breaking news
-
పదేళ్లు సీఎంననడం అభ్యంతరకరం
నల్లగొండ: మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్రెడ్డి సీఎం రేవంత్రెడ్డిపై మరోమారు విరుచుకు పడ్డారు. మరో పదేళ్ల పాటు తానే సీఎంనని రేవంత్ రెడ్డి ప్రకటించడంపై రాజగోపాల్రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ శనివారం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్య బద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు’.. అని రాజగోపాల్రెడ్డి ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టించాయి. -
‘కేటీఆర్.. అది మా డైలాగ్.. కాపీ కొట్టావ్’
హైదరాబాద్. రాష్ట్రంలో తమ ఫోన్లు సహా పలువురు ఫోన్లను సీఎం రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేయిస్తున్నారని కేటీఆర్ ఆరోపించడమే కాకుండా దీనిపై లైడిటెక్టర్ పరీక్షలు రావాలంటూ సవాల్ చేశారు. ఈ అంశానికి సంబంధించి లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా? మగాడివైతే రా అని సీఎం రేవంత్కు సవాల్ విసిరారు కేటీఆర్. ఇప్పుడు దీనిపై కాంగ్రెస్-బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేటీఆర్ వ్యాఖ్యలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. ‘ మగాడివైతే రా అని కేటీఆర్ సవాల్ చేయడం సూట్ కాలేదు. ఇది మా డైలాగ్.. నువ్వు కాపీ కొట్టావ్’ అంటూ చమత్కరించారు. ‘రేవంత్ రెడ్డి వస్తే...నువ్వు తట్టుకోగలవా కేటీఆర్. రేవంత్ రెడ్డి నాటు కోడి , కేటీఆర్ బ్రాయిలర్ కోడి. కేటీఆర్ మీ హాయాంలో బెడ్రూమ్లోకి పోయి అరెస్ట్ చేస్తారు.. అప్పుడు ఏం చేశావ్. గత ఐదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంను మేము విమర్శిస్తే.. దానికి కారణం ఉంది. కేసీఆర్ ప్రభుత్వంలో అమలు కాని హామీలపైనే విమర్శలు చేశాం. అసెంబ్లీలో ప్రశ్నిస్తే కోమటిరెడ్డి, సంపత్లను సస్పెండ్ చేశారు. మాకైతే అసెంబ్లీలో మాట్లాడటానికి అవకాశమే ఇవ్వలేదు. మల్లన్న సాగర్లకు పోయేవారి పైన లాఠీలు విరగొట్టారు. పదేళ్లు దుర్మార్గపు పాలన సాగించారు. హరీష్ రావు మీ నియోజకవర్గ ప్రజలు ఎన్ని సార్లు ఫ్రీ బస్సు వాడుకున్నారో లెక్క తీద్దమా. సీఎం రేవంత్ వస్తారు.. కేసీఆర్ను రమ్మనండి,. గజ్వేల్లో మహిళలు ఫ్రీ బస్సు ఎక్కారో లేదో తేల్చుకుందాం. గతంలో ఆర్టీసీ బస్సులు ఖాళీగా తిరిగేవి. ఇప్పుడు కిటకిటలాడుతున్నాయి. .మహిళలకు ఫ్రీ ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ తిడుతున్నాడా.?, రూ.500కే గ్యాస్ సిలిండర్ , 200 యూనిట్ల ఫ్రీ కరెంటు పై చర్చకు సిద్దమా కేటీఆర్. మహిళా సంఘాలకు మా ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇస్తుంది. దీనిపై చర్చకు వచ్చే ధైర్యం బిఆర్ఎస్ నేతలకు ఉందా?, సంపన్నులు తినే సన్నబియ్యాన్ని పేదలకు అందిస్తున్నాం. పేద పిల్లలకు కార్పోరేట్ విద్య అందించేందుకు ఓక్కో నియోజకవర్గంలో రూ. 200 కోట్ల తో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు నిర్మిస్తున్నాం. ఇలాంటి ఆలోచనలు ఏరోజైనా కేసీఆర్ చేసాడా?, అని జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. -
‘జనం కోరుకున్నారు.. సీఎం చెప్పారు’
హైదరాబాద్: ‘వచ్చే 10 ఏళ్లు పాలమూరు బిడ్డనే ముఖ్యమంత్రిగా ఉంటారు’ అని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో అలజడి సృష్టించాయి. అవకాశం దొరికినప్పుడల్లా వచ్చేసారి కూడా తానే ముఖ్యమంత్రినని రేవంత్ చెప్పుకుంటూ ఉన్నారు. దీనిపై పలువురు కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉండగా, తాజాగా రాజగోపాల్ రెడ్డి బయటపడ్డారు.ప్రధానంగా రేవంత్ మళ్లీ తానే ముఖ్యమంత్రినని ఎలా చెప్పుకుంటారని రాజగోపాల్రెడ్డి ప్రశ్నించారు. దీనిపై ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ స్పందించారు. రేవంత్ 10 నుంచి 15 ఏళ్ల పాటు సీఎంగా ఉండాలనేది కొల్లాపూర్ ప్రజలు కోరుకున్నారని, రేవంత్ ముఖ్యమంత్రిగా ఉంటే తమ జిల్లా పెండింగ్ పనులు అవుతాయని సభకు వచ్చిన ప్రజలు కోరుకున్న నేపథ్యంలోనే అలా వ్యాఖ్యానించారని సంపత్ కుమార్ చెప్పుకొచ్చారు. జనం చెప్పిన దాన్నే సీఎం సభలో చెప్పారని స్పష్టం చేశారు. రాజగోపాల్రెడ్డి మంత్రి పదవి సంగతి అధిష్టానం చూసుకుంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం.జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను… pic.twitter.com/nGtGpQzgGk— Komatireddy Raj Gopal Reddy (@rajgopalreddy_K) July 19, 2025 కేటీఆర్ మాటలు శ్రుతిమించుతున్నాయిబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు చురకలంటిచారు సంపత్ కుమార్. కేటీఆర్ మాటలు శ్రుతిమించుతున్నాయని, ప్రస్తుతానికి కేటీఆర్ పుస్తకంలో ఒక పేజీ మాత్రమే చదివామని, ఇంకా చాలా కథ ఉందంటూ సెటైర్లు వేశారు. ‘కేటీఆర్ నీకంటే ఎక్కువ బాష మాట్లాడగలను... తట్టుకోలేవు. లోకేష్ను కలవలేదంటవ్...కలిస్తే తప్పేంటి అని నువ్వే అంటవ్...రేవంత్ రెడ్డి మొనగాడు. మొగాడు కాబట్టే మిమ్మల్ని మట్టి కరిపించాడు.సీఎంను ఉద్దేశించి మాట్లాడే పద్దతి నేర్చుకో కేటీఆర్’ అని సూచించారు. -
అంత నిస్సహాయ స్థితిలో ఏం లేను.. ఈటల ‘కోవర్టు’ వ్యాఖ్యల కలకలం
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో అవమానాలు, అవహేళనలు తప్పవని.. వాటిని తట్టుకుని నిలబడితేనే నిలదొక్కుకోగలమని హుజూరాబాద్ కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసినవా? అనే చర్చ జోరందుకుంది.సాక్షి, మేడ్చల్-మల్కాజ్గిరి: హుజురాబాద్ కార్యకర్తలను ఉద్దేశించి బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల ఆవేదన తనకు అర్ధం అయ్యిందని.. వాళ్ల రాజకీయ అవసరాలు తీర్చలేనంత నిస్సహాయ స్థితిలో తాను లేనని అన్నారాయన. శనివారం శామీర్పేట నివాసంలో ఆయన హుజురాబాద్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. నాకు స్ట్రెయిట్ ఫైట్ తప్పా.. స్ట్రీట్ ఫైట్ రాదు. మీదికి ఒక మాట.. లోపల ఒక మాట మాట్లాడటం రాదు. బాజప్తా మాట్లాడతా.. బేజాప్తా మాట్లాడటం రాదు. హుజురాబాద్ చైతన్యానికి మారుపేరు. మనకు మనంగా భీఆర్ఎస్ నుంచి బయటకు రాలేదు. 2021లో ఆ పార్టీ నుంచి నరకం అనుభవించా. రాజకీయాల్లో అవమానాలు, అవహేళనలు ఉంటాయి.. అవి తట్టుకుందాం. ప్రజలు ఎప్పుడూ మోసం చేయరు. అయితే హుజురాబాద్లో ఓడిపోతా అని ఊహించలేదు. శత్రువుతో నేరుగా కోట్లాడతా. కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకోవడం నాకు రాదు. నా చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసు. ధీరుడు వెనుదిరగడు.. ఎంత వరకు ఓపిక పట్టాలో తెలుసు. పదవులే పరవధిగా భావించే వాడిని కాదు. ఏ పార్టీలో పనిచేస్తే ఆ పార్టీకి అంకితభావంతో ఉంటా. నా అనుభవం వాడుకుంటే పార్టీకి ఉపయోగపడుతుంది. కాలం చాలా గొప్పది. హుజురాబాద్లో గత 20 ఏళ్లుగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోలేదు. హుజురాబాద్లో 2019 లోకసభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 53 వేల మెజార్టీ వచ్చింది. వ్యక్తులు ఎదకుండా ఏ పార్టీ బలపడలేదు. కార్యకర్తల ఆవేదన అర్ధం అయ్యింది. వాళ్ల రాజకీయా అవసరాలు తీర్చలేనంత నిస్సహాయంగా లేను. కొందరు సోషల్ మీడియాలో కుట్రలు చేస్తున్నారు. అబద్ధపు పునాదులపై బతుకుతున్నారు. కడుపులో కత్తులు పెట్టుకుని కుట్రలు చేస్తున్నారు. వీధి పోరాటాలు మనకు అవసరం లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగు పడని పల్లె లేదు. నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో ఆఫీస్ ఉంటుంది. నేను రాకముందు బీజేపీకి హుజురాబాద్లో కేడరే లేదు. నేను వచ్చాకే కరీంనగర్లో బీజేపీకి 50వేల మెజారిటీ. హుజురాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలో మనవాళ్లే ఉంటారు. కురుస స్వభావులను చూసి నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదు. కొత్త, పాత వాళ్ళు అనే భావన లేదు. ఉన్నదాంట్లో గుర్తించి మనకి పదవులు వస్తాయి. ఎవరి దయాదక్షిణ్యాలు మనకు అవసరం లేదు. కోవర్టులు రాజకీయాల్లోనే కాదు అన్నింట్లో ఉంటారు. వారి గురించి బాధపడకండి..హుజురాబాద్ వస్తా.. మీ వెంటే ఉంటా.. మిమ్మల్ని గెలిపించుకుంటా. ఇక నుంచి పదిరోజులకు ఒకసారి హుజురాబాద్ వస్తా. కార్యకర్తలు మరుగుజ్జులు కాదు.. కుంగిపోవద్దు. రోశయ్య ,కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ లాంటి వాళ్ళతోనే కొట్లాడిన. సముద్రంలో తుపాను వచ్చే ముందు సైలెంట్గా ఉంటుంది. నాలాంటి వాళ్ళు మాట్లాడితే సమాజం రియాక్ట్ అవుతుంది. నేను ప్రజల నుంచి వచ్చిన వాడ్ని. ప్రజలే నాకు న్యాయ నిర్ణేతలు’’ అని ఈటల వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ కామెంట్లపై బీజేపీ శ్రేణుల్లో జోరుగా చర్చ నడుస్తోంది. -
బాబు, రేవంత్ దాగుడు మూతలు!
