breaking news
-
మజ్లిస్కు రేవంత్ జీహుజూర్
గోల్కొండ: రాష్ట్రంలో మజ్లిస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గులామ్గా మారి జీహుజూర్ అంటున్నారని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా షేక్పేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసీటు కూడా గెలుచుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీ.. పరువు కాపాడుకునేందుకు జూబ్లీహిల్స్లో విజయం సాధించడానికి మజ్లిస్ పార్టీకి గులామ్గా మారిందని ఆరోపించారు.మజ్లిస్ పార్టీ అడిగినవాటినల్లా మంజూరు చేస్తూ మైనార్టీ ఓట్లను పొందడానికి సీఎం రేవంత్రెడ్డి ఎంతకైనా తెగిస్తున్నారని మండిపడ్డారు. మజ్లిస్ పార్టీ తరఫున గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తిని అద్దెకు తెచ్చుకొని ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా మార్చారని ఎద్దేవా చేశారు. మైనార్టీలను ప్రసన్నం చేసుకోవడానికి అన్ని హద్దులూ దాటి హడావుడిగా అజహరుద్దీన్కు మంత్రి పదవి కట్టబెట్టారని విమర్శించారు. ఇది ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడమే అని ఆరోపించారు. మజ్లిస్ పార్టీ ఒత్తిళ్లకు లొంగి విలువైన ఆర్మీ స్థలాలను ముస్లిం స్మశానవాటికలకు కేటాయిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పథకాలకు నిధులు కేంద్రానివే.. రాష్ట్రంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నిటికి కేంద్ర ప్రభుత్వ నిధులే అందుతున్నాయని కిషన్రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రేషన్ బియ్యానికి సైతం కేంద్ర ప్రభుత్వ నిధులే ఆధారమని పేర్కొన్నారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధి మొత్తం ప్రధాని నరేంద్రమోదీ కృషి వల్లేనని తెలిపారు. రాష్ట్రంలో రైతంగానికి అందుతున్న ఆర్థిక సహాయం కూడా కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు.గత రెండేళ్ల రేవంత్ పాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. తనకు తాను సెక్యులర్ వాదిగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ.. ప్రజలను వర్గాలుగా విభజించి పాలిస్తోందని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్రెడ్డిని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. -
పేదలకో న్యాయం.. పెద్దలకో న్యాయమా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘హైదరాబాద్లో హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు ఎంతో మంది బాధితులుగా మారారు. ఈ రెండేళ్లలో రేవంత్రెడ్డి సర్కారు ఒక్క ఇటుక పెట్టలేదు.. ఒక్క కొత్త కట్టడం లేదు. రేవంత్రెడ్డి చేసింది ఏంటి అంటే.. కూలగొట్టడమే’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మరో 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం తిరిగి రానుందని, అప్పుడు బాధితులందరికీ న్యాయం చేస్తామని తెలిపారు. తెలంగాణ భవన్లో ఆదివారం హైడ్రా బాధితులతో కలిసి నిర్వహించిన కార్యక్రమంలో ఆయన.. హైడ్రా కూల్చివేతలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘హైడ్రా అరాచకాలు: పెద్దలకు న్యాయం, పేదలకు అన్యాయం’పేరుతో ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పాలనలో పెద్దలకు ఒక న్యాయం, పేదలకు మరో న్యాయం లభిస్తోందని దుయ్యబట్టారు. చాంద్రాయణగుట్టలో స్కూళ్లు కూడా కూల్చివేసిన ప్రభుత్వం, గర్భిణులను పక్కకు తోసేసి, మూడేళ్ల చిన్నారులు భోజనం లేకుండా ఏడ్చేలా చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఒక ఇంటì గృహప్రవేశం చేసి వారం రోజులు కాలేదు.. బుల్డోజర్ వచ్చి కూల్చేసింది. ఇది మానవత్వం లేని చర్య‘అని ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రా బాధితుల బాధ అందరికీ అర్థమవ్వాలని అన్నారు. గత రెండేళ్లలో రేవంత్ రెడ్డి చేసింది కేవలం కూల్చివేతలే‘అని విమర్శించారు.వాళ్ల దగ్గరకు హైడ్రా వెళ్లగలదా?ప్రభుత్వానికి అందరూ సమానమైతే అక్రమంగా ఇళ్లు నిర్మించుకొని ఉంటున్న పెద్దవాళ్ల జోలికి ఎందుకు వెళ్లటంలేదని కేటీఆర్ ప్రశ్నించారు. ‘పెద్దపెద్ద బిల్డర్ల జోలికి ఎందుకు వెళ్లలేదు? పేదలకు న్యాయం చేయాలనుకుంటే.. ఫైవ్ స్టార్ హోటళ్లలో సమావేశాలు ఎందుకు పెడుతున్నట్టు? పేదల ఇళ్లు కూలగొట్టలేదని హైడ్రా కమిషనర్ చెబుతున్నారు. పేపర్లు, కోర్టు తీర్పులు ఉన్నా కూడా.. ఆలస్యం చేస్తే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటారని అంటున్నారు. ఇలా చేస్తే ఇక ప్రజాస్వామ్యం ఎందుకు? కోర్టులు ఎందుకు? ఎఫ్టీఎల్లో ఇళ్లు కడితే ఎవరినీ వదలం అని చెప్పి పెద్దలను వదిలేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెరువును పూడ్చి ఇల్లు కట్టారు. మరో మంత్రి వివేక్ కూడా హిమాయత్ సాగర్ చెరువు వద్ద ఇల్లు కట్టుకున్నారు. సీఎం రేవంత్రెడ్డి అన్న తిరుపతిరెడ్డి దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఇల్లు కట్టుకున్నారు. సున్నం చెరువులో ఇల్లు కట్టుకున్న పేదలది తప్పు.. దుర్గం చెరువులో కట్టిన తిరుపతిరెడ్డిది ఒప్పా? ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి చెరువు మధ్యలోనే ఇల్లు కట్టుకున్నారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెరువులోనే ఇల్లు కట్టుకున్నారు. వాళ్ల దగ్గరకు వెళ్లి నోటీసులు ఇచ్చే దమ్ము హైడ్రా అధికారులకు ఉందా? శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ.. గాజులరామారంలో 11 ఎకరాల ఆక్రమణకు ప్రభుత్వమే అండగా ఉంది. పేదలను వెళ్లగొట్టి గాంధీకి మాత్రం అండగా నిలిచారు. మూసీ నదిలో అడ్డంగా కట్టిన బిల్డింగ్ను కూడా ఇప్పటివరకు ఆపలేదు. మంత్రులు, పెద్దపెద్ద నాయకులకు ప్రభుత్వం అండగా ఉంటుంది..పేదలపైకి బుల్డోజర్లు పంపుతుంది. అందుకే మేం హైడ్రాను వ్యతిరేకిస్తున్నాం’అని కేటీఆర్ స్పష్టంచేశారు. రాహూల్ మాటలేమయ్యాయి?‘బుల్డోజర్ నా శరీరంపై నుంచి వెళ్లాలని యూపీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. అదే బుల్డోజర్ తెలంగాణలో ఇళ్లను కూలగొడుతుంటే రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారు? కొండాపూర్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న కొందరికి ప్లాట్లు ఇచ్చారు. వారిని కూడా హైడ్రా వెళ్లగొట్టింది. ఆర్మీ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూలగొట్టడం తప్పు అని, తెలియక తప్పు జరిగితే సరిదిద్దాలని చెప్పారు. ఇప్పుడు ఎందుకు కూలగొడుతున్నారు?’అని కేటీఆర్ ప్రశ్నించారు. -
జూబ్లీహిల్స్ 'డూ ఆర్ డై'
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఆషామాషీగా తీసుకోవద్దని మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. ఈ ఎన్నిక ఫలితంతో తనతోపాటు మంత్రులందరి భవిష్యత్తు ముడిపడి ఉందని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఉప ఎన్నిక ఫలితం సానుకూలంగా వస్తుందనే ధీమాతో ఉండొద్దని, మంత్రులు ఈ ఎన్నికను చాలా సీరియస్గా తీసుకోవాలని ఆదేశించినట్టు సమాచారం. ఆదివారం మధ్యాహ్నం తన క్యాంపు కార్యాలయం సమీపంలో ఆయన కేబినెట్ సహచరులకు లంచ్ ఏర్పాటు చేశారు. అంతకుముందు దాదాపు గంటన్నరకు పైగా అక్కడే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార సరళిని ఆయన సమీక్షించారు. ఈ సమీక్షలో సీఎం మాట్లాడుతూ.. ఉప ఎన్నికలో గెలవాల్సిన ఆవశ్యకతను మంత్రులకు వివరించారు. జూబ్లీహిల్స్ ఎన్నిక జరుగుతున్న తీరును అధిష్టానం కూలంకషంగా పరిశీలిస్తోందని, డివిజన్లవారీగా బాధ్యతలు తీసుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్ల పనితీరు గురించి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటోందని చెప్పారు. డివిజన్లు, బస్తీలతో సహా బూత్ స్థాయిలో ప్రచార మేనేజ్మెంట్ పకడ్బందీగా జరగాలని, ఈ వారం రోజులపాటు ప్రతి మంత్రి ఉప ఎన్నికను సీరియస్గా తీసుకుని పనిచేయాలని సూచించారు. ‘ఈ ఎన్నికల్లో ఓడినా, గెలిచినా సీఎంగా నా ఒక్కడిపైనే ప్రభావం ఉండదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజల్లో ఓ ఇమేజ్ కల్పిస్తుంది. ఈ ఎన్నికలో సానుకూల ఫలితం రాకపోతే నాతోపాటు వ్యవస్థకు నష్టం చేస్తుంది. డూ ఆర్ డై తరహాలో ఈ ఎన్నికను తీసుకోవాలి. తూతూమంత్రపు వ్యవహారాలకు స్వస్తి చెప్పి మీ సొంత ఎన్నికలా తీసుకుని పనిచేయండి. మంచి మెజార్టీతో ఈ ఎన్నికలో గెలవాలి’అని దిశానిర్దేశం చేశారు. కౌంటర్లు ఇవ్వకపోతే ఎలా? ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టండంలో, సోషల్ మీడియా ప్రచారంలో ఆశించిన మేర మంత్రులు పనిచేయడం లేదని సీఎం రేవంత్రెడ్డి అసహనం వ్యక్తంచేసినట్టు తెలిసింది. బీఆర్ఎస్ పదేళ్లలో చేసిన విధ్వంసాన్ని అధిగమిస్తూ రాష్ట్ర ప్రజలకు అవసరమైన అన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని, హైదరాబాద్ నగరంలో గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ఈ విషయాలను జూబ్లీహిల్స్ ఓటర్లకు వివరంగా చెప్పాలని మంత్రులకు సూచించారు. బీఆర్ఎస్, బీజేపీ విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని ఆదేశించారు. సోషల్మీడియాలో బీఆర్ఎస్ చేస్తున్న దు్రష్పచారాన్ని తిప్పికొట్టేందుకు స్వయంగా మంత్రులే సోషల్ మీడియాను పర్యవేక్షించాలని, ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వారియర్లను అప్రమత్తం చేయాలని కోరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న ఆరోపణలను వెంటనే తిప్పికొట్టేలా ప్రణాళిక రూపొందించుకోవాలని, సెంటిమెంట్ను ఉపయోగించుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్ ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథం, పీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్కుమార్గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామితోపాటు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
