Bapatla
-
మంత్రి ఇలాకాలో పరేషన్
● తెనాలి ఎంఎల్ఎస్ పాయింట్ పరిధిలో నిండుకున్న రేషన్ బియ్యం నిల్వలు ● నాలుగు రోజులైనా రేషన్ దుకాణాలకు చేరని వైనం ● దాదాపు 80 షాపులకు మూడో తేదీకి మాత్రమే చేరిన సరుకులు ● ఇంకా రేషను అందని 40 షాపులు ● బియ్యం కోసం వచ్చి తిరిగి వెళుతున్న పేదలు వైఎస్సార్ సీపీ హయాంలో ఠంఛనుగా.. గుడివాడ నుంచి తోలటమే జాప్యానికి కారణం ! -
వంటింట్లోకి యుద్ధం!
మంగళవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 2026సత్తెనపల్లి: పశ్చిమాసియ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధాన్ని బూచిగా చూపించి మార్కెట్లో నిత్యవసరాల ధరలను అమాంతం పెంచేస్తున్నారు. దీంతో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజల జీవనం కష్టంగా మారుతోంది. పప్పుల నుంచి నూనెల వరకు అన్ని రకాల వస్తువుల ధరలు పెంచేయడంతో పేద ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ధరలను అదుపు చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం గుడ్లప్పగించి చూస్తోంది. ఇదే అదునుగా వ్యాపారులు ధరలను అమాంతం పెంచేస్తూ నిలువునా దోచేస్తున్నారు. ధరలను కట్టడి చేయాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. యుద్ధాన్ని బూచిగా చూపి.. అమెరికా–ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల నూనెల దిగుమతి తగ్గిపోయిందని చెబుతూ వ్యాపారులు ధరలను పెంచేస్తున్నారు. కొందరు వ్యాపారులైతే సిండికేట్గా మారి కృత్రిమ కొరత సష్టిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని వల్ల నూనె ధర లీటరుకు రూ. 20 నుంచి రూ. 30 వరకు పెరిగింది. పామాయిల్ ధర లీటరుకు రూ. 20, రిఫైండ్ ఆయిల్ ధర లీటర్కు రూ. 30 వరకు పెరిగింది. వివిధ రకాల పప్పుల ధరలు కూడా కేజీకి రూ.10 నుంచి రూ. 20 వరకు పెంచేశారు. ధరల కట్టడిలో విఫలం... నిత్యావసర ధరలు రెండు నెలల నుంచి పెంచి సామాన్యులను దోచుకుంటున్నప్పటికీ యంత్రాంగం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ధరలను కట్టడి చేయాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అసలు వీటిని పర్యవేక్షించాల్సిన అధికారులు అటుగా కనీసం చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకిలా వ్యవహరిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వ్యాపారులతో అధికారులు అంటకాగుతున్నారా? అంటూ పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు పాలకులు యుద్ధప్రభావం ఏమీ లేదని చెబుతుంటేఏ మరోవైపు ఇలా ధరలు పెరగడం చూస్తుంటే అసలేం జరుగుతుందన్న ప్రశ్నలు సామాన్యుడిలో తలెత్తుతున్నాయి. ఏం కొనేటట్టు లేం.. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన ప్రజల కొనుగోలు స్థితి పడిపోయింది. ఏ వంట చేయాలన్నా .. నూనె, గ్యాస్ కనీస అవసరం. నూనె లేనిదే, గ్యాస్ లేనిదే ఏ వంట చేయలేని దుస్థితి. ఈ పరిస్థితుల్లో నూనె ధరలు పెరగడం వల్ల వినియోగాన్ని తగ్గించుకుంటున్నారు. గ్యాస్ కొరత కారణంగా అసలు వంటకాలే తగ్గిస్తున్నారు. కొంత మంది రిఫైండ్ ఆయిల్ వాడిన వారు పామాయిల్తో సరిపెట్టుకుంటున్నారు. సామాన్యులకు వెజి ‘ట్రబుల్స్’... ప్రస్తుతం కూరగాయల ధరలు ఆకాశాన్నింటి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒక్కసారిగా కూరగాయల ధరలన్నీ పెరిగిపోయాయి. కొద్దిరోజులుగా కూరగాయల ధరలు రూ. 20 పైగా పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. కిలో వంకాయలు రూ.30 నుంచి రూ. 60 వరకు పెరిగాయి. డజన్ నిమ్మకాయలు రూ. 120 పైనే విక్రయిస్తున్నారు. కూరగాయలు రకాన్ని బట్టి రూ 10 నుంచి రూ. 30 వరకు పెరిగినట్లు వినియోగ దారులు చెబుతున్నారు. రకం పాతధర(కిలో) కొత్త ధర వంకాయలు రూ. 40 రూ. 60 టమాటా రూ. 30 రూ. 40 గోరుచిక్కుళ్లు రూ. 30 రూ. 40 బెండకాయలు రూ. 40 రూ. 50 దొండకాయలు రూ. 30 రూ. 40 పచ్చిమిర్చి రూ. 30 రూ. 50 బీరకాయలు రూ. 40 రూ. 60 పశ్చిమాసియా ఉద్రిక్తత కారణంగా ముఖ్యంగా హర్మూజ్ జలసంధి వద్ద రవాణా అంతరాయాలతో దేశంలో వంట గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ఇదే అదునుగా కొందరు గ్యాస్ సిలిండర్లను మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గృహ వినియోగ సిలిండర్ ఇంకా పూర్తిస్థాయిలో అందడం లేదు. ఇదిలా ఉండగానే మరోవైపు కమర్షియల్ సిలిండర్ ఏకంగా రూ. 993 పెరిగింది. గ్యాస్ కొరత లేదని అధికారులు చెబుతున్నా గ్రామాల్లో గ్యాస్ కష్టాలు మాత్రం తప్పడం లేదు ధరలను నియంత్రించడంతోపాటు గ్యాస్ సరఫరా పై ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. పప్పుల నుంచి నూనెల వరకు అదే తీరు సలసల కాగుతున్న వంట నూనెల ధరలు కూరగాయల ధరలకు సైతం రెక్కలు ఇంకా పూర్తిస్థాయిలో తీరని వంట గ్యాస్ కష్టాలు సామాన్య, పేద ప్రజలు బతికేదెలా? ఆందోళన వ్యక్తం చేస్తున్న పేదలు పట్టించుకోని కూటమి పాలకులు -
పశు ఔషధి కేందాల్లో చౌకగా మందులు
బాపట్ల: పశువుల కోసం జనరిక్ పశు ఔషధి విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలపై జిల్లా అధికారులతో సోమవారం స్థానిక కలెక్టరేట్లో ఆయన సమావేశం నిర్వహించారు. పశువులకు తక్కువ ధరకే నాణ్యమైన ఔషధాలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం జనరిక్ పశు ఔషధి విక్రయ కేంద్రాలను మంజూరు చేసిందని కలెక్టర్ చెప్పారు. జిల్లాకు నాలుగు కేంద్రాలు మంజూరయ్యాయన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ప్రాథమిక గొర్రెలు సహకార సంఘాల ద్వారా ఈ కేంద్రాలు నిర్వహిస్తామన్నారు. అత్యంత చౌక ధరలకే పశువులకు సంబంధించిన ఔషధాలన్ని ఈ కేంద్రాల్లో లభ్యమవుతాయన్నారు. ఒక ఔషధి కేంద్రం ఏర్పాటుకు రూ.3.61 లక్షలు ఖర్చు అవుతుందని, అందులో 25 శాతం ప్రభుత్వం నుంచి రాయితీ వస్తుందన్నారు. ఐదుగురు జిల్లా స్థాయి అధికారులతో నియమించిన కమిటీ ఔషధ కేంద్రాలకు అనుమతి ఇస్తుందన్నారు. జేసీ భావన వశిష్ఠ, డీఆర్ఓ జి.గంగాధర్ గౌడ్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వేణుగోపాల్ పాల్గొన్నారు. ● జిల్లాలో హెచ్ఐవీ నియంత్రణ మరియు నివారణ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో వైద్యాధికారులతో జిల్లాలో హెచ్ఐవీ నిర్మలన పై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ● కౌమార బాలబాలికల సాధికారత సాధనకు కిశోరి వికాసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కిశోర వికాసంపై రూపొందించిన వాల్పోస్టర్లను కలెక్టర్ సోమవారం విడుదల చేశారు. కిశోర వికాసం కార్యక్రమాలు వేసవిలో నిర్వహిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. మంగళవారం నుంచి జూన్ 11వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ -
రంగురాళ్ల కేసు నీరుగార్చేందుకు యత్నం
సాక్షి, టాస్క్ ఫోర్స్: రంగురాళ్ల కేసును నీరుగార్చే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండల పరిధిలోని శంకరాపురం అటవీ భూముల్లో టీడీపీ నాయకులు తవ్వితీసిన రంగురాళ్లను ఆ శాఖ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గత మూడు రోజుల క్రితం దాచేపల్లిలో ఓ గోడౌన్లో పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న రంగరాళ్లను వినుకొండకు తరలించి భద్రపరిచారు. అయితే స్వాధీన పరుచుకున్న రంగురాళ్ల వివరాలను నేటికీ పూర్తిస్థాయిలో అధికారులు వెల్లడించకపోగా... ఈ కేసుపై నీలినీడలు కమ్ముకునేలా వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. దాచేపల్లిలో దొరికిన రంగరాళ్లను టీడీపీకి చెందిన కీలక నేతల పాత్ర ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. టీడీపీలో కీలకంగా ఉన్న సదరు నాయకులపై కేసులు పెట్టకుండా జోరుగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలిసింది. రాష్ట్రస్థాయిలో ఓ ముఖ్య నేత ద్వారా ఫారెస్ట్ అధికారులపై ఒత్తిడి చేస్తూ టీడీపీ నాయకులను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తవ్వకాలు చేసే కూలీలపైనే కేసులు పెట్టేలా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. సూత్రధారులను విడిచిపెట్టేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లు వినికిడి. అధికారుల పాత్రే కీలకం దాచేపల్లిలో పట్టుబడిన రంగురాళ్లు సుమారుగా రూ.కోటి పైనే ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇంత భారీ స్థాయిలో రంగురాళ్లు పట్టుబడటం ఇదే మొదటిసారి. అటవీ భూముల్లో యథేచ్ఛగా రంగురాళ్ల కోసం తవ్వకాలు నిర్విరామంగా జరుగుతుంటే అధికారులు చూడకపోగా.. కేసులు కూడా నీరుగార్చేలా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఆ శాఖ అధికారులు కూడా తాయిలాలు అందినట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఓ కారులో లభించిన రంగురాళ్లను స్వాధీనం చేసుకున్న అధికారులు కారును వదిలి పెట్టేందుకు భారీ స్థాయిలో ముడుపులు తీసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. శాఖాపరమైన విచారణ జరిగినట్లు కూడా సమాచారం. రంగు రాళ్లు తవ్వించే అక్రమార్కులకు పూర్తిస్థాయిలో అటవీశాఖ అధికారుల సహకారం ఉండటం వల్లనే కొండకు సొరంగాలు వేస్తున్నారు. సహజసిద్ధమైన సంపదను కాపాడాల్సిన అధికారులే అక్రమార్కులతో చేతులు కలిపారు. శంకరాపురం కొండలలో రంగురాళ్ల తవ్వకాల వ్యవహారం పైస్థాయి అధికారులకూ తెలుసని సమాచారం. ఇకనైనా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
అగ్ని కీలలకు ఆహుతైన మొక్కజొన్న
ఇంకొల్లు(చినగంజాం): ప్రమాదవశాత్తూ పంట పొలాల్లో మంటలు చెలరేగడంతో పంటలు ఆహుతయ్యాయి. తహసీల్దార్ ఏవీఎస్ శ్రీనివాస్ అందించిన వివరాలు మేరకు.. మండలంలోని పావులూరు, చిన్ననక్కలపాలెం గ్రామాల మధ్య పంట పొలాల్లో ఆదివారం ఉదయం 9 గంటలు నుంచి 10 గంటల సమయంలో మూడు ప్రాంతాల్లో మంటలు చెలరేగడంతో సుమారు 100 ఎకరాల్లో పంట పొలాలు పూర్తిగా తగులబడిపోయాయి. సమాచారం అందుకున్న తహసీల్దార్ శ్రీనివాస్ చీరాల అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి వచ్చి సుమారు మూడున్నర గంటల పాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోనికి తీసుకొనివచ్చారు. అగ్ని ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాద స్థలానికి ఇంకొల్లు సీఐ రామానాయక్, ఎస్ఐ జీ సురేష్, అగ్నిమాపక శాఖ జిల్లా అధికారులు హాజరయ్యారు. అగ్ని ప్రమాద ఘటనలో రైతు సింగంశెట్టి వెంకటరత్నానికి చెందిన 4 ఎకరాలు మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి కావడంతో తీవ్రంగా నష్టపోయాడు. మిగిలిన 96 ఎకరాల్లో రైతులు ముందుగానే పంటను కోయడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా కోసిన తర్వాత మిగిలిన చొప్ప కూడా అగ్నిప్రమాదంలో తగలబడిపోయాయి. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సందర్శించి పంట నష్టపోయిన రైతుకు నష్టపరిహారం అందజేసేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాల్సిందిగా సూచించారు. -
నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్
నరసరావుపేట రూరల్: ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. అర్జీదారులు తమ సమస్య గురించి ఖచ్చితమైన, పూర్తి సమాచారంతో దరఖాస్తు చేయాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరిస్తారని తెలిపారు. అలాగే ప్రతి సోమవారం కలెక్టరేట్లో రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ముగ్గురు రెవెన్యూ డివిజనల్ అధికారులు, మండల తహసీల్దార్లు పాల్గొని వినతులు స్వీకరిస్తారని వివరించారు. రూ.25 లక్షల ఆస్తి నష్టం గుంటూరు రూరల్: ప్రత్తిపాడు మండలం గొట్టిపాడులో భారీ అగ్నిప్రమాదం ఆదివారం చోటుచేసుకుంది. పొలం సమీపంలో నాలుగు వరిగడ్డివాములు, ఒక లారీ దగ్ధం కావ్వటంతో భారీ నష్టం జరిగిందని బాధితులు గరికపాటి లక్ష్మయ్య తెలిపారు. పందెం ఎద్దులకు చెందిన వరిగడ్డి వాములు కావటం, దానితోపాటు ఒక లారీ, లారీలోని ఎద్దుల పందేలకు వినియోగించే సామగ్రి దగ్ధమయ్యాయి. సుమారు రూ.25 లక్షల వరకూ ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని బాధితులు తెలిపారు. ఘటనపై ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): కుడొ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ ఆధ్వర్యంలో స్థానిక టీజేపీఎస్ కళాశాలలో జిల్లా నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించినట్లు ఎన్నికల పర్యవేక్షకుడు రిషి వర్మ రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా ఆర్ఆర్ ప్రసాద్, కార్యదర్శిగా సిద్ధార్థ, కోశాధికారిగా రిషి వర్మ రాజు ఎన్నికయ్యారు. ఎన్నికల నిర్వహణకు డిస్ట్రిక్ట్ స్పోట్స్ అథారిటీ నుంచి అబ్జర్వర్గా బాక్సింగ్ కోచ్ రామిశెట్టి విశ్వనాథ్, స్టేట్ అసోసియేషన్ నుంచి కోటిరెడ్డి హాజరయ్యారన్నారు. రిటర్నింగ్ ఆఫీసర్గా శ్రీనివాసరావు వ్యవహరించారని చెప్పారు. ‘మణిపాల్ లైవ్ బేరియాకాన్’లో ప్రముఖ వైద్యులు తాడేపల్లిరూరల్: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ‘మణిపాల్ లైవ్ బేరియాకాన్–2026’ పేరుతో ప్రత్యేక అకడమిక్ ఈవెంట్ను నిర్వహించారు. విజయవాడలోని వరుణ్ నోవాటెల్ హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు, బేరియాట్రిక్ సర్జన్లు హాజరై తమ అనుభవాలను వివరించారు. మణిపాల్ హాస్పిటల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు మాట్లాడుతూ ఊబకాయం ప్రధాన సమస్య కాదని, దీనికి సరైన ప్లానింగ్, మల్టీ డిసిప్లినరీ అప్రోచ్తో చికిత్స అవసరమని తెలిపారు. మణిపాల్ హాస్పిటల్ డైరెక్టర్ జె.రామాంజనేయరెడ్డి మాట్లాడుతూ బేరియాకాన్ ద్వారా ఆధునిక శస్త్రచికిత్స నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, రోబోటిక్ సర్జరీ సేవలు, వైద్య సమాజానికి దగ్గర చేయడం తమ లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు బత్తిని రాజేష్, రాజేష్ చండ్ర, వరుణ్ దాసరి, రవి దాస్యం, అమిత్ , భానుప్రవీణ్ నాయుడు, మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు రూరల్: మండుతున్న ఎండల వేళ ఆదివారం వర్షం కురిసింది. కాకుమాను, పెదనందిపాడు, గుంటూరు రూరల్ మండలాల్లో మబ్బులతో కూడిన వర్షం పడింది. కాకుమాను గ్రామంలో అక్కడక్కడ చిన్నపాటి వడగడ్లు పడ్డాయి.. -
మున్సిపల్ ట్రాక్టర్ను ఢీకొన్న కారు
పిడుగురాళ్ల: మున్సిపల్ ట్రాక్టర్ను వెనుక నుంచి కారు ఢీకొనటంతో ఒకరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలైన సంఘటన పిడుగురాళ్ల పట్టణంలోని బైపాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... నరసరావుపేటకు చెందిన ఓ కుటుంబం కారులో తెలంగాణ రాష్ట్రంలోని జానపాడు దర్గా దర్గకు వెళ్తున్నారు. ఈక్రమంలో కొండమోడు డంపింగ్ యార్డులో చెత్తను వేసి పిడుగురాళ్లలోని ఓటర్ ట్యాంక్ వద్ద పార్క్ చేసేందుకు వస్తున్న ట్రాక్టర్ను పట్టణంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి దగ్గరలో కారు వెనుకగా ఢీకొనడంతో కారు గాలిలో పల్టీలు కొట్టి కింద పడింది. ఘటనలో ఇమామ్ హుస్సేన్ (38) అక్కడిక్కడే మృతి చెందగా కరిముల్లా, షకీరా, నజీమా, నూర్జహాన్, హసీమా, జానీలకు గాయాలయ్యాయి. సంఘటన స్థలాన్ని పిడుగురాళ్ల పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావు, ఎస్ఐ శివనాగరాజు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా.. క్షతగాత్రులను పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం నరసరావుపేటకు తరలించారు. సీఐ శ్రీరాం వెంకట్రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ముగిసిన అండర్–11 చెస్ పోటీలు
గుంటూరు వెస్ట్(క్రీడలు): స్థానిక ఇన్నర్ రింగ్ రోడ్డులోని విజేత ఐఐటీ స్కూలులో ఆదివారం నైట్ క్యాజిల్ చెస్ అకాడమీ ఆధ్వర్యాన నిర్వహించిన అండర్–11 చిన్నారుల చెస్ పోటీలు ముగిశాయని టోర్నమెంట్ డైరెక్టర్ వైవీకే చక్రవర్తి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 50 మందికిపైగా చిన్నారులు పోటీల్లో పాల్గొన్నారన్నారు. బాలికల విభాగంలో పి.లాలిత్య, పి.భవిష్య, బాలురలో ఎం.చేతన్, శౌర్యదీప్ సింగ్లు ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించి విజేతలుగా నిలిచారన్నారు. నలుగురు చిన్నారులు ఈ నెల 9, 10 తేదీల్లో విశాఖపట్నంలో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్ రవీంద్రరాజు, విజేత స్కూల్ డైరెక్టర్ నిమ్మల సురేష్, ఇన్చార్జి సంధ్యలు విజేతలకు బహుమతులు అందించారని తెలిపారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నగరం: భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి మీ భూమి–మీ హక్కు కార్యక్రమం దోహదపడుతుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. బాపట్ల జిల్లా నగరం మండలం పూడివాడ గ్రామంలో ఆదివారం జరిగిన పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. మీ భూమి–మీ హక్కు కార్యక్రమంలో భాగంగా చేపట్టిన రీ సర్వేతో రైతులకు స్పష్టమైన భూ హక్కులు లభిస్తున్నాయన్నారు. రీసర్వే పూర్తయిన తర్వాత శాసీ్త్రయంగా రూపొందించిన భూ హక్కు పత్రాలు పట్టాదార్ పాస్పుస్తకాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ బి.వినోద్కుమార్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భూముల హద్దులు, విస్తీర్ణం కచ్చితంగా నిర్ధారించడంతో భూ వివాదాలు తగ్గడమే కాకుండా రైతులకు బ్యాంక్ రుణాలు, ప్రభుత్వ పథకాలు సులభంగా పొందవచ్చన్నారు. భూహక్కు పత్రాలు, పాస్ పుస్తకాలను రైతులు భద్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట, ఆర్డీవో శ్రీదేవి, తహసీల్దార్ నాంచారయ్య, ఎంపీడీవో శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు. యడ్లపాడు: మండల పరిధిలోని సొలస గ్రామంలో వెలసిన శ్రీ భూ సమేత రంగనాయక స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలు ఆదివారం పవళింపు సేవతో ముగిశాయి. ఉత్సవాల ముగింపులో భాగంగా ఆలయ అర్చకులు పర్చూరి రామకృష్ణమాచార్యుల నేతృత్వంలో స్వామి వారికి పూలంగి సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం ద్వాదశ ప్రదక్షిణలు చేశారు. ఆలయ ఈఓ నెమలిరెడ్డి పర్యవేక్షణలో ధర్మకర్తలు అర్వపల్లి మనోహర్– నాగజ్యోతి దంపతులు, అర్వపల్లి బ్రదర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు భక్తులు భారీగా తరలివచ్చి రంగనాథుని దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా సాగిన ఈ కార్యక్రమాల అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ గావించారు. భక్తుల గోవింద నామస్మరణతో సొలస క్షేత్రం మార్మోగింది. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 525.40 అడుగులకు చేరింది. ఇది మొత్తం 159.3072 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 450 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
పెద్దాసుపత్రికి నిర్లక్ష్య రోగం
గుంటూరు మెడికల్: జీజీహెచ్కు క్యాజువాలిటీ (ఎమర్జన్సీ వార్డు) గుండె లాంటిది. రోడ్డు ప్రమాదాల బాధితులు, దాడుల్లో గాయపడిన వారు, విషప్రభావానికి గురైన వారిని అత్యవసర సేవల విభాగంలో (ఎమర్జెన్సీ వార్డు) చేరుస్తారు. అయితే ఎమర్జెన్సీ వార్డులో సరైన వైద్య సౌకర్యాలు అందుబాటులో లేవు. ముఖ్యంగా డ్యూటీలో ఉండాల్సిన డ్యూటీ అసిస్టెంట్ ఫిజీషియన్లు (డీఏపీ), డ్యూటీ అసిస్టెంట్ సర్జన్లు (డీఏఎస్)లు అందుబాటులో ఉండటం లేదు. ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్టుమెంట్ ఉన్నప్పటికీ సదరు వైద్యులు సక్రమంగా విధులు నిర్వహించడం లేదు. ఎమర్జెన్సీ వార్డులో పర్యవేక్షణ చేయాల్సిన సివిల్ సర్జన్ ఆర్ఎంఓ ఆస్పత్రిలో నివాసం ఉండటం లేదు. రాత్రి వేళల్లో ఎమర్జన్సీ వార్డులో అందుబాటులో ఉండటం లేదు. నర్సింగ్ అధికారుల పర్యవేక్షణ మొక్కుబడిగా ఉంది. వైద్య పరీక్షల కోసం ఎదురు చూపులు.... జీజీహెచ్లో వ్యాధి నిర్ధారణ కోసం చేసే సిటీ స్కాన్, ఎమ్మారై స్కాన్, ఆల్ట్రాసౌండ్ స్కాన్, ఎక్స్రే, రక్త పరీక్షలు ఇలా వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం రోగులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. స్ట్రక్చర్లపై, వీల్చైర్లలో ఆక్సిజన్ మాస్క్లు ధరించి సైతం రోగులు వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. వైద్య పరీక్షల అనంతరం రిపోర్ట్లకు సైతం ఇదే తరహా కష్టాలు రోగులకు తప్పడం లేదు. ప్రైవేటు అంబులెన్స్లే దిక్కు..... పెద్దాసుపత్రికి వచ్చి చనిపోతే వారి భౌతిక కాయాన్ని తరలించాలంటే... ముఖ్యంగా రాత్రి వేళల్లో తరలించాలంటే బంధువులు రూ.వేలల్లో ప్రైవేటు అంబులెన్స్ల వారికి డబ్బులు చెల్లించాల్సిందే. మృతదేహాలను తరలించే కాంట్రాక్ట్ను మహాప్రస్థానం పేరుతో ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించింది. వారు సాయంత్రం ఆరు గంటలు దాటితే సేవలు నిలిపివేస్తున్నారు. రాత్రివేళ చనిపోతే మరుసటిరోజు వరకు వార్డులో లేదా మార్చురీలో ఉండాల్సిందే. అర్ధాకలితో విధుల నిర్వహణ జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్లో పనిచేస్తున్న సుమారు 30 మంది వైద్య సిబ్బందికి ఏడాదిపైగా వేతనాలు చెల్లించలేదు. కాంట్రాక్ట్ స్టాఫ్నర్సులు, పారామెడికల్ సిబ్బంది సుమారు 700 మందికి పైగా రెండు నెలలుగా వేతనాలు చెల్లించలేదు. వేతనాలు రాక పలువురు వైద్య సిబ్బంది అర్ధాకలితో విధులు నిర్వహిస్తూ అవస్థలు పడుతున్నారు. శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బందికి సైతం ప్రతినెలా వేతనాలు చెల్లింపులు జరగటం లేదు. ముట్టజెప్పాల్సిందే... కాన్పుల విభాగంలో, మార్చురీ వద్ద, ఆపరేషన్ థియేటర్ల వద్ద అధిక మొత్తంలో మామూళ్లు వసూలు చేసి రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నా ఆసుపత్రి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుండిపోతున్నారు. రోగులకు కట్టుమార్చే వారు సైతం ముడుపులు తీసుకుని డ్రెస్సింగ్ చేస్తున్నారు. పెద్ద ఆసుపత్రిలో పుట్టినా, గిట్టినా ముడుపులు తప్పనిసరి అన్నట్లుగా కింది స్థాయి ఉద్యోగులు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కార్యాలయంలోనూ మామూళ్ల రోగం తీవ్ర స్థాయిలో ఉందని ఆసుపత్రి ఉద్యోగులు వాపోతున్నారు. మందులు, సర్జికల్, ఆక్సిజన్, వర్క్షాపు బిల్లుల మంజూరుకు పర్సంటేజీలు ఇవ్వకపోతే సంతకాలు చేయడం లేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నారు. నీటి కష్టాలు తప్పడం లేదు ఎండలకు జీజీహెచ్లో రోగులు నీటి సరఫరా లేక అల్లాడిపోతున్నారు. తాగునీరు తప్పనిసరిగా బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. దాతల సాయంతో కూలింగ్ వాటర్ కూలర్స్ ఏర్పాటు చేసినా వాటిల్లో నీటిని నింపే ప్రక్రియ సక్రమంగా చేయడం లేదు. ఆసుపత్రిలో రోగులను వార్డులోకి తరలించేందుకు అవసరమైన వీల్చైర్లు, స్ట్రక్చర్లు అందుబాటులో ఉండటం లేదు. రోగుల సహాయకులే తరలించాల్సిన దుస్థితి నెలకొంది. నిబంధనల ప్రకారం జీజీహెచ్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ వైద్య సేవలు అందించాల్సి ఉంది. కానీ పెద్ద ఆసుపత్రిలో సీనియర్ వైద్యులు పనివేళలు పాటించడం లేదు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించాల్సి ఉంది.గుంటూరు జీజీహెచ్లో అవుట్ పేషెంట్ విభాగంలో (ఓపీ) చికిత్స పొందాలంటే తొలుత ఓపీ చీటీ తీసుకోవాలి. ఆసుపత్రి అధికారులు ఓపీ చీటీల ప్రక్రియను ఆన్లైన్ చేశారు. ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న సెల్ఫోన్, ఆధార్ కార్డు ఉండి గంటసేపు క్యూలో ఉంటే ఓపీ చీటీ చేతికందుతుంది. తీరా ఓపీ చిటీ తీసుకుని వైద్యుల వద్దకు వెళితే అక్కడ సీనియర్ వైద్యులు వార్డుల్లో బిజీగా ఉంటూ జూనియర్ వైద్యులతో ఓపీ వైద్య సేవలను మమా అనిపిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
వినుకొండ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన పట్టణంలోని మార్కాపురం రోడ్డులో గల చెక్పోస్టు సెంటర్లో ఆదివారం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. నాదెండ్ల మండలం సాతులూరు గ్రామానికి చెందిన శివరాత్రి మునెయ్య (30) వినుకొండ రూరల్ మండలం శివాపురం వద్ద జరిగే పాతపాటి పోలేరమ్మ తిరునాళ్ల సందర్భంగా హోటల్ నిర్వహించేందుకు సామగ్రి ఆటోలో వేసుకొని బయలుదేరాడు. చెక్పోస్టు సెంటర్ వద్దకు రాగానే జేసీబీ రోడ్డుపైకి రావడంతో ఆటో అదుపు తప్పి జేసీబీని ఢీకొట్టింది. ఈ ఘటనలో మునెయ్య మృతి చెందాడు. ఆటోలో ఉన్న మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మునయ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ముగిసిన జాతీయ నాటకోత్సవాలు
చీరాల: చీరాల కళాంజలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల జాతీయ 9వ నాటకోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. స్థానిక కస్తూర్బా గాంధీ మున్సిపల్ గరల్స్ హైస్కూల్ ఆవరణలో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి శింగమనేని సుబ్బారావు కళావేదికపై సుమ్రిత యూత్ అసోసియేషన్, మధిర వారి యయాతి అనే పౌరాణిక నాటకం ప్రదర్శించారు. ప్రతిరోజూ రెండు నాటికలతో పాటు కూచిపూడి నృత్య ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. వర్తమాన సమాజ స్థితిగతులకు నాటికలు అద్దంపట్టాయి. కార్యక్రమానికి ప్రేక్షకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు సంస్థలు వారిచే నాటిక పోటీలను నిర్వహించారు. నాటకోత్సవాలు విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించిన కళాంజలి కార్యదర్శి సాంబశివరావును అభినందిస్తూ గౌరవ సత్కారం నిర్వహించారు. కళాంజలి అధ్యక్ష, కార్యదర్శులు కోడూరి ఏకాంబరేశ్వరబాబు, సాంబశివరావు, బత్తుల బ్రహ్మారెడ్డి, వలివేటి మురళీకృష్ణ, పూర్ణా సత్యం, లూక, పొట్టి శ్రీనివాసరావు, దరియా సాహెబ్ తదితరులు తెలిపారు. -
రంగస్థల ప్రముఖులకు అవార్డుల ప్రదానం
తెనాలి: కొలంకపురి నాటక కళాపరిషత్, శ్రీసాయి ఆర్ట్స్, కొలకలూరు సంయుక్త నిర్వహణలో ఉభయ రాష్ట్రస్థాయి 12వ ఆహ్వాన నాటికల పోటీలు రెండోరోజైన ఆదివారం రాత్రి కొనసాగాయి. కొలకలూరు గ్రామపంచాయతీ పరిధిలోని ఖాజీపేట నాటకశాల వద్ద ప్రత్యేక వేదికపై జరుగుతున్న ఈ నాటిక పోటీలు గడ్డం ప్రకాష్ జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. ఇందులో భాగంగా హైదరాబాద్కు చెందిన ప్రముఖ రంగస్థల, టీవీ, సినీనటులు డాక్టర్ గోవాడ వెంకట్కు కరణం సురేష్ జ్ఞాపకార్థం ‘సవ్యసాచి’ అవార్డును ప్రదానం చేసి సత్కరించారు. విజయనగరానికి చెందిన ప్రముఖ రంగస్థల నటి ఎస్.జ్యోతిరాణికి గోపరాజు హేమలత జీవిత సాఫల్య పురస్కారాన్ని గోపరాజు శివరామకృష్ణ హనుమత్ శేఖర్, కుటుంబసభ్యులు ప్రదానం చేశారు. సభకు ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ మాజీ కార్యదర్శి డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు అధ్యక్షత వహించారు. కళారంగ ప్రముఖులు డాక్టర్ ముత్తవరపు సురేష్బాబు (చిలకలూరిపేట), గుదె పాండురంగారావు (అనంతపురం), కూచి రామాంజనేయులు (వినుకొండ), ఏటూరి రోహిణీకుమార్ (హైదరాబాద్), చెరుకూరి సాంబశివరావు (గుంటూరు) పాల్గొన్నారు. కళారంగంలో కొలంకపురి నాటక కళాపరిషత్, శ్రీసాయి ఆర్ట్స్, కొలకలూరు చేస్తున్న కృషిని ప్రశంసించారు. గోపరాజు రమణ, గోపరాజు విజయ్, వైఎస్కేఎన్ స్వామి, సుంకర శ్రీనివాసరావు, సుద్దపల్లి మురళీధర్ పర్యవేక్షించారు. నాటక పోటీల్లో భాగంగా తొలుత కళానికేతన్, వీరన్నపాలెం వారి ‘దీపం కింద చీకటి’ నాటికను ప్రదర్శించారు. అగస్త్య రచనకు వైబీ చౌదరి దర్శకత్వం వహించారు. తదుపరి హేలాపురి కల్చరల్ అసోసియేషన్–ఏలూరు వారి ‘అనగనగా ఓ రాత్రి’ నాటికను ప్రదర్శించారు. పీవీ సత్యనారాయణ రచనకు మహమ్మద్ ఖాజావలి దర్శకత్వం వహించారు. చివరగా ఎస్ఎంఆర్ క్రియేషన్స్–అనకాపల్లి వారి ‘మలిసంధ్య’ నాటికను ప్రదర్శించారు. గోవిందరాజుల నాగేశ్వరరావు రచనకు ముత్యాలరావు దర్శకత్వం వహించారు. -
చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో సదస్సు
గుంటూరు మెడికల్: చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో బీపీ మండల్ ట్రస్ట్ అధ్యక్షుడు, గుంటూరుకు చెందిన ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు అనేకమంది మేధావులను, ఉద్యమకారులను కలిసి మద్దతు కోరారు. స్వరాజ్ అభియాన్ అధ్యక్షుడు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్, ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ సుకుమార్, సీనియర్ జర్నలిస్ట్, రాజ్యసభ టీవీ మాజీ చైర్మన్ ఊర్మిలేష్, రాష్ట్రీయ జనతాదళ్ అధికార ప్రతినిధులు డాక్టర్ కాంచన యాదవ్, కుమారి ప్రియాంక భారతి, సమాజ్ వాది పార్టీ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ లక్ష్మణ్, ఏఐసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ రాజేంద్రపాల్ గౌతమ్, ప్రొఫెసర్ సందీప్ తదితరులను డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు కలిశారు. ఈ సందర్భంగా తాను కలిసిన వారికి డాక్టర్ వెంకటేశ్వర్లు 1992లో ఆనాటి కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు, కేపీ రెడ్డయ్య యాదవ్ ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించిన ప్రతిని వారికి అందజేశారు. లోక్ సభలోను , అనేక రాష్ట్రాల అసెంబ్లీలలో ఓబీసీల సంఖ్య చాలా తక్కువగా ఉన్నదని, రిజర్వేషన్లు కల్పించకపోతే రానున్న కాలంలో వారి సంఖ్య మరీ తగ్గిపోయే అవకాశం ఉన్నట్లు ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ ఆందోళన వ్యక్తం చేసినట్లు డాక్టర్ ఆలా వివరించారు. ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కోసం ఆగస్టు 7న ఢిల్లీలో మేధావుల సదస్సును నిర్వహించనున్నట్లు ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సందీప్ వివరించినట్లు చెప్పారు. -
ఊళ్లకు వెళ్తే సమాచారం ఇవ్వండి
బాపట్లటౌన్: వేసవిలో ప్రజలు అప్రమత్తంగా ఉన్నప్పుడే దొంగతనాల నివారణ సాధ్యమని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. వేసవి సెలవుల సందర్భంగా అనేక కుటుంబాలు విహారయాత్రలు, తీర్థయాత్రలు, సుదూర ప్రాంతాల్లో నివసిస్తున్న బంధువుల ఇళ్లకు వెళుతుంటారని, ఈక్రమంలో ఇళ్లల్లో చోరీలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఊళ్లకు వెళ్లేవారు ముందస్తుగా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఇళ్లకు తాళాలు వేసి ఉండటం వల్ల, పరిస్థితులను గమనించి అపరిచితులు, దుండగులు తాళాలు వేసిన గృహాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. దొంగతనాలను నివారించేందుకు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విలువైన వస్తువులు, బంగారం, వెండి ఆభరణాలను తాళం వేసిన ఇంటిలో ఉంచకుండా బ్యాంక్ లాకర్లు, ఇతర సురక్షిత ప్రదేశాల్లో భద్రపరచాలన్నారు. సమాచారం అందినప్పుడు పోలీసులు ఆ గృహాలపై ప్రత్యేక నిఘా ఉంచి రాత్రి గస్తీ సమయంలో ఆ ఇళ్లను పర్యవేక్షిస్తారన్నారు. ఎక్కడైనా అపరిచిత వ్యక్తులు, అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులు కనిపించినట్లయితే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్కు, 112 నెంబర్కు కాల్ చేసి సమాచారం అందించాలన్నారు. ప్రజల సహకారంతోనే దొంగతనాలను సమర్థవంతంగా అరికట్టవచ్చన్నారు. జిల్లా వ్యాప్తంగా చోరీలను నియంత్రించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న గృహాల వివరాలను సేకరించి, రాత్రి గస్తీ తిరిగే సిబ్బంది ఆ గృహాలను పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. పోలీస్ సైరన్ వేస్తూ రాత్రి గస్తీ విధులు సమర్ధవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు భద్రతా భావన కలిగించాలన్నారు. అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులను క్షుణ్ణంగా విచారించి, అవసరమైతే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వారి వేలిముద్రలను సేకరించాలన్నారు. -
బంగారం వ్యాపారిపై దాడి కేసులో నిందితుల అరెస్టు
గురజాల: వ్యాపారిపై దాడి చేసి బంగారం దొంగిలించి పరారైన నిందితులను అరెస్టు చేసినట్లు పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు తెలిపారు. గురజాల డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. వినుకొండకు చెందిన బంగారం వ్యాపారి యక్కల శ్రీనివాసరావు రెడీమెడ్ బంగారం వస్తువులు అమ్మడం కోసం ప్రతి సోమవారం కారంపూడి వస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 27వ తేదీన కారంపూడికి వచ్చాడు. మధ్యాహ్నం సమయంలో అంకాళమ్మ దేవాలయం వద్ద యూనియన్ బ్యాంకు సమీపంలో నడుచుకుంటూ వెళ్తుండగా పథకం ప్రకారం అతనిపై దాడి చేసి అతని వద్ద ఉన్న బంగారం వస్తువులను తీసుకుని పరారయ్యారు. కారంపూడిలోని శివరామకృష్ణ జ్యూయలర్స్లో గుమాస్తాగా పనిచేస్తున్న గోసుల సాంబయ్య పన్నిన పథకం ప్రకారం నాదెండ్ల మండలం సాతులూరు గ్రామం బండారు అజిత్, గుంటూరు అంబేడ్కర్ నగర్కు చెందిన కాండ్రగుంట శశికుమార్, కాండ్రకుంట సాయికిరణ్, అన్నం నిఖిల్, గుంటూరులోని గుజ్జనగుండ్లకు చెందిన గోగుల పవన్, పమిడిపాడు గ్రామానికి చెందిన గోసుల సాంబయ్యలు ఒక ప్లాను ప్రకారం వ్యాపారి యక్కల శ్రీనివాసరావుపై దాడి చేసి బంగారం వస్తువులను దొంగిలించి పరారయ్యారు. ఆ ప్రాంతంలోని సీసీ పుటేజీలు ద్వారా నిందితులను పోలీసులు గుర్తించి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితులను కారంపూడిలోని పేటసన్నెగండ్ల కాలువ వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.60 లక్షల విలువ కలిగిన 566.60 గ్రాముల బంగారం, యమహా–ఎంటీ 15, హీరో గ్లామర్ ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితులను చాకచాక్యంగా పట్టుకుని అరెస్టు చేసిన పోలీసులను ఎస్పీ అభినందంచారు. సమావేశంలో డీఎస్పీ ఎంఎ మహేశ్వరరావు, సీఐ పి శరత్బాబు, ఎస్ఐ ఎం వాసులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా నీట్
చీరాల: బాపట్ల జిల్లాలో నీట్–2026 ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం చీరాలలోని రెండు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీ, ఎన్ఆర్పీఎం హైస్కూల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. కలెక్టర్ వి.వినోద్కుమార్ పరిశీలించారు. నీట్కు మొత్తం 558 మందికిగాను 540 మంది హాజరు అయ్యారు. ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో 14 రూమ్లో 336 మందికి గాను 321 మంది హాజరయ్యారు. ఎన్ఆర్పీఎం హైస్కూల్లో 10 రూమ్స్లో 222 మందికిగాను 219 మంది పరీక్ష రాశారు. ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, మున్సిపల్ కమిషనర్ డానియేల్ జోసఫ్, తహసీల్దార్ గోపీకృష్ణ, జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ స్నేహలత పాల్గొన్నారు. -
భక్తజనసంద్రంగా ఇంద్రకీలాద్రి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వేసవి సెలవులు, నీట్ పరీక్ష నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు, యాత్రికులు, విద్యార్థులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం 9 గంటల నుంచే అంతరాలయ దర్శనం రద్దు చేసి రూ.300 టికెట్పై బంగారు వాకిలి దర్శనం కల్పించారు. దీంతో ఉదయం 11గంటల కల్లా క్యూలైన్లో వేచి ఉన్న భక్తులందరికీ అమ్మవారి దర్శనం పూర్తయ్యింది. మరో వైపున అమ్మవారి మహా నివేదన నిమిత్తం మధ్యాహ్నం అన్ని దర్శనాలు నిలిపివేయడంతో క్యూలైన్లలో రద్దీ పెరిగింది. మధ్యాహ్నం 12.20 గంటలకు తిరిగి దర్శనాలు ప్రారంభం కాగా, క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు త్వరగా దర్శనం అయ్యేలా దేవస్థాన అధికారులు చర్యలు తీసుకున్నారు. భక్తుల రద్దీతో ఘాట్రోడ్డులోని పార్కింగ్ ప్రదేశం పూర్తిగా వాహనాలతో నిండిపోవడంతో కార్లు ఇతర వాహనాలను కనకదుర్గనగర్కు మళ్లించారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవల, పల్లకీ సేవలోనూ ఉభయదాతలు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో సూర్యోపాసన సేవ.. సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సూర్యోపాసన సేవ జరిగింది. లక్ష కుంకుమార్చన వేదిక వద్ద సూర్య భగవానుడి విగ్రహానికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సేవలో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. స్నాన ఘాట్, క్యూలైన్ల పరిశీలన.. దుర్గగుడి ఈవో శీనానాయక్ ఆదివారం పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తొలుత దుర్గాఘాట్ స్నానాల రేవులో అపరిశుభ్రంగా ఉండటంతో శానిటేషన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవులోని గట్టుపై మట్టి, వ్యర్థాలు నదిలో పడకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయాలని ఇంజినీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. ఎండల తీవ్రత నేపథ్యంలో భక్తులకు మజ్జిగ, మంచినీటితో పాటు చంటి పిల్లలకు బిస్కెట్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. తెనాలిరూరల్: రైలు నుంచి జారి పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన తెనాలి– చుండూరు స్టేషన్ల మధ్య ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పట్టాల వెంబడి మృతదేహం ఉందన్న సమాచారంతో తెనాలి జీఆర్పీ పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లారు. సుమారు 30 నుండి 35 ఏళ్ల మధ్య వయసు ఉన్న వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. రైలు నుంచి జారి పడడం వల్ల మృతి చెందాడని ప్రాథమికంగా భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. జీఆర్పీ ఎస్ఐ ఎల్. సరస్వతి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆక్రమించి తీరాల్సిందే..!