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఎనుముల రేవంత్ రెడ్డి గురుశిష్యులని ప్రతీతి. అప్పుడప్పుడూ ఈ ప్రచారాన్ని రేవంత్ తోసిపుచ్చుతున్నట్లు కనిపించినా.. కొన్ని సందర్భాల్లో అది నిజమే అన్నట్టుగానూ ఉంటుంది. విభజన సమస్యలు, ఆస్తుల పంపిణీ, విద్యుత్తు బకాయిల వంటి ముఖ్యమైన అంశాలపై కాకుండా.. బనకచర్ల ప్రాజెక్టు ఏదో పెద్ద విపత్తు అయినట్లు ఇరువురూ ఢిల్లీలో సమావేశం కావడం ఈ విషయాన్ని రూఢి చేస్తోంది. కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగిన తీరు, ఆ తరువాత వచ్చిన వార్తలు, నేతలు చేసిన వ్యాఖ్యలను నిశితంగా గమనిస్తే.. రేవంత్ ఏదో మొహమాటానికి ఢిల్లీ వెళితే.. శిష్యుడిని మేనేజ్ చేద్దామనుకున్న చంద్రబాబు భంగపడ్డట్టుగా కనిపిస్తుంది. ఈ సమావేశంలో బనకచర్ల ప్రస్తావనే రాలేదని రేవంత్ రెడ్డి ఒకటికి రెండుసార్లు స్పష్టం చేసినా చంద్రబాబు దీనికి బదులేదీ ఇచ్చినట్టు లేదు. పైగా.. ఏదో కమిటికి ఈ వ్యవహారాన్ని అప్పగించినట్లు చంద్రబాబు తన కేబినెట్ మంత్రి రామానాయుడితో చెప్పించడం రేవంత్ను ఇబ్బందిపెట్టే విషయం అయిపోయింది. బదులుగా రేవంత్ మరోసారి తన వాదన వినిపించి ఆత్మరక్షణలో పడితే.. చంద్రబాబు ఢిల్లీ నుంచి నేరుగా రాయలసీమలో ఒక నీటి విడుదల కార్యక్రమానికి వెళ్లి కూడా బనకచర్ల ప్రస్తావన చేయకపోవడం ద్వారా డిఫెన్స్లో పడినట్లు విశ్లేషించుకోవాలి. తద్వారా చంద్రబాబు బనకచర్ల పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు విమర్శించే ఆస్కారం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లో పోలవరం, బనకచర్ల ప్రాజెక్టుల గురించి చంద్రబాబు కొన్ని నెలలుగా విస్తారంగా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలోని వివిధ రాజకీయ పక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్లు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పోటాపోటీ విమర్శలు చేసుకున్నాయి. నిజానికి బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ చాలా కష్టమని అంతా భావిస్తున్నారు. అందులోను పోలవరం ప్రాజెక్టు ఎత్తును 150 అడుగుల నుంచి 135 అడుగులకు తగ్గించడానికి చంద్రబాబు సర్కార్ అంగీకరించిందన్న వార్తల నేపథ్యంలో ఆ సందేహం మరింతగా బలపడుతోంది. దీనివల్ల ఏపీకి తీరని నష్టం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ అంశం నుంచి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా బనకచర్ల డ్రామాకు తెరతీయగా, రేవంత్ పరోక్షంగా సహకరించారన్న విమర్శలు వస్తున్నాయి. సీఎంల భేటీలో బనకచర్ల ప్రాజెక్టు అజెండాపై తాము అంగీకరించడం లేదని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. అనుమతే లేని ప్రాజెక్టుపై చర్చ అసమంజసమని కూడా అభిప్రాయపడింది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు అథారిటీ, గోదావరి బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేసింది. దీంతో బనకచర్ల అజెండాలో ఉంటే రేవంత్ వెళతారా? లేదా? అన్న ప్రశ్న వచ్చింది. ఒకవేళ వెళ్లినా బనచర్ల అజెండా అయితే రేవంత్, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి బృందం బాయ్ కాట్ చేస్తుందని కూడా లీక్ ఇచ్చారు. ఎలాగైతేనేం కేంద్ర మంత్రి సి.ఆర్.పాటిల్ సమక్షంలో ఇద్దరు సీఎంలు సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాల సీఎంలు పరస్పరం సత్కరించుకున్నారు. కేంద్ర మంత్రిని సన్మానించారు. బాగానే ఉంది. కాని బయటకు వచ్చి సమావేశం వివరాలను చెప్పిన తీరు మాత్రం ఆశ్చర్యం కలిగించింది. రేవంత్ రెడ్డి బనకచర్ల ప్రస్తావన రాలేదని చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టును చేపడతామని ఏపీ చెబితే కదా.. తాము ఆపాలని చెప్పాల్సింది అని ఆయన అన్నారు. పైగా ఇదసలు అనధికార సమావేశమని అనడం ఆసక్తికరంగా ఉంది. కేంద్రం ఇలా అనధికార సమావేశాలు పెడుతుందా? కేంద్ర మంత్రి అంత పని లేకుండా ఉంటారా? ఈ మాత్రం దానికి హైదరాబాద్లోనో, అమరావతిలోనో భేటీ జరుపుకున్నా సరిపోతుంది కదా? అన్న వ్యాఖ్యలు వచ్చాయి. అయితే రెండు రాష్ట్రాల నీటి సమస్యలపై కేంద్రం కమిటీ ఏర్పాటు చేస్తుందని చెప్పారు. సీఎంలు పరిష్కరించుకోలేని సమస్యలను అధికారులు తీర్చగలుగుతారా! అనే సందేహం వస్తుంది. అది వేరే విషయం. రేవంత్ వ్యాఖ్యలకు భిన్నంగా ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాకు చెప్పారు. బనకచర్లకు సంబంధించి సాంకేతిక అంశాలను కూడా దృష్టిలో ఉంచుకుని కమిటీ వేయాలని నిర్ణయించినట్లు అన్నారు. అది నిజమా? కాదా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. రేవంత్ చెప్పినదాని ప్రకారం అసలు బనకచర్ల ప్రస్తావనే రాలేదు. కేంద్ర జల్ శక్తి శాఖ పీఐబీ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో కూడా బనకచర్ల గురించి ఏమీ తెలపలేదు. దాంతో చంద్రబాబు బృందం ఇన్నాళ్లు చేసిన హడావుడంతా ఒట్టిదేనా అన్న విమర్శలు వస్తున్నాయి. అదే టైమ్లో రేవంత్ చెప్పిన దానిలో ఎంతవరకు వాస్తవం ఉందన్న ప్రశ్నను బీఆర్ఎస్ వేస్తోంది. సీఎంల భేటీ అజెండాలో బనకచర్ల అంశం ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నారు. అటువంటప్పుడు అజెండాలోని అంశంపై ఎవరూ మాట్లాడలేదా?, తెలుగుదేశం మీడియా ఏపీ ఎడిషన్లలో చంద్రబాబు బనకచర్ల గురించి మాట్లాడారని, తెలంగాణ ఎడిషన్లలో ఆ ఊసే లేదన్నట్లుగా కథనాలు వచ్చాయి. ఒకవేళ చర్చ జరిగి ఉంటే, రేవంత్ తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టించినట్లవుతుంది. మాట్లాడకుండా ఉండి ఉంటే చంద్రబాబు ఏపీ ప్రజలను మోసం చేసినట్లు అవుతుంది. మరి వీరిద్దరిలో ఎవరు నిజం చెప్పినట్లు? రేవంత్ ప్రకటనపై చంద్రబాబు వివరణ ఇవ్వాలి. అలాగే ఏపీ మంత్రి వ్యాఖ్యలపై తెలంగాణ స్పందించాలి. రేవంత్ రెండో రోజు కూడా దీనిపై కొంత స్పష్టత ఇచ్చినా, చంద్రబాబు నోరు మెదపలేదు. తనకు అనుకూలంగా ఉంటే చంద్రబాబు ఈపాటికి ప్రచారంతో హోరెత్తించే వారు. కాని ఆయన అలా చేయకపోవడం, రాయలసీమ టూర్లో కూడా ప్రస్తావించకపోవడం అనుమానాలకు దారి తీస్తోంది. ఏపీలో టీడీపీ ప్రభుత్వానికి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య మాచ్ ఫిక్సింగ్ ఉందన్న అభిప్రాయం వ్యాప్తిలో ఉంది. దానికి ఇప్పుడు బీజేపీ కూడా తోడైనట్లు అనిపిస్తుంది. కేంద్రమైనా వాస్తవం ఏమిటో వెల్లడిస్తుందా? లేదా? రేవంత్, నిమ్మలతోపాటు కేంద్రం కూడా ఒకే తరహా ప్రకటన చేసి ఉంటే ఈ గందరగోళానికి అవకాశం ఉండేది కాదు. అలా కాకుండా ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం వారు స్టేట్మెంట్లు ఇవ్వడంతో వారికే తలనొప్పిగా మారిందని చెప్పాలి. ఇక ఇద్దరు సీఎంలు కూర్చుని అంగీకరించినట్లు చెబుతున్న టెలిమెట్రీ ఏర్పాటు, హైదరాబాద్లో గోదావరి బోర్డు, విజయవాడలో కృష్ణా బోర్డు ఉండాలన్న నిర్ణయం, శ్రీశైలం ప్రాజెక్టుకు మరమ్మతులకు ఏపీ అంగీకారం వంటివే ప్రధాన చర్చాంశాలై ఉంటే మాత్రం ఇది కాలక్షేపపు సమావేశమే అవుతుందని కొందరు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే అవి ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నవే. కాగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పోలవరం ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్లు ఉండాలని, కాని చంద్రబాబు ప్రభుత్వం 41.15 మీటర్లకు తగ్గించేందుకు అంగీకరించిందని అంటున్నారు. ఈ నీటి మట్టానికి పరిమితమైతే బనకచర్ల ప్రాజెక్టుకు నీరు ఎలా అందుతుందని ఆయన ప్రశ్నించారు. దీనికి కూడా చంద్రబాబు ప్రభుత్వం జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. కాని అన్నిటికి దబాయించడమే పద్దతిగా పెట్టుకున్న చంద్రబాబు టీమ్ వీటిపై ఎంతవరకు వాస్తవాలు వెల్లడిస్తుందన్నది సందేహమే. ఏతావాతా చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను పణంగా పెట్టి మళ్లీ రెండు కళ్ల సిద్దాంతం ఆలపించినట్లు టీడీపీ మీడియాలో రాయించుకున్నారా? అన్న భావన కలుగుతోంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సీఎం రేవంత్కు బిగ్ షాక్.. రాజగోపాల్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్ వేదికగా..