Wanaparthy
-
అమరుల కుటుంబాలను మరిచిన కాంగ్రెస్ ప్రభుత్వం
మాది ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న నా కూతురు కావలి సువర్ణ 2010 జనవరి 19న తెలంగాణ కోసం ఉరేసుకుని చనిపోయింది. నాడు మా బాధను పంచుకోవడానికి ఎంతోమంది నాయకులు వచ్చి ఓదార్చి వెళ్లారు. 2014లో అప్పటి ప్రభుత్వం నా కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు రూ.10 లక్షల ఆర్థికసాయం అందజేసింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మర్చిపోవడంతో పాటు అమరుల కుటుంబాలను ఓదార్చిన పాపాన పోలేదు. ఇప్పటికై నా సీఎం రేవంత్రెడ్డి అమరుల కుటుంబాలను కలిసి వారి ఆర్థిక స్థితిగతులను తెలుసుకొని అండగా నిలవాలి. – కావలి రాములమ్మ, మిరాసిపల్లి, కొత్తకోట మండలం ● -
ప్రగతి పథంలో..
తెలంగాణ వచ్చాక ఉన్నత విద్యాలయాల ఏర్పాటు వనపర్తి: జిల్లాకు మొదటి నుంచి విద్యాపర్తిగా పేరుంది. సంస్థానాధీశుల కాలం నుంచే పాలకులు విద్యకు తగిన ప్రాధాన్యత ఇస్తూ.. ఉన్నత విద్యాలయాల ఏర్పాటుకు నాంది పలికారు. ప్రజాప్రతినిధులుగా ఎవరు ఎన్నికై నా.. తమదైన శైలిలో విద్యాభివృద్ధికి కృషిచేశారు. 1959లోనే వనపర్తిలో సాంకేతిక విద్య అందుబాటులోకి వచ్చింది. సంస్థానాధీశుల రాజప్రాసాదంలో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేతులమీదుగా పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించారు. ఆ తర్వాత పాలకులు డిగ్రీ, పీజీ, ఉద్యాన కళాశాలలను ఏర్పాటు చేయగా.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఫిషరిస్ సైన్స్ కాలేజీ, వ్యవసాయ మహిళా డిగ్రీ కాలేజీ, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలకు వనపర్తి నిలయమైంది. అదే విధంగా నర్సింగ్, మెడికల్ కాలేజీలు సైతం సువిశాలమైన విస్తీర్ణంలో రూపుదిద్దుకున్నాయి. ప్రస్తుత ప్రభుత్వంలో యంగ్ ఇండియా స్కూల్ సైతం జిల్లాకు మంజూరు కాగా.. సొంత భవనంలో ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డి విద్యనభ్యసించిన వనపర్తి జిల్లా పరిషత్ పాఠశాల, ఇంటర్ కాలేజీలను రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రూ. 47కోట్లతో అధునాతన భవన నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. రిజర్వాయర్లుగా సప్త సముద్రాలు.. వనపర్తి సంస్థానాధీశురాలైన రాణి శంకరమ్మ హయాంలో వనపర్తి చుట్టూ వర్షపునీటిని నిల్వ చేసేందుకు సప్త సముద్రాలను నిర్మించారు. అయితే జలయజ్ఞంలో భాగంగా వాటిని రిజర్వాయర్లుగా మార్చేందుకు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సర్కారు బీజం వేయగా.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వాటిని పూర్తిస్థాయిలో నిర్మించి కృష్ణానీటితో నింపారు. దీంతో పాటు జిల్లాలోని సుమారు 1,075 చెరువులు, కుంటలను సైతం కేఎల్ఐ, బీమా, జూరాల సాగునీటి కాల్వలతో అనుసంధానం చేయడంతో జిల్లా నలుమూలల కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పెబ్బేరులోని ఫిషరీస్ సైన్స్ కళాశాల పుష్కర తెలంగాణ.. పచ్చని పాలమూరు! ఎడ్యుకేషన్ హబ్గా మారిన వనపర్తి అందుబాటులోకి ఆధునిక వైద్యం రికార్డుస్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులు -
ప్రజావాణి అర్జీలు సత్వరం పరిష్కరించాలి
వనపర్తి: ప్రజావాణిలో అందిన అర్జీలను సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, డీఆర్ఓ సూర్యప్రకాశ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిరుపతయ్యతో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ఒకవేళ ఫిర్యాదుకు సంబంధించిన అంశం తమ శాఖ పరిధిలో లేకపోతే.. సంబంధిత శాఖకు లేఖ రాసి పంపించాలన్నారు. పరిష్కరించలేని అంశం ఏదైనా ఉంటే ఉన్నతాధికారులకు పంపించడం లేదా ఏ నిబంధన ప్రకారం పరిష్కారం చేయడం లేదో ఫిర్యాదుదారుడికి తెలియజేయాలి తప్ప.. తమ వద్ద పెండింగ్లో ఉంచుకోవద్దని తెలిపారు. ప్రజావాణిలో 59 దరఖాస్తులు అందినట్లు కార్యాలయ సిబ్బంది పేర్కొన్నారు. -
వేడుకలకు ముస్తాబు
రాష్ట్ర అవతరణ వేడుకలకు సమీకృత కలెక్టరేట్ ముస్తాబైంది. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించే వేడుకల ఏర్పాట్లను సోమవారం ఏఓ భానుప్రకాశ్తో కలిసి కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. ఎక్కడా ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి హాజరుకానున్నారు. ఉదయం 7:50 గంటలకు ఎస్పీ సునీతారెడ్డి, 7:53 గంటలకు కలెక్టర్ ఆదర్శ్ సురభి చేరుకుంటారు. 7:55 గంటలకు వచ్చే ముఖ్య అతిథికి వారు పుష్పగుచ్ఛ అందజేసి ఆహ్వానించనున్నారు. అనంతరం ముఖ్య అతిథి జాతీయ జెండావిష్కరణ, తెలంగాణ గీతాలాపన, పోలీసు గౌరవ వందన స్వీకరణ అనంతరం జిల్లా ప్రగతి నివేదికను ప్రజలకు చదివి వినిపిస్తారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలతో పాటు స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను శాలువాతో సత్కరిస్తారు. విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వర్తింపజేస్తూ.. మంజూరు పత్రాల అందజేత, స్టాల్స్ సందర్శనతో కార్యక్రమం ముగుస్తుంది. -
ప్రజలకు మెరుగైన వైద్యం..
తెలంగాణ ఏర్పాటు తర్వాత అనతికాలంలోనే వనపర్తి జిల్లాగా ఆవిర్భవించడం.. వెనువెంటనే జిల్లాకు నర్సింగ్, మెడికల్ కాలేజీల మంజూరుతో స్థానిక ఏరియా ఆస్పత్రి జిల్లా జనరల్ ఆస్పత్రిగా రూపాంతరం చెందింది. దీంతో వైద్య సేవల కోసం ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. అన్ని రకాల వైద్యసేవలు ఇక్కడే అందుబాటులోకి వచ్చాయి. క్యాన్సర్ కేర్ సెంటర్ నుంచి.. రూ.లక్షలు వెచ్చించాల్సి వచ్చే మెటర్నటీ వైద్యసేవలను పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన ఎంసీహెచ్లో 90శాతం కాన్పులు కావడం విశేషం. -
చదరంగానికి పూర్వ వైభవం
వనపర్తి టౌన్: చదరంగం క్రీడలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా చెస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు డా. ఎల్.మురళీధర్ తెలిపారు. జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 6, 7న స్విస్ లీగ్ పద్ధతిలో ఉమ్మడి జిల్లా క్రీడాకారుల ఎంపికలు జిల్లాకేంద్రంలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ప్రజా వైద్యశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చదరంగం క్రీడ మేధస్సును పెంచడంతో పాటు విద్యార్థుల్లో సృజనాత్మకత శక్తిని పెంపొందిస్తుందని, అందుకే విద్యార్థుల్లో ఈ క్రీడపై ఆసక్తి పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అండర్–9, 11, 13 విభాగాల్లో బాలబాలికలకు చెస్ పోటీలు నిర్వహించడంతో పాటు ఆయా విభాగాల్లో ప్రఽథమ, ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థులకు వెండి పతకాలు అందిస్తామన్నారు. స్విస్ లీగ్ పద్ధతిలో కొనసాగే పోటీల్లో ఆసక్తి గల విద్యార్థులు అత్యధికంగా పాల్గొని రాష్ట్రస్థాయి జట్టులో పాలమూరు ఖ్యాతిని చాటేలా సత్తా చాటాలని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. చెస్ పోటీలకు హాజరయ్యే బాల బాలికలకు భోజన వసతి కల్పిస్తామని, ఆసక్తిగల విద్యార్థులు 5వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఏ క్రీడ పోటీలు జరిగినా పాలమూరు ప్రాతినిథ్యం ఉంటుందని, చెస్ పోటీల్లోనూ అదే ఒరవడిని కొనసాగించేందుకు వనపర్తి చెస్ అసోసియేషన్ ధృఢ నిశ్చయంతో పని చేస్తుందన్నారు. సమావేశంలో సంఘం అధ్యక్షుడు యాదగిరి, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, ట్రెజరర్ టీపీ కృష్ణయ్య, సంయుక్త కార్యదర్శి రాములు, సత్తార్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం
వనపర్తిటౌన్: రాష్ట్ర ఆడపడుచుల సంక్షేమం, సాధికారతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదివారం పెబ్బేర్లోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన మహిళా వారోత్సవాలకు వారు ముఖ్యఅతిథులుగా హాజరై జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయంలో కట్టు, బొట్టుకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, ప్రభుత్వం మహిళలకు కానుకగా ఇచ్చే చీర ఆత్మ గౌరవానికి ప్రతీక అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమ పాలన అందిస్తోందని తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధి, సాధికారతకు ప్రాధాన్యమిస్తూ పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోందని వివరించారు. అన్నిరంగాల్లో ముందుండేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, మహిళాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. గత పాలకులు చేసిన అప్పుల భారాన్ని ప్రస్తుతం ప్రజలే భరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని నిప్పులు చెరిగారు. కార్యక్రమంలో పుర చైర్మన్ అక్కి శ్రీనివాస్గౌడ్, వైస్ చైర్మన్ సుమిత్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమోదినిరెడ్డి, వైస్ చైర్మన్ విజయవర్ధన్రెడ్డి, కౌన్సిలర్లు, కమిషనర్ పాల్గొన్నారు. గోదాం నిర్మాణానికి శంకుస్థాపన.. వనపర్తి రూరల్: మండలంలోని పెద్దగూడెం గ్రామంలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న గోదాం నిర్మాణానికి ఆదివారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కొత్తకాపు శివసేనారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ చేసేందుకు గోదాముల నిర్మాణం ఎంతో అవసరమని పేర్కొన్నారు. గోదాం నిర్మాణం పూర్తయితే ధాన్యం నిల్వ ఇబ్బందులు తొలగి రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ పుష్పలత, కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకులు కొండన్న, రాములు, బాలరాజు, గ్రామ ప్రజలు, మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
కల్యాణ.. వైభోగమే
● మన్యంకొండలో వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం మహబూబ్నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో పౌర్ణమిని పురస్కరించుకొని ఆదివారం స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన పల్లకీలో స్వామి దంపతులను సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాల మధ్య గరుడగిరి నుంచి దేవస్థానం సమీపంలోని మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని ప్రారంభించారు. మంత్రోచ్ఛరణాలు, సన్నాయి వాయిద్యాల మధ్య అపూర్వ మంగళసూత్రధారణ, తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు. కల్యాణం అనంతరం స్వామి దంపతులను పల్లకీలో గరుడగిరి వరకు తీసుకెళ్లి పూజలు జరిపించారు. రకరకాల పూలు, వివిధ ఆభరణాలు అలంకరణలో స్వామి దంపతులు దగదగ మెరిసిపోతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజ్, సూపరింటెండెంట్ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. శేషవాహనంపై స్వామివారి విహారం మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా శనివారం రాత్రి స్వామివారి శేషవాహన సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో కొలువుదీరిన స్వామివారిని శేషవాహనంపై ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. శేషవాహన సేవను తిలకించేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి దర్శనం అనంతరం ప్రత్యేక హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. -
5 నుంచి జిల్లా ప్రశిక్షణ శిబిరం
వనపర్తిటౌన్: జిల్లాలో ఈ నెల 5, 6, 7 తేదీల్లో 3 రోజుల పాటు జిల్లా ప్రశిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా ప్రశిక్షణ ప్రభారీ గిరమోని శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ అధ్యక్షతన జిల్లాస్థాయి ప్రశిక్షణ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ.. బీజేపీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఏప్రిల్ 15 నుంచి మే నెల 15వ తేదీ వరకు జిల్లాలోని అన్ని మండలాల్లో మండల ప్రశిక్షణ శిబిరాలు నిర్వహించామని, రాష్ట్ర, జిల్లాస్థాయి నాయకులకు ప్రతి జిల్లాలో ప్రశిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అందులో భాగంగానే జిల్లాకేంద్రం నాగవరంలోని సూర్యచంద్ర ప్యాలెస్ స్కూల్లో ఈ నెల 5 నుంచి 7వ తేదీవరకు జిల్లాస్థాయి ప్రశిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 250 మంది జిల్లా, రాష్ట్రస్థాయి నాయకులతో నిర్వహించే శిబిరంలో మూడు రోజుల పాటు వివిధ కాలాంశాలపై 13 సెషన్లు ఉంటాయని.. ప్రతి సెషన్కు రాష్ట్రస్థాయి నాయకులు, శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు ప్రధాన వక్తలుగా హాజరుకానున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పర్టీ రాష్ట్ర నాయకులు అయ్యగారి ప్రభాకర్రెడ్డి, సబిరెడ్డి వెంకట్రెడ్డి, మున్నూరు రవీందర్, జెడ్పీ మాజీ చైర్మన్ ఆర్.లోక్నాథ్రెడ్డి, రాష్ట్ర కార్యవర్గసభ్యులు పురుషోత్తంరెడ్డి, రామన్నగారి వెంకటేశ్వర్రెడ్డి, కేతూరి బుడ్డన్న, ఓబీసీ మోర్చా మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి బి.శ్రీశైలం, జిల్లా ప్రధాన కార్యదర్శులు పెద్దిరాజు, శ్రీనివాస్గౌడ్, వారణాసి కల్పన తదితరులు పాల్గొన్నారు. 31 వేల బస్తాల ధాన్యం రాక నవాబుపేట: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఆదివారం 31 వేల బస్తాల ధాన్యం వచ్చింది. ఇందులో ఆర్ఎన్ఆర్ 28,146 బస్తాలు రాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.2,880, కనిష్టంగా రూ.2,212 ధర వచ్చింది. అలాగే 3 వేల బస్తాల 1010 రాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.1,911, కనిష్టంగా రూ.1,711 ధర లభించిందని మార్కెట్ కార్యదర్శి రమేష్ తెలిపారు. డైట్ సెట్ విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: డైట్ సెట్లో అర్హత సాధించిన విద్యార్థులు మంగళవారం నుంచి శుక్రవారం వరకు జిల్లాకేంద్రంలోని డైట్ కళాశాలలో తమ ధ్రువపత్రాలను పరిశీలించుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ మేరాజుల్లాఖాన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ర్యాంక్ కార్డు, హాల్టికెట్, ఎస్సెస్సీ, ఇంటర్, కులం, ఆదాయం సర్టిఫికెట్లతోపాటు బోనోఫైడ్స్ తీసుకురావాలని సూచించారు. మరింత సమాచారం కోసం సెల్ నం.99499 93714ను సంప్రదించాలని కోరారు. -
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
కొల్లాపూర్ రూరల్/భూత్పూర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో 4, 5 తేదీల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఆదివారం కొల్లాపూర్ మండలం నార్లాపూర్ రిజర్వాయర్ను కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ సందర్శించి.. హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పరిశీలనలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి నార్లాపూర్ రిజర్వాయర్ను సందర్శించనున్నారని.. సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను వారు ఆదేశించారు. అనంతరం సోమశిలలో హెలిప్యాడ్ స్థలంతో పాటు కృష్ణా ఘాట్లను పరిశీలించి.. అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా భద్రతాపరమైన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. వారి వెంట జిల్లా పర్యాటకశాఖ అధికారి నర్సింహ, ఆర్డీఓ బన్సీలాల్, తహసీల్దార్ మాధవి, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ శ్రీధర్ ఉన్నారు. భూత్పూర్ మండలంలోని కర్వెన ప్రాజెక్టును 5న సీఎం రేవంత్రెడ్డి సందర్శించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా నీటిపారుదలశాఖ సీఈ సత్యనారాయణరెడ్డితో కలిసి దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి హెలీప్యాడ్ కోసం అనువైన స్థలాన్ని పరిశీలించారు. వారి వెంట ఇరిగేషన్ అధికారి విజయభాస్కర్రెడ్డి, సర్పంచ్ సుశీల రెడ్యానాయక్, నరేందర్రెడ్డి, తిరుపతిరెడ్డి ఉన్నారు. -
సర్వీస్ తంటాలు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయుల సర్వీస్లో పూర్తిస్థాయి పారదర్శకత ఉండేందుకు ప్రభుత్వం సర్వీస్ బుక్ డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ చేపట్టింది. ఇందులో భాగంగా ఐఎఫ్ఎంఎస్ (ఇంటిగ్రేటెడ్ ఫైనాన్సియల్ మేనేజ్మెంట్ సిస్టం)ను తీసుకువచ్చింది. ఉద్యోగులు తమ సర్వీస్ బుక్కులను డిజిటలైజేషన్ చేసేందుకు పెద్దఎత్తున కసరత్తు చేస్తున్నారు. అయితే చాలామంది ఉద్యోగులు సకాలంలో సర్వీస్బుక్ల నమోదు, ఆన్లైన్లో అప్లోడ్ చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ రాకపోవడం, సదుపాయాలు లేకపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించి మే 31 నాటికే గడువు ముగియగా.. మరిన్ని రోజులు గడువు ఇవ్వాలని ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు కోరుతున్నాయి. పారదర్శకత పెంచేలా.. ప్రతి ఉద్యోగికి సర్వీస్ బుక్ ఎంతో కీలకమైంది. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి రిటైర్డ్ అయ్యే వరకు పూర్తి వివరాలను ఇందులో పొందుపరుస్తారు. ఈ క్రమంలో సర్వీస్ బుక్కుల్లో పారదర్శకత పాటించేందుకు ఇప్పుడు ఆన్లైన్ విధానాన్ని తీసుకువచ్చారు. ఇందులో ప్రధానంగా మ్యానువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్, జనరల్ ఇన్సూరెన్స్, మ్యానువల్ వెరిఫికేషన్ వంటి అంశాలను తప్పకుండా నమోదు చేయాల్సి ఉంటుంది. వీటితోపాటు ముఖ్యంగా పదోన్నతులు, బదిలీ వివరాలు, వివిధ డిపార్ట్మెంట్ల పరీక్షలు, ఉపాధ్యాయుల టెట్ అర్హత వివరాలను పొందుపర్చాలి. డిప్యూటేషన్లు, ఫారిన్ సర్వీస్ వివరాలను సాధారణంగా ఎంట్రీ చేయాల్సి ఉంది. అంతేకాకుండా ప్రభుత్వం తీసుకువచ్చిన హెల్త్ స్కీం వర్తించేందుకు సర్వీస్ బుక్కులో కుటుంబ సభ్యుల వివరాలను కూడా పొందుపర్చాల్సి ఉంటుంది. నమోదులో ఇబ్బందులు.. సర్వీస్ బుక్కులు సీనియర్ ఉద్యోగి అయితే 50 నుంచి 60 పేజీలు, జూనియర్ ఉద్యోగి అయితే 40 నుంచి 50 పేజీలు ఉంటాయి. వీటిని ఆన్లైన్లో పొందుపర్చాలంటే అన్ని పేజీలను స్కాన్ చేయడంతోపాటు అన్నీ కూడా 50 ఎంబీలోపు ఉండేలా చూసుకోవాలి. అయితే చాలామంది సీనియర్ ఉద్యోగులు ఈ ప్రక్రియ తెలియకపోవడంతో ఆన్లైన్లో నమోదు కోసం కంప్యూటర్ ఆపరేటర్లను సంప్రదించాల్సి వస్తుంది. ఈ క్రమంలో బడిబాట, జనాభా లెక్కలు వంటి పనులు ఉపాధ్యాయ, ఉద్యోగులు సర్వీస్ బుక్కులో ఎంట్రీలను మరింత ఆసల్యం చేస్తున్నారు. కార్యాలయంలోనే ప్రక్రియ.. ప్రభుత్వం సర్వీస్ బుక్ల డిజిటలైజేషన్ చేపడుతున్న క్రమంలో పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బుక్లకు సంబంధించి డ్రాయింగ్ అధికారి వద్ద మాత్రమే ఆన్లైన్ ప్రక్రియ చేయాల్సి ఉంది. ఐఎంఎఫ్ పోర్టల్కు సంబంధించిన పాస్వర్డ్, ఐడీలను సదరు అధికారులకు మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. ఈ ప్రక్రియను వివిధ డిపార్ట్మెంట్లలోని మండల స్థాయి అధికారులు, ఉపాధ్యాయుల సర్వీస్ బుక్లను కాంప్లెక్స్ హెచ్ఎంలు చేపడుతున్నారు. వారు బుక్కులోని అంశాలను పూర్తిగా పరిశీలించి, అన్నింటినీ సరిచూసి ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కో ఉపాధ్యాయుడి సర్వీస్ బుక్ను ఆన్లైన్ చేసేందుకు చాలా సమయం పడుతుంది. కొన్నిచోట్ల నెట్ సమస్య, కొన్నిచోట్ల సిబ్బంది కొరత వంటివి అడ్డంకిగా మారుతున్నాయి. డిజిటలైజేషన్ ప్రక్రియలో వేధిస్తున్నసాంకేతిక, ఇతరత్రా సమస్యలు వివిధ స్థాయిలలో నమోదులో తీవ్రజాప్యంతో ఇక్కట్లు గత నెల 31 వరకే ముగిసిన గడువు మరిన్ని రోజులు పొడిగించాలని కోరుతున్న ఉద్యోగులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 26 వేలఉపాధ్యాయ, 18 వేల ఇతర ఉద్యోగులు -
ఇబ్బందులు తొలగించాలి..
సర్వీస్ బుక్ల డిజిటలైజేషన్కు సంబంధించి ఆన్లైన్ చేసేందుకు మరింత సమయం ఇవ్వాలి. సెలవులు కావడంతో కొంతమంది టూర్లకు వెళ్లడం, ఇతర పనులు, ఆరోగ్యం సమస్యలు ఉన్నవారు ఉన్నారు. వెంటనే ఆన్లైన్ చేయడం వల్ల తప్పులు దొర్లితే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ప్రభుత్వం స్పంచింది ఈ నెలాఖరు వరకు గడువు పొడిగించడంతోపాటు సర్వీస్ బుక్ల ఆన్లైన్ నమోదులో ఇబ్బందులు లేకుండా చూడాలి. – మదన్మోహన్యాదవ్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గడువు పొడిగించాలి.. ఉద్యోగ, ఉపాధ్యాయుల సర్వీస్ బుక్కులను ఆన్లైన్ చేయడం మంచి నిర్ణయమే. ఇలా చేయ డం వల్ల భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు లే కుండా ఉంటాయి. కానీ, వీటిని ఆన్లైన్ చేసేందుకు కేవలం 10 రోజులు మాత్రమే సమయం ఇచ్చి ప్రక్రియ పూర్తి చేయాలి అని చెప్పడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొంతమంది బడిబాట, కొంత మంది జనగనణలో ఉన్నారు. అలాంటి వారికి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం గడువు తేదీని పొడిగించాలి. – శ్యాంబాబు, టీపీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు● -
బాల్య వివాహాలను వ్యతిరేకించాలి
వనపర్తి: బాల్య వివాహాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తూ సమాజంలోని అన్ని అంశాలపై సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల సందర్భంగా శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్నేహ (కిషోర బాలికలు) సంఘాల సభ్యులకు జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో మాక్ పార్లమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్తో పాటు ఎస్పీ సునీతారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. బాలికలు ప్రధాని, స్పీకర్, ఎంపీల పాత్రలు పోషిస్తూ పార్లమెంట్ సమావేశం నిర్వహించారు. మహిళా సంక్షేమం, మహిళల ఆరోగ్యం, అభివృద్ధి, వరి కొనుగోళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పలు సామాజిక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కిషోర బాలికలతో ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమన్నారు. సమాజంలో ఐక్యత చాలా ముఖ్యమని, బాలికల కోసం మాక్ పార్లమెంట్ నిర్వహించడం మంచి సాధనగా అభివర్ణించారు. సమావేశంలో విద్యార్థినులు మహిళల్లో రక్తహీనత, సమాజంలో జరుగుతున్న పలు సమస్యలపై ప్రశ్నలు అడగడం బాగుందని కొనియాడారు. బాల్య వివాహాలను వ్యతిరేకించడంతో పాటు వాటిపై గళం వినిపించాలని, ఉన్నత విద్య పూర్తి చేసిన తర్వాతే వివాహం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో మూడేళ్లలో 60 బాల్య వివాహాలు జరిగినట్లు తెలిపారు. ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే హెల్ప్లైన్ నంబర్ 1098కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎస్పీ సునీతారెడ్డి మాట్లాడుతూ.. బాలికలకు విద్యనే అత్యంత ప్రాధాన్యం కావాలని, ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని లక్ష్యాలను సాధించాలన్నారు. ప్రస్తుత కాలంలో బాలికలకు అనేక సవాళ్లు ఉన్నాయని.. వాటిని అవగాహనతో అధిగమించాలని కోరారు. పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలని, ప్రశ్నించేతత్వం అలవాటు చేసుకోవాలని, ఏ రంగంలో ఉన్నా ఉత్తమ స్థానాన్ని సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు వరి కొనుగోళ్లకు సంబంధించిన కమీషన్ చెక్కులు, ఎఫ్పీఓ సంఘాలకు సంబంధించిన చెక్కులను కలెక్టర్ అందజేశారు. అదేవిధంగా బాలికల సంరక్షణకు సంబంధించిన వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో డీఆర్డీఓ ఉమాదేవి, డీఎస్పీ బాలాజీనాయక్, డీసీఓ రాణి, డీఐఓ జ్యోతి, డీడబ్ల్యూఓ సుధారాణి, జిల్లా వైద్యాధికారి డా. సాయినాథ్రెడ్డి, డీఐఈఓ నరేంద్ర, పలువురు అధికారులు, స్నేహ సంఘాల బాలికలు, విద్యార్థులు పాల్గొన్నారు. మాక్ పార్లమెంట్ నిర్వహిస్తున్న స్నేహ సంఘాల సభ్యులు -
ప్రజల భద్రతలో రాజీ లేదు
● కేసుల దర్యాప్తులో ప్రమాణాలు పాటించాలి ● సైబర్ మోసాలు, బాల్య వివాహలపై అవగాహన కార్యక్రమాలు ● ఎస్పీ డి.సునీతారెడ్డి సమీక్షలో పాల్గొన్న పోలీసు అధికారులు వనపర్తి: ప్రజల విశ్వాసమే పోలీసుశాఖకు అతిపెద్ద బలం.. ప్రతి అధికారి ప్రజలకు చేరువగా ఉంటూ, వారి సమస్యలు తెలుసుకొని వెంటనే స్పందించాలి.. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాలు, సైబర్ మోసాల నియంత్రణ, గ్రామస్థాయిలో భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడం ప్రతి పోలీసు అధికారి బాధ్యతని ఎస్పీ డి.సునీతారెడ్డి అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ భవనంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, అన్ని పోలీస్టేషన్ల ఎస్ఐలతో నిర్వహించిన నెలవారి నేర సమీక్షలో ఆమె మాట్లాడారు. ప్రతి ఎస్ఐ తమ పరిధిలోని గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని, గ్రామ పోలీసు అధికారులు తమకు అప్పగించిన గ్రామాలపై పూర్తి అవగాహనతో ఉండి ముందస్తు సమాచార సేకరణపై దృష్టి సారించాలన్నారు. రౌడీషీటర్స్, సస్పెక్ట్ల కదలికలపై నిఘా ఉంచాలని, బూకోర్ట్, నైట్ పెట్రోలింగ్ సిబ్బంది ఫింగర్ ప్రింట్ డివైస్లు వినియోగించి అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరించాలని సూచించారు. ఆన్లైన్ మోసాలపై ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయాలని.. గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే వీడియోకాల్స్, డిజిటల్ అరెస్టులు, పోలీసుల పేరుతో వచ్చే మోసపూరిత కాల్స్ను నమ్మవద్దని ప్రజలకు తెలియజేయాలన్నారు. సీసీ కెమెరాల ప్రాధాన్యత వివరిస్తూ.. ప్రతి గ్రామం, వీధి, పరిశ్రమలు, పవిత్ర స్థలాల్లో ఏర్పాటు చేయించాలని సూచించారు. డయల్ 100 కాల్స్కు త్వరితగతిన స్పందిస్తూ ప్రజల నమ్మకాన్ని మరింత పెంపొందించుకోవాలన్నారు. జిల్లావ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపడానికి ప్రత్యేక కార్యచరణ రూపొందించుకోవాలని, పోలీస్స్టేషన్ల పరిధిలో దొంగతనాలు జరగకుండా గస్తీ నిర్వహిస్తూ రాత్రిళ్లు అనవసరంగా రోడ్లపై తిరిగే వారిని కట్టడి చేయాలని సూచించారు. పోలీస్స్టేషన్లలోని రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఉండాలని.. ప్రతి రికార్డును కచ్చితంగా క్షుణ్ణంగా పరిశీలిస్తామని, నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతగా పని చేయాలన్నారు. సమీక్షలో అదనపు ఎస్పీ రాజేష్ మీనా, డీఎస్పీ గిరిబాబు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, వనపర్తి సీఐ రత్నం, కొత్తకోట సీఐ రాంబాబు, ఆత్మకూర్ సీఐ శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్ పాల్గొన్నారు. -
వారంలోగా ధాన్యం సేకరణ పూర్తి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): జిల్లాకు సంబంధించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను వారం రోజుల్లో (జూన్ 4, 5 తేదీలో)గా పూర్తి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. శనివారం మహబూబ్నగర్ కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ఉమ్మడి పాలమూరుకు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లపై ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే అత్యధిక వరిధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ నంబర్వన్ స్థానంలో నిలిచిందన్నారు. వరి, మొక్కజొన్న ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, రైతులు నష్టపోకుండా తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి బాయిల్డ్ మిల్లులకు తరలించినట్లు వెల్లడించారు. వాతావరణ శాఖ జూన్ 4 తర్వాత వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించిన నేపథ్యంలో వారం రోజుల్లోగా జూన్ 4, 5 తేదీల్లోగా కొనుగోళ్లు ప్రక్రియ పూర్తిచేయాలని సూచించారు. కొనుగోలు, రవాణా, నిల్వ, రైతులకు చెల్లింపుల ప్రక్రియను సమన్వయంతో వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ధాన్యం సేకరణలో రాష్ట్రవ్యాప్తంగా 8,575 కేంద్రాలు, 13 వేల వాహనాలు, 2 లక్షల మంది సిబ్బంది, 2008 రైస్ మిల్లులు భాగస్వామ్యం అయ్యాయని, 20.80 కోట్ల గన్నీ సంచులు సరఫరా చేశామన్నారు. శనివారం వరకు 62 లక్షల మె.ట., ధాన్యం సేకరించి.. 8.75 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,11,500 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. జిల్లాల వారీగా గోదాంలలో నిల్వ స్థలాల కేటాయింపుపై పరస్పర సమన్వయం చేసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్రను ఆదేశించారు. జూన్ 4, 5 తేదీల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టుల సందర్శిస్తారని, జూరాలతో పాటు పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును పరిశీలిస్తారని చెప్పారు. రైతు పండించిన ప్రతిగింజను కొనుగోలు చేస్తాం తడిసిన ధాన్యాన్ని కొని గోదాంలకు తరలించాం 4, 5 తేదీల్లో సీఎం రేవంత్రెడ్డి ప్రాజెక్టుల సందర్శన రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
పొగాకుతో ప్రాణాంతక సమస్యలు
వనపర్తిటౌన్: పొగాకు వినియోగంతో క్యాన్సర్ బారినపడే ప్రమాదం ఉందని.. వినియోగదారుడికంటే కుటుంబమే అధిక భారం మోయాల్సి వస్తుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి జి.కళార్చన తెలిపారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లాకేంద్రంలోని బాలుర జూనియర్ ఒకేషనల్ కళాశాల భవనం ఎదుట దినసరి కూలీలకు పొగాకుతో కలిగే నష్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడుతూ.. ఇంటి పెద్ద పొగాకుకు బానిసై అనారోగ్యం బారినపడితే ఇంట్లో వాళ్లు బతికుండగానే నరకం చూడాల్సి వస్తోందని తెలిపారు. కొద్ది నిమిషాల ఆనందం కోసం తాగే పొగాకుతో కుటుంబాలు రోడ్డున పడుతాయనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆర్థిక విలువలు పెంపొందించుకోవాలన్నారు. డా. రామచందర్రావు మాట్లాడుతూ.. మత్తుకు బానిసైన వ్యక్తులు ప్రభుత్వ ఆస్పత్రిలోని డి అడిక్షన్ సెంటర్లో కౌన్సిలింగ్ పొంది భవిష్యత్ను సుఖమయం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ కళాజాత సువర్ణ బృందం తమ ఆటపాటలతో ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా చైతన్యపర్చారు. అనంతరం దినసరి కూలీలతో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెనన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, డా. రియాశ్రీ, పట్టణ ఎస్ఐ హరిప్రసాద్, డా. శ్రీనివాస్, జూనియర్ వైద్యుడు డా. శశాంక్, పారా లీగల్ వలంటీర్లు రవీందర్, అనిల్, లోక్ అదాలత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓపెన్ పదిలో రాష్ట్రంలోనే ప్రథమం వనపర్తిటౌన్: ఓపెన్ పది, ఇంటర్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఓపెన్ పదిలో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో, ఓపెన్ ఇంటర్ ఫలితాల్లో 5వ స్థానంలో నిలిచిందని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ తెలిపారు. ఓపెన్ పదిలో 391 మందికిగాను 370 మంది పాసై 94.63 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. అలాగే ఓపెన్ ఇంటర్లో 723 మందికిగాను 612 మంది పాసయ్యారని.. 80.21 శాతం ఉత్తీర్ణత నమోదైందని చెప్పారు. వివిధ కారణాలతో చదువు మధ్యలో ఆపేసిన వారు ఓపెన్ స్కూల్ ద్వారా తమ చదువు పూర్తి చేయాలని సూచించారు. -
నేడు దరఖాస్తునకు చివరి గడువు
వనపర్తి: ఉమ్మడి జిల్లాలోని మైనార్టీ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్, మైనార్టీ సంక్షేమశాఖ ద్వారా సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణ దరఖాస్తు గడువు సోమవారంతో ముగియనుందని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి ముజాహిద్ ఖాన్, ఉమ్మడి జిల్లా ఆర్ఎల్సీ ఖాజా బహుద్దీన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు htt ps://cet.cgg.gov.in/tmreir వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలని, కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షలు మించరాదన్నారు. మొత్తం 100 సీట్లు ఉంటాయని, ఇందులో మహిళలకు 33 శాతం దివ్యాంగులకు 5 శాతం సీట్లు కేటాయించనున్నట్లు వివరి ంచారు. మరిన్ని వివరాలకు ఫోన్నంబర్ 040 23236112 సంప్రదించాలని సూచించారు. దరఖాస్తుల ఆహ్వానం వనపర్తి: సీఎం ఓవర్సిస్ స్కాలర్షిప్ పథకం కింద విదేశీ విద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే మైనార్టీ విద్యార్థులు జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు www.tela nganaepass.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి ముజాహిద్ఖాన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విదేశీ విద్యాలయాల్లో జనవరి 1 నుంచి జూన్ 30 వరకు ప్రవేశాలు పొందిన వారు అర్హులని, కుటుంబ ఆదాయం రూ.5 లక్షలు మించరాదని పేర్కొన్నారు. ఎంపికై న వారికి రూ.20 లక్షల ఉపకార వేతనంతో పాటు విమాన ప్రయాణ ఖర్చులు రూ.60 వేలు చెల్లిస్తామన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన హార్డ్కాపీలు రెండు సెట్లను అటెస్టెడ్ చేసి జులై 31 వరకు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాలకు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ కార్యాలయం లేదా సెల్నంబర్ 72078 54914, ఫోన్నంబర్ 08545 232500 సంప్రదించాలన్నారు. మండలానికి శిక్షణ ఐఏఎస్లు గోపాల్పేట: శిక్షణ ఐఏఎస్లు సాయిశివాని, సచిన్ బసవరాజ్ రెవెన్యూశాఖ గురించి తెలుసుకునేందుకు శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. తహసీల్దార్ తిలక్కుమార్రెడ్డి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ మదన్ మండలంలోని చాక్పల్లికి తీసుకెళ్లి సర్వేనంబర్లు, దిక్కులు చూపే రాళ్లు చూపించారు. శనివారం కార్యాలయంలో రైతుల ఖాతాలు ఎలా చూడాలి, రికార్డులు ఎన్ని రకాలు, ఎలా పరిశీలించాలనే విషయాలను తహసీల్దార్ వారికి వివరించారు. వారి వెంట రెవెన్యూ సర్వేయర్లు ఉన్నారు. -
వరి సాగే అధికం..
మండలంలో సాగునీటి వనరులు అధికంగా ఉండటంతో ఇక్కడి రైతులు వరి సాగుపైనే దృష్టి సారిస్తున్నారు. జూరాల ఎడమ కాల్వతో పాటు అమరచింత ఎత్తిపోతల పథకం ద్వారా సమృద్ధిగా సాగునీరు అందుతుండటంతో ఎలాంటి వరి వంగడాలు వేసుకుంటే మంచి లాభాలు వస్తాయనే విషయాలను రైతులకు వివరిస్తున్నాం. – అరవింద్, ఏఓ, అమరచింత జిల్లాలో వానాకాలం పంటల సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఆదేశాలతో పూర్తి చేశాం. ప్రభుత్వం సన్నరకం వరికి బోనస్ ఇస్తుండటంతో రైతులు అత్యధికంగా వరి సాగుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. రెండోస్థానంలో పత్తి, చెరుకు, కంది సాగుకు మక్కువ చూపుతున్నారు. ఎంత మేర విత్తనాలు, ఎరువులు కావాలనే వివరాలను ఏఓలతో సేకరించి ప్రభుత్వానికి నివేదించాం. పంటల సాగుకు ముందే నిల్వ చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. – ఆంజనేయులుగౌడ్, జిల్లా వ్యవసాయ అధికారి -
పోక్సో.. కాస్కో
అమ్మాయిల పట్ల లైంగిక దాడులకు పాల్పడే వారు ప్రభుత్వ ఉద్యోగులైనా.. ఇతరులైనా పోక్సో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. 7వ తరగతి నుంచి ఈ చట్టంపై అవగాహన కల్పించే విధంగా పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. పాఠశాల, ఇంటర్ విద్యార్థులతో పాటు గ్రామాల్లో ప్రజలకు సైతం ఈ చట్టం గురించి వివరిస్తున్నాం. బాలికల పట్ల ఎవరైనా దాడులకు పాల్పడితే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వడం, పోలీసులకు ఫిర్యాదు వంటివి చేయాలి. – వెంకటేశ్వర్లు, డీఎస్పీ మహబూబ్నగర్ మహబూబ్నగర్ క్రైం: బాలికలు, అమ్మాయిలను లైంగిక వేధింపులు, దాడుల నుంచి రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్) చట్టాన్ని 2012 నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. ఈ సెక్షన్ కింద అభియోగం మోపబడిన వారికి రెండు నెలలు లేదా ఆరు నెలలు లేదా ఏడేళ్లు లేకుంటే జీవితఖైదు శిక్ష పడుతుంది. ప్రధానంగా పోక్సో కేసు నమోదు చేసిన అతి తక్కువ కాలంలో పరిశోధన చేసి సంబంధిత వ్యక్తిపై చార్జిషీటు దాఖలు చేసి కోర్టులో హాజరుపరచాలి. ఆ తర్వాత న్యాయమూర్తి సంఘటన తీవ్రతను బట్టి నిందితుడికి జైలుశిక్ష ఖరారు చేస్తారు. గురువులు సైతం వక్ర బుద్ధి ఏం చేసిన బయటకు పొక్కదనో.. లేదా నోరు లేదనో అభంశుభం తెలియని బాలికలపై కొందరు ప్రబుద్ధులు వెకిలి చేష్టలకు పాల్పడుతున్నారు. కొందరు యువత అశ్లీల వీడియోల ప్రభావంతో మైనర్లపై అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. అలాగే విద్యార్థినులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన గురువులు సైతం వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు జిల్లాలో నిత్యం చోటు చేసుకుంటున్నాయి. అయితే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కొన్ని ప్రభుత్వ పాఠశాలలోనే ఇలాంటి ఘటనలు జరుగుతుండటం బాధాకారం. కొంతకాలంగా జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుండగా, తీవ్రతను బట్టి కోర్టులు జీవిత ఖైదు శిక్షలు విధిస్తున్నాయి. బెయిల్ దొరకడం కష్టమే.. పోక్సో కేసులు చాలా సున్నితమైనవి. అంతే కాకుండా నేరం రుజువైతే నిందితులకు బెయిల్ దొరకడం కష్టమేనని పోలీసులు పేర్కొంటున్నారు. ఒక్కసారి కేసు నమోదైతే ఆ తర్వాత ఇతర కేసుల మాదిరిగా రాజీ కుదుర్చుకునే అవకాశం కూడా ఉండదు. కేవలం దోషిని కటకటాల్లోకి నెట్టడంతోనే దీని పర్యావసనం ఆగిపోదు. మొత్తం కుటుంబం సమాజంలో విలువను కోల్పోయి తలదించుకు బతకాల్సి వస్తుంది. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాలో కలిపి 2020 నుంచి ఇప్పటి వరకు మొత్తం 2,369 పోక్సో కేసులు నమోదయ్యాయి. వీటిలో నేరారోపణలు రుజువై 40 మందికి శిక్ష పడింది. దాదాపు 90 శాతం కేసులు ఇంకా కోర్టు పరిధిలోనే ఉన్నాయి. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లాలో 758 పోక్సో కేసులు నమోదయ్యాయి. శిక్షలు పడిన పలు కేసులు ఇలా.. మిడ్జిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2020లో టీవీ చూడటానికి ఇంటికి వచ్చిన ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసిన రమేష్ అనే యువకుడికి ఈ నెల 7న న్యాయమూర్తి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 2021 జవనరి 24న జడ్చర్ల పట్టణానికి చెందిన ఎండీ సాబిల్ ఓ బాలిక ఫొటోలు మార్ఫింగ్ చేసి బెదిరించి బలవంతంగా జడ్చర్లలోని లాడ్జికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. సదరు దృశ్యాన్ని వీడియో తీసి తన మిత్రులు సయ్యద్ తాలిబ్, సయ్యద్ అల్తాప్లకు వాట్సాప్లో పంపించాడు. వారు కూడా వీడియోలు చూపించి అమ్మాయిని లొంగతీసుకోవడానికి ప్రయత్నించారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో పోక్సో కోర్టు న్యాయమూర్తి నిందితుల్లో ఏ1 ఎండీ సాబిల్కు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.90 వేల జరిమానా, ఏ2 సయ్యద్ తాలిబ్, ఏ3 సయ్యద్ అల్తాప్కు ఒక్కొక్కరికి మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. మహబూబ్నగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2023 మే 7న ఇంటి బయట నిద్రిస్తున్న ఆరేళ్ల బాలికను ఓ వ్యక్తి తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడగా.. నిందితుడికి జీవిత ఖైదు శిక్ష విధించారు. గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను మాయమాటలతో లోబరుచుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకొని మోసం చేసిన ఘటనపై 2017లో కోదండపూర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసుపై గద్వాల ఫాస్ట్ట్రాక్ స్పెషల్ కోర్టు నిందితుడు చాకలి హరిచంద్రకు 35 ఏళ్ల జైలుశిక్ష, రూ.5 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. మహబూబ్నగర్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని ధర్మాపూర్ పాఠశాలతోపాటు షాసాబ్గుట్ట, వన్టౌన్ స్టేషన్ పరిధిలో వీరన్నపేట హైస్కూల్లో పనిచేసే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆయా పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి అమ్మాయిలపై లైంగిక దాడి చేయగా ఈ ముగ్గురిపై పోక్సో కేసులు నమోదయ్యాయి.’ 2020 నుంచి ఉమ్మడి జిల్లాలో 2,369 పోక్సోకేసులు ఏడేళ్ల వ్యవధిలో ఒక్క మహబూబ్నగర్లోనే 758 కేసులు నమోదు కీచకులుగా మారుతున్న కొందరు ఉపాధ్యాయులు పకడ్బందీగా చట్టం అమలుతో నిందితులకు కఠిన శిక్షలు -
సంతోషం కలిగించింది..
