోసం కొలువుకి సంబంధించి నో కాంప్రమైజ్. వర్కింగ్ మదర్కి మాత్రం సర్దుబాట్లు తప్పవు’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహిళలు. ఇలా ఇల్లు, పిల్లలు, ఉద్యోగం మధ్య సమన్వయ మనే అష్టావధానం.. కాదు కాదు, శత సహస్రావధానం, ఒక్క భానుతేజదే కాదు.. కడుపులో చల్ల కదలకుండా చేసుకునే టీచర్ ఉద్యోగం నుంచి 24/7 ఆన్టాస్క్ ఉండే ఆంత్రొ ప్రెన్యూర్ వరకు వర్కింగ్ మదర్స్ అందరిదీ!పోనీ పిల్లల్ని వాయిదా వేసుకుంటే..ఇదివరకటిలా పిల్లల కోసం ఇప్పుడు బయ లాజికల్ క్లాక్ను ఫాలో కావాల్సిన అవసరం లేదు. ఎగ్ ఫ్రీజింగ్, ఆంబ్రియో ఫ్రీజింగ్, సరోగసీ లాంటి.. సౌకర్యాలు ఎన్నో ఉన్నాయి. ఆ సహాయంతో కెరీర్లోనే కాదు.. ఆర్థికంగానే స్థిరపడ్డాకే పిల్లల్ని కనే వెసులుబాటు ఉంది. కానీ ఆ ప్రక్రియల్లో సక్సెస్ రేట్ లెక్కేసుకోవాలి. అంతవరకు, జీవనశైలి జబ్బులు రాకుండా జాగ్రత్త పడాలి. ‘ఆ తలనొప్పి కంటే.. వయసులో పిల్లలను కనడమే బెటర్’ అంటున్నారు చాలామంది వర్కింగ్ ఉమన్.మరి పరిష్కారం?వర్కింగ్ మదర్స్కి ఇటు ఉద్యోగం.. అటు పిల్లల పెంపకం మధ్య నలగకుండా.. అపరాధ భావానికి గురవకుండా రెండిటినీ వీలయినంత వరకు సమన్వ యం చేసుకోగల సహకారం కావాలి. ⇒ నెలల వయసు నుంచి స్కూల్ ఈడు వచ్చేవరకు పిల్లల సంరక్షణ కోసం అన్ని సంస్థలు క్రషెస్, డే కేర్ సెంటర్స్ను ఏర్పాటు చేయాలి. దీనివల్ల వర్కింగ్ మదర్స్కు మాన సిక ప్రశాంతత, రిలీఫ్ ఉండటమే కాక పిల్లల కోసం సెలవులు, ముందస్తు అనుమ తులు లాంటి పనివేళల వృథా తగ్గుతుంది అంటున్నారు భిన్నరంగాల్లోని వర్కింగ్ మదర్స్. ⇒ చాలా సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఇలాంటి కన్వీనియెన్స్ ఉన్నప్పటికీ ప్రభుత్వ సంస్థలు సహా మిగిలిన అన్ని రంగాల్లోనూ ఏర్పాటైతే బాగుంటుందనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.‘మగాళ్లూ.. కాస్త ఆలోచించండి’⇒ ‘ఉద్యోగం పురుష లక్షణమే. కానీ, మారుతున్న పరిస్థితుల్లో ఉద్యోగాలు చేస్తున్న మమ్మల్ని కూడా గుర్తించండి, గౌరవించండి’ అని కోరుతున్నారు మహిళలు.⇒ ‘చిన్నచూపు చూడటం, సూటిపోటి మాటలు లేకపోతే మా పని మేం హాయిగా చేసుకుంటాం. కుటుంబంలోనూ సంతోషం వెల్లివిరుస్తుంది’ అంటున్నారు.⇒ ‘పిల్లల చదువులు, ఇంటి పనులు, తమపై ఆధారపడినవారు ఉంటే వారి కష్టసుఖాలు, సింగిల్ మదర్ అయితే అదనపు బాధ్యతలు.. ఇలా పది చేతులున్నా సరిపోనన్ని పనులు. మీరు ఇవన్నీ అర్థం చేసుకుంటే మాకు పదివేలు’ అని కోరుతున్నారు. -
సివిల్స్పై సర్వే తప్పనిసరి!
(మహేశ్వర్ పెరి, ఫౌండర్ చైర్మన్ కెరీర్స్ 360) : దేశంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ పరీక్షలను ‘మదర్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్స్’గా భావిస్తారు. సివిల్ సర్వీస్ పరీక్షల ద్వారానే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్), ఇండియన్ ఫారెన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్), తదితర సర్వీసుల్లో పోస్టులను భర్తీ చేస్తారు. దేశంలోనే అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లక్ష్యంగా ఏటా లక్షలాది మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఏటా దాదాపు వెయ్యి ఖాళీలు మాత్రమే అందుబాటులో ఉంటున్నా సుమారు 11 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అంతటి పోటీపరీక్షలో నెగ్గాలంటే పట్టుదల, అకుంఠిత దీక్ష, కఠోర శ్రమ, జనరల్ స్టడీస్, సంబంధిత సబ్జెక్టులపైన పట్టు తప్పనిసరి. చాలా తక్కువ సక్సెస్ రేటు మాత్రమే ఉన్న ఈ పరీక్షల్లో విజయం కోసం ఏళ్ల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. మొదటి ప్రయత్నంలోనే ఏదో ఒక సర్వీసును దక్కించుకుంటున్నవారు కేవలం 7 శాతం మాత్రమే ఉంటున్నారు. మిగతా 93 శాతం మందికి ఒకటి కంటే ఎక్కువ ప్రయత్నాలు అవసరమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సుదీర్ఘ కాలం కొనసాగే ఈ పరీక్షల ప్రిపరేషన్ యువతపై అధిక భారాన్ని మోపుతూ వారు నేర్చుకునే సామర్థ్యాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ‘యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమయ్యే లక్షలాది మంది యువత కృషి, సమయం వృథా అవుతోంది. వారిపై ఒత్తిడి, వ్యయప్రయాసలు పెరుగుతున్నాయి. ఏళ్ల తరబడి సుదీర్ఘ ప్రిపరేషన్ యువత నేర్చుకునే సామర్థ్యాన్ని, వారి విమర్శనాత్మక ఆలోచనను హరించివేసే ప్రమాదముంది. దరఖాస్తులు పెరుగుతున్నప్పటికీ ఆ మేర పెరగని ఖాళీలు యూపీఎస్సీని ప్రెషర్ కుక్కర్గా మార్చాయి. అంతిమంగా ఈ స్థితి కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు లాభం చేకూర్చుతోంది. యూపీఎస్సీ పరీక్ష విధానంపై దేశవ్యాప్తంగా తప్పనిసరిగా చర్చ జరగాలి. దేశంలో యువతతోపాటు అన్ని వైపుల నుంచి అభిప్రాయాలు స్వీకరించాలి. దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించాలి’ అని నిపుణులు, విద్యావేత్తలు కోరుతున్నారు.ఖాళీలు కొన్నే.. అభ్యర్థులు లక్షల్లో..ఐఏఎస్, ఐపీఎస్ తదితర సర్వీసుల్లో చేరి ప్రజాసేవ చేయాలనుకునే అభ్యర్థులు సివిల్స్ను ఒకప్పుడు కఠినమైన పరీక్షగా భావించేవారు. కానీ ఇప్పుడు ఈ పరీక్షలు యుద్ధాన్ని తలపిస్తున్నాయి. కేవలం కొన్ని ఖాళీల కోసం ఏటా లక్షలాది మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 2000 సంవత్సరంలో ఒక్కో ఖాళీకి 365 మంది పోటీపడేవారు. ఇటీవల ఈ పోటీ మరింత అధికమైంది. 2020–23 మధ్య ఏటా దాదాపు 11.3 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఖాళీలు మాత్రం ఏటా దాదాపు వెయ్యి మాత్రమే ఉన్నాయి. చాలా తక్కువ విజయశాతం అత్యంత కఠినమైన పరీక్ష అయిన యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు విజయం కోసం కొన్నేళ్లపాటు వేచిఉండాల్సి వస్తోంది. 2013కు ముందు ప్రతి 365 మంది అభ్యర్థులకు ఒకరిగా ఉన్న సక్సెస్ రేటు ఆ తర్వాత ప్రతి 1,215 మంది అభ్యర్థులకు ఒకరికి పడిపోయింది. అంటే.. సివిల్స్ సర్వీస్ పరీక్షల్లో విజయ శాతం 0.1%, వైఫల్య శాతం 99.9%. ఇదంతా ఒక దశాబ్దంలో జరిగింది. సుదీర్ఘ ప్రిపరేషన్..సివిల్స్ పరీక్షల్లో ప్రయత్నాల పెంపు అభ్యర్థులకు మేలు చేయడానికి బదులుగా వారిని సుదీర్ఘ కాలం పాటు పరీక్షల ప్రిపరేషన్కే పరిమితమయ్యేలా చేసింది. 2014కు ముందు చాలామంది 2 లేదా 3వ ప్రయత్నంలోనే యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణులయ్యేవారు. ప్రయత్నాల సంఖ్య పెంచాక ఈ సగటు 3–4కు పెరిగింది. సివిల్స్లో విజయం సాధించడానికి 93% మంది విద్యార్థులు ఒకటి కంటే ఎక్కువ ప్రయత్నాలు తీసుకుంటుండటం గమనార్హం. తొలి ప్రయత్నంలో విజయం సాధించేవారు 7 శాతమే ఉంటున్నారు. అభ్యర్థులు తమ తొలి ప్రయత్నానికి ముందు రెండేళ్ల ప్రిపరేషన్ కాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే.. ఈ పరీక్షల కోసం అభ్యర్థులు ఆరేళ్లకు పైగా తమ విలువైన సమయాన్ని కేటాయించాల్సి వస్తోంది. దీంతో సివిల్స్ ప్రతిభ పరీక్షగా కంటే ఓర్పు పరీక్షగా మారిందని చెప్పొచ్చు. అభ్యర్థులు ఎంత ఎక్కువ సమయం, డబ్బు, మానసిక బలాన్ని పెట్టుబడిగా పెట్టగలిగితేనే పరీక్షలో అంతగా అవకాశాలు మెరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. టాప్ ర్యాంకర్లు సైతం..సివిల్స్లో టాప్ ర్యాంకర్లు సైతం 3 నుంచి 5 ప్రయత్నాల్లోనే విజయాన్ని అందుకుంటున్నారు. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించాలనేది చాలామందికి కలగానే మిగులుతోంది. 2024లో టాపర్గా నిలిచిన శక్తి దూబే మొదటి మూడు ప్రయత్నాల్లో ప్రిలిమ్స్ను కూడా దాటలేకపోయింది. నాలుగో ప్రయత్నంలో మెయిన్స్ దాటినా ఇంటర్వూ్యలో విఫలమైంది. 5వ ప్రయత్నంలో ఆమె టాపర్గా నిలిచి సత్తా చాటింది. ఆమె 2018 నుంచి సివిల్స్కు సిద్ధమైతే 2025లో ఐఏఎస్ అధికారిణి అయ్యారు. అంటే.. శక్తి దూబేకు ఐఏఎస్ అధికారిణి కావడానికి ఏకంగా ఏడేళ్లు పట్టింది. అలాగే 2024లో రెండో ర్యాంకు సాధించిన హర్షిత గోయల్ 3 ప్రయత్నాల్లో, మూడో ర్యాంకు సాధించిన డోంగ్రే అర్చిత్ పరాగ్ 2, నాలుగో ర్యాంకు సాధించిన షా మార్గి చిరాగ్ 5, ఐదో ర్యాంకు సాధించిన ఆకాశ్ గార్గ్ 2, ఆరో ర్యాంకు సాధించిన కోమల్ పునియా 3, ఏడో ర్యాంకు సాధించిన ఆయుషి బన్సాల్ 3, ఎనిమిదో ర్యాంకు సాధించిన రాజ్ కృష్ణ ఝా 5, తొమ్మిదో ర్యాంకు సాధించిన ఆదిత్య విక్రమ్ అగర్వాల్ 5, పదో ర్యాంకు సాధించిన మయాంక్ త్రిపాఠి 3 ప్రయత్నాల్లో విజయం సాధించారు. అంటే.. టాప్ పది మందిలో 8 మంది సివిల్స్ సాధించడానికి 3–5 ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. మొత్తం మీద దాదాపు 93% మంది విజయవంతమైన అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువసార్లు సివిల్స్ కోసం ప్రయత్నించారు. తొలిసారి పరీక్షలకు హాజరైనవారిలో దాదాపు 7% మంది మాత్రమే విజయం సాధిస్తున్నారు. పునఃపరిశీలించాల్సిన సమయం ఆసన్నమైందా? ఏమీ నేర్చుకోకుండా పరీక్షకు సిద్ధమవుతున్న వారి ప్రాథమిక సంవత్సరాలను వృథా చేసుకోకుండా ఉండటానికి సివిల్స్ ప్రయత్నాల సంఖ్య, గరిష్ట వయసును పునఃపరిశీలించాల్సిన సమయం ఆసన్నమైందా? 6వ ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థి మొదటి ప్రయత్నంలోనే ఫెయిలైన అభ్యర్థి కంటే మెరుగైనవాడా? మనం మెరిట్ను ఎలా అంచనా వేస్తాం? ప్రయత్నాలు, తీసుకున్న సంవత్సరాల ఆధారంగా విజయానికి వెయిటేజ్ ఇవ్వబడిందా?.. వీటిపైన దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించాలి. పరీక్ష విధానం మార్పుతో మలుపుయూపీఎస్సీ చరిత్రలో 2013 ఒక ప్రధాన మలుపుగా నిలిచింది. ఆ ఏడాది పరీక్షకు కొన్ని నెలల ముందు యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ పరీక్ష విధానాన్ని మార్చింది. జనరల్ స్టడీస్ పేపర్లను పెంచి వెయిటేజీలో మార్పులు తెచ్చింది. దీంతో ఏళ్ల తరబడి పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఆందోళనలు చేశారు. అదనపు ప్రయత్నాలు, వయోపరిమితి సడలింపు రూపంలో ఉపశమనం కోరుతూ దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేశారు. దాంతో ప్రభుత్వం 2014 నుంచి పరీక్షలకు సన్నద్ధమయ్యేవారికి మరో రెండు అటెంప్ట్స్ అదనంగా అవకాశం కల్పించింది. -
యంత్రుడి చేతుల్లోకి మనిషి! డెడ్ ఇంటర్నెట్ థియరీ నిజమే!!
‘‘ఓ మర మనిషి మా లోకి రా..’’ అంటూ పిలిచిన మనిషి.. ఇప్పుడు పూర్తిగా దాని చెప్పుచేతల్లోకి వెళ్లిపోయాడా? ఇంటర్నెట్ అనేది మనిషి చేజారి పోయిందా?.. ఇప్పుడది పూర్తిగా బాట్ల నియంత్రణలో నడుస్తోందా?.. ఈ అర్థం వచ్చేలా ఓపెన్ఏఐ సీఈవో ఆల్ట్మన్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా కలకలం రేగింది. తద్వారా Dead Internet Theory కి బలమైన మద్దతు చేకూరినట్లైంది. ఇంతకీ ఈ థియరీ ఏంటి?.. చాట్జీపీటీ లాంటి ఏఐ చాట్బాట్ను రూపొందించిన వ్యక్తి ఇలా మాట్లాడడం వెనుక ఆంతర్యం ఏంటి? పరిశీలిస్తే.. ఇంటర్నెట్లో మనం చూస్తోంది నిజంగా మనుషులనేనా?.. కొన్ని పోస్టులు చేసేది.. ఇతరుల పోస్ట్లకు కామెంటలు చేసేది.. లైకులు, షేర్లు ఇదంతా మనుషులు చేస్తున్నదేనా?.. లేదంటే అప్పుడెప్పుడో చర్చ జరిగినట్లు.. కృత్రిమ మేధస్సు చేస్తోందా?. ఇప్పటివరకు ఇది కేవలం ఊహగా కనిపించినా.. తాజాగా OpenAI CEO సామ్ ఆల్ట్మన్ చేసిన వ్యాఖ్యలతో ‘Dead Internet Theory’ అనే సిద్ధాంతం వాస్తవానికి దగ్గరగా ఉందేమో అనే అనుమానాలు బలపడ్డాయి. ChatGPT వంటి శక్తివంతమైన AI చాట్బాట్ను రూపొందించిన వ్యక్తి.. సామ్ ఆల్ట్మన్. అలాంటి వ్యక్తి తన ఎక్స్ అకౌంట్లో ఓ ఆసక్తికరమై పోస్ట్ చేశారు.. డెడ్ ఇంటర్నెట్ థియరీని ఇంతకాలం నేను అంతగా నమ్మలేదు. కానీ ఇప్పుడు ఎక్స్(పూర్వపు ట్విటర్)ను చూస్తుంటే చాలా LLM-run అకౌంట్లు ఉన్నట్లు అనిపిస్తోంది అని అన్నారు.i never took the dead internet theory that seriously but it seems like there are really a lot of LLM-run twitter accounts now— Sam Altman (@sama) September 3, 2025ఈ వ్యాఖ్య వైరల్ కావడంతో, పలువురు వినియోగదారులు ఆల్ట్మన్ను వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఆ విషయం తమకు ఎప్పుడో తెలుసని ఒకరు.. డెడ్ఇంటర్నెట్కు పునాది వేసింది మీరే కదా? అని మరొకొరు కామెంట్ చేశారు. బ్రేకింగ్.. LLMల సృష్టికర్త, ఇప్పుడు ఎక్స్లో అన్నీ LLMలే అని బాధపడుతున్నాడు ఇంకొకరు సెటైరిక్గా స్పందించారు. మరొకరైతే ఎలాన్ మస్క్తో ఉన్న వైరంతోనే ఇలా మాట్లాడుతున్నారంటూ కామెంట్ చేశారు.. ఇలా ఆల్ట్మన్ను తమకు తోచిన తెగ ఆడేసుకుంటున్నారు.డెడ్ ఇంటర్నెట్ థియరీ అంటే ఏమిటి?డెడ్ ఇంటర్నెట్ థియరీ అనేది ఒక వివాదాస్పదమైన సిద్ధాంతం, ఇది 2021లో "Dead Internet Theory: Most of the Internet is Fake" అనే బ్లాగ్ ద్వారా ప్రజల్లోకి వచ్చింది. దీని ప్రకారం, ఇంటర్నెట్లో ఎక్కువ భాగం నిజమైన మనుషుల ద్వారా కాకుండా.. AI బాట్స్, ఆటోమేటెడ్ స్క్రిప్ట్స్, మరియు LLM-run అకౌంట్ల ద్వారా నడుస్తోందని అంటోంది. అంటే.. Large Language Model (LLM) ఆధారంగా నడిచే సోషల్ మీడియా లేదంటే ఆన్లైన్ అకౌంట్లు. ఇవి నిజమైన వ్యక్తులు నిర్వహించకపోవచ్చు. అర్టిషీషియల్ ఇంటెలిజెన్సీ(AI) మోడల్స్ ద్వారా ఆటోమేటెడ్గా స్పందించేవి, పోస్టులు చేసేవి.. లేదంటే చాట్ చేసేవి అయి ఉండొచ్చు. ఇంటర్నెట్లో మనం చూస్తున్న చాలా అకౌంట్లు, పోస్టులు, కామెంట్లు.. అన్నీ మనుషులు చేసినవి కాదని.. ఏఐ చాట్బాట్లు చేసినవి అర్థం. అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) మోడల్స్, యాంత్రిక వ్యవస్థలు ఇంటర్నెట్ను పూర్తిగా ఆక్రమించేశాయని.. తద్వారా మనం నిజమైన మనుషులతో కాకుండా, యంత్రాలతో సంభాషిస్తున్నాం అనే ఈ థియరీ చెప్పింది. ఒకరకంగా.. The Matrix సినిమా లాంటి వాస్తవికతను మాయగా చూపించే సిద్ధాంతమన్నమాట. దీనికి ఓ ప్రత్యక్ష ఉదాహరణ పరిశీలిస్తే.. సోషల్ఏఐ SocialAI అనేది డెడ్ ఇంటర్నెట్ థియరీకి ఒక ప్రాక్టికల్ ఉదాహరణ. ఇదొక సోషల్ నెట్వర్క్ యాప్. మైఖేల్ సైమన్ అనే టెక్ ప్రాడిజీ దీనిని రూపొందించాడు. ఈ యాప్లో యూజర్లు చాట్ చేస్తారు.. పోస్టులు పెడతారు.. కామెంట్లు చేస్తారు. కానీ twist ఏంటంటే.. అవతల ఉండేది నిజమైన మనిషి కాకపోవచ్చు. SocialAI లో AI బాట్స్ అచ్చం మనుషుల్లాగే స్పందిస్తాయి. చాలా పోస్టులకు వచ్చిన కామెంట్లు, లైక్స్ అన్నీ కృత్రిమంగా రూపొందించబడినవే. అంటే.. అక్కడ ఉండేది మనిషా? బాట్? అనేదానిపై స్పష్టత లేకుండా పోతుంది.అందుకే అంత రీచ్..సోషల్ మీడియాలో లైకులు, షేర్ల కోసం జరిగే పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ క్రమంలో.. 2016 తర్వాత ఇంటర్నెట్లో నిజమైన యూజర్ యాక్టివిటీ తగ్గిపోయిందన్నది Dead Internet Theory థియరీ చెప్పేది. ఎక్కువ కంటెంట్ బాట్స్, AI, ఆటోమేటెడ్ సిస్టమ్లు తయారు చేస్తున్నాయని, ఫోరమ్లు, సోషల్ మీడియా, కామెంట్స్ అన్నీ నిజమైన మనుషుల నుంచి రావడం తగ్గిపోయిందని చెబుతుందీ సిద్ధాంతం. సపోజ్.. సోషల్ మీడియాలో కొన్ని పోస్టులను గమనించండి. ఆ యూజర్కు పెద్ద ఫాలోయింగ్ ఉండడు. కానీ ఉన్నట్లుండి అతను చేసే ఓ పోస్టుకు విపరీతంగా లైకులు, షేర్లు వస్తాయి. అలాగని అందులోవన్నీ జెన్యూన్గా వచ్చినవి అనుకుంటే పొరపాటే. అదంతా యంత్రుడి మాయాజాలం. యూజర్లు వ్యక్తపర్చాల్సిన అభిప్రాయాలు, ఆన్లైన్ అనుభవాలు.. క్రమంగా కృత్రిమంగా ప్రభావితం అవుతూ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఎలాన్ మస్క్ ట్విటర్ను చేజిక్కించుకున్నాక.. కంటెంట్ క్రియేటర్లకు డబ్బు ఇచ్చే విధానం ప్రారంభమైంది. దీంతో AI బాట్ల వినియోగం విపరీతంగా పెరిగింది. ఏఐ ఆధారిత ఇమేజ్లు, పోస్టులు పెరిగిపోయాయి. తద్వారా ఇష్టానుసారం చేస్తున్న పోస్టులతో రీచ్ దక్కుతోంది. నష్టాలేంటంటే.. నిన్నటి దాకా ఇది ఒక conspiracy theory. కానీ, ఇప్పుడది నిజమై ఉంటుందని ఆల్ట్మన్ పోస్ట్తో స్పష్టమవుతోంది. అయితే ఏఐ బాట్లతో ముప్పు ఉందనే సైబర్ విశ్లేషకులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తూ వస్తున్నారు. వాటి మీద ఆధారపడడం వల్ల మనిషి బుర్రకు పదును పెట్టకపోవడంతో.. స్కిల్స్ మరుగున పడిపోతుంది. మానవ సంబంధాల ప్రామాణికత తగ్గిపోతుంది. ఒక్కోసారి వినియోగదారుల మానసిక స్థితిపై ప్రభావం చూపొచ్చు. అంతేకాదు.. నిజమైన సమాచారాన్ని గుర్తించడం కష్టంగా ఉంటోంది. వెరసి సామాజిక మాధ్యమాలు ఒక యాంత్రిక మాయాజాలంగా మారుతున్నాయి.నిన్ను నీవే మర్చిపోయిన వేళ.. నియంత్రణ నీ చేతుల్లో లేదు. సృష్టి నీదే అయినా, ఆట మాత్రం ఇంకెవరో ఆడుతున్నారు.కొసమెరుపు.. ఏఐ బాట్లు, డీప్ఫేక్లు పెరిగిపోయిన కాలంలో.. నిజమైన వాటిని గుర్తించడం కష్టంగా మారుతోంది. అందుకే ఆన్లైన్లో మనుషులు తమను నిరూపించుకోవడానికి ఒక సాంకేతిక పరిష్కారం అవసరమని సామ్ ఆల్ట్మన్ భావించారు. అలా 2023 జులై 24న పుట్టిందే Worldcoin ప్రాజెక్టు(2019లోనే బీజం పడింది). దీని ద్వారా మనిషి ఐరిస్ ఆధారంగా ఇంటర్నెట్ వినియోగం కోసం ఓ యూనిక్ ఐడీ(Proof of Personhood) ఇస్తారు. అప్పుడు అవతల ఉంది మనిషా? లేకుంటే ఏఐ చాట్బాట్ అనేదానిపై స్పష్టత వస్తుంది. ఇందులో మనుషుల గుర్తింపును రక్షించేందుకు బ్లాక్చెయిన్, బయోమెట్రిక్ వెరిఫికేషన్ వంటివి ఉపయోగిస్తారు. వివిధ దేశాలకు చెందిన కోటి 20 లక్షల మంది ఈ ప్రాజెక్టులో భాగం అయ్యారు. ఈ యాప్ ద్వారా 26 లక్షల అకౌంట్లు క్రియేట్ అయ్యాయి. అయితే ఏఐ కాలంలో.. నిజమైన మనిషిని గుర్తించడానికి ఇది ఒక వినూత్న పరిష్కారమే అయినప్పటికీ సవాళ్లు మాత్రం తప్పడం లేదు. అలా వరల్డ్నెట్వర్క్ ప్రాజెక్టు నత్తనడకన ముందుకు సాగుతోంది.:::వెబ్డెస్క్ ప్రత్యేకం -
మీ ఫోన్లో వైరస్ ఉందా?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నెట్తో అనుసంధామైన స్మార్ట్ఫోన్ చేతిలో ఉంటే అరచేతిలో ప్రపంచం ఉన్నట్టే.. అలాగే మన స్మార్ట్ఫోన్లోకి రహస్య నిఘా (హిడెన్ స్పై) యాప్లు ప్రవేశిస్తే మన కదలికలను ఒక వేగు వెంటాడుతున్నట్టే.. అందుకే ‘మీ ఫోన్లో వైరస్ ఉందా..!’అని చెక్ చేసుకోమని చెబుతున్నారు సైబర్ భద్రత నిపుణులు.స్పైవేర్ యాప్ మీ ఫోన్లోకి చొరబడితే అది మీ పూర్తి డేటాను రహస్యంగా సేకరించి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు. స్పైవేర్ యాప్లను గుర్తించడం కూడా కష్టమేనని అంటున్నారు. అవి చూడడానికి సాధారణ గేమింగ్ యాప్ల మాదిరిగా ఐకాన్తో కొన్ని ఉంటాయని, మరికొన్ని మనకు కనిపించకుండానే తెరవెనుక రన్ అవుతుంటాయని చెబుతున్నారు. ప్రధాన అనర్థాలు ఇవీడేటా ట్రాన్స్మిషన్: మీ ఫోన్లోని కీలక సమాచారాన్ని మీ అనుమతి లేకుండా థర్డ్పార్టీకి (హ్యాకర్లు, ప్రకటనదారులు, హానికరమైన సంస్థలకు) ఎప్పటికప్పుడు పంపుతాయి.ఫోన్ పనితీరులోనూ సమస్యలు: స్పైవేర్ చేరిన తర్వాత అది మీ ఫోన్ వేగాన్ని తగ్గించవచ్చు. తరచూ ఫోన్ వేడెక్కడం.. బ్యాటరీ త్వరగా డిశ్చార్జి అవడం జరుగుతుంది. ప్రైవసీ పోతుంది: ఫోన్లోకి వైరస్ చేరితే ఫొటోలు, కాంటాక్ట్ నంబర్లు, ఇతర ఆర్థిక వివరాలు వంటి వ్యక్తిగత డేటా దొంగిలించబడే ప్రమాదం ఉంది. మన వ్యక్తిగత సమాచారం, వీడియోలు.. ఫొటోలతో ఐడెంటిటీ థెఫ్ట్తోపాటు ఆన్లైన్ బ్యాంకు లావాదేవీల సమాచారం తెలిస్తే ఆర్థిక నష్టానికి దారితీయవచ్చు. అనధికార యాక్సెస్: స్పైవేర్ మీ ఫోన్ను అనధికారికంగా యాక్సెస్ చేసే ప్రమాదం ఉంది. మరిన్ని మాల్వేర్లను ఇన్స్టాల్ చేయడానికి, మీ ఫోన్ కెమెరా, మైక్ను యాక్సెస్ చేయడానికి లేదా యాప్లను మార్చటానికి సైబర్నేరగాళ్లకు వీలు కల్పిస్తుంది.ఫోన్ మన కంట్రోల్ తప్పుతుంది: ఫోన్లో యాప్లు వాటంతట అవే తెరవడం లేదా మూసివేయబడడం. మనకు తెలియకుండానే ఇతర నంబర్లకు టెక్స్ట్ మెసేజ్లు పంపడం. వింత పాప్–అప్లు వస్తుండడం మీరు గమనించవచ్చు. ఫోన్లోకి స్పైవేర్, వైరస్లు ఎలా వస్తాయి? అవగాహన లేకుండా చేసే పనులతో మనమే మన ఫోన్లోకి వైరస్లను ఆహ్వానిస్తున్నామని సైబర్ భద్రత నిపుణులు పేర్కొంటున్నారు. కొన్నిసార్లు మనం అనధికారిక మూలాల నుంచి (థర్డ్పార్టీ లింక్ల నుంచి) అనుమానాస్పద యాప్లను డౌన్లోడ్ చేసుకోవడంతో వైరస్ చేరవచ్చు. ఈ– మెయిల్లు, టెక్స్ట్ మెసేజ్లు, వాట్సాప్ మెసేజ్లలోని అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయడం ద్వారా కూడా హిడెన్ యాప్లు మన ఫోన్లలోకి వచ్చే ప్రమాదం ఉందని సైబర్ భద్రత నిపుణులు పేర్కొంటున్నారు. కొన్నిసార్లు సోషల్ మీడియాలోని హానికరమైన లింకులను క్లిక్ చేసినా వైరస్ వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు.ఫోన్ వైరస్ బారిన పడకుండా ఎలా కాపాడుకోవాలి?» గుర్తింపు పొందిన యాంటీవైరస్ సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేసుకుని ఫోన్ను స్కాన్ చేసుకోవాలి.» ఫోన్ను ఎప్పటికప్పడు అప్డేట్ చేయడంతో సెక్యూరిటీ ప్యాచ్అప్లు, నూతన సెక్యూరిటీ అప్డేట్లు వస్తాయి. దీని వల్ల వైరస్లను అడ్డుకోవచ్చు. » మీరు ఉపయోగించని, అనుమానాస్పద యాప్లను వెంటనే అన్ ఇన్స్టాల్ చేయండి» ఏవైనా యాప్లను డౌన్లోడ్ చేసేటప్పుడు గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ వంటి నమ్మదగిన స్టోర్స్ నుంచే యాప్లు డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ రేటింగ్, రివ్యూలు తప్పక పరిశీలించాలి. » టు ఫ్యాక్టర్ అథెంటికేషన్ను వినియోగించాలి. -
పొదుపు.. చేసి చూపించండి!
ఈ తరం పిల్లలు.. చాలా స్పీడు. వాళ్ల జోరుకు తగ్గట్టు తల్లిదండ్రులు వారికి మంచీ చెడూ చెప్పాలి. చెప్పడం కాదు.. తల్లిదండ్రులు స్వయంగా అలా నడుచుకోవాలి. ఎందుకంటే పిల్లలు ముందు అనుసరించేదీ, అనుకరించేదీ పేరెంట్స్నే. డబ్బుల విషయంలో మరీనూ! అందుకే, తల్లిదండ్రులు ముందు ఆర్థిక పాఠాలు నేర్చుకోవాలి.. ఆచరించాలి..వాటిని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి! ఇంతకీ వాటిని ఎలా చెప్పాలి?మాటలకు.. చేతలకు..విచ్చలవిడిగా ఖర్చు చేయకూడదని మీ పిల్లలకు చెప్పి.. మీరు మాత్రం డిస్కౌంట్ సేల్ ఉందని కొనుగోలు చేశారా? ఆర్థిక అత్యవసర సమయంలో ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఏ లోన్ యాప్లోనో లేదా స్నేహితుల దగ్గరో అప్పు చేసేశారా? మీ ఆదాయం ఎంతో పిల్లలకు తెలిసినప్పుడు.. మీరు చేస్తున్న ఖర్చు ఎక్కువన్న విషయాన్ని మీ పిల్లలు గమనించడం లేదనుకుంటే ఎలా?నిత్యం ‘డబ్బు’ గొడవలుభార్యాభర్తలిద్దరూ సంపాదించే వారైతే.. డబ్బు గురించి గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భార్యాభర్తల్లో ఒకరు ఎక్కువగా ఖర్చు చేస్తూ మరొకరు పొదుపుగా ఉండే కుటుంబాలు కూడా ఎన్నో. ఇలాంటి కారణాల వల్ల ప్రతి ఆర్థిక నిర్ణయం గురించి వాదించుకుంటూ, ఇద్దరూ తరచుగా తగాదాలకు దిగుతుంటారు.ఆర్థిక విషయాల దాటవేతచాలామంది భారతీయులు పిల్లలతో డబ్బు గురించి మాట్లాడటం సరికాదని భావిస్తారు. మరీ ముఖ్యంగా ఆర్థిక సమస్యలను పిల్లలకు చెప్పకుండా దాచేస్తారు.పాకెట్ మనీచాలామంది తల్లిదండ్రులు.. ఒక వయసు దాటాక కూడా పిల్లల ప్రతి ఆర్థిక నిర్ణయంలో తలదూరుస్తుంటారు. వారిపై నమ్మకం ఉంచరు. పిల్లలకు పాకెట్ మనీ ఇవ్వడానికి ఇష్టపడరు. ఒకవేళ ఇచ్చినా.. దాని గురించి సవాలక్ష ప్రశ్నలు, ఎలా ఖర్చు చేశారంటూ విచారణలు!మీ తరం.. ఈ తరం..మీ తల్లిదండ్రుల తరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ భిన్నంగా ఉంది. తరాలు మారుతున్నా.. ఆర్థిక వ్యవస్థ మారుతున్నా.. అది గుర్తించకుండా ఇప్పటికీ చాలామంది తల్లిదండ్రులు పాత పాఠాలే చెప్తుంటారు.పిల్లలపై ప్రభావం ?మీ మాటలకు, చేతలకు పొంతన లేకపోతే ఆర్థిక విషయాల్లో పిల్లలకు గందరగోళం ఏర్పడుతుంది. మీరు ఎక్కువ వడ్డీలకు అప్పులు చేసి, ప్రతినెలా వాటికే మీ జీతంలో ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తున్నారని వారికి తెలిస్తే వారిలో ఆర్థిక క్రమశిక్షణ తప్పిపోతుంది. మీరు చెప్పే మాటలను పిల్లలు నమ్మకపోవచ్చు.⇒ తల్లిదండ్రుల గొడవల వల్ల పిల్లల్లో డబ్బు గురించి ఆందోళన, ఒత్తిడి పెరుగుతాయి. ఆర్థిక విషయాలంటే పిల్లల దృష్టిలో.. గొడవలకు దారితీసేవిగా మారిపోవచ్చు. దీంతో డబ్బు గురించి చర్చ అంటేనే భయపడవచ్చు.⇒ దీనివల్ల పిల్లలకు డబ్బు గురించి అవగాహన లేకుండా పోతుంది. డబ్బు గురించి ఏమీ తెలియకపోవడం వల్ల.. దాని గురించి మాట్లాడాలంటేనే సిగ్గు, ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఆర్థిక లావాదేవీలు చేయాలన్న ఆలోచనలు పెరుగుతాయి.⇒ ఇది మంచి–చెడు గురించి నేర్చుకోకుండా చేయడమే కాకుండా భవిష్యత్తులో వారు తల్లిదండ్రులపై ఆర్థికంగా ఆధారపడేలా చేస్తుంది. ఆ అసంతృప్తి.. తెలిసీ తెలియని వయసులోనే ‘అప్పుల’వైపు వారి మనసును మళ్లేలా చేయవచ్చు.⇒ పాతకాలం నాటి సిద్ధాంతాలతో మీ ఎంపికలను గుడ్డిగా అమలు చేయడం వల్ల పిల్లలు కొత్త ఆర్థిక పాఠాలు నేర్చుకోలేరు. అదే సమయంలో వారి స్నేహితుల్లో కొందరు ఆర్థిక విషయాల్లో చురుగ్గా వ్యవహరిస్తుండటం వీరి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలను మీకు చెప్పాలన్నా సంకోచిస్తారు.ఎలా నివారించాలి ?మీ పిల్లలు తెలివిగా ఖర్చు చేయాలనుకుంటే మీరు బడ్జెట్ను ఎలా తయారు చేస్తారో వారికి ప్రత్యక్షంగా చూపించండి. ముందుగా అత్యవసరమైన వస్తువులకే ప్రాధాన్యత ఇవ్వండి. ఖర్చు చేయదగ్గ డబ్బులు మిగిలితే తక్కువ అవసరం ఉన్న వస్తువులను ఎంచుకోండి. ప్రతినెలా పొదుపు చేయడమూ నేర్పించండి.⇒ ఆర్థిక విషయాల గురించి భార్యాభర్తలు కూర్చుని మాట్లాడుకోవాలి. కుటుంబ సాధారణ లక్ష్యాలు, పిల్లల చదువుకు పొదుపు చేయడం, ఇంటికి కావాల్సిన ముఖ్యమైన వస్తువులు ప్రాధాన్యతగా ఉండాలి. ఇదే విషయాన్ని పిల్లలకు చెప్పడం అవసరం.⇒ పిల్లల వయసుకు తగ్గట్టుగా వారితో ఆర్థిక విషయాలు చర్చించాలి. ఇంట్లో ప్రతినెలా ఎంత ఆదాయం వస్తోంది, ఏయే విషయాలకు ఎంత ఖర్చు చేస్తున్నారు.. ఇవన్నీ చర్చించాలి. డబ్బు జీవితంలో ఎంత ముఖ్యమైనదో వారికి అర్థమైతే.. ఆర్థిక క్రమశిక్షణ దానంతట అదే వస్తుంది.⇒ పాకెట్ మనీ పిల్లలకు కొద్దిగా ఇవ్వండి. దీనిని వారు ఎలా ఖర్చు చేస్తున్నారో.. ఏదో ఇంటరాగేషన్ చేస్తున్నట్టు కాకుండా, సరదా సంభాషణల్లో తెలుసుకోవాలి. దీనివల్ల వారిలో ఆత్మవిశ్వాసం,మీపై నమ్మకం, గౌరవం పెరుగుతాయి. స్వతంత్ర ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటూ డబ్బును బాధ్యతగా ఖర్చు చేస్తారు.⇒ ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ, ఇప్పుడున్న ఆర్థిక సాధనాల గురించి ముందుగా మీరు కొంతైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సొంత నిర్ణయాలు తీసుకోవడానికి వారిని అనుమతించండి. చిన్న చిన్న ఆర్థిక వ్యవహారాల్లో వాళ్లు తప్పులు చేసినా ఫర్వాలేదు. వాటి నుంచి నేర్చుకుంటారు. -
సముద్రాలకు మనుషులే ముప్పు!
భూగోళంపై అన్ని రకాల జీవుల మనుగడకు సముద్రాలు అత్యంత కీలకం. జీవులకు అవసరమైన ప్రాణవాయువును సముద్రాలే అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నాయి. కోట్లాది మంది జీవనోపాధి కల్పిస్తున్నాయి. అంతేకాకుండా ప్రపంచ 90 శాతం వాణిజ్యం సముద్ర మార్గాల ద్వారానే జరుగుతోంది. అయితే, ఆధునిక కాలంలో మానవ కార్యకలాపాల వల్ల అవి పెనుముప్పును ఎదుర్కొంటున్నాయి. మనుషుల వల్ల నానాటికీ పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులు శాపంగా మారుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2050 నాటికి సముద్రాలపై మనుషుల దుష్ప్రభాభావం రెండు రెట్లు పెరుగుతుందని యూరప్లో తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. ఈ వివరాలను ‘సైన్స్’ పత్రికలో ప్రచురించారు. కాలుష్యం, తద్వారా అధిక ఉష్ణోగ్రతల వల్ల సముద్రాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. వాటిలోని జీవజాలం నశించిపోతోంది. మరోవైపు సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. ఆమ్ల ప్రభావంతో సముద్ర జలాలు మరింత ఉప్పుగా మారుతున్నాయి. మొత్తానికి సముద్ర జీవావరణ వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆహ్లాదం పంచే సముద్రాలు ప్రమాదం ముంగిట ఉన్నట్లు అధ్యయనకర్త బెన్ హల్పెర్న్ వెల్లడించారు. భూమిపై మనుషుల కార్యకలాపాల వల్ల సముద్రాలకు ఇప్పటికే చాలా నష్టం జరిగిందని, ఇప్పటికైనా మేల్కొనకపోతే 2050 నాటికి ఈ నష్టం రెండింతలు అవుతుందని తేల్చిచెప్పారు. ఇది నిజంగా ఊహించని పరిణామం అని పేర్కొన్నారు. సముద్రాలపై ప్రతికూల ప్రభావాలు వేగంగా పెరుగుతుండడమే అసలు సమస్య అని వివరించారు. కోలుకోలేని దశకు జీవావరణ వ్యవస్థ సముద్రాలపై వాతావరణ ప్రభావాలే తప్ప మనుషుల ప్రభావం అంతగా ఉండదని ఇన్నాళ్లూ భావించారు. భూమిపై జనవాసాల కంటే సముద్రాల విస్తీర్ణం ఎన్నో రెట్లు ఎక్కువ కాబట్టి ఇలాంటి అంచనాకొచ్చారు. కానీ, మనుషుల ప్రభావం గణనీయంగా ఉంటున్నట్లు తేలింది. ఉష్ణోగ్రతల పెరుగుదలతో సముద్రాలు వేడెక్కుతుండడం ఒక అంశమైతే.. నియంత్రణ లేని చేపల వేట, సముద్ర వాణిజ్యం వంటివి సమస్య తీవ్రతను మరింత పెంచుతున్నట్లు వెల్లడయ్యింది. మానవుల చర్యల వల్ల సముద్రాలు ఒత్తిడికి లోనవుతున్నాయి. ఉష్ణమండల ప్రాంతాలతోపాటు ధ్రువ ప్రాంతాల్లో జీవావరణ వ్యవస్థ ఇప్పటికే కోలుకోలేని దశకు చేరుకుంది. పగడపు దిబ్బలు, మడ అడవులు ధ్వంసం ఆధునిక కాలంలో సముద్ర తీర ప్రాంతాలు సైతం సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. పగడపు దిబ్బలు అంతరించిపోతున్నాయి. మడ అడవులు ధ్వంసమవుతున్నాయి. కాలుష్యం కారణంగా సముద్ర జీవుల వృద్ధికి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. సముద్రాల్లోకి స్వచ్ఛమైన జలం కాకుండా మురికి నీరు చేరుతోంది. స్వచ్ఛమైన జలం, సముద్ర జలం మధ్య సమతూకంలో ప్రతికూల మార్పులు వస్తున్నాయి. ఇవన్నీ సముద్రాలకు నష్టం చేకూర్చడంతోపాటు స్థానికంగా జీవనోపాధి అవకాశాలు తగ్గిపోవడానికి కారణమవుతున్నాయి. ఫలితంగా ఆహారం, ఉపాధి కోసం సముద్రాలపై ఆధారపడే దేశాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. ఈ ముప్పు మరింత పెరుగుతుందే తప్ప తగ్గే అవకాశం లేదని నిపుణులు తేల్చిచెబుతున్నారు. ముప్పు తప్పించుకోవాలంటే వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. ఉష్ణోగ్రతల పెరుగుదలను నియంత్రించాలని, సముద్రాల్లో చేపల వేట నియంత్రణ చర్యలను బలోపేతం చేయాలని, సముద్ర వాణిజ్యంలోనూ నియంత్రణ అవసరమని అంటున్నారు. భవిష్యత్తు వైపు దృష్టిసారిస్తే ఇప్పుడు మనమేం చేయాలో తెలుస్తుందని బెన్ హల్పెర్న్ హితవు పలికారు. భవిష్యత్తును నాశనం చేసుకోవాలా? లేక కాపాడుకోవాలా? అనేది మన చేతుల్లోనే ఉందన్నారు. ముక్కలైన మంచు కొండ ప్రపంచంలోనే అతిపెద్ద మంచు కొండగా రికార్డుకెక్కిన ఏ23ఏ ఐస్బర్గ్ విచ్ఛిన్నమైపోయింది. తన రికార్డును కోల్పోయింది. ఈ ఐస్బర్గ్ ముక్కలుగా విడిపోయింది. మరికొన్ని వారాల్లోనే పూర్తిగా చెదిరిపోయే అవకాశం ఉందని సైంటిస్టులు చెప్పారు. ఏ23ఏ ఐస్బర్గ్ అమెరికాలోని రోడ్ ఐలాండ్ స్టేట్ విస్తీర్ణంతో సమానంగా ఉండేది. దీని బరువు లక్ష కోట్ల టన్నుల పైమాటే. అంటార్కిటికాలో 1986లో ఏర్పడింది. దక్షిణ అట్లాంటిక్ సముద్రంలోని సౌత్ జార్జియా దీవి వైపు ప్రయాణిస్తూ ముక్కలైంది. ప్రస్తుతం ఇది హూస్టన్స్టేట్ విస్తీర్ణానికి తగ్గిపోయింది. ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద మంచు కొండగా డీ15ఏ ఐస్బర్గ్ రికార్డుకెక్కింది. ఏ23ఏ నుంచి విడిపోయిన మంచు ముక్కలకు ఏ23డీ, ఏ23ఈ, ఏ23ఎఫ్ అనే పేర్లు పెట్టారు. కాలుష్యం, వాతావరణ మార్పుల కారణంగా సముద్రం వేడెక్కడం వల్ల ఏ23ఏ ఐస్బర్గ్ విచి్ఛన్నమైనట్లు సైంటిస్టులు స్పష్టంచేశారు. ఇలా మంచు కొండలు ముక్కలై కరిగిపోతే సముద్ర మట్టాలు పెరిగే ప్రమాదం ఉంటుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏసీ, నాన్ ఏసీ కోచ్లలో సదుపాయాల కొరత
సాక్షి, సిటీబ్యూరో: ప్రతిరోజూ సికింద్రాబాద్ నుంచి పాట్నాకు వెళ్లే దానాపూర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (12791) ట్రైన్లో సాధారణ ప్రయాణికులతో పాటు కాశీ, ప్రయాగ తదితర పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు వందలాది మంది భక్తులు సైతం బయలుదేరి వెళ్తారు. ప్రయాణికుల రద్దీ, డిమాండ్ ఎక్కువ.. పరిశుభ్రత తక్కువ.. బోగీలు, మరుగుదొడ్లు సకాలంలో శుభ్రం చేయకపోవడం వల్ల దుర్వాసన వ్యాపిస్తోందని ప్రయాణికుల నుంచి తరచూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సాధారణ బోగీలు కిక్కిరిసిపోవడంతో కొంతమంది రిజర్వేషన్ బోగీల్లోకి అక్రమంగా ప్రవేశిస్తారు. దీంతో బోగీలపై ఒత్తిడి పెరుగుతోంది.మరోవైపు ఆన్బోర్డు సిబ్బంది ఎప్పటికప్పుడు బోగీలను శుభ్రం చేయకపోవడం వల్ల దుర్వాసన ప్రయాణికులను ఠారెత్తిస్తోంది. ఒక్క దానాపూర్ ఎక్స్ప్రెస్ మాత్రమే కాదు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని దూరప్రాంతాల రైళ్లలో అరకొర సదుపాయాల కారణంగా 40 శాతానికి పైగా ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. ‘తిరుగు ప్రయాణంలో పాట్నా నుంచి రాత్రి 9.30గంటల సమయంలో సికింద్రాబాద్కు చేరుకొనే సమయానికి దానాపూర్ ఎక్స్ప్రెస్(12792) మరింత దారుణంగా మారుతుంది. మరుగుదొడ్లు, వాష్బేసిన్లు కంపు కొడతాయి. బోగీల్లోకి బొద్దింకలు వస్తాయి’ అని రామంతాపూర్కు చెందిన ఆనంద్ విస్మయం వ్యక్తం చేశారు.నీటి కొరతే కారణమా..? హైదరాబాద్ నుంచి ప్రతిరోజూ సుమారు 200 రైళ్లు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. వాటిలో 85 ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్ రైళ్లు దూర ప్రాంతాలకు బయలుదేరుతాయి. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే సమయంలో రైళ్లను శుభ్రం చేస్తారు. ఆన్బోర్డ్ సదుపాయాలు కూడా అందజేస్తారు. కానీ రైళ్లు బయలుదేరిన కొన్ని గంటల తర్వాత ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న కొద్దీ సదుపాయాలు లోపిస్తున్నాయి. నీటి లభ్యత లేకపోవడం వల్ల కొన్ని చోట్ల రైళ్లలో నీటిని నింపడం లేదు. బోగీలను శుభ్రం చేయడం లేదు. దీంతో మరుగుదొడ్లు, వాష్బేసిన్లు చెత్తకుప్పలుగా మారుతున్నట్లు ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రయాణికుల సదుపాయాలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.దక్షిణ మధ్య రైల్వేలోని పలు ప్రధాన స్టేషన్ల నుంచి బయలుదేరే దూరప్రాంతాల రైళ్లలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. ముఖ్యంగా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మరే క్రమంలో ఈ నీటి కొరత సవాల్గా మారుతుంది. సికింద్రాబాద్–విజయవాడ, రేణిగుంట, గుంతకల్, సికింద్రాబాద్–గుంటూరు, సికింద్రాబాద్–బల్లార్ష, నాందేడ్–సికింద్రాబాద్ తదితర మార్గాల్లో రాకపోకలు సాగించే దూరప్రాంత రైళ్లలో పరిశుభ్రత లోపిస్తున్నట్లు వెల్లడించింది. సికింద్రాబాద్ డివిజన్ నుంచి బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్ తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలోనూ శుభ్రత ఒక సవాల్గా మారింది.అరకొరగా ఆన్బోర్డు సేవలు.. సాధారణంగా ఏసీ, స్లీపర్ బోగీలను ఎప్పటి కప్పుడు శుభ్రం చేసేందుకు ఆన్బోర్డ్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. కానీ చాలా రైళ్లలో ఈ సిబ్బంది అందుబాటులో ఉండటం లేదు. ఐదారు బోగీలకు కేవలం ఒకరిద్దరు మాత్రమే పనిచేస్తారు. ఆన్బోర్డు సర్వీసులను అందజేసే ప్రైవేట్ సంస్థలు తగినంత మంది సిబ్బందిని నియమించకపోవడం వల్లనే ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. చర్లపల్లి–గోరక్పూర్ తదితర రైళ్లలో ఆన్బోర్డు సర్వీసులు అధ్వాన్నంగా ఉన్నాయని చేవెళ్లకు చెందిన ఫణిరాజ్ తెలిపారు. ‘బళ్లార్షాలో నీళ్లు నింపకుండానే కొన్ని రైళ్లు బయలుదేరుతాయి. ఆ తర్వాత మళ్లీ నాగపూర్లోనే నీళ్లు నింపేందుకు అవకాశం ఉంటుంది. దీంతో మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలు ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది’ అని చెప్పారు.మరోవైపు ఆన్బోర్డు సేవలను అందజేయడంలో విఫలమైన సంస్థలపైన రైల్వే అధికారులు భారీ ఎత్తున పెనాల్టీలు కూడా విధిస్తున్నారు. ఇలాంటి కాంట్రాక్టర్లు, సంస్థలపై సుమారు రూ.22.5 లక్షల పెనాల్టీ విధించినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల నుంచి వచ్చిన 2,265 ఫిర్యాదుల ఆధారంగానే రూ.16.7 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. నగరంలోని చర్లపల్లి, సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లలో వాటరింగ్ సదుపాయం ఉంది. త్వరలో కాచిగూడలోనూ ఏర్పాటు చేయనున్నట్లు ఒక అధికారి చెప్పారు.ఆన్బోర్డ్ సేవలను బలోపేతం చేయాలి సరైన సర్వీసులు అందజేయని సంస్థలు, కాంట్రాక్టర్లపై జరిమానాలు విధించడం ఒక్కటే పరిష్కారం కాదు. అలాంటి వారిని తొలగించి సమర్థవంతమైన సేవలు చేసే వారికి బాధ్యతలను అప్పగించాలి. ఆన్బోర్డ్ సేవల వ్యవస్థను బలోపేతం చేయాలి. – శ్రీనివాస్, ప్రయాణికుడు -
టీచర్స్ డే.. ఆరోజులు మళ్ళీ రావు!
టీచర్ అంటే పాఠాలు చెప్పేవాడు కాదు, జీవితం ఎలా ఉండాలో చూపించే దారిదీపం.. ఇది ఇవాళ విపరీతంగా కనిపిస్తున్న ఓ కొటేషన్. వాట్సాప్లో స్టేటస్గా, ఇన్స్టాగ్రామ్ ఎడిటింగ్లతో తెగ వైరల్ అవుతోంది. డిజిటల్ యుగంలో టీచర్స్ డే సెలబ్రేషన్స్ మారిపోయిందనడానికి ఇదే ఒక రుజువు. కానీ.. నిజమైన టీచర్స్ డే సెలబ్రేషన్స్ ఎలా ఉండేవో మీకు తెలుసా?టీచర్స్ డే అంటే గుర్తొచ్చేది.. ఒకానొక టైంలో స్కూళ్లలో జరిగిన అద్భుతమైన వేడుకలు. టీచర్ల కోసం దాచుకున్న, పేరెంట్స్ను అడుక్కున్న సొమ్ముతో కొనే గిఫ్ట్లు, ఫేవరెట్ టీచర్ల కోసం స్పెషల్గా రాసి.. గీసి తీసుకొచ్చే గ్రీటింగ్స్, వాళ్ల కోసం కొని తెచ్చే గులాబీ పువ్వులు.. బొకేలు, శాలువాలు, చాకెట్లు.. అబ్బో మామూలు హడావిడి నడిచేది కాదు. మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.. బడి పిల్లలే టీచర్ల అవతారం ఎత్తి పాఠాలు బోధించడం గురించి. టీచర్స్ డే.. స్టూడెంట్స్ టీచర్లుగా మారి పాఠాలు చెప్పేవారు. అబ్బాయిలు ప్యాంట్షర్టులు.. పంచెలు, అమ్మాయిలు చీరలు, ప్రిన్సిపాల్ గెటప్కు సూట్ బూట్ స్పెషల్గా వచ్చేవాళ్లు. టీచర్లు హాయిగా విశ్రాంతి తీసుకుని.. నవ్వుతూ, ఆటలాడుతూ సందడిగా గడిపేవారు. విద్యార్థులు టీచర్ల వేషాలు వేసుకుని, బోధనలో తాము నేర్చుకున్నదాన్ని తిరిగి చూపించేవారు. ఆ సమయంలో టీచర్లనూ అనుకరించేవాళ్లు. అలా బడులలో ఒక పండుగ వాతావరణం కనిపించేది. అయితే ఈ ఒక్కరోజు మార్పు.. ఒక ఆట కాదు. గురుపూజోత్సవం ఉద్దేశం వేరు. గురువుల బాధ్యతను అర్థం చేసుకునే ప్రయత్నం. టీచర్ అంటే మనల్ని భయపెట్టే వ్యక్తి కాదు.. మనల్ని అర్థం చేసుకునే వ్యక్తి అని తెలియజేసేది. ఆ అనుభవం విద్యార్థుల్లో గౌరవం, కృతజ్ఞత, నైతికత పెంచేది. నేను చదివిన బడిలో నాలుగేళ్లపాటు టీచర్స్ డే రోజున.. ‘సార్’గా మారిపోయాను నేను. అందులో.. పదో తరగతి చదివే టైంలో మా క్లాస్ వాళ్లకే పాఠాలు చెప్పాల్సి రావడం నన్ను ఎంతో ఎగ్జయిట్ చేసింది. నీట్గా టక్ చేసుకుని.. సోషల్ బుక్ చేతిలో పట్టుకుని.. పైకి గంభీరంగా బిల్డప్ ఇచ్చినా, లోపల మాత్రం ఉప్పొంగే ఆనందంతో తరగతి గదిలో అడుగుపెట్టాను. సీరియస్గా పాఠం చెబుతూ.. మధ్యలో ప్రశ్నలు అడుగుతూ, చాక్పీస్ ముక్కలను వాళ్లపైకి విసురుతూ.. ఆన్సర్ చెప్పనివాళ్లకు పన్మిష్మెంట్ కూడా ఇస్తూ చేసిన ఓవరాక్షన్ అంతా ఇంత కాదు. ‘‘ఆగరా.. రేపు నీ పని చెప్తాం’’ అంటూ నా ఫ్రెండ్స్ నావైపు చూసిన గుర్రుచూపు ఇప్పటికీ నాకు గుర్తు. అరేయ్.. నిజంగా టీచర్లా చేస్తున్నావ్ కదరా అంటూ మా హెడ్ మాస్టర్, టీచర్లు ఇచ్చిన కాంప్లిమెంట్లు, ఆరోజు సాయంత్రం నాకు బెస్ట్ టీచర్గా ఇచ్చిన షీల్డ్.. ఏనాటికి మరిచిపోలేను. నాకే కాదు.. మీలోనూ ఇలాంటి అనుభవాల్లో ఏదో ఒకటి ఉండి ఉండొచ్చు. ఈరోజుల్లో.. అలాంటి వేడుకలు కొంత తగ్గినట్లే అనిపిస్తుంది. టెక్నాలజీ, విద్యావిధానాలు కారణాలు ఏమైనా కావొచ్చు. ఇప్పుడు అలాంటి అనుభవాలు తగ్గిపోయాయి. టీచర్స్ డే అంటే ఏదో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లా.. స్కూల్ ఈవెంట్లా అతికష్టంలా కనిపిస్తోంది. టీచర్స్ డే వేడుకలు సోషల్ మీడియా పోస్టులకే పరిమితమైపోతున్నాయి. ఎంతైనా ఆరోజులే వేరు.. బడిలో మాత్రమే కాదు.. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక గురువు ఉంటారు. వారు చూపిన దారే మన ప్రయాణానికి మార్గదర్శకంగా మారుతుంది. అలాంటి వ్యక్తులకు ఒక చిన్న మెసేజ్, ఒక చిన్న ఫోన్కాల్, ఒక చిన్న “థ్యాంక్యూ” కూడా వాళ్ల హృదయాన్ని తాకొచ్చు. ఇట్లు.. ఓ నిత్యవిద్యార్థి -
A23A: ముక్కలై.. మెగా టైటిల్ను కోల్పోయి!
