-
ఇంత రాద్ధాంతం నడుమ ప్రెస్మీట్ అవసరమా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ ఉద్రిక్తతలకు కారణమవుతున్న జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీరును ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం తప్పుబట్టారు. అనవసర వివాదాలకు పవన్ తెర తీస్తున్నారంటూ సాక్షితో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు, అలాగే హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించాలన్న ఆయన ప్రకటనపై రాజకీయ దుమారం రేగింది. ఈ పరిణామంపై తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం తీవ్రంగా స్పందించారు.పవన్ కల్యాణ్ అనవసర వివాదాలకు తెర లేపుతున్నారని కోదండరాం విమర్శించారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యాఖ్యలు నచ్చకపోతే అభ్యంతరాలు వ్యక్తం చేయాల్సిన అవకాశం ఉన్నప్పటికీ, పోలీసు కేసుల వరకు వెళ్లడం సరైన విధానం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యక్తుల మధ్య ఉన్న విభేదాలను ప్రాంతాల మధ్య వైరుధ్యంగా మార్చడం ఆందోళనకరమని అన్నారు.మొదటి నుంచి తెలంగాణ అంటే బీజేపీకి గిట్టదని, ఈ వివాదాల వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉండొచ్చని కోదండరాం వ్యాఖ్యానించారు. బీజేపీ పార్టీ పవన్ కల్యాణ్ ద్వారా ఈ తరహా పరిస్థితులను నడిపిస్తోందని ఆరోపించారు. ఇంత రాద్దాంతం జరుగుతున్న తరుణంలో పవన్ హైదరాబాద్ వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఆయన తన అభిప్రాయాలను ఏపీలోనే వ్యక్తం చేయవచ్చని సూచించారు.ఇదిలా ఉండగా.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జనసేన ఊపిరిలూదుకొన్నది తెలంగాణ గడ్డపైనేనని పేర్కొంటూ, ఈ నేల నుంచే పార్టీకి పోరాట పటిమ లభించిందని అన్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అదే సమయంలో.. జనసేన సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో.. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఈ ప్రెస్మీట్కైనా పోలీసులు అనుమతి ఇస్తారని ఆశిస్తున్నట్లు ‘ఎక్స్’లో వెటకారంగా ఓ పోస్ట్ చేశారు. -
రెండు పడవలపై రేవంత్ ప్రయాణం!
తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత ఎన్టీఆర్ను ఏ విధంగా చూడాలి. కాంగ్రెస్ పార్టీని ఎదిరించిన వీరుడుగా చూడాలా? లేక కాంగ్రెస్కు స్పూర్తి ఇచ్చిన నేతగా చూడాలా? నిజంగానే ఇది ఒక ఆసక్తికరమైన సన్నివేశం. హైదరాబాద్ మైత్రివనం వద్ద ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేసిన సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన ప్రసంగం ఒకవైపు, మహానాడులో తెలుగుదేశం చేసిన తీర్మానం మరో వైపు ఉన్నాయి. ఇవి పరస్పర విరుద్దంగా కనిపిస్తాయి. మహానాడులో చేసిన తీర్మానంలో ఏమి రాశారో గమనించండి.తెలుగునాట కాంగ్రెస్ పాలనలో అవినీతి, ఆశ్రిత పక్షపాతం పెరిగి, భవిష్యత్తు దుర్భరంగా మారిన వేళ ఉదయించిన వెలుగు కిరణం తెలుగుదేశం అని అందులో పేర్కొన్నారు. ఢిల్లీ కాంగ్రెస్ పెత్తందార్ల మితిమీరిన జోక్యం, అడుగడుగునా తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతింటున్న వైనం ప్రతి తెలుగు గుండెను పిండేశాయి. అన్ని వర్గాలవారు తీవ్ర నిరాశ, నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతున్నతరుణంలో 1982 మార్చి 28న ఎన్.టి.రామారావు తెలుగుదేశం పార్టీని ప్రకటించారని ఆ తీర్మానంలో వివరిచారు.కాంగ్రెస్పై పోరాటం అన్న తీర్మానంలో ఈ అంశాలను పేర్కొన్నారు. అంటే దాని అర్థం కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ అనే కదా! కాంగ్రెస్ అవినీతిపార్టీ అని చెబుతున్నట్లే కదా! దానికి శ్రీకారం చుట్టిన ఎన్టీఆర్.. కాంగ్రెస్కు ఎలా స్పూర్తి అవుతారు? కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జాతిరత్నంలా ఎలా కనిపించారు?అందులో కూడా అంబేద్కర్, మాజీ ప్రధాని ఇందిరగాంధీలతో సమానంగా ఎన్టీఆర్ను పొగిడారు. దీనిని కాంగ్రెస్ వాదులు అంగీకరించగలరా? ఆ రకంగా చూస్తే ప్రస్తుతం కూడా కాంగ్రెస్ అధిష్టానం దగ్గరకు రేవంత్ కూడా పెక్కుమార్లు వెళుతున్నారు కదా! అంటే ఇప్పుడు కూడా తెలంగాణవారి ఆత్మగరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినట్లేనా?దానిని ఆయన ఒప్పుకుంటారా?అంబేద్కర్ రాజ్యాంగ రచన కమిటీ అధ్యక్షుడుగా ఉండడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన నేత. అలాగే ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా ఉంటూ ఎన్నో విజయాలను దేశానికి అందించారు. కాని ఎన్.టి.రామారావు రాజకీయాలలోకి రావడానికి ముందు సినీమా నటుడు. పలు సాంఘిక పాత్రలతో పాటు రాముడు, కృష్ణుడు వంటి పాత్రలు పోషించడం ద్వారా తెలుగు ప్రజలను ఆకట్టుకున్న మాట నిజమే. ఆ రకంగా ఆయన గొప్పవాడే. తదుపరి ప్రజలలో తనపై ఉన్న సినీ క్రేజ్ను ఆసర చేసుకుని రాజకీయాలలోకి వచ్చారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సీటుు ఆఫర్ చేసి ఉంటే రిస్థితి ఎలా ఉండేదో తెలియదు. కాంగ్రెస్పై విమర్శలు చేస్తూ ఆయన అధికారం చేపట్టగలిగారు.తెలుగుదశం పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్ధిగా ఉంది. ఒకసారి కాంగ్రెస్ మద్దతుతో ఎన్టీఆర్ను నాదెండ్ల భాస్కరరావు దించితే, అప్పుడు వచ్చిన ప్రజాందోళన, దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష సహకారం వంటి కారణాలతో తరిగి అధికారంలోకి వచ్చారు. కాని 1995లో స్వయాన అల్లుడి చేతిలో ఘోర పరభవానికి గురై ఆయన మళ్లీ పదవి కోల్పోయారు. 1985లో ఏపీలోని మూడు ప్రాంతాలలో పోటీచేసి గెలిచిన నేతగా రికార్డు ఉన్నప్పటికీ, 1989లో ఆయనే తెలంగాణలోని కల్వకుర్తిలో పోటీచేసి ఓటమపాలయ్యారు. తన పాలన కాలంలో తానిచ్చిన హామీలను నరవేర్చడానికి ఆయన కృషి చేసిన మాట నిజమే.అలాగే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ను అధికారం నుంచి దించడానికి నేషనల్ ఫ్రంట్ స్థాపనలో క్రియాశీలక పాత్ర పోషించి దానికి ఛైర్మన్గా వ్యవహరించారు. ఈ మొత్తం ప్రక్రియలో కాంగ్రెస్కు స్పూర్తిని ఇచ్చిన అంశం ఏమిటో తెలియదు. అయిన ఫర్వాలేదు. ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడ స్థిరపడ్డ టీడీపీ మద్దతుదారులు, ప్రత్యేకించి కమ్మ వర్గంవారు జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల సందర్భంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రేవంత్ను కోరారు. అందుకు అంగీకరించి ఆ ప్రకారం విగ్రహ పెట్టించారు. విశేషం ఏమిటంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ కమ్మ కార్పొరేషన్ చైర్మన్, వైస్ ఛైర్మన్లు ఈ కార్యక్రమానికి సంబంధించి భారీ ప్రచార ప్రకటనలు ఇచ్చారు.ఈ నేపథ్యంలో విగ్రహం ఆవిష్కరణ చేసి రేవంత్ ఉపన్యాసం పెద్దగా ఇవ్వకుండా వెళ్లపోయి ఉంటే ఇబ్బంది లేకుండా పోయేది. కాని ఎన్టీఆర్, ఇందిరాగాంధీల స్పూర్తిగా ప్రజాపాలన చేస్తున్నట్లు చెప్పడం విడ్డూరంగానే అనిపిస్తుంది. ఎన్టీఆర్ ఒక హార్స్ పవర్కు ఏభై రూపాయలకే రైతులకు విద్యుత్ అందించారని, ఆ స్పూర్తితోనే వైఎస్ రాజశేఖరరెడ్డి కర్షకులకు ఉచిత విద్యుత్ ఇచ్చారని చెప్పడం విడ్డూరమే అనిపిస్తుంది. ఎన్టీఆర్ తీసుకువచ్చిన రెండు రూపాయలకే కిలో బియ్యం, మద్య నిషేధం తదితర కార్యక్రమాలకు టీడీపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడే1998లో మంగళం పలికారు. ఎన్టీఆర్ను పదవీచ్యుతుడిని చేశాక ఆయన అవసరమే పార్టీకి లేదని, సినిమావాళ్లు రాజకీయాలకు పనికిరారని కూడా ప్రకటనలు చేశారు.ఎన్టీఆర్ మరణం తర్వాత ఆయనకు జనంలో ఉన్న అభిమానాన్ని కేష్ చేసుకోడానికి చంద్రబాబు మళ్లీ రాగం మార్చి ఉండవచ్చు. కాని ఇందులో కాంగ్రెస్కు ఏమి సంబంధం. వైఎస్సార్ సొంతంగా ఉచిత విద్యుత్ స్కీమ్ను రూపొందించుకుని కాంగ్రెస్ అధిష్టానంతో ఓకే చేయించుకుని ప్రకటన చేశారు. ఎన్టీఆర్ కన్నా ముందే కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా రూ.1.90కే ఆ రోజుల్లో కిలో బియ్యం సరఫరా చేశారు. తెలంగాణకు చెందిన ప్రఖ్యాత కాంగ్రెస్ నేత పివి నరసింహరావు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగాను, తదుపరి దేశానికి ప్రధానిగా సేవలందించి కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. ఆయన జాతిరత్నం కాకుండా ఎలా పోయారు.బహుశా సోనియాగాంధీ ఆయన అంటే పడదు కనుక పివి పేరు ప్రస్తావించలేదేమో తెలియదు. ఆ మాటకు వస్తే జవహర్ లాల్ వంటి గొప్పనేతలు కాంగ్రెస్కు ఉండగా, ఎన్టీఆర్ పేరును అరువుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఏమి ఉంది. పైగా రేవంత్ తెలుగుదేశంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అగ్రనేతలందరిని తీవ్రంగా విమర్శించిన రీతిలోనే ,కాంగ్రెస్లోకి వచ్చాక ఎన్టీఆర్ను కూడా పరుష పదజాలంతోనే దుయ్యబట్టారు. మరి ఇంతలోనే ఆయనలో ఈ మార్పు ఎందుకు వచ్చింది? ఎన్టీఆర్ గొప్పదనాన్ని ఎవరూ కాదనరు. మా బోటి వాళ్లం అంతా ఆయన పార్టీని స్థాపించి నప్పుడు కేరింతలు కొట్టినవారమే.కాని వివిధ రాజకీయ పరిణామాల తర్వాత ఆయన మాత్రమే తెలుగుజాతి ఆత్మగౌరవం ఆయన ఒక్కరే అంటే మాత్రం ఒప్పుకోవడం కష్టం. తెలుగుదేశం వారు అలా అన్నారంటే తప్పులేదు. కాంగ్రెస్ పార్టీ సీఎం ఆ వ్యాఖ్యలు చేయడం ద్వారా కాంగ్రెస్ వాదుల మనోభావాలను గాయపరిచినట్లు అవుతుందన్న అభిప్రాయం ఉంది. పనిలో పని తనకు గురువైన చంద్రబాబును కూడా ఆయన పొగుడుకున్నట్లుగా ఉంది.