తమ వేతనాలు ఇక నుంచి ప్రతి నెల ఒకటో తేదీనే చెల్లించే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించడం సంతోషం కలిగించింది. ఇంతవరకు వేతనం కోసం రెండు, మూడు నెలలు వేచి చూడాల్సిన పరిస్థితి ఉండింది. తమలాంటి ఉద్యోగుల కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించడం ఆనందంగా ఉంది. – చరణ్, పంచాయతీ కార్మికుడు, మస్తీపురం చిన్న పంచాయతీలకు ప్రత్యేక నిధులు మంజూరయినప్పుడే పని చేస్తున్న కార్మికులకు వేతనాలు చెల్లించే పరిస్థితి ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతి నెల ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వేతనాలు చెల్లిస్తామని ప్రకటించడం మాలాంటి కార్మికుల ఆశలకు ఊపిరి నింపింది. ఇక నుంచి మేము కూడా ప్రతి నెల ఒకటో తేదీనే వేతనాలు తీసుకుంటామనే ప్రకటన సంతోషం కలిగిస్తోంది. – చుక్క అంజన్న చింతరెడ్డిపల్లి పంచాయతీ వర్కర్. గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు ఇక నుంచి ప్రతి నెల ఒకటో తేదీన చెల్లిస్తామని సీఎం ప్రకటించడం హర్షణీయం. రెండు, మూడు నెలలు దాటినా వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కార్మికులకు ప్రతినెల చెల్లించేందుకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామని, అధికారులు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించడం మంచిదే. ఇచ్చిన హామీ అమలు చేయకపోతే కార్మికులతో కలిసి ఆందోళనలు నిర్వహిస్తాం. – సి.రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు, టీయూసీఐ అమరచింత -
తరుగు పేరిట కోత విధిస్తే చర్యలు
● తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం.. రైతులు ఆందోళన చెందొద్దు ● రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాన్గల్/వీపనగండ్ల: తరుగు పేరిట రైతుల ధాన్యంలో కోత విధించే రైస్మిల్లర్లపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. మండలంలోని కేతేపల్లిలో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని శుక్రవారం కలెక్టర్ ఆదర్శ్ సురభి, రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్తో కలిసి మంత్రి పరిశీలించారు. మార్కెట్లో ఉన్న సమస్యలు, ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యాన్ని స్థానిక రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందొద్దన్నారు. కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని.. తూకం చేసిన ధాన్యం తరలింపునకు లారీల సంఖ్య పెంచాలని సూచించారు. అలాగే మిల్లులకు చేరిన ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేయించాలని, కేంద్రాల్లో రైతులకు సరిపడా టార్పాలిన్లు, తాగునీటి వసతి కల్పించాలన్నారు. అలాగే సమీపంలో ఉన్న మైరూన్ రైస్మిల్లును సందర్శించి ధాన్యం అన్లోడ్, నిల్వలపై ఆరా తీశారు. మిల్లుల వద్ద లారీలు ఎట్టి పరిస్థితుల్లో ఆగొద్దని, అవసరమైతే స్థానికంగా హమాలీలను నియమించుకొని వేగంగా అన్లోడ్ చేయించాలని సూచించారు. హమాలీల సంఖ్య పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. ఎఫ్సీఐ ఇబ్బందులు మంత్రి దృష్టికి.. రైతులు తాలు, ధుమ్ము ఉన్న ధాన్యం తీసుకురావడంతో బియ్యంలో మెరికలు, నలుపుగా వస్తుండటంతో ఎఫ్సీఐ వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని మిల్లు యజమాని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. శుభ్రం చేసిన ధాన్యం తీసుకొస్తే ఇబ్బందులు ఉండవని తెలిపారు. మంత్రి వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్దన్సాగర్, తహసీల్దార్ కార్తీక్రావు, కాంగ్రెస్ నాయకులు రవికుమార్, పుల్లారావు, భాస్కర్యాదవ్, రాముయాదవ్, పౌరసరఫరాల అధికారులు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. -
మహిళల అభ్యున్నతితోనే రాష్ట్రం అభివృద్ధి
వనపర్తిటౌన్: త్వరలో నియోజకవర్గంలో ఒక్క పూరి గుడిసె కనిపించకుండా ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల సందర్భంగా శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో మహిళా సంఘాల సభ్యులకు బ్యాంక్ లింకేజీ చెక్కులు, రెండోవిడత ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళల అభ్యున్నతితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా నమ్ముతుందని.. మహిళల ఆర్థికాభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి ఒక్క వనపర్తి జిల్లాలోనే ఇప్పటి వరకు రూ.30.29 కోట్లను ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించిందన్నారు. ఆరోగ్య బీమాను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని, జిల్లాలో 30 వేల తెల్ల రేషన్ కార్డులు కొత్తగా ఇచ్చినట్లు తెలిపారు. విద్య, వైద్యానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఆరువేల మంది ఉపాధ్యాయులను నియమించినట్లు వెల్లడించారు. త్వరలో వనపర్తి మహిళలకు పెట్రోల్బంక్ మంజూరు కాబోతుందని, ప్లాట్లు లేని పేదలకు వెయ్యి ప్లాట్లు మంజూరు చేసి అందులో లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు. మహిళలు సూపర్మార్కెట్, రైస్మిల్లు, గోదాములు నిర్మించుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళల ఆర్థిక సాధికారతకు జిల్లాలో ఇప్పటి వరకు రూ.83.76 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు, మొదటి విడతలో మహిళలకు ఉచితంగా 12,669 ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తే.. మలి విడతలో 15 వేల చీరలు వచ్చినట్లు వెల్లడించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ మాట్లాడుతూ.. మహిళల చేతుల్లో సంసారం ఉంటేనే కుటుంబం బాగుపడుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. సంఘంలో ఉన్న మహిళ ప్రమాదవశాత్తు చనిపోతే తీసుకున్న రుణం మొత్తం మాఫీ అయ్యే విధంగా ప్రభుత్వమే బీమా చేసినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, క్యాంటీన్లు, సోలార్ ప్లాంట్లు, బస్సులు, గోదాములు అన్ని మహిళలకే కేటాయిస్తున్నట్లు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మహిళా సంఘాల సభ్యులకు రూ.3.40 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణ చెక్కును అందజేశారు. కార్యక్రమంలో పుర చైర్పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ మధుసూదన్గౌడ్, పుర కమిషనర్ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా ఎన్యూమరేషన్ ప్రక్రియ
వనపర్తి: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)లో భాగంగా జూన్ 25 నుంచి ప్రారంభమయ్యే ఎన్యూమరేషనన్ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పి.సుదర్శన్రెడ్డి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ షెడ్యూల్, నిర్వహణపై అవగాహన కల్పించారు. వీడియో కాన్ఫరెనన్స్లో కలెక్టరేట్ కాన్ఫరెనన్స్ హాల్ నుంచి కలెక్టర్ ఆదర్శ్ సురభి, రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ హాజరయ్యారు. అనంతరం కలెక్టర్ సూపర్వైజర్లతో మాట్లాడుతూ.. మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి సూపర్వైజర్ తమ పరిధిలోని పనులను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, సి–సెక్షన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. 51 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలి వనపర్తిటౌన్: ఖాళీగా ఉన్న 600పైగా ఎంఈఓ పోస్టులు, 80 డిప్యూటీ ఈఓ కేడర్ పోస్టులను పదోన్నతుల ద్వారా వెంటనే భర్తీ చేయాలని ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జి.సదానందంగౌడ్ డిమాండ్ చేశారు. గురువారం రాత్రి జిల్లాకేంద్రంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పోస్టులు ఖాళీగా ఉండటంతో పాఠశాలల పర్యవేక్షణ అస్తవ్యస్తంగా మారిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు 51 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల హెల్త్స్కీమ్ అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అభినందనీయమని, రాష్ట్ర ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు కొత్తగా ఉమ్మడి సర్వీస్ నిబంధనలు రూపొందించాలన్నారు. సీపీఎస్ రద్దు చేసి కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పింఛన్ విధానం అమలు చేయాలని కోరారు. మోడల్, ఎయిడెడ్ పాఠశాలల్లో టీచర్లకు 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సైతం హెల్త్కార్డు వర్తింపజేసి మినిమం బేసిక్ పే, సమ్మె కాలపు వేతనాలు చెల్లించాలన్నారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, సీపీఎస్ ఉపాధ్యాయులకు సంబంధించిన డీఏ బకాయిలను వెంటనే మంజూరు చేయాలని, పెండింగ్ డీఏలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం సంఘం జిల్లా జిల్లా అధ్యక్షుడిగా నర్సింహనాయుడును ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి గజేందర్, ఆర్థిక కార్యదర్శి సభ్యుడు అలీ తదితరులు పాల్గొన్నారు. జూరాలకు స్వల్ప ఇన్ఫ్లో ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్ఫ్లో వచ్చి చేరుతుందని పీజేపీ అధికారులు తెలిపారు. గత రెండు రోజులుగా స్థానికంగా కురుస్తున్న వర్షాల ఆధారంగా ప్రాజెక్టుకు శుక్రవారం సాయంత్రం వరకు ప్రాజెక్టుకు 3,005 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. 30 క్యూసెక్కులు ఆవిరి అయ్యిందని చెప్పారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 0.950 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇదిలా ఉండగా.. డెడ్ స్టోరేజీ లెవెల్లో ఉన్న జూరాల నీటిమట్టం స్థానికంగా కురుస్తున్న వర్షాలతో స్వల్పంగా ఇన్ఫ్లోలు రావడంతో తాగునీటి పథకాలకు ఇబ్బందులు తప్పినట్లయింది. పీయూలో నలుగురికి ప్రొఫెసర్లుగా పదోన్నతి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పీయూలో పలు డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న అధ్యాపకులకు ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదో న్నతులు కల్పించే ప్రక్రియను చేపట్టారు. 15 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న వారిని అసోసియేట్ ప్రొఫెసర్ నుంచి ప్రొఫెసర్కు పదోన్నతులు కల్పించారు. ఇందులో మైక్రోబయోలజీ డిపార్ట్మెంట్లో మధుసూదన్రెడ్డి, కిషోర్, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో చంద్రకిరణ్, నూర్జహాన్ ఉన్నారు. కామర్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజ్కుమార్కు అసోసియేట్ ప్రొఫెసర్గా పదోన్నతి కల్పించారు. -
అన్నదాతల నిరసన
వనపర్తి రూరల్: మండలంలోని రాజపేట శివారులో ఉన్న గిరిజన భవనంలో అధికారులు వరి ధాన్యం నిల్వ చేస్తున్నారు. గురువారం గ్రామంలోని రైతులు ట్రాక్టర్లలో ధాన్యం తీసుకొచ్చి దించుకోవాలని అధికారులను కోరారు. తడిసిన ధాన్యం మదనాపురం బాయిల్డ్ మిల్లుకు తీసుకెళ్లాలని సూచించగా.. ఇక్కడే దించుకోవాలంటూ రైతులు పట్టుబట్టారు. ఎస్ఐ హృశికేష్ అక్కడికి చేరుకొని సింగిల్విండో చైర్మన్ రఘువర్ధన్రెడ్డి, సర్పంచ్ ఎల్లయ్య కలిసి రైతులతో మాట్లాడారు. తడిసిన ధాన్యం వేరే మిల్లుకు తరలించాలని, తడవని ధాన్యం ఇక్కడే దించుకుంటామని చెప్పడంతో రైతులు శాంతించారు. కాగా.. లారీల్లోని సంచులు దించుతుండగా మొలకెత్తిన సంచులు కనిపించడంతో మళ్లీ గొడవ మొదలైంది. లారీలోని తడిసిన ధాన్యం దించుకుంటారు.. తమ ధాన్యం వేరే మిల్లుకు ఎందుకు తీసుకెళ్లాలని అధికారులను ప్రశ్నించారు. ఎంతచెప్పినా వినకపోవడంతో అధికారులు గోదాంకు తాళం వేసి వెళ్లిపోయారు. చివరకు పౌరసరఫరాల సంస్థ డీఎం ఆంజనేయులు అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడి తడిసిన ధాన్యం మదనాపురం బాయిల్డ్మిల్లుకు తరలించేలా ఒప్పించారు. -
ప్రజాసేవ.. గొప్ప మానవత్వం
వనపర్తి రూరల్: ప్రతి మనిషి తన సంపాదనలో కొంత భాగాన్ని ప్రజాసేవకు వినియోగించడం గొప్ప మానవత్వమని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గురువారం పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామంలో బూజుల సోమమ్మ, రంగారెడ్డి మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో వారి కుమారులు ఖగేంధర్రెడ్డి, హేమసుందర్రెడ్డి, భువనేశ్వర్డ్డి ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, ఎస్పీ సునీతారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇతర దేశాల్లో ఉంటూ స్వగ్రామంలో తల్లిదండ్రుల పేరిట కంటి వైద్య శిబిరం నిర్వహించిన బీఎస్ఆర్ మెమోరియల్ సొసైటీ వ్యవస్థాపకులను ఆయన అభినందించారు. సమాజంలో ప్రతి మనిషి సంపాదించిన దాంట్లో కొంత పేదలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోసం ఖర్చు చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. తాను కూడా తన స్వగ్రామం మంగంపల్లిలో 20 ఏళ్లు సర్పంచ్గా పని చేశానని, ఆ గ్రామంలో ఆడబిడ్డల పెళ్లిళ్లకు తనవంతుగా రూ.21 వేలతో పాటు పుస్తే, మెట్టెలను అందిస్తూ వస్తున్నానని.. ఎంపీపీ అయిన తర్వాత మండలస్థాయిలో పేద కుటుంబాల్లో మృతిచెందిన వారి అంత్యక్రియల నిమిత్తం రూ.5 వేలు మేఘన్న అభయాస్తం ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామంలో ఎంతోమంది చదువుకునే విద్యార్థులు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి, పేదలకు తనవంతు సాయం అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల కష్టాల్లో తోడుగా నిలబడే మంచి మనసున్న వారందరికి సమాజం రుణపడి ఉంటుదన్నారు. కన్నవారిని, జన్మనిచ్చిన గ్రామాన్ని ఎప్పటికీ మరవొద్దని.. తమకు తోచిన సాయాన్ని అందిస్తూ రావాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పుట్టా నాగేష్, పెబ్బేరు పుర చైర్మన్ అక్కి శ్రీనివాస్గౌడ్, బీఎస్ఆర్ సొసైటీ సభ్యులు, మార్కెట్ వైస్ చైర్మన్ విజయవర్ధన్రెడ్డి, ఉప సర్పంచ్ బొల్లి రాజు, సమాఖ్య అధ్యక్షురాలు ఇందిర తదితరులు పాల్గొన్నారు. -
‘రుణ’ం తీర్చలేక.. ప్రాణాలతో ‘విముక్తి’
● ఉమ్మడి జిల్లాలో ఇటీవల పెరుగుతున్న బలవన్మరణాలు ● అర్ధంతరంగా తనువు చాలిస్తున్న యువతరం ● పిల్లల నూరేళ్ల జీవితాన్నీ చేజేతులా కాలరాస్తున్న వైనం ● ఆన్లైన్ లోన్, బెట్టింగ్ యాప్ల బారిన పడి కుంగుబాటు ● నారాయణపేట జిల్లా మక్తల్కి చెందిన కర్రెమ్ సూర్యనారాయణ అలియాస్ తిమ్మప్ప అలియాస్ సూర్య, అలియాస్ తిప్పియ్య అనే 27 ఏళ్ల వ్యక్తి ఆన్లైన్ బెట్టింగ్కు బానిసయ్యాడు. గత ఏడాది కాలంగా డబ్బుల కోసం దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. మక్తల్తో పాటు పరిసర ప్రాంతాల్లో కిరాణం, వైన్ షాపులు, తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్గా చేసుకుని దొంగతనాలకు పాల్పడేవాడు. ఇటీవల పోలీసులకు పట్టుబడడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 10 నెలల్లో సుమారు 25 మంది వరకు.. ఉమ్మడి పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో గత ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు సుమారు 25 మంది అప్పుల బాధతో బలవన్మరణాలకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఒక్క గద్వాల జిల్లాలోనే 20 మంది వరకు ఉన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన వారిలో అత్యధికంగా అత్యాశతో అప్పులు చేసిన వారు.. ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్న యువకులు తనువు చాలించినట్లు తెలుస్తోంది. సాధారణ ఖర్చులు పెరగడంతో.. ఉమ్మడి పాలమూరులో ప్రధానంగా మధ్య తరగతి వర్గాలు ఎక్కువగా వ్యవసాయం, కూలీ పనులు, చిరు వ్యాపారాలతో పాటు పలు ప్రైవేట్ సంస్థల్లో చిన్నపాటి ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తున్నాయి. పిల్లల చదువులు, వైద్యం, ఇంటి అద్దెల వంటి సాధారణ ఖర్చులు ఏటేటా పెరుగుతున్నాయి. ఇందుకనుగుణంగా జీతాలు పెరగకపోవడంతో సరిపోక కుటుంబ పోషణ భారంగా మారింది. బ్యాంకుల్లో రుణాలు సులభంగా అందకపోవడంతో చాలా మంది ప్రైవేట్ ఫైనాన్స్, రోజు వారీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. చిన్న మొత్తంతో ప్రారంభమైన అప్పు.. ఆ తర్వాత నెల నెలా వడ్డీలతో కలిపి అధిక భారంగా మారుతుండడం ఆయా కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ● 2026 ఏప్రిల్ 6: గద్వాల జిల్లా అయిజ మండలం చిన్నతాండ్రపాడుకు చెందిన ఓ వ్యక్తి కుటుంబ అవసరాల కోసం తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. కొన్ని నెలలు సక్రమంగా వడ్డీలు చెల్లించాడు. ఆ తర్వాత చెల్లించకపోవడంతో ఒత్తిళ్లు రావడం.. తీర్చే స్థోమత లేకపోవడంతో పురుగుల మందు తాగి తనువు చాలించాడు. ● 2025 ఆగస్ట్ 15: నాగర్కర్నూల్ జిల్లా వెల్దండకి చెందిన ఓ విద్యార్థి ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు. గమనించిన తల్లిదండ్రులు అతడిని హెచ్చరించారు. అప్పులు ఇచ్చిన వారికి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో విద్యార్థి మరోసారి ఆన్లైన్ బెట్టింగ్ ఆడగా.. డబ్బులు పోయాయి. దీంతో మనస్తాపానికి గురై అతడు ఉరి వేసుకుని మృతిచెందాడు. ● గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలో సెలూన్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తి కొంతకాలంగా మట్కా జూదానికి అలవాటు పడి అప్పుల పాలయ్యాడు. చేసిన అప్పులు తీర్చలేక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. 2025 డిసెంబర్ 12 : గద్వాలకి చెందిన ఓ ఉపాధ్యాయుడు రియల్ ఎస్టేట్తో పాటు ఫైనాన్స్, చిట్టీ వ్యాపారాలు చేసేవాడు. పెట్టుబడుల కోసం భారీగా అప్పు చేశాడు. నష్టాలు రావడం.. అప్పులు చెల్లించే స్థోమత లేక గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అత్యాశతో సామర్థ్యానికి మించి అప్పులు.. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో కొందరు సామర్థ్యానికి మించి అప్పులు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా యువకులు రియల్ ఎస్టేట్, ఇతరత్రా వ్యాపార పెట్టుబడుల కోసం భారీగా రుణాలు సేకరిస్తున్నారు. తమకు తెలిసిన వారి వద్ద, పలు ప్రైవేట్ బ్యాంకుల్లో అప్పులు తీసుకుంటున్నారు. ఆ తర్వాత వ్యాపారాలు సరిగ్గా నడవకపోవడం.. రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడం వంటి విపత్కర పరిస్థితుల్లో బ్యాంక్లకు నెలనెలా ఈఎంఐలు కట్టలేని పరిస్థితి ఉంటోంది. ఈ క్రమంలో మరో చోట రుణం తీసుకొచ్చి వడ్డీలు చెల్లించడం.. క్రెడిట్ కార్టుల నుంచి నెల వారీగా సర్దుబాటు చేయడం వంటివి చేస్తూ.. చివరకు అప్పులు తీర్చలేక చతికిలపడుతోంది. లోన్, బెట్టింగ్ యాప్ల బారిన పడి.. ప్రస్తుత తరంలో సెల్ఫోన్ నిత్యావసరంగా మారడం.. సామాజిక మాధ్యమాల్లో లోన్ యాప్ల ఆకర్షణీయ ప్రకటనలు కట్టిపడేసేలా ఉంటున్నాయి. ఆధార్, పాన్, ఫోన్ నంబర్ ఉంటే చాలు.. నిమిషాల్లో రుణాలు ఇస్తుండడంతో అప్పుల పాలైన వారు వాటిని ఆశ్రయిస్తున్నారు. ఆ తర్వాత వడ్డీల పేరుతో నిర్వాహకులు వేధింపులకు దిగడం.. చెల్లించని పక్షంలో రుణ గ్రహీతలు ఇచ్చిన కాంటాక్ట్ నంబర్లకు ఫోన్లు చేసి అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారు. ఈ అవమానాలు భరించలేక పలువురు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే జిల్లాలో వీటిపై ఇప్పటివరకు కేసులు నమోదు కాలేదు. మరోవైపు త్వరగా డబ్బు వస్తుందనే ఆశతో చాలా మంది యువత ఆన్లైన్ బెట్టింగ్కు దిగుతున్నారు. మొదట చిన్న మొత్తాలతో ప్రారంభమైన బెట్టింగ్.. చివరకు లక్షల్లో నష్టాలకు దారితీస్తోంది. ఈ క్రమంలో కుటుంబాలకు తెలియకుండా చేసిన అప్పులు కట్టలేక.. కుటుంబ సభ్యులకు చెప్పలేక అవమాన భారంతో బలవన్మరణాలు చోటుచేసుకుంటున్నట్లు పలు ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. అవసరమైతే కౌన్సెలింగ్ తీసుకోవాలి.. అందరికీ ఆర్థిక క్రమశిక్షణ ముఖ్యం. ఆదాయానికి మించి అప్పులు చేయొద్దనే ప్రాథమిక సూత్రాన్ని మరవొద్దు. ఆన్లైన్ యాప్లు, బెట్టింగ్లకు దూరంగా ఉండాలి. ఏ వ్యాపారమైతే చేయదలుచుకున్నారో దానిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. పెట్టుబడులకు రుణాలు చేసే ముందు కుటుంబసభ్యులతో ఆర్థిక విషయాలు చర్చించాలి. ఆర్థిక సమస్యలతో మానసిక ఒత్తిడి పెరిగితే కుటుంబసభ్యులు, స్నేహితులతో పంచుకోవాలి. అప్పులు జీవితంలో ఒక సమస్య మాత్రమే. అది జీవితానికి ముగింపు కాదు. అవసరమైన పక్షంలో కౌన్సెలింగ్ తీసుకోవాలి. – డాక్టర్ అనిల్రాజ్, మానసిక వైద్య నిపుణుడు, మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రి -
తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం
వనపర్తి రూరల్: అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. గురువారం ఆయన మండలంలోని చిట్యాల వ్యవసాయ మార్కెట్యార్డును సందర్శించి ధాన్యం నిల్వ కోసం అదనంగా ఏర్పాటు చేసిన గోదాంను రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్తో కలిసి తనిఖీ చేసి అక్కడ కొనసాగుతున్న అన్లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. అక్కడే ఉన్న రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వరి ధాన్యం సేకరణ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి గింజను కొనుగోలు చేస్తామని తెలిపారు. వచ్చే 15 రోజుల్లో కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాల్లో అకాల వర్షాలకు 600 మెట్రిక్ టన్నుల ధాన్యం తడవగా.. వాటిని బాయిల్డ్ మిల్లుకు తరలించామని తెలిపారు. జిల్లాలో రెండేళ్లుగా రికార్డుస్థాయిలో వరి ధాన్యం దిగుబడులు వస్తున్నాయని.. గతంలో సీజన్కు 1.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి ఉండగా, ప్రస్తుతం 2.50 లక్షల మెట్రిక్ టన్నుల వరకు చేరిందన్నారు. ధాన్యం నిల్వకు గోదాముల్లో స్థలం కొరత ఏర్పడుతోందని తెలిపారు. ఆయన వెంట మార్కెట్యార్డు చైర్మన్ శ్రీనివాస్గౌడ్, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, డీఆర్డీఓ ఉమాదేవి, పౌరసరఫరాలసంస్థ డీఎం ఆంజనేయులు తదితర అధికారులు ఉన్నారు. రికార్డుస్థాయిలో వరి దిగుబడి.. వనపర్తి: జిల్లాలో రికార్డుస్థాయిలో వరి ధాన్యం దిగుబడులు వచ్చినందున నిల్వ కోసం అదనపు స్థలం అవసరం అవుతోందని.. రైస్మిల్లర్లు వరి ధాన్యాన్ని దించుకోవడంలో ప్రభుత్వానికి సహకరించి అన్లోడ్ ప్రక్రియ సజావుగా సాగేలా సమన్వయంతో ముందుకు వెళ్లాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్తో కలిసి రైస్మిల్లర్లతో సమావేశమయ్యారు. మిల్లర్ల వారీగా గోదాములలో ఖాళీ స్థలాలపై చర్చించి అదనంగా ధాన్యం బస్తాల కేటాయింపుపై సూచనలు చేశారు. నిల్వ కోసం అందుకు తగిన అద్దె చెల్లిస్తామని తెలిపారు. సమావేశంలో డీఎస్ఓ కాశీ విశ్వనాథ్, పౌరసరఫరాలసంస్థ జిల్లా మేనేజర్ ఆంజనేయులు పాల్గొన్నారు. -
సురవరం సేవలు చిరస్మరణీయం : ఎమ్మెల్యే
వనపర్తి: గోల్కొండ పత్రిక సంపాదకులు, వనపర్తి తొలి ఎమ్మెల్యే సురవరం ప్రతాపరెడ్డి సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కొనియాడారు. సురవరం 130వ జయంతి సందర్భంగా గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చిత్రపటానికి, పక్కన ఉన్న పార్క్లోని సురవరం కాంస్య విగ్రహానికి శాట్ చైర్మన్ శివసేనారెడ్డితో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన సమాజానికి చేసిన సేవలు.. మార్పు, సంస్కరణల కోసం చేసిన పోరాటాలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బి.శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ మధుసూదన్గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ‘రైతుల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం’ పాన్గల్/వీపనగండ్ల: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరించడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. గురువారం పాన్గల్ మండలం చింతకుంట, వీపనగండ్ల మండలం కల్వరాల వరి కొనుగోలు కేంద్రాలను శాట్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డితో కలిసి సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి 45 రోజులు దాటినా తూకం చేయడం లేదని పలువురు రైతులు వివరించగా.. వెంటనే ఆయన కలెక్టర్, అదనపు కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ధాన్యం బస్తాలను తరలించేందుకు జాప్యం లేకుండా లారీలను పంపాలని సూచించారు. సమస్యలను రెండ్రోజుల్లో పరిష్కరించాలని లేనిపక్షంలో రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లు, సేకరించిన ధాన్యం బస్తాల తరలింపులో జాప్యంతో అకాల వర్షాలకు తడిసి రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి 45 రోజులు గడుస్తున్నా తూకం చేయడంలో తీవ్ర జాప్యంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణం పాఠం చెబుతారన్నారు. నియోజకవర్గంలో రైతులు ఇబ్బందులు పడుతున్నా మంత్రి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లు మోసపోతే గోస పడుతాం అనే మాట వంద శాతం నిజమైందని పేర్కొన్నారు. మాజీ ఎంపీపీ శ్రీధర్రెడ్డి, చంద్రశేఖర్నాయక్, రవికుమార్, వెంకటయ్యనాయుడు, గో పాల్రెడ్డి, తిలకేశ్వర్గౌడ్, భాస్కర్రెడ్డి పాల్గొన్నారు. -
రైతుపై రవాణా భారం
కొనుగోలు కేంద్రాల నుంచి సొంత వాహనాల్లో ధాన్యం తరలింపు ● అద్దె కోసం రవాణా కాంట్రాక్టర్లను ఆశ్రయించాల్సిందే.. ● గతంలో వెచ్చించిన డబ్బులు ఇచ్చినట్లేనా..? ● జిల్లాలో 9 రూట్లు.. నిత్యం 360 లారీలు అందుబాటులో... పదిరోజుల కిందట 314 బస్తాల వరి ధాన్యాన్ని వీపనగండ్ల గోదాంకు ట్రాక్టర్లలో తరలించాం. బస్తాకు రూ.9 చొప్పున కాంట్రాక్టర్ ఇస్తామన్నారు. డబ్బుల కోసం వెళ్తే.. ఇంకా బిల్లు రాలేదని తర్వాత ఇస్తామంటున్నారు. అద్దె చెల్లించాలని ట్రాక్టర్ల యజమానులు వత్తిడి తెస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే రవాణా డబ్బులు ఇప్పించాలి. – కురుమయ్య, రైతు, గోపల్దిన్నె (వీపనగండ్ల) నేను దొడ్డురకం వరి పండించా. వారం కిందట సంచికి రూ.పది చొప్పున 270 సంచులు రెండు ట్రాక్టర్లలో గోపాల్పేట గోదాంకు తరలించాను. అప్పు చేసి రూ.ఐదు వేలు అద్దె చెల్లించాను. ధాన్యం తరలించిన డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు. అధికారులు త్వరగా చెల్లించేలా చూడాలి. – బాషమోని శేఖర్, రైతు, ఏదుట్ల రైతులు ధాన్యం మిల్లుల వద్ద దించగానే వే బ్రిడ్జి రసీదు, మిల్లర్ ధాన్యం తీసుకున్నట్లుగా ఇచ్చిన రసీదు ట్రాన్పోర్టు కాంట్రాక్టర్కు చూపిస్తే వెంటనే డబ్బులు ఇవ్వమని ఆదేశాలిచ్చాం. ఎక్కడైనా లోపాలుంటే పరిశీలించి కాంట్రాక్టర్లతో వెంటనే రైతులకు అద్దె డబ్బులు ఇప్పిస్తాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే మా దృష్టికి తీసుకురావాలి. – వినోద్కుమార్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వనపర్తి: అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఉత్పత్తులను అమ్ముకొనేందుకు అష్టకష్టాలు పడటంతో పాటు ఆర్థిక భారం తప్పడం లేదు. జిల్లావ్యాప్తంగా ఒకేసారి ధాన్యం విక్రయాలు పుంజుకోవడంతో సకాలంలో తూకాలు, తరలింపు అసాధ్యంగా మారింది. ధాన్యం మిల్లులు, గోదాములకు తరలించేందుకు సరిపడా వాహనాలను రవాణా కాంట్రాక్టర్లు సమకూర్చడం లేదు. రైతులే తమ సొంత, అద్దె వాహనాల్లో ధాన్యాన్ని మిల్లులకు తరలించి అన్లోడ్ చేసిన వెంటనే మిల్లర్లు ఇచ్చిన రసీదు, వేబ్రిడ్జి రసీదును కాంట్రాక్టర్కు చూపిస్తే వెంటనే డబ్బులు చెల్లించాలని రవాణా కాంట్రాక్టర్లకు అధికారులు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. తమకు ఇంకా బిల్లులు రాలేదంటూ.. కొందరు కాంట్రాక్టర్లు రైతులకు వాహనాల అద్దె చెల్లించడం లేదు. గతేడాది కూడా ఇలాంటి పరిస్థితుల్లో రైతులు నెలల తరబడి సదరు కాంట్రాక్టర్ల చుట్టూ తిరిగి వాహనాల అద్దె డబ్బులను వసూలు చేసుకున్న ఘటనలు లేకపోలేదు. ప్రస్తుత సీజన్లో అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలను ఉంచలేక రైతులు సొంత, అద్దె వాహనాల్లో మిల్లులకు ధాన్యం తరలిస్తున్నారు. కొనుగోలు కేంద్రం నుంచి మిల్లులున్న దూరం ఆధారంగా బస్తాకు రూ.8 నుంచి రూ.10 వరకు వాహనదారులు డబ్బులు వసూలు చేస్తున్నారు. కాగా రవాణా కాంట్రాక్టర్లు చెల్లింపుల విషయంలో రైతులు, అద్దె వాహనాలు సమకూర్చిన వారిని పలుమార్లు అడిగించుకుంటున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మంత్రి జూపల్లి ఇలాకాలోని వీపనగండ్ల మండలంలో ఉన్న గోవర్ధనగిరి కొనుగోలు కేంద్రం నుంచి 16, గోపల్దిన్నె నుంచి 10, కల్వరాల నుంచి 12, వీపనగండ్ల కొనుగోలు కేంద్రం నుంచి 20 ప్రైవేట్ వాహనాల్లో రైతులు తమ ధాన్యాన్ని గోదాంకు తరలించారు. పదిరోజులు గడుస్తున్నా.. నేటికీ రవాణా కాంట్రాక్టర్ డబ్బులు చెల్లించలేదు. డబ్బులు అడిగితే తనకే ఇంకా బిల్లు రాలేదంటూ చెబుతున్నారని రైతులు వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం బస్తాలు తరలించేందుకు సకాలంలో లారీలు రావడం లేదు. చేసేది లేక గ్రామాల్లోని ట్రాక్టర్లలో మిల్లులకు తరలించాం. ధాన్యం బస్తాలను మేము తరలిస్తే అద్దె రవాణా కాంట్రాక్టర్ ఖాతాలో జమ చేస్తున్నారు. దీంతో మేము చాలా నష్టపోతున్నాం. రైతు ఖాతాలో అద్దె జమ చేయడంతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. – బంగి నర్సింహ, అప్పారెడ్డిపల్లి, ఖిల్లాఘనపురం -
9 రూట్లు.. 360 వాహనాలు...
జిల్లావ్యాప్తంగా యాసంగి సీజన్ వరి ధాన్యం సుమారు 3.70 లక్షల మెట్రిక్ టన్నులు విక్రయానికి వస్తుందని అధికారులు 400పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులు, గోదాంలకు తరలించేందుకు తొమ్మిది రూట్లుగా విభజించి ఒక్కో రూట్కు 40 లారీల చొప్పున 360 లారీలు అందుబాటులో ఉంచాలని టెండర్లు నిర్వహించి కాంట్రాక్టర్లకు బాధ్యతలు అప్పగించారు. కానీ వారు సకాలంలో సరిపడా వాహనాలు సమకూర్చకపోవడంతో ధాన్యం కేంద్రాల్లో పేరుకుపోయి అకాల వర్షాలకు తడిసి మొలకెత్తడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సరిపడా వాహనాలు సమకూర్చాలని జిల్లా అఽధికారులు రవాణా కాంట్రాక్టర్లకు చెప్పినా స్పందన లేకపోవడంతో రైతులే ట్రాక్టర్లలో తరలించుకుంటే అద్దె చెల్లిస్తామని అధికారులు చెప్పడంతో ముందుకొచ్చారు. కానీ అద్దెకూడా వెంటనే చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా.. సంతోకర విషయం ఏమిటంటే గతంతో పోలిస్తే ధాన్యం విక్రయించిన డబ్బులు మిల్లర్ ధాన్యం తీసుకున్నట్లు రసీదు ఇచ్చిన కొన్ని గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కావడం విశేషం. -
ధాన్యం తరలింపునకు అదనపు లారీలు
కొత్తకోట రూరల్: వరి ధాన్యం తరలింపునకు అదనంగా లారీలను సమకూర్చాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి రవాణా కాంట్రాక్టర్లను ఆదేశించారు. బుధవారం ఆయన పెద్దమందడి మండలంలోని సప్తగిరి, శ్రీ భవాని శంకర ఇండస్ట్రీస్ రైస్మిల్లులను తనిఖీ చేసి ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్తో కలిసి తనిఖీ చేశారు. అన్లోడింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని.. ఇందుకోసం మరింత మంది హమాలీలను సమకూర్చుకోవాలని సూచించారు. లారీలు ఎక్కువ సమయం వేచి ఉండకుండా వెంటనే అన్లోడ్ చేయాలని, గోదాముల్లో ధాన్యాన్ని భద్రంగా నిల్వ చేయాలన్నారు. శ్రీ భవాని శంకర ఇండస్ట్రీస్ వద్ద యజమానితో మాట్లాడిన కలెక్టర్ అదనపు నిల్వ స్థలాన్ని తక్షణమే సిద్ధం చేయాలని సూచించారు. అలాగే కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యాన్ని తరలించేందుకు తమ ప్రైవేట్ వాహనాలను కూడా వినియోగించాలని, వరి ధాన్యం నిల్వలకు అదనపు స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఐకేపీ కొనుగోలు కేంద్రం సందర్శన.. పెద్దమందడిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఇప్పటి వరకు ఎన్ని వరి సంచులు తరలించారు.. ఇంకా ఎన్ని సంచులు కొనుగోలు చేయాల్సి ఉందని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు కలెక్టర్ను కలిసి లారీల కొరత తీవ్రంగా ఉందని.. అదనపు లారీలు సమకూర్చాలని కోరారు. ప్రస్తుతం రవాణా ఖర్చులను తామే భరిస్తున్నామని తెలిపారు. స్పందించిన కలెక్టర్ రవాణా కాంట్రాక్టర్తో మాట్లాడి వెంటనే మరిన్ని లారీలను కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. అలాగే రైతులకు రవాణా ఖర్చులను కాంట్రాక్టర్ నుంచి వసూలు చేసి ఇప్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా పౌరసరఫరాల అధికారి కాశీ విశ్వనాథ్, తహసీల్దార్ పాండునాయక్, ఇతర అధికారులు ఉన్నారు. -
పాలమూరే ప్రధానాస్త్రం!
అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల మంటలు తెలంగాణ ఉద్యమంలో పాలమూరు వెనుకబాటు ప్రధానాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎన్నికలు పాలమూరు ప్రాజెక్ట్ చుట్టే నడిచాయి. తొలి పర్యాయంలో బీఆర్ఎస్ అధికారంలోకి రాగా.. పీఆర్ఎల్ఐ ప్రాజెక్ట్కు అడుగడుగునా అవాంతరాలు ఎదురయ్యాయి. నీటి తరలింపునకు సంబంధించి జూరాల నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్కు మార్చిన సోర్సుపై ప్రధాన రాజకీయ పక్షాల మధ్య భిన్న వాదనలు నడిచాయి. ఎట్టకేలకు 2015 జూన్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్ట్కు శంకుస్థాపన చేశారు. తొలి విడతలో ఐదు రిజర్వాయర్ల (నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్) పనులు మొదలుపెట్టారు. 2023 సెప్టెంబర్ 16న నార్లాపూర్ వద్ద మొదటి పంప్ను ప్రారంభించారు. అయితే నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్ వరకు 16 కిలోమీటర్ల టన్నెల్, 8.3 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్ ద్వారా నీటిని తరలించాల్సి ఉంటుంది. ఇందులో టన్నెల్ పూర్తి కాగా.. 2.5 కి.మీ. మేర ఓపెన్ కెనాల్ పెండింగ్లో ఉంది. ఇక్కడ దాదాపు 15 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించాల్సి ఉంది. ఈ పనులు పూర్తయితే నార్లాపూర్ నుంచి కర్వెన వరకు అంటే నాలుగు రిజర్వాయర్లకు నీటిని తరలించే అవకాశం ఉంది. ఈ అంశాన్ని లేవనెత్తుతూ రెండున్నరేళ్లుగా తట్టెడు మట్టి తీయడం లేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే చివరలో మిగిలిన పనుల పూర్తిపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని గత జనవరిలో మాజీ సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ఈ క్రమంలో అసెంబ్లీలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ భవన్లో మాజీ ఇరిగేషన్ మంత్రి హరీశ్రావు పోటాపోటీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవ్వడం తీవ్ర చర్చకు దారితీసింది. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పీఆర్ఎల్ఐ పనులు పూర్తిచేయించేందుకు బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. ఇటీవల జిల్లాకు చెందిన మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశమై జూన్లో పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. తొలి రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మధ్యలో మాజీ మంత్రి హరీశ్రావు పాల్గొనేలా.. చివరకు ముగింపు రోజున కేసీఆర్ పాల్గొనేలా భారీ బహిరంగసభ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుండడంతో రాజకీయ సందడి నెలకొంది. మరోవైపు పాలమూరు ప్రాజెక్ట్ అస్త్రంగా తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా పోరు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు ఉమ్మడి జిల్లా రాజకీయాలను హీటెక్కించాయి. పీఆర్ఎల్ఐతో పాటు జిల్లాలోనిఎండింగ్ ప్రాజెక్ట్లను వెంటనే పూర్తి చేయాలని జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు ఉమ్మడి పాలమూరు జిల్లా పెండింగ్ ప్రాజెక్ట్ల సాధన జేఏసీ నేతలు వినతిపత్రాలు ఇచ్చారు. పాలమూరు పథకంలోని ఏదుల రిజర్వాయర్ నుంచి 0.5 టీఎంసీల నీటిని డిండి ప్రాజెక్ట్కు తరలించాలనే ప్రతిపాదనను విరమించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీని వల్ల జిల్లాకు తీవ్ర నష్టం జరుగుతుందని.. తాము పోరాటం చేస్తామని.. ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు అడ్డుకోవాలని జేఏసీ చైర్మన్ రాజేందర్రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం పర్యటన సందర్భంగా జేఏసీ నేతలు ఆయనను కలిసి వినతిపత్రం అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశం ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలతో పాటు ముఖ్యమంత్రిని ఇరుకున పెట్టే అవకాశం ఉండగా.. రాజకీయ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే డిమాండ్తో బీఆర్ఎస్ పోరు వచ్చే నెలలో పాదయాత్ర, బహిరంగ సభకు సన్నాహాలు ఇదే అంశంతో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత ఉద్యమ బాట 2027 డిసెంబర్లోపు పూర్తి చేసేలా కాంగ్రెస్ కార్యాచరణ 2 రోజుల పాటు ప్రాజెక్ట్ల సందర్శనకు సీఎం సమాయత్తం పొలిటికల్ డ్రామాలకే పరిమితమని బీజేపీ విమర్శలు బీఆర్ఎస్ పాదయాత్రకు సన్నాహాలు చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ సైతం పోటాపోటీగా అడుగులు వేస్తోంది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు ఉమ్మడి జిల్లాలో మిగిలిన పెండింగ్ ప్రాజెక్ట్లపై ఇటీవల హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ వేర్వేరుగా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీక్షించారు. వెంటనే భూసేకరణ పూర్తి చేయాలని.. గ్రీన్చానల్ ద్వారా నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పాలమూరులోని అన్ని ప్రాజెక్ట్ల పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులకు డెడ్లైన్ పెట్టినట్లు తెలిసింది. అంతేకాదు.. సీఎం స్వయంగా ఈ నెల 30, 31న లేదంటే వచ్చే నెల మూడు, నాలుగో తేదీన రెండు రోజుల పాటు పాలమూరు–రంగారెడ్డితో పాటు ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాజెక్ట్ల సందర్శనకు సమాయతమైనట్లు సమాచారం. పెండింగ్ ప్రాజెక్ట్ల పూర్తికి చర్యలను వేగిరం చేయడంతో పాటు గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఉమ్మడి జిల్లా ప్రాజెక్ట్లకు ఏ విధంగా అన్యాయం చేసిందనే దానిపై ప్రజలకు వివరించనున్నట్లు తెలుస్తోంది. -
రెడ్క్రాస్ సేవలు మరింత చేరువ
వనపర్తి: జిల్లాలో అధికసంఖ్యలో సభ్యత్వ నమోదు చేపట్టి రెడ్క్రాస్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ కోరారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ వనపర్తి జిల్లాశాఖ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక సభ్యత్వ నమోదు నిర్వహించగా.. కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. శ్రీనివాసులు మాట్లాడుతూ.. సేవా కార్యక్రమాల్లో యువత, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు చురుగ్గా పాల్గొనాలని కోరారు. సమాజ సేవలో రెడ్క్రాస్ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. కార్యక్రమానికి జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి డా. ప్రియాంక నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. కార్యక్రమంలో జిల్లా కో–ఆర్డినేటర్ రాజేంద్రకుమార్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు. మహిళా ప్రగతి.. తెలంగాణ ఉన్నతి వనపర్తి: మహిళల సాధికారత కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని జిల్లా మహిళా సమాఖ్య భవనంలో నిర్వహించిన ‘మహిళా ప్రగతి – తెలంగాణ ఉన్నతి’ అనే నినాదంతో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా తూడి మేఘారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్థికంగా ఎదిగి కుటుంబాలతో పాటు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకొని ప్రతి మహిళ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అనంతరం అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ మాట్లాడుతూ.. మహిళా సంఘాలు గ్రామీణాభివృద్ధికి వెన్నముకగా నిలుస్తున్నాయని తెలిపారు. మహిళలు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని సూచించారు. డీపీఎంలు నాగమల్లిక, కె.ప్రభాకర్, ఆనంద్ తదితరులు మహిళా సంఘాల అభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు మహిళా శక్తిని ప్రతిబింబించాయి. డీఆర్డీఓ ఉమాదేవి, మున్సిపల్ చైర్పర్సన్ ఎస్ఎల్ఎన్ మాధవి, అదనపు డీఆర్డీఓ సరోజ, జెడ్ఎంఎస్ అధ్యక్షురాలు ఇందిర, జిల్లాలోని 7 మండలాల ఎంఎంఎస్ అధ్యక్షులు పాల్గొన్నారు. -
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
ఖిల్లాఘనపురం/వనపర్తి రూరల్: ప్రతిసారి సమావేశాల్లో పెద్ద జీతగాడిలా పని చేస్తామంటూ చెప్పుకొనే వారికి ఇప్పుడు రైతుల కష్టాలు కనిపించడం లేదా అని మాజీ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రశ్నించారు. బుధవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి ఖిల్లాఘనపురం మండలంలోని ఉప్పరిపల్లి, మల్కాపురం, గట్టుకాడిపల్లి, పెబ్బేరు మండలం గుమ్మడం, సూగూరు, రంగాపురం, పెబ్బేరులోని కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షానికి తడిసిందని, ఆ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను కొనుగోలు చేయకపోవడంతో రైతులు కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ అధికారుల లెక్కల ప్రకారం రాష్ట్రంలో యాసంగిలో 65.42 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా.. 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం, అధికార పార్టీ నాయకులు ఎందుకు రైతులను మోసగిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చెప్పిన 90 లక్షల మెట్రిక్ టన్నుల్లో ఇప్పటి వరకు 42 శాతం మాత్రమే కొనుగోలు చేశారని.. రవాణా ఏజెన్సీల నిర్లక్ష్యంతో రైతులు అరిగోస పడుతున్నారని చెప్పారు. గన్నీబ్యాగులుంటే లారీలు రావు.. లారీలు వస్తే గన్నీబ్యాగుల కొరగ.. రెండూ ఉంటే హమాలీలు రావడం లేదని ఎద్దేవా చేశారు. రైతులు పంటలు పండించడానికి పడిన కష్టం కంటే ధాన్యం అమ్ముకోవడానికి ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లారీలు, ట్రక్కులు లేని వారికి రవాణా ఏజెన్సీ ఎలా ఇచ్చారో ప్రభుత్వానికి, అధికార పార్టీ నాయకులకు తెలియాలన్నారు, ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. తరుగు పేరిట ధాన్యంలో కోతలు విధించినా పట్టించుకునే వారు కరువయ్యారని.. అకాల వర్షానికి తడిసిన, మొలకెత్తిన ధాన్యం పూ స్థాయిలో మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామాల్లో ఉన్న రైతువేదికలను ధాన్యం నిల్వలకు వినియోగించాలని సూచించారు. అనంతరం గట్టుకాడిపల్లి శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. -
అప్పులుంటే.. చంపేస్తావా!
నీ మనసు ఇంత కఠినమా నాన్నా వనపర్తి: జీవనోపాధి కోసం మామిడితోటలు లీజుకు తీసుకుని మామిడి పండ్లు విక్రయిస్తూ.. మిగతా సమయంలో తోటల సంరక్షణ చేసుకుంటూ జీవించే ఓ కుటుంబం సరైన లాభాలు లేక.. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక.. అప్పులు ఇచ్చిన వారి ఒత్తిళ్లు తట్టుకోలేక ఓ కుటుంబ పెద్ద తన భార్య, ఇద్దరు పిల్లలను నీటిలో సంపులో పడేసి ప్రాణాలు తీసి.. తానూ ఉరేసుకున్న ఉదంతం ఉమ్మడి పాలమూరు జిలాల్లో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని డోకూరు గ్రామానికి చెందిన నర్సింహులు(40) నాలుగేళ్ల క్రితం ఖిల్లాఘనపురం మండలం సల్కెలాపురం శివారులో సుమారు 50 ఎకరాల మామిడి తోటను లీజు తీసుకుని కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తోటల లీజు, ఇతర అవసరాల కోసం గద్వాలలో కొందరితో అప్పు చేశాడు. డోకూరులోని తన సొంత ఇంటిపై ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో రూ.లక్షల్లో అప్పు చేశాడు. ఇటీవల ఈఎంఐలు సక్రమంగా చెల్లించడం లేదని ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు ఇంటి గోడలపై ఈ ఇంటిని అప్పుకింద జప్తు చేయనున్నట్లు రాయడంతో గ్రామంలో తోటివారు, బంధువులు, సన్నిహితుల ఎదుట అవమానంగా భావించాడు. ఐపీ పెట్టే ప్రయత్నం చేశాడు. తన వద్ద ఉన్న వాహనాలు, వస్తువులను అమ్మేసి అప్పులు తీర్చే ప్రయత్నం చేశాడు. అయినా.. వడ్డీలు వసూలు చేసేవారు, ఈఎంఐలు చెల్లించాల్సిన ఫైనాన్స్ కంపెనీల నుంచి ఒత్తిడి తగ్గలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన కుటుంబ సభ్యులతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే భార్య ఎల్లమ్మ(36), కుమారుడు నిహాల్(15), కూతురు సాహితీశ్రీ(13)ల కాళ్లు, చేతులు కట్టేసి తోటలోని సంపులోకి తోసి తాను నివాసం ఉండే కంటైనర్కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. బాబు 10.. పాప 8 నర్సింహులు కుమారుడు నిహాల్ దేవరకద్రలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి పూర్తిచేయగా.. ఈ విద్యా సంవత్సరం పదో తరగతి చదవాల్సి ఉంది. అలాగే పాప సాహితీశ్రీ అదే పాఠశాలలో 7 తరగతి పూర్తిచేయగా.. ఈసారి 8వ తరగతి చదవాల్సి ఉందని బంధువులు తెలిపారు. నర్సింహులు, ఎల్లమ్మ, నిహాల్, సాహితీశ్రీ (ఫైల్) దేవరకద్ర: నర్సింహులు కుటుంబం మరణంతో మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరులో విషాదం అలుముకుంది. ఐదు దశాబ్దాల క్రితం గద్వాల నుంచి వలస వచ్చిన నర్సింహులు, తన సోదరులు ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. పండ్ల తోటలను లీజుకు తీసుకుని వచ్చిన లాభాలతో ఆ కుటుంబాలు గడిపేవారు. కాలక్రమంలో పండ్ల తోటలకు నష్టం రావడంతో నర్సింహులు అప్పులు పేరుకుపోయాయి. గత జూన్లో దాదాపు రూ.కోటి బాకీ పడ్డాడని డోకూరు గ్రామస్తులు నర్సింహులుపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇలా చేసిన అప్పులు తీర్చలేక భార్యాబిడ్డలను హత్య చేసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామంలోని వారి కుటుంబ సభ్యులు వాపోయారు. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం డోకూరుకే తెస్తుండడంతో నర్సింహులు ఇంటి వద్ద అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న వనపర్తి డీఎస్పీ గిరిబాబు ఖిల్లాఘనపురం మండలం సల్కెలాపురం గ్రామ శివారులోని మామిడి తోటకు వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించి ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. నమ్మివచ్చిన భార్య, జన్మనిచ్చిన పిల్లల్ని కడతేర్చిన తండ్రి కాళ్లు చేతులు కట్టి నీటిసంపులో పడేసి.. తానూ ఉరేసుకుని బలవన్మరణం తాను చేసిన అప్పులు వారినేం చేస్తాయోననే భయంతో ఘాతుకం కౌలు రైతు కుటుంబాన్ని చిదిమేసిన అప్పులు -
సాగునీటి ప్రాజెక్టులు వేగవంతం
● వారం రోజుల్లో భూసేకరణ పూర్తిచేయాలి ● త్వరలో ప్రాజెక్టుల సందర్శనకు సీఎం రేవంత్రెడ్డి ● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కందనూలు: నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇస్తూ.. ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేయాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్యాకేజీ–8 పరిధిలోని వట్టెం అతిథిగృహంలో కలెక్టర్లు హేమంత కేశవ్ పాటిల్, ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేశ్రెడ్డి, వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, తూడి మేఘారెడ్డితో కలిసి పాలమూరు ఎత్తిపోతల, ఎంజీకేఎల్ఐ, డిండి, ఉమామహేశ్వర బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్, మార్కండేయ, కర్నెతండా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లతోపాటు వివిధ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు, భూసేకరణ పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ప్రాజెక్టుల వారీగా చేపట్టిన పనులు, భూ సేకరణ పురోగతిని అధికారులు వివరించారు. ముఖ్యంగా కాల్వల నిర్మాణం, రిజర్వాయర్ల అనుబంధ పనులు, పంప్హౌజ్ల ఏర్పాటు, విద్యుత్ కనెక్షన్లు వంటి అంశాలపై చర్చించారు. అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసేందుకు రెవె న్యూ, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతులకు సాగునీరు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. అందుకు అనుగుణంగా ప్రతి పనిని గడువులోగా పూర్తిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా భూ సేకరణ ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పారదర్శకంగా వ్యవహరించాలన్నా రు. నష్టపరిహారం చెల్లింపుల్లో జాప్యం జరగకుండా చూడాలన్నారు. వారం రోజుల్లో భూ సేకరణ ప్రక్రియను పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు. నిర్లక్ష్యాన్ని సహించం.. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తయితే వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి జూపల్లి అన్నారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించబోమన్నారు. పనుల నాణ్యత విషయంలోనూ రాజీ పడొద్దన్నారు. త్వరలో ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రానున్నారని.. ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రధాన సమస్యల పరిష్కారానికి అవసరమైన అనుమతుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు. -
పారాహుషార్..!
