breaking news
Sakshi Special
-
షుగర్ డ్రింక్స్, మద్యం, పొగాకుపై... పన్నుల మోత మోగించండి!
నానాటికి మారుతున్న జీవన శైలి ప్రజలను రోగాల బారిన పడేస్తోంది. డయాబెటిస్, కేన్సర్వంటి దీర్ఘకాలిక వ్యాధులు పెరిగిపోతున్నాయి. వీటికి చెక్ పెట్టడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కొత్తరకం ప్రతిపాదన చేసింది. ‘‘చక్కెర పానీయాలు, మద్యం, పొగాకు ధరలు రాబోయే పదేళ్లలో కనీసం 50 శాతం పెరగాలి. వాటిపై ఆ మేరకు పన్నులు పెంచండి’’ అని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. స్పెయిన్లోని సెవిల్లెలో జరిగిన ఫైనాన్స్ ఫర్æ డెవలప్మెంట్ సమావేశం ఈ మేరకు సిఫార్సు చేసింది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను అరికట్టడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. వాటిపై పన్నులను మరింతగా పెంచితే మధుమేహం, కేన్సర్ తదితర వ్యాధులకు కారణమయ్యే హానికరమైన ఉత్పత్తుల వాడకాన్ని బాగా తగ్గించవచ్చని డబ్ల్యూహెచ్ఓ భావిస్తోంది. ‘‘దేశాల దగ్గరున్న అత్యంత సమర్థమైన నియంత్రణ సాధనాల్లో పన్నులు ముఖ్యమైనవి. ప్రజారోగ్యమే లక్ష్యంగా చక్కెర పానీయాలు, మద్యం, పొగాకు వంటివాటి వాడకాన్ని పూర్తిగా తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది’’ అని డబ్ల్యూహెచ్ఓ హెల్త్ ప్రమోషన్, వ్యాధి నివారణ విభాగం అసిస్టెంట్ డెరెక్టర్ జనరల్ జెరెమీ ఫర్రార్ అన్నారు. ఆ దేశాల్లో సత్ఫలితం కొలంబియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో ఈ దిశగా చేసిన ప్రయోగం మంచి ఫలితాలిచ్చింది. అదనపు పన్నులతో పొగాకు తదితరాల ధరలు విపరీతంగా పెరగడంతో వాటి వాడకం బాగా తగ్గింది. అయితే డబ్ల్యూహెచ్ఓ సిఫార్సులను పొగాకు తదితర పరిశ్రమలు వ్యతిరేకిస్తున్నాయి. ‘‘చక్కెర, తీపి పానీయాలపై పన్నుల వల్ల ఏ దేశంలోనూ ఆరోగ్య ఫలితాలు మెరుగుపడలేదు. ఊబకాయం వంటివి తగ్గలేదు. ఇలాంటి స్పష్టమైన ఆధారాలను డబ్ల్యూహెచ్ఓ విస్మరించడం ఆందోళనకరం’’ అని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆ‹ఫ్ బెవరేజెస్ అసోసియేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేట్ లోట్మాన్ విమర్శించారు. మరోవైపు, ఇది ప్రజారోగ్యం సాకుతో పన్నుల భారం పెంచే యత్నమని కూడా విమర్శలొస్తున్నాయి. పన్నులు పెంచడం ఆల్కహాల్ సంబంధిత హానిని నివారిస్తుందనడం పక్కదారి పట్టించడమేనని డిస్టిల్డ్ స్పిరిట్స్ కౌన్సిల్లో సైన్స్ అండ్ రీసెర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమండా బెర్గర్ ఆందోళన వ్యక్తం చేశారు. కానీ బ్లూంబర్గ్, ప్రపంచ బ్యాంకు, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ మాత్రం పన్ను పెంపు ప్రతిపాదనను సమరి్థంచాయి. ఇందుకు ముందుకొచ్చే దేశాలకు తోడ్పడతామని చెప్పుకొచ్చాయి. 2012–22 మధ్య దాదాపు 140 దేశాలు పొగాకు ఉత్పత్తులపై పన్నులను 50 శాతం పైగా పెంచాయి. అల్ట్రా ప్రాసెస్డ్ ఆహార పదార్థాలపైనా పన్ను పెంచే యోచనలో ఉన్నాయి. భారత్లో ఇలా... భారత్లో కూడా కొవ్వు, చక్కెర, ఉప్పు అధికంగా ఉండే ఆహారాలపై ఆరోగ్య పన్ను విధించాలని వైద్య నిపుణుల నేతృత్వంలోని జాతీయ కన్సారి్టయం సూచించింది. అంతేగాక పిల్లల ఆహార పదార్థాల మార్కెటింగ్పై కఠినమైన నియమాలు విధించాలని కోరింది. భారత్లో కౌమార దశలో ఉన్నవారిలో ఊబకాయం బాగా పెరుగుతుండటంపై ఇండియన్ కౌన్సిల్ ఆ‹ఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆ‹ఫ్ న్యూట్రిషన్ ఆందోళన వ్యక్తం చేశాయి. యువత ఆహారపు అలవాట్లను మార్చడానికి, మెరుగుపరచడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది. క్యాంటీన్లలో, విద్యా సంస్థల సమీపంలో కొవ్వు, చక్కెర, ఉప్పు అధికంగా ఉన్న ఆహార పదార్థాల విక్రయాన్ని నిషేధించాలని డిమాండ్ చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
6న దలైలామా 90వ జన్మదిన వేడుక
ధర్మశాల: టిబెటన్ల బౌద్ధ గురువు దలై లామా 90వ పుట్టిన రోజు వేడుకకు భారీగా ఏర్పాట్లు సాగుతున్నాయి. హిమాలయాల్లోని మెక్లియోడ్గంజ్ పట్టణంలోగల ప్రధాన దలై లామా ఆలయం ట్సుగ్లంగ్ఖంగ్కు కాషాయ వ్రస్తాలు ధరించిన బౌద్ధ భిక్షువుల తాకిడి పెరుగుతోంది. టిబెటన్ ప్రవాస ప్రభుత్వం ఇక్కడే కొలువై ఉన్నందున ఈ పట్టణాన్ని లిటిల్ లాసా అని కూడా పేర్కొంటారు. లామా పుట్టినరోజు వేడుకలతోపాటు ఇక్కడ పలు కార్యక్రమాలు జరగనున్నాయి. దలై లామా తదుపరి వారసుడిని సైతం ప్రకటించనున్నారు. దీంతో, ఇక్కడ జరిగే పరిణామాలను ప్రపంచమే ఆసక్తిగా గమనిస్తోంది. జూన్ 30వ తేదీ నుంచి ప్రారంభమైన వారోత్సవాల్లో మత సదస్సులు, యువజన వేదికలు, సామూహిక ప్రార్థనలు జరుగనున్నాయి. ఈ నెల 2 నుంచి 4వ తేదీ వరకు జరిగిన 15వ టిబెటన్ మత సదస్సుకు 100 మందికి పైగా టిబెటన్ బౌద్ధ నేతలు, ప్రతినిధులు హాజరయ్యారు. అదేవిధంగా, 3– 5వ తేదీల్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ టిబెటన్ యూత్ ఫోరం సదస్సుకు 15 దేశాలకు చెందిన 100 మందికి పైగా తరలివచ్చారు. దలై లామా పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ నెల 5న ప్రవాసంలోని టిబెటన్ ప్రభుత్వ కేబినెట్ ‘కషగ్’ఆధ్వర్యంలో సామూహిక ప్రార్థనలు జరగనున్నాయి. ప్రధాన టిబెటన్ ఆలయంలో జరిగే ఈ కార్యక్రమానికి టిబెటన్ల తరఫున దలై లామా సైతం హాజరై ప్రార్థనల్లో పాల్గొంటారని సెంట్రల్ టిబెటన్ యంత్రాంగం తెలిపింది. టిబెటన్ల స్వాతంత్య్ర పోరాటాన్ని వివరించే షెన్పెన్ ఖిమ్సార్ దర్శకత్వం వహించిన ‘4 రివర్స్ 6 రేంజెస్’సినిమా ప్రదర్శన 5న సాయంత్రం ఉంటుందని పేర్కొంది. ప్రముఖులు హాజరు జూలై 6న 14వ దలై లామా 90వ పుట్టిన రోజు వేడుకలు జరగనున్నాయి. ప్రత్యేకంగా జరిగే ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, అరుణాచల్ సీఎం పెమా ఖండూ, సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాల్, హాలీవుడ్ స్టార్ రిచర్డ్ గెరె తదితర ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా తదుపరి దలై లామాను సైతం ప్రకటిస్తారు. జూలై 7–9వ తేదీల్లో టిబెటన్ కళలు, వైద్యం, సాహిత్యం, మతం, విద్య సంబంధిత ప్రదర్శనలుంటాయి. వైద్య శిబిరం సైతం నిర్వహిస్తారు. టిబెటన్ బౌద్ధులు దలై లామాను బుద్ధుని సజీవ రూపంగా ఆరాధిస్తారు. దలై లామా వారసత్వం కొనసాగుతుందని, గడెన్ ఫొడ్రంగ్ ట్రస్ట్కు మాత్రమే భవిష్యత్తు లామాను నిర్ణయించే అధికారం ఉందని, ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోరాదని దలై లామా బుధవారం స్పష్టం చేయడం తెల్సిందే. అయితే, వారసుడి నిర్ణయంపై తమ అనుమతి తప్పక ఉండాల్సిందేనని చైనా వాదిస్తోంది. ఈ నేపథ్యంలో చైనా పాలక కమ్యూనిస్ట్ పారీ్టతో టిబెటన్ బౌద్ధమతం దశాబ్దాలుగా సాగిస్తున్న పోరాటంలో నూతన అధ్యాయం మొదలుకానుంది. -
అలా తప్పించుకున్నారు!
టిబెట్ ఆధ్యాత్మిక గురువు, 14వ దలైలామా రేపు 90వ ఏట అడుగుపెట్టనున్నారు. ఆయన 66 ఏళ్లుగా భారత్లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. 23 ఏళ్ల వయసులో భారత్లో అడుగుపెట్టిన ఆయన మరిక తిరిగి టిబెట్ వెళ్లనే లేదు. టిబెటన్లు బుద్ధుని అంశగా భావించి ఆరాధించే దలైలామా భారత్కు ఎందుకు వచ్చారు? బుల్లెట్లను, ద్రోహాన్ని తప్పించుకుని ఒక యువ టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు మనద ఏశానికి ఎలా చేరుకున్నారు? గడ్డకట్టుకుపోయే వాతావరణంలో, కఠినమైన దారుల్లో రెండు వారాలు ఎలా ప్రయాణించారు? ఇది టిబెట్ రాజకీయ కల్లోలాన్ని తెలిపే కథ. అది 1950ల చివరి కాలం. చైనా ఆక్రమణలతో టిబెట్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. 1951లో బలవంతంగా సంతకం చేయించిన పదిహేడు పాయింట్ల ఒప్పందం, చైనా నియంత్రణలో ఉన్న టిబెటన్ ప్రజలకు మతపరమైన స్వయంప్రతిపత్తిని హామీగా ఇచ్చింది. కానీ స్వయంప్రతిపత్తి ఒక భ్రమ అని త్వరలోనే తెలిసొచ్చింది. 13వ దలైలామా ముందే చెప్పినట్టుగా టిబెట్పైనే కాదు, వారి మతంపైనా దాడి జరిగింది. చైనా సైనికులు టిబెట్ రాజధాని లాసాలో స్వేచ్ఛగా తిరుగడం, బౌద్ధ సన్యాసుల భూములను స్వా«దీనం చేసుకోవడంతో దలైలామా అధికారం క్షీణించడం ప్రారంభమైంది. రాజీ కోసం దలైలామా మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయతి్నంచినా లాభం లేకపోయింది. 1959 నాటికి, ప్రతిఘటనలు నిరసనగా మారాయి. తమ ఆధ్యాత్మిక గురువును నిర్బంధిస్తారని, లేదంటే చంపుతారని టిబెట్ ప్రజలు భయపడ్డారు. ఊహించనట్టుగానే లాసాను చైనా సైనిక దళాలు, ట్యాంకులు, ఫిరంగులు చుట్టుముట్టాయి. అదే రోజు, లాసాలో దలైలామాను అంగరక్షకులు లేకుండా వారి సైనిక ప్రధాన కార్యాలయంలో జరిగే నృత్య ప్రదర్శనకు హాజరు కావాలని చైనా జనరల్ కోరాడు. వేలాది మంది టిబెటన్లు వీధుల్లోకి వచ్చి, దలైలామా వేసవి రాజభవనమైన లాసాలోని నార్బులింగకా చుట్టూ మానవహారంంగా ఏర్పడ్డారు. రాజభవనంలో చర్చల తరువాత ఆ రాత్రి దలైలామా లాసాను విడిచి భారత్కు వెళ్లాలని నిర్ణయమైంది. మార్చి 17న పొగమంచు కమ్ముకున్న రాత్రి, ఎప్పుడూ మెరూన్ కలర్ దుస్తుల్లో ఉండే దలైలామా తనను ఎవరూ గుర్తు పట్టకుండా సైనికుడి యూనిఫాం ధరించారు. తల్లి, తోబుట్టువులు, ట్యూటరు, కొందరు విశ్వాసపాత్రులైన అధికారులు వెంట రాగా చీకటి నడుమ వెనుకద్వారం నుంచి రాజభవనాన్ని వీడారు. ౖచైనా సైన్యం చెక్పోస్టులను తప్పించుకుంటూ వారి బృందం ముందుకు నడిచింది. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు ఎక్కువగా రాత్రిపూటే ప్రయాణించింది. చుషుల్, లోకా, కైచు లోయ గుండా, ఖెంజిమనే సమీపంలోని హిమాలయాలను దాటి, నేటి అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్కు చేరుకుంది. గడ్డకట్టుకుపోయే వాతావరణం. ఆహారం లేదు. పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. అయినా కెచు నది దాటి, ఎత్తైన లోయల గుండా, మఠాలు, తిరుగుబాటు శిబిరాల గుండా ముందుకు సాగారు. ఒకసారి చైనీస్ నిఘా విమానం వీరిపైనుంచే వెళ్లింది. కానీ దాన్నుంచి తప్పించుకున్నారు. ఎట్టకేలకు మార్చి 26న భారత సరిహద్దుకు మైళ్ల దూరంలో ఉన్న లుంట్సే జోంగ్కు చేరుకుంది. వెంటనే ప్రధాని నెహ్రూకు సమాచారం అందింది. అప్పటికే చైనా నుంచి హెచ్చరికలున్నప్పటికీ ఖాతరు చేయకుండా నెహ్రూ నిర్ణయాత్మకంగా వ్యవహరించారు. తవాంగ్ సమీపంలోని చుటాంగ్ము సరిహద్దు పోస్టుకు వెళ్లి, దలైలామా, ఇతర టిబెటన్ శరణార్థులకు స్వాగతం పలకాల్సిందిగా అస్సాం రైఫిల్స్ను ఆదేశించారు. మార్చి 31 నాటికి, దలైలామా, ఆయన పరివారం ఖెన్జిమనే పాస్ ద్వారా భారత్లోకి ప్రవేశించారు. భారత్, చైనాలను విడదీసే అంతర్జాతీయ సరిహద్దు మెక్మోహాన్ రేఖ సమీపంలో ఒక చిన్న పోస్ట్ వద్ద అస్సాం రైఫిల్స్కు చెందిన భారత జవాను హవల్దార్ నరేన్ చంద్ర దాస్ కంటికి అలసిపోయి, నలిగిన దుస్తుల్లో ఉన్న ఓ వ్యక్తి సమీపించడం కనిపించింది. ఆయనే 14వ దలైలామా అని ఆయనకే కాదు.. చాలామంది భారతీయులకు తెలియదు. అలా దలైలామా భారత్లో అడుగు పెట్టారు. ఆ వెంటనే, ‘టిబెటన్ ఆధ్యాత్మిక నాయకునికి భారత్లో ఉండేందుకు స్వాగతం’అంటూ నెహ్రూ నుంచి సందేశం వచ్చింది. దాస్తో పాటు ఇతర అస్సాం రైఫిల్స్ సిబ్బంది దలైలామా, ఆయన పరివారాన్ని తవాంగ్కు తీసుకెళ్లారు. అక్కడ వారికి వైద్యం అందించారు. తరువాత కొన్ని నెలలు ఆయన ముస్సోరీలో ఉన్నారు. అనంతరం హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలకు వెళ్లారు. అప్పటినుంచీ అదే టిబెటన్ల ప్రవాస ప్రభుత్వ కేంద్రంగా మారింది. స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నా దలైలామా సాహసోపేత భారత యాత్రకు ఆరు దశాబ్దాలు నిండాయి. ‘నేను శరణార్థిని. అయినా భారత్లో స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నాను’అని దలైలామా అనేక సందర్భాల్లో గుర్తు చేసుకున్నారు. అంతేకాదు, భారత్లో తనకు స్వాగతం పలికిన హవల్దార్ నరేన్ చంద్ర దాస్ను 2017లో కలిసి భావోద్వేగానికి లోనయ్యారు కూడా! అప్పటికి దాస్కు 79 ఏళ్లు కాగా దలైలామాకు 81 ఏళ్లు. ‘‘నేను కూడా వృద్ధుడిని అయ్యానని మీ ముఖం చూస్తుంటే నాకర్థమైంది. 58 ఏళ్ల కిందట నాకు భారత్లో రక్షణగా నిలిచినందుకు ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది’’అంటూ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. దలైలామాను అనుసరించి చాలామంది టిబెట్ను విడిచి భారత్కు చేరారు. కానీ టిబెట్ సమస్యకు ఇప్పటికీ పరిష్కారం లభించలేదు. 60 ఏళ్లకిందట ౖసైనికుడి వేషంలో దలైలామా భారత్లో అడుగుపెట్టినప్పుడు టిబెట్ పరిస్థితి ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. లక్షలాది మంది టిబెటన్ల రాజకీయ, మత, సాంస్కృతికి జీవితాలపై ఇప్పటికీ కత్తి వేలాడుతూనే ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
టేకు ఆకుతో లేజర్ తీవ్రతకు చెక్..!
టేకు అనగానే.. అందమైన ఫర్నీచర్లో ఇమిడిన విలువైన కలప గుర్తొస్తుంది. టేకు చెట్టులో కలప తప్ప ఆకులు ఎందుకూ పనికిరావని ఇన్నాళ్లూ అనుకునేవాళ్లు. కానీ ఈ పత్రాలకు కూడా గొప్ప ప్రయోజనం ఉందని తాజా పరిశోధనలో వెల్లడైంది. తీవ్రమైన లేజర్ కిరణాల రేడియేషన్ను అడ్డుకునే శక్తి టేకు ఈ ఆకుల్లో ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. వైద్యం, వినోద రంగం, పరిశ్రమలు, రక్షణ రంగం, శాస్త్రీయ పరిశోధన.. ఇలా ఆధునిక యుగంలో ప్రధాన రంగాల్లోనూ.. ఇంటర్నెట్కు వెన్నెముక లాంటి ఫైబర్ ఆప్టిక్స్లోనూ.. టేకు ఆకుల్లోని ప్రత్యేక శక్తిని ఉపయోగించవచ్చని చెబుతున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్అత్యంత ప్రభావశీలమైన లేజర్ కిరణాల రేడియేషన్ నుంచి చర్మాన్నీ, కంటినీ, సున్నితమైన ఆప్టికల్ పరికరాలను సైతం రక్షించే శక్తి టేకు ఆకులకు ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. వైద్యం, వినోద రంగం, పరిశ్రమలు, రక్షణ రంగం, శాస్త్రీయ పరిశోధన.. ఇలా ఆధునిక యుగంలో ప్రధాన రంగాల్లో లేజర్ రేడియేషన్దే ప్రధానపాత్ర. ఇంటర్నెట్కు వెన్నెముక లాంటి ఫైబర్ ఆప్టిక్స్లోనూ లేజర్ కిరణాలే కీలకం. అయితే, వీటిని ఉపయోగించే సమయంలో పొరపాటున ఆ కిరణాలు మనుషుల కళ్లకు, శరీరానికి హాని జరగనీయకుండా అడ్డుపడే కవచాన్ని రూపొందించేందుకు టేకు ఆకు అద్భుతంగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ నిధులతో పరిశోధనలు చేసే స్వయంప్రతిపత్తి గల సంస్థ ‘రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఆర్ఆర్ఐ)’ శాస్త్రవేత్తల పరిశోధనలో టేకు ఆకు ప్రయోజకత్వం వెల్లడైంది. ఆర్ఆర్ఐను ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత సర్ సి.వి.రామన్ స్థాపించారు.ప్రత్యేక లక్షణాలు టేకు ఆకులను ఎండబెట్టి, పొడి చేసి, ఆ పొడిని ప్రత్యేక రసాయనాల్లో నానబెట్టి, శుద్ధి చేసిన తర్వాత గోధుమ–ఎరుపు రంగు ద్రవాన్ని వెలికితీశారు. ఈ వర్ణద్రవ్యానికి లేజర్ కాంతి లక్షణాలు మార్చి, తీవ్రతను తగ్గించే నాన్లీనియర్ ఆప్టికల్ (ఎన్ఎల్ఓ) గుణాలు ఉన్నట్టు ఆర్ఆర్ఐ శాస్త్రవేత్తలు గుర్తించారు. అధిక తీవ్రతల వద్ద కాంతి ప్రసారాన్ని తగ్గించడానికి.. మన శరీరం, కళ్ళను కాపాడటానికి నాన్ లీనియర్ వస్తువుల్లో ఉండే ఆప్టికల్ పవర్ లిమిటింగ్ ఉపయోగపడుతుంది. ఇవే లక్షణాలు టేకు ఆకుల్లోనూ ఉన్నట్టు పరిశోధనలో వెల్లడైంది.‘సింథటిక్’ పదార్థాలకు బదులుగా..ఇప్పటివరకు వాడుతున్న గ్రాఫీన్, ఫుల్లెరెన్స్, మెటల్ నానోపార్టికల్స్ వంటి ప్రకృతికి హాని కలిగించే ఖరీదైన సింథటిక్ ఆప్టికల్ పదార్థాలకు బదులు టేకు ఆకుల్లోని రంగులను వాడుకోవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. సహజమైన, కుళ్లి ప్రకృతిలో కలిసిపోయే పర్యావరణ ప్రియమైన, విరివిగా లభించే టేకు ఆకులను ఉపయోగించటం ద్వారా లేజర్ రక్షక కళ్లజోళ్లు, ఇతర ఆప్టికల్ పరికరాలు తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.లేజర్ రేడియేషన్ ఉపయోగాలులేజర్ రేడియోషన్ లేదా లేజర్ కాంతి ఎంత ప్రయోజనకరమైనదో అంతే ప్రమాదకరమైనది. దీన్ని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకమైన కళ్లజోళ్లు ధరించాలి. లేజర్ కాంతి కంటిని నేరుగా తాకితే దృష్టి కోల్పోయే ప్రమాదం ఉంది. అధిక శక్తి గల లేజర్లు చర్మాన్ని కూడా కాల్చేయగలవు. దీన్ని అనేక రంగాల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు.» వైద్యరంగంలో కన్ను, చర్మ సంబంధ శస్త్ర చికిత్సలు; డయాగ్నొస్టిక్స్లో...» పరిశ్రమల్లో కటింగ్, వెల్డింగ్, లేజర్ మార్కింగ్, లేజర్ స్కాన్లలో..» శాస్త్రీయ పరిశోధనలో కాంతి లక్షణాలను అధ్యయనం చేయడానికి..» సీడీ ప్లేయర్లు, లేజర్ పాయింటర్లు, బార్కోడ్ స్కానర్ వంటి వినియోగదారుల ఉత్పత్తుల్లో..» రక్షణ రంగంలో కమ్యూనికేషన్, శత్రువుల క్షిపణులను కూల్చడం వంటి వాటికి.. » వినోద రంగంలో లేజర్ లైట్ షోలు, స్పెషల్ ఎఫెక్టుల కోసం.. -
మహిళల మెదడు సేఫ్!
‘మనసున్న మనిషికి సుఖము లేదంతే..’ అన్నారు ఆచార్య ఆత్రేయ. సుఖం ఉండకపోగా, డిప్రెషన్లోకి వెళ్లిపోయే ప్రమాదమూ ఉండొచ్చు. ‘యాంటీడిప్రెసెంట్స్’లు వాడి ఆ డిప్రెషన్ నుంచి∙బయట పడొచ్చనుకోండీ.. అయితే వాటిని వాడితే మెదడుపై దీర్ఘకాల దుష్ప్రభావాలు ఉంటాయని శాస్త్ర పరిశోధకులు కనిపెట్టారు. ‘ఇందులో కొత్తేముందీ!’ అంటారా? ఉంది. యాంటీడిప్రెసెంట్లు వాడితే మెదడుపై పడే దుష్ప్రభావాలు మగవాళ్లలోనే కానీ, ఆడవాళ్లలో కాదట!మానసిక రుగ్మతలకు వైద్యులు సిఫారసు చేసే ‘యాంటీడిప్రెసెంట్’ ఔషధాలు దీర్ఘకాలంలో పురుషుల మెదడుపై దుష్ప్రభావాలు చూపే అవకాశాలు ఉండగా, మహిళల్లో అలాంటి ప్రభావం దాదాపు లేదని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టి.ఐ.ఎఫ్.ఆర్.) శాస్త్రవేత్తలు ఎలుకలపై జరిపిన తాజా పరిశోధనలో వెల్లడైంది. అయితే యాంటీడిప్రెసెంట్లు పురుషుల మెదడుపై ఈ విధంగా ప్రభావాన్ని చూపటం అన్నది వారి వయసుపై కూడా ఆధారపడి ఉండొచ్చని వారు భావిస్తున్నారు.యాంటీ డిప్రెసెంట్లు ఏం చేస్తాయి?సెరటోనిన్ అనే న్యూరోహార్మోన్ మెదడులోని భావోద్వేగాల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆ హార్మోన్ను నియంత్రించటమే యాంటీడిప్రెసెంట్ల పని. నిరాశ, నిస్పృహ, ఆందోళన తదితర న్యూరోసైకియాట్రిక్ వ్యాకులతలకు వైద్యులు ప్రధానంగా ‘సెలెక్టివ్ సెరటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్లు’ (ఎస్.ఎస్.ఆర్.ఐ.లు) సిఫారసు చేస్తారు. ఈ మందులు మెదడులోని సెరటోనిన్ అధికం చేసి మానసిక ఉపశమనానికి తోడ్పడతాయి.మగ ఎలుకల్లోనే మార్పులుఎస్.ఎస్.ఆర్.ఐ.లలో విస్తృతంగా వాడుకలో ఉన్న ఔషధం ‘ఫ్లూఆక్సిటీన్’. గర్భిణులు, బాలింతలు, పిల్లలు, కౌమార దశలో ఉన్నవారు సహా అన్ని వయసుల వారికి వైద్యులు సిఫారసు చేసే ఈ ఫ్లూఆక్సిటీన్ దీర్ఘకాలిక ప్రభావాలు ఎలా ఉంటాయన్న విషయమై ఎలుకల మెదడుపై జరిపిన ఈ అధ్యయనంలో అనేక ఆసక్తికరమైన సంగతులు వెల్లడయ్యాయి. ఫ్లూఆక్సిటీన్ను ఇవ్వడం వల్ల మగ ఎలుకల మెదడులో విస్తృతమైన వ్యతిరేక మార్పులు కనిపించాయి. పుట్టిన కొద్ది రోజుల వయసున్న ఎలుకలకు యాంటీడిప్రెసెంట్లను ఇచ్చినప్పుడు క్రమేణా ఆందోళన స్థాయిలు పెరిగాయి.లైంగిక పరిపక్వతకు చేరుకున్న దశలో ఉన్న ఎలుకలకు ఇచ్చినప్పుడు అవి తక్కువ ఆందోళనను కనబరిచాయి. ఈ మందు ఇచ్చిన ఆడ ఎలుకల ప్రవర్తన, మెదడు నిర్మాణం, మైటోకాండ్రియా లేదా జన్యు వ్యక్తీకరణలలో మార్పులేమీ కనిపించలేదు. బహుశా ఇందుకు ఈస్ట్రోజెన్, ఇతర స్త్రీ హార్మోనుంచి రక్షణ లభిస్తుండవచ్చునని తెలిపారు. జెండర్ క్రోమోజోమ్లు, జన్యుపరమైన వ్యత్యాసాలపై మరింత అధ్యయనం జరిపితే దీనిపై నిర్ధారణకు అవకాశం ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు.అత్యంత సాధారణ ఔషధం‘ఫ్లూఆక్సిటిన్’ అనేది 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారికి, గర్భిణులకు చికిత్సపరంగా మంచి ఫలితాల కోసం ఇచ్చే అత్యంత సాధారణ ఔషధం. ప్రొజాక్, ఫ్లూడాక్ వంటి బ్రాండ్పేర్లతో ఇది లభిస్తోంది. అయితే దాని దీర్ఘకాలిక ప్రభావాన్ని అంచనా వేయడానికి మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది’ అని తాజా పరిశోధనా పత్రాన్ని సమర్పించిన ముఖ్య అధ్యయనకర్త ఉత్కర్షా ఘాయ్ అంటున్నారు. ఘాయ్ ముంబైలోని టి.ఐ.ఎఫ్.ఆర్. (టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్) లో పీహెచ్డి, బెంగళూరులోని నిమ్హాన్స్లో పోస్ట్డాక్టరల్ రీసెర్చ్ చేశారు. అధ్యయనం జరిగిన విధానంఫ్లూఆక్సిటిన్ తీసుకున్న తర్వాత.. సెక్సువల్ హార్మోన్లు క్రియాశీలకం కావడానికి ముందు, తర్వాత మెదడుపై ప్రభావాలను అధ్యయనం చేసేందుకు టి.ఐ.ఎఫ్.ఆర్. శాస్త్రవేత్తల బృందం ఎలుకల్ని రెండు జట్లుగా విభజించింది. ఒక జట్టు : ఎలుకలు 2 నుండి 21 రోజుల వయసున్నవి. ఇంకో జట్టు : 28–48 రోజుల వయసున్నవి. అప్పుడే పుట్టిన ఎలుకల్లో ఈ మందు వాడకంతో ఆందోళన క్రమంగా పెరిగింది. అదే రెండో జట్టు ఎలుకల్లో ఒత్తిడి, ఆందోళన స్వల్పంగా తగ్గాయి. ఈ అధ్యయన ఫలితాలను మానవుల్లోనూ అవే రెండు దశలుగా శైశవ దశ నుంచి శరీరంలో సెక్సువల్ హార్మోన్లు కనిపించే వయసు వరకు; టీనేజీ నుంచి 25 ఏళ్ల వరకు ఈ బృందం అన్వయించింది. సహాయకారిగా విటమిన్ బి3యాంటీడిప్రెసెంట్ల వాడటం వల్ల కొందరి మెదడుపై కనిపించే దుష్ప్రభావాలను తగ్గించేందుకు చేసిన అధ్యయనంలో భాగంగా ఈ బృందం విటమిన్ బి3 (నికోటినమైడ్)ని ఎలుకలకు ఇచ్చింది. ఆశ్చర్యకరంగా, పుట్టి కొద్ది రోజులే అయిన ఎలుకలలో గమనించిన అనేక ప్రతికూల ప్రభావాలు బి3 ప్రభావంతో ఉపశమించాయి. వాటి జీవక్రియ పునరుద్ధరణ జరిగింది. వాటి నిరాశ, నిస్పృహల ప్రవర్తనలలో గణనీయమైన తగ్గుదల కనిపించింది.దీంతో వైద్యులకు ఒక ఆశారేఖ దొరికినట్టయింది. తీవ్రమైన ఆందోళన, ఒత్తిడి ఉండి.. ఆత్మహత్య చేసుకోవాలనుకునే మానసిక స్థితి ఉన్న గర్భిణులకు ఎస్ఎస్ఆర్ఐలు తప్పనిసరిగా ఇవ్వాల్సి వస్తుంది. అలా ఇస్తే వాటి ప్రభావం పుట్టే పిల్లలపై పడుతుంది. కానీ, విటమిన్ బీ3 వాడితే... ఆ ప్రభావం తగ్గుతుందని ప్రస్తుత పరిశోధనల్లో కొంత వరకు తేలింది. ఇది గర్భిణులందరికీ గొప్ప శుభవార్తే. కాకపోతే పూర్తిస్థాయిలో పరిశోధనలు జరగాల్సి ఉంది. -
పైరసీ.. సినిమా చూపిస్తోంది!
⇒ సినిమా పైరసీ వల్ల తెలుగు చిత్ర పరిశ్రమకు గత ఏడాది రూ.3,700 కోట్ల నష్టం వాటిల్లిందని తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ వెల్లడించింది. ఒక్క తెలుగు సినీ పరిశ్రమకే ఈ స్థాయిలో నష్టం వాటిల్లితే.. మరి దేశవ్యాప్తంగా ఇతర భాషల చిత్రాల సంగతేంటి? పైరసీ నష్టాల నుండి బయటపడేందుకు చిత్ర నిర్మాతలు బీమా రక్షణను కోరుతున్నారు. బీమా సంస్థలు మాత్రం.. నష్టాలను లెక్కించడం, నిరూపించడం కష్టమంటూ బీమా కవరేజ్ ఇవ్వడానికి ఇష్టపడడం లేదు.⇒ పుష్ప–2, కల్కి 2898 ఏడీ, గేమ్ ఛేంజర్, తండేల్, సింగిల్.. మొన్నటికి మొన్న కన్నప్ప.. ఇలా చెప్పుకుంటూ పోతే పైరసీకి గురైన సినిమాల జాబితా పెద్దదే. ఈ ఏడాది మార్చిలో విడుదలైన సల్మాన్ ఖాన్ నటించిన సికందర్ చిత్రం లీక్ కావడంతో నిర్మాత రూ.91 కోట్ల నష్టాన్ని చవిచూశారన్న వార్తలు గుప్పుమన్నాయి. చిత్ర పరిశ్రమను పైరసీ భయం వెంటాడుతోంది. ప్రధానంగా పెద్ద బడ్జెట్ చిత్రాల విషయంలో నిర్మాతలు ఆందోళనగా ఉన్నారు. పైరసీ సంబంధ నష్టాల నుండి బయటపడేందుకు చిత్ర నిర్మాతలు బీమా రక్షణను కోరుతున్నారు. అయితే కవరేజ్ విషయంలో బీమా సంస్థలు వెనుకాడుతున్నాయని సినీ పరిశ్రమ చెబుతోంది.⇒ వ్యవస్థాగత మార్పులతో..: బీమా కవరేజ్పై ఆధారపడటం కంటే వ్యవస్థాగత మార్పుల ద్వారా పైరసీని ఎదుర్కోవాలని కొందరు నిర్మాతలు భావిస్తున్నారు. పైరసీ కవర్తో నష్టాలను తిరిగి పొందే బదులు కఠిన చట్టాలను తీసుకురావడం ద్వారా పైరసీని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నది వారి ఆలోచన. మరికొందరు మాత్రం పైరసీ కవర్తో నష్టం కొంతైనా పూడ్చుకోవచ్చని భావిస్తున్నారు.⇒ నిధుల సవాళ్లు ఉన్న సమయంలో పైరసీ కవర్ కోసం అదనపు ఖర్చు అనేది నిర్మాతలకు భారమయ్యే వ్యవహారమే. సినీ రంగానికి ‘పరిశ్రమ’ హోదా ఇవ్వడం వల్ల ఈ సమస్యలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది చిత్ర నిర్మాతలు పైరసీ ముప్పును పరిష్కరించడానికి ప్రత్యేక బీమా ఉత్పత్తుల కంటే ప్రధానంగా యాంటీ–పైరసీ అమలుపై ఆధారపడుతున్నారు. అంటే కాపీరైట్ కలిగిన కంటెంట్ను అనధికారికంగా వినియోగం, పంపిణీని అడ్డుకోవడానికి వ్యూహాలు, చర్యలను అమలు చేస్తున్నారు.⇒ రెండు ప్రధాన బీమాలు..: మన చలనచిత్ర పరిశ్రమలో ప్రధానంగా రెండు బీమాలు ఉన్నాయి. వీటిలో ఒకటి చిత్ర నిర్మాణం కోసం కాగా, మరొకటి పంపిణీ కోసం. నిర్మాణంలో ఆలస్యం; తారాగణం, సిబ్బంది అనారోగ్యం; పరికరాల నష్టం, ప్రొఫెషనల్ సేవల్లో లోపాలు తప్పులు లేదా నిర్లక్ష్యం కారణంగా క్లయింట్కు కలిగే ఆర్థిక నష్టాలకు ‘చలనచిత్ర నిర్మాణ బీమా’ కవరేజీని అందిస్తోంది. ఫిల్మ్ ప్రింట్లు, డిజిటల్ మాస్టర్స్ నష్టం, థియేటర్లలో విడుదల జాప్యం, వ్యాపార అంతరాయాలు, విడుదలకు ముందు లేదా డిజిటల్ విడుదల ప్రారంభ దశలలో లీక్ లేదా పైరసీ నుండి ఉత్పన్నమయ్యే నష్టాల నుండి ‘చలనచిత్ర పంపిణీ బీమా’ రక్షిస్తుంది.పైరేటెడ్ మూలాల నుండి..అధిక బడ్జెట్తో నిర్మాణాలు చేపట్టే స్టూడియోలు పైరసీ కవర్ కోసం బీమా సంస్థలను సంప్రదిస్తున్నాయి. సినిమా విడుదలకు ముందే కంటెంట్ లీక్ అవుతోందనే భయం నిర్మాతలు, నిర్మాణ సంస్థల్లో పెరుగుతోందని బీమా కంపెనీ ‘అలయన్స్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్’ చెబుతోంది. ‘మీడియా పార్ట్నర్స్ ఆసియా’ ఇటీవలి నివేదిక ప్రకారం.. పైరసీ అదుపు చేయకపోతే భారత్లో డిజిటల్ వీడియో పరిశ్రమకు ఆదాయ నష్టాలు ప్రస్తుత రూ.10,260 కోట్ల నుంచి 2029 నాటికి రెండింతలై రూ.20,520 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. కరోనా మహమ్మారి తర్వాత సబ్స్క్రిప్షన్ ఆదాయంలో 150 శాతం పెరుగుదల ఉన్నప్పటికీ.. దేశంలోని 51 శాతం మీడియా వినియోగదారులు పైరేటెడ్ మూలాల నుండి కంటెంట్ను వినియోగిస్తున్నారని ‘ఈవై–ఐఏఎంఏఐ’ రిపోర్ట్ వెల్లడించింది. బీమా కంపెనీలతో చర్చలు..ఈ నష్టం ఆదాయంపై ప్రభావం చూపడమే కాకుండా డిజిటల్ వీడియో పరిశ్రమ వృద్ధికి ఆటంకం కలిగిస్తోంది. ఉద్యోగ నష్టాలకు దారితీస్తోంది. ‘ఆదాయాలపై పైరసీ ప్రభావం చూపుతూనే ఉంది. సినిమా పంపిణీకి బీమాను ఎంచుకునేటప్పుడు.. పైరసీ నష్టాలు, నిరోధక చర్యలకు కూడా కవరేజ్ ఉండాలి’ అని నిర్మాతలు అంటున్నారు. సినిమా పైరసీ నుంచి రక్షణ పొందడానికి నిర్మాతలు, బీమా కంపెనీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. పైరసీకి కవరేజ్ అత్యవసరం అన్న డిమాండ్ పెరుగుతోంది. బీమా సంస్థలు మాత్రం పైరసీ నష్టాలకు బీమా కవరేజ్ చేయడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే నష్టాలను లెక్కించడం, నిరూపించడం కష్టం అనేది వాటి వాదన. -
అంతరిక్షంలో అతిథి
భూమి దిశగా గ్రహశకలాలు దూసుకొస్తూ అతిథుల్లా పలకరిస్తుంటాయి. అయితే ప్రచండ వేగంతో రావడంతో భూవాతావరణంలోకి రాగానే మండిపోయి మసైపోతాయి. కానీ దేదీప్యమానంగా వెలిగిపోయే తోకతో మెరుపువేగంతో దూసుకొచ్చే తోకచుక్క ఇందుకు మినహాయింపు. ఆకాశంలో కనిపించినంతసేపు కనువిందు చేయడం దీని ప్రత్యేకత. అలాంటి తోక చుక్క ఒకటి మన సౌరమండలంలోకి అతిథిగా వచ్చిందని నాసా శాస్త్రవేత్తలు తాజాగా ప్రకటించారు. దీనికి 3ఐ/అట్లాస్ అని నామకరణం చేశారు. చరిత్రలో ఇప్పటిదాకా సౌరకుటుంబం ఆవలి నుంచి వచ్చిన మూడో కొత్త తోకచుక్క ఇదేనని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చిలీలోని రియో హర్టాడో నగరంలో ఏర్పాటుచేసిన ఆస్ట్రరాయిడ్ టెరిస్ట్రియల్ –ఇంపాక్ట్ లాస్ అరైవల్ సిస్టమ్(అట్లాస్) సర్వే టెలిస్కోప్, అమెరికా శాన్డీగో కౌంటీలోని పాలమార్ అబ్జర్వేటరీ జ్వికీ టెలిస్కోప్లు ఈ తోకచుక్క రాకను జూలై ఒకటో తేదీన కనిపెట్టాయి. ధనస్సు రాశిగా పిలవబడే నక్షత్ర కూటమి వైపు నుంచి ఈ తోకచుక్క మన సౌరకుటుంబం దిశగా వచ్చిందని శాస్త్రవేత్తలు గుర్తించారు.భూమికెలాంటి ప్రమాదం లేదన్న సైంటిస్టులుప్రస్తుతం ఈ తోకచుక్క భూమికి 67 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఇంతదూరం నుంచి వెళ్తుండటంతో దీని కారణంగా భూమికి ఎలాంటి ప్రమాదం లేదని అధ్యయనకారులు తేల్చిచెప్పారు. ఈ తోకచుక్క తన మార్గంలో పయనిస్తూనే సూర్యుని సమీపంగా వెళ్లనుంది. ప్రస్తుతం ఇది సూర్యునికి 67 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్టోబర్ 30వ తేదీన ఆదిత్యునికి అతి దగ్గరగా వెళ్లనుంది. కేవలం 21 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి అది తన పథంలో దూసుకుపోనుంది. అంటే అంగారక గ్రహం కంటే కూడా ఇది సూర్యుని సమీపానికి వెళ్లనుంది. సెప్టెంబర్ నెల వరకు ఖగోళ ఔత్సాహికులు ఈ తోకచుక్కను టెలిస్కోప్ సాయంతో చూడొచ్చు. తర్వాత అది సూర్యుని ఆవలిదిశ వైపుగా వెళ్లడంతో భూమి మీద నుంచి తోకచుక్క సరిగా కనిపించకపోవచ్చు. మళ్లీ డిసెంబర్ తర్వాత కనువిందు చేయనుంది. గతంలో 2017లో ఒక తోకచుక్క, 2019లో మరో తోకచుక్క ఇలా మన సౌరకుటుంబంలోకి అలా అతిథులుగా వచ్చి ఇలా వెళ్లిపోయాయి. 1ఐ/ఓమువామూ, 2ఐ/బొరిసోవ్ తోకచుక్కల తరహాలోనే ఇది కూడా తోకచుక్కలకు సంబంధించిన మరింత వాస్తవిక సమాచారాన్ని అందించి వెళ్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొత్త తోకచుక్క కావడంతో దీని తోక పొడవు, వెడల్పుల వివరాలు ఇంకా తెలియలేదు. కొత్త తోకచుక్కను సీ/2025 ఎన్1 అనే పేరుతోనూ పిలుస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అసిడిటీ, గ్యాస్, అజీర్ణ సమస్యలున్నాయా?
అబ్బా.. గ్యాస్ ఎక్కువైంది. సోడా తాగాలితిన్నది అరిగి చావడం లేదు... హాజ్మోలా తీసుకు రాఅసిడిటీ ఎక్కువైపోతోంది. రోజుకో ట్యాబ్లెట్ వేసుకుంటున్నా’’ఇలాంటి డైలాగులు మీరు తరచూ వింటూనే ఉంటారు. ఆల్ ఈజ్ వెల్ అనుకుని మందులు, మాత్రలు మింగుతూ కాలం గడిపేస్తూంటారు. చిన్నవని తీసిపారేసే ఈ సమస్యలు కాలం గడిచేకొద్దీ ముదిరిపోయి రకరకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తూంటాయి. అప్పుడు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. బోలెడంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది కూడా. ఇలా కాకుండా.. అసలు రోగమే రాకుండా చూసుకోవడమే మేలు కదా? అందుకు ఏం చేయాలంటే..దేశంలో గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా నగర ప్రాంతాల్లో. వంద మంది నగరవాసుల్లో కనీసం 70 మంది ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అప్పుడప్పుడు సమస్యలు ఎదుర్కొనేవాళ్లు 59 మందైతే.. వారం రోజుల్లో 12 మంది, రోజూ నలుగురు జీర్ణకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మలబద్ధకం సమస్య 22 మందిని పీడిస్తూంటే.. దేశంలో ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య 14 లక్షలు!. ఈ సమస్యలన్నింటికీ తినే ఆహారం కారణమని, జీవనశైలి కూడా తోడ్పడుతుందని ఒకప్పుడు అనుకునేవాళ్లం కానీ.. ఇప్పుడు ఈ జాబితాలోకి ఇంకోటి వచ్చి చేరింది. గట్ మైక్రోబయోమ్!మన జీర్ణకోశంలో బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటివి కనీసం వెయ్యి రకాలు ఉంటాయి. తాజా పరిశోధనల ప్రకారం.. ఈ సూక్ష్మజీవుల వైవిధ్యత, సంఖ్యల్లో తేడా వస్తే అసిడిటీ మొదలుకొని కేన్సర్ వరకూ అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం... 60 శాతం మంది నగర వాసుల్లో నిశ్శక్తి, యాంగ్జైటీ, మూడ్ మారిపోవడం వంటి సమస్యలకు ఈ గట్ మైక్రోబయోమ్(gut microbiom) కారణం!. అందుకే ఇటీవలి కాలంలో మన జీర్ణకోశంలోని సూక్ష్మజీవులను బ్యాలెన్స్ చేసుకునేందుకు, ఉపయోగకరమైన వాటిని పెంచుకునేందుకు రకరకాల పద్ధతులు, అలవాట్లు ప్రచారంలోకి వచ్చాయి. తినే తిండిని మార్చితే..అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్న గట్ మైక్రోబయోమ్ సమస్యను సరి చేసుకోవడం చాలా సులువు కూడా. తినే ఆహారంలో చిన్న చిన్న మార్పుల ద్వారా కొన్ని నెలల్లోపే పూర్వస్థితికి చేరుకోవచ్చునంటున్నారు నిపుణులు. చేయాల్సిందిలా సింపుల్...పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే గింజలు, పప్పు ధాన్యాలు, పండ్లు కాయగూరలు తినడం. వీటివల్ల మన జీర్ణకోశంలోని ఉపయోగకరమైన బ్యాక్టీరియా వృద్ధి అవుతుంది.పెరుగు, మజ్జిగ, కెఫిర్ (పాలను కెఫీర్ గింజలతో కలిపి పులియబెట్టి తయారు చేసుకోవాలి), కిమ్చీ, కంబూచా వంటివి తీసుకోవడం వల్ల ఉపయోగకరమైన బ్యాక్టీరియా పెరిగేందుకు ఉపయోగపడుతుంది. వీటిని ప్రోబయాటిక్స్ అని పిలుస్తారు.వెల్లుల్లి, ఉల్లిపాయ, అరటికాయ, ఓట్స్ వంటివి జీర్ణకోశంలోని ఉపయోగకరమైన బ్యాక్టీరియా ఎదిగేందుకు ఉపయోగపడతాయి. ప్రీబయాటిక్స్ అన్నమాట.డార్క్ చాకొలెట్ (కనీసం 70 శాతం కోకో ఉన్నది), గ్రీన్ టీ, రకరకాల బెర్రీస్ వంటివాటిల్లో ఉండే పాలిఫినాల్స్ జీర్ణకోశంలోని సూక్ష్మజీవుల వైవిధ్యత పెరిగేందుకు దోహదపడతాయి. జీర్ణకోశం బ్యాలెన్స్ చేసుకోవడానికి ఆహారం మాత్రమే సరిపోదు. దీంతోపాటు రోజూ కనీసం ఏడు గంటలపాటు నిద్రపోవడం అవసరం. వీలైనంత వరకూ ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో మంట/వాపులు తగ్గిపోతాయి. ఫ్యాక్టరీల్లో తయారైన ఆహారం, చక్కెర, కృత్రిమ చక్కెరలు, మితిమీరిన మద్యపానం, ధూమపానాలు జీర్ణకోశం లోపలిపొరలను బలహీనపరుస్తాయి. తద్వారా చెడు బ్యాక్టీరియా పెరిగేందుకు కారణమవుతాయి. శరీరం, ఆరోగ్యం సహకరిస్తే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయండి. జీర్ణకోశాన్ని కాపాడే మ్యూకస్ ఎక్కువ ఉత్పత్తి అయ్యే అవకాశముంది. చివరిగా... అన్నింటికంటే ముఖ్యమైన విషయం... అవసరమైతే కానీ యాంటీబయాటిక్స్ వాడకూడదు. వీటివల్ల శరీరంలో ఉండే ఉపయోగకరమైన బ్యాక్టీరియా నశించిపోతుంది. :::గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
ఫస్ట్టైమర్లే విన్నర్లు!
బిహార్లో త్వరలో జరుగనున్న 18వ శాసనసభ ఎన్నికలకు రాజకీయ పార్టీలు అస్త్రశ్రస్తాలతో సిద్ధమవుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై దృష్టి పెట్టాయి. గెలుపు గుర్రాల కోసం అన్వేషణ కొనసాగుతోంది. సిట్టింగ్లతో పోలిస్తే ఓటర్లు కొత్త అభ్యర్థులకే పట్టం కట్టడం బిహార్లో ఆనవాయితీగా వస్తోంది. 2010, 2015, 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గమనిస్తే ఈ విషయం తేటతెల్లమవుతోంది. గత మూడు పర్యాయాలు అసెంబ్లీలో అడుగు పెట్టినవారిలో సగానికి పైగా ఎమ్మెల్యేలు మొదటిసారి పోటీ చేసి గెలిచినవారే కావడం విశేషం. విజేతల్లో ఫస్ట్టైమ్ ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉండడం బిహార్ ప్రత్యేకత అని చెప్పొచ్చు. అభ్యర్థులను వరుసగా రెండోసారి గెలిపించడానికి ఓటర్లు ఇష్టపడడం లేదు. కొత్త ముఖాలు 50 శాతానికి పైగానే.. బిహార్లో శాసనసభ స్థానాల సంఖ్య 243. 2010 ఎన్నికల్లో ఏకంగా 150 మంది మొదటిసారి విజయం సాధించారు. అంటే 61.7 శాతం మంది తొలిసారి అసెంబ్లీలో ప్రవేశించారు. 2015లో వీరి సంఖ్య కొంత తగ్గింది. 243 మందికి గాను 131 మంది తొలిసారి గెలిచారు. 53.9 శాతం మంది మొదటిసారి ఎమ్మెల్యేలు అయినవారు ఉన్నారు. 2020 ఎన్నికల్లో 127 మంది ఫస్ట్టైమ్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అసెంబ్లీ వీరి వాటా 52.3 శాతం. మొత్తానికి కొత్త ముఖాల సంఖ్య 50 శాతానికిపైగానే ఉండడం గమనార్హం. రెండోసారి కంటే మూడోసారి గెలిచిన వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉంది. ఈసారి ఎన్నికల్లోనూ ఇదే ధోరణి కొనసాగుతుందా? లేక ఓటర్లు మనసు మార్చు కుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది. సిట్టింగ్లకు కష్టకాలమే రాష్ట్రంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరోసారి పోటీచేసి నెగ్గడం గగనకుసుమంగా మారుతోంది. గత 20 ఏళ్లుగా వారి సక్సెస్ రేటు క్రమంగా పడిపోతోంది. 2005లో పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 71.4 శాతం మంది మళ్లీ గెలిచారు. 2010లో పోటీచేసినవారిలో కేవలం 55 శాతం మంది రెండోసారి ఎన్నికయ్యారు. 2015లో వీరి సంఖ్య 53.1 శాతానికి పడిపోయింది. 2020 ఎన్నికల్లో 48.6 శాతం మంది మరోసారి గెలిచారు. పాత ఎమ్మెల్యేలను పక్కనపెట్టి కొత్త నేతలకు ఓటర్లు పట్టం కడుతుండడం అశావహులకు వరం లాంటిదేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా యువత ఈ అవకాశం సది్వనియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎల్లుండే మెగా సునామీ?
పెను ఉత్పాతానికి మరో రెండు రోజులేనా? శనివారం (జూలై 5న) మెగా సునామీ విరుచుకుపడబోతోందా? జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య ప్రాంతాన్ని ముంచెత్తనుందా? ‘జపాన్ బాబా వాంగా’ పేరుతో ప్రసిద్ధురాలైన ర్యో తత్సుకీ జోస్యం నిజమైతే అక్షరాలా అదే జరగనుంది! ‘ద ఫ్యూచర్ ఐ సా (నేను దర్శించిన భవిష్యత్తు)’ పేరుతో రాసిన పుస్తకంలో ఆమె ఈ మేరకు ఎప్పుడో హెచ్చరించారు. దాంతో శనివారం నిజంగానే సునామీ వస్తుందా అంటూ ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఊపిరి బిగబట్టి మరీ ఎదురు చూస్తున్నారు. ఈ జోస్యానికి సంబంధించిన వార్తలు, చర్చోపచర్చలతో రెండు రోజులుగా ఇంటర్నెట్ అక్షరాలా హోరెత్తిపోతోంది. ‘జూలై5డిజాస్టర్’ ఇప్పుడు ఆన్లైన్లో యమా ట్రండింగ్లో ఉంది. ఈ భయాందోళనల నడుమ టోక్యో, సమీప ప్రాంతాల్లో విమాన తదితర ప్రయాణాలను జనం భారీగా రద్దు చేసుకుంటున్నారు. తత్సుకీ ఏం చెప్పారు? కరోనా ఉత్పాతాన్ని కూడా తుత్సుకీ ముందే ఊహించి చెప్పడం విశేషం! అప్పటినుంచీ ఆమె పేరు ప్రపంచమంతటా మార్మోగడం మొదలైంది. ఇక జూలై 5న వస్తుందని పేర్కొన్న సునామీ గురించి తన పుస్తకంలో 20 ఏళ్ల ముందే పేర్కొన్నారామె. ‘‘జపాన్, ఫిలిప్పీన్స్ నడుమ సముద్రగర్భం ఒక్కసారిగా బద్దలవుతుంది. ఆకాశహరŠామ్యలను తలదన్నేంత ఎత్తున అలలు ఎగిసిపడతాయి. లక్షలాది మందికి ప్రాణగండం’’ అంటూ వరి్ణంచారు. దాంతో ఇది కూడా నిజమవుతుందా అంటూ ఎక్కడ చూసినా అంతులేని ఉత్కంఠ రాజ్యమేలుతోంది. ఎవరీ తత్సుకీ? తత్సుకీ జపాన్కు చెందిన మాంగా ఆరి్టస్టు. ‘ద ఫ్యూచర్ ఐ సా (నేను దర్శించిన భవిష్యత్తు)’ ఆమె స్వయంగా చేత్తో రాసిన పుస్తకం. బ్రిటన్ యువరాణి డయానా మృతి, 2011లో జపాన్ను వణికించిన భూకంపం, సునామీ తదితరాలను అందులో ఆమె ముందుగానే పేర్కొన్నారు. అవన్నీ అక్షరాలా నిజమయ్యాయి కూడా. దాంతో గత శతాబ్దికి చెందిన బల్గేరియా మిస్టిక్, హీలర్ బాబా వంగా పేరిట ఆమెను ఇప్పుడంతా ‘జపనీస్ బాబా వంగా’ అంటూ కీర్తిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మనోళ్ల అక్రమ వలసలు తగ్గాయి
వాషింగ్టన్: ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో 10,300 మందికి పైగా భారతీయులు అక్రమంగా అమెరికా లోకి ప్రవేశిస్తూ పట్టుబడ్డారు. వైట్హౌస్ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ మేరకు పేర్కొంది. అయితే 2024తో పోలిస్తే భారతీయుల అక్రమ వలసలు 70 శాతం తగ్గినట్టు వెల్లడించింది. గతేడాది జనవరి– మే మధ్య 34,535 మంది భారతీ యులు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించే ప్రయత్నంలో పట్టుబడ్డారు. అంటే సగటున రోజుకు 230 మంది! 2025లో ఇది రోజుకు 69కి తగ్గింది. ట్రంప్ రెండోసారి గద్దెనెక్కాక ఇమిగ్రేషన్ నిబంధనల అమలును కఠినతరం చేయడమే ఇందుకు కారణమని ప్రభుత్వం తెలిపింది. అమెరికా లోకి ప్రవేశించడానికి ప్రయత్నించి పట్టుబడ్డ 10,382 మంది భారతీయుల్లో గుజరాత్కు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. ట్రంప్ తిరిగి అధికారంలోకి వస్తారని ఊహించే స్మగ్లింగ్ సిండికేట్ 2024 చివరి నుంచి తమ కార్యకలాపాలను తగ్గించిందని నివేదిక పేర్కొంది. ఈ ఏడాది ఇప్పటి దాకా ఏకంగా 6 లక్షలకు పైగా అక్రమ వలసదారులను అమెరికా సరిహద్దుల వద్ద అరెస్టు చేసింది. 2024లో ఇదే కాలంలో 12,33,959 మంది పట్టుబడ్డారు. పట్టుబడ్డ 10,382 మంది భారతీయుల్లో 30 మంది ఒంటరి మైనర్లున్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో 500 మందికి పైగా భారతీయ మైనర్లను అమెరికా అరెస్టు చేసింది. అనేక దేశాల నుంచి ఏటా వేలాది మంది తమ పిల్లలను అమెరికా–మెక్సికో, అమెరికా–కెనడా సరిహద్దులో వదిలి వెళ్తారు. వారికి అమెరికన్ పౌరసత్వం లభిస్తుందనే ఆశతో ఇలా చేస్తుంటారు. ఈ పిల్లలంతా 12–17 ఏళ్లు, అంతకంటే చిన్న వయసు వారని నివేదికలు చెబుతున్నాయి.పత్రాల్లేని వారు 2.2 లక్షలుడిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) 2024 ఏప్రిల్ నివేదిక ప్రకారం అమెరికాలో 2.2 లక్షల మంది భారతీయులు ఎలాంటి అనుమతి పత్రాలూ లేకుండా అనధికారికంగా నివసిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివకరూ 332 మంది భారతీయులను అమెరికా బహిష్కరించింది. అయినా ప్రమాదకరమైన డంకీ మార్గాల ద్వారా అమెరికాలోకి ప్రవేశించడానికి భారతీయులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కొన్నిసార్లు ప్రమాదకరమైన సముద్ర మార్గాల్లోనూ వెళ్తున్నారు. గత మే 9న కాలిఫోర్నియా తీరంలోని డెల్మార్ సమీపంలో జరిగిన పడవ ప్రమాదంలో 14 ఏళ్ల భారతీయ బాలుడు, అతని 10 ఏళ్ల అతని సోదరి మరణించారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
జిన్పింగ్ శకానికి తెర?
చైనాలో షీ జిన్పింగ్ శకం ముగిసిందా? పలువురు అధ్యక్షులకు పట్టిన గతే ఆయనకు కూడా పట్టనుందా? నెల రోజులుగా డ్రాగన్ దేశంలో జరుగుతూ వస్తున్న పలు అనూహ్య పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. మే 21 నుంచి జూన్ 5 దాకా జిన్పింగ్ రెండు వారాల పాటు ఆచూకీ లేకుండాపోయారు. అధికారిక కార్యక్రమాలు వేటిలోనూ పాల్గొనలేదు. కనీసం బహిరంగ వేదికలపై కూడా కన్పించలేదు. ఆయన చైనా పగ్గాలు చేపట్టిన గత 12 ఏళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి. దానికి తోడు అధ్యక్షుని గురించిన వార్తలను ప్రతి రోజూ ఫ్రంట్ పేజీల్లో విధిగా ప్రముఖంగా ప్రచురించే చైనా అధికార మీడియాలోఆ రెండు వారాల పాటు ఎక్కడా కనీసం ఆయన ప్రస్తావన కూడా రాలేదు! అధ్యక్షుని గైర్హాజరీపై ప్రపంచమంతా జోరుగా చర్చ జరిగినా చైనా ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. అధికారిక మీడియాలోనూ ఖండన వంటివి రాలేదు. చివరికి జూన్ 5 తర్వాత జిన్పింగ్ తిరిగి దర్శనమిచ్చినా ఆయనలో ముందున్న కళాకాంతులేవీ కన్పించలేదు. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకòÙంకోతో జరిగిన భేటీలో బాగా అనాసక్తంగా దర్శనమిచ్చారు. ‘‘జిన్పింగ్ బాగా నీరసించి, ఆరోగ్యంగా కన్పించారు’’ అని భేటీ తర్వాత బెలారస్ అధ్యక్షుని తరఫున వెలువడ్డ అధికారిక మీడియా ప్రకటన పేర్కొంది. దీనికి తోడు జిన్పింగ్కు భారీ స్థాయిలో ఉండే వ్యక్తిగత భద్రత కూడా కొద్దిరోజులుగా బాగా తగ్గిపోయింది. ఆయన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన మ్యూజియానికి అధికారిక హోదాను తొలగించారు. అంతేకాదు, ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో జిన్పింగ్ ఫోన్లో సంభాషించారు. దాన్ని గురించిన చైనా అధికార టీవీ సంస్థ ప్రసారం చేసిన వార్తా కథనంలో జిన్పింగ్ను ఎలాంటి హోదా లేకుండా సంబోధించడం విశేషం! అతి శక్తిమంతమైన డ్రాగన్ దేశాన్ని ఇనుప పిడికిలితో శాసిస్తూ వస్తున్న జిన్పింగ్కు పాలనకు నూకలు చెల్లాయనేందుకు ఇవన్నీ స్పష్టమైన సంకేతాలేనంటూ జోరుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పాలక కమ్యూనిస్టు పారీ్టలో నెలకొన్న తీవ్ర అంతర్గత విభేదాలు అంతిమంగా జిన్పింగ్ను తప్పించే దిశగా సాగుతున్నాయంటూ ప్రవాస చైనా మేధావులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. జిన్పింగ్కు ముందున్న అధ్యక్షుడు హూ జింటావో కూడా అధికారాంతానికి ముందు అచ్చం ఇలాగే కొతంకాలం పాటు అనూహ్యంగా కనబడకుండా పోవడం విశేషం. ఆ తర్వాత జిన్పింగ్ పగ్గాలు చేపట్టారు. అనతికాలంలోనే పార్టీలోని తన విరోధులు, వ్యతిరేకుల ఆట కట్టించి అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఇప్పుడు జిన్పింగ్కు కూడా అదే గతే పడుతోందంటూ ఆయన వ్యతిరేకులు సంబరపడిపోతున్నారు. నిజానికి జిన్పింగ్పై తిరుగుబాటుకు పథక రచన చేసింది, నిశ్శబ్దంగా తెర వెనక పావులు కదిపింది 82 ఏళ్ల జింటావోనే అని కూడా చెబుతున్నారు. ఇవేమీ నిజం కాదని, అధ్యక్షుడు తీవ్ర అనారోగ్యం పాలై చికిత్స పొందుతున్నారని మరో వాదన కూడా వినిపిస్తోంది. మొత్తానికి ఈ ఉదంతం ప్రస్తుతం అంతర్జాతీయంగా పెను కలకలం రేపుతోంది. బ్రెజిల్లోని రియో డిజనిరోలో శనివారం నుంచి జరగనున్న 17వ బ్రిక్స్ సదస్సుకు కూడా జిన్పింగ్ హాజరు కావడం లేదు. దీన్ని చైనా అధికారికంగా ధ్రువీకరించింది. మూడు రోజుల సదస్సుకు ఆయన బదులుగా ప్రధాని లీ కియాంగ్ భేటీలో పాల్గొంటారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ బుధవారం మీడియాకు వెల్లడించారు. దీనికి కారణం ఏమిటన్న ప్రశ్నలకు ఆమె సమాధానం దాటవేశారు. బ్రిక్స్ సదస్సుకు జిన్పింగ్ డుమ్మా కొడుతుండటం గత 12 ఏళ్లలో ఇదే తొలిసారి! ఈ పరిణామం ఆయన భవితవ్యంపై అనుమానాలను మరింతగా పెంచుతోంది. జాంగ్ హవా! అధ్యక్షుడు జిన్పింగ్ అధికార కమ్యూనిస్టు పార్టీకి ప్రధాన కార్యదర్శి మాత్రమే గాక సర్వశక్తిమంతమైన సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ)కి చైర్మన్ కూడా. అయితే ప్రస్తుతం చైనాలో అధికార వ్యవహారాలన్నీ సీఎంసీ వైస్ చైర్మన్ జనరల్ జాంగ్ యూక్సియా కనుసన్నల్లో నడుస్తున్నాయని చెబుతున్నారు. జిన్పింగ్ చైనా చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో వరుసగా మూడోసారి అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు సహకరించిన వారిలో జాంగ్ ముఖ్యుడు కావడం విశేషం! శక్తిమంతమైన 24 మందితో కూడిన కమ్యూనిస్టు పార్టీ పొలిట్బ్యూరోలో ఆయన సభ్యుడు. అంతేగాక పారీ్టలోని సీనియర్ సభ్యుల్లో అత్యధికులు ప్రస్తుతం జాంగ్కు దన్నుగా నిలిచినట్టు వార్తలొస్తున్నాయి. మాజీ అధ్యక్షుడు జింటావో అనుయాయులైన వారంతా జిన్పింగ్ను తొలినుంచీ లోలోపల వ్యతిరేకిస్తూ వస్తున్న వారేనని సమాచారం. నిజానికి సైనిక, ఆర్థిక తదితర కీలక వ్యవహారాల్లో కొన్నాళ్లుగా జిన్పింగ్ మాట సాగడం లేదని చెబుతున్నారు. అంతేగాక ఆయన అనుయాయులైన డజన్ల కొద్దీ సైనిక జనరళ్లు కొద్ది రోజులుగా అనూహ్యంగా మాయమవుతున్నారు. మరికొందరికి ఉన్నట్టుండి ఉద్వాసన పలికారు.వారసుడు వాంగ్! చైనా చైనా కమ్యూనిస్టు పార్టీ సారథిగా ఇటీవలే నియమితుడైన వాంగ్యాంగ్ త్వరలో జిన్పింగ్ స్థానంలో అధ్యక్షునిగా పగ్గాలు చేపడతారని వార్తలొస్తున్నాయి. టెక్నోక్రాట్ అయిన వాంగ్కు మృదు స్వభావిగా, మార్కెట్ శక్తుల అనుకూలునిగా పేరుంది. అందుకే సంస్కరణవాది అయిన నాయకునిగా కమ్యూనిస్టు పార్టీ ఆయనను దేశ నాయకత్వ బాధ్యతలకు సిద్ధం చేస్తోందని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆషాఢం.. వైవిధ్యం
ఆదివాసీ గిరిజన గూడేలు భిన్నమైన సంస్కృతులు, విభిన్నమైన సంప్రదాయాలు, ఆచారాలకు నిలయాలు. ఏటా ఈ గ్రామాల్లో నిర్వహించే ఆషాఢ మాస పండగకు ఎంతో ప్రత్యేకత ఉంది. పంటలు బాగా పండాలని, అందరూ బాగుండాలని.. ఎటువంటి అరిష్టం దరిదాపులకు రాకుండా ఉండాలని వేడుకుంటూ గ్రామ పొలిమేరల్లో శంకుదేవుడికి పూజలు చేస్తూ పూర్వీకుల ఆచార వ్యవహారాలను కొనసాగిస్తున్నారు. ముంచంగిపుట్టు: అల్లూరి జిల్లాలోని గిరిజన గ్రామాల్లో ఆదివాసీలు సంస్కృతీ సంప్రదాయాలకు ఎంతో విలువనిస్తారు. తూచ తప్పకుండా పాటిస్తారు. పూర్వీకులు చూపించిన దిశ నిర్దేశాన్ని నేటికీ ఆచరిస్తున్నారు. ఇదే కోవకు చెందినది ఆషాఢమాస పండగ. పూరీ జగన్నాథుని రథయాత్ర ముగిసిన తరువాత గ్రామపెద్దలు పండగ తేదీ నిర్ణయిస్తారు. ఈ ప్రకారం గ్రామాల్లో పండగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.అరిష్టాల నుంచి గట్టెక్కి.. ఆదివాసీ తండాల్లో పూర్వం అనేక రకాల ఇబ్బందులు ఎదురయ్యేవి. ముఖ్యంగా జూన్, జూలై నెలల్లో రైతులు పంటలు వేసుకునే సమయంలో దుక్కిటెద్దులు, పెంపుడు జంతువులు, అందరికీ ఆరోగ్య సమస్యలు ఎదురయ్యేవి. ఈ మాసంలో అరిష్టాలు ఎక్కువై ప్రాణ, ఆస్తి, పంట నష్టాలు సంభవించేవి. వీటి నుంచి బయటపడేందుకు ఆషాడ మాసంలో ఊరి పొలిమేర వద్ద మేక, కోడిని బలిదానం చేసి ప్రత్యేక పూజలు చేసేవారు. అప్పటి నుంచి అన్నీ నష్టాలు తొలగిపోతూ రావడంతో సంస్కృతీ సంప్రదాయాలను పాటిస్తున్నారు. తరాలు మారినా పూర్వీకుల ఆచార వ్యవహారాలను ఆచరిస్తున్నారు. ఏటా ఈ పండగ చేయడం వల్లే తమకు ఎంతో మేలు జరుగుతోందని ఆదివాసీలు చెబుతున్నారు. గ్రామ పొలిమేరలో.. గిరిజన గ్రామాల్లో పొలిమేరలోని రహదారి పక్కన ఆవు పేడతో అలికి శుద్ధి చేస్తారు. నాలుగు కర్ర పుల్లలతో పందిరి ఏర్పాటు చేసి శంకుదేవుడిని ప్రతిష్టిస్తారు. మామిడి ఆకులతో తోరణాలు కట్టి పందిరి కింద అరటి మొక్కను పాతుతారు. సాగుకు ఉపయోగించే కొత్త విత్తనాలను పందిరిపై చల్లుతారు. అలాగే మట్టితో కుండలు, ప్రమిదలు తయారు చేసి వాటిలో వత్తులు పెట్టి దీపం వెలిగిస్తారు. మట్టితో తయారుచేసి రెండు ఎద్దుల విగ్రహాలకు చెక్క, కర్రతో సిద్ధం చేసిన రెండు చక్రాల బండిని అమర్చుతారు. దీనిని పందిరి ఉత్తర దిక్కుకు పెడతారు. ఇళ్ల వద్ద పనికిరాని పాత తట్టలు, బుట్టలు, చేటలు, చీపుళ్లను తీసుకు వచ్చి దిష్టి తీస్తారు. ధూపదీప నైవేద్యాలతో పూజలు చేస్తారు. అనంతరం కోడి లేక మేకను బలి ఇస్తారు. మాంసాన్ని గ్రామంలో ప్రతి ఇంటికి కొద్ది కొద్దిగా పంచుతారు. ఇలా చేయడం వల్ల గ్రామంలో ఎటువంటి అరిష్టాలు ఎదురు కావని, పనులకు ఎటువంటి ఆటంకం లేకుండా సజావుగా జరుగుతాయని ఆదివాసీ గిరిజనుల నమ్మకం. ప్రస్తుతం గ్రామాల్లో పండగ ప్రారంభం కావడంతో సందడి నెలకొంది.దోషాలు పోతాయని మా నమ్మకం గ్రామాల్లో ఎటువంటి అరిష్టాలు కలగకుండా ఉండేందుకు ఆషాఢ మాస పండుగను ఏటా జరుపుకుంటున్నాం. జగన్నాథుని రథయాత్ర మొదలైన వారంలో ఈ పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. గ్రామ పొలిమేర వద్ద శంకుదేవుడికి పూజలు చేయడం వల్ల అన్ని దోషాలు పోయి మంచి జరుగుతుంది. – బొరిబొరి లచ్చన్న, గిరిజన రైతు, బొడిపుట్టు, ముంచంగిపుట్టు మండలంపూర్వీకుల నుంచి నిర్వహిస్తున్నాం పూర్వీకులు ఆచరించిన సంస్కృతీ సంప్రదాయాలను పాటిస్తూ వారి అడుగుజాడల్లో నడుస్తున్నాం. నాటి తరం నుంచి నేటి తరం వరకు ఈ ఆషాఢమాస పండగను జరుపుకుంటున్నాం. వ్యవసాయానికి, ఆరోగ్యానికి, గ్రామానికి ఎటువంటి నష్టం జరగకుండా ఈ పండగ నిర్వహిస్తున్నాం. – రెయ్యల మత్స్యరావు, గిరిజన రైతు,బొడిపుట్టు, ముంచంగిపుట్టు మండలం -
ఊరు.. బేజారు!
‘కొత్త బట్టలు ఎక్కడ్నుంచి తేవాలయ్యా...? అర్థం చేసుకోవేం? ఏడాదిగా శని పట్టుకుంది. ఎట్లా చెప్పాల్రా నీకు..?’ – తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో కుమారుడి ఎదుట వానపల్లి దుర్గాదేవి నిర్వేదం!‘నేనేం చేయనవ్వా? నన్నే తీసేశారు.. ఏడాదిగా దరిద్రాన్ని చూస్తున్నా..’ – జక్కంపూడి నగర్లో పెన్షన్ కోల్పోయిన 80 ఏళ్ల వృద్ధురాలి వద్ద మాజీ వలంటీర్ సయ్యద్ బాషా నిస్సహాయత!!‘పండగొస్తే గుండె దడ వస్తోంది. పైసా అప్పు కూడా పుట్టడం లేదు. చుట్టాలొస్తున్నారంటే భయమేస్తోంది. సంతోషంగా ఉన్న రోజు లేదు. ఊరంతా కలిసి పండగ చేసుకుని ఏడాది దాటింది...’ – అనపర్తి ఎస్సీ కాలనీలో లక్ష్మీ భవాని, కోటేశ్వరి ఆక్రోశం!‘అవును మరి.. తాపీగా కూసున్నా...! సెంద్రబాబు డబ్బులు పంపాడని...! వడ్లు కొని ఇరగదీశాడని...! మా ఆవిడ ఫ్రీ బసెక్కి ఊరెళ్లింది...ఇంటినిండా గ్యాస్ బండలున్నాయి..!’ – సింగగూడెం, లింగపాలెం దగ్గర గోదావరి జిల్లాల యాసలో గండుల సుబ్బారావు, పొట్టవూరు శ్రీనివాస్ వ్యంగ సంభాషణ!!వనం దుర్గాప్రసాద్ – ఉభయ గోదావరి జిల్లాల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : గోదారి పల్లెలంటే.. ఉప్పొంగే సంతోషాల పరవళ్లు! పచ్చని తోరణాల లోగిళ్లు! మర్యాదలతో అతిథులను ఉక్కిరిబిక్కిరి చేసే గోదారమ్మ తీరం ఏడాదిగా బావురుమంటోంది! పల్లె కళ తప్పింది. గత ప్రభుత్వ హయాంలో సాఫీగా సాగిన బతుకు బండి ఇప్పుడు గతుకుల బాటలో కూరుకుపోయి నరకం అనుభవిస్తోంది! వైఎస్ జగన్ పాలనలో ఏదో ఒక పథకం కింద నెలనెలా డబ్బులొచ్చేవి. అమ్మ ఒడి... విద్యా దీవెన.. వసతి దీవెన.. రైతు భరోసా... చేయూత... చేదోడు.. కాపునేస్తం... వాహన మిత్ర.. ఇలా ఒకదాని వెంట మరొకటిగా డబ్బులు అందేవి. పండుగలు వస్తే పేదలు సంతోషంగా జరుపుకొనేవారు. నెలకు సరిపడా సరుకులు ముందే తెచ్చుకునేవారు. స్కూళ్లు తెరవటమే ఆలస్యం.. పిల్లలకు యూనిఫాం, టై, బెల్ట్, బూట్లు, పుస్తకాలు.. విద్యా కానుక సిద్ధంగా ఉండేది! చేతిలో ట్యాబ్లతో పిల్లలు ఆత్మ విశ్వాసంతో ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లేవారు. టీడీపీ కూటమి సర్కారు ఏడాది పాలనలో అంతా తిరగబడింది! బతుకు బండి తలకిందులైంది!! మావోడు ఏమయ్యాడు..? ఊరితో బంధం తెగిందవ్వా..! కాళ్ల మండలం వేంపాడులో గ్రామ సచివాలయానికి వచ్చిన ఓ 60 ఏళ్ల అవ్వ ‘మావోడు ఏమయ్యాడయ్యా?’ అంటూ వలంటీర్ గురించి ఆరా తీసింది. ఇంటికే వచ్చేవాడు. పెన్ష¯న్Œ తెచ్చి ఇచ్చేవాడు. బిడ్డలా అండగా ఉండేవాడు.. అంటూ పేగు బంధమే తెగినంతగా బా«ధ పడింది. ఉండి దగ్గర ఉప్పులూరు గ్రామ వలంటీర్ కనిపించడంతో ఊరిలో వారంతా చుట్టూ చేరి ఆప్యాయంగా పలుకరించారు. ‘ఏమయ్యావ్ తండ్రీ..?’ అంటూ 80 ఏళ్ల లక్ష్మి ఆదుర్దాగా ఆరా తీసింది. మాసిన దుస్తులు, పెరిగిన గడ్డం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. రాజమహేంద్రవరంలో రోజూ కూలీకి వెళ్తున్నానని ఆ వలంటీర్ చెప్పాడు. ‘ప్రభుత్వం మారింది. మన ఊరితో బంధం తెగిందవ్వా..’ అంటూ కంట తడి పెట్టాడు. వీరవాసరం కొణితివాడలోనూ ఇదే సన్నివేశం. గణపవరం మండలం కొమ్మూరులో వలంటీర్ కోసం గ్రామస్తులు వాకబు చేస్తున్నారు. బడ్డీ కొట్టు బంద్.. కొవ్వూరు డివిజన్ పైడిమెట్ట, పోచారం, తాళ్లపూడి, బల్లిపాడు, చింతలపూడిలోని లింగపాలెం... ఇలా ఏ ఊరు చూసినా ఉసూరుమంటున్నాయి. ఆ పథకం... ఈ పథకం వచి్చందని, టీ కోసం నేను డబ్బులిస్తానంటే నేనిస్తానని పోటీ పడ్డ వాతావరణం ఇప్పుడు కానరావడం లేదు. బడ్డీ కొట్టు నరేష్ వ్యాపారం సాగక ఊరొదిలి వెళ్లాడు. ఊరందరికీ కూరలు అమ్మే సుజాత పట్నం చేరుకుంది. గ్రామంలో ట్యూషన్లు చెప్పే మాణిక్యం కాకినాడ కాలేజీలో అధ్యాపకుడిగా చేరాడు. పథకాలు వచ్చినన్నాళ్లు జనం చేతిలో డబ్బులుండేవి. పిల్లలకు ట్యూషన్లు చెప్పించేవాళ్లు! ఏడాదిగా పైసా రాకపోవడంతో గ్రామాల్లో గుబులు రేగుతోంది! చిన్న వ్యాపారాలు నడవడం లేదు. ఆటోవాలాలు డీలా పడ్డారు. ‘మేం టీడీపీనే... అయినా జగన్ పాలనే బాగుంది..’ ధర్మాజీ గూడెం వద్ద ఆటోవాలా నరేష్ తేల్చి చెప్పేశాడు! రైతుల ఆనందం ఆవిరి.. గోదావరి జిల్లాల్లో రైతన్న పరిస్థితి దయనీయంగా ఉంది. పంటలకు గిట్టుబాటు ధర లేదు.. ఈ ప్రభుత్వం దళారీల దయకు వదిలేసింది. ధాన్యం అమ్మితే డబ్బులివ్వకుండా తిప్పలు పెడుతోంది. తేమ శాతం అంటూ కోతలు పెడుతోంది. రైతు కూలీలకు పనులు లేవు. పట్టణాల్లో తాపీ పనులకు వెళ్తున్నారు. పిల్లల చదువులకు అప్పులే శరణ్యమయ్యాయి. వైఎస్ జగన్ పాలన సాగిన ఐదేళ్లూ స్వర్ణ యుగమని, ఇప్పుడు మాకు ఖర్మ పట్టుకుందని ఆవేదనగా చెబుతున్నారు. రైతుల ఆనందం ఆవిరైందని వ్యవసాయదారుడు సుబ్బారావు కండువాతో కన్నీళ్లు తుడుచుకున్నాడు. చెయ్యి తడిపితేనే అర్జీలు తీసుకునే పాడు రోజులు మళ్లీ దాపురించాయని చెప్పాడు.పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం కొమరాడకు చెందిన టైలర్ కృష్ణారావు ఏడాదిగా అష్ట కష్టాలు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు పథకాలు ఏవీ రాకపోవడంతో బట్టలు కుట్టించేందుకు తనవద్దకు ఎవరూ రావడం లేదని, గతంలో నెలకు రూ.15 వేలు సంపాదించిన తాను రూ.3 వేలు ఆర్జించడం కూడా గగనంగా ఉందని చెబుతున్నాడు. కుమార్తెను చదివించేందుకు అప్పులు చేయాల్సి వచ్చిందని, భీమవరం వస్త్ర దుకాణంలో సగం రోజులు కూలీకి వెళ్తున్నానని చెప్పాడు. ఆ దేవుడి దయే..! ఆ దేవుడే నాకు తిండి పెట్టే ఏర్పాటు చేశాడు.. పెన్షన్ మంజూరు చేశాడు (వైఎస్ జగన్ను తలచుకుంటూ...) వలంటీర్ ఇంటికొచ్చి పలకరించేవాడు. ఇప్పుడు పలకరించే దిక్కులేదయ్యా. ఊరే బావురు మంటోంది – జోగి రామలక్ష్మి, (జక్కంపూడి నగర్, తూ.గో)బంధం తెగిపోయింది ఇంటర్ వరకు చదివా. జగనన్న పుణ్యమా అని వలంటీర్గా చేరి ఊరందరి కష్టసుఖాలు తెలుసుకునే భాగ్యం దక్కింది. మీకు ఐదు వేలు ఏమిటి.. పదివేలు ఇస్తానన్న చంద్రబాబు మమ్మల్ని రోడ్డున పడేశారు. దీనికి బాధపడటం లేదు గానీ మా పల్లెతో బంధం తెగిపోయిందని ఏడుపొస్తోంది. – సయ్యద్ బాషా (మాజీ వాలంటీర్) -
శత్రు భీకర అపాచీలొస్తున్నాయ్
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ తన వైమానిక సామర్థ్యాన్ని మరింత పటిష్టం చేసుకుంటున్న తరుణంలో భారత వాయుసేనకు అమెరికా నుంచి తీపి కబురు అందింది. ఐదేళ్ల క్రితంనాటి ఒప్పందంలో భాగంగా తొలి దఫా అపాచీ యుద్ధ హెలికాప్టర్లను అందజేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అమెరికా నుంచి తెప్పిస్తున్న ఈ అధునాతన హెలికాప్టర్లు వచ్చాక వీటిని వాయుసేన దళాలకు అందించనున్నారు. పాకిస్తాన్ సరిహద్దు వెంట కీలక మిషన్లలో ఇవి పాలుపంచుకోనున్నాయి. దాదాపు రూ.5,140 కోట్ల ఒప్పందంలో భాగంగా భారత్కు అమెరికా ఆరు అపాచీ ఏహెచ్–64ఇ రకం యుద్ధ హెలికాప్టర్లను అందచేయాల్సి ఉంటుంది. 15 నెలల క్రితమే తొలి బ్యాచ్ హెలికాప్టర్లను డెలివరీ చేయాల్సిఉన్నా ఇంతవరకు అది ఆచరణలో సాధ్యంకాలేదు. ఎట్టకేలకు ఈనెలలోనే మూడింటిని అప్పజెప్పనున్నారు. వీటిని వెంటనే పాక్ సరిహద్దులో మోహరించనున్నట్లు తెలుస్తోంది. రవాణాకు సంబంధించిన 2024 మార్చిలోనే కొన్ని హెలికాప్టర్లను అందుకున్నా యుద్ధ హెలికాప్టర్ల అందజేత మాత్రం ఇన్ని నెలలుగా ఆలస్యమైంది. ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ కోర్కు తొలుత గత మే–జూన్లో ఇస్తామని అమెరికా ప్రకటించింది. తర్వాత ఈ గడువును పొడిగించింది. తర్వాత డిసెంబర్కల్లా ఇస్తామని తెలిపింది. ఆ గడువు కూడా ముగిసింది. ఇక 2025 జూన్లో ఇస్తామని ఇటీవల ప్రకటించింది. సరఫరా గొలుసులో అవాంతరాల కారణంగా భారత్కు అప్పగింత ఆలస్యమైందని అమెరికా వివరణ ఇచ్చింది. రెండో దఫా మూడు హెలికాప్టర్లను మరుసటి ఏడాదిలో అందజేయనున్నట్లు అమెరికా పేర్కొంది. పశ్చిమ సరిహద్దు వెంట భారత సైనికదళాల ప్రత్యేక ఆపరేషన్లలో నూతన తరం అపాచీ హెలికాప్టర్లు కీలక బాధ్యతలు నెరవేర్చనున్నాయి. వేగం, దాడి, లక్ష్య చేధనలో తిరుగులేని సామర్థ్యాలు నూతన హెలికాప్టర్ల సొంతం. కొత్త హెలికాప్టర్ల చేరికతో భారత అమ్ములపొది మరింత శక్తివంతంకానుంది. 2015నాటి ఒప్పందం ప్రకారం ఇప్పటికే 22 అపాచీ హెలికాప్టర్లను భారత వాయుసేన అందుకుంది. వీటికి తోడుగా అత్యంత శక్తివంతమైన, ఎటాక్ హెలికాప్టర్లు అత్యావశ్యకం కావడంతో ఇలా నూతన తరం ఏహెచ్–64ఇ కోసం భారత్ అమెరికాకు ఆర్డర్ ఇచ్చింది. మెరుపుదాడిలో దిట్ట→ 2012లో తయారుచేసిన ఏహెచ్–64డీ బ్లాక్–3ని మరింత ఆధునీకరించి ఏహెచ్–64ఈ గార్డియన్గా రూపాంతరీకరించారు.→ గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. గరిష్టంగా ఏకధాటిగా 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.→ గరిష్టంగా 16 హెల్ఫైర్ రకం చిన్న క్షిపణులు, 2.75 అంగుళాల వ్యాసముండే 76 రాకెట్లు, వందల బుల్లెట్ల వర్షం కురిపించే 30 ఎంఎం బుల్లెట్ చైన్ ఇందులో అమర్చారు.→ గరిష్టంగా 10,543 కేజీల బరువులను మోసుకెళ్లగలదు. నిమిషానికి 2,800 అడుగుల ఎత్తుకు ఎగరగలదు.→ గరిష్టంగా 20,000 అడుగుల ఎత్తు వరకు ఎగరగలదు→ నూతన తరం హెలికాప్టర్లో జాయింట్ టాక్టిక్ ఇన్ఫర్మేషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఒకేసారి నిరాటంకంగా భిన్నరకాల సైనిక వ్యవస్థలతో ఇది అనుసంధానమవుతుంది. అంటే క్షిపణిని ప్రయోగించి మిస్సైల్ లాంచర్, భూస్థిర రాడార్లు, కమాండర్ కంట్రోల్ సెంటర్లు, తోటి హెలికాప్టర్లు, యుద్ధ విమానాలతో ఇది అనుసంధానమై ఉంటుంది.→ కమ్యూనికేషన్, నావిగేషన్, సెన్సార్, దాడికి సంబంధించి అధునాతన టెక్నాలజీతో దీనిని రూపొందించారు.→ తాను సేకరించిన డేటాను, శత్రుజాడను రెప్పపాటు కాలంలో సైనిక స్థావరాలు, వ్యవస్థలకు చేరవేసి అప్రమత్తంచేస్తుంది. తనపై దాడికి తెగబడే శత్రు హెలికాప్టర్లు, భూ స్థిర స్థావరాలపై బుల్లెట్ల వర్షం కురిపించగలదు.→ ఇన్ఫ్రారెడ్ లేజర్ సాంకేతికతతో వర్షం వంటి అననుకూల పరిస్థితుల్లోనూ లక్ష్యాన్ని వేగంగా, సులభంగా గుర్తించి దాడి చేయగలదు→ టీ700– జనరల్ ఎలక్ట్రిక్701డీ రకం శక్తివంతమైన ఇంజిన్లు ఇందులో ఉంటాయి. అధునాతన రెక్కల కారణంగా ఇది చాలా వేగంగా నిట్టనిలువుగా గాల్లోకి ఎగరగలదు. → అన్ని రకాల డ్రోన్ల నుంచి సీ, డీ, ఎల్, కేయూ బ్యాండ్ల ద్వారా వీడియో డేటాను తెప్పించుకుని విశ్లేషించి కమాండ్ సెంటర్కు చేరవేయగలదు→ వీటిలో ఇంధన ట్యాంక్ కూడా పెద్దది. దీంతో ఎక్కువ సేపు శత్రువుతో పోరాడేందుకు ఇది ఎంతో అనువైంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఓ-1 రూట్లో యూఎస్కు!
అగ్ర రాజ్యంలో ఉద్యోగం చేయాలన్నది లక్షలాది మంది కల. యూఎస్ వర్క్ వీసా పొందడం ఆషామాషీ కాదు. ఈ వీసా కోసం సుదీర్ఘ కాలం వేచి ఉండడం, వలసలపై ట్రంప్ ప్రభుత్వ కఠిన చర్యలు.. వెరసి అమెరికాలో ఉద్యోగ అవకాశాలను కోరుకునే నిపుణులకు ఓ–1 వీసా ప్రత్యామ్నాయంగా అవతరిస్తోంది. స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం), కళలు, విద్య, వ్యాపారం, అథ్లెటిక్స్, సినిమా, టెలివిజన్ రంగంలో ‘అసాధారణ సామర్థ్యం‘ కలిగిన వ్యక్తులకు తాత్కాలిక నివాసం కోసం ఈ ప్రత్యేక నాన్–ఇమ్మిగ్రెంట్ వీసా జారీ చేస్తారు. తీవ్ర పోటీ ఉన్న హెచ్–1బీ వీసాకు ప్రత్యామ్నాయంగా ఓ–1 వీసా వినుతికెక్కుతోంది. అయితే లాటరీ లేకుండానే వీసా పొందే అవకాశం ఉండడం అభ్యర్థులకు కలిసి వచ్చే అంశం. – సాక్షి, స్పెషల్ డెస్క్జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు; చలనచిత్రం, టెలివిజన్ పరిశ్రమలో అసాధారణ విజయాల రికార్డు ద్వారా.. అసాధారణ సామర్థ్యాన్ని ప్రదర్శించే వ్యక్తులకు యూఎస్లోకి ఓ–1 వీసా తాత్కాలిక ప్రవేశాన్ని అందిస్తోంది. ఈ వీసా పొందాలంటే దరఖాస్తుదారులు ప్రముఖ అవార్డులు, విద్య పరిశోధన ప్రచురణలు, వారున్న రంగానికి చేసిన సేవల వంటి ఎనిమిది కఠిన ప్రమాణాలలో కనీసం మూడింటిని కలిగి ఉండాలి.కఠిన పరిశీలన కారణంగా కేవలం 37 శాతం మాత్రమే దరఖాస్తులు ఆమోదం పొందుతున్న హెచ్–1బీ వీసా మాదిరిగా కాకుండా.. అధిక నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులు వ్యవస్థాగత అడ్డంకులను దాటడానికి ఓ–1 వీసా వీలు కల్పిస్తోంది. అర్హతల విషయంలో ఇది దరఖాస్తుదారులకు మరింత సౌలభ్యాన్ని అందిస్తోంది. ఈ వీసా పొందాలంటే కనీస జీతం లేదా అధికారిక డిగ్రీ అవసరం లేదు. సాధించిన విజయాలకు రుజువుగా అంతర్జాతీయ అవార్డులు, మీడియా కవరేజీ పొందుపరిస్తే చాలు.మూడవ స్థానంలో మనమే..: ఓ–1 వీసాలు పొందిన దేశాల జాబితాలో గ్రేట్ బ్రిటన్, బ్రెజిల్ తర్వాత మూడవ స్థానంలో భారత్ నిలిచింది. 2022–23లో భారతీయులు 1,418 ఓ–1 వీసాలు దక్కించుకున్నారు. అధిక నైపుణ్యం కలిగిన విదేశీ ప్రతిభను ఆకర్షించడానికి, కొనసాగడానికి టెక్నాలజీ కంపెనీలు దృష్టిసారించాయి. అమెరికా ప్రస్తుతం భారీగా నిపుణుల వేటలో ఉంది. ప్రధానంగా ఏఐ నిపుణుల అవసరం పెరిగింది. దీంతో విదేశీ పరిశోధకులు, ఇతర అధిక నైపుణ్యం కలిగిన నిపుణులకు డిమాండ్ను పెంచుతోంది. వీరిలో అత్యధికులు యూఎస్లోకి సులభ మార్గాన్ని ఓ–1 వీసా అందిస్తుందని భావిస్తున్నారు.చాలా ఖరీదు... ఓ–1 వీసా దరఖాస్తు సాధారణంగా హెచ్–1బీ వీసా దరఖాస్తు కంటే చాలా ఖరీదైనది. దీని ఖర్చులు 10,000–30,000 డాలర్ల వరకు ఉంటాయి. హెచ్–1బీ ఫీజుల కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ అన్నమాట. కానీ సక్సెస్ రేట్ 93 శాతం ఉంది. తొలుత గరిష్టంగా మూడేళ్ల వరకు యూఎస్లో నివాసానికి అనుమతిస్తారు. అసాధారణ సామర్థ్యాన్ని ప్రదర్శించడం కొనసాగించినంత వరకు సంవత్సర కాల పరిమితితో అభ్యర్థి కోరినన్నిసార్లు గడువు పొడిగిస్తారు. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అధికారిక డేటా ప్రకారం మంజూరైన ఓ–1 వీసాల సంఖ్య 2019–20లో 8,838 మాత్రమే. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య రెండున్నర రెట్లకుపైగా పెరిగింది.దిగ్గజ కంపెనీల క్యూ..గూగుల్, ఓపెన్ ఏఐ, టెస్లా, మెకిన్సే వంటి దిగ్గజ కంపెనీలు భారత్ నుండి కొత్త ప్రతిభను ప్రోత్సహించడానికి రెడీ అయ్యాయి. ఈ కంపెనీలు సేవలందిస్తున్న రంగాల్లో బాగా స్థిరపడిన అభ్యర్థులను వారి యూఎస్ ప్రధాన కార్యాలయానికి ఆకర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. హార్వర్డ్, యేల్, కొలంబియా వంటి అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు ఎల్లప్పుడూ ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ అధ్యాపకులను, పరిశోధకులను నియమించునే పనిలో ఉంటున్నాయి.ఏటా పెరుగుతున్నాయ్..హెచ్1–బీతో పోలిస్తే ఓ–1 వీసాల సంఖ్య తక్కువగా ఉంది. 2023–24లో మొత్తం 2,25,957 హెచ్1–బీ వీసాలకు ఆమోద ముద్రపడింది. ఓ–1 వీసాల విషయంలో ఈ సంఖ్య 22,669 మాత్రమే. హెచ్1–బీ డిమాండ్ తగ్గుతున్న ధోరణిలో ఉన్నప్పటికీ.. ఓ–1 వీసాలు సంవత్సరానికి దాదాపు 10% పెరుగుతున్నాయి. ఓ–1 వీసాలకు అయ్యే ఖర్చు ఎక్కువైనప్పటికీ కంపెనీలు, వ్యక్తులు ఇప్పటికీ ఇంత పెద్ద మొత్తం వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నారు. -
డబ్బులు వచ్చిపడుతున్నాయ్!
రూ.11.6 లక్షల కోట్లు.. ప్రపంచంలోని వివిధ దేశాల్లోని భారతీయులు 2024–25లో మనదేశానికి పంపిన డబ్బులివి. ఇలా అందుకున్న మొత్తం పరంగా ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో నిలిచి ఔరా అనిపించింది. ఈ స్థాయిలో నగదు వెల్లువెత్తడం ఇదే తొలిసారి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మించి రెమిటెన్స్లు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. దేశాల పరంగా చూస్తే అత్యధికంగా యూఎస్ నుంచి రెమిటెన్స్ల వరద పారుతోంది. -సాక్షి, స్పెషల్ డెస్క్విదేశాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ మనదేశంలోని తమ వాళ్లకు డబ్బులు పంపే భారతీయులు కోటిన్నరకు పైగానే ఉంటారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ దేశాలలోని స్వదేశీయుల నుంచి భారత్కు బట్వాడా అయిన స్థూల నగదు విలువ 135.46 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.11.6 లక్షల కోట్లకుపైనే) చేరుకుందని భారతీయ రిజర్వు బ్యాంకు విడుదల చేసిన తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు వచ్చిన మొత్తాల్లో ఇదే అత్యధికమని, మునుపటి ఆర్థిక సంవత్సరం కంటే 14 శాతం ఎక్కువని కూడా ఆర్బీఐ పేర్కొంది. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం.. 2023–24లో ఇలా అత్యధిక మొత్తం అందుకున్న దేశం మనదే.ఆ మూడు దేశాల నుంచే...నిజానికి భారత్ ఒక దశాబ్దానికి పైగానే దేశాలన్నిటి కంటే అధిక మొత్తంలో నగదు చెల్లింపులను అందుకుంటోంది. గత ఎనిమిదేళ్లలో భారత్కు ఈ నగదు ప్రవాహం రెట్టింపు అయింది. 2016–17లో మన దేశానికి అందిన నగదు మొత్తం 61 బిలియన్ డాలర్లు మాత్రమే. కాగా, గత ఆర్థిక సంవత్సరంలో రెట్టింపునకుపైగా వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న పరిణామాలు, యుద్ధ వాతావరణం, ముడి చమురు ధరలు బలహీనంగా ఉన్నప్పటికీ ఎన్నారైలు స్వదేశానికి పంపుతున్న నగదు మొత్తాలు మాత్రం ఏటా పెరుగుతూ ఉండటం గమనార్హం. అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూకే.. ఏటా భారత్కు బట్వాడా అవుతున్న నగదు మొత్తంలో ఈ మూడు దేశాల నుంచే దాదాపు 60 శాతం మనదేశానికి వస్తోంది. ఇదే సమయంలో జి.సి.సి. (గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్) దేశాల నుంచి వస్తున్న నగదు స్వల్పంగా తగ్గుతోంది. (ఆధారం : ఆర్బీఐ)ప్రధానంగా ఇంటి ఖర్చులకేప్రపంచ బ్యాంకు డేటా ప్రకారం కూడా ఇండియానే ఎక్కువ నగదును పొందుతున్న దేశంగా ఉంది. 2024లో మెక్సికో 68 బిలియన్ డాలర్ల అంచనా మొత్తంతో రెండవ స్థానంలో, చైనా 48 బిలియన్లతో మూడవ స్థానంలో ఉంది. భారత్కు ప్రధానంగా వివిధ దేశాలకు వెళ్లిన స్వదేశీయుల నుంచే నగదు అందుతోంది. ఇలా దేశాలకు బట్వాడా అయే నగదు మొత్తాలను అంతర్జాతీయ ద్రవ్య నిధి రెండు రకాలుగా వర్గీకరించింది. ఒకటి ప్రాథమిక ఆదాయ ఖాతా కింద ఉద్యోగులు తమ సంపాదన నుంచి ఇళ్లకు పంపిస్తున్నవి, రెండు.. ద్వితీయ ఆదాయ ఖాతా కింద వ్యక్తిగత మొత్తాల బదిలీలు (ఉదా: విరాళాలు, నగదు సహాయాలు వగైరా..) భారత్ విషయంలో – నగదు బట్వాడాలు అన్నవి ప్రధానంగా విదేశాలలో నివసిస్తున్న భారతీయ ఉద్యోగులు, కార్మికుల నుంచి కుటుంబ నిర్వహణ కోసం అందుతున్నవేనని ఆర్బీఐ 2025 మార్చిలో తన నెలవారీ బులెటి¯Œ లో పేర్కొంది.పెట్టుబడుల కంటే ఎక్కువ!నగదు బదిలీ ఖర్చులు తక్కువగా ఉండే దేశాలలో భారత్ నేటికీ ఒకటిగా కొనసాగుతోందని ఆర్బీఐ డేటా వెల్లడించింది. ‘భారత్కు అందుతున్న నగదు మొత్తం భారత్కు వస్తున్న స్థూల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కంటే ఎక్కువగా ఉంది. దాంతో బయటి నుంచి వచ్చే నగదు భారత్కు ఒక స్థిరమైన వనరు అయింది’ అని ఆర్బీఐ సిబ్బంది సర్వే నివేదిక పేర్కొంది. అంతేకాకుండా, ఆ మొత్తాలు భారతదేశ వాణిజ్య లోటు నిధుల భర్తీలో ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో స్థూల నగదు ప్రవాహం దేశంలోని 287 బిలియన్ల వాణిజ్య లోటులో దాదాపు సగంగా (47 శాతం) ఉంది. -
పక్షులకూ భూతాపం సెగలు
ఆచార వ్యవహారాలు, సంస్కృతికి పట్టు గొమ్మ ల్లాంటి పల్లెటూర్లలో ఉదయం వెచ్చటి సూర్య కిరణ కాంతులు ఎంతటి హాయి గొల్పుతాయో అక్కడి పక్షుల కిలకిలారావాలు అంతకంటే ఎక్కువగా మనల్ని మైమరపింపజేస్తాయి. ఎలాంటి బాదరబందీలేకుండా స్వేచ్ఛగా విహరించే అలాంటి పక్షిజాతులకు ఇప్పుడు మానవ తప్పిదాలు శాపంగా మారుతున్నాయి. శిలాజ ఇంధనాల విచ్చలవిడి వినియోగం, ఇష్టారీతిన సాగుతున్న మానవ కార్యకలాపాలు, పరిశ్రమల కాలుష్యం, అడవుల నరికివేత తదితరాలతో భూగోళం మండిపోతోంది. భూతాపోన్నతి ఏటికేడు పైకి పోతోంది తప్ప కిందకు దిగిరావట్లేదు.ఈ వాతావరణ మార్పుల దుష్ప్రభావాలు ఇప్పుడు పక్షులపై పడ్డాయి. అన్నెంపున్నెం ఎరుగని పక్షులను వాతావరణమార్పుల మాటున పరోక్షంగా మానవుడు చేజేతులా చంపేస్తున్నాడన్న కఠోర వాస్తవాలు తాజాగా వెలుగుచూశాయి. వాతావరణ మార్పుల కారణంగా 500కుపైగా పక్షిజాతులు త్వరగా అంతరించిపోయే ప్రమాదపుటంచునకు చేరుతున్నాయని తాజా అధ్యయనం ఒకటి కుండబద్దలు కొట్టింది. ఇంగ్లండ్లోని బెర్క్షైర్లోని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్ పరిశోధకులు చేసిన అధ్యయనం ప్రకారం అడవుల నరికివేత కారణంగా తమ సహజ ఆవాసాలను కోల్పోతున్న వందలాది పక్షిజాతులు వచ్చే వందేళ్లలో కనుమరుగవడం ఖాయమని పరిశోధకులు తేల్చిచెప్పారు. మూడు రెట్లు పెరిగిన ముప్పుగతంలోనూ వ్యాధులు ప్రబలడం, సహజావరణంలో ఆహారం, అస్తిత్వం కోసం పోటీ, కొత్త ప్రాంతాలకు వలసలు.. ఇలా పలు కారణాల కారణంగా కొన్ని పక్షిజాతులు అంతర్థానమయ్యాయి. అయితే 1500 సంవత్సరం నుంచి చూస్తే నాడు అంతరించిపోయిన పక్షిజాతుల కంటే ఇప్పుడు వాతావరణ మార్పులు, అడవుల నరికివేత కారణాలతో అంతర్థానమవుతున్న పక్షిజాతుల సంఖ్య మూడు రెట్లు ఎక్కువగా ఉందని పరిశోధకులు ఆందోళన వ్యక్తంచేశారు. సంబంధిత పరిశోధనా తాలూకు వివరాలు ‘నేచర్ ఎకోలజీ అండ్ ఎవల్యూషన్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి.ఒంటె మెడ గొడుగు పక్షి, హెల్మెటెడ్ హార్న్బిల్ వంటి ప్రఖ్యాత పక్షిజాతులు సైతం అంతరించిపోయే ప్రమాదముంది. ‘‘ ఇప్పటికే పరిస్థితి చేయిదాటి పోయిందనే చెప్పాలి. అడవుల నరికివేత, వేటను ఆపడంతోపాటు వాతావరణ మార్పులకు అడ్డుకట్టవేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇప్పుడు మరింతగా శ్రమించాల్సి ఉంది. ప్రత్యేకంగా ఈ జాతి పక్షులను పెంచి వీటి సంతతిని వృద్ధి చేయాలి. బ్రీడింగ్ విధానాలను అమలుచేయాలి’’ అని పరిశోధనలో కీలక రచయిత కెర్రీ స్టీవార్ట్ వ్యాఖ్యానించారు. విస్తృతస్థాయిలో పరిశోధనవాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావం ఏఏ జాతి పక్షులపై అత్యధికంగా ఉందనేది నిర్ధారించుకునేందుకు పరిశోధకులు పెద్ద కసరత్తే చేశారు. అంతరించిపోయే ప్రమాదమున్న శిలీంధ్రాలు, మొక్కలు, జంతువులు, పక్షుల జాబితాను తెప్పించి అందులోని 10,000కుపైగా పక్షిజాతులపై సమగ్రస్థాయిలో అధ్యయనం చేశారు. ముఖ్యంగా వాతావరణ మార్పు ప్రభావాలకు లోనయ్యే పెద్ద రెక్కల పక్షులపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. పెద్ద రెక్కల పక్షులు ఎక్కువగా వేటగాళ్ల బారిన పడుతున్నాయి. ఈ పక్షులుండే అటవీ ప్రాంతాలు సైతం గనుల తవ్వకం, నూతన పరిశ్రమల ఏర్పాటు వంటి కారణాలతో కనుమరు గవుతు న్నాయి. ‘‘ ఆధునిక ప్రపంచంలో పక్షిజాతుల అంతర్థానం అనేది మరో అతిపెద్ద ముప్పు.అరుదైన, అంతర్థానమవుతున్న పక్షిజాతుల సంరక్షణ ఇప్పుడు తక్షణావసరం’’ అని స్టీవార్ట్ అన్నారు. ‘‘ అడవి బాగుండాలంటే పక్షులు ఉండాలి. పక్షులు అడవికి ఎంతో మేలుచేస్తాయి. వందల వేల రకాల చెట్ల పళ్లను తిని గింజలను విస్తారంగా పడేస్తాయి. తద్వారా అడవి అంతటా అన్ని రకాల మొక్కలు పుట్టుకొస్తాయి. రోజు లెక్కలేనన్ని కీటకాలను తిని పురుగుల అతి బెడదను నివారిస్తాయి. ఆకుల్ని, పూతను తిని చెట్లను నాశనంచేసే చిన్న కీటకాలను పక్షులు వేటాడి ఆయా ప్రాంతాల్లో చెట్లను పరోక్షంగా కాపాడతాయి. చిన్న పక్షులు చెట్ల పరపరాగ సంపర్కానికీ దోహదపడి పూత, కాతకు కారణమవుతాయి.అడవిలో ఆహారచక్రం సవ్యంగా ముందుకు సాగాలన్నా పక్షులు ఉండాల్సిందే. ఇంతటి కీలకమైన వందలాది పక్షిజాతులు కనుమరుగైతే జరిగే జీవావరణ నష్టాన్ని పూడ్చడం అసాధ్యం. అందుకే తక్షణం అడవుల అనవసర నరికివేతకు స్వస్తి పలకాలి. వేటగాళ్ల ఆగడాలను అడ్డుకోవాలి. అరుదైన పక్షులను ప్రత్యేకంగా పెంచి వాటి సంతతిని వృద్ధి చెందించాలి’’ అని పరిశోధనలో మరో సీనియర్ రచయిత్రి, ప్రొఫెసర్ మాన్యులా గోంజాల్వెజ్ సారెజ్ చెప్పారు. -
వచ్చేస్తోంది మన బాహుబలి
న్యూఢిల్లీ: ఇరాన్లోని ఫోర్డో భూగర్భ యురేనియం శుద్ధి కర్మాగారాలపై అమెరికా వేల కేజీల బరువైన బంకర్ బస్టర్ బాంబులను పడేసి విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో తమ అమ్ముల పొదిలోనూ అలాంటి బాహుబలి బాంబులు ఆత్యావశ్యకమని భారత సైన్యం భావించింది. అనుకున్నదే తడవుగా ఆ దిశగా రంగం సిద్ధంచేసిందని వార్తలొచ్చాయి. ఈ వార్తలను నిజం చేస్తూ భారత రక్షణ, పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) ఒక కొత్త విషయాన్ని ప్రకటించింది. అత్యంత శక్తివంతమైన అగ్ని–5 ఖండాంతర క్షిపణికి బంకర్ బస్టర్ బాంబును మోసే సామర్థ్యాన్ని ఆపాదిస్తూ మిస్సైల్ను మరింత ఆధునీకరిస్తున్నట్లు డీఆర్డీఓ ప్రకటించింది. ఆపరేషన్ సిందూర్ వేళ పాకిస్తాన్లోని కిరానా హిల్స్లోని భూగర్భ అణుకేంద్రంపై భారత వాయుసేన బాంబులు పడేసిందన్న వార్తల నడుమ అధునాతన బంకర్ బస్టర్ బాంబు తయారీకి ఏర్పాట్లు జరుగుతుండటం విశేషం. ఏకంగా 100 మీటర్లు నేలలోకి చొచ్చుకుపోయేలా..అగ్ని–5 ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్కు అత్యంత బరువైన వార్హెడ్ను మోసుకెళ్లేలా మార్పులు చేయబోతున్నట్లు డీఆర్డీవో తెలిపింది. తొలుత రెండు వేరియంట్లలో ఈ కొత్త మిస్సైల్ను తయారుచేస్తారు. ఆకాశం నుంచి లక్ష్యంమీదకు జారవిడిచాక అది నేలలో ఏకంగా 100 మీటర్ల లోతు వరకు చొచ్చుకుపోయేలా డిజైన్ చేస్తున్నారు. అవసరమైతే శత్రు భూగర్భ అణుకేంద్రాలను భూస్థాపితం చేయాల్సిందేనని ఇరాన్–అమెరికా ఉదంతం నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని భారత్ తలపోస్తోంది. అందులో భాగంగానే బంకర్ బస్టర్ బాంబులతో సంప్రదాయక క్షిపణులను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుతున్నట్లు సంస్థ వివరించింది. సాధారణంగా అగ్ని–5 క్షిపణి గరిష్టంగా 5,000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించి అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని చేధిస్తుంది. దూరం కంటే కూడా అత్యంత బరువును మోయగలిగేలా కొత్తవేరియంట్లను సిద్ధంచేస్తున్నారు. తొలి దశలో గరిష్టంగా 7,500 కేజీల బరువైన బంకర్ బస్టర్ బాంబును దీనిని అమర్చుతారు. పేలిపోవడానికి ముందు నేలలోకి గరిష్ట లోతులోకి చొచ్చుకుని పోయేలా కొత్తతరహా మెకానిజంతో దీనిని సిద్ధంచేస్తున్నారు. తక్కువ ఖర్చులో పని పూర్తయ్యేలా..అమెరికా ప్రయోగించిన భారీ బాంబులను క్షిపణు లు మోసుకెళ్లలేవు. వాటిని మోసేందుకు, లక్ష్యంపై జారవిడిచేందుకు ప్రత్యేకంగా స్టెల్త్ రకంగా నార్త్రోప్ బీ–2 స్పిరిట్ బాంబర్లను అమెరికా సమకూర్చుకుంది. ఒక్కో స్పిరిట్ బాంబర్ విమానం ఖరీదు వేల కోట్ల రూపాయలు. ఇదంతా భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం. దీనిని ప్రత్యామ్నాయంగా క్షిపణికి అమర్చి దాని ద్వారా బంకర్ బస్టర్ బాంబును రణక్షేత్రంలో పడేయాలని భారత్ భావిస్తోంది. అందులోభాగంగా ఇప్పటికే తన అమ్ములపొదిలో ఉన్న అగ్ని–5ను ఈ కార్యం కోసం డీఆర్డీఓ ఎంచుకుంది. ఒకటి భూతలంపై.. మరోటి భూగర్భంలో..రెండు వేరియంట్లలో ఒకటి భూతలం మీది లక్ష్యాలను చేధిస్తుంది. ఇది నేలలోకి చొచ్చుకుపోదు. కేవలం భవన నిర్మాణాల వంటి కట్టడాలనే నామరూపాల్లేకుండా పేల్చేస్తుంది. మరో రకం నేలలోకి చొచ్చుకెళ్లాన తర్వాతే పేలుతుంది. రెండు వేరియంట్లు గరిష్టంగా 8,000 కేజీల బాంబును మోసుకెళ్లేలా సిద్ధంచేయాలని భావిస్తున్నారు. ఈ బాంబు అందుబాటులోకి వస్తే ఇంతటి వేలకేజీల బరువైన బంకర్బస్టర్ బాంబులున్న దేశాల సరసన భారత్ నిలుస్తుంది. శత్రువుల కమాండ్–కంట్రోల్ సెంటర్లు, క్షిపణి నిల్వ కేంద్రాలు, సైనిక స్థావరాలపై ఈ బాంబులను ప్రయోగించనున్నారు. ఎప్పటికప్పుడు శత్రుత్వాన్ని పెంచుకుంటూ పక్కలో బళ్లెంలా తయారైన పాకిస్తాన్, చైనాలను నిలువరించాలన్నా, వాటి సైనిక సామర్థ్యాన్ని దెబ్బకొ ట్టాలన్నా భారత్కు ఇలాంటి భారీ బాంబుల అవసరం ఎంతైనా ఉందని డీఆర్డీఓ పేర్కొంది.హైపర్సోనిక్ వేగంతో దూసుకెళ్లేలా...ఎంత వేగంగా కిందకు పడితే అంతటి పెను వినాశనం సాధ్యమవుతుంది. అందుకే అత్యధిక హైపర్సోనిక్ వేగంతో దూసుకెళ్లేలా ఈ రెండు వేరియంట్లను తయారుచేస్తున్నారు. భూతల లక్ష్యాలను చేధించే వేరియంట్ మ్యాక్8 వేగంతో, భూగర్భ లక్ష్యాలను ఛిద్రంచేసే వేరియంట్ మ్యాక్20 వేగంతో ప్రయాణించేలా డిజైన్ చేస్తున్నారు.బంకర్ బస్టర్ ఉపయోగాలేంటి?సైనిక బంకర్లు, క్షిపణి స్థావరాలు, భూగర్భ ఆయుధాగారాలు, భూగర్భ యురేనియం శుద్ధి కార్మాగారాలను భూస్థాపితం చేయాలంటే బంకర్ బస్టర్ బాంబుతోనే సాధ్యం. జీపీఎస్ ట్రాకింగ్, అతి వేగం, భారీ బరువు దీని ప్రత్యేకతలు. నేలపై పడగానే పేలకుండా నిర్దేశిత లక్ష్యం చేరుకునేదాకా నేలకు రంధ్రంచేసుకుంటూ లోపలికి వెళ్తుంది. ఈ క్రమంలో బాంబు పాడైపోకుండా బయటివైపు పటిష్టమైన ఉక్కు కవచం దీనిని రక్షణంగా ఉంటుంది. యుద్ధక్షేత్రంలో పోరాడే సైనికులు, యుద్ధట్యాంక్లు, డ్రోన్లకు దిశానిర్దేశం చేసే సైన్యాధికారులు భూగర్భంలో ఉండే కమాండ్ కంట్రోల్ సెంటర్లో సురక్షితంగా ఉంటారు. ఈ కంట్రోల్ సెంటర్ను నాశనంచేస్తే రణక్షేత్రంలోని బలగాలకు సరైన దిశానిర్దేశం కరువవుతుంది. దీంతో ఆ శత్రుబలగాలను నిలువరించడం భారత బలగాలకు తేలిక అవుతుంది. శత్రువులు ప్రయోగించే కొన్ని రకాల బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు పాక్షిక భూగర్భ లాంఛర్ నుంచే దూసుకొస్తాయి. వీటిని భూస్థాపితం చేయాల న్నా బంకర్బస్టర్లు అవసరమే. -
రండి.. చదువుకోండి
భారతీయ విద్యార్థుల ఆకర్షణే లక్ష్యంగా జర్మనీ పని చేస్తోంది. విద్యార్థుల ప్రవేశాలకు వీలైనంత సౌలభ్యాన్ని కల్పిస్తామంటూ హామీ ఇస్తోంది. విద్యార్థుల సామాజిక మాధ్యమాలతో పనిలేదంటూ, వారి ఖాతాలు తనిఖీ చేయబోమంటూ వెసులుబాటు కల్పిస్తోంది. తమ దేశంలో చదువుకోవాలంటూ ఆహ్వానిస్తోంది. ప్రస్తుతం ఈ పరిణామం జర్మనీకి వెళ్లి చదువుకోవాలనుకునే యువతకు ఉపశమనాన్ని కలిగించింది. అమెరికా, బ్రిటన్ దేశాల్లో వీసా అడ్డంకులు పెరుగుతున్నందున సురక్షిత గమ్యస్థానంగా జర్మనీ అభివృద్ధి చెందుతోంది. ఇందులో భాగంగానే గత విద్యా సంవత్సరంతో పోలిస్తే గడిచిన రెండు నెలల్లో 35 శాతం మేర ప్రవేశాల దరఖాస్తులు పెరిగినట్టు ప్రకటించింది.చదువు తర్వాత వెసులుబాటు..⇒ వాస్తవానికి జర్మనీ అనేక రంగాల్లో నిపుణుల కొరతను ఎదుర్కొంటోంది. భారత్, జర్మనీ మధ్య విద్యా, పరిశోధనల్లో ద్వైపాక్షిక సంబంధాలు పెరుగుతున్నాయి. ఉమ్మడి విద్యా కార్యక్రమాలు, పరిశోధనలు నడుస్తున్నాయి. భారత్ నుంచి ప్రతిభావంతులైన మానవ వనరులు, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడానికి జర్మనీ ఆసక్తి కనబరుస్తోంది.⇒ ప్రస్తుతం 2,300 కంటే ఎక్కువ ఇంగ్లిష్–బోధన కార్యక్రమాలను ఆ దేశం అందిస్తోంది.⇒ చదువు పూర్తయ్యాక ఉద్యోగ అన్వేషణ కోసం 18 నెలల స్టే–బ్యాక్ పీరియడ్ –ఉపాధి లభించిన తర్వాత నివాస అనుమతి పొడిగింపు విద్యార్థులకు కలిసొచ్చే అంశాలు.జీవన వ్యయం, ఫీజులు తక్కువే! గత దశాబ్దంలో భారతీయ విద్యార్థులకు అగ్ర గమ్యస్థానాల్లో జర్మనీ స్థిరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో 2025లో జర్మనీలో భారత విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అంచనా.ఇందుకు పలు కారణాలున్నాయి1. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయాలు ఉండటం 2. తక్కువ ట్యూషన్ ఫీజు 3. ఉన్నత విద్య, పరిశోధన–ఆవిష్కరణలపై ప్రాధాన్యత కల్పించడం 4. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం(స్టెమ్) రంగాలతో పాటు ఆంగ్లంలో అందించే అనేక కార్యక్రమాలు 5. జీవన వ్యయం తక్కువ 6. సమృద్ధిగా స్కాలర్షిప్లు 7. మేటి ఉద్యోగావకాశాలు ఏటా విద్యా వీసాలు పెరుగుదల.. జర్మనీలో దాదాపు 425 విశ్వ విద్యాలయాలు ఉన్నాయి. వాటిల్లో 305 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు. యూఎస్, కెనడా, యూకే, ఆస్ట్రేలియా,భారత్ విద్యార్థుల ఉన్నత చదువులకు గమ్యస్థానంగా జర్మనీ నిలుస్తోంది. మరోవైపు వీసాల జారీలోనూ నిబంధనలను జర్మనీ సరళతరం చేస్తోంది. వాటి సంఖ్య ఏటా పెంచుకుంటూ వస్తోంది. జర్మనీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం వీసాల జారీ చూస్తే.. సంవత్సరం వీసాల సంఖ్య 2021 63,000 2024 90,0008 మందిలో ఒకరు మనోళ్లే న్యూఢిల్లీలోని జర్మన్ అకడమిక్ ఎక్సే్ఛంజ్ సర్విస్ (డీఏఏడీ) నివేదిక ప్రకారం జర్మనీలోని విశ్వవిద్యాలయాల్లో సుమారు 4.05 లక్షల మంది విదేశీ విద్యార్థులు చేరారు. వీరిలో భారతీయులదే అగ్రస్థానం. ప్రస్తుతం 50 వేల మంది భారతీయ విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. అంటే ప్రతి ఎనిమిది మందిలో ఒకరు భారత్ కు చెందిన విద్యార్థులే ఉన్నారు. -
డాక్టర్ హార్ట్ బీట్ : అమ్మతనం ఇచ్చిన‘బ్రహ్మా’నందం
జీవితం ఒక సినిమా అయితే... దేవుడు రాసిన స్క్రిప్ట్ను కూడా మార్చి రాయగల రైటర్లు డాక్టర్లు. జీవితం ఒక మూవీ అయితే... పేషెంట్కు లైఫ్కో కొత్త డైరెక్షనిచ్చి హిట్ చేయగల టాప్ డైరెక్టర్లు డాక్టర్లు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే... జీవితం... సినిమా కంటే విచిత్రమైనది. దాంట్లో లవ్, మదర్ సెంటిమెంట్, స్టడీస్లో సక్సెస్తో కెమెరా టిల్ట్ చేసి తలెత్తి పైకి చూడాల్సినంత అడ్మిరేషన్, ఎదురుగా మృత్యువు నిలబడ్డా చిరునవ్వుతో ఎదుర్కొనేంత హీరోయిక్ కరేజ్, హెల్మెట్లు లేకపోవడంతో జరిగే అనర్థాల స్టంట్స్... ఇలా ఎన్నో... ఎన్నెన్నో!! ఇన్ని ఎమోషన్స్ను మనతో పంచుకున్నారు నిష్ణాతులూ, లబ్ధప్రతిష్ఠులైన కొందరు డాక్టర్లు... నేడు డాక్టర్స్ డే సందర్భంగా కొన్ని భావోద్వేగాలు వాళ్ల మాటల్లోనే...మదర్ హుడ్అమ్మతనపు కమ్మదనం కోసం అర్రులు సాచే అమ్మాయిలెందరో! అలాంటి అమ్మాయిల్లో ఆమె కూడా ఒకరు. అప్పటికే ఆ అమ్మాయికి నాలుగు అబార్షన్లు అయ్యాయి. ఆ గర్భస్రావాల్లో ఒకట్రెండు దాదాపు పూర్తికాలం గర్భం మోసిన దాఖలాలూ ఉన్నాయి. కానీ ఏ ప్రసవంలోనూ బిడ్డ జీవించి పుట్టలేదు. ఈసారి ఐదో ప్రసవం సమయంలో ఆ దంపతులు నా దగ్గరికి వచ్చారు. వాళ్లకు ఇది ఐదోసారి గర్భధారణ. అల్ట్రా సౌండ్ స్కానింగ్లో ఏదో తేడా ఉంది. వాళ్లలో ఉండే వేదన ఎంతో ఎవ్వరైనా అంచనా వేయవచ్చు. చదవండి: ఐఏఎస్ కల: మృత్యువు పెట్టిన ‘పరీక్ష’ పాసయ్యాడు!మా దగ్గర రెండు రకాలుగా పరీక్షలు నిర్వహిస్తాం. మొదటిది క్రోమోజోముల్లో ఏదైనా తేడా ఉందేమో తెలుసుకునే క్యారియోటైపింగ్ టెస్ట్. రెండోది ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టడానికి గల అవకాశాలను తెలిపే ప్రాంబబిలిటీ పరీక్ష. వాళ్లు రెండోది కోరుకున్నప్పటికీ... అప్పటికే ఉన్న ప్రతికూలతల కారణంగా అది సాధ్యం కాలేదు. ఇలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే... ఒకవేళ పుట్టబోయే బిడ్డకు శారీరక అవయవాల్లో లోపాలో లేదా మానసికంగా బిడ్డ ఎదుగుదల బాగుండదనో తెలిస్తే జెనెటిక్ కౌన్సెలింగ్ ఇచ్చి... ‘ఇదీ పరిస్థితి. ఇక మీరు నిర్ణయం తీసుకోండి’ అని చెబుతాం. ఇక ఆ తర్వాత నిర్వహించిన క్యారియోటైపింగ్ పరీక్షల్లో బిడ్డలో ‘క్రోమోజోమల్ ట్రాన్స్ లొకేషన్’ జరిగినట్లు తేలింది. అంటే... క్రోమోజోముల్లోని ఒకచోట ఉండాల్సినవి అక్కడినుంచి మారి మరోచోట చేరాయి. కానీ చూడ్డానికి అంతా బాగానే ఉంది. ఇలాంటప్పుడు బిడ్డ ఆరోగ్య కరంగానే పుడుతుందా అంటే చెప్పలేం. ఇలాంటి సందర్భాల్లో ప్రకృతి ఓ పని చేస్తుంది. అనారోగ్యకరమైన బిడ్డను ఈ లోకంలోకి రాకుండా చేసేందుకు మూడు నెలలలోపు స్వాభావికంగా దానంతట అదే బిడ్డ పడిపోయేలా చేస్తుంది. అంటే నేచురల్ అబార్షన్ జరిగిపోతుందన్నమాట. అదే ఒకవేళ మూడు నెలలు గడిచిపోయాయంటే ఇక బిడ్డ పూర్తిగా ఎదగడానికి అవకాశం ఉందన్నమాట. మొదటి సస్పెన్సు కాలమైన ఆ మూడు నెలలూ గడిచిపోయాయి. ఇదీ చదవండి: కూతురి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని తండ్రి సాహసం, వైరల్ వీడియోఇప్పుడు రెండో సస్పెన్సు మొదలైంది. ఇప్పటికే నిండు చందమామలాంటి బిడ్డలు నలుగురు ఆ అమ్మ ఒడినుంచి జారిపోయారు. కడుపున మరో బంగారం పెరుగుతోందిగానీ... ఆ కొంగుబంగారమూ కొంగుజారిపోతే? అమ్మో!! అందుకే మేమంతా కాబోయే ఆ అమ్మను జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉన్నాం. క్రోమోజోమల్ ట్రాన్స్లొకేషన్ జరిగిందంటే ఏదో జరిగిందనే అర్థం. కాకపోతే అదెక్కడో, ఎలాగో, దాని పర్యవసానాలేమిటో తెలియదు. జాగ్రత్తగా వేచిచూస్తున్నాం. ఎట్టకేలకు అల్లరిపిడుగు పుట్టనే పుట్టింది. ఆ బంగారుతల్లి ఒడిలోకి బంగారుకొండ చేరింది. అంతా సుఖాంతం. బిడ్డకు పూర్తి ఆరోగ్యం. మా అందరిలోనూ కొండంత ఆనందం. నేను చెప్పేదేమిటంటే... ప్రతి ఒక్కరికీ జెనెటిక్ పరీక్షలు అవసరం కాకపోవచ్చు. కానీ ఎలాంటి బిడ్డ పుడుతుందో... పుట్టి జీవితాంతం తల్లిదండ్రులను క్షోభపెడుతుందో తెలియని పరిస్థితుల్లో జన్యుపరీక్షలు అవసరం. ఓ సీనియర్ జన్యువైద్య పరిశోధకురాలిగా, జెనెటిక్స్ వైద్యురాలిగా ఇదీ నా సూచన.డాక్టర్ యానీ క్యూ హసన్, సీనియర్ జెనెటిక్ – మాలెక్యులార్ స్పెషలిస్ట్, కామినేని హాస్పిటల్స్, హైదరాబాద్ -
ఐటీ ఉద్యోగితో పోలిస్తే వారికి రెట్టింపు ఆదాయం
కెరీర్కు బంగారు బాటగా ఇంజనీరింగ్ను పరిగణించే మన దేశంలో.. ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకోవడానికి దాదాపు రూ.10-20 లక్షలు ఖర్చు చేయాలి. అంతేకాదు జీవితంలో విలువైన 4 సంవత్సరాలు వెచ్చించాలి. ఇంత వ్యయ ప్రయాసలకు ఓరి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా కొత్తగా ఉద్యోగంలో చేరితే చేతికి వచ్చే జీతం ఎంతో తెలుసా? సగటున గంటకు రూ.139-186 మాత్రమే. అదేదో చిన్నాచితకా కంపెనీల్లో వీరు ఉద్యోగం చేస్తు న్నారా అంటే అదీ కాదు. అగ్రశ్రేణి ఐటీ కంపెనీల్లో! ప్లంబర్లు, ఎలక్ట్రిషియన్లు, కార్పెంటర్లు, డ్రైవర్ల వంటి నిపుణులైన కార్మికుల కంటే ఈ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు అందుకునే వేతనం తక్కువ.-సాక్షి, స్పెషల్ డెస్క్భారత్లో ఎంట్రీ-లెవల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల సగటు జీతం 2007-2010 కాలంలో సంవత్సరానికి దాదాపు రూ.3.5 లక్షలుగా ఉండేది. అప్పటితో పోలిస్తే 2024లో ఆర్థికంగా చాలా మార్పులు వచ్చాయి. పెట్రోల్, డీజిల్ సహా అన్నింటి ధరలూ పెరిగోయి, కానీ, సాఫ్ట్వేర్ రంగంలో ఎంట్రీ లెవల్ ఉద్యోగాల్లో పనిచేస్తున్న వాలామంది ప్రెసర్ల వేతనాల్లో మాత్రం పెద్దగా మార్పు రాలేదు. అర్బన్ కంపెనీ, స్విగ్గీ, జొమాటో, ఊబర్, ఓలా వంటి ప్లాట్ఫామ్స్లో పనిచేస్తున్న కార్మికులైతే బీటెక్ గ్రాడ్యుయేట్ల కంటే రెండింతలకుపైనా ఆదాయం అందుకుంటున్నారని ఎడ్యుకేషనల్ ప్రొడక్ట్స్, సర్వీసెస్ కంపెనీ 'కెరీ ర్స్ 360' నివేదిక చెబుతోంది. ఇంజనీరింగ్ విద్యార్థులను ప్రోత్స హించాలంటే జీతాలు పెంచాల్సిన అవసరం ఉందని సూచించింది.బీటెక్ చదువు ఖర్చు పెరిగింది... రోజుకు 9 గంటల చొప్పుననెలలో 20 రోజుల పని దినాలకు అంటే నెలలో 180 గంటలు విధులు నిర్వర్తించారని భావిస్తే.. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్ లో ఫ్రెషర్లు అందుకునే వేతనం కంపెనీని బట్టి గంటకు రూ. 130 నుంచి రూ.180 మధ్య ఉంది. బీటెక్ డిగ్రీ దశాబ్దన్నర క్రితం రూ.1-2 లక్షల్లో పూర్తి అయ్యేది. ఇప్పుడు ఏకంగా దానికి పదిరెట్లకుపైనే ఖర్చు పెరిగింది. గ్రాడ్యుయేట్లు తమ నాలుగేళ్ల చదువు కోసం అధిక సమయం. కృషి, డబ్బును పెట్టుబడిగా పెడుతున్నారు. కానీ, చదువు పూర్తై పట్టా చేతికొచ్చాక.. కోటి ఆశలతో కొత్త ఉద్యోగంలో చేరితే జీతాలు మాత్రం ఆశించిన స్థాయిలో ఉండటం లేదు.రికవరీకి 6-8 ఏళ్లు..అర్బన్ కంపెనీలో నైపుణ్యం కలిగిన కార్మికులు సగటున గంటకు రూ.311 సంపాదిస్తున్నారు. ప్లంబర్లు. ఎలక్ట్రిష్ యన్స్, టెక్నీషియన్స్, బ్యూటీషియన్స్, కార్పెంటర్లు, డ్రైవర్లు, మసాజ్ థెరపిస్ట్ వంటి నైపుణ్యం కలిగిన ఈ కార్మి వీలు నెలకు సగటున 160 గంటలు పనిచేస్తే.. పన్నులు. కమీషన్, మెటీరియల్ వ్యయాలు పోను నెలకు రూ. 40 వేలకుపైగా సంపాదిస్తున్నారు.ఇది కేవలం జీతాల పోలిక కాదని కెరీర్స్ 300 అంటోంది. 2010 పూర్వం బీటెక్ విద్యార్ధి తన డిగ్రీకి అయిన ఖర్చును తిరి రాబట్టుకోవడానికి రెండు మూడేళ్లు పట్టేది. ఇప్పుడు తగ్గాల్సింది పోయి పెరిగిపోయింది. ఏకంగా 5 ఏళ్లకుపైనే: పడుతోంది. మరోవైపు గగ్ ఎకానమీలోనూ ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయి ఈ రంగంలో నైపుణ్యం కలిగిన కార్మికులు ఉపాధి అవకాశాలను వేగంగా, తక్కువ అడ్డంకులతో సాధిస్తున్నారని కెరీర్స్.. 360 చెబుతోంది. -
సాంకేతిక మార్గదర్శకులు!