పేదలకో న్యాయం.. పెద్దలకు మరో న్యాయమా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: హైడ్రా అరాచకాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రేవంత్ సర్కార్ ఒక్క కొత్త నిర్మాణం చేపట్టలేదని కేటీఆర్ మండిపడ్డారు. ఎఫ్టీఎల్ పరిధిలో మంత్రి వివేక్, రేవంత్ సోదరుడి ఇల్లు ఉంది. పట్నం మహేందర్ గెస్ట్హౌస్ చెరువు మధ్యలో ఉంది. పేదలకు ఒక న్యాయం.. పెద్దలకు మరో న్యాయమా?’’ అంటూ కేటీఆర్ నిలదీశారు.‘‘కేసీఆర్ హయాంలో హైదరాబాద్లో ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు నిర్మించాం. కొత్త జిల్లాలు ఏర్పాటు, ఫ్లోరైడ్ మహమ్మారిని తరిమేశాం. రేవంత్ సర్కార్ కొత్తగా ఒక్క నిర్మాణం చేపట్టలేదు. 500 రోజుల్లో కేసీఆర్ తిరిగి అధికారంలోకి వస్తారు. హైడ్రా బాధితులను ఆదుకుంటాం. హైడ్రా పై భట్టి విక్రమార్క పీపీటీ పేరుతో 15 బిల్డర్ల పేర్లు చెప్పారు.. కానీ ఇప్పటి వరకూ ఒక్కరిపై యాక్షన్ ఎందుకు తీసుకోలేదు?. హైడ్రా చేసేది మంచే అయితే భట్టి చెప్పిన వారిపై చర్యలు ఎందుకు లేవు?. ఎఫ్టీఎల్ పరిధిలో కూల్చివేస్తామన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్కి పొంగులేటి ఇంటిని కూల్చే ధైర్యం ఉందా?’’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.‘‘మంత్రి వివేక్ ఇల్లు, రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు ఎఫ్టీఎల్లో ఉంది. పట్నం మహేందర్ రెడ్డి గెస్ట్ హౌస్ చెరువు మధ్యలో ఉంది. శాసన మండల చైర్మన్ సుఖేందర్రెడ్డి ఇల్లు చెరువు పక్కనే ఉంది. వీరిపై చర్యలు ఉండవు కానీ సున్నం చెరువు వద్ద పేదల చెరువు మాత్రం వెంటనే కూల్చి వేస్తారు. గాజుల రామారం వద్ద బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ భూమిని అలానే ఉంచారు. పేదల ఇల్లు మాత్రం కూల్చారు. మా పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరారు కాబట్టి ఆయన భూమిపై ఎలాంటి చర్యలు లేవా?. సీఎం ఒత్తిడితో అధికారులు అక్కడ ఉండే ఆయన భూమికి ఫెన్సింగ్ వేశారు...మూసిలో అడ్డంగా కట్టిన ప్రాజెక్టును మంత్రులు అధికారులు ఎందుకు కూల్చలేదు. యూపీలో బుల్డోజర్ వస్తే అడ్డుకుంటా అన్న రాహుల్ గాంధీ తెలంగాణలో బుల్డోజర్ పేదల ఇల్లు కూలుస్తుంటే ఎందుకు మాట్లాడరు. పదేళ్లు కేసీఆర్ అధికారంలో ఉండగా పేదలకు న్యాయమే చేశాం తప్ప ఎవరికీ అన్యాయం చేయలేదు. హైడ్రా కూల్చివేతలపై బాధితులు మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. నోటీసులు లేకుండా తమ ఇళ్ళను కూల్చివేశారు. సామాన్లు సైతం తీసుకోకుండా కూల్చివేయడంతో బాధితులు రోడ్డున పడ్డారు’’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బీఆర్ఎస్ ఆఫీసుపై దాడి.. కేటీఆర్ సంచలన హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: భద్రాచలంలోని మణుగూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి, ధ్వంసంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గూండాల రాజ్యం, రౌడీయిజం పెరిగిపోయింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.మణుగూరు ఘటనపై కేటీఆర్ మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పాలనలో రౌడీయిజం పెరిగిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం నలుమూలలా, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర రాజధాని దాకా ప్రతి చోటా రౌడీల రాజ్యం నడుస్తోంది. అరాచకత్వం కొనసాగుతోంది. దీనికి చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉంది’ అని హెచ్చరించారు. మరోవైపు.. పార్టీ ఆఫీసు దాడి ఘటనను వ్యతిరేకిస్తూ మణుగూరు అంబేద్కర్ సెంటర్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసనలకు దిగారు. ఆందోళన కార్యకర్తలు చేపట్టారు.ఇక, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని బీఆర్ఎస్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడి కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఫర్నిచర్కు నిప్పు పెట్టడంతో పాటు ఆవరణలో ఫ్లెక్సీలు చింపేశారు. ప్రభుత్వ స్థలంలో భారత రాష్ట్ర సమితి కార్యాలయం నిర్మించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. పార్టీ ఆఫీసుపై బీఆర్ఎస్ జెండాను తొలగించి కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు. దీంతో, పట్టణంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కాంగ్రెస్ గుండాగిరి ?బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ అల్లరి మూకల దాడిభద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు బీఆర్ఎస్ కార్యాలయంలో జెండా గద్దెను ధ్వంసం చేసి, కార్యాలయ భవనం మీద దాడి చేసిన కాంగ్రెస్ pic.twitter.com/vPW8AXh45D— Pavani Goud BRS (@PAVANIGOUD_BRS) November 2, 2025 -
రేసు మొదలైంది: ముగ్గురు నేతలు, ఒక విజేత!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ‘జూబ్లీహిల్స్’ ఉప ఎన్నిక ప్రధాన రాజకీయ పక్షాలకు అగ్ని పరీక్షగా మారింది. అధికార కాంగ్రెస్తో పాటు ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు గెలుపు కోసం అవసరమయ్యే అన్ని అ్రస్తాలను ప్రయోగిస్తూ సర్వశక్తులొడ్డుతున్నాయి. అధికార కాంగ్రెస్ అభివృద్ధి మంత్రం, బీసీ కార్డు, సినీ కార్మికుల సంక్షేమం, మైనారిటీ వర్గానికి మంత్రి పదవి ఇవ్వడం వంటివి కాగా.. బీఆర్ఎస్ సానుభూతి, మూడు పర్యాయాలుగా ప్రాతినిధ్యం, ప్రభుత్వ వైఫల్యాలు, ఆరు గ్యారంటీల బాకీ కార్డు, ప్రత్యర్థుల కుటుంబ నేపథ్యం తమకు కలిసి వచ్చే అంశాలుగా భావిస్తోంది. బీజేపీ హిందూత్వ ఎజెండా, ప్రభుత్వ వైఫల్యాలను ప్రధాన ప్రచారాస్త్రాలుగా మల్చుకుంటోంది. మూడు పక్షాలూ హేమాహేమీలను ఎన్నికల ప్రచారంలో దింపడంతో మాటల తూటాలు రాజకీయ అగ్గి రాజేస్తున్నాయి. ఆయా పారీ్టల గెలుపోటములపై బలాలతో పాటు బలహీనతలు ప్రభావం చూపనున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్కు అనుకూల అంశాలు రాష్ట్రంలో అధికారంలో ఉండటం, కేవలం రెండు నెలల్లో రూ.150 కోట్లకుపైగా విలువైన అభివృద్ధి పనులు, రాష్ట్ర మంత్రి వర్గంలో మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన అజహరుద్దీన్కు మంత్రివర్గంలో అవకాశం కల్పించడం, పార్టీ అభ్యరిత్వం ఎంపికలో బీసీ కార్డు ప్రయోగం. ఎన్నికల బరిలో దిగిన యువనేత నవీన్ యాదవ్కు వ్యక్తిగత పరిచయాలు, మజ్లిస్, వాపపక్షాలు, టీజేసీ, సినీ కారి్మకులు, బీసీ సంఘాల మద్దతు, సీఎంతో పాటు ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు ఫోకస్ పెట్టడం. గత 12 ఏళ్లుగా సిట్టింగ్ ఎమ్మెల్యే వైఫల్యాలు. ప్రతికూల అంశాలు: నియోజకవర్గంలో సంస్థాగత పట్టుతో పాటు స్థానిక ప్రాతినిధ్యం లేకపోవడం, పార్టీలలోని కొత్త, పాత కేడర్లో అంతర్గత కుమ్ములాటలు, కొరవడిన సమన్వయం, నవీన్ యాదవ్ కుటుంబ నేపథ్యం, దివంగత మాగంటి గోపీనాథ్ మూడు పర్యాయాల పాటు ప్రాతినిధ్యం వహించడం. బీఆర్ఎస్కు గట్టి కేడర్, గడిచిన రెండేళ్లలో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రత్యర్థుల ప్రచారం తదితర అంశాలు ప్రభావం చూపనున్నాయి. బీఆర్ఎస్కు కలిసొచ్చే అంశాలు.. సానుభూతి గత మూడు పర్యాయాల పాటు ప్రాతినిధ్యం, సంస్థాగతంగా గట్టి ఓటు బ్యాంక్, స్థానిక ప్రాతినిధ్యం, ముస్లిం మైనారిటీల్లో పట్టున్న సోషల్ వర్కర్ పారీ్టలో చేరడం, ఎన్నికల ప్రచార భారాన్ని మొత్తాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన భుజస్కంధాలపై వేసుకోవడం, గత రెండేళ్లలో ప్రభుత్వ వైఫల్యాలు, ఆరు గ్యారంటీల బాకీ కార్డు. ప్రతికూల అంశాలు: అధికారంలో లేకపోవడం, పలువురు ముఖ్య నేతలు, కార్పొరేటర్లు పార్టీ ఫిరాయించడం, అధికారంలో ఉన్నప్పుడు మిత్రపక్షమైన మజ్లిస్ కాంగ్రెస్ పంచన చేరడం. తాజాగా అధికార కాంగ్రెస్ అభివృద్ధి మంత్రం, ప్రత్యర్థి యువకుడు కావడంతో పాటు వ్యక్తిగత పరిచయాలు అధికంగా ఉండటం.కమలం పార్టీకి అనుకూల అంశాలు హిందూత్వ ఎజెండా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్మిషా. కేంద్రంలో అధికారంలో ఉండటం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మాజీ మజ్లిస్ నేత కావడం, మజ్లిస్ బేషరతుగా మద్దతు ఇవ్వడం, టీడీపీ, జనసేన పారీ్టల మద్దతు. అభ్యర్థి దీపక్ రెడ్డికి విరివిగా వ్యక్తిగత పరిచయాలు ఉండటం ప్రతికూల అంశాలు: సంస్థాగతంగా బలహీనంగా ఉండటం. స్థానిక ప్రాతినిధ్యం లేకపోవడం. బీజేపీ పోటీ చేయడం రెండోసారి కావడం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 14% ఓట్లు లభించడం. కాంగ్రెస్, బీఆర్ఎస్లతో పోలిస్తే పారీ్టకి బలమైన కేడర్ నెట్వర్క్ లేకపోవడం. -
మణుగూరులో ఉద్రిక్తత
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: మణుగూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కార్యాలయాన్ని ముట్టడించిన కాంగ్రెస్ నేతలు.. ఫర్నిచర్ను తగలబెట్టారు. మంటలను ఫైర్ సిబ్బంది, పోలీసులు అదుపు చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన రేగా కాంతారావు.. కాంగ్రెస్ కార్యాలయాన్ని బీఆర్ఎస్ కార్యాలయంగా మార్చారంటూ కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాంగ్రెస్ కార్యాలయాన్ని ఆక్రమించి బీఆర్ఎస్ కార్యాలయంగా మార్చుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.. ఇప్పుడు ఆ కార్యాలయాన్ని స్వాధీన పరుచుకునేందుకు ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ ఆఫీస్పై కాంగ్రెస్ జెండా ఎగురవేశారు. -