ఈ భూమ్మీద ఏదీ శాశ్వతం కావన్నాడు ఓ కవి. ప్రభుత్వాలు, పదవులు, ఘనతలు, రికార్డులు.. రోజులు, ఏండ్లు దొర్లే కొద్దీ కొత్తదనానికి అనుగుణంగా మార్పునకు లోనవుతుంటాయి. A23a విషయంలోనూ ఇప్పుడు అదే జరిగింది. ఆరు ముంబై మహానగరాలు కలిస్తే ఎలా ఉంటుందో.. ఆ సైజులో ఉండి అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ఈ ఐస్బర్గ్ హఠాత్తుగా ముక్కలైంది.అంటార్కిటికా ఫ్లిచెనర్ రోన్నె ఐస్ షెల్ఫ్ నుంచి 1986 ఆగష్టులో విడిపోయింది. అప్పటి నుంచి 34 ఏళ్లుగా అక్కడే స్థిరంగా ఉండిపోయింది. అయితే 2020 నుంచి వెడ్డెల్ సముద్రం పశ్చిమం వైపు అది నెమ్మదిగా కదలడం మొదలుపెట్టింది. కిందటి ఏడాది జనవరిలో అది సుడిగుండంలో చిక్కుపోయింది. అయితే అనూహ్యంగా డిసెంబర్ మధ్యలో అది అక్కడి నుంచి బయటపడింది.బలమైన గాలుల ప్రభావమే దాన్ని అక్కడి నుంచి బయటపడేసి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అటుపై యూఎస్ నేషనల్ ఐస్ సెంటర్ దీనిని ఈ భూమ్మీద అతిపెద్ద ఐస్బర్గ్🧊గా ప్రకటించింది. ఒక చిన్న ద్వీపం పరిమాణంలో ఉండి, ట్రిలియన్ టన్నుల బరువుతో.. ప్రపంచంలో నీటిపై తేలియాడుతూ అతిపెద్ద మెగా ఐస్బర్గ్గా గుర్తింపు దక్కించుకుంది.ఆ టైంలో సుమారు 4వేల స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఈ ఐస్బర్గ్.. బ్రిటీష్ సరిహద్దుల వైపు ప్రయాణించడాన్ని శాస్త్రవేత్తలు ఆసక్తిగా గమనించారు. దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఆనుకుని ఉన్న సౌత్ జార్జియాను అది ఢీ కొడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇది ముక్కలైనట్లు సైంటిస్టులు గురువారం ప్రకటించారు. రాబోయే మరికొన్ని వారాల్లో అది మరిన్ని ముక్కలు కావొచ్చని చెబుతున్నారు.మెగా టైటిల్ దానికే..A23A ముక్కలు కావడంతో మెగా ఐస్బర్గ్ టైటిల్ కోల్పోయింది. అమెరికాలోని రోడ్ ఐల్యాండ్ స్టేట్ పరిమాణంలో ఉండేది.. ఇప్పుడు టెక్సాస్ స్టేట్లోని హ్యూస్టన్ పరిమాణానికి పడిపోయింది. దాని ముక్కలకు.. ఏ23డీ, ఏ23ఈ గా నామకరణం చేశారు. దీంతో.. బ్రిటన్ డీ15ఏ ప్రపంచంలోని అతిపెద్ద ఐస్బర్గ్ ఘనతను సొంతం చేసుకుంది.D15A ఐస్బర్గ్ అనేది అంటార్కిటికాలోని అమేరీ ఐస్ సెల్ఫ్ Amery Ice Shelf నుంచి విడిపోయిన భారీ మంచు పర్వతం. ఇది మొదటగా D15 అనే పేరుతో గుర్తించబడింది, కానీ 2016లో ఇది రెండు భాగాలుగా విడిపోయింది. ఇందులో D15A అతిపెద్ద భాగం. D15B అతి చిన్న భాగం. D15A పరిమాణం.. పొడవు: 51 నాటికల్ మైళ్ళు, వెడల్పు: 24 నాటికల్ మైళ్ళు. ఇది సుమారు 3,000 చ.కి.మీ విస్తీర్ణంలో ఉంది. అంటే గోవా రాష్ట్రం అంత పరిమాణం. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం.. D15A స్థిరంగా ఉన్నప్పటికీ, వాతావరణ మార్పులు, సముద్రపు వేడి నీరు, మరియు అలల ప్రభావం వల్ల దీని భవిష్యత్తు కూడా అనిశ్చితంగా ఉంది.A68a గురించి..ఏ68ఏ.. A23a కంటే ముందు ప్రపంచంలో మెగా ఐస్బర్గ్గా రికార్డుల్లో నమోదైంది. పరిమాణంలో లండన్ నగరం కంటే మూడు రెట్లు పెద్దది. బరువు ఒక ట్రిలియన్ టన్నులుగా ఉండేదని అంచనా. ఇది కూడా సౌత్ జార్జియాను ఢీ కొట్టవచ్చని అప్పట్లో ఆందోళన చెందారు. అయితే.. ఐల్యాండ్కు సరిగ్గా వంద మైళ్ల దూరంలో ఉండగానే దానికి భారీగా డ్యామేజ్ అయ్యింది. ఆపై అది సముద్రంలోనే కరిగిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.ఏం జరగొచ్చు?ఏ23ఏ ముక్కలు కావడం అనేది కొత్త విషయం ఏం కాదని.. అదే సమయంలో ఆసక్తికరమైన అంశమేనని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడోకు చెందిన శాస్త్రవేత్త టెడ్ స్కాంబోస్ చెబుతున్నారు. తుపానులు, అలలు A23A అనే భారీ హిమపర్వతాన్ని బలహీనపరిచాయని, దాని లోపల ఉన్న చీలికలను బయటపెడుతూ వచ్చిందని అంటున్నారు. ఇక.. మీజర్స్ అనే మరో శాస్త్రవేత్త అభిప్రాయం ప్రకారం.. త్వరలోనే ఇదిట్రాక్ కూడా చేయలేనంత చిన్న ముక్కలు కావొచ్చని అంటున్నారు. అయితే..వేసవి ముగిసే దాకా ఆ A23A ముక్కలు అలాగే ఉంటే మాత్రం.. ముప్పు తప్పదని స్కాంబోస్ అంటున్నారు. వేడి నీరు కారణంగా ఒక్క రోజులోనే అది మంచు పర్వతం కుప్పకూలినట్లుగా విరిగిపోవచ్చు అని చెప్పారాయన. ఇదిలా ఉంటే.. మంచుపర్వతాలు విరిగిపోవడం వల్ల నేరుగా సముద్ర మట్టం పెరగదు. కానీ ఐస్ షెల్ఫ్లు చిన్నవిగా మారితే.. భూభాగంపై ఉన్న మంచు వేగంగా కరిగి సముద్రంలో కలిసే అవకాశం ఉంటుంది, ఇది సముద్ర మట్టం పెరగడానికి కారణమవుతుంది. -
కెరీర్ లెక్కల్లోనైనా 'మా సారు'...తగ్గేదే లే!
మాస్టారు లెక్కలు చెబితే మనసుకి బాగా ఎక్కింది... అభిమానం అనే లెక్క పెరిగింది. ఆ లెక్క చదువుకే పరిమితం కాలేదు. కెరీర్ లెక్కలు చూసేవరకూ తెచ్చింది. ఓ లెక్కల మాస్టారు ఓ కుర్రాడి జీవితాన్ని అంతగా ప్రభావితం చేశారు. సినిమా ఇండస్ట్రీలో రికార్డు స్థాయి వసూళ్లు లెక్కలు చూస్తున్న డైరెక్టర్ సుకుమార్ తన శిష్యుడు బుచ్చిబాబు సానాకి కాలేజీలో లెక్కల పాఠాలు చెప్పి, డైరెక్టర్ని చేసి, కెరీర్ వసూళ్ల లెక్కలు చూసుకునేవరకూ అండగా ఉన్నారు. ‘ఎప్పటికీ ఉంటారు’ అని శిష్యుడు అంటున్నారు. టీచర్స్ డే సందర్భంగా ‘ఉప్పెన’ ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా తన గురువు సుకుమార్ గురించి ‘సాక్షి’కి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ...→ ముందుగా ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు మీ గురువుకి సంబంధించిన జ్ఞాపకాలను షేర్ చేసుకుంటారా? బుచ్చిబాబు: ఆ రోజుల్లో సుకుమార్ సార్ నాలా బక్క పలచగా ఉండేవారు. తెల్లగా షార్ప్ మీసాలతో హ్యాండ్స్ వరకూ బటన్స్ పెట్టి, ఫుల్ హ్యాండ్స్ చొక్కాలో నీట్గా వచ్చేవారు. ఆయన చిరంజీవిగారి ఫ్యాన్ అని తెలిశాక మా సీనియర్స్ అందరూ ఓ 40, 50 మంది సుకుమార్ సార్ వస్తుంటే ‘మాస్టర్’ సినిమాలో ‘హే జు హే జు’ అని బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టేవారు. ఆయన మురిసి΄ోయేవారు. సుకుమార్ సార్ చిరంజీవిగారి ఫ్యాన్ అయితే మేము సుకుమార్ సార్ ఫ్యాన్స్. → మీరు లెక్కల మాస్టారుకే కనెక్ట్ అవ్వడానికి కారణం? స్టూడెంట్స్ లెక్కలకు కనెక్ట్ అవ్వడం రేర్. అలాంటిది లెక్కల మాస్టార్కి ఎందుకు కనెక్ట్ అవుతాం? అయినా ఆయనకి కనెక్ట్ అయ్యాం. ఎందుకంటే లెక్కలు కూడా సార్ అందంగా చెప్పేవారు. తెలుగు పాఠంలా విడదీసి అర్థమయ్యేలా చెప్పేవారు. సూత్రాల్ని కూడా సులువుగా చెప్పడం మా మాస్టార్ ప్రత్యేకత. అప్పుడు లెక్కలు చెప్పడంలో తగ్గలే. ఇప్పుడు కెరీర్ లెక్కల్లోనూ మా సారు తగ్గేదే లే! → చదువుకునే రోజుల్లో మీ గురువుకి ఏదైనా బహుమతి ఇచ్చారా? నేను ఇవ్వలేదు గానీ, ఆయనే మాకు సినిమాలకి వెళ్ళమని డబ్బులిచ్చేవారు. కానీ ‘నా క్లాస్ వినేసి వెళ్ళండి’ అని కండీషన్ పెట్టేవారు. → ఓ శిష్యుడిగా మీ గురువుకి బహుమతి ఇవాల్సి వస్తే ఏం ఇస్తారు? మా బంధం లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నాను. అందుకే లైఫ్ లాంగ్ నేను చేసే ప్రతీ సినిమాకి ‘సుకుమార్ రైటింగ్స్ బేనర్’ ఉంటుంది. ఓ శిష్యుడిగా నేను ఆయనకిచ్చే గిఫ్ట్ ఇదే అనుకుంటున్నాను. → మీ కెరీర్ మొదలయ్యాక మీ గురువు మీకు ఇచ్చిన బహుమతులేమైనా? ‘ఉప్పెన’ సినిమా అయ్యాక ఆయన ఒక లెటర్ రాశారు. నేను ΄÷ద్దున నిద్ర లేచి చూస్తే సుకుమార్ సార్ లెటర్ రాశారు అని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఫేక్ అనుకుని నమ్మలేదు. అయితే సుకుమార్ సార్ పక్కన ఉన్నవాళ్ళు చెప్తే నమ్మాను. ఆ లెటర్ నా గురువుగారు నా లైఫ్లో నాకు ఇచ్చిన మర్చి΄ోలేని బహుమతి.→ లైఫ్లో కీలక మెట్లు అయిన చదువు, ఆ తర్వాత కెరీర్... ఈ రెండింటిలోనూ సుకుమార్గారితో మీకు కనెక్షన్ ఉంది. మీ ఇద్దరికీ అంత సింక్ కుదరడానికి కారణం? నేను ఇంటర్మీడియట్ అంటే... నా నూనూగు మీసాల వయసు నుండీ ఆయన తెలుసు నాకు. యవ్వనంలో ప్రతి ఒక్కరికీ ఒక రోల్ మోడల్ ఉంటారు కదా. నా రోల్ మోడల్ సుకుమార్ సారే. నాకు టెన్త్ వరకూ రోల్ మోడల్ ఎవరూ లేరు. ఇంటర్మీడియట్కి వెళ్ళిన దగ్గర నుండీ ‘సుకుమార్ సార్ నా రోల్ మోడల్’ అని చెప్పడం మొదలెట్టాను. నేను ఆయన్ని అంత ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. మా ఫ్రెండ్స్ ‘ఒరేయ్ సుకుమార్లా మాట్లాడుతున్నావ్.. ఆలోచిస్తున్నావ్’ అంటారు. నా లోపలకి ఆయన్ని అంత గట్టిగా తీసేసుకున్నాను. → ఓ గురువుగా కెరీర్ గురించి మీకు ఆయన ఎలాంటి సలహాలు ఇస్తుంటారు? ఈ కెరీరే ఆయన సలహా. ఆయన పరిచయం కాక΄ోతే, నా క్లాస్కి ఆయన లెక్కలు మాస్టారు కాక΄ోయి ఉంటే నేను సినిమా వైపు వచ్చి ఉండేవాణ్ణే కాదు. → సుకుమార్గారు కాకుండా మీరు అభిమానించే గురువులు ఎవరైనా ఉన్నారా? గరికిపాటి నరసింహారావుగారు కూడా నా గురువుగారే. కాకినాడ చైతన్య కాలేజ్లో బీఎస్సీ కంప్యూటర్స్ చదువుకునేటప్పుడు సంస్కృతం చెప్పేవారు. ఆయన పాఠాలు చెప్పే విధానం చమత్కారంగా ఉండేది. ఒకసారి రాజు అని నా స్నేహితుడు క్లాస్కి లేట్గా వచ్చి, ‘మే ఐ కమ్ ఇన్ సార్’ అన్నాడు. గరికిపాటిగారు ‘తమరి నామధేయం ఏంటో’ అని అడిగారు. వాడు రాజా అనగానే ‘ఏ రాజ్యానికో’ అని వెంటనే సెటైర్ వేశారు. వాడు క్లాస్ వింటూ నెత్తి మీద టోపీ తీయలేదు. ‘రాజువారు తమరి కిరీటం తియ్యాలి’ అన్నారు. ఆయన అంత చమత్కారంగా ఉండేవారు. పాఠాలను కూడా ప్రవచనాల్లా చెప్పేవారు. ఆయన చెప్పిన సంస్కృతంలోనే నాకు ఎక్కువ మార్కులు వచ్చాయి. ఇలాంటి గురువులు దొరకడం నా అదృష్టం. సినిమాలో ఒకరు, సాహిత్యంలో ఒకరు... నన్ను అమితంగా ప్రభావితం చేసిన ఇద్దరూ గొప్ప వ్యక్తులు. → సుకుమార్ గారు, మీ మధ్య ఏమైనా చిన్ని చిన్ని మనస్పర్థలు వచ్చినప్పుడు ఎవరు ముందుగా మాట్లాడేవాళ్లు? ‘మనం తప్పు చేశాం... ఆయన తిట్టారు. ఫోన్ చేసి మాట్లాడదాం’ అని ఫోన్ తీసేలోపే ఆయన మెసేజ్ ఉండేది. ‘సారీ రా ఏమనుకోకు, ఏదో మాటనేశా’ అని అంటారు. మా గురువుగారు ఎదుటోడు ఎంత పెద్ద తప్పు చేసినా ‘క్షమించడం’లో ముందుంటారు. → మీ జీవితంలో మీ గురువుగారి పాత్ర అంటే... ఏం చెబుతారు? వ్యక్తిగా బుచ్చిబాబు సానాకి అయితే ఏం సంబంధం లేదు గానీ డైరెక్టర్ బుచ్చిబాబు సానా అయితే మాత్రం మొత్తం మా గురువుగారి పాత్రే. → క్లాస్ రూమ్లో మీ మాస్టారు ఎలా ఉండేవారు? బ్లాక్ బోర్డ్ మీద ఒక లెక్క రాసి, అది మాకు ఎక్స్ప్లెయిన్ చేశాక ‘ఎనీ డౌట్స్’ అని చిటికేసి గట్టిగా అరిచి, అడిగేవారు. అలా ఆ మాటతో పక్కకి ΄ోయిన మా బ్రెయిన్స్ని కూడా లోపలికి తీసుకొచ్చేసేవారు (నవ్వుతూ).→ సుకుమార్గారు మిమ్మల్ని ఎలా పిలుస్తారు?నన్ను ఒరేయ్ అనే పిలుస్తారు...అంత క్లోజ్ అయితే తప్ప ఒరేయ్ అని పిలవరు ఎవర్నీ. నాకు ఒరేయ్ అని పిలిపించుకోవడం అమితమైన ఆనందాన్నిస్తుంది.→ గురువుని మించిన శిష్యుడు అనిపించు కోవాలనుకుంటున్నారా? గురువుని మించిన కాదు గానీ గురువు మెచ్చిన శిష్యుడు అవ్వాలనే కోరిక మాత్రం ఎప్పుడూ ఉంటుంది. – డి.జి. భవాని -
భలేగా బ్యాట్మింటన్ ఆడుతున్న రోబో శునకం
కొందరు బ్యాట్మింటన్ ఆడుతుంటే దూరంగా పడిన షటిల్ను వాళ్ల పెంపుడు శునకం పరుగెత్తుకెళ్లి నోటితో కరిచి తెచ్చివ్వడం చూస్తూనే ఉంటా. అయితే ఈ రోబో శునకం మాత్రం షటిల్ను తెచ్చివ్వడానికి బదులు షటిల్బ్యాట్ పట్టుకుని ఆటకు సిద్ధమైంది. రోబోటిక్స్, కృత్రిమ మేథ, క్రీడాంశాల సమ్మేళనంగా రూపుదిద్దుకున్న ఈ కొత్త తరహా రోబో ఇప్పుడు రోబోటిక్ రంగంలో చర్చనీయాంశమైంది. బ్యాడ్మింటన్లో చకాచకా షటిల్తో షాట్స్ కొడుతుంటే టకాటకా తిరిగి షాట్స్ కొడుతున్న చిన్న రోబో శునకానికి ‘ఏఎన్వైఎంఏఎ–ఎనిమల్’అని పేరు పెట్టారు. స్విట్జర్లాండ్లోని ప్రభుత్వరంగ విశ్వవిద్యాలయం అయిన ఈటీహెచ్, జ్యూరిచ్లోని పరిశోధకులు ఈ రోబో శునకాన్ని రూపొందించారు. మెషీన్ లెర్నింగ్, రోబోటిక్స్ల మేలు కలయికగా దీనిని తయారుచేశామని పరిశోధకులు చెప్పారు. మనిషి తరహాలో వేగంగా కదులుతూ షటిల్ గమనాన్ని గుర్తిస్తూ తిరిగి షాట్ కొట్టగలడం ఈ రోబో శునకం ప్రత్యేకత. వర్సిటీలోని రోబోటిక్స్ సిస్టమ్స్ ల్యాబ్లోని ప్రొఫెసర్ మార్కో హట్టర్ సారథ్యంలోని పరిశోధనా బృందం ఈ రోబోను సృష్టించింది. ఇది ఎలా పనిచేస్తుంది? ఈ రోబో శునకం బరువు 50 కేజీలుకాగా ఎత్తు 1.5 అడుగులు మాత్రమే. ఎదురుగా షటిల్కాక్ దూసుకొచ్చే విధానాన్ని విశ్లేషించి, దానికి అనుగుణంగా కాళ్లు కదపాల్సిన విధానాన్ని విశ్లేషించి ఈ రోబోకు ప్రోగ్రామింగ్ చేశారు. ఎదురుగా నిలబడిన ఆటగాడు ఎంత ఎత్తు నుంచి షటిల్కాక్ కొట్టాడు? కాక్ ఎంత ఎత్తు నుంచి దూసుకొస్తోంది? ఎంత వేగంతో వస్తోంది? అది ఏ దిశలో నేలను తాకొచ్చు? అనే పలు అంశాలపై తొలుత పరిశీలనచేసి ఓ అంచనాకొచ్చారు. తర్వాత కాక్ పథానికి తగ్గట్లు ఎనిమల్ రోబో శునకం నాలుగు కాళ్లను ఎటు వైపునకు కదపాలి. పరుగెత్తేలా లేదంటే ఇంకా పైకి లేచి కొడితే సరిపోతుందా? ఒకవేళ పరిగెడితే వెంటనే పడిపోకుండా స్థిరంగా నిలదొక్కుకోవడం ఎలా? అనే అనేక అంశాలపై ముందస్తు అంచనాప్రోగ్రామ్లను రాసుకొని వాటితో తొలుత పరీక్షలు జరిపి విజయవంతమయ్యారు. తర్వాత అన్నింటినీ కలిపి ఆటగాడు కొట్టిన కాక్ను వేగంగా తిరిగికొట్టడం, అది కూడా కోర్ట్కి లోపల పడేలా షాట్ కొట్టడం వంటివి ప్రోగ్రామింగ్కు జతచేశారు. ఆట వేగానికి తగ్గట్లుగా రోబో శునకం నాలుగు కాళ్లు మాత్రమే కాదు ప్రత్యేక ‘చేయి’సైతం చురుకుగా కదిలేలా పలు మార్పులుచేశారు. ఎట్టకేలకు మనిషి ఆటను సైతం ఎదిరించేలా స్థాయికి రోబోను సృష్టించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వయసు పెరుగుతుంటే..ఎత్తు తగ్గుతుంది!
వయసు మీరిన కొద్దీ మన శరీరంలో అనేక మార్పులు వస్తాయి. జుట్టు నెరుస్తుంది. చర్మంపై ముడతలు వస్తాయి. అంతేకాదు ఎత్తు కూడా తగ్గుతారట. 40 ఏళ్ల వయసు వచ్చేనాటికి చాలా మందిలో ఎత్తు తగ్గడం ప్రారంభం అవుతుంది. పురుషుల కంటే మహిళలు ఎక్కువ ఎత్తు తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే వారి ఎముకలు పలుచగా మారడం.. మెనోపాజ్ తర్వాత మరింత త్వరగా జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రచురితమైన అనేక అధ్యయనాలు చెబుతున్న వివరాల ప్రకారం.. – సాక్షి, స్పెషల్ డెస్క్ఎంత ఎత్తు కోల్పోతారు?⇒ 70 ఏళ్ల వయసు వచ్చేసరికి.. మహిళలు దాదాపు 2 అంగుళాలు కోల్పోవచ్చు పురుషులు సగటున ఒక అంగుళం తగ్గవచ్చు⇒ 80 ఏళ్ల వయసు వచ్చేసరికి పురుషులు, స్త్రీలు మరో అంగుళం తగ్గవచ్చుఎందుకు తగ్గుతారు?ఆస్టియోపొరోసిస్: చాలామందిలో.. ప్రధానంగా స్త్రీలలో వెన్నెముక సంకోచించడానికి ఈ వ్యాధి ప్రధాన కారణం. ఆస్టియోపొరోసిస్ బారినపడితే ఎముకలు బరువు తగ్గి పలుచగా, గుల్లబారి పెళుసుగా తయారవుతాయి. తేలికపాటి ఒత్తిడికి కూడా ఎముకలు విరిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.వెన్నెముక మార్పులు..వెన్నెముకలో వెన్నుపూస డిస్క్లు ఉంటాయి. 80% నీరు కలిగిన ఈ డిస్క్లు యవ్వనంలో బలంగా, మృదువుగా ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ ఈ డిస్క్లు క్రమంగా కుంచించుకుపోతాయి.కండరాల బలహీనత..పొట్ట, నడుము కండరాలు బలహీనపడతాయి. ప్రత్యేకించి సార్సోపీనియా అనే పరి స్థితి వల్ల వయసు పెరిగే కొద్దీ కండరాల బరువు, పనిచేసే విధానం, బలం కూడా తగ్గుతాయి. వీటన్నింటి వల్ల వెన్నెముకను నిటారుగా ఉంచడం కష్టమవుతుంది.పాదాల్లో మార్పులు..యవ్వనం వరకు కాస్త ఎగుడు దిగుడుగా ఉన్న పాదాలు.. వయసు పైబడుతున్నకొద్దీ చదునుగా మారవచ్చు. దీనివల్ల మొత్తం ఎత్తు తగ్గొచ్చు.ఈ ప్రక్రియను నెమ్మదించగలరా?⇒ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండాలి. ⇒ ముఖ్యంగా శరీరంలోని కేంద్ర భాగం.. అంటే కటి, తుంటి, వీపు, ఉదర కండరాలను బలోపేతం చేయడానికి, ఎముక పెరుగుదలను ప్రేరేపించడానికి బరువులతో కూడిన వ్యాయామాలు చేయాలి..⇒ఎముకల ఆరోగ్యానికి తోడ్పడటానికి ఆహారంలో తగినంత కాల్షియం, విటమిన్–డి ఉండేలా చూసుకోవాలి. 50 ఏళ్లు పైబడిన మహిళలు, 70 ఏళ్లకు పైబడ్డ పురుషులు ప్రతిరోజూ సుమారు సగటున 1,200 మిల్లీగ్రాముల కాల్షియం, విటమిన్–డి తీసుకోవాలి. స్పష్టమైన మోతాదు, ఆయా వ్యక్తుల శరీరానికి తగ్గ అవసరాల కోసం వైద్య నిపుణులను సంప్రదించడం మేలు.వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి⇒ ఏడాది లేదా రెండేళ్లలో ఒక అంగుళం కంటే ఎక్కువగా ఎత్తు తగ్గితే ఆస్టియోపొరోసిస్ లేదా ఇతర అనారోగ్య సమస్యకు సంకేతం కావచ్చు. ⇒ ఎముకలకు సంబంధించిన ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా నిర్లక్ష్యం చేయవద్దు. -
ప్రకటనల్లోనూ బాద్షా!
సాక్షి, స్పెషల్ డెస్క్: టీవీలో సినిమా అయినా, సీరియల్ అయినా.. నిమిషాల వ్యవధిలో ప్రకటనలు ప్రత్యక్షం అవుతూనే ఉంటాయి. ఏదైనా ఉత్పాదన జనంలోకి సులభంగా చొచ్చుకుపోవాలంటే ప్రముఖులు ఆమోదించాల్సిందే. ప్రముఖ నటుడు, బాలీవుడ్ బాద్షాగా పేరున్న షారూక్ ఖాన్ టీవీ ప్రకటనల్లో ఎక్కువగా కనిపించిన సెలబ్రిటీగా నిలిచారు. ఆ తరువాతి స్థానంలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎం.ఎస్.ధోని ఉన్నారు. టీఏఎం మీడియా రీసెర్చ్కు చెందిన యాడ్ఎక్స్ ఇండియా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. 2025 జనవరి–జూన్ కాలంలో ప్రసారం అయిన టెలివిజన్ ప్రకటనలలో షారూక్ ఖాన్ 8 శాతం వాటాతో అత్యధికంగా కనిపించిన సెలెబ్రిటీగా మొదటి స్థానంలో ఉన్నారు. వివిధ బ్రాండ్లకు సంబంధించి రోజుకు అన్ని చానెళ్లలో కలిపి సగటున ఆయన 27 గంటలు వీక్షకుల ముందు ప్రత్యక్షమయ్యారు. 7 శాతం వాటాతో తరువాతి స్థానంలో పోటీపడుతున్న ఎం.ఎస్.ధోని సగటున రోజుకు 22 గంటలు కనిపించారు. మొదటి పది స్థానాల్లో నిలిచిన ఇతర ప్రముఖులలో అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, అమితాబ్ బచ్చన్, అనన్య పాండే, రణ్బీర్ కపూర్, అనుష్క శర్మ, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ ఉన్నారు.ఎక్కువ బ్రాండ్లతో ధోని2025 మొదటి అర్ధభాగంలో టీవీల్లో ప్రసారం అయిన 43 బ్రాండ్ల ప్రకటనలతో ఎంఎస్ ధోని అగ్రస్థానంలో ఉన్నారు. షారూక్ 35, బిగ్ బి 28 బ్రాండ్స్ యాడ్స్లో దర్శనమిచ్చారు. ఆహారం, పానీయాలుసెలెబ్రిటీల యాడ్స్లో 23 శాతం వాటాతో తొలి స్థానంలో ఆహారం, పానీయాల రంగం ఉంది. వ్యక్తిగత సంరక్షణ, పరిశుభ్రత సంబంధ ఉత్పత్తులు 17 శాతం, గృహ ఉత్పత్తుల విభాగం 8 శాతం వాటాతో తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక ఉత్పత్తులవారీగా చూస్తే టాయిలెట్, ఫ్లోర్ క్లీనర్స్ 8 శాతం, శీతల పానీయాలు 6 శాతం, సబ్బులు 6 శాతం వాటాతో పోటీపడుతున్నాయి. ప్రముఖుల యాడ్స్లో 40 శాతం వాటా కేవలం 10 రకాల ఉత్పత్తులదే. వీటిలో టాయిలెట్–ఫ్లోర్ క్లీనర్స్, శీతల పానీయాలు, వాషింగ్ పౌడర్స్–లిక్విడ్స్, నిర్మాణ సామగ్రి, పెయింట్స్, జీర్ణ సంబంధ ఉత్పత్తులు (డైజెస్టివ్స్), టూత్పేస్టులు, పాల ఆధారిత పానీయాలు ఉన్నాయి.సినీతారలవే అధికంటీవీలో ప్రసారం అయిన ప్రకటనలలో 29 శాతం వాటా సెలెబ్రిటీలది. సెలెబ్రిటీల ప్రకటనల్లో సినీ తారల వాటా ఏకంగా 74 శాతం ఉంది. క్రీడాకారులు 4 శాతం, టీవీ తారలు 3 శాతం ఉన్నారు. 2025 జనవరి–జూన్ లో సెలెబ్రిటీలతో కూడిన ప్రకటనల సంఖ్య 2023 జనవరి–జూన్ తో పోలిస్తే 12 శాతం, గత ఏడాదితో ఇదే కాలంతో పోలిస్తే 20 శాతం తగ్గాయి. ఆన్ లైన్ గేమింగ్లో..ఆహారం, పానీయాల యాడ్స్లో పురుష సెలెబ్రిటీలు ఎక్కువగా కనిపించగా, వ్యక్తిగతసంరక్షణ ప్రకటనల్లో మహిళా సెలెబ్రిటీలు ఆధిపత్యం చెలాయించారు. ఆన్ లైన్ గేమింగ్ విభాగంలో వచ్చిన ప్రకటనల్లో అత్యధిక సంఖ్యలో 38 మంది తారలు తళుక్కుమన్నారు. జంటలతో కూడిన యాడ్స్లో దీపికా పదుకోన్ –రణ్వీర్ సింగ్, అనుష్క శర్మ–విరాట్ కోహ్లీలదే హవా. జంటల ప్రకటనల్లో వీరి వాటా దాదాపు 30 శాతం ఉంది. అక్షయ్ కుమార్–ట్వింకిల్ ఖన్నా, రణ్బీర్ కపూర్–ఆలియా భట్ సైతం యాడ్స్లో ప్రముఖంగా కనిపించారు. -
ఈఎంఐ.. విలాసమే.. విలాపమై!
‘అప్పు’డే తెల్లారిందా.. పాత సినిమాలో ఒక డైలాగ్. మిలేనియల్స్ (1981–96 మధ్య పుట్టినవారు).. జెన్ జీ (1997–2012 మధ్య జన్మించినవారు).. పరిస్థితి ఇలాగే ఉంది. అనవసరా లు, విలాసాల కోసం విపరీతంగా అప్పులు చేసేస్తున్నారు. లోన్యాప్లు.. సులభ వాయిదాలు.. వారిని ‘ఈజీగా’ అప్పుల బాట పట్టేలా చేస్తున్నాయి. ‘అప్పు చేయడం రోగం.. తీర్చకపోవడం ప్రమాదకరం అనేది గుర్తించకపోతే సమస్యలు తప్పవు’ అంటున్నారు నిపుణులు.క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ‘ట్రాన్స్ యూనియన్ సిబిల్’ ప్రకారం.. ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశంలో వ్యక్తిగతంగా రుణాలు తీసుకున్న వారు (యునిక్ ఇండివిడ్యువల్ బారోవర్స్) 28 కోట్ల మంది. ఆర్బీఐ లెక్కల ప్రకారం.. వ్యక్తిగత రుణాలు లేదా వ్యాపారం కోసం లేదా ఇతర అవసరాల కోసం రుణాలు తీసుకునేవారి సంఖ్యతోపాటు, తీసుకునే మొత్తం కూడా పెరిగింది. 2018 మార్చి నాటికి తలసరి రుణం రూ.3.41 లక్షలు ఉంటే 2023 మార్చికి రూ.3.8 లక్షలకు, 2025 మార్చి నాటికి రూ.4.77 లక్షలకు పెరిగింది.కనీసం 3 రుణాలతో..ఫిన్టెక్ సంస్థల వంటి బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ) చిన్నచిన్న మొత్తాల్లో ఇచ్చే రుణాలను జెన్ జీ, మిలేనియల్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. రూ.50వేల కంటే తక్కువ రుణాల్లో.. ఈ సంస్థలు ఇచ్చినవే 84.3 శాతం. ముఖ్యంగా ఇలా రుణం తీసుకుంటున్నవారిలో సుమారు 10 శాతం మంది సమయానికి చెల్లించడం లేదట. మరీ ముఖ్యంగా.. గత త్రైమాసికంలో ఇలా రుణం తీసుకున్నవారిలో 66 శాతానికిపైగా అప్పటికే కనీసం 3 రుణాలు తీసుకుని ఉన్నారని ఆర్బీఐ చెబుతోంది.అనవసర ఖర్చులకు 29 శాతం‘భారత్ ఎలా ఖర్చు చేస్తోంది: వినియోగదారుల వ్యయాల తీరుతెన్నులపై లోతైన అధ్యయనం’ పేరుతో కన్సల్టింగ్, ఫైనాన్షియల్ అడ్వైజరీ సేవల్లో ఉన్న పీడబ్ల్యూసీ ఇండియా సహకారంతో ఫిన్స్ టెక్ సాఫ్ట్వేర్ కంపెనీ పర్ఫియోస్ ఇటీవల ఒక నివేదికను రూపొందించింది. 30 లక్షల మంది టెక్–ఫస్ట్ వినియోగదారుల లావాదేవీల సమాచారాన్ని, వారు చేసే ఖర్చులను పరిశీలించింది.⇒ ప్రజలు చేసే మొత్తం వ్యయంలో హంగులు, ఆర్భాటాలు వంటి అనవసర ఖర్చులకు చేసేది 29 శాతం ఉంటోంది. ఈ ఖర్చుల్లో 62 శాతం కంటే ఎక్కువ ఫ్యాషన్, వ్యక్తిగత సంరక్షణ వస్తువుల షాపింగ్కు చేస్తున్నారు.⇒ తప్పనిసరి ఖర్చులకు చేసే వ్యయం 39% కాగా, అవసరాలకు 32% ఖర్చు చేస్తున్నారు. ⇒ అన్ని నగరాల్లోనూ వ్యక్తులు తమ ఆదాయంలో 33 శాతానికి పైగా నెల వాయిదాల (ఈఎంఐ) చెల్లింపులకు కేటాయిస్తున్నారు.ఈఎంఐ.. ఆదాయాన్ని మింగేస్తూనెల వాయిదాలు (ఈఎంఐలు).. చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కానీ, దీర్ఘకాలంలో ప్రమాదకరమైనవి. ఎప్పుడు ఎంత ఖర్చు పెడుతున్నామో తెలీదు. – ఇందులోని మరో ముఖ్యమైన విషయం. ఈఎంఐల మాటున ఉండే వడ్డీ. ⇒ ఒకేసారి చెల్లించకుండా భవిష్యత్తులో చెల్లించడం వల్ల.. భవిష్యత్తు లక్ష్యాలు, ఖర్చులు, అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు అప్పులు చేయాల్సిన దుస్థితి దాపురిస్తుంది.⇒ ఉద్యోగం పోయినా.. తక్కువ జీతం వచ్చే ఉద్యోగా నికి మారినా.. ఏదైనా అనారోగ్య సమస్యలాంటిది వచ్చి ఆర్థిక అత్యవసర పరిస్థితి వచ్చినా.. ఈఎంఐలు గుదిబండలా మారతాయి. ఒకటికి మించి ఈఎంఐలు ఉంటే ప్రతినెలా తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది.జీరో కాస్ట్ ఈఎంఐచాలామంది ‘జీరో కాస్ట్ ఈఎంఐ’ ఉందిగా అని ఈ మధ్య విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. పేరుకే జీరోకానీ, ఇది కూడా ఖరీదైనదే. ⇒ చాలా సందర్భాల్లో ఆయా కంపెనీలు / వేదికలు ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తాయి.⇒ ఈ లావాదేవీ జరిగిన తరువాత.. ఒకవేళ మనకు ఏదో విధంగా డబ్బు చేతికి అంది ఆ అప్పు తీర్చేద్దామంటే కుదరదు. ముందస్తు చెల్లింపులమీద చార్జీ ఉంటుంది. ⇒ మామూలు ఈఎంఐలానే, ఏదైనా ఒక్క నెలలో చెల్లింపు చేయలేకపోయినా.. ఆలస్యంగా చేసినా.. మొత్తం బకాయిపై వడ్డీ చెల్లించాలి. అలాగే ఆ రుణం తీసుకున్నప్పటి నుంచి జరిపే అలాంటి అన్ని లావాదేవీలపైనా వడ్డీ చెల్లించాలి. ఇలాంటి రకరకాల చార్జీల భారం పడుతుంది.⇒ ఆలస్యంగా చెల్లించడం వల్ల క్రెడిట్ స్కోర్పైనా ప్రభావం పడుతుంది.ఏమిటి పరిష్కారం?ఏది కొనాలని అనిపించినా.. ఒక 10 నిమిషాల పాటు ఆలోచించాలి. మూడు ప్రశ్నలు వేసుకోవాలి.⇒ ఇది అత్యవసరమా? లేక విలాసం కోసం కొంటున్నానా?⇒ దీనిపై చేస్తున్న ఖర్చు నెలవారీ బడ్జెట్ను ఎలా ప్రభావితం చేస్తుంది?⇒ ఇది లేకుండా నేను ఉండలేనా?ఈ ప్రశ్నలకు మీ మనసు చెప్పే సమాధానాలతో మీరు సంతృప్తి చెందాక కొనుగోలు చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకోండి.⇒ వస్తువుల్లో కాకుండా మనుషుల్లో.. అనుబంధాలు, ఆప్యాయతలు, స్నేహాలలో ఆనందాన్ని వెతుక్కోవడం మొదలుపెట్టండి. అంతిమంగా.. అప్పు లేదా ఈఎంఐలు మీ జీవితాన్ని శాసించకుండా చూసుకోండి. ఆనందం, విలాసం కావాల్సిందే.. కానీ, దాని కోసం మీ ఆర్థిక హద్దులు దాటకండి.. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా ఇతరులను చూసి నిర్ణయాలు తీసుకోకండి.ఈఎంఐ.. తత్వం అర్థమై..ఈఎంఐల తత్వం తెలిసిన వాళ్లు వీటికి కొత్త రూపాలు ఇచ్చారు. అవి..⇒ ఎండింగ్ మై ఇన్కమ్ లేదా ఎంప్టీయింగ్ మై ఇన్కమ్ లేదా ⇒ ఈటింగ్ మై ఇన్కమ్ (నా ఆదాయాన్ని తినేస్తోంది)⇒ ఎవ్రీ మంత్ అయామ్ బ్రోక్ (ప్రతినెలా నన్ను ఏడిపిస్తోంది)⇒ ఎక్స్క్యూజ్ మై ఇగ్నోరెన్స్ (నా అజ్ఞానాన్ని మన్నించు)⇒ ఎండ్లెస్ మంత్లీ ఇన్కన్వీనియన్స్ (అంతులేని నెలవారీ అసౌకర్యం)⇒ ఎవ్రీ మంత్ ఇంటరప్టెడ్ (ప్రతినెలా అంతరాయం) ⇒ ఎవ్రీ మంత్ ఇన్ డెటెడ్ (ప్రతినెలా అప్పులు) -
హైదరాబాద్లో ఇక్కడే తరచూ ప్రమాదాలు
హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గించడానికి సన్నాహాలు చేస్తున్న నగర ట్రాఫిక్ విభాగం అధికారులు బ్లాక్స్పాట్స్పై దృష్టి పెట్టారు. తరచూ ప్రమాదాలకు కారణమవుతున్న ప్రాంతాలను గుర్తించి, కారణాలను అధ్యయనం చేయడంతో పాటు నివారణ చర్యలకు కసరత్తు చేస్తున్నారు. నగరంలోని ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల పరిధిలో నిర్వహించిన స్టడీ ఆధారంగా 54 బ్లాక్స్పాట్స్ ఉన్నట్లు గుర్తించారు. గడిచిన రెండేళ్ల గణాంకాల ఆధారంగా దీన్ని నిర్ధారించారు. – సాక్షి, సిటీబ్యూరోసిటీలో బ్లాక్స్పాట్స్గా పరిగణించే ప్రమాదకరమైన ప్రాంతాలను గుర్తించడానికి ట్రాఫిక్ పోలీసులు శాంతిభద్రతల విభాగం అధికారులతో సమన్వయం ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల నిరోధానికి ట్రాఫిక్ పోలీసులు పని చేస్తారు. అయితే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దానిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసేది మాత్రం లా అండ్ ఆర్డర్ పోలీసులే. ఈ నేపథ్యంలోనే వారితో కలిసి ట్రాఫిక్ పోలీసులు అధ్యయనం చేశారు. 2023–24లో సిటీలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల జాబితాలను సేకరించారు. ఒకే ప్రాంతం లేదా స్టెచ్లో రెండు కంటే ఎక్కువ యాక్సిడెంట్స్ (Accidents) చోటు చేసుకున్న ఏరియాలను గుర్తించారు. వీటిలో యాదృచి్ఛకంగా జరిగిన వాటిని మినహాయించారు. ఇంజినీరింగ్ సహా ఇతర లోపాల వల్ల చోటు చేసుకున్న ప్రమాదాలకు ప్రాధాన్యం ఇస్తూ బ్లాక్స్పాట్స్గా నిర్ధారించారు. అనేకం ‘చావు’రస్తాలే.. నిత్యం ప్రమాదాలు చోటు చేసుకునే ప్రాంతాల్లో అత్యధికం చౌరస్తాలు, జంక్షన్లే ఉంటున్నాయి. రద్దీ వేళలు, సిగ్నల్స్ యాక్టివ్గా ఉండే సమయంలో కంటే మిగిలిన సమయాల్లోనే ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ 54 బ్లాక్స్పాట్స్లో దాదాపు 40 శాతం చౌరస్తాల్లో ఉన్నవే. ఆ ప్రాంతాలు సైతం హైదరాబాద్–సైబరాబాద్–రాచకొండ సరిహద్దుల్లో ఉన్నవి కొన్ని ఉండటం గమనార్హం. వీటిలో చోటుచేసుకుంటున్న ప్రమాదాల్లో మరణించిన/క్షతగాత్రులైన వారిలో 40 శాతం పాదచారులు, మరో 40 శాతం ద్విచక్ర వాహనచోదకులే ఉంటున్నారు. ఇవే ప్రధాన కారణాలు పరిమితికి మించిన వేగం (ప్రదానంగా ఐఆర్ఆర్లో..) ⇒ మద్యం తాగి వాహనాలు నడపటం ⇒ మలుపులు ఉన్న చోట్ల డివైడర్లు, మీడియమ్స్ లేకపోవడం ⇒ అత్యంత సమస్యాత్మకంగా(బ్లైండ్) ఉన్న మలుపులు ⇒ కీలక సూచనలు చేసే సైనేజ్ బోర్డులు లేకపోవడం ⇒ ఇరుకైనా రోడ్లు, ఆపై అక్కడే ఉంటున్న ఆక్రమణలు ⇒ రోడ్డు ఇంజినీరింగ్ను పట్టించుకోకుండా రహదారి నిర్మాణం ⇒ రహదారులపై హఠాత్తుగా చేపడుతున్న మరమ్మతులు ⇒ క్యారేజ్ వేలో తొలగించకుండా వదిలేసిన చెట్లు, కరెంటు స్తంభాలు ⇒ అవసరమైన స్థాయిలో విద్యుత్ దీపాలు లేకపోవడం ⇒ వాహనచోదకులు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం ⇒ నో–ఎంట్రీలోకి వాహనాలతో దూసుకుపోవడం ⇒ రోడ్ మార్కింగ్ పక్కగా లేకపోవడం, శాస్త్రీయత కొరవడటం‘ఇన్నర్’లోనే అత్యధికంగా.. నగర ట్రాఫిక్ కమిషనరేట్ పరిధిలో 28 ట్రాఫిక్ పోలీసుస్టేషన్లు ఉన్నాయి. వీటిలోని కేవలం కొన్నింటిలో మాత్రమే బ్లాక్స్పాట్స్ లేవని తేలింది. అత్యధిక ఠాణాల పరిధిలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకునే బ్లాక్స్పాట్స్ ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. వీటిలోనూ ఒక ఠాణా పరిధిలో ఐదు, మరోదాని పరిధిలో నాలుగు, నాలుగు పోలీసుస్టేషన్ల పరిధిలో మూడేసి, తొమ్మిదింటిలో రెండు చొప్పున యాక్సిడెంట్స్ స్పాట్స్ ఉన్నట్లు ట్రాఫిక్ విభాగం అధికారులు గుర్తించారు. ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్డు(ఐఆర్ఆర్)లో విస్తరించి ఉన్న ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల పరిధుల్లోనే బ్లాక్స్పాట్స్ ఎక్కువగా ఉంటున్నాయని తేలింది.ఏ ఠాణా పరిధిలో ఎన్ని, ఎక్కడ? ⇒ బోయిన్పల్లి: 5 (డెయిరీ ఫాం ఎక్స్ రోడ్, బోయిన్పల్లి చెక్పోస్టు, బోయిన్పల్లి ఎక్స్ రోడ్, సీటీఓ) ⇒ లంగర్హౌస్: 4 (బాపూఘాట్, లక్ష్మీనగర్, మొఘల్ క నాలా, దర్గా) ⇒ గాంధీనగర్: 3 (ట్యాంక్బండ్పైన చిల్డ్రన్ పార్క్, బడేమియా కబాబ్, లేపాక్షి) ⇒ ఎస్సార్నగర్: 3 (ఈఎస్ఐ, ఉమేష్చంద్ర స్టాట్యూ, మైత్రీవనం) ⇒ అఫ్జల్గంజ్: 3 (అఫ్జల్గంజ్ టి జంక్షన్, సీబీఎస్, చాదర్ఘాట్ చౌరస్తా) ⇒ బేగంపేట: 3 (హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, పీఎన్టీ, రసూల్పుర చౌరస్తా) ⇒ చాదర్ఘాట్: 2 (నల్లగొండ చౌరస్తా, మలక్పేట గంజ్) ⇒ మలక్పేట: 2 (మూసరాంబాగ్ చౌరస్తా, వైభవ్ బస్టాప్) ⇒ బహదూర్పుర: 2 (పురానాపూల్ శ్మశానవాటిక, జూపార్క్ చౌరస్తా) ⇒ తిరుమల గిరి: 2 (తిరుమలగిరి చౌరస్తా, లోతుకుంట) ⇒ బంజారాహిల్స్: 2 (కేబీఆర్ పార్క్, రోడ్ నెం.3 జంక్షన్) ⇒ చాంద్రాయణగుట్ట: 2 (బండ్లగూడ చౌరస్తా, ఒమర్ హోటల్) ⇒ గోపాలపురం: 2 (గురుద్వార, రైల్ నిలయం) ⇒ నల్లకుంట: 2 (విద్యానగర్ చౌరస్తా, తిలక్నగర్ చౌరస్తా) ⇒ ఉస్మానియా యూనివర్సిటీ: 2 (హబ్సిగూడ చౌరస్తా, తార్నాక చౌరస్తా) ⇒ జూబ్లీహిల్స్: 1 (జూబ్లీహిల్స్ చెక్పోస్టు) ⇒ చిక్కడపల్లి: 1 (వీఎస్టీ చౌరస్తా) ⇒ గోల్కొండ: 1 (రామ్దేవ్గూడ) ⇒ కార్ఖానా: 1 (బోయిన్పల్లి మార్కెట్ యార్డ్) ⇒ లాలాగూడ: 1 (మెట్టుగూడ చౌరస్తా) ⇒ బొల్లారం: 1 (అల్వాల్ రైతుబజార్) ⇒ సైఫాబాద్: 1 (ఓల్డ్ సైఫాబాద్ ఠాణా) ⇒ బేగంబజార్: 1 (ఎంజే మార్కెట్) ⇒ చాంద్రాయణగుట్ట: 1 (కేశవగిరి టి జంక్షన్) ⇒ హుమాయున్నగర్: 1 (రేతిబౌలి) ⇒ కాచిగూడ: 1 (నిబోలిఅడ్డా వద్ద పాత ఠాణా) ⇒ అంబర్పేట్: 1 (త్రిశూల్ బార్) ⇒ మహంకాళి: 1 (ప్లాజా చౌరస్తా) ⇒ సుల్తాన్బజార్: 1 (కోఠి ఆంధ్రాబ్యాంక్) ⇒ సంతోష్నగర్: 1 (పిసల్బండ చౌరస్తా) చదవండి: హైదరాబాద్కు మరో వందేభారత్ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ సహకారంతో.. నగరంలోని బ్లాక్స్పాట్స్పై అధ్యయనానికి ట్రాఫిక్ విభాగంలో ఇంజినీరింగ్ సెల్ పని చేస్తోంది. మృతులతో కూడిన ప్రమాదాలు చోటు చేసుకున్న ప్రాంతాలను జీహెచ్ఎంసీ (GHMC) అధికారులతో కలిసి అధ్యయనం చేస్తున్నాం. ప్రమాదాలకు కారణాలను గుర్తించి బల్దియా, జాతీయ రహదారుల సంస్థలకు సిఫార్సులు చేస్తున్నాం. ప్రతి మూడు నెలలకు కలెక్టర్ నేతృత్వంలో జరిగే రోడ్ సేఫ్టీ (Road Safety) మీటింగ్స్లో వీటిని ప్రతిపాదించడంతో పాటు పనుల పురోగతినీ సమీక్షిస్తున్నాం. ప్రమాదాలను నియంత్రించేందుకు షార్ట్టర్మ్, లాంగ్టర్మ్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నాం. స్వల్ప మార్పు చేర్పులను ట్రాఫిక్ అధికారులే చేపడతారు. పెద్ద మొత్తంతో ముడిపడిన వాటి విషయంలో స్వచ్ఛంద సంస్థల సహాయం కోరుతున్నాం. ఇప్పటికే ఈ కోణంలో సర్వేజనా ఫౌండేషన్ సహాయం అందిస్తూ కొన్ని చర్యలు తీసుకుంటోంది. బ్లాక్స్పాట్స్ను నిర్మూలించడంతో పాటు నగరంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యల్ని సూచించాల్సిందిగా ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాను కోరాం. ప్రస్తుతం వాళ్లు నగరవ్యాప్తంగా అధ్యయనం చేస్తున్నారు. నివేదిక అందిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటాం. – జోయల్ డెవిస్, హైదరాబాద్ ట్రాఫిక్ చీఫ్ -
ఒత్తిడి.. ఆందోళన ఇవేనయా ప్రపంచాన!
ఆర్థికంగా ఎదగాలన్న ఆశ, సామాజికంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలన్న ఆకాంక్ష, కీర్తి ప్రతిష్టల కోసం పాకులాట.. ఈ పోటీ ప్రపంచంలో మనుషుల్ని మానసిక రోగులుగా మార్చేస్తున్నాయి. పైకి ఆరోగ్యంగా కనిపిస్తున్నా.. మనుషుల్లో ఒత్తిడులు, మనో వైకల్యాలు అధికంగా ఉంటున్నాయి. అనుకోనివి జరగడం ‘ఆందోళన’లోకి, అనుకున్నవి జరగకపోవటం ‘ఒత్తిడి’లోకి మనుషుల్ని నెట్టేస్తున్నాయి.. ప్రాణాల మీదకుతెస్తున్నాయి.. ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక స్పష్టం చేసింది. - సాక్షి, స్పెషల్ డెస్క్ ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న ప్రతి 100 మరణాలలో ఒకటి ఆత్మహత్యేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తాజాగా వెల్లడించింది. 2021లో మొత్తం 7,27,000 మంది వివిధ వయసులలోని వారు ఆత్మహత్య కారణంగా ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. 20 కంటే ఎక్కువ ఆత్మహత్యా యత్నాలలో ఒక ఆత్మహత్య మరణం సంభవిస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. మొత్తం మీద ప్రపంచంలో 100 కోట్ల మందికి పైగా వివిధ మానసిక ఆరోగ్య రుగ్మతలతో జీవిస్తున్నారని నివేదించింది. మెంటల్ హెల్త్ అట్లాస్ 2024 ‘వరల్డ్ మెంటల్ హెల్త్ టుడే’, ‘మెంటల్ హెల్త్ అట్లాస్ 2024’అనే రెండు కొత్త అధ్యయన నివేదికల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వివరాలన్నిటినీ పొందుపరిచింది. రానున్న వారాల్లో, ‘మెంటల్ హెల్త్ అట్లాస్ 2024’నివేదికలో భాగంగా దేశాల వారీగా డేటాను విడుదల చేయనుంది. కోవిడ్ తర్వాత మానసిక అనారోగ్యాలపై డబ్ల్యూహెచ్ఓ చేపట్టిన తొలి కీలకమైన అధ్యయనాలివి. ప్రధాన మానసిక రుగ్మతలుమానవాళిని చుట్టు ముడుతున్న మానసిక రుగ్మతల్లో ‘ఆందోళన’, ‘ఒత్తిడి’లను ప్రధానమైనవిగా డబ్ల్యూహెచ్ఓ గుర్తించింది. 2021లో, అన్ని మానసిక రుగ్మతల్లో ఇవి రెండూ ‘మూడింట రెండు వంతుల’కంటే ఎక్కువగా ఉన్నట్లు కనుగొంది. నివేదిక ప్రకారం – 2011–2021 మధ్య మానసిక రోగుల సంఖ్య ప్రపంచ జనాభా కంటే వేగంగా పెరిగింది! దశాబ్దం క్రితం జనాభాలో 0.9 తొమ్మిది శాతంగా ఉన్న మానసిక రుగ్మతలు 13.6 శాతానికి చేరాయి. లక్ష్యానికి దూరంగా ఐరాస అన్ని దేశాలలో, అన్ని సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో యువతలో సంభవించే మరణాలలో ఆత్మహత్యలే ఎక్కువగా ఉంటున్నాయి. 2030 నాటికి కనీసం మూడింట ఒక వంతు ఆత్మహత్యలను తగ్గించటానికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా ఐక్యరాజ్య సమితి పెట్టుకున్న లక్ష్యం నెరవేరేలా కనిపించటం లేదు. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ఆ గడువు నాటికి 13 శాతం తగ్గుదల మాత్రమే సాధ్యం అయ్యేలా ఉందని డబ్ల్యూహెచ్ఓ అంచనా వేస్తోంది. భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లు » తగినన్ని మానసిక చికిత్స ఆసుపత్రులు లేకపోవటం » ఉన్నవాటిలో కూడా నిర్వహణ పరమైన లోపాలు » రోగుల పట్ల సిబ్బంది క్రూరత్వం, నిర్లక్ష్యం » విధి నిర్వహణలో ఉదాసీనత, నిధుల లేమి » శిక్షణ పొందిన నర్సులు, సోషల్ వర్కర్లు, సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు, కౌన్సెలర్లు, ఇతర ఆరోగ్య కార్యకర్తల తీవ్ర కొరత. 40 దాటితే సమస్యలే» 2021లో ప్రపంచ వ్యాప్తంగా 5 కోట్ల 70 లక్షల మందిలో మానసిక రుగ్మతలు నమోదు అయ్యాయి. (బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్ హెల్త్, న్యూరో సైన్సెస్ నివేదిక ప్రకారం ఇండియాలో 3 కోట్ల మంది తీవ్రమైన మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు) » మొత్తం రుగ్మతల్లో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువగా ఆందోళన, ఒత్తిడి ఉంటున్నాయి. » 2011– 2021 మధ్య, మానసిక రోగుల సంఖ్య ప్రపంచ జనాభా కంటే వేగంగా పెరిగింది. » పురుషులలో ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండటం, బలహీనమైన బంధాలు, (అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ – ఏడీహెచ్డీ, ఆటిజం స్పెక్ట్రమ్) వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. 18 ఏళ్లలోపు వారిలో.. వయసుకు తగ్గ మానసిక ఎదుగుదల, నైపుణ్యాలు లేకపోవడం వంటివి ఎక్కువగా ఉంటున్నాయి. » స్త్రీలలో ప్రధాన సమస్యలు.. ఆందోళన, ఒత్తిడి, ఈటింగ్ డిజార్డర్ (ఎక్కువ లేదా తక్కువ తినడం వంటి రుగ్మతలు). » నలభై ఏళ్లు దాటాక ఒత్తిడి, ఆందోళన పెరిగిపోతున్నాయి. » 50 – 69 సంవత్సరాల మధ్య మనోవైకల్యాలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. -
ఫోన్ చేజారితే....గుండె పగిలినట్టే..
నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు.. చేతిలో ఫోన్ ఉండాల్సిందే. నిద్ర లేకపోయినా, తిండి తినకపోయినా ఫోన్ ఉంటే చాలనుకునే జనమూ ఉన్నారు. అంతలా స్మార్ట్ఫోన్స్ జీవితంలో భాగమయ్యాయి. అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ ఉపకరణం చేజారితే గుండె పగిలినంత పని అవుతుంది. ఈ ఫీలింగ్ ఏ ఒక్కరికో పరిమితం కాదు. దేశంలో అత్యధికులది ఇదే మాట. – సాక్షి, స్పెషల్ డెస్క్టెక్నాలజీ మార్కెట్ రీసెర్చ్ కంపెనీ కౌంటర్పాయింట్ రీసెర్చ్ తాజాగా చేపట్టిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. తమ స్మార్ట్ఫోన్ పగిలిపోయినప్పుడు, కింద పడిపోయినప్పుడు కలత, భయాందోళనకు గురైనట్లు సర్వేలో పాల్గొన్న 95 శాతం మంది తెలిపారు. స్మార్ట్ఫోన్ కొనుగోలు నిర్ణయాలను మన్నిక ప్రభావితం చేస్తోంది. కాబట్టే మన్నిక చాలా ముఖ్యమైన అంశంగా 79 శాతం యూజర్లు భావిస్తున్నారు. తరచూ వాడుతుంటారు కాబట్టి చేతి నుంచి ఫోన్ కింద పడడం సహజం. అలా పడినప్పుడు పాడవకుండా బలమైన స్క్రీన్ ఉండాలని ఎక్కువమంది కోరుకుంటున్నారు. అలాగే బలమైన ఫ్రేమ్, నీట తడిసినా ఏమీకాని వాటర్ రెసిస్టెన్స్ సౌకర్యమూ ఉండాల్సిందేనంటున్నారు. డేటా కోల్పోతామని.. ఫోన్ అంటేనే ఒక ప్రపంచం. ప్రతి ఒక్కరికీ భావోద్వేగాలతో ముడిపడినది. ఫోన్ పాడైతే డేటా నష్టపోతామన్న భయం చాలామందిలో ఉంది. దాదాపు 89 శాతం మంది ఈ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఫొటోలు, వీడియోలు, బ్యాంకింగ్ వివరాలు, కాంటాక్ట్లు, చాట్లు డిలీట్ అవుతాయని ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. అందుకే 90 శాతం మంది కస్టమర్లు తమ ఫోన్లకు కవర్స్, స్క్రీన్ గార్డ్స్తోపాటు బీమా తీసుకుంటున్నారు. ఫోన్ వేడెక్కడం (41 శాతం), బ్యాటరీ సమస్యలు (32), ప్రమాదవశాత్తు నష్టం వాటిల్లడం (32 శాతం) వంటి సమస్యలు సైతం యూజర్లను ఆందోళన కలిగిస్తున్నాయి. గుదిబండగా మరమ్మతు ఫోన్స్ రిపేర్ గుదిబండగా భావిస్తున్నారు. రిపేర్ అంటేనే ఖరీదైన వ్యవహారంగా మారిందని కస్టమర్లు చెబుతున్నారు. 70 శాతం కంటే ఎక్కువ మంది వినియోగదారులు మరమ్మతు ఖర్చుల కోసం రూ.2,000 కంటే ఎక్కువ ఖర్చు చేశారని సర్వేలో తేలింది. దాదాపు 29 శాతం మంది కస్టమర్లు ఫోన్ రిపేర్ కోసం రూ.5,000 కంటే ఎక్కువ వెచ్చించినట్టు తెలిపారు. ‘మన్నిక’పై అధ్యయనం స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఒప్పో ఇండియా తరఫున కౌంటర్పాయింట్ రీసెర్చ్ ఈ సర్వే చేపట్టింది. భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో ‘మన్నిక’అనే అంశం పాత్రను అర్థం చేసుకోవడం లక్ష్యంగా అధ్యయనం జరిగింది. దేశంలోని ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాల్లో 4,564 మంది వినియోగదారుల నుంచి సమాచారం సేకరించి నివేదిక రూపొందించారు. » 78% మంది వినియోగదారులు తమ ఫోన్స్ దెబ్బతింటాయనే భయంతో వర్షం, తీవ్ర ఎండ వంటి కఠిన పరిస్థితుల్లో ఉపయోగించడం లేదు.» 95% మంది యూజర్లు తమ ఫోన్ పగిలిపోయినప్పుడు, పడిపోయినప్పుడు కలత, ఆందోళనకు గురవుతున్నారు.» 79% మంది వినియోగదారులు స్మార్ట్ఫోన్ మన్నిక అత్యంత ముఖ్యమైన అంశంగా భావిస్తున్నారు.» 89% మంది తమ ఫోన్ పాడైతే వ్యక్తిగత డేటాను కోల్పోతామని భయపడుతున్నారు. ఫొటోలు, వీడియోలు, బ్యాంకింగ్ వివరాలు, కాంటాక్ట్లు, చాట్స్ డిలీట్ అవుతాయని ఆందోళన చెందుతున్నారు. -
అంతగా అక్కడ ఏం నచ్చింది జక్కన్న?
ఎస్ఎస్ రాజమౌళి.. లార్జర్ దెన్ లైఫ్ సినిమాలకు కేరాఫ్ దర్శకుడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ప్రతీ చిత్రం.. భావోద్వేగ దృశ్యవిచిత్రమే. భారీ స్థాయిలో నిర్మాణం.. అద్భుతమైన హీరోయిజం.. హైస్టాండర్డ్ విజువల్ ఎఫెక్ట్స్తో ఆయన చెక్కే చిత్రాలు.. ప్రపంచం మొత్తం భారత చలనచిత్ర పరిశ్రమ వైపు చూసేలా చేశాయి. అయితే పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్పై ఇప్పుడు ఆయన దృష్టి పడింది.జక్కన్న ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్బాబుతో (SSMB 29) ఓ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్తో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. తూర్పు ఆఫ్రికా దేశం కెన్యాలో షూటింగ్ చేసుకుంటోందీ చిత్రం. ఆ దేశ మంత్రి ముసాలియా ముదావాదిని మూవీ టీమ్ మర్యాదపూర్వకంగా కలిస్తే.. ఆసక్తికర విషయాన్నే ఆయన తెలియజేశారు.Kenya this past fortnight became the stage for one of the world’s greatest filmmakers, @ssrajamouli, the visionary Indian director, screenwriter, and storyteller whose works have captured the imagination of audiences across continents. Rajamouli, with a career spanning over two… pic.twitter.com/T1xCGVXQ64— Musalia W Mudavadi (@MusaliaMudavadi) September 2, 2025రాజమౌళి రెండు దశాబ్దాలుగా చలన చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. చాలా శక్తివంతమైన కథనాలను, దృశ్యాలను, లోతైన సాంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పడంలో ఆయన ఎంతో ప్రసిద్ధి చెందారు. తూర్పు ఆఫ్రికా అంతటా పర్యటించి 120 మందితో కూడిన రాజమౌళి టీమ్ కెన్యాను ఎంచుకుంది. మసాయి మరా మైదానాల నుంచి మొదలు సుందరమైన నైవాషా, ఐకానిక్ అంబోసెలి వంటి ప్రాంతాలు ఆసియాలోనే అతిపెద్ద చలనచిత్రంగా తెరకెక్కుతున్న మూవీలో భాగం కాబోతున్నాయి.సుమారు 120 దేశాల్లో ఈ మూవీని విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికిపైనే చేరువయ్యే అవకాశం ఉంది. కెన్యాలో షూటింగ్ చేయడం ఒకమైలురాయిగా నిలిచిపోతుంది. ప్రపంచ వేదికపై మా దేశ అందాలను, ఆతిథ్యాన్ని, సుందర దృశ్యాలను చూపడంలో ఈ సినిమా శక్తిమంతంగా పనిచేయనుంది. ఎస్ఎస్ఎంబీ 29 చిత్రంతో కెన్యా తన చరిత్రను ప్రపంచంతో పంచుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ విషయంలో గర్వంగా ఉంది అని ట్వీట్ చేశారాయన. సో.. మహేష్ సినిమాతో సరికొత్త ప్రపంచాన్నే ఆవిష్కరించేందుకు రాజమౌళి సిద్ధమయ్యారన్నమాట. మరి అంతగా ఆయన్ని ఆకర్షించిన విషయాలు అక్కడేం ఉన్నాయి?..కెన్యాలోని మసాయి మరా, లేక్ నైవాషా, అంబోసెలీ నేషనల్ పార్క్.. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రకృతి, వన్యప్రాణి, సఫారీ గమ్యస్థానాలు. వీటిని ఒక్కొక్కటిగా పరిశీలిస్తే..మసాయి మరా నేషనల్ రిజర్వ్ (Masai Mara National Reserve).. బిగ్ ఫైవ్కు ఆవాసం. అంటే.. సింహం, చిరుతపులి, ఏనుగు, గేదె, రైనోలు ఇక్కడ నివసిస్తున్నాయి. ప్రతి సంవత్సరం జూలై-అక్టోబర్ మధ్యలో లక్షలాది వన్యప్రాణులు (విల్డీబీస్ట్, జెబ్రాలు) టాంజానియాలోని సెరెంగెటి నుంచి మసాయి మరాకు వలస వస్తాయి.సుమారు 500కి పైగా పక్షుల జాతులు ఆవాసం ఉన్నట్లు అంచనా. ఉదయం, సాయంత్ర వేళల్లో గేమ్ డ్రైవ్లు ద్వారా వన్యప్రాణులను దగ్గరగా చూడొచ్చు.అంబోసెలీ నేషనల్ పార్క్ (Amboseli National Park).. ఆఫ్రికాకు మాత్రమే కాదు.. ప్రపంచంలోనే అత్యున్నత శిఖరంగా పేరున్న కిలిమంజారో పర్వతశ్రేణి నేపథ్యంగా కనిపిస్తుంది ఈ పార్క్. ఆఫ్రికన్ ఏనుగుల గుంపులకు ఇది ఎంతో ప్రసిద్ధి. సింహాలు, చిరుతలు, జిరాఫీలు, జీబ్రాలు అనేక ఇతర జాతులు కనిపిస్తాయి. పొడి ప్రాంతం అయినప్పటికీ ఇక్కడి నీటి వనరులు వన్యప్రాణులకు ఆకర్షణగా నిలుస్తాయి.లేక్ నైవాషా (Lake Naivasha).. అనేక రకాల పక్షులు, నీటిలో నివసించే వన్యప్రాణులతో ఈ సరస్సు జీవవైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంటుంది. ప్రైవేట్ అభయారణ్యం.. క్రెసెంట్ ఐల్యాండ్లో జిరాఫీ, జీబ్రాలు, ఇతర మృగాలు స్వేచ్ఛగా సంచరిస్తుంటాయి. దీంతో ఫొటోగ్రాఫర్లు, నేచర్ లవర్స్కి ఇదొక స్వర్గధామం. నైవాషా ఐకానిక్ సరస్సులో హిప్పోలు(నీటి ఏనుగులు), పక్షుల రాకపోకలతో కనువిందు చేసే దృశ్యాలను చూడటానికి బోటు ప్రయాణాలు అందుబాటులో ఉన్నాయి.ఈ మూడింటితో పాటు అరుదైన జాతుల వన్యప్రాణుల ఆవాసం సంబురు (Samburu)లోనూ చిత్రీకరణ జరగవచ్చని తెలుస్తోంది. గ్రెవీస్ జెబ్రా (Grevy's Zebra), సోమాలీ ఆస్ట్రిచ్ (Somali Ostrich), రెటిక్యులేటెడ్ జిరాఫీ (Reticulated Giraffe), బేసియా ఒరిక్స్ (Besia Oryx), గెరెనుక్ (Gerenuk) ఈ ఐదు అరుదైన జాతుల వల్ల ఈ ప్రాంతాన్ని ‘సంబురు స్పెషల్ ఫైవ్’ అని పిలుస్తారు. వన్యపప్రాణి పరిశోధకులు, ఫొటోగ్రాఫర్లకు ఇది వరల్డ్ ఫేవరెట్ స్పాట్గా పేరుంది.భారతీయ చిత్ర పరిశ్రమ.. కెన్యా అడవులను ప్రధాన లొకేషన్గా ఎంచుకోవడం ఇదే మొదటిసారి!!. పైగా మసాయి మరా, అంబోసెలీ, లేక్ నైవాషా అద్భుతమైన ప్రకృతి దృశ్యాలతో, వన్యప్రాణులతో నిండి కెన్యా సఫారీకి ఇవి ఒక కంప్లీట్ ప్యాకేజీగా ఉన్నాయి. దీనికి తోడు చిత్రంలో మహేష్ బాబు పాత్ర ఒక రగ్డ్ ఎక్స్ప్లోరర్ రోల్లో కనిపిస్తారని.. అరుదైన ఔషధం కోసం వెతుకుతూ అడవుల్లో ప్రయాణిస్తారనే స్టోరీ లైన్ ఒకటి తెరపైకి వచ్చింది. సో.. ఈ తరహా కథకు పురాతనమైన.. మనిషి నియంత్రణలో లేని అడవులు(అన్టేమ్డ్) అవసరమని రాజమౌళి అనుకుని ఉండొచ్చు. పైగా కెన్యా లాంటి దేశం భారతీయ సినిమాకు కొత్త వేదికగా నిలవడమే కాకుండా పాన్ వరల్డ్ ప్రేక్షకులనూ ఆకట్టుకునే ప్రయత్నం కూడా. మొదట్లోనే చెప్పుకున్నట్లు.. లార్జర్ దెన్ లైఫ్ అనిపించాలంటే విలక్షణమైన కెన్యా దేశపు లొకేషన్లు ఈ విజన్కు సరిపోతాయి అని జక్కన్న ఫిక్స్ అయి ఉండొచ్చు. -
లలితం... అజరామరం ఆయన పాట!
“రమేశ్ నాయుడు ఈ పదం సంగీత ప్రియులకు అమృతంలా తోస్తుంది. తన వేలి చివరల నుంచి సంగీతాన్ని అలలుగా విసిరేసే స్వర బ్రహ్మ ఆయన! గుండెను లాలించి మత్తులో ఓలలాడించే మెలొడీలు సృష్టించాలంటే ఆయన తర్వాతే ఎవరైనా. ఈ తరానికి రమేశ్ నాయుడి పేరు తెలియకపోవచ్చు. కానీ “శివరంజని, ‘మేఘ సందేశం’, ‘ముద్ద మందారం’, “శ్రీవారికి ప్రేమలేఖ, “స్వయంకృషి లాంటి సినిమాల కోసం ఆయన స్వరపరిచిన పాటలు మాత్రం సుపరిచితం. మాధుర్య ప్రధానమైన పాటలే కలకాలం నిలుస్తాయని రమేశ్ నాయుడు గట్టిగా నమ్మేవారు. సాహిత్యానికే బాణీలు కట్టేవారు. అందుకే ఆ పదాల సొగసు చెక్కు చెదరదు, భావం నేరుగా మనసును తాకుతుంది.ఇదీ రమేశ్ నాయుడి స్వర ప్రస్థానం!పసుపులేటి రమేశ్ నాయుడు 1933, నవంబర్ 25న కృష్ణాజిల్లా కొండపల్లిలో జన్మించారు. తెలుగు కంటే హిందీ పాటలే ఆయన్ను ఎక్కువగా ప్రభావితం చేశాయి. హిందీ సినిమాల్లో గాయకుడు కావాలన్న కోరికతో ఇల్లొదిలి బొంబాయి చేరుకున్నారు. కొన్నాళ్ళు ఢక్కాముక్కీలు తిన్నాక బి.ఆర్. చోప్రాను చేరుకోగలిగారు. ఆయన కోరిక మేరకు కొన్ని బాణీలు కట్టారు. అవి చూసి ఆశ్యర్యపోయిన చోప్రా ఆయన్ను AMV కంపెనీకి రికమెండ్ చేశారు. అలా 14 ఏళ్ళ వయసులోనే రమేశ్నాయుడు AMV కంపెనీలో పని చేశారు. 16 ఏళ్ళ వయసులో “బంద్వల్ పహీజ్ఙా అనే మరాఠీ సినిమాకి సంగీతం అందించారు. హిందీలో ఆయన చేసిన ఏకైక సినిమా “హామ్లెట్“. 1954లో విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆడకపోవడం ఆయన్ను నిరాశపరిచింది. ఆ తర్వాత అనారోగ్య కారణాల వల్ల రమేశ్ నాయుడు మద్రాసు వచ్చేశారు. 1957లో ప్రముఖ నటి సి. కృష్ణవేణి నిర్మించిన “దాంపత్యం సినిమాకు సంగీతం అందించారు. అదే ఆయనకు తొలి తెలుగు చిత్రం.1959లో “మనోరమ సినిమా కోసం హిందీ గాయకుడు తలత్ మెహమూద్ తో రమేశ్ నాయుడు ఏకంగా నాలుగు పాటలు పాడించారు. కానీ పేరు వస్తున్న టైంలో కలకత్తాకి మకాం మార్చారు. అక్కడ ఒక బెంగాలీని పెళ్ళి చేసుకున్నారు. అక్కడే పదేళ్ళ పాటు బెంగాలీ, నేపాలీ, ఒరియా సినిమాలకు పని చేశారు.1972లో “అమ్మ మాట సినిమాతో తెలుగులో రమేశ్ నాయు డి ప్రయాణం మళ్ళీ మొదలైంది. ఈ సినిమాలో సినారె రాసి, ఎల్.ఆర్. ఈశ్వరి పాడిన మాయదారి సిన్నోడు అనే మత్తెక్కించే పాటను అంతే గమ్మత్తుగా స్వరపరిచారు. 1973లో హీరో కృష్ణ నిర్మించిన “దేవుడు చేసిన మనుషుల్ఙు సినిమాలో విన్నారా అలనాటి వేణుగానం ఎంత హాయిగా ఉంటుందో ఈశ్వరి పాడిన మసక మసక చీకటిలో ఐటమ్ సాంగ్ అంత కవ్విస్తుంది.రాజశ్రీ పాటల రచయితగానే మనందరికీ తెలుసు. కానీ ఆయన సంగీత దర్శకత్వంతో పాటు సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు. 1975లో ఆయన డైరెక్ట్ చేసిన “చదువుసంస్కారం సినిమాకి రమేశ్ నాయుడు సంగీతం అందించారు. ఇందులోని దీపానికి కిరణం అనే పాట లలితంగా ఉంటుంది.“సీతా ఔర్ గీతాకి రీమేక్ గా నాగిరెడ్డి, చక్రపాణి 1973లో తీసిన “గంగమంగ, అదే ఏడు వచ్చిన “జీవితం సినిమాలు, 1974లో వచ్చిన “చందన నాయుడు గారికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. చందన సినిమా కోసం జానకమ్మ పాడిన పొన్నపూలా ఉయ్యాలా అనే పాట నిజంగా పొన్నపూల పరిమళాన్ని వెదజల్లుతున్నంత గొప్పగా ఉంటుంది. ఇందులో ఆయనే స్వయంగా పాడిన ఓ రామ చక్కని బంగారు బొమ్మ కంట తడి పెట్టిస్తుంది.ఆ ముగ్గురు!రమేశ్ నాయుడు స్వర యాత్రను గొప్ప మలుపు తిప్పింది మాత్రం తెలుగు సినిమాకే మూల స్తంభాల్లాంటి ముగ్గురు దర్శకులు! ఆ ముగ్గురు దర్శకరత్న దాసరి నారాయణరావు, హాస్య బ్రహ్మ జంధ్యాల, విజయ నిర్మల! ఈ ముగ్గురు దర్శకుల మొదటి సినిమాలకు స్వర కల్పన చేసిన ఘనత కూడా ఆయనకే దక్కింది.దాసరి నారాయణరావుతో...దాసరితో రమేశ్ నాయుడి అనుబంధం 1972లో వచ్చిన “తాతమనవడు సినిమాతో మొదలైంది. దర్శకుడిగా దాసరికి ఇది మొదటి సినిమా. ఇందులో రమేశ్ నాయుడు స్వరం కూర్చి, రామకృష్ణ పాడిన అనుబంధం ఆత్మీయత అనే పాట ఇప్పటి తరానికి కూడా బాగా తెలుసు. దాసరి దర్శకత్వం వహించిన “రాధమ్మ పెళ్లి(1974) కోసం రమేశ్ నాయుడు స్వయంగా పాడిన టైటిల్సాంగ్ఆర్ద్రతతో మనసును బరువెక్కిస్తుంది.1976లో బాలచందర్ డైరెక్ట్ చేసిన “అపూర్వ రాగంగళ్ అనే తమిళ సినిమాను దాసరి తెలుగులో “తూర్పు పడమరగా తీశారు. తమిళ పాటల్నేయథాతథంగా వాడకుండా కొత్త బాణీలు కట్టే స్వేచ్ఛనిచ్చారు. స్వరములు ఏడైనా అంటూ సి. నారాయణరెడ్డి గుప్పించిన తాత్వికతను రమేశ్ నాయుడి బాణీలో అంతే చక్కగా పలికించారు సుశీలమ్మ. ఇందులో ‘శివరంజని నవరాగిణి’ అంటూ సినారె రాసిన క్లిష్టమైన సాహిత్యానికి శివరంజని రాగంలో రమేశ్ నాయుడు చేసిన స్వర కల్పన అటు మాస్ ని ఇటు క్లాస్ ని ఆకట్టుకుంది. ఈ పాటకు కొనసాగింపుగానే 1978లో దాసరి “శివరంజని సినిమా తీశారని చెబుతారు. ఈ సినిమా కోసం జోరు మీదున్నావు తుమ్మెదా అంటూ కల్యాణి రాగంలో సుశీలమ్మ పాడిన పాటను ఇప్పటికీ, ఎప్పటికీ మర్చిపోలేం. నవమి నాటి వెన్నెల నీవు వెన్నెలంత మెత్తగా అనిపిస్తుంది. సందమామ వచ్చాడమ్మా అంటూ చందమామలా చల్లగా తాకే పాట, అభినవ తారవో లాంటి పాటలు రమేశ్ నాయుడి పనితనానికి మచ్చుతునకలు.“చిల్లర కొట్టు చిట్టెమ్మ (1977) తెలుగు సినిమా చరిత్రలో ఓ ప్రభంజనం. దాసం గోపాలకృష్ణ రాసిన నాటకాన్ని అంతే అద్భుతంగా తెరకెక్కించారూ దాసరి. ఈ సినిమాలో తల్లి గోదారికే ఆటుపోటుంటే అనే పాటకు రమేశ్ నాయుడికి ఉత్తమ గాయకుడిగా నంది అవార్డు వచ్చింది. ఇక చూడు పిన్నమ్మ అనే కొంటె పాట గొప్ప ట్రెండ్క్రియేట్చేసింది.దాసరి డైరెక్షన్ లో వచ్చిన “కల్యాణి (1979) కోసం దాసం గోపాలకృష్ణ రాసిన గుబులు పుట్టిస్తావు అనే పాటలో నాయుడు గారు ఒకే సాహిత్యాన్ని రెండు బాణీలతో పలికించి గొప్ప ప్రయోగం చేశారు. ఇందులోనే లలిత కళారాధనలో అనే పాట చిరస్థాయిగా నిలిచిపోయింది.1982లో దాసరి, రమేశ్ నాయుడు కాంబినేషన్ లోనే వచ్చిన సినిమా “జయసుధ, నాయుడు గారికి బాగా నచ్చిన రాగాల్లో ఒకటైన కల్యాణిలో కంపోజ్ చేసిన టైటిల్ సాంగ్ లో ప్రణయ కావ్యమున ప్రథమ పంక్తివో అంటూ సినారె చిక్కటి పదాలతో చక్కటి కవితలల్లారు. ఇదే సినిమాలో గోరువెచ్చని సూరీడమ్మా అనే పాట తేలికైన మాటలతో హాయిగా సాగిపోతుంది.1983లో దాసరి, రమేశ్ నాయుడు, అ కాంబినేషన్ లో రెండు గొప్ప సినిమాలు వచ్చాయి. వాటిలో ఒకటి “బహుదూరపు బాటసారి అయితే రెండోది “మేఘ సందేశం! పాటల తేనెపట్టు లాంటి ఈ సినిమాలో ఒక్కో పాట ఒక్కో మకరందపు చుక్క. ఆకులో ఆకునై పాట వినని తెలుగువారుండరేమో! కృష్ణశాస్త్రి కవితను రమేశ్ నాయుడు ఇలా అద్భుతంగా మలిచారు. దేవులపల్లి వారే రాసిన ముందు తెలిసెనా ప్రభూ, సిగలో అవి విరులో, శీతవేళ రానీయకు లాంటి పాటలు, వేటూరి విరచించిన నిన్నటి దాకా శిలనైనా లాంటి స్వర ముత్యాలు, రాధికా కృష్ణా, ప్రియే చారుశీలే వంటి జయదేవుని అష్టపదుల గురించి ఎంత చెప్పినా తక్కువే. పాడనా వాణి కల్యాణిగా అంటూ మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడిన పాట ఆయనకు శాస్త్రీయ సంగీతంతో సమానమైన పేరు తెచ్చి పెట్టింది.ఈ పాటలన్నీ ఒక ఎత్తు అయితే ఆకాశ దేశాన మరో ఎత్తు. జేసుదాస్ పాడిన ఈ పాట నాయుడు గారికి జాతీయ అవార్డు తెచ్చి పెట్టింది. ఈ పాట రాసిన వేటూరి వారు కొన్ని జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆయన రికార్డింగ్ కి వెళ్ళే టైంకి స్టూడియోలో అతి తక్కువ వాయిద్యాలు ఉన్నాయట. ఈ కొన్ని వాయిద్యాలతో నాయుడు గారు సంగీతం ఎలా పుట్టిస్తారో చూద్దాం అనుకున్నారట. కానీ కాసేపటికి జేసుదాస్ గొంతులో నుంచి తను రాసిన సాహిత్యం అత్యద్భుతమైన పాటగా జాలువారడం చూసి పులకించిపోయారట.విజయ నిర్మలతో...1973లో వచ్చిన “మీనా విజయ నిర్మల దర్శకత్వం వహించిన తొలి సినిమా. ఈ సినిమా విజయంలో రమేశ్ నాయుడు స్వరపరిచిన మల్లె తీగ వంటిది ఎంత హాయిగా ఉంటుందో పెళ్ళంటే నూరేళ్ళ పంట అంత విషాదాన్ని పలికిస్తుంది. శ్రీరామ నామాలు శతకోటి అన్న పాట మెత్తగా మనసును మీటుతుంది.విజయ నిర్మల దర్శకత్వం వహించిన “దేవదాసు(1974) కమర్షియల్ హిట్ కాకపోయినా ఆరుద్ర రాసి, రమేశ్ నాయుడు స్వరపరిచిన కల చెదిరింది, పొరుగింటి దొరగారికి పాటలు జనాన్ని బాగా ఆకట్టుకున్నాయి.ఏఎన్నార్, కృష్ణ హీరోలుగా విజయ నిర్మల డైరెక్ట్ చేసిన యాక్షన్ మూవీ “హేమాహేమీలు(1979). ఇందులోని ఏ ఊరు ఏ వాడ, నువ్వంటే నాకెంతో ఇష్టం అనే రెండు క్లబ్ సాంగ్స్బాగా పాపులర్అయ్యాయి.1980లో విజయ నిర్మల డైరెక్ట్చేసిన “సంఘం చెక్కిన శిల్పాలు కోసం రమేశ్ నాయుడి స్వర కల్పన పలికెను ఏదో రాగం అన్నట్లు హాయిగా సాగిపోతుంది. ఈ సినిమా కోసం 20 ఏళ్ళ గ్యాప్ తర్వాత రావు బాల సరస్వతి పోయి రావే అమ్మా అనే పాట పాడారు.ఇక రమేశ్ నాయుడు, విజయ నిర్మల కాంబినేషన్ లోనే వచ్చిన “భోగిమంటలు (1981) సినిమాలలో భోగి మంటల పాట, అరవైలో ఇరవై వచ్చింది అనే పాట కూడా జనానికి బాగా గుర్తుండిపోయాయి.జంధ్యాలతో...జంధ్యాలతో నాయుడి గారి స్వర యాత్ర విలక్షణమైనది. కామెడీ, మెలొడీ కలగలిపిన చక్కటి కలబోత ఈ ఇధ్దరిది. దీనికి వేటూరి కలం తోడైతే ఇక చెప్పేదేముంది? 1981లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా “ముద్ద మందారం. ఇందులోని ముద్దుకే ముద్దొచ్చే, అలివేణీ ఆణిముత్యమా, నీలాలు కారేనా లాంటి పాటలు సినిమాని ఎవర్గ్రీన్గా మార్చాయి.మనసా తుళ్ళిపడకే అమృతం ఒలికే ఈ పాట “శ్రీవారికి ప్రేమలేఖ సినిమాలోనిది. సప్త స్వరాలతో నిండుగా మోగే సరిగమపదని స్వరధార అనే పాట నాయుడు గారి సంగీత జ్ఞానానికి మచ్చుతునక. సాహిత్యానికే బాణీలు కట్టే ఆయన ఈ పాటలో వేటూరి వారు ప్రస్తావించిన అన్ని రాగాలకూ న్యాయం చేస్తూ అద్భుతమైన రాగమాలికను వెలయించారు.కళాతపస్వి ప్రేరణతో జంధ్యాల తీసిన సినిమా “ఆనంద భైరవి. పిలిచిన మురళికి అంటూ మువ్వలా మోగే పాటకు రమేశ్ నాయుడు ఆనంద భైరవి రాగంలో స్వరం కూర్చితే, వేటూరి అందమైన ఆ మాటకు పల్లవిలోనే చోటిచ్చేశారు. నెమ్మదిగా సాగే ఆనంద భైరవి రాగంలో ఇంత వేగంగా పాటను కూర్చడం గొప్ప ప్రయోగమని చెబుతారు.ముళ్ళపూడి వారి రెండు జెళ్ళ సీత పాత్ర పేరుతోనే జంధ్యాల 1983లో “రెండు జెళ్ళ సీత అనే సినిమా తీశారు. ఇందులోని కొబ్బరి నీళ్ళా జలకాలాడి అనే అల్లరి పాటను రమేశ్ నాయుడు ఎంత అందంగా మలిచారో! ఇందులోనే మందారంలో మధురిమలై, రెండు జెళ్ల సీత తీపి గుండె కోత లాంటి పాటలు కూడా శ్రోతలకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.అలక పానుపు ఎక్కనేల అనేది “శ్రీవారి శోభనం సినిమాలోని పాట. ఈ పాటలో పడుచు పిల్లకు, పండు ముసలికి జానకమ్మతోనే పాడించారు రమేశ్ నాయుడు గారు. ఇందులోనే చంద్ర కాంతిలో చందన శిల్పం అన్న పాటలో అటు వేటూరి వారి మాటలు, ఇటు నాయుడు గారి బాణీ వెన్నెల విరజిమ్ముతాయి.నువు కాటుక దిద్దకపోతే మలి సందెకు చీకటి రాదు ఒక ప్రియుడు ప్రియురాలిని పొగడ్డానికి ఇంత కంటే గొప్ప మాటలు కావాలా? 1985లో జంధ్యాల తీసిన “మొగుడు పెళ్ళాలు సినిమా కోసం వేటూరి రాశారీ పాట. అంతే అందంగా స్వరాలు కూర్చారు రమేశ్ నాయుడు.జంధ్యాల, రమేశ్ నాయుడు, వేటూరి వారి కాంబినేషన్ లో వచ్చిన చివరి సినిమా “అహ నా పెళ్ళంట. 1987లో విడుదలైన ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో మైలురాయి లాంటిది. కథలోకి చక్కగా ఇమిడిపోయేలా రమేశ్ నాయుడు కూర్చిన బాణీలు ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.వేటూరి ఏమన్నారంటే...రమేశ్ నాయుడితో ఉన్న ఆత్మిక బంధాన్ని వేటూరివారు తను రచించిన “కొమ్మకొమ్మకో సన్నాయి పుస్తకంలో గుర్తు చేసుకున్నారు. అభూత కల్పనలు అక్షర సత్యంగా మారిన అపురూప సంఘటన పేరే “రమేశ్నాయుడు అంటూ ఆయన పరిచయ వాక్యాలు రాసుకున్నారు. “నేను ఆర్జించుకున్న ఆప్తమిత్రుడు ఆయన. ఆయన భౌతికంగా దూరమయ్యాక నేను ఆయన కోసం రాసిన పడవ పాట ఆయనకు గుర్తుగా మిగిలిపోయింది అంటూ “ఆశాజ్యోతి లోని ఏరెల్లిపోతున్నా నీరుండిపోయింది అన్న పాటను గుర్తు చేసుకున్నారు.మరికొన్ని స్వర ముత్యాలు!పెద్దగా ఆడని కొన్ని సినిమా లు రమేశ్ నాయుడి బాణీల వల్ల గుర్తింపు వచ్చిన సందర్భాలున్నాయి. 1979లో విడుదలైన “మంగళ తోరణాలు అనే సినిమాలో సుశీలమ్మ ఏమయ్యిందంటే నే చెప్పలేను అంటే బాలు ఏమీ కాలేదంటే నేనొప్పుకోను అని బదులిచ్చే తీరు శ్రోతలను సమ్మోహనపరుస్తుంది.70ల్లో సుశీలమ్మ, 80ల్లో జానకమ్మ నాయుడు గారి పాటలకు ఊపిరి పోశారు. ఆయన సంగీత దర్శకత్వంలో శైలజ పాడ్డం తక్కువే. అలా ఆవిడ పాడిన అతి కొన్ని పాటల్లో చిరస్థాయిగా నిలిచిపోయేది “కొత్త నీరు సినిమాలోని ఊగిసలాడకే మనసా అనే పాట.ఇక 1980లో దాసరి సమర్పించిన “సుజాత అనే సినిమాలో ఉంగరం పడిపోయింది. అనే పాటను నాయుడు గారు చాలా సరదాగా కంపోజ్ చేశారు. పాటంతా ‘పోతే పోనీ’ అనే మాట వినిపిస్తూనే ఉంటుంది.1985లో విడుదలైన ‘సువర్ణ సుందరి ఆ కోవలోకే వస్తుంది. ఈ సినిమాలోని ఇది నా జీవితాలాపన పాటకుగాను నాయుడు గారు, బాలు నంది అవార్డులు గెలుచుకున్నారు. ఊహవో ఊపిరివో పాట కూడా మనసును రంజింపజేస్తుంది.కళాతపస్వితో...1987లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన “స్వయంకృష్ఙి రమేశ్ నాయుడి ఆఖరి సినిమా. ఈ సినిమాలో ఆయన పారా హుషార్ అంటూ హుషారెత్తిస్తారు, సిగ్గూ పూబంతి అంటూ సిగ్గుల మొలకలేయిస్తారు. ఇక సిన్నీ సిన్నీ కోరికలడగా అయితే జానకమ్మ గొంతులో హాయిగా సాగిపోతుంది. రమేశ్ నాయుడు, సిరివెన్నెల సీతారామశాస్త్రి కాంబినేషన్ లో వచ్చిన అతి తక్కువ సినిమాల్లో ఇది చెప్పుకోదగ్గది.“స్వయంకృషి సినిమా సాధించిన ఘన విజయం చూడకుండానే రమేశ్ నాయుడు సినిమా రిలీజ్ అయిన రోజునే అంటే 1987 సెప్టెంబరు 3న, 54 ఏళ్ళ వయసులో సుదూర స్వర తీరాలకు తరలిపోయారు. ఆయన మరికొంత కాలమున్నా... మొదటి నుంచి తెలుగు సినిమాలకే పరిమితమైనా, మన పాటల దశ, దిశ మరోలా ఉండేదేమో!మెరుపులా మెరిశావు... వలపులా కురిశావు...కన్నుతెరిచి చూసేలోగా నిన్నలలో నిలిచావు!వేటూరి రాసిన ఈ పదాలు రమేశ్ నాయుడి స్వర యాత్రకు చక్కగా సరిపోతాయి. అద్భుతమైన స్వర నిధులను రాశిగా పోసిన ఆయన శ్రోతలు తేరుకునేలోపే మాయమైపోయారు కదా మరి!- శాంతి ఇశాన్ -
వృద్ధాప్యాన్ని డీ కొట్టొచ్చు!?
టీవీలో సంతూర్ సబ్బు ప్రకటన గుర్తుందా.. ఓ పాప మమ్మీ అంటూ పరుగెత్తుకుంటూ తల్లి దగ్గరకు రావడం.. బిడ్డకు తల్లి అయినా వయసు కనిపించడం లేదన్నట్టు ఆ నటుడు ఆశ్చర్యపోవడం! వయసును ఓడించడం ప్రకటనల్లోనే కాదు, నిజ జీవితంలోనూ సాధ్యమేనట! విటమిన్ డి సప్లిమెంట్లను నిత్యం తీసుకోవడం ద్వారా వృద్ధాప్యం దరిచేరదని తాజా పరిశోధనలో తేలింది.ప్రతిరోజూ 2,000 ఐయూ (ఇంటర్నేషనల్ యూనిట్స్) మోతాదులో విటమిన్ –డీ3 తీసుకుంటే ‘టెలొమియర్స్’ ఆరోగ్యంగా ఉంటాయని తాజా పరిశోధన వెల్లడించింది. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ, మరికొన్ని సంస్థలు సంయుక్తంగా చేపట్టిన అధ్యయనం అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ప్రచురితమైంది. పరిశోధకులు మొత్తం 1,054 మందిపై 5 ఏళ్లపాటు అధ్యయనం చేశారు. వీరిలో 55 ఏళ్లకుపైబడిన మహిళలు, 50–55 ఏళ్ల పురుషులు ఉన్నారు. పరిశోధన ప్రారంభంలో, అలాగే రెండు, నాలుగు సంవత్సరాల తర్వాత వారి టెలొమియర్స్ను కొలిచారు. సగం మందికి రోజుకు 2,000 ఐయూ విటమిన్–డీ3∙ఇచ్చారు. మిగిలిన సగం మందికి ఎలాంటి విటమిన్ ఇవ్వలేదు. విటమిన్–డి గ్రూపులోని వ్యక్తుల్లో టెలొమియర్స్ సురక్షితంగా ఉన్నట్టు ఫలితాలు వచ్చాయి. విటమిన్ –డీ ఎందుకంటే..ఎముకల ఆరోగ్యానికి విటమిన్–డీ చాలా అవసరమని అందరికీ తెలిసిందే. ఇది మన శరీరం కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది. వయసుతో సంబంధం లేకుండా ఎముకలు దృఢంగా తయారు కావడానికి, ఆరోగ్యంగా ఉండేందుకు ఈ విటమిన్ తగినంత స్థాయిలో అవసరం. రోగనిరోధక వ్యవస్థను సైతం ఇది బలంగా చేస్తుంది. విటమిన్–డి సప్లిమెంట్లు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను తగ్గించగలవని అధ్యయనంలో తేలింది. రుమటాయిడ్ ఆర్రై్థటిస్, కణజాలాలు గట్టిపడడం వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులను నివారించడంలో ఇది సహాయపడుతుందని ప్రారంభ పరిశోధనలు సూచిస్తున్నాయి. శరీరంలోని వాపు ఉంటే టెలొమియర్స్ను దెబ్బతీస్తుంది. ఆ వాపును విటమిన్–డి తగ్గిస్తుంది.ఇంతకీ మోతాదు ఎంత?విటమిన్ –డి ఎంత మోతాదులో తీసుకోవాలన్న అంశంపై ఏకాభిప్రాయం లేదు. హార్వర్డ్ పరిశోధకులు రోజుకు 2,000 ఐయూ మోతాదు ఉపయోగించారు. 70 ఏళ్లలోపు వారికి 600 ఐయూ, ఆపైబడి వయసున్న వృద్ధులకు సిఫార్సు చేసిన 800 ఐయూ కంటే ఇది చాలా ఎక్కువ మోతాదు. అయితే ఇతర పరిశోధనలు కేవలం 400 ఐయూ మోతాదులో రోజూ తీసుకుంటే జలుబును నివారించడంలో సహాయపడతాయని సూచిస్తున్నాయి. ఇప్పటికే శరీరంలో ఉన్న విటమిన్–డి స్థాయిలు, మొత్తం పోషకాహారం, ఇతర పోషకాలతో ఈ విటమిన్ ఎలా కలిసిపోతుందో వంటి అంశాలపై ‘సరైన మోతాదు’ ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తొందరపాటు చర్య!తాజా పరిశోధనలు ఉత్తేజకరంగా ఉన్నప్పటికీ.. వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేయాలనే ఆశతో అధిక మోతాదులో విటమిన్–డి తీసుకోవడం తొందరపాటు చర్యగా కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమతుల ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, కంటి నిండా నిద్ర, ధూమపానం చేయకపోవడం, ఒత్తిడిని జయించడం వంటివి ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి దోహదపడతాయన్నది వారి మాట. ఇవన్నీ సహజంగా టెలొమియర్స్ ఆరోగ్యానికీ తోడ్పడతాయి. అయితే విటమిన్–డి లోపం ఉన్నా, ఎముకల ఆరోగ్యం సరిగా లేకున్నా సప్లిమెంట్లు తీసుకోవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. మొక్కల నుంచి వచ్చే ఆహారాల్లో లభించే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ (వాపు తగ్గించే) సమ్మేళనాలు టెలొమియర్స్ను ఆరోగ్యంగా ఉంచుతాయని గతంలో చేపట్టిన పలు అధ్యయనాల్లో తేలింది. అయితే ఆరోగ్యకరమైన బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ), సామాజిక సత్సంబంధాలు కూడా టెలొమియర్స్ను రక్షించడంలో సహాయపడతాయి. సూర్యరశ్మితోనే..: ఎముకల ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, కండరాల పనితీరు, మానసిక ఆరోగ్యానికి అవసరమైన కీలకమైన పోషకం విటమిన్ డి. ఇది సూర్యరశ్మి నుంచే 80 శాతం వరకు లభిస్తుంది. – సాక్షి, స్పెషల్ డెస్క్ -
నిరీక్షించి...నీరసించి
సాక్షి నెట్వర్క్ : యూరియా కష్టాలు రైతులను వెంటాడుతున్నాయి. గంటల తరబడి క్యూలైన్లో నిలబడుతున్న వారు అనారోగ్యం పాలవుతున్నారు. » మహబూబాబాద్ జిల్లా బయ్యారంలోని వ్యవసాయ మార్కెట్ చెక్పోస్ట్ వద్ద ఇల్లెందు–మహబూబాబాద్ ప్రధాన రహదారిపై రైతులు యూరియా కోసం నాలుగు గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. మహబూబాబాద్ పట్టణంలోని పీఏసీఎస్ వద్ద మంగళవారం కూడా రైతులు బారులుతీరారు. కురవి సొసైటీ వద్ద కూపన్ల కోసం క్యూలో నిలబడి రైతులు నానా అవస్థలు పడ్డారు. కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి పీఏసీఎస్ వద్దకు సోమవారం అర్ధరాత్రి సుమారు రెండు వేల మంది రైతులు యూరియా కోసం వచ్చారు. క్యూలో ఉన్న గాంధీనగర్కు చెందిన ఆవుల నారాయణ అనే రైతుకు ఫిట్స్ వచ్చింది. నర్సింహులపేటలో కూపన్లు ఇవ్వకపోవడంతో రైతులు పట్టాపాస్ బుక్కుల జిరాక్స్ కాపీలను తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. » వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో ఖమ్మం–వరంగల్ జాతీయ రహదారిపై ధర్నా చేయడంతో వాహనాలు నిలిచిపోయాయి. » మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఎమ్మెల్యే అనిరు«ధ్రెడ్డి తన కార్యాలయానికి ఎదురుగా ఉన్న ఆగ్రో సేవా కేంద్రం దుకాణం వద్దకు వెళ్లారు. యూరియా కోసం పడిగాపులు పడుతున్న రైతులు ఒక్కసారిగా క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు యూరియా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులను సముదాయించి మాట్లాడిన ఎమ్మెల్యే అనిరు«ధ్రెడ్డి వెంటనే కలెక్టర్ విజయేందిరకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. సాయంత్రంలోగా యూరియాను అందజేస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో రైతులు వెనుదిరిగారు. » దేవరకద్రలో తెల్లవారుజామున 4 గంటలకు వచ్చినా టోకెన్లు ఇచ్చి వెనక్కి పంపుతున్నారని, యూరియా మా త్రం ఇవ్వడం లేదని ఆందోళన చేపట్టారు. ఉదయం 6 గంటలకే రాయచూర్ జాతీయరహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రాయచూర్–మహబూబ్నగర్ వైపు వెళ్లే వందలాది వాహనాలు నిలిచిపోయాయి. » వనపర్తి జిల్లావ్యాప్తంగా యూరియా ఆందోళనలు కొనసాగాయి. ఖిల్లాఘనపురంలో రైతులు రోడ్డెక్కి ధర్నా చేశారు. » నాగర్కర్నూల్ జిల్లాలో యూరియా కోసం రైతులు ఆందోళనలు, ధర్నాలు చేపట్టారు. అచ్చంపేటలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. » గద్వాల సింగిల్విండో కార్యాలయానికి దాదాపు 400 మంది రైతులు మంగళవారం ఉదయం 8 గంటల వరకే చేరుకున్నారు. యూరియా లేదని అధికారులు చెప్పడంతో అంబేడ్కర్ చౌక్లో రోడ్డుపై బైఠాయించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని పీఏసీఎస్ కేంద్రం వద్ద యూరియా లేకపోవడంతో రైతులు రాస్తారోకో చేశారు. » కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ సొసైటీ వద్ద లారీ లోడ్ వచ్చిందని సమాచారం అందుకున్న రైతులు అక్కడకు వెళ్లారు. సోమవారం టోకెన్లు ఇచ్చామని చెప్పడంతో రైతులు రాజీవ్ రహదారిపై ధర్నాకు దిగారు.రైతు సమస్యలపై అదే నిర్లక్ష్యం ఏఐసీసీ సీనియర్ నేత మాణిక్కం ఠాగూర్ సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రైతు సమస్యలపై నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉందని, ప్రధాని మోదీ హామీలు జుమ్లాలుగానే మిగిలిపోతున్నాయని ఏఐసీసీ ఏపీ ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ విమర్శించారు. ఆంధ్ర, తెలంగాణ రైతులకు జుమ్లాలు అవసరం లేదని.. వారికి కావలసింది సమయానికి ఎరువులేనన్నారు. ఏపీ, తెలంగాణకు కలిపి ఏటా సుమారు 24–25 ఎల్ఎంటీ యూరియా అవసరం ఉంటుందని ఠాగూర్ గుర్తు చేశారు. అయినప్పటికీ ప్రతి విత్తన సీజన్లో.. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఎరువు కొరత తలెత్తుతోందని చెప్పారు. రైతులు గంటల తరబడి బారులు తీరాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఎస్సీవో వంటి అంతర్జాతీయ వేదికల్లో ఫొటోలకే పరిమితమవుతున్నారని విమర్శించారు. రైతుల కోసం దీర్ఘకాలిక ఎరువుల సరఫరా ఒప్పందాలు కుదుర్చేందుకు ఈ వేదికలను ఉపయోగించే ఆలోచన ఆయనకు ఉందా? అని ఠాగూర్ ప్రశ్నించారు.ఇబ్బంది లేకుండా యూరియా సరఫరా చేస్తాంమరో వారం రోజుల్లో 27,470 మెట్రిక్ టన్నుల యూరియా: మంత్రి తుమ్మల సాక్షి, హైదరాబాద్: రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎరువుల సరఫరా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రైతులకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచడానికి కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. సోమవారం, 9,000 మెట్రిక్ టన్నులు, మంగళవారం మరో 5,000 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి చేరిందన్నారు. ఈ యూరియా రైల్వే రేక్ పాయింట్లయిన సనత్నగర్, వరంగల్, జడ్చర్ల, నాగిరెడ్డిపల్లి, మిర్యాలగూడ, కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాలకు చేరుకుంటుందని తెలిపారు. వచ్చే వారంరోజుల్లో కరాయికల్, గంగవరం, దామ్ర పోర్టుల ద్వారా మరో 27,470 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి చేరనుందని మంత్రి తుమ్మల తెలిపారు. ఈ ఎరువులను రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా డిమాండ్కు అనుగుణంగా పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.అదేవిధంగా ఇటీవల వర్షాల కారణంగా జరిగిన పంట నష్టానికి పరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. వరదలతో నష్టపోయిన రైతులకు అన్యాయం జరగకుండా, సకాలంలో సహాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అందుకోసం పంట నష్టం సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని, 5 రోజుల్లోపు పంటనష్టంపై పూర్తి నివేదికను పూర్తి చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. -
స్టార్టింగ్ ప్రాబ్లమా?
స్టార్టింగ్ ప్రాబ్లం.. మనం తరచూ వినే డైలాగ్. తలపెట్టిన పనులను తరచూ వాయిదా వేస్తుంటారు కొందరు. వారిని ఆట పట్టించడానికి ‘స్టార్టింగ్ ప్రాబ్లమా’ అని అంటుంటాం. వ్యాయామం, ఇంటి పనుల వంటివి ప్రారంభించడం కష్టంగా అనిపిస్తుందా? యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ హాస్పిటల్స్లో న్యూరాలజీ వైద్యులు, న్యూరో సైంటిస్ట్గా పనిచేస్తున్న డాక్టర్ ఫేయ్ బెగేటి ఓ చక్కటి, సులభ పరిష్కారాన్ని ప్రతిపాదిస్తున్నారు. మెదడు శక్తిని పెంచడానికి, మానసిక అడ్డంకులను తొలగించడానికి నిబద్ధతతో కూడిన ఓ ‘5 నిమిషాలు’ చాలు అంటున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్రేపట్నుంచి వాకింగ్కు వెళ్తా.. డిసెంబర్ 31 నాడు.. ‘జనవరి 1 నుంచి వాకింగ్ లేదా వ్యాయామం చేస్తా’రేపట్నుంచి ఉదయం ఆరింటికే నిద్ర లేస్తా..పోటీ పరీక్షలకు రేపట్నుంచి ప్రిపరేషన్ మొదలుపెడతా.... ఇలాంటి నిర్ణయాలు చాలామంది తీసుకుంటారు. కానీ, బద్ధకం వాటిని అమలు చేయనివ్వదు. అలాంటి కష్టమైన పనులను చేయడంలో మనసు, మెదడు.. రెండూ మొండికేస్తుంటాయి. మరి, దీన్ని అధిగమించడం ఎలా?5 నిమిషాల నియమం.. మనసును సిద్ధం చేసే ఓ చిట్కా. ఇది వాయిదా వేసే మనస్తత్వాన్ని మారుస్తుంది. తద్వారా మానసిక అలసట తగ్గుతుందని బెగేటి అంటున్నారు. ఒక పనిని ప్రారంభించడానికి మనసు సన్నద్ధంగా లేనప్పుడు.. ఆ పనిని కేవలం 5 నిమిషాల సేపు చేసి చూడాలి. సాధారణంగా మన మెదడు పని కష్టాన్ని ఎక్కువగా అంచనా వేస్తుంది. అందువల్ల ఎక్కువ సేపు చేస్తే అలసిపోతానని ముందే ఊహించుకుంటుంది. కాబట్టి 5 నిమిషాల పాటు నిబద్ధతతో పనిచేస్తే మెదడు అలవాటు పడి, తరవాత ఆ పని కొనసాగించేలా ప్రేరేపిస్తుంది. మానసిక అలసటే పెద్ద సమస్యశారీరక అలసట ఉన్నా ఫర్వాలేదుగానీ.. మానసిక అలసట ఉంటే మాత్రం మెదడు పనిచేయనివ్వదు. మెదడు అలసటను.. స్మార్ట్ఫోన్ ‘లో బ్యాటరీ’ మోడ్తో పోల్చారు బెగేటి. లో బ్యాటరీ ఉన్నా మనం పనిచేస్తుంటే.. ‘బ్యాటరీ లో’ అని ప్రతిసారీ అరుస్తున్నట్టే.. ‘నేను చేయను/చేయడానికి సిద్ధంగా లేను’ అని మెదడు కూడా మొరాయిస్తుంది. సోషల్ మీడియా స్క్రోలింగ్ వంటి తక్షణ వినోదాన్ని అందించే సాధారణ కార్యకలాపాలను ఎంచుకోవడం ద్వారా.. మెదడు తక్కువ కష్టమైన పనులవైపు మొగ్గు చూపుతుంది. ‘5 నిమిషాల’ నియమం.. మెదడుకున్న ఈ బద్ధకానికి చక్కటి చిట్కాలా పనిచేస్తుంది. ‘5 నిమిషాలే కదా చేసేద్దాం’ అని చేసేస్తుంది.దినచర్యగా మారుతుందఏదైనా పనిని ప్రారంభించినప్పుడు మెదడు డోపమైన్ ను విడుదల చేస్తుంది. ఇది ప్రేరణతోపాటు ఆనందం ఇచ్చే రసాయనం. ఈ 5 నిమిషాల ప్రక్రియ.. మనలో జోష్ నింపి ఆ సమయం తరవాత కూడా పని చేయడానికి ప్రేరేపిస్తుంది. ఇది ఒక దినచర్యగా అలవాటైతే.. దీర్ఘకాలంలో మెదడు చురుగ్గా, మరింత ప్రభావవంతంగా పనిచేసేందుకు దారితీస్తుందని బెగేటి పేర్కొన్నారు. వ్యాయామం, ఇంటి బాధ్యతలతో సహా ఏదైనా సవాలుతో కూడిన, శక్తిని వినియోగించే పనికి ఈ నియమం రోజువారీ సాధనంగా పనిచేస్తుంది. 5 నిమిషాల నియమం.. వాయిదా వేసే విధానానికి చెక్ పెట్టడంలో సహాయపడుతుంది. అదే సమయంలో నిర్ణయం తీసుకోవడంలోనూ , దృష్టి కేంద్రీకరించిన పని వల్ల వచ్చే అలసటను తగ్గించి మెదడును చురుగ్గా ఉంచుతుంది.చిన్న చిన్న ప్రయత్నాలు» చిన్న చిన్న ప్రయత్నాలతో మెదడును సిద్ధం చేయండి. » అవి నిరంతరం పనిని కొనసాగించేలా ప్రేరేపిస్తాయి.» రోజూ కేటాయించే ఆ 5 నిమిషాలు.. అంటే సంవత్సరానికి సుమారు 30 గంటల అభ్యాసంతో స్థిరంగా చేసే చిన్న పనులు పెద్ద ఫలితాలను ఇస్తాయి. » పనులను మరింత సులువుగా మొదలుపెట్టేందుకు ఈ చిట్కా తోడ్పడుతుంది.» మెదడు.. చేయనని మొండికేసే స్థితి నుంచి నేను చేయగలననే చురుకైన స్థితికి మారడానికి ఈ నియమం దోహద పడుతుంది.ఇలా విజయవంతం చేయండి» చేయాల్సిన పూర్తి పని నుంచి ఒక నిర్దిష్ట చిన్న విభాగాన్ని మీ ప్రారంభ సాధనంగా ఎంచుకోండి» ఇందుకోసం టైమర్లో అయిదు నిమిషాల సమయాన్ని సెట్ చేయండి» మీ దృష్టిని మరల్చే వాటిని గుర్తించి తొలగించండి.» 5 నిమిషాల తర్వాత పురోగతిని చెక్ చేయండి. దీనిని బట్టి ఆ పనిని కొనసాగించాలా వద్దా అని నిర్ణయించుకోండి. -
బుల్లెట్టు రైలెక్కి వచ్చేత్తపా..!
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరోసారి వార్తల్లో నిలిచారు. సుమారు ఆరేళ్ల తర్వాత.. పొరుగుదేశం చైనాలో ఆయన పర్యటిస్తున్నారు. బీజింగ్లో బుధవారం జరగబోయే రెండో ప్రపంచ యుద్ధ వార్షికోత్సవ సైనిక కవాతును ఆయన వీక్షించనున్నారు. ఈ కార్యక్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా 26 దేశాధినేతలు పాల్గొనబోతున్నారు. కిమ్ జోంగ్ ఉన్ రైలు ప్రయాణం గురించి ప్రపంచం ఇప్పుడు ఆసక్తికరంగా చర్చించుకుంటోంది. 2019లో చైనా, 2023లో రష్యాలో పర్యటించిన టైంలోనూ ఆయన రైలు మార్గం గుండానే ప్రయాణించారు. ఉత్తర కొరియా పాలకులకు ఇలా రైలు ప్రయాణం కొన్ని దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది. కాదు కాదు ప్రత్యేక కారణాల దృష్ట్యా తప్పడం లేదు!!.. కిమ్ జోంగ్ ఉన్ ప్రయాణించే రైలు మామూలుది కాదు. సుమారు 90 కోచ్లు ఉండే ఈ రైలులో కాన్ఫరెన్స్ రూమ్, బెడ్రూమ్స్, ఫ్లాట్ స్క్రీన్ టీవీలు, అంతర్జాతీయ వంటకాలు, ఖరీదైన రెడ్ వైన్లు అందుబాటులో ఉంటాయి. రైలు అంతర్గతంగా పింక్ లెదర్ ఆర్మ్చైర్లు, జెబ్రా ప్రింట్ డిజైన్, బోర్డో వైన్లు, లాబ్స్టర్లు, అంతర్జాతీయ వంటకాలు, కాన్ఫరెన్స్ హాళ్లు, బెడ్రూమ్స్తో రాజసంగా ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చెఫ్లు, రెడ్ వైన్లు, నృత్య కళాకారుల బృందం ఆయన వెంట ప్రయాణిస్తారు. అయితే.. అది పూర్తిగా బుల్లెట్ప్రూఫ్, బాంబ్ప్రూఫ్. ఇది కుటుంబ భద్రతా భయాల కారణంగా ఏర్పడిన సంప్రదాయం. ఈ రైలు వేగం గంటకు 50 కిలోమీటర్లు మాత్రమే. భారీ సాయుధ కవచాలతో నిర్మించబడి ఉండడం వల్ల దీని ప్రయాణం కూడా అంతే భద్రంగా సాగుతుంటుంది. భారీ సాయుధ కవచాలతో నిర్మించబడి ఉండడం వల్ల దీని ప్రయాణం కూడా అంతే భద్రంగా సాగుతుంటుంది. అందుకే.. కిమ్ జోంగ్ ఉన్ తన తండ్రి, తాతల మాదిరిగా విమానాలకంటే రైలు ప్రయాణానికే ప్రాధాన్యం ఇస్తున్నారు.ఈ రైలు కేవలం రవాణా సాధనం కాదు, అది ఒక మొబైల్ కమాండ్ సెంటర్గా పనిచేస్తుంది. ఈ రైలు కోసం అంతర్జాతీయ రక్షణ, రైలు నిర్మాణ నిపుణులు పని చేశారు. ఈ స్థాయి సౌకర్యాలు, భద్రతా వ్యవస్థలు కలిగి ఉండే రైలు నిర్మాణం, నిర్వహణకు సుమారుగా 200–300 మిలియన్ డాలర్లు (మన కరెన్సీలో రూ.1,600–రూ.2,400 కోట్లు) వరకు ఖర్చు అయ్యిందనే అంచనా. పర్యటన ఉద్దేశం..ఉత్తర కొరియా–రష్యా–చైనా మైత్రి బలోపేతం ద్వారా.. తద్వారా అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా బలమైన సంకేతాలు పంపే ప్రయత్నంగా కిమ్ పర్యటనను విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో చైనా, ఉత్తర కొరియా మధ్య ఆర్థిక, భద్రతా సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉందనే చర్చా నడుస్తోంది. -
నీటితో కొట్టుకుపోతున్న మట్టి ఎంత?