‘రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అంతకుముందు పాలమూరు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘2034 వరకు ఇంకో పదేళ్ల పాటు పాలమూరు బిడ్డనే ముఖ్యమంత్రిగా ఉంటారు. పదేళ్లుగా పెండింగ్లో ఉన్న పాలమూరు, కల్వకుర్తి, బీమా, కోయిల్సాగర్ ప్రాజెక్టులను పూర్తిచేసే బాధ్యత నేను తీసుకుంటా. డిసెంబర్ 9 కల్లా అన్ని ప్రాజెక్టుల భూసేకరణ పూర్తిచేసి, నిర్వాసితులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లిస్తాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
ఎవర్ని వదిలిపెట్టం.. కేటీఆర్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య జరిగిన కొట్లాటలో గాయపడిన 141వ డివిజన్ (గౌతమ్ నగర్) కార్పొరేటర్ సునీత భర్త రాము యాదవ్ను కేటీఆర్ శుక్రవారం పరామర్శించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 90 సీట్లు సాధించామని.. రెండో సారి కూడా తిరుగులేని విజయం సాధించామన్నారు.హైదరాబాద్లో ఒక్క సీటు కూడా రాలేదనే కారణంతో కాంగ్రెస్ గుండాగిరి రాజ్యం తెస్తోంది. మా ఎమ్మెల్యే, మా కార్పొరేటర్లు దేవుడి కార్యక్రమానికి చెక్కులు ఇచ్చే కార్యక్రమంలో గొడవ చేస్తారా? మీ అడ్డా అని వీర్రవీగుతున్నారా?. అధికారంలోకి వచ్చాక ఎవర్ని వదిలి పెట్టం’’ అంటూ కేటీఆర్ హెచ్చరించారు. గుండాల్లాగా రాజకీయం చేస్తూ బస్తీ మే సవాల్ అంటూ సవాల్ చేస్తున్నారు’’ అని కేటీఆర్ మండిపడ్డారు.మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి సిద్ధిపేటలో బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసి పెట్రోల్ పోసి తగలబెడతామని బెదిరిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?. పోలీసులు కొంత మందికి తొత్తులుగా మారారు. మేము మిమ్మల్ని వదలం. మా కార్యకర్తలు తరలి వచ్చి మీ అంతు చూస్తాం. మా ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి రాలేదని ఇష్టానుసారంగా చేస్తున్నారు. మేము ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్లు చేయటం లేదు’’ అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పాలమూరు అంటే కేసీఆర్కు చిన్నచూపు: సీఎం రేవంత్
సాక్షి, నాగర్ కర్నూల్: కృష్ణా జలాలు పొలాల్లో పారుతుంటే ఎందుకంత విషం చిమ్ముతున్నారంటూ రేవంత్రెడ్డి మండిపడ్డారు. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ పాలమూరుకు ఎందుకు న్యాయం చేయలేదంటూ ప్రశ్నించారు. పాలమూరులో ప్రాజెక్టులకు డిసెంబర్లో భూములు సేకరిస్తాం. రెండేళ్లలో ప్రాజెక్ట్లు పూర్తి చేసి చూపిస్తాం’’ అని రేవంత్ అన్నారు.సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లాలో పర్యటించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెంట్లవెల్లి మండలం జటప్రోల్లో రూ.150 కోట్లతో 22 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ముందుగా గ్రామంలోని పురాతన మదనగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన, ఆ తర్వాత భారీ బహిరంగ సభ ప్రసంగించారు. సభలో ఇందిరా మహిళాశక్తి కింద స్వయం సహాయక బృందాల మహిళలకు వడ్డీలేని రుణాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా బహిరంగ సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘‘రెండేళ్లు కాలేదు అప్పుడే దిగిపో.. దిగిపో అంటున్నారు. పాలమూరు అంటే కేసీఆర్ కుటుంబానికి చిన్నచూపు. కరీంనగర్ నుంచి పారిపోయిన కేసీఆర్ ఆదరిస్తే సున్నం పెట్టారు. వాల్మికీలను ఎస్టీ జాబితాలో చేర్పిస్తామన్న కేసీఆర్ ఎందుకు చేయలేదు?. చెప్పులు కుట్టమని, గొర్రెలు పెంచమని చేపలు పట్టమని చెప్పారు. ఆయన బిడ్డలే రాజ్యాలు ఏలాలా? పాలమూరు బిడ్డలకు పదవులు వద్దా?. మాదిగ కులాల వర్గీకరణ చేసినందుకు కేసీఆర్కు కడుపుమంటగా ఉంది. 25 వేల కోట్లు ఖర్చు పెడితే పాలమూరు ప్రాజెక్ట్లు పూర్తయ్యేవి. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం మూడేళ్లలో కూలేశ్వరం అయ్యింది’’ అంటూ రేవంత్ విమర్శలు గుప్పించారు. -
సీఎం రేవంత్పై కేటీఆర్ సంచలన ఆరోపణలు
సాక్షి,ఖమ్మం: సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ‘నీ సీఎం సీటుకు ఎసరు పెడతారని ఉత్తమ్,పొంగులేటి,భట్టి ఫోన్లు ట్యాప్ చేయడం లేదా?.దమ్ముంటే దీనికి రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఖమ్మం పర్యటనలో భాగంగా శుక్రవారం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ నివాసంలో జరిగిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్.. రేవంత్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం రేవంత్రెడ్డికి సరిగా కేసులు కూడా పెట్టడం రాదు. మాపై దొంగ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం,ఫోన్ ట్యాపింగ్,కారు రేసింగ్ అని తప్పులు పెడుతున్నారు. లీకులు తప్ప ఆయన పెద్దగా చేసేదేమీ లేదు. రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాకు సీఎం రేవంత్ ఏం అభివృద్ధి చేశారు? 18 నెలల పాలనలో రాష్ట్రానికి ఏం అభివృద్ధి చేశారు. ఎప్పుడైనా,ఎక్కడికైనా చర్చకు సిద్ధం. కేసీఆర్ సీతారామ ప్రాజెక్ట్ కడితే రేవంత్ రిబ్బన్ కట్చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పొంగులేటికి కాంట్రాక్ట్లు వచ్చాయి.2014లో ఖమ్మం ఎలా ఉండేది. మా పాలనలో ఎంత అభివృద్ధి జరిగిందో మీకు తెలియదా?. ఖమ్మంను అభివృద్ధి చేసింది కేసీఆర్ కాదా? సీఎం రేవంత్ సీటుకు భట్టి విక్రమార్క,కోమటిరెడ్డి ఎసరుపెడుతున్నారు.అందుకే వారి ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు. దీనికి సీఎం రేవంత్ సమాధానం చెప్పాలంటూ కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపారు. -