మజ్లిస్ ముందు మోకరిల్లుతున్నాయ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, బీఆర్ఎస్లు మజ్లిస్కు మోకరిల్లుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన ఇంటింటి ప్రచారంలో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఇప్పుడు మజ్లిస్ కనుసన్నల్లో ఉందని.. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు మజ్లిస్ ఓటు బ్యాంకే ముఖ్యంగా మారిందని దుయ్యబట్టారు. ఈ పరిస్థితుల నుంచి జూబ్లీహిల్స్ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కేవలం ఒక్క నియోజకవర్గానికే పరిమితమైంది కాదని.. మొత్తం రాష్ట్రాన్ని ప్రభావితం చేసేలా కీలకంగా మారిందని చెప్పారు. మజ్లిస్ సానుభూతిపరుల ఓట్ల కోసమే సోనియా, రాహుల్గాం«దీలు అజహరుద్దీన్ను మంత్రి పదవి కట్టబెట్టారని కిషన్రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ అవకాశవాద రాజకీయాలపై కార్పెట్ బాంబింగ్ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల పేరిట, రేవంత్ సర్కార్ ఇందిరమ్మ ఇళ్ల పేరిట పేదలను దగా చేస్తున్నాయని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి సర్కార్ వాటి అమలులో మీనమేషాలు లెక్కిస్తోందని దుయ్యబట్టారు. రూ. 4 వేల నిరుద్యోగ భృతి, మహిళలకు రూ. 2,500, విద్యార్థినులకు స్కూటీలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, విద్యా భరోసా కార్డులు, వివాహమైతే తులం బంగారం వంటి పథకాలను అమలు చేయాలంటూ ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయాలని ప్రజలకు కిషన్రెడ్డి పిలుపునిచ్చారు.ప్రత్యేక తెలంగాణలో కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగాలు వచ్చాయని.. బంగారు తెలంగాణ అని చెప్పి కేసీఆర్ సొంత కుటుంబాన్నే బంగారం చేసుకున్నారని విమర్శించారు. డబుల్ బెడ్రూం పథకం కేవలం ప్రచారానికి వాడుకొని కేసీఆర్ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజలకు ఏం చేశాయని పార్టీలకు ప్రజలు ఓటు వేయాలని కిషన్రెడ్డి నిలదీశారు. పాకిస్తాన్ అంటే వాళ్లకు ప్రేమ శత్రు దేశమైన పాకిస్తాన్పై కాంగ్రెస్ పార్టీ గురు, శిష్యులకు ప్రేమ ఎక్కువని కిషన్రెడ్డి ఆరోపించారు. సర్జికల్ స్ట్రైక్స్, ఆపరేషన్ సిందూర్ను చులకన చేసి భారతీయ సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం కాంగ్రెస్ పార్టీకే చెల్లిందని ఎద్దేవా చేశారు. పాక్కు మద్దతుగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న బీజేపీకి ఓటు వేసి తమ పార్టీ అభ్యర్థి దీపక్రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. -
2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్/రహ్మత్నగర్: గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏటా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలిచ్చిందో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు డిమాండ్ చేశారు. మరో ఎన్నికల హామీ అయిన నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి రహ్మత్నగర్ డివిజన్లో నిర్వహించిన భారీ రోడ్షోలో కేటీఆర్ మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడిపోతున్నామనే నిరాశతో సీఎం నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్కు ఓట్లు వేయకుంటే అన్నీ రద్దుచేస్తామని ధమ్కీ ఇస్తున్నారని విమర్శించారు. ఎగిరెగిరి పడితే జూబ్లీహిల్స్ ప్రజలు పెట్టే వాతలకు ప్రభుత్వమే పతనమయ్యే రోజు వస్తుందని హెచ్చరించారు. ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలవాలని రేవంత్రెడ్డి ప్లాన్ వేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి కౌంట్డౌన్ మొదలైందని, 500 రోజుల్లో తిరిగి కేసీఆర్ సీఎం కాబోతున్నారని తెలిపారు. ‘గోపన్న లేడని, సునీతమ్మ ఆడబిడ్డ అని అనుకోవద్దు. ఆడబిడ్డ అంటే ఆదిశక్తి. రౌడీలు సతాయిస్తే ఎట్లా అని అనుకోవద్దు. జనతా గ్యారేజ్ వంటి బీఆర్ఎస్ భవన్ పక్కనే ఉంది. మీరు ఒక్క ఫోన్ కొడితే 40 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వస్తా. బీఆర్ఎస్ పార్టీ మొత్తం మీకు అండగా ఉంటుంది’అని భరోసా ఇచ్చారు. గోపీనాథ్ కాపాడిన శివమ్మ పాపిరెడ్డి హిల్స్ స్థలంలో పెద్ద స్టేడియం కట్టించి ఆయన పేరు పెడతామన్నారు. ఒక్క ఆడబిడ్డను ఓడించేందుకు సీఎం, మంత్రులు కాలికి బలపం కట్టుకొని గల్లీగల్లీ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీతో రేవంత్రెడ్డిది పేగుబంధం సీఎం రేవంత్రెడ్డికి కాంగ్రెస్తో ఉన్నది ఫేక్ బంధమైతే.. బీజేపీతో ఉన్నది పేగు బంధమని కేటీఆర్ ఆరోపించారు. బతికి ఉన్నప్పుడు ఆయన మామ జైపాల్రెడ్డిని బండబూతులు తిట్టిన రేవంత్రెడ్డి.. ఇప్పుడు కుటుంబ విలువల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సెటిల్మెంట్లు చేసే బ్లాక్మెయిలర్ సెంటిమెంట్ గురించి మాట్లాడితే ఏం చెప్పాలి? అని ప్రశ్నించారు. కరోనా సమయంలో రూపాయి ఆమ్దానీ లేకున్నా కేసీఆర్ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఆపలేదని, ఇప్పుడు సీఎంకు కనీసం గురుకుల పాఠశాలలు నడపడం తెలియట్లేదని ఎద్దేవా చేశారు. సీఎం ఎన్ని ఎత్తులు వేసినా బీఆర్ఎస్కు భారీ విజయం దక్కబోతోందని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు దేశపతి శ్రీనివాస్, మాగంటి సునీత, మహమూద్ అలీ, నిరంజన్ రెడ్డి, దాస్యం వినయ్భాస్కర్, విష్ణువర్ధన్రెడ్డి, బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు. కాగా, శనివారం తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ బీఆర్ఎస్లో చేశారు. ఆయనకు కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహా్వనించారు. -
ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలకు పెద్దపీట: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలకు పెద్దపీట వేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లలో రోడ్ షొ నిర్వహించి కార్నర్ మీటింగ్లలో ప్రజలనుద్దేశంచి ఆయన ప్రసంగించారు. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఐదేళ్లు మహిళా మంత్రి లేదని.. తాము అధికారంలోకి రాగానే సీతక్క, కొండా సురేఖలకు మంత్రి పదవులు ఇచ్చామని గుర్తుచేశారు. శిల్పారామం దగ్గర మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం స్టాల్స్ ఇచ్చామన్నారు. ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే దాన్ని రద్దు చేయాలని మాట్లాడటం బీఆర్ఎస్ బద్ధిని తెలియజేస్తోందని విమర్శించారు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెలిని ఇంటి నుంచి బయటకు పంపిన కేటీఆర్.. జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తున్న ఆ పార్టీ అభ్యర్థి సునీతమ్మను మంచిగా చూసుకుంటాడా అని ప్రశ్నించారు. ఇవన్నీ కేటీఆర్ చెల్లెలే బయటకు వచ్చి చెబుతోందన్నారు. సొంత చెల్లికి అన్నం పెట్టని వారు పిన్నమ్మ కూతురికి బంగారు గాజులు పెడతానంటే ప్రజలు నమ్ముతారా? అని ఎద్దేవా చేశారు. పదేళ్లు పట్టించుకోలేదేం? ఉపఎన్నికలో సెంటిమెంట్ రాజేయాలని బీఆర్ఎస్ చూస్తోందని.. పదేళ్లు అధికారంలో ఉన్నా, అదే పార్టీకి చెందిన వ్యక్తి ఎమ్మెల్యేగా పనిచేసినా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదో ప్రజలు ఆలోచించాలన్నారు. ఇప్పుడు తాడు బొంగరం లేకుండా అభివృద్ధి చేస్తామని ఓట్లు దండుకోవడానికి ఆ పార్టీ నేతలు ముందుకొస్తున్నారని దుయ్యబట్టారు. మాయమాటలు చెప్పే వాళ్లకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ను గెలిపించేందుకు బీజేపీ ప్రయత్నం పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ పనిచేసిందని.. అందుకు ప్రతిగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ను గెలిపించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. కేంద్రంలో ప్రతి సందర్భంలో మోదీ సర్కారుకు కేసీఆర్ మద్దతు పలికారని గుర్తుచేశారు. రాష్ట్రానికి నయా పైసా నిధులు తేలేని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కొత్తగా సమస్యలు ఉన్నట్లు మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్రెడ్డి.. దాని పరిధిలోకి వచ్చే జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానంలోని బోరబండకు వచ్చి సమస్యలు ఎందుకు పరిష్కరించలేదని సీఎం నిలదీశారు. ఆశీర్వదిస్తే రూ. వందల కోట్లతో అభివృద్ధి ‘బీఆర్ఎస్కు పదేళ్లు అవకాశం కల్పించినా అభివృద్ధి జరగలేదు. కాంగ్రెస్కు ఈసారి అవకాశం ఇవ్వండి. అభివృద్ధి చేసి చూపిస్తాం’ అని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. సాధారణ ఎన్నికల్లో అజహరుద్దీన్ను గెలిపిస్తే మంత్రిని చేస్తామని మాట ఇచ్చామని.. ఇచ్చిన మాట ప్రకారం ఆయన్ను మంత్రి పదవి ఇచ్చామని తెలిపారు. స్థానికుడైన నవీన్ యాదవ్ను ఆశీర్వదిస్తే రూ. వందల కోట్లతో ఈ ప్రాంతాన్ని అభివద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని రేవంత్ హామీ ఇచ్చారు. అందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే బాధ్యత నవీన్ తీసుకుంటాడన్నారు. రోడ్ షో కార్నర్ మీటింగ్లలో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. -