ఆయనేమో మహనాడు తీర్మానంలో కాంగ్రెస్ను అవినీతి పార్టీ అని అంటారు. రేవంతేమో ఆ టీడీపీ గొప్పదని చెబుతున్నారు. అంతేకాదు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఒక టీటీడీపీ నేత ప్రసంగిస్తే, విద్యావ్యవస్థకు ఒక మంత్రి లేకుండా తెలంగాణలో చేశారని, అది దౌర్బగ్యామని, లోకేష్తో పోల్చి రేవంత్ను మరో టీడీపీ మహిళా నేత విమర్శించారు. అయినా టీడీపీ నేతలను పొగడదలచుకుంటే ఎవరు అభ్యంతరం చెబుతారు. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు అని అంటారు.అలాగే కాంగ్రెస్ను అవమానించిన టీడీపీని రేవంత్ ఏదో కొన్ని ఓట్ల కోసం పొగుడుకుంటే మొత్తం కాంగ్రెస్ అభిమానుల నుంచి నిరసనలు గురయ్యే అవకాశం ఉంది. గత ఎన్నికలలో టీడీపీ ఓట్లు గణనీయంగానే కాంగ్రెస్కు పడి ఉండవచ్చు. కాని భవిష్యత్తులో బీజేపీ ఒత్తిడి చేసి ఇక్కడ ఉన్న టీడీపీ మద్దతుదారుల ఓట్లను బీజేపీకి వేయాలని గట్టిగా కోరితే అప్పుడు ఇదే రేవంత్రెడ్డి ఏమి చేస్తారో చూడాల్సి ఉంటుంది. ఏది ఏమైనా కాంగ్రెస్కు సొంత ఐడియాలజీ ఉందన్న సంగతి రేవంత్ గుర్తిస్తే మంచిదేమో! లేకుంటే రేవంత్ రెండు పడవల మీద కాళ్లేసి ప్రయాణిస్తున్నారన్న అనుమానం ప్రజలలో రావచ్చేమో!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘తెలంగాణ ప్రజలకు పవన్ కచ్చితంగా క్షమాపణ చెప్పాలి’
హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై తెలంగాణ కాంగ్రెస్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ సభ అంశానికి సంబంధించి ఎమ్మెల్యే అనిరుధ్.. ‘సాక్షి’తో మాట్లాడారు. ‘పవన్ కళ్యాణ్ సభ విషయం లొ మాకు అభ్యంతరం లేదు. సభ ఎవరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కోనసీమ కొబ్బరిచెట్లకు తెలంగాణ నరదృష్టి తగిలిందని గతంలో పవన్ మాట్లాడారు. తెలంగాణ ప్రజలపై పవన్ నీచంగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణను అవమానించిన విషయంలో కచ్చితంగా క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాకే సభ పెట్టాలి. పవన్ సభ పై బీజేపీ, బిఆర్ఎస్ మౌనం వెనక రాజకీయ కారణం ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బీజేపీ, బిఆర్ఎస్ కలసి పోటీ చేసే అవకాశాలున్నాయి’ అని తెలిపారు. పవన్.. కొండగట్టు అంజన్నపై ఒట్టేసి చెప్పు! -
పవన్.. కొండగట్టు అంజన్నపై ఒట్టేసి చెప్పు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టనున్న ‘నవనిర్మాణ సంకల్ప సభ’ రాజకీయ దుమారానికి దారితీసింది. తెలంగాణ ఉద్యమం నుంచి రాష్ట్ర ఆవిర్భావం వరకు, ఆ తర్వాత కూడా తెలంగాణపై పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాజకీయ, ప్రజా సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పవన్పై విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించిన వ్యక్తికి ఇక్కడ నవనిర్మాణం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని, ముందుగా తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే సభ నిర్వహించాలని డిమాండ్ చేశారు.సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం మాట్లాడుతూ.. తెలంగాణ వారి కనులు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతాయని మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని తెలంగాణలో సభలు పెడుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 11 రోజులు అన్నం మానేశానని చెప్పిన వ్యక్తి, అదే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఇక్కడికి వచ్చి మొసలి కన్నీరు కారిస్తే ప్రజలు నమ్మరన్నారు.తెలంగాణ ఏర్పడినప్పుడు వ్యతిరేకించిన వ్యక్తి ఇప్పుడు తెలంగాణపై ప్రేమ చూపించడం రాజకీయ నాటకమేనని విమర్శించారు. ‘‘కన్న తల్లికి గాజులు కొనలేని వాడు పినతల్లికి ఒడ్డాణం చేస్తాడనే సామెత ఉంది. ఆంధ్రప్రదేశ్లో చేయలేనిది తెలంగాణలో వచ్చి చేస్తాననడం విడ్డూరం’’ అని వ్యాఖ్యానించారు.పవన్ కళ్యాణ్ నవనిర్మాణ సభల వెనుక బీజేపీ రాజకీయ ఎజెండా ఉందని ఆరోపించిన పొన్నం.. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం, కేరళ, తమిళనాడుల్లో కాకుండా తెలంగాణనే ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టడం, సామాజిక వైషమ్యాలు సృష్టించడం లక్ష్యంగా బీజేపీ డైరెక్షన్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే అనుమానం ప్రజల్లో ఉందన్నారు.‘‘సినిమాల్లో హీరోగా అభిమానించొచ్చు. కానీ రాజకీయాల్లో తెలంగాణ వ్యతిరేక ధోరణితో వస్తే నిలదీస్తాం. పవన్ కళ్యాణ్ సినిమా నటుడు. పైసలు ఇస్తే ఏ పాత్రనైనా పోషిస్తాడు. ఇప్పుడు బీజేపీ స్క్రిప్ట్కు తగ్గట్టే నటిస్తున్నాడు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ కోసం పార్లమెంట్లో, ఉద్యమాల్లో, సకల జనుల సమ్మెలో వేలాది మంది పోరాడారని గుర్తుచేసిన మంత్రి పొన్నం.. అమరవీరుల త్యాగాలతో ఏర్పడిన రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ఎవరైనా కించపరిస్తే సహించబోమన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ప్రతి తెలంగాణ బిడ్డకు పండుగరోజు అని, ఆ వేడుకల్లో పాల్గొనాలనుకుంటే ఎవరైనా రావొచ్చని, కానీ తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించే వ్యక్తి ఇక్కడ రాజకీయ సభలు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.ఆంధ్రప్రదేశ్తో తమకు సోదర సంబంధాలే ఉన్నాయని, అక్కడి ప్రజలపై ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పారు. అయితే తెలంగాణపై విషం కక్కిన వ్యక్తి ఇక్కడికి వచ్చి ప్రేమ నటిస్తే ప్రజలు నమ్మరన్నారు. ‘‘బీజేపీ ఇచ్చే రెమ్యూనరేషన్ కోసం తెలంగాణకు రావడం లేదని నువ్వు నమ్మిన దేవుడు కొండగట్టు అంజన్నపై ప్రమాణం చేసి చెప్పగలవా పవన్ కళ్యాణ్?’’ అంటూ సవాల్ విసిరారు.విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, గంగవరం, కృష్ణపట్నం పోర్టుల అంశం, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి ప్రజా సమస్యలపై స్పందించకుండా తెలంగాణకు వచ్చి రాజకీయాలు చేయడం ఎందుకని ప్రశ్నించారు. ‘‘సినిమాల్లో దేశభక్తి చూపించడం కాదు.. నిజ జీవితంలో ప్రజల కోసం నిలబడాలి. ఏపీ ప్రజలు నీకు అధికారం ఇచ్చారు. ముందు అక్కడ నవనిర్మాణం చేసి చూపించు’’ అని హితవు పలికారు.తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గాయపరిచేలా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ముందుగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో తెలంగాణ సమాజం ఆయన రాజకీయ ఉద్దేశాలను అంగీకరించదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు -
బీజేపీ ఎదుగుదల ఓర్వలేక ఈటలపై పోస్టర్లు: రామచందర్రావు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనం వల్లే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు. రైతుల జీవితాలతో ఆడుకోవద్దని హితవు పలికారు. అలాగే, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్పై పోస్టర్ల విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణలో నెల రోజులు ఆలస్యంగా ధాన్యం కొనుగోలు ప్రారంభించారు. ప్రభుత్వ చేతకానితనం వల్లే ఇలా జరిగింది. రైతుల జీవితాలతో ఆడుకోవద్దు. బీజేపీ రాజేందర్పై పోస్టర్లు వేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. ఈ పోస్టర్లకు పార్టీ నేతలకు సంబంధం లేదు. బీజేపీ ఎదుగుదల ఓర్వలేక ఇలా పోస్టర్లు వేస్తున్నారు. దీనిపై డీజీపీ, కమిషనర్లకు ఫిర్యాదు చేశాం. ఢిల్లీ తెలంగాణ భవన్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తున్నాం. ఈ వేడుకలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు’ అని చెప్పుకొచ్చారు.కాగా, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ను విమర్శిస్తూ ఆయన ఇంటి వద్ద ఫ్లెక్సీ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ‘నీ ఏడుపే బీజేపీకి శాపం.. బీజేపీ నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చింది. బీజేపీకి నువ్ చేసిన ఒక్క మేలైనా చెప్పగలవా?’ అంటూ వెలిసిన ఫ్లెక్సీ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఫ్లెక్సీలో ‘రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని ఏడుపు, సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని ఏడుపు, కేంద్ర మంత్రి పదవి రాలేదని ఏడుపు’ అని విమర్శించారు.అలాగే బీజేపీ ఈటలకు చేసిన మేలును తెలుపుతూ ‘ఓడిపోయినా మల్కాజిగిరి ఎంపీ టిక్కెట్ ఇచ్చింది.. రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది.. మోదీ నాయకత్వంలో గెలిచాక కూడా నా ఇమేజ్తో గెలిచాను అనడం ఏ రాజకీయ నైతికత’ అని ఫ్లెక్సీలో ప్రశ్నించారు. ‘బీజేపీ నాయకులు ఎదుగుతుంటే అసహనం ఎందుకు? ఇందూరు బిడ్డ ఎంపీ అర్వింద్కు వస్తున్న ఆదరణ చూసి కడుపు మంట ఎందుకు? అని నిలదీశారు. గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేసినట్టు భావిస్తున్నారు. దీంతో, బీజేపీలో నేతల మధ్య ఉన్న విభేదాలు ఉన్నట్టు మరోసారి బహిర్గతమైంది. -
డబ్బుల్లేవ్.. ఓపిక పట్టండి!