రేవంత్వి చెత్త వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: బనకచర్ల విషయంలో ఢిల్లీ సమావేశంలో తన నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసిన సీఎం రేవంత్రెడ్డి, తన చీకటి బాగోతాన్ని కప్పి పుచ్చుకునేందుకు కేటీఆర్పై చెత్త వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి పక్కన ఉన్న వారంతా గార్బేజ్ (చెత్త) బ్యాచేనని, కాలుష్యం అధికంగా ఉండే ఢిల్లీలో రేవంత్రెడ్డి చెత్త వ్యాఖ్యలతో అది మరింత పెరిగిందని ఎద్దేవా చేశారు. గురువారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు. బనకచర్లపై అబద్ధాలు చెబుతున్నారు.. ‘బనకచర్ల ప్రాజెక్టు ఢిల్లీ భేటీ ఎజెండాలో ఉందని ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు చెపుతుంటే, రేవంత్రెడ్డి అసలు చర్చకే రాలేదని అంటున్నారు. కేంద్ర జలశక్తి నిర్వహించిన సమావేశంలో బనకచర్లపై చర్చ జరిగినట్లు ఏపీలోని అన్ని పేపర్లలో వచి్చంది. లైయింగ్ సిండ్రోమ్ అనే వ్యాధితో రేవంత్రెడ్డి బాధ పడుతున్నాడు. అందుకే అబద్ధాలు చెపుతున్నాడు. కేటీఆర్ మీలా బ్యాగ్లు మోయలేదు.. మేము బనకచర్ల గురించి మాట్లాడుతుంటే ఆయన డ్రగ్స్, గంజాయి అంటూ మోకాళ్లకు, బోడి గుండుకు ముడి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్రెడ్డిలా కేటీఆర్ బ్యాగ్లు మోయలేదు. ఆయన చుట్టూ ఉన్నవారు కూడా బ్యాగులు మోసేవారే. పరిపాలన అంటే బ్యాగ్లు మోసుడు కాదని రేవంత్రెడ్డి గుర్తుంచుకోవాలి. కేటీఆర్ను లోకేశ్ అర్ధరాత్రి పూట కలిశాడని అంటున్నాడు. రాష్ట్రంలో అర్ధరాత్రి పూట గోడలు దూకే అలవాటు రేవంత్రెడ్డికే ఉంది. ఎవడో దుబాయ్లో చనిపోతే కేటీఆర్కు ఏం సంబంధం? కేటీఆర్పై చేసిన ఆరోపణలకు రుజువులు ఉంటే చూపించాలి. లేదంటే కేటీఆర్కు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి..’అని హరీశ్రావు డిమాండ్ చేశారు. శాంతిభద్రతలు పూర్తిగా విఫలం ‘కాంగ్రెస్ పార్టీ పాలనలో మలేరియా, డెంగ్యూ వంటి రోగాలతో గురుకుల పాఠశాలల విద్యార్థులు ఆస్పత్రుల్లో ఉంటున్నారు. మరోవైపు గ్రామాల్లో పాలన పడకేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి. మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఇంటిపై, నా క్యాంపు కార్యాలయంపై, పాడి కౌశిక్రెడ్డి ఇంటిపై, సునీత లక్ష్మారెడ్డిపై, మర్రి రాజశేఖర్రెడ్డిపై దాడికి దిగుతున్నారు..’అని మాజీమంత్రి చెప్పారు. మా ఫోన్లతో పాటు విలేకరులవీ ట్యాప్ చేస్తున్నారు.. ‘రేవంత్రెడ్డికి కేంద్రమంత్రి కిషన్రెడ్డి అండగా ఉంటున్నాడు కాబట్టే ఈడీ ఆయన్ను అరెస్టు చేయడం లేదు. మాపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. ఇంటెలిజెన్స్ వ్యవస్థతో నిఘా పెట్టినా మాకేం కాదు. రేవంత్రెడ్డి బీఆర్ఎస్ నాయకుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నాడు. విలేకరుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి..’అని హరీశ్రావు ఆరోపించారు. -
చంద్రబాబు స్క్రిప్టు.. రేవంత్ చిలక పలుకు
సిరిసిల్ల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి తొత్తుగా మారారని, తెలంగాణ ప్రయోజనాలను గురుదక్షిణగా తాకట్టు పెట్టేందుకు చూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు విమర్శించారు. ఇక్కడ మాట్లాడుతున్న చిలుక రేవంత్రెడ్డి అయితే పలుకులు మాత్రం చంద్రబాబువని మండిపడ్డారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.ఆరు దశాబ్దాలుగా జరిగిన జలదోపిడీ ఒక ఎత్తయితే సీఎం రేవంత్రెడ్డి కోవర్టుగా మారి ఢిల్లీలో బుధవారం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టడం ఒక ఎత్తు అని ధ్వజమెత్తారు. బనకచర్ల ప్రాజెక్టు గురించి చర్చ పెడితే సమావేశానికే వెళ్లను అని చెప్పిన రేవంత్రెడ్డి.. ఎలా మీటింగ్కు పోయారని ప్రశ్నించారు. అసలు ఆదిత్యనాథ్ను సాగునీటి సలహాదారుగా పెట్టుకోవడమే పెద్ద తప్పు అన్నారు. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వొద్దని అడ్డుకున్నదే చంద్రబాబు నాయుడు అని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ రైతుల హక్కులను కాపాడడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారని స్పష్టం చేశారు. బనకచర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే మరోసారి ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధమవుతుందని హెచ్చరించారు. చంద్రబాబు కనుసన్నల్లో కేంద్రం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తోందని, తెలంగాణ జలవనరులను దోపిడీ చేయాలని చూస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే బనకచర్ల ప్రాజెక్టు కట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డికి తెలిసిందల్లా రియల్ ఎస్టేట్ వ్యాపారమేనని ఎద్దేవా చేశారు. రాయలసీమ, ఆంధ్రా కూడా బాగుండాలని.. అదే సమయంలో తెలంగాణ నీటి వాటా తేలాలని కేసీఆర్ కోరుకున్నట్లు చెప్పారు. తమకు ఆంధ్రా ప్రజలతో గొడవ లేదని స్పష్టంచేశారు. వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని. కన్నెపల్లిలో మోటార్లను ఆన్ చేస్తే తెలంగాణలో కరువు ఛాయలు ఉండవని అన్నారు. డ్రగ్స్ కేసులో ఆధారాలు చూపాలి సీఎం రేవంత్రెడ్డి మీడియా చిట్చాట్ పేరుతో తనపై విషం చిమ్ముతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం కార్యాలయానికి గౌరవం ఇచ్చి ఇప్పటి వరకు సంయమనం పాటించానని, ఇకపై ఊరుకోబోనని స్పష్టంచేశారు. డ్రగ్స్ కేసులో తనపై విచారణ జరుగుతుందని రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆధారం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘హైదరాబాద్లో నాతో ముఖాముఖి చర్చకు వచ్చే దమ్ము లేక ఢిల్లీకి వెళ్లి మరీ రేవంత్రెడ్డి నాపై బురద జల్లుతున్నారు. న్యాయస్థానాల పరిధి నుంచి తప్పించుకోవడానికే చిట్చాట్ల పేరుతో దొంగచాటు మాటలు మాట్లాడుతున్నారు. పిరికి దద్దమ్మలా చిట్చాట్ల పేరుతో నా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ఇకపై వీటిని సహించేది లేదు. సీఎం చేసిన నిరాధార ఆరోపణలకు క్షమాపణ చెప్పాలి. డిమాండ్ చేశారు. లేదంటే పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’అని హెచ్చరించారు. -
విలన్లు క్లైమాక్స్లోనే అరెస్ట్ అవుతారు: సీఎం రేవంత్
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్లామని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి కాకుండా ఫామ్ హౌస్కు రావాలా? అంటూ రేవంత్ చమత్కరించారు. బనకచర్ల చర్చ జరిగిందో లేదో కేంద్రమే చెప్పిందని ఒక ప్రశ్నక సమాధానంగా చెప్పారు సీఎం రేవంత్. ‘ ‘కేసీఆర్ సభకు రావాలి. గత ప్రభుత్వం అవినీతిపై విచారణ జరుగుతోంది. కేటీఆర్ డ్రగ్స్ కేసులోనూ విచారణ కొనసాగుతోంది. శాఖాపరమైన విచారణ రాత్రికి రాత్రే పూర్తి కాదు. విలన్లు క్లైమాక్స్లోనే అరెస్ట్ అవుతారు’ అని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. ‘కేటీఆర్ను కాపాడాలని కిషన్రెడ్డి చూస్తున్నారు. అందుకే కాళేశ్వరం, ట్యాపింగ్ కేసు సీబీఐకి ఇవ్వాలనుకుంటున్నాం. బీసీ రిజర్వేషన్లపై మా వ్యూహం మాకుంది. సెప్టెంబర్ 30 లోపు లోకల్ బాడీ ఎన్నికలు జరుపుతాం. రెండేళ్ల తర్వాత నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తాం’ అని రేవంత్ తెలిపారు.చంద్రబాబు తొత్తు రేవంత్: కేటీఆర్సిరిసిట్ల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ తొత్తుగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వొద్దని అడ్డుకుందే చంద్రబాబని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ హక్కులను కాపాడటానికి కేసీఆర్ ఉన్నారని, బనకచర్లపై కాంగ్రెస్ స్టాండ్ మార్చకోకపోతే మరొకసారి ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధమవుతోందన్నారు. చిలుక రేవంత్ అయతే పలుకులు చంద్రబాబువి అని కేటీఆర్ సెటైర్లు వేశారు. ఏ బేసిన్లో ఏ ప్రాజెక్టు ఉందో సీఎం రేవంత్కు తెలియదని, ఆయనకు తెలిసింది రియల్ ఎస్టేట్ మాత్రమేనని కేటీఆర్ విమర్శించారు. -
సీఎం రేవంత్కు కిషన్రెడ్డి లేఖ.. ఏమన్నారంటే?