మాపై దుష్ప్రచారంలో బీజేపీ, బీఆర్ఎస్ పోటీ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మెజార్టీని పెంచుకునేందుకు కాంగ్రెస్ పని చేస్తుంటే... బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం మాపై తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు పోటీ పడుతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లారెడ్డిగూడలోని శాలివాహన నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో స్థానిక కాంగ్రెస్ నాయకులు శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తమ స్వార్ధ రాజకీయాల కోసం బీఆర్ఎస్, బీజేపీ అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. ఈ ఉప ఎన్నికల్లో లబ్ది పొందేందుకే ఇప్పుడు కొత్త డైవర్షన్ డ్రామాకు తెరదీశారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తమకు అనుకూలంగా వక్రీకరించుకొని మాపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. మా ప్రభుత్వం ప్రజలకు మంచి చేసే ఏ ఒక్క ప్రధాన సంక్షేమ పథకాన్ని రద్దు చేయలేదని, ఆపలేదన్నారు. అలాంటి ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి యుద్ధం చేసి గెలిచిన చక్రవర్తిలా ఫీల్ అవుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నేను రాజు కాదు అని ప్రజల సొమ్ముకు ధర్మకర్త మాత్రమే అని ఇప్పటికే ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారన్నారు. ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని, ఈ విషయంలో మా చిత్తశుద్ధిని శంకించే అర్హత బీఆర్ఎస్ కు గానీ బీజేపీకి గానీ లేదన్నారు. ఆరు గ్యారంటీలను దశలవారీగా అమలు చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఎవరికీ అన్యాయం జరగదని, జరగనివ్వమన్నారు. అక్రమ నిర్మాణాలు తొలగించే ముందు, పేదలకు పునరావాసం కల్పించాకే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంలో అధికారుల అత్యుత్సాహాన్ని సహించమన్నారు. ఇప్పటికైనా ప్రజల తీర్పును గౌరవించి, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలని కోరారు. ప్రతిపక్షాల జూటా మాటలు నమ్మి మోసపోవద్దని, తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలే అజెండాగా ముందుకెళ్తున్న ఈ ప్రజా ప్రభుత్వానికి అండగా ఉండాలని జూబ్లీహిల్స్ ఓటర్లకు మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ కు మద్దతు తెలిపిన మాదిగ దండోరా, తెలంగాణ మాదిగ హక్కుల దండోరా, టి.ఎం.ఆర్.పి.ఎస్, ఉస్మానియా యూనివర్సిటీ టీజీఆర్ఎస్ఏ తదితర 9 దళిత సంఘాల ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఏఐసీసీ ఇంచార్జ్ విశ్వనాథ్, ఎమ్మెల్యేలు విజయ రామరావు, మక్కన్ సింగ్ ఠాకూర్, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, మాజీ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. -
సీఎం రేవంత్ వ్యాఖ్యలపై సీఈవోకు బీజేపీ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై సీఈఓ సుదర్శన్ రెడ్డికి బీజేపీ ఫిర్యాదు చేసింది. మోడల్ కోడ్ ఉల్లంఘనపై సీఎంపై ఎస్ఈసీకి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదులో బీజేపీ పేర్కొంది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దేశ సైన్యాన్ని అవమానపర్చేవిధంగా ఉన్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. సైన్యంపై తప్పుడు, అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఎన్నికల నియమావళి ఉల్లంఘనగా పరిగణించాలంటూ విజ్ఞప్తి చేసింది. “దేశ భద్రతా బలగాల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా సీఎం వ్యాఖ్యలు ఉన్నాయని.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమైవని బీజేపీ మండిపడుతోంది. -
రియల్ ఎస్టేట్ నాశనం చేశారు.. ఎందుకు ఓటేయాలి?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయకపోగా.. రెండేళ్లలోనే రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన కాంగ్రెస్ తోక కత్తిరించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో శనివారం ఆయన మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ నాశనం చేశారు.. ఇందిరమ్మ రాజ్యం అంటూ పేదల ఇళ్లు కూలగొడుతున్నారు.. హైడ్రా, బుల్డోజర్ పేరుతో పేదలపై జులుం ప్రదర్శిస్తున్నారని ఫైరయ్యారు. భర్త చనిపోయి మాగంటి సునీత ఏడిస్తే.. దాన్ని కూడా డ్రామా అంటున్న కాంగ్రెస్కు మహిళలు గట్టిగా బుద్ధి చెప్పాలని కోరారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ను మళ్లీ తెచ్చుకోవాలంటే.. జూబ్లీహిల్స్ నుంచే జైత్రయాత్ర ప్రారంభం కావాలన్న కేటీఆర్.. ఈ నెల 11న కారు గుర్తుకు ఓటేసి మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఓటమి భయంతో రేవంత్ రెడ్డి ప్రజలను బెదిరిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రెండేళ్లలోనే రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటికొచ్చిన హామీలన్నీ ఇచ్చిన కాంగ్రెస్.. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు. ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని చెప్పి.. ఇప్పుడు ప్రజల మెడలో గొలుసులు కూడా లాక్కుంటోందని సెటైర్లు వేశారు. అటు.. ఫ్రీ బస్ పేరుతో భార్య డబ్బులను కూడా భర్త నుంచి వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి పదవి ఇచ్చిందే ప్రజలు.. అది మర్చిపోయి రాజులా ఫీలవుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రజల సొమ్ముకు ధర్మ కర్త అంతే అని.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు బుద్ధి చెబుతారని కేటీఆర్ హెచ్చరించారు. అన్ని సర్వేలు హాస్తం వైపే: ఉత్తమ్జూబ్లిహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అంతిమ విజయం కాంగ్రెస్ పార్టీదేనని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) దీమా వ్యక్తం చేశారు. అన్నీ సర్వేలు హస్తం వైపే వెలువడడమే ఇందుకు తార్కాణమని ఆయన పేర్కొన్నారు. ఇక్కడి నుండి బరిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు నల్లేరు మీద నడకేనని ఆయన తేల్చిచెప్పారు. జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉదయం నియోజకవర్గ పరిధిలోని యూసుఫ్ గూడ డివిజన్ కృష్ణానగర్లో సహచర మంత్రి పొన్నం ప్రభాకర్తో కలసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని నిరుపేదలు నిర్లక్ష్యానికి గురయ్యారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఒక్కటంటే ఒక్క తెల్ల రేషన్ కార్డు మంజూరు చేయలేక పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. కేవలం 20 నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన నిరుపేదలకు 89 లక్షల నుండి కోటి 15 లక్షలకు తెల్ల రేషన్ కార్డులు పెంచామన్నారు. ఇంత పెద్ద ఎత్తున నిరుపేదలకు తెల్ల రేషన్ కార్డులను మంజూరు చేసిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కిందన్నారు.ఈ కార్యక్రమంలో షాద్ నగర్ శాసనసభ్యులు ఇదూలపల్లి శంకరయ్య,కాంగ్రెస్ పార్టీ నేత అజారుద్దీన్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత ముదిరాజ, బొల్లు కిషన్ తదితరులు పాల్గొన్నారు.బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు: పొన్నంరాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటయ్యాయని ఆరోపించారు. ఆ రెండు పార్టీల కుట్రలను ఛేదించడానికి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఎన్ని నిధులు విడుదల చేశారని మంత్రి పొన్నం సూటిగా ప్రశ్నించారు.జూబీహిల్స్లో పొంగులేటి పాదయాత్ర రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి, రెహమత్ నగర్ డివిజన్ కాంగ్రెస్ ఇన్ఛార్జి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం జూబీహిల్స్ నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పీజేఆర్ తల్లితండ్రుల పేరు కలిగిన శివమ్మ, పాపిరెడ్డి హిల్స్లో మంత్రి పొంగులేటి కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్కు మద్దతుగా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రికి గజపూల మాల, నృత్యాలతో అక్కడి ప్రజలు స్వాగతం పలికారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వందమంది మైనార్టీ యువకులకు, మరో వంద మంది మహిళలకు కాంగ్రెస్ కండువాలు కప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుతిన్న బీఆర్ఎస్ నాయకులకు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఓటు అడిగే హక్కులేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకతాను ముక్కలే, గత పార్లమెంటు ఎన్నికల నుంచి వాటి మధ్య పొత్తు ఉందని అన్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు తధ్యమని అందువల్లే బీఆర్ఎస్ మాజీ మంత్రులు అక్కసుతో మాట్లాడుతున్నారని, ఆ మాజీ మంత్రులు భాష సంస్కరించుకోవాలని పొంగులేటి హితవు పలికారు.సీఎం రోడ్ షో.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులుజూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం 7 గంటలకు ఎర్రగడ్డ డివిజన్ లోని విజయ థియేటర్ నుంచి ప్రారంభమయ్యే రోడ్ షోలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ ఏర్పాట్లను పర్యవేక్షించారు.విజేత థియేటర్ నుంచి మోతీనగర్ ఎక్స్ రోడ్, డాన్ బోస్కో స్కూల్, జనప్రియ బ్యాక్ సైడ్ వరకు రోడ్ షో సాగుతుంది. జనప్రియ బ్యాక్ సైడ్ (బి శంకర్లాల్ నగర్)లో బహిరంగ సభ నిర్వహిస్తారు.టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు శ్రీ గణేష్, డా. ఆర్. భూపతి రెడ్డి, జి. మధుసూదన్ రెడ్డి, తుడి మేఘారెడ్డి, డా. రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్, డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, ఎనగల వెంకట్రామ్ రెడ్డి తదితరులు రోడ్ షోలో పాల్గొంటారు.రెండో రోజు సీఎం ప్రచారం ఇలా..⇒ రెండో రోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి⇒ ఇవాళ బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లలో ప్రచారంలో పాల్గొననున్న సీఎం⇒ సాయంత్రం 7 గంటలకు బోరబండ డివిజన్ లో కార్నర్ మీటింగ్లో పాల్గొననున్న సీఎం⇒ అనంతరం ఎర్రగడ్డ డివిజన్లోని సుల్తాన్ నగర్ హనుమాన్ టెంపుల్ నుంచి జనప్రియ వరకు రోడ్ షో⇒ జనప్రియ వద్ద కార్నర్ మీటింగ్లో ప్రసంగించనున్న సీఎం రేవంత్ రెడ్డికేటీఆర్ రోడ్ షోజూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈరోజు సాయంత్రం కేటీఆర్ (KTR) రోడ్ షో నిర్వహించనున్నారు. రెహమత్నగర్ డివిజన్ పరిధిలోని ప్రతిభ నగర్ ఇందిరాగాంధీ విగ్రహం వద్ద రోడ్ షో ప్రారంభమవుతుంది. శ్రీరామ్ నగర్ హోటల్ SD వద్ద ప్రసంగించి, రెహమత్నగర్ వద్ద ఉన్న పీజేఆర్ విగ్రహం వరకు కేటీఆర్ రోడ్ షో కొనసాగించనున్నారు. -
మైనార్టీ మంత్రి కాంగ్రెస్ను ఒడ్డున పడేస్తారా?