చీరాల అర్బన్: ఈపురుపాలెం స్ట్రయిట్కట్ మాదిరిగా వేటపాలెం స్ట్రయిట్కట్ సీమౌత్ వద్ద మార్పునకు వ్యూహం పన్నారు. ఆ ప్రాంత మత్స్యకారుల నుంచి వ్యతిరేకత రాకుండా స్ట్రయిట్కట్లో జెట్టీ నిర్మాణం జరుగుతుందని నమ్మబలుకుతున్నారు. ఆ ప్రాంత ప్రైవేటు వ్యక్తుల భూమి వెంట ప్రభుత్వ నిధులతో రోడ్డు ఏర్పాటుకు పథక రచన చేశారు. ఈ క్రమంలో పొట్టిసుబ్బయ్యపాలెం తీరం నుంచి స్ట్రయిట్కట్ కాలువ వరకు వారు అనుకున్నది జరిగితే సుమారు 50 ఎకరాల తీరప్రాంత భూమి అనధికారికంగా వారి ఆధీనంలోకి వెళుతుందని, దాని విలువ సుమారు రూ.100 కోట్లు ఉంటుందని చెప్పుకుంటున్నారు. అందుకు స్థానిక పచ్చనేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అభివృద్ధి పేరుతో... అక్కడ జరిగే లోపాలను, ఆక్రమణల ఆలోచన బయట పడకుండా అభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్నారు. ఆ క్రమంలో సదరు భూములు వెంట ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.2.50 కోట్లతో రోడ్డు నిర్మాణం జరుగుతోందని.. కలెక్టర్ నిధుల మంజూరుకు సానుకూలంగా స్పందించారని.. సీమౌత్ వద్ద వాలు మలుపు తిప్పుతామని చెబుతున్నారు. అందుకు డ్రైనేజీ శాఖ పరంగా నిధులు మంజూరు చేస్తారని.. లేదంటే తామే నిధులు సమకూర్చి అధికారుల పర్యవేక్షణలో వాలు మలుపు చర్యలు చేపట్టే విధంగా అడుగులు వేస్తున్నామంటున్నారు. కాలువ దగ్గర జెట్టీ నిర్మాణం జరుగుతోందని.. మత్స్యకారులకు ఇబ్బంది ఉండదని పేర్కొంటున్నారు. అప్పుడు తీరం నుంచి మా భూముల పక్కన వచ్చే రోడ్డు వరకు ఎత్తు, పల్లాలుగా ఉన్న ఇసుకను చదును చేస్తామని.. ఇలా ప్రస్తుతం ఆ ప్రాంతంలో జరుగుతున్న ప్రచారం. సీఆర్జెడ్ పరిధి పట్టించుకోవాలి.. ఆ ప్రాంతంలో తీరం నుంచి సీఆర్జెడ్ పరిధి, అభివృద్ధి పేరుతో జరుగుతున్న ప్రచారంలో చేపట్టే పనులు తదితర విషయాలపై సంబంధిత అధికారులు సమగ్రంగా సమాచారాన్ని బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. ఈపురుపాలెం స్ట్రయిట్ కట్ వివాదంలో అధికారులు మీనమేషాలు లెక్కించారు. తీరా సమస్య తీవ్ర రూపం దాల్చిన తరువాత పరిష్కార చర్యలు చేపట్టారు. చివరకు విషయం కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. తాజాగా వేటపాలెం స్ట్రయిట్కట్ వాలు మలుపుకు సంబంధించి ఆ ప్రాంతవాసుల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ముందస్తుగా అధికారులు స్పందించి వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలి. తీరం పరాధీనం కాకుండా కాపాడాలి. ప్లాట్లు విక్రయించేందుకు అడుగులు వీరిలో వస్త్ర వ్యాపారి ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి అనుమతులు రాకుండానే ప్లాట్లు వేసి విక్రయించేందకు అడుగులు వేశారు. విషయం బహిర్గతం కావటంతో ఆయన తాత్కాలికంగా వెనకడుగు వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం కొత్త ఆలోచనతో ముందుకెళుతున్నారు. అందుకు పచ్చనేత చేసిన హితోపదేశమే కారణమని సమాచారం. సునామీ సమయంలో... గతంలో సునామీ వచ్చినప్పుడు పొట్టిసుబ్బయ్యపాలెం తీరంలో భయంకరమైన అలల తాకిడికి సుమారు 9 మంది మృత్యువాత పడ్డారు. అప్పట్లో ఆ ప్రాంతంలో భారీ ఇసుక తిన్నెలు ఉండేవి. దీంతో ప్రమాదస్థాయి ఒకింత తగ్గింది. తరువాత ఇసుక తిన్నెలు మానవ చర్యలతో కనుమరుగయ్యాయి. ఈ క్రమంలో సీ వ్యూ పేరుతో తాత్కాలిక లబ్ధి కోసం చేపట్టే చర్యలు భవిష్యత్లో ప్రమాద హేతువులు కాకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. తీరం వెంట భూముల్లో ప్రభుత్వ స్థలం కూడా కొంత ఉందని వినిపిస్తున్న ఆరోపణల నేపథ్యంలో తహసీల్దార్ గీతారాణిని వివరణ అడగ్గా ఆమె పరిశీలించి తగిన చర్యలు చేపడతామన్నారు. వేటపాలెం స్ట్రయిట్కట్ నుంచి సీ మౌత్కు వెళ్లే వాలుకు సంబంధించి రైతులకు ఉపయోగపడే విధంగా చర్యలు చేపట్టాలని వెంకటేశ్వర్లు అనే రైతు మాకు అర్జీ ఇచ్చాడు. ముందస్తుగా ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తామని చెప్పాం. ఇంకా అక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. – సుబ్బారావు, డ్రైనేజీ విభాగ డీఈఈ వేటపాలెం స్ట్రయిట్కట్ (కాలువ)లో జెట్టీ నిర్మాణానికి ఎలాంటి ప్రతిపాదన లేదు. అక్కడ జెట్టీ నిర్మిస్తారనే ప్రచారం గురించి నాకు తెలియదు. మా పరంగా మేం ఎప్పుడు, ఎవరికీ జెట్టీ వస్తుందని చెప్పలేదు. – కృష్ణ కిషోర్, మత్స్యశాఖ ఏడీ, వేటపాలెం వేటపాలెం మండలం పొట్టి సుబ్బయ్యపాలెం పరిధిలో తీరాన్ని కబళించేందుకు పథక రచన జరుగుతోంది. తీరప్రాంత అభివృద్ధి ముసుగులో అక్రమార్కులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో చీరాలకు చెందిన ఓ బడా బాబు, కొత్తపేటకు చెందిన ఓ వస్త్ర వ్యాపారి కీలకపాత్ర పోషిస్తున్నారు.ఈ ఎపిసోడ్లో చీరాల బడా బాబుగా గుర్తింపు పొందిన వ్యక్తి ఒకరు. రెండో వ్యక్తి కొత్తపేటలో పేరున్న వస్త్ర వ్యాపారి. వీరిద్దరితోపాటు చీరాలకు చెందిన ఓ జ్యూవలరీ వ్యాపారి స్లీపింగ్ పార్టనర్. బడా బాబు, జ్యూవలరీ వ్యాపారి ఒక జట్టు. ఈ పథక రచన గతంలోనే జరిగింది. అయితే బడా బాబు నుంచి సుమారు 40 ఎకరాలు కొనుగోలు చేసి అగ్రిమెంట్ చేసుకున్న గుంటూరుకు చెందిన టీడీపీ నేత, స్థానిక స్థితిగతులను, కాస్త లోతుగా అధ్యయనం చేసిన తరువాత వెనక్కు తగ్గాడు. తరువాత కొత్తపేట వస్త్ర వ్యాపారి రంగంలోకి దిగాడు. పచ్చనేత, యువనేతల మద్దతు కూడగట్టాడు. ఈ క్రమంలో తాజా అడుగులు వేస్తున్నారు. -
బాగా చదివితే బంగారు భవిష్యత్తు
బాపట్ల: బాగా చదివితే మంచి భవిష్యత్తు మీ సొంతమవుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ విద్యార్థులతో అన్నారు. కోవిడ్తో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులతో జిల్లా కలెక్టర్ శనివారం ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. కష్టపడి శ్రద్ధతో చదువుకుంటే మీరు ఉన్నత స్థాయికి వెళ్తారని, అందుకు ప్రభుత్వం అండగా నిలిస్తుందని కలెక్టర్ చెప్పారు. చీరాలకు చెందిన ఊటుకూరి లీలాలక్ష్మీ, ఊటుకూరి లక్ష్మీనారాయణ, వేమూరికి చెందిన చైత్ర సాహితీ దాస్, సాయి ప్రీతమ్ లకు ప్రభుత్వమే ఉచితంగా విద్య అందిస్తుందన్నారు. ఇద్దరు తెనాలిలో, మరో ఇద్దరు తిరుపతిలో విద్యను అభ్యసిస్తున్నారని చెప్పారు. విద్యార్థులకు అవసరమైన కాలేజీ బ్యాగ్స్, ట్రాలీ బ్యాగ్స్ లు తక్షణమే ఇస్తామన్నారు. స్టడీ చైర్, స్టడీ టేబుల్ కావాలని చైత్ర సాహితీదాస్ కోరడంతో తక్షణమే ఇప్పించాలని మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఖాతా నుంచి వారికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేసి ఇవ్వాలని పీడీకి సూచించారు. ఇంటర్మీడియట్ విద్యలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైతే ఒక్కొక్కరికి ఒక్కో ల్యాప్టాప్ ఇస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం చదువులు, వారి యోగక్షేమాలను అడిగి ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియం చేసుకుని, మీ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని ఆయన సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ రాధా మాధవి, డీసీపీఓ పురుషోత్తం, ఎన్ఐసీ పీఓ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. వేతనాల సమస్యకు పరిష్కారం.. కారుణ్య నియామకం కింద నియమితులైన ఇరువురు ఉద్యోగుల వేతనాల సమస్యను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిష్కరించారు. 2024లో కారుణ్య నియామకం కింద ఇరువురు ఉద్యోగాలు పొందారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ ఆడిట్ టీం లో జూనియర్ అసిస్టెంట్ గా పి.వి.సందీప్, లీగల్ సెల్లో జూనియర్ అసిస్టెంట్గా రాజ్యలక్ష్మి నియమితులయ్యారు. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో 18 నెలల నుంచి వీరికి వేతనాలు విడుదల కాలేదు. కలెక్టర్ వినోద్ కుమార్ను కలిసి తమ సమస్యను విన్నవించారు. స్పందించిన కలెక్టర్ తక్షణమే వారి నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులు, సాంకేతిక సమస్యలను పరిశీలించి వేతనాలు విడుదల చేశారు. దీంతో వారిరువురు శనివారం కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కలను అందించి, కృతజ్ఞతలు తెలిపారు. సూర్యలంక పనుల పరిశీలన.. సూర్యలంక సముద్రతీరంలో జరుగుతున్న పనులను ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్, ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మరాజులు శనివారం పరిశీలించారు. అధికారులు పనుల పర్యవేక్షణలో శ్రద్ధ చూపించాలని సూచించారు. వారివెంట బాపట్ల ఆర్డీఓ పి. గ్లోరియా, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.విజయమ్మ, జిల్లా ఇన్చార్జి పర్యాటక శాఖ అధికారి ఆనందపాల్, ఏపీటీడీసీ మేనేజర్ సతీష్, పంచాయతీ రాజ్ ఎస్ఈ రాజన్ బాబు, గ్రామీణ నీటి సారాఫరా శాఖ ఎస్ఈ అనంత రాజు, డీఎఫ్ఓ రవిశంకర్ తదితరులు ఉన్నారు. కోవిడ్తో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులతో కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ సమావేశం -
ఇదేం రీల్స్ పిచ్చి!
గుంటూరు మెడికల్: పేదల పెద్ద ఆసుపత్రి గుంటూరు జీజీహెచ్ సోషల్ మీడియా రీల్స్కు అడ్డాగా మారింది. రోగులకు సేవలందించాల్సిన ఓ వైద్యుడు సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్గా మారింది. కర్రతో విన్యాసాలు చేస్తూ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట రీల్స్ చేసి వాట్సాప్ స్టేటస్గా పెట్టడంతోపాటు, ఫేస్బుక్, యూట్యూబ్లలో సైతం అప్లోడు చేశాడు. సాక్షాత్తు సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుటే డాక్టర్ రీల్స్ చేస్తున్నా సూపరింటెండెంట్ గానీ, సీఎస్ ఆర్ఎంఓగానీ, అడ్మినిస్ట్రేటర్ గానీ ఎవరూ ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తుంది. విధులకు డుమ్మా.. రీల్స్తో హంగామా జీజీహెచ్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఏఎస్) గా క్యాజువాల్టీ మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ గురుప్రసాద్ శుక్రవారం క్యాజువాల్టీలో విధులు నిర్వహించకుండా సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట రీల్స్ చేసిన విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. జీజీహెచ్లో క్యాజువాల్టీ ఆసుపత్రికి గుండెకాయలాంటిది. రోడ్డు ప్రమాద బాధితులు, విషప్రభావానికి గురైన వారు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ప్రాణాపాయ స్థితిలో అత్యవసర చికిత్సల కోసం వచ్చేవారంతా కూడా మొదట ఎమర్జెన్సీ వార్డుకు చికిత్స కోసం వస్తుంటారు. అక్కడ వైద్యులు నిరంతరం అప్రమత్తంగా ఉండి బాధితులను రోగులను సత్వరమే పరీక్షించి చికిత్స అందించడం ద్వారా ప్రాణాలు పోకుండా కాపాడవచ్చు. ఎంతో కీలకమైన క్యాజువాల్టీలో డాక్టర్ విధులు నిర్వహించకుండా రీల్స్ చేయడంపై ప్రశ్నించినందుకు ఎమర్జెన్సీ మెడిసిన్ ఇన్చార్జి, ఆర్ధోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ అనిల్బాబుతో సైతం దురుసుగా మాట్లాడి కర్రతో దాడిచేసినట్లు డాక్టర్ అనిల్బాబు లిఖిత పూర్వకంగా ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేశాడు. గతంలోనూ ఆరోపణలు.. గతంలోనూ ఎమర్జెన్సీ మెడిసిన్లో విధులు నిర్వహించడం లేదని, డ్యూటీలు నిర్వహించకుండా రీల్స్ చేస్తున్నారన్న ఆరోపణలు డాక్టర్ గురుప్రసాద్పై వచ్చాయి. అతడిపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటూ గతంలో ఎమర్జెన్సీ మెడిసిన్ ఇన్చార్జిగా పనిచేసిన డాక్టర్ గాజుల రామకృష్ణ సైతం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ ఆసుపత్రి అధికారులు సదరు వైద్యుడిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోవడం వల్లే మళ్లీ నేడు ఆవిధంగా రీల్స్ చేస్తూ ఆసుపత్రి పరువు బజారున పడేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రిలో వైద్యులు ఇలా సోషల్ మీడియాలో రీల్స్ చేయడం విమర్శలకు తావిస్తుంది. జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్వర్మ సంఘటనపై స్పందించి ఎమర్జెన్సీ వార్డులో రోగులకు సత్వర వైద్య సేవలు అందించేలా వైద్యులు నిత్యం అందుబాటులో ఉండేలా చూడాలని, రీల్స్ చేయకుండా కట్టడి చేయాలని పలువురు కోరుతున్నారు. -
వైభవంగా సాక్షి భావనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు
పొన్నూరు: పట్టణంలోని సుందరవల్లీ రాజ్యలక్ష్మి సమేత సాక్షి భావనారాయణస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శనివారం ఉదయం వసంతోత్సవం, చక్రస్నానం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రాత్రి ధ్వజారోహణం, హేయ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ అధికారులు, ధర్మకర్తలమండలి సభ్యులు శిఖాకొల్లి గుర్నాధరావు, కాట్రగడ్డ రామచంద్రరావు, గుడివాడ పవన్, ధరణికోట పద్మావతి, ఆకురాతి అనురాధ, ఊటుకూరి బాజీ శిరీష, కూరాకుల సత్యనారాయణ, సింహాద్రి వెంకటలక్ష్మి, పరాశరం రంగవల్లి, ఎక్స్ అఫీషియో సభ్యులు పొన్నూరు బాలగంగాధరతిలక్ పర్యవేక్షించారు. ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూ దూరవిద్య కేంద్రం పరిధిలో ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరిగిన పలు యూజీ కోర్సుల పరీక్ష ఫలితాలను వర్సిటీ ఇన్చార్జి వీసీ ఆచార్య కె గంగాధరరావు శనివారం విడుదల చేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బీఏ, బీబీఏ, ఐదవ సెమిస్టర్, బీకాం జనరల్, కంప్యూటర్ సైన్స్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను వెల్లడించామన్నారు. ఈనెల 13వ తేదీలోగా రీవాల్యుయేషన్కు దరఖాస్తులు అందజేయాలని సూచించారు. యూజీ కోర్సులకు ప్రతి పేపర్కు రూ.1200 చొప్పున ఫీజు చెల్లించాలన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈనెల 16వ తేదీలోగా పరీక్షల కోఆర్డినేటర్ కార్యాలయానికి అందజేయాలని సూచించారు. పూర్తి వివరాలను వర్సిటీ వెబ్సైట్ నుంచి పొందవచ్చన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య జి సింహాచలం, ఐసీటీ డైరెక్టర్ ప్రభాకర్, పరీక్షల విభాగ డిప్యూటీ రిజిస్ట్రార్ జైనలుద్దీన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు కోదండపాణి, సూపరింటెండెంట్ టంకశాల వెంకటేశ్వర్లు, ఉద్యోగులు మురళి, వలి, మోహన్ తదితరులు పాల్గొన్నారు. వినుకొండ: మహిళపై లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న సీఐ చిన్నమల్లయ్యపై పోలీస్ ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు చేపట్టారు. వినుకొండకు చెందిన ఓ మహిళపై లైంగికదాడితోపాటు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐను శనివారం సస్పెండ్ చేశారు. కేసు నమోదు నేపథ్యంలో సీఐ పరారీలో ఉన్నాడు. ఆయనను పట్టుకునేందుకు నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు ఆంధ్ర, తెలంగాణల్లోని పలు ప్రాంతాల్లో వెతుకులాట ప్రారంభించారు. ఏ క్షణమైన ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. నగరంపాలెం: పోలీస్ విధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలు దృష్ట్యా ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు (హెచ్సీ), ఒక కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు, అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో తాడేపల్లి పోలీస్స్టేషన్న్ హెచ్సీ ఏవీ.రమణ, కానిస్టేబుల్ సీహెచ్.రాము, తెనాలి గ్రామీణ పోలీస్స్టేషన్ హెచ్సీ చెంగల రాయుడుని సస్పెండ్ చేశారు. జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బంది విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, నిబద్ధతతో వ్యవహరించాలని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజలతో మర్యాదగా మెలగాలని చెప్పారు. అవినీతి, అసాంఘిక కార్యకలాపాలు, విధుల దుర్వినియోగానికి పాల్పడవద్దని సూచించారు. ఎవరైనా గీత దాటితే శాఖాపరమైన చర్యలు కఠినంగా ఉంటాయని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. -
ఊసే లేని ఉచితం.. ఆగని అక్రమం
చీరాల అర్బన్: నియోజకవర్గంలో అధీకృత ఇసుక రీచ్లు లేవు. కానీ ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగుతున్నాయి. ఉచిత ఇసుక ఊసే లేదుకానీ, పచ్చనేత అండతో అక్రమ ఇసుక దందా ఆగడం లేదు. ఉచిత ఇసుక ఎక్కడ చంద్రబాబు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కప్పం చెల్లిస్తేనే రైట్ రైట్.. ఉచిత ఇసుక డిపో ఏర్పాటు చేసిన కొత్తలో ఎడ్ల బండ్ల యజమానులు ఇసుక తోలకాలతో కొంత మేర ఉపాధి పొందేవారు. ఈక్రమంలో అక్రమ దందా ఆపేందుకు అని ఇసుక డిపోను కొద్దిరోజులు మూసేశారు. ఎడ్ల బండ్లకు చెక్ చెప్పారు. కప్పం చెల్లించే ట్రాక్టర్లకు పచ్చజెండా ఊపారు. అందుకు ఆర్థికపరమైన వ్యక్తిగత ప్రయోజనాలు పని చేశాయన్నది బహిరంగ రహస్యం. జిల్లాలో కొల్లూరు, జువ్వెలదిన్నెలలో మాత్రమే అధీకృత ఇసుక రీచ్లు ఉన్నాయి. కానీ నియోజకవర్గంలో ఎక్కడ పడితే అక్కడ భారీగా ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా జరుగుతోంది. ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు ఇసుక అక్రమంగా రవాణా అవుతోంది. ఇంతజరుగుతున్నా.. అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. సొంతింటి నిర్మాణాలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వాస్తవానికి సొంతిల్లు నిర్మాణానికి సంబంధించి ఆ ప్రాంత తహసీల్దార్ నుంచి అనుమతి తీసుకుని ఎడ్ల బండ్లు లేదా ట్రాక్టర్లు ద్వారా ఇసుకను తరలించుకోవచ్చు. అయితే అక్రమార్కుల ఆధీనంలో ఇసుక వ్యవస్థ బందీ అయ్యింది. దీంతో సొంతింటి అవసరాలకు కూడా ఇసుకను అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చీరాల నియోజకవర్గం ప్రభుత్వం ప్రకటించిన అఽధీకృత ఇసుక రీచ్ల జాబితాలో లేదు. ఈ నేపథ్యంలో 2024 జూలై మొదటి వారంలో వేటపాలెం మండలం నాయినిపల్లి పరిధిలో ప్రభుత్వ ఉచిత ఇసుక డిపోను ఏర్పాటు చేశారు. రీచ్లు ఉన్న ప్రాంతాల నుంచి ఇసుకను డంప్ చేశారు. ఏమైందో ఏమో కానీ అది మూన్నాళ్ల ముచ్చటయ్యింది. కొద్ది రోజులకే డిపోను తీసేశారు. -
స్వర్ణ ప్రకాశ రూపిణిగా బగళాముఖి అమ్మవారు
బాపట్ల: ప్రసిద్ధిగాంచిన చందోలులోని బగళాముఖి అమ్మవారు స్వర్ణ ప్రకాశ రూపిణిగా దర్శనమిచ్చారు. దివ్యక్షేత్రం వార్షిక ఉత్సవాలలో భాగంగా శనివారం ప్రాచీన స్వర్ణ ఆభరణాల శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం ఆభరణాలను అమ్మవారికి అలంకరింపజేశారు. అమ్మవారిని దర్శించడానికి జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు విచ్చేశారు. తొలుత ఆలయం నుంచి దేవాదాయ, పోలీస్, రెవెన్యూ పంచాయతీ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో చందోలు స్టేట్ బ్యాంకు వద్దకు శోభాయాత్రగా చేరుకొనగా బ్యాంక్ మేనేజర్కు అనుమతి లెటర్ ఇచ్చి అందరూ సంతకాలు చేసి బ్యాంకు నుంచి సీల్డు నగలు బాక్స్ను స్వీకరించి ఆలయానికి చేరుకున్నారు. ఆలయం వద్దకు చేరుకొని అందులో ఉన్న ఆభరణాలను అధికారుల సమక్షంలో అమ్మవారి అలంకారం నిమిత్తం ఆలయ పూజారులకు అప్పగించారు. అప్పటి నుంచి భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. దర్శనానికి వచ్చిన భక్తులకు కొనకాల బుల్లిబాబు ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అందరికీ చల్లటి మజ్జిగ అందజేశారు. ప్రముఖుల సందర్శన స్వర్ణాభరణముల అలంకారంలో అమ్మవారిని దర్శించటానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి సుజాత, పెనుగొండ వాసవి పీఠాధిపతులు పరమ శ్రీప్రజ్ఞ భారతిస్వామి, బాపట్ల ఎస్పీ బి ఉమామహేశ్వర్, బాపట్ల డీఆర్ఓ జి గంగాధర్గౌడ్, ట్రాన్స్ఫోర్ట్ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. పంచలోహ సింహాలు వితరణ బాపట్ల శాసనసభ్యులు వేగేశ న నరేంద్ర వర్మ రాజు కుటుంబ సమేతంగా అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించారు. రూ.9 లక్షల వెచ్చించి తయారు చేయించిన గ్రానైట్ రాతి పద్మ పీఠం, పంచలోహ సింహాలను అమ్మవారి ఆలయానికి సమర్పించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ సూపరింటెండెంట్ ఎం భాగ్యలక్ష్మి, తహసీల్దార్ డి వెంకటేశ్వరరావు, ఎస్ఐ ఎంవీ శివకుమార్, పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ బి సుజాత, వీఆర్ఓ అరుణకుమారి, ఆలపాటి వెంకటరమణారావు, భవనం బసవరెడ్డి, దోమ నాగేశ్వరరెడ్డి, కేతరాజు, పట్టాభిరామారావు ట్రస్ట్ బోర్డు చైర్మన్ కలకోట చక్రధర్రెడ్డి సభ్యులు వక్కలగడ్డ ప్రసాద్, అయినంపూడి వెంకట పద్మజ, నక్క సముద్రాలు, ఎనకపల్లి వెంకటప్పయ్య తదితరులు ఉన్నారు. -
టెన్త్ ఫలితాల్లో తొలి స్థానం అభినందనీయం
బాపట్ల: పదవ తరగతి ఫలితాల్లో బాపట్ల జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానం సాధించడం గర్వకారణమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లాలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను శాలువా కప్పి, ప్రశంసాపత్రాలు అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం రెండున్నర శాతం పెరిగిందని పేర్కొన్నారు. విద్యార్థుల మార్కులు కేవలం గుర్తింపుకే పరిమితమని, జీవితంలో విజయానికి మార్కులే ప్రమాణం కాదని కలెక్టర్ అన్నారు. చదువుపై ఆరోగ్యకరమైన పోటీ, క్రమశిక్షణ ఉంటే మంచి ఫలితాలతో పాటు జీవితంలో కూడా విజయాన్ని సాధించవచ్చని సూచించారు. తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు నిరుత్సాహపడకూడదని, తల్లిదండ్రులు ఒత్తిడి చేయవద్దని చెప్పారు. జీవితంలో ఉన్నత లక్ష్యాలు పెట్టుకుని మీ ఊరు, ప్రాంతం, దేశానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను ప్రోత్సహించారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసి ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. 100% ఉత్తీర్ణత సాధించిన పాఠశాల హెచ్ఎంలను, ఎంఈఓలను అభినందించారు. ఈ సందర్భంగా కొల్లూరు జెడ్పీ బాలికల హైస్కూల్కు చెందిన బావిరెడ్డి దివ్య తేజశ్రీ 596 మార్కులతో రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించగా, సత్కరించారు. వేటపాలెం జెడ్పీహెచ్ఎస్ పందిళ్లపల్లి చెందిన ఎడవల్లి తేజస్వి (593), గద్దె బంధవ్య (592), సంతమాగులూరు మండలం మెక్కనవారిపాలెం జెడ్పీహెచ్ఎస్కు చెందిన చదలవాడ సాయి రామ్ ధీరాజ్ (586), చెరుకూరు జెడ్పీహెచ్ఎస్కు చెందిన షేక్ షాహుల్ హామీద్ (585), పందిలపల్లి చెందిన గుంటూరు హర్ష (585)ను అభినందించారు. -
బతుకే వరం.. కాదు భారం!