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రతిపాదించిన పునరుత్పాదక ఇంధన (రెన్యూవబుల్ ఎనర్జీ) కార్యక్రమాలపై తెలంగాణ ప్రభుత్వ సహకారం కోరుతూ లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (CPSUలు), ముఖ్యంగా కోల్ ఇండియా లిమిటెడ్ (CIL), నేవేలీ లిగ్నయిట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (NLCIL).. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకుని, సౌర, పవన విద్యుత్ ప్లాంట్లు, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు (PSP), బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS) వంటి కీలకమైన పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని కిషన్రెడ్డి లేఖలో తెలిపారు. ఈ ప్రాజెక్టులు వచ్చే మూడేళ్లలో దాదాపు రూ.10 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్శించనున్నాయి.లేఖలో కీలక ప్రతిపాదనలు:తెలంగాణలోని అధిక సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం గల జోన్లను గుర్తించి ఆయా ప్రాంతాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లను అభివృద్ధి చేయడం.గ్రిడ్ స్టెబిలిటీ, ఎనర్జీ రిలయబిలిటీలను మరింత పెంచేలా అత్యాధునిక బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS)ను అభివృద్ధి చేయడం.క్రిటికల్ బ్యాలెన్సింగ్ కెపాసిటీని అందించేందుకు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాల అధ్యయనం, అమలు.ప్రాజెక్టు అమలును వేగవంతం చేయడానికి, స్థానిక ఆర్థిక ప్రయోజనాలను పెంచడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలతో లేదా బొగ్గు కంపెనీలు స్వతంత్ర ప్రాతిపదికన జాయింట్ వెంచర్ మోడల్స్ ఏర్పాటు చేయడం.ఈ ప్రతిపాదనలు, ప్రాజెక్టులకు భూసేకరణ, భూకేటాయింపు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు అవసరం.ఈ ప్రాజెక్టులు కర్బన ఉద్గారాలను తగ్గించడం, గాలి నాణ్యతను మెరుగుపరచడం, సహజ వనరుల నిర్వహణ తదితర విషయాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. వీటి ద్వారా ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి, ఇంధన భద్రతతోపాటుగా, అవసరమైనంత మేర విద్యుత్ ను అందుబాటులోకి తీసుకురావడం, సమ్మిళిత అభివృద్ధి, జీవన ప్రమాణాలను పెంచడం వంటి సామాజిక-ఆర్థిక ప్రయోజనాలు కూడా లభించనున్నాయి. ఈ ప్రాజెక్టులు విజయవంతంగా అమలుకావడానికి రాష్ట్ర ప్రభుత్వం, CPSUల మధ్య నిర్మాణాత్మక భాగస్వామ్యం, సరైన సమన్వయం అత్యంత అవసరం. ఇందుకోసం మీరు ప్రత్యేకమైన చొరవతీసుకోవాలని కోరుతున్నాను. మీ జోక్యంతోనే ఈ ప్రాజెక్టులు వేగంగా, సమర్థవంతంగా అమలు అవుతాయని విశ్వసిస్తున్నాను.పునరుత్పాదక విద్యుదుత్పత్తిలో తెలంగాణ సామర్థ్యాన్ని గుర్తిస్తూ.. రాష్ట్రంలో హరితాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణమైన చిత్తశుద్ధితో సహకారం అందిస్తోంది. ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. భారతదేశ సుస్థిర విద్యుత్ వ్యవస్థలో తెలంగాణ పాత్ర కీలకం కానున్న సందర్భంలో.. ఈ ప్రాజెక్టుల ప్రాధాన్యత మరింత పెరగనుంది. తెలంగాణకు ఉన్న పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యం, హరితాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను దృష్టిలో ఉంచుకుని.. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని మరో మెట్టు ముందుకు తీసుకెళ్తాయి. దీంతోపాటుగా భారతదేశం సుస్థిర ఇంధన పరివర్తన దిశగా చేస్తున్న కృషిలో తెలంగాణ కీలక పాత్ర పోషించడానికి ఇదొక చక్కటి అవకాశం. భారతదేశపు దీర్ఘకాల ప్రణాళికలైన ఇంధన భద్రత, పర్యావరణ పరిరక్షణను సాకారం చేసుకోవడంలో భాగంగా ఆర్థిక పురోగతిని, అభివృద్ధి అవకాశాలను సమతుల్యం చేసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అత్యంత కీలకం.పర్యావరణ పరిరక్షణతో పాటుగా ఆత్మ నిర్భరతతో కూడిన భవిష్యత్ను ఏర్పరచుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిర్మాణాత్మక సహకారంలో మీ చొరవ కీలకం. తెలంగాణలో రానున్న ఈ సానుకూల మార్పుకు మీ సహకారాన్ని కోరుతూ.. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ, మా శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థలనుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు. -
తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ సెలైన్స్పై కవిత కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశమై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్పై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ సరైనదే అని కవిత చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై కూడా కవిత ఆసక్తికర కామెంట్స్ చేశారు.ఎమ్మెల్సీ కవిత తాజాగా మీడియా చిట్ చాట్లో మాట్లాడుతూ..‘బీసీ రిజర్వేషన్పై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్టే. బీఆర్ఎస్ నాయకులు ఆర్డినెన్స్ వద్దని చెప్పడం సరికాదు. బీఆర్ఎస్ వాళ్ళు నా దారికి రావాల్సిందే. నాలుగు రోజులు టైం తీసుకుంటారేమో అంతే. 2018 చట్ట సవరణ చేసి ఆర్డినెన్స్ తేవడం సబబే. నేను న్యాయనిపుణులతో చర్చించిన తర్వాతే ఆర్డినెన్స్కు సపోర్ట్ చేశాను. అలాగే, తీన్మార్ మల్లన్న నాపై చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ నాయకులు స్పందించకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఒక ఎమ్మెల్సీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచింది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లనను నేను జనాభా లెక్కల నుంచి తీసివేశాను అన్నారు. ఆయన ఎవరో నాకు తెలియదు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కమీషన్ల కోసమే బనకచర్ల..అనంతరం, బనకచర్లపై చర్చకు తాను వెళ్లనని సీఎం రేవంత్ రెడ్డి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. నిన్నటి డిల్లీ సమావేశంలో ఎజెండాలో మొదటి అంశమే బనకచర్ల. ముఖ్యమంత్రి, మంత్రి ఉత్తమ్ సిగ్గులేకుండా గోదావరి జలాలను చంద్రబాబు చేతిలో పెట్టారు. బనకచర్లపై చర్చే జరగలేదని రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నాడు. తెలంగాణ హక్కులను కాలరాసిన నాన్ సీరియస్ ముఖ్యమంత్రి తన పదవి రాజీనామా చేయాలి. బనకచర్ల వల్ల ఆంధ్రా ప్రజలకు ఏం లాభం లేదు. కాంట్రాక్టర్లు, కమిషన్ల కోసం బనకచర్ల కడుతున్నారు. ముఖ్యమంత్రి మెగా కంపెనీ వాటా కోసమే డిల్లీకి వెళ్లారు. చంద్రబాబు ఎజెండాలో భాగంగానే సీఎం డిల్లీకి వెళ్ళాడు. బనకచర్ల ఆపకపోతే న్యాయపోరాటం చేస్తాం.సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చంద్రబాబును ఎదుర్కొని సన్మానం చేశారు. సిగ్గులేకుండా బనకచర్ల ప్రాజెక్టును చంద్రబాబుకు అప్పనంగా అప్పగించారు. రేవంత్ రెడ్డి బనకచర్లపై బుకాయిస్తున్నారు. ఆయనకు పాలించే హక్కు లేదు. తక్షణమే సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. నాలుగు విజయాలు సాధించామని సీఎం రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారు. కృష్ణానది బోర్డును అమరావతిలో పెట్టడం అనేది ఏపీ విభజన చట్టంలో ఉంది. తెలంగాణ ప్రజల హక్కులను చంద్రబాబు కాళ్ల దగ్గర తాకట్టుపెట్టారు.బాబుకు బహుమతిగా గోదావరి నీళ్లు..పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలి. తన స్కూల్ బీజేపీ, కాలేజీ టీడీపీ, ఉద్యోగం కాంగ్రెస్లో అని సీఎం చెప్తుంటారు. ముఖ్యమంత్రి ఇంకా కాలేజీలోనే ఉన్నానని అనుకుంటున్నారు. అందుకే గోదావరి నీళ్లను చంద్రబాబుకు గిఫ్టుగా ఇచ్చారు. తుపాకులగూడెం నుంచి నదుల అనుసంధానం జరిగితే తెలంగాణ, ఆంధ్రాకు న్యాయం జరుగుతుంది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బనకచర్లపై అసలు చర్చ జరగలేదు. కొప్పుల ఈశ్వర్ స్వయంగా బొగ్గుగని కార్మికుడు.. వారికి బొగ్గుగని కార్మిక సంఘం బాధ్యతలు అప్పగించడాన్ని స్వాగతిస్తున్నా’ అంటూ కామెంట్స్ చేశారు. -
రేవంత్ గుట్టు రట్టయ్యింది: కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్రెడ్డి 48వ ఢిల్లీ పర్యటన గుట్టురట్టయ్యిందన్న కేటీఆర్.. ముసుగు వీడింది.. నిజం తేటతెల్లమయ్యిందన్నారు. ‘‘నిధులు రాహుల్ గాంధీకి.. నీళ్లు చంద్రబాబుకి.. బనకచర్ల గురించి చర్చే రాలేదని బుకాయిస్తున్నారు. గురుదక్షిణగా గోదావరి జలాలను అప్పజెప్పడానికేనా?. నువ్వు గద్దెనెక్కింది’’ అంటూ ఎక్స్ వేదికగా రేవంత్పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘కోవర్టులెవరో, తెలంగాణ కోసం కొట్లాడిందెవరో తేలిపోయింది. ఒక్క బొట్టు నీరు అక్రమంగా అప్పజెప్పినా పోరాటం తప్పదు. తెలంగాణను పీక్కుతింటున్న రాబందుల పని పడతాం’’ అంటూ కేటీఆర్ హెచ్చరించారు. నీ గురువుపై విశ్వాసం చూపించడానికి తెలంగాణ విధ్వంసం కావలసిందేనా?. ఇంకెందుకు రెండు రాష్ట్రాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు?. నిన్ను ఎన్నుకున్న పాపానికి…చెరిపేయి సరిహద్దులు! తెలంగాణా మీద నీ అక్కసు చల్లారుతుందేమో!’’ అంటూ కేటీఆర్ పోస్ట్ చేశారు.ముసుగు వీడింది, నిజం తేటతెల్లమయ్యింది! 48వ ఢిల్లీ పర్యటన గుట్టురట్టయ్యిందినిధులు రాహుల్ గాంధీకి, నీళ్లు చంద్రబాబుకి, తెలంగాణా వ్యతిరేకిని ముఖ్యమంత్రిగా గెలిపించినందుకు….బూడిద తెలంగాణ ప్రజలకి! బనకచర్ల గురించి చర్చే రాలేదని బుకాయించి….గురుదక్షిణగా గోదావరి జలాలను అప్పచెప్పడం…— KTR (@KTRBRS) July 16, 2025 -
రిజర్వేషన్లు ఎలా ఉంటాయో!?