వరల్డ్ ఎకనామిక్ ఫోరం ‘2025 టెక్నాలజీ పయనీర్స్’ పేరిట 28 దేశాల నుండి 100 స్టార్టప్స్ను ఎంపిక చేసింది. ‘ఆవిష్కరణల రంగంలో విస్తృత మార్పులు చోటు చేసుకున్నాయి. తక్కువ వనరులతో తదుపరి స్థాయి, ఆధునికతను అందుకోవడానికి అనేక కంపెనీలు కృత్రిమ మేధ (ఏఐ) ఉపయోగిస్తున్నాయి. ఆస్టరాయిడ్ మైనింగ్, ఎగిరే ఎలక్ట్రిక్ ట్యాక్సీల నుండి వ్యవసాయాన్ని మార్చడానికి ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించడం, భూమి ఉపరితలం కింద కీలక ఖనిజాలను గుర్తించడానికి సూపర్నోవా పేలుళ్ల నుండి శక్తిని ఉపయోగించడం వరకు.. ఇలాంటి కొత్త దారులను కంపెనీలు ఎంచుకుంటున్నాయి’ అని వరల్డ్ ఎకనమిక్ ఫోరం కితాబిచ్చింది. వివిధ రంగాల్లో ఆవిష్కరణలను నడిపిస్తున్న ఈ సంస్థల్లో.. 2025 జాబితాలో భారత్ నుంచి ఏకంగా 10 కంపెనీలు చోటు సంపాదించుకోవడం విశేషం. హైదరాబాద్ కంపెనీ ఈక్వల్ సైతం వీటిలో ఉంది. ఈ కంపెనీల గురించి సంక్షిప్తంగా..అగ్నికుల్ కాస్మోస్: ఇది 2017లో చెన్నైలో ఏర్పాటైంది. భూమికి తక్కువ కక్ష్యలో 100 కేజీల వరకు బరువుండే పేలోడ్ను, సుమారు 700 కి.మీ. ఎత్తువరకు మోయగల ’అగ్నిబాణ్’ అనే చిన్న ప్రయోగ వాహనాలను అభివృద్ధి చేసింది. దీన్ని ప్రయోగించేందుకు అగ్నికుల్ లాంచ్ప్యాడ్ను కూడా ఈ సంస్థ తయారుచేసింది. ఇది దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ లాంచ్ప్యాడ్. ఇంతవరకు శ్రీహరికోటలో ఒకటే లాంచ్ప్యాడ్ ఉండేది. అగ్నిబాణ్ను 2024 మే 30న శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. ‘అగ్నిలెట్’ పేరుతో ప్రపంచంలో తొలిసారిగా సింగిల్–పీస్, 3డీ–ప్రింటెడ్, సెమీ–క్రయోజెనిక్ రాకెట్ ఇంజిన్ తయారు చేసింది.సైన్స్ ఎల్ఆర్ (సైబర్నెటిక్స్ ల్యాబొరేసైన్స్ ఎల్ఆర్ (సైబర్నెటిక్స్ ల్యాబొరేటరీ): టరీ): బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ రోబోటిక్స్ తయారీలో ఉంది. ఇప్పటికే సైరో అనే రోబో తయారుచేసింది. ఇది గుడ్డు, బిస్కెట్ నుంచి.. ఎలాంటి వస్తువునైనా అత్యంత జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తుందని, ఏ పరిశ్రమ అవసరాలనైనా చక్కబెడుతుందని కంపెనీ చెబుతోంది.డెజీ: స్మైల్స్.ఏఐ పేరుతో 2019లో బెంగళూరు కేంద్రంగా ప్రారంభం అయింది. తర్వాత డెజీగా పేరు మార్చుకుంది. ఏఐ ఆధారిత డయాగ్నస్టిక్ టెక్నాలజీని ఉపయోగించి దంత సంరక్షణ సేవలను అందిస్తోంది.దిగంతర: అంతరిక్ష నిఘా, ఇంటెలిజెన్స్ సేవల్లో ఉంది. ప్రపంచంలో తొలిసారిగా వాణిజ్యపరంగా అంతరిక్ష నిఘా శాటిలైట్ను ప్రయోగించింది. అంతరిక్ష కార్యకలాపాలు, ట్రాఫిక్ నిర్వహణ సేవలూ అందిస్తోంది. అంతరిక్షంలో ఉన్న పరిస్థితులను తెలియజేయడంతోపాటు శాటిలైట్లు, శకలాలు ఢీకొనకుండా అలర్ట్స్ చేస్తుంది. భూమికి తక్కువ కక్ష్యలో 5 సెంటీమీటర్ల చిన్న వస్తువులనూ గుర్తిస్తుంది. ఉత్తరాఖండ్లో 2018లో స్థాపించారు.ఈక్వల్: సురక్షిత కేవైసీ ధ్రువీకరణ సేవలను హైదరాబాద్ కేంద్రంగా అందిస్తోంది. కంపెనీని కేశవ్ రెడ్డి, రాజీవ్ రంజన్ 2022లో నెలకొల్పారు. 250లకుపైగా కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి. 2025 మార్చిలో 10 కోట్లకుపైగా లావాదేవీలను పూర్తి చేసింది.ఎక్స్పోనెంట్ ఎనర్జీ: బెంగళూరు కేంద్రంగా అడ్వాన్స్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ రంగంలో ఉంది. బ్యాటరీ ప్యాక్స్తోపాటు 15 నిమిషాల్లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ పూర్తి అయ్యే ఈ–పంప్స్ (చార్జింగ్ స్టేషన్) తయారు చేస్తోంది.ఫ్రేట్ టైగర్: ముంబై కేంద్రంగా సరుకు రవాణా మౌలిక వసతులు, నిర్వహణ సేవలు అందిస్తోంది. సరుకు సేకరణ, డెలివరీ, బిల్లింగ్తో సహా రవాణా కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి డిజిటల్ వేదికను రూపొందించింది.గెలాక్స్ ఐ: అంతరిక్ష సాంకేతిక రంగంలో బెంగళూరుకు చెందిన స్టార్టప్. ఐదుగురు ఐఐటీ మద్రాస్ విద్యార్థులు దీనిని ఏర్పాటు చేశారు. అన్ని కాలాలలోనూ వాతావరణ సమాచారం, తక్కువ వెలుతురులోనూ నిఘా; భూమిపై మనుషులు, వాహనాలు, వస్తువుల కదలికలు; పంట దిగుబడి వంటి సమాచారాన్ని హై రిజొల్యూషన్స్ చిత్రాలతో అందించే హైబ్రిడ్ ఇమేజింగ్ శాటిలైట్ను ప్రపంచంలో తొలిసారిగా దేశీయంగా తయారు చేస్తోంది. మేఘాలు ఉన్నా, రాత్రి సమయంలోనూ చిత్రాలను తీయగల సాంకేతికత అభివృద్ధి చేసింది.సోలార్స్క్వేర్: ముంబైలో 2015లో మొదలైన ఈ కంపెనీ సోలార్ ప్యానెల్ సిస్టమ్స్ రూపకల్పన, స్థాపన రంగంలో ఉంది. రూఫ్టాప్ సోలార్ సిస్టమ్స్, నిర్వహణ, ఫైనాన్సింగ్ సేవలను అందిస్తోంది.ది ఈ–ప్లేన్ కో: ఐఐటీ మద్రాస్లో 2019లో ప్రాణం పోసుకుంది. నగరాల్లో రవాణా కోసం.. ఎగిరే ఎలక్ట్రిక్ ట్యాక్సీల అభివృద్ధిలో నిమగ్నమైంది. ఒక కార్గో విమానాన్ని సైతం పరీక్షిస్తోంది. ఎయిర్ ట్యాక్సీని తొలుత మానవ పైలట్తో ప్రవేశపెట్టే పనిలో ఉంది. నిబంధనలు అనుమతిస్తే రానున్న రోజుల్లో అటానమస్ ఎయిర్ ట్యాక్సీ రానుంది. పైలట్ లేకుండానే ఇది గాల్లో చక్కర్లు కొడుతుంది. -
స్కోరుంటేనే.. లోన్
తాను వివాహం చేసుకోబోయే వ్యక్తి క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందని ఓ యువతి పెళ్లికి నిరాకరించింది. మహారాష్ట్రలో ఈ ఏడాది ఫిబ్రవరిలో వెలుగు చూసిన ఈ ఘటన అందరినీ నివ్వెరపోయేలా చేసింది. మరో సంఘటనలో క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్న వ్యక్తి ఉద్యోగ నియామకాన్ని రద్దు చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు సమర్థించింది. ఈ రెండు సందర్భాల్లోనూ రెండు జీవితాలను క్రెడిట్ స్కోర్ మార్చేసింది. క్రెడిట్ స్కోర్ అంత ముఖ్యమా.. ఇంతకీ ఈ స్కోర్ ఏమిటి.. ఎవరు, ఎలా నిర్ణయిస్తారు.. సామాన్యుల మదిలో ఉన్న సందేహాలకు జవాబు తెలుసుకుందాం. – సాక్షి, స్పెషల్ డెస్క్నాకు లోన్ కావాలి. క్రెడిట్ స్కోర్ ఉంటేనే ఇస్తామన్నారు. ఏమిటీ స్కోర్?ఓసారి మీ స్నేహితులనో, బంధువులనో ఓ రూ.లక్షో.. 2 లక్షలో చేబదులు అడిగి చూడండి! ఎంతమంది ఇచ్చి ఉంటారు? ఎంతమంది బంగారమో, ఇంటి పత్రాల వంటి హామీలు అడిగి ఉంటారు? మీరు బాగా తెలిసినవారే అయినా మీరు తిరిగి చెల్లించగలరా అని వందసార్లు ఆలోచిస్తారు. అలాంటిది మీరెవరో తెలియకుండా ఓ బ్యాంకు లేదా లోన్ యాప్ మిమ్మల్ని నమ్మి, ఎలాంటి తనఖా లేకుండా అప్పు ఎలా ఇస్తాయి? అందుకే, మీరేంటి.. గతంలో ఏదైనా బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటే తిరిగి ఎలా చెల్లించారు.. చెల్లించకుండా ఎగ్గొట్టారా.. వంటి అంశాలన్నీ వారు చూస్తారు. ఇలా వినియోగదారుడి రుణ అర్హతను సూచించే సంఖ్యే క్రెడిట్ స్కోర్. దీని ఆధారంగానే బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ) ఒకరికి రుణం ఇవ్వాలా లేదా అని నిర్ణయిస్తాయి. చెల్లింపుల చరిత్ర, రుణ అర్హత–తీసుకున్న మొత్తాలు, కాల పరిమితి, తరచూ లోన్లకు దరఖాస్తులు, విభిన్న రుణాలు.. వీటి ఆధారంగా స్కోర్ మారుతుంది. మనదేశంలో తొలి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ట్రాన్స్యూనియన్ సిబిల్. ఈ కంపెనీ ఇచ్చే క్రెడిట్ స్కోర్.. సిబిల్ స్కోర్గా జనంలో బాగా పాపులర్ అయింది.నా క్రెడిట్ స్కోరు తక్కువైతే రుణం రాదా? ఒక వ్యక్తి తాను తీసుకున్న రుణాలను నిర్వహించిన తీరు ఆధారంగా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ/క్రెడిట్ బ్యూరోలు 300 నుంచి 900 వరకు స్కోర్ ఇస్తున్నాయి. స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే రుణం లభించే అవకాశాలు అంత మెరుగ్గా ఉంటాయి. 90 శాతం లోన్స్ 750కిపైగా స్కోర్ ఉన్నవారికే మంజూరు అవుతున్నాయి. ఆదాయం, ప్రస్తుత ఈఎంఐలు, క్రెడిట్ స్కోర్ ఆధారంగా రుణ అర్హతను ఆర్థిక సంస్థలు నిర్ణయిస్తాయి. ఏ కంపెనీలు ఈ స్కోర్ ఇస్తున్నాయి? వాటికి ఆర్బీఐ అనుమతి ఉందా?క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ లేదా క్రెడిట్ బ్యూరోలు వ్యక్తులు, కంపెనీల రుణ సమాచారాన్ని ఆర్థిక సంస్థల నుంచి నెలవారీ ప్రాతిపదికన సేకరించి, నిర్వహణతోపాటు విశ్లేషిస్తాయి. ఈ రుణ సమాచారాన్ని ఉపయోగించి వ్యక్తుల కోసం క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లు, కంపెనీల కోసం క్రెడిట్ కంపెనీ రిపోర్ట్లు రూపొందిస్తాయి. రుణ అర్హత, గత రుణ చరిత్ర ఆధారంగా వ్యక్తుల కోసం క్రెడిట్ స్కోర్, కంపెనీలకు క్రెడిట్ ర్యాంక్లను జారీ చేస్తాయి. ఆర్బీఐ లైసెన్స్ పొందిన క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు భారత్లో ట్రాన్స్యూనియన్ సిబిల్, ఈక్విఫ్యాక్స్ ఇండియా, ఎక్స్పీరియన్ ఇండియా, సీఆర్ఐఎఫ్ హై మార్క్. ఆర్బీఐ నియంత్రణలోనే ఇవి పనిచేస్తాయి. స్కోర్ ఎక్కువగా ఉంటే ప్రయోజనం ఏమిటి?ట్రాన్స్యూనియన్ సిబిల్ గణాంకాల ప్రకారం 2025 జనవరి–మార్చిలో కొత్తగా మంజూరైన రుణాల్లో 57.6 శాతం వినియోగదారుల స్కోర్ 800లకుపైగా ఉంది. 22.8 శాతం మంది స్కోర్ 750–799 మధ్య, 9.7 శాతం వినియోగదారులకు 700–749 మధ్య, 5.2 శాతం కస్టమర్లకు 650–699 మధ్య, 4.7 శాతం మందికి 650 కంటే తక్కువ స్కోర్ ఉంది. స్కోర్ ఎక్కువగా ఉన్నవారికే లోన్ లభిస్తోందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. గృహ, వాహన రుణాల వంటి సెక్యూర్డ్ లోన్స్కు సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నా, క్రెడిట్ హిస్టరీ లేకున్నా రుణ సంస్థలు ముందుకు వస్తున్నాయి. వ్యక్తిగత రుణం, విద్యా రుణాల వంటి అన్ సెక్యూర్డ్ లోన్స్కు క్రెడిట్ స్కోర్ ఉండాల్సిందే. కొత్త వాళ్లకు రుణం రాదంటున్నారు. నిజమేనా?అలాంటిది ఏమీ లేదు. ఈ ఏడాది జనవరి–మార్చి కాలంలో లోన్లు తీసుకున్నవారిలో 16 శాతం మంది కొత్తవారే. ఉద్యోగులైతే వారు పనిచేస్తున్న కంపెనీని బట్టి రుణ సంస్థలు సూపర్–ఏ, కేటగిరీ–ఏ, బీ, సీ, డీ అని విభజించి రుణ మొత్తాన్ని, కాల పరిమితిని నిర్ణయిస్తున్నాయి. కంపెనీ పనితీరు కూడా లోన్ అప్లికేషన్ ను ప్రభావితం చేస్తుంది.నాకు క్రెడిట్ హిస్టరీ లేదు. యూపీఐ వాడుతున్నాను. లోన్ వస్తుందా?క్రెడిట్ హిస్టరీ లేని ఉద్యోగులు అయితే కనీసం మూడు నెలల పే స్లిప్స్ను సమర్పించాలి. ఎన్ బీఎఫ్సీలు చిన్న మొత్తాల్లో రుణం ఇస్తాయి. సకాలంలో చెల్లిస్తే క్రెడిట్ లిమిట్ (రుణ మొత్తం) పెంచుతాయి. యూపీఐ వాడుతున్న చిరు వ్యాపారులు, కార్మికులకు కూడా ఆదాయం, యూపీఐ చెల్లింపులను విశ్లేషించి ఎన్ బీఎఫ్సీలు చిన్న మొత్తాల్లో అప్పులు ఇస్తున్నాయి.ఏది మంచి స్కోర్ ?851-900 (అద్భుతం)బకాయిలు లేని రుణగ్రహీతలు.751-850 (మంచిది)సకాలంలో చెల్లింపులతో బలమైన క్రెడిట్ చరిత్ర ఉన్నవారు.651-750 (సగటు)తగిన రుణ నిర్వహణతో సగటు రుణ చరిత్ర కలిగినవారు.501- 650 (పేలవమైనది)సమయానికి పూర్తికాని చెల్లింపులు, అధిక రుణ వినియోగం కారణంగా ఎక్కువ రిస్క్ ఉన్నవారు.300 - 500 (చాలా పేలవమైనది)బకాయిలు, రుణం పొందడంలో ఇబ్బందులతో దారుణమైన రుణ చరిత్ర ఉన్నవారు.రూ.50 లక్షల వరకు.. దరఖాస్తుదారు పనిచేస్తున్న కంపెనీ సూపర్–ఏ ప్లస్ విభాగంలో ఉండి, స్కోర్ మెరుగ్గా ఉంటే.. ఎన్ బీఎఫ్సీలు 8 ఏళ్ల కాల పరిమితితో రూ.50 లక్షల వరకు అన్ సెక్యూర్డ్ లోన్స్ ఇస్తున్నాయి. గతంలో ఈ కాల పరిమితి అయిదేళ్లు ఉండేది. కంపెనీల స్థిరత్వం, లాభ, నష్టాలు, ఆదాయం కూడా వారి ఉద్యోగులు పొందే రుణ మొత్తాన్ని నిర్ణయిస్తోంది. అంతిమంగా దరఖాస్తుదారు క్రెడిట్ స్కోరే ముఖ్యం. – సాయి కుమార్ మామిడి, ప్రైవేట్ బ్యాంక్ సీనియర్ సేల్స్ అడ్వైజర్, హైదరాబాద్ -
కలిసి తింటే.. కలదు సుఖం
‘కలిసి తినే కుటుంబం కలిసి ఉంటుంది’ అని సామెత. కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చొని, భోజనం చేస్తే మనసుకు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుందని పూర్వీకులు తమ అనుభవంతో ఏర్పరచిన ఈ సంప్రదాయాన్ని ఇప్పుడు వైద్య పరిశోధకులు సైతం ధ్రువీకరిస్తున్నారు. ‘కలిసి ఉంటే కలదు సుఖం – కలసి తింటే కలదు ఆరోగ్యం’ అని నిర్ధారణగా చెబుతున్నారు. చక్కటి భోజన సంభాషణ మనిషిలోని నిస్సత్తువను పోగొడుతుందని, మానసిక ఒత్తిళ్ల నుంచి ఉపశమనం లభిస్తుందని, కుటుంబ సభ్యుల మధ్య బంధాలు మరింత బలపడతాయని మానసిక, వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.ఆస్వాదనతో పాటు అనుభూతీ!కుటుంబ సభ్యులను అత్మీయతలతో పెనవేసే అనేక అంశాలలో ‘అందరూ కలిసి భోజనం చేయటం’ అనే అలవాటు ముఖ్యమైనది. భోజనాన్ని ఆస్వాదిస్తూనే, సంభాషణలను అనుభూతి చెందే అవకాశం డైనింగ్ టేబుల్ మీద ఉంటుంది. కుటుంబానికి ఇంతకంటే ముఖ్యమైన ‘రౌండ్ టేబుల్ సమావేశం’ మరొకటి ఉండదు. ఉల్లాసకరమైన మాటలు వస్తాయి. ఉత్తేజకరమైన నవ్వులు పూస్తాయి. ఆహ్లాదం ఘుమఘుమలాడుతుంది. సందట్లో ఓ నాలుగు ముద్దలు ఎక్కువ తింటాం. అందుకే భోజన సంభాషణ అంటే కేవలం ఒక మంచి విషయం మాత్రమే కాదు, మానసికమైన ఆరోగ్యం కూడా అంటున్నారు మనోవైజ్ఞానిక నిపుణులు. – సాక్షి, స్పెషల్ డెస్క్జెన్–జి తరానికి తప్పనిసరిభోజన సంభాషణలు కేవలం ఆచారాలు కావు. ఇవి రోజువారీ నిస్సత్తువను పోగొట్టి, మానసిక ఆరోగ్యాన్నిచ్చే సందర్భాలు కూడా. భారతీయ సంస్కృతిలో అంతర్లీనమైనదిగా ఉన్న ప్రియ భోజన భాషణ ఇప్పటి జెన్–జి తరానికి తప్పనిసరి అవసరం అని అధ్యయనాలు చెబుతున్నాయి. భోజనం చేసే సమయంలోని మనోల్లాసమైన సంభాషణలు మెదడును నెమ్మదింపజేస్తాయి. నాడీ వ్యవస్థను నియంత్రించడంలో, ఒత్తిడిని తగ్గించడంలో తోడ్పడతాయి. అయితే ఆధునిక జీవన శైలిలోని ఉరుకులు పరుగుల వల్ల వ్యక్తిగత జీవితంలోకి వృత్తిపరమైన బాధ్యతలు చొరబడి, ఇంటిల్లపాదీ కలిసి కూర్చొని భోజనం చేసే సంప్రదాయం నెమ్మదిగా అంతరించిపోతోంది.ఆసక్తి ఉన్నా అవకాశం లేదుఈ తరం పిల్లలు భోజనానికి కలవరు. ఇంటి సంభాషణలపై ఆసక్తి చూపరు. అలాగని కుటుంబ సంబంధాలు, కుటుంబ భోజనాలపై వారు మరీ అంత నిర్లిప్తంగా కూడా ఏమీ లేరు. 1996 తర్వాత జన్మించిన 2,000 మందిపై జరిగిన ఒక అధ్యయనం ప్రకారం 64 శాతం మంది తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో భోజన సంభాషణలను జరపటంలో ఆసక్తి చూపారు. అదే సమయంలో.. అందుకు అవకాశం ఉండటం లేదని అన్నారు. ఎవరికి వారుగా భోజనం ముగించే వ్యక్తిగత వ్యవహారంగా మారిన ప్రస్తుత తరుణంలో.. కుటుంబ బంధాలు మెరుగవ్వాలంటే కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకొంటూ భోజనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.భోజన సమయ బంధుత్వాలు..: చిన్న కుటుంబాల్లో పెద్దవాళ్లకు చోటు ఉండదు. కానీ భోజన సమయంలో పెద్దవాళ్ల గురించిన కథలకు చోటు లేకుండా ఉండదు. తరాల కథలు మాటల్లోకి వస్తాయి. పారంపర్య కుటుంబ గాథలు ఇష్టమైన భోజనంలా అనిపిస్తాయి. ‘మరి కాస్త వడ్డించు’ అని అడిగినట్లుగా వంశవృక్షంలోని తాత ముత్తాల గురించి ‘ఇంకా చెప్పు’ అని కుతూహలంగా అడిగి మరీ చెప్పించుకుంటారు. ఎంతో ముఖ్యమైన రేపటి ఆ ‘ముఖ్యమైన సమావేశం’ గురించిన ఆలోచన మదిలోకే రాదు. అంతా కలిసి భోంచేస్తున్నారు కదా పాపం.. అని డెడ్లైన్లు డైనింగ్ హాల్ బయటే ఉండిపోతాయి. ఇక భోజన సమయంలో ‘నో–ఫోన్ పాలసీ’ పెట్టుకుంటే కడుపు నిండా కబుర్లు.. కళ్ల నిండా కమ్ముకునే నిద్ర మేఘాలు. ‘బర్నౌట్కు’ తగిన చికిత్స..: ఒత్తిడి, అలసట. శక్తి క్షీణత.. అన్నీ కలిసి ప్రపంచాన్ని ఇప్పుడు ‘బర్నౌట్’ చేసేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ బర్నౌట్ను ‘పని ఒత్తిడి సిండ్రోమ్’గా వర్ణించింది. ప్రస్తుతం ఈ డిజిటల్ ప్రపంచంలో బర్నౌట్ కాని వారు లేరంటే అతిశయోక్తి కాదు. 2024 సెప్టెంబర్లో భారత వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య (ఫిక్కీ), బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ సంయుక్తంగా నిర్వహించిన ఓ అధ్యయనం.. 58 శాతం మంది భారతీయులు పనిలో అమితంగా బర్నౌట్ అవుతున్నట్లు వెల్లడించింది. ఈ బర్నౌట్ నుంచి బయటపడేందుకు కుటుంబంతో కలిసి భోజనం చేయటం ఒక మంచి మార్గమని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, సానుకూల భోజన సంభాషణలు.. ఒత్తిడికి మూలమైన ‘కార్టిసాల్’ అనే హార్మోన్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడే ‘ఆక్సిటోసిన్’ హార్మోన్ను విడుదల చేస్తాయి. ఆక్సిటోసిన్ సామాజిక బంధాలకు, సంతానోత్పత్తికి దోహదపడుతుంది. లైంగిక సామర్థ్యం పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. దీని వల్ల మెదడుకు విశ్రాంతి లభిస్తుంది. మాటలు ప్లేట్లు దాటకూడదు!..: భోజన సంభాషణలు తేలికగా ఉన్నప్పుడే కలిసి భోజనం చేయటం వల్ల ప్రయోజనాలు చేకూరుతాయి. లేదంటే, ఒంటరిగా తినడమే నయం అనే నిస్పృహలోకి వెళ్లిపోతారు. పచ్చళ్ల దగ్గర మొదలై పంతాలూ పట్టింపుల వరకు వెళ్లిపోతే.. కలిసి భోజనం చేయకపోతేనే ఉత్తమం. చాలా వరకు సంభాషణ ఆహార పదార్థాల చుట్టూరానే తిరగాలి. మాటల్లోనే మాధుర్యం ఒలకాలి. ఇంట్లో ఎవరు ఏది ఇష్టంగా తింటారో సరదాగా చర్చించుకోవాలి. రుచికరమైన వంటకాలు చేసిన వారిని ప్రశంసించడం.. ఈ చర్చా కార్యక్రమాన్ని రక్తికట్టించే అసలైన ప్రధాన ముడిసరుకు. అది మన అభిరుచిని తెలియజేయడమే కాదు.. మనకు ప్రేమగా వండిపెట్టిన వారి నైపుణ్యానికి కూడా దక్కాల్సిన కితాబు. వంటంతా ఒక ఎత్తయితే.. వడ్డన మరో ఎత్తు. ప్రేమగా, కొసరి కొసరి వడ్డిస్తుంటే.. ఎవ్వరూ నో చెప్పలేరు. అందుకే, అలా ప్రేమగా వడ్డించినవారిని కూడా మనస్ఫూర్తిగా మెచ్చుకోవాలి. కిందటి రోజు చూసిన సినిమా, ఆవకాయ పచ్చళ్లపై చర్చ, వంశపారంపర్య విశేషాల ప్రస్తావన.. కాదేదీ ప్రస్తావనకు అనర్హం. ఇలాంటి మంచి విషయాల చుట్టూ మాటలు సాగితే మనసుకు, దేహానికి మంచి మెడిసిన్ పడినట్లే. -
తనను తాను డెలివరీ చేసుకుంది!
కొత్త పుంతలు తొక్కుతున్న కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీకి సరికొత్త నిదర్శనం ఇది.. సైన్స్ ఫిక్షన్ సినిమాను పోలిన సన్నివేశం ఇది.. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన వస్తువు చిటికెలో డోర్ డెలివరీ అవుతున్నట్లుగా ఒక కొత్త టెస్లా కారు ఫ్యాక్టరీ నుంచి స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ కస్టమర్ ఇంటికి వచ్చేసింది! హైవేపై సాఫీగా మందుకు కదులుతూ.. మధ్యమధ్యలో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఆగుతూ.. గరిష్టంగా 115 కి.మీ. వేగంతో దూసుకెళ్తూ తన కొత్త ఓనర్ ఉన్న లొకేషన్కు భద్రంగా చేరుకుంది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా కంపెనీ ప్రపంచంలోనే తొలిసారిగా ఏమాత్రం మానవ ప్రమేయం లేకుండా తమ కొత్త కారును నేరుగా వినియోగదారుడి చెంతకు చేర్చింది. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో నడిచే పూర్తిస్థాయి అటానమస్ కారు ‘మోడల్ వై’ను టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలో ఉన్న ఫ్యాక్టరీ నుంచి అక్కడికి 30 నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్న కస్టమర్ ఇంటికి పంపించింది. మార్గమధ్యలో ట్రాఫిక్ సిగ్నళ్లు, ఫ్లైఓవర్లు, హైవేలను దాటుకుంటూ కారు తన కొత్త యజమాని ఇంటికి చేరుకుంది. ఫ్యాక్టరీ నుంచి గమ్యస్థానం చేరుకొనే వరకు కారు సాగించిన ప్రయాణాన్ని అందులోని ‘డాష్ క్యామ్’రికార్డు చేసింది. ఇందుకు సంబంధించి టెస్లా విడుదల చేసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. మరోవైపు తమ అటానమస్ కారు డెలివరీని ఎలాన్ మస్క్ ‘ఎక్స్’వేదికగా ప్రకటించారు. ‘తొలిసారి ఒక కారు యజమానికి తనను తాను డెలివరీ చేసుకుంది’అని పేర్కొన్నారు. నిర్ణీత గడువుకన్నా ఒక రోజు ముందే కారును డెలివరీ చేశామన్నారు. తనకు తెలిసినంత వరకు వాహనంలో వ్యక్తులెవరూ లేకుండా లేదా రిమోట్ ఆపరేటింగ్ లేకుండా ఒక పబ్లిక్ హైవేపై ప్రయాణించిన తొలి పూర్తిస్థాయి అటానమస్ కారు తమదేనన్నారు. ఈ విజయాన్ని సాధించినందుకు టెస్లా సాఫ్ట్వేర్, ఏఐ చిప్ డిజైన్ బృందాలను ఆయన అభినందించారు. మోడల్ వై కారు గంటకు గరిష్టంగా 115 కి.మీ. వేగంతో ప్రయాణించినట్లు టెస్లా ఏఐ, ఆటోపైలట్ విభాగం చీఫ్ అశోక్ ఎల్లుస్వామి వెల్లడించారు. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
ఎగిరే ట్యాక్సీలు
పౌర విమానయాన చరిత్రలోనే తొలిసారిగా జూన్ 3న అమెరికాలో ‘అలియా సీఎక్స్300’ అనే విద్యుత్ విమానం ఐదుగురు ప్రయాణికులతో విజయవంతంగా గమ్యస్థానాన్ని చేరుకుని చరిత్ర సృష్టించింది. 130 కి.మీ. ప్రయాణానికి దీనికి పట్టిన సమయం 35 నిమిషాలు కాగా, ఇంధనానికి (విద్యుత్కు) అయిన ఖర్చు సుమారుగా రూ.700. అంత చౌకగా విమానయానాన్ని సాధ్యం చేయటంలో కొత్త శకానికి నాంది పలికిన ఈ విమానం.. మనదేశ ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ అభివృద్ధి ప్రయత్నాలకూ పరోక్షంగా ప్రోత్సాహాన్నిచ్చింది. అత్యాధునిక విమాన రవాణా (ఏఏఎమ్)లో భాగంగా ఇప్పటికే కీలక చర్యలు చేపట్టిన మనదేశం వచ్చే ఏడాది నాటికి ఈ విమానాలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పనిచేస్తోంది.2023లో బెంగళూరులో జరిగిన ఒక అధ్యయనంలో.. ప్రైవేటు వాహనాలు వాడే ఉద్యోగుల్లో 57 శాతం, ప్రజా రవాణా ద్వారా ప్రయాణించే ఉద్యోగుల్లో 55 శాతం మంది కార్యాలయాలకు ఆలస్యంగా వస్తున్నారని తేలింది. ఆలస్యం కారణంగా ఏడాదిలో సుమారు 7 లక్షల పని గంటలు నష్టపోయారని అంచనా. 2023లో ట్రాఫిక్ రద్దీ కారణంగా కోల్పోయిన పని గంటల వల్ల ఒక్క బెంగళూరు నగరమే 200 బిలియన్ డాలర్లు నష్టపోయింది.పట్టణాల్లో ఇలాంటి సమస్యలు అధిగమించేందుకు తక్కువ వ్యవధిలో గమ్యానికి చేర్చే అత్యాధునిక విమాన రవాణా (ఏఏఎమ్) ఎంతో ఉపయోగపడుతుందని ‘స్కై వేస్ టు ద ఫ్యూచర్ – ఆపరేషనల్ కాన్సెప్ట్స్ ఫర్ అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ఇన్ ఇండియా’ నివేదికలో పేర్కొన్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్, భారత పౌర విమానయాన మంత్రిత్వశాఖ కలిసి సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి.అంతర్జాతీయ సంస్థలతో కలిసి..మానవ రహిత ఎయిర్ ట్యాక్సీ, ఎయిర్ మొబిలిటీలో నూతన ఆవిష్కరణల కోసం.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), యూరోపియన్ యూనియన్ సేఫ్టీ ఏజెన్సీ (ఈఏఎస్ఏ) మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. అంతేకాకుండా, ఈ వ్యవస్థ నిర్వహణ కోసం అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏఓ), అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వంటి వాటితోనూ మనదేశం కలిసి పనిచేస్తోంది. విద్యుత్ ఎయిర్ ట్యాక్సీలపై అధ్యయనం చేసేందుకు డీజీసీఏ 7 వర్కింగ్ గ్రూపులను ఏర్పాటుచేసిందని ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ గ్రూపులు దృష్టి సారిస్తున్న అంశాల్లో ప్రధానమైనది వెర్టిపోర్టులు (ఎయిర్ ట్యాక్సీల కోసం ప్రత్యేకించిన ఎయిర్పోర్టులు. సాధారణ హెలికాప్టర్ మాదిరిగానే ఎయిర్ ట్యాక్సీలు నిలువుగా టేకాఫ్ అవుతాయి. అదే విధంగా ల్యాండ్ అవుతాయి.). ఇంకా అటానమస్ డ్రోన్ల ట్రాఫిక్ వ్యవస్థ, ఎయిర్ ట్యాక్సీల నిర్వహణ, మరమ్మతులు, నియంత్రణ మార్గదర్శకాలు, సురక్షిత ప్రయాణానికి అవసరమైన మౌలిక వసతుల వంటి అంశాలపై ఈ గ్రూపులు పనిచేస్తున్నాయి.రెండు దశల్లో విస్తరణభారత్లో తొలి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ 2026 అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. డీజీసీఏ ఏర్పాటు చేసిన కమిటీలు 2026 నాటికి ఎయిర్ ట్యాక్సీలను మొదట ఢిల్లీ–ఎన్ సీఆర్, ముంబై, బెంగళూరులలో ప్రారంభించి, తదుపరి దశలో చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలకు విస్తరింపజేసే దిశగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీల విధి విధానాలు ఖరారు అయ్యాక ఇండిగో మాతృసంస్థ అయిన ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ (ఐజీఇ), అమెరికా ఎయిర్ ట్యాక్సీ తయారీ కంపెనీ ‘ఆర్చర్ ఏవియేషన్’తో కలిసి ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనుందట. చార్జీలు ఎంత ఉండొచ్చు?ఎయిర్ ట్యాక్సీ చార్జీలు ప్రస్తుతం ఉన్న క్యాబ్ చార్జీల కంటే కాస్త మాత్రమే ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఉదాహరణకు ప్రస్తుతం క్యాబ్లో ఢిల్లీ నుండి గుర్గావ్కు ఒక మనిషికి రూ. 1,500–2,000 చార్జీ అవుతుండగా, దీనికి ఒకటిన్నర రెట్లు మాత్రమే ఎక్కువగా రూ. 2,000–3,000 వరకు ఎయిర్ ట్యాక్సీ చార్జీ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.ఏమని పిలవాలి?విద్యుత్ ఎయిర్ ట్యాక్సీని సాంకేతికంగా ‘ఎలక్ట్రిక్ వెర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్’ (ఇ.వి.టి.ఓ.ఎల్.) ఎయిర్క్రాఫ్ట్ అంటున్నారు. మొత్తంగా ఈ రవాణా వ్యవస్థని ‘అత్యాధునిక విమాన రవాణా (ఏఏఎమ్)’ అంటారు. – సాక్షి, స్పెషల్ డెస్క్పనిచేస్తున్న 2 సంస్థలుడీజీసీఏ రికార్డుల ప్రకారం ప్రస్తుత దేశంలో పౌర విమానయాన రంగంలో ఎయిర్ ట్యాక్సీల తయారీకోసం 2 సంస్థలు పనిచేస్తున్నాయని పార్లమెంటులో ప్రభుత్వం ప్రకటించింది. అవి చెన్నైకి చెందిన ‘యుబిఫ్లై టెక్నాలజీస్’ లేదా ఈ–ప్లేన్ కంపెనీ. ఐఐటీ మద్రాసులో ప్రాణం పోసుకున్న ఈ కంపెనీ ఎయిర్ ట్యాక్సీ, కార్గో ట్యాక్సీల తయారీలో పనిచేస్తోంది.చండీగఢ్కి చెందిన ‘నల్వా ఏరో’. ఇది కనీసం ఐదుగురు ప్రయాణించగలిగే ఎయిర్ ట్యాక్సీ రూపకల్పనలో నిమగ్నమై ఉంది.ఎన్నో ప్రయోజనాలు» వెర్టిపోర్టులన్నీ సౌర, పవన విద్యుత్వంటి సంప్రదాయేతర ఇంధన వనరులతో నడిచేలా చూడాలన్నది కేంద్రం ఆలోచన. అలాగే, ఇవి పూర్తిగా గ్రీన్ పోర్టులుగా పర్యావరణ హితంగా ఉండాలని యోచిస్తోంది. విద్యుత్ ఎయిర్ ట్యాక్సీలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.» రోడ్లమీద ట్రాఫిక్ సమస్యకు ఫుల్స్టాప్ పెట్టొచ్చు» కాలుష్య కారక ఉద్గారాలను విడుదల చేయవు. శబ్ద కాలుష్యమూ ఉండదు.»ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంతోపాటు సరకు రవాణా, ఎమర్జెన్సీ సేవలకూ పనికొస్తుంది» అత్యాధునిక సాంకేతికత, ప్రమాణాలతో పనిచేస్తాయి కాబట్టి ప్రమాదాలకు ఆస్కారం చాలా తక్కువ» సరికొత్త ఉద్యోగావకాశాలు వస్తాయి» మారుమూల ప్రాంతాలకు కూడా ఈ ట్యాక్సీ సేవలను అందించవచ్చు -
ISSలో శుభాంశు శుక్లా.. ఇస్రో ఎందుకో వెనుకబడింది!
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడు ఎవరు?.. ఇంకెవరు తాజాగా ఆ ఫీట్తో చరిత్ర సృష్టించింది భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లానే. పైగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ మిషన్లో భారతీయ అంతరిక్ష సంస్థ(ISRO) కూడా భాగంగా ఉంది. అలాంటప్పుడు ఇస్రో ఎందుకు దీనిని అంతగా ప్రమోట్ చేసుకోవడం లేదు!!.శుభాంశు శుక్లా అడుగు.. భారత అంతరిక్ష ప్రయాణంలో కొత్త అధ్యాయం. శుభాంశు పైలట్గా సాగిన ఐఎస్ఐఎస్కి సాగిన యాక్జియం-4 మిషన్ ప్రయాణం.. అంతరిక్షంపై భారత్ చేసిన సంతకం. కానీ, ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ISRO తక్కువగా ప్రచారం చేయడం కోట్ల మంది భారతీయులకు నిరాశ కలిగిస్తోంది. దేశం మొత్తం గర్వపడే ఈ ఘనతను మరింత ఉత్సాహంగా, ప్రజలతో పంచుకోవాల్సిన అవసరం లేదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ఇస్రో ఎందుకు వెనకబడిందనే విషయాన్ని పరిశీలిస్తే..వీళ్ల తర్వాత శుక్లానే..అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామి భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ. సోయుజ్ T-11 (Soyuz T-11) మిషన్ కోసం 1984, ఏప్రిల్ 3న ఆయన స్పేస్లోకి వెళ్లారు. అక్కడ సోవియట్ యూనియన్ (ఇప్పటి రష్యా) ద్వారా నిర్వహించబడిన సల్యూట్ 7లో(సెకండ్జనరేషన్ అంతరిక్ష కేంద్రం) ఏడు రోజులపాటు శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించారు. ఆ తర్వాత భారతీయులెవరూ స్పేస్లోకి వెళ్లింది లేదు. కానీ..భారతీయ మూలాలు ఉన్న కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్.. తెలుగు మూలాలున్న భారత సంతతికి చెందిన శిరీషా బండ్లా, రాజా జాన్ వూర్పుటూర్ చారి మాత్రం రోదసీ యాత్రలు చేశారు. ఈ లెక్కన రాశేష్ శర్మ తర్వాత స్పేస్లోకి.. అందునా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి అడుగిడిన తొలి వ్యక్తి ఘనత శుభాంశు శుక్లాదే. పైగా నలుగురితో కూడిన ఈ బృందంలో పైలట్గా ఉన్న శుభాంశు స్వయంగా 7 కీలక ప్రయోగాలు(60 ప్రయోగాల్లో) నిర్వహించనున్నారు. అలాంటప్పుడు భారత అంతరిక్ష చరిత్రలో మైలురాయిని ఇస్రో ఎందుకు హైలైట్ చేసుకోవడం లేదు!.అంత బడ్జెట్ కేటాయించి మరీ..అంతరిక్ష ప్రయోగంలో దూసుకుపోతున్న భారత్.. చంద్రయాన్, మంగళయాన్తో సూపర్ సక్సెస్ సాధించింది. అలాంటి దేశం తరఫున ఐఎస్ఎస్కి వెళ్లిన తొలి మిషన్ ఇదే. పైగా భారతదేశం భవిష్యత్తులో చేపట్టబోయే మానవసహిత అంతరిక్ష ప్రయోగం గగన్యాన్ మిషన్కు.. శుక్లా పాల్గొన్న ఈ మిషన్ ముందడుగుగా పరిగణించబడుతోంది. ఇందుకోసమే భారత ప్రభుత్వం తరఫున Department of Space (DoS) ఈ మిషన్ కోసం రూ. 715 కోట్లు కేటాయించింది. డిసెంబర్ 2024 నాటికి రూ. 413 కోట్లు ఖర్చయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 135 కోట్లు అదనంగా కేటాయించారు. మిగిలిన రూ. 168 కోట్లు 2026 మార్చి నాటికి వినియోగించనున్నారు.ఈ మొత్తం బడ్జెట్లో శుభాంశు శుక్లా ప్రయాణం, శాస్త్రీయ ప్రయోగాలు, శిక్షణ, అంతరిక్ష ప్రయాణానికి అవసరమైన ఇతర సాంకేతిక అంశాలు ఉన్నాయి. పైగా తాజా మిషన్లో జీవశాస్త్రం, వైద్యం, సాంకేతికత వంటి రంగాలకు సంబంధించిన ప్రయోగాలు జరుగుతున్నాయి. అనుకుంటే ఈ విషయాలన్నింటిని భారీగా ప్రచారం చేసుకునేదే. కానీ, ఎందుకో ఆ పని చేయడం లేదు. దీంతో Wake up ISRO! అనే చర్చ మొదలైంది.అందుకేనా?..ఇస్రో మౌనానికి కారణాలు కొన్ని ఉండొచ్చు. సాధారణంగా తక్కువ ప్రచారంతో, శాస్త్రీయ దృష్టితో ముందుకు సాగే సంస్థ ఇది. అందుకే దేశానికి గర్వకారణమైన ఘట్టం విషయంలోనూ అదే వైఖరి అవలంభిస్తుందా? అనే అనుమానం కలగకమానదు. సంస్థ సంస్కృతికి తోడు ప్రభుత్వ నియంత్రణ, అంతర్జాతీయ ఒప్పందాల పరిమితులు కూడా ప్రభావం చూపించి ఉండొచ్చని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. వీటికి తోడు..యాక్సియం-4 స్పేస్ మిషన్.. ప్రైవేట్ అంతర్జాతీయ భాగస్వామ్యం అంటే ISRO, NASA, Axiom Space సంయుక్త భాగస్వామ్యంతో జరిగిన మిషన్. అందుకే గతంలో చంద్రయాన్-3 వంటి సొంత మిషన్లకు భారీ ప్రచారం ఇచ్చిన ఇస్రో, తాజా మిషన్ అంతర్జాతీయ భాగస్వామ్యంతో జరిగినందున తక్కువ స్థాయిలో స్పందించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా.. మిషన్ ముగిసే సమయంలోనైనా ఇస్రో శుభాంశు శుక్లా ఘనతను ప్రపంచమంతా మారుమోగిపోయేలా ప్రచారం చేయాలని పలువురు భారతీయులు ఆశిస్తున్నారు.:::వెబ్డెస్క్ ప్రత్యేకం -
కుర్చీకి అతుక్కోకు.. రోగాలు తెచ్చుకోకు
రోజులో గంటల తరబడి కూర్చుని ఉండేవాళ్లలో.. అల్జీమర్స్ వంటి మెదడు సంబంధ అనారోగ్య సమస్యలు వచ్చే ముప్పు చాలా ఎక్కువట. అమెరికాలోని వాండర్బిల్ట్ యూనివర్సిటీ మే నెలలో విడుదల చేసిన అధ్యయనం చెప్పిన విషయమిది. ఎక్కువసేపు కూర్చుని ఉండే ఐటీ ఉద్యోగుల్లో ఫ్యాటీ లివర్, ఊబకాయం సమస్యలు వస్తున్నాయని ఫిబ్రవరిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ పరిశోధన వెల్లడించింది. రోజులో 8 గంటలు అంతకుమించి ఎక్కువ సమయం కూర్చుని ఉండిపోయేవాళ్లు మానసిక అనారోగ్యాలు, గుండె జబ్బులు, కొన్ని రకాల కేన్సర్లు, ఒత్తిడి.. ఇంకా అనేక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అధ్యయనాలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా.. ఎక్కువసేపు కూర్చోవడం అన్నది టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని దాదాపు రెట్టింపు చేస్తుందట. – సాక్షి, స్పెషల్ డెస్క్గంటల తరబడి.. కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసే ఉద్యోగస్తులు, టీవీలకు అతుక్కుపోయేవాళ్లంతా పారాహుషార్. కూర్చున్నంతసేపూ సుఖంగానే ఉంటుంది కానీ.. తరువాత్తరువాత అనారోగ్యాలతో కష్టం తెలుస్తుంది అంటున్నారు వైద్య నిపుణులు, పరిశోధకులు. ఎక్కువసేపు కూర్చోవడం లేదా శారీరక కదలికలు బొత్తిగా లేకపోవటం అన్నవి శారీరకంగా, మానసికంగా అనేక అనారోగ్యాలకు దారి తీస్తున్నట్లు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వైద్య పరిశోధకులు గుర్తించారు. ఎక్కువసేపు కదలకుండా ఉండటం వల్ల కేలరీలు కరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. దాంతో బరువు పెరుగుతారు. జీర్ణక్రియ మందగిస్తుంది. కొవ్వుల్ని, చక్కెరలను సమర్థవంతంగా విచ్ఛిన్నం చేసి, శరీరానికి శక్తిని అందించే సామర్థ్యం తగ్గి అనారోగ్యాలు దరిచేరతాయి.ఎక్కువసేపు కూర్చుంటే వచ్చేవి..హృద్రోగాలు..: రక్త ప్రవాహం తగ్గడం, రక్త నాళాలలో కొవ్వు నిల్వలు పేరుకుపోవడం రక్తపోటుకు, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడానికి కారణమవుతాయి.టైప్ 2 మధుమేహం..: మన శరీరంలోని క్లోమం తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోవడం లేదా శరీరం ఇన్సులిన్ను సరిగ్గా ఉపయోగించలేకపోవడం లేదా ఈ రెండింటి వల్లా టైప్ 2 మధుమేహం వస్తుంది. దీనివల్ల దాహం, అలసట, మసక దృష్టి, పుండ్లు గాయాల వంటివి నెమ్మదిగా నయమవడం లాంటివి జరుగుతాయి.మస్క్యులోస్కెలెటల్ (అస్థి–కండరాల నొప్పి)..: కోర్ (ఉదరం, వీపు కటిభాగం సహా ప్రధాన దేహం), నడుము, కాళ్ల కండరాలు బలహీనపడతాయి. శరీరంలో కదలికలు కష్టం అవుతాయి. వెన్ను, మెడ దృఢత్వాన్ని కోల్పోతాయి. వెన్నెముక అమరిక దెబ్బతింటుంది.రక్త ప్రసరణ, రక్తనాళ సమస్యలు..: రక్త ప్రసరణ సాఫీగా జరగదు. దాంతో కాళ్లు, పాదాలలో రక్తం ఒక చోట చేరటం జరుగుతుంది. వాపు, కాళ్లలో ఉబ్బిన (వెరికోస్) సిరలు, రక్తం గడ్డకట్టటం లాంటివి సంభవించవచ్చు.కేన్సర్ ప్రమాదం..: పెద్దపేగు, రొమ్ము, మహిళల్లో గర్భాశయ సంబంధ కేన్సర్ల వంటివి వచ్చే ప్రమాదం ఉంది. తగ్గిన రక్త ప్రసరణ, జీవక్రియ మందగమనం కణుతుల పెరుగుదలకు, వ్యాప్తికి దోహదం చేయవచ్చు.మానసిక అనారోగ్యాలు..: ఎక్కువసేపు కూర్చోవటం అన్నది మొదట శరీరంపై ప్రభావం చూపి, మెల్లిగా మానసిక అనారోగ్యాల వైపు కూడా దారి తీయవచ్చు. మెదడు పరిమాణం తగ్గడం, (సెరిబ్రల్ ఎట్రొఫీ) మెదడు కుంచించుకుపోతుంది, మతిమరుపు వస్తుంది.వ్యాయామం చేస్తే సరిపోదా?సరిపోతుంది. అయితే అది కొంతవరకు మాత్రమే. ప్రతిరోజూ 60 నుంచి 75 నిమిషాలు తేలికైన లేదా కఠినమైన వ్యాయామం చేయగలిగిన వారు కూర్చోవడం వల్ల కలిగే అనారోగ్య ప్రమాదాలను కొంత వరకు తగ్గించుకోవచ్చు. అయితే ఇది వైద్యులు సాధారణంగా సిఫార్సు చేసే దానికంటే ఎక్కువ వ్యాయామం. చాలామంది అంత చేయలేరు కూడా. అంత మాత్రాన నిరాశ చెందనవసరం లేదు. రోజుకు 30 నిమిషాలు వ్యాయామం చేయగలిగినా కూడా కూర్చోవటం వల్ల ముప్పిరిగొనే వ్యాధుల నుండి చాలావరకు తప్పించుకోవచ్చు. అయితే, అరగంట వ్యాయామం చేశాం కదా అని 6 గంటలపాటు కదలకుండా కూర్చుంటాం అంటే కుదరదు. రోజంతా కదులుతూ ఉండటం కూడా ముఖ్యమేనని పరిశోధకులు అంటున్నారు. అదే పనిగా కూర్చోకుండా మధ్యమధ్యలో చిన్నచిన్న విరామాలు తీసుకోవాలి. కనీసం అరగంటకోసారి లేచి నిల్చోవడం, కాసేపు నడవడం, ఫోన్ కాల్స్ సమయంలో నడుస్తూ మాట్లాడటం, ఒళ్లు సాగదీసుకోవడం వంటివి చేయాలి.ఏ యూనివర్సిటీ ఏం కనుగొంది?హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) సంయుక్తంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐటీ ఉద్యోగుల మీద ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించాయి. ఎక్కువసేపు కూర్చోవటం, అధిక పనిగంటలు, పని ఒత్తిడుల కారణంగా వారిలో ఊబకాయం, కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం (ఫ్యాటీలివర్ – ఎమ్ఏఎఫ్ఎల్డి) వంటి సమస్యలతో బాధపడుతున్నారట.గంటల తరబడి కూర్చోవడాన్ని అమెరికన్ జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఏకంగా ధూమపానంతో సమానమని, ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువ ప్రమాదకరమని పేర్కొంది.ఎక్కువసేపు కూర్చుంటే వచ్చే దుష్ప్రభావాలపై ప్రపంచవ్యాప్తంగా అధ్యయనాలు జరిగాయి. ఎలాంటి సమస్యలు వస్తాయని వారు చెప్పారంటే..» యూనివర్సిటీ ఆఫ్ బెడ్ఫోర్డ్షైర్ (బ్రిటన్): హృద్రోగాలు, మధుమేహం» యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో (అమెరికా) : చురుగ్గా ఉండే యువతలోనూ గుండె జబ్బులు, ఊబకాయం. » హార్వర్డ్ టి.హెచ్. చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (అమెరికా): టైప్ –2 మధుమేహం, గుండె జబ్బులు, స్ట్రోక్» యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్ (బ్రిటన్) : టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు. » ఘెంట్ యూనివర్సిటీ (బెల్జియం) : (12–14 ఏళ్ల పిల్లల్లో) నిద్ర సరిగ్గా పట్టకపోవడం, తక్కువ సేపు నిద్ర పోవడం» యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్ల్యాండ్ (ఆస్ట్రేలియా) : ఊబకాయం, హృద్రోగాలు, టైప్ – 2 డయాబెటిస్, స్ట్రోక్, కొన్ని రకాల కేన్సర్లు -
విమర్శల జడివానలో మమ్దానీ
అన్ని వర్గాల నుంచి విమర్శల బాణాలు గుచ్చుకుంటున్నా గెలుపే లక్ష్యంగా సాగిపోతున్న మమ్దానీ వైఖరిపై ఇప్పుడు న్యూయార్క్ నగరవ్యాప్తంగా చర్చకొనసాగుతోంది. పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్ వ్యతిరేక వైఖరితో వార్తల్లోనేకాదు న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికల్లోనూ నిలిచి డెమొక్రటిక్ అభ్యరి్థత్వాన్ని గెల్చుకున్న జోహ్రామ్ ఖ్వామీ మమ్దానీని భారత్లోనూ పెద్దసంఖ్యలో ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రధాని మోదీ, హిందూయిజం, భారత ప్రభుత్వ పాలనా విధానాలపైనా మమ్దానీ గతంలో చేసిన వ్యాఖ్యలు, పెట్టిన ట్వీట్లే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. తరచూ అబద్దాలు వల్లెవేస్తూ అందలానికి ఎక్కాలని చూసే పూర్తి అవకాశవాది అనే ఆరోపణలూ పెరిగాయి. మొదట్నుంచీ అతి వాగ్దానాలు డెమొక్రటిక్ పార్టీ తరఫున అభ్యరి్థత్వాన్ని గెల్చుకున్న వెంటనే మమ్దానీని ‘నెరవేరని వాగ్దానాలుచేసే నేత’గా ప్రస్తుత న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ అభివర్ణించారు. ‘‘ఎలాంటి వాగ్దానాలు చేస్తే జనం మెచ్చుతారో మమ్దానీ అచ్చు అలాగే మాట్లాడతారు. నెరవేర్చడం అసాధ్యం అని తెల్సికూడా ఇష్టమొచి్చన హామీలిస్తాడు’’అని ఎరిక్ ఆరోపించారు. ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి మమ్దానీని ఓడిస్తానని ఎరిక్ ప్రతిజ్ఞచేశారు. ‘‘అపార్ట్మెంట్లలో అద్దెలను క్రమబద్దీకరిస్తానని, అవసరమైతే భారీగా తగ్గేలా చేస్తానని మమ్దానీ హామీ ఇచ్చాడు. ప్రజాధనంతో ప్రజలందరికీ ఉచిత బస్సు, శిశుసంరక్షణ కార్యక్రమాలు చేపడతానని చెప్పాడు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సరకు దుకాణాలు తెరుస్తానన్నాడు. తన వాగ్దానాలు నెరవేర్చేందుకు ఏకంగా 10 బిలియర్ డాలర్లు ఖర్చువుతుందని ప్రకటించారు. ఇందుకు కావాల్సిన నగదు మొత్తాలను న్యూయార్క్ నగరంలోని సంపన్నులు, బడా పారిశ్రామికవేత్తల నుంచి పన్నుల రూపంలో ముక్కు పిండిమరీ వసూలుచేస్తానన్నాడు. అయితే నగరంలో పన్నులు వసూలుచేసే అధికారం మేయర్కు ఉండదన్న కనీస అవగాహన మమ్దానీకి లేదు’’అని ఆడమ్స్ గుర్తుచేశారు. మమ్దానీ ప్రస్తుతం క్వీన్స్ 36వ జిల్లా నుంచి న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. పాలస్తీనాకు జై.. నెతన్యాహూకు నై పాలస్తీనియన్ల హక్కులను పరిరక్షించాలని తరచూ మమ్దానీ ప్రసంగాలిస్తుంటారు. గాజాలోని హమాస్పై ఇజ్రాయెల్ సేనల భీకర దాడులను ఈయన తీవ్రంగా తప్పుబట్టారు. దాడులకు ఆదేశించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ యుద్ధనేరాలకు పాల్పడిన నేరస్తుడిగా మమ్దానీ అభివరి్ణంచారు. ‘‘యుద్దనేరస్తుడిగా అంతర్జాతీయ నేర న్యాయస్థానం నెతన్యాహూపై 2024 నవంబర్లోనే అరెస్ట్ వారెంట్ జారీచేసింది. అతను న్యూయార్క్కు వస్తే ఖైదు చేసి బందీఖానాలో పడేస్తా’’అని మమ్దానీ గతంలో చేసిన వ్యాఖ్యలపై అమెరికాలోని యూదు సంఘాలు ఒంటికాలిపై లేచి ఆగ్రహం వ్యక్తంచేశాయి. మోదీపైనా విమర్శలు గుజరాత్ అల్లర్లలో ఎంతో మంది ముస్లింలు చనిపోయారని, అందుకు నాటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీయే కారణమని మమ్దానీ గత నెలలో ఆరోపించారు. అమెరికాలో ఏదైనా వేడుకలో మోదీతో కలిసి మీరు వేదికను పంచుకుంటారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు మమ్దానీ పైవిధంగా సమాధానమిచ్చారు. ‘‘నెతన్యాహూ మాదిరే మోదీ కూడా యుద్దనేరస్తుడే. గుజరాత్లో ఎంతో మంది ముస్లింల మరణాలకు మోదీ కూడా కారణమే. అందరూ చనిపోగా గుజరాత్లో మచ్చుకైనా మనం మిగిలిపోతామ ని ఒక్క ముస్లిం కూడా భావించి ఉండడు’’ అని అన్నారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీతోపాటు కాంగ్రెస్ నేతలూ తీవ్ర అభ్యంతరంవ్యక్తంచేశారు. ‘‘మమ్దానీ ఒక్కసారి నోరు తెరిచాడంటే తమకింక పనిలేదని పాకిస్తాన్లోని తప్పుడు ప్రచార బృందాలు కూడా సెలవు పెట్టి ఇంటికి వెళ్లిపోతాయి. ఆ స్థాయిలో భారత్పై విద్వేషం చిమ్ముతాడు. న్యూయార్క్ నుంచి ఊహాత్మక అబద్దాలు అల్లే ఇతగాడు ఉండగా మనకు వేరే శత్రువు అక్కర్లేదు’’అని కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ వ్యాఖ్యానించారు. నగరంలో మమ్దానీకి మద్దతుదారులు పెరిగితే చివరకు ‘జిహాదీ మేయర్’అవతరిస్తాడు అని ఒక నెటిజన్ ఆగ్రహం వ్యక్తంచేశాడు. మమ్దానీని విమర్శించే వాళ్లు అతని తల్లిదండ్రులపైనా విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘మమ్దానీ తండ్రి అసలైన మార్కిస్ట్కాదు. నిఖార్సయిన వ్యక్తికాదు. ఇక అతని తల్లి మీరా నాయర్ అసలైన కేరళ మలయాళీ నాయర్ కాదు. ఆమె పేరులో అక్షరదోషం ఉంది. ఆ పేరు నాయర్ కాదు పంజాబీ నయ్యర్. మమ్దానీ చాలా ప్రమాదకరమైన వ్యక్తి. ఇతని హిందువులన్నీ, యూదులన్నీ అస్సలు పడదు. వీళ్లపై జరిగే దాడులను సమర్థిస్తాడు’’అని మరో నెటిజన్ విమర్శించాడు. హిందూ వ్యతిరేకి? 2020 ఆగస్ట్లో న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్ కూడలి వద్ద రామమందిర వేడుకలను నిరసిస్తూ జరిగిన ఒక హిందూ వ్యతిరేక ర్యాలీలో మమ్దానీ పాల్గొన్నట్లు ఒక వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. జిహాదీ, ఖలిస్తాన్ వేర్పాటువాదులు ఈ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో శ్రీరాముడిని, హిందువులనుద్దేశిస్తూ మమ్దానీ అసభ్య పదజాలాన్ని వాడారు. గతంలో బీజేపీకి వ్యతిరేక పోస్ట్లు పెట్టారు. ‘‘భారత్లో బీజేపీ కేవలం హిందుత్వాన్నే ప్రోత్సహిస్తోంది. మన హిందూ ముత్తాతలు ఉర్దూ కవితలను ఇష్టపడితే, ముస్లిం పెద్దలు ఎంతో శ్రద్ధతో గుజరాతీలో భజనలు చేశారు. ఇలాంటి ఘన చరితను బీజేపీ తుడిచిపారేస్తోంది’’అని మమ్దానీ గతంలో ఒక ట్వీట్చేశారు. ‘‘ఉగాండాలో ఉన్న మా కుటుంబాన్ని మేం భారతీయులనే కారణంతో వెలివేశారు. ముస్లింలు అనే కారణంగా భారత్లో మా తోటి ముస్లింలను పీడిస్తున్నారు’’అని గతంలో మరో పోస్ట్ పెట్టారు. బాబ్రీ మసీదు విధ్వంసానికి పూర్వపు ఫొటోను షేర్చేసి దానికి ఒక క్యాప్షన్ ఇచ్చారు. ‘‘ఇది 400 ఏళ్లపాటు నిలిచిన మసీదు. కానీ దీనిని బీజేపీ ప్రేరేపిత మతమూక 1992లో కూల్చేసింది. దీనికి గుర్తుగా టైమ్స్ స్క్వేర్ కూడలిలో హిందువులు పండగ చేసుకున్నారు’’అని మరో పోస్ట్ పెట్టారు. ఆధునిక నాగరికతకు నిలయమైన న్యూయార్క్కు అవకాశమొస్తే మేయర్గా సేవలందించాల్సిన నేత ఇలా వివక్షధోరణితో ఉంటే పాలన సవ్యంగా సాగడం కష్టమని పలువురు న్యూయార్క్వాసులు ఆందోళన వ్యక్తంచేశారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
మేడిన్ ఇండియా ఎలక్ట్రానిక్స్
ఎలక్ట్రానిక్స్ తయారీలో భారత్ చాలా పురోగతి సాధించింది. దశాబ్దంలో వచ్చిన మార్పును చూస్తే ఔరా అనిపించాల్సిందే. ఇందుకు స్మార్ట్ఫోన్స్ను ఉదాహరణగా చెప్పవచ్చు. యాపిల్ ఫోన్లూ భారత్లో రూపుదిద్దుకుంటున్నాయి. 2014లో దేశంలో వినియోగించిన ఫోన్లలో 30 శాతంలోపు దేశీయంగా అసెంబుల్ అయితే.. 2024 వచ్చే సరికి ఇది 99 శాతం దాటిందంటే ఎలక్ట్రానిక్స్ రంగంలో భారత దూకుడును అర్థం చేసుకోవచ్చు. ఉపకరణాల తయారీలో వినియోగించే విడిభాగాలను దేశీయంగా ఉత్పత్తి చేయడం ద్వారా ‘ఎలక్ట్రానిక్స్ హబ్’గా అవతరించే దిశగా భారత్ దూసుకుపోతోంది. – సాక్షి, స్పెషల్ డెస్క్ఏటా కొత్త మైలురాళ్లు..మొబైల్ ఫోన్స్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్.. ఇలా విభాగం ఏదైనా తయారీపరంగా భారత్లో ఏటా కొత్త మైలురాళ్లు నమోదవుతున్నాయి. దేశంలో తయారైన ఎలక్ట్రానిక్స్ విలువ 2014–15లో రూ. 1.9 లక్షల కోట్లుగా ఉంటే 2023–24 నాటికి ఐదురెట్లు పెరిగి రూ. 9.5 లక్షల కోట్లకు చేరుకోవడం ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో భారత్లో జరుగుతున్న పురోగతికి నిదర్శనం. అయితే మొబైల్ ఫోన్ల అసెంబ్లింగ్ కొత్త రికార్డులకు ప్రధానంగా రూ. 1.9 లక్షల కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కారణం. 2024–25లో భారత్ నుంచి స్మార్ట్ఫోన్ల ఎగుమతులు రూ. 2 లక్షల కోట్లు దాటాయి. ఎలక్ట్రానిక్స్ తయారీలో వినియోగించే విడిభాగాల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు పీఎల్ఐ పథకం ప్రకటించడం ఈ రంగంలో పెద్ద అడుగు పడినట్టు అయింది.ఈసీఎంఎస్తో ఊతం..విడిభాగాల తయారీ కంపెనీలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్లో రూ. 22,919 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ తయారీ పథకం (ఈసీఎంఎస్) ప్రారంభించింది. ఈ పథకం 2031–32 వరకు కొనసాగుతుంది. కెమెరా మాడ్యూల్స్, డిస్ప్లేలు, మల్టీ లేయర్ పీసీబీలు సహా వివిధ విడిభాగాల తయారీని ప్రోత్సహించనుంది. రూ. 59,350 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం, రూ. 4.5 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తి సాధించడం, కొత్తగా 91,600 మందికి ప్రత్యక్షంగా ఉపాధిని కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి ఇప్పటికే 70 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 80% చిన్న, మధ్యతరహా కంపెనీలు ఉన్నాయి. టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్కాన్, డిక్సన్ టెక్నాలజీస్ వంటి పెద్ద కంపెనీలు సైతం దరఖాస్తు చేసిన కంపెనీల జాబితాలో ఉన్నాయని సమాచారం. అసెంబ్లింగ్ను మించితేనే..ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్ ఎదగాలంటే విడిభాగాల తయారీలో దూసుకుపోవాలి. అసెంబ్లింగ్కు పరిమితం కాకుండా తయారీ దిశగా అభివృద్ధి చెందాలన్నది నిపుణుల అభిప్రాయం. మొబైల్ ఫోన్లను తయారు చేయడానికి దేశీయంగా ఉన్న ఎలక్ట్రానిక్ తయారీ సేవలు లేదా కాంట్రాక్ట్ తయారీ కంపెనీలు కెమెరాలు, డిస్ప్లేలు, హై–ఎండ్ బ్యాటరీ ప్యాక్లు, సెమీకండక్టర్లు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల వంటి కీలక భాగాల దిగుమతులపై ఆధారపడుతున్నాయి. ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులైన స్మార్ట్ టీవీలు, సీసీటీవీ కెమెరాలు, కంప్యూటర్లు, వేరబుల్స్, హియరబుల్స్ను సైతం దిగుమతి చేసుకున్న విడిభాగాలతోనే అసెంబుల్ చేçస్తున్నారు. విడిభాగాలు ఇప్పటికీ చైనా, కొరియా, తైవాన్ నుంచి ప్రధానంగా సరఫరా అవుతున్నాయి. ఎలక్ట్రానిక్స్ విడిభాగాల విలువలో దిగుమతుల వాటా ఏకంగా 85–90% ఉందని ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. -
అగ్రి రోబోటిక్స్.. ప్రణాళికతో సక్సెస్
కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ వంటి సాంకేతికతలు అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తున్న రోజులివి. వ్యవసాయ రంగం కూడా ఇప్పుడు ఈ డిజిటల్ మార్పులను స్వీకరిస్తోంది. కానీ, మన దేశంలో ఇంకా చాలా ప్రాంతాల్లో వ్యవసాయ రంగంలో రోబోలను విలాసవంతమైన ఆవిష్కరణగా మాత్రమే చూస్తున్నారు. ఈ దశలో తెలంగాణ రాష్ట్రం డిజిటల్ వ్యవసాయ విప్లవం దిశగా అడుగులు వేస్తోంది.ఈ కృషిలో తెలంగాణ సహా తెలుగు రాష్ట్రాలు అగ్రగామిగా ఎలా మారగలవన్న అంశంపై డిజిటల్ వ్యవసాయంలో ప్రపంచ స్థాయి పరిజ్ఞానం ఉన్న సీనియర్ శాస్త్రవేత్త, హైదరాబాద్లోని అగ్రికల్చరల్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఏటీఏఆర్ఐ– అటారి) సంచాలకులు డాక్టర్ షేక్ ఎన్.మీరాతో ‘సాక్షి’ ముచ్చటించింది. రోబోటిక్స్, డిజిటల్ వ్యవసాయ సాంకేతికతపై స్పష్టమైన ప్రణాళికతో, సమగ్రమైన విధానంతో ముందడుగు వేస్తే రైతులకు మేలు జరుగుతుందని మీరా అంటున్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..వ్యవసాయ రోబోటిక్స్పై ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు పోటెత్తుతున్నాయి.. ఎందుకని?వ్యవసాయ రంగంలోని ప్రధాన సమస్యలకు రోబోలు సమాధానంగా నిలుస్తున్నాయి. ఇవి కూలీల కొరతను పరిష్కరిస్తాయి. ఎరువులు, నీరు, పురుగుమందుల వంటి ఉత్పాదకాల వినియోగాన్ని తగ్గిస్తాయి. ఉత్పాదకతను పెంచుతాయి. అనేక దేశాల్లో ఇందుకు ఉదాహరణలు కనిపిస్తాయి:ఎకో రోబోటిక్స్ (స్విట్జర్లాండ్): గడ్డిపై కాకుండా ఇతర కలుపు మొక్కలపై మాత్రమే కలుపు మందులను పిచికారీ చేస్తూ 90% వరకు రసాయనాల వినియోగాన్ని ఈ రోబోలు తగ్గిస్తున్నాయి.అగ్రోబోట్ (స్పెయిన్): స్ట్రాబెర్రీలను సున్నితంగా, నాణ్యత పాడవకుండా కోసే సామర్థ్యం ఈ రోబోలకు ఉంది.ఇలాంటి రోబోలు ఖరీదైన ‘టాయ్స్’ కాదు. భారతీయ చిన్న రైతులకు సరిపోయేలా, సరసమైన వ్యయంతో మనమూ తయారు చేయవచ్చు.⇒ తెలంగాణ కోసం మీరు గతంలో సూచించిన ఐదు అంచెలవ్యూహం ఏమిటి?⇒ తెలంగాణకు ఉన్న ఉరిమే ఉత్సాహం క్షేత్రస్థాయిలో ఆచరణలోకి రావాలంటే ఈ ఐదు అంచెల వ్యూహాన్ని అనుసరించాలి:ఒక పనికి ఒక రోబో: ఉదాహరణకు.. మల్టీ టాస్కింగ్ రోబోలు కాకుండా, పసుపును ఉడకబెట్టే ఆవిరి యంత్రం, కలుపు తీసే యంత్రం, వరుసలుగా విత్తనాలు వేసే యంత్రం లాంటి చిన్న రోబోలను అభివృద్ధి చేయాలి.స్థానిక ఆవిష్కరణ – ప్రపంచ ప్రేరణ: ఇంజనీరింగ్ కాలేజీలు, పాలిటెక్నిక్లు, అగ్రి–స్టార్టప్లను ప్రోత్సహించి పత్తి తీయటం, మిరప కాయలు కోయటం, వరి నాట్లు వేయటం వంటి పనులు చేసే చిన్న రోబోలను స్థానికంగానే రూపొందించాలి. పైలట్ గ్రామాల్లో రోబోటిక్ జోన్లు: స్మార్ట్ అగ్రికల్చర్ మిషన్ కింద 20 గ్రామాలను ఎంచుకొని పైలట్ ప్రాజెక్టులను అమలు చేయాలి. ఈ గ్రామాల్లో ఫలితాలను బట్టి రాష్ట్రం అంతటా అమలు చెయ్యాలి. అద్దెకు రోబోలు: రోబోలను ట్రాక్టర్ల మాదిరిగా అద్దెకు ఇచ్చే విధంగా కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చెయ్యాలి. రోబోలను రైతులు మొబైల్ ఫోన్ ద్వారా బుక్ చేసుకునే సౌలభ్యం ఉండాలి.గ్రామీణ రోబోటిక్ వనరుల కేంద్రాలు: గ్రామీణ యువతకు శిక్షణ ఇచ్చి.. రోబోల మరమ్మతులకు సంబంధించిన నైపుణ్యాలు నేర్పించే శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలి.ఇతర దేశాల్లో చిన్న రైతులకు రోబోల ద్వారా అందిస్తున్న అనుభవాల నుంచి మనం నేర్చుకోవాల్సినవేమిటి? ప్రభుత్వాలు పరిశోధనలకు విధానాలు, పెట్టుబడుల ద్వారా అండగా నిలవాలి. సబ్సిడీలు అందించి, శిక్షణ సదుపాయాల ద్వారా అవసరమైన ఆధునిక నైపుణ్యాలను అందించాలి. ఇజ్రాయెల్: ప్రతి నీటి చుక్కను, పోషకాలను వృథా కాకుండా సూటిగా లక్ష్యానికి చేరేలా రోబో ఆధారిత ఎరువుల సరఫరా వ్యవస్థను ఇజ్రాయెల్ అమలు చేస్తోంది. మహబూబ్నగర్ వంటి కరువు ప్రాంతాలకు ఇది ఎంతో ఉపయోగకరం. ఆస్ట్రేలియా: భారీ కమతాల్లో తమంతట తామే కలుపు తీసే అటానమస్ వీడర్లను ఆస్ట్రేలియాలో గతంలోనే అభివృద్ధి చేసింది. జపాన్, దక్షిణ కొరియా: వృద్ధ రైతులకు తోడ్పాటునందించే వరి నాట్లేసే రోబో యంత్రాల ఉత్పత్తిపై జపాన్, దక్షిణ కొరియా దేశాలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. రైతులు ఈ రోబోలను అద్దెకు తీసుకొని నాట్లు వేసుకుంటున్నారు. చైనా: రోబోలను చైనా ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు ఇస్తోంది. గ్రామీణ యువతకు ‘రోబో ఆపరేటర్లు’గా శిక్షణ ఇస్తోంది.తెలంగాణ ఉద్యాన తోటల సాగు రంగానికి రోబోలు ఎలా తోడ్పడగలవు?రాష్ట్రంలో భారీగా మామిడి, అరటి వంటి పండ్ల తోటలు, మిరప, పసుపు, కూరగాయల తోటలు సాగవుతున్నాయి. అరటి గెలలు కోసే రోబోలు, మామిడి కాయలను గ్రేడింగ్ చేసే రోబోలను అందుబాటులోకి తెస్తే నాణ్యత పెరిగి మంచి ధర వస్తుంది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని పాలీహౌస్ రైతులకు రోబోలను అందిస్తే తక్కువ ఖర్చుతోనే పనులు చకచకా, తక్కువ ఖర్చుతో పూర్తి చేసుకోగలుగుతారు.కానీ, ప్రతిబంధకాలు కూడా ఉన్నాయి కదా?అవును. ప్రధానంగా రోబోల ధరలు. రోబో ధర రూ. 8–10 లక్షలు ఉంటే రైతులకు అందుబాటులో ఉండదు. రూ. 50 వేల నుంచి లక్ష పరిధిలో దొరికేలా మార్గాలు చూడాలి.⇒ స్థానికంగా మరమ్మతులు చేసే వ్యవస్థ ఉండాలి. ⇒ రోబోలు వస్తే ఇక తమకు ఏమీ పని ఉండదని రైతులు భావిస్తున్నారు. అవి మనుషులకు ప్రత్యామ్నాయం కాజాలవని, రైతు కూలీలకు సహాయంగా ఉండే సాధనాలు మాత్రమేనని చెప్పి, వారిలో నమ్మకం కల్పించాలి. క్షేత్ర ప్రయోగాల్లో రోబోలు వాడి చూపించి రైతుల్లో రోబోల ప్రయోజకత్వంపై నమ్మకం కలిగించాలి.రోబోలతో తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయంపై ప్రభావం ఎంత ఉండొచ్చు?పురుగుమందులు, ఎరువుల వాడకం 30–40% తగ్గిపోతుంది. పనులు ఒత్తిడి ఉండే కాలంలో కూలీల శ్రమ 20–25% వరకు తగ్గుతుంది. విత్తనాలు వేయటం, నాట్లు వేయటం, పంటల కోతలో సామర్థ్యం 50% పెరుగుతుంది. రోబోలను నడపటం, మరమ్మతు చేయటం, డిజైన్లపై పనిచేయటం ద్వారా గ్రామీణ యువతకు కొత్త ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.విశేష అనుభవంసీనియర్ వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్తగా అపారమైన క్షేత్రస్థాయి అనుభవంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో పనిచేసిన అనుభవం డాక్టర్ షేక్ ఎన్.మీరాకు ఉంది. ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ (ఐఫాడ్)లో సీనియర్ డిజిటల్ అగ్రికల్చర్ నిపుణుడిగా ఈజిప్టు రాజధాని కైరో నగరం కేంద్రంగా గతంలో అనేక సంవత్సరాలు పనిచేశారు.‘అటారి’ అంటేభారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసీఏఆర్–ఐకార్), పరిశోధనా సంస్థలు కాలానుగుణంగా చేసే పరిశోధనల ఫలితాలను సాధారణ రైతులకు చేర్చేందుకు కృషి విజ్ఞాన కేంద్రాల (కేవీకేలు) వ్యవస్థ ఏర్పాటైంది. ప్రతి జిల్లాలో కనీసం ఒక కేవీకే ఉంటుంది.స్థానిక వాతావరణ, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా రైతులకు మార్గనిర్దేశనం చేయటంలో కేవీకేలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. కేవీకేల వ్యవస్థపై పర్యవేక్షణకు జోన్ల వారీగా 11 అగ్రికల్చరల్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఏటీఏఆర్ఐ– అటారి)లు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల కేవీకేలు హైదరాబాద్ అటారి అజమాయిషీలో పనిచేస్తుంటాయి. -
నిక్షేపంగా న్యూక్లియర్ సైట్లు
వేల కేజీల బరువైన భారీ బాంబులను యురేనియం శుద్ధి కేంద్రాలపై పడేసి వాటిని నామరూపాల్లేకుండా చేశామని అమెరికా, ఇజ్రాయెల్ అధినేతలు శెభాష్ అని తమకుతామే జబ్బలు చరుచుకున్నారు. అయితే వాస్తవంలో ఇరాన్కు అంతటి నష్టమేమీ జరగలేదని స్వయంగా అమెరికా నిఘా నివేదిక ఒకటి పేర్కొంది. పర్వతగర్భ ఫోర్డో అణుకేంద్రాన్ని భూస్థాపితం చేయడమే లక్ష్యంగా కొండపైభాగంపై అరడజను దాకా జీబీయూ–57 ఏ/బీ మ్యాసివ్ ఆర్డ్నెన్స్ పెనిట్రేటర్ గైడెడ్ బాంబులను అమెరికా పడేసింది. అయితే కొండ పైభాగం మాత్రమే కూలిపోయిందని, అంతర్భాగంలో ఉన్న అణుకేంద్రానికి ఎలాంటి నష్టం జరగలేదని తాజా నివేదిక కుండబద్దలుకొట్టింది. అమెరికా రక్షణశాఖ(పెంటగాన్)లోని నిఘా విభాగమైన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(డీఐఏ) టాప్ సీక్రెట్ కేటగిరీలో రూపొందించిన ఈ నివేదికలోని కీలక అంశాలు అంతర్జాతీయ మీడియాకు లీక్ అయ్యా యి. ఈ వివరాలను సీఎన్ఎన్ వార్తాసంస్థ తొలుత తన కథనంలో బహిర్గతంచేసింది. అణుబాంబు తయారుచేయకుండా ఇరాన్ను శాశ్వతంగా నిలువరించామన్న ట్రంప్ వ్యాఖ్య ల్లో నిజం లేదని ఈ నివేదికతో స్పష్టమైంది. ముందుజాగ్రత్తగా ఇరాన్ ఆ మూడు యురేనియం శుద్ధి కర్మాగారాల నుంచి ముడి యురేనియం, శుద్ధిచేసిన యురేనియం నిల్వలు, సెంట్రిఫ్యూజ్లను ముందే వేరే చోట్లకు తరలించిందన్న వాదనలకు ఈ నివేదికతో బలం చేకూరింది. నివేదికలో ఏముంది? ఈ మూడు అణుకేంద్రాల్లోని కీలక నిర్మాణాలు, మౌలిక వసతులు, పరికరాలకు పెద్దగా నష్టం వాటిల్లలేదని, దాడుల కారణంగా యురేనియం శుద్ధి కార్యక్రమానికి మాత్రం తాత్కాలికంగా బ్రేక్ పడిందని నివేదిక పేర్కొంది. ధ్వంసమైన విభాగాలను పునరుద్ధరించి మరి కొన్ని నెలల్లో ఇరాన్ మళ్లీ న్యూక్లియర్ సైట్లను పూర్వస్థితికి తీసుకురాగలదని నివేదిక అభిప్రాయపడింది. నతాంజ్, ఫోర్డో ప్లాంట్లను భూగర్భంలో నిర్మించగా ఇస్ఫహాన్ న్యూక్లియర్ టెక్నాలజీ సెంటర్ను నేలపై నిర్మించారు. అమెరికా జలాంతర్గామి నుంచి ప్రయోగించిన టోమాహాక్ క్రూజ్ క్షిపణుల ధాటికి ఇస్ఫహాన్ అణుకేంద్రం మాత్రమే బాగా దెబ్బతింది. ఈ అంశాన్ని ఇరాన్ సైతం ఒప్పుకుంది. అయితే భూగర్భంలో నిర్మించిన నతంజ్, ఫోర్డోలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది. భూగర్భ నిర్మాణాల అవసరాలు తీర్చే నేలపై నిర్మించిన అనుబంధ నిర్మాణాలు మాత్రమే దాడుల్లో ధ్వంసమయ్యాయని నివేదిక పేర్కొంది. బయటివైపు నిర్మించిన విద్యుత్, ఇంధన సంబంధ వ్యవస్థలు నాశనమయ్యాయి. కానీ భూగర్భంలోని సెంట్రిఫ్యూజ్ నిర్వహణ వ్యవస్థలు నిక్షేపంగా ఉన్నాయని, అక్కడి సెంట్రీఫ్యూజ్లను దాడులకు ముందే తరలించారని నివేదిక వెల్లడించింది. ఈ లెక్కన ఇరాన్ అణుకార్యక్రమం తాత్కాలికంగా వాయిదాపడిందిగానీ శాశ్వతంగా ఆగిపోలేదు. మరికొన్ని నెలల్లో రిపేర్లు, పునర్నిర్మాణాల తర్వాత భూగర్భ కేంద్రాల్లో మళ్లీ యురేనియం శుద్ధి కార్యక్రమం మొదలయ్యే అవకాశముందని నివేదిన అంచనావేసింది. అదంతా అబద్ధం: ట్రంప్ అంతపెద్ద బాంబులేసినా ఫోర్డో న్యూక్లియర్ ప్లాంట్ ఇంకా పనిచేసే స్థితిలోనే ఉందని తమ దేశ నిఘా నివేదిక పేర్కొనడంపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు తన సొంత సామాజికమాధ్యమం ట్రూత్ సోషల్’లో పలు పోస్ట్లు పెట్టారు. ‘‘అణురియాక్టర్లకు ఎలాంటి నష్టం జరగలేదన్న వార్తలన్నీ అబద్ధం. నకిలీ వార్తలను నమ్మకండి. ఇరాన్లోని అణుకేంద్రాలన్నీ సర్వనాశనమయ్యాయి. తప్పుడు, అబద్ధాలు కథనాలు వండివార్చినందుకు న్యూయార్క్ టైమ్స్, సీఎన్ఎన్ వార్తాసంస్థల చెంపలను అమెరికా పౌరులు చెళ్లుమనిపించాలి. బంకర్ బస్టర్ బాంబులు ప్రయోగించడం అనేది చరిత్రలోనే అత్యంత విజయవంతమైన సైనికదాడి. ఇంతటి గొప్పదాడిని ఈ మీడియాసంస్థలు తక్కువచేసి చూపిస్తున్నాయి. లక్ష్యాలను ఖచ్చితత్వంతో పేలి్చన పైలెట్లను అభినందించాల్సిందే. పైలెట్లు అద్భుతంగా పనిచేశారు. వీళ్ల సాహసాన్ని మీడియా కించపరుస్తోంది’’అని అన్నారు. ముఖ్యంగా సీఎన్ఎన్పై ట్రంప్ తిట్లదండకం మొదలెట్టారు. ‘‘సీఎన్ఎన్ మొత్తం తప్పుడు కథనాలనే ప్రసారంచేస్తుంది. నేను కూడా సీఎన్ఎన్ ఛానలే చూస్తా. మరో ప్రత్యామ్నాయం లేదుమరి. అందులో అంతా చెత్తే ఉంటుంది. అన్ని నకిలీ వార్తలే’’అని అన్నారు. స్పందించిన శ్వేతసౌధం నివేదిక రూపకల్పనను ఒప్పుకున్న వైట్హౌస్.. ఆ నివేదికలోని అంశాలతో మాత్రం విబేధించడం విశేషం. ట్రంప్ సర్కార్ ప్రతిష్టను దిగజార్చేందుకే ఇలాంటి అసత్యాలను మీడియాలో ప్రచారంచేస్తున్నారని వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. ‘‘అత్యంత రహస్యమైన ఆ నివేదికలోని అంశాలు లీక్ అయిన మాట వాస్తవమే. అంతర్గత నిఘా విభాగ కిందిస్థాయి సిబ్బందిలో కొందరు ఈ దారుణానికి ఒడిగట్టారు. అధ్యక్షుడు ట్రంప్ను అపకీర్తి పాలుచేద్దామని కొందరు కుట్ర పన్ని ఇలా లీక్ చేశారు. ఇరాన్ అణుకార్యక్రమాలను అడ్డుకునేందుకు వేలకిలోమీటర్లు ప్రయాణించి, తెగించి బాంబులేసిన యుద్ధవిమాన పైలట్ల ధైర్యసాహసాలను ఈ లీక్వీరులు కించపరిచారు. ఒక్కోటి 13,600 కేజీల బరువుండే 14 భారీ బాంబులను పేలిస్తే ఎంతటి వినాశనం జరుగుతుందో అందరికీ తెలుసు. ఇరాన్ అణుకేంద్రాలు పూర్తిగా పనికిరాకుండా పోయాయి’’అని కరోలిన్ చెప్పారు. లీక్కు పాల్పడిన వ్యక్తులను గుర్తించేందుకు ఎఫ్బీఐతో దర్యాప్తు చేయిస్తున్నామని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ చెప్పారు. లీక్ అయిన నివేదిక కేవలం అంచనా నివేదిక అని ఆయన వ్యాఖ్యానించారు. నిజం దాస్తున్న ఇరాన్! శత్రు దేశం కారణంగా నష్టం జరిగితే దేశ ప్రతిష్ట దృష్ట్యా స్వల్పనష్టమే జరిగిందని ఎవరైనా తక్కువ చేసి చెబుతారు. ఆ లెక్కన ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ భఘైల్ సైతం తమ అణుకేంద్రాలు తక్కువస్థాయిలోనే ధ్వంసమయ్యాయని చెప్పాలి. కానీ ఆయన భారీ నష్టం వాటిల్లిందని బుధవారం మీడియాతో అన్నారు. దీని వెనుక అంతరార్థం వేరే ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా వేరే చోట జరిగే తమ అణుకార్యక్రమంపై ఎవరికీ అనుమానం రావొద్దనే ఉద్దేశ్యంతోనే ఆయన ఇలా అబద్ధాలు చెబుతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పునర్నిర్మాణాల తర్వాత మళ్లీ అణుకార్యక్రమాన్ని మొదలెట్టే విషయం బయటకు పొక్కితే అతిగా అంతర్జాతీయ ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతోనూ ఇస్మాయిల్ ఇలా అబద్ధాలు చెబుతున్నారని తెలుస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఘనంగా రెండో అడుగు
న్యూఢిల్లీ: భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12 గంటలు దాటి ఒక నిమిషం. అమెరికాలో ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్. పదేపదే వాయిదాల అనంతరం, దేశమంతా ఊపిరి బిగబట్టి మరీ ఎదురుచూస్తున్న చరిత్రాత్మక క్షణాలు ఎట్టకేలకు రానే వచ్చాయి. యాగ్జియం–4 మిషన్ వాణిజ్య మిషన్ను వెంట తీసుకుని స్పేస్ఎక్స్ ఫాల్కన్–9 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. కాసేపటికే యాగ్జియం–4 క్యాప్సూల్ రాకెట్ నుంచి విడివడింది. మొత్తమ్మీద 10 నిమిషాల్లోనే భూమికి 200 కి.మీ. ఎగువ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. మిషన్ పైలట్గా 140 కోట్ల పై చిలుకు భారతీయుల ఆకాంక్షలను మోసుకుంటూ మన వ్యోమగామి, గ్రూప్ కెపె్టన్ శుభాన్షు శుక్లా (39) సగర్వంగా రోదసిలోకి ప్రవేశించారు. రాకేశ్ శర్మ తర్వాత 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అంతరిక్షంలో అడుగు పెట్టిన రెండో భారతీయునిగా నిలిచారు. మర్చిపోలేని ఆ క్షణాలను రోదసి నుంచే దేశవాసులందరితో పంచుకుని మురిసిపోయారు. ‘ప్రియమైన నా దేశవాసులారా! నమస్తే’ అంటూ భుజాన త్రివర్ణ పతాకం ధరించి భావోద్వేగానికి లోనయ్యారు. అంతరిక్ష ప్రవేశ యాత్ర అద్భుతంగా సాగిందంటూ సంభ్రమాశ్చర్యాల నడుమ పేర్కొన్నారు. జైహింద్, జై భారత్ అంటూ రోదసి సాక్షిగా నినదించారు. శుభాన్షు స్వస్థలం లఖ్నవూ నుంచి ప్రయోగాన్ని ఆద్యంతం వీక్షించిన ఆయన తల్లిదండ్రులు ఆనందాశ్రువులు రాల్చారు. తమ కుమారుడు చరిత్ర సృష్టించాడంటూ పరవశించిపోయారు. కేంద్ర మంత్రివర్గం ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో సమావేశమై శుభాన్షు ఘనతను ప్రస్తుతించింది. దేశపతాకను ఆయన అత్యున్నత స్థాయిలో రెపరెపలాడించారంటూ ప్రశంసించింది. రాజకీయ తదితర రంగాల ప్రముఖులు తదితరుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. అంతరిక్షంలో 28 గంటల ప్రయాణం అనంతరం యాగ్జియం–4 మిషన్ భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం దాదాపు 4:30 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)తో అనుసంధానం అవనుంది. అనంతరం మరో ముగ్గురు సహచర వ్యోమగాములు మిషన్ కమాండర్, నాసా ఆస్ట్రోనాట్ పెగ్గీ విట్సన్, మిషన్ స్పెషలిస్టులు స్లవోస్ ఉజ్నాన్స్కీ విస్నియెవ్స్కీ (పోలండ్), టైబర్ కపు (హంగరీ)తో కలిసి శుభాన్షు ఐఎస్ఎస్లోకి ప్రవేశిస్తారు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయునిగా ఆయన సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. యాగ్జియం–4 ఇస్రో, నాసా సంయుక్త మద్దతుతో రూపొందిన వాణిజ్య అంతరిక్ష యాత్ర.మిషన్ గ్రేస్ మిస్టర్ శుక్స్ ఐఎస్ఎస్లో ఉన్నంతకాలం శుభాన్షును శుక్స్ అనే సంకేత నామంతో పిలవనున్నారు. అలాగే తమ యాగ్జియం–4 వ్యోమనౌకకు కూడా వ్యోమగాములు నలుగురూ గ్రేస్ అని పేరు పెట్టుకున్నారు. విజయవంతంగా అంతరిక్షంలో చేరిన అనంతరం వారు ఈ మేరకు వెల్లడించారు. ‘‘ఓపికతో వేచి చూసేవారికి అంతా మంచే జరుగుతుంది. గ్రేస్ సిబ్బంది తొలి యాత్రను దేవుడు అన్నివిధాలా వెంట ఉండి నడిపించు గాక’’ అంటూ యాగ్జియం–4 బృందానికి స్పేస్ ఎక్స్ శుభాకాంక్షలు తెలిపింది.వందేమాతరం నుంచి... ‘యూ హి చలా చల్’ దాకా అంతరిక్ష యాత్రకు బయల్దేరే ముందు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి, ప్రశాంతంగా ఉండటానికి వ్యోమగాములు తమకు నచి్చన సంగీతాన్ని, పాటలను ఆస్వాదించడం ఆనవాయితీ. అలా యాగ్జియం–4 యాత్రకు బయల్దేరే ముందు శుభాన్షు హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘ఫైటర్’ సినిమాలోని తనకెంతో ఇష్టమైన వందేమాతరం పాటను విన్నారు. ఐఎస్ఎస్లో ఆస్వాదించేందుకు వీలుగా పలు పాటలతో కూడిన ప్లే లిస్ట్ను అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. అందులో షారుక్ ఖాన్ నటించిన ‘స్వదేశ్’ సినిమాలోని సూపర్హిట్ రోడ్డు పాట ‘యూ హి చలా చల్ రాహీ, కిత్నీ హసీఁ హై ఏ దునియా (అలా సాగిపో యాత్రికా, ఈ ప్రపంచమెంత అందమైనదో!) తదితర పాటలు అందులో ఉన్నాయి. ప్రయోగానికి ముందు శుభాన్షు ఎక్స్ పోస్టులో ఈ మేరకు వెల్లడించారు. యాదృచి్చకంగా స్వదేశ్ సినిమాలో షారుక్ కూడా నాసా సైంటిస్టు కావడం విశేషం.చిన్ననాటి కల సాకారం! గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా. అంతరిక్షంలో ప్రవేశించి, ఐఎస్ఎస్లో అడుగుపెట్టబోతున్న ఆయన పేరు దేశమంతటా మార్మోగిపోతోంది. మానవసహిత అంతరిక్ష యాత్ర దిశగా భరత జాతి కంటున్న ఎన్నో ఏళ్ల కలకు ఎట్టకేలకు రెక్కలు తొడిగిన ఆయన, ఆ క్రమంలో తన చిన్ననాటి కలను కూడా విజయవంతంగా నెరవేర్చుకున్నారు. రాకేశ్ శర్మ అంతరిక్షంలో కాలుమోపిన ఏడాదికి, అంటే 1985లో ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్నవూలో శుభాన్షు జని్మంచారు. బాల్యంలో ఒక ఎయిర్ షో చూసినప్పటి నుంచే ఆకాశంపై మనసు పారేసుకున్నారు. విమానాలు, వాటి వేగం, వాటి శబ్దాలు తన బుల్లి మనసులో శాశ్వతంగా తిష్ట వేసుకుపోయాయి. పైలట్ కావాలని అప్పుడే తీర్మానించుకున్నారాయన. నేషనల్ డిఫెన్స్ అకాడెమీలో చేరి తన కల నిజం చేసుకున్నారు. 2006లో భారత వాయుసేనలో చేరారు. పదేళ్ల పై చిలుకు కెరీర్లో 2 వేల గంటల పైచిలుకు ఫ్లయింగ్ అవర్స్ అనుభవం ఆయన సొంతం. సుఖోయ్–30 ఎంకేఐ, మిగ్–29తో పాటు జాగ్వార్, డోర్నియర్–228 వంటి పలు యుద్ధ విమానాలు నడిపారు. ప్రస్తుతం గ్రూప్ కెప్టెన్గా చేస్తున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఏరోస్పేస్లో ఎంటెక్ చేశారు. 2027లో ఉద్దేశించిన గగన్యాన్ మిషన్ కోసం 2019లో కేంద్రం ఎంపిక చేసిన నలుగురు ఆస్ట్రొనాట్ల బృందంలో శుభాన్షు ఒకరు. అంతరిక్ష యాత్ర నిమిత్తం తొలుత బెంగళూరులో, తర్వాత రష్యాలో గగారిన్ కాస్మోనాట్ శిక్షణ కేంద్రంలో కఠోరమైన శిక్షణ పొందారు. యాగ్జియం–4 మిషన్కు పైలట్గా కీలక బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఏకాగ్రత, సునిశిత బుద్ధి తిరుగులేనివని సహచర వ్యోమగాములు కూడా కితాబిచ్చారు. ...అలా ఎన్డీఏలోకి శుభాన్షు పేరు ఇప్పుడిలా దేశమంతా మారుమోగుతోందంటే ఆయన ఎన్డీఏలో చేరి వాయుసేన పైలట్ కావడమే ప్రధాన కారణం. అయితే ఎన్డీఏలో శుభాన్షు ప్రవేశం అనుకోకుండా జరిగిందని ఆయన తండ్రి గుర్తు చేసుకున్నారు. ‘‘శుభాన్షు స్కూల్మేట్స్ ఎన్డీఏ పరీక్ష రాసేందుకు దరఖాస్తు ఫారాలు తీసుకొచ్చారు. కానీ వారిలో ఒకరికి వయోపరిమితి దాటిపోయింది. దాంతో శుభాన్షును రాస్తావా అని అడిగాడు. మావాడు వెంటనే సరేనన్నాడు. అలా పరీక్ష రాసి ఎన్డీఏకు సెలక్టయ్యాడు’’ అంటూ వివరించారు. తమకైతే శుభాన్షు సివిల్స్ రాసి కలెక్టర్ కావాలని ఉండేదని వెల్లడించారు. తల్లిదండ్రుల ఆనంద నృత్యం శుభాన్షు అంతరిక్షయాత్రను వీక్షించి ఆయన తల్లిదండ్రులు ఉప్పొంగిపోయారు. యాగ్జియం–4 ప్రయోగాన్ని లఖ్నవూలో శుభాన్షు విద్యాభ్యాసం చేసిన సిటీ మాంటెసొరీ స్కూల్లో ప్రత్యక్షప్రసారం ద్వారా వారు వీక్షించారు. యాత్ర విజయవంతం కాగానే తోటివారందరితో కలిసి భాంగ్రా నృత్యం చేస్తూ ఆనందం పంచుకున్నారు. ప్రాంగణమంతా చప్పట్లతో, ‘హిప్ హిప్ హుర్రే’, ‘భారత్మాతా కీ జై’ నినాదాలతో మార్మోగిపోయింది. తమకివి మరపురాని క్షణాలని శుభాన్షు తండ్రి శంభూ శుక్లా అన్నారు. ‘‘ఇవి ఆనందాశ్రువులు. ఇంతకన్నా మాట్లాడేందుకు నాకు మాటలే రావడం లేదు’’ అని తల్లి ఆశా చెప్పారు. తన కొడుకు ఇలాంటి ఘనత సాధిస్తాడని ముందే తెలుసన్నారు. యాత్ర జయప్రదం కావాలని ఆకాంక్షిస్తూ ప్రయోగానికి ముందు కుమారునికి ఆమె వర్చువల్గా చక్కెర కలిపిన పెరుగు తినిపించి నోరు తీపి చేశారు. తమ విద్యార్థి భారత కీర్తిని అంతరిక్షం దాకా చేర్చాడంటూ స్కూలు టీచర్లు తదితరులు కూడా హర్షం వెలిబుచ్చారు.నాడు ‘సారే జహా సే అచ్చా’ స్క్వాడ్రన్ లీడర్ రాకేశ్ శర్మ తర్వాత రోదసిలోకి ప్రవేశించిన రెండో భారతీయునిగా శుభాన్షు శుక్లా నిలిచారు. సోవియట్ యూనియన్ సల్యూట్–7 స్పేస్ మిషన్లో భాగంగా రాకేశ్ శర్మ 1984లో 8 రోజుల పాటు అంతరిక్ష యాత్ర చేయడం తెలిసిందే. అక్కడినుంచి భూమి ఎలా కన్పిస్తోందన్న అప్పటి ప్రధాని ఇందిర ప్రశ్నకు బదులుగా ‘సారే జహా సే అచ్చా’ అంటూ రాకేశ్ శర్మ ఇచ్చిన భావోద్వేగపూరిత సమాధానంతో జాతి యావత్తూ ఉప్పొంగిపోయింది.ప్రయోగానికి ముందూ సమస్యలే యాగ్జియం–4 ప్రయోగ వేళ సమీపించగానే సహచర వ్యోమగాములతో కలిసి శుభాన్షు నెల రోజుల క్వారెంటైన్ నుంచి బయటికొచ్చారు. ఒక్కొక్కరుగా వ్యోమనౌకలోకి ప్రవేశించారు. రాకెట్ తాలూకు ఒక తీగ వేలాడుతుండటంతో పాటు పలు సమస్యలను గమనించి అప్పటికప్పుడు సరిచేశారు. మే 29న జరగాల్సిన ఈ ప్రయోగం రాకెట్ సమస్యలతో పదేపదే వాయిదా పడుతూ వచ్చింది.14 రోజులు, 60 ప్రయోగాలు శుభాన్షు తన ముగ్గురు సహచర వ్యోమగాములతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో 14 రోజుల పాటు గడుపుతారు. ఈ సందర్భంగా భారరహిత స్థితిలో వారు దాదాపు 60 ప్రయోగాలు నిర్వహిస్తారు. వాటిలో ఆహారం, పౌష్టికత సంబంధిత ప్రయోగాలు కూడా ఉన్నాయి. వాటిని నాసో మద్దతుతో ఇస్రో, కేంద్ర బయోటెక్నాలజీ శాఖ రూపొందించాయి. శుభాన్షు కోసం ఇస్రో ఏడు ప్రయోగాలను సిద్ధం చేసి ఉంచింది. సూక్షభార స్థితిలో మెంతులు, పెసలు ఎలా మొలకెత్తుతాయో ఆయన పరీక్షించి చూడనున్నారు. ప్రధానితో, పిల్లలతో మాటామంతి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి ప్రధాని మోదీతో శుభాన్షు మాటామంతి జరపనున్నారు. అలాగే పలు స్కూళ్లకు చెందిన విద్యార్థులతో పాటు అంతరిక్ష రంగ నిపుణులు, సంస్థల సీఈఓలు, దిగ్గజాలతో కూడా ఆయన తన అనుభవాలను పంచుకుంటారు.క్యారెట్ హల్వా, మామిడి రసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) భారతీయ వంటకాల ఘుమఘుమలాడనుంది. భారత పాక ప్రావీణ్యానికి అద్దం పట్టే కూరలు, అన్నం, మామిడి రసం వంటివాటిని శుభాన్షు ఐఎస్ఎస్కు వెంట తీసుకెళ్లారు. ‘‘తనకు క్యారెట్, పెసరపప్పు హల్వా అంటే చాలా ఇష్టం. వాటితోపాటు మరెన్నో మా ఇంటి రుచులను వెంట తీసుకెళ్లాడు. తోటి వ్యోమగాములకు కూడా రుచి చూపిస్తానని చెప్పాడు’’ అని శుభాన్షు సోదరి శుచి తెలిపా రు. ఇతర వ్యోమగాములు పప్రికా పేస్ట్ (హంగరీ), ఫ్రీజ్–ఫ్రైడ్ పైరోజీస్ (పోలండ్) వంటి వంటకాలను తమతో పాటు తీసుకెళ్లారు.నింగిని నెగ్గి, తారలు తాకి శుభాన్షుకు వాయుసేన అభినందనలు యాగ్జియం–4 మిషన్ను భారత్కు ఓ అది్వతీయానుభూతిగా వాయుసేన అభివరి్ణంచింది. ‘‘వాయుసేన యోధుడు గ్రూప్ కెపె్టన్ శుభాన్షు శుక్లా చరిత్రాత్మక అంతరిక్ష యాత్రకు శ్రీకారం చుట్టారు. నింగిని నెగ్గుతూ తారల్ని తాకుతూ దేశ గౌరవాన్ని, ప్రతిష్టను తనతోపాటు సగర్వంగా అంతరిక్షంలోకి మోసుకెళ్లారు’’ అంటూ అభినందించింది. ఆయన ప్రొఫైల్ ఫొటోను షేర్ చేసింది. ‘నీలిదుస్తుల్లో (వాయుసేన యూనిఫాంను ఉద్దేశించి) శిక్షణ, చుక్కలకేసి పయనం’ అంటూ అందమైన క్యాప్షన్ జోడించింది. ‘ఈ అద్భుత యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాం’ జాతీయ పతాకంలోని మూడు రంగులతో కూడిన అక్షరాలతో మరో సందేశాన్ని పోస్టు చేసింది. కేంద్ర మంత్రివర్గం అభినందనలు దేశ ఆకాంక్షలను మోసుకెళ్లారు: మోదీ యాగ్జియం–4 మిషన్ విజయవంతం కావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. 140 కోట్ల పై చిలుకు భారతీయుల ఆశలు, ఆకాంక్షలను శుభాన్షు తనతో పాటు అంతరిక్షంలోకి మోసుకెళ్లారన్నారు. ‘‘ఐఎస్ఎస్లో అడుగు పెట్టిన తొలి భారతీయునిగా నిలవనున్న గ్రూప్ కెప్టెన్ శుక్లాకు, ఇతర వ్యోమగాములకు శుభాభినందనలు’’ అంటూ ప్రధాని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆయన సారథ్యంలో కేంద్ర మంత్రివర్గం సమావేశమై శుభాన్షుకు అభినందనలు తెలిపింది. యాగ్జియం–4 యాత్ర దిగి్వజయం కావాలని ఆకాంక్షించింది. ఈ మేరకు మంత్రివర్గం ఆమోదించిన తీర్మానాన్ని కేంద్ర సమాచార ప్రసార మంత్రి అశ్వినీ వైష్ణవ్ చదివి విని్పంచారు.సగర్వంగా ఆకాశాన్ని ముద్దాడారు: ఖర్గేశుభాన్షు సగర్వంగా ఆకాశాన్ని ముద్దాడారంటూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అభినందించారు. ఆయన యాత్ర సఫలమవాలన్నారు. -
ఆ ఐదింటిలో... టాప్–10లో భారత్
సాక్షి, స్పెషల్ డెస్క్ : కీలకమైన ఐదు ప్రధాన సాంకేతిక రంగాల్లో భారత్ టాప్–10లో చోటు సంపాదించింది. ఈ రంగాల్లో ప్రపంచంలోని 25 ప్రధాన దేశాల సామర్థ్యాలను తెలియజేస్తూ హార్వర్డ్ కెన్నడీ స్కూల్కు చెందిన బెల్ఫర్ సెంటర్ ఫర్ సైన్స్అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ ‘క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇండెక్స్’ అనే సూచీని రూపొందించింది. ఏఐ, బయోటెక్నాలజీ, సెమీకండక్టర్స్, అంతరిక్షం, క్వాంటమ్ టెక్నాలజీ విభాగాల్లో దేశాల తయారీ సామర్థ్యం, సాంకేతిక పురోగతి, ప్రభుత్వ నియంత్రణ, అంతర్జాతీయంగా స్థానం, మానవ వనరులు, ఆర్థిక వనరుల వంటి అంశాల ఆధారంగా దేశాలకు స్థానాలు కేటాయించారు.ఏఐలో దూసుకుపోతూ..కృత్రిమ మేధ విభాగంలో భారత్ దూసుకుపోతోందని చెప్పాలి. దేశంలో ఏఐ వినియోగం.. అమెరికా, యూకేలతో పోలిస్తే ఎక్కువగా ఉంది. ఇంటర్నెట్ వినియోగదారుల్లో 90% మంది ఏదో ఒక విధంగా ఏఐని వాడుతున్నారు. దేశంలో ఏఐ యూజర్ల సంఖ్య 72 కోట్లు దాటింది. ‘క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇండెక్స్’ ఏఐ విభాగంలో జపాన్ , తైవాన్ , దక్షిణ కొరియా కంటే మనం ముందున్నాం. బయో టెక్నాలజీ రంగంలో ప్రపంచంలో భారత్ అగ్రదేశాల సరసన చోటు దక్కించుకుంది. వ్యాక్సిన్ల ఉత్పత్తిలో మనమే ప్రపంచంలో నంబర్ వన్. ఈ సూచీలోని బయోటెక్నాలజీ విభాగంలో ఫ్రాన్స్, తైవాన్ , దక్షిణ కొరియాలను మనం అధిగమించాంసిలికాన్ వేఫర్ల ఉత్పత్తిలో.. సెమీకండక్టర్ల తయారీలో వాడే సిలికాన్ వేఫర్ల ఉత్పత్తిలో ప్రపంచంలో మనం మూడో స్థానంలో ఉన్నాం. ప్రపంచ చిప్ వినియోగంలో 10 శాతం వాటా భారత్ కైవసం చేసుకుంది. చిప్ డిజైన్ సౌకర్యాలలో ప్రపంచంలో 7% మాత్రమే భారత్ కలిగి ఉన్నప్పటికీ.. ప్రపంచంలోని డిజైన్ ఇంజనీర్లలో దాదాపు 20% మంది భారత్లోనే ఉన్నారు. వీరిలో అత్యధికులు యూఎస్, యూరప్ సంస్థల కోసం పనిచేస్తున్నారు. ఈ సూచీలో సెమీకండక్టర్స్ విభాగంలో మనం ఫ్రాన్స్కంటే ముందున్నాం. 5వ అతిపెద్ద సంస్థగా ఇస్రోఅంతరిక్ష పరిశోధనలో ప్రపంచంలో 5వ అతిపెద్ద సంస్థగా ఇస్రో చోటు సంపాదించింది. ప్రపంచంలో మొదటి ప్రయత్నంలోనే ప్రతిష్టాత్మక ‘మంగళ్యాన్’ ప్రాజెక్టు ద్వారా అంగారకుడిపైకి అడుగుపెట్టిన దేశం భారత్. ఈ సూచీలో అంతరిక్ష విభాగంలో జపాన్ , దక్షిణ కొరియా, తైవాన్ కంటే మనదేశం ముందుంది. క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి అత్యధిక పేటెంట్లకు దరఖాస్తు చేసిన దేశాల్లో మనదేశం 9వ స్థానంలో ఉంది. ఈ సూచీలో క్వాంటమ్ టెక్నాలజీలో తైవాన్, దక్షిణ కొరియాలను భారత్ మించిపోవడం గమనార్హం.ఏయే అంశాల ఆధారంగా స్కోర్ను నిర్ణయించారంటే...ఏఐటాప్ మోడల్స్ కచ్చితత్వం, డేటా, ఆల్గరిధమ్స్, కంప్యూటింగ్ పవర్, నియంత్రణ, అంతర్జాతీయంగా స్థానం, మానవ వనరులు, ఆర్థిక వనరులు.బయోటెక్నాలజీ జన్యు ఇంజనీరింగ్, ఔషధాల తయారీ, వ్యాక్సిన్ పరిశోధన, వ్యవసాయ సాంకేతికత, నియంత్రణ, అంతర్జాతీయంగా స్థానం, మానవ వనరులు, భద్రత, ఆర్థిక వనరులు.సెమీకండక్టర్స్అసెంబ్లింగ్, టెస్టింగ్, ఎక్విప్మెంట్, తయారీ–ఫ్యాబ్రికేషన్ , చిప్ డిజైన్ – టూల్స్, ప్రత్యేక ముడిపదార్థాలు–వేఫర్స్, నియంత్రణ, అంతర్జాతీయంగాస్థానం, మానవ వనరులు, ఆర్థిక వనరులు. స్పేస్రిమోట్ సెన్సింగ్, టెలికమ్యూనికేషన్ ్స, పొజిషనింగ్–నావిగేషన్ –టైమింగ్, సైన్ ్స– అంతరిక్ష పరిశోధన, దేశీయంగా అంతరిక్ష ప్రయోగ సామర్థ్యం, నియంత్రణ, అంతర్జాతీయంగా స్థానం, మానవ వనరులు, ఆర్థిక వనరులు క్వాంటమ్క్వాంటమ్ కంప్యూటింగ్, కమ్యూనికేషన్స్ , సెన్సింగ్,ప్రభుత్వ విధానాలు, అంతర్జా తీయంగా స్థానం, మానవ వనరులు, భద్రత, ఆర్థిక వనరులు. -
సాంకేతిక సౌరభం
వనపర్తిటౌన్: వనపర్తి ఎడ్యుకేషన్ హబ్కు కేరాఫ్గా మారింది. ఇందుకు సంస్థానాదీశుల కాలంలోనే బీజం పడింది. పాఠశాల విద్య, సాంకేతిక విద్యకు వనపర్తి రాజులు జీవం పోశా రు. 1936, అంతకంటే ముందు నిజాం ప్రభువు హయాంలో హైదరాబాద్ రాష్ట్రంలో పది పాఠశాలలు ఉంటే.. అందులో ఒకటి వనపర్తిలో (పాత జూనియర్ కళాశాల) ఏర్పాటు చేసేలా సంస్థానాదీశులు చొరవ తీసుకున్నారు. అప్పట్లో నిరుపేద కుటుంబాలకు చెందిన అన్ని వర్గాల విద్యార్థులకు ప్రతి ఏటా స్కాలర్షిప్లు అందించే వారు. 1959లో సంస్థానాదీశుడు రాజా రామేశ్వర్రావు హయాంలో దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించారు. ఈ కళాశాలలో చదువుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. నేపాల్, జర్మనీ తదితర దేశాల నుంచి వచ్చి సాంకేతిక విద్య ను అభ్యసించారు. ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ కోర్సుల్లో 30 నుంచి 40 మందికి సాంకేతిక విద్య అందించారు. రాజా రామేశ్వర్రావు ఔదార్యం.. ఈ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలను రాజా రామేశ్వర్రావు 1959 నుంచి 1971 వరకు సమర్థవంతంగా నడిపారు. ఆ తర్వాత 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రాజప్రాసాదాన్ని (కళాశాల భవనం) ఒక్క రూపాయి ఆశించకుండా ప్రభుత్వానికి అందజేశారు. అప్పట్లో రాజా వారి నిర్ణయం సంచలనమని నేటికీ చర్చించుకుంటారు. ఆరు కోర్సులతో.. పాలిటెక్నిక్ విద్య ప్రభుత్వ అదీనంలోకి వచ్చాక మొదట్లో ఉన్న మూడు కోర్సులతో పాటు సీసీపీ, డీ ఫార్మసీ, ఇన్స్ట్రుమెంటేషన్ కోర్సులతో కళాశాల కొనసాగుతోంది. 1,200 మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా.. కృష్ణదేవరాయ పాలిటెక్నిక్ పేరుతో రాజప్రాసాదం విరాజిల్లుతోంది. 55 ఏళ్ల తర్వాత మహిళా పాలిటెక్నిక్ కళాశాల.. వనపర్తిలో సాంకేతిక విద్యకు అడుగులు పడిన 55 ఏళ్ల తర్వా త జిల్లాలోని పెబ్బేరుకు మహిళా పాలిటెక్నిక్ కళాశాల మంజూరైంది. ఇందులో రెండు కోర్సులు ఉన్నాయి. ప్రస్తుతం 300 మంది విద్యార్థినులు చదువుతున్నారు. రాజుల కాలంలోనే మోడల్ బేసిక్ ప్రాక్టిసింగ్ స్కూల్ను ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్యానికి పూర్వం, స్వాతంత్య్ర అనంతరం కొన్నేళ్ల పాటు వనపర్తి పాతబజార్లోని హనుమాన్, శంకర్గంజ్లోని దేవాలయాల్లో బ్రాహ్మణులు నిరుపేదలకు చదువులు చెబుతూ జీవ నం సాగించేవారు. సంస్థానాధీశుల కాలం నుంచే వనపర్తిలో విద్యకు ఎంతో ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. స్వాతంత్ర్యానికి పూర్వమే ఇక్కడ పాఠశాల విద్యకు ప్రాధాన్యం ఉంది. ఫలితంగా ఇక్కడి ప్రజలు విద్యాపరంగా చైతన్యవంతులు అని గుర్తింపు వచి్చంది. ఉపాధి అవకాశాలు మెండు.. ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ శాఖ గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ విద్య విద్యార్థులకు వరంలాంటిది. పాలిటెక్నిక్ విద్యతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయి. పలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రథమ ప్రాధాన్యం ఇస్తారు. ప్రైవేట్ కంపెనీల్లో రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు సంపాదించొచ్చు. డిప్లామాతోనే విద్యార్థులు స్థిరపడే అవకాశం పాలిటెక్నిక్ విద్యతో చేకూరుతుంది. త్వరలో జరిగే పాలిసెట్ కౌన్సిల్ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. – జగన్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, వనపర్తి విద్యాపర్తిగా గుర్తింపు.. రాజుల కాలం నుంచే విద్యకు ప్రాధాన్యం ఇచ్చారు. సాంకేతిక విద్యలో వనపర్తికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచే కాకుండా రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాల నుంచి ఇక్కడకు వచ్చి విద్యనభ్యసించారు. జిల్లాలోని పెబ్బేరులో పదేళ్ల క్రితం మహిళా పాలిటెక్నిక్ కళాశాలతో పాటు ప్రైవేట్ రంగంలోనూ సాంకేతిక విద్య అందుబాటులోకి వచ్చింది. – టీపీ కృష్ణయ్య, విద్యావేత్త, వనపర్తి ఉన్నత స్థాయికి చేర్చింది.. వనపర్తిలో విద్యనభ్యసించిన ఎంతోమంది అత్యున్నత స్థాయికి చేరారు. నిజాం కాలం నుంచి వచ్చిన ప్రతి విద్యాసంస్థ ప్రారంభం వెనుక ప్రజా పోరాటాలు, ప్రజల ఆకాంక్షలు ఇమిడి ఉన్నాయి. రాజరికం నుంచి ప్రస్తుత రాజకీయ పార్టీలకు అతీతంగా విద్యావికాసంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే వనపర్తి అగ్రగామిగా నిలుస్తుంది. ఐఏఎస్లు, ఐపీఎస్లు, సైంటిస్టులు, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి వంటి వారితో పాటు ప్రతి రంగంలో వనపర్తి అక్షర జ్ఞానం కనిపిస్తుంది. – గణేశ్కుమార్, ఉపాధ్యాయుడు, వనపర్తి విద్యకు పెద్దపీట.. నిజాం కాలంలో ప్రతిభ కలిగిన విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చి ప్రోత్సహించిన చరిత్ర ఈ ప్రాంతానికి ఉంది. అంతే కాకుండా కులమతాలకు అతీతంగా అందరికీ విద్య అందించడంలో వనపర్తి ఆది నుంచీ అడుగులు వేస్తోంది. సాంకేతిక విద్య అభ్యసించేందుకు నేపాల్, జర్మనీ, జపాన్ వంటి దేశాల నుంచి వచ్చే వారు. సాంకేతిక విద్యను చేరువ చేసేందుకు రాజా రామేశ్వర్రావు తన రాజప్రాసాదాన్ని ప్రభుత్వానికి ఉదారంగా ఇవ్వడం విద్యా విస్తరణపై వనపర్తి సంస్థానాధీశులకు ఉన్న దూరదృష్టిని తెలియజేస్తుంది. – భైరోజు చంద్రశేఖర్, వనపర్తి -
క్యాబ్ డ్రైవర్లకు ఇక గడ్డుకాలమే!
అవును. నిజం. ఒకట్రెండేళ్లలో క్యాబ్డ్రైవర్లు అనే వారు ఉండకపోవచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కారణంగా ఊబర్, ఓలా, ర్యాపిడో వంటివి పుట్టుకొచ్చి క్యాబ్ డ్రైవర్ల ఆదాయంలో కొంత వాటా పంచుకుంటూంటే... రోబోటిక్స్, అటానమస్ వెహికల్ టెక్నాలజీ కాస్తా... డ్రైవర్ల ఉద్యోగాలకే గండికొట్టే సూచనలు కనిపిస్తున్నాయి. డ్రైవర్ల అవసరం లేని కార్లను టెస్లా ఎప్పుడో తయారు చేసింది కదా? అప్పుడు లేని సమస్య ఇప్పుడెందుకు వస్తుందని అంటున్నారా?సింపుల్.. టెస్లాతోపాటు ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇప్పుడు ఈ అటానమస్ వెహికల్ టెక్నాలజీని క్యాబ్స్గా మార్చే ప్రయత్నాల్లో ఉన్నాయి మరి! టెస్లా ఇప్పటికే తన సైబర్ ట్రక్ను క్యాబ్ సర్వీసులు అందించేలా మార్చి పరిశీలిస్తూండగా.. అమెజాన్ వచ్చే ఏడాది నుంచి ఏటా కనీసం పదివేల రోబో ట్యాక్సీలను సిద్ధం చేస్తోంది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని హేవర్డ్ ప్రాంతంలో అమెజాన్ సుమారు 2.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రోబో ట్యాక్సీల తయారీకి ఒక ప్లాంట్ను ఏర్పాటు చేసింది. నలుగురు ప్రయాణించగల విశాలమైన ట్రక్కులాంటి ఈ వాహనం పేరు జూక్స్. అన్నీ సవ్యంగా సాగితే ఈ ఏడాది చివరికల్లా కొన్ని వాహనాలు లాస్ వేగస్ నగరంలో పరుగులు పెడతాయి కూడా. ఆ తరువాత.. దశలవారీగా మయామీ, ఆస్టిన్, శాన్ఫ్రాన్సిస్కోలకు వీటి సేవలను విస్తరించనున్నారు. ప్రస్తుతం ఈ వ్యాన్లను టెస్ట్ ట్రాక్పై నడిపి పరిశీలిస్తున్నారు కూడా. డ్రైవింగ్ తీరుతెన్నులు, పికప్.. డ్రాప్ఆఫ్ల సందర్భంగా ఏమేం జరుగుతున్నాయో తెలుసుకుంటున్నారు. మరోవైపు.. టెస్లా కంపెనీ కూడా తన సైబర్ ట్రక్ను కాస్తా సైబర్ క్యాబ్గా మార్చే ప్రయత్నాల్లో ఉంది. 2027 నాటికి తొలి దశ వాహనాలను రోడ్లపైకి ఎక్కిస్తారు. రోబోట్యాక్సీ అని పిలుస్తున్న ఈ వాహనంలో ఇద్దరు ప్రయాణించవచ్చు. స్టీరింగ్ వీల్, పెడల్స్ వంటివేవీ ఉండవు. అన్నీ కృత్రిమ మేధ ద్వారానే జరిగిపోతాయి. ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 320 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవు. ముందు, వెనుక ఎక్కడ అద్దాలుండవు. కెమెరాలు, సెన్సర్ల ద్వారానే పరిసరాలను గమనిస్తూ డ్రైవ్ చేస్తుందీ వాహనం. ఒక్కో రోబోట్యాక్సీని 30,000 డాలర్లకు అమ్మేందుకు టెస్లా ప్రయత్నిస్తోంది. మానవ డ్రైవర్ల పరిస్థితి?జూక్స్, రోబోట్యాక్సీలు విస్తృత స్థాయిలో అందుబాటులోకి వస్తే మానవ డ్రైవర్లకు గడ్డుకాలమే!. ప్రస్తుతానికి ఇవి అమెరికాకే పరిమితం కావచ్చు కానీ... భవిష్యత్తులో ఇతర ప్రాంతాలకు మరీ ముఖ్యంగా వివిధ దేశాల్లోని నగర ప్రాంతాలకు విస్తరించడం ఖాయం. అదే జరిగితే ట్యాక్సీ డ్రైవర్లకు డిమాండ్ తగ్గిపోతుంది. రోబో ట్యాక్సీలో ఒక ఒక మైలు ప్రయాణించేందుకు 0.20 డాలర్లు ఖర్చు అవుతుందని, బస్సులతో పోలిస్తే ఇది నాలుగు రెట్లు తక్కువ అని టెస్లా ఇప్పటికే ప్రకటించింది. ఇదే వాస్తవమైతే చవక కాబట్టి వీటిల్లో ప్రయాణించేందుకే మొగ్గు చూపుతారు. కాకపోతే..మానవ డ్రైవర్లను ఈ రోబోట్యాక్సీ నిర్వహణకు ఉపయోగించుకోవచ్చునని ఒక అంచనా. అంతేకాదు... కొంతమంది అభిప్రాయం ప్రకారం ఈ రోబో ట్యాక్సీలు మానవ డ్రైవర్లను పూర్తిగా లేకుండా చేయలేవు. ఎందుకంటే ఇలాంటి వాహనాల భద్రత, నియంత్రణలకు సంబంధించిన నిబంధనలు ఇప్పటివరకూ రూపుదిద్దుకోలేదు. ప్రభుత్వాలు పూనుకుని వీటిని సిద్ధం చేసేందుకు చాలా సమయమే పట్టవచ్చు. మరికొంత మంది అభిప్రాయం ప్రకారం అటానమస్ వాహనాలు నగరాల్లో కొన్ని నిర్దిష్ట మార్గాలకు మాత్రమే పరిమితమవుతాయి. సంక్లిష్టమైన రూట్లలో మానవ డ్రైవర్లనే ఉపయోగిస్తారు. ::గిళియారు గోపాలకృష్ణ మయ్యాPhotos/Videos Credits: zoox.com/newatlas.com -
బంధం.. బలహీనం!
ప్రియుడితో ఫోన్ మాట్లాడొద్దని మందలించిన కన్న తండ్రిని.. తల్లి, అక్కతో కలిసి కొట్టి చంపిన కూతురు.. మహబూబాబాద్ జిల్లాలో ఘటనఆస్తి వివాదం కోసం కన్న తండ్రి ఎదుటే సోదరుడిని తుదముట్టించిన చెల్లెళ్లు.. జగిత్యాల జిల్లాలో ఘోరం ప్రేమకు అడ్డు వస్తోందని కన్నతల్లినే ప్రియుడితో హత్య చేయించిన 15 ఏళ్ల బాలిక.. తాజాగా హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలో దారుణం – సాక్షి సెంట్రల్ డెస్క్మానవ సంబంధాలు మృగ్యమైపోతున్నాయనడానికి వరుసగా జరుగుతున్న ఇలాంటి ఘటనలే నిదర్శనం. చిన్న చిన్న కారణాలకు అయినవాళ్లను, ఆప్తులను అంతమొందించే పరిస్థితులు పెరిగిపోతున్నాయ్. ఓవైపు విజ్ఞానం పెరుగుతున్నా.. మరోవైపు ఇలాంటి అజ్ఞానమూ తాండవిస్తోంది. కుటుంబం అంటే అందమైన పొదరిల్లు అనే భావన క్రమంగా అంతర్థానమవుతోంది. ఒకప్పుడు కుటుంబ సభ్యులతో చిన్నచిన్న పంతాలు, పట్టింపులు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడవి పగలు, హత్యల వరకు వెళ్లిపోయాయి. తమ ఆనందం కోసం ఏం చేయడానికైనా, ఎంతకు తెగించడానికైనా వెనకాడటంలేదు. తల్లి లేదు.. తండ్రి లేడు.. తోబుట్టువులైనా.. కట్టుకున్న వాళ్లైనా.. బంధనాల్లాంటి బంధాలు మాకొద్దు.. మా లైఫ్.. మా ఇష్టం.. మా స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు అడ్డొస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదు.. అనే తీరు నేడు ఎక్కువైపోయింది. రక్తపాతమే కావాలా?ఫోన్ మాట్లాడొద్దన్నారని.. ప్రేమ పెళ్లికి అంగీకరించడంలేదని.. కన్నవాళ్లనే కడతేరుస్తున్నారు. నిజానికి ఇలాంటి అంశాల్లో వారికి వేరే ఆప్షన్లు ఉన్నప్పటికీ, రక్తపాతాన్నే ఎందుకు ఎంచుకుంటున్నారు? హత్య చేస్తే జైలుకు వెళతామనే ఆలోచన కూడా లేకుండా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? పోలీసు అధికారులు, మానసిక వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం.. ఇలాంటి ఘటనల వెనుక కారణాలు అన్ని కేసుల్లో ఒకేలా ఉండవు. పరిస్థితులు, అవసరాలను బట్టి పలు అంశాలు ఇందులో ఇమిడి ఉంటాయి. అయితే, ఇవేవీ ఆకస్మిక కోపం వల్లో, క్షణికావేశంలోనో జరిగే నేరాలు మాత్రం కావు. నిందితులకు ఉన్న మానసిక రుగ్మతలు, ఒత్తిడి, విభ్రాంతికరమైన ఆలోచనలు, కోరుకున్న వాతావరణం ఇంట్లో లేకపోవడం, తమకు ఎలాంటి అడ్డంకులూ ఉండకూడదనుకోవడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలు. పిల్లల్లో పెడాలోచనలు ఎందుకు? మా పిల్లలు మాట వినరు.. సరిగ్గా చదవరు.. ఎప్పుడూ ఫోన్తోనే ఉంటారని చెప్పని తల్లిదండ్రులే లేరంటే అతిశయోక్తి కాదు. మారుతున్న ప్రపంచంతోనే అందరి అలవాట్లలోనూ మార్పులు వస్తున్నాయి. పిల్లల ఆలోచనలు, అలవాట్లలో కూడా ఇదే కనిపిస్తోంది. పిల్లల్లో విపరీత మనస్తత్వానికి కారణం ఏమిటి అంటే... స్మార్ట్ ఫోన్ అనే సమాధానం ఠక్కున వస్తుంది. కొంతవరకు ఇది నిజమే అయినా.. ఇతర కారణాలూ ఉన్నాయి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు ఇరువురూ కలిసి సంపాదిస్తే తప్ప.. అవసరాలు తీరని పరిస్థితి. ఈ నేపథ్యంలో పిల్లలతో కలిసి గడిపేందుకు సమయమే ఉండటంలేదు. వారితో ప్రేమగా మాట్లాడి, అవసరాలు తెలుసుకుని తీర్చే పరిస్థితి లేదు. ఇది క్రమంగా వారిలో ఒంటరితనానికి దారితీసి.. తమకు కావాల్సింది స్మార్ట్ ఫోన్లో వెతుక్కోవడం మొదలుపెడుతున్నారు. ఇంట్లో లభించని ప్రేమానురాగాలు బయటి వ్యక్తి చూపిస్తే.. అది నిజమో, అబద్ధమో కూడా తెలుసుకోకుండా వారికి దాసోహమైపోతున్నారు. అదే సమయంలో ఇంట్లో తల్లిదండ్రులు తమను కంట్రోల్ చేయడం వారికి నచ్చడంలేదు. బయట తమకు ఎంతో స్వేచ్ఛ ఉందని.. ఇంట్లో అన్నింటికీ తల్లిదండ్రులు అడ్డుపడుతున్నారనే భావన క్రమంగా పెరిగి.. వారిపై కోపం పెంచుకుంటున్నారు. అది ఏకంగా కన్నవారి అడ్డు తొలగించుకోవాలనుకునే స్థాయికి వెళ్లిపోతోంది. అయితే, అందరూ ఇలాగే ఉన్నారని కాదు. మానసిక రుగ్మతలు ఉన్నవారు, చాలాకాలంగా తల్లిదండ్రుల వైఖరితో విభేదిస్తున్నవారు, ప్రేమ వంటి విపరీతమైన భావోద్వేగంలో కూరుకుపోయి ఉన్నవారు.. ఏదీ ఆలోచించే పరిస్థితిలో ఉండరు. ఇలాంటివారు పర్యవసనాలను పట్టించుకోకుండా తాము అనుకున్నది చేయడానికే మొగ్గు చూపిస్తారు.తల్లిదండ్రులు ఏం చేయాలి? తమ పిల్లల ప్రతి చర్యకూ తల్లిదండ్రుల బాధ్యత తప్పకుండా ఉంటుంది. కాలానికి తగ్గట్టే తల్లిదండ్రుల ప్రవర్తనలోనూ మార్పులు రావాలి. పిల్లలను ఎక్కువగా నియంత్రించడం, ఆంక్షలు పెట్టడం వంటివి చేయకూడదు.. అలా అని పూర్తిగా వదిలేయకూడదు. రెండింటినీ సమపాళ్లలో బ్యాలెన్స్ చేయాలి. పిల్లలను అదేపనిగా కట్టుదిట్టం చేస్తే ఒత్తిడిలో కూరుకుపోయి నిరాశలో మునిగిపోతారు.. లేదా తిరగబడతారు. రెండూ ప్రమాదకరమే. రోజులో వీలైనంత సమయం వారితో మాట్లాడాలి. ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవాలి. అన్నింటికీ మేం ఉన్నాం అనే భరోసా కల్పించాలి. కుటుంబ బంధాలు, విలువల గురించి అర్థమయ్యేరీతిలో చిన్నప్పటి నుంచే తెలియజెప్పాలి. వ్యక్తిత్వ లోపాలే కారణం అకారణంగా హత్యలకు పాల్పడే వాళ్లకు ఐక్యూ లెవల్స్ తక్కువ ఉంటాయి. ఈ బెడద నుంచి తప్పించుకోవాలన్న తాత్కాలిక ఆలోచన వల్లే చంపుతున్నారు. వారి వ్యక్తిత్వంలోనే లోపాలు ఉంటాయి. మానసిక రుగ్మతలు ఉన్నవాళ్లు మాత్రమే ఇలాంటి కుట్రలు చేసి, ఇతరులను కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తారు.. కుట్రలో పాల్గొనే వారందరికీ వ్యక్తిత్వ లోపాలు ఉంటాయి. ఇలాంటివారిలో చాలామంది.. చిన్నప్పటి నుంచి కుటుంబంలో ఒకరకమైన అనిశ్చితి, హింస, కోపాలకు గురై ఉంటారు. వారికి తాము చేసిన నేరం సమంజసమే అనిపిస్తుంది.– వీరేందర్, సైకాలజిస్ట్కనుమరుగవుతున్న బంధాలను కాపాడుకోవాలి కన్నవాళ్లను, కట్టుకున్నోళ్లను కడతేర్చడం వంటివి మామూలు హత్యకేసులు కావు. సమాజంలో కనుమరుగవుతున్న బంధాలు, అనుబంధాలకు నిదర్శనంగా వీటిని అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో సినిమాల్లో, సోషల్ మీడియాలో కనిపించే ప్రేమను నిజమని నమ్మేస్తున్నారు. దానికి అడ్డుగా నిలిచినవారిని తొలగించాలనే తప్పుడు భావనలు పెరిగిపోతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య భావోద్వేగ బంధం లేనప్పుడు ప్రేమ ఒక వ్యసనంగా మారుతుంది. పిల్లలకు చిన్న వయసులోనే ఎమోషనల్ ఎడ్యుకేషన్ అందించడం ఇందుకు ఒక పరిష్కారం. తల్లిదండ్రులు పిల్లల మార్కులు, ర్యాంకుల కంటే వారితో బంధానికి ఎక్కువ విలువనివ్వాలి. వారి భావాలను అర్థం చేసుకోవాలి, వారి ప్రైవసీని గౌరవించాలి. – సైకాలజిస్ట్ విశేష్ విలువలు నేర్పకపోవడం వల్లే.. చిన్న వయసులోనే ప్రేమ అనే భ్రమలో పడుతున్నారు. అది తల్లిదండ్రుల కంటే ఎక్కువనుకుంటున్నారు. తల్లిదండ్రులతో సరైన సంబంధాలు లేకపోవడం, వాళ్లని సరిగా అర్థం చేసుకోలేకపోవడం ఇందుకు కారణాలు.అందుకే పిల్లలతో ఎంత సమయం గడుపుతున్నారనేది చాలా ముఖ్యం. చాలా మంది టీచర్లు, తల్లిదండ్రులు పిల్లలకు ఎలాంటి విలువలు నేర్పడంలేదు. బాల్యం నుంచే విలువలతోపాటు నేరాలు–చట్టాలపై అవగాహన కల్పించాలి. – డా. మమతా రఘువీర్, తరుణి స్వచ్ఛంద సంస్థ కుటుంబ సభ్యులపైనే దాడులు, హత్యలకు కారణాలివీ..నియంత్రించడం (ఏదైనా వద్దు అని చెప్పడం, ఫోన్ తీసేసుకోవడం వంటివి) 38%ఆస్తి వ్యవహారాలు 10%విభేదాలు 8%కోపం, క్షణికావేశం 8%స్వేచ్ఛాయుత జీవితం కోరుకోవడం 7% -
హలో... హలో.. 120 కోట్లు
తిండి, బట్ట, నీడ.. వీటి సరసన ఇప్పుడు ఫోన్ కూడా చేరిపోయింది. అంతలా మన జీవితంలో ఈ ఉపకరణం భాగమైంది. దీనికంతటికీ కారణం టెలికం సేవలు మారుమూల పల్లెలకూ చొచ్చుకుపోవడమే. ఎంతలా అంటే ఏకంగా 120 కోట్ల మంది భారతీయులకు చేరువయ్యేలా! టెలికం చందాదార్ల సంఖ్య పరంగా ప్రపంచంలో చైనా తర్వాత రెండవ అతిపెద్ద దేశం మనదే. – సాక్షి, స్పెషల్ డెస్క్ఏప్రిల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 30 లక్షల మంది టెలికం చందాదారులు పెరిగారు. ఇందులో మూడింట రెండొంతులు గ్రామీణ ప్రాంతాలవారే కావడం ఆసక్తికరమైన అంశం. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఏప్రిల్ గణాంకాల ప్రకారం మొత్తం చందాదారుల సంఖ్య 120.38 కోట్లకు చేరుకుంది. ఇక దేశంలో ప్రతి 100 మంది జనాభాకు 85.19 టెలిఫోన్ కనెక్షన్స్ ఉన్నాయి. టెలి సాంద్రత పట్టణాల్లోనే అధికం. ఇక్కడ 100 మంది జనాభాకు 131.46 టెలిఫోన్ కనెక్షన్స్ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంఖ్య 59.26. టెలి సాంద్రత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 94.77గా ఉంది. ఢిల్లీలో అత్యధికంగా 276.75 ఉంటే, అత్యల్పంగా బిహార్లో 57.37 ఉంది. ఇంటర్నెట్ యూజర్లలో సగం వాటా రిలయన్స్ జియో సొంతం చేసుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో వైర్లెస్ వినియోగదారులు 8.24 కోట్లు కాగా, వైర్లైన్ కస్టమర్లు 41.12 లక్షల మంది ఉన్నారు.పల్లెల్లో మోగుతోందిగ్రామీణ ప్రాంతాల్లో ఫోన్ మోగుతోంది. అవును.. టెలిఫోన్ సబ్స్క్రైబర్లు దశాబ్ద కాలంలో పట్టణాల్లో 8.7 కోట్లు పెరిగితే పల్లెల్లో 11.71 కోట్లు అదనంగా వచ్చి చేరారు. చందాదారుల విషయంలో పట్టణాలకు, పల్లెలకు అంతరం తగ్గుతోంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో టెలికం సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారన్న మాట. ఈ ఏడాది మార్చితో పోలిస్తే ఏప్రిల్లో టెలిఫోన్ చందాదారులు పట్టణ ప్రాంతాల్లో 10 లక్షలు (0.16 శాతం) పెరిగితే గ్రామీణ ప్రాంతాల్లో 19.6 లక్షలు (0.37 శాతం) వృద్ధి చెందడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాలకు టెలికం సేవలు విస్తృతం అవుతుండడమే ఇందుకు కారణం.నెటిజన్స్ పెరిగారుదశాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా టెలికం చందాదారుల సంఖ్య 20 శాతమే పెరిగింది. అంటే కొత్తగా 20 కోట్ల మంది తోడయ్యారు. అదే ఇంటర్నెట్ విషయంలో యూజర్ల సంఖ్య పెరిగిన తీరు చూస్తే ఔరా అనిపించక మానదు. 2015లో నెటిజన్ల సంఖ్య 10 కోట్లు మాత్రమే. 2025 ఏప్రిల్ 30 నాటికి బ్రాడ్బ్యాండ్ కస్టమర్ల సంఖ్య 9 రెట్లు దూసుకెళ్లి ఏకంగా 94 కోట్లు దాటింది. చవక స్మార్ట్ఫోన్లు, టెలికం కంపెనీల మధ్య చవక టారిఫ్ల యుద్ధం.. వెరసి ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య ఈ స్థాయికి చేరింది. 2015 ఏప్రిల్లో మొబైల్ ఇంటర్నెట్ యూజర్లు 8.5 కోట్లు, వైర్డ్ సబ్స్క్రైబర్స్ 1.5 కోట్లు ఉన్నారు. తాజా గణాంకాల ప్రకారం వైర్లెస్ నెట్ వాడకందారులు 90 కోట్లు, వైర్డ్ చందాదారులు 4.14 కోట్లు.» చైనాలో 170 కోట్ల మంది టెలికం వినియోగదారులు ఉన్నారు.» భారత్లో మొత్తం టెలికం చందాదారుల సంఖ్య 120.38 కోట్లు» ఏప్రిల్లో మొబైల్ నంబర్ పోర్టబిలిటీ దరఖాస్తులు 1.35 కోట్లు -
విద్యార్థుల్లో జిజ్ఞాస ఎంత?