ప్రముఖ క్రికెటర్, మాజీ ఎంపీ అజహరుద్దీన్ తెలంగాణ కేబినెట్లో మంత్రి అయ్యారు. అభిమానులు, క్రికెట్ ప్రేమికులు సంతోషించాల్సిన వార్తే కానీ.. ఇంకో పది రోజుల్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఉన్న తరుణంలో అకస్మాత్తుగా ఈయన ఒక్కరినే మంత్రిని చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమవుతోంది. కాంగ్రెస్ పార్టీకి అంత అనుకూలంగా లేకపోవడం వల్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. సహజంగానే భారతీయ జనతా పార్టీ ఈ అంశంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అజహర్పై తీవ్రమైన అభియోగాలు మోపుతూ, మతపరంగా రాజకీయ లబ్ది పొందడానికి యత్నిస్తున్నారు. భారత రాష్ట్ర సమితి నేరుగా ఆరోపణలు చేయకుండా, రేవంత్ ఈ పదవి మైనార్టీలను మోసం చేయడానికి ఇచ్చారని, ఇది ఆరు నెలల పదవేనని వ్యాఖ్యానిస్తోంది. మైనార్టీ ఓటు బ్యాంకును ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఈ పని చేసిందన్నది బహిరంగ రహస్యమే. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనార్టీ ఓటర్ల సంఖ్య సుమారు లక్ష. పైగా రాష్ట్ర కేబినెట్లో మైనార్టీలెవరూ లేకపోవడంపై అసంతృప్తి ఉందని సీఎం రేవంత్కు నిఘా వర్గాల ద్వారా తెలిసిందట. అయితే.. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కు విరుద్ధంగా మంత్రి పదవి ఇవ్వడమేమిటని బీజేపీ ప్రశ్నించింది. అయితే రాజస్థాన్లో బీజేపీ కూడా ఉప ఎన్నికల సమయంలోనే ఒకరికి మంత్రి పదవి ఇచ్చిన విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పడంతో ఈ వాదన వీగిపోయినట్లయింది. బీజేపీ మైనార్టీల ప్రయోజనాలకు అడ్డుపడుతోందని, గవర్నర్పై కేంద్రం ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి అజహరుద్దీన్ ప్రమాణ స్వీకారం జరక్కుండా చూసే ప్రయత్నమూ చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. రాజస్థాన్ అనుభవం లేకపోతే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేసి ఉండేదేమో. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2023లోనే అధికారం చేపట్టినప్పటికీ మైనార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ లేకపోవడంతో కేబినెట్లో ఈ వర్గానికి ప్రాతినిథ్యం లేకుండా పోయింది. షబ్బీర్ అలీ వంటి సీనియర్ నేతలు మంత్రి పదవి ఆశించినా సలహాదారు పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అజహర్ను మంత్రిని చేయడం మైనార్టీ ప్రాతినిథ్యం కోసం కాదని, ఉప ఎన్నికల్లో పరిస్థితి అంత బాగాలేదన్న సమాచారంతోనేనని కొందరు విశ్లేషకుల అంచనా. కొన్ని రోజుల క్రితం సినీ కార్మికులు సీఎం రేవంత్ను సన్మానిస్తూ ఒక కార్యక్రమం నిర్వహించారు. ఇది కూడా పరోక్షంగా ఎన్నికల ప్రచార సభే. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ యాభై వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తారని చెబుతున్నా లోలోపలి అనుమానం కారణంగానే మైనార్టీ వర్గానికి చెందిన అజహర్ను మంత్రి చేశారని వీరు అంటున్నారు.ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం సాధారణంగా జరిగేదే కానీ.. ఓటమి ప్రభావం రాష్ట్రం మొత్తమ్మీద ఉండే అవకాశం ఉంది కాబట్టి కాంగ్రెస్ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోందని అంచనా. ఇప్పటివరకూ జరిగిన సర్వేల ప్రకారం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య హోరాహోరీ నడుస్తోంది. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో గట్టి పోటీ ఇస్తోంది. కొందరు మైనార్టీ నేతలను కూడా ఆకర్శించడం కూడా కాంగ్రెస్ దృష్టిని మీరిపోలేదు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతోందన్న విషయాన్ని కూడా కాంగ్రెస్ పరిగణలోకి తీసుకున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ తరఫున సీఎం సహా పలువురు మంత్రులు ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ పక్షాన కేటీఆర్, హరీష్ రావులు ప్రధాన బాధ్యత వహిస్తున్నారు. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంటు నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ కూడా ఒక సెగ్మెంట్. దీంతో ఈ ఉప ఎన్నిక ఆయనకు కూడా ఇది ప్రతిష్టాత్మకంగా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్లు మైనార్టీ ఓటర్లపై ఆశలు పెట్టుకున్నాయి. ఇంతకీ అజహర్ నియామకం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కు వ్యతిరేకమా? కాదా? ఏ రాజకీయ పార్టీ కూడా ఇలా వ్యవహరించరాదనే చెప్పాలి. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కిందకు రాకపోయినా, మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కిందకు వస్తుందని ఒక సీనియర్ అధికారి అభిప్రాయయపడ్డారు. అయితే ఈ కాలంలో రాజకీయ పార్టీల నుంచి నైతికత ఆశించడం అత్యాశే. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అజహర్పై దేశద్రోహంతోపాటు తీవ్రమైన కేసులున్నాయని వ్యాఖ్యానించారు. క్రికెట్లో ఒక వెలుగు వెలిగిన అజహర్కు ఆ తరువాత ఫిక్సింగ్ అభియోగాల మరకలూ అంటాయి. క్రికెట్కు దూరమయ్యారు. రాజకీయాలకు దగ్గరయ్యారు. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత రాజస్థాన్ నుంచి పోటీ చేశారు కానీ గెలవలేదు. అప్పటి నుంచి ఆయన తెలంగాణ రాజకీయాల్లోనే కొనసాగుతున్నారు. కాంగ్రెస్ ప్రముఖుడిగా, వర్కింగ్ అధ్యక్షుడిగా జూబ్లీహిల్స్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఉప ఎన్నికలోనూ బరిలోకి దిగాలని ఆశించినా టిక్కెట్ నవీన్ యాదవ్కు ఇవ్వాలన్న రేవంత్ నిర్ణయంతో అది జరగలేదు. అజహర్ అభ్యర్థిత్వాన్ని ఎంఐఎం కూడా వ్యతిరేకించిందని సమాచారం. కాంగ్రెస్ పార్టీ గవర్నర్ కోటా కింద అజహరుద్దీన్కు ఎమ్మెల్సీ పదవి కేటాయించింది కానీ.. దానికి ఇంతవరకు గవర్నర్ ఆమోద ముద్ర వేయలేదు. అంటే.. ఎమ్మెల్సీ కాకముందే అజహర్ నేరుగా మంత్రి అయ్యారన్నమాట. ఇంకో ఆరు నెలల్లోపు అజహర్ ఎమ్మెల్సీ కాలేకపోతే మంత్రి పదవి వదలుకోవల్సి ఉంటుంది. వాస్తవానికి మూడు నెలల క్రితమే అజహర్ను మంత్రిని చేయడంపై నిర్ణయం జరిగిందని మహేష్ గౌడ్ చెబుతున్న మాటలు నమ్మ శక్యంగా లేవు. ఎందుకంటే కొంత కాలం క్రితమే ఆయన అజహర్కు మంత్రి పదవి ఇస్తున్న సంగతి తనకు తెలియదని చెప్పారు. ఏతావాతా... అజహర్కు మంత్రి పదవి దక్కడం కాంగ్రెస్కు మేలు చేస్తుందా? లేదా? అన్నది ఇంకో పది రోజుల్లో తేలనుంది!కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కిషన్ రెడ్డి.. మీకేం తెలుసు: అజారుద్దీన్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం మరోసారి హీటెక్కింది. కాంగ్రెస్, బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి అజారుద్దీన్ కౌంటరిచ్చారు. దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన తనను దేశ ద్రోహి అంటూ వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.మంత్రి అజారుద్దీన్ తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘కిషన్ రెడ్డి.. మీరేం మాట్లాడుతున్నారు. నా గురించి మీకు ఏం తెలుసు. నేను హిందూ, ముస్లిం అన్ని వర్గాల వాడిని.. అందరివాడిని. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసమే బీజేపీ నన్ను టార్గెట్ చేసింది. దేశ గొప్పతనాన్ని చాటి చెప్పిన నేను దేశ ద్రోహినా?. నా దేశభక్తిపై ఎవరూ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో జూబ్లీహిల్స్ ఎన్నికలకు తన మంత్రి పదవికి సంబంధం లేదని తెలిపారు. తనను కేబినెట్లోకి తీసుకోవడం సీఎం రేవంత్ రెడ్డి, హైకమాండ్ నిర్ణయమని పేర్కొన్నారు. సీఎం ఏ శాఖలు ఇచ్చినా సంతోషమే.. నాకు ఇవి ఇవ్వాలని నేను అడగడం లేదు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేస్తానని తెలిపారు. ఏ శాఖ ఇచ్చినా న్యాయం చేస్తాననే నమ్మకం ఉందని అన్నారు.కిషన్రెడ్డి ఆరోపణలు.. ఇక, అంతకుముందు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. అజారుద్దీన్పై సంచలన ఆరోపణలు చేశారు. దేశ ద్రోహానికి పాల్పడి భారత్కు చెడ్డపేరు తెచ్చిన వ్యక్తి అజారుద్దీన్ అని విమర్శించారు. అలాంటి వ్యక్తికి కాంగ్రెస్ మంత్రి పదవి ఇవ్వడం ప్రజాస్వామ్యానికి అవమానమని వ్యాఖ్యానించారు. ఆయనపై అనేక కేసులు ఉన్నాయని తెలిపారు. దేశ గౌరవానికి భంగం కలిగించిన వ్యక్తిని గవర్నర్ కోటాలో కాంగ్రెస్ ఎలా ఎమ్మెల్సీని చేస్తుందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.టీపీసీసీ విమర్శలు..మరోవైపు.. కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు టీపీసీపీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటరిచ్చారు. తాజాగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. అజారుద్దీన్పై కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఆయనకు మంత్రి పదవి ఇస్తే బీజేపీ నేతలకు ఎందుకంత అక్కసు అని ఫైర్ అయ్యారు. అజార్కు మంత్రి పదవి ఇచ్చే విషయంలో మూడు నెలల ముందే హైకమాండ్ నిర్ణయం తీసుకుందన్నారు. సుదీర్ఘ కాలం దేశానికి ఆయన సేవలందించారని, ఈ నేపథ్యంలో అజార్ విషయంలో కాంగ్రెస్ ప్రత్యేక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఇండియా క్రికెట్ టీం కెప్టెన్గా దేశానికి అజారుద్దీన్ ఎన్నో విజయాలు సాధించి పెట్టారని, ఎంపీగా ప్రజలకు సేవ చేశారని గుర్తుచేశారు. అజార్కు మంత్రి పదవి ఇవ్వడంతో రాష్ట్రంలోని మైనార్టీలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. -