● పారామెడికల్ కళాశాలల్లో అడ్డగోలుగా అడ్మిషన్లు ● అక్రమార్జనే ధ్యేయంగా అనుమతి లేని కోర్సుల్లోనూ ప్రవేశాలు ● ఇక్కడ చేరికలు.. హైదరాబాద్లో పరీక్షలు ● ఉమ్మడి జిల్లాలో 8 అనుమతులు లేని కళాశాలలు ● అప్రమత్తంగా లేకపోతే విద్యార్థులకు తప్పని ఇబ్బందులు ఇక్కడ చేరిక.. అక్కడ పరీక్ష జిల్లాకేంద్రంలోని పలు పారామెడికల్ కళాశాలల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. వీటిలో ఎంపీహెచ్డబ్ల్యూ, ల్యాబ్టెక్నీషియన్ వంటి ఇంటర్మీడియట్ స్థాయి చిన్నపాటి కోర్సులు నిర్వహించే అవకాశం ఉంది. కానీ, కొన్ని పారామెడికల్ కళాశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ ఎమ్మెల్టీ వంటి కోర్సులకు అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడి కళాశాలల్లో అడ్మిషన్లు తీసుకుని.. హైదరాబాద్లో అనుమతులున్న కళాశాలలకు పరీక్ష ఫీజు, ప్రాక్టికల్స్ చేయించడం, సర్టిఫికెట్ ఇప్పించడం వంటివి చేయిస్తున్నారు. చివరికి నామమాత్రంగా విద్యార్థులకు కళాశాలలో తరగతులు నిర్వహించి పరీక్షలు అన్నీ కూడా హైదరాబాద్లోనే రాయిస్తున్నారు. ఇందుకు రెగ్యులర్ కళాశాలలో వసూలు చేస్తున్న మాదిరిగా రూ.వేలల్లో ఫీజులు, రికార్డులు, ప్రాక్టికల్స్ వంటి వాటికి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆయా కళాశాలల్లో జరుగుతున్న తతంగం అంతా ఇంటర్మీడియట్ అధికారులకు తెలిసినా పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ● పాలమూరు నగరంలోని ఓ పారామెడికల్ కళాశాల నుంచి నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తికి చెందిన విద్యార్థిని తల్లికి ఫోన్ చేసి తమ కళాశాలలో బీఎస్సీ ఎమ్మెల్టీ, ఏఎన్ఎం, జీఎన్ఎం, ఇతర డిగ్రీ స్థాయి పారామెడికల్ కోర్సులు ఉన్నాయని, ఇటీవల ఇంటర్మీడియట్ పూర్తి చేసిన మీ విద్యార్థినిని చేర్పించాలని కోరారు. దీంతో సదరు బాలిక తల్లి జిల్లాకేంద్రంలోని తమ బంధువులకు ఫోన్ చేసి ఆ కళాశాలలో విద్యార్థినిని చేర్పిస్తున్నట్లు తెలిపింది. అయితే బంధువులు సదరు పారామెడికల్ కళాశాలకు ఎలాంటి అనుమతులు లేవని చెప్పడంతో అవాకై ్కంది. ● పాలమూరు నగరంలోని న్యూటౌన్ వద్ద ఉన్న ఓ పారామెడికల్ కళాశాల నుంచి ఇంటర్మీడియట్ పూర్తిచేసిన కొడంగల్కు చెందిన ఓ విద్యార్థికి ఫోన్ చేసి తమ వద్ద జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ ల్యాబ్ టెక్నీషియన్ వంటి కోర్సులు ఉన్నాయని వాటిలో చేరాలని చెప్పగా విద్యార్థి ఫీజు మాట్లాడుకుని వచ్చారు. అనంతరం ఫీజు తగ్గించేందుకు స్థానికంగా ఉండే మీడియాలో పనిచేసే తన బంధువును తీసుకెళ్లగా.. తమ వద్ద ఎలాంటి కోర్సులు లేవని కళాశాల సిబ్బంది బుకాయించడంతో ఖంగుతినడం సదరు విద్యార్థి వంతైంది. మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: అక్రమార్జనే ధ్యేయంగా.. ఉమ్మడి జిల్లాలోని కొన్ని పారామెడికల్ కళాశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ ఎమ్మెల్టీతోపాటు ఇతర మెడికల్ కోర్సులకు అడ్మిషన్లు తీసుకుంటున్నారు. పలు ప్రభుత్వ కళాశాలల నుంచి విద్యార్థుల వివరాలు సేకరించి తమ వద్ద వివిధ కోర్సులు ఉన్నాయని నమ్మబలుకుతూ.. అడ్మిషన్లు తీసుకోవాలని తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది నుంచి విద్యార్థుల వివరాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం పారామెడికల్ కళాశాలల్లో ఎస్సెస్సీ తర్వాత కేవలం ఎంపీహెచ్డబ్ల్యూ, ఎమ్మెల్టీ, ఎక్స్రే టెక్నీషియన్ వంటి కోర్సులకు మాత్రమే అడ్మిషన్లు ఇవ్వాలి. కానీ, నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ కళాశాలల్లో నిర్వహించాల్సిన కోర్సులను పారామెడికల్ కళాశాలల్లో అడ్మిషన్లు కల్పించడం విస్మయానికి గురిచేస్తుంది. అన్నీ తెలిసినా.. ఇంటర్మీడియట్ శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవవహరిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతుండగా.. ఇప్పటికే కొన్ని కళాశాలల్లో పదుల సంఖ్యలో అడ్మిషన్లు అయ్యాయి. జిల్లాకేంద్రంలోని పలు కళాశాలల్లో ఈ వ్యవహారం పెద్దఎత్తున నడుస్తుంది. రికార్డుల్లో ఎక్కువ మంది విద్యార్థుల పేర్లు లేకుండా.. ఎవరికి అనుమానం రాకుండా వీటిని పలు కళాశాలలు నిర్వహిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 74 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. వీటిలో కొన్ని కళాశాలలు రెన్యువల్, ఫైర్సేఫ్టీ వంటి ఇబ్బందుల కారణంగా పూర్తిస్థాయిలో అనుమతులు ఇవ్వలేదు. అయినప్పటికీ ప్రస్తుతం అడ్మిషన్లు తీసుకుంటున్నారు. గతేడాది పూర్తిస్థాయిలో అనుమతులు లేని ఓ కళాశాలకు చెందిన 200 మంది విద్యార్థులను ఎంవీఎస్ కళాశాల నుంచి పరీక్షలు రాయించారు. ప్రతి సంవత్సరం జిల్లాలోని ఏదో ఒక కళాశాలకు అనుమతులు రాకపోవడం, విద్యార్థులను ప్రభుత్వ కళాశాలల నుంచి పరీక్షలు రాయించడం పరిపాటిగా మారింది. దీంతో విద్యార్థులు త్రీవ ఇబ్బందుల పాలవుతున్నారు. సంబంధిత అధికారులు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే వీటిని గుర్తిస్తే అడ్మిషన్లు తీసుకోకుండా అడ్డుకోవచ్చని విద్యార్థి సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే విద్యా శాఖ అధికారులు మాత్రం వచ్చేనెలలో తనిఖీలు చేపడుతామని చెప్పడం గమనార్హం. ఈ క్రమంలో విద్యార్థులు అప్రమత్తంగా లేకపోతే చివరికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చర్యలు తీసుకుంటాం.. జిల్లాలో అనుమతులు లేకుండా, సంబంధం లేని కోర్సుల్లో విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తున్న కళాశాలలను గుర్తించి తప్పకుండా శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. ఇందుకోసం ఈ నెల 31 తర్వాత ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తాం. విద్యార్థులు కళాశాలలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే అడ్మిషన్లు తీసుకోవాలి. – రమణి, డీఐఈఓ -
ఏసీబీకి చిక్కిన సర్వేయర్
రాజోళి/ గట్టు: లంచం తీసుకుంటూ ప్రభుత్వ సర్వేయర్ ఏసీబీకి పట్టుబడిన ఘటన వడ్డేపల్లి మండలంలో చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ కథనం ప్రకారం.. వడ్డేపల్లి మండలం కొంకల గ్రామానికి చెందిన ఓ రైతు తనకున్న 4.14 ఎకరాల భూమిని సర్వే చేయాలని సర్వేయర్ బ్రహ్మయ్యను సంప్రదించాడు. దీనికి గాను సర్వేయర్ ఎకరాకు రూ.5 వేల చొప్పున రూ.20 వేలు లంచం డిమాండ్ చేశాడు. అడ్వాన్సుగా రూ.5 వేలు తీసుకున్నాడు. మిగిలిన డబ్బు కోసం ఒత్తిడి చేయడంతో.. విసిగిపోయిన రైతు మహబూబ్నగర్లో ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఈ క్రమంలో మంగళవారం శాంతిగనర్లోని తహసీల్దార్ కార్యాలయంలో సదరు రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు సర్వేయర్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకొని విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా.. ఏసీబీ అధికారులు గట్టులోని సర్వేయర్ బ్రహ్మయ్య ఇంట్లోనూ తనిఖీలు చేపట్టారు. రైతు దగ్గర నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన వ్యవహారంపై ఏసీబీ అధికారులు నేరుగా గట్టులోని బ్రహ్మయ్య ఇంటికి చేరుకుని తనిఖీలు చేశారు. -
మిల్లుల్లో ధాన్యం త్వరగా దించుకోవాలి
వనపర్తి రూరల్: కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు చేరుకునన్న వరి ధాన్యాన్ని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా త్వరగా దించుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. మంగళవారం శ్రీరంగాపురం మండల కేంద్రంతో పాటు కంభాళాపురం, పెబ్బేరు పరిసరాలు, రంగాపూర్లోని రైస్మిల్లులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ధాన్యం అన్లోడింగ్, అదనపు ధాన్యం నిల్వలను పరిశీలించారు. మిల్లుల ఆవరణలో గోదాములు, స్థలాలను పరిశీలించి రాబోయే రోజుల్లో ధాన్యం నిల్వకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అదనపు స్థలాన్ని సిద్ధం చేసుకోవాలని మిల్లర్లకు సూచించారు. లారీలు ఎక్కువ సమయం వేచి ఉండకుండా హమాలీల సంఖ్య పెంచి ధాన్యాన్ని త్వరగా దించుకోవాలన్నారు. తూకంలో ఎలాంటి అక్రమాలకు పాల్పడినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తిస్థాయిలో ధాన్యం సేకరించాలని, రైతులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట తహసీల్దార్లు వరలక్ష్మి, సత్యనారాయణరెడ్డి, ఆర్ఐలు రాఘవేందరావు, సింగిల్విండో సిబ్బంది, రైస్మిల్లర్లు ఉన్నారు. -
క్యాన్సర్.. కలకలం
జిల్లాలో 404 కేసులు నమోదు ● బాధితుల్లో అత్యధికులు మహిళలే.. ● ఆహారపు అలవాట్లే ప్రధాన సమస్య అంటున్న నిపుణులు ● జిల్లా ఆస్పత్రిలో డే కేర్ కీమో థెరపీ సేవలు జిల్లాలో నమోదతువున్న కేసులు.. బ్రెస్ట్, మౌత్, సర్వికల్, కొలన్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ లక్షణాలు.. గుట్కా, కై నీ, మద్యం, పొగాకు సేవించడం, నిద్రిలేమి, పాకెట్ ఫుడ్స్, ఎక్కువగా వాడిన నూనె, ఆకుకూరగాయలపై పురుగు మందుల ప్రభావం, అసాధారణ నొప్పులు, రక్తస్రావం, దీర్ఘకాలిక ఆయసం, దగ్గు, ఆకస్మికంగా బరువు తగ్గడంలాంటివి క్యాన్సర్ లక్షణాలుగా చెప్పవచ్చు. స్క్రీనింగ్ తర్వాతే నిర్ధారణ అవుతుంది. స్థానిక డే కేర్ క్యాన్సర్ సెంటర్లో అందించే సేవలు కీమో థెరపీ, ఇమ్యూనో థెరపీ/టార్గెటెడ్ థెరపీ, రక్త మార్పిడి, ఇంజెక్షన్లు, క్యాన్సర్ స్క్రీనింగ్, నిర్ధారణ పరీక్షలు, బయాప్సీ, చిన్న శస్త్రచికిత్సలు, నొప్పి నివారణ, పల్లియేటివ్ కేర్, పోషకాహార సలహాలు, మానసిక ఆరోగ్య కౌన్సెలింగ్ సేవలు, చికిత్స తర్వాత పరిశీలన, ఫాలోఅప్, అత్యవసర వైద్య సాయం వనపర్తి: జిల్లాలో ఏటా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. భారత వైద్య పరిశోధన మండలి, వ్యాధి సమాచార, పరిశోధన కేంద్రాలిచ్చే నివేదికలతో వైద్య, ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలోని చిన్న జిల్లాల్లో ఒకటైన వనపర్తిలో ప్రస్తుతం 404 వివిధ రకాల క్యాన్సర్ కేసులు నమోదు కావడం శోచనీయం. వీరిలో కొందరికి స్థానిక జీజీహెచ్లో డే కేర్ కీమో థెరపీ సేవలు అందిస్తుండగా.. మరికొందరు అందుబాటులోని ప్రైవేట్ క్యాన్సర్ ఆస్పత్రులకు వెళ్లి రూ.లక్షలు వెచ్చించి వైద్యం తీసు‘కొంటున్నారు’. మహిళలే అధికం.. జిల్లాలో నమోదైన క్యాన్సర్ కేసుల్లో 80 శాతం మహిళలే ఉండటం గమనార్హం. జిల్లావ్యాప్తంగా 404 కేసులు నమోదు కాగా.. వారిలో 322 మహిళలు, 82 మంది పురుషులు ఉన్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించిన లెక్కలతో స్పష్టమవుతోంది. అన్ని ప్రాంతాల్లోనూ మహిళలే అధికంగా క్యాన్సర్ బారిన పడుతున్నారని.. నివారణ కోసం భారత ప్రభుత్వం ఇటీవల 15 ఏళ్లలోపు బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ను ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఈ వ్యాక్సిన్ పెళ్లి తర్వాత వేసుకుంటే అంతగా పని చేయదని నిపుణులు చెబుతున్నారు. అందుకే వైద్యశాఖ అధికారులు పాఠశాల స్థాయిలోనే బాలికలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఆహారపు అలవాట్లే ప్రధాన కారణమా..? మారుతున్న కాలానుగుణంగా ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులు, ఎక్కువగా ఎసిడిక్ ఆహార పదార్థాలను తీసుకోవడంతోనే క్యాన్సర్ కణాలు పుట్టుకొస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మహిళల్లో ఎక్కువగా రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వస్తుందని, వాటితోనే ఎక్కువగా ప్రాణనష్టం కలుగుతునట్లు అధికారిక లెక్కలు సైతం వెల్లడిస్తున్నాయి. ప్రాథమిక దశలో గుర్తిస్తే మేలు.. క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశ అంటే స్టేజ్–1, స్టేజ్–2, స్టేజ్–3లో గుర్తించి సరైన వైద్యం తీసుకుంటే ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకోవచ్చు. ఆలస్యంగా గుర్తించడంతో సమస్య జఠిలం కావచ్చు. ఆరు నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. – డా. దయాకర్రావు, సర్జరీ అంకాలజీస్ట్, యశోద ఆస్పత్రి రోగులకు సేవలు అందిస్తున్నాం.. రోగి మానసిక ఒత్తిడికి గురికాకుండా ఇంటి దగ్గర ఉంటూనే ఉదయం ఆస్పత్రికి వచ్చి చికిత్స తీసుకొని వెళ్లవచ్చు. జీజీహెచ్తో పాటు వైద్య కళాశాలలోనూ కీమో థెరపీ, పాలియోటివ్ కేర్ సేవలు అందిస్తున్నాం. గ్రామీణప్రాంత పేద రోగులకు డేకేర్ సెంటర్ ప్రయోజనకర సేవలు అందిస్తోంది. – రాంచందర్రావు, పీఓ, క్యాన్సర్ డే కేర్ సెంటర్, వనపర్తి ●గోపాల్పేటలో 76 కేసులు.. జిల్లాలో అత్యధికంగా గోపాల్పేట పీహెచ్సీ పరిధిలో 76 కేసులు, రెండోస్థానంలో పెద్దమందడి పీహెచ్సీ పరిధిలో 39 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కమాలోద్దీన్పూర్ పీహెచ్సీ పరిఽధిలో 5 కేసులు నమోదయ్యాయి. ఎన్సీడీసీ ప్రోగ్రాం టెస్టులతో క్యాన్సర్ లక్షణాలున్న వారిని బయాప్సీ టెస్టులకు సిఫారస్ చేసి రోగులను గుర్తించి డే కేర్ సెంటర్లో వైద్యసేవలందిస్తున్నారు. -
పెంచిన ఇంధన ధరలు తగ్గించే వరకు ఉద్యమం
వనపర్తి: పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే వరకు కాంగ్రెస్పార్టీ ప్రజల పక్షాన ఉద్యమం కొనసాగిస్తోందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ మంగళవారం జిల్లాకేంద్రంలో డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస శ్రేణులు ఎద్దులబండ్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం మోపుతోందని విమర్శించారు. ప్రజల సమస్యలను ప్రశ్నించే ప్రతిపక్ష పాత్రను కాంగ్రెస్పార్టీ సమర్థవంతంగా పోషిస్తోందని, ధరల పెంపు దేశం కోసం, ధర్మం కోసం చేస్తున్నామని చెప్పడం సరైంది కాదన్నారు. ప్రజల సమస్యలపై దృష్టి సారించాల్సిన నాయకులు రాజకీయ ప్రయోజనాలకే పరిమితమవుతున్నారని విమర్శించారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతులు, కార్మికులు, చిరు వ్యాపారులు, సామాన్య ప్రజలను పట్టించుకోకుండా పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర సరుకుల ధరలను పెంచుతూ ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. రూ.లక్షల కోట్ల అప్పులు చేస్తూ కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూరుస్తోందని ఆరోపించారు. ఇలాగే ధరలు పెరిగితే భవిష్యత్లో ఎద్దుల బండ్లు, గుర్రపుబండ్లు, సైకిళ్ల వినియోగం పెరిగే పరిస్థితి వస్తుందన్నారు. ప్రజల కోసం పనిచేసినప్పుడే దేశ ప్రగతి సాధ్యమవుతుందని, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, కాంగ్రెస్పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సాయిచరణ్రెడ్డి, తిరుపతయ్య, పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి బ్రహ్మచారి, కౌన్సిలర్లు ధనలక్ష్మి, మహేశ్వరి, విజయలక్ష్మి, పార్టీ అధికార ప్రతినిధులు శరవంద, కోళ్ల వెంకటేష్, ఆదిత్య పాల్గొన్నారు. -
అన్నదాత.. అరిగోస
వనపర్తి రూరల్/కొత్తకోట రూరల్: జిల్లాలో శనివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి చిట్యాల వ్యవసాయ మార్కెట్యార్డులో సుమారు 20 వేల బస్తాల వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ఆదివారం ఉదయం తడిసిన ధాన్యాన్ని ఆరబోయలేక, తూకం చేసిన సంచులను నీటిలోంచి తీసి ఆరబెట్టలేక రైతులు పడుతున్న ఇబ్బందులు వర్ణానాతీతం. ఏ రైతును పలుకరించినా మార్కెట్కు ధాన్యం తెచ్చి 60 రోజులు అవుతుందని.. కొనుగోలు పూర్తి కాలేదని చెప్పడం కనిపించింది. రోజు అధికారులు సందర్శించి కొనుగోలు చేయాలని చెబుతారేగాని.. ఎక్కడికి తరలించాలనే ముందుచూపు లేక తాము నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం తడిసిన తర్వాత అధికారులు వచ్చి మార్కెట్యార్డులో ఉన్న షెడ్డులోకి తరలిస్తామని చెబుతున్నారు. ఇదే పని నాలుగు రోజుల ముందు చేసి ఉంటే ధాన్యం తడిసేది కాదని అంటున్నారు. ● ఆదివారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లిలో ఏర్పాటు చేసిన సింగిల్విండో, ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. రోజు సాయంత్రం అయిందంటే చాలు ఈదురు గాలులు, పిడుగులు, అకాల వర్షాలకు అన్నదాతలు అరిగోస పడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ధాన్యం బస్తాలను వేగంగా గోదాంలకు తరలించాలని వేడుకుంటున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రోడ్డెక్కి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. నీటిలోనే తూకం చేసిన వరి ధాన్యం బస్తాలు -
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం
వనపర్తి రూరల్: రైతులు ఆందోళన చెందొద్దని.. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వ నిబంధనల మేరకు కొనుగోలు చేస్తామని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ తెలిపారు. మండలంలోని పెద్దగూడెం గ్రామ కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిందని ఆదివారం రైతులు ఆందోళన చేస్తుండగా విషయం తెలుసుకున్న ఆయన అక్కడకు చేరుకొని వారితో మాట్లాడారు. అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్నిరైతులకు నష్టం కలగకుండా నిబంధనల ప్రకారం కొనుగోలు చేసేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ధాన్యం తడవకుండా తగినన్ని టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. వర్ష సూచన ఉన్నందున కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, ప్రభుత్వం రైతుల పక్షాన ఉటుందని.. కేంద్రానికి వచ్చిన ప్రతి గింజను కొంటామని రైతులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్రెడ్డి, ఎస్ఐ హృశికేష్, సర్పంచ్ పుష్పలత, ఏపీఎం బుచ్చన్న, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. రేపు సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష కందనూలు: నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులపై మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కీలక సమీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ హేమంతకేశవ్ పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర పాడి పరిశ్రమ, క్రీడలు, యువజనశాఖల మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ డా.మల్లు రవి, ఎమ్మెల్సీలతో పాటు నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు హాజరవుతారని పేర్కొన్నారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నీటిపారుదల ప్రాజెక్టుల ప్రస్తుత స్థితి, పనుల పురోగతి, భూసేకరణ సమస్యలు, పెండింగ్ పనులు, పునరావాసం తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. నేటి నుంచి డీఎడ్ పరీక్షలు వనపర్తిటౌన్: జిల్లాలో డీఎడ్ ప్రథమ సంవత్సర పరీక్షలు సోమవారం నుంచి జూన్ 1వ తేదీ వరకు కొనసాగనున్నట్లు జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ, ఏసీజీఈ గణేష్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. పరీక్ష రాసే అభ్యర్థులు ఉదయం 8:30 గంటల వరకు కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. -
ధాన్యం కొనుగోళ్లు అస్తవ్యస్తం
వనపర్తి: అధికార, పాలకవర్గం నిర్లక్ష్యం, ముందస్తు ప్రణాళిక లేకపోవడంతోనే ధాన్యం విక్రయానికి రైతులు అరిగోసపడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఉదయం ఆయన స్థానిక నాయకులతో కలిసి స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. అంతకుముందు జిల్లాకేంద్రంలోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు వరి, మొక్కజొన్న తడిసి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తూకం చేసిన ధాన్యం సకాలంలో తరలించి ఉంటే తడిసిపోయేదా అని ప్రశ్నించారు. తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంటల సాగు సమయంలో యూరియా కోసం రైతులు వరుసలో నిలబడాల్సి వస్తోందన్నారు. జిల్లాలో వరి కొనుగోళ్లు ప్రారంభమై 40 రోజులు కావస్తున్నా.. ఇప్పటి వరకు కొన్ని గ్రామాలకు ఒక్క లారీ కూడా వెళ్లని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. ముందస్తు ప్రణాళిక లేకనే ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. వాహనాలు లేని వారికి, డిఫాల్టర్ మిల్లర్లకు అధికారులు ధాన్యం తరలింపు బాద్యతలు అప్పగించడంతో కొనుగోలు కేంద్రాల నుంచి సకాలంలో ధాన్యం మిల్లులకు వెళ్లడం లేదని, చేసేది లేక రైతులు సొంత ట్రాక్టర్లలో తూకం చేసిన ధాన్యాన్ని మిల్లులు, గోదాంలకు తరలిస్తున్నారన్నారు. ప్రభుత్వానికి సుమారు రూ.120 కోట్ల మేర బకాయి ఉన్న శ్రీరంగాపూర్కు చెందిన ఓ మిల్లర్కు అధికారులు రవాణా బాధ్యతలు ఎలా అప్పగించాలని ప్రశ్నించారు. కొన్ని మిల్లులకు 90 శాతం ధాన్యం కేటాయింపులు.. ప్రభుత్వ అనుబంధంతో రైస్మిల్లులు నడిపిస్తున్న కొందరికి ప్రతి సీజన్లో 90 శాతం ధాన్యం కేటాయింపులు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని.. నిబంధనలు అందరికీ ఒకేలా ఉంటే కేటాయింపుల్లో కాంగ్రెస్ అనుబంధంగా ఉండే మిల్లర్లకు అగ్రభాగం ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. కొందరు రాజకీయ బ్రోకర్లు, మిల్లర్లు, అధికారులు కు మ్మకై ్క ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, నిబంధనలు అందరికీ సమానంగా అమలు చేయా లని, తప్పుచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై పౌరసరఫరాలశాఖ కమిషనర్కు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. శ్రీధర్ హత్య కేసు ఏమైంది..? చిన్నంబావి మండలం బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్రెడ్డి హత్య కేసును రెండేళ్లు పూర్తయినా.. ఎందుకు ఛేదించడం లేదని నిరంజన్రెడ్డి ప్రశ్నించారు. పోలీసు అఽధికారులు మారుతున్నారే తప్ప విచారణ కొలిక్కి రావటం లేదని విమర్శించారు. సహచర మంత్రిని కాపాడేందుకు సీఎం ఈ వ్యవహారాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్లుగా భావించాల్సి వస్తుందన్నారు. మాజీ మంత్రి వెంట బీఆర్ఎస్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, మున్సిపల్ మాజీ చైర్మన్ పలుస రమేష్గౌడ్, నాయకులు లక్ష్మారెడ్డి, మాణిక్యం, నందిమళ్ల అశోక్, జోహెబ్, రాము తదితరులు ఉన్నారు. అధికారులు, పాలకల నిర్లక్ష్యంతోనే రైతులకు అవస్థలు -
యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు..
వనపర్తి: వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఆదివారం హైదరాబాద్ నుంచి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సీ్త్ర, శిశు సంక్షేమశాఖ మంత్రి అనసూయ, ఇతర సహచర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరం నుంచి కలెక్టర్ ఆదర్శ్ సురభి ఎస్పీ సునీతారెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. వీసీ అనంతరం కలెక్టర్ సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలని, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. లారీల విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తడానికి వీలులేదని, రవాణాశాఖ అధికారులు చొరవ తీసుకొని ఖాళీగా ఉన్న లారీలు, డీసీఎంలు, ట్రాక్టర్లను ధాన్యం తరలించడానికి మళ్లించాలన్నారు. అదేవిధంగా ధాన్యం అన్లోడ్ చేయడానికి గోదాంలలో సరిపడా హమాలీలను అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం నుంచి 30వ తేదీ వరకు మహిళా వారోత్సవాలు ప్రణాళిక ప్రకారం ఘనంగా నిర్వహించాలని కోరారు. నిర్దేశించిన విధంగా రోజువారి కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ రాజేష్ మీనా, డీఎస్ఓ కాశీ విశ్వనాథ్, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఆర్డీఓ ఉమాదేవి, జిల్లా సంక్షేమశాఖ అధికారి సుధారాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
సాగు తీరు మారేనా?
మూస పద్ధతిలోనే పంటల సాగు వనపర్తి: నేలల స్వభావం, వాతావరణం, మార్కెటింగ్, స్థానిక డిమాండ్ ఆధారంగా పంటల ఉత్పత్తులు, నీటి లభ్యత తదితర పరిస్థితుల ఆధారంగా వ్యవసాయశాఖ అధికారుల సూచనల మేరకు రైతులు వివిధ రకాల పంటలు సాగుచేయడం ఆధునిక వ్యవసాయంగా చెప్పవచ్చు. కానీ జిల్లాలో దశాబ్ద కాలంగా మూస పద్ధతిలో ఒకేరకమైన పంటలు సాగు చేస్తుండటంతో మార్కెటింగ్, కూలీలు, ఎరువుల కోసం అవస్థలు తదితర ఘటనలు ఏటా పెరుగుతున్నాయి. ప్రస్తుత యాసంగిలో వరి ధాన్యం విక్రయించుకునేందుకు రైతులు పడుతున్న ఇబ్బందులు, రవాణాకు సొంత ట్రాక్టర్లను సైతం మిల్లుల వద్ద వరుసలో నిలబెట్టి రోజుల తరబడి ధాన్యం వద్దనే పడిగాపులు పడాల్సిన దుస్థితిని చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు. జిల్లావ్యాప్తంగా మొత్తం 2.35 లక్షల ఎకరాల సాగు భూమి ఉంటే.. పండ్ల తోటలు, అక్కడక్కడ ఆయిల్పాం, చెరుకు మినహా.. సుమారు 1.95 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది. దీంతో ప్రస్తుత యాసంగిలోనే సుమారు 3.75 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం విక్రయానికి వస్తుందని అధికారుల అంచనా. కాగా 40 రోజుల్లో సుమారు 1.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాలశాఖ కొనుగోలు చేసింది. మరో 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రావచ్చని అధికారుల లెక్కల ప్రకారం తెలుస్తోంది. రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో వరి దిగుబడులు వచ్చినట్లు అధికారుల లెక్కలతో స్పష్టమవుతోంది. కాగా పప్పు దినుసులు, ఆకు, కూరగాయలు, నూనెగింజల కోసం ఇతర ప్రాంతాలపై ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రోజూ కర్నూలు, బెంగుళూరు నుంచి కూరగాయాలు జిల్లాకు దిగుమతి అవుతున్నాయి. కనీసం జిల్లాకు సరిపడా ఆకు కూరగాయలు సైతం ఇక్కడ పండించడం లేదు. పంటల వైవిద్యాన్ని పాటించాలని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నా.. అనాసక్తే చూపుతున్నారు. పంటలు 2021–22 2022–23 2023–24 2024–25 2025–26 జొన్న 1,868 1,455 776 1,933 1298 మొక్కజొన్న 11,631 12,077 11,111 9,054 4,100 కంది 13,890 6,185 3,954 6,791 5,998 పెసర 226 58 5 47 69 మినుములు 651 227 399 1,044 1,206 వేరుశనగకు డిమాండ్.. జిల్లాలో పండించిన వేరుశనగ (పల్లీ)కి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లోనూ మంచి డిమాండ్ ఉంటుంది. ఇందుకు కారణం ఇక్కడి వేరుశనగలో అఫ్లటాక్సిన్ అనే శిలీంద్రం లేకపోవడంతో ఎక్కువ కాలం నిల్వ ఉండటమే గాకుండా రంగు, రుచి మారదు. రెండేళ్ల కిందటి వరకు ఈ ప్రాంతంలో పండించిన వేరుశనగను యూరప్ దేశాలకు ఎగుమతి చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత నీటి లభ్యత పెరగడంతో మెట్ట పంటలు సాగుచేసే పొలాలను రైతులు వరి సాగుకు అనుగుణంగా మార్చడంతో ఏటా మెట్ట పంటల సాగు తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం మొక్కజొక్క, పత్తి, కంది, పెసర, శనగ, మినుము సాగు చాలా వరకు తగ్గిపోయింది. పంటల వైవిధ్యంపై రైతుల అనాసక్తి ఏటా తగ్గుతున్న మెట్ట పంటలు, కూరగాయల సాగు ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంతోనైనాప్రయోజనం చేకూరేనా? ఏటా వానాకాలంలో మెట్ట పంటల సాగు ఇలా.. (ఎకరాల్లో..) -
జూరాల పూడి‘నది’
గద్వాల: కృష్ణాబేసిన్ పరిధిలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే తొలిప్రాజెక్టు ప్రియదర్శిని జూరాల. ఉమ్మడి పాలమూరులోని నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, పాలమూరు– రంగారెడ్డి, కోయిల్సాగర్తోపాటు నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల నుంచే నీరు విడుదల అవుతుంది. ఇంతటి ప్రాధాన్యత గల జూరాల జలాశయం ప్రస్తుతం బురదతో పూడుకుపోయింది. ఫలితంగా జలాశయంలో నీటినిల్వ సామర్థ్యం తగ్గిపోయి.. రబీ సీజన్లో సాగు, తాగునీటి కష్టాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో జూరాల జలాశయంలో పూడిక తీసేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. ఇందులో భాగంగా జలాశయంలో ఎంతమేర బురద పేరుకుపోయింది. ఎన్నిటీఎంసీల నీటినిల్వ సామర్థ్యం తగ్గిందనే లెక్కలు వేశారు. జలాశయంలో పేరుకుపోయిన బురదను తొలగించేందుకు సుమారు రూ.312 కోట్లు వ్యయం అవుతుందని అంచనాలు రూపొందించి నివేదికను మూడు నెలల కిందట ప్రభుత్వానికి సమర్పించారు. 2012 నాటికే.. ఇందులో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కృష్ణాబేసిన్లో నిర్మించిన జూరాల ప్రాజెక్టులో 2012 సంవత్సరం నాటికే 2.16 టీఎంసీల బురద పేరుకుపోయినట్లు, ఆ తర్వాత బురద పేరుకునేందుకు సరిపడా స్థలం కూడా లేకపోవడంతో వరదల సమయంలో నీటితోపాటు బురద సైతం దిగువకు వెళ్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే ప్రాజెక్టుకు ఉన్న క్రస్టుగేట్లలో పెద్దఎత్తున బురద పేరుకుపోయి గేట్లు, ఇనుప రోపులకు నష్టం వాటిల్లుతున్నట్లు గుర్తించారు. జూరాల ప్రాజెక్టు జలాశయం 1,045 అడుగులు.. జూరాల ప్రాజెక్టు జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు (1,045 అడుగులు) కాగా.. ఇందులో ప్రస్తుతం 2 టీఎంసీలపైనే బురద పేరుకుపోయింది. దీనిపై ప్రభుత్వం పలుమార్లు సర్వే చేయించగా.. సుమారు 2.16 టీఎంసీల బురద పేరుకుపోయినట్లు అధికారులు లెక్క తేల్చారు. అంటే జలాశయం సామర్థ్యం 7.5 టీఎంసీలకు కుదించుకుపోయినట్లయింది. జలాశయంలో కష్టసాధ్యంగా పూడికతీత వ్యవహారం 2.30 టీఎంసీల మేర పేరుకుపోయిన బురద పలుమార్లు సర్వేలు.. రూ.312.77 కోట్ల అంచనా వ్యయం నివేదిక అందజేసిన సాగునీటి పారుదల శాఖ అంతర్గత చర్చలో అసాధ్యమనే అధికారుల అభిప్రాయం రాళ్లతో కూడినది కావడంతో.. సాధారణంగా జలాశయంలో బురద తొలగించిన అనంతరం బయటకు వచ్చే ఇసుక సుమారు 20– 30 శాతం మేర ఉంటుందని అధికారుల అంచనా. అయితే కృష్ణాబేసిన్ సహజ స్వరూపం రాళ్లతో కూడినది కావడంతో ఇసుక మేట్లు అనుకున్నంత స్థాయిలో ఏర్పడవు. అదే తుంగభద్ర నది సహజ స్వరూపం అధిక భాగం ఇసుకతో కూడుకున్నదై ఉంటుంది. దీంతో తుంగభద్ర బేసిన్లో ఏర్పడే ఇసుకమేట్లు కృష్ణాబేసిన్లో ఏర్పడవని అధికారులు తేల్చారు. ఏప్రిల్ చివరి వారంలో హైదరాబాద్లో ఈఎన్సీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలోనూ ఇదే అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది. 7 శాతం ఇసుక వస్తే బురద తొలగించేందుకు ఏజెన్సీలు ముందుకు రావని, దీంతో జూరాలలో బురద తొలగింపు అసాధ్యమైన పని అని సమావేశంలో అభిప్రాయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వానిదే నిర్ణయం.. జూరాల ప్రాజెక్టులో సుమారు 2 టీఎంసీలకు పైనే బురద పేరుకుపోయినట్లు సర్వేలో తేలింది. ఈ క్రమంలో ఇసుకను తీసుకుని బురద తొలగించేందుకు పనులు దక్కించుకునే ఏజెన్సీలు ప్రభుత్వానికి రూ.300 కోట్లు చెల్లించాలని తుది నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి మూడు నెలల కిందట పంపించాం. దీనిపై ప్రభుత్వం నుంచి నిర్ణయం రావాల్సి ఉంది. – జుబేర్, జూరాల డ్యాం ఈఈ -
ఈదురుగాలుల బీభత్సం
● నేలకొరిగిన వృక్షాలు.. తెగిన విద్యుత్ తీగలు ● స్తంభించిన రాకపోకలు మదనాపురం/వనపర్తి రూరల్/కొత్తకోట రూరల్ /ఆత్మకూర్/అమరచింత/ పాన్గల్/ గోపాల్పేట/ ఖిల్లాఘనపురం: జిల్లావ్యాప్తంగా శనివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో మదనాపురం – కొత్తకోట ప్రధాన రహదారిపై భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ తీగలు తెగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆత్మకూర్, కొత్తకోట వైపు వెళ్లాల్సిన వందలాది వాహనాలు, బస్సులు, అత్యవసర అంబులెన్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొత్తకోటలో భారీ వేప చెట్లు, చెట్ల కొమ్మలు రోడ్డుకు పక్కనే ఉన్న విద్యుత్ తీగలపై, రోడ్డుపై పడడంతో రాకపోకలు, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. స్థానికులు గుమిగూడి ప్రధాన రహదారిపై చెట్లను తొలగించారు. తడిసిన ధాన్యం.. వనపర్తి మండలంలోని చిట్యాల వ్యవసాయ మార్కెట్యార్డులో వరి ధాన్యం తడిసిపోయింది. టారాలిన్లు కప్పినా అడుగున వర్షపునీరు నిలిచి తడిసి ముద్దవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీరంగాపురం, పెబ్బేరుతో పాటు ఆయా మండలాల్లోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఽకొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. ఈదురుగాలులకు చందాపూర్ రోడ్డుపై చెట్లు విరిగిపడ్డాయి. ● అమరచింత–ఆత్మకూర్ మధ్యలో చెట్లు కూలి విద్యుత్ తీగలపై పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆత్మకూర్ గాంధీచౌక్లో వర్షపునీరు నిలిచి రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. ● గోపాల్పేట మండలంలో పొలికెపాడు– తూడుకుర్తి, గోపాల్పేట – చాకల్పల్లి రహదారులపై చెట్లు విరిగి రోడ్డుపై పడిపోయాయి. ● పాన్గల్లో ప్రధాన రహదారిపై చెట్లు నెలకొరగగా.. నిరంజన్ ఇంటి పైకప్పు కూలిపడగా.. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలపై టార్పాలిన్లు కప్పినా అక్కడక్కడా తడిసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ● ఖిల్లాఘనపురం మండలంలోని సోళీపురం నుంచి కోతులకుంట తండాకు వెళ్లే దారిలో 20 స్తంభాలు, నాలుగు ట్రాన్స్ఫార్మర్లు పడిపోయాయి. దీంతో తండాలో అంధకారం నెలకొంది. మామిడిమాడలో తెలుగు శేషమ్మకు చెందిన రేకుల ఇంటి కప్పు ఈదురు గాలులకు ఎగిరిపోయింది. పిడుగు పాటుతో ఎద్దు మృతి.. కొత్తకోట మండలంలోని కనిమెట్టలో పిడుగు పాటుకు గురై రైతు బోయ కృష్ణయ్యకు చెందిన ఎద్దు మృతి చెందింది. అదేవిధంగా కొత్తకోటలోని మాంసం మార్కెట్ సమీపంలో, పాత జూనియర్ కళాశాల సమీపంలోని ప్రధాన రోడ్డుపై భారీ వేపచెట్లు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శంకరమ్మపేటలో పిడుగుపాటు మదనాపురం మండలంలోని శంకరమ్మపేటలో బోయ సురేష్ ఇంటి ఎదుట ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగుపడి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. -
ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి
వనపర్తి: ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని.. నైపుణ్యాలు పెంపొందించుకొని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక యువజన, క్రీడా వారోత్సవాల సందర్భంగా మే 1వ తేదీన మహబూబ్నగర్లో జాబ్మేళా నిర్వహించగా.. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాల అందజేత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్యఅతిథులుగా హాజరై వివిధ ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించిన 17 మందికి నియామక పత్రాలు అందజేశారు. అలాగే ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక క్రీడా, యువజన వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఫుట్బాల్, వాలీబాల్, హాకీ తదితర క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు కలెక్టర్, ఎమ్మెల్యే ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఆరోగ్యకర జీవన విధానానికి క్రీడలు ఎంతో అవసరమని, ఫిట్నెస్ను ప్రతి ఒక్కరూ జీవితంలో భాగంగా మార్చుకోవాలని సూచించారు. క్రీడలతో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయన్నారు. యు వత క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా తెలంగాణ పర్యాటకశాఖకు సంబంధించిన బ్రాండింగ్ కిట్లను కలెక్టర్, ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, జిల్లా యువజన క్రీడల అధికారి సుధీర్రెడ్డి, ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
శిక్షలతోనే నేరాల నియంత్రణ
వనపర్తి: సమర్థవంతమైన దర్యాప్తు, పటిష్టమైన సాక్ష్యాధారాల సమర్పణతో కోర్టుల్లో శిక్షల శాతాన్ని పెంచడం పోలీసుశాఖ ప్రధాన లక్ష్యమని, దీంతో ప్రజల్లో భద్రతాభావం, పోలీసులపై నమ్మకం, గౌరవం మరింత రెట్టింపు అవుతాయని అదనపు ఎస్పీ రాజేష్ మీనా అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, డీసీఆర్బీ అధికారులు, జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల కోర్టు డ్యూటీ కానిస్టేబుళ్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కోర్టుల్లో నిందితులకు శిక్షలు పడినప్పుడే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని.. అనవసరంగా కేసులు పెండింగ్లో ఉండకుండా కోర్టు డ్యూటీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు నుంచి కేసు పూర్తయ్యే వరకు అవసరమైన సాక్ష్యాలు, పత్రాలు, వాంగ్మూలాలు సమయానికి కోర్టుకు చేరేలా చూడడం బాధ్యతని తెలిపారు. అదేవిధంగా కోర్టు సమాచారం, విచారణకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఎస్సైలకు తెలియజేయాలని, పెండింగ్లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్లు, సమన్ల అమలుపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన అమలు చేయాలన్నారు. అనంతరం పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాట్లాడుతూ.. పోలీసు అధికారులు, ప్రాసిక్యూషన్ విభాగం సమన్వయంతో పనిచేస్తేనే కోర్టులో కేసులు బలపడతాయని తెలిపారు. కేసులకు సంబంధించిన పత్రాలు, సాక్ష్యాలు, సాక్షుల హాజరు విషయంలో ఆలస్యం జరగకుండా చూడాలని సూచించారు. ప్రతి కేసును బాధ్యతగా తీసుకొని సమగ్రంగా కోర్టులో ప్రవేశపెడితే శిక్షల శాతం గణనీయంగా పెరుగుతుందన్నారు. సమావేశంలో డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, డీసీఆర్బీ ఎస్ఐ తిరుపతిరెడ్డి, ఐటీ కోర్ సిబ్బంది గోవింద్, రవీందర్బాబు, డీసీఆర్బీ సిబ్బంది వెంకటన్నగౌడ్, జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల కోర్టు డ్యూటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఇళ్లగణన గడువులోగా పూర్తికావాలి : కలెక్టర్
వనపర్తి: జనగణన–2027లో భాగంగా ఇళ్లగణన ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి చార్జ్ అధికారులు, అదనపు చార్జ్ అధికారులు, సూపర్వైజర్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చార్జ్ అధికారులు ఎన్యూమరేటర్లతో సమన్వయం చేసుకుంటూ ఇళ్లగణన ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఎన్యూమరేటర్లు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించి సర్వే ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని కోరారు. ఇళ్లగణనలో ఒక్క ఇల్లు కూడా తప్పిపోకుండా ఎన్యూమరేటర్లు పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ఇళ్లగణన జూన్ 9లోగా పూర్తి చేయాలని కోరారు. సెన్సెస్ ప్రక్రియ ప్రభుత్వానికి అత్యంత కీలకమైన కార్యక్రమమని.. అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో స్థానిక సంస్థల అ దనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, సైన్న్స్ అధికారి శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. గణప సముద్రం నిర్వాసితులకు పరిహారం ఖిల్లాఘనపురం: మండలంలోని గణప సముద్రం రిజర్వాయర్లో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం ఎట్టకేలకు పరిహారం విడుదల చేసింది. మొత్తం 388 ఎకరాలకుగాను రూ.42,13,74,661 విడుదలైనట్లు ఖిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ క్యామ నవనీత, సింగిల్విండో చైర్మన్ కె.మురళీధర్రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు టి.సాయిచరణ్రెడ్డి తెలిపారు. ఎక్కడా అవినీతికి తావు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమ అయినట్లు చెప్పారు. నిధుల విడుదల సందర్భంగా శనివారం మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చిత్రపటాలకు వారు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రైతులకు ఇచ్చిన మాట కోసం ముఖ్యమంత్రి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రిని నిరంతరం కలిసి నిధుల విడుదలకు కృషి చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, వ్యవసాయశాఖ మంత్రులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు విజయ్కుమార్, పెద్దలు ఆగారం ప్రకాష్, క్యామ రాజు, గంజాయి రమేష్, నారాయణ, లింగస్వామి, శ్రీరాములు, రజినీకాంత్, నరేష్, బుచ్చిరెడ్డి, యాదగిరి, ముజాహిద్, హజీం, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం సరికాదు ఆత్మకూర్: వార్డు అధికారులు, సిబ్బంది విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని పుర కమిషనర్ చికినె శశిధర్ హెచ్చరించారు. శనివారం స్థానిక పుర కార్యాలయంలో వార్డు అధికారులు, మెప్మా ఆర్పీలు, సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిత్యం వార్డుల్లో పర్యటించి ఇంటి, కొళాయి పన్నులు వసూలు చేయాలని, తడి, పొడిచెత్త వేర్వేరుగా ఇచ్చే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కొందరు చెత్తను రోడ్లు, డ్రైనేజీల్లో పారబోస్తున్నారని.. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీంలో అర్హులను గుర్తించి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలన్నారు. స్వచ్ఛతలో పారుశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకమని.. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వాటర్మెన్లు నిత్యం అందుబాటులో ఉండి తాగునీటి సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని, స్థానికుల నుంచి ఫిర్యాదులు అందితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
చేయూత.. పరిశీలన
కొనసాగుతున్న పింఛన్దారుల వివరాల నమోదు ● మూడు నెలలకోసారి ముఖచిత్రాల నమోదు ● జిల్లాలో 70 వేల పైచిలుకు లబ్ధిదారులు ● పురపాలికల్లో వార్డు అధికారులు, గ్రామపంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు ●చేయూత యాప్లో నమోదు.. ప్రభుత్వ ఆదేశాల మేరకు చేయూత పింఛన్దారుల వివరాలను చేయూత యాప్లో నమోదు చేస్తున్నాం. ఈ విషయాన్ని ముందస్తుగానే పట్టణంలోని అన్ని వార్డుల్లో టాం టాం వేయించాం. నడవలేని, మంచానికే పరిమితమైన వారి ఇళ్లకు వార్డు అధికారులు వెళ్లి నమోదు చేసుకుంటున్నారు. నెలాఖరు నాటికి వివరాల నమోదు పూర్తిచేస్తాం. – నూరుల్ నదీం, పుర కమిషనర్, అమరచింత ముందస్తు సమాచారం ఇస్తున్నాం.. చేయూత యాప్లో పింఛన్దారుల వివరాల నమోదు విషయాన్ని గ్రామాల్లో పంచాయతీ సిబ్బంది ద్వారా ముందస్తుగా సమాచారం ఇస్తున్నాం. పంచాయతీ కార్యదర్శులు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఐరీష్ నమోదు చేసుకుంటున్నారు. వివరాలు నమోదు చేసుకోకపోతే వచ్చే నెల పింఛన్ రాదనే విషయాన్ని లబ్ధిదారులకు తెలియజేస్తూ నమోదును వేగవంతంగా చేపడుతున్నాం. – శ్రీనివాసులు, ఎంపీడీఓ, అమరచింత వచ్చే నెల 15 వరకు.. చేయూత పింఛన్ లబ్ధిదారుల వివరాలను చేయూత యాప్లో నమోదు చేసే కార్యక్రమం కొనసాగుతోంది. జిల్లావ్యాప్తంగా వచ్చే నెల 15 వరకు నమోదు కార్యక్రమం కొనసాగనుంది. నమోదు ప్రక్రియ ఇకపై ప్రతి మూడు నెలలకు ఓ మారు ప్రభుత్వం చేపట్టనున్నట్లు తెలిసింది. – ఉమాదేవీ, డీఆర్డీఓ అమరచింత: రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం నుంచి కొత్తగా చేయూత పింఛన్ మంజూరుకు శ్రీకారం చుట్టడమే కాకుండా ప్రస్తుత లబ్ధిదారుల వివరాలతో పాటు వారి ఐరిష్ను నమోదు చేసుకునే కార్యక్రమం చేపట్టింది. జిల్లాలోని అన్ని గ్రామాలతో పాటు పుర కేంద్రాల్లో మూడురోజులుగా పింఛన్దారుల వివరాలను ప్రత్యేక చేయూత యాప్లో నమోదు చేస్తున్నారు. లబ్ధిదారుడి ఆధార్ నంబర్తో పాటు అతని కళ్లు, ముఖం ఫొటో క్యాప్చర్ చేస్తూ యాప్లో నమోదు చేసుకుంటున్నారు. సకాలంలో యాప్లో వివరాలు నమోదు చేసుకోకుంటే వారి పింఛన్ రద్దయ్యే అవకాశం ఉంది. కూలి పనులతో పాటు బతుకుదెరువు కోసం పట్టణాలకు వలస వెళ్లిన వారిని వారి కుటుంబ సభ్యులు స్వగ్రామానికి పిలిపించుకొని అధికారుల వద్ద వివరాలను నమోదు చేయిస్తున్నారు. ● జిల్లాలోని 255 గ్రామపంచాయతీలలో చేయూత నమోదు కార్యక్రమం యుద్ధప్రాతిపదికన కొనసాగుతోంది. జూన్ 15 వరకు నమోదు ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు వెల్లడించడంతో ప్రతి లబ్ధిదారు తమ వివరాలతో పాటు అధికారులు అడిగిన సమాచారాన్ని అందిస్తున్నారు. జిల్లాలో చేయూత పింఛన్ పొందుతున్న వారి సంఖ్య 70 వేల పైచిలుకు ఉందని డీఆర్డీఓ అధికారులు వెల్లడిస్తున్నారు. చాలా గ్రామాల్లో లబ్ధిదారులు చనిపోయినా.. అతడి పేరుపై కుటుంబ సభ్యులు నేటికీ బ్యాంకు, పోస్టాఫీసు ద్వారా పింఛన్ పొందుతున్నారని, రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేయూత యాప్లో లబ్ధిదారుల నమోదుకు శ్రీకారం చుట్టింది. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అక్కడే ఐరిష్ నమోదు చేస్తుండటంతో ఇకపై మృతిచెందిన వారి పింఛన్లు నిలిచిపోవడం ఖాయమంటున్నారు. దీంతో అర్హత కలిగి నేటికి పింఛన్ తీసుకోలేని వారికి ఇది ఒక అవకాశంగా మారింది. వృద్ధాప్య 27,195 ఒంటరి మహిళలు 2,521 బీడీ కార్మికులు 963 చేనేత 564 పెబ్బేరు 1,592 అమరచింత 2,020 డయాలసీస్ 104 పైలేరియా 5 గీత కార్మికులు 389 ఆత్మకూర్ 1,237 మృతిచెందిన వారిని తొలగింపునకే.. -
ధాన్యం దించేందుకు సహకరించండి
వీపనగండ్ల: వరి ధాన్యాన్ని గోదాంలో దించేందుకు రైతులు తమవంతు సహకారం అందించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ కోరారు. శనివారం మండల కేంద్రంలోని వ్యవసాయ గోదాంను ఆయన సందర్శించి రైతులతో మాట్లాడారు. ధాన్యాన్ని గోదాంలో దించేందుకు అదనంగా హమాలీలను ఏర్పాటు చేస్తున్నామని.. కొనుగోలు కేంద్రాల నుంచి ట్రాక్టర్లలో రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని దించేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని తహసీల్దార్ ఖాజామైనుద్దీన్ను ఆదేశించారు. నాలుగు రోజులుగా గోదాం వద్ద పడిగాపులు పడుతున్నామని.. కనీస వసతులు లేక ఇబ్బందులకు గురవుతున్నామని రైతులు అడిషనల్ కలెక్టర్కు మొరపెట్టుకున్నారు. -
ఆధునిక సాగుపై అవగాహన
కొత్తకోట రూరల్: రైతులకు ఆధునిక వ్యవసాయ సాగు పద్ధతులపై అవగాహన కల్పించేందుకు మండలంలోని అమడబాకుల రైతువేధికలో శుక్రవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. పాలెం వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త ప్రొ. డా. ప్రగతికుమారి హాజరై సాగునీటి పొదుపు పద్ధతులు, వాతావరణ అనుకూల పంటల సాగు విధానం, ఎరువుల సమతుల్యత, ఆధునిక వ్యవసాయంపై రైతులకు వివరించారు. తక్కువ నీటితో అధిక దిగుబడి సాధించే పద్ధతులను అవలంబించాలని సూచించారు. అనంతరం రైతుల సమస్యలు తెలుసుకొని సస్యరక్షణ చర్యలపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో కొత్తకోట వ్యవసాయ అధికారి జాస్మిన్, ఏఈఓ రవీందర్రెడ్డి, కళాశాల విద్యార్థులు కె.నర్సింహ, చంద్రవర్ధన్, సర్పంచ్ గాయత్రి, రైతులు పాల్గొన్నారు. -
తపాలశాఖలో కలవరం!