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యార్థుల పఠనాసక్తి, వారిలోని సామర్థ్యాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రత్యేక పరీక్షలు చేపట్టనున్నారు. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) దీనికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసింది. దీన్ని బేస్లైన్ టెస్ట్గా చెబుతున్నారు. పరీక్ష నిర్వహణ, విద్యా సామర్థ్యాల పరిశీలనకు సంబంధించిన మార్గదర్శకాలను ఎస్సీఈఆర్టీ మంగళవారం జిల్లా అధికారులకు పంపింది. ప్రభుత్వ పాఠశాలల్లోని 1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు వీటిని నిర్వహిస్తారు. సంవత్సరానికి మూడుసార్లు జరిగే ఈ పరీక్షల్లో వచ్చే మార్కులను పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఓ యాప్ను తయారు చేశారు. విద్యాసంవత్సరం ప్రారంభంలో ఒకసారి, మధ్యలో మరోసారి, చివరలో ఇంకోసారి పరీక్షలు ఉంటాయి. రెగ్యులర్గా జరిగే పరీక్షలకు ఇవి భిన్నంగా ఉంటాయనిఅధికారులు తెలిపారు. పాఠశాలహెచ్ఎంలు ప్రతీ విద్యార్థికి సంబంధించిన మార్కులను యాప్లో పొందుపరుస్తారు. వీటి ఆధారంగా విద్యార్థి ఎక్కడ వెనుకబడి ఉన్నాడు? ఏ జిల్లాల్లో ప్రమాణాలు ఎలా ఉన్నాయి? అనే వివరాలను ఎస్సీఈఆర్టీ పరిశీలించి, విద్యార్థుల స్థాయిని పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది.పరీక్ష విధానం ఇదీ.. ఈ ప్రక్రియ మొత్తం ఎస్సీఈఆర్టీ నేతృత్వంలోనే నడుస్తుంది. ప్రశ్నపత్రాల రూపకల్పన, వాటి పరిశీలన ఈ విభాగమే చూస్తుంది. ఇది తరగతి వారీగా మారుతుందని తెలిపారు. ప్రాథమిక స్థాయిలో అనర్గళంగా చదవడం, రాయడం, చదివిన దాన్ని అర్థం చేసుకోవడం తప్పనిసరి. దీని ఆధారంగానే పరీక్ష నిర్వహిస్తారు. పిల్లలు సరళ పదాలు, గుణింతాలు ఒత్తుల పదాలు, వాక్యాలు, పేరాలను చదవాలి. తెలుగు పదాలను తడబడకుండా, తప్పులు లేకుండా నిర్ణీత వేగంతో చదివితేనే ఆ విద్యార్థికి సామర్థ్యం ఉన్నట్లుగా గుర్తిస్తారు. గణితంలో 1, 2 తరగతుల విద్యార్థుల సంఖ్యలు గుర్తించడం కూడికలు, తీసివేతలు సమస్యల సాధన, 3, 4, 5 విద్యార్థులు కూడికలు, తీసివేతలు, భాగహారం వంటివి చేయాలి. 6–10వ తరగతి వారికి పాఠ్యాంశాల్లో కనీస ప్రశ్నలు వస్తాయి. ఇందులో విద్యార్థి ఎంత వేగంతో సమాధానం ఇస్తున్నాడు? ఇచ్చేదాంట్లో సరైన సమాధానం శాతం ఎంతమేర ఉందనే దాన్ని సామర్థ్యానికి కొలమానంగా తీసుకుంటారు. 9, 10 తరతుల విద్యార్థులను కొంత తికమక పెట్టే రీతిలోనూ ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షల్లో వచ్చే మార్కులకు, సంవత్సరంలో నిర్వహించే పరీక్షలకు ఏ సంబంధం ఉండదని అధికారులు తెలిపారు. -
యురేనియంను దాచేసింది!
గుట్టుచప్పుడుకాకుండా వేల కేజీల బరువైన బంకర్ బస్టర్ బాంబులేసి పర్వతగర్భ ఫోర్డో అణుకేంద్రాన్ని నాశనంచేశానని అమెరికా ఆనందపడేలోపే తాజా ఉపగ్రహ చిత్రాలు కొత్త భయాలను మోసుకొచ్చాయి. దాడులు ఖాయమన్న అంచనాతో ఇరాన్ సైన్యం ముందుగానే ఆ అణుకేంద్రం నుంచి వందల కేజీల అత్యంతశుద్ధమైన యురేనియంను అక్కడి నుంచి వేరే చోటుకు తరలించిందన్న వార్త ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.ఎంతో కష్టపడి శుద్ధిచేసిన యురేనియంను గాల్లో దీపంలా అలా అణుకేంద్రంలో నిర్లక్ష్యంగా వదిలేసేంత అమాయకత్వం ఇరాన్కు లేదని, ఎంతో తెలివిగా యురేనియం నిల్వలను వేరే చోటుకు తీసుకెళ్లిందని వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తలకు బలంచేకూరేలా అమెరికా వైమానిక దాడులకు ముందే న్యూక్లియర్ సెంటర్కు కొన్ని భారీ ట్రక్కులు వచ్చి వెళ్లినట్లు తాజా ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇవేం తెలీకుండానే యురేనియంలేని న్యూక్లియర్ కేంద్రంపై అమెరికా హడావిడిగా బాంబులేసిందని కొందరు చెబుతున్నారు.పక్కా ప్రణాళికతో..చిన్నని స్థూపాకార ఉక్కు బ్యారెళ్లలో 400 కేజీల అత్యంత శుద్ధ యురేనియంను ఫోర్డో యురేనియం శుద్ధి కర్మాగారం నుంచి ఇరాన్ రహస్య ప్రాంతానికి తరలించిందని వార్తలొచ్చాయి. ఈ చిన్న బ్యారెళ్లను తర్వాత చిన్న వాహనాల్లోకి మార్చి తరలించవచ్చు. కారు డిక్కీలో పెట్టి ఎవ్వరికీ అనుమానం రాకుండా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. 400 కేజీల యురేనియంతో దాదాపు 10 అణుబాంబులను తయారుచేయొచ్చు. అణుకేంద్రంలో ఉండాల్సిన ఈ పేలుడు పదార్థం ఇప్పడు లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అంతర్జాతీయ అణు ఇంధన ఏజెన్సీ చీఫ్ రఫేల్ మారియానో గ్రస్సీ సైతం ధృవీకరించినట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత శాంతిచర్చలకు సిద్ధమైతే, తమ వద్ద యురేనియం నిల్వలు ఉన్నాయని బెదిరించి ఇరాన్ తన డిమాండ్లను సాధించే వీలుంది.‘‘ చర్చల సమయంలో ఇరాన్ ఇదే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించి తమ డిమాండ్లు నెరవేరాలని కోరవచ్చు. ఈ సమస్యకు పరిష్కారం వెతకాల్సి ఉంది. ఏదేమైనా బాంబులు పేల్చి మేం వాళ్ల యురేనియం శుద్ధి కేంద్రాలను నాశనంచేశాం. ఇప్పట్లో ఇరాన్ మళ్లీ అణుశుద్ధిని మొదలుపెట్టడం అసాధ్యం’’ అని ఏబీసీ వార్తాసంస్థతో జేడీ వాన్స్ చెప్పారు. ఈ అంశంపై రఫేల్ మారియానో సీఎన్ఎన్, ది న్యూయార్క్ టైమ్స్ వార్తాసంస్థలతో మాట్లాడారు. ‘‘ఇందులో దాచాల్సిందేమీ లేదు. అంతా బహిరంగ రహస్యమే.తమ యురేనియం నిల్వలను కాపాడుకునే దమ్ము తమకు ఉందని ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఆ యురేనియంతో అణుబాంబును తయారుచేయడం కుదరదు. కనిపించకుండా పోయిన యురేనియం శుద్ధత కేవలం 60 శాతమే. 90 శాతం శుద్ధత ఉంటేనే అణుబాంబుకు అక్కరకొస్తుంది. దాడులకు ఒక వారం ముందు అణు ఇంధన ఏజెన్సీ పర్యవేక్షణ బృంద సభ్యులు ఇస్ఫహాన్ అణుకేంద్రానికి వెళ్లినప్పుడు అక్కడ యురేనియం నిల్వలను చూశారు’’ అని రఫేల్ వెల్లడించారు. ఆ 16 ట్రక్కులు ఎక్కడ?ఫోర్డో భూగర్భ అణుకేంద్రం ముఖద్వారం వద్దకు దాడులకు ముందు 16 పటిష్టమైన ట్రక్కులు వచ్చినట్లు మాక్సార్ టెక్నాలజీస్ సంస్థ వారి ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ట్రక్కుల నిండా ఏవో బ్యారెళ్లను నింపి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆ ట్రక్కులు ఇప్పుడు ఎక్కడున్నాయో ఎవరికీ తెలీదు. అయితే ట్రక్కులపై అమెరికా నిఘా వర్గాలు ఓ కన్నేశాయని, ట్రంప్ అనుమతి వచ్చాక వాటిపై దాడులుచేసేందుకు అమెరికా సేనలు సిద్ధంగా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాతో మరో కథనం వెలువడింది. -
ప్రజాస్వామ్యానికి సంకెళ్లు
1975. జూన్ 25. స్వతంత్ర భారత చరిత్రలోనే అత్యంత చీకటిమయమైన అధ్యాయానికి తెర లేచిన రోజు. దేశం ఎన్నటికీ మర్చిపోలేని రోజు. అధికారాన్ని కాపాడుకునేందుకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించిన రోజు. ఆ నిశిరాత్రి వేళ ఆమె తీసుకున్న చీకటి నిర్ణయం ఏకంగా 21 నెలల పాలు దేశ ప్రజల పాలిట నిత్య కాళరాత్రే అయింది. ఎటుచూసినా దమనకాండ. రాజకీయ ప్రత్యర్థులు మొదలుకుని సామాన్యుల దాకా దేశవ్యాప్త నిర్బంధాలు. ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన మౌలిక హక్కులు దేవుడెరుగు, జీవించే హక్కుకే దిక్కు లేని దుస్థితి.పత్రికా స్వేచ్ఛను ఉక్కుపాదంతో తొక్కిపెట్టిన పరిస్థితి! సర్వం సహా అధికారమంతా ఇందిర చిన్న కుమారుడు సంజయ్గాంధీ రూపంలో ఓ రాజ్యాంగేతర శక్తి చేతుల్లో కేంద్రీకృతం! అసలే దుందుడుకుతనానికి మారుపేరు. ఆపై బాధ్యతల్లేని అధికారం. దాని అండతో, సన్నిహిత కోటరీ చెప్పినట్టల్లా ఆడుతూ ఆయన పాల్పడ్డ అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అనుమానం వచ్చిన వారల్లా జైలుపాలే. చివరికి జనాభాను తగ్గించే చర్యల పేరిట కంటబడ్డ వారికల్లా బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిపారేయడం సంజయ్ నియంతృత్వ పోకడలకు పరాకాష్టగా నిలిచింది.మొత్తంగా దేశమే ఓ జైలుగా మారి 21 నెలల పాటు అక్షరాలా హాహాకారాలు చేసింది. అయితే అంతిమ విజయం ప్రజాస్వామ్యానిదే అయింది. ఎమర్జెన్సీ ఎత్తివేత అనంతరం జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇందిరను ఓడించి, నియంత పోకడలు పోయేవారికి ప్రజలు మర్చిపోలేని పాఠం నేర్పారు. అలాంటి ఎమర్జెన్సీ చీకటి అధ్యాయానికి తెర లేచి నేటికి సరిగ్గా 50 ఏళ్లు. ఈ సందర్భంగా, అందుకు దారి తీసిన పరిస్థితులు, ఎమర్జెన్సీ అకృత్యాలు, దాని పరిణామాలు తదితరాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.....అలా మొదలైందినిజానికి ఎమర్జెన్సీ నాటికి దేశమంతటా నానారకాలుగా అస్థిరత రాజ్యమేలుతోంది. ఇందిరకు వ్యతిరేకంగా లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ తదితరుల సారథ్యంలో విపక్షాలు సంఘటితమవుతూ వస్తున్నాయి. అయితే ఎమర్జెన్సీకి పూర్వ రంగాన్ని సిద్ధం చేసింది మాత్రం ఇందిర ఎన్నికను రద్దు చేస్తూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగ్మోహన్లాల్ సిన్హా వెలువరించిన చరిత్రాత్మక తీర్పే. 1971 లోక్సభ ఎన్నికల్లో రాయ్బరేలీ నుంచి ఇందిరపై తలపడి ఓడిన సోషలిస్టు పార్టీ అభ్యర్థి రాజ్ నారాయణ్ ఆమె ఎన్నికను సవాలు చేస్తూ కోర్టుకెక్కారు. ఇందిర ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇందిర ఎన్నికల ఏజెంటు యశ్పాల్ కపూర్ ప్రభుత్వోద్యోగిగా ఉంటూనే ఆమె కోసం పని చేశారని పేర్కొన్నారు.ఈ కేసును కొద్దిరోజులకు అంతా మరచిపోయినా బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం తాలూకు ఆర్థిక భారం కారణంగా నాలుగేళ్లుగా జనంలో రగులుతున్న అసంతృప్తి ఇందిర సర్కారుపై ఆగ్రహంగా మారుతున్న సందర్భమది. మూడేళ్ల పాటు ఇందిర సర్కారుకు వ్యతిరేకంగా విపక్షాలు నానాటికీ బలం పుంజుకోసాగాయి. అలాంటి సమయంలో ఎంపీగా ఇందిర ఎన్నికను కొట్టేస్తూ జస్టిస్ సిన్హా 1975 జూన్ 12న అనూహ్యంగా సంచలన తీర్పు వెలువరించారు. అంతేగాక ఆమె ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు కూడా వేశారు! దానిపై ఇందిర సుప్రీంకోర్టుకు వెళ్లినా లాభం లేకపోయింది. ఆమెను ప్రధానిగా కొనసాగనిచ్చినా, పార్లమెంటులో ఓటు హక్కులకు మాత్రం కత్తెర వేస్తూ జూన్ 24న సుప్రీం తీర్పునిచ్చింది.ఇది విపక్షాలకు అతి పెద్ద ఆయుధంగా అందివచ్చింది. జేపీ ఇచ్చిన సంపూర్ణ క్రాంతి (సంపూర్ణ విప్లవ) నినాదం అప్పటికే దేశమంతటా కార్చిచ్చులా వ్యాపిస్తోంది. చూస్తుండగానే దేశమంతటా, ముఖ్యంగా ఉత్తరాదిన ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటసాగాయి. సుప్రీం తీర్పు వచ్చిన మర్నాడు జూన్ 25న విపక్షాలన్నీ ఢిల్లీ రాంలీలా మైదాన్లో భారీ స్థాయిలో నిర్వహించిన సంపూర్ణ విప్లవ ర్యాలీ సర్కారు పునాదులనే కదిలించింది.పౌరులు సహాయ నిరాకరణ చేయాలని, పోలీసులు, సైనిక బలగాలు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కాకుండా అంతరాత్మ ప్రబోధానుసారం నడచుకోవాలని జేపీ ఇచ్చిన పిలుపు కేంద్రం గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. పరిస్థితులు చేయి దాటుతున్నాయని భావించిన ఇందిర సన్నిహితులతో సంప్రదించి ఓ నిర్ణయానికి వచ్చారు. ‘అంతర్గత భద్రతకు ముప్పు పొంచి ఉన్నందున దేశమంతటా ఎమర్జెన్సీ విధించా’లంటూ ఆ అర్ధరాత్రే రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్కు సిఫార్సు చేయడం, క్షణాల మీద ఆయన ఆమోదముద్ర వేయడం చకచకా జరిగిపోయాయి.ఏం జరిగింది?⇒ ఎమర్జెన్సీ కారణంగా వాక్ స్వాతంత్య్రంతో పాటు ప్రజల రాజ్యాంగపరమైన హక్కులన్నీ రద్దయ్యాయి. ⇒ మీడియాపై కనీవినీ ఎరగని రీతిలో పూర్తిస్థాయి ఆంక్షలు కొనసాగాయి. ⇒ అనుమానం వస్తే చాలు, ఎంతటివారినైనా ముందస్తు నిర్బంధంలోకి తీసుకోవడం పరిపాటిగా మారింది. ⇒ జేపీతో పాటు అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే ఆడ్వాణీ, మధు దండావతే, నానాజీ దేశ్ముఖ్, ప్రకాశ్సింగ్ బాదల్, కరుణానిధి, జార్జి ఫెర్నాండెజ్, ప్రకాశ్ కారత్ తదితర విపక్ష నేతలందరినీ నిర్బంధించి జైలుపాలు చేశారు.⇒ డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ (మీసా) వంటి చట్టాలతో ఎవరినైనా కటకటాల్లోకి నెట్టారు. ⇒ ఈ నిర్బంధాలకు గుర్తుగా ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆ సమయంలో పుట్టిన తన కూతురికి మీసా భారతి అని పేరు పెట్టుకోవడం విశేషం! ⇒ న్యాయవ్యవస్థ హక్కులకు కూడా కోత పడింది. విపక్ష నేతలను అరెస్టు చేయాలంటూ జారీ చేసే కార్యనిర్వాహక ఉత్తర్వులను న్యాయస్థానాలు సమీక్షించకుండా వాటి అధికారాలకు కత్తెర వేశారు. ⇒ జనాభా పెరుగుదలకు అడ్డుకట్ట వేసేందుకంటూ దేశవ్యాప్తంగా లక్షలాది మందికి బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించారు. ⇒ సుందరీకరణ పేరుతో ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లోని మురికివాడలన్నింటినీ అధికారులు నేలమట్టం చేసి లక్షలాది మందికి నిలువ నీడ లేకుండా చేశారు.చివరికేమైంది? ⇒ ఎమర్జెన్సీ ఎత్తేశాక 1977 జనవరి 20న లోక్సభను రద్దు చేశారు. తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తొలిసారి ఓటమి పాలైంది. ⇒ ఇందిరతో పాటు ఆమె తనయుడు సంజయ్ కూడా ఓటమి చవిచూశారు. ⇒ మొరార్జీ దేశాయ్ ప్రధానిగా మార్చి 24న జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. ⇒ లుకలుకలతో కొద్దికాలానికే కుప్పకూలినా, కేంద్రంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోయింది. ⇒ ఎమర్జెన్సీ ఆందోళనల్లోంచే ఫెర్నాండెజ్, కారత్ వంటి కొత్త తరం నాయకులు ఎదిగి వచ్చారు.మీడియాకూ చుక్కలే ⇒ ఎమర్జెన్సీ కాలంలో మీడియాపై ఇందిర సర్కారు, ముఖ్యంగా ఆమె తనయుడు సంజయ్ గాంధీ అక్షరాలా ఉక్కుపాదం మోపారు! అందుకోసం ప్రివెన్షన్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ అబ్జెక్షనబుల్ మ్యాటర్ పేరుతో చట్టమే తెచ్చారు. ⇒ మాట విననందుకు 200 మందికి పైగా జర్నలిస్టులను అరెస్టు చేశారు. వారిపై పన్నుల ఎగవేత వంటి పలు అభియోగాలు మోపారు. ⇒ జేపీ ఉద్యమానికి కవరేజీ ఇచ్చినందుకు కుల్దీప్ నయ్యర్, కె.ఆర్.మల్కానీ వంటి జర్నలిస్టులను జైలుపాలు చేశారు. ⇒ మాట వినని పత్రికలకు న్యూస్ ప్రింట్ అందకుండా చేశారు. ⇒ చివరికి గాంధీ స్వయంగా స్థాపించిన నవజీవన్ ప్రెస్ తాలూకు ప్రింటింగ్ యంత్రాలన్నింటినీ జప్తు చేశారు. ⇒ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ), యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా (యూఎన్ఐ), హిందూస్తాన్ సమాచార్, సమాచార్ భారతి వంటి వార్తా సంస్థలను ‘సమాచార్’ పేరిట బలవంతంగా విలీనం చేసిపారేశారు. ⇒ వార్తా పత్రికలపై నియంత్రణ కోసం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఒక ఐపీఎస్ అధికారిని ప్రత్యేకంగా నియమించారు. ప్రతి వార్తనూ అక్షరాక్షరం క్షుణ్నంగా చదివి సరేనన్న మీదటే ప్రింటుకు వెళ్లేది. ⇒ ఇన్ని చేసినా కలానికి మాత్రం సంకెళ్లు వేయలేకపోయారు. నియంతృత్వాన్ని నిరసిస్తూ మీడియా గళం విప్పింది. ⇒ ఎమర్జెన్సీ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఖాళీ ఎడిటోరియల్ ప్రచురించింది.సినిమాలకూ చీకటి రోజులే!⇒ బాలీవుడ్తో పాటు దేశ సినీ పరిశ్రమకు కూడా ఎమర్జెన్సీ చీకటి కాలంగానే మిగిలిపోయింది.⇒ సంజయ్గాందీని ప్రస్తుతించేందుకు నిరాకరించారని బాలీవుడ్ స్టార్ దేవానంద్ సినిమాలను దూరదర్శన్లో నిషేధించారు.⇒ ప్రభుత్వ 20 సూత్రాల పథకాన్ని పొగిడేందుకు ఏర్పాటు చేసిన గాన విభావరిలో పాల్గొనేందుకు ససేమిరా అన్న గాయక దిగ్గజం కిశోర్కుమార్ గొంతు ఆలిండియా రేడియోలో విని్పంచకుండా, ఆయన పాటలు దూరదర్శన్లో కన్పించకుండా చేశారు.⇒ ఇందిరను పోలిన పాత్రలో సుచిత్రసేన్ జీవించిన ‘ఆం«దీ’, నియంతృత్వంపై వ్యంగ్యాస్త్రాలు విసిరిన ‘కిస్సా కుర్సీ కా’ వంటి సినిమాలను నిషేధించారు. ఇందిర నియంతృత్వాన్ని సినీ పరిశ్రమ ఎదిరించింది. దేవానంద్ ఏకంగా నేషనల్ పార్టీ ఆఫ్ ఇండియా పేరిట కొత్త పార్టీయే పెట్టారు.⇒ శత్రుఘ్న సిన్హా, ప్రాణ్, డానీ డెంగ్జోంగ్పా వంటి బాలీవుడ్ దిగ్గజాలు పొలిటికల్ స్టార్ బ్రిగేడ్ పేరిట జనతా పార్టీకి మద్దతిచ్చారు. ⇒ విప్లవ ఇతివృత్తంతో పట్టాభిరామారెడ్డి దర్శకత్వం వహించిన కన్నడ సినిమా చండ మారుతను నిషేధించడమే గాక అందులో నటించిన ఆయన భార్య స్నేహలతారెడ్డిని కటకటాల్లోకి నెట్టారు. ఏడాదికి పైగా తీవ్ర నిర్బంధంలో గడిపిన ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. పెరోల్పై బయటికొచ్చిన ఐదు రోజులకే కన్నుమూశారు.హోం మంత్రికే తెలియదు! దేశంలో ఎమర్జెన్సీ విధించిన విషయం మర్నాటిదాకా సాక్షాత్తూ నాటి కేంద్ర హోం మంత్రి ఓం మెహతాకే తెలియదు! ఉదయం పత్రికల్లో చదివి విస్తుపోవాల్సి వచ్చింది. తర్వాత కాసేపటికే కేంద్ర కేబినెట్ను సమావేశపరిచిన ఇందిర, ఎమర్జెన్సీ విధింపు గురించి సహచర మంత్రులకు తీరిగ్గా వెల్లడించారు. అనంతరం ఆలిండియా రేడియోలో జాతినుద్దేశించి ప్రసంగించారు. తన సర్కారుకు వ్యతిరేకంగా భారీ స్థాయిలో లోతైన కుట్ర జరుగుతున్నందున తనకు మరో దారి లేకపోయిందని చెప్పుకొచ్చారు.ఇది ప్రజాస్వామ్యానికి ఇందిర పాతర వేసిన రోజు – ఎమర్జెన్సీ నిర్ణయంపై లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ అదృశ్య యుద్ధ విమానం వెనుక భారతీయ మేధావి!
వార్ టెక్నాలజీలో అత్యద్భుతం.. నార్త్రోప్ B-2 స్పిరిట్ బాంబర్. తాజాగా ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా ప్రయోగించడంతో వీటి గురించి మరోసారి చర్చ నడుస్తోంది. అయితే ఈ యుద్ధ విమానాల రూపకల్పనలో భారతీయ మూలాలున్న మేధావి కూడా ఉన్నారు. కాలక్రమంలో.. గూఢచర్యం ఆరోపణలతో ఆయన జైలు పాలు కావడం ఇక్కడ ప్రముఖంగా చెప్పుకోదగిన అంశం.నోషిర్ షెరియర్జీ గోవాడియా(Noshir Sheriarji Gowadia).. ముంబైలోని ఓ పార్శీ కుటుంబంలో 1944లో జన్మించారీయన. ఆపై 19 ఏళ్ల వయసులో ఉన్నత విద్య కోసం అమెరికాకు వలస వెళ్లి.. అక్కడ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదివారు. 1969లో ఆయనకు అమెరికా పౌరసత్వం లభించింది. ఇంజినీరింగ్ మేధావిగా నార్త్రోప్ గ్రుమ్మన్ కార్పొరేషన్లో B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్కు సంబంధించిన ప్రొపల్షన్ సిస్టమ్ను రూపకల్పన చేయడంలో గోవాడియా కీలక పాత్ర పోషించారు. అయితే..దశాబ్దంన్నర తర్వాత.. అనారోగ్య కారణాలతో నార్త్రోప్ గ్రుమ్మన్ నుంచి తప్పుకున్న ఆయన న్యూమెక్సికోలో డిఫెన్స్ కన్సల్టింగ్ సంస్థ ప్రారంభించారు. అయితే 1997లో DARPAతో వివాదం కారణంగా ఆయన సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దయింది. దీంతో.. చాలా కాలం ఆయన అజ్ఞాతంలో ఉండిపోయారు. 2005 అక్టోబర్ 15వ తేదీన హవాయ్లోని విల్లాపై దాడి చేసిన ఎఫ్బీఐ డబ్బుతో రహస్య సమాచారానికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకుంది. చైనాతో రహస్య సంబంధాల నేపథ్యంలో ఆయన్ని అదే తేదీన అరెస్ట్ చేసింది. విచారణలో నివ్వెరపోయే విషయాలు అధికారులకు తెలిజేశారు. గోవాడియా చైనాలోని చెంగ్డూ, షెన్జెన్ వంటి నగరాలకు ఆరు సార్లు ప్రయాణించి, స్టెల్త్ మిసైల్ ఎగ్జాస్ట్ డిజైన్ చేయడంలో సహాయం చేశారని నిర్ధారించారు. బదులుగా చైనా నుంచి కనీసం $110,000 పొందారని తేలింది. మొత్తం 14 అభియోగాలలో ఆయన దోషిగా తేలడంతో 2011లో హోనోలులు కోర్టు ఆయనకు 32 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. అలా ఒక మేధావి జీవితం.. గూఢచారిగా కటకటాల పాలైంది. కీలకంగా గోవాడియానే.. B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ను అమెరికా డిఫెన్స్ కంపెనీ నార్త్రోప్ (ఇప్పటి నార్త్రోప్ గ్రుమన్) రూపొందించింది. ఈ ప్రాజెక్టులో అనేక మంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు పనిచేశారు. మరీ ముఖ్యంగా హాల్ మార్కేరియన్ (Hal Markarian),నోషిర్ షెరియర్జీ గోవాడియా(Noshir Sheriarji Gowadia) గురించి చెప్పుకోవాలి. మార్కేరియన్.. 1979లో B-2 బాంబర్కు సంబంధించిన తొలి డిజైన్ స్కెచ్లు రూపొందించారు. ఆయన ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేశారు. విమానం యొక్క ప్రాథమిక ఆకృతికి బీజం వేశారు. అయితే.. భారతీయ మూలాలున్న ఇంజినీర్ గోవాడియా B-2 బాంబర్లోని స్టెల్త్ ప్రొపల్షన్ సిస్టమ్ను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా, విమానం ఎగ్జాస్ట్ను రాడార్, హీట్ సెన్సర్లకు కనిపించకుండా చేయడంలో ఆయన టెక్నాలజీ కీలకమైంది. వీళ్లిద్దరితో పాటు ఇర్వ్ వాలాండ్, జాన్ కాషెన్, హాన్స్ గ్రెల్మాన్ వంటి స్టెల్త్ టెక్నాలజీ నిపుణులు కూడా భాగస్వాములయ్యారు.వియత్నాం, యోమ్ కిప్పూర్ యుద్ధాల సమయంలో అమెరికా ఎదుర్కొన్న సమస్యల్ని అధిగమించేందుకు నోషిర్ గోవాడియా నేతృత్వంలో.. ‘స్టెల్త్’ సాంకేతికతను అభివృద్ధి చేయడం ప్రారంభమైంది. ‘బ్లూబెర్రీ మిల్క్షేక్’ అనే కోడ్ నేమ్తో సాగిన గోప్యమైన ప్రాజెక్టులో గోవాడియా కీలకపాత్ర వహించారు. బాంబర్ ఇంజిన్ ఎగ్జాస్ట్ను రాడార్, హీట్ సెన్సర్లకు దృశ్యమవకుండా చేయడం ఆయన ప్రాథమిక లక్ష్యం. ఈ ప్రయత్నంలో ఆయన ఘన విజయం సాధించారు. B-2 బాంబర్ ప్రత్యేకతలుబీ2 బాంబర్.. దట్టమైన యాంటీ-ఎయిర్క్రాఫ్ట్ డిఫెన్స్లలోకి చొచ్చుకుపోవడానికి తక్కువ-పరిశీలించదగిన స్టీల్త్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. అందుకే దీనిని స్టెల్త్ బాంబర్ అని పిలుస్తారు. స్టెల్త్ డిజైన్: ఇది ఫ్లయింగ్-వింగ్ ఆకృతిలో ఉండి, రాడార్కు కనిపించకుండా ఉండేలా రూపొందించబడింది. దీని రాడార్ క్రాస్ సెక్షన్ ఒక చిన్న పక్షి స్థాయిలో మాత్రమే ఉంటుంది.ఇన్ఫ్రారెడ్ & హీట్ సిగ్నేచర్ తగ్గింపు: ఎగ్జాస్ట్ సిస్టమ్ను ప్రత్యేకంగా రూపొందించి, హీట్ సెన్సర్లకు కనిపించకుండా చేస్తుంది.అత్యధిక పరిధి: ఒకసారి మిడ్-ఎయిర్ రీఫ్యూయలింగ్తో 10,000 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించగలదు.అత్యంత ఖచ్చితమైన దాడులు: 40,000 పౌండ్ల బాంబులు మోసే సామర్థ్యం ఉంది, అందులో న్యూక్లియర్ బాంబులు కూడా ఉంటాయి.క్రూ సౌకర్యాలు: దీన్ని “ఫ్లయింగ్ హోటల్” అని కూడా పిలుస్తారు—ఇందులో బెడ్, మైక్రోవేవ్, ఫ్రిడ్జ్, టాయిలెట్ వంటి సౌకర్యాలు ఉన్నాయి, ఎందుకంటే కొన్ని మిషన్లు 40 గంటలపాటు సాగుతాయి.తయారీ ఖర్చుబీ2 బాంబర్ ఖర్చు: సుమారు $2.1 నుండి $2.2 బిలియన్ (2025 నాటికి ₹17,000 కోట్లకు పైగా).మొత్తం ప్రోగ్రాం వ్యయం: అభివృద్ధి, పరీక్షలు, ఉత్పత్తి కలిపి $79 బిలియన్ ఖర్చయింది.ప్రతి మిషన్ ఖర్చు: ఒక B-2 మిషన్కు సగటున $3–4 మిలియన్ ఖర్చవుతుంది. ఎందుకంటే ఒక్క గంట ఫ్లైట్ ఖర్చే $150,000 ఉంటుంది.చైనా డ్రోన్ నిజంగా B-2ని పోలి ఉందా?అవును.. 2025 మేలో చైనాలోని మలాన్ టెస్ట్ బేస్ వద్ద శాటిలైట్ చిత్రాల్లో కనిపించిన స్టెల్త్ డ్రోన్ B-2 స్పిరిట్ను పోలి ఉంది. దీని వింగ్స్పాన్(సుమారు 52 మీటర్లు), టెయిల్లెస్ ఫ్లయింగ్-వింగ్ డిజైన్, ఇన్ఫ్రారెడ్-సిగ్నేచర్ తగ్గింపు లక్షణాలు.. ఇవి అన్నీ B-2 లక్షణాలను ప్రతిబింబిస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది చైనా యొక్క H-20 ప్రాజెక్ట్ లేదా కొత్త హై-ఆల్టిట్యూడ్ స్టెల్త్ డ్రోన్ కావచ్చు. అయితే ఈ డ్రోన్ రూపకల్పనకు నోషిర్ గోవాడియా అందించిన గోప్య సమాచారం ప్రభావం ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇరాన్ కంటే ముందు.. అమెరికా దీనిని ప్రయోగించిన సందర్భాలు🕊️ 1999 – కొసోవో యుద్ధం (Operation Allied Force)- B-2 బాంబర్లు తొలిసారిగా యుద్ధంలో పాల్గొన్న సందర్భం.- మిస్సోరీలోని వైట్మాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి నేరుగా సెర్బియాకు వెళ్లి, కీలక లక్ష్యాలపై ఖచ్చితమైన బాంబింగ్ చేశారు.- ఒక్కో మిషన్ 30 గంటలకు పైగా సాగింది. 🏔️ 2001–2002 – ఆఫ్ఘానిస్తాన్ (Operation Enduring Freedom)- తాలిబాన్ స్థావరాలు, శిక్షణ శిబిరాలు, గుహలపై దాడులు.- అమెరికా నుంచి నేరుగా ఎగిరి, మిడ్-ఎయిర్ రీఫ్యూయలింగ్తో లక్ష్యాలను చేరుకున్నారు. 🏜️ 2003 – ఇరాక్ యుద్ధం (Operation Iraqi Freedom)- ప్రారంభ దాడుల్లో భాగంగా సద్దాం హుస్సేన్కు చెందిన కమాండ్ సెంటర్లు, మిస్సైల్ సదుపాయాలపై బంకర్ బస్టర్ బాంబులతో దాడి. 🌍 2011 – లిబియా (Operation Odyssey Dawn)- మూడు B-2 బాంబర్లు లిబియాలోని ఎయిర్ఫీల్డ్స్, ఫోర్టిఫైడ్ షెల్టర్లపై దాడి చేసి, నో-ఫ్లై జోన్ అమలు ప్రారంభానికి దోహదం చేశాయి. ⚔️ 2017 – సిరియా (అధికారికంగా నిర్ధారణ కాలేదు)- ఐసిస్ స్థావరాలపై B-2 బాంబర్లు GBU-57 బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేశాయని నివేదికలు ఉన్నాయి. 🚀 2024 – యెమెన్- హౌతీ తిరుగుబాటుదారులపై దాడి. ఈ మిషన్ ద్వారా బీ-2 బాంబర్ సామర్థ్యాన్ని మళ్లీ ప్రపంచానికి చూపించారు. 🌑 2025 – ఇరాన్ (Operation Midnight Hammer)- 7 B-2 బాంబర్లు 37 గంటల పాటు ఎగిరి, ఇరాన్లోని Fordow, Natanz, Isfahan న్యూక్లియర్ కేంద్రాలపై 30,000 పౌండ్ల బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేశాయి. -
ఏవీ.. డ్రైవర్ లేకుండానే!
అమెరికాలోని ఆస్టిన్ నగర వీధుల్లో ఒక ఎర్ర కారు.. దానిమీద ‘రోబో ట్యాక్సీ’ అని రాసి ఉంది. ఇది సెల్ఫ్ డ్రైవింగ్ లేదా డ్రైవర్ రహిత కారు. ప్రపంచ ప్రసిద్ధ టెస్లా కంపెనీ ఈ రోబో ట్యాక్సీ సేవలను ఆదివారం ప్రారంభించింది. దీంతో ఇప్పుడు స్వయం చోదక వాహనాల (అటానమస్ వెహికల్ –ఏవీ) మీద చర్చ మరోసారి మొదలైంది. యూఎస్ఏలోని సిలికాన్ వ్యాలీ, చైనాలోని బీజింగ్ నగరంలో ఇప్పటికే ఏవీలు పరుగులు తీస్తున్నాయి. సరుకు రవాణా కోసం అటానమస్ ట్రక్స్ దూసుకెళుతున్నాయి. ప్రపంచంలో వాహనాల తయారీలో నాలుగో స్థానంలో ఉన్న భారత్లో.. ఏవీలు సాకారం అయ్యే అవకాశాలు ఎప్పుడెప్పుడా అని వాహన ప్రియులు ఎదురుచూస్తున్నారు. అసలు ఏవీలు ఎక్కడెక్కడ ఏయే స్థాయిల్లో ఉన్నాయి.. ఏవీ ఎలా పనిచేస్తుంది.. డ్రైవర్ లేకుండా ఇది ఎలా నడుస్తుంది?విదేశాల్లో ఇలా..సాధారణ క్యాబ్స్తో పోలిస్తే పలు దేశాల్లో అటానమస్ వెహికల్స్ ఆధారిత క్యాబ్స్ సగం చార్జీలనే వసూలు చేస్తున్నాయి. ఒక్క యూఎస్లోనే ఒక ట్రిలియన్ డాలర్ల వ్యాపార అవకాశాలు ఉన్నాయని ఊబర్ సీఈవో డారా కాస్రోసాహీ ఇటీవల వెల్లడించారు. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్కు చెందిన వేమో ఇప్పటికే యూఎస్, చైనాలో అటానమస్ వెహికల్స్తో రైడ్ హెయిలింగ్ సేవలు ఆఫర్ చేస్తోంది.యూఎస్కు చెందిన పోనీ.ఏఐ అటానమస్ క్యాబ్స్ సర్వీసులు అందిస్తోంది. అలాగే అటానమస్ ట్రక్స్ ద్వారా సరుకు రవాణా రంగంలోనూ ఉంది. భారత్కు చెందిన గౌతమ్ నారంగ్, అర్జున్ నారంగ్, అపేక్ష కుమావత్ కలిసి అమెరికాలో ఏర్పాటుచేసిన ‘గతిక్.ఏఐ’ అనే కంపెనీ అటానమస్ ట్రక్స్ ద్వారా వాల్మార్ట్ వంటి కంపెనీలకు సేవలందిస్తోంది. న్యూరో అనే కంపెనీ చిన్న అటానమస్ వ్యాన్స్ ద్వారా యూఎస్లో సరుకు రవాణా చేస్తోంది. చైనాలో డీప్రూట్.ఏఐ ఈ రంగంలో ఉంది. వీరైడ్, వాబి, మోషనల్, అరోరా తదితర కంపెనీలు సైతం ఆటానమస్ వెహికల్స్తో పోటీపడుతున్నాయి.అమెరికాలోని ఆస్టిన్ నగరంలో టెస్లా కంపెనీకి చెందిన రోబో ట్యాక్సీలను లాంఛనంగా ప్రారంభించారు. దశాబ్దాల కఠోర శ్రమకు ఇది ఫలితమని, అయితే ఇది పైలట్ ప్రాజెక్టేనని టెస్లా కంపెనీ అధినేత ఎలన్ మస్క్ తెలిపారు. ప్రస్తుతం ట్రిప్పునకు 4.20 డాలర్లు (సుమారు రూ.364) వసూలు చేస్తున్నారు. ఈ క్యాబ్స్ పూర్తిస్థాయిలో ప్రజలందరికీ ఎప్పటికి అందుబాటులోకి వస్తాయో మస్క్ ఇంకా ప్రకటించలేదు. మనదేశం విషయానికొస్తే.. టాటా మోటార్స్ ఇటీవల వైయు అనే పూర్తిస్థాయి అటానమస్ వాణిజ్య వాహనానికి పేటెంట్ పొందింది. దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది వస్తువులు, ప్రయాణికుల రవాణాకు అనుకూలమైనది.మన దేశంలో ప్రారంభ దశలోనే..అటానమస్ వెహికల్స్ రాకతో ఆటోమొబైల్ పరిశ్రమలో సాంకేతికంగా పెద్ద ముందడుగు పడిందని చెప్పవచ్చు. భారత్లో అటానమస్ వెహికల్స్ అభివృద్ధి ఇంకా ప్రారంభ దశలోనే ఉందని చెప్పాలి. పూర్తిగా అటానమస్ అంటే డ్రైవర్ అవసరమే లేకుండా నడిచే వాహనాలు (లెవెల్–5) ఇంకా వాణిజ్యపరంగా అందుబాటులో లేనప్పటికీ.. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్) అభివృద్ధి, అటానమస్ దిశగా సాంకేతికతల పరీక్షల్లో పురోగతి ఉంది. భారత్లో మైనస్ జీరో, స్వాయత్ రోబోస్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా ఈలిక్సీ, ఫ్లక్స్ ఆటో, ఫ్లో మొబిలిటీ తదితర కంపెనీలు ఏవీల అభివృద్ధిపై దృష్టి సారించాయి. ఇదిలా ఉంటే.. డ్రైవర్లెస్ కార్లను భారత్లో అనుమతించేది లేదని పలు సందర్భాల్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెబుతూ వచ్చారు.5 లెవెల్స్లో..వాహనాల నియంత్రణ, నిర్వ హణ విషయంలో ఆటో మేషన్ స్థాయిని బట్టి లెవెల్–0 నుంచి పూర్తి అటానమస్ లెవల్–5 వరకు.. ఏవీలను 6 స్థాయిలుగా వర్గీకరించారు. లెవెల్ – 0 అంటే పూర్తిగా డ్రైవర్పైనే ఆధారపడి ఉంటుంది. లెవెల్ – 1లో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. ముందున్న వాహనం వేగాన్ని బట్టి ఏవీ దానంతట అదే వేగాన్ని నియంత్రించుకుంటుంది. లెవెల్ – 2లో సాంకేతికత స్టీరింగ్ను, వేగాన్ని నియంత్రిస్తుంది. లెవెల్ 1, 2లలో కచ్చితంగా డ్రైవర్ ఉండాల్సిందే. లెవెల్ –3లో ప్రత్యేక పరిస్థితుల్లో వాహనం దానంతట అదే నియంత్రించుకుంటుంది.కానీ, కొన్ని సందర్భాల్లో కారు ఇచ్చే అలర్ట్స్ను బట్టి డ్రైవర్ స్టీరింగ్ను తన చేతుల్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. లెవెల్ –4 అంటే.. చాలా అరుదుగా తప్ప, దాదాపుగా డ్రైవర్ అవసరం లేకుండానే కారు నడుస్తుంది. వీటిని ఎక్కడ పడితే అక్కడ నడపడం సాధ్యం కాదు. ప్రత్యేకమైన ప్రాంతంలోనే (జియో ఫెన్సింగ్ సాయంతో) నడుపుతారు. అంటే ఆ ప్రాంతానికి సంబంధించిన పూర్తి వివరాలే ఫీడ్ చేస్తారన్నమాట. ఆ పరిస్థితుల్లోనే కారు నడవగలదు. లెవెల్ – 5.. అసలు డ్రైవర్ అవసరమే ఉండదు. పూర్తిగా కారు తనంతట తానే నడుస్తుంది. ప్రపంచంలో లెవెల్ – 5 స్థాయి వాహనాలను ఎవరూ తయారుచేయలేదు. సెన్సార్స్, కెమెరాలతో..అటానమస్ వెహికల్స్ వాటి పరిసరాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి రూట్ మ్యాప్ను నిర్మించడానికి, నవీకరించడానికి పలు సెన్సార్లపై ఆధారపడతాయి.⇒ రాడార్ సెన్సార్లు సమీపంలోని వాహనాలను ట్రాక్ చేస్తాయి. కెమెరాలు ట్రాఫిక్ సిగ్నల్స్ను గుర్తిస్తాయి. అలాగే రహదారి సంకేతాలను అర్థం చేసుకుంటాయి. పాదచారులు, ఇతర వాహనాల కదలికలను గమనిస్తుంటాయి. ⇒ లైడార్ (లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్) సాంకేతికత దూరాలను కొలవడానికి; లేన్ గుర్తులను, రహదారి సరిహద్దులను గుర్తించడానికి లేజర్ పల్స్లను ఉపయోగిస్తుంది. వాహనం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని అధిక రిజొల్యూషన్ 3డీ మ్యాప్గా సృష్టిస్తుంది. అడ్డంకులు, పాదచారులు, ఇతర వాహనాలను గుర్తించడంలో సహాయపడుతుంది. ⇒ వాహనాలను నిలిపేందుకు నిర్దేశించిన గీతలను, చుట్టూ ఉన్న కార్లను గుర్తించేందుకు చక్రాల దగ్గర పొందుపరిచిన అల్ట్రాసోనిక్ సెన్సార్లు సహాయపడతాయి. ⇒ ట్రాఫిక్ సంకేతాలు, పాదచారుల సమాచారాన్ని ఇతర కెమెరాలు అందిస్తాయి. ⇒ ఏవీల్లో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్), ఇనెర్షియల్ మెజర్మెంట్ యూనిట్ (ఐఎంయూ) కూడా ఉన్నాయి. లొకేషన్ కు సంబంధించిన సమాచారాన్ని జీపీఎస్ అందిస్తుంది. వాహన వేగం, దిశలో వచ్చే మార్పును ఐఎంయూ ట్రాక్ చేస్తుంది.⇒ సెన్సార్స్ అందించిన డేటాను అత్యంత సామర్థ్యం గల సాఫ్ట్వేర్ ప్రాసెస్ చేస్తుంది. ఇది సరైన మార్గాన్ని నిర్ణయించడంతోపాటు వాహన వేగం, దిశ, బ్రేకింగ్, స్టీరింగ్ను నియంత్రిస్తుంది. ముందే పొందుపరిచిన ట్రాఫిక్ నియమాలు, అడ్డంకులను గుర్తించే విధానాలు, పరిసరాల అధ్యయనం, మనుషులు, యంత్రాల గుర్తింపు ద్వారా ఈ సాంకేతిక వ్యవస్థ సురక్షిత, సమర్థవంత ప్రయాణాన్ని అందిస్తుంది. -
చిక్కడు.. దొరకడు!
ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం నానాటికీ తీవ్రరూపం దాలుస్తోంది. దాడులు, ప్రతిదాడులకు పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ యుద్ధంలోకి అమెరికా సైతం అడుగుపెట్టడం అగి్నకి ఆజ్యం పోసినట్లయ్యింది. ఇజ్రాయెల్తోపాటు అమెరికాపై కత్తులు నూరుతున్న అసలు కథానాయకుడు, ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఇప్పుడు ఎక్కడున్నారు? అనేది టాప్ సీక్రెట్గా మారింది. దశాబ్దాలుగా ఇరాన్ను మకుటం లేని మహారాజులా ఏలుతున్న 86 ఏళ్ల ఖమేనీ కోసం ఇజ్రాయెల్ నిఘా వర్గాలు వేట సాగిస్తున్నాయి. ఆయనకు విదేశాల్లోనే కాదు, సొంత దేశంలోనూ శత్రువులున్నారు. ఖమేనీ ఆచూకీ దొరికితే సజీవంగా బంధించి, చట్టప్రకారం శిక్షించడమో లేక అక్కడికక్కడే అంతం చేయడమో తథ్యమని పశ్చిమ దేశాల మీడియా అంచనా వేస్తోంది. ఇరాన్లో తమ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ప్రతిష్టించాలంటే ఆయన ప్రాణాలతో ఉండడానికి వీల్లేదని ఇజ్రాయెల్, అమెరికా నిర్ణయానికి వచి్చనట్లు తెలుస్తోంది. ఖమేనీ భౌతికంగా లేకుండాపోతేనే ఈ యుద్ధం ముగస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేయడం గమనార్హం. ‘‘ఖమేనీ ఆధునిక హిట్లర్. అతడు బతికి ఉండడానికి వీల్లేదు’’ అని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కట్జ్ సైతం అన్నారు. చావుకు భయపడే మనిషి కాదు ఇరాన్లో ఈ నెల 12న ఇజ్రాయెల్ సైన్యం హఠాత్తుగా దాడికి దిగింది. ఆ వెంటనే ఖమేనీ ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గుర్తుతెలియని ప్రాంతంలో అత్యంత పటిష్టమైన భద్రత కలిగిన బంకర్లో ఆయన క్షేమంగా ఉన్నట్లు ఇరాన్ అధికార వర్గాలు చెబుతున్నాయి. సుశిక్షితులైన బాడీగార్డులు ఆయనకు రక్షణ కల్పిస్తున్నట్లు పేర్కొంటున్నాయి. ఖమేనీ కచి్చతంగా ఎక్కడున్నారో ఎవరికీ తెలియకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) అత్యున్నత స్థాయి అధికారులకు సైతం ఖమేనీ ఆచూకీ గురించి తెలియదని అంటున్నారు. ఇజ్రాయెల్ నిఘా వర్గాలకు ఏమాత్రం ఉప్పందకుండా ఇరాన్ సర్కారు అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఖమేనీని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఉన్నత శ్రేణి భద్రతా దళం నిరంతరం ఆయనకు కాపలా కాస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఖమేనీ ప్రాణాలకు ఎవరూ హానీ తలపెట్టే అవకాశం లేకుండా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఖమేనీ చావుకు భయపడే మనిషి కాదని, ఇరాన్ భవిష్యత్తు కోసం ఆయన ప్రాణాలతో ఉండడం అవసరమని అన్నారు. అమెరికా దాడుల తర్వాత బంకర్లోకి.. సాధారణ పరిస్థితుల్లో ఖమేనీ సెంట్రల్ టెహ్రాన్లోని ఓ కాంపౌండ్లో ఉంటారు. అక్కడి నుంచి విధులు నిర్వర్తిస్తారు. మిలటరీ కమాండర్లు, అధికారులతో ప్రతివారం సమావేశమవుతారు. ప్రజలతో మాట్లాడాలన్నా ఇక్కడే. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లరు. ఇజ్రాయెల్ దాడులు మొదలైన వెంటనే ఖమేనీ బంకర్లోకి వెళ్లలేదని సమాచారం. బయటే ఉంటూ ప్రతిదాడికి వ్యూహాలు రచించినట్లు తెలుస్తోంది. ఈ నెల 21న అమెరికా సైన్యం యుద్ధరంగంలోకి అడుగుపెట్టిన తర్వాతే ఆయన బంకర్లోకి చేరుకున్నారు. మూడు ప్రధాన అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం తర్వాత ఖమేనీ మరింత అప్రమత్తమయ్యారు. తన విశ్వాసపాత్రులైన అనుచరులు, సహాయకులతోనూ కమ్యూనికేషన్ తగ్గించుకున్నారు. ఫోన్లు ఉపయోగించడం ఆపేశారు. ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉంటున్నారు. శత్రువులకు తన ఆచూకీ చిక్కకుండా ఉండడానికే ఈ జాగ్రత్త. శత్రువుల చేతికి చిక్కితే మరణాన్ని చేతులారా ఆహ్వానించినట్లేనని ఖమేనీని బాగా తెలుసు. ఆయనను ఖతం చేయడానికి ఇజ్రాయెల్ ఇప్పటిదాకా చేయని ప్రయత్నమే లేదు. ఇజ్రాయెల్ ప్రత్యేక ఆపరేషన్ల ద్వారా ఎంతోమందిని హత్య చేసింది. కొద్ది రోజుల క్రితమే పేజర్ బాంబులతో హెజ్»ొల్లా నాయకులను మట్టుబెట్టింది. ఖమేనీని మాత్రం కనీసం టచ్ చేయలేకపోయిందంటే ఆయన ఎంత సురక్షితంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ‘‘ఏదో ఒకరోజు ఇజ్రాయెల్ నన్ను చంపేయడం ఖాయం. దేశం కోసం వీరమరణం పొందడం నాకు సంతోషమే’’ అని కొన్నేళ్ల క్రితం ఖమేనీ వ్యాఖ్యానించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Cinema Controversy: పేరులోనే అంతా ఉంది!
ఎల్లలు దాటేసిన భారతీయ సినిమా.. సొంతగడ్డపైనే చిక్కులు ఎదుర్కొంటోంది!. ‘‘ఆ పేరులో ఏముంది లే?’’ అని అనుకోవడానికి ఇప్పుడు లేదు. ఎందుకంటే.. ఆ పేరే ఇప్పుడు సినిమాకు అడ్డం పడుతోంది. జానకీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అనే సినిమాలో ‘జానకీ’ అనే పేరును మారిస్తేనే రిలీజ్ సర్టిఫికెట్ ఇస్తామంటోంది సెన్సార్ బోర్డు. మాలీవుడ్ స్టార్, బీజేపీ ఎంపీ.. కేంద్ర మంత్రి(సహాయ) సురేష్ గోపి ఈ చిత్రంలో కీ రోల్ పోషించడం ఇక్కడ మరో విశేషం.సినిమాను దేశం అనే బౌండరీని దాటించి.. ఇంటర్నేషనల్ ఆడియొన్స్ను అలరించేందుకు మన ఫిల్మ్మేకర్లు రకరకాల ప్రయత్నాలు చేస్తున్న రోజులివి. ఫిక్షన్, బోల్డ్, ఒక్కోసారి సామాజిక అంశాలను స్పృశిస్తూ సక్సెస్ అవుతున్నారు. అయితే ఈ మసాలాలను అందరూ మెచ్చడం లేదు. రాజకీయ, మతపరమైన వర్గాల నుంచి ఒక్కోసారి తీవ్ర అభ్యంతరాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అదీ పేర్ల విషయంలోనే కావడం మరో విశేషం. అలాంటి కొన్ని ‘సినిమా కష్టాల’ను ఓసారి గుర్తు చేసుకుందాం.పద్మావత్2017-2018లో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన చిత్రం. సంజయ్లీలా భన్సాలీ డైరెక్షన్లో దీపికా పదుకొనే, రణ్ర్ సింగ్, షాహిద్కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన హిస్టారికల్ ఫిక్షన్డ్రామా. అయితే కర్ణిసేన నుంచి తీవ్ర అభ్యంతరాలతో ఈ సినిమా విడుదల అనుమానమే అనుకున్నారంతా. చివరకు పద్మావత్గా పేరును మార్చేయడంతో పాటు పలు సీన్లకు కత్తెర వేయడంతో విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది.ఎస్ దుర్గామలయాళంలో 2017లో రిలీజ్ అయిన చిత్రం. అయితే విడుదలకు ముందు ఈ చిత్రం సెక్సీ దుర్గ పేరుతో వివాదంలోకి ఎక్కింది. హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఆ తర్వాతే ఈ పేరును ఎస్ దుర్గాగా మార్చడంతో విడుదలకు అనుమతించారు. రాజ్శ్రీ దేశ్పాండే, కన్నణ్ నాయర్ లీడ్ పాత్రల్లో మతాంతర వివాహంనేపథ్యంతో సనల్ కుమార్ శశిథరన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.సత్యప్రేమ్ కీ కథసమీర్ విద్వాన్స్ డైరెక్షన్లో .. కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ జంటగా 2023లో రిలీజ్ అయిన చిత్రమిది. తొలుత ఈ రొమాంటిక్ లవ్ డ్రామాకు సత్యనారాయణ కీ కథ అనుకున్నారు.అయితే దేవుడి పేరుపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వివాదం ముదరముందే పేరును మార్చేసి రిలీజ్ చేశారు.జానకీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళఇది తాజా కాంట్రవర్సీ. మలయాళ సీనియర్ హీరో సురేష్ గోపి ముఖ్యపాత్రలో అనుపమ పరమేశ్వరన్ లీడ్ క్యారెక్టర్లో తెరకెక్కిన చిత్రం ఇది. కోర్టు రూమ్ డ్రామాగా ప్రవీన్ నారాయణన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రంలో లీడ్ పాత్ర దాడికి గురయ్యే బాధితురాలు. జానకీ అంటే సీతాదేవి(శ్రీరాముడి భార్య)కి మరో పేరు అని, భక్తుల మనోభావాలు దెబ్బతినడంతో పాటు హిందూ సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యే అవకాశం ఉందని, కాబట్టి పేరు మారిస్తేనే రిలీజ్ సర్టిఫికెట్ ఇస్తామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) స్పష్టం చేసింది. పైపెచ్చు ఈసినిమాకు ఇదివరకే 13+ సర్టిఫికెట్ను బోర్డు ఇష్యూ చేయడం గమనార్హం. ఇంతేకాదు..రీసెంట్గా ఇలాగే ఓ మలయాళ సినిమాలో హీరోయిన్ పేరును జానకీ నుంచి జయంతిగా మార్చిన తర్వాతే రిలీజ్కు లైన్ క్లియర్ అయ్యిందని కేరళ ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జనరల సెక్రటరీ బీ ఉన్నికృష్ణన్ చెబుతున్నారు. అయితే అదేం చిత్రమో పేరును చెప్పేందుకు ఆయన నిరాకరించారు. పై చిత్రాలే కాదు.. ఈ తరహా అభ్యంతరాల వివాదాలతో ార్పులుసంతరించుకున్న చిత్రాలు ఇంకా చాలానే ఉన్నాయి.అక్షయ్కుమార్ లీడ్ రోల్లో లారెన్స్ కాంచన రీమేక్గా 2020లో రిలీజ్ అయిన సినిమా. లక్ష్మీబాంబ్గా తొలుత టైటిల్ ఫిక్స్ చేయగా.. హిందూ సంఘాల అభ్యంతరాలతో లక్ష్మీగా మార్చేశారు. 2013లో సంజయ్లీలా భన్సాలీ డైరెక్షన్లో వచ్చిన రామ్-లీలా.. అభ్యంతరాల తర్వాత గోలియోన్ కీ రాస్లీలా రామ్-లీలాగా టైటిల్ మార్చుకుంది. కిందటి ఏడాది మలయాళంలో రాహుల్ సదాశివన్ డైరెక్షన్లో వచ్చిన భ్రమయుగంలో లీడ్ రోల్ చేసిన సీనియర్ హీరో మమ్ముట్టి పేరు(కుంజామోన్ పోట్టి)పై బ్రహ్మణ సంఘాల(కుంజామోన్ ఇళ్లం అనే వర్గం) నుంచి అభ్యంతరాలు వచ్చాయి. విషయం ఆ రాష్ట్ర హైకోర్టుకు చేరింది. దీంతో విడుదలకు ముందే కొడుమోన్ పోట్టిగా పేరును మార్చేశారు.ఇవేకాదు.. కంగనా రనౌత్ తలైవి, అనుష్క రుద్రమదేవి, రిషబ్ శెట్టి కాంతార, సుదీప్తో తీసిన ది కేరళ స్టోరీ చిత్రాల విషయంలోనూ విడుదలకు ముందే పలు అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయితే మేకర్ల క్లారిఫికేషన్ కారణంగా ఈ చిత్రాల విడుదలకు పెద్దగా ఆటంకాలు ఎదురు కాలేదు. సెన్సార్ బోర్డు తన కత్తెరకూ పదును పెట్టలేదు. 🎬 సెన్సార్ బోర్డు (CBFC)కు ఏం హక్కు ఉంది?సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) భారత ప్రభుత్వంలోని సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ (Ministry of Information and Broadcasting) పరిధిలో పనిచేస్తుంది. సినిమాటోగ్రాఫ్ చట్టం, 1952 ప్రకారం ఈ బోర్డు ఏర్పాటు చేయబడింది. సినిమా విడుదలకు ముందు CBFC నుండి సర్టిఫికేషన్ పొందడం తప్పనిసరి. ఈ బోర్డు సినిమాలకు U, UA, A, S వంటి సర్టిఫికేట్లను జారీ చేస్తారు.సాధారణంగా.. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)కు ఓ సినిమాగానీ, అందులోని పాత్ర పేరు మార్చించేసే చట్టపరమైన అధికారం నేరుగా లేదు. కానీ, తాము సూచించిన మార్పులకు గనుక దర్శన నిర్మాతలు అంగీకరించకపోతే సదరు చిత్రానికి సర్టిఫికెట్ ఇవ్వకుండా ఆపే అధికారం మాత్రం ఉంటుంది.🧾 CBFC అధికారాలుపేరు, సన్నివేశాలు, సంభాషణలు ద్వారా జాతిపరమైన లేదంటే మతపరమైన భావోద్వేగాలు దెబ్బతినే అవకాశం ఉందనుకుంటే, వారు సర్టిఫికేట్ ఇవ్వకుండా నిలిపివేయవచ్చు.పై విషయంలో మార్పులకు సిఫార్సు చేయవచ్చు (ఇందులో పాత్ర పేరు, శీర్షిక, సంభాషణలవంటి అంశాలుంటాయి)సర్టిఫికేట్ లేకుండా సినిమా విడుదల చేయటం చట్టవిరుద్ధం, కాబట్టి చాలా సందర్భాల్లో దర్శకులు సూచించిన మార్పులను అంగీకరిస్తారు.🚫 CBFC చేతిలో లేనిది..నేరుగా సినిమాగానీ, క్యారెక్టర్గానీ పేరు మార్చమని ఆదేశించడం. ఎందుకుంటే.. తుది నిర్ణయం ఆ సినిమా దర్శకనిర్మాతలదే.CBFC యొక్క నిర్ణయాన్ని Film Certification Appellate Tribunal (FCAT) లేదంటే కోర్టుల్లో ఆ చిత్ర దర్శకనిర్మాతలు సవాల్ చేయొచ్చు. -
Israel-Iran: అణుయుద్ధం.. నిజమెంత?
ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం రోజు రోజుకు మరింత ముదురుతోంది. ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా మెరుపుదాడులతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. తాజాగా.. సోమవారం తెల్లవారుజామున ఇరాన్ అర గంట వ్యవధిలోనే ఇజ్రాయెల్పై 22 క్షిపణులతో దాడి చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చాలామంది మనసుల్లో మెదులుతున్న ప్రశ్న ఏమిటంటే.. ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా? అని!. ఈ ప్రశ్నకు సమాధానం అంత తేలిక కాదు. చాలా విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. అవేంటో.. ఒక్కటొక్కటిగా చూద్దాం.1.ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి దౌత్యవర్గాల్లో అణుయుద్ధంపై చర్చ జరుగుతూనే ఉంది. దశాబ్దాల తరువాత మధ్యప్రాచ్య పరిస్థితులు అణుయుద్ధానికి దారితీసేలా ఉన్నాయన్న వ్యాఖ్యలూ వినపిస్తున్నాయి. అయితే ఆ దారుణం జరక్కుండా చూసేందుకు ప్రభుత్వాధినేతలు చాలామంది తమవంతు ప్రయత్నాలూ చేస్తున్నారు. 2.‘‘అణుస్థావరాలపై అమెరికా దాడి యుద్ధం ప్రకటించడమే!’’ అని ఇరాన్ చెప్పడమే కాకుండా.. అణ్వాయుధాలకు సంబంధించిన అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చట్టం నుంచి వైదొలగే ఆలోచన కూడా చేస్తోంది. 1970 నుంచి అమల్లో ఉన్న ఈ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చట్టం నుంచి వైదొలగడం అంటే.. ఇరాన్ తనకు నచ్చినట్టుగా అణు ఇంధనాన్ని శుద్ధి చేసుకోగలదు. అణ్వాస్త్రాలూ తయారు చేసుకోగలదు. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) వంటి ఐరాస సంస్థల పర్యవేక్షణను అనుమతించదన్నమాట. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇరాన్ మరింత వేగంగా అణ్వాయుధాలను తయారు చేసుకునే అవకాశం ఏర్పడుతుంది.3. ఇదిలా ఉంటే ప్రస్తుత యుద్ధ వాతావరణంలో ఏ దేశం ఎటువైపున ఉన్నదన్నది కూడా అణుదాడులు జరిగే అవకాశాలను నిర్ణయిస్తుంది. ఇరాన్పై అమెరికా దాడులను రష్యా, చైనా తీవ్రంగా ఖండించాయి. అయితే ప్రస్తుతానికి ఈ రెండు దేశాలూ ఇరాన్కు నేరుగా మిలటరీ సాయం చేసే స్థితికి చేరలేదు. టర్కీ, ఖతార్, సౌదీ అరేబియాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మరోవైపు భారత్సహా అనేక ఆసియా దేశాలు ఇరు పక్షాలకూ దూరంగా ఉంటున్నాయి. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని, చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఇరుదేశాలకు సూచిస్తున్నాయి. 4. అమెరికా నిన్న ఇరాన్ అణు స్థావరాలపై బంకర్ బాంబులతో విరుచుకుపడ్డ నేపథ్యంలో ఐఏఈఏ ఒక హెచ్చరిక చేసింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఇరాన్-ఇజ్రాయెల్ ప్రాంతంలో రేడియోధార్మిక ప్రభావం పెరిగిపోవడం ఖాయమని స్పష్టం చేసింది. ఫోర్డో, నటాన్జ్, ఇస్ఫహాన్లలోని అణుస్థావరాలను తాము ధ్వంసం చేసినట్లు అమెరికా ప్రకటించినప్పటికీ ఆ ప్రాంతాల్లో రేడియోధార్మిక పదార్థాలేవీ లేవని ఇరాన్ ప్రకటించడం కొంత ఊరటనిచ్చే అంశం. సరిగ్గా దాడులు జరిగే ముందే ఇరాన్ ఫర్డో స్థావరం నుంచి సుమారు 400 కిలోల యురేనియం (60 శాతం శుద్ధత కలిగినది. ఆయుధాల తయారీకి కనీసం 90 శాతం శుద్ధమైన యురేనియం 235 అవసరం.)ను అక్కడి నుంచి తరలించినట్లు వార్తలొచ్చాయి. ఇంకోపక్క ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశంలో ఇజ్రాయెల్ తన వైఖరిని సమర్థించుకోగా.. వాటిని సార్వభౌమత్వంపై దాడులుగా ఇరాన్ అభివర్ణించింది. మొత్తమ్మీద చూస్తే ప్రపంచం అణుయుద్ధపు అంచుల్లో ఉందని చెప్పలేము. ఇప్పటివరకూ యుద్ధం ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికాలకే పరిమితమై ఉంది. మధ్యప్రాచ్య దేశాలు, రష్యా, చైనా వంటి అభివృద్ది చెందిన దేశాలు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇందులో మార్పు లేనంత వరకూ అణుయుద్ధం జరిగే అవకాశం తక్కువే!. :::గిళియారు గోపాలకృష్ణ మయ్యా! -
సెల్ఫోన్ వాడకంతో మాటలు రాని చిన్నారులు
కర్నూలు వెంకటరమణకాలనీకి చెందిన శివరాముడుకి ఒక కుమారుడు ఉన్నాడు. పాలుతాగాలన్నా, ఏదైనా తినాలన్నా మొబైల్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఆ బాలునికి మూడేళ్ల వయస్సు. ఇప్పటికీ ఆ బాలుడికి మాటలు రావడం లేదు.కర్నూలుకు చెందిన లలితకుమారికి భర్త ఇటీవలే మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారున్ని అల్లారుముద్దుగా పెంచేందుకు ఆమె రెండేళ్ల వయస్సు నుంచే పిల్లాడిని గారాబం ఎక్కువ చేసింది. ఈ క్రమంలో ఆ బాలుడు సెల్ఫోన్కు ఎక్కువగా బానిసయ్యాడు. అర్ధరాత్రి 2 గంటలైనా సెల్ఫోన్ చూస్తూ గడిపేవాడు. ఈ క్రమంలో బాలుడు నాలుగేళ్ల వయస్సు వచ్చినా మాట్లాడటం లేదు.ఒకప్పుడు చంటిపిల్లలకు చందమామను చూపి గోరుముద్దలు తినిపించేవారు. ఆ తర్వాత తరం వారు వీధిలోకి వెళ్లి జంతువులు, ఇతర పిల్లలను చూపిస్తూ అన్నం పెట్టేవారు. గత తరం వారు టీవీలో కార్టూన్ బొమ్మలు చూపించి పిల్లలకు భోజనం పెట్టేవారు. కానీ నేటితరం మాత్రం మొబైల్ చేతికిచ్చి భోజనం తినిపిస్తున్నారు. అలవాటైన చిన్నారులు రాత్రింబవళ్లూ మొబైల్ కావాలంటున్నారు. దీంతో వారికి మూడేళ్ల వయస్సు వచ్చినా మాటలు రాని పరిస్థితి నెలకొంటోందని, చిన్న పదాలు కూడా పలకడం లేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. – కర్నూలు(హాస్పిటల్)ఒకప్పుడు ప్రతి ఇంట్లో పిల్లలకు అమ్మానాన్నలతో పాటు తాతయ్య, నానమ్మ, చిన్నాన్న, చిన్నమ్మ, అత్తమ్మలు ఉండేవారు. వీరందరూ పిల్లలను ఆడిస్తూ పెంచేవారు. బయటకు తీసుకెళ్లి ప్రపంచాన్ని చూపించి పిల్లలను ఆనందింపజేసేవారు. ఇప్పుడు ఇంట్లో ఎంత మంది ఉంటే అందరూ బిజీగా మారారు. చిన్నకుటుంబాలు ఎక్కువ కావడంతో పిల్లలను ఆడించేవారు కరువయ్యారు. వారికి సెల్ఫోన్లో వచ్చే ఆటలే ఆటవస్తువులుగా మారాయి. అందులో వచ్చే కార్టూన్ బొమ్మలను, రంగులను చూసి పిల్లలు ఆకర్షితులు అవుతున్నారు. రెండేళ్ల వయస్సు కూడా రాకముందే పెద్దల కంటే మిన్నగా మొబైల్ను ఆపరేట్ చేసేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. వారి ఉత్సాహం, చైతన్యం చూసి ఆ వయస్లులోని చిన్నారులను చూసి ఇంట్లో తల్లిదండ్రులతో పాటు పెద్దలు కూడా ఎంతో సంతోషిస్తున్నారు. మాట ముచ్చట కురువై.. అతి చిన్న వయస్సులోనే సెల్ఫోన్లోని ఫీచర్లను వాడేయడం, యూట్యూబ్తో పాటు సోషల్ మీడియాను ఎలా వాడాలో పెద్దలకు చూపించడం వంటివి నేర్వడంతో సంతోషించడం పెద్దల వంతైంది. ఈ క్రమంలోనే వారికి మూడేళ్లు వచ్చినా మాటలు రాకపోవడం చాలా మంది గమనించలేకపోతున్నారు. ఒకప్పుడు ఏడాదిన్నరకే అమ్మా నాన్నతో పాటు అవ్వా తాత, అత్తమ్మ, మామ అనే చిన్న చిన్న పదాలు పలికేవారు. రెండేళ్ల వయస్సుకు పొట్టిపదాలతో మాట్లాడేవారు. మూడేళ్లకు వచీ్చరానీ మాటలతో గలగలా మాట్లాడుతూ అల్లరి చేసేవారు. ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా ఆ ముచ్చటే కరువైంది. పెద్దలతో పాటు పిల్లలు కూడా సెల్ఫోన్లకు బానిసలు కావడంతో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేశారు. చికిత్స కోసం ఆసుపత్రులకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆవరణలోని బాలల సత్వర చికిత్స కేంద్రంలో గత ఐదేళ్లలో పుట్టుకతో వచ్చిన లోపాలతో పాటు ఎదుగుదల లోపాలతో వచ్చే చిన్నారులు కూడా ఉన్నారు. వీరిలో అధిక శాతం చిన్నతనంలోనే మొబైల్ వాడకం వల్ల మాటలు రాకపోవడంతో పాటు దృష్టిలోపం, వినికిడిలోపం, నేర్చుకోలేకపోవడం, భాష తెలియకపోవడం వంటి లోపాలతో వస్తున్నారు. ఇక్కడే గాకుండా చిన్నపిల్లల విభాగంలోనూ ఇలాంటి చిన్నారులు చికిత్స కోసం వస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులు,క్లినిక్లలోనూ ప్రతిరోజూ పదుల సంఖ్యలో ఇలాంటి చిన్నారులను చూస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చిన్నతనంలో ఎక్కువ సమయం డిజిటల్ తెరలను చూడటంతో వారిలో సమాజంలో ఇతరులను కలిసే తత్వం తగ్గుతుంది. పిల్లలు ఆటల పట్ల దృష్టి పెట్టే సమయాన్ని తగ్గిస్తాయి. ఎక్కువసేపు మొబైల్ చూసే పిల్లల్లో ఊబకాయం వస్తుంది. ఇది భవిష్యత్లో వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వారు నిద్రించే సమయాన్ని తగ్గిస్తుంది. డిజిటల్ తెరల నుంచి వెలువడే నీలికాంతి ఎండోజెనస్ మెలటోనిన్ను అణిచివేస్తుంది. మొబైల్కు దూరంగా ఉంచడమే మేలు పిల్లల భాషా నైపుణ్య అభివృద్ధికి మొబైల్ తెరలే అవరోధంగా నిలుస్తున్నాయి. అల్లరి మాని్పంచేందుకు, ఆహారం తినిపించేందుకు అలవాటు పడిన ఈ మొబైల్ ఫోన్ వారిని బానసలుగా మార్చుకుంటోంది. ఈ క్రమంలో చిన్నారుల ఎదుగుదలపై అవి తీవ్రంగా ప్రభావాన్ని చూపిస్తోంది. భవిష్యత్ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఇంట్లో తల్లిదండ్రులతో పాటు ఇంట్లోని పెద్దలు సైతం వారి ఇంట్లోని చిన్నారులను మొబైల్కు దూరంగా ఉంచే ప్రయత్నం చేయాలి. ఈ మేరకు ముందుగా పిల్లల ముందు పెద్దలు సైతం మొబైల్ ఎక్కువగా వాడకుండా ఉండటమే మేలు.పెద్దలు వాడకపోతే పిల్లలు అటువైపు దృష్టి సారించరు. ఈ సమయంలో పిల్లలు ఆడుకునేందుకు బొమ్మలను కొనివ్వడం, ఆటలు ఆడించడం, మైదానాలు, పార్కులకు తీసుకెళ్లి ఆడించడం, బందువుల ఇళ్లకు తీసుకెళ్లి వారిని పరిచయడం చేయించడం, వారి పిల్లలతో స్నేహం చేయించడం వంటివి చేయాలి. అప్పుడే పిల్లల్లో శారీరక, మానసిక అభివృద్ధి చెందుతుంది. -
ఆ 3 అణు కేంద్రాలు
ఇరాన్లోని కీలకమైన మూడు అణు కేంద్రాలపై అమెరికా సైన్యం అనూహ్యంగా దాడులకు దిగిన నేపథ్యంలో వాటి గురించి క్లుప్తంగా...1.ఫోర్డో యురేనియం ఎన్రిచ్మెంట్ ప్లాంట్ టెహ్రాన్కు నైరుతి దిశలో 60 మైళ్ల దూరంలో పర్వతం అంతర్భాగంలో 90 మీటర్ల లోతున ఫోర్డో అణుశుద్ధి కేంద్రం ఏర్పాటు చేశారు. నతాంజ్ కంటే ఇది పరిమాణంలో చిన్నదే. వైమానిక దాడుల నుంచి రక్షణతోపాటు అణుపరీక్షల గురించి బాహ్య ప్రపంచానికి తెలియకూడదన్న ఉద్దేశంతో కొండ దిగువన దుర్భేద్యంగా నిర్మించారు. ఫోర్డోను ఇజ్రాయెల్తోపాటు పశ్చిమ దేశాలు లక్ష్యంగా చేసుకోవడానికి కారణం ఇది పటిష్ట స్థితిలో ఉండడంతోపాటు ఇక్కడ పెద్ద సంఖ్యలో అత్యాధునిక సెంట్రీఫ్యూజ్లను బిగించే సామర్థ్యం కలిగి ఉండడం. ఫోర్డోలో సైతం 60 శాతం శుద్ధి చేసిన యురేనిజం నిల్వలున్నాయి. ఈ అణుకేంద్రంపై అమెరికా సైన్యం బి–2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ ద్వారా 30,000 పౌండ్ల బరువైన బంకర్ బస్టర్ (జీబీయూ–57) బాంబును ప్రయోగించినట్లు సమాచారం. ఈ దాడి వల్ల ఫోర్డోకు ఏ మేరకు నష్టం వాటిల్లిందన్నది ఇంకా తెలియరాలేదు. పర్వత ప్రాంతం భారీగా దెబ్బతినడంతోపాటు రంగు మారినట్లు ఉపగ్రహ చిత్రాలను బట్టి తెలుస్తోంది. అమెరికా దాడి చేయడం తథ్యమన్న ముందస్తు అంచనాతో ఫోర్డో నుంచి యురేనియం, సెంట్రీఫ్యూచ్లు, కీలక పరికరాలను ఇరాన్ అధికారులు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ప్రచారం సాగుతోంది. దీనిపై ఇరాన్ ఎలాంటి ప్రకటన చేయలేదు.2. నతాంజ్ న్యూక్లియర్ ఫెసిలిటీ ఇరాన్ రాజధాని టెహ్రాన్కు ఆగ్నేయ దిశలో 135 మైళ్ల దూరంలో నతాంజ్ అణుకేంద్రం ఉంది. ఇరాన్కు ఇదే అత్యంత ముఖ్యమైన యురేనియం శుద్ధి, నిల్వ కేంద్రం. అణు కార్యక్రమంలో నతాంజ్దే కీలక పాత్ర. అమెరికా దాడుల కంటే ముందు ఇక్కడ 60 శాతం శుద్ధి చేసిన యురేనియం నిల్వచేశారు. అణు బాంబు తయారు చేయాలంటే 90 శాతం శుద్ధి చేసిన యురేనియం అవసరం. అంటే అణు బాంబు తయారీకి ఇరాన్ చాలా సమీపంలోకి వచ్చిందనే చెప్పొచ్చు. అమెరికా దాడుల కంటే ముందే ఇజ్రాయెల్ సైన్యం నతాంజ్పై దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో భూఉపరితలంపై ఉన్న మౌలిక సదుపాయాలు చాలావరకు ధ్వంసమయ్యాయి. భూఅంతర్భాగంలో ఉన్న పటిష్ట స్థితిలో సదుపాయాలకు పెద్దగా నష్టం వాటిల్లలేదు. కానీ, అమెరికా దాడుల్లో నతాంజ్లోని సెంట్రీఫ్యూజ్లు, ఇతర పరికరాలు చాలావరకు నామారూపాల్లేకుండా పోయినట్లు తెలుస్తోంది. నతాంజ్పై గతంలోనూ పలుమార్లు దాడులు జరిగాయి. అవి సఫలం కాలేదు. నతాంజ్కు సమీపంలోని పికాక్స్ అనే పర్వతం కింద మరో భారీ అణుకేంద్రాన్ని నిర్మించడానికి ఇరాన్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లు గతంలో వార్తలొచ్చాయి.3. ఇస్ఫహాన్ న్యూక్లియర్ టెక్నాలజీ సెంటర్ టెహ్రాన్కు ఆగ్నేయ దిశలో 215 మైళ్ల దూరంలోని ఇస్ఫహాన్ న్యూక్లియర్ టెక్నాలజీ సెంటర్లో యురేనియం కన్వర్షన్ సదుపాయాలు, ల్యాబ్లు, చైనా తయారీ రియాక్టర్లు ఉన్నాయి. ఇక్కడ వేలాది మంది అణు శాస్త్రవేత్తలు పని చేస్తుంటారు. ఇటీవల ఇజ్రాయెల్ సైన్యం ఇస్ఫహాన్ అణుకేంద్రంపై దాడికి దిగడంతో కొన్ని భవనాలు దెబ్బతిన్నాయి. కానీ, అమెరికా దాడిలో భారీ నష్టమే వాటిల్లినట్లు తెలుస్తోంది. అమెరికా దాడుల్లో ఇస్ఫహాన్లో రేడియేషన్ లీకేజీ అయినట్లు ఎలాంటి సమాచారం రాలేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ) ప్రకటించింది.ఇరాన్లోని మరికొన్ని అణు కేంద్రాలు (ఇక్కడ దాడులు జరగలేదు) బుషెహర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇరాన్లో ఇదొక్కటే కమర్షియల్ అటామిక్ రియాక్టర్. పర్షియన్ గల్ఫ్లో ఏర్పాటు చేశారు. రష్యా సరఫరా చేస్తున్న యురేనియంతో ఇక్కడ అణ్వస్త్ర తయారీ పరిశోధనలు జరుగుతుంటాయి.అరాక్ హెవీ వాటర్ రియాక్టర్పెవన్స్–గ్రేడ్ ప్లుటోనియం ఉత్పత్తి చేయడానికి అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ నెలకొల్పారు. 2015లో ఈ కేంద్రాన్ని పాక్షికంగా ఆధునీకరించారు.టెహ్రాన్ రీసెర్చ్ రియాక్టర్‘శాంతి కోసం అణుశక్తి’ అనే కార్యక్రమంలో భాగంగా 1967లో అమెరికా సరఫరా చేసిన టెక్నాలజీ, పరికరాలతో టెహ్రాన్ రీసెర్చ్ రియాక్టర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ తక్కువ శుద్ధి చేసిన యురేనియంతో అణు పరిశోధనలు జరుగుతున్నాయి.ఇవి కూడా...→ కరాజ్ (అణు పరిశోధన కేంద్రం) → దార్కోవిన్(నిర్మాణంలో ఉన్న అణుకేంద్రం) → అనారక్(అణు పరిశోధన కేంద్రం) → అర్దాకన్(అణు పరిశోధన కేంద్రం) → సఘాంద్(యురేనియం మైన్) – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇరుకున పడ్డ ఇరాన్!
అగ్రరాజ్యం అమెరికా సైతం తమపై కత్తికట్టడంతో ఇప్పుడు ఇరాన్ తాడోపేడో తేల్చుకోవాల్సిన తరుణమొచ్చింది. అయితే ఈ కష్టకాలంలో కాడెత్తేయకుండా కడదాకా తమకు తోడుగా నిలిచే నిజమైన నేస్తలెందరో ఇప్పుడు ఇరాన్ లెక్కబెట్టుకుంటోంది. యుద్ధంలో పైచేయి సాధించేందుకు పనికొచ్చే ప్రత్యామ్నాయాలు ఎన్ని ఉన్నాయో బేరీజువేసుకుంటోంది. ఇజ్రాయెల్, అమెరికాలకు దీటుగా చైనా, రష్యా ఏమేరకు తనకు సైనిక సాయం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇస్తాయోనని ఇరాన్ సమీక్ష జరుపుతోంది. హోర్ముజ్ జలసంధి మీదుగా చమురు నౌకల రాకపోకలను అడ్డుకుంటే తనకు ఒనగూరే లాభమెంతో లెక్కేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇరాన్ ముందు ఆప్షన్లు ఎన్ని అనే అంశం ప్రధానంగా అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. హోర్ముజ్ జలసంధిని ఆపేస్తే?సముద్రం ద్వారా రావాణా అయ్యే చమురులో దాదాపు 25 శాతం ఈ హోర్ముజ్ జలసంధి ద్వారానే సరఫరా అవుతోంది. కేవలం 33 కిలోమీటర్ల వెడల్పుండే ఈ జలమార్గం గుండా చమురు, సహజవాయువు రవాణా నౌకలను అడ్డుకుంటే ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగే ప్రమాదం పొంచి ఉంది. పెట్రోల్, డీజిల్ ధరల మంటలు పైకి ఎగిస్తే ప్రపంచార్థికం దెబ్బతినడం ఖాయం. ఈ భయాలను బూచిగా చూపి తమపై దాడులను ఆపాలని అమెరికా, ఇజ్రాయెల్ కూటమి దేశాలను ఇరాన్ హెచ్చరించే వీలుంది. వేగంగా దూసుకెళ్లే బోట్ల ద్వారా వేలాదిగా మెరైన్ మైన్(సముద్ర మందుపాతర)లను జలసంధి మార్గంలో ఇరాన్ మొహరించిందనే వార్తలు వెలువడ్డాయి. వీటిలో నిజమెంతో ఎవరికీ తెలీదు. అదే నిజమైతే నౌకలు అటు వెళ్లేందుకు వణుకుతాయి. పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై ముప్పేట దాడి?అమెరికా భూభాగం నుంచి నేరుగా దాడులు చేయడం కష్టం. పశ్చిమాసియాలో దశాబ్దాలుగా తిష్టవేసి ఏర్పాటుచేసుకున్న సమీప స్థావరాల నుంచే అమెరికా దాడిచేయగలదు. కువైట్, బహ్రెయిన్, ఖతార్, యుఏఈలోని అమెరికా వైమానిక స్థావరాలపై ఇరాన్ మెరుపుదాడులు చేసి ప్రతిదాడులను నిలువరించవచ్చు.ఈ భయంతోనే అమెరికా ఇప్పటికే ఒకటి, రెండు స్థావరాల నుంచి యుద్ధవిమానాలను వేరేచోటుకు తరలించినట్లు ప్రైవేట్ శాటిలైట్ తాజా చిత్రాలతో స్పష్టమైంది. అమెరికా గడ్డపై తమ మద్దతుదారుల ద్వారా పేలుళ్లు జరిపి మారణహోమం సృష్టించే ఛాన్సుంది. అందుకే ఈ విషయంలో అమెరికా ఇప్పటికే అప్రమత్తమై పలు ప్రధాన ప్రాంతాల్లో నిఘాను కట్టుదిట్టంచేసిందని వార్తలొచ్చాయి.పెంచిపోషించిన సాయుధ సంస్థల సాయంతో..గాజాలో హమాస్, లెబనాన్లో హెజ్బొల్లా, యెమెన్లో హౌతీ రెబల్స్, ఇరాక్లో మిలీషియా సంస్థలకు ఆర్థిక, ఆయుధసాయం చేసి ఇరాన్ తన పరోక్ష సైన్యంగా తీర్చిదిద్దుకుంది. వీటిని ఒకరంగా ప్రతిఘటన దళంగా పేర్కొంటారు. అయితే 20 నెలలుగా ఇజ్రాయెల్తో పోరాడి హమాస్ తన అగ్రనాయకత్వాన్ని కోల్పోయి ఒకరకంగా అలసిపోయింది. హెజ్బొల్లా ఉగ్రసంస్థ పోరాడే వీలుంది. ఇరాన్తో కలిసి నడుస్తామని మూడ్రోజుల క్రితమే హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. ఎర్రసముద్రంలో విదేశీ చమురు నౌకలు అడ్డుకుంటామని చెప్పారు. ఇరాక్లోని మిలీషియా సంస్థలు ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే మిలీషియాలు, హౌతీలకు డ్రోన్లు, చిన్నపాటి క్షిపణులను ప్రయోగించడంలో నైపుణ్యముంది. వీళ్లు ఇరాన్కు తోడు నిలిచే అవకాశముంది.చైనా, రష్యాల పరోక్ష సాయంచైనా ఇప్పటికే కొన్ని చమురునౌకల ముసుగులో కొన్ని ఆయుధాలను ఇరాన్కు తరలించి సాయపడినట్లు తెలుస్తోంది. యుద్దం తీవ్రతరమైతే తమ చిరకాల మిత్రుడు ఇరాన్కు సాయంగా రష్యా, చైనాలు ముందడుగు వేసే వీలుంది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులను ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్ తప్పుబట్టారు. ఈ విషయమై ఇటీవలే చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో పుతిన్ ఫోన్లో మాట్లాడారు.అణుకార్యక్రమం ఆగకపోవచ్చా?యురేనియం శుద్ది కర్మాగారాలపై ఇజ్రాయెల్, అమెరికా క్షిపణి, బాంబు దాడులు ఇరాన్ను అణ్వాయుధం తయారుచేయకుండా మరికొన్ని వారాలు, నెలలు అడ్డుకో గలవుగానీ శాశ్వతంగా ఆపలేవని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. న్యూక్లియర్ సెంటర్లలోకాకుండా వేరేచోట్ల యురేనియంను నిల్వచేస్తే అమెరికా, ఇజ్రాయెల్ల పరిస్థితి ఏంటనే అంశం తెరమీదకొచ్చింది. తన దేశ ఉనికి, అస్థిత్వం ప్రశ్నార్థకంగా మారే పరిస్థితే వస్తే ఇరాన్ ఎంతకైనా తెగిస్తుందనే విశ్లేషణల నడుమ ఈ సమరం ఏ దిశలో పయనిస్తుందో ఇప్పుడే ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
25నిమిషాల్లో ‘ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్’
వాషింగ్టన్: ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా చేపట్టిన ‘ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్’ విజయవంతమైందని అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డేనియల్ కెయినీ చెప్పారు. ఈ మొత్తం ఆపరేషన్ కేవలం 25 నిమిషాల్లోనే ముగిసిందని తెలిపారు. ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ సైన్యానికి ఇరాన్లో గగన తల రక్షణ వ్యవస్థ నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురు కాలేదని, ఆపరేషన్ పూర్తయిన వెంటనే తమ విమానాలు క్షేమంగా తిరిగివచ్చా యని స్పష్టం చేశారు. ఆపరేషన్ మిడ్నైట్ హ్యామ ర్లో ఏడు స్టెల్త్ బి–2 బాంబర్లు పాల్గొన్నాయని తెలిపా రు. ఈ బాంబర్లు 14 భారీ ఆర్డినెన్స్ పెనెట్రేటర్ బాంబులను(బరువు 13,600 కిలోలు) ఫోర్డో, నతాంజ్ అణు కేంద్రాలపై జారవిడిచాయని పేర్కొన్నారు. అలాగే టోమాహాక్ క్షిపణులు ఇస్ఫహాన్ అణు కేంద్రాన్ని ధ్వంసం చేశాయని వివరించారు. ఏడు బి–2 స్పిరిట్ బాంబర్లు ‘‘2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత బి–2 స్టెల్త్ బాంబర్లు ఈ స్థాయిలో భారీ ఆపరేషన్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. మిస్సోరీ నుచి బాంబర్లు బయలుదేరాయి. అమె రికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 6.40 గంటలకు మూడు అణు కేంద్రాలపై దాడులు మొదల య్యాయి. 7.05 గంటలకు మా విమానాలు ఇరాన్ గగనతలం నుంచి బయటకు వచ్చేశాయి. 14 బంకర్– బస్టర్ బాంబులు, 24కుపైగా టోమాహాక్ క్షిపణులు ప్రయో గించాం. పశ్చిమాసి యాలో ఇటీవల ఉద్రిక్తతలు ప్రారంభమైన అనంతరం ఇరాన్పై మా అతిపెద్ద దాడి ఇదే. ఏడు బి–2 స్పిరిట్ బాంబర్లతో విరుచుకుపడ్డాం. ఒక్కోదాంట్లో ఇద్దరు సిబ్బంది ఉన్నారు. నిశ్శబ్దంగా వెళ్లి పని పూర్తి చేసుకొని వచ్చారు. కొద్దిమందికే తెలుసు ఇరాన్పై ఆపరేషన్ గురించి అమెరికా ప్రభుత్వ ముఖ్యుల్లో, సైనిక వ్యూహకర్తల్లో చాలా కొద్దిమందికే తెలుసు. అమెరికా జలాంతర్గామి నుంచి ఇస్ఫహాన్ అణు కేంద్రంపై 24కుపైగా టోమాహాక్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైళ్లు ప్రయోగించాం. ఉపరితలంపైనున్న మౌ లిక సదుపాయాలను నేలమట్టం చేశాం. సాయంత్రం 6.40 గంటలకు బి–2 బాంబర్లు రెండు భారీ బంకర్–బస్టర్ బాంబులను ఫోర్డో న్యూక్లియర్ సైట్పై జారవిడిచాయి. మిగిలిన బాంబర్లు వాటి లక్ష్యాలను విజయవంతంగా ఛేదించాయి. చివరి దాడి ఇస్పహాన్పై టోమాహాక్ క్షిపణితో జరిగింది. రాత్రి 7.05 గంటల కల్లా ఆపరేషన్ ముగిసింది. ఇరాన్కు చెందిన సర్ఫేస్–టు–ఎయిర్ క్షిపణి వ్యవస్థ మా యుద్ధ విమానాల రాకను గుర్తించలేదు’’ అని డాన్ కెయినీ వివరించారు.ఆపరేషన్ విజయవంతం: పీట్ హెగ్సెత్ ఇరాన్పై ‘ఆపరేషన్ మిడ్నైట్ హామర్’ పూర్తిస్థాయిలో విజయవంతమైందని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ స్పష్టంచేశారు. మూడు ఇరాన్ అణు కేంద్రాలు నాశనమయ్యాయని అన్నారు. ఇరాన్ అణ్వయుధాలు దక్కించుకోవడానికి వీల్లేదని డొనాల్డ్ ట్రంప్ మొదటనుంచీ చెబుతూనే ఉన్నారని గుర్తుచేశారు. ఇరాన్తో యుద్ధాన్ని తాము కోరుకోవడం లేదన్నారు. ఇరాన్ ప్రభుత్వం చర్చలకు ముందుకు వస్తుందని భావిస్తున్నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ చెప్పారు. చర్చలకు ఇరాన్ను ఒప్పించాలంటూ డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లో ఇప్పటివరకు 430 మంది మరణించారని, 3,500 మంది గాయపడ్డారని ఇరాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని నౌర్న్యూస్ వెల్లడించింది. ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్లో 24 మంది మృతిచెందారని, 1,272 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. ఏమిటీ టోమాహాక్ క్షిపణులు?అమెరికా నావికా దళంలో కీలకమైనవి బీజీఎం–109 టోమాహాక్ ల్యాండ్ అటాక్ లాంగ్రేంజ్ మిస్సైళ్లు. యుద్ధనౌకలు, జలాంతర్గాముల నుంచి వీటిని అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో భూఉపరితలంపైనున్న లక్ష్యాలపై ప్రయోగించవచ్చు. 1970వ దశకంలో తొలిసారిగా జనరల్ డైనమిక్స్ కంపెనీ తయారుచేసింది. 12కుపై వేరి యంట్లు ఉన్నాయి. టోమాహాక్ క్షిపణి బరువు 1,300 కిలోలు. బూస్టర్తో కలిపి రూ.1,600 కిలోలు. పొడవు 5.56 మీటర్లు గంటకు 920 కిలోమీటర్లకుపైగా వేగంతో ప్రయాణించి 2,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు.మాట వినకపోతే మళ్లీ దాడులు: ట్రంప్వాషింగ్టన్: ఇరాన్లో కీలకమైన అణు కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేశామని, శిథిలా లుగా మార్చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మూడు అణు కేంద్రాలపై అమెరికా సైన్యం దాడులు చేసిన అనంతరం శనివారం రాత్రి ట్రంప్ వైస్హౌస్లో మాట్లాడారు. అమెరికాపై ప్రతీకార దాడులకు దిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్ను హెచ్చరించారు. శాంతి కావాలో, యుద్ధం కావాలో తేల్చుకోవాలని ఆ దేశానికి సూచించారు. భీకర స్థాయి దాడులతో ఇరాన్కు గట్టిగా బుద్ధి చెప్పే శక్తి అమెరికాకు మాత్రమే ఉందన్నారు. పశ్చిమాసియాలో ఇరాన్ ఒక దుష్టశక్తిగా మారిందని, ఇతర దేశాలకు ప్రమాదకరంగా పరిణమించిందని మండిపడ్డారు. మాట వినకపోతే ఇకపై జరగబోయే దాడులు మరింత భయాన కంగా ఉంటాయని ఇరాన్కు తేల్చిచెప్పారు.ట్రంప్ నిర్ణయం అద్భుతం: నెతన్యాహూజెరూసలేం: ఇరాన్ అణు కేంద్రాలపై అమె రికా దాడి చేయడం పట్ల ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెత న్యాహు హర్షం వ్యక్తంచేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. శాంతి కోసమే ఇరాన్పై బలప్రయోగం చేపట్టాల్సి వచ్చిందన్నారు. ఈ దాడులతో పశ్చిమాసియాలో రాబోయే రోజుల్లో శాంతి, సౌభాగ్యం, స్థిరత్వం, భద్రత చేకూరుతాయని స్పష్టంచేశారు. నెతన్యాహు ఆదివారం మీడియాతో మాట్లాడారు. చరిత్రను మలుపు తిప్పే నిర్ణయం తీసుకుందని అమెరికాను కొనియాడారు. ప్రపంచంలో ఏ దేశం కూడా చేయలేని సాహసోపేత కార్యాన్ని అమెరికా చేసి చూపించిందని పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలతో ప్రాణాంతక శక్తిగా మారిన ఇరాన్కు బుద్ధి చెప్పిన గొప్ప నాయకుడిగా డొనాల్డ్ ట్రంప్ను చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ఉద్ఘాటించారు.బాధ్యతారాహిత్యంఅమెరికాపై రష్యా ధ్వజంమాస్కో/బీజింగ్: ఇరాన్లోని మూడు అణు స్థావరాలపై భారీ బాంబులతో అమెరికా జరిపిన దాడిని రష్యా తీవ్రంగా ఖండించింది. ఇప్పటికే అనేక సంక్షోభాలతో అట్టుకుతున్న పశ్చిమాసియాను మరింత ప్రమాదంలోకి నెట్టడమేనని పేర్కొంది. అమెరికా తన బాధ్యతారాహిత్యంతో అంతర్జాతీయ చట్టాలు, ఐరాస పీఠికను, తీర్మానాలను ఉల్లంఘించిందని మండిపడింది. ‘ఒక సార్వభౌమ దేశంపై క్షిపణులు, బాంబులతో దాడులు చేయడం బాధ్యతారహిత చర్య. దీనిని సమర్థించుకునేందుకు ఎన్ని వాదనలు వినిపించినా సరే, ఇది అంతర్జాతీయ చట్టాలకు ఐరాస చార్టర్, భద్రతా మండలి తీర్మానాలను తీవ్రంగా ఉల్లంఘించడమే. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగిన దేశం ఈ దాడులు చేయడం ఆందోళనకరం’అని అమెరికా పేరును ప్రస్తావించకుండా పేర్కొంది. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరి కా బాంబు దాడులను చైనా సైతం తీవ్రంగా ఖండించింది. ఐరాస చార్టర్ను ఉల్లంఘించిన అమెరికా పశ్చిమాసియాలో ఉద్రిక్తత లను మరింత రాజేసిందని పేర్కొంది. -
బాహుబలి బాంబు
ఎప్పుడెప్పుడా అని ఇజ్రాయెల్ ఎంతో ఆశగా ఎదురుచూసినా బంకర్ బస్టర్ బాంబులను అమెరికా మోసుకొచ్చింది. అనుకున్న లక్ష్యాలపై అమాంతం పడేసింది. పర్వతప్రాంతాన్ని పిండిముద్దలా బద్దలుకొట్టింది. అత్యంత పటిష్టమైన కఠినశిలలను సైతం తునాతునకలు చేసే వేల కేజీల బరువైన భారీ బాంబులతో ఇరాన్ అణుకేంద్రాలపై భీకర దాడులుచేసిన అమెరికా బీ–2ఏ స్పిరిట్ స్టెల్త్ బాంబర్ విమానాల గురించి, అవి ప్రయోగించిన భారీ బంకర్ బస్టర్ బాంబుల గురించే ఇప్పుడంతా మాట్లాడుకుంటున్నారు. భూతలం మీది లక్ష్యాలను తునాతునకలుచేసే బాంబులను ప్రయోగించడం సర్వసాధారణం. కానీ ఇలా భూగర్భంలోని లక్ష్యాలను సైతం అలవోకగా చేధించి ఛిన్నాభిన్నంచేయగల శక్తివంతమైన పేలుడు ఆయుధాన్ని అమెరికా ఇటీవలికాలంలో ఎప్పుడూ ప్రయోగించలేదు. మిత్రదేశానికి సాయంగా ఇరాన్ యుద్ధంలో అడుగుపెట్టిన తొలిరోజే భారీబాంబులతో యుద్ధాన్ని అమెరికా కొత్త మలుపు తిప్పింది. బాంబు బరువు 13,600 కిలోలుఇరాన్లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ యురేనియం శుద్ధికర్మాగారాలపై ప్రయోగించిన జీబీయూ–57 ఏ/బీ మ్యాసివ్ ఆర్డ్నెన్స్ పెనిట్రేటర్(ఎంఓపీ) గైడెడ్ బాంబు బరువు ఏకంగా 13,600 కిలోలు. ఒక్కో బాంబు ఖరీదు రూ.170 కోట్లు. భూమిలోపల మరింత లోతుల్లో నిర్మించిన బంకర్లు, సొరంగాలను భూస్థాపితం చేయడమే లక్ష్యంగా అమెరికా వైమానికదళం కోసం ఈ బాంబులను రూపొందించారు. ఒక గది పరిమాణంలో పిండిముద్దపై ఎంతపెద్ద రాయి పడేస్తే అంతలోతుకు అది వెళ్తుందికదా. అలాగే ఎంత భారీ బరువైన బాంబును పడేస్తే తొలుత అది అంతలోతుకు వెళ్తుంది. తర్వాత అది పేలుతుంది. అత్యంత లోతుల్లోకి చేరేందుకు అనువుగా ఈ బాంబును అత్యంత ఎత్తులోంచి జారవిడుస్తారు. అడ్డంగా పడిపోకుండా నిటారుగా, బాణంలాగా భూమికి గుచ్చుకునేలా బాంబు కొనకు జీపీఎస్ ట్రాకర్ అమర్చుతారు. మెరుపువేగంతో దూసుకొచ్చి..ఈ బాంబు పొడవు 20 అడుగులు. మొత్తం బాంబు బరువులో 80 శాతం బాడీ బరువే ఉంటుంది. మొత్తం వార్హెడ్లో కేవలం 20 శాతం మాత్రమే పేలుడుపదార్థం ఉంటుంది. తొలుత ఎక్కువ లోతుల్లోకి వెళ్లాలనే ఉద్దేశ్యంతో ఇలా దీనిని డిజైన్చేశారు. నేలను తాకినప్పుడు బయటిపొర ధ్వంసంకాకుండా ఉండేందుకు అత్యంత పటిష్టమైన ఫెర్రో–కోబాల్ట్ లోహమిశ్రమ కవచాన్ని అమర్చుతారు. చాలా లోతుకు వెళ్లాలంటే మరింత వేగంగా కిందకు పడాలి. అందుకోసం ఇది సూపర్సోనిక్ వేగంతో కిందకు దూసుకొస్తుంది. బరువు, వేగం, దిశ ఇలా అన్ని కలిసి దీనిని అత్యంత శక్తివంతమైన ఆయుధంగా మార్చేశాయి. . ఆగకుండా 61 మీటర్లు చొచ్చుకెళ్లి..అత్యంత కఠినమైన శిలాప్రాంతంపై పడినా ఇది ఖచ్చితంగా 61 మీటర్ల లోతు అంటే 200 అడుగుల లోతు వరకు వెళ్లగలదు. అక్కడ ఇది పేలి ఆ ప్రాంతం మొత్తాన్ని నామరూపాల్లేకుండా తునాతు నకలు చేస్తుంది. అయితే ఆ లోతులో అణుకేంద్రంలేకుంటే ఎలా అనే సందేహం రావొచ్చు. మొదటి బాంబు పేలిన చోటే అత్యంత ఖచ్చితంగా మరో బాంబును పడేస్తారు. అది పేలి మరింత లోతు వరకు భూమిని పెకలించివేసి పెను విస్ఫోటనం సృష్టిస్తుంది. అలా అవసరమైనన్ని బాంబులను ఒకేచోట ఒకదాని వెంట మరోటి పడేసి లక్ష్యాన్ని ఎలాగైనా బద్దలుకొడతారు. కొత్తింటి కోసం బోరు వేసినప్పుడు ఉక్కు కేసింగ్లు ఎలాగైతే ఒకదాని వెంట మరోటి జతచేస్తూ రంధ్రం లోతును పెంచుకుంటూ పోతారో యుద్దంవేళ ఈ బాంబులతో అలా భూగర్భ నిర్మాణాలను నాశనంచేసే దాకా ఒకేచోట బాంబులను ప్రయోగిస్తారు. ఆదివారం అమెరికా జీబీయూ–57 ఏ/బీ మ్యాసివ్ ఆర్డ్నెన్స్ పెనిట్రేటర్(ఎంఓపీ) బాంబు ఇదే పనిచేసింది. బాంబుకు తగ్గ విమానంఇంతటి బరువైన బాంబులను అలవోకగా మోస్తూ అత్యంత ఎత్తుల్లో ప్రయాణించగల సామర్థ్యమున్న బాంబర్విమానానికి మాత్రమే ఇంతటి సత్తా ఉంటుంది. అమెరికా అమ్ము ల పొది లోని బీ–2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ విమా నం మాత్ర మే ఈ పనిచేయగలదు. అందుకే ట్రంప్సేన వీటిని కదనరంగంలో మొహరించి ఇరాన్ అణుక్షేత్రాలపై మెరుపుదాడులు చేయించింది. బాంబులను అమర్చకముందు ఈ స్టెల్త్ విమానం బరువు ఏకంగా 71,000 కేజీలు. ఇది ఒకేసారి రెండు ఎంఓపీ బాంబులను మోసుకెళ్లగలదు. ఒక్కో విమానం ఖరీదు ఏకంగా రూ.18,000 కోట్లు. ఈ విమానాన్ని నార్త్రోప్ గ్రూమ్మన్ అనే ఆయుధ తయారీసంస్థ తయారుచేసి అమెరికా ఆర్మీకి విక్రయించింది. ఈ విమానం ఎక్కడా ఆగకుండా ఏకధాటిగా 11,000 కిలోమీటర్లు ప్రయాణించగలదు. మార్గమధ్యంలో ఇంధనాన్ని గాల్లోనే నింపుకుంటే మరో 7,500 కి.మీ.లు ప్రయాణించి బాంబులేస్తుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వాట్సాప్..ఇక యాడ్స్ అడ్డా!
టెక్నాలజీ దిగ్గజం మెటా.. ‘వాట్సాప్ యాడ్స్’పె దృష్టి సారించింది. ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే కమ్యూనికేషన్ యాప్లలో రారాజైన వాట్సాప్లో ప్రకటనలను ప్రసారం చేయనున్నట్టు ఈ అమెరికన్ దిగ్గజం ప్రకటించింది. ఫేస్బుక్, ఇన్ స్టాగ్రామ్ ప్రకటనల ఆదాయంతో సక్సెస్ చూసిన మెటా.. తాజాగా వాట్సాప్ యాడ్స్ను ‘తెర’పైకి తెచ్చింది. వాట్సాప్ను ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది వినియోగిస్తున్నారు. వీరిలో ఏకంగా 85 కోట్లతో భారత్ అగ్ర స్థానంలో ఉంది.ప్రపంచవ్యాప్తంగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా జనంతో వాట్సాప్ మమేకమైపోయింది. మెసేజ్, ఫొటో, వీడియో.. ఇలా ఏది పంపాలన్న వాట్సాప్ మాత్రమే వాడేంతగా మనం అలవాటు పడిపోయాం. అందుకేనేమో.. చాలా సంవత్సరాలుగా ప్రకటనలు లేకుండానే కొనసాగించిన మెటా కంపెనీ ఎట్టకేలకు వాట్సాప్ అప్డేట్స్ ట్యాబ్లో ప్రకటనలు ప్రసారం చేయాలని నిర్ణయించింది.యూజర్లు, వారి కాంటాక్ట్స్ పోస్ట్ చేసిన ఫొటోలు, వీడియోలు, టెక్స్్ట సందేశాలతోపాటు స్టేటస్ ఫీచర్లో వాట్సాప్ స్పాన్సర్ చేసే ప్రకటనలూ ప్రత్యక్షం అవుతాయి. బ్రాండ్స్ తమ చానెళ్లను ప్రచారంలోకి తేవడానికి కావాల్సిన రుసుము చెల్లించే సౌకర్యాన్ని వాట్సాప్ పరిచయం చేయనుంది. తద్వారా ఫాలోవర్లకు టెక్స్ట్ వీడియోల రూపంలో కంటెంట్ను పంచుకోవచ్చు. కంటెంట్ను ఆస్వాదించేందుకు తమకు నచ్చిన చానెళ్లకు నెలవారీ చందా చెల్లించేందుకు సైతం ఫాలోవర్లకు అవకాశం ఉంటుంది.కళ్లుచెదిరే వ్యాపారం..: వాట్సాప్ నెలవారీ యాక్టివ్ వినియోగదార్ల సంఖ్య 200 కోట్ల పైచిలుకే. 85.4 కోట్ల యూజర్లతో భారత్ ప్రపంచంలో తొలి స్థానంతో దూసుకుపోతోంది. తరవాతి స్థానాల్లో బ్రెజిల్ (14.8 కోట్లు), ఇండోనేషియా (11.2 కోట్లు), యూఎస్ (9.8 కోట్లు), ఫిలిప్పీన్స్ (8.8 కోట్లు) ఉన్నాయి. ప్రస్తుతం వాట్సాప్ 60 భాషల్లో 180 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. వాట్సాప్ ’అప్డేట్స్’ ట్యాబ్ను రోజుకు 150 కోట్ల మంది వీక్షిస్తున్నారు. ఈ అంశమే వాట్సాప్ మాతృ సంస్థ మెటాకు కలిసి రానుంది. ఇప్పటికే ఎఫ్బీ, ఇన్స్టాగ్రామ్ వేదికగా కళ్లు చెదిరే వ్యాపారం చేస్తోంది మెటా. ఈ జాబితాలో ఇప్పుడు వాట్సాప్ చేరుతోంది.అంచనాలకు అందనంత....: ఈ టెక్ దిగ్గజాల ప్రకటనల ఆదాయం అంచనాలకు అందనంత ఉంది. గూగుల్ 2024లో రూ.22,75,560 కోట్ల ఆదాయం పొందింది. 2025 జనవరి–మార్చిలో మెటా ప్రకటనల ఆదాయం రూ.3,55,180 కోట్లు. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 16.14 శాతం అధికం. ప్రతిరోజు మెటా యాప్స్ను ప్రపంచవ్యాప్తంగా 343 కోట్ల మంది వాడుతున్నారు. ఏడాదిలో ఈ సంఖ్య 6 శాతం పెరిగింది. ఇక భారత్లో ఈ రెండు దిగ్గజాలు 2023–24లో ప్రకటనల రూపంలో సుమారు రూ.50,000 కోట్లు అందుకున్నాయంటే ఆశ్చర్యం వేయక మానదు.ఈ రంగాల్లో ప్రయోజనం..: డైరెక్ట్ టు కంజ్యూమర్ (డీ2సీ), ఫాస్ట్ మూవింగ్ కంజ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ), బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా, ఎడ్యుకేషన్ టెక్నాలజీ (ఎడ్టెక్), ఆరోగ్య సంరక్షణ, క్విక్ కామర్స్ వంటి రంగాలలోని బ్రాండ్స్ వాట్సాప్ స్టేటస్ ప్రకటనల నుండి ప్రయోజనం పొందుతాయని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్, రీల్స్, ఫేస్బుక్ షార్ట్ వీడియోలతో పోలిస్తే వాట్సాప్ స్టేటస్లోని ప్రకటనలు బ్రాండ్స్ చేసే పెట్టుబడిపై తక్షణ రాబడిని ఇవ్వకపోవచ్చని కూడా చెబుతున్నారు.సమ్మతితో ప్రకటనలుప్రస్తుతానికి ప్రకటనలు కేవలం అప్డేట్స్ ట్యాబ్లో మాత్రమే కనిపిస్తాయి. వ్యక్తిగత చాట్స్ ఎప్పటిలానే యాడ్స్ ఫ్రీగానే కొనసాగుతాయని వాట్సాప్ వెల్లడించింది. అలాగే ప్రకటనకర్తలకు వ్యక్తుల ఫోన్ నంబర్లు షేర్ చేయడం లేదా అమ్మడం చేయబోమని కూడా పేర్కొంది. వాట్సాప్ అనేది స్నేహితులు, కుటుంబ సభ్యులతో చాట్ చేయడానికి ఉపయోగించే ప్రైవేట్ డిజిటల్ స్థలం. ఇక్కడ ప్రకటనలు ఇచ్చేటప్పుడు బ్రాండ్స్ జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.వాట్సాప్ పట్ల యూజర్లలో నమ్మకం ఉంది. యూజర్లు కుటుంబంతో, సన్నిహితులతో మాట్లాడతారు. సున్నిత లావాదేవీలను నిర్వహిస్తారు. ప్రకటనలు ఆ పవిత్రతకు భంగం కలిగిస్తే మెటాకు ఎదురుదెబ్బ తగిలే అవకాశం లేకపోలేదు. వినియోగదారుల సమ్మతితో ప్రకటనలు ఇవ్వాలి. యూజర్ల ప్రైవసీకి భంగం కలగకూడదు.అన్నింటా భారతీయులేగూగుల్లో ఏదైనా వెతుకుతున్నప్పుడో.. ఎఫ్బీ, యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్లో విహరిస్తున్నప్పుడో ప్రకటనలు వెల్లువెత్తుతుంటాయి. నిముషాల వ్యవధిలోనే కొత్త కొత్త యాడ్స్ ప్రత్యక్షమవుతుంటాయి. ఇందుకు కారణం.. మనతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్స్ను కోట్లాది మంది వాడుతుండడమే. ఈ స్థాయిలో యూజర్లు ఉన్నారు కాబట్టే బ్రాండ్ల ప్రచారానికి ఈ యాప్స్ అడ్డాగా మారాయి. వీటికి ఉన్న యూజర్ల సంఖ్య చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఎఫ్బీ, యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ వాడకంలో మన భారతీయులే ముందంజలో ఉన్నారు.గూగుల్: రోజుకు సగటున 850 కోట్ల వరకు సెర్చెస్ నమోదవుతున్నాయి. 100 కోట్ల మంది రోజువారీ యాక్టివ్ యూజర్లున్నారు. భారత్ నుంచి నెలకు 1,200 కోట్ల విజిట్స్ నమోదవుతున్నట్టు సమాచారం. యూఎస్ తర్వాత రెండో స్థానంలో భారత్ నిలిచింది.ఫేస్బుక్: ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైచిలుకు నెలవారీ యాక్టివ్ వినియోగదారులు ఉన్నారు. ప్రపంచంలో అత్యధికంగా వాడుతున్న సామాజిక మాధ్యమం ఇదే. ప్రపంచ జనాభాలో దాదాపు 37 శాతం మంది ఫేస్బుక్ వాడుతున్నారు. రోజు ఎఫ్బీ తెరుస్తున్నవారు 211 కోట్ల మంది. యూజర్లలో ఎక్కువ మంది 25–34 ఏళ్ల వయస్కులు. ఇక పురుషుల సంఖ్య 56.7 శాతం, స్త్రీలు 43.3 శాతం. 37 కోట్ల యూజర్లతో భారత్ అగ్ర స్థానంలో నిలిచింది. యూఎస్ 19.3 కోట్లు, ఇండోనేషియా 11.7 కోట్లు, బ్రెజిల్ 11 కోట్లు, మెక్సికో 9 కోట్లు, ఫిలిప్పీన్స్ 8.7 కోట్లు, వియత్నాం 7.4 కోట్లు, బంగ్లాదేశ్ 5.5 కోట్లతో తర్వాతి వరుసలో ఉన్నాయి.యూట్యూబ్: యాక్టివ్ యూజర్లు నెలకు 253 కోట్లకు పైమాటే. 46.7 కోట్ల మంది యూజర్లతో మన దేశం అగ్రస్థానాన్ని ఆక్రమించింది. యూఎస్లో 23.8 కోట్లు, బ్రెజిల్లో 14.4 కోట్ల మంది వాడుతున్నారు. 80 భాషల్లో 100కుపైగా దేశాల్లో అందుబాటులో ఉంది. వినియోగదార్లలో పురుషులు 54 శాతం, స్త్రీలు 46 శాతం ఉన్నారు.ఇన్స్టాగ్రామ్: 200 కోట్లకుపైగా నెలవారీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. 41.4 కోట్లతో భారత్ మొదటి స్థానంలో ఉంది. యూఎస్ 17 కోట్లు, బ్రెజిల్ 14 కోట్లతో ఆ తర్వాతి స్థానాల్లో పోటీపడుతున్నాయి. యూజర్లలో అత్యధికులు 25–34 ఏళ్ల వయసు వారే. -
ఆ విమానాలు నిలిపివేయడమే మంచిది
సాక్షి, హైదరాబాద్: ఎయిర్ ఇండియా బోయింగ్ 787–8 రకం విమానాల్లో సమస్యలు పరిష్కారం అయ్యేవరకు వాటి సర్వీసులను నిలిపివేయడమే మంచిదని విమాన ప్రయాణాలు సాగించేవారిలో 56 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఎయిర్ ఇండియా బోయింగ్ 787–8 రకం విమానం ఈ నెల 12న అహ్మదాబాద్లో కూలిపోవటంతో 270 దుర్మరణం చెందారు. ఈ ఘటన తర్వాత విమాన ప్రయాణికులు తమ ప్రయాణానికి సంబంధించి ఏయే అంశాలపై ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారన్నది తెలుసుకునేందుకు లోకల్ సర్కిల్స్ సంస్థ దేశవ్యాప్తంగా 40 వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది.ఆ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో ప్రధానంగా తాము ప్రయాణించబోయేది ఏ రకం విమానం అన్నదానికి ప్రయాణికులు ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిసింది. 41 శాతం మంది తాము ఏ రకమైన విమానంలో ప్రయాణించబోతున్నాము.. అది ఏ కంపెనీది అన్నది కూడా చూస్తున్నారు. సర్వేలోని కొన్ని ప్రశ్నలకు వచ్చిన సమాధానాలు.. -
జంట భూకంపాలా? అణుపరీక్షలా?
ఇజ్రాయెల్ విశ్రాంతి లేకుండా విరుచుకుపడుతుంటే ఇరాన్ ఓవైపు ప్రతిదాడి చేస్తూనే మరోవైపు అణుపరీక్షలు జరిపిందన్న వార్తలు ఒక్కసారిగా సంచలనం సృష్టించాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంత? అనే ప్రశ్న వెంటనే తలెత్తింది. ఈ వార్తల్లో వాస్తవముందని వాదించే వాళ్లు రెండు అంశాలను తెరమీదకు తెచ్చారు. ఈ వారం మొదట్లో ఇరాన్లో రిక్టర్ స్కేల్పై 2.5 తీవ్రతతో ఒకసారి భూకంపం వచ్చింది. తాజాగా శుక్రవారం 5.1 తీవ్రతతో మరోసారి భూకంపం సంభవించింది. భీకరపోరు చేస్తున్న దేశంలో వెంటవెంటనే భూకంపాలు రావడం, అదికూడా అంతరిక్ష కేంద్రం, క్షిపణి ఉత్పత్తి కర్మాగారాలు ఉన్న సెమ్నాన్ ప్రావిన్సులోనే సంభవించడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి. ఓవైపు అణుబాంబును తయారుచేసే స్థాయికి యురేనియంను ఇరాన్ ఇంకా శుద్ధిచేయలేదన్న వార్తలొస్తుండగా అణుపరీక్షల వేళ అణుబాంబు పేల్చడం వల్లే భూమి కంపించి అది రిక్టర్ స్కేల్పై నమోదైందని మరికొందరు వాదిస్తున్నారు. వీటిల్లో నిజమెంత అనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. అవి భూకంపనాలు కాదు, అణుబాంబు పేలుళ్లేనని నిర్దారణ అయితేగనక ప్రపంచంలో పదో అణ్వస్త్రదేశంగా ఇరాన్ అవతరించిందని భావించాల్సి ఉంటుంది. అప్పుడు అణ్వస్త్రదేశంపై దాడులను కొనసాగించడంపై ఇజ్రాయెల్, దానికి మద్దతు పలకడంపై అమెరికా పునరాలోచన చేయడం ఖాయం. తొలుత ఫోర్డోలో.. తర్వాత సెమ్నాన్లో.. ఇజ్రాయెల్ క్షిపణిదాడుల తర్వాతే ఫోర్డోలో 2.5 తీవ్రతతో అదే రోజు భూకంపం సంభవించింది. ఇది జరిగిన ఐదు రోజులకు అంటే జూన్ 20వ తేదీ రాత్రి 9.19 గంటలకు ఉత్తర ఇరాన్లో 5.1 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. సెమ్నాన్కు ఆగ్నేయంగా 36 కిలోమీటర్ల దూరంలో భూఉపరితలానికి 10 కి.మీ.ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ భూకంపం ధాటికి ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా సమీప ప్రాంతాల్లో భూమి బాగా కంపించింది. ఇదే సమయంలో నటాంజ్, ఫోర్డో యురేనియం శుద్ధి కర్మాగారాలపై ఇజ్రాయెల్ బాంబులవర్షం కురిపించింది. దీంతో ఈ అణుకేంద్రాలు దెబ్బతిన్నాయి. ప్రైవేట్ ఉపగ్రహ చిత్రాల్లో చూస్తే అణుకేంద్రాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోందిగానీ వినాశనానికి కారణం బాంబు దాడులా, అణుబాంబు పేలుళ్ల అనేది ఎవరికీ తెలీడం లేదు. అవి నిజమైన భూకంపాలంటూ మరో వాదన తాజా భూప్రకంపనలు కేవలం భూకంపాల కారణంగా సంభవించాయని, అణుపరీక్షలు జరగలేదని కొందరు వాదిస్తున్నారు. దీనికి చారిత్రక నేపథ్యం ఉంది. ఇరాన్ భౌగోళికంగా భూకంపాలు తరచూ సంభవించే ప్రాంతంలో ఉంది. ఆలై్ఫన్–హిమాలయన్ భూకంప పట్టీలో ఇరాన్ ఉంది. ఇక్కడ ఏటా సూక్ష్మస్తాయిలో ఏకంగా 2,000 భూకంపాలు వస్తాయి. రిక్టర్ స్కేల్పై 5 అంతకంటే ఎక్కువ తీవ్రతతో డజనుకుపైగా భూకంపాలు నమోదవుతాయి. 2006 నుంచి 2015 ఏడాదిదాకా గణాంకాలను పరిశీలిస్తే ఇరాన్లో 96,000 సార్లు భూకంపాలు వచ్చాయి. సాధారణంగా భూగర్భంలో అణుపరీక్షలు జరిపితే భూమి పైపై పొరలపై ఒత్తిడి కల్గి స్వల్పస్థాయిలో భూమి కంపిస్తుందని యూఎస్ జియోలాజికల్ సర్వే(యూఎస్జీఎస్) పేర్కొంది. అణుబాంబు పేలిన కారణంగా మొదలయ్యే భూకంపం తీవ్రత కొంతదూరానికే పరిమితమవుతుంది. అణుబాంబు పేలితే కేవలం పీ–బ్యాండ్ తరంగాలే ఉద్భవిస్థాయి. నిజంగా భూకంపం వస్తే పీ–బ్యాండ్తోపాటు ఎస్–బ్యాండ్ తరంగాలు కూడా వస్తాయి. ఎస్–బ్యాండ్ తరంగాలు తమ కేంద్రస్థానం నుంచి వెదజల్లబడి సూక్ష్మస్థాయిలో తిరిగి కేంద్రాన్ని చేరతాయి. పలు రకాల పరికరాల ద్వారా భూకంప శాస్త్రవేత్తలు దీనిని గుర్తించగలరు. ఈ లెక్కన 2.5 తీవ్రతతో వచ్చిన భూప్రకంపనలకు సహజ భూకంపమే కారణమని నిపుణులు నిర్ధారించారు. అయితే భూకంపం వచ్చిన అదే సమయానికి అదే ప్రాంతంలో ఇజ్రాయెల్ దాడులు చేయడం గమనార్హంఆపరేషన్ సిందూర్ వేళ.. మే నెలలో నాలుగురోజులపాటు పాకిస్తాన్పై భారత్ జరిపిన ‘ఆపరేషన్ సిందూర్’భీకర దాడుల వేళ సైతం పాకిస్తాన్లో భూకంపాలు సంభవించాయి. దీంతో పాకిస్తాన్లో అణుపరీక్షలు జరిగాయనే వాదన వినిపించింది. అయితే ఆ వాదన తప్పు అని తర్వాత తేలింది. సమగ్ర అణ్వస్ర వ్యాప్తినిరోధక ఒప్పదం(సీటీబీటీఓ), యూఎస్జీఎస్, స్వతంత్య్ర భూగోళశాస్త్ర అధ్యయనకారుల వాదన ప్రకారం ఒకవేళ భూప్రకంపనలు నమోదైతే, వాటి కేంద్రాన్ని 10 కి.మీ.ల లోతులో గుర్తిస్తే అది ఖచ్చితంగా సహజ భూకంపమే. ఎందుకంటే పది కిలోమీటర్ల లోతుకు భూమిని తవ్వి అక్కడ అణుబాంబును పేల్చడం అసాధ్యం. శుక్రవారం నమోదైన భూకంపం సంబంధ నాభి స్థానాన్ని 10 కి.మీ.ల లోతులో గుర్తించారు. ఈ లెక్కన ఇరాన్లో అణుపరీక్షలు జరగలేదనే వాదన తాజాగా బలపడింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఓటీటీ రిలీజ్.. సూపర్ హిట్!
ఓవర్ ద టాప్.. సంక్షిప్తంగా ఓటీటీ. వినోద రంగాన్ని సమూలంగా మార్చి కొత్త రికార్డులకు వేదికవుతోంది. దేశవ్యాప్తంగా ఓటీటీ వీక్షకుల సంఖ్య 2024 నాటికి 55 కోట్లకు చేరిందంటే దీని స్పీడును అర్థం చేసుకోవచ్చు. టెలికం కంపెనీల దూకుడు పుణ్యమాని నగరాలే కాదు పల్లెలకూ ఆన్ లైన్ లో వీడియో స్ట్రీమింగ్ సంస్కృతి పాకింది. ఈ స్థాయిలో ప్రాచుర్యంలోకి వచ్చింది కాబట్టే నేరుగా ఓటీటీల్లో (ఒరిజినల్స్) రిలీజయ్యే సినిమాలు, వెబ్ సిరీస్, షోల సంఖ్య మన దేశంలో భారీగా పెరిగాయి. దేశంలో సగటున రోజుకో ఓటీటీ ఒరిజినల్ విడుదలై వీక్షకులకు వినోదాన్ని పంచుతోంది.2021లో మొత్తం ఓటీటీ ఒరిజినల్స్లో సినిమాల వాటా ఏకంగా 53 శాతం నమోదై రికార్డు సృష్టించింది. మహమ్మారి సమయంలో థియేటర్లు చాలా కాలం పాటు మూతపడ్డాయి. థియేటర్లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమాలు మరో మార్గం లేక ఓటీటీ బాట పట్టాయి. అయితే 2022 నుండి వెబ్ సిరీస్ల ఆధిపత్యం కొనసాగుతోంది. గడిచిన మూడేళ్లలో వెబ్ సిరీస్ల వాటా ఏటా 68–71 శాతం ఉంది. 2024లో రిలీజైన 315 ఒరిజినల్స్లో 214 వెబ్ సిరీస్లే. 2023లో ఈ సంఖ్య 272గా ఉంది. మొత్తం ఓటీటీ వీక్షకుల్లో 27.5 శాతం (15 కోట్లు) మంది పెయిడ్ కంటెంట్ను ఆస్వాదిస్తున్నారు. మిగిలిన 72.5 శాతం మంది ఉచితంగా అందుబాటులో ఉన్న కంటెంట్ను వీక్షిస్తున్నారు.ప్రాంతీయ భాషలపై ఫోకస్2021 నుంచి చూస్తే.. మొత్తం ఒరిజినల్స్లో మూడింట రెండొంతులు హిందీ కంటెంట్ కైవసం చేసుకుంది. దేశంలో గత ఏడాది ఓటీటీల్లో ప్రత్యక్షమైన ఒరిజినల్స్లో 65% వాటాతో హిందీ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. హొయిచొయి, క్లిక్, అడ్డాటైమ్స్ వంటి ఓటీటీ యాప్స్ దూకుడుతో బెంగాలీ 2వ స్థానాన్ని సంపాదించింది. దాదాపు 9 శాతం వాటాతో తెలుగు మూడో స్థానంలో ఉంది. తెలుగులో ‘ఆహా’ యాప్ 27 లక్షల మంది చందాదారులతో దూసుకుపోతోంది. ఇతర భాషలతో పోలిస్తే హిందీతోపాటు బెంగాలీ, తెలుగు, తమిళం, మలయాళంలో సృజనాత్మకత మెరుగ్గా ఉంది. దీంతో నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఇతర పెద్ద ప్లాట్ఫామ్లు ఈ ప్రాంతీయ భాషలపై దృష్టి సారించాయి. దక్షిణాదిన ఓటీటీ వినియోగాన్ని సినిమాలే నడిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో పెద్ద హిట్స్లో దాదాపు 70 శాతం నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్లలోనివే. మిగిలినవి జియో హాట్స్టార్, సోనీ లివ్లో ప్రసారం అయ్యాయి. -
అవునా.. ఈ శతాబ్దపు వివాహం ఇదేనా?