మానసిక పరిపక్వత లేకపోవడం.. క్షణికావేశం.. ఇలా కారణం ఏదైతే ఏంటి... నిండు నూరేళ్లు బతకాల్సిన జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. వారిని నమ్ముకున్న వారి జీవితాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. ఎవరైనా ఈ దిశగా ఆలోచించకుంటే ఆయా కుటుంబాలు ఒంటరిగా మిగిలిపోక తప్పదు. 01సిహెచ్ఆర్ఎల్110: సింబాలిక్ 01సిహెచ్ఆర్ఎల్111: జనార్దన్ 01సిహెచ్ఆర్ఎల్112: స్వాతికిరణ్ – బలవన్మరణాలతో కుటుంబాలు నాశనం – చిన్న సమస్యలకే ఎక్కువగా కుంగుబాటు – మృతుల్లో 20 – 50 ఏళ్ల లోపువారే అధికం – కుటుంబసభ్యులకు తప్పని శోకం మానసిక పరిపక్వత లేకపోవడం.. క్షణికావేశం.. ఇలా కారణం ఏదైతే ఏంటి... నిండు నూరేళ్లు బతకాల్సిన జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. వారిని నమ్ముకున్న వారి జీవితాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. ఎవరైనా ఈ దిశగా ఆలోచించకుంటే ఆయా కుటుంబాలు ఒంటరిగా మిగిలిపోక తప్పదు. వేటపాలెం: మూడు రోజుల క్రితం రావూరిపేటకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మాజేటి ప్రభాకర్, భార్య పార్వతి దంపతులు.. వారికి లేక లేక ఐదేళ్ల తరువాత పుట్టిన 13 నెలల చిన్నపాప ఉందని కూడా మర్చి పోయి ఇంట్లోనే ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. గత ఏడాది వేటపాలెం పాకనాటి వీధిలో అద్దె కుంటూ 36 ఏళ్ల వ్యక్తి తన భార్య మరణించగా ఒక్కడే ఉంటున్నాడు. ఆమె మరణాన్ని తట్టుకోలేక ఆరు నెలలకే ఇంట్లో ఫ్యాన్కి ఉరేసుకొని మృతి చెందాడు. కొత్తపాలేనికి చెందిన 32 ఏళ్ల యువకుడు డిసెంబరు నెలలో ఆర్థిక ఇబ్బందులతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ మరుసటి రోజు తెల్లవారుజామున ఇంటి ముందు ఉన్న చెట్టుకు ఉరేసుకున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. డిసెంబరు నెలలో దేశాయిపేట పంచాయతీ నీలకంఠాపురానికి చెందిన 25 ఏళ్ల యువకుడు సాప్టువేర్ ఉద్యోగం చేస్తుండేవాడు. పెళ్లి అయిన రెండేళ్లకే భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మానసికంగా కుంగిపోయి ఇంట్లో ఫ్యాన్కి ఉరేసుకొని మృతి చెందాడు. గత ఏడాది నవంబరు నెలలో ఆణుమల్లిపేటకు చెందిన 36 ఏళ్ల వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో కుంగిపోయి రైలు కింద పడి చనిపోయాడు. ఇది జరిగిన రెండు రోజులకే ఇతనికి సంబంధించిన 30 ఏళ్ల మహిళ రామన్నపేట దగ్గరలో రైలు కింద పడి మృతి చెందింది. నియోజకవర్గ పరిధిలో 2024 –26 కాలంలో దాదాపు 15 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. కుటుంబ సమస్యలనో, ఆర్థిక ఇబ్బందులనో, అనారోగ్యం, పరీక్షల్లో తప్పడం, ప్రేమ విఫలమవడం.. ఇలా రకరకాల కారణాలతో అతిగా ఆలోచించి బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. మానసికంగా కుమిలిపోతున్న వారిని కుటుంబ సభ్యులు సకాలంలో గుర్తించక పోవడం, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, ముఖ్యంగా తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను పిల్లలపై బలవంతంగా రుద్దడం కూడా ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు యువత పరిపక్వత చెందని వయసులో తప్పుడు నిర్ణయాలతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పరిష్కారం ఏంటి? ఆత్మహత్య భావనలో ఉన్న వారిని ఒంటరిగా ఉంచకూడదు. వీతైనంత వరకు ఇంట్లో అందరి మధ్య ఉంచి కుటుంబ సభ్యులంతా వారిలో ధైర్యం నింపాలి. వీలైనంత వరకు ఆత్మహత్య భావన ఉన్నవారిని దానికి సహకరించే వస్తువులను అందుబాటులో లేకండా చూడాలి. ఆత్మవిశ్వాసం, పాజిటివ్ థింకింగ్ పుస్తకాలు, బిహేవియర్ థెరపీ, కౌన్సెలింగ్ ప్రక్రియలు శక్తివంతంగా ఉపయోగపడుతాయి. వీలైతే మానసిక వైద్య నిపుణులచే కౌన్సెలింగ్ ఇప్పించాలి. మానసిక కుంగుబాటు లక్షణాలు.. ఆత్మహత్యకు పాల్పడేవారిని ముందే గుర్తించవచ్చని మానసిక నిపుణలు చెబుతున్నారు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వారు కొన్ని అసాధారణ లక్షణాలను కలిగి ఉంటారు. – ఒంటరితనాన్ని కోరుకుంటారు. అతిగా మద్యం తాగుతారు. – ప్రతీకారం తీర్చుకోవడంపైనే ఎక్కవగా మాట్లాడుతుంటారు. – తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవడం, అతిగా నిద్రపోవడం. – రాత్రిపూట నిద్రపోకుండా ఎక్కువగా ఆలోచించడం. – అసలు దేనికీ స్పందించకపోవడం, చనిపోతున్నట్లు ముందుగానే పరోక్షంగా సంకేతాలు ఇవ్వడం లాంటివి చేస్తుంటారు. – ఆత్మహత్యకు పాల్పడటం, యత్నించడం, అందుకు ప్రోత్సహించడం చట్టప్రకారం నేరం. ఆత్మహత్యకు ప్రయత్నించిన వారిపై భారత న్యాయ సంహిత (బీఎన్ఎస్)సెక్షన్ 226 కింద, ఆత్మహత్యకు ప్రోత్సహించే వారిపై సెక్షన్ 108 కింద కేసు నమోదు చేస్తారు. అతిగా ఆలోచించకూడదు – స్వాతికిరణ్, వైద్యాధికారి, వేటపాలెం పెరుగుతున్న జీవన ప్రమాణాలు, మారుతున్న విధానాలతో ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారు. సమస్యలు ఎవరికీ చెప్పుకోలేక ఎవరికి వారే కుమిలిపోతున్నారు. అతిగా ఆలోచించకుండా మనోధైర్యాన్ని కోల్పోకుండా ఇతరులతో పంచుకొని సమస్యను పరిష్కరించుకోవాలి. పరిష్కార మార్గాలు చూసుకోవాలి కానీ ఆత్మహత్యలు పరిష్కారం చూపవు. ప్రశాంతంగా బతకాలి – జనార్దన్, ఎస్సై, వేటపాలెం మానవ జీవతం అంటే ఒడిదొడుకులుంటాయి. కష్టసుఖాలను సమపాళ్లలో తీసుకోవాలి. దేనికీ బెదరకూడదు. కుంగిపోకూడదు. సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా మహిళలు ఇంట్లో సమస్యలను తలకెక్కించుకోకూడు. తేలిగ్గా తీసుకుని బతకడం నేర్చుకోవాలి. భర్త తప్పు చేస్తే పెద్దలకు చెప్పడం లేదా.. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. ప్రేమించి మోసం చేస్తే వాటిని ఏ రకంగా ఎదుర్కోవాలో తెలుసుకోవాలి. ప్రతి సమస్యకు చావే పరిష్కారం కాదు. వేటపాలెం: మూడు రోజుల క్రితం రావూరిపేటకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మాజేటి ప్రభాకర్, భార్య పార్వతి దంపతులు.. వారికి లేక లేక ఐదేళ్ల తరువాత పుట్టిన 13 నెలల చిన్నపాప ఉందని కూడా మర్చి పోయి ఇంట్లోనే ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. గత ఏడాది వేటపాలెం పాకనాటి వీధిలో అద్దె కుంటూ 36 ఏళ్ల వ్యక్తి తన భార్య మరణించగా ఒక్కడే ఉంటున్నాడు. ఆమె మరణాన్ని తట్టుకోలేక ఆరు నెలలకే ఇంట్లో ఫ్యాన్కి ఉరేసుకొని మృతి చెందాడు. కొత్తపాలేనికి చెందిన 32 ఏళ్ల యువకుడు డిసెంబరు నెలలో ఆర్థిక ఇబ్బందులతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ మరుసటి రోజు తెల్లవారుజామున ఇంటి ముందు ఉన్న చెట్టుకు ఉరేసుకున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. డిసెంబరు నెలలో దేశాయిపేట పంచాయతీ నీలకంఠాపురానికి చెందిన 25 ఏళ్ల యువకుడు సాప్టువేర్ ఉద్యోగం చేస్తుండేవాడు. పెళ్లి అయిన రెండేళ్లకే భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మానసికంగా కుంగిపోయి ఇంట్లో ఫ్యాన్కి ఉరేసుకొని మృతి చెందాడు. గత ఏడాది నవంబరు నెలలో ఆణుమల్లిపేటకు చెందిన 36 ఏళ్ల వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో కుంగిపోయి రైలు కింద పడి చనిపోయాడు. ఇది జరిగిన రెండు రోజులకే ఇతనికి సంబంధించిన 30 ఏళ్ల మహిళ రామన్నపేట దగ్గరలో రైలు కింద పడి మృతి చెందింది. నియోజకవర్గ పరిధిలో 2024 –26 కాలంలో దాదాపు 15 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. కుటుంబ సమస్యలనో, ఆర్థిక ఇబ్బందులనో, అనారోగ్యం, పరీక్షల్లో తప్పడం, ప్రేమ విఫలమవడం.. ఇలా రకరకాల కారణాలతో అతిగా ఆలోచించి బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. మానసికంగా కుమిలిపోతున్న వారిని కుటుంబ సభ్యులు సకాలంలో గుర్తించక పోవడం, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, ముఖ్యంగా తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను పిల్లలపై బలవంతంగా రుద్దడం కూడా ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు యువత పరిపక్వత చెందని వయసులో తప్పుడు నిర్ణయాలతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పరిష్కారం ఏంటి? ఆత్మహత్య భావనలో ఉన్న వారిని ఒంటరిగా ఉంచకూడదు. వీతైనంత వరకు ఇంట్లో అందరి మధ్య ఉంచి కుటుంబ సభ్యులంతా వారిలో ధైర్యం నింపాలి. వీలైనంత వరకు ఆత్మహత్య భావన ఉన్నవారిని దానికి సహకరించే వస్తువులను అందుబాటులో లేకండా చూడాలి. ఆత్మవిశ్వాసం, పాజిటివ్ థింకింగ్ పుస్తకాలు, బిహేవియర్ థెరపీ, కౌన్సెలింగ్ ప్రక్రియలు శక్తివంతంగా ఉపయోగపడుతాయి. వీలైతే మానసిక వైద్య నిపుణులచే కౌన్సెలింగ్ ఇప్పించాలి. పెరుగుతున్న జీవన ప్రమాణాలు, మారుతున్న విధానాలతో ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారు. సమస్యలు ఎవరికీ చెప్పుకోలేక ఎవరికి వారే కుమిలిపోతున్నారు. అతిగా ఆలోచించకుండా మనోధైర్యాన్ని కోల్పోకుండా ఇతరులతో పంచుకొని సమస్యను పరిష్కరించుకోవాలి. పరిష్కార మార్గాలు చూసుకోవాలి కానీ ఆత్మహత్యలు పరిష్కారం చూపవు. – స్వాతికిరణ్, వైద్యాధికారి, వేటపాలెం మానవ జీవతం అంటే ఒడిదొడుకులుంటాయి. కష్టసుఖాలను సమపాళ్లలో తీసుకోవాలి. దేనికీ బెదరకూడదు. కుంగిపోకూడదు. సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా మహిళలు ఇంట్లో సమస్యలను తలకెక్కించుకోకూడు. తేలిగ్గా తీసుకుని బతకడం నేర్చుకోవాలి. భర్త తప్పు చేస్తే పెద్దలకు చెప్పడం లేదా.. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. ప్రేమించి మోసం చేస్తే వాటిని ఏ రకంగా ఎదుర్కోవాలో తెలుసుకోవాలి. ప్రతి సమస్యకు చావే పరిష్కారం కాదు. – జనార్దన్, ఎస్సై, వేటపాలెం ఆత్మహత్యకు పాల్పడేవారిని ముందే గుర్తించవచ్చని మానసిక నిపుణలు చెబుతున్నారు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వారు కొన్ని అసాధారణ లక్షణాలను కలిగి ఉంటారు. -
ధర దక్కక.. దుఃఖం తీరక..
పుస్తెలు తాకట్టు పెట్టి పెట్టిన పెట్టుబడులు.. బొట్టు బొట్టుగా చెమటోడ్చి రాత్రనక పగలనక కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక కర్షకులు కన్నీరు పెట్టుకుంటున్నారు. చేసిన సాగులో వరుణ దేవుడు కరుణించడంతో కాస్త దిగుబడులు వచ్చాయి. ఇక తమ కష్టాలు తీరుతాయని భావించిన సమయంలో పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక అల్లాడిపోతున్నారు. మద్దతు ధర ప్రకటించినా ఆ మేరకు కొనుగోళ్లు జరిగేలా చంద్రబాబు ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకపోవడంతో అన్నదాతల ఆశలు ఆవిరవుతున్నాయి. కారంచేడు: గతేడాది సాగు చేసిన పొగాకు నేటికీ కర్షకులు ఇంటి వద్దనే దాచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. గిట్టుబాటు ధరలతో చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎదురు చూసిన రైతులను సర్కారు నిండా ముంచేసింది. చివరి ఆకు వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన పాలకులు మధ్యలోనే చేతులు ఎత్తేశారు. దీంతో సాగు చేసిన పంటలో కేవలం 50–60 శాతం వరకు మాత్రమే కొనుగోలు చేశారని, మిగిలిన పొగాకు నేటికీ రైతుల ఇళ్ల వద్ద ఉందని ఆరోపిస్తున్నారు. నేటి ఆ పంటను తిరగ తిప్పుకోవడానికి, కాపలా కోసం ఎదురు పెట్టుబడులు పెట్టుకోవాల్సిన దుస్థితి వచ్చిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. పొగాకు సాగు కోసం పెట్టిన రూ.లక్షలు పెట్టుబడులు కనీసం వస్తాయా.. రావా... అని ఆందోళన చెందుతున్నారు. చివరి ఆకు వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన నాయకులు ఇప్పటికై నా తమ గోడు పట్టించుకోవాలని వేడుకుంటున్నారు. దళారుల ఇష్టారాజ్యం.. చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చెయ్యకపోవడంతోనే దళారులు తమకు ఇష్టమైన ధరలు నిర్ణయించుకుని దోపిడీ చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం మొక్కజొన్నకు మద్దతు ధరగా రూ.2,400 ప్రకటించినప్పటికీ కొనుగోలు చేయకపోవడంతో దళారులు కేవలం రూ.1650–1700 వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారన్నారు. ఈ ధరకు ఇస్తే ఇవ్వండి.. లేకుంటే లేదు.. అనే ధోరణిలో మొక్కజొన్న కొనుగోళ్లు సాగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే తమకు ఎంతో మేలు చేసిన వారు అవుతారని కోరుతున్నారు. పెట్టిన పెట్టుబడులకు గ్రహణమేనా.. ఈ ఏడాది ప్రభుత్వం మాటలు నమ్మి సాగు చేసిన మొక్కజొన్న కొనుగోళ్లు లేకపోవడంతో పెట్టిన పెట్టుబడులు కూడా రావని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది మొక్కజొన్న సాగుకు కౌలు ధరలతో కలిపి రూ.60 వేల నుంచి రూ. 70 వేల వరకు పెట్టుబడులు పెట్టామని రైతులు చెబుతున్నారు. దిగుబడులు మాత్రం సుమారు 35 – 40 క్వింటాళ్లు వచ్చాయని పేర్కొంటున్నారు. ప్రస్తుతం దళారులు కేవలం రూ.1600 చొప్పున కొనుగోలు చెయ్యడం వలన పెట్టుబడులకు కూడా నష్టం వాటిల్లే ప్రమాదముందన్నారు. అదే ప్రభుత్వ గిట్టుబాటు ధరలతో కొనుగోలు చేస్తే ఎకరానికి పెట్టుబడులు పోను రైతు కష్టానికి సుమారు రూ.20 వేల వరకు మిగులుతాయని చెబుతున్నారు.గత ఏడాది ఎక్కువ మంది రైతులు పొగాకు సాగు చేశారు. ఈ ఏడాది ఆ తప్పు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందుగానే ఎవరూ సాగు చేయవద్దని చెప్పింది. ప్రత్యామ్నాయ పంటలనే సాగు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో పర్చూరు నియోజకవర్గంలోని కారంచేడు, పర్చూరు, ఇంకొల్లు, యద్దనపూడి మండలాల్లో అధికంగా మొక్కజొన్న సాగు చేశారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు పూర్తిగా అనుకూలించాయి. రైతులు ఊహించిన దానికంటే ఎక్కువగానే దిగుబడులు వచ్చాయి. సంతోషించాల్సిన సమయంలోనే మొక్కజొన్నను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో రైతులు వేదన చెందుతున్నారు. నేను కారంచేడు ప్రాంతంలో అప్పులు చేసి సుమారు 40 ఎకరాల్లో గత ఏడాది పొగాకు సాగు చేశా. నాటి కూటమి పెద్దలు చివరి ఆకు వరకు కొనుగోలు చేస్తాం.. ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. నేడు అదే పాలకులు ముఖం చాటేశారు. ఇప్పటికీ రైతుల వద్ద 40 శాతానికిపైగా పొగాకు ఉంది. నా వద్ద సుమారు రూ.50 లక్షల విలువైన పొగాకు నిల్వలున్నాయి. – యార్లగడ్డ సుబ్బారావు, రైతు నేను రెండు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. ఎకరానికి సుమారు అన్ని ఖర్చులతో కలిపి రూ.60 వేలు నుంచి రూ. 70 వేల వరకు ఖర్చు అయ్యింది. దిగుబడులు బాగున్నాయి. ఎకరానికి సుమారుగా 35–40 బస్తాల వరకు వచ్చాయి. ధరలు మాత్రం చాలా తక్కువగా అడుగుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలి. – నూతి రంగనాయకులు చౌదరి, రైతు ఈ ఏడాది మొక్కజొన్న సాగుతో మంచి దిగుబడి చాలా సంతోషంగా ఉంది. మద్దతు ధరలు లేవు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలను దళారులు రూ. 2400 ఉంటే, దళారులు మాత్రం కేవలం రూ.1600 కే అడుగుతున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. – దండూరి అప్పయ్య, కౌలు రైతు -
బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ మాట్లాడుతూ దైనందిన జీవితంలో కార్మికుల పాత్ర ముఖ్యమైనదన్నారు. సమాజంలో కార్మికులకు భద్రతా, పనికి సరిపడా వేతనం కార్మికుల హక్కులని తెలిపారు. ప్రజలందరూ చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. బాలకార్మిక వ్యవస్థ సమాజంలో ఎక్కువగా ఉందని, ఫ్యాక్టరీలు, హోటళ్లలో పిల్లలు కార్మికులుగా మారుతున్నారన్నారు. పేదరికం, అవగాహనా లోపం వలన తల్లిదండ్రులు పిల్లల చదువులు మాన్పించి కార్మికులుగా మారుస్తున్నారని తెలిపారు. బాలకార్మిక నిర్మూలన మనందరి సమష్టి బాధ్యత అన్నారు. బార్ ప్రెసిడెంట్ మధిర నాగేశ్వరరావు, ప్యానెల్ అడ్వకేట్, కార్మిక దినోత్సవంపై అవగాహన కలిగించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్స్ పాండురంగారావు, ఎం.మాధురి, ఏ.సంతోష్కుమార్, ఆర్.చేతన్, పి.వీరాంజనేయులు, స్టేక్ హోల్డర్స్, సోప్ వర్కర్స్, మునిసిపల్ వర్కర్స్, ప్యానెల్ అడ్వకేట్స్, పారా లీగల్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన నరసింహుని జయంతి వేడుకలు
రాజాధి రాజ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న నృసింహుని జయంతి ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఉదయం ఆలయంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ నారసింహస్వామి ఉత్సవమూర్తులకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాపూర్ణాహుతి హోమం, నరసింహ మూలమంత్ర హోమం అనంతరం శాంతి కల్యాణం చేశారు. సాయంత్రం రాజాధిరాజ వాహనంపై స్వామివారు గ్రామోత్సవంలో దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. జయంతి ఉత్సవాల శాశ్వత కై ంకర్యపరులుగా మాల్యవంతం లక్ష్మీ నరసింహాచార్యులు, శేషమ్మ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్కుమార్ పర్యవేక్షించారు. కమనీయం రంగనాథుడి కల్యాణం యడ్లపాడు: సొలస గ్రామంలోని శ్రీభూదేవి సమేత రంగనాయకస్వామి దేవస్థానం ఆధ్యాత్మిక శోభతో పరవశించిపోయింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ మండపాన్ని సుగంధభరిత పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. వేదికపై నూతన వధూవరులుగా ముస్తాబైన శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథుడి కల్యాణ మహోత్సవం గురువారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. అర్చకులు పర్చూరి రామకృష్ణమాచార్యులు నేతృత్వంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం, ఉలూఖల గౌరీ పూజల అనంతరం వేదమంత్రోచ్ఛారణలు, మేళతాళాల నడుమ శాస్త్రోక్తంగా సాగిన కల్యాణం భక్తులు తిలకించి పులకించిపోయారు. ఎదుర్కోలు ఉత్సవం సందర్భంగా గ్రామ భక్త బృందం చేసిన కోలాట నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శుక్రవారం కల్యాణానంతరం హోమం, బలిహరణ కార్యక్రమాలు జరిగాయి. స్వామివారు గరుడ వాహనంపై రథోత్సవంలో పురవీధుల్లో ఊరేగుతుండగా, గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో నీరాజనాలు అర్పించారు. ఈవో నెమలిరెడ్డి పర్యవేక్షణలో ధర్మకర్తలు అర్వపల్లి మనోహర్–నాగజ్యోతి దంపతులు, అర్వపల్లి బ్రదర్స్, గ్రామ పెద్దలు ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వేసవి క్రీడా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ గుంటూరు వెస్ట్: వేసవి క్రీడా శిక్షణకు తమ పిల్లల్ని పంపించి వారిలోని సృజనాత్మతకు, ప్రతిభకు తల్లిదండ్రులు దోహదపడాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ పేర్కొన్నారు. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో సమ్మర్ క్రీడా కోచింగ్ క్యాంప్ల పోస్టర్ను శుక్రవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్, జేసీ అశుతోష్ శ్రీవత్సవ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారులకు సెలవుల్లో కనీస ఆటవిడుపుతోపాటు చక్కని ఆరోగ్యం కూడా వేసవి శిక్షణ ద్వారా లభిస్తాయన్నారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అఫ్రోజ్ ఖాన్ పాల్గొన్నారు. -
ఉన్నవ గ్రామంలో చోరీ
యడ్లపాడు: మండల పరిధిలోని ఉన్నవలో పట్టపగలే గర్తు తెలియని దుండగులు ఇంట్లో చోరీ చేసినట్లు యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన చెన్నుపాటి కృష్ణవేణి రోజువారీ కూలి పనులకు వెళ్లి, సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చారు. ఆ సమయంలో పిల్లలు బయట ఆడుకోవడానికి వెళ్లారు. ఆమె ఇంటి లోపలికి వెళ్లి చూడగా, అల్మారాలోని దుస్తులు చిందరవందరగా పడి ఉన్నాయి. అల్మారా తలుపులు తీసి ఉండటంతో పాటు, లోపల ఉన్న లాకర్ కూడా తెరిచి ఉండటాన్ని ఆమె గమనించారు. ఆందోళనతో లాకర్ను పరిశీలించగా, అందులో దాచిన సుమారు 48 గ్రాముల బంగారం గొలుసు, చెవిపోగులు వంటి విలువైన ఆభరణాలు మాయమైనట్లు గుర్తించారు. బాధితులరాలి ఫిర్యాదు మేరకు ఎస్ఐ టి.శివరామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరింపజేయాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా బెల్లంకొండ: జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరింప చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. బెల్లంకొండ, నాగిరెడ్డిపాలెం గ్రామాలలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను కలెక్టర్ అధికారులతో కలసి శుక్రవారం పరిశీలించారు. జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ కె.అమలకుమారి మండల వ్యాప్తంగా సాగవుతున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలు, న్యూట్రి గార్డెన్లు, సెరీకల్చర్ విధానాలను వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అంగన్వాడీ కేంద్రంలో న్యూట్రి గార్డెన్లను ఏర్పాటు చేయాలని, అధికారులు తమ పరిధిలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. న్యూట్రి గార్డెన్, కిచెన్ గార్డెన్స్ ద్వారా ప్రతి కుటుంబానికి పోషకాహారం అందించడమే లక్ష్యమని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు ఖర్చులు తగ్గి రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు, జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వరనాయక్, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు అధికారి ఆంజనేయులు, డ్రామా పీడీ సిద్ధలింగమూర్తి, ఏపీడీ నారాయణ, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. భద్రయ్యకుంట పనులు పరిశీలన రాజుపాలెం: జలధార పథకం ద్వారా చెరువుల అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. మండలంలోని రెడ్డిగూడెం పరిధిలోని భద్రయ్యకుంటలో జరుగుతున్న ఉపాధి పనులను జిల్లా కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెండు నెలలో చెరువుకుంట పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. రాజుపాలెం సమీపంలో జ్యోతి నాగేశ్వరరావు సూర్య మండల నమూనాను సందర్శించి అభినందించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ సిద్ధలింగమూర్తి, ఏపీడీ పొత్తూరి వెంకటనారాయణ, ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అమలకుమారి,ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
మహిళలు, బాలికల భద్రతకు అధిక ప్రాధాన్యం
బాపట్ల టౌన్: మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. బాపట్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం శక్తి యాప్ వినియోగం, మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణకు కట్టుబడి పనిచేస్తోందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం అందించే విధంగా శక్తి యాప్ను రూపొందించామని వివరించారు. మొబైల్లో యాప్ను ఇన్న్స్టాల్ చేసుకుని బటన్ నొక్కితే సమీపంలోని పోలీస్ సిబ్బంది వేగంగా స్పందిస్తారని వివరించారు. మహిళల భద్రత కోసం జిల్లాలో ఐదు శక్తి బృందాలు పనిచేస్తున్నాయని ఎస్పీ తెలిపారు. ప్రివెన్షన్, ప్రొటెక్షన్, ప్రాసిక్యూషన్ (ట్రిపుల్–పీ) విధానంలో ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నామని చెప్పారు. ఈవ్టీజింగ్, ర్యాగింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. అత్యవసర సమయంలో 112, గృహహింసల భారినపడితే 181, బాలలు సహాయం కోసం 1098, సైబర్ నేరాలకు 1930, మహిళా భద్రత కోసం 1091 వంటి హెల్ప్లైన్ నంబర్లకు సమాచారం అందించి సహాయం పొందాలని సూచించారు. మహిళలపై నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బాపట్ల పట్టణంలోని వివిధ కళాశాలలకు చెందిన 2,000 మందికిపైగా విద్యార్థినిలు కార్యక్రమంలో పాల్గొని తమ ఫోన్లలో శక్తి యాప్ను డౌనన్ లోడ్ చేసుకున్నారు. కార్యక్రమంలో డీఎస్పీ చంద్రమౌళి పాల్గొన్నారు. -
ఎంఈవోకు కలెక్టర్ అభినందన
రూ.1.50 లక్షల ఆస్తి నష్టం చినగంజాం: పోక్సో కేసులో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఘటన శుక్రవారం పెదగంజాం గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ శీలం రమేష్ అందించిన వివరాలు.. పెదగంజాం పంచాయతీలోని మాదిగపల్లెకు చెందిన చాట్ల అంజయ్య(59)పై గతంలో పోక్సో కేసు నమోదైంది. శుక్రవారం ఒంగోలు కోర్టులో విచారణ నిమిత్తం అంజయ్య చిన్న కుమారుడు జాన్ శ్రీను ఇద్దరు కలిసి వెళ్లారు. మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో అంజయ్య భార్య నాగేంద్రమ్మకు ఫోన్ చేసి తాను కేసు భయంతో చనిపోతున్నాను.. నాకు బతకాలని లేదు అని చెప్పి గ్రామంలో సమాధుల వద్ద ఉన్న జీడితోట వద్దకు రమ్మని చెప్పి ఫోన్ పెట్టేశాడు. భార్య అక్కడకు వెళ్లి చూడగా అంజయ్య పురికొస తాడుతో జీడిచెట్టుకు ఉరివేసుకొని వేలాడుతున్నాడు. భార్య నాగేంద్రమ్మ అతని శవాన్ని ఇంటికి తీసుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్ఐ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. గుంటూరు రూరల్: స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తులను గుంటూరు టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు అందిన సమాచారం మేరకు ఇన్నర్ రింగ్రోడ్డు రెడ్డిపాలెం సమీపంలో ఐరాస్పా రిలాక్స్ రెన్యూ రిజువంట్ స్పా సెంటర్లో నల్లపాడు పోలీసులతో కలిసి దాడిచేయగా మేనేజర్ సూర్యతోపాటుగా ఇతర రాష్ట్రాలకు చెందిన ఇద్ద మహిళలను, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. విచారణ నిమిత్తం నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నల్లపాడు పోలీసులు తెలిపారు. నల్లపాడు పోలీసు స్టేషన్పరిధిలోని ఇన్నర్రింగ్రోడ్డు ఫేజ్–2 చిల్లీస్ సెంటర్ ఎదురగల స్పా సెంటర్లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం టాస్క్ఫోర్స్ పోలీసు బృందం దాడిచేసి మహిళలు, పురుషులను అదుపులోకి తీసుకున్న సంఘటన శుక్రవారంచోటుచేసుకుంది. చిల్లీ సెంటర్లోని ఏ9 బ్యూటీఫుల్ సెలూన్ అండ్ స్పా –2 మసాజ్ సెంటర్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం పోలీసులు దాడిచేశారు. ఏడుగురు పురుషులు, నలుగురు మహిళలు, ఇతర రాష్ట్రానికి చెందిన ఒక మహిళ, 11సెల్ఫోన్లు, స్పా నిర్వాహకుడు ఆదినారాయణలను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
వైభవంగా భావదేవుడి రఽథోత్సవం
బాపట్ల: భావపురి నడిబొడ్డున కొలువుతీరిన భావదేవుడి రథోత్సవం అంగరంగ వైభవంగా శుక్రవారం జరిగింది. శ్రీమత్సుందరవల్లీ రాజ్యలక్ష్మీసమేత శ్రీక్షీర భావనారాయణ స్వామి వారికి సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అలయఅర్చకులు, బ్రహ్మణుల సమక్షంలో కల్యాణమహోత్సవాన్ని నిర్వహించారు. కల్యాణం అనంతరం స్వామివారికి గరుడవాహనంపై పట్టణంలోని పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భావదేవుడికి ఆలయకమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తూనే ఉన్నారు. మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథోత్సవాన్ని తిలకించేందుకు బాపట్ల నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో కిక్కిరిసిపోయింది. భక్తులు స్వామివారి రథాన్ని లాగేందుకు ఉత్సాహంగా పోటీ పట్టారు. ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామిని దర్శించుకున్న వారిలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్, ఎస్పీ ఉమామహేశ్వర్, ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మరాజు, మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ప్రభాకర్ తదితరులు ఉన్నారు. -
చీరాల ఆర్డీఓ ఒంగోలుకు బదిలీ
చీరాల టౌన్: చీరాల రెవెన్యూ డివిజన్ అధికారి తూమాటి చంద్రశేఖర నాయుడు అనుకున్నట్లే బదిలీ అయ్యారు. ప్రభుత్వం శుక్రవారం నిర్వహించిన ఆర్డీఓల బదిలీల్లో చీరాల ఆర్డీవో ఒంగోలు బదిలీ అయ్యారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో చీరాలను డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయగా మొట్టమొదటి ఆర్డీఓగా సరోజిని, ఎన్నికల సమయంలో అనంతరపురం నుంచి సూర్యనారాయణరెడ్డి, ఐదు రోజులు మాత్రం డి.అఖిల ఆర్డీఓగా పనిచేశారు. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ప్రోటోకాల్ అధికారిగా పనిచేస్తున్న తూమాటి చంద్రశేఖర నాయుడును చీరాల ఆర్డీఓగా నియమించడంతో ఇరవై నెలల పాటు చీరాలలో పనిచేశారు. ప్రస్తుతానికి చీరాల ఆర్డీఓగా ఎవ్వరినీ నియమించలేదు. -
బాపట్ల
శనివారం శ్రీ 2 శ్రీ మే శ్రీ 20267అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.9760 టీఎంసీలు. నగరంపాలెం: విశ్వశాంతిని కాంక్షిస్తూ బృందావన్ గార్డెన్స్లోని వేంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో చండీహోమం నిర్వహించారు. తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.4000, గరిష్ట ధర రూ.8200, మోడల్ ధర రూ.6000 వరకు పలికింది. 7 -
టెన్త్ ఫలితాల్లో ఆక్స్ఫర్డ్ విజయకేతనం
గుంటూరు ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో గుంటూరు ఆక్స్ఫర్డ్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని ఆక్స్ఫర్డ్ విద్యాసంస్థల డైరెక్టర్ ఎస్. విజయభాస్కర్రెడ్డి శుక్రవారం తెలిపారు. గుంటూరు బృందావన్గార్డెన్స్లోని ఆక్స్ఫర్డ్ మెయిన్ క్యాంపస్లో జరిగిన విద్యార్థుల అభినందన సభలో విజయభాస్కర్రెడ్డి మాట్లాడుతూ తమ విద్యార్థులు 600 మార్కులకు అత్యధికంగా 597, 594 కై వసం చేసుకున్నారని చెప్పారు. అదే విధంగా ముగ్గురు విద్యార్థులు 593 సాధించగా, 592 మరో ముగ్గురు, ఐదుగురు విద్యారులు 591 కై వసం చేసుకున్నట్లు వివరించారు. 590కు పైగా 17 మంది, 580 పైన 74 మంది, 570 పైన 176 మంది, 560 పైన 271, 550కు పైగా 344, 540కి పైగా 423, 530కి పైగా 490, 520కి పైగా 543 మంది, 510కి పైగా 593, 500కు పైగా 641, 500లోపు 641 మంది విద్యార్థులు విజయం సాధించారని చెప్పారు. 1200 మంది విద్యార్థులకు గాను మ్యాథ్స్లో 104 మందికి 100 మార్కులు, 248 మందికి 95 పైన మార్కులు, తెలుగులో 108 మందికి 100 మార్కులు, 357 మందికి 95 మార్కులపైన మరియు సోషల్లో 71 మందికి 100 మార్కులు, 351 మందికి 95 పైన మార్కులు, సైన్స్లో 19 మందికి 100 మార్కులు, 243 మందికి 95 పైగా మార్కులు, హిందీలో 19 మందికి 100 మార్కులు, 230 మందికి 95 పైగా మార్కులు, ఇంగ్లీష్లో 230 మందికి 95కు పైగా మార్కులు సాధించినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల నిరంతర కృషి, తల్లిదండ్రుల సహకారంతో ఆక్స్ఫర్డ్ ఘన విజయం సాధించిందని కొనియాడారు. పాఠశాల చైర్మన్ డాక్టర్ ఎస్.ప్రాన్సిస్రెడ్డి, వైస్ చైర్మన్ అరోన్రెడ్డి, డైరెక్టర్ జోసఫ్రెడ్డి, ఇన్చార్జ్లు మనోజ్, భాస్కర్ విద్యార్థులను అభినందించారు. -
హెచ్టీ పత్తి విత్తనాలునిల్వ చేసినా కఠిన చర్యలు
జిల్లా వ్యవసాయ అధికారి ఎం జగ్గారావుసత్తెనపల్లి: హెచ్టీ పత్తి విత్తనాల నిల్వలు, అమ్మకాలకు రాష్ట్రంలో అనుమతి లేదని పల్నాడు జిల్లా వ్యవసాయ అధికారి ఎం జగ్గారావు అన్నారు. కమిషనర్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గుంటూరు వారి ఆదేశాల మేరకు కమిషనర్ కార్యాలయ ఏడిఏ ప్రేమ్శేఖర్, వ్యవసాయ అధికారి సుకుమార్తో కలిసి పట్టణంలోని పలు విత్తన దుకాణాల్లో గురువారం తనిఖీలు నిర్వహించారు. జగ్గారావు మాట్లాడుతూ విత్తన డీలర్లు కలుపు మందులు తట్టుకునే హెచ్టీ పత్తి విత్తనాలు నిల్వలు, అమ్మకాలకు మన రాష్ట్రంలో అనుమతి లేదన్నారు. అటువంటి పత్తి విత్తనాల విక్రయం చట్టరీత్యా నేరమన్నారు. నిషేధిత పత్తి విత్తనాలు ఎవరైనా విత్తన డీలర్లు నిల్వలు, అమ్మకాలు జరుపుతున్నారా అని తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో విత్తన డీలర్ల దగ్గర ఇప్పటివరకు ఎటువంటి హెచ్టీ లక్షణాలు ఉన్నటువంటి పత్తి విత్తనాలు లేవని గుర్తించారు. పత్తి విత్తనాల నిల్వలు వచ్చిన వెంటనే విత్తన డీలర్లు మండల వ్యవసాయ అధికారి వారికి తెలియజేసి వారి అనుమతి మేరకు విక్రయాలు జరపాలన్నారు. ప్రతి విత్తన డీలర్ రైతులకు తప్పనిసరిగా విత్తన కొనుగోలు రసీదు ఇవ్వాలన్నారు. సత్తెనపల్లి మండల వ్యవసాయ అధికారి బి సుబ్బారెడ్డి మాట్లాడుతూ విత్తన డీలర్లు అందరూ గుర్తింపు పొందిన డిస్ట్రిబ్యూటర్ వద్ద నుండి మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. రైతులు లైసెన్సు ఉన్న డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. గుర్తింపు లేని మధ్యవర్తుల వద్ద విత్తనాలు కొనుగోలు చేయవద్దన్నారు.అలాంటి మధ్యవర్తుల సమాచారం ఉంటే అధికారులకు తెలియ జేయాలని సూచించారు. -
పది ఫలితాలలో ప్రకాశించిన దివ్య ‘తేజ’
కొల్లూరు: పదో తరగతి ఫలితాలలో గ్రామీణ ప్రాంతానికి చెందిన దివ్య తేజ ప్రకాశించింది. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం గాజుల్లంకకు చెందిన భావిరెడ్డి హరిప్రసాద్ కుమార్తె దివ్య తేజశ్రీ గురువారం వెలువడిన పదో తరగతి పరీక్ష ఫలితాలలో 596 మార్కులు సాధించింది. కొల్లూరులోని జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో పదో తరగతి విద్యను అభ్యసించిన బాలిక తొలి నుంచి చదువుల్లో చురుకుగా ఉండేది. విద్యార్థినిలో ఉన్న ప్రతిభను గుర్తించిన పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యేక తోడ్పాటు అందించారు. పొలం పనులతో తలమునకలయ్యే తండ్రి.. ఇంటి పనులలో మమేకయ్యే తల్లి కూతురికి ప్రోత్సాహం అందించడంతో పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితం సాధించడానికి దోహదపడింది. స్వగ్రామమైన గాజుల్లంక నుంచి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్లూరులోని జెడ్పీ బాలికోన్నత పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేది. ఉపాధ్యాయ బృందంతోపాటు పలు వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయులు తోడ్పాటే విజయానికి కారణమని విద్యార్థిని తెలిపింది. ఐఐఐటీ పూర్తి చేయడంతోపాటు, సివిల్స్ సాధించడమే లక్ష్యమని పేర్కొంది. -
జిల్లాలో 86.07 శాతం ఉత్తీర్ణత