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేదు. ప్రతి నెలా అవుతున్న ఖర్చులకు ఖజానాకు వచ్చే రాబడులు సరిపోవడం లేదు. అనివార్య ఖర్చులు పెరిగిపోతున్నాయి. అదనపు ఆదాయం వచ్చే మార్గాలు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో కొత్త పథకాలను అమలు చేయలేకపోతున్నాం. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలులో భాగంగా సామాజిక పింఛన్లు పెంచేందుకు ఎంత ప్రయత్నించినా నిధులు సమకూరడం లేదు. మీమీ నియోజకవర్గాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం డబ్బులు ఇప్పట్లో ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కొన్నాళ్లు సర్దుకుపోవాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులను ముమ్మరం చేస్తాం..’ అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఆర్థిక పాఠాలు చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటై రెండున్నరేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పార్టీ ప్రజా ప్రతినిధులకు వాస్తవ పరిస్థితులను తెలియజెప్పాలనే ఆలోచనతో ఉమ్మడి జిల్లాల వారీగా ఆయన ఎమ్మెల్యేలతో సమావేశమవుతున్నారు. ఇప్పటివరకు ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులతో సమావేశమైన ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూనే, ఆదాయం పెంచుకునే మార్గాల గురించి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని కోరుతున్నట్టు సమాచారం. ప్రజలపై పన్నులు వేయకుండా నెట్టుకొస్తున్నాం.. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి గురించి భట్టి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరణ ఇస్తున్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వచ్చిన రాబడులు, చేసిన అప్పులు, కాంగ్రెస్ హయాంలో ఆదాయ, వ్యయాలను సంవత్సరాల వారీగా తెలియజేస్తున్నారు. ‘ప్రస్తుతం ప్రతి నెలా రూ.16–17 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుంటే రూ.18–20వేల కోట్ల వరకు ఖర్చులవుతున్నాయి. ఆదాయం కంటే ప్రతి నెలా రూ.2,200 కోట్ల వరకు అధికంగా వ్యయమవుతోంది. ఈ పరిస్థితుల్లో కొత్త పథకాల అమలు అసాధ్యం. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలపై రూపాయి కూడా అదనంగా పన్ను వేయకుండా నెట్టుకొస్తున్నాం. జీఎస్టీ, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, వాహనాలకు పన్నులు, కేంద్రం నుంచి వచ్చే నిధులు, ఇతర ఆదాయంతో సర్దుకుంటున్నాం. పాత పథకాలేవీ తీసేసే పరిస్థితి లేదు. సంక్షేమ పథకాల అమలుకు, ఉద్యోగుల జీతాలు, పింఛన్లకు ప్రతి నెలా నిధులిస్తున్నాం. పాత అప్పులే పీకల దాకా.. కొత్త అప్పులు తెచ్చినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. పాత అప్పులే పీకల వరకు ఉన్న నేపథ్యంలో తెచ్చిన దాని కంటే ఎక్కువగా అప్పులు కట్టాల్సి వస్తోంది. వీటికి తోడు అభివృద్ధి పనులు, పెండింగ్లో ఉన్న బిల్లుల చెల్లింపులు, పరిపాలనా వ్యయం, విద్య, వైద్యం వంటి కీలక రంగాల నిర్వహణ కోసం కష్టపడాల్సి వస్తోంది. ఏరోజుకారోజు సర్దుకోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ఈ ఏడాది మొత్తం ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నాం. ఆర్థిక పరిస్థితిని దారిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. మీమీ నియోజకవర్గాల్లో అభివృద్ధి నిధుల కోసం కొంచెం ఓపిక పట్టండి. పరిస్థితిని ప్రజలకు అర్థమయ్యేలా వివరించండి..’ అని భట్టి చెబుతున్నట్టు తెలిసింది. ఏం చేయొచ్చో చెప్పండి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఉన్న మార్గాల గురించి సలహాలు, సూచనలు ఇవ్వాలని ఎమ్మెల్యేలను డిప్యూటీ సీఎం కోరుతున్నారు. ఈ సమావేశాల్లో పాల్గొన్న కరీంనగర్కు చెందిన ఓ ఎమ్మెల్యే ‘సాక్షి’తో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని తెలియజేయడం మంచిదే. మేం కూడా కొన్ని సలహాలిచ్చాం. పాత పథకాలేవీ తీసేయవద్దని చెబుతూనే కొంతమేరకు క్రమబద్ధీకరించాల్సిన ఆవశ్యకతను వివరించాం. రైతు భరోసాను కుదించాలని, పింఛన్లు ప్రతి యేటా కొంత పెంచాలని, ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ బీమా లాంటి పథకాలు ప్రజల్లో మంచి పేరు తెస్తాయని, అవసరమైతే నిరుపయోగమైన ప్రభుత్వ భూములను అమ్మడం ద్వారా ఆదాయ వనరులు పెంచుకునే అవకాశాలను పరిశీలించాలని సూచించాం. పార్టీ కార్యకర్తలు గతంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు ఇవ్వాలని అడిగాం. మా నియోజకవర్గాల్లోని రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన గురించి ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లాం. రిజి్రస్టేషన్ల రేట్లు పెంచినా పర్వాలేదని చెప్పాం. ఇచ్చిన హామీలను అమలు చేసిన తర్వాతే ఓట్ల కోసం వచ్చామనే భావన ప్రజల్లో కలిగించేలా ప్రణాళిక రూపొందించాలని సూచించాం..’ అని వెల్లడించారు. -
అది రైతులను చంపేసే డిస్కమ్!
రాంగోపాల్పేట్ (హైదరాబాద్): నేతి బీరకాయలో నెయ్యి ఎంతుంటుందో రైతుల మీద ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అంతే ప్రేమ ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. 24 గంటల కరెంటును ఎగ్గొట్టేందుకే ఇప్పుడు రైతు డిస్కమ్ అంటూ పాటపాడుతున్నాడని మండిపడ్డారు. సీఎం చెప్పే రైతు డిస్కమ్ రైతు మెడకు ఉరిపెట్టే డిస్కమ్ అని, అది రైతులను చంపేసే డిస్కమని ఘాటుగా విమర్శించారు. ఆదివారం సికింద్రాబాద్లోని మిల్లీనియం గార్డెన్లో కంటోన్మెంట్ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులకు ఎస్ఐఆర్, సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై జరిగిన శిక్షణ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు.ముఖ్యమంత్రి కాక ముందు రేవంత్రెడ్డి బయటి దేశానికి వెళ్లినపుడు రైతులకు 3 గంటలు కరెంటు ఇస్తే సరిపోతుందన్నారని, దాన్ని అమలు చేసేందుకు ఇప్పుడు రైతు డిస్కమ్ పాట అందుకున్నారన్నారు. రైతులకు ఇచ్చే రైతు బంధు రైతుల ఖాతాలో పడటం లేదు కానీ.. రాహుల్ బంధుకు మాత్రం నెలనెలా పడుతున్నాయని దుయ్యబట్టారు. రైతులకు ధాన్యం సంచులు ఇవ్వడం పట్టించుకోకున్నా, ఢిల్లీకి పంపే ధనం సంచుల మీద ముఖ్యమంత్రికి బాగా మోజుందని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో పోటీ చేయబోమని ప్రకటించే ధైర్యముందా? కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 6 వేల ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారని, రెండేళ్లలో ఆరు ఇళ్లయినా కట్టించారా, కనీసం ఆరు ఇటుకలైనా పెట్టారా అని కేటీఆర్ ప్రశ్నించారు. దమ్ముంటే మీరిచ్చిన 420 హామీలు నెరవేరుస్తామని, లేకుంటే ఎన్నికల్లో పోటీ చేయమని ప్రకటించే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా అని నిలదీశారు. ముఖ్యమంత్రి చిన్న పిల్లల దగ్గరకు వెళ్లినా బూతు పురాణాలు మాట్లాడుతున్నారని, పేగులు మెడలో వేసుకుంటానని, గుడ్లు పీకుతానని, లాగులో తొండలు వేస్తానని అంటున్నారని మండిపడ్డారు.అందుకే ఆయన తమ్ముడు కొండల్రెడ్డి లాగే ఈయనను తొండలరెడ్డి పేరుతో పిలవాలని ఎద్దేవా చేశారు. హామీలు నెరవేర్చమంటే కేసీఆర్ తెలంగాణను అప్పుల పాలు చేశాడని అంటున్నారని.. అదే నిజమని కానీ అప్పులు చేసి లక్ష డబుల్ బెడ్రూమ్లు నిర్మించారని, రైతుల ఖాతాల్లో రూ.73 వేల కోట్లు వేశారని, రెండుమార్లు రూ.30 వేల కోట్లతో రైతు రుణమాఫీ చేశాడని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 60 ఏళ్లలో చేయలేనిది కేసీఆర్ 6 నెలల్లో లక్ష కోట్లు ఖర్చు పెట్టి విద్యుత్ వ్యవస్థను మార్చి 24 గంటలు కరెంటు ఇచ్చాడన్నారు.కాంగ్రెస్ దరిద్రాన్ని దేశం మొత్తం వదిలించుకుందని కానీ తెలంగాణలో ప్రజలు నెత్తిన పెట్టుకున్నారని, దాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు జరగనున్న ఎస్ఐఆర్పై అప్రమత్తంగా ఉండాలని, బూత్స్థాయి నాయకులు బీఎల్వోలతో ఉంటూ అర్హులది ఒక్క ఓటు కూడా పోకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు తదితరులు పాల్గొన్నారు. -
‘SIR పై ప్రతి ఒక్కరు అప్రమత్తముగా ఉండాలి’
హైదరాబాద్: ‘సర్’ ఇప్పడు దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారని, దీని పేరుతో ఓట్లు తొలగించే అవకాశం ఉందన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమావేశం నిర్వహించగా అందులో తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ‘ SIR ఇప్పుడు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. SIR పేరుతో ఓట్లు తొలగించడం జరుగుతుంది. ఓటు అనేది ప్రతి ఒకరి హక్కు. అంబేద్కర్ మనకు ఓటు హక్కు కల్పించారు. SIR పై ప్రతి ఒక్కరు అప్రమత్తముగా ఉండాలి. ఓటు హక్కు తొలగించే హక్కు ఎవరికి లేదు. కానీ ఈ కేంద్రం SIR పేరుతో తొలగిస్తుంది. 18 సంవత్సరాల నిండిన వారు ఓటు ఎన్రోల్ మెంట్ చేసుకోవాలి. బీఆర్ఎస్ మెంబర్ షిప్ డ్రైవ్ కూడా పెద్ద ఎత్తున జరగాలి. ఈసారి మెంబర్ షిప్ డ్రైవ్ డిజిటల్ లో చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎంతో అభివృద్ధి పనులు చేశాం. కంటోన్మెట్ ప్రజలు సురక్షిత మంచినీరు అందజేశాం. అలవీ కానీ హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం వచ్చాక.. హామీలు గాలికి వదిలేశారు. ఒక్క పథకం సక్రమంగా అమలు కావడం లేదు. మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది’ అని మండిపడ్డారు. -
‘సర్’పై అప్రమత్తంగా ఉండాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై బీఆర్ఎస్ కార్యకర్తలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. క్లాసిక్ గార్డెన్లో బీఆర్ఎస్ కంటోన్మెంట్ నియోజవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జూన్ 25 నుండి సర్ ప్రారంభమవుతుందని.. సర్’పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.‘‘కాంగ్రెస్ పాలనలో పరిశ్రమలకు వారానికి మూడు రోజులు పవర్ హాలిడే ఉండేది. 65 సంవత్సరాలలో కాంగ్రెస్ చేయని పని ఆరు నెలల్లో కేసీఆర్ చేసి చూపించారు. 24 గంటల పాటు రైతులకు, పరిశ్రమలకు కేసీఆర్ నాణ్యమైన కరెంటు ఇచ్చారు’’ అని కేటీఆర్ గుర్తు చేశారు.‘‘వ్యవసాయానికి రోజుకు మూడు గంటల కరెంటు ఇస్తే చాలు అన్నా రేవంత్ రెడ్డి.. ఇప్పుడేమో రైతులకు 24 గంటలు కరెంటు ఇస్తామని ప్రగల్భాలు పలుకుతున్నాడు. 35 వేల ఓటర్లు డిఫెన్స్ ల్యాండ్లో ఇల్లు కట్టుకున్నారు. వారి ఓటు హక్కు ఉండాలంటే సర్లో నమోదు చేసుకోవాలి. హైదరాబాద్లో మొత్తం బీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించారు. గ్రామాల్లో రేవంత్ 420 మోసపూరిత హామీలను నమ్మి కాంగ్రెస్కు ఓట్లు వేశారు. దేశం మొత్తం కాంగ్రెస్ దరిద్రాన్ని వదిలించుకుంటే మనం నెత్తి మీద పెట్టుకున్నాం...సుమారు 2 లక్షల పట్టాలు కేసీఆర్ ఇచ్చారు.. రెండున్నర సంవత్సరాల్లో ఒక్క ఇండ్ల పట్టాలు అయినా రేవంత్ ఇచ్చారా?. స్కూటీ లేదు లూటీ మాత్రం నడుస్తుంది. రైతుబంధు లేదు రాహుల్ బంధు నడుస్తుంది. రైతులకు యూరియా ఇచ్చే దిక్కు లేదు. ధాన్యం కొనే దిక్కు లేదు కానీ.. రైతులకు రైతు డిస్కం తెస్తారంటా?. రైతులకు ఊరి వేయడానికే రైతు డిస్కం తెస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో 95 లక్షల ఓట్లు సర్ పేరుతో తీసేశారు.. కోర్టుకు వెళ్లారు.. కోర్టులో ఉండగానే ఎన్నికలు జరిగాయి బీహార్లో 65 లక్షల ఓట్లు తొలగించారు. అందరూ సర్లో పాల్గొని.. మన ఓట్లు తొలగించకుండా మనం అప్రమత్తంగా ఉండాలి’’ అని కేటీఆర్ సూచించారు -
రేవంత్ రెగ్యులర్ సీఎం కాదు.. రెన్యువల్ సీఎం..