ప్రపంచంలో ఇప్పటిదాకా అత్యంత ఖరీదైన పెళ్లిగా గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించింది ఏదో తెలుసా?.. రెండు దశాబ్దాల కిందటే.. వందల కోట్లు ఖర్చు చేసిన ఆ వివాహ విశేషాల గురించి చివర్లో చెప్పుకుందాం. ఈలోపు.. ఈ శతాబ్దపు వివాహం(Wedding of the Century) ఇదేనంటూ నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ విషయంలో ఆ ప్రాంత ప్రజలు రెండుగా విడిపోయి వాదులాడుకుంటున్నారు. ఇంతకీ పెళ్లి గోల ఏంటంటే..అమెరికా టెక్ దిగ్గజం జెఫ్ బెజోస్(61)కి ఆయన ప్రేయసి, ప్రముఖ జర్నలిస్ట్ లారెన్ సాంచెజ్కు జరగబోయే వివాహం గురించే ప్రపంచం ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇటలీ నగరం వెనిస్లో జూన్ 24 నుంచి 26వ తేదీల మధ్య మూడు రోజులపాటు అంగరంగ వైభంగా ఈ వివాహ వేడుక జరగనుంది. లియోనార్డో డికాప్రియో, కిమ్ కార్డాషియన్, బియాన్స్, మిక్ జాగర్ లాంటి ప్రముఖులు ఈ వివాహానికి అతిథులుగా హాజరు కాబోతున్నారు. ఇందుకోసం భారీగానే వెచ్చించబోతున్నారట.వెనిస్లోని చారిత్రక భవనాలు, ప్యాలెస్లను వివాహ వేదికల కోసం అద్దెకు తీసుకుందీ జంట. ఒక్క ఫ్లవర్ డెకరేషన్ కోసం రూ.8 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారు. కేటరింగ్ కోసం రూ.10కోట్ల దాకా కేటాయించారు. కేవలం లారెన్ ధరించబోయే దుస్తులు, ఆభరణాల కోసం ₹12 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారట. ఇవేకాకుండా.. అతిథులకు వసతి, రవాణా.. విలాసవంతమైన హోటళ్లు, వాటర్ టాక్సీలు, ప్రైవేట్ బోట్ల ఖర్చు కోసం మిలియన్లు కుమ్మరించబోతున్నాడు ఈ అపర కుబేరుడు. ఈ వివాహ వేడుకకు అంచనా ఖర్చు ₹125 కోట్ల నుంచి ₹166 కోట్ల ($15 మిలియన్ నుంచి $20 మిలియన్ వరకు) మధ్యగా ఉండొచ్చని ఒక అంచనా. వీళ్ల వివాహం మాటేమోగానీ.. ‘‘వెడ్డింగ్ ఆఫ్ ది సెంచరీ’’ అంటూ సోషల్ మీడియా ఊదరగొట్టేస్తోంది. అదే సమయంలో ఈ హైప్రొఫైల్ వెడ్డింగ్ వివాదానికి కూడా దారి తీసింది. కొంతమంది ఈ వేడుకను వెనిస్కు గౌరవంగా భావిస్తున్నారు. నగరానికి పర్యాటక ఆదాయం తీసుకురావచ్చని ఆశిస్తున్నారు. అయితే.. వెనిస్ను ప్రైవేట్ పార్టీగా బెజోస్ భావిస్తున్నారా? అంటూ మరికొందరు మండిపడుతున్నారు. "No Space for Bezos! అనే నినాదాలతో నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ఈ పాటికే రియాల్టో వంతెనపై భారీ బ్యానర్లు కట్టారు. ఈ వేడుక వల్ల నగరంలో అధిక రద్దీ నెలకొంటుందని, స్థానికులకు అసౌకర్యం కలగడంతో పాటు పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడొచ్చనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్లు. జెఫ్ బెజోస్ గురించి.. జెఫ్ బెజోస్ జనవరి 12, 1964న అల్బుకర్కీ, న్యూ మెక్సికో(అమెరికా) జన్మించారు. 1994లో బెజోస్ సెకండ్హ్యాండ్ పుస్తకాలు అమ్మే ఆన్లైన్ స్టోర్గా అమెజాన్ను ప్రారంభించారు. అది ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థగా మారింది. ఆపై 2000లో బ్లూ ఆరిజిన్ అనే అంతరిక్ష సంస్థను స్థాపించారు. 2013లో వాషింగ్టన్ పోస్ట్ అనే ప్రముఖ వార్తాపత్రికను కొనుగోలు చేశారు. 2017 నుంచి 2021 వరకు ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఫోర్బ్స్ జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు.క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ AWS కూడా బెజోస్ నేతృత్వంలోనే ప్రారంభమైంది. మెకెంజీ స్కాట్ను బెజోస్ 1993లో వివాహం చేసుకున్నారు, 2019లో ఈ జంట విడాకులు తీసుకుంది. ఆపై లారెన్ సాంచెజ్తో ప్రేమలో మునిగిపోయిన ఆయన.. నిశ్చితార్థం చేసుకుని ఇప్పుడు వివాహానికి సిద్ధమయ్యారు. ‘‘నాకు నెంబర్వన్ కిరీటం అవసరం లేదు. ఉపాధి కల్పించే యజమానిగా గుర్తింపు కావాలి’’ అనేది ఆయన philosophy. ఉద్యోగులతో వ్యక్తిగతంగా లేఖలు రాయడం, వారిని ప్రోత్సహించడం వంటి చర్యలు ఆయన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. లారెన్ వెండీ సాంచెజ్ (Lauren Wendy Sánchez).. వయసు 55. ఆమె ఒక టీవీ ప్రెజెంటర్, జర్నలిస్ట్, హెలికాప్టర్ పైలట్ కూడా. Extra", "Good Day LA వంటి షోలతో ఆమెకు పేరు దక్కింది. 2024లో ఆమె బ్లూ ఆరిజిన్ ద్వారా అంతరిక్షానికి వెళ్లిన తొలి మహిళలలో ఒకరిగా నిలిచారు. "Black Ops Aviation" అనే ఎయిర్ ఫిల్మింగ్ కంపెనీ ఉంది — ఇది మహిళల చేత నడపబడే మొదటి సంస్థలలో ఒకటి. ఫ్యాషన్ ఐకాన్గా ఆమె స్టైలిష్ దుస్తులు, డిజైనర్ బ్రాండ్స్ కోసం ప్రసిద్ధి. ఇటీవల కర్దాషియన్ కుటుంబం ఆమెకు విలాసవంతమైన UFO-ప్రేరిత బ్యాగ్ బహుమతిగా ఇచ్చారు.లారెన్ గతంలో ఎన్ఎఫ్ఎల్ మాజీ ఆటగాడు టోనీ గోంజాలెజ్తో డేటింగ్ చేసి ఓ కొడుకును కన్నారు. ఆపై హాలీవుడ్ టాలెంట్ ఏజెంట్ పాట్రిక్ వైట్సెల్ను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ముగ్గురు పిల్లలు. పాట్రిక్ నుంచి విడాకులు తీసుకున్నాక ఆమె జెఫ్ బెజోస్తో డేటింగ్ మొదలు పెట్టి.. ఇప్పుడు పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. ప్రపంచంలో ఇప్పటివరకు జరిగిన అత్యంత ఖరీదైన పెళ్లిళ్లు.. టాప్ 10 జాబితా పరిశీలిస్తే.. 1.ఖాదిజా ఉజాఖోవా Weds సైద్ గుట్సెరీవ్ – సుమారు ₹8,300 కోట్లు(1 బిలియన్ డాలర్లు)2016లో మాస్కోలో జరిగిన ఈ పెళ్లిలో జెన్నిఫర్ లోపెజ్, ఎన్రికె ఇగ్లెషియస్ లైవ్ షోలు ఇచ్చారు. అతిథులకు బెంట్లీ కార్లలో స్వాగతం పలకడంతో పాటు బంగారు బాక్స్లను గిఫ్ట్లుగా ఇచ్చారు. 2. అనంత్ అంబానీ Weds రాధికా మర్చంట్ – సుమారు ₹5,000 కోట్లు2024లో జరిగిన ఈ పెళ్లిలో జరిగిన సందడి అంతా ఇంతా కాదు. పాప్ సింగర్ రిహన్నా ప్రత్యేక షోతో అలరించారు. ఖరీదైన క్రూయిజ్ పర్యటనలతో పాటు ప్రపంచ ప్రముఖుల హాజరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 3. ఇషా అంబానీ Weds ఆనంద్ పిరమల్ – సుమారు ₹800 కోట్లు2018లో ఉదయ్పూర్లోని రాజమహల్లో ఈ వివాహ వేడుక జరిగింది. ఈ పెళ్లిలో బియాన్స్ లైవ్ షో ఇచ్చారు. 4. వనీషా మిట్టల్ Weds అమిత్ భాటియా – సుమారు ₹550 కోట్లు2004లో ఫ్రాన్స్లో వెర్సైల్స్ ప్యాలెస్లో వివాహ వేడుక జరిగింది. కైలీ మినోగ్ ప్రదర్శనతోపాటు ఐఫెల్ టవర్ వద్ద బాణా సంచాలు కాల్చి వేడుక నిర్వహించారు. 5.ప్రిన్స్ చార్ల్స్ Weds ప్రిన్సెస్ డయానా – సుమారు ₹400 కోట్లు1981లో ఈ రాయల్ వెడ్డింగ్ను ప్రపంచవ్యాప్తంగా 750 మిలియన్ల మంది వీక్షించారు. 6. ప్రిన్స్ హ్యారీ Weds మేఘన్ మార్కెల్ – సుమారు ₹375 కోట్లు2018లో విండ్సర్ క్యాసిల్లో జరిగిన ఈ వివాహ వేడుక.. ప్రపంచవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షించింది. 7. కింగ్ ఫెలిప్ Weds క్వీన్ లెటీషియా (స్పెయిన్) – సుమారు ₹290 కోట్లుఆ దేశ రాజధాని మాడ్రిడ్లో రాజ సంప్రదాయాలతో ఘనంగా జరిగిందీ వివాహం. 8. ప్రిన్స్ విలియం Weds కేట్ మిడిల్టన్ – సుమారు ₹275 కోట్లు2011లో వెస్ట్మినిస్టర్ ఏబీ చర్చిలో జరిగిన ఈ వివాహ వేడుకకు ప్రపంచం నలుమూలల నుంచి 1,900 మందికిపైగా ప్రత్యేక అతిథులు హాజరయ్యారు 9. అంజెలా బేబి Weds హువాంగ్ షియామింగ్ (చైనీస్ సెలెబ్రిటీలు) – సుమారు ₹260 కోట్లు2015లో హోలోగ్రాఫిక్ క్యాసెల్లో.. ప్రత్యేక డిజైనర్ గౌన్తో వధువు మెరిసిపోగా.. ఈ వివాహం వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. 10. మైఖేల్ జార్డన్ Weds ఎవెట్ ప్రియెటో – సుమారు ₹80 కోట్లుబాస్కెట్బాల్ చక్రవర్తి మైఖేల్ జార్డన్ వివాహం క్యూబన్ అమెరికా మోడల్ య్వెట్ ప్రియెటో 2013లో జరిగింది. సుమారు 500 మంది అతిథుల నడుమ.. ఉషర్, రాబిన్ థిక్ లైవ్ షోలతో ఘనంగా జరిగింది ఈ వివాహ వేడుక. పైవాటిల్లో భారత పారిశ్రామికవేత్త లక్ష్మీ మిట్టల్ కుమార్తె వనీషా మిట్టల్ వివాహం గిన్నిస్ బుక్లోకి ఎక్కింది. వ్యాపారవేత్త అమిత్ భాటియాతో వనీషా వివాహం 2004లో సుమారు రూ. 550 కోట్ల వ్యయంతో ఫ్రాన్స్లోని వెర్సైల్స్ ప్యాలెస్ వేడుకగా జరిగింది. ఆరు రోజులపాటు జరిగిన పెళ్లి వేడుకకు హాలీవుడ్, బాలీవుడ్ నుంచి ఎందరో ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ వివాహ వేడుకకు అయిన ఖర్చు కంటే అధిక ఖర్చుతో జరిపించిన వివాహాలు ఉన్నప్పటికీ.. అప్పటి బడ్జెట్.. పరిస్థితులు.. ఇతర కారణాలతో వనీషా మిట్టల్ వివాహ వేడుక గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కడం విశేషం. -
నిజాం నవాబుకు ఈ ఊరి నుంచే తమలపాకులు!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: బీబీపేట.. ఈ పేరు వినగానే అందరికీ గుర్తుకువచ్చేది తమలపాకుల తోటలు. నిజాం కాలంలోనే ఇక్కడి పెద్ద చెరువు కింద తమలపాకుల తోటలు ఉండేవి. తాతల కాలం నుంచి తమలపాకులు పండించిన కామారెడ్డి జిల్లా బీబీపేట రైతులు సాగునీటి కష్టాలతో పంట సాగును వదిలేశారు. అయితే తమలపాకులతో ఉన్న అనుబంధాన్ని తెంచుకోలేని రైతులు.. ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుని ఆకులు అమ్ముతూ పూటగడుపుతున్నారు. సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలకు సరిహద్దుల్లో ఉన్న బీబీపేట గ్రామంలో 2,532 కుటుంబాలు ఉండగా, 11,312 మంది జనాభా ఉంది. ఇక్కడ అత్యధిక కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నాయి.గ్రామ రైతులు నిజాం కాలం నుంచే తమలపాకులను పండించేవారు. దాదాపు ఏడు గ్రామాలకు సాగునీటినందించే బీబీపేట పెద్ద చెరువు కింద తమలపాకుల తోటలు సాగు చేసేవారు. ఇక్కడ పండించిన తమలపాకుల్లో ఘాటు ఎక్కువగా ఉండేదని చెబుతారు. నిజాం నవాబు కుటుంబానికి కూడా ఇక్కడి నుంచి తమలపాకులు వెళ్లేవి. వీటిని నిజాం నవాబు కూడా ఎంతో ఇష్టపడేవారని చెబుతారు. పెద్ద చెరువు కింద దాదాపు 140 ఎకరాల్లో తమలపాకుల తోటలు పెంచేవారు. ఇక్కడ పండించిన తమలపాకులను అప్పట్లో హైదరాబాద్, నాందేడ్, విజయవాడ, వరంగల్, కరీంనగర్ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. ఉమ్మడిగా తోటల పెంపకం తమలపాకుల తోటలను రైతులు ఉమ్మడిగా పెంచేవారు. ఒక ఎకరం భూమిలో పది నుంచి పదిహేను మంది రైతులు కలిసి పంట సాగు చేసేవారు. తోట పెంచడమే కాదు ఆకులను తెంపడం, వాటిని రవాణా చేయడం, అమ్మడం వంటి పనులు చేయడానికి ఎక్కువ మంది అవసరం ఉంటుండడంతో రైతులు ఉమ్మడిగా పంట పండించేవారు. తద్వారా ఏ ఇబ్బంది లేకుండా ఉండేది. కొందరు రైతులైతే కూలీల అవసరం లేకుండానే వారి కుటుంబ సభ్యులే కలిసి పంట సాగు నుంచి తెంపడం, అమ్మడం దాకా వాళ్లే చేసుకునేవారు. వందలాది మంది రైతులు పంటల సాగులో పనిచేసేవారు. తమలపాకు తోటల ద్వారా గ్రామంలో కూలీలకు కూడా ఎంతో ఉపాధి లభించేది. తమలపాకు తోటలతో ఆ కుటుంబాలన్నీ ఉన్నతంగా బతికేవి. అయితే 1995 ప్రాంతంలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులతో చెరువు నిండకపోవడంతో రైతులు తమలపాకుల తోటల సాగుకు దూరమయ్యారు. దశాబ్దాల పాటు తమలపాకుల తోటలతో బతికిన రైతులు, నీళ్లు లేక పంట భూములను పడావుగా వదిలేయాల్సి వచ్చింది. దిగుమతి చేసుకుని అమ్ముకుంటున్న రైతులుతమలపాకుల తోటలతోనే జీవనం సాగించిన ఎన్నో కుటుంబాలు తోటలు పెంచడం మానేసినప్పటికీ వ్యాపారాన్ని మానలేకపోయాయి. దీంతో ఆయా కుటుంబాలవారు ఇతర ప్రాంతాల నుంచి తమలపాకులను తెప్పించుకుని విక్రయిస్తున్నారు. కామారెడ్డి, దోమకొండ, సిరిసిల్ల, మాచారెడ్డి, గంభీరావుపేట, రామాయంపేట తదితర ప్రాంతాలకు బీబీపేట (Bibipet) రైతులు వెళ్లి తమలపాకులు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. చదవండి: మూడు సంస్థానాలు, 46 జాగీర్లుఒకప్పుడు తమలపాకులు పండించి, ఎగుమతి చేసిన రైతులు ఇప్పుడు దిగుమతి చేసుకుని అమ్ముకునే దయనీయ పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ తమలపాకులు పండినపుడు హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట తదితర ప్రాంతాలకు వెళ్లి అమ్మేవారు. నాందేడ్ ప్రాంతం నుంచి వ్యాపారులు వచ్చి తమలపాకులను కొనుగోలు చేసుకుని తీసుకెళ్లేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు తలకిందులై రైతులు తమలపాకులను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. తమలపాకులతోనే జీవనం నా వయసు 83 ఏండ్లు. మా తాతల కాలం నుంచి తమలపాకుల తోటలు ఉండేవి. నేను 30 ఏళ్లపాటు పెంచిన. ఆకుతోటమీదనే బతికినం. ఆకులను తలమడ్ల రైల్వే స్టేషన్ దాకా ఎడ్ల బండ్లమీద తీసుకుపోయి అక్కడి నుంచి రైలులో పట్నం తీసుకుపోయి అమ్ముతుంటిమి. కొందరు పంట మీద వడ్లు పెట్టేటోళ్లు. మా ఊరికి ఎక్కడెక్కడి నుంచో బ్యారగాళ్లు అచ్చి ఆకులు కొనుక్కుని పోయేటోళ్లు. బీబీపేట అంటేనే తమలపాకుల తోటలు గుర్తు చేసేటోళ్లు. మా ఊరికి ఎంతో పేరుండేది. నీళ్ల కరువుతోని తోటలు బందుజేసినం. ఇగ తోటల ముచ్చటనే లేకుండాపోయింది. ఇప్పుడు మా మనుమడు హైదరాబాద్ (Hyderabad) నుంచి తమలపాలకులు తీసుకువచ్చి ఇస్తే బస్టాండ్ దగ్గర కూర్చుని అమ్ముతున్న. – కుర్ల నారాయణ, బీబీపేట -
World Music Day నాదమే జీవనం
కోయిల ఊరికే ఉండదు... పాడుతుంది. గాలి కూడా కామ్గా కూర్చోదు... సవ్వడి చేస్తుంది. వినాలే గానీ... కిటికీ పరదా చప్పుడు కూడా సంగీతమే! ఆనందమో, చిరు సంతోషమో కలిగినప్పుడు... ప్రతి గొంతూ కూని రాగం తీస్తుంది. సంగీతం లేకపోతే... ఈ జగతి ఉత్త శూన్యం. సప్త స్వరాలే... ఉచ్ఛ్వాస నిశ్వాసలు. ‘వరల్డ్ మ్యూజిక్ డే’ సందర్భంగా ఒక పాటకో, ఒక గళానికో, ఒక స్వరానికో కృతజ్ఞత చెప్పుకోకపోతే ఎలా..? నాదమే జీవనంగా బతుకుతున్న నలుగుర్ని కలవకపోతే ఎలా..!ఊపిరి ఉన్నంతవరకూ పాటే నా ప్రపంచం– సంగీతదర్శకురాలు శ్రీలేఖ→ మ్యూజిక్ డైరెక్టర్గా ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి రోజూ సంగీతాన్ని ఆస్వాదిస్తాను... ఆనందిస్తాను. ఊపిరి ఉన్నంతవరకు పాటలతో సెలబ్రేట్ చేసుకుంటాను. పాటే నా ప్రపంచం. సంగీతం తప్ప నాకు వేరే ప్రపంచం తెలియదు. సంగీతాన్ని రోజూ ఇష్టపడుతున్నప్పటికీ ‘వరల్డ్ మ్యూజిక్ డే’ సందర్భంగా నాకు నచ్చిన పాటలను మరింత ఎక్కువగా వింటాను. నేను కంపోజ్ చేసిన పాటలను నెమరు వేసుకుంటాను... ఇలా చేసి ఉంటే బాగుండేది, అలా చేసి ఉంటే బాగుండేది... ఇలా రకరకాలుగా నా పాటలను విశ్లేషించుకుంటాను. → అప్పట్లో లైవ్ ఇన్స్ట్రూమెంట్స్ ఎక్కువగా ఉండేవి. ప్రొడ్యూసర్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్లు ఎక్కువగా కోరుకునేవారు కూడా. పాటలు కూడా అలాగే ఉండేవి. రికార్డింగ్, సాంగ్ రికార్డింగ్లో నేను కూడా లైవ్ ఇన్స్ట్రూమెంట్స్ ఉపయోగించాను. వివిధ లైవ్ ఇన్స్ట్రూమెంట్లతో హాల్ మొత్తం సందడిగా, పండగ వాతావరణంతో ఉండేది. ప్రతిరోజూ ఒక పండగలా ఉండేది. ఎవరికి వారు బిజీ కావడం, లైవ్ ఇన్స్ట్రూమెంట్ రిక్వైర్డ్ సాంగ్స్ రాకపోవడం, డీజే టైప్ పాటలు, రెట్రో, హిప్ హాప్లాంటివి వచ్చి లైవ్ అవసరం లేకుండా పోయింది. ఒకవేళ అవసరం ఉన్నా ఎక్కడున్న వారు అక్కడ, ఎవరికి టైమ్ ఉన్నప్పుడు వారు పాడి, వాయించి పంపుతున్నారు. వాటిని తరువాత మిక్స్ చేస్తున్నారు. అంతా డిజిటలైజ్డ్ అయిపోయింది. ఇది ఎంతవరకు వెళుతుందో మాత్రం తెలియదు. → ఫుల్ ఆర్కెస్ట్రా ఉన్నప్పుడు సాంగ్ స్ట్రక్చర్ ఇలా రాబోతుందని తెలిసేది. ఎందుకంటే సింగర్స్తో సహా లైవ్ ఉండేది. స్ట్రక్చర్ గురించి ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్కే తెలియడం లేదు. అక్కడొక ముక్క, ఇక్కడొక ముక్క, పల్లవి ఒకరు చేస్తారు... బీజియమ్ ఒకరు చేస్తారు. ఫైనల్ వచ్చే వరకు కూడా సాంగ్ ఎలా వస్తుంది? అనేది మ్యూజిక్ డైరెక్టర్కి తెలియడం లేదు. మార్పులు, చేర్పులు చేయాలంటే అదొక తతంగం. సో... సాంకేతిక అభివృద్ధి పరంగా మైనస్ ఉంది. కాకపోతే పని గంటలు తగ్గుతాయి. అలాంటి ప్లస్లూ ఉన్నాయి. → సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరితోనూ బాగుంటాను. కోటిగారు, వందేమాతరం శ్రీనివాస్గారు, కీరవాణి అన్నయ్య, మణిశర్మగారు... ఇలా ఎంతోమంది చిన్నప్పటి నుంచి నన్ను చూసి ఉన్నారు కాబట్టి, అందరికీ నేను పెట్. అందరూ నన్ను అభిమానిస్తారు. → నా సినిమాల్లో నాకు సంతృప్తినిచ్చినవి చాలా ఉన్నాయి. ఉదాహరణకు ‘ధర్మచక్రం, తాజ్మహల్, ప్రేమించు, ప్రేయసి రావే, శివయ్య’ వంటివి. మొన్న వచ్చిన ‘హిట్–2’లో ‘ఉరికే ఉరికే’ సాంగ్ బ్లాక్ బస్టర్. నా కెరీర్లో ఎక్కువగా మంచి సినిమాలకు పని చేసే చాన్స్ రావడం నా అదృష్టం. → ఏఐ (కృత్రిమ మేధ) గురించి విన్నాను. ఎంత ఏఐ వాడినా, ఎలా చేసినా తెలిసిపోతుంది. హ్యూమన్ ఎమోషన్ ఏఐ ఇవ్వలేదు. మనిషి కంపోజ్ చేసి ఇచ్చినంత ఏఐ ఇవ్వలేదు. → సినిమా రంగంలో రావడానికి నేను వచ్చిన టైమే కష్టం అనుకుంటే ఇప్పుడు మరింత కష్టం అయింది. ఎంతోమంది డైరెక్టర్స్, సింగర్స్, కంపోజర్స్ వస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని బాగా కష్టపడాలి. ఇక మనం ఏ స్థాయికి వెళతామనేది అది మన అదృష్టంపై ఆధారపడి ఉంటుంది. → నేను సినిమా ఒప్పుకోవడానికి మూడు విషయాల గురించి ఆలోచిస్తాను. మొదటిది కథ. జనరల్గా కథే కదా హీరో. కథ ఎలా ఉంది, ఏ జానర్లో ఉంది, డైరెక్టర్ ఫ్యాషనేట్గా తీయగలరా? ప్రాపర్గా రిలీజ్ చేయగలరా? వీటి గురించి ఆలోచిస్తాను. → మహిళలు, పురుషులు అని కాదు... సినిమా ఫీల్డ్లోకి రావాలంటే ఎవరికైనా అది అంత తేలికైన విషయం కాదు. కమర్షియల్ ఫీల్డ్ కాబట్టి ఇంట్లో అందరినీ ఒప్పించాలి, చాలా టాస్క్లు ఉంటాయి. దేవుడి దయ వల్ల ఆ టాస్క్లన్నీ దాటుకొని ఇప్పటికీ సక్సెస్ఫుల్గా ఉన్నాను.– డి.జి. భవానిమనసుని తాకాలంటేమెలోడీ బెస్ట్– సంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్→ ప్రపంచ సంగీత దినోత్సవాన్ని జూన్ 21న వరల్డ్ వైడ్గా జరుపుకుంటారు. మనకు కూడా ఇక్కడ మ్యూజిక్ డే సెలబ్రేషన్స్ని చేస్తుంటారు. కానీ, నాకైతే ప్రతి రోజూ సంగీత దినోత్సవమే. ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకూ సంగీతంతోనే ఉంటాను కాబట్టి. → సంగీతంలో అప్పటికీ, ఇప్పటికీ టెక్నాలజీ వైజ్, వర్కింగ్ వైజ్ చాలా మార్పులొచ్చాయి. మ్యూజిక్ ఎప్పుడూ మెలోడీ వైజ్ మెలోడీనే ఉంటుంది... దాన్ని ఏదీ రీ ప్లేస్ చేయలేదు. గతంలో లైవ్లో అందరం ఒకేసారి రికార్డ్ చేసేవాళ్లం. ఇప్పుడు బిట్ బిట్గా, సిస్టమ్ ద్వారా చేస్తున్నాం. ఒక పదం పదం పరంగా కూడా రికార్డింగ్ చేస్తున్నాం. అలాగే ఏఐ ద్వారా వాయిస్ మాడ్యులేషన్స్లో కూడా మార్పులొస్తున్నాయి. → సాంకేతికంగా ఎప్పటికప్పుడు మార్పులు వస్తుంటాయి. దానికి తగ్గట్టుగానే పని చేయాల్సి ఉంటుంది. అయితే ముందు రోజుల్లో లైవ్ రికార్డింగ్స్ ఉన్నప్పుడు ఒకటేసారి మొత్తం ఆర్కెస్ట్రా, సింగర్స్ అంతా కలిసి ఒక టేక్లో అయిపోయేది. అది ఒక రకంగా సులభంగా ఉండేది. ఎందుకంటే... గతంలో ఫ్లూట్ బిట్, వీణ బిట్, తబలా బిట్ ఇది... అని ఒక ప్రాపర్గా సెట్ చేసుకుని కంపోజ్ చేసేవారు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత చాలా ఆప్షన్స్ వచ్చాయి. ఒక్కొక్క ట్యూన్ సెలక్షన్స్కే చాలా రోజులు పట్టేస్తోంది. అంటే ఎక్కువ ట్యూన్స్ ఎంచుకునే అవకాశం ఉండటంతో ఇంకా ఏదో మంచిది దొరుకుతుంది, ఇంకా కొత్త ట్యూన్ దొరుకుతుంది అని. ఈ ప్రాసెస్ కొంచెం కాంప్లికేటెడ్. అయితే ఈ టెక్నాలజీ పరంగా సౌలభ్యం ఏంటంటే టైమింగ్స్. సింగర్ లేదా మ్యుజిషియన్ టైమ్కి అందుబాటులో లేకున్నా, ఇతర దేశంలో ఉన్నా వారు పాడటం లేదా వాయించి పంపితే మేము ఇక్కడ యాడ్ చేస్తాం. ఒక రకంగా ఇది అడ్వాంటేజ్. → ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్కి ఒక్కో శైలి ఉంటుంది. నా పరంగా వచ్చేసరికి నేనెప్పుడూ మెలోడీని ప్రేమిస్తాను. ఏ పాట కంపోజ్ చేసినా కూడా మెలోడీకి తొలి ప్రాధాన్యం ఇస్తాను. ఎందుకంటే మనకు సంగీతం అనగానే మొదట టచ్ అయ్యేది మనసు. మెలోడీయే మనకు ఎక్కువ రోజులు గుర్తుంటుందని బలంగా నమ్ముతాను. నా తొలి ప్రాధాన్యం ఎప్పుడూ మెలోడీయే. కానీ, కథ, సందర్భం, అవసరాన్ని బట్టి అక్కడ మాస్ సాంగ్ లేదా బీట్ సాంగ్ ఇస్తుంటాను. → ఇప్పుడొస్తున్న యువ సంగీత దర్శకులు చాలా బాగా పని చేస్తున్నారు. అయితే ఆరోగ్యకరమైన పోటీ అనేది చాలా అవసరం. ఎందుకంటే.. ఒక్కొక్కరికి ఒక్కో శైలి ఉంటుంది. ఒక్కొక్కరిలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వైవిధ్యమైన స్టైల్స్, ఫీల్స్ వినడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా మనం ఏదో చేయాలి? అనే ఉత్సాహం ఉండాలి. అయితే పోటీ ఆరోగ్యకరంగా ఉండాలి. → నా కెరీర్లో దాదాపు 90 సినిమాలు చేశాను. అయితే ఓ సంతృప్తి అనేది సినిమా విజయం వల్ల ఉంటుంది... కథ వల్ల ఉంటుంది. ఆ స్టోరీ జనాల్లోకి బాగా వెళ్లడం, మన పాటలు బాగా హిట్ అయితే అదో సంతృప్తి ఉంటుంది. నా సినిమాల్లో అలా సంతృప్తి ఇచ్చినవాటిలో ‘ప్రేమకావాలి, మనం, ఇష్క్, గోపాల గోపాల, టెంపర్’ వంటివి చాలా ఉన్నాయి. → ప్రస్తుతం కొత్తగా ఇండస్ట్రీకి వస్తున్న సంగీత దర్శకులు, సింగర్స్లో చాలా మంచి ప్రతిభ ఉంది. ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా పరిధి బాగా పెరిగింది. దాని వల్ల స్టార్ వేల్యూ, పాపులారిటీ అన్నది గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా సులభం అయింది. అయితే కొత్తవాళ్లకు అంకితభావం... ప్రధానంగా ఓపిక అనేది ఉండాలి. అప్పుడే మన లక్ష్యం అనేది చేరుకుంటాం. ప్రతి ఒక్కరికి ఒక్కో టైమ్ ఉంటుంది... మన సమయం వచ్చినప్పుడు ఆ లక్ష్యాన్ని చేరుకుంటాం. → ప్రస్తుతం ‘వారాహి’ అనే సినిమా చేస్తున్నాను. అలాగే తేజగారి చిత్రంతో పాటు అర్జున్గారి సినిమా చేస్తున్నాను. మరో ఐదారు సినిమాలు కూడా ఒప్పుకున్నాను.→ నేను చిన్నప్పటి నుంచి ఇళయరాజా సార్, ఏఆర్ రెహమాన్ సార్ పాటలు వింటూ పెరిగాను. వాళ్ల వర్కింగ్ స్టైల్, లైఫ్ స్టైల్.. చె΄్పాలంటే వాళ్లే నాకు స్ఫూర్తి. నాకే కాదు ఇప్పుడు కొత్తగా వచ్చే చాలా మంది సంగీత దర్శకులకు, అలాగే ఇప్పుడు ఉన్న వారికి కూడా. నేను మాత్రం ఆర్డీ బర్మన్గారు, ఇళయరాజా సార్, ఏఆర్ రెహమాన్గారు.. వాళ్ల వద్ద నుంచి చాలా నేర్చుకున్నాను.→ సినిమా ఒప్పుకోవాలంటే నా తొలి ప్రాధాన్యత కథే. అయితే కొన్నిసార్లు బ్యానర్, హీరో, డైరెక్టర్ వేల్యూ కూడా ఉంటాయి. అయితే ఎవరైనా కొత్తవాళ్లు, కొత్త ప్రొడక్షన్ హౌస్ వాళ్లు నన్ను కలిస్తే మాత్రం ముందు కథ విని, నచ్చితే ఒప్పుకుంటాను.– డేరంగుల జగన్ మోహన్లైవ్ రికార్డింగ్లోడెప్త్ ఉంటుంది – సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల→ సంగీత దర్శకుడిగా ప్రతిరోజునీ నా ఫస్ట్ డే మ్యూజిక్ డైరెక్షన్లానే భావిస్తాను. ప్రతిరోజూ ఓ స్ట్రగులే. అందుకే అప్గ్రేడ్ అవుతుంటాను. ప్రజలు ఎలాంటి సంగీతాన్ని ఇష్టపడుతున్నారో తెలుసుకుని, కొత్త తరహా సంగీతాన్నందించాలన్నదే నా తపన. → మనం ఆనందంలో ఉన్నప్పుడు పాట వింటాము. దుఃఖంగా ఉన్నప్పుడూ పాట వింటాము. మన భావాలను పంచుకోవాలనుకున్నప్పుడు మ్యూజిక్తో తెలియజేస్తాం. ఇలా పలు రకాలుగా సంగీతం అనేది మన జీవితంలో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. → దశాబ్ద కాలానికి పైగా సంగీతరంగంలో రాణిస్తున్నాను. ఈ రంగంలో టెక్నాలజీ అప్డేట్ అవుతూ వస్తోంది. టెక్నాలజీని మనం ఎంత వరకు కరెక్ట్గా వాడాం అన్నది జాగ్రత్తగా గమనించుకుంటుంటే అడ్వాంటేజ్గానే ఉంటుంది. కొన్నిసార్లు డిస్అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఒరిజినాలిటీ అనేది ఎప్పుడూ మిస్ కాకూడదు. మ్యూజిక్ అనేది హ్యూమన్ టచ్తో సంబంధం ఉన్న అంశం. అలాగే సంగీత దర్శకులకు ఏఐ ఉపయోగపడుతుంది. కానీ మనం దాన్ని ఎంతవరకు వినియోగిస్తున్నాం అన్నది చూసుకోవాలి. → ఇండస్ట్రీలో ఉన్న పోటీతత్వాన్ని గమనిస్తుంటాను. ఫస్ట్ నాకు నేను పోటీగా ఉండాలనుకుంటాను. ఎంతమంది ఉన్నా కూడా మనకు మనం పోటీగా ఉన్నప్పుడే మనం ముందుకు వెళ్లగలం. ఇండస్ట్రీలో సంగీతదర్శకుల మధ్య ఉండే పోటీని చూసి ఉలిక్కిపడను. నేను ఎదగడానికి ఏం చేయాలి అని చూస్తాను తప్ప పక్కన ఇంకెవరో వచ్చారని కంగారు పడను. → డిజిటల్ సాయంతో మ్యూజిక్ చేయడం కొంతవరకు సౌకర్యంగానే ఉంటుంది. కానీ లైవ్ రికార్డింగ్స్ అనేవి మాత్రం డెప్త్ క్రియేట్ చేస్తాయి. ఎంత చెప్పినా లైవ్ లైవే... దాంట్లో తిరుగులేదు. నేను గిటారిస్ట్ని. లైవ్ అంటే ఏంటో నాకు తెలుసు. ఎంత టెక్నాలజీ వాడినా కూడా లైవ్ అన్నది లైవే. డిజిటలైజ్ వల్ల పని సులభం అవ్వొచ్చు. కానీ లైవ్ రికార్డింగ్ అనేది మ్యూజిక్ను నిలబెడుతుంది. → శ్రోతలకు లిరిక్స్ వినిపించేలా మనం సంగీతం ఇవ్వాలి. ఆ పాటకు లిరిక్స్ చాలా ముఖ్యమని, లిరిక్దే ప్రథమ స్థానమని భావిస్తాను. నా సినిమాల్లోని పాటల్లో లిరిక్స్ ఆడియన్స్కు వినిపించాలనే ప్రయత్నిస్తుంటాను. లిరిక్స్ ఆడియన్స్కు అర్థమైతే, అప్పుడు ఆ లిరిక్కు మ్యూజిక్ డైరెక్టర్ ఈ తరహా మ్యూజిక్ ఇచ్చాడని వారికి అర్థమౌతుంది. అదే లిరిక్ అర్థం కాకుండా మనం మ్యూజిక్ ఇస్తే ఎందుకు లిరిక్ అర్థం కావడం లేదనిపిస్తుంది. లిరిక్ అర్థమైనప్పుడే సినిమాలోని సందర్భం మ్యూజిక్తో ఆడియన్స్కు మరింత చేరువ అవుతుంది. → సినిమాలో సౌండ్ అనేది డిజైన్ చేసినప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే మంచిది. ఒక సినిమాకు ఇద్దరు... ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేసే విధానానికి నేను వ్యతిరేకిని. ఇది నా సొంత అభి్రపాయం. అయితే కొన్నిసార్లు ఒక సినిమాకు ఇద్దరు... ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేసినప్పుడు అది వర్కౌట్ అయ్యింది. అలాంటప్పుడు ఒక సినిమాకు ఒకే సంగీత దర్శకుడు పని చేయాలని చెప్పడానికి నేనెవర్ని. కానీ... చేస్తే మొత్తం సినిమా చేయాలని నేను కోరుకుంటాను. ఈ విషయంపై నా స్టాండ్ ఏంటంటే... నాకు వ్యక్తిగతంగా ఇష్టం లేదు. కానీ సంగీత దర్శకుల్లో నేను ఒక భాగమే. ఎవరైనా వచ్చి, ఫలానా సినిమాలో ఒకే ఒక్క సాంగ్ చేయమన్నా చేస్తాను. → మ్యూజిక్ రంగంలో స్థిరపడాలనుకునే కొత్త తరం వారికి నేను చెప్పేది ఒక్కటే. ఒక్కసారి డిసైడ్ అయితే వెనక్కి తిరిగి చూడొద్దు. నిత్యం కష్టపడాలి. ఫోకస్గా ఉండాలి. ప్రతిక్షణం మ్యూజిక్ పైనే ఫోకస్ పెట్టి పని చేయాలని చెబుతాను. → వరల్డ్ మ్యూజిక్ డేని సెలబ్రేట్ చేసుకుంటాను. ఈ సందర్భంగా నా సహచర మ్యూజిషియన్స్ అందరికీ విషెస్ చెబుతున్నాను. అందరికీ అవకాశాలు రావాలని, అందరూ సక్సెస్ కావాలని, అందరూ ఎదగాలని కోరుకుంటాను. ప్రస్తుతం అడివి శేష్గారి ‘గూఢచారి 2, ఆది సాయికుమార్గారి ‘శంబాల’ సినిమాలు చేస్తున్నాను. మరో ఆరు సినిమాలు లైనప్లో ఉన్నాయి.→ నేను సినిమా ఒప్పుకోవాలంటే కథను మాత్రమే చూస్తాను. అలాగే నేను ఉపయోగించే ఇన్స్ట్రూమెంట్స్ సినిమా టు సినిమా మారిపోతుంటాయి. కథ, ఆ సినిమా హీరో, ఆ హీరో బాడి లాంగ్వేజ్ని బట్టి ఎలాంటి స్టైల్ క్రియేట్ చేయవచ్చు. డైరెక్టర్ ఏ విధమైన మ్యూజిక్ ఆశిస్తున్నారు. ఇటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ట్యూన్స్ చేస్తాను. ∙‘మేజర్, నాంది, గూఢచారి, కృష్ణ అండ్ హిజ్ లీలా, డీజే టిల్లు’ వంటి చిత్రాలు ఓ సంగీతదర్శకుడిగా నా కెరీర్లో ఎక్కువ సంతృప్తినిచ్చాయి. – ముసిమి శివాంజనేయులు -
విధ్వంసకర క్లస్టర్ బాంబు
యుద్ధం మొదలైనప్పటి నుంచి తమపై క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించి విధ్వంసం సృష్టించిన ఇరాన్ ఇప్పుడు ఏకంగా క్లస్టర్ బాంబులను ప్రయోగిస్తూ దారుణాలకు ఒడిగడుతోందని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఎన్నో దేశాలు నిషేధం విధించిన క్లస్టర్ బాంబులను ఇరాన్ ఉద్దేశపూర్వకంగా భారీ పౌరనష్టం జరగాలని తమపై ప్రయోగిస్తోందని ఇజ్రాయెల్ శుక్రవారం ప్రకటించింది. గత వారం రోజులుగా కొనసాగుతున్న సమరంలో ఇరాన్ క్లస్టర్ బాంబులను వినియోగించడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. దీంతో డజన్లకొద్దీ దేశాల నుంచి నిషేధాన్ని ఎదు ర్కొంటున్న క్లస్టర్ బాంబులపై చర్చ మొదలైంది. ప్రత్యేకతలేంటి?ఏదైనా బాంబును జారవిడిస్తే అది ఒకేసారి పూర్తిగా పేలిపోతుంది. మొత్తం మందుగుండు అయిపోతుంది. కానీ క్లస్టర్ బాంబు అలా కాదు. అందులో గోళాకృతిలో చిన్న చిన్న బాంబులుంటాయి. వాటిని మోస్తున్న కస్టర్ బాంబు వార్హెడ్ను ప్రయో గించాక లక్ష్యాన్ని ఢీకొట్టడానికి కొంతదూరంలో అంటే గాల్లోనే అది పేలిపోతుంది. దాంతో అందులోని గోళాకార చిన్నపా టి బాంబులన్నీ చెల్లాచెదురు గా నలుదిక్కులా పడి పేలిపో తాయి. దీంతో వినాశనం విస్తృతస్థాయిలో ఉంటుంది. జన సమూహంపై ఈ బాంబు పడితే ఈ చిన్న బాంబులు సృష్టించే విధ్వంసం అంతాఇంతా కాదు. ఇష్టమొచ్చినట్లు అన్ని వైపులకు దూసుకెళ్లడంతో నలుచెరుగులా ఉన్న వారంతా తీవ్రస్థాయిలో లేదా మధ్యస్థాయిలో గాయపడటం ఖాయం. ఇంతటి ప్రమాదకర బాంబు కావడంతోనే చాలా దేశాలు ఈ క్లస్టర్ బాంబు వినియోగానికి దూరంగా ఉండిపోయాయి. ఇంట్లో కొంత ఎత్తు నుంచి ఒక గాజుముక్కను నేలపై పడేస్తే అది ముక్కలుచెక్కలై ఎలాగైతే గది మొత్తం పరుచుకుంటుందో ఈ క్లస్టర్ బాంబులోని పేలని ముక్కలు పరిసరాల్లోకి దూసు కెళ్లి దారుణ నష్టానికి కారణమవుతాయి. శుక్రవారం ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రయోగించిన ఒక క్లస్టర్ బాంబు ఆకాశంలో ఏడు కిలోమీటర్ల ఎత్తులో పేలిపోయి పెద్దసంఖ్యలో చిన్నబాంబులుగా మారి 8 కిలో మీటర్ల పరిధిలో వేర్వేరుచోట్ల బద్ధలయ్యాయి. బా లిస్టిక్ క్షిపణితో పోలిస్తే ఈ బాంబు తీవ్రత ఎక్కువ గా ఉంటుందని ఇజ్రాయెల్ సైనికాధికారిది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్’ వార్తాసంస్థతో చెప్పారు.పొంచి ఉన్న మరో ప్రమాదంక్లస్టర్ బాంబు పేలాక అంతటా పడిపోయే చిన్న బాంబులు అన్నీ అదే సమయంలో పేలకపోవచ్చు. పేలని ఆ కొన్నింటిని నిర్వీర్యమైనట్లు భావించకూడదు. అవి కొంతకాలం తర్వాత పేలుతాయి. అంటే యుద్ధక్షేత్రంలో ఈ క్లస్టర్ బాంబును ప్రయోగిస్తే ఆ తర్వాతకూడా అక్కడికి జవాన్లు వెళ్లాలంటే జంకాల్సిందే. ఎక్కడ పడిన బాంబు ఎప్పుడు పేలుతుందో ఎవరూ ఊహించలేరు. 2008లో వందకుపైగా దేశాలు ఐక్యరాజ్యసమితి సారథ్యంలో ఈ బాంబు వినియోగంపై నిషేధాన్ని అమల్లోకి తెచ్చాయి. 111 దేశాలు, 12 ఇతర సంస్థలు ఈ ఒప్పందంపై సంతకాలుచేశాయి. క్లస్టర్ బాంబుల ఉత్పత్తి, నిల్వ, రవాణా, వినియోగంపై నిషేధం విధించారు. అయితే ఆనాడు ఇరాన్, ఇజ్రాయెల్, రష్యా, ఉక్రెయిన్, అమెరికా ఈ ఒడంబడికకు కట్టుబడతామని ప్రకటించలేదు. ఈ లెక్కన అమెరికా సైతం ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధంలో దిగితే ఈ బాంబులను ఉపయోగించే వీలుంది. లేదంటే పరోక్షంగా ఇజ్రాయెల్కు సరఫరా చేసే అవకాశముంది. చాన్నాళ్ల క్రితం సిరియాను ఏలిన బషర్ అల్ అసద్ ప్రభుత్వం సైతం తాము అంటే గిట్టనివారిపై వీటిని విపరీతంగా వాడిందని ఆరోపణలున్నాయి. అఫ్గాన్లో అమెరికా సైతం ఇదే బాటలో పయనించిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 2006 లెబనాన్ యుద్ధంలో ఇజ్రాయెల్ ఏకంగా 40 లక్షల క్లస్టర్ బాంబులను ప్రయోగించిందని ఐక్యరాజ్యసమితి గతంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. 19 ఏళ్ల క్రితం ప్రయోగించిన క్లస్టర్ బాంబుల్లో కొన్ని ఇప్పటికీ పేలుతూ లెబనాన్ పౌరుల ప్రాణాలు హరిస్తున్నాయని స్థానిక మీడియా గతంలో ఆరోపించింది.రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలోనూ...ఆనాడు ఒప్పందంలో భాగస్వామిగా లేని రష్యా నెలలతరబడి కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంలో దానిపై విచ్చలవిడిగా వాడుతోందని తెలుస్తోంది. దీంతో రష్యాతో పోరాటంచేస్తున్న ఉక్రెయిన్కు తమ వద్ద పేరుకుపోయిన లక్షలాది క్లస్టర్ బాంబులను సరఫరాచేయాలని అమెరికా భావిస్తోంది. సమరసమయంలో పేలితే అది యుద్ధనీతిగా భావించవచ్చు. కానీ యుద్ధం ముగిశాక కూడా పేలుతూ ఇవి ఒకరకంగా పౌరహక్కులను కాలరాస్తున్నా యని మానవహక్కుల సంఘాలు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. -
హర్మూజ్ జలసంధి మూతపడితే...???
ఇజ్రాయెల్ - ఇరాన్ల మధ్య యుద్ధం ముదిరి పాకాన పడుతోంది. వారం రోజుల పరస్పర క్షిపణి దాడుల తరువాత ఇరుదేశాలిప్పుడు పైచేయి కోసం కొత్త ఎత్తుగడలు పన్నుతున్నాయి. జోక్యం చేసుకోవాలని ఒకవైపు ఇజ్రాయెల్ అమెరికాను రెచ్చగొడుతూంటే.. ఇరాన్ హర్మూజ్ జలసంధిని దిగ్బంధం చేయడం ద్వారా సమస్యను అంతర్జాతీయ చేసే ప్రయత్నాల్లో ఉంది. ఏమిటీ హర్మూజ్ జలసంధి? దాన్ని మూసేస్తే ప్రపంచానికి మరీ ముఖ్యంగా భారత్కు ఏమిటి నష్టం?(India Effects With Hormuz Block). సూయెజ్ కెనాల్... యూరప్ దేశాలను హిందూ మహాసముద్రంతో కలిపే సముద్ర మార్గం. సరుకుల రవాణాకు అత్యంత కీలకం. సూయెజ్ లాంటిదే ఈ హర్మూజ్ జలసంధి కూడా. ఇరాన్, ఒమాన్ల మధ్య ఉంటుంది. పర్షియన్ జలసంధిని ఒమాన్ జలసంధితో, అరేబియా సముద్రంతోనూ కలుపుతుంది. సూయెజ్ కెనాల్, హర్మూజ్ జలసంధులు రెండింటి ద్వారా ముడిచమురు, ఎల్ఎన్జీలు సరఫరా అవుతూంటాయి. మన దేశం సౌదీ అరేబియా, ఖతార్ తదితర మధ్యప్రాచ్చ దేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడిచమురు, ఎల్ఎన్జీ గ్యాస్లు సూయెజ్తోపాటు హర్మూజ్ జలసంధి ద్వారా రవాణా అవుతూంటాయి. ప్రపంచ చమురు రవాణాలో సుమారు తొమ్మిది శాతం సూయెజ్ కెనాల్ ద్వారా జరుగుతుంటే.. అంతకు రెట్టింపు మోతాదు హర్మూజ్ ద్వారా సాగుతూంటుంది. భారీ నౌకలు, ఆయిల్ కంటెయినర్లు ఉన్న నౌకలు వీటిని భారత్తోపాటు ఇతర ఆసియా దేశాలకు సరఫరా చేస్తూంటాయి. భారత్ తన చమురు అవసరాల్లో 80 శాతం వరకూ దిగుమతుల ద్వారా పూర్తి చేసుకుంటూ ఉంటుంది. ఇరాక్లోని బస్రా నుంచి అత్యధికంగా 20 - 23 శాతం వస్తూంటే.. రష్యా నుంచి వచ్చేది 18 - 20 శాతం వరకూ ఉంటుంది. ఇవి కాకుండా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, అమెరికా (ఆరేడు శాతం), నైజీరియా, పశ్చిమ ఆఫ్రికా, కువైట్ల నుంచి మిగిలిన ముడిచమురు కొనుగోలు చేస్తూంటాం. ద్రవరూప సహజ వాయువు (ఎల్ఎన్జీ) విషయానికి వస్తే మన దిగుమతుల్లో సగం ఖతార్ నుంచి అందుతూంటే.. అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, ఆస్ట్రేలియా, రష్యా, మొజాంబీక్ల నుంచి మిగిలిన సగం వస్తాయి. 2022 తరువాత అంటే ఉక్రెయిన్తో యుద్ధం మొదలైన తరువాత రష్యా నుంచి ఎల్ఎన్జీ దిగుమతులు కొంచెం పెరిగాయి. ఇజ్రాయెల్పై కోపంతోనో లేక ఆ దేశానికి సర్ది చెప్పగల సామర్థ్యమున్న అమెరికా పట్టించుకోవడం లేదనో ఇరాన్ కనక ఈ జలసంధిని మూసేసిందంటే.. చమురు, గ్యాస్ దిగుమతులపై ఆధారపడ్డ భారత్ లాంటి దేశాలకు చుక్కలు కనిపించడం ఖాయం!. ప్రతి రోజు హర్మూజ్ జలసంధి ద్వారా భారత్కు చేరే ముడిచమురే సుమారు 15 లక్షల బ్యారెళ్లు మరి! ఈ రవాణ ఆగిపోయిందంటే.. రోజుకు 10 నుంచి 12 కోట్ల లీటర్ల పెట్రోలు ఉత్పత్తి కాదన్నమాట. కొంచెం అటు ఇటుగా ఇది మన రోజువారీ వినియోగానికి సమానం. చమురు రవాణా నిలిచిపోవడం వల్ల డీజిల్తోపాటు అనేక ఇతర పదార్థాల ఉత్పత్తి కూడా నిలిచిపోతుంది. ఈ కొరతను ఎదుర్కొనేందుకు దేశాలు పోటాపోటీగా చమురు కొనుగోళ్లు మొదలుపెడతాయి. తద్వారా డిమాండ్ పెరిగి ఎక్కువ డాలర్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీంతో రూపాయి విలువ పడిపోతుంది. వస్తువుల ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణమూ అదుపు తప్పుతుంది.:::గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
టార్గెట్ ‘ఫోర్డో’
ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత ఫోర్డో ఫ్యూయెల్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇజ్రాయెల్ క్షిపణి దాడుల్లో ఇరాన్లోని నతాంజ్, ఇస్ఫహాన్ అణుశక్తి కేంద్రాలు చాలావరకు ధ్వంసమయ్యాయి. అక్కడ అణుబాంబులు తయారు చేసే పరిస్థితి లేకపోవచ్చని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక మిగిలిన అతిపెద్ద అణుకేంద్రం ఫోర్డో. అందుకే ఇజ్రాయెల్ సైన్యం దీనిపై గురిపెట్టింది. ఉపగ్రహ చిత్రాలను పరిశీలిస్తే ఫోర్డో అణుకేంద్రం గురించి స్పష్టంగా తెలిసిపోతోంది. కొండ చుట్టూ రహదారులు, సొరంగాల ప్రవేశ మార్గాలు, పక్కనే సహాయక భవనం, సెంట్రీఫ్యూజ్లు భద్రపర్చిన స్థలంగా భావిస్తున్న ప్రాంతం ఇందులో కనిపిస్తున్నాయి. పర్వతాల అంతర్భాగంలో అత్యంత దుర్భేద్యంగా నిర్మించిన ఫోర్డో న్యూక్లియర్ సైట్ను ధ్వంసం చేయాలంటే ఇప్పుడున్న ఏకైక మార్గం అమెరికానే. ఏమిటీ అణుకేంద్రం? అణు బాంబు తయారీపై ఇరాన్ ఎప్పటినుంచో దృష్టి పెట్టింది. అమెరికా, ఇజ్రాయెల్ సహా పశ్చిమ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా లెక్కచేయకుండా ముందుకెళ్తోంది. బాహ్య ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా ప్రయోగాలు కొనసాగిస్తోంది. ఇరాన్లో షియా ముస్లింల పవిత్ర నగరం ఖోమ్కు 20 మైళ్ల దూరంలోని ఫోర్డో అనే గ్రామం వద్ద కొండ కింద 80 నుంచి 90 మీటర్ల(262 నుంచి 295 అడుగుల) లోతున అణుకేంద్రం నిర్మించింది. దీని గురించి తొలిసారిగా 2009లో అందరికీ తెలిసింది. ఇరాన్ నుంచి కొన్ని కీలక డాక్యుమెంట్లను ఇజ్రాయెల్ నిఘా సంస్థలు చేజిక్కించుకోవడంతో ఫోర్డో గురించి కొంత సమాచారం బయటకు వచి్చంది. కానీ, 2002 నుంచే ఇక్కడ నిర్మాణాలు మొదలైనట్లు తెలిసింది. ఫోర్డోలో 2,700 సెంట్రీఫ్యూజ్లు ఫోర్డో కేంద్రంలో అణుబాంబు తయారీకి అవసరమైన సెంట్రీఫ్యూజ్లు 2,700 ఉన్నట్లు ఐఏఈఏ ఇటీవల తెలియజేసింది. 3,000 సెంట్రీఫ్యూజ్లు ఏర్పాటు చేసే వెసులుబాటు ఫోర్డోలో ఉంది. ఇరాన్ అణు శాస్త్రవేత్తలు ఇక్కడ యురేనియంను 60 శాతం వరకు శుద్ధిచేశారు. దాన్ని 90 శాతంగా మార్చడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇప్పుడున్న యురేనియంను 233 కిలోల వెపన్–గ్రేడ్ యురేనియంగా మూడు వారాల్లో మార్చొచ్చు. 9 అణు బాంబులు తయారు చేయడానికి ఈమాత్రం యురేనియం చాలు. అణ్వస్త్ర రహిత దేశమైన ఇరాన్ ఈ స్థాయిలో యురేనియం నిల్వ చేసుకోవడం ఆందోళనకరమని ఐఏఈఏ ఈ ఏడాది మే 31న పేర్కొంది. అణు బాంబు తయారీకి ఇరాన్ అత్యంత చేరువలోకి రావడమే ఇజ్రాయెల్ భయానికి అసలు కారణం. ఫోర్డో అణుకేంద్రాన్ని సర్వనాశనం చేస్తే తప్ప తమ భద్రతకు ఢోకా ఉండదని ఇజ్రాయెల్ చెబుతోంది. కానీ, అది ఇజ్రాయెల్ వల్ల సాధ్యమేనా? ప్రత్యామ్నాయ మార్గం ఇదే.. ఒకవేళ ఫోర్డోను పూర్తిగా నామరూపాల్లేకుండా చేయడం సాధ్యం కాకపోతే కనీసం నిరీ్వర్యం చేయడానికి ఒక అవకాశం ఉంది. అది ఏమిటంటే.. అణుకేంద్రం లోపలికి దారితీసే సొరంగాల ఎంట్రన్స్లను ధ్వంసం చేయడం. అలాగే గాలి ప్రసరణ కోసం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థను దెబ్బతీయొచ్చు. సొరంగాలు, విద్యుత్ సరఫరా వ్యవస్థను ధ్వంసం చేస్తే లోపల కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. అణుబాంబు ప్రయోగాలు హఠాత్తుగా ఆగిపోవచ్చు. దెబ్బతిన్న వ్యవస్థలను పునరుద్ధరించుకోవాలంటే చాలా సమయమే పడుతుంది. ఇరాన్ అణుశక్తి ప్రయోగాల్లో ఫోర్డో న్యూక్లియర్ సెంటర్ అత్యంత కీలకంగా మారింది. ఇరాన్పై జరుగుతున్న యుద్ధంలోకి అమెరికాను సైతం ఎలాగైనా లాగడానికి ఇజ్రాయెల్ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఫోర్డో అణుకేంద్రాన్ని ధ్వంసం చేయడమేనని తెలుస్తోంది. ఏకైక అస్త్రం జీబీయూ–57 పెనిట్రేటర్ బాంబుఉపరితలం నుంచి 90 మీటర్ల లోతులో రాతికొండల కింద ఉన్న అణుశక్తి కేంద్రాన్ని ధ్వంసం చేయాలంటే సాధారణ క్షిపణులు, డ్రోన్లు, బాంబులు సరిపోవు. దానికి శక్తివంతమైన బాంబు కావాలి. ఇది అమెరికా వద్ద మాత్రమే ఉంది. ఈ విషయాన్ని అమెరికాలోని ఇజ్రాయెల్ రాయబారి యెచీల్ లీటెర్ స్వయంగా చెప్పారు. సొంతంగా పనిపూర్తి చేసే సామర్థ్యం ఇజ్రాయెల్కు లేదు కాబట్టి అమెరికాపై ఆధారపడక తప్పదు. అమెరికా వద్ద జీబీయూ–57 ఆర్డినెన్స్ పెనిట్రేటర్ బాంబులు ఉన్నాయి. ఇవి భూమిలోకి దూసుకెళ్లి పేలుళ్లు సృష్టిస్తాయి. ఒక్కో బాంబు 60 మీటర్ల లోతు వరకు దూసుకెళ్లగలదు. అమెరికా వైమానిక దళానికి చెందిన బి–2 స్టెల్త్ బాంబర్ల ద్వారా జీబీయూ–57 బాంబులను ప్రయోగించాల్సి ఉంటుంది. ఫోర్డో న్యూక్లియర్ సెంటర్ను ధ్వంసం చేయాలంటే కేవలం ఒక్క బాంబు సరిపోదు. ఒకేచోట వెన్వెంటనే కనీసం రెండు బాంబులు ప్రయోగిస్తేనే ఆశించిన ఫలితం ఉంటుంది. మొదటి బాంబు 60 మీటర్ల వరకు వెళ్లి పేలుడు జరిగిన వెంటనే మరో బాంబును ప్రయోగించాలని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. రిపీటెడ్ స్ట్రైక్స్ తప్ప మరో మార్గం లేదని అమెరికా ఎయిర్ఫోర్స్ మాజీ కల్నల్ సెడ్రిక్ లైటన్ తెలిపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
డూమ్స్డే ఎయిర్క్రాఫ్ట్ రెడీ!
వాషింగ్టన్: అత్యంత అరుదైన సందర్భాల్లో వాడే శత్రు దుర్భేద్య ఈ–4బీ రకం విమానం హఠాత్తుగా అగ్రరాజ్య గగనతలంలో కనిపించి ఆశ్చర్యానికి గురిచేసింది. యుద్ధంలో ఇరాన్పై అమెరికా బాంబులేస్తే ప్రతిదాడిగా ఇరాన్ సైతం అమెరికాపై బాంబుల వర్షం కురిపించొచ్చు. అలాంటి సందర్భాల్లో భూమిపై ఎక్కడా దిగకుండా గాల్లో చక్కర్లు కొడుతూనే అమెరికా రక్షణ మంత్రిసహా కీలక ఉన్నతాధికారులు పాలన సాగించేందుకు ఈ విమానాన్ని వినియోగిస్తారు. ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకోబోతోందన్న వార్తల నడుమ ఈ అధునాతన లోహవిహంగం ప్రత్యక్షమవడం గమనార్హం. ఈ విమానాన్ని బోయింగ్ 747–200బీ మోడల్లో మార్పులు చేసి తయారు చేశారు. అమెరికాలో యుద్ధంవస్తే అంటే ప్రళయకాలంలో వాడే విమానంగా దీనికి డూమ్స్డే ఎయిర్క్రాఫ్ట్ అనే పేరుంది. దీనిని ‘నైట్వాచ్’, ‘ఫ్లయింగ్ పెంటగాన్’ అని మారు పేర్లు కూడా ఉన్నాయి. ఈ విమానం మంగళవారం లూసియానాలోని బోస్సియర్ వైమానిక స్థావరం నుంచి మేరీల్యాండ్లోని జాయింట్ బేస్ ఆండ్రూస్కు చేరుకుంది. ఎన్నెన్నో ప్రత్యేకతలు.. ఈ విమానం ఏకధాటిగా 7,000 మైళ్ల దూరం ప్రయాణించగలదు. సిబ్బంది సహా 112 మంది వరకు ప్రయాణించే సదుపాయం ఉంది. గతంలో ఈ విమానం అత్యధికంగా ఏకధాటిగా 35 గంటలపాటు ఎగిరింది. శత్రుదాడులను తట్టుకునేలా అంటే సైబర్ దాడులు, అణుబాంబుపేలుళ్ల ప్రకంపనలు, విద్యుదయస్కాంత ప్రభావాలకు లోనుకాకుండా దీనిని పటిష్టంగా నిర్మించారు. న్యూక్లియర్, థర్మల్ కవచాలు దీనికి తొడిగారు. గాల్లో ప్రయాణిస్తూనే ఇందులోని అధికారులు ప్రపంచం నలుమూలల ఉన్న స్వదేశీ, విదేశీ నేతలు, అధికారులకు ఆదేశాలు జారీచేయొచ్చు. దీనిలో ఏకంగా 67 ఉపగ్రహ డిష్ వ్యవస్థలు ఉన్నాయి. యుద్ధవిమానంగానూ.. అత్యవసర సందర్భాల్లో యుద్ధవిమానంగానూ మారిపోతుంది. వెంటబడే శత్రు విమానాలపై బాంబులను ప్రయోగించగలదు. మళ్లీ ల్యాండింగ్ చేయాల్సిన పనిలేకుండా గాల్లోనే ఇంధనాన్ని నింపుకోగలదు. ఈ మొత్తం విమానంలో ఉన్నతాధికారుల విశ్రాంతి కోసం 18 పడకలు ఉన్నాయి. కీలక నిర్ణయాలు తీసుకునేందుకు పెద్ద సమావేశ గది ఏర్పాటుచేశారు. ఈ విమానం మొత్తంగా మూడు అంతస్తుల్లో ఉంటుంది. 9/11 దాడుల తర్వాత ఈ సిరీస్ విమానంలో నాటి అధ్యక్షుడు జార్జ్ బుష్ పలుమార్లు ప్రయాణించారు. 1995లోనూ హరికేన్ ఓపెల్ ఘటన సమయంలో ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఉన్నతాధికారులు ఇందులోంచే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమెరికా వాయుసేనలో ఇలాంటివి నాలుగు విమానాలు ఉన్నాయి. యుద్ధ సన్నద్థతను పరీక్షించేందుకే ఈ విమానాన్ని వాషింగ్టన్కు తీసుకొచ్చారని అంతర్జాతీయ మీడియా తెలిపింది. -
తోడబుట్టిన బలగం
‘శత్రువులు ఎక్కడో ఉండరు’ అని ఒక సినిమా డైలాగ్. ఇంట్లో టీవీ రిమోట్ కోసం ఫైటింగ్జరిగేది ఆ ‘శత్రువుల’తోనే! ఇంట్లో ప్రతిదానికీ పోటీ ఉండేది ఆ ‘శత్రువుల’ మధ్యనే! ఇంతగా ఫైటింగ్ చేస్తారా.. ఇంట్లో పెద్దవాళ్లకు తెలియకుండా జాడీ పగలగొట్టేసినప్పుడు, ఆ విషయాన్ని దాచి పెట్టటానికి తోడుదొంగలయ్యేది మళ్లీ ఆ‘శత్రువులే’! వాళ్లెవరంటారా, ఇంకెవరు? తోబుట్టువులు! కొండంత ధైర్యం.. అమెరికాకు చెందిన బ్రిగమ్ యంగ్ యూనివర్సిటీ 395 కుటుంబాలను కలిసి చేసిన అధ్యయన ఫలితాల్లో అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత, శ్రద్ధ కరువైనప్పటికీ తోబుట్టువులతో బలమైన బంధాలు ఉంటే, కౌమారదశలో నిరాశ, ఆందోళన, ఒంటరితనం అనేవి ఆవరించే అవకాశం 60 శాతం వరకు తక్కువగా ఉంటుందట. తోబుట్టువులు ఉన్నవారు మనోవ్యథల నుంచి వేగంగా కోలుకుంటారు. మానసిక అనారోగ్యాలకు భయపడిపోకుండా ధైర్యంగా పోరాడతారు. సామాజికంగానూ మెరుగైన సంబంధాలను ఏర్పరచుకుంటారు. అసలు తోబుట్టువులంటూ ఉంటే చాలు.. వాళ్ల బంధం గట్టిగా లేకున్నా వాళ్లు ఉన్నారన్న ధైర్యమే భావోద్వేగాల పరంగా ముఖ్యపాత్ర వహిస్తుందట.మైగ్రేన్లు, రక్తపోట్లు రావు.. తోబుట్టువులుంటే ఉండే ఆ ధీమా బాల్యంతోనే ఆగిపోదు. యవ్వనం, వృద్ధాప్యం వరకూ కూడా మన వెంట వస్తుంది. ఇల్లినాయ్ విశ్వవిద్యాలయ అధ్యయనం ప్రకారం కనీసం ఒక తోబుట్టువైనా ఉన్న వ్యక్తులు సామాజికంగా గణనీయమైన సామర్థ్యాలను కలిగి ఉంటారు. బయటి పోటీ ప్రపంచంలో బలమైన వ్యక్తుల మధ్య తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. తోబుట్టువులు మాట్లాడుకుంటారు, విభేదిస్తారు. వాదించుకుంటారు, పోటీ పడతారు, రాజీపడతారు.. ఇవన్నీ కూడా వారికి మేలే చేస్తాయి తప్ప కీడు చేయవు. ఈ సందర్భంగా వచ్చే ఆలోచనలు, మానసిక పరిపక్వత వంటివి భవిష్యత్తులో ఉద్యోగం, వివాహం, స్నేహం తదితర సంబంధాల్లో వచ్చే సమస్యల పరిష్కారానికి తెలివిడి కలిగిన మార్గాన్ని ఏర్పరుస్తాయట. బ్రిటన్కు చెందిన ‘ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్’ పరిశోధన కూడా.. తోబుట్టువులతో దగ్గరి సంబంధాలు ఉన్న పెద్దలు జీవితంలో సంతృప్తిగా ఉన్నట్లు కనుగొంది. తోబుట్టువులతో దృఢమైన అనుబంధాలు కలిగి ఉన్న పెద్దలు మైగ్రేన్లు, అధిక రక్తపోటుతో సహా, ఒత్తిడి సంబంధిత అనారోగ్యాలకు 20–25 శాతం తక్కువగా గురవుతారని 2019 సైకలాజికల్ సైన్స్ అధ్యయనం వెల్లడించింది.మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా తోబుట్టువుల బాంధవ్యాలకు ప్రాముఖ్యం ఉంది. జర్మనీలో, మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ చేసిన సుదీర్ఘ అధ్యయనాలు – కనీసం ఒక తోబుట్టువు ఉన్న వ్యక్తులు పెద్దయ్యాక చక్కని సామాజిక సంబంధాలను కలిగి ఉండే అవకాశం 45 శాతం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించాయి. కుటుంబ గౌరవం, పెద్దల సంరక్షణకు పెద్దపీట వేసే జపాన్ లో.. తోబుట్టువులు తరచూ సంరక్షణ పాత్రలను పోషిస్తుంటారు. సాధారణంగా తండ్రి లేదా తల్లి లేని సింగిల్ పేరెంట్ కుటుంబాల్లో పిల్లలు అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కానీ, అమెరికాలో ‘చైల్డ్ డెవలప్మెంట్ జర్నల్’లో వచ్చిన పరిశోధనా వ్యాసం – సింగిల్ పేరెంట్ కుటుంబాల పిల్లల్లో.. తోబుట్టువులు ఉన్నవారు ఇలాంటి సమస్యలు లేకుండా ఉన్నారని, తోబుట్టువుల అండే అందుకు కారణమని వెల్లడించింది. తోడున్నవాళ్లూ తోబుట్టువులే!.. ఇదంతా చదివాక, ‘అరే, నాకు తోబుట్టువులు లేరే’ అని డీలా పడిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. తోబుట్టువులు లేని వాళ్లు కూడా –తోబుట్టువులతో ముడిపడి ఉన్న భావోద్వేగ ప్రయోజనాలను, ముఖ్యంగా మెంటల్ సపోర్ట్ను.. స్నేహితులు, బంధువులు లేదా దీర్ఘకాలం రూమ్మేట్లుగా ఉన్న ‘తోబుట్టువుల లాంటి’ వారి ద్వారా పొందవచ్చని నిపుణులు అంటున్నారు. ఒకే రక్తాన్ని పంచుకుపుట్టకపోవడం అన్నది ప్రతికూలాంశం ఏమీ కాబోదని, జన్యువులతో సంబంధం లేకుండా కూడా తోబుట్టువులు దొరకొచ్చని కూడా పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ లెక్కన చూస్తే ప్రాణ స్నేహితులు కూడా ఒకరకంగా తోబుట్టువులే.తోబుట్టువులు ఉంటే చాలు..» తోబుట్టువులు ఉన్నవారు ఒత్తిడికి గురయ్యే అవకాశాలు 60 శాతం తక్కువ (బ్రిగమ్ యంగ్ యూనివర్సిటీ)» తోబుట్టువులు ఉన్నవాళ్లకు రాజీపడటం, దీర్ఘకాల అనుబంధాలను కొనసాగించటం వంటి నైపుణ్యాలు అలవడతాయి. (యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయ్)» తోబుట్టువులతో బాల్యంలో చక్కటి సంబంధాలు ఉన్న పెద్దల్లో ఒత్తిడి సంబంధ అనారోగ్యాలు 2025 శాతం వరకు తక్కువ (సైకలాజికల్ సైన్స్) తాజా పరిశోధన ప్రకారం.. బాల్యంలో ఈ తోబుట్టువులు ఎంత కొట్టుకున్నా... పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఒకరికొకరు అండగా, ఆలంబనగా ఉంటారట. మీకో తోబుట్టువు ఉంటే, మీ లోపల మీకు ఎప్పటికీ ఒక తోడు ఉన్నట్లేనని పరిశోధకులు అంటున్నారు. ఇదెలాగంటే –అక్క అమ్మగా మారిపోయి అక్కునచేర్చుకుంటుంది. తమ్ముడు టెక్నాలజీలో కింగ్ అయిపోయి అన్నగారి సందేహాలను తీరుస్తాడు.– సాక్షి, స్పెషల్ డెస్క్ -
కోహినూరు వజ్రం కాకతీయులదే!
ఖిలా వరంగల్: కాకతీయుల పాలన స్వర్ణయుగం అంటారు. ఓరుగల్లును రాజధానిగా చేసుకుని గణపతిదేవ చక్రవర్తి 1199 నుంచి 1262 వరకు సుదీర్ఘకాలం పరిపాలించాడు. కళింగ, వేంగి రాజవంశమైన తూర్పు గంగాల నుంచి 13వ శతాబ్దంలో కోహినూరు వజ్రం కాకతీయుల చెంతకు చేరింది. వారికి అత్యంత విలువైన ఆస్తులలో ఒకటిగా నిలిచింది. రాణిరుద్రమదేవి తన తండ్రి నుంచి కోహినూరును వారసత్వంగా పొందింది. ఆమె దానిని తొలుత భద్రకాళి దేవికి అలంకరణ కోసం అంకితం చేయగా.. ఆ తర్వాత కాకతీయులు ఆ వజ్రాన్ని రాజధాని పరిపాలనా భవనంలో ఉంచి తమ శక్తి ప్రతిష్టకు ప్రతీకగా ఉపయోగించారు. కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు క్రీస్తుశకం 1310లో ఢిల్లీ సుల్తాన్ పంపిన మాలిక్కాపుర్తో సంధి చేసుకుని అపారమైన సంపదతోపాటు కోహినూరు వజ్రాన్ని సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు, ప్రస్తుతం పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం కొల్లూరు గనులలో ఓ వితంతువుకు ఆ వజ్రం దొరికిందని, గ్రామ పెద్ద ద్వారా గణపతిదేవ చక్రవర్తి కోహినూరు వజ్రాన్ని బహుమతిగా అందుకొని మొదటి యజమాని అయ్యారని ఓ కథనం. అతడు కాకతీయుల ఆరాధ్య దైవమైన శ్రీభద్రకాళి, తర్వాత కాకతీదేవి విగ్రహానికి నుదుటన అలంకరించి ఆరా«ధన చేశారని చరిత్ర చెబుతోంది. విలువైన వజ్రం.. ప్రపంచంలోనే విలువైన వజ్రాల్లో కోహినూరు ఒకటి. కోహినూరు వజ్రం కోసం చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. కోహినూరు వజ్రం చరిత్ర చుట్టూ కూడా ఎన్నో వివాదాలు ఉన్నాయి. అయితే, భారత్లోని తెలుగు నేలపై దొరికిన ఈ వజ్రం ఎన్నో రాజవంశాల చేతులు మారింది. చివరకు భారత్ నుంచి బ్రిటన్ చేరుకుంది. అక్కడి రాజకుటుంబానికి వారసత్వ సంపదగా మారింది. కోహినూరు వజ్రాన్ని తిరిగి భారత్కు అప్పగించాలని భారత ప్రభుత్వం గట్టిగా డిమాండ్ చేసింది. అలాంటి కోహినూరు వజ్రం తెలుగు నేలపై ఎక్కడ దొరికింది, ఇది బ్రిటన్ ఎలా చేరింది వంటి వివరాలను ఒకసారి తెలుసుకుందాం..! తెలుగు నేలపై .. వివాదాస్పద చరిత్ర కలిగిన కోహినూరు వజ్రం మూలాలు మిస్టరీగానే ఉన్నాయి. కోహినూరు వజ్రం సృష్టి.. దాని ప్రారంభ చరిత్ర చుట్టూ అనేక కథనాలు ఉన్నాయి. కోహినూరు అనేది పర్షియన్ పదం.. భాషా పరంగా కోహ్–ఇ–నూర్ అని రాయబడింది. దాని అర్థం కాంతి పర్వతం. కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడికి ఆంధ్రప్రదేశ్లోని నేటి గుంటూరు జిల్లా కొల్లూరు గనిలో లభించిన కోహినూర్ వజ్రం బహుమతిగా లభించింది. కాకతీయుల నుంచి ఖిల్జీ చేతికి.. చాలా మంది చరిత్రకారుల ప్రకారం కోహినూర్ వజ్రం కాకతీయ రాజవంశం పాలనలో కాకతీయుల ఆరాధ్యదైవమైన కాకతీమాత దేవతకు కన్నుగా ప్రతిష్టించబడింది. 14వ శతాబ్దం ప్రారంభంలో టర్కిక్ ఖిల్జీ రాజవంశం సైన్యం దోపిడీ కోసం దక్షిణ భారతదేశ రాజ్యాలపై దాడి చేయడం ప్రారంభించింది. 1310లో అల్లావుద్దీన్ ఖిల్జీ తన జనరల్ మాలిక్ కాపుర్ వరంగల్పై దాడి చేయగా.. ప్రతాపరుద్రుడు అపార సంపదతోపాటు కోహినూరు వజ్రాన్ని అప్పగించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. దీనికి మరో కథనం .. ప్రతాపరుద్రుడి పాలనలో కోహినూరు వజ్రం గోల్కొండ కోటలో ఉండేది. అయితే కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు క్రీస్తుశకం 1310లో ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ పంపిన మాలిక్ కాపుర్తో సంధి చేసుకుని అపారమైన సంపదతోపాటు కోహినూర్ వజ్రాన్ని వారికి సమర్పించారు. అయితే ఆతర్వాత కోహినూరు వజ్రం .. ఒక రాజవంశం నుంచి మరొక రాజవంశానికి చేరి చివరకు మొఘల్లకు చేరింది. అక్కడ నుంచి వజ్రం ఎలా చేతులు మారిందనేది చాలా స్పష్టంగా ఉంది. అలా ఢిల్లీ చేరిన వజ్రం పలు రాజవంశాల చేతులు మారుతూ ఇబ్రహీం లోడి చేతికి చేరింది. మొదటి పానిపట్టు యుద్ధంలో మొఘల్ రాజవంశ స్థాపకుడైన బాబర్ చేతిలో ఇబ్రహీంలోడి ఓటమి పాలై మరణించిన తర్వాత మొదటి మొఘల్ పాలకుడు బాబర్ కోహినూరును స్వాదీనం చేసుకున్నాడు. కోహినూరు వజ్రం సింహాసనం పైభాగంలో మెరిసే రత్నపు నెమలి తలపై ఉంచారు. మొఘల్ నుంచి పర్షియన్ చేతికి.. 1739లో పర్షియన్ పాలకుడు నాదిర్షా మొఘల్ సామ్రాజ్యంపై దండెత్తి ..వారిని ఓడించాడు. అప్పుడు ఢిల్లీని దోచుకున్నాడు. ఢిల్లీ సుల్తానులు, మొఘల్ చక్రవర్తులు శతాబ్దాలుగా పోగు చేసిన అపారమైన సంపదను తన వశం చేసుకున్నాడు. తనతో కోహినూరు వజ్రాన్ని కూడా తీసుకువెళ్లాడు. నాదిర్షా ఆవజ్రాన్ని చూడగానే .. కోహ్–ఇ–నూర్ అని నామకరణం చేశారు. అప్పటి నుంచి ఆ వజ్రానికి కోహినూరు అనే పేరు వచ్చింది. అఫ్గాన్ నుంచి సిక్కుపాలకులు.. నాదిర్షా నుంచి కోహినూరు వజ్రం అహ్మద్ ఖాన్ అబ్దాలీతో ప్రస్తుత అఫ్గానిస్తాన్ (1747–1856)లోని దుర్రానీ రాజు చేతికి చేరుకుంది. అతను షా యొక్క కమాండర్. అనంతరం పర్షియన్లతో విడిపోయాడు. తన అదీనంలో ఉన్న కోహినూర్తో అతను 1747తో అఫ్గాన్ ప్రజలందరికీ పాలకుడిగా పట్టాభిషిక్తుడయ్యాడు. అహ్మద్ షా అబ్దాలీ పేరును స్వీకరించాడు. అతను 1747లో మొదటి ఆధునిక అఫ్ఘన్ రాజ్యాన్ని స్థాపించాడు. వజ్రం దాదాపు ఏడు దశాబ్దాల పాటు అక్కడే ఉంది. 1813లో అబ్దాలీ బహిష్కరించబడిన వారసుడు షా షుజా.. ఆశ్రయం కోసం కోహినూరును సిక్కు పాలకుడు మహారాజా రంజిత్సింగ్కు అప్పగించారు. దీంతో కోహినూరు వజ్రం భారత దేశానికి తిరిగి వచ్చింది. ఈ సమయంలోనే కోహినూరు వజ్రం అంచనా విలువ బ్రిటిష్ వారిని ఆకర్షించింది. 1849లో రెండో ఆంగ్లో సిక్కు యుద్ధంలో సిక్కు ఓటమి తర్వాత రంజిత్సింగ్ వారసుడు దులీప్ సింగ్ యుద్ధ ఒప్పందంలో భాగంగా కోహినూరును బ్రిటిష్ వారికి అప్పగించారు. 1851లో లండన్కు.. కోహినూర్ సిక్కుల చేతి నుంచి బ్రిటిష్ చేతిలోకి వెళ్లింది. 1851లో కోహినూరు లండన్లోని గ్రేట్ ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు ఉంచారు. ఆ ప్రదర్శన తర్వాత దాని రూపాన్ని మెరుగుపరచడానికి రాయిని కత్తిరించి పాలిష్ చేశారు. కోహినూరును కత్తిరించి పాలిష్ చేసిన తర్వాత అది కిరీట ఆభరణాల్లో భాగమైంది. క్వీన్ విక్టోరియా దీనిని గౌన్కు కుడివైపున బ్రోచ్గా (వజ్రం) ధరించారు. ఆతర్వాత సంవత్సరంలో కోహినూరు వజ్రం.. రాజకుటుంబీకుల కిరీటాల్లో కూడా కనిపించింది. ఈ వజ్రాన్ని రాజకుటుంబం తమ ఇంటి పెద్ద కోడలికి వారసత్వంగా అందజేశారు. ప్రపంచంలో అత్యంత విలువైన కోహినూరు వజ్రాన్ని తిరిగి ఇవ్వాల్సిందిగా బ్రిటన్ను భారత ప్రభుత్వం చాలాసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం కనిపించలేదని చరిత్ర చెబుతోంది. -
టీవీలకు కనెక్ట్ అవుతున్నారు!
‘ఓటీటీలో కొత్తగా ఏ సినిమాలు, వెబ్ సిరీస్ వచ్చాయో?’.. ‘ఆ హీరో, హీరోయిన్ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా’.. ఎవరి నోట విన్నా ఇప్పుడు ఇవే మాటలు. ఇంటర్నెట్తో పనిచేసే కనెక్టెడ్ టీవీ ఉంటే చాలు.. ఎంచక్కా ఇంట్లో కూర్చుని నచ్చిన సినిమాను, సిరీస్ను తమకు అనుకూలమైన సమయంలో ఆస్వాదిస్తున్నారు. ఈ కనెక్టెడ్ టీవీలు ఇప్పుడు పల్లెలకూ విస్తరిస్తున్నాయి. 2025 జనవరి–మార్చిలో కొత్తగా 3.5 కోట్ల కనెక్టెడ్ టీవీ వ్యూయర్లు పెరిగారని కాంటార్ మీడియా కంపాస్ నివేదిక వెల్లడించింది. ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు ఇప్పుడు కంటెంట్ కోసం డిజిటల్ ప్లాట్ఫామ్లపై ఆధారపడుతున్నారట.ఇంటర్నెట్ విస్తృతి మనదేశంలో కేవలం స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగేందుకే పరిమితం కాలేదు. కనెక్టెడ్ టీవీల జోరుకూ దోహద పడుతోంది. దాంతో సంప్రదాయ టీవీ వీక్షణ నుంచి డిజిటల్ వైపు జనం మళ్లుతున్నారు. దేశవ్యాప్తంగా మూడు నెలల్లోనే కనెక్టెడ్ టీవీ వీక్షకులు కొత్తగా 3.5 కోట్ల మంది తోడవడమే దీనికున్న క్రేజుకు నిదర్శనం. యువ వీక్షకులు సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడం, ఓవర్ ద టాప్ (ఓటీటీ) జోరు, టెలికం కంపెనీల చవక బ్రాడ్బ్యాండ్ ప్యాక్స్, స్మార్ట్ టీవీలు అందుబాటు ధరలో లభించడం.. వెరసి కనెక్టెడ్ టీవీల సంఖ్య దేశంలో దూసుకుపోతోంది. తీరిక సమయంలో చూసేస్తున్నారుఅమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, ఆహా, జియో హాట్స్టార్ వంటి ఓటీటీ యాప్స్ ద్వారా ఆన్–డిమాండ్ కంటెంట్ను ఆస్వాదించేందుకు కనెక్టెడ్ టీవీ వీలు కల్పిస్తుంది. ఇంటర్నెట్ ఆధారిత కనెక్టెడ్ టీవీల్లో వీక్షకులు తమకు వీలున్న సమయంలో నచ్చిన కంటెంట్ను వీక్షించే సౌలభ్యం ఉంటుంది. భారత్లో పూర్తి డిజిటల్ టీవీ వీక్షకులు 23 శాతం ఉన్నారు. సంప్రదాయ టీవీకి వీరు దూరం. కేబుల్, ఉపగ్రహం, ఓవర్ ద ఎయిర్ సిగ్నల్స్ ద్వారా నిర్దిష్ట సమయం ప్రకారం ప్రసారమయ్యే కార్యక్రమాల వీక్షణకే సంప్రదాయ టీవీ పరిమితం అవుతుంది. 58% మంది భారతీయులు ఇప్పటికీ ప్రతి నెలా సంప్రదాయ టీవీ వీక్షణపై ఆధారపడుతున్నారు. పాత తరం జనాభాలో సంప్రదాయ టీవీకి ఇప్పటికీ ప్రజాదరణ కొనసాగుతోంది. యువతరం డిజిటల్కు..మీడియా ప్రాధాన్యతలలో తరాలనుబట్టి అంతరం స్పష్టంగా కనిపిస్తోంది. 15–34 సంవత్సరాల వయస్సు గలవారిలో.. అంటే జనరేషన్ జెడ్ (13–28 ఏళ్ల మధ్య ఉన్నవారు), యంగ్ మిలీనియల్స్ (29–34 ఏళ్ల మధ్య ఉన్నవారు) డిజిటల్, ఓటీటీని 55%, సోషల్ మీడియాను 57% మంది ఇష్టపడుతున్నారు.45 ఏళ్లకుపైగా వయసున్న వారిలో 44% మంది ఇంటర్నెట్ ఆధారిత ఇతర కార్యక్రమాల కంటే సంప్రదాయ టీవీ వీక్షణకే మొగ్గు చూపుతున్నారు. కుటుంబంతో కలిసి చూడగలిగే ఆరోగ్యకర షోలను లక్ష్యంగా చేసుకునే వీడియో స్ట్రీమింగ్ కంపెనీల కంటెంట్, మార్కెటింగ్ వ్యూహాలను పట్టణ ప్రాంతాల్లో కనెక్టెడ్ టీవీ సెట్ల పెరుగుదల ప్రభావితం చేస్తోంది. గ్రామీణ భారతం హవాగ్రామీణ వాసులు సంప్రదాయ టీవీనే చూస్తున్నారనుకుంటే పొరపాటే. గ్రామీణ భారతం ఒక మీడియా పవర్హౌస్గా అవతరించింది. పాత అంచనాలను బద్దలు కొడుతూ గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ వీక్షకులు 74%, సంప్రదాయ వీక్షకులు 75% ఉన్నారు. కనెక్టెడ్ టీవీ మెట్రోలకే పరిమితం కాలేదని.. పట్టణ, గ్రామీణ ప్రేక్షకులను సమానంగా చేరుకుంటోందని కాంటార్ నివేదిక స్పష్టం చేసింది. ఇక ప్రకటనల విషయానికొస్తే విభిన్న ప్రేక్షకులను వేర్వేరు సందేశాలతో చేరుకోవడానికి కనెక్టెడ్ టీవీ ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుందని వినోద పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. కుటుంబ సమేతంగా ఈ కనెక్టెడ్ టీవీలో సినిమాలూ, వెబ్ సిరీస్లూ చూడటం కూడా పెరిగింది. ముఖ్యంగా పండుగలు, సెలవు రోజుల్లో కనెక్టెడ్ టీవీ గ్రామీణ ప్రాంతాల్లోనూ వినోద కేంద్రంగా మారిందని వారు అంటున్నారు. -
మ్యాట్రిక్స్తోనే డేటాలో 'కిక్'
ఐటీ సెక్టార్లో డేటాసైన్స్ తికమక పెడుతోంది. ఫ్రెషర్స్ ఆ స్పీడ్ను అందుకోలేకపోతున్నారు. ఏడాది గడచినా డేటా ఆనుపానులు బుర్రకెక్కడం లేదు. దీంతో కొత్తగా చేరినవారు బెంచ్ మీదే కాలక్షేపం చేయాల్సి వస్తోంది. ఈ పరిస్థితి ఐటీ ఫ్రెషర్స్లో ఆందోళన రేపుతోంది. ప్రాజెక్టు రాకుంటే ఉద్యోగం నిలబడటం కష్టమే. దేశవ్యాప్తంగా డేటాసైన్స్ చదువుతున్నవారు ఏటా 3.5 లక్షల మంది ఉన్నారు. వీరిలో 80 వేల మందికే డేటా అనలిస్టులుగా ఉద్యోగాలొస్తున్నాయి. వీళ్లలో సగటున 20 వేల మందికే నైపుణ్యం ఉంటోంది. మిగిలిన 60 వేల మంది బెంచ్ మీదే ఉంటున్నారని ఇటీవల నాస్కామ్ వెల్లడించింది. -సాక్షి, హైదరాబాద్కారణాలేంటి?డేటాసైన్స్కు ఆయువు పట్టు గణితం. గణితంపై పట్టు సాధించాలంటే పాఠశాల స్థాయి నుంచే కష్టపడాలి. ఇంటర్లో లోతుగా అధ్యయనం చేయాలి. ముఖ్యంగా మ్యాట్రిక్స్పై పట్టు ఉండాలి. ప్రాబబులిటీస్ను ఏ రూపంలో ఉన్నా చేయగల సమర్థత ఉండాలి. కానీ ఇంటర్లోనే మ్యాట్రిక్స్, కాలిక్యులేషన్స్ను సాదాసీదాగా తీసుకుంటున్నారు. కాలేజీల్లో పరీక్ష కోసం మాత్రమే గణితం ప్రాక్టీస్ చేయిస్తున్నారు. సబ్జెక్టు లోతుల్లోకి వెళ్లడం లేదు. ఒకటి రెండు మెథడ్స్తో సరిపుచ్చుతున్నారు. ఇదే విద్యార్థులకు శాపంగా మారుతోంది. ఇంజనీరింగ్లో ఈ విధానం పనికిరాదని అధ్యాపకులు అంటున్నారు. డిజిటల్ ఎలక్ట్రానిక్స్, డేటా స్ట్రక్చర్, డిస్క్రియేట్ మేథమెటిక్స్, ఆల్గరిథమ్ డిజైన్ అండ్ అనాలిసిస్ వంటి చాప్టర్స్లో రాణించాలంటే ఇంటర్ పునాది గట్టిగా ఉండాలి. మ్యాట్రిక్స్పై పూర్తి అవగాహన ఉండాలి. బిగ్ డేటా అనాలిసిస్లో డిజిటల్ డిజైనింగ్లో డేటా విశ్లేషణ క్షణాల్లో శరవేగంగా మారుతుంది. ఐటీ సెక్టార్లో డేటా స్పీడ్ మరింత వేగంగా ఉంటుంది. దీన్ని విశ్లేషించే వేగం ఇంజనీరింగ్ ఫ్రెషర్స్కు ఉండటం లేదని ఐటీ పరిశ్రమ అంటోంది.గురి పెట్టకుంటే గోవిందా..ప్రపంచవ్యాప్తంగా డేటా అనలిస్టులకు డిమాండ్ పెరుగుతోంది. అమెరికా ఇప్పటికే 5,381 బిగ్ డేటా కేంద్రాలు ఏర్పాటు చేసింది. మనదేశంలో 870 కేంద్రాలు ఉన్నాయి. మరో మూడేళ్లలో ఇవి 1,800కు చేరబోతున్నాయి. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై కార్పొరేట్ కంపెనీలు రూ.వేల కోట్లు ఖర్చు పెడుతున్నాయి. మన దేశంలో ఈ ఏడాది చివరి నాటికి 15 లక్షల మంది డేటా అనలిస్టుల అవసరం ఉందని ఐటీ కంపెనీలు చెబుతున్నాయి.ప్రస్తుతం ఉన్నది 4.5 లక్షల మందే. దీన్ని దృష్టిలో పెట్టుకుని డేటాసైన్స్లో నాణ్యత పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. డేటా వేగాన్ని పెంచేలా మైండ్సెట్ను కేంద్రీకరించే తీరును టెన్త్ నుంచే తీసుకురావాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రాబబులిటీస్, మ్యాట్రిక్స్ విభాగాలపై ప్రత్యేక దృష్టి పెంచాలని సూచిస్తున్నారు. ఇంజనీరింగ్ డేటా సైన్స్ చేసే విద్యార్థులు కూడా డేటా నిపుణుల వద్ద ప్రత్యేక తర్ఫీదు తీసుకోవాలని, ఆన్లైన్ కోర్సుల ద్వారా నైపుణ్యం పెంచుకోవాలని చెబుతున్నారు. గణితమే కీలకండేటాసైన్స్కు కీలకం మేథమెటిక్స్. ముఖ్యంగా మ్యాట్రిక్స్పై పట్టు ఉంటేనే డేటా అనాలిసిస్లో రాణిస్తారు. ఇంటర్లోనే మేథ్స్పై సమర్థత ఎంత అనేది బేరీజు వేసుకోవాలి. ప్రాబబులిటీ, మ్యాట్రిక్స్పై ఆసక్తి ఉంటేనే డేటాసైన్స్ వైపు వెళ్లడం మంచిది. – డాక్టర్ కేపీ సుప్రీతి, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి, జేఎన్టీయూహెచ్స్పీడ్ లేకుంటే కష్టమేడేటాసైన్స్పై శరవేగంగా పనిచేసే సమర్థత ఉండాలి. కొన్నిసార్లు అర్థం చేసుకోవడం కష్టమే. కాలిక్యులేషన్ వేగంగా ఉంటే తప్ప కంప్యూటర్ పరుగును అందుకోలేం. ఇంజనీరింగ్ స్థాయిలోనే డేటాసైన్స్లో మెళకువలు నేర్చుకోవడమే కాదు, వాటిని ప్రాక్టీస్ కూడా చేయాలి. – కంకిపాటి శేషగిరిరావు, ఐటీ రంగ నిపుణుడు -
ఒక్కమాటే..మంత్రము
మనం ఆన్లైన్లో ఏదైనా కొనాలన్నా.. ఆహారం ఆర్డర్ చేయాలన్నా.. బైక్/కారు బుక్ చేయాలన్నా.. ఏ భాషలోనైనా సమాచారం కావాలన్నా.. ఇకమీదట ఫోన్లో టైప్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. నేరుగా ఏం కావాలో ‘మాట’ మాత్రంగా చెప్తే చాలు.. పని జరిగిపోతుంది. దేశంలోని అన్ని భాషలనూ అర్థం చేసుకుని, ఆయా భాషల్లో సేవలు అందించే ‘వాయిస్ ఏఐ’ రోజులు వస్తున్నాయి. ఇందుకోసం భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన ‘ఇండియా ఏఐ మిషన్’ జోరందుకుంది. రోజువారీ పనులను చక్కబెట్టుకోడానికీ ‘వాయిస్ ఏఐ’ అనే కృత్రిమ మేధ మనకోసం ‘కార్యేషు కమాండర్’లా సిద్ధం కాబోతోంది. – సాక్షి, స్పెషల్ డెస్క్దేశంలో ప్రస్తుతం ఉన్న 90 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు, గ్రామాల్లో.. ఇంగ్లీష్ వ్యాప్తి తక్కువగా ఉంటుంది. డిజిటల్ అక్షరాస్యత ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. ఈ ప్రాంతాల్లోని వారు వాయిస్ కమ్యూనికేషన్ ద్వారా తమ పనులు చక్కబెట్టేందుకు ఇష్టపడుతున్నారు. ఇలా టెక్స్›్టను టైప్ చేయటానికి ఇష్టపడని, లేదా టైప్ చేయటం రాని వారి కోసం ఒక సరళమైన, స్పష్టమైన ‘వాయిస్ ఇంటరాక్షన్’ విధానాన్ని వృద్ధి చేసేందుకు భారతీయ కృత్రిమ మేధ (ఏఐ) స్టార్టప్ కంపెనీలు కృషి చేస్తున్నాయి.చెబితే చాలు... చేసి పెడుతుంది!రైతులు, గ్రామీణ వ్యాపారులు, గిగ్ వర్కర్లు, గృహిణులు సహా ఆన్లైన్ వినియోగదారులందరూ ఈ వాయిస్ ఎఐతో ఇంటర్నెట్ వాడకం స్వరూపాన్నే మార్చేయబోతున్నారని భారతీయ వాయిస్ ఏఐ స్టార్టప్ కంపెనీలు చెబుతున్నాయి. రైతులు ఇప్పటికే తమ ఫోన్లో ఒక్క మాట కూడా చదవకుండానే, ఒక్క బటన్ కూడా నొక్కకుండానే పంటల బీమా, క్రెడిట్ అర్హత, వాతావరణ పరిస్థితులకు తట్టుకునే వ్యవసాయ విధానాల సమాచారం తెలుసుకుంటున్నారు. జ్ఞాని.ఏఐ ప్రయోగాత్మకంగా ఇటీవలే దేశంలోని 120 గ్రామాలలో 15 వేల కంటే ఎక్కువ మంది రైతులకు ఈ విధానంలో సమాచారాన్ని అందించింది. ఒక బాట్ (సాఫ్ట్వేర్ అప్లికేషన్) ద్వారా వారికి 3 నిమిషాల వాయిస్ కాల్ వచ్చింది. ఇది వాళ్ల స్థానిక భాష, యాసలోనే వాళ్లకు కావాల్సిన సూచనలూ, సలహాలూ అందించడం విశేషం.నాలుగు కంపెనీల ఎంపిక‘ఇండియా ఏఐ మిషన్’ కింద భారత ప్రభుత్వం రూ.10,372 కోట్ల పంచ వర్ష బడ్జెట్ కేటాయింపులతో ‘సర్వమ్’, సోకెట్ ల్యాబ్స్, జ్ఞాని.ఏఐ, గాన్.ఏఐ అనే నాలుగు స్టార్టప్ కంపెనీలను ఎంపిక చేసింది. ప్రాథమిక వాయిస్ ఏఐ మోడళ్లను, అత్యాధునిక లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎమ్) తయారుచేసే బృహత్తర బాధ్యతలను వీరికి అప్పగించింది. ‘సర్వమ్’ ఏఐ.. 10 భారతీయ భాషల్లో శిక్షణ పొందిన వ్యవస్థను రూపొందించింది. ఇది గణితం, కోడింగ్, బహుభాషా అవగాహన వంటి అనేక ప్రక్రియలను సులభంగా చేయగలదు. జ్ఞాని.ఏఐ 12 భారతీయ భాషలు సహా మొత్తం 40 ప్రపంచ భాషలను గుర్తించి సేవలు అందిస్తుంది. సోకెట్ ల్యాబ్స్ భారతీయ భాషలకు అనుగుణంగా ‘ప్రజ్ఞ–1బి’ అనే ప్రాథమికమైన ఏఐ మోడల్ని (ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీ మాదిరిగా) రూపొందించింది. గాన్.ఏఐ అనేది ఇన్స్టంట్ ఏఐ వీడియోలు తయారుచేస్తుంది.‘భారత్లోనే తయారవ్వాలి – భారతదేశ అభివృద్ధికే పనిచేయాలి.. ఇదే ఇండియా ఏఐ మిషన్ ప్రధాన ఉద్దేశం’ అని కంపెనీల ఎంపిక సందర్భంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. ‘స్వదేశీ వాయిస్’ సవాళ్లు!భారతీయ స్టార్టప్లు నేటికీ పాశ్చాత్య డేటాసెట్లపై శిక్షణ పొందిన ఓపెన్ ఏఐ, డీప్గ్రామ్ వంటి నమూనాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఇవి భారతీయ భాషలు, అందులోని యాసలు, పేర్లు లేదా స్థానిక సూక్ష్మాంశాలను తరచుగా తప్పుగా అర్థం చేసుకుంటున్నాయి. ఈ అంతరాన్ని తగ్గించడానికి, అందుకు అవసరమైన సాంకేతికను సాధించేందుకే కేంద్రం ‘ఇండియా ఏఐ మిషన్’కు శ్రీకారం చుట్టింది.భవిష్యత్తంతా మాటలదే..!గూగుల్ నివేదిక ప్రకారం స్మార్ట్ ఫోన్ వాడేవారిలో 60 శాతం భారతీయులు వాయిస్ అసిస్టెంట్ల ద్వారా సంభాషిస్తున్నారు. ‘వాట్ కన్సల్ట్’ నివేదిక ప్రకారం నెట్ సేవల్ని పొందే భారతీయుల్లో 76 శాతం మందికి స్పీచ్, వాయిస్ రికగ్నిషన్ టెక్నాలజీపై అవగాహన ఉంది. దీన్ని బట్టి, మాతృభాషలో స్మార్ట్ఫోన్తో మాట కలిపి దైనందిన పనుల్ని చక్కబెట్టుకునే అలవాటు దేశ ప్రజల్లో ఎంతలా విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు. ఆంగ్ల భాష లేదా ఇతర భాషలలో ఉండే ఆప్షన్లను ఫోన్లో చేతి వేళ్లతో నొక్కటం ద్వారా ముందుకు సాగే ‘గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్’ (జి.యు.ఐ.) విధానానికి ఉన్న పరిమితులకు పరిష్కారంగా వచ్చిన ఈ ‘వాయిస్ ఏఐ’దే భవిష్యత్తంతా అని నిపుణులు అంటున్నారు.2022లో మొత్తం ఏఐ స్టార్టప్లలో 702 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడితే.. అందులో సుమారు 437 మిలియన్ డాలర్లు సంభాషణాపరమైన / వాయిస్ ఏఐ స్టార్టప్లలో పెట్టారు.ఎవరెవరు ఏమేం చేస్తారంటే..కొత్తగా తయారుచేయబోయే ఈ ఏఐ మోడళ్ల స్థాయిని వాటిలో ఉండే పారా మీటర్ల ఆధారంగా అంచనా వేస్తారు. ఎన్ని ఎక్కువ పారామీటర్లు ఉంటే అంత శక్తిమంతమైన మోడల్ అన్నమాట. సర్వమ్ ఏఐ రూపొందించిన సర్వమ్: ఎమ్, 2,400 కోట్ల పారామీటర్లు ఉండే మోడల్. ఇది భారతీయ భాషలన్నింటిలోనూ శిక్షణ పొందింది. స్టార్టప్లకు చేయూత నివ్వడం, సీసీటీవీ కెమెరాల్లాంటి భారతదేశంలో తయారయ్యే ఏఐ హార్డ్వేర్ వంటి వాటిని ప్రోత్సహించడం వంటి అదనపు బాధ్యతలు దీనికి అప్పగించింది ప్రభుత్వం. సోకెట్ ఏఐ: ఇది భారత దేశ మొట్ట మొదటి ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్ను తయారుచేస్తుంది. 12,000 కోట్ల పారామీటర్లతో అనేక భారతీయ భాషల్లో పనిచేసే దీన్ని ఆరోగ్య సంర క్షణ, విద్య, రక్షణ రంగాల్లో వాడతారు. జ్ఞాన్ ఏఐ: 1,400 కోట్ల పారామీటర్లతో రూపొందించే ఈ వాయిస్ మోడల్ వివిధ భారతీయ భాషలను అర్థం చేసుకోగలదు. రియల్ టైమ్లో కూడాస్పందించగలదు. కేవలం మాటలతోనే స్మార్ట్ఫోన్లో పనులు చేయాలనుకునేవారి కోసం స్మార్ట్ వాయిస్ అసిస్టెంట్లు, టూల్స్ను ఇది తయారుచేస్తుంది. -
కాంతివేగంతో డేటా
ప్రపంచంలోనే అత్యాధునిక, అత్యంత సురక్షితమైన సమాచార బదిలీ విధానమైన క్వాంటమ్ కమ్యూనికేషన్స్లో భారత్ తన సత్తా చాటింది. తొలిసారిగా అత్యంత భద్రమైన డేటా ట్రాన్స్ఫర్ ప్రక్రియ అయిన క్వాంటమ్ కమ్యూనికేష్ను విజయవంతంగా పరీక్షించామని రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్డీవో), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)–ఢిల్లీ సంయుక్తంగా ప్రకటించాయి. దీంతో డేటా హ్యాకింగ్కు ఎలాంటి అవకాశంలేని విధానాన్ని భారత్ తన రహస్య సమాచారమార్పిడి కోసం వినియోగించుకునేందుకు అవకాశం లభించింది.ఢిల్లీ క్యాంపస్లో ఫ్రీ–స్పేస్ ఆప్టికల్ లింక్ ద్వారా శాస్త్రవేత్తలు ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించి చూశారు. ఈ వివరాలను రక్షణ శాఖ వెల్లడించింది. సెకన్కు 250 బిట్స్ సెక్యూర్ కీ రేటుతో ఈ విధానాన్ని పరీక్షించారు. ప్రయోగాన్ని విజయవంతం చేసిన శాస్త్రవేత్తలను రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ అభినందించారు.ఏమిటీ క్వాంటమ్ కమ్యూనికేషన్?క్వాంటమ్ కమ్యూనికేషన్ అనేది సాధారణ ప్రజలు అస్సలు నమ్మలేనంతటి, గమ్మతైన సమాచార మార్పిడి విధానం. సాధారణభాషలో చెప్పాలంటే.. ఇద్దరు స్నేహితుల వద్ద చెరో వాకీటాకీ ఉందనుకుందాం. వాకీటాకీ అనేది కాస్తంత దూరాలకు మాత్రమే పనిచేస్తుంది. కానీ ఈ స్నేహితుల్లో ఒకడు చంద్రమండలం మీద ఉన్నాసరే అతను మాట్లాడేది ఇతని వాకీటాకీలో వినిపిస్తే ఎలా ఉంటుంది?. మధ్యలో ఎవ్వరూ వీరి మాటలను ట్రాక్ చేయడంగానీ, హ్యాక్చేయడంగానీ కుదరకపోతే!. అద్భుతమే కదా. ఆ అద్భుతాన్ని సుసాధ్యంచేసే ప్రక్రియే క్వాంటమ్ కమ్యూనికేషన్. విశ్వంలోనే అత్యంత సూక్ష్మమైన కాంతి అణువు(ఫొటాన్)ల సాయంతో పూర్తి సురక్షితంగా సమాచారాన్ని చేరవేయవచ్చు. ఇదంతా క్వాంటమ్ ఎంటాంజిల్మెంట్ మహిమ!క్వాంటమ్ ఎంటాంజిల్మెంట్ దృగ్విషయం కారణంగా ఇలా అతిసూక్ష్మస్థాయిలో డేటాను మరోచోటుకు బదిలీచేయొచ్చు. దూరంతో సంబంధంలేకుండా ఎంతటి దూరాల మధ్యనున్న అణువుల మధ్య కూడా ఒక మార్మికమైన బంధం, బదిలీ సాధ్యమవుతుంది. దీనినే క్వాంటమ్ ఎంటాంజిల్మెంట్ అంటారు. కిలోమీటర్ దూరంలోని అణువుల మధ్య డేటా ట్రాన్స్ఫర్ను డీఆర్డీవో, ఐఐటీ శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తిచేశారు. దీనిని సింపుల్గా చెప్పాలంటే... 1990 దశకంలో పెద్ద హిట్ అయిన హీరో నాగార్జున సినిమా ‘హలో బ్రదర్’ చూసే ఉంటారు.అందులో కవల సోదరుల్లో ఒకరు ఎలా డ్యాన్స్చేస్తే మరొకరు అలాగే కాలుకదపడం, ఎలా ఫైట్చేస్తే అలాగే డిష్యుండిష్యుం పోరాటం చేయడం చూసే ఉంటారు. క్వాంటమ్ ఎంటాంజిల్మెంట్లో కూడా అచ్చం ఇలాగే ఒక అణువుపై మనం సమాచారాన్ని నిక్షిప్లం చేస్తే ‘క్వాంటమ్ ఎంటాంజిల్మెంట్’ ద్వారా దానితో అదృశ్యబంధం ఏర్పర్చుకున్న ఫొటాన్ కణం మీద సైతం అదే సమాచారం ఠక్కున ప్రత్యక్షమవుతుంది.పాత సినిమాల్లో మంత్రదండం సాయంతో మాంత్రికుడు ఒకచోట మాయమై మరోచోట ప్రత్యక్షమైనట్లు డేటా సైతం ఒక చోట నుంచి మరో చోటుకు కాంతివేగంతో ప్రసారమవుతుంది. నేటి సైబర్ ప్రపంచంలో దాదాపు ప్రతీ సమాచారం హ్యాకర్ల చేతికి చిక్కుతుంది. కానీ క్వాంటమ్ కమ్యూనికేషన్లో ఇది అసాధ్యం. ఒకవేళ అత్యంత నిపుణుడైన హ్యాకర్ ఈ జంట మధ్య డేటాచోరీకి యత్నిస్తే వెంటనే ఈ సెండర్, రిసీవర్లకు తెల్సిపోతుంది.ఫ్రీ–స్పేస్ ద్వారా..ఫ్రీ–స్పేస్ అంటే బహిరంగంగా ఈ సమాచార బదిలీ జరుగుతుంది. ఇందులో ఎలాంటి కేబుళ్లకు, వైర్లకు పనిలేదు. వేల కిలోమీటర్లదూరంలోని రెండు భవంతుల మధ్య, రెండు శాటిలైట్ల మధ్య కూడా క్వాంటమ్ కమ్యూనికేషన్ను ఉపయోగించవచ్చు. సైనిక రహస్యాల స్థాయిలో అత్యంత సురక్షితంగా డేటాను పంపించడానికి ఇçప్పుడు అందుబాటులో ఉన్న అన్ని ఇంటెలిజెన్స్ టూల్స్ కంటే క్వాంటమ్ కమ్యూని కేషన్ అనేది మెరుగైంది. ఈ విధానంలో పంపే సమాచారాన్ని మూడో వ్యక్తి పసిగట్టలేరు. భారత్లో భవిష్యత్తులో క్వాంటమ్ నెట్వర్క్ లు, అల్ట్రా సెక్యూర్ ఇంటర్నెట్ కనెక్షన్లకు ఈ విధానం బాటలువేయనుంది. ఎన్క్రిప్షన్ ద్వారా జాతీయ భద్రత, రక్షణ, ఆర్థిక, టెలికమ్యూనికేషన్స్ రంగాల్లో భవిష్యత్తులో ఈ సాంకేతికతను విరివిగా వాడుకోవచ్చు. -
ఇప్పుడే వద్దు! ఇద్దరు చాలు!!
‘ఉద్యోగం / వ్యాపారంలో స్థిరపడాలి. ఆ తర్వాతే పెళ్లి, పిల్లలు’.. ఇంతేగా ఓ సగటు యువతీ, యువకుడి ఆలోచన. ఇదంతా పెళ్లికి ముందు. పెళ్లి తర్వాత వారి ఆలోచనల్లో చాలా మార్పులొస్తున్నాయి. ఇప్పుడే వద్దు అని చెప్పేవారు కొందరైతే.. ఇద్దరిని మించి పెంచలేం బాబోయ్ అంటున్నవారు మరికొందరు. పిల్లలను వద్దనుకోవడానికి లేదా వాయిదా వేయడానికే మొగ్గుచూపుతున్న జంటల సంఖ్య పెరుగుతోంది. ప్రధానంగా విద్యావంతులైన మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళల్లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. ఆర్థిక, అనారోగ్య సమస్యలే పిల్లలను కనాలా వద్దా అన్న నిర్ణయం తీసుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. – సాక్షి, స్పెషల్ డెస్క్అనారోగ్య సమస్యలు వంధ్యత్వం, గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు భారత్లో 13 శాతం, అమెరికాలో 16 శాతం మంది వెల్లడించారు. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) వంటి హార్మోన్ల సమస్యలు, థైరాయిడ్, ఊబకాయం వంటివి సంతానోత్పత్తికి ఆటంకంగా మారుతున్నాయి. సమయపాలన లేని ఆహారపుటలవాట్లు; విధులు, ఉద్యోగంలో భాగంగా గంటల తరబడి కంప్యూటర్లకు అతుక్కుపోవడం, శారీరక శ్రమ లేమి, వంశపారంపర్యంగా వస్తున్న సమస్యలు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. గర్భధారణ సమయంలో సరైన వైద్య సంరక్షణ లేకపోవడం కారణమని భారత్లో 14 శాతం, యూఎస్లో 8 శాతం మంది తెలిపారు. గర్భం వచ్చిన తర్వాత తల్లి, బిడ్డ ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. వారు సూచించిన పరీక్షలు చేయించడంతోపాటు, మందులు వాడాలి. ఈ ప్రక్రియను ఆర్థికంగా భారంగా భావించడమో, లేదా వైద్య సౌకర్యాలు లేకపోవడమో కారణంగా.. మాతృత్వాన్ని కాదనుకోవడమో, వాయిదా వేయడమో చేస్తున్నారు.చూసుకునేవారు లేక..తగినంత/నాణ్యమైన పిల్లల సంరక్షణ అవకాశాలు లేకపోవడం కారణమని భారత్లో 18 శాతం, అమెరికాలో 12 శాతం మంది తెలిపారు. అంటే పిల్లలను చూసుకోవడానికి పెద్దవారు అందుబాటులో లేకపోవడం, సంరక్షణ కేంద్రాల లేమి.. కుటుంబాలను గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి. పిల్లలను చూసుకునేవారు లేకపోతే తల్లిదండ్రులు పని చేయడం కష్టతరం అవుతుంది. వారి ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మహిళలు ఉద్యోగాలకు దూరం కావడానికి దారితీస్తుంది. ఇలాంటి కారణాలతో భాగస్వామి తక్కువ మంది పిల్లలను కోరుకోవడమూ ప్రధాన కారణమని భారత్, యూఎస్లలో 19 శాతం మంది వెల్లడించారు.మనదేశంలో జననాల రేటు 1960లలో సగటున ఒక్కో మహిళకు సుమారు 6గురు పిల్లలుగా ఉండేది. ఇప్పుడు ఇది 1.9కి పడిపోయింది. అంటే ఇద్దరు పిల్లలు కూడా కాదన్నమాట. ప్రపంచ సగటు 2.2తో పోలిస్తే ఇది తక్కువే. ఇందుకు ఆర్థిక పరిమితులు, ఉద్యోగ అభద్రత, అనారోగ్య సమస్యలు... ఇలా ఎన్నో కారణాలు. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) రూపొందించిన ‘స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2025’ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్రపంచ జనాభాలో 37 శాతం మంది ఉన్న భారత్, అమెరికా వంటి 14 దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు.ఇద్దరు చాలంటున్నారుఎంతమంది పిల్లలు కావాలని అడిగితే ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది చెప్పిన సమాధానం.. ఇద్దరు! మనదేశంలో అసలు పిల్లలే వద్దన్నవారు సగటున 5 శాతం కాగా, ఇది అమెరికాలో సుమారు 14 శాతం కావడం గమనార్హం. ఒక్కరే చాలని మనదేశంలో సగటున 14 శాతం మంది చెబితే.. అమెరికాలో కేవలం 7 శాతం మందే ఇలా కోరుకున్నారు. ఇద్దరు బిడ్డలు కావాలని మనదేశంలో పురుషుల్లో 33 శాతం, మహిళల్లో 41 శాతం మంది చెప్పారు. అమెరికాలో ఇలా కావాలన్నవారి సగటు కేవలం 26 శాతమే. మనదేశంలో ముగ్గురు లేదా నలుగురు పిల్లలు కావాలన్నవారు స్త్రీ, పురుషుల్లో గరిష్ఠంగా 6 శాతాన్ని కూడా మించలేదు. ఆసక్తికరంగా అమెరికాలో ఇలా కావాలన్నవారు దాదాపు 16 శాతం.ఆర్థిక పరిమితులుభారత్, అమెరికాలో ఆర్థిక పరిమితులే ప్రధానంగా మాతృత్వానికి అడ్డంకిగా ఉన్నాయని 38 శాతం మంది వెల్లడించారు. ఆదాయ అసమానతలు, అప్పులు పేరుకుపోవడం, ఊహించని ఖర్చులు, ఉద్యోగ భద్రత లేకపోవడం, నిరుద్యోగం, పొదుపు లేకపోవడం లేదా సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోవడం వంటి ఆర్థిక పరిమితులు చుట్టుముడుతున్నాయి. ఈ సవాళ్లే కుటుంబ జీవితంలోని వివిధ అంశాలను.. ప్రధానంగా బిడ్డలను కనాలన్న నిర్ణయాన్ని కూడా ప్రభావితం చేస్తున్నాయి. పిల్లలను వద్దనుకోవడానికి.. నిరుద్యోగం లేదా ఉద్యోగం పోతుందేమోనన్న అభద్రతాభావం కారణమని 21 శాతం భారతీయులు, 17 శాతం అమెరికన్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా జాబ్ మార్కెట్లో అనిశ్చితి ఒకవైపు.. ఏఐ వంటి నూతన సాంకేతికత రాకతో కొన్ని రంగాలకు చెందిన పలు విభాగాల్లో ఉద్యోగుల తీసివేతలు మరోవైపు.. వెరసి యువతకు ఉద్యోగాలు, కొత్త అవకాశాల వేట తప్పడం లేదు. ఇవన్నీ కూడా పిల్లలను కనాలా వద్దా అన్న నిర్ణయాన్ని ప్రభావితం చేస్తున్నాయి. -
Bike Taxi Ban: అవసరమైతే హైదరాబాద్కి పోతాం!
కర్నాటకలో యాప్ ఆధారిత అగ్రిగేటర్లు నడుపుతున్న టూ-వీలర్ టాక్సీ సర్వీసుల కార్యకలాపాలకు నిన్నటి(జూన్16) నుంచి బ్రేకులు పడ్డాయి. కోర్టు తీర్పు.. ప్రభుత్వం నుంచి విధానాల రూపకల్పనపై సరైన స్పందన లభించకపోవడంతో ప్రస్తుతం బైక్ ట్యాక్సీలపై నిషేధం అమలు అవుతోంది. దీంతో లక్ష మంది గిగ్ వర్కర్లపై ప్రభావం పడుతోంది. ఇందులో.. ఇదే తమ జీవనోపాధి అని వాపోతున్నారు వేలమంది రైడర్లు. కర్నాటకలో బైక్ ట్యాక్సీలపై నిషేధం వేలాది మంది రైడర్లను తీవ్రంగా ప్రభావం చేస్తోంది. కాలేజీ ఫీజులు చెల్లించేందుకు బైక్లు నడుపుతున్న విద్యార్థుల దగ్గరి నుంచి.. ఉద్యోగాలు పొగొట్టుకున్న టెక్కీల దాకా ఈ సేవలనే ఆదాయ వనరుగా మార్చుకున్నారు. కొందరికి ఇది పార్ట్ టైం జాబ్ కాగా.. మరికొందరికి ఫుల్ టైం ఆదాయం అందించే వనరు. 👉కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చదువు మధ్యలోనే మానేసిన ఓ యువకుడు మాట్లాడుతూ.. ప్రతీ రైడ్ ఒక కొత్త వ్యక్తిని కలవడానికి కలిగించిన అవకాశం. ఈ ప్రయాణం నా ఒంటరితనాన్ని అధిగమించడంలో సహాయపడింది. నేను ఆనందంగా చేసే పనిలో ఆదాయం కూడా వచ్చింది. అలాంటి ఆదాయ వనరుకు ఇప్పుడు గండిపడింది.👉ఇంజినీరింగ్ పూర్తయ్యాక సాఫ్ట్వేర్ ఉద్యోగం రాలేదు. బిజినెస్ ప్రారంభించాలన్న కల ఉంది. కానీ నెలవారీ జీతంతో పొదుపు కష్టం. అందుకే బైక్ టాక్సీల వైపు వచ్చాను. టార్గెట్లు లేవు, ఒత్తిడి లేదు, పూర్తి స్వేచ్ఛ ఉంది. ఈ నిషేధం నా వంటి కలలవాళ్లను తీవ్రంగా దెబ్బతీస్తుంది. అవసరమైతే హైదరాబాద్కు మారిపోతాను, కానీ ఈ పని వదలను:::మహదేవపురకు చెందిన ఇంద్ర శేఖర్(25) 👉బైక్ రైడ్లతో రోజుకు రూ.3,000 సంపాదించేవాడిని. అందులో కనీసం రూ.2,000 పొదుపు చేసేవాడిని. ఈ రోజుల్లో ఖర్చులకు ఫుల్ టైం ఉద్యోగం ఒక్కటే సరిపోవడం లేదు. పెద్ద నగరాల్లో జీవించాలంటే అదనపు ఆదాయం కచ్చితంగా అవసరం. అలాంటి ఆదాయం లేకుండా పోయింది:::జగదీష్(24), నాన్-ఐటీ ప్రొఫెషనల్👉సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి వరకు సాగర్ బైక్ ట్యాక్సీలతో రైడ్లు కొడుతూ సంపాదించుకుంటున్నాడు. ఈ సేవలు నా జీవన విధానాన్ని మార్చేశాయి. ఇప్పుడు ఒక్కసారిగా ఆగిపోవడం చాలా నిరాశ కలిగిస్తోంది. నా ఆదాయ మార్గం పూర్తిగా కోల్పోయాను. ఇప్పుడు మరో ఉద్యోగం కోసం వెతుకుతున్నాను అని తెలిపాడు. 👉వైట్ఫీల్డ్లో నివసించే 27 ఏళ్ల టెకీకి ఇది పార్ట్టైం జాబ్. ఆఫీస్ తర్వాత బైక్ టాక్సీ రైడ్లు చేస్తాను. ట్రాఫిక్లో ఒంటరితనాన్ని తగ్గించేందుకు ఇది మంచి మార్గం. కానీ, ఇప్పుడది లేకుండా పోతోంది అని అంటున్నాడు. నమ్మా బైక్ టాక్సీ అసోసియేషన్ స్పందనబైక్ ట్యాక్సీ డ్రైవర్లను ఏదో నేరస్తుల్లాగా పరిగణించడం అన్యాయం. ఇక్కడి ఆర్థిక వ్యవస్థలో మేమూ భాగమే. మమ్మల్ని చర్చ లేకుండానే ఎందుకు బయటకు తోసేస్తున్నారు?. లైసెన్సింగ్, ఇన్సూరెన్స్, భద్రతపై స్పష్టమైన నిబంధనలు కావాలి. లక్షకు పైగా గిగ్ వర్కర్ల జీవనాధారాన్ని కాపాడేందుకు ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే నమ్మా బైక్ టాక్సీ అసోసియేషన్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి వినతిపత్రం సమర్పించింది. తీర్పు ఇలా..కర్ణాటక వ్యాప్తంగా బైక్ టాక్సీలు చట్టవిరుద్ధమని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అలాగే.. గత శుక్రవారం ( జూన్ 13న) ఉబర్, ఓలా, రాపిడో యాప్ సంస్థలు దాఖలు చేసిన స్టే అభ్యర్థనలను డివిజన్ బెంచ్ తిరస్కరించింది. అయితే, నిబంధనల రూపకల్పనలో పురోగతి కనిపిస్తే స్టే ఇచ్చేందుకు సుముఖత చూపిస్తామని కోర్టు తెలిపింది. కానీ ప్రభుత్వం మాత్రం అలాంటి నిబంధనలను రూపొందించేది లేదని స్పష్టం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు జూన్ 24కు వాయిదా వేసింది.మాకు అవసరంబెంగుళూరులో నిత్యం తీవ్రతరమవుతున్న ట్రాఫిక్ సమస్యను ప్రస్తావిస్తూ అనేకమంది ప్రయాణికులు సోషల్ మీడియాలో ఫోటోలు, వ్యాఖ్యలతో తమ ఆవేదనను, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. శాశ్వతంగా ట్రాఫిక్తో స్తంభించిపోయే బెంగుళూరుకు బైక్ టాక్సీలు సహా అందుబాటులో ఉన్న అన్ని ప్రజా రవాణా మార్గాలు అవసరమని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో కోర్టు తీర్పును, ప్రభుత్వవ విధానాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు.వా.. ఎన్ను ఐడియాఇలాంటి నిర్ణయాలతో సంబంధం లేకుండా తమ దారులు తమకు ఉన్నాయని యాప్ ఆధారిత అగ్రిగేటర్లు అంటున్నాయి. రాపిడో తమ యాప్లో 'బైక్' సర్వీసును 'బైక్ పార్శిల్'గా మార్చినట్టు తెలుస్తోంది. ప్రయాణికులు తమను తామే 'పార్శిల్'గా బుక్ చేసుకుని ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్నారు. ‘‘రైడ్ బుక్ చేసుకోలేకపోతున్నారా? ఫర్వాలేదు, మిమ్మల్ని మీరే పార్శిల్గా పంపించుకోండి. దీనిని 'ప్యాస్ - ప్యాసింజర్ యాజ్ ఏ సర్వీస్' అనొచ్చు" అంటూ ఓ యూజర్ ఇందుకు సంబంధించిన బుకింగ్ స్క్రీన్షాట్ను షేర్ చేశారు. అలాగే.. ఉబెర్ 'మోటో'ను 'మోటో కొరియర్'గా మార్చింది. వా.. ఎన్ను ఐడియా(వా.. ఏం ఐడియా!) తెలివైన ఎత్తుగడ" అని మరో యూజర్ పేర్కొన్నారు. -
సుదూర విశ్వంలో బుల్లి గెలాక్సీలు
అవడానికి అవి చిట్టి పొట్టి గెలాక్సీలే. కానీ వాస్తవానికి మహా గట్టి గెలాక్సీలు. అటూ ఇటుగా ఈ అనంత విశ్వంతో పాటే పురుడు పోసుకున్నాయి. విశ్వం 1,380 కోట్ల ఏళ్ల కింద ఉనికిలోకి వచ్చిందన్నది సైంటిస్టుల మాట. ఈ బుల్లి నక్షత్ర మండలాల వయసు ఏకంగా 1,300 కోట్ల ఏళ్లు! వీటి నుంచి అనూహ్యమైన ఆకుపచ్చని కాంతి అపార పరిమాణంలో వెలువడుతోంది. వెయ్యి కోట్ల పై చిలుకు ఏళ్ల కింద ఎటు చూసినా చిక్కనిబూర్ మాదిరిగా కమ్ముకుని, కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించని విశ్వాన్ని పారదర్శకంగా, ఇప్పుడు మనం చూస్తున్న విధంగా మార్చింది ఆ కాంతేనట. ఆ లెక్కన మన ఆవిర్భావం కూడా దాని పుణ్యమేనని సైంటిస్టులు తేల్చారు. అంతటి కీలకమైన కాంతికి ఉద్గమ స్థానమైన బుల్లి గెలాక్సీలను జేమ్స్ వెబ్ టెలీస్కోప్ తాజాగా తన బ్రహా్మండమైన కెమెరా కంటితో బంధించింది. అంతరిక్ష శాస్త్రవేత్తలు వాటిని ముద్దుగా రెడ్ షిఫ్ట్–7 అని పిలుచుకుంటున్నారు.డజన్లకొద్దీ... ఈ బుల్లి గెలాక్సీలు డజన్లకొద్దీ ఉన్నట్టు జేమ్స్ వెబ్ తేల్చింది. వైశ్విక పునరయానీకరణగా పిలిచే తొలి దశలో వీటి పాత్ర కీలకంగా నిలిచింది. అప్పట్లో విశ్వమంతటా తటస్థ హైడ్రోజన్ వాయువుతో నిండి ఉండేది. దాంతో సర్వత్రా సన్నని పొగమంచు మాదిరి పొర కమ్ముకుని ఉండేది. తొలి 100 కోట్ల ఏళ్లూ ఇదే పరిస్థితి. అలాంటి విశ్వం నేడున్న రూపురేఖలు సంతరించుకుందంటే ఈ గెలాక్సీల్లో నాడు జరిగిన స్టార్ బరస్ట్ వల్లే! అంటే తారల ఆవిర్భావానికి కారణమైన పెను పేలుళ్లు. ఆ క్రమంలో ఈ గెలాక్సీల నుంచి వెలువడ్డ శక్తిమంతమైన పరారుణ రేడియో ధారి్మకత హైడ్రోజన్ అణువుల్లోని ఎల్రక్టాన్లను విడదీసి ఆ వాయువును అయానీకరించింది. గెలాక్సీల్లో నుంచి నేటికీ వెలువడుతున్న ఆ ఆకుపచ్చని ఉద్గారాలను జేమ్స్ వెబ్ సాయంతో పరిశోధకులు గుర్తించారు. గెలాక్సీల సమూహాన్ని అబెల్ 2744గా పిలుస్తున్నారు. దీని తాలూకు అపరిమితమైన గురుత్వాకర్షణ ఒక సహజ పట్టకంగా జేమ్స్ వెబ్కు సాయపడింది. విశ్వాన్ని జేమ్స్ వెబ్ తాలూకు నియర్ ఇన్ఫ్రా రెడ్ కెమెరా (ఎన్ఐఆర్ కామ్), ఇన్ఫ్రా రెడ్ స్పెక్ట్రో గ్రాఫ్ (ఎన్ఐఆర్ స్పెక్) లెన్స్ ఏకంగా మరో 400 కోట్ల ఏళ్లు వెనక్కు చూడగలిగాయి. అలా ఈ బుల్లి గెలాక్సీల ఉనికి తొలిసారి బయటపడింది. ఇవి మన పాలపుంత కన్నా ఏకంగా 2 లక్షల రెట్లు చిన్నవి కావడం విశేషం. అయినా మొత్తం విశ్వం అయానీకరణ చెందేందుకు అవసరమైనంత పరారుణ ఉద్గారాలను వెలువరించి గట్టి పిండాలు అనిపించుకున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
టచ్లో ఉండకండి
కర్ణుడి కవచ కుండలాల్లా స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మన శరీరంలోనూ ఒక భాగంగా మారిపోయింది. ఫోన్ ఉంటేనే అన్ని అవయవాలూ ఉన్నట్లు! ఫోన్ చూస్తుంటేనే అన్ని అవయవాలూ బాగా పని చేస్తున్నట్లు! నిద్రలోను, మెలకువలోను మన మైండ్ ఫోన్ మీదే. ఫోన్కి ఇంతగా ‘కట్టు బానిస’అయిపోతే ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నా ఫోన్ని వదల్లేకపోతున్నాం.అది మన తప్పు కాదు. ఫోనే మనల్ని వదలటం లేదు. మరి దీనికి పరిష్కారం లేదా? లేకనేం, ‘డిజిటల్ డీటాక్స్’ఉంది అంటున్నారు వైద్య నిపుణులు, సైకాలజిస్టులు. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం, అఖిల భారత గేమింగ్ ఫెడరేషన్తో కలిసి బెంగళూరులో ‘బియాండ్ స్క్రీన్స్’అనే కార్యక్రమాన్ని చేపట్టింది.డ్రగ్స్కి బానిసలు అయినట్టే.. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్ల వంటి డిటిజల్ ఉపకరణాలు, ముఖ్యంగా అందులోని సోషల్ మీడియాకు బానిసలైనవారికి కౌన్సెలింగ్ ద్వారా అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా విద్య, ఉపాధి వంటి అంశాల్లో తాత్కాలిక, దీర్ఘకాలిక పరిష్కారాలూ చూపిస్తారు. మనం డిజిటల్ ఉపకరణాలకు ఎంతగా బానిసలు అయిపోతున్నామో చెప్పేందుకు ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే. దీనికి పరిష్కారమే డిజిటల్ డీటాక్స్.స్క్రీన్పై ఈదులాట తగ్గాలి ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, రీల్స్, షార్ట్స్, యూట్యూబ్.. ఈ ప్రపంచంలోకి అడుగుపెడితే ఒక పట్టాన మనల్ని బయటపడనివ్వదు. ఇదో మాయాలోకం. ఫోన్లో చార్జింగ్ అయిపోయేంత వరకు స్క్రీన్పై ఈదులాట సాగుతూనే ఉంటుంది. తలనొప్పిగా ఉన్నది గమనించం. కళ్లు మసక బారుతున్నదీ పట్టించుకోం. నిస్సత్తువ, నిస్తేజం అన్నవి స్క్రీన్ని అన్నేసి గంటలు చూడటం వల్లనే అనీ గుర్తించం. అందుకే ‘డిజిటల్ డీటాక్స్’అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు. వీకెండ్లో ‘పీస్ ఆఫ్ మైండ్’ డిజిటల్ డీటాక్స్ అంటే నెమ్మదిగా స్మార్ట్ ఫోన్ స్క్రీన్ని చూసే టైమ్ని తగ్గించుకోవటం. తద్వారా అనారోగ్యాల ముప్పునుంచి తప్పించుకోవటం. మన చేతిలో పట్టే ఫోన్ని మన మెదడును అప్పగించేసి బానిసలు కాకుండా ఉండటం. మనకు వారాంతంలో ఎలా సెలవో అలాగే గ్యాడ్జెట్లకు వీక్లీ ఆఫ్ ఇవ్వాలి. వీకెండ్లో ముఖ్యమైన పనులు తక్కువగా ఉంటాయి డిజిటల్ డీటాక్స్ మొదటి దశకు ఈ రోజులు అనుకూలంగా ఉంటాయి.డిజిటల్ డీటాక్స్ కూడా సాధనేడిజిటల్ డిటాక్స్లో భాగంగా ముందుగా డిజిటల్ ఉపకరణాలను దూరంగా పెట్టాలి. అత్యవసరమైతే తప్ప వాటి జోలికి పోకూడదు. నిజానికిది అంత సులభమైన సాధన కాదు. ప్రారంభంలో ఏమీ తోచదు. ఎందుకంటే అలవాటైపోయిన ప్రాణం కదా. ఒంటరిగా ఉన్నట్లనిపిస్తుంది. నోటిఫికేషన్లు ఏమైనా వచ్చి ఉంటాయా అన్న ఆసక్తి, ఆందోళన మనసును పీకుతుంటుంది. స్థిమితంగా ఉండలేం. ప్రపంచంలో జరిగే అతి ముఖ్యమైన సంఘటనలు మిస్ అవుతున్నామన్నంత ఆరాటం ఉంటుంది. కానీ, ఏమీ ఫర్వాలేదు. అలవాటు అయ్యాక మాత్రం తేలిగ్గా చేయగలుగుతాం. ఫోన్ని స్విచాఫ్ చెయ్యక్కర్లేదు. ఫోన్ మీద నుంచి మనసును స్విచాఫ్ చేసుకుంటే చాలు. పక్కా ప్లానింగ్తో.. ⇒ అలాగే డీటాక్సింగ్ సమయంలో మనం చేయవలసిన పనులు ముందే అనుకుంటే మనసు ఫోన్ మీదకు మళ్లదు. ⇒ ఉదయం పూట ఖాళీ దొరికితే జిమ్కు వెళ్లొచ్చు. ⇒ పార్కులో రోజూ ఫోన్ లేకుండా రన్నింగ్, వ్యాయామం, యోగా వంటివి ఒక్కరైనా, నలుగురితో కలిసైనా చేయండి. ⇒ స్నానం చేశాక మీకు నచి్చన ఆలయానికి వెళ్లండి. ⇒ ఇంటి పనుల్లో మీ శ్రీమతికి, కుటుంబ సభ్యులకు సాయం చేయండి. ⇒ కొత్తకొత్త రకాల మొక్కలను పెంచండి. ⇒ మీ స్నేహితులకు ఫోన్ చేసి గెట్ టుగెదర్ ఏర్పాటుచేసుకోవచ్చు. కానీ, అందరూ ఫోన్లు పక్కన పెట్టేయాలన్న కండిషన్ పెట్టుకోండి. ⇒ మంచి పుస్తకం చదవండి. ఆన్లైన్లో కాదు.. కొని, చదవండి. లేదంటే ఎవరి దగ్గర నుంచైనా తీసుకుని చదవండి. ⇒ ధ్యానం అలవాటు చేసుకోండి. ⇒ మీకు బాగా దగ్గరివాళ్లు లేదా మనసుకు నచి్చన వాళ్లతో రెస్టారెంటుకు భోజనానికో, పార్కుకో, షాపింగుకో వెళ్లండి. ⇒ స్నేహితులూ, పిల్లలతో కలిసి క్రికెట్ లాంటి ఆటలు ఆడండి. ⇒ కనీసం ఏడాదికి ఒకసారి.. ఒక అనాథాశ్రమం లేదా వృద్ధాశ్రమంలో ఒక రోజు పూర్తిగా గడపండి. ⇒ మనసుంటే మార్గం ఉంటుంది. ఇలాంటి జాబితాను ఎవరికి వారు వారి ఇష్టాయిష్టాలకు అనుగుణంగా తయారుచేసుకోవచ్చు.డిజిటల్ డిటాక్స్ ప్రయోజనాలు ⇒ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉత్తేజాన్ని పుంజుకుంటుంది. ⇒ మైండ్లోంచి పెద్ద లోడ్ ఏదో దిగినట్లు అనిపిస్తుంది. ⇒ సోషల్ మీడియా తెచ్చిపెట్టే ఆదుర్దా, ఆందోళన, అసహనం అన్నీ మాయం అవుతాయి. ⇒ మెదడుకు పని చెప్పడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ⇒ కుటుంబ సభ్యులతో గడపటం ఎంత ఉల్లాసంగా ఉంటుందో గ్రహిస్తాం. ⇒ రోజూ వందల కొద్దీ సోషల్ మీడియా పోస్టులు, వీడియోల వంటివి చూడటం వల్ల మన మెదడు ఒక విషయం మీద ఫోకస్ చేయలేదు. అదే అన్నీ ఆపేస్తే.. మన ఆరోగ్యం, భవిష్యత్తు, మనకు కావాల్సిన వారి గురించి ఆలోచించడం.. ఇలాంటి విషయాలమీద శ్రద్ధ పెట్టవచ్చుమన పెద్దలే గురువులు నిజానికి డిజిటల్ డీటాక్స్ ఎలా చేయాలో ఇంట్లో అమ్మమ్మలు, తాతయ్యలు, పెద్దనాన్నలు లాంటి పెద్దవాళ్లను ఎవరిని అడిగినా చెప్తారు. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగిపోయినా వాళ్లకు అనవసరం. వాళ్లు చేయాల్సిన పనులు శ్రద్ధగా, కచి్చతంగా చేసేవాళ్లు. కుటుంబ సంబంధాలు చక్కగా నెరిపేవాళ్లు. బంధువుల కుటుంబాల్లో జరిగే అన్ని కార్యక్రమాలకూ హాజరయ్యేవారు.అక్కడ అందరితోనూ కలిసి మాట్లాడేవారు. ఇప్పటిలా.. నలుగురూ కలిసినా ఒక్కొక్కరూ ఒక్కో ఫోను పట్టుకుని.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉండేవారు కాదు. అలాంటి వాళ్లు లేరు అంటారా.. అయితే మీకు మళ్లీ ఫోన్లోని డిజిటల్ డీటాక్స్ యాప్లే శరణ్యం. అవి : డిజిటల్ డీటాక్స్ డ్రాగన్స్, ఆఫ్టైమ్, ఆఫ్్రస్కీన్, హెడ్స్పేస్, యాప్డీటాక్స్.పర్వదినాల్లో జైనులు... మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలోని కొన్ని ప్రాంతాల్లోని జైనులు.. ‘పర్యూషణ్ పర్వ్’అనే ఆధ్యాతి్మక కార్యక్రమంలో భాగంగా డిజిటల్ డిటాక్స్ చేపడుతున్నారు. కొందరు పూర్తిగా ఫోన్లు స్విచాఫ్ చేస్తే.. మరికొందరు ఆ రోజంతా వాట్సాప్ వాడకుండా ఉంటున్నారు. అహ్మదాబాద్లోని జైనులు మరో అడుగు ముందుకేసి, ఒక పోటీ కూడా పెట్టారు. రోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు.. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు ఏవీ వాడకూడదని నిబంధన పెట్టారు. దీనికి ట్యాగ్లైన్..‘మొబైల్ ఫోన్ ఒక మంచి సేవకుడు. అదే సమయంలో ప్రమాదకరమైన గురువు కూడా’. 50 రోజులపాటు ఇలా డిజిటల్ డిటాక్స్ చేసి విజేతలుగా నిలిచిన 10 మందికి ఝార్ఖండ్లోని వారి పవిత్ర క్షేత్రానికి ఉచిత తీర్థయాత్ర ఆఫర్ ఇచ్చారు. -
అరుదైన ప్రాణులకు ఊపిరి
ఆరిలోవ: వాతావరణ కాలుష్యం, వేటగాళ్ల ఉచ్చులు, క్రూర మృగాల దాడి, మారుతున్న పర్యావరణ పరిస్థితుల కారణంగా ఎన్నో వన్యప్రాణి జాతులు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. ఒకప్పుడు సజీవంగా ఉన్న జాతులు నేటి తరానికి టీవీల్లో, పుస్తకాల్లో మాత్రమే కనిపించే పరిస్థితి నెలకొంది.వాటి ఉనికే ప్రశ్నార్థకమవుతున్న ఈ తరుణంలో విశాఖ నగరంలోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్కు ఒక ఆశాకిరణంగా నిలుస్తోంది. అంతరించిపోతున్న అరుదైన వన్యప్రాణులకు పునరుత్పత్తి కేంద్రంగా మారి, వాటి వంశాన్ని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడి సంరక్షకుల కృషితో గత ఎనిమిది నెలల్లోనే 12 అంతరించిపోతున్న జాతులకు చెందిన 46 పిల్లలు ఊపిరిపోసుకున్నాయి. వన్యప్రాణి సంరక్షణలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాయి. అరుదైన జీవులకు అభయం విశాఖ జూ పార్కు ఇప్పుడు కేవలం జంతు ప్రదర్శనశాల మాత్రమే కాదు.. అంతరించిపోతున్న జీవజాతులకు ఒక సురక్షితమైన ఆవాసం, పునరుత్పత్తి కేంద్రం. వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972 ప్రకారం షెడ్యూల్–1 జాబితాలోని అనేక జీవులు ఇక్కడ విజయవంతంగా తమ సంతతిని పెంచుకుంటున్నాయి. జింక పిల్లలు, అడవి దున్నలు, అడవి కుక్కల పిల్లలు, నీల్గై, రెడ్నెక్డ్ వాలబీ, బెంగాల్ ఫాక్స్, ఇండియన్ గ్రే వోల్ఫ్, రింగ్టైల్డ్ లెమూర్స్ వంటి జాతులకు చెందిన చిట్టి ప్రాణులు తమ ఎన్క్లోజర్లలో తల్లుల వెంట ఉత్సాహంగా తిరుగుతూ సందర్శకులను అలరిస్తున్నాయి. ఈ అద్భుతమైన దృశ్యాలు జూకి వచ్చే వారికి కనువిందు చేయడమే కాకుండా, అంతరించిపోతున్న జాతులను పరిరక్షించడం ఎంత అవసరమో తెలియజేస్తున్నాయి. వెటర్నరీ వైద్యులు, యానిమల్ కీపర్ల నిరంతర పర్యవేక్షణలో ఈ ఘనత సాధ్యమైంది.8 నెలలు.. 46 బుల్లి ప్రాణులు గడిచిన ఎనిమిది నెలలకాలంలో ఇందిరా గాంధీ జూ పార్కులో 12 రకాల వన్యప్రాణులకు 46 పిల్లలు పుట్టాయి. ఇందులో అడవి కుక్కలు–14, కృష్ణ జింక (రాష్ట్ర జంతువు) –9, చుక్కల జింక–7, కనుజు–5, నీల్ గై–3, బార్కింగ్ డీర్–2, మౌస్ డీర్–1, బెంగాల్ ఫాక్స్–1, ఇండియన్ గ్రే వోల్ఫ్–1, అడవి దున్న (బైసన్)–1, రెడ్–నెక్డ్ వాలబీ–1, రింగ్టైల్డ్ లెమూర్–1 ఉన్నాయి. అంతరించిపోతున్న జాతుల విశేషాలివి.. ఈ జూలో పునరుత్పత్తి అవుతున్న కొన్ని ముఖ్యమైన అంతరించిపోతున్న జాతులు, వాటి ప్రత్యేకతలు ఇప్పుడు తెలుసుకుందాం.. ⇒ అడవి కుక్కలు(ఆసియాటిక్ వైల్డ్ డాగ్స్): ఇవి వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లోని షెడ్యూల్–1 కిందకు వస్తాయి. ఇందిరా గాంధీ జూ పార్కులో వీటి పునరుత్పత్తి కేంద్రం ఉంది. వీటి ఎత్తు సుమారు 50 సెం.మీ., శరీరం పొడవు 90 సెం.మీ., తోక పొడవు 40–45 సెం.మీ. ఉంటుంది. ⇒ కృష్ణ జింక(బ్లాక్బక్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువుగా గుర్తింపు పొందిన ఈ జింకలు, తమ మెలితిరిగిన కొమ్ములతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కృష్ణ జింక షెడ్యూల్–1 జాబితాలో ఉంది ⇒ మూషిక జింక(మౌస్ డీర్): షెడ్యూల్–1 జాబితాలోని ఈ జింక శరీరం పొడవు 50–60 సెం.మీ., బరువు 3–4 కిలోలు ఉంటుంది. ప్రపంచంలోని అతి చిన్న జింక జాతులలో ఇది ఒకటి. చూడటానికి చిన్నగా, సున్నితంగా ఉండే ఈ జీవి కూడా షెడ్యూల్–1 జాబితాలో ఉంది. ⇒ కనుజు : ఇది కూడా షెడ్యూల్–1 జాబితాలో ఉంది. మగ కనుజులకు చెట్ల కొమ్మల మాదిరిగా ఉండే కొమ్ములు 3.5 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. ⇒ నీలి ఎద్దు( నీల్గై): ఆసియా జింక జాతులలో అతి పెద్దదైన నీల్గై షెడ్యూల్–2 జాబితాలో ఉంది. దీని గొంతు భాగం తెల్లగా ఉంటుంది. మగ నీల్గైకి 13 సెం.మీ. జుట్టు ఉంటుంది. ఆడవి 200 కిలోలు, మగవి 250 కిలోల వరకు బరువు వరకు పెరుగుతాయి. ⇒ రెడ్ నెక్డ్ వాలబీ: ఈ జాతి జీవుల పునరుత్పత్తి ఎంతో ఆసక్తికరం. రెడ్నెక్డ్ వాలబీ గర్భం దాల్చిన 30 రోజుల్లో పిల్లకు జని్మస్తుంది. తర్వాత ఆ పిల్ల తల్లి పొట్ట కింద సంచిలో సుమారు 7 నెలల పాటు పెరిగి, తల్లి పాలు తాగుతుంది. 12 నెలల తర్వాత స్వతంత్రంగా జీవించడం మొదలుపెడుతుంది.వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు జూ పార్కులో వన్య ప్రాణుల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాం. ఇటీవల పునరుత్పత్తి అయిన పలు రకాల జాతుల పిల్లలను ఇక్కడ సంరక్షకులు, జూ వెటర్నరీ వైద్యులు, సిబ్బంది, యానిమల్ కీపర్లు ప్రత్యేక శ్రద్ధతో సంరక్షిస్తున్నారు. అంతరించిపోతున్న జాతుల సంతతి జూలో గణనీయంగా పెరుగుతోంది. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం వీటికి ఎలాంటి హాని కలిగించినా చట్టరీత్యా నేరమవుతుంది. – జి.మంగమ్మ, జూ క్యూరేటర్ -
..మా ఊరొచ్చింది ఏనుగు!