బాపట్ల టౌన్: పది పరీక్షల్లో బాపట్ల జిల్లాకు ఉత్తమ ఫలితాలు వచ్చాయని జిల్లా విద్యాశాఖ అధికారి డి.శ్రీనివాస్ తెలిపారు. గురువారం ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 86.07 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. బాలికలు 88.74, బాలురు 83.39 శాతం ఉత్తీర్ణత పొందారని చెప్పారు. 597 మార్కులు అద్దంకి బెల్ అండ్ బ్లేనేట్ హైస్కూల్ విద్యార్థి సాధించగా, కొల్లూరులోని జెడ్పీ బాలికల హైస్కూల్ విద్యార్థి 596 మార్కులు సాధించినట్లు వెల్లడించారు. జిల్లా పరిషత్ పాఠశాలలు 80.52 శాతం, ప్రభుత్వ పాఠశాలలు 72.61 శాతం ఉత్తీర్ణత పొందారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ పాఠశాలలు 92.20, కేజీబీలు 87.8 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. రీ వెరిఫికేషన్ కోసం మే 1 నుంచి 7 వరకు రూ.వెయ్యి ఫీజు చెల్లించాలని, రీ కౌంటింగ్ కోసం మే 1 నుంచి 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దీనికి రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. సప్లిమెంటరీ పరీక్షలు కోసం మే 1 నుంచి 9 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రూ.50 ఫెనాల్టీతో మే 10 నుంచి 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మూడు సబ్జెక్టులకు రూ.110.6 సబ్జెక్టులకు రూ.120 చెల్లించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లా 15వ స్థానంలో నిలిచిందని వివరించారు. గతేడాది కన్నా మూడు శాతం ఉత్తీర్ణత పెరిగినట్లు వెల్లడించారు. -
విజయకీలాద్రిపై నృసింహ జయంతి
తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరంలో ఉన్న విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై గురువారం నృసింహ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి మంగళగశాసనాలతో ఉదయం 9 గంటలకు దుష్ట గ్రహ నివారణ, ఆయురా రోగ్యాభివృద్ధి కోసం లక్ష్మీ నారసింహ ఇష్టి కార్యక్రమాలు వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు. సాయంత్రం లక్ష్మీనృసింహ స్వామి వారికి అభిషేకం, విశేష అలంకరణ, లక్ష్మీ నృసింహస్వామి కల్యాణం, అష్టోత్తర శతనామార్చన, నివేదన, మంగళాశాసనం, తిరు నక్షత్ర తనియన్ విన్నపం, తీర్థ ప్రసాద గోష్టి, వేద ఆశీర్వచనం, తదియారాధన కార్యక్రమాలు కనుల పండువగా నిర్వహించామని తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని లక్ష్మీ నరసింహ స్వామి వారి అనుగ్రహాన్ని పొందారని పేర్కొన్నారు. దుర్గి: దుర్గి మండలం అడిగొప్పుల గ్రామంలోని నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి హుండీ కానుకలు లెక్కించగా రూ.26,72,462 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణా ధికారి, అసిస్టెంట్ కమిషనర్ కె. ఆదిశేషు నాయుడు తెలిపారు. గురువారం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ధర్మకర్త యాగంటి మల్లికార్జునరావు, కారంపూడి గ్రూప్ దేవదాయశాఖ కార్యనిర్వహణాధికారి హనుమంతరావుల సమక్షంలో 51 రోజులపాటు భక్తులు అమ్మవారికి సమర్పించిన హుండీ లెక్కింపు చేపట్టారు. కానుకల రూపంలో వచ్చిన ఆదాయాన్ని బ్యాంకు అధికారులకు అందజేసి సంబంధిత రసీదును తీసుకున్నట్లు అధికారులకు వివరించారు. కార్యక్రమంలో ఎన్ఎంఆర్ సిబ్బంది, అర్చక, పరిచారక, నాయీ బ్రాహ్మణులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. తెనాలిరూరల్: మండలంలోని పెదరావూరు గ్రామంలోగల అభయ హస్త సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కేంద్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ వి.రామసుబ్రమణియన్ దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విద్యా గణపతి, బాలాంబిక సమేత సర్వ హితేశ్వర స్వామి వార్లను దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు చింతపల్లి సుబ్రహ్మణ్యశర్మ, సహాయకుడు పోలేపెద్ది రామకృష్ణ, ఆలయ అర్చకుడు శుభం శర్మ, మార్కెట్ యార్డు వైస్చైర్మన్ పాలడుగు సురేంద్ర, కిక్కూరి శ్రీనివాసరెడ్డి తదితరులు జస్టిస్ రామసుబ్రమణియన్ దంపతులకు స్వాగతం పలికారు. మంగళగిరి టౌన్: గుంటూరు జిల్లా మంగళాద్రిలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామి వారి జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయ ముఖ మండపంలో గురువారం ఉదయం విశేష అభిషేకం, విశేష అలంకరణ నిర్వహించారు. అనంతరం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, పార మాత్మిక నారసింహ హోమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం స్వామి నామకరణ మహోత్సవం నిర్వహించారు. ఉత్సవ మూర్తులను శేష వాహనంపై అధిష్ఠింప జేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి కె.సునీల్కుమార్ పర్యవేక్షించారు. -
చట్టాలపై అవగాహన అవసరం
గుంటూరు లీగల్: చట్టాలపై మహిళలకు అవగాహన అవసరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ అన్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు గురువారం మహిళా ప్రాంగణంలోని వన్ స్టాప్ సెంటర్లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. మహిళా ప్రాంగణంలోని వన్ స్టాప్ సెంటర్లో ఉన్న బాధిత మహిళలతో ఆయన మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. న్యాయ పరమైన సలహాలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా వారికి అందే చట్టాల గురించి వివరించారు. కార్యక్రమంలో వన్ స్టాప్ సెంటర్ లీగల్ కౌన్సెలర్ శాంతకుమారి, సిబ్బంది పాల్గొన్నారు. ఐపీడీ కాలనీ, సాయికృష్ణ నగర్లోని ప్రజ్వల కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ ఓల్డ్ ఏజ్ హోమ్ను సందర్శించి అక్కడ ఉన్న వృద్ధులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. చట్టాల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆశ్రమం ప్రెసిడెంట్, ప్యానెల్ అడ్వకేట్ కట్టా కాళిదాసు, పారా లీగల్ వలంటీర్స్ పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ -
రైతులతో ప్రత్యక్ష సంబంధాలు కలిగిఉండాలి
బాపట్ల: గ్రామీణ జీవనానికి వ్యవసాయం వెన్నెముక వంటిదని, పి.జి.విద్యార్థులు తమ పరిశోధనలు, ప్రయోగాలు, నూతన ఆలోచనలు, ఆవిష్కరణలను గ్రామీణ వ్యవసాయదారుల చెంతకు తీసుకెళ్లడంలో కృషి చేయాలని, అప్పుడే వారి విద్యకు సార్ధకత చేకూరుతుందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కౌన్సిల్ అఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్ పర్సన్ డాక్టర్ కె.రత్న శీలామణి అన్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో నిర్వహిస్తున్న పి.జి. విద్యార్థుల జాతీయ సదస్సు– 2026లో ముగింపు సభ బుధవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయంలో మార్పులు తెచ్చేందుకు వారు చేస్తున్న ప్రయోగాలు సత్ఫాలితాలను ఇవ్వాలని, సుస్థిరమైన సేద్య రూపకల్పన దిశగా వారి విద్య కొనసాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ జి.రామచంద్ర రావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా17 వ్యవసాయ విశ్వ విద్యాలయాల నుంచి 820 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారని, వారిలో 60 శాతం మంది మహిళలు పాల్గొనడం విశేషమన్నారు. గౌరవ అతిధిగా పాల్గొన్న సంగం సీడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఆలపాటి సత్యనారాయణ ప్రతి ఏటా వందలాది పరిశోధనా పత్రాలు సమర్పించబడుతున్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తొలుత అసోసియేట్ డీన్ ఇన్చార్జి డాక్టర్ ఎస్.ఆర్. కోటేశ్వరరావు స్వాగతోపన్యాసం చేశారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ కె. శ్రీనివాసులు మాట్లాడారు. కార్యక్రమంలో కో ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ లాల్ అహమ్మద్ మొహమ్మద్, డాక్టర్ టి.వి.శ్రీధర్, స్టూడెంట్ టీచర్ కోఆర్డినేటర్ డాక్టర్ డి.వి.ఎస్.అక్షయ్ పాల్గొన్నారు. స్టూడెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నివేదిత వందన సమర్పణ చేశారు. –డాక్టర్ కె.రత్నశీలామణి -
క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడిన తొమ్మిది మంది అరెస్ట్
నగరంపాలెం: క్రికెట్ బెట్టింగ్కు పాల్పడిన తొమ్మిది మందిని నగరంపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1.10 లక్షలు, ఏడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. ఆయన కథనం మేరకు... సోమవారం రాత్రి శ్రీరామ్నగర్ ఒకటో వీధిలోని వెంకటేశ్వర టీ స్నాక్స్ దుకాణం వెనుక ఖాళీ స్థలంలో ఆన్లైన్ యాప్స్ ద్వారా క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్నారనే సమాచారంతో నగరంపాలెం పీఎస్ సీఐ సత్యనారాయణ తనిఖీలు చేశారు. తనిఖీల్లో వర్రా మణికంఠ (ఏటీ అగ్రహారం 12వ వీధి), రామిశెట్టి సురేష్ (నెహ్రూనగర్ ఆరో వీధి), కాసినేడి నటరాజ్కుమార్, కుంచాల సాయికుమార్, బొడ్డు ఇస్సాక్ (శ్రీరామ్నగర్ ఒకటో వీధి), షేక్.బాజీ (రామిరెడ్డినగర్ 4వ వీధి), పైడి ఎర్రంనాయుడు, పైడి అశిరినాయుడు (శ్రీరామ్నగర్ రెండో వీధి) యంపటి కోటిరెడ్డి (ఎన్జీవో కాలనీ)లను అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు రుజువు కావడంతో తొమ్మిది మందిని అరెస్ట్ చేసి, ఏడు సెల్ఫోన్లు, రూ.1.10 లక్షలు స్వాధీనం చేసుకున్నారని అన్నారు. ఈ తొమ్మిది మంది ఆన్లైన్లో ఏపీబుక్.ఇన్, లక్కీ కిస్మత్.కామ్, గల్లీబెట్స్.ఇన్, వీల్బుక్.కామ్లలో బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు గుర్తించారని అన్నారు. క్రికెట్ను ఆటగా వీక్షించాలని, ఎవరూ జూదంగా మార్చవద్దని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. కేసుని ఛేదించిన సీఐ సత్యనారాయణ, ఎస్ఐలు రాంబాబు, ఎ.రామచంద్రరెడ్డి, కానిస్టేబుళ్లు ఎ.శ్రీనివాసరావు, పి.గంగరాజు, సీహెచ్.ఉదయచంద్, షేక్ షకీల్ అహ్మద్లను జిల్లా ఎస్పీ అభినందించారు. వారికి ప్రశంసాపత్రాలు అందించారు. -
ఉపాధ్యాయుడిని వదిలేసి హెచ్ఎంకు నోటీసు తగదు
గుంటూరు ఎడ్యుకేషన్ ఆరు నెలలుగా పాఠశాలకు గైర్హాజరైన ఉపాధ్యాయుడిని వదిలేసి, తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తున్న ఇన్చార్జ్ హెచ్ఎంకు షోకాజ్ నోటీసు ఇవ్వడం తగదని అఖిల భారత సెకండరీ ఉపాధ్యాయుల సంఘ (ఏఐఎస్టీఎఫ్) ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసఫ్ సుధీర్బాబు అన్నారు. బుధవారం జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషాను డీఈవో కార్యాలయంలో ఎస్టీయూ నాయకులతో కలసిన జోసఫ్ సుధీర్బాబు ఉపాధ్యాయుడితో పాటు అతనికి సహకరించిన ఎంఈవోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుధీర్బాబు మాట్లాడుతూ గుంటూరు తూర్పు పరిధిలోని గోరంట్ల ఎంపీపీ (ఎల్ఈ) స్కూల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుడు గత ఆర్నెల్లుగా విధులకు గైర్హాజరైన విషయాన్ని ఇటీవల ఒక ప్రధాన దినపత్రిక వెలుగులోకి తెచ్చేవరకూ అధికారులకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. పాఠశాల ఇన్చార్జ్ హెచ్ఎంకు వాట్సాప్ ద్వారా సెలవు సమాచారాన్ని పంపి, లీప్ యాప్ ద్వారా హాజరు నమోదు చేస్తున్న విషయం సంబంధిత ఎంఈవోకు తెలియదా అని ప్రశ్నించారు. ప్రముఖ పత్రికలో కథనం వచ్చిన తరువాత నిద్ర మేల్కొన్న ఎంఈవో... ఉపాధ్యాయుడిని వదిలి, విధులకు సక్రమంగా హాజరవుతున్న ఇన్చార్జ్ హెచ్ఎం, పైగా దివ్యాంగురాలికి షోకాజ్ నోటీసు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. డీఈవోను కలసిన వారిలో ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు డి.పెదబాబు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ బాజీ, వై.శ్యాంబాబు ఉన్నారు. గోరంట్ల పాఠశాల వ్యవహారంపై విచారణ గుంటూరు ఎడ్యుకేషన్ గోరంట్లలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఎల్ఈ)లో బుధవారం విద్యాశాఖాధికారులు విచారణ నిర్వహించారు. ఆర్నెల్లుగా ఉపాధ్యాయుడు గైర్హాజరుకావడం, ఇన్చార్జ్ హెచ్ఎంకు షోకాజ్ నోటీసు జారీ వెనుక వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు పాఠశాలకు వెళ్లిన గుంటూరు ఉప విద్యాశాఖాధికారి జి.ఏసురత్నం, ఎంఈవో విజయభాస్కర్ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ హెచ్ఎం రాజకుమారి వాంగ్మూలం నమోదు చేశారు. క్షేత్రస్థాయిలో జరిపిన విచారణలో గుర్తించిన అంశాలపై ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నారు. -
పానక నివేదన పథకం ప్రారంభం
మంగళగిరి టౌన్ : గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో వేంచేసియున్న ఎగువ సన్నిధి శ్రీ పానకాల లక్ష్మీనరసింహునికి పానక నివేదన పథకాన్ని ప్రారంభించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్కుమార్ బుధవారం ఒక ప్రకటలో పేర్కొన్నారు. భక్తులు కోరిన రోజున వారి గోత్ర నామాలతో స్వామి వారికి పానకం నివేదిస్తామని ఆయన తెలిపారు. ఒక బిందెకు రూ. 40, 11 బిందెలకు రూ. 440, 27 బిందెలకు రూ. 1080, 108 బిందెలకు రూ. 4320, 365 బిందెలు (రోజుకు ఒక బిందె చొప్పున సంవత్సరానికి) రూ. 14,600 లతో పథకాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో భక్తులు ప్రత్యక్ష, పరోక్ష సేవలు పొందేందుకు ఆర్జిత సేవలను కూడా అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ఊంజల్ సేవ, బంగారు గరుడోత్సవం, పెద్ద శేషవాహనం, చిన్నశేష వాహనం సేవలకు రూ.5 వేల చొప్పున, సుదర్శన హోమం, నరసింహ హోమం, లక్ష్మీ హోమానికి రూ. 3500 చొప్పున, శాంతి కల్యాణం రూ. 1500, నిత్య గోత్ర నామార్చనకు (సంవత్సరం) రూ. 516 గా ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ ఆర్జిత సేవల కోసం రుసుము చెల్లించుటకు ఆన్లైన్ ద్వారా ‘సిటీ యూనియన్ బ్యాంక్, మంగళగిరి శాఖ, అకౌంట్ నెం. 500 101 014 411 599, ఐఎఫ్ఎస్సీ సీఐయూబీ 0000 688’కు చెల్లించవచ్చని తెలియజేశారు. నిత్యాన్నదాన ప్రసాదాలకు విరాళాలు ఇచ్చే వారు మహారాజ పోషకులు రూ. 1,01,116 పైన, రాజపోషకులు రూ. 50,116 పైన, పోషకులు రూ. 25116 పైన, ఒక్కరోజు అన్నప్రసాదానికి విరాళం ఇచ్చేవారు రూ. 10116 గా నిర్ణయించామని వివరించారు. విరాళాలు ఆన్లైన్ ద్వారా ‘మంగళగిరి సిటీ యూనియన్ బ్యాంక్ అకౌంట్ నెం. 500 101 042 919 33, ఐఎఫ్ఎస్సీ సీఐయూబీ 0000 686’లో చెల్లించవచ్చని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
‘ఎన్ఏబీఎల్’ అక్రిడిటేషన్తో గుర్తింపు
చేబ్రోలు: విద్యాసంస్థల్లోని ల్యాబ్లకు ఎన్ఏబీఎల్ అక్రిడిటేషన్ ద్వారా అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని బెంగళూరుకు చెందిన క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిపుణుడు డాక్టర్ పుల్లారెడ్డి తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో ‘ఎన్ఏబీఎల్ అక్రిడిటేషన్పై అవగాహన సదస్సు’ బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ పుల్లారెడ్డి ఎన్ఏబీఎల్ అక్రిడిటేషన్ ప్రాముఖ్యత, డాక్యుమెంటేషన్ విధానం, ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియపై అవగాహన కల్పించారు. అక్రిడిటేషన్ పొందడానికి ల్యాబ్లు కచ్చితమైన నాణ్యత ప్రమాణాలు, ప్రామాణిక పరీక్ష విధానాలు, సమగ్ర రికార్డుల నిర్వహణ, సాంకేతిక ప్రమాణాలను అనుసరించాల్సి ఉంటుందని తెలిపారు. ల్యాబ్ క్వాలిటీ మాన్యువల్ తయారీ, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ రూపొందించడం, టెస్టింగ్ మరియు కాలిబ్రేషన్ రికార్డుల నిర్వహణ, ఇంటర్నల్ ఆడిట్ అండ్ క్వాలిటీ కంట్రోల్, ఎన్ఏబీఎల్ ఆన్లైన్ అప్లికేషన్ సమర్పణ వంటి ముఖ్య అంశాలను అధ్యాపకులకు వివరించారు. విద్యాసంస్థల్లోని ల్యాబ్లకు ఎన్ఏబీఎల్ అక్రిడిటేషన్ కలిగి ఉండటం వలన పరీక్షా ఫలితాలపై విశ్వసనీయత పెరగడమే కాకుండా, ఇండస్ట్రీ మరియు పరిశోధన రంగాల్లో అవకాశాలు విస్తరిస్తాయని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు లభిస్తుందని తెలిపారు. ఎన్ఏబీఎల్–క్యూసీఐ కో ఆర్డినేటర్ మానసి కులకర్ణి ‘గుణవత్తా యాత్ర’ కార్యక్రమం, క్వాలిటీ ప్రమాణాల ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు, పరిశ్రమ నిపుణులు పాల్గొన్నారు. తెనాలి: తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ సంస్థ శ్రీవేంకటేశ్వర నాట్య కళాపరిషత్ తిరుపతిలో ఏటా నిర్వహించే గరుడ నాటక పోటీలకు తెనాలి నుంచి రెండు నాటికలు ఎంపికయ్యాయి. సాంఘిక నాటికల విభాగంలో అద్దేపల్లి–ఆరాధ్యుల ఆర్ట్స్, తెనాలి వారి ‘ఎవరు’ నాటిక, బాలల పద్యనాటక విభాగంలో బృందా అవ్యాన్ ఆర్ట్స్ శ్రీసరస్వతి శిశుమందిర్, తెనాలి వారి ‘వైకుంఠం’ నాటిక ఎంపికయ్యాయి. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో జరిగే పోటీల్లో మే నెల 22వ తేదీన సాయంత్రం 6.30 గంటలకు ఎవరు నాటిక, 8.30 గంటలకు వైకుంఠం పద్యనాటిక ప్రదర్శనకు అవకాశం కల్పించినట్టు సంబంధిత కమిటీ కార్యదర్శి గజేంద్ర సమాచారం పంపినట్టు నాటికల నిర్వాహకుడు ఆరాధ్యుల కన్నా బుధవారం సాయంత్రం తెలిపారు. రెండు నాటికలను పట్టణానికి చెందిన యువనర్తకి, నాట్యగురువు ఆరాధ్యుల తేజస్విప్రఖ్య రచించగా, నటుడు, దర్శకుడు అద్దేపల్లి లక్ష్మణశాస్త్రి దర్శకత్వంలో ప్రదర్శిస్తారని తెలిపారు. సహకరించిన సుల్తానాబాద్లోని శ్రీ సరస్వతి శిశుమందిర్ స్కూల్ ఫౌండర్ సెక్రటరీ కోడూరు రమాదేవి, శిశుమందిర్ అధ్యక్షులు అవ్వారు లత, హెచ్ఎం వలివేటి రాజేంద్ర కుమార్, యర్రంశెట్టి హనుమంతరావులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాటక సమాజాల నిర్వాహకులు తేజస్వి ప్రఖ్య, లక్ష్మణశాస్త్రిని పట్టణ రంగస్థల కళాకారుల సంఘం మాజీ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణశెట్టి, షేక్ జానీబాష, దేవిశెట్టి కృష్ణారావు, ఆర్ అండ్ బీ రాజు, బద్దుల తిరుమలయ్య, హార్మోనిస్టు యోహాను, ఫ్రాన్సిస్, పరిశుద్ధరావు తదితర కళాకారులు అభినందించారు. బీఈడీ పరీక్షలలో అక్రమాలపై విచారణ జరపాలి వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం గౌరవ అధ్యక్షుడు పంతగాని రమేష్ ఏఎన్యూ (పెదకాకాని): బీఈడీ పరీక్షల్లో అక్రమాలపై ప్రభుత్వం వెంటనే విచారణ జరపాలని ఏఎన్యూ వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం గౌరవ అధ్యక్షుడు పంతగాని రమేష్ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. వర్సిటీ పరిధిలో జరుగుతున్న బీఈడీ నాలుగో సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలను కొందరు అధికారులు రూ.లక్షల వ్యాపారంగా మర్చారని ఆరోపించారు. థియరీ పరీక్షలలోను ఒకరి బదులు మరొక రాయించటం, కాపీయింగ్ చేయించడం దారుణమన్నారు. అమరావతిలోని కళాశాలకు 129 కిలోమీటర్ల దూరంలో ఉన్న వినుకొండ కళాశాలను కేంద్రంగా కేటాయించటం, వినుకొండ నరసరావుపేటలోని ఒకే యాజమాన్యానికి చెందిన కళాశాలను సెంటర్లుగా కేటాయించడం, గతంలో బీఈడీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో నిందితులుగా ఉన్న వారి కళాశాలలకు సెంటర్లను కేటాయించటం, ఆరు బీఈడీ కళాశాలల్లో సెంటర్లు ఏర్పాటు చేయటం ద్వారా వర్సిటీ అక్రమాలకు తెరతీసిందన్నారు. నరసరావుపేట, వినుకొండతో పాటు పల్నాడులోని మరో రెండు సెంటర్లలో కాపీయింగ్ చేయించారని ఆయన ఆరోపించారు. -
అమ్మ ప్రేమ అజేయం
చీరాల: చీరాల కళాంజలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల జాతీయ 9వ నాటకోత్సవాలు ఆహుతులను ఆకట్టుకుంటున్నాయి. స్థానిక కస్తూర్బా గాంధీ మున్సిపల్ గరల్స్ హైస్కూల్ ఆవరణలో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి మామిడాల వెంకయ్య–సీతారావమ్మ కళావేదికపై స్వర్ణ సూర్య డ్రామా లవర్స్, హైదరాబాద్ వారి శ్రీమాత్రేనమః అనే నాటికను ప్రదర్శించారు. ప్రియుడి కంటే బిడ్డ మీదే తల్లికుండే ప్రేమ అజేయమని చాటే శ్రీమాత్రేమనః నాటిక ప్రేక్షకులను ఆధ్యంతం ఆలోచింపచేసింది. నాటికకు రచన, దర్శకత్వం ఉదయ్ భాగవతుల వ్యవహించారు. అనంతరం చీరాల కళాంజలి వారి పుటుక్కు జరజర డుబుక్కుమే నాటికను ప్రదర్శించారు. అరువు సొమ్ము బరువు చేటు అనే సందేశంతో నాటిక హాస్య చమత్కార సంభాషణలతో సాగింది. నాటికకు రచన దివాకర్బాబు, దర్శకత్వం పూర్ణా సత్యం వ్యవహరించారు. నాటికలోని పాత్రధారులు ఆ పాత్రలకు నటనతో జీవం పోశారు. అనంతరం నాటికల్లోని నటీనటులను, రచయిత, దర్శకత్వం వహించిన వారికి చీరాల ఎన్ఆర్పీఎం హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ వారు ప్రదర్శనా పారితోషకాన్ని అందించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి ప్రేక్షకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు సంస్థలు వారిచే నాటిక పోటీలను నిర్వహిస్తున్నట్లు కళాంజలి అధ్యక్ష, కార్యదర్శులు కోడూరి ఏకాంబరేశ్వరబాబు, సాంబశివరావు, బత్తుల బ్రహ్మారెడ్డి, వలివేటి మురళీకృష్ణ, పూర్ణా సత్యం, లూక, పొట్టి శ్రీనివాసరావు, దరియా సాహెబ్ తెలిపారు. – ఆకట్టుకుంటున్న ఉభయ తెలుగు రాష్ట్రాల జాతీయ నాటకోత్సవాలు -
ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలేవీ?
నయనానందకరం.. కల్యాణోత్సవం ●తల్లిదండ్రులు ఉంటున్న ఇంట్లో పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన వైనం ● త్రుటిలో తప్పించుకున్న కన్నవారు ● ఆస్తివివాదాల నేపధ్యంలో ఘటన మంగళగిరి టౌన్ : మంగళగిరి పట్టణంలో వేంచేసి యున్న శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ ముఖ మండపంలో బుధవారం స్వామికి ఆలయ అర్చకులు లక్ష పుష్పార్చన కనుల విందుగా నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మల్లెలు, చేమంతి, గులాబి, తులసి దళాలతో పుష్పార్చన చేశారు. రాత్రి చతుర్వేద పారాయణం, తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. పుష్పార్చన వల్ల పాపాలు తొలగించి మంచి ఫలితాలు పొందవచ్చని అర్చకులు వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్కుమార్ పర్యవేక్షించారు. దుగ్గిరాల: దుగ్గిరాల మండలం మంచికలపూడి గ్రామంలో వేంచేసి ఉన్న వేణుగోపాలస్వామివారి దేవస్థానంలో బుధవారం నూతన జీవ ధ్వజ స్తంభం పునఃప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈవో మంతెన విఠల్ శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ నూతన జీవ ధ్వజ స్తంభ పునః ప్రతిష్టా కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామి వారిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారని తెలిపారు. అన్నసంతర్పణ కార్యక్రమాన్ని కమిటీ వారు నిర్వహించారని తెలిపారు. మాచవరం: పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో అంకమ్మ తల్లి దేవాలయ ప్రతిష్ట మహోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల సమక్షంలో వేదమంత్రోచ్ఛరణలతో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. పరిసర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. బంధువుల రాకతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆలయ నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తెనాలిరూరల్: ప్రైవేటు వ్యక్తులు సాగు చేసుకుంటున్న సుమారు రూ.ఐదు కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా జగ్గడిగుంటపాలెం టిడ్కో గృహాల వెనుక పొలాల్లో 2012లో ప్రభుత్వం సేకరించిన 61 సెంట్ల భూమి ఉంది. అనేక కారణాలతో అది ఖాళీగా ఉండడంతో అక్కడ పొలాలు సాగు చేసే రైతులే ఈ భూమిలోనూ సాగు చేసుకుంటున్నారు. ప్రస్తుతం రైతు రత్తయ్య తాను కౌలుకు తీసుకున్న పొలాలతో పాటు ఈ భూమిలోనూ సాగు చేసుకుంటున్నాడు. ఇటీవల జరిపిన రీ సర్వేలో 61 సెంట్లు ప్రభుత్వ భూమి ఉన్నటు తహసీల్దార్ గుర్తించారు. ఈ నేపథ్యంలో సాగుదారుడితో మాట్లాడి భూమిని బుధవారం స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో భూమి విలువ సుమారు రూ. ఐదు కోట్లు ఉంటుంది. యడ్లపాడు: మండలంలోని సొలస గ్రామంలో కొలువైన శ్రీభూ సమేత రంగనాయకస్వామి ఆలయ వార్షిక కళ్యాణ మహోత్సవాలు బుధవారం కొనసాగాయి. మూడో రోజు ఉత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకుడు పరుచూరి రామకృష్ణ చార్యుల నేతృత్వంలో మూలవిరాట్లతో పాటు నవవధువరులుగా ఉత్సవ మూర్తులను విశేష అలంకరణ చేశారు. అనంతరం స్వామివారికి సుప్రభాతసేవ, బిందతీర్థం, నిత్యార్చన, హోమ, గ్రామబలిహరణ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీలక్ష్మీ అమ్మవారికి నిర్వహించిన సామూహిక సహస్రనామ కుంకుమార్చన పూజల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిప్రపత్తులు చాటుకున్నారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టంగా రాత్రివేళ స్వామివారి ఉత్సవమూర్తిని భారీ విద్యుత్ అలంకరణ చేసిన హనుమత్ వాహనంపై అధిష్టింపజేసి గ్రామోత్సవం నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాహలం నడుమ సాగిన ఈ వాహనసేవను వీక్షించేందుకు భక్తులు బారులు తీరారు. ఆలయ ధర్మకర్తలు అర్వపల్లి మనోహర్ –నాగజ్యోతి, అర్వపల్లి బ్రదర్స్తో పాటు గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. బాపట్ల: మహిళల పట్ల ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలకు గానూ ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు డిమాండ్ చేశారు. వేమూరి రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని ఈనెల 9వ తేదీన జిల్లావ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లతోపాటు జిల్లా కేంద్రంలో ఫిర్యాదు చేసినప్పటికీ వారిపై చర్యలు తీసుకోకపోవటం బాధకరమన్నారు. ఈమేరకు ఫిర్యాదులపై చర్యలు తీసుకోకపోవటంపై పార్టీ పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గాదె మధుసూదనరెడ్డి, రేపల్లె సమన్వయకర్త పీటా నాగమోహన్కృష్ణలతో బుధవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో మళ్లీ ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా వరికూటి మాట్లాడుతూ మహిళలను అగౌరపరిచేవిధంగా మాట్లాడిన వేమూరి రాధాకృష్ణను అరెస్టు చేయకుండా ప్రశ్నించిన తమ నాయకులపై కేసులు కట్టడం ఏమేరకు న్యాయమో అర్ధంకావటంలేదన్నారు. ఇప్పటికై న పోలీసులు తమ తీరును మార్చుకోవాలని, లేకుండే ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్నారు. పెట్రోలు, డీజిల్ను బ్లాక్ మార్కెట్లో విక్రయించేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేయగా వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జోక్యం చేసుకోవటం పరిస్థితి సాధారణస్థితికి వచ్చిందని వరికూటి పేర్కొన్నారు. బ్లాక్మార్కెట్కు తరలిస్తే ఆందోళన చేస్తామని జగన్మోహన్రెడ్డి ప్రకటించిన మరుసటిరోజే డీజిల్, పెట్రోల్లు సాధారణ స్థితికి వచ్చాయన్నారు. అనైతిక రాజకీయాలు చేయటం మానుకోవాలి.. మహిళలను అగౌరపరిచేవిధంగా మాట్లాడిన రాధాకృష్ణను అరెస్టు చేయకుండా ఆయనపై ఫిర్యాదు చేసిన వారిన్ని అరెస్టులు చేసి బెదింపులకు దిగటం ఏవిధమైన న్యాయమో పోలీసులు చెప్పాలని వైఎస్సార్ సీపీ పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గాదె మధుసూదనరెడ్డి పేర్కొన్నారు. రాజకీయాలు చేయటంలో తప్పులేదని, అనైతిక రాజకీయాలు మంచిపద్ధతి కాదని ఆయన సూచించారు. కన్నకూతురు ఘాతుకం చిలకలూరిపేట: ఆస్తి, కుటుంబ కలహాల నేపథ్యంలో కన్న తల్లిదండ్రులను కుమార్తె కాల్చి హతమార్చేందుకు యత్నించిన సంఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో చోటు చేసుకుంది. బాధిత తల్లిదండ్రులు గౌరిశెట్టి సుకన్య, మల్లిఖార్జునరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సుకన్య, మల్లిఖార్జునరావు దంపతులకు ఇరువురు కుమార్తెలు. చిన్న కుమార్తె చంద్రికకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమెకు ఆరేళ్ల పాప దేవసేన ఉంది. భర్తతో వివాదాల నేపథ్యంలో మూడేళ్ల కిందట విడాకులు తీసుకుంది. పాపతో కలసి రెండేళ్ల కిందిటి వరకు పట్టణంలోని గుర్రాలచావిడిలో ఉన్న తల్లిదండ్రుల వద్దే ఉండేది. తల్లిదండ్రుల ఆరోపణ ప్రకారం.. ఏడాది నుంచి మరో వ్యక్తితో సహజీవనం కొనసాగిస్తూ పాపను తల్లిదండ్రుల వద్దే వదిలివేసి ఉంటుంది. ఈ క్రమంలో తాత నుంచి వారసత్వంగా సంక్రమించిన ఆస్తిలో తనకు వాటా ఇవ్వాలని తరుచూ తల్లిదండ్రులతో గొడవ పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి 9గంటల సమయంలో తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చి గొడవకు దిగింది. దీంతో తల్లిదండ్రులు మనవరాలిని తీసుకొని లోనికి పరిగెత్తి తలుపులు మూసుకున్నారు. దీంతో ఆగ్రహించిన చంద్రిక పంచలో ఉన్న గ్రిల్స్ నుంచి లోపలికి పెట్రోల్ చల్లి నిప్పు పెట్టింది. మంటలు, పొగ రావడంతో చుట్టుపక్కల వారు గమనించి నీళ్లు పోసి మంటలను చల్లార్చారు. ఇంటి పంచలో ఉన్న మంచాలు, బ్యాగులు తగలబడి పోయాయి. అయితే స్థానికులు సకాలంలో స్పందించి మంటలు ఆర్పడంతో ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ఈ విషయమై తల్లి సుకన్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి పరిశీలించి, చంద్రికను విచారిస్తున్నారు. ఆక్వాకల్చర్ పార్క్ వేగవంతం చేయాలి బాపట్ల: జిల్లాలో ఇంటిగ్రేటెడ్ ఆక్వాకల్చర్ పార్క్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పార్క్ ఏర్పాటుకు సంబంధించిన పురోగతిని పరిశీలించారు. ఇంటిగ్రేటెడ్ ఆక్వాకల్చర్ ద్వారా చేపలు, రొయ్యలు, ఇతర జలవనరుల ఉత్పత్తిని సమగ్రంగా పెంచే విధంగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఈపురుపాలెం స్ట్రెయిట్ కట్ వద్ద నిర్మిస్తున్న జెట్టి పనులు, నిజాంపట్నం మండలం కొత్తపాలెం గుండి సముద్రం వద్ద చేపడుతున్న పనులను నిర్దిష్ట టైమ్ బౌండ్లో పూర్తి చేయాలని ఆదేశించారు. మత్స్యశాఖ ఏడీ గాలిదేవుడుతో పాటు ఈడబ్ల్యూడీసీ అధికారులు, ఏపీ మానిటరింగ్ బోర్డు అధికారులు పాల్గొన్నారు. అందుబాటులో జనరిక్ మెడిసిన్.. బాపట్ల: ప్రధాన మంత్రి భారతీయ జనఔషధ పథకం ద్వారా ప్రజలకు నాణ్యమైన జనరిక్ ఔషధాలను తక్కువ ధరలకు అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, బాపట్ల వారి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం రెడ్ క్రాస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రధాన మంత్రి భారతీయ జనఔషధ కేంద్రం (మెడికల్ – సర్జికల్ స్టోర్స్) ను జిల్లా కలెక్టర్, బాపట్ల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ వి. వినోద్ కుమార్ ప్రారంభించారు. రెడ్క్రాస్ చైర్మన్ బి.ఎస్.నారాయణ భట్, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.విజయమ్మ, ఆర్డీఓ.పి.గ్లోరియా, మున్సిపల్ కమిషనర్ జి.రఘునాధ్ రెడ్డి, బాపట్ల తహసీల్దార్ సలీమా, రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ● ఆర్అండ్బీ రహదారుల నిర్మాణం, మరమ్మతుల్లో ప్రతివారం పురోగతి కనిపించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఆర్అండ్బీ, సూర్యఘర్, సీఎండీఎఫ్, ఎంపీ లాడ్స్ నిధులతో చేపట్టిన పనుల అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ● జిల్లాలో ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధుల వినియోగంలో ఎలాంటి లోపాలు లేకుండా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా మానిటరింగ్ కమిటీ సమావేశంలో నిధుల వినియోగం, పనుల పురోగతిపై సమీక్ష చేపట్టి, అర్హులైన లబ్ధిదారులకు వంద శాతం ప్రయోజనం చేరేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ● జిల్లాలో ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులకు సూచించారు. న్యూ వీసీ హాల్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో విద్యాశాఖ సహా పలు శాఖల పనులను సమీక్షించారు. బాపట్లలో ఏర్పాటు చేసిన ఆటిజం సహాయ కేంద్రం ప్రారంభానికి సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు వరికూటి అశోక్బాబు, గాదె మధుసూదన రెడ్డి, పీటా నాగమోహన్కృష్ణ జిల్లా ఎస్పీ కార్యాలయంలో మళ్లీ ఫిర్యాదు చేసిన నేతలు రాధాకృష్ణను వెంటనే అరెస్టు చేయకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పీటా నాగమోహన్ పేర్కొన్నారు. ఫిర్యాదులు చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారేగానీ, ఫిర్యాదు చేసిన వారికి న్యాయం చేయాలని పోలీసులకు తెలియకపోవటం బాధకరమన్నారు. కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ -
రిక్త హస్తం
చేతి వృత్తులకు ఇప్పటికై నా మగ్గం ఉన్నవారికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ వర్తించేనా! దరఖాస్తుల పరిశీలన పూర్తవుతుంది ● నేతన్న నేస్తంపై సమాధానమే కరవు ● నేటితో ముగుస్తున్న దరఖాస్తు గడువు ● చంద్రబాబు ప్రభుత్వంపై చేనేతలు గుర్రు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో దన్నుగా నిలిచిన సీఎం జగన్ విద్యుత్ శాఖ కార్యాలయంలో తుది జాబితా ఉపవృత్తుల వారికి ఏదీ ? – జాన్ థామస్, విద్యుత్శాఖ డీఈ, చీరాల – రఘనందన్, హ్యాండ్లూమ్స్ ఏడీ, చీరాల -
నాణ్యమైన విద్య అవసరం