మనం తినే ఆహారంలో 95% మట్టిలోనే పండుతోంది. వ్యవసాయానికి, ఆహార భద్రతకు నేలపైన ఉండే 6 అంగుళాల మట్టే (టాప్ సాయిల్) మూలాధారం. మానవాళికి ఎంతో విలువైన ఈ వారసత్వ సంపద వర్షాలకు, వరదలకు కొట్టుకుపోతోంది. మేటలు వేసిన ఇసుక ఆ మట్టిలోనిదే. పంట నష్టం, ఆస్తి నష్టం కన్నా మట్టి నష్టం చాలా పెద్దది. మనం ఎవరూ పట్టించుకోని విపత్తు ఇది.ఇలా భూముల్లోనుంచి కొట్టుకెళ్లిన మట్టి, ఇసుకతో రిజర్వాయర్లు, చెరువులు పూడుకుపోతున్నాయి. పైమట్టిని కోల్పోతున్న సాగు భూములు నిస్సారమవుతున్నాయి. ఫలితంగా 1960లో కిలో రసాయనిక ఎరువు వేస్తే 16.5 కిలోల పంట వచ్చేది. ఇప్పుడు 3.5 కిలోలకు తగ్గిపోయింది. మన దేశంలో ప్రతి సంవత్సరం హెక్టారుకు సగటున 21 టన్నుల టాప్ సాయిల్ కొట్టుకుపోతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, వరదలకు కోల్పోతున్న మట్టి ఎంత? మట్టి కొట్టుకుపోకుండా ఏమైనా చెయ్యగలమా? ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకోవాలి? వ్యవసాయ పద్ధతుల్లో ఏం మార్పులు తేవాలి? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? చదవండి.. – సాక్షి సాగుబడిమట్టి.. మనకు పూర్వీకులు ఇచ్చిన వారసత్వ సంపద. మొక్కల పెరుగుదలకు అవసరమైన పోషకాలు, తేమతో కూడి ఉండే నేల పైపొర వ్యవసాయానికి చాలా ముఖ్యమైనది. మట్టి కోతకు గురికావటం వల్ల భూమి ఉత్పాదకశక్తి, పంట దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. భూమి పైపొరలో 6 సెం.మీ. లోతు మట్టిలోనే పంటలు పండించుకొని తిని మనం బతుకుతున్నాం. 95% ఆహారాన్ని ఇస్తున్నది ఈ మట్టే. రాళ్లు రప్పలు, ఆకులు అలముల కారణంగా మట్టి సహజసిద్ధంగా నిరంతరం ఏర్పడుతూనే ఉంటుంది. 6 సెం.మీ. మందాన మట్టి ఏర్పడటానికి 1,000 సంవత్సరాలు పట్టవచ్చని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ లెక్క తేల్చింది. అయితే, అంతకన్నా అతివేగంగా కొట్టుకుపోతున్నది. ఎక్కువగా దున్నే భూములు, కొండ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువ.తెలుగు రాష్ట్రాల్లో కొట్టుకుపోతున్న మట్టి ఎంత?తెలుగు రాష్ట్రాల్లో ఏటా హెక్టారుకు సగటున 14–15 టన్నుల మట్టి కొట్టుకుపోతోంది. తెలంగాణలో సగటున హెక్టారుకు ఏడాదికి 14 టన్నులు, ఆంధ్రప్రదేశ్లో సగటున 15 టన్నుల మట్టి వర్షానికి, వరదలకు కొట్టుకుపోతున్నదని ఐఐటీ ఢిల్లీ అధ్యయనంలో వెల్లడైంది. అయితే, కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా వేల టన్నుల్లోనే మట్టి కోతకు గురై కొట్టుకుపోతోంది.కొండ ప్రాంతాలు, వాలు ఎక్కువగా ఉన్న భూములు, అడవులు నరికివేసిన నేలలు, తవ్వకాలు జరిగే ప్రాంతాలు, ఎక్కువగా దుక్కి లేదా దమ్ము చేసే ఎటువంటి ఆచ్ఛాదనా లేని వ్యవసాయ భూముల్లో నుంచి నమ్మలేనంత ఎక్కువ మొత్తంలో హెక్టారుకు ఏడాదికి వేల టన్నుల్లోనే మట్టి కొట్టుకుపోతోంది. ఆంధ్రప్రదేశ్లో ఇది 4,407 టన్నులైతే, తెలంగాణలో కొంచెం తక్కువగా 3,498 టన్నులు కొట్టుకుపోతోందని ఈ అధ్యయనం వెల్లడించింది.పెద్దపల్లిలో అత్యధికంతెలంగాణ జిల్లాల్లో కోతకు గురై కొట్టుకుపోతున్న మట్టి హెక్టారుకు ఏడాదికి సగటున టన్నుల్లో : పెద్దపల్లి– 22, నల్లగొండ– 20, కుమురంభీం ఆసిఫాబాద్– 18, ములుగు– 18, జయశంకర్ భూపాలపల్లి– 18, ఆదిలాబాద్ – 17, జగిత్యాల– 17, భద్రాద్రి కొత్తగూడెం– 17, మంచిర్యాల– 17, ఖమ్మం– 16, సూర్యాపేట– 16, వరంగల్ రూరల్– 16, మహబూబాబాద్– 13, కరీంనగర్ – 13, వరంగల్ అర్బన్– 13, యాదాద్రి భువనగిరి– 13, వనపర్తి– 12, జనగాం– 12, నిర్మల్– 12, నిజామాబాద్– 12, వికారాబాద్– 12, కామారెడ్డి– 11, రాజన్న సిరిసిల్ల– 11, మహబూబ్నగర్– 11, నాగర్ కర్నూల్– 11, సంగారెడ్డి– 10, నారాయణపేట– 10, సిద్ధిపేట– 9, మెదక్– 9, రంగారెడ్డి– 9, జోగుళాంబ గద్వాల– 8, మేడ్చల్–మల్కాజిగిరి– 6, హైదరాబాద్– 0. జనావాసాలతో కిక్కిరిసి ఉండే హైదరాబాద్ జిల్లా నుంచి వర్షానికి మట్టి పెద్దగా కొట్టుకుపోవట్లేదు! అత్యధికంగా మట్టి కొట్టుకుపోతున్న రాష్ట్రాల్లో తెలంగాణ (Telangana) ఒకటని ఇస్రో అధ్యయనం తెలిపింది.ఆరు వర్గీకరణలుఈశాన్య రాష్ట్రమైన అస్సాంలోని బ్రహ్మపుత్ర నదీ పరీవాహక ప్రాంతం దాదాపు 300 చదరపు కిలోమీటర్లు లేదా దాని ఉపరితల నేలలో 31 శాతం ‘విపత్కర’ స్థాయిలో కోతకు గురవుతోంది. ‘దేశంలో నేల కోతపై సమగ్ర అవగాహన కలిగించేందుకు నేల కోత ఏయే జిల్లాల్లో ఏయే దశల్లో ఉందో అధ్యయనం చేశాం’ అన్నారు సహారియా. ఒక సంవత్సరంలో హెక్టారు భూమి నుంచి టన్నుల కొద్దీ మట్టి కొట్టుకుపోతోంది. ఒక సంవత్సరంలో ఒక హెక్టారులో 100 టన్నులకు పైగా మట్టి కోతకు గురైనట్లు తేలితే, ఆ ప్రాంతాన్ని ‘విపత్తు’ ప్రాంతంగా వర్గీకరిస్తారు.జాతీయ సగటు హెక్టారుకు 21 టన్నులుదేశంలో వానలు, వరదలకు సగటున సంవత్సరానికి హెక్టారు భూమి నుంచి 21 టన్నుల మేరకు మట్టి నీటితో పాటు కొట్టుకుపోతోందని ఢిల్లీ ఐఐటీ అధ్యయనంలో తేలింది. భౌగోళిక స్థితి, జీవవైవిధ్య పరంగా హిమాలయాలు, బ్రహ్మపుత్ర లోయ ప్రాంతాలు నేల కోతకు అతిపెద్ద హాట్స్పాట్. అక్కడితో పోల్చితే భిన్నంగా ఉండే ఒడిశా లో కూడా ‘విపత్కర’ స్థితిలో నేల కోతకు గురవుతోంది.జిల్లాల వారీగా చూస్తే, దేశంలో నేల కోతకు గురయ్యే అవకాశం ఉన్న 20 జిల్లాల్లో తొమ్మిది అస్సాంలోనే ఉన్నాయని అధ్యయనం పేర్కొంది. అడవుల నరికివేత, రసాయనిక/పారిశ్రామిక వ్యవసాయ పద్ధతుల్లో వ్యవసాయం చెయ్యటమే ఇందుకు కారణమని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ‘నేల కోతకు సంబంధించి పాన్–ఇండియా స్థాయిలో రాష్ట్రాలు, జిల్లాల వారీగా అధ్యయనం చేసి గణాంకాలను ఆన్లైన్లో అందరికీ అందుబాటులో ఉంచాం. భవిష్యత్తులో నేల సంరక్షణ ప్రణాళికల అమలుకు ఈ సమగ్ర అవగాహన దోహదపడుతుందని ఆశిస్తున్నాం అన్నారు సహారియా.వర్షపాతం ఇంకా పెరుగుతుంది!వర్షపాతం వచ్చే రోజుల్లో మరింత పెరుగుతుందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. 2050 నాటికి ఖరీఫ్ కాలంలో 5–10 శాతం, రబీ కాలంలో 12–17 శాతం వర్షపాతం పెరుగుతుందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గతంలో పార్లమెంటులో చెప్పారు. అంటే, నివారణ చర్యలకు మనం ఉపక్రమించకపోతే రానున్న రోజుల్లో మరింత మట్టి కొట్టుకుపోతుందన్నమాట. 2050 నాటికి హెక్టారుకు మరో 10 టన్నుల మట్టి కొట్టుకుపోతుందని కూడా మంత్రి హెచ్చరించారు. సుస్థిర వ్యవసాయ పద్ధతుల ద్వారా ఈ సమస్యను కొంత వరకు అధిగమించవచ్చు.100 టన్నుల మట్టి పోతే విపత్తు!మన దేశంలో భూముల ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని ఢిల్లీలోని ఇండియన్ ఇ¯Œ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) అధ్యయనం వెల్లడించింది. దాదాపు 30 శాతం భూభాగం ‘స్వల్పంగా’ కోతకు గురవుతూ ఉంటే, కీలకమైన 3 శాతం భూభాగం ‘విపత్కర’ స్థితిలో మట్టిని వర్షాలు, వరదల వల్ల నష్టపోతోందని ఈ పరిశోధన తెలిపింది. జియోస్పేషియల్ మోడలింగ్ – మ్యాపింగ్’ పేరిట జరిగిన ఈ అధ్యయనం మన దేశం అంతటా నేల కోతను లెక్కగట్టింది. ఢిల్లీ ఐఐటీలో సివిల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, హైడ్రోసెన్స్ ల్యాబ్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డా. మనబేంద్ర సహారియా, రవిరాజ్ అధ్యయనం చేశారు.ఉత్తరాంధ్రలో అత్యధికంఏపీలోని పాత జిల్లాల్లో కోతకు గురై కొట్టుకుపోతున్న మట్టి హెక్టారుకు ఏడాదికి సగటున టన్నుల్లో : శ్రీకాకుళం– 27, విశాఖపట్నం– 27, విజయనగరం– 25, తూర్పు గోదావరి– 16, చిత్తూరు– 16, అనంతపురం– 15, వైఎస్సార్ కడప – 14, పశ్చిమ గోదావరి– 13, కృష్ణా– 13, ప్రకాశం– 13 (782), గుంటూరు– 12, కర్నూలు– 12, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు– 10 .భవిష్యత్తు తరాలు ఏమైపోతాయి?హెక్టారు భూమిలో 1 సెం. మీ. వర్షం కురిస్తే లక్ష లీటర్ల నీరు పడుతుంది. అధిక వర్షాలకు పొలంలోని మెత్తని మట్టి నీట కరిగి వరదతో వెళ్లిపోతుంది. ఆ మట్టి నీటి అడుగుకు చేరాలంటే పది గంటలు పడుతుంది. కాబట్టి, రిజర్వాయర్లు, చెరువుల్లోకి వరద నీటి ద్వారా ఆ మట్టి చేరుతుంది. ఇసుకైతే దగ్గర్లోని పొలాల్లో మేట వేస్తుంది. నేల పైపొర మట్టి వర్షానికి కొట్టుకుపోతే అడుగున మొరం, రాళ్లు, రప్పలు పైకి తేలతాయి. ఒక మోస్తరు వర్షపు నీరు పొలం నుంచి బయటకు పోకుండా భూమిలోకి ఇంకాలంటే పంట పొలాల్లో కందకాలు, కుంటలు తవ్వుకోవాలి. నీరు ఇంకటంతో పాటు మట్టి కూడా పొలం దాటి బయటకు పోకుండా కందకాలు లేదా కుంటల్లో ఆగుతుంది. మట్టిని తర్వాత తీసి మళ్లీ పొలంలో వేసుకోవచ్చు. మట్టిని పరిరక్షించుకునేందుకు అందరూ శ్రద్ధ తీసుకోవాలి. లేకపోతే భవిష్యత్తు తరాలు ఏమైపోతాయి?– డా. అల్లూరి పద్మరాజు, ఆంగ్రూ మాజీ వైస్ఛాన్సలర్మట్టిని జాతి సంపదగా చూడాలిఏటా హెక్టారు భూమిలో 1.5 టన్నుల మట్టి కొత్తగా ఏర్పడుతుంది. 200 ఏళ్లకు గానీ ఒక అంగుళం ఎత్తు మట్టి ఏర్పడదు. అయితే, అంతకు 8 రెట్ల మట్టి ప్రతి ఏటా వాన నీటితో, గాలితో కొట్టుకు పోతోంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. పొలం రైతు సొంతదైనా మట్టిని జాతి సంపదగా చూడాలి. మట్టిని కాపాడుకోవటానికి, భూసారాన్ని పెంపొందించుకోవటానికి ప్రభుత్వం ఈ 4 పనులు చెయ్యాలి: 1. భూమిని వీలైనంత మేరకు ఆచ్ఛాదన పంటలతో, గడ్డితో కప్పి ఉంచటం. 2. అతిగా దున్నటం, దమ్ము చెయ్యటం తగ్గించటం. 3.సాగు పద్ధతి ఏదైనా భూమిలో సేంద్రియ పదార్థం ఎక్కువగా కలిసేలా పచ్చిరొట్ట పంటలు సాగు చేసి కలియదున్నాలి. 4. ప్రతి సీజన్లోనూ దున్నాల్సిన అవసరం ఉన్న వరి వంటి పంటలకు బదులు తోటల సాగుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి.– డా. జీవీ రామాంజనేయులు, ఈడీ, సుస్థిర వ్యవసాయ కేంద్రం వ్యవస్థాపకులు -
హతవిధి.. పాక్ ప్రధానికి ఘోర పరాభవం!
2025లో చైనా తియాంజిన్లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు గురించి ప్రపంచమంతా ఇప్పుడు చర్చించుకుంటోంది. ట్రంప్ టారిఫ్ వార్, ఉక్రెయిన్ శాంతి చర్చల అంశాలతో పాటు పహల్గాం దాడి విషయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా.. భారత దేశానికి మద్దతుగా సదస్సులో పాల్గొన్న దేశాలు తీర్మానం సైతం చేయడం ప్రధానంగా నిలిచాయి. అయితే.. ఈ సదస్సు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు చేదు అనుభవాన్ని మిగిల్చిందన్న చర్చ జోరుగా నడుస్తోంది. అందుకు ఈ సమ్మిట్లో చోటుచేసుకున్న కొన్ని ఘటనలు కారణంగా కాగా.. వాటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ చేస్తూ పాక్ ప్రధానిని నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. షరీఫ్ అంతర్జాతీయంగా అవమానానికి గురయ్యారన్నది ఆ పోస్టుల సారాంశం. అందుకు కారణం లేకపోలేదు.. వేదికపై ఆతిథ్య దేశాధినేత సహా మిగతా ప్రపంచాధినేతలెవరూ ఆయన్ని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. కాదు కాదు.. అసలు పట్టన్నట్లు వ్యవహరించడమే పెద్దగా హైలైట్ అయ్యింది. అవి ఒక్కొక్కటిగా పరిశీలిస్తే.. મોદી અને પુતિનની મુલાકાત દરમિયાન પાકિસ્તાનને નીચે જોવા જેવી સ્થિતિ પેદા થઈRead more at: https://t.co/xr1jIGM2b2#PMModiSCOsummit2025 #NarendraModi #PMModi #ShehbazSharif #VladimirPutin #SCOsummit2025 #SCOsummitinChina #XiJinping #Reels #shorts #newskida #treeshinewskida pic.twitter.com/NxjZc9wc6W— NewsKida (@TreeshiNewsKida) September 1, 2025భారత ప్రధాని నరేంద్ర మోదీ పాక్ ప్రధాని షరీఫ్ను అసలు పట్టించుకోలేదు. మోదీ-పుతిన్ ఇద్దరూ కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా.. షరీఫ్ బిక్కముఖం వేసుకుని పలకరించలేదే అన్నట్లు చూస్తూ ఉండిపోయారు. పైగా మోదీ తన ప్రసంగంలో పహల్గాం దాడి గురించి మాట్లాడిన ఆయన.. కొన్ని దేశాలు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నాయంటూ పాక్నే ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఆ ప్రసంగం సాగినంత సేపు అక్కడే ఉన్న షరీఫ్ ముఖంలో నెత్తురు చుక్క కనిపించలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది!. PM Modi, Putin, Xi Jinping and Shehbaz Sharif meetup in SCO Summit 2025😭🤣#SCOSummit pic.twitter.com/MKnj7TjCO1— Bruce Wayne (@_Bruce__007) September 1, 2025ఇక.. పుతిన్ను కలవాలన్న షరీఫ్ ఉత్సాహం.. అవమానాన్నే మిగిల్చింది. సదస్సు ముగిశాక.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో కరచలనం చేయడానికి షరీఫ్ కంగారుగా పరిగెత్తుతూ కనిపించారు. పుతిన్ షేక్ హ్యాండ్ ఇవ్వడంతో షరీఫ్ మురిసిపోయారు. ఆ సమయంలో పక్కనే ఉన్న చైనా అధ్యక్షుడు జిన్పింగ్.. షరీఫ్ను చూసి పూర్తిగా పట్టన్నట్లు ప్రవర్తించారు. అయితే కాసేపటికే పుతిన్ మరోసారి ఆయన్ని పలకరించారు.आतंक पर बड़ी चोट कर रहे थे PM मोदी, सुन रहे थे पाक पीएम शहबाज शरीफ#PMModi #ShehbazSharif #PMModiInChina #SCOSummit2025 #Pakistan pic.twitter.com/EU2UkhZCq1— One India News (@oneindianewscom) September 1, 2025Shehbaz Sharif after seeing Xi and Putin with Modi while ignoring him 😭 pic.twitter.com/fDlEIEQDor— Fazal Afghan (@fhzadran) September 1, 2025 Pakistan PM Shehbaz Sharif Serving Juice to @narendramodi and #Putin Nice Gesture 🙌 #NarendraModi #ShehbazSharif #SCOSummit #SCOSummit2025 pic.twitter.com/R1eZEni9M7— SATYA ᴿᶜᴮ 🚩 (@sidhufromnaayak) September 1, 2025 ఇక సదస్సు ముగిసిన తర్వాత.. గ్రూప్ ఫొటో సమయంలోనూ షరీఫ్కూ పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. మోదీకి ఎక్కడో ఎనిమిది మంది దేశాధినేతల అవతల నిలబెట్టారు. అంతెందుకు.. చైనా, పాకిస్తాన్కు దశాబ్దాలుగా మిత్ర దేశం అయినప్పటికీ.. ఈ సదస్సులో షరీఫ్ను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కొసమెరుపు. దీంతో.. షాంగై సదస్సు ఏమోగానీ పాక్ ప్రధాని పరిస్థితి దయనీయంగా, దౌర్భాగ్యంగా కనిపించిందని కొందరు నెటిజన్స్ అభివర్ణించారు. ఇంకొందరైతే ఓ అడుగు ముందుకువేసి.. పుతిన్-మోదీ-జిన్పింగ్ భేటీ అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి, ఇటు పాక్ షరీఫ్కు పీడకలను మిగిల్చే అవకాశం ఉందంటూ జోకులు పేలుస్తున్నారు. ట్విటర్, రెడ్డిట్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ లాంటి ఫేమస్ ఫ్లాట్ఫారమ్లలో మీమ్స్, ట్రోలింగ్ ముంచెత్తాయి. మిత్ర హస్తం అవతలి వాళ్లు అందించాలే తప్ప.. అడుక్కోకూడదు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. పుతిన్తో కరచలనం కోసం ఓ బిచ్చగాడిలా ప్రవర్తించారంటూ పాక్ ప్రజలే ఆయన్ని దెప్పి పొడుస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పాక్కు, ఆ దేశ ప్రధానికి ఉన్న ప్రాధాన్యం ఇదేనా? అనే చర్చా జోరుగా నడుస్తోంది. అదే సమయంలో పాక్ మీడియా షరీఫ్ను గ్లోబల్ పవర్హౌజ్ అంటూ కితాబిస్తూ ప్రచారం చేస్తుండడం గమనార్హం. -
ప్రతీ లావాదేవీపై ‘ఐ’టీ!
మల్టీ నేషనల్ బ్యాంక్ ఉద్యోగి ఒకరు తన ఆదాయపన్ను రిటర్నుల్లో వడ్డీ ఆదాయం కింద రూ.25,000 వచ్చినట్టు చూపించాడు. దీంతో ఆదాయపన్ను శాఖ మదింపు అధికారి (అసెసింగ్ ఆఫీసర్)కి సందేహం వచ్చి సంబంధిత ఐటీఆర్ను పరిశీలన కోసం తీసుకున్నారు. పన్ను చెల్లింపుదారు బ్యాంక్ లావాదేవీలను పరిశీలించగా, మరింత విలువైన సమాచారం లభించింది. దీంతో పెనాల్టీ విధించి, చెల్లించాలంటూ నోటీసు జారీ చేశారు. ఒక వ్యాపారి స్థలం విక్రయించగా లాభం వచ్చింది. ఐటీఆర్లో వివరాలు వెల్లడించకుండా గోప్యంగా ఉంచాడు. ఎస్ఎఫ్టీ ద్వారా వచ్చిన సమాచారానికి, వ్యాపారి ఐటీఆర్లో వివరాలకు మధ్య తేడా ఉందని అసెసింగ్ ఆఫీసర్ గుర్తించారు. ఐటీఆర్ మదింపు అనంతరం, స్థలం విక్రయంపై మూలధన లాభాల పన్నుతోపాటు, పెనాల్టీ చెల్లించాలంటూ ఆదేశించారు. అంతేకాదు ఆదాయపన్ను చట్టం కింద చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయడమే కాదు.. చట్టంలోని నిబంధనలను అనుసరించి అన్ని ఆర్థిక వివరాలనూ వెల్లడించడం, పన్ను చెల్లించడం తప్పనిసరి. చెప్పకపోతే పన్ను అధికారులకు తెలియదులే! అన్న నిర్లక్ష్యం పనికిరాదు. అన్ని ముఖ్యమైన ఆర్థిక లావాదేవీల సమాచారం ఐటీ శాఖ గుప్పిట్లో ఉంటుంది. ఖరీదైన కొనుగోళ్లు, క్రెడిట్ కార్డు రుణాలు, ప్రాపర్టీ లావాదేవీలు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడుల సమాచారం ఆదాయపన్ను శాఖకు చేరుతుంది. ఏ చిన్న అంతరం ఉన్నా ఏఐ సాయంతో పన్ను అధికారులు సులభంగా గుర్తిస్తున్నారు. కనుక పన్ను చెల్లించాల్సిన బాధ్యత నుంచి తప్పించుకోవడం కష్టమే..! అన్ని బ్యాంక్లు, ఆర్థిక సంస్థలు, తపాలా శాఖ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ తదితర రిపోర్టింగ్ ఎంటీటీలు (ఆర్ఈలు) ఆదాయపన్ను శాఖ వద్ద ‘స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్’ను (ఎస్ఎఫ్టీ) ఏటా దాఖలు చేయాల్సి ఉంటుంది. ప్రతీ పాన్పై చేసిన నిర్దేశిత ఆర్థిక లావాదేవీల వివరాలను ఎస్ఎఫ్టీలో వెల్లడించాలి. పన్ను ఎగవేతలను నివారించేందుకు ఆదాయపన్ను శాఖ ఎస్ఎఫ్టీలను పరిశీలిస్తుంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి తన వార్షిక ఆదాయం రూ.4.5 లక్షలేనంటూ సెక్షన్ 87ఏ కింద రిబేటును వినియోగించుకుని ఎలాంటి పన్ను లేకుండా రిటర్నులు దాఖలు చేశాడని అనుకుందాం. కానీ, అదే వ్యక్తి రూ.5 లక్షలు విలువ చేసే బంగారం కొనుగోలు చేసి ఉంటే ఆదాయపన్ను శాఖ వద్దనున్న రికార్డులు ఆ విషయాన్ని లేవనెత్తుతాయి. దాంతో వారి ఐటీఆర్లు స్క్రూటినీ (పరిశీలన)కి వెళతాయి. తనకు ఆదాయం రూ.6 లక్షలుగానే చూపించొచ్చు. తీరా చూస్తే బ్యాంక్ నుంచి ఉపసంహరణలు లేకపోవచ్చు. అలాంటప్పుడు ఆ వ్యక్తి జీవన అవసరాలకు కావాల్సిన సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? ఇలాంటివన్నీ ఆదాయపన్ను శాఖ అధికారులు సులభంగా పసిగట్టగలరు. కనుక ఎస్ఎఫ్టీ గురించి, ఏఐఎస్ గురించి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి. ప్రతి సమాచారం రికార్డు అవుతుంది.. స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ (ఎస్ఎఫ్టీ) ద్వారా బ్యాంక్లు, మ్యూచువల్ ఫండ్స్, రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, తదితర సంస్థలు అందించే సమాచారం.. పాన్ నంబర్ వారీగా వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)లో నమోదవుతుంది. అన్ని ముఖ్య ఆర్థిక లావాదేవీల వివరాలు ప్రతీ పన్ను చెల్లింపుదారుడి ఏఐఎస్లో ఆటోమేటిక్గా రికార్డు అవుతాయని సింఘానియా అండ్ కో పార్ట్నర్ రికిత నయ్యర్ వెల్లడించారు. కనుక ఏఐఎస్ను ఒక్కసారి పరిశీలించుకున్న తర్వాత ఐటీఆర్ దాఖలు చేసుకోవాలని సూచించారు. దీనివల్ల కచ్చితమైన సమాచారంతో ఐటీఆర్ నమోదు చేయడం సాధ్యపడుతుందని, తద్వారా ఐటీఆర్ వేగంగా ప్రాసెస్ అవుతుందని చెప్పారు. గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2024–25) పన్ను రిటర్నుల సమర్పణకు పొడిగించిన గడువు సెప్టెంబర్ 15వ తేదీతో ముగియనుంది.ఐటీఆర్లో వెల్లడించకపోతే ఏమవుతుంది? ‘‘పన్ను చెల్లింపుదారు ఆదాయపన్ను రిటర్నుల్లో (ఐటీఆర్) కీలక లావాదేవీల సమాచారాన్ని వెల్లడించనప్పుడు లేదా ఎస్ఎఫ్టీ, ఏఐఎస్లోని సమాచారంతో, ఐటీఆర్లోని వివరాలు సరిపోలనప్పుడు తదుపరి పలు పరిణామాలకు దారితీయవచ్చు’’ అని సంజోలి మహేశ్వరి తెలిపారు. నోటీసులు: ఏఐఎస్లో నమోదైన అధిక విలువ కలిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వివరణ కోరుతూ ఆదాయపన్ను శాఖ నోటీసు జారీ చేస్తుంది. ఐటీఆర్లో వెల్లడించిన లావాదేవీలు సరిగ్గానే ఉన్నాయా? అంటూ ధ్రువీకరించాలని కోరుతుంది. పూర్తి వివరాలు వెల్లడించకపోవడం లేదంటే పాక్షిక వివరాలతో సరిపెట్టినట్టయితే సవరించిన ఐటీఆర్లు దాఖలు చేయాలని కోరుతుంది. పరిశీలన: ఐటీఆర్లో వెల్లడించిన ఆదాయానికి, ఎస్ఎఫ్టీలో లావాదేవీల సమాచారానికి మధ్య పొంతన లేనప్పుడు లేదా అసలు ఐటీఆర్ దాఖలు చేయనప్పుడు లేదంటే నోటీసుకు స్పందించనప్పుడు లేదా నోటీసుకు సరైన సమాధానం ఇవ్వనప్పుడు సంబంధిత పన్ను చెల్లింపుదారుడి ఐటీఆర్ను పూర్తి స్థాయి పరిశీలనను అసెసింగ్ ఆఫీసర్ చేపడతారు. నోటీసు జారీ చేసి సరైన సమాచారంతో రిటర్నులు దాఖలు చేయాలని పన్ను అధికారి కోరొచ్చు. పెనాల్టిలు: నిబంధనల ప్రకారం ఐటీఆర్లు దాఖలు చేయకపోవడం లేదా పన్ను చెల్లించనట్టయితే.. జరిమానాతో సహా చెల్లించాలని ఆదేశాలు జారీ చేస్తారు. ఈ పెనాల్టీ అసలు పన్నుకు 50 శాతం నుంచి 200 శాతం వరకు ఉంటుంది. అంతేకాదు చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు. ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగ్గొట్టినట్టు గుర్తిస్తే జరిమానాకు అదనంగా జైలు శిక్ష కూడా పడుతుందని మహేశ్వరి తెలిపారు. ఎగవేసిన మొత్తం రూ.25 లక్షలకు పైన ఉంటే 6 నెలల నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్షతోపాటు జరిమానా చెల్లించాల్సి వస్తుందని.. తప్పుడు వివరాలతో లేదా వివరాలను రహస్యంగా ఉంచి వెల్లడించని సందర్భాల్లో 3 నెలల నుంచి 2 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించొచ్చని చెప్పారు. అయితే, నోటీసులకు సకాలంలో స్పందించి, వాస్తవ సమాచారంతో ఐటీఆర్లు దాఖలు చేసి, పన్ను చెల్లించడం ద్వారా ఈ ఇబ్బందులను అధిగమించొచ్చు. ఎస్ఎఫ్టీల్లోకి చేరే లావాదేవీలు.. → ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు అంతకుమించిన విలువపై బ్యాంక్ డ్రాఫ్ట్లు/ పే ఆర్డర్లు / బ్యాంకర్ చెక్కులకు నగదు చెల్లింపులు. → బ్యాంక్లు, కోపరేటివ్ బ్యాంకుల నుంచి ప్రీ–పెయిడ్ ఇన్స్ట్రుమెంట్లను రూ.10 లక్షలు అంతకుమించి నగదు చెల్లించి కొనుగోలు చేయడం. → ఒక వ్యక్తి కరెంట్ ఖాతాలో నగదు జమలు రూ.50 లక్షలు అంతకుమించి చేసినప్పుడు. → ఒక వ్యక్తి కరెంట్ ఖాతా నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50 లక్షలు, అంతకుమించి నగదు ఉపసంహరణలు. → కరెంట్, టైమ్ డిపాజిట్ కాకుండా ఇతర బ్యాంక్ ఖాతాల్లో ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు అంతకుమించి నగదు జమ చేయడం. → వస్తువు లేదా సేవా విక్రయంపై ఒక వ్యక్తి రూ.2 లక్షలకు మించి నగదు చెల్లించడం. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 44ఏఈబీ కిందకు ట్యాక్స్ ఆడిట్ అవసరమైన వారికే ఈ నిబంధన → ఒకటి లేదా ఒకటికి మించిన క్రెడిట్ కార్డులకు ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు చెల్లింపులు రూ.లక్ష అంతకుమించి ఉంటే → ఒకటి లేదా అంతకు మించిన క్రెడిట్ కార్డులకు డిజిటల్ చెల్లింపుల మొత్తం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు, అంతకు మించితే. → ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు అంతకుమించిన మొత్తంతో టైమ్ డిపాజిట్ (రెన్యువల్ కాకుండా) చేయడం. → బాండ్లు లేదా డిబెంచర్లపై మొత్తం మీద (ఒకటికి మించిన లావాదేవీలు కూడా) ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు అంతకుమించి ఇన్వెస్ట్ చేయడం. → షేర్ల కొనుగోలు విలువ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు (ఒక్క లావాదేవీ లేదా ఒకటికి మించిన లావాదేవీల మొత్తం), అంతకుమించినప్పుడు ఎస్ఎఫ్టీ ద్వారా బ్రోకర్లు ఐటీ శాఖకు ఫైల్ చేయాల్సిందే. → షేర్ల బైబ్యాక్లో పాల్గొని విక్రయించిన మొత్తం రూ.10 లక్షలు అంతకుమించిన సందర్భాల్లో. → మ్యూచువల్ ఫండ్స్లో యూనిట్లపై పెట్టుబడి రూ.10 లక్షలు అంంతకుమించిన సందర్భాల్లో. → స్థిరాస్తి కొనుగోలు లేదా విక్రయం విలువ (రిజిస్ట్రేషన్ వ్యాల్యూ/ప్రభుత్వ మార్కెట్ విలువ లేదా రికార్డు అయిన అసలు కొనుగోలు/విక్రయం విలువ) రూ.30 లక్షలు అంతకుమించిన సందర్భాల్లో రిజిస్టార్ లేదా సబ్ రిజి్రస్టార్ నివేదించాల్సి ఉంటుంది. → ఫారీన్ కరెన్సీ కోసం రూ.10 లక్షలు అంతకుమించిన చెల్లింపులు చేసినప్పుడు. → క్రెడిట్ లేదా డెబిట్ కార్డు లేదా ట్రావెలర్స్ చెక్కు లేదా డ్రాఫ్ట్ రూపంలో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు అంతకుమించి ఖర్చు చేసిన సందర్భాల్లో సమాచారం ఎస్ఎఫ్టీ రూపంలో ఐటీ శాఖకు వెళుతుంది. రిజిస్ట్రార్ అండ్ షేర్ ట్రాన్స్ఫర్ ఏజెంట్, రిజి్రస్టార్ కార్యాలయాలు తదితర) ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాతి మే 31లోపు ఎస్ఎఫ్టీలను నమోదు చేయాల్సింఇక్కడ చెప్పిన పరిమితులన్నీ ఒక ఆర్థిక సంవత్సరం మొత్తానికి కలిపి అమలవుతాయి. రిపోర్టింగ్ ఎంటీటీలు (బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు, మ్యూచువల్ ఫండ్స్ ట్రస్టీలు లేదా మ్యూచువల్ ఫండ్స్దే.– సంజోలి మహేశ్వరి , నాంజియా అండ్ కో ఎల్ఎల్పీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు.వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్) వేతనాలు, వడ్డీ ఆదాయం, డివిడెండ్లు, ఇల్లు/ప్లాంట్లు/మెíÙనరీలపై అద్దె ఆదాయం తదితర లావాదేవీల వివరాలతోపాటు.. టీడీఎస్, టీసీఎస్, జీఎస్టీ ఇతర పన్ను సంబంధిత వివరాలు, రెమిటెన్స్లు (విదేశీ చెల్లింపులు/స్వీకరణలు), షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్లలో పెట్టుబడులు/ఉపసంహరణలు, ఆఫ్ మార్కెట్ కొనుగోళ్లు/విక్రయాలు, ప్రాపర్టీల క్రయ/విక్రయాలు ఇలా సమగ్ర సమాచార నివేదికగా ఏఐఎస్ ఉంటుంది. అంతేకాదు బంగారం, కార్లు తదితర అధిక విలువ కొనుగోళ్లు, కమీషన్ల ఆదాయం, విదేశీ పర్యటనలపై అధిక వ్యయాలు, జీవిత బీమా పాలసీల నుంచి అందుకున్న మొత్తం, లాటరీ/బెట్టింగ్ల్లో గెలుచుకుంటే, ఆయా వివరాలు కూడా ఇందులోకి చేరతాయి. దీన్ని రిటర్నుల దాఖలుకు ముందు ఒకసారి పరిశీలించుకుని, అందులోని వివరాలు/లావాదేవీలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిపై తమ అభిప్రాయాలను ఆదాయపన్ను శాఖకు నివేదించొచ్చు. ఉదాహరణకు ఏదైనా పెట్టుబడి విషయంలో అసలు కంటే అధిక మొత్తం ఉన్నట్టు గుర్తించినట్టయితే ఇదే విషయాన్ని ఆదాయపన్ను శాఖ దృష్టికి తీసుకెళ్లొచ్చు. దాంతో అది సవరణకు గురవుతుంది. పన్ను చెల్లింపుదారుడికి సంబంధించి సమగ్రమైన ఆర్థిక సమాచార నివేదిక ఇది. పూర్తిగా పరిశీలించుకుని, నిబంధనల ప్రకారం ఆ వివరాలను ఐటీఆర్లో స్వచ్ఛందంగా వెల్లడించే దిశగా పన్ను చెల్లింపుదారులను ప్రోత్సహించడమే దీని ఉద్దేశం. ఫారమ్ 26ఏఎస్ ఫారమ్ 26ఏఎస్ అన్నది పన్ను చెల్లింపుదారుడి ఆదాయంపై మినహాయించిన టీడీఎస్, వ్యయాలపై వసూలు చేసిన టీసీఎస్, ప్రాపర్టీ క్రయ/విక్రయాల వివరాలతో ఉంటుంది. ఏఐఎస్, ఫారమ్ 26ఏఎస్ను ఆదాయపన్ను ఈ–ఫైలింగ్ పోర్టల్ నుంచి పొందొచ్చు. -
స్టార్టింగ్ ప్రాబ్లమా
స్టార్టింగ్ ప్రాబ్లం.. మనం తరచూ వినే డైలాగ్. తలపెట్టిన పనులను తరచూ వాయిదా వేస్తుంటారు కొందరు. వారిని ఆట పట్టించడానికి ‘స్టార్టింగ్ ప్రాబ్లమా’ అని అంటుంటాం. వ్యాయామం, ఇంటి పనుల వంటివి ప్రారంభించడం కష్టంగా అనిపిస్తుందా? యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ హాస్పిటల్స్లో న్యూరాలజీ వైద్యులు, న్యూరో సైంటిస్ట్గా పనిచేస్తున్న డాక్టర్ ఫేయ్ బెగేటి ఓ చక్కటి, సులభ పరిష్కారాన్ని ప్రతిపాదిస్తున్నారు. మెదడు శక్తిని పెంచడానికి, మానసిక అడ్డంకులను తొలగించడానికి నిబద్ధతతో కూడిన ఓ ‘5 నిమిషాలు’ చాలు అంటున్నారు.రేపట్నుంచి వాకింగ్కు వెళ్తా.. డిసెంబర్ 31 నాడు.. ‘జనవరి 1 నుంచి వాకింగ్ లేదా వ్యాయామం చేస్తా’రేపట్నుంచి ఉదయం ఆరింటికే నిద్ర లేస్తా..పోటీ పరీక్షలకు రేపట్నుంచి ప్రిపరేషన్ మొదలుపెడతా.... ఇలాంటి నిర్ణయాలు చాలామంది తీసుకుంటారు. కానీ, బద్ధకం వాటిని అమలు చేయనివ్వదు. అలాంటి కష్టమైన పనులను చేయడంలో మనసు, మెదడు.. రెండూ మొండికేస్తుంటాయి. మరి, దీన్ని అధిగమించడం ఎలా? 5 నిమిషాల నియమం.. మనసును సిద్ధం చేసే ఓ చిట్కా. ఇది వాయిదా వేసే మనస్తత్వాన్ని మారుస్తుంది.తద్వారా మానసిక అలసట తగ్గుతుందని బెగేటి అంటున్నారు. ఒక పనిని ప్రారంభించడానికి మనసు సన్నద్ధంగా లేనప్పుడు.. ఆ పనిని కేవలం 5 నిమిషాల సేపు చేసి చూడాలి. సాధారణంగా మన మెదడు పని కష్టాన్ని ఎక్కువగా అంచనా వేస్తుంది. అందువల్ల ఎక్కువ సేపు చేస్తే అలసిపోతానని ముందే ఊహించుకుంటుంది. కాబట్టి 5 నిమిషాల పాటు నిబద్ధతతో పనిచేస్తే మెదడు అలవాటు పడి, తరవాత ఆ పని కొనసాగించేలా ప్రేరేపిస్తుంది.మానసిక అలసటే పెద్ద సమస్యశారీరక అలసట ఉన్నా ఫర్వాలేదుగానీ.. మానసిక అలసట ఉంటే మాత్రం మెదడు పనిచేయనివ్వదు. మెదడు అలసటను.. స్మార్ట్ఫోన్ ‘లో బ్యాటరీ’ మోడ్తో పోల్చారు బెగేటి. లో బ్యాటరీ ఉన్నా మనం పనిచేస్తుంటే.. ‘బ్యాటరీ లో’ అని ప్రతిసారీ అరుస్తున్నట్టే.. ‘నేను చేయను/చేయడానికి సిద్ధంగా లేను’ అని మెదడు కూడా మొరాయిస్తుంది. సోషల్ మీడియా స్క్రోలింగ్ వంటి తక్షణ వినోదాన్ని అందించే సాధారణ కార్యకలాపాలను ఎంచుకోవడం ద్వారా.. మెదడు తక్కువ కష్టమైన పనులవైపు మొగ్గు చూపుతుంది. ‘5 నిమిషాల’ నియమం.. మెదడుకున్న ఈ బద్ధకానికి చక్కటి చిట్కాలా పనిచేస్తుంది. ‘5 నిమిషాలే కదా చేసేద్దాం’ అని చేసేస్తుంది.దినచర్యగా మారుతుందిఏదైనా పనిని ప్రారంభించినప్పుడు మెదడు డోపమైన్ ను విడుదల చేస్తుంది. ఇది ప్రేరణతోపాటు ఆనందం ఇచ్చే రసాయనం. ఈ 5 నిమిషాల ప్రక్రియ.. మనలో జోష్ నింపి ఆ సమయం తరవాత కూడా పని చేయడానికి ప్రేరేపిస్తుంది. ఇది ఒక దినచర్యగా అలవాటైతే.. దీర్ఘకాలంలో మెదడు చురుగ్గా, మరింత ప్రభావవంతంగా పనిచేసేందుకు దారితీస్తుందని బెగేటి పేర్కొన్నారు. వ్యాయామం, ఇంటి బాధ్యతలతో సహా ఏదైనా సవాలుతో కూడిన, శక్తిని వినియోగించే పనికి ఈ నియమం రోజువారీ సాధనంగా పనిచేస్తుంది. 5 నిమిషాల నియమం.. వాయిదా వేసే విధానానికి చెక్ పెట్టడంలో సహాయపడుతుంది. అదే సమయంలో నిర్ణయం తీసుకోవడంలోనూ , దృష్టి కేంద్రీకరించిన పని వల్ల వచ్చే అలసటను తగ్గించి మెదడును చురుగ్గా ఉంచుతుంది.చిన్న చిన్న ప్రయత్నాలు⇒ చిన్న చిన్న ప్రయత్నాలతో మెదడును సిద్ధం చేయండి. అవి నిరంతరం పనిని కొనసాగించేలా ప్రేరేపిస్తాయి.⇒ రోజూ కేటాయించే ఆ 5 నిమిషాలు.. అంటే సంవత్సరానికి సుమారు 30 గంటల అభ్యాసంతో స్థిరంగా చేసే చిన్న పనులు పెద్ద ఫలితాలను ఇస్తాయి.⇒ పనులను మరింత సులువుగా మొదలుపెట్టేందుకు ఈ చిట్కా తోడ్పడుతుంది.⇒ మెదడు.. చేయనని మొండికేసే స్థితి నుంచి నేను చేయగలననే చురుకైన స్థితికి మారడానికి ఈ నియమం దోహద పడుతుంది.ఇలా విజయవంతం చేయండి⇒ చేయాల్సిన పూర్తి పని నుంచి ఒక నిర్దిష్ట చిన్న విభాగాన్ని మీ ప్రారంభ సాధనంగా ఎంచుకోండి⇒ ఇందుకోసం టైమర్లో అయిదు నిమిషాల సమయాన్ని సెట్ చేయండి⇒ మీ దృష్టిని మరల్చే వాటిని గుర్తించి తొలగించండి.⇒ 5 నిమిషాల తర్వాత పురోగతిని చెక్ చేయండి. దీనిని బట్టి ఆ పనిని కొనసాగించాలా వద్దా అని నిర్ణయించుకోండి. -
‘ప్రొఫైల్ ’ నకిలీ.. ‘సైబర్’ మకిలి
నకిలీ ప్రొఫైల్, సైబర్ వేధింపులు, ప్రొఫైల్ హ్యాకింగ్.. తీరు ఏదైనా సైబర్ నేరాల సంఖ్య భారత్లో ఏటా పెరుగుతూనే ఉంది. జనం డిజిటల్కు పెద్ద ఎత్తున మళ్లుతుండడం, అదే సమయంలో పూర్తిగా అవగాహన ఉండకపోవడం.. సైబర్ నేరగాళ్లకు కలిసి వస్తున్నాయి. ముఖ్యంగా ఆన్ లైన్ , సామాజిక మాధ్యమాల వేదికగా నకిలీ ఆన్ లైన్ ఖాతాలు తెరిచి చేస్తున్న మోసాలే ఎక్కువగా ఉంటున్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్ఇతర వ్యక్తులు, బ్రాండ్, సంస్థలా కనిపించడానికి నకిలీ ఆన్ లైన్ ఖాతా తెరిచి చేస్తున్న మోసాలు దేశంలో అధికంగా ఉంటున్నాయి. అక్రమంగా డబ్బు సంపాదించే లక్ష్యంతో వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వివరాలను ఉపయోగించి సైబర్ నేరస్తులు ఇతరులను మోసం చేస్తున్నారు. గతేడాది ఇలాంటి ఘటనలు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఛిyb్ఛటఛిటజీఝ్ఛ.జౌఠి.జీn) ద్వారా 39,846 నమోదయ్యాయి. నాలుగేళ్లలో ఈ తరహా మోసాలు మూడు రెట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్ సీఆర్పీ వేదిక ద్వారా సైబర్ వేధింపుల ఫిర్యాదులు మూడున్నర రెట్లు పెరిగి 39,077కు చేరాయి. ప్రొఫైల్ హ్యాకింగ్, గుర్తింపు చోరీ ఘటనలు మూడింతలకుపైగా అధికమై 38,295కు పెరిగాయి. ఆన్ లైన్ జాబ్, మ్యాట్రిమోనియల్ మోసాలు కూడా పెరుగుతూ ఉన్నాయి.కేసులు ఎన్నోరెట్లు..అధికారిక లెక్కల ప్రకారం గతేడాది దేశవ్యాప్తంగా 22 లక్షలకుపైగా సైబర్ సెక్యూరిటీ ఘటనలు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. ఆన్ లైన్ , సామాజిక మాధ్యమాల ద్వారా మోసాలు 2020తో పోలిస్తే 2024 నాటికి దాదాపు మూడింతలయ్యాయి. మహిళలు, పిల్లలపై జరుగుతున్న సైబర్ నేరాల సంఖ్య రెండింతలకుపైగా పెరిగి గత ఏడాది 48,475కు చేరాయి. సైబర్ నేరస్తులు ఇతర దేశాల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నట్టు వారు ఉపయోగించిన ఇంటర్నెట్ ప్రొటోకాల్ (ఐపీ) అడ్రస్లను బట్టి తెలుస్తోంది. సైబర్ క్రిమినల్స్ చాలా సందర్భాల్లో తప్పుడు లొకేషన్ , గుర్తింపుతో తప్పుదోవ పట్టిస్తున్నట్టు హోం మంత్రిత్వ శాఖ వర్గాలు గుర్తించాయి.కేటాయింపులు మూడింతలు..పౌరులు, వ్యాపారాలు, ప్రభుత్వానికి సురక్షిత సైబర్స్పేస్ను నిర్మించడానికి నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ (ఎన్ సీఎస్పీ)ని కేంద్రం తీసుకొచ్చింది. అలాగే దేశంలోని సైబర్స్పేస్ను జల్లెడ పట్టేందుకు, సైబర్ భద్రతా ముప్పులను గుర్తించడానికి నేషనల్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ (ఎన్ సీసీసీ) ఏర్పాటు చేసింది. డేటా సంరక్షణ కోసం డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) చట్టం–2023 తీసుకొచ్చింది. ఎలక్ట్రానిక్స్, సమాచార మంత్రిత్వ శాఖ సైబర్ సెక్యూరిటీ మౌలిక వసతుల కోసం కేటాయించిన నిధులు 5 ఏళ్లలో మూడింతలకుపైగా పెరగడం గమనార్హం. -
గంటకు 400 కిలోమీటర్లు!
భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఒకటైన ముంబై–అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయి. గుజరాత్లోని స్టేషన్ ్సలో సివిల్ పనులు పూర్తి అయ్యాయని రైల్వే శాఖ ప్రకటించింది. అత్యాధునిక సాంకేతికతతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో భాగంగా ఈస్ట్ జపాన్ రైల్వే కంపెనీ అభివృద్ధి చేస్తున్న ‘ఈ–10’ షింకన్సెన్ బుల్లెట్ రైలు 2030లో పట్టాలెక్కనుంది. గంటకు 400 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లడం ఈ ట్రైన్ ప్రత్యేకత.జపాన్ పర్యటనలో భాగంగా షింకన్సెన్ బుల్లెట్ రైలులో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణించడం ప్రాధాన్యత సంతరించుకుంది. జపాన్ సహకారంతో ముంబై–అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్టును భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. హై స్పీడ్ రైల్ నడపడం కోసం అక్కడ శిక్షణ పొందుతున్న భారత డ్రైవర్లతోనూ మోదీ ముచ్చటించారు. ఈ నేపథ్యంలో దేశంలోని తొలి హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు మరోసారి వార్తల్లోకెక్కింది.508 కి.మీ. కారిడార్బుల్లెట్ రైలు ప్రాజెక్టు గుజరాత్, మహారాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీల గుండా పోతుంది. మొత్తం కారిడార్ పొడవు 508 కిలోమీటర్లు. ఇందులో 12 స్టేషన్లు ఉంటాయి. వీటిలో మహారాష్ట్రలో నాలుగు, గుజరాత్లో ఎనిమిది రానున్నాయి. మహారాష్ట్రలో ముంబై స్టేషన్ భూగర్భంలో నిర్మిస్తుండగా మిగిలిన థానే, విరార్, బోయిసర్, అలాగే గుజరాత్లోని వాపి, బిలిమోరా, సూరత్, భారుచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి వద్ద ఎలివేటెడ్ స్టేషన్ ్స రానున్నాయి.⇒ మొత్తం 8 స్టేషన్లలో ఫౌండేషన్ పనులు పూర్తయ్యాయి. ⇒ 395 కి.మీ పీయర్ పనులు, 407 కి.మీ. ఫౌండేషన్, 337 కి.మీ. గర్డర్ క్యాస్టింగ్ కూడా పూర్తయ్యాయి. ⇒ 17 రివర్ బ్రిడ్జిల నిర్మాణం పూర్తయింది. మరో 9 రివర్ బ్రిడ్జిల నిర్మాణం పూర్తికావచ్చింది. ⇒ 317 కి.మీ. వయడక్ట్ నిర్మాణం కూడా పూర్తయింది. ⇒ గుజరాత్లో 198 కిలోమీటర్ల ట్రాక్ సిద్ధమైంది.ట్రయల్ రన్ 2027లో..గుజరాత్లో మొదటి 50 కిలోమీటర్ల మార్గంలో 2027లో బుల్లెట్ రైలు పరుగు తీయనుంది. గుజరాత్లోని స్టేషన్ల నిర్మాణం 2027 డిసెంబర్ నాటికి, మొత్తం ప్రాజెక్టు 2029 డిసెంబర్ నాటికి పూర్తవుతుందని రైల్వే శాఖ ప్రకటించింది.రూ.78,839 కోట్ల వ్యయంముంబై–అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,08,000 కోట్లు. ఈ ఏడాది జూన్ 30 నాటికి రూ.78,839 కోట్లు ఖర్చు చేశారు.⇒ ప్రాజెక్టు అంచనా వ్యయంలో 81 శాతం మొత్తాన్ని జపాన్ ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ ఏజెన్సీ (జికా) ద్వారా జపాన్ ప్రభుత్వం సమకూరుస్తోంది. ⇒ ఈ ప్రాజెక్టులో రైల్వే శాఖకు 50 శాతం; మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలకు చెరి 25 శాతం వాటా ఉంది. ఆర్థిక సహాయంతోపాటు భారత్లో సమాచార సేకరణ, పరీక్షల కోసం రెండు షింకన్సన్ రైళ్లను జికా ఉచితంగా సరఫరా చేస్తోంది.స్థల సేకరణ పూర్తిమహారాష్ట్రలో భూసేకరణ, అనుమతుల జాప్యం, కోవిడ్–19 మహమ్మారి.. తదితర కారణాలతో ఈ ప్రాజెక్టు దాదాపు రెండున్నరేళ్లు ఆలస్యం అయింది. ప్రాజెక్టుకు కావాల్సిన 1,389.5 హెక్టార్ల భూ సేకరణ పూర్తి అయినట్టు రైల్వే శాఖ వెల్లడించింది. అన్ని అనుమతులూ పొంది, సివిల్ కాంట్రాక్టులన్నీ నిర్మాణ సంస్థలకు అప్పగించారు.80 నిమిషాల్లో...గంటకు 400 కి.మీ. వేగంతో పరిగెత్తే ఈ–10 బుల్లెట్ ట్రైన్ ముంబై నుంచి సబర్మతికి మధ్య ఉన్న 508 కిలోమీటర్ల దూరాన్ని నాన్ –స్టాప్గా అయితే 80 నిముషాల్లో పూర్తి చేస్తుంది.ఈ–5 కాదు.. ఈ–10 రైళ్లుఒప్పందంలో భాగంగా జపాన్ ప్రభుత్వం ‘ఈ–5’ షింకన్సెన్ బుల్లెట్ రైళ్లు మనదేశానికి పంపాలి. కానీ, ఇప్పుడు అత్యాధునికమైన ‘ఈ–10’ రైళ్లు ఆ దేశం తయారుచేస్తోంది. వాటినే మనకు పంపనుంది. ఇవి జపాన్ తోపాటు భారత్లోనూ 2030 ప్రారంభంలో ఎంట్రీ ఇవ్వనున్నాయి. ‘ఈ–5’ బుల్లెట్ ట్రైన్ వేగం గంటకు గరిష్టంగా 320 కి.మీ. కాగా, ఈ–10 రైలు వేగం 400 కి.మీ. ఈ రైళ్లను భారత్లోనూ తయారు చేసే అవకాశం ఉంది. సముద్రగర్భ రైల్ టన్నెల్ఈ కారిడార్లో 21 కిలోమీటర్ల పొడవైన సముద్రగర్భ రైల్ టన్నెల్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ముంబై–థానే మధ్య నిర్మిస్తున్న ఈ టన్నెల్లో భారత్లో మొట్టమొదటి 7 కి.మీ. పొడవైన సముద్రగర్భ సొరంగం కూడా ఉంది. 13.1 మీటర్ల వ్యాసం కలిగిన ఒకే ట్యూబ్ సొరంగంలో రెండు ట్రాక్లు ఉంటాయి. మహారాష్ట్రలోని 4 కి.మీ. టన్నెల్ పనులు, గుజరాత్లోని ఒకే ఒక్క టన్నెల్ నిర్మాణం పూర్తయ్యాయి.⇒ హైస్పీడ్ రైల్ కారిడార్ మొత్తం పొడవు 508 కి.మీ.⇒ నర్మద, తపతి వంటి నదులపై నిర్మిస్తున్న మొత్తం 25 రివర్ బ్రిడ్జిలలో 17 పూర్తి⇒ మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.1,08,000 కోట్లలో ఇప్పటికే రూ.78,839 కోట్ల వ్యయం⇒ గుజరాత్లో 2027లో 50 కిలోమీటర్లలో పాక్షిక కార్యకలాపాలు⇒ 2030లో పూర్తిస్థాయిలో పరుగులు తీయనున్న బుల్లెట్ రైల్ -
కలలకు మేత.. కడుపే!