‘ఏనుగమ్మ ఏనుగు.. మా ఊరొచ్చింది ఏనుగు’ అని భలే సంబరపడిపోతున్నారు అమెరికన్లు. చూడటానికి పరిమాణంలోనూ, రాజసంలోనూ అచ్చం గజరాజుల్లా జీవం ఉట్టిపడేలా కనిపిస్తున్న ఇవన్నీ చెక్కతో చేసినవి. ఒకటికాదు, రెండు కాదు.. ఏకంగా 100 బొమ్మలు! ఆసియాలో వన్యప్రాణుల పరిరక్షణకు పనిచేస్తున్న యూకేకు చెందిన ‘ఎలిఫెంట్ ఫ్యామిలీ’ అనే స్వచ్ఛంద సంస్థ ‘ద గ్రేట్ ఎలిఫెంట్ మైగ్రేషన్’ పేరుతో వినూత్నంగా నిధుల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కుంజర సమూహం యూఎస్లోని ప్రముఖ నగర వీధుల్లో జనానికి వింత అనుభూతిని కలిగిస్తోంది. ప్రదర్శన మాత్రమే కదా, గొప్ప ఏముంది అని కొట్టిపారేయకండి.. ఎందుకంటే ఇవి మనదేశంలోనే రూపుదిద్దుకున్నాయి.మనదేశంలోని ఆసియా ఏనుగులు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచినవి. అలాంటి ఏనుగులు రైలు ఢీకొట్టడం, విద్యాదాఘాతాల వంటివాటి వల్ల మరణించడం చూసి తట్టుకోలేక వాటికోసం 2002లో అప్పటి జైపూర్ రాజకుటుంబం, బ్రిటన్కు చెందిన ప్రముఖ ఫైన్షాయర్ సర్ ఎవలిన్ డి రాస్చైల్డ్ సంయుక్తంగా ‘ఎలిఫెంట్ ఫ్యామిలీ’ని ఏర్పాటుచేశాయి. ఈ సంస్థ ఏనుగుల సంరక్షణలో భాగంగా అనేక కార్యక్రమాలు చేపడుతోంది. అందులో ఒకటి ‘ద గ్రేట్ ఎలిఫెంట్ మైగ్రేషన్ ’. ఈ ప్రాజెక్టు కోసం.. భారత్లో తయారైన ఈ భారీ ఏనుగుల బొమ్మలు ఇప్పుడు అమెరికన్లు కట్టిపడేస్తున్నాయి.ఖరీదు కాస్త ఎక్కువే!ప్రదర్శన అంటే కేవలం చూడటమే కాదు.. ఔత్సాహికులు తమకు నచ్చిన బొమ్మను బుక్ చేసుకోవచ్చు కూడా. ఏనుగు పిల్ల నుంచి భారీ కరిరాజు వరకు శిల్పులు నాలుగు రకాల బొమ్మలు తయారుచేశారు. వీటి ధరలు రూ.6,88,000లతో మొదలై రూ.18,92,000 వరకు ఉన్నాయి. బొమ్మ తయారుచేసి, ఇవ్వడానికి 4–6 నెలల సమయం పడుతుందని ‘ఎలిఫెంట్ ఫ్యామిలీ’ సంస్థ చెబుతోంది. తమిళనాడు నీలగిరిలోని గూడలూర్కు చెందిన 200 మంది స్థానిక గిరిజన కళాకారుల సంఘం ‘కో ఎగ్జిస్టెన్ ్స కలెక్టివ్’ చేతిలో ఇవి రూపుదిద్దుకున్నాయి. నీలగిరి ప్రాంతంలో తిరిగే ఏనుగులను పోలిన ఈ బొమ్మలను.. శిల్పులు అయిదేళ్లు శ్రమించి తీర్చిదిద్దారు.నగరాల వారీగా..గజరాజుల శిల్పాలను అమెరికా అంతటా తిప్పి, ప్రదర్శనలు ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగా 2024 జూలైలో న్యూపోర్ట్తో మొదలై న్యూయార్క్ సిటీ, మియామీ బీచ్, హ్యూస్టన్ లలో ఎగ్జిబిషన్ జరిగింది. మోంటానాలోని బ్రౌనింగ్లో జూన్ 4న ప్రారంభమైన ప్రదర్శన జూన్ 16తో ముగిసింది. పశ్చిమ యూఎస్ వయోమింగ్లోని జాక్సన్ హోల్లో మే 17 నుంచి జూన్ 20 వరకు జరుగుతుంది. జులై 1 నుంచి ఈ గజరాజులు కాలిఫోర్నియా వాసులకు కనువిందు చేయనున్నాయి.సంచరించడానికి స్థలం..లాంటానా కామరా పుష్పించే ఈ కలుపు మొక్క వేగంగా వ్యాపిస్తుంది. జలావరణాల్లో ఇవి వేగంగా విస్తరించడం వల్ల జంతువులు జనావాసాల్లోకి రావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందుకే, ఈ మొక్కలను ఏనుగు బొమ్మల తయారీకి వాడటం ద్వారా.. వన్యప్రాణుల సంచారానికి ఎక్కువ స్థలం ఉంటుందని, అటవీ పునరుద్ధరణకు దోహదపడుతుందనేది ‘ఎలిఫెంట్ ఫ్యామిలీ’ ఆలోచన. ‘ద గ్రేట్ ఎలిఫెంట్ మైగ్రేషన్ ’ ద్వారా సేకరించే నిధులను.. మానవులు, వన్యప్రాణుల సామరస్య సహజీవనాన్ని ప్రోత్సహించడానికి ప్రపంచవ్యాప్తంగా చేపట్టే కార్యక్రమాల కోసం వెచ్చిస్తారు. -
విద్యార్థులు తగ్గుతున్నారు
ప్రభుత్వ పాఠశాలల్లో ఏటేటా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తున్నా విద్యార్థుల తల్లిదండ్రుల్లో ప్రభుత్వ స్కూళ్లపై నమ్మకం కలగడం లేదు. దీంతో ప్రభుత్వ స్కూళ్లకు మూసివేత ప్రమాదం పొంచి ఉంది. గడిచిన నాలుగేళ్లలో ఒక్క నల్లగొండ జిల్లాలోనే 310 వరకు స్కూళ్లు జీరో ఎన్రోల్మెంట్తో మూతపడ్డాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పాఠశాలల్లో విద్యార్థులు తక్కువగా ఉన్నారన్న కారణంతో గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా సర్దుబాటు చేయగా దాదాపు 1,980 స్కూళ్లు మూతపడ్డాయి. ఇక విద్యా సంవత్సరంలోనూ మరిన్ని స్కూళ్లపైనా మూసివేత కత్తి వేలాడుతోంది. – సాక్షి ప్రతినిధి, నల్లగొండసిద్దిపేటలో తెరుచుకున్నస్కూళ్లుసిద్దిపేట జిల్లాలో 12 జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లు ఈసారి తెరుచుకున్నాయి. అక్కన్నపేట మండలం రేగొండ ప్రాథమిక పాఠశాల గత ఏడాది జీరో ఎన్రోల్మెంట్తో మూతపడింది. టీచర్లు గ్రామంలో అవగాహన కల్పించి 35 మంది విద్యార్థులను చేర్పించారు. ఆ పాఠశాలను ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.అత్యధికంగా వరంగల్లో మూసివేత ⇒ 2024–25 విద్యా సంవత్సరంలో అత్యధికంగా వరంగల్ జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూత పడ్డాయి. 135 స్కూళ్లు విద్యార్థుల్లేక, తక్కువ మంది (పది మందిలోపే) విద్యార్థులు ఉండటంతో టీచర్లు, విద్యార్థుల సర్దుబాటుతో అవి మూత పడ్డాయి.⇒ ఆ తర్వాత సూర్యాపేట జిల్లాలో 94 స్కూళ్లు మూతపడ్డాయి. నల్లగొండ జిల్లాలో 24, మంచిర్యాల జిల్లాలో 32, ఆసిఫాబాద్లో 34, నిర్మల్లో 48, నిజామాబాద్లో 38, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 89, కరీంనగర్ జిల్లాలో 50, రాజన్నసిరిసిల్లలో 18, జగిత్యాలలో 61, పెద్దపల్లిలో 29, హనుమకొండలో 41, మహబూబ్నగర్ జిల్లాలో 48, నాగర్కర్నూల్లో 15, వనపర్తిలో 33, గద్వాలలో 4, నారాయణపేటలో 37 స్కూళ్లు మూత పడ్డాయి. మూడేళ్లలో గణనీయంగా తగ్గిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు మూత పడుతూనే ఉండగా, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది. గడిచిన మూడేళ్ల గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. విద్యాశాఖ లెక్కల ప్రకారమే 2022–23 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 30,09,212 మంది విద్యార్థులు ఉంటే ప్రస్తుతం వారి సంఖ్య 23,71,772కు తగ్గిపోయింది. అదే క్రమంలో ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా ర్థుల సంఖ్య 37,26,220కి పెరిగింది.ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లలో పెరిగిన విద్యార్థులు ఖమ్మం జిల్లాలోనూ రామలింగాలపల్లి క్రాస్ రోడ్డు, ఆలియాతండా, గంగారంతండా కొత్తతండా పాఠశాలలు మూతపడ్డాయి. అయితే ఓవరాల్గా చూస్తే ఈ మూడేళ్లలో ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రైవేటు స్కూళ్లలోనూ రెట్టింపు స్థాయిలో విద్యార్థుల సంఖ్య పెరిగింది. 2022–23లో ప్రభుత్వ స్కూళ్లలో 1,08,715 మంది విద్యార్థులు ఉంటే వారి సంఖ్య 2024–25లో 1,10,934కు పెరిగింది. ప్రైవేట్ స్కూళ్లలో గతంలో 1,22,781 మంది ఉంటే 1,26,421కి పెరిగింది. ఏటేటా పెరుగుతున్న జీరో ఎన్రోల్మెంట్ ప్రభుత్వ పాఠశాలల్లో జీరో ఎన్రోల్మెంట్ ఏటేటా పెరుగుతోంది. అక్కడక్కడ బడిబాటలో టీచర్లు విద్యార్థుల తల్లిదండ్రులను ఒప్పించి ఒకటీ రెండు మూత పడిన స్కూళ్లను తెరిపిస్తున్నా, వందల సంఖ్యలో మూత పడుతూనే ఉన్నాయి. ⇒ 2021–22 విద్యా సంవత్సరంలో జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్ల సంఖ్య 1,086 ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య రెట్టింపునకు దగ్గరైంది. ⇒ జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్ల సంఖ్య 2022–23 విద్యా సంవత్సరంలో 1,307కు పెరగగా, 2023–24 సంవత్సరంలో 1,745కు, 2024–25 సంవత్సరంలో వాటి సంఖ్య 1,980కి పెరిగింది. ⇒ ఈ నెల 19 వరకు నిర్వహించే బడిబాట తర్వాత వాటిల్లో ఎన్ని తెరుచుకుంటాయో, ఈసారి ఎన్ని స్కూళ్లు మూత పడతాయో త్వరలోనే తేలనుంది. -
తరాలు మారి.. అంతరాలు పెరిగి..
ఈ తరం యువతకు, నిన్నటి తరం వయోధికులకు నడుమ దూరం పెరుగుతోంది. పెద్దవాళ్లను బాగా చూసుకోవడమంటే వాళ్లకు కావలసిన వైద్య సదుపాయాలను కల్పించడం, సమయానికి మందులు, భోజనం వంటివి అందజేయడమే అనే భావన పెరిగిపోతోంది. తమ భావోద్వేగాలను పిల్లలతో పంచుకోవాలని పెద్దలు ఆశిస్తుండగా, యువత మాత్రం అందుకు సిద్ధంగా లేదు. ఈ నెల 15వ తేదీన అంతర్జాతీయ వయోధికుల వేధింపుల నివారణ అవగాహన దినం సందర్భంగా హెల్పేజ్ ఇండియా ‘ప్రస్తుత డిజిటల్ యుగంలో వృద్ధాప్యంపై యువత దృక్కోణం’అనే అంశంపై సర్వే నిర్వహించింది. ఈ అధ్యయనంలో యువత, వయోధికుల అభిప్రాయాలను సేకరించారు. హైదరాబాద్తో పాటు దేశవ్యాప్తంగా 10 నగరాల్లో 5,798 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. సర్వేలోని ముఖ్యాంశాలు..⇒ సర్వేలో వృద్ధాప్యం అంటే ఏమిటి అన్న ప్రశ్నకు 56 శాతం యువత ‘ఒంటరితనం’అని, మరో 48 శాతం ‘ఇతరులపై ఆధారపడేవారు’అని బదులిచ్చారు. అపార అనుభవం కలిగినవారు అని 51 శాతం యువత పేర్కొనగా, ‘గౌరవించవలసిన వాళ్లు’అని 43 శాతం మంది అభిప్రాయపడ్డారు. ⇒ సర్వేలో పాల్గొన్న వయోధికుల్లో 54 శాతం మంది తాము ఒంటరితనానికి గురవుతున్నట్లు చెప్పారు. 47 శాతం మంది తమ బాధలను పూర్తిగా అర్థం చేసుకోవడం లేదని వాపోయారు. ⇒ ఉమ్మడి కుటుంబాల్లో మాత్రం పెద్దవాళ్లకు, పిల్లలకు మధ్య అనుబంధాలు కొంతవరకు బలంగానే ఉన్నాయి. 49 శాతం యువత తమ తాత, ముత్తాతలతో ఎక్కువ సమయం గడుపుతున్నామని చెప్పారు. 50 శాతం మంది వృద్ధులు తమ కొడుకులతో ఎక్కువ అనుబంధాన్ని, 40 శాతం మంది తమ మనవళ్లతో ఎక్కువ అనుబంధాన్ని కలిగి ఉన్నామని వెల్లడించారు. ⇒ చిన్న కుటుంబాల్లో వయోధికులకు సముచితమైన గౌరవం లభిస్తున్నట్లు సర్వేలో తేలింది. సర్వేలో పాల్గొన్న 75 శాతం వయోధికుల్లో 46 శాతం మంది కుటుంబం తమ మాట వింటుందని, మరో 28 శాతం మంది అప్పుడప్పుడు మాత్రమే వింటుందని తెలిపారు. ⇒71 శాతం వృద్ధులు సాధారణ మొబైల్ ఫోన్లు వాడుతుండగా, 13 శాతం మంది కంప్యూటర్లు, ఇంటర్నెట్ సేవలను వినియోగిస్తున్నట్లు తేలింది. 66 శాతం వయోధికులు మొబైల్ ఫోన్ను ‘సాంకేతిక గందరగోళం’గా భావిస్తున్నారు. ⇒ 51 శాతం యువత, 45 శాతం వయోధికులు తరాల మధ్య అతిపెద్ద అంతరం ఉన్నట్లు పేర్కొన్నారు. 57 శాతం యువత, 49 శాతం వయోధికులు మాత్రం మనం ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవచ్చుననే ఆశావహ దృక్పథాన్ని కలిగి ఉన్నారు. ⇒ సర్వేలో పాల్గొన్న 86 శాతం వయోధికులు కుటుంబమే తమకు అండగా ఉందని తెలిపారు.సంతోషకరమైన వృద్ధాప్యం కావాలి జీవితంలో ప్రతి ఒక్కరికి వృద్ధాప్యం అనివార్యమైన దశ. పెద్దలను అర్ధం చేసుకోవడంలో యువత విఫలం కావడం వల్ల చాలామంది వయోధికులు సంతోషకరమైన వృద్ధాప్యానికి దూరమవుతున్నారు. కుటుంబ సంబంధాలు బలోపేతంగా ఉంటేనే ఆ సంతోషం లభిస్తుంది. – శ్యామ్, స్టేట్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్, హెల్పేజ్ ఇండియా -
ఎండ ప్రచండం!
జూన్ 14 వరకు తీవ్రమైన వడగాడ్పులు.. వాయవ్య భారతానికి వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరిక.పంజాబ్, హరియాణాలకు రెడ్ అలర్డ్. వచ్చే 48 గంటల్లో భానుడి ఉగ్రరూపం అంటూ జూన్ 12న ఐఎండీ మరో హెచ్చరిక.వేసవి వెళ్లిపోయింది. ఉష్ణోగ్రత ఉండిపోయింది! దేశంలోని అన్ని ప్రాంతాలను వడగాడ్పులు చుట్టు ముట్టాయి. ఇది ప్రస్తుతం.– సాక్షి, స్పెషల్ డెస్క్2030 నాటికి ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, చెన్నై, వంటి నగరాల్లో వడగాడ్పులు వీచే రోజుల సంఖ్య ఇప్పటితో పోలిస్తే రెట్టింపు కానుందట. టైర్ –1, 2 సిటీల్లో 72 శాతం వాటికి తీవ్ర వేడిమి, భారీ వర్షాల ముప్పు పొంచి ఉందట. ఐపీఈ గ్లోబల్ – ఎస్రి ఇండియా సంయుక్త అధ్యయనం ఇలాంటి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.భానుడి ప్రతాపానికి పంజాబ్, హరియాణా, రాజస్తాన్ తల్లడిల్లిపోతున్నాయి. ఢిల్లీలో రెడ్ అలెర్ట్. స్కూళ్లు బంద్. ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది ఏప్రిల్ మధ్య నుండి జూన్ 10 వరకు దాదాపు 700 వడదెబ్బ కేసులు నమోదయ్యాయి. ప్రపంచ చరిత్రలోనే ‘హాటెస్ట్ ఇయర్’గా 2024 నమోదైంది. మళ్లీ ఇప్పుడు ఆ స్థాయిలో భారత్లో సెగలు రేగుతున్నాయి. భవిష్యత్తుల్లో వేసవి కాలం.. మరిన్ని రోజులు ఉండనుందట. వడగాడ్పుల తీవ్రత మరింత పెరగనుందట. ఒకపక్క భారీ వర్షాలు.. మరోపక్క పిడుగుల వర్షం కురవనుంది. మానవాభివృద్ధి, సుపరిపాలన వంటి అంశాల్లో పనిచేసే ఐపీఈ గ్లోబల్; భౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్)పై పనిచేసే ఎస్రి ఇండియా సంయుక్తంగా దేశంలో తీవ్ర వేడి, అత్యంత వర్షపాతం అంశాలపై అధ్యయనం చేశాయి. జిల్లా స్థాయిలో సమస్య తీవ్రతను మ్యాపింగ్ చేశాయి. పట్టణాల్లో మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, ప్రజారోగ్య వ్యవస్థలను పర్యావరణ ఉత్పాతాలను తట్టుకునేలా తీర్చిదిద్దాల్సిన అవసరాన్ని ఈ అధ్యయనం నొక్కి చెప్పింది.పదింట 8 జిల్లాల్లో...1993 నుంచి చూస్తే.. వేసవిలో తీవ్రమైన వడగాడ్పులు ఉండే రోజులు 15 రెట్లు పెరిగాయి. కోస్తా జిల్లాల్లో తీవ్రమైన వేడి, భారీ వర్షాలు.. ఇలా విచిత్రమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 2040 నాటికి.. ప్రతి 10 కోస్తా జిల్లాల్లోనూ 8 జిల్లాల్లో వేసవి ముగిసినా తీవ్ర వేడి, ఉక్కపోత వంటివి వర్షాకాలంలో కూడా నమోదైనా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ సమస్యలకు పరిష్కారంగా.. రియల్టైమ్లో వాతావరణాన్ని అంచనా వేసేందుకు ఒక క్లైమేట్ రిస్క్ అబ్జర్వేటరీ (సీఆర్ఓ) ఏర్పాటును ఈ అధ్యయనం సూచించింది. జీడీపీలో 4.5 శాతం తగ్గుదలఎండ దెబ్బకు ఆర్థిక నష్టం కూడా పెరిగే ముప్పు పొంచి ఉంది. 2030 నాటికి భారతదేశం అంచనా వేసుకున్న 8 కోట్ల ప్రపంచ ఉద్యోగాలలో 3 కోట్ల 40 లక్షల ఉద్యోగాలు తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. తీవ్రమైన వేడి, ఉక్కపోత కారణంగా పని గంటల్ని కోల్పోయే పరిస్థితి ఉండటంతో ఈ దశాబ్దంలో స్థూల జాతీయోత్పత్తి (జి.డి.పి.)లో 4.5 శాతం వరకు తగ్గుదల కనిపించవచ్చని రిజర్వు బ్యాంకు హెచ్చరించింది.తీవ్రం.. సాధారణం!తీవ్రమైన వాతావరణం అన్నది ఇప్పుడు చాలా సాధారణమైన విషయమైపోయింది. దీన్ని కనిపెట్టి, మార్చుకోవాలంటే మనకు భౌగోళిక ఉపకరణాలు చాలా అవసరం. – అజేంద్రకుమార్, ఎమ్.డి., ఎస్రివాతావరణ అస్థిరతలు పసిగట్టాలివాతావరణం, అభివృద్ధి అనేవి పరస్పర అవినాభావ సంబంధం ఉన్నవి. భారత్ సహా గ్లోబల్ సౌత్గా పిలిచే దేశాలన్నింటి ముందూ ఇప్పుడు ఒక సమస్య ఉంది. అదేంటంటే.. వాతావరణ అస్థిరతలను పసిగట్టి, అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతూనే ప్రజల జీవన ప్రమాణాలనూ పెంచాలి. – అశ్వజిత్ సింగ్, వ్యవస్థాపకుడు, ఎమ్.డి., ఐపీఈ గ్లోబల్కోస్తా ప్రాంతాల్లోనే ఎక్కువభారతదేశం అంతటా వడగాడ్పులు వీచే రోజులు 2030, 2040 నాటికి గణనీయంగా పెరుగుతాయని అంచనా. ప్రాంతాల వారీగా వడగాడ్పు రోజుల సంఖ్యలో పెరుగుదల అంచనాలు.. -
ఇంతింతై.. కాస్తంతై..
భారత ఐటీ పరిశ్రమలోని 5 అగ్రశ్రేణి సంస్థల్లోని మొత్తం ఉద్యోగుల్లో.. నాలుగింట మహిళా ఉద్యోగుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. అదే సమయంలో మొత్తం మహిళా ఉద్యోగుల సంఖ్య మూడింట పెరిగింది. ప్రారంభ స్థాయి ఉద్యోగాల్లో మహిళల వాటా మూడింట ఒక వంతు కంటే ఎక్కువే ఉంది. కానీ సీనియర్ స్థాయిల్లో మాత్రం బాగా తగ్గింది. ఐటీ కంపెనీల్లో స్త్రీ, పురుష ఉద్యోగుల మధ్య వేతన అంతరం కూడా ఎక్కువగా ఉంది. – సాక్షి, స్పెషల్ డెస్క్దేశీయ ఐటీ రంగంలో మహిళలు గట్టిపోటీని ఎదుర్కొంటున్నారు. మనదేశంలోని అగ్రశ్రేణి 5 కంపెనీల్లో నాలుగు సంస్థలు 2024–25లో తమ ఉద్యోగుల్లో మహిళల వాటా తగ్గినట్లు నివేదించాయి. మొత్తం మీద ఈ ఐదు కంపెనీలు 2024 మార్చి నుండి 2025 మార్చి వరకు నికరంగా 27,000 మందికిపైగా మహిళలను కొత్తగా చేర్చుకున్నట్లు వెల్లడించాయి.విప్రో మినహా...: మహిళా సిబ్బంది వాటా 2023–24లో 35.6 శాతం నుండి 2024–25లో 35.3 శాతానికి తగ్గిందని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నివేదించింది. ఇన్ఫోసిస్లో ఈ సంఖ్య 39.3 నుండి 39 శాతానికి వచ్చి చేరింది. హెచ్సీఎల్ టెక్లో మహిళా ఉద్యోగుల వాటా 29.1 నుండి 28.8 శాతానికి తగ్గింది.క్యాలెండర్ ఇయర్ అకౌంటింగ్ (జనవరి–డిసెంబర్)ను అనుసరించే కాగ్నిజెంట్లో మొత్తం ఉద్యోగుల్లో మహిళా సిబ్బంది వాటా 2023లో 38.8 నుంచి 2024లో 38 శాతానికి పరిమితమైంది. విప్రో మాత్రమే ఈ విషయంలో మినహాయింపు. ఈ సంస్థలో మహిళామణుల సంఖ్య 2023–24తో పోలిస్తే 36.6 నుండి గత ఆర్థిక సంవత్సరంలో 37.1 శాతానికి పెరిగింది. సీనియర్ స్థాయిల్లో తగ్గుతోంది..: మన సమాజంలోని లింగ అసమానతలు, సాంస్కృతిక సవాళ్ల కారణంగా మహిళా ఉద్యోగుల వాటా స్తబ్దుగా ఉందని క్వెస్ ఐటీ స్టాఫింగ్ చెబుతోంది. ప్రారంభ స్థాయి ఉద్యోగాల్లో మహిళల వాటా మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మందిని కలిగి ఉన్నప్పటికీ.. సీనియర్ స్థాయిల్లో వారి సంఖ్య బాగా తగ్గుతోందని వెల్లడించింది. సీనియర్ నాయకత్వం విషయంలో చాలా సంస్థలలో మహిళల నిష్పత్తి సింగిల్ డిజిట్లోనే ఉంది. టీసీఎస్లో అగ్రశ్రేణి జట్టులో మహిళలు 3.6 శాతం మాత్రమే ఉన్నారు. కాగ్నిజెంట్ ఈ విషయంలో 20 శాతం మార్కును దాటింది. చాలా సంస్థలు శ్రామిక శక్తిలో మహిళల వాటా విషయంలో మూడింట ఒక వంతు (33 శాతం) సంఖ్యకు కట్టుబడి ఉన్నాయి. సాంకేతిక రంగంలో సందర్భం, మార్కెట్ తీరు, యజమానుల విచక్షణపైనే మహిళల నియామకాలు ఉంటాయని స్టాఫింగ్ కంపెనీ ఎక్స్ఫెనో అంటోంది. వేతనాల్లోనూ అంతరమే..స్త్రీ, పురుష నిష్పత్తితోపాటు ఐటీ కంపెనీల్లో వేతన అంతరం కూడా పెద్ద ఎత్తున ఉంది. టీసీఎస్లో బోర్డు సభ్యులు, సీనియర్ మేనేజ్మెంట్ మినహా మహిళా ఉద్యోగుల సగటు వార్షిక జీతం 2024–25లో రూ.10.6 లక్షలు మాత్రమే. ఈ కంపెనీలో ఇదే స్థాయి ఉద్యోగాల్లో పురుషులకు ఏకంగా రూ.16.7 లక్షల వేతనం ఉంది. అలాగే ఇన్ఫోసిస్లో మహిళా ఉద్యోగుల సగటు వార్షిక జీతం రూ.8 లక్షలు ఉంది. పురుష సహోద్యోగులకు ఇది రూ.11 లక్షలు. ఇతర దిగ్గజ కంపెనీల్లో ఇలా..యాక్సెంచర్, క్యాప్జెమినె వంటి గ్లోబల్ కంపెనీలలో మహిళా ప్రాతినిధ్యం బలంగా ఉంది. 2024లో యాక్సెంచర్ మొత్తం సిబ్బందిలో మహిళా సిబ్బంది వాటా 48 శాతం కావడం విశేషం. క్యాప్జెమినైలో మహిళా సిబ్బంది వాటా 38.8 శాతం నుండి 39.7 శాతానికి పెరిగింది. మేనేజర్ స్థాయి రోల్స్లోకి వెళ్లే అవకాశాలు పురుషుల కంటే మహిళలకు 2.1 రెట్లు తక్కువగా ఉన్నాయని క్వెస్ చెబుతోంది. కరోనా మహమ్మారి తరువాత వచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం మహిళా ఉద్యోగులకు లాభిస్తుందని భావించినప్పటికీ.. అది ఆశించిన ఫలితాలు అందించలేదని నిపుణులు అంటున్నారు. ఇంటి నుంచే పని వల్ల ఇంటి పని భారం మరింత పెరిగిందని.. దానివల్ల వృత్తి, ఉద్యోగాలపై శ్రద్ధ పెట్టడం చాలామందికి కష్టమైందని చెబుతున్నారు. టాప్–5 కంపెనీల్లో మహిళా ఉద్యోగుల సంఖ్య -
తాబేలుకు ఫాదర్స్ డే
మనకు తెలిసి ఈ భూమ్మీద అత్యంత ఎక్కువ కాలం బతికే జీవి తాబేలు. దాదాపు 300 ఏళ్లు బతుకుతుందని అంచనా. అలాంటి ఓ తాబేలు అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడాలో ఉన్న మయామీ జూలో ఓ తాబేలు 135వ బర్త్డేను, మొదటి ఫాదర్స్డేను కూడా జరుపుకొంది. వృద్ధాప్యంలో మొదటిసారి తండ్రయిన తాబేలుగా గిన్నిస్ రికార్డులకూ ఎక్కనుంది. 234 కిలోల బరువున్న గాలాపాగోస్కు చెందిన ఈ తాబేలు పేరు గోలియత్. ఇది 1890లో జన్మించి ఉంటుందని భావిస్తున్నారు. ఈ జాతి తాబేళ్లు అంతరించిపోతున్న సరీసృపాల్లో ఉన్నాయి. గోలియత్ను 1929లో బ్రోంక్స్ జూకు, ఆ తరువాత 1981లో మయామి జూకు తరలించారు. ఇన్నేళ్ల తరువాత.. స్వీట్ పీ అనే వందేళ్ల తాబేలు వల్ల గోలియత్కు తండ్రి స్థానం లభించింది. జనవరి 27న స్వీట్ పీ ఎనిమిది గుడ్లు పెట్టగా.. 128 రోజులు పొదిగిన తరువాత ఒక్కటి మాత్రమే తాబేలు పిల్లగా మారింది. ఇన్నేళ్లలో గోలియత్కు ఇదే తొలి సంతానం కావడం విశేషం! ఈ జూలో మొట్టమొదటి గాలాపాగోస్ జాతి తాబేలు పిల్ల కూడా. తాబేళ్లు పుట్టుకతోనే స్వతంత్రంగా ఉంటాయని, ఈ తాబేలు పిల్లను ప్రత్యేక స్థలానికి తరలించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇక జూ నిర్వాహకులు ఆదివారం గోలియత్ పుట్టిన రోజుతోపా టు, మొదటి ఫాదర్స్డేను కూడా నిర్వహించారు. వృద్ధాప్యంలో మొదటి సారి తండ్రయిన తాబేలుగా గోలియత్కు గిన్నిస్ రికార్డ్ కోసం దరఖాస్తు చేసినట్లు జూ నిర్వాహకులు తెలిపారు. 135 ఏళ్లు గోలియిత్ రికార్డును కచి్చతంగా సొంతం చేసుకుంటుందని ఆశిస్తూ ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎస్సెస్సీ.. ఇంజనీర్!
ముదిగొండ: చదివింది పదో తరగతే... కానీ చిన్నతనం నుంచే ఇంజనీర్ కావాలన్న పట్టుదలను మాత్రం వీడలేదు. ఓ రైస్ మిల్లు మెకానిక్ వద్ద కొన్నేళ్లు పని నేర్చుకుని.. ఆతర్వాత సొంతంగా చిన్నచిన్న మరమ్మతులు చేయ డం మొదలుపెట్టాడు. ఆపై సొంతంగా కొత్త రైస్ మిల్లుల్లో పరికరాలు బిగించే స్థాయికి చేరాడు. ఒకటి కాదు రెండు కాదు 33 ఏళ్ల కాలంలో 110 మంది రైస్ మిల్లుల ఏర్పాటులో భాగంగా పంచుకున్న వ్యక్తి విజయగాథ ఇది. మిత్రులను చూస్తూ..ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురానికి చెందిన తునికిపాటి సుధాకర్ పదో తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. కానీ ఆతర్వాత ఆయన పదో తరగతి మెమో పోయింది. డూప్లికేట్ సర్టిఫికెట్ ఎలా తీసుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఆయన స్నేహితులు ఇంటర్ పూర్తిచేసి ఇంజనీరింగ్ విద్య మొదలుపెట్టారు. అయినప్పటికీ ఉన్నత విద్య చదవాలనే పట్టుదల వీడని సుధాకర్ ఎలా ముందుకు సాగాలా అని ఆలోచనలో పడ్డాడు. ఇంటర్ పాస్ అయి, బీటెక్ చదవాలంటే నాలుగేళ్లు పడుతుంది. ఆతర్వాత ఎంచుకున్న విభాగం లోనూ స్థిరపడాలంటే నైపుణ్యాలు తప్పనిసరి. కానీ సుధాకర్కు మెకానికల్ ఇంజనీర్ కావాలని ఉండటం, చదివే పరిస్థితులు లేక తొలుత రైస్ మిల్లు మెకానిక్ వద్ద శిక్షణ ఆరం భించాడు. కొన్నేళ్లు ఆయన శిక్షణ రాటుదేలాక సొంతంగా మరమ్మతులు చేయడం మొదలుపెట్టాడు.కొత్త మిల్లులపై దృష్టిచాన్నాళ్లు రైస్ మిల్లు మరమ్మతుల రంగంలో పనిచేసిన సుధాకర్ నైపుణ్యం సాధించాడు. ఆతర్వాత కొత్త మిల్లుల ఏర్పాటుపై దృష్టి సారించాడు. ఇలా 33 ఏళ్లలో ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలో 110 మిల్లుల ఏర్పాటులో భాగం పంచుకున్నాడు. ఏ స్థాయి మిల్లు అయినా సరి యజమానుల సూచనలతో కావాల్సిన విడిభాగాలు తెప్పించడం.. చకచకా రోజుల వ్యవధిలోనే మిల్లులు సిద్దం చేయడంలో ప్రావీణ్యం సాధించాడు. విడిభాగాలు తెప్పిం చడం, అమర్చడం, విద్యుత్, వెల్డింగ్ ఇలా అన్నీ ప్రక్రియల్లో నైపుణ్యం సాధించినా సహాయకులతో కలిసి నెలలోగా మిల్లును సిద్ధం చేస్తుండటం విశేషం. అంతేగాక తాను అమర్చిన మిల్లుల్లో ఏ సమస్య వచ్చినా త్వరగా మరమ్మతు చేసి పనులు ఆగకుండా చూస్తుండటంతో పలు జిల్లాల్లో పేరు సాధించాడు.ఎక్కడెక్కడ..?: ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ రైస్ మిల్లు షెడ్డులో పరికరాలు జిల్లాల్లోనే కాక ఏపీలోని పలు ప్రాంతాల్లో సుధాకర్ రైస్ మిల్లులు సిద్ధం చేశాడు. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట, ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో రైస్ మిల్లుల ఏర్పాటులో భాగం పం చుకున్నాడు. మిల్లుల ఏర్పాటుకు కావాల్సిన పరికరాలను విజయవాడ, బెంగళూరు, చైన్నై, హైదరాబాద్లో యజమానులతో తెప్పించి.. సామర్థ్యం మేరకు రోజుల వ్యవధిలోనే మిల్లులను సిద్ధం చేస్తుంటామని సుధాకర్ తెలిపారు.మూడు మిల్లులు సుధాకర్తోనే..2004లో పాల్వంచ సమీపాన పాండురంగాపురం, 2015లో తోడేళ్లగూడెం, 2023లో మిట్టపల్లిలో మూడు రైస్ మిల్లులు ఏర్పాటుచేశాం. ఈ పనులన్నీ సుధాకర్ ఆధ్వర్యంలోనే జరిగాయి. మిల్లుల ఏర్పాటు పనులే కాక ఏ చిన్న మరమ్మతు వచ్చినా చేస్తాడు. తద్వారా మాతో పాటు రైతులకు ఇక్కట్లు లేకుండా పనులు సాగుతున్నాయి.- ఇలవల సంజీవరెడ్డి,పొందురంగాపురం, పాల్వంచ మండలం -
ఎటెళ్లిపోయాయో.. ఆ 900 బస్తాలు
సాక్షి టాస్క్ఫోర్స్: పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని టీడీపీ కూటమి నేతలు బుక్కేస్తున్నారు. రూ.కోట్ల విలువైన బియ్యాన్ని పక్కదారి పట్టించేస్తున్నారు. వెయ్యి బస్తాలకు పైగా రేషన్ బియ్యం ఉన్న ఓ గోదామును అధికారులు శుక్రవారం తనిఖీచేసి తాళం వేయగా తెల్లారేసరికి 109 బస్తాలను ఉంచి మిగిలిన వాటిని రాత్రికి రాత్రే తరలించేశారంటే పచ్చమూకలు ఎంతటి బందిపోట్లో తెలుస్తోంది. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో వెలుగుచూసిన ఈ బాగోతం వెనుక టీడీపీ ముఖ్యనేత కుమారుడున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.వివరాలివీ.. ఓ గుర్తుతెలియని వ్యక్తి శుక్రవారం అక్రమ బియ్యం దందాపై ఇచ్చిన సమాచారంతో పట్టణంలోని శిరుగుప్ప రోడ్డులో ఉన్న ఓ గోదామును సివిల్ సప్లయ్స్ రాష్ట్ర డైరెక్టర్ మహేష్నాయుడు తనిఖీ చేశారు. అందులో వెయ్యిబస్తాలకు పైగా రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. అప్పటికే ఆలస్యం కావడంతో ఆయన గోడౌన్కు తాళం వేయించారు. దానిని సీజ్ చేసేందుకు శనివారం ఉదయం ఆయన గోదాముకు వచ్చారు. గోదాములో కేవలం 109 బస్తాలు మాత్రమే ఉండడాన్ని చూసి మహేష్నాయుడు, సివిల్ సప్లయ్స్, డిప్యూటీ తహసీల్దార్ బాబు, పోలీసు అధికారులు అవాక్కయ్యారు. మిగతా బియ్యం బస్తాలన్నీ రాత్రికి రాత్రే తరలిపోయాయి. రంగంలోకి టీడీపీ ముఖ్యనేత కుమారుడు!..మహేష్నాయుడు గోడౌన్ తనిఖీకి వెళ్లగానే ఆదోనికి చెందిన టీడీపీ ముఖ్యనేత ఒకరు ఫోన్ చేసినట్లు తెలిసింది. వెయ్యికి పైగా బియ్యం బస్తాలు పట్టుబడినట్లు తెలుసుకుని ఆయన తనకేమీ సంబంధంలేదని తప్పుకున్నట్లు సమాచారం. అయితే, ఆ వెంటనే సదరు ముఖ్యనేత కుమారుడు అక్కడికి చేరుకోవడం, తన తండ్రికి తెలీదని.. చూసీచూడనట్లుగా వదిలేయాలని డైరెక్టర్ను కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు కూడా సంపాదించుకునేందుకు అడ్డుతగిలితే ఎలాగని డైరెక్టర్తో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ముఖ్యనేతల కుమారుల బియ్యం దందా..వాస్తవానికి.. ఆదోని టీడీపీలో రెండు వర్గాలున్నాయి. అందులో ఒక వర్గం నేత కుమారుడు ఆదోని పట్టణం, మరో వర్గం నేత కుమారుడు ఆదోని రూరల్ ఏరియాలో బియ్యం దందా చేస్తున్నారు. వీరిని నిలువరించే వాళ్లు లేకపోవడంతో వారిద్దరూ పోటీపడి మరీ బియ్యం దందాను సాగిస్తున్నారు. సమీపంలోని కర్ణాటక సరిహద్దులు దాటించి రూ.కోట్లు దండుకుంటున్నారని ఆరోపణలున్నాయి.దోషులపై పీడీ యాక్ట్..రేషన్బియ్యం దందాలో ఎవరెవరి హస్తం ఉందో సోమవారం తేలుస్తాం. రాత్రి వెయ్యికి పైగా బియ్యం బస్తాలున్నట్లు గుర్తించాం. తెల్లారేసరికి అవన్నీ నిపించకుండాపోవడం చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. విషయాన్ని పైకి తీసుకెళ్తా. పూర్తిస్థాయి విచారణ చేయించి దోషులపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయిస్తాం.– మహేష్నాయుడు, సివిల్ సప్లయ్స్ డైరెక్టర్కచ్చితంగా టీడీపీ నేతల ప్రమేయం..పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ దందాలో కచ్చితంగా టీడీపీ నేతల ప్రమేయం ఉంది. పూర్తిస్థాయి విచారణ చేయకుండా అసలైన దోషులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. – వై. సాయిప్రసాద్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఆదోని -
అర్థం చేసుకోరూ..!
ఇంటర్నెట్ తెచ్చిన మార్పులతో 10, 12 ఏళ్లలోపు పిల్లలకే పెద్దలకు సంబంధించిన విషయాలు తెలిసొస్తున్నాయి. ఒక వయసు వచ్చేటప్పటికే గర్ల్/బాయ్ ఫ్రెండ్స్ కచ్చితంగా ఉండాలనే ధోరణి ఏర్పడుతోంది. అయితే, టీనేజీలో వచ్చే మార్పులకు సంబంధించి భావోద్వేగపరంగా ఇతరత్రా మార్పు లపై మన విద్యా విధానంలో అవగాహన కల్పించే ప్రయత్నాలు జరగడం లేదు. శారీరక ఆరోగ్యం ఎంత అవసరమో, భావోద్వేగ ఆరోగ్యమూ అంతే ముఖ్యం. యువతకు ఆరోగ్యకర సంబంధాలను బలంగా ఏర్పరచే శక్తిని ఇవ్వాలంటే విద్య కూడా మార్గదర్శకంగా మారాలని నిపుణులు చెబుతున్నారు.సాక్షి, హైదరాబాద్: స్నేహం మొదలుకొని ప్రేమ వరకు... దీని పరిధిలో ప్రభావం చూపే అంశాల్లో ఆత్మవిశ్వాసం, సానుకూల అభిప్రాయం, స్పందన–ప్రతిస్పందన ఎలా ఉండాలన్న దానిపై చాలామందికి అంటే మరీ ముఖ్యంగా జెన్–జెడ్ (జనరేషన్ జెడ్)గా పిలిచే నేటి యువతరానికి అవగాహన ఉండటం లేదు. స్నేహం, ప్రేమ, రిలేషన్షిప్లో చిన్నపాటి వైఫల్యం ఎదురైనా లేదా అలాంటి భావన కలిగినా అది మానసికంగా తీవ్ర ప్రభావం చూపుతోంది. చిన్న చిన్న సమస్యలు కూడా పెద్ద సమస్యలుగా కనిపిస్తున్నాయి. తిరస్కరణ పెను విపత్తుగా గోచరిస్తోంది.ఇది డిప్రెషన్, ఆత్మహత్యలు లేదా హింసకు పురిగొల్పుతోంది. దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న ఇలాంటి అనేక ఘటనలు కలకలం సృష్టించాయి. ఈ నేపథ్యంలో సంబంధాల ప్రభావం, భావోద్వేగ నైపుణ్యాల అవసరం విశ్వవిద్యాలయ స్థాయిలో గుర్తించగా.. ఢిల్లీ వర్సిటీ ఈ సమస్యను తేలిగ్గా తీసుకోకుండా, విద్యాపరంగా ఓ కోర్సు రూపంలో పరిష్కరించేందుకు ముందుకు రావడం విశేషం.భావోద్వేగాల అవగాహనపై ముందడుగు..⇒ ప్రేమించడం ఒక్కటే కాదు, ప్రేమను ఒప్పించుకోవడం, అర్థం చేసుకోవడం, పరస్పర గౌరవంతో నడిపించడమూ ఓ కళే. గందరగోళ ప్రపంచంలో జీవిస్తున్న జెన్–జెడ్ తరానికి, ఢిల్లీ యూనివర్సిటీ ‘నెగోషి యేటింగ్ ఇంటిమేట్ రిలేషన్షిప్స్’ అనే ఓ విశిష్టమైన కోర్సును అందుబాటు లోకి తెచ్చింది. ఈ కోర్సు ఒక గైడెన్స్ వ్యవస్థలా పనిచేస్తుందని కౌన్సెలర్లు, విద్యావేత్తలు, నిపు ణులు చెబుతున్నారు. జెన్–జెడ్ తరానికి అనుభవజ్ఞుల మార్గదర్శ నం కల్పించడం, భావోద్వేగ అవగాహన పెంపొందించడంలో ఇది ఓ ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే...⇒ బాడీ ఇమేజ్, సోషల్ మీడియా ప్రొఫైల్స్ వంటి అంశాలు సంబంధాల్లో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ⇒ నేటి విద్యార్థులు గత తరం కంటే చాలా వ్యక్తిగత ధోరణిలోకి వెళ్లారు. భావోద్వేగాలపై కోర్సులు వారిని అంతర్గతంగా మారుస్తాయి. ⇒ యువత నుంచి ‘నేను ఇష్టపడే వ్యక్తిని ఎలా అప్రోచ్ కావాలి?’, ‘వాళ్ల తల్లిదండ్రులను కలిసేటప్పుడు ఎలా ప్రవర్తించాలి?’ అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధాలను నిర్మించుకోవడం, నమ్మకం పెంపొందించడం, ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం వంటి అంశాలను నేర్పే కోర్సులు తప్పనిసరిగా మారాయి.⇒ భావోద్వేగపరమైన అవగాహన వల్ల మన బాధను, ఇతరుల బాధను అర్థం చేసుకునే తత్వం అలవడుతుంది.⇒ స్వీయగౌరవం, ఇతరుల హద్దులను గౌరవించడం నేర్చుకోవచ్చు. అతి తక్కువ సమయంలో సంబంధాలు విడిపోవడం తగ్గించవచ్చు.‘నెగోషియేటింగ్ ఇంటిమేట్ రిలేషన్షిప్స్’ కోర్సు ప్రత్యేకతలివీ⇒ ఈ కోర్సు కేవలం థియరీతో నడవదు. విద్యార్థుల స్వీయ అనుభవాలు, డిజిటల్ జీవితం, పాప్ కల్చర్ ప్రభావం, డేటింగ్ చాలెంజెస్ వంటి అంశాలపై విశ్లేషణ చేయించడమే దీని లక్ష్యం.⇒ సంబంధాల్లో రెడ్ ఫ్లాగ్స్ (అపాయం సూచించే సంకేతాలు) గుర్తించడాన్ని నేర్పించటం.⇒ భావోద్వేగ సమతుల్యత పెంపొందించటం.⇒ గౌరవం, ఒప్పందం ఆధారంగా సంబంధాలు నిర్మించడం.⇒ సమస్యలు, ఒత్తిళ్లు వచ్చినప్పుడు ఎలా పరిష్కరించాలో నేర్పడం.⇒ స్నేహం, ప్రేమ, లైంగికతలతో ముడిపడిన ప్రవర్తన గురించి మౌలిక అవగాహన కల్పించడం.⇒ సోషల్ మీడియా, షోలు, రీల్స్ వంటివి మన సంబంధాలపై చూపే ప్రభావాన్ని విశ్లేషించడం.ఎలా అర్థం చేసుకోవాలో నేర్పించాలి...ళీ టీనేజీలో వచ్చే మార్పులకు సంబంధించి భావోద్వేగపరంగా ఇతరత్రా మార్పులపై మన విద్యా విధానంలో అవగాహన కల్పించే ప్రయత్నాలు జరగడం లేదు. టీచర్లకు కూడా విద్యార్థు లకు ఈ విషయంపై ఏమి బోధించాలో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభు త్వాలు కూడా ఆలోచించి ప్రతీ విద్యాసంస్థలో ఒకరిద్దరు ఫ్యాకల్టీ మెంబర్లకు భావోద్వేగపరమైన అంశాలు, స్నేహాలు, సంబంధాలపై శిక్షణ ఇచ్చి విద్యార్థులకు బోధించేలా చూడాలి. మేము ఇప్పటికే 500కుపైగా స్కూళ్లలో ప్రేమలు, రిలేషన్స్ షిప్స్ను ఎలా అర్థం చేసుకోవాలి, వాటితో ఎదురయ్యే పరిణామాలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశాం. – సి.వీరేందర్, సైకాలజిస్ట్ -
విన్యాసాల వాయిద్యం.. మార్ఫా సంగీతం..
గణేష్ చతుర్థి ఊరేగింపులైనా.. పెళ్లి వేడుకలైనా.. నగరాన్ని సందర్శించే ప్రముఖులను స్వాగతించాలన్నా టక్కున గుర్తొచ్చేది మార్ఫా బ్యాండ్. ఈ ఉల్లాసభరితమైన సంగీతం లేకపోతే హైదరాబాద్ సంప్రదాయం అసంపూర్ణమే. పాతబస్తీలో అందాల రాణులతో నృత్యం చేయించి, కొడుకు పెళ్లిలో నాగార్జునతో డ్యాన్స్ చేయించి.. తరాలకు, ప్రాంతాలకు అతీతంగా అలరించే శక్తి తనదని నిరూపించుకుంటోంది మార్ఫా సంగీత వాయిద్యం.. ఆఫ్రో, అరబ్ సంప్రదాయం నుంచి శతాబ్దాల క్రితం వలస వచ్చిన ఈ సంగీతం భాగ్యనగర సంస్కృతిలో భాగమైపోయింది. నగరంలో జరిగే ప్రతి వేడుకలోనూ తన ప్రశస్తిని చాటుకుంటోంది.. – సాక్షి, సిటీబ్యూరోనగరంలో అబ్బురపరుస్తున్న రిథమిక్ ట్యూన్స్సంస్కృతి, సంప్రదాయాలకు అతీతంగా కుల, మత సంబంధం లేకుండా అభిమానులున్న నగరానికి చెందిన మార్ఫా సంగీతం ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు పొందుతోంది. మధ్యప్రాచ్యంలో మార్ఫా ప్రదర్శనలు జరుగుతుంటే, మరోవైపు ఇటీవలే న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వంటి ప్రదేశాల్లో ఔత్సాహికుల నృత్యాలతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఆహార్యం నుంచి వైవిధ్యం..తల చుట్టూ ఎర్రటి చెక్కిన స్కార్ఫ్లు చుట్టుకుని, తెల్లటి కుర్తాలు, లుంగీలను «మార్ఫా కళాకారులు దరిస్తారు. ఈ కళాకారులు రాత్రిపూట, నిర్విరామంగా మూడు నుంచి ఆరు గంటల పాటు నిలబడి ప్రదర్శనలు ఇస్తారు. మెడలో బరువైన ఢోలక్ మోస్తూనే లయకు అనుగుణంగా> నృత్యం చేయాలి. ఉత్సవాలు, ఊరేగింపుల్లో తీవ్ర అలసట కారణంగా మార్ఫా కళాకారుల నోటి నుంచి రక్తస్రావం, అనారోగ్యానికి గురికావడం జరుగుతుంటుంది. మార్ఫా బ్యాండ్లో సంప్రదాయంగా 8, 12, 16, 22 మంది సభ్యులు ఉంటారు. ప్రేక్షకుల ఆదరణ మేరకు, బృందంలోని కొంతమంది సభ్యులు నృత్యం చేయవచ్చు. వారి సహచరులు వాయిద్యాలను వాయించేటప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన డాగర్ డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది. దీనిలో ఒక కళాకారుడు కత్తిని గాలిలోకి ఊపుతూ నర్తిస్తుంటే, ఇతర సంగీతకారులు క్రమంగా బీట్ టెంపోను పెంచుతారు.వైవిధ్యభరిత వాయిద్యాల సమ్మేళనం..మార్ఫా సంగీతంలో ‘మార్ఫా, సవారీ, నాగిన్, యాబు బక్కే రబు సాలా’ వంటి వివిధ శైలితో కూడిన రిథమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటీ దానికంటూ సొంత విలక్షణమైన వైవిధ్యంతో అలరిస్తాయి. ఈ సంగీతం అనేక వాయిద్యాల సహాయంతో పలకిస్తారు. ప్రధానంగా మార్ఫాలు (ధోలక్, డాఫ్ అని పిలుస్తారు). వీటిని సంగీతకారులు ‘థాపి’ అని పిలిచే చెక్క స్ట్రిప్లతో కొడతారు. వీరి పూర్వీకులు మేక చర్మంతో తయారు చేసిన మార్ఫాలపై కొట్టేవారు. నేటి కళాకారులు వాయించడం సులభం. ఖర్చు తక్కువ అవుతుందిని ఫైబర్ వాయిద్యాలు ఇష్టపడతున్నారు. కొన్ని విభిన్న వాయిద్యాలను కందూర, ముషాద్ జెట్టా, మార్ఫాలు, బిండియా పీటల్ అని పిలుస్తారు. వాటిలో ఎక్కువ భాగం ధోలక్ను పోలి ఉన్నప్పటికీ పరిమాణంలో తేడాలుంటాయి. ‘కళాకారులకు వారు వాయించడానికి ఎంచుకున్న వాయిద్యం ఆధారంగా వేతనం చెల్లిస్తారు’ అని కళాకారులు చెబుతున్నారు.చరిత్రతో మమేకం.. ఈ మార్ఫా బ్యాండ్లు తరచూ జెండా మార్చ్ల వంటి కార్యక్రమాలకు నియమించుకుంటారు. ఇటీవల మిస్ వరల్డ్ పోటీదారుల పాతబస్తీ సందర్శన సందర్భంగా వారికి మార్ఫా సంగీతం స్వాగతం పలికింది. నిజాం పాలనలో నగరానికి చేరుకుందీ యెమెన్ కళారూపం. ఈ కళారూపాన్ని నగరానికి ఎవరు పరిచయం చేశారు? అనే దానిపై కొంత వివాదం ఉంది. ఇది తీసుకొచ్చింది సిద్ధిలు (ఆఫ్రికన్ సంతతికి చెందిన వారు) అని కొందరు చెబుతుండగా, దీనిని ప్రాచుర్యంలోకి తెచ్చింది యెమెన్ పూర్వీకులేనని కొందరు అంటున్నారు.కళాకారులు ఏమంటున్నారు? ‘నిజాం పాలనలో వేడుకల సందర్భాల్లో ఈ వాయిద్యాన్ని వినియోగించేవారు. నేటికీ గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సమయంలో మార్ఫా తప్పనిసరి’ అని మార్ఫా కళాకారుడు కయ్యూమ్ బిన్ ఒమర్ చెప్పాడు. గత 28 సంవత్సరాలుగా ఈ వృత్తిలో ఉన్న ఓమర్ ప్రారంభంలో 70–80 మంది మార్ఫా బృందం ఉండేది. అయితే ప్రస్తుతం ఆ సంఖ్య 15కి తగ్గింది. మొత్తంగా చూస్తే ఇప్పటికీ మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నామనీ, తెలుగు రాష్ట్రాల వెలుపల కొన్ని ప్రదర్శనలు ఇస్తున్నామని ఒమర్ అంటున్నాడు. డాగర్ డ్యాన్స్ హైలెట్.. సాంప్రదాయ యెమెన్ నృత్యరూపం డాగర్ డ్యాన్స్కు అత్యంత డిమాండ్ ఉందని అరబి మార్ఫా బ్యాండ్ యజమాని మొహమ్మద్ యూసుఫ్ చెప్పారు. అయితే, నిజమైన కత్తులకు బదులు ప్రస్తుతం ప్లాస్టిక్ లేదా చెక్క కత్తులను వినియోగిస్తున్నారు. ‘గతంలో కొంతమంది ప్రేక్షకులు మద్యం మత్తులో కత్తులను లాక్కొని, ఇతరులను ఇబ్బందులకు గురిచేసిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం కత్తుల వినియోగాన్ని నిషేధించింది, కానీ సంప్రదాయాన్ని సజీవంగా ఉంచడానికి చెక్క లేదా ప్లాస్టిక్ కత్తులను ఉపయోగిస్తున్నాం’ అని మహమ్మద్ చెప్పారు. కళను సజీవంగా ఉంచేందుకు.. ‘నా పేరు ఫిరోజ్. కానీ అందరూ నన్ను జాబ్రీ అని పిలుస్తారు. చిన్నతనం నుంచి అంటే 24 సంవత్సరాలుగా మార్ఫా ప్లే చేస్తున్నా. నగరంలో ముఖ్యంగా బార్కాస్ ఏసీ గార్డ్స్ వంటి ప్రదేశాల్లో మార్ఫా ప్రసిద్ధి చెందింది. నిజాంల కింద పనిచేసిన యెమెన్ సైనికుల ద్వారా 200 ఏళ్ల క్రితం మార్ఫా నగరానికి వచ్చిందంటారు. అదేమో గానీ మా పెద్దలు ఈ కళను నాకు అందించారు. దీనిని సజీవంగా ఉంచడానికి నా వంతు కృషి చేస్తున్నా. నా బృందంలో 20 మంది సభ్యులున్నారు. నగరం అంతటా వివాహాలు, వేడుకల్లో ప్రదర్శనలు ఇస్తాం. మతాలకు అతీతంగా ఆహ్వానిస్తారు. ఇతర రాష్ట్రాలకూ వెళ్తుంటాం. కేవలం వారసత్వాన్ని సజీవంగా ఉంచాలన్నదే మా ఆలోచన. – ఫిరోజ్ మార్ఫా ఆర్టిస్ట్ (సోషల్ మీడియా పోస్ట్ నుంచి) -
ఆదాయం ఆశల పల్లకీలో..
దేశంలోని 74 శాతం గ్రామీణ కుటుంబాలు రాబోయే ఒక ఏడాదిలో తమ ఆదాయం గణనీయంగా వృద్ధి చెందుతుందని ఆశిస్తున్నట్లు ‘నాబార్’్డ (నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్) తాజా సర్వే వెల్లడించింది. 2025 మే నెలలో జరిగిన ఆ సర్వే ప్రకారం – ఈ 74 శాతం అన్నది గత మార్చిలో 72 శాతంగా నమోదైంది. 2024 సెప్టెంబర్లో నాబార్డ్ ద్వైమాసిక ‘రూరల్ ఎకనమిక్ కండిషన్స్ అండ్ సెంటిమెంట్స్ సర్వే (ఆర్.ఇ.సి.ఎస్.ఎస్.) ప్రారంభం అయినప్పటి నుంచి – రానున్న ఒక సంవత్సరంలో తమ ఆదాయం పెరుగుతుందని ఆశిస్తున్న వారి శాతంలో ఇదే అత్యధికం. – సాక్షి, స్పెషల్ డెస్క్నైరుతితో చిగురించిన ఆశలు600 గ్రామాల్లో.. ప్రతి నమూనా గ్రామం నుంచి 10 కుటుంబాలను ఎంపిక చేసుకుని 6,000 మందితో నాబార్డ్ ఈ సర్వే నిర్వహించింది. ఈ ఏడాది మే నెలలో ఐదవ విడత సర్వే పూర్తయింది. సర్వే ఫలితాలను బట్టి గ్రామీణ ప్రాంతాలలో తమ ఆదాయంలో పెరుగుదలను ఆశించే వారి సంఖ్య పెరగటం మాత్రమే కాకుండా, తమ ఆదాయం క్షీణించవచ్చునని మునుపు అనుకున్న వారి సంఖ్య సర్వే మొదటి విడతలోని 7.3 నుంచి 6.7 శాతానికి తగ్గటం విశేషం. గ్రామీణ కుటుంబాలలో ఆదాయం వృద్ధి గురించి పెరుగుతున్న ఆశావాదం.. గత కొన్ని నెలలుగా గ్రామీణ రంగం పుంజుకుంటోందన్న సానుకూల ఆలోచనలకు అనుగుణంగా ఉంది. 2025లో ‘సాధారణం కంటే ఎక్కువ’గా నైరుతి రుతుపవనాల ప్రభావం ఉంటుందన్న అంచనా గ్రామీణ రంగంలో సానుకూల మార్పునకు దోహదపడింది. ఆ సానుకూలత గ్రామీణ భారతదేశంలో వ్యవసాయ వృద్ధిని, కొనుగోలు శక్తిని పెంచుతుందన్న ఆశలు రేపింది. పెరగనున్న వాస్తవ వేతనాలుఇటీవలి ‘ఇండియా రేటింగ్స్’ నివేదిక ప్రకారం కూడా అనుకూల రుతుపవనాల వ్యవసాయ వృద్ధి కారణంగా 2025–26 లో వాస్తవ వేతనాలు (ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెరిగినవి) స్థిరంగా 6.5 శాతం నుంచి 7 శాతం వరకు వృద్ధి చెందుతాయని అంచనా. ఏదైనా ప్రతికూల వాతావరణ పరిస్థితులు, సంఘటనలు, రుతుపవనాల పురోగతిలో అంతరాయం, వాణిజ్యం లేదా భౌగోళిక రాజకీయ సమస్యలు సంభవిస్తే మాత్రం వాస్తవ వేతన వృద్ధి రేటు తగ్గవచ్చని కూడా నివేదిక సూచించింది. కాగా, నాబార్డ్ నివేదిక ప్రకారం.. ఆదాయం పెరుగుదలపై మే నెలలో స్వల్పంగా గ్రామీణ కుటుంబాల ఆశలు చిగురించాయి. 53.8 శాతం మంది మెరుగైన ఆదాయాలు వస్తాయని భావిస్తున్నారు. 2025 మార్చిలో ఈ ఆశ 52.5 శాతంగా మాత్రమే ఉంది. ఉపాధి లభ్యతపై సానుకూలతవచ్చే త్రైమాసికంలో లభించనున్న ఉపాధి అవకాశాలపై అంచనాలు కూడా ఇదే తరహాలో ఉన్నాయి. ఈ ఏడాది మే నెలలో 53.5 శాతం కుటుంబాలు ఉపాధి పరిస్థితుల్లో మెరుగుదలను ఆశించగా, 2024 సెప్టెంబర్ తర్వాత ఇదే అత్యధిక ఆశావహ శాతం. కేవలం 8 శాతం మంది మాత్రమే తగ్గుదలను అంచనా వేశారు, ఫలితంగా నికర సానుకూలత 45.4కు చేరుకుందని నాబార్డ్ సర్వే వెల్లడించింది. 2025 జనవరిలో స్వల్పంగా తగ్గిన ఆశలు తిరిగి స్థిరంగా కోలుకున్నాయి. ఈ ఏడాది మే నెలలో కుటుంబ ఆదాయాలు స్వల్ప మెరుగుదలను చూపించాయి. సర్వేలో పాల్గొన్నవారిలో 37.4 శాతం మంది గత సంవత్సరంతో పోలిస్తే తమ ఆదాయంలో పెరుగుదల కనిపించినట్లు తెలిపారు. మార్చిలో ఇది 34.8 శాతంగా ఉంది. అయితే 21.4 శాతం మంది తమ ఆదాయం తగ్గిందని, 41.3 శాతం మంది ‘ఏమో చెప్పలేం’ అని సమాధానం ఇచ్చారు.పొదుపు ఆలోచన కొంత తగ్గింది!నాబార్డ్ సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో వినియోగ వ్యయాలు కూడా బలంగానే ఉన్నాయి. 79.1 శాతం కుటుంబాలు తమ ఖర్చు పెరిగినట్లు తెలిపాయి. ఇది మార్చి నెలతో పోలిస్తే (79.9 శాతం) స్వల్పంగా తగ్గినప్పటికీ , నికరంగా 74.6 వద్ద స్థిరంగా ఉంది. ఈ ధోరణి గ్రామీణ కుటుంబాలలోని నిరంతర విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. అయితే ఇందుకు భిన్నంగా, పొదుపు చేయాలన్న ఆలోచన తగ్గిపోయింది. కేవలం 18.8 శాతం కుటుంబాలు మాత్రమే తమ పొదుపు మొత్తాలు పెరిగినట్లు చెప్పగా, 28.7 శాతం కుటుంబాలు తగ్గాయని తెలిపాయి. ఫలితంగా 9.9 శాతం నికరమైన ప్రతికూలత కనిపించింది. మార్చి (–11.9) నుంచి ఇది స్వల్ప మెరుగుదలను సూచిస్తున్నప్పటికీ, సర్వేలో వరుసగా ఐదవ విడతలో సైతం పొదుపు బలహీనంగానే ఉంది. -
దేశాన్ని బట్టి నిద్ర!
ఆరోగ్యవంతులు చక్కగా నిద్రపోతారు. చక్కగా నిద్రపోయేవారు ఆరోగ్యంగా ఉంటారు. మరి ఎన్ని గంటలు నిద్రపోతే ఆరోగ్యంగా ఉంటారు? మంచి ఆరోగ్యానికి కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర అవసరమని ఏళ్లుగా డాక్టర్లు చెబుతూ వస్తున్నదే. అయితే అలాంటి పట్టింపు అవసరం లేదని, జీవన శైలిని బట్టి కాస్త తక్కువగానో ఎక్కువగానో నిద్రించవచ్చని కెనడాలోని విక్టోరియా, బ్రిటన్లోని కొలంబియా విశ్వ విద్యాలయాల పరిశోధకులు తమ తాజా అధ్యయనంలో వెల్లడించారు. – సాక్షి, స్పెషల్ డెస్క్10 గంటల నిద్ర అనారోగ్యమే!ప్రతి దేశంలోనూ సంస్కృతికి అనుగుణం కాని నిద్ర గంటల వల్ల ఆరోగ్యం దెబ్బతింటోందని కూడా క్రిస్టీన్ బృందం తమ అధ్యయనంలో కనుగొంది. అంటే చాలా తక్కువ నిద్రపోవడం లేదా చాలా ఎక్కువ నిద్రపోవడం అని కాకుండా, వారి సంస్కృతిని అనుసరించి నిద్ర పోవటం అన్నదే వారిని ఆరోగ్యంగా ఉంచుతోంది. బ్రిటన్ పౌరులు కొందరు 10 గంటల 26 నిమిషాల కంటే ఎక్కువ నిద్రపోయిన కారణంగా.. అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నారని క్రిస్టీన్ బృందం పేర్కొంది. అమెరికాలో 8 గంటల 13 నిమిషాలు నిద్రపోయే వారిలో కూడా ఈ సమస్య కనిపించింది. క్రిస్టీన్ బృందం తమ అధ్యయనంలో పోషకాహారం, సంపద, అసమానత, భౌగోళిక పరిస్థితులు వంటి అంశాలను చేర్చలేదు. కాబట్టి నిద్ర గంటలకు, ఆరోగ్యంపై నిద్ర చూపే ప్రత్యక్ష ప్రభావంపై తీర్మానాలేవీ చేయలేకపోయారు. ‘ఎవరైనా ఎన్ని గంటలు నిద్రపోవాలన్న ప్రశ్నకు సమాధానం నిజంగా చాలా సంక్లిష్టమైనది. మనిషికి రోజుకు ఎనిమిది గంటల నిద్ర అవసరం అనేందుకు ఎటువంటి ఆధారాలూ లేవు. మీ నిద్ర, ఆరోగ్యం విషయంలో మీ సంస్కృతిని పరిగణనలోకి తీసుకోవాలి’ అని కీలే విశ్వవిద్యాలయంలోని స్లీప్ సైకాలజిస్ట్ డాక్టర్ దల్జిందర్ చామర్స్ సూచించారు.దేశానికొక ‘తగినంత నిద్ర’నిద్ర కేవలం దేహధర్మం మాత్రమే కాదని, ఆ దేశ అలవాట్లు, సంస్కృతి, పని వేళలు, అక్కడి వాతావరణం, సూర్యరశ్మి తగిలేలా ఉండటం, సామాజిక నిబంధనల వంటి అనేక కారకాలు నిద్ర పోయే సమయాన్ని ప్రభావితం చేస్తాయని ‘విక్టోరియా స్కూల్ ఆఫ్ నర్సింగ్’లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్న డాక్టర్ క్రిస్టీన్ చెబుతున్నారు. ‘‘ఒక దేశంలో ‘తగినంత’ నిద్రగా పరిగణన పొందేది, మరొక దేశంలో అతి నిద్ర కావచ్చు, లేదా చాలినంత నిద్ర కాకనూ పోవచ్చు’’ అని ఈ అధ్యయనంలో పాల్గొన్న క్రిస్టీన్ అంటున్నారు. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా, ఆసియా, ఆఫ్రికా తదితర 20 దేశాలలో ఈ అధ్యయనం కోసం ఆన్లైన్ ప్రశ్నపత్రాన్ని పూర్తి చేసిన దాదాపు 5,000 మంది వ్యక్తుల నిద్ర అలవాట్లు, ఆరోగ్య డేటాను విశ్లేషించి క్రిస్టీన్ బృందం ఈ ముగింపునకు వచ్చింది. నిద్రా సమయంపై గతంలోనూ అనేక సుప్రసిద్ధ సంస్థలు ఎన్నో అధ్యయనాలు చేశాయి. అలా జరిగిన 14 అధ్యయనాల నుండి అదనపు సమాచారాన్ని కూడా ప్రస్తుతం బృందం సేకరించింది. అంతేకాకుండా ఆయుర్దాయం, గుండె జబ్బులు, ఊబకాయం, మధుమేహం వంటి వాటికీ, నిద్రపోయే గంటలకు మధ్య ఉన్న సంబంధాన్ని లెక్కలోకి తీసుకుని పరిశోధకులు ఈ ఫలితాలను వెల్లడించారు. ఫ్రాన్స్లో ఎక్కువ... జపాన్లో తక్కువతాజా అధ్యయనం ప్రకారం.. భారతీయులు సగటున 7 గంటల 15 నిమిషాలు నిద్రపోతున్నారు. ఈ విషయంలో ప్రపంచ సగటు కూడా మన నిద్రా సమయంతో సమానంగా ఉండటం విశేషం. ఫ్రాన్స్ జాతీయులు తక్కిన దేశస్థుల కన్నా ఎక్కువ సమయం నిద్రిస్తున్నారు. ప్రశ్నపత్రం పూరించిన ముందు రోజు రాత్రి సగటున వారు 7.52 గంటలు నిద్రించారు. ఇక అందరికన్నా తక్కువగా నిద్రపోయిన వారు జపనీయులు. వారు 6.18 గంటలు మాత్రమే నిద్రపోయారు. బ్రిటన్ వాళ్లు 7 గంటల 33 నిమిషాలు నిద్రపోతే, అమెరికాలో నిద్రా సమయం 7 గంటల 2 నిమిషాలే. క్రిస్టీన్ బృందం మరికొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను కూడా కనుగొంది. ఆరోగ్యకారకమైన ‘ఆదర్శ’ నిద్రా సమయం అంటూ ఏ దేశంలోనూ లేదు! తక్కువ సగటు నిద్ర వ్యవధి ఉన్న దేశాల వారిని ఎక్కువసేపు నిద్రపోయే దేశాలలోని వ్యక్తులతో పోల్చి చూసినప్పుడు వాళ్ల ఆరోగ్యం అధ్వానంగా ఉందని చెప్పటానికి ఈ బృందానికేమీ ఆధారాలు కనిపించలేదు. దేశ సంస్కృతికి అనుగుణమైన నిద్ర గంటలు.. ఆదర్శ నిద్ర గంటల కంటే ఆరోగ్యంగా ఉంచుతున్నాయని అధ్యయనం పేర్కొంది. -
ఇంజన్ వైఫల్యమే!
దేశాన్ని దిగ్భ్రాంతికి లోను చేసిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ (వీటీ–ఏఎన్బీ) 171 విమాన ప్రమాదానికి ఇంజన్ వైఫల్యమే కారణమై ఉంటుందని వైమానిక రంగ నిపుణులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే పెను ప్రమాదాన్ని సూచిస్తూ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు పైలట్ చేసిన మేడే కాల్లోనూ, ప్రమాద వీడియోల్లోనూ విమానం ఇంజన్ శబ్దం అసలు విన్పించమే లేదు. దాన్నిబట్టి విమానం అప్పటికే పూర్తిగా థ్రస్ట్ (ఎగిరేందుకు అవసరమైన వేగం) పూర్తిగా కోల్పోయిందని విశ్లేషిస్తున్నారు. పక్షులు ఢీకొట్టడం వంటివి ఇందుకు కారణం కావచ్చంటున్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో పక్షుల బెడద ఎక్కువే. అయితే బోయింగ్లో అత్యాధునికమైన ఈ శ్రేణి విమానాల్లో రెండు అత్యంత శక్తిమంతమైన ఇంజన్లుంటాయి. ఒకటి అనుకోకుండా ఫెయిలైనా రెండో ఇంజన్ సాయంతో విమానం సునాయాసంగా ఎగరగలదు. దాన్ని బట్టి రెండు ఇంజన్లూ విఫలమై ఉంటాయని అనుకోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కానీ 10 లక్షల ప్రయాణాలకు కేవలం ఒకసారి మాత్రమే అలా జరిగే ఆస్కారముంటుంది! ఇంధన కల్తీ, యాంత్రిక వైఫల్యం వల్ల కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తవచ్చు. కానీ బోయింగ్ 787లో వాడేది అత్యంత శక్తిమంతమైన జనరల్ మోటార్స్ కంపెనీ తాలూకు జీఈఎన్ఎక్స్ ఇంజన్లు. అవి అత్యంత విశ్వసనీయమైనవి. ఈ నేపథ్యంలో ప్రమాద కారణం పెద్ద పజిల్గా మారింది. బ్లాక్బాక్స్ డేటాను పూర్తిగా విశ్లేషించిన మీదటే దీనిపై స్పష్టత వస్తుందని నిపుణులు అంటున్నారు. వారి విశ్లేషణ ప్రకారం ప్రమాద కారణాలు ఏమై ఉండొచ్చంటే...టేకాఫ్ సెట్టింగుల్లో లోపంవిమానం టేకాఫ్ కాగానే లాండింగ్ గేర్ మూసుకోవాలి. సురక్షితమైన ఎత్తుకు చేరేదాకా రెండు ఫ్లాప్లూ (రెక్కల వెనక భాగం) విచ్చుకుని ఉండాలి. అప్పుడే విమానానికి ఎగిరేందుకు అవసరమైన శక్తి, ఊపు లభిస్తాయి. వీటన్నింటినీ టేకాఫ్ సెట్టింగులుగా పిలుస్తారు. ఇకగురువారం మధ్యాహ్నం ప్రమాద సమయంలో అహ్మదాబాద్లో ఏకంగా 43 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. దాంతో వాయుసాంద్రత తక్కువగా ఉంది. అలాంటప్పుడు లాండింగ్ గేర్, ఫ్లాప్లు అత్యంత కచ్చితత్వంతో పని చేయడం చాలా కీలకం. కానీ ఏఐ171 విమానం గేర్ తెరుచుకునే ఉండగా ఫ్లాప్లు మూసుకుపోయాయి. ఇది పెను ప్రమాదానికి దారితీసే అసాధారణ పరిస్థితి. దీనివల్ల పైకెగిరేందుకు కావాల్సిన శక్తి సమకూరక విమానం అదుపు తప్పుతుంది. పైగా అవసరమైన థ్రస్ట్ లభించకుండానే పైలట్ టేకాఫ్కు ప్రయత్నించి ఉంటాడంటున్నారు. ఇలా ఫ్లాప్లు వెంటనే ముడుచుకుపోవడం వల్లే 2008లో స్పాన్ఎయిర్ విమానం కుప్పకూలింది.సరిపోని థ్రస్ట్ బోయింగ్ ఇంజన్లు శక్తిమంతమైనవే అయినా విమానం బరువు, రన్వే పొడవు, ఉష్ణోగ్రత తదితరాల ఆధారంగా టేకాఫ్కు నిర్దిష్ట థ్రస్ట్ సెటింగ్లు అవసరమవుతాయి. 43 డిగ్రీల ఎండ ఉన్నందున ఇంజన్ సామర్థ్యం సహజంగానే కాస్త తగ్గుతుంది. అలాంటప్పుడు టేకాఫ్కు మామూలు కంటే అధిక థ్రస్ట్ తప్పనిసరి. కానీ ఏఐ171 పైలట్ రొటేషన్ స్పీడ్ను పొరపాటుగా లెక్కించి తక్కువ థ్రస్ట్ ప్రయోగించి ఉండొచ్చు. 241 మంది ప్రయాణికులు, భారీ లగేజీ, ఏకంగా 1.25 లక్షల లీటర్ల ఇంధన బరువు దీనికి తోడై విమానం సజావుగా ఎగరలేకపోయి ఉంటుంది.లాండింగ్ గేర్ వైఫల్యంప్రమాద సమయంలో ఏఐ171 విమానం లాండింగ్ గేర్ తెరుచుకునే ఉంది. ఇది డ్రాగ్కు దారితీస్తుంది. దాంతో విమానం సజావుగా ఎగరలేదు. అందుకే టేకాఫ్ అయ్యాక క్షణాల్లోనే గేర్ మూసుకోవాల్సి ఉంటుంది. కానీ తొలుత దాదాపుగా మూసుకున్న ఏఐ171 లాండింగ్ గేర్ ఆ వెంటనే బయటికొస్తూ కన్పించింది. బహుశా విమానాన్ని పైకి తీసుకెళ్లేందుకు అవసరమైన థ్రస్ట్ లభించడం లేదని అర్థమై ఎమర్జెన్సీ లాండింగ్కు వీలుగా పైలట్ ఉద్దేశపూర్వకంగానే అలా చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. మొత్తం ఉదంతంలో ఏదో ఒక దశలో పైలట్ లోపం కచ్చితంగా ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి లోపాలను సునాయాసంగా అధిగమించే అత్యాధునిక సాంకేతికత 787 సొంతం. ఇక్కడే పైలట్ మానవ తప్పిదం చోటుచేసుకుని ఉంటుందంటున్నారు.విద్రోహ కోణంఉగ్రవాదులో, దేశ వ్యతిరేక శక్తులో ఉద్దేశపూర్వకంగానే విమానాన్ని కూల్చేయడం. కానీ ఇప్పటిదాకా అందుబాటులో ఉన్న సమాచారం,సాక్ష్యాలను బట్టి ఇందుకు అవకాశాలు తక్కువే.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఐ లవ్ యు డాడీ...
నాటి రోజుల్లో నాన్న అంటే సం పాదించేవాడుగా, కుటుంబానికి ఆర్థిక భద్రతను కల్పించేవాడిగా మాత్రమే గుర్తింపు ఉండేది. నేటి సమాజంలో తండ్రి పాత్ర ఒక కొత్త మలుపు తీసుకుంది. కేవలం సంపాదనకే పరిమితం కాకుండా, పిల్లలతో కలిసి ఆడుతూ.. పాడుతూ.. అల్లరి చేస్తూ... వారి ఆలనా పాలనా చూసే మంచి తండ్రి. అభివృద్ధిలో, భావోద్వేగ బంధాలలో, నైతిక విలువల్లో భాగస్వామి అయ్యే లవ్లీ డాడీ!ప్రస్తుత తల్లిదండ్రుల తరం ‘సమాన భాగస్వామ్యం‘ అనే సిద్ధాంతాన్ని అంగీకరిస్తోంది. తండ్రులు ఇప్పుడు పిల్లల ఆరోగ్యం, విద్య, ఆటలు, వారితో గడిపే సమయం – అన్నిట్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు. పాలు పట్టడం నుంచి బడికి తీసుకెళ్లడం వరకు ప్రతి దైనందిన పనిలోనూ తండ్రి పాత్ర కనిపిస్తుంది.భావోద్వేగాలకు ప్రాధాన్యంఈ తరానికి చెందిన తండ్రులు పిల్లలను ఆదేశించేవాళ్లుగా కాదు అన్ని విషయాలు వారితో చర్చించేవాళ్లుగా మారారు. వారి భయాలు, ఆశలు, ప్రశ్నలు, ఆనందాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బంధం పిల్లల మనోభావాలపై ఎంతో ప్రభావాన్ని చూపుతుంది.వర్క్–లైఫ్ బ్యాలెన్స్ కుటుంబానికి సమయం కేటాయించడం కోసం నేటి తండ్రులు పని సమయంలో సర్దుబాటు చేసుకుంటున్నారు. ‘క్వాలిటీ టైమ్‘ అనే మాట ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది. రోజూ కొంత సమయం పిల్లలతో గడపడం, స్కూల్ ఈవెంట్స్కు హాజరవడం, వారికి కథలు చెప్పడం వంటి పనులు ఈ తరం తండ్రుల ప్రత్యేకతగా చెప్పవచ్చు.టెక్నాలజీతో అనుబంధంఈ డిజిటల్ యుగంలో తండ్రులు.. పిల్లల విద్య, ఆరోగ్యం, అభివృద్ధి, ఆన్ లైన్ యాప్స్, వీడియో కాల్స్, ఈ– లర్నింగ్ టూల్స్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. టెక్నాలజీ సహకారంతో పిల్లల ప్రపంచానికి దగ్గరగా ఉంటున్నారు.ఆధునిక తండ్రిమోడర్న్ ఫాదర్హుడ్ అనేది ప్రేమతో, సహనంతో, బాధ్యతతో కూడినదిగా మారింది. ఒక తండ్రి మోడర్న్గా, ప్రేమగా మారినప్పుడు కుటుంబం మారుతుంది. కుటుంబం మారినప్పుడు సమాజం మారుతుంది. ఈ మార్పు ఒక మంచి భవిష్యత్తుకు వేదికగా మారుతుందని చెప్పడంలో సందేహం లేదు.ఉదాహరణగా తండ్రిఓ ఆధునిక తండ్రిగా, సింగిల్ ఫాదర్గా ఉండటం అనే అసాధ్యమైన పనిని కూడా నేటి తండ్రులు సుసాధ్యం చేస్తున్నారు. పిల్లల చదువు, భావోద్వేగాలు, వారి భవిష్యత్తునూ చూసుకోవడంపై దృష్టి పెడుతున్నారు. సెలబ్రిటీలు కూడా ఇందుకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నా తండ్రి తనంలో వారు చూపే నిబద్ధతా, ప్రేమా ప్రతి తండ్రికీ ఆదర్శ్ర పాయమే.కరణ్ జోహర్ సరోగసీ ద్వారా జుహీ, యష్ అనే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నారు. సింగిల్ డ్యాడ్గా ఆయన తన పిల్లలకు ఆదర్శంగా ఉండటమే కాక, తన అనుభవా లను పుస్తక రూపంలోనూ, ఇంటర్వ్యూలలోనూ పంచుకున్నారు. -
బోయింగ్ డ్రీమ్లైనర్ రహస్యాల్ని బయటపెట్టి..
అహ్మదాబాద్ విమాన ప్రమాద నేపథ్యంతో.. బోయింగ్ డ్రీమ్లైనర్ 787-8 విమానాలను ఇక మీదట భారత విమానయాన సంస్థలకు ఉపయోగించకూడదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందట. ఈ మేరకు.. ప్రమాదంపై విచారణ ముగిశాక అమెరికా వైడ్బాడీ ఎయిర్లైనర్తో సమీక్ష జరిపిన తర్వాతే ఏ నిర్ణయం అనేది ప్రకటించనుందని ఆంగ్ల మీడియా కథనాల సారాంశం. అయితే.. బోయింగ్ విమానం.. అందునా డ్రీమ్లైనర్(Dreamliner) ఎంత మాత్రం సురక్షితం కాదన్న ఆ సంస్థ వేగు, మాజీ ఉద్యోగి జాన్ బార్నెట్ స్టేట్మెంట్ ఇప్పుడు తాజా ప్రమాద నేపథ్యంలో తెర మీకు వచ్చింది. బోయింగ్లో మూడు దశాబ్దాల పాటు పనిచేసిన బార్నెట్.. ఆయన 787 డ్రీమ్లైనర్ విమానాల భద్రతా లోపాలను బయటపెట్టి సంచలన చర్చకు దారి తీశారు. అయితే ఆయన సజీవంగా లేరు. 👉జాన్ బార్నెట్(John Barnett) 2024 మార్చిలో బలవన్మరణానికి పాల్పడ్డారు. సౌత్ కరోలీనా చార్లెస్టన్లో తన ట్రక్కులో ఆయన తుపాకీతో కాల్చుకుని చనిపోయారు. అయితే ఆయనది ఆత్మహత్య కాదని.. ఆయన్ని హత్య చేశారని ఆయన సన్నిహితులు ఇప్పటికీ వాదిస్తుంటారు. అందుకు.. ‘‘ఈ పోరాటం ఇంకా ఎంతో కాలం చేయలేను’’ అంటూ ఆయన చేతిరాతతో దొరికిన నోట్ను ప్రస్తావిస్తుంటారు.👉ఆ నోట్ ఆధారంగా.. ఆయన కుటుంబ సభ్యులు బోయింగ్పై దావా వేశారు. ఆపై కొన్నాళ్లకు కంపెనీతో సెటిల్మెంట్ చేసుకుని ఆ కేసును వెనక్కి తీసుకున్నారు. 👉787 డ్రీమ్ లైనర్ విమానం సుదూర ప్రాంతాల మధ్య ప్రయాణానికి ఉపయోగించే అత్యాధునిక విమానం. అయితే ఆ విమానం అందుకు పనికి రాదన్నది బార్నెట్ వాదన. 👉బోయింగ్ సంస్థలో బార్నెట్ మూడు దశాబ్దాలకు పైగా పని చేశారు. 2010 నుండి 787 డ్రీమ్లైనర్ను తయారు చేస్తున్న నార్త్ చార్లెస్టన్ ప్లాంట్లో క్వాలిటీ మేనేజర్గా విధులు నిర్వర్తించారు. అనారోగ్యంతో 2017లో పదవీ విరమణ చేశారు. సంస్థ నుంచి పదవీ విరమణ తర్వాత నుంచి మరణించేదాకా.. బోయింగ్పై ఆయన విమర్శలు గుప్పించారు.ఏం చెప్పాడంటే.. 2019లో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బోయింగ్ సంస్థ లోపాల గురించి బార్నెట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘బోయింగ్ ఫ్యాక్టరీలో సరిగా లేని లోపభూయిస్ట భాగాలను ఉద్దేశపూర్వకంగా విమానంలో అమర్చారు. ఆక్సిజన్ వ్యవస్థలోని కొన్ని తీవ్రమైన సమస్యలను కనుగొన్నాం. అత్యవసర సమయాల్లో ప్రతీ నాలుగు ఆక్సిజన్ మాస్కుల్లో ఒకటి పనిచేయదు. వాస్తవానికి.. కొత్త విమానాన్ని నిర్మించే ప్రయత్నంలో సౌత్ కరోలినాలో అసెంబ్లింగ్ ప్రక్రియ హడావిడిగా జరిగింది. ఇది భద్రతపై కంపెనీని రాజీ పడేలా చేసింది’’ అంటూ చెప్పారాయన. అలాగే.. Photo Credits: Netflix👉ఇదే కాకుండా కార్మాగారంలోని వివిధ బాగాలను ట్రాక్ చేయడంలో కార్మికులు విఫలమయ్యారని, దీని వల్ల ఫాల్ట్ ఉన్న భాగాలు కనిపించకుండా పోయాయని తెలిపారు. ఈ విషయాన్ని నిర్వాహకులకు తెలిపినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. 2017లో యూఎస్ రెగ్యులేటర్, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) సమీక్ష, బార్నెట్ వ్యక్తం చేసిన కొన్ని ఆందోళనల్ని సమర్థించింది. 👉2022లో నెట్ఫిక్స్ ‘డౌన్ఫాల్: ది కేస్ అగెనెస్ట్ బోయింగ్’ డాక్యుమెంటరీలో జాన్ బార్నెట్ కనిపించారు. ప్రత్యేకించి 737 మ్యాక్స్ ప్రమాదాల గురించి ఆయన చర్చించారు.👉2024 మొదట్లో.. అలస్కా ఎయిర్లైన్స్ తలుపులు ఊడిపడిన ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో బోయింగ్ వైఫల్యాలను ఆయన ఎత్తి చూపించారు. చివరకు.. తన మరణానికి ముందు కూడా ఆయన కంపెనీకి వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చాడు. 👉అయితే, బోయింగ్ సంస్థ మాత్రం బార్నెట్ ఆరోపణల్ని ఖండించింది. తమ విమానాలు అత్యున్నత స్థాయి భద్రత, నాణ్యత ప్రమాణాలతో నిర్మితమవుతున్నాయని చెప్పింది. భద్రత, నాణ్యత, సమగ్రత బోయింగ్ విలువల్లో ప్రధానమైనవని కంపెనీ నొక్కి చెప్పింది. తాజాగా.. అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంతో.. బోయింగ్ డ్రీమ్లైనర్పై బార్నెట్ చేసిన వ్యాఖ్యల ప్రస్తావన తెర మీదకు వచ్చింది. -
విమానంలో విద్యుత్
నడవడమే రాని మానవుడు నేడు పక్షిలా గాలిలో ఎగిరిపోయే సాధనాలను కనుగొని ఎక్కడికి అంటే అక్కడికి నిమిషాలు, గంటల్లోనే ప్రయాణిస్తున్నాడు. దేశ విదేశాల్లో విమానంలో చక్కర్లు కొడుతున్నాడు. ఆ విమానం నడవాలంటే మాత్రం ఇంధనంతో పాటు విద్యుత్ కూడా చాలా అవసరం. కానీ, అవే ఒక్కోసారి వందల ప్రాణాలు పోవడానికి కారణం అవుతున్నాయి. అహ్మదాబాద్లో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదం కూడా అలాంటిదే.ఈ దుర్ఘటనకు విమానంలో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా విఫలమవడం కారణం కావొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు విమానంలో విద్యుత్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది..? ఎందుకు విఫలం అవుతుంది..? దానివల్ల జరిగిన ప్రమాదాలేంటి? అనే అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.సాక్షి, అమరావతి: విమానంలో ప్రధానంగా నాలుగు రకాల విద్యుత్ వ్యవస్థలు పనిచేస్తుంటాయి. వాటినే ప్రధాన, అత్యవసర, ద్వితీయ, సహాయక విద్యుత్ వ్యవస్థలుగా పిలుస్తుంటారు. వీటితో పాటు ఓవర్లోడ్, షార్ట్ సర్క్యూట్ వంటి ఆకస్మిక ప్రమాదాల నుంచి రక్షించేందుకు సర్క్యూట్ బ్రేకర్లను అమర్చుతారు. అత్యవసర సమయంలో వాడుకునేందుకు వీలుగా విద్యుత్ను బ్యాటరీల్లో నిల్వ చేస్తారు. నావిగేషన్, కమ్యూనికేషన్, నియంత్రణ, క్యాబిన్, కాక్పిట్ లైటింగ్, ఎయిర్ కండిషనింగ్, టీవీ, ఫ్యాన్లు వంటి కీలక పనులకు ఈ విద్యుత్ వ్యవస్థ ఉపయోగపడుతుంది.ఇది ఏమాత్రం విఫలమైనా విమానం కుప్పకూలే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. విమానంలో జనరేటర్లు లేదా ఆల్టర్నేటర్లు అనేవి ఉంటాయి. ఇవి ఇంజిన్తో నడుస్తూ విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి. ప్రధాన ఇంజన్లు పని చేయనప్పుడు సహాయక విద్యుత్ యూనిట్ ఆదుకుంటుంది. రామ్ ఎయిర్ టర్బైన్ అనేది కొన్ని సందర్భాల్లో విద్యుత్ వనరుగా పనికొస్తుంది. ట్రాన్స్ఫార్మర్ రెక్టిఫయర్ యూనిట్లు కొన్ని వ్యవస్థల కోసం విద్యుత్ను అందిస్తుంటాయి. బ్యాటరీలు బ్యాకప్ పవర్ సోర్స్లుగా పనిచేస్తాయి. కాకపోతే ఈ వ్యవస్థ అన్ని విమానాల్లోనూ ఒకేలా ఉండదు. సింగిల్ ఇంజిన్ జనరల్ ఏవియేషన్ ఎయిర్క్రాఫ్ట్, ఆధునిక, బహుళ ఇంజిన్ కమర్షియల్ జెట్ ఎయిర్క్రాఫ్ట్ మధ్య విద్యుత్ వ్యవస్థ సామర్థ్యం, నిర్మాణంలో చాలా తేడా ఉంటుంది. ముందే శిక్షణ ఇస్తారు.. విద్యుత్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా తగిన సూచనలను, శిక్షణను ముందే పైలట్లకు తెలియజేస్తారు. విద్యుత్ వ్యవస్థ వైఫల్యాన్ని సూచించడానికి ఒక అమ్మీటర్, లోడ్ మీటర్ లేదా హెచ్చరిక లైట్ ఉంటాయి. బలమైన రక్షణ వ్యవస్థ, పర్యవేక్షణ, వైఫల్య హెచ్చరిక నిబంధనలు విద్యుత్ వ్యవస్థలో ఉంటాయి. ఇవి ఎప్పటికప్పుడు తగిన సూచనలను పైలట్లకు అందజేస్తుంటాయి. స్టాండ్బై ఫ్లైట్ ఇన్స్ట్రుమెంట్స్, ఎయిర్క్రాఫ్ట్ ఎమర్జెన్సీ ఫ్లోర్ పాత్ ఇల్యూమినేషన్ వంటి భాగాలు వాటికి సొంత బ్యాకప్ విద్యుత్ ఉంటుంది. విద్యుత్ వ్యవస్థ పూర్తిగా విఫలమైనా కూడా ఇవి పనిచేస్తాయి. విమానంలో సర్క్యూట్ బ్రేకర్ విఫలమైనప్పుడు ఒకసారి మాత్రమే రీసెట్ చేయాలి. రెండోసారి చేయకూడదు. విద్యుత్ జనరేటర్లు, వైర్ల నుంచి పొగలు, మంటలు వస్తే విద్యుత్ ఐసోలేషన్ విధానాన్ని అనుసరించాలి. విమానాన్ని త్వరగా ల్యాండ్ చేయాలి. ఏమాత్రం ఆలస్యమైనా భారీ నష్టం సంభవిస్తుంది.విద్యుత్ వ్యవస్థ విఫలంతో విమాన ప్రమాదాలు, దుర్ఘటనల్లో కొన్ని⇒ ఎండీ11 అనే స్విస్ ఎయిర్ విమానంలో విద్యుత్ అగ్నిప్రమాదం వల్ల కెనడా సమీపంలో 1998 సెపె్టంబర్ 2న అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయింది. ⇒ 2010 ఆగస్టు 24న ఉత్తర సూడాన్లో ఖార్టూమ్ నుంచి బీరుట్ బయల్దేరిన ఏ321 ఎయిర్బస్లో జనరేటర్లు దెబ్బతిని విద్యుత్ వ్యవస్థ పనిచేయడం మానేసింది. 49 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ⇒ 2009 మార్చి 15న లండన్ హీత్రూ నుంచి ఎడిన్బర్గ్కు బయల్దేరిన బ్రిటిష్ ఎయిర్వేస్కు చెందిన ఏ319 విమానంలో విద్యుత్ వైఫల్యం ఏర్పడి పైలట్లకు డిస్ప్లే కనిపించలేదు. పొగలు కూడా వచ్చాయి. దీంతో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ⇒ 2008 సెపె్టంబరు 22న అమెరికన్ ఎయిర్లైన్స్కు చెందిన బి752 సియాటిల్ నుంచి న్యూయార్క్ వెళ్తుండగా విద్యుత్ సమస్య ఎదుర్కొంది. చికాగోలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ల్యాండింగ్ గేర్ దెబ్బతిన్నది. 192 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. -
ప్రయాణికులపాలిట పీడకల... డ్రీమ్లైనర్
విదేశాల్లో మెరుగైన ఉపాధి అవకాశాల కోసం కలలు రెక్కలు కట్టుకుని విమానం ఎక్కే వందలాది మంది ప్రయాణికులు తాజాగా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ పేరు చెప్పగానే హడలిపోతున్నారు. ఇది మార్గమధ్యంలో కూలిపోయి తమ కలలను కల్లలుచేస్తుందన్న ప్యాసింజర్ల భయాందోళల నడుమ ఈ మోడల్ విమానంపై సర్వత్రా చర్చ నెలకొంది. అమెరికా విమానతయారీరంగ దిగ్గజం బోయింగ్ 2011లో అత్యంత ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తెచ్చిన ఈ విమానం ఇప్పుడు అత్యంత అప్రతిష్టను మూటగట్టుకుంటోంది. దీంతో ఈ మోడల్ విమానం గత విజయాలు, విశేషాలతోపాటు వివాదాలపర్వాన్ని యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. వేర్వేరు చోట్ల తయారుచేసి మరోచోట విడిభాగాలను పటిష్టమైన ప్రామాణాలను పాటించకుండానే బిగిస్తున్నారని, డిజైన్ లోపాలున్నాయని ఈ మోడల్పై ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మోడల్ పుట్టుపూర్వోత్తరాలను ఒకసారి గమనిద్దాం. విలాసానికి మారుపేరు.. ఎప్పుడొచ్చింది? 2011లో విశ్వవిపణిలోకి తొలిసారిగా అడుగుపెట్టినప్పుడు బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ విమానంలోని సదుపాయాలు, సామర్థ్యాన్ని చూసిన వాళ్లంతా ఔరా అనేశారు. ఎక్కువ మంది ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యంతోపాటు సుదూరాలకు ఇది అవలీలగా వెళ్లగలదు. కొనుగోలుచేసిన, నిర్వహణ సంస్థకు అనువుగా 242 నుంచి గరిష్టంగా 290 వరకు ప్రయాణికులు ఇందులో ప్రయాణించవచ్చు. సామర్థ్యం ఎంత? ఏకధాటిగా ఎక్కడా ఆగకుండా ఏకంగా 13,530 కిలోమీటర్లు ప్రయాణించగలదు. దీంతో సుదూర నగరాల మధ్య సంధానకర్తగా ఇది మంచి పేరు తెచ్చుకుంది. అత్యంత పటిష్టమైన, అత్యంత తేలికైన మూలకాలతో విమాన నిర్మాణ విడిభాగాలను తయారుచేశారు. దీంతో మిగతా పోటీ సంస్థల మోడళ్లతో పోలిస్తే దీని బరువు తక్కువగా ఉంటుంది. మైలేజీపరంగా తక్కువ ఇంధనంతో పనిచేస్తుంది. టెక్నాలజీ ఎలాంటిది? కొత్తతరం డిజైన్, అధునాతన ఫ్లై–బై–వైర్ కంట్రోలర్లతో పనిచేస్తుంది. ప్రతి ఆదేశాన్ని పైలట్ ఇవ్వాల్సిన పనిలేకుండా గాల్లో కదిలే దిశ, ఒంపుకు అనుగుణంగా ఆటోమేటిక్గా కంప్యూటరే ఆదేశాలు ఇచ్చే వ్యవస్థ ఇందులో ఉంది. అత్యాధునిక ప్రయాణికుల భద్రతా ఏర్పాట్లు దీనిలో ఉన్నాయి. సింథటిక్ విజన్ సిస్టమ్(ఎస్వీఎస్) సాయంతో కింద ఉన్న భూభాగాన్ని త్రిమితీయ(3డీ) ఫొటోలు తీసి ల్యాండింగ్, టేకాఫ్ సమయాల్లో రన్వేపై పక్షులు, ఎయిర్పోర్ట్ వస్తువులు ఏమైనా ఉన్నాయోలేదో వెంటనే అలర్ట్చేస్తుంది. మంచుదుప్పటి కప్పుకున్నా, భీకర వర్షం పడుతున్నా రన్వే పరిసరాలను స్పష్టంగా చూపిస్తుంది. ఇంకెన్ని ఫీచర్లు ఉన్నాయి? ప్రయాణికుల సీటింగ్ క్యాబిన్, కాక్పిట్, కార్గో సెక్షన్లు అన్నింటిపైనా సమీకృత పర్యవేక్షణ ఉండేలా ఇంటిగ్రేటెడ్ మాడ్యులర్ ఏవియానిక్స్(ఐఎంఏ) విధానంతో విమానం పనిచేస్తుంది. ఆక్సిజన్ పీడనం, ఇంధన లీకేజీలు, హఠాత్తుగా ప్రయాణ ఎత్తు తగ్గడం, పిడుగులతో కుదుపులకు లోనవడం వంటి సందర్బాల్లో వెనువెంటనే ఆటోమేషన్లో తనంతట తానుగా సర్దుబాటు చేసుకునే వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. మరి లోపాలేంటి? తొలిరోజుల్లో నవతరం విమానానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన 787–8 డ్రీమ్లైనర్ నెమ్మదిగా విమర్శల సుడిగుండంలో పడింది. 2013లో ఈ మోడల్ విమానాల్లో లిథియం అయాన్ బ్యాటరీలు పేలిపోయాయి. దీంతో అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మిని్రస్టేషన్(ఎఫ్ఏఏ) వీటి రాకపోకలను స్తంభింపజేసింది. విమానం మధ్యలోని ప్రధాన విడిభాగాన్ని ఇతర భాగాలను అనుసంధానించేటప్పుడు సరైన ప్రమాణాలను పాటించట్లేరని 2019లో తొలిసారిగా ఆరోపణలు వచ్చాయి. బిగింపుల మధ్య అతుకులు సరిగా పూడ్చట్లేరని, ఇందుకు కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కూడా తోడైందని వెల్లడైంది. దీంతో తరలింపు కోసం వాడిన బోల్ట్లు ఆ తర్వాత సైతం జాయింట్ల వద్ద అలాగే ఉండిపోయి మొత్తం వ్యవస్థకే సమస్యాత్మకంగా మారుతున్నాయి. సమీక్ష జరిపాకే ఎయిర్లైన్స్లకు కొత్త విమానాలను డెలివరీ చేయాలని ఎఫ్ఏఏ ఆదేశించడంత 2021 జనవరి నుంచి 2022 ఆగస్ట్దాకా 787 సిరీస్ల డెలివరీ ఆగిపోయింది.లోపాలను ఎత్తిచూపిన సీనియర్ ఉద్యోగులు ఏళ్ల తరబడి బోయింగ్ సంస్థలో పనిచేసిన సీనియర్ ఇంజినీర్లు ఈ మోడల్ విమానాల్లో లోపాలు ఉన్నట్లు పలుమార్లు బహిరంగంగా చెప్పారు. బోయింగ్ సంస్థలో ఇంజనీర్గా 17 ఏళ్లపాటు పనిచేసిన మాజీ ఉద్యోగి సామ్ సలేహ్పౌర్ 2024లో ఎఫ్ఏఏకు ఫిర్యాదు కూడా చేశారు. ‘‘విడిభాగాల ఉత్పత్తి దశలో బోయింగ్ అడ్డదారులు తొక్కుతోంది. విడిభాగాల బిగింపు సమయంలో అత్యున్నత స్థాయి ప్రమాణాలను పాటించట్లేదు. హడావిడిగా తుది ఆమోద ముద్ర వేసేలా ఇంజనీరింగ్ సిబ్బందిపై ఒత్తిడి చేస్తోంది. సరైన బిగింపు లేకపోవడం వల్ల విమానం పాతబడేకొద్దీ లోపం అనేది అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అసెంబ్లీ యూనిట్లలో సిబ్బంది అడవిలో టార్జాన్ మాదిరిగా ఒక చోట నుంచి మరోచోటుకు వేగంగా మారుతూ పనిని సవ్యంగా చేయట్లేరని సంస్థకు ఎన్నోసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. 2020 ఏడాది నుంచి మూడుసార్లు సంస్థ ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేస్తే నన్ను ‘నోరు మూస్కో’అన్నారు. ఇన్ని లోపాలతో తయారైన ఈ లోహ విహంగాలు టిక్ టిక్ శబ్దం చేసే టైంబాంబులే. రక్షణ, భద్రతా సంస్కృతికి బోయింగ్ తిలోదకాలిస్తోంది’’అని సలేహ్పౌర్ ఆరోపించారు.సమస్యలు ఎత్తిచూపి శాశ్వత నిద్రలోకి.. క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్గా 32 ఏళ్లు బోయింగ్లో పనిచేసిన జాన్ బార్నెట్ సైతం పలు లోపాలను ఎత్తిచూపారు. ‘‘అత్యధిక పని ఒత్తిడి కారణంగా సిబ్బంది.. తయారీ లోపాలున్నాసరే ఆయా భాగాలను బిగించేస్తున్నారు. ఆక్సీజన్ వ్యవస్థల్లో ఇలాంటి లోపాలను గుర్తించా. ప్రతి నాలుగింట ఒక ఎమర్జెన్సీ బ్రీతింగ్ మాస్్కలో లోపం ఉంది. వాడేటప్పుడు ఇవి విఫలమవడం ఖాయం’’అని అన్నాడు. ఈ లోపాలను బయటపెట్టినందుకు ఈయనపై కేసు నమోదైంది. తర్వాత ఈయన ఆత్మహత్యచేసుకున్నారు. విమానాల్లో లోపాల ను క్వాలిటీ ఆడిటర్ జాషువా డీన్ సైతం బయటపెట్టారు. తర్వాత ఆయన సైతం అనారోగ్య సమస్యలతో చనిపోయారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏసీ @ 24.. ఆదా సూపర్
సాక్షి, స్పెషల్ డెస్క్ : ‘ఏసీ లేనిదే నాకు నిద్రపట్టదు’.. తరచూ మన చుట్టూ ఉండే వాళ్లు చెప్పే డైలాగ్. ఇంట్లో, ఆఫీసులో.. చివరకు కారులో కూర్చున్నా చాలామందికి చల్లని గాలి వీయాల్సిందే. ఎక్కువమందికి ఏసీ 16–20 డిగ్రీల మధ్యే ఉండాలి. అంతలా జనం ఏసీ చల్లదనానికి అలవాటుపడ్డారు. ఏటా భారత్లో 1.5 కోట్ల ఏసీలు అమ్ముడవుతున్నాయంటే కారణం ఇదే. ఇదంతా నాణేనికి ఒకవైపు. కానీ, అతి చల్లదనం.. మనకుగానీ, పర్యావరణానికి గానీ మంచిది కాదని వైద్యులు, పర్యావరణ నిపుణులు చెబుతున్నమాట. అందుకే కనిష్టంగా 20.. గరిష్టంగా 28 డిగ్రీల సెల్సియస్కు ఏసీల సెట్టింగ్స్ను తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరి, ఇలా చేస్తే మనకు, పర్యావరణానికి ఏంటి ప్రయోజనం? సీలు మనకు ఎంత చల్లదనాన్నిఇస్తాయో.. విద్యుత్ వ్యవస్థకు, పర్యావరణానికి అంత ‘వేడి’కూడా చేస్తాయి. అంటే... విద్యుత్ వాడకం పెరుగుతుంది! మనం వాడే విద్యుత్.. బొగ్గు వంటి వాటితో ఉత్పత్తి అయితే ఆ మేరకు పర్యావరణంపైనా ప్రభావం పడుతుంది. పర్యావరణంపై ప్రభావాన్ని కొందరు తేలిగ్గా తీసుకోవచ్చు.. ఎందుకంటే, అది ఎప్పటికోగానీ ఫలితం చూపించదు అనుకుంటారు కాబట్టి! కానీ, విద్యుత్ వాడకం పెరగడం వల్ల మాత్రం ఫలితాలను మనం తక్షణమే చూడాల్సి వస్తుంది.. చూస్తున్నాం కూడా.. కరెంటు కోతల రూపంలో!! విద్యుత్ అంతరాయాలు దేశంలో విద్యుత్ డిమాండ్.. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మించిపోయింది. దీని ఫలితంగా ముఖ్యంగా వేసవిలో ఏప్రిల్ నుండి జూన్వరకు కొన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా 2024లో గరిష్ట డిమాండ్ 250 గిగావాట్లకు చేరుకుంది. ఈ డిమాండ్ 2025లో 8 శాతం పెరుగుతుందని అంచనా. వేసవిలోనూ దేశంలో వర్షాలు పడడంతో విద్యుత్ డిమాండ్ అదుపులో ఉంది. అయితే జూన్లో వేడి గాలులు తిరిగి వీయడంతో విద్యుత్ వినియోగం పెరిగింది. విద్యుత్ డిమాండ్ ఈ ఏడాది జూన్9న 241 గిగావాట్లకు చేరింది. 2025లో ఇదే గరిష్టం. పెరుగుతున్న విద్యుత్ వాడకాన్ని కట్టడి చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. అందుకే ఇళ్లు, హోటళ్లు, కార్లలో వినియోగించే ఏసీలకు సరికొత్తగా ‘ఉష్ణోగ్రత నిబంధన’ను వర్తింపజేయనున్నట్టు ప్రకటించింది. ఏటా రూ. 7.5 లక్షల కోట్లు ఆదా!ఏసీ ఉష్ణోగ్రత ఒక్కో డిగ్రీ పెరిగితే (ఉదాహరణకు 16 నుంచి 17 డిగ్రీల సెల్సియస్కు చేరితే ).. విద్యుత్ వినియోగం 6 శాతం తగ్గుతుందని కేంద్ర విద్యుత్ కార్యదర్శి పంకజ్ అగర్వాల్ వెల్లడించారు. ఈ స్థాయి తగ్గింపు వల్ల దేశం మొత్తంగా చూస్తే.. గరిష్ఠంగా 3 గిగావాట్ల వరకు ఆదా చేయవచ్చునట. ‘దేశంలో దాదాపు 10 కోట్ల ఎయిర్ కండీషనింగ్ ఉపకరణాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం సుమారు 1.5 కోట్ల ఏసీలు కొత్తగా తోడవుతున్నాయి. ఏసీలతో 50 గిగావాట్ల విద్యుత్ ఖర్చు అవుతోంది. మొత్తం దేశీయ డిమాండ్లో ఇది సుమారు 20 శాతం. ఇంధన సామర్థ్యాన్ని పెంచడానికి, విద్యుత్ వినియోగాన్ని తగ్గించే ప్రతిపాదిత చర్యలతో 2035 నాటికి భారత గరిష్ట విద్యుత్ డిమాండ్లో 60 గిగావాట్లను ఆదా చేసే అవకాశం ఉంది’అని ఆయన తెలిపారు. ఇదే జరిగితే నూతన విద్యుత్ ఉత్పత్తి, గ్రిడ్ మౌలిక సదుపాయాల ఖర్చుల విషయంలో భారత్ ఏటా రూ.7.5 లక్షల కోట్లను ఆదా చేస్తుందని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం అధ్యయనం వెల్లడించింది. 2వేల కోట్ల యూనిట్ల ఆదా! ఏసీని 24 డిగ్రీల వద్ద వాడటం వల్ల.. వచ్చే కరెంటు బిల్లు మొత్తం తగ్గడమే కాదు, విద్యుత్తును కూడా భారీగా ఆదా చేయవచ్చని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ (బీఈఈ) చెబుతోంది. ఖర్చు ఆదా, పర్యావరణ ప్రయోజనాల కోసం బాధ్యతాయుతంగా ఏసీ వినియోగాన్ని ప్రోత్సహించడానికి బీఈఈ పలు నగరాల్లో ఇంధన పరిరక్షణపై ప్రచారం చేస్తోంది. ఏసీలను 24ని డిగ్రీల వద్ద సెట్ చేస్తే.. సంవత్సరానికి 2,000 కోట్ల యూనిట్ల వరకు విద్యుత్ ఆదా అవుతుంది. తద్వారా రూ.10,000 కోట్లు పొదుపు చేయవచ్చు. సగం మంది వినియోగదారులు తమ సూచలను పాటించినా 1,000 కోట్ల యూనిట్ల విద్యుత్ ఆదా చేయవచ్చని, రూ.5,000 కోట్లు పొదుపు చేసినట్టేనని తెలిపింది. అంతేకాదు, కర్బన ఉద్గారాలు సంవత్సరానికి 82 లక్షల టన్నులు తగ్గుతాయని బీఈఈ వెల్లడించింది. కొత్తవి వచ్చేది 2027లోనే? ప్రస్తుతం ఏసీలు 16–30 డిగ్రీల సెట్టింగ్స్తో వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత నిబంధన ఈ ఏడాదే అమలులోకి వస్తే.. కొత్త ఏసీలు కనీసం 20, గరిష్టం 28 డిగ్రీల ఉష్ణోగ్రతతో మాత్రమే పనిచేసేలా కంపెనీ సెట్టింగ్స్తో వస్తా యి. కానీ ఈ కొత్త ఏసీలు ఇప్పుడే వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఏసీ తయారీ కంపెనీలకు 2025 సమ్మర్ సీజన్నిరాశను మిగిల్చింది. చాలా ప్రాంతాల్లో 2024 స్థాయిలో ఎండలు లేకపోవడం, అకాల వర్షాలతో వాతావరణం చల్లబడింది. దీంతో అమ్మకాలు ఆశించిన స్థాయిలో జరగలేదు. డీలర్లు, తయారీ కంపెనీల వద్ద ఏసీ యూనిట్ల నిల్వలు పేరుకుపోయాయి. వీటి అమ్మకాలు జరిగేది 2026 సీజన్లోనే. వచ్చే ఏడాది భానుడు ప్రతాపం చూపిస్తే కొత్త ఏసీలు రంగ ప్రవేశం చేసే అవకాశం ఉంది. » దేశంలోఏసీలతో ఖర్చయ్యే మొత్తం విద్యుత్ 50 గిగావాట్లు » మొత్తం దేశీయ డిమాండ్లో ఇది సుమారు 20% » ఏసీలను 24 డిగ్రీల వద్ద సెట్ చేస్తే.. ఏడాదికి 2 వేలకోట్ల యూనిట్ల విద్యుత్ ఆదా » రూ.10,000 కోట్లు పొదుపు » ఏటా 82 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలుతగ్గుదల -
పిల్లల పెంపకం.. చాలా కాస్ట్లీ
‘ఒకరికి ఏడాదికి రు.13 లక్షలు’ముంబైకి చెందిన అంకుర్ ఝవేరీ అనే ఒక ప్రొఫెషనల్ తాజాగా లింక్డ్ఇన్లో పెట్టిన ఈ పోస్టు.. పట్టణ ప్రాంత మధ్యతరగతి తల్లిదండ్రుల ఆర్థిక భారాన్ని ఎత్తి చూపుతూనే, పిల్లల పెంపకానికి, చదువుకు అయ్యే ఖర్చు విపరీతంగా పెరుగుతుండటంపై ఆందోళన రేకెత్తించింది. మెట్రోపాలిటన్ నగరంలో ఒకరికి ఏడాదికి రూ.13 లక్షలు ఖర్చవుతుండగా, అందులో చదువుకు అయ్యే ఖర్చే రు.7 నుంచి 8 లక్షల వరకు ఉంటోందని ఝవేరీ తన పోస్టులో అంచనా వేశారు. ‘గత వారం నేను నా కజిన్ను కలిసే వరకు, భారతదేశంలోనిఇ నగరాల్లో పిల్లలను పెంచడం తలకు మించిన భారమని నాకు తెలియదు’ అని ఝవేరీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.నెలకు రూ.లక్షకు పైగానే ఏదైనా ఒక ఇంటర్నేషన్ స్కూల్లో ట్యూషన్ ఫీజు ఏడాదికి ఒకరికి రూ.7 నుండి 8 లక్షల మధ్య ఉందని, ఇక యూనిఫారాలు, పుస్తకాలు, ప్రైవేట్ ట్యూషన్లు, చదువుకు సంబంధించిన ఇతర ఖర్చులన్నీ కలిపితే – సంవత్సరానికి మరో రూ. 2 నుండి 4 లక్షల వరకు అవుతుందని అంకుర్ ఝవేరీ పేర్కొన్నారు. ఒక విద్యా సంవత్సరానికి మొత్తం ఖర్చు దాదాపుగా రూ.12 లక్షలు అవుతోందని చెప్పారు. ఝవేరీ మరికొన్ని ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ రూ.12 లక్షలకు అదనంగా కోచింగ్ / పాఠ్యేతర కార్యకలాపాలు, దుస్తులు, పుట్టినరోజు పార్టీలు, హాలిడే ఖర్చులు మొదలైనవి కూడా నెలకు రూ.8000–10,000 (ఏడాదికి రూ.1 లక్ష) చొప్పున కలిపితే, మొత్తం వార్షిక వ్యయం రూ.13 లక్షలు అవుతుందని తన పోస్టులో అంచనా కట్టారు.ఆర్థిక భారానికి సిద్ధంఈ లెక్కలన్నీ కూడా తన పైపై అంచనాలు మాత్రమే అని అంగీకరిస్తూ, ‘నేనింకా ఏమైనా మిస్ అయ్యానేమో తల్లిదండ్రులు చెప్పాలి’ అని ఝవేరీ నెటిజనుల అభిప్రాయాన్ని కోరారు. తన పోస్టుపై వ్యతిరేకత వ్యక్తం అవుతుందేమోనని భావించిన ఝవేరీ, ‘‘కొంతమంది ఐ.సి.ఎస్.ఇ. పాఠశాలలు తక్కువ ఫీజులు వసూలు చేస్తున్నాయి, పిల్లల్ని అక్కడ చేర్చవచ్చు కదా?’ అని అనొచ్చు. ఇక్కడ నేను రెండు విషయాలను తీసుకుని ఈ లెక్కలు వేశాను. అవి, ఒకటి : ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి చదువును అందించాలని కోరుకుంటారు. రెండు : ఐ.సి.ఎస్.ఇ. పాఠశాలల్లో ప్రవేశం దొరకటం చాలా కష్టం’ అని ఝవేరీ వివరించారు.సామాజిక ఒత్తిడీ కారణం! ఝవేరీ పెట్టిన పోస్టుపై మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొంతమంది ఆయనతో ఏకీభవించారు. మరికొంత మంది విభేదించారు. ఖరీదైన పాఠశాలలు కావాలనుకున్నప్పుడే ఇంత ఖర్చు అవుతుంది అని కొందరు వాదించారు. ఒక నెట్ యూజర్ ‘బ్రాండెడ్ స్కూళ్లలో అంతేగా’ అని కామెంట్ చేశారు. మరొకరు.. పిల్లల చదువు విషయమై తల్లిదండ్రుల మీద ఉండే సామాజిక ఒత్తిడి గురించి మాట్లాడారు. తమ పిల్లలు ఎక్కడ వెనుకబడి పోతారోనన్న భయంతో తల్లిదండ్రులు కష్టమో, నష్టమో తలకు మించిన ఆర్థిక భారానికి సిద్ధమౌతారు, ప్రైవేటు స్కూళ్లు చెప్పే ఫీజులు కడతారు అని చెప్పారు. ఒక నెటిజెన్ ఝవేరీ పోస్టుతో పూర్తిగా విభేదించారు. ‘సెలబ్రిటీల పిల్లలు చదివే స్కూళ్లలో మీ పిల్లల్ని ఎవరు చదివించమన్నారు?’ అని విమర్శించారు. ఐ.సి.ఎస్.ఇ., సి.బి.ఎస్.ఇ., ఐ.జి.సి.ఎస్.ఇ. పాఠశాలల్లో సీటు తెచ్చుకోగలిగితే తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను పిల్లలకు అందివ్వవచ్చు అని కొందరు అన్నారు. -
భారత దేశ చరిత్రలో అతిపెద్ద విమానం ప్రమాదం!
భారత్లో ఇవాళ(జూన్ 12, 2020) ఘోర ప్రమాదం జరిగింది. గుజరాత్ అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ నిమిషాల వ్యవధిలో కుప్పకూలి పేలిపోయింది. ఈ ప్రమాదంలో 241 మృతిచెందారు. 230 ప్రయాణికుల్లో ఒకరు మినహా అంతా దుర్మరణం చెందారు. ఇద్దరు పైలట్లు, 10 మంది విమాన సిబ్బంది మృత్యువాత పడ్డారు. అయితే ఒక ప్రయాణికుడు మృత్యుంజయుడై వచ్చాడు. ప్రమాదం జరిగిన ఐదారు గంటల తర్వాత ప్రమాదగురైన వ్యక్తి ,నడుచుకుంటూ బయటకొచ్చాడు. ఈ విషయాన్ని అహ్మదాబాద్ సీపీ ప్రకటించారు. ఇదిలా ఉంచితే. భారత దేశ చరిత్రలో ఇంతకు ముందు విమాన ప్రమాదాలు చాలానే జరిగాయి. అందులో అత్యంత ప్రాణ నష్టం కలిగించిన ప్రమాదం ఎప్పుడు జరిగిందో తెలుసా?ఆగష్టు 7, 2020 ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ 1344 (కోజికోడ్, కేరళ)వివరాలు: దుబాయ్ నుండి కోజికోడ్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ IX-1344, ఒక బోయింగ్ 737-800, భారీ వర్షంలో ల్యాండింగ్ సమయంలో రన్వే దాటి, రెండు భాగాలుగా చీలి, ఒక లోయలో పడింది. టేబుల్టాప్ రన్వే తో పాటు ప్రతికూల వర్షాకాల పరిస్థితులు.ప్రాణనష్టం: 21 మంది మరణించారు, ఇద్దరు పైలట్లతో సహా, విమానంలోని 190 మందిలో (184 ప్రయాణీకులు ఉన్నారుమే 22, 2010ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ 812 (మంగళూరు, కర్ణాటక) వివరాలు: దుబాయ్ నుండి మంగళూరుకు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ IX-812, ఒక బోయింగ్ 737-800, ల్యాండింగ్ సమయంలో రన్వే దాటి, ఒక లోయలో పడి మంటల్లో చిక్కుకుంది. ప్రాణనష్టం: విమానంలోని 166 మందిలో 158 మంది (160 ప్రయాణీకులు, 6 సిబ్బంది) మరణించారు, 8 మంది బతికారు.• కారణం: పైలట్ తప్పిదం, ప్రధానంగా కెప్టెన్ హెచ్చరికలు ఉన్నప్పటికీ ల్యాండింగ్ను రద్దు చేయడంలో విఫలమవడం, జులై 17, 2000జూలై 17, 2000: అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412 (పాట్నా, బిహార్)• వివరాలు: కోల్కతా నుండి ఢిల్లీకి పాట్నా మీదుగా వెళ్తున్న అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412 పాట్నా విమానాశ్రయం సమీపంలో ఒక రెసిడెన్షియల్ ప్రాంతంలో ల్యాండింగ్ ప్రయత్నంలో కుప్పకూలింది. పైలట్ తప్పిదం మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమానం నియంత్రణ కోల్పోయింది.• ప్రాణనష్టం: విమానంలోని 58 మందిలో 55 మంది (52 ప్రయాణీకులు, 6 సిబ్బంది) మరణించారు, అలాగే భూమిపై 5 మంది మరణించారు.• కారణం: పరిశోధనల్లో పైలట్ తప్పిదం, పేలవమైన దృశ్యమానతలో గో-అరౌండ్ ప్రయత్నంలో తప్పు నిర్వహణను సూచించాయి.నవంబర్ 12, 1996సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్, కజకిస్తాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానాలు గాల్లో ఉండగానే హర్యానా ఛాక్రి దాద్రి వద్ద ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో రెండు విమానాల్లోని 349 మంది దుర్మరణం పాలయ్యారు. భారత దేశంలో ఇప్పటిదాకా జరిగిన అతిపెద్ద విమానం ప్రమాదం ఇదే. ఏప్రిల్ 26, 1993ఔరంగబాద్లో ఎయిరిండియా విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ప్రమాదానికి గురైంది. ఘటనలో 55 మంది మరణించగా.. 66 మంది గాయపడ్డారు.ఆగష్టు 16, 1991ఇంఫాల్లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో 69 మంది మృతి చెందారుఫిబ్రవరి 14, 1990ఇండియన్ ఎయిన్స్ విమానం బెంగళూరు ఎయిర్పోర్టులో దిగుతుండగా.. క్రాష్ ల్యాండ్ అయ్యింది. ప్రమాదంలో 92 మంది మరణించారు. అక్టోబర్ 19, 1988ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం అహ్మదాబాద్ ఎయిర్పోర్టులో క్రాష్ ల్యాండ్ అయ్యింది. ప్రమాదంలో 133 మంది మరణించారు.జూన్ 21, 1982ఎయిర్ ఇండియా విమానం బాంబేలో ప్రతికూల వాతావరణంతో కుప్పకూలింది. 17 మంది మరణించగా.. 94 మంది ప్రాణాలతో బయటపడ్డారు.జనవరి 1, 1978ఎయిర్ ఇండియా విమానం ముంబై బాంద్రా తీరంలో కూలి 213 మంది మరణించారు. అక్టోబర్ 12, 1976ముంబైలో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘోరంలో 95 మంది దుర్మరణం పాలయ్యారు.మే 31, 1973ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం ఢిల్లీ ఎయిర్పోర్టులో ప్రమాదానికి గురైంది. 48 మంది మరణించగా.. 17 మందికి గాయాలయ్యాయిజూన్ 14, 1972లో.. జపాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం ఢిల్లీ ఎయిర్పోర్టులో ప్రమాదానికి గురైంది. 82 మంది మరణించగా.. ఐదుగురు గాయపడ్డారు జులై 28, 1963లో.. యునైటెడ్ అరబ్ ఎయిర్లైన్స్ విమానం ముంబై ఎయిర్టుపోర్టులో ప్రమాదానికి గురై 63 మంది మరణించారుజులై 7, 1962లో అలియాలియా విమానం ముంబై నార్త్ఈస్ట్లో ప్రమాదానికి గురైంది. 94 మంది మరణించారు.మే 25, 1958లో.. అన్ అవ్రో యార్క్ విమానంలో మంటలు చెలరేగి గురుగావ్లో కుప్పకూలింది. విమానంలోని ఐదుగురు మరణించారు.ఇదీ చదవండి: అహ్మదాబాద్ ఘోర ప్రమాదం.. కుప్పకూలిన విమానం వీడియో -
యూఎస్లో లాటిన్ రగడ
వలసదారుల రగడతో అమెరికా భగ్గుమంటోంది. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపే క్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన చర్యలు వివాదాలకు దారితీస్తున్నాయి. మెక్సికో వంటి లాటిన్ అమెరికా దేశాల వలసదారులు వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అక్రమ వలసదారులనే అభియోగాలతో లాస్ ఏంజెలెస్లో గత శుక్రవారం పదుల సంఖ్యలో లాటిన్ ప్రజలను ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ (ఐసీఈ) విభాగం అరెస్టు చేసింది. వాటిని వ్యతిరేకిస్తూ మొదలైన ఆందోళనలు చూస్తుండగానే తీవ్ర రూపు దాలుస్తున్నాయి. లాటిన్లు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసనలకు విధ్వంసానికి పాల్పడుతున్నారు. జాతీయ బలగాల మోహరింపు, మూకుమ్మడి అరెస్టులతో కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు. అల్లర్లు ఇతర నగరాలకూ విస్తరిస్తుండటంతో లాస్ ఏంజెలెస్లో తాజాగా కర్ఫ్యూ విధించాల్సి వచి్చంది. ఈ నేపథ్యంలో అమెరికాలో మొత్తం అక్రమ వలసదారులు, వారిలో లాటిన్ అమెరికన్లు ఎందరన్న దానిపై చర్చ జరుగుతోంది. అంతటా మెక్సికన్ జెండాలే! లాస్ ఏంజెలెస్ అల్లర్లలో పాల్గొంటున్న నిరసనకారుల్లో ఎవరి చేతుల్లో చూసినా మెక్సికో జెండాలే కన్పిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలవారికి కలల గమ్యస్థానం అమెరికా. దాంతో అనేక దేశాల నుంచి వలసదారులు అక్కడికి సమక్రమ, అక్రమ మార్గాల్లో పోటెత్తుతూ వచ్చారు. 2022 గణాంకాల ప్రకారమే అమెరికాలో కోటి 10 లక్షల మందికి పైగా అక్రమ వలసదారులున్నారు. వారిలో ఏకంగా 77 శాతం, అంటే 79 లక్షల పై చిలుకు లాటిన్ అమెరికన్లే. వారిలోనూ ఏకంగా 41 లక్షలతో మెక్సికో తొలిస్థానంలో ఉంది. సెంట్రల్ అమెరికా దేశాల వారు 21 లక్షలు, దక్షిణ అమెరికా నుంచి 10 లక్షలు, కరీబియన్ దీవుల నుంచి 7.3 లక్షల మంది ఉన్నారు. మరోవైపు మూడేళ్లుగా అమెరికాకు వెళ్తున్న శరణార్థుల సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. 2016లో 85 వేలుగా నమో దైన శరణార్థులు 2021 నాటికి 11 వేలకు తగ్గారు. కానీ 2024లో ఏకంగా లక్ష మంది పొట్ట చేతపట్టుకుని అమెరికాలో ప్రవేశించారు. వీరిలో ఆఫ్రికా, దక్షిణాసియా దేశాల వారి సంఖ్యే ఎక్కువ. – సాక్షి, నేషనల్ డెస్క్ -
న్యూయార్క్ మేయర్ రేసులో మీరా నాయర్ కుమారుడు
ప్రఖ్యాత సినీ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడు, ఇండియన్–అమెరికన్ రాజకీయ నాయకుడు జోహ్రాన్ క్వామి మమ్దానీ అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ మేయర్ పదవికి పోటీ పడుతున్నాడు. ఒడిశాలో జన్మించిన మీరా నాయర్ ‘మీరాబాయి ఫిలిమ్స్’బ్యానర్ కింద పలు చిత్రాలు నిర్మిండడంతోపాట దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. కామసూత్ర, మాన్సూన్ వెడ్డింగ్, సలామ్ బాంబే వంటి చిత్రాలతో ఆమె సంచలనం సృష్టించారు. డెమొక్రటిక్ పార్టీ సభ్యుడైనా ఆమె కుమారుడు మమ్దానీ ప్రస్తుతం న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికలు త్వరలో జరుగబోతున్నాయి. ఈ పదవికి మాజీ గవర్నర్ ఆండ్రూ కౌమో పేరు ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తోంది. మరోవైపు ఆయనకు మమ్దానీ గట్టి పోటీనిస్తున్నాడు. నిధుల సేకరణ, నూతన ఆలోచనలు, ఆశయాలతోపాటు టెక్నాలజీని విస్తృతంగా వాడుకుంటూ జనాదరణ పొందే ప్రయత్నం చేస్తున్నాడు. ఆండ్రూ కౌమోను ఓడించడం ఖాయమని ధీమాగా చెబుతున్నాడు. ఒకవేళ మమ్దానీ అనుకున్న లక్ష్యం సాధిస్తే.. న్యూయార్క్ సిటీకి మొట్టమొదటి ముస్లిం మేయర్గా, తొలి ఇండియన్–అమెరికన్ మేయర్గా చరిత్ర సృష్టిస్తాడు. ఎవరీ మమ్దానీ? జోహ్రాన్ మమ్దానీ 1991 అక్టోబర్ 18న ఉగాండాలోని కంపాలాలో జన్మించాడు. ఆయన తండ్రి మహమూద్ మమ్దానీ, తల్లి మీరా నాయర్. మహమూద్ మమ్దానీ ఉగాండాతో ప్రముఖ మార్క్సిస్ట్ పండితుడు. జోహ్రాన్కు ఐదేళ్ల వయసున్నప్పుడు ఆ కుటుంబం దక్షిణాఫ్రియాలోని కేప్టౌన్కు చేరుకుంది. రెండేళ్ల తర్వాత అమెరికాలోని న్యూయార్క్లో స్థిరపడింది. జోహ్రాన్ మమ్దానీకి 2018లో అమెరికా పౌరసత్వం లభించింది. బ్రాంక్స్ హైసూ్కల్ ఆఫ్ సైన్స్తోపాటు బౌడిన్ కాలేజీలో విద్యాభ్యాసం చేశాడు. కాలేజీలో ఉన్నప్పుడు రాజకీయాలపై ఆసక్తి చూపించేవాడు. స్థానికంగా రాజకీయ, సేవ కార్యక్రమాల్లో వాలంటరీగా సేవలందించేవాడు. 2017లో డెమొక్రటిక్ సోషలిస్టు ఆఫ్ అమెరికా అనే సంస్థలో చేరాడు. తర్వాత డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా 2020, 2021, 2022, 2024లో న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. క్వీన్స్ 36వ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. చట్టసభల్లో చురుగ్గా పని చేస్తున్నాడు. 20 బిల్లును ప్రతిపాదించగా, అందులో మూడు బిల్లులు చట్టాలుగా మారాయి. న్యూయార్క్ మేయర్ రేసులో 2024 అక్టోబర్ 23న అడుగుపెట్టాడు. జోహ్రాన్ మమ్దానీలో మంచి కళాకారుడు కూడా ఉన్నాడు. 2019లో ‘నానీ’పేరిట ఒక మ్యూజిక్ వీడియో విడుదల చేశాడు. షియా ముస్లిం మతస్థుడైన మమ్దానీ ఇటీవలే రమా దువాజీని వివాహం చేసుకున్నాడు. ఆమె సిరియాలో జన్మించారు. పలు పత్రికల్లో చిత్రకారిణిగా పనిచేశారు. మమ్దానీ దంపతులు క్వీన్స్లోని అస్టోరియాలో నివాసం ఉంటున్నారు. పాలస్తీనాకు మద్దతు మమ్దానీ ఎన్నికల అజెండా ప్రజలను ఆకట్టుకుంటోంది. నగరంలో అద్దెలపై ఫ్రీజింగ్ విధిస్తానని, రవాణా, శిశు సంరక్షణ సేవలు ఉచితంగా అందిస్తానని, కనీస వేతనాన్ని 30 డాలర్లకు పెంచుతానని మమ్దామీ హామీ ఇస్తున్నారు. ఇక ఇజ్రాయెల్–పాలస్తీనా వివాదంలో మమ్దానీ పాలస్తీనాకు బహిరంగంగా మద్దతు పలుకుతున్నాడు. గాజాలో వెంటనే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్ను డిమాండ్ చేస్తున్నారు. అన్ని రకాల వివక్షకు ఆయన బద్ధవ్యతిరేకి. అలాగే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను మమ్దానీ నిశితంగా విమర్శిస్తున్నాడు. ఎన్నికల ప్రచారంలో తన దక్షిణాసియా మూలాలను పదేపదే గుర్తుచేస్తున్నాడు. హిందీ భాషలో ఒక వీడియో విడుదల చేశాడు. ఇందులో బాలీవుడ్ సినిమాలు, డైలాగ్ల ప్రస్తావన ఉంది. బిలియనీర్స్ కే పాస్ ఆల్రెడీ సబ్ కుచ్ హై, అబ్ ఆప్కా టైమ్ ఆయేగా(ధనవంతులకు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీ వంతు వస్తుంది) అని ఓటర్లకు చెబుతున్నాడు. ఈ నెల 24న మేయర్ ఎన్నిక జరుగనుంది. ర్యాంక్డ్–చాయిస్ వోటింగ్ సిస్టమ్ ద్వారా మేయర్ను ఎన్నుకుంటున్నారు. అంటే ఓటర్లు తమ ప్రాధాన్యత ప్రకారం ఐదుగురు అభ్యర్థులకు ర్యాంకులు ఇస్తారు. ఈ ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిచిన అభ్యర్థికి మేయర్ పదవి లభిస్తుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జననాల తగ్గుదల వరమా.. శాపమా?