బాపట్ల: ప్రతి వ్యవసాయ విద్యార్థికి నాణ్యమైన విద్యను నైపుణ్యంతో కలిపి అందించే ప్రణాళికతో ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ముందడుగు వేస్తోందని ఉప కులపతి డాక్టర్ పి.వి. సత్యనారాయణ అన్నారు. ప్రతి పట్టభద్రుడికి ఉద్యోగ కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ‘‘పరిశోధన మరియు వాస్తవాల మధ్య వారధి: స్థిరమైన రైతులు, ఆహార వ్యవస్థలు, సమాజ సంక్షేమం కోసం స్మార్ట్ ఆవిష్కరణలు’’ అనే అంశంపై బాపట్ల వ్యవసాయ కళాశాలలో మంగళవారం పీజీ విద్యార్థుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. దీనికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో దేశ జనాభా 37 కోట్లని, నేటికి 6.5 రెట్లు జనాభా పెరిగినప్పటికీ 540 బిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి శాస్త్రవేత్తలు, రైతుల వలన సాధ్యమైందని తెలిపారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది ప్రపంచ స్థాయిలో 18 శాతం ఉంటే, భారత్లో అది 12 శాతంగా ఉండటం గర్వించదగ్గ విషయమన్నారు. అధిక మోతాదుతో నేలపై దుష్ప్రభావం వ్యవసాయ విద్యార్థుల వాస్తవిక గణాంకాలను తెలుసుకుంటే క్షేత్ర స్థాయిలోని సమస్యలు అవగతం అవుతాయన్నారు. పూర్వీకులు సేంద్రియ వ్యవసాయ విధానం చేయడం వలన పౌష్టికాహారాన్ని తీసుకోగలిగారని చెప్పారు. ప్రస్తుతం ఆహారంలో పోషక విలువలు తక్కువగా ఉంటున్నాయని తెలిపారు. అధిక మోతాదులో ఎరువులను, పురుగు మందులను వాడటం వలన నేలపై దుష్ప్రభావం పెరుగుతుందని చెప్పారు. భూమి యొక్క ఉత్పాదకత, సారవంతతను కోల్పోయే తీవ్రమైన పర్యావరణ సమస్యగా ఇది పరిణమిస్తుందని తెలిపారు. భూగర్భ జలాల వాడకం విషయంలో కూడా జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. నేలలు నిస్సారంగా మారి, వ్యవసాయానికి పనికిరాకుండా పోతాయన్నారు. రైతు సంక్షేమానికి చాలా కీలకమైన నీటిపారుదల సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అధిక దిగుబడులను ఇచ్చే రకాలను రూపొందించుకునేలా పరిశోధనలు సాగాలన్నారు. నేచురల్ ఫార్మింగ్ డిగ్రీని దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టామని తెలిపారు. కార్యక్రమంలో పరిశోధనల ముఖ్యాంశాలతో కూడిన ప్రతులను ముఖ్య అతిథులు, మాజీ ఉప కులపతి డా.సూరపనేని కోటేశ్వరరావు ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా 14 విశ్వ విద్యాలయాలకు చెందిన 810 మంది పి.జి. విద్యార్థులు పరిశోధన పత్రాలను సమర్పించి, సంబంధిత పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీన్ ఆఫ్ పీజీ స్టడీస్ డాశ్రీశ్రీ ఏవీ రమణ, డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాశ్రీశ్రీ జి.రామచంద్ర రావు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ డాశ్రీశ్రీ డి.సంపత్ కుమార్, అసోసియేట్ డీన్ డాశ్రీశ్రీ పి. ప్రసూనారాణి తదితరులు సదస్సు ముఖ్య ఉద్దేశాలను వివరించారు. సదస్సు ఆర్గనైజింగ్ కార్యదర్శి డాశ్రీశ్రీ కె. శ్రీనివాసులు, స్టూడెంట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ బాలాజీ, డాశ్రీశ్రీ ఎన్.టి.ఆర్. కాలేజీ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ అసోసియేట్ డీన్ డాశ్రీశ్రీ డి.డి.స్మిత్, డాక్టర్ ఎన్.టి.ఆర్. కాలేజీ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అసోసియేట్ డీన్ డాశ్రీశ్రీ ఎం.సర్దార్ బేగ్, డాశ్రీశ్రీ లాల్ అహమద్ మొహమ్మద్, డాశ్రీశ్రీ టి.వి.శ్రీధర్, స్టూడెంట్ టీచర్ కో ఆర్డినేటర్ డాశ్రీశ్రీ డి.వి.ఎస్. అక్షయ్, స్టూడెంట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా నృసింహుని జయంత్యుత్సవాలు
మంగళగిరి టౌన్: గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నృసింహుని జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ముఖ మండపంలో మంగళవారం ఉత్సవమూర్తులకు అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించారు. ఉదయం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సుదర్శన నారసింహ హోమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం పంచసూక్త హోమం అనంతరం రాత్రి సహస్ర దీపాలంకరణ సేవ చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ ఏర్పాట్లు ఈవో సునీల్కుమార్ పర్యవేక్షించారు. యడ్లపాడు: మండలంలోని సొలస గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భూసమేత రంగనాయకస్వామి ఆలయం వార్షిక కల్యాణ మహోత్సవం రెండోరోజైన మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు పర్చూరి రామకృష్ణ చార్యులు ఆధ్వర్యంలో మూలవిరాట్, ఉత్సవ మూర్తులకు విశేష అలంకరణలు చేశారు. ఉదయం నుంచి స్వామి వారికి గ్రామ బలిహరణ, హోమం, రంగనాయక స్వామి సహస్ర నామార్చన, రాత్రికి హంస వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ ఈవో నెమలిరెడ్డి పర్యవేక్షించారు. ఆయా కార్యక్రమాల్లో ధర్మకర్తలు అర్వపల్లి మనోహర్–నాగజ్యోతి, అర్వపల్లి బ్రదర్స్, భక్తులు భాగస్వాములయ్యారు. నగరంపాలెం: గుంటూరు నగరంలోని ఆర్.అగ్రహారం శ్రీకన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి జయంతి మహోత్సవాల్లో భాగంగా మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకుడు విశ్వనాఽథ్ ఆధ్వర్యంలో లక్ష మలెలతో పూజ చేపట్టారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు హాజరై, అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు, మిర్చియార్డు డైరెక్టర్ కొనకళ్ల సత్యం, కోట శేషగిరిరావు, జుజ్జూరి శ్రీనివాసరావు, యక్కల నాగభూషణం, మాగులూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఎర్రబాలెం(క్రోసూరు): వేసవి తాపానికి అడవి నుంచి తప్పిపోయి జనసంచారంలోకి వచ్చిన జింక బిక్కుబిక్కుమంటూ బావిలో పడింది. స్థానికులు చూసి రక్షించారు. పోలీసులకు సమాచారం అందించారు. మంగళవారం మండలంలోని ఎర్రబాలెం గ్రామంలోని ప్రధాన రహదారి పక్కన పొలాలలో ఈ సంఘటన చోటుచేసుకుందని ఎస్ఐ రవిబాబు తెలిపారు. జింకను పిడుగురాళ్ల అటవీశాఖ అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 525.70 అడుగులకు చేరింది. ఇది 159.8751 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 450 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
ఇంధనం పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ బాపట్ల: పెట్రోల్, డీజిల్ పక్కదారి పట్టిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లో మీడియా సమావేశం ఆయన నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ నల్ల బజార్కు తరలి వెళ్లకుండా అరికట్టామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ఏర్పాటు చేశామన్నారు. క్షేత్రస్థాయిలో పెట్రోల్ బంక్లపై పర్యవేక్షణకు వీఆర్వోలు, ఉప తహసీల్దార్లను నియమించామన్నారు. పెట్రోల్ బంక్ యజమానులు, వీఆర్వోలు సమన్వయంతో పనిచేస్తున్నారన్నారు. 96 పెట్రోల్ బంకులు జిల్లాలో నడుస్తున్నాయన్నారు. అన్ని బంకుల్లో కొరత లేదన్నారు. కొండపల్లి నుంచి జిల్లాకు ఇండెంట్ మేరకు వాహనాలలో పెట్రోల్, డీజిల్ సమృద్ధిగానే వస్తుందన్నారు. కొండపల్లి ఐఓసీ దగ్గర జిల్లాకు సంబంధించిన వాహనాల పర్యవేక్షణ కొరకు ఇద్దరు ఉప కలెక్టర్లను నియమించామన్నారు. ప్రతిరోజు అక్కడ 250 వాహనాలను ఫుల్ చేస్తున్నారని వివరించారు. ఈరోజు 47 బంకులకు సంబంధించి ఇండెంట్స్ ఇవ్వగానే 24 వాహనాలు వచ్చేశాయని, నాలుగు వాహనాలు ప్రయాణంలో ఉండగా, మిగిలిన వాహనాలు ఫిల్ అవుతున్నాయన్నారు. అక్కడి నుంచి వస్తున్న వాహనాలకు జియో లొకేషన్ ట్రాకింగ్ ద్వారా కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్నామన్నారు. పూర్తిస్థాయిలో నిఘా ఉంచామన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ నిల్వలు జిల్లా ప్రజలకు చాలినంత ఉన్నాయని కలెక్టర్ చెప్పారు. 24 గంటల్లో 4.42 లక్షల లీటర్ల డీజిల్ జిల్లాకు రాగా 2.53 లక్షల లీటర్లు మాత్రమే అమ్మకాలు జరిగాయన్నారు. 2.50 లక్షల లీటర్ల పెట్రోల్ జిల్లాకు రాగా కేవలం 1.62 లక్షల లీటర్లు అమ్మకాలు జరిగాయన్నారు. ఒకటి రెండు రోజుల్లోనే పూర్తిగా సాధారణ స్థాయికి చేరుకుంటుందన్నారు. పెట్రోల్ బంక్ లలో డీజిల్ పదివేల లీటర్లు, పెట్రోలు 5000 లీటర్లకు చేరితే ముందుగా ఇండెంట్ ఇవ్వాలని పెట్రోల్ బంక్ యజమానులను ఆదేశించామన్నారు. డీజిల్, పెట్రోలు పక్కదారి పట్టకుండా సీసీ కెమెరాలు నిఘా ఉంచామని, రాత్రిపూట ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయన్నారు. ● భావన్నారాయణ స్వామి దేవస్థానం ఎదురుగా ఉన్న 153 మీటర్ల రహదారిలో పూల మొక్కలు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు. చారిత్రాత్మకమైన దేవాలయానికి ఎదురుగా ఉన్న రహదారిని ఆహ్లాదకరంగా మారుస్తామన్నారు. ఫుట్ పాత్ ఆక్రమణలు తొలగించి, పూల కుండీలలో మొక్కలు నాటుతామన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి జమీర్ బాషా, పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. జలధార కార్యక్రమం పర్యవేక్షణ జిల్లాలో జలధార కార్యక్రమం కింద చేపట్టిన పనులను ప్రతి గ్రామంలో స్వయంగా సందర్శించి పరిశీలిస్తానని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన ప్రతి పనిని తప్పనిసరిగా ఆన్లైన్లో అప్లోడ్ చేసి పారదర్శకత పాటించాలని ఆదేశించారు. జలధార కార్యక్రమానికి రూ.123 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని, ఈ నిధులను సమర్థంగా వినియోగిస్తూ గ్రామీణ ప్రాంతాల్లోని చెరువుల అభివృద్ధి, నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. చెరువుల వద్ద విస్తృతంగా మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణను కూడా బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు. అధికారులు చొరవతో, చురుకుదనంతో పని చేసి లక్ష్యాలను సమయానికి పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలోని 20 మండలాల్లో దశలవారీగా పర్యటిస్తూ పనుల పురోగతిని సమీక్షించనున్నట్లు తెలిపారు. ఉత్తమంగా పని చేసిన ఎంపీడీవోలకు ‘బెస్ట్ ఎంపీడీవో అవార్డు’ ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. జలధార సమావేశానికి డ్వామా పీడీ విజయలక్ష్మి, ఏపీఎంఐ పీడీ సురేష్, హార్టికల్చర్ డీడీ కలీమ్, ఇరిగేషన్ విభాగ ఇంజినీర్లు, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీఓలు, అటవీ శాఖ రేంజ్ అధికారులు, బీట్ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు వర్టికల్గా హాజరయ్యారు. -
వెంటాడుతున్న పెట్రోల్, డీజిల్ కొరత
రేపల్లె: పట్టణంలో పెట్రోల్, డీజిల్ కొరత సమస్య రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. నాలుగవ రోజు కూడా సమస్య కొనసాగింది. పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలో ఉన్న ఐదు పెట్రోల్ బంకుల్లో మంగళవారం ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిచ్చాయి. ఉదయం రెండు గంటలపాటు పలు బంకులలో పెట్రోలు, డీజిల్ సరఫరా చేసినా తర్వాత స్టాక్ అయిపోయిందంటూ వాహన చోదకులను తిప్పి పంపించేశారు. ఇంధన కొరతతో రైతులు, ఆటో డ్రైవర్లు, చిన్న వ్యాపారులు తీవ్రంగా ప్రభావితం అవుతున్నారు. వ్యవసాయ పనులు సాగుతున్న ఈ సమయంలో డీజిల్ లభ్యం కాకపోవడం రైతులకు మరింత సమస్యగా మారింది. ఇదిలా ఉండగా, జిల్లా స్థాయి అధికారులు మాత్రం ఇంధనం కొరత లేదని చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు రేపల్లెలో భిన్నంగా ఉన్నాయి. దీంతో వాహన చోదకులు అంసతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంధనం కోసం సమీప పట్టణాలకు వెళ్లాల్సి రావడంతో అదనపు ఖర్చు, సమయం వృథా అవుతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని, బంకులకు సరిపడా ఇంధనం సరఫరా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వేమూరు నియోజకవర్గంలో... వేమూరు: నియోజక వర్గంలోని 20 బంకులు ఉన్నాయి. అమృతలూరు మండలంలోని కూచిపూడి, పెదపూడి, అమృతలూరు, గోవాడ ఇంటూరు గ్రామాల్లో బంకులు ఉండగా.. పెదపూడి, గోవాడ గ్రామాల్లో బంకులు మూసేశారు. వేమూరు మండలంలోని జంపని, వేమూరు, చావలి గ్రామాలలో బంకులు ఉన్నాయి. జంపని, చావలిలో మూతపడ్డాయి. కొల్లూరు మండలంలో 6 బంకులు ఉండగా, దోనేపూడి బంకులు మూసేశారు. భట్టిప్రోలు మండలంలో 5 బంకులు, చుండూరు మండలంలో రెండు ఉన్నాయి. వీటిలోనూ కొన్నిచోట్లే పెట్రోలు లభ్యమైంది. డీజిల్ అస్సలు లేక పోవడంతో వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. అమృతలూరు మండలంలోని బంకులను పోలీసులు తనిఖీ చేశారు. -
ప్రైవేటు టీచర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
లక్ష్మీపురం: విద్యారంగంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. ప్రైవేటు టీచర్స్, లెక్చర్స్, ప్రొఫెసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యాన స్థానిక రెవెన్యూ కల్యాణ మండపంలో మంగళవారం నిర్వహించిన సభలో రాష్ట్ర వ్యాప్తంగా 72 మంది ప్రైవేటు టీచర్లకు సీవీ రామన్ ప్రతిభా పురస్కారాలు అందజేశారు. అసోసియేషన్ కన్వీనర్ ఎం.సూర్యారావు అధ్యక్షతన జరిగిన సభలో లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 36 లక్షల మందికిపైగా విద్యార్థులకు ప్రైవేటు ఉపాధ్యాయులు బోధిస్తున్నారని, అధికారిక లెక్కల ప్రకారం 1.20 లక్షల మంది ప్రైవేటు రంగంలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారన్నారు. కానీ వారిలో చాలా మందికి కనీస వేతనాలు అమలు కావట్లేదన్నారు. ప్రభుత్వ పరంగా వారి కోసం చేపట్టాల్సిన చర్యలేవీ చేపట్టట్లేదన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం గుర్తింపు కార్డులు, హెల్త్కార్డులు మంజూరు చేయాలన్నారు. ముఖ్యంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 20 సంవత్సరాలుగా ప్రైవేటు విద్యారంగం శరవేగంగా పెరుగుతుందని, కానీ టీచర్ల పరిస్థితి ఘోరంగా ఉందన్నారు. ఎం.సూర్యారావు మాట్లాడుతూ హక్కులు సాధించుకోవటానికి ఉపాధ్యాయులు ఐక్యంగా ఉండాలన్నారు. ప్రైవేటు ఉపాధ్యాయుల సంక్షేమం, హక్కుల కోసం తమ అసోసియేషన్ నిరంతరంగా కృషి చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బి.లక్ష్మణరావు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వి.నాగేశ్వరరావు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ జేఏసీ ఆర్గనైజెంగ్ సెక్రటరీ ముజఫర్ అహ్మద్, పిటిఎల్పిడబ్ల్యూఎ రాష్ట్ర నాయకులు కిరణ్, శ్రీనివాసరెడ్డి, ఎం.శ్రీనిను, శ్రీవాణి, సదరన్ ప్రైవేటు టీచర్స్ అసోసియేసన్ అధ్యక్షులు డాక్టర్ నాగయ్య, తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు డీజిల్ అందుబాటులోకి తీసుకురావాలి
వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఈదా శ్రీనివాసరెడ్డి బాపట్ల: రైతులకు డీజిల్ సమస్య రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ రైతువిభాగం జిల్లా అధ్యక్షులు ఈదా శ్రీనివాసరెడ్డి కోరారు. జిల్లా కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ భావన వశిష్టను మంగళవారం ఆయన కలిశారు. మొక్కజొన్న రైతులకు ప్రస్తుతం వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉన్నాయని, జిల్లాలో 1700 కుటుంబాలు మొక్కజొన్న సాగుపై ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. రైతులకు అవసరమైన పనులకు డీజిల్ కొరత లేకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో రైతు విభాగం జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పె పూర్ణచంద్రరావు, రాష్ట్రకార్యదర్శి ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు, చీరాల నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షులు కావూరి రమణారెడ్డి తదితరులు ఉన్నారు. -
బెట్టింగ్ మాఫియా
చీరాల: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ క్రికెట్ పోటీలు ఉత్కంఠ.. ఉద్వేగంతో సాగుతున్నాయి. వేసవిలో ఐపీఎల్ మ్యాచ్లను చూస్తూ క్రికెట్ అభిమానులు ఎంజాయ్ చేస్తుంటే క్రికెట్ అభిమానులను బెట్టింగ్ల పేరుతో క్రికెట్ బుకీలు తమ బుట్టలో వేసుకుంటున్నారు. రెండు నెలల పాటు జరిగే మొత్తం 74 మ్యాచ్లు ఆరంభం నుంచే మంచి హీటెక్కిస్తున్నాయి. బెట్టింగ్ కాసేవారు మాత్రం క్రికెట్ అభిమానులను బెట్టింగ్ ఆశ చూపి రొంపులోకి దించుతున్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా క్రికెట్ బుకీలను పెద్ద సంఖ్యలో సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో పెద్ద చేపలను వదిలి చిన్న చేపలను పట్టుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆన్లైన్లోనే బెట్టింగ్.. చీరాల్లో కోట్లాది రూపాయలు బెట్టింగ్ కారణంగా చేతులు మారుతున్నాయి. ఇందుకు వేటపాలెం నుంచి ఈపూరుపాలెం వరకు పెద్ద ఎత్తున బడా బుకీలుగా ఏజెంట్లు బెట్టింగ్లను నడుపుతున్నారు. గతంలో ఒకే చోటు కూర్చొని బెట్టింగ్లు జరుగుతుంటే పోలీసులు నిఘా పెట్టి పట్టుకునేవారు. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితి లేదు. బెట్టింగ్ బాబులు రూటు మార్చారు. ఆన్లైన్ యాప్ను డౌన్లోడ్ చేసి టీవీలో ఒక బంతికంటే ముందుగానే వచ్చే సమాచారాన్ని చూస్తూ ఫోన్ల ద్వారానే బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. పోలీసుల నిఘాకు అందకుండా ఇంట్లోనే ఉంటూ బుకీ ఏజెంట్లు పందేలు కాస్తున్నారు. బంతి బంతికి, ఓవర్ ఓవర్లుకు బెట్టింగ్ కాయిస్తున్నారు. బ్యాటింగ్ సరళిని బట్టి అప్పటికప్పుడు బెట్టింగ్ మార్చడంతో సులువుగా సంపాదించుకునే ఉద్దేశంతో చిన్న, మధ్యతరగతి కుటుంబాల వారు ఈ బెట్టింగ్తో చితికిపోతున్నారు. గతంలో క్రికెట్ బెట్టింగ్ కారణంగా తీవ్ర అప్పులపాలై అప్పులు తిరిగి చెల్లించలేక మానసిక వేదనతో పలువురు బలవణ్మరణాలకు పాల్పడ్డారు. బెట్టంగ్లకు డబ్బులు చెల్లించలేక దొంగతనాలకు పాల్పడటంతో పాటు గతంలో ఈపురుపాలెం, దేవాంగపురి గ్రామాల్లో బెట్టింగ్ అప్పులు చెల్లించలేక ఇరువురు యువకులు ఊరు వదలి వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు. ఆట సరళిని బట్టి.. బెట్టింగ్ రాయుళ్లు తమకు అనువుగా మ్యాచ్లను మార్చుకుంటున్నారు. టీవీలు చూస్తూ ఓవర్లో ఎన్ని రన్స్ కొడతారు.. ఈ బంతి సిక్స్.. ఫోర్.. డబుల్ రన్.. ఈ ఓవర్లో వికెట్ పడుతుందంటూ బెట్టింగ్లు కడుతున్నారు. టీవీల వద్ద వ్యక్తిగతంగా పందేలు కాస్తున్నారు. బుకీ ఏజెంట్లు మాత్రం యువకులు, వ్యాపారులు, వస్త్ర వ్యాపారులు లక్షలాది రూపాయలు బుకీల ద్వారా పందేలు కాస్తున్నారు. బెట్టింగ్ వ్యవహారం అంతా కోడ్ లాంగ్వేజ్ ద్వారా సాగిస్తున్నారు. సెల్ఫోన్ల ద్వారా బుకీలతో మాట్లాడుతూ ‘‘ఈటింగ్.. ఎస్.... నో ..’’ వంటి పదాలు వాడుతున్నారు. కొత్తవారైతే ముందుగా డబ్బులు డిపాజిట్ చేయించుకుంటారు. ఎప్పటి నుంచి బుకీలతో సస్సంబంధాలు ఉన్నవారికి మాత్రం అరువు కూడా ఇస్తుంటారు. బెట్టింగ్లో పోతే రూ.5వేలు.. గెలిస్తే రూ.20 వేలు ఇలా క్రికెట్ అభిమానులను డబ్బు ఆశ చూపుతున్నారు. గెలిచిన డబ్బులను మరుసటి రోజునే వారికి ఫోన్ పే, గూగుల్ పే ద్వారా జమ చేస్తున్నారు. ఒకప్పుడు టీవీల్లో చూస్తూ పందేలు కాస్తుండేవారు. అయితే ప్రస్తుతం అంతా సెల్ఫోన్లో చూస్తూనే పందేలు కాస్తున్నారు. ముఖ్యంగా యువకులు ఈ బెట్టింగ్లలో ఎక్కువగా బుక్ అవుతున్నారు. చితుకుతున్న కుటుంబాలు.. క్రికెట్ బెట్టింగ్ భూతం గ్రామాలకు పాకింది. ఎక్కువ మొత్తంలో డబ్బు వస్తుందనే ఆశతో ఎంతో మంది బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. పోయిన డబ్బు కట్టేందుకు అప్పులపాలవుతున్నారు. చీరాల ప్రాంతంలో అధికంగా నివసించే చిన్నా, మధ్యతరగతి కుటుంబాల వారు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. కొందరు ప్రాణాలు తీసుకుంటే మరికొందరు ఊరు వదిలివేళ్ళిపోతున్నారు. బెట్టింగ్ల కోసం చేసిన అప్పులు వడ్డీతో సహా పేరుకుపోయి అవి తిరిగి చెల్లించలేని స్థితిలో వడ్డీ వ్యాపారులు చేసే ఇబ్బందులు తట్టుకోలేక ఇళ్లలోని బంగారం తాకట్టు పెడుతున్నారు. ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నారు. ఎక్కువగా యువకులు, విద్యార్థులు, వ్యాపారులే బలైపోతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా చాప కిందనీరు వస్తున్న బెట్టింగ్ భూతాన్ని పోలీసులు నిలువరించాలని ప్రజలు కోరుతున్నారు. రోజువారీ కూలీలు, వ్యవసాయ కూలీలు, చిరువ్యాపారులు ఽఅధికంగా ఉండే చీరాల్లో క్రికెట్ బుకీలు, ఏజెంట్లకు కొదవ లేదు. చీరాల నియోజకవర్గంలో పేరు మోసిన బుకీలు, ఏజెంట్లు లక్షలు సంపాదిస్తూ పేదల రక్తాన్ని తాగుతున్నారు. చీరాల నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో బుకీలున్నారు. జాండ్రపేటలో ఇద్దరు, వేటపాలెంలో ఇద్దరు, ఈపూరుపాలెంలో ఇద్దరు ఏజెంట్లు, చీరాల ప్రాంతాల్లో జరిగే బెట్టింగ్లను నడుపుతున్నారు. ఎప్పటికికప్పుడు పోలీసులకు సమాచారం తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ డబ్బు లావాదేవీలంతా ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. ఫలితాన్ని బట్టి డబ్బు అందుతుంది. ఇందుకు నమ్మకస్తులను మాత్రమే ఎంచుకుంటున్నారు బుకీ ఏజెంట్లు. నమ్మకంలేనివారి వద్ద ముందే డబ్బు డిపాజిట్ చేసుకుంటున్నారు. క్రికెట్ బెట్టింగ్లలో ఆరితేరిన పెద్ద బుకీలు ఎక్కువ మంది ఉన్నారు. ఎప్పటి నుంచే ఇదే తరహాలో తెరవెనుక బెట్టింగ్లు చేస్తూ పెద్ద మొత్తం ఆదాయాన్ని గడించారు. ఐపీఎల్ సీజన్లో లక్షల్లో డబ్బు చేతులు మారుతోంది. ఐపీఎల్ సీజన్లో క్రికెట్ బుకీలపై పోలీసులు నిఘా ఉంచారు. సీసీఎస్ పోలీసులు ఇటీవల జిల్లా వ్యాప్తంగా 50 మందికి పైగా క్రికెట్ బుకీలను అదుపులోకి తీసుకున్నారు. చీరాల టూటౌన్, వేటపాలెం, చెరుకుపల్లి, బాపట్ల, రేపల్లె, కర్లపాలెం పోలీస్స్టేషన్లలో వీరిని ఉంచారు. పోలీసులు మాత్రం జిల్లాలో 42 మందిని మాత్రమే అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరిలో 37 మంది చీరాల నియోజకవర్గానికి చెందిన వారే ఉండడం విశేషం. వీరి నుంచి కారు, బైక్, 25 సెల్ ఫోన్లు, రూ.51,400 నగదును స్వాధీనం చేసుకున్నారు. అధికార పార్టీ నేతలతో సంబంధాలు ఉన్న వారు కూడా ఉన్నారు. వేటపాలెం మండలంలో 25మందిని అదుపులోకి తీసుకోగా వారిలో నలుగురు పరారీలో ఉన్నారు. వారం రోజుల కిందట అదుపులోకి తీసుకుంటే పరారీలో ఎలా ఉన్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. మరికొందరికి స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో నేతల ‘పలుకు’బడి బాగా పనిచేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. -
ఘరానా దొంగల ముఠా అరెస్ట్
బాపట్ల టౌన్: వరుస దొంగతనాలకు పాల్పడుడిన ఘరానా దొంగల ముఠాను జిల్లా పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఎస్పీ బి. ఉమామహేశ్వర్ కేసు వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ... ఈ ఏడాది జనవరిలో చీరాల మండలం, గాంధీనగర్ ఎంజీహెచ్ కాలనీలో బచ్చు వెంకట సుబ్బసత్య రామాంజనేయులు ఇంటిలోకి ముగ్గురు ప్రవేశించారన్నారు. రామాంజనేయులతోపాటు ఏపీపీగా విధులు నిర్వర్తిస్తున్న ఆయన చెల్లిపై దాడి చేసి వారి నుంచి 64 గ్రాముల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారని చెప్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు చీరాల వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించారన్నారు. అదే తరహాలో రాష్ట్రంలోని బాపట్ల, తెనాలి, ఒంగోలు, కావలి, కొవ్వూరు, గుత్తి తదితర ప్రాంతాల్లో నేరాలు జరిగాయని తెలిపారు. దీంతో వేలిముద్రలు, సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారాల ప్రకారం దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం హోలి బోయిడా గ్రామానికి చెందిన భురు మక్వానా, జుందాం గ్రామానికి చెందిన రమేష్ మాచర్, భూటియా గ్రామానికి చెందిన సంతోష్ భూరియాలను నిందితులుగా గుర్తించామన్నారు. వారిని మంగళవారం అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తే ఇదే తరహాలో మొత్తం 18 నేరాలకు పాల్పడినట్లు అంగీకరించారని తెలిపారు. వాటిలో బాపట్ల, చీరాల, గూడూరు, తెనాలి, ఒంగోలు తదితర మొత్తం 10 ప్రదేశాల్లోరీ నేరాలు చేసినట్లు వారు అంగీకరించారన్నారు. వారి నుంచి 137 గ్రాముల బంగారం, 1.50 కేజీల వెండి వస్తువులు, రూ. 5 లక్షల నగదు, నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వాటి మొత్తం విలువ రూ. 30.88 లక్షలు ఉంటుందన్నారు. కేసుల ఛేదనలో ప్రతిభ చూపిన సీసీఎస్, చీరాల సబ్ డివిజన్, ఐటీ కోర్ పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
స్పా సెంటర్పై దాడి
ముగ్గురు మహిళలు, ఒక నిర్వాహకుడు అరెస్ట్ గుంటూరు రూరల్: గుట్టు చప్పుడు కాకుండా స్పా సెంటర్లలో వ్యభిచారం నిర్వహిస్తున్నారని సమాచారం మేరకు నల్లపాడు పోలీస్స్టేషన్ పోలీసులు స్పా సెంటర్లపై మంగళవారం దాడులు నిర్వహించారు. నగరాలులోని లోటస్ సెలూన్ అండ్ స్పా సెంటర్పై టాస్క్ఫోర్స్ బృందం నల్లపాడు పోలీసులతో కలిసి దాడులు నిర్వహించగా స్పా సెంటర్ నిర్వాహకుడు, అతనితోపాటు ముగ్గురు మహిళలు, కండోమ్స్, ఒక వ్యక్తి, ఐదు సెల్ఫోన్లు అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. శ్రీకాకుళానికి చెందిన వంశీ అనే వ్యక్తి స్పా పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను విచారణ కోసం నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించామన్నారు. నరసరావుపేట టౌన్ : చోరీసొత్తు కలిగి ఉన్నట్లు నేరం రుజువు అవడంతో నిందితులకు ఒక్కొక్కరికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. 2022వ సంవత్సరంలో మండలంలోని బసికాపురం గ్రామంలో వేంపూడి అనంతమ్మ మెడలోనీ బంగారు గొలుసును ముగ్గురు ఆగంతకులు బలవంతంగా లాక్కొని వెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న నరసరావుపేట రూరల్ పోలీసులు ప్రాథమిక దర్యాప్తు అనంతరం నిందితులైన నరసరావుపేటకు చెందిన దేవర భవానీ ప్రసాద్, ఉయ్యాల విష్ణు, పాలపర్తి ప్రవీణ్లను అరెస్టు చేసి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. విచారణలో చోరీసొత్తు కలిగి ఉన్నట్లు నేరం రుజువు అవడంతో పై విధంగా కోర్టు తీర్పు వెలువడింది. వెల్దుర్తి: మండలంలోని లోయపల్లి గ్రామంలో పిడుగుపాటుకు గురై పూరి గుడిసె పూర్తిగా దగ్ధమైన సంఘటన మంగళవారం జరిగింది. లోయపల్లి మధ్యాహ్నం వరకు విపరీతంగా ఎండకాసినంతరం, మధ్యాహ్నం 3గంటల తరువాత మాచర్ల నియోజక వర్గంలోని పలు ప్రాంతాలలో తేలికపాటి వర్షం కురిసింది. మండలంలో మాత్రం దాని ప్రభావం కారణంగా పలుమార్లు ఉరుములు మెరుపులు వచ్చాయి. సాయంత్రం సమయంలో లోయపల్లి గ్రామంలో మండ్లి నాసరయ్యకు చెందిన పూరి గుడిసె మీద పిడుగు పడటంతో గుడిసె పూర్తిగా కాలిపోయి ఆ కుటుంబ సభ్యులు రోడ్డున పడ్డారు. రోజువారీ పనులు చేసుకొని జీవించే వారు దిక్కుతోచని స్థితిలో కట్టుబట్టలతో నిలిచారు. తహసీల్దార్ రాజశేఖర్ నాయక్ వచ్చి పరిశీలించి కుటుంబ సభ్యులకు రోజు వారీ నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ. 87.84లక్షలు స్వాహా
పిడుగురాళ్ల: ఆన్లైన్ బెట్టింగ్కు బానిసై ఏటీఎంలో పెట్టాల్సిన రూ. 87.84లక్షలను సీఎంఎస్ ఉద్యోగి స్వాహా చేసినట్లు గురజాల డీఎస్పీ మల్లా మహేశ్వరరావు తెలిపారు. పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు... సీఎంఎస్వో కంపెనీ మేనేజర్ అనిల్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేయటం జరిగిందని, క్యాస్ కస్టోడీగా పని చేసే మామిడి నరేష్ రూ. 87,84,900 నగదును తన సొంత అవసరాలు, ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లలో పెట్టింగ్లు పెట్టాడని విచారణ తెలిసిందన్నారు. నరేష్ ఇదే కంపెనీలో 15 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాడన్నారు. సీఎంఎస్ కంపెనీ వారు వారానికి ఒక సారి నిర్వహించే ఆడిట్లో రూ. 87,84,900లు తేడా ఉన్నట్లు గుర్తించి ఫిర్యాదు చేయటం జరిగిందన్నారు. పిడుగురాళ్ల సీఐ శ్రీరాం వెంకట్రావు, ఎస్ఐ శివనాగరాజు, సిబ్బంది ఉదయం బైపాస్ రోడ్డులో మామిడి నరేష్ను పట్టుకోవటం జరిగిందన్నారు. అతని వద్ద నుంచి రూ. 25,53,000లను స్వాధీనం చేసుకోవటం జరిగిందన్నారు. ఆ నగదును అతని ఖాతా, అతని భార్య ఖాతాలో ఉంచుకుని వాడుకొని ఆన్లైన్ బెట్టింగ్ చేస్తూ మొత్తం ఖర్చు చేసుకున్నట్లు విచారణ తెలిసిందన్నారు. నిందితుడు మామిడి నరేష్ను కోర్టులో హాజరు పరచనున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో సీఐ శ్రీరాం వెంకట్రావు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
జిల్లాలో ఇంధన కొరత లేదు
నిజాంపట్నం (రేపల్లె): జిల్లాలో ఇంధన కొరత లేదని, వాహన చోదకులు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ వినోద్కుమార్ చెప్పారు. నిజాంపట్నం మండలం కూచినపూడిలోని పెట్రోలు బంకులో మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. స్టాక్ వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అక్రమ నిల్వలు చేయరాదని సూచించారు. ప్రస్తుత వేసవి దృష్ట్యా ఇది ప్రమాదకరమన్నారు. పెట్రోలు బంకులపై నిరంతరం తమ అధికారుల నిఘా కొనసాగుతోందని చెప్పారు. ఇంధనం సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. బంకులలో ఇంధనం ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా నిర్వాహకులు స్టాకు లేదని చెప్పినా, అధిక మొత్తంలో విక్రయిస్తున్నా జిల్లా కలెక్టరేట్కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. వినియోగదారులు 94932 47765 నంబరుకు విషయం తెలియజేయాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు వినియోగదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాసరావు ఉన్నారు. అభివృద్ధి పనుల పరిశీలన మండలంలోని బొర్రావారిపాలెం గ్రామంలో జరుగుతున్న పంప్హౌస్, వాటర్పైప్ లైనింగ్ నిర్మాణం, మంచి నీటి కుంట నిర్మాణ పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పనుల నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఆయన వెంట గ్రామీణ నీటి పారుదల శాఖ ఎస్ఈ అనంతరాజు, డీపీఎల్వో ప్రభాకర్ తదితరులు ఉన్నారు. -
ఇన్నర్ రింగ్రోడ్డు బాధితులను ఆదుకోండి
గుంటూరు రూరల్: ఇన్నర్ రింగ్రోడ్డు ఫేజ్–3లో ఇళ్లు కోల్పోయిన బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కోరారు. స్వర్ణభారతినగర్ ఇన్నర్ రింగ్రోడ్డు ఫేజ్–3 బాధితులు మంగళవారం ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని ఆయన కార్యాలయంలో కలసి వినతి పత్రం అందజేశారు. గతంలో సుమారు 300 ఇళ్లను కూల్చివేశారని, నేటికీ వారికి ఇళ్ల స్థలాలు కానీ, ఇళ్లు కాని ఇచ్చిన దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. నేటికీ ఎందరో చిన్నపిల్లలతో రోడ్డున పడ్డారని వాపోయారు. కొంత మందికి ఇళ్ల స్థలాలను లాం తదితర ప్రాంతాల్లో చూపారని కానీ అక్కడ ఇప్పటికే గతంలో స్థలాలు కేటాయించగా అందులో ఇళ్ల నిర్మాణాలు చేసుకుని జీవిస్తున్నారని వాపోయారు. వాళ్లు ఉంటున్న స్థలాలు మరలా మాకు ఇచ్చి మమ్మల్ని ఉండమంటే ఏవిధంగా న్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు స్పందించిన ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మాట్లాడుతూ బాధితులకు న్యాయం జరిగే విధంగా ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్వర్ణభారతినగర్ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
ముగిసిన రాష్ట్రస్థాయి నాటికల పోటీలు
మార్టూరు: ఉభయ తెలుగు రాష్ట్రస్థాయి నాటికల పోటీల విజేతగా ‘అమ్మ చెక్కిన బొమ్మ’ నిలిచింది. స్థానిక మార్టూరు మండల కేంద్రంలో శ్రీకారం కళాపరిషత్, మార్టూరు రోటరీ క్లబ్లు సంయుక్తంగా మూడు రోజులపాటు నిర్వహించిన నాటికల పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. పోటీలలో విశేషంగా ప్రేక్షకులతో పాటు న్యాయ నిర్ణీతల మన్ననలను సైతం ఆకట్టుకున్న గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారు ప్రదర్శించిన ‘అమ్మ చెక్కిన బొమ్మ’ నాటిక అత్యధికంగా ఐదు విభాగాల్లో బహుమతులు కై వసం చేసుకుని అగ్రస్థానంలో నిలిచింది. శ్రీకృష్ణ ఆర్ట్స్ కల్చరల్ ఆర్గనైజేషన్ గుడివాడ వారు ప్రదర్శించిన ‘ద్వారబంధాల చంద్రయ్య నాయుడు’తో పాటు, విజయవాడ సాంస్కృతిక సమితి వారు ప్రదర్శించిన ‘మమ్మల్ని బతకనివ్వండి’ నాటికలు రెండు కూడా పోటాపోటీగా నిలిచి నాలుగు విభాగాల్లో బహుమతులు కై వసం చేసుకుని ద్వితీయ స్థానంలో నిలిచాయి. అభినయ ఆర్ట్స్ గుంటూరు వారు ప్రదర్శించిన ‘సహాన’ నాటికతోపాటు బీవీకే క్రియేషన్స్ కాకినాడ వారు ప్రదర్శించిన ‘కన్నీటికి విలువెంత నాటికలు మూడు విభాగాల్లో బహుమతులు గెలుచుకొని పోటాపోటీగా తృతీయ స్థానంలో నిలిచాయి. అరవింద ఆర్ట్స్ తాడేపల్లి వారు ప్రదర్శించిన ‘దేవుణ్ణి చూశా’ నాటికలో పున్నయ్య చౌదరి ప్రత్యేక బహుమతితోనూ, హర్ష క్రియేషన్స్ విజయవాడ వారి ‘చెరిగిపోని చిరునామా’లో పూర్ణసత్యం ఉత్తమ సహాయ నటులుగా చె రొక బహుమతిని కై వసం చేసుకున్నారు. ఉత్తమ దర్శకుడిగా గోవాడ వెంకట్.. అమ్మ చెక్కిన బొమ్మ ప్రదర్శనలో ఉత్తమ రచన బీశెట్టి జ్యోతి రాజ్, ఉత్తమ దర్శకుడు గోవాడ వెంకట్, ఉత్తమ నటుడు భాను ప్రకాష్, ఉత్తమ జ్యూరీ అవార్డు హర్షిణి, ఉత్తమ ప్రదర్శన గోవాడ క్రియేషన్స్ అందుకున్నారు. ద్వార బంధాల చంద్రయ్య నాయుడు నాటికలో బీ నాగసాయి, ఎంఆర్వీ ఆర్ ప్రసాద్లు ప్రత్యేక బహుమతులు అందుకోగా ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్గా ఎస్ శ్రీనివాస్, ఉత్తమ మేకప్గా శేషగిరి బహుమతులు అందుకున్నారు. మమ్మల్ని బతకనివ్వండి ప్రదర్శనలో ఉత్తమ రంగాలంకరణకుగాను ఫణి, ఉత్తమ లైటింగ్ విభాగంలో రోహిత్, ఉత్తమ సంగీతం లీలామోహన్, ఉత్తమ ద్వితీయ ప్రదర్శనకు గాను విజయవాడ సాంస్కృతిక సమితి బహుమతులు అందుకున్నారు. సహాన నాటికలో ఉత్తమ జ్యూరీ నటిగా కుసుమసాయి, వీసీ హెచ్ కే ప్రసాద్ ప్రత్యేక బహుమతి, ప్రత్యేక ప్రదర్శనగా అభినయ ఆర్ట్స్ వారు అందుకున్నారు. కన్నీటికి విలువెంత నాటికలో ఎం సౌమ్య ప్రత్యేక బహుమతిని, ఉత్తమ విలన్గా ఎస్ జ్యోతి రాణి, ఉత్తమ ప్రదర్శనగా బీవీకే క్రియేషన్స్ కాకినాడ వారు బహుమతులు అందుకున్నారు. న్యాయ నిర్ణేతలు, పరిషత్ నిర్వాహకులు, విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. విజేతగా ‘అమ్మ చెక్కిన బొమ్మ’ -
జాతీయ స్థాయి నాటకోత్సవాలు ప్రారంభం
చీరాల: చీరాల కళాంజలి ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల జాతీయ స్థాయి 9వ నాటకోత్సవాలు సోమవారం స్థానిక కస్తూర్బాగాంధీ మున్సిపల్ గరల్స్ హైస్కూల్ ఆవరణలో ప్రారంభమయ్యాయి. సోమవారం రాత్రి డాక్టర్ రాయని హనుమంతరావు కళావేదికపై విజయవాడకు చెందిన త్రిధార ది ఆర్ట్స్ ల్యాండ్ బృందం కూచిపూడి నృత్యం, శ్రీరామ పట్టాభిషేకం నృత్య రూపకం ప్రదర్శించారు. పల్నాడు జిల్లా యడ్లపాడుకు చెందిన మానవతా సాగరి బృందం ప్రదర్శించిన ‘అందరూ మంచివారే..కానీ.?’ నాటిక మనుషుల మధ్య మంచితనం విలువను చాటింది. నాటికకు జరుబుల రామారావు స్వీయ రచన, దర్శకత్వం వహించారు. అనంతరం గుంటూరుకు చెందిన శ్రీరమణ కళా నిలయం వారు మాతృత్వం నాటికను ప్రదర్శించారు. తల్లి బిడ్డల్ని వేరు చేయాలని చూస్తే భర్తలకు వ్యతిరేకంగా మహిళలంతా ఏకమవుతారని చాటే సందేశంతో నాటిక సాగింది. సుఖమంచి కోటేశ్వరరావు రచించిన ఈ నాటికకు పొగర్తి నాగేశ్వరరావు దర్శకత్వం వహించారు. ప్రదర్శన అనంతరం నటీనటులు, రచయితలు, దర్శకులను ఘనంగా సత్కరించారు. అధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరై నాటికలను ఆసక్తిగా తిలకించారు. కళాంజలి సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు కోడూరి ఏకాంబరేశ్వరబాబు, సాంబశివరావు, బత్తుల బ్రహ్మారెడ్డి, వలివేటి మురళీకృష్ణ, పూర్ణా సత్యం, లూక, పొట్టి శ్రీనివాసరావు, దరియా సాహెబ్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
గతంలో మాకు పెట్రోల్, డీజిల్ సమస్య ఎదురు కాలేదు..