ఇంతవరకూ ఎవరు చెప్పినా, ‘‘పగటి పూట ఆలోచనలే రాత్రి పూట కలలు’’ అని చెప్పినవాళ్లే. సిగ్మండ్ ఫ్రాయిడ్ అదే చెప్పారు. మన వేదాలూ, ఉపనిషత్తులూ అదే చెప్పాయి. అయితే ఏం తింటే కలలు, పీడకలలు వస్తాయో ఏ కలల శాస్త్రమూ చెప్పలేదు. ఏ శాస్త్ర పరిశోధనా గుట్టు విప్పలేదు. అయినా తినే ఆహారానికీ, నిద్రలో వచ్చే కలలకు సంబంధం ఉంటుందని అసలు ఎవరు ఊహిస్తారు కనుక?! ఆహారమేమో కడుపులోకి వెళ్లేది. కలలేమో బ్రెయిన్లోంచి వచ్చేవి. లింక్ ఎలా ఉంటుంది? అందుకే ఆ వైపుగా పరిశోధనలు జరగలేదు. తాజాగా ఇప్పుడు, పరిశోధన కాదు కానీ, అధ్యయనం ఒకటి జరిగింది. అందులో ఏం తేలిందంటే.. పడనివి తింటే పీడకలలు మన పీక పట్టుకుంటాయని!!ఏం తింటే వస్తాయి?కలలు ఎందుకొస్తాయో చెప్పే శాస్త్రాలే కానీ, ఏం తింటే కలలు వస్తాయో చెప్పిన శాస్త్రం ఒక్కటీ మనకు లేదు. ‘ఆన్ డ్రీమ్స్’ అని అరిస్టాటిల్ రాసినా, ‘ది ఫిలాసఫీ ఆఫ్ డ్రీమ్స్’ అని స్వామీ శివానంద విశ్లేషించినా.. అవేవీ కూడా ‘కలలకు మేత ఎవరు వేస్తున్నారు?’ అనే కోణం లోంచి దృష్టి సారించినవి కావు. అయితే ఇటీవల కెనడా అధ్యయనవేత్తలు కొందరు కలలకు–ఆహారానికి సంబంధం ఉందని నిర్ధారించటంతో, ‘ఏం తింటే పీడ కలలు వస్తాయి?’ అనే ఆసక్తి అంతటా మొదలైంది.పాలు కలిస్తే పీడ కలలు!తాజా అధ్యయనానికి ముందు కూడా కొన్ని సర్వేలు జరిగాయి. కానీ అవి – ‘కలలకు, కడుపుకు సంబంధం ఉండే అవకాశం లేకపోలేదు’ అన్నంత వరకు మాత్రమే ఫలితాలను అందించాయి. 2005 నుంచి ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న మరొక అధ్యయనం ఈ దిశగా ఒక అడుగు ముందుకు వేసి, ఫాస్ట్ ఫుడ్ తినే వారి కంటే పాల ఉత్పత్తులతో కూడిన ఆహారం తినే వారికే ఎక్కువగా వింతైన కలలు వస్తున్నట్లు కనుగొంది!స్వీట్లు తినేవారిలో ఎక్కువ2021లో జరిగిన సర్వేలో.. పండ్లు, చేపలు ఎక్కువగా తింటే, రాత్రి కన్న కలలు ఉదయానికి బాగా స్పష్టంగా జ్ఞాపకం ఉంటాయని; అలాగే చక్కెరలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల పీడ కలలు వస్తున్నాయనీ వేర్వేరుగా రెండు అంశాలను అధ్యయనవేత్తలు గుర్తించారు. ఇక 2015లో జరిగిన అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు 18 శాతం మంది.. తినే ఆహారం కలలకు కారణం అవుతుందన్న భావనను ఆమోదించారు. సైకాలజీ విద్యార్థులపై సర్వేఇరవై ఏళ్లుగా జరుగుతున్న అధ్యయనాలన్నిటికీ కొనసాగింపుగా, ఇటీవల 1,082 మంది కెనడా మనస్తత్వశాస్త్ర విద్యార్థులతో నీల్సన్, డెనాల్డ్, పావెల్ పరిశోధకులు ఆ¯Œ లైన్ సర్వే నిర్వహించారు. ఆ విద్యార్థుల ఆహార అలవాట్లు, ఆరోగ్యం ఎలా ఉంటున్నదీ, సరిగానే నిద్ర పోతున్నారా, ఎలాంటి కలలు వస్తుంటాయి అనే ప్రశ్నలు అడిగారు. ఆహారం, పడని ఆహారం కలలను ఎలా ప్రభావితం చేస్తోందన్నది కనిపెట్టటమే వారి లక్ష్యం.ఆ ప్రయత్నంలో పీడ కలలు రావటం పైన కూడా ఆహారం ప్రభావం ఉన్నట్లు వారు గుర్తించారు!తాజా అధ్యయన ఫలితాలు⇒ ఫుడ్ అలర్జీలు; గోధుమ, బార్లీలో ఉండే గ్లూటెన్ పడని వారికి పీడకలలు వస్తున్నాయి. ⇒ ఆహారంలోని లాక్టోస్ పడని వారికి నిద్రలేమి ఉంటోంది. ⇒ కడుపు నొప్పి, ఉబ్బరం వంటి జీర్ణాశయ ఇబ్బందులలో కూడా లాక్టోస్ పాత్ర ఉంటోంది.⇒ గట్ మైక్రోబయోమ్ (పెద్ద పేగులో ఉండే బ్యాక్టీరియాలోని సంక్లిష్ట వ్యవస్థ), కేంద్ర నాడీ వ్యవస్థ మధ్య సంబంధం ఉంది. ⇒ పేగుల్లోని ఇబ్బంది నిద్రలో పీడ కలలకు దారి తీస్తోంది.⇒ ‘పోస్ట్–ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్’ ప్రభావంగా కనిపించే పీడ కలలకు, ఆహారానికి లంకె కనిపించింది.⇒ కొన్ని ఆహారాలు కలలపై ఎంతవరకు ప్రభావం చూపుతాయో పరీక్షించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరం.తదుపరి అధ్యయనాలు⇒ లాక్టోస్ ఉన్న జున్ను, లాక్టోస్ లేని జున్ను వంటి కొన్ని ఆహారాలను తిన్నప్పుడు ఏమి జరుగుతుందో పరీక్షించడం.⇒ లాక్టోస్ పడని వారు, తరచుగా పీడకలలు వచ్చేవారు, వివిధ రకాల ఫుడ్ అలర్జీలు ఉన్న వారిని మరింత లోతుగా పరిశీలించడం.విరుగుడు ఉపాయాలుపీడ కలల్ని నిరోధించటానికి అధ్యయనవేత్తలు కొన్ని సూచనలు ఇస్తున్నారు. అవి :⇒ రాత్రి ఆలస్యంగా తినకండి.⇒ తియ్యగా, కారంగా ఉండే ఆహారాలు భారీగా తీసుకోకండి. ⇒ లాక్టోస్ పడకపోతే, పడుకునే ముందు పాల ఉత్పత్తులను తీసుకోకండి. లాక్టోస్ లేని ఆహారాన్ని భుజించండి. ⇒ గట్టిగా ఉన్న, ఎక్కువ కాలం నిల్వ ఉన్న జున్నులో.. మృదువైన, తాజా జున్నులో కంటే లాక్టోస్ తక్కువగా ఉంటుంది.⇒ మీకు ఫుడ్ అలర్జీలు ఉంటే, పడుకునే ముందు అటువంటి ఆహారాలను తీసుకోవడం తగ్గించండి.⇒ మీ నిద్రను లేదా కలల నాణ్యతను ప్రభావితం చేసే ఆహార పదార్థాలేవో మీకు మీరే గుర్తించండి. ⇒ నిజంగా అవి మీ నిద్రను లేదా మీ కలల నాణ్యతను ప్రభావితం చేస్తాయో లేదో చూడటానికి వాటిని అప్పుడప్పుడు తినకుండా, ఏం జరుగుతుందో గమనించండి. ⇒ ఫైబర్ ఉన్న పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లతో కూడిన (కొవ్వులు, కేలరీలు తక్కువగా ఉండేవి) పోషకాలు అధికంగా ఉండే సమతుల ఆహారం తీసుకోండి. చక్కగా నిద్రపడుతుంది.ప్రధాన అధ్యయనాలుబ్రిటిష్ చీజ్ బోర్డ్ (2005) నీల్సన్, పావెల్ (2015) అబ్దుల్ రజాక్ ఎట్ ఆల్ (2021) నీల్సన్, డెనాల్డ్, పావెల్ (2025) -
ఇగో పెంచిన పగ
రెండోసారి అమెరికా గద్దెనెక్కింది మొదలు, అన్ని దేశాలతోనూ గిల్లికజ్జాలతో తంపులమారిగా, ప్రపంచానికే పెను బెడదగా తయారయ్యారు ట్రంప్. మరీ ముఖ్యంగా భారత్ మీదనైతే మితిమీరిన ప్రతీకార ధోరణి ప్రదర్శిస్తున్నారు. పాకిస్తాన్తో సంధి కుదిర్చే యత్నాలను నిర్ద్వంద్వంగా తిరస్కరించిందన్న కోపంతో ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నారు. అందుకోసం ఏకంగా తాను అగ్రరాజ్యానికి అధ్యక్షుడిని అన్న వాస్తవాన్ని కూడా పక్కన పెట్టారు. అహంకార (ఇగో) ధోరణితో వ్యవహరిస్తున్నారు. అమెరికాకు అతి ముఖ్యమైన మిత్ర రాజ్యాల్లో ఏ దేశంపైనా లేనివిధంగా భారత్పై తాజాగా ఏకంగా 50 శాతం సుంకాలు విధించడం వ్యక్తిగత కసి తీర్చుకునే ప్రయత్నాల్లో భాగమే. – అమెరికా ఆర్థిక సేవల సంస్థ జెఫ్రీస్న్యూఢిల్లీ/వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఆ దేశానికే చెందిన ప్రఖ్యాత ఆర్థిక సేవల సంస్థ జెఫ్రీస్ పలుగురాళ్లతో నలుగు పెట్టింది. భారత్ విషయంలో కొద్ది నెలలుగా ఆయన ప్రదర్శిస్తూ వస్తున్న కురచ బుద్ధిని తీవ్రస్థాయిలో తూర్పారబట్టింది. ‘‘ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్తాన్తో తలెత్తిన యుద్ధ పరిస్థితులను చల్లబరిచేందుకు మధ్యవర్తిత్వం చేస్తానంటే ససేమిరా అంటూ భారత్ తిరస్కరించడాన్ని ట్రంప్ నేటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. బతిమాలినా, బెదిరించినా, చివరికి పదేపదే బ్లాక్మెయిలింగ్కు దిగినా మోదీ సర్కారు దిగి రాలేదని, తనకు అణుమాత్రం కూడా అవకాశం ఇవ్వలేదని ఆయనలో కడుపుమంట నానాటికీ పెరిగిపో తోంది. ఇరుదేశాల మధ్య చిరకాలంగా అపరిష్కృతంగా ఉన్న కశ్మీర్ సమస్యను పరిష్కరించి, తనను తాను శాంతిదూతగా చిత్రించుకుని చిరకాల స్వప్నమైన నోబెల్ శాంతి బహుమానం సాధించాలన్న కలలకు అడ్డంగా గండి కొడుతోందన్న ఆగ్రహం పూర్తిస్థాయిలో కట్టలు తెంచుకుంటోంది. ప్రస్తుతం అంతర్జాతీయ వేదికపై భారత్ ఎంత ప్రముఖ దేశంగా వెలిగిపోతోందో తెలిసి కూడా ట్రంప్ ప్రదర్శిస్తున్న ప్రతీకార వైఖరి ఇరుదేశాల నడుమ పూడ్చలేనంతటి అగాధానికి దారి తీస్తోంది. అధ్యక్ష స్థానంలో ఉన్న నాయకుని వ్యక్తిగత ఇగో భారత్, అమెరికా ద్వైపాక్షిక బంధానికే పెను ముప్పుగా పరిణమిస్తోంది’’అంటూ తాజా నివేదికలో నిర్మొహమాటంగా కడిగిపారేసింది.భారత్ ‘తగ్గేదేలే’!ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాల నేపథ్యంలో, తక్షణం కాల్పుల విరమణకు ఒప్పుకోకుంటే భారీగా సుంకాలు బాదుతానంటూ బెదిరించి భారత్, పాక్ నడుమ అణుయుద్ధాన్ని ఆపానంటూ ట్రంప్ కొద్ది నెలలుగా పదేపదే గొప్పలకు పోతుండటం, ఆ వ్యాఖ్యలను మోదీ సర్కారు ఎప్పటికప్పుడు నిర్ద్వంద్వంగా ఖండిస్తూ వస్తుండటం తెలిసిందే. పాక్ పూర్తిగా కాళ్ల బేరానికి వచ్చి, స్వయానా మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారి పదేపదే ప్రాధేయపడ్డ కారణంగానే ఆ దేశంతో కా ల్పుల విరమణకు అంగీకరించినట్టు కేంద్రం విస్పష్టంగా ప్రకటించింది కూడా. అలాగే కశ్మీర్ విషయంలో కూడా మధ్యవర్తిత్వానికి ట్రంప్ ఎంతగానో ఉబలాటపడ్డారు. తన సమక్షంలో చర్చలు జరపండంటూ భారత్, పాక్కు పదేపదే బాహాటంగా పిలుపులు కూడా ఇచ్చారు. ఈ విషయంలో మూడో శక్తి ప్రమేయాన్ని ఎన్నటికీ, ఏ విధంగానూ అంగీకరించేది లేదని భారత్ స్పష్టం చేసింది. అందుకు ఒళ్లు మండి ట్రంప్ సుంకాలు బాదుతున్నా ‘తగ్గేదే లే’దంటోంది.మన ‘సాగు’పైనా గురి!వ్యవసాయ రంగంలో అమెరికా జోక్యానికి మోదీ సర్కారు ససేమిరా అంటుండటం ట్రంప్కు కొరుకుడు పడని మరో విషయమని జెఫ్రీస్ నివేదిక తేల్చింది. భారత వ్యవసాయ, పాడి మార్కెట్లలో పూర్తిస్థాయిలో కాలు పెట్టాలని అగ్ర రాజ్యం చాలాకాలంగా ఉవ్విళ్లూరుతోంది. ఆ ఆకాంక్షలకు కేంద్రం శాశ్వతంగా తలుపులు మూసేసింది. దీనిపై కూడా ట్రంప్ అగ్గి మీద గుగ్గిలంగా ఉన్నట్టు జెఫ్రీస్ వెల్లడించింది. అమెరికాతో భారత్ స్వేచ్ఛా వాణి జ్య చర్చలు మార్చి నుంచీ నానుతుండటం వెనక ఇది కూడా ఒక ప్రధాన కారణమని విశ్లేషకులు కూడా భావిస్తు న్నారు. ‘‘రైతులు, కూలీలు కలిపి భారత్లో 25 కోట్ల మందికి వ్యవసా యమే జీవనాధారం! భారత శ్రామిక శక్తిలో ఇది ఏకంగా దాదాపు 40 శాతం!!’’అని జెఫ్రీస్ నివేదిక చెప్పుకొచ్చింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
మోదీకి జపాన్ కానుకగా ఇచ్చింది మన బోధిధర్మ ప్రతిమే
జపాన్ పర్యటనలో అక్కడి ప్రఖ్యాత షోరిన్జాన్ దారూమేజీ ఆలయ సందర్శన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కానుకగా అందుకున్న దారూమా ప్రతిమ అందరి దృష్టినీ తెగ ఆకర్షిస్తోంది. చివరికి ఇంటర్నెట్లో కూడా అదే ట్రెండింగ్గా మారింది. జపాన్ చరిత్ర, సంస్కృతులతో దారూమాది విడదీయలేని బంధం! జపనీస్ భాషలో దారూమ అంటే బోధిధర్మ అని అర్థం. ఇక జీ అంటే ఆలయం. బోధిధర్ముడు జెన్ బౌద్ధ స్థాపకుడు. రాజధాని టోక్యోకు ఉత్తరాన టకసాకిలో ఉన్న షోరిన్జాన్ దారూమేజీ ఆలయం శతాబ్దాలుగా భక్తులు, పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తూ వస్తోంది. ప్రస్తుత రూపంలోని దారూమా ప్రతిమను రూపొందించింది ఆలయపు తొమ్మిదో పీఠాధిపతి అయిన టొగకు. కొంతకాలంలోనే దారూ మా జపనీయుల ఇంటింటి బొమ్మగా మారి పోయింది. నేటికీ ఏటా దారుమా ప్రతిమోత్సవాన్ని షోరిన్జా న్లో ఘనంగా జరుపుతారు. అలాంటి ప్రతిమను మోదీకి బహూ కరించడం ద్వారా భారత్కు జపాన్ శుభాకాంక్షలతో పాటు ఆ ధ్యాత్మిక ఆశీస్సులు కూడా అందించిందని భావిస్తు న్నారు. జపాన్లో మామూలు కుటుంబాలతో పాటు రాజకీయ నాయకులు మొదలుకుని వ్యాపారవేత్తల దాకా ఆశలకు, ప్రగతికి ప్రతీకగా ఇళ్లు, కార్యాల యాల్లో దారూమా ప్రతిమను ఉంచుకోవడం పరిపాటి. బోధిధర్ముడు మనవాడే!జెన్ బౌద్ధ స్థాపకుడైన బోధిధర్ముడు భారతీ యుడేనని, అందునా దాక్షిణాత్యుడని, క్రీస్తుపూర్వం ఐదో శతాబ్దికి చెందినవాడని చెబుతారు. తమిళ నాడులోని పల్లవ రాజు మూడో కుమారుడైన బోధి« దర్మ సన్యాసం స్వీకరించి జెన్ బౌద్ధాన్ని చైనాకు తీసుకెళ్లాడు. అంతేకాదు, మార్షల్ ఆర్ట్స్లోనూ ఆయన సాటిలేని మేటి. ఆ పోరాట కళను చైనాకు పరిచయం చేసింది కూడా బోధిధర్ముడే. అందుకే చైనీయులు ఆయనను దామో పేరిట దైవంతో సమానంగా కొలుచు కున్నారు. మూలికా వైద్యంలోనూ బోధిధర్ముడు సిద్ధుడు. ఆ విద్యను చైనీయులకు ప్రసాదించింది కూడా ఆయనేనని మనవాళ్లు నమ్ముతారు. ఆ సిద్ధవైద్య కళ శాశ్వతంగా తమకే సొంతం కావాలనే దురాశతో చివరికి దారుమాను విషమిచ్చి అంతం చేశారంటారు. ఈ ఇతివృత్తంతో సూర్య హీరోగా కొన్నేళ్ల క్రితం వచ్చిన సెవెన్త్ సెన్స్ సినిమా ఘనవిజయం సాధించింది.ఎటు తిప్పినా పైకే!చూసేందుకు చిన్నదే అయినా, దారూమా ప్రతిమ తాలూకు ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు...→ తెరుచుకుని ఉండే కన్ను, తిరుగులేని బ్యాలెన్స్ దీని ప్రధాన ఆకర్షణలు.→ ఇది గుండ్రంగా, లోపలంతా బోలుగా, కళ్లు చెదిరే రంగులతో కూడి ఉంటుంది.→ భారీదనం కారణంగా దారూమాను ఎటువైపు పడేలా తట్టినా వెంటనే పైకి లేస్తుంటుంది.→ ఏడుసార్లు కింద పడ్డా, ఎనిమిదోసారి కూడా పట్టు వీడకుండా పైకి లేవాల్సిందే’నన్న ప్రఖ్యాత జపనీస్ సామెతకు ఇది ప్రతీకగా నిలుస్తుంది.→ లక్ష్యాలు నిర్దేశించుకోవడానికి, అహరహం శ్రమించి కలలను నిజం చేసుకోవడానికి దారూమా ప్రతిమను చిహ్నంగా భావిస్తారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
భారత్–రష్యా క్రూడ్ బంధం!
భారత్ పాలిట వరంలా మారిన రష్యా చమురు అంతర్జాతీయంగా సెగలు పుట్టిస్తోంది. రష్యా చమురుతో ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ పరోక్షంగా ఆజ్యం పోస్తోందంటూ అమెరికా అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ఈ సాకుతో మరో 25 శాతం అదనపు సుంకాలను కూడా వడ్డించింది. మరి నిజంగా ఈ చౌక క్రూడ్తో భారతీయ వినియోగదారులు లాభపడుతున్నారా? అంటే సమాధానం కాదనే వస్తోంది. ప్రైవేటు రిఫైనరీ కంపెనీలకు మాత్రం లాభాల పంట పండుతోంది. ఇదే అమెరికా, భారత్ మధ్య ఇప్పుడు ‘క్రూడ్’ యుద్ధానికి దారితీస్తోంది!! రష్యా చౌక చమురు దిగుమతి లాభాల్లో అధిక వాటా దేశీయ ప్రవేటు రంగ రీఫైనలరీ దక్కించుకుంటున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో యూరప్తో సహా అనేక దేశాలు ఆంక్షలు, నిషేధం విధించడంతో రష్యా చమురుపై ’మాస్కో రాయితీ’ ప్రకటించింది. ఈ క్రమంలో చమురు దిగుమతి బిల్లు తగ్గించుకునేందుకు భారత్ రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేస్తోంది. 2002 వరకు కేవలం 1 శాతంగా ఉన్న రష్యా చమురు దిగుమతులు 2025 ఆగస్టు చివరి నాటికి గణనీయంగా 37 శాతానికి చేరుకుంది. గత నాలుగేళ్లుగా భారత్ సగటున రోజుకు 1.5 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురు దిగుమతి చేసుకుంటోది. ఇందులో 40 శాతానికి పైగా ప్రయివేటు రంగ రిఫైనరీలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, నయరా ఎనర్జీల సొంతం కావడం విశేషం! మిగులు లాభాలన్నీ ప్రయివేటు రిఫైనరీలకే.... రష్యా దిగుమతుల్లో అధిక వాటా పొందుతున్న ప్రయివేటు రిఫైనరీలు చమురు శుద్ధి చేసి ఉత్పత్తులను యూరప్, ఆసియా దేశాలకు భారీగా ఎగుమతి చేసి గణనీయంగా లాభాలు గడించాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మూడో ఏడాదిలో జీ7+ దేశాలు భారత్, టరీ్కలోని ఆరు రిఫైనరీలు నుంచి 18 బిలియన్ డాలర్లు (21 బిలియన్ డాలర్ల) విలువైన చమురు ఉత్పత్తులు దిగుమతి చేసుకున్నాయని ఫిన్లాండ్కు చెందిన సీఆర్ఈఏ థింక్ట్యాంక్ నివేదిక తెలిపింది. ఇందులో దాదాపు 9 బిలియన్ యూరో ఉత్పత్తులు రష్యా ముడి చమురుతో శుద్ధి చేసినవేనని సీఆర్ఆఏ పేర్కొంది. ఈ ఆరు రిఫైనరీలలో రిలయన్స్ చెందిన జామ్నగర్ శుద్ధి కార్మాగారం అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడి నుంచి జీ7+ దేశాలకు ఎగుమతి అయిన 12 బిలియన్ యూరోల్లో 4 బిలియన్ యూరోలకు పైగా రష్యా చమురుతోనే ఉత్పత్తి చేసినవని సీఆర్ఈఏ వివరించింది. ఈ జాబితాలో ప్రభుత్వరంగ ఓఎన్జీసీ మంగళూరు రిఫైనరీ నాలుగో స్థానంలో, నయరా ఎనర్జీ వడినార్ రిఫైనరీ ఆరోస్థానంలో ఉన్నాయి. దీనికి తోడు ‘భారత్లో వ్యాపార కంపెనీలు రష్యా ఆయిల్ను రీసెల్లింగ్ చేసుకుంటున్నాయి. తద్వారా.. 16 బిలియన్ డాలర్ల అదనపు లాభాలను (దాదాపు రూ.1.35 లక్షల కోట్లు) పొందాయి’ అంటూ అమెరికా ఆరి్థక మంత్రి స్కాట్ బెసెంట్ చేసిన వ్యాఖ్యలు ’రష్యా చౌక చమురు దిగుమతి లాభాల్లో అధిక వాటా ప్రైవేటు కంపెనీలు దక్కించుకుంటున్నాయి’ అనే వాదనలను మరింత బలపరిచాయి. ఇంధన ఎగుమతులతో వేల కోట్ల ఆదాయంభారత్కు ఇంధన ఎగుమతులతో వేల కోట్ల ఆదాయం సమకూరుతోందని కస్టమ్స్ గణాంకాలు చెబుతున్నాయి. 2023–24లో 84.1 బిలియన్ డాలర్లు, 2024–25లో 63.3 బిలియన్ల డాలర్లు పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు జరిగాయి. ఇదే ఆరి్థక సంవత్సరంలో 24 బిలియన్ డాలర్లు డిజిల్ ఎగుమతులు, 15 బిలియన్ డాలర్ల జెట్ ఫ్యూయల్ ఎగుమతులు జరిగాయి. రష్యా ఉరల్స్ క్రూడ్ నుంచి నాణ్యమైన డీజిల్, జెట్ ఫ్యూయెల్ వంటి రవాణా ఇంధనాలు ఎక్కువగా తయారవుతున్నాయి. 2024–25లో 15.5 బిలియన్ డాలర్ల గ్యాసోలిన్, ఇతర చమురు ఉత్పతుల ఎగుమతులు జరగడం గమనార్హం.ఎగుమతుల్లో రిలయన్స్ టాప్ ఈ ఏడాది భారత ఇంధన దిగుమతుల్లో వాల్యూమ్ పరంగా రిలయన్స్, నయారా ఎనర్జీలు రెండింటి వాటా 81 శాతంగా ఉన్నాయి. ఎగుమతుల్లో అధిక భాగం డిజిల్, జెట్ ఫ్యూయెల్ ఉన్నాయి. రోజుకు 9.14 లక్షల బ్యారెళ్ల ఎగుమతితో 71 శాతం వాటా రిలయన్స్దే. రిలయన్స్ జామ్నగర్ రిఫైనరీ జూన్లో రోజుకు 7.46 లక్షల బ్యారెళ్ల రష్యా చమురు దిగుమతి చేసుకుంది. ఇక్కడి నుంచి తన మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 1.36 మిలియర్ల బీపీడీలో 67 శాతం ఎగుమతి చేసింది. మిగిలిన ఇంధన ఎగుమతుల్లో రోజుకు 1.18 లక్షల బ్యారెళ్లతో నయరా ఎనర్జీ, ఓఎన్జీసీకి చెందిన మంగళూరు రిఫైనరీ రోజుకు 1.14 లక్షల బ్యారెళ్లతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.పరోక్ష సబ్సీడీలతో పీఎస్యూల లాభాలకు గండి ప్రభుత్వరంగ రిఫైనరీ రష్యా చౌక చమురు మిగులు లాభాలకు కేంద్ర ప్రభుత్వ ‘స్థిర ఇంధన ధరల విధానం’ చిల్లుపెడుతోంది. రష్యా ఆయిల్ ఇప్పటికీ బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ కంటే 2–3 డాలర్లు, యూఈఏ బ్యారెల్ క్రూడాయిల్ కంటే 5–6 డాలర్ల డిస్కౌంట్ ధరకే లభిస్తుంది. సాధారణంగా ఇది రీఫైనరీ సంస్థలకు దండిగా లాభాలను తెచ్చిపెడుతోంది. అయితే ప్రభుత్వ సంస్థలైన ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్లు రష్యా చమురు కొనుగోలు మిగులు లాభాలను పెట్రోల్, డిజిల్, ఎల్పీజీ తదితర పరోక్ష సబ్సీడీలకు వినియోగిస్తున్నాయి. గల్ఫ్, అమెరికా క్రూడాయిల్ ధరలతో పోలిస్తే, 2022 జనవరి నుండి 2025 జూన్ వరకు రష్యా డిస్కౌంట్ ధరలతో ముడి చమురు కొనుగోలు చేయడం ద్వారా భారత్ దాదాపు 15 బిలియన్ డాలర్లు ఆదా చేసిందని పరిశ్రమ గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 2023లో రష్యా రికార్డు స్థాయి డిస్కౌంట్తో భారత్ దాదాపు 7 బిలియన్ డాలర్ల వరకు ఆదా చేసింది. ఈ మొత్తంలో సింహభాగం రిలయన్స్, నయారా కంపెనీలకే దక్కింది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
సంచార జాతుల్లో వెలుగులు నింపిన జగన్
సాక్షి, అమరావతి: ఉదర పోషణకు ఊరూరా సంచారం.. రోడ్డు పక్కన, మురికి కాల్వల గట్టున జీవనం.. ఆధార్, ఓటరు గుర్తింపు కార్డులకు కూడా నోచుకోని దుర్భరం.. ఇది రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాక ముందు సంచార జాతుల జీవన చిత్రం. అటువంటి సంచార జాతుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుంది. అయితే కూటమి పాలనలో ఇచ్చిన హామీలు కూడా అమలుకు నోచుకోని దారుణ పరిస్థితికి జారిపోయారు. ఈ నెల 31న విముక్త సంచార జాతుల స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వారి జీవన చిత్రానికి సంబంధించిన కథనం ఇది. దుర్భర జీవనం... భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను కళారూపాల ద్వారా పరిరక్షిస్తూ ధర్మప్రచారకులుగా ఊరూర తిరుగుతూ జీవనోపాధి పొందేవారిని సంచార జాతులుగా పరిగణించారు. కనీసం సొంత ఊరు, ఇల్లు, చిరునామా, కుల «ధృవీకరణ, రేషన్కార్డు, ఆధార్కార్డు లేక దశాబ్దాల తరబడి ప్రభుత్వ పథకాలకు కూడా నోచుకోని దుర్భర బతుకులు వారివి. పూసలు, దండలు, వనమూలికలు అమ్ముతూ, తలవెంట్రుకలు వంటివి కొంటూ, గొడుగులు బాగుచేస్తూ, సవరాలు అమ్ముతూ, చిత్తుకాగితాలు ఏరుకుంటూ, చిన్న చిన్న సర్కస్లు చేస్తూ, ఖాళీ సమయంలో భిక్షాటన చేస్తూ బతుకులు వెళ్లదీసే పరిస్థితి వారిది. సంచార జాతుల స్వాతంత్య్రం– 1952బ్రిటిష్ ప్రభుత్వం క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్, 1871 ద్వారా దాదాపు 500 కులాల వారికి ‘జన్మతః నేరస్తులు’ అనే ముద్ర వేసింది. ఈ చట్టం వల్ల వారు ఎక్కడ కనిపించినా అరెస్ట్ చేసి జైలులో పెట్టేవారు. ఫలితంగా గౌరవంగా బ్రతకలేక, చాలా మంది రహస్యంగా సంచార జీవితం గడుపుతూ భిక్షాటనపై ఆధారపడ్డారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఈ చట్టం రద్దు కాలేదు. నిరంతర పోరాటాల తరువాత 1952 ఆగస్టు 31న ఈ కులాలను విముక్త జాతులుగా ప్రకటించారు. అందుకే సంచార జాతులు ఆ రోజును తమ నిజమైన స్వాతంత్య్ర దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అయితే, వారి జీవనస్థితి మెరుగుపడేందుకు చేసిన కమిటీలు, కమిషన్ల సిఫార్సులు పరిమిత స్థాయిలో మాత్రమే అమలయ్యాయి.సంక్షేమ ఫలాలు అందించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వంరాష్ట్రంలో 52 సంచార జాతులకు చెందిన సుమారు రెండు లక్షల మంది ఉన్నారు. వారికి కుల ధృవీకరణ పత్రాలు, చిరునామా (నెటివిటి సర్టిఫికెట్)లు, ఆధార్, రేషన్కార్డులు జారీకి వైఎస్ జగన్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. వారిలో అనేకమందికి ఇళ్ల స్థలాలు కేటాయించారు. సంచార జాతుల పిల్లలకు చదువులను చేరువ చేసేలా అమ్మ ఒడిని వర్తింపజేశారు. చేయూతతోపాటు నవరత్నాలతో అనేక సంక్షేమ పథకాల ద్వారా సంచార జాతులకు రూ.1,288.44కోట్లకుపైగా లబ్ది చేకూర్చడం విశేషం. వారిలో 32 సంచార జాతుల కోసం ప్రత్యేకంగా అత్యంత వెనుకబడిన తరగతుల (ఎంబీసీ) కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. గుర్తింపు లేని తోలుబొమ్మలాటల కులస్తులను గుర్తించి బీసీ–బీ సీరియల్ నంబర్ 25లో చేర్పించారు. హామీలను నెరవేర్చని కూటమి సర్కార్కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చని పరిస్థితి. ఎంబీసీలకు స్థానిక సంస్థల్లో ఐదు శాతం రిజర్వేషన్లు, దేవాలయాల పాలక మండలిలో సభ్యత్వం, మున్సిపల్ కార్పొరేషన్లలో ఎస్సీ, మైనార్టీల మాదిరిగానే కో–అప్షన్ మెంబర్గా ఎంబీసీలకు అవకాశం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సంచార జాతుల గుర్తింపు కార్డుల మంజూరు... ఇలా ఏ ఒక్క హామీనీ అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం దగా చేస్తోంది.జగన్ పాలనలో గుర్తింపుజగన్ పాలనలోనే సంచార జాతులకు గుర్తింపు దక్కింది. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర కావస్తున్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ దిశలో చర్యలు తీసుకోవాలి. –పెండ్ర వీరన్న, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ -
కనెక్ట్.. యూకే
భారత్పై అమెరికా అనూహ్యమైన సుంకాలు విధిస్తోంది. ఇప్పటికే కొన్ని అమల్లోకి వచ్చాయి. మరి ప్రత్యామ్నాయం? అమెరికాతో దౌత్యపరమైన చర్చలు కొనసాగిస్తూనే.. భారత్ కొత్త మార్కెట్లను అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల యూకేతో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్టీఏ) ఒక మైలురాయిగా చెప్పాలి. ఎందుకంటే భారత్ నుంచి ఈ దేశానికి జరుగుతున్న ఎగుమతుల్లో 99 శాతం ఎఫ్టీఏ పరిధిలోకి రాబోతున్నాయి. బ్రిటన్ నుంచి వస్తున్న దిగుమతుల్లో 94 శాతాన్ని ఎఫ్టీఏలోకి తెస్తామని భారత్ హామీ ఇచ్చింది. మరి ఈ ఎఫ్టీఏతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఏమైనా లాభం ఉంటుందా? ఏయే రంగాలకు లాభం? యూకే నుంచి ఏ రంగాల్లోకి పెట్టుబడులొచ్చే అవకాశం ఉంది? వాటన్నిటిపై యూకే డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్తో ‘సాక్షి’ ప్రతినిధి మంథా రమణమూర్తి ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ...ఎఫ్టీఏతో తెలుగు రాష్ట్రాలకు లాభమేంటి? యూకేతో విద్య, వ్యాపార, సాంస్కృతిక సంబంధాల్లో పెరుగుతున్న సానుకూలతను మూడేళ్లుగా చూస్తున్నా. ఈ దేశాల ప్రధానులు ఇటీవలే కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో ఈ పరిధి రక్షణ, టెక్నాలజీ, విద్య, వాతావరణ మార్పులన్నిటికీ విస్తరించనుంది. టెక్నాలజీ, ఫార్మా రంగంలో గట్టి పునాదులున్న హైదరాబాద్కు ఎఫ్టీఏతో చాలా లాభాలుంటాయి. ఏపీలో కొన్నేళ్లుగా పోర్టులు అభివృద్ధి చేస్తున్నారు. లాజిస్టిక్స్, వ్యవసాయ రంగాల్లో అవకాశాలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ ఎప్పట్నుంచో ఐటీ, ఫార్మా రంగాల్లో అగ్రగామిగా ఉంది కదా. మరి ఎఫ్టీఏతో కొత్తగా ఏం జరుగుతుంది? నిజమే. రాష్ట్రాన్ని బట్టి అవకాశాలు మారుతాయి. ఏపీ విషయానికొస్తే ఎగుమతులపై దృష్టి పెట్టాలి. ఈ మధ్యే నేను విశాఖలో సీఐఐ సదస్సుకు వెళ్లా. సీఫుడ్, టెక్స్టైల్స్, కాఫీ, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్ని పెంచడంపై చర్చించాం. ఎఫ్టీఏతో టారిఫ్లు తగ్గుతాయి. సర్టిఫికేషన్ ప్రక్రియ తేలికవుతుంది. దీనివల్ల ఏపీ ఉత్పత్తులు యూకే మార్కెట్లోకి ప్రవేశించడం సులువవుతుంది. ఫుడ్ ప్రాసెసింగ్ కీలకంగా మారనుంది. వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించాల్సి ఉంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్ ఉత్పత్తుల్ని ఎగుమతి చేసే కంపెనీలకు ఎఫ్టీఏ బాసటగా నిలుస్తుంది. ఇది ఏపీ వ్యవసాయ ఎకానమీని మారుస్తుంది. తెలంగాణ విషయానికొస్తే ఎఫ్టీఏ వల్ల సర్టిఫికేషన్ ప్రాసెస్ సులువవుతుంది. టారిఫ్లు తగ్గుతాయి. ఇది ఫార్మా, టెక్నాలజీ రంగాలకు కీలకం. టెక్నాలజీ నిపుణుల రాకపోకలు తేలికవుతాయి. ఈ ఒప్పందం దీర్ఘకాలంలో తెలుగు రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపించొచ్చు? దీర్ఘకాలంలో ప్రత్యేకించి ఫార్మా, టెక్నాలజీ రంగాల్లో వాణిజ్య పరిమాణం పెరుగుతుంది. యూకే ఫార్మా మార్కెట్ ప్రస్తుతం 30 బిలియన్ డాలర్లు. కానీ అందులో భారత్ వాటా 3 శాతమే. దీన్ని పెంచే అవకాశం తెలంగాణకు ఎక్కువ. ఒప్పందం వల్ల ఆర్ అండ్ డీతోపాటు ఏఐ వంటి కొత్త రంగాల్లో భాగస్వామ్యాలు ఏర్పడతాయి. ఏపీకి సంబంధించినంత వరకూ ప్రాసెస్డ్ ఫుడ్ ఎగుమతులదే అగ్రస్థానమవుతుంది. నిపుణుల రాకపోకలకు నిబంధనలు సడలిస్తున్నారా? అవును. స్వల్ప కాలానికి సంబంధించి ప్రత్యేకంగా కంపెనీల మధ్య రాకపోకలు తేలికవుతాయి. ఎందుకంటే ఇరుదేశాల్లోనూ సోషల్ సెక్యూరిటీ చెల్లించాలనే నిబంధనను ఉండదు. కంపెనీలకిది చాలా పెద్ద ఊరట. యూకే నిపుణుల్ని ఇక్కడికి రప్పించాలన్నా, ఇక్కడి వారిని అక్కడికి పంపాలన్నా ఆయా కంపెనీలకు ఖర్చు తగ్గుతుంది. కాబట్టి రాకపోకలు పెరుగుతాయి.మరి యూకే నుంచి చౌక ఉత్పత్తులొచ్చి ముంచేయకుండా ఇక్కడి వ్యాపారాలను ప్రత్యేకించి ఎంఎస్ఎంఈలను దెబ్బతీయకుండా ఒప్పందంలో తగిన జాగ్రత్తలుంటాయా?భారత్కే కాదు. యూకేకు కూడా ఎంఎస్ఎంఈ రంగమే వెన్నెముక. ఏ ఒప్పందంలోనైనా సున్నితమైన రంగాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తప్పనిసరిగా ఉంటాయి. డెయిరీ, చేనేత లాంటి రంగాలకు భద్రత ఉంటుంది. ఉదాహరణకు యూకే నుంచి డెయిరీ ఉత్పత్తులను తీసుకుంటే భారత్లో తయారుకాని స్పెషాలిటీ చీజ్ (పనీర్) వంటి వాటికే అనుమతి ఉంటుంది. చేనేతకు యూకే నుంచి పోటీ ఉండదు. ఎందుకంటే యూకేలో చేనేత లేదు. ఈ ఒప్పందంతో భారత చేనేతకు యూకే ఫ్యాషన్ మార్కెట్లో అవకాశాలు పెరుగుతాయి. మరి ఫుడ్ ప్రాసెసింగ్లో కొత్త టెక్నాలజీలు కావాలి కదా? యూకే కంపెనీలు అందిస్తాయా? కచ్చితంగా. యంత్రాలు, టెక్నాలజీపై పెట్టుబడులు పెట్టడం తప్పనిసరి. ఇక్కడి కంపెనీలు ఇప్పటికే ఈ మార్గాలను అన్వేషిస్తున్నాయి. అలాంటి పెట్టుబడుల్ని ప్రోత్సహించే వేదికను ఎఫ్టీఏ అందిస్తుంది. దీనివల్ల భారత కంపెనీలు యూకేతోపాటు ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే సామర్థ్యాన్ని పెంచుకుంటాయి. ఒప్పందం వల్ల ద్వైపాక్షిక వాణిజ్యం 25% పెరుగుతుందని యూకే అంచనా వేస్తోంది. వాటిలో తెలుగు రాష్ట్రాల వాటా ఎంత ఉండొచ్చు?రాష్ట్రాలవారీగా చెప్పడం కష్టం. కానీ బాగా లబ్ధి పొందే రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ ఉంటాయి. ఉదాహరణకు ప్రస్తుతం భారత్ నుంచి యూకేకు ఎగుమతవుతున్న సీఫుడ్లో ఏపీ వాటా 2.25 శాతమే. ఎఫ్టీఏ వల్ల సర్టిఫికేషన్ ప్రక్రియ తేలికవుతుంది కనుక ఏపీకి విస్తృత అవకాశాలుంటాయి. నిజానికి ఎఫ్టీఏ వల్ల సుంకాలు తగ్గటమే కాదు. సరి్టఫికేషన్ కూడా తేలికవుతుంది. త్వరగా పాడైపోయే సీఫుడ్ లాంటి వాటికిది ఆక్సిజన్. అందుకే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) కూడా చాలా ఆశాభావంతో ఉంది.ఫుడ్ ప్రాసెసింగ్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్లున్నారు? ఇది కీలక రంగం. ఎందుకంటే భారత్ ప్రస్తుతం తన ఆహార దిగుబడిలో 10 శాతాన్నే ప్రాసెస్ చేస్తోంది. తగినన్ని పెట్టుబడులతో విలువను జోడిస్తే కాఫీ, సీఫుడ్తోపాటు పలు వ్యవసాయ ఉత్పత్తుల్ని ప్రాసెస్ చేయొచ్చు. యూకేతోపాటు ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయొచ్చు. ఏపీ ఇప్పటికే యూఎస్, చైనాకు ఎగుమతి చేస్తోంది. సర్టిఫికేషన్ ప్రక్రియను సరళం చేయడం ద్వారా యూకే మార్కెట్ను వేగంగా అందుకోవచ్చు.సంప్రదాయేతర ఇంధనాలు, ఏరోస్పేస్, హైదరాబాద్ స్టార్టప్లలోకి ఎక్కువ పెట్టుబడులొస్తాయా? గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటుతోపాటు ఏరోస్పేస్, ఇంజనీరింగ్ రంగాల్లో భాగస్వామ్యాలను ఇప్పటికే చాలా యూకే కంపెనీలు అన్వేషిస్తున్నాయి. ఎఫ్టీఏతో భాగస్వామ్యాలు పెరుగుతాయి. యూకే ఎక్స్పోర్ట్ ఫైనాన్స్ అనేది యూకే–ఇండియా ప్రాజెక్టులకు మద్దతిచ్చే ప్రధాన వనరుగా ఉంటుంది. మరి కార్మికులు, పర్యావరణం, ప్రజారోగ్యానికి సంబంధించి ప్రతికూలతలేమైనా ఉంటాయా? ఈ ఒప్పందంలో అవినీతి నిరోధక, వినియోగదారుల రక్షణ, పర్యావరణం, లింగబేధంపై ప్రత్యేక చాప్టర్లున్నాయి. వాటన్నిటినీ చేర్చి భారత్ చేసుకున్న తొలి ఎఫ్టీఏ ఇది. కార్మికుల్ని, పర్యారణాన్ని పణంగాపెట్టి వాణిజ్య విస్తరణ జరగదనడానికి ఇదే నిదర్శనం. మరి ఈ ఒప్పందంతో రానున్న అవకాశాలపై చిన్నచిన్న వ్యాపారవేత్తలకు అవగాహన ఎలా? భారత ఎగుమతిదారులకు బాసటగా డీజీఎఫ్టీతోపాటు సీఐఐ, ఎఫ్టీసీసీఐ, కామర్స్ చాంబర్ వంటి పారిశ్రామిక సమాఖ్యలు సదస్సులు నిర్వహిస్తున్నాయి. ఇరుదేశాల వ్యాపార బృందాలు అవకాశాలపై అవగాహన కల్పిస్తాయి. ఇది పూర్తిగా అమల్లోకి రావడానికి ఒక ఏడాది పడుతుంది. -
కొమ్ములగొండి
ఎకిలీస్. గ్రీకు రచయిత హోమర్ సృష్టించిన అజరామర ఇతిహాస ద్వయంలో మొదటిదైన ఇలియాడ్లో కథానాయకుడు. ప్రపంచ ఇతిహాస చరిత్రలోనే వీరత్వానికి తిరుగులేని ప్రతీకలనదగ్గ పాత్రల్లో సాటిలేనివాడు. గ్రీకు యోధులందరిలోనూ అగ్రగణ్యుడు. ‘ఎకలీస్ షీల్డ్’గా పిలిచే అతని దివ్య కవచం కూడా అంతటి ప్రసిద్ధమైనదే. కర్ణుని కవచాన్ని తలపించే ఆ షీల్డ్ కారణంగా ఎకిలీస్ జీవితపర్యంతమూ ఎవరి చేతుల్లోనూ ఓటమి కాదు కదా, కనీసం ఎదురన్నది కూడా ఎరగని మహావీరునిగా నిలిచాడు.ఇదంతా క్రీస్తుపూర్వం 12వ శతాబ్దం, అంటే నేటికి సుమారు 3,200 ఏళ్ల క్రితం నాటి గాథ. అయితే అంతకు చాలాకాలం క్రితమే, సరిగ్గా చెప్పాలంటే ఏకంగా 16.5 కోట్ల ఏళ్లకు పూర్వమే ఎకిలీస్ షీల్డ్ను కూడా తలదన్నేంతటి సహచ కవచంతో రొమ్ము విరుచుకు సంచరించిన, సకల జీవజాలానికీ సింహస్వప్నమై నిలిచిన జీవి ఒకటుంది! అదే స్పైకోమెల్లస్ అనే రాక్షసబల్లి. బహుశా మానవాళికి ఇప్పటిదాకా తెలిసిన డైనోసార్లలోకెల్లా అత్యంత భీకరమైనది, బలిష్టమైనది, భయానకమైనది, అజేయమైనది అదేనంటే అతిశయోక్తి కాదు!! ‘కత్తుల’రత్తయ్య!2,500 కి.మీ పై చిలుకు విస్తరించిన దట్టమైన అట్లాస్ పర్వత శ్రేణుల్లో నేటి మొరాకో తీరంలోని బులెమేన్ అనే చిన్నపాటి పట్టణ సమీపంలో 16.5 కోట్ల ఏళ్ల క్రితం ఈ స్పైకోమెల్లస్ సంచరించినట్టు సైంటిస్టులు బుధవారం వెల్లడించారు. అక్కడ దొరికిన శిలాజాలను లోతుగా పరిశీలించిన మీదట వారు ఈ మేరకు నిర్ధారణకు వచ్చారు. దీన్ని ఒకరకంగా ఆ కాలపు కత్తుల రత్తయ్య అని చెప్పొచ్చు. ఎందుకంటే ముళ్లపందిని తలపించే రీతిలో దాని ఒంటిపై పక్కటెముకల నిండా పొలుసులను తలపించే కొమ్ములే.అయితే అవి సాదాసీదా కొమ్ములు కావు! అత్యంత పదునైన కత్తులు కూడా వాటిముందు దిగదుడుపే. కొన్నైతే ఏకంగా మీటర్ పొడవుతో, చూస్తేనే పై ప్రాణాలు పైకే పోయేలా ఉంటాయి! ‘‘కానీ మెడ, వీపు భాగంలో అంత పెద్ద కొమ్ములతో స్వీయరక్షణ ఎలా సాధ్యమన్నది అర్థం కాని విషయం’’అంటూ ఈ అధ్యయనానికి సారథ్యం వహించిన లండన్లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం సకశేరుక శిలాజ శాస్త్రవేత్త సూజన్ మెయిడ్మెంట్ ఆశ్చర్యం వెలిబుచ్చారు.‘‘ఇప్పటిదాకా మనకు తెలిసిన సకల జీవజాతుల్లోనూ ఇంతటి విచిత్ర, బలిష్ట ప్రాణి మరోటి లేదు’’అని ఇంగ్లండ్లోని బర్మింగ్హాం యూనివర్సిటీకి చెందిన శిలాజ శాస్త్రవేత్త, అధ్యయన సహ సారథి రిచర్డ్ బట్లర్ విస్మయం వ్యక్తం చేశారు. దీని వివరాలను నేచర్ జర్నల్ తాజా సంచికలో ప్రచురించారు. శాకాహార ‘రాకాసి’!⇒ 13 అడుగుల పొడవు, దాదాపు 2,000 కిలోల బరువైన శరీరం స్పైకోమెల్లస్ సొంతం.⇒ యాంకిలోసార్స్గా పిలిచే కవచ రాక్షసబల్లుల్లో అత్యంతపురాతన జీవి ఇదేనట.⇒ ఇంతా చేస్తే ఇది పక్కా శాకాహారి! భారంగా అడుగులేసేదట.⇒ మాంసాహార డైనోసార్ల బారినుంచి కాపాడుకోవడంతో పాటు ఆడ డైనోసార్లను ఆకర్షించేందుకు కూడా ఈ పొలుసులు వాటికి బ్రహ్మాండంగా పనికొచ్చేవట.⇒ జత కోసం స్పైకోమెల్లస్ల నడుమ పోటీలో గెలుపోటములు దాదాపుగా ఈ కొమ్ముల తాలూకు బలం మీదే ఆధారపడేవట.⇒ మెడ నుంచి మొదలై వీపు పొడవునా ఒకదాని పక్కన ఒకటిగా వ్యాపించిన అనేక వెన్నెముకలు దీని ప్రత్యేకత!⇒ దీని తోక భాగంలో ఉండే పొడవైన కొమ్ము వెనక నుంచి వచ్చే శత్రువులను కాచుకునేదట.⇒ స్పైకోమెల్లస్లు యాంకిలోసార్స్ కుటుంబానికి చెందిన డైనోసార్లు. వీటికి తోక భాగంలో కొమ్ములు పుట్టుకొచ్చింది ఇప్పటిదాకా భావిస్తున్న దానికంటే 3 కోట్ల ఏళ్లముందేనని స్పైకోమెల్లస్ శిలాజాన్ని పరీక్షించిన మీదట సైంటిస్టులు తేల్చారు.⇒ స్టేగోసార్స్ అనే మరో శాకాహార డైనోసార్లకు యాంకిలోసార్స్ సమకాలీకులు. అంటే జురాసిక్ యుగం నాటివి.⇒ అవి అంతరించాక కూడా ఇవి చాలాకాలం పాటు మనుగడ సాగించాయి.⇒ 6.6 కోట్ల ఏళ్ల క్రితం భూమిని ఢీకొన్న గ్రహశకలం దెబ్బకు డైనోసార్ల యుగంతో పాటు యాంకిలోసార్స్ కూడా సమూలంగా అంతరించిపోయాయి.⇒ యాంకిలోసార్స్ కుటుంబంలోకెల్లా ఇప్పటి దాకా తెలిసిన అతి పెద్ద స్పైకోమెల్లస్ ఏకంగా 8 మీటర్ల పొడవున్నట్టు తేలింది! అది నేటి ఉత్తర అమెరికా పశ్చిమ ప్రాంతంలో సంచరించినట్టు అక్కడ దొరికిన శిలాజాన్ని బట్టి నిర్ధారణ అయింది.⇒ 2021లో స్పైకోమెల్లస్ తాలూకు పక్కటెముక భాగపు శిలాజం దొరికింది. 2023లో దొరికిన ప్రస్తుత శిలాజంలో పూర్తి అస్థిపంజరం లేదు. ముఖ్యంగా తల భాగం మిస్సయింది. అయినా దీనికి సంబంధించి చాలా వివరాలు, విశేషాలను అది బయట పెట్టిందంటూ సైంటిస్టులు సంబరపడుతున్నారు. -
65 అడుగుల ఎత్తులో అద్భుతమైన కట్టడం
జడ్చర్ల: ఎంతో విశిష్టత గల ఆ ప్రాచీన ఆలయ చరిత్రను తెలుసుకుంటే గర్వంగా ఉంటుంది. ఆలయ ప్రాంగణంలోని శిథిలాలను చూస్తే అయ్యో అనిపిస్తుంది. ఇటుక మీద ఇటుకను పేర్చి నిర్మించిన ఆ అద్భుతమైన కట్టడం.. ఇప్పుడు గత వైభవానికి సాక్ష్యంగా నిలిచింది. తల తెగిన శిల్పాలు, గుప్త నిధుల వేటలో మిగిలిన శిథిలాలు.. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన గొల్లత్త గుడిపై కథనమిది.రాష్ట్ర కూటుల కాలం నాటి నిర్మాణం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్–ఆల్వాన్పల్లి గ్రామాల మధ్య 167 నంబర్ జాతీయ రహదారిని ఆనుకుని.. దాదాపు 6 ఎకరాల విస్తీర్ణంలో గొల్లత్త గుడి ఆలయాన్ని నిర్మించారు. దీన్ని 8వ శతాబ్దంలో రాష్ట్రకూటులు నిర్మించినట్లు పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు చెబుతున్నారు. దాదాపు 65 అడుగుల ఎత్తులో.. నాలుగు అడుగుల మందంతో.. కేవలం ఇటుకపై ఇటుకను పేర్చి నిర్మించారు. మధ్యలో ఎలాంటి బంకమట్టి లేకుండా అంత ఎత్తు వరకు.. అత్యంత కళాత్మకంగా గుడి నిర్మాణం చేపట్టారు. ఈ తరహాలో నిర్మించిన గుడి దక్షిణ భారతంలోనే ఒకటి.. ఇలాంటిదే మరొకటి ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ భీతర్గావ్ శివారులో ఉంది.జైనుల ఆలయంగా ప్రసిద్ధి.. ఒకప్పుడు ఈ ప్రాంతంలో జైన మతం బాగా ప్రాచుర్యంలో ఉండేది. ఎంతో మంది జైన తీర్థంకరులు నడయాడిన నేలగా ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. జైనీయుల స్థిర నివాసంగా, ధాన్య భాండాగారంగా గొల్లత్త గుడి పేరు గాంచింది. ఈ గుడిలో బంగారు కుండలు (Gold Pots) ఉండేవన్న ప్రచారం ఉంది. ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతానికి కాలి నడకన తరలివచ్చే జైన గురువులు.. దీన్ని సందర్శించేవారని అప్పటి శాసనాల ద్వారా గుర్తించారు. ఆలయం లోపల వర్ధమాన మహావీరుడు, పార్శ్వనాథుడి విగ్రహాలు ఉండేవి. భద్రత దృష్ట్యా ఇక్కడి నుంచి ఒకటి హైదరాబాద్లోని గోల్కొండకు, మరొకటి పాలమూరు పిల్లలమర్రిలోని మ్యూజియాలకు తరలించారు.శిథిలావస్థలో గుడి.. గొల్లత్త గుడి కాలక్రమేనా శిథిలావస్థకు చేరుకుంది. గుడి పైకప్పు కూలిపోయింది. వర్షాల కారణంగా చుట్టూ ఉన్న కొన్ని ఇటుకలు పట్టు తప్పిపోగా, కరిగిపోయాయి. దీంతో గుడి పటిష్టానికి పురావస్తుశాఖ అధికారులు.. కింద నుంచి దాదాపు 7 అడుగుల వరకు తాత్కాలికంగా సిమెంట్ పనులు చేయించారు. ఊడిన ఇటుకల స్థానంలో కొత్తగా చేర్చిన ఇటుకలు కరిగిపోగా.. శతాబ్దాల కిందటి ఇటుకలు చెక్కుచెదరక పోవడం గమనార్హం. ప్రస్తుత గుడి మాదిరిగానే.. చుట్టూ మరో ఐదు గుళ్లు ఉండగా.. కాలక్రమేణా కనుమరుగయ్యాయి. గుడి వెనుక దిబ్బలు గొల్లత్త గుడి (Gollatha temple) వెనుక భాగంలో రెండు ప్రధాన దిబ్బలు ఉన్నాయి. వీటిలో ఒక దిబ్బ కనుమరుగవగా.. ఈ దిబ్బ చుట్టూ పండుగల సందర్భంగా ఎడ్ల బళ్లతో వచ్చి జనం తిరిగేవారని చెబుతుంటారు. మరో దిబ్బ ఇప్పటికీ కనిపిస్తుంది. ఈ దిబ్బలో అప్పటి నిర్మాణాల ఆనవాళ్లు కనిపిస్తాయి. పాదాల గుట్టలో శిథిలావస్థలో ఎన్నో విగ్రహాలు కనిపిస్తాయి. ధ్వంసమైన నంది విగ్రహాలు చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తాయి. నాలుగు అడుగుల పొడవు, మూడు అడుగుల వెడల్పుతో మహిళల పాదముద్రలు చెక్కిన రాతి గుర్తులు ఉన్నాయి. గజ్జెలు, గొలుసులు, నాలుగు వేళ్లకు మెట్టెలతో చెక్కి ఉన్నాయి. అత్యంత సుందరంగా చెక్కిన ఈ పాదాలు అప్పటి శిల్పకళా నైపుణ్యానికి ప్రతీకగా పేర్కొనవచ్చు.గుప్త నిధుల కోసం తవ్వకాలు ఈ ప్రాంతంలో గుప్త నిధుల కోసం కొందరు విచ్చలవిడిగా తవ్వకాలు చేపట్టారు. వారి చేతుల్లో ఆలయ ప్రాంగణం చాలా వరకు ధ్వంసమైంది. గుడి పైకప్పులో సైతం తవ్వకాలు జరపడంతో కూలిపోయింది. గుడి దక్షిణ భాగంలో సైతం తవ్వకాలు జరిపారు. ప్రస్తుతం గుడి చుట్టూ ముళ్ల పొదలు, కంపచెట్లు ఏపుగా పెరగడంతో.. గుడి ఉనికికి ప్రమాదం ఏర్పడింది.పేరు వెనుక కథ ఈ గుళ్ల నిర్మాణం వెనుక స్థానికంగా ఓ కథ ప్రచారంలో ఉంది. పాలు, పెరుగు అమ్ముకునే ఈ ప్రాంతానికి చెందిన ఓ గొల్ల పడుచు.. తన ఆస్తినంతా వెచ్చించి ఈ గుళ్లని నిర్మించిందని.. అందుకే ఈ గుళ్లకు గొల్లత్త గుళ్లు అనే పేరు వచ్చిందని ఒక కథనం ప్రచారంలో ఉంది.చదవండి: మధ్యయుగ వైద్య చరిత్రలో మేటి.. అగ్గలయ్యరూ.2 కోట్లతో ప్రతిపాదనలు గొల్లత్త గుడిని పరిరక్షించేందుకు రాష్ట్ర పురావస్తు శాఖ మేనేజింగ్ డైరెక్టర్ విశాలాక్షి హయాంలో రూ.2 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి కేంద్రానికి నివేదించారు. ఇప్పటికే కేంద్ర పురావస్తుశాఖ ఆధ్వర్యంలో రూ.54 లక్షల వ్యయంతో గుడి స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించారు.అమలుకాని ప్రతిపాదనలు గొల్లత్త గుడి అభివృద్ధికి కలెక్టర్ రొనాల్డ్రోస్ హయాంలో పురావస్తుశాఖ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. తదుపరి ఎలాంటి చొరవ లేకపోవడంతో ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి గొల్లత్త గుడి అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలి. – రాములు, మాజీ మండల ఉపాధ్యక్షుడు, గంగాపూర్పర్యాటకంగా అభివృద్ధి చేయాలి గొల్లత్త గుడిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ గుడిని కాపాడాలి. ఇప్పటికే గుప్త నిధుల కోసం వేటగాళ్లు ఈ ప్రాంతమంతా తవ్వేశారు. నాటి చరిత్రకు సంబంధించిన విగ్రహాలు, తదితర కట్టడాలు ధ్వంసమయ్యాయి. – శ్రీనివాసులు, గంగాపూర్ -
బాటిల్ నెక్.. ట్రా‘ఫికర్’కు ఏదీ చెక్..?