ప్రపంచంలో మరే దేశానికి లేనంతటి యువశక్తి భారత్ సొంతం. మొత్తం జనాభాలోనూ చైనాను అధిగమించి ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచాం. అయితే ప్రపంచవ్యాప్త ట్రెండుకు అనుగుణంగా భారత్లో కూడా జననాల రేటు భారీగా తగ్గుముఖం పడుతూ వస్తోంది. జనాభా పెరుగుదల స్థిరంగా కొనసాగాలంటే జననాల (టీఎఫ్ఆర్–టోటల్ ఫెర్టిలిటీ) రేటు కనీసం 2.1 ఉండాలి. అంటే ప్రతి మహిళ కనీసం ఇద్దరిని కనాలన్నమాట. దీన్ని భర్తీ రేటుగా పిలుస్తారు. కానీ భారత్లో టీఎఫ్ఆర్ ఏకంగా 1.9కి పడిపోయిందని ‘సంతాన సంక్షోభం’ పేరిట ఐక్యరాజ్యసమితి జనాభా కార్యకలాపాల నిధి (యూఎన్ఎఫ్పీఏ) విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. దాంతో జననాల రేటు తగ్గుదల ప్రభావం మన దేశంపై అంతిమంగా ఎలా ఉండనుందన్న చర్చ జోరందుకుంది.ఇదీ పరిస్థితి!1.9 టీఎఫ్ఆర్ కారణంగా భారత్లో జనాభా పెరుగుదల నానాటికీ తగ్గి 40 ఏళ్లకు ఆగిపోతుందని యూఎన్ఎఫ్పీఏ అంచనా వేసింది. అప్పటికి దేశ జనాభా 170 కోట్లకు చేరి అక్కడి నుంచి తగ్గుముఖం పడుతుందని పేర్కొంది. కానీ భారత్లో టీఎఫ్ఆర్ శరవేగంగా 1.29కు పడిపోతుందని గతేడాది లాన్సెట్ జరిగిన అధ్యయనం శాస్త్రీయంగా అంచనా వేసింది. అదే జరిగితే దేశ జనాభాలో తగ్గుదల 40 ఏళ్లకంటే చాలా ముందే మొదలయ్యే వీలుంది. 1950ల్లో ఒక్కో భారత మహిళ సగటున ఏకంగా ఆరుగురిని కనేది! 1980ల నాటికి అది 4.6కు తగ్గింది. అక్కడినుంచి ఇద్దరు పిల్లలు చాలనే పరిస్థితికి రావడానికి కేంద్ర ప్రభుత్వం ఎంతగానో శ్రమించాల్సి వచ్చింది. చిన్న కుటుంబాలు పరిపాటిగా మారిపోయాయి. మహిళల ఆర్థిక స్వాతంత్య్రం పెరిగిన కొద్దీ వారు కనే పిల్లల సంఖ్య మరింతగా తగ్గుతూ వస్తోంది. ఎక్కువమందిని కని కెరీర్ను పణంగా పెట్టేందుకు వారు ఇష్టపడటం లేదు. పిల్లల పెంపకంలో వారికి భర్త మద్దతు లేకపోవడమూ దీనికి కారణమే.ఆందోళన అక్కర్లేదు!జననాల రేటు (టీఎఫ్ఆర్) తగ్గితే జనాభాపరంగా చాలా మార్పులు చోటుచేసుకుంటా యి. ముఖ్యంగా యువ శ్రామిక శక్తి క్రమంగా తగ్గిపోతుంది. వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది. ‘‘2050 నాటికి భారత జనాభాలో వృద్ధుల సంఖ్య ఐదో వంతుకు చేరుతుంది. చైనాది ప్రస్తుతం ఇదే పరిస్థితి. ఒకే సంతానం నిబంధనను దశాబ్దాలుగా కఠినంగా అమలు చేయడమే అందుకు కారణం’’ అని జనాభా నిపుణులు చెబుతున్నారు. ‘‘జనాభా పెరుగుదలను బాగా తగ్గించిన దక్షిణాది రాష్ట్రాలన్నీ దాని పర్యవసానాలను ఇప్పటికే అనుభవిస్తున్నాయి. మొత్తం 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో టీఎఫ్ఆర్ ఇప్పటికే 2.1 కంటే చాలా తక్కువకు పడిపోయింది. బిహార్ (3), మేఘాలయ (2.9), ఉత్తరప్రదేశ్ (2.7) వంటివి మాత్రమే ఇందుకు మినహాయింపు’’ అని ఇంటర్నేషనల్ ఇన్స్టి ట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ డెమోగ్రఫీ ప్రొఫెసర్ శ్రీనివాస్ గోలి వివరించారు. ‘‘అంతమాత్రాన టీఎఫ్ఆర్ తగ్గుదలను చూసి ఇప్పటికిప్పుడు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. దీనివల్ల కార్మిక శక్తి భారీగా తగ్గుతుందన్నది అపోహ మాత్రమే. నైపుణ్యాలను పెంపొందించుకోవడం, ప్రాంతాల మధ్య వలసలను మరింతగా ప్రోత్సహించడం ద్వారా సమస్యను సులువుగా అధిగమించవచ్చు’’ అని అభిప్రాయపడ్డారు. అయితే వృద్ధుల సంఖ్య పెరుగుదల ఒక్కటే మున్ముందు భారత్కు సమస్యగా మారే ఆస్కారముందని ఆయన అంచనా వేశారు. ‘‘వయోపరమైన అంతరం నానాటికీ పెరిగిపోయి చివరికి పెద్దవాళ్ల ఆలనాపాలనా చూసే వారసుల సంఖ్య తగ్గిపోతుంది. ఆ పరిస్థితుల్లో వృద్ధుల సంరక్షణకు అవసరమైన వసతులు, ప్రభుత్వపరమైన సౌకర్యాలు మన దగ్గర బాగా తక్కువే’’ అని గుర్తు చేశారు. 60–75 ఏళ్ల వయసు వారికి ఇప్పటిమాదిరిగా తగిన ఉపాధి అవకాశాలు కూడా మున్ముందు సవాలుగానే మారవచ్చని అహ్మదాబాద్లోని ఎల్జే వర్సిటీ ప్రొఫెసర్ అమితాబ్ కుందు అభిప్రాయపడ్డారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆకలి తీర్చే అక్షయపాత్ర
భక్తుల కోరిక తీర్చడమే కాదు.. తన దర్శనానికి వచ్చినప్పుడు ఆకలి కూడా తీరుస్తున్నాడు జగత్కల్యాణ చక్రవర్తి..తిరుమల వేంకటేశ్వరుడు.. ఆ దేవదేవుడే ఆదేశించినట్లుగా ప్రతిరోజు తిరుమలలో అన్నప్రసాదవితరణ మహాయజ్ఞంలా సాగుతోంది....తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు టీటీడీ నిరంతర యజ్ఞంగా అన్నప్రసాద వితరణ ఉచితంగా చేస్తోంది. 1985, ఏప్రిల్ 6న శ్రీవేంకటేశ్వర నిత్యాన్నదానం పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారకరామారావు చేతులమీదుగా టీటీడీ ప్రారంభించింది. తదుపరి 1994, ఏప్రిల్ 1న శ్రీవేంకటేశ్వర నిత్యాన్నదానం ట్రస్టుగా, తర్వాత దీనిని శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుగా నామకరణం చేశారు. మొదటగా తిరుమలలో కల్యాణకట్ట ఎదురుగా గల పాత అన్నదానం కాంప్లెక్స్లో అన్నదానం జరిగేది. ఇప్పటి వరకు శ్రీ వైంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ కు దాతలు దాదాపు రూ. 2,190 కోట్ల విరాళాలను అందించారు. ఎందరో దాతలు ఇచ్చిన నిధులతో నిర్విరామంగా అన్నప్రసాద వితరణ సాగుతోంది. వ్యక్తిగతంగా దాతల పుట్టిన రోజు, దాతల కుటుంబ సభ్యుల పేర్లతో, దాతల ట్రస్ట్ లు, కంపెనీల పేరుతో రూ.44 లక్షలు అందించవచ్చు. శ్రీవారి పుట్టిన రోజు అయిన శ్రవణా నక్షత్రం, శ్రీ పద్మావతీ అమ్మవారి పుట్టిన రోజు అయిన ఉత్తరషాడ నక్షత్రం, పంచమితీర్థం, వైకుంఠ ఏకాదశి, శ్రీవారి, శ్రీపద్మావతీ అమ్మవారి ప్రత్యేక రోజుల్లో కూడా దాతలు విరాళంగా అందించవచ్చు.భక్తుల నుంచి విశేష ఆదరణదాతలు రూ.44 లక్షలు అన్నప్రసాద వితరణకు విరాళం అందిస్తే, ఆ రోజంతా తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్–1లోని 20, వైకుంఠం క్యూ కాంప్లెక్స్– 2లోని 31 కంపార్ట్మెంట్లు, నారాయణగిరిలోని 9 కంపార్ట్ మెంట్లు, ఏటీసీ, ఎంబీసీ, టిబీసీ, పీఏసీ– 2, పీఏసీ – 4 కేంద్రాలు, శిలాతోరణం, కృష్ణతేజ వరకు బయటి క్యూలైన్లు, తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం కాంప్లెక్సులు, శ్రీగోవిందరాజ స్వామి ఆలయ అన్నప్రసాదరణ వితరణ కేంద్రం, రుయా ఆస్పత్రి, స్విమ్స్, మెటర్నిటి ఆస్పత్రి, బర్డ్, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి, తిరుచానూరులోని అన్నప్రసాద భవనం, ఒంటిమిట్టలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాద వితరణ చేస్తారు. ప్రతి రోజూ టీటీడీలో అన్నప్రసాదాల తయారీ, పంపిణీకి సుమారు పలువురు ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారు. అన్నప్రసాదాలు విభాగంలో పలువురు శ్రీవారి సేవకులు సేవలు అందిస్తున్నారు. తద్వారా భక్తులు నుంచి టీటీడీ అన్నప్రసాదం విభాగం విశేష ఆదరణ పొందుతోంది.దాతలు స్వయంగా అన్న ప్రసాదం వడ్డించే అవకాశంరూ. 44 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులు ప్రత్యేకంగా అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. విరాళం అందించే దాతల పేరును తిరుమల వెంగమాంబ అన్నప్రసాద భవనంలోని డిస్ ప్లే బోర్డులో ప్రదర్శిస్తారు. అదేవిధంగా ఒకరోజు అన్నప్రసాదాలను వడ్డిస్తారు. ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణ రూ.44 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఉదయం అల్పాహారం కోసం రూ.10 లక్షలు, మధ్యాహ్నం భోజనం కోసం రూ.17 లక్షలు, రాత్రి భోజనం కోసం రూ.17 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తారు. తిరుమల, తిరుపతి, ఒంటిమిట్టలోని టీటీడీ అన్నప్రసాదాలు వితరణ కేంద్రాల నుండి రోజుకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రికి సుమారు 2.5 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరిస్తున్నారు. -
కార్పొరేట్స్కూళ్లలో ఫైనాన్షియర్లు!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల్లో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయడాన్ని నియంత్రిస్తామని ప్రభుత్వం గత ఏడాది ప్రకటించింది. దీనిపై మంత్రివర్గ ఉప సంఘం చర్చించింది. మరోవైపు రాష్ట్ర విద్యా కమిషన్ కూడా భారీ ఫీజులపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది స్కూళ్లు మొదలయ్యేలోగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తల్లిదండ్రులు భావించారు. కానీ దీనిపై ఇంతవరకు ఎలాంటి ఆదేశాలూ వెలువడలేదు. ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో ప్రైవేటు పాఠశాలలు ఈ ఏడాది కూడా ఫీజులు భారీగా పెంచాయి.అంతేకాదు కొన్ని కార్పొరేట్ స్కూళ్లు ఈసారి కొత్త దందా ప్రారంభించాయి. నిర్ధారిత ఫీజులు సకాలంలో వసూలు చేసుకునే క్రమంలో ఫైనాన్షియర్లను ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో తల్లిదండ్రుల తరఫున తొలుత యాజమాన్యాల బినామీలైన ఈ ఫైనాన్షియర్లే ఫీజులు చెల్లించేస్తారు. ఆ తర్వాత వీరు తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తారు. గడువు లోపు చెల్లించకపోతే వడ్డీ కూడా వసూలు చేసేలా ఈ కొత్త తరహా దందాకు కొన్ని కార్పొరేట్ స్కూళ్లు తెరలేపాయి.పుస్తకాలు, యూనిఫాం, యాప్ల పేరిట బాదుడు రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షలకు పైగా విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ళలో చదువుతున్నారు. స్కూల్లో విద్యార్థి చేరేటప్పుడు ఉన్న ఫీజు ఆ మరుసటి సంవత్సరం ఉండటం లేదు. ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోంది. తల్లిదండ్రుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 25 శాతం మేర ఫీజులు పెరిగాయి. సాధారణ స్కూళ్ళలో కూడా రూ.50 వేల వార్షిక ఫీజు ఉంది. ఇక కార్పొరేట్ స్కూళ్ళు ఏకంగా రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ వసూలు చేస్తున్నాయి. దీంతో పాటు పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫాం, ఇతర వస్తువులన్నీ తమ వద్దే కొనాలంటున్నాయి.ఓ కార్పొరేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థికి ఒక్క పాఠ్య పుస్తకాల వ్యయమే రూ.12 వేల వరకు ఉండటం గమనార్హం. మరోవైపు పాఠశాల సొంత ‘యాప్’ల పేరిట మరో దోపిడీకి కూడా కొన్ని యాజమాన్యాలు తెరలేపాయి. ఇందుకోసం ప్రతి విద్యార్థి నుంచి క్లాసు ఆధారంగా రూ.2,500 నుంచి రూ.5,000 వరకు వసూలు చేస్తున్నాయి. ఫీజులు (Fees) నియంత్రిస్తామని, అడ్డగోలు దోపిడీకి కళ్లెం వేస్తామని చెప్పిన ప్రభుత్వం..ఈ దిశగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోవడంతో కార్పొరేట్ స్కూళ్లు ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫైనాన్షియర్ల ఏర్పాటులో చట్టబద్ధతను వారు ప్రశ్నిస్తున్నారు. చట్టం లేదు.. నియంత్రణ లేదు ప్రైవేటు ఫీజుల దందాను నియంత్రించేందుకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్తాన్, గుజరాత్, పశ్చిమబెంగాల్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ సహా 15 రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తెచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కూడా ఇదే తరహాలో పటిష్టమైన చట్టాన్ని తేవాలని కొన్నేళ్ళుగా ఆలోచిస్తోంది. దాదాపు 11 వేల ప్రైవేటు స్కూళ్ళను దీని పరిధిలోకి తేవాలని భావించింది. ఇష్టానుసారం కాకుండా, స్కూళ్ళలోని మౌలిక వసతుల ఆధారంగా ఫీజులు పెంచే నిబంధన విధించే యోచనలో ఉంది.ఈ దిశగా గతంలో ఆచార్య తిరుపతిరావు కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కొన్ని సిఫారసులు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత కూడా ఈ దిశగా కార్యాచరణకు పూనుకుంది. మంత్రులతో కమిటీ వేసింది. విద్యా కమిషన్ నుంచి నివేదిక కోరింది. మంత్రుల కమిటీ ఫీజుల నియంత్రణ దిశగా అధికారులతో సంప్రదింపులు చేపట్టింది. కానీ వీటిపై ఇంతవరకూ ఎలాంటి స్పష్టత రాలేదు. తిరుపతిరావు కమిటీ సిఫారసులు కనుమరుగుతిరుపతిరావు కమిటీ ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయ సేకరణ జరిపింది. ఈ మేరకు కొన్ని సిఫారసులు చేసింది. ‘ప్రతి స్కూలు 10 శాతం లోపు ఫీజు పెంచుకోవచ్చు. పది శాతం దాటితే..యాజమాన్యం ఖర్చు చేసే ప్రతి పైసా బ్యాంక్ లావాదేవీగా మాత్రమే ఉండాలి. వేతనాలు, స్కూల్లో మౌలిక వసతుల కోసం జరిపే కొనుగోళ్లు, ఇతరత్రా ఖర్చులకు సంబంధించిన లావాదేవీలన్నీ బ్యాంకు ద్వారానే జరగాలి. 10 శాతానికి పైగా ఫీజు పెంచే స్కూళ్ళన్నీ విధిగా లెక్కలు చూపాలి. వీటిని ఫీజుల రెగ్యులేటరీ కమిటీ పరిశీలించాలి.ఎక్కడ తప్పు జరిగినా భారీ జరిమానా విధించాలి. అవసరమైతే స్కూలు గుర్తింపు రద్దు చేయాలి..’అని సూచించింది. ఈ మేరకు 2018లో కమిటీ ప్రత్యేక సాఫ్ట్వేర్ను తయారు చేసింది. ఈ నేపథ్యంలో 10 శాతం లోపు ఫీజులు పెంచిన దాదాపు 4,500 స్కూళ్ళు తమ ఖర్చులను ఆన్లైన్ ద్వారా చూపాయి. అయితే ఆ తర్వాత ఈ విధానం కనుమరుగైంది. కమిటీ సిఫారసులు కఠినంగా అమలు చేస్తే చాలా వరకు స్కూళ్లు 10 శాతం లోపే ఫీజులు పెంచేందుకు అవకాశం ఉంటుందని అంచనా.చట్టం తేవాలిప్రైవేటు పాఠశాలలు ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ సంవత్సరం ఏకంగా 25 శాతం పెంచారు. కరోనా తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద, మధ్యతరగతి వారికి ఈ ఫీజులు గుదిబండలా మారుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా ఫీజులు నియంత్రించాలి. చిత్తశుద్ధితో చట్టాన్ని తెచ్చి అమలు చేయాలి. – పొలుసు సంజీవరావు, హైదరాబాద్ (విద్యార్థి తండ్రి)ప్రభుత్వ నియంత్రణ ఉండాలిప్రైవేటు స్కూళ్లలో ఫీజులు ఇష్టానుసారం పెంచుతున్నారు. మరోవైపు నాణ్యత ప్రమాణాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. కొన్ని స్కూళ్లలో టీచర్లకు జీతాలు ఇవ్వడం లేదు. వీటన్నింటిపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. – నాగరాజు (ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి)వడ్డీ వసూలు చేస్తున్నారుఫీజులు, సకాలంలో చెల్లించకపోతే వడ్డీలు, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్కుల పేరిట వేలకు వేలు వసూలు చేస్తున్నారు. ఇదేమిటని ప్రశి్నస్తే..అన్ని పాఠశాలలు ఇలానే చేస్తున్నాయంటున్నారు. మీకు ఇష్టం లేకపోతే టీసీ ఇచ్చేస్తాం తీసుకెళ్లండంటున్నారు. ఇలా వసూలు చేయడం చట్ట విరుద్ధం అని చెబుతున్న అధికారులు..ఈ పాఠశాలల వైపు మాత్రం కన్నెత్తి చూడడం లేదు. – ఆశ (విద్యార్థి తల్లి) -
అమ్ములపొదిలోకి తేజస్ 2.0
పాకిస్తాన్తో ఉద్రిక్తలు తారస్థాయికి చేరిన వేళ మన వైమానిక పాటవం మరింత బలోపేతం కానుంది. తేలికరకం యుద్ధ విమానం తేజస్ తాలూకు అత్యాధునిక ఎంకే1–ఏ వేరియంట్ ఈ నెలాఖరుకల్లా ఎయిర్ఫోర్స్ అమ్ములపొదిలోకి చేరనుంది. దశలవారీగా మొత్తం 83 విమానాలు సమకూరనున్నాయి. ఇజ్రాయెల్కు చెందిన అత్యాధునిక ఏఈఎస్ఏ (యాక్టివ్ ఎల్రక్టానికలీ స్కాన్డ్ అరే) రాడార్లతో వాటిని అత్యంత బలోపేతంగా తీర్చిదిద్దారు. ఇది ప్రపంచంలోనే అత్యంత మెరుగైన రాడార్ వ్యవస్థ.ఫలితంగా పాశ్చాత్య దేశాలకు చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలకు తీసిపోని సామర్థ్యం తేజస్ ఎంకే1–ఏ సొంతమైనట్టు జెరూసలేం పోస్ట్ వార్తా సంస్థ వెల్లడించింది. ఇవి గతేడాదే అందుబాటులోకి రావాల్సి ఉండగా కీలక విడిభాగాల సరఫరా తదితరాల్లో ఆలస్యం వల్ల జాప్యమైంది. కాలం చెల్లుతున్న మిగ్–21, జాగ్వార్ యుద్ధ విమానాలను పూర్తిగా తేజస్లతో భర్తీ చేయాలని కేంద్రం నిర్ణయించడం తెలిసిందే. ప్రస్తుతం తొలి తరానికి చెందిన 40 తేజస్ యుద్ధ విమానాలు సేవలందిస్తున్నాయి. వాయుసేన వద్ద ప్రస్తుతం 31 ఫైటర్ స్క్వాడ్రన్లు మాత్రమే ఉన్నాయి. వీలైనంత త్వరగా వాటిని కనీసం 42కు పెంచుకోవాలన్నది లక్ష్యం. ఒక్కో స్క్వాడ్రన్లో 16 నుంచి 20 దాకా యుద్ధ విమానాలుంటాయి. ఇవీ ప్రత్యేకతలు ⇒ తేజస్ ఎంకే1–ఏలో అమర్చిన అత్యాధునిక ఏఈఎస్ఏ రాడార్ వ్యవస్థను ఇజ్రాయెల్ ప్రభుత్వ రంగ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్కు చెందిన ఎల్టా సిస్టమ్స్ సంస్థ అభివృద్ధి చేసింది. ⇒ తేజస్లో అమర్చిన అధునాతన ఎల్రక్టానికల్ యుద్ధతంత్ర వ్యవస్థను కూడా ఎల్టాయే సరఫరా చేసింది. ⇒ ఇజ్రాయెల్కే చెందిన ఎల్బిట్ సిస్టమ్స్ రూపొందించిన అత్యాధునిక హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే ఘర్షణల వేళ పైలట్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ⇒ ఏఈఎస్ఏ వ్యవస్థ తదితరాలన్నింటినీ మేకిన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా ఇజ్రాయెల్ భాగస్వామ్యంతో భారత్లోనే తయారు చేశారు. ⇒ తేజస్ ఎంకే1–ఏకు ఇజ్రాయెల్ సమకూర్చిన పలు సాంకేతిక హంగులు ఆ దేశానికే చెందిన పలు యుద్ధవిమానాల్లో కూడా లేకపోవడం విశేషం. ⇒ రఫేల్ యుద్ధ విమానాల్లోని రాడార్ గైడెడ్ డెర్బీ క్షిపణులను తేజస్ఎంకే1–ఏకు అమర్చనున్నారు. ఫలితంగా దాని యుద్ధపాటవం ఎన్నో రెట్లు పెరగనుంది. ⇒ తేజస్ తాలూకు భావి వెర్షన్లు మరింత అధునాతనమైన కానార్డ్ వింగ్స్, ఎల్రక్టానిక్ తదితర వ్యవస్థలు, మరింత మెరుగైన రేంజ్ వంటివాటిని సంతరించుకోనున్నట్టు జెరూసలేం పోస్ట్ తెలిపింది. ⇒ తేజస్ మూడో వెర్షన్లను మరింత ఆధునీకరించేందుకు ప్రభుత్వ రంగ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నిత్యం శ్రమిస్తోంది. ⇒ ఈ నేపథ్యంలో వాటికి అవసరమైన అధునాతన సాంకేతిక వ్యవస్థల సరఫరా కాంట్రాక్టుల కోసం ఇజ్రాయెల్తో పాటు ఫ్రాన్స్, అమెరికా ఆయుధ కంపెనీలు పోటీపడుతున్నాయి. -
పిల్లలా... వద్దులే!
ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు, ఇకపై వద్దంటూ ఒకప్పుడు ప్రభుత్వాలే ముమ్మరంగా ప్రచారం చేశాయి. జనాభా అడ్డూఅదుపూ లేకుండా పెరిగిన రోజులవి. జనాభా వృద్ధి నానాటికీ నేలచూపులు చూస్తుండటం నేటికాలపు చేదు నిజం. భారత్ అనే కాదు, జనాభా వృద్ధిలో ప్రపంచమంతటా కనీవినీ ఎరగని రీతిలో భారీ తగ్గుదల నమోదవుతోంది! దాంతో వీలైనంత మందిని కనండని ప్రభుత్వాలే వేడుకుంటున్నాయి. కానీ ఫలితం మాత్రం పెద్దగా కన్పించడం లేదు. నానాటికీ చుక్కలనంటున్న జీవనవ్యయమే దీనికి ప్రధాన కారణమని ఐక్యరాజ్యసమితి జనాభా నిధి (యూఎన్ఎఫ్పీఏ) సర్వే తేల్చింది.పునరు త్పాదనకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా దంపతుల మనోగతం తెలుసుకునేందుకు ఈ ఐరాస సంస్థ ప్రయత్నం చేసింది. ఇందుకోసం 14 దేశాల్లో 14 వేల జంటలపై అధ్యయనం జరిపింది. ‘‘అత్యధికులకు ఎక్కువమందిని కనాలని ఉన్నా ఆకాశాన్నంటున్న ఖర్చులకు భయపడుతున్నారు. పోషణ భారమవుతుందనే భయంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఒక్క సంతానానికే పరిమితమవుతున్నారు’’ అని తేల్చింది. తమ శాంపిల్ సంఖ్య చూసేందుకు చిన్నదిగా కనిపిస్తున్నా సర్వే ఫలితాలు మాత్రం కోట్లాది మంది మనోగతానికి అద్దం పడుతున్నాయని స్పష్టం చేసింది. ఈ ఏడాది చివరికల్లా మరో 50 దేశాల్లో సర్వే జరపాలని యూఎన్ఎఫ్పీఏ నిర్ణయించింది.ఇలా చేశారు⇒ సర్వేలో సమాజంలోని అన్ని వర్గాల అభి ప్రాయాలూ సముచితంగా ప్రతిఫలించేలా యూఎన్ఎఫ్పీఏ జాగ్రత్తలు తీసుకుంది.⇒ భారత్, అమెరికా, బ్రెజిల్, మెక్సికో, ఇటలీ, హంగరీ, జర్మనీ, స్వీడన్, దక్షిణకొరియా, మొరాకో, నైజీరియా, దక్షిణాఫ్రికా, థాయ్లాండ్, ఇండోనేసియా దేశాలను ఎంచుకుంది. తద్వారా అన్ని ఖండాలకూ సరైన ప్రాతినిధ్యం ఉండేలా చూసింది. ప్రపంచ జనాభాలో మూడో వంతు ఈ దేశాల్లోనే ఉండటం విశేషం!⇒ పేద, వర్ధమాన, సంపన్న దేశాలను ఎంచుకుంది. జననాల రేటు అత్యల్పంగా, అత్యధికంగా ఉన్న దేశాలు తగినంతగా కవరయ్యేలా జాగ్రత్త పడింది.⇒ అల్పాదాయ, మధ్యతరగతి, సంపన్న జంటలు; యువ, మధ్యవయసు, 50 ఏళ్ల పైచిలుకు వారిని తగిన నిష్పత్తిలో ఎంపిక చేసుకున్నారు.ఇదీ తేలింది⇒ సర్వేలో పాల్గొన్న ప్రతి ఐదుగురిలో ఒకరు ఎక్కువ మందిని కనాలని ఉన్నా అందుకు సాహసం చేయలేకపోయినట్టు అంగీకరించారు.⇒ సంతాన లేమికి వంధ్యత్వాన్ని కారణంగా పేర్కొన్నది 12 శాతం మంది మాత్రమే!⇒ ఆర్థిక స్తోమత లేకపోవడం వల్లే పిల్లల్ని కనలేదని, లేదా రెండో సంతానానికి వెళ్లలే దని 39% మంది వాపోయారు. ఇలాంటివా రి సంఖ్య దక్షిణ కొరియాలో అత్యధికంగా (58 %), స్వీడన్లో అత్యల్పంగా (19%) ఉంది.⇒ ఎక్కువ మందిని కనాలని ఉన్నా అందుకు సాహసం చేయలేకపోయినట్టు 50 ఏళ్ల పై చిలుకు వారిలో సగం మందికి పైగా అంగీకరించారు.⇒ థాయ్లాండ్లో 19 శాతం మంది వంధ్యత్వాన్ని ప్రధాన కారణంగా చూపారు. తర్వాతి స్థానాల్లో అమెరికా (16 శాతం), దక్షిణాఫ్రికా (15 శాతం), నైజీరియా (14 శాతం), భారత్ (13 శాతం) ఉన్నాయి.⇒ ఆఫీసుకు వెళ్లి రావడానికే రోజుకు సగటున మూడు గంటలు పోతోందంటూ చాలా జంటలు ఆవేదన వెలిబుచ్చాయి. దాంతో పిల్లల బాగోగులు చూసుకునేంత సమయం లేదని వాపోయాయి.40 ఏళ్ల కింద చాలా దేశాలు అధిక జనాభాతో సతమతమయ్యాయి. కానీ 2015 నుంచి జనాభా తగ్గుదలే పెను సమస్యగా మారుతూ వస్తోంది. ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సంక్షోభమిది. దీనికి తోడు చాలా దేశాల్లో వృద్ధుల సంఖ్య శరవేగంగా పెరుగుతుండటంతో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలోకి జారుతోంది – డాక్టర్ నటాలియా కనెం, యూఎన్ఎఫ్పీఏ సారథిభారత్లో కూడా..!భారత్లో జనాభా 146.4 కోట్లకు చేరినట్టు యూఎన్ఎఫ్పీఏ నివేదిక వెల్లడించింది. అయితే అన్ని దేశాల్లో మాదిరిగానే మన దేశంలోనూ జనాభా వృద్ధి నానాటికీ తగ్గిపోతోందని పేర్కొంది. జనాభా పెరుగుదల స్థిరంగా ఉండాలంటే సంతానోత్పత్తి రేటు సగటున ఒక్కో మహిళకు కనీసం 2.1 ఉండాలి. కానీ భారత్లో అది 1.9కి తగ్గినట్టు నివేదిక తెలిపింది.నివేదిక విశేషాలు...⇒ ప్రపంచ దేశాలన్నింట్లోనూ అత్యధిక యువతతో భారత్ కళకళలాడుతోంది. జనాభాలో 24 శాతం 0–14 ఏళ్ల వయసు వారున్నారు. 10–19 ఏళ్లు 17 శాతం కాగా 24 శాతం మంది 10–24 ఏళ్ల వయసువారు. ⇒ జనాభాలో ఏకంగా 68 శాతం పనిచేసే వయసులో (15–64) ఉన్నారు. ⇒ 65 ఏళ్లు, ఆపైబడ్డ వృద్ధులు 7 శాతం. ⇒ మహిళల్లో సగటు ఆయుప్రమాణం 74 ఏళ్లు కాగా పురుషుల్లో 71 ఏళ్లు. ⇒ భారత్లో జనాభా మరో 40 ఏళ్ల పాటు పెరిగి 170 కోట్లకు చేరుకుంటుంది. అక్కడినుంచి తగ్గుముఖం పడుతుంది. -
నా దారి నేను చూసుకుంటా..!
తరాలుగా సంక్రమించిన కుటుంబ వ్యాపారాన్ని సహజంగా వారసులు కొనసాగిస్తుంటారు. వారసులు నడుపుతున్న వాటిలో మనకు తెలిసిన దుకాణాలే చాలా ఉంటాయి. అంతెందుకు మన పొరుగునే ఉంటారు. కుటుంబ వ్యాపార విధానం ఒక్క భారత్కే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా తరతరాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. వారసత్వాన్ని కొనసాగించడం ఒక బాధ్యతగా భావించిన రోజులు గతం. యువ‘తరం’ మారింది. ఆలోచనల్లో అంతరం కనిపిస్తోంది. పాత తరం వ్యాపారం భారంగా భావించడమో.. తమ కొత్త ఆలోచనలకు పదును పెట్టాలనుకోవడమో.. కారణం ఏదైనా భారత్లో కేవలం 7% మంది వారసులు మాత్రమే తమ కుటుంబ వ్యాపారాన్ని అందిపుచ్చుకోవాలని భావిస్తున్నారట. – సాక్షి, స్పెషల్ డెస్క్హెచ్ఎస్బీసీ గ్లోబల్ ఇటీవల నిర్వహించిన సర్వే ఆసక్తి రేకెత్తిస్తోంది. మనదేశంలో వారసత్వం చుట్టూ ఉన్న సంప్రదాయ అంచనాలను.. ఈ నివేదికలోని అంశాలు తలకిందులు చేస్తున్నాయి. 79% వ్యాపార యజమానులు ఇప్పటికీ తమ వ్యాపారాన్ని కుటుంబ సభ్యునికి బదిలీ చేయాలని ఆసక్తి చూపుతున్నప్పటికీ.. కుటుంబ వ్యాపారాన్ని వారసత్వంగా స్వీకరించేందుకు అతి తక్కువగా 7% మంది వారసులు మాత్రమే సిద్ధంగా ఉన్నామని చెప్పారట. 88% మంది భారతీయ వ్యవస్థాపకులు తమ కుటుంబ సంపదను నిర్వహించడంలో తదుపరి తరం సామర్థ్యంపై నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. కొసమెరుపు ఏమంటే తమ పిల్లలు కుటుంబ వ్యాపారాన్ని అందిపుచ్చుకుంటారని ఆశించడం లేదని 45% మంది నిర్మొహమాటంగా తేల్చి చెప్పారు. సర్వేలో 1,798 మంది..హెచ్ఎస్బీసీ గ్లోబల్ ప్రైవేట్ బ్యాంకింగ్ ‘ఆసియాలో కుటుంబ వ్యాపారాలు: సామరస్యంగా వారసత్వ బదిలీ 2025’ పేరుతో నివేదిక రూపొందించింది. కనీసం రూ.17 కోట్లు పెట్టుబడి పెట్టగలిగే అధిక నికర విలువ (హెచ్ఎన్ఐ) కలిగిన 1,798 మంది వ్యాపారవేత్తలు ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. ఈ పరిశోధనను చైనా, ఫ్రాన్స్, హాంకాంగ్, భారత్, సింగపూర్, స్విట్జర్లాండ్, తైవాన్, యూఏఈ, యూకే, యూఎస్లో ఆన్ లైన్ లో నిర్వహించారు. వందేళ్లకుపైగా విజయవంతంగా..దేశంలో కుటుంబ యాజమాన్యంలోని వ్యాపారాలు సంపద బదిలీ, వారసత్వ ప్రణాళికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. పటిష్టమైన ఆర్థిక సలహాలు, నష్ట నివారణ చర్యలు, సంపద నిర్వహణకు తదుపరి తరానికి పాతతరం.. వారి అనుభవాన్ని రంగరించి సలహాలూ సూచనలూ ఇస్తోంది. తమ కుటుంబ వ్యాపారం భవిష్యత్తులో మరింత విస్తరించాలనే దూరదృష్టితో.. కుటుంబ పెద్దలు అత్యంత పారదర్శకంగా బదిలీ ప్రక్రియను చేపట్టడంతోపాటు యువతరానికి మార్గదర్శకత్వమూ వహిస్తున్నారు. కొన్ని కుటుంబ వ్యాపారాలు 100 ఏళ్లకుపైగా విజయవంతంగా కొనసాగుతున్నాయంటే ఇలాంటి చర్యలే కారణం. మన దగ్గరే అత్యధికం..ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థల వ్యవస్థాపకులకు వేర్వేరు వారసత్వ ప్రణాళికలు ఉన్నాయి. కొందరు తమ వ్యాపారాలను విక్రయించడానికి ఇష్టపడుతున్నారు. చాలా మంది మాత్రం తాము నిర్వహిస్తున్న వ్యాపారాన్ని కుటుంబ సభ్యునికి బదిలీ చేయాలని అనుకుంటున్నారు. ఇలాంటి వారి సంఖ్య అత్యధికంగా భారత్లో 79% ఉంటే.. యూకేలో 77%, స్విట్జర్లాండ్ 76%, తైవాన్ 61, చైనా 56, హాంగ్కాంగ్లో 44% ఉంది. ఇక మహా నగరాల్లో పెరిగి, విదేశాల్లో చదువుకున్న రెండో, మూడో తరం వ్యవస్థాపకులు వారి వారసత్వ వ్యాపారాలను నూతనంగా మలుచుకుంటున్నారు. మా మీద నమ్మకంతో బాధ్యతలు అప్పగించారని, కాబట్టే వ్యాపారాన్ని మరింత బాధ్యతగా తీసుకున్నామని దాదాపు 95% మంది చెప్పారు. ఇలా చెప్పిన వాళ్లు మనదేశంలోనే ఎక్కువ. ఈ విషయంలో ప్రపంచ సగటు 81%. కుటుంబ వ్యాపారాన్ని చేపట్టినప్పటికీ.. కొత్త ఆలోచనలతో ఇతర వ్యాపారాల్లోకి కూడా అడుగుపెట్టగలం అనే ధీమాను 83% మంది తదుపరితరం భారతీయులు వ్యక్తం చేశారు.జీడీపీలో 79% వాటా.. భారత జీడీపీలో కుటుంబ వ్యాపారాల వాటా దాదాపు 79% ఉంది. 1990ల నాటి ఆర్థిక సరళీకరణ తర్వాత చాలా వరకు ఈ కంపెనీలు ఏర్పాటయ్యాయి. ఇప్పుడీ సంస్థల్లో తరాల మార్పు జరుగుతోంది. 2023–2030 మధ్య ఆసియా పసిఫిక్ ప్రాంతంలో రూ.4,95,90,000 కోట్ల సంపద ఒక తరం నుంచి తదుపరి తరానికి బదిలీ జరుగుతుందని మెకిన్సే అంచనా వేసింది. వీరిలో అల్ట్రా–హై నెట్వర్త్ వ్యక్తులు 60% మంది ఉన్నారు. -
తీవ్రమైతే.. వర్కవుట్ కావు
తీవ్రమైన వర్కవుట్లు, వ్యాయామాలు కుర్ర గుండెలకు కూడా మంచివి కావట. ప్రత్యేకించి బాడీబిల్డింగ్పై మోజున్న వారు, సిక్స్ ప్యాక్ల వంటివాటిపై శ్రద్ధ పెట్టేవారు.. తమ చిన్ని గుండెల గురించి మరిచిపోతున్నారు. ఫలితంగా తీవ్రమైన వ్యాయామాల ఒత్తిడి.. గుండె లయ తప్పేలా చేస్తోంది. ఇది ‘యూరోపియన్ హార్ట్ జర్నల్’ చెబుతున్న మాట. ఫిట్నెస్, బాడీబిల్డింగ్ కోసం కఠోర శ్రమ చేసేవారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఈ అధ్యయనం హెచ్చరించింది. – సాక్షి, స్పెషల్ డెస్క్అమెరికాకు చెందిన ప్రముఖ మహిళా బాడీ బిల్డర్ జోడీ వాన్స్.. కేవలం 20 ఏళ్ల వయసులోనే ఈ ఏడాది మార్చిలో గుండెపోటుతో కన్నుమూసింది. బాడీబిల్డింగ్లో భాగంగా శరీరాన్ని తీవ్రమైన డీహైడ్రేషన్కు గురిచేయడం వల్ల ఇలా జరిగిందని వైద్యులు తేల్చారు. కార్డియాక్ అరెస్ట్తో కన్నడ నటుడు పునీత్ రాజ్కుమార్ హఠాన్మరణం!మిస్టర్ తమిళనాడు టైటిల్ విన్నర్, ప్రముఖ బాడీ బిల్డర్ యోగేష్ గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు.ఈ జాబితా చాలా పెద్దదే. అందరి మరణాలకూ సాధారణ కారణం.. గుండెపోటు.వీళ్లందరి హృదయాలకూ ఉమ్మడి శత్రువు.. అతి వ్యాయామం, తీవ్రమైన వర్కవుట్లు.బాడీ బిల్డింగ్ మోజుబాడీ బిల్డింగ్ అంటే కుర్రాళ్లకు భలే మోజు. కండలు పెంచడం.. సిక్స్ ప్యాక్.. చాలామందికి ఒక ప్యాషన్. వర్కవుట్లు, జిమ్, వ్యాయామం.. జెన్ జెడ్ (1997–2012 మధ్య పుట్టినవాళ్లు) తరంలో చాలామందికి, జెన్ వై (1981–1996 మధ్య పుట్టినవాళ్లు) తరంలో కొందరికి దినచర్యలో భాగం. సాధారణ వ్యాయామం చేసేవాళ్లకు ఫర్వాలేదుగానీ.. తీవ్రమైన వర్కవుట్లు చేసేవాళ్లకు, బాడీబిల్డర్లకు మాత్రం.. అది వారి శారీరక సౌందర్యాన్ని పెంచాల్సింది పోయి.. ప్రాణాలు తీస్తోంది.మరికొందరు బరువు తగ్గే క్రమంలో డీహైడ్రేషన్కు గురవడం, కఠినమైన ఆహార నిబంధనలు పాటిస్తూ హృదయ సంబంధ సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. గుండెపోటు వల్ల హఠాన్మరణం అన్నది యువకులలో, ఆరోగ్యంగా ఉండేవారిలో అరుదే అయినప్పటికీ బాడీబిల్డింగ్ ప్రొఫెషన్లో ఉండేవారికి ఈ ప్రమాదం పొంచి ఉన్నట్లు ‘యూరోపియన్ హార్ట్ జర్నల్’ ప్రచురించిన అధ్యయన పత్రం పేర్కొంది. బాడీ బిల్డర్లకూ ముప్పేస్టేజీ ఎక్కి కండరాల ప్రదర్శన చేయటమే బాడీబిల్డర్ల పని అనుకుంటాం కానీ... అంత తీరుగా, అంత దృఢంగా, అందరిలోనూ ఒకే ఒక్కడిలా, అంతిమ విజేతగా నిలిచేందుకు వారు పడే శ్రమ, చేసే సాధన ఎంత కఠినమైనవో.. వారి గుండెకు మాత్రమే తెలుస్తుంది. మరి అంత ఒత్తిడిని ఆ గుండె తట్టుకోగలుగుతోందా అని గమనించకపోతే ఏమవుతుంది? సంకేతం ఇవ్వకుండానే సెలవు తీసుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా పురుష బాడీబిల్డర్లలో ఆకస్మిక మరణాలకు గుండె పోట్లే ప్రధాన కారణం అవుతున్నాయని ‘యూరోపియన్ హార్ట్ జర్నల్’ వెల్లడించింది. ఈ అధ్యయనానికి ఇటలీలోని పడోవా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ మార్కో వెచియాటో నేతృత్వం వహించారు.సుదీర్ఘ అధ్యయనంఅధ్యయనం కోసం డాక్టర్ వెచియాటో, ఆయన బృందం అధికారిక బాడీబిల్డింగ్ పోటీల రికార్డులు, అనధికారిక ఆన్ లైన్ డేటాబేస్ నుండి 20,286 మంది పురుష బాడీబిల్డర్ల పేర్లను సేకరించారు. వారంతా 2005 – 2020 మధ్య కనీసం ఒక అంతర్జాతీయ ఫిట్నెస్ ఈవెంట్లో పాల్గొన్నవారే. ఆ తర్వాత మీడియా నివేదికలు, సోషల్ మీడియా, బాడీబిల్డింగ్ ఫోరమ్లు, బ్లాగుల వంటి వివిధ వెబ్ సైట్లలో ఐదు వేర్వేరు భాషలలో తమ జాబితాలో ఉన్న పోటీదారులలో మరణించిన వారెవరైనా ఉన్నారా అని శోధించారు. తమ దృష్టికి వచ్చిన వారి మరణాలను వివిధ వనరులను ఉపయోగించి జాగ్రత్తగా పోల్చి చూసుకున్నారు. ఆ డేటాను ఇద్దరు క్లినికల్ వైద్యులకు సమర్పించి ఆ మరణాలకు కారణాలను నిర్ధారించుకున్నారు. ప్రొఫెషనల్ బాడీబిల్డర్లలో ఎక్కువ..: డాక్టర్ వెచియాటో బృందం పురుష బాడీబిల్డర్లలో సంభవించిన 121 మరణాలను కనుగొన్నారు. వారి సగటు మరణ వయస్సు 45 సంవత్సరాలు. వారిలో 38 శాతం మంది గుండె సంబంధ కారణాలతో మరణించినవారే. ముఖ్యంగా ఆకస్మిక గుండెపోట్ల ప్రమాదం ప్రొఫెషనల్ బాడీబిల్డర్లలో ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. నాన్–ప్రొఫెషనల్స్తో పోలిస్తే ఇది ఐదు రెట్లు ఎక్కువ. బాడీబిల్డింగ్లో ఆరోగ్యంపై ప్రభావం చూపే అంశాలు అనేకం ఉంటాయి. కఠినమైన కండర శిక్షణ, తీవ్రమైన ఆహార నియమాలు, డీహైడ్రేషన్, వేగంగా బరువును తగ్గించే వ్యాయామాలు, కండర సామర్థ్యాన్ని పెంచే మందులను అతిగా వాడకం.. వాటిలో ప్రధానమైనవి.బాడీబిల్డర్లూ.. పారాహుషార్..: బాడీబిల్డింగ్ ప్రక్రియలో శరీరం తీవ్రమైన మార్పులకు లోనవుతుంది. ఆ ప్రభావం గుండెపై పడుతుంది. అందువల్ల సుశిక్షుతులైన వారి మార్గదర్శకత్వంలో.. సురక్షితమైన శిక్షణా విధానాలు పాటించాలి. మెరుగైన వైద్య పర్యవేక్షణలో ఉండాలి. కండర సామర్థ్యాన్ని పెంచే ఔషధాలకు అలవాటు పడకూడదు.బాడీబిల్డర్ల విషయంలో పైకి ఆరోగ్యంగా కనిపించేదంతా నిజమైన ఆరోగ్యం కాకపోవచ్చని, తీరైన ఆ శరీరాకృతి వెనుక కూడా ప్రమాదం దాగి ఉండొచ్చని ఈ పరిశోధన సూచిస్తోంది. ప్రొఫెషనల్ బాడీ బిల్డర్స్లో ఎక్కువ మంది పురుషులే కాబట్టి పరిశోధకులు వారిపైనే దృష్టి సారించారు. మహిళా బాడీబిల్డర్లపైనా ఇలాంటి అధ్యయనం చేయబోతున్నారు.బాడీబిల్డింగ్ మంచిదే కానీ...!క్రీడలు, వ్యాయామ వైద్యుడిగా నేను బాడీబిల్డర్లను చాలా దగ్గరగా చూశాను. బాడీబిల్డింగ్ అనేది ఫిట్నెస్ను, స్వీయ–క్రమశిక్షణను ప్రోత్సహించడం వంటి అనేక సానుకూల అంశాలను కలిగి ఉండటం మాత్రమే కాకుండా, అంతర్లీనంగా కొన్ని ఆరోగ్య సవాళ్లను, ప్రమాదాలను కూడా తెచ్చిపెట్టడాన్ని నేను గుర్తించాను. బాడీబిల్డింగ్, ఫిట్నెస్ సాధనలో ఉన్నవారిలో అకాల మరణాలు పెరుగుతున్నట్లు కొన్ని నివేదికలు తెలియజేస్తున్నాయి. ఆరోగ్యంగా ఉన్న అథ్లెట్లలో కూడా ఇలా జరిగిన సంఘటనలు ఉన్నాయి. – డాక్టర్ మార్కో వెచియాటో -
ఇడ్లీ పిండి కూడా షాపు నుంచే!
ఇడ్లీలు, దోసెల వంటి అల్పాహారం కోసం కావాల్సిన పిండిని ఇంట్లోనే రుబ్బి తయారు చేసుకుంటాం. ఇప్పుడు అలా కాకుండా దుకాణం నుంచి కొని తెచ్చుకునేవారి సంఖ్య పెరిగింది. రెడీమేడ్ పిండి కొనుక్కోవడం ఎప్పటి నుంచో ఉంది. ఇదేం కొత్త విషయం కాదంటారా? నిజమే.. రుబ్బిన పిండి వంటి రెడీ టు కుక్ మిశ్రమాలను గడిచిన రెండేళ్లలో కొత్తగా 1.8 కోట్ల కుటుంబాలు కొనుగోలు చేయడమే ఇక్కడ సరికొత్త విషయం. అంతర్జాతీయ పరిశోధన సంస్థ కాంటార్ ‘ఎఫ్ఎంసీజీ పల్స్’ నివేదికలో ఇలాంటి అనేక ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.ఇంటికి కావాల్సిన సరుకుల కోసం భారతీయులు ఒక ఏడాదిలో దుకాణాలకు 156 సార్లు వెళ్లారట. అంటే 56 గంటలకు ఒకసారి లేదా ప్రతి రెండు రోజులకోసారి సరుకులు కొనుగోలు చేశారని కాంటార్ తన ‘ఎఫ్ఎంసీజీ పల్స్’ నివేదికలో వెల్లడించింది. 2023–24లో సైతం భారతీయులు ఇదే స్థాయిలో షాపింగ్ చేశారని తెలిపింది. అంతేకాదు, వినియోగదారులు ఖర్చు చేసిన మొత్తం, కొనుగోలు చేసిన ఉత్పత్తుల సంఖ్య పెరిగిందని వివరించింది. 2025 జనవరి–మార్చి కాలంలో ఫాస్ట్ మూవింగ్ కంజ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) అమ్మకాల్లో 3.5% వృద్ధి నమోదైంది.అన్ బ్రాండెడ్ హవా..స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన 22 కంపెనీల పరిమాణ వృద్ధి రేటు కేవలం 3.6% మాత్రమే. కానీ, ప్రముఖ కంపెనీలవి కాని అన్ బ్రాండెడ్ ఉత్పత్తులు ఏడాదిలో 6.1% వృద్ధి సాధించాయి. 2023–24తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో వినియోగదారుడు కొనుగోలు చేసిన సగటు ప్యాక్ పరిమాణం 16% పెరిగింది. అంటే పావుకిలో బదులు అరకిలో.. అరకిలో బదులు కిలో ఇంటికి తెచ్చుకున్నారన్న మాట. అలాగే ప్యాక్ల సంఖ్య 13% పెరిగింది. 2023–24లో వినియోగదార్లు సగటున 200 ప్యాక్లు కొనుగోలు చేస్తే.. 2024–25కు వచ్చే సరికి ఇది 226కి చేరింది.⇒ సరుకుల కోసం ఒక ఏడాదిలో 156 సార్లు వెళ్లారు. అంటే 56 గంటలకోసారి అన్నమాట.⇒ ప్యాక్ సైజు 16 శాతం, ప్యాక్ల సంఖ్య 13 శాతం పెరిగింది.⇒ జాతీయ సగటుతో పోలిస్తే దక్షిణ ఢిల్లీ వాసుల ఎఫ్ఎంసీజీ వినియోగం రెండింతలు అధికం.⇒ పశ్చిమ ఢిల్లీవాసులు గరిష్టంగా ఏటా రూ.39,325 ఖర్చు చేశారు.⇒ వ్యయాల పరంగా నైరుతి బెంగళూరు ప్రీమియం ఎఫ్ఎంసీజీ మార్కెట్గా నిలిచింది.వాషింగ్ లిక్విడ్స్..దుస్తులు ఉతికేందుకు వాడే సబ్బుల అమ్మకాలు క్రమంగా తగ్గుతున్నాయి. సబ్బులకు బదులు కస్టమర్లు లిక్విడ్స్ను ఎంచుకుంటున్నారు. ఎఫ్ఎంసీజీ రంగంలో వాషింగ్ లిక్విడ్స్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగంగా అవతరించాయి. రెండు ఆర్థిక సంవత్సరాల్లో వీటి పరిమాణం 2.7 రెట్లు దూసుకెళ్లింది. వాషింగ్ లిక్విడ్స్ కొనుగోలు చేస్తున్న గృహాల సంఖ్య 2022–23 నుంచి కొత్తగా 2.4 కోట్లు పెరిగింది. 20 శాతం కుటుంబాలే దేశంలో వీటిని వినియోగిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం.. గత 5 ఏళ్లలో దేశంలో వాషింగ్ మెషీన్ల అమ్మకాలు పెరగడమే.అంతా రెడీమేడ్..రెడీ–టు–కుక్ మిశ్రమాల అమ్మకాలు రెండింతలై కొత్తగా 1.8 కోట్ల కుటుంబాలకు ఇవి చేరాయి. ప్రధానంగా దోసె, ఇడ్లీల తయారీకి వాడే రుబ్బిన పిండ్లు ఎక్కువగా కొంటున్నారు. రెడీ–టు–కుక్ కూరలను నూతనంగా 6 లక్షల గృహాలు ఆస్వాదించాయి. మ్యూస్లీ, పొరిజ్, ఓట్స్తో తయారైన అల్పాహార ఉత్పత్తులు రెండు సంవత్సరాలలో 1.5 రెట్లు వృద్ధి చెందాయి. కార్బోనేటేడ్ శీతల పానీయాలు, పండ్ల రసాలు, పాల ఆధారిత పానీయాలు, చాక్లెట్స్, బిస్కెట్స్, సాల్టీ స్నాక్స్, ఐస్ క్రీమ్స్ వంటి ఉత్పత్తుల విక్రయాలు 2.4% పెరిగాయి. బిస్కెట్స్ వినియోగం ఇంటి వెలుపల తగ్గితే, ఇళ్లలో పెరిగింది.చిన్న ప్యాక్లవైపు..దేశంలోని ఉత్తర, తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో 10–40 లక్షల మధ్య జనాభా ఉన్న మినీ మెట్రో పట్టణాల్లో.. వినియోగ వస్తువులు, ఇతర విభాగాల ధరల పెరుగుదల, వేతన వృద్ధి స్తబ్ధుగా కొనసాగుతుండడం కొనుగోళ్లను తగ్గిస్తోంది. దుకాణాలకు వెళ్తున్న సంఖ్యలో మార్పు లేనప్పటికీ చిన్న, మరింత చవకైన ప్యాక్ పరిమాణాల వైపు కస్టమర్లు మళ్లుతున్నారు. అంటే ధరను కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటున్నారన్నమాట. ఇక 2024–25లో సూపర్ మార్కెట్స్లో అమ్మకాల పరిమాణం 43% ఎగిసింది. కిరాణా దుకాణాల వ్యాపారం మాత్రం స్థిరంగా ఉంది. పట్టణ మార్కెట్లు మెరుగ్గా..పట్టణ మార్కెట్లు 2025 జనవరి–మార్చి త్రైమాసికంలో 4.4% వృద్ధిని సాధించగా, గ్రామీణ మార్కెట్లు 2.7% పెరిగాయి. పట్టణ మార్కెట్.. గ్రామీణ ప్రాంతాల కంటే వేగంగా వృద్ధి చెందడం ఇది వరుసగా మూడో త్రైమాసికం. చాలా లిస్టెడ్ కంపెనీల అమ్మకాల్లో పట్టణ మార్కెట్ల నుంచి 50–70% సమకూరుతోంది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, వేతనాల్లో పెరుగుదల తక్కువగా ఉండటం, ఇంటి అద్దెలు పెరగడం గత సంవత్సరంలో పట్టణాల్లో రోజువారీ కిరాణా, ప్రధాన వస్తువుల డిమాండ్పై ప్రభావం చూపాయి.హిందూస్తాన్ యూనిలీవర్, గోద్రెజ్ కంజ్యూమర్ ప్రొడక్ట్స్, టాటా కంజ్యూమర్ ప్రొడక్ట్స్, మారికో వంటి ఎఫ్ఎంసీజీ కంపెనీలు మిశ్రమ ఫలితాలను అందుకున్నాయి. వాటి అమ్మకాల్లో పెరుగుదల గరిష్ఠంగా 7 శాతాన్ని మించలేదు. ఖరీదైన వస్తువులు, పెద్ద ప్యాక్ల వైపు కస్టమర్లు ఆకర్షితులవుతున్నందున రాబోయే రోజుల్లో పట్టణ ఎఫ్ఎంసీజీ రంగంలో బలమైన వృద్ధి కనిపించే అవకాశం ఉందని కాంటార్ నివేదిక పేర్కొంది. -
పటిష్ఠ క్వారంటైన్తోనే చెక్!
చైనా తమపై ఆగ్రో టెర్రరిజానికి పాల్పడిందని ఇటీవల అమెరికా ప్రకటించింది. ‘ఫ్యూసేరియం గ్రామినిరమ్’ అనే ప్రమాదకరమైన శిలీంధ్రాన్ని చైనా నుంచి అక్రమంగా అమెరికాలోకి తీసుకువచ్చిన నేరానికి చైనా పౌరురాలు, మిచిగాన్ యూనివర్సిటీ పరిశోధకురాలు యుంకింగ్ జియాన్(33), ఆమె చైనా ప్రియుడు జున్యాంగ్ లియు(33)లను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది ఖచ్చితంగా చైనా పనిగట్టుకొని చేయిస్తున్న ‘ఆగ్రో టెర్రరిస్టు’ చర్యేనని అమెరికా ఆరోపించింది. శత్రు దేశంలో జీవ భద్రతను, వ్యవసాయ– ఆహార భద్రతను విచ్ఛిన్నం చేసే ఉగ్రవాద చర్యలను ‘ఆగ్రో టెర్రరిజం’ అని వ్యవహరిస్తారు. ఈ వార్తతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. ఈ నేపథ్యంలో.. అసలు ‘ఫ్యూసేరియం గ్రామినిరమ్’ శిలీంధ్రం పంటలకు ఎంతవరకు ప్రమాదకరం? ఒక దేశం నుంచి మరో దేశానికి ఏదైనా శిలీంధ్రాలు, వైరస్లు, సూక్ష్మజీవులు, విత్తనాలను పరిశోధనల కోసం అధికారిక అనుమతులతో తీసుకెళ్లే వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటుంది? దాని అవసరం ఏమిటి? వంటి విషయాలను పరిశీలిద్దాం.కొత్త వాతావరణమే సమస్యఒక దేశం మరో దేశంపై ఆయుధాలతో విరుచుకుపడితే ఆ దాడి నష్టం ఏపాటిదో అప్పటికప్పుడే తెలిసిపోతుంది. అదే గనక.. ఒక విధ్వంసక శిలీంధ్రాన్నో, సూక్ష్మజీవినో, వైరస్నో జీవాయుధంగా ప్రయోగిస్తే ఈ ఆగ్రో టెర్రరిస్టు చర్య వల్ల కలిగే నష్టం వెంటనే తెలియదు. కొన్నేళ్లు పట్టొచ్చు. ఎందుకంటే, ఒక దేశంలో ఉండే శిలీంధ్రం లేదా వైరస్ వేరు దేశపు కొత్త వాతావరణ పరిస్థితుల్లోకి ప్రవేశించినప్పుడు ఆ వాతావరణం నప్పితే చెలరేగిపోవచ్చు. అక్కడి పంట పొలాల్లో విధ్వంసం సృష్టించి ఆ దేశపు ఆహారోత్పత్తి పునాదుల్నే కదిలించి, కోలుకోలేని దెబ్బ తీయవచ్చు. లేదంటే, ఆ కొత్త వాతావరణం సరిపడకపోతే తేలిపోనూవచ్చు. ఆ కొత్త వాతావరణంలోని ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలిలో తేమపై ఈ శిలీంధ్రం, సూక్ష్మజీవి, వైరస్, విత్తనాల ప్రవర్తన తీరు ఎంత విధ్వంసకరంగా ఉంటుందన్న విషయం ఆధారపడి ఉంటుంది. అందుకే పరిశోధనల కోసం విదేశాలకు ఇలాంటివి తీసుకెళ్లాలంటే పటిష్టమైన పరీక్షలు, నియమనిబంధనలతో కూడిన క్వారంటైన్ వ్యవస్థ ఏర్పాటైంది. అదేమీ లేకుండా ఫంగస్ను పంపటం ద్వారా చైనా ‘ఆగ్రో టెర్రరిస్టు (వ్యవసాయ ఉగ్రవాద)’ చర్యకు ఒడిగట్టిందని అమెరికా మండిపడింది. ‘ప్రమాదకరమైన జీవాయుధాన్ని అక్రమంగా దేశంలోకి తీసుకురావటం వ్యవసాయ సంబంధమైన ఉగ్రవాద చర్య. ఇది పంటలకే కాదు మనుషులు, పశువుల ఆరోగ్యానికి కూడా గొడ్డలిపెట్టు. యావత్ జాతి భద్రతకే ప్రత్యక్ష ముప్పు’ వంటిదని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బిఐ) డైరెక్టర్ కష్ పటేల్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.అన్ని దేశాల్లోనూ ఉన్నదే! ‘ఫ్యూసేరియం గ్రామినిరమ్’ శిలీంధ్రంను ‘కిల్లర్ ఫంగస్’ అని కూడా అభివర్ణిస్తున్నారు. ‘గ్రామినే’ కుటుంబానికి చెందిన వరి, మొక్కజొన్న, గోధుమ, బార్లీ వంటి ప్రధాన ఆహార ధాన్యపు పంటలకు కంకి దశలో సోకటం ద్వారా దిగుబడిని దెబ్బతీసి తీవ్ర ఆర్థిక నష్టం కలిగిస్తుంది అయితే, ఇది ఇప్పటికే దాదాపు అన్ని దేశాల్లోనూ ఉన్న శిలీంధ్రమేనని నిపుణులు చెబుతున్నారు. ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు, కేంద్ర ప్రభుత్వ జాతీయ మొక్కల జన్యు వనరుల సంస్థ (ఐసిఎఆర్–ఎన్బిపిజిఆర్) హైదరాబాద్ కేంద్రం మాజీ సంచాలకులు డాక్టర్ బలిజేపల్లి శరత్బాబు ‘సాక్షి సాగుబడి’తో మాట్లాడుతూ.. ‘ఇది కొత్త శిలీంధ్రం కాదు. అమెరికా, భారత్, పాకిస్తాన్, చైనా సహా చాలా దేశాల్లో ఇప్పటికే ఉనికిలో ఉంది. అనేక పంటల కంకులను ఆశించి, దిగుబడికి పెను నష్టం చేస్తుంటుంది. ఇది సోకిన ధాన్యం తింటే వికారం, వాతులు వంటి సమస్యలు వస్తాయి. అయితే, పంటలకు విధ్వంసకమైనదైనప్పటికీ ఇది ప్రాణహాని కలిగించినట్లు ఆధారాలు లేవు. నిజానికి పప్పులు, మిరపకాయలు, వేరుశనగలను ఆశించే అఫ్లోటాక్సిన్లు దీనికన్నా ప్రమాదకరం. ఒక్కోసారి కేన్సర్ కారకం కూడా కావచ్చు’ అన్నారు.దిగుమతి, ఎగుమతికి క్వారంటైన్ తప్పనిసరి!శిలీంధ్రం, సూక్ష్మజీవి, వైరస్, విత్తనాలు, మొక్కలు వంటి జీవ పదార్థాలను ఒక దేశం పరిశోధనల కోసం, వ్యాపార రీత్యా అధికారికంగా ఎగుమతి చేయాలన్నా, దిగుమతి చేసుకోవాలన్నా అంత సులువేమీ కాదు. అంతర్జాతీయ మొక్కల సంరక్షణ ఒడంబడిక (ఐపిపిసి)లో పేర్కొన్న విధంగా కఠినమైన క్వారంటైన్ నియమ నిబంధనలను రెండు దేశాలూ త్రికరణశుద్ధితో పాటించాల్సిందే.ఎగుమతి చేసే దేశం ప్రమాదం లేదని ఫైటో శానిటరీ సర్టిఫెకెట్ ఇవ్వాలి. దిగుమతి చేసుకునే దేశ ప్రభుత్వం దిగుమతి చేసుకునే సంస్థ/వ్యక్తికి ఇంపోర్ట్ పర్మిట్ ఇవ్వాల్సి ఉంటుంది. దిగుమతి చేసుకున్న తర్వాత ఒక సీజన్లో క్వారంటైన్ చట్టాల ప్రకారం ప్రయోగాలు చేసి, అందులో హానికారక చీడపీడలు ఏవీ రవాణా కావటం లేదని నిర్థారించుకున్న తర్వాతే ఆ దేశపు సహజ వాతావరణంలోకి ప్రవేశపెట్టడానికి అనుమతిస్తారు. ఇదంతా జరగడానికి చాలా సమయం పడుతుంది. చదవండి: జాబ్స్ టియర్స్.. కొత్త మిల్లెట్ పంట!ప్రపంచ వాణిజ్య సంస్థ సభ్యదేశాలన్నీ సాధారణ వ్యవసాయోత్పత్తుల ఎగుమతి, దిగుమతులకు కూడా శానిటరీ, ఫైటో శానిటరీ నియమాలు పాటించాల్సిందే. ఈ నియమాలను అమలుచేసే పటిష్ట క్వారంటైన్ వ్యవస్థ అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో అమల్లో ఉంటుంది. ఎయిర్పోర్టులు, సీపోర్టుల్లో తనిఖీలు అతి కఠినంగా ఉంటాయి. అమెరికా ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్న హవాయి రాష్ట్రం నుంచి దాదాపు అన్ని రకాల పండ్లు కూరగాయలు వేరే రాష్ట్రాలకు తీసుకెళ్లడానికి నిర్దిష్టమైన ఆంక్షలు అమల్లో ఉన్నాయన్నారు డాక్టర్ శరత్బాబు.మన క్వారంటైన్ వ్యవస్థ బలహీనం చైనా నుంచి ‘ఫ్యూసేరియం గ్రామినిరమ్’ శిలీంధ్రాన్ని అమెరికాకు తీసుకెళ్లింది పరిశోధనల కోసమైనప్పటికీ క్వారంటైన్ నిబంధనలు పాటించలేదు. అనుమతులు లేవు కాబట్టే ఈ పనిని ‘వ్యవసాయ ఉగ్రవాద’ చర్యగా అమెరికా సీరియస్గా పరిగణించింది. జియోపొలిటికల్ ఉద్రిక్తతలు కూడా దీనికి కారణమై ఉండొచ్చు. ఈ శిలీంధ్రం అన్ని దేశాల్లోనూ ఉన్న జాతే. అయినా, వేర్వేరు దేశాల్లో అనేక ఉపజాతులు ఉంటాయి. ఒక ఉపజాతి ఒక దేశంలో పెద్ద సమస్య కాకపోయినా, వేరే దేశంలోని విభిన్న వాతావరణంలోకి వెళ్లిన తర్వాత పెను విపత్తు సృష్టించవచ్చు లేదా నిద్రాణంగా ఉండిపోవచ్చు. అందుకే జీవపదార్థాలేవైనా దేశ సరిహద్దులు దాటించేటప్పుడు కఠినమైన క్వారంటైన్ పరీక్షలు చెయ్యటం తప్పనిసరి. మన దేశంలో ఈ క్వారంటైన్ వ్యవస్థ బలహీనంగా ఉంది. ఇకనైనా పటిష్టం చెయ్యాలి.– డాక్టర్ బలిజేపల్లి శరత్బాబు, అధ్యక్షులు, ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, మాజీ సంచాలకులు, జాతీయ మొక్కల జన్యు వనరుల సంస్థ (ఐసిఎఆర్–ఎన్బిపిజిఆర్) హైదరాబాద్ కేంద్రం. -
భర్తలకు స్పాట్.. రాజాలా బలవుతున్న భర్తలెందరో!
‘‘అరె మామా.. పెళ్లంటేనే భయమైతుంది రా’’ అంటూ తన స్నేహితుడు రవికి ఫోన్ చేసి ఆందోళనగా చెబుతున్నాడు విష్ణు. ‘‘సడన్ ఎందుకు మామా అలా అనిపిస్తోంది?’’ అంటూ అవతలి నుంచి రవి వాయిస్ వినిపించింది. ‘‘అరేయ్.. మేఘాలయా హనీమూన్ కోసం వెళ్లిన జంట మిస్ అయ్యిందని మొన్న ఓ వార్త లింకు పంపాను కదరా’’ అంటూ గుర్తు చేశాడు విష్ణు. ‘‘ఆ.. అవును.. పాపం ఆ భార్యకి కూడా ఏమైందో తెల్వదంట కదా!. అయితే ఏమైంది ఇప్పుడు’’ అన్నాడు రవి. ‘‘ఏం లేదురా.. ఆ మొగుడ్ని చంపింది ఆ భార్యేనంట!!’’ అంటూ విష్ణు చెప్పడంతో షాక్ తినడం ఇవతల రవి వంతైంది. మేఘాలయా హనీమూన్ జంట మిస్టరీ మిస్సింగ్ ఎపిసోడ్లో బయటపడ్డ ట్విస్ట్ గురించి రవి-విష్ణులాంటి వాళ్లెందరో చర్చించుకుంటున్నారు. అదీ సోషల్ మీడియా వేదికగా..!. మరో వ్యక్తితో బంధంలో ఉండి కూడా రాజా రఘువంశీని వివాహం చేసుకోవడం, ఆపై అతన్ని అడ్డుతొలగించుకునేందుకు ప్రియుడితో స్కెచ్ వేయడం.. హనీమూన్లోనే భర్తకు స్పాట్ పెట్టడం.. ‘‘అసలు ఈ పెళ్లిళ్లు ఎందుకయ్యా?’’ అని చర్చను సోషల్ మీడియాలో తెర మీదకు తెచ్చింది. అయితే ఇందుకు ఈ ఒక్క కేసే కాదు.. ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న వరుస ఘటనలే కారణం. సిమెంట్ డ్రమ్ము అంటేనే.. ప్రాణంగా ప్రేమించి మరీ పెద్దలను ఎదురించి వివాహం చేసుకున్నారు సౌరభ్ తివారీ. అలాంటిది తన గంజాయి ‘ఛప్రీ’ ప్రియుడు షాహిల్ శుక్లా కోసం భర్తనే కడతేర్చింది ముస్కాన్ రస్తోతి. భర్తకు మత్తు మందు ఇచ్చి, ఆపై చంపి ముక్కలు చేసి.. ఆ బాడీని పెద్ద డ్రమ్ములో కుక్కి సిమెంట్తో ముంచేశారు. ఆపై.. సౌరభ్ కుటుంబాన్ని నమ్మించేందుకు అతని ఫోన్ నుంచి సందేశాలు పంపుతూ ఏకంగా 12 రోజులపాటు ఈ గంజాయి జంట సరదాగా గడిపింది. అయితే తిరిగి వచ్చాక శవాన్ని మాయం చేసే క్రమంలో సీల్డ్ డ్రమ్ము పగిలిపోవడంతో.. భయపడిన ముస్కాన్ తన తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పింది. దీంతో బంగారం లాంటి భర్తను చంపిన ముస్కాన్ను ఆమె తల్లిదండ్రులే దగ్గరుండి పోలీసులకు అప్పగించడం ఈ కేసులో కొసమెరుపు. ప్రస్తుతం ముస్కాన్, షాహిల్ శుక్లా జైల్లో శిక్ష అనుభవిస్తుండగా.. ఇండోర్ కేసుగా ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భర్తకు అడ్డంగా దొరికిన యూట్యూబర్ ఆపై.. రవీనా ఓ యూట్యూబర్. అయితే ఆమె చేసే వీడియోలు భర్తకు నచ్చేవి కాదు. దీంతో తనను మందలించడమే తన భర్త పనిగా పెట్టుకున్నాడనుకుని ఆమె రగలిపోయింది. ఈ క్రమంలో ఓరోజు సోషల్ మీడియాలో సురేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తన కంటెంట్ను పొగడ్తలతో ముంచెత్తడంతో సురేష్ ప్రేమలో పీకల లోతుల ప్రేమలో పడిపోయింది. ఈ క్రమంలో ఓరోజు.. మార్చి 25వ తేదీన ఇంట్లోనే ప్రియుడితో ఏకాంతంగా గడుపుతూ భర్తకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. దీనిపై నిలదీసిన భర్తను ఇద్దరూ కలిసి ఊపిరిరాడకుండా చేసి కడతేర్చారు. ఆ కరాళ రాత్రిలో భర్త మృతదేహాన్ని ప్రియుడి సాయంతో బైక్పై తీసుకెళ్లి నగర శివారులోని పడేశారు. విచారణలో హర్యానా భివానిలో జరిగిన ఈ ఘోరం బయటపడింది. భర్తను కడతేర్చి ఆపై పక్కలో.. నిద్రలోనే ఓ వ్యక్తిని పాము పదిసార్లు కాటేసిందని, రాత్రంతా అతని మంచంలోనే ఉంటూ కాటు వేస్తూనే ఉందని, ఆ విష ప్రభావంతో అతను కన్నుమూశాడని ఆ మధ్య ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అయితే ఇది భార్య చేసిన కుట్ర అని తెలుసుకోవడానికి పోలీసులకు ఎంతో టైం పట్టలేదు. మీరట్ అక్బర్పూర్ సదాత్ గ్రామానికి చెందిన అమిత్(25) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వృత్తిరిత్యా బయటి ప్రాంతాలకు వెళ్తుండడంతో.. అమర్జీత్ అనే యువకుడితో ఏడాదిగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. చుట్టాల ద్వారా ఈ విషయం తెలుసుకున్న అమిత్.. భార్యను మందలించాడు. దీంతో ప్రియుడితో కలిసి స్కెచ్ గీసింది. ఏప్రిల్ 14వ తేదీ రాత్రి మంచంలో నిద్రిస్తున్న అతన్ని ఊపిరాడకుండా చంపేసింది. ఆపై అద్దెకు పామును తెచ్చి భర్త మృతదేహం మీద కాట్లు వేయించి మంచంలో పడేసింది. అప్పటికే ప్రాణం పోవడం విషం శరీరానికి ఎక్కలేదు. బదులుగా.. పోస్టుమార్టం నివేదికలో అతను విషం వల్ల కాకుండా ఊపిరి ఆడకపోవడం వల్లే మరణించాడని తేలింది. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. భార్య రవిత అసలు విషయం బయటపెట్టింది.పెళ్లై పదిరోజులు తిరగకుండానే.. మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందిన రాజా రఘువంశీకి మే 11వ తేదీన సోనమ్తో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. మే 20వ తేదీన హనీమూన్ కోసం మేఘాలయా వెళ్లింది ఈ జంట. అయితే ఈ జంట ఆచూకీ లేకపోవడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని.. ప్రతికూల వాతావరణంలోనూ దట్టమైన అడవుల్లో గాలింపు చేపట్టారు పోలీసులు. ఈ లోపు.. రాజా రఘువంశీ మృతదేహం దొరకడంతో సోనమ్ ఆచూకీ కోసం అతని కుటుంబం కంగారుపడింది. ఈలోపు విచారణ జరిపిన ప్రత్యేక దర్యాప్తు బృందం షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. సోనమే రాజాను హత్య చేయించిందని!. తన తండ్రి కంపెనీలో పని చేసే రాజ్ కుష్వాహ్తో ఆమె ప్రేమలో ఉందని, ఆ విషయం తెలిసి తండ్రి మందలించాడని, ఆపై బలవంతంగా రాజా రఘువంశీకి ఇచ్చి వివాహం చేయడంతో ఆమె భర్తను వదలించుకోవాలని నిర్ణయించుకుంది. ప్రియుడి సాయంతో ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్స్ను సంప్రదించి తన భర్తను చంపేందుకు సుపారీ ఇచ్చిందామె. అలా.. మూడు రోజుల తర్వాత రాజా రఘువంశీని వాళ్లు మట్టుపెట్టారు. విచారణలో ఈ షాకింగ్ విషయం బయటపడడంతో అందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హనీమూన్ వెళ్లే ముందు రఘువంశీని ఒత్తిడి చేసి మరీ రూ.10 లక్షల విలువైన బంగారు నగలు అతని ఒంటిపై వేయించిందని, వాటి కోసమే హత్య జరిగిందన్న కోణంలో నమ్మించాలని ప్రయత్నించింది. అయితే ఆమె రిటర్న్ టికెట్స్ బుక్ చేయకపోవడంతో మొదలైన అనుమానం.. చివరకు మొత్తం వ్యవహారాన్ని బయటపెట్టింది. ముంబై, థానే, నవీ ముంబైలో గత నాలుగు నెలల్లో.. ఇలా భర్తలను వివాహేతర సంబంధం కోసం బలిగొన్న భార్యల కేసులు ఆరు దాకా నమోదు అయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. కొసమెరుపు ఏంటంటే.. తమ ప్రాణాలను రక్షించుకునేందుకు ఒకరిద్దరు భర్తలు తమ భార్యలను ప్రియుడికి ఇచ్చి వివాహం చేసిన సందర్భాలూ ఈ మధ్యకాలంలోనే చోటు చేసుకోవడం. అయితే ఇందులో ఒక కేసులో ప్రియుడు తాను తప్పు చేశానని గ్రహించి దగ్గరుండి ఆమెను మళ్లీ భర్త దగ్గర దిగబెట్టగా.. మరో కేసులో మాత్రం ఆ భర్త చేసిన త్యాగం అలాగే మిగిలిపోయింది. -
అంతరిక్షంలో అంతుబట్టని వస్తువు
అంతరిక్షం అనంత రహస్యాల పుట్ట. మానవుడు ఇప్పటికీ గుర్తించని వింతలు, విడ్డూరాలకు అంతరిక్షంలో కొదవేలేదు. ఖగోళ శాస్త్రవేత్తలకు తాజాగా ఓ వింత అనుభవం ఎదురైంది. డీప్ స్పేస్లో ఓ గుర్తు తెలియని వస్తువును కనిపెట్టారు. అదేమిటన్నది వారికే అంతుబట్టడం లేదు. ఆ వస్తువు నుంచి రేడియో, ఎక్స్ తరంగాలు వెలువడుతున్నట్లు గుర్తించారు. అందులో తరచుగా పేలుళ్లు సంభవిస్తూ తరంగాలను ఉత్పత్తి చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ వివరాలను జర్నల్ నేచర్లో ప్రచురించారు. ఈ అంతుబట్టని వస్తువు నుంచి ప్రతి 44 నిమిషాలకోసారి రెండు నిమిషాలపాటు బలమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ఇది చాలా అసాధారణమని సైంటిస్టులు అంటున్నారు. ఇలాంటి పరిణామం మునుపెన్నడూ చూడలేదని స్పష్టంచేస్తున్నారు. ఇప్పటిదాకా అంతరిక్షంలో గుర్తించిన వస్తువుల్లో ఇలా తక్కువ సమయంలో తరచుగా సంకేతాలు వెలువడినట్లు తేలలేదు. ఈ కొత్త వస్తువును లాంగ్ పిరియడ్ ట్రాన్సియంట్(ఎల్పీటీ) కేటగిరీలో చేర్చారు. ఇది మ్యాగ్నేటర్ కావొచ్చని అంచనా వేస్తున్నారు. మృత నక్షత్రానికి చెందిన అత్యధిక ఆయస్కాంత శక్తి కలిగిన అవశేషాన్ని మ్యాగ్నేటర్ అంటారు. రాబోయే రోజుల్లో రేడియో, ఎక్స్–రే టెలిస్కోప్ల ద్వారా ఇలాంటి వస్తువులను మరిన్ని గుర్తించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. విశ్వం ఆవిర్భావం గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇవి దోహదపడతాయని చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కాలుష్య కణాలగుట్టువిప్పిన గణితవేత్త
పరిశ్రమల నుంచి, వాహనాల నుంచి వెలువడుతూ భూతాపోన్నతికి కారణమవుతున్న పొగ, కాలుష్యకారక కణాల గురించి శాస్త్రవేత్తలకు ఇప్పటికే ఒక అవగాహన ఉంది. వీటి కారణంగా ఏ స్థాయిలో కాలుష్యం సంభవిస్తోందో, వాతావరణ మార్పులో వీటి ప్రభావ స్థాయిలను పర్యావరణ వేత్తలు ఇప్పటికే అంచనావేయగల్గుతున్నారు. అయినాసరే ఆకస్మిక వర్షాలు, వరదలు వంటి వాటిని ఇప్పటికీ సరిగా అంచనావేయలేని పరిస్థితి. వీటికి కారణంగా గోళాకృతిలో లేని ఇతర రకాల కణాలు కారణమని శాస్త్రవేత్తలు కనుగొన్నారుగానీ వీటి పరిమాణాన్ని, ప్రభావాన్ని గణించే విధానాన్ని అభివృద్దిచేయలేకపోయారు. గత 15 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యకు ఆస్ట్రేలియాలోని మాక్వరైటన్ విశ్వవిద్యాలయంలోని గణిత శాస్త్రవేత్త, అసోసియేట్ ప్రొఫెసర్ స్టార్ట్ హాకిన్స్ పరిష్కారం కనుగొన్నారు. దీంతో మరింత ఖచి్చతత్వంతో వాతావరణ అంచనా సుసాధ్యంకానుంది. 2008లో వాతావరణ భౌతికశాస్త్రవేత్త మైఖేల్ బాక్స్ చేసిన ఒక ప్రసంగాన్ని హాకిన్స్ విన్నారు. వాతావరణమార్పులకు కారణమవుతున్న అన్ని ఆకృతుల కాలుష్యకణాలను లెక్కించకుండా మనం చేసే వాతావరణ అంచనాలు భవిష్యత్తులో అంత నిరుపయోగంగా మారే ప్రమాదంఉంది’’అని మైఖేల్ బాక్స్ చేసిన ప్రసంగం హాకిన్స్ను ఆలోచనల్లో పడేసింది. ఈ గజిబిజి ఆకృతుల కణాలను లెక్కగట్టే విధానాన్ని అభివృద్ధిచేసి ఈ పొల్యూషన్ పొడుపు ప్రశ్నకు సమాధానం వెతకాలని నిశ్చయించుకుని ఎట్టకేలకు 15 ఏళ్ల తర్వాత ఆ పనిలో సఫలీకృతులయ్యారు. ఏమిటీ కణాలు? వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి వెలువడే ధూళి కణాలు గోళాకృతిలో ఉంటాయి. కానీ రాజస్థాన్లోని థార్ఎడారిసహా పలు గనుల తవ్వవం వంటి చోట్ల శిలలు క్రమంగా ఒరుసుకుపోయి, కోతకు గురై అత్యంత సూక్ష్మ శిలా కణాలు ఉద్భవించి గాల్లో కలుస్తున్నాయి. జీవఇంథనాలు మండించినపుపడు వెలువడే కొన్ని రకాల నుసి సైతం భిన్నాకృతిలో ఉంటోంది. ఢిల్లీలో చలికాలంలో నిర్మాణ పనుల వేళ గాల్లో కలిసే పరిశ్రమల వ్యర్థ్యాల నుంచి సైతం వేర్వేరు ఆకృతుల్లో ధూళి కణాలు వెలువడుతున్నాయి. వీటిని ప్రస్తుతమున్న వాతావరణ సిద్ధాంతాలతో గణించడం కష్టం. ఈ కణాలు గాల్లో అధికమై సూర్యరశ్మి భూమిపై పడకుండా అడ్డుకుని భూమిని చల్లబరచవచ్చు లేదంటే భూమి నుంచి వేడి బయటకు పోకుండా అడ్డుకుని భూతాపోన్నతికి కారణం కావచ్చు. ఈ రెండు దృగి్వషియాలను సైతం గోళాకృతియేతర కణాల కోణంలో లెక్కించాల్సి ఉంది. ప్రసరణ దిశలో ఏదైనా వస్తువు అడ్డుగా ఉంటే కాంతి దిశను మార్చుకుంటుంది. ఈ సిద్ధాంతాన్ని ఈ అసాధారణ ఆకృతి కణాలకు అన్వయిస్తూ కంప్యూటేషన్ మెథడ్ను హాకిన్స్ రూపొందించారు. ఇప్పుడీ గణిత సూత్రాలు భవిష్యత్తులో వైద్య ఇమేజింగ్ సాంకేతికతల ఆధునీకరణకూ ఉపయోగపడనున్నాయి. అ్రల్టాసౌండ్ , ఎంఆర్ఐ వంటి సాంకేతికతలు తరంగాలు మన శరీరంలో ఎలా ప్రయాణిస్తాయనే సూత్రాలపైనే ఆధారపడి పనిచేస్తాయి. కొత్త గణిత సూత్రాలతో అత్యాధునిక అ్రల్టాసౌండ్ , ఎంఆర్ఐ తీయొచ్చు. పలు రకాల కోటింగ్లలోనూ విరివిగా వాడొచ్చు. ఈ సూత్రాలను కాంతి విక్షేపణకు సంబంధించిన ప్రతి రంగంలోనూ ఉపయోగించవచ్చు. వడగాల్పులు, రుతుపవన అంచనాలు, కాలుష్య ప్రభావాలు వంటిలోనూ ఈ సూత్రాలను వాడొచ్చు. దీంతో వాతావరణ ముందస్తు హెచ్చరిక వ్యవస్థను మరింత బలోపేతం చేయొచ్చు. ఈ పరిశోధనా వివరాలు ‘క్వాంటేటివ్ స్పెక్ట్రోస్కోపీ, రేడియేటివ్ ట్రాన్స్ఫర్’జర్నల్లో ప్రచురితమయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈ నగరాలు...సముద్రం పాలు!
నదీజలాలు. నాగరికతకు పుట్టినిళ్లు. అత్యంత భారీ వర్షాలు వచ్చినప్పుడు ఉగ్రరూపంలో ఉప్పొంగినా తర్వాత సాధారణ స్థితికి వచ్చి మానవులకు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. కానీ సముద్రజలాలు అలాకాదు. ప్రపంచవ్యాప్తంగా సముద్రతీరమున్న ఎన్నో పట్టణాలను ఇప్పుడు సముద్రజలాల పెరిగే నీటిమట్టాలు అక్కడి ప్రజల్లో ఆందోళన మట్టాలను అమాంతం పెంచేస్తున్నాయి. తరతరాలుగా తీరప్రాంతాల్లోనే స్థిరనివాసం ఏర్పాటుచేసుకుని ఉంటున్న స్థానికులను సాగరజలాలు ఇప్పుడు బద్ధశత్రువుగా మారాయి. తీవ్రమైన వ్యాధి శరీరాన్ని కబళించినట్లు ఈ సముద్రజలాలు నెమ్మదిగా ఆయా తీరప్రాంతాల సమతల భూభాగాలను శాశ్వతంగా తనలో కలిపేసుకుంటున్నాయి. శరవేగంగా పెరుగుతున్న సముద్ర నీటిమట్టాలు ఇప్పుడు కోట్లాది మంది ప్రజలకు కంటిమీద కనుకులేకుండా చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా డజనుకుపైగా తీరప్రాంతాల్లో సముద్ర నీటిమట్టాలు ఇటీవలికాలంలో చాలా అత్యధిక వేగంతో పెరుగుతున్నాయని సింగపూర్లోని నాంయాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ(ఎన్టీయూ) శాస్త్రవేత్తలు కుండబద్దలు కొట్టారు. 2014 నుంచి చూస్తే గత ఆరేళ్లలోనే ఏటా ఒక సెంటీమీటర్ ఎత్తు సముద్రజలాల నీటిమట్టం పెరుగుతూ తీరప్రాంతాలను శాశ్వతంగా ముంచేసినట్లు తాజా అధ్యయనంలో తేలింది. ఆసియా, ఆఫ్రికా, యూరప్, ఉత్తర అమెరికా, ద.అమెరికా ఖండాల్లో 48 తీరనగరాలకు తీరనిశోకంగా సాగరజలాలు మారాయని అధ్యయనం పేర్కొంది. వాతావరణ మార్పులకుతోడు కుంగిపోతున్న భూమి కారణంగా ఈ సమస్య తీవ్రమవుతోందని తేలింది. రెండేళ్ల క్రితం ఈశాన్యచైనాలోని తియాంజిన్ నగరంలో తీరప్రాంత వీధులన్నీ కుంగడంతో వేలాది మందిని అపార్ట్మెంట్ల నుంచి హుటాహుటిన ఖాళీ చేయించారు. 2014 నుంచి 2020 ఏడాది వరకు చూస్తే తియాంజిన్ నగర భూభాగం ఏటా 18.7 సెంటీమీటర్లమేర కుంగింది. సముద్రజలాలు పెరిగి భూగర్భజలాలు పెరగడంతో నేల కుంగింది. ముంపు బారిన ముంబై దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరాన్నీ ముంపు సమస్య పట్టిపీడిస్తోంది. 2014 నుంచి చూస్తే సంవత్సరానికి 0.01 సెం.మీ.ల నుంచి 5.9 సెంటీమీటర్ల స్థాయిలో ముంబైలోని చాలా ప్రాంతాలను సముద్రనీరు ముంచేసింది. ఏటా 1 సెం.మీ.చొప్పున నేల సముద్రజలాల్లో కలిసిపోతున్న చోట్ల 62 లక్షల మంది జీవిస్తున్నట్లు ఎన్టీయూ అధ్యయనకారులు ప్రకటించారు. మాతుంగా ఈస్ట్లోని కింగ్ సర్కిల్ స్టేషన్ ప్రాంతం వేగంగా ముంపునకు గురవుతోంది. ఇక్కడ ఏటా 2.8 సె.మీ.ల మేర సముద్రజలాలు పెరుగుతున్నాయి. విశ్వవ్యాప్తంగా సాగరజలాలు గత ఏడాది 0.59 సెంటీమీటర్లమేర ఎగిశాయని నాసా అధ్యయనంలో స్పష్టమైంది. భూగర్భజలాలను విచ్ఛలవిడిగా తోడేయడం, ఊహించనంత బరువుతో ఆకాశహర్మ్యాలను నిర్మించడం, నిరాటంకంగా కొనసాగుతున్న మెట్రో ప్రాజెక్ట్ పనులు, చిత్తడినేలలను ప్రభుత్వాలు పునరుద్ధరించడం తదితర కారణాలు సైతం మహానగరంలోకి సాగరజలాలు చొచ్చుకొచ్చేలా చేస్తున్నాయి. కనీసం 50 లక్షల జనాభా ఉన్న సముద్రతీర నగరాల వెంట సముద్రనీటిమట్టాలు పెరుగుతున్న అంశాన్ని ఉపగ్రహాల సాయంతో విశ్లేషించి ఈ అధ్యయనం చేశారు. అగ్రరాజ్యంలోనూ.. అమెరికాలోని మయామీ సిటీని సాగరజలాలు ముంచెత్తుతున్నాయి. 2014 నుంచి 2020 వరకు చూస్తే మయామీ సిటీలో కోకోనట్ గ్రోవ్సహా చాలా ప్రాంతాలు గరిష్టంగా 2.2 సెంటీమీటర్లమేర సముద్రజలాల మట్టాలు పెరిగాయి. ఏటా 1 సెం.మీ. సముద్రనీరు పెరుగుతున్న ప్రాంతాలు 43,000 మందికిపైగా అమెరికన్లు నివసిస్తున్నారు. న్యూయార్క్ నగరంలోని క్వీన్స్ పరిధిలోని బ్రీజీ పాయింట్ వద్ద నీరు ఏటా 3 సె.మీ.ల మేర పెరుగుతోంది. ఇక్కడ ఏటా 1 సెం.మీ. సముద్రనీరు పెరుగుతున్న చోట 1,03,000 మందికిపైగా అమెరికన్లు నివసిస్తున్నారు. లాస్ ఏంజెలిస్ సిటీలోని శాన్ పెడ్రో సహా పలు తీర ప్రాంతాల్లో నీరు ఏటా 2.5 సె.మీ.ల మేర పెరుగుతోంది. హ్యూస్టన్ సిటీ పరిధిలో గరిష్టంగా ఏకంగా 11 సెం.మీ. మేర సముద్రమట్టాలు పెరుగుతున్నాయి. హ్యూస్టన్లోని సెంట్రల్ సౌత్వెస్ట్ ప్రాంతంలో ఏటా 8 సెం.మీ.ల మేర సముద్రనీరు పైకొస్తోంది.కొత్త పరిష్కారం చూపుతున్న జపాన్ భూకంపాలను తట్టుకునేలా నిర్మాణాలు చేస్తున్న జపాన్ ఇప్పుడు సముద్రమట్టాల పెరుగుదల ముప్పుకూ మరో పరిష్కారం వెతికింది. విచ్ఛలవిడిగా భూగర్భజలాలను వాడడంతో నేల కుంగి పరోక్షంగా సముద్రనీరు చొచ్చుకొస్తున్న నేపథ్యంలో గ్రౌండ్వాటర్ అతి తోడివేతకు చెక్ పెట్టింది. ఈ విషయంలో కఠిన నిబంధనలను అమలుచేస్తోంది. పటిష్టవంతమైన నీటి పారుదల వ్యవస్థను ఏర్పాటుచేసింది. 2014 ఏడాది నుంచి చూస్తే 0.01–2.3 సె.మీ.ల స్థాయిలో నేల కుంగినా ఇప్పుడు మాత్రం ఆ దురవస్థ నుంచి కాస్తంత బయటపడింది. ఎగువ ప్రాంతాలు, అడువులు, నదుల నుంచి సిటీ వైపుగా వచ్చే నీటిని నగరానికి దూరంగా ఉన్న రెండు రిజర్వాయర్లలో నింపుతోంది. అక్కడి నుంచి అవసరమైన మేరకే నీటి నగరంలో జనావాసాలకు, పరిశ్రమలకు సరఫరాచేస్తోంది. అయితే జపాన్ మోడల్ అన్ని దేశాలకు పనికొస్తుందో లేదో తెలీదు. పైగా ఇది అత్యంత ఖర్చుతో కూడిన వ్యవహారమని జపాన్లోని వసేడా యూనివర్సిటీలో ప్రొఫెసర్ మిగూయెల్ ఎస్తిబాన్ అభిప్రాయపడ్డారు. భూగర్భజలాల అతి తోడివేతను తగ్గించుకుని తైపే నగరం ఈ సమస్య నుంచి కాస్తంత బయటపడింది. దీనికితోడు బ్యాంకాక్, అమెరికాలోని హ్యూస్టన్, బ్రిటన్లోని లండన్ నగరాలు సైతం భూగర్భజాలాల అతివాడకానికి చరమగీతం పాడాయి.భూగర్భజలాలు పైకి రావడానికి కారణాలెన్నో.. తీర ప్రాంతాల వెంట భవనాల నిర్మాణం, గనుల తవ్వకం, భూఫలకాల కదలికలు, భూకంపాలు, సహజంగా భూమిపొరలు ఒత్తకునిపోవడం తదితర కారణాలతో భూమి కాస్తంత కుంగుతుంది. వీటికితోడు కింది పొరలో భూగర్భజలాలు ఉన్న చోటు నుంచి మనం నీటిని తోడేసి ఖాళీచేస్తున్నాం. దీంతో అప్పటిదాకా భూగర్భజలాలపై ఉన్న శిలలు, నేల పొరలు కిందకు పడిపోతున్నాయి. ఇలా భూమి కుంగుతోంది. ‘‘ అత్యధికంగా భూమి కుంగుతున్న 48 తీరప్రాంతాల్లో సగం ప్రాంతాలు ఈ సమస్యకు అతిగా భూగర్భజలాలను తోడేయడమే కారణం’’ అని ఎన్టీయూ పరిశోధనలో కీలక పరిశోధకురాలు చెరిక్ టే చెప్పారు. జకార్తా వంటి నగరాల్లో భూగర్భజలాలను వెలికితీయడం మరీ ఎక్కువైందని ఆయన వెల్లడించారు. ‘‘ అత్యధిక అభివృద్ధి ప్రాజెక్టులు, జనాభా ఉన్న దేశాల్లో అధిక భూగర్భజలాల వినియోగం కనిపిస్తోంది. ముఖ్యంగా, ఆసియా, తూర్పు ఆసియా ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రమవుతోంది. తక్కువ ఎత్తున్న డెల్టా ప్రాంతాల్లో వెలిసిన నగరాలకు ఈ సమస్య మరీ ఎక్కువ. సముద్రంలో కలవడానికి ముందే ఎక్కువ పాయలుగా విడిపోయి ప్రవహించే నదుల వెంట ఉన్న ప్రాంతాల్లోనూ ఇదే సమస్య కనిపిస్తోంది. జకార్తా, బ్యాంకాక్, హో చి మిన్ సిటీ, షాంఘైలకు ఈ ముంపు ముప్పు ఎక్కువ. జకార్తా సిటీలో సగం ప్రాంతాలు సముద్ర నీటిమట్టం కంటే తక్కువ ఎత్తులో ఉండటం గమనార్హం. 1970 ఏడాదితో పోలిస్తే జకార్తాలో ప్రస్తుతం పలు ప్రాంతాలు 4 సెం.మీ. కుంగిపోయాయి. ఈ కారణంగానే తీరానికి కాస్తంత దూరంగా నుసంతారా పేరిట కొత్త రాజధానిని ప్రభుత్వం నిర్మిస్తోంది. ‘‘ తీరం వెంట మా ఇల్లు ఉంది. ఇంటి కిటికీలు నా చిన్నప్పుడు మెడ ఎత్తులో ఉండేవి. ఇప్పుడు మోకాలు ఎత్తుకు వచ్చేశాయి. నేలపై సముద్రనీరు చొచ్చుకొచ్చి నప్పుడల్లా మా ఇంటి అడుగును పూడుస్తూ వచ్చాం. దీంతో గ్రౌండ్ఫ్లోర్లో ఇంటి ఎత్తు తగ్గుతూ వస్తోంది. చివరకు గ్రౌండ్ఫ్లోర్ మొత్తం మునిగిపోతుందో, ఇల్లే కూలిపోతుందో మాకే అర్థంకావట్లేదు’’ అని నార్త్ జకార్తాలోని ఎర్నా, ఆమె తల్లి సోనీ వాపోయారు. తాత్కాలిక ప్రత్యామ్నాయాలు జకార్తా, ఈజిప్్టలోని అలెగ్జాండ్రియా, వియత్నాంలోని హో చీ మిన్ సిటీల్లోకి పెరిగిన సముద్రమట్టాలు చొచ్చుకురాకుండా గోడలు, అవరోధాలు నిర్మించారు. వచ్చిన నీరు అక్కడే తిష్టవేయకుండా కందకాల వంటి తవ్వి నీటిని మరో చోటుకు మళ్లించారు. అయితే ‘‘గోడలు ఒకరకంగా మంచిచేస్తే మరోరకంగా చేటుచేస్తున్నాయి. ఎగువ నుంచి వరద వస్తే మళ్లీ ముంపు సమస్య అలాగే ఉండిపోతుంది’’ అని ఇటలీలోని పడోవా యూనివర్సిటీలో ప్రొఫెసర్ పెట్రో తియాటినీ చెప్పారు. షాంఘై వినూత్న పంథా షాంఘై నగరం వాటర్ ఇంజెక్షన్ అనే కొత్త విధానాన్ని అవలంబిస్తోంది. యాంగ్జే నది నుంచి సేకరించిన నీటిని శుద్ధిచేసి ఆ నీటిని బావులు, ఇతర మార్గాల ద్వారా నేలలోకి పంపిస్తోంది. నీటిని తోడేందుకు వేసిన బోరుబావుల రంధ్రాల నుంచి నీటిని నేలలోకి పంపుతోంది. అలా భూగర్భజలాల మట్టాలను పెంచుతోంది. తద్వారా భూగర్భజలాల సమతుల్యతను కాపాడుతోంది. చైనాలోని చోంగ్క్విన్, ఎల్సాల్విడార్లోని శాన్ సాల్విడార్ సిటీలో ‘స్పాంజ్ సిటీ’ పంథాలో వెళ్తున్నాయి. అత్యధిక నీటిని పీల్చుకునే మట్టిరకం, చెట్లు, గడ్డిని పెంచుతున్నాయి. అదనంగా వచ్చిన నీరు పార్కుల్లోకి, చిత్తడినేలల్లోకి వెళ్లేలే ఏర్పాట్లుచేశారు. ‘‘అదనపు నీటిని నిల్వచేసేందుకు పేద్ద రిజర్వాయర్ కట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది. దీనితో పలిస్తే పదో వంతు వ్యయంతోనే సమస్యకు పరిష్కారం వెతకొచ్చు’’ అని వర్జీనియా టెక్ వర్సిటీలో ప్రొఫెసర్ మనోòÙహర్ షెర్జాయీ చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
టూరు.. ఒక్కో తీరు
పర్యాటకుల ఆసక్తులు మారాయి. పర్యటనల ధోరణి మారింది. యువత సోలో జర్నీ సో బెటరూ అంటున్నారు. కొందరు సోషల్ మీడియా వీడియోలూ, వెబ్ సిరీస్లూ, సినిమాలూ చూసి అందులోని ప్రాంతాలకు ట్రిప్పులకు చెక్కేస్తున్నారు. మరికొందరు సపరివార సమేతంగా విహార యాత్రలు చేస్తున్నారు. ఇంకొందరు క్రికెట్ మ్యాచ్లను బట్టి తమ టూర్లు ప్లాన్ చేసుకుంటున్నారు.. యుద్ధభూముల్లో స్ఫూర్తి పొందుతున్నారు.. నిశీధిలో నింగిలోని చుక్కలను లెక్కపెట్టేస్తున్నారు.. ఇది నయా పర్యాటక ముఖచిత్రం.‘‘పాతాళ్లోక్ సీజన్ 2’.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన వెబ్ సిరీస్. ఈశాన్య భారతంలోని నాగాలాండ్లో ఎక్కువ భాగం షూట్ చేశారు. ఒక సినిమా లేదా వెబ్ సిరీస్ ఇంత స్థాయిలో అక్కడ షూట్ జరగడం ఇదే మొదటిసారి. అక్కడి పచ్చని కొండ ప్రాంతాలు, ఇళ్లు, దట్టమైన వెదురు అడవులు.. అన్నీ చూపరులను కట్టిపడేస్తాయి. అది చూశాక నాకు నాగాలాండ్ వెళ్లాలనిపించింది.స్నేహితులతో వెళ్లి వచ్చేశా’’ అంటాడు హైదరాబాద్కి చెందిన కె.ఉమావెంకట్. ప్రముఖ ప్రైవేటు సంస్థలో పనిచేసే అతడు వారాంతాల్లో కూడా స్నేహితులతో వరంగల్ వంటి చుట్టుపక్కల ప్రాంతాలకు సరదాగా వెళ్లి వచ్చేస్తుంటాడు. ‘ఉద్యోగంలో చేరిన తరవాత కొత్త స్నేహితులు వచ్చారు. వీళ్లే నాకు సహచరులు, స్నేహితులు’ అంటాడు. ఇలాంటి వాళ్లనే ఇప్పుడు ఫ్రొలీగ్స్ అని పిలుస్తున్నారు. అంటే ఫ్రెండ్స్ అయిన కొలీగ్స్ అన్నమాట. ఇలా సహచర ఉద్యోగ స్నేహితులతో షికార్లకు వెళ్లడం ఇటీవలికాలంలో పెరిగింది.దేశభక్తి.. ప్రకృతి సౌందర్యం..యుద్ధభూమి అంటే వీరత్వానికి ప్రతీక. సైనికుల ధైర్యసాహసాలకు వేదిక. అలాంటి రణభూమికి కూడా పర్యటనలకు వెళ్లేందుకు ఇప్పుడు ఇష్టపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ‘భారత రణభూమి దర్శన్’ పేరిట ప ర్యాటకాన్ని ప్రోత్సహించే కార్యక్రమం చేపట్టింది. జమ్మూ కశ్మీర్, లఢాక్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, అరు ణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్లలో 77 ప్రదేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. భారత సాయుధ దళాల త్యా గాలను ఇవి గుర్తుచేసి, సందర్శకులను రోమాంఛితం చేస్తాయి. ఇవి దేశభక్తి, ప్రకృతి సౌందర్యాల కలబోతలు.తారాలోకం చూస్తూ..రాత్రిపూట ఖగోళ రహస్యాలను, చందమామ, నక్షత్రాల సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు కూడా చాలామంది ఇష్టపడుతున్నారు. ఇది మానసిక ప్రశాంతతను ఇస్తోందని వారు చెబుతున్నారు. ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ‘ స్కైస్కానర్’ నిర్వహించిన సర్వేలో.. రాత్రిపూట ఆకాశాన్ని ఫొటోలు తీసేందుకు ఇష్టపడి పర్యటనలకు వెళ్లినవారు 56% మంది. రాత్రిపూట నక్షత్రాలు, చంద్రుడు ఉండగా కొండప్రాంతాల్లో నిద్రించేందుకు వెళ్లినవారు 53% మంది.సినిమాలు, వెబ్సిరీస్లు చూసి..సోషల్ మీడియాలో వచ్చే రీల్స్, వీడియోలు సామాన్యులను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో అనేక ప్రదేశాల గురించి చెబుతున్నారు. అలాగే నెట్ఫ్లిక్స్, ప్రైమ్, జీ5, సోనీ లివ్ వంటి వేదికల్లో వస్తున్న వెబ్ సిరీస్లు, సినిమాలు కూడా పర్యటనలు చేయాలను కునేవారిని ప్రభావితం చేస్తున్నాయి. ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ సంస్థలు థామస్ కుక్, ఎస్ఓటీసీ వి డుదల చేసిన ‘ఇండియా హాలిడే రిపోర్ట్ 2025’ సర్వేలో.. ఇలాంటి ప్రాంతాలకు పర్యటనలకు వెళ్తున్నామని 60 శాతం మంది చెప్పడం విశేషం. ఇలా వెళ్లేవారిలో యువతే∙అధికం.సపరివార సమేతంగా..యువతరం తమ తల్లిదండ్రులు, తాతయ్య, అమ్మమ్మ / నాన్నమ్మలతో కలిసి విహార యాత్రలకు వెళ్లాలని అనుకుంటున్నారు. మంచి ఉద్యోగం, 5–6 అంకెల జీతం.. వీరిని ఇందుకు ప్రోత్సహిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబంలోని పెద్దలు గతంలో ఎక్కువ పర్యటనలు చేయకపోవడం కూడా యువతను ఈ నిర్ణ యానికి ప్రేరేపిస్తోంది. దీంతో సపరివార సమే తంగా విహారయాత్రలు చేస్తున్నారు. ‘ఇండి యా హాలిడే రిపోర్ట్ 2025’ ప్రకారం దాదాపు 65% ఇలా పర్యటనలకు వెళ్తున్నారు.క్రికెట్ ప్రేమికులూ..క్రికెట్ను ఇష్టపడేవారు క్రికెట్ మ్యాచ్ల షెడ్యూల్ ప్రకా రం టూర్లు ప్లాన్ చేసుకుంటున్నారు. టీ20, వన్డే వంటి మ్యాచ్లు జరిగే చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యటిస్తూ.. రకరకాల స్థానిక రుచులను ఆస్వాదిస్తు న్నారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో మ్యాచ్లను ఇలా చాలామంది చూశారట. ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ స్కై స్కానర్ ‘పిచ్ పర్ఫెక్ట్ జర్నీస్’ ప్రకారం.. 48% మంది మ్యాచ్కి కనీసం 2 నెలల ముందే ఇలా ట్రిప్స్ ప్లాన్ చేసుకున్నారు. వీరిలో స్నేహితులతో వెళ్లినవారు 74% కాగా, కుటుంబంతో వెళ్లినవారు 59%. భార్య లేదా ప్రియురాలు / సహజీ వనం చేస్తున్నవారితో వెళ్లినవారు 46 శాతం.మిమూనింగ్.. సోలో పర్యటనహనీమూన్ వినే ఉంటారు. అంటే జీవిత భాగస్వామితో వివాహానంతరం చేసే విహార యాత్ర. మి మూనింగ్ అంటే.. ఒక్కరే వెళ్లడం. ప్రభాస్ నటించిన ‘చక్రం’ సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి చెప్పినట్టు ‘తనలో తామే రమించడం’. ఒక్కరే ఆ అనుభూతిని ఆస్వాదించడం. ట్రెకింగ్, వాటర్ రాఫ్టింగ్ వంటి సాహస యాత్రలు చేయడం. ఎలాంటి బాదరబందీ లేకుండా ఒక్కరే.. ‘జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది’ అనుకుంటూ ఎక్కడికైనా వెళ్లిపోవడం, ఎంజాయ్ చేయడం. ఇలా వెళ్లి స్థానికతను ఆస్వాదిస్తున్నారు.ఆయా ప్రాంతాల్లో స్థానిక పండుగలూ, కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. స్థానిక రుచులను టేస్ట్ చేస్తున్నారు. భారత్ సహా 7 దేశాల్లో నిర్వహించిన ‘అమెరికన్ ఎక్స్ప్రెస్ 2024 గ్లోబల్ ట్రావెల్ ట్రెండ్స్’ రిపోర్ట్ ప్రకారం.. 84 శాతం మంది మిమూనింగ్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రపంచ సగటు 66 శాతం కంటే ఇది చాలా ఎక్కువ కావడం గమనార్హం. భారత్ సహా 13 దేశాల్లోని 13 వేల మందిని 2024 జూన్లో సర్వే చేసిన రిపోర్టు ‘హిల్టన్ 2025 ట్రెండ్స్’. దీని ప్రకారం సోలో పర్యటనలు చేస్తున్నవారు 47 శాతం మంది. వీరిలో మిలీనియల్స్ (1981–96 మధ్య పుట్టినవారు) 51 శాతం కాగా, జనరేషన్ జెడ్ (1997–2012 మధ్య పుట్టినవారు) 55 శాతం కావడం విశేషం. -
ఈ వారం కథ: దృశ్యమాలిక
గలగలా మాట్లాడుతూ చైతన్యానికి ప్రతీకలా ఉండే అమ్మని ఇలా చూస్తుంటే దుఃఖం ఆగడం లేదు. కష్టసుఖాల్లో నా వెన్నంటే ఉన్న ఆవిడ నాకు అమ్మ మాత్రమే కాదు; స్నేహితురాలూ, గురువూ, దైవం అన్నీనూ! భర్తతోనూ, పిల్లలతోనూ, స్నేహితురాళ్ళతోనూ, మరెవ్వరితోనూ చెప్పుకోలేని విషయాలని అమ్మతో పంచుకుంటుండే నాకు ఏ ఒక్కరోజైనా అమ్మతో మాట్లాడలేకపోతే ఆ రోజంతా ఎంతో వెలితిగా వుండేది. నిన్న రాత్రి కూడా అమ్మతో దాదాపు గంటసేపు ఏదో పిచ్చాపాటి మాట్లాడాను. అలాంటిది తెల్లవారు జాముకల్లా అమ్మ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిందన్న దుర్వార్తని వినవలసి వస్తుందని నేను కలలోనైనా ఊహించలేదు. ‘జాతస్య మరణం ధ్రువం’ అని తెలిసినా, నాకు అత్యంత ఆత్మీయురాలైన అమ్మ విషయంలో మాత్రం నేను దాన్ని అన్వయించుకోలేకపోతున్నాను. ‘చదువుకో తల్లీ నీకు సౌఖ్యమబ్బేను, ఆడుకోవమ్మా నీకు హాయి కలిగేను’ అంటూ అమ్మ చల్లని గొంతుతో పాడే జోల నా చెవుల్లో ఇంకా వినిపిస్తూనే వుంది.‘చిన్నా, చిన్నా’ అంటూ అమ్మ నన్ను పిలుస్తున్నట్టే అనిపిస్తోంది. ఒకటా, రెండా– ఎన్నో ఎన్నెన్నో జ్ఞాపకాలు. నా మదిలో అలలు అలలుగా కదులుతూ నన్ను ఒక రకమైన సుషుప్తిలోకి నెట్టేస్తున్నాయి. ‘అమ్మా, చూడు అన్నయ్య నన్ను కొడుతున్నాడు’ అని చెప్పగానే, ‘ఎవరమ్మా నా చిట్టితల్లిని కొట్టిందీ, హన్నా’ అంటూ నా తరఫున వకాల్తా పుచ్చుకొని, అన్నయ్యకి రెండు అంటించి మురిపెంగా నన్ను ఎత్తుకుని ముద్దాడిన అమ్మ! ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరంలో చివరి పరీక్షకి ముందురోజున ‘నేను ఈ సబ్జెక్టు సరిగ్గా చదవలేదు, ఫెయిలయిపోతాను’ అంటూ అమ్మ ఒళ్లో తల పెట్టుకుని భోరుమని ఏడుస్తుంటే, ‘ఊరుకో చిన్నా, ముందు కాసేపు ప్రశాంతంగా నిద్రపో’ అంటూ తన ఒళ్లో నన్ను నిద్రబుచ్చి, రెండుగంటల తర్వాత ‘చిన్నా, ఇంక మేలుకోమ్మా’ అంటూ నా చేతిలో కాఫీ పెట్టి నేను చదువుకుంటున్నంతసేపూ నాతో పాటే తనూ ఏదో పుస్తకం చదువుకుంటూ కూర్చోవడమే కాకుండా, ఆ మరుసటి రోజు నన్ను వెంటబెట్టుకుని కాలేజీ వద్ద దిగబెట్టి, నేను పరీక్ష రాసి బైటకి వచ్చేదాకా కాలేజీ గేటు పక్కనే నా కోసం ఓపిగ్గా ఎదురుచూస్తూ నిలుచున్న అమ్మ!సివిల్ సర్వీసెస్ ఎంట్రన్స్లో నెగ్గాక ఇంటర్వ్యూ ముందు రోజున ‘అమ్మా బోర్డులో ఎలాంటి ప్రశ్నలు వేస్తారో ఏమో’ అని నేను భయపడుతుంటే, ‘ఏడాది పాటు ఒకే లక్ష్యంగా, అకుంఠిత దీక్షలా, అహర్నిశలూ చదివిన నీకు ఈ ఇంటర్వ్యూ ఒక లెక్కా? అంతా సవ్యంగానే జరుగుతుంది, ధైర్యంగా వుండమ్మా’ అంటూ నాపై నాకు నమ్మకాన్ని పెంచిన అమ్మ! ఐఏఎస్కి సెలక్టయి ట్రైనింగ్కి వెళ్ళాక ‘అమ్మా, ఇక్కడ అంతా నార్త్ ఇండియన్సే వున్నారు. వాళ్ళతో నేను కలవలేక పోతున్నాను. హాస్టల్లో భోజనం కూడా అస్సలు బావుండడం లేదు. పుల్కాలు, మసాలా కూరలూ తినలేక పోతున్నాను’ అంటూ ఫోన్లో నా కష్టాలని ఏకరువు పెట్టిన పదిహేను రోజుల్లోనే ఆవకాయ, మాగాయ జాడీలు పట్టుకుని నా దగ్గరకు వచ్చేసి, నా ట్రైనింగ్ పూర్తయ్యేదాకా నాకు వండి పెడుతూ, నా దగ్గరే ఉండిపోయి, వచ్చీరాని హిందీలో అక్కడ అందరితో మాట్లాడుతూ వాళ్లకి మన వంటలనీ, ఆప్యాయతనీ రుచి చూపిస్తూ మెల్లిమెల్లిగా వాళ్లందరినీ నాకు ఫ్రెండ్స్ని చేసేసిన అమ్మ! ‘అమ్మా, ఎప్పుడూ నా తోడూనీడగా ఉండేదానివి. ఇలా ఉన్నట్టుండి నన్ను ఒంటరిని చేసి ఎందుకు వెళ్ళిపోయావమ్మా? లేమ్మా, ఒక్కసారి నాతో మాట్లాడమ్మా. నన్ను ఒక్కసారి చిన్నా అని పిలువమ్మా’ అంటూ పెద్దగా ఏడ్చేస్తున్నాను.∙∙ ‘‘అమ్మా, అమ్మా’’ అంటూ పిల్లలు గట్టిగా కుదుపుతుంటే ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను.ఎదురుగా చేతిలో పుష్పగుచ్ఛం పట్టుకుని మా పిల్లలు మన్వి, తన్వి.‘ఏమిటి సిరీ, అత్తయ్యగారుగాని మళ్ళా కలలోకి వచ్చారా?’ అన్న మావారి మాటలకు అవునన్నట్టుగా తలుపాను.పిల్లలిద్దరూ కలిసి నా చేతిలో పుష్పగుచ్ఛం పెట్టి ‘హ్యాపీ బర్త్ డే అమ్మా’ అంటుంటే వాళ్లవైపు నిరాసక్తంగా చూశాను. దాంతో పిల్లల్లోని ఉత్సాహం అంతా నీరు కారిపోవడం గమనించిన మా వారు వెంటనే ‘మీరు వెళ్లి హాల్లో ఏర్పాట్లు చేస్తుండండి. నేను అమ్మని తీసుకొస్తాను’ అని చెప్పి వాళ్ళని పంపించారు.‘అలాగే డాడీ’ అంటూ పిల్లలు హాల్లోకి వెళ్ళాక ‘ఇప్పుడు ఈ వేడుకలు ఎందుకండీ’ అంటున్న నన్ను మధ్యలోనే ఆపేసి, ‘అత్తయ్యగారు పోయి ఇంతకాలమైనా నువ్వింకా ఇలాగే ఉంటే ఎలా సిరీ? రోజుల తరబడి నువ్విలా నిస్తేజంగా ఉంటుంటే నిన్ను చూసి పిల్లలు ఎంత బెంగ పడుతున్నారో నీకేమైనా తెలుస్తోందా అసలు?’ అన్న ఆయన మాటలకి నాలో కోపం ఉవ్వెత్తున పొంగుకొచ్చింది.‘అదేమిటండీ, అలా మాట్లాడతారు? పోయింది ఎవరో దూరపు బంధువు కాదు, మా అమ్మ. ఆవిడతో నాకున్న అనుబంధం తెలిసీ మీరిలా...’ అంటుంటేనే నా గొంతు గద్గదమైంది.అది చూసి మా వారు తగ్గిపోయారు.‘నిన్ను బాధపెట్టాలని కాదు సిరీ. నిజమే, తల్లి లేని లోటు ఎవరూ తీర్చేది కాదు. అలాగని నీ విధుల్ని నువ్వు మర్చిపోకూడదు కదా! నీపై ఆధారపడ్డ ఒక కుటుంబం ఉంది. నువ్వు ఇద్దరు పిల్లలకి అమ్మవి, నాకు భార్యవి’ అన్నారు.‘మీకు చేయవలసిన వాటిలో నేను ఏ విధమైన లోటు చేశానండీ? మనసులో బాధ పొంగి పొర్లుతున్నా వేళకి అందరికీ అన్నీ అందిస్తూనే ఉన్నానుగా’ ఉక్రోషంగా అన్నాను.‘నిజమే, అన్నీ చేస్తూనే ఉన్నావు. కాని, ఇలా మొహంలో కళాకాంతులు లేకుండా, జీవితంలో సర్వం కోల్పోయినదానికి మల్లే తిరుగుతున్న నిన్ను చూసి పిల్లలు కూడా దిగాలుగా, మొహాలు వేళ్ళాడేసుకుని వుంటున్నారు. వాళ్ళల్లో హుషారు రోజురోజుకీ తగ్గిపోతుందన్న విషయం నువ్వు గమనించావా? అయినా పుట్టినరోజు పూట మన మధ్య ఇటువంటి వాదనలు వద్దుగాని, నీకోసం పిల్లలిద్దరూ కలిసి నీ పుట్టినరోజుని ప్రత్యేకంగా చేసి నిన్ను సంతోషపెట్టాలని చూస్తున్నారు సిరీ. నీకోసం ఒక పెద్ద సర్ప్రైజ్ కూడా ఉంచారు. నువ్వు కాదంటే వాళ్ళు బాధపడతారు, పద’ అంటూ హాల్లోకి తీసుకెళ్లారాయన.అక్కడ టేబుల్పైన అందంగా అలంకరించిన కేకు, క్యాండిల్స్, ఇంకా రకరకాల గిఫ్టులు.వాటిని చూసిన నా మొహం విప్పారలేదు. ఎందుకంటే, పుట్టినరోజు అనగానే నాకు ముందుగా గుర్తుకొచ్చేది అమ్మే! నెలరోజుల ముందునుండే పిల్లలకి ఫోన్ చేసి, ‘పిల్లలూ, ఈసారి అమ్మ పుట్టినరోజు ఎలా చేస్తున్నారూ, అమ్మకి ఏం బహుమతులిస్తున్నారూ’ అంటూ హడావిడి చేస్తూండేది అమ్మ! ఇంక ఆరోజునైతే అందరికంటే ముందే ఫోన్ చేసి, ‘చిన్నా, పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. నా ఆయుష్షు కూడా పోసుకుని పదికాలాల పాటు చల్లగా ఉండు చిట్టితల్లీ’ అంటూ ఆశీర్వదించేది. అలాంటి అమ్మ లేని పుట్టినరోజు పండుగా, ఒక పండుగేనా ! అమ్మ ఆశీస్సులతో మొదలయ్యే వేడుకని అమ్మ లేకుండా జరుపుకోవడం నాకేమాత్రం ఇష్టం లేకున్నా, ఆయన చెప్పినట్టుగా పిల్లల మనసుల్ని కష్టపెట్టకూడదన్న ఉద్దేశంతో కేకు కట్ చేసి పిల్లలకీ, ఆయనకీ నా చేత్తో తినిపించాక, నిర్లిప్తంగా వంటింట్లోకి నడవబోతుంటే, ‘ఉండమ్మా, అసలైన సర్ప్రైజ్ పైనుంది, రా’ అంటూ పిల్లలిద్దరూ నా చెయ్యి పట్టుకుని పైకి తీసుకెళ్లారు. మాది రెండంతస్తుల మేడ. పై అంతస్తులో మేమంతా క్రికెట్ మ్యాచ్లూ, సినిమాలూ చూసే హోమ్ థియేటర్ ఉంది.అక్కడ స్విచ్ ఆన్ చేయగానే చిరునవ్వుతో కనిపించిన అమ్మని అబ్బురంగా చూస్తుండిపోయాను.‘చిన్నా, ఎలా ఉన్నావురా? నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు నిండునూరేళ్లు సుఖశాంతులతో ఆనందంగా జీవితాన్ని గడపాలన్నదే నా ఆకాంక్ష’ అన్న అమ్మ మాటలకి నాలో ఆనందం పరవళ్ళు తొక్కింది.శివసాన్నిధ్యాన్ని చేరుకున్న అమ్మ ఇలా నా ఎదురుగా నిలుచుని ఎలా మాట్లాడగలుగుతోందో అర్థంకాక నేను తెల్ల మొహం వేస్తే, పిల్లలిద్దరూ ముసిముసిగా నవ్వుతూ, ‘ఇంకా ఉంది చూడమ్మా’ అన్నారు.దాదాపు గంట నిడివి ఉన్న ఆ త్రీడీ వీడియోలో అమ్మతో నా మధురస్మృతులని పొందుపరచిన ఎన్నో ఫొటోలు, మేమిద్దరం కలిసి వెళ్లిన టూర్లలో, ఫంక్షన్లలోని చిన్న చిన్న వీడియో క్లిప్పింగులు, అక్కడక్కడ అమ్మ స్వయంగా తన గళంతో చెబుతున్న కబుర్లూ!అదంతా చూశాక చెప్పలేనంత ఆనందంతో నా మనసు నిండిపోయింది. ఇన్నాళ్ళుగా నా హృదయాన్ని కలచివేస్తున్న బాధంతా ఒక్కచేత్తో తీసేసినట్టుగా బుగ్గలపై నుండి జాలువారుతున్న అశ్రువులను తుడుచుకుంటూ ‘ఎప్పుడు చేశారమ్మా ఇవన్నీ?’ అని నేను అడుగుతుంటే మా వారు నా వెనక నుండి ముందుకొచ్చి, ‘దాదాపు నెలరోజుల పైనుండి పిల్లలు ఎంతో కష్టపడి ఈ వీడియోని తయారు చేశారు. ఇప్పుడొస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకా త్రీ డీ టెక్నాలజీ సాయంతో అత్తయ్యగారు నీ ఎదురుగా నిలబడి, నీతో మాట్లాడుతున్నట్టుగా వీడియో క్లిప్పింగులు, స్పెషల్ ఎఫెక్ట్లు జత చేసి తయారుచేశారు. ఇదంతా కూడా నిన్ను ఆనందపెట్టాలన్న తపనతో చేశారు వాళ్ళు. అలాంటిది, నువ్విలా ఏడుస్తుంటే ఎలా చెప్పు?’ అంటూ తన చేత్తో నా కన్నీళ్ళని తుడిచారు.‘ఇవి కన్నీళ్ళు కావండీ, ఆనందభాష్పాలు. నవ్వినా, ఏడ్చినా కన్నీళ్ళేగా వచ్చేది’ అంటూ పిల్లలిద్దరినీ దగ్గరికి రమ్మన్నట్టుగా చేత్తో పిలవడం ఆలస్యం, మొహాలు చాటంత చేసుకుని గబగబా పరిగెత్తుకుంటూ వచ్చారిద్దరూ.వాళ్ళ నుదుటిన ముద్దాడుతూ, ‘థాంక్యూ సో మచ్ బుజ్జి కన్నలూ. మీ అమ్మమ్మకి తిరిగి ప్రాణం పోసి నా కళ్ళ ముందు నిలిపారు’ అన్నాను.నా మాటలకి వాళ్ళ మొహాలు మతాబుల్లా వెలిగిపోగా ‘అక్కా, ఎన్ని రోజులయింది కదా అమ్మ మనల్ని ఇలా ‘బుజ్జికన్నలూ’ అని పిలిచి’ అన్న మన్వి మాటలకి ‘అవును తన్వీ, ఇంకా కొన్నాళ్ళయితే మనం ఆ పిలుపే మర్చిపోయేవాళ్ళమేమో’ అంది తన్వి.ఆ మాటలు వింటుంటే ‘అయ్యో, నా నిరుత్సాహంతో పిల్లలని నేను ఇంత బాధపెట్టానా’ అనిపించింది. అదే మాట మా వారితో అనగానే, ఆయన వెంటనే ‘తల్లి పోతే బాధ ఉండడం సహజమే సిరీ. అందులోనూ నువ్వు ఆవిడ గారాల కూతురివి కాబట్టి ఆ బాధ నుండి బయటపడేందుకు నీకు మరింత సమయం కావాల్సి వచ్చింది, అది నేను అర్థం చేసుకోగలను. నిజానికి, మనుషులు చనిపోవడం అంటే భౌతికంగా వాళ్ళు ఇక్కడ మనతో లేకపోవడం. అంతే! వాళ్లతో మనకున్న అనుబంధమూ, వారి జ్ఞాపకాలూ ఎప్పుడూ సజీవంగానే ఉంటాయి, వాటికి మరణం లేదు. కాబట్టి మనం ఇక్కడ ఉన్నంతకాలం వారు వదిలి వెళ్ళిన ఆ మధురస్మృతులని నెమరేసుకుంటూ మనసులో మరింత ఆనందాన్ని పోగేసుకుంటూ, వాటిని తరగని ఆస్తిగా మలచుకుని రాబోయే తరాలకి అందివ్వాలే తప్ప, వాళ్ళు మన మధ్యన లేరన్న విషయాన్ని అదేపనిగా తలుచుకుంటూ జీవితాన్ని దుర్భరం చేసుకోకూడదు’ అన్నారు.ఆయన చెబుతున్నదాన్ని శ్రద్ధగా వింటున్న నాకు, ఆ మాటల్లో ఆ క్షణాన ఏదో అంతర్లీనమైన సందేశం వున్నట్టనిపించింది.∙∙ ఆ మరుసటి రోజున మన్వి స్కూల్కీ, ఇంకా తన్వి దాని స్నేహితురాలి ఇంటికీ వెళ్ళాక అమ్మతో కలిసి దిగిన ఫొటోలున్న ఆల్బమ్స్ అన్నింటినీ మంచంపై పరచుకుని తీరిగ్గా ఒక్కో ఫొటో తిరగేయసాగాను. ప్రతి ఫొటో వెనకా మరచిపోలేని అందమైన జ్ఞాపకాలు నా ఎదుట నిలిచి నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ‘ఈ స్మృతులన్నింటినీ దృశ్యమాలికలుగా నిక్షిప్తం చేస్తే కలకాలం సజీవంగా వుంటాయి కదా’ అన్న ఆలోచన తళుక్కుమనగానే వెంటనే లేచి అల్మారాలో వున్న డిజిటల్ కెమెరాని బయటకి తీశాను.ఒక్కో ఫొటోపై కెమెరాని ఫోకస్ చేస్తూ ఆ ఫొటోకు సంబంధించిన సందర్భాన్ని చక్కటి మాటల్లో నాకు తోచినట్టుగా అర్థవంతంగా వివరించడం మొదలెట్టాను. అలా చేస్తూ ఎంతసేపున్నానో తెలియదు.కాలింగ్ బెల్ మోగడంతో లేచొచ్చి తలుపు తీస్తే ఎదురుగా మన్వి !‘అప్పుడే స్కూల్ అయిపోయిందా’ అంటూ గోడగడియారం వైపు చూసి, ‘అమ్మో, సాయంత్రం నాలుగు గంటలు దాటింది. పనిలో పడి టైం చూసుకోలేదు. మీకోసం నేనింకా టిఫిన్ కూడా తయారు చేయలేదు’ అని నేను కంగారుపడుతుంటే తన్వి కూడా లిఫ్ట్ తలుపు తెరుచుకుని రావడం కనిపించింది.దాంతో ‘కాళ్ళూ చేతులూ కడుక్కురండి. ఈలోగా నేను మీకోసం స్నాక్స్ చేస్తాను’ అంటూ గబగబా వంటింట్లోకి నడిచాను.ఫ్రిజ్లో నుంచి దోసెపిండిని బయటకి తీసి, ఉల్లిపాయలూ, పచ్చి మిరపకాయలూ సన్నగా తరిగి కలిపి వాటితో వేడి వేడిగా పొంగనాలు వేసి ప్లేట్లలో సర్ది హాల్లోకి తీసుకోచ్చేటప్పటికి అక్కడ నేను పరిచిన ఫొటోలని తదేకంగా చూస్తూ కనిపించారు పిల్లలు.నా చేతుల్లో నుండి టిఫిన్ ప్లేట్లు అందుకుంటూ ‘అమ్మా, ఈ ఫొటోల్లో అమ్మమ్మ ఎంత చిన్నగా, సన్నగా వుందో! అన్నట్టు, కెమెరాతో ఏం చేస్తున్నావు నువ్వు? ఈ ఫొటోలని డిజిటలైజ్ చేస్తున్నావా?’ అని అడిగిన పిల్లలకి నేనేం చేస్తున్నదీ వివరించాను.‘నువ్వు బ్యాక్ గ్రౌండ్లో ఉంటూ నీ గొంతు మాత్రమే వినిపించేకంటే, నువ్వు కూడా ఫొటో పక్కనే కనిపిస్తుంటే బాగుంటుంది కదమ్మా! ఫొటోని చూపిస్తూ నువ్వు మాట్లాడుతుంటే నేను వీడియో తీస్తాను’ అంది ఫొటోగ్రఫీ మీద మక్కువున్న నా చిన్నకూతురు మన్వి.‘మన్వి చెప్పింది బావుందమ్మా. ఎప్పటికప్పుడు ఒక వీడియో అయిపోగానే అది నాకు ఇచ్చేశావంటే నేను దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మెరుగులు దిద్దుతాను’ అంది ఇంజినీరింగ్ చదువుతున్న నా పెద్ద కూతురు తన్వి. ఆ వెంటనే ‘నేను ఎలాగో నెలరోజుల తర్వాత హాస్టల్కి వెళ్ళిపోవాలి కదా. అక్కడ ఈ వీడియోలని చూసుకుంటే నువ్వు నా దగ్గరే ఉన్నట్లుగా ఉంటుంది’ అని కూడా అంది.దాని మాటలకి ఆలోచనలో పడ్డాను.‘పిచ్చిపిల్ల, ఇప్పుడైతే హాస్టల్లో దూరంగా ఉంది కాబట్టి అమ్మని తన దగ్గరే చూసుకోవాలని అనుకుంటోంది, అదే ఆ తర్వాత, మా అమ్మలాగే నేనూ ఈ లోకాన్ని వీడిపోయాక? ఎప్పుడోకప్పుడు నేను కూడా వెళ్ళిపోవలసిన దాన్నేగా! ఎవరి ఆయుష్షు ఎన్నాళ్ళో ఎవరికి తెలుసు?’నా మనసు పరిపరివిధాలు పోసాగింది.‘తన్వి మనసు చాలా సున్నితం. చిన్న చిన్న వాటికే బెంగ పెట్టేసుకుంటుంది. నేను ఎప్పుడైనా ఆఫీసు పనిపై ఊరు వెళ్ళవలసి వస్తే నాలుగురోజుల ముందునుండే దిగులు పడుతుండేది. ఇంజనీరింగులో చేరి సంవత్సరంన్నర దాటినా ఇంకా దానికి హోం సిక్నెస్ పోలేదు. సెలవులకి ఇక్కడి వచ్చీ తిరిగి వెళ్ళిపోయే రోజున చాలా అయిష్టంగా హాస్టల్కి వెళ్తుంది. ఇంక మన్వికైతే ఇంకా చిన్నతనం పోలేదు. పసిపిల్లకి మల్లే మారాం చేస్తుంటుంది నా దగ్గరా, వాళ్ళ అక్క దగ్గరా! నేను కాస్త దిగులుగా ఉంటేనే తట్టుకోలేని ఈ పిల్లలు నేను ఏకంగా ఈ లోకాన్ని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతే, ఆ బాధని తట్టుకోగలరా? మా అమ్మని తలచుకుంటూ నేను ఇంతలా బాధపడుతున్నాను కదా, మరి నేను వెళ్లిపోయాక నా పిల్లలూ నాలాగే నా గురించే ఆలోచిస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారేమో! అమ్మో, అలా అస్సలు కాకూడదు’అలా అనుకోగానే నా మదిలో చటుక్కున ఒక ఆలోచన అంకురించింది .‘నేను పోయాక, ఆ బాధ నుంచి పిల్లలు త్వరగా కోలుకునేందుకుగానూ వాళ్ళతో వర్తమానంలో నాకున్న అనుబంధం గురించే కాకుండా, భవిష్యత్తులో వాళ్లకి ఎదురయ్యే వివిధ సమస్యలకి నా అనుభవంతో నేను ఇచ్చే సలహాలనీ, సూచనలనీ నా మాటలతో వివరించే వీడియోలను చేస్తే, అవి పిల్లలకి సాంత్వనని కలిగించడమే కాకుండా ముందుముందు వాళ్లకి ఉపయోగకరంగా కూడా ఉంటాయి.’అలా అనుకున్నాక నా మనసు కాస్త ఊరటపడింది. ∙∙ ఆ రాత్రి నా ఆలోచనని ఆయన ముందుంచుతూ ‘యాభైఏళ్లకే నేనిలా ఆలోచించడం అశుభం అంటారా? నా ఆలోచనా విధానంలో లోపం ఉందంటారా, నేను నెగటివ్గా ఆలోచిస్తున్నానంటారా?’ అని అడిగాను.‘అదేం లేదు సిరీ. జీవితం క్షణభంగురం. ఎవరికైనా సరే నుదుటిన రాసిపెట్టి ఉన్నంత కాలమే ఈ పృథ్విపై స్థానం ఉంటుంది. పోయిన వాళ్లతో కలిసి మనమూ పోలేము కాబట్టి వాళ్ళతో పంచుకున్న అనుభూతులని పదిలపరుచుకోవడమూ, అలాగే మనమూ ఎల్లకాలమూ ఇక్కడ ఉండబోమన్న అవగాహనతో మన పిల్లలతో ముడిపడి వున్న బాంధవ్యాన్ని పదిలంగా భద్రపరుచుకోవడమూ చక్కటి ఆలోచనే. కాబట్టి మనసులో ఏ శంకలూ పెట్టుకోకుండా గో ఎహెడ్. అలాగే నువ్వు కూడా ఇంక ఆఫీసుకి వెళ్ళడం మొదలెడితే కాస్త త్వరగా మనుషులలో పడతావు. నీ చదువు, ఉద్యోగం వెనకాల అత్తయ్యగారి ప్రోత్సాహం అంతా ఇంతా కాదనీ, ఆవిడే లేకపోతే జీవితంలో నువ్వేమీ సాధించలేకపోయే దానివనీ నాతో నువ్వే చాలాసార్లు చెప్పావు. అలాంటిది ఇప్పుడు ఆవిడ ఈ లోకంలో లేదన్న బాధతో నువ్వు నీ శక్తిసామర్థ్యాలని కుదించేసుకుని ఇలా ఇంట్లోనే ఉండిపోతే ఆవిడ ఆత్మ ఎంత క్షోభిస్తుందో ఒక్కసారి ఆలోచించు. ఇకనైనా నీ సెలవుని రద్దు చేసుకుని ఆఫీసులో చేరిపోయి మనుషుల్లో పడేందుకు ప్రయత్నం చేయి సిరీ’ ఆయన మాటలతో నా ఆలోచనకి బలం కలగడమే కాకుండా నా కర్తవ్యం కూడా నాకు బోధపడింది..∙∙ ఆ మరుసటి సోమవారమే ఆఫీసులో చేరిపోయాను. ఇంక అప్పటి నుంచి తీరిక సమయాల్లో అమ్మతో, పిల్లలతో ఇంకా మావారితోనూ నా అనుబంధాన్ని దృశ్యమాలికలుగా మలుస్తూ , మా అమ్మ జ్ఞాపకాలకి ప్రాణం పోస్తూ ఆవిడ ఈలోకంలో లేదన్న బాధనుంచి మెల్లిమెల్లిగా తేరుకోవడం మొదలెట్టాను. దాంతో, మావారూ హ్యాపీ, పిల్లలూ హ్యాపీ, వెరసి కుటుంబమంతా హ్యాపీ. కాలం అన్ని గాయాలనీ మాన్పుతుంది. నిజమే కాని, దానికి మనవంతు కృషి మనమూ జోడిస్తే గాయం కాస్త త్వరగా నయమవుతుంది కదూ! -
డ్రోన్.. స్టార్టప్లు పెరిగెన్
డ్రోన్స్ .. ఇటీవలి కాలంలో ఈ మానవ రహిత విమానాలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఆపరేషన్ సిందూర్, రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో వీటిపట్ల జనంలో ఆసక్తి పెరిగింది. రక్షణ రంగం, ఈ–కామర్స్, వ్యవసాయం, ఆరోగ్యం వంటి విభిన్న రంగాల్లో కొత్త అవకాశాలను డ్రోన్స్ స్టార్టప్స్ అందిపుచ్చుకుంటున్నాయి. మరోపక్క ఐఐటీ గ్రాడ్యుయేట్లు ఈ స్టార్టప్ల ఏర్పాటులో ముందుంటున్నారు. ఈ కంపెనీలకు ఉన్న అపార అవకాశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడుల వరద పారిస్తున్నారు. డ్రోన్ కంపెనీలు గత ఏడాది స్వీకరించిన నిధులు రెండింతలు అయ్యాయంటే భవిష్యత్ అవకాశాలను అంచనా వేయొచ్చు. – సాక్షి, స్పెషల్ డెస్క్దేశంలో డ్రోన్ టెక్నాలజీ స్టార్టప్లు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఈ కంపెనీల ఆదాయాలు పెరుగుతున్నాయి. మార్కెట్లో విస్తరించడంతోపాటు సాంకేతిక సామర్థ్యాలూ పెంచుకుంటున్నాయి. ప్రస్తుతం భారత డ్రోన్ తయారీ రంగంలో 506 కంపెనీలు నిమగ్నమయ్యాయి. ఈ రంగంలోని టాప్–100 స్టార్టప్స్లో సంఖ్య పరంగా బెంగళూరు ముందంజలో ఉంటే.. ఈ కంపెనీలను స్థాపించిన వ్యవస్థాపకుల్లో అత్యధికులు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల్లో (ఐఐటీ) చదివిన విద్యార్థులు కావడం విశేషం. ప్రపంచంలో అత్యధిక డ్రోన్ స్టార్టప్లు అమెరికాలో ఉంటే తరవాత మనదేశంలోనే ఉన్నాయి. అలాగే ఈ పదేళ్లలో ఈ రంగంలో అత్యధిక ఫండింగ్ అందుకున్న దేశాల్లో మనది నాలుగో స్థానం.బెంగళూరు టాప్..డ్రోన్ ్స రంగంలో దేశంలో 2018లో అత్యధికంగా 61 కంపెనీలు ఎంట్రీ ఇచ్చాయి. ఆ తర్వాతి సంవత్సరం ఈ సంఖ్య 54గా నమోదైంది. 2020లో 59 కంపెనీలు రంగ ప్రవేశం చేశాయి. టాప్–100 కంపెనీల్లో బెంగళూరు నుంచి 24, హైదరాబాద్ 11, ముంబై 11, ఢిల్లీ 10, చెన్నై 8, నోయిడా నుంచి 8 కొలువుదీరాయి. ఇక డ్రోన్ కంపెనీల స్థాపకుల్లో ఐఐటీ బాంబే 18 మంది, ఐఐటీ కాన్పూర్ నుంచి 14 మంది, బిట్స్ పిలానీ విద్యార్థులు 12 మంది ఉన్నారు. ప్రపంచంలో డ్రోన్ స్టార్టప్స్ను అందించిన టాప్ – 10 విద్యాసంస్థల్లో మనదేశానివి 3 ఉండటం విశేషం.వెన్నుతడుతున్న ప్రభుత్వం..ప్రభుత్వ అనుకూల విధానాలు, వివిధ రంగాలలో డ్రోన్స్ డిమాండ్ పెరగడం, ఆవిష్కరణలు.. ఈ రంగానికి కలిసి వచ్చే అంశాలు. వ్యవసాయం, మౌలిక సదుపాయాల రంగం మొదలు దేశ రక్షణ అవసరాలు, విపత్తుల సమయంలో వాడకం వరకు డ్రోన్ వినియోగ పరిధి విస్తరిస్తుండడం జోష్నిస్తోంది. 2021లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన డ్రోన్ నియమాలు ముఖ్యంగా.. అనుమతుల సంఖ్య, పత్రాలు, రుసుముల తగ్గింపు మొదలు ఆన్ లైన్ సింగిల్ విండో సిస్టమ్ ఏర్పాటు వంటివి ఈ రంగం పురోభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నాయి.నిధులు వెల్లువెత్తాయి..దశాబ్ద కాలంలో భారతీయ డ్రోన్ కంపెనీల్లోకి రూ.4,882 కోట్ల నిధులు వెల్లువెత్తాయి. 2016లో రూ.38.6 కోట్ల నుంచి 2024 నాటికి రూ.2,119 కోట్లకు ఎగిశాయి. అంటే ఏకంగా 5,389% వృద్ధి నమోదైందన్న మాట. 2020 నుంచి ఫండింగ్ ఊపు మీద ఉంది. 2023తో పోలిస్తే గతేడాది ఈ పెట్టుబడుల రాక రెండింతలకుపైగా పెరిగింది. 2025లో జూన్ 4 నాటికి సుమారు రూ.335 కోట్ల నిధులను డ్రోన్ కంపెనీలు అందుకున్నాయి. ఐఐటీ ఢిల్లీ విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టార్టప్స్లో అత్యధికంగా దశాబ్ద కాలంలో రూ.927 కోట్ల పెట్టుబడులు వచ్చి చేరాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఐఐటీ బాంబే, ఐఐఎం కలకత్తా, హార్వర్డ్ బిజినెస్ స్కూల్, ఐఐటీ కాన్పూర్ విద్యార్థుల స్టార్టప్స్ ఉన్నాయి. కొన్ని కంపెనీలు బాగా రాణిస్తుండటం, మరికొన్ని సాంకేతికత పరంగా మెరుగ్గా ఉండటం తదితర కారణాలతో.. ఈ రంగంలోని 12 కంపెనీలు చేతులు మారాయి. నాలుగు కంపెనీలు ఐపీవోల ద్వారా నిధులు సమీకరించాయి. -
చాట్ జీపీటీ వాడకంలో.. భారత్ నంబర్ 1
వాడకం అంటే మనవాళ్లదే. రెండేళ్ల క్రితం అందుబాటులోకి వచ్చిన ‘చాట్జీపీటీ’ భారతీయులకు అత్యంత ఇష్టమైన యాప్గా అవతరించింది. చాట్జీపీటీ వినియోగంలో ప్రపంచంలో 13.5% మంది యూజర్లతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. అమెరికాను కూడా వెనక్కి నెట్టి ఔరా అనిపించింది. చాట్జీపీటీ వినియోగదారుల సంఖ్య భారత్లో 10.8 కోట్లకు చేరుకుంది. దీన్ని బట్టి భారతీయుల జీవితాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎలా మమేకం అయిపోయిందో అర్థం చేసుకోవచ్చు. – సాక్షి, స్పెషల్ డెస్క్టెక్నాలజీ వాడకంలో మనవాళ్లను కొట్టేవారే లేరని మరోసారి నిరూపితమైంది. చాట్జీపీటీ యూజర్లలో భారతీయులు నంబర్వన్గా నిలిచారు. అమెరికా కూడా మన తరవాతే ఉంది. యూఎస్ వాటా 8.9% మాత్రమే. ఇండోనేసియా 5.7, బ్రెజిల్ 5.4, ఈజిప్ట్ 3.9, మెక్సికో 3.5, పాకిస్తాన్ 3, జర్మనీ 3, ఫ్రాన్స్ 2.9, వియత్నాం 2.6% వాటాతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఏఐ ఆధారిత ఈ చాట్బాట్ సాంకేతిక నిపుణులకు మాత్రమే పరిమితం కాలేదు. విద్యార్థులు, కంటెంట్ క్రియేటర్స్కు తోడు సామాన్యులూ మన దేశంలో తెగ వాడేస్తున్నారు. హోంవర్క్లో సహాయం, మనసుకి నచ్చిన వారికి సందేశం, కావాల్సిన సమాచారాన్ని సేకరించడం, కంటెంట్ క్రియేషన్ .. అవసరం ఏదైనా అమెరికన్ కంపెనీ రూపొందించిన ఈ చాట్బాట్ వేగంగా భారత్లో విస్తరిస్తోందని క్వీన్ ఆఫ్ ది ఇంటర్నెట్గా ప్రసిద్ధి చెందిన విశ్లేషకురాలు, వెంచర్ క్యాపిటలిస్ట్ మేరీ మీకర్ తన ‘2025 ఏఐ ట్రెండ్స్’ నివేదికలో తెలిపారు. అంతేగాక చైనా తయారీ ఏఐ చాట్బాట్ ‘డీప్సీక్’ వినియోగంలోనూ భారతీయులు మూడో స్థానంలో నిలిచారు. ప్రపంచ వినియోగదారుల్లో 6.9 శాతం మంది మనదేశం నుంచే ఉన్నారు. 33.9% వాటాతో చైనా, 9.2%తో రష్యా టాప్–2లో ఉన్నాయి. డీప్సీక్ మొత్తం వినియోగదార్ల సంఖ్య 5.4 కోట్లు.తెలుగులోనూ వినియోగం..ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య భారీగా పెరగడం, బలమైన, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిశ్రమ, డిజిటల్ పరివర్తనకు ప్రభుత్వ మద్దతు, ప్రాంతీయ భాషలపై దృష్టి పెట్టడం వంటి వివిధ అంశాలు ఏఐ వినియోగంలో ఈ పెరుగుదలకు కారణమని నివేదిక వెల్లడించింది. చాట్జీపీటీ తెలుగు, హిందీ, మలయాళం, తమిళం వంటి అనేక భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. అంటే మనకు కావాల్సిన సమాచారాన్ని తెలుగులోనూ అందిస్తుందన్నమాట. స్మార్ట్ఫోన్లు అందుబాటు ధరల్లో లభించడం, ఇంటర్నెట్ వేగం దూసుకెళ్లడం కూడా చాట్జీపీటీ వాడకం అధికం కావడానికి ముఖ్యమైన కారణంగా చెప్పవచ్చు. రోజుకు 100 కోట్లకుపైగా..చాట్జీపీటీ వేదికగా రోజుకు 100 కోట్లకుపైగా సర్చెస్ నమోదవుతున్నాయంటే నోరెళ్లబెట్టాల్సిందే. వార్షిక సర్చెస్ 36,500 కోట్లకు చేరుకోవడానికి గూగుల్కు 11 ఏళ్ల సమయం పడితే.. చాట్జీపీటీ ఈ మైలురాయిని 5.5 రెట్లు వేగంగా రెండేళ్లలోనే అందుకుంది. 2022 నవంబర్ 30న రంగ ప్రవేశం చేసిన చాట్జీపీటీ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వినోదం, ఆటల కోసం కాకుండా నేర్చుకోవడానికి, రాయడానికి, కోడింగ్ కోసం, కంటెంట్ క్రియేట్ చేయడానికి దీనిని ఉపయోగిస్తున్నందున ప్రజాదరణ విపరీతంగా పెరిగింది. చాట్జీపీటీకి అంతర్జాతీయంగా 80 కోట్ల మంది నెలవారీ యాక్టివ్ యూజర్లున్నారు. 21 నెలల క్రితంతో పోలిస్తే చాట్జీపీటీ యాప్లో మూడు రెట్లు ఎక్కువ సమయాన్ని యూజర్లు వెచ్చిస్తున్నారు. చెల్లించేందుకూ సిద్ధం..ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. చాట్జీపీటీ పెయిడ్ సబ్స్క్రైబర్ల సంఖ్య గణనీయంగా పెరిగి 2 కోట్లు దాటింది. ఈ సంఖ్య సంవత్సరానికి 153 శాతం చొప్పున దూసుకెళుతోంది. ఈ ప్లాట్ఫామ్ మాతృ సంస్థ అయిన ఓపెన్ ఏఐకి పెద్ద మొత్తంలో ఆదాయ వనరుగా అవతరించింది. ఏడాదిలోనే ఈ మొత్తం పది రెట్లు పెరిగింది. చాట్బాట్ ఒక్కటే కంపెనీకి ఏటా రూ.31,709 కోట్ల ఆదాయాన్ని అందిస్తోంది. ఎక్కువ మంది యూజర్లు మెరుగైన ఫీచర్ల కోసం చెల్లించేందుకు వెనుకాడడం లేదు. డెస్క్టైమ్ అధ్యయనం ప్రకారం..ఏఐ జోరులో భారత్ అగ్రగామిగా కొనసాగుతుందనడంలో సందేహం లేదు. ఈ ధోరణి కారణంగా దేశం నుంచి మరిన్ని ఏఐ స్టార్టప్లు ఉద్భవించడానికి దారితీసే అవకాశం ఉంది. డెస్క్టైమ్ అధ్యయనం ప్రకారం 92.2% భారతీయ కార్యాలయాలు తమ రోజువారీ కార్యకలాపాలలో చాట్జీపీటీ వినియోగాన్ని అనుమతించాయి. చాట్జీపీటీని స్వీకరించడంలో అమెరికా కంటే భారత్ చాలా ముందుంది. యూఎస్ కార్యాలయాలలో 72.2% మాత్రమే చాట్జీపీటీని ఉపయోగిస్తున్నాయి. -
కోరేది కొండంత.. దాచేది పిసరంత!