కవాడిగూడ/ముషీరాబాద్: రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా బొందపెట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్రెడ్డి పేమెంట్ కోటాలో సీఎం గద్దెనెక్కారని, ఆయన రెగ్యులర్ సీఎం కాదని, రెన్యువల్ సీఎం అని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారంటీలు 420 అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. శనివారం తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్ల జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద జీవో 17ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వంలో చిన్న కాంట్రాక్టర్లకు ఇచ్చిన నిధుల టెండర్లపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చేవెళ్ల, కామారెడ్డి డిక్లరేషన్ల పేరుతో ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 72 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని నమ్మబలికి జీవో 17తో చిన్న చిన్న కాంట్రాక్టర్లను కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. జీవో 17ను రద్దు చేసేంతవరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టంచేశారు. రాష్ట్రంలో కాంట్రాక్టులు సీఎం రేవంత్రెడ్డి బామ్మర్ది, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కొడుకు, బీజేపీ నేతలకు దక్కుతున్నాయని ఆరోపించారు. 2028లో బీఆర్ఎస్ వస్తుందని, 50 వేల మందిని కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దుతామని కేటీఆర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కాంట్రాక్టర్ల జేఏసీ చైర్మన్ మందా శ్యామ్, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. ఒక్క ఇళ్లయినా కట్టావా? జీహెచ్ఎంసీలో ఒక్క ఇళ్లయినా కట్టావా అంటూ సీఎం రేవంత్రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. కానీ ఎంత మంది ఇళ్లు కూల్చి వారి ఉసురుపోసుకున్నారో తెలుసా అంటూ ఘాటుగా మండిపడ్డారు. శనివారం మధ్యాహ్నం ముషీరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధ్యక్షతన జరిగిన బూత్ లెవల్ ఏజెంట్స్ (బీఎల్ఏ) సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ‘నూరు రోజుల్లోనే ఆరు గ్యారంటీల అమలు ఏమైందని ప్రశ్నిస్తే కండలు తిరిగిన పహిల్వాన్ అయినా మూడు నెలల్లోనే పిల్లలను పుట్టిస్తారా... అన్న సీఎం రేవంత్రెడ్డి 30 నెలలైనా పిల్లలు పుట్టకపోతే నిన్ను ఏమనాలి?’అని సీఎం రేవంత్రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధినేత రాహుల్గాంధీ నగర కేంద్ర గ్రంథాలయానికి వచ్చి కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొట్టండి.. మీకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు అదే నిరుద్యోగులు సెక్యూరిటీ లేకుండా రాహుల్, రేవంత్ ఎక్కడ దొరుకుతారా అని ఎదురుచూస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్కుమార్, దేశపతి శ్రీనివాస్, సురభివాణిదేవి, దామోదర్ పాల్గొన్నారు. -
ఉచిత విద్యుత్ ఎత్తేయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రైతాంగానికి 24 గంటలూ నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుందని, ఆ పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎత్తేసేది లేదని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ఆలోచన తమకు లేదని తేల్చిచెప్పారు. అసలు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలన్న నిబంధన కేంద్రం ఎప్పుడూ పెట్టలేదని చెప్పిన రేవంత్.. ఉచిత విద్యుత్, స్మార్ట్ మీటర్ల విషయంలో బీఆర్ఎస్కు సవాల్ చేశారు. ఉచిత విద్యుత్ ఎత్తేసినా, వ్యవసాయానికి మీటర్లు పెట్టినా వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని, తాము అలా చేయకపోతే బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకుంటుందా అని వ్యాఖ్యానించారు. శనివారం రేవంత్రెడ్డి విలేకరులతో ఇష్టాగోష్టి మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ‘మేం అధికారంలోకి వచ్చేసరికి తెలంగాణలోని డిస్కంలు కుప్పకూలే పరిస్థితిలో ఉన్నాయి. డిస్కంలకు ఇప్పుడు రూ.69,745 కోట్ల అప్పులున్నాయి. అవి బాగుచేయలేనంతగా నిర్వీర్యమయ్యాయి. ఉచిత విద్యుత్ కింద రైతులకిచ్చే కరెంటుకు ఒక్క రూపాయి కూడా గత ప్రభుత్వం డిస్కంలకు చెల్లించలేదు. దీంతో డిస్కంలు అప్పులు చేసి బొగ్గు, విద్యుత్ కొనుగోలు చేసుకోవాల్సి వచ్చేది. ఉద్యోగుల నిర్లక్ష్యం, నిర్వహణా లోపాల కారణంగా ఇతర అవసరాలకు వినియోగించిన విద్యుత్ను కూడా ఉచిత విద్యుత్ లెక్కలో రాసేవాళ్లు. వాళ్లు కనీసం ఎప్పుడు ఎంత కరెంటు తీసుకోవాలనే అంచనాలు కూడా వేయలేదు. మేం అధికారంలోకి వచ్చాక డిస్కంలను దారిలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే రైతులతో పాటు ప్రభుత్వం గంపగుత్తగా కరెంటును వినియోగించుకునే కేటగిరీని కలిపి ప్రత్యేకంగా రైతు డిస్కం ఏర్పాటు చేశాం. దీనిద్వారా ఎంత విద్యుత్ తీసుకున్నామో, ఎంత సరఫరా చేశామో, నిర్వహణ నష్టాలు ఎంతో, బిల్లులు ఎంత వస్తున్నాయో కచ్చితంగా లెక్క తేలుతుంది. తెలంగాణ రైతాంగం రాత్రిపూట పెద్దగా వ్యవసాయానికి విద్యుత్ వాడదు కాబట్టి ధర తక్కువ ఉన్నప్పుడు కొనుగోలు చేసి ఆ డిస్కం ద్వారా రైతులకు విద్యుత్ ఇస్తాం. అసలు మాకు ఉచిత విద్యుత్ ఎత్తేయాలనే ఆలోచనే లేదు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు కూడా పెట్టబోం. అలా పెట్టేది ఉంటే వచ్చే ఎన్నికల్లో మేం పోటీ చేయబోం. ఒకవేళ మేం పెట్టకపోయినా, ఉచిత విద్యుత్ ఎత్తేయకపోయినా బీఆర్ఎస్ పోటీ చేయకుండా ఉంటుందా? బీఆర్ఎస్ నా సవాల్ను స్వీకరించాలి. అప్పుడే స్మార్ట్ మీటర్లు పెట్టారు అసలు స్మార్ట్ మీటర్ల విషయంలో కేంద్రంతో ఒప్పందం చేసుకుంది బీఆర్ఎస్సే. 2017, జూన్ 30న అజయ్మిశ్రా, రఘుమారెడ్డి, గోపాలరావు అనే అధికారులు ఈ ఒప్పందంపై సంతకాలు పెట్టారు. 2017–18లో 29,632 స్మార్ట్ మీటర్లు కూడా పెట్టారు. కేంద్రం ఏ రోజూ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని అడగలేదు. అసలు అలాంటి నిబంధనే లేదు. నోరు తెరిస్తే కేసీఆర్ చెప్పేది అబద్ధాలే. రైతుల కోసం తామేదో యుద్ధం చేసినట్టు అప్పట్లో చెప్పుకుని రైతుల దగ్గర మార్కులు కొట్టేయాలని అలాంటి మాటలు చెప్పారు. రైతులు ఆయన కంటే తెలివైన వారు కాబట్టి కర్రు కాల్చి వాత పెట్టారు. మోదీ నా చుట్టమేమీ కాదు. ఆ పథకంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు చేరాయి. ఏపీ కూడా చేరింది. నాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా రాష్ట్రమంతటా స్మార్ట్ మీటర్లు పెట్టినా వ్యవసాయానికి మాత్రం పెట్టలేదు. తీగల మీద బట్టలు ఆరేయాలని కేసీఆర్ అన్నప్పుడే 1999 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసింది. కాంగ్రెస్సే. నాణ్యమైన విద్యుత్ ఇచ్చి రైతుల ఆత్మగౌరవం పెంచడానికి తెచ్చిన పారదర్శక విధానమే రైతు డిస్కం. సీఆర్పీసీ, ఐపీసీల్లో శిక్షలు వేసేందుకు నిబంధనలు లేవా? మరి ఎస్సీ, ఎస్టీ కమిషన్, మహిళా కమిషన్, హెచ్ఆర్సీ, మైనార్టీ కమిషన్లు ఎందుకు ఏర్పాటు చేశారు. బీసీ కమిషన్ను ఎందుకు అడుగుతున్నారు. తమ వర్గాలకు కమిషన్ ఉంటే న్యాయం జరుగుతుందనే కదా. ఆ తరహాలోనిదే రైతు డిస్కం కూడా. మోదీకి కిషన్రెడ్డి చెప్పాలి కదా? బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి కేసుల్లో సీబీఐ విచారణను రాష్ట్ర ప్రభుత్వం కోరిన తర్వాత కూడా కేంద్రం ఎందుకు స్పందించడం లేదు. కనీసం సీబీఐ వాళ్లు ఆపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. తుమ్మిడిహెట్టిపై చర్చిద్దామంటే మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఈ విషయాలను మోదీ దగ్గర కిషన్రెడ్డి చెప్పాలి కదా? అంతర్రాష్ట్ర జలవివాదాలు రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని మోదీ చెబుతున్నారు కదా? వచ్చే నెల1న ఆదిలాబాద్కు వెళ్తున్నా. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా దారిలోకి రాడో చూస్తా. పోలవరం ముంపు కింద ఏడు మండలాలు ఏపీకి ఇచ్చిన మోదీ తెలంగాణ కోసం వెయ్యి ఎకరాల భూమి ఇవ్వలేడా? సోయి తప్పిన మాటలు ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు విషయంలో బీఆర్ఎస్ సోయి తప్పిన మాటలు మాట్లాడుతోంది. పువ్వాడ అజయ్ ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టినప్పుడు కేసీఆర్ ఏం చేశాడు? కమ్మ సంఘానికి భూమి ఇవ్వలేదా? భీమవరంలో కేటీఆర్ పోటీ చేస్తానని చెప్పి బీఆర్ఎస్ ఏపీకి తోట చంద్రశేఖర్ను అధ్యక్షుడిని చేయలేదా? ఆయనకు కూకట్పల్లిలో 30 ఎకరాల భూమి ఇవ్వలేదా? హక్కుల కోసం పోరాటం ఎలా చేయాలో, చరిత్రలో కొందరిని ఎలా గౌరవించాలో నాకు తెలుసు. అసలు తారక రామారావు అనే పేరు మార్చుకోవాలి కదా? ఆ పేరుతో ఎంతకాలం బతుకుతారు? ప్రధానికి కనపడడం లేదా? గ్లోబరీనా అనే సంస్థ కేటీఆర్ బినామీ. ఆ సంస్థ వల్లనే తెలంగాణలో పరీక్ష పేపర్లు లీకయ్యాయి. విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు సీబీఎస్ఈ వ్యవస్థను కూడా గ్లోబరీనా కుప్పకూల్చింది. హరీశ్, కేటీఆర్ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడరు. ప్రధాని మోదీకి ఎందుకు కనపడడం లేదు? బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే కదా? రెండు పెద్ద కేసుల్లో ఆధారాలతో కేంద్రానికి ఇచ్చాం. ఆ కుటుంబాన్ని అరెస్టు చేస్తారో లేదో మోదీ, కిషన్రెడ్డిలే చెప్పాలి. జుట్టు వారి చేతిలో పెట్టాం. రాష్ట్రంలో జనగణన, ఎస్ఐఆర్లు నడుస్తున్నాయి. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలకు తొందరేముంది? ఆర్థిక వెసులుబాటును బట్టి రైతు భరోసా చెల్లిస్తాం. మహిళా సమాఖ్యలతో గోదాములు ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు, దళారులతో పనిలేకుండా ఓ ప్రణాళిక రూపొందిస్తున్నాం. గోదాములు, రైస్మిల్లులను మహిళా సమాఖ్యలతో ఏర్పాటు చేయిస్తాం. బ్యాంకు లింకేజీతో రుణాలు ఇప్పిస్తాం. వారినే యజమానులను చేస్తాం. దీనికి గొప్ప ప్రణాళిక మా దగ్గర ఉంది. ఇప్పటికే పెట్రోల్ బంకులిచ్చాం. సోలార్పవర్ ప్లాంట్లు ఇచ్చాం. ఆదానీ, అంబానీలకు మా ఆడబిడ్డలే పోటీ అనే రీతిలో వారి సాధికారతకు కట్టుబడి ఉన్నాం. అసెంబ్లీలో చెప్పాం.. మళ్లీ చెబుదాం రాష్ట్రం అప్పుల పాలవుతుందనే వాదనలో వాస్తవం లేదు. మేం యేటా రూ.70–75వేల కోట్లు అప్పులు తెస్తే రూ.90వేల కోట్ల వరకు పాత అప్పులు కడుతున్నాం. అన్ని లెక్కలు అసెంబ్లీలో చెప్పాం. మళ్లీ అసెంబ్లీలో అన్ని విషయాలు చెప్తాం. మేం తెచ్చిన అప్పులే కాదు కట్టిన అప్పులు కూడా చూడాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎంత మోసం చేసినా భరించాం. ఇప్పుడు అంతా తెలంగాణ వాళ్లమే కదా? ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు? ఆ కుటుంబం డీఎన్ఏనే అబద్ధాల డీఎన్ఏ. వాళ్ల మూలుగతో సహా మారిస్తేనే వారి వైఖరి మారుతుంది. అలా చేస్తే వాళ్లు ఉండరు. ఫ్యామిలీ మొత్తం అబద్ధాలమీదనే బతుకుతుంది. బ్లాక్ మెయిల్ చేసి బతుకుతుంది. చివరకు క్రషర్ల వాళ్లని కూడా పొడుగాయన బెదిరించాడు. నెలకు రూ.50 లక్షలు ఇస్తే క్రషర్ల గురించి మాట్లాడబోనని ఓ ఎమ్మెల్సీ ద్వారా బ్లాక్మెయిల్ చేశాడు. మూడడుగుల ఆయన, ఆరడుగులాయన చెత్త మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు. హరీశ్.. ఓ బబుల్ షూటర్ అసలు ఆరడుగులాయన ఫ్యూచర్ ఏంటో ఆయనకే తెలియదు. ఆయన ఎందులో ఉంటాడో కూడా తెలియదు. గుండెల మీద చేయి వేసి కేసీఆర్ మీద ఒట్టేసి హరీశ్రావు బీఆర్ఎస్లోనే ఉంటాడేమో చెప్పమనండి. 2008లో వైఎస్సార్ దగ్గరకు పోలేదా? హరీశ్రావు మాటలను ఎవరూ సీరియస్గా తీసుకోవద్దు. ఆయన ట్రబుల్షూటర్ కాదు.. బబుల్ షూటర్. వచ్చే ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ నుంచే పోటీ చేస్తాడన్న నమ్మకం నాకు లేదు. ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడనే సమాచారం నాకుంది. కానీ నేను చెప్పదల్చుకోలేదు. ఓవైపు పార్టీ సమావేశం జరుగుతుంటే ఢిల్లీ వెళ్లాడు. మీడియా పట్టుకుంటే అడ్వొకేట్ను కలిసేందుకు వెళ్లానని ఫొటోలు పెట్టాడు. తీర్పు రిజర్వ్ అయిన కేసులో అడ్వొకేట్ దగ్గరకెళ్లి ఆయన మాట్లాడేదేముంటుంది? కేంద్రంలో పెద్ద మంత్రి అవుతాడేమో నాది, పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. నేను పీసీసీ అధ్యక్షుడిగా, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాం. ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా, నేను ముఖ్యమంత్రిగా ప్రతి ఎన్నికల్లో గెలుస్తూనే ఉన్నాం. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, ఉప ఎన్నికలు గెలిచాం. 2029లో కూడా మా కాంబినేషన్లోనే ఎన్నికల్లో గెలుస్తాం. మహేశ్గౌడ్ నాకు మంచి మిత్రుడు కూడా. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆయన పెద్ద కేంద్రమంత్రి కూడా అయ్యే అవకాశముంది. మాది సక్సెస్ఫుల్ కాంబినేషన్. మా పనితీరును ఫలితాలే చెబుతున్నాయి. నేను 2034 వరకు ఇక్కడే ఉంటా. రాష్ట్ర ప్రయోజనాలను ఎట్టి పరిస్థితుల్లో దెబ్బతిననీయను. అన్నింటినీ కొలిక్కి తెస్తా. రాష్ట్రాన్ని ఒక ట్రిలియన్ ఎకానమీగా రూపుదిద్దేందుకు అన్ని వ్యవస్థలను చక్కదిద్దే ప్రయత్నం చేస్తా’ అని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. వడ్లు కొనంది ఎవరు?అసలు ధాన్యం కొనుగోలు చేయంది ఎవరు? కేంద్రం కాదా? వరి వేస్తే ఉరి అన్నది బీఆర్ఎస్ కాదా? మేము వడ్లే కాదు మక్కలు కూడా కొంటున్నాం. మక్కలకు మద్దతు ధర ప్రకటించిన వారు ఒక్క గింజయినా కొన్నారా? మేం పండిన ప్రతి ధాన్యం గింజ కొంటున్నాం. పండిన పంటలో పంజాబ్ (86%), ఛత్తీస్గఢ్ (67%), హరియాణా (65%), ఒడిశా (52%) తరహాలో తెలంగాణ పంటఎందుకు కొనరు? తెలంగాణలో పండిన దాంట్లో 38 శాతమే కొంటారా? మేం వచ్చే నెల 15 లోపు ధాన్యమంతా కొంటాం. ఆ తర్వాత కిషన్రెడ్డి, మోదీ సంగతి చెబుతాం. వడ్లు కొనకపోతే బీజేపీ వాళ్ల ఇళ్ల ముందు తీసుకెళ్లి పోస్తాం. బస్సులో వెళ్లి రైతు యాత్ర చేస్తున్న వారి ఇళ్ల వద్దకు ట్రాక్టర్లు తీసుకెళతాం. ఇప్పటికే 60లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం. 20 లక్షల టన్నుల మక్కలు కొంటాం. ఈ స్థాయిలో ఏ రోజైనా, ఏ ప్రభుత్వమైనా కొనుగోలు చేసిందా? అకాల వర్షం వల్ల రైతులకు కొంత నష్టం కలిగింది. రైతు దుఃఖంలో ఉన్నప్పుడు వారి దగ్గరకు వెళ్లి సెల్ఫీ లు దిగి సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటున్నారు. అది కూడా ఒక బతుకేనా?. -
అలాగైతే మేం ఎన్నికల్లో పోటీ చేయం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మోటర్లకు మీటర్లు పెట్టినా.. రైతులకు ఉచిత విద్యుత్ నిలిపివేసినా మేం ఎన్నికల్లో పోటీ చేయం.. ఒక వేళ మోటర్లకు మీటర్లు పెట్టకపోయినా.. ఉచిత విద్యుత్ కొనసాగించినా ఎన్నికల్లో పోటీ నుంచి బీఆర్ఎస్ తప్పుకుంటుందా? అంటూ ఆ పార్టీకి సీఎం రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ రైతుల ముసుగులో లైఫ్ లైన్ కోసం ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు.‘‘రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిచేందుకే రైతు డిస్కం. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న విద్యుత్ వినియోగాన్ని రైతు డిస్కమ్కు కనెక్ట్ చేస్తున్నాం. దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఎక్కడాలేని విధంగా రైతు డిస్కంను ఏర్పాటు చేశాం. రైతు డిస్కం ఏర్పాటుతో జవాబుదారీతనం పెరుగుతుంది. ప్రభుత్వానికి అవసరాన్నిబట్టి తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేసే వెసులుబాటు కలుగుతుంది. బీజేపీ, బీఆర్ఎస్ అబద్ధాల పునాదులపై పార్టీలను బతికించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి’’ అంటూ రేవంత్ దుయ్యబట్టారు.‘‘కిషన్రెడ్డికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా. వడ్లు కొనంది మీరు.. రైతు పండించిన ప్రతీ గింజను మా ప్రభుత్వం కొంటుంది. మేం కొంటున్నది ఎంత.. కేంద్రం కొనేది ఎంత?. కేంద్రం ఎంఎస్పీ నిర్ణయించింది కానీ ఒక్క గింజనైనా కొంటున్నారా?. వరి, జొన్న, మొక్కజొన్నలు మొత్తం మా ప్రభుత్వం కొంటుంది. మేం కొన్న మొత్తం పంట కేంద్రం కొనాలి. కేంద్రం కొనకపోవడం వల్లే రాష్ట్రంలో రైతు గోస పడుతున్నాడు. కేంద్రం కొనకపోతే బస్సులు వేసుకుని వెళ్లిన వాళ్ల దగ్గరికే ట్రాక్టర్లు వేసుకుని వెళతాం. జల వివాదాలను రాష్ట్రాలు సమన్వయంతో పరిష్కరించుకోవాలని మోదీ చెప్పారు. కానీ తుమ్మిడిహట్టి కోసం కలిసి మాట్లాడటానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కోరినా స్పందించడంలేదు’’ అంటూ రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. -
స్పీకర్ స్థానం నుంచి మంత్రి పదవి వైపు?