మంత్రిగా అజహరుద్దీన్ ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: మాజీ క్రికెటర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ అజహరుద్దీన్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం రాజ్భవన్లోని దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో గవర్నర్ జిష్ణుదేవ్వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు. ఇంగ్లిష్ లో అల్లా సాక్షిగా అజహరుద్దీన్ ప్రమాణం చేశారు. ఉదయం 12:26 నిమిషాలకు ప్రారంభమైన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఐదు నిమిషాల్లో ముగిసింది.ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్రెడ్డి ముంబై నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి నేరుగా రాజ్భవన్కు వచ్చారు. అజారుద్దీన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు సహచర మంత్రులు (కొండా సురేఖ, సీతక్క మినహా) హాజరయ్యారు. నూతన మంత్రిగా ప్రమాణం చేసిన అజహరుద్దీన్ను అభినందించారు. ప్రమాణ స్వీకార అనంతరం గవర్నర్తో కలిసి సీఎం, కేబినెట్ సహచరులు గ్రూప్ ఫొటో దిగారు. ఏ శాఖ ఇస్తారో..? అజహరుద్దీన్కు ఏ శాఖ ఇస్తారన్నది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో మైనారిటీలకు ఉప ముఖ్యమంత్రి హోదాలో హోం మంత్రిత్వ శాఖను కేటాయించిన నేపథ్యంలో అజహరుద్దీన్కు కూడా మంచి అవకాశం లభిస్తుందనే చర్చ జరుగుతోంది. ఆయనకు కూడా హోంశాఖ కేటాయిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, మైనారిటీ సంక్షేమంతోపాటు క్రీడాశాఖ అజారుద్దీన్కు కేటాయిస్తారని తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రానికే అజహరుద్దీన్కు శాఖ కేటాయిస్తారని భావించినా వరంగల్ పర్యటన, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో సీఎం రేవంత్ ఉన్న నేపథ్యంలో సాధ్యం కాలేదు. శనివారం అజహరుద్దీన్¯ మంత్రిత్వ శాఖపై స్పష్టత వస్తుందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. ఏ శాఖ ఇచ్చినా ఓకే: మంత్రి అజహరుద్దీన్ తనకు మంత్రిగా అవకాశం కల్పించినందుకు సంతోషంగా ఉందని, ఏ శాఖ ఇచ్చినా ఇబ్బంది లేదని రాష్ట్ర మంత్రి అజహరుద్దీన్ వ్యాఖ్యానించారు. మంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కా>ంగ్రెస్ పార్టీ అధిష్టానం, ముఖ్యమంత్రి, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తనను మంత్రిగా చూసినందుకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సంతోషపడుతున్నారని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు సరైనవి కావన్నారు. తన గురించి గూగుల్ను అడిగితే తెలుస్తుందని, తన దేశభక్తి గురించి కిషన్రెడ్డి సర్టీఫికెట్ అవసరం లేదని చెప్పారు. జూబ్లీహిల్స్ ఎన్నికకు, తనకు మంత్రి పదవి ఇవ్వడానికి ఎలాంటి సంబంధం లేదని, తాను పార్టీ పట్ల నిబద్ధతతో ఉన్నందునే మంత్రి పదవి ఇచ్చారని చెప్పారు. -
ఇల్లు కూలగొట్టుడే ఇందిరమ్మ రాజ్యమా?
సాక్షి, హైదరాబాద్/గోల్కొండ: పేదల ఇళ్లు కూలగొట్టుడే ఇందిరమ్మ రాజ్యమా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ప్రశ్నించారు. హైదరాబాద్లో కేసీఆర్ లక్ష ఇళ్లు కడితే రేవంత్రెడ్డి సర్కారు హైడ్రా బుల్డోజర్తో వేల ఇళ్లు కూల్చిందని ఆరోపించారు. ఆ పేదల శాపాలే కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఉరితాళ్లై చుట్టుకుంటాయని దుయ్యబట్టారు. ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని పలుచోట్ల ఆయన రోడ్ షోలు నిర్వహించారు. తొలుత షేక్పేటలో ప్రచార వాహనం నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కేసీఆర్ ప్రభుత్వం జీవో 58, 59 కింద 1.5 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలిచ్చిందని గుర్తుచేశారు. ఒక్క జూబ్లీహిల్స్లోనే 3,500 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇంటి పట్టా ఇవ్వలేదు సరికదా పేదల ఇళ్లు కూలగొడుతోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్కు డిపాజిట్ పోతేనే ప్రజలకు బాకీలన్నీ వస్తాయి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విసిగిపోయిన 4 కోట్ల మంది ప్రజల గోస తీర్చే అవకాశం 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లకు వచ్చిందని కేటీఆర్ చెప్పారు. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయి చిత్తుచిత్తుగా ఓడితేనే ప్రజలకు రావాల్సిన బాకీలన్నీ వస్తాయన్నారు. మైనారిటీలను ఆకట్టుకోవడానికే కాంగ్రెస్ పార్టీ అజహరుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. రెండేళ్లుగా మైనారిటీలకు ప్రాతినిధ్యం లేని కేబినెట్ను కొనసాగించిన రేవంత్రెడ్డి.. ఆర్ఎస్ఎస్ విధానాలను అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు.బీఆర్ఎస్ కులమతాల పునాదులపై పనిచేయదని.. కానీ కాంగ్రెస్ ఆ పని చేస్తోందని మండిపడ్డారు. ఆడబిడ్డలు, వృద్ధులు, ఆటోడ్రైవర్లు సహా అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ 420 హామీలిచ్చినా ఏ ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. దోచుకున్న సొమ్ముతో ప్రజలకు రూ. 5 వేల చొప్పున ఇచ్చి ఓట్లు కొనేందుకు వస్తోందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతలిచ్చే డబ్బు తీసుకొని ఆడపడుచులైతే మిగతా రూ. 55 వేలు ఏవని అడగాలని.. మిగతా వారు వారికిచ్చిన హామీలకు అనుగుణంగా మిగతా అప్పు ఎప్పుడు తీరుస్తారని ప్రశ్నించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. నాడు అగ్రస్థానం.. నేడు అట్టడుగుకు.. బీఆర్ఎస్ హయాంలో సంపద సృష్టిలో నంబర్ వన్గా ఉన్న తెలంగాణ ప్రస్తుతం రేవంత్ సర్కారు పాలనలో అట్టడుగున 28వ ర్యాంక్కు పడిపోయిందని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ను నాశనం చేసిందని.. ఆటోవాళ్ల ఉపాధి దెబ్బతీయడం వల్ల 162 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. నగర ప్రజల్ని, గ్రామీణ రైతాంగాన్ని మోసం చేసిన కాంగ్రెస్ రెండేళ్ల పాలనను, పదేళ్ల కేసీఆర్ పాలనను చూసిన ప్రజలంతా ఆలోచించి ఓటు వేయాలని కేటీఆర్ కోరారు. -
ఆ ఇద్దరికీ కీలక పదవులు.. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ విస్తరణ నేపథ్యంలో మంత్రి పదవులు ఆశించిన సీనియర్లకు అదిష్టానం బుజ్జగింపులు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా పి. సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. అలాగే.. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ నేత, బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి కేబినెట్ బెర్త్ ఆశించారు. అయితే బదులుగా ఆయనకు సలహాదారు పదవి కట్టబెడుతూ ఆరు గ్యారెంటీల అమలు బాధత్యను అప్పగించింది రేవంత్ ప్రభుత్వం. అలాగే.. ప్రేమ్సాగర్రావు కూడా కేబినెట్ అవకాశం కోసం ఆశలు పెట్టుకున్నారు. అయితే.. కేబినెట్ ర్యాంకు హోదాలో సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ను కేటాయించింది. ఆశావహుల జాబితా నుంచి ఈ ఇద్దరూ అవుట్ కావడంతో మంత్రి వర్గ విస్తరణకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాల ప్రాధాన్యం, సామాజిక వర్గాల ప్రాధాన్యతను కాంగ్రెస్ అధిష్టానం పరిగణనలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రాజగోపాల్కు?ఇదిలా ఉంటే.. మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. అజారుద్దీన్కు మంత్రి పదవి నేపథ్యంలో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో జరిగే మంత్రి వర్గ విస్తరణలో బెర్త్ దక్కుతుందా? అనే ఆయన వర్గీయులు ఎదురు చూస్తున్నారు. -