సీబీఐ ఎఫ్ఐఆర్లో పోస్టల్ సూపరింటెండెంట్ భూమన్న పేరు ● బదిలీ వేటు వేసి పోస్టింగ్ ఇవ్వని ఉన్నతాధికారులు ● పూర్తి వివరాలు సేకరిస్తున్న సీబీఐ అధికారులు ● బిల్లుల చెల్లింపులపై సృష్టత కరువు బదిలీ అయ్యారు.. ఇక్కడ విధులు నిర్వర్తించే పోస్టల్ సూపరింటెండెంట్ భూమన్న బదిలీ కావడంతో ఉన్నతాధికారులు అదనపు బాధ్యతలు అప్పగించారు. రెండు రోజుల కిందటే బాధ్యతలు తీసుకోవడంతో అదనపు విధుల బిల్లుల చెల్లింపు సమాచారం తీసుకోలేదు. పూర్తిస్థాయిలో అధ్యాయనం చేసి నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు చేపడతాం. – ఎన్.వెంకటేశ్వర్, ఇన్చార్జి సూపరింటెండెంట్, వనపర్తి వనపర్తిటౌన్: బీపీఎంలు, ఏబీపీఎంలు, డాక్ సేవక్ల అదనపు బిల్లుల చెల్లింపు కోసం పోస్టల్ ఇన్స్పెక్టర్ గోపీనాథ్ లంచం ఆశిస్తూ ఈ నెల 8న సీబీఐకి పట్టుబడిన విషయం పాఠకులకు విధితమే. ఈ వ్యవహారంలో పోస్టల్ సూపరింటెండెంట్ భూమన్న పాత్ర ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటిని భూమన్న ఖండించినప్పటికీ.. అనూహ్యంగా సీబీఐ ఎఫ్ఐఆర్లో అతడి పేరు నమోదు కావడంతో తపాలశాఖలో కలవరం మొదలైంది. భూమన్నను వనపర్తి నుంచి బదిలీ చేసిన ఉన్నతాధికారులు ఇప్పటి వరకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. రెండ్రోజుల కిందట సీబీఐ అధికారులు భూమన్న, పోస్టల్ ఇన్స్పెక్టర్ గోపీనాథ్కు సంబంధించిన పూర్తి వివరాలను వనపర్తి ప్రధాన పోస్టల్ కార్యాలయం నుంచి తెప్పించుకున్నట్లు సమాచారం. ఈ కేసులో పోస్టల్ సూపరింటెండెంట్ పేరు నమోదు కావడంతో సీబీఐ విచారణ ఎవరెవరికి తలనొప్పి తెచ్చిపెడుతుందోనని సిబ్బందిలో కలవరం మొదలైంది. భూమన్న ఎక్కడెక్కడ విధులు నిర్వర్తించారు.. ఆయన వ్యవహారం శైలిపై సీబీఐ దృష్టి సారించినట్లు అధికారులు చర్చించుకుంటున్నారు. -
అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి
వనపర్తి: ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ.. బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లాస్థాయి ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి ఆయనతో పాటు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీత హాజరయ్యారు. కార్యక్రమాన్ని తెలంగాణ గీతాన్ని ఆలపించి ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రసంగాన్ని చదివి వినిపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సమాజాన్ని పట్టిపీడిస్తున్న దళారీ వ్యవస్థను పూర్తిగా అంతం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజల అర్జీలను ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయొద్దని.. వేగంగా పరిష్కార మార్గం చూపాలని కోరారు. విద్య, వైద్యంపై దృష్టి సారించి వీటికే అధిక నిధులు కేటాయించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. భూములకు సంబంధించి రైతుల నుంచి వచ్చే అర్జీలను వేగంగా పరిష్కరించాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రతి వ్యక్తికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో 65 ఏళ్లలో రూ.65 వేల కోట్ల అప్పు చేస్తే.. గత పాలకులు తొమ్మిదేళ్లలో రూ.8 లక్షల కోట్ల అప్పుచేసి రాష్ట్రాన్ని తిరోగమనంవైపు తీసుకెళ్లారని ఆరోపించారు. రూ.28 కోట్ల వడ్డీలేని రుణాలు.. జిల్లాలోని 8,258 స్వయం సహాయక సంఘాలకు రూ.28 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మహిళలకు 97,076 ఇందిరమ్మ చీరలు, 70,516 మందికి చేయూత పింఛన్లు అందిస్తున్నట్లు చెప్పారు. విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించామని.. పదోతరగతి ఫలితాల్లో గతేడాదితో పోలిస్తే మెరుగైన స్థానాన్ని సాధించామని, 97 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 19వ స్థానంలో నిలిచినట్లు వివరించారు. రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
‘జీల్దార్ తిప్ప’లు తప్పేనా..?
పైప్లైన్లో తరలించాలి.. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి డీ–5 కాల్వకు నీటిని తరలించేందుకు 338.5 ఎఫ్ఆర్ఎల్ లెవల్లో స్లూయిస్ ఏర్పాటు చేశారు. అక్కడే 318 ఎఫ్ఆర్ఎల్ లెవల్లో పైప్లైన్ నిర్మాణం చేపట్టి జీల్దార్తిప్ప చెరువు సమీపంలో 304 లెవల్లో నీటిని విడుదల చేయాలి. అక్కడి నుంచి ఆయకట్టు భూములుకు నీళ్లు పారించేందుకు మైనర్ కాల్వలు ఉన్నాయి. – వెంకట్రెడ్డి, నిర్వాహకుడు, గ్రామాభ్యుదయ సేవా సంస్థ ఎల్లూరు ఉన్నతాధికారుల పరిశీలనలో.. జీల్దార్తిప్ప చెరువుకు నీటి తరలింపు అంశం ఉన్నతాధికారుల పరిశీలనలో ఉంది. మొదట మొలచింతలపల్లి వాగు వద్ద లిఫ్టు ఏర్పాటు చేయాలని, తర్వాత కేఎల్ఐ, పాలమూరు ప్రాజెక్టుల నుంచి కాల్వల ద్వారా నీటిని తరలించాలని నిర్ణయించారు. కానీ, కాల్వలు తవ్వేందుకు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. పైప్లైన్ ఏర్పాటు అంశం కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉంది. – అమర్సింగ్, డీఈ, నీటిపారుదలశాఖ కొల్లాపూర్: కేఎల్ఐ, పాలమూరు ప్రాజెక్టులకు కూతవేటు దూరంలోనే ఉన్న జీల్దార్తిప్ప చెరువుకు కృష్ణానదీ నీటిని తరలించే ప్రక్రియ ఏళ్ల తరబడి ప్రకటనలు, శిలాఫలకాలకే పరిమితమవుతోంది. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని ముక్కిడిగుండం, గేమ్యానాయక్తండా, మొలచింతలపల్లి, ఎర్రగట్టుబొల్లారం గ్రామాలు కేఎల్ఐ, పాలమూరు ప్రాజెక్టులకు సమీపంలోనే ఉంటాయి. లక్షలాది ఎకరాలకు నీరందించే ప్రాజెక్టులు పక్కనే ఉన్నా ఆ గ్రామాలకు మాత్రం సాగునీరు అందడం లేదు. నల్లమల అటవీ ప్రాంతంలో దశాబ్దాల క్రితం నిర్మించిన జీల్దార్తిప్ప చెరువుపైనే నేటికీ ఆయా గ్రామాల రైతులు ఆధారపడుతున్నారు. చెరువు నిండితేనే రెండు పంటలు పండిస్తారు. లేదంటే ఒక్క పంటతోనే సరిపెట్టుకోవాలి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు జీల్దార్తిప్ప చెరువుకు కృష్ణానది నీటిని తరలించాలని పాలకులు భావించారు. ఇందుకోసం నిధులు మంజూ రుచేసి, శంకుస్థాపనలు కూడా చేశారు. కానీ, పనులు మాత్రం ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. ● కృష్ణానది నీటిని మొలచింతపల్లి, ముక్కిడిగుండం గ్రామాల్లోని పంటపొలాలకు అందించాలనే ఉద్దేశంతో 2004లో రూ.3 కోట్లతో కృష్ణా బ్యాక్వాటర్పై మినీ లిఫ్టు నిర్మించేందుకు శిలాఫలకం వేశారు. కానీ పనులు చేపట్టలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మరోసారి మొలచింతలపల్లి, ముక్కిడిగుండం గ్రామ పొలాలకు సాగునీరు మళ్లించాలనే అంశం తెరపైకి వచ్చింది. 2019లో కేఎల్ఐ నుంచి జీల్దార్తిప్ప చెరువుకు నీటిని తరలించేందుకు రూ.19 కోట్లు కేటాయించగా.. అదే సంవత్సరం మార్చిలో పనులు చేపట్టేందుకు శంకుస్థాపన చేశారు. కానీ భూసేకరణకు నిధులు సరిపోవనే సాకుతో పనులు ముందుకు సాగలేదు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రూ.35 కోట్లతో మరోసారి నీటి తరలింపు పనులకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ రద్దుచేసి నూతన ప్రతిపాదనలు తయారు చేసింది. జీల్దార్తిప్ప చెరువు కృష్ణా నీటికి నోచుకోని మొలచింతలపల్లి, ముక్కిడిగుండం గ్రామాల రైతులు కేఎల్ఐ, పాలమూరు ప్రాజెక్టుల పక్కనే ఉన్నా అందని సాగునీరు నీటి తరలింపునకు రెండుసార్లు శంకుస్థాపన పైప్లైన్ ద్వారా తరలింపు.. కేఎల్ఐ ప్రాజెక్టులోని డీ–5 కాల్వకు అనుసంధానంగా కాల్వలు తవ్వాలని గతంలో అధికారులు నిర్ణయించారు. డీ–5 కాల్వ పాలమూరు ప్రాజెక్టులోని నార్లాపూర్ రిజర్వాయర్లో మునిగిపోతోంది. దీంతో ఇప్పుడు నార్లాపూర్ రిజర్వాయర్కు అనుసంధానంగానే నీటి తరలింపు చేపట్టాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. కాల్వలు తవ్వేందుకు అటవీ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని, కాల్వలకు బదులుగా ప్రెజర్మెయిన్స్ ఏర్పాటు చేసి.. పైప్లైన్లతో నీటిని జీల్దార్తిప్ప చెరువుకు తరలిస్తే బాగుంటుందని ప్రతిపాదించారు. దీనిపై నివేదిక అందజేసిన అధికారులు తర్వాత ప్రక్రియపై దృష్టి సారించడం లేదనే ఆరోపణలున్నాయి. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి జీల్దార్తిప్పకు వెళ్లే మార్గంలో పెద్దవాగు, ఉడుములు వాగు, చిన్నవాగులు ప్రవహిస్తుంటాయి. వీటిమీదుగా కాల్వల నిర్మాణాలు ఖర్చుతో కూడిన వ్యవహారం. పైగా కాల్వల కోసం భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేని ఇక్కడి రైతులు పైప్లైన్ ద్వారా నీటిని తరలించాలని కోరుతున్నారు. -
అన్నదాతల ఆందోళన
గోపాల్పేట: రవాణా ఏజెన్సీపై చర్యలు తీసుకొని మార్చాలని, తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలంటూ శుక్రవారం గోపాల్పేటలో రైతులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి గోపాల్పేట మండలంలోని ఏదుట్ల, ఏదుల, చెన్నారం, సమీప గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని గోపాల్పేటలోని గోదాంకు తరలించాలని నిర్వాహకులు సూచించడంతో రైతులంతా ఒక్కసారిగా ధాన్యం ట్రాక్టర్లతో తీసుకొచ్చారు. దీంతో సుమారు కిలోమీటర్ మేర ట్రాక్టర్లు నిలిచాయి. గోదాంలో ధాన్యం దింపేందుకు కేవలం ఎనిమిది మంది హామాలీలు మాత్రమే ఉండటం.. ట్రాక్టర్లు రోడ్డు పక్కన ఉంచి లారీలు, డీసీఎంలలో వచ్చిన ధాన్యం మొదట దింపడంతో ఎన్నిరోజుల పాటు ధాన్యం దించుతారని రైతులు ఆగ్రహానికి గురయ్యారు. దీనికితోడు గోదాంకు సంబంధించిన కాంట్రాక్టర్ బస్తాకు అరకిలో తరుగు తీయాలని చెప్పడంతో రైతులు సాయంత్రం నాలుగు నుంచి గోదాం ఎదురుగా ఉన్న బీటీరోడ్డుపై ధర్నాకు దిగారు. వీరికి బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్నారు. 20 మంది హమాలీలు బస్తాలు దింపేందుకు వస్తే తిప్పి పంపారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ఎన్నిరోజులు పడిగాపులు పడాలి.. కొనుగోలు చేసిన తర్వాత మిల్లులకు తరలించేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోందని.. సొంతంగా ట్రాక్టర్లలో తీసుకొస్తే దింపేందుకు హమాలీలు కూడా అందుబాటులో ఉండటం లేదని మండిపడ్డారు. వెంటనే కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలంటూ భీష్మించుకు కూర్చున్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ శశిధర్, తహసీల్దార్ తిలక్కుమార్రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడి ధర్నా విరమించాలని కోరారు. కలెక్టర్ వచ్చి రవాణా ఏజెన్సీపై చర్యలు తీసుకొని మార్చాలని, తరుగు లేకుండా ధాన్యం సేకరించాలని డిమాండ్ చేశారు. సాయంత్రం ఏడు వరకు జేసీ వస్తారని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. రాత్రి 7.30 గంటలకు రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ వచ్చి రైతులతో మాట్లాడారు. శనివారం నుంచి హమాలీల సంఖ్య పెంచుతామని, అలాగే ట్రాక్టర్లలో ఉన్న ధాన్యం మొదట దింపేలా చూస్తామని హామీ ఇచ్చారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ హామీతో విరమణ -
తరుగు పేరిట మోసం చేస్తే చర్యలు
పాన్గల్: కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం తూకం, తరలింపులో జాప్యం జరగకుండా చూడాలని, వేగవంతం చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంతో పాటు మండలంలోని దావాజిపల్లి కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి సేకరణ ప్రక్రియ, బస్తాల తరలింపుపై అధికారులతో ఆరా తీసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రాలకు రైతులు తాలు, చెత్త, దుమ్ము లేకుండా ధాన్యం తీసుకొస్తే తూకం విషయంలో ఇబ్బందులు తలెత్తవని, శుభ్రం చేసిన ధాన్యం తీసుకొచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని నిబంధనల మేరకు తూకం చేయాలని.. మిల్లర్లు వచ్చిన ధాన్యాన్ని దించుకోవడంలో ఇబ్బందులకు గురి చేసినా, తరుగు పేరిట మోసం చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేంద్రాల్లో ధాన్యం తూకం, బస్తాల తరలింపులో అధికారులు, కేంద్రాల నిర్వాహకులు అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ఐకేపీ ఏపీఎం శ్రీనివాసులు, ఆర్ఐ మహష్, సీసీ సువర్ణ, రైతులు ఉన్నారు. -
ా
మిల్లర్ల మాయ జాలం!మిల్లుల్లో కనిపించని సీజ్ చేసిన ప్రభుత్వ ధాన్యం● కస్టోడియన్ల నిర్లక్ష్యంతో రూ.కోట్ల విలువైన వడ్లు పక్కదారి? ● టాస్క్ఫోర్స్ అధికారుల తనిఖీల్లో బట్టబయలు.. మరో కేసు నమోదు ● జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేస్తే మరిన్ని వెలుగులోకి వచ్చే అవకాశం ●25వేల బస్తాలు ముందే తరలించాం.. పెద్దమందడి మండలంలోని రెండు మిల్లులను టాస్క్ఫోర్స్ అధికారులు సీజ్ చేసిన కొంత కాలానికి, నేను డీఎంగా ఇన్చార్జి బాధ్యతలు నిర్వహించిన సమయంలో సుమారు 25 వేల బస్తాలను షిఫ్ట్ చేశాం. గతంలో ఇక్కడ పనిచేసిన డీఎంకు కేసు నమోదు చేసిన సమయంలో బ్యాలెన్స్ ధాన్యం వేలం వేయాలని పంచనామాలో రాశాం. కానీ సదరు అధికారి వేలం వేయలేదు. – కాశీవిశ్వనాథ్, డీఎస్ఓ పరిశీలిస్తాం.. జిల్లావ్యాప్తంగా సీజ్ చేసిన మిల్లుల్లో ధాన్యం నిల్వల పరిశీలన చేస్తాం. ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లలో బిజీగా ఉన్నాం. కస్టోడియన్లు ధాన్యం భద్రతా అంశాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్లు, లోకల్ రెవెన్యూ అధికారులకు కస్టోడియన్ ఇస్తాం. పెద్దమందడి మండలంలోని రెండు మిల్లుల కస్టోడియన్ ఎవరూ.. ధాన్యం ఎక్కడికి తరలించారు. ఎవరు తరలించారనే అంశాలను పరిశీలిస్తాం. – వినోద్కుమార్, అదనపు కలెక్టర్ (రెవన్యూ) వనపర్తి: సీజ్ చేసిన రైస్మిల్లుల్లోని వరిధాన్యం మాయం కావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యాన్ని భద్రపర్చాల్సిన అధికారుల నిర్లక్ష్యంతో మిల్లులకు వేసిన సీజ్లు అలాగే ఉండగానే.. ధాన్యం మాయం కావడం సంచలనం రేపుతోంది. కొన్ని నెలల క్రితం పెద్దమందడి మండలంలోని రెండు మిల్లుల్లో ఉండాల్సిన ధాన్యం కంటే తక్కువగా నిల్వలు ఉన్నాయని అందిన సమాచారం మేరకు రాష్ట్ర టాస్క్ఫోర్స్ అధికారులు సుదీర్ఘంగా తనిఖీలు చేపట్టారు. ధాన్యం నిల్వల్లో భారీగా తేడా ఉండటంతో కేసు నమోదు చేసి.. రెండు మిల్లులను సీజ్ చేశారు. అయితే ఆయా మిల్లుల్లో ఉండాల్సిన ధాన్యం పెద్దమొత్తంలో మాయమైనట్లు అందిన సమాచారం మేరకు తాజాగా మరోసారి తనిఖీలు చేపట్టారు. రెండు రోజులపాటు పలు దఫాలుగా తనిఖీలు నిర్వహించగా.. మిల్లుల్లోని ధాన్యం మాయమైనట్లు తేలడంతో మరో కేసు నమోదు చేసినట్లు తెలిసింది. -
భానుడి భగభగ
గురువారం అత్యధిక ఉష్ణోగ్రతలు జిల్లాల వారీగా ఇలా.. పాలమూరు: ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు భగభగమంటూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. అత్యవసర పనుల కోసం బయటకు వచ్చే జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం వేడి గాలులు అధికంగా వీస్తుండడంతో వడదెబ్బ బాధితులు పెరుగుతున్నారు. ఉమ్మడి పాలమూరులో అత్యధికంగా నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బొల్లపల్లిలో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నాగర్కర్నూల్ (వెల్దండ)మహబూబ్నగర్ (బాలానగర్) 43.6 గద్వాల (ఉండవెల్లి) 43.3 నారాయణపేట (దామరగిద్ద) -
యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి
వనపర్తి/వనపర్తి రూరల్: క్రీడలు శారీరక దారుఢ్యంతోపాటు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని.. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా.జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న క్రీడా వారోత్సవాల సందర్భంగా గురువారం జిల్లా పోలీసు కార్యాలయ మైదానంలో క్రికెట్ టోర్నీ నిర్వహించగా.. పోలీసు, రెవెన్యూ, ప్రెస్ మీడియా, ఉపాధ్యాయ జట్లు ఉత్సాహంగా పాల్గొన్నాయి. ఈ పోటీల్లో పోలీసు జట్టు విజేతగా నిలవగా.. ఉపాధ్యాయుల జట్టు రన్నరప్గా నిలిచింది. రెవెన్యూ జట్టు తరఫున కలెక్టర్ ఆదర్శ్ సురభి స్వయంగా ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అదనపు ఎస్పీ రాజేశ్ మీనా పోలీసు జట్టుకు నాయకత్వం వహించి అర్ధశతకం సాధించారు. టోర్నీ విజేత, రన్నరప్ జట్లకు చిన్నారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి, డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతారెడ్డి చేతులమీదుగా ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం క్రీడలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గ్రామీణ మట్టిలో మాణిక్యాలను వెలికితీసి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. శారీరక దారుఢ్యం క్రీడలతోనే సాధ్యమని.. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక క్రీడా వారోత్సవాల్లో భాగంగా క్రికెట్ టోర్నీ నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీవైఎస్ఓ సుధీర్రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా.చిన్నారెడ్డి పెబ్బేరు పట్టణంలోని ఖేలో ఇండియా ఫుట్బాల్ మైదానంలో కలెక్టర్ ప్రత్యేక నిధులు రూ. 10లక్షలతో ఏర్పాటుచేసిన నూతన ఫ్లడ్లైట్లను ఎమ్మెల్యే మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డితో కలిసి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ప్రారంభించారు. ఇదే మైదానంలో ఎమ్మెల్యే నిధులు రూ. 10లక్షలతో నిర్మించనున్న డ్రెసింగ్ రూమ్, జిమ్, టాయిలెట్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. యువతకు క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. అనంతరం ఫుట్బాల్ పోటీలను వారు ప్రారంభించగా.. వనపర్తి, గోపాల్పేట, పెబ్బేరు, ఆత్మకూర్ జట్లు ఫుట్బాల్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నాయి. కార్యక్రమంలో పెబ్బేరు ఫుట్బాల్ క్లబ్ అధ్యక్షుడు కృష్ణకుమార్రెడ్డి, వైస్ చైర్మన్ సుమిత్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ గౌని ప్రమోదిని, వైస్చైర్మన్ ఎద్దుల విజయవర్ధన్రెడ్డి, కౌన్సిలర్ శివసాయి పాల్గొన్నారు. -
వడ్ల బస్తాలతో బారులు
వీపనగండ్ల గోదాం వద్ద బారులుతీరిన వరిధాన్యం వాహనాలు వీపనగండ్ల: మండల కేంద్రంలోని గోదాం వద్ద గురువారం వరిధాన్యం వాహనాలు బారులుతీరాయి. సుమారు 150 వాహనాల్లో వడ్ల బస్తాలను తీసుకురాగా.. అన్లోడ్ చేసేందుకు సరిపడా హమాలీలు లేకపోవడంతో 1.5 కి.మీ. మేర వాహనాలు నిలిచిపోయాయి. 5వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంగల గోదాంకు అమరచింత, ఆత్మకూర్ తదితర మండలాల నుంచి పెద్ద మొత్తంలో లారీలు, ట్రాక్టర్ల ద్వారా ధాన్యాన్ని తీసుకొస్తున్నారు. అయితే బీహార్కు చెందిన 18 మంది హమాలీలు మాత్రమే ఉండటంతో అన్లోడ్ చేయడం కష్టసాధ్యంగా మారింది. పరిసర గ్రామాల్లోని హమాలీలను అన్లోడ్ చేసేందుకు కోరినా ఎవరూ రావడం లేదని తహసీల్దార్ ఖాజామైనొద్దీన్ తెలిపారు. ప్రస్తుతం ఉన్నతాధికారుల ఆదేశం మేరకు కామన్, డాన్ రకాల ధాన్యాన్ని మాత్రమే అన్లోడ్ చేస్తుండటంతో మిగతా రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. సమాచారం అందుకున్న స్థానిక సీపీఎం నాయకులు గోదాం వద్దకు చేరుకొని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. గోదాం వద్ద హమాలీలు లేక నిలిచిన వాహనాలు -
మక్తల్ను అన్నిరంగాల్లో తీర్చిదిద్దుతా
● 19 బీటీరోడ్ల నిర్మాణానికి రూ.68కోట్లు మంజూరు ● త్వరలోనే 150 పకడల ఆస్పత్రి అందుబాటులోకి ● రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి మక్తల్: నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో తీర్చిదిద్దడమే తన లక్ష్యమని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం మక్తల్లో అసంపూర్తి భవనాలను ఆయన పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 19 బీటీరోడ్లను 65 కి.మీ. మేర నిర్మించేందుకు రూ. 68కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. కొల్పూర్ – కుర్తికొండ వద్ద జూరాల ప్రాజెక్టు తరహాలో బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మించేందుకు అవసరమైన నిధుల మంజూరుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. హిందూపూర్ వద్ద ఽథర్మల్ పవర్ స్టేషన్కు సైతం త్వరలో గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే మక్తల్లో డిగ్రీ కళాశాల, రిజిస్ట్రర్ కార్యాలయం, కోర్టు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మక్తల్ మండలంలోని గొల్లపల్లి –మంతన్గోడ్ బీటీరోడ్డు నిర్మాణానికి రూ. 1.50కోట్లు, చిట్యాల – గుర్రందొడ్డి మార్గంలో వంతెన నిర్మాణానికి రూ. 20కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. మక్తల్లో నిర్మిసు న్న 150 పడకల ఆస్పత్రిని త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అదే విధంగా 220 కేవీ విద్యుత్ సబ్స్టేషన్, టౌల్ హాల్ నిర్మాణాలకు కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాజీవ్గాంధీ ఆశయసాధనకు కృషి.. దివంగత మాజీ ప్రధాని రాజీవ్గాంధీ దేశానికి అందించిన సేవలు మరువలేనివని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రాజీవ్గాంధీ వర్ధంతి సందర్బంగా మక్తల్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యువత శక్తిపై అపారమైన విశ్వాసం ఉంచిన రాజీవ్ గాంధీ.. 18 ఏళ్ల వయసు నుంచే ఓటు హక్కు కల్పించి, ప్రజాస్వామ్య వ్యవస్థల్లో యువశక్తి ప్రాధాన్యం పెంచారన్నారు. రాజీవ్గాంధీ ఆశయాలను కాంగ్రెస్ ప్రబుత్వం ముందుకు తీసుకెళ్తుందన్నారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో యువత అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ గణేశ్కుమార్, నాయకులు వాకిటి హన్మంతు, కట్ట సురేశ్, ఫయాజ్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, కావాలి తయాప్ప, రవికుమార్, మందుల నరేందర్, ఆనంద్గౌడ్, నర్సింహులు, గణేశ్, ఓబులేషు, వెంకటేశ్, లక్ష్మణ్, శ్యామ్, రవి పాల్గొన్నారు. -
వనమహోత్సవం లక్ష్యం 20.60లక్షల మొక్కలు
వనపర్తి: వనమహోత్సవంలో భాగంగా ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా 20,60,900 మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో వనమహోత్సవంపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాఖల వారీగా కేటాయించిన లక్ష్యాలను సకాలంలో పూర్తిచేసేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. వచ్చేనెలలో వర్షాలు పడిన వెంటనే మొక్కలు నాటడం ప్రారంభించాలన్నారు. ముఖ్యంగా ఎవెన్యూ ప్లాంటేషన్పై ప్రత్యేక దృష్టిసారించాలని.. పండ్ల మొక్కలు, ఈత, మునగ వంటి మొక్కలు అధికంగా నాటాలన్నారు. అదే విధంగా నాటిన ప్రతి మొక్కను జియో ట్యాగింగ్ చేయాలని తెలిపారు. ● పని కావాలని అడిగే ప్రతి కూలీకి ఉపాధి హామీ పథకం పనులు కల్పించాలని అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. వేసవి తీవ్రత దృష్ట్యా కూలీలు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు పనులను ముగించుకొని వెళ్లిపోవచ్చన్నారు. పని ప్రదేశాల్లో కూలీలకు చలువ నీడ, మంచినీరు, ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాలని సిబ్బందికి సూచించారు. ఉపాధి హామీ పథకంలో పని దినాల సంఖ్య పెంచితే.. గ్రామ పంచాయతీలకు సీసీరోడ్లు నిర్మించుకోడానికి మెటీరియల్ కాంపోనెంట్ పెరుగుతుందని తెలిపారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి ఉన్నారు. చారిత్రక కట్టడాలపరిరక్షణ అందరి బాధ్యత కొల్లాపూర్ రూరల్: చారిత్రక కట్టడాల పరిరక్షణ మన అందరి బాధ్యత అని జిల్లా పర్యాటక శాఖ అధికారి నర్సింహ అన్నారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని సోమశిల గ్రామంలో ఉన్న పురాతన, ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంలో ఉపాధి హామీ కూలీలతో కలిసి గ్రామ సమీపంలో నుంచి సోమేశ్వరాలయం వరకు హెరిటేజ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమశిల గ్రామానికి జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు ఉందని, గ్రామంలో పురాతన కట్టడాలు ఎన్నో ఉన్నాయని, మన సంపదను కాపాడుకోవాల్సి బాధ్యత మనదేనని స్పష్టం చేశారు. ఉపాధి హామీ కూలీలకు లలితా సోమేశ్వరాలయం గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకటలక్ష్మి, మాజీ సర్పంచ్ మద్దిలేటి, పురాతన శాఖ పర్యవేక్షకుడు కుర్మయ్య, నాయకులు కాటం వెంకటస్వామి, నారాయణ, మౌలాలి తదితరులు పాల్గొన్నారు. -
డీసీసీబీలో యూపీఐ సేవలు
● ఇకపై గూగుల్ పే, ఫోన్ పే ద్వారా సులభంగా లావాదేవీలు ● నగదు రహిత చెల్లింపులకుముందడుగు ●మహబూబ్నగర్ (వ్యవసాయం): జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డీసీసీబీ) డిజిటల్ బ్యాంకింగ్ దిశగా మరో కీలక ముందడుగు వేసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 1920 సంవత్సరంలో స్థాపించబడిన ఈ బ్యాంక్, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దశాబ్దాలుగా అండగా నిలుస్తూ వస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 22 బ్రాంచ్లతో సేవలందిస్తున్న డీసీసీబీ.. తాజాగా తన ఖాతాదారులకు యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కొత్త సేవలతో ఖాతాదారులు గూగుల్ పే, ఫోన్పే వంటి ప్రముఖ డిజిటల్ యాప్ల ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలకు అనుసంధానం చేసుకుని నగదు రహిత లావాదేవీలు సులభంగా నిర్వహించుకోవచ్చు. డబ్బు పంపడం, స్వీకరించడం, క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేయడం, చిన్న వ్యాపార లావాదేవీలను తక్షణమే పూర్తి చేయడం వంటి సేవలు ఇప్పుడు మొబైల్ ఫోన్ ద్వారానే సాధ్యమవుతున్నాయి. 3 లక్షలకుపైగా ఖాతాదారులు డీసీసీబీ పరిధిలో ప్రస్తుతం మూడు లక్షలకు పైగా ఖాతాదారులు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, మహిళా సంఘాలు, చిన్న వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు అధిక సంఖ్యలో ఈ బ్యాంక్ సేవలను వినియో గిస్తున్నారు. యూపీఐ సేవలు అందుబాటులోకి రావడంతో వీరికి బ్యాంక్ శాఖలకు వెళ్లే అవకాశం తగ్గి.. ఇంటి వద్ద నుంచే వేగవంతమైన డిజిటల్ సేవలు పొందే అవకాశం ఏర్పడింది. 24 గంటల పాటు.. ఖాతాదారులు తమ మొబైల్ నంబర్ను బ్యాంక్ ఖాతాతో అనుసంధానం చేసుకుని యూపీఐ యాప్లో నమోదు చేసుకుంటే సేవలు వెంటనే యాక్టివేట్ అవుతాయి. రోజులో 24 గంటల పాటు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. భద్రతా ప్రమాణాలతో కూడిన ఈ వ్యవస్థ ద్వారా కేవలం కొన్ని సెకన్లలోనే డబ్బు బదిలీలు పూర్తవుతాయని పేర్కొన్నారు. చెల్లింపులపై అవగాహన.. సహకార బ్యాంకింగ్ వ్యవస్థను ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా తీర్చిదిద్దే క్రమంలో డీసీసీబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రజల్లో డిజిటల్ చెల్లింపులపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు సమాచారం. -
లారీకి 30 బస్తాల చొప్పున హాంఫట్..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఎండా కాలం సాగుకు సంబంధించి ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కేంద్రాల్లో ఇప్పటివరకు కొనుగోళ్లు అంతంత మాత్రంగానే జరుగుతురన్నాయి. సీజన్ ముగిసే దశకు చేరుకున్నా.. నిర్దేశిత లక్ష్యంలో కనీసం 30 శాతం చేరుకోలేదు. హమాలీలు, లారీల కొరతతోపాటు మిల్లుల్లో స్థలాభావం వంటి కారణాలు కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇది చాలదన్నట్లు రోజుల తరబడి నిరీక్షణతో కష్టనష్టాలకు ఓర్చి సర్కారు సెంటర్లలోనే అమ్ముకుందామనుకున్న రైతులకూ భంగపాటు తప్పడం లేదు. మిల్లర్లు, కేంద్రాల నిర్వాహకులు తాలు పేరిట నిలువు దోపిడీకి తెగబడడంతో వారు గుండెలు బాదుకుంటున్నారు. పాలక పక్షంలో కొరవడిన చిత్తశుద్ధి, అధికారుల తూతూమంత్రపు పర్యవేక్షణతోనే ఈ దుస్థితి నెలకొనగా.. అన్నదాతలు అరిగోస పడుతున్నారు. కేవలం 2,89 లక్షల మెట్రిక్ టన్నులే.. మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు 1,018 సెంటర్లు కేటాయించారు. ఇందులో 900 వరకు మాత్రమే తెరుచుకున్నాయి. ప్రభుత్వ కేంద్రాల్లో మొత్తంగా 11,49,813 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్ధారించారు. అయితే 19వ తేదీ వరకు ఆయా ప్రభుత్వ కేంద్రాలకు సుమారు 3,42,939 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చింది. ఇందులో ఇప్పటివరకు 2,89,135 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. కేంద్రాల్లో ఇంకా 66,082 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లకు సిద్ధంగా ఉన్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. సరిపోను హమాలీలు లేకపోవడం, లారీల కొరతతో ధాన్యం తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. సెంటర్లలో కొనుగోలు చేసిన ధాన్యంలో సుమారు 33,416 మెట్రిక్ టన్నులను ఇంకా మిల్లులకు తరలించాల్సి ఉండగా.. బస్తాల వద్ద రైతులు రోజుల తరబడి కాపలా కాస్తున్నారు. జిల్లాల వారీగా ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్ల వివరాలు.. జిల్లా మార్కెట్కు కొన్నది ఇంకా మిల్లులకు రసీదు వచ్చింది కేంద్రాల్లోఉంది తరలించింది ఇచ్చింది మహబూబ్నగర్ 67,420 56,620 10,800 54,338 53,150 వనపర్తి 1,20,000 94,291 36,000 70,000 69,000 నాగర్కర్నూల్ 6,500 4,600 2,000 4,028 1,966 జోగుళాంబ గద్వాల 46,019 34,735 11,284 34,462 34,462 నారాయణపేట 1,03,000 98,889 5,998 92,891 91,089 క్వింటాల్కు 3 నుంచి 5 కిలోల వరకు మాయాజాలం రైతులకు కనీస సమాచారం ఇవ్వకుండానే వ్యవహారం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, సిబ్బందితో కుమ్మక్కు లారీ డ్రైవర్ల పేరు చెబుతూ పొంతనలేని సమాధానాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇంకా నత్తనడకనే క్రయవిక్రయాలు తూతూమంత్రపు పరిశీలనలకే అధికారుల పరిమితం ‘పాన్గల్ మండలంలోని గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 20 కేంద్రాల్లో ఇప్పటి వరకు 94,367 బస్తాల ధాన్యం కొనుగోలు చేయగా.. కేవలం 45,716 బస్తాలను మాత్రమే మిల్లులకు తరలించారు. ఇంకా 48,651 బస్తాలు నిల్వ ఉండటంతో రైతులు కేంద్రాల్లోనే పడిగాపులు పడుతున్నారు. సేకరించిన ధాన్యం తరలింపునకు లారీలు సకాలంలో రాకపోవడంతో తూకం చేసిన బస్తాల నిల్వలు భారీగా పేరుకుపోయాయి. అకాల వర్షాలకు ధాన్యం బస్తాలు తడిస్తే ఎవరు బాధ్యత వహించాలని ఆందోళన చెందుతున్నారు. కేంద్రాల్లో ఓ వైపు కొనుగోలు చేసిన ధాన్యం బస్తాల నిల్వలు.. మరోవైపు తూకం చేయని ధాన్యం కుప్పలు పేరుకుపోయాయి. సంబంధిత అధికారులు స్పందించి ధాన్యం తరలింపునకు తగిన చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.’ సెంటర్లలో తూకం వేసిన రసీదు ఉంది.. నేరుగా మిల్లులకు వచ్చిన తర్వాత తూకం ఎలా తక్కువ వస్తుందని ప్రశ్నిస్తే తేమ ఎక్కువగా ఉంది.. ఒప్పుకోకుంటే తీసుకెళ్లండి అంటూ మిల్లుల నిర్వాహకులు తెగేసి చెబుతున్నారు. అంతేకాకుండా రైతులకు సమాచారం ఇవ్వకుండానే మిల్లర్లు బస్తాల సంఖ్యను కుదించి.. ఆ మేరకు బిల్లులు చేస్తున్నట్లు సమాచారం. సెంటర్ల నిర్వాహకులు, మిల్లర్లు కుమ్మకై ్క దందా నడిపిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మద్దతు ధర వస్తుందనే ఆశతో రోజుల తరబడి పడిగాపులు కాచినా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా.. చివరకు నష్టపోక తప్పడం లేదని ‘సాక్షి’ బృందం పరిశీలన సందర్భంగా పలువురు రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. ప్రభుత్వ కేంద్రాల్లో నిబంధనల ప్రకారం తాలు, బస్తా బరువు పేరిట కిలోన్నర వరకు తరుగు తీస్తున్నారు. కొన్ని చోట్ల రెండు కిలోల చొప్పున కోత పెడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా 41.150 కిలోగ్రాముల చొప్పున బస్తా ధాన్యం తూకం వేసి.. రైతులకు రసీదు ఇస్తున్నారు. ఆ తర్వాత వాటిని లారీలు తదితర వాహనాల్లో కేటాయించిన మిల్లులకు తరలిస్తున్నారు. అక్కడ మిల్లర్లదే హవా నడుస్తుండగా.. రైతుల నడ్డి విరుస్తున్నారు. సెంటర్లలో తూకం వేసినప్పటికీ.. తూకం తక్కువగా వచ్చిందంటూ బస్తాకు అదనంగా కిలోన్నర నుంచి రెండు కిలోల కోత పెడుతూ మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. లారీకి సుమారు 30 బస్తాల చొప్పున (దాదాపు రూ.29 వేలు) కోత పెడుతూ అన్నదాతలను నిలువునా దోచుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో మిల్లులన్నింటిలోనూ ఈ తరహా దందా జరుగుతున్నట్లు తెలుస్తోంది. -
కూరగాయలు.. కుతకుత
రెట్టింపైన ధరలు.. బెంబేలెత్తుతున్న ప్రజలు ●గతంలో రూ.వంద పట్టుకెళ్తే వారానికి సరిపడా కూరగాయలు వచ్చేవి. ప్రస్తుతం ధరలు రెండింతలు అయ్యాయి. టమాటా, పచ్చిమిర్చి, బీరకాయ లాంటి కూరగాయల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయి. ఆదాయం పెరగలేదు కానీ ఖర్చులు మాత్రం రెట్టింపయ్యాయి. ప్రభుత్వం వెంటనే ధరలను అదుపు చేయాలి. – శ్రావణి, గృహిణి, దంతనూరు, మదనాపురం రోజువారీ కూలి పనులకు వెళ్లే పేద కుటుంబాలకు ధరల పెరుగుదల భారంగా మారింది. కూరగాయల ధరలు మాంసం ధరలతో పోటీ పడుతున్నాయి. ఆకుకూరల ధరలు కూడా భారీగా పెరగడంతో పిల్లలకు ఏం వండి పెట్టాలో అర్థం కావడం లేదు. ధరలు తగ్గితేనే ఉపశమనం లభిస్తుంది. – మొగిలి, అజ్జకొల్లు, మదనాపురం మదనాపురం: సామాన్య ప్రజలు వంటింట్లోకి వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. కూరగాయల ధరలకు ఒక్కసారిగా రెక్కలు రావడంతో మధ్యతరగతి బడ్జెట్ తలకిందులైంది. ఈ మధ్యకాలంలోనే ధరలు రెట్టింపు కావడంతో మార్కెట్కు వెళ్లిన వినియోగదారులు అరకొరగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. 15 రోజుల కిందట కిలో రూ.30 లభించే టమాట నేడు రెండింతలు కాగా.. చివరకు కొనుగోలుదారు రూ.60 చెల్లించినా నాణ్యమైనవి దొరకడం లేదు. అలాగే క్యాబేజీ రూ.20 నుంచి రూ.35, ఉల్లిగడ్డ రూ.25, బంగాళదుంప రూ.30 నుంచి రూ,40, వంకాయ రూ.30 నుంచి రూ.45, బెండకాయ రూ.40 నుంచి రూ 50, గోరుచిక్కుడు రూ.60, క్యాప్సికం రూ.50 నుంచి రూ.70, బీనన్స్ బీర రూ.70, కాకర రూ.80, రూ.80 నుంచి రూ.100 కిలో అమ్ముతున్నారు. సొరకాయ ఒక్కటి రూ.25 పలుకుతోంది. క్యారెట్, దొండ కిలో రూ.50 నుంచి రూ.60 వరకు విక్రయిస్తున్నారు. ఆకుకూరలు గతంలో రూ.10 పది కట్టలు ఉండగా.. ఇప్పుడు రూ.20కి ఇస్తున్నారు. కొత్తిమీర చిన్న కట్టలు రూ.20కి 4 ఇస్తుండగా.. నిమ్మ, కీర ధరలూ పెరిగాయి. ఎండల తీవ్రతతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఉద్యాన అధికారులు చెబుతున్నారు. ఏటా మే నుంచి జూన్ వరకు ధరలు పెరుగుతూనే ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. గ్రామాల్లోని రైతులు జిల్లాకేంద్రంతో పాటు పట్టణాల్లోని మార్కెట్లకు కూరగాయలు పెద్దగా తీసుకురావటం లేదు. హోల్సేల్ వ్యాపారులు ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి స్థానికంగా విక్రయిస్తున్నారు. వీటిల్లో నాణ్యత ఉండటం లేదు. ఎండకు కాత, పూత రావడం లేదని.. అక్కడక్కడ పండిన అరకొర భానుడి దెబ్బకు పాడవుతున్నాయని రైతులు చెబుతున్నారు. రూ.60కి చేరువలో టమాట, పచ్చి మిర్చి సెంచరీ దిశగా అల్లం ఎండల తీవ్రతతోనే అంటున్న ఉద్యాన అధికారులు -
బీఎల్వోలతో సమన్వయం చేసుకోవాలి
వనపర్తి: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు బూత్ లేవల్ ఏజెంట్లను నియమించుకొని బీఎల్వోతో సమన్వయం చేసుకునేలా ప్రయత్నించాలని కలెక్టర్ ఆదర్శ సురభి సూచించారు. బుధవారం కలెక్టరేట్లో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 15 నుంచి 24వ తేదీ వరకు సన్నాహక కార్యక్రమాలు, బూత్ల మ్యాపింగ్, బీఎల్వోలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ లెవల్ అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించి ఓటర్ల వివరాలను ధ్రువీకరించాల్సి ఉంటుందని.. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించనున్నట్లు వివరించారు. ఆగస్టు 30 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ, సెప్టెంబర్ 28 వరకు వాటి పరిష్కారం చేపట్టి అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ఇంటింటి సర్వే, కొత్త ఓటర్ల నమోదు, మరణించిన, డూప్లికేట్ ఓటర్ల తొలగింపు, చిరునామా మార్పులు వంటి చర్యలకు రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని కోరారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్, డీఆర్వో సూర్యప్రకాష్ , ఆర్డీఓ సుబ్రమణ్యం, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. టూరిస్టు గైడ్లుగా యువతకు అవకాశం.. పర్యాటక రంగంపై ఆసక్తి ఉన్న యువత టూరిస్ట్ గైడ్లుగా మారేందుకు తెలంగాణ హెరిటేజ్, పర్యాటకశాఖ అవకాశాలు కల్పిస్తోందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. బుధవారం కలెక్టర్ కలెక్టరేట్లోని తన చాంబర్లో తెలంగాణ హెరిటేజ్, పర్యాటకశాఖ రూపొందించిన టూరిస్ట్ గైడ్ పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్రంలోని చారిత్రక, సాంస్కృతిక, పర్యాటక ప్రాంతాల గురించి పర్యాటకులకు సమగ్రంగా వివరించేందుకు శిక్షణ పొందిన టూరిస్ట్ గైడ్లు అవసరమన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు తెలంగాణ వారసత్వ సంపదను ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. పర్యాటక రంగంపై ఆసక్తి ఉన్న యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. -
‘జిల్లాస్థాయి ప్రజాపాలన’కు ఏర్పాట్లు
వనపర్తి: ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక జిల్లాస్థాయి కార్యక్రమాన్ని 22వ తేదీన నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జెడ్పీ సీఈఓ యాదయ్యతో కలిసి అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాస్థాయి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహిస్తున్నామని, ప్రతి శాఖ తమకు సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలతో కరపత్రాలు సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై స్పష్టమైన అవగాహన కల్పించే విధంగా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, కుర్చీలు తదితర అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి శాఖ తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. పోలీసు సేవలు మరింత చేరువ వనపర్తి: పోలీసు సేవలు ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జిల్లా పోలీస్శాఖ ‘ఆన్సైట్ ఎఫ్ఐఆర్’ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని ఎస్పీ సునీతరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదుదారు పోలీస్స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. ఘటనా స్థలానికి పోలీసులు వచ్చి ఫిర్యాదును అక్కడే స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేసే ఈ విధానంతో బాధితులకు కాస్త ఊరట లభిస్తుందని పేర్కొన్నారు. ఈ విధానంతో ప్రజలకు త్వరితగతిన, పారదర్శక, నమ్మకమైన పోలీసు సేవలు అందనున్నట్లు తెలిపారు. మహిళపై అత్యాచారాలు, చిన్న పిల్లలపై జరిగే నేరాలు, రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, చోరీలు, గొడవలు, మిస్సింగ్ కేసులు, లైంగిక వేధింపులు, బాల్యవివాహాలు, ర్యాగింగ్, వృద్ధులు, దివ్యాంగులు, గ్రామీణ ప్రాంత ప్రజలు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న బాధితులు పోలీస్స్టేషన్కు వెళ్లలేని పరిస్థితుల్లో డయల్ 100కు గాని సంబంధిత పోలీసు అధికారికి నేరుగా ఫోన్ చేసి సమాచారం అందజేయాలని సూచించారు. దీంతో సమయం ఆదా కావడంతో పాటు కేసుల దర్యాప్తు మరింత వేగంగా, సమర్థవంతంగా కొనసాగనుందని, పోలీసులు ప్రజలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తూ భద్రతా భావన పెంపొందించే అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. సురవరం జయంతిని ఘనంగా నిర్వహిస్తాం వనపర్తి: నియోజకవర్గ తొలి ఎమ్మెల్యే సురవరం ప్రతాప్రెడ్డి 130వ జయంతిని ఘనంగా నిర్వహిస్తామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని తన నివాసంలో సాహితీవేత్తలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, మేధావి, సాహితీవేత్త, న్యాయవాదిగా ఆయన సురవం సమాజానికి చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. సురవరం జయంతి ఉత్సవాలకు ముఖ్యఅతిథులుగా వారి జీవితంపై పరిశోధన చేసిన గన్నమరాజు, గిరిజా మనోహర్బాబు, సాగునీటిరంగ నిపుణుడు శ్రీధర్రావు దేశ్పాండేతో పాటు తెలంగాణ అస్తిత్వవాదంతో పాటు రాజకీయ సామాజిక అంశాలు విశ్లేషిస్తున్న సహచర ఉద్యమకారుడు వి.ప్రకాష్ను ఆహ్వానిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు గట్టుయాదవ్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమళ్ల అశోక్, సాహితీ కళావేదిక అధ్యక్షుడు పలుస శంకర్గౌడ్, సాహితీవేత్తలు వీరయ్య, బలరాం, బైరోజుచంద్రశేఖర్, కిరణ్, నాయకులు తిరుమల్లేశ్, జోహెబ్ హుస్సేన్, కుమార్, తోట శ్రీను పాల్గొన్నారు. కురుమూర్తిస్వామి హుండీ లెక్కింపు చిన్నచింతకుంట: అమ్మాపురం కురుమూర్తి స్వామికి భక్తులు అమవాస్య, శని, సోమవారాలు పురస్కరించుకొని భక్తులు సమర్పించుకున్న కానుకల హుండీని బుధవారం లెక్కించారు. హుండీ ద్వారా ఆలయానికి రూ.9,10,636 ఆదాయం వచ్చినట్లు ఆలయ చైర్మన్ బత్తుల బాల్రాజు, ఈఓ మధనేశ్వరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్, కమిటీ సభ్యులు మైపాల్రెడ్డి, తిరుపత్రెడ్డి, వేగనాత్, అర్జున్, భరత్రెడ్డి పాల్గొన్నారు. -