ప్రమాణాలకు అనుగుణంలేని రహదారులు.. ప్రయాణాలు సవ్యంగా లేక ఇబ్బందులకు గురవుతున్న వాహనదారులు.. పలుచోట్ల బాటిల్ నెక్.. అక్కడ ట్రాఫిక్ పీక్.. అధికారుల ఫ్లై‘ఓవర్ లుక్’.. రహదారుల విస్తీర్ణం తక్కువ.. వాహనాల సంఖ్య ఎక్కువ.. కరెంటు స్తంభాల రాస్తారోకో.. ట్రాఫిక్ విభాగం, జీహెచ్ఎంసీ మధ్య కొరవడిన సమన్వయం.. వెరసి హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా ట్రాఫిక్ సమస్య (Traffic Problem) నిత్యకృత్యంగా మారింది. అవకాశమున్నా అవసరమైన మేర రహదారులు విస్తరించకపోవడం వాహనదారులకు శాపంగా మారిన వైనంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనమిది.. – సాక్షి, సిటీబ్యూరో‘పెత్తనం ఒకరి చేతిలో... బెత్తం మరొకరి చేతిలో...’రాజధానిలోని ట్రాఫిక్కు ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. రోడ్లపై ఉండి స్థితిగతులను పర్యవేక్షించేది ట్రాఫిక్ పోలీసులైతే... వాహన శ్రేణులు సవ్యంగా సాగడానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించే బాధ్యత మాత్రం జీహెచ్ఎంసీది. ఈ రెండింటి మధ్య సమన్వయలేమి కారణంగా ట్రాఫిక్ సమస్యలు తీరడం మిథ్యగా మారిపోయింది. నగరంలోని రోడ్ల విస్తీర్ణం, కనిష్టం కంటే తక్కువగా ఉన్న వైనం. పెంచే అవకాశం ఉన్నా పట్టించుకోని యంత్రాంగం వెరసి నగరవాసికి మాత్రం నిత్యం నరకమే కనిపిస్తోంది.కనిష్ట స్థాయిలోనూ లేని రోడ్లు... అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం నగర విస్తీర్ణంలో కనిష్టంగా 12 శాతం రహదారులు ఉండాలి. హైదరాబాద్ పురాతన నగరం కావడంతోపాటు అనేక కారణాల వల్ల ఇక్కడ కేవలం 9 శాతం రోడ్లు ఉన్నాయి. ఫలితంగా ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా ట్రాఫిక్ జామ్లే. అడ్డంకులు తొలగిస్తే ఈ విస్తీర్ణాన్ని 15.5 శాతానికి పెంచుకునే అవకాశం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంటే.. కనిష్టం కంటే 3.5 శాతం ఎక్కువన్నమాట. అయితే దీనికి సంబంధించి ట్రాఫిక్ పోలీసులు ఏళ్లుగా పంపిస్తున్న ప్రతిపాదనల్లో సగం వాటిని కూడా జీహెచ్ఎంసీ (GHMC) సహా అనే శాఖలు అమలు చేయకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటున్నాయి. 60 లక్షల వాహనాలు... 40 ఫ్లైఓవర్లు.. ముంబై మహానగరంలో ఉన్న వాహనాల సంఖ్య 52 లక్షలైనా అక్కడున్న ఫ్లైఓవర్ల సంఖ్య మాత్రం 55. హైదరాబాద్లో వాహనాల సంఖ్య 60 లక్షలకు చేరుతున్నా ఫ్లైఓవర్లు 40 మాత్రమే ఉన్నాయి. మరో పురాతన నగరమైన కోల్కతా (Kolkata) సైతం గతంలో అస్తవ్యస్త ట్రాఫిక్తో ఎన్నో ఇబ్బందులు పడేది. అక్కడి రోడ్ల విస్తీర్ణం కేవలం ఆరు శాతం ఉండటమే అందుకు కారణం. ఆ తర్వాత అక్కడ ఫ్లైఓవర్లను అవసరమైన స్థాయిలో నిర్మించడం ద్వారా రోడ్ల విస్తీర్ణం 12 శాతానికి పెరిగింది. నగర ట్రాఫిక్ విభాగం అధికారులు 2007లో సర్వే నిర్వహించి జీహెచ్ఎంసీకి నివేదిక పంపారు. దీని ప్రకారం నగరంలోని 30 ప్రాంతాల్లో 17.83 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్లు నిర్మిస్తే రోడ్ల విస్తీర్ణాన్ని పెంచవచ్చని తేల్చారు. ఈ ఫ్లైఓవర్లు జంక్షన్స్ జామ్ కాకుండా కూడా ఉపకరిస్తాయని నివేదించారు. అయితే ఇప్పటికీ వీటిలో కనీసం సగం ప్రతిపాదనలు కూడా అమలుకాలేదు. బాటిల్ నెక్.. ట్రా‘ఫికర్’కు ఏదీ చెక్.. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న నేచురల్ బాటిల్ నెక్స్తో ఇబ్బందులు అనేకం. భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో ఏర్పడిన వీటి వల్లా ఎన్నో ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. రాణిగంజ్లోని సయిదానిమ సమాధి సమీపంలో, ఎస్సార్ నగర్–ఈఎస్ఐ, చాదర్ఘాట్–మలక్పేట్ మార్గాల్లో ఇలాంటివి అనేకం ఉన్నాయి. నగర వ్యాప్తంగా ఇలాంటి బాటిల్నెక్స్ (bottlenecks) సంఖ్య 26 ఉండగా... చాలా తక్కువ మాత్రమే పరిష్కారానికి నోచుకున్నాయి. ట్రాఫిక్ విభాగం అధికారులు, జీహెచ్ఎంసీ కలిసి పనిచేయడంతో శ్యామ్లాల్ నాలా సహా అనేక సమస్యలు పరిష్కారమయ్యాయి. మిగిలిన ప్రాంతాల్లోనూ ఇలాంటి ఫలితాలు రావాలంటే ప్రభుత్వ విభాగాలు సమష్టిగా ముందుకు వెళ్లాలి. నేచురల్ బాటిల్నెక్ సమస్యలను పరిష్కరించడం ద్వారా అదనంగా 2 శాతం రోడ్లను విస్తరించవచ్చు.సమన్వయం లేక కరెంట్ ‘షాక్’... రాజధానిలోని అనేక ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ పూర్తయినా ఫలితం లేకుండా పోయింది. ఆయా చోట్ల రోడ్ల విస్తీర్ణం పూర్తి అయినా ఒకప్పుడు రోడ్డు పక్కన ఉండి, విస్తర్ణం కారణంగా రోడ్లపైకి వచ్చిన కరెంట్ స్తంభాలతో ఈ పరిస్థితి తలెత్తింది. కొత్తగా రోడ్లు వేసిన చోట, పాత రహదారుల్లోనూ అనేక చోట్ల ఈ సమస్య ఉంది. విద్యుత్, జీహెచ్ఎంసీ విభాగాలు సమన్వయంతో పని చేయకపోవడమే దీనికి కారణం. వీటితోపాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో కరెంట్ ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు అడ్డదిడ్డంగా ఉండటంతో దాదాపు 50 మార్గాలు కుంచించుకుపోయాయి. జీహెచ్ఎంసీతోపాటు ఆయా విభాగాలు స్పందిస్తే మరికొంత రోడ్డును అదనంగా విస్తరించుకోవచ్చు.‘అవసరమైనప్పుడే’ స్పందన... ఇలాంటి సమస్యలపై జీహెచ్ఎంసీ సహా ఇతర విభాగాలు ప్రజల ఇబ్బందులు తీర్చడం కంటే ‘అవసరమైనప్పుడు’మాత్రమే అప్రమత్తమై ఎక్కువగా స్పందిస్తాయి. 2012లో జరిగిన ఇంటర్నేషనల్ బయో డైవర్సిటీ కాన్ఫరెన్స్, 2017లో ఇవాంక ట్రంప్ టూర్, ఇటీవల జరిగిన మిస్ వరల్డ్ (Miss World 2025) పోటీలు వంటి సందర్భాల్లో మాత్రం హడావుడి చేశాయి. అతిథులకు ఇక్కడి రోడ్లకు లేని ‘అందాలను’ చూపాలని ప్రయత్నిస్తుంటాయి. చదవండి: ‘మా మేడమ్ మాకే కావాలి.. మేడమ్ మీరు వెళ్లొద్దు’డెలిగేట్స్ బస చేసే హోటళ్లు, కార్యక్రమాలు జరిగే ప్రాంతాల మధ్య ఉన్న రోడ్లను కూడా అభివృద్ధి చేసేస్తాయి. దీనికోసం బాటిల్నెక్స్, ఇతర అడ్డంకులను తొలగించేస్తాయి. అవసరమైతే మ్యాన్హోల్స్ సమాచారం సైతం సేకరించి అభివృద్ధి చేసేస్తాయి. దేశ, విదేశాల అతిథుల కోసం చూపించిన ‘ప్రేమ’ను కొనసాగిస్తూ తమకు ఈ చిక్కుల నుంచి విముక్తి ప్రసాదించాల్సిన అవసరాన్ని అధికారులు గుర్తించాలని నగరవాసులు, వాహనదారులు కోరుతున్నారు. -
చైనా-భారత్-పాక్.. కనివినీ ఎరుగని రీతిలో విధ్వంసం!
దక్షిణాసియా దేశాలైన భారత్, పాకిస్తాన్, చైనాలను ఈ మధ్యకాలంలో తీవ్రమైన ప్రకృతి విపత్తులు కుదిపేస్తున్నాయి. మునుపెన్నడూలేని విధంగా క్లౌడ్ బరస్ట్, మెరుపు వరదలు మూడు దేశాల్లోనూ తీవ్ర నష్టం కలిగించాయి. ఈ సీజన్లో వర్షాలు మామూలే అయినా.. ఈ ఏడాది మాత్రం అసాధారణంగా నమోదు అవుతోంది. అందుకు కారణాలను పరిశీలిస్తే.. భారీ వర్షాలు భారత్, పాకిస్తాన్, చైనా దేశాలను పెను విపత్తులుగా ముంచెత్తాయి. క్లౌడ్ బరస్ట్, మెరుపు/ఆకస్మిక వరద(Flash Floods) ఎక్కువగా వినాల్సి వస్తోంది. ఇవే ఈ మూడు దేశాల్లో విపరీతమైన ఆస్తి, ప్రాణ నష్టాల్ని కలిగించాయి. జమ్ము కశ్మీర్ ఈ ప్రభావంతో ఈ మధ్యకాలంలో ఎంతో మంది మరణించడం చూస్తున్నదే. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రహదారులు దారుణంగా దెబ్బ తిన్నాయి. దక్షిణ రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ఇదే పరిస్థితి.ఇక.. పాకిస్తాన్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా, గిల్గిట్-బాల్టిస్తాన్, పంజాబ్ ప్రాంతాలు వర్షాలు, వరదలతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. రెండు నెలల కాలంలో వర్షాలు, వరదలతో పాక్లో 700 మంది మరణించినట్లు పలు గణాంకాలు చెబుతున్నాయి. వీళ్లలో చిన్నారులే అధికంగా ఉన్నారు. చైనాలో రెండు నెలల వర్షాల వల్ల ₹1.84 లక్షల కోట్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లింది. ప్రాణ నష్టాన్ని చైనా అధికారికంగా ప్రకటించలేదు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల మాన్సూన్ ట్రఫ్ దక్షిణ దిశగా కదిలిపోతోంది. ఈ ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతం.. దానికి వ్యతిరేకంగా ఇంకొన్ని చోట్ల తగ్గుదల కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో వర్షపాతం తగ్గుముఖం పట్టింది. మాన్సూన్ ట్రఫ్ అంటే..మాన్సూన్ ట్రఫ్ అనేది దక్షిణాసియా దేశాల్లో వర్షాకాలంలో వర్షాల పంపిణీకి దిశానిర్దేశం చేసే వాతావరణ రేఖ. ఇది సాధారణంగా పాకిస్తాన్ నుంచి బెంగాల్ ఖాతీ వరకు విస్తరించి ఉంటుంది. ఈ ట్రఫ్ చుట్టూ తక్కువ ఒత్తిడి ఏర్పడిన ప్రాంతాల(Low Pressure Formation) వల్ల వర్షాలు కురుస్తుంటాయి. చైనా, పాక్, భారత్లో ఈ సీజన్లో వర్షాలకు కారణం ఇదే. (తక్కువ ఒత్తడి ప్రాంతాల్లోకి చుట్టుపక్కల నుంచి గాలి ప్రవహిస్తుంది. ఆ గాలి ఆవిరితో నిండిన మేఘాలను తీసుకువస్తుంది. ఇది వర్షాలు కురవడానికి అనుకూల పరిస్థితిని కలిగిస్తుంది. అందుకే మాన్సూన్ కాలంలో తక్కువ ఒత్తడి ప్రాంతాలు భారీ వర్షాలకు కారణమవుతాయి). అయితే..వాతావరణ మార్పు, నగరీకరణ, అటవీ నాశనం వంటి మానవ చర్యలు ఈ ట్రఫ్ మార్గాన్ని అస్థిరంగా మార్చి వర్షాల తీవ్రతను పెంచుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల కొండ ప్రాంతాలు, నదుల నుంచి నీటి ఆవిరి ఎక్కువగా ఉంటోంది. ఈ ఆవిరి మేఘాల్లో చేరి, ఒక స్థాయికి చేరుకున్న తర్వాత తక్కువ సమయంలో భారీ వర్షంగా కురుస్తుంది. ఇది వర్షపాతం తీవ్రతను పెంచుతూ, ఆకస్మిక వరదలకు దారితీస్తోంది. పైపెచ్చు ఉదయం వేళల్లో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఆవిరి పెరిగి, తక్కువ సమయంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ✅ పరిష్కార మార్గాలు• ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు: ప్రజలకు సమయానికి సమాచారం అందించాలి. అయితే అది కష్టతరంగా మారుతోంది• వరద మైదానాల పునరుద్ధరణ: సహజ జల ప్రవాహ మార్గాలను తిరిగి స్థాపించాలి.• స్థిరమైన నగరీకరణ ప్రణాళికలు: పర్యావరణాన్ని దెబ్బతీయకుండా అభివృద్ధి.• అటవీ విస్తరణ: వర్షపు నీటిని శోషించే వనరుల పెంపు.• ప్రజల అవగాహన: వాతావరణ మార్పు, ప్రకృతి విపత్తులపై ప్రజలలో చైతన్యం కలిగించాలి.దక్షిణాసియాలో వర్ష విపత్తులు మామూలు ప్రకృతి ధోరణుల కంటే ఎక్కువగా మానవ చర్యల ప్రభావంతో ఏర్పడుతున్నాయి. వాతావరణ మార్పును అర్థం చేసుకుని, దీన్ని ఎదుర్కొనే విధానాలను అభివృద్ధి చేయడం అత్యవసరమనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. -
అమెరికాలో కొత్తరకం వ్యాధి!
మానవ శరీరంలో మాంసాన్ని తినేసే ప్రమాదకరమైన పరాన్నజీవికి సంబంధించిన తొలి కేసు అమెరికాలో నమోదైంది. మేరీలాండ్లో ఓ వ్యక్తి ఈ నెల 4వ తేదీన దీనిబారిన పడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ వ్యాధిని న్యూవరల్డ్ స్రూ్కవార్మ్(ఎన్డబ్ల్యూఎస్) మియాసిస్ అని పిలుస్తున్నారు. ఒక జాతికి చెందిన ఈగ(మగ్గోట్స్) లార్వా మనిషి శరీరంలోని కణజాలంలో తిష్టవేసి, క్రమంగా మాంసాన్ని భక్షిస్తుందని అంటున్నారు. ఎల్సాల్వెడార్ దేశం నుంచి వ్యక్తికి వ్యాధి సోకినట్లు డాక్టర్లు పేర్కొన్నారు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ప్రివెన్షన్(సీడీసీ) సహకారంతో తొలి కేసును నిర్ధారించినట్లు యూఎస్ డిపార్టుమెంట్ ఆఫ్ హెల్త్, హ్యూమన్ సర్విసెస్(హెచ్హెచ్ఎస్) తెలియజేసింది. → ఎన్డబ్ల్యూఎస్ మియాసిస్ అనేది సాధారణంగా పాడి పశువులు, ఇతర జంతువుల్లో కనిపిస్తుంది. దక్షిణ అమెరికాతోపాటు కరీబియన్ దీవుల్లో దీని ఉనికి ఉంటుంది. కానీ, ఇటీవల సెంట్రల్ అమెరికా, మెక్సికోతోపాటు అమెరికాకు సైతం విస్తరించినట్లు నిపుణులు గుర్తించారు. → ప్రధానంగా శరీరంపై పుండ్లు, గాయాలు ఉన్నవారికి ఎన్డబ్ల్యూఎస్ మియాసిస్ సోకే అవకాశాలు అధికంగా ఉంటాయి. దీని ప్రభావానికి గురైన పశువులకు, ప్రాంతాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. → కొక్లియోమియా హోమినివోరక్స్ ఈగ లార్వాలే ఈ స్రూ్కవారŠమ్స్. జంతువుల పుండ్లు, గాయాలపై వాలుతుంటాయి. పుండు భాగంలో లేదా సున్నితమైన కణజాలంపై ఒక ఆడ ఈగ ఒకేసారి 300 వరకు గుడ్లు పెట్టగలదు. → గుడ్ల నుంచి బయటకు వచ్చే లార్వాలు పుండ్ల లోపలికి చొచ్చుకెళ్తాయి. క్రమంగా మాంసాన్ని తినేస్తాయి. తీవ్రమైన నొప్పి కలుగుతుంది. సరైన చికిత్స తీసుకోకపోతే ప్రాణాపాయం సంభవిస్తుంది. → లార్వాలు మూడు నుంచి ఐదు రోజుల్లో పుండు నుంచి బయటకు వచ్చి కిందపడిపోతాయి. భూమి కిందిభాగంలోకి చేరుకుంటాయి. ఈగలుగా మారి బయటకు వస్తాయి. గుడ్లు పెట్టడానికి పుండ్లు, గాయాలు ఉన్న జంతువులను వెతుక్కుంటాయి. → కొక్లియోమియా హోమినివోరక్స్ ఈగ జీవితకాలం దాదాపు 30 రోజులు. మొత్తం జీవితకాలంలో 3,000కుపైగా గుడ్లు పెడతాయి. → న్యూవరల్డ్ స్రూ్కవార్మ్ మియాసిస్ వల్ల మనుషులకు ముప్పు తక్కువేనని అమెరికా వైద్యులు చెబుతున్నారు. దేశంలో ఈ ఏడాది జంతువులకు ఈ పరాన్నజీవి సోకలేదు. → ఒకసారి సోకితే ఆ ఉధృతి తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకే ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థతో కలిసి పని చేస్తున్నారు. → ఈగలకు సంతాన నిరోధక ఆపరేషన్లు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. టెక్సాస్లో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్లుగా ఈగల్లో సంతానాన్ని అరికట్టడానికి ఈగలనే ప్రయోగిస్తారు. స్టెరిలైజ్ చేసిన మగ ఈగలు ఆడ ఈగలతో కలిస్తే.. ఆ ఆడ ఈగల్లో సంతాన సామర్థ్యం క్షీణిస్తుంది. → మనుషులు గాయాలు, పుండ్లు బయటకు కనిపించకుండా జాగ్రత్తపడితే ఈగల బారినపడే అవకాశాలు ఉండవు. గాయాలకు సాధ్యమైనంత త్వరగా చికిత్స తీసుకోవాలి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మధ్యయుగ వైద్య చరిత్రలో మేటి.. అగ్గలయ్య
యాదగిరిగుట్ట రూరల్: తెలంగాణ ప్రాంతంలో మధ్యయుగ కాలంలో వైద్య చరిత్రకు ఒక మూలస్తంభంగా, వైద్య వారసత్వానికి శక్తిమంతమైన చిహ్నంగా నిలిచిన ప్రముఖ జైన ఆయుర్వేద, శస్త్ర వైద్యుడు అగ్గలయ్య. ఈయనకు సంబంధించిన శాసనాలు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని సైదాపురం గ్రామంలో ఉన్నాయి. ఈ శాసనాలు దక్షిణ, మధ్య భారతదేశంలో 6 నుంచి 12 శతాబ్దాల మధ్య పరిపాలించిన చాళుక్య రాజుల కాలం నాటివని ఆర్కియాలజీ అధికారులు గుర్తించారు. చాళుక్యుల రాజుల్లోని రెండవ జయసింహుడుతో పాటు మరి కొంతమంది రాజుల కాలంలో సామంతుడుగా ఉన్న జైన శస్త్ర వైద్యుడు అగ్గలయ్య (Aggalayya) గురించి ఈ శాసనంలో వివరించారు. అప్పట్లో అగ్గలయ్య చేసిన సేవలకు రెండవ జయసింహుడు అతని పేరు మీద కొన్ని మాన్యాలను ఈ సైదాపురం ప్రాంతంలో ఇచ్చారని ఈ శాసనంలో పొందుపరిచారు. ఆయుర్వేదం, శస్త్ర చికిత్సలో మాంత్రికుడు ఆయుర్వేదం, శస్త్ర చికిత్సలో అగ్గలయ్య మాంత్రికుడు. శస్త్ర వైద్యంలో జబ్బు నయం కానటువంటి వారిని, ఈ అగ్గలయ్య వద్దకు పంపించేవారని, ఈ శాసనం తెలుపుతుంది. భారత దేశంలోనే 11వ శతాబ్దం నాటికి ఒక సర్జన్ ఉన్నాడని ప్రాథమిక వనరుగా ఈ శిలాశాసనం తీసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. దక్షిణ భారతదేశంలో ఆయుర్వేద చరిత్రను తెలిపే అతి విలువైన శాసనం ఈ సైదాపురం శాసనం. మధ్యయుగం కాలంలో కొందరు వైద్యులు శస్త్ర చికిత్సలు చేసేవారు అని అనడానికి రుజువు ఈ శాసనం. అగ్గలయ్య చరిత్ర అగ్గలయ్య జైన మతానికి చెందిన శస్త్రచికిత్స వైద్యుడు. ఈయన దక్షిణ భారతదేశంలోని తెలంగాణ (Telangana) ప్రాంతానికి చెందిన గొప్ప వైద్యుడు. ఇతను సుమారుగా 1000 ఏడీలో జన్మించి, 1080 ఏడీలో మరణించాడు. ఈయన భార్య పేరు వల్లికాంభే. తెలంగాణలోని ఆలేరు సమీపంలోని ఇక్కురికే (ప్రస్తుతం ఇక్కుర్తి) గ్రామం ఈయన స్వస్థలం. ఈయన స్థాపించిన వైద్య రత్నాకర జినాలయాలు, అనేక చారిత్రక నిర్మాణాలు ఈ ఇక్కుర్తి ప్రాంతంలో ఉండేవని పురావస్తుశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఇక్కుర్తి ప్రాంతంలోనే ఈయన సమాధి గత కొన్ని సంవత్సరాల కిందట వరకు ఉందని, కాలానుగుణంగా ఆ సమాధిని తవ్వకాల్లో తీసేశారని అధికారులు చెబుతున్నారు. శస్త్ర విద్యలో ప్రావీణ్యుడు చాళుక్యుల కాలంలో అగ్గలయ్య శస్త్ర చికిత్సలో ఓ వెలుగు వెలిగిన వైద్యుడు. ఇతర వైద్యులు నయం చేయని వ్యాధులను నయం చేసేవాడు. ఈయనకు నరవైద్యవర, ప్రాణాచార్య, వైద్యరత్నాకర, వైద్యశిఖామణి అనే బిరుదులు ఉన్నాయి. అగ్గలయ్యను రాజ వైద్యుడుగా పిలిచేవారు. జైనులకు శస్త్రచికిత్స, ఆయుర్వేద కళను బోధించేవాడు. విదేశాల నుంచి వచ్చే ఇతర వైద్యుల సందేహాలను నివృత్తి చేసేవాడు.సామంత రాజుగా అగ్గలయ్య అగ్గలయ్య చేసిన వైద్య సేవలకు ప్రత్యేక గుర్తింపు కల్పిస్తూ, ఆనాటి చాళుక్య రాజులు ఈయన్ను సామంత రాజుగా చేసుకున్నారు. నలుగురు రాజులు మారినా ఈయననే ఆస్థాన వైద్యుడిగా, సామంత రాజుగా కొనసాగించారు. జైన మతం అయినప్పటికీ.. అగ్గలయ్య జైన మతానికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ, వైద్య శాస్త్రంలో ఆయన అభివృద్ధిని అడ్డుకోలేదని శాసనాలు చెబుతున్నాయి. అహింస జైన సూత్రం అయినా, శస్త్ర చికిత్సలో వైద్య విద్య కోసం, అభ్యాస కేంద్రాలను ఏర్పాటు చేసి, 9వ శతాబ్దంలో ఉగ్రాదిత్య వంటి జైన పండితులు వైద్య గ్రంథాలను ఏర్పాటు చేయడంలో అగ్గలయ్య తమ వంతు పాత్ర పోషించాడని చరిత్ర చెబుతుంది.సైదాపురంలో రెండు శాసనాలు సైదాపురం గ్రామంలో అగ్గలయ్యకు సంబంధించిన రెండు శాసనాలు ఉన్నాయి. ఈ శాసనాలు రాతి స్తంభాలపై మూడువైపులా చెక్కబడి ఉన్నాయి. మొదట రెండు భాగాలు తెలుగు, కన్నడ లిపిలో ఉండగా, మూడో వైపు సంస్కృత భాషలో ఉన్నాయి.శాసనంలో మొదటి భాగం అగ్గలయ్య జైనుడని, ఆయనకు వైద్యరత్నాకరుడని, ప్రాణాచార్యుడని, నరవైద్యుడని బిరుదులు ఉన్నట్లు ఈ శాసనం తెలుపుతుంది. పూర్వ కాలంలో కొలిపాక, (నేడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక) పరిధిలో ఉన్న ముప్పనపల్లి గ్రామాన్ని అగ్గలయ్య నిర్మించిన జైన వసతులు (జైన సంప్రదాయాన్ని పాటించే సన్యాసులు, గురువులు, శిష్యులు నివసించే మఠాలు) వీటి నిర్వహణకు అప్పటి గ్రామ పెద్ద గవుండ బహుమానంగా ఇచ్చినట్లు ఈ శాసనం తెలుపుతుంది. శక సంత్సరం 956 నుంచి క్రీ.శ. 1034 జూన్ 4 గురువారం నాడు సంభవించిన చంద్ర గ్రహణాన్ని పురస్కరించుకుని మహారాజు హైదరాబాద్కు ఉత్తరాన 20 మైళ్ల దూరంలో ఉన్న పొట్లకేరి (నేటి పఠాన్ చెరువు) విడిది చేసిన సందర్భంగా ఈ దానం చేశారు.శాసనంలో రెండవ భాగం శాసనంలో రెండవ భాగంలో బహుమానంగా ఇచ్చిన భూమి, దానిపై వచ్చే రాబడి అంశాల వివరాల గురించి ఉంది.మూడవ భాగం అగ్గలయ్య జైనమత వాలంభి, మంచివారికి ఎల్లప్పుడూ సహాయం చేయాలని అనుకునే వాడు. తోటి వైద్యుల సందేహాలను నివృత్తి చేస్తూ, జయసింహుని ఆస్థానంలో వర్ధిల్లిన ఇతర ఆయుర్వేద పండితులకు, బ్రహ్మస్వరూపమని, చికిత్సా విధానంలో పాండిత్యుడని, మందులకు లొంగని మొండి వ్యాధులకు ఉపశమనం లభించినా, ప్రాణాపాయ స్థితి నుంచి తప్పినా, అది అగ్గలయ్య చేతి చలవేనని చెబుతుంది. స్వయంగా జయసింహుని ముదిరిన వ్యాధి (ప్రకర్ష) దశలో ఉన్నప్పుడు ఎందరో వైద్యులు కాపాడాలని యత్నించి విఫలం కాగా, తన చేతి వాటంతో చికిత్స చేసి, వ్యాధిని తగ్గించిన ఘనుడు అగ్గలయ్య. తంత్ర శాస్త్రంలోని ఉమా తంత్రం, సంగ్రహ పరిచ్ఛేదాలో కూడా అగ్గలయ్య నిపుణుడని ఈ శాసనం తెలుపుతుంది.సిరూర్ శాసనాలు అగ్గలయ్య గురించి మరి కొన్ని విషయాలు సంగారెడ్డి జిల్లాలోని సిరూర్ గ్రామంలో వెలువడిన మరో రెండు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ శాసనాలు పశ్చిమ చాళుక్య రాజైన భువనైకమల్లదేవ (సోమేశ్వర–2) క్రీ.శ 1069లో వేసిందిగా గుర్తించారు. ఈ శాసనంలో అగ్గలయ్య ప్రశంసలను, జైనమత దేవత పద్మావతితో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తుంది. అదేవిధంగా 1074లో వేసిన మరో శాసనంలో ఆయనను వైద్య శిఖామణి అని స్పష్టంగా సూచిస్తుంది. అలాగే మహాసామంత రాజుగా ఆయన హోదాను నిర్ధారిస్తుంది. అగ్గలయ్య పండితులకు, రుషులకు వారి జీవనోపాధి కోసం, భూములు, ఇళ్ల స్థలాలను బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ శాసనం ఆయన భార్య లక్షణాలను, సమాజం, సంక్షేమ పట్ల నిబద్ధతను చూపిస్తుంది. ప్రస్తుతం ఈ శాసనాలు పురావస్తు శాఖ అధికారులు మ్యూజియంలో భద్రపరిచారు.అగ్గలయ్య పేరు మీద గుట్ట అగ్గలయ్యకు ఉన్న విస్తృత గుర్తింపు శాసనాలకే పరిమితం కాకుండా, ప్రదేశాలకు కూడా విస్తరించి ఉన్నాయి. వరంగల్లోని హనుమకొండ సమీపంలో ఉన్న ఒక కొండకు అగ్గలయ్య గుట్ట (అగ్గలయ్య దిబ్బ) అనే పేరును ఆ కాలంలోని రాజులు పెట్టారు. ఈ ప్రాంతం 9, 10 శతాబ్దాల్లో అనేక జైన శిల్పాలకు నిలయంగా ఉంది. ఈ కొండపైన ఒక పెద్ద విగ్రహం ఉంది, అది అగ్గలయ్య విగ్రహమేనని చరిత్రకారులు చెబుతున్నారు. ప్రముఖ చరిత్ర కారుడు శ్రీ రామోజీ హరగోపాల్ అగ్గలయ్య గురించి పలు పరిశోధనలు చేసి వెలుగులోకి తీసుకొచ్చారు. ఎన్ఐఎమ్హెచ్ బృందం పరిశోధనలు హైదరాబాద్లోని ఎన్ఐఎమ్హెచ్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్) బృందం, డాక్టర్ జీపీ ప్రసాద్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్చార్జి, డాక్టర్ పి.సాకేత్ రామ్ రీసెర్చ్ ఆఫీస్ (ఆయుర్వేద), పి.మురళీ మనోహర్ అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ (క్యురేటర్) తెలంగాణలో ప్రముఖ పరిశోధన, చరిత్ర కారుడు, కవి రామోజు హరగోపాల్ సహాయ సహాకారాలతో ఈ సైదాపురం అగ్గలయ్య శాసనాల్లో పరిశోధనలు జరిపి, వైద్య శాసనాలను గుర్తించారు. ఈ శాసనాల వివరాలను ఫ్రేమ్ రూపంలో ఎన్ఐఎమ్హెచ్లో పొందుపరిచారు.చదవండి: అర్థం చేసుకోవాలి.. అనర్థాలు నివారించుకోవాలి!చాళుక్యుల కాలంలో గొప్ప వైద్యుడు గొప్ప వైద్యుడు అగ్గలయ్య. వివిధ దేశాల నుంచి వైద్యులు అగ్గలయ్య వద్దకు సర్జరీలో మెళకువలను నేర్చుకునేవారు. కొన ఊపిరితో ఉన్న వారిని కూడా అగ్గలయ్య బతికించేవాడు. క్రీస్తు పూర్వం సుశ్రుతుడు వైద్య సేవలందించగా, క్రీస్తు శకంలో అగ్గలయ్య వైద్య సేవలు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం వారసత్వ సంపదను కాపాడాలి. – డాక్టర్ జీపీ ప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్చార్జి, ఎన్ఐఎమ్హెచ్, హైదరాబాద్ -
అర్థం చేసుకోవాలి... అనర్థాలు నివారించుకోవాలి
పెళ్లి మంత్రాల్లో ఏ అర్థం ఉందో తెలుసుకోరు చాలామంది. పెళ్లిలో ఎలాంటి విధానంతో మెలగాలో తెలుసుకోరు ఎంతకాలమైనా. బడిలో ఒకటో తరగతి నుంచి పాఠాలు చదువుతారుగాని పెళ్లిలో ఏ అవగాహన పాఠాలు చదవకుండానే నెట్టుకొచ్చేయాలనుకుంటారు. వర్తమానంలో దంపతుల మధ్య జరుగుతున్న అనర్థాలు ప్రతి ఒక్కరినీ ఆగి, తమ వైవాహిక జీవనాన్ని తరచి చూసుకోమని కోరుతున్నాయి. సరి చేసుకుని ఆనందమయం చేసుకోమంటున్నాయి.న్యూస్పేపర్లు తెరిస్తే భార్యాభర్తల విడాకులు, హత్యోదంతాలు, ఆత్మహత్యలు... సోషల్ మీడియాలో చూస్తే వీధికెక్కి రచ్చ చేసుకోవడం, ఇంటి గుట్టు బయటపడేయడం... వివాహం వార్తగా మారడం... వివాహ గొడవలే ప్రధాన వార్తలుగా చలామణి కావడం చూస్తుంటే మనం ఎటువంటి సమాజం నుంచి ఎటువంటి సమాజానికి చేరుకుంటున్నామనేది పరిశీలించుకోవాలి.గతంలో ఎలా ఉండేది?నలభై, యాభై ఏళ్ల క్రితం వివాహ వ్యవస్థలో ఘోరమైన ఉదంతాలు ఇంత విస్తృతంగా కనిపించేవి కాదు. దంపతులు, పిల్లలు, అవ్వా తాతలు... కుటుంబ వ్యవస్థ కొనసాగుతూ ఉండేది. భార్యాభర్తల కీచులాటలు టీకప్పులో తుఫానులా ఉండేవి. చెప్పాలంటే కొందరు భార్యాభర్తల గొడవలు వీధిలో ఉన్నవారికి నవ్వులాటగా ఉండేవి. అంటే భార్యాభర్తలు చీటికి మాటికి కీచులాడుకోవడం నవ్వదగ్గ విషయంగా, వారి చేతగాని విషయంగా ఉండేది. విడాకులు అనే మాట చాలా అరుదుగా వినవచ్చేది. విడాకుల నిర్ణయానికి ఇటువైపు వర్గం, అటువైపు వర్గం వ్యతిరేకంగా నిలిచేది. యాక్సెప్టెన్స్ ఉండేది కాదు. వివాహాన్ని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నం విడిపోవడానికి పట్టుపట్టడంలో ఉండేది కాదు.ఇవాళ ఎలా ఉంది?వివాహ వ్యవస్థను గౌరవించకపోవడం, ఒకరి పట్ల ఒకరు చూపాల్సిన నిజాయితీ లోపించడం, పిల్లల మీద కక్ష తీర్చుకోవడం, సమస్యకు బదులుగా భార్యనో భర్తనో నిర్మూలించడమే ఏకైక పరిష్కారం అనుకోవడం, వివాహం జీవితానికి ఒక గుదిబండగా మారిందని దాని నుంచి ఎలాగైనా బయటపడాలని చెడు మార్గాలు వెతకడం, హాయిగా ఉన్న ఇంటి నుంచి దూరంగా వెళ్లి ఆ నునుపైన కొండలపై మరింత హాయిగా గడపాలనుకోవడం... ఇవన్నీ అందమైన జీవితాలను ఆగమాగం చేస్తున్నాయి. పరేషానీలోకి నెట్టేస్తున్నాయి. మానసిక, శారీరక కష్టాలు తెచ్చి భవిష్యత్తును చావు దెబ్బ తీస్తున్నాయి.మీ వివాహం సమస్యల్లో ఉంటే–మీ వివాహం సమస్యల్లో ఉంటే మీ వివాహ బంధంలో ఈ విషయాలను చెక్ చేసుకోండి.1. నిజాయితీ: మీరు మీ జీవిత భాగస్వామి పట్ల నిజాయితీతో ఉన్నారా? నిజమైన ప్రేమతో ఉన్నారా? నిజమైన ప్రేమ పొందేలా మీ చర్యలు ఉన్నాయా? ప్రేమను ప్రదర్శిస్తున్నారా? నువ్వంటే నాకు చాలా ప్రేమ అని ఒకసారైనా చెప్పగలుగుతున్నారా. ప్రేమ వివాహానికి మూలం. ప్రేమను వ్యక్తం చేయనప్పుడు ప్రేమ పొందలేరు.2. కమ్యూనికేషన్: మీ మనసులో ఉన్నది స్పష్టంగా మీ జీవిత భాగస్వామికి చెబుతున్నారా? చెప్పి వారికి అది అర్థం చేసుకోవడానికి సమయం ఇస్తున్నారా? అన్నీ మనసులో పెట్టుకుని మౌనంగా ఉంటే అది హింస కిందకు వస్తుంది. మౌనంతో హింసించే విధానం మానుకుంటే వివాహంలో మాట, మంచి మాట మెల్లగా వస్తాయి.3. వింటున్నారా?: వినడం తెలిస్తే సగం సమస్యలు పోతాయి. మీ జీవితభాగస్వామి ఏదైనా చెప్పబోతే మధ్యలోనే తుంచేస్తే, ఎదురు చెప్తే ఇక ఏమీ ముందుకు వెళ్లదు. ఎదుటి వారు చెప్తున్నది పూర్తిగా విని, సమయం తీసుకొని అందులోని మంచి చెడు పట్ల మీ అభిప్రాయం మెత్తగా, స్పష్టంగా చెప్పగలిగితే, అరవడాలు కరవడాలు లేకుండా మాట్లాడుకోగలిగితే చాలు. వివాహం వర్థిల్లుతుంది.4. గౌరవం ఉండాలి: ఒక మనిషి మరో మనిషిని ఎప్పుడు ఇష్టపడతాడంటే ఆ మనిషి తనను గౌరవిస్తున్నాడని తెలిసినప్పుడే. మనం వెళితే గౌరవించి టీ ఇచ్చే ఇంటికే మనం వెళ్తాం తప్ప ముఖాన తలుపు వేసే వారింటికి వెళతామా? భార్యాభర్తల విషయం కూడా అంతే. చులకన భావం వివాహానికి ప్రథమ విరోధి. భార్య/భర్త ఒకరినొకరు చులకన భావంతో చూస్తే వివాహం చులకనకు లోనవుతుంది. ఆ తర్వాత హేళన, ఆపైన తిట్టు, అటుపై కొట్లాట, తదుపరి నువ్వెంతంటే నువ్వెంత అనే మాటలు వచ్చేస్తాయి. చులకన వద్దు.5. సహానుభూతి: పని చేసి అలసిపోయి ఉంటాడేమో, వంటపని, ఇంటి పనితో డస్సిపోయిందేమో అని ఒక నిమిషం పరస్పరం ఆలోచిస్తే... సానుభూతి అందిస్తే ఎంతో ఓదార్పుగా ఉంటుంది. అలసిపోయి ఉన్న జీవిత భాగస్వామిని ‘ఆ.. పెద్ద చేశావులే’ అనే ఒక్క మాటతో శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు. సహానుభూతి చూపితే అది పెద్ద సహాయం చేస్తుంది. ఎమోషనల్ ఇంటిమసీ చాలా ముఖ్యం.6. హద్దులు: మీరు వివాహం చేసుకున్నారు కాని ΄÷లంలో పని చేసే ఎద్దును తెచ్చుకోలేదు. వివాహంలో హద్దులు ఉంటాయి. భార్య/భర్తల పర్సనల్ స్పేస్లో ఎంతవరకు వెళ్లాలో తెలుసుకొని ఉండాలి. ఉమ్మడి ఇష్టాలను కలిసి నిర్వహించుకోవాలి.7. ఆర్థికం: ఆర్థిక విషయాలలో భార్యాభర్తల మధ్య అవగాహన అన్నింటి కంటే ముఖ్యం. అప్పులు, అధిక ఖర్చులు ఇద్దరిలో ఎవరు చేసినా ఆ వివాహం ప్రమాదంలో ఉన్నట్టు. అలాగే ప్రతి పైసా గీచిగీచి లెక్క అడిగినా ప్రమాదమే. ఇంటి ఖర్చు, ΄÷దుపు, బాధ్యతలకు అవసరమైన సహాయం... వీటిని జాగ్రత్తగా చూసుకుంటే అంతటా అనుకూలమే.ఈ ఏడు సలహాలు వివాహం ముందుకెళ్లడానికి ఏడడుగులు.పెళ్లి అర్థం కాకుండా పెళ్లెందుకు చేసుకున్నారు?పెళ్లి బొమ్మలాట కాదు. అది పెద్ద బాధ్యత. జీవితాన్ని ఫలవంతం చేసే దశ. ఒంటరి మనిషికి కుటుంబం అనే అందమైన బాంధవ్యాన్ని ఇచ్చే వరం. సంతానాన్ని ఇచ్చి ఎనలేని తృప్తినిచ్చే మార్గం. వివాహంలో అడుగుపెట్టాలంటే మానసికంగా, శారీరకంగా సిద్ధమయ్యి అన్నీ ఆలోచించుకుని ఉండాలి. కాని గతంతో పోలిస్తే ఇంత ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు లేదు. అమ్మాయి, అబ్బాయిల ఇష్టాయిష్టాలు తమకు తాము పట్టించుకోకపోవడం, కుటుంబాలు నిర్లక్ష్యం చేయడం, పొంతన కుదురుతుందో లేదో చూడకపోవడం, అబ్బాయికి అమ్మాయికి ఉన్న ఉపాధి మార్గాలు వారిని కలిపి ఉంచుతాయా... ఎక్కువ పని గంటల వల్ల గాని, ఇతర ఊర్లకు వెళ్లి పని చేయడం వల్లగాని గ్యాప్ తెస్తాయా చూడకపోవడం... డబ్బు పట్ల ఎవరికి ఎంత ఆశ, అత్యాశ ఉంది... అబ్బాయి/అమ్మాయి గురించి ఆరా తీస్తే వారు పెద్దలకు, సంప్రదాయాలకు ఇచ్చే విలువ ఏ మాత్రం ఉంటుంది... ఇవన్నీ చూడకుండానే చేసేస్తున్నారు. దాని వల్ల సమస్యలు వెంటనే బయల్దేరుతున్నాయి. -
డాక్టర్ రోబో.. సర్జన్ అవతారం!
రజనీకాంత్ నటించిన రోబో సినిమాలో ఆపరేషన్ థియేటర్లో డెలివరీ చేస్తున్న హ్యూమనాయిడ్ రోబో సన్నివేశం ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పించింది. సినిమాల్లోనే కాదు.. వాస్తవ ప్రపంచంలోనూ రోబోలు సర్జరీలను చకచకా చేస్తున్నాయి. అన్నింటా మనం అన్నట్టు ఈ విషయంలో భారత్ సైతంతగ్గేదేలే అంటోంది.వైద్య పరిశ్రమ అంచనాల ప్రకారం భారత్లో ఇప్పటివరకు రోబోలు సహాయకులుగా 1,50,000 కంటే ఎక్కువ శస్త్రచికిత్సలు జరిగాయి. అంతేగాక పూర్తిగా రోబోటిక్ శస్త్రచికిత్సలు సైతం విజయవంతంగా నిర్వహిస్తున్నారు మన వైద్యులు. ప్రస్తుతం మన దేశంలో 1,000 మంది సర్జన్లు ఏటా 12,000 కంటే ఎక్కువ రోబోటిక్ శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారంటే ఆశ్చర్యంవేయక మానదు.విదేశీ రోగులకూ సేవలు..ఫలితాలను అంచనావేసే ప్రిడిక్టివ్ అనలిటిక్స్, వ్యక్తులనుబట్టి చికిత్సా మార్గాల ద్వారా ఆరోగ్యాన్ని, ఆరోగ్య సంరక్షణ నిర్ణయాలను మెరుగుపర్చడం, రోగనిర్ధారణ కచ్చితత్వం ద్వారా శస్త్రచికిత్సా విధానాల సామర్థ్యాన్ని కృత్రిమ మేధ పెంచుతోందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. శస్త్రచికిత్స సమయాలను ఏఐ దాదాపు 15 శాతం తగ్గించగలదని అంటున్నారు. రోబోటిక్ శస్త్రచికిత్సల కోసం వచ్చే విదేశీ రోగులకు గమ్యస్థానంగా భారత్ అవతరిస్తోంది.యూఎస్, యూరప్ వంటి దేశాలతో పోలిస్తే వైద్య ఖర్చులు మనదగ్గర కనీసం 50 శాతం తక్కువ. అమెరికా, యూకే, నైజీరియా, కెన్యా, సౌదీ అరేబియా, ఉజ్బెకిస్తాన్, ఒమన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా నుండి ఎక్కువ మంది రోగులు భారత్కు వస్తున్నారు. భారతదేశ సర్జికల్ రోబోటిక్స్ మార్కెట్ ప్రస్తుతం రూ.7,830 కోట్లకుపైగా ఉంది. 2030–31 నాటికి దాదాపు రూ.34,800 కోట్లకు చేరుతుందని అంచనా.సంక్లిష్ట విధానాల్లో సౌలభ్యంగుండెకు సంబంధించినవి, క్యాన్సర్ (ఆంకాలజీ), ఆర్థోపెడిక్స్, వెన్నెముక, నరాల సంబంధమైనవి, జీర్ణాశయం, గైనకాలజీ, యూరాలజీ, జనరల్ సర్జరీ వంటి సంక్లిష్టమైన ప్రక్రియల కోసం రోబోటిక్ శస్త్రచికిత్సలను ఆసుపత్రులు నిర్వహిస్తున్నాయి. వివిధ రకాల సంక్లిష్ట విధానాలను నిర్వహించడానికి సంప్రదాయ పద్ధతులకు మించిన సౌలభ్యం, కచ్చితత్వం, నియంత్రణను రోబోటిక్స్ అందిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు.ఇలా చేస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక శస్త్రచికిత్సా వ్యవస్థలలో.. భారత్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నది ‘డా వించీ సర్జరీ విధానం’. ప్రపంచ వ్యాప్తంగా ఈ విధానం ద్వారా సుమారు 8 లక్షల సర్జరీలు జరిగాయట. మనదేశంలో నిర్వహించే అత్యంత సాధారణ క్లినికల్ రోబోటిక్ సర్జికల్ వ్యవస్థలో కెమెరా ఆర్మ్, శస్త్రచికిత్సా పరికరాలతో కూడిన యాంత్రిక చేతులు (మెకానికల్ ఆర్మ్) ఉంటాయి. శస్త్రచికిత్స చేసే టేబుల్ పక్కన కంప్యూటర్ కన్సోల్లో కూర్చుని ఈ యాంత్రిక చేతులను సర్జన్ నియంత్రిస్తారు. త్రీడీ వ్యూలో పెద్దగా, అధిక స్పష్టతతో శస్త్రచికిత్స చేపట్టే భాగాన్ని ఈ కన్సోల్ చూపుతుంది.మెరుగైన ఫలితాలు..అత్యవసరం కాని శస్త్రచికిత్సలకు రోబోటిక్స్ విభిన్న ప్రయోజనాలను అందించగలవని వైద్యులు అంటున్నారు. గాయం చుట్టుపక్కల కణజాలాలకు నష్టం తగ్గించేలా శస్త్రచికిత్సను కచ్చితంగా నిర్వహించడం ఇందులోని ప్రత్యేకత. రోబోటిక్స్తో మరో ప్రయోజనం ఏమిటంటే మరింత నియంత్రణ, స్పష్టంగా చూసే వీలు ఉండడంతో సంక్లిష్ట, వీలుకాని భాగాలనూ చేరుకోవచ్చు. అధిక సామర్థ్యం, శస్త్రచికిత్స తదనంతరం ఖర్చులు తగ్గడం, ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉండటం, ఔషధ మోతాదు తగ్గడం తదితర ప్రయోజనాలు ఉండడంతో ఈ ప్రక్రియ దేశంలో క్రమంగా ప్రాచుర్యం పొందుతోంది.ఖరీదైన వ్యవహారమేరోబోటిక్ సర్జరీలకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ.. ఈ సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి చేయాల్సిన ముందస్తు పెట్టుబడి ఆసుపత్రులకు ఆందోళన కలిగిస్తోంది. రోబోటిక్ సర్జరీలలో చార్జీలు కేసును బట్టి.. ప్రధానంగా శస్త్రచికిత్స రకాన్ని బట్టి మారతాయి. డా వించీ రోబోటిక్ సర్జరీకి అవసరమైన యంత్ర పరికరాల విలువ సుమారు రూ.14 కోట్ల నుంచి గరిష్ఠంగా 20 కోట్ల వరకు ఉంటుందట.వార్షిక నిర్వహణ వ్యయాలు రూ.87 లక్షల నుంచి రూ.1.3 కోట్ల వరకు ఉంటాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఖరీదైన వ్యవహారం కాబట్టి చిన్న ఆసుపత్రులు, గ్రామీణ ప్రాంతాల్లో వీటి వినియోగం ప్రశ్నార్థకమేనని చెబుతున్నాయి. ఎస్ఎస్ ఇన్నోవేషన్ ్స ఇంటర్నేషనల్, మెరిల్ లైఫ్ సైన్సెస్, రిలయన్ ్స ప్రమోట్ చేస్తున్న యాడ్వర్బ్ టెక్నాలజీస్, మెడ్ట్రానిక్ వంటి కంపెనీలు ఈ అడ్డంకిని తొలగించడానికి భారీ అడుగులు వేస్తున్నాయి.అయితే రోబోటిక్ సర్జరీలపట్ల ప్రజల్లో అవగాహన పరిమితంగా ఉండడం, సమగ్ర బీమా కవరేజ్ లేకపోవడం వల్ల రోగులకు అధిక భారం పడుతోంది. సుమారు 70 శాతం తక్కువ ఖర్చుతో సంప్రదాయ పద్ధతుల్లో శస్త్ర చికిత్సలకు వీలుండడం ఈ రంగం వృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయన్నది నిపుణుల మాట. ఇన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ రోబోటిక్ సర్జరీలు పెరుగుతుండడం గమనార్హం.రెండో స్థానంలో దక్షిణాది..దేశంలో సర్జికల్ రోబోల వినియోగంలో ఉత్తర భారతదేశంలోని ఆసుపత్రుల వాటా 35 శాతంగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. ప్రధానంగా ఢిల్లీ–ఎన్ సీఆర్ ఈ విషయంలో ముందుంది. ఆ తర్వాతి స్థానంలో 30 శాతం వాటాతో దక్షిణ భారతం నిలిచింది. -
రుణం భారమా...‘రాజీ’ ఉందిగా!