మాట మీద నిలబడటం కొందరికే సాధ్యం!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మహాభారతంలోని కర్ణుడి పాత్ర చాలా ఇష్టమట. చేతికి ఎముక లేనట్టుగా దానం చేసే లక్షణం కర్ణుడిది. మిత్రధర్మం కోసం ప్రాణత్యాగమూ చేసి ఉండొచ్చు. కానీ ప్రజాస్వామ్య యుగంలో కర్ణుడి పాత్ర అంత వాస్తవికమైంది కాదనే చెప్పాలి. పైగా రేవంత్ ఏ రాజకీయ ధుర్యోధనుడితో ప్రస్తుతం మిత్ర సంబంధం ఉందన్న చర్చకు ఆస్కారం ఇచ్చారు. రాజకీయ నేతలు తమని తాము కర్ణుడిలా ఊహించుకుంటారేమో తెలియదు కానీ ఆయన మాదిరిగా మాటమీద నిలబడే వారు చాలా అరుదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా సినీ కార్మికులు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో రేవంత్ పాల్గొన్నారు. సమ్మె సందర్భంగా సీఎం చొరవ తీసుకుని సమస్య పరిష్కారానికి సహకరించినందుకు సినీ కార్మికులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో మరీ ముఖ్యంగా కృష్ణానగర్ ప్రాంతంలో సినీ జూనియర్ ఆర్టిస్టులు వేలమంది నివసిస్తూంటారు. వారి ఓట్లు దక్కించుకునేందుకు రేవంత్ ఈ మాట అన్నారేమో మరి!. ఎందుకంటే కార్మికుల సమ్మె ఎప్పుడో పరిష్కారమైతే ఇప్పుడు సన్మాన సభ ఏమిటో?.. అయితే ఈ సందర్భంగా రేవంత్ ఇంకో హామీ ఇచ్చారు. సినీ కార్మికులకు ఆదాయంలో ఇరవై శాతం చెల్లిస్తేనే సినిమా టిక్కెట్ల రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతిస్తుందని ప్రకటించారు. ధరల పెంపు నిర్మాతలు, హీరోలకు ఆదాయం తెస్తుందని, కార్మికులకు దక్కేది ఏమీ ఉండదని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల చెవులకు ఈ హామీ వినసొంపుగా ఉండొచ్చు. కానీ అది ఆచరణ సాధ్యమా?.. ఎందుకంటే... ప్రతి సినిమాకూ ఓ సంక్షేమ నిధి అంటూ ఏదీ ఉండదు. అందరికీ కలిపి ఒకదాన్ని ఏర్పాటు చేస్తే ఎవరికి ఎంతివ్వాలన్నది అర్థం కాని పరిస్థితి ఏర్పడొచ్చు. రేవంత్ మాట్లాడుతూ.. నిజమే కానీ టిక్కెట్ ధరలు అన్ని సినిమాలకూ పెరగవు. టిక్కెట్ ధరలు పెంచిన తరువాత కూడా నష్టాలొస్తే ఏం చేయాలి? లాభ నష్టాలతో సంబంధం లేకుండా టిక్కెట్ రేట్ పెంచిన వెంటనే అందులో 20 శాతం వేరుచేసి కార్మికులకు కేటాయించాలని ప్రభుత్వం ఏమైనా చెప్పగలుగుతుందా?అందుకు నిర్మాతల సంఘాలు ఒప్పుకుంటాయా? ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని తన ఆలోచనపై నిర్మాతలతో చర్చించి ఆ తరువాత ఒక ప్రకటన చేసి ఉంటే బాగుండేది.కొంతకాలం క్రితం పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సినిమా హాల్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించడం, ఒక బాలుడు గాయపడి, ఇప్పటికీ కోలుకోలేకపోవడం తెలిసిన సంగతే. హీరో అల్లు అర్జున్ జైలు పాలయ్యారు కూడా. తొక్కిసలాట ఘటనపై తీవ్రంగా స్పందించిన సీఎం రేవంత్ తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వమని అసెంబ్లీలోనే ప్రకటించారు. కానీ ఆ తరువాత షరా మామూలే. యధావిధిగా బెనిఫిట్ షోలకు అనుమతులు వచ్చేస్తున్నాయి. బీజేపీ కూటమి భాగస్వామి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజా సినిమా బెనిఫిట్ షోతోపాటు టిక్కెట్ రేట్ల పెంపునకూ ఓకే అన్నారు. గురువు.. టీడీపీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారేమో మరి!. రేవంత్కు కర్ణుడి పాత్ర నిజంగానే అంత ఇష్టమైతే ఇలా మాట తప్పవచ్చా అని ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం ఉండదు. ఇంకో సంగతి చెప్పాలి. దానగుణంలో గొప్పవాడైన కర్ణుడు కౌరవుల పక్షాన ఉన్న సంగతి మర్చిపోరాదు. కౌరవాగ్రజుడు దుర్యోధనుడికి అనుయాయిగా కర్ణుడు కూడా అపకీర్తిని ఎదుర్కోవాల్సి వచ్చింది మరి. సినీ కార్మికుల పిల్లల కోసం స్కూల్ పెడతానని అన్నారు.ఆలోచన బాగానే ఉంది కాని అందుకు అవసరమైన మూడు నాలుగెకరాల స్థలం ఈ మహానగరంలో ఎక్కడి నుంచి తెస్తారు? దాన్ని ప్రభుత్వ అధికారులు చూడగలుగుతారు. కాని,కార్మిక సంఘాలు ఎలా వెదుకుతాయో చెప్పలేము. హాలీవుడ్ను హైదరాబాద్కు తీసుకు వచ్చే బాధ్యత తమదని, ప్రపంచ సినిమా వేదికగా హైదరాబాద్ కావాలన్న ఆకాంక్ష కూడా మెచ్చుకోతగ్గదే. అయితే.. చంద్రబాబుతోపాటు రేవంత్ రెడ్డితోనూ సత్సంబంధాలు నెరుపుతున్న మీడియా సంస్థకు సొంతంగా ఒక స్టూడియో ఇప్పటికే ఉంది. దీనికి పోటీగా మరిన్ని వస్తాయంటే వారు ఊరకుంటారా? అయితే రామోజీ ఫిలిం సిటీకే హాలీవుడ్ను రప్పిద్దామని ఆయన అనడం ద్వారా వారిని సంతృప్తిపరిచారని అనుకోవచ్చు. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ లో సినీ పరిశ్రమకు చోటు ఇస్తామని చెప్పడం బాగానే ఉంది. అందులో పరిశ్రమ అభివృద్దికి వ్యూహారచన ఉండవచ్చు. కాగా ఒకసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కిపోనని రేవంత్ గంభీరంగా ప్రకటించినా, ఇంతకుముందు అలా మాటకు కట్టుబడి ఉండలేకపోయారని అనుభవం చెబుతోంది. పైగా.. గతంలో రాజకీయ నేతలు ఎందుకు ఎలాంటి హామీలు ఇస్తారు?ప్రజలను ఏ విధంగా మాయ చేస్తారో తన అభిప్రాయాలను చెప్పిన వీడియోలు ఇప్పటికీ కనిపిస్తుంటాయి. కాంగ్రెస్ పార్టీ పక్షాన గత ఎన్నికలలో ఆయన ఇచ్చిన హామీలు,వాటి అమలు తీరు మొదలైనవాటిని పరిగణనలోకి తీసుకుంటే జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రేవంత్ ఈ ప్రసంగం చేశారా అన్న భావన కలుగుతుంది. కొసమెరుపు ఏమిటంటే సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డితో సంబంధం లేకుండా ఈ సభ జరగడం!.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
అజహరుద్దీన్కు మంత్రి పదవి కోడ్ ఉల్లంఘనే
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేప థ్యంలో ఒక వర్గం ఓటర్లను ప్రలోభపరిచేలా సీఎం వ్యవహరిస్తున్నారని బీజేపీ విమర్శించింది. ఎన్ని కల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ అజహ రుద్దీన్కు మంత్రి పదవి కట్టబెట్టే ప్రయత్నాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో)కి ఆ పార్టీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మీడియా కథనాలు తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొంది.ప్రభుత్వ చర్యను ఉపసంహరించేలా అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని కోరింది. గురువారం ఈ మేరకు సీఈవోకు బీజేఎల్పీ ఉపనేత పాయల్శంకర్, మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డి, లీగల్ సెల్ నేత ఆంథోనిరెడ్డిలతో కూడిన ప్రతినిధి బృందం వినతిపత్రం సమర్పించింది. అజహరుద్దీన్కు మంత్రి పదవి ప్రతిపాదన ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొంది. -
దేశ ఖ్యాతిని చాటిన క్రీడాకారుడు అజహరుద్దీన్
సాక్షి, హైదరాబాద్: భారత క్రికెట్ జట్టుకు సుదీర్ఘ కాలం కెప్టెన్గా సేవలందించి దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన మహ్మద్ అజహరుద్దీన్ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోకుండా బీజేపీ కుట్రలు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. ముస్లిం మైనారిటీ అనే ఏకైక కా రణంతో అజర్ను మంత్రివర్గంలోకి తీసుకోవద్దంటూ బీజేపీ కొర్రీలు పెడుతుందని ధ్వజమెత్తారు. గాంధీ భవన్లో గురువారం ఆయన మీడియా స మావేశంలో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉపఎన్ని కలో గెలిచే అవకాశం లేదని బీజేపీకి తెలుసని... అందుకే బీఆర్ఎస్కు లాభం చేసేందుకు కుట్రలకు తెరతీసిందని దుయ్యబట్టారు. బీజేపీ, బీఆర్ఎస్ తెరవెనుక బంధం గురించి ఇప్పటికే కల్వకుంట్ల కవిత బట్టబయలు చేసిందని ఆయన గుర్తుచేశారు.గతంలో బీఆర్ఎస్ సహకారంతోనే బీజేపీ రాష్ట్రంలో 8 సీట్లు గెలుచుకుందన్నారు. జూబ్లీహిల్స్లో బీఆర్ ఎస్కు లాభం చేకూర్చేందుకు ఆలస్యంగా బలహీనౖ మెన అభ్యర్థిని బీజేపీ ప్రకటించిందని భట్టి ఆరోపించారు. బీఆర్ఎస్కు లాభం కలిగించేందుకే అజహ రుద్దీన్ను మంత్రి కాకుండా బీజేపీ అడ్డుకుంటోందని దుయ్యబట్టారు. అజహరుద్దీన్తో ప్రమాణ స్వీకారం చేయించకుండా గవర్నర్పై బీజేపీ ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసిందని... అయితే గవర్నర్ అలాంటి వ్యక్తి కాదనే నమ్మకం తనకుందని భట్టి అన్నారు. కుట్రలో భాగంగానే ఎన్నికల కమిషన్కు బీజేపీ ఫిర్యాదు చేసిందని మండిపడ్డారు.రాజస్తాన్లో ఉపఎన్నిక వేళ మంత్రి పదవి ఎలా ఇచ్చారు?గతంలో రాజస్తాన్లోని శ్రీకరణ్పూర్ ఉపఎన్నికలో పోటీ చేసే అభ్యర్థి సురేంద్రపాల్ సింగ్ను బీజేపీ మంత్రివర్గంలోకి తీసుకుందని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. ఉపఎన్నికకు కేవలం 20 రోజుల ముందు ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకున్నా రని.. బీజేపీ ద్వంద్వ ప్రమాణాలకు ఇది నిదర్శన మని భట్టి విమర్శించారు. మైనారిటీ అనే ద్వేషంతోనే అజహరుద్దీన్ ప్రమాణస్వీకారాన్ని బీజపీ అడ్డుకోవాలని చూస్తోందని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను మైనారిటీలు అర్థం చేసుకో వాలని.. ఉపఎన్నిక కేవలం జూబ్లీహిల్స్ నియోజక వర్గం వరకేనని, అజహరుద్దీన్ జూబ్లీహిల్స్ అభ్యర్థి కాదన్నారు. మంత్రిగా ఆయన ప్రమాణస్వీకారం కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో జరగడంలేదన్నారు.ఎవరెన్ని కుట్రలు చేసినా సమాజంలోని అన్ని వర్గాలకు భాగస్వామ్యం కల్పించడం కాంగ్రెస్ మూల సిద్ధాంతమని భట్టి స్పష్టం చేశారు. అందులో భాగంగానే అజహరుద్దీన్కు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తున్నట్లు తెలిపారు. మంత్రుల మధ్య స్పష్టమైన అవగాహన, ఆలోచన, ప్రణాళిక నిర్ణయాలపై నిబద్ధత ఉన్నాయని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మొంథా తుపానుకు సంబంధించి ప్రభుత్వం 46 గంటల ముందే అప్రమత్తమైందని.. సీఎం రేవంత్రెడ్డితోపాటు యావత్ కేబినెట్, సీఎస్, అధికార యంత్రాంగమంతా 24 గంటలూ పనిచేసి కావాల్సిన చర్యలు చేపట్టిందని చెప్పారు. ప్రభుత్వ ముందస్తు చర్యల వల్ల భారీ ప్రాణ, ఆస్తి, ఇతర నష్టం జరగకుండా చూడగలిగినట్లు భట్టి తెలిపారు. -