అన్నదాత.. గుండెకోత
తాలు పేరిట మిల్లర్ల నిలువు దోపిడీ రాత్రింబవళ్లు కష్టపడితే 514 క్వింటాళ్ల ధాన్యం పండింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో స్థానికంగా ఏర్పాటు చేసిన సెంటర్లో కొనుగోలు చేసిన తర్వాత ధాన్యాన్ని గాయత్రి మిల్లుకు తీసుకెళ్లాం. అక్కడ మిల్లు నిర్వాహకులు తాలు పేరుతో కొత్త నాటకానికి తెరలేపారు. క్వింటాల్కు ఏకంగా 5 కిలోల చొప్పున తరుగు తీస్తేనే అన్లోడ్ చేస్తామని మొండికేశారు. నిబంధనల ప్రకారం క్వింటాల్కు కిలో కంటే ఎక్కువ తరుగు తీయొద్దు. అధికారులకు మొరపెట్టుకున్నా.. ఫలితం లేకుండా పోయింది. వాహన అద్దె భారం మోయలేక.. చేసేదేమీ లేక వారి దోపిడీకి తలవంచాల్సి వచ్చింది. దాదాపు 25 క్వింటాళ్ల పైగా ధాన్యాన్ని ఉచితంగా మిల్లర్ల పాలైంది. మా ఆవేదన ప్రభుత్వానికి వినబడడం లేదు. – రాజు, అజ్జకొల్లు, మదనాపురం, వనపర్తి ఈ ఫొటోలో ఉంది పెద్ద దర్పల్లిలోని సప్తగిరి పారా బాయిల్డ్ రైస్ మిల్లు నిర్వాహకులు ఇచ్చిన ట్రక్ షీట్. మహబూబ్నగర్ జిల్లా కోయిల్కొండ మండలం వింజమూరు ప్రభుత్వ సెంటర్లో భీమయ్యయాదవ్తో పాటు మరో ఏడుగురు రైతుల నుంచి 856 బస్తాల (342 క్వింటాళ్లు) ధాన్యాన్ని కొనుగోలు చేసి సదరు రైస్ మిల్లుకు తరలించారు. అక్కడ తూకం తక్కువగా వచ్చిందంటూ మిల్లర్లు 825 బస్తాలకే లెక్కగట్టారు. ఆ తర్వాత మరో మూడు బస్తాలు కలిపి 331 క్వింటాళ్లకు డబ్బులు చెల్లిస్తామని ఫైనల్ చేశారు. అంటే 31 బస్తాలు (11 క్వింటాళ్లు) తక్కువ చూపించారు. ఈ విషయం తెలుసుకున్న సదరు రైతులు మిల్లు నిర్వాహకులను నిలదీశారు. తమకు చెప్పకుండానే ఎలా చేస్తారని ప్రశ్నించారు. సెంటర్ల నిర్వాహకులకు చెప్పామని మిల్లరు తెలపగా.. అక్కడికి వెళ్లారు. వారు లారీ డ్రైవర్కు చెప్పామని చేతులు దులుపుకోవడంతో మోసం చేస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మరో లారీకి సంబంధించి మోసపూరితంగా ఇలానే 30 బస్తాల కోత పెట్టారని.. సెంటర్లలో నామమాత్రపు తనిఖీలు నిర్వహిస్తున్నారే తప్ప తమకు న్యాయం చేయాలనే స్పృహ అధికారుల్లో కొరవడిందని రైతు భీమయ్య యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
ఖిల్లాఘనపురం: జిల్లాలోని పలు పాఠశాలల్లో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ కోరారు. బుధవారం మండలంలోని మానాజీపేట తెలంగాణ మోడల్ పాఠశాలలో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని జిల్లా సెక్టోరియల్ అధికారులు మహానంది, ప్రతాప్రెడ్డి, ఎంఈఓ జయశంకర్. విశ్రాంత ఉప విద్యాధికారి విశ్వనాథంతో కలిసి సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి శిక్షణలో నేర్పుతున్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చదువుతో పాటు శిబిరాల్లో అందిస్తున్న కంప్యూటర్, కుట్లు అల్లికలు, క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించాలని సూచించారు. శిక్షణలో నేర్పిన అంశాలు మున్ముందు ఉపయోగపడతాయని చెప్పారు. అదేవిధంగా గ్రామంలో వేసవి శిబిరం నిర్వహిస్తున్న మానాజీపేట హెల్పింగ్ హ్యాండ్ సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు. అనంతరం సిరివెన్నెల సీతారామశాస్త్రి జయంతిని పురస్కరించుకుని క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పాటల పోటీలు నిర్వహించగా విజేతలకు బహుమతులు అందజేశారు. బడిబాట పోస్టర్ ఆవిష్కరించారు. ఆయన వెంట సర్పంచ్ శ్రీలత, ఉపాధ్యాయులు రాఘవేందర్, క్యాంపు వలంటీర్లు తదితరులు ఉన్నారు. -
కొనుగోళ్లలో జాప్యం సరికాదు
వనపర్తి రూరల్: కేంద్రాలకు వచ్చిన వరి ధాన్యం కొనుగోళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని, ఎక్కడా జాప్యం జరగకుండా చూడాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. బుధవారం ఆయన మండలంలోని కడుకుంట్ల కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, తాలు, చెత్త లేకుండా కేంద్రానికి తీసుకొచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. సేకరించిన ధాన్యాన్ని రైస్మిల్లుకు తరలించడానికి స్థానిక ట్రాక్టర్లను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, తద్వారా రవాణా ప్రక్రియ వేగవంతం అవుతుందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తిస్థాయిలో ధాన్యాన్ని సేకరించాలని.. రైతులు శ్రమించి పండించిన పంటను కొనుగోలు చేయడంలో మిల్లర్లు నిబంధనలు అతిక్రమించకూడదని, ఎక్కడైనా తరుగు పేరిట మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
వనపర్తిటౌన్: అందరి భాగస్వామ్యంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ఏఎంఓ మహానంది, సీఎంఓ ప్రతాప్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని పీఎంశ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో వేసవి శిబిరంలో భాగంగా బుధవారం నేషనల్ గ్రీన్కార్ప్స్ (ఎన్జీసీ) జిల్లా కో–ఆర్డినేటర్ ఐ.సుదర్శన్రావు ఆధ్వర్యంలో పర్యావరణంపై అవగాహన సదస్సు నిర్వహించగా వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. పర్యావరణాన్ని భద్రంగా కాపాడితే మంచి గాలి, నీరు భవిష్యత్ తరాలకు అందుతాయన్నారు. నేటి బాలలే రేపటి యువత.. విద్యార్థులు కచ్చితంగా పర్యావరణంపై అవగాహన కలిగి ఉండి విధిగా మొక్కలు నాటడం అలవర్చుకోవాలని, భూగర్భ జలాలను కాపాడాలని, అడవుల సంరక్షణ గురించి తెలుసుకోవాలని సూచించారు. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ, విద్యుత్ ఆదా, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపుపై విద్యార్థులు నిర్వహించిన స్కిట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులకు పర్యావరణంపై చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. అనంతరం సుదర్శన్రావు విద్యార్థులతో పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వాడమని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లేష్ కుమార్, నిరీషా తదితరులు పాల్గొన్నారు. -
విధుల్లో చేరిన ఎస్పీ
నిప్పుల కుంపటి జాగ్రత్తలు తప్పనిసరి.. ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రధానంగా శిశువులు, చిన్నారులు, వృద్ధులతోపాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఎక్కువసేపు ఎండలో ఉండటంతో వేడిగాలుల వల్ల వెంటనే అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని, అన్ని వయస్సుల వారికి ఎండదెబ్బ ముప్పు పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎండల ప్రభావం ప్రధానంగా దినసరి కూలీలు, రైతులు, వీధివ్యాపారులు, ఆరుబయట పనిచేసే వారిపై తీవ్రంగా ఉండనుంది. దాహం వేయకపోయినా తరచుగా నీరు, కొబ్బరినీరు, మజ్జిగ, నిమ్మరసం, ఓఆర్ఎస్ వంటివి తీసుకోవాలని చెబుతున్నారు. అలాగే రక్షణ కోసం గొడుగు, టోపీ ధరించాలని సూచిస్తున్నారు. సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి పాలమూరులో రోజురోజుకూ ఎండల తీవ్రత పెరిగి నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిత్యం 41 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా నాగర్కర్నూల్ జిల్లా లింగాలలో 42.7, గద్వాల జిల్లాకేంద్రంలో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వడగాల్పుల ప్రభావంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మరింత వేడిని రగిల్చనుంది. కనీసం వారం రోజుల పాటు వడగాల్పులు వీస్తాయని, ఈ ప్రభావంతో ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 20 నుంచి 25 వరకు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని హెచ్చరికలు సూచించింది. జోగుళాంబ గద్వాలలో అత్యధికం.. ఉమ్మడి జిల్లాలో జోగుళాంబ గద్వాల జిల్లాలో ఎండల ప్రభావం తీవ్రంగా ఉంది. మంగళవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నమోదైన టాప్ 10 గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఐదు ఈ జిల్లాలోనే ఉండటం గమనార్హం. గద్వాల, అయిజ, ధరూరు, కేటీదొడ్డి, ఇటిక్యాల మండలాల్లో 41.6 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తర్వాత నాగర్కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి, చారకొండ, లింగాల, తెలకపల్లి మండలాలు, మహబూబ్నగర్ జిల్లాలోని కోయిల్కొండలో 41.6 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వనపర్తి: శిక్షణ నిమిత్తం వెళ్లిన ఎస్పీ సునీతరెడ్డి మంగళవారం తిరిగి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఇటీవల విధుల్లో చేరిన అదనపు ఎస్పీ (అడ్మిన్) రాజేష్ మీనా మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. యువ ఐపీఎస్ అదనపు ఎస్పీ (అడ్మిన్)గా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందని, ప్రజాసేవలో నిబద్ధత, విధుల్లో కర్తవ్య నిష్ట, సమర్థ నాయకత్వ లక్షణాలతో జిల్లా పోలీసుశాఖకు మరింత బలాన్ని చేకూరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉమ్మడి పాలమూరుకు ఆరెంజ్ అలర్ట్ జారీ వారం రోజులపాటు తీవ్రమైన వడగాల్పులు కనీసం 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదు బయటకు వెళ్తే జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యులు అత్యవసరమైతేనే బయటకు.. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రధానంగా చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలి. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు. ఎండలో తిరగాల్సి వస్తే గొడుగు, టోపీ వినియోగించాలి. ఎవరైనా వడదెబ్బకు గురైతే వెంటనే ఆస్పత్రికి తరలించాలి. – హేమంత కేశవ్ పాటిల్, కలెక్టర్, నాగర్కర్నూల్ -
పురాతన కట్టడాలనుసంరక్షించాలి
ఖిల్లాఘనపురం: పురాతన కట్టడాలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పురావస్తుశాఖ అధికారులు గౌస్, జావిద్ అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం మండలానికి వచ్చిన వారు గ్రామపెద్దలు, యువత, విద్యార్థులతో కలిసి ఖిల్లా గట్టును సందర్శించి గుట్టపై ఉన్న ప్రధాన ద్వారాలు, ఫిరంగి, చెరువులు, గుర్రపు గాట్లు తదితర వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజుల కాలం నాటి కోట, ఫిరంగి నేటికీ చెక్కు చెదరలేదన్నారు. గుట్టపై కాకతీయుల కాలంలో తవ్విన చెరువుల్లో నేటికీ నీళ్లు ఉన్నాయని తెలిపారు. ప్రతి ఏటా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను ఖిల్లా గట్టును చూపించాలని సూచించారు. పురాతన కట్టడాలు, నిర్మాణాలు, ఆలయాలు విద్యార్థి దశలో చూస్తే గుర్తుండిపోతాయని చెప్పారు. వారి వెంట గ్రామపెద్దలు ఆగారం ప్రకాష్, నాగేష్, యాదయ్య, దేవేందర్, ముజాహిద్, వెంకటేష్, పలువురు వార్డు సభ్యులు ఉన్నారు. ముగిసిన ఇంటర్సప్లిమెంటరీ పరీక్షలు వనపర్తిటౌన్: జిల్లాలో ఈ నెల 13న ప్రారంభమైన ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు మంగళవారం ముగిశాయి. చివరిరోజు ఉదయం జరిగిన మొదటి సంవత్సరం పరీక్షలకు 1,778 మంది విద్యార్థులకుగాను 1,621 మంది హాజరుకాగా 157 మంది గైర్హాజరయ్యారు. అదేవిధంగా మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 622 మంది విద్యార్థులకుగాను 568 మంది హాజరుకాగా.. 54 మంది రాయలేదని డీఐఈఓ నరేందర్కుమార్ వివరించారు. మెడికల్ దుకాణాల బంద్తో ఇబ్బందులు ఉండవు వనపర్తి: జిల్లాలో బుధవారం మెడికల్ దుకాణాల బంద్ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ రష్మిక ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజారోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని జిల్లా కెమిస్ట్, డ్రగిస్ట్ ప్రతినిధులతో సంప్రదింపు జరిపామని.. వనపర్తి, పెబ్బేరు, ఆత్మకూర్, కొత్తకోటలో కనీసం మూడు దుకాణాలు తెరిచి ఉంటాయని పేర్కొన్నారు. అదేవిధంగా జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఉన్న జీవన్ధారా, రెడ్క్రాస్ జనరిక్ మెడికల్ దుకాణం అందుబాటులో ఉంటాయని వివరించారు. మెడిప్లస్, అపోలో వంటి రిటైల్ ఫార్మసీ చైన్ ప్రతినిధులను సంప్రదించగా.. వారు కూడా బంద్ రోజున తమ సేవలు కొనసాగిస్తామని, మందుల లభ్యతలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ప్రాంతంలో కనీసం ఒక దుకాణం తెరిచేలా చూస్తామని చెప్పారని తెలిపారు. ఎక్కడైనా మెడిసిన్ అందుబాటులో లేకపోతే జిల్లా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ను సెల్నంబర్ 83339 25874 సంప్రదించాలని సూచించారు. -
ఇబ్బందులు తొలగనున్నాయి..
జూరాల ప్రధాన ఎడమ కాల్వలో పూడికతీత పనులు చేపట్టడంతో సాగునీరు సాఫీగా చివరి ఆయకట్టు వరకు పారే అవకాశం ఉంది. కాల్వలో ఒండ్రుమట్టితో పాటు రాళ్లు, ముళ్లపొదలు ఏళ్లుగా తొలగించకపోవడంతో సాగునీరు ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉండేది. వీటిని తొలగించడంతో సమృద్ధిగా పంటలకు అందే అవకాశం ఉంది. – హన్మంతు, రైతు, నందిమళ్ల ‘అమరచింత’ కాల్వలో సైతం.. జూరాల ఎడమ కాల్వకు అనుసంధానంగా ఉన్న అమరచింత ఎత్తిపోతల పథకం పరిధిలో మస్తీపురం, మూలమళ్ల, సింగంపేట, ఖానాపురం, పాంరెడ్డిపల్లి గ్రామాలతో పాటు అమరచింతకు సాగునీరు అందుతుంది. ఎత్తపోతల కాల్వలో సైతం పూడితీత పనులు కొనసాగుతున్నాయి. పట్టణ ప్రాంతంలో ఉపాధి పనులు లేకపోవడంతో మిగిలిన గ్రామాల్లో విస్తరించిన కాల్వలో ఉపాధి కూలీలతో పూడికతీత పనులు చేపట్టడం సంతోషం. – సత్యారెడ్డి, రైతు, అమరచింత కూలీలకు ఉపాధి కల్పించేందుకు.. జూరాల ఎడమ కాల్వలో పూడికతీత పనులు చేపట్టమని నీటిపారుదలశాఖ అధికారులు కోరడంతో ఉపాధిహామీ పథకం ద్వారా కూలీలతో పూడికతీత పనులు చేపడుతున్నాం. మండలంలోని వివిధ గ్రామాల్లో విస్తరించిన ఎడమ కాల్వతో పాటు అమరచింత, చంద్రగడ్ ఎత్తిపోతల కాల్వల్లో పేరుకుపోయిన పూడిక, ముళ్లపొదలు తొలగిస్తున్నాం. – శ్రీనివాసులు, ఎంపీడీఓ, అమరచింత -
సాగునీరు పారేలా...!
జూరాల ఎడమ, అనుబంధ కాల్వల్లో పూడికతీత ●అమరచింత: ఉపాధిహామీ పథకంలో భాగంగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ, అనుబంధ కాల్వల్లో పూడికతీత పనులు జోరుగా కొనసాగుతున్నాయి. కాల్వల్లో నీటిసరఫరా నిలిచిపోవడంతో రోజు ఉపాధి కూలీలతో పూడికతీతతో పాటు ముళ్లపొదల తొలగింపు పనులు కొనసాగుతోంది. యాసంగిలో ప్రధాన ఎడమకాల్వ ద్వారా కేవలం రామన్పాడు రిజర్వాయర్ వరకు 20 వేల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే సాగునీరు అందించడంతో మిగిలిన ఆయకట్టు కాల్వలు నీటి ప్రవాహం లేక ఎండుముఖం పట్టాయి. ఈసారి వేసవిలో కాల్వల మరమ్మతులకు ప్రతిపాదనలు లేకపోవడంతో ఇదే అదునుగా భావించిన పీజేపీ అధికారులు జాతీయ ఉపాధిహామీ పథకం ద్వారా పూడికతీత పనులకు శ్రీకారం చుట్టారు. ఇందుకుగాను ఆయా మండలాల్లోని నీటిపారుదలశాఖ ఏఈలు ఎంపీడీఓలను సంప్రదించి కాల్వల్లో ఉపాధి పనులు చేపట్టాలని కోరడంతో సమీప గ్రామాల కూలీలతో పనులు చేపడుతున్నారు. వచ్చే వర్షాకాలంలో సాగునీరు సాఫీగా ముందుకు పారే విధంగా ప్రధాన, పిల్ల కాల్వల్లో సైతం పూడిక తొలగించి రైతులకు ప్రయోజనం కలిగే విధంగా అధికారులు పనులు చేయిస్తున్నారు. నీటిపారుదలశాఖ సిఫార్సులతో ఉపాధిహామీ పథకంలో.. ఎంపీడీఓల పర్యవేక్షణలో ఊపందుకున్న పనులు వేసవిలో మరమ్మతులు లేకపోవడంతోనే.. -
దొడ్డురకం ధాన్యం దించుకోవాల్సిందే
వనపర్తి: రైస్మిల్లర్లు సన్నరకంతో పాటు దొడ్డురకం వరి ధాన్యాన్ని కూడా దించుకొని ప్రభుత్వానికి సహకరించాలని, లేదంటే చర్యలు తప్పవని కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రైస్మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యాసంగి సీజన్ ధాన్యం కేటాయింపునకు జిల్లాలో 55 మిల్లులు మాత్రమే అర్హత సాధించాయని.. వాటిలో 9 మంది మినహా మిగతా మిల్లర్లు దొడ్డురకం వరి ధాన్యాన్ని దించుకోవడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోందన్నారు. మిల్లర్లు ఈ సీజన్లో సన్న, దొడ్డురకం వరి ధాన్యం దింపుకొని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. సహకరించని మిలర్లను ప్రభుత్వ ఆదేశానుసారం బ్లాక్లిస్టులో ఉంచుతామని హెచ్చరించారు. ఏవైనా సమస్యలుంటే తెలియజేయాలని.. పరిష్కారానికి ప్రభుత్వం తరఫున కృషి చేస్తామని చెప్పారు. జిల్లాలో ఖాళీగా ఉన్న గోదాముల్లో ధాన్యాన్ని నిల్వ చేసేందుకు తగిన ఏర్పాటు చేయాలని రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, పౌరసరఫరాల సంఘం జిల్లా మేనేజర్ ఆంజనేయులు, గిడ్డంగుల కార్పొరేషన్ రీజనల్ మేనేజర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
అన్నదాతల ఆగ్రహం.. రోడ్డెక్కి ఆందోళన
వనపర్తి రూరల్: కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 45 రోజులు గడుస్తున్నా.. నేటికీ వరి ధాన్యం కొనుగోళ్లు చేపట్టడం లేదంటూ ఆగ్రహించిన రైతులు మంగళవారం మండలంలోని రాజపేట కొనుగోలు కేంద్రం ఎదుట రహదారిపై బైఠాయించి ధాన్యానికి నిప్పంటించి రాస్తారోకో చేపట్టారు. వీరికి సర్పంచ్ ఎల్లయ్య, సింగిల్విండో చైర్మన్ రఘువర్ధన్రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. నెల రోజులుగా ధాన్యం అమ్ముకోలేక.. ఇప్పటికే విక్రయించిన ధాన్యాన్ని రైస్మిల్లుకు తరలించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అకాల వర్షాలకు ధాన్యం తడిస్తే తీవ్రంగా నష్టపోతా మని రైతులు తమ ఆవేదనను వెళ్లగక్కారు. ఽతూకం చేసిన ధాన్యాన్ని రైతులు ట్రాక్టర్లలో మిల్లుకు తరలిస్తే మిల్లరు దించుకోకుండా తిప్పి పంపారని అసహనం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ రమేష్రెడ్డి, ఎస్ఐ హృశికేష్ అక్కడికి చేరుకొని వారితో మాట్లాడారు. ఇప్పటి నుంచి సకాలంలో ధాన్యం కొనుగోలు చేస్తామని.. తరలింపునకు లారీల కొరత తలెత్తకుండా చూస్తామని, ఎ లాంటి ఆందోళనలు చెందవద్దని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించి ధర్నా విరమించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ చిన్నారెడ్డి, నాయకులు మాధవరెడ్డి, జయరాములు, సుదర్శన్రెడ్డి, తిరుపతయ్య, తెలుగు నారాయణ, మోహన్రెడ్డి, సత్యారెడ్డి, శంకర్రెడ్డి, మహిళా రైతులు పాల్గొన్నారు. ధాన్యానికి నిప్పంటించి నిరసన -
పంటమార్పిడితోనే అధిక దిగుబడులు
వనపర్తి రూరల్: పంటమార్పిడితోనే అధిక దిగుబడులు పొందవచ్చని.. రైతులు ఒకే రకం పంటలు కాకుండా పంటమార్పిడి చేపట్టాలని పాలెం వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత డా. పద్మశ్రీ సూచించారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలోని చందాపూర్ రైతువేధికలో రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమెతో పాటు శాస్త్రవేతలు డా. ఆగ్రోనమి, శోభా రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు ఏళ్ల తరబడి వరి మాత్రమే సాగుచేస్తున్నారని, దీంతో చీడపీడల బాధ అధికమవుతుందని చెప్పారు. కూరగాయలు, పప్పుదినుసులు, వాణిజ్య పంటలు సాగు చేయాలని సూచించారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గించి పచ్చిరొట్ట, జీవన ఎరువులు వాడాలని కోరారు. పంటను రోజు గమనించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలని, నేల పరీక్షల ఆధారంగా ఎరువులు వినియోగించడం ఉత్తమమని పేర్కొన్నారు. ఎరువులు, పురుగు మందులు సరైన మోతాదులో. సరైన సమయంలో వాడాలని.. ఇది పంటల నాణ్యతను పెంచడంతో పాటు సాగు ఖర్చు తగ్గిస్తుందని వివరించారు. ఏఈఓ శ్రీనివాసులు మాట్లాడుతూ.. భూ సారం పెంపొందించేందుకు వ్యవసాయశాఖ ద్వారా రాయితీపై జీలుగ, జనుము విత్తనాలు అందిస్తున్నామని చెప్పారు. రైతులు వాటిని సాగుచేసి పూత దశలో భూమిలో కలియదున్ని భూ సారం పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఈఓ బాలప్రకాష్, వినోద్, విండో డైరెక్టర్ మహేందర్, ఉప సర్పంచ్ నరేందర్, శ్యాంయాదవ్, అధికారులు, రైతులు పాల్గొన్నారు. -
జిల్లాలో ఇలా..
జూరాల ఎడమ కాల్వ జిల్లాలోని అమరచింత, ఆత్మకూర్, మదనాపురం, కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగాపురం, వీపనగండ్ల, చిన్నంబావి మండలాలకు విస్తరించి ఉంది. మొత్తం 85 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. దీంతోపాటు గోపాల్దిన్నె రిజర్వాయర్కు సైతం ఇదే కాల్వ ద్వారా నీరు సరఫరా అవుతుండటంతో అత్యధికంగా జిల్లా ప్రజలకే లబ్ధి చేకూరుతుంది. ఎనిమిదేళ్లుగా కేవలం వానాకాలంలోనే ఆయకట్టు మొత్తానికి సాగునీరు అందిస్తున్న అధికారులు, యాసంగిలో మాత్రం వారబందీ విధానంలో ఆయకట్టు కుదించి నీటిని వదులుతున్నారు. ప్రతిసారి వేసవిలో మరమ్మతుల కారణంగా కాల్వలో పూడికతీత పనులు ముందుకు సాగకపోయేవి. ప్రస్తుత వేసవిలో కాల్వ మరమ్మతు లేకపోవడంతో యుద్ధప్రాతిపదికన పూడికతీత పనులు కొనసాగుతున్నాయి. -
ఘన వ్యర్థాల నిర్వహణపై విస్తృత అవగాహన
వనపర్తి: ఘన వ్యర్థాల నిర్వహణపై గ్రామస్థాయిలో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. మంగళవారం ఆయన ఘన వ్యర్థాల నిర్వహణ, ఉపాధిహామీ లక్ష్యాలు తదితర అంశాలపై కలెక్టరేట్ నుంచి ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్న్స్ నిర్వహించారు. సుప్రీంకోర్టు ఇటీవల జారీ చేసిన ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన నాలుగు మార్గదర్శకాలను గ్రామపంచాయతీల్లో సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. వ్యర్థాలు సేకరించే పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి శాసీ్త్రయ విధానంలో చెత్త నిర్వహణ చేపట్టేలా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి మండలంలో భారీస్థాయిలో వ్యర్థాలు ఉత్పత్తి చేసే బల్క్వేస్ట్ జనరేటర్లను గుర్తించి వారిపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలన్నారు. అలాగే ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా గ్రామపంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఆదాయ వనరులను సృష్టించాలని కోరారు. ఫంక్షన్ హాళ్లు, ప్రజారవాణా సదుపాయాలు, హాస్టళ్లు వంటి ఆదాయాన్ని తెచ్చే ఆస్తులను గ్రామపంచాయతీలు అభివృద్ధి చేయాలని సూచించారు. ఉపాధిహామీ కూలీల సంఖ్య పెంపునకు తగిన చర్యలు చేపట్టాలని.. నిరంతర ఉపాధి కల్పించే విధంగా పనులు గుర్తించాలని సూచించారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఉపాధి పనులను ఉదయం 5.30 నుంచి 6 గంటల మధ్య ప్రారంభించేలా చూడాలని, పని ప్రదేశాల్లో కార్మికులకు తాగునీరు, నీడ తదితర మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జెడ్పీ సీఈఓ యాదయ్య, జెడ్పీ డిప్యూటీ సీఈఓ రాంమహేశ్వర్రెడ్డి, డీఎల్పీఓ రఘునాథ్, డీఆర్డీఓ ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
వనపర్తి రూరల్: రైతులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి రాకుండా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. సోమవారం మండలంలోని చిట్యాల వ్యవసాయ మార్కెట్యార్డులోని వరి కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి చేశారు. ధాన్యం సేకరణ, తూకం, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి నిర్వాహకులకు సూచనలు చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని.. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే కేటాయించిన రైస్మిల్లులు, గోదాములకు తరలించేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి దశలో పారదర్శకత పాటించాలని స్పష్టం చేశారు. ‘ఖిల్లా’ మార్కెట్ చైర్పర్సన్గా క్యామ నవనీత ఖిల్లాఘనపురం: ఖిల్లాఘనపురం, పెద్దమందడి మండలాలకు కలిపి ఖిల్లాఘనపురంలో ఏర్పాటు చేయనున్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా పట్టణానికి చెందిన క్యామ నవనీతను నియమిస్తూ సోమవారం ప్రభుత్వం జీఓ జారీచేసింది. అదేవిధంగా ఉపాధ్యక్షులుగా పెద్దమందడి మండలం దొడగుంటపల్లికి చెందిన కొత్తకాపు వెంకటేశ్వర్రెడ్డి, డైరెక్టర్లుగా దిండు రవీందర్, డి.బాలరాజు, ముప్పురి రత్నయ్య, తలకొండపల్లి రఘునాథ్, బయన్న, పాత్లావత్ బాషా, రవీందర్రెడ్డి, మర్యాద బాలకృష్ణారెడ్డి, బత్తుల దుర్గయ్య, ఎండీ ఖాజా నయీముద్ధీన్, రవీంద్రనాథ్, తూము రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. -
మక్క రైతుల తిప్పలు..
రోజుల తరబడి కేంద్రాల వద్దే పడిగాపులు వెంటనే తరలించాలి.. ఐదెకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తే 106 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే గన్నీబ్యాగులు లేవని చెబితే బయట ప్రైవేట్గా కొనుగోలు చేశాం. తూకం పూర్తయినా నేటికీ తరలించడం లేదు. 20 రోజులుగా లారీలు రావడం లేదు. కేంద్రంలో కొనుగోలు చేసిన ధాన్యం కుప్పలు 100కు పైగా ఉన్నాయి. వర్షం వస్తే మేమేం కావాలి. వెంటనే తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. – రాములు, రైతు, పొలికెపాడు, గోపాల్పేట గన్నీ బ్యాగుల కొరతతో ఇబ్బందులు.. మొక్కజొన్న విక్రయానికి చాలా ఇబ్బందులు పడ్డాం. ఎప్పుడూ లేని విధంగా గన్నీ బ్యాగుల కొరత తలెత్తడంతో ప్రైవేట్లో రూ.30కి సంచి చొప్పున కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పంట విక్రయ సమయంలో అదృష్టవశాత్తు అకాల వర్షాలు కురవకపోవడంతో బయటపడ్డాం. – రమేష్, చిన్నంబావి డబ్బులు జమ చేస్తున్నాం.. గన్నీబ్యాగుల కొరత ఉన్నమాట వాస్తవమే. కానీ రైతులు ప్రైవేట్గా కొనుగోలు చేసి తీసుకొస్తే తూకాలు చేస్తున్నాం. ఇందుకు సంబంధించిన డబ్బులను వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నాం. ఇప్పటి వరకు 50 శాతానికి పైగా కొనుగోళ్లు పూర్తి చేశాం. చెల్లింపులు కూడా వెంటనే పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. కేంద్రాలకు తీసుకొచ్చిన పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తాం. రైతులు అధైర్యపడొద్దు. – చంద్రమౌళి, మార్క్ఫెడ్ అధికారి, వనపర్తి వనపర్తి: మొక్కజొన్న విక్రయానికి జిల్లా రైతులకు అవస్థలు తప్పడం లేదు. జిల్లాలోని గోపాల్పేట, రేవల్లి, ఏదుల, చిన్నంబావి, వనపర్తి, ఖిల్లాఘనపురం మండలాల్లో సాగు సుమారు 14 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి రావచ్చని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. దీని ప్రకారం మార్క్ఫెడ్ అధికారులు ధాన్యం కొనుగోళ్లకుగాను జిల్లావ్యాప్తంగా వనపర్తి, గోపాల్పేట, రేవల్లి, ఏదుట, వీపనగండ్ల, పెబ్బేరులో కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరణ బాధ్యతను పీఏసీఎస్లకు అప్పగించారు. కాగా అటు వరి, ఇటు మొక్కజొన్న కొనుగోళ్లు చేపట్టలేక పీఏసీఎస్ సిబ్బంది సతమతమవుతుండగా.. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొంది. తప్పని ఆర్థిక భారం.. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో పాటు పంట ఉత్పత్తులు తడిసిపోకుండా టార్పాలిన్లు, ఎలక్ట్రానిక్ కాంటాలు, కావాల్సిన మేర గన్నీబ్యాగులు, తూకం చేసిన ధాన్యం బస్తాలను తరలించేందుకు సరిపడా లారీలు, నిల్వలకు గోదాంలను సమకూర్చాల్సి ఉంది. కాగా మార్క్ఫెడ్ అధికారులు సరైన దృష్టి సారించకపోవడంతో తూకం చేసిన మొక్కజొన్న బస్తాలు కేంద్రాల్లోనే నిల్వ ఉండటం.. రాశులుగా పోసి పంట ఉత్పత్తులు నింపేందుకు సరిపడా గన్నీబ్యాగులు లేకపోవడం వంటి సమస్యలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదేమిటని నిర్వాహకులను ప్రశ్నిస్తే గన్నీబ్యాగులు తీసుకొస్తే తూకం చేస్తామంటూ నిర్లక్ష్యంగా సమాధానాలు ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చేసేది లేక కొందరు రైతులు ప్రైవేట్గా గన్నీబ్యాగులు కొనుగోలు తీసుకొస్తే తూకం చేసి అక్కడే నిల్వ చేసి వదిలేస్తున్నారు. ఈ విషయమై కమ్యూనిటీ పార్టీల నాయకులు సైతం నిరసన కార్యక్రమాలు చేపట్టినా అధికారుల్లో చలనం కనిపించడం లేదు. లారీలు, గన్నీబ్యాకుల కొరతే ప్రధాన కారణం తూకాలు చేసినా.. తరలని వైనం ధాన్యం తడుస్తుందని అన్నదాతల ఆందోళన వనపర్తిలో భారీగా నిల్వలు.. వనపర్తి మార్కెట్యార్డులోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి వనపర్తి, గోపాల్పేట, ఖిల్లాఘనపురం తదితర ప్రాంతాల రైతులు పెద్దఎత్తున పంట ఉత్పత్తులు విక్రయానికి తీసుకొస్తున్నారు. 20 రోజులుగా కొనుగోళ్లు కొనసాగకపోవడంతో రైతు లు మార్కెట్లోనే పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొంది. కొనుగోలు చేసిన ఉత్పత్తులు అధికారు లు కేటాయించిన నిర్దేశిత గోదాంలకు చేరితేనే రై తుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతా యి. కేంద్రాల్లోనే ధాన్యం బస్తాలు నిల్వ ఉండడంతో విక్రయించి రోజులు గడుస్తున్నా.. డ బ్బులు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
క్రీడలకు ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం
వనపర్తి: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యమిస్తూ క్రీడాభివృద్ధే ధ్యేయంగా పని చేస్తోందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న యువజన, క్రీడా వారోత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లాకేంద్రంలో జిల్లా యువజన, క్రీడల అధికారి సుధీర్రెడ్డి ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించగా.. ముఖ్యఅతిథులుగా కలెక్టర్తో పాటు అదనపు ఎస్పీ రాజేష్ మీనా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానం నుంచి బస్డిపో మీదుగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు రన్న సాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడలు భాగం కావాలని కోరారు. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటేనే మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటామని.. అందరూ ఫిట్నెస్ను కాపాడుకోవాలని సూచించారు. అనంతరం బాక్సింగ్ స్పోర్ట్స్ క్యాంప్ను ప్రారంభించారు. యువత క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. అదనపు ఎస్పీ రాజేష్ మీనా మాట్లాడుతూ.. క్రీడలను అలవాటు చేసుకోవడంతో శారీరకంగా దృఢంగా ఉండటం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఫిట్నెస్ కలిగి ఉండాలని.. తద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకోగలమన్నారు. కార్యక్రమంలో భాగంగా యూత్, స్పోర్ట్స్ వీక్, టూరిజానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. వారోత్సవాల్లో ప్రతిరోజు ఒక కార్యక్రమం నిర్వహిస్తామని జిల్లా యువజన క్రీడల అధికారి తెలిపారు. యువతలో స్కిల్ డెవలప్మెంట్, యూత్ పార్లమెంట్, స్వచ్ఛదనం.. పచ్చదనం, వివిధ రంగాల్లో రాణిస్తున్న యువతకు సన్మానం తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ బాలాజీనాయక్, అధికారులు, క్రీడాకారులు, విద్యార్థులు, యువత పాల్గొన్నారు. -
మర‘మత్తు’లోనే..!
నడిగడ్డ సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యపు నీడలు గద్వాల: జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతుపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. దో హబ్గా పిలువబడే కృష్ణా, తుంగభద్ర నదులు నడిగడ్డలో పారుతున్నప్పటికీ.. సాగునీటి ప్రాజెక్టుల పనులు దశాబ్దాలుగా పెండింగ్లో ఉండటంతో పంట పొలాలకు సాగునీరు పారడం గగనంగా మారుతోంది. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, నెట్టెంపాడు, ఆర్డీఎస్, గట్టు ఎత్తిపోతల పథకాల ద్వారా ఏటా రెండు పంటలకు సమృద్ధిగా సాగునీరు పారి కళకళలాడాల్సిన వ్యవసాయ భూములు కాస్త బీళ్లుగా మారుతున్నాయి. జిల్లావ్యాప్తంగా యాసంగిలో జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టు కింద కేవలం 49వేల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందిస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. తుగభద్ర నది పరిధిలోని రాజోళిబండ డైవర్షన్ పథకం కింద రెండేళ్లుగా యాసంగిలో పూర్తిగా పంటలకు క్రాప్హాలిడే ప్రకటించారు. అదే విధంగా కృష్ణానది పరిధిలోని నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద ఉన్న ర్యాలంపాడు జలాశయానికి పలుచోట్ల లీకేజీలు ఏర్పడటంతో ఆయకట్టుకు యాసంగిలో పూర్తిగా క్రాప్హాలిడే ఇస్తున్నారు. అదే విధంగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన గేట్ల ఇనుప రోపులు తెగిపోగా.. మరమ్మతు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. మరమ్మతులను పూర్తిచేయడంలో పాలకులు, అధికారులు అవలంబిస్తున్న నిర్లక్ష్యంపై రైతన్నలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వానాకాలంలోనే పూర్తిస్థాయిలో.. కృష్ణానది పరిధిలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కింద 1,09,296 ఎకరాలు, నెట్టెంపాడు ప్రాజెక్టు కింద 1,42,000 ఎకరాలు, తుంగభద్ర నది పరిధిలో ఆర్డీఎస్ కింద 83,998 ఎకరాలతో కలిపి మొత్తం 3,35,294 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. ఏటా వానాకాలంలో పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరు పారుతోంది. యాసంగిలో మాత్రం కేవలం 49వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు పరిమితమవుతోంది. గత మూడేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వానాకాలం ముంచుకొస్తున్నా జూరాల గేట్లకు పూర్తికాని మరమ్మతు యాసంగిలో 26వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు ర్యాలంపాడు జలాశయం 2 టీఎంసీలకే పరిమితం నత్తనడకన ఆర్డీఎస్ పనులు ఇదీ పరిస్థితి.. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం 62 క్రస్ట్ గేట్లు ఉండగా.. అందులో 12 గేట్లకు సంబంధించి ఇనుప రోపులు పూర్తిగా తెగిపోయాయి. దీంతో ఈ ఏడాది వరద సమయంలో ప్రాజెక్టు భద్రతపై పెద్దఎత్తున ఆందోళనలు వ్యక్తమయ్యాయి. రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఉన్నతాధికారులు జూరాల ప్రాజెక్టును సందర్శించి.. అంతా బాగుందంటూ ప్రకటనలు చేసి వెళ్లారు. ప్రస్తుతం ప్రాజెక్టు గేట్ల మరమ్మతు ఇంకా అసంపూర్తిగానే మిగిలింది. ఫలితంగా యాసంగిలో కేవలం 26వేల ఎకరాలకే సాగునీటిని అందిస్తున్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగంగా 4 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ర్యాలంపాడు జలాశయం అడుగు భాగాల్లో, తూముల వద్ద లీకేజీలు ఏర్పడ్డాయి. ఫలితంగా జలాశయం ఉనికికే ప్రమాదం పొంచి ఉంది. దీంతో 4 టీఎంసీల సామర్థ్యాన్ని కాస్త 2 టీఎంసీలకు కుదించి.. నాలుగేళ్లుగా ఏటా వానాకాలం పంటకే నీరందిస్తున్నారు. రాజోళిబండ డైవర్షన్ పథకం హెడ్వర్క్స్, గేట్లు, ప్రధాన కాల్వల మరమ్మతు 2007లో మొదలుపెట్టగా.. నేటికీ టీవీ సీరియల్ మాదిరిగా కొనసాగుతూనే ఉంది. ఫలితంగా ఆర్డీఎస్ కింద యాసంగిలో క్రాప్హాలిడే ప్రకటించడం ఆనవాయితీగా మారింది. -
ప్రతి గింజ కొనుగోలు చేస్తాం
కొత్తకోట రూరల్: పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. సోమవారం కొత్తకోటలోని పీఏసీఎస్ కార్యాలయంలో కొత్తకోట, పామాపురం గ్రామాల వరి కొనుగోళ్లకు సంబంధించి అధికారులతో సమావేశమై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్తో మాట్లాడి వెంటనే ధాన్యాన్ని మిల్లులు, గోదాములకు తరలించాలని సూచించారు. మిల్లర్లు ఆలస్యం చేయకుండా త్వరగా ధాన్యాన్ని దించుకోవాలని సూచించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రైతులు ధైర్యంగా ఉండాలన్నారు. అంతకుముందు పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహ ప్రవేశాల్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి అసంపూర్తిగా ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్యార్డును, కొత్త మున్సిపల్ భవనం నిర్మాణానికి సంబంధించిన నమూనాను పరిశీలించారు. పుర చైర్పర్సన్ పి.అరుణ, వైస్ చైర్పర్సన్ పి.పల్లవి, మార్కెట్యార్డ్ చైర్మన్ పి ప్రశాంత్, మాజీ సర్పంచ్ శేఖర్రెడ్డి, రావుల కరుణాకర్రెడ్డి, పీఏసీఎస్ సీఈఓ బాలరాజు, పామాపురం సీఈఓ రాఘవేందర్రెడ్డి పాల్గొన్నారు. కాజ్వే నిర్మాణానికి భూమిపూజ.. మదనాపురం: మండలంలోని దంతనూరు – శంకరంపేట మధ్యలో ఉన్న వాగుపై కాజ్వే నిర్మాణానికి ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి సోమవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షాకాలంలో ఆయా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచి ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని.. సమస్యను పరిష్కరించేందుకు కాజ్వే నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. నాణ్యత ప్రమాణాలతో నిర్దేశిత కాలపరిమితిలోగా పనులు పూర్తి చేయాలని కోరారు. సర్పంచులు నాగరాజుగౌడ్, శ్రీనివాసులు, తహసీల్దార్ రేపోలు రాజు, ఎంపీడీఓ ప్రసన్నకుమారి, సుక్క మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
50 శాతం చేరని లక్ష్యం..
జిల్లావ్యాప్తంగా 14 వేల మెట్రిక్ టన్నుల మక్కలు కొనుగోలు చేయాలని మార్క్ఫెడ్ లక్ష్యం నిర్దేశించినా.. ఇప్పటికింకా 50 శాతానికి సైతం చేరలేదని రైతులు, రైతు కూలీ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. సేకరించిన ధాన్యంలో చాలావరకు కేంద్రాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. వరి, మొక్కజొన్న కొనుగోళ్లు ఏకకాలంలో కొనసాగుతున్నాయని.. వరి ధాన్యాన్ని రైస్మిల్లులు, గోదాంలలో నిల్వ చేస్తుండటంతో మొక్కజొన్నకు అవకాశం లేకుండా పోయిందని అధికారులు చెబుతున్నారు. రైతులకు చేసిన డబ్బుల చెల్లింపుల వివరాలు చెప్పేందుకు కూడా మార్క్ఫెడ్ అధికారులు అనాసక్తి కనబరుస్తుండటం గమనార్హం. ఇప్పటికీ వనపర్తి మార్కెట్యార్డులో భారీగా మొక్కజొన్న రాశులు కనిపిస్తున్నాయి. -
భూ సేకరణ ప్రక్రియ సాగుతోంది..