కారంచేడు: గతంలో మాకు పెట్రోల్, డీజిల్ సమస్య ఎదురు కాలేదు.. ఈ సారి మాత్రం ఇంధన కొరత ఎదుర్కొంటున్నామని వాహనదారులు జిల్లా కలెక్టర్కు తెలిపారు. పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా కారంచేడు గ్రామంలో మూతపడిన బంకులను కలెక్టర్ డాక్టర్ వీ వినోద్కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో బంక్లో పెట్రోల్, డీజిల్ లేకపోవడం వలన అక్కడ బంక్ యజమానులతో ఫోన్లో మాట్లాడారు. బంక్కు అవసరమైన పెట్రోల్, డీజిల్ కోసం డబ్బు చెల్లించామని, ఇంకా స్టాక్ రాలేదని యజమానులు వివరించారు. అనంతరం అక్కడకు పెట్రోల్, డీజిల్ కోసం వచ్చిన వినియోగదారులతో ఆయన మాట్లాడారు. గతంలో ఈ పెట్రోల్ బంక్ల వద్ద ఇలా సమస్యలు ఉన్నాయా, ఇప్పుడే ఈ సమస్యలు ఉన్నాయా అని అడిగారు. గ్రామంలోని రెండు బంక్లు అందుబాటులో ఉన్నాయని, గతంలో ఎప్పుడూ ఈ సమస్యను మేము ఎదుర్కోలేదన్నారు. గ్రామంలోని రెండు బంక్ల వద్ద ఇలాంటి సమస్యలు ఎదురైతే మాత్రమే మేము చీరాలకు వెళ్లి పెట్రోల్, డీజిల్ కోనుగోలు చేసుకుంటామని తెలిపారు. ఒక్కోసారి మండలంలోని స్వర్ణ గ్రామంలోను పెట్రోల్, డీజిల్ తెచ్చుకుంటామన్నారు. రైతులు ఎక్కువగా ఉంటారని, వారు మాత్రమే అవసరాలను బట్టి క్యాన్ల ద్వారా డీజిల్ తెచ్చుకొని పెట్టుకుంటామన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఎవరూ డీజిల్ గురించి ఆందోళన చెందవద్దన్నారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తమైదని, అన్ని బంకుల వద్ద పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉంటుందన్నారు. పెట్రోల్ బంక్లను తనిఖీ చేసిన కలెక్టర్ -
మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య
ఉప్పుటూరు (చినగంజాం): మద్యానికి బానిసై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాపట్ల జిల్లా చినగంజాం మండలంలోని ఉప్పుటూరు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ పులి గోపి అందించిన సమాచారం ప్రకారం.. ఉప్పుటూరు గ్రామానికి చెందిన షేక్ నాజర్ వలి(20) తల్లిదండ్రులు విడిపోగా తల్లి వేరొక వివాహం చేసుకుంది. ప్రస్తుతం అతను అమ్మమ్మ దగ్గర ఉంటూ వెల్డింగ్ పనులు చేసుకుంటున్నాడు. మూడు నెలల క్రితం అతని తండ్రి మృతిచెందాడు. ఈ నేపథ్యంలో కొంత కాలంగా మద్యానికి బానిసైన నాజర్వలి సోమవారం ఇంట్లోనే ఉరేసుకుని మృతిచెందాడు. సమాచారం అందుకున్న స్థానిక వీఆర్వో, పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి శవపంచనామా నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు అవివాహితుడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో నరాలశెట్టి ప్యానల్ విజయం బాపట్ల: బాపట్ల కో ఆపరేటివ్ అర్బన్ ఎన్నికల్లో బ్యాంకు మాజీ చైర్మన్ నరాలశెట్టి ప్రకాశరావు ప్యానల్ విజయం సాధించింది. రెండు ప్యానల్స్ ఎన్నికల బరిలోకి దిగగా నరాలశెట్టి ప్యానల్ విజయం కై వసం చేసుకుంది. తొమ్మిది మంది డైరెక్టర్లు గెలుపొందారు. గెలుపొందిన వారిలో బండారు రవికుమార్(ఆర్మీ రవి), అనంత నగేష్బాబు, కోటి ఉమామహేశ్వరరావు, గర్నెపూడి వెంకటేశ్వరరావు, జూలకంటి వెంకటకృష్ణారావు, జోగి ఆనంద్, నరాలశెట్టి కృష్ణమూర్తి, పులిపాక రఘురాం, బాపట్ల జ్ఞాన సత్యప్రతాప్లు గెలుపొందారు. గెలుపొందిన వారు చైర్మన్, వైఎస్ చైర్మన్ను ఎన్నుకోకున్నారు. చైర్మన్ రేస్లో బండారు రవికుమార్ చైర్మన్ రేస్లో బండారు రవికుమార్(ఆర్మీ రవి), వైస్ చైర్మన్ రేసులో కోటి ఉమామహేశ్వరరావు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ మేరకు వీరి ఎన్నిక మంగళవారం జరగనుంది. డైరెక్టర్లను అభినందించిన వారిలో బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు విన్నకోట సత్యప్రసాద్, రిటైర్డ్ తహసీల్దార్ వల్లయ్య, రెడ్క్రాస్ జిల్లా చైర్మన్ బి.ఎస్.నారాయణభట్టు, సైనిక ఉద్యోగుల సంఘం నాయకులు తాండ్ర సాంబశివరావు తదితరులు ఉన్నారు. తాడేపల్లిరూరల్: మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి రూరల్ పెనుమాక గ్రామంలో కత్తి చేత్తో పట్టుకుని హల్చేసిన టీడీపీ కార్యకర్తను ఎట్టకేలకు తాడేపల్లి పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరిచారు. ఈ సందర్భంగా సీఐ వీరేంద్రబాబు తాడేపల్లి పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉండవల్లిలో నివాసముంటూ ప్రస్తుతం కృష్ణాయ పాలెంలో నివాసముంటున్న పెద్దపరం జ్యోతి అనే యువకుడికి కత్తిపట్టుకుని పెనుమాకలో హల్చల్ చేసిన కూనపురెడ్డి ప్రదీప్చంద్కు మధ్య కొంతకాలంగా మనస్పర్ధలు ఉన్నాయి. శనివారం రాత్రి పెద్ద పరంజ్యోతి కూనపురెడ్డి ప్రదీప్కు ఫోన్ చేయగా ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీనిని ఆసరా చేసుకుని ప్రదీప్చంద్ ద్విచక్రవాహనంలో కత్తులు పెట్టుకుని పెనుమాక వెళ్లి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. జరిగిన సంఘటనపై పెద్దపరంజ్యోతి ఫిర్యాదు చేయడంతో గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, నార్త్జోన్ డీఎస్పీ మురళీకృష్ణ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, ప్రదీప్చంద్ ఉండవల్లి సెంటర్లో ఉండగా అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తీసుకువచ్చామని, ఇతను రెండు కత్తులుకలిగి ఉన్నాడని, ఆ రెండింటిని కూడా మారణాయుధాలుగా నిర్ధారించి కేసు నమోదు చేశామని తెలిపారు. గతంలో ప్రదీప్పై తాడేపల్లి పోలీస్స్టేషన్లో మూడు కేసులు నమోదు అయ్యాయని, అయినా ఇతని ప్రవర్తనలో మార్పు కనిపించలేదని, ఉన్నతాధికారుల సూచనల మేరకు ప్రదీప్పై రౌడీషీట్ ఓపెన్ చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. తాడేపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఇలాంటి వారు ఎవరైనా కత్తులు పట్టుకుని వీరంగం చేస్తే వెంటనే తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. చోరీ కేసులో నిందితుడికి జైలు తిరుపతి లీగల్: ఓ చోరీ కేసులో గుంటూరు జిల్లా తెనాలి, గంగానమ్మ పేటకు చెందిన పి. నాగ ఉమామహేశ్వరరావుకు రెండు నెలలు జైలు, రూ.వంద జరిమానా విధిస్తూ తిరుపతి రెండో అదనపు జూనియర్ జడ్జి పి. కోటేశ్వరరావు సోమవారం తీర్పు చెప్పారు. ఈనెల తొమ్మిదో తేదీన తిరుమల సి ఆర్ ఓ ఆఫీసు హాల్లో నంద్యాల జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ప్యాంటు జేబులోని సెల్ ఫోను అపహరణకు గురైంది. అతని ఫిర్యాదు మేరకు తిరుమల టూ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేసి నిందితుడు నాగ ఉమామహేశ్వరరావును అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి అతనికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఆయుధాల చట్టం కింద కేసు నమోదు వివరాలు వెల్లడించిన సీఐ వీరేంద్ర -
బెట్టింగ్ రాయుళ్లపై పోలీసుల మెరుపుదాడి
బాపట్ల టౌన్: క్రికెట్ బెట్టింగ్ లపై ఆదివారం జిల్లాలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. దాడుల వివరాలను సోమవారం సాయంత్రం ఎస్పీ కార్యాలయం లో ఎస్పీ బి.ఉమామహేశ్వర్ వివరించారు. జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలను కట్టడి చేసేందుకు సిసిఎస్ డీఎస్పీ పి. జగదీష్ నాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏకకాలంలో దాడులు నిర్వహించి చీరాల టూటౌన్, రూరల్, వేటపాలెం, చెరుకుపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో బెట్టింగ్ లకు పాల్పడుతున్న ముఠాలను ఆదివారం అదుపులోకి తీసుకున్నామన్నారు. బెట్టింగ్ లకు పాల్పడుతున్న 42 అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేశామన్నారు. వారి వద్దనుంచి 25 మొబైల్ ఫోన్లు, రూ.51,400 నగదు, కారు, బైక్ సీజ్ చేయటం జరిగిందన్నారు. సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్ నాయక్, చీరాల డిఎస్పి ఎండీ మోయిన్, బాపట్ల పట్టణ, చీరాల 2 టౌన్, రూరల్ సర్కిల్ సీఐ సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్ఐలు పాల్గొన్నారు. 42 మందిపై కేసులు నమోదు 25 మొబైల్ ఫోన్లు, రూ.51,400 నగదు, కారు, బైక్ సీజ్ -
హెల్మెట్ ధారణతో ప్రాణరక్షణ
చీరాల: హెల్మెట్ ధరించడం భారం కాదని, అది రోడ్డు ప్రమాద సమయంలో ప్రాణాలు కాపాడుతుందని ఎస్పీ బి.ఉమామహేశ్వర్ పేర్కొన్నారు. శిరోరక్ష–ప్రాణరక్ష కార్యక్రమంలో భాగంగా సోమవారం చీరాలలోని మసీదు సెంటర్ ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు. గడిచిన 30 రోజులుగా జిల్లా వ్యాప్తంగా హెల్మెట్ వినియోగంపై వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ద్విచక్రవాహనం నడిపే వారు తన ప్రాణాన్ని, కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని హెల్మెట్ ధరించాలని సూచించారు. హాయ్ రెస్టారెంట్, మసీదు సెంటర్ వద్ద హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న వారిని అభినందించారు. అలానే హెల్మెట్ లేనివారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎండీ మోయిన్, ఒన్టౌన్ సీఐ జి.సోమశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 38 అర్జీలు గ్రీవెన్స్ను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు చర్యలు చేపట్టినట్టు ఎస్పీ ఉమామహేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం చీరాల ఒన్టౌన్ పోలీస్స్టేషన్లో గ్రీవెన్స్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. చీరాల సబ్డివిజన్ పరిధిలో 38 మంది అర్జీలు అందజేయగా నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఇకపై ప్రతివారం జిల్లాలోని ఒక్కో నియోజకవర్గంలో గ్రీవెన్స్ నిర్వహిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో చీరాల డీఎస్పీ ఎండీ మోయిన్, సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్నాయక్, పీజీఆర్ఎస్ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఒన్టౌన్ సీఐ సోమశేఖర్, పోలీసు అధికారులు పాల్గొన్నారు. అవసరమైన మేరకే ఇంధనం వాడుకోండి వాహనదారులు అవసరమైన మేరకే ఇంధనం కొనుగోలు చేయాలని ఎస్పీ ఉమామహేశ్వర్ సూచించారు. సమస్య తాత్కాలికమేనని, ప్రజలు ఆందోళన చెందవద్దని చెప్పారు. సోమవారం చీరాలలోని పలు ఫిల్లింగ్ స్టేషన్లను ఎస్పీ తనిఖీ చేసి, యజమానులతో మాట్లాడారు. బ్లాక్లో పెట్రోలు, డీజిల్ విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. స్టాక్ ఉన్నా, లేదని చెప్పి వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తే ఉపేక్షించేది లేదన్నారు.జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ -
28 నుంచి బాపట్లలో పీజీ విద్యార్థుల జాతీయ సదస్సు
బాపట్ల : భారతీయ వ్యవసాయాన్ని సుస్థిరత, సాంకేతికత, సమగ్ర అభివృద్ధి దిశగా మలచాలనే లక్ష్యంతో ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వ్యవసాయ కళాశాల, బాపట్ల ఆధ్వర్యాన పి.జి.విద్యార్థుల జాతీయ సదస్సును ఈనెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్నట్లు అసోసియేట్ డీన్ డాక్టర్ పి.ప్రసూనరాణి తెలిపారు. సోమవారం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘పరిశోధన, వాస్తవాల మధ్య వారధి, స్థిరమైన రైతులు, ఆహార వ్యవస్థలు, సమాజ సంక్షేమం కోసం స్మార్ట్ ఆవిష్కరణలు’ అనే ప్రధాన అంశంతో జరిగే ఈ జాతీయ సదస్సు వ్యవసాయ పరిశోధనలను రైతు అవసరాలతో అనుసంధానం చేసే కీలక వేదికగా నిలవనుందని తెలిపారు. దేశవ్యాప్తంగా 15 వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, వివిధ కేంద్ర, రాష్ట్ర స్థాయి పరిశోధన సంస్థల నుంచి దాదాపుగా 800 మంది పీజీ, పీహెచ్డీ విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొని తమ పరిశోధన ఫలితాలను ప్రదర్శించనున్నారని ఆమె వివరించారు. సదస్సుకు ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ పి.వి.సత్యనారాయణ అధ్యక్షత వహించనున్నారని, ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్, పి.జె.టి.యస్.ఏ.యు., ఆర్.వి.యస్.కె.వి.వి., గ్వాలియర్ మాజీ ఉప కులపతి డా.సూరపనేని కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారని, డీన్ అఫ్ పి.జి. స్టడీస్ డాక్టర్ ఏ.వి.రమణ ఇతర విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు పాల్గొననున్నట్లు తెలిపారు. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి, వివిధ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాల నిపుణులు కీలక ప్రసంగాలు చేస్తారని తెలిపారు. -
డీజిల్ కొరతతో ఆర్టీసీ బస్సులో వరికూటి ప్రయాణం
వేమూరు: బందరు పోర్టు పనుల వేగవంతంపై సోమవారం నిర్వహించిన సంకల్పన సాధన సమావేశానికి వేమూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు ఆర్టీసీ బస్సులో మచిలీపట్నం వెళ్లారు. డీజిల్ కొరత కారణం, పలు బంకుల్లో డీజిల్ పూర్తిగా లేకపోవడంతో అశోక్బాబు కారును ఇంటివద్ద ఉంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొరత ఏర్పడడంతో బంకు వద్ద ఆటోలు, ట్రాక్టర్లు, లారీలు, ప్రైవేటు బస్సులు నిలిచిపోతున్నాయని అన్నారు. డీజిల్ కొరతతో సంకల్పన సాధన సమావేశానికి బస్సులో వెళ్లినట్లు వివరించారు. ప్రభుత్వం ఇంధన కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తాడేపల్లిరూరల్: అవయవదానం చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకు రావడం అభినందనీయమని మణిపాల్ హాస్పిటల్ వైద్యులు సోమవారం పేర్కొన్నారు. చిలకలూరి పేటకు చెందిన పెడవల్లి నాగేశ్వరరావు (45) ఈనెల 23వ తేదీ తన కుమార్తెతో బైక్పై ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. స్థానిక ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు చేర్పించారు. ఆరోగ్యపరిస్థితిలో మార్పులేకపోవడంతో 24వ తేదీ గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా, వైద్యుల సలహా మేరకు తాడేపల్లి పట్టణ పరిధిలోని మణిపాల్ హాస్పిటల్కు తీసుకువచ్చారు. వైద్యపరీక్షల అనంతరం నాగేశ్వరరావుకు బ్రెయిన్లో రక్తస్రావం ఉందని తెలిపి చికిత్స ప్రారంభించారు. అయితే ఆయన ఆరోగ్యపరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించలేదు. ఏప్రిల్ 26వ తేదీ సాయంత్రం బ్రెయిన్డెడ్గా పరిగణించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. నాగేశ్వరరావు తండ్రి ఆదినారాయణ, కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు ఆంధ్రప్రదేశ్ జీవన్దాన్ చైర్మన్ డాక్టర్ కె.రాంబాబు, హాస్పిటల్ డైరెక్టర్ రామాంజనేయ రెడ్డిల ఆధ్వర్యంలో ఒక కాలేయం, ఒక కిడ్నీని మణిపాల్ హాస్పిటల్లో అవసరమైన వారికి ట్రాన్స్ప్లాంటేషన్ నిర్వహించారు. కార్నియాను విజయవాడ ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి తరలించారు. మంచి కార్యక్రమానికి ముందుకు వచ్చిన దాత కుటుంబానికి మణిపాల్ హాస్పిటల్స్ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపారు. సృజనాత్మకతను వెలికితీసేందుకు శిక్షణ శిబిరాలు దోహదం తాడేపల్లి రూరల్: చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి వేసవి శిక్షణ శిబిరాలు తోడ్పడతాయని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం తాడేపల్లిలోని రాష్ట్ర గ్రంథాలయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రంథాలయాల్లో పిల్లల కోసం వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. పిల్లలు సెల్ఫోన్కి బానిసలు కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్ గుంటూరు రూరల్: వివాహితను ఆత్మహత్యకు ప్రేరేపించిన ఘటనలో నల్లపాడు పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఇంచార్జి సౌత్ డీఎస్పీ బివి.మధుసూదన్రావు తెలిపారు. సోమవారం నగరంలోని డీఎస్పీ కార్యాలయంలో నిందితుల వివరాలను వెల్లడించారు. తాడికొండ మండలంకు చెందిన మిక్కిలి అనిత (33)కు 2020 సంవత్సరంలో జొన్నలగడ్డ గ్రామానికి చెందిన నాలాది మల్లికార్జునరావుతో వివాహం జరిగింది. పెళ్ళి సమయంలో ఆమె తల్లిదండ్రులు రూ.లక్షన్నర నగదు, 6 గ్రాముల బంగారం కట్నంగా ఇచ్చారు. వీరికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. ఈ క్రమంలో గ్రామంలో స్థలాన్ని కొనాలని అందుకు అనితను తన తల్లిదండ్రుల నుంచి డబ్బులు తేవాలని మల్లిఖార్జునరావు, నాలాది శివశంకరరావు, నాలాది మాథంగిషైనీలు తరచూ వేధించారు. దీంతో అనిత మళ్లీ తల్లిదండ్రులనుంచి మరో రూ.లక్ష తీసుకురాగా స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇదిలా ఉండగా మల్లిఖార్జునరావు తన మరదలైన మాథంగి షైనితో వివాహేతర సంబంధం పెట్టుకుని అనితను శారీరకంగా, మానసికంగా వేధిస్తూ, డబ్బులు తీసుకురాకపోతే రెండో వివాహం చేసుకుంటానని బెదిరించేవాడు. దీంతో వేధింపులు భరించలేక అనిత ఈనెల 9వ తేదీన పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. సంఘటనపై మృతురాలి సోదరుడు మిక్కిలి ధర్మతేజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు దర్యాప్తు చేపట్టి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా నిందితులు చేసిన నేరం ఒప్పుకోవటంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. -
నృసింహుని గరుడ సేవ
మంగళగిరి టౌన్ : మంగళగిరి పట్టణ పరిధిలో వేంచేసి యున్న శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి జయంత్యుత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం ఆలయ ముఖ మండపంపై నరసింహస్వామి వారికి అర్చకులు ఉదయం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్ఠ, నారసింహ మూల మన్య హోమం నిర్వహించారు. సాయంత్రం అగ్ని ప్రణయనం, కుమ్భారాధన, నారసింహ హోమం అనంతరం స్వామి వారికి గరుడ సేవ నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. వైభవంగా శ్రీ వాసవీ అమ్మవారి గ్రామోత్సవం రెంటచింతల: ఆర్యవైశ్యుల ఇలవేల్పు, జగజ్జనని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదిన వేడుకలలో భాగంగా ఆదివారం రాత్రి అమ్మవారి ఉత్సవ విగ్రహంతో గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్థానిక కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుంచి భక్తులు పెద్దసంఖ్యలో గ్రామ పురవీధులలో భక్తిశ్రద్ధలతో నగర సంకీర్తన నిర్వహించారు. గ్రామోత్సవంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దీవెనలు పొందారు. సోమిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో భక్తులు కోలాటం ప్రదర్శించారు. దేవస్థానం చైర్మన్ నాళం చినబాబు, కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. చెన్నకేశవ స్వామిని తాకిన సూర్య కిరణాలు వేమూరు: జంపని గ్రామంలో వేంచేసి ఉన్న భూసహిత చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో సోమవారం ఉదయం మూలవిరాట్ స్వరూపం చెన్నకేశవుడిని సూర్యకిరణాలు తాకాయి. పాదాల నుంచి కీరీటం వరకు స్వామి వారిని 40 నిమిషాలకు పైగా సూర్య భగవానుడు స్పృశించాడు. ఈ సుందరమైన అనుభూతిని కలిగించే దృశ్యాన్ని చూసి భక్తులు తన్మయం చెందారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో తరచూ స్వామి వారిపై సూర్య కిరణాలు పడుతుంటాయని అర్చకులు శ్రీనివాస మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారికి సూర్య అష్టకం పంచసూక్తాలను పఠించి సూర్య నమస్కారాలు చేశారు. రేపటి నుంచి చందోలు బగళాముఖి అమ్మ తిరునాళ్ల చందోలు(కర్లపాలెం): బాపట్ల జిల్లా చందోలు గ్రామంలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన బగళాముఖి అమ్మవారి వార్షిక తిరునాళ్ల ఈనెల 29 నుంచి వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కలకోట చక్రధర్రెడ్డి, ఈవో నరసింహమూర్తి తెలిపారు. తిరునాళ్లకు తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధికంగా భక్తులు హాజరవుతారని తెలిపా రు. మే 2వ తేదీన బగళా ముఖి అమ్మవారికి ప్రాచీన కాలంనాటి బంగారు ఆభరణాలు అలంకరణ చేయటం జరుగుతుందని చెప్పారు. మే 3వ తేదీన పలు గ్రామాల నుంచి భక్తులు భారీ విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేసుకుని పసుపు బండ్లతో ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకుంటారన్నారు. -
ఆందోళన అవసరం లేదు
బాపట్ల జిల్లాలో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్, జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు. జిల్లాలోని 96 పెట్రోల్ బంకులకు కొండపల్లి, ఒంగోలు ఆయిల్ డిపోల నుంచి నిరంతరాయంగా సరఫరా కొనసాగుతోందని వెల్లడించారు. ఇంధన పంపిణీ ప్రక్రియను రెవెన్యూ, సివిల్ సప్లయి శాఖల అధికారులు ప్రతి గంట పర్యవేక్షిస్తూ నివేదికలు సేకరిస్తున్నారన్నారు. భద్రతా చర్యల్లో భాగంగా ప్రతి బంక్ను సీసీ కెమెరాల నిఘాలో ఉంచడంతోపాటు పోలీసు సిబ్బందిని కాపలాగా నియమించామని తెలిపారు. ఆక్వా, వ్యవసాయ అవసరాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి, రైతులు బంకుల వద్ద ఉన్న ఇంధనం పొందేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. బ్లాక్ మార్కెట్లో ఇంధనం విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేసి నిల్వలు చేయవద్దని కోరారు. సమస్యలు, ఫిర్యాదుల కోసం జిల్లా కలెక్టరేట్లో 24 గంటల కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యవసర సమాచారం కోసం 9493247765 నంబర్ను సంప్రదించవచ్చని సూచించారు. -
కరకట్టల కటకట..
నాడు ధాన్యాగారం.. నేడు దయనీయం ఆయకట్టు ఘనం.. పంట భద్రత తీసికట్టు ప్రతి ఏడాది కాలువకు గండ్లు.. నేటికీ అందని పంట నష్టపరిహారం.. కారంచేడు, స్వర్ణ గ్రామాల మధ్య కొమ్మమూరు కాలువకు పడ్డ గండికి అడ్డు గోడగా వేసిన ఇసుక, మట్టి బస్తాలు – మురళీధర్, ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్, రేపల్లె -
ఉపాధి పథకం అవినీతిపై విచారణ చేపట్టాలి
బాపట్ల పేదలకు ఉపాధి కల్పించేందుకు ఉన్న గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భారీ అవినీతి జరిగిందని, అవినీతిపై వెంటనే విచారణ చేపట్టాలని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షులు తోకల కృష్ణమోహన్ పేర్కొన్నారు. అవినీతిపై విచారణ చేపట్టాలని కోరుతూ సోమవారం బాపట్లలో వైఎస్సార్సీపీ కార్యాలయంలో నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ప్రజాసమస్యల పరిష్కారవేదికలో వినతి పత్రం అందించారు. గ్రామాల్లో దొంగ హాజరు వేసుకుని సొమ్ము చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ఉపాధి హామీ పథకంలో పని ప్రదేశాల్లో కల్పించాల్సిన సౌకర్యాల విషయంలో కూడా అధికారులు పట్టించుకోవటంలేదన్నారు. ప్రతి పనిలోనూ అవినీతి జరుగుతుందని, వాస్తవంగా పేదలకు దక్కాల్సిన పనులు సక్రమంగా దక్కటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో యువత జిల్లా అధ్యక్షులు కొక్కిలిగడ్డ చెంచయ్య, స్టేట్ పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అనిల్ కుమార్, స్టేట్ సోషల్ మీడియా వింగ్ జాయింట్ సెక్రటరీ బట్టు అనిల్కుమార్, బాపట్ల నియోజకవర్గ పంచా యతీరాజ్ అధ్యక్షులు పిన్నబోయిన ప్రసాద్, పర్చూ రు నియోజకవర్గ పంచాయతీరాజ్ కార్యవర్గ సభ్యు లు వంకాయలపాటీ భాగ్యరావు, షేక్ బాబుల్లా, రేగులగడ్డ అరుణ్ పవార్, వాణిజ్య విభాగం అధ్యక్షుడు మువ్వల రాంబాబు, నరిశెట్టి శ్రీనివాసరావు, మిన్నకంటి శివ, దొడ్డ రవి, గోరంట్ల భాస్కరరావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
కృత్రిమ ఇంధన కొరతతో ప్రభుత్వం కొత్త పన్నాగం
– వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి గాదె మధుసూదనరెడ్డి పర్చూరు(చినగంజాం): రాష్ట్రంలో అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న వ్యక్తులకు మాత్రమే లాభం చేకూర్చేందుకే పెట్రోల్, డీజిల్ను కృత్రిమ కొరత సృష్టించి చంద్రబాబు ప్రభుత్వం మరో కొత్త పన్నాగానికి తెర లేపిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జి గాదె మధుసూదనరెడ్డి విమర్శించారు. పర్చూరులోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కొరత ఉండటానికి ప్రభుత్వం వ్యవహరిస్తున్న పోకడలే కారణమని దుయ్యబట్టారు. అధికార పార్టీకి చెందిన తొత్తులకు లాభం చేకూర్చడమే కాకుండా దళారీ వ్యవస్థను రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం పెంచి పోషిస్తుందని ఆయన విమర్శించారు. దళారులు ఆయిల్ను భారీ మొత్తంలో నిల్వపెట్టుకొని రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతను సృష్టించడం ద్వారా సామాన్య ప్రజానీకంతో పాటు రైతులు, కార్మికులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ పరిమితిగా ఆయిల్ పంపిణీ చేయాలంటూ చెప్పిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శించారు. -
బాపట్ల
మంగళవారం శ్రీ 28 శ్రీ ఏప్రిల్ శ్రీ 20267పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.9760 టీఎంసీలు. అంకమ్మతల్లికి పూజలు దాచేపల్లి:స్థానిక వీర్ల అంకమ్మతల్లి కొలుపు ల తిరునాళ్ల సందర్భంగా సోమవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. నిమ్మకాయల ధరలు తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.5,500, గరిష్ట ధర రూ.10,000, మోడల్ ధర రూ.7,000 వరకు పలికింది. 7 -
అర్జీలు నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి
పర్చూరు(చినగంజాం): గ్రీవెన్స్లో ప్రజలు అందజేస్తున్న అర్జీలను నిర్ణీత గడువులోగా అధికారులు సత్వరం పరిష్కరించేందుకు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ వీ వినోద్కుమార్ సూచించారు. నియోజకవర్గస్థాయిలో పర్చూరులోని కొల్లా వెంకటనారాయణ తులశమ్మ కల్యాణ మండపంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో సోమవారం ప్రజా విజ్ఞప్తుల దినం, ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆరు మండలాల ప్రజల అర్జీలతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి 368 మంది తమ సమస్యలతో కూడిన అర్జీలను కలెక్టర్ సమక్షంలో అందజేశారు. జేసీ భావన వశిష్ట, నియోజకవర్గ ప్రత్యేకాధికారి ఎస్ లవన్న, డీఆర్వో, ఆర్డీవో తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఆర్ఐ
బాపట్ల:బాపట్ల మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ షేక్ ఇమామ్ ఏసీబీ అధికారులకు చిక్కా రు. వివరాలు ఇలా ఉన్నాయి..చిన్నగంజాం మండలం కొత్తపేట గ్రామానికి చెందిన దేవరకొండ నాగేంద్రం, ఆమె కుమార్తె మౌనిక పట్టణంలోని సంజయ్గాంధీ కాలనీలో 2025లో రెండు ఇళ్లు కొనుగో లు చేశారు. ఆస్తులపై టైటిల్ ట్రాన్స్ఫర్, ప్రాపర్టీ పన్ను మార్పుల కోసం ఇమామ్ను సంప్రదించగా, గతంలోనే ఒక ఇంటికి బాధితుని భార్య నాగేంద్రంతో టైటిల్ ఇచ్చినందుకు రూ.25 వేలు చలానాలు, మరో రూ.25 వేలు లంచంగా స్వీకరించాడని బాధితులు తెలిపారు. మళ్లీ బాధితుని కుమార్తె మౌనిక పేరుతో టైటిల్మార్పు, పన్ను సవరణ కోసం రూ.60 వేలు డిమాండ్ చేయడంతో బాధితులు ఆందోళనకు గురయ్యారు. చివరికి రూ.25వేలు ముందుగా ఇవ్వాలని ఒప్పందం కుదిరింది. ఈ పరిస్థితుల్లో బాధితులు అవినీతి నిరో ధక శాఖ(ఏసీబీ) అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం వల పన్ని మౌనిక నుంచి రూ.25 వేలు లంచం స్వీకరిస్తున్న సమయంలోనే షేక్ ఇమామ్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకుని, తదు పరి విచారణ చేపట్టారు. దాడిలో సీఐలు నాగరాజు, మన్మథరావు, సుబ్బారావు, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఇంధన కొరత.. ప్రజలు ఉక్కిరిబిక్కిరి
రేపల్లె: ఇంధన కొరత జిల్లా ప్రజలను పట్టిపీడిస్తోంది. మూడో రోజు కూడా వాహనదారులకు ఆయిల్ కష్టాలు తప్పలేదు. జిల్లాలో ఇంధన కొరత లేదని, భయపడద్దని అధికారులు చేస్తున్న ప్రకటనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో వాహనదారులు డీజిల్, పెట్రోల్ కోసం బంకుల్లో పడిగాపులు పడుతున్నారు. అయినా దొరుకుతుందన్న ఆశ లేదు. ఎండ వేడిమిని తట్టుకుని ఆయిల్ కోసం నిరీక్షిస్తున్నారు. రేపల్లె పట్టణంలోని కృష్ణా టాకీస్ వెనుక బజారు పల్స్ ఆసుపత్రి సమీపంలోని బంక్, పండ్ల మార్కెట్ సెంటర్ ప్రాంతాలు సోమవారం వాహనాలతో నిండిపోవడంతో ఊపిరి తీసుకోవడానికి కూడా చోటు లేకుండా మారాయి. బారులుగా నిలిచిన వాహనాలు ట్రాఫిక్ను పూర్తిగా స్తంభింపజేసి, పరిస్థితిని మరింత క్లిష్టతరం చేశాయి. ఇంధన భయం నగరాన్ని పట్టిపీడిస్తున్న వేళ, ప్రజల పరుగులు ఆందోళన తీవ్రతను ప్రతిబింబిస్తున్నాయి. బంకుల్లో నిరీక్షణ కొల్లూరు: ఇంధనం కొరతతో వాహనదారులతోపాటు రైతులు, ఇటుక పరిశ్రమ దారులు కష్టాలు పడుతున్నారు. మూడు రోజులుగా డీజిల్, పెట్రోల్ సరఫరాలో కొరత కారణంగా ఇటుక సరఫరా చేసే లారీలు నిలిచిపోయాయి. డీజిల్ కొరతతో మోటరు పనిచేయక పంటలకు నీరు అందక ఎండిపోతున్నాయి. గంటల తరబడి ఇంధనం కోసం నిల్చున్నప్పటికీ తమ వంతు వచ్చే సరికి బంక్లో అయిల్ నిల్వ నిండుకుందన్న చావుకబురు బంక్ల నిర్వాహకులు చెబుతుండడంతో వాహనదారులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అప్రమత్తమైన అధికార యంత్రాంగం ఆయిల్ అందుబాటులో ఉన్న బంక్లలో పంపిణీ చేపట్టాల్చిందేనని హెచ్చరించడంతో నిర్వాహకులు ఆయిల్ పంపిణీ చేపట్టారు. మండలంలో ఆరు పెట్రోల్ బంక్లు ఉండగా, దోనేపూడిలోని ఓ బంక్ మూత పడింది. మిగిలిన 5 బంక్లలో కొల్లూరులోని రెండు బంక్లు, దోనేపూడిలోని మరో బంక్లలో సోమవారం ఆయిల్ పంపణీ చేయడంతో రైతులు, వ్యాపారులు, వాహనదారులు పెద్ద సంఖ్యలో ఆయిల్ కోసం బంక్ల వద్దకు చేరుకున్నారు. మండలంలోని అనంతవరం, కొల్లూరు గౌడపాలెం సమీపంలోని మరో బంక్లో ఆయిల్ నిల్వ లేని కారణంగా పంపిణీ నిలిచిపోయింది. -
అవసరాల మేరకే ఇంధనం కొనుగోలు చేయాలి
బాపట్ల: జిల్లాలో ఇంధన సరఫరా నిరంతరం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట తెలిపారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా పరిస్థితిపై ఆదివారం జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ ఎస్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏమీ లేదని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. సరఫరా మరింత పెంచుతున్నామని, పరిస్థితి త్వరలోనే సాధారణ స్థితికి వస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని, రెవెన్యూ, పోలీస్ బృందాలను పెట్రోల్ బంకుల వద్ద పరిశీలించాలని ఆదేశించినట్లు చెప్పారు. ఎక్కడైనా సమస్యలు ఎదురైతే సంబంధిత అధికారులకు కంట్రోల్ రూమ్కు 9493247765 సమాచారం ఇవ్వాలని సూచించారు. వ్యవసాయం, ఆక్వా కల్చర్, పంట కోత కార్యకలాపాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ఆయిల్ అవసరమైన రైతులు మండల స్థాయిలో తహసీల్దార్, గ్రామస్థాయిలో వీఆర్ఓలు దరఖాస్తులు చేసుకుంటే ర్మిషన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఇంధన దుర్వినియోగం, బ్లాక్ మార్కెటింగ్, అక్రమ మార్పిడి వంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం బాపట్ల మండలం, కర్లపాలెం రోడ్డులోని హెచ్పీ పెట్రోల్ బంక్ను తనిఖీ చేశారు. జాయింట్ కలెక్టర్ వెంట డీఎస్ఓ ఆర్.జమీర్ బాషా ఉన్నారు. -
నేరాలకు అడ్డా!