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30లోగా గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. మరోవైపు ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి చట్టబద్ధత కల్పనకు పంచాయతీరాజ్ చట్టానికి సవరణలతో త్వరలో ఆర్డినెన్స్ సైతం తీసుకురానుంది. దీంతో ఆర్డినెన్స్ ఎప్పుడు జారీ అవుతుంది? రిజర్వేషన్లు ఎలా ఉంటాయి? అనే అంశాలు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీల సన్నాహాలతో స్థానిక సంస్థల ఎన్నికల రాజుకుంటున్న నేపథ్యంలో గతంతో పోల్చితే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఏ విధంగా ఉండవచ్చనేది చర్చనీయాంశంగా మారింది. ఆర్డినెన్స్ ఎలా ఉంటుందో..: పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం చూస్తే..అన్ని రిజర్వేషన్లు కలుపుకొని 50 శాతానికి లోబడి ఉండాలి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ప్రస్తుతం ఉన్న 22 శాతం రిజర్వేషన్లను, 42 శాతానికి పెంచి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆర్డినెన్స్ తేనుండటంతో.. అందులో పొందుపరిచే అంశాలు, బీసీ జనాభా లెక్కలు, వాటిని బట్టి మారే రిజర్వేషన్లు చర్చనీయాంశమయ్యాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు వారి జనాభా ప్రాతిపదికన ఖరారు కానున్నందున వాటి విషయంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చునని అంటున్నారు. అయితే రిజర్వేషన్లు మొత్తంగా మారిపోయే అవకాశం ఉందని, కాబట్టి ఎస్సీ,ఎస్టీ స్థానాలు కూడా కొంత మేరకు ప్రభావితం కావచ్చునని చెబుతున్నారు. వార్డు స్థానాలు మొదలు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ అధ్యక్షులు, జడ్పీ చైర్పర్సన్ స్థానాల వరకు రిజర్వేషన్లలో మార్పులు జరిగే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు.. గతంలో ఉన్న రిజర్వేషన్లు రెండు పదవీ కాలాల (టర్మ్లు) సమయం కొనసాగాయి. ఇప్పుడు ఒకే టర్మ్కు రిజర్వేషన్లు పరిమితం కానున్నాయి. అంటే ఈసారి నిర్ణయించే రిజర్వేషన్లు ఒక టర్మ్ మాత్రమే ఉంటాయన్న మాట. ఈ కారణంగానూ రిజర్వేషన్ స్థానాల్లో అనేక మార్పులు చోటు చేసుకోవచ్చునని అంటున్నారు. తాజా జనాభా లెక్కలతోనూ ప్రభావితం! గతంలో మాదిరిగానే సర్పంచ్, ఎంపీటీసీ రిజర్వేషన్లు మండల ప్రతిపాదికన, జెడ్పీటీసీ స్థానాలు జిల్లా యూనిట్గా..ఎంపీపీ అధ్యక్షుడు జిల్లా యూనిట్గా, జెడ్పీపీ చైర్మన్ రాష్ట్ర యూనిట్గా రిజర్వేషన్లు ఉంటాయా లేదా అనేది కూడా రాజకీయ పార్టీల నేతలు, ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠకు కారణమౌతోంది. అయితే ప్రభుత్వం జారీచేసే ఆర్డినెన్స్కు అనుగుణంగా ఆయా రిజర్వేషన్లు మారే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు తాజా జనాభా లెక్కల్లో (కుల గణన)వచ్చిన మార్పులను బట్టి రిజర్వేషన్లు కూడా మారిపోతాయని భావిస్తున్నారు. స్థానాల సంఖ్యపై స్పష్టత! రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, వార్డుల సంఖ్యతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల సంఖ్యపై స్పష్టత వచ్చినట్టు సమాచారం. గ్రామ పంచాయతీలు 12,782గా, గ్రామాల వార్డులు 1,12,712, ఎంపీటీసీ స్థానాలు 5,816, జెడ్పీటీసీ స్థానాలు 566, మండల ప్రజా పరిషత్లు 566, జిల్లా పరిషత్లు 31గా లెక్క తేలినట్లు తెలుస్తోంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖాపరంగా ఈ లెక్క తేల్చినట్లు అధికారవర్గాల భోగట్టా. 2019లో జరిగిన మండల, జిల్లా పరిషత్ ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో ఒక జిల్లా ప్రజా పరిషత్ (జెడ్పీపీ)–(మేడ్చల్ జిల్లా పరిషత్ రద్దు) స్థానం తగ్గగా అనేక గ్రామాలు, మండలాలు సమీప మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో ఎంపీటీసీ స్థానాల సంఖ్య 55 నుంచి 60 స్థానాల వరకు తగ్గినట్లు తెలుస్తోంది. మరోవైపు కొత్త మండలాలు, గ్రామ పంచాయతీల సంఖ్య పెరిగింది. తగ్గిన ఎంపీటీసీలు, పెరిగిన మండలాలు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని అనేక గ్రామాలు సమీప మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో మేడ్చల్ జిల్లా ప్రజా పరిషత్ (గ్రామీణ జిల్లా) ఉనికిలో లేకుండా పోతోంది. కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయడం, కార్పొరేషన్లలో ఆయా గ్రామాలు విలీనం కావడం వల్ల ఎంపీటీసీ స్థానాల సంఖ్య తగ్గనున్నట్టు తెలుస్తోంది. 2019లో ఎంపీటీసీ స్థానాలు 5,847 ఉండగా, ప్రస్తుతానికి ఆ సంఖ్య 5,800 వరకు తగ్గవచ్చని అంచనా. రాష్ట్రంలో మండలాల సంఖ్య 539 నుంచి 566కు పెరిగింది. గత ఎన్నికల్లో 12,769 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 12,782కు పెరిగింది. వీటిపై రాష్ట్రవ్యాప్తంగా 10–11 తేదీలలో అభ్యంతరాలను స్వీకరించి 12న తుది జాబితా ప్రకటించాల్సి ఉండగా, క్షేత్రస్థాయి నుంచి సకాలంలో పూర్తి సమాచారం అందకపోవడంతో వాటి ప్రకటనలో జాప్యం జరిగింది. సోమవారం నాటికి కూడా కొన్నిచోట్ల నుంచి వివరాలు రాకపోవడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సీట్లపై కచి్చతమైన సంఖ్యను అధికారులు అధికారికంగా వెల్లడించలేదు. 2019 ఎన్నికల నాటికి మండల ప్రజా పరిషత్లు 539 ఉండగా, 2025 ఎన్నికల నాటికి 566కు పెరగనున్నాయి. గతంలో గ్రామ పంచాయతీలు 12,769 ఉండగా, ఇప్పుడు 12,782కు చేరుకున్నట్టు అధికారవర్గాల సమాచారం. -
హెచ్సీఏ కంటే జూబ్లీహిల్స్ బైఎలక్షనే నాకు ముఖ్యం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్లో చోటు చేసుకున్న పరిణామాలపై టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ స్పందించారు. హెచ్సీఏ అవినీతి సర్వసాధారణం అయ్యిందన్న ఆయన.. తాను ఆ విషయాన్ని పట్టించుకునే స్థితిలో లేనని అన్నారు. మంగళవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ..‘‘రూల్స్ పాటించకపోతే ఇలాంటి కష్టాలే వస్తాయ్. హెచ్సీఏలో చాలా సమస్యలున్నాయ్. అసోషియేషన్ అనేది ఎప్పుడూ స్వలాభంతో నడవకూడదు. ఫోర్జరీ చేసినందుకే ప్రస్తుత ప్రెసిడెంట్ అరెస్ట్ అయ్యాడు. కాబట్టి, ఇప్పటివరకు జరిగిన అవకతవకలు బయటకి తీయాలి. హెచ్సీఏలో జరుగుతున్న పరిణామాలపై బీసీసీఐ ఫోకస్ పెట్టాలి. హెచ్సీఏ సభ్యులు, కోచ్ల పిల్లలనే క్రికెట్ ఆడిస్తున్నారు. సెలక్టర్లలో కూడా అవినీతి ఉంది. మొత్తంగా అవినీతి అనేది కామన్గా మారింది. పార్టీ ఆదేశిస్తే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ చేస్తా. జూబ్లీహిల్స్ రేసులో నేను కూడా ఉన్నాను. హెచ్సీఏ కంటే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక లో పోటీ చేయడమే నా ముఖ్య లక్ష్యం’’ అని అజారుద్దీన్ కుండబద్ధలు కొట్టారు. -
స్థానిక సంస్థల ఎన్నికలపై దూకుడు పెంచిన బీజేపీ
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ దూకుడ పెంచింది. ఈ మేరకు ఘట్కేసర్ సమీపంలోని పీపీఆర్ కన్వెన్షన్లో వర్క్ షాపు నిర్వహించింది. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన రాంచందర్ రావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ బన్సల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వర్క్షాపుకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పదాధికారులు, జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిచేలా వ్యూహ రచన చేస్తున్నారు. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ముగ్గురు ప్రధాన కార్యదర్శలతో కమిటీ ప్రకటించే అవకాశం ఉంది. -
బాబు పంపిందే రేవంత్ మాట్లాడుతున్నారు: జగదీష్రెడ్డి
లేని గొప్పలు చెప్పుకోవడం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అలవాటుగా మారిందని, తన గురురు చంద్రబాబు కోసం తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి మండిపడ్డారు. తిరుమలగిరి సభలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ జగదీష్రెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడారాయన. సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణకు రేవంత్ చేసింది ఏమీ లేదు. చెప్పుకోవడానికి ఏమీ లేదు. లేని గొప్పలు చెప్పుకోవడం ఆయనకు అలవాటు. తిరుమలగిరి సభకు స్పందనే లేదు. అందుకే సీఎం ఆ సభలో బూతులు మొదలుపెట్టారు. నానాటికీ ఆయన తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారు అని జగదీష్ రెడ్డి అన్నారు. ‘‘నీళ్ళ విషయంలో మరొక సారి రేవంత్ అజ్ఞానం బయటపడింది. ఏపీ సీఎం చంద్రబాబు పంపిన దానినే రేవంత్ మీడియా ముందు మాట్లాడుతున్నారు. తద్వారా తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. గురుదక్షిణ కింద కృష్ణ, గోదావరి జలాలను బాబుకు అప్పజెప్పబోతున్నారు. బనకచర్ల కోసం మేడిగడ్డను గాలికి వదిలేస్తున్నారు’’ అని రేవంత్పై జగదీష్ మండిపడ్డారు. మేడి గడ్డ బ్యారేజీ, అన్నారం , సుందిల్ల నుండి బాహుబలి పంపు హౌస్ వరకు ఎక్కడైనా చర్చకు సిద్దం’’ అని సవాల్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 6,47,479 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశాం. మరి మా హయంలో రేషన్ కార్డులు పంపిణీ జరగలేదని అంటున్న రేవంత్ చెంప దెబ్బకు సిద్ధమా?. ఇప్పుడు ఎన్నికలు పెడితే నల్గొండలో 12 సీట్లకు 12 సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుంది.ధాన్యం ఉత్పత్తిలో నల్గొండ జిల్లాను దేశంలోనే నంబర్ వన్గా బీఆర్ఎస్ ప్రభుత్వం తీర్చిదిద్దింది. ధాన్యం ఉత్పత్తిలో 3 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 40 లక్షల మెట్రిక్ టన్నుల పెంచింది బిఆర్ఎస్ ప్రభుత్వమే. నల్గొండలో యాదాద్రి పవర్ ప్లాంట్, 3 మెడికల్ కాలేజీ లు, యాద్రాది టెంపుల్ అభివృద్ధి కేసీఆర్ హయాంలోనే జరిగాయి కదా. మరి సీఎంగా రేవంత్ హయాంలో ఒక్క ప్రాజెక్ట్ అయినా ప్రారంభించారా?. నల్గొండ రైతులనే అడుగుదాం.. వారి చెంప దెబ్బలకు నేను సిద్ధంగా ఉన్నా. మరి సీఎం రేవంత్, మంత్రులు అందుకు సిద్ధమేనా? అని జగదీష్రెడ్డి సవాల్ విసిరారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విషయంలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను జగదీష్ రెడ్డి ఖండించారు. రాజకీయాల్లో ఇలాంటి అక్కర్లేదు. ఎవరికివారే సంస్కారం నేర్చుకుంటే మంచిది. సీఎం రేవంత్ కూడా విజ్ఞతతో మాట్లాడడం నేర్చుకోవాలి అని జగదీష్రెడ్డి హితవు పలికారు. -