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో త్వరలోనే మంత్రివర్గ ప్రక్షాళన జరగనుందనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో హీట్ పెంచుతోంది. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో కేబినెట్లో కొత్త ముఖాలకు అవకాశం కలి్పంచేందుకు అధిష్టానం గట్టిగా యోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే నివేదికలు తెప్పించుకుంటున్న ఏఐసీసీ పెద్దలు.. జూన్ చివరి వారంలో ఈ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల మధ్య తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా ఢిల్లీ వేదికగా మారిపోయాయి. స్పీకర్ స్థానం నుంచి మంత్రి పదవి వైపు? తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్కుమార్ శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో పత్రిపక్ష నేత రాహుల్ గాం«దీతో భేటీ అయ్యారు. ఈ సమావేశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తనకు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో చోటు కలి్పంచాలని ఆయన రాహుల్ను కోరినట్లు విశ్వసనీయ సమాచారం. స్పీకర్ పదవి కంటే మంత్రిగా ప్రజాసేవ చేసేందుకే ఆయన మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ బాట పట్టిన ఆశావహులు!... మంత్రివర్గంలో మార్పుచేర్పులు ఖాయమనే సంకేతాలు రావడంతో రాష్ట్రానికి చెందిన పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు ఢిల్లీ వేదికగా లాబీయింగ్ మొదలుపెట్టారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోటాలో మంత్రి పదవి దక్కించుకునేందుకు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇటీవల వారిద్దరూ ఢిల్లీలో అధిష్టానం పెద్దలను కలిసి తమకు న్యాయం జరుగుతుందనే ధీమా వ్యక్తం చేశారు. తెరవెనుక సీనియర్ల ప్రయత్నాలు.. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వార్తల నేపథ్యంలో పారీ్టకి చెందిన సీనియర్ నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తెరవెనుక మంత్రాంగం నడిపిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం మంచిర్యాల ఎమ్మె ల్యే ప్రేమ్సాగర్రావు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు సైతం ఢిల్లీకి వచ్చారు. తమ అసంతృప్తిని, ఆకాంక్షలను అధిష్టానం ముందుంచి హైదరాబాద్ పయనమయ్యారు. అధిష్టానం పెద్దలను కలిసేందుకు వచ్చిన వారు.. మీడియా కంట పడకుండా అత్యంత గోప్యత పాటించడం గమనార్హం. -
పవన్ ప్యాకేజీ స్టార్: కాంగ్రెస్ ఎమ్మెల్యే
జడ్చర్ల: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం జడ్చర్లలో ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రొఫెసర్ నాగేశ్వర్ గురించి మాట్లాడే నైతిక హక్కు, అర్హత పవన్ కల్యాణ్కు లేదని, ఆయనపై విమర్శలు చేయడం తగదన్నారు. నాగేశ్వర్ రాజకీయ, సామాజిక విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ అని.. ఆయన గోటికి కూడా పవన్ సరిపోరని పేర్కొన్నారు.పవన్ ఒక ప్యాకేజీ స్టార్.. చంద్రబాబు ప్యాకేజీ ఇచ్చారు కాబట్టి ఆయనతో ఉన్నారని, అదేవిధంగా అమిత్షా దగ్గరకు వెళ్లి ప్యాకేజీ మాట్లాడుకున్నారేమో అన్నారు. పవర్ కోసం ఆయన ఏ పార్టీతోనా పొత్తు పెట్టుకుంటారని ఎద్దేవా చేశారు. నాగేశ్వర్ను అరెస్ట్ చేయడానికి వస్తే తానే ఆయన ఇంటి ఎదుట నిలబడతానని, మొదట తనను అరెస్ట్ చేసిన తరువాతే ప్రొఫెసర్ను అరెస్టు చేయాల్సి ఉంటుందన్నారు. ఏపీ రాజధాని అమరావతికి అంత బడ్జెట్ ఎందుకుని ప్రశ్నించారు. ఏపీ పాలకులంతా హైదరాబాద్లోనే ఉన్నారని, వారికి ఇక్కడే రాజధాని కోసం 5 వేల ఎకరాల భూమి కేటాయిస్తామని.. వారు ఇక్కడి నుంచే పాలన సాగించుకోవచ్చని సూచించారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సిట్ తమకు నోటీసులు పంపిందని, తనతో పాటు మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డితో కలిసి సోమవారం విచారణకు హాజరవుతామని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, తన ఫోన్తో పాటు తన కుటుంబసభ్యుల ఫోన్లను, తన అనుచరుల ఫోన్లను ట్యాప్ చేయించారని ఆరోపించారు. విచారణ అనంతరం సీఎలీ్పలో జరిగే మీడియా సమావేశంలో బీఆర్ఎస్ బాగోతాలను ఎండగడుతామన్నారు. -
బీఆర్ఎస్ భారీ వ్యూహం.. కేసీఆర్ దూకుడు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిస్తున్న రాజకీయ పోరుకు మరింత పదును పెట్టేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమైంది. ఎన్నికల హామీల అమలులో వైఫల్యం, ప్రజాసమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, పాలనలో అవినీతి, అధికార పార్టీ నేతల అక్రమాలపై ఆరోపణలను ప్రధాన అ్రస్తాలుగా మలుచుకోవాలని గులాబీ పార్టీ నిర్ణయించింది. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ రంగాలకు చెందిన కార్మికుల మద్దతు కూడగట్టేలా ప్రభుత్వాన్ని నిరంతరం ప్రజాక్షేత్రంలో నిలదీసేందుకు పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేసే కసరత్తు ప్రారంభించింది.అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికార కాంగ్రెస్ వ్యతిరేక ఓటు చీలి బీజేపీ వైపు మళ్లకుండా రాజకీయంగా అడ్డుకట్ట వేసే వ్యూహం కూడా అవసరమని భావిస్తోంది. యువతను ఆకర్షించే కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగంలో చురుకుదనం పెంచడం, భవిష్యత్లో కేటీఆర్ పాదయాత్ర, కేసీఆర్ బస్సు యాత్రల వంటి భారీ ప్రజా కార్యక్రమాలతో మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో దూకుడు పెంచేందుకు బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.హామీల అమలుపై నిరంతర ఒత్తిడి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందనే అంశాన్ని క్షేత్రస్థాయిలో బలంగా తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఇప్పటికే వరంగల్లో రైతు సదస్సు నిర్వహించిన బీఆర్ఎస్ త్వరలో తెలంగాణ భవన్లో యువజన, విద్యార్థి నేతలతో సమావేశం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. రైతుభరోసా, రైతు రుణమాఫీ, మహిళలకు హామీలు, నిరుద్యోగ భృతి, ఉద్యోగ నియామకాలు వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వంపై నిరంతర రాజకీయ ఒత్తిడి తీసుకురావాలని పార్టీ నిర్ణయించింది.అక్రమాలు, అవినీతి ఆరోపణలను ప్రజల ముందుంచడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ విశ్వసనీయతపై ప్రజల్లో నిరంతరం చర్చ జరిగేలా చూడాలని బీఆర్ఎస్ భావిస్తోంది. కేటీఆర్, హరీశ్రావులతోపాటు పార్టీ ముఖ్య నేతలు రేవంత్ ప్రభుత్వంపై రోజుకో ఆరోపణ, విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ ఇప్పటికే అసెంబ్లీతోపాటు ప్రజా వేదికలు, సామాజిక మాధ్యమాలు, జిల్లా స్థాయిలో కార్యక్రమాల ద్వారా ఈ అంశాలను ప్రజల్లోకి నిరంతరం తీసుకెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది. సంస్థాగత బలోపేతమే ప్రధాన లక్ష్యం సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడంపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీల పునర్వ్యవస్థీకరణ, క్రియాశీల కార్యకర్తల గుర్తింపు, యువ నాయకత్వానికి ప్రాధాన్యం వంటి అంశాలపై కార్యాచరణ ప్రారంభించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని క్షేత్రస్థాయిలో పార్టీ ఉనికిని మరింత బలోపేతం చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. కాంగ్రెస్పై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఓట్ల రూపంలో మార్చుకోవడానికి ఇప్పటి నుంచే బూత్ స్థాయి నుంచే పార్టీ వ్యవస్థను పటిష్టం చేసే పనులు ప్రారంభమైనట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గ్రేటర్పై ఫోకస్.. యువతను చేరుకునే ప్రయత్నం గ్రేటర్ పరిధిలో కొత్తగా ఏర్పాటైన మూడు కార్పొరేషన్లలో నెలకొన్న రాజకీయ పరిణామాలను కూడా బీఆర్ఎస్ అత్యంత కీలకంగా చూస్తోంది. ‘సర్’పై అవగాహన కార్యక్రమాల పేరిట నగర ఓటర్లతో మరింత సన్నిహిత సంబంధాలు పెంచుకోవాలని పార్టీ యోచిస్తోంది. సర్పై కేటీఆర్ గ్రేటర్ పరిధిలో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు డిజిటల్ యుగంలో కీలకంగా మారుతున్న ‘జెన్ జీ’యువతను ఆకర్షించేందుకు ప్రత్యేక ముఖాముఖి సమావేశాలు, ఇంటరాక్టివ్ కార్యక్రమాలు నిర్వహించే ప్రణాళికను సిద్ధం చేస్తోంది. -
తెలంగాణ కేబినెట్లో భారీ మార్పులు.. ముహూర్తం ఫిక్స్!
ఢిల్లీ: త్వరలో తెలంగాణ మంత్రివర్గ ప్రక్షాళన దిశగా కసరత్తు జరుగుతోంది. జూన్ చివరి వారంలో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇవాళ రాహుల్ గాంధీని కలిసిన స్పీకర్ గడ్డం ప్రసాద్.. తనకు మంత్రి వర్గంలో చోటు కల్పించాలని కోరారు. మంత్రివర్గంలో చోటు కోసం అధిష్టానం చుట్టూ ఆశావహులు చక్కర్లు కొడుతున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి కేబినెట్లో చోటు కోసం పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.ఆది శ్రీనివాస్కు కేబినెట్ లో చోటు కల్పించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మరోవైపు, పీసీపీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. పని తీరు సరిగా లేని పలువురి మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశం ఉందని.. హై కమాండ్ అంతర్గతంగా నివేదికలు తెప్పించుకుంటుందని టాక్. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్ల పూర్తి కావడంతో కేబినెట్లో కొత్త వారికి అవకాశం కల్పించే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. -
‘బీజేపీ యాత్రతోనే మంత్రులు కల్లాల బాట పట్టారు’
హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్ నేతలు అబద్ధాలు చెబుతున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో రైతు గోసం-బీజేపీ భరోసా పేరుతో రైతాంగం పడుతున్న బాధలను తెలుసుకునేందుకు యాత్ర చేపట్టామని, నాలుగురోజుల పాటు అనేక జిల్లాల్లో పర్యటించి.. రైతాంగం ఆర్తనాదాలు విన్నామన్నారు. బీజేపీ పోరాటం చేయగానే.. ప్రభుత్వం సమీక్షలు, జిల్లాల్లో కల్లాల బాట పడుతుందని ఎద్దేవా చేశారు.‘ధాన్యం కొనుగోళ్లు 80 శాతం పూర్తి అయ్యాయని ముఖ్యమంత్రి చెప్పారు. మా పర్యటనలో 80 శాతం ధాన్యం కుప్పలు పేరుకుపోయి కనిపించాయి. మంత్రులు ఇవే సమీక్షలు, పర్యటనలు ముందే చేస్తే బాగుండేది కదా?, ఇసుక, సిమెంట్ లారీలను ముందే ఆపి ధాన్యం సేకరణ ఎందుకు చేయలేదు. రైతులే గన్నీ బ్యాగులు కొనే పరిస్థితి. లారీ, హామాలీల ఖర్చు రైతే ఇస్తున్నాడు.. రైతాంగం శ్రమను ఈ విధంగా దోపిడీ చేస్తున్నారు. చివరి గింజ వరకు కొనే బాధ్యత నాది అని ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు చేతకాకపోతే దిగిపోమ్మని గత సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఎందుకు కొనుగోలు చేయడం లేదు. గద్దెనెక్కగానే రేవంత్ రెడ్డి గద్దలెక్క మారిపోయారు. ఓటు బ్యాంకు కోసమే రైతులను వాడుకుంటున్నారు. కేంద్రం ఇచ్చిన యూరియాను కూడా సక్రమంగా ఇవ్వకుండా.. యాప్ పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారు. తుమ్మల నాగేశ్వరరావు వయసు మీరీ, బుద్ధి మందగించింది కాబట్టే బీజేపీని విమర్శిస్తున్నారు. మంత్రి పదవుల కోసం, సూట్ కేసులు మోయడానికి కాంగ్రెస్ నేతలు డిల్లీ యాత్రలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లపై బహిరంగ చర్చకు సిద్ధం.. మంత్రులు ఉత్తమ్, తుమ్మల చర్చకు వస్తారా?, బీజేపీ యాత్ర చేస్తే కాంగ్రెస్ ఎందుకు భయపడుతుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ కు పెట్రోల్ డీజల్ పై అవగాహన లేదు. పెట్రోల్ డీజల్ పై 30 శాతం వ్యాట్ ను ఎందుకు ముఖ్యమంత్రి తగ్గించడం లేదు. రైతు వడదెబ్బతో చనిపోతే మంత్రులు వెళ్లి పరామర్శించారా?.. ఎక్స్ గ్రేషియా ప్రకటించారా?, సన్ ప్లవర్, శెనిగలు కొంటున్నామని తుమ్మల చెబుతున్నారు.. మీ కౌంటర్ ఎక్కడ పెట్టారో చూపించాలి. రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ లేదు. రాష్ట్రంలో దోపిడి రాజ్యం నడుస్తోంది. కేంద్రం కొనుగోళ్లు చేయలేకపోతే.. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్లు చేయలేదా?’ అని ప్రశ్నించారు. -