లింక్ కెనాల్ నిర్మాణానికి దాదాపు 300 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. గ్రామాల వారీగా రైతులతో మాట్లాడాం. మంత్రి జూపల్లి కృష్ణారావు రెగ్యులర్గా కెనాల్ పనులపై ఆరా తీస్తున్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాల ని సూచించారు. ఇప్పటి వరకు కొంతమేరకు కాల్వ తవ్వకాలు పూర్తయ్యాయి. చాలా చోట్ల అక్విడెక్టు పనులు కూడా పూర్తి చేశారు. భూ సేకరణకు రెవెన్యూ అధికారులు చర్యలు ప్రారంభించారు. – శ్రీనివాసరెడ్డి, ఈఈ, నీటిపారుదలశాఖ ● -
‘సేంద్రియ’ ప్రోత్సాహం
జీలుగ, జనుము విత్తనాలకు 50 శాతం రాయితీ వనపర్తి: రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి భూ సారాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలను 50 శాతం రాయితీపై రైతులకు అందజేస్తోంది. కొన్నేళ్లుగా వానాకాలం సీజన్లో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ రైతుల అభ్యర్థనల మేరకు పాలమూరు జిల్లాలో జనుము, జీలుగ విత్తనాలను సిద్ధం చేసి పీఏసీఎస్లు, రైతు ఆగ్రో కేంద్రాలు, హాకా సెంటర్లతో పాటు వివిధ కేంద్రాల్లో విక్రయిస్తోంది. రైతులు పచ్చిరొట్ట ఎరువుల వాడకాన్ని ఏటా పెంచుతూ వస్తున్నారు. ప్రస్తుత వానాకాలం సీజన్లో జిల్లాల వారీగా వ్యవసాయశా ఖ అధికారులు ఇచ్చిన ఇండెంట్ ప్రకారం వనపర్తి లోని తెలంగాణ రాష్ట్ర విత్తనశుద్ధి కేంద్రంలో 9,200 క్వింటాళ్ల జీలుగ, జనుము విత్తనాలను సిద్ధం చేసి ఉంచారు. ఇప్పటికే నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాల్లోని పలు పీఏసీఎస్ కేంద్రాలకు వీటిని సరఫరా చేసినట్లు అధికారులు వెల్లడించారు. ● గత ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా రైతుబంధు పథకాన్ని అమలులోకి తీసుకొచ్చి విత్తనాలు, వ్యవసాయ యంత్రాలపై ఇచ్చే రాయితీని ఎత్తివేసింది. కొంతకాలంగా రైతులకు పెట్టుబడి సాయం సక్రమంగా అందడం లేదు. విత్తనాలపై రాయితీ లేక, పెట్టుబడి సాయం సకాలంలో అందక రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలపై 50 శాతం రాయితీని వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ● పచ్చిరొట్ట ఎరువుల్లో జీలుగ, జనుము, పిల్లిపెసర ఉండగా.. పాలమూరు రైతులు కేవలం జీలుగ, జనుముకే ఆసక్తి చూపుతున్నారు. దీంతో వనపర్తిలోని తెలంగాణ రాష్ట్ర విత్తన శుద్ధి కేంద్రంలో ఆయా విత్తనాలను ప్రాసెసింగ్ చేసి సిద్ధం చేసి ఉంచారు. జీలుగ విత్తనాలు 30 కిలోల బస్తా అందుబాటులో ఉండగా.. పూర్తి ధర రూ.4,905. యాభై శాతం రాయితీతో రైతులు పొందవచ్చు. అలాగే జనుము విత్తనాలు 40 కిలోల బస్తాలు అందుబాటులో ఉన్నాయి. పూర్తి ధర రూ.6,220 కాగా.. యాభై శాతం రాయితీతో రూ.3,110కే రైతులకు సరఫరా అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యవసాయశాఖ అధికారుల అంచనాల ప్రకారం జీలుగ విత్తనాలు 8,500 క్వింటాళ్లు.. జనుము విత్తనాలు 700 క్వింటాళ్లు సిద్ధం చేసి ఉంచారు. వనపర్తిలోని విత్తనశుద్ధి కర్మాగారంలో తరలింపునకు సిద్ధంగా ఉన్న విత్తనాలు ఉమ్మడి జిల్లా రైతుల కోసం 9,200 క్వింటాళ్లు.. సిద్ధం చేసిన రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఇప్పటికే నారాయణపేట, పాలమూరు జిల్లాలకు సరఫరా పంట విత్తనాలకు రాయితీ లేనట్టే.. జిల్లాలో వానాకాలం, యాసంగిలో సాగుచేసే వరి, వేరుశనగ, కంది, పెసర, మొక్కజొన్న, మినుములు, పత్తి, మిరప తదితర ఆహార ధాన్యాల విత్తనాలపై ప్రభుత్వం కొంతకాలంగా రాయితీని ఎత్తివేసింది. ఉమ్మడి జిల్లాకు కావాల్సిన సుమారు 50 వేల క్వింటాళ్ల వరి (సన్నా, దొడ్డురకం) విత్తనాలను విత్తనాభివృద్ధి సంస్థ సిద్ధం చేసి ఉంచింది. మరో 15 రోజుల తర్వాత పీఏసీఎస్లు, రైతు ఆగ్రో కేంద్రాల ద్వారా వరి, కంది విత్తనాలు రైతులకు విక్రయిస్తారు. వరి 25 కిలోల బస్తాలు, కంది 4 కిలోల బస్తాలు రైతులకు అందుబాటులో ఉంటాయి. రెండు పర్యాయాలు వానాకాలంలో మెట్ట పంటల సాగు తగ్గిపోవటంతో జిల్లాకేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ వారి విత్తనశుద్ధి కర్మాగారంలో కేవలం వరి, కంది విత్తనాలను మాత్రమే ప్రాసెసింగ్ చేస్తోంది. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల రైతులకు వ్యవసాయ అధికారుల సిఫారస్ మేరకు జనుము, జీలుగ, ఆహార ధాన్యాల విత్తనాలు సిద్ధం చేసి ఉంచాం. ఇప్పటికే నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాలకు 1,050 క్వింటాళ్ల పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు పంపిణీ చేశాం. వర్షాలు ప్రారంభం కాగానే వరి, కంది తదితర ఆహార ధాన్యాల విత్తనాలను సైతం పీఏసీఎస్, రైతు ఆగ్రో కేంద్రాలు, హాకా సెంటర్లలో అందుబాటులో ఉంచుతాం. – ఆదినారాయణరెడ్డి, రీజియన్ మేనేజర్, విత్తన శుద్ధికర్మాగారం, మహబూబ్నగర్ -
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం
వనపర్తిటౌన్: కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుపేదలు ఎంతగానో లబ్ధి పొందుతున్నారని.. సీఎంఆర్ఎఫ్ వరమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని తన నివాసంలో 111 మంది లబ్ధిదారులకు రూ.28.22 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసి మాట్లాడారు. ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకోలేని వారికి వైద్యఖర్చుల నిమిత్తం సీఎంఆర్ఎఫ్ అందజేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖలో 190 ఈఓ పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం పొందే విధంగా కృషి చేసిన చిన్నారెడ్డిని కార్యనిర్వహణాధికారులు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధానకార్యదర్శి నందిమళ్ల యాదయ్య, డీసీసీ మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, నాయకులు పాల్గొన్నారు. -
ధాన్యం సేకరణ వేగవంతం
వనపర్తి: జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం కావాలని, అదేవిధంగా గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వరి కొనుగోళ్ల ప్రక్రియపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. జిల్లావ్యాప్తంగా రోజు 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడమే లక్ష్యంగా పని చేయాలన్నారు. ప్రతి కేంద్రం వద్ద సరిపడా లారీలను అందుబాటులో ఉంచి, రైతులకు ఇబ్బందులు కలగకుండా వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. ప్రస్తుత అవసరాల మేరకు నిర్దేశిత కొనుగోలు కేంద్రాలకు అదనపు లారీలను పంపాలన్నారు. ధాన్యం కొనుగోళ్లు, లోడింగ్, అన్లోడింగ్ విషయంలో ఏమైనా సమస్యలుంటే తెలియజేయాలని, పోలీసు అధికారుల సమన్వయంతో అన్లోడింగ్ చేయించాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో నిర్దేశిత లక్ష్యం ప్రకారం వరి ధాన్యం కొనుగోళ్లు జరగాలని.. రైతులు తెచ్చిన ధాన్యాన్ని వేగంగా తూకం వేసి కేటాయించిన మిల్లులకు తరలించాలన్నారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి కాశీవిశ్వనాథ్, జిల్లా మేనేజర్ ఆంజనేయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. రైస్మిల్లులు, గోదాంల తనిఖీ.. ఖిల్లాఘనపురం: గోదాములు, రైస్మిల్లుల వద్ద వరి ధాన్యం లారీల అన్లోడింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ కోరారు. ఆదివారం మండలంలోని మానాజీపేట దగ్గర ఉన్న ఖిల్లా ఆగ్రో గోదాం, శ్రీరామ ఇండస్ట్రీస్, లక్ష్మీనర్సింహ రైస్మిల్లును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ధాన్యంతో ఉన్న లారీలు, డీసీఎంల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, గోదాములు, రైస్మిల్లులకు వచ్చిన వాహనాల్లోని ధాన్యం బస్తాలను దించే ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. మండలస్థాయి అధికారుల పర్యవేక్షణ ఉండాలని.. గ్రామాల్లోని కేంద్రాల దగ్గర వేగంగా తూకాలు చేయించడం, బస్తాలను వెంటనే లారీల్లో మిల్లులకు తరలించేలా చూడాలన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ సుగుణ, ఎస్ఐ వెంకటేష్, ఆర్ఐ తిరుపతయ్య, సింగిల్విండో సీఈఓ కృష్ణ తదితరులు ఉన్నారు. -
ఆగుతూ.. సాగుతూ...
నత్తనడకన సింగోటం – గోపల్దిన్నె లింక్ కెనాల్ పనులు ● పూర్తికాని భూసేకరణ ప్రక్రియ ● రూ.147.7కోట్ల వ్యయంతో నాలుగేళ్ల క్రితం పనులకు శ్రీకారం ● కెనాల్ పూర్తయితే 34 వేల ఎకరాలకు సాగునీరు కొల్లాపూర్: సింగోటం – గోపల్దిన్నె లింక్ కెనాల్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కొల్లాపూర్ నియోజకవర్గంలోని చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన కెనాల్ పనులు నాలుగేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. భూ సేకరణలో జాప్యం కారణంగా నిర్మాణం ముందుకు సాగడంలేదు. ఈ కెనాల్పై ఐదు మండలాల రైతులు ఆశలు పెట్టుకున్నారు. కెనాల్ నిర్మాణం పూర్తయితే వారికి సాగునీటి సమస్య తీరనుంది. శాశ్వత పరిష్కారం కోసం.. కొల్లాపూర్ నియోజకవర్గంలో జూరాల ప్రధాన ఎడమ కాల్వ, భీమా కెనాల్ కింద వేలాది ఎకరాల ఆయకట్టు భూములు ఉన్నాయి. చివరి ఆయకట్టు రైతులకు యాసంగి సీజన్లో సాగునీటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సింగోటం – గోపల్దిన్నె లింక్ కెనాల్ నిర్మాణానికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా సాగునీటిని మళ్లించే విధంగా డిజైన్ రూపొందించారు. 2018లో ఈ కెనాల్ నిర్మాణానికి నిధుల కేటాయించగా.. 2022లో విడుదలయ్యాయి. రూ. 147.7కోట్ల వ్యయంతో చేపట్టిన పనులు 2023లో వేగంగా జరిగాయి. తర్వాతి కాలంలో నిధుల విడుదలలో జాప్యం.. భూసేకరణ సమస్యల కారణంగా పనులు నిలిచిపోయాయి. 5 కి.మీ. మాత్రమే నిర్మాణం.. సింగోటం రిజర్వాయర్ నుంచి గోపల్దిన్నె రిజర్వాయర్ వరకు 22.5 కి.మీ. మేరకు కెనాల్ నిర్మించా ల్సి ఉంది. ఇందులో వనపర్తి జిల్లా పరిఽధిలో 18 కి. మీ., నాగర్కర్నూల్ జిల్లా పరిధిలో 4.5 కి.మీ., కా ల్వ తవ్వాలి. అయితే వనపర్తి జిల్లా పరిధిలో 200 ఎకరాలు, నాగర్కర్నూల్ జిల్లా పరిధిలో 100 ఎకరా ల భూసేకరణ చేపట్టాల్సి ఉంది. భూ నిర్వాసితు లకు ఎకరా రూ. 5లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తర్వాత పరిహారాన్ని రూ. 6లక్షలకు పెంచారు. కానీ రైతులు రూ. 20 లక్షలు ఇస్తేనే భూములు ఇస్తామని మొండికేయడంతో కాల్వ తవ్వకాలు రెండేళ్ల క్రితం నిలిచిపోయాయి. గోపల్దిన్నె రిజర్వాయర్ నుంచి దాదాపు 5 కి.మీ. మేరకు మాత్రమే కాల్వ తవ్వకాలు చేపట్టారు. ప్రయోజనం ఇలా.. సింగోటం – గోపల్దిన్నె లింక్ కెనాల్తో వీప నగండ్ల,చిన్నంబావి, కొల్లాపూర్, పెంట్లవెల్లి మండలాల్లోని చివరి ఆయకట్టు పొలాలకు సాగునీరు అందుతుంది. ప్రస్తుతం పాన్గల్ మండలంలో కొంత మేరకు సాగునీరు అందుతోంది. లింక్ కెనాల్కు తూములు ఏర్పా టుచేసి.. సమీపంలోని చెరువులు, కుంటలకు నీరు మళ్లించేలా డిజైన్లు రూపొందించారు. లింక్ కెనాల్ ద్వారా నీటి సరఫరా ప్రారంభమైతే జూరాల ఎడమ కాల్వ కింద ఉన్న 24, 500 ఎకరాల ఆయకట్టు భూములతో పాటు రాజీవ్ భీమా కాల్వల కింద ఉన్న 9,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు లభిస్తుంది. అదే విధంగా వేసవిలో పలు గ్రామాలకు తాగునీటి సమస్యలు కూడా తీరుతాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి జూపల్లి కృష్ణారావు సింగోటం – గోపల్దిన్నె లింక్ కెనాల్ నిర్మాణంపై నీటిపారుదలశాఖ అఽధికారులతో సమీక్షించారు. పనులు నిలిచిపోవడానికి గల కారణాలను తెలుసుకున్నారు. పనుల పూర్తికోసం సంబంధిత కాంట్రాక్టు కంపెనీతో మాట్లాడారు. ఏడాది క్రితం కెనాల్ పనులను పునఃప్రారంభించారు. భూ సేకరణ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ప్రాజెక్టుల భూ సేకరణ కోసం కలెక్టర్ల వద్ద రూ. 25కోట్ల మేరకు నిధులు ఉండటంతో రైతులకు న్యాయమైన పరిహారం చెల్లించాలని ఆయన సూచించారు. కానీ భూసేకరణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీంతో ఇటీవల మంత్రి జూపల్లి మరోమారు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులను ఒప్పించి భూసేకరణ త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. అవసరమైతే తానే స్వయంగా రైతులతో మాట్లాడతానని ఆయన వారికి సూచించారు. -
సమన్వయంతో పనిచేయాలి
వనపర్తి: ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న యువజన క్రీడలు, టూరిజం వారోత్సవాలను లైన్ డిపార్ట్మెంట్, మండలస్థాయి అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని తన చాంబర్లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 18వ తేదీన ఫిట్ అండ్ యాక్టివ్ తెలంగాణ కార్యక్రమం సందర్భంగా ఉదయం 6.30 గంటలకు ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానం నుంచి బస్డిపో మీదుగా పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు 2కే రన్, యువ టూరిజం క్లబ్లను జాగృతం చేసే గోడపత్రిక ఆవిష్కరణ ఉంటుందన్నారు. రెండోరోజు కెరీర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, చారిత్రాత్మక పురాతన కట్టడాలపై అవగాహన.. మూడోరోజు యూత్ లీడర్షిప్ సమ్మిట్, పర్యాటకానికి సంబంధించి హెరిటేజ్ వాక్, లోకల్ గైడ్ వలంటీర్ల రిజిస్ట్రేషన్ జరుగుతుందని చెప్పారు. అలాగే నాలుగోరోజు స్పోర్ట్స్డే సందర్భంగా పెబ్బేరులో ఫుట్బాల్ క్రీడ, ఐదోరోజు యూత్ ఫర్ క్లీన్ తెలంగాణ, పర్యాటక ప్రాంతాల్లో స్వచ్ఛదనం.. ఆరోరోజు ఉద్యోగ సాధన, టూరిజం బ్రాండ్ కిట్ విడుదల కార్యక్రమాలు కొనసాగుతాయని వివరించారు. ఆయా కార్యక్రమాలను రోజువారీగా జిల్లాకేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో నిర్వహించి విజయవంతం చేయాలని ఆదేశించారు. డీవైఎస్ఓ సుధీర్కుమార్రెడ్డి, జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ, పరిశ్రమల అధికారి జ్యోతి పాల్గొన్నారు. కళా నైపుణ్యాలు పెంపొందించుకోవాలి.. వనపర్తిటౌన్: విద్యార్థులు చదువుతో పాటు కళా నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ప్రయత్నించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ కోరారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా శనివారం కలెక్టరేట్లో జెడ్పీహెచ్ఎస్ మద్దిగట్ల, మోజర్ల విద్యార్థులు బంజారా, తెలంగాణ బోనాల నృత్యాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. విద్యార్థులు కళా నృత్యాలను నేర్చుకొని నాటి కళలను, చరిత్రను బతికించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం విద్యార్థులను డీఈఓ అబ్ధుల్ ఘనీ అభినందించారు. జీసీడీఓ ఇందిర, పెద్దమందడి మండల విద్యాధికారి మంజులత, ప్రధానోపాధ్యాయుడు ఎస్.వరప్రసాదరావు, జిల్లా కో–ఆర్డినేటర్లు శేఖర్, మహానంది, నారాయణమ్మ, ప్రతాప్రెడి పాల్గొన్నారు. -
సెలవుల్లో విహరిద్దాం.. కనులారా వీక్షిద్దాం
పాలమూరులో పర్యాటక కేంద్రాలు, పుణ్యక్షేత్రాలు ఏ ప్రాంత అభివృద్ధిలోనైనా పర్యాటక కేంద్రాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. పర్యాటక రంగం ద్వారా వచ్చే ఆదాయాలు, పర్యాటక క్షేత్రాల ద్వారా వచ్చే పేరు ప్రతిష్టలు, తద్వారా ప్రపంచస్థాయిలో ఆ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు నిస్తాయి. ఈ మధ్య కాలంలో దేశ, ప్రపంచ పర్యాటకుల దృష్టిని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని పలు పర్యాటక క్షేత్రాలు, స్థలాలు అమితంగా ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే వేసవి సెలువు సగం పూర్తయ్యాయి. మరో నాలుగు వారాల్లో విద్యాసంస్థలు ప్రారంభంకానున్నాయి. అంతలోపు ఈ సెలవుల్లో ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలు కుటుంబ సమేతంగా సందర్శించేందుకు మంచి సమయం. రెండు, మూడు రోజుల సమయం కేటాయించి అనుకున్న ప్రాంతాల్లో పర్యటించొచ్చు. ఉమ్మడి జిల్లాలో చూడదగ్గ ప్రాంతాలపై ప్రత్యేక కథనం.. – స్టేషన్ మహబూబ్నగర్ – వివరాలు 8లో.. -
ధాన్యం తరలింపులో జాప్యం సరికాదు
వనపర్తి: ధాన్యం తరలింపులో జాప్యం సరికాదని.. కొనుగోలు కేంద్రాల వద్ద సరిపడా లారీలను అందుబాటులో ఉంచి వేగంగా మిల్లులకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రవాణా కాంట్రాక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు, వీసీలో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సమావేశమయ్యారు. రవాణా కాంట్రాక్టర్లు ప్రభు త్వ అవసరం మేరకు వాహనాలను సమాకూర్చాల్సిందేనని, అవసరమైతే సిమెంట్, ఇసుక తరలింపు లారీలను కూడా వినియోగించాలని సూచించారు. కేంద్రాల వద్ద ధాన్యం నిల్వలు పెరగకుండా వేగంగా తరలించాలని.. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మిల్లుల వద్ద ధాన్యం దించుకునే విషయంలో ఏమైనా సమస్యలుంటే తెలియజేయాలని, పోలీసుల సహకారం తీసుకోవాలని కోరారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన మిల్లులకు మాత్రమే తరలించాలని.. అలా కాదని ఇష్టం ఉన్నట్లు వ్యవహరించి అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, పౌరసరఫరాలసంస్థ జిల్లా మేనేజర్ ఆంజనేయులు, డీటీఓ మానస పాల్గొన్నారు. -
పల్లెల్లో పబ్లిక్ స్కూల్స్
అచ్చంపేట: పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికో తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఎంపిక చేసిన పాఠశాలల్లో నర్సరీ నుంచి ఇంటర్ వరకు విద్య అందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 13 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రారంభించేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇప్పటికే అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూరు, పొల్కంపల్లి పాఠశాలలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికచేసి.. ఆయా హంగులన్నీ సమకూర్చడంతో టీపీఎస్కు మంచి స్పందన వచ్చింది. డేటా ఆధారిత ఎంపిక.. పాఠశాలల ఎంపికను సాధారణ పరిపాలనా నిర్ణయంగా కాకుండా.. డేటా ఆధారంగా చేపట్టారు. యూడైస్ ఆధారంగా విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశాలపై బేరీజు వేశారు. మండలస్థాయి నుంచి పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యార్థులు సంఖ్య, భవనాల స్థితి, ఉపాధ్యాయుల లభ్యత వంటి అంశాలను సేకరించారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో ప్రతిపాదనలను విశ్లేషించి.. దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని పాఠశాలల ఎంపిక చేపట్టారు. ఒక్కో టీపీఎస్కు రూ.15 కోట్లు.. వచ్చే ఏడాది నుంచే ఎంపికచేసిన పాఠశాల ల్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ప్రారంభం కా నున్నాయి. ఒక్కో టీపీ ఎస్కు సమారు రూ.15 కోట్లు ఖర్చు చేయనున్నారు. 1,000 నుంచి 1,500 మంది విద్యార్థులకు నర్సరీ నుంచి 12వ తరగతి (ఇంటర్) వరకు ఒకే చోట విద్య అందుబాటులోకి రా నుంది. ప్రైవేటు స్కూళ్ల కు ఽధీటుగా డిజిటల్ క్లాస్రూమ్లు, ల్యాబ్ లు, లైబ్రరీలు, క్రీడా సామగ్రి, కొరత లేకుండా టీచర్లు, పూర్తిస్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, మినరల్ వాటర్, కిచెన్షెడ్, డైనింగ్ హాల్, అదనపు తరగతి గదులు, క్రీడా ప్రాంగణం తదితర అధునాతన సౌకర్యాలు కల్పించనున్నారు. దూర ప్రాంతాల పాఠశాలలను విలీనం చేస్తే.. విద్యార్థుల కోసం ప్రభుత్వ స్కూల్ బస్సు ఏర్పాటు చేయనున్నారు. టీపీఎస్ల ఏర్పాటుతో గ్రామీణ విద్యార్థులకు మెరుగైన విద్య అందనుంది. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గుచూపుతున్న తల్లి దండ్రులు.. ఇప్పడు ప్రభుత్వ పాఠశాలలపై విశ్వా సం పెంచుకునే పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా అడ్మిషన్ల సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉంది. ఆదర్శంగా వంగూరు టీపీఎస్.. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో విజయవంతంగా అమలవుతున్న వంగూరు తెలంగాణ పబ్లిక్ స్కూల్ నమూనాను అనుసరించడం ద్వారా నూతన టీపీఎస్లకు ఒక స్థిరమైన ప్రమాణం లభిస్తోంది. ఆధునిక తరగతి గదులు, డిజిటల్ బోధన, ఆంగ్ల మాధ్యమం అమలు, నైపుణ్యాభివృద్ధి ప్రధానంగా ఉన్నాయి. అదే విధానాన్ని ఉమ్మడి జిల్లాలో అమలుచేస్తే విద్యార్థుల సామర్థ్యాలు పెరగడంతో పాటు పోటీ పరీక్షల్లో కూడా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలు పెరుగుతాయి. సెమీ రెసిడెన్షియల్స్గా.. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా పనిచేయనున్నాయి. ఒకే గ్రామంలో వేర్వేరు చోట్ల ఉన్న బడులు, జూనియర్ కళాశాలలను ఒకే ప్రాంగణంలోకి తీసుకురానున్నారు. విద్యార్థులు నర్సరీ నుంచి పదో తరగతి లేదా ఇంటర్ వరకు చదువుకోవచ్చు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ అందిస్తారు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల విస్తరణ చర్యలు రాష్ట్ర విద్యారంగంలో ఒక పెద్ద సంస్కరణగా నిలిచే అవకాశముంది. ఉమ్మడి జిల్లాలో 13 పాఠశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు అంతర్జాతీయప్రమాణాలతో టీపీఎస్ల నిర్మాణానికి చర్యలు ఒకే చోట నర్సరీ టు ఇంటర్ విద్య వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభం -
అకాల వర్షం..అపార నష్టం
ధాన్యం బురదమయం.... 10 రోజులుగా మార్కెట్యార్డులో వరి ధాన్యం ఆరబోస్తున్నా.. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం కళ్లెదుటే వర్షానికి కొట్టుకుపోయి బురదమయమైంది. ఒక్కసారిగా వచ్చిన వర్షం మాకు కన్నీరే మిగిల్చింది. తడిసిన ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేసి న్యాయం చేయాలి. – హన్మంతు, రైతు, మూలమళ్ల పది రోజులుగా పడిగాపులు.. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి పది రోజులు అవుతోంది. తాలు, తేమశాతం ఎక్కువగా ఉందంటూ కాలయాపన చేశారు. శనివారం సాయంత్రం ఒక్కసారిగా వచ్చిన వర్షానికి కళ్ల ముందే ధాన్యం కొట్టుకుపోతుంటే ఆపలేకపోయాం. టార్పాలిన్లు కూడా లేవు. అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టా.. ఇప్పుడు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు. – ఆంజనేయులు, రైతు, రామన్పాడు, మదనాపురం తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం అకాల వర్షానికి జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో కొద్దిమేర ధాన్యం తడిసింది. రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదు. తడిసిన ధాన్యం సైతం కొనుగోలు చేస్తాం. బాయిల్డ్ మిల్లులకు కేటాయించి రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటాం. – ఆంజనేయులు, డీఎం, పౌరసరఫరాల సంస్థ వనపర్తి/ఆత్మకూర్/మదనాపురం/కొత్తకోట/ గోపాల్పేట: అన్నదాతలపై వరణుడు కన్నెర్రజేశాడు. జిల్లాలోని వనపర్తి, కొత్తకోట, అమరచింత, ఆత్మకూర్, గోపాల్పేట, రేవల్లి, మదనాపురం శనివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మేఘావృతమై ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. అక్కడే ఉన్న రైతులు ధాన్యం రాశులపై కవర్లు, టార్పాలిన్లు కప్పి కాపాడుకునే ప్రయత్నం చేశారు. వనపర్తి మండలం చిట్యాల శివారులోని వ్యవసాయ మార్కెట్యార్డులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో సీసీ యార్డుపై వర్షపు నీరు భారీగా పారడంతో విక్రయానికి తీసుకొచ్చిన ధాన్యం వర్షపు నీటితో పాటు డ్రైనేజీలో చేరింది. రైతులు నీటిలో కొట్టుకుపోకుండా ధాన్యం ఆపే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకపోయింది. అలాగే మండలంలోని అచ్యుతాపురం, రాజాపేట, నాగవరం, ఉమ్మడి గోపాల్పేట మండలంలోని చెన్నారం, ఎదుట్ల, బుద్దారం, ఆత్మకూర్, మదనాపురం మార్కెట్యార్డుతో పాటు మండలంలోని అజ్జకొల్లు, రామన్పాడు, కొత్తకోటలోని పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో తేమశాతం తగ్గించుకునేందుకు ఆరబెట్టిన ధాన్యంతో పాటు ఎండిన ధాన్యం కూడా చాలా వరకు తడిసింది. టార్పాలిన్లు కప్పేందుకు వర్షంలోనే ప్రయత్నించినా.. ధాన్యం తడిసిందని రైతులు వాపోతున్నారు. కేంద్రాల్లో తూకం పూర్తయి తరలింపునకు ఉన్న ధాన్యం బస్తాలు కూడా తడిసి ముద్దయ్యాయి. కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయకపోవడం, సేకరించిన ధాన్యం కూడా సకాలంలో తరలించకపోవడంతో కష్టాలు తప్పడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 20 వేల బస్తాల వరకు అకాల వర్షానికి తడిసి ఉంటుందని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అఽధికారుల ప్రాథమిక అంచనా. కొత్తకోట శివారులో రహదారిపై తడిసిన వరి ధాన్యం కుప్ప ఆత్మకూర్ మండలం మూలమళ్లలో రోడ్డుపై కూలిన చెట్టును తొలగిస్తున్న ప్రయాణికులు రూ.లక్షల్లో నష్టం.. తోటలో మామిడి కాయ లు కోతకు వచ్చాయి. రెండ్రోజుల్లో తెంచాల్సి ఉండగా గాలివానకు రాలిపోయాయి. నాలుగు టన్నులకుపైగానే కాయలు రాలిపోయాయి. దీంతో రూ.లక్షల్లో నష్టం వచ్చింది. – కావలి భాగ్యలక్ష్మి, మామిడి రైతు, ఆరేపల్లి రాలిన మామిడి.. అకాల వర్షానికి మామిడి తోటలు దెబ్బతిన్నాయి ఈదురు గాలులకు కాయలు రాలిపోయాయి. ఆత్మకూర్ మండలంలోని ఆరేపల్లి, గుంటిపల్లి, తూంపల్లి, వీరరాఘవపూర్ తదితర గ్రామాల్లో ఉన్న తోటల్లో కాయలు కోతకు రాగా గాలికి రాలిపోవడంతో పూర్తిగా నష్టపోయామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికితోడు చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో స్తంభాలు కూలి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి వినియోగదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. త్వరగా కొనుగోళ్లు పూర్తి చేయాలి 12 రోజులుగా మార్కెట్యార్డులో ధాన్యం ఆరబోస్తున్నా. సకాలంలో ధాన్యం కొనుగోలు పూర్తి చేయకపోవడంతో వర్షానికి తడసింది. మళ్లీ ఆరడానికి రెండ్రోజులు పడుతుంది. మా బాధలు తీర్చేవారే కరువయ్యారు. – మధు, రైతు, ఆత్మకూర్●నిలిచిన విద్యుత్ సరఫరా.. అమరచింత – ఆత్మకూర్ మధ్యలో చెట్లు కూలి విద్యుత్ తీగలపై పడటంతో సరఫరా నిలిచిపోయింది. ఆత్మకూర్ గాంధీచౌక్లో వర్షపు నీరు నిలిచి వాహనదారులు రాకపోకలకు అవస్థలు పడ్డారు. డ్రైనేజీ వద్ద కల్వర్టు నిర్మించకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు ట్రాన్స్కో అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. -
వాహనాల సంఖ్య పెంచాలి
వనపర్తి: కొనుగోలు కేంద్రాల నుంచి వరి ధాన్యాన్ని మిల్లులు, గోదాంలకు తరలించడానికి కాంట్రాక్టు లారీలే కాకుండా ఇతర వాహనాలను కూడా వినియోగించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి పౌరసరఫరాలశాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, రవాణా కమిషనర్ ఇలంబర్తి అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, రవాణాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్న్స్ నిర్వహించగా.. కలెక్టరేట్లోని సమావేశ మందిరం నుంచి రెవెన్యూ అదనపు కలెక్టర్తో పాటు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, జిల్లా రవాణాశాఖ అధికారి మానస, పౌర సరఫరాల సంస్థ డీఎం ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటికే జిల్లాలో ధాన్యం తరలింపునకు కాంట్రాక్టు లారీలు కాకుండా అదనంగా రవాణాశాఖ చొరవతో 10 డీసీఎంలు, 20 ట్రాక్టర్లు సమకూర్చినట్లు వివరించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ -
పాలమూరు కోసం పోరు..
వనపర్తిశిక్షణ అదుర్స్.. విద్యార్థుల్లో క్రమశిక్షణ, సంస్కారం, దేశభక్తి పెంపొందించేందుకు వందేమాతరం ఫౌండేషన్ వేసవి శిబిరాలు నిర్వహిస్తోంది. శనివారం శ్రీ 16 శ్రీ మే శ్రీ 2026–8లో uసాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి పాలమూరు, నల్లగొండ జిల్లాల్లో సుమారు 12 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి.. సాగు నీరందించాలనే డిమాండ్తో బీఆర్ఎస్ ఉద్యమ బాట పట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనకు ఆ పార్టీ ముఖ్య నేతలైన మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు కసరత్తు మొదలుపెట్టారు. తొలి దశలో పాలమూరు ప్రాజెక్ట్తో పాటు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై పోరు సాగించేలా పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఒకవైపు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సంస్థాగత బలోపేతంలో భాగంగా సభ్యత్వ నమోదు చేపట్టడంతో పాటు మరోవైపు ప్రజా సమస్యలపై గళం వినిపించేలా సమాయత్తమవుతుండడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. జూన్ మొదటి వారంలో... చివరి దశలో మిగిలిన ప్రతిష్టాత్మక పాలమూరు ప్రాజెక్ట్ పనులను పూర్తి చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే సంకల్పంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ముందుకు సాగుతున్నారు. ఉమ్మడి పాలమూరులోని 14 నియోజకవర్గాలకు చెందిన ఆ పార్టీ ముఖ్య నాయకులు హైదరాబాద్లో ఇటీవల పలుమార్లు సమావేశమై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తొలుత పాలమూరు ప్రాజెక్ట్ కోసం పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం మహబూబ్నగర్ జిల్లాలోని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ నివాసంలో ఆయనతో పాటు మాజీ మంత్రులు నిరంజన్రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, హర్షవర్దన్రెడ్డి, చిట్టెం రాంమోహన్రెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, నవీన్కుమార్రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితర నేతలు మరోమారు సమావేశమై చర్చించిన అనంతరం వచ్చే నెలలో పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. వారి మాటలను బట్టి జూన్ మొదటి వారంలోపు లేదంటే రెండో వారం ప్రారంభంలో యాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. విద్య, వైద్యం తదితర రంగాల వారీగా సైతం.. పాదయాత్ర అనంతరం జిల్లాకేంద్రాలు, తదితర ముఖ్య ప్రాంతాల వారీగా వ్యవసాయం, విద్య, వైద్యం వంటి వివిధ రంగాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్ఎస్ నేతలు రోజు వారీగా పోరు కొనసాగించనున్నట్లు సమాచారం. సామాజిక వర్గాల వారీగా సైతం భేటీలు నిర్వహించి.. వారి సమస్యల పరిష్కారం దిశగా గళమెత్తేలా నేతలు తగిన కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ హయాంలో అమలైన పథకాలు, అభివృద్ధి పనులు, ప్రజలకు చేకూరిన మేలు వివరిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో పథకాల అమలులో లోపాలు, అభివృద్ధి పనుల తీరుపై ఎండగట్టే కార్యాచరణతో గులాబీ దళం ప్రత్యేక కసరత్తు చేపట్టినట్లు తెలుస్తోంది. తొలి రోజు కేటీఆర్.. చివరి రోజు కేసీఆర్ పాదయాత్ర షెడ్యూల్ త్వరలో విడుదల చేస్తామని బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. యాత్ర ప్రారంభమయ్యే తొలి రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నట్లు సమాచారం. పాదయాత్ర మధ్య మధ్యలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావుతో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొనేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. రోజు వారీగా కిలోమీటర్ల వారీగా కొనసాగనున్న యాత్రకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో రైతులతో మాటామంతి, కార్నర్ మీటింగ్లు, బస చేసే ప్రదేశాల్లో సమావేశాలు నిర్వహించేలా నేతలు ప్రణాళిక తయారు చేస్తున్నారు. చివరి రోజు ప్రజలతో భారీ బహిరంగసభకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానుండగా.. పెద్ద ఎత్తున జనసమీకరణ చేసేలా ఉమ్మడి జిల్లాలోని ఆయా సెగ్మెంట్ల నాయకులతో ముఖ్య నేతలు ముందస్తుగా సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ నేతల ఉద్యమ కార్యాచరణ జూన్లో పాదయాత్రకు సన్నాహాలు నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు.. తొలి రోజు కేటీఆర్.. మధ్యలో హరీశ్రావు హాజరు చివరి రోజు భారీ బహిరంగ సభ ‘గులాబీ’ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రాక నార్లాపూర్ లేదంటే ఉదండాపూర్ నుంచి.. పాలమూరు ప్రాజెక్ట్కు సంబంధించి తొలి దశలో నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని నార్లాపూర్, వనపర్తి జిల్లాలో ఏదుల, నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో వట్టెం, మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలంలో కర్వెన, జడ్చర్ల మండలంలో ఉదండాపూర్ రిజర్వయర్లను నిర్మిస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నార్లాపూర్లో మొదటి పంప్ మోటార్ స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్కడి నుంచే బీఆర్ఎస్ నేతలు పాదయాత్ర ప్రారంభించే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ లెక్కన ఉదండాపూర్లో యాత్ర ముగియనున్నట్లు తెలుస్తోంది. అయితే ఉదండాపూర్లోనే పాదయాత్ర ప్రారంభించి.. నార్లాపూర్లో ముగించే అవకాశం సైతం ఉన్నట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. -
తగ్గని ‘గృహజ్యోతి’
●పొదుపుగా వాడుతున్నారు.. జిల్లాలోని గృహజ్యోతి లబ్ధిదారులు వేసవిలోనూ విద్యుత్ను పొదుపుగా వాడుతున్నారు. కూలర్లు, ఏసీలు వాడే వారి సంఖ్య తక్కువగా ఉండటంతో తీవ్రమైన వేసవిలోనూ గృహజ్యోతి లబ్ధిదారులు పెరుగుతున్నారు. మిగతా జిల్లాల్లో వేసవిలో విద్యుత్ వినియోగం పెరిగి గృహజ్యోతి లబ్ధిదారులు తగ్గినట్లు తెలిసింది. కానీ మన జిల్లాలో పొదుపు కారణంగా పెరుగుదల కొనసాగుతోంది. – తిరుపతిరావు, ఎస్ఈ, విద్యుత్శాఖ నెల లబ్ధిదారులు ప్రభుత్వం చెల్లించిన నగదు (రూ.లక్షల్లో..) జనవరి 84,204 189.77 ఫిబ్రవరి 84,399 203.00 మార్చి 84,567 217.23 ఏప్రిల్ 84,770 255.74 వనపర్తిటౌన్: వేసవిలో ఉక్కపోతతో అల్లాడుతున్నా.. జిల్లాలోని గృహజ్యోతి లబ్ధిదారులు మాత్రం పొదుపు మంత్రాన్ని పాటిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 1,26,663 మంది గృహ విద్యుత్ వినియోగదారులు ఉండగా.. అందులో 84 వేల మంది పైచిలుకు 200 యూనిట్లలోపే విద్యుత్ వినియోగిస్తున్నారు. ఈ లబ్ధిదారుల సంఖ్య ప్రతినెల పెరుగుతూనే వస్తోంది. వేసవిలో ఎండలు తీవ్రరూపం దాల్చినా లబ్ధిదారుల సంఖ్య పెరగడం గమనార్హం. వేసవిలో నిరంతరాయంగా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు వినియోగిస్తారు. ఈ క్రమంలో విద్యుత్ వినియోగం పెరిగి కొందరు లబ్ధిదారులకు కోత పడుతుందని అధికార యంత్రాంగం భావించింది. కానీ అందుకు విరుద్ధంగా ప్రతినెల లబ్ధిదారుల సంఖ్య పెరుగుతుండటంతో పాటు టీజీఎస్పీడీసీఎల్కు ప్రతినెల ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయం కూడా పెరుగుతోంది. 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే తెల్లరేషన్కార్డుదారులకు ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ అందిస్తోంది. ఏప్రిల్ నాటికి ప్రభుత్వం రూ.2.55 కోట్లకుపైగా విద్యుత్సంస్థకు చెల్లించింది. గృహజ్యోతి లబ్ధిదారులు ప్రతినెలా పెరుగుతుండగా.. పాత వినియోగదారులు సైతం 200 యూనిట్లలోపు విద్యుత్ను వినియోగించేలా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. జిల్లాలో ఇలా.. చలికాలం అయిన జనవరిలో జిల్లావ్యాప్తంగా 84,204 మంది గృహజ్యోతి లబ్ధిదారులు ఉండగా.. ప్రభుత్వం రూ.కోటి 89 లక్షల 77 వేలు విద్యుత్ సంస్థలకు బిల్లు చెల్లించింది. ఫిబ్రవరికి వచ్చేసరికి ఈ సంఖ్య 84,399కి చేరింది. అంటే ఒక్క నెలలోనే 195 మంది కొత్త లబ్ధిదారులు పెరగడంతో ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు చెల్లించే బిల్లు రూ.2.03 కోట్లకు చేరింది. మార్చి నెలలో 168 మంది లబ్ధిదారులు అధికం కావడంతో మొత్తం సంఖ్య 84,567 మందికి చేరగా.. రూ.2 కోట్ల 17 లక్షల 23 వేలకు చేరింది. ఏప్రిల్లో అత్యధికంగా 203 లబ్ధిదారులు పెరగగా జిల్లావ్యాప్తంగా లబ్ధిదారుల సంఖ్య 84,770కి చేరింది. ప్రభుత్వం సంస్థకు చెల్లించాల్సిన బిల్లు రూ.2 కోట్ల 55 లక్షల 74 వేలకు చేరింది. అంటే ఈ లెక్కన వేసవిలోనే గృహజ్యోతి పథకం ద్వారా విద్యుత్ సంస్థకు అధిక ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. వివరాలు 9లో..జిల్లాలో లబ్ధిదారులు ఇలా.. జిల్లాలో ప్రతి నెల పెరుగుతున్న లబ్ధిదారులు ప్రస్తుతం 84,770 మంది.. వేసవిలోనూ కనిపించని మార్పు పొదుపుతోనే సాధ్యమైందంటున్న అధికారులు -
కొనసాగుతున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
వనపర్తిటౌన్: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని డీఐఈఓ నరేందర్కుమార్ తెలిపారు. శుక్రవారం ఉదయం జరిగిన ప్రథమ సంవత్సరం పరీక్షలకు జనరల్, ఒకేషనల్ విద్యార్థులు 2,506 మందికిగాను 2,367 మంది హాజరుకాగా 139 మంది గైర్హాజరయ్యారన్నారు. అదేవిధంగా మధ్యాహ్నం జరిగిన సెకండ్ ఇయర్ పరీక్షలకు జనరల్, ఒకేషనల్ విద్యార్థులు 932 మందికిగాను 868 మంది పరీక్షలు రాయగా 64 మంది హాజరుకాలేదని చెప్పారు. పగిలిన మిషన్ భగీరథ పైప్లైన్ అమరచింత: మిషన్ భగీరథ ప్రధాన పైప్లైన్ పగలడంతో ఆత్మకూర్, అమరచింత, చిన్నచింతకుంట, మదనాపురం మండలాల్లోని 30 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. మదనాపురం మండలంలోని గోపాన్పేట వద్ద ఓ రైతు తన పొలం దుక్కి దున్నుతుండగా పైప్లైన్ పగిలి తాగునీరు వృథాగా పారింది. విషయం తెలుసుకున్న మిషన్ భగీరథ అధికారులు వెంటనే నీటి సరఫరా నిలిపివేసి మరమ్మతులను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నారు. ఈఈ అంజద్పాషా, డీఈ విజయ్కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించి కొనసాగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. త్వరగా పూర్తిచేసి నీటి సరఫరాలో ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రధాన పైప్లైన్ పగలడంతో అమరచింత, ఆత్మకూర్ పురపాలికలతో ఆత్మకూర్ మండలంలోని పిన్నంచర్ల, బాలకిష్టాపూర్, మూలమల్ల, మదనాపురం మండలంలో మదనాపురంతో పాటు కొత్తపల్లి, దుప్పల్లి, గోపన్పేట, కర్వెన, భగత్సింగ్తండా, అమరచింత మండలంలోని సింగంపేట, మస్తీపురం, చంద్రప్పతండా, పాంరెడ్డిపల్లి తండా, కొంకన్వానిపల్లి, చిన్నచింతకుంట మండలంలోని అల్లీపురం, కురుమూర్తి, అమ్మాపురం, గూడూరు, తిరుమలాపురం, దాసరపల్లి, అప్పంపల్లి, ముచ్చింతల, చిన్నచింతకుంట, మద్దూరు, ఎదులాపురం గ్రామాల్లో శుక్రవారం నీటి సరఫరా నిలిచింది. అసలే వేసవి కాలం అందులోనూ నీటి సరఫరా నిలిచిపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. మరమ్మతులు పూర్తిచేసి వెంటనే నీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు. నిర్వహణ మరిచారు.. ● ఆర్టీసీ బస్టాండ్లో వసతులు కరువు ● గ్రామాల్లో బస్సుషెల్టర్లు లేక ఇబ్బందులు ● పట్టించుకోని అధికారులు, పాలకులు -
పోరాటాలకు ఊపిరిపోసిన ప్రజా నాట్యమండలి
వనపర్తి రూరల్: దేశ స్వాతంత్య్రం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, ప్రజా పోరాటాలను ముందుకు నడిపించిన ఘన చరిత్ర ప్రజా నాట్యమండలి సొంతమని ప్రజా నాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాయంలో ప్రజా నాట్యమండలి 4వ మహాసభను పతాకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ.. 1943లో ప్రజా నాట్యమండలి ఏర్పడిందని, దేశ స్వాతంత్య్రం కోసం ఆటపాటలతో ప్రజల్లో స్వాతంత్య్ర ఆకాంక్షను రగిలించి పోరాటాల్లోకి నడిపించిందన్నారు. ప్రజలను చైతన్యం చేసి నిజాం పాలనను కూల్చిందన్నారు. ప్రజా సమస్యలపై జరిగిన పోరాటాల్లోను ప్రజా నాట్యమండలి కీలక పాత్ర పోషించిదన్నారు. వచ్చే 5వ మహాసభ నాటికి జిల్లా ప్రజనాట్య మండలిని బలోపేతం చేయాలని పేర్కొన్నారు. నాయకులు విజయరాములు, వంకా గోపాల్, ఎర్రన్న, కళావతమ్మ, రమేష్, విజయుడు, శ్రీరామ్, రవీందర్ పాల్గొన్నారు. -
పెట్రోల్ మంట.. డీజిల్ సెగ
● వాహనదారుల జేబుకు చిల్లు ● పాలమూరులో పెట్రోల్పై రూ.3.39, డీజిల్పై 3.26 పెంపు ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రతిరోజూ రూ.3కోట్ల అదనపు భారం పాలమూరు: అనుకున్నట్లే.. సామాన్యుడిపై పెట్రో, డీజిల్ బాంబు పడింది. పశ్చిమాసియాలో కొనసాగతోన్న యుద్ధ సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడు చమురు ధరలు పెరిగాయి. దేశవ్యాప్తంగా చముర కొరత వల్ల పెట్రోల్, డీజిల్పై లీటర్కు రూ.3 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెంచిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. కొత్త ధరల ప్రకారం వనపర్తిలో పెట్రోల్ లీటర్ రూ.108.41 ఉండగా.. ప్రస్తుతం రూ.111.80కి పెరిగింది. డీజిల్ రూ.96.59లు ఉండగా... ప్రస్తుతం రూ.99.85కి పెరిగింది. ఈ లెక్క ప్రకారం పెట్రోల్ రూ.3.39, డీజిల్ 3.26 చొప్పున పెరిగాయి. ధరల పెంపు సామాన్యుడిపై తీవ్ర భారం పడే అవకాశం ఉంది. నిత్యవసర ధరలు కూడా పెరుగుతాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రోజుకు సగటున 15 లక్షల లీటర్ల పెట్రోల్, 70 లక్షల లీటర్ల డీజిల్ను వినియోగిస్తున్నారు. 44వ నంబర్జాతీయ రహదారిపై ఉన్న బంకుల్లో పెట్రోల్, డీజిల్ విక్రయాలు ఎక్కువగా జరుగుతాయి. పెరిగిన ధరలతో ప్రతిరోజూ వాహనదారులపై దాదాపు రూ.3 కోట్ల వరకు అదనపు భారం పడనుంది. సామాన్యుడికి గుదిబండ.. నిత్యావసరాల ధరలు ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న సమయంలో ఇంధన ధరల పెంపు ప్రజల జీవితాలను మరింత కష్టాల్లోకి నెట్టేస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు మేలు జరిగే ప్రయత్నం చేయకుండా.. దేశ సంపద ఇతర దేశాలకు పంచుతూ సంక్షోభంలోకి నెట్టేస్తుంది. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరల పెంచి సామాన్యులపై మరింత ఆర్థిక భారం మోపుతోంది. బీజేపీ ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు చేసి సామాన్య ప్రజల సంక్షేమ కోసం ఒక్క పని కూడా చేయట్లేదు. – శివసేనారెడ్డి, శాట్ చైర్మన్ ప్రజలపై భారం సరికాదు.. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్య ప్రజలపై అదనపు ఆర్థిక భారం మోపుతోంది. ఇంధన ధరలు పెరగడంతో రవాణా ఛార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంతర్జాతీయ పరిస్థితులు, పశ్చిమ దేశాల్లో జరుగుతున్న యుద్ధాలను సాకుగా చూపి ఇంధన ధరలు పెంచడం సమంజసం కాదు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించి ప్రజలకు ఊరట కల్పించాలి. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తే ప్రజాగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ధరలు తగ్గించే వరకు ప్రజల మద్దతుతో పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగిస్తాం. – వాకిటి శ్రీధర్, బీఆర్ఎస్పార్టీ జిల్లా అధికార ప్రతినిధి -
వైకల్యాన్ని బలంగా మార్చుకోవాలి : డీఈఓ
వనపర్తిటౌన్: వైకల్యాన్ని బలహీనతగా భావిస్తే జీవితంలో ఏదీ సాధించలేమని.. బలంగా మార్చుకోవాలని జిల్లా విద్యాధికారి అబ్ధుల్ ఘనీ కోరారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని కేడీఆర్నగర్లో ఉన్న భవిత కేంద్రంలో జిల్లా విద్యాశాఖ, అల్మింకో సంస్థ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో 61 మంది ప్రత్యేక అవసరాల విద్యార్థులకు ట్రై సైకిల్స్, ఎంఆర్ కిట్లు (బుద్ధిమాంధ్యత), హియరింగ్ పరికరాలు, టీఎల్ఎం కిట్లు, వివిధ రకాల పరికరాలను మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మానసిక స్థైర్యంతో వైకల్యాన్ని ఎదిరించి పోరాడితే బంగారు భవిష్యత్ ఉంటుందన్నారు. విద్యార్థులు విలువైన కిట్లను జాగ్రత్తగా వినియోగించుకుంటూ అభ్యసన సామర్థ్యాలు మెరుగుపర్చుకోవాలని సూచించారు. మార్కెట్యార్డ్ చైర్మన్ శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. వైలక్యాన్ని చూసి భయపడితే ఎలాంటి విజయాలను తాకలేరని, భయాన్ని వీడి నేటి సమాజంలో ఉన్నతంగా ఎదిగేందుకు చిన్నతనం నుంచే సిద్ధపడాలన్నారు. కిట్లను వినియోగించుకోవడంతో జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ అరుణ జ్యోతి, జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి ప్రతాప్రెడ్డి, మండల విద్యాధికారి మద్దిలేటి, సామాజికవేత్త గంధం నాగరాజు, ఐఆర్పీలు, అల్మింకో ప్రతినిధులు సోనీ యాదవ్, అస్మిత్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవాలి
వీపనగండ్ల: గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉద్యోగులదేనని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. శుక్రవారం మండలంలోని కల్వరాలలో ఆయన పర్యటించి పర్యావరణ పరిరక్షణలో భాగంగా చేపడుతున్న పనులను పరిశీలించారు. అలాగే రహదారికి ఇరువైపులా ఉన్న మొక్కలకు నీరు పోశారు. అనంతరం ఉపాధి ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపాధి కూలీల సంఖ్య పెంపనకు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఆయన వెంట డీఆర్డీఓ ఉమాదేవి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఏపీఎం అక్తర్ ఉన్నీసాబేగం, పలువురు అధికారులు ఉన్నారు. ఎన్యూమరేటర్లకు సహకరించాలి : అదనపు కలెక్టర్ వనపర్తి: జనగణన–2027లో భాగంగా మే 11 నుంచి జిల్లాలో ఇళ్లగణన ప్రారంభమైందని.. ఇందుకోసం ఇళ్లకు వచ్చే ఎన్యూమరేటర్లకు ప్రజలు పూర్తిగా సహకరించి కచ్చితమైన సమాచారాన్ని తెలియజేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ గణనలో ఇంటి పరిస్థితి, ఇంటి నిర్మాణ స్వభావం, గదుల సంఖ్య, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, విద్యుత్, వంట ఇంధనం (గ్యాస్ సిలిండర్, కట్టెలు, విద్యుత్), వాహనాలు, ఇంటర్నెట్ సదుపాయం వంటి వివరాలు సేకరిస్తారని పేర్కొన్నారు. అలాగే కుటుంబ సభ్యుల వివరాలు, స్మార్ట్ఫోన్లు, టెలివిజన్, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ తదితర గృహోపకరణాల వివరాలను కూడా నమోదు చేస్తారన్నారు. అధికారులు అడిగే 33 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వాలని.. ఎన్యూమరేటర్లకు ప్రభుత్వ అధికారిక గుర్తింపుకార్డు ఉంటుందని తెలిపారు. జనగణన ద్వారా ప్రభుత్వానికి సమగ్ర సమాచారం అందుబాటులోకి వచ్చి, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించేందుకు దోహదపడుతుందన్నారు. -
ఉపాధి కూలీల సంఖ్య పెంచాలి
ఖిల్లాఘనపురం: ఉపాధిహామీ కూలీల సంఖ్య పెంచేందుకు మండల, గ్రామస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని జెడ్పీ సీఈఓ యాదయ్య అన్నారు. గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఉపాధి పనుల నిర్వహణ, కూలీల సంఖ్య పెంపు, పనులు చేస్తున్న ప్రాంతంలో ఏర్పాట్లు తదితర విషయాలపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఉపాధి పనులకు వచ్చే కూలీల సంఖ్య పెంచడం తక్షణ కర్తవ్యమన్నారు. అలాగే వారికి గ్రామస్థాయిలో కల్పిస్తున్న పనులను ఎప్పటికప్పుడు గుర్తించాలని.. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. మండలస్థాయి అధికారులు నిత్యం గ్రామాల్లో పర్యటిస్తూ వారికి సూచనలు, సలహాలు ఇవ్వాలని, పని ప్రదేశంలో కూలీలకు నీడ, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కల పెంపకం, నాటే ప్రాంతాలు గుర్తించాలని చెప్పారు. మరుగుదొడ్లు, సీఎస్సీల పురోగతిని పరిశీలించారు. ఎన్ఎఫ్బీఎస్ పథకం ద్వారా 2017, ఏప్రిల్ 13 తర్వాత మృతిచెందిన పేద కుటుంబాలకు ప్రభుత్వం రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తుందని.. ఎవరైనా ఉంటే మీ–సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునేలా చూడాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓ విజయసింహారెడ్డి, ఎంపీఓ నర్సింహులు, వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు. -
18 నెలల్లో పూర్తి...