సంపాదించుకోవాలి.. త్వరగా పదవీ విరమణ చేయాలి.. ఇదీ భారతీయ యువత ఆలోచన. ముఖ్యంగా 25 ఏళ్లలోపు వయసున్న ఉద్యోగుల్లో.. 43 శాతం మంది 45–55 సంవత్సరాలకే రిటైర్మెంట్ తీసుకోవాలని భావిస్తున్నారు. ముందస్తు పదవీ విరమణ కోరుకుంటున్నప్పటికీ 75% మంది తమ ఆదాయంలో కేవలం 1–15% మాత్రమే పెన్షన్ పథకాలకు కేటాయిస్తున్నారు. దేశంలో ప్రైవేటు రంగంలో పనిచేసేవారు, వ్యక్తిగతంగా ఉపాధి పొందుతున్నవారిపై ప్రముఖ ప్రొఫెషనల్ సేవల సంస్థ ‘గ్రాంట్ థోర్న్టన్ భారత్’చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నవారిలో.. తమ పదవీ విరమణ తరువాత ఆశిస్తున్న ఆదాయానికి, వారి ఆర్థిక ప్రణాళికలకు మధ్య చాలా అంతరం ఉంది. అంటే రిటైర్ అయ్యాక ఆశిస్తున్న ఆదాయం ఎక్కువ.. కానీ అందుకు తగ్గట్టుగా చేయాల్సిన పొదుపు మాత్రం తక్కువ అన్నమాట. ‘ఇండియాస్ పెన్షన్ ల్యాండ్స్కేప్: ఏ స్టడీ ఆన్ రిటైర్మెంట్ రియాలిటీ అండ్ రెడీనెస్’పేరుతో ‘గ్రాంట్ థోర్న్టన్ భారత్’సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది.2024 ఆగస్టు–సెప్టెంబర్ మధ్య నిర్వహించిన సర్వే ఆధారంగా దీన్ని రూపొందించారు. ఇందులో పాల్గొన్నవారిలో 79 శాతం మంది వయసు 25–54 ఏళ్లలోపే. 88 శాతం మంది ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నవారు కాగా, 5 శాతానికిపైగా వ్యక్తిగతంగా ఉపాధి పొందుతున్నవారు. వీరిలో వార్షికాదాయం రూ.5–10 లక్షలు ఉన్నవారు 12.6 శాతం కాగా, రూ.10–20 లక్షల మధ్య ఉన్నవారు 25.25 శాతం. రూ.20–30 లక్షల మధ్య ఆదాయార్జనపరులు 27.25 శాతం. రూ.40 లక్షలకుపైన ఆదాయం ఉన్నవారు 30.23 శాతం.సంపాదన ఉన్నప్పటికీ..56% మంది సంవత్సరానికి రూ.20 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్నప్పటికీ.. చాలా తక్కువ మందే పెన్షన్పథకాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. అధిక ఆదాయం సంపాదించేవారిలో 30% మంది నెలకు రూ.2 లక్షల కంటే ఎక్కువ పెన్షన్లు ఆశిస్తున్నారు. సంవత్సరానికి రూ.40 లక్షల కంటే ఎక్కువ సంపాదించేవారిలో 58% మంది పదవీ విరమణ కోసం వారి జీతంలో 1–15% మాత్రమే కేటాయిస్తున్నారు. రూ.20–30 లక్షల ఆదాయం ఆర్జించేవారిలో 75% మంది పెన్షన్కోసం తమ వేతనంలో 6–20% సమకూరుస్తున్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో సగం మందికి అటల్ పెన్షన్ యోజన గురించి అవగాహన లేదు. పెన్షన్ మొత్తాలను ఎలా లెక్కిస్తారో 30% మందికి తెలియదు. ఆర్థిక అక్షరాస్యత పెరగాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు చెబుతున్నాయి.రూ.లక్ష పెన్షన్ కావాలి55% మంది నెలకు రూ.లక్ష కంటే ఎక్కువ పెన్షన్ ఆశిస్తున్నారు. అయితే 11% మంది మాత్రమే తమ ప్రస్తుత పెట్టుబడులు ఈ అంచనాలను అందుకోవడానికి సరిపోతాయని నమ్ముతున్నారు. ప్రభుత్వ మద్దతు ఉన్న పెన్షన్ప్రణాళికల పట్ల సుమారు 39% మంది మొగ్గుచూపుతున్నారు. అధిక ముప్పు, అధిక రాబడి ఉన్న ప్రణాళికలు ముఖ్యంగా యువతను ఆకర్షిస్తున్నాయి. 25 ఏళ్లలోపు వారిలో 31% మంది ఈ పథకాలపై ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి నెలకు రూ.లక్ష పెన్షన్ పొందడానికి 30 ఏళ్ల వ్యక్తి 12% వార్షిక రాబడి, 6.75% యాన్యుటీ రేటును ఊహిస్తూ 60 సంవత్సరాల వయస్సు వరకు నెలకు రూ.6,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.సంప్రదాయ పెన్షన్..: 56% మంది 55–65 సంవత్సరాల మధ్య పదవీ విరమణ పొందాలని ఆలోచిస్తున్నారు. 45–50 ఏళ్ల మధ్య రిటైరైపోవాలని సుమారు 11 శాతం మంది చెప్పారు. 75% మంది తమ జీతంలో 15% లోపే పదవీ విరమణ పథకాలకు కేటాయిస్తున్నారు. అత్యధికులు ఇప్పటికీ సంప్రదాయ పెన్షన్ సాధనాలవైపే మొగ్గు చూపుతున్నారు. 35% మంది ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఎంచుకుంటున్నారు.తరువాత గ్రాట్యుటీ, జాతీయ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) మీద ఆధారపడుతున్నారు. అయితే, గ్రాట్యుటీ మాత్రమే సరిపోదని 99% మంది భావిస్తున్నారు. 32% మంది మాత్రమే ఎన్పీఎస్ పనితీరుతో సంతృప్తి చెందారు. ఈపీఎఫ్కు ప్రజాదరణ ఉన్నప్పటికీ దాని పనితీరుపై కేవలం 46% మంది మాత్రమే సంతృప్తిగా ఉన్నారు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) విషయంలో కూడా చాలా తక్కువ మందే ఆసక్తి చూపారు. పదవీ విరమణ తర్వాత స్థిర ఆదాయాన్ని అందించడంలో మంచివే అయినప్పటికీ 76% మంది యాన్యుటీ పథకాలలో పెట్టుబడి పెట్టడం లేదని నివేదిక వివరించింది.పొంచి ఉన్న సంక్షోభం..: శ్రామిక జనాభా పెరుగుతున్న కొద్దీ ఆశిస్తున్న పదవీ విరమణ అవసరాలు, వాస్తవ పొదుపుల మధ్య అంతరం స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని తగ్గించడానికి వ్యక్తుల జీవిత అవసరాలకు అనుగుణంగా ఉండే బలమైన పెన్షన్ వ్యవస్థ అవసరం. అత్యధికులు తమ గ్రాట్యుటీ మొత్తాలు సరిపోవని భావిస్తున్నారు. తక్కువ వార్షిక పెట్టుబడుల రేటు కారణంగా పదవీ విరమణ తర్వాత వచ్చే హామీ ఆదాయం విషయంలో అనిశ్చితి ఉంది. బలమైన ఆర్థిక విద్య, మరింత ఆకర్షణీయమైన పెన్షన్ ఉత్పత్తులు, అధిక పొదుపులను ప్రోత్సహించడానికి విధాన పరమైన సంస్కరణలు రాకపోతే రాబోయే దశాబ్దాలలో పదవీ విరమణ పొందిన వ్యక్తుల కుటుంబాల్లో సంక్షోభం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
పచ్చని కాపురాల్లో... వివాహేతర చిచ్చు
వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. తమ బంధానికి అడ్డుగా ఉన్నారన్న కారణంతో ఏకంగా హత్యలదాకా వ్యవహారం వెళ్తోంది. ఇలాంటి ఘటనల్లో ఎక్కువగా బాధితుల బిడ్డలు అనాథలుగా మారుతుండటం అందరినీ కలవరపెడుతోంది. ఈ మధ్యకాలంలో తరచూ ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. » సత్యసాయి జిల్లా దర్మవరం మండలం పోతుకుంట గ్రామానికి చెందిన ఓ వివాహితకు రొద్దం మండలానికి చెందిన పురుషుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అనుమానం వచ్చిన భర్త మంజునాథ్ నిత్యం వేధించసాగాడు. మధ్యలో అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి భార్య పన్నాగం పన్నింది. మద్యం మత్తులో ఉన్న భర్తను కిరాయి ఇచ్చి హత్య చేయించింది. గతేడాది జరిగిన ఈ ఘటనకు కారణాలు ఆలస్యంగా వెలుగు చూశాయి. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. ఏడాది తర్వాత మృతదేహాన్ని రీపోస్టుమార్టం చేయడంతో వాస్తవాలు వెలుగు చూశాయి. » సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం కుటాలపల్లిలో గతేడాది ఎన్నికల సమయంలో ఓ దారుణ హత్య వెలుగు చూసింది. ఇద్దరు వ్యక్తులు ఒకే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించడమే దీనికి కారణంగా తేలింది. అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో అమర్నాథ్రెడ్డి, శ్రీనివాసరెడ్డి ఒకరికి తెలియకుండా మరొకరు వివాహేతర సంబంధం కొనసాగించారు. అయితే ఆర్థిక లావాదేవీల్లో తేడా రావడంతో శ్రీనివాసరెడ్డి మరికొందరితో కలిసి అమర్నాథ్రెడ్డిని హతమార్చాడు. గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. సాక్షి, పుట్టపర్తి : రెండు మనసులు.. మూడు ముళ్లు.. ఏడు అడుగులతో ముడిపడిందే భార్యాభర్తల బంధం. జీవితాంతం ప్రేమ, ఆప్యాయతలతో పాటు కష్టసుఖాలు, కుటుంబ బాధ్యతలను మోసుకుంటూ ముందుకు సాగేదే సంసారం. ఈ పవిత్ర బంధం.. మనస్పర్థలు, అనుమానాలు, కుటుంబ కలహాలతో విచ్ఛిన్నం అవుతోంది. చిన్నపాటి మనస్పర్థల కారణంగా పరాయి వ్యక్తులతో చనువుగా పెరిగి.. సాన్నిహిత్యం ఏర్పడుతోంది. అదే వివాహేతర సంబంధాలకు దారి తీస్తోంది. అలాంటి సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు రేపుతున్నాయి. ఈ క్రమంలో కొంతమంది అడ్డు తొలగించుకునే క్రమంలో భర్తలను, ప్రియులను చంపేస్తున్నారు. ఫలితంగా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. చిన్నారులు అనాథలుగా మారుతున్నారు. హత్య చేసి పరారీ అవుతుండటంతో చిన్నారులు ఎవరి దగ్గర ఉండాలో అర్థం కాక బాల్యంలోనే కార్మికులుగా మారి అష్టకష్టాలు పడుతున్నారు. అఘాయిత్యాలకు దారి తీస్తూ.. వివాహేతర సంబంధాలతో భార్యభర్తల మధ్య మనస్ఫర్థలు పెరిగి అఘాయిత్యాలకు దారి తీస్తున్నాయి. ఇద్దరి మధ్యలోకి మరొకరు రావడంతో పరిస్థితులు నిమిషాల్లో మారిపోతున్నాయి. క్షణికావేశంతో హత్యలు, ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. దంపతుల్లో ఎవరో ఒకరు జైలుకు వెళ్లినా.. కనీసం బెయిల్ ఇప్పించేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో అలాంటి దంపతుల పిల్లలు అనాథలుగా మారుతున్నారు. అంతేకాదు వివాహేతర సంబంధాలతో ఎలాంటి పరిణామాలు జరిగినా.. వారి కుటుంబ సభ్యులు సమాజంలో తలెత్తుకొని తిరగలేని పరిస్థితి నెలకొంది.కారణాలు ఎన్నెన్నో.. » పని ఒత్తిడితో జీవిత భాగస్వామికి సరైన సమయం కేటాయించకపోవడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. » చిన్న సమస్యలను పెద్దవిగా చూస్తూ.. పదే పదే చర్చించి.. తల్లిదండ్రుల వరకూ వెళ్లడం.. ఆ తర్వాత పోలీస్స్టేషన్ల మెట్లు ఎక్కుతున్నారు. » జీవిత భాగస్వాములు తాము చెప్పినట్లు వినలేదంటూ ఇద్దరిలో ఎవరో ఒకరు దారి తప్పి సమస్యల ఊబిలో కూరుకుపోతున్నారు. » స్మార్ట్ఫోన్లను అతిగా వినియోగించి సోషల్ మీడియా పరిచయాలతో ప్రాణాల మీదికి తెచ్చుకోవడం. » మద్యానికి బానిసై ఆర్థిక సమస్యల్లో చిక్కుకుని .. కుటుంబ పోషణ గురించి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుండటం కూడా కారణమవుతోంది. సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి దంపతుల మధ్య మనస్పర్థలు రావడం సహజమే. అయితే క్షణికావేశాలకు వెళ్లకుండా.. సామరస్యంగా ఇద్దరూ పరిష్కార మార్గం ఎంచుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. వివాహం జరిగిన కొత్తలో మనస్ఫర్థలు వచ్చినా.. వెంటనే సరిదిద్దుకోవాలి. అయితే ఇరవై ఏళ్ల దాంపత్య జీవితంలో కూడా ఇంకా సమస్యలు వెలుగు చూస్తుండటం అవగాహన లోపమే. దంపతులిద్దరూ పిల్లలు, కుటుంబ బాధ్యతల గురించి తెలుసుకుంటే ఎలాంటి మనస్పర్థలు రావు. క్షణికావేశంతో తీసుకునే నిర్ణయాలతో కుటుంబం రోడ్డున పడుతుంది. అంతేకాకుండా చిన్నారులు అనాథలుగా మారాల్సి వస్తోంది. – వి.రత్న, సత్యసాయి జిల్లా ఎస్పీ -
180 మీటర్ల రైడ్కు ఓలా!
రద్దీ ట్రాఫిక్లో త్రిచక్ర వాహనాలు, కార్లు రయ్మని దూసుకుపోవడం కష్టం. ఈ ట్రాఫిక్ కష్టాలను ద్విచక్ర వాహనాలు అంటే బైక్లు సులువుగా తగ్గిస్తాయి. ఇదే బాధతో ఒక కస్టమర్ సైతం తన బైక్ను బుక్ చేసుకుని ఉంటారని భావించిన ఒక ఓలా రైడర్కు ఊహించని ఘటన ఎదురైంది. నవ్వు తెప్పించే ఆ ఘటన వివరాలను ఆ రైడర్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ‘రోహిత్ వ్లోగ్స్టర్’లో పొందుపరిచారు. ఒక టీనేజీ అమ్మాయి బుక్ చేసిన ఆ రైడ్ తాలూకు పూర్తి వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్చేయగా కొన్ని గంటల్లోనే 20 లక్షల మంది చూశారు. ఈ వీడియో చూశాక నెటిజన్లు ఆపకుండా కామెంట్లు పెట్టడం మొదలెట్టారు.ఇంతకీ ఆ వీడియోలో ఏముంది?పట్టపగలు నిర్మానుష్యంగా ఉన్న వీధిలో ఒక టీనేజర్ నుంచి ఓలా బైక్ రైడ్ బుక్ అవడంతో సంబంధిత అబ్బాయి వెంటనే లొకేషన్కు చేరుకున్నాడు. ట్రాఫిక్ ఏమీ లేకున్నా అమ్మాయి బైక్ ఎందుకు బుక్చేసుకుందా అని ఒకింత అనుమానంగా చూశాడు. అమ్మాయిని బైక్ మీద ఎక్కించుకోవడానికి ముందుగా గమ్యస్థానాన్ని యాప్లో సరిచూశాడు. ఇక్కడి నుంచి గమ్యస్థానం కేవలం 180 మీటర్లదూరంలో ఉండటం చూసి అవాక్కయ్యాడు. ఇంత తక్కువ దూరానికి బైక్ అవసరమా? అని నేరుగా అడిగేశాడు. ‘‘ దూరం తక్కువే. కానీ కుక్కలే ఎక్కువ’’ అని అమ్మాయి చెప్పిన సమాధానంతో పక్కున నవ్వేశాడు. వీధి శునకాల సమస్యకు అమ్మాయి కనుక్కున్న పరిష్కారం చూసి మెచ్చుకున్నాడు. వెంటనే అమ్మాయిని బైక్ మీద ఎక్కించుకుని గమ్యస్థానంలో దింపాడు. అంత తక్కువ దూరానికి కేవలం రూ.19 బిల్లు అయ్యింది. ఆ బిల్లు చెల్లించేసి అమ్మాయి చకచకా వెళ్లిపోవడం చూసి అవాక్కవడం అబ్బాయి వంతయింది. ‘ View this post on Instagram A post shared by ROHIT VLOGSTER (@rohitvlogster) 180 మీటర్లకు కూడా బైక్ బుక్ చేయొచ్చని నాకూ ఇప్పుడే అర్థమైంది. రైడ్ స్టార్ట్ చేసి అమ్మాయిని కారణం అడిగి, ఆమె నుంచి సమాధానం పూర్తిగా వినేలోపే స్టాప్ వచ్చేసింది’’ అని రైడర్ ఒక పోస్ట్లో పేర్కొన్నాడు. సంబంధిత వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. కొందరు నెటిజన్లు స్ట్రీట్ డాగ్కు డాగేశ్ అనే పేరు పెట్టి.. ‘డాగేశ్ ఉన్నాడంటే ఎవరైనా ఆ మాత్రం భయపడాల్సిందే’ అని వ్యాఖ్యానించారు. డాగేశ్ అంటే మజాకానా!! అని మరొకరు స్పందించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కేన్సర్ను అరికట్టే ఔషధాహారం!
సాక్షి, సాగుబడి: భవిష్యత్తులో కేన్సర్ చికిత్సలో భాగంగా వైద్యులు కొన్ని రకాల బియ్యం లేదా బియ్యం తవుడుతో చేసే ఆహారాన్ని సూచించవచ్చు. అవి తింటే కేన్సర్ రాకపోవచ్చు, వచ్చినా తగ్గిపోవచ్చు. అంటే చాలా తక్కువ ఖర్చుతోనే కేన్సర్ను అరికట్టేయవచ్చు. ఆశ్చర్యంగా అనిపిస్తున్న దీన్ని సుసాధ్యం చేస్తోంది ఫిలిప్పీన్స్లోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఇరి). 3 రకాల ఊదా, ఎరుపు రంగు వరి బియ్యంపై పొర(తవుడు)లో కేన్సర్లను అరికట్టే ఔషధ పదార్థాన్ని వెలికితీసి, ఔషధాహారాన్ని విజయవంతంగా రూపొందించారు అక్కడి శాస్త్రవేత్తలు. కొలొరెక్టల్ కేన్సర్ (పెద్దపేగు+గుదద్వారం కేన్సర్), రొమ్ము కేన్సర్లను అరికట్టడానికి ఈ ఫుడ్ సప్లిమెంట్ దోహదపడుతుంది.కేన్సర్ కణాలపై దీని పనితీరును ‘ఇరి’ ప్రయోగశాలలో పరీక్షించి అద్భుత ఫలితాలు సాధించారు. ఈ ప్రతిష్టాత్మక పరిశోధనకు సారథ్యం వహిస్తున్న ‘ఇరి’ ప్రధాన శాస్త్రవేత్త, తెలుగువారైన డాక్టర్ నెసె శ్రీనివాసులు ఈ విశేషాలను టెలిఫోన్ ఇంటర్వ్యూలో ‘సాక్షి’కి వెల్లడించారు.ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు పెనుముప్పుగా పరిణమించిన కేన్సర్ మహమ్మారికి ముకుతాడు వేసే అద్భుత ‘ఔషధాహారం’ అందుబాటులోకి రానుంది. పురాతన వరి వంగడాల్లో కేన్సర్లను అరికట్టే అద్భుత ఔషధ గుణాలున్నట్లు ఫిలిప్పీన్స్లోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఇరి) శాస్త్రవేత్తలు తాజా పరిశోధనల్లో కనుగొన్నారు. ఈ పరిశోధనలో కీలకపాత్ర పోషించింది ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ నెసె శ్రీనివాసులు. ప్రస్తుతం ఈయన ఇరిలో కంజ్యూమర్ డ్రివెన్ గ్రెయిన్ క్వాలిటీ – న్యూట్రిషన్ సెంటర్ అధిపతిగా ఉన్నారు. ఈయన తల్లిది అనంతపురం. ఈయన పెరిగింది కర్ణాటకలో.3 రకాల పురాతన వరి రకాలతో..ప్రపంచవ్యాప్తంగా 1,32,000 పురాతన వరి వంగడాలున్నాయి. వీటిలో చాలా వరకు తెల్లబియ్యం రకాలే. రకరకాల రంగుల బియ్యం రకాలు 800. వీటిలో పోషకాలపై జరిపిన పరిశోధనల్లో 6 రకాల్లో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ కేన్సర్ ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నట్లు ‘ఇరి’ గుర్తించింది. ప్రస్తుత పరిశోధనలో 3 రకాలను శాస్త్రవేత్తలు వాడారు. ఫిలిప్పీన్స్ కు చెందిన ఎరుపు, ఊదా కలసిన రంగు గల ‘బాలాటినో’ రకం బియ్యం, ‘కింటుమాన్’ అనే ఎర్ర బియ్యంతో పాటు ఇండోనేíసియాకు చెందిన ఎరుపు, ఊదా కలసిన రంగుండే కేతన్ హితం’ అనే పురాతన రకాలను వాడారు. ఈ బియ్యపు తవుడులోని ఔషధ విలువలున్న పదార్థాన్ని ఉపయోగించి కేన్సర్ను అరికట్టే ఫుడ్ సప్లిమెంట్ను తయారు చేశారు. ఇది పొడి లేదా ద్రవ రూపంలో ప్రజలకు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.ఒక్క గ్రాము చాలు!300 గ్రాముల బియ్యం నుంచి తీసిన తవుడుతో 1 కిలో ఫుడ్ సప్లిమెంట్ను ఉత్పత్తి చేయవచ్చు. కేన్సర్ నిరోధక లక్షణాన్ని మనిషి దేహంలో కలిగించడానికి కనీసం 1 గ్రాము సరిపోతుందని డా.శ్రీనివాసులు తెలిపారు. కేన్సర్ రోగుల కణాలపై ప్రయోగశాలలో ఈ ఔషధాహారంతో నిర్వహించిన పరీక్షల్లో అద్భుత ఫలితాలు వచ్చాయి. ఈ రెండు రకాల కేన్సర్ రోగులకు ఇస్తున్న కీమోథెరపీ ఔషధం ‘డోక్సోరుబిసిన్’తో సరిసమానమైన ఫలితాలను.. ఈ ఫుడ్ సప్లిమెంట్ ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. త్వరలో దీన్ని ఎలుకలపైన, ఆ తర్వాత కేన్సర్ రోగులపైన ప్రయోగించబోతున్నామని వెల్లడించారు.సాంబమసూరిలోకి ఈ జన్యువులుఈ 3 రకాల పురాతన వరి వంగడాల్లోని కేన్సర్ నిరోధక ఔషధ గుణాలకు కారణమైన జన్యువులు ఏవో గుర్తించేందుకు ‘ఇరి’లో పరిశోధన కొనసాగుతోంది. ‘ఈ పరిశోధన పూర్తయ్యాక అధిక దిగుబడినిచ్చే మన సాంబమసూరి వరి వంగడంలోకి ఈ ఔషధ గుణాలున్న జన్యువులను జన్యు సవరణ ప్రక్రియ ద్వారా జోడిస్తాం. ఆ సరికొత్త సాంబమసూరి ముడి బియ్యాన్ని అన్నంగా వండుకొని తినొచ్చు.ఫుడ్ సప్లిమెంట్ తింటే వంద శాతం ఫలితం ఉంటుంది. వండిన అన్నం తింటే.. అందులోని కేన్సర్ నిరోధక ఔషధ గుణం 70% వరకు వంటపడుతుంది. కేన్సర్ కణాలు క్రమంగా కోలుకొని సాధారణ స్థితికి వస్తాయి. ఆరోగ్యంగా ఉన్న కణాలకు ఎలాంటి హానీ జరగదని కూడా మా ప్రయోగశాలలో రూఢీ అయ్యింది. ఇది స్వల్ప ఖర్చుతో కేన్సర్ను అరికట్టే మార్గంగా ప్రపంచం ముందుకు వస్తోంది’ అని డా. శ్రీనివాసులు వివరించారు. -
ఈశాన్యాన భగభగలు
ఈశాన్య భారతంలో పచ్చదనానికి మారుపేరైన అరుణాచల్ప్రదేశ్, మణిపూర్లో అటవీ విస్తీర్ణం శరవేగంగా తగ్గిపోతోంది. కార్చిచ్చులను సకాలంలో గుర్తించి అదుపు చేయకపోవడం, విచ్చలవిడి పోడు వ్యవసాయం, గంజాయి వంటివాటి అక్రమ సాగు, రోడ్లు, రైల్వే తదితర మౌలిక అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భారీగా భూ సేకరణ తదితరాలు ఇందుకు కారణమని ప్రముఖ భూ పరిశీలన, విశ్లేషణ సంస్థ సుహోరా టెక్నాలజీస్ అధ్యయనం వెల్లడించింది. రెండు రాష్ట్రాలకు సంబంధించి గత నాలుగేళ్ల ఉపగ్రహ డేటాను లోతుగా విశ్లేíÙంచిన మీదట ప్రమాదకర అంశాలు వెలుగులోకి వచి్చనట్టు తెలిపింది. ముఖ్యంగా దట్టమైన అడవుల లోపలి, మారుమూల ప్రాంతాల్లో రేగే కార్చిచ్చులు పెను నష్టానికి కారణమవుతున్నాయి. అరుణాచల్లోని నందిపార్ ప్రాంతంలో గత ఏప్రిల్ 24న రేగిన భారీ కార్చిచ్చు భారీ నష్టం మిగిల్చింది. ఒక్క రోజులోనే ఏకంగా 10 వేల ఎకరాలకు పైగా అటవీ ప్రాంతం బుగ్గిగా మారింది. ప్లానెట్స్కోప్ ఉపగ్రహ చిత్రాల సాయంతో జరిపిన విశ్లేషణ ద్వారా సుహోరా ఈ మేరకు వెల్లడించింది. ఇలాంటి కార్చిచ్చులను ఉపగ్రహ డేటా సాయంతో ఆదిలోనే గుర్తించి అదుపు చేయవచ్చని పేర్కొంది. ఇక జీవవైవిధ్యానికి మారుపేరైన మణిపూర్లో 2001 నుంచే అటవీ విస్తీర్ణంలో భారీ తగ్గుదల నమోదవుతూ వస్తోంది! రాష్ట్రంలో గత నాలుగేళ్లలో 21,100 హెక్టార్ల అటవీ భూమి మాయమైనట్టు గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ పేర్కొంది. ఇందులో ఏకంగా 17,800 హెక్టార్ల అటవీ భూమిని ఒక్క 2024లోనే కోల్పోయిందని వెల్లడించింది. ఫలితంగా 91 కోట్ల మెట్రిక్ టన్నుల అదనపు కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి విడుదలైనట్టు పేర్కొంది. కార్చిచ్చుకు తోడు పోడు, గంజాయి వంటివాటి అక్రమ సాగు, జనం వంట చెరుకుపై ఆధారపడుతుండటం, రోడ్లు, రైల్వే వంటి మౌలిక ప్రాజెక్టులు ఇందుకు కారణమని అధ్యయనం తేల్చింది. పచ్చదనపు తొడుగు లేకపోవడంలో కొన్నేళ్లుగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం పెరగడమే గాక వర్షపాత ధోరణులు కూడా బాగా మారిపోయినట్టు వివరించింది. తక్షణం దిద్దుబాటు చర్యలు తీసుకోని పక్షంలో ఈశాన్య భారతంలో పెను పర్యావరణ సంక్షోభం తప్పదని హెచ్చరించింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
సముద్రాలకు ఎండదెబ్బ
‘ఎండ దెబ్బ’కు మహాసముద్రాలు అతలాకుతలమై పోతున్నాయి. ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, ఇండొనేసియాలతో కూడిన వాయవ్య పసిఫిక్ ప్రాంత సముద్ర జలాల్లో 2024లో రికార్డు స్థాయిలో ఏకంగా అర డిగ్రీ సెంటీగ్రేడ్ మేరకు అధిక ఉష్ణోగ్రత నమోదైంది. దాంతో పసిఫక్ మహాసముద్ర జలాలు ఏకంగా 4 కోట్ల చదరపు కి.మీ. మేరకు కనీవిని ఎరుగని రీతిలో వేడెక్కిపోయాయి. ఆ పరిధిలోని జీవజాలాన్ని కూడా ఈ పరిణామం తీవ్రంగా ప్రభావితం చేసింది. అరుదైన కోరల్ రీఫ్స్ వంటివాటి ఉనికే ప్రమాదంలో పడింది. అంతేగాక ఇండొనేసియాలోని న్యూ గినియా దీవుల్లో ఉన్న ఆ ప్రాంతపు ఏకైక గ్లేసియర్ ఏడాదిలోనే సగం మేరకు కరిగిపోయింది. ఎండలు ఇలాగే పెరిగిపోతే మరో ఏడాదికల్లా అది పూర్తిగా మాయం కావడం ఖాయమని ఐరాస వాతావరణ విభాగమైన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) జోస్యం చెప్పింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్ల్లో గతేడాది ఎండలు సరికొత్త రికార్డులు సృష్టించాయని గురువారం విడుదల చేసిన వార్షిక నివేదికలో వెల్లడించింది. ‘‘ప్రపంచమైన ఎండల నడుమ వాయవ్య పసిఫిక్ ప్రాంత దేశమైన ఫిలిప్పీన్స్పై గత అక్టోబర్, నవంబర్ నెలల్లో లెక్కలేనన్ని తుపాన్లు విరుచుకుపడ్డాయి! ఈ విపరిణామాలన్నింటికీ వాతావరణ మార్పులే ప్రధాన కారణం’’ అంటూ వాపోయింది. మొత్తంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత కూడా 2024లో రికార్డు స్థాయిలో పెరిగిపోయిందని అధ్యయనకర్తల్లో ఒకరైన బ్లెయిర్ ట్రెవిన్ వివరించారు. ‘‘మొత్తం పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతను చూసుకున్నా 2022 తర్వాత రెండో అత్యధిక పెరుగుదలను నమోదు చేసింది! అక్కడి సముద్రమట్టాలు ప్రపంచ సగటుతో పోలిస్తే శరవేగంగా పెరిగిపోతున్నాయి. ఇవన్నీ చాలా ప్రమాదకర పరిణామాలే. ఎందుకంటే వాయవ్య పసిఫిక్ ప్రాంత జనాభాలో ఏకంగా సగానికి పైగా తీరానికి కేవలం అర కిలోమీటర్ దూరంలోనే నివసిస్తున్నారు’’ అని హెచ్చరించారు. సముద్రమట్టాల పెరుగుదల వేగం ఇలాగే కొనసాగితే వారంతా అతి త్వరలో నిర్వాసితులుగా మారి పొట్ట చేత పట్టుకుని వలస పోవడం తప్ప మరో మార్గం ఉండదని అధ్యయన బృంద సభ్యుడు థియా తుర్కింగ్టన్ అభిప్రాయపడ్డారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈ రేయి వేడైనది..!
ఈ రేయి చల్లనిది అని పాడుకునే రోజులు పోయాయి. పగటి ఉష్ణోగ్రతలు మాదిరే రాత్రి కూడా వేడి వాతావరణం వేధించే రోజులు వచ్చేశాయి. అదీ చాలా ప్రమాదకర స్థాయిలో ఉండటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. రాత్రి వేడి వాతావరణం ఉండే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ టాప్–2లో ఉందని కేంద్ర ఇంధన, పర్యావరణ, నీటి మండలి (సీఈఈఈడబ్ల్యూ) చేసిన ‘హౌ ఎక్స్ట్రీమ్ హీట్ ఇంపాక్టింగ్ ఇండియా’ అనే తాజా అధ్యయనంలో వెల్లడైంది. తాజాగా విడుదలైన ఈ అధ్యయనం దేశంలో నాలుగు దశాబ్దాల వాతావరణ ఆధారిత ఉష్ణోగ్రతలను అంచనా వేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రాత్రిపూట వేడి పెరుగుతోందని హెచ్చరించింది. –సాక్షి, అమరావతిఐదు రెట్లు పెరిగిన రాత్రి వేడిదేశ వ్యాప్తంగా 734 జిల్లాల్లో వేడి ప్రమాదకర స్థాయిని అంచనా వేయడానికి 35 సూచికలను సీఈఈఈడబ్ల్యూ ఉపయోగించింది. తద్వారా 417 జిల్లాల్లో అత్యధిక ప్రమాదకరంగా వేడి పెరుగుతున్నట్లు గుర్తించింది. వేడి ఉష్ణోగ్రతల ప్రమాదం స్థాయి 201 జిల్లాల్లో మధ్యస్థంగానూ, 116 జిల్లాల్లో తక్కువగానూ ఉన్నట్లు తేల్చింది. కాగా ఇందులో ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, గోవా, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్లు టాప్ 10లో ఉన్నాయి. 1982–2011 బేస్ లైన్తో పోలిస్తే గత దశాబ్దం(2012–2022) 70 శాతం జిల్లాల్లో వేసవిలో ఐదు రెట్లు వేడి పెరిగింది. 10 శాతం తేమ పెరిగిందని కూడా ఈ అధ్యయనం తెలిపింది. ఒక మెరుగైన ఇల్లు అంటే చలికాలంలో వెచ్చగా, వేసవిలో చల్లగా ఉండాలని ప్రముఖ గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ అనేవారట. ఆధునిక నాగరికతకు ముందే భవనాలను చలికాలంలో సూర్యరశ్మిని గ్రహించేలా, వేసవిలో నీడ ఎక్కువగా ఉండేలా ఇళ్లను నిర్మించేవారు. మళ్లీ అలాంటి సాంకేతికతతో భవన నిర్మాణాలు చేయాల్సిన ఆవశ్యకత నెలకొంది.పగలూ రాత్రీ ఏకమైపోతాయిగత ఐదు దశాబ్దాల్లో 700కు పైగా వేడి తరంగాల కారణంగా 17 వేల మంది మరణించారని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) ఇటీవల వెల్లడించింది. ఎక్కువకాలం ఉండే వేడి రాత్రుల యుగంలోకి ప్రవేశిస్తున్నామని సీఈఈఈడబ్ల్యూ అధ్యయనం ఇప్పుడు హెచ్చరించింది. ఈ పరిస్థితులను వెంటనే అర్థం చేసుకుని వాతావరణాన్ని చల్లబరిచేందుకు అత్యవసర చర్యలు చేపట్టకపోతే కొన్నేళ్లకు సూర్యుడు అస్తమించే సమయం తగ్గిపోతుందని, అంటే రాత్రి కూడా పగలుగానే మారిపోతుందని అధ్యయనం స్పష్టం చేసింది. హీట్ యాక్షన్ ప్లాన్స్(హెచ్ఎపీ) జాతీయ స్థాయిలో చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని చెబుతోంది. -
రూ.1 తయారీకి.. రూ.1.11 వ్యయం
ఒక రూపాయి బిళ్ల తయారవడానికి ఒక రూపాయి 11 పైసలు కావాలి. అదే 10 రూపాయల బిళ్లకైతే రూ.5.54. రూ.10 నోటు మన చేతిలోకి రావడానికి సుమారు ఒక రూపాయి ఖర్చవుతోంది. కరెన్సీ తయారవ్వాలన్నా కరెన్సీ కావాల్సిందే. ఈ ఖర్చు ఏటా భారీగా పెరిగిపోతోంది. 2024–25లో కరెన్సీ ముద్రణకు ఏకంగా రూ.6,373 కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 25 శాతం ఎక్కువ. నాలుగేళ్లలో ఖర్చు 58.8 శాతం పెరిగిపోయింది. – సాక్షి, స్పెషల్ డెస్క్కరెన్సీ నోట్లను కొంత మంది పర్సులోనో, జేబులోనో కుక్కిపెడతారు. పాడవుతాయన్న పట్టింపు ఉండదు. చినిగిపోయినా ఏముందిలే ఏ షాపులోనైనా తీసుకుంటారు అన్న ధీమా. లేదంటే బ్యాంకులో మార్చుకోవచ్చని తేలిగ్గా తీసుకుంటారు. మా డబ్బులు మా ఇష్టం అని కొట్టిపారేయకండి. కరెన్సీ నోటు కూడా ఖర్చు పెట్టి తయారుచేయాల్సిందే. ఎందుకంటే తయారీ, పంపిణీ వ్యయాన్ని జోడిస్తే ఆ కరెన్సీ విలువ మీకు కనిపించే అంకెను మించి ఉంటుంది.కరెన్సీ తయారీలో వాడే సిరా, కాగితం వంటి ముడి సరుకు వ్యయాలకుతోడు సిబ్బంది వేతనాలూ పెరిగాయి. దీని ఫలితంగా ముద్రణ ఖర్చు పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల తన వార్షిక నివేదికలో వెల్లడించింది. అంతేగాక నకిలీ నోట్లను చెక్ పెట్టేందుకు ఎప్పటికప్పుడు నూతన సెక్యూరిటీ ఫీచర్లను జోడించడం కూడా ఖర్చును పెంచిందని ఆర్బీఐ చెబుతోంది. పెరిగిన నోట్ల సరఫరాఆర్బీఐ నివేదిక ప్రకారం.. 2020–21లో నోట్ల ముద్రణకు రూ.4,012 కోట్ల ఖర్చు అయింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ వ్యయం కాస్తా రూ.6,373 కోట్లకు చేరింది. అంటే నాలుగేళ్లలో 58.8 శాతం ఎగసిందన్నమాట. 2023–24లో కరెన్సీ ముద్రణ ఖర్చులు రూ.5,101 కోట్లు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. నాలుగేళ్లలో దేశంలో నోట్ల సరఫరా దాదాపు 2,233 కోట్ల నుంచి 35.7 శాతం పెరిగి 3,030 కోట్లకు చేరింది. ఆర్బీఐకి కరెన్సీ నోట్లు నాలుగు ప్రింటింగ్ ప్రెస్ల నుంచి వస్తాయి. ఇందులో నాసిక్ (మహారాష్ట్ర), దేవాస్ (మధ్యప్రదేశ్) ప్రెస్లు భారత ప్రభుత్వానికి చెందినవి. మైసూర్ (కర్ణాటక), సల్బోని (పశ్చిమ బెంగాల్) ప్రెస్లు రిజర్వ్ బ్యాంక్ అనుబంధ సంస్థ అయిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ లిమిటెడ్ యాజమాన్యంలో ఉన్నాయి. మూడు రకాల కరెన్సీచెలామణిలో ఉన్న కరెన్సీలో భారత్లో ప్రస్తుతం బ్యాంకు నోట్లతోపాటు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ), నాణేలు ఉన్నాయి. 2024–25లో దేశంలో చెలామణిలో ఉన్న బ్యాంకు నోట్ల విలువ 6 శాతం, పరిమాణం (నోట్ల సంఖ్య) 5.6 శాతం పెరిగింది. 2023 మేలో రూ.2000 నోట్ల ఉపసంహరణ ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. నాటి నుంచి రూ.3.56 లక్షల కోట్లలో 98.2% విలువైన నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయి. రూ.500 నోట్ల హవాగత ఆర్థిక సంవత్సరంలో విలువ పరంగా రూ.500 నోట్ల వాటా ఏకంగా 86 శాతంగా ఉంది. ఏడాదిలో వీటి విలువ స్వల్పంగా తగ్గింది. పరిమాణం పరంగా రూ.500 నోట్ల వాటా 40.9 శాతం ఉంది. చెలామణిలో ఉన్న మొత్తం నోట్లలో రూ.500 నోట్ల వాటాయే అత్యధికం. పరిమాణం పరంగా తరువాతి స్థానాన్ని రూ.10 నోట్లు కైవసం చేసుకున్నాయి. వీటి వాటా మొత్తం పరిమాణంలో 16.4 శాతం. చెలామణిలో ఉన్న నోట్లలో రూ.10, రూ.20, రూ.50 నోట్ల మొత్తం వాటా 31.7 శాతం. గత ఆర్థిక సంవత్సరం చెలామణిలో ఉన్న నాణేల విలువ 9.6 శాతం, సంఖ్య 3.6 శాతం దూసుకెళ్లింది. 2025 మార్చి 31 నాటికి చెలామణిలో ఉన్న మొత్తం నాణేల పరిమాణంలో రూ.1, రూ.2, రూ.5 నాణేల వాటా 81.6 శాతం. విలువ పరంగా ఈ నాణేల వాటా 64.2 శాతానికి చేరింది. ఈ–రుపీ కొత్త రికార్డు2024–25లో చెలామణిలో ఉన్న ఈ–రుపీ విలువ 334 శాతం పెరిగింది. 2025 మార్చి 31 నాటికి ఆర్బీఐ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) విలువ రిటైల్ రూపంలో (చెలామణిలో) నాలుగు రెట్లు పెరిగి రూ.1,016.46 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది కేవలం రూ.234 కోట్లు. ఈ–రుపీ డిజిటల్ రూపంలో పనిచేసే నగదు. వినియోగదారులు దీన్ని నిల్వ చేయడంతోపాటు బదిలీ కూడా చేయొచ్చు. 2025 మార్చి నాటికి 17 బ్యాంకులు డిజిటల్ వాలెట్స్ ద్వారా ఈ–రుపీని అందిస్తున్నాయి. దీన్ని 60 లక్షల మంది వినియోగిస్తున్నారు. పెరిగిన నకిలీ రూ.500 నోట్లు 2024–25లో బ్యాంకింగ్ వ్యవస్థలో నకిలీ రూ.500 నోట్ల సంఖ్య 37.3 శాతం పెరిగిందని ఆర్బీఐ వెల్లడించింది. రూ.5.88 కోట్ల విలువైన 1.18 లక్షల నకిలీ రూ.500 నోట్లు (కొత్త డిజైన్) కనుక్కొన్నారు. 2023–24లో రూ.4.28 కోట్ల విలువైన 85,711 నకిలీ నోట్లు గుర్తించారు. నకిలీ రూ.200 నోట్లు 13.9% పెరిగాయి. రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ. 2000 నోట్లలో నకిలీవి.. గతేడాదితో పోలిస్తే వరుసగా 32.3, 14, 21.8, 23 శాతం పెరిగాయి. నకిలీ రూ.2000 నోట్ల సంఖ్య ఏడాదిలో 26,035 నుంచి 3,508 నోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం నకిలీ నోట్ల సంఖ్య 2.17 లక్షలు. అంత క్రితం ఏడాది ఈ సంఖ్య 2.22 లక్షల నోట్లు. -
పర్యావరణ విలాపం
యుద్ధం కొనసాగినన్ని రోజులూ రణ క్షేత్రాల్లో ఎక్కడ చూసినా రక్తతర్పణమే. సైనికుల రుధిరంతో తడిసి ముద్దయిన భూములు మాత్రమే కాదు పరోక్షంగా కోట్లాది ఎకరాల్లో సాగుభూమి, జనావాస ప్రాంతాలు ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్ఈపీ), 2024 నివేదిక స్పష్టంచేసింది. హౌతీల తిరుగుబాటు, హమాస్–ఇజ్రాయెల్ యుద్ధం, ఉక్రెయిన్–రష్యా యుద్ధంతోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో జరుగుతున్న అంతర్యుద్ధాలు, ఘర్షణలు చివరకు పర్యావరణ సంక్షోభాగ్నుల్ని మరింత ఎగసిపడేలా చేస్తున్నాయని యూఎన్ఈపీ నివేదిక వెల్లడించింది. సరిహద్దు వివాదాలు మొదలు అంతర్జాతీయ విధానాలదాకా పొరుగు దేశాలు, శత్రుదేశాల మధ్య వైరం తుదకు పర్యావరణాన్ని మరింతగా నాశనంచేస్తోందని నివేదిక హెచ్చరిస్తోంది. దశాబ్దాల క్రితమే జీవాయుధాలు ప్రయోగించి కిలోమీటర్ల కొద్దీ జనావాసాలను విషవాయువులతో గరళమయం చేసిన దేశాల దుష్టాంతాలనూ నివేదిక గుర్తుచేసింది. యుద్దాల వేళ శత్రు దేశాల జలాశయాలను, ఆనకట్టలపై బాంబులేసి నేలమట్టంచేయడంతో వందల కోట్ల లీటర్ల తాగు,సాగునీరు దిగువ ప్రాంతాలను ముంచేసి లక్షల ఎకరాల సాగుభూములు నీటమునుగుతున్నాయి. ఆనకట్టల నీరు సమీప ప్రాంతాల్లో గనుల తవ్వకాన్ని స్తంభింపజేస్తోంది. ఆయా నదీ ప్రవాహాల వెంట జీవవైవిధ్యం సైతం ధ్వంసమవుతోంది. మైదాన ప్రాంతాలు, పీఠభూములు సైతం నామరూపాల్లేకుండా నాశనమవుతున్నాయి. ఇలా ఆయా దేశాల్లో పర్యావరణం పతనమవుతోంది. జీవవైవిధ్యానికి గొడ్డలిపెట్టు1990 దశకం నుంచి చూస్తే ఇప్పటిదాకా ఎన్నో యుద్ధాలు మరెన్నో రకాలుగా పర్యావరణ విధ్వంసానికి ప్రధాన కారణమయ్యాయి. 1990 దశకంలో యుద్ధంలో భాగంగా కువైట్లోని 700కుపైగా చమురు బావులకు ఇరాక్ సేనలు నిప్పు పెట్టాయి. దీంతో రోజుకు 50 లక్షల బ్యారెళ్ల చమురు అగ్నికి ఆహుతై నల్లటి మేఘాలు యావత్ ప్రాంతంలో కమ్మేశాయి. దీంతో అంతులేని పర్యావరణ విధ్వంసం జరిగింది. చమురుబావులు ఏకధాటిగా ఏడు నెలలపాటు తగలబడి చరిత్రలో ఎన్నడూ లేనంతటి పొగను సహజావరణలోకి వెదజల్లాయి. సమీప సముద్ర ఉపరితలజలాలు సైతం విస్తృతంగా పరుచుకున్న చమురు తెట్టతో పాడైపోయాయి. దీంతో పర్యావరణ సమతుల్యత బాగా దెబ్బతింది. కువైట్ లోని 99 శాతం మంచినీటి సరస్సులు కాలుష్యకాసారాలుగా మిగిలిపోయాయి. వాయుకాలుష్యానికితోడు ఆ రీజియన్లో మెజారిటీ ప్రజలకు శ్వాససంబంధ వ్యాధులు ప్రబలాయి. ఈ ఘటనతో ప్రపంచం ఆర్థికగాయాలను చవిచూడాల్సి వచ్చింది. ఆతర్వాతి నుంచే ముడి చమురు ధరలు వడివడిగా పెరగడం మొదలైంది.ఆనకట్టల పేల్చివేతతో అంతులేని విధ్వంసంఉక్రెయిన్పైకి దురాక్రమణ జెండాతో దూసుకొస్తున్న రష్యా వైమానిక దళాలు 2023లో కఖోవ్కా ఆనకట్టను రాత్రికిరాత్రే పేల్చేశారు. దీంతో డ్యామ్లోని అపార జలరాశి దిగువ ప్రాంతాల్లోకి వృథాగా పోయింది. దిగువ ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. 5 లక్షల ఎకరాల్లో పంటభూములు పూర్తిగా నాశనమయ్యాయి. గనులు, చమురు బావులు, పారిశ్రామిక వ్యర్థాలు మొత్తం డినిప్రో నది, నల్లసముద్ర పరీవాహక ప్రాంతాల్లోకి కొట్టుకొచ్చి పర్యావరణ విధ్వంసాన్ని మరింత పెంచాయి. ఇలా ఒక్క కఖోవ్కా డ్యామ్ పేల్చివేతతో దాదాపు వేయికిపైగా ప్రాంతాల్లో పర్యావరణం కోలుకోనంతగా పాడైపోయిందని నివేదిక పేర్కొంది. జీవవైవిధ్యం ధ్వంసమవడంతోపాటు వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలు రోడ్డునపడ్డాయి.తాజాగా గాజాలో..గాజాలో ఇజ్రాయెల్ విధ్వంసం ఇంకా కొనసాగుతోంది. భవ నాలు, రోడ్లను పేల్చేయడంతో గాజా అంతటా ఎక్కడ చూసినా కాంక్రీట్ శిథిలాల కుప్పలే కనిపిస్తున్నాయి. 2023–24 కాలంలో గాజాలో దాదాపు 4 కోట్ల టన్నుల చెత్త పెరిగింది. అంటే ప్రతి చదరపు మీటర్కు 107 కేజీల చెత్త అదనంగా వచ్చి చేరింది. గాజాలో పచ్చదనం దాదాపు పూర్తిగా కనుమరుగైంది. గాజా సమీప ప్రాంతాల్లో 80% చెట్లు కూలిపోయాయి. మూడింట రెండొంతుల సాగుభూమి బాంబులు, ఫిరంగి గుళ్లు, క్షిపణి శకలాలతో నిండిపోయి సాగుకు పనికిరాకుండా పోయాయి. తూర్పు మధ్య« దరా ప్రాంతంలో భూమాత ఊపిరితిత్తులుగా ఖ్యాతిగాంచిన ‘వాడీ గాజా’ చిత్తడి నేలలు చాలా వరకు ధ్వంసమయ్యాయి. ఇక్కడి 150 రకాల సకశేరుక జీవులు, 70 రకాల ప్రాణుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.దళాలు.. పర్యావరణ దోషులురోజూ ప్రపంచవ్యాప్తంగా వందల పౌరవిమానాలు కోట్ల లీటర్ల ఇంథనాన్ని మార్గమధ్యంలో ఆకాశంలో మండిస్తూ పొగను వెదజల్లుతూ పర్యావరణానికి చేటుచేస్తున్నాయి. సముద్రమార్గాల్లో ప్రయాణిస్తూ సరుకు రవాణా నౌకలు సైతం ఇదే పనిచేస్తున్నాయి. వీటిని మించి యుద్ధా్దల ద్వారా దేశాల సాయుధబలగాలు అత్యధికస్థాయిలో కర్బన ఉద్గారాలను వాతావరణంలోకి విడుదల చేస్తున్నాయని నివేదిక కుండబద్దలు కొట్టింది. గ్రీన్హౌస్ గ్యాస్ల విడుదలలో యుద్ధాల్లో పాల్గొన్న దేశాల మిలటరీల వాటా 5.5 శాతానికి పెరిగింది. ఇందులో ఒక్క అమెరికా వాటానే ఒక శాతం ఉండటం గమనార్హం. యుద్ధ ట్యాంక్లు, శతఘ్నులు, జెట్ విమానాలు, సైనిక రవాణా వాహనాలు కోట్ల లీటర్ల ఇంధనాన్ని తాగేస్తూ పొగ, అత్యధిక స్థాయిలో కర్బన ఉద్గారాలను వెలువరిస్తున్నాయి. గాజాలో పేలుళ్లతో పేరుకుపోయిన 1.5 కోట్ల టన్నుల కాంక్రీట్ శిథిలాలు సైతం పర్యావరణానికి పెనుముప్పుగా పరిణమించనున్నాయి. సహజ వనరులు నాశనం కావడానికి కొత్తగా పొడచూపుతున్న యుద్ధాలు 40 శాతం కారణమని నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇకనైనా పర్యావరణ విధ్వంసాలకు ఆయా దేశాలను బాధ్యులను చేస్తూ నష్టపరిహార, సహాయక చర్యలు తీసుకోవాలని యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ కొన్ని సూచనలు చేసింది. అవేంటంటే..→ విస్తృతస్థాయిలో, ఎక్కువ మంది పౌరులను ప్రభావితంచేసే ఘర్షణలను ఇకపై అంతర్జాతీయ నేరంగా పరిగణించాలి→ ఐరాస వాతావరణ మార్పుల ముసా యిదా సమావేశం(యూఎన్ఎఫ్సీసీసీ) నిబంధనలను అనుసరిస్తూ ఇకపై ప్రతిదేశం తమ సైన్యం ఏ స్థాయిలో కర్బన ఉద్గారాలను వెదజల్లిందో ఆ డేటాను నిష్పాక్షికంగా బహిర్గతం చేయాలి→ అంతర్జాతీయ రెడ్క్రాస్ సంస్థ ప్రతిపాదించినట్లుగా ఘర్షణలు సద్దుమణిగాక యుద్ధంతో దెబ్బతిన్న పర్యావరణానికి పునరుజ్జీవం కల్పించేందుకు 20 శాతం నిధులను కేటాయించాలి→ ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సదస్సులో భారత్ చేసిన ‘‘ ఒకే భూమి, ఒకే కుటుంబం’ ప్రేరణగా సమీకృత వాతావరణ దౌత్య వేదికనూ నెలకొల్పాలి. సరిహద్దుల వెంట నిరాయుధీకరణకు అధిక ప్రాధాన్యతనివ్వాలి→ 2024లో అన్ని దేశాల సైనిక బడ్జెట్లు 2.4 ట్రిలియన్ డాలర్లకు పెరిగినట్లే.. జీవవైవిధ్య పరిరక్షణా నిధులనూ దేశాలు పెంచాలి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
స్వచ్ఛంగా భారత ఇం‘ధనం’!
పర్యావరణ కాలుష్యం రోజురోజుకీ పెరుగుతున్న వేళ స్వచ్ఛ ఇంధనం ప్రాధాన్యత పెరుగుతోంది. అందుకే మనదేశం కూడా గ్రీన్ ఎనర్జీపై దృష్టి పెట్టింది. అంతేకాదు, ప్రపంచానికి మార్గదర్శకంగానూ నిలుస్తోంది. మన పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 232 గిగావాట్లకు చేరుకుంది. తద్వారా ఈ రంగంలో ప్రపంచంలో నాలుగో అతిపెద్ద దేశంగా నిలిచింది. 2014లో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 75.52 గిగావాట్లు మాత్రమే. అంటే పదేళ్లలో సామర్థ్యం మూడింతలు పెరిగిందన్న మాట. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్వచ్ఛ ఇంధన రంగంలో మనదేశం సాధించిన పురోగతిపై ప్రత్యేక కథనం. 2030 నాటికి 500 గిగావాట్ల సామర్థ్యాన్ని అందుకోవాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఏటా 50 గిగావాట్లకుపైగా గ్రీన్ ఎనర్జీ సామర్థ్యాన్ని జోడించాల్సి ఉంటుంది. భారత పునరుత్పాదక ఇంధన రంగం 2020 ఏప్రిల్ నుంచి 2024 సెపె్టంబర్ మధ్య సుమారు 20 బిలియన్డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అందుకుంది. 2047 నాటికి మొత్తం పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 1,800 గిగావాట్ల మైలురాయికి చేరాలన్నది భారత ప్రభుత్వ దీర్ఘకాలిక లక్ష్యం. అందుకు అనుగుణంగా ముందుకు సాగుతున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. అందుకు నిదర్శనం.. ఈ రంగంలో ప్రభుత్వం చేస్తున్న వ్యయం పెరగడమే. 2019–20 నుంచి 2023–24 నాటికి... పునరుత్పాదక ఇంధనానికి సంబంధించిన పథకాలు, కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.3,193 కోట్ల నుంచి రూ.6,119 కోట్లకు పెరిగింది.టాప్లో సోలార్ పవర్.. సౌర విద్యుత్ ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో మూడవ, పవన విద్యుత్ రంగంలో నాల్గవ అతిపెద్ద దేశంగా అవతరించడం విశేషం. 2023లో మొత్తం పునరుత్పాదక విద్యుత్ 18.5 గిగావాట్లు, 2024లో 25 గిగావాట్లు అదనంగా వచ్చి చేరింది. 2014లో దేశంలో సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కేవలం 2.63 కోట్లే. కానీ, ప్రభుత్వ చర్యల ఫలితంగా 2025 నాటికి ఏకంగా 108 గిగావాట్లకు ఎగసింది. అంటే 41 రెట్ల పెరుగుదల అన్నమాట. దీంతో పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంది. పవన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతం 51 గిగావాట్లకు పెరిగింది. 2014లో ఇది 21 గిగావాట్లు. మాడ్యూల్స్ తయారీలో.. సౌర విద్యుదుత్పత్తి విషయానికి వస్తే సోలార్ మాడ్యూల్స్ తయారీ సామర్థ్యం దేశంలో 2014లో 2.3 గిగావాట్లు మాత్రమే. 2024 నాటికి ఇది 90 గిగావాట్లను తాకింది. 2030 నాటికి 150 గిగావాట్లకు చేరుకోవాలని భారత్ ఆకాంక్షిస్తోంది. దశాబ్దం క్రితం దేశీయంగా సోలార్ సెల్స్, వేఫర్ల ఉత్పత్తి పరిమితంగా ఉండేది. నేడు సోలార్ సెల్స్ ఉత్పత్తిలో 25 గిగావాట్లు, వేఫర్ ఉత్పత్తిలో 2 గిగావాట్లతో భారత్ తన స్థానాన్ని పదిలపర్చుకుంది.దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి స్వయం సమృద్ధి గల దేశంగా మారే ప్రయత్నంలో మన దేశం 2030 నాటికి సోలార్ సెల్స్ ఉత్పత్తిలో 100 గిగావాట్స్, వేఫర్ ఉత్పత్తిలో 40 గిగావాట్ల సామర్థ్యాన్ని అందుకోవాలని కృత నిశ్చయంతో ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూ.24,000 కోట్లతో చేపట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం సౌర విద్యుత్ రంగానికి ఊపునిచ్చింది. దూకుడుగా ప్రభుత్వం.. 2025 ఫిబ్రవరి నాటికి దాదాపు 176 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. 70.21 గిగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టులకు టెండర్లు దాఖలయ్యాయి. సముద్రం లేదా సరస్సులో ఏర్పాటు చేసే ఆఫ్షోర్ పవన విద్యుత్ ప్రాజెక్టుల విభాగంలో 2030 నాటికి 37 గిగావాట్ల మేర టెండర్లను ఆహ్వానించాలని భారత్ నిర్ణయించింది. గుజరాత్, తమిళనాడులో పైలట్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఆర్ఈ–ఇన్వెస్ట్ 2024 వేదికగా భారత స్వచ్ఛ ఇంధన రంగంలో 2030 నాటికి రూ.32.45 లక్షల కోట్ల పెట్టుబడులకు వివిధ దేశాలకు చెందిన కంపెనీలు ముందుకు వచ్చాయి. ఇక దేశంలోని మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో శిలాజేతర విద్యుత్ సామర్థ్యం వాటా 2014తో పోలిస్తే 32.5% నుండి గత ఏడాది 47.37%కి పెరిగింది. ప్రధానమంత్రి సూర్య ఘర్ ప్రాజెక్టును 2024 ఫిబ్రవరిలో కేబినెట్ ఆమోదించింది. 2026–27 నాటికి దేశంలో ఒక కోటి గృహాలకు రూఫ్టాప్ సోలార్ను ఏర్పాటు చేయడానికి మొత్తం రూ.75,021 కోట్ల వ్యయం చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా అదనంగా 30 గిగావాట్ల సౌర సామర్థ్యం లభిస్తుందని అంచనా. రూ.19,744 కోట్లతో జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ను మంత్రివర్గం ఆమోదించింది. 2030 నాటికి ఈ మిషన్ కింద 125 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం అదనంగా చేరనుంది. – సాక్షి, స్పెషల్ డెస్క్ -
శ్రేయస్ అయ్యర్... సారథిగా సూపర్
ధోనీ మాదిరిగా వ్యూహరచనలో మేటి... కోహ్లి తరహాలో దూకుడులో ఘనాపాటి... రోహిత్ను అనుకరిస్తున్నట్లు అనిపించినా... అతడికి అతడే సాటి! ‘అతడి చేయి పడితే రాయి కూడా రత్నంలా మెరుస్తుంది’... అన్న రీతిలో దశాబ్ద కాలానికి పైగా ‘ప్లే ఆఫ్స్’ మొఖం చూడని జట్టును తుదిపోరుకు చేర్చిన ఘనుడతడు! ఐపీఎల్ చరిత్రలో మరే సారథికి సాధ్యం కాని విధంగా మూడు వేర్వేరు జట్లను తుదిపోరుకు తీసుకెళ్లిన మొనగాడతడు! అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ జట్టును నడిపించడంలో నేర్పరి అతడు! మనం ఇంతసేపు చెప్పుకున్నది... ఈసారి ఐపీఎల్ ట్రోఫీ గెలవకపోయినా తన నాయకత్వ చతురతతో అందరి మనసులు గెలిచిన పంజాబ్ కింగ్స్ సారథి శ్రేయస్ అయ్యర్ గురించే!! ధోనీ, రోహిత్ కూడా కెప్టెన్లుగా మూడు కంటే ఎక్కువ ఐపీఎల్ ఫైనల్స్ ఆడినా... ఆ ఇద్దరూ ఒకే జట్టును నడిపించారు. కానీ గత ఐదేళ్లలో అయ్యర్ మూడు వేర్వేరు ఫ్రాంఛైజీలకు తుదిపోరు మజా చూపాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు ఆడిన ఏకైక ఫైనల్ శ్రేయస్ సారథ్యంలోనే కాగా... పదేళ్ల విరామం అనంతరం గతేడాది కోల్కతా నైట్రైడర్స్కు ముచ్చటగా మూడో కప్పు అందించింది కూడా అయ్యరే. పంజాబ్కు ట్రోఫీ కట్టబెట్టలేకపోయినా... సారథిగా మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడు. ‘బాధ్యత సగం మాత్రమే పూర్తయింది. వచ్చే ఏడాది తప్పక కప్పు గెలుస్తాం’ అని ఫైనల్ అనంతరం ధీమా వ్యక్తం చేసిన అయ్యర్... భారత జట్టు భవిష్యత్తు నాయకత్వంపై భరోసా పెంచుతున్నాడు!!సాక్షి, క్రీడావిభాగం : 2024 ఐపీఎల్ ఫైనల్లో సన్రైజర్స్ హైదరాబాద్ను చిత్తుచేసి... కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) జట్టు మూడోసారి కప్పు కైవసం చేసుకుంది. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ ట్రోఫీ అందుకున్నా... ఆ సమయంలో భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కేకేఆర్ జట్టు మెంటార్గా ఉండటంతో క్రెడిట్ అంతా అతడికే దక్కింది. తదనంతర పరిణామాల్లో గంభీర్ టీమిండియా హెడ్కోచ్గా ఎదగగా... సమర్థ నాయకుడిని కేకేఆర్ వేలానికి వదిలేసింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన కోల్కతా జట్టు... ఈసారి లీగ్ దశ దాటలేకపోవడమే గాక... పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంటే... వేలంలో భారీ ధర పెట్టి శ్రేయస్ను దక్కించుకున్న పంజాబ్ రెండోసారి రన్నరప్గా నిలిచింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు శ్రేయస్ సారథ్య సామర్థ్యాన్ని వివరించేందుకు.దేశవాళీ మ్యాచ్లు ఆడకుండా నిర్లక్ష్యం వహించినందుకు బీసీసీఐ కాంట్రాక్టు కోల్పోవడం... అపార ప్రతిభ ఉన్నా ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ఎంపిక కాకపోవడం ఇవన్నీ పక్కన పెడితే... అతడిలో గొప్ప నాయకుడు ఉన్నాడని తాజా ఐపీఎల్ నిరూపించిందింది. ఆటగాడిగా అదుర్స్... ఈ సీజన్లో 17 మ్యాచ్లాడిన శ్రేయస్ 50.33 సగటుతో 604 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు. మిడిలార్డర్లో బ్యాటింగ్కు దిగి 175.07 స్ట్రయిక్రేట్తో పరుగులు రాబట్టాడు. అతడి గణాంకాలను అంకెల్లో కొలవడం కష్టమే! సీజన్ ఆరంభంలో గుజరాత్తో జరిగిన పోరులో సెంచరీకి సమీపించినా... జట్టు ప్రయోజనాలకే పెద్దపీట వేయడంతోనే అయ్యర్ తీరు అందరినీ ఆకట్టుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 19 ఓవర్లు ముగిసేసరికి 220 పరుగులు చేసింది. అయ్యర్ 42 బంతుల్లో 97 పరుగులు చేసి సెంచరీకి సమీపించాడు. చివరి ఓవర్లో స్ట్రయికింగ్లో ఉన్న శశాంక్ సింగ్ దగ్గరకు వెళ్లి ‘నా శతకం గురించి ఆలోచించకు. జట్టు కోసం వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయి’ అని దిశానిర్దేశం చేశాడు. ఆ ఓవర్ మొత్తం ఆడిన శశాంక్ 23 పరుగులు రాబట్టగా... అయ్యర్ అజేయంగా నిలిచాడు. స్పిన్ను సమర్థవంతంగా ఆడతాడనే గుర్తింపును మరింత పెంచుకుంటూ... ఈసారి మిడిల్ ఓవర్స్లో భారీ షాట్లతో విరుచుకుపడి పరుగులు రాబట్టాడు. అందుకే సీజన్ మొత్తంలో 43 ఫోర్లే కొట్టిన అయ్యర్... 39 సిక్స్లతో అత్యధిక సిక్స్లు కొట్టిన వారి జాబితాలో నికోలస్ పూరన్ (40) తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. ముంబైపై అసమాన పోరాటం ఇక క్వాలిఫయర్–2లో ముంబై ఇండియన్స్పై శ్రేయస్ ఆడిన ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బుమ్రా యార్కర్లను ఎదుర్కొనేందుకు మహామహులు ఇబ్బంది పడుతున్న తరుణంలో అతడు దాన్ని షార్ట్థర్డ్ మ్యాన్ దిశగా తరలించిన తీరు చూసి తీరాల్సిందే. ఆశలే లేని స్థితిలో అద్భుత పోరాటం కనబర్చిన ఈ ముంబైకర్... జట్టును ఒంటిచేత్తో ఫైనల్కు చేర్చాడు.‘అయ్యర్ అవుట్ అయినప్పుడే... పంజాబ్ పరాజయం ఖాయమైంది’ బెంగళూరుతో ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా ప్రతి ఒక్కరి నోట వినిపించిన మాట ఇదే. అంతలా అభిమానుల నమ్మకాన్ని సంపాదించుకున్న శ్రేయస్... చేతి వరకు వచ్చిన కప్పు చేజారుతున్నా కాస్త కూడా చలించలేదు. చిరకాల కల నెరవేరడంతో ప్రపంచ మేటి ఆటగాడు విరాట్ కోహ్లి చిన్నపిల్లాడిలా వెక్కివెక్కి ఏడుస్తుంటే... సుదీర్ఘ కాలం ఫ్రాంఛైజీకి ప్రాతినిధ్యం వహించినా.. జట్టును విజేతగా నిలపలేకపోయిన ఏబీ డివిలియన్స్, క్రిస్ గేల్ వంటి దిగ్గజ ప్లేయర్లు సంబరాల్లో భాగమైపోయారు. ఇక ఆర్సీబీ అభిమానుల ఆనందానికైతే అవధులే లేవు! తన చుట్టూ ఇంత జరుగుతున్నా కనీసం ముఖ కవలికల్లో సైతం మార్పు కనబడని అయ్యర్ నింపాదిగా వచ్చే ఏడాది చూసుకుందాం అన్నట్లు ముందుకు సాగిపోయాడు. భవిష్యత్తు వన్డే కెప్టెన్! మైదానం బయట నుంచి పాంటింగ్ జట్టును తీర్చిదిద్దితే... ఆ వ్యూహాలను గ్రౌండ్లో ఆచరణలో పెట్టడంలో అయ్యర్ విజయవంతమయ్యాడు. బౌన్సీ పిచ్పై కైల్ జెమీసన్తో బ్యాక్ ఆఫ్ ది లెంత్ బంతులు వేయించడం... ముంబైతో మ్యాచ్లో వైడ్ యార్కర్లు వేసే విధంగా విజయ్ కుమార్ వైశాఖ్కు దిశానిర్దేశం చేయడం... అవసరమైనప్పుడు ‘నకల్ బాల్స్’ వేసే విధంగా ప్రోత్సహించడం ఇలా... ఒకటా రెండా సీజన్ ఆసాంతం శ్రేయస్ కెప్టెన్సీలో తనదైన పదును చూపాడు. క్వాలిఫయర్–2లో శశాంక్ సింగ్ నిర్లక్ష్యంతో రనౌట్ అయన సందర్భంలో సారథిగా అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అయ్యర్... ప్రియాన్‡్ష, ప్రభ్సిమ్రన్ వంటి యువ ఆటగాళ్లను పెద్దన్నలా వెన్నుతట్టి ప్రోత్సహించాడు. ఐపీఎల్ జరుగుతున్న సమయంలోనే ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేయగా... అందులో అయ్యర్ పేరు లేకపోవడం చూసి పంజాబ్ కోచ్ పాంటింగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అయినా దాన్ని పెద్దగా పట్టించుకోని శ్రేయస్... గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు ‘నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు... ఫలితం గురించి ఆలోచించకు’ అన్న రీతిలో ఐపీఎల్పైనే దృష్టి పెట్టాడు. ప్రస్తుతం టెస్టు, టి20 జట్లలో రెగ్యులర్ ఆటగాడు కాని 30 ఏళ్ల అయ్యర్... వన్డేల్లో మాత్రం రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత నాయకత్వ రేసులో ముందు నిలవడం ఖాయమే! -
అమెరికాపై చైనా.. ‘ఆగ్రో టెర్రరిజం’
ఆగ్రో టెర్రరిజానికి పాల్పడిన ఇద్దరు చైనీయులను అమెరికా పోలీసులు అక్కడి కాలమానం ప్రకారం మంగళవారం అరెస్ట్ చేయటంతో ప్రపంచ దేశాలు ఒక్కసారి ఉలిక్కిపడ్డాయి. పంటలకు తీవ్రనష్టం కలిగించటం ద్వారా వ్యవసాయ, ఆహార భద్రతకు విఘాతం కలిగించే ఉగ్రవాద చర్యలను ఆగ్రో టెర్రరిజంగా చెబుతారు. అదే దురుద్దేశంతో ‘ఫ్యూసేరియం గ్రామినిరమ్’అనే ప్రమాదకరమైన శిలీంధ్రాన్ని అక్రమంగా, కుట్రపూరితంగా అమెరికాలోకి తెచ్చారన్న ఆరోపణపై చైనా పౌరులైన యుంకింగ్ జియాన్, ఆమె సన్నిహితుడు జున్యాంగ్ లియులను అమెరికా పోలీసులు అరెస్ట్ చేసి, విచారణ జరుపుతున్నారు. ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా కూడా చైనా నుంచే వ్యాప్తిలోకి వచ్చిందన్న అనుమానాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఇటీవల అమెరికా.. చైనా నుంచి వస్తువుల దిగుమతిపై సుంకాలు అతి భారీగా పెంచిన నేపథ్యంలో తాజా ఆగ్రో టెర్రరిజం చర్య చర్చనీయాంశమైంది. చైనా కమ్యూనిస్టు పార్టీ కుతంత్రమే యుంకింగ్ జియాన్ చైనా కమ్యూనిస్టు పార్టీ విధేయురాలని, ఈ ప్రమాదకర శిలీంధ్రంపై చైనాలో పరిశోధన చేసిన ఆమెకు చైనా ప్రభుత్వం నిధులు ఇచ్చినట్లు కూడా ఆధారాలున్నాయని కాష్ పటేల్ తెలిపారు. ‘సహ నిందితుడైన ఆమె సన్నిహితుడు జున్యాంగ్ లియు కూడా చైనా యూనివర్సిటీలో ఇదే శిలీంధ్రంపైనే పరిశోధనలు చేస్తుండేవాడు. ఈ శిలీంధ్రంపై మిచిగాన్ యూనివర్సిటీలో పరిశోధనల కోసమే డెట్రాయిట్ మెట్రోపాలిటన్ ఎయిర్పోర్ట్ ద్వారా గత ఏడాది అక్రమంగా రవాణా చేసినట్లు లియు తొలుత బుకాయించినా, తర్వాత తప్పు అంగీకరించారని తెలిపారు. వీరిద్దరిపైనా కుట్ర, అమెరికాలోకి వస్తువుల స్మగ్లింగ్, తప్పుడు స్టేట్మెంట్లు,వీసా అక్రమాలకు సంబంధించిన అభియోగాలు నమోదు చేశా’మని కాష్ పటేల్తెలిపారు. అమెరికా ఆహార వ్యవస్థను దెబ్బతీయటం ద్వారా తీవ్ర పరిణామాలు కల్పించి అమెరికా ప్రజల జీవితాలను, ఆర్థిక వ్యవస్థను పెనుప్రమాదంలోకి నెట్టాలన్న కుతంత్రంతో చైనా కమ్యూనిస్టు పార్టీ అనుక్షణం పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ దుర్భిద్ధితోనే పరిశోధకులను, ఇతరులను అమెరికా సంస్థల్లోకి పనిగట్టుకొని చొప్పిస్తోందని చెప్పటానికి ఇదొక ప్రబల నిదర్శనం అని కాష్ పటేల్ అన్నారు. ఈ కుతంత్రాలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు ఎఫ్బిఐ అవిశ్రాంతంగా కృషి చేస్తూనే ఉంటుందన్నారు. నష్టం జరగకముందే ఈ ముప్పును పసిగట్టడంలో డెట్రాయిట్ ఎఫ్బిఐ బృందం, కస్టమ్స్–సరిహద్దు భద్రతా దళాలు సమన్వయంతో సమర్థవంతంగా పనిచేశారని ప్రశంసించారు. ఆగ్రో టెర్రరిజం మూలాలు.. మధ్య ప్రాచ్యానికి చెందిన అస్సిరియన్ అనే జాతి వారు క్రీ.పూ. 660లోనే వ్యవసాయసంబంధమైన ఉగ్రవాదచర్యకు తొలిసారి పాల్పడ్డారని చరిత్ర చెబుతోంది. ధాన్యపు పంటలను నాశనం చేసే ఎర్గోట్ అనే శిలీంధ్రాన్ని ప్రయోగించి శత్రువుల నీటి వనరులను అస్సిరియన్లు కలుషితం చేశారు. ఆధునిక కాలంలో తొలి ప్రపంచ యుద్ధంలో జర్మనీ గ్లాండర్స్, ఆంథ్రాక్స్ క్రిములను శత్రువుల గుర్రాలపై ప్రయోగించింది. యూరప్లో శత్రు సేనలకు సరఫరా అయ్యే ధాన్యాగారాలపై ఈ ఫంగస్లను ప్రయోగించినట్టు చెబుతారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో.. బ్రిటన్లోని బంగాళా దుంపల పొలాలను ‘కొలరాడో పొటాటో బీటిల్స్’సాయంతో నాశనం బ్రిటన్ చేయాలని ప్రయత్నించింది. విమానం సాయంతో వీటిని పొలాల్లోకి విడిచిపెట్టింది. ప్రమాదకరమైన ఫంగస్‘ప్రమాదకరమైన జీవాయుధాన్ని అక్రమంగా దేశంలోకి తీసుకురావటం వ్యవసాయ సంబంధమైన ఉగ్రవాద చర్య. యావత్ జాతి భద్రతకే ఇది ప్రత్యక్ష ముప్పు’వంటిదని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ)డైరెక్టర్ కాష్ పటేల్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘‘యుంకింగ్ జియాన్ అనే యువతి మిచిగాన్ యూనివర్సిటీలో పరిశోధనల కోసం ఫ్యూసేరియం గ్రామినిరమ్ అనే ప్రమాదకరమైన శిలీంధ్రాన్ని దేశంలోకి అక్రమంగా తీసుకువచ్చినట్లు భావిస్తున్నాం.గోధుమ, వరి, మొక్కజొన్న, బార్లీ తదితర పంటల్లో ‘కంకి ఎండు తెగులు’ను కలిగించటం ద్వారా దిగుబడిని తీవ్రంగా నష్టపరిచే అత్యంత ప్రమాదకరమైన ఫంగస్ ఇది. ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల డాలర్ల మేర ఆర్థిక నష్టానికి కారణమవుతున్న ఈ శిలీంధ్రం.. పంటలను దెబ్బతీయటంతో పాటు మనుషులు, పశువుల తీవ్రమైన అనారోగ్య సమస్యలను సృష్టించగలదు’అని ఆయన పేర్కొన్నారు. పాక్ ద్వారా మన దేశంలోకీ.. చైనా, పాకిస్థాన్ సరిహద్దుల ద్వారా భారత్కు కూడా ఆగ్రో టెర్రరిజం ముప్పు పొంచి ఉందన్న చర్చ జరుగుతోంది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డిఆర్డిఓ) పత్రాల ప్రకారం.. బంగ్లాదేశ్లో కనిపించిన ఒక ప్రమాదకర ఫంగస్ 2016లో పశ్చిమ బెంగాల్లోని 2 జిల్లాల్లోకి ప్రవేశించింది. గోధుమ పంటను నాశనం చేసే ఆ ఫంగస్ను ప్రభుత్వం సమర్థంగా నాశనం చేసింది. మూడేళ్ల పాటు గోధుమ పంట వేయకుండా ఆదేశాలు జారీచేసి, ఆ ఫంగస్ విస్తరించకుండా చేయగలిగింది. అంతకుముందు 2015లో పత్తి పంటను నాశనం చేసే ప్రమాదకర వైరస్ పాకిస్థాన్ నుంచి దక్షిణ పంజాబ్ ప్రాంతంలోకి ప్రవేశించింది. దాదాపు మూడింట రెండొంతుల పత్తి పంట నాశనమైపోయింది. సుమారు 670 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. పంట నష్టాన్ని భరించలేక సుమారు 15 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.- సాక్షి, స్పెషల్ డెస్క్ -
క్యాంపస్ కొలువులకు కేరాఫ్ వరంగల్ ఎన్ఐటీ
సాక్షి ప్రతినిధి, వరంగల్: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) వరంగల్ ప్లేస్మెంట్లకు కేరాఫ్గా మారింది. నిట్లోని సెంటర్ ఫర్ కెరీర్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ (సీసీపీడీ) ఆధ్వర్యంలో నిర్వహించే క్యాంపస్ సెలెక్షన్లకు ప్రపంచ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఇక్కడి విద్యార్థులను ఎంపిక చేసుకోవడానికి క్యూ కడుతున్నాయి. 2024–25 విద్యాసంవత్సరానికిగాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న 296 కంపెనీలు నిట్ క్యాంపస్ సెలక్షన్స్లో పోటీపడ్డాయి. క్యాంపస్ సెలక్షన్స్కు 1,508 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1,201 మంది ఎంపికయ్యారు.ఓ విద్యార్థికి అత్యధిక వార్షిక ప్యాకేజీ రూ. 64.3 లక్షలు రాగా.. అత్యల్ప వార్షిక ప్యాకేజీ రూ.14.3 లక్షలుగా నమోదైంది. యూజీ, పీజీ విద్యార్థులతోపాటు తొలిసారి ఆరుగురు పీహెచ్డీ అభ్యర్థులు రూ. 9 లక్షల వార్షిక ప్యాకేజీకి ఎంపిక కావడం విశేషం. సాఫ్ట్వేర్ ఇంజనీర్, డేటా అనాలసిస్, డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్, ప్రోడక్ట్ అనాలసిస్, ప్రోడక్ట్ ఇంజనీర్, కన్సల్టెంట్, మేనేజ్మెంట్, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రెయినీ లాంటి పోస్టులకు విద్యార్థులు ఎంపికయ్యారు.ఒడిదొడుకులున్నా ‘టాప్’లోనే..ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కొలువుల మార్కెట్ ఈసారి అంతంతమాత్రంగానే ఉన్నా నిట్ క్యాంపస్ సెలెక్షన్స్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. కొలువులకు ఎంపికైన 1,201 మందిలో 679 మంది యూజీ విద్యార్థులు, 516 మంది పీజీ, ఆరుగురు పీహెచ్డీ విద్యార్థులు ఉన్నారు. వారిలో బీటెక్ ఈసీఈ చేసిన సోమిల్ మాల్ధానీ ఏకంగా 64.3 లక్షల అత్యధిక వార్షిక ప్యాకేజీకి ఎంపికయ్యాడు. గతేడాది మొత్తం 1,483 మంది విద్యార్థులు ప్లేస్మెంట్కు అర్హత పొందగా 1,128 మంది ఎంపికయ్యారు. బీటెక్లో 82 శాతం మంది, ఎంటెక్, ఇతర పీజీ కోర్సుల్లో 76 శాతం మంది విద్యార్థులకు కొలువులు లభించాయి. గతేడాది ఒక విద్యార్థి అత్యధికంగా రూ. 88 లక్షల వార్షిక వేతనానికి ఎంపికవగా 12 మంది రూ. 68 లక్షల చొప్పున వార్షిక వేతనానికి ఎంపికయ్యారు. సగటు వార్షిక వేతనం రూ. 15.6 లక్షలుగా నమోదైంది.సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తా..మాది జైపూర్లోని మధ్యతరగతి కుటుంబం. నిట్లో అత్యుత్తమ విద్యాబోధనతోపాటు సీసీపీడీ గైడెన్స్లో బెంగళూరుకు చెందిన స్టార్టప్ సాఫ్ట్వేర్ కంపెనీకి రూ. 64.3 లక్షల వార్షిక ప్యాకేజీకి ఎంపికయ్యా. సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేసి మిత్రులకు ఉద్యోగాలు కల్పించడమే నా లక్ష్యం.– సోమిల్ మాల్ధానీ, రూ.64.3 లక్షల వార్షిక ప్యాకేజీ పొందిన విద్యార్థివిద్యార్థుల్లో ప్రేరణ నింపుతున్నాం..మా క్యాంపస్ నుంచి గతేడాది 1,128 మంది విద్యార్థులు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికవగా ఈసారి 1,201 మంది ఎంపికవడం అభినందనీయం. అత్యుత్తమ బోధనతోపాటు లక్ష్య సాధన దిశగా విద్యార్థులకు మేం ప్రేరణ కల్పిస్తున్నాం.– బిద్యాధర్ సుబుదీ, నిట్ డైరెక్టర్వర్క్షాప్లు, కమ్యూనికేషన్ స్కిల్స్ వల్లే..విద్యార్థులను ఇంటర్వ్యూలకు ప్రిపేర్ చేయడం, వర్క్షాప్లు, వారి కమ్యూనికేషన్ స్కిల్స్కు పదునుపెట్టడం క్యాంపస్ సెలక్షన్స్లో విజయానికి కీలక భూమిక పోషించాయి.– హరికృష్ణ, సీసీపీడీహెడ్, ఎన్ఐటీ, వరంగల్ -
మారుపేరు.. మమకారాల ఊరు
మేడిపల్లి(వేములవాడ): ఒక్కొక్క గ్రామంలో ఒక్కో రకమైన వింతలు ఉంటాయి. జగిత్యాల జిల్లా ఉమ్మడి మేడిపల్లి మండలం కమ్మరిపేట గ్రామంలో కూడా మారుపేర్ల (నిక్ నేమ్) వింత ఉంది. గోదావరి జిల్లాల్లో వెటకారం ఉన్నట్లు, కమ్మరిపేటలో కూడా వెటకారంతో కూడిన ప్రేమలు ఉంటాయి. మచ్చుకు కొన్ని మారుపేర్లుకమ్మరిపేటలో కొందరిని తల్లిదండ్రులు పెట్టిన పేర్లతో కాకుండా మారుపేర్లతోనే గుర్తిస్తా రు. ఉదాహరణకు.. నల్లోడు, కోడిజుట్టుగాడు, బర్లోడు, గుడుగుడు మల్లయ్య, బూటుగాడు, సెంబుగాడు, కటకట రాయడు, బారెపు మల్లయ్య, బొట్టుగాడు, దస్తగిరిగాడు, జేంకొరుకుడు, ఆపకా యేగాడు, సెట్టెపిసోడు, పొట్టన్న, బీపిగాడు, ఎద్దుగాడు, పిసోడు, పొట్టోడు, బుడ్డిగాడు, యాస్టీంగ్గాడు, నరుకుడుగాడు, పిర్రలెంకడు, మల్కుమల్లోజీ, ఒక్కపొద్దు, బొమ్మగాడు, సాంబర్గాడు, పత్తగాడు, బొంబాయిగాడు, బ్రహ్మంగారు, తత్తర్గాడు, గొట్టాలు, గుండంగాడు.. ఇలా దాదాపు ఊరందరికీ మారుపేర్లు ఉన్నాయి. అవసరమైనప్పుడు అండగా..కమ్మరిపేటలో గ్రామస్తులందరూ వరుసలతో పాటు వెటకారం జోడించి మారుపేర్లతో పిలుచుకుంటారు. ఇలా పిలవడం ఎదుటివారిని తక్కువ చేసినట్లు అస్సలు కాదు. ప్రేమగా ఇలా పిలుచుకోవడంలో గ్రామస్తులంతా ఆదర్శంగా నిలుస్తారు. గ్రామంలో ఎవరికైనా, ఏ సమయంలోనైనా సమస్య వచ్చినా.. అందరూ తలో చేయి వేసి ఆదుకుంటారు. ఎవరైనా చనిపోతే కులమతాలకు అతీతంగా దగ్గరుండి కార్యాలు జరుపుతారు. ఈ విషయంలో చాలా మంది పెద్దలు కమ్మరిపేట గ్రామాన్ని ప్రశంసిస్తారు. భీమారం గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించేందుకు కమ్మరిపేట గ్రామస్తులు తమదైన పాత్ర పోషించారు. ఇలా చాలా విషయాల్లో కమ్మరిపేట మండలంలో ఆదర్శంగా నిలుస్తోంది.మారుపేరుతోనే పిలుస్తారు నాపేరు బినవేని రెడ్డి. కానీ మా గ్రామంలో ఇంటివారు పెట్టిన పేరుతో పిలవరు. మారుపేర్లతోనే ఎక్కువగా పిలుస్తారు. మా పూర్వీకులు బర్లు కాసేవారని నన్ను బర్ల రెడ్డి అంటారు. మా ఊర్లో దాదాపు అందరినీ ఇలాగే పిలుస్తారు. – బినవేని రెడ్డి, కమ్మరిపేటఅలా పిలిస్తేనే ప్రేమ..సరదాగా మారుపేర్లతో పిలవడం మా ఊరి వెటకార భాషలో భాగం. అలా పిలిచినా ఎవరూ ఇబ్బంది పడరు. అలా పిలిస్తేనే గుండెకు దగ్గరగా.. ప్రేమతో పిలిచినట్లు భావిస్తారు. గ్రామంలో అందరం కలిసిమెలిసి ఉంటాం. ఏదైన విషయంలో భేదాభిప్రాయాలున్నా ఇతర గ్రామాల మధ్యవర్తిత్వానికి ఇష్టపడం.– ఆకునూరి శ్రీనివాస్, కమ్మరిపేటఊరంతా ఒక్కటవుతంచాలా గ్రామాల్లో వరుసలు పెట్టి పిలుస్తారు. మా గ్రామంలో వరుసలతో పాటు వెటకారం జోడించి పిలుస్తాం. ఇది ఎప్పటినుంచో వస్తున్న పరంపర. ఏ వర్గంవారైనా వరుసపెట్టి పిలవడం మాకు అలవాటు. మా గ్రామంలో గొడవలు పడ్డా.. ఇతర గ్రామాలు ఒత్తిడి ప్రయోగిస్తే ఊరంతా ఒక్కటవుతం. ఇది మా ఊరు గొప్పతనం.– గొల్ల ముఖేశ్, కమ్మరిపేట -
ఓస్! ఇంతేనా?!
ప్రపంచ జనాభా మొత్తాన్ని ఒక ముద్దలా చేస్తే ఆ ముద్ద ఎంత పరిమాణంలో ఉంటుంది? ఏమిటీ పిచ్చి ప్రశ్న?! పిచ్చి ప్రశ్న కాదు. కొందరు శాస్త్రవేత్తలకు వచ్చిన ఆలోచన! వారి ఆలోచనకు తాజాగా ఒక గణిత శాస్త్రవేత్త అంచనా వేసి పెట్టారు. ఆయన లెక్క ప్రకారం – ప్రస్తుత ప్రపంచ జనాభాను మొత్తం ఒక ముద్దలా చేస్తే ఆ ముద్ద ఎంత పరిమాణంలో ఉంటుందో తెలుసా? మీరు అనుకున్న దాని కంటే చాలా చిన్నదిగా! ఇదేం జవాబు? లెక్కా పక్కా ఉండక్కర్లేదా? ఉంది.. లెక్క ఉంది.. పక్కాగా కూడా ఉంది.‘రెడిట్’ ఇంటర్నెట్ ఫోరమ్లో ‘కివి2703’ అనే అకౌంట్లో ఒక అజ్ఞాత గణితశాస్త్ర నిపుణుడు ప్రపంచ జనాభా మొత్తాన్ని ఒక ముద్దగా (మీట్బాల్) గా చేస్తే 0.6 మైళ్లు.. అంటే కిలోమీటరు వెడల్పు లోపలే ఉంటుందని అంచనా వేశారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, న్యూయార్క్లో 1250 అడుగుల ఎత్తయిన ‘ఎంపైర్ స్టేట్ బిల్డింగ్’కు రెండున్నర రెట్లు, లేదా పారిస్లో 1063 అడుగుల ఐఫిల్ టవర్కు మూడింతలకు పైగా ఎత్తులో ఆ మీట్బాల్ ఉంటుందని ఆయన లెక్క తేల్చారు. – సాక్షి, స్పెషల్ డెస్క్శాస్త్రవేత్త గారూ.. మీరు ఓకేనా ?గణిత శాస్త్రవేత్త సమాధానం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. 788 కోట్ల జనాభాను ముద్దగా చేస్తే ‘ఇంతేనా ఉండేది.. ఇంత చిన్నాగానా’ అని ఒక నెట్ యూజర్ ఆశ్చర్యపోతే, ‘ఇంతకన్నా పెద్దదిగా ఉంటుంది అనుకున్నానే..’ అని ఇంకొక యూజర్ కామెంట్ చేశారు. మరొకరైతే, ‘మీరు బాగానే ఉన్నారా సైంటిస్టు గారూ?’ అని గణిత శాస్త్రవేత్తపై జోక్ వేశారు. గతంలో – మానవజాతి ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచ జనాభా అంతటిని కలిపి అమెరికాలోని గ్రాండ్ కాన్యన్ లోయలోకి చేరిస్తే ఎంత పరిమాణంలో ఉంటుందో ఒక సైన్స్ యూట్యూబ్ చానల్ వేసిన గ్రాఫిక్స్ నుంచి స్ఫూర్తి పొంది ఈ గణిత శాస్త్రవేత్త తాజాగా తన లెక్కలు వేశారట. మానవులందరూ ఒక చోట శంఖం ఆకారంలో కుప్పగా ఆ వీడియోలో ఉండగా, అజ్ఞాత శాస్త్రవేత్త అదే ప్రయోగాన్ని ఒక గుండ్రటి మాంసపు ముద్దగా చేసి చూపించారు. సెంట్రల్ పార్క్లో ‘మీట్బాల్’మానవ ‘మీట్బాల్’ పరిమాణాన్ని లెక్కంచటానికి అజ్ఞాత గణితవేత్త కొన్ని ప్రాథమిక అంచనాలను తీసుకున్నారు. ప్రస్తుత ప్రపంచ జనాభాను 788 కోట్లుగా వేసుకున్నారు. ఒక్కో మనిషి సగటు బరువును 62 కిలోలుగా అనుకున్నారు. మానవ శరీరాల సాంద్రతను క్యూబిక్ మీటరుకు 985 కిలోగ్రాములుగా లెక్కించారు. క్యూబిక్ మీటరు అంటే ఒక మీటరు పొడవు, ఒక మీటరు వెడల్పు, ఒక మీటరు ఎత్తు ఉన్న ప్రదేశం. ఈ అంచనాల నుంచి ‘హ్యూమన్ మీట్బాల్’ ఎంత పరిమాణంలో ఉంటుందో లెక్కించారు. ఆ లెక్క ప్రకారం భూమి పైన ఉన్న 788 కోట్ల మందిని ఒక చక్కటి బంకతో కలిపి ముద్ద చేస్తే ఇంచుమించు ఒక కిలోమీటరు వెడల్పులో గోళాకారం తయారైంది. ఆ ఎర్రటి మాంసపు బంతిని న్యూయార్క్ సెంట్రల్ పార్క్ మధ్యలో ఉంచితే ఎలా ఉంటుందో కూడా ఆయన ఒక విజువల్ సృష్టించారు. గ్రాండ్ కాన్యన్లో ‘మీట్ కోన్’అమెరికాలోని సుప్రసిద్ధ యూట్యూబ్ చానళ్లలో ‘వీసాస్’ ఒకటి. విద్య, సైన్స్, గణితం వంటి అంశాలపై 40 ఏళ్ల మైకేల్ స్టీవెన్స్ వీడియోలు చేస్తుంటాడు. ఈ యూట్యూబ్ చానల్లో గతంలో పోస్ట్ చేసిన ఒక వీడియోను చూసి మానవ మీట్బాల్ను అంచనా వెయ్యటానికి స్ఫూర్తి పొందారు రెడిట్ అజ్ఞాత గణిత శాస్త్రవేత్త. ఆరిజోనా రాష్ట్రంలో కొలరాడో నది ఒడ్డున ఉన్న గ్రాండ్ కాన్యన్ లోయలో... సృష్టి ఆరంభం నుంచి ఉన్న మానవ జనాభానంతా (సుమారు 10,600 కోట్లు) పోస్తే, ఆ లోయలో 15 కుప్పలు తయారైనట్లు ‘వీసాస్’ ప్రెజెంటర్ మైకేల్ స్టీవెన్స్ గ్రాఫిక్స్తో చేసిన వీడియో అది. అంతమంది జనాభాను ఒక చోట చేర్చినా కూడా ఆ లోయ ఇంకా ఖాళీగానే ఉండటం విశేషం అని స్టీవెన్స్ అంటారు. 446 కి.మీ. పొడవు, కొన్నిచోట్ల 1.6 కి.మీ. వరకు లోతు ఉన్న ఆ లోయలో.. కెనడాకు చెందిన గ్రాఫిక్ డేటా విజువలైజేషన్ బ్లాగర్ ఇస్మాయిల్ శాంటోస్ బ్రాల్ట్ జనాభాను నింపారు. మనిషి సగటు బరువును 70 కిలోలుగా వేసుకుని, 49 కోట్ల టన్నుల బరువుతో 700 కోట్ల మంది జనాభాను ఒక కుప్పగా చేరిస్తే అదే పరిమాణంలో 15 కుప్పలు తయారయ్యాయి. ఈ వీడియో ప్రేరణతోనే ఇప్పుడీ రెడిట్ శాస్త్రవేత్త ప్రస్తుత జనాభాతో మీట్బాల్ను సృష్టించారు. -
సుశిక్షిత మూగ గూఢచారులు
వాసన పసిగట్టి ప్రమాదాన్ని కనిపెట్టే జాగిలాలను మాత్రమే ఇప్పటి వరకు మనం చూశాం. అయితే పైకి కనిపించని ‘నిగూఢ దళాలు’ కూడా వివిధ దేశాల సైన్యాలలో నిశ్శబ్దంగా పని చేసుకుంటూ పోతున్నాయి. అవి మందుపాతరలను కనిపెడతాయి. సముద్ర జలాల్లోని పేలుడు పదార్థాలను గుర్తిస్తాయి. సరిహద్దుల్లో చొరబాటు దారులను అడ్డుకుని, వారిపై దాడి కూడా చేస్తాయి. శిక్షణ పొందిన ఈ మూగజీవులు.. ప్రపంచ దేశాల ఆర్మీలకు గొప్ప ‘మార్మిక’ శక్తిగా తోడ్పడుతున్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్మహా తెలివైన ‘హీరో ర్యాట్స్’దశాబ్దాల అంతర్యుద్ధంతో మందుపాతరల భూమిగా మారిన కాంబోడియా ఆనాటి మందుపాతరలను కనిపెట్టి, వాటిని శక్తిహీనం చేసేందుకు ఎలుకల సహాయం తీసుకుంటోంది. శిక్షణ పొందిన ‘ఆఫ్రికన్ జెయింట్ పౌచ్డ్ ర్యాట్స్’ లేదా ‘హీరో ర్యాట్స్’ అనే ఆ ఎలుకలు మందుపాతరలు కచ్చితంగా గుర్తిస్తున్నాయి. ఉక్రెయిన్, ఇజ్రాయెల్, ఇంకా అనేక యూరోపియన్ దేశాల సైన్యాలు కూడా హీరో ర్యాట్స్ దళాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ హీరో ర్యాట్స్ సబ్ సహారా ఆఫ్రికాకు చెందినవి. టెక్నాలజీ సైతం పసికట్టలేని టి.ఎన్.టి. (ట్రైనైట్రోటోల్యున్) వంటి పేలుడు పదార్థాల సూక్ష్మ జాడలను కూడా ఇవి తమ ఆఘ్రాణ శక్తితో గుర్తించగలవు. 45 సెంటీమీటర్ల పొడవైన శరీరంతో, దాదాపు అర మీటరు పొడవున్న తోకలు కలిగి ఉండే హీరో ర్యాట్స్.. ఇంటి ఎలుకల కంటే కాస్త పెద్దవిగా, చిన్న పిల్లిని పోలి ఉంటాయి. భూమి లోపల ఉన్న మందుపాతరలపై అవి పేలకుండా నడిచేంత తేలికగానూ ఉంటాƇు. మొజాంబిక్, అంగోలా దేశాల సైన్యంలో కూడా ఈ ‘హీరో ర్యాట్స్’ దళాలు ఉన్నాయి. డిటెక్టర్ల కంటే మెరుగైనవి!ఒక హీరో ర్యాట్ టెన్నిస్ కోర్టు విస్తీర్ణంలో ఉండే భూమి లోపలి ప్రాంతాన్ని కేవలం 30 నిమిషాల్లో స్పష్టంగా గాలించగలదు. ఇదే పని చేయడానికి మనుషులకు కొన్ని రోజులు పడుతుంది. పైగా ఒక్కోసారి ప్రాణానికే ముప్పు వాటిల్లవచ్చు. హీరో ర్యాట్స్కి ఒక ఏడాది కంటే తక్కువ సమయంలో పూర్తి శిక్షణ ఇవ్వవచ్చు. ఇవి 6 నుంచి 8 సంవత్సరాలు జీవిస్తాయి. వాటి జీవితకాలంలో ఎక్కువ కాలాన్ని సైన్యంలో ఉపయోగించుకోవచ్చు. బెల్జియంలోని స్వచ్ఛంద సేవా సంస్థ ఎ.పి.ఒ.పి.ఒ. (యాంటీ పర్సనల్ లాండ్మైన్స్ డిటెక్షన్ ప్రొడక్ట్ డెవలప్మెంట్) ఈ ఎలుకలకు శిక్షణ ఇస్తోంది. ‘హీరో ర్యాట్స్‘ అని బ్రాండ్ చేసి, వివిధ దేశాల సైన్యాల అవసరాలకు సరఫరా చేస్తోంది. మెటల్ డిటెక్టర్లు గుర్తించలేని ప్లాస్టిక్ మందుపాతరలను కూడా గుర్తించే నైపుణ్యం వీటికి ఉంది. మానవ కఫం నమూనాలలో క్షయవ్యాధిని కూడా గుర్తించే విధంగా వీటికి శిక్షణ ఇస్తున్నారు.సరిగ్గా బాంబు ఉన్న చోటుకు..కంబోడియా, ఉక్రెయిన్లు ఈ హీరో ర్యాట్స్ని మందుపాతరల ఏరివేతకు ప్రయోగిస్తుండగా.. ఇజ్రాయెల్ భద్రతా దళాలు విమానాశ్రయాల్లో లగేజీలలోని పేలుడు పదార్థాలను పసిగట్టేందుకు ఉపయోగిస్తున్నాయి. బాంబు వాసన పసిగట్టే జాగిలాలకు ఇవి దీటైనవి. కుదురుగా, వేగవంతంగా, ఎవరి గమనింపులోకీ వెళ్లకుండా ఈ ఎలుకలు ఉగ్రవాద ముప్పును ముందస్తుగా గుర్తించి, ముప్పును తప్పించటానికి సహాయపడతాయి. ఇప్పుడు రష్యా కూడా వీటిని ఉపయోగించుకుంటోంది. భారత్కు తేనెటీగల దళంప్రపంచంలోని వివిధ దేశాల సైన్యం ఎలుకల సహాయం తీసుకుంటున్నట్లే.. మనదేశం సరిహద్దుల భద్రత, రక్షణల కోసం తేనెటీగల్ని పెంచుతోంది. నిరంతరం అస్థిరంగా ఉండే బంగ్లాదేశ్ సరిహద్దులో సరిహద్దు భద్రతా దళం (బి.ఎస్.ఎఫ్.) తేనెటీగలను మోహరించింది. చొరబాట్లతోపాటు, స్మగ్లింగ్ను కూడా అరికట్టేందుకు పశ్చిమ బెంగాల్లోని నాడియా జిల్లాలో, బి.ఎస్.ఎఫ్. 32వ బెటాలియన్ ముళ్లతీగల కంచెల వెంట పెట్టెల్ని వేలాడదీసి వాటిల్లో తేనెటీగల్ని పెంచుతోంది. తేనెకు తేనె... భద్రతకు భద్రత! ఈ పెట్టెల లోపల ఉండే తేనెటీగల గుంపు... స్మగ్లర్లు, చొరబాటు దారులను అడ్డుకుంటుంది. కంచెలను దాటేందుకు ప్రయత్నించే వారిపైన ఆ గుంపు తక్షణం మూకుమ్మడి దాడి చేస్తుంది. తేనెటీగల కోసం ఆ సమీపంలో తేనెనిచ్చే పూల మొక్కలను పెంచుతున్నారు. బి.ఎస్.ఎఫ్. సిబ్బందికి తేనెటీగల పెంపకంలో సైన్యం శిక్షణనిస్తోంది.నీళ్ల అడుగున.. నిగూఢాల ఛేదనప్రపంచ దేశాల్లోని వివిధ నావికా దళాలు సముద్రంలోని అత్యంత తెలివైన జీవుల్ని తమ కార్యకలాపాలకు ఉపయోగించుకుంటున్నాయి. అమెరికా నావికాదళం ఇందుకోసం సముద్ర క్షీరదాల కార్యక్రమం (మెరైన్ మమ్మల్ ప్రోగ్రామ్) చేపట్టింది. నీటి అడుగున పొంచి ఉండే మైన్ల ప్రమాదాలను గుర్తించడానికి, నావికా దళం ఆస్తులను రక్షించడానికి డాల్ఫిన్లు, ‘కాలిఫోర్నియా సీ లయన్స్’కు యూఎస్ శిక్షణ ఇస్తోంది. డాల్ఫిన్లు, వాటి సహజసిద్ధమైన ధ్వని గ్రాహ్యతా నైపుణ్యంతో యంత్రాల కంటే కూడా కచ్చితంగా.. మునిగిపోయిన పేలుడు పదార్థాలను గుర్తించగలవు. అవి వేగంగా ఉంటాయి. తెలివిగా ఉంటాయి. సముద్ర గర్భంలోని వస్తువుల్ని, డైవర్లను గాలించేవిధంగా వాటికి శిక్షణ ఉంటుంది. రష్యా కూడా నీటి అడుగున నిఘా, గూఢచర్యం వంటివాటి కోసం డాల్ఫిన్ లకు శిక్షణ ఇవ్వటం మొదలు పెట్టింది. -
డీల్ కాదు.. జేబు ఖాళీ!
ఒక వస్తువు కావాల్సి వచ్చి ఆన్స్ లైన్స్ లో వెతికేటప్పుడు.. ఆ ఉత్పాదన తాలూకు పేజీలో ‘ఒకటి మాత్రమే ఉంది’, ‘10 నిమిషాల్లో కొంటే భారీ డిస్కౌంట్’, ‘ఫ్లాష్ డీల్ ఈ రోజు వరకే’ వంటి సందేశాలు దర్శనమిస్తాయి. అవి నిజమనుకుని నమ్మి కస్టమర్లు వెంటనే కొనేస్తారు. అమ్మకాలను పెంచుకోవడమే లక్ష్యంగా చేసే ఈ మాయాజాలాన్ని ‘డార్క్ ప్యాటర్న్స్’ అని పిలుస్తారు. ఈ–కామర్స్ కంపెనీలు పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ఆర్భాటంగా నిర్వహించే ‘ఆన్స్ లైన్స్ సేల్స్’ సమయంలో ఈ మాయాజాలం విభిన్న రూపాల్లో ‘స్క్రీన్స్ ’పైన దర్శనమిస్తుంది.ఓ సర్వే ప్రకారం కొనాలన్న ఆలోచన లేనప్పటికీ డార్క్ ప్యాటర్న్స్ కారణంగా ఆకర్షితులై 40% కంటే ఎక్కువ మంది వినియోగదారులు వస్తువులను కొనుగోలు చేస్తున్నారట. షాపింగ్ వెబ్సైట్ల తప్పుదారి పట్టించే, మోసపూరిత, చట్టవిరుద్ధ వ్యూహాలే ఇందుకు ప్రధాన కారణం. ఈ–కామర్స్, క్విక్ కామర్స్ కంపెనీలు వివిధ రకాల డార్క్ ప్యాటర్న్స్తో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. తీరా చూస్తే తాము ఎక్కువ ఖర్చు చేశామనో.. లేదా అంతగా ఉపయోగకరం కాని ఉత్పత్తులను కొన్నామనో వినియోగదారులు తరువాత తెలుసుకుంటున్నారు. ఆన్స్ లైన్ కస్టమర్లు తమకు కావాల్సిన వస్తు, సేవలను వేగంగా, సౌకర్యంగా పొందడం కోసం తరచూ డబ్బు, సమాచారం, గోప్యతతో రాజీ పడుతున్నారనేది నగ్న సత్యం.ఒకటికి రెండుసార్లు..ఏ వెబ్సైట్ ఉపయోగిస్తున్నా, సర్వీస్ ప్రొవైడర్ను ఎంతగా విశ్వసించినా మీ నుండి ఏ సమాచారం అడుగుతున్నారు, ఎటువంటి అనుమతులు కోరుతున్నారు అనే అంశాలపై వినియోగదార్లు అప్రమత్తంగా ఉండాలి. స్క్రీన్స్ పై ఉన్న సమాచారాన్ని జాగ్రత్తగా చదవాలి. ‘బై’ బటన్స్ క్లిక్ చేసే ముందు మీకు కావాల్సింది మాత్రమే అక్కడ ఉందో లేదో ఒకటికి రెండుసార్లు గమనించాలి. ఆన్స్ లైన్ సేవల కోసం సైన్ అప్ చేసే ముందు అన్ని సమయాల్లో రద్దు చేసుకునేందుకు స్పష్టమైన, కచ్చిత అవకాశం ఉందా లేదా నిర్ధారించుకోవాలి. కనీసం ఒకటి..అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా–2024 నివేదిక ప్రకారం.. అత్యధికంగా డౌన్స్ లోడ్ అయిన టాప్–53 భారతీయ యాప్స్లో ఒకటి మినహా మిగిలినవన్నీ కనీసం ఒక డార్క్ ప్యాటర్న్ ఉపయోగించాయట. లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వే ప్రకారం దాదాపు 50% భారతీయ వినియోగదారులు ఆన్స్ లైన్ చెల్లింపుల సమయంలో కనీసం ఒక డార్క్ ప్యాటర్న్ సమస్యను ఎదుర్కొన్నారట.రంగంలోకి కేంద్ర ప్రభుత్వంఈ–కామర్స్ సంస్థలు అనుసరిస్తున్న ఈ మోసపూరిత విధానాల పట్ల వినియోగదారులు, ఆఫ్లైన్స్ ట్రేడర్ల నుంచి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఉత్పత్తులు పరిమితంగా ఉన్నాయని బుకాయించడం, పేమెంట్ చేసే సమయానికి అదనపు చార్జీ, నకిలీ కౌంట్డౌన్స్ టైమర్స్, ఒక వస్తువు చూపించి మరొకటి అంటగట్టడం, లావాదేవీ రద్దు చేసే అవకాశం లేకపోవడం, యూజర్ కోరకున్నా ప్రకటనల వీడియో ప్లే కావడం, తప్పుడు రివ్యూలు, పోల్చుకునే అవకాశం లేకపోవడం వంటి 13 రకాల డార్క్ ప్యాటర్న్స్ను గుర్తించింది.నిబంధనలను పాటించకపోతే చట్ట పరంగా చర్యలు ఉంటాయని ఈ–కామర్స్ కంపెనీలను వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. వినియోగదారుల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే, అనాలోచిత కొనుగోళ్లు, చర్యలకు దారితీసే తప్పుదారి పట్టించే డార్క్ ప్యాటర్న్స్ను తొలగించడానికి చేసిన మార్పులను వివరిస్తూ అంతర్గత వార్షిక తనిఖీ నివేదికలను మంత్రిత్వ శాఖకు సమర్పించాలని కంపెనీలకు స్పష్టం చేసింది. విదేశాల్లో చట్టాలుభారత్లో ఇప్పటివరకు ఈ పద్ధతిని నిషేధించే నిర్దిష్ట చట్టాలు లేవు. వినియోగదారుల రక్షణ చట్టం–2019 ప్రకారం అన్యాయమైన వాణిజ్య పద్ధతులుగా గుర్తిస్తూ డార్క్ ప్యాటర్న్స్ను అరికట్టడానికి కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ (సీసీపీఏ) 2023 నవంబర్లో మార్గదర్శకాలను జారీ చేసింది. అమెరికా, ఈయూ తదితర దేశాల్లో దీనికి సంబంధించి చట్టాలు అమలులోనూ ఉన్నాయి. వినియోగదారులు కుకీజ్ను అంగీకరించడం కంటే తిరస్కరించడం కష్టతరం చేసినందుకు గూగుల్, ఫేస్బుక్ రెండింటికీ ఈయూ, ఫ్రెంచ్ డేటా రక్షణ చట్టాల ప్రకారం 2022లో జరిమానా విధించారు. -
భూకంప ప్రభావం అంతరిక్షంలో!!
పట్టాలపై రైలు పరుగులు తీస్తుంటే.. హఠాత్తుగా ముందున్న ఇంజిన్ కాస్తంత నెమ్మదించినా వెనకాలే క్యూ కట్టిన బోగీలన్నీ టపటపా ఢీకొన్నంత పనిచేస్తాయి. ఎందుకంటే ప్రతి బోగీ పక్క బోగీతో అనుసంధానమై ఉంటుంది. కానీ ఎలాంటి అనుసంధానంలేని సుదూర శాటిలైట్లు సైతం భూకంపం వేళ ప్రభావితం అవుతున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. భూకంపం ధాటికి భూకంపకేంద్ర సమీప భవనాలు, భవంతులు పేకమేడల్లా కదలిపోవడం చూస్తుంటాం. కానీ ఆకాశంలో ఉండే కృత్రిమ ఉపగ్రహాల పనితీరు సైతం భూకంపాల తీవ్రతకు లోనవుతోందని తాజా పరిశోధనలో తేలింది. భౌతికంగా భూమితో అనుసంధానంకాని ఉపగ్రహాలకు భూకంప పర్యవసానాలకు మధ్య గల సంబంధాన్ని తొలిసారిగా ఈ పరిశోధన ఆవిష్కరించింది. జపాన్లోని నగోయా విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తల బృందం చేసిన ఈ పరిశోధనా తాలూకు వివరాలు ‘ఎర్త్, ప్లానెట్స్, స్పేస్’జర్నల్లో ప్రచురితమయ్యాయి. భూతలం సహా గగనతలం.. రెండు భూఫలకాల కొనల వద్ద రాపిడి, ఢీకొనే సందర్భాల్లో భూకంపం సంభవిస్తుంది. ఇవి భూతల వనరులనే కాదు గగనతల కృత్రిమ వనరులైన శాటిలైట్లనూ ప్రభావితం చేస్తాయని అధ్యయనకారుల్లో అనుమానం మొదలైంది. ఈ అనుమానాన్ని నివృత్తిచేసుకునేందుకు గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్(జీఎన్ఎస్ఎస్)లోని 4,500కుపైగా రిసీవర్ల ద్వారా సమగ్ర సమాచారాన్ని తెప్పించుకుని ఆ డేటాతో త్రిమితీయ(3డీ) ‘‘వాతావరణ ఇబ్బందుల’’ముఖచిత్రాన్ని రూపొందించారు. 2024 జనవరి ఒకటో తేదీన జపాన్లోని ఇషికావా ప్రిఫెక్ఛర్లోని నోటో ద్వీపకల్పంలో రిక్టార్ స్కేల్పై 7.5 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం సంభవించింది. అప్పుడు ఆకాశంలోకి సంక్లిష్టమైన ధ్వని తరంగాలు దూసుకెళ్లాయి. ఇవి భూమి నుంచి ఆకాశంలో 60 నుంచి 1,000 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న అయనో ఆవరణం(ఐనోస్ఫియర్)లోకి వెళ్లాయి. అక్కడి స్వేచ్ఛాయుత ఎలక్ట్రాన్లతో నిండిన వాయువులను ఈ ధ్వనితరంగాలు విపరీతంగా ప్రేరేపించాయి. దాంతో ఈ వాయువులు కింద పొర అయిన థర్మోస్ఫియర్ వాతావరణంలోకి కొంత శక్తిని విడుదలచేశాయి. అప్పటికే థర్మోస్పియర్ ఆవరణలో స్థిరంగా ఉన్న శాటిలైట్లపై ఈ అదనపు శక్తి ప్రతికూల ప్రభావం చూపింది. దీంతో శాటిలైట్ల నుంచి భూమి మీదకు జరగాల్సిన కమ్యూనికేషన్ సిగ్నళ్ల ప్రసరణ వేగంలో మార్పులు కనిపించాయి. సిగ్నళ్లు ఆలస్యంగా రావడంతోపాటు సిగ్నళ్లలో సాంద్రత సైతం తగ్గిపోయినట్లు గుర్తించారు. టోమోగ్రఫీ సాయంతో వైద్యరంగంలో వాడే సీటీ స్కాన్ తరహాలో వేర్వేరు కోణాల్లో శాటిలైట్ల డేటాను క్రోడీకరించి 3డీ చిత్రాలను రూపొందించారు. భూకంపం సంభవించినప్పుడు కేవలం పది నిమిషాల వ్యవధిలోనే ధ్వని తరంగాలు ఐనోఆవరణను చేరిపోతున్నాయి. ప్రశాంత కొలనులో రాయి విసిరితే ఏర్పడే వలయాకార అలల్లా ధ్వని తరంగాలు ఐనోస్ఫియర్లోకి వెళ్తున్నాయి. భూకంపం సంభవించినప్పుడు భూఫలకాలు ఢీకొన్న ఒక్క ప్రాంతంలోనే ధ్వని తరంగాలు ఉధ్భవిస్తాయని గతంలో భావించారు. అలాకాకుండా నోటో ద్వీపకల్ప ఘటనలో 150 కిలోమీటర్ల పొడవునా రెండు భూఫలకాలు ఢీకొన్న చోట్ల నుంచి ధ్వనితరంగాలు పుట్టుకొచ్చాయని, ఇలాంటి సందర్భాల్లోనే అధిక తరంగాలు ఉద్భవిస్తున్నాయని ఈ పరిశోధనలో ముఖ్య రచయిత డాక్టర్ వెజియాంగ్ ఫూ చెప్పారు. పలు సమస్యలు.. ధర్మోస్ఫియర్పై అదనపు ఒత్తిడితో శాటిలైట్ల నుంచి ప్రసారాల నాణ్యత తగ్గిపోవడంతో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్), శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. భూకంపాలతో ఉపగ్రహాల పనితీరూ దెబ్బతింటుందని స్పష్టంగా అర్థమైందని మరో రచయిత, ప్రొఫెసర్ యుచీ ఒట్సుకీ చెప్పారు. భూకంపాల ముందస్తు హెచ్చరికల వ్యవస్థను మరింత పటిష్టచేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని యుచీ అభిప్రాయపడ్డారు. భూకంపాలతోపాటు సునామీ, అగి్నపర్వతాల విస్ఫోటం వంటి అత్యంత తీవ్ర వాతావరణ పరిస్థితులకూ తమ అధ్యయన మోడళ్లను అన్వయించి మరింత విస్తృతస్థాయి అవగాహనకు ప్రయతి్నస్తున్నామని పరిశోధకులు వెల్లడించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎండలు ముందే ముగిశాయెందుకు?
మే నెల భానుడి ప్రచండ వేడికి పెట్టింది పేరు. రోహిణి కార్తెలో రోకళ్లు పగులుతాయని పెద్దల మాట. సూర్యప్రకోపానికి జనం విలవిల్లాడిపోయే కాలంగా ఎండాకాలం దశాబ్దాలుగా పేరు తెచ్చుకుంది. కానీ ఈసారి మే నెలలో దాదాపు వేడి మాయమై చల్లదనమే రాజ్యమేలింది. దేశవ్యాప్తంగా చాలా చోట్ల వర్షాలు పడ్డాయి. పైగా ముందస్తుగానే ఎండాకాలం జనాలకు బైబై చెప్పి వెళ్లిపోయింది. 2024లో మే, జూన్ నెలల్లో ఎండలు విపరీతంగా ఉండటంతో 2025లో ఆదిత్యుడు ఇంకెంత రెచ్చిపోతాడోనన్న భయాలను పటాపంచలు చేస్తూ ఈసారి మే నెలలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే నమోదవడం విశేషం. తక్కువ ఎండలకు తోడు తక్కువ రోజులే ఎండాకాలం కొనసాగడం గమనార్హం. వేడిమి, ఉక్కబోతతో విసుగుతెప్పించే వేసవికాలం వేగంగా గడిచిపోయింది. 2024 సంవత్సరం భూమి మీద అత్యంత ఉష్ణమయ ఏడాదిగా చరిత్రలో నిలిచిపోయింది. ఇక భారత్లో గత ఏడాది మేలో దేశవ్యాప్తంగా వడగాలులు చండ ప్రచండంగా వ్యాపించి జనాన్ని బెంబేలెత్తించాయి. ఇందుకు పూర్తి భిన్నంగా 2025 మేనెల సాగిపోవడం సాధారణ ప్రజానీకాన్ని ఆశ్చర్యంలో, ఒకింత ఆలోచనలో పడేసింది. ఈసారి దేశ వాతావరణ ముఖచిత్రంలో మార్పులొచ్చాయని కొందరు విశ్లేషణలు మొదలెట్టారు. 2024 మే, జూన్లో..గత ఏడాది మే, జూన్ నెలల్లో దేశవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదుకావడంతోపాటు వడగాల్పుల ఘటనలు చాలా చోట్ల సంభవించాయి. దీంతో చాలా ప్రాంతాల్లో కరువు తాండవించింది. దీంతో జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటాయి. నీటి లభ్యత బాగా తగ్గిపోయింది. భూగర్భజలాలు మరింత కిందకు వెళ్లిపోయాయి. విద్యుత్ కొరత సమస్య సైతం అధికమైంది. వాతావరణ మార్పులతో ముడిపడిన ఈ అధిక ఉష్ణోగ్రతల విపరిణామాలు వెనువెంటనే వ్యవసాయం, ఆరోగ్యంతోపాటు కోట్లాది మంది మధ్యతరగతి ప్రజల జీవనంపైనా దుష్ప్రభావాలు చూపాయి. వడదెబ్బకు జనం పిట్టల్లా రాలిపోయారు. 2025 మేలో అధిక ఉష్ణోగ్రతలు నమోదుకాకుండా అకాలవర్షాలు అడ్డుకున్నాయి. దేశవ్యాప్తంగా మెజారిటీ రాష్ట్రాల్లో వర్షాలు పడ్డాయి. పలు చోట్ల కుండపోత వర్షాలు కురిశాయి. వాతావరణ చక్రంలో మార్పుల కారణంగానే మేలో వేడిమి మటుమాయమై చల్లదనం వచ్చి చేరిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. చల్లదనం అత్యధిక రోజులు కొనసాగడంతో అది అంతిమంగా ఎండకాలం ముగింపునకు ముందస్తు నాంది పలికిందని నిపుణులు విశ్లేషించారు. మరెన్నో కారణాలు..వర్షాకాలం ఈసారి ముందస్తుగా ముంచుకురావడం సైతం ఎండకాలం తీవ్రతను తగ్గించేసింది. వాతావరణంలో ముందస్తుగా తేమ శాతం పెరగడం, చల్లని గాలుల క్రమానుగతిలో మార్పులు సైతం ఉష్ణోగ్రత అధికం కాకుండా అడ్డుకున్నాయి. దీంతో వేసవికాలంలో వేడి తగ్గిపోయింది. గతంతో పోలిస్తే ఈసారి ఎండాకాలంలో వాతావరణం చాలావరకు మేఘావృతమైంది. దాంతోపాటు దేశంలో మేనెలలో ప్రతిరోజూ ఏదోఒక చోట వర్షాలు పడుతూ సగటు ఉష్ణోగ్రత పెరగకుండా నిలువరించాయి. ఈ చల్లదన పరిస్థితులు పరోక్షంగా ప్రభుత్వాల మీదా పెనుభారాన్ని ఒక్కసారిగా దించేశాయి. విద్యుత్ డిమాండ్ పెరగకుండా అడ్డుకున్నాయి.ముందుకొచ్చిన కొత్త ధోరణిఉడికించే ఉష్ణోగ్రతలు ఉన్నపళంగా తగ్గిపోవడం కొన్ని రకాల పంటల దిగుబడిపైనా ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చక్కటి వేడి పరిస్థితుల్లోనే కొన్నిరకాల పంటలు ఏపుగా పెరిగే పరిస్థితులు ఉంటాయని, ఈసారి ఎండలు ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో ఆయా పంటల సాగుఫలంపై ప్రతికూల ప్రభావం పడొచ్చని వ్యవసాయరంగ నిపుణులు చెబుతున్నారు. ఈసారి మారిన ఈ పరిస్థితులకు తగ్గట్లు కర్షకులు తమ పంటల విత్తునాటడం మొదలు ఎరువులు, పురుగుమందులు చల్లడం దాకా ప్రతిదాంట్లో కాస్తంత సమయపాలన పాటించడం తప్పనిసరి అయిందని వాళ్లు చెబుతున్నారు. హఠాత్తుగా ఎండాకాలం వ్యవధి తగ్గి వర్షాలు మొదలవడంపై వాతావరణ విభాగం సైతం వాతావరణ ముందస్తు అంచనాల వ్యూహాలకు పదునుపెట్టింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆపరేషన్ స్పైడర్స్వెబ్...నయా పెరల్ హార్బర్!