జూబ్లీహిల్స్ ఎన్నికలో కాంగ్రెస్ ఆపదమొక్కులు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఆపద మొక్కులు మొ క్కుతోందని గురువారం ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ఎన్నికలో గెలుపు కోసం సినీ కార్మికులకు అడ్డగోలు వాగ్దా నాలు చేయడం, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ను కేబినెట్లోకి తీసుకోవడం, మంత్రు లు గతంలో ఎప్పుడూ లేని విధంగా హైదరాబాద్ వీధుల్లో హడావుడి చేయడం చూ స్తుంటే కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు తెలిసిపోతోందని అన్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు క్షేత్రస్థాయి వాస్తవాలను గ్రహి స్తున్నట్లు కనిపిస్తోందని, జూబ్లీహిల్స్లో డిపాజిట్ కోల్పోతేనే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయక త్వానికి గుణపాఠం చెప్పడానికి ఇదే సరైన సమయమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. -
అజారుద్దీన్కు మంత్రి పదవి రాకుండా బీజేపీ కుట్ర: భట్టి
సాక్షి, హైదరాబాద్: అజారుద్దీన్కు మంత్రి పదవి రాకుండా బీజేపీ కుట్రలు చేస్తోందంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. ఎన్నికల కమిషన్కు బీజేపీ నేతలు లేఖ రాశారని.. జూబ్లీహిల్స్ బయట ఎన్నికల కోడ్ లేదన్నారు. తెలంగాణకు, హైదరాబాద్కు గొప్ప పేరు తెచ్చిన వ్యక్తి అజారుద్దీన్. ఈ రాష్ట్రం మీద, ఈ దేశం మీద బీజేపీకి ప్రేమ లేదు. ఈ దేశానికి పేరు తెచ్చిన అజారుద్దీన్ను కేబినెట్లోకి తీసుకుంటే స్వాగతించాల్సింది పోయి... వద్దని బీజేపీ ఎన్నికల కమిషన్కు లేఖ రాసింది’’ అని భట్టి మండిపడ్డారు.‘‘పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ సరెండర్ అయింది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు బీజేపీ సరెండర్ అయింది. బీఆర్ఎస్ను గెలిపించేందుకు బీజేపీ ఎత్తులు వేస్తుంది. బీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చే పనిలో భాగంగానే అజారుద్దీన్పై బీజేపీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. ప్రమాణ స్వీకారం జరగకుండా ఉండేందుకు గవర్నర్పై బీజేపీ ఒత్తిడి తెస్తుంది. జూబ్లీహిల్స్ బయట ఎన్నికల కోడ్ లేదు. కరగ్పూర్ నియోజకవర్గంలో పోలింగ్కు ముందు అభ్యర్థిని మంత్రిగా బీజేపీ ప్రకటించింది. అజారుద్దీన్ ఇక్కడ అభ్యర్థి కూడా కాదు.. అయినా అభ్యంతరం ఎందుకు?’’ అంటూ భట్టి విక్రమార్క ప్రశ్నించారు. -
నాపై కాంగ్రెస్ వాళ్లే తప్పుడు ప్రచారం: రాజగోపాల్ రెడ్డి
సాక్షి, యాదాద్రి భువనగిరి: తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖండించారు. రాజకీయంగా తాను ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఆయనే ప్రెస్ మీట్ పెట్టి చెబుతాను అంటూ క్లారిటీ ఇచ్చారు. పార్టీ మార్పు అంటూ తప్పుడు ప్రచారాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని లక్కారం, చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని చెరువులను పరిశీలించి గంగ పూజను నిర్వహించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని చెరువు నిండినప్పుడు కాలనీలు జలమయం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. అనంతరం, రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ..‘చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధికి 500 కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపుదిద్దబోతున్నాం. చౌటుప్పల్ చెరువుకు ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తుగా ప్రణాళికలు వేసి దండు మల్కాపురం, లక్కారం వద్ద వరద నీటిని డైవర్ట్ చేయడంతో మున్సిపాలిటీ ప్రజలకు వరద ముప్పు తప్పిందని తెలిపారు.పార్టీ మార్పుపై.. పార్టీ మారుతున్నానని సొంత పార్టీ వాళ్లు, బయట పార్టీ వాళ్లు నాపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలు దుష్ప్రచారాలను ఎవరు నమ్మవద్దు. నేను ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లయితే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రకటిస్తాను. నేను ప్రస్తుతం సిన్సియారిటీ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తను, ఎమ్మెల్యేను.. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే పని చేస్తాను. క్రమశిక్షణ గల కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కార్యకర్తగా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి కట్టుబడి ఉంటా. నా ముందు మునుగోడు అభివృద్ది తప్ప, మరో ఆలోచన లేదు. నాపై సోషల్ మీడియాలో వచ్చే దుష్ప్రచారాలను నమ్మవద్దు అంటూ కామెంట్స్ చేశారు. -
కోడ్ ఉండగా మంత్రిని నియమించవచ్చా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఓ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతుండగా, రాష్ట్ర మంత్రిగా ఎవరినైనా నియమించవచ్చా?. ఆ అసెంబ్లీ స్థానం పరిధిలో అమల్లో ఉన్న ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కాదా?. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా ముఖ్యమంత్రి సిఫారసుల మేరకు గవర్నర్ కొత్త మంత్రిని నియమించవచ్చా?. ఈ సందేహాలకు కేంద్ర ఎన్నికల సంఘమే సమాధానం చెప్పాల్సి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి.జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి వచ్చే నెల 11న ఉప ఎన్నికలు జరగనుండగా, ఈ నెల 31న మాజీ క్రికెటర్ ముహమ్మద్ అజారుద్దీన్తో రాష్ట్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించాలని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వచ్చే డిసెంబర్ ఏడో తేదీతో రెండేళ్లు పూర్తికానుండగా, ఇప్పటి వరకు రాష్ట్ర మంత్రివర్గంలో ముస్లింలకు చోటు కల్పించలేదు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం పరిధిలో గణనీయ సంఖ్యలో ఉన్న ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితిలో అజారుద్దీన్ను మంత్రిగా ప్రభుత్వం నియమించనుండటం ఆసక్తికరంగా మారింది.నాడు సీఎంకు నేరుగా ఈసీ ఫోన్.. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా మంత్రివర్గంలో కొత్త మంత్రిని నియమించవచ్చా? గతంలో ఇలాంటి ఘటనలెక్కడైన జరిగాయా? అప్పుడు ఎన్నికల సంఘం ఏం చేసింది? అనే సందేహాలను కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ అశోక్ లావాసా ఇటీవల హైదరాబాద్లో ఇచ్చిన ఓ ఉపన్యాసంలో నివృత్తి చేశారు. మంతన్ ఆధ్వర్యంలో గత సెప్టెంబర్ 13న నగరంలోని విద్యా అరణ్య పాఠశాలలో నిర్వహించిన సంస్థ సహా వ్యవస్థాపకుడు ‘అజయ్ గాంధీ’ స్మారక ఉపన్యాసంలో ఈ మేరకు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.గతంలో గోవాలోని ఓ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతుండగా, ఆ స్థానం పరిధిలో గణనీయ సంఖ్యలో ఉన్న సామాజికవర్గానికి సంబంధించిన ఓ వ్యక్తిని రాష్ట్రమంత్రిగా నియమించాలని అప్పటి సీఎం మనోహర్ పారికర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో నాటి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ నేరుగా మనోహర్ పారికర్కు ఫోన్ చేసి ఉప ఎన్నికలు ముగిసే వరకు కొత్త మంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని కోరారని అశోక్ లావాసా వెల్లడించారు. మంత్రుల నియాయకం విషయంలో రాజ్యాంగం ద్వారా తనకు సంక్రమించిన అధికారాలను సైతం వాడుకోలేనా? అని మనోహర్ పారికర్ బదులిచ్చారని గుర్తు చేసుకున్నారు.ఎన్నికలు జరుగుతున్న సమయంలో కొత్త మంత్రితో ప్రమాణస్వీకారం చేయిస్తే ఆ సామాజికవర్గ ఓటర్లను ప్రభావితం చేసినట్టు అవుతుందని ప్రధాన కమిషనర్ నచ్చజెప్పడంతో అప్పట్లో మనోహర్ పారికర్ వెనక్కుతగ్గి ప్రమాణస్వీకారోత్సవాన్ని వాయిదా వేసుకున్నారని అశోక్ లావాసా తెలిపారు. రాష్ట్రంలో కొత్త మంత్రిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వస్తున్న వార్తలపై సీఈఓ కార్యాలయం స్పందనను ‘సాక్షి’ కోరగా, దీనిపై తమకు ఏమైన ఫిర్యాదులు వస్తే కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తామని బదులిచ్చారు. ఈసీ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. -ముహమ్మద్ ఫసియుద్దీన్.