జూరాల, కొత్తపల్లి మధ్యన కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి ప్రభుత్వం రూ.123 కోట్లు కేటాయించింది. దీంతో ఆర్అండ్బీశాఖ ఆధ్వర్యంలో టెండర్ల ప్రక్రియ పూర్తిచేశారు. మెస్సర్స్ అనూషా ప్రాజెక్టు వారు పనులు దక్కించుకున్నారు. ముఖ్యమంత్రి పనులను లాంఛనంగా ప్రారంభించగా.. మంత్రి వాకిటి శ్రీహరి త్వరితగతిన పూర్తిచేసే విధంగా సంబంధిత కాంట్రాక్టు కంపెనీ, ఆర్అండ్బీ అధికారులతో మాట్లాడుతున్నారు. మొత్తం 18 పిల్లర్లతో ఏడాదిన్నరలోగా పనులు పూర్తిచేసే విధంగా పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్తున్నట్లు ఆర్అండ్బీ అధికారులు పేర్కొంటున్నారు. -
ధాన్యం కొనుగోళ్లు మరింత వేగవంతం
కొత్తకోట రూరల్: వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ మరింత వేగంగా కొనసాగించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియపై గురువారం సాయంత్రం కలెక్టరేట్లోని తన చాంబర్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఏయే మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఎంతెంత ధాన్యం తూకం చేసి మిల్లులకు తరలించేందుకు సిద్ధంగా ఉంది.. ఈ రోజు ఎంత ధాన్యం కేంద్రాలకు వచ్చింది.. తూకం చేసి బస్తాల్లో నింపిన ధాన్యం ఎన్ని క్వింటాళ్లు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. గురువారం 382 కొనుగోలు కేంద్రాల్లో 6,569 మెట్రిక్ టన్నుల ధాన్యం తూకం చేసినట్లు పౌరసరఫరాలశాఖ అధికారి వివరించారు. 195 లారీల ధాన్యం ఆయా మిల్లుల వద్ద దించినట్లు లెక్కలు చూపించారు. ఇప్పటి వరకు 69,428 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. స్పందించిన కలెక్టర్ పెద్దమందడి, కొత్తకోట, మదనాపురం, పాన్గల్ ఐకేపీ కేంద్రాల్లో తూకం చేసి బస్తాల్లో నింపిన ధాన్యం నిల్వలు అధికంగా ఉన్నాయని, అదేవిధంగా పీఏసీఎస్కు సంబంధించి కొత్తకోట, ఆత్మకూర్, ఖిల్లాఘనపురం, పెద్దమందడి, వనపర్తి, గోపాల్పేట మండలాల్లో నిల్వలు అధికంగా ఉన్నందున శుక్రవారం ఆయా మండలాలకు అత్యధికంగా లారీలు పంపించాల్సిందిగా పౌరసరఫరాలసంస్థ డీఎం ఆంజనేయులు ట్రాన్స్పోర్ట్ అధికారులను ఆదేశించారు. హమాలీల కొరత రాకుండా చూడాలని మార్కెటింగ్ అధికారిని ఆదేశించారు. రోజు సమీక్ష ఉంటుందని, కొనుగోళ్లలో మరింత వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీ విశ్వనాథ్, డీఆర్డీఓ ఉమాదేవి, కో–ఆపరేటివ్ అధికారి బి.రాణి, డీటీఓ మానస, మార్కెటింగ్ అధికారి స్వరణ్సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
‘హైలెవల్’.. ముమ్మరం
రూ.123 కోట్లతో వంతెన నిర్మాణం ● జూరాల– కొత్తపల్లి మధ్య కృష్ణానదిలో కొనసాగుతున్న పిల్లర్ల పనులు ● తాత్కాలిక రహదారిపై వాహనాల రాకపోకలు ● గద్వాల, ఆత్మకూర్ మధ్య తగ్గనున్న దూరం కొనసాగుతున్న పిల్లర్ల పనులు గద్వాల జిల్లా పరిధిలోని కొత్తపల్లి వైపు ముందుగా పిల్లర్ల నిర్మాణాలు చేపడుతున్నాం. ఇదివరకే మూడు పిల్లర్ల పనులు చేపట్టాం. వరద నీరు వచ్చేలోగా కొత్తపల్లి వైపు నిర్మాణాలు పూర్తి చేసేలా ముందుకెళ్తున్నాం. జూరాల వైపు వరద వచ్చినా పనులు చేపట్టేందుకు అవకాశం ఉంది. ఏడాదిన్నరలోగా పనులు పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. – దేశ్యానాయక్, ఈఈ, ఆర్అండ్బీ, వనపర్తి ఆనందంగా ఉంది.. గద్వాల మండలం కొత్తపల్లి సమీపంలో కృష్ణానదిపై వంతెన నిర్మిస్తారని చిన్నతనం నుంచి వింటున్నాం. ప్రస్తుతం మా గ్రామం మీదుగా రాకపోకలు కొనసాగుతుండటంతో ఆనందంగా ఉంది. ఎన్నో ఏళ్లనాటి కల సాకారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రుణపడి ఉంటాం. – మహేశ్వర్రెడ్డి, మాజీ సర్పంచ్, కొత్తపల్లి, గద్వాల మంత్రి కృషి ఫలితంతోనే.. ఆత్మకూర్ మండలంలోని జూరాల గ్రామం వద్ద కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి మంత్రి వాకిటి శ్రీహరి ఎంతో శ్రమించారు. కొందరు అడ్డంకులు సృష్టించినా సీఎంను ఒప్పించి రూ.123 కోట్లు మంజూరు చేయించి పనులు ప్రారంభించారు. – పరమేష్, కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు, ఆత్మకూర్ ఆత్మకూర్కు మహర్దశ.. జూరాల గ్రామం వద్ద ఆ త్మకూర్, గద్వాలకు వా హనాలు తిరుగుతుంటే సంబురంగా ఉంది.వంతె నని ర్మాణానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. పనుల పూర్తికి ప ట్టుదలతో ముందుకెళ ్తున్న మంత్రి వాకిటి శ్రీహరికి రుణపడి ఉంటాం. ఆత్మకూర్ రూపురేఖలు మారడం ఖాయం. – రహ్మతుల్లా, మార్కెట్ కమిటీ చైర్మన్, ఆత్మకూర్ ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువన హైలెవల్ వంతెన నిర్మాణానికి ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ ప్రాంత ప్రజల కల సాకారం కాబోతుంది. వంతెన పనులు ప్రారంభం కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వంతెన నిర్మాణంతో గద్వాల, ఆత్మకూర్ ప్రాంతాల మధ్య దూరం తగ్గనుంది. జూరాల, కొత్తపల్లి గ్రామాల మధ్య కృష్ణానదిలో భారీ పిల్లర్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇదివరకే తాత్కాలిక రహదారి ఏర్పాటు చేయడంతో వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఆత్మకూర్ మండలం జూరాల గ్రామం వద్ద రూ.123 కోట్లతో వంతెన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గతేడాది డిసెంబర్ 1న శంకుస్థాపన చేయగా.. వెంటనే తాత్కాలిక రహదారి నిర్మాణ చేపట్టి వినియోగంలోకి తీసుకొచ్చారు. వివాదాలు.. అడ్డంకులు... హైలెవల్ వంతెన పనులను ప్రారంభించిన నాటి నుంచి వివాదాలు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు భద్రతలో భాగంగా వంతెన నిర్మాణం డ్యాం వద్ద చేపట్టాలని ఎంపీ డీకే అరుణ పట్టుబట్టారు. ఇరిగేషన్శాఖ సమీక్షలో సైతం మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి డ్యాం వద్దనే వంతెన నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించడంతో పెద్దఎత్తున ఆందోళనలు కొనసాగాయి. ఎంపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇరిగేషన్ నిధులతో డ్యాం సేఫ్టీ వంతెన నిర్మించాలని, ఆర్అండ్బీ నిధులతో కొత్తపల్లి–జూరాల వంతెన నిర్మించాలని, అభివృద్ధిని అడ్డుకోవడం లేదని ఎంపీ స్పష్టం చేశారు. ఈ విషయమై కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. పోటాపోటీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఆత్మకూర్ నుంచి జూరాల మీదుగా గద్వాలకు వెళ్లేందుకు 32 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంది. గద్వాల మండలం కొత్తపల్లి, ఆత్మకూర్ మండలం జూరాల గ్రామం వద్ద కృష్ణానదిపై వంతెన నిర్మిస్తే కేవలం పది కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. 22 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. ప్రస్తుతం నిర్మించిన తాత్కాలిక రహదారిపై ప్రయాణిస్తున్న రెండు జిల్లాల ప్రయాణికులు దూరభారం తగ్గడంతో సమయంతో పాటు డబ్బులు ఆదా అవుతున్నాయని అంటున్నారు. అలాగే గద్వాల నుంచి హైదరాబాద్కు వెళ్లాలంటే ఎర్రవల్లి చౌరస్తా మీదుగా హైవే మీద ప్రయాణం చేయాల్సి ఉంది. వంతెన నిర్మాణం పూర్తయితే గద్వాల నుంచి ఆత్మకూర్ మీదుగా తక్కువ వ్యవధిలో కొత్తకోట హైవేకు చేరుకోవచ్చు. దీంతో 40 కిలోమీటర్ల దూరం తగ్గనున్నట్లు అంచనాలు ఉన్నాయి. అలాగే ఎమ్మిగనూరు, ఆదోని, బళ్లారి, మంత్రాలయం వెళ్లే వారికి దూరం తగ్గే అవకాశం ఉంది. వ్యాపార పరంగా ఆత్మకూర్, జూరాల, కొత్తపల్లి ప్రాంతాలు అభివృద్ధి చెందనున్నాయి. తగ్గనున్న దూరం.. -
విపత్తులను సమర్థంగా ఎదుర్కోవాలి
వనపర్తి: భవిష్యత్లో ఎలాంటి విపత్తులు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కోడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని.. అందుకు అన్ని శాఖలు ప్రాథమిక కసరత్తు పక్కాగా చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ అధికారులను ఆదేశించారు. పర్యావరణ విపత్తులు ఏ విధంగా ఎదుర్కోవాలి.. ఎలా సన్నద్ధం కావాలనే అంశాలపై కేంద్ర, రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖలు జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలకు టేబుల్ ప్రాక్టీస్, మాక్డ్రిల్తో ముందస్తు శిక్షణనిస్తుంది. ఇందులో భాగంగా గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు ఎస్పీ రాజేష్ మీనాతో కలిసి ఆయన జిల్లా అధికారులతో ప్రాథమిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. అకస్మాత్తుగా వచ్చే పర్యావరణ విపత్తులను జిల్లా యంత్రాంగం ఏ విధంగా ఎదుర్కొంటుందనే అంశంపై అన్ని శాఖలు తమ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకొని శుక్రవారం కలెక్టరేట్కు రావాలని ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు తమ కార్యాచరణను టేబుల్వర్క్ ద్వారా విశదీకరించాలని.. 18వ తేదీన మాక్డ్రిల్ ద్వారా ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుందన్నారు. మాక్డ్రిల్కు జిల్లాలో 7 ప్రాంతాలను గుర్తించామని.. ఆయా శాఖల సిబ్బంది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎలా అమలు చేస్తారో ప్రదర్శించాలని కోరారు. మాక్డ్రిల్ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పర్యావరణ విపత్తుల విభాగాల అధికారులు ఆన్లైన్లో పరిశీలిస్తారన్నారు. అదనపు ఎస్పీ రాజేష్ మీనా మాట్లాడుతూ.. భారీ వర్షాలు, వరదలు, పరిశ్రమల్లో భారీ అగ్ని ప్రమాదాలు, అడవుల్లో మంటలు చెలరేగడం, రోడ్డు, రైలు ప్రమాదాలు సంభవించినప్పుడు జిల్లా యంత్రాంగం ఏ విధంగా వ్యవహరించాలి.. ప్రాణనష్టం జరగకుండా క్షతగాత్రులను ఏ విధంగా రక్షించాలి.. అందుకు కమ్యూనికేషన్ వ్యవస్థ ఎలా వినియోగించుకోవాలనే విషయాలపై ముందస్తు ప్రణాళిక ఉండాలని, అప్పుడే ప్రాణ నష్టాన్ని నివారించవచ్చన్నారు. మాక్డ్రిల్తో ఆత్మ విశ్వాసం పెరుగుతుందని తెలిపారు. మాక్డ్రిల్ అనేది నిజంగా విపత్తు వచ్చినట్లు, దానిని నివారించేందుకు సిబ్బంది చేసే కృషి కళ్లకు కట్టినట్టు ఉండాలన్నారు. కార్యక్రమంలో సీపీఓ రామకృష్ణ, జిల్లా అగ్నిమాపక అధికారి బి.ధర్మ, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, డీఎస్పీ గిరిబాబు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ -
రోడ్డెక్కిన అన్నదాతలు.. స్తంభించిన రాకపోకలు
వనపర్తి రూరల్: వరి ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు లారీల కొరత లేకుండా చూడాలని గురువారం మండలంలోని చిట్యాల వ్యవసాయ మార్కెట్యార్డు ఎదుట రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మార్కెట్యార్డులో కొనుగోలు కేంద్రం ప్రారంభించినా ధాన్యం సేకరణ జరగడం లేదని, అకాల వర్షాలకు ధాన్యం తడిస్తే తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ రమేష్రెడ్డి, మార్కెట్యార్డు చైర్మన్ శ్రీనివాస్గౌడ్ అక్కడికి చేరుకొని ఎలాంటి ఆందోళన చెందవద్దని, సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించి ధర్నా విరమించారు. పోలీసులు రహదారిపై ఉన్న ద్విచక్ర వాహనాలను తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. గోపాల్పేట: కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై నెలరోజులు పూర్తి కావస్తున్నా ఇప్పటి వరకు రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయడం లేదని బుద్దారం రైతులు గురువారం రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ శేఖర్ రైతులతో కలిసి ధర్నాలో పాల్గొని మాట్లాడారు. రైతులు ఆరుగాలం కష్టపడి పంట పండించి కేంద్రానికి తీసుకొస్తే ప్రభుత్వం కొనుగోళ్లకు ఎందుకు జాప్యం చేస్తోందని ప్రశ్నించారు. ధాన్యంలో తాలు, గడ్డి, రాళ్లు ఉన్నాయని అధికారులు కారణాలు చెప్పడం విచారకరమన్నారు. కేంద్రంలో సరిపడా గన్నీ బ్యాగులు కూడా అందుబాటులో లేవని.. కావాలనే కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే కొనుగోళ్లు ప్రారంభించకుంటే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ తిలక్కుమార్రెడ్డి, ఎస్ఐ జగన్మోహన్ అక్కడకు చేరుకొని రైతులతో మాట్లాడారు. శుక్రవారం నుంచి కొనుగోళ్లు సక్రమంగా జరిపిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ అధికారి రామ్మోహన్రావు, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. -
గురుకుల విద్యార్థికిప్రతిభా పురస్కారం
వనపర్తి రూరల్: చిట్యాల, కడుకుంట్ల ఎంజేపీ బీసీ గురుకుల జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ బైపీసీ విద్యార్థి విలాస్ వార్షిక పరీక్షల్లో 991 మార్కులు సాధించారు. గురువారం హైదరాబాద్లోని సేవాలాల్ బంజారా భవన్లో తెలంగాణ ప్రభుత్వ బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఎంజేపీ సొసైటీ నిర్వహించిన ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో విలాస్కు రాష్ట్ర ఎంజేపీ కార్యదర్శి బడుగు సైదులు ప్రతిభా పురస్కారం, రూ.10 వేలు, జ్ఞాపిక అందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆర్సీఓ శ్రీనివాస్గౌడ్, డీసీఓ శ్రీవేణి, ప్రిన్స్పాల్ గురువయ్యగౌడ్, కళాశాల అధ్యాపక బృందం అభినందనలు తెలిపారు. -
ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
వనపర్తి రూరల్: ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్కు దీటుగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. ఏబీడీ లిక్కర్ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద రూ.49 లక్షలతో పెబ్బేరు, శ్రీరంగాపురం మండలాల్లోని 13 అంగన్వాడీలను ఆధునికీకరించి ఆదర్శ కేంద్రాలుగా తీర్చిదిద్దారు. పెబ్బేరులోని 2, 5, మండలంలోని కంచిరావుపల్లి మోడల్ అంగన్వాడీ కేంద్రాలను గురువారం రాష్ట్ర శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో తెలంగాణాను విద్యారంగంలో నంబర్–1గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అల్పాహార పథకం త్వరలోనే అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తున్నామని.. తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించాలని సూచించారు. అలాగే సీఎస్ఆర్ నిధులు 2 శాతం పెంచి ఉమ్మడి పెబ్బేరు మండలంలోని పాఠశాలల అభివృద్ధికి సహకరించాలని, పాఠశాలలకు ప్రహరీలు, రవాణా సౌకర్యాలను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఏబీడీ కంపెనీ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. ఏబీడీ లిక్కర్ కంపెనీ సహకారంతో పెబ్బేరు, శ్రీరంగాపురం మండలాల్లోని 13 అంగన్వాడీ కేంద్రాలను ఆదర్శంగా తీర్చిదిద్దడం అభినందనీయమని కొనియాడారు. ఈ సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్గౌడ్, సర్పంచ్, వైస్ చైర్మన్ సుమిత్ర, మార్కెట్ వైస్ చైర్మన్ విజయవర్ధన్రెడ్డి, ఏబీడీ కంపెనీ ప్రతినిధులు రాజేష్, ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన బోధన
వనపర్తిటౌన్: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక సాంకేతికతను వినియోగించి బోధన అందిస్తున్నామని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ తెలిపారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లాకేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల నుంచి అంబేడ్కర్ చౌక్ వరకు పుర వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల (పీటీఎం) సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా వసతులు, సౌకర్యాలు కల్పిస్తూ విద్యనందిస్తున్నామని.. అప్పులు చేసి తిప్పలు పడుతూ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చదివించే బదులు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి బంగారు భవిష్యత్కు బాటలు వేయాలని కోరారు. ప్రైవేట్కు ఏ మాత్రం తగ్గకుండా విద్యా అందుతుందని తల్లిదండ్రులకు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహార కార్యక్రమాన్ని సైతం ప్రారంభించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పుర కమిషనర్ వెంకటేశ్వర్లు, కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి ప్రతాప్రెడ్డి, ప్లానింగ్ అధికారి శేఖర్, ఏఎంఓ మహానంది, జీహెచ్ఎంలు ఉమాదేవి, శివాజీ, సామాజికవేత్త గంధం నాగరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
సకాలంలో వంతెన నిర్మాణం పూర్తి
ఆత్మకూర్: జూరాల గ్రామం వద్ద కృష్ణానదిపై రూ.123 కోట్లతో నిర్మిస్తున్న వంతెన పనులు సకాలంలో పూర్తి చేస్తామని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. బుధవారం ఆయన స్థానిక నాయకులతో వంతెన నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతుందని, వంతెన నిర్మాణం పూర్తయితే గద్వాల–ఆత్మకూర్ మధ్య రాకపోకలకు సమయంతో పాటు దూరం తగ్గుతుందన్నారు. వర్షాకాలంలోగా పిల్లర్ల నిర్మాణం పూర్తిచేసి ఏడాదిలోగా వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పారు. హైదరాబాద్ నుంచి వయా ఆత్మకూర్, గద్వాల, రాయచూరు మీదుగా మంత్రాలయం వెళ్లే వారికి దాదాపు 60 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని వివరించారు. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ రహమతుల్లా, పుర చైర్పర్సన్ నాగమణి, వైస్ చైర్మన్ నల్గొండ శ్రీనివాసులు, కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు పరమేష్, జిల్లా కార్యదర్శి తులసీరాజ్ యాదవ్, కౌన్సిలర్లు, సర్పంచ్లు, పార్టీ నాయకులు ఉన్నారు. ఆధ్యాత్మిక చింతన అవసరం.. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం పట్టణంలో పునః నిర్మించిన పెద్దమ్మతల్లి ఆలయం, విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా గెలిచి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశానని, ఆ తల్లి దయతో మంత్రిగా ఎన్నికై ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. పట్టణంలో సంస్థానాధీశుల కాలం నుంచి గ్రామదేవతలను పూజించేవారని శిథిలావస్థకు చేరుకోవడంతో పునర్నిర్మించుకోవడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మొగిలి శ్రీధర్గౌడ్, ఆలయ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు. రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి -
పేదల సొంతింటి కల సాకారం
మదనాపురం: రాష్ట్రంలోని పేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పని చేస్తున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని నర్సింగాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల్లో పాల్గొని లబ్ధిదారులతో కలిసి ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో పేదలను మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పారు. మొదటి విడత నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయని.. రెండోవిడత త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం స్థానిక నాయకులతో మాట్లాడి గ్రామంలో ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకులు హనుమాన్రావు, కొండన్న, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి -
ఉపాధికి ఊతం
వేసవిలో కూలీల సంఖ్య పెంపే లక్ష్యం ● గ్రామాల బాట పట్టిన అధికారులు ● జాబ్కార్డు ఉన్న కూలీలందరూపాల్గొనేలా అవగాహన ● గతేడాది 16 వేల మందికి.. ఈ ఏడాది రెట్టింపు యోచనతో ముందుకు... ● జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న వీబీ జీ రాంజీ పథకం అవగాహన కల్పిస్తున్నాం.. రోజు గ్రామాలకు వెళ్లి ఉపాధి పనుల అవశ్యకతను కూలీలకు వివరిస్తున్నాం. ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని.. జీవనభృతితో పాటు గ్రామాభివృద్ధికి సైతం ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరవుతాయనే విషయాలను వివరిస్తున్నాం. ఈ నెలాఖరు వరకు జాతీయ ఉపాధిహమీ పథకం ఉంటుందని.. జూన్ 1 నుంచి వీబీ జీ రాంజీ కొత్త పథకం అమలులోకి వస్తుందని, జాబ్కార్డులు ఉన్న కూలీలు పనులు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నాం. – శ్రీనివాసులు, ఎంపీడీఓ, అమరచింత కూలీల పెంపునకు స్పెషల్ డ్రైవ్.. జాతీయ ఉపాధిహమీ పథకం ద్వారా జాబ్కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వేసవిలో పనులు కల్పించడానికి ప్రభుత్వ ఆదేశాలతో మే నెలలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. కొత్త పథకంలో ఎలాంటి నిబంధనలు ఉంటాయో తెలియదు. గ్రామాలకు మంజూరైన ఉపాధి పనులను కూలీలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. ఈ ఏడాది 33 వేల మంది కూలీలకు ఉపాధి కల్పించాలనేది ప్రణాళిక. – ఉమాదేవి, డీఆర్డీఓ అమరచింత: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా వేసవిలో గ్రామాల్లోని అధికమంది కూలీలకు పని కల్పించి ఆదుకోవాలనే లక్ష్యంతో అధికారులు ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. మండల ప్రత్యేక అధికారులతో పాటు ఎంపీడీఓలు గ్రామపంచాయతీ కార్యదర్శులు, ఉపాధి సిబ్బందితో కలిసి రోజు గ్రామాల బాట పట్టారు. తమ వద్ద ఉన్న ఉపాధి కూలీల వివరాలను చేతబట్టుకొని ఇల్లిల్లూ తిరిగి పనుల్లో పాల్గొనాలంటూ అవగాహన కల్పిస్తున్నారు. దీంతో కొంతకాలంగా పనులకు దూరంగా ఉంటున్న కూలీలందరూ తిరిగి పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. రెండేళ్ల కిందట జిల్లావ్యాప్తంగా 15 వేల నుంచి 16 వేల మంది కూలీలు ఉపాధిహామీ పనుల్లో పాల్గొంటే.. ఈసారి ఆ సంఖ్యను రెట్టింపు చేయాలనే లక్ష్యంతో అధికారుల గ్రామ పర్యటనలు కొనసాగుతున్నాయి. కూలీలు గ్రామాల్లో చెరువు పూడికతీత, రహదారులకు ఇరువైపులా ముళ్లపొదల తొలగింపు, మొక్కల సంరక్షణ, నర్సరీల నిర్వహణతో పాటు పలు రకాల పనులు చేపడుతూ ఉపాధి పొందుతున్నారు. ఈసారి జిల్లావ్యాప్తంగా 33 వేల మందికి ఉపాధిహమీ పథకం ద్వారా పని కల్పించి రికార్డు సాధించాలనే సంకల్పంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. నీటి సంరక్షణకు ప్రాధాన్యం.. గ్రామాల్లో నీటి సంరక్షణ పనులకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో పేరుకుపోయిన మట్టిని తొలగించి వర్షాకాలంలో వర్షపు నీరు వృథా కాకుండా నింపడంతో భూగర్భ జలాలు పెంపొందుతాయని అధికారులు వెల్లడిస్తున్నారు. వర్షపు నీటితో గ్రామాల్లోని చెరువులు కళకళలాడే విధంగా పూడికతీత పనులు చేపడుతున్నారు. అదేవిధంగా వ్యవసాయ పొలాల్లోని బావుల్లో సైతం పూడికతీత చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇంకుడు గుంతల నిర్మాణం..గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలు, ఇళ్లలో ఇంకుడు గుంతల తవ్వకానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. వ్యక్తిగత ఇంకుడు గుంతలతో పాటు చేతి పంపులు, నీటి ట్యాంకుల వద్ద నీరు వృథాగా రహదారులపై పారకుండా వాటిని నిలువరించేందుకు ఇంకుడు గుంతలను తవ్విస్తూ కూలీలకు ఉపాధి చూపుతున్నారు. -
జిల్లాలో 1.20 లక్షల జాబ్కార్డులు..
ఉపాధి కూలీల సంఖ్య పెంచాలనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రోజు పనులకు వస్తున్న కూలీల హాజరు వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మరుసటి రోజు పెంచే యత్నం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 1.20 లక్షల జాబ్కార్డులు ఉండగా.. ఏటా సుమారు 15 వేల మంది పనుల్లో పాల్గొనేవారు. 2024–2025 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్యను 30 వేల నుంచి 33 వేల వరకు పెంచి గ్రామాల్లో సమృద్ధిగా ఉపాధి పనులు చేపట్టి కేంద్రం నుంచి అధిక నిధులు వచ్చేలా కృషి చేస్తున్నారు. ఇందుకోసం గ్రామంలోని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, యువత సహకారం తీసుకుంటున్నారు. -
లింక్ కెనాల్ పనులు త్వరగా పూర్తి చేయాలి
వీపనగండ్ల: సింగోటం–గోపల్దిన్నె లింక్ కెనాల్ పనులు త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలోని బొల్లారం గ్రామంలో భూ సేకరణపై రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత రెవెన్యూ రికార్డుల విలువ కంటే మూడింతల ధరను భూములు కోల్పోయిన రైతులకు పరిహారంగా చెల్లిస్తామని.. అందుకు అవసరమైన నివేదికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. లింక్ కెనాల్ నిర్మాణం పూర్తయితే వీపనగండ్ల, చిన్నంబావి, కోడేరు మండలాల్లోని 40 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని వివరించారు. ప్రభుత్వ భూములున్న రైతులకు కూడా పూర్తిస్థాయి పరిహారం అందిస్తామని తెలిపారు. భూ సేకరణ సత్వరమే పూర్తిచేసి సాగునీరు అందేవిధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. సమావేశంలో జిల్లా భూ సేకరణ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ తిరుపతయ్య, ఇరిగేషన్ సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్రీనివాస్రెడ్డి, ఆర్డీఓ సుబ్రమణ్యం, సర్పంచ్లు సుదర్శన్రెడ్డి, రామన్గౌడ్, కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకులు నారాయణరెడ్డి, చిన్నారెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు. రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
అరుణాచలం, గోవాకు ప్రత్యేక బస్సులు
వనపర్తిటౌన్: వేసవి సెలవులు, వీకెండ్స్ సందర్భంగా స్థానిక ఆర్టీసీ డిపో నుంచి అరుణాచలం, గోవాకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు డిపో మేనేజర్ దేవేందర్గౌడ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22న శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు గోవా బస్సు బయలుదేరుతుందని, ఒక్కొక్కరికి రూ.3,600 చార్జీ ఉంటుందని పేర్కొన్నారు. అదేవిధంగా 31వ తేదీ పౌర్ణమి సందర్భంగా అరుణాచల గిరి ప్రదక్షిణకు 29వ తేదీ శుక్రవారం ప్రత్యేక బస్సు అందుబాటులో ఉంటుందన్నారు. కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శన అనంతరం అరుణాచల గిరి ప్రదక్షిణ ఆదివారం ముగించుకొని సోమవారం ఉదయం వనపర్తి చేరుకుంటుందన్నారు. ప్రయాణానికి ఒక్కొక్కరికి రూ.3,600 చార్జి ఉంటుందని వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు, భక్తులు సద్వినియోగం చేసుకోవాలని.. పూర్తి వివరాలకు సెల్నంబర్లు 73828 29379, 79957 01851 సంప్రదించాలని సూచించారు. ఇంటర్ సప్లిమెంటరీపరీక్షలు ప్రారంభం వనపర్తిటౌన్: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం పరీక్షలు నిర్వహించారు. ఫస్ట్ ఇయర్ పరీక్షలకు జనరల్ 976 మంది విద్యార్థులకుగాను 912 మంది, ఒకేషనల్ విద్యార్థులు 89 మందికిగాను 81 మంది హాజరయ్యారు. 72 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. అలాగే ద్వితీయ సంవత్సరం పరీక్షలకు జనరల్ 224 మంది విద్యార్థులకుగాను 205, ఒకేషనల్ విద్యార్థులు 22 మందికిగాను 17 మంది హాజరుకాగా.. 24 మంది రాయలేదు. సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశాయి. నిలకడగా ఉల్లి ధరలు దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో బుధవారం జరిగిన వేలంలో ఉల్లి ధరలు నిలకడగా ఉన్నాయి. కొన్ని వారాలుగా రూ.వెయ్యి దాటని ఉల్లి ధర గత వారం కొంతమేర పెరిగింది. ఉదయం మార్కెట్లో స్థానిక వ్యాపారులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు వేలంలో పాల్గొన్నారు. క్వింటా ఉల్లి గరిష్టంగా రూ.1,500, కనిష్టంగా రూ.వెయ్యి వరకు పలికింది. 50 కిలోల బస్తాను గరిష్టంగా రూ.750, కనిష్టంగా రూ.500 వరకు విక్రయించారు. ఉల్లి నాణ్యతగా ఉండడంతో వినియోగదారులు పెద్దఎత్తున ఉల్లిని కొనుగోలు చేశారు. కొనసాగిన అమ్మకాలు.. మార్కెట్ బయట రైతులు యథావిధిగా ఉల్లి అమ్మకాలు సాగించారు. ధరలు పెరగడంతో రైతులు రూ.600 నుంచి రూ.650 వరకు 50 కిలోల బస్తాను విక్రయించారు. చాలామంది రైతులు ట్రాక్టర్లపై ఉల్లి బస్తాలు తెచ్చి సాయంత్రం వరకు అమ్మకాలు సాగించారు. ఎక్కువగా వినియోగదారులు ఉల్లి బస్తాలను కొనుగోలు చేశారు. బాదేపల్లి యార్డుకు పోటెత్తిన ధాన్యం జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు బుధవారం వివిధ ప్రాంతాల నుంచి భారీగా ధాన్యం విక్రయానికి వచ్చింది. 15,674 బస్తాల ధాన్యం, 8,433 బస్తాల మొక్కజొన్న యార్డుకు రావడంతో ఆవరణంతా కిక్కిరిసిపోయింది. కాగా ధాన్యం ఆర్ఎన్ఆర్ రకం క్వింటా గరిష్టంగా రూ.2,539, కనిష్టంగా రూ.1,601 ధరలు లభించాయి. అలాగే వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.7,642, కనిష్టంగా రూ.5,329, ఆముదాలు గరిష్టంగా రూ.6,239, కనిష్టంగా రూ.6,206, పొద్దుతిరుగుడు రూ.6,210, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,872, కనిష్టంగా రూ.1,601, జొన్నలు రూ.5,789, మినుములు రూ.6,600 చొప్పున వచ్చాయి. -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు : ఎమ్మెల్యే
గోపాల్పేట: తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పని చేస్తోందని.. ఇందుకు నిదర్శనమే ఇందరమ్మ ఇళ్ల పథకమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఇందరమ్మ ఇల్లు నిర్మించుకున్న మునిగల్ల నాగమ్మ గృహ ప్రవేశానికి ఆయన హాజరై లబ్ధిదారుకు కొత్త దుస్తులు అందజేసి మాట్లాడారు. ఇచ్చిన హామీ మేరకు ఇల్లు నిర్మించుకున్న ప్రతి లబ్ధిదారుకు చీరసారె ఇస్తున్నామని చెప్పారు. వచ్చే నెలలో రెండోవిడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని.. రానివారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. ఆయన వెంట స్థానిక కాంగ్రెస్పార్టీ నాయకులు ఉన్నారు. -
ధాన్యం సేకరణలో వేగం పెంచాలి
వనపర్తి: వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా కొనసాగాలని.. మిల్లుల వద్ద లారీలు ఎక్కువ సమయం వేచి ఉండటానికి వీలులేదని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరం నుంచి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వానికి వరి కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగడమే ప్రథమ ప్రాధాన్యమని తెలిపారు. క్షేత్రస్థాయిలో అలసత్వం వహిస్తే సహించేది లేదని.. రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి మిల్లు వద్ద ఓ ప్రత్యేక అధికారి ఉండి ధాన్యం లారీలను త్వరగా ఖాళీ చేయించేలా పర్యవేక్షణ చేయాలన్నారు. పలు మండలాల్లో మిల్లుల వద్ద లారీలు ఎక్కువ మొత్తంలో వేచి ఉన్నట్లు సమాచారం అందుతుందని.. త్వరగా అన్లోడ్ చేయించాలని ఆదేశించారు. మిల్లర్లు తరుగు పేరిట కోతలు విధించడానికి ఆస్కారం లేకుండా చూడాలని.. ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కొనుగోళ్లు వేగంగా పూర్తిచేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. అవసరమైన లారీలను అందుబాటులో ఉంచమని ధాన్యం రవాణా కాంట్రాక్టర్లకు సూచించాలని, లారీల కొరత కనిపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మిల్లుల వద్ద అదనంగా హమాలీలను ఏర్పాటుచేసి లారీల్లోని ధాన్యం త్వరగా ఖాళీ చేసేలా చొరవ చూపాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్, డీసీఎస్ఓ కాశీ విశ్వనాథ్, డీఆర్డీఓ పీడీ ఉమాదేవి, డీసీఓ రాణి, డీటీఓ మానస, తహసీల్దార్లు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. జనగణనపై విస్తృత ప్రచారం.. జనగణన–2027పై గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. బుధవారం కలెక్టరేట్ ప్రాంగణంలో జనగణన–2027 ప్రచార వాహనాన్ని అదనపు ఎస్పీ రాజేష్ మీనా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్తో కలిసి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జనగణనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచార వాహనం ప్రతి గ్రామం, పట్టణంలో తిరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రజలు జనగణన ప్రక్రియలో చురుగ్గా పాల్గొని కచ్చితమైన సమాచారం అందించాలని, సంక్షేమ పథకాల రూపకల్పన, అభివృద్ధి ప్రణాళికలకు ఈ సమాచారం ఉపయోగపడుతుందన్నారు. డీఆర్డీఓ ఉమాదేవి, ఏవో భానుప్రకాష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి -
బక్రీద్కు కట్టుదిట్టమైన భద్రత
వనపర్తి: బక్రీద్కు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నామని అదనపు ఎస్పీ రాజేష్ మీనా తెలిపారు. బుధవారం డీజీపీ సీపీ ఆనంద్ హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఇతర పోలీసు అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. బక్రీద్ సందర్భంగా జిల్లాలో భద్రతా చర్యలు, ప్రత్యేక బందోబస్తు ప్రణాళికలు, చెక్పోస్టుల పర్యవేక్షణ, పోలీస్ బృందాల మొహరింపు తదితర అంశాల గురించి డీజీపీకి వివరించారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఎస్పీ గిరిబాబు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి వెంకటయ్యగౌడ్, వనపర్తి, కొత్తకోట సీఐలు సుగంధ రత్నం, శ్రీరాంబాబు, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ రామేశ్వర్రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అదనపు ఎస్పీ రాజేష్ మీనా -
స్తంభించిన కొనుగోళ్లు
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో పంట దిగుబడుల క్రయవిక్రయాలు స్తంభించాయి. యార్డుకు వివిధ ప్రాంతాల నుంచి ధాన్యం పోటెత్తడంతో మార్కెట్ ఆవరణలో స్థలం లేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా ఎక్కడి ధాన్యం అక్కడే ఉండిపోవడంతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. సోమవారం దాదాపు 30 వేల బస్తాల వరి ధాన్యం, మొక్కజొన్న ఇతర దిగుబడులు మార్కెట్కు రావడంతో కొనుగోళ్లు జరిపినా తూకాలు, బస్తాల తరలింపు చేయకపోవడంతో మంగళవారం కొనుగోళ్లు నిలిపివేశారు. దీంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. వరుసగా శుక్ర, శనివారాల్లో సైతం ఇదే సమస్య కారణంగా కొనుగోళ్లు నిలిపివేయగా.. ఆదివారం బస్తాలను గోదాంలకు తరలించడంతో సోమవారం క్రయవిక్రయాలు సాఫీగా సాగాయి. అయితే మూడు రోజుల సరుకు మంగళవారం ఒకేసారి రావడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. దీంతో కొనుగోళ్లు నిలిపివేసి.. తూకాలు, బస్తాల తరలింపు చేపట్టారు. రోజుల తరబడి పడిగాపులు.. బాదేపల్లి యార్డు ఆవరణలో సామర్థ్యానికి మించి దిగుబడులు రావడం, సకాలంలో టెండర్లు దాఖలు చేసి తూకాలు వేయడం, బస్తాల తరలింపులో ఆలస్యం చోటు చేసుకునే పరిస్థితి వస్తుంది. దీంతో రోజు విడిచి రోజు కొనుగోళ్లు చేయాలని మార్కెట్ యార్డు అధికారులు, పాలక మండలి నిర్ణయించారు. అయితే సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు రెండు, మూడు రోజులపాటు మార్కెట్లోనే పడిగాపులు కాయాల్సి వస్తుంది. లారీలు, హమాలీల కొరతతో ఇబ్బందులు.. ఒకవైపు పేరుకుపోయిన నిల్వలు.. మరోవైపు మొక్కజొన్న ఇతర దిగుబడులు మార్కెట్కు ప్రతిరోజు భారీగా వస్తుంది. ఈ క్రమంలో బస్తాలు తరలించేందుకు లారీలు, హమాలీలు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మార్కెట్ నుంచి బయటి ప్రాంతాల్లోని గోదాంలకు తరలించాలంటే అక్కడ కూడా ఖాళీ లేని పరిస్థితి కారణంగా ఆలస్యం జరుగుతుంది. కాబట్టి క్రయవిక్రయాలలో ఇబ్బందులు రాకుండా చూడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆరుగాలం అష్టకష్టాలు పడి పండించిన పంట దిగుబడులను అమ్మడానికి సైతం ఇబ్బందులు పడాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఇదే పరిస్థితి ఉందని, ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారుల కుమ్మక్కు..? ధాన్యం దిగుబడులు అధికంగా రావడం, రోజుల తరబడి రైతులు మార్కెట్లోనే ఉండిపోయే పరిస్థితులు తలెత్తడం కారణంగా వ్యాపారులు ఇదే అదునుగా తక్కువ ధర కేటాయిస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు. ఎలాగో అమ్మకతప్పదన్న కారణంగా వ్యాపారులంతా కుమ్మకై ్క తమ ఇష్టానుసారంగా ధరలు నిర్ణయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తమకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బాదేపల్లి యార్డుకు పోటెత్తిన మొక్కజొన్న, వరి ధాన్యం ఇకపై రోజు విడిచి రోజు చేపట్టాలని నిర్ణయం మంగళవారం నిలిపివేత.. నేడు టెండర్ ప్రక్రియ తీవ్ర ఆందోళనలో రైతులు -
కాంగ్రెస్తోనే పేదల సొంతింటి కల సాకారం
వనపర్తి రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరై పేదల సొంతింటి కల సాకారమవుతుందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. మంగళవారం పెబ్బేరు మండలం కంచిరావుపల్లిలో 12 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహ ప్రవేశాల్లో ఆయన పాల్గొని కొత్త దుస్తులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ.. తాము శిథిల ఇళ్లలో ఉంటూ ఎప్పుడు కూలుతాయోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాలం వెళ్లదీశామని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేష్, సర్పంచ్ అరుణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎద్దుల విజయవర్ధన్రెడ్డి, జైపాల్రెడ్డి, పార్టీ మండల నాయకులు ,గ్రామపెద్దలు, వార్డు సభ్యులు, యువకులు పాల్గొన్నారు. -
వేసవి శిబిరాలతో సృజనాత్మకత పెంపు
వనపర్తిటౌన్: విద్యా వారోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న వేసవి శిబిరాలతో విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందుతుందని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ తెలిపారు. మంగళవారం జిల్లాకేంద్రంలో విద్యా వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలు పూర్తయ్యే వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని.. ఉత్తీర్ణులయ్యేలా ఉపాధ్యాయులు చదివించాలని సూచించారు. ఉపాధ్యాయుల బోధనను శ్రద్ధగా వినడంతోనే కాకుండా అర్థం చేసుకుంటేనే పై తరగతుల్లో మంచి మార్కులు సాధించగలరన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్లానింగ్ అధికారి శేఖర్, కమ్యూనిటీ మొబైల్ అధికారి ప్రతాప్రెడ్డి, మండల విద్యాధికారి మద్దిలేటి, జీహెచ్ఎంలు ఉమాదేవి, వరలక్ష్మి, సువర్ణాదేవి, శివకుమార్, ఉపాధ్యాయులు ధర్మరాజు, సామాజికవేత్త గంధం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రయాణం.. ప్రమాదం!