నాటో దేశాలు నిరంతరం ఆయుధాలతో సహా సర్వ సామగ్రీ సమకూరుస్తుంటే తప్ప యుద్ధరంగంలో పూట గడవని పరిస్థితి ఉక్రెయిన్ది. అవతలున్నదేమో అపార సైనిక పాటవానికి మారుపేరైన రష్యా. అలాంటి అగ్రరాజ్యానికి చెందిన ఏకంగా 41 బాంబర్ విమానాలను ఏదో వీడియోగేమ్ ఆడుతున్నంత అలవోకగా దాని సొంతగడ్డ మీదే ధ్వంసం చేసిన తీరు ప్రపంచవ్యాప్తంగా పెను కలకలం సృష్టించింది. అది కూడా ఏ ఒక్కచోటో కాదు. రష్యావ్యాప్తంగా ఏకంగా మూడు టైమ్ జోన్లలో, ఏకంగా 6,000 కి.మీ. పరిధిలో ఉన్న ఐదు వైమానిక స్థావరాలపై ఏకకాలంలో విజయవంతంగా దాడులు జరగడం విశేషం. ఆ దెబ్బకు రష్యా బాంబర్ శ్రేణి విమానాల్లో మూడో వంతు తుడిచిపెట్టుకుపోయాయి! అత్యంత సంక్లిష్టమైన ఇంతటి ఆపరేషన్ను పూర్తి కచ్చితత్వంతో, కేవలం డ్రోన్ల సాయంతో కారుచౌకగా, తనవైపు ఎలాంటి ప్రాణనష్టమూ లేకుండా పూర్తి చేసిన వైనం రక్షణ నిపుణులనే విస్మయపరిచింది. ఆధునిక ప్రపంచ యుద్ధ చరిత్రలోనే అతి పెద్ద, అత్యంత సంక్లిష్టమైన సర్జికల్ స్ట్రైక్ ఇదేనని చెబుతున్నారు. అంతేగాక ఏ కోణం నుంచి చూసినా అత్యంత విజయవంతమైన దాడిగా కూడా ఇది నిలిచింది. రష్యా చరిత్రలో అతి పెద్ద నిఘా వైఫల్యంగా కూడా ఇదేనని చెబుతున్నారు. ఈ దాడులను తమ పాలిట ‘పెరల్ హార్బర్’ ఉదంతంగా రష్యా మీడియానే అభివర్ణిస్తోంది. రెండో ప్రపంచయుద్ధం చివర్లో హవాయిలోని పెరల్ హార్బర్పై జపాన్ మెరుపు దాడులకు దిగి అమెరికా యుద్ధనౌకలను సముద్రంలో ముంచేసింది. ఈ ఉదంతం అమెరికాను యుద్ధంలోకి లాగడమే గాక జర్మనీ, జపాన్ తదితర అక్షదేశాల ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది. ‘ఆపరేషన్ స్పైడర్స్వెబ్’ పేరిట ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడులు రష్యాను ఆ స్థాయిలో దెబ్బకొట్టాయని అక్కడి మీడియా వాపోతోంది. అది అక్షరాలా నిజమేనని రక్షణ నిపుణులు ముక్త కంఠంతో చెబుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ ఆధునిక యుద్ధ వ్యూహాలను తక్షణం సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని ఇది మరోసారి గుర్తు చేసిందని వారంటున్నారు.ఇంత భారీ ఆపరేషన్కు రష్యా గడ్డ మీద కూడా అవసరమైన మద్దతు తప్పనిసరి. ఇందుకోసం ఉక్రెయిన్ రష్యాలో ఏకంగా ఆఫీసే తెరిచింది! అది కూడా రష్యా అంతర్గత భద్రతా విభాగం ఎఫ్ఎస్బీ కార్యాలయం పక్కనేనని జెలెన్స్కీ వెల్లడించడం విశేషం. ఏ ప్రాంతంలో అన్నది మాత్రం చెప్పలేదు. → మొత్తం ఆపరేషన్ను ఉక్రెయిన్ సీక్రెట్ సరీ్వస్ (ఎస్బీయూ) పక్కాగా నిర్వహించింది.→ దీన్ని జెలెన్స్కీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. దాడి వెనక ఏడాదిన్నర ప్రణాళిక ఉన్నట్టు వెల్లడించారు. ‘‘రష్యా గడ్డ నుంచే ఎంతోమంది ఇందుకు తోడ్పడ్డారు. వారందరినీ దాడులకు ముందే సురక్షితంగా తరలించాం. మావైపు ప్రాణనష్టం లేకుండా రష్యాను చావుదెబ్బ తీశాం’’ అన్నారు. రష్యాపై మరిన్ని దాడులు తప్పవన్నారు.→ డ్రోన్ దాడుల అనంతరం రష్యా ప్రతీకార దాడుల్లో 12 మంది ఉక్రెయిన్ సైనికుల మృతికి బాధ్యత వహిస్తూ ఉక్రెయిన్ పదాతి దళాధిపతి మేజర్ జనరల్ మైకేలియో ద్రాపత్యు రాజీనామా చేశారు.ఎక్కడెక్కడ దాడులు... → ఒలెన్యా (ముర్మాన్స్క్ ), బెలయా (ఇర్కుట్స్క్ –సైబీరియా), ద్యాగిలెవొ (సెంట్రల్ ర్యాజాన్), ఇవనొవొ → ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి బెలయా ఏకంగా 4,000 కి.మీ. దూరంలో ఉంటుంది! → వీటిలో ఒలెన్యా, బెలయా స్థావ రాల మధ్య దూరం ఏకంగా 6,000 కి.మీ.! ఇవి పరస్పరం మూడు టైమ్ జోన్ల దూరంలో ఉండటం విశేషం. → అమూర్, ఇవనోవో, ర్యాజన్ తదితర ప్రాంతాల్లోనూ డ్రోన్ దాడుల యత్నాలు జరిగాయని రష్యా ధ్రువీకరించింది.గతంలోనూ... మూడేళ్ల పై చిలుకు యద్ధంలో అనూహ్య, ఆకస్మిక దాడులతో రష్యాకు ఉక్రెయిన్ తీవ్ర నష్టం కలిగించడం ఇది తొలిసారేమీ కాదు. → 2022 ఏప్రిల్లో రష్యా యుద్ధనౌక మోస్క్ వాను నెప్ట్యూన్ యాంటీ షిప్ మిసైళ్లతో ఉక్రెయిన్ నల్లసముద్రంలో ముంచేసింది. ళీ 2022 అక్టోబర్లో ఆక్రమిత క్రిమియాను రష్యా భూభాగానికి కలిపే కీలక కెర్చ్ బ్రిడ్జిని బాంబులతో పేల్చేసింది. ళీ 2024 ఆగస్టులో ఉక్రెయిన్ సైన్యం తొలిసారిగా సరిహద్దులు దాటి రష్యా భూభాగంపై మెరుపు దాడులకు దిగి కుర్క్స్ ప్రాంతాన్ని స్వా«దీనం చేసుకుంది. తీరని అవమానం మిగిల్చిుంది!ట్రక్కుల్లో తరలించి...సింపుల్ ప్లానింగ్. పూర్తి గోప్యత. పక్కా రిహార్సల్స్. ఆకస్మిక దాడి. అమలులో మెరుపువేగం. 100 శాతం లక్ష్యసాధన. సర్జికల్ స్ట్రైక్స్ వంటి స్పెషల్ ఆపరేషన్స్ ఏ మేరకు సఫలమైందీ తేల్చేందుకు ప్రఖ్యాత సైనిక నిపుణుడు అడ్మిరల్ విలియనం మెక్రావెన్ సిద్ధాంతీకరించిన గీటురాళ్లు. వాటన్నింటినీ పూర్తిస్థాయిలో మేళవించిన ఆపరేషన్గా స్పైడర్స్ వెబ్ నిలిచింది. → మొత్తం ఆపరేషన్లో ఉక్రెయిన్ చాలావరకు పౌర మౌలిక సదుపాయాలనే వాడుకుంది. → ఇంతటి భారీ స్థాయి దాడులకు ప్రణాళిక రచించిన ఉక్రెయిన్, అందుకు సిద్ధం చేసిన డ్రోన్లను రష్యాలోకి తేలిగ్గా దొంగచాటుగా తరలించడం విశేషం. → అనంతరం వాటిని ట్రక్కుల్లో చెక్క కంటైనర్లలో పెట్టి ఎయిర్బేస్లకేసి తరలించారు. → ఒక్కో కంటైనర్లో 36 డ్రోన్లను ఉంచారు. వాటిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. → దాడుల్లో ఎక్కడా ప్రత్యక్షంగా సిబ్బందిని నియోగించే అవసరమే లేకుండా పకడ్బందీగా ముందస్తు ఏర్పాట్లు చేశారు. → ట్రక్కులను వైమానిక స్థావరాలకు అతి సమీపంలోకి తీసుకెళ్లారు. → అక్కడినుంచి నిర్ధారిత సమయంలో కంటైనర్ల పైకప్పును రిమోట్ ద్వారా తెరిచారు. → ఆ వెంటనే వాటిలోంచి డ్రోన్లు పైకెగిరి లక్ష్యాలపైకి దూసుకెళ్లాయి. సరిగ్గా విమానాలపై పడి పేలిపోయాయి. కంటైనర్ల నుంచి డ్రోన్లు పైకి ఎగురుతున్న దృశ్యాలతో కూడిన వీడియోలను రష్యా మీడియా విడుదల చేసింది. వాటిని అడ్డుకునేందుకు కొందరు సాయుధులు ట్రక్కులపైకి ఎక్కుతున్న దృశ్యాలు కూడా కొన్నింట్లో కనిపిస్తున్నాయి.కారుచౌకే.. కానీ ఖతర్నాక్ రష్యా ఎయిర్బేస్లపై దాడుల్లో ఉక్రెయిన్ వాడింది ఎఫ్పీవీ (ఫస్ట్ పర్సన్ వ్యూ) రకం డ్రోన్లు. → ఇవి కారుచౌకగా దొరుకుతాయి. పేలుడు పదార్థాలను బిగించి పంపగల ఒక్కో ఎఫ్పీవీ డ్రోన్ ఖరీదు కేవలం రూ.42 వేలు మాత్రమేనని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. → అయితే గురితప్పకుండా లక్ష్యాన్ని ఛేదించడంలో వీటికివే సాటి. → డ్రోన్కు అమర్చిన కెమెరా సాయంతో అక్కడి పరిసరాలను దాని ఆపరేటర్ ప్రత్యేక కళ్లద్దాల సాయంతో లైవ్లో చూడటమే గాక వీడియో తీయగలడు. రిమోట్గా ఆపరేట్ చేయగలడు. → పరిసరాల చిత్రీకరణ వంటి సైనికేతర పనుల్లో ఈ డ్రోన్లను విరివిగా వాడుతుంటారు. వీటి రేంజ్ కొన్ని కిలోమీటర్లకే పరిమితం.రష్యా అణుదాడి చేస్తుందా...? ఉక్రెయిన్ డ్రోన్ దాడులపై రష్యా తీవ్ర అవమాన భారంతో ఉడికిపోతోంది. కారుచౌకైన డ్రోన్లతో కోలుకోలేని దెబ్బతీయడాన్ని జీర్ణం చేసుకోలేకపోతోంది. దీనికి ప్రతీకారం తప్పదని రష్యా రక్షణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. కనుక ఉక్రెయిన్పై భారీ స్థాయిలో విరుచుకుపడటం ఖాయమే. → ఉక్రెయిన్ ప్రధానంగా నాటో సభ్యదేశాలు సమకూర్చిన ఆయుధాలనే తనపై వాడుతోంది. కనుక యూరప్లోని నాటో దేశాల్లోని సైనిక స్థావరాలు, ఆయుధాగారాలను రష్యా లక్ష్యంగా చేసుకోవచ్చు. వాటిపై దాడులు చేస్తామని గతంలోనే ఎన్నోసార్లు హెచ్చరించింది కూడా. → ఉక్రెయిన్ బహుశా ఈ ప్రమాదాన్ని ముందే ఊహించింది. డ్రోన్ దాడులు పూర్తిగా తన పనేనని, నాటో మిత్రులకు ఏ సంబంధమూ లేదని జెలెన్స్కీ ప్రకటించారు. వాణిజ్యపరంగా సులువుగా అందుబాటులో ఉన్న డ్రోన్లనే దాడుల్లో వాడినట్టు వివరించారు. అందుకు రుజువుగా దాడుల ఫొటోలను విడుదల చేశారు. → నష్ట, అవమాన తీవ్రత దృష్ట్యా ఉక్రెయిన్పై రష్యా అణుదాడికి దిగినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు.రష్యాకు నష్టం ఇలా... → 41 టీయూ–95, టీయూ–22ఎం3 దీర్ఘ శ్రేణి బాంబర్లు, దాడుల్లో వాటికి ఆద్యంతం దన్నుగా నిలిచే ఏ–50 నిఘా విమానాలపై డ్రోన్ దాడులు జరిగాయి. → వాటిలో 14 పూర్తిగా, మిగతా 27 చాలావరకు ధ్వంసమైనట్టు చెబుతున్నారు. → మూడున్నరేళ్లుగా ఉక్రెయిన్పై క్షిపణి, బాంబు దాడులకు రష్యా ప్రధానంగా ఉపయోగిస్తున్నది ఈ విమానాలనే! → ఈ నష్టం విలువ కనీసం రూ.60 వేల కోట్ల (700 కోట్ల డాలర్ల)పై చిలుకేనని రష్యా రక్షణ శాఖే అంచనా వేసింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
రిటర్నుల దాఖలుకు రెడీనా..?
ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో 6.47 కోట్ల నుంచి 8.39 కోట్లకు రిటర్నులు పెరిగాయి. పెరుగుతున్న అవగాహన, ఆదాయపన్ను శాఖ విస్తృత ప్రచారం ఇందుకు మద్దతుగా నిలుస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి (అసెస్మెంట్ సంవత్సరం 2025–26) ఆదాయపన్ను రిటర్నుల పత్రాలను ఆదాయపన్ను శాఖ నోటిఫై చేసింది. వీటిల్లో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. వీటి ఫలితంగా అదనపు వివరాలు నమోదు చేయాల్సి వచ్చింది. వీటితోపాటు.. ఆదాయన్ను రిటర్నుల పత్రాల ఎంపిక విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఐటీఆర్ 1, 4లో మార్పులు ఐటీఆర్ 1, 4 పత్రాల దాఖలుకు మరింత మందికి అర్హత లభించింది. ఈక్విటీ, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపై దీర్ఘకాల మూలధన లాభం కలిగిన వారు సైతం వీటిని దాఖలు చేయవచ్చు. కాకపోతే మూలధన లాభం ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షలు మించకూడదు. ‘‘ముందు సంవత్సరాల్లో సెక్షన్ 112ఏ కింద దీర్ఘకాల మూలధన లాభం (ఎల్టీసీజీ) పన్ను మినహాయింపు పరిధిలోనే ఉన్నప్పటికీ ఐటీఆర్–1 ఫారమ్కు అర్హత ఉండేది కాదు. దీనికి బదులు ఐటీఆర్–2 లేదా 3 దాఖలు చేయాల్సి వచ్చేది. ఇవి మరింత సంక్లిష్టంగా ఉండడంతో అధిక సమయం పట్టేది. చిన్న పన్ను చెల్లింపుదారులకు శ్రమ తగ్గించే ఉద్దేశ్యంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఐటీఆర్–1, 4 పరంగా అర్హత ప్రమాణాలను సవరించింది. మొత్తం ఎల్టీసీజీ రూ.1.25 లక్షలు మించనప్పుడు, మూలధన నష్టాలను క్యారీఫార్వార్డ్ (తదుపరి సంవత్సరాలకు బదిలీ) చేసుకోవాల్సిన అవసరం లేని వారు ఐటీఆర్ 1, 4 దాఖలు చేసుకునేందుకు అనుమతించింది’’అని ట్యాక్స్మన్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ వాద్వా తెలిపారు. ఒకవేళ దీర్ఘకాల మూలధన లాభం రూ.1.25 లక్షలకు మించినా లేదా మూలధన నష్టాలను క్యారీ ఫార్వార్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్న వారు ఇంతకుముందు మాదిరే ఐటీఆర్ 2 లేదా 3లో నిబంధనల ప్రకారం తమకు అనుకూలమైన దానిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. రూ.1.25 లక్షల వరకు మూలధన లాభంపై ఎలాంటి పన్ను లేకపోవడంతో ఈ వెసులుబాటు లభించింది. ఆధార్ నంబర్ ఉండాల్సిందే.. ఐటీఆర్ 1, 2, 3, 5 పత్రాల్లో ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీ కాలమ్ను తొలగించారు. ఇంతకుముందు వరకు ఆధార్ లేకపోయినా ఆధార్ కోసం దరఖాస్తు చేసుకున్న ఎన్రోల్మెంట్ నంబర్తో ఐటీఆర్ దాఖలు చేసుకునే అవకాశం ఉండేది. అసెస్మెంట్ సంవత్సరం (ఏవై) 2025–26 ఐటీఆర్లు దాఖలు చేయాలంటే కచ్చితంగా ఆధార్ నంబర్ ఉండాల్సిందే. లేదంటే ఐటీఆర్ దాఖలు చేయలేరని వాద్వా తెలిపారు. వ్యాపారులైతే అదనపు వివరాలు వ్యాపార ఆదాయం, వృత్తిపరమైన ఆదాయం ఉన్న వారు ఒక విధానం నుంచి మరో విధానానికి ఏటా మళ్లేందుకు అవకాశం లేదు. వీరు ఒక్కసారి కొత్త విధానాన్ని ఎంపిక చేసుకుంటే, జీవిత కాలంలో తిరిగి ఒక్కసారే పాత విధానానికి మళ్లేందుకు అనుమతిస్తారు. ‘‘గతేడాది ఐటీఆర్ 4 పత్రం కొత్త పన్ను విధానం నుంచి తప్పుకున్నారా? అని మాత్రమే అడిగేది. అవును అని బదులిస్తే ఫారమ్ 10–ఐఈఏ అక్నాలెడ్జ్మెంట్ నంబర్ ఇవ్వాల్సి వచ్చేది. ఏవై 2025–26 ఐటీఆర్–4లో మాత్రం మరిన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఫారమ్ 10–ఐఈఏ గత ఫైలింగ్ల ధ్రువీకరణలను సైతం సమరి్పంచాల్సి ఉంటుంది. ప్రస్తుత సంవత్సరంలోనూ కొత్త పన్ను విధానం నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నా రా? అనే ధ్రువీకరణ సైతం ఇవ్వాలి’’అని వాద్వా తెలిపారు. టీడీఎస్ వివరాలు ఈ ఏడాది ఐటీఆర్ 1, 2, 3, 5లో టీడీఎస్ కాలమ్లో.. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఏ ఆదాయం నుంచి టీడీఎస్ మినహాయించారన్న వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. వేతనం కాకుండా ఇతర ఆదాయంపై టీడీఎస్ మినహాయించినట్టయితే ఆ వివరాలు నమోదు చేయడం తప్పనిసరి అని వాద్వా తెలిపారు. మూలధన నిబంధనల్లో మార్పులు 2024 బడ్జెట్లో స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభాల నిబంధనల్లో మార్పులు చేశారు. ఇవి 2024 జూలై 23 నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో గత ఆర్థిక సంవత్సరంలో లిస్టెడ్ షేర్లు లేదా అన్లిస్టెడ్ షేర్లు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, ఇల్లు, భూమి లేదా ఇతర క్యాపిటల్ అసెట్లను విక్రయించినట్టయితే.. అవి ఏ తేదీన విక్రయించారన్న దాని ఆధారంగా పన్ను బాధ్యతలను వేర్వేరుగా మదింపు వేసుకోవాలి. 2024 జూలై 23కు ముందు విక్రయించినట్టయితే ఒక రేటు, ఆ తర్వాత విక్రయించిన వారికి మరొక రేటు వర్తిస్తుంది. ఐటీఆర్ పత్రాల్లో 2024 జూలై 23కు ముందు, ఆ తర్వాత లావాదేవీల వివరాలను సమగ్రంగా నమోదు చేయాలి. ఈక్విటీ, డెట్ సెక్యూరిటీలపై వేర్వేరు రేట్ల ప్రకారం పన్ను చెల్లించాలి. మూలధన లాభం ఉంటే ఐటీఆర్ 2, 3 లేదా 5లో నిబంధనల ప్రకారం తమకు సరిపోయే పత్రాన్ని దాఖలు చేయాలి. అన్లిస్టెడ్ బాండ్లు, డిబెంచర్లపై లాభం అన్లిస్టెడ్ బాండ్లు, డిబెంచర్లపై మూలధన లాభాలను ఈ ఏడాది ఐటీఆర్ పత్రాల్లో ప్రత్యేకంగా వెల్లడించాల్సి ఉంటుంది. 2024 జూలై 23 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ‘‘వీటి ప్రకారం.. అన్లిస్టెడ్ డిబెంచర్లు లేదా బాండ్లు 2024 జూలై 22 లేదా అంతకుముందు ఇష్యూ చేసి ఉంటే, వాటి గడువు ముగింపు లేదా విక్రయం లేదా బదిలీ 2024 జూలై 23 లేదా ఆ తర్వాత జరిగితే.. ఆ మొత్తాన్ని స్వల్పకాల మూలధన లాభం కిందే పరిగణిస్తారు. ఎంతకాలం పాటు కొనసాగించారన్న దానితో సంబంధం లేదు. ఈ ఆదాయాన్ని తమ వార్షిక ఆదాయానికి కలిపి నిబంధనల మేరకు పన్ను చెల్లించాలి. 2024 జూలై 23కు ముందు ఇన్వెస్ట్ చేసి, ఆ లోపే విక్రయించినట్టయితే అప్పుడు దీర్ఘకాల మూలధన లాభం కింద 20 శాతం పన్ను చెల్లించాలి’’అని వాద్వా వివరించారు. అన్లిస్టెడ్ బాండ్లు, డిబెంచర్లలో పెట్టుబడులు కలిగిన వారు ఐటీఆర్ 2, 3 లేదా 5 ద్వారా వెల్లడించాల్సి ఉంటుంది. బైబ్యాక్ సైతం డివిడెండే2024 అక్టోబర్ 1 నుంచి లిస్టెడ్ కంపెనీలు చేపట్టే షేర్ల బైబ్యాక్లో పాల్గొని, ఆదాయం అందుకుంటే ఆ మొత్తాన్ని డివిడెండ్ కిందే పరిగణిస్తారు. ‘ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్’ (ఇతర వనరుల రూపంలో వచ్చిన ఆదాయం) కింద బైబ్యాక్ మొత్తాన్ని డివిడెండ్ ఆదాయంగా చూపించాలని వాద్వా సూచించారు. ‘‘క్యాపిటల్ గెయిన్స్ షెడ్యూల్లో మాత్రం బైబ్యాక్లో షేర్లను విక్రయించగా వచ్చిన మొత్తాన్ని సున్నా కింద చూపించాలి. అప్పుడు షేర్ల కొనుగోలుకు చేసిన పెట్టుబడి మొత్తం మూలధన నష్టం అవుతుంది. దీన్ని తదుపరి సంవత్సరాలకు క్యారీ ఫార్వార్డ్ చేసుకోవాలి. తదుపరి ఎనిమిది ఆర్థిక సంవత్సరాల్లో దీర్ఘకాల మూలధన లాభాలతో సర్దుబాటు చేసుకోవచ్చు’’అని వాద్వా వివరించారు. 80డీడీ, 80యూ కోసం డిజేబిలిటీ సర్టీఫికెట్ వైకల్యంతో ఉన్న వారి కోసం చేసిన వ్యయాలను పాత పన్ను విధానంలో సెక్షన్ 80డీడీ లేదా సెక్షన్ 80యూ కింద మినహాయింపు కోరుకునే అవకాశం ఉంది. ఇందుకు గతంలో ఫారమ్ 10–ఐఏ వివరాలు ఇస్తే సరిపోయేది. అయితే ఈ ఏడాది నుంచి ఈ సెక్షన్ల కింద మినహాయింపు కోరేవారు ఫారమ్ 10–ఐఏతోపాటు (మెడికల్ సర్టీ ఫికెట్) డిజేబిలిటీ సర్టిఫికెట్ అక్నాలెడ్జ్మెంట్ నంబర్ (వైకల్య సర్టిఫికెట్ ధ్రువీకరణ) ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు ఐటీఆర్ 2 లేదా 3ని ఎంపిక చేసుకోవాలని వాద్వా సూచించారు. వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్యూఎఫ్) దివ్యాంగుల కోసం చేసే వైద్య వ్యయాలు లేదా ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులపై సెక్షన్ 80డీడీ కింద పన్ను మినహాయింపు కోరొచ్చు. 80యూ సెక్షన్ అన్నది స్వయంగా వైకల్యం ఎదుర్కొంటున్న పన్ను చెల్లింపుదారుల కోసం ఉద్దేశించినది. 40 శాతం వైకల్యం ఉన్న వారు రూ.75,000, 80 శాతం వరకు వైకల్యం ఎదుర్కొనే వారు రూ.1.25 లక్షల ఆదాయంపై పన్ను మినహాయింపును ఈ రెండు విభాగాల్లోని వారు క్లెయిమ్ చేసుకోవచ్చు. రూ.కోటిదాటితేనే అప్పుల వివరాలు.. ఇప్పటి వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో మొ త్తం ఆదాయం రూ.50లక్షలు మించినట్టయితే ఆస్తులు, అప్పుల వివరాలను ఐటీఆర్లో వెల్లడించాల్చి వచ్చేది. 2025–26 అసెస్మెంట్ సంవత్సరం నుంచి మొత్తం ఆదాయం రూ.కోటి మించినప్పుడే ఆస్తులు, అప్పుల వివరాలు వెల్లడించాలంటూ నిబంధనల్లో మార్పులు చేశారు. ఎవరికి ఏ ఫారమ్? ఐటీఆర్–1: వేతనం లేదా పింఛను రూపంలో రూ.50లక్షలకు మించకుండా ఆదాయం, ఒక ఇంటిపై ఆదాయం కలిగిన వారు, ఇతర ఆదాయం ఉన్న వారు (లాటరీ లేదా పందేల్లో గెలుపు రూపంలో కాకుండా) ఐటీఆర్–1 దాఖలు చేసుకోవచ్చు. ఈ ఏడాది నుంచి వచ్చిన మార్పుల ప్రకారం దీర్ఘకాల మూలధన లాభం రూ.1.25 లక్షలు మించని వారు సైతం ఇదే పత్రాన్ని ఎంపిక చేసుకోవచ్చు. భారత్కు వెలుపల ఆస్తులు కలిగిన వారు లేదా విదేశీ ఆదాయం కలిగిన వారు ఐటీఆర్–1 దాఖలుకు అర్హులు కారు. అలాగే రూ.50 లక్షలకు మించి ఆదాయం కలిగిన వారు, వ్యవసాయ ఆదాయం రూ.5,000 మించిన వారికీ ఐటీఆర్–1 వర్తించదు. ఐటీఆర్–2: వ్యక్తులు లేదా హెచ్యూఎఫ్లు రూ.50 లక్షలకు మించి ఆదాయం కలిగి.. అదే సమయంలో వ్యాపారం లేదా వృత్తిపరమైన ఆదాయం లేనట్టయితే ఐటీఆర్–2ను ఎంపిక చేసుకోవాలి. ఇతర ఆదాయం (లాటరీలు, పందేల రూపంలో గెలుచుకున్న ఆదాయం సైతం) కలిగి ఉంటే.. స్వల్పకాల మూలధన లాభం, రూ.1.25 లక్షలకు మించి దీర్ఘకాల మూలధన లాభం, మూలధన నష్టాలను క్యారీ ఫార్వార్డ్ చేసుకోవాలనుకుంటే, ఒకటికి మించి ఇళ్లపై ఆదాయం.. విదేశీ ఆస్తులు/ ఆదాయం.. క్రిప్టో ఆదాయం కలిగినవారు (మూలధన లాభంగా చూపించేట్టయితే), వ్యవసాయం ఆదాయం రూ.5,000 మించి ఉంటే, ఒక కంపెనీలో డైరెక్టర్ హోదాలో ఉంటే, అన్లిస్టెడ్ షేర్లు కలిగిన వారు సైతం ఫారమ్ 2ను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్–3: ఐటీఆర్–2లో పేర్కొన్న అన్ని ఆదాయాలకు అదనంగా ఒక సంస్థలో భాగస్వామిగా ఉంటే, క్రిప్టో ఆదాయాన్ని వ్యాపార ఆదాయంగా చూపిస్తుంటే ఐటీఆర్–3ని ఎంపిక చేసుకోవాలి. వ్యాపారం, వృత్తి నుంచి ఆదాయం (ఆడిట్, ఆడిట్ అవసరం లేని కేసులు), వేతనం, అద్దె ఆదాయం, స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభాలు, వడ్డీ, డివిడెండ్లు, లాటరీ ఆదాయం లేదా ఇతర ఏదైనా ఆదాయం.. ఒక సంస్థలో భాగస్వామిగా ఆదాయం అందుకున్న వారికి ఇది వర్తిస్తుంది. వ్యాపారం లేదా వృత్తి నిర్వహిస్తూ ప్రిజంప్టివ్ ఇన్కమ్ను ఎంపిక చేసుకోని వారు, వ్యాపారం లేదా వృత్తి ఆదాయం కలిగి రికార్డులు నిర్వహిస్తూ, వాటిని ఆడిటింగ్ చేయాల్సి ఉన్న వారికి కూడా ఇదే వర్తిస్తుంది. ఐటీఆర్–4: రూ.50లక్షల వరకు ఆదాయం కలిగిన వ్యక్తులు, హెచ్యూఎఫ్లు, పార్ట్నర్íÙప్ ఫర్మ్లు (ఎల్ఎల్పీలు కాకుండా).. ఐటీఆర్–1 కిందకు వచ్చే ప్రతీ ఆదాయానికి అదనంగా.. ప్రిజంప్టివ్ ఇన్కమ్ (టర్నోవర్పై నిరీ్ణత శాతాన్ని ఆదాయంగా చూపించే) స్కీమ్ కింద వ్యాపారం/వృత్తి ఆదాయం కలిగిన వారు ఐటీఆర్–4ను ఎంపిక చేసుకోవాలి. వ్యవసాయం ఆదాయం రూ.5,000 కు మించకుండా ఉంటేనే దీనికి అర్హత ఉంటుంది. లాటరీ, పందేల రూపంలో కాకుండా ఇతర ఆదాయం కలిగిన వారు.. వీటికి అదనంగా దీర్ఘకాల మూలధన లాభం రూ.1.25 లక్షలకు మించకుండా ఉండి, మూలధన నష్టాలను క్యారీ ఫార్వార్డ్ చేసుకోవాల్సిన అవసరం లేని వారు ఐటీఆర్ –4 దాఖలు చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్–5: ఎల్ఎల్పీలు, అసోసియేషన్ ఆఫ్ పర్సన్లు (ఏవోపీలు), బాడీ ఆఫ్ ఇండివిడ్యువల్స్ (బీవోఐలు), ఆర్టీఫీషియల్ జ్యురిడికల్ పర్సన్ (ఏజేపీలు)లకు ఇది వర్తిస్తుంది. ఐటీఆర్–6: సెక్షన్ 11 కింద మినహాయింపులు క్లెయిమ్ చేయని కంపెనీలు ఐటీఆర్–6 దాఖలు చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్–7: సెక్షన్ 139(4ఏ), లేదా సెక్షన్ 139(4బి) లేదా సెక్షన్ 139(4సి), లేదా సెక్షన్ 139(4డి), లేదా సెక్షన్ 139(4ఈ), లేదా సెక్షన్ 139(4ఎఫ్)ల కింద ఆదాయం కలిగిన వ్యక్తులు, కంపెనీలకు ఐటీఆర్–7 వర్తిస్తుంది. డిజిటల్ ఫారమ్ 16 ఆదాయపన్ను శాఖ కొత్తగా డిజిటల్ ఫారమ్ 16ను ప్రకటించింది. ఉద్యోగుల వేతనం నుంచి మినహాయించిన పన్ను వివరాలు (టీడీఎస్) ఫారమ్ 16లో ఉంటాయి. సాధారణంగా ఏటా మే చివరి నాటికి ఈ పత్రాన్ని యాజమాన్యాలు ఉద్యోగులకు జారీ చేస్తుంటాయి. దీని ఆధారంగా ఉద్యోగులు రిటర్నులు దాఖలు చేస్తుంటారు. ఇకపై ట్రేసెస్ పోర్టల్ నుంచి నేరుగా ఫారమ్ 16 డిజిటల్ పత్రాన్ని జారీ చేయనున్నారు. దీంతో ఈ డిజిటల్ ఫారమ్ 16ను పన్ను రిటర్నుల దాఖలు పోర్టళ్లపై డిజిటల్గా అప్లోడ్ చేసుకోవచ్చు. దాంతో ఫారమ్ 16లో ఉన్న వివరాలన్నీ ఐటీఆర్లో ఆటోమేటిగ్గా భర్తీ అవుతాయి. ఇవి గమనించాలి.. → వ్యక్తులు, హెచ్యూఎఫ్లు, ఆడిటింగ్ అవసరం లేని సంస్థలు జూలై 31 లేదా ఆలోపు ఐటీఆర్లు ఫైల్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఈ ఏడాది ఐటీఆర్ పత్రాల్లో మార్పులు తీసుకొచ్చినందున ఈ గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించారు. → ఆడిటింగ్ అవసరమైన వ్యాపార సంస్థలకు ఈ గడువు అక్టోబర్ 31. → సవరణ రిటర్నులు దాఖలుకు డిసెంబర్ 31 వరకు గడువు ఉంటుంది. → రూ.5లక్షలకు మించని ఆదాయం కలిగిన వారు రూ.5వేల ఆలస్యపు రుసుం, రూ.5 లక్షలు మించిన ఆదాయం కలిగిన వారు రూ.1,000 ఆలస్యపు రుసుంతో డిసెంబర్ 31 వరకు బిలేటెడ్/లేట్ రిటర్నులు దాఖలు చేసుకోవడానికి అనుమతి ఉంది. → అప్డేటెడ్ రిటర్నులను అసెస్మెంట్ సంవత్సరం ముగిసిన నాటి నుంచి నాలుగేళ్ల వరకు దాఖలు చేసుకోవచ్చు. ఇందుకు మార్చి 31 తుది గడువు. సాక్షి, బిజినెస్ డెస్క్ -
కృత్రిమ రక్తం
రక్తం ప్రాణాధారం. ఏదైనా ప్రమాదం జరిగి లేదా శస్త్రచికిత్స వల్ల చాలా రక్తం పోయిన మనిషిని బతికించాలంటే ఆసుపత్రిలో ఆ వ్యక్తి బ్లడ్ గ్రూప్నకు సరిపోయే రక్తం ఉండాలి. ఒకవేళ లేకపోతే సరిపోయే బ్లడ్ గ్రూప్ ఉన్న ఆరోగ్యవంతుడైన మనిషి నుంచి రక్తాన్ని సేకరించి ఎక్కించాలి. ఆ రక్తం దొరక్క కొన్నిసార్లు ప్రాణాలే పోతుంటాయి. కానీ భవిష్యత్తులో దీన్ని పూర్తిగా నివారించవచ్చు! ఎవరికైనా నిమిషాల్లో.. మనుషులే ఇవ్వాల్సిన అవసరం లేకుండా 24 గంటలూ రక్తం అందుబాటులో ఉండొచ్చు!! దీన్ని కృత్రిమ రక్తం అందామా లేక కృత్రిమ ప్రాణాధారం అందామా? ఏ పేరు పెట్టి పిలిచినా ఇదీ రక్తమే. ఈ దిశగా జపాన్లో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. అవి విజయవంతమైతే కోట్లాది మంది ప్రాణాలు కాపాడొచ్చు.ప్రపంచంలోనే తొలిసారి 2018లో కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఎస్టిమేషన్ ఆఫ్ బ్లడ్ రిక్వైర్మెంట్ ఇన్ ఇండియా అనే నివేదిక విడుదల చేసింది. దేశంలో పెరుగుతున్న జనాభా, వారి ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా దేశంలో రక్తమార్పిడుల వంటి వాటికి ఎంత రక్తం అవసరం అవుతుందో కనిపెట్టడం దీని ప్రధాన ఉద్దేశం. 2008 నాటి ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 2007లో మన దేశంలో కోటి యూనిట్ల రక్తం కావాలని అంచనా వేసింది. కానీ, అప్పటికి మనదేశంలో అందుబాటులో ఉన్నది 40 లక్షల యూనిట్లే. 2018 లెక్కల ప్రకారం అవసరమైనది 2.65 కోట్ల యూనిట్లు. ఈ లెక్కన ప్రస్తుతం ఇది ఎంతకు చేరి ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఒక్క మనకే కాదు.. యావత్ ప్రపంచానికి కృత్రిమ రక్తం.. నిజంగా ప్రాణదాత.రక్తమార్పిడి చరిత్ర మొట్టమొదటి రక్తమార్పిడి 1665లో ఇంగ్లండ్లో జరిగింది. కొన్ని కుక్కల నుంచి రక్తాన్ని తీసి గాయపడిన కుక్కకు ఎక్కించి దాని ప్రాణాలు కాపాడారు. ఆ తరువాత 1818లో బ్రిటిష్ వైద్యుడు జేమ్స్ బ్లండెల్ మనుషుల్లో రక్తమార్పిడి విజయవంతంగా నిర్వహించారు. 19వ శతాబ్దంలో న్యూయార్క్లో థియోడర్ గెయిలార్డ్ థామస్ అనే స్త్రీల వైద్య నిపుణుడు (గైనకాలజిస్ట్) రక్తానికి బదులు ఆవు పాలను వాడాడు. 1875లో.. తన దగ్గరకు తీవ్ర రక్తస్రావంతో వచ్చిన మహిళకు 175 మిల్లీలీటర్ల ఆవుపాలు ఎక్కించాడు.వారంపాటు ఆమె జ్వరం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి సమస్యలతో ఇబ్బందిపడినా తరువాత అన్నీ సర్దుకున్నాయట. అలా థామస్ ఏడుసార్లు పాలు ఎక్కించాడట. ఆ ఫలితాలు ఎన్నో మెడికల్ జర్నళ్లలోనూ ప్రచురితమయ్యాయి. 1880 వరకు ఇలా రక్తానికి బదులు ఆవు, మేకపాలు ఎక్కించడం అమెరికా అంతటా జరిగిందని సైన్స్ మ్యాగజైన్ రాసింది. అప్పటి నుంచీ ఇప్పటివరకూ జపాన్తోపాటు అమెరికా, యూకే, చైనా వంటి దేశాలు కృత్రిమ రక్తంపై ఇప్పటికే చాలా పరిశోధనలు, ప్రయోగాలు చేశాయి.. చేస్తున్నాయి. పాడైపోయిన మానవ రక్తంతో.. మానవ రక్తానికి ప్రత్యామ్నాయంగా కృత్రిమ రక్తాన్ని జపాన్ పరిశోధకులు ప్రయోగశాలలో అభివృద్ధి చేశారు. జపాన్లోని నారా మెడికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హిరోమీ సకాయి ఇందులో కీలకపాత్ర పోషించారు. ఆమె, ఆమె వైద్య బృందం సాధించిన ఈ ఘనతను వైద్య చరిత్రను మలుపుతిప్పే ఘటనగా నిపుణులు వరి్ణస్తున్నారు. ఈ ప్రక్రియకు వీళ్లు వాడింది.. పాడైపోయిన మానవ రక్తాన్నే. ఈ రక్తంలోని హిమోగ్లోబిన్ను వీళ్లు వేరుచేశారు. దాన్ని ఎలాంటి వైరస్లూ సోకేందుకు అవకాశం లేని ప్రత్యేక షెల్లో ఉంచి, అత్యంత జాగ్రత్తగా, కొన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా ఈ కృత్రిమ రక్తం తయారుచేశారు.ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. వాలంటీర్లకు 100 నుంచి 400 మిల్లీలీటర్ల కృత్రిమ రక్తాన్ని ఎక్కించి పరీక్షిస్తున్నారు. ఈ ఆవిష్కరణకు మద్దతుగా జరుగుతున్న మరో ఆవిష్కరణలో భాగంగా ప్రాణవాయువును తీసుకెళ్లేందుకు వాహకాలను తయారుచేస్తున్నారు. చువో యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ తెరియుకి కొమట్సు బృందం. ప్లాస్మాలోని అల్బుమిన్తో వీటిని రూపొందించారు. ఇవి రక్తపోటును నియంత్రించేందుకు, గుండెపోటు వంటివి రాకుండా చేసేందుకు సహాయపడతాయి. క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే 2030 నాటికి ఈ రక్తం అందుబాటులోకి వస్తుంది. రక్తం ఎప్పుడు కావాలంటే.. ఎముకల లోపల ఉండే మూలుగ నుంచి రక్తం తయారవుతుంది. సగటున మనిషి శరీరంలో దాదాపు 5 లీటర్ల వరకు రక్తం ఉంటుంది. మన రక్తం ఎర్రగా ఉండటానికి కారణం మన రక్తంలో ఆక్సిజన్ను మోసుకెళ్లే హిమోగ్లోబిన్ అనే పిగ్మెంట్. కొన్ని రకాల శస్త్రచికి త్సలు, ప్రమాదాలు, ప్రసవాలు, పోషకాహార లోపం వల్ల వచ్చే రక్తహీనత, బోన్ మేరో మార్పిడి, బోన్ మేరో ఫెయిల్యూర్, లుకేమియా, హీమోఫీలియా, డెంగ్యూ జ్వరం, తీవ్రమైన మలేరియా జ్వరం వంటి సందర్భాల్లో రక్తమార్పిడి అవసరమవుతుంది.2 ఏళ్లు.. ఊదా రంగు.. సాధారణంగా మన రక్తం 42 రోజుల వరకే నిల్వ ఉంటుంది. ఆలోపు వాడకపోతే వృథా అయిపోతుంది. కానీ ఈ కృత్రిమ రక్తం 2 ఏళ్లపాటు నిల్వ ఉంటుంది. అంటే.. వృథా అయ్యే అవకాశమే లేదన్నమాట. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. మనరక్తం ఎరుపు రంగులో ఉంటే ఇది ఊదా రంగులో ఉంటుంది. అలవాటు కావడానికి మనకు కాస్త సమయం పడుతుందేమో! అంతేకాదు, బ్లడ్ గ్రూప్తో సంబంధం లేకుండా అందరికీ ఈ రక్తాన్ని ఎక్కించే అవకాశం కూడా ఉందట. -
తెలంగాణ ‘పానకాల స్వామి’!
చింతకాని: చుట్టూ కొండలు.. ఆహ్లాదాన్ని పంచే పచ్చని పొలాలు.. ఎత్తయిన గుట్టపై రాతి కొండలో స్వయంభువుగా వెలిసిన శ్రీ గజగిరి లక్ష్మీనర్సింహస్వామి కొలిచిన వారికి కొంగు బంగారంలా వర్థిల్లుతున్నాడు. భక్తులు పోసిన బెల్లం పానకాన్ని సగం స్వీకరించి.. మిగతాది ప్రసాదంగా మిగులుస్తూ పానకాల స్వామిగా పూజలు అందుకుంటున్నాడు. త్రేతాయుగంలో హిరణ్యకశిపుడి బారి నుంచి ప్రహ్లాదుడిని రక్షించే క్రమంలో ఖమ్మం జిల్లా చింతకాని మండలం సీతంపేట సమీపాన ఉన్న కొండపై ప్రకృతి రమణీయతకు ముగ్ధుడై నర్సింహస్వామి స్వయంభువుగా వెలిసినట్లు పురాణాలు చెబుతున్నాయి. పానకాల స్వామి ఆలయం.. దేశంలో ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి తర్వాత తెలంగాణలోని సీతంపేటలో మాత్రమే ఉంది. ఘనమైన ఆలయ చరిత్ర త్రేతాయుగంలో నర్సింహస్వామి.. హిరణ్యకశిపుడి బారి నుంచి ప్రహ్లాదుడిని రక్షించి తిరిగి వైకుంఠానికి శ్రీదేవి, భూదేవి సమేతంగా వెళ్తున్నాడట. మార్గమధ్యలో సీతంపేట వద్ద ప్రకృతి రమణీయతతో అలరారుతుండటంతో దేవేరుల కోరిక మేరకు స్వామి ఇక్కడ కొండపై స్వయంభువుగా వెలిశాడని భక్తుల నమ్మిక. 500 ఏళ్ల క్రితం.. సుమారు 500 ఏళ్ల క్రితం ఈ ప్రాంత జమీందారు, నాగులవంచ పరగణా«దీశుడు గడ్డం సీతారామిరెడ్డి తాత భూపతిరెడ్డికి సంతానం లేకపోవటంతో.. ఆ దంపతులు ఇష్ట దైవం నర్సింహస్వామిని నిత్యం పూజించేవారు. ఒకరోజు భూపతిరెడ్డి కలలో కనిపించి దేవుడు ‘నీకు సంతానం కలగాలంటే నాకు గుడి కట్టించాలి. జ్యోతి రూపంలో ఆకాశమార్గంలో వెళ్తుంటాను. ఆ జ్యోతి ఎక్కడయితే అదృశ్యమవుతుందో అక్కడే ఆలయం నిర్మించాలి’.. అని చెప్పి అదృశ్యమయ్యాడట. దీంతో జమీందార్ సూచనల మేరకు పండితులు అన్వేషిస్తుండగా సీతంపేట వద్ద అడవిలోని కొండల మధ్యలో.. రాతి కొండపై స్వామి వారు దేదీప్యమానంగా దర్శమిచ్చారట. భూపతిరెడ్డి రాతి కొండపై స్వామి గుడి కట్టించాడు. తదనంతరం జమీందారుకు సంతానం కలిగింది. కాగా, స్వామి ఇక్కడ ఏనుగు పడుకున్న ఆకారాన్ని పోలి ఉండడంతో.. శ్రీ గజగిరి లక్ష్మీనర్సింహ స్వామిగా కొలుస్తున్నారు. పానకాల స్వామిగా.. నర్సింహస్వామికి పాంచారాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం ఆరాధన, పూజలు నిర్వహించేవారు. కొంతకాలానికి ఒక భక్తుడిని స్వామి వారు ఆవహించి.. ‘నాకు దప్పికగా ఉంది. బెల్లం పానకం పోయండి’.. అని సూచించారట. దీంతో అర్చకులు బిందెలతో పానకం పోయగా.. సగం మాత్రమే స్వీకరించారని ప్రతీతి. ఇదేమిటని ప్రార్థించడంతో ‘సగం పానకాన్నే స్వీకరిస్తా.. మిగతాది భక్తుల కోసం’.. అని చెప్పినట్లు ప్రతీతి. దీంతో అప్పటి నుంచి శ్రీ గజగిరి లక్ష్మీనర్సింహ స్వామిని పానకాల స్వామిగా కొలుస్తున్నారు. ఏటా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజు ఇక్కడ స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. కొండపై కోనేరు.. కొండపై ఆలయం, కోనేరు ఉంటాయి. ఈ కోనేరు స్వామి వారి పాదముద్రల ఆకారంలో ఉండడంతో పాటు ఎండాకాలంలో ఎక్కడా నీరు లేకున్నా కోనేరు మాత్రం ఎండిపోయిన దాఖలాలు లేవు. దీన్ని స్వామి మహిమగా భక్తులు చెప్పుకుంటారు. కాగా, త్రిదండి చినజీయర్ స్వామి 2004లో ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాలు, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనకు ఆయన హాజరయ్యారు. ధూపదీప నైవేద్యానికి 150 ఎకరాలు నైజాం నవాబు భూమి శిస్తు వసూళ్ల కోసం ఈ ప్రాంతానికి రాగా జమీందారు భూపతిరెడ్డి ఆయనను ఆలయానికి తీసుకెళ్లాడట. అక్కడ పానకం మహిమను వివరిస్తే నవాబు స్వామి విగ్రహం నోట్లో చేయి పెట్టి అబద్ధమని పరిహాసమాడాడట. దీంతో ఆగ్రహించిన స్వామి.. తన దంతాలతో నవాబు చేయి బయటకు రాకుండా పట్టుకోవడంతో.. ఆయన క్షమించమని కోరడమే కాక ధూపదీప నైవేద్యాల నిమిత్తం కనుచూపు మేర ఉన్న భూమిని ఆలయానికి రాసిచ్చాడని చెబుతారు. కాగా, భూపతిరెడ్డి వంశీయులైన నాగులవంచ గ్రామానికి చెందిన గడ్డం ఉపేందర్రెడ్డి కుటుంబీకులు గత మూడేళ్ల వరకు ఆలయ ధర్మకర్త మండలి సభ్యులుగా కొనసాగారు. ప్రస్తుతం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటవుతోంది. అయితే, ఆలయం పేరిట ఉన్న 150 ఎకరాల భూమిని అమ్మి నగదు బ్యాంక్లో డిపాజిట్ చేశారు. ఈ డిపాజిట్లపై వచ్చే వడ్డీతో కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. ఈ నగదు ఎటూ సరిపోనందున.. ప్రభుత్వం స్పందించి ఆలయ అభివృద్ధిపై దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారుఆధ్యాత్మిక కేంద్రంగా రూపొందించాలి తెలంగాణలో స్వామి పానకం తాగే ఏకైక ఆలయం సీతంపేటలోనే ఉంది. పచ్చని పంట పొలాల మధ్య ఎత్తయిన కొండపై స్వామి స్వయంభువుగా వెలిశారు. ఘనచరిత్ర కలిగిన శ్రీ గజగిరి లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అనేక అవకాశాలు ఉన్నాయి. – చుండూరు రామకోటేశ్వరరావు, ఆలయ ఈవో నిర్వహణ కష్టంగా ఉంది శ్రీ గజగిరి లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని అభివృద్ది చేయాలి. దేశంలో ఉన్న రెండు ఆలయాల్లో సీతంంపేటలో ఒకటి ఉంది. ఆలయానికి ఉన్న డిపాజిట్లపై వచ్చే వడ్డీతో ఆలయ నిర్వహణ కష్టంగా ఉంది. ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించాలి. – పీవీ రమణాచార్యులు, ఆలయ అర్చకుడు -
స్టేటస్పెట్టుకుంటే డబ్బులిస్తాం!
సైబర్ నేరగాళ్లు రూటు మార్చారు. ‘తక్కువ మొత్తం.. ఎక్కువ మంది నుంచి వసూలు’అనే సరికొత్త మోసతంత్రాన్ని తెరపైకి తెచ్చారు. నగరాల్లో సైబర్ మోసాలపై క్రమంగా అవగాహన పెరుగుతుండటంతో సైబర్ నేరగాళ్లు క్రమంగా ద్వితీయశ్రేణి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. వాట్సాప్ వాడటం అన్ని ప్రాంతాల్లో పరిపాటిగా మారడంతో దాన్నే ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. తాము పంపిన ఫొటోలను వాట్సాప్ స్టేటస్గా పెట్టుకుంటే మీ బ్యాంకు ఖాతాల్లో కాసులు వచ్చిపడతాయని బురిడీ కొట్టిస్తున్నారు.వాట్సాప్ స్టేటస్గా పెట్టిన ఫొటోలను వ్యూ, లైక్, కామెంట్.. ఇలా ఒక్కో టాస్క్కు రూ. 2 చొప్పున మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని ప్రచారం చేస్తున్నారు. ఇదంతా జరగాలంటే ముందుగా రిజి్రస్టేషన్ ఫీజు కింద రూ. 300 తాము చెప్పిన ఫోన్ నంబర్కు పంపాలని సూచిస్తున్నారు. వాటిని నమ్మి వాట్సాప్ స్టేటస్ టాస్క్ ముందుకొచ్చే వారి నుంచి ముందుగా రూ. 300 వసూలు చేయడమే కాకుండా మరో ఆరుగురిని చేరిస్తే కట్టిన రూ. 300 తిరిగి ఇస్తామని ఊదరగొడుతున్నారు. క్రమంగా మల్టీలెవల్ మార్కెటింగ్ తరహాలో చైన్ను ఏర్పాటు చేస్తూ అమాయకుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. తాండూరు ప్రాంతంలో ఈ తరహా సైబర్ మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. మారింది. వేలాది మంది ఈ తరహాలో డబ్బులు పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. - సాక్షి, హైదరాబాద్బాధితులు ఫిర్యాదు చేయకపోవడంతో..సైబర్ మోసగాళ్లు చెప్పే మాటలు నమ్మి బాధితులంతా రూ.300 చొప్పున వారు చెప్పే గూగుల్ పే, ఫోన్ పే నంబర్లకు చెల్లిస్తున్నారు. ఇందులో ఒకరిద్దరికి రూ. 300 తిరిగి ఇస్తున్న నేరగాళ్లు... ఎక్కువ మంది నుంచి డబ్బులు దండుకోవడమే పనిగా పెట్టుకుంటున్నారు. వాట్సాప్ స్టేటస్ను నెలపాటు పెట్టుకోవడంతోపాటు ప్రతిరోజూ స్కీన్ర్ షాట్ పంపాలని నిబంధన విధించడం.. చివరకు నిబంధనలు పాటించనందున మళ్లీ మొదటి నుంచి చేయాలంటూ అమాయకులను మోసగిస్తున్నారు. ఈ తరహా మోసాలు ప్రధానంగా తాండూరు, వికారాబాద్ ప్రాంతంలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. అయితే బాధితులంతా ఇంత చిన్నమొత్తానికి పోలీసులకు ఏం ఫిర్యాదు చేస్తాంలేనని వదిలేస్తుండటం సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతోంది. బాధితుల సంఖ్య పెరిగేకొద్దీ సైబర్ నేరగాళ్లు కొల్లగొడుతున్న సొమ్ము రూ. లక్షల్లోకి చేరుతోంది.తెలిసిన వాళ్లు చెబితే డబ్బు కట్టాం మాకు తెలిసిన వ్యక్తి ద్వారా వాట్సాప్ స్టేటస్ పెడితే డబ్బులు వస్తాయని తెలిసి మేం కూడా రూ. 300 ఫీజు ఆన్లైన్లో కట్టి రుద్ర టెక్నాలజీ పేరిట వాట్సాప్ గ్రూప్లో చేరాం. ఆ తర్వాత 30 ఫొటోలు వచ్చాయి. రోజుకు ఒకటి చొప్పున వాట్సాప్ స్టేటస్గా పెట్టుకున్నాం. కానీ ఆ తర్వాత డబ్బులు తిరిగి రాలేదు. – సుదర్శన్రెడ్డి, తాండూరుఐదుగురిని చేర్పించి మోసపోయావికారాబాద్లో ఓ స్నేహితుడి ద్వారా రూ. 300 ఆన్లైన్లో పంపా. 30 రోజులపాటు ఫొటోలు పెట్టాక డబ్బులు అడిగితే టాస్క్ సరిగా చేయలేదన్నారు. గ్రూప్లో ఐదుగురిని చేరి్పస్తే వెంటనే డబ్బులు వస్తాయని ఆశపెట్టడంతో ఐదుగురిని చేరి్పంచా. అయినా నాతోపాటు ఆ ఐదుగురి డబ్బులు కూడా పోయాయి. – నీరటి నరేశ్కుమార్, కొత్తూరు -
చెట్టు రంగు మారిందో... అగ్నిపర్వతం పేలిందే!
అగ్నిపర్వతాలు ఎప్పుడు బద్ధలవుతాయో కచ్చితంగా గుర్తించగల పరిజ్ఞానం ఇప్పటిదాకా లేదు. ఇది తరచూ తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టానికి దారితీస్తోంది. అగ్నిపర్వతాల విస్ఫోటాన్ని ముందుగానే కనిపెట్టగల విధానాన్ని తాజాగా ఆవిష్కరించారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’, స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఈ దిశగా కీలక ముందడుగు వేశారు. అగ్నిపర్వతం చుట్టుపక్కల ఉండే చెట్లూ చేమల ఆధారంగా అదెప్పుడు పేలేదీ ముందుగానే గుర్తించవచ్చని వారంటున్నారు. అగ్నిపర్వతం పేలినప్పుడు శిలాద్రవం (మాగ్మా) వెలువడుతుందన్నది తెలిసిందే. మాగ్మా కంటే ముందే కార్బన్ డయాక్సైడ్ అధిక మోతాదుల్లో వెలువడుతుంది. దాన్ని పీల్చే చెట్ల ఆకుల రంగు మారిపోతుంది. అవి ముదురు ఆకుపచ్చ రంగును సంతరించుకుంటాయి. ఈ మార్పును స్పష్టంగా గమనించవచ్చు. అంతేగాక పేలుడుకు ముందు ఆ ప్రాంతంలో భూమి ఎత్తు హఠాత్తుగా పెరుగుతుంది. భూకంప తరంగాలు ఉత్పన్నమవుతాయి. ఇవన్నీ అగ్నిపర్వతం పేలుడుకు సంకేతాలేనని నాసా ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉపగ్రహాలతో విశ్లేషణ అగ్నిపర్వతాలపై కార్బన్ డయాక్సైడ్ స్థాయిలను గుర్తించాలంటే సైంటిస్టులు ఆ పర్వతాలపైకి చేరుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే తక్కువ స్థాయిలో వెలువడే కార్బన్ డయాక్సైడ్ను ఉపగ్రహ చిత్రాల ద్వారా అంచనా వేయడం సాధ్యం కాదు. కానీ ఇది చాలాసార్లు ప్రమాదకరంగా మారుతోంది. ఇలాంటి సమస్యలు ఇకపై దూరమైనట్లే. ఎందుకంటే చెట్ల ఆకుల రంగు ద్వారా అగ్నిపర్వతాల పేలుడును కచ్చితంగా గుర్తించగలమని సైంటిస్టులు పేర్కొంటున్నారు. ఈ రకమైన విశ్లేషణకు ఎన్నో రకాల శాటిటైట్లు అందుబాటులో ఉన్నాయని టెక్సస్లోని యూనివర్సిటీ ఆఫ్ హూస్టన్లో వోల్కనాలజీ డాక్టోరల్ విద్యార్థి నికోల్ గిన్ చెప్పారు. ఇటలీలో సిసిలీ తీరంలోని మౌంట్ ఎట్నా అగ్నిపర్వతంతోపాటు సమీపంలోని చెట్టూచేమల చిత్రాలను లాండ్శాట్ 8, టెరా శాటిలైట్, సెంటినెల్–2తోపాటు ఇతర ఎర్త్–అబ్జర్వింగ్ ఉపగ్రహాల ద్వారా సేకరించారు. వాటిని సమగ్రంగా విశ్లేషించారు. అక్కడ అధిక కార్బన్ డయాక్సైడ్తో చెట్ల ఆకుల రంగు మారినట్లు కనిపెట్టారు. ఈ అగ్నిపర్వతం నుంచి మాగ్మా ప్రవాహం మొదలైంది.→ ప్రపంచ జనాభాలో 10 శాతం అగ్నిపర్వతాలకు కొన్ని మైళ్ల దూరంలోనే నివసిస్తోంది.→ అగ్నిపర్వతాల పేలుడు గురించి ముందే తెలియక చాలా సందర్భాల్లో ఆస్తి, ప్రాణనష్టం సంభవిస్తున్నాయి.→ చెట్ల ఆకుల రంగు ద్వారా పేలుడును సామాన్యులు సైతం ముందే కనిపెట్టవచ్చని సైంటిస్టులు అంటున్నారు. తద్వారా ప్రాణాపాయం నుంచి సులువుగా బయటపడొచ్చని సూచిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వీసా ఫ్రీ.. విదేశాలు!
విదేశాలు చుట్టి రావాలని ఎవరికి ఉండదు. సమస్యల్లా వీసా పొందడమే. వీసా అక్కర్లేదు.. పాస్పోర్ట్ ఉంటే చాలు, ఆతిథ్యం స్వీకరించేందుకు విచ్చేయండి అని భారతీయులను ఆహ్వానించే దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ జాబితాలో తాజాగా ఫిలిప్పీన్స్ వచ్చి చేరింది. పలు దేశాలు వీసా రహిత ప్రవేశం, వీసా ఆన్ అరైవల్, ఆన్లైన్ వీసాలు (ఈ–వీసాలు) అందించడం ద్వారా పాస్పోర్ట్ ఉన్న భారతీయులకు ప్రయాణాన్ని సులభతరం చేశాయి. - సాక్షి, స్పెషల్ డెస్క్వీసా అవసరం లేకుండానే..విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ప్రకారం 2025 మార్చి నాటికి 25 దేశాలలో భారతీయ పాస్పోర్ట్ హోల్డర్లకు వీసా రహిత ప్రవేశం అందుబాటులో ఉంది. దేశాన్నిబట్టి కాల వ్యవధులు, కొన్ని షరతులు ఉన్నాయి. దీర్ఘకాలిక ద్వైపాక్షిక ఒప్పందాల కారణంగా ఎలాంటి వీసా, రోజుల పరిమితి లేకుండా దక్షిణాసియాలో భూటాన్, నేపాల్ను చుట్టేయవచ్చు. హిందూ మహాసముద్ర ద్వీప దేశాలైన మాల్దీవులు (90 రోజులు అక్కడ ఉండొచ్చు), సీషెల్స్ (ముందస్తు ప్రయాణ అనుమతితో 90 రోజులు) భారతీయులను స్వాగతిస్తున్నాయి. మారిషస్ సైతం ఉచిత ప్రవేశాన్ని మంజూరు చేస్తోంది. ఆగ్నేయాసియాలో థాయ్లాండ్ 60 రోజుల వీసా రహిత ప్రయాణాన్ని అందిస్తోంది. 2026 డిసెంబర్లోగా 30 రోజుల పాటు వీసా లేకుండానే మలేషియా చుట్టొచ్చు. కరేబియన్ దీవులు భారతీయులకు వీసా రహిత ప్రయాణానికి హాట్స్పాట్. బార్బడోస్, గ్రెనడా, హైతీ, జమైకా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెడీన్స్లో 30 నుండి 90 రోజుల వరకు బస చేయవచ్చు. ఇతర వీసా రహిత దేశాలలో పశ్చిమ ఆఫ్రికాలోని సెనెగల్, మధ్య ఆసియాలోని కజకిస్తాన్, బెలారస్, ఆగ్నేయాసియాలో ఫిలిప్పీన్స్ ఉన్నాయి.వీసా ఆన్ అరైవల్పాస్పోర్టు కలిగిన భారతీయ పౌరులకు వీసా ఆన్ అరైవల్ 38 దేశాల్లో అందుబాటులో ఉంది. ఈ జాబితాలో ఉన్న దేశానికి చేరుకున్న వెంటనే విమానాశ్రయంలోనే వీసా మంజూరు చేస్తారు. ఆఫ్రికాలోని టాంజానియా, కెన్యా, రువాండా, మడగాస్కర్, గినియా–బి స్సావు, జింబాబ్వే.. ఆసియాలోని లావోస్, కంబోడియా, ఇండోనేషియా, ఇరాన్, జోర్డాన్, మయన్మార్ వీటిలో ఉన్నాయి. మధ్యప్రాచ్య దేశాలైన ఖతార్, ఒమన్ కూడా వీసా ఆన్ అరైవ ల్ అందిస్తున్నాయి. కరేబియన్ మళ్ళీ ఇక్కడ బలంగా ఉంది. సెయింట్ లూ సియా, సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడీన్స్ సైతం ఈ జాబితాలో నిలిచాయి.ఈ–వీసా 62 దేశాల్లో.. భారత పౌరులకు 62 దేశాలు ఈ–వీసా ఆఫర్ చేస్తున్నాయి. ఈ జాబితాలో ఉన్న దేశాలకు వెళ్లే ఔత్సాహికులు రాయబార కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. సంబంధిత పత్రాలతో ఆన్లైన్లో వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే చాలు. అర్హతలనుబట్టి మంజూరు చేస్తారు. సమయం, ఖర్చు ఆదా అవుతుంది. ఆసియాలో జపాన్, సింగపూర్, ఇండోనేషియా, వియత్నాం, మలేషియా, శ్రీలంక, తైవాన్ ఎలక్ట్రానిక్ వీసా అందిస్తున్నాయి. కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, అర్మేనియా, అజర్బైజాన్, జార్జియా, రష్యా వంటి మధ్య ఆసియా, యురేషియా దేశాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఆఫ్రికా నుంచి కెన్యా, టాంజానియా, ఇథియోపియా, మొరాకో, ఈజిప్ట్, దక్షిణాఫ్రికా, నమీబియా దేశాలకు ఈ–వీసాలను పొందవచ్చు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సైతం భారతీయ పౌరులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తాయి. లాటిన్ అమెరికా, కరేబియన్లలోని అర్జెంటీనా, చిలీ, సురినామ్, ఆంటిగ్వా అండ్ బార్బుడా ఈ సౌలభ్యాన్ని అందిస్తున్నాయి. పశ్చిమాసియాలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, టర్కీ, ఒమన్ కూడా ఈ–వీసాలను ఆఫర్ చేస్తున్నాయి. బుర్కినా ఫాసో, బెనిన్, సావో టొమే అండ్ ప్రిన్సిపే, ఈక్వటోరియల్ గినియా ఈ జాబితాలో ఉన్నాయి.టాప్–10 వీసా–ఫ్రీ దేశాలుపర్యాటక ప్రదేశాలు, బీచ్లు, ప్రకృతి సుందర దృశ్యాలు, నోరూరించే వంటకాలు, జీవ వైవిధ్యం పరంగా ఎక్కువ మంది సందర్శించడానికి ఇష్టపడేవి.. థాయ్లాండ్, నేపాల్, మారిషస్, భూటాన్, మలేషియా, డొమినికా, కెన్యా, శ్రీలంక, ఖతార్, సీషెల్స్.కొన్ని మార్గదర్శకాలువీసా రహిత దేశాలకు ప్రయాణించే భారతీయులు కొన్ని మార్గదర్శకాలను పాటించాలి. ఎన్ని రోజులు ఆ దేశంలో ఉండొచ్చు, నిర్దిష్ట ప్రవేశ అర్హతలు ధ్రువీకరించుకోవాలి. పాస్పోర్ట్ కనీసం ఆరు నెలల వరకు చెల్లుబాటులో ఉండాలి. తిరుగు ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వెళ్లే దేశాన్ని బట్టి ఖర్చులకు సరిపడా డబ్బులు బ్యాంకు ఖాతాలో ఉంచడమేగాకుండా అందుకు ఆధారాలనూ చూపించాల్సి ఉంటుంది. ఎక్కడ బస చేస్తున్నదీ హోటల్ వివరాలు సమర్పించాలి. -
కొంపముంచుతున్న కొత్త స్నేహాలు
సాక్షి, పుట్టపర్తి: ప్రస్తుతం యువత బయట కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా అందుబాటులో ఉంటోంది. పలకరింపులు..పరామర్శలన్నీ వాట్సాప్, ఇన్ స్టా గ్రామ్ వేదికగానే సాగుతున్నాయి. ఇదే క్రమంలో సామాజిక మాధ్యమాల ద్వారానే కొత్త కొత్త స్నేహాలు పుట్టుకువస్తున్నాయి. హలో అంటే చాలు పొలోమంటూ ఫ్రెండ్ రిక్వెస్టులు వచ్చి వాలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు తెలిసీ తెలియని వయసులో ఒకరికొకరు ఆకర్షితులై.. తర్వాత లేని పోని సమస్యల్లో ఇరుక్కుంటున్నారు.ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్ల ద్వారా ఒకరికొకరు దగ్గరై.. ప్రేమ వ్యవహారాల్లో మునిగి తేలుతున్నారు. చాలామంది మైనర్లు సోషల్ మీడియా వేదికగా చిన్న వయసులోనే ప్రేమ, పెళ్లి వ్యవహారాల వరకూ వెళ్తున్నారు. ఇలాంటి ఘటనలు జిల్లాలోని ఏదో ఒక పోలీస్ స్టేషన్లో వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎక్కువ మంది మైనర్లే.. తెలిసీ తెలియని వయసులో నిత్యం సోషల్ మీడియాలో ఉంటూ కొత్త పరిచయాలతో స్టేషన్ మెట్లు ఎక్కుతున్న మైనర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బాల్య వివాహాలు, ప్రేమ పెళ్లిళ్లు, ఆన్లైన్ ప్రేమ తగాదాలు.. ఇలా వివిధ రకాల ఫిర్యాదులు నిత్యం పోలీసు స్టేషన్కు వస్తున్నాయి. అయితే ఎక్కువ మంది మైనర్లే ఉండటంతో వారి భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని పోలీసులు సామాజిక బాధ్యతగా తల్లిదండ్రులను పిలిపించి.. సర్దిజెప్పుతుండగా... సమస్య బయటికి రాకుండా సద్దుమణుగుతోంది. ఇక ఆన్లైన్ ద్వారా పరిచయాలతో పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్న జంటలు కూడా నెలల వ్యవధిలోనే విడాకుల వరకూ వచ్చేస్తున్నాయి. నిబంధనలు బేఖాతరు.. సోషల్ మీడియా పరిచయాలతో దగ్గరవుతున్న వారు...కొన్నిరోజులకే న్యాయం చేయాలంటూ పోలీసు స్టేషన్కు వస్తున్నారు. చాలా సందర్భాల్లో అమ్మాయి మైనర్ కావడం... అప్పటికే పరిస్థితి చేయి దాటిన నేపథ్యంలో పెద్దలే గుట్టు చప్పుడు కాకుండా వివాహాలు జరిపిస్తున్నారు. బాల్య విహహం తప్పని తెలిసినా చాలా మంది ఎదురుచెప్పలేకపోతున్నారు. అధికారులకు తెలిసినా అమ్మాయి భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని అవగాహన కల్పించడానికే పరిమితం అవుతున్నారు. నూతన జంటలను విడదీయలేక.. మానవీయ కోణంలో ఆలోచించి వదిలేస్తున్నారు.పుట్టపర్తికి చెందిన 17 ఏళ్ల యువతికి గోరంట్ల మండలానికి చెందిన 18 ఏళ్ల యువకుడు ఇన్స్టాగ్రామ్లో పరిచయయ్యాడు. ఇద్దరూ చాటింగ్ చేసుకుంటూ వాట్సాప్ కాల్స్ వరకు వచ్చారు. ఆ తర్వాత వీడియో కాల్స్.. ఫొటోల మారి్పడి తదితర వ్యవహారాలన్నీ సాగాయి. పెళ్లి చేసుకుందామనేలోపు ఇద్దరి మధ్య తగాదాలు వచ్చాయి. పుట్టపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. తనకు ఆ అమ్మాయిపై ఇష్టం పోయిందని యువకుడు అడ్డం తిరిగాడు.. మైనర్లు కావడంతో పోలీసులు ఇద్దరికీ సర్దిజెప్పి పంపించారు. హిందూపురానికి చెందిన 18 ఏళ్ల యువతికి పెనుకొండకు చెందిన 27 ఏళ్ల పురుషుడు ఫేస్ బుక్ ద్వారా పరిచయమయ్యాడు. తర్వాత ఇద్దరూ ఆర్నెల్ల పాటు చాటింగ్ చేసుకుంటూ ఫోన్ నంబర్లు, అడ్రస్ మార్చుకున్నారు. గంటల తరబడి వాట్సాప్ చాటింగ్ కొనసాగింది. అయితే ఆ తర్వాత ఆ వ్యక్తికి అప్పటికే వివాహమైందన్న విషయం కనుక్కొన్న యువతి నానా రభస చేసింది. తనను మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు అమ్మాయి తల్లిదండ్రులను పిలిచి గుట్టుగా వ్యవహారాన్ని చక్కబెట్టి పంపారు. అవగాహన కల్పిస్తున్నాం మొబైల్ ఫోన్ అతిగా వినియోగించే యువత వాట్సాప్, ఇన్స్ట్రాగాం తదితర సోషల్ మీడియా సైట్లులోనే ఎక్కువ సమయం గడుపుతోంది. ఆయా మాధ్యమాల్లో కొత్తవ్యక్తుల పరిచయాలు వారి జీవితాలనే మార్చేస్తున్నాయి. అందువల్ల ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారనే విషయంపై తల్లిదండ్రులు తప్పనిసరిగా కనిపెడుతూ ఉండాలి. స్మార్ట్ ఫోన్ వినియోగంలో లాభాలతో పాటు అనేక అనర్థాలూ ఉన్నాయి. బాల్య వివాహాలతో కలిగే అనర్థాలపై నిత్యం అవగాహన కల్పిస్తున్నాం. – మహేష్, జిల్లా బాలల సంరక్షణ అధికారి, పుట్టపర్తి -
మార్స్ కొంప ముంచిన సౌర గాలులు
భూమికి సమీపంలో ఉన్న అంగారక గ్రహం(మార్స్)పై విస్తృతమైన పరిశోధనలు జరుగుతున్నాయి. అక్కడికి వ్యోమగాములను పంపించే ప్రయత్నాలు సైతం మొదలయ్యాయి. ఈ అరుణ గ్రహంపై కోట్లాది సంవత్సరాల క్రితం నీరు, వాతావరణం ఉండేవి. అవి క్రమేపి అంతరించిపోయాయి. మొత్తం శూన్యం ఆవరించింది. జీవుల మనుగడపై ఆస్కారమే లేకుండాపోయింది. మార్స్పై నీరు, వాతవరణం కనుమరుగైపోవడానికి కారణం ఏమిటన్నది ఎట్టకేలకు గుర్తించగలిగారు. బలమైన సౌర గాలులు, సౌర తుఫాన్ల కారణంగా అంగారక గ్రహం ఆయస్కాంత శక్తిని కోల్పోయినట్లు తేలింది. ఆయస్కాంత శక్తిని కోల్పోయిన తర్వాత అక్కడున్న ద్రవ రూపంలోని నీరు అంతరిక్షంలోకి ఆవిరైపోయింది. వాతావరణం సైతం నెమ్మదిగా అంతరించింది. దాంతో మార్స్ ఉపరితలంపై ఎర్రమట్టి దిబ్బలు, దుమ్ము, రాళ్లు మాత్రమే మిగిలాయి. మార్స్ అటా్మస్పియర్ వోలటైల్ ఎవల్యూషన్(మావెన్) మిషన్లో భాగంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) ఈ విషయం కనిపెట్టింది. చాలా ఏళ్లుగా పరిశోధకుల మదిని తొలిచేస్తున్న ప్రశ్నకు సమాధానం దొరికినట్లయ్యింది. సౌర గాలుల్లోని శక్తి కణాలు అంగారకుడి వాతావరణంలోకి చొచ్చుకెళ్లాయని, దాంతో నీరు ఆవిరైందని, తటస్థ కణాలు, అణువులు వాతావరణం నుంచి బయటకు వెళ్లిపోయాయని నిర్ణయానికొచ్చారు. ఈ పరిశోధన కోసం సోలార్ విండ్ అయాన్ అనలైజర్, న్యూట్రల్ గ్యాస్, ఐయాన్ మాస్ స్పెక్ట్రోమీటర్ ఉపయోగించారు. మార్స్పై ఒక భాగం పూర్తిగా వెలుతురు, మరో భాగం పూర్తిగా చీకటి ఉంటుంది. ఈ రెండు భాగాల సమగ్ర డేటా సేకరించారు. సౌర గాలులు, తుఫాన్లు అరుణ గ్రహం స్థితిగతులను పూర్తిగా మార్చేసినట్లు స్పష్టమయ్యింది. ఈ మొత్తం పరిశోధన వివరాలను సైన్స్ అడ్వాన్సెస్ పత్రికలో ప్రచురించారు. అంగారకుడిపై మరింత అవగాహన పెంచుకోడానికి, భవిష్యత్తులో చేపట్టే పరిశోధనలకు ఈ వివరాలు దోహదపడతాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఒకవేళ మార్స్పై నీరు, వాతావరణం యధాతథంగా ఉంటే అది మరో భూగోళంగా మనుషుల మనుగడకు తోడ్పడేదని మనం భావించవచ్చు. సౌర గాలులు, తుఫాన్లు అంగారకుడి కొంప ముంచడమే కాదు.. మన ఆశలనూ నీరుగార్చేశాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సమ్మర్ క్యాంప్స్లోనూ ఏఐ
చెస్, డ్యాన్స్, భావవ్యక్తీకరణ నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసం, డ్రాయింగ్, పెయింటింగ్.. ఇవీ సమ్మర్ క్యాంప్స్ అనగానే మనకు గుర్తొచ్చేవి. అవి కూడా వేసవి సెలవుల్లోనే నేర్చుకునేవారు. కానీ, ఇప్పుడు సమ్మర్ క్యాంప్స్ అర్థమే మారిపోయింది. ఇప్పుడు ఏడాది పొడవునా ఈ క్యాంప్స్ కొనసాగుతున్నాయి. తల్లిదండ్రుల నుంచి వస్తున్న డిమాండ్ నేపథ్యంలో పాఠశాలలు, కో–కరిక్యులర్ యాక్టివిటీస్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన సంస్థలు.. ఏడాదంతా పిల్లలను వివిధ అంశాల్లో సానబెడుతున్నాయి. మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. సమ్మర్ క్యాంప్స్లో ప్రాధాన్యతగా ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నిలిచి ఔరా అనిపిస్తోంది. కోవిడ్ సమయంలో.. ముఖ్యంగా లాక్డౌన్లో విద్యార్థులు ఇంటిపట్టునే ఉన్నారు. ఆ సమయంలో పాఠశాలలూ ఆన్లైన్లోనే తరగతులు నిర్వహించాయి. దీంతో పిల్లలు మొబైల్ ఫోన్స్, ట్యాబ్స్, కంప్యూటర్లకు అలవాటుపడ్డారు. నాటి నుంచి పిల్లలకు చదువుతోపాటు.. కంప్యూటర్ పరిజ్ఞానమూ పెరిగింది. ఆన్లైన్ వేదికగా పిల్లలు పలు బోధనాంశాలను నేర్చుకుంటున్నారు. చాలామంది పిల్లలకు ఫిజికల్ యాక్టివిటీస్కు బదులు ఆన్లైన్ గేమ్స్ అలవాటయ్యాయి. అలా పిల్లల కార్యకలాపాలన్నీ ఫిజికల్ టు డిజిటల్ అయిపోయాయి. మరోపక్క తల్లిదండ్రులు కూడా సాంకేతికంగా తమ పిల్లల భవిష్యత్తుకు తగ్గ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని ఉబలాటపడుతున్నారు. ఈ పరిణామాల కారణంగానే.. సమ్మర్ క్యాంప్స్ కూడా చాలావరకు మారిపోయాయి. అందుకే పంపుతున్నారుసమ్మర్ క్యాంప్స్కు వస్తున్న పిల్లల్లో.. ఎక్కువమంది చిన్నారుల తల్లిదండ్రులు ఉద్యోగాలు చేసేవారే. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు తమ పిల్లలను ఇంట్లో ఉంచలేక, క్యాంప్లకు పంపించి ఏదో ఒక యాక్టివిటీలో బిజీగా ఉంచుతున్నారు. ఇంట్లో అల్లరి భరించలేక లేదా మొబైల్ ఫోన్లకు అలవాటు పడ్డారన్న కారణంతో మరికొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను సమ్మర్ క్యాంప్లో చేరి్పస్తున్నారు. చాలాకొద్ది మంది మాత్రమే తమ పిల్లలు కెరీర్లో క్రీడలను భాగం చేసుకోవాలని భావించి క్యాంప్లకు పంపుతున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. కొత్త అంశాలు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సమ్మర్ క్యాంప్స్ ఇప్పుడు టెక్నాలజీ, అడ్వెంచర్, లైఫ్ స్కిల్స్కు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఏఐ, కోడింగ్, ఆస్ట్రానమీ, స్పేస్ టెక్నాలజీ వంటి సాంకేతిక అంశాలు వచ్చి చేరాయి. అడ్వెంచర్లో హార్స్ రైడింగ్, ట్రెక్కింగ్, పారాగ్లైడింగ్ వంటి అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. లైఫ్ స్కిల్స్లో వంటలు, వ్యవసాయం, పశు సంపద గురించి తరగతులు మొదలయ్యాయి. ఆర్చరీ, చెస్లతోపాటు ఫొటోగ్రఫీ, సాల్సా, బెల్లీ వంటి డ్యాన్సులు.. మ్యూజిక్ కూడా సమ్మర్ క్యాంప్స్లో నేర్పిస్తున్నారు. స్విమ్మింగ్, స్కేటింగ్ వంటి వాటిలోనూ కొన్నిచోట్ల శిక్షణ ఇస్తున్నారు. ఏఐ, ఎంఎల్, కోడింగ్.. పాఠ్యాంశాలతోపాటు కో–కరిక్యులర్ యాక్టివిటీస్లో ఇప్పుడు ఏఐ, మెషీన్ లెరి్నంగ్, కోడింగ్ ప్రధాన ప్రాధాన్యతలుగా ఉన్నాయి. ఈ తరగతులు సమ్మర్ క్యాంప్స్నకే పరిమితం కాకుండా ఏడాదంతా ఒక సబ్జెక్ట్గా జరుగుతున్నాయి. ప్రముఖ కార్పొరేట్ పాఠశాలల్లో చదివే ఎంతోమంది విద్యార్థులు వీటిని ఎంచుకుంటున్నట్టు చెబుతున్నారు. దాంతో పాఠశాలలు కూడా ఈ సబ్జెక్టులను చెప్పిస్తున్నాయి. ఆసక్తికర అంశం ఏంటంటే.. వారంలో ఒక రోజు.. అది కూడా 1–2 గంటలు క్లాస్ చెప్పే ఏఐ నిపుణుడికి పాఠశాలలు నెలకు రూ.70,000 వరకు చెల్లిస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సబ్జెక్టులకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే విద్యార్థులు చాట్ జీపీటీ సాయం తీసుకుంటున్నారు. పాఠశాలలకు వెళ్లే పిల్లల్లో కొందరు వెబ్సైట్ డిజైనింగ్ కూడా చేస్తున్నారు. -
అమ్మ బాధ.. చిన్నారి మానసిక వ్యథ
ఇంట్లో భర్త లేదా అత్తమామల వేధింపులు.. మహిళల మీదే కాదు, చిన్నారుల మీదా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా టీనేజర్లలో ఇవి మానసిక సమస్యలకు దారితీస్తున్నాయి. వారిలో ఆందోళన, ఒత్తిడికి కారణమవుతున్నాయి. బెంగళూరుకు చెందిన ‘జాతీయ మానసిక ఆరోగ్యం, న్యూరో సైన్సెస్ ఇన్స్టిట్యూట్’, సీవేదా కన్సార్షియం, అంతర్జాతీయ సంస్థల పరిశోధనలో తేలిన అంశమిది. ప్రముఖ ‘ప్లోస్ వన్’జర్నల్లో ప్రచురితమైన ఈ అధ్యయనం కోసం 2,800 మంది టీనేజీ యువత, తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించారు. మనదేశంలో గృహహింస సర్వ సాధారణమైపోయింది. చాలామంది మహిళలు మౌనంగా దీన్ని భరిస్తుంటారు. కొద్దిమంది మాత్రమే ఎదిరించి పోరాడతారు. మౌనంగా భరించే తల్లులతోనే ఈ సమస్య ఆగడం లేదు.. వారి పిల్లలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. అమెరికాకు చెందిన పబ్లిక్ లైబ్రరీ ఆఫ్ సైన్స్ ‘ప్లోస్ వన్’జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ఇదే తేల్చింది. ఈ అధ్యయనం కోసం వారు.. దేశంలో ఏడు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని 12–17 ఏళ్ల మధ్య యువతను ఎంచుకున్నారు. మానసిక రుగ్మతలు; మానసిక, శారీరక, లైంగిక వేధింపులకు గురైన వారి తల్లులను పరిశీలించారు. – సాక్షి, స్పెషల్ డెస్క్ఆత్మహత్యలకూ పురికొల్పుతున్నాయిగృహ హింసకు గురైన తల్లుల్లో ఆందోళన, ఒత్తిడి వంటి మానసిక సమస్యలు స్పష్టంగా కనిపించాయి. ఇందులోనూ ముఖ్యంగా.. భౌతిక, లైంగిక దాడులకు గురైన తల్లుల్లో ఆందోళన వంటి రుగ్మతలు ఎక్కువగా కనిపించగా.. మానసిక, భౌతిక, లైంగిక దాడులకు గురైన వారిలో తీవ్ర ఒత్తిడి వంటి సమస్యలు కనిపించాయి. మనదేశంలో ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు గృహ హింసకు గురవుతున్నారని అంచనా. ఇవి వారిలో బయటకు చెప్పలేని బాధకు కారణమవడమే కాకుండా.. ఆత్మహత్యలకు కూడా పురికొల్పుతున్నాయి. పాశ్చాత్య దేశాల్లో చేసిన అధ్యయనాల్లో ఈ విషయం ఇప్పటికే రుజువైందని అధ్యయనకర్తలు తెలిపారు.గర్భధారణ సమయంలోనూ.. అమ్మతనం ప్రతి స్త్రీకి ఒక కల. ప్రసవమంటే వేదన. కానీ, పుట్టే బిడ్డ కోసం ఎంత కష్టమైనా భరిస్తుంది. ఆ కష్టానికి గృహహింస కూడా తోడై మహిళలను మరింత కష్టపెడుతోంది. మనదేశంలో గృహ హింస కారణంగా మహిళలు గర్భధారణ సమయంలోనూ అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. గర్భం మధ్యలోనే పోవడం, నెలలు నిండకుండానే పిల్లలు పుట్టడం జరుగుతున్నాయి. ఇవి పుట్టే పిల్లలపైనా ప్రభావం చూపుతున్నాయి. వారిలో భావోద్వేగ, నడవడిక/ప్రవర్తనాపరమైన సమస్యలతోపాటు చదువులోనూ వెనకబడేలా చేస్తున్నాయి. ‘ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మహిళల పాలిట వరమూ కాగలదు, శాపమూ కాగలదు. భర్త చెడ్డవాడై, అత్త మామలు మంచి వాళ్లయితే.. మహిళకు వాళ్లు మానసికంగా బలాన్ని ఇవ్వగలుగుతారు. అదే అత్తమామలు ఆమెను వేధిస్తే ఆమెకు అదో కొత్త సమస్య. భర్త, అత్తమామల వేధింపులకు గురిచేస్తే నరకమే’అని ఈ సర్వే చేసినవాళ్లు అభిప్రాయపడ్డారు. ‘కౌమారం’పై జరిగే దాడిభార్యలను అనుక్షణం తిట్లతో మానసికంగా వేధించడం, బెదిరించడం, వాళ్లకు ఇంట్లో అన్నం, నీళ్లు వంటివి ఇవ్వకుండా పస్తులుండేలా చేయడం.. ఇవన్నీ ఇంట్లో ఉండే చిన్నారులు చూస్తుంటారు. భర్తలు అరిచేటప్పుడు చాలామంది చిన్నారులు బింకచచ్చిపోయి ఉండిపోతారు. మరికొందరు ఏడుస్తారు. ఇలా తమ తల్లులపై జరుగుతున్న దాడిని ప్రత్యక్షంగా చూసిన ఆ చిన్నారుల లేత మెదళ్లు తీవ్రంగా ప్రభావితమై వారిలో మానసిక రుగ్మతలకు కారణమవుతాయి. వారి నడతను ప్రభావితం చేసి.. వారి చదువుపైనా ప్రతికూల ప్రభావం చూపుతాయి. జీవితంలో టీనేజీ /యవ్వనం చాలా ప్రధానమైన దశ. మన ఆలోచనా విధానం మొగ్గతొడిగేది అప్పుడే. ఆశలు, ఆశయాలు ఊపిరిపోసుకునేదీ అప్పుడే. మనం సమాజంలో ఎలా నడుచుకోవాలో, వ్యక్తిత్వం ఎలా ఉండాలో నేర్చుకునేదీ అప్పుడే. కానీ అదే సమయంలో.. తమ తల్లులను ఇంట్లోనివారు పెట్టే హింసలు, తల్లులు అనుభవించే మానసిక వేదన వారి లేత మనసులను గాయపరుస్తున్నాయి. వారి విపరీత మానసిక ధోరణికి కారణమవుతున్నాయి. అయితే, గృహహింసను ఎదుర్కొనే మహిళలకు పుట్టే పిల్లల్లో ఇలాంటి మానసిక సమస్యలు ఎలా వస్తున్నాయో శాస్త్రీయంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఈ సర్వే అభిప్రాయపడింది. అంతేకాకుండా ఉమ్మడి కుటుంబాలు, సాంస్కృతికపరమైన అంశాలపైనా పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. గృహహింస అంటే..» కట్నం కోసమో మరే ఇతర అవసరాల కోసమో భార్యలను భర్తలు వాళ్ల పుట్టింటికి వెళ్లిపోయేలా హింసించడం.» వాళ్లపై భౌతికదాడి చేయడం, యాసిడ్ వంటివి పోసి గాయపర్చడం » కత్తుల వంటి వాటితో గాయపర్చడం, వాతలు పెట్టడం » అమ్మాయి పుడితే హింసించడం, అబ్బాయి పుట్టేవరకు వేధించడంటీనేజర్లలో ఈ సమస్య పరిష్కారానికి...» పాఠశాలల్లో ఇలాంటి పిల్లలను గుర్తించాలి.» వారిలో ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు పోగొట్టేందుకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి» మహిళలపై గృహహింస జరగకుండా నిరోధించాలి. -
ముంచుకొస్తున్న ముప్పు
న్యూఢిల్లీ: హిమాలయ పర్వతాలు భారతదేశానికి పెట్టని కోటలాంటివి. హిమాలయాల్లోని 800 కిలోమీటర్లకుపైగా పొడవైన హిందూకుష్ పర్వత శ్రేణిలో ఎన్నెన్నో హిమానీనదాలు(గ్లేసియర్స్) ఉన్నాయి. ఎన్నో నదులు, సరస్సులకు ఇవే ఆధారం. మధ్య, దక్షిణాసియాలో హిందూకుష్ గ్లేసియర్స్ నుంచి వచ్చే నీటిపై ఆధారపడి 200 కోట్ల మంది జీవనం సాగిస్తున్నారు. కర్బన ఉద్గారాలు, వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతుండడంతో హిమానీనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. పారిశ్రామిక యుగానికి ముందున్న ఉష్ణోగ్రతల కంటే మరో 2 డిగ్రీల సెల్సియస్కుపైగా పెరిగితే ఈ శతాబ్దం ఆఖరు నాటికి హిందూకుష్ హిమానీనదాల మంచులో 75 శాతం అంతమైపోతుందని తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. 200 కోట్ల మంది జీవనం ప్రమాదంలో పడుతుందని తేలింది. ఈ అధ్యయనం వివరాలను సైన్స్ జర్నల్లో ప్రచురించారు. భూగోళంపై మానవ మనుగడ కొనసాగాలంటే వాతావరణ మార్పుల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణపై ప్రపంచ దేశాలన్నీ తక్షణమే దృష్టిపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. → 10 దేశాలకు చెందిన 21 మంది శాస్త్రవేత్తలు ఉమ్మడిగా ఈ అధ్యయనం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా 2 లక్షలకుపైగా గ్లేసియర్లలో మంచు కరుగుతున్న తీరును పరిశీలించడానికి 8 గ్లేసియర్ మోడల్స్ ఉపయోగించారు. → ఉష్ణోగ్రతలు మరింత పెరగకుండా స్థిరంగా ఉన్నప్పటికీ గ్లేసియర్లలో మంచు కరగడం ఇప్పట్లో ఆగదని అధ్యయనకర్తలు స్పష్టంచేశారు. రాబోయే కొన్ని దశాబ్దాలపాటు ఈ పరిమాణం కొనసాగు తూనే ఉంటుందని పేర్కొన్నారు. → ఉష్ణోగ్రత కేవలం అర డిగ్రీ పెరిగినా సరే దాని ప్రభావం హిమానీనదాలపై కచ్చితంగా ఉంటుందని, ఈ మేరకు మంచు కరిగిపోతుందని సైంటిస్టు డాక్టర్ హ్యారీ జెకొల్లారీ చెప్పారు. మనం ఈ రోజు తీసుకొనే నిర్ణయాలు మన భవిష్యత్తు తరా ల బతుకులను నిర్ణయిస్తాయని అన్నారు. రాబోయే తరాలు బాగుండాలంటే గ్లేసియ ర్లను కాపాడుకోవాలని సూచించారు. → పారిస్ వాతావరణ ఒప్పందం ప్రకారం.. భూమిపై ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీలకు పరిమితం చేస్తే హిమాలయాలు, కాకస్ పర్వతాల్లో 40–45 శాతం మంచును కాపాడుకోవచ్చు. → ఒకవేళ ఉష్ణోగ్రతలు 2.7 డిగ్రీలు పెరిగితే ప్రపంచవ్యాప్తంగా 75 శాతం మంచు కరిగిపోతుంది. ఈ శతాబ్దం ఆఖరు నాటికి కేవలం 25 శాతమే మిగిలి ఉంటుంది. → యూరప్లో ఆల్ఫ్స్, ఉత్తర అమెరికాలో రాకీస్తోపాటు ఐస్ల్యాండ్లోని గ్లేసియర్లు మానవులకు జీవనాధారం కల్పిస్తున్నాయి. ప్రస్తుతం వీటికి ముప్పు పొంచి ఉంది. భూగోళం మరో రెండు డిగ్రీలు వేడెక్కితే.. ఇక్కడ మంచు 10–15 శాతమే మిగులుతుందని అంచనా వేస్తున్నారు. దాదాపు 90 శాతం మంచు కనుమరుగైతే పరిస్థితి తీవ్రత ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక స్కాండినేవియా ప్రాంతంలో మంచు పూర్తిగా కరిగిపోతుందన్న అంచనాలున్నాయి. → హిమానీనదాలపై ఐక్యరాజ్యసమితి తొలి సదస్సు ప్రస్తుతం తజకిస్తాన్లోని దుషాన్బేలో జరుగుతోంది. 50కిపై దేశాలు ఇందులో పాల్గొంటున్నాయి. → గ్లేసియర్లు వేగంగా కరిగిపోతుండడం వల్ల ఆసియాలో 200 కోట్ల మందికి కష్టాలు రాబోతున్నాయని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉపాధ్యక్షుడు యింగ్మింగ్ యాంగ్ హెచ్చరించారు. ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లో సమీప భవిష్యత్తులో తీవ్రమైన వరదలు, కరువులు సంభవించే ప్రమాదం ఉందని, సముద్ర నీటి మట్టం పెరగడం వల్ల తీర ప్రాంతాలు మునిగిపోతాయని చెప్పారు. → మంచు కరిగిపోవడాన్ని ఆపాలంటే శిలాజ ఇంధనాలను పక్కనపెట్టాలని, క్లీన్ ఎనర్జీని ఉపయోగించుకోవాలని యింగ్మింగ్ యాంగ్ స్పష్టంచేశారు. భూమిని అగ్నిగుండంగా మారుస్తున్న కాలుష్య ఉద్గారాలకు కళ్లెం వేయాలన్నారు. -
పేదోడి ప్రొటీన్ నత్త కూర
మలికిపురం: నత్త.. నెమ్మదిగా కదిలే జీవి. వీటిని బద్ధకానికి సూచికగా భావిస్తారు. కానీ.. ఇది వేసే ప్రతి చిన్న అడుగు అర్థవంతమైన విజయాలకు దారి తీస్తుందని భావించే వారూ లేకపోలేదు. జీవితంలో తొందరపడకుండా.. సమయం తీసుకోవడమనే ప్రాముఖ్యతను నత్త నొక్కి చెబుతుంది. ఈ విషయాలు పక్కన పెడితే నత్తల వల్ల మానవాళికి అనేక ఉపయోగాలున్నాయి. నత్తలను వ్యవసాయ క్షేత్రాల్లో రక్షకులుగా రైతులు, వ్యవసాయ అధికారులు భావిస్తారు. క్రిమికీటకాల నుంచి పంటలను కాపాడతాయని విశ్వసిస్తారు. నత్త గుల్లలను సేకరించి ప్రత్యేక బట్టీలలో కాల్చి సున్నంగా వినియోగిస్తారు. కోస్తా జిల్లాల ప్రజలు నత్త మాంసాన్ని పేదోడి ప్రొటీన్గా భావిస్తారు. చికెన్, మటన్ మాదిరిగా నత్త మాంసంతో కూరలు వండుకుని ఆరగిస్తారు. కాలువలు.. పొలాలే వీటి ఆవాసం పొలాలు, బోదెలు, కాలువలు, చెరువుల్లో నత్తలు విరివిగా పెరుగుతాయి. పదేళ్లుగా కోనసీమలో పలుచోట్ల క్రాప్ హాలిడే పాటిస్తుండటం వల్ల ఆ పొలాల్లో నత్తల పెరుగుదల అధికంగా ఉంది. అనేక మంది నత్తల్ని సేకరించి మాంసం తీసి విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. దశాబ్దాల కాలంగా నత్త మాంసం విక్రయాలు జరుగుతున్నా.. ఇటీవల కాలంలో స్టార్ హోటళ్లలో నత్త మాంసంతో చేసే కూరలకు డిమాండ్ పెరిగింది. నత్త మాంసంతో పలు రుచికరమయిన వంటలు తయారవుతున్నాయి. సాధారణంగా శనగపప్పు కాంబినేషన్లో వండుతారు. ఇప్పుడు మామిడి కాయలు, జీడిపప్పు, చింత చిగురు కాంబినేషన్లో నత్త కూర వండుతున్నారు. విదేశాల్లో నత్తల పెంపకం ఫ్రాన్స్, వియత్నాం, పోర్చుగల్, బల్గేరియాతో పాటు ఆఫ్రికా దేశాల్లో నత్తలను ఆహారంగా వినియోగిస్తున్నారు. సాగు ప్రయోజనాలతో పాటు ఆహారం కోసం నత్తల్ని పెంచటాన్ని ‘హెలిసి కల్చర్’గా పిలుస్తారు. స్పెయిన్లోని లైడా నగరంలో ఏటా వసంత కాలంలో ‘లా అప్లెక్ డెల్ కారాగోల్’ పేరిట ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. ఇక్కడ కేవలం నత్తలతో చేసిన వంటకాలను మాత్రమే వడ్డిస్తారు. ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది ఆహార ప్రియులు ఇక్కడికొచ్చి హాజరై నత్తల వంటకాలను లొట్టలేసుకుని ఆరగిస్తారు. నత్తలను రుచికర ఆహారంగా తినడమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా పలు వర్గాలలోని చాలా మందికి ప్రొటీన్ అందించే ఆహారంగా వీటికి పేరుంది. నత్తల్లో ఉండే పోషకాలు నత్తల్లో 82 శాతం వరకూ నీరు ఉంటుంది. కొవ్వు తక్కువ. చేపల్లో మాదిరిగా ఒమేగా–3 ఆమ్లాలు ఉంటాయని, ఇవి గుండెకు మంచిదని వైద్యులు చెబుతారు. ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. నియాసిన్, సెలీనియం వంటి విటమిన్లు కూడా లభిస్తాయి. ప్రొటీన్, ఇతర పోషకాల వల్ల శరీరానికి శక్తిని అందిస్తుంది. కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకల్ని బలపరుస్తుంది. విటమిన్లు, ఖనిజాలు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. గ్రామీణ, సముద్రతీర ప్రాంతాల్లో నత్తలను కొన్ని రకా ల ఆరోగ్య సమస్యలకు చికిత్సగా ఉపయోగిస్తారు. అయితే.. నత్తలను శుభ్రం చేయకపోతే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కోస్తాలో ఆహారంగా తింటారు కోస్తా జిల్లాల్లో అనాదిగా నత్త మాంసం ఆహారంగా వినియోగంలో ఉంది. చేపల మాదిరిగా వీటిని సేకరించి ప్రాసెస్ చేసి విక్రయిస్తారు. మాంసాహారులు కొనుగోలు చేసి ఆహారంగా తింటారు. నత్తల్లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని గ్రామీణ ప్రాంతాల ప్రజలు భావిస్తారు. - సిద్ధార్థ వర్ధన్, ఫిషరీస్ అసిస్టెంట్ డైరెక్టర్ -
బలసిరి.. కొత్త వరి
పిఠాపురం: రంగు.. రుచి.. వాసన.. ఇదేదో వాణిజ్య ప్రకటన అనుకుంటే పొరపాటే. వరిలోనూ ఇటువంటి లక్షణాలున్న బియ్యం అందుబాటులోకి వచ్చాయి. గతంలో ఇటువంటి బియ్యం ఉన్నాయని చెబితే.. ఆశ్చర్యం వ్యక్తం చేసేవారు. ఇటువంటి అనేక రకాల కొత్త వంగడాలను ఇక్కడి రైతులు పండిస్తూ అందుబాటులోకి తెస్తున్నారు. అత్యధిక పోషక విలువలున్న వరి వంగడాలను ఉత్పత్తి చేయడానికి ప్రకృతి వ్యవసాయ రైతులు నడుం బిగించారు. అరుదైన వరి రకాలు గతంలో రాష్ట్రేతర ప్రాంతాల నుంచి తెచ్చే స్థానిక రైతులు.. ఇప్పుడు కాకినాడ జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు పలు రకాల వరి వంగడాలను ఆన్లైన్ ద్వారా విక్రయిస్తున్నారు. ఇక్కడ పండించిన అరుదైన వరి రకాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో వేంకటేశ్వర స్వామివారి నైవేద్యానికి సైతం ఉపయోగిస్తుండడం విశేషం. ఈ అరుదైన రకాల్లో నవారా, ఇంద్రాణి, కాలపట్టి, డెహ్రాడూన్ రెడ్ రైస్, పరిమళ సన్న, బర్మా బ్లాక్, రత్నచొడి, రక్తసాలి, చింతలూరు సన్నాలు, కూజి, పాటలియా, బాస్బోగ్, కామిని బోగ్, మైసూర్ మల్లిగ, సిద్ధ సన్నాలు, కోమల్ సాల్ వంటి రకాలున్నాయి. జిల్లాలో సుమారు 25 హెక్టార్లలో 30 మంది రైతులు సేంద్రియ పద్ధతిలో అరుదైన వరి రకాలను పండిస్తున్నారు. చాలా డిమాండ్ ఉందిపన్నెండేళ్ల నుంచి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రాణప్రదంగా చేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయంలో పండించిన అరుదైన రకాల ధాన్యం తిరుమల తిరుపతి దేవస్థానంలో వేంకటేశ్వర స్వామివారికి నైవేద్యంగా ఉపయోగించడానికి ఇస్తున్నాను. సాధారణ రకాల కంటే.. మంచి డిమాండ్ ఉన్న అరుదైన రకాలను సాగు చేస్తున్నాను. ఇతర ప్రాంతాల నుంచి వివిధ రకాల విత్తనాలు తెచ్చి, విత్తనాభివృద్ధి చేస్తున్నాను. కేవలం విత్తనాలకు మాత్రమే వీటిని పండిస్తున్నాను. రెండు తెలుగు రాష్ట్రాల రైతులు కొనుగోలు చేస్తున్నారు. వీటిని ఆన్లైన్ ద్వారా పంపిస్తున్నాం. ఈ బియ్యానికి మంచి డిమాండ్ ఉండడంతో ఆదాయం బాగుంటుంది. నాతో పాటు జిల్లాలో చాలా మంది రైతులు వీటి సాగు ప్రారంభించారు. ఇతర రాష్ట్రాల రైతులూ నా వద్ద విత్తనాలు తీసుకుంటున్నారు. – అడపా వెంకటరమణ, ప్రకృతి వ్యవసాయ రైతు, భోగాపురం, పిఠాపురం మండలం, కాకినాడ జిల్లా విత్తనం కోసమే పండిస్తున్నా...ప్రకృతి వ్యవసాయంలో పలు రకాల ధాన్యాన్ని పండిస్తున్నాను. కేవలం విత్తనాల కోసం కొన్ని అరుదైన రకాలు పండిస్తున్నాను. ఎవరైనా విత్తనాలకు అడిగితే ఉచితంగా ఇస్తున్నాను. ఇతర రాష్ట్రాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి.ఎకరం పొలంలో పది రకాల అరుదైన రకాలను పండిస్తున్నాను. ఈ సాగంతా పాతకాల పద్ధతిలోనే చేయాలి. యంత్రాలతో సాధ్యం కాదు. – ఉల్లి సురేష్, ప్రకృతి వ్యవసాయ యువ రైతు, కొత్తపల్లి, కాకినాడ జిల్లాఅరుదైన రకాలివే.. » రక్తసాలి రక్త హీనతతో బాధపడుతున్న వారికి మంచి ఆహారం. ఈ బియ్యం తినడం వల్ల హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరుగుతుంది. మూడు వేల ఏళ్ల నుంచి ఇది వాడుకలో ఉంది. » కూచి పట్టాలియా బాగా సన్నగా ఉంటుంది. తినడానికి బాగుంటుంది. పోషకాలు ఎక్కువ. » నవరను కింగ్ ఆఫ్ రైస్ అంటారు. ప్రస్తుతం దేశంలో లభించే బియ్యంలో అత్యంత పోషక విలువలున్న ఆహారం. సుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా మంచి ఆహారం. దీనిని రోజూ తింటే సుగర్ నార్మల్కు వస్తుంది. మోకాళ్ల నొప్పులూ తగ్గిస్తుంది. » ధూదేశ్వర్ అనే దేశీయ వరి విత్తనం. గాలులకు పడిపోని సన్న రకం. పంటకాలం సుమారు 120 రోజులు. ఇది తెలుపు రంగులో ఉంటుంది, బాలింతలకు శక్తినిచ్చి, తల్లులకు, పిల్లలకు అధిక పోషకాలు అందిస్తుంది. పాల వృద్ధి, పిల్లల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. » ఇంద్రాణి అనేది దేశీయ వరిరకం. సువాసన ఉండే ఈ రకం పంట కాలం సుమారు 130 రోజులు. పాయసం, పులిహోర, పలావు, దద్దోజనానికి అనుకూలమైంది. » రత్నచొడి అనే దేశీయ వరి విత్తనం. తెలుపు రంగులో ఉండే సన్న రకం. పంట కాలం సుమారు 135 రోజులు. అధిక పోషక విలువలు కలిగి, కండపుష్టి, శరీర ధారుడ్యం పెంచి, మంచి పోషకాలు కలిగి ఉంటుంది. రోగ నిరోధక శక్తి కలిగిస్తుంది. పూర్వకాలంలో సైనికులకు ఆహారంగా ఇచ్చేవారు. » కుజీపటాలియా అనేది దేశీయ విత్తనం. సన్న రకం. పంటకాలం సుమారు 120 రోజులు. గాలులకు పడిపోదు. కొవ్వు రహిత, సోడియం లేనివి. తక్కువ కేలరీలు, గ్లూకోజ్ తక్కువగా ఉండి, రోగ నిరోధక శక్తి పెంచుతుంది. » కేత్రీ మహరాజ్ సెంటెడ్ వెరైటీ. గింజ పొడవుగా ఉంటుంది. పంటకాలం సుమారు 130 రోజులు. పాయసం, దద్దోజనం, పులిహోర పలావులకు బాగుంటుంది. » మైసూరు మల్లిగ దేశీయ విత్తనం. తెల్లని రంగు, గాలులకు పడిపోని సన్నని గింజ. పంట కాలం సుమారు 120 రోజులు. ఎదిగే పిల్లలకు అధిక పోషకాలు, ప్రొటీన్లు అందిస్తుంది. » ఘని అనే దేశీయ వరి రకం. చిన్న గింజ. పంటకాలం సుమారు 130 రోజులు. అధిక ఫైబర్, కాల్షియం కలిగి ఉంటుంది. స్పాండిలైటిస్, మోకాళ్ల నొప్పులు తగ్గించే ఆహార ఔషధంగా గుర్తింపు పొందింది. » కుంకుమసాలి.. కుంకుమ పువ్వు, రక్తసాలి మొదలైన విత్తనాలు ఒకే కోవకు చెందిన దివ్యమైన ఔషధాలు. ఇవి రక్తంలోని మలినాలను శుభ్రం చేసి, వాత, పిత్త, కఫాలను సమపాళ్లలో ఉంచే దివ్యమైన ఆహార ఔషధాలు. -
అమ్మా.. నాకు జీతం వచ్చిందోచ్!
తొలి వేతనం.. జీవిత ప్రయాణంలో ఒక కీలక మైలురాయి. ఆర్థిక స్వాతంత్య్రం, ఒక బాధ్యత, కుటుంబ సమష్టి ప్రయాణానికీ సూచిక. అంతటి ప్రత్యేకత ఉన్న తొలి జీతం అందుకున్న రోజు కోట్లాది మందికి భావోద్వేగ ఘట్టం. ఒక్కొక్కరు ఒక్కో తీరుగా ఈ వేడుకను జరుపుకొంటారు. ఇంట్లో వాళ్లకు, బంధువులు, స్నేహితులు, సహచరులకు స్వీట్లు పంచేవారు కొందరైతే.. తొలి సంపాదనతో తమ వాళ్లకు బహుమతులను అందించేవారు మరి కొందరు. తొలి వేతనం రాగానే ‘అమ్మా.. జీతం పడింది’ అంటూ జన్మనిచ్చిన తల్లితో సంతోషం పంచుకునేవారే ఎక్కువని యాడ్ ఏజెన్సీ ‘రీడిఫ్యూజన్ ’, లక్నో యూనివర్సిటీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘భారత్ ల్యాబ్’ తాజా సర్వేలో వెల్లడించింది. – సాక్షి, స్పెషల్ డెస్క్చిన్న నగరాల నుంచి..‘నా తొలి వేతనం’ పేరుతో నిర్వహించిన సర్వేలో దేశవ్యాప్తంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు చెందిన 2,125 మంది యువ ఉద్యోగులు పాలుపంచుకున్నారు. 1997–2012 మధ్య జన్మించిన ఈ జెన్ –జీ తరం వాళ్లు.. మొదటి నెల జీతాన్ని ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, ఎలా ఆదా చేస్తున్నారు అన్న అంశాలపై లోతుగా అధ్యయనం చేశారు. సర్వేలో పాల్గొన్నవారిలో కొందరు ప్రధానంగా కుటుంబ సభ్యులకు గిఫ్టులు అందించి తమ కృతజ్ఞతను చూపారు. కొంత మొత్తాన్ని ఆదా చేయడం ద్వారా.. పెరుగుతున్న ఆర్థిక దూరదృష్టికి నిదర్శనంగా నిలిచారు మరికొందరు. విరాళాలు ఇచ్చి తమలో స్వార్థం లేదని ఇంకొందరు నిరూపించారు. ప్రతి రూపాయి లెక్కించే కుటుంబాలకు ఇవన్నీ భావోద్వేగాలతో ముడిపడిన అంశాలే. ‘మొదటి జీతం.. ఒక స్వాతంత్య్ర ప్రకటన. ముఖ్యంగా మహిళలకు ఒక నిశ్శబ్ద విప్లవం’ అంటారు భారత్ ల్యాబ్ కో–చైర్మన్, రీడిఫ్యూజన్ చైర్మన్ సందీప్ గోయల్.ముందుగా అమ్మకు..తొలి వేతనం అందుకున్న మరుక్షణమే 44.6% మంది ఆ సంతోషాన్ని తొలుత అమ్మతో పంచుకుంటున్నారు. 28.6% మంది తండ్రికి, 16.1% మంది జీవిత భాగస్వామికి, 10.7% మంది తోబుట్టువులకు సమాచారం ఇస్తున్నారు. తరాలు మారుతున్నా.. సామాజిక పరిస్థితులు మారుతున్నా.. కుటుంబ బంధాలకు ఇచ్చే విలువను ఇది సూచిస్తుందని నివేదిక వివరించింది. ఇంటికి తమవంతు ఆర్థిక సహకారంగా గత తరాలు భావిస్తే.. నేటి జెన్ –జీ తరం మహిళల్లో 88.5% మంది తమ మొదటి జీతాన్ని స్వాతంత్య్రంగా అభివర్ణించారు. ఆర్థిక స్వాతంత్య్రం మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అనడానికి ఈ ప్రకటనే నిదర్శనం. స్వాతంత్య్రంతో పాటు ఇంటికి అందించాల్సిన బాధ్యత అని 41.2% మంది పురుషులు భావించారు.దానంలోనూ, పొదుపులోనూ మహిళలేమొదటి జీతాన్ని పొదుపు, దానం చేయడంలో.. రెండింటిలోనూ పురుషుల కంటే మహిళలే ముందుండటం విశేషం. మొత్తంగా 24.5% మంది తొలి జీతాన్ని జాగ్రత్తగా పొదుపు చేశారు. అత్యవసర నిధిని ఏర్పాటు చేయడం, తదుపరి విద్యకు సిద్ధం కావడం లేదా కష్ట సమయాల్లో కుటుంబాన్ని పోషించడం వంటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని పొదుపునకు ప్రాధాన్యత ఇచ్చారు. విడివిడిగా చూసినప్పుడు.. 50% మంది మహిళలు పొదుపు చేస్తే, పురుషుల్లో ఈ సంఖ్య 32.3% మాత్రమే. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..20.4% మంది తొలి జీతాన్ని దాతృత్వ కార్యక్రమాలకు వినియోగించారు. మతపర సంస్థలు, ఎన్ జీఓలు లేదా నేరుగా అవసరంలో ఉన్నవారికి విరాళంగా ఇచ్చారు. భారత్లోని యువ సంపాదకులు సమాజ అభ్యున్నతి, శ్రేయస్సును అర్థం చేసుకుంటారని నిరూపించారు. దానంలో మహిళలు 41.6% కాగా, పురుషుల్లో ఈ సంఖ్య 27.7% ఉంది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని యువతుల్లో ఆర్థిక వివేకం, సామాజిక బాధ్యత పెరుగుతోందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. తమవారికి కృతజ్ఞతగా..తొలి వేతనం పొందిన సంబరాన్ని 38.8% మంది బహుమతుల ద్వారా పంచుకుంటున్నారు. గుర్తుండిపోయే రోజున తల్లుల కోసం ఆభరణాల నుండి తోబుట్టువులకు గ్యాడ్జెట్స్ వరకు.. తమ ప్రయాణానికి మద్దతుగా నిలిచిన వారికి గిఫ్టులతో కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కిరాణా సామాగ్రి, ఫ్యాన్లు, యుటిలిటీ బిల్లుల వంటి వాటికి 12.2% మంది ఖర్చు చేశారు. తల్లిదండ్రుల అవసరాలకు 4.1% మంది తమ తొలి జీతాన్ని వెచ్చించారు. సర్వేలో పాల్గొన్నవారిలో 88.3% మంది తమ మొదటి జీతం అవసర ఖర్చులకు సరిపోతుందని చెబితే.. 11.7% మంది ఇబ్బందులు పడ్డట్టు తెలిపారు.బంగారం కొంటున్నారు..పుత్తడి మన జీవితాల్లో భాగం.. అదొక ఆర్థిక భరోసా. అందుకే, ఆభరణాలకు బదులుగా యువ మహిళా ఉద్యోగులు పసిడి కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో మూడింట ఒక వంతు మహిళలు తమ తొలి జీతంతో బంగారం కొన్నారు.భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, భారతదేశంలోని 76% యువత నెలవారీ పొదుపు (సిస్టమాటక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ – సిప్) కంటే సౌకర్యవంత పెట్టుబడి విధానాలను ఇష్టపడుతున్నారని నివేదిక వెల్లడించింది. అదనపు ఆదాయం, పండుగ బోనస్లు వచ్చినప్పుడు టూర్స్ లేదా తమ కలల బైక్ కొనుగోలు వంటి వ్యక్తిగత లక్ష్యాలకు ఖర్చు చేస్తున్నారు. సంకెళ్ళు లేకుండా జెన్ –జీ తరం పొదుపు చేయాలనుకుంటున్నారు. -
అంతా చూస్తున్నారు.. అతి వద్దు!
సాక్షి, హైదరాబాద్: ‘విద్యార్థి వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సోషల్ మీడియా ఖాతాలను మరింత లోతుగా పరిశీలిస్తాం... సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించే ప్రణాళిక కొనసాగుతోంది’ఇదీ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇటీవల ప్రకటించిన విషయం. దీన్నిబట్టి చూస్తే సోషల్ మీడియా ప్రొఫైలింగ్కు ఎంతటి ప్రాధాన్యత పెరుగుతుందో అర్థమవుతోంది. కేవలం విదేశాల్లో చదువు, ఉద్యోగాలకు వెళ్లే వారికే కాదు.. స్థానికంగా ఉద్యోగాలు పొందాలనుకునే యువతకు సంబంధించి సైతం ఆయా సంస్థలు ఇటీవల సోషల్ మీడియా ప్రొఫైలింగ్ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. సదరు వ్యక్తి సోషల్ మీడియాలో వెల్లడించే భావాలు.. పెడుతున్న పోస్టులు, కామెంట్లు, వీడియోల ఆధారంగా అతడి వ్యక్తి త్వం ఏంటి? ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు? ఇలా అనేక విషయాల్ని అంచనా వేస్తు న్నాయి. ఇంకాస్త లోతుగా వెళితే పెళ్లి సంబంధాల సమయంలోనూ అబ్బాయి–అమ్మాయిల గురించి, వారి స్నేహాలు, ప్రవర్తన, ఇతరులతో ఉన్న సంబంధాలపై ఒక అంచనాకు వస్తున్నారు. ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్, ఎక్స్లలో వాళ్లు షేర్ చేసే ఫొటోలు, వీడియోల ఆధారంగా కూడా ప్రవర్తన, నడవడికను ఇట్టే అంచనా వేస్తున్న రోజులివి. అందుకే సోషల్ మీడియాలో అంతాచూస్తున్నారని, కాబట్టి అతి ధోరణి వద్దని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.ఫన్ పేరిట కించపర్చేలా వ్యాఖ్యలు సాంకేతికతతో ఎంత ఉపయోగం ఉంటుందో.. అంతేస్థాయిలో అనర్థాలున్నాయి. నేటి యువత ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్ట్రాగామ్, టెలిగ్రామ్, స్నాప్చాట్ వాడటం పరిపాటిగా మారింది. గంటల తరబడి చాటింగ్లు, మీటింగ్ల్లో కొందరు హద్దు దాటుతున్నారు. యువత, విద్యార్థులు ఫన్ పేరిట ఎదుటి వారిని కించపర్చేలా వ్యాఖ్యలు చేస్తున్నారు.. తోటి విద్యార్థులను సైబర్ బుల్లీయింగ్ (తప్పుడు వ్యాఖ్యలతో వేధించడం) చేస్తున్నారు. రాజకీయ వ్యాఖ్యలు, మతపరమైన వివాదాస్పద కామెంట్లు పెడుతుంటారు. ఈ వ్యాఖ్యలే వారిపాలిట ఇబ్బందికరంగా మారుతున్నాయి. కొన్నిసార్లు వీసాల రద్దు వరకు దారి తీస్తున్నాయి. ఎంబసీల్లోని అధికారులు వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారి సోషల్ మీడియా ఖాతాలు వెరిఫై చేస్తున్నారు. యూకే, కెనడా, అమెరికా లేదా ఇతర ఏ దేశానికి వెళ్లాలన్నా వీసాలు ఆమోదం పొందడం లేదు. ఇందుకు ప్రధాన కారణం సోషల్ మీడియా ప్రొఫైలింగ్. అందుకే మన వ్యక్తిగత ప్రవర్తన కేవలం బయటి సమాజంలోనే కాదు.. సోషల్ మీడియా ప్రపంచంలోనూ ఉన్నతంగా ఉండాలని చెబుతున్నారు. మన చేతుల్లోనే.. మన భవిష్యత్తు» కేవలం విదేశాల్లో విద్యా అవకాశాల విషయంలోనే కాదు.. అన్ని వయస్సుల వారి అవకాశాలకు ప్రతిబంధకంగా ఈ సోషల్ మీడియా ప్రొఫైలింగ్ మారుతోందని మరవొద్దు. » పెళ్లి సంబంధమైనా, కొత్త ఉద్యోగమైనా సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాల వెతుకులాట కొనసాగుతోందని మరవొద్దు. » ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సైతం సోషల్ మీడియా యాప్లలో, వాట్సాప్ వంటి గ్రూప్ల్లో సంయమనంతో ఉండకపోతే చిక్కులు తప్పవు. » అనసవర వ్యాఖ్యలు చేయడంతో కొన్నిసార్లు ఇతర కంపెనీల్లో గొప్ప ఆఫర్లు వచ్చినా ఉద్యోగాలు పొందలేని పరిస్థితి. అదేవిధంగా ఒక ఉద్యోగి మతం, ప్రాంతం, కులాన్ని కించపర్చేలా వ్యాఖ్యలు పోస్టులు పెడితే ఉద్యోగ ఎదుగుదలకు అవి ప్రతిబంధకాలుగా మారే ప్రమాదం ఉంటుంది. » మన వ్యక్తిగత వివరాలు, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలు, ఫ్రెండ్స్ ఎవరు, తరచూ ఎక్కడికి వెళుతుంటాం.. వీటన్నింటినీ క్రోడీకరించి ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడి అవతలి వ్యక్తి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేయొచ్చని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతిగా సమాచారం అనవసరం.. సోషల్ మీడియాలో కొందరు తమ సమస్త వివరాలు చెబుతుంటారు. కానీ, అవసరానికి మించి ఏ వ్యక్తిగత సమాచారమూ సోషల్ మీడియాలో పంచుకోకపోవడమే ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. పుట్టిన రోజులు, కుటుంబ సభ్యుల వివరాలు, ఫొటోలు, మన స్వస్థలాల వివరాలు వీలైనంత వరకు పెట్టకుండా ఉండాలని సూచిస్తున్నారు. సోషల్ మీడియా వాడకంపై సరైన అవగాహన ఉండాలని పేర్కొంటున్నారు. మన వ్యక్తిగత సమాచారం మనం కాకుండా ఏ వెబ్సైట్లో, సెర్చ్ ఇంజిన్లో చూసినా వెంటనే దాన్ని తొలగించాలని ఆ వెబ్సైట్ను కోరాలని వారు సూచిస్తున్నారు. సోషల్ మీడియా ప్రొఫైలింగ్ అంటే..? ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, ఎక్స్ (ట్విట్టర్), స్నాప్చాట్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్లలో ఖాతాలున్న వారు.. వాటిల్లో షేర్ చేసుకుంటున్న ఫొటోలు, వీడియోలు, వివరాలు, పెడుతున్న కామెంట్లు అన్నింటినీ క్రోడీకరించి అవతలి వ్యక్తి గురించి అంచనావేసే పద్ధతినే సోషల్ మీడియా ప్రొఫైలింగ్అంటాం. దీని ఆధారంగా ఒక వ్యక్తి సామాజిక ప్రవర్తనను దాదాపుగా అంచనా వేయొచ్చు. -
అపురూపాలు పదిలం
గత స్మృతులను నెమరు వేసుకోవాలి. వర్తమానంలో మనుగడ సాధిస్తూ.. భవిష్యత్పై కలలు కనాలి. వాటిని నిజం చేసుకునేందుకు ప్రయత్నాలు చేయాలి.. అంటారు పెద్దలు. గతం తిరిగిరానిదని కూడా ఉద్బోధిస్తుంటారు. ఏ శాస్త్ర సాంకేతిక విజయాన్ని పరిశీలించినా.. దానికి మూలం పూర్వీకుల నుంచి సంక్రమించిన పరిజ్ఞానమే. ఇలాంటి పరిజ్ఞానాన్ని మరిచిపోకుండా.. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. వాటిని భద్రపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామస్తులు. అయిదారు దశాబ్దాల క్రితం వినియోగించిన వస్తువులు, వ్యవసాయ పరికరాలను భావితరాలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామంలో సేకరించిన వస్తువులను తెలంగాణ ఆద్యకళా మ్యూజియం పేరిట భద్రపరిచే ప్రయత్నాలు చేస్తూ పలువురి మన్ననలు పొందుతున్నారు. – సాక్షి, మహబూబాబాద్యాభై ఏళ్లుగా ప్రయత్నాలు పూర్వీకులు వినియోగించిన వస్తువులు, ఆనాటి కళలు, వారి సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు పూనుకున్నారు శ్రీరామగిరి వాసులు. యాభై ఏళ్ల క్రితం వివేకానంద సాంస్కృతిక సమితిని ఏర్పాటు చేశారు. ఈ సమితి ద్వారా ఆనాటి వీధిభాగోతాలు మొదలుకొని.. చిడతల రామాయణం, జడకుప్పి, కోలాటం తదితర కళలను పరిరక్షిస్తూ నేటికీ ప్రదర్శిస్తున్నారు. పాతకాలం నాటి వస్తువులను కూడా సేకరిస్తున్నారు. భావితరాల కోసం.. మారిన కాలం, వైజ్ఞానిక రంగాల్లో వచ్చిన మార్పుల ఫలితంగా అనేక నూతన ఆవిష్కరణలు వచ్చాయి. కానీ గతంలో పూర్వీకులు వినియోగించిన వస్తువులను భావితరాలకు చూపించాలనే ఆలోచనతో శ్రీరామగిరి వాసులు తమ ఇళ్లల్లోని వస్తువులను భద్రపరిచారు. వీటిలో మోటబొక్కెన, బకెట్ పంపు డబ్బాలు, కుందెన, పాన్ధాన్ (ఆకులు, సున్నం, వక్కల కత్తెర, వక్కలు భద్రపరిచే పెట్టె), చుట్టకుదురు, రోకళ్లు, ఇసుర్రాయి, ఉట్టి, చల్లకవ్వం, ఉట్టి, అటికలు (మట్టితో తయారు చేసిన పాత్రలు), పిల్లలు ఆడుకునే రింగున్, బొంగరాలు మొదలైనవి ఉన్నాయి. చేపల వేట కోసం వినియోగించే ఊత, మావుతోపాటు విడిచిన బట్టలు వేసుకునే మైల్దాన్, మంగలి పెట్టె, సానరాయి మొదలైవాటితోపాటు, శ్రీరామగిరి గ్రామానికి చెందిన పాతకాలం పండితులు రాసిన తాళపత్ర గ్రంథాలను కూడా సేకరించారు. ఆద్యకళా మ్యూజియం ఏర్పాటు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగానే తెలుగు విశ్వవిద్యాల యం ప్రొఫెసర్లు, పురావస్తు శాఖ వారి ఆధ్వ ర్యంలో వస్తువులు, జానపద కళల ప్రదర్శనల ద్వారా ఆనాటి కళలకు గుర్తింపు తెచ్చేందుకు కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగానే ప్రొఫెసర్ సుజాత, జయదీర్ తిరుమలరావు శ్రీరామగిరి గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోని యువకులు, పెద్దలు సేకరించిన పురాతన వస్తువులు, వ్యవసాయ పరికరాలను చూసి ఆశ్చర్యపోయారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వివేకానంద సాంస్కృతిక మండలి సభ్యులను అభినందించారు. గ్రామంలో సేకరించిన వస్తువులను హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్న ఆద్య కళా మ్యూజియానికి తరలించారు.పురాతన కళ, సంస్కృతి పరిరక్షణ మా గ్రామంలో ఐదు దశాబ్దాల క్రితం సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం వివేకానంద సాంస్కృతిక కళామండలిని ఏర్పాటు చేశాం. నాతోపాటు, మా గ్రామానికి చెందిన బొమ్మిడి వినోద్రెడ్డి, ఇతర మిత్రులం.. ఇప్పటికీ ప్రాచీన కళల పరిరక్షణకు పాటుపడుతున్నాం. వస్తువులు, వ్యవసాయ పరికరాలను సేకరించాం. చిడతల రామాయణం, జడకుప్పి వంటి కళల ప్రదర్శనకు.. రాష్ట్ర స్థాయిలో మా గ్రామానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఊరిలో సేకరించిన వస్తువులను మ్యూజియంలో భద్రపరుస్తున్నారంటే మా గ్రామానికే గర్వకారణంగా భావిస్తున్నాం. – కళాధర్ రాజు, ప్రధాన కార్యదర్శి, వివేకానంద సాంస్కృతిక మండలి కావలసినవి తయారు చేసుకునేవాళ్లు పూర్వ కాలం పద్ధతులే వేరు. చేతి వృత్తులు, కుల వృత్తుల వాళ్లు ఎక్కువ. ఎవరికి కావలసిన వస్తువులను వారు తయారు చేసుకునే వాళ్లు. అప్పుడు వస్తు మార్పిడి ఉండేది. ఏ వస్తువు కూడా పర్యావరణానికి భంగం కలిగించేది కాదు. అందువల్లే పూర్వీకులు అంత ఆరోగ్యంగా ఉన్నారు. – మురళీధర్ స్వామి, రిటైర్డ్ ఉపాధ్యాయుడు జ్ఞాపకాలు పదిలం చిన్నతనంలో పల్లెటూరులో పెరిగాను. అందరం వరుసలతో పిలుచుకునే వాళ్లు. కానీ గోళం, ఊత, గాజె, బొట్టుపెట్టలు ఇప్పుడు కనిపించడం లేదు. వండిన అన్నం ఉట్టిమీద పెడితే.. స్టూలు వేసుకొని ఎక్కి అన్నం పెట్టుకున్న గుర్తులు ఇప్పటికి మరుపు రావు. – బండారు వెంకటరమణ, మహబూబాబాద్ -
పండుటీగలు ప్రాణాలు నిలిపేనా?
ప్రతిష్టాత్మకమైన స్పేస్ మిషన్ల ద్వారా అంతరిక్షంలోకి చేరుకున్న ఉదంతాలను గుర్తుచేసుకుంటే నీల్ఆర్మ్స్ట్రాంగ్ కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, రాకేశ్ శర్మ మనకు స్మరణకు వస్తారు. తాజాగా అయితే శుభాన్షు శుక్లా కూడా గుర్తొస్తారు. కానీ ఇప్పుడు ఈ జాబితాలోకి మరో విశిష్ట అతిథి వచ్చేశారు. అదే ప్రూట్ ఫ్లై. అంటే పండుటీగ! గతంలో ఎన్నోసార్లు ప్రయోగశాలల్లో ఎన్నో పరిశోధనలకు తన వంతు సాయం అందించిన పండుటీగ ఇప్పుడు అంతరిక్షం దాకా ఎగరనుంది! ఆగ్జియం స్పేస్ మిషన్ బృందం పండుటీగలను కూడా అంతరిక్షంలోకి పంపనుంది. అంతరిక్షంలో వ్యోమగాములకు ప్రమాదకరంగా మారిన రేడియోధార్మికత డీఎన్ఏను ధ్వంసం చేస్తోంది. ఈ సమస్యకు పండుటీగలతో పరిష్కారం కనుగొనేందుకు ప్రయతి్నస్తున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు వెళ్లే ఆగ్జియమ్–4 మిషన్లో భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లా బృందంతోపాటు పండుటీగలు సైతం ఐఎస్ఎస్కు వెళ్లనున్నాయి. ఏం ప్రయోగం చేయబోతున్నారు? పండుటీగలు అత్యంత వేగంగా పునరుత్పత్తి చేస్తాయి. దీంతో వీటిని అంతరిక్షంలో రేడియోధార్మిక ప్రభావానికి లోను చేస్తే రేడియేషన్ వాటిని ఏ స్థాయిలో నాశనం చేస్తుంది?. దాన్ని తట్టుకుని అవి ఎంతవరకు మనగల్గుతాయి? డీఎన్ఏను పునరుద్ధరించుకోగలవా? అలా డీఎన్ఏ మరమత్తులు సాధ్యమా? ఇలాంటి ప్రశ్నలకు వ్యోమగాములు సమాధానాలు వెతకనున్నారు. ఇందుకోసం పండుటీగలను, వాటి లార్వాలను ఐఎస్ఎస్కు తీసుకెళ్తున్నారు. రేడియేషన్ తర్వాత పండుటీగలు ఎలాంటి ప్రొటీన్లను ఉత్పత్తిచేసి డీఎన్ఏ రిపేర్లు చేసుకునే అవకాశముందనే విషయాలపై స్పష్టత రానుంది. పండుటీగ ప్రయోగం విజయవంతమైతే దాని సాయంతో శాస్త్రవేత్తలు భవిష్యత్లో చందమామ, అంగారకుడు, సుదూర ప్రాంతాలకూ మానవసహిత ప్రాజెక్ట్లను నిరభ్యంతరంగా చేపట్టే వీలుంది. పండుటీగలే ఎందుకు? ఇలాంటి ప్రయోగాలకు పండుటీగలే అత్యంత అనుకూలమని తేలింది. ఎందుకంటే మనిషి డీఎన్ఏలో సహజసిద్ధంగా ఉన్న సూక్ష్మస్థాయి లోపల కారణంగానే తరచూ పలు రోగాలు సోకుతాయి. అలా మనిషిలో రోగాలకు కారణమయ్యే జన్యువులు, పండుటీగల్లోని అలాంటి జన్యువులతో దాదాపు 75 శాతం పోలి ఉండటం విశేషం. అందుకే భవిష్యత్ ప్రయోగాలను చేపట్టనున్నారు. పైగా పండుటీగ లార్వా అత్యంత విపత్కర పరిస్థితులను సైతం తట్టుకోగలదు. అత్యధిక స్థాయి రేడియేషన్ను సైతం తట్టుకొని మనగలదని ఇప్పటికే స్పష్టమైంది. ఇంతటి రేడియేషన్ను చాలా రకాల జీవులు అస్సలు తట్టుకోలేవు. ఇంతటి విశిష్ట లక్షణాలు ఉన్నందుకే పండుటీగను ఈ ప్రయోగానికి ఎంచుకున్నారు. అంతరిక్షం అనేది మనం రాత్రిళ్లు ఆకాశం కేసి చూసినప్పుడు కనిపించినంత ప్రశాంతంగా ఉండదు. అక్కడ రేడియోధార్మికతను అడ్డుకునే ఎలాంటి వాతావరణం ఉండదు. అంతటా శూన్యం వ్యాపించి ఉండటంతో రేడియోధార్మికత అనేది నిరాటంకంగా తీక్షణస్థాయిలో ప్రసరిస్తుంది. రేడియేషన్ అనేది మనిషి డీఎన్ఏలోని నిచ్చెనలాంటి నిర్మాణాలను దెబ్బతీస్తుంది. గురుత్వాకర్షణ లేని కారణంగా వెంటనే మళ్లీ మరమత్తు చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. దీంతో భవిష్యత్తులో క్యాన్సర్ సోకే ముప్పు ఉంటుంది. అందుకే రేడియేషన్ నుంచి రక్షణ పొందుతూ వ్యోమగాములు వ్యోమనౌకల్లో మనుగడ సాగించాల్సి ఉంటుంది. అందుకే రేడియేషన్ నుంచి రక్షణ పొందే విధానాలపై ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు అవసరం. పండు టీగలోని ప్రోటీన్లు రేడియేషన్కు లోనైనా వెంటనే రిపేర్లు చేసుకోగలిగితే ఇదే తరహా ప్రోటీన్లతో శాస్త్రవేత్తలు కొత్తతరం ఔషధాలను అభివృద్ధిచేయనున్నారు. భవిష్యత్తులో వ్యోమగాములకు వీటిని అందించనున్నారు. జూన్ 8వ తేదీన భారత్, అమెరికా, పోలండ్, హంగేరీ దేశాల వ్యోమగాములతో ఆగ్జియమ్–4 క్యాప్సూల్ అంతరిక్షంలోకి వెళ్లనుంది. మనం తినే పండు చుట్టూ తిరిగే పండుటీగ చుట్టూ మన శాస్త్రవేత్తలు తిరుగుతారని మనం కలలో కూడా ఊహించి ఉండం. – సాక్షి, నేషనల్ డెస్క్