ఎన్నో అవసరాలకు నేడు అరువు ఆధారంగా మారుతోంది. రుణంపై ఖరీదైన కొనుగోళ్లకు సైతం వెనుకాడడం లేదు. ఈఎంఐతో చిన్నగా తీర్చేయొచ్చులే అన్న ధీమా కనిపిస్తోంది. కానీ, ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోతే..? లేదంటే ప్రమాదం/వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల కారణంగా ఆర్థిక పరిస్థితులు తలకిందులై.. రుణం తీర్చడం కష్టంగా మారితే? ఈ రిస్క్ ను రుణం తీసుకునే ముందు ఎవరూ ఆలోచించడం లేదు. ఒకవేళ రుణం చెల్లించలేని క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్లినప్పుడు ఉన్న ఏకైక మార్గం.. రాజీ (సెటిల్మెంట్) చేసుకోవడమే. ఇది ఎలా పనిచేస్తుంది..? రుణ చరిత్రపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? తదితర విషయాలతో కూడిన కథనమిది.రుణ వాయిదాలను సకాలంలో చెల్లించకపోవడం వల్ల అసలుకు వడ్డీ తోడవుతుంది. దీనిపై పెనాల్టీ తదితర చార్జీలు కూడా పడతాయి. సకాలంలో రుణాన్ని చెల్లించాల్సిన బాధ్యత రుణ గ్రహీతలపై, దీన్ని చట్టబద్ధంగా వసూలు చేసుకునే హక్కు రుణదాతలకు ఉంటుంది. అసాధారణ పరిస్థితులు ఎదురై రుణాన్ని సకాలంలో చెల్లించలేని పరిస్థితుల్లో వన్టైమ్ లోన్ సెటిల్మెంట్ (రుణ పరిష్కారం) కోసం అభ్యర్థించొచ్చు. రుణం ఇచ్చిన బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ ఇందుకు అనుమతిస్తే.. చెల్లించాల్సిన మొత్తం చాలా వరకు తగ్గిపోతుంది. కానీ, దీని కారణంగా తర్వాతి కాలంలో రుణం పొందడం కష్టంగా మారొచ్చు. ‘‘వ్యక్తిగత రుణం, వాహన రుణం, గృహ రుణం, విద్యా రుణం, వ్యాపార రుణం, క్రెడిట్ కార్డు రుణం తదితర రుణాల్లో సెటిల్మెంట్కు వెళ్లొచ్చు. రుణాన్ని పరిష్కరించుకునే ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు కొన్ని ఉన్నాయి. ఇది క్రెడిట్ స్కోరుపై, ఆర్థిక భవిష్యత్పై గణనీయమైన ప్రభావం చూపిస్తుంది’’ అని ఎంపాకెట్ (ఇన్స్టంట్ లోన్ ప్లాట్ఫామ్) వ్యవస్థాపకుడు, సీఈవో గౌరవ్ జలాన్ వివరించారు. రుణ పరిష్కారం అన్నది అంతిమ ఆప్షన్గానే ఉండాలన్నది నిపుణుల సూచన. నెలవారీ చెల్లింపులు చేయలేక రుణ ఎగవేత పరిస్థితుల్లోకి వెళ్లినప్పుడే లోన్ సెటిల్మెంట్ను పరిగణనలోకి తీసుకోవాలని ‘బేసిక్ హోమ్ లోన్’ సంస్థ సీఈవో అతుల్ మోంగా సూచించారు. దీనివల్ల చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సిన అవసరం తప్పుతుందన్నారు.ప్రధానంగా.. ‘‘అన్ సెక్యూర్డ్ రుణాలైన వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డు, వ్యాపార రుణాల విషయంలో రుణ పరిష్కారాన్ని పరిశీలించొచ్చు. అదే సమయంలో సెక్యూర్డ్ కిందకు వచ్చే గృహ రుణాలు, ఆటో రుణాలు లేదా ప్రాపర్టీపై రుణాలు, బంగారంపై రుణాల పరిష్కారానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే తనఖాలో ఉన్న వాటిని రుణదాతలు స్వా«దీనం చేసుకుంటారు’’ అని మైమనీ మంత్ర డాట్ కామ్ వ్యవస్థాపకుడు, ఎండీ రాజ్ ఖోస్లా పేర్కొన్నారు.తగ్గే భారం ఎంత? రుణం తీర్చే అవకాశం లేనప్పుడు పరిష్కారం మాత్రం ఎందుకు? అని సందేహించొచ్చు. చట్టపరమైన చర్యలకు దూరంగా ఎంతో కొంత చెల్లించి భయపడే మార్గం దీంతో లభిస్తుంది. దీనివల్ల మానసిక నిశి్చంత లభిస్తుంది. సెటిల్మెంట్తో తగ్గే భారం ఎంత? అన్న దానికి ఇతమిద్ధమైన సూత్రం ఏమీ లేదు. రుణం ఇచ్చిన సంస్థతో బేరసారాలు.. నియమ, నిబంధనలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రుణగ్రహీత చెల్లింపుల సామర్థ్యాలపైనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా అధిక వడ్డీ భారం ఉండే క్రెడిట్ కార్డు, వ్యక్తిగత రుణాల విషయంలో సెటిల్మెంట్తో చెప్పుకోతగ్గ భారం తగ్గుతుంది. రుణగ్రహీత తన ఇబ్బందికర పరిస్థితుల గురించి రుణదాతకు సమర్థవంతంగా వివరించగలిగితే.. పాక్షిక చెల్లింపులకు బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ అంగీకరించొచ్చు. అవకాశం ఉంటే పూర్తి మొత్తంతో పరిష్కరించుకోవడం మెరుగైన ఆప్షన్ అవుతుందని నిపుణుల సూచన. మొత్తం బకాయి ఎంత? దానిపై వడ్డీ భారం ఎంత? చర్చల సామర్థ్యంపైనే తుదకు ఎంత మొత్తం చెల్లించాలన్నది ఆధారపడి ఉంటుందని అతుల్ మోంగా తెలిపారు. అసలు రుణం కంటే కొంచెం ఎక్కువగాను.. అసలు, వడ్డీ అన్ని చార్జీలు మొత్తం కంటే తక్కువ చెల్లించే పరిష్కారానికి వీలుంటుంది. ‘‘ఏక మొత్తంలో చెల్లిస్తారు గనుక మొత్తం బకాయిలో తక్కువకే రుణ దాతలు అంగీకరిస్తారు. ఒకవేళ పాక్షిక చెల్లింపులకు సైతం కటకట ఎదుర్కొంటుంటే.. మొత్తం బకాయిలో 25 శాతం లేదా 30 శాతం చెల్లించే ప్రతిపాదన చేయొచ్చు. మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి రుణదాతకు వివరించాలి. దీంతో చెల్లించాల్సిన మొత్తం 30–50 శాతానికి పరిమితం అవుతుంది’’ అని విద్యా రుణాల పంపిణీ సంస్థ ‘ప్రాపెల్డ్’ వైస్ ప్రెసిడెంట్ రవికిషోర్ గోయల్ తెలిపారు. చెల్లించాల్సిన మొత్తం భారీగా ఉండి, చెల్లించే సామర్థ్యం చాలా తక్కువగా ఉంటే మరింత తక్కువ మొత్తానికి లోన్ సెటిల్ చేసుకునేందుకు అభ్యర్థించొచ్చని ఖోస్లా సూచించారు. బకాయిలో 10 నుంచి 50 శాతం మధ్య చెల్లింపులు చేసేందుకు సిద్ధం కావాలన్నారు. సాధారణంగా రుణదాతలు బకాయిలో 50 శాతానికి పైన చెల్లించే పరిష్కారానికి అంగీకరిస్తుంటారని.. అయినప్పటికీ, సాధ్యమైనంత తక్కువకు పరిష్కారం కుదుర్చుకునేందుకు ప్రయత్నం చేయొచ్చని సూచించారు. సమీప కాలంలో ఆర్థిక పరిస్థితులు కుదుటపడే అవకాశం లేని పరిస్థితుల్లోనే లోన్ సెటిల్మెంట్ను పరిశీలించాలన్నారు. కొన్ని సందర్భాల్లో ఒకే విడత కాకుండా నిర్ణీత కాల వ్యవధిలోపు ఒకటికి మించిన వాయిదాల్లో చెల్లించే పరిష్కారం సైతం కుదుర్చుకునేందుకు అవకాశం ఉంటుంది. మధ్యవర్తుల సాయం.. రుణ గ్రహీతల తరఫున రుణ పరిష్కారం కోసం బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలతో చర్చలు నిర్వహించేందుకు డెట్ కౌన్సిలర్ లేదా డెట్ సెటిల్మెంట్ ఏజెన్సీ సేవలు సైతం అందుబాటులో ఉన్నాయి. రుణ పరిష్కారం గురించి ఎలాంటి అవగాహన లేని వారు, ఎలా మాట్లాడాలో తెలియని వారు ఈ తరహా సేవలను పొందొచ్చు. ‘‘నిపుణుల సాయం తీసుకోవడం వల్ల స్పష్టమైన ప్రయోజనాలు లభిస్తాయి. సంప్రదింపుల్లో డెట్ సెటిల్మెంట్ కంపెనీలు ఎంతో అనుభవం కలిగి ఉంటాయి. రుణగ్రహీత తరఫున మెరుగైన ప్రయోజనాలతో కూడిన పరిష్కారాన్ని చూడగలవు’’ అని గౌరవ్ జలాన్ తెలిపారు. అంగీకార పత్రాలు సంబంధిత డాక్యుమెంట్ల పని కూడా సులభతరం అవుతుందన్నారు. ఇలాంటి సేవలు అందించే కంపెనీల చార్జీలు ఎక్కువగా ఉంటాయి. కనుక అందుబాటు ధరలపై అందించే సంస్థలను చూసుకోవడం ముఖ్యం. కొన్ని సంస్థలు ఫ్లాట్ ఫీజు వసూలు చేస్తుంటే, కొన్ని బకాయిలో 15–25% వరకు తీసుకుంటాయని మోంగా తెలిపారు. ఇలాంటి సంస్థల సేవలను పొందే ముందు వాటి విశ్వసనీయతను ధ్రువీకరించుకోవాలి.క్రెడిట్ స్కోరుపై ప్రభావంరుణాన్ని సెటిల్ చేసుకున్న తర్వాత ఆ సమాచారాన్ని బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ క్రెడిట్ బ్యూరోలకు అందిస్తాయి. ‘సెటిల్డ్’ లేదా ‘సెటిల్డ్ ఫర్ లెస్ దెన్ ద ఫుల్ అమౌంట్’ (అసలు కంటే తక్కువ మొత్తంతో పరిష్కారం) అంటూ బ్యాంక్లు తెలియజేస్తాయి. రుణ గ్రహీత క్రెడిట్ రిపోర్ట్లోకి ఇదే సమాచారం చేరుతుంది. సెటిల్డ్ అకౌంట్కు సంబంధించిన సమాచారం ఏడేళ్ల వరకు క్రెడిట్ రిపోర్ట్లో కొనసాగుతుంది. సెటిల్డ్ అని ఉంటే రుణం తిరిగి చెల్లించే సామర్థ్యం లేమిని సూచిస్తుంది. కనుక క్రెడిట్ స్కోరుపై గణనీయమైన ప్రభావమే పడుతుంది. దీంతో భవిష్యత్తులో అవసరానికి రుణం లభించదు. ఒకవేళ రుణం లభించినా ఇతరులతో పోలి్చతే చెల్లించాల్సిన వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. రుణ బకాయిని పూర్తిగా చెల్లించినట్టయితే క్రెడిట్ రిపోర్ట్లో అది క్లోజ్డ్ (ముగిసినట్టు) అని ఉంటుంది. మరో రుణం పుడుతుందా? రుణాన్ని పరిష్కరించుకున్నాక చేయాల్సిన మొదటి పని, తిరిగి తమ క్రెడిట్ స్కోర్ను పునర్నిర్మించుకోవడం. తిరిగి మరో రుణం తీసుకునేందుకు కనీసం రెండేళ్లయినా విరామం ఇవ్వాలన్నది నిపుణుల సూచన. అప్పటి వరకు ఏ రుణం కోసం విచారణ చేయొద్దు. రుణ విచారణలు సైతం క్రెడిట్ స్కోర్పై ప్రభావం చూపిస్తాయి. రుణ పరిష్కారం చేసుకున్న వారు సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు తీసుకోవడం మంచి ఆలోచన. అంటే ఫిక్స్డ్ డిపాజిట్పై జారీ చేసే క్రెడిట్ కార్డు. ఈ కార్డుపై 30–50 రోజుల కాలానికి వడ్డీ లేని రుణ సదుపాయం లభిస్తుంది. ఈ కార్డు మొత్తం లిమిట్లో 50 శాతం మించకుండా క్రమశిక్షణతో వినియోగిస్తూ, సకాలంలో చెల్లింపులు చేస్తూ వెళ్లాలి. దీనివల్ల రెండేళ్ల కాలంలో క్రెడిట్ స్కోరు బలపడుతుంది. తద్వారా గతంలో చేసుకున్న రుణ పరిష్కారం తాలూకు ప్రభావాన్ని అధిగమించొచ్చు. చివరి ఎంపికే.. క్రెడిట్ స్కోరుపై ప్రభావం చూపిస్తుంది కనుక లోన్ సెటిల్మెంట్ అన్నది చివరి ఎంపికగానే ఉండాలి. దీనికంటే ముందు రుణ బకాయి మొత్తాన్ని చెల్లించే మార్గాలను పరిశీలించాలి. రుణదాతతో చర్చించుకుని, కొంత కాలం పాటు మారటోరియం (విరామం/6–12 నెలలు) కోరొచ్చు. ఈ లోపు ఆర్థిక పరిస్థితులను గాడిన పెట్టుకుని రుణ బకాయిని వడ్డీ సహా చెల్లించే వెసులుబాటును పరిశీలించాలి. లేదంటే దీర్ఘకాలానికి రుణాన్ని పునర్వ్యవస్థీకరించి, తక్కువ నెలసరి వాయిదాలతో చెల్లించే పరిష్కారం కుదుర్చుకోవచ్చు. ఏవైనా ఆస్తులు ఉంటే విక్రయించి చెల్లించడం మెరుగైన మార్గం అవుతుంది. అవసరమైతే కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల సాయంతో గట్టెక్కే మార్గం చూడొచ్చు. ఏ విధంగా చూసినా అవకాశం లేనప్పుడు రుణ పరిష్కారానికి వెళ్లొచ్చు. ఇవి గుర్తుంచుకోండి... కొన్ని వేల రూపాయిల బకాయి కోసం లోన్ సెటిల్మెంట్ కోరడం అస్సలు సూచనీయం కాదు. ఎంత కష్టమైనా సరే చెల్లించడమే మెరుగైన ఆప్షన్ అవుతుంది. రుణ బకాయి వ్యక్తి వార్షిక ఆదాయంలో 20–30 శాతం ఉన్నప్పుడు లోన్ సెటిల్మెంట్ ఆప్షన్ ఎంపిక చేసుకుని క్రెడిట్ స్కోరులో రాజీ పడవద్దని ఖోస్లా సూచించారు. → లోన్ సెటిల్మెంట్లో భాగంగా అంగీకారం మేర చెల్లింపులు చేసిన తర్వాత మిగిలిన మొత్తాన్ని రుణ దాత మాఫీ చేస్తారు. దాంతో చట్టపరంగా ఇకమీదట చెల్లించాల్సిన బాధ్యత ఉండదు. → రుణ పరిష్కారం కంటే దివాలా పిటిషన్ దాఖలు చేయడమే తేలిక కదా అని అనుకోవద్దు. దివాలాతో రుణాలకు శాత్వతంగా దారులు మూసుకుపోయినట్టు అవుతుంది. దీనికంటే సెటిల్మెంట్ నయం. → కొన్ని బ్యాంక్లు లేదా ఎన్బీఎఫ్సీలు తక్కువ మొత్తం చెల్లింపులకు అంగీకరించకపోవచ్చు. → రుణం చెల్లించకుండా లేదా పరిష్కారం కుదుర్చుకోకుండా కాలయాపన చేస్తే బ్యాంక్లు/ఎన్బీఎఫ్సీలు చట్టపరమైన చర్యలు మొదలు పెడతాయి. రుణగ్రహీతలపై కోర్టులో సివిల్ కేసు దాఖలు చేస్తాయి. కొన్ని సందర్భాల్లో క్రిమినల్ కేసు దాఖలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దీనివల్ల లేనిపోని చార్జీల భారం నెత్తిన పడుతుంది. → సకాలంలో వసూలు కాని రుణ ఖాతాలను బ్యాంక్లు/ఎన్బీఎఫ్సీలు థర్డ్ పార్టీ సంస్థలకు అప్పగించొచ్చు. దీనివల్ల వారి నుంచి కఠిన వసూళ్ల చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
చెరుగుతున్న చేతిరాత
ప్రస్తుతం అంతా డిజిటల్ యుగం. చేతిరాత దాదాపుగా చచ్చిపోతోంది. డిజిటల్ అవకాశాలు చేతిరాత అవసరాన్నే దాదాపుగా తగ్గించేశాయి. రాత అవసరమైన కెరీర్ను పక్కకు పెట్టే అవకాశం వచ్చింది. ఒకప్పుడు చొక్కా జేబులకు హుందాగా వేలాడిన పెన్ను ఇప్పుడు అలంకారప్రాయంగా కూడా మిగలని పరిస్థితి! కాలేజీ విద్యార్థులు టైపింగ్, టెక్స్టింగ్ చేయడం లేదా వాయిస్ నోట్స్ పంపడం చేస్తున్నారు. స్క్రీన్లపై, వ్యాకరణ స్లిప్లు, అక్షర దోషాలు కూడా ఆటోకరెక్ట్ అవుతున్నాయి. ఇలాంటి డిజిటల్ యుగంలో ఇంకా విద్యార్థులకు ‘చేతిరాత’శిక్షలు అవసరమా? ఇది ఇప్పుడు పాఠశాలలు ఆలోచించాలంటున్నారు నిపుణులు. ‘పేలవమైన చేతివ్రాతను శిక్షించడం మానేయాలి. విద్యార్థి పనిని ప్రదర్శన కోసం కాకుండా కంటెంట్ కోసం అంచనా వేయాలి. ప్రత్యామ్నాయ మూల్యాంకన పద్ధతులను అన్వేషించాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇద్దరూ పిల్లలకు వ్యక్తిగత రచన కోసం ప్రైవేట్ స్థలాన్ని ఇవ్వాలి. యువతకు రాయడానికి, విఫలమవడానికి, నేర్చుకోవడానికి అవకాశం ఇవ్వండి. వారిని శిక్షించే పద్ధతులను మార్చండి’అని సూచిస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న ఎత్తుగడలు చేతిరాత భయం యొక్క మూల కారణాలను తొలగిస్తాయి. రాయడం ముఖ్యమైన జీవిత నైపుణ్యమే. అలాంటి చోట పెన్ను ఒక సాధనంగా ఉండాలే తప్ప.. బెదిరింపు ఆయుధంగా మారకూడదని హెచ్చరిస్తున్నారు. గ్రాఫో ఫోబియా ‘ముత్యాల్లాంటి అక్షరాలు.. రాత చూస్తేనే మార్కులు పడిపోతాయి’అందమైన చేతిరాత ఉన్న విద్యార్థులకు ఉపాధ్యాయులిచ్చే కితాబు. ‘ఏంట్రా ఈ కొంగలు తొక్కిన రాత.. ఇట్లా రాస్తే ఏం అర్థమవుతుంది?’... ఇవి రాత బాగలేని వారికి పడే చివాట్లు. ఇప్పటికీ మన దేశంలోని తరగతి గదుల్లో టీచర్స్ నోట వినబడే ముచ్చట్లు. అవును చేతిరాతలు ఒకప్పుడు తలరాతలను మార్చాయి. కొందరికి మాత్రం ఫోబియాను మిగిల్చాయి. ప్రస్తుత డిజిటల్ యుగంలో.. చేతిరాత కళపై చర్చ జరుగుతోంది. చేతిరాత అనగానే గుర్తొచ్చేది కాపీరైటింగ్ నోట్స్. తెలుగుకోసం డబల్ రూల్.. ఇంగ్లిష్ కోసం ఫోర్ రూల్ బుక్స్. రాత బాగుపడటం కోసం పదేపదే రాయించే టీచర్స్. రాత బాగోకపోతే టీచర్లతో పడే తిట్లు. బాగున్నందుకు అందే మెచ్చుకోళ్లు. పాఠశాలలో ఉండగా డైరీ ఎంట్రీలు.. యవ్వనంలో ప్రేమ లేఖలు. అవి కొందరిని సృజనాత్మక రచనలోకి మారేలా చేస్తే.. రాత సరిగ్గా లేని కొందరినీ భయంలోకి నెట్టేశాయి. అందుకే.. చిన్న దరఖాస్తు.. అందులో రాయాల్సిందల్లా పేరు, చిరునామా, తేదీ మాత్రమే. అయినా సరే.. పెన్ను, పేపర్ తాకగానే ఓ బెరుకు.. అక్షరం ముందుకు కదలదు. అబ్బా ఆన్లైన్ ఫామ్ పెట్టొచ్చు కదా.. ఎంత వయసొచ్చినా సరే.. ఇప్పటికీ కొంతమందికి ఉండే ఫోబియా ఇది. చేతిరాత సరిగా లేక.. బాల్యంలో టీచర్ చేత తిన్న తిట్లు గుర్తుకు వచ్చి కలిగే భయం. దీనిని గ్రాఫోఫోబియా (చేతివ్రాత భయం), స్క్రిప్టోఫోబియా (బహిరంగంగా రాయడానికి భయం) అని పిలుస్తారు. బాల్యంలో చేతిరాత సరిగా లేకపోవడం వల్ల ఎంతో మందికి మిగిల్చిన చేదు జ్ఞాపకాలు.. ఆ తరువాత ఉన్నత విద్యను, ఆపైన కెరీర్ను కూడా ప్రభావితం చేశాయంటే అతిశయోక్తి కాదు.శిక్షగా రాత! భారత విద్యా వ్యవస్థలో నేటికీ చేతిరాతే ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇటీవల ముంబైలోని ఒక ట్యూషన్ టీచర్ చేతి రాత సరిగా లేదని ఎనిమిదేళ్ల బాలుడి చేతిని కొవ్వొత్తితో కాల్చిన విషయం తెలిసిందే. క్లాస్రూమ్లో చేసిన తప్పులకు శిక్షగా కూడా ఈ చేతిరాతనే ప్రయోగిస్తుంటారు ఉపాధ్యాయులు. క్లాసు జరుగుతుండగా మాట్లాడిన విద్యారి్థతో ‘నేను మళ్ళీ తరగతిలో మాట్లాడను’అని 200 సార్లు రాయమని సూచించడం అందుకో ఉదాహరణ. చేతిరాతలో జెండర్ పాత్ర కూడా ఉంది. అమ్మాయివై ఉండి ఇట్లా రాస్తే ఎట్లా.. అని టీచర్లతో తిట్లుతిన్న అమ్మాయిలనేకం. ఆ ఒత్తిడి కొందరికి కాలిగ్రఫీ, స్టెనోగ్రఫీ లాంటివాటిపై ప్రేమను పెంచితే.. పదేపదే విమర్శలు మరికొందరికి అవమాన భారాన్ని మిగిల్చాయి. ఈ శిక్షలు రాయడాన్ని శిక్ష, అవమానంగా అలవాటు చేశాయి. పేలవమైన చేతిరాత భయంతో రాయడం మానేశామని 36.3% మంది విద్యార్థులు 2012 జరిగిన ఓ అధ్యయనంలో చెప్పారంటే.. తీవ్రత ఏపాటిదో అర్థమవుతుంది. ఇప్పుడంటే వాట్సప్, మెసెంజర్, ఈమెయిల్.. వీటన్నింటికీ ఫోన్ లేదా ల్యాప్టాప్లో పాస్వర్డ్తో సంరక్షణ ఉంది కాబట్టి ఎవరో చూస్తారనే భయం లేదు. కానీ.. యువతకు గోప్యత అంటూ లేని కాలంలో.. తమ డైరీనో లేఖనో దొరికితే.. కలిగే అవమానం, శిక్ష.. చేతిరాతను జీవితాంతం ట్రామాగా మిగిల్చిన సందర్భాలూ ఉన్నాయి. ఇవన్నీ.. మెదడులోని హిప్పోకాంపస్, లింబిక్ వ్యవస్థలను ప్రభావితం చేస్తాయి. ఇది శ్రద్ధ, జ్ఞాపకశక్తి, భావోద్వేగాల నియంత్రణను దెబ్బతీస్తుంది. అందుకే రాయడానికి పెన్ను పట్టుకోగానే వారికి చేతిలో వణుకు, అరచేతులకు చెమటలు రావడం, గుండె వేగంగా కొట్టుకోవడం, వికారం, తిమ్మిర్లు రావడం, మణికట్టు నొప్పి వస్తాయి. ఇవన్నీ ఒకప్పుడు వారు ఎదుర్కొన్న అవమానాల తాలూకు మానసిక సంకేతాలు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భారత్ ఎకానమీకి 'పర్యాటకం' దన్ను
దేశీయ పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి అనంతరం పర్యాటకం తిరిగి పూర్వ స్థాయిని మించి పుంజుకుంది. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకం రెండూ బలంగా విస్తరిస్తున్నప్పటికీ, వసతి మౌలిక సదుపాయాలలో గణనీయమైన కొరత ఉందని నీతిఆయోగ్ తాజా నివేదికలో స్పష్టం చేసింది. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం పీక్ సీజన్లలో దేశవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా హోటల్ గదుల కొరత ఉంటుందని నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో హోమ్ స్టేలు కీలక ప్రత్యామ్నాయంగా మారుతున్నాయని, వాటి విస్తరణకు మరిన్ని మార్గాలను అనుసరించాల్సిన అవసరం ఉందని నివేదిక సూచించింది. –సాక్షి, అమరావతిప్రత్యామ్నాయ వసతి రంగం పురోగతిపర్యాటక రంగం విస్తృతంగా పెరుగుతున్న తరుణంలో వసతి మౌలిక సదుపాయాల లోటును భర్తీ చేయడానికి ప్రత్యామ్నాయ వసతి కీలక పరిష్కారంగా నిలుస్తోంది. కొత్త హోటళ్ల నిర్మాణానికి అధిక పెట్టుబడి, నియంత్రణ ఆమోదాలు, భూమి లభ్యత అవసరం. అయితే, హోమ్ స్టేలు తక్కువ ఖర్చుతోనే చక్కటి వసతి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ప్రత్యేకించి మారుమూల ప్రాంతాలు, ద్వితీయ–తృతీయ శ్రేణి నగరాలకు ఇవి ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి. పర్యావరణ స్పృహ, కమ్యూనిటీ ఆధారిత పర్యాటకంతో వీటిని అనుసంధానం చేయాలని నివేదిక సూచించింది. హోమ్ స్టేల కోసం కేంద్రం, రాష్ట్రాలు ఒక నమూనా విధానం రూపొందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. నివేదిక సిఫారసు చేసిన అంశాల్లో.. కొత్త ఆపరేటర్లకు సాంకేతిక సహాయం, ప్రాజెక్టు నిర్వహణ నైపుణ్యం, ఉత్తమ పద్ధతులపై మార్గదర్శకం, ఆర్థిక, ఆర్థికేతర రాయితీలు, గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు ప్రత్యేక మద్దతు, నీరు, విద్యుత్, ఆస్తి పన్నులలో నివాస రేట్ల రాయితీలు, హోమ్ స్టే రిజి్రస్టేషన్ కోసం సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థ ఏర్పాటు వంటివి ఉన్నాయి. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు.. » 2024లో ప్రయాణ–పర్యాటక రంగం దేశ ఆర్థిక వ్యవస్థకు రూ.21.15 లక్షల కోట్లు అందించింది. ఇది 2019తో పోలిస్తే 21 శాతం పెరుగుదల. » వచ్చే దశాబ్దంలో ఈ రంగం రూ.43.25 లక్షల కోట్లు ఆర్థిక వ్యవస్థకు అందజేస్తుంది. ఇది దేశ జీడీపీలో 7.6 శాతంగా ఉంటుంది. » 2024లో దేశీయ పర్యాటకులు రూ.16 లక్షల కోట్లు ఖర్చు చేశారు. ఇది 2019తో పోలిస్తే దాదాపు 25 శాతం అధికం. 2034 నాటికి ఈ ఖర్చు రూ.28.70 లక్షల కోట్లు చేరనుంది. » అంతర్జాతీయ పర్యాటకులు 2024లో రూ.2.85 లక్షల కోట్లు ఖర్చు చేయగా, 2034 నాటికి అది రూ.4.07 లక్షల కోట్లు దాటుతుందని అంచనా. » ప్రస్తుతం పర్యాటక రంగంలో 4.32 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. అంటే, ప్రతి 11 ఉద్యోగాలలో ఒకటి ఈ రంగానిదే. 2034 నాటికి ఈ రంగంలో ఉపాధి 6.3 కోట్లకు పెరుగుతుంది. » పర్యాటకుల అభిరుచులు కూడా మారుతున్నాయి. సుదీర్ఘమైన, ప్రయోజనకరమైన ప్రయాణాలపై వారు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. » 87 శాతం మంది పర్యాటకులు కొత్త గమ్యస్థానాల్లో పర్యటించి, ఆ అనుభూతులను పదిలపరచుకోడానికి దీర్ఘకాల పర్యటనలను కోరుకుంటున్నారు. » వర్కేషన్స్ (విహార ప్రదేశంలో ఉంటూ పని చేయడం), డిజిటల్ నోమాడ్ (స్థిర నివాసం లేకుండా, ప్రపంచంలోని ఏ ప్రదేశం నుంచైనా ఆన్లైన్లో పని చేసేవాడు) సంస్కృతి పెరుగుతున్నందున దీర్ఘకాల వసతిపై డిమాండ్ పెరిగింది. » హోమ్ స్టేలు, ఆఫ్బీట్ అలాగే గ్రామీణ పర్యాటకం వేగంగా విస్తరిస్తున్నాయి. దేశీయ హోమ్ స్టే మార్కెట్ 2024లో రూ.4,722 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. » ఈ మారుతున్న ధోరణులు పర్యావరణ హిత, వెల్నెస్ టూరిజం, గ్రామీణ హోమ్ స్టేల వంటి ప్రత్యామ్నాయ పర్యాటక నమూనాలకు దారి తీస్తున్నాయి. -
పేరెంట్స్.. ముందు మీరు పాటించండి
పిల్లల్ని ఎంత ముద్దు చేసినా, వారికి బుద్ధుల్ని నేర్పించే వయసొకటైతే వచ్చేస్తుంది. అప్పుడిక క్రమశిక్షణ అలవాటు చేయాల్సిందే. అయితే ఆ శిక్షణ.. శిక్షలా ఉండకూడదు. ముద్దార నేర్పించినట్లుగా ఉండాలి. పిల్లలు మెత్తటి మట్టి ముద్దల్లాంటి వారు. వారిని చక్కగా మలచటం పెద్దల చేతుల్లోనే ఉంటుంది. ‘మొక్కై వంగనిది మానై వంగునా?’ అనే సామెత ఎలాగూ ఉన్నదే! వాళ్లు మొక్కలుగా ఉన్నప్పుడే.. వాళ్లు మంచి అలవాట్లు, బాధ్యతలు నేర్చుకోవాలంటే.. అవి చేసి చూపించాల్సింది, పాటించాల్సింది మొదట తల్లిదండ్రులే.స్కూల్లో టీచర్లు చదువు నేర్పటానికి ఒక సిలబస్ ఉన్నట్లే, ఇంట్లో తల్లిదండ్రులు మంచి అలవాట్లు నేర్పటానికి కూడా 6 సబ్జెక్టుల సిలబస్ ఒకటి ఉంది : ఆహారం, ఆటలు, నిద్రవేళలు, సమయపాలన, నియంత్రణ, సంభాషణ. ఈ ఆరు సబ్జెక్టుల్లో పరీక్షలు రాయవలసింది పిల్లలు కాదు. తల్లిదండ్రులు! ఆ ఆరు సబ్జెక్టులు, ఆరు సిలబస్లు ఏమిటో చూద్దామా..– సాక్షి, స్పెషల్ డెస్క్సబ్జెక్ట్ 1 ఆహారం పిల్లలు అడిగినా అడగకున్నా ఏదో ఒకటి తినిపిస్తూ, తినేందుకు ఇస్తూ పేరెంట్స్ తమ ప్రేమను వెలిబుచ్చుతుంటారు. స్కూలుకు వెళ్లడానికి మారాం చేస్తే ఏదో ఒకటి షాపులో కొని ఇస్తుంటారు. చిన్నపిల్లలు వాళ్లకేం తెలుసు.. జంక్ఫుడ్ ఎంత ప్రమాదకరమో! వారంలో ఎక్కువ రోజులు హోటళ్ల నుంచో లేదా ఆన్లైన్ ద్వారానో ఆహారం తెప్పించుకుని ఇంట్లో తినడం చేస్తే.. పిల్లలకు ఇక ఏం చెప్తాం?ఎలా నేర్పించాలి?చాక్లెట్లు, జంక్ఫుడ్, బయటి ఆహారం వంటివి ఎంత ప్రమాదకరమో వీడియోల ద్వారా వారికి అర్థమయ్యేలా చూపించాలి. కాస్త పెద్ద పిల్లలైతే పత్రికల్లో కథనాలు చూపించాలి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వంటి వెబ్సైట్లలో సమాచారం చూపించాలి. తాజా పండ్లు, కూరగాయల వల్ల ప్రయోజనాలు తెలియజెప్పాలి. మీరు చెప్పే వాటిలో.. మీమీ ఆరోగ్య పరిస్థితులను బట్టి.. వీలైనంతవరకు పిల్లలతో కలిసి తినాలి.సబ్జెక్ట్ 2ఆటలు పిల్లలకు కూడా వయసుకు తగిన శారీరక శ్రమ అవసరం. అవి లేకనే పిల్లల్లో స్థూలకాయం, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇలా నేర్పించండి: పిల్లలతో కలిసి మీరూ ఇంటి పనులు చేయండి. కలిసి తోట పని చేయండి. వాకింగ్ చేయండి. వాటి ప్రయోజనాలు వాళ్లకు వీడియోలు లేదా పత్రికల్లో కథనాల ద్వారా తెలియజేయండి. సబ్జెక్ట్ 3నిద్ర వేళలు వేళకు నిద్రపోవటం, నిద్ర లేవటం మంచి అలవాటు. కానీ, చాలామంది పిల్లలు ఉదయాన్నే లేవరు. దాంతో వాళ్లను లేపి, రెడీచేసి, టిఫిన్ తినిపించేసరికి తల్లులకు తలప్రాణం తోకకి వస్తుంది. మీరే ముందు లేవండిసూర్యోదయానికంటే ముందే లేవడం మొదట తల్లిదండ్రులే ప్రారంభించాలి. ఇందుకోసం ముందు చేయాల్సిన రెండు విషయాలు.. రాత్రి వీలైనంత త్వరగా నిద్రపోవడం, బద్ధకాన్ని వదిలించుకోవడం. ఉదయాన్నే లేవడం వల్ల కలిగే ప్రయోజనాలు పిల్లలకు చెప్పండి. విజయవంతమైన వ్యక్తులంతా.. సూర్యోదయానికంటే ముందే నిద్రలేచినవాళ్లేనని వాళ్ల జీవిత చరిత్రలు వివరించండి. పిల్లలను.. వాకింగ్ చేద్దామనో, అలా మేడమీదకు ఎండలోకి వెళ్లివద్దామనో నిద్రలేపండి. మొదట్లో లేవరు. కానీ, లేపడం మానొద్దు. నెమ్మదిగా అలవాటు అవుతుంది. మీరు వాకింగ్కో లేదా మేడమీదకో వాళ్లను తీసుకెళ్లినప్పుడు వాళ్లకు నచ్చిన విషయాలు జరిగితే వాళ్లే రోజూ మిమ్మల్ని లేపుతారు.సబ్జెక్ట్ 4సమయపాలనఅందరికీ ఉండేవి ఆ 24 గంటలే. అందులోనే మన నిత్య కృత్యాలకు, ఇతర పనులకు ఎంత సమయం కేటాయిస్తాం అన్నదానిపై మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. మీరు ఫాలో అవ్వండిమీరు ఒక టైమ్ టేబుల్ వేసుకుని దాన్ని మీ ఇంట్లో ఒక గోడమీదనో మరోచోటో అంటించండి. దాన్ని చూసుకుని మరీ ఫాలో అవ్వండి. ప్రతిసారీ టిక్కులు పెట్టండి. మీరు చూస్తున్న, చేస్తున్న విషయం పిల్లలకు తెలియాలి. నెమ్మదిగా వాళ్ల బెడ్రూమ్లో కలర్ఫుల్గా వాళ్లతోనే ఒక టైమ్ టేబుల్ తయారుచేయించండి. లేదా వాళ్లే తయారుచేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వాళ్లు కూడా మీలాగే చేసేందుకు ప్రయత్నిస్తారు. మొదట్లో.. వాళ్లు విజయవంతంగా దాన్ని ఫాలో అయిన ప్రతిరోజూ ఒక ప్రశంస లేదా బహుమతి ఏదో ఒకటి ఇవ్వండి. తరువాత వాళ్లకు మీరేమీ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే అన్నీ చేసేస్తారు.సబ్జెక్ట్ 5నియంత్రణ సోషల్ మీడియా వచ్చాక పెద్దలకు, పిల్లలకు కూడా స్మార్ట్ ఫోనే లోకం అయిపోయింది. టీవీలు చూస్తూ తినడం చేస్తున్నారు. చాలామంది పెద్దలు పిల్లలు చదువుకుంటుంటేనో, వాళ్లు చూస్తుండగానో లేదా వాళ్లతోనో.. గంటల తరబడి రీళ్లూ, వీడియోలూ, టీవీలో సినిమాలూ / వెబ్సిరీస్లూ చూస్తుంటారు. మీకు మీరే నియంత్రించుకోండిసోషల్ మీడియా, టీవీ ఉచ్చులోంచి ముందు మీరు బయటపడండి. పిల్లల ముందు, వాళ్లు చదువుకుంటున్నప్పుడు ఫోన్లో వీడియోలు చూడటం తగ్గించండి. అలాగే భోజన సమయంలో టీవీ ఆఫ్ చేయడం మీరు అలవాటు చేసుకోండి. ముఖ్యంగా రాత్రుళ్లు టీవీలూ ఫోన్లూ తగ్గించండి. ఉదయాన్నే త్వరగా లేవగలుగుతారు.సబ్జెక్ట్ 6సంభాషణ ఈ రోజుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలాంటి వారినైనా ఎక్కడైనా బతికేలా చేయగలవు. ఇందుకు ప్రధానమైనవి.. సంభాషణా చాతుర్యం, మాటల్లో స్పష్టత, అవసరమైన చోట మృదుత్వం, ధైర్యంగా భావవ్యక్తీకరణ. ఇవి పిల్లలు.. బడిలో టీచర్లు, ఇంట్లో మిమ్మల్నే చూసి నేర్చుకుంటారని మర్చిపోవద్దు.పిల్లలతో మాట్లాడండి.. వినండితల్లిదండ్రులు తరచూ పిల్లలతో మాట్లాడుతూ ఉండాలి. ఉద్యోగాల్లో ఎంత తీరిక లేకుండా ఉన్నా, పిల్లల కోసం తీరిక చేసుకోవాలి. వారి స్కూలు విషయాలను అడిగి తెలుసుకుంటుండాలి. వాళ్లు చెప్పేది శ్రద్ధగా వినాలి. ఆ నమ్మకం వారికి కలగకపోతే వారు మనసువిప్పి మీతో మాట్లాడటం మానేస్తారు. సెలవు రోజుల్లో వారిని మీతోపాటు మార్కెట్కో, షాపుకో తీసుకెళ్లండి.. బయట ఎలా మాట్లాడాలో వాళ్లే నేర్చుకుంటారు.ఓపిక పట్టండిపిల్లలకు మంచి అలవాట్లు నేర్పటానికి పెద్దలకు ఓర్పు అవసరం. » పిల్లలు అలవాటు పడేంత వరకు వారికి గుర్తు చేస్తూనే ఉండాలి. » మంచి అలవాట్లు నేర్చుకునే విషయంలో పిల్లల ప్రయత్నాలను గుర్తించి, ప్రశంసించాలి. » పిల్లలకు మీరు కొన్ని అలవాట్లను ఏర్పరచలేకపోతుంటే వారి ఉపాధ్యాయులు, పిల్లల వైద్యులు లేదా ఇతర నిపుణుల సలహా తీసుకోవడానికి వెనుకాడకండి. -
ఐపీవో నిధుల సమీకరణకు కోత..!
ఇటీవల తిరిగి ప్రైమరీ మార్కెట్లు జోరందుకున్నప్పటికీ పలు కంపెనీలు ఐపీవో నిధుల సమీకరణకు కోత పెడుతున్నాయి. సెకండరీ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, పెట్టుబడులకు పలు అవకాశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు సైతం అంతగా ఆసక్తి చూపకపోవడం వంటి అంశాలు ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. నిజానికి ప్రస్తుత కేలండర్ ఏడాది (2025)లో పలు అన్లిస్టెడ్ కంపెనీలు పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు క్యూ కడుతున్నాయి. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్ను దాఖలు చేస్తున్నాయి. అనుమతులు సైతం పొందుతున్నాయి. అయితే జనవరి మొదలు ప్రపంచ దేశాలపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అదనపు సుంకాలను విధిస్తుండటంతో సెంటిమెంటు బలహీనపడినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ప్రధానంగా భారత్ ఎగుమతులపై ఇటీవల 50 శాతంవరకూ టారిఫ్లను ప్రకటించడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలియజేశారు. యూఎస్ టారిఫ్ల కారణంగా సముద్ర ఉత్పత్తులు, టెక్స్టైల్స్, లెదర్, జ్యువెలరీ, కెమికల్స్ తదితర పలు రంగాలు ప్రభావితంకావచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫార్మాపై సైతం సుంకాలు విధించే వీలున్నట్లు ట్రంప్ హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఫలితంగా కొద్ది నెలలుగా దేశీ స్టాక్ మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలోనే సాగుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. వీటికితోడు దేశీ కంపెనీల ఏప్రిల్–జూన్(క్యూ1) ఫలితాలు ఆకట్టుకోకపోవడంతో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు సైతం దేశీ స్టాక్స్ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో పలు అన్లిస్టెడ్ కంపెనీలు ఐపీవో ద్వారా సమీకరించదలచిన నిధుల పరిమాణాన్ని తగ్గించుకుంటున్నాయి. పునరాలోచనలో.. ఈ ఏడాది జనవరి నుంచి పలు కంపెనీలు లిస్టింగ్కు ఆసక్తి చూపుతున్నప్పటికీ సమీకరించతలపెట్టిన నిధుల పరిమాణంలో కోత పెట్టుకుంటున్నట్లు మార్కెట్ నిపుణులు తెలియజేశారు. వెరసి 2025లో ఇప్పటివరకూ సుమారు 15 కంపెనీలు ఇష్యూల పరిమాణాన్ని తగ్గించుకున్నాయి. ఈ జాబితాలో ఇటీవల లిస్టయిన దిగ్గజాలు ఎన్ఎస్డీఎల్, జేఎస్డబ్ల్యూ సిమెంట్సహా.. ఏథర్ ఎనర్జీ, ఎస్కే ఫైనాన్స్, బ్లూస్టోన్, మొబిక్విక్, ష్లాస్ బెంగళూరు(లీలా హోటల్స్), ఇండిక్యూబ్, అర్బన్ కంపెనీ, స్మార్ట్ వర్క్స్, స్వస్తికా ఇన్ఫ్రా తదితరాలు చేరాయి. 48 కంపెనీల లిస్టింగ్ ఈ కేలండర్ ఏడాదిలో ఇప్పటివరకూ 48 కంపెనీలు ఐపీవోలు చేపట్టి స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యాయి. తద్వారా రూ. 64,135 కోట్లు సమకూర్చుకున్నాయి. అంతక్రితం ఏడాది అంటే 2024లో 90 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వచ్చాయి. తద్వారా ఏకంగా రూ. 1,67,535 కోట్లు(19.5 బిలియన్ డాలర్లు) సమీకరించాయి. ఇది రికార్డుకాగా.. ఈ ఏడాది ద్వితీయార్థంలోనూ పలు దిగ్గజాలు లిస్టింగ్ బాటలో సాగనున్నాయి. పలు అవకాశాలు ప్రైమరీ మార్కెట్లలో కొన్ని నెలలుగా చిన్న, మధ్యతరహా సంస్థలు(ఎస్ఎంఈ) సైతం సందడి చేస్తున్నాయి. దీంతో ఎన్ఎస్ఈ ఎమర్జ్, బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్స్ ద్వారా పలు చిన్న కంపెనీలు సైతం భారీ స్థాయిలో ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు మర్చంట్ బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. మరో వైపు కొద్ది నెలలుగా బంగారం, వెండి వంటి విలువైన లోహాలు ఆకర్షణీయ రిటర్నులు ఇవ్వడం, రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ల ఐపీవోలు, మ్యూచువల్ ఫండ్ల సిప్ పథకాలు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీంతో మెయిన్ బోర్డ్ ప్రైమరీ మార్కెట్లో కొన్ని ఇష్యూలు మాత్రమే లిస్టింగ్లోనూ విజయవంతమవుతున్నట్లు వివరించారు. వెనకడుగు తీరిదీ... వివిధ ప్రతికూలతల కారణంగా తొలుత వేసిన ప్రణాళికలను సవరిస్తూ కొన్ని కంపెనీలు ఐపీవో నిధుల సమీకరణ పరిమాణంలో కోత పెడుతున్నాయి. జేఎస్డబ్ల్యూ సిమెంట్ రూ. 4,000 కోట్ల విలువను రూ. 3,600 కోట్లకు సవరించగా.. ఏథర్ ఎనర్జీ రూ. 3,100 కోట్ల నుంచి రూ. 2,626 కోట్లకు తగ్గించుకుంది. ఈ బాటలో ఎస్కే ఫైనాన్స్ రూ. 2,200 కోట్లస్థానే రూ. 1,600 కోట్లు మాత్రమే సమీకరించగా.. బ్లూస్టోన్ రూ. 1,000 కోట్ల నుంచి రూ. 820 కోట్లకు వెనకడుగు వేసింది. లీలా హోటల్స్ రూ. 5,000 కోట్ల ప్రణాళికను రూ. 3,000 కోట్లకు కుదిస్తే.. మొబిక్విక్ రూ. 1,900 కోట్ల నుంచి రూ. 700 కోట్లకు భారీగా కోత పెట్టుకుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
అంతరాలు!
డైనింగ్ టేబుల్పై నోరూరించే వంటకాలు ఘుమఘుమలాడుతున్నాయి. ఓ తాత, ఆయన మనవడు.. నిశ్శబ్దంగా సాగుతోంది వారి భోజనం. తనతో ఈరోజైనా ఏమైనా మాట్లాడతాడేమోనని ఆ పెద్దాయన ఎదురు చూపులు. 21 ఏళ్ల ఆ కుర్రాడు మాత్రం తన ప్రపంచంలో తాను ఫోన్ లో ఎప్పటిలాగే నిమగ్నమయ్యాడు. ఇద్దరిదీ ఒకేగూడు.. అయినా ఇరువురి మధ్య దూరం. ఇలాంటి దృశ్యాలు.. ఏ ఒక్క కుటుంబానికో పరిమితం కాలేదు. దేశంలోని లక్షలాది ఇళ్లల్లో ఇదే పరిస్థితి.దేశ జనాభాలో 15–29 సంవత్సరాల మధ్య వయసు గల యువత దాదాపు 29% ఉన్నారని అంచనా. అంటే దాదాపు 42 కోట్ల మంది! ఈ ఏడాది చివరినాటికి దేశ జనాభాలో 60 ఏళ్లు, ఆపై వయసుగలవారు 12 శాతం వరకు ఉంటారు. 2050 నాటికి ఇది 19 శాతానికి చేరుతుంది. వీరి జనాభా 25 ఏళ్లలో రెండింతలవుతుందని అంచనా. ఇది మనదేశంలో రెండు ప్రధాన తరాల ముఖ చిత్రం.మనసుల మధ్య ఎడంసాధారణంగా తరాల మధ్య అంతరం ఉంటుంది. కానీ, ఇటీవల వ్యక్తుల మధ్యే కాదు.. మనసుల మధ్య కూడా ఎడం ఉంటోంది. జనరేష¯Œ –జడ్.. పెద్దలను గౌరవిస్తారు. కానీ ఒంటరి వారని, తమపై ఆధారపడతారన్న చులకన భావమూ ఉంటోందని సుప్రసిద్ధ ఎన్జీవో ‘హెల్పేజ్ ఇండియా’ దేశవ్యాప్తంగా చేపట్టిన అధ్యయనం చెబుతోంది. పెద్దలతో యువతరానికి ఉన్న పరిమిత బంధాలు, కుటుంబాల్లో మూస పద్ధతులు.. వెరసి అభిమానం ఉన్నా ఇరువురి మధ్య దూరం ఉంటోందని వివరించింది. తరాలున్న కుటుంబాల్లో 18–24 ఏళ్ల వయసున్న యువతకు.. తాతయ్య, అమ్మమ్మ, నానమ్మలతో ఆత్మీయ అనుబంధం ఎక్కువ.వృద్ధులతో యువత ఎలా మమేకం అవుతున్నారంటే.. -
శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద
దోమలపెంట/నాగార్జునసాగర్: ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది. శనివారం రాత్రి 7 గంటల సమయంలో జూరాల ప్రాజెక్టు నుంచి స్పిల్వే, విద్యుదుత్పత్తి ద్వారా 4,16,629, సుంకేసుల నుంచి 53,313, హంద్రీ నుంచి 250 మొత్తం 4,70,192 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలంకు వస్తోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు పది గేట్లు ఒక్కొక్కటి 18 అడుగుల మేర ఎత్తి.. స్పిల్వే ద్వారా 4,19,314 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. మరోవైపు ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 26,087.. మొత్తం 61,402 క్యూసెక్కుల నీటిని అదనంగా నాగార్జునసాగర్కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 881.7 అడుగుల వద్ద 197.4617 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 24 గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 30,000, హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2,818, ఎంజీకేఎల్ఐ ద్వారా 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో 16.480 మిలియన్ యూనిట్లు, కుడిగట్టు కేంద్రంలో 13.750 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేశారు. కాగా, నాగార్జున సాగర్ ప్రాజెక్టు 26 క్రస్ట్గేట్ల ద్వారా స్పిల్వే మీదుగా 3,61,322 క్యూసెక్కులు, విద్యుదుత్పాదనతో 33,414 క్యూసెక్కులు మొత్తం 3,94,736 క్యూసెక్కుల వరద నీటిని అధికారులు దిగువ కృష్ణా నదిలోకి విడుదల చేస్తున్నారు. -
అతి వేడి.. ఆరోగ్యానికి హానికరం
వేడివేడి టీలో మనం రంగు, రుచి, వాసనల్ని ఆస్వాదిస్తాం. పొగలు కక్కే కాఫీ ఘుమఘుమలకు మైమరిచిపోతాం. అందుకు కారణం, వేడి కూడా ఒక రుచిలా మనకు అలవాటై ఉండటం! అయితే ఈ పానీయాల వేడి.. పరిమితికి మించితే దీర్ఘకాలంలో కేన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీ తాజాగాహెచ్చరించింది! – సాక్షి, స్పెషల్ డెస్క్వేడి పానీయాలు వేడిగానే కదా ఉండాలి! వాటిని వేడిగానే కదా తాగాలి! కాకపోతే, ఎవరి ఇష్టాన్ని బట్టి వారు కాస్త వేడి తక్కువగానో, కొంచెం వేడి ఎక్కువగానో తాగుతారు. మరి వేడి వల్ల కేన్సర్ రావటం ఏంటి? వస్తే ఏ రకం వస్తుంది? గొంతుకు వస్తుందా? ఉదరానికి వస్తుందా? నిజానికి వేడి పానీయాలకు, గొంతు కేన్సర్కు సంబంధం ఉన్నట్లు ఇంతవరకు ఏ ఆధారాలూ లేవు. అలాగే వేడి పానీయాలకు కడుపు కేన్సర్కు మధ్య సంబంధం కూడా అస్పష్టంగానే ఉంది. ఇదంతా నిజమే కానీ, మితి మీరిన వేడి ఉన్న పానీయాలను సేవించటం వల్ల అన్నవాహిక కేన్సర్ వచ్చే అవకాశం ఉన్నట్లు తాము గుర్తించామని వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.65 డిగ్రీలు దాటితే డౌటే!2016లో ‘ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కేన్సర్’ జంతువులపై చేసిన ప్రయోగాల్లో.. వేడి పానీయాలను అతి వేడిగా తాగటం వల్ల కేన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నట్లు గుర్తించింది. 70 డిగ్రీల వేడి వద్ద ఎలుకలకు పట్టించిన నీరు, అలా వేడి నీటిని పట్టించని ఎలుకలతో పోల్చి చూస్తే, అధిక వేడి నీటిని పట్టించిన ఎలుకల అన్నవాహికలో ముందస్తుగా కేన్సర్ సంకేతాలు కనిపించాయి.వేడికి ఆమ్లాలు తోడౌతాయి!పానీయాల వేడికి, ‘గ్యాస్ట్రిక్ ఆసిడ్ రిఫ్లెక్స్’ (కడుపులో ఉత్పత్తి అయ్యే ఆమ్లాలు తిరిగి అన్నవాహికలోకి వెనక్కి తన్ని, వాపును కలుగజేసే పరిస్థితి) తోడై అన్నవాహిక కేన్సర్ అవకాశాలు పెరగడాన్ని కూడా తాజా అధ్యయనంలో పరిశోధకులు గమనించారు. అలా బయటి ద్రవాల వేడి, లోపలి ఆమ్లాలు కలిసి కేన్సర్ వృద్ధికి కారకాలు అవుతున్నట్లు వారు భావిస్తున్నారు. ‘గుటక’ మోతాదూ విలనే!ఒకేసారి ఎంత వేడిగా తాగుతారు, ఎంత త్వరగా తాగుతారు అనే దానిపైనే కేన్సర్ ప్రమాదం ప్రధానంగా ఆధారపడి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. వారి అధ్యయనం ప్రకారం.. వేడివేడి పానీయాలను ఒకేసారి ఎక్కువగా తాగితే ఆ వేడి తీవ్రత వల్ల అన్నవాహికకు పుండ్లు పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మరొక అధ్యయనంలో.. వేర్వేరు ఉష్ణోగ్రతలలో వేడి వేడి కాఫీ, టీలు తాగే వ్యక్తుల అన్నవాహిక లోపల ఉష్ణోగ్రతను కొలిచినప్పుడు వారు తీసుకున్న ‘గుటక’ మోతాదు, వేడి కంటే కూడా ఎక్కువ దుష్ప్రభావం చూపుతున్నట్లు కనుగొన్నారు. 65 డిగ్రీల వేడి ఉండే కాఫీలో ఒక పెద్ద గుటక (20 మిల్లీ లీటర్లు) అన్నవాహిక లోపల ఉష్ణోగ్రతను 12 డిగ్రీల వరకు పెంచటాన్ని వారు గుర్తించారు. అందువల్ల టీ, కాఫీల వంటి వేడి పానీయాలను త్వరత్వరగా కాకుండా.. కాస్త వేడి చల్లారే వరకు ఉండి, నింపాదిగా తాగాలని సూచిస్తున్నారు.సుఖోష్ణం ఆహ్లాదకరంటీ, కాఫీ వంటి వేడి పానీయాలను అందరూ వేడివేడిగానే తాగుతారు. వీటిలో ఉండే కెఫినన్, థియోఫిలిన్ అనే రసాయనిక పదార్థాల వల్ల కేన్సర్ రాదు. బాగా వేడివేడిగా తాగడం వ్యాధికారకమని కొందరు అంటున్నారు. ఇక్కడో విషయం గమనించాలి. మన నాలుక, నోరు భరించలేని వేడిని మనం తాగలేం. టీగానీ, కాఫీగానీ నోటిలోని లాలాజలంతో కలిసినప్పుడు మనం తట్టుకోగలిగే వేడి మాత్రమే ఉంటుంది. ఆ మార్పు యాంత్రికంగా జరిగిపోతుంది. జంతువుల మీద ప్రయోగాలు చేసేటప్పుడు ‘గొట్టాల ద్వారా’ వాటి కడుపులోకి వేడి పానీయాలు పంపుతారు. కాబట్టి అధిక వేడి సాధ్యపడవచ్చు. ఇక రెండో విషయం.. ఎంత ప్రమాణంలో తాగాలి, రోజుకి ఎన్నిసార్లు తాగవచ్చు? అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లు అతిగా ఏదైనా ప్రమాదకరమే. అతివేడి, అతి చలవ పదార్థాలు వెంటవెంటనే శరీరానికి తగిలినా, నోటిలోకి వెళ్లినా.. మన కణజాలాలు కాలిపోయి చర్మరోగాలు కలుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది. ఆ వ్యాధులు ముదిరితే కేన్సర్కు దారితీసే అవకాశం ఉంటుంది. పేపర్ కప్పుల్లో కాఫీ, టీలు తాగటం చాలా ప్రమాదకరం. ఆ పేపరు పొర కెమికల్స్తో కూడినది. దానికి ఏమాత్రం వేడితగిలినా.. రసాయనిక చర్య సంభవించి, అవి మన నోట్లోంచి కడుపులోకి వెళ్లి కేన్సర్ వంటి అనేక రోగాలకు దారితీయవచ్చు. - డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహ శాస్త్రి, విశ్రాంత అదనపు సంచాలకులు, ప్రిన్సిపాల్, ఆయుష్ విభాగం -
భారత్ – బ్రిటన్ మధ్య స్నేహ వారధి.. పాల్
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం స్వరాజ్ పాల్ పంజాబ్లోని జలంధర్లో 1931 ఫిబ్రవరి 18న జన్మించారు. ఆయన తండ్రి ప్యారేలాల్ స్థానికంగా చిన్నపాటి ఉక్కు ఫౌండ్రీని నడిపేవారు. స్వరాజ్ పాల్ 1949లో పంజాబ్ యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేశాక అమెరికాలోని ప్రతిష్టాత్మక మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆప్ టెక్నాలజీలో (ఎంఐటీ) మెకానికల్ ఇంజినీరింగ్లో బ్యాచిలర్స్, మాస్టర్స్ చేశారు. స్వదేశానికి తిరిగొచ్చాక కుటుంబ వ్యాపారమైన ఏపీజే సురేంద్ర గ్రూప్లో చేరారు. అయితే, ల్యూకేమియాతో బాధపడుతున్న కుమార్తె అంబికాకు మెరుగైన వైద్యచికిత్స కోసం 1966లో ఆయన బ్రిటన్కి వెళ్లారు. కానీ, దురదృష్టవశాత్తూ నాలుగేళ్లకే కుమార్తె కన్ను మూయడంతో విషాదంలో మునిగిపోయిన పాల్.. ఆ తర్వాత ఆమె పేరిట అంబికా పాల్ ఫౌండేషన్ అనే చారిటబుల్ ట్రస్టును ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా బాలల విద్య, ఆరోగ్యానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల కోసం మిలియన్ల కొద్దీ పౌండ్లను విరాళంగా ఇచ్చారు. 1968లో లండన్ ప్రధాన కేంద్రంగా కపారో గ్రూప్నకు స్వరాజ్ పాల్ శ్రీకారం చుట్టారు. తర్వాత రోజుల్లో అది బ్రిటన్లోనే అతి పెద్ద స్టీల్ కన్వర్షన్, డిస్ట్రిబ్యూషన్ వ్యాపార దిగజాల్లో ఒకటిగా ఎదిగింది. ప్రస్తుతం బ్రిటన్, భారత్, అమెరికా, కెనడా తదితర దేశాల్లో ఏటా 1 బిలియన్ డాలర్ల ఆదాయంతో కార్యకలాపాలు సాగిస్తోంది. లెజెండ్.. లార్డ్ స్వరాజ్ పాల్ (Lord Swraj Paul) మృతిపై ఇరు దేశాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. బ్రిటన్–భారత్ మధ్య వారధిగా వ్యవహరించిన పాల్ తనకు స్ఫూర్తిప్రదాత అని కోబ్రా బీర్ వ్యవస్థాపకుడు లార్డ్ కరణ్ బిలిమోరియా తెలిపారు. విద్య, వ్యాపారం, రాజకీయాలు ఇలా అన్ని రంగాల్లోనూ ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు కృషి చేశారని పేర్కొన్నారు. వోల్వర్హ్యాంప్టన్ యూనివర్సిటీ చాన్సలర్గా వర్సిటీ అభివృద్ధిలో ఆయన ఎంతో కీలక పాత్ర పోషించారని విశ్వవిద్యాలయం బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చెయిర్ ఏంజెలా స్పెన్స్ పేర్కొన్నారు. బ్రిటన్లోని అనేక మంది భారతీయులకు మార్గదర్శిగా నిల్చిన ‘లెజెండ్’ అని పాల్ను సన్ మార్క్ వ్యవస్థాపకుడు లార్డ్ రామీ రేంజర్ అభివర్ణించారు. భారత్–బ్రిటన్ను మరింత చేరువ చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను పటిష్టం చేయడంలో ఆయన చెరగని ముద్ర వేశారని లండన్లోని భారత హైకమిషన్ ప్రధాని మోదీ సోషల్ మీడియా వ్యాఖ్యలను రీపోస్ట్ చేసింది. ఆయన విదేశాల్లో భారత్కి గొంతుకగా నిల్చారని హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామి పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషి.. భారత్–బ్రిటన్ మధ్య సంబంధాలను పటిష్టం చేసే దిశగా 1975లో ఇండో–బ్రిటీష్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన లార్డ్ పాల్ దానికి సుదీర్ఘకాలం చైర్మన్గా వ్యవహరించారు. పాల్ సేవలకు గుర్తింపుగా 1978లో బ్రిటన్ రాణి ఆయనకు నైట్హుడ్ ప్రదానం చేశారు. 1983లో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ భూషణ్ (Padma Bhushan) పురస్కారంతో ఆయన్ను సత్కరించింది. పలు సంవత్సరాలుగా బ్రిటన్లో అత్యంత సంపన్నుల జాబితాలో ఆయన పేరు క్రమం తప్పకుండా ఉంటోంది. 2 బిలియన్ పౌండ్ల సంపదతో ఈ ఏడాది సండే టైమ్స్ రిచ్ లిస్ట్లో ఆయన 81వ స్థానంలో నిల్చారు. ఆరోగ్యం అంతగా సహకరించకపోతున్నప్పటికీ ఇటీవలి వరకు ఆయన హౌస్ ఆఫ్ లార్డ్స్కి తప్పకుండా హాజరయ్యారు. 2008లో హౌస్ ఆఫ్ లార్డ్స్ డిప్యుటీ స్పీకర్గా పాల్ వ్యవహరించారు. తద్వారా భారత నేపథ్యంతో, ఆ బాధ్యత చేపట్టిన తొలి వ్యక్తిగా ఘనత సాధించారు. 2000 నుంచి 2005 వరకు ఇండియా–యూకే రౌండ్ టేబుల్కి కో–చెయిర్గా వ్యవహరించారు. 2009లో బ్రిటన్ మోనార్క్కి సలహా మండలి అయిన ప్రీవీ కౌన్సిల్ సభ్యుడిగా కూడా ఆయన నియమితులయ్యారు. మరోవైపు, వ్యక్తిగత జీవితంలో ఆయన్ను విషాదాలు వెన్నాడాయి. 2015లో కపారో గ్రూప్ సీఈవోగా వ్యవహరిస్తున్న కుమారుడు అంగద్ పాల్, 2022లో ఆయన భార్య అరుణ మరణించారు. దీనితో వారి స్మారకార్థం తలపెట్టిన పలు సంక్షేమ కార్యక్రమాలకు ఆయన మరింత సంపద, సమయం వెచ్చించారు. భార్య మరణానంతరం అంబికా పాల్ ఫౌండేషన్ పేరును అరుణ అండ్ అంబికా పాల్ ఫౌండేషన్గా మార్చారు. 2023 ఫిబ్రవరిలో లండన్లోని చారిత్రక ఇండియన్ జింఖానా క్లబ్లో లేడీ అరుణ స్వరాజ్ పాల్ హాల్ని ప్రారంభించారు. -
ఉద్యోగం పోతే.. మీరు భద్రమేనా?
ప్రపంచవ్యాప్తంగా 2023లో 1,193 టెక్ కంపెనీలు 2,64,220 మంది ఉద్యోగులను.. గతేడాది 551 టెక్ సంస్థలు 1,52,922 మందిని తొలగించాయి. ఈ ఏడాది ఇప్పటికే 186 కంపెనీలు 81,567 మందిని ఇంటికి సాగనంపాయి. ఒక్క టెక్ ఇండస్ట్రీలోనే ఇలా ఉంటే ఇతర రంగాల్లో పరిస్థితి? ఇదంతా ఎందుకంటే.. ఉద్యోగం కోల్పోయినప్పుడు ఉండే మానసిక వేదన అంతా ఇంతా కాదు. ఆర్థికంగా బలంగా ఉన్నవారైతే ఏ ఇబ్బందీ లేదు. నెల జీతం మీద బతికేవారికే సమస్యల్లా. నిత్యావసరాలు, ఇంటి అద్దె, నెల వాయిదాలు, పిల్లల ఫీజులు, వైద్యం.. ఇలా తప్పించుకోలేని ఖర్చుల జాబితా పెద్దదిగానే ఉంటుంది. అనుకోని కష్టం ఎదురైతే ఎదుర్కొనే ప్రణాళిక లేకపోతే చాలామంది ఆర్థికంగా చితికిపోతారు. అప్పుల ఊబిలో కూరుకుపోతారు. జాబ్ మార్కెట్లో ప్రస్తుత తరుణంలో ఉన్న అనిశ్చితి పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కొన్ని సూత్రాలు పాటించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్అత్యవసర నిధిసగటు ఉద్యోగికి.. అలాగే కుటుంబానికి ఇదే పెద్ద ధీమా. కనీసం 6–12 నెలల ఇంటి ఖర్చులకు సమానమైన మొత్తంలో అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోండి. తద్వారా ఆర్థిక భద్రత పెరుగుతుంది. అకస్మాత్తుగా ఉద్యోగం పోతే.. ఊహించని, అత్యవసర ఖర్చులను తీర్చడానికి ఈ ఫండ్ సమయానికి ఆదుకుంటుంది. » ఈ నిధి లేకపోతే అధిక వడ్డీతో అప్పులు, లేదా ఇతర ప్రత్యామ్నాయాలపై ఆధారపడవలసి వస్తుంది. ఇదే జరిగితే ఆర్థిక సమస్యలు మరింత తీవ్రమవుతాయి.» ఆర్థికంగా బలంగా ఉంటే మనశ్శాంతి ఉంటుంది. అన్నింటికీ మించి ఒత్తిడి తగ్గుతుంది. » ఆహారం, వైద్య బిల్లులు, బీమా ప్రీమియం వంటి ముఖ్యమైన ఖర్చుల కోసం మాత్రమే ఈ అత్యవసర ఫండ్ను ఉపయోగించండి. » జాబ్ కోల్పోయిన తర్వాత కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవడానికి ఈ నిధుల నుంచి కొంత మొత్తాన్ని కేటాయించండి. కొత్త కోర్సు, శిక్షణ పూర్తి అయితే ఉద్యోగావకాశాలు పెరుగుతాయి.అదనపు ఆదాయ మార్గాలుప్రతి ఒక్కరిలో ఏదో ఒక నైపుణ్యం, అభిరుచి, ఆసక్తి దాగి ఉంటుంది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంతో పాటు వీటి ద్వారా అదనపు ఆదాయాన్ని సంపాదించడానికి ప్రయత్నించండి. ఆదాయ నష్టాలను అధిగమించడంలో ఇవి మీకు సహాయపడతాయి. ఇదే సమయంలో వీలైనంత పొదుపు చేయడం, పెట్టుబడి పెట్టడం కూడా మర్చిపోవద్దు. ఆరోగ్య బీమాచాలా మంది ఉద్యోగులు సంస్థ అందించే గ్రూప్ హెల్త్ కవరేజీపైనే ఆధారపడతారు. సొంతంగా బీమా పాలసీ తీసుకోరు. కంపెనీ నుంచి ఉంది కదా అన్న ధీమా, నిర్లక్ష్యపు ధోరణి ఉంటుంది. ఉద్యోగం కోల్పోయినప్పుడు ఈ బీమా వర్తించదు. అందుకే కుటుంబం అంతటికీ వర్తించే సమగ్ర వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేయడం ఉత్తమం. వ్యక్తిగత బీమా ఉంటే జాబ్ పోయినా, మానేసినా చింత ఉండదు. కుటుంబంలోని వారందరికీ నిరంతర ఆరోగ్య బీమా రక్షణ ఉంటుంది.తక్కువ అప్పుఉద్యోగం కోల్పోతామన్న అభద్రతకు లోనైతే.. అప్పులు / రుణాలను కనిష్ట స్థాయిలో ఉంచడానికి ప్రయత్నించండి. కొత్త రుణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. వీలైతే ముందస్తుగా ఈఎంఐలు చెల్లించండి.» బ్యాంకులకు చెల్లించాల్సిన వాయిదాల క్రమం తప్పితే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. ఇదే జరిగితే భవిష్యత్తులో రుణం పొందడంలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. » ఉద్యోగాన్ని కోల్పోయినట్టయితే రుణదాతకు ఈ విషయాన్ని తెలియజేయడంతోపాటు మారటోరియం, నెల వాయిదాల (ఈఎంఐ) గడువు పెంచడం (రీషెడ్యూల్) గురించి విన్నవించండి. » బంధువులు, స్నేహితులు, తెలిసిన వారి నుంచి అప్పు తీసుకున్నట్టయితే పరిస్థితిని నిజాయితీగా వివరించండి.బడ్జెట్లో మార్పులుఅనిశ్చితి సమయాల్లో విచ్చలవిడి ఖర్చులను తగ్గించుకోండి. అత్యవసరమైతే తప్ప ఖర్చు చేయండి. » అనవసర ఖర్చులు తగ్గిస్తే చేతిలో డబ్బులు మిగులుతాయి. ఉద్యోగ నష్టానికి సంబంధించిన ఒత్తిడి తగ్గుతుంది. » ఉద్యోగం కోల్పోవడం వల్ల తలెత్తే ఆర్థిక పరిణామాలు, తదుపరి ఉద్యోగ అన్వేషణ, జాబ్ మార్కెట్ గురించి మీ ఆలోచనలు, భావాలు, ప్రణాళికలను కుటుంబంతో పంచుకోండి. » కుటుంబ సభ్యులు తమ భావాలను వ్యక్తీకరించడానికి, నిర్ణయం తీసుకునే ప్రక్రియకు దోహదపడే సుహృద్భావ వాతావరణాన్ని కల్పించండి. ఈ విధానం కుటుంబ బంధాలను బలోపేతం చేస్తుంది. » మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, రిటైర్మెంట్ ఇన్వెస్ట్మెంట్స్ వంటి వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ కదిలించొద్దు. -
ఈ స్పేస్ మాది..!