రహదారులపై ధాన్యం ఆరబోత ● జిల్లాలో తరుచూ చోటు చేసుకుంటున్న ప్రమాదాలు ● రెండేళ్లలో నలుగురు మృత్యువాత.. మరో పదిమందికి గాయాలు ● అవగాహన కార్యక్రమాలు కరువు ● పట్టించుకోని అధికారులు ●వనపర్తి: రోడ్లపై పంటనూర్పిళ్లు, ధాన్యం ఆరబోయడంతో నిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా.. సంబంధిత అధికారులు స్పందించడం లేదు. విలువైన ప్రాణాలు కోల్పోతున్నా.. నిర్లక్ష్యం వీడకపోవడం శోచనీయం. రోడ్లపై ఇనుప చక్రాలతో ట్రాక్టర్లు వెళ్తే జరిమానా విధిస్తున్న అధికారులు.. ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నారు. తాజాగా ఏదుల రిజర్వాయర్ సమీపంలో రోడ్డుపై మొక్కజొన్న ఆరబెట్టి చుట్టూ ఉంచిన రాళ్లకు బైకు ఢీకొని 24 ఏళ్ల వీరపాగ కృష్ణ మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నింపింది. నిత్యం రద్దీగా ఉండే రహదారులపై కూడా పంట ఉత్పత్తులను ఆరబెట్టడం, నూర్పిళ్లు చేయడం ఆగడం లేదు. జాతీయ ఉపాధిహామీ పథకం నిధులతో రైతులు పొలాల్లోనే పంట నూర్పిళ్లు, ఆరబెట్టుకునేందుకు కల్లాలు ఏర్పాటు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించినా.. నిర్మాణాలకు ఆసక్తి చూపడం లేదు. ఏటా వానాకాలం, యాసంగి సీజన్లలో రోడ్లపై పంటలను ఆరబెట్టడం, నూర్పిళ్లు చేయడం పరిపాటిగా మారింది. రోడ్లపై ధాన్యం కుప్పలు, ఆరబోసిన ధాన్యం చుట్టూ ఏర్పాటుచేసిన రాళ్లతో రాత్రిళ్లు ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. జిల్లావ్యాప్తంగా రెండేళ్లలో ద్విచక్ర వాహనదారులు నలుగురు మృతిచెందిగా.. మరో పదిమందికిపైగా గాయాల పాలైనట్లు అధికారిక సమాచారం. ఇక ప్రమాదానికి గురైనా పోలీస్స్టేషన్లో సమాచారం ఇవ్వని ఘటనలు పదుల సంఖ్యలో ఉంటాయి. ఈ ఘటనలపై ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, పోలీసుశాఖ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. జిల్లాలో ఏటా వరి సాగు పెరుగుతూనే ఉంది. దీంతో జిల్లా అధికారులు కొనుగోలు కేంద్రాల సంఖ్య గణనీయంగా పెంచారు. కేంద్రాల వద్దనే పంటలను ఆరబెట్టేందుకు సౌకర్యాలు కల్పిస్తే రైతులు రోడ్లపైకి వచ్చే అవకాశం ఉండదు. ఇలాంటి ప్రమాదాలకు అడ్డుకట్ట పడుతుంది. -
గ్రామాల అభివృద్ధికి కృషి
● తాలు పేరుతో తరుగు తీస్తే చర్యలు ● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాన్గల్: గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి పరిష్కారిస్తూ అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని కేతేపల్లి, వెంగళాయిపల్లి, జమ్మాపూర్లో పర్యటించి గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాగునీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచి పూర్తయిన వాటి గృహా ప్రవేశాలు పూర్తి చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. కొనుగోలు కేంద్రాల్లో జాప్యం చేయకుండా ధాన్యం తూకం చేయాలని, తాలు పేరుతో తరుగు తీసి రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తూకంలోనూ పారదర్శకత ఉండాలని.. అధికారులు మండలానికి ఓ వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి సమస్యలు పోస్టు చేస్తే పరిష్కరించేలా జిల్లా అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. దీంతోపాటు ధాన్యం తరలించే లారీలకు జియో ట్యాగింగ్ చేస్తే ఎక్కడ ఉన్నాయనే విషయం తెలుస్తుందని సూచించారు. అధికారులు రోజు పర్యవేక్షిస్తూ రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ప్రజలు మంత్రికి వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్సాగర్, మాజీ ఎంపీపీ వెంకటేష్నాయుడు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రవికుమార్, ఆయా గ్రామాల సర్పంచ్లు అనసూయమ్మ, మల్లయ్య, తహసీల్దార్ కార్తీక్రావు, ఎంపీడీఓ గోవిందరావు, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
ధాన్యం సేకరణలో వేగం పెంచాలి
వనపర్తి: రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలకు వచ్చిన నాణ్యమైన వరి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు సేకరించి తరలించేందుకు పక్కా ప్రణాళిక అమలు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మొక్కజొన్న, వరి కొనుగోళ్లపై మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహచర మంత్రులు, ప్రధానకార్యదర్శితో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై దిశా నిర్దేశం చేశారు. రోజు 10 వేల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేసి మిల్లులు, గోదాములకు తరలించాలని ఆదేశించారు. రవాణా కాంట్రాక్టర్లు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సెక్టార్ వారీగా సొంత వాహనాలతో పాటు వారు చెప్పిన అద్దె వాహనాల్లో ధాన్యం తరలింపునకు కేటాయించాల్సిందేనన్నారు. ఒకవేళ ఒప్పందం ప్రకారం లారీలు సమకూర్చకుంటే చీటింగ్ కేసు నమోదు చేయాలని, గత సీజన్తో పాటు ఈ సీజన్ డబ్బులు సైతం ఇవ్వకుండా నిలిపివేయాలని ఆదేశించారు. రవాణా, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేస్తూ వాహనాల కొరత లేకుండా చూడాలన్నారు. జిల్లాలో ఉన్న లారీ అసోసియేషన్లతో మాట్లాడి అన్ని లారీలు, డీసీఎంలు ధాన్యం తరలించేందుకు వినియోగించుకోవాలని రవాణా అధికారిని ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ గోదాములను ధాన్యం నిల్వలకు తీసుకోవాలని, గోదాములను గుర్తించి జాబితా ఇవ్వాలని పౌరసరఫరాలశాఖ అధికారిని ఆదేశించారు. రోజు కొనుగోలు చేసిన ధాన్యం మిల్లు, గోదాముల్లో దించుకోవాలని, అవసరమైతే పోలీసుల సహకారం తీసుకోవాలని సూచించారు. ఒప్పందం కుదుర్చుకున్న 53 మిల్లులకు రోజు ధాన్యం తరలించి వెంటనే దించుకునేలా చూడాలన్నారు. అన్ని మిల్లుల వద్ద సిబ్బందిని ఉంచి రోజువారీగా ధాన్యం సేకరణ ప్రక్రియను పర్యవేక్షించి నివేదిక అందించాలని కోరారు. హమాలీల సమస్య తలెత్తకుండా చూడాలని లేబర్ కమిషనర్ను ఆదేశించారు. కేంద్రం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు వచ్చిన ధాన్యం.. రోజువారీగా కొనుగోలు చేసిన ధాన్యం వివరాలతో నివేదిక అందజేయాలన్నారు. కొనుగోళ్లు పూర్తయ్యే వరకు రోజువారీ వివరాలను మీడియాకు ఇవ్వాల్సిందిగా సూచించారు. రానున్న 15 రోజులు రెవెన్యూ అదనపు కలెక్టర్తో పాటు పౌరసరఫరాలు, మార్కెటింగ్, వ్యవసాయ, డీఆర్డీఓ, డీసీఓ, రవాణా తదితర శాఖలు ధాన్యం కొనుగోలుపైనే దృష్టి సారించాలని.. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్, డీఆర్డీఓ ఉమాదేవి, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీ విశ్వనాథ్, పౌరసరఫరాల సంస్థ డీఎం ఆంజనేయులు జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, కో–ఆపరేటివ్ అధికారి బి.రాణి, డీటీఓ మానస, మార్కెటింగ్ అధికారి స్వరణ్సింగ్ పాల్గొన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి -
తెలియక వచ్చాను..
బాదేపల్లి యార్డులో మంగళవారం కొనుగోళ్లు చేయడం లేద ని తెలియక ధాన్యం తీసుకువచ్చాను. దీంతో ధాన్యం కుప్ప వద్దే పడిగాపులు కాసే పరిస్థితి ఏర్పడింది. ముందస్తు సమాచారం తెలిసి ఉంటే బుధవారమే తీసుకువచ్చే వాడిని. రైతులను ఇబ్బంది పెట్టకుండా చర్యలు తీసుకోవాలి. – మధుసూదన్రెడ్డి, రైతు, గోప్లాపూర్ రైతులు సహకరించాలి.. బాదేపల్లి యార్డుకు సోమవారం ఒక్కరోజే 30 వేల బస్తాల దిగుబడులు వచ్చాయి. దీంతో బస్తాలు తూకం వేయడంలో ఆలస్యమైంది. మంగళవారం కూడా అవే బస్తాలు తూకాలు వేశాం. బస్తాల తరలింపులోనూ ఆలస్యం కావడంతో రోజు విడిచి రోజు కొనుగోళ్లు చేయాలని నిర్ణయించాం. ఈ విషయం రైతులు గమనించి సహకరించాలి. – అశ్వక్ ఆహ్మద్, మార్కెట్ కార్యదర్శి, బాదేపల్లి -
నేడు ప్రపంచ నర్సుల దినోత్సవం
● ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్సీల్లో కీలక విధుల నిర్వహణ ● నిస్వార్థ సేవలతో ఎంతోమంది ప్రాణాలు రక్షిస్తున్న వైనం ఒక తల్లి బిడ్డకు జన్మనిస్తే.. నర్సు తనదైన సేవ చేసి పునర్జన్మ ప్రసాదిస్తోంది. ఒంట్లో ఏమాత్రం అనారోగ్యం అనిపించినా డాక్టర్ అని పరుగులు పెడతామే కానీ.. అక్కడ మనకు నిజమైన సేవలందించేది నర్సులే. ఆస్పత్రిలో అడ్మిట్ అయిన రోగి త్వరగా కోలుకోవడంలో నర్సుల పాత్ర చాలా కీలకం. 24 గంటల పాటు రోగులకు అందుబాటులో ఉంటూ సమయానికి ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్స్ అందించడమే కాకుండా అవసరమైన చికిత్సతో పాటు పరీక్షలు చేస్తూ ప్రాణాలు రక్షిస్తారు. తాము సేవ చేసే వ్యక్తి ఎవరో.. వారి వ్యక్తిత్వమేమిటో.. పేదవాడా.. డబ్బున్నవాడా.. అని పట్టించుకోకుండా సేవలందించే ఆత్మబంధువులు. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు పీహెచ్సీల్లో విధులు నిర్వహిస్తూ.. ఎంతో మందికి ప్రసవాలు చేస్తూ, వేల సంఖ్యలో రోగులకు పలు రకాల చికిత్సలు అందిస్తూ నిస్వార్థ సేవ చేస్తున్నారు. మంగళవారం ప్రపంచ నర్సుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. – పాలమూరు నాగర్కర్నూల్ జనరల్ ఆస్పత్రిలో గ్రేడ్, హెడ్ నర్సులతో పాటు జీఎన్ఎంలు 327 మంది, అచ్చంపేట, కొల్లాపూర్ ఏరియా ఆస్పత్రుల్లో 42 మంది, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 76 మంది, పీహెచ్సీల్లో 32 మంది, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 400 మంది నర్సులు ఉన్నారు. ఇక ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 160 మంది, రెండు ప్రైవేట్ కళాశాలల్లో 300 మంది విద్యార్థులు నర్సింగ్ అభ్యసిస్తున్నారు. పాలమూరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల జనరల్ ఆస్పత్రిలోని ఎంసీహెచ్ బ్లాక్లో కొనసాగుతుంది. ఈ కళాశాలలో ఫస్టియర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు తగరతులు ఉండగా మొత్తం 231 మంది విద్యార్థులు నర్సింగ్ అభ్యసిస్తున్నారు. ఫస్టియర్లో 59, సెకండియర్లో 58, థర్డ్ ఇయర్లో 57, ఫోర్త్ ఇయర్లో 57 మంది ఉన్నారు. నర్సింగ్ కళాశాలకు సొంత భవనం లేకపోవడంతో తరగతుల నిర్వహణ, వసతి గృహానికి సమస్యగా మారింది. ఇటీవల మెడికల్ కళాశాల సమీపంలో ఐదు ఎకరాల్లో శాశ్వత కళాశాల భవనం, హాస్టళ్లు నిర్మించాలని భూమి చదును చేశారు. దాదాపు రూ.40 కోట్లతో కళాశాల భవనం రెండు అంతస్తులు, హాస్టళ్లు రెండు అంతస్తులు, క్రీడా స్థలాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు రూపొందించారు. అలాగే నారాయణపేట జిల్లాలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 120 మంది విద్యార్థులు నర్సింగ్ అభ్యసిస్తున్నారు.గద్వాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో 11 మంది స్టాఫ్ నర్సులు, 72 మంది జీఎన్ఎమ్లు, అలంపూర్ ఏరియా ఆస్పత్రిలో 27 మంది నర్సులు, ఇతర ఆస్పత్రుల్లో 156 మంది నర్సులు ఉన్నారు. గద్వాల నర్సింగ్ కళాశాలలో 320 మంది విద్యార్థులు నర్సింగ్ అభ్యసిస్తున్నారు. వనపర్తి జిల్లా ఆస్పత్రితో పాటు పీహెచ్సీలు, ఇతర ఆస్పత్రుల్లో మొత్తం 326 మంది నర్సింగ్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, ఎన్హెచ్ఎంలు ఉన్నారు. జిల్లాకేంద్రంలో 214 మంది విద్యార్థులు నర్సింగ్ కోర్సు చేస్తున్నారు. -
సూచనలు ఇస్తాను..
నవాబ్పేట పీహెచ్సీలో రెండేళ్లుగా నర్సుగా పని చేస్తున్నాను. పీహెచ్సీకి వచ్చే వారిలో చాలామంది వైద్యంపై ఎలాంటి అవగాహన లేకుండా వస్తుంటారు. అలాంటి వారికి సమస్య తెలుసుకుని చికిత్స అందిస్తుంటాను. మారుమూల పల్లెల నుంచి రాత్రివేళలో పలు రకాల సమస్యలతో వస్తుంటారు. వారందరికి కావాల్సిన ప్రాథమిక చికిత్స అందిస్తుంటాను. ఇక ఈ పీహెచ్సీలో కాన్పులు అధికంగా అవుతుంటాయి. గర్భిణులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రసవం తర్వాత ఎలాంటి ఆహారం తీసుకువాలనే విషయంపై సూచనలు ఇస్తాను. – పుష్పలత, నర్సు, నవాబ్పేట -
ఎస్పీ ప్రజావాణికి 12 వినతులు
వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 12 వినతులు వచ్చాయి. డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్ అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి పరిశీలించి తక్షణమే విచారించి బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత పోలీస్స్టేషన్ అధికారులను ఆదేశించారు. ప్రజల సౌలభ్యానికే డివిజన్ స్థాయి ప్రజావాణి : ఆర్డీఓ ప్రజావాణి అర్జీలను వేగంగా పరిష్కరించాలని ఆర్డీఓ సుబ్రమణ్యం అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన డివిజనల్ స్థాయి ప్రజావాణికి ఆయన హాజరై అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. ప్రజల సౌలభ్యం, అర్జీల సత్వర పరిష్కారానికే ప్రభుత్వం రెవెన్యూ డివిజన్స్థాయిలో ప్రజావాణి నిర్వహణకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రజావాణి ఫిర్యాదులు, అర్జీలను పరిశీలించి సత్వర పరిష్కారం చూపేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజావాణికి 10 వినతులు వచ్చాయని కార్యాలయ సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం వనపర్తి: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలలు, అధునాతన ఏటీసీ కోర్సుల్లో 2026–2028 విద్యాసంవత్సరం మొదటి విడత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ జిల్లా కన్వీనర్, ప్రిన్సిపాల్ మహ్మద్ ఇస్తేమాల్హక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల అభ్యర్థులు http://iti.telangana.gov. in వెబ్సైట్లో ఈ నెల 14 నుంచి జూన్ 8 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్నంబర్లు 98492 44030, 79953 35372 సంప్రదించాలని సూచించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రవేశాలకు.. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (బేగంపేట, రామంతపూర్)లో 1వ తరగతి (డే స్కాలర్) ప్రవేశాలకు జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజనాభివృద్ధిశాఖ అధికారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2019, జూన్ 1 నుంచి 2020, మే 31 మధ్యన జన్మించిన వారు అర్హులని, విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లోని వారికి రూ.2క్ష లక్షలు మించరాదన్నారు. దరఖాస్తు పత్రాలను ఈ నెల 18న సాయంత్రం 5లోగా కలెక్టరేట్లోని మొదటి అంతస్తు రూమ్నంబర్ 118లో సమర్పించాలన్నారు. ఈ నెల 22న ఉదయం 11 గంటలకు లాటరీ విధానంలో విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొనా ్నరు. నివాసం, కులం, ఆదాయ ధ్రువపత్రాలు మీ–సేవ ద్వారా పొందాలని.. అన్ని ధ్రువపత్రాల జిరాక్స్పై గజిటెడ్ అధికారితో అటెస్టెడ్ చేయించాలని సూచించారు. ఎస్టీ గురుకులాల్లో అడ్మిషన్లు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు గురుకులాల్లో ఖాళీగా ఉన్న ఇంటర్మీడియట్ సీట్లను భర్తీ చేస్తున్నట్లు ఆర్సీఓ కల్యాణి ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 9 గురుకులాల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయని, వాటిని ఈ నెల 16, 18 కౌన్సెలింగ్ నిర్వహించిన భర్తీ చేస్తామన్నారు. ధర్మాపూర్ వద్ద ఉన్న ఎస్టీ బాలికల హాస్టల్లో కౌన్సెలింగ్ ఉంటుదని, పదోతరగతి ఉత్తీర్ణులైన వారు, ఒరిజినల్ సర్టిఫికెట్లుతో హాజరుకావాలని, మరింత సమాచారం కోసం 94909 57312, 94909 57314, 94909 57315 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
తరుగు పేరిట మోసం చేస్తే చర్యలు
వనపర్తి: మిల్లుల వద్ద లారీలు ఎక్కువ సమయం వేచి ఉండకుండా వేగంగా ధాన్యం దించుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరం నుంచి కలెక్టర్ ధాన్యం కొనుగోళ్లు, మిల్లుల వద్ద అన్లోడింగ్, జనగణన ప్రక్రియ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో యాసంగి సీజన్ వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి తరలిన ధాన్యం కేటాయించిన మిల్లుకు చేరిన తర్వాత అక్కడ తరుగు, ఇతర కారణాల పేరిట రైతులను మోసం చేయడానికి వీలులేదని.. అలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మిల్లుల వద్ద ధాన్యం దించుకోకుండా అనేక కారణాలు చూపి లారీలను నిలబెట్టుకుంటే చర్యలు తప్పమన్నారు. తహసీల్దార్లు పర్యవేక్షణ చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. రవాణా కాంట్రాక్టర్లు కూడా సరిపడా లారీలను అందుబాటులో ఉంచాలని, ఏ విధమైన సమస్యలు తలెత్తకుండా చూడాలని చెప్పారు. క్షేత్రస్థాయి హద్దులను తనిఖీ చేసుకోవాలి.. జనగణన–2027లో భాగంగా సోమవారం నుంచి క్షేత్రస్థాయి హౌస్ లిస్టింగ్ ప్రక్రియ నిర్వహించడానికి వెళ్తున్న ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు గుర్తింపు కార్డులు, జనగణన సామగ్రి తప్పనిసరిగా అందజేయాలని చార్జ్ అధికారులకు కలెక్టర్ సూచించారు. ఎన్యూమరేటర్లు మొదటి మూడురోజులు తమకు కేటాయించిన హౌస్ లిస్టింగ్ బ్లాక్ల హద్దుల్ని తనిఖీ చేసుకునేలా చూడాలని సూచించారు. హెచ్ఎల్బీల హద్దుల్ని మూడురోజులు తనిఖీ చేసుకొని హౌస్లిస్టింగ్ ఆపరేషన్స్కు సిద్ధం కావాలన్నారు. ఈసారి డిజిటల్ పద్ధతిలో జనగణన చేస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేయాలని సూచించారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున ఉదయం వేళల్లో క్షేత్రస్థాయిలో పర్యటించేలా చూడాలని, ఎవరు కూడా వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్త తీసుకోవాలని కోరారు. ఓఆర్ఎస్ కిట్ అందుబాటులో ఉంచాలని ఛార్జ్ అధికారులకు సూచించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్, సీపీఓ హరికృష్ణ, డీఆర్డీఓ ఉమాదేవి, వీసీ ద్వారా తహసీల్దార్లు, పోలీస్ అధికారులు, సెన్సస్ ఛార్జ్ అధికారులు పాల్గొన్నారు. -
సమన్వయ లోపంతోనే..
మిల్లర్లు కోత విధిస్తే ఉపేక్షించం ● కేంద్రాల్లోనే నాణ్యతను పునః పరిశీలించాలి ● రవాణాకు నిర్దేశిత వాహనాలే వినియోగించాలి ● రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మిల్లర్లు ప్రత్యేకించి ఈ సీజన్లో చిన్నపాటి యంత్రాలను తీసుకొచ్చి నూక, బియ్యం శాతం తక్కువగా వస్తుందంటూ రైతుల ధాన్యంలో కోతలు విధించే ప్రయత్నం చేస్తున్నారని.. వాటి ఫలితాలు అశాసీ్త్రయమైనవని, పరిగణలోకి తీసుకునేది లేదని కలెక్టర్ ఆదర్శ్ సురభి స్పష్టం చేశారు. రవాణా ఏజెన్సీలు అగ్రిమెంట్ సమయంలో ఇచ్చిన లారీలకు బదులు ఇతర లారీలతో ధాన్యం తరలిస్తామంటే ఒప్పుకునేది లేదన్నారు. ధాన్యం తరలింపులో ఇబ్బందులకు గురిచేస్తే బిల్లుల చెల్లింపుల సమయంలో అవస్థలు తప్పవని రవాణా ఏజెన్సీలను హెచ్చరించారు. జిల్లాకు సుమారు 70 లక్షల గన్నీబ్యాగులు అవసరమైతే ప్రస్తుతం 55 లక్షల గన్నీబ్యాగులు ఉన్నాయని, మిగతా వాటి కోసం ఇండెంట్ పంపిస్తామన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులు, గోదాంలకు సొంత వాహనాల్లో ధాన్యం తరలిస్తే రవాణా డబ్బులను చెల్లించనున్నట్లు చెప్పారు. వనపర్తి: అధికారులు, మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల మధ్య సమన్వయ లోపంతోనే వరి ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని కళ్యాణసాయి గార్డెన్స్లో వరి ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో నిర్వహించిన సమీక్షకు ఆయనతో పాటు వనపర్తి, దేవరకద్ర ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, మధుసూదన్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని కొనుగోలు కేంద్రాలకు సుమారు 1.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం విక్రయానికొస్తే ఇప్పటి వరకు 40 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. కొన్న ధాన్యం సకాలంలో మిల్లులు, గోదాంలకు తరలించకపోవడం, మిల్లుల వద్ద ధాన్యం బస్తాలతో లారీలు నిలిచిపోవడం వంటి సమస్యలు నిత్యం తమ దృష్టికి వస్తున్నాయని, రైతులు మిల్లులు, గోదాం వద్దకు వెళ్లి పైరవీలు చేస్తే తప్ప ధాన్యం దించుకోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయని, రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ధాన్యం విక్రయించేందుకు రైతులు మిల్లర్లు, అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను బతిమిలాడాలా అంటూ పౌరసరఫరాలశాఖ అధికారులు, సిబ్బందిపై మండిపడ్డారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగి రైతులు విక్రయించిన ధాన్యంలో కోతలు విధిస్తూ ఇబ్బందుల పాలు చేస్తుంటే ఏం చేస్తున్నారంటూ డీఎం, డీఎస్ఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత ప్రయోగాలు చేస్తూ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలుజేసే వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు సూచించారు. సదరు ఔట్సోర్సింగ్ టీఏను స్టేజీపైకి పిలిపించి రైతులను ఇబ్బందులు పెట్టమని ఎవరు చెప్పారని నిలదీశారు. ప్రభుత్వ గోదాంల వద్ద టీఏలు, మిల్లుల వద్ద మిల్లర్లు తూకాల్లో కోతలు విధించి రైతులకు అన్యాయం చేయాలని చేసే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. మిల్లర్లు తీసుకున్న ధాన్యానికి నిబంధనల ప్రకారం బియ్యం అప్పగించాలని.. అందుకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నాణ్యమైన ధాన్యం బస్తాలో నింపి నిర్దేశిత మిల్లులు, గోదాంలకు తరలించేలా డీఆర్డీఓ, డీసీఓ, మెప్మా, సివిల్ సప్లయ్ అధికారులు, రెవెన్యూ అదనపు కలెక్టర్ నిత్యం పర్యవేక్షణ చేయాలని మంత్రి ఆదేశించారు. సమన్వయంతో కొనుగోళ్ల ప్రక్రియ సాగాలి.. జిల్లావ్యాప్తంగా ఎక్కడా వరిధాన్యం కొనుగోలు సమస్య అనే ఫోన్ రానివ్వకుండా అధికారులు, మిల్లర్లు, లారీ ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్లు సమన్వయంతో పని చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి కోరారు. మిల్లర్లు రైతుల ధాన్యంలో కోత విధించి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయరాదన్నారు. గోదాంల వద్ద టీఏలను సైతం పౌరసరఫరాలశాఖ అధికారులు నిత్యం పర్యవేక్షణ చేస్తూ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ బి.శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ చైర్మన్ మాధవి, డీఆర్డీఓ ఉమాదేవి, మార్కెటింగ్ శాఖ డీఎం స్వరణ్సింగ్, డీఎం, డీఎస్ఓ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో సుమారు 280 మిల్లులుంటే.. కేవలం 53 మిల్లులకే యాసంగి ధాన్యం కేటాయింపులు చేశారు. అధికారులు కొందరికే ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని.. మిగతా వారితో ఎందుకు రికవరీ చేయడం లేదని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రశ్నించారు. ధాన్యం నాణ్యత లోపాలతో మిల్లర్లు నష్టపోతున్నారని జిల్లా మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు శేఖర్రెడ్డి బదులివ్వగా, అందుకు ఎమ్మెల్యే స్పందిస్తూ.. మిల్లర్లు నష్టపోతే వందలోపు ఉన్న మిల్లులు మూడువందలకు చేరవుగా ఎందుకు పెరుగుతాయని.. రైతులను నష్టపరిచే చర్యలను తాము ఎప్పటికీ ఉపేక్షించబోమన్నారు. సంచిలో ఆరు కిలోల తాలు వస్తుందని ఆయన మరో ఆరోపణ చేస్తే సంచిలో అంత తాలుంటే ధాన్యం నింపే అవకాశం ఉండదన్నారు. రైతులు ధాన్యం దించేందుకు మిల్లులు, గోదాంల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి రాకూడదని, కొనుగోలు కేంద్రాల్లో ఒక్కసారి తూకం చేస్తే సమస్య ఉత్పన్నం కానివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లాస్థాయి అధికారులు సక్రమంగా పర్యవేక్షిస్తే సమస్యలు అక్కడికక్కడే పరిష్కారమవుతాయన్నారు. రైతుల పక్షాన ఎమ్మెల్యే మిల్లర్లు, అధికారులు, ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్లు, టీఏలను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. దీంతో సమీక్షకు హాజరైన రైతులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. -
రైతులను అరిగోస పెడుతున్న ప్రభుత్వం
వనపర్తి రూరల్/గోపాల్పేట: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన మొక్కజొన్న, వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, కేంద్రాల్లో అన్నదాతలను ముప్పతిప్పలు పెట్టడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. సోమవారం వనపర్తి మండలం చిమనగుంటపల్లి, చిట్యాల వ్యవసాయ మార్కెయార్డు, గోపాల్పేటలోని వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆయన సందర్శించి రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గింజ కొంటామన్న మంత్రులు, అధికారుల మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయని విమర్శించారు. రైతుబంధు, సాగునీరు ఇవ్వకున్నా, విద్యుత్ కోతలున్నా అష్టకష్టాలు పడి పండించిన వరి, మొక్కజొన్నను కొనకుండా రైతులను హరిగోసలు పెడుతున్న ప్రభుత్వం ఆగంగాక తప్పదని హెచ్చరించారు. రవాణా, హమాలీలు, గన్నీబ్యాగుల కొరత తీర్చకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. యాసంగి పంటలో ఎలాంటి తరుగు ఉండదని తెలిసి కూడా క్వింటాకు 10 కిలోల తరుగు తీస్తూ రైతులను దోచుకున్నారని ఆవేదన వ్యక్తం చేవారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చిన వరి, మొక్కజొన్న అకాల వర్షాలకు తడిసే ప్రమాదం ఉందని.. వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని, తరుగు పేరుతో మోసం చేయొద్దని సూచించారు. ఆయన వెంట చిట్యాల సర్పంచ్ శోభ, పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, నాయకులు వాకిటి శ్రీధర్, మాణిక్యం, భానుప్రకాష్, రఘువర్ధన్రెడ్డి, రవిప్రకా ష్, చిట్యాల రాము, పరంజ్యోతి, రమేష్గౌడ్, నందిమళ్ల అశోక్, గోపాల్పేటలో సర్పంచ్ స్వప్నభాస్కర్, రైతుబంధు మాజీ అధ్యక్షుడు తిరుపతియాదవ్, పార్టీ మండల అధ్యక్షుడు బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటి తంటాలు
వట్టిపోతున్న సోర్సుబోర్లు.. మిషన్ భగీరథపైనే ఆశలు ● వనపర్తిలో 4 రోజులకోసారి సరఫరా ● పెబ్బేరు శివారు ప్రాంతాల్లో ట్యాంకర్లతో.. ● పురపాలికల్లో సరిపడా లేని ట్యాంకర్లు ● వేసవిలో తప్పని నీటి కష్టాలు ●అమరచింత: జిల్లాలోని పుర ప్రజలకు నిత్యం తాగునీటిని సరఫరా చేసేందుకు అధికారులు పూర్తిస్థాయిలో నిమగ్నమైనా.. సోర్సుబోర్లు వట్టిపోతుండటంతో మిషన్ భగీరథపైనే ఆధారపడాల్సిన పరిస్థితి దాపురించింది. కొన్ని పురపాలికల్లో రోజు విడిచి రోజు నీటిని వదులుతుండటంతో వచ్చి నీటిని నిల్వ చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాకేంద్రంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. మూడు, నాలుగు రోజులకోసారి వార్డుల వారీ గా నీటిని వదులుతుండగా.. వాటినే పొదుపుగా వా డుకోంటున్నామని ప్రజలు తెలిపారు. పెబ్బేరు పురపాలికలో కొత్తగా ఏర్పడిన కాలనీల్లో తాగునీటి పైప్లైన్లు ఏర్పాటు చేయకపోవడంతో పురపాలికకు చెందిన రెండు ట్యాంకర్ల ద్వార నిత్యం ఆయా కాలనీలకు సరఫరా చేస్తున్నారు. అమరచింత, ఆత్మకూర్, కొత్తకోట పురపాలికల్లో పూర్తిస్థాయిలో మిషన్ భగీరథ నీటిపైనే ఆధారపడి పట్టణ ప్రజలకు తాగునీటిని సరఫరా చేసే పరిస్థితులు ఉన్నాయి. ఉన్న సోర్సుబోర్లు వేసవిలో వట్టిపోయే స్థితికి చేరుకున్నాయి. మిషన్ భగీరథే ఆధారం.. ప్రస్తుతం మున్సిపాలిటీల్లో నీటి సరఫరా మిషన్ భగీరథపైనే పూర్తిస్థాయిలో ఆధారపడింది. జలాశయాల్లో నిల్వ నీటిమట్టం రోజురోజుకు తగ్గుతుండటంతో వేసవిలో తాగునీటి కష్టాలు తప్పేలా లేవని పట్టణ ప్రజలు వెల్లడిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఎల్కూర్లోని మిషన్ భగీరథ సంప్హౌజ్ వద్ద మరమ్మతులు తలెత్తితే నీటి సరఫరాలో ఆటంకాలు ఎదురవుతాయి. వేసవిని దృష్టిలో ఉంచుకొని సోర్సుబోర్లు వట్టిపోకుండా మరమ్మతులను వెంటనే చేపట్టడం, ట్యాంకర్లను అద్దెకు తీసుకోవడం వంటి చర్యలతో నీటి కష్టాలను దూరం చేయవచ్చు. నీటి కోసం ఎదురుచూపులు వేసవికి ముందే రెండ్రోజులకు ఓసారి కొ ళాయిలకు నీటిని వదిలేవారు. ప్రస్తుతం 4 రోజులకు ఒకసారి వ దులుతున్నారు. నీటి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. నీటి సమస్య పరిష్కరించాలని అధికారులకు విన్నవించినా ఫలితం లేదు. – లక్ష్మి, 24వ వార్డు, వనపర్తి పుర అధికారుల నిర్లక్ష్యం.. కాలనీవాసులు తాగునీటి కోసం రోజు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది. కొళాయిల్లో నీరు వస్తుందని తెలిస్తే చాలు అన్ని పనులు వదిలేసి నీటిని పట్టుకొని నిల్వ చేసుకునే దుస్థితి నెలకొంది. మూడు, నాలుగు రోజులకు ఓసారి నీటిని వదులుతున్నారు. నీటిసమస్య తీవ్రంగా ఉంది. అధికారులు పట్టించుకొని పరిష్కరించాలి. – సాయిలీల, 22వ వార్డు, వనపర్తి ముందస్తు చర్యలు.. వేసవిలో పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. పురపాలికలోని చేతి పంపులను బాగుచేయించి మోటార్లు బిగించి నీటిని అందిస్తున్నాం. మిషన్ భగీరథ నీటితో పాటు సోర్సుబోర్లను వినియోగించుకుంటూ ప్రజలకు నీటి కష్టాలు కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. – శశిధర్, పుర కమిషనర్, ఆత్మకూర్ ఒక్కరికి రోజుకు 125 లీటర్ల చొప్పున.. నిత్యం కొళాయిల ద్వారా ఒక్కరికి 125 లీటర్ల చొరప్పున నీటిని సరఫరా చేయాలి. ఇలా ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది లెక్కన నీటిని అందించాల్సి ఉంది. వచ్చిన నీటిని తాగు, ఇతర అవసరాలకు వినియోగించే అవకాశం ఉంది. -
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
గోపాల్పేట: ఉమ్మడి గోపాల్పేట మండలంలో ఆదివారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసింది. ఆరబెట్టిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షానికి తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గోపాల్పేట మండలంలోని చాకల్పల్లి, ఏదుట్ల, రేవల్లి మండలంలోని గౌరిదేవిపల్లి, నాగపూర్, రేవల్లి, శానాయిపల్లిలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గౌరిదేవి పల్లిలో తడిసిన ధాన్యాన్ని చూపిస్తున్న రైతు -
పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలి
పాన్గల్: పండుగలు శాంతియుతంగా జరుపుకొంటూ అందరికీ ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. ఆదివారం మండలంలోని మాందాపూర్లో వీరభద్రుడి ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలను వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు రోజువారి పనులతో పాటు కొంత సమయం దైవ భక్తికి కేటాయించాలన్నారు. చదువుతోనే సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం లభిస్తుందని.. తమ పిల్లలను బాగా చదివించాలని సూచించారు. అంతకుముందు మంత్రి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. పోటీలకు ఆర్థిక తోడ్పాటునందించిన మంత్రిని ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్సాగర్, సర్పంచ్ సుగుణమ్మ, ఉప సర్పంచ్ శ్యాంసుందర్రెడ్డి, మాజీ సర్పంచ్లు కృష్ణయ్యసాగర్, జయరాములుసాగర్, కమిటీ సభ్యులు కుపేందర్రెడ్డి, పరమేష్, మహేష్, నర్సింహరాజు, భగవంతు పాల్గొన్నారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు.. ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో ఆర్భాటాలకు పోయి అప్పుల పాలు కావద్దని మంత్రి జూపల్లి లబ్ధిదారులకు సూచించారు. గ్రామంలో సర్పంచ్ సుగుణమ్మ ఇంటి గృహ ప్రవేశం చేసి మాట్లాడారు. ప్రభుత్వం అందించే రూ.5 లక్షలతో నిబంధనల మేరకు ఇంటిని నిర్మించుకోవాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పారు. రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
నాణ్యమైన వరి ధాన్యం తీసుకురావాలి
వనపర్తి: రైతులు తాలు, చెత్త లేకుండా నాణ్యమైన వరి ధాన్యం కేంద్రాలకు తీసుకొస్తే కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. ఆదివారం రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీ విశ్వనాథ్, వ్యవసాయ, కో–ఆపరేటివ్, తహసీల్దార్లు, మిల్లర్లు, ఐకేపీ, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించి సమీక్షించారు. రైస్మిల్లర్లు ధాన్యం త్వరగా దించుకోకపోవడంతో రోజుల తరబడి లారీలు ఆగిపోవడం, కొనుగోలు కేంద్రాల్లో తూకం చేయకపోవడం తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యంలో తాలు, చెత్త ఎక్కువగా ఉండటంతో ఎఫ్సీఐకి నాణ్యమైన బియ్యం తిరిగి ఇవ్వడం సాధ్యం కాదని, రైతులు నిబంధనల ప్రకారం నాణ్యమైన వరి ధాన్యం తీసుకొచ్చేలా చూడాలని మిల్లర్లు కలెక్టర్కు వివరించారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ రైతులు సహకరించి తూర్పారబట్టిన వడ్లను కేంద్రానికి తీసుకురావాలని, నాణ్యమైన ధాన్యం సేకరణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెంటనే కొనుగోలు చేసి డబ్బులు ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. సేకరించిన ధాన్యం ట్యాబ్ఎంట్రీలో జాప్యం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మిల్లర్లు వచ్చిన లారీలను త్వరగా ఖాళీ చేసి పంపించాలని, రోజుల తరబడి మిల్లుల వద్ద నిలుపుకోవద్దని సూచించారు. కొనుగోలు ప్రక్రియను యుద్ధప్రాతిపదికన నిర్వహించాలని, అకాల వర్షాలకు ధాన్యం తడిసే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి యాసంగి కొనుగోళ్ల ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో డీసీఓ రాణి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి -
అభివృద్ధి వైపు.. పీయూ
నిధులు (రూ.కోట్లలో..) రీసెర్చి ఫెసిలిటీ భవనం 13.50 బాలుర హాస్టల్ 12.50 బాలికల హాస్టల్ 12.50 ఎస్టీ బాలికల హాస్టల్ 10 ఎస్టీ బాలుర హాస్టల్ 10 సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ 5 ఇంజినీరింగ్ కళాశాల 35 లా కళాశాల 10 సింథటిక్ ట్రాక్ గ్యాలరీ 4.60 సింథటిక్ ట్రాక్లో టైల్స్వర్స్ 0.53 మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. పలు అభివృద్ధి పనులకు అటు ప్రభుత్వం, ఇటు యూనివర్సిటీ అంతర్గత నిధులు వెచ్చించి విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో గతంలో ఎప్పుడూ లేనంతంగా ఏకంగా రూ.113.63 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఇందులో పలు నిర్మాణాలు చివరి దశకు చేరుకోగా.. మరికొన్ని నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ప్రస్తుతం వేసవి సెలవులు ఉండగా.. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం వరకు పలు భవనాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే లా, ఇంజినీరింగ్ కళాశాలల భవన నిర్మాణం ప్రారంభం కావడంతో పీయూ కొత్త అధ్యాయం మొదలుకానుంది. ఒకేసారి నాలుగు హాస్టళ్లు నిర్మిస్తుండటంతో విద్యార్థులకు వసతి సమస్య తీరనుంది. దక్షిణ తెలంగాణకు రీసెర్చ్ హబ్గా.. పీఎం ఉషా స్కీం ద్వారా రీసెర్చ్ ఫెసిలిటీ భవనాన్ని రూ.13.50 కోట్లతో నిర్మించారు. ఇది దక్షిణ తెలంగాణలోనే అతిపెద్ద రీసెర్చి హబ్గా అవతరించనుంది. ప్రస్తుతం నిర్మాణం చివరి దశలో ఉంది. దీని ద్వారా పీయూలోని అన్ని డిపార్ట్మెంట్లకు ఒక్కో రీసెర్చ్ ల్యాబ్ను కేటాయించనున్నారు. ముఖ్యంగా సైన్స్ డిపార్ట్మెంట్లకు సంబంధించి ప్రత్యేక ల్యాబ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఉషా స్కీం నుంచి రూ.కోట్లు వెచ్చించి మైక్రోస్కోప్, స్పెక్రోస్కోప్ వంటివి ఏర్పాటు చేయనున్నారు. సైన్స్ పరికరాల కొనుగోలుకు సైతం ఇప్పటికే టెండర్లు పిలిచారు. తీరనున్న హాస్టల్ సమస్యలు... యూనివర్సిటీలో మొత్తం 13 కోర్సుల్లో విద్యార్థులు చదువుతున్నారు. అయితే పూర్తిస్థాయిలో సీట్లు సరిపోకపోవడంతో విద్యార్థి అడ్రస్ నుంచి ఉన్న దూరం ఆధారంగా సీట్ల కేటాయింపులు చేస్తున్నారు. వీటికి తోడు లా, ఇంజినీరింగ్ కళాశాలలు కూడా కొత్తగా రావడంతో ఇక్కడ అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ప్రస్తుతం ఉన్న పాత బాలబాలికల హాస్టళ్లలోనే వసతి కల్పిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి రెండు కళాశాలలకు సంబంధించిన విద్యార్థుల సంఖ్య రెట్టింపు కానుండటంతో పీయూలో ఒకేసారి నాలుగు హాస్టళ్లు నిర్మిస్తున్నారు. రెండు హాస్టళ్లు యూనివర్సిటీ ద్వారానే నిర్మిస్తుండగా ఒక బాలిక, ఒక బాలుర హాస్టల్స్ను ఎస్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న హాస్టళ్లకు వీటితో సీట్లు రెట్టింపు కానున్నాయి. పీయూలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు ఇలా.. యూనివర్సిటీలో రూ.113 కోట్లతో కొనసాగుతున్న పనులు శరవేగంగా నూతన భవనాల నిర్మాణాలు విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి రీసెర్చ్ ఫెసిలిటీ భవనం సీవేజ్ వాటర్ ట్రీట్మెట్ ప్లాంట్, సింథటిక్ ట్రాక్ గ్యాలరీ ప్రారంభమైన లా, ఇంజినీరింగ్ కళాశాల భవనాలు అందుబాటులోకి ఎస్టీపీ ప్లాంట్.. పీయూలో సాధారణ భవనాలతో పాటు అత్యాధునిక టెక్నాలజీని వినియోగించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పీయూలో హాస్టళ్లు, ఆఫీస్ల నుంచి వృథాగా వచ్చే నీటిని ఎస్టీపీ (సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్)లో ఫిల్టర్ చేసి తిరిగి వినియోగించేందుకు ఈ ప్లాంట్ ఎంతో ఉపయోగపడనుంది. దీని ద్వారా నీటి వృథా అరికట్టడంతోపాటు నీటి ఎద్దడి, డ్రెయినేజీ సమస్య కూడా తీరనుంది. న్యాక్ గ్రేడింగ్లో కూడా దీనికి మార్కులు వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు దక్షిణ తెలంగాణలో ఉన్న ఏకై క సింథటిక్ ట్రాక్ పీయూలో మాత్రమే అందుబాటులో ఉండగా దానికి గ్యాలరీ నిర్మాణం పనులు పూర్తి కావొచ్చాయి. దీని నిర్మాణం కోసం అధికారులు రూ.4.60 కోట్లు వెచ్చించారు. -
నిబంధనల మేరకే ధాన్యం కొనుగోళ్లు
వనపర్తి రూరల్: కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లుకు వచ్చిన వరి ధాన్యం లారీలను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దించుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. ఆదివారం ఆయన మండలంలోని శేరుపల్లి శివారులో ఉన్న సప్తగిరి రైసుమిల్ను ఆకస్మికంగా తనిఖీ చేసి ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను కేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, కొనుగోళ్ల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు, మిల్లు యజమానులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం అన్లోడింగ్ సమయంలో ఎలాంటి తరుగు తీయకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తిస్థాయిలో ధాన్యాన్ని సేకరించాలని, రైతులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి రైస్మిల్లుకు నియమించిన ప్రత్యేక అధికారి లారీల రాకపోకలకు సంబంధించిన వివరాలను ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేయాలని ఆదేశించారు. ఏ ఽలారీ ఎప్పుడు వచ్చింది.. ఎప్పడు ఖాళీ అయ్యింది అనే వివరాలు అందులో నమోదు చేయాలన్నారు. లోడింగ్, అన్లోడింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించడానికి ప్రతి రైసుమిల్కు గ్రామపంచాయతీ అధికారులను నియమించామని.. మిల్లు వద్ద ఉండి ధాన్యం సేకరణ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగేలా చూస్తారని పేర్కొన్నారు. మిల్లర్లు ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించకూడదని, ఎక్కడైనా తరుగు పేరిట మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ -
పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటాను..
పోలీస్ విధి నిర్వహణలో బాధ్యతలు నిర్వర్తిస్తూనే పిల్లలతో ప్రత్యేకంగా సమయం కేటాయిస్తాను. ఒకవైపు విధులు, మరోవైపు కుటుంబ బాధ్యతలు నిర్వర్తించేందుకు సమయాన్ని బ్యాలెన్స్ చేసుకుంటాను. సమాజంలో ప్రస్తుత పరిస్థితులను వారికి అర్థమయ్యేలా చెబుతూ వారితో ఫ్రెండ్లీగా ఉంటాను. డ్యూటీలో బిజీగా ఉంటున్నా పిల్లలు అర్థంచేసుకుని సర్దుకుంటున్నారు. తల్లులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు – విజయలక్ష్మి, ఏఎస్ఐ, షీ టీం ఇన్చార్జి, నాగర్కర్నూల్ -
వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలి
కొత్తకోట: ప్రతి జిల్లా కేంద్రంలో వెల్నెస్ సెంటర్లు ఏర్పాటుచేసి.. విశ్రాంత ఉద్యోగులకు మెరుగైన సేవలు అందించాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.వెంకట్రెడ్డి కోరారు. శనివారం కొత్తకోటలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావ దినమైన జూన్ 2న పీఆర్సీ ప్రకటించడంతో పాటు విశ్రాంత ఉద్యోగులకు హెల్త్ కార్డులు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. అనంతరం జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నర్సింహాగౌడ్, రవీందర్రెడ్డి ఆయనను శాలువాలతో సన్మానించారు. -
కొనుగోళ్లలో కొర్రీలను తట్టుకోలేక.. ధాన్యానికి నిప్పుపెట్టి రైతుల నిరసన
వీపనగండ్ల: తరుగు, తాలు పేరుతో రైస్మిల్లర్లు పెడుతున్న కొర్రీలను తట్టుకోలేని రైతులు శనివారం వీపనగండ్ల మండలం గోవర్ధనగిరిలో నడిరోడ్డుపై వరిధాన్యానికి నిప్పుపెట్టి ఆందోళనకు దిగారు. రైస్మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మండల మహిళా సమాఖ్య ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపిస్తే.. తరుగు, తాలు, తేమ తదితర కారణాలు చూపి ధాన్యాన్ని తిరిగి పంపిస్తున్నారన్నారు. తద్వారా రవాణా ఖర్చులు పెరిగి ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. రైతుల ఆందోళనతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ఎస్ఐ నరేశ్ అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. -
జనగణనలో భాగస్వాములు కావాలి
● కలెక్టర్ ఆదర్శ్ సురభి ● జిల్లా కేంద్రంలో ఉత్సాహంగా మారథాన్ వనపర్తి: జనగణనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి విజ్ఞప్తి చేశారు. జనగణన నమోదుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన మారథాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బాలుర జూనియర్ కళాశాల మైదానం నుంచి ప్రారంభమైన మారథాన్.. పాలిటెక్నిక్ కళాశాల వరకు ఉత్సాహంగా కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2021 లో నిర్వహించాల్సిన జనగణన ప్రక్రియ కరోనా కారణంగా ఆలస్యమైందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా డిజిటల్ విధానంలో జనగణన చేపడుతున్నట్లు వివరించారు. ఈ నెల 11 నుంచి జూన్ 10 వరకు జిల్లావ్యాప్తంగా సుమారు 13వేల మంది సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఇళ్ల గణన చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజలు సరైన సమాచారం అందించి సహకరించాలని కోరారు. జనగణనతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల రూపకల్పన మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ గిరిబాబు, సీపీఓ హరికృష్ణ, డీవైఎస్ సుదీర్రెడ్డి పాల్గొన్నారు. పెండింగ్ చెల్లింపులు పూర్తిచేయండి.. 2022–23 యాసంగి సీజన్ ధాన్యానికి సంబంధించిన బకాయిల చెల్లింపులను ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి మిల్లర్లకు సూచించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్తో కలిసి రైస్మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2022–23 యాసంగి వేలం ధాన్యానికి సంబంధించి బకాయిలను క్లియర్ చేసేందుకు ప్రభుత్వం 90 రోజుల గడువు ఇచ్చిందన్నారు. ఈ అవకాశాన్ని మిల్లర్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పెండింగ్ చెల్లింపులు పూర్తిచేసిన మిల్లర్లను డిఫాల్టర్ జాబితా నుంచి తొలగించి.. వారికి తిరిగి ప్రభుత్వ ధాన్యం కేటాయింపులు పొందే అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి కాశీ విశ్వనాథ్, డీఎం ఆంజనేయులు ఉన్నారు. -
ఉదయం 6 గంటలకే దినచర్య మొదలు..
మేము భార్యభర్తలు ఇద్దరం ఉద్యోగులు కావడం వల్ల చాలా బిజీగా ఉంటాం. నా దినచర్య ప్రతి రోజు ఉదయం 6 గంటలకు మొదలవుతుందని చెబుతుంది జనరల్ ఆస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ శిరీష. ప్రతి రోజు ఉదయం 6 గంటలకు నిద్రలేచిన తర్వాత పిల్లలకు వంట చేసి 7.30 గంటలకు పిల్లలను నిద్రలేపుతా. వారిని పాఠశాలకు రెడీ చేసి పంపిస్తా. ఆ తర్వాత నేనుకూడా రెడీ అయి ఆస్పత్రికి వెళ్లాల్సి ఉంటుంది. పిల్లలు చిన్నవారు కావడం వల్ల ప్రస్తుతం కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఒకవైపు పిల్లల మంచి చెడులు.. మరోవైపు ఉద్యోగం, కెరీర్ చూసుకోవడం పెద్ద టాస్క్గా మారింది. అయినా అన్నింటిని బ్యాలెన్స్గా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. – డాక్టర్ శిరీష, ఆర్ఎంఓ జనరల్ ఆస్పత్రి పిల్లలతో ఆర్ఎంఓ డాక్టర్ శిరీష -
సోషల్ మీడియా యుగంలో.. అమ్మ పాత్ర పెద్ద టాస్క్
ప్రస్తుత సోషల్ మీడియా యుంగంలో ఉద్యోగిగా ఉండే ఒక తల్లి పాత్ర అత్యంత ముఖ్యమని.. రెండువైపులా సమన్వయం చేసుకుంటూ జీవితంలో రాణించాల్సి ఉంటుందని చెబుతున్నారు మహబూబ్నగర్ ఎస్పీ డి.జానకి. మాకు ఒక కూతురు పేరు సంవేద్య చదువు కోసం హైదరాబాద్లో ఉంటుంది. వృత్తిరీత్యా ఎస్పీ కావడం వల్ల 24 గంటల బిజీగా (మహబూబ్నగర్ నగరంలో) ఉంటాను. ఆడపిల్లలు ఉన్న తల్లి మరింత అప్రమత్తంగా ఉంటూ వారికి అందుబాటులో ఉండటం చాలా అవసరం. ఎస్పీగా ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజు ఫోన్ మాట్లాడటానికి కొంత సమయం కేటాయిస్తాను. తన ఆరోగ్యంతోపాటు పాఠశాల విషయాలు, వ్యక్తిగత అంశాలు అన్నింటిని తెలుసుకుంటాను. సెలవులు వస్తే ఆమె ఇక్కడికి రావడం, లేదా వారంలో ఒకరోజు నేను అక్కడికి వెళ్లడం చేస్తాను. ఉద్యోగరీత్యా ప్రస్తుతం పాపకు కొంత దూరంగా ఉండాల్సి వస్తోంది. నేను నాన్ వెజ్ వంటలు చేయను.. కానీ, మా పాపకు చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం.. తనకు ఇష్టమైన చికెన్ ఫ్రై ఎంతో ఇష్టంగా చేసి పెడతాను. ఉద్యోగం వేరు.. తల్లి బాధ్యత వేరు.. ఈ రెండింటికి న్యాయం చేయాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. పిల్లలు ఒక వయసుకు వచ్చే వరకు వారికి తల్లితోడు ఎంతో అవసరం. – డి.జానకి, ఎస్పీ, మహబూబ్నగర్