చర్చకు సిద్ధమా?.. సీఎం రేవంత్ సవాల్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కేసీఆర్ రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లలోనే కూలేశ్వరం అయిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. ‘70 ఏళ్ల కిందట కాంగ్రెస్ పాలనలో కట్టిన మూసీ, నాగార్జునసాగర్, శ్రీశైలం, ఎస్ఆర్ఎస్పీ, జూరాల ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో.. కేసీఆర్ పాలనలో కట్టిన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ఎలా ఉన్నాయో నాగార్జునసాగర్ కట్టపై చర్చిద్దామా?.. సుందిళ్ల వద్దకు పోదామా?.. చర్చకు సిద్ధమా?’ అని బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. రూ.లక్ష కోట్లు మింగి తెలంగాణ ధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. కూలిన కూలేశ్వరం వద్ద మిమ్మల్ని ఉరి తీసినా పాపం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో సోమవారం రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పలువురు పేదలకు స్వయంగా రేషన్కార్డులు అందజేశారు. అంతకు ముందు ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో ప్రసంగించారు. నాడు బెల్టు షాపులు తెరిచారు ‘రేషన్కార్డు.. పేదల ఆత్మగౌరవం, గుర్తింపు, ఆహార భద్రత. అలాంటి రేషన్ కార్డులను తమ పదేళ్ల పాలనలో పేదలకు ఇవ్వాలన్న ఆలోచనే బీఆర్ఎస్కు లేదు. అప్పుడు రేషన్ షాపులు తెరవలేదు. బెల్ట్ షాపులను మాత్రమే తెరిచింది. ఇప్పుడు మా ప్రభుత్వంలో పేదలకు 5.61 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం. 3.10 కోట్ల మంది పేద ప్రజలకు సన్న బియ్యం అందిస్తున్నాం. ఈ రోజు రేషన్ షాపుల వద్ద జనాలు నిలబడి సన్న బియ్యం తెచ్చుకుంటున్నారు. పేదలకు సన్న బియ్యం ఇస్తుంటే బీఆర్ఎస్ నాయకులు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. దీనితో పాటు రైతు రుణమాఫీ, భరోసా, సన్న ధాన్యానికి బోనస్ వంటి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణ మాఫీ చేశాం. 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతు భరోసా ఇచ్చాం. పండించిన ప్రతి గింజను కొని బోనస్ ఇచ్చాం. దాంతో ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నంబర్వన్గా నిలిచాం. రైతును రాజును చేసింది ఇందిరమ్మ రాజ్యమే. సోనియాగాంధీ ఇచ్చిన హామీ మేరకు రైతులు పండుగ చేసుకుంటున్నారు. గత పదేళ్లలో కొత్త కోడలు వస్తే కార్డులో పేరు నమోదు చేయని పరిస్థితి. ఇప్పుడు 26 లక్షల మంది పేర్లను చేర్చాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. మహిళలు అంబానీతో పోటీపడేలా చేస్తున్నాం.. ‘మహిళల స్వయం సమృద్ధికి కృషి చేస్తున్నాం. రూ.21 వేల కోట్లు వడ్డీలేని రుణాలు అందించాం. మహిళా సంఘాలు వ్యాపారంలో అంబానీతో పోటీపడేలా చేస్తున్నాం. వెయ్యి బస్సులు కొని మహిళా సంఘాలు ఆర్టీసీకే అద్దెకు ఇచ్చేలా రుణాలు అందిస్తున్నాం. నాడు పెట్రోలు బంకులు రిలయన్స్ అంబానీలే పెట్టేవారు. వారితో పోటీ పడేలా మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చి పెట్రోలు బంకులు ఏర్పాటు చేయిస్తున్నాం. మహిళ సంఘాల ఆధ్వర్యంలో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయించి వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఒప్పందం చేసుకుంటున్నాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయ్యేలోపు లక్ష ఉద్యోగాలను కల్పిస్తాం. ఇప్పటికే 60 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఎస్సీ ఉప కులాల వర్గీకరణ అమలు చేసి దేశంలోనే ఆదర్శంగా నిలిచాం. జనగణనలో కులగణన చేసేలా కాంగ్రెస్ మోదీ మెడలు వంచాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తాం. బీసీలు రాజ్యాధికారం పొందేలా చేస్తాం..’ అని రేవంత్రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏం చేసిందో మహిళలు ఆలోచించాలి ‘త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఆ ఎన్నికల్లో జిల్లాలో ఒక్క గంజాయి మొక్క మొలవకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలదే. మహిళలు ఇంటికి పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో ఆలోచించండి. మీకు వడ్డీ›లేని రుణాలు, ఉచిత బస్, సబ్సిడీ గ్యాస్ ఇచ్చాం. ఇవన్నీ ఇంట్లో మీ ఇంటాయనతో చర్చించి కాంగ్రెస్కు సహకరించండి. 2034 వరకు మేమే అధికారంలో ఉంటాం. రాష్ట్రాన్ని ఒక ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దుతాం..’ అని సీఎం అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్కార్డులు: మంత్రి ఉత్తమ్ దేశంలో ఎక్కడా లేని విధంగా సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించామని, ఇప్పుడు కొత్త రేషన్కార్డుల పంపిణీని చేపట్టామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందిస్తున్నట్లు తెలిపారు. గతంలో రేషన్ కార్డుల ద్వారా దొడ్డు బియ్యం వస్తే అందులో 90 శాతం వృధా అయ్యేవని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చి సన్న బియ్యం అందజేస్తోందని చెప్పారు. ప్రస్తుతం 3.10 కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పాత రేషన్ కార్డులలో కూడా కొత్తగా కుటుంబ సభ్యులను చేర్చుకునే అవకాశం ఉందన్నారు. దేవాదుల ప్రాజెక్టు–6 ప్యాకేజీ ద్వారా పాలకుర్తి, స్టేషన్ ఘనపూర్తో పాటు తుంగతుర్తి నియోజకవర్గానికి కూడా గోదావరి జలాలు అందుతాయని చెప్పారు.20 వేల ఎకరాలు అదనంగా సాగవుతాయన్నారు. బునాదిగాని కాల్వను రీడిజైన్ చేయడానికి రూ.200 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. కాంగ్రెస్ పేదల ప్రభుత్వం: మహేశ్కుమార్గౌడ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను ప్రజా పాలనలో అమలు చేస్తున్నామని, 5 లక్షల మందికి రేషన్ కార్డులు ఇస్తున్న ఈరోజు శుభ దినమని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ అన్నారు. ఇది నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమం అని అన్నారు. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని మహేశ్గౌడ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యేలు మందుల సామేల్, బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, కుంభం అనిల్కుమార్రెడ్డి, బాలునాయక్, లక్ష్మారెడ్డి, జైవీర్రెడ్డి, యశస్వినిరెడ్డి, రామచందర్నాయక్, ఎమ్మెల్సీలు శంకర్నాయక్, అద్దంకి దయాకర్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలకు పొన్నం కౌంటరిచ్చారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే నిధులను ఆయనే ఆపుతున్నారని ఘాటు విమర్శలు చేశారు.మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పార్టీ బీసీల చాంపియన్. గుడ్డుకు వెంట్రుక కట్టే పని పెట్టుకోవద్దని బీజేపీ నేతలకు విజ్ఞప్తి చేస్తున్నాం. బీజేపీ నేతలు అరవింద్, బండి సంజయ్, ఈటల రాజేందర్, లక్ష్మణ్, కృష్ణయ్య గారు బీసీ రిజర్వేషన్లకు మద్దతు తెలపాలని కోరుతున్నాం. తెలంగాణ కుల గణన విప్లవాత్మక నిర్ణయమని స్వయానా వారణాసి ప్రజా ప్రతినిధి (ఆర్ఎస్ఎస్)నేత నాతో అన్నారు. బీజేపీ నేతలు దుర్బుద్దిని వీడండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. అంతకంటే ముందు ఇచ్చిన హామీ మేరకు స్పష్టమైన విధానంతో కుల సర్వే నిర్వహించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల చట్టం తీసుకొచ్చాం.చట్టం 3, 4 ప్రకారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తాం. బీజేపీ లక్ష్మణ్ అసహనంతో మాట్లాడున్నారు. రాష్ట్రానికి కేంద్రం నిధులు మీరే ఆపారు. చట్టపరమైన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని బీసీ రిజర్వేషన్ల బిల్లును ముందుకు తీసుకెళ్తున్నాం. కడుపులో కత్తులు పెట్టుకొని మాట్లాడకండి. బీసీ రిజర్వేషన్ల పట్ల మాకు చిత్త శుద్ధి ఉంది. రాష్ట్రపతి ఆమోదం పొందించి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చేలా కేంద్రాన్ని ఒప్పించండి. ఫ్యూడల్ సిద్ధాంతాలతో అడ్డుపడకండి. బిల్లు చట్టబద్ధత కోసం సీఎం రేవంత్, మంత్రులందరం సిద్ధంగా ఉన్నాం.. మీ నాయకులను తీసుకుని రండి ఢిల్లీకి వెళ్దాం.బీఆర్ఎస్ అధ్యక్ష పదవి, కార్యనిర్వాహక పదవి బీసీలకు ఇవ్వలేరా?. ఆర్డినెన్సు తీసుకొచ్చే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటే.. దొంగ దొంగ అంటూ డ్రామాలు చేస్తున్నారు. ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం 50 శాతం ఎత్తేసినపుడు.. బీసీ రిజర్వేషన్లు ఎందుకు సాకారం కాదు అని ప్రశ్నిస్తున్నా. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ అయినా సరే గెలిచేది బీసీ అభ్యర్థి అనే విషయం మరిచిపోకూడదు. బీసీ రిజర్వేషన్లుకు మద్దతు ఇవ్వాల్సిందిగా అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