‘ఆకాశంలో సగం’ అనే మాట మనకు సుపరిచితం. అయితే ఆరోజుల్లో ‘స్పేస్ సైన్స్’కు సంబంధించి మహిళా శాస్త్రవేత్తల సంఖ్య చాలా తక్కువ. గతంతో పోల్చితే ఇప్పుడు ఉమెన్ స్పేస్ సైంటిస్ట్ల సంఖ్య బాగా పెరిగింది. ‘ఇస్రో’ మంగళ్యాన్ మిషన్ నుంచి చంద్రయాన్ మిషన్ వరకు ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్లలో కీలక పాత్ర పోషించారు. శాస్త్ర సాంకేతిక రంగంలో అడుగు పెట్టడానికి ఈతరం అమ్మాయిలకు స్ఫూర్తిని ఇస్తున్నారు...ఆకాశమే అపూర్వ పాఠశాలఉత్తర్ప్రదేశ్లోని లక్నోకు చెందిన రీతూ కరిధాల్కు ఆకాశం ఎప్పుడూ వింతగా అనిపించేది. అంత పెద్దగా కనిపించిన చంద్రుడు ఎందుకు తగ్గుకుంటూ వెళతాడు? పగటి పూట చుక్కలు ఎందుకు కనిపించవు? ఇలాంటి సందేహాలెన్నో ఆ చిట్టి బుర్రకు వచ్చేవి. ఆకాశంపై అమితమైన ఆసక్తే రీతూను సైన్స్ వైపు నడిపించింది. స్కూల్ రోజుల్లో నాసా, ఇస్రోకు సంబంధించిన ప్రాజెక్ట్ల సమాచారం గురించి దినపత్రికలలో వెదికేది. కనిపిస్తే వాటిని కట్ చేసి దాచుకునేది.పోస్ట్గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత ఇస్రోలో స్పేస్ సైంటిస్ట్గా ప్రస్థానం ప్రారంభించింది. ప్రతిష్ఠాత్మకమైన మంగళ్యాన్ మిషన్తో పాటు ఇస్రోలోని ఎన్నో ప్రాజెక్ట్లలో కీలక బాధ్యతలు నిర్వహించింది రీతూ కరిధాల్.‘మంగళ్యాన్ మిషన్ కోసం పనిచేయడం అపూర్వ అనుభవం. నిరంతర మేధోమథనం జరుగుతుండేది. సెలవు అంటూ లేకుండా పనిచేశాం. వృత్తి, కుటుంబ జీవితాన్ని సమన్వయం చేసుకోవడం అంత తేలిక కాదు. అయితే నా భర్త, కుటుంబ సభ్యుల సహకారం వల్ల అది సాధ్యం అయింది’ అంటుంది రీతూ కరిధాల్.రీతూ కరిధాల్వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ఇస్రోఒకప్పుడు ఇస్రోలో పనిచేసిన మహిళలు రిటైర్ అయిన తరువాత ఇంటికే పరిమితం కావచ్చుగాక, అయితే వారు ఎక్కడ ఉంటే అక్కడ ఇస్రో కొలువుదీరుతుంది. ఆనాటి శాస్త్రసాంకేతిక విషయాల గురించి చందమామ కథల్లా ఈతరం పిల్లలకు చెబుతుంటారు. అలాంటి వారిలో ఇస్రోలో తొలి మహిళా కెమికల్ ఇంజనీర్ లలితా రామచంద్రన్ ఒకరు. 1969లో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (విఎస్ఎస్సి)లో టెక్నికల్ అసిస్టెంట్గా చేరినప్పుడు ఆమె వయసు 22 సంవత్సరాలు. తిరువనంతపురంలో క్రయోజనిక్ అప్పర్ స్టేజ్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఆమె రిటైర్ అయ్యారు. ‘ఆరోజుల్లో పెద్దగా సౌకర్యాలు లేకపోవచ్చు. అయితే ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో కలిసి పనిచేసే అదృష్టం దక్కింది’ అంటారు లలిత.1972లో ఇస్రోలో చేరారు జె.గీత. ‘ఆరోజుల్లో నెట్ లేదు. డేటా సేకరణ అనేది ప్రధాన సవాలుగా ఉండేది. రిసెర్చ్, రిఫరెన్స్ కోసం లైబ్రరీలకు వెళ్లి గంటల కొద్ది సమయం గడిపేవాళ్లం’ అంటున్న గీత... సతీష్ధావన్, వసంత్ ఆర్ గోవరికర్లాంటి స్టాల్వాల్ట్స్ మార్శదర్శకత్వంలో పనిచేశారు.ప్రాజెక్ట్లకు సంబంధించిన చర్చల్లో చురుగ్గా పాల్గొనేవాళ్లం. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా తమ అభిప్రాయలను నిస్సంకోచంగా చెప్పే స్చేచ్ఛ ఉండేది. జూనియర్ చెప్పినా సరే, ఆ అభిప్రాయం నచ్చితే ఆమోదించేవారు’ అంటున్న రాధిక రామచంద్రన్ ‘కేరళ యూనివర్శిటీ’లో పోస్ట్ గ్రాడ్య్రుయేషన్ పూర్తయిన తరువాత 1984లో ఇస్రోలో చేరారు.లలితా రామచంద్రన్సైన్స్ ఫిక్షన్టుఇస్రో సైంటిస్ట్తన చిన్నప్పుడు టెలివిజన్లో వచ్చే స్టార్ ట్రెక్, సైన్స్ ఫిక్షన్ అంటే నందిని హరినాథ్కు చాలా ఇష్టం. టీవిలో వచ్చే సైన్స్ ప్రోగ్రామ్స్పై అమిత ఆసక్తి ప్రదర్శించే నందిని తాను స్పేస్ సైంటిస్ట్ అవుతానని అనుకోలేదు. ‘జస్ట్ అలా జరిగింది అంతే!’ అని స్పేస్ సైంటిస్ట్ గా తన ప్రయాణం గురించి నవ్వుతూ చెబుతుంది నందిని. ఉద్యోగంలో చేరిన కొత్తలో రోజుకు పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు పనిచేసిన రోజులు ఉన్నాయి. భోజనం చేయడం కూడా మరిచి పనిచేసిన రోజులు ఉన్నాయి.‘ఇస్రో సైంటిస్ట్ అని పరిచయం చేసినప్పుడు ప్రజలు గౌరవించే తీరు వృత్తిపట్ల బాధ్యతను మరింత పెంచుతుంది. మంగళ్యాన్ ప్రాజెక్ట్లో భాగం కావడం గర్వంగా భావిస్తున్నాను. ఆ ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నప్పుడు నిద్ర, తిండి గురించి పట్టించుకునేవాళ్లం కాదు. ఇంట్లో తక్కువ సమయం మాత్రమే గడిపేవాళ్లం. ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం’ అంటుంది నందిని హరినాథ్.నందిని హరినాద్వివక్ష లేదు... ప్రతిభే ప్రమాణం‘నేను ఇస్రోలో 1982లో చేరినప్పుడు అక్కడ కొద్ది మంది మహిళా ఉద్యోగులు మాత్రమే కనిపించేవారు. ఊహకు అందని రీతిలో ఇప్పుడు ఎంతోమంది పనిచేస్తున్నారు’ అంటుంది అనురాధ టికె. ఇస్రో శాటిలైట్ సెంటర్లో జియోశాట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ అయిన అనురాధ ఎంతోమంది అమ్మాయిలకు రోల్ మోడల్. ‘తొమ్మిది సంవత్సరాల వయసులోనే ఆకాశంపై ఆసక్తి మొదలైంది’ అని తన బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటుంది అనురాధ. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగు పెట్టడం గురించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ద్వారా విన్న అనురాధ సంభ్రమాశ్చర్యాలకు గురైంది. ‘చంద్రుడిపై మానవుడు’ అనే అంశంపై తన మాతృభాష కన్నడంలో కవిత రాసింది.‘ఇస్రోలో స్త్రీ, పురుషులు అనే భేదం ఉండదు. ప్రతిభ, అంకితభావం మాత్రమే ప్రమాణం. స్పేస్ ప్రోగ్రామ్స్లో ఎంతమంది మహిళలు పనిచేస్తే అంత మంచిది. అది ఎంతో అమ్మాయిలకు స్ఫూర్తినిస్తుంది. వారు చేస్తున్నారు. మేము కూడా చేయగలం అనే ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది’ అంటుంది అనురాధ.అనురాధ టికెభూదేవి అంత ఓపిక... ఆకాశమంత ప్రతిభప్రతిష్ఠాత్మకమైన మంగళ్యాన్ మిషన్ ప్రతిభావంతులైన మహిళా శాస్త్రవేత్తలను లోకానికి పరిచయం చేసింది. ఆ మహిళా శాస్త్రవేత్తలపై ‘ఇస్రో’స్ మాగ్నిఫిసియెంట్ ఉమెన్ అండ్ దెయిర్ ఫ్లైయింగ్ మెషిన్స్’ పేరుతో పుస్తకం రాసింది మిన్నీ వేద్. నందిని, రీతూ కరిధాల్, మౌమిత దత్తా, మినై సంపత్... మొదలైనవారి గురించి ఈ పుస్తకంలో రాసింది. ‘స్పేస్’ను కెరీర్గా ఎంచుకోవడానికి కారణం ఏమిటి? రకరకాల ఒత్తిళ్లను తట్టుకొని ఎలా ముందుకు వెళ్లారు? వృత్తి, కుటుంబ జీవితాన్ని ఎలా సమన్వయం చేసుకున్నారు?.... ఇలాంటి ప్రశ్నలకు ఈ పుస్తకం సమాధానం చెబుతుంది. మన దేశంలో ఫస్ట్ ఇండిజినస్ రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ రిసాట్–1 ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేసిన వలర్మతి వ్యక్తిగత, ఉద్యోగ జీవిత అనుభవాలు కూడా ఈ పుస్తకంలో కనిపిస్తాయి. మంగళ్యాన్ మిషన్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ ఇన్చార్జిగా పనిచేసిన మినాల్ సంపత్ స్పేస్క్రాఫ్ట్ టెస్టింగ్ పనుల్లో భాగంగా బెంగళూరు, అహ్మదాబాద్ల మధ్య తరచు ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఆ సమయంలో మూడు సంవత్సరాల తన కుమారుడు గుర్తుకు వచ్చేవాడు. ‘మా బాబు గుర్తుకు వచ్చిన సమయంలో పేలోడ్స్ కూడా నా బిడ్డలే కదా అనుకునేదాన్ని’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది మినాల్ సంపత్. ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఈ పుస్తకంలో కనిపిస్తాయి. -
కింగ్.. ‘అనలిటికల్ థింకింగ్’!
రోజురోజుకు కృత్రిమమేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ వినియోగం విస్తృతం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోప్రపంచవ్యాప్తంగా డిమాండ్కు అనుగుణంగా ఉద్యోగాల సాధన ఉద్యోగార్థులకు కష్టసాధ్యంగా మారుతోంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కార్పొరేట్ సంస్థలు కోరుకున్న విధంగా వివిధ నైపుణ్యాలున్న వారు ఉద్యోగాలు పొందడం సులభమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే... విమర్శనాత్మక ఆలోచన, విశ్లేషణాత్మక నైపుణ్యాలు, భావోద్వేగ మేధస్సు వంటివి కీలక ఉద్యోగ నైపుణ్యాలుగా పరిగణిస్తున్నారు. ఏఐ, మెషీన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా విశ్లేషణ వంటి సాంకేతిక నైపుణ్యాలకూ అధిక డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో అత్యంత ముఖ్యమైన ఉద్యోగ నైపుణ్యాలపై ‘గ్లోబల్ సర్వే ఆఫ్ ఎంప్లాయర్స్’నివేదిక రూపొందించింది. అలాగే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆయా నైపుణ్యాలకు ర్యాంకింగ్స్ ఇస్తూ ‘ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ 2025’నివేదికను వెలువరించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా 1.41 కోట్లకు పైగా ఉద్యోగులున్న 1,043 కంపెనీల ప్రతినిధుల అభిప్రాయాల ఆధారంగా రిపోర్ట్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ర్యాంకింగ్స్లో అనలిటికల్ థింకింగ్ (విశ్లేషణాత్మక ఆలోచన) 69 శాతంతో అగ్రస్థానంలో నిలుస్తోంది. – సాక్షి, హైదరాబాద్ఇక భారత్ విషయానికొస్తే... వివిధ అధ్యయనాలు, సర్వేలు, నిపుణుల అభిప్రాయాలు సూచనలను బట్టి చూస్తే దేశంలో ముఖ్యమైన ఉద్యోగ నైపుణ్యాలు... కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్, డేటా అనాలిసిస్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ చుట్టూ కేంద్రీకృతం అవుతున్నాయి. భారత్లో కంపెనీలు కోరుకుంటున్న ముఖ్య సాంకేతికత ఇలా ఉన్నాయి.కృత్రిమ మేథ,మెషీన్ లెర్నింగ్:ఏఐ అల్గోరిథంలు, న్యూరల్ నెట్వర్క్ అప్లికేషన్లలో నైపుణ్యం కలిగిన నిపుణులకు డిమాండ్. డేటా విశ్లేషణ: డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం ఒక ప్రమాణంగా మారుతోంది. అందువల్ల డేటా మానిప్యులేషన్, గణాంక విశ్లేషణ, విజువలైజేషన్లో నైపుణ్యాల ఆవశ్యకత పెరిగింది. సైబర్ భద్రత: రోజురోజుకు సైబర్ ముప్పు పెరుగుతుండటంతో నెట్వర్క్ల రక్షణలో నైపుణ్యాలు, సాంకేతికంగా ఎదురయ్యే ముప్పును అర్థం చేసుకోవడం, భద్రతా ప్రోటోకాల్ అమలుకు అత్యంత ప్రాధాన్యత క్లౌడ్ కంప్యూటింగ్: వ్యాపారాలు క్లౌడ్లోకి మార్పిడి జరుగుతుండటంతో, క్లౌడ్ సేవలు, ఆర్కిటెక్చర్ డిజైన్, డిప్లాయ్మెంట్ వ్యూహాల పరిజ్ఞానం వంటి వాటికి అధిక డిమాండ్సాఫ్ట్వేర్ అభివృద్ధి: సాఫ్ట్వేర్ డెవలపర్ల కోసం ముఖ్యంగా ఏఐ–ఆధారిత అప్లికేషన్లు, క్లౌడ్ టెక్నాలజీలలో అనుభవం ఉన్నవారి కోసం డిమాండ్.బ్లాక్చైన్ టెక్నాలజీ: ఫైనాన్స్, సప్లయ్ చైన్ పరిశ్రమల్లో పరివర్తనాత్మక ప్రభావంతో బ్లాక్చెయిన్ నిపుణులకు డిమాండ్ పెరిగింది. సాఫ్ట్ స్కిల్స్, అనుకూలతలు:కొత్త వ్యవస్థలను త్వరగా నేర్చుకోవడం, మారుతున్న పని వాతావరణాలకు అనుగుణంగా మారడం, కొత్త సాంకేతికతలను స్వీకరించే సామర్థ్యం చాలా ముఖ్యం. సమస్య పరిష్కారం: దినచర్యలనూ ఆటోమేట్ చేస్తున్నందున సంక్లిష్ట సమస్యల పరిష్కారం, విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యాలకు డిమాండ్ పెరిగింది.భావోద్వేగ మేధస్సు: ఆటోమేటెడ్ ప్రపంచంలో సానుభూతి, భావోద్వేగ మేధస్సు వంటి మానవ నైపుణ్యాలకు డిమాండ్. నాయకత్వం, సామాజిక ప్రభావం: టీమ్లకు మార్గనిర్దేశం చేయడానికి, సంక్లిష్ట పరిస్థితులను అధిగమించడానికి సమర్థ నాయకత్వం, సామాజిక ప్రభావ నైపుణ్యాలు ముఖ్యం. కస్టమర్ సర్వీస్: వ్యాపార విజయానికి బలమైన కస్టమర్ సంబంధాలను పెంపొందించుకోవడం ముఖ్యం. డిజిటల్ మార్కెటింగ్: వ్యాపారాలు తమ నిర్దేశిత, టార్గెటెడ్ కస్టమర్లను చేరుకునేందుకు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమేషన్ స్కిల్స్, కంటెంట్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్లో నైపుణ్యాలు చాలా అవసరం వ్యాపారాలు తమ నిర్దేశిత, టార్గెటెడ్ కస్టమర్లను చేరుకునేందుకు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమేషన్ స్కిల్స్, కంటెంట్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్లో నైపుణ్యాలు చాలా అవసరం ప్రాజెక్ట్ నిర్వహణ: వనరుల నిర్వహణ, సాంకేతిక ప్రాజెక్ట్ నాయకత్వంతో సహా ప్రాజెక్ట్ నిర్వహణ నైపుణ్యాలకు డిమాండ్ ఉంది. -
స్పేస్ వార్.. ఇదే ఫ్యూచర్!
2025 మే 9.. టీవీలకు అతుక్కుపోయిన ఉక్రెయిన్ ప్రజలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వారు చూస్తున్న కార్యక్రమాలు అర్ధంతరంగా నిలిచిపోయాయి. అంతరాయం కలిగితే షాక్కు గురికావడం ఏంటి? ఇది సహజమే కదా అన్నదే మీ ప్రశ్న కదూ. అక్కడికే వస్తున్నాం.. మాస్కో వేదికగా రష్యా తన యుద్ధ ట్యాంకులు, ఆయుధ సంపత్తిని ప్రదర్శిస్తూ సైనికులతో నిర్వహించిన విక్టరీ డే కవాతు తమ దేశంలో ప్రత్యక్ష ప్రసారం కావడం ఉక్రెయిన్లను ఆశ్చర్యానికి లోను చేసింది. ఉక్రెయిన్ కు టెలివిజన్ సేవలను అందించే కక్ష్యలో తిరుగుతున్న ఉపగ్రహాన్ని రష్యాకు మద్దతుగా ఉన్న హ్యాకర్లు హైజాక్ చేశారు. ఇదంతా ఉక్రెయిన్ వాసులను భయపెట్టడానికి రష్యా చేసిందన్నమాట! – సాక్షి, స్పెషల్ డెస్క్పెద్ద పెద్ద దేశాలన్నింటికీ అంతరిక్షంలో ఎన్నో శాటిలైట్లు ఉన్నాయి. వాటిలో ఒక్క ప్రధానమైన ఉపగ్రహాన్ని నిలిపేసినా చాలు.. ఒక్క బుల్లెట్ కూడా కాల్చకుండానే భారీ నష్టమే కలిగించవచ్చు! ఊహించుకుంటేనే భయంగానూ, విచిత్రంగానూ అనిపిస్తోంది కదూ. భవిష్యత్తులో అంతరిక్షం కూడా ‘ప్రధాన యుద్ధభూమి’ కానుంది. మామూలు దెబ్బ కాదు.. కక్ష్యలో ఉన్న ఉపగ్రహాల్లో 12,000 పైచిలుకు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ప్రసార సమాచార మార్పిడిలో మాత్రమే కాకుండా సైనిక కార్యకలాపాలు, జీపీఎస్, నిఘా సేకరణ వంటి నావిగేషన్ వ్యవస్థ సహా అనేక అంశాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవి.. దేశం మీదకు వస్తున్న శత్రు క్షిపణులు సమీపిస్తున్నాయని హెచ్చరించగలవు. శత్రు దేశాల జాతీయ భద్రతను విఫలమయ్యేలా చేసేందుకు; శత్రువు ఆర్థిక వ్యవస్థను, సైనిక సంసిద్ధతను దెబ్బతీసేందుకు కూడా ఉపయోగపడగలవు. రష్యాకు మద్దతు ఇస్తున్న హ్యాకర్లు టెలివిజన్ సిగ్నల్స్ను హైజాక్ చేసి ఉక్రెయిన్ కు చేసినట్టుగా మానసికంగానూ దెబ్బకొట్టగలవు.బలహీనమైన లింక్ కోసం..హ్యాకర్లు సాధారణంగా ఉపగ్రహానికి సపోర్ట్ చేసే లేదా భూమిపై సమాచారాన్ని నియంత్రించే సాఫ్ట్వేర్, హార్డ్వేర్లలో బలహీనమైన లింక్ కోసం చూస్తుంటారు. కక్ష్యలో తిరిగే ఉపగ్రహం సాఫ్ట్వేర్లో ఏ చిన్న లోపం పసిగట్టినా.. ఇంతే సంగతులు! దాన్ని సులభంగా దెబ్బతీయవచ్చని నిపుణులు అంటున్నారు. 2022లో రష్యన్ దళాలు ఉక్రెయిన్ ను ఆక్రమించినప్పుడు.. ఉక్రెయిన్ ప్రభుత్వం, సైన్యం ఉపయోగించే అమెరికాకు చెందిన ఉపగ్రహ సంస్థ వయాశాట్ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. వేలాది మోడెమ్లను ప్రభావితం చేయడానికి మాల్వేర్ను ఉపయోగించడంతో యూరప్లోని చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి.సూపర్ పవర్స్గా..చంద్రుడిపైకి ఒక చిన్న అణు రియాక్టర్ను పంపే ప్రణాళికల్లో నాసా ఉంది. చైనా లేదా రష్యా కంటే ముందుగా ఈ పని పూర్తి చేయాలన్నదే అమెరికా లక్ష్యంగా కనిపిస్తోంది. చంద్రుడిపై ముందుగా స్థావరం ఏర్పాటు చేసుకుని, కొన్ని కీలక ప్రాంతాలను తమవే అని ప్రకటించుకోవాలని భావిస్తోంది. చంద్రుడిపై హీలియం–3 సమృద్ధిగా ఉంది.హీలియం కేంద్రక సంలీనం (రెండు హీలియం కేంద్రకాలు కలిసి ఒక పెద్ద కేంద్రకంగా ఏర్పడే రసాయన ప్రక్రియ) ద్వారా భారీ మొత్తంలో శక్తి ఉత్పన్నమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సాంకేతికత ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదు. కానీ, చంద్రుడిపై నియంత్రణ.. ఏ దేశాలు సూపర్ పవర్స్గా ఉద్భవిస్తాయో నిర్ణయించగలదని శాస్త్రవేత్తలు అంటున్నారు.అంతరిక్షంలో అణ్వాయుధం!యూఎస్ జాతీయ భద్రతా అధికారుల ప్రకారం.. భూమి దిగువ కక్ష్యలో ఉన్న దాదాపు ప్రతి ఉపగ్రహాన్ని ఒకేసారి నాశనం చేయడానికి అణు, అంతరిక్ష ఆధారిత ఆయుధాన్ని రష్యా అభివృద్ధి చేస్తోంది. ఈ ఆయుధం భూమి దిగువన ఉన్న కక్ష్యను ఉపగ్రహాలకు ఒక సంవత్సరం పాటు ఉపయోగించలేని విధంగా చేయగలదని సమాచారం. దీనిని ఉపయోగిస్తే అమెరికా, దాని మిత్రదేశాలు ఆర్థిక సంక్షోభానికి, అణు దాడికి కూడా గురయ్యే అవకాశం కూడా ఉంది. రష్యా, చైనా సైతం ఉపగ్రహాలను కోల్పోతాయి.అయితే యూఎస్ మాదిరిగా కాకుండా విభిన్న శాటిలైట్లను రష్యా, చైనాలు ఉపయోగిస్తున్నాయి. ఉపగ్రహ వ్యతిరేక అణు ఆయుధాన్ని అంతరిక్షంలో ఉంచితే.. అది ఎలాంటి ముప్పు తెస్తుందో ఊహకు కూడా అందదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశాలు కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను, ఇంధన వనరులను ఉపయోగించుకోవాలని చూస్తున్నందున.. చంద్రుడిపై, గ్రహశకలాలలో లభించే విలువైన ఖనిజాలు, ఇతర పదార్థాలు భవిష్యత్తులో సంఘర్షణలకు దారితీయవచ్చని అభిప్రాయపడుతున్నారు. శాటిలైట్..: ఉపగ్రహ భద్రతా సాఫ్ట్వేర్ను లక్ష్యంగా చేసుకుని.. భూమి నుండి సంకేతాలను పంపే, లేదా స్వీకరించే దాని సామర్థ్యాన్ని దెబ్బతీస్తే.. ఉపగ్రహం కమ్యూనికేట్ చేయగల సామర్థ్యాన్ని అడ్డుకోగలిగితే.. గణనీయమైన స్థాయిలో నష్టం వాటిల్లుతుంది. ఉపగ్రహ ఆధారిత సేవలన్నీ నిలిచిపోతాయి. శత్రుదేశం ఏం చేయాలనుకుంటే చేయొచ్చు. జీపీఎస్..: ఇక జీపీఎస్.. ఇప్పుడు మన నిత్య జీవితంలో ఇదో భాగమైపోయింది. జీపీఎస్ సేవల్లో ఒక్కసారిగా అంతరాయం కలిగితే.. అంతా గందరగోళం అవుతుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు.ఏం చేయొచ్చు?దాడులు, నిఘా, పనిచేయకుండా నిర్వీర్యం చేయడం.ఎలా చేయొచ్చు?» భూమి నుంచి.. అంతరిక్ష ఉపగ్రహాల వంటివాటిపై. » అంతరిక్షంలో ఉన్న వాటిపై అంతరిక్షంలో నుంచి.» అంతరిక్షం నుంచి భూమిపై ఉన్నవాటిపై. -
బ్యాంకులపై.. భారీగా ఫిర్యాదులు!
భారతీయ బ్యాంకులకు కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఫిర్యాదులు అందుకోవడంలోనూ ముందుంది. ఈ విషయంలో ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో యాక్సిస్ బ్యాంక్ మొదటి స్థానంలో నిలిచింది. సేవల విషయంలో కొన్ని బ్యాంకులు స్వల్ప మెరుగుదలను చూపించినప్పటికీ మొత్తం ఫిర్యాదుల సంఖ్య గణనీయంగా ఉంది. ఖాతాదారుల తమ సమస్యలను నివేదించేందుకు బ్యాంకులు అందుబాటులోకి తెచ్చిన వేదికలపైనే కాదు.. సేవల్లో విఫలమైతే సామాజిక మాధ్యమాల్లోనూ బ్యాంకులను ఎండగట్టేందుకు వెనకాడటం లేదు.డిజిటల్ ఎకానమీ మారుమూల పల్లెలకూ విస్తరిస్తుండడంతో బ్యాంకింగ్ సామాన్యులకూ చేరువైంది. బ్యాంకింగ్ విస్తృతితోపాటు అదే స్థాయిలో కస్టమర్లు సమస్యలనూ ఎదుర్కొంటున్నారు దీంతో బ్యాంకులకు అందుతున్న ఫిర్యాదులూ పెరుగుతున్నాయి. 2024–25 సంవత్సరానికిగాను బ్యాంకుల బిజినెస్ రెస్పాన్సిబిలిటీ, సస్టేనబిలిటీ రిపోర్ట్స్ (బీఆర్ఎస్ఆర్) ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్ఎస్బీఐలో 29.8 లక్షలుఅనధికారిక ఎలక్ట్రానిక్ డెబిట్ లావాదేవీలకు సంబంధించి వినియోగదారుల నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 6.87 లక్షలకు పైగా ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో మార్చి చివరి నాటికి 1.05 లక్షలు పెండింగ్లో ఉన్నాయి. ఖాతాదారుడి అనుమతి లేకుండా మోసపూరితంగా బ్యాంక్ ఖాతా, డెబిట్/క్రెడిట్ కార్డు నుండి డబ్బు తీసుకోవడం, ఆన్ లైన్ కొనుగోళ్లు, ఇతర అనుమానాస్పద కార్యకలాపాలను అనధికార ఎలక్ట్రానిక్ డెబిట్ లావాదేవీలుగా పరిగణిస్తారు. ఇక రుణాల మంజూరుతో సహా ముఖ్యమైన సేవలను అందించడంలో జాప్యంపై 12,502; సైబర్ భద్రత, ముఖ్యమైన సేవల పంపిణీ మినహా ఇతర ఫిర్యాదుల విభాగం కింద 21.50 లక్షల కంప్లెయింట్లను బ్యాంకు అందుకుంది. అంత క్రితం ఏడాదిలో ‘ఇతర’ విభాగం కింద బ్యాంకుకి 24.02 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. మొత్తంగా అన్ని విభాగాల్లో కలిపి 29.8 లక్షల కంప్లెయింట్లు వస్తే పెండింగులో 1.2 లక్షలు ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకుకి 11.39 లక్షలు, బ్యాంక్ ఆఫ్ బరోడాకు 5.34 లక్షల ఫిర్యాదులు వచ్చాయి.ప్రైవేటు బ్యాంకుల్లోనూ..2024–25లో యాక్సిస్ బ్యాంకు 5.90 లక్షల ఫిర్యాదులను అందుకుంది. వీటిలో మార్చి చివరి నాటికి 11,143 పెండింగ్లో ఉన్నాయి. ‘ఇతర’ విభాగంలో 76,111, ప్రకటనలకు సంబంధించి 12,744, అన్యాయమైన వాణిజ్య పద్ధతులను అవలంబించిందన్న ఆరోపణలపై 4,438 కంప్లెయింట్లు అందాయి. » ఐసీఐసీఐ బ్యాంకుకి మొత్తం 5.34 లక్షల కంప్లెయింట్లు వచ్చాయి. వీటిలో మార్చి చివరి నాటికి 45,151 పరిష్కారానికి నోచుకోవాల్సి ఉంది. అంత క్రితం ఏడాది 3.46 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. అన్ని మార్గాలలో కస్టమర్ ఫిర్యాదులను స్వీకరించే విధానం మెరుగుపడిందని, ఫలితంగా సంఖ్య పెరిగిందని బ్యాంకు తెలిపింది. » హెచ్డీఎఫ్సీ బ్యాంకు 4.57 లక్షల ఫిర్యాదులను స్వీకరించింది. వీటిలో 16,306 పెండింగ్లో ఉన్నాయి. ఏడాది క్రితం 4.85 లక్షల కంప్లెయింట్లు వచ్చాయి. అంబుడ్స్మన్కూ..రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు (ఆర్బీఐ) చెందిన అంబుడ్స్మన్ కార్యాలయాలకు 2024–25లో వివిధ బ్యాంకుల ఖాతాదారుల నుంచి 2.96 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. అంత క్రితం ఆర్థిక సంవత్సరంలో వీటి సంఖ్య 2.93 లక్షలు. రుణాలు, అడ్వాన్సులు, డిజిటల్ బ్యాంకింగ్ ఉత్పత్తులకు సంబంధించిన కస్టమర్లు లేవనెత్తిన సాధారణ సమస్యలు వీటిలో ప్రధానంగా ఉన్నాయి. ఈ కంప్లెయింట్లలో ఎక్కువ భాగం బ్యాంకులపైనే ఉన్నాయి. ఆ తరువాతి స్థానంలో బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు), నాన్–బ్యాంక్ సిస్టమ్ పార్టిసిపెంట్స్, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలు ఉన్నాయి.సోషల్ మీడియాలో చురుగ్గా..సామాజిక మధ్యమాల్లో కస్టమర్ ఫిర్యాదులు, ప్రశ్నలకు పరిష్కారం, స్పందించడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అత్యంత చురుగ్గా ఉన్నాయని సోషల్ మీడియా రిసెర్చ్ సంస్థ ‘సింప్లిఫై360’ ఇటీవలి నివేదిక వెల్లడించింది. జూన్ 13–28 మధ్య తొమ్మిది ప్రముఖ బ్యాంకుల సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది.» ఫేస్బుక్లో రోజుకు 3 పోస్టులతో ఎస్బీఐ అత్యంత చురుకైన బ్యాంకుగా నిలిచిందని ఈ నివేదిక వివరించింది.» ఫేస్బుక్, ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 45 శాతం, ఎస్బీఐ 41 శాతం ప్రశ్నలకు సమాధానం ఇచ్చాయి.» యాక్సిస్, ఐసీఐసీఐ, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ 80 శాతం ప్రశ్నలను పరిష్కరించడంలో విఫలమయ్యాయి. » ఫేస్బుక్లో ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకులు ఉత్తమ ప్రదర్శన కనబరిచాయి. కానీ ఇవి ఎక్స్లో పెద్దగా రాణించలేదు. » హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎక్స్లో చాలా చురుకుగా ఉన్నప్పటికీ బ్యాంక్ తన ప్రయత్నాలకు పెద్దగా గుర్తింపు పొందలేదని నివేదిక వివరించింది. -
ఆ 3 రోజులే ట్రాఫిక్ ఎక్కువ.. ఎందుకంటే!
ఊరికి పశ్చిమాన ఉన్నవి ఆ ప్రాంతాలు.. ఐటీ కారిడార్లు.. హైదరాబాద్కు తలమానికం.. నగరానికి మణిహారం.. ఐటీకి ఆలవాలం.. లక్షలాది ఉద్యోగులు.. దాదాపు అంతకు రెట్టింపు వాహనాలు.. వీఐపీల రాకపోకలతో బీజీ బీజీ.. ఇంతేనా! ఆ ప్రాంతాలు ఐటీ కారి‘డర్’కు.. ట్రా‘ఫికర్’కు కేరాఫ్ కూడా. వానొచ్చినప్పుడు చూడాలి వాటి సొగసు.. చినుకు పడితే వణుకే.. ప్రయాణమంటే ప్రయాసే.. అడుగుడుగునా అవస్థలే.. రహదారులన్నీ వాహనాల బారులే.. ఫ్లై ఓవర్లు ఉన్నా.. అండర్ పాస్లున్నా.. చాలా వెడల్పాటి రోడ్లున్నా.. తప్పని ట్రా‘ఫికర్’. నగరవాసికి నరకం చూపుతున్న ట్రాఫిక్ సమస్యపై ‘సాక్షి’ ప్రత్యేక కథనమిదీ.. సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్లో ప్రయాణం నరకప్రాయంగా మారింది. ముఖ్యంగా ఐటీ సంస్థలు ఉండే పశ్చిమ హైదరాబాద్లో అయితే వాహన విస్ఫోటంతో నగరవాసికి పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. ఐటీ కారిడార్లలోని రహదారులపై రోజుకు 10 లక్షల వాహనాలు చక్కర్లు కొడుతుంటాయి. ఇలాంటి బిజీ రోడ్లపై తేలికపాటి వర్షాలకే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది.హైదరాబాద్లో ఉన్న సుమారు 15 వేల ఐటీ, ఐటీఈఎస్ కంపెనీల్లో 9,05,715 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. చాలా ఐటీ సంస్థలు ఉద్యోగుల కోసం హైబ్రిడ్ విధానాన్ని అవలంబిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు వారంలో 2–3 రోజులు ఆఫీసు నుంచి, మిగిలిన రోజుల్లో ఇంటి నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే చాలా మంది ఐటీ ఉద్యోగులు వీకెండ్స్కు ముందు, తర్వాత రోజులైన శుక్ర, సోమవారాల్లో ఇంటి నుంచి పనిచేసేందుకే ఇష్టపడుతున్నారు. మంగళ, బుధ, గురువారాల్లో మాత్రం ఆఫీసులకు వస్తున్నారు. దీంతో సోమ, శుక్రవారాలతో పోలిస్తే మిగిలిన రోజుల్లో ఐటీ కారిడార్లలోని రహదారులపై వాహనాలు కిక్కిరిసిపోతున్నాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల అధ్యయనంలో వెల్లడైంది.ఏ ఏ రోజుల్లో ట్రాఫిక్ జాం ఎక్కువంటేసోమ, శుక్ర వారాలతో పోలిస్తే మంగళ, బుధ, గురువారాల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇందులోనూ మంగళ, బుధవారాల్లో 20–25 శాతం, గురువారాల్లో 10–15 శాతం రోడ్లు వాహనాలతో బిజీగా ఉంటాయి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య, సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల మధ్య రోడ్ల మీద వాహనాలు కిక్కిరిసిపోతున్నాయి. ఈ నాలుగు గంటలు నరకమే.. ఐటీ కారిడార్లలో రోజుకు 10 లక్షల ఆటోలు, బస్సులు, కార్లు, బైక్లు తిరుగుతుంటాయి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఇక్కడ ప్రయాణించాలంటే వణుకే. ఈ నాలుగు గంటల్లో సుమారు లక్ష వాహనాల్లో ఐటీ ఉద్యోగులు ప్రయాణిస్తుంటారు. వారం మధ్య దినాల్లో ట్రాఫి క్ రద్దీ విపరీతంగా ఉంటుంది. సోమ, శుక్ర వారాల్లో ఐటీ ఉద్యోగులు హైబ్రిడ్ విధానంలో ఇంటి నుంచే పని చేస్తుండగా.. మంగళ, బుధ, గురువారాల్లో మాత్రం ఆఫీసులకు వెళుతున్నారు. దీంతో నివాస ప్రాంతాలతో అనుసంధానమై ఉండే ఐటీ కారిడార్లలో ట్రాఫిక్ రద్దీ 25 శాతం అధికం.ప్రధానంగా ఈ రోడ్లు జాంజాం.. ⇒ గచ్చిబౌలి–మియాపూర్ రోడ్ ⇒ లింగంపల్లి వయా గచ్చిబౌలి రోడ్ ⇒ హైటెక్ సిటీ–జేఎన్టీయూ వయా హఫీజ్పేట, కేపీహెచ్బీ ⇒ బొటానికల్ గార్డెన్ అండ్ కొత్తగూడ ⇒ టోలిచౌకి–రాయదుర్గం రోడ్ (షేక్పేట ఫ్లై ఓవర్)కొత్తగా మరో 25 లక్షల గృహాలు.. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఏటా ఇచ్చే అనుమతుల్లో 60 శాతానికి పైగా భవన నిర్మాణ అనుమతులు ఐటీ కారిడార్లలోనే ఉంటాయి. అయితే ఆ మేరకు ఆయా రహదారుల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి జరగడం లేదు. భవిష్యత్తు అవసరాలను ఏమాత్రం దృష్టిలో పెట్టుకోకుండా ఇబ్బడిముబ్బడిగా అనుమతులు ఇస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వెస్ట్ హైదరాబాద్లో 30 అంతస్తులకుపైగా హైరైజ్ భవనాలు వందల సంఖ్యలో నిర్మాణమవుతున్నాయి. వచ్చే 4–5 ఏళ్లలో ఐటీ కారిడార్లలో కొత్తగా 25 లక్షల గృహాలు అందుబాటులోకి వస్తాయని అంచనా. ఈ కారిడార్లలో నివాసముండే కుటుంబాల్లో ఇంటికి 2–3 కార్లు ఉంటున్నాయి. ఈ లెక్కన లక్షల వాహనాలు కొత్తగా రోడ్ల మీదికి వస్తాయి. ఇప్పుడున్న రద్దీనే తట్టుకోలేక చేతులెత్తేస్తున్న ప్రభుత్వ విభాగాలు భవిష్యత్తు పరిణామాల గురించి కూడా ముందస్తుగా ఆలోచిస్తే బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.ఏం చేయాలంటే.. ⇒ ఎడతెరిపిగా వర్షాలు కురిసే రోజుల్లో ఐటీ సంస్థలు వేర్వేరు లాగిన్, లాగ్ అవుట్ వేళలను అవలంబించాలి. ⇒ సాధ్యమైనంత వరకు మెట్రో, ఎంఎంటీఎస్, బస్సులు వంటి ప్రజా రవాణాను ఉద్యోగులు వినియోగించేలా సంస్థలు ఆదేశించాలి. ⇒ ఒకే ప్రాంతం, ఒకే సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఎవరికివారు సొంత వాహనాల్లో ఆఫీసులకు వెళ్లే బదులుగా ముగ్గురు, నలుగురు కలిసి ఒకే కారులో ప్రయాణించేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ⇒ కార్ పూలింగ్, బైక్ ట్యాక్సీ వంటి ప్రత్యామ్నాయ వాహన ఏర్పాట్లు చేసుకోవడం ఉత్తమం ⇒ యాజమాన్యాలు ఉద్యోగులకు ప్రతి రోజు ఆఫీసులో విధిగా నిర్వహించే మీటింగ్స్ను ఆన్లైన్ లేదా వర్చువల్ విధానంలో చేయడం ఉత్తమం. ⇒ ఐటీ కారిడార్లలో రోడ్లు, డ్రైనేజీల్లో చెత్తాచెదారం, సిమెంట్ కాంక్రీట్ వంటి వాటితో నిండిపోయి వర్షపు నీటి ప్రవాహ మార్గాలను అడ్డుకోకుండా మున్సిపల్, హైడ్రా, పోలీసులు సమన్వయంగా పనిచేయాలి. ⇒ హైబ్రిడ్ విధానంలో ఉద్యోగులు వారంలో తప్పనిసరిగా మూడు రోజులు ఆఫీసుకు రావాలనేది యాజమాన్యాల నిబంధన. వానాకాలం, ఇతరత్రా అత్యవసర రోజుల్లో ఈ నిబంధనల్లో సడలింపులు ఇచ్చేలా సంస్థలను అధికారులు ఆదేశించాలి. ⇒ ఆఫీసు నుంచైనా, ఇంటి నుంచైనా ఉద్యోగుల పని వేళలు, ఉత్పాదకతలో ఎలాంటి మార్పులు లేనప్పుడు సాధ్యమైనంత వరకు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వడమే మేలు. దీంతో రహదారులపై ట్రాఫిక్ రద్దీ తగ్గడమేకాకుండా యాజమాన్యాలకూ ఉద్యోగుల రవాణా ఖర్చులు తగ్గుతాయి.‘వీఐపీ’ల రాకపోకలు కూడా కారణమే..గతంలో రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార ప్రముఖులు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో నివాసం ఉండేందుకు ఇష్టపడేవారు. అయితే ఇప్పుడు ఆయా ప్రాంతాలు వాణిజ్య ప్రాంతాలుగా మారడంతో వారంతా కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ, మాదాపూర్ (Madapur) వంటి పశ్చిమ హైదరాబాద్కు వలస వెళుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో నిరంతరం వీఐపీల కదలికల కారణంగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. గతంలో సినిమా ఫంక్షన్లు ఎల్బీ స్టేడియంలో జరిగేవి. కానీ, ఇప్పుడు హైటెక్స్, హెచ్ఐసీసీ (HICC) వంటి ఐటీ కారిడార్లలోని ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. ఫలితంగా అభిమానుల తాకిడితో రోడ్లన్నీ స్తంభించిపోతున్నాయి. హెచ్ఐసీసీ, హైటెక్స్, నోవాటెల్, జేఆర్సీ, సంధ్య వంటి కన్వెన్షన్లలో నిత్యం ఏదో ఒక భారీ కార్యక్రమంఉంటుండటంతో ఐటీ కారిడార్లు బిజీ బిజీగా మారుతున్నాయి. కుండపోతగా కురిసినప్పుడే సమస్య వాన నీరు వెళ్లే మార్గాల పరిమాణం కంటే అధికంగా కుండపోత వర్షపునీరు వచ్చినప్పుడు రోడ్లన్నీ వరదతో నిండి ట్రాఫిక్ జాం అవుతున్నాయి. దీంతో వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద హైడ్రా (Hydraa), పోలీసులు సమన్వయంగా పనిచేస్తూ మోటార్లతో వరద నీటిని ఎత్తిపోస్తున్నాం. దీంతో కనీసం రెండు లైన్లు ట్రాఫిక్ క్లియర్ అవుతుంది. – చంద్రశేఖర్ రెడ్డి, ఏసీపీ, మాదాపూర్మల్టీమోడల్ ట్రాన్స్పోర్టే పరిష్కారం బహుళ అంతస్తుల్లో నివాసం ఉండేందుకు కస్టమర్లు ఆసక్తి చూపుతున్నందున డెవలపర్లు కూడా హైరైజ్ ప్రాజెక్ట్లు ఎక్కువగా చేపడుతున్నారు. అయితే ఐటీ కారిడార్లలో ట్రాఫిక్ రద్దీకి సరైన పరిష్కారం మెట్రో, ఎంఎంటీఎస్ల విస్తరణ, మల్టీమోడల్ ట్రాన్స్పోర్ట్ వినియోగమే. ఆఫీసులు, విద్యాసంస్థలు వేర్వేరు పనివేళలను అమలు చేయాలి. – జైదీప్ రెడ్డి, ప్రెసిడెంట్, క్రెడాయ్ హైదరాబాద్ -
డాక్టర్ ఏఐ.. మీ హెల్త్ కోచ్..!
మీరు స్మార్ట్ వాచ్ లేదా స్మార్ట్ రింగ్ వంటి వేరబుల్స్ పెట్టుకుంటే.. ప్రతిరోజూ మీ వాచ్లో లేదా స్మార్ట్ ఫోన్లో ఓ లిస్ట్ కనిపిస్తుంది. ఎన్ని స్టెప్స్ నడిచారు? ఎంత సమయం నిద్రపోయారు? హార్ట్ రేట్ ఎలా ఉంది? స్లీప్ స్కోర్ ఎంత?.. ఇవన్నీ తెలుసుకోవచ్చు. ఇవన్నీ చూడడానికి కేవలం నంబర్లు. మనం నిత్యం అవి చెక్ చేసుకుంటూ లైఫ్ స్టైల్లో చేయాల్సిన మార్పుల గురించి ఆలోచిస్తాం. అప్పుడప్పుడు అనేక సందేహాలు కూడా వస్తుంటాయి. ఆ ట్రాకింగ్ డేటాలో నిజానిజాలేంటి? ఆ గణాంకాల గుట్టు ఎంత వరకూ శాస్త్రీయం అని మనమే గూగుల్ తల్లిని అడుగుతుంటాం. ఇకపై, మీకు ఆ శ్రమ అక్కర్లేదు. అన్నీ ‘ఏఐ’ చూసుకుంటుంది. స్మార్ట్ వాచ్లు, రింగ్లు, ఇతర వేరబుల్ ట్రాకర్లు సేకరించిన డేటాని విశ్లేషిస్తుంది. లైఫ్ స్టైల్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలో చెబుతుంది. అంటే జిమ్లో ఫిట్నెస్ కోచ్లా, ఇంట్లో ఫ్యామిలీ డాక్టర్లా అన్నమాట! –సాక్షి, స్పెషల్ డెస్క్దిగ్గజ ఐటీ కంపెనీలన్నీ ఇప్పుడు ‘ఏఐ’ అప్డేట్స్పైనే వర్క్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే గూగుల్ గూటి నుంచి వచ్చిన జెమినై కూడా నిత్య నూతనంగా అప్డేట్ అవుతోంది. ఇప్పుడు కొత్తగా ఓ ఏఐ సిస్టమ్ని అడాప్ట్ చేసుకుంది. అదే ’పర్సనల్ హెల్త్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్’ (పీహెచ్ఎల్ఎల్ఎమ్). ఇదో హెల్త్ కోచ్ మాదిరిగా పని చేస్తుంది. అంటే.. మనం వాడే యాపిల్ వాచ్, ఫిట్ బిట్ వంటి ఫిట్నెస్ ట్రాకర్ల నుంచి వచ్చే డేటాని తీసుకుంటుంది. విశ్లేషిస్తుంది. తగిన సలహాలు ఇస్తుంది. ఉదాహరణకి.. మీ నిద్ర క్వాలిటీ తగ్గిందా? వెంటనే అలర్ట్ అవుతుంది. తన నిఘా వ్యవస్థని అడుగుతుంది. మీరెంత సమయం సిస్టమ్పై వర్క్ చేస్తున్నారు, టైమ్కి తింటున్నారా లేదా.. ఇలా అన్నింటినీ ట్రాకర్స్ నుంచి తీసుకుని ‘స్క్రీన్ టైమ్ తగ్గించాలి.. డైట్లో ఇలాంటి మార్పులు చేయాలి.. రాత్రి పడుకునే ముందు లైట్ ఫుడ్ తీసుకోవాలి‘ వంటి పలు సూచనలు చేస్తుంది. సో.. మన హెల్త్ ట్రాకర్లు.. కేవలం డేటా మెషీన్లు కాదు, పర్సనల్ హెల్త్ కోచ్లుగా కూడా సరికొత్త అవతారం ఎత్తనున్నాయన్నమాట.850 కేసులను పరిశీలించి..దేన్నయినా వెంటనే నిజం అని ఎలా నమ్ముతాం? శాస్త్రీయంగా ఓ నిర్ధారణకి రావాలి. అందుకే గూగుల్ కూడా ఈ ఏఐ లాంగ్వేజ్ మోడల్పై ప్రయోగాత్మకంగా పరిశీలన చేసింది. ‘నేచర్’ మెడిసిన్ జర్నల్లో వచ్చిన రిపోర్ట్ ప్రకారం.. పలు ఫిట్నెస్ ట్రాకర్ల నుంచి సేకరించిన 850 కేసులను గూగుల్ సేకరించింది.రియల్ టైమ్లో తీసుకున్న మొత్తం డేటాని ఏఐతో కంపైల్ చేస్తే.. 79% నిద్రకి సంబంధించిన ప్రశ్నలకు.. 88% ఫిట్నెస్ డేటాపై సరైన సమాధానాలు ఇచ్చిందట.హార్ట్ బీట్ డేటాపై సగటున 76% సరైన విశ్లేషణ చేసిందని గూగుల్ పరిశోధకులు ప్రకటించారు.ఎంత వరకు సురక్షితం?‘ఆహా!! ఏఐ ఓ అద్భుతమే’ అని మనం ప్రశంసించినా.. కచ్చితంగా దానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. అందుకే దీనికి కూడా పరిధిని నిర్దేశించుకోవాలని ఆరోగ్య రంగ నిపుణులు చెబుతున్నారు. ‘ఏఐ హెల్త్ కోచ్లు చెప్పేవి కేవలం సూచనలుగానే పరిగణించాలి. దాన్నే వైద్యుడిగా భావించకూడదు’ అంటున్నారు. ఎందుకంటే కొన్నిసార్లు ఏఐ తప్పు అంచనాలు వేయొచ్చని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. పిల్లల కోసం వాడుతున్నట్లయితే కచ్చితంగా పేరెంటల్ కంట్రోల్స్ తప్పనిసరి. ఎప్పటికప్పుడు ప్రైవసీ సెట్టింగ్స్ను తప్పనిసరిగా చెక్ చేయాలి.» ఎంత స్మార్ట్ అవుతున్నాయో అంతే సున్నితమైన డేటాను కూడా వేరబుల్స్ రికార్డ్ చేస్తున్నాయి.» హార్ట్ రేట్, స్లీప్ ప్యాటర్న్స్, మానసిక స్థితికి సంబంధించిన సమాచారం లీక్ అయితే.. చాలా పెద్ద సమస్యే. » సైబర్ సెక్యూరిటీ కట్టుదిట్టంగా లేకపోతే.. హెల్త్ డేటా వ్యాపార వస్తువైపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. » ‘పటిష్టమైన డేటా ప్రైవసీ రక్షణ, వాడేవారిలో డిజిటల్ అక్షరాస్యత.. రెండూ తోడైతే హెల్త్ ట్రాకర్స్, ఏఐ మనిషి లైఫ్కి చక్కని రక్షణ కవచాలుగా మారతాయి. కచ్చితంగా ఆరోగ్య రంగంలో విప్లవమే అవుతుంద’ని టెక్ నిపుణులు చెబుతున్నారు. » యాపిల్ సంస్థ కూడా ఈ తరహా ఏఐ ఫీచర్స్ అందించేందుకు సిద్ధమవుతోంది. ఐఓఎస్ 18లో ఆరోగ్య సంబంధిత టూల్స్, ఏఐ ఆధారిత న్యూట్రిషన్ ట్రాకింగ్ను అందించేందుకు ప్రయోగాలు చేస్తోంది.మన గత చరిత్రనూ తవ్వి..ఏఐ అందించిన ఈ ఫలితాల ఆధారంగా చూస్తే.. ఇది హెల్త్ ఎక్స్పర్ట్లు ఇచ్చిన సమాధానాలతో దాదాపు సమానమే. అంతేకాదు.. గూగుల్ పరిశోధకులు చెబుతున్న ప్రకారం.. పీహెచ్ఎల్ఎల్ఎమ్ వినియోగదారుల హెల్త్ రికార్డ్స్పై మరింత లోతైన విశ్లేషణ చేస్తుందట. రియల్ టైమ్ డేటానే కాకుండా ట్రాకర్ల నుంచి యూజర్ల హిస్టరీని కూడా ఏఐతో కంపైల్ చేస్తున్నారు గూగుల్ పరిశోధకులు. దీంతో మరింత నమ్మకమైన సూచనలు చేసేందుకు వీలవుతుందట. వినియోగదారులకు ఓ ఫ్యామిలీ డాక్టర్ లా సేవలు అందించేలా సిద్ధం చేస్తున్నామని ఏఐ రూపకర్తలు చెబుతున్నారు. -
మరో అద్భుతం భారతీయ రైల్వే ఖాతాలో..
ఈ మధ్యకాలంలో ఇండియన్ రైల్వేస్ ఎన్నో అద్భుత ఘట్టాలను సాధించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆర్చ్ బ్రిడ్జ్, పొడవైన రైల్వే టన్నెల్, చారిత్రక పాంబన్ బ్రిడ్జ్.. ఇలాంటి నిర్మాణాల తర్వాత ఇప్పుడు మరో ‘వావ్’ ఫీట్ను సాధించింది. అదే.. దేశంలోనే అత్యంత పొడవైన గ్రేడ్ సెపరేటర్ బ్రిడ్జ్ పూర్తి చేయడం. కట్నీ జంక్షన్లో ఇంజినీరింగ్ అద్భుతం.. మధ్యప్రదేశ్లోని కట్నీ జంక్షన్ వద్ద ఈ గ్రేడ్ సెపరేటర్ బ్రిడ్జి ఉంది. ఈ బ్రిడ్జ్ మొత్తం 33.40 కిలోమీటర్లు పొడవు. ఇందులో ఒకటి "అప్" ట్రైన్ల కోసం (ఇప్పటికే పూర్తయింది). మరొకటి "డౌన్" ట్రైన్ల కోసం.. ఇది 17.52 కిలోమీటర్ల పొడవుతో ఇంకా నిర్మాణంలో ఉంది. అప్ బ్రిడ్జ్ను రైల్వే భద్రతా కమిషనర్ (CRS) ఆమోదించారు. దీంతో అతిత్వరలోనే ఇది ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తోంది. మొత్తం.. 15.85 కిలోమీటర్ల పొడవుతో, ఫిల్లర్లపైనే నిర్మించిన ఈ ఎలివేటెడ్ ట్రాక్ నగరాన్ని పూర్తిగా మళ్లించి ట్రాఫిక్ను గణనీయంగా తగ్గిస్తుంది.గ్రేడ్ సెపరేటర్ బ్రిడ్జ్ అంటే.. రవాణా మార్గాలు (రోడ్లు, రైల్వేలు) ఒకే స్థాయిలో కాకుండా, వేర్వేరు ఎత్తుల్లో నిర్మించడమన్నమాట. తద్వారా వాటి మధ్య రాకపోకలలో అంతరాయం లేకుండా చేయొచ్చు. అంటే.. సిగ్నల్స్ లేకుండా ప్రయాణించగలవు. తద్వారా ప్రమాదాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అధిక ట్రాఫిక్ ఉన్న ప్రాంతాల్లో ఇది అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది.2020లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాదిలో పూర్తి కావాలనే టార్గెట్ ఉంది. గతి శక్తి పథకంలో భాగంగా.. ఈ ప్రాజెక్ట్ ప్రధానమంత్రి గతి శక్తి పథకంలో భాగంగా చేపట్టబడింది. "అప్ లైన్" సెపరేటర్ నిర్మాణ ఖర్చు ₹580 కోట్లు కాగా, రెండు సెపరేటర్ల మొత్తం ఖర్చు రూ.1,247.68 కోట్లుగా అంచనా.ట్రాఫిక్ తగ్గింపు, సమయపాలన మెరుగుదల.. దేశంలోనే అతిపెద్ద రైల్వే జెంక్షన్ యార్డ్గా న్యూ కట్నీకి పేరుంది. గూడ్స్ & ప్యాసింజర్ ట్రైన్ల అధిక రాకపోకల వల్ల నిత్యం ఇక్కడ తీవ్ర రద్దీ నెలకొంటోంది. తద్వారా రైళ్ల రాకపోకలపై ఇది తీవ్ర ప్రభావం చూపెడుతోంది. అయితే.. తాజా గ్రేడ్ సెపరేటర్ బ్రిడ్జ్ వాడకంలోకి వస్తే ఈ సమస్య తొలిగిపోనుంది. అదెలాగంటే.. సింగ్రౌలి, బిలాస్పూర్ నుంచి వచ్చే ట్రైన్లు ఇక న్యూ కట్నీ జంక్షన్(కట్నీ ముద్వారా) వద్ద ఆగాల్సిన అవసరం లేదు. కోటా, బీనా వైపు వెళ్లే ట్రైన్లకు ఇది ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. అంటే.. వెస్ట్ సెంట్రల్, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేజోన్ల నుంచి వచ్చే రైళ్ల రాకపోకలు సునాయసంగా కొనసాగే అవకాశం ఉంటుంది. ప్రయాణ సౌలభ్యం, సరుకు రవాణా మెరుగుదల.. కట్నీని మళ్లించే ట్రైన్లు ఇక నాన్ స్టాప్గా ప్రయాణించగలవు. ధన్బాద్, గయా, ముజఫర్పూర్ వంటి నగరాలకు వెళ్లే ప్రత్యేక ట్రైన్లు కూడా హాల్టింగ్ లేకుండా ముందుకు వెళ్తాయి. అదనంగా.. పవర్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా కూడా సకాలంలో జరిగేందుకు వీలు కల్పించనుంది. నిర్మాణంలో వినియోగించిన వనరులు15,000 టన్నుల స్టీల్1.50 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్1.90 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టినాలుగు Rail Over Rail (ROR) బ్రిడ్జ్లు, వాటిలో పొడవైనది 91.40 మీటర్లుఈ అద్భుతమైన నిర్మాణం భారత రైల్వేలు సాధించిన మరో ఘనతగా నిలిచింది. దేశ రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చే దిశగా ఇది కీలక అడుగుగా నిపుణులు భావిస్తున్నారు.