రైతు గోస చూడండి
సారంగపూర్: రాష్ట్రంలో ఇప్పటివరకు 80 శాతం ధాన్యం సేకరించామని రేవంత్ సర్కారు అబద్ధాలు చెబుతోందని.. ఆ 80 శాతం ఎక్కడ కొనుగోలు చేశారో చెబుతారా? అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ప్రశ్నించారు. ఇంతటి అబద్ధాలకోరు సర్కారును గతంలో ఎక్కడా చూడలేదని ధ్వజమెత్తారు. గాలిమోటార్లలో గాలి తిరుగుడు తిరిగి చెప్పడం కాదు.. గ్రామాల్లో రైతు గోస చూడాలని, పండించిన పంటలు అమ్ముకోలేక రైతులు పడుతున్న అవస్థలు చూడాలని డిమాండ్ చేశారు. రైతులను గోసపెట్టి, బాధపెట్టే ఈ ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేనేలేదని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎం పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవగలవా? అని ప్రశ్నించారు. ఒకవేళ గెలిచి చూపిస్తే తాను జీవితాంతం రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ చేపట్టిన ‘రైతుగోస–బీజేపీ భరోసా’ యాత్ర తొలి విడత నిర్మల్ జిల్లా సారంగపూర్లో గురువారం ముగిసింది. అంతకుముందు ఏలేటి, ఎంపీ ఈటల రాజేందర్తో పాటు బీజేపీ ప్రజా ప్రతినిధుల బృందం మార్కెట్యార్డులో వరి, జొన్న, మొక్కజొన్న పంటలను పరిశీలించింది. రైతుల సమస్యలను తెలుసుకుంది. ఆ తర్వాత సాయంత్రం మండల కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో ఏలేటి మాట్లాడారు. ప్రతి గింజ కొనుగోలు చేయాలి ‘గన్నీ బ్యాగులు కొనుగోలు చేసి, హమాలీ ఖర్చులు, లారీ ఖర్చులు తామే భరించి పండించిన పంటలను విక్రయించుకునేందుకు రైతులు పడుతున్న బాధలు ప్రభుత్వానికి కనిపించడం లేదా? కనిపిస్తే కాంగ్రెస్ మంత్రులు, నాయకులు ఏం చేస్తున్నారో చెప్పాలి. బీజేపీ చేసే రైతు భరోసా కార్యక్రమానికి భయపడి అక్కడక్కడా కొన్ని లారీలు, గన్నీబ్యాగులు సమకూర్చడం కాదు.. రైతులు పండించిన ప్రతి గింజను ఎలాంటి అదనపు ఖర్చులు లేకుండా కొనుగోలు చేయాలి..’ అని ఏలేటి డిమాండ్ చేశారు. దుర్భర పరిస్థితులు కాంగ్రెస్ ఘనతే..: ఈటల రైతులే గన్నీ బ్యాగులు కొనుగోలు చేసి, హమాలీ డబ్బులు అదనంగా చెల్లించి, లారీలు సైతం తామే నమకూర్చుకునేందుకు ముందుకు వస్తున్నా మార్కెట్లలో ధాన్యం తూకం వేసే పరిస్థితి లేదని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. రైతాంగానికి ఇలాంటి దుర్భర పరిస్థితులు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. ‘మూడు నెలల క్రితమే పంట చేతికి వస్తోంది.. ఆల్ పార్టీ మీటింగ్ పెడతారా..మీకు మీరే కొనుగోళ్ల విషయంలో నిర్ణయం తీసుకుంటారా?.. అని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను సంప్రదించాం. ఆ సమయంలో మాకు తెలువదా.. మేము ఎలా కొనాలో మీరు చెప్పాలా.. అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దురహంకారానికి ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారు చేస్తున్న ఆందోళనలే నిదర్శనం..’ అని ఈటల ధ్వజమెత్తారు. కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తానని గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారు వారిని ఏవిధంగా పట్టించుకుంటోందో చెప్పాలన్నారు. రైతులకు గన్నీ బ్యాగులు, హమాలీ, లారీల ఖర్చులు తిరిగి ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు కంట కన్నీరు పెట్టించే ఈ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు చరమగీతం పాడతారని అన్నారు. రైతులకు న్యాయం చేసే వరకు బీజేపీ పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పారు. ఎమ్మెల్యేలు రామారావుపటేల్, పాయల శంకర్, పాల్వాయి హరీష్ మాట్లాడుతూ.. రైతులను క్షోభపెడితే ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని అన్నారు. రైతు కన్నీరు కారిస్తే ఆ ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతుందని అన్నారు. బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల సందర్శన..రైతులతో ముఖాముఖి నిర్మల్: ఏలేటి, ఈటలతోపాటు ఎమ్మెల్యేలు వెంకటరమణరెడ్డి, రామారావు పటేల్, రాకేశ్రెడ్డి, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, కొమురయ్య, కిసాన్సెల్ అధ్యక్షుడు లక్ష్మీనర్సయ్య తదితరులతో కూడిన బృందం నిర్మల్ జిల్లాలో పర్యటించింది. కడెం మండలం పెద్దూరుతండా, ఖానాపూర్ మండల కేంద్రంలోని మార్కెట్యార్డు, మామడ మండలం పొన్కల్, సోన్, దిలావర్పూర్ మండల కేంద్రాల్లోని ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. మామడ మండల కేంద్రం, పొన్కల్ గ్రామంలోని కొనుగోలు కేంద్రాల్లో నెల నుంచి ధాన్యం కుప్పలు ఇలాగే ఉంటున్నా ఎందుకు కొనుగోలు చేయడం లేదని మహేశ్వర్రెడ్డి ఈ సందర్భంగా సంబంధిత అధికారిని ప్రశ్నించారు. రైతుల నుంచి చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోలు చేయాలని లేనిపక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. తడుస్తున్న ధాన్యాన్ని చూస్తున్న రైతుల కళ్లల్లో నీళ్లు వస్తున్నాయని, వాళ్లను చూస్తుంటే తమకూ కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయని అన్నారు. -
కమలంలో కాంగ్రెస్ కోవర్టులు?
సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతా పార్టీలో కాంగ్రెస్ కోవర్టులున్నారనే ఆరోపణలు ఆ పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో, మరీ ముఖ్యంగా సీఎం రేవంత్రెడ్డితో బీజేపీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు అంతర్గతంగా అంటకాగుతున్నారని, సన్నిహితంగా మెలుగుతున్నారనే చర్చ కమల దళంలో కాక పుట్టిస్తోంది. కొందరు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలు, నియోజకవర్గ స్థాయిల్లో ఎక్కడికక్కడ సర్దుబాటు చేసుకుని ముందుకు సాగుతున్నట్టుగా పార్టీ నాయకత్వానికి సమాచారం అందినట్టు తెలుస్తోంది. మరోవైపు మరికొందరు పార్టీ నేతలు, వివిధ స్థాయిల నాయకులు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్తో సర్దుబాటు చేసుకున్నారనే ఆరోపణలూ గట్టిగానే వినిపిస్తుండటంతో బీజేపీ అధినాయకత్వం కూడా అప్రమత్తమైందని, పరిస్థితిని చక్కదిద్దేందుకు రంగంలోకి దిగినట్టు సమాచారం. క్లాస్ పీకిన పాటిల్ ఇటీవల రాష్ట్ర బీజేపీకి చెందిన ప్రజాప్రతినిధులతో సమావేశం సందర్భంగా...తెలంగాణ ఇన్చార్జి అభయ్ పాటిల్ కొందరు నేతలను ముఖాముఖి ప్రశ్నించి పద్థతి మార్చుకోవాలని హెచ్చరికలు జారీచేయడం చర్చనీయాంశమయ్యింది. కొందరు ప్రజాప్రతినిధులు అవసరం ఉన్నా, లేకపోయినా సీఎంను కలుసుకోవడం ఆయనతో వేదికలు పంచుకోవడం, తమ నియోజకవర్గానికి చెందిన కార్యక్రమం కాకపోయినా పాల్గొని సీఎంకు స్వాగతాలు పలకడంపై వంటి వాటిపై అంతర్గతంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. తమ నియోజకవర్గంలోని సమస్యలు, ఇతర అంశాలపై సీఎంను కలుసుకోవడంలో తప్పేమీ లేదని, అయితే సీఎం మీటింగ్లకు వెళుతూ, సంబంధం లేని చోట వేదికలు పంచుకుంటే కార్యకర్తలు, ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళతాయంటూ గట్టిగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతల వ్యవహారశైలిని పాటిల్ నిలదీసినట్టు పార్టీ వర్గాల సమాచారం. కాగా కాంగ్రెస్ నేతలతో కుమ్మక్కు, మిలాఖత్లపై తమ వద్ద ఆధారాలున్నాయనే విధంగా పాటిల్ ద్వారా అగ్రనేతలు సంకేతాలిచ్చారని అంటున్నారు. మున్సిపోల్స్లో పెద్దెత్తున మిలాఖత్.. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అనేక జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు అధికచోట్ల, బీఆర్ఎస్ విజయానికి కొన్నిచోట్ల బీజేపీ నాయకులు పూర్తిస్థాయిలో సహకరించారనే ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఆర్థికపరమైన లావాదేవీలు కూడా జరిగాయని, ఇటు ఎన్నికల కోసం ఇచ్చిన పార్టీ ఫండ్ను ఎదుటిపార్టీ ఇచ్చిన డబ్బును కొన్ని జిల్లాల్లో కొందరు పార్టీ నేతలు జేబుల్లో వేసుకున్నారనే ఆరోపణలు కూడా పెద్దెత్తున వచ్చాయి. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయావకాశాలు ఎక్కువగా లేని మెదక్, మంచిర్యాల, వరంగల్, రామగుండం, వికారాబాద్, నల్లగొండ, మహబూబ్నగర్, జనగామ తదితర జిల్లాల్లో బహిరంగంగానే కాంగ్రెస్, బీఆర్ఎస్లకు బీజేపీ నాయకులు సహకరించినట్టు అప్పట్లో విమర్శలు వినిపించాయి. కొన్ని మున్సిపాలిటీల్లో పార్టీ అభ్యర్థులకు కొన్నిచోట్ల అతి తక్కువ ఓట్లు (కొన్నిచోట్ల సున్న) రావడానికి నాయకుల తీరు, రాజకీయ ప్రత్యర్థులతో కుమ్మక్కు కావడమే కారణమని కూడా పార్టీ నిర్థారించింది. ఈ వ్యవహారంపై ఆయా జిల్లాల్లోని పార్టీ నాయకులు జాతీయ, రాష్ట్ర నాయకత్వాలకు లిఖితపూర్వక ఫిర్యాదులు కూడా చేసినట్టు విశ్వసనీయ సమాచారం. కాగా మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్కు లోపాయికారీగా సహకరించిన తీరుపై రాష్ట్ర నాయకత్వాన్ని జాతీయ నాయకత్వం నిలదీసి పూర్తి నివేదికను సమర్పించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. మళ్లీ ఆ ముద్ర పడకుండా .. బీఆర్ఎస్–బీజేపీ కుమ్మక్కు అయ్యాయని కాంగ్రెస్..కాంగ్రెస్–బీజేపీల మధ్య అవగాహన ఉందని బీఅర్ఎస్.. తరచుగా ఆరోపణా్రస్తాలు సంధించుకుంటున్న విషయం తెలిసిందే. ఇలాంటి ఆరోపణల వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి రాజకీయంగా తీరని నష్టం జరిగిందని భావిస్తున్న జాతీయ నాయకత్వం..ఈసారి అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ముందు నుంచే జాగ్రత్త పడాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాల సమాచారం. మరో రెండున్నరేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో పార్టీపై అలాంటి ముద్ర ఏదీ లేకుండా క్లీన్గా వెళ్లేందుకు అవసరమైన కార్యాచరణను ఇప్పటినుంచే సిద్ధం చేసే దిశలో చర్యలు చేపడుతోందని పార్టీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ పూర్తి బలం పుంజుకుని, కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందనే వాతావరణం నెలకొనగానే..పార్టీపై ఆరోపణలు, ఇతర రూపాల్లో ఎప్పటికప్పుడు ఏదో ఒకపెద్ద అవాంతరం ఎదురై చతికిలపడాల్సి వస్తోందని అధినాయకత్వం భావిస్తోందని సమాచారం. ప్రస్తుతం పార్టీ నేతలు కొందరు కాంగ్రెస్కు అనుకూలంగా ఉంటున్నారా? కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నారా? అనే అనుమానాల నేపథ్యంలో.. మరోసారి గతంలో మాదిరి పరిస్థితి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా ‘కోవర్ట్’ల అంశంపైనా నాయకత్వం గట్టిగా దృష్టి కేంద్రీకరించిందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. -