నిరసన తెలిపితే కాల్పులా?: కవిత
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మల్లన్నపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిని ఆదివారం కలిసిన కవిత.. మల్లన్న సభ్యత్వాన్ని రద్దుచేయాలని కోరారు. ఆయన వ్యాఖ్యలను ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేయాలని విన్నవించారు. మల్లన్నపై డీజీపీ కార్యాలయంలో కూడా ఆమె ఫిర్యాదు చేశారు. ఆయా చోట్ల కవిత మీడియాతో మాట్లాడారు. మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలకు కోపం వచ్చి కొందరు నిరసన వ్యక్తం చేశారని, అంతమాత్రానికే ల్పులు జరిపి చంపేస్తారా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డి స్పందించి వెంటనే మల్లన్నపై చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆయనతో అలా మాట్లాడించింది ప్రభుత్వమే అని భావించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. కాల్పులపై దర్యాప్తు చేయాలని డీజీపీని కోరినట్లు చెప్పారు. తాను మామూలు ఆడబిడ్డను కాదు.. అగ్గిరవ్వను అని వ్యాఖ్యానించారు. మల్లన్న వ్యాఖ్యలపై ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించకపోవడం ఏంటని ప్రశ్నించారు. గత రెండేళ్లుగా బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నట్లు చెప్పారు. తన పోరాటం ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చిందని కవిత అన్నారు. తనను అగౌరవ పరిచిన తీన్మార్ మల్లన్నపై బీఎన్ఎస్ 74,79 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని అదనపు ఐజీ రమణకుమార్కు వినతి పత్రం అందజేసినట్లు చెప్పారు. మల్లన్న బీసీ బిడ్డ కాబట్టి ఏది పడితే అది మాట్లాడతానంటే చెల్లదని స్పష్టంచేశారు.కవిత ఇంటి వద్ద భారీ బందోబస్తుతీన్మార్ మల్లన్న క్యూన్యూస్ కార్యాలయంపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేసిన నేపథ్యంలో బంజారాహిల్స్ రోడ్డు నంబర్–14లోని కల్వకుంట్ల కవిత ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆమె ఇంటికి వెళ్లే మార్గాల్లో వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. సుమారు 50 మంది పోలీసులతో నాలుగు చోట్ల పికెటింగ్లు ఏర్పాటుచేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. -
తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై కవిత ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న)పై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికు ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు చేశారు. వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అనంతరం జూబ్లీహిల్స్లోని గుత్తా నివాసంలొ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో ఆడబిడ్డలంటే ఎంతో గౌరవం ఉంటుందన్నారు. బీసీ బిడ్డల్లో గౌరవించే అవకాశం మెండుగా ఉంటుందన్న కవిత.. రాజకీయాల్లో మహిళలపై పురుష పదజాలం వాడడంతో రాజకీయాల్లోకి మహిళలు రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు.‘‘తెలంగాణ జాగృతి విషయంలో బీసీ రిజర్వేషన్ల అమలుకై పోరాటం చేస్తూనే ఉన్నాం. మీరు బీసీ బిడ్డా కాబట్టి ఏదీ పడితే అదీ మాట్లాడితే సరికాదు. తీన్మార్ మల్లన్న మీరు మాట్లాడిన మాటలకు మావాళ్ళకు కోపం వచ్చి నిరసన చేశారు. ఇంత మాత్రనికే గన్ఫైర్ చేసి చంపేస్తారా!??. ఒక ఆడబిడ్డ ప్రశ్నిస్తే సహించలేకపోతున్నారా !?. నేను ఊరుకునే ప్రసక్తే లేదు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలి. లేదంటే మీరు వెనకనుండి మాట్లాడించారని భావించాల్సి ఉంటుంది. వెంటనే చర్యలు తీసుకోవాలి’’ అని కవిత డిమాండ్ చేశారు.‘‘ఇప్పుడు సెషన్స్ లేవు కాబట్టి.. మీరు ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేయాలని ఛైర్మన్ సూచించారు. వెంటనే తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీ సభ్యత్వం నుండి సస్పెండ్ చేయాలి. 24 గంటలు గడిచిన ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం విడ్డూరం. ఎమ్మెల్సీ మహిళా నేతపై చేసిన వ్యాఖ్యలను పట్టించుకోకపోతే.. మిగతా సాధారణ మహిళల పరిస్థితి ఏంటీ? సీఎం, డీజీపీకీ రిక్వెస్ట్ చేస్తున్నా.. ఫైరింగ్ మీద పూర్తి ఎంక్వైరీ చేయాలి. గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు మహిళా జర్నలిస్టులను అరెస్టు చేశారు. తీన్మార్ మల్లన్న ఎవరు అసలు.. నన్నెందుకు అడ్డుకుంటాననీ అరుస్తూ గోలా గోలా చేస్తున్నాడు’’ అంటూ కవిత వ్యాఖ్యానించారు.కాగా, ఇవాళ ఉదయం(ఆదివారం) తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేసిన ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కాగా, 3.30 గంటలకు డీజీపీని కలిసి కవిత ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. మేడిపల్లిలోని తీన్మార్ మల్లన్న ఆఫీస్లో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. దీంతో మల్లన్న గన్మెన్ గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు.మలన్న కార్యాలయానికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని అదుపు చేశారు. ఇరువర్గాలను ఆఫీస్ నుంచి పంపించివేశారు. కవిత చేపట్టిన బీసీ ఉద్యమాన్ని తప్పుబడుతూ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై జాగృతి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిపై స్పందించిన మల్లన్న తనపై కవిత అనుచరులు హత్యాయత్నం చేశారంటూ ఆరోపించారు. హత్యాయత్నాన్ని ఆపేందుకు తన గన్ మెన్ గాల్లోకి కాల్పులు జరిపారన్నారు. -
మల్లన్నపై దాడి.. కొత్త పార్టీ ప్రకటనతో రాజకీయ వేడి
సాక్షి,హైదరాబాద్:తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కొత్త పార్టీని స్థాపించనున్నట్లు ప్రకటించారు. బీసీలను ఏకం చేస్తూ ఈ పార్టీ భవిష్యత్ కార్యచరణ ఉంటుందని ప్రకటించడం పొలిటికల్ హీట్ను మరింత పెంచింది.తీన్మార్ మల్లన్న కార్యాలయంలో కాల్పులుబీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేపట్టిన బీసీ ఉద్యమాన్ని తప్పుబడుతూ మల్లన్న పలు వ్యాఖ్యలు చేశారు. మల్లన్న చేసిన వ్యాఖ్యలపై జాగృతి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిపల్లిలోని ఆయన ఆఫీస్పై దాడి చేశారు. అయితే, దాడితో అప్రమత్తమైన తీన్మార్ మల్లన్న గన్మెన్లు గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు.తెలంగాణ మరో కొత్త రాజకీయ పార్టీ జాగృతి కార్యకర్తల దాడిపై తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడారు. నాపై హత్యాయత్నం జరిగింది. నన్ను కాపాడేందుకు గన్ మెన్ ఫైర్ చేశారు. దాడి నాపై చేసి.. కవిత డీజీపీకి ఫిర్యాదు చేయడం సిగ్గు చేటు. పక్కా ప్లాన్ ప్రకారం దాడి చేశారు. దాడికి ఉసిగొల్పిన కవిత శాసన మండలి సభ్యత్వం రద్దు చేయాలి. త్వరలో రాజకీయ పార్టీ పెడతా.. బీసీలను ఏకం చేస్తానని తెలిపారు. గతంలో తెలంగాణ నిర్మాణ పార్టీ’ 2023లో తీన్మార్ మల్లన్న ఓ కేసులో భాగంగా చర్లపల్లి జైలులో శిక్షను అనుభవించారు. చర్లపల్లి జైలు నుంచి విడుదల అనంతరం ‘తెలంగాణ నిర్మాణ పార్టీ’ పేరుతో రాజకీయపార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో (2024) మేడ్చల్ అసెంబ్లీ స్థానం నుంచి తన పార్టీ తరఫున పోటీ చేస్తానని తెలిపారు.అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు ప్రజల మనోభావాలు గౌరవించేందుకు కాదని, మహారాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశం కోసమేనని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేది యువతేనని..రైట్ రీ కాల్ తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఇప్పుడు మరోసారి తీన్మార్ మల్లన్న తాను కొత్త రాజకీయ పార్టీని పెట్టనున్నట్లు ప్రకటించడం గమనార్హం. -
తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ చింతపండు నవీన్(తీన్మార్ మల్లన్న) కార్యాలయంపై దాడి జరిగింది. మేడిపల్లిలోని ఆయన ఆఫీస్పై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కార్యకర్తలు దాడి చేశారు. ఆఫీస్లో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. దీంతో మల్లన్న గన్మెన్ గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు.మలన్న కార్యాలయానికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని అదుపు చేశారు. ఇరువర్గాలను ఆఫీస్ నుంచి పంపించివేశారు. కవిత చేపట్టిన బీసీ ఉద్యమాన్ని తప్పుబడుతూ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై జాగృతి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిపై స్పందించిన మల్లన్న తనపై కవిత అనుచరులు హత్యాయత్నం చేశారంటూ ఆరోపించారు. హత్యాయత్నాన్ని ఆపేందుకు తన గన్ మెన్ గాల్లోకి కాల్పులు జరిపారన్నారు.