చీరాల అర్బన్: అలక్ష్యం.. అహంకారం రాజ్యమేలుతోంది. బాబు జమానాలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అవుతున్నాయి. పాలనలో మితిమీరిన రాజకీయ జోక్యం. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికి అడ్డుఅదుపు లేకుండా పోయింది. గంజాయి, బెట్టింగ్లతో పాటు జూదం యథేచ్ఛగా సాగుతోంది. అధికారులు గొప్పులు చెబుతున్నా ఆచరణలో కనిపించడం లేదు. దీంతో చీరాల నియోజకవర్గంకు నేరాలకు అడ్డాగా మారిపోయింది. నూతనంగా బాధ్యతలు చేపట్టిన పోలీస్, ఎకై ్సజ్ అధికారులకు సవాల్గా మారింది. మొదటి వారంలోనే.. టీడీపీ ప్రభుత్వంలో గంజాయి మాఫియా పెరిగింది. ఈ నెల మొదటి వారంలో వేటపాలెంలో 15.50 కిలోల గంజాయి పట్టుబడింది. గత వారంలో బాపట్లలో 27.50 కిలోల గంజాయి పట్టుబడింది. రెండు రోజుల క్రితం చీరాలలో 56 ప్యాకెట్లు గంజాయి(630 గ్రాములు) పట్టుబడింది. దీనిపై జీఆర్పీ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అయితే పట్టుబడుతున్న మొత్తం కన్నా సంబంధిత అధికారుల కళ్లు కప్పి గంజాయి వినియోగం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న దృష్ట్యా మరింత నిఘా పెట్టాల్సి ఉంది. గాంబ్లింగ్.. గాంబ్లింగ్ ప్రధానంగా పేకాట, క్రికెట్ బెట్టింగ్ పట్టణంలోని పలు లాడ్జిలు, తీరప్రాంతంలోని రిసార్ట్స్, హోటల్స్లో సాగుతున్నాయి. అలా గుర్తింపు పొందిన హోటల్స్, లాడ్జిలు, రిసార్టులను కింగ్ పిన్ గాంబ్లర్స్గా గుర్తింపు పొందిన వారు ఎంచుకుంటారు. వారు మిగిలిన జూదప్రియులు ఏ వారం ఎక్కడ బస చేయాలో ముందుగానే చెప్తారు. ఆ ప్రకారం సదరు జూద ప్రియులు పర్యాటకులు, వ్యాపారులు ముసుగులో ఆయా వారాల్లో వారు సూచించిన చోట బస చేస్తారు. తరువాత అందరూ కలిసి తమ జూద క్రీడను కొనసాగిస్తారు. ఇది కొందరు అధికారులకు కూడా తెలుసు. వారందరికీ రాజకీయ అండ ఉందనేది బహిరంగ రహస్యం. వీటితో పాటు షేర్ మార్కెట్ సెన్సెక్స్ ఆధారంగా కూడా కొందరు జూదం ఆడుతున్నారు. ఇక బ్రాకెట్ ఆట సుదీర్ఘకాలంగా కొనసాగుతోంది. ఈ సాలెగూడులో చిక్కుకున్న కొందరు నైతికంగా, ఆర్థికంగా చితికిపోయి బలన్మరణం పొందినవారు ఉంటున్నారు. రూ.20 నుంచి రూ.50 అదనంగా.. చీరాల ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలో మద్యం బెల్ట్ షాపులు జోరుగా సాగుతున్నాయి. ఈ షాపుల్లో క్వార్టర్ బాటిల్కు అసలు ధర కన్నా సందర్భాన్ని బట్టి రూ.20 నుంచి రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారు. దీంతో మద్యపాన ప్రియుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. నియంత్రించాల్సిన ఎకై ్సజ్ అధికారుల చిత్తశుద్ధిని ప్రజలు శంకిస్తున్నారు. తీర ప్రాంతంలో బహిరంగ వేలం పాటలు ద్వారా బెల్ట్ దుకాణాలను దక్కించుకున్న వారు అదనపు ధరలకు మద్యం విక్రయాలు బహిరంగంగా విక్రయించటం అందుకు కారణంగా చెబుతున్నారు. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఇటీవల కాలంలో జాతీయ రహదారుల్లో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. పలువురు ప్రాణాలను మూల్యంగా చెల్లించాల్సి వస్తోంది. మద్యం తాగిన క్రమంలో కొన్ని సందర్భాల్లో, హెల్మెట్లు లేక కొన్ని సందర్భాల్లోనూ వాహన చోదకులు గాయపడుతున్నారు. తాజాగా రామాపురం రోడ్డులో మన్నం అపార్ట్మెంట్కు కూతవేటు దూరంలో 216 జాతీయ రహదారికి సమీపంలో ఏర్పాటు చేస్తున్న బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు సరైన చర్య కాదని ప్రజలు అంటున్నారు. ఎందుకంటే ఆ ప్రాంత కూడలి ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్గా గుర్తింపు పొందింది. ఇసుక అక్రమ తవ్వకాలు చీరాల నియోజకవర్గంలో ప్రభుత్వ పరంగా అధీకృత ఇసుక రీచ్లు లేవు. కానీ ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగుతున్నాయి. ఉన్నతాధికారులు దృష్టి సారించినపుడు ఒకటి, రెండు రోజులు ఆపి మమ అనిపిస్తారు. తరువాత తమ దందాను సాగిస్తుంటారు. అందుకు రాజకీయ అండ కారణం. చీరాల నియోజకవర్గం నుంచి రేషన్ బియ్యం ప్రతి నెలా నల్లబజారు తరలుతుంటాయి. ఒంగోలుకు చెందిన ఓ వ్యక్తి ఈ దందా సాగిస్తున్నాడు. కట్టడి చేస్తారా .. కలిసి పోతారా! ఈ క్రమంలో చీరాల వన్టౌన్, టూ టౌన్, రూరల్ పోలీస్ సర్కిళ్లకు కొత్త ఇన్స్పెక్టర్లు బాధ్యతలు స్వీకరించారు. కొద్ది రోజుల క్రితం చీరాల ఎకై ్సజ్ సర్కిల్కు నూతన ఇన్స్పెక్టర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో జరిగే అక్రమాలను అరికట్టి అక్రమార్కులకు చెక్ చెప్తారా.. లేకుంటే వారితో కలసి పోతారా అనే కోణంలో రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లోను చర్చ జరుగుతోంది. -
దేశ ఆర్థికాభివృద్ధికి జనగణన కీలకం
బాపట్ల: ప్రతి పౌరుడు స్వచ్ఛందంగా 2027 జనాభా నమోదు ప్రక్రియలో పాల్గొనాలని జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్ గౌడ్ కోరారు. జనాభా– 2027 స్వీయనమోదుపై అవగాహన కోసం 5కే రన్ ర్యాలీ ఆదివారం నిర్వహించారు. పట్టణంలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయం నుంచి జెండా ఊపి 5 కెకే రన్ ర్యాలీని ప్రారంభించారు. డీఆర్ఓ మాట్లాడుతూ దేశ ఆర్థికాభివృద్ధిలో జనాభా గణాంకాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. సరైన డేటా ఆధారంగా వనరుల పంపిణీ, మౌలిక సదుపాయాల దేశ ఆర్థికాభివృద్ధి, పరిశ్రమల ప్రోత్సాహం వంటి అంశాలలో నిర్ణయాలు తీసుకోవడం సులభమవుతుందని వివరించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జనాభా లెక్కల సేకరణ 2027 లో జిల్లాలో ఇప్పటికే శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. మే ఒకటి నుంచి ప్రతి ఇంటింటికి జనాభా లెక్కలు సేకరణకు అధికారులు రావడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు సహకరించి పూర్తి వివరాలను అందించాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్డీ ఓ శ్రీనివాసరావు, డీఈ కృష్ణా రెడ్డి పాల్గొన్నారు. -
లా అండ్ ఆర్డర్, ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యం
లా అండ్ ఆర్డర్, ప్రజల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తాం. గంజాయి, గాంబ్లింగ్ కట్టడి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తాం. వేసవి కాబట్టి ఎవరైనా ఊరు వదిలి వెళ్లే సమయంలో విలువైన వస్తువులు ఇళ్లలో ఉంచి వెళ్లొద్దు. అలానే ఊరు వెళ్లే ముందు పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలి. దీంతో పెట్రోలింగ్ టీం ప్రత్యేక దృష్టి పెడతారు. హెల్మెట్ ధారణపై వాహన చోదకులకు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తాం. అక్రమార్కులను నియంత్రిస్తాం. – శశికుమార్, ఇన్స్పెక్టర్, టూటౌన్ సర్కిల్, చీరాల -
యువకళారత్న పురస్కారాల ప్రదానం
నగరంపాలెం: గుంటూరు నగరంలోని బృందావన్గార్డెన్స్లో ఉన్న వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై నిర్వహిస్తున్న మహామంజీరనాదం–26 వైభవంగా కొనసాగుతున్నాయి. సాయి మంజీర కూచిపూడి ఆర్ట్ అకాడమీ 16వ అంతర్జాతీయ నృత్య వేడుకలు ఆదివారం జరగ్గా, ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు లంకా విజయబాబు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం డాక్టర్ హనీ ఉన్నికృష్ణన్ (కర్ణాటక) మోహినీ అట్టం, తరిత్ సర్కార్ (జార్ఖండ్) కఽథక్ నృత్యం, క్షితిజా కాసరవల్లి (కర్ణాటక) భరత నాట్యం, గోపాల్ సింగ్ (మణిపుర్) మణిపురి నృత్యాలను విభిన్న విన్యాసాలతో నర్తించారు. కళాకారుల నృత్యాలు సభికులను అలరించాయి. కళాకారులను యువ కళారత్న పురస్కారాలతో సత్కరించారు. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ కాజు వేంకటసుబ్రహ్మణ్యం, కోశాధికారి వేంకటగిరి నాగలక్ష్మీ, నారా రాధిక పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): ఏడు రోజులుగా విశాఖపట్నంలో జరుగుతున్న టీ–20 సీనియర్ క్రికెట్ ఆంధ్ర జోనల్ టోర్నీలో గుంటూరు జిల్లా జట్టు విజేతగా నిలిచిందని జీడీసీఏ త్రీమెన్ కమిటీ సభ్యుడు టి.వి.శివరామకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా జట్టు నార్త్ జోన్, సౌత్ జోన్, సెంట్రల్ జోన్, విశాఖపట్నం, అనంతపురం జట్లపై వరుస విజయాలతో విజయ పరంపర కొనసాగించిందన్నారు. ఆంధ్ర జోనల్ విన్నర్గా నిలిచిందన్నారు. ముఖ్యంగా యువ క్రీడాకారులు సమష్టిగా రాణించి అద్భుత విజయాలు నమోదు చేశారని తెలిపారు. సుదీర్ఘకాలం తర్వాత గుంటూరు జిల్లా క్రీడాకారులు విజేతగా నిలవడం అభినందనీయమన్నారు. జట్టు సభ్యులకు త్రీ మెన్ కమిటీ సభ్యులు జీవీ శరత్బాబు, సిహెచ్.వి.నాగరాజు అభినందనలు తెలిపారు. చీరాల రూరల్: థాయ్లాండ్లో నిర్వహించిన ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో చీరాలకు చెందిన క్రీడాకారులు సిహెచ్.నాగరాజు, జి.ఉమామహేశ్వరరావు, ఎ.సాంబశివరావు 40 ప్లస్, 45 ప్లస్, 50 ప్లస్ విభాగంలో పాల్గొని పతకాలు సాధించారు. ఆదివారం స్థానిక ఎన్ఆర్ అండ్ పీఎం హైస్కూలు క్రీడా మైదానంలో చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అసోసియేషన్ అధ్యక్షుడు పోలుదాసు రామకృష్ణ మాట్లాడారు. 100, 200 మీటర్లు పరుగు పందెంలో, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, షాట్పుట్, జావెలిన్ త్రోలో బంగారు పతకాలు, సిల్వర్ మెడల్స్ సాధించి చీరాలకు కీర్తి ప్రతిష్టలు తెచ్చారని క్రీడాకారులను కొనియాడారు. పోలుదాసు రామకృష్ణ, చారుగుళ్ల గురుప్రసాద్, సుధాకరరావు, నారాయణమూర్తి, శ్రీరాం రమేష్, పూర్ణా, మద్దు వెంకట సుబ్బారావు, రవి, భాస్కరరావు, రామబ్రహ్మం పాల్గొన్నారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 525.80 అడుగులకు చేరింది. ఇది 160.0644 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 900 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
తిరుపతమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
పెనుగంచిప్రోలు: స్థానిక శ్రీతిరుపతమ్మ వారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు దినం కావటంతో పాటు పలు శుభకార్యాలు ఉండటంతో అమ్మవారి దర్శనానికి వివిధ జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. ఆలయ క్యూలైన్లు, పరిసరాలు కిక్కిరిశాయి. వేకువ జాము నుంచే భక్తులు పాలు, పొంగళ్లతో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి భక్తులకు ఆలయ వేద పండితులు దిలీప్కుమార్ సౌజన్యంతో ఆలయం వారు నిరంతరాయంగా మజ్జిగ పంపిణీ చేశారు. భక్తులు మధ్యాహ్న సమయంతో మునేరు అవతల మామిడి తోటల్లో సేద తీరారు. పెద్ద సంఖ్యలో వాహనాలు రావటంతో గ్రామంలో ట్రాఫిక్ సమస్యలు కూడా ఏర్పడ్డాయి. -
గ్రామీణ వైద్యులకు గుర్తింపు ఇచ్చిన ఘనత డాక్టర్ వైఎస్సార్దే
గుంటూరు మెడికల్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆర్ఎంపీ, పీఎంపీ గ్రామీణ వైద్యులకు గుర్తింపు ఇచ్చేందుకు ప్రత్యేకంగా కోర్సును ప్రవేశపెట్టి, వారి గుర్తింపు కోసం ఎంతో కృషి చేశారని ఏపీఆర్జేసీ న్యాయ సలహాదారు డాక్టర్ లోక్నాథ్ అన్నారు. ఆదివారం గుంటూరు నాజ్సెంటర్లో సౌత్ ఇండియన్ ఫస్ట్ ఎయిడర్స్ అసోసియేషన్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ లోక్ నాథ్ మీడియా తో మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆర్ఎంపీ, పీఎంపీలకు గుర్తింపు ఇచ్చే ప్రక్రియ మరుగున పడిపోయిందన్నారు. గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ మాట్లాడుతూ గ్రామీణ రోగులను పరీక్షించి ప్రథమ చికిత్స చేసేందుకు ఆర్ఎంపీ వైద్యులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో గ్రామీణ వైద్యులు చేసే సేవ మరువలేనిదన్నారు. ప్రభుత్వం వెంటనే గ్రామీణ వైద్యులను గుర్తించి వారికి గుర్తింపు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షుడు గోవిందరాజులు, అధ్యక్షుడు సాంబశివరావు, అమర్ రెడ్డి, నిర్గుణ రావు, శ్రీనివాసరావు, వలి, జన విజ్ఞాన వేదిక గౌరవ అధ్యక్షుడు డాక్టర్ వి.బ్రహ్మరెడ్డి, అఖిల భారత ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ ప్రదాతల ఆర్ఎంపీ, పీఎంపీల సంఘం, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, సెయింట్ జాన్ అంబులెన్స్ ఇండియా గౌరవ రాష్ట్ర కార్యదర్శి, డాక్టర్ ఎం.మహేంద్ర కుమార్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది వి.బి.సుమంత్ లు మాట్లాడుతూ.. 24 గంటలూ గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారికి ఆర్ఎంపీలు వైద్యసేవలు అందిస్తున్నారని కొనియాడారు. గుర్తింపు ఉన్నా లేకపోయినా ధైర్యంగా ప్రజలకు వైద్యం అందించాలని, అది ప్రథమ చికిత్సకు కట్టుబడి మాత్రమే పనిచేయాలని సూచించారు. ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినా, ఎన్ని పీహెచ్సీలు పెరిగినా, అర్థరాత్రి అయినా ఆర్ఎంపీలకు ఎప్పటికీ గుర్తింపు ఉంటుందన్నారు. -
ఆ ప్లాట్లకు తప్పని పాట్లు
చిలకలూరిపేట: పురోగమనం నుంచి తిరోగమనం వైపు అన్న చందంగా ఉంది కూటమి పాలకుల తీరు. ఒకసారి రెసిడెన్షియల్ అని ప్రకటించి, అధికారికంగా వెలువడిన ఉత్తర్వుల ఆధారంగా ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి మళ్లీ పాట్లు తప్పని పరిస్థితి ఎదురైంది. వివరాలు.. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణ పరిధిలోని బాలాజీ థియేటర్, పెదనందిపాడురోడ్డు, ఆర్టీసీ కాలనీ, ఎన్ఆర్టీ రోడ్డులోని గోల్కొండ గార్డెన్స్, సంజీవనగర్, పండరీపురం, కోండ్రుపాడు, చీరాల రోడ్డులోని కక్కెర దాసయ్య గోడౌన్లు వంటి మొత్తం 12 ప్రదేశాలను 2024 మార్చి 13న ప్రభుత్వం ఇండస్ట్రియల్ ఏరియా నుంచి రెసిడెన్షియల్కు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సవరించిన మాస్టర్ ప్లాన్ను విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ఆధారంగా కొంతమంది స్థల యజమానులు ప్లాట్లు వేసి విక్రయాలు చేశారు. రెసిడెన్షియల్గా మారిన నేపథ్యంతో పాటు, సంబంధిత స్థలాలు నివేశ ప్రాంతాల మధ్యలో ఉండటంతో ఆ ప్లాట్లలో ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రజలు కొనుగోలు చేశారు. హఠాత్తుగా ఇండస్ట్రియల్లోకి... అయితే ఉరమని ఉరుములా హఠాత్తుగా ఈ 12 ప్రదేశాలను రెసిడెన్షియల్ నుంచి తిరిగి ఇండస్ట్రియల్/కమర్షియల్లోకి మారుస్తూ ఈ నెల రెండో తేదీన ప్రభుత్వం గెజిట్(రాజపత్రం) జారీ చేసింది. దీంతో సంబంధిత ప్రదేశాల్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. విషయం తెలుసుకున్న సంబంధిత ప్లాట్ల కొనుగోలు దారులు, స్థల యజమానులు డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్లో తమకు జరుగుతున్న అన్యాయంపై ఫిర్యాదు చేశారు. అవి రెసిడెన్షియల్ జోన్లోనే కొనసాగించాలని తమ అభ్యంతాలను తెలియజేశారు. అత్యధిక శాతం ప్లాట్లుగా ... గతంలో రెసిడెన్షియల్కు మారిన 12 ప్రదేశాల్లో అత్యధిక స్థలాల్లో ఇప్పటికే ప్లాట్లు వేసి విక్రయాలు చేయడం కూడా జరిగింది. ఉదాహరణకు చీరాల రోడ్డులో ఉన్న కక్కెర దాసయ్య గోడౌన్ల స్థలానికి సంబంధించి 10.60 ఎకరాలకు గాను గతంలో ఆ స్థలాల వెనుక భాగంలో 1.5 ఎకరాలను స్థల యజమానులు విక్రయించగా అందులో ఇప్పటికే గృహాలు నిర్మాణం చేసుకొని పలువురు నివాసం ఉంటున్నారు. మరో 6.25 ఎకరాలు రెసిడిన్షియల్గా మారగా మరో 2.85 ఎకరాల్లో గోడౌన్లు ఉన్నాయి. అయితే ప్రస్తుతం మొత్తం భూమిని ఇండస్ట్రీయల్కు మారుస్తూ గెజిట్ జారీ కావడంతో బెంబేలెత్తడం ప్లాట్లు కొనుగోలు చేసిన వారి వంతయింది. దీంతో ఇక్కడ ప్లాట్లు కొన్నవారు వాసవి గార్డెన్స్ పేరుతో సంఘం ఏర్పాటు చేసుకొని ప్రజా ప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో వీరు డీటీసీపీకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 21న పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చెందిన టీపీఎస్ లక్ష్మణస్వామి, స్థానిక టౌన్ప్లానింగ్ అధికారులతో కలసి విచారణ నిర్వహించారు. అయితే ఏమవుతుందోనన్న ఆందోళనలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారితో పాటు, స్థల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థలాలను రెసిడెన్షియల్ జోన్లోనే కొనసాగించి తమకు న్యాయం చేకూర్చాలని కోరుతున్నారు. పాత ఉత్తర్వులకు భిన్నంగా ఉన్నపళంగా కొత్త గెజిట్ జారీ చేయాల్సి రావడం వెనుక ఓ ప్రజా ప్రతినిధి చక్రం తిప్పినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెసిడెన్షియల్ నుంచి ఇండస్ట్రియల్/ కమర్షియల్లోకి మార్చి సంబంధిత స్థల యజమానులపై ఒత్తిడి తేవడం ద్వారా వారి నుంచి ప్రయోజనం పొందడమే లక్ష్యంగా ఈ వ్యవహారం కొనసాగిందని ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సంబంధిత అధికారులు 2024లో వెలువడిన మాస్టర్ ప్లాన్కు సంబంధించి రెండేళ్లకే తిరిగి సంబంధిత స్థలాలను ఇండస్ట్రియల్లోకి మార్చేలా ప్రణాళిక రూపొందించటం వివాదస్పదంగా మారింది. 12 ప్రదేశాలకు సంబంధించి రెండు స్థలాల వారు రెసిడెన్షియల్గా మారినప్పటికీ అక్కడ ఉన్న గోడౌన్లను తొలగించటకపోవడం ఆసరాగా చేసుకొని తిరిగి అన్ని స్థలాలను ఇండస్ట్రీయల్గా చేయడం ఎక్కడి న్యాయమని ప్లాట్లు కొనుగోలు చేసినవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
బాపట్ల
ఆదివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026●రాష్ట్ర ప్రభుత్వం పాలన గాలికొదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసే పనిలో నిమగ్నమయ్యింది. దీనిలో భాగంగానే తమపై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందుతోంది. ఒక్క మొక్కజొన్నకే కాకుండా ఏ పంటకు కనీసం మద్దతు ధర లేకుండా పోయింది. గత ప్రభుత్వంలో ప్రతి ఏడాది రైతుకు క్రమం తప్పకుండా న్యాయం జరిగేది, ఇప్పుడు ఆ లోటు వారికి తెలుస్తుంది. – పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు కనీస మద్దతు ధరలేక, ప్రభుత్వ సాయం అందక ఇబ్బందులు పడుతున్న రైతులకు మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకతో మంచి రోజులొస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం వద్ద మొక్క జొన్న కొనేందుకు డబ్బులు లేవనడం వారి చేతకాని తనానికి నిదర్శనం. టీడీపీ ప్రభుత్వ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న విషయం ప్రజలకు తెలీదనుకుంటున్నారా..? – అంబటి రాంబాబు, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు, -
కళ్లుండీ చూడలేని కబోదిలా..
పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం కళ్లుండీ చూ డలేని కబోదిలా మా రింది. మొక్కజొన్నకు కేంద్ర ప్రకటించిన మద్దతు ధర ప్రకారం రూ.2,400కు కొనుగోలు చేయాల్సిన సర్కారు కొనుగోలు కేంద్రాలను తెరవకపోవడంతో దళారులకు రూ. 1200 నుంచి రూ.1400లకు అమ్ముకోవాల్సిన దుస్థితి. టీడీపీ నేతలు దళారులతో కుమ్మకై ్క తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో రైతులు నష్టపోతున్నారు. పంటకు గిట్టుబాటు ధరలు లేవు. – మేరుగ నాగార్జున, మాజీ మంత్రి ● -
అంతం కాదు... ఆరంభం
మొక్కజొన్న ఽగిట్టుబాటు ధర కోసం అంబటి మురళీ కృష్ణ రగిలించిన పోరాట స్ఫూర్తికి ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర స్థాయి ఉద్యమంలా మార్చేస్తాం.చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులు కరవుతో అల్లాడిపోతారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతుల కోసంరూ.3000 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ఆదుకున్నారు. ఈ ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కూడా రైతులకు దక్కనివ్వడం లేదు. – లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ ● -
మంగళగిరిలో అదనపు కోర్టు ప్రారంభం
మంగళగిరి టౌన్ : గుంటూరు జిల్లా మంగళగిరిలో అదనంగా నిర్మించిన కోర్టును శనివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందనరావు న్యాయమూర్తులతో కలసి ప్రారంభించారు. తొలిరోజు నాలుగు కేసులను విచారించారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తులను మంగళగిరి బార్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డి. కృష్ణమోహన్, జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ వి. సుజాత, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి, మంగళగిరి కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రియదర్శిని, జస్టిస్ సురేష్బాబు, జిల్లా జడ్జి కల్యాణ చక్రవర్తి, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. యడ్లపాడు: మండలంలోని సొలస గ్రామంలో వేంచేసి ఉన్న భూసమేత రంగనాయకస్వామి ఆలయం శనివారం భక్తులతో కళకళ లాడింది. బ్రహ్మోత్సవాలకు నాలుగు రోజులు ముందుగా స్వామి వారి నిజరూప దర్శనం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మరుసటి రోజైన శనివారం ఆలయ అర్చకులు పర్చూరి రామకృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో శ్రీదేవి, భూదేవి, రంగనాయక స్వామి మూలవిరాట్లకు పంచామృత అభిషేకాలు చేశారు. అనంతరం చందన అలంకరణలో భక్తులకు దర్శనమివ్వగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాచేపల్లి : స్థానిక వీర్ల అంకమ్మ తల్లి కొలుపుల తిరుణాల శనివారం ప్రారంభమైంది. అమ్మవారి ఆలయంలో కమిటీ సభ్యులు, భక్తులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. కొలుపులు తిరుణాల ప్రారంభ సందర్భంగా గ్రామంలోని బొడ్రాయికి జలాభిషేకం చేశారు. అనంతరం మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారి కొలుపులు తిరుణాల సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. తాడేపల్లిరూరల్ : తాడేపల్లి పట్టణ పరిధిలోని భరతమాత సెంటర్ వద్ద బకింగ్హామ్ కెనాల్కు అనుసంధానంగా ఉన్న డ్రైనేజీలోకి ఓ కారు దూసుకు వెళ్లింది. శనివారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనలో కారు కాలువకు, డ్రైనేజీకి మధ్యలో మురుగునీటిలో కూరుకుపోయింది. కానిస్టేబుల్ ఒకరు ఉండవల్లి సెంటర్ నుంచి బైపాస్ వైపు కారులో అతివేగంగా వెళుతుండగా, భరత మాత సెంటర్ వద్ద కాంక్రీట్ దిమ్మను ఢీకొని 15 అడుగుల లోతులో కారు పడిపోయింది. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. కారు బెలూన్స్ ఓపెన్ కావడంతో కానిస్టేబుల్కు స్వల్ప గాయాలయ్యాయి. గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జెడ్పీ కార్యాలయంలో శనివారం స్థాయీ సంఘ సమావేశాలను నిర్వహించారు. జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా ఛాంబర్లో నిర్వహించిన సమావేశంలో ప్రణాళిక–ఆర్థిక, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, పనులకు సంబంఽధించిన స్థాయీ సంఘ సమావేశాల అజెండాలపై చర్చించారు. -
బాపట్ల
శనివారం శ్రీ 25 శ్రీ ఏప్రిల్ శ్రీ 20267గజలక్ష్మీదేవి అలంకరణ పిడుగురాళ్ల: పట్టణంలోని జానపాడు రోడ్డులో ఉన్న వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవాలలో భాగంగా శుక్రవారం అమ్మవారు గజలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. నిమ్మకాయల ధరలు తెనాలి: మార్కెట్ యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3,500, గరిష్ట ధర రూ.9,000, మోడల్ ధర రూ.6,000 వరకు పలికింది. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.5360 టీఎంసీలు. 7 -
విజ్ఞాన్, ఇంటెల్ మధ్య అవగాహన ఒప్పందం
చేబ్రోలు: గుంటూరు జిల్లా వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీ, ప్రముఖ టెక్ దిగ్గజం బెంగళూరులోని ఇంటెల్ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ల మధ్య కీలక అవగాహన ఒప్పందం కుదిరిందని ఇన్చార్జి వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిషోర్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా అవగాహన ఒప్పందానికి సంబంధించిన పత్రాలను ఇంటెల్ ఇండియా కంపెనీ ఆసియా పసిఫిక్ అండ్ జపాన్ రీజియన్ సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ సలోని సింఘాల్కు వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పీఎంవీ రావు అందజేశారు. ఈ సందర్భంగా ఇన్చార్జి వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిషోర్ మాట్లాడుతూ, డిజిటల్ యుగంలో వేగంగా పెరుగుతున్న ఉద్యోగ అవకాశాలకు అనుగుణంగా విద్యార్థులకు కృత్రిమ మేధస్సు (ఏఐ) నైపుణ్యాలను అందించడం ఈ అవగాహన ఒప్పందం ప్రధాన లక్ష్యమన్నారు. ఫ్యాకల్టీ, ట్రైనర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, విద్యార్థులకు కో–బ్రాండెడ్ సర్టిఫికెట్లు అందించడం, ఉపాధి అవకాశాలపై మార్గదర్శకత కల్పించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఇంటెల్ ఇండియా ఆసియా పసిఫిక్–జపాన్ రీజియన్ సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ సలోని సింఘాల్ మాట్లాడుతూ, విజ్ఞాన్ యూనివర్సిటీతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ఆనందంగా ఉందని, డిజిటల్ యుగానికి అనుగుణంగా విద్యార్థులను సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాల వైపు దారితీస్తూ, ముఖ్యంగా ఏఐ నైపుణ్యాలను అందించి వారిని భవిష్యత్తుకు సిద్ధం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఇంటెల్ ఇండియా రూపొందించిన కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన 601 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. అలాగే ‘ఏఐ స్మార్ట్ క్యాంపస్ హ్యాకథాన్’లో ప్రతిభ చాటిన విద్యార్థులకు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఇంటెల్ ఇండియా నేషనల్ ఆపరేషన్స్ మేనేజర్ విక్రమ్ పర్మార్, విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య, రిజిస్ట్రార్ పీఎంవీ రావు, డీన్లు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ స్టేడియానికి విద్యుత్తు సరఫరా బంద్
లక్ష్మీపురం: గుంటూరు నడిబోడ్డున ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో విద్యుత్ బిల్లు సకాలంలో చెల్లించక పోవడంతో అధికారులు రంగంలోకి దిగారు. బృందావన్ గార్డెన్స్లోని ఎన్టీఆర్ స్టేడియం, శ్యామలానగర్లో ఉన్న స్విమ్మింగ్ పూల్లో ఫ్యూజులు తీసేయడంతో క్రీడాకారులు తీవ్ర అసౌకర్యాన్ని గురయ్యారు. తొలి నుంచీ క్రీడాకారుల జీవితాలతో చంద్రబాబు సర్కార్ ఆటలాడుతోంది. శుక్రవారం విద్యుత్ శాఖ అధికారులు ఫ్యూజులు తీయడంతో సరఫరా నిలిచిపోయినట్లు సమాచారం. శ్యామలానగర్లోని ఎన్టీఆర్ స్విమ్మింగ్ పూల్లో సాయంత్రం ఇలా చేయడంతో క్రీడాకారులుగా సభ్యత్వం ఉన్న వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే స్విమ్మింగ్ పూల్కు సకాలంలో నీటి సరఫరా అందడం లేదు. ఇప్పటికే నంబర్ షిప్కు రూ.50వేల చొప్పున సుమారు రూ.2 కోట్లు ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. ఇంకో రెండు వందల మందికి సభ్యత్వాలు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. వసతుల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. -
రోడ్డు ప్రమాదాలు అరికట్టండి
బాపట్ల: రోడ్డు ప్రమాదాలు అరికట్టడానికి పోలీసులు, రవాణా, అనుబంధ శాఖల అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆదేశించారు. రహదారుల భద్రతపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పీఎం రాహత్ పథకానికి సంబంధించిన గోడపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. మే నెల ఒకటో తేదీ నుంచి ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి చేస్తున్నామని ప్రకటించారు. డీటీఓ పరంధామరెడ్డి, ఆర్డీవోలు, డీఎస్పీలు, కమిటీలోని అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మాదకద్రవ్యాల రవాణా అరికట్టాలి గంజాయి వంటి మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల రవాణా, వినియోగాన్ని అరికట్టాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. గంజాయి వంటి ముత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నియంత్రణ జిల్లా స్థాయి కమిటీ సమావేశం శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. వీటి నియంత్రణలో రాష్ట్రంలో బాపట్ల జిల్లా ఆరో స్థానంలో నిలిచిందని చెప్పారు. ఇలాంటి కార్యకలాపాలు జరిగే 32 ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. యువతను ప్రభావితం చేస్తున్న మత్తు పదార్థాలను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ చెప్పారు. ఆర్డీవోలు, డీఎస్పీలు, కమిటీలోని జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. అందుబాటులో అడ్వెంచర్ స్పోర్ట్స్ సూర్యలంక బీచ్లో అడ్వెంచర్ స్పోర్ట్స్ అందుబాటులోకి తెస్తామని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. బీచ్ను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. పర్యాటకులకు కనువిందు చేసే పారా మోటరింగ్, జెట్టీలు, ఏటీవీ వాహనాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పదిమంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆర్డీవో గ్లోరియా, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శేషగిరిరావు, అటవీ శాఖ అధికారులు, తదితరులు ఆయన వెంట ఉన్నారు. నీటిని సంరక్షించాలి జిల్లాలో ప్రతి నీటి బొట్టును సంరక్షించే దిశగా జలధార కార్యక్రమాన్ని అమలు చేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని న్యూ వీసీ హాల్ నుంచి జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వినోద్కుమార్ -
పరిశోధన విస్తరణ సలహా మండలి సమావేశం
గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానం నందు శుక్రవారం కృష్ణ మండలం వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశాన్ని నిర్వహించారు. – సమావేశంలో నూతన ఉపకులపతి డాక్టర్ పీవీ సత్యనారాయణ మాట్లాడుతూ విస్తరణ, పరిశోధన శాస్త్రవేత్తల కృషిని అభినందించారు. రైతుల సమస్యల పరిష్కారానికి వ్యవసాయశాఖ, విశ్వవిద్యాలయం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతు స్థాయిలో క్షేత్ర పరిశీలనలు, విత్తనోత్పత్తి చేపట్టాలన్నారు. 2026–27 సంవత్సరం వ్యవసాయ భవిష్యత్తు ప్రణాళిక రూపకల్పనకు అన్ని అనుబంధ శాఖలతో చర్చించి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ● పరిశోధన సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ వ్యవసాయంలో మితిమీరిన రసాయనాల వినియోగం తగ్గించాలన్నారు. ● విస్తరణ సంచాలకుడు డాక్టర్ జి.శివన్నారాయణ మాట్లాడుతూ వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని వివిధ విస్తరణ కార్యక్రమాలను రూపొందించాలన్నారు. ● పత్తిపంటలో గులాబి రంగు పురుగుల యాజమాన్యం, అపరాల పంటల్లో సమగ్ర యాజమాన్యం పద్ధతులు, వరిలో కలుపు యాజమాన్యం, పశుపెంపకం, వంటి ప్రచురణలను విడుదల చేశారు. వివిధ పంటల ప్రధాన శాస్త్రవేత్తలు పంటల్లో ఉత్తమ యాజమాన్య పద్ధతులు వివరించారు. కార్యక్రమంలో ఏపీఎస్సీఆర్ డైరెక్టర్ డాక్టర్ వై సతీష్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, మార్కాపురం జిల్లాల వ్యవసాయ అధికారులు, ఆర్ఈఏసీ సభ్యులు, అభ్యుదయ రైతులు, తదితరులు పాల్గొన్నారు. -
పదోన్నతులపై పిల్లిమొగ్గలు