సింగరేణిపై బాల్క సుమన్ వ్యాఖ్యలు.. కాంగ్రెస్ నేతలు సీరియస్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి (టీబీజీకేఎస్) పూర్వ వైభవం తీసుకురావడానికి సాధారణ నిరసనలు సరిపోవని, ఉధృతమైన క్షేత్రస్థాయి పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. సింగరేణి ఆఫీసులు తగలబెట్టాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తాజాగా మాట్లాడుతూ.. టీబీజీకేఎస్కు పూర్వ వైభవం తీసుకురావడానికి మిలిటెంట్ తరహా కార్యకలాపాలు చేయాలి. సింగరేణి ఆఫీసులు తగలబెట్టాలి. రైల్వే పట్టాలను కోసిపారేయండి. కేవలం అంతర్గత సమావేశాలు, ప్రెస్ మీట్లు, సోషల్ మీడియా ప్రచారాలకే పరిమితం కాకుండా ఇలాంటివి చేయాలి. ప్రజాసమస్యలపై గట్టిగా నిలబడి పోరాడే క్రమంలో కేసులు ఎదురైనా, జైలుకు వెళ్లాల్సి వచ్చినా వెనకడుగు వేయవద్దు. కాంగ్రెస్ పాలన మూడేళ్లకు చేరుకుంటున్న తరుణంలో, గట్టిగా ఒత్తిడి తెస్తేనే కార్మిక వర్గం తమ వైపు నిలుస్తుందని పేర్కొన్నారు.బాల్క సుమన్ వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సుమన్ వ్యాఖ్యలపై తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో మంత్రి పొన్నం మాట్లాడుతూ..‘బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు చట్ట వ్యతిరేకం. సుమన్ను పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. ఆయన వ్యాఖ్యలపై సుమోటోగా కేసు నమోదు చేయాలి. రైలు పట్టాలు కోసేస్తే ఎంత ప్రమాదమో తెలియదా?. పట్టాలు కోసేస్తే యాక్సిడెంట్ అయి ప్రజలు చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు. సింగరేణి ఆఫీసును తగలపెడతారా? సింగరేణి కార్మికులు సుమన్పై తిరగబడాలి. బీఆర్ఎస్ నేతలకు ఎందుకు ఇంత ఫస్ట్రేషన్. రైతులు రోడ్లపైకి రావడం లేదని బీఆర్ఎస్ నేతలే అంటున్నారు. కృత్రిమ ఉద్యమం చేయాలని బీఆర్ఎస్ చూస్తుంది’ అంటూ మండిపడ్డారు.మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందిస్తూ..‘సుమన్ పేపర్ పులి. ప్రజల కోసం బీఆర్ఎస్ ఏమైనా చేస్తోందా?. బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేశారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఖతమైపోయింది. తగలబెట్టడం, కూలగొట్టడం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ముఖ్య నేతలు మాట్లాడాలి’ అని డిమాండ్ చేశారు. -
రూ.వేయి కోట్ల భూ కుంభకోణం
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ భూములను అందినకాడికి కొల్లగొడుతున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దషాపూర్లో సర్వే నంబరు 173 నుంచి 183 వరకు ఉన్న సర్వే నంబర్లలోని 170 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర జరిగిందన్నారు. సుమారు రూ.వేయి కోట్లు విలువ చేసే ఈ కుంభకోణంపై సిట్ లేదా సీఐడీ విచారణ జరిపి ప్రభుత్వ భూములను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంలో భాగస్వాములైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంగళవారం తెలంగాణ భవన్లో హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. ‘ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురి కాకుండా నిషేధిత జాబితా 22ఏలో పెట్టాలని తహసీల్దార్కు ఆర్డీఓ ఆదేశాలు జారీ చేశారు. ఇదే విషయాన్ని 2026 జనవరిలో హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లోనూ పొందుపరచడంతో పాటు దీనిని ప్రభుత్వ భూమిగా ఫిబ్రవరి 24న తహశీల్దార్ తేల్చారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ఫిబ్రవరి 28న ఈ భూమి ప్రైవేటు వ్యక్తులకు చెందినదిగా తహశీల్దార్ ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగు రోజుల్లో ప్రభుత్వ భూమి ప్రైవేటు భూమిగా పేర్కొంటూ భూ భారతిలోనూ అప్లోడ్ చేశారు. కలెక్టర్ ఆమోదం లేకుండా ఇది ఎలా సాధ్యమవుతుంది? రూ.వేయి కోట్ల విలువైన భూములపై జరిగిన కుంభకోణంపై చర్యలు తీసుకోవాలి’అని హరీశ్రావు డిమాండ్ చేశారు. బదిలీతో సరిపెడుతారా? ‘భూ కుంభకోణంపై మీడియా కథనాల నేపథ్యంలో కేవలం తహశీల్దార్ బదిలీతో సరిపెట్టారు. దాడుల కోసం తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లిన ఏసీబీ అధికారులు ఎవరి ఒత్తిళ్ల వల్ల తిరిగి వచ్చారో చెప్పాలి. సీఎం రేవంత్రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి ఈ కుంభకోణంలో ఉన్నందున ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. భూ భారతిలో 170ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేటు భూమిగా నమోదైంది. తహశీల్దార్ ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు సదరు అధికారిని సర్వీసు నుంచి తొలగించాలి. భూ కుంభకోణంపై సిట్ లేదా సీఐడీ విచారణ జరపడంతో పాటు ఇందులో భాగస్వాములైన అధికారులు, ప్రభుత్వ పెద్దలపై విచారణ జరపాలి’ అని హరీశ్రావు డిమాండు చేశారు. జగిత్యాలలో ఆర్టీసీ డ్రైవర్ను సస్పెండ్ చేయడాన్ని హరీశ్ ఖండించారు. ధాన్యం కొనుగోలుపై ప్రశ్నించిన డ్రైవర్పై విధించిన సస్పెన్షన్ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండు చేశారు. ఆర్టీసీ డ్రైవర్ అశోక్కు బీఆర్ఎస్ అండగా నిలవడంతో పాటు న్యాయపోరాటం చేస్తామని హరీశ్రావు ప్రకటించారు. -
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి.. మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ అవసరమైతే పోరాటానికి కూడా సిద్ధమవుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో సరైన వసతులు లేవని, మెస్ చార్జీలు పెంచినా, విద్యార్థుల భోజనంలో నాణ్యత లేదన్నారు. విద్య కోసం అవసరమైతే పోరాటానికి సిద్ధమవుతానని, వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు నిర్మిస్తే అవి కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్తున్నాయన్నారు. అవే డబ్బులు విద్యకు ఖర్చు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులకు సరైన ప్రొటీన్ ఫుడ్ అందడం లేదన్నారు రాజగోపాల్రెడ్డి. -
ఒక్కటైనా కట్టారా?
కూకట్పల్లి (హైదరాబాద్): అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా..హైదరాబాద్ నగరానికి కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలన గురించి అవగాహన ఉంది కాబట్టే నగర ప్రజలు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన అనేక ఫ్లై ఓవర్లు మొదలుకుని టిమ్స్ ఆసుపత్రి దాకా ప్రతి ఒక్కటీ తామే నిర్మించామని, ప్రస్తుతం వాటికే సీఎం రేవంత్రెడ్డి రిబ్బన్ కట్ చేస్తూ తామే నిర్మించామని చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత నగరానికి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా అదనంగా ఖర్చు చేయలేని అసమర్థ ప్రభుత్వం అని మండిపడ్డారు. రెండున్నర సంవత్సరాల్లో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా నిర్మించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించినట్టు నిరూపించినా రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. సోమవారం కూకట్పల్లిలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ మోసం చేసింది.. ‘బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేవలం అభివృద్ధి పైనే దృష్టి పెట్టాం. తెలంగాణకు 24 గంటల కరెంటు, తాగునీటిని అందించింది కేసీఆరే. కానీ అసెంబ్లీ ఎన్నిలప్పుడు అడ్డగోలుగా హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రతి వర్గాన్ని మోసం చేసింది. ప్రభుత్వ విధానాలతో హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా దెబ్బతింది. లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకు, సెంట్రింగ్ కార్మికులకు ఉపాధి లభించకుండా పోయింది. బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే భవన నిర్మాణ, సెంట్రింగ్ కార్మికుల కోసం బీమాతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. నగరంలో ప్రతి ఇంటికీ 24 గంటలు తాగునీటిని సరఫరా చేస్తాం. ఈ బాధ్యత నేనే తీసుకుంటా..’అని కేటీఆర్ స్పష్టం చేశారు. దొంగ ఓట్లపై జాగ్రత్తగా ఉండాలి ‘ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పారీ్టకి అండగా ఉన్న కార్యకర్తలకు, నాయకులకు ప్రతి ఒక్కరికీ తగిన అవకాశం, గౌరవం కల్పిస్తాం. ‘సర్’విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ ఒక్కరు ఓటు కోల్పోకుండా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలో నమోదు చేసిన దొంగ ఓట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈసారి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం డిజిటల్ విధానంలో నిర్వహిస్తాం. ఈ కార్యక్రమం దాదాపు 50 నుంచి 60 రోజుల పాటు కొనసాగుతుంది. సభ్యత్వ నమోదుకు సంబంధించి పార్టీ తరఫున కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇస్తాం..’అని కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా ‘సర్’పై కార్యకర్తలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. -
ప్రజా పాలనలో ఇంతటి దుస్థితినా?: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: గర్భిణి రైల్వే ప్లాట్ఫామ్పైనే ప్రసవించాల్సిన పరిస్థితి… మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్లాల్సిన దుస్థితి… అంటూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత, ఆరోగ్యశాఖ మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదేనా ‘ప్రజా పాలన’నా అంటూ రేవంత్ సర్కార్ను నిలదీస్తూ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారాయన. తాండూర్లో ఓ నిరుపేద గర్భిణికి 108 అంబులెన్స్ సేవలు సమయానికి అందలేదని, ఫలితంగా ఆమె రైల్వే ప్లాట్ఫామ్పైనే ప్రసవించాల్సి వచ్చిందని ఆయన ఆరోపించారు. అదే సమయంలో భద్రాచలంలో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని తరలించేందుకు హియర్స్ వాహనం అందుబాటులో లేక కుటుంబ సభ్యులు భుజాలపై మోసుకెళ్లిన ఘటన కూడా చోటుచేసుకుందని ఆయన పేర్కొన్నారు. ఘటనలకు సంబంధించిన పేపర్ క్లిప్పింగులను పోస్ట్ చేశారు.Is this the “Praja Palana” people were promised?The condition of Telangana’s public healthcare system under the Congress government is becoming deeply disturbing and heartbreaking.In Tandur, a poor pregnant woman was forced to deliver her baby on a railway platform after 108… pic.twitter.com/1O4cQYr54Y— Harish Rao Thanneeru (@BRSHarish) May 25, 2026కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్ సేవలు, హియర్స్ వాహన సదుపాయాలు ఇప్పుడు నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించారాయన. అత్యవసర పరిస్థితుల్లో పేదలకు అండగా ఉండాల్సిన వ్యవస్థలు ఇలా కుప్పకూలడం అత్యంత బాధాకరమని అన్నారు. ప్రాణాలు కాపాడాల్సిన సేవలు పనిచేయకపోవడం, మరణానంతరం గౌరవం ఇవ్వాల్సిన వ్యవస్థలు కూడా విఫలమవడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే 108 సేవలను, హియర్స్ వ్యవస్థను బలోపేతం చేయాలని, బాధ్యతను నిర్ణయించాలని రేవంత్ ప్రభుత్వాన్ని హరీశ్రావు డిమాండ్ చేశారు. -
కాంగ్రెస్ను బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు : కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో పాలనను కాంగ్రెస్ గాలికొదిలేసిందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఆదివారం అంబర్పేటలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. కేటీఆర్ మాట్లాడుతూ..రాష్ట్రంలో పాలనను కాంగ్రెస్ గాలికొదిలేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు పీకల్లోతు కోపం ఉంది. కాంగ్రెస్ను బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు. హైడ్రా, మూసీ పేరుతో పేదల ఇళ్లు కూల్చేస్తున్నారు. ఉన్న నగరాన్నే సీఎం రేవంత్రెడ్డి పట్టించుకోవడం లేదు. ఇలాంటి నాయకుడు ఫ్యూచర్ సిటీ నిర్మిస్తాడంటే నమ్మాలా?. బీఆర్ఎస్లో పనిచేసే వారికే గుర్తింపు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సర్వేల ఆధారంగానే టికెట్లు. బీఆర్ఎస్లో పని చేసేవారికే గుర్తింపు. రాష్ట్రంలో ఎప్పుడూ ఎన్నికలు జరిగిన బీఆర్ఎస్దే గెలుపు. సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తాం. ఎస్ఐఆర్పై అందరూ అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజాసమస్యలపై పోటారం చేసిన వాళ్లకే టికెట్లు. కొందరి ఓట్లు తొలగించేందుకు బీజేపీ కుట్రలు చేస్తోంది’అని ఆరోపించారు.