గుంటూరు మెడికల్: అంతా మా ఇష్టం... ఏది చేసినా అడిగెదెవ్వరు... అన్నట్లుగా గుంటూరు జీజీహెచ్ పరిపాలన అధికారులు వ్యవహరిస్తున్నారు. వారికి నచ్చక పదేళ్లుగా పోస్టు ఖాళీగా ఉన్నా ప్రమోషన్ ద్వారా భర్తీ చేయలేదు. ప్రమోషన్లు ఇస్తామని కిందిస్థాయి ఉద్యోగుల్లో ఆశలు రేకెత్తిస్తూ నోటిఫికేషన్లు ఇచ్చారు. ఏడాదిలోగా భర్తీ చేయాల్సి ఉంటుంది. కానీ గడువు ముగిసే వరకు సాగదీసి, మరోసారి నోటిఫికేషన్ ఇస్తామని పదోన్నతులు రాకుండా తీవ్ర అన్యాయం చేస్తున్నారు. గుంటూరు జీజీహెచ్లో రికార్డు అసిస్టెంట్ పోస్టులు 2021 నుంచి రెండు ఖాళీగా ఉన్నాయి. కిందిస్థాయి ఉద్యోగుల్లో చాలా మంది అర్హులున్నారు. గతంలో రెండు సార్లు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. తాజాగా మళ్లీ నోటిఫికేస్ ఇచ్చారు. ఈ నెల 26లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ పోస్టులు ఐదుకుపైగానే ఖాళీగా ఉన్నాయి. కొన్నింటిని ఇక్కడి ఉద్యోగులకు ప్రమోషన్ ద్వారా భర్తీ చేయాలి. పది సంవత్సరాలుగా అధికారులు తాత్సారం చేస్తున్నారు. దీనివల్ల పలు కిందిస్థాయి పోస్టులు రద్దయ్యాయి. కోర్టుకు వెళ్లిన వారికి మాత్రమే ప్రమోషన్లు ఇచ్చారు. మిగతావారు కూడా కోర్టును ఆశ్రయించారు. ఫిర్యాదు చేసినా పరిస్థితి మారలేదు. వారికి మాత్రం ఓకే... గుంటూరు జీజీహెచ్, గుంటూరు మెడికల్ కాలేజ్ల అధికారులు సమన్వయంతో పనిచేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ఆ దిశగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గతంలో జిల్లాలోనే పరిపాలన అధికారులుగా (ఏఓ)పనిచేసిన ఇరువురు నేడు జీజీహెచ్, వైద్య కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ)లుగా ఉన్నారు. గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్కు ఈనెల 13న అడిషనల్ డీఎంఈగా, వైద్య కళాశాల ప్రిన్సిపాల్కు 2024 అక్టోబర్లో అడిషనల్ డీఎంఈగా ప్రమోషన్ ఇచ్చారు. -
మే 1 నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు
డీఎస్డీఓ అఫ్రోజ్ ఖాన్ గుంటూరు వెస్ట్ (క్రీడలు): జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మే1వ తేదీ నుంచి 31 వరకు వివిధ క్రీడల్లో వేసవి శిక్షణనిస్తామని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అఫ్రోజ్ ఖాన్ తెలిపారు. శుక్రవారం స్థానిక బీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరలు సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 18 మండలాల్లో 8నుంచి14 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలకు శిక్షణ ఏర్పాటు చేస్తున్నామన్నారు. శిబిరంలో ప్రతిభ కనబరచిన వారిని గుర్తించి క్రీడా హాస్టల్స్కు ఎంపిక చేస్తామన్నారు. వివరాలకు బీఆర్ స్టేడియంలో సంప్రదించాలన్నారు. ఈ సమావేశంలో స్టెప్ మేనేజర్ బి.రాధిక, మేనేజర్ సీహెచ్ కొండయ్య పాల్గొన్నారు. గుంటూరు లీగల్: జిల్లాలో కుటుంబ వివాదాలు పెరుగుతున్న నేపథ్యంలో న్యాయవ్యవస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉన్న ఫ్యామిలీ కోర్టుకు తోడు, అదనంగా మరో కుటుంబ వివాదాల న్యాయస్థానం ఏర్పాటు చేశారు. నూతన కోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం ఉదయం 10 గంటలకు గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్ రావు కోర్టును ప్రారంభించనున్నారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.కృష్ణమోహన్, జస్టిస్ వెంకటేశ్వర్లు నిమ్మగడ్డ, జస్టిస్ వడ్డిబోయిన సుజాత, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ కార్యక్రమానికి హాజరుకానున్నారు. గుంటూరు జిల్లా, సెషన్న్స్ జడ్జి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో, గుంటూరు బార్ అసోసియేషన్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ ఆధ్వర్యంలో శనివారం యువ న్యాయవాదులకు డ్రాఫ్టింగ్, ప్లీడింగ్, కన్వేయన్సింగ్ వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు విభాగం హెడ్ ప్రొఫెసర్ ఎస్.విజయలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 10 గంటలకు న్యాయవిభాగంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్,కామర్స్ అండ్ లా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం సురేష్ అధ్యక్షత వహిస్తారన్నారు. కీనోట్ స్పీకర్ గా జిల్లా మాజీ జడ్జి జీవీ కృష్ణయ్య, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు డాక్టర్ బి. వెంకట రమణారెడ్డి, నర్రా శ్రీనివాసరావులు హాజరవుతారన్నారు. విద్యార్థులు, యువన్యాయవాదులు వారి అనుభవాన్ని, అమూల్యమైన వృత్తి సలహాలను సద్వినియోగం చేసుకోవాలని విభాగాధిపతి ప్రొఫెసర్ విజయలక్ష్మి కోరారు. నిర్కా డైరెక్టర్ డాక్టర్ శేషు మాధవ్ కొరిటెపాడు(గుంటూరు): రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ అండ్ కమర్షియల్ అగ్రికల్చర్ (నిర్కా) ప్రధాన లక్ష్యమని ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ శేషుమాధవ్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం మిర్చియార్డు ఎదుట ఉన్న నిర్కా(పూర్వ సీటీఆర్ఐ) ప్రాంగణంలో జిల్లాలోని గిరిజన రైతులకు సబ్ ప్లాన్ కింద నానో బయోటెక్ ఎరువులు, టార్పాలిన్ పట్టల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి నిర్కా గుంటూరు ఇన్చార్జి డాక్టర్ వి.వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ డాక్టర్ శేషుమాధవ్ మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో రైతులు ఎక్కువగా పొగాకు, పసుపు, మిర్చి వంటి వాణిజ్య పంటలను సాగు చేస్తుంటారని తెలిపారు. అయితే అధిక మోతాదులో ఎరువులు వినియోగిస్తోన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీని వల్ల మట్టిలో పోషకాలు లేక భూమి సారం కోల్పోతుందన్నారు. అందుకు ప్రత్యామ్నాయంగా ఈ నానో బయోటెక్ ఎరువులను తాము గిరిజన రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. వీటి వల్ల సూక్ష్మజీవులు బాగా పెరిగి పోషకాలు పుష్కలంగా అందడంతో పాటు, పంట ఖర్చు కూడా తగ్గుతుందన్నారు. కార్యక్రమంలో నిర్కా శాస్త్రవేత్త జె.పూర్ణబిందు, టెక్నికల్ ఆఫీసర్ ఎంవీ జయకృష్ణ, సుబ్బారావు, బాపట్ల ఏసు, దీపక్ తదితరులు పాల్గొన్నారు. -
సామాజిక స్పృహ కల్పించేదే నాటిక
● హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ ● అట్టహాసంగా ప్రారంభమైన నాటికల పోటీలు మార్టూరు: సామాజిక రుగ్మతలకు పరిష్కారం చూపుతూ గ్రామీణ ప్రాంత నిరక్షరాస్యులను సైతం చైతన్యవంతం చేయగలిగితేనే నాటకం లక్ష్యం నెరవేరినట్లు అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ అన్నారు. స్థానిక మద్ది సత్యనారాయణ కంపెనీ ఆవరణలో శుక్రవారం రాత్రి మార్టూరు రోటరీ క్లబ్, శ్రీకారం కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన 16వ రాష్ట్రస్థాయి నాటిక పోటీలను ప్రారంభిస్తూ ఆయన మాట్లాడారు. 16 ఏళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లోసామాజిక చైతన్యమే లక్ష్యంగా వ్యయ ప్రయాసల కోర్చి నాటక పరిషత్తులు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆయన 3150 రోటరీ జిల్లా గవర్నర్ డాక్టర్ ఎస్వీ రాంప్రసాద్ విశ్రాంత ఐపీఎస్ అధికారి ఎన్ ముక్తేశ్వరరావు స్థానిక నిర్వహకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి నాటికల పోటీలను ప్రారంభించారు. మనుషుల హృదయాల్లోనే దేవడు ఉంటాడు.. మొదటి నాటికగా అరవింద ఆర్ట్స్ తాడేపల్లి వారు ప్రదర్శించిన దేవుణ్ణి చూశా నాటిక ప్రేక్షకులను రక్తి కట్టించింది. దైవం మానుష రూపేణా అనే నానుడి ప్రకారం దేవుడు దేవాలయాల్లోనూ కనిపించడని లోకాల్లోనూ ఉండడని మానవత్వం మూర్తీ భవించిన మనుషుల హృదయాలలో ఉంటాడనే ఇతివృత్తంతో దేవరకొండ బాలగంగాధర్ తిలక్ మూల కథకు యల్లాప్రగడ భాస్కరరావు నాటకీకరణ చేయగా గంగోత్రి సాయి దర్శకత్వం వహించారు. నేటి ప్రభుత్వాలపై వదిలిన సైటెర్.. రెండో నాటికగా కళానికేతన్ వీరన్నపాలెం వారు ప్రదర్శించిన ‘దీపం కింద చీకటి’ నేటి ప్రభుత్వాలపై వదిలిన సైటెర్ లా ఉందని ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో తెలియజేశారు. రౌడీలు, తీవ్రవాదులు, సంఘ విద్రోహ శక్తుల వంటి నేరస్తులను సంవత్సరాల తరబడి జైల్లో ఉంచి వారికి సకల సౌకర్యాలను కల్పిస్తున్న ప్రభుత్వం నిజాయితీగా కష్టపడి జీవనం సాగించే సామాన్యులకు కనీస వైద్య సౌకర్యం కల్పించడంలో చూపుతున్న అలసత్వాన్ని నిర్లక్ష్యాన్ని నటీనటులు జనరంజకంగా ప్రదర్శించారు. వృద్ధ దంపతుల జీవన పోరాట.. మూడో నాటికగా విజయవాడ సాంస్కృతిక సమితి వారు ‘మమ్మల్ని బతకనివ్వండి’ నాటికను ప్రదర్శించారు. తుఫాను మధ్యలో చిక్కుక్కున్న ఇద్దరు వృద్ధ దంపతుల జీవన పోరాటమే ఈ నాటిక ఇతివృత్తం. రచన, దర్శకత్వం సుఖమంచి కోటేశ్వరరావు వహించారు. మొదటి రోజు కార్యక్రమంలో రోటరీ 3020 జిల్లా గవర్నర్ డాక్టర్ ఏలూరి కళ్యాణ చక్రవర్తి, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నం మోహనకృష్ణ, గుంటూరు ఎల్వీఆర్ సన్స్ క్లబ్ అధ్యక్షుడు నూకవరపు కోటేశ్వరరావు, అబ్దుల్ కలాం సేవా పురస్కార గ్రహీత సింగారెడ్డి శౌరి రెడ్డి, ఎఫర్ట్ సంస్థ డైరెక్టర్ జాష్టి మోహన్రావు, శ్రీకారం కళాపరిషత్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు, జాష్టి అనూరాధ మార్టూరు రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మాదాల సాంబశివరావు, చెరుకూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ‘దేవుణ్ణి చూశా’ నాటికలోని ఓ సన్నివేశం -
ఆంగ్రూ వీసీగా బాపట్ల పూర్వవిద్యార్థి
బాపట్ల టౌన్: ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం నూతన ఉప కులపతిగా బాపట్ల వ్యవసాయ కళాశాల 1983 బ్యాచ్ విద్యార్థి డాక్టర్ పాలడుగు వెంకట సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం ఏజీ విశ్వవిద్యాలయంలో కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి. ప్రసూనరాణి ఆధ్వర్యంలో అధ్యాపకులు సత్యనారాయణను శాలువాతో సత్కరించారు. ప్రసూనారాణి మాట్లాడుతూ బాపట్ల వ్యవసాయ కళాశాలలో 1983లో బీఎస్సీ చేరి, అంచలంచెలుగా ఎదిగి, పరిశోధన సంచాలకులు స్థాయికి సత్యనారాయణ చేరుకున్నారన్నారు. 40కిపైగా అధిక దిగుబడినిచ్చే వరి వంగడాలు రూపొందించి ఆంధ్ర రైస్ మాన్గా పేరు సాధించారని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు మొబైల్ వ్యాన్ గుంటూరు లీగల్: ప్రజలకు న్యాయ సేవలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర న్యాయ సేవా సంస్థ అందజేసిన మొబైల్ లీగల్ అవేర్నెస్ వ్యాన్ను గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కోర్టు న్యాయమూర్తులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ పాల్గొన్నారు. ప్రధాన న్యాయమూర్తి బి.సాయికళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ మొబైల్ వ్యాన్ ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో న్యాయ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. పేద, బలహీన వర్గాలకు న్యాయ సేవలు సులభంగా అందుబాటులోకి తీసుకువడానికి ఈ వ్యాన్ కీలకంగా మారనుందని తెలిపారు. ఐదు వెండి గంగాళాలు బహూకరణ పెదకాకాని: స్థానిక మల్లేశ్వరస్వామి వారి నిత్యాభిషేక సేవకు వినియోగించేందుకు 1.174 కిలోల తూకం కలిగిన ఐదు వెండి చిన్న గంగాళాలను చినకాకాని గ్రామానికి చెందిన రావెళ్ళ సత్యనారాయణ దంపతులు బహూకరించారు. వీటిని శుక్రవారం ఉప కమిషనరు గోగినేని లీలాకూమార్కు అందజేశారు. ఉచిత అన్నప్రసాద వితరణకు విశాఖపట్నానికి చెందిన ఎం.నారాయణ, శివపార్వతి దంపతులు రూ. 40 వేలు, గుంటూరుకు చెందిన చింతా రవీంద్రరెడ్డి, సునీత దంపతులు రూ.60 వేలు విరాళంగా అందించినట్లు ధర్మకర్తల మండలి చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు తెలిపారు. దర్మకర్తల మండలి సభ్యుడు దూపాటి శివశంకరరావు సిబ్బంది పాల్గొన్నారు. దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగానే కనిపించింది. వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల వరకు ఓ మోస్తరు రద్దీ కనిపించగా, సాయంత్రం ఆరు గంటల నుంచి సాధారణ భక్తుల తాకిడి కనిపించింది. మరో వైపున తెల్లవారుజామున అమ్మవారికి నిర్వహించిన ఖడ్గమాలార్చన, ఉదయం ఆలయంలో జరిగే లక్ష కుంకుమార్చన, చండీయాగం, శ్రీచక్ర నవార్చన వంటి ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. రద్దీ సమయాల్లో అంతరాలయ దర్శనాన్ని రద్దు చేసి, శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉండటంతో మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత తిరిగి ప్రారంభించారు. -
రాత్రివేళ రైట్.. రైట్..
చీరాల అర్బన్: చీరాల నియోజకవర్గంలో అధికారికంగా ఎలాంటి ఇసుక రీచ్లు లేవు. ఎవరికీ ఇసుక తవ్వకాలు, రవాణాకు సంబంధించి అనుమతులు లేవని అధికారులు పలుమార్లు స్పష్టం చేశారు. అయితే ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతూనే ఉంది. దీనిపై తోడేస్తున్న ఇసుకాసురులు అనే శీర్షికతో శుక్రవారం సాక్షి పత్రికలో కథనం ప్రచురితమైంది. జరుగుతున్న ఇసుక అక్రమాలపై సమగ్రంగా వివరించటం జరిగింది. విషయాన్ని స్థానిక అధికారులతో పాటు, కలెక్టర్ వి. వినోద్కుమార్ దృష్టికి కూడా తీసుకెళ్లటం జరిగింది. దీంతో స్థానిక అధికారులు ఒకింత అప్రమత్తమయ్యారు. తాత్కాలికంగా పగలు ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను ఆపాలని, రెండు రోజులు ఆగి విషయం కాస్త సద్దుమణిగాక యథావిధిగా ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా సాగించేందుకు మూజువాణి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. అయితే అప్పుడు కూడా పగలు ఎలాంటి తవ్వకాలు, రవాణా వద్దని, రాత్రి వేళ రైట్, రైట్ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. నిన్న, మొన్నటి వరకు కీలక నేత, యువనేతలు చెప్పిందే అక్రమ సామ్రాజ్యంలో తుది మాట. అయితే అక్రమ ఇసుక దందాలో ఆధిపత్య పోరుతో ఒకరికి ఒకరు పునరాలోచనలో పడ్డట్లు చెప్పుకుంటున్నారు. అందుకు అనుగుణంగా బేషరతుగా ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు సంబంధించి ఇద్దరు అధికారులు మధ్యే మార్గంగా క్రియాశీలక పాత్ర పోషించినట్లు చెప్పుకుంటున్నారు. ఆ క్రమంలో కీలక నేత, యువనేతల మనుషులైనా, లేదా సంస్థ మనుషులైనా ఎవరైనా పగటి పూట ఇసుక తవ్వకాలు, రవాణా జరపకూడాదు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు అక్రమ ఇసుక దందా సాగించవచ్చని ఓ ఒప్పందం కుదిరినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ దందాలో వ్యక్తులు తమ సన్నిహితులు వద్ద చెప్పుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా దందా ఆగుతుందా. సాగుతుందా. ఇది అధికారుల చిత్తశుద్ధికి ఒక పరీక్షలా మారిందని మైనింగ్, రెవెన్యూ, పోలీస్ తదితర విభాగాలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ జోరుగా చర్చ సాగుతోంది. ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లింది కాబట్టి కట్టడి చేస్తారా, లేకుంటే రాజకీయ చదరంగంలో ఆయన కూడా ఒక పావుగా మారే పరిస్థితులు ఏర్పడతాయా అనే కోణంలో ప్రజల్లో చర్చ జరుగుతోంది. అయితే కలెక్టర్ వాస్తవాలను పరిశీలించి, క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసి అక్రమ ఇసుక దందాకు చెక్ చెప్తారని ప్రజలు నమ్ముతున్నారు. ఏం జరుగుతుందనేది వేచి చూడాల్సిందే. శుక్రవారం నియోజకర్గ పరిఽధిలో ఎక్కడ కూడా ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా జరగపోవటం గమనార్హం. నియోజకవర్గంలో కలెక్టర్ పర్యటన ఉండటంతో పాటు సాక్షి పత్రికలో వెలువరించిన కథనాలు కూడా కారణమని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే సహజ వనరుల దోపిడీ అగుతుందని ప్రజలు ఆభిప్రాయ పడుతున్నారు. అందుకు అనుగుణంగా ఉన్నతాధికారులు తగిన చర్యలు కొనసాగిస్తారని ఆశిద్దాం. ఇసుక అక్రమ తవ్వకాలు రవాణాకు సంబంధించి కీలక నేత, యువనేతలు అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారు. ఆపేది లేదు. అడ్డుకునేది లేదు. విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లింది. కాబట్టి రెండు రోజులు ఆగండి. సంబంధిత అధికారులతో మాట్లాడాం. సిండికేట్ పగలకుండా చూసుకోండి. ఎప్పటి మాదిరిగానే ఇసుక అక్రమ దందా కొనసాగుతందని కీలక నేత, యువనేతల తరఫున వారి అనుయాయులు అభయం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. -
బైక్ దొంగతనం కేసులో 9 నెలలు జైలు
చీరాల: గుర్తుతెలియని వాహనం ఢీకొని అసోం వాసి మృతిచెందిన సంఘటన గురువారం రాత్రి చీరాల 216 జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు... అసోం రాష్ట్రానికి చెందిన బైగురైట్ (36), అతని స్నేహితులు పెరంబదూర్కు రైలులో వెళుతుండగా చీరాల సమీపంలో జారిపడ్డాడు. గాయాలైన అతడు ఈ విషయాన్ని స్నేహితులకు తెలియచేసి గురువారం రాత్రి 216 రహదారిలోకి వచ్చాడు. ఈ క్రమంలో రాత్రి వేళ గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో గాయాలై మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలంలో మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టానికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలింపు నగరంపాలెం(గుంటూరువెస్ట్):గంజాయి, మాదక ద్రవ్యాల క్రయ, విక్రయాలు, అక్రమ రవాణా చేసే ఓ యువ మహిళపై పీడీ ఎన్డీపీఎస్ చట్టం ప్రయోగించి రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. తాడేపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని తాడేపల్లి టౌన్లో ఉంటున్న 26 ఏళ్ల వి.నాగమణి గంజాయి క్రయ, విక్రయాలు, నిల్వలు, రవాణా చేస్తున్నట్లు పోలీసు లు గుర్తించారు. ఆమైపె నాలుగు కేసులు నమోదై ఉన్నాయి. ఆమైపె కేసులు నమోదు చేసినా ఆమెలో మార్పురాలేదు. ప్రజా భద్రత దృష్ట్యా ఆమెను నిర్బంధించడమే సరైన చర్యగా పోలీసులు భావించారు. దీంతో నాగమణిపై పీడీ చట్టం ప్రయోగించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ద్వారా తాడేపల్లి పీఎస్ సీఐ వీరేంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పీడీ చట్టం అమలుకు ఉత్తర్వులు జారీ చేయగా, ఆమెను రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. గుంటూరు ఎడ్యుకేషన్: ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మలి విడత ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈనెల 25, 26, 27 తేదీల్లో విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలను విజయవంతం చేయాలని ఫ్యాప్టో జిల్లా చైర్మన్ కె.నరసింహారావు పిలుపునిచ్చారు. శుక్రవారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఫ్యాప్టో జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈనెల 26న గుంటూరు జిల్లా నుంచి రిలే నిరాహార దీక్షకు జిల్లా ఫ్యాప్టో నాయకులు, కార్యకర్తలు, ఫ్యాప్టో పోరుబాటకు మద్దతిస్తున్న ఉపాధ్యాయ సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనే విధంగా కృషి చేయాలని జిల్లా ఫ్యాప్టో కార్యవర్గం పిలుపునిచ్చింది. సమావేశంలో గుంటూరు జిల్లా ఫ్యాప్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్స్ యు.రాజశేఖర్, జి.దాసు, ఫ్యాప్టో జిల్లా కార్యవర్గ సభ్యు లు ఎం.కళాధర్, షేక్ బాజీ,ప్యాప్టో జిల్లా నాయకులు జి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. డ్వామా పీడీ సిద్ధ లింగమూర్తి నూజండ్ల: ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న ప్రతి కూలీకి ప్రభుత్వం నిర్దేశించిన గరిష్ట వేతనం అందేలా చర్యలు చేపట్టాలని అఽందుకు అధికారులు సూచనలు అందించాలని డ్వామా పీడీ సిద్ధ లింగమూర్తి అదేశించారు. మండల పరిధిలోని టి.అన్నవరం, తెల్లపాడు, పమిడిపాడు గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి పనులను ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. క్షేత్ర స్థాయిలో జరిగిన పనులను వాటి కొలతలు పరిశీలించారు. కూలీలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కూలి వేతనం తక్కువగా వస్తుందని గరిష్టంగా అందేలా చూడాలని ఉపాధి కూలీలు ఆయనను కోరారు. -
ఖైదీ పరారీపై జైళ్ల శాఖ డీఐజీ విచారణ
రేపల్లె: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి నుంచి రిమాండ్ ఖైదీ భీముడు అజిత్కుమార్ పరారైన ఘటనపై జైళ్ల శాఖ ఉన్నతాధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంపై విచారణ నిమిత్తం జైళ్ల శాఖ గుంటూరు రేంజ్ డీఐజీ వరప్రసాద్ శుక్రవారం రేపల్లె సబ్జైలును సందర్శించారు. ఈ సందర్భంగా డీఐజీ సబ్జైలులోని రికార్డులను, సీసీ టీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఇప్పటికే సస్పెండ్కు గురైన జైలు సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావుతో పాటు ఇతర సిబ్బందిని విడివిడిగా విచారించారు. పరారీ వెనుక ఎవరి పాత్ర ఉందనే కోణంలో ఆరా తీశారు. ఈ సందర్భంగా డీఐజీ వరప్రసాద్ మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు. గతంలోనే ఇతర జైలు నుంచి తప్పించుకున్న చరిత్ర ఉన్న అజిత్కుమార్ను రేపల్లె సబ్జైలుకు తీసుకురావడానికి నిబంధనలు అంగీకరించవన్నారు. అయినప్పటికీ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు అతనికి ఇక్కడ రిమాండ్ ప్రవేశం కల్పించడంపై విచారణ చేస్తున్నామన్నారు. ఖైదీ అజిత్కుమార్ అధికారులకు రూ. లక్షల్లో లంచం ఇచ్చాడన్న ఆరోపణలను అవాస్తవమన్నారు. అయితే విచారణలో కొంతమంది సిబ్బందికి కొంత మేర నగదు అందినట్లు ప్రాథమికంగా తేలిందని ధృవీకరించారు. ఈ వ్యవహారంపై జైలు సిబ్బంది, సూపరింటెండెంట్కు సంబంధించిన బ్యాంకు ఖాతాలు, ఆర్థిక వ్యవహారాలను పూర్తిగా తనిఖీ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కేసులో బాధ్యులైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన
ఇంకొల్లు(చినగంజాం): రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం పరిపాలన సాగుతుందని.. దళారీ వ్యవస్థ రాజ్యమేలుతుందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున విమర్శించారు. రైతులు పండించిన పంటలకు కూటమి ప్రభుత్వంలో గిట్టుబాటు ధర దక్కడం లేదంటూ నాగార్జున ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జి గాదె మధుసూదనరెడ్డి గురువారం ఇంకొల్లు తహసీల్దార్ ఏవీఎస్ శ్రీనివాస్కు వినతిపత్రం అందించారు. అనంతరం విలేకరులతో ఏర్పాటుచేసిన సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ పాలనలో రైతులు నియోజకవర్గంతోపాటు జిల్లా అంతటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ఇటీవల వరి సాగు చేసిన రైతులు నష్టపోయిన విషయం తెలిసిన విషయమేనని అన్నారు. ప్రస్తుతం మొక్కజొన్న రైతుల పరిస్థితి పూర్తిగా దళారీల చేతుల్లోకి వెళ్లిందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించకపోగా స్పందించాల్సిన మంత్రి మేము కొనలేం.. అనే పరిస్థితి వచ్చిందన్నారు. ఎటువంటి పక్షపాతం లేకుండా పార్టీలకఅతీతంగా రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మొక్కజొన్నను మార్క్ఫెడ్, సొసైటీల ద్వారా రూ.2400 మద్దతు ధర ప్రకటించి పార్టీలకతీతంగా కొనుగోలు చేసి ప్రతి రైతుకు న్యాయం చేశామన్నారు. నేటి ప్రభుత్వంలో రూ.2400 మద్దతు ధర ప్రకటించి కొనకపోవడంతో రైతు రూ.1500, రూ.1600 అమ్ముకొనే దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. తక్షణమే జొన్న, మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని, మద్దతు ధర ప్రకటించాలని ప్రభుత్వమే మార్క్ఫెడ్ ద్వారా, సొసైటీల ద్వారా కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం.. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో కేంద్ర మంత్రులకు కూడా సమస్యను తెలియజేస్తామన్నారు. రాబోయే రోజుల్లో శనగ కొనే పరిస్థితి లేదని, కౌలు, కూలీ రైతులు ఎక్కువ మంది ఉన్నారని వారందరినీ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈవిషయంపై జగన్ను కలిసి సమస్యను వివరిస్తామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులను మోసగిస్తోంది.. నియోజకవర్గ ఇన్చార్జి గాదె మధుసూదనరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మొక్కజొన్న, శనగ రైతులను మోసం చేసిందన్నారు. మొక్కజొన్న, శనగ దిగుబడులు అధికంగా వచ్చాయని రైతులు ఆనందం పడేలోగా మద్దతు ధర లేక ఆందోళన చెందారన్నారు. కొంత మంది తెలివిగా రైతుల వద్ద నుంచి శనగను తక్కువ ధరకు కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజీలలో పెడుతున్నారని రాబోయే రోజుల్లో ఎక్కువ ధరకు అమ్ముకొనే కుటిల ఆలోచనలతో దళారీ వ్యవస్థను ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించి మంచి చేయాలని వైఎస్సార్ సీపీ కోరుకుంటున్నట్లు తెలిపారు. మొక్కజొన్న, శనగ ప్రభుత్వం కొనేలాగా రైతుల తరపున పోరాడతామన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి బండారు ప్రభాకరరావు, పార్టీ మండల అధ్యక్షుడు చిన్నిపూర్ణారావు, జిల్లా రైతు విభాగం కార్యదర్శి సింహాద్రి బ్రహ్మారెడ్డి, పులఖండం జయరామరెడ్డి, మాజీ సర్పంచ్ పులఖండం వెంకారెడ్డి, ఎస్సీ విభాగం అధ్యక్షుడు నూతలపాటి బలరాం, శ్రీనివాసరావు, రావి పేరయ్యచౌదరి, పోపూరి మోహనరావు, ఇంకొల్లు పట్టణ అధ్యక్షుడు కరివాసు, బలరామరాజు, వెంకటేశ్వరరాజు, జఖరయ్య, పీ ప్రసాద్ తలకాయల కోటి, ఎం శ్రీరాములు, అన్ని గ్రామాల మాజీ సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు తదితులు పాల్గొన్నారు. -
తోడేస్తున్న ఇసుకాసురులు
చంద్రబాబు పాలనలో ప్రకృతి వనరులను దోచుకుంటున్నారు. అక్రమ సంపాదనే ధ్యేయంగా సహజ వనరుల దోపిడీ విచ్చలవిడిగా సాగుతోంది. ఇది అందరికీ కనిపిస్తున్న బహిరంగ రహస్యం. కానీ సంబంధిత అధికారులకు మాత్రం కనిపించదు. కన్నెర్ర చేయాల్సిన పాలకులు, కట్టడి చేయాల్సిన అధికారులు ఒక్కటయ్యారు. దోచుకుందాం, పంచుకుందాం అనే ధోరణితో ముందుకు సాగుతున్నారని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. చీరాల అర్బన్: చీరాల నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ ఇసుక దందా అంతా ఇంతా కాదు. దీనిపై జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్ ప్రత్యేక దృష్టి సారిస్తేనే అక్రమ ఇసుక దందాకు అడ్డుకట్ట పడుతుందని ప్రజలు అంటున్నారు. జిల్లాలో ఇసుక రీచ్లకు అనుమతి ఉన్న ప్రాంతాల జాబితాలో చీరాల నియోజకవర్గం లేదు. ఈ విషయం ప్రజలకు కూడా తెలుసు. అయితే కీలకనేత, యువనేత, సంబంధిత అధికారులకు మాత్రం ఆ విషయం తెలీదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అక్రమార్కుల మధ్య ఆధిపత్య పోరు ఇసుక అక్రమార్కుల మధ్య ఆధిపత్య పోరు గతంలో పతాక స్థాయికి చేరింది. చీరాల మండలం బోయినవారిపాలెం పరిఽధిలో ఎంపీ, ఎమ్మెల్యే అనుచరులుగా గుర్తింపు పొందిన వారి మధ్య వివాదం నెలకొంది. ఆ క్రమంలో ఓ పొక్లయినర్కు నిప్పు పెట్టినట్లు వాదనలు బలంగా వినిపించాయి. అందుకు సంబంధించిన కేసు ఈపురుపాలెం పోలీస్స్టేషన్లో నమోదైంది. ఈ సంఘటన తరువాత నియోజకవర్గంలో అక్రమ ఇసుక దందా సాగించే వారి మధ్య కొందరి ప్రమేయంతో సయోధ్య కుదిరినట్లు చెప్పుకున్నారు. ఆ క్రమంలో నియోజకవర్గ పరిధిలో ఇసుక అక్రమ క్వారీయింగ్ ఎక్కడ జరిగినా కీలక నేత, యువనేతలకు ట్రాక్టర్కు రూ.300, ఇతర సంబంధీకులకు వారి, వారి స్థాయిని బట్టి మామూళ్లు ఇచ్చుకుంటూ సాఫీగా దందా సాగిస్తున్నారని వినికిడి. వాళ్లకిచ్చి..మీకిచ్చి.. ఈ క్రమంలో ఓ సంస్థ మాకు రాయల్టీ వసూలు చేసుకునే హక్కు ఉందని ముందుకొచ్చారు. వారు ఒక్కో ఇసుక ట్రాక్టర్ వద్ద రూ.200 రాయల్టీగా వసూలు చేస్తున్నారని, కీలకనేతకు, యువనేతకు ట్రక్కుకు రూ.300 చెల్లిస్తూ, క్వారీ వాళ్లకు నిర్ణీత ధర, ఇతరత్రా ఖర్చులు చెల్లిస్తుంటే తమకు గిట్టుబాటు కావటం లేదనే అసంతృప్తులతో మళ్లీ వివాదాలు తెరకెక్కాయని చెప్పుకుంటున్నారు. రాత్రి ఒకరు ... పగలు మరొకరు కట్టడి చేయాల్సిన అధికారుల తీరు కంచే చేను మేసిందన్న చందంగా తయారైంది. కీలక నేత, యువనేతలకు సంబంధించి వారు పగటి వేళ ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా సాగించకూడదు. సంస్థకు సంబంధించిన వారు రాత్రి వేళ ఇసుక తవ్వకాలు, రవాణా సాగించకూడదని ఇద్దరు అధికారులు మధ్యే మార్గంగా సలహా ఇచ్చి సమస్యను సర్దిపుచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. లేదంటే వచ్చే నగదు అందరం నష్టపోవల్సి వస్తుందని హితవు పలికినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓ సంస్థ తరఫున మరికొందరు చీరాల నియోజకవర్గంలో మా పరంగా ఇసుక తవ్వకాలు, రవాణాకు ఎవరికి అనుమతులు ఇవ్వలేదు. ఏఎంఆర్ సంస్థకు గ్రావెల్, గ్రానైట్ తదితరాలకు మాత్రమే రాయల్టీ వసూలు అధికారం ఉంది. ఇసుకకు సంబంధించి లేదు. – శ్రీనివాస్, మైనింగ్ ఏడీ, బాపట్ల ఇసుక తవ్వకాలు, రవాణాకు ఎవరికి అనుమతులు లేవు. సమాచారం అందిన వెంటనే చర్యలు చేపడుతున్నాం. క్షేత్రస్థాయిలో ప్రత్యేక సూచనలు చేశాం. – చంద్రశేఖర్నాయుడు, ఆర్డీఓ, చీరాల -
పాస్ పుస్తకాల జారీకి వేగవంతమైన చర్యలు
గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ గుంటూరు వెస్ట్: సర్వే పూర్తయిన రెండు గ్రామాల్లో పట్టాదార్ పాసుపుస్తకాల జారీకి సంబంధించి ఈ–కేవైసీ ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుంచి సీసీఎల్ఏ గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేసి, ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు చెప్పారు. వీడియో కాన్ఫరెన్న్స్లో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, జడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ వెంకట రత్నం, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజినీర్ కె.కళ్యాణ చక్రవర్తి, అధికారులు పాల్గొన్నారు. విజయ పతాకం ఎగురవేయాలి పారా సిట్టింగ్ క్రికెట్లో గుంటూరు జిల్లా నుంచి టీమ్ జాతీయ జట్టుకు ఎంపికై న కంఠ ఈశ్వరరావు, షేక్ నాగూర్ వల్లి, బండపల్లి మహేష్, బండారు దుర్గారావులను జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ గురువారం స్థానిక కలెక్టరేట్లో అభినందించారు. టీమ్ ఇండియాకు ఎంపికై న అభ్యర్థులు గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కు మర్యాదపూర్వకంగా కలిసారు. విజయ పతాకతో తిరిగిరావాలని జిల్లా కలెక్టర్ ఆకాక్షించారు. కఠోర శ్రమకు మారుపేరు భగీరథ మహర్షి కఠోర శ్రమకు మారుపేరు భగీరథ మహర్షి అని జిల్లా కలెక్టర్ సాయి కాంత్ వర్మ కొనియాడారు. భగీరథ మహర్షి జయంతి వేడుకలు గురువారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్ఓ ఎన్.ఎస్.కె.ఖాజావలి బి.సి సంఘాల నాయకులతో కలిసి భగీరథ మహర్షి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి కె.మయూరి, బీసీ సంఘాల నాయకులు వేములకొండ శ్రీనివాస్, జంపని నాగేశ్వర రావు, షేక్ షూకుర్, రాజకొండ నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులు వేగవంతం కావాలి అభివృద్ధి పనులు వేగవంతం కావాలని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో గురువారం వీడియో సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా అన్ని శాఖలు పనిచేయాలని స్పష్టం చేశారు. శాఖల మధ్య సమన్వయం అవసరమన్నారు. రహదారులు, గృహ నిర్మాణం వంటి పనులు ప్రజలకు ఎంతో అవసరమని వాటి పట్ల దృష్టి సారించి త్వరితగతిన పూర్తి అయ్యేటట్లుగా అధికారులు శ్రద్ధ వహించాలన్నారు. జిల్లాలో మంజూరైన రహదారులు వాటి పరిస్థితుల వివరాలను పరిశీలించి తక్షణం పనులు పూర్తి చేసేందుకు అవకాశం ఉన్న వాటిని అతివేగంగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో రహదారులు భవనాల శాఖ అధికారులు, జల వనరుల శాఖ అధికారులు, విద్యుత్తు శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లాకు పేరు తీసుకురావాలి జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అఫ్రోజ్
గుంటూరు వెస్ట్ (క్రీడలు): రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీల్లో పతకాలు సాధించి గుంటూరు జిల్లాకు పేరు తీసుకురావాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అప్రోజ్ ఖాన్ అన్నారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో బీఆర్ స్టేడియంలో గురువారం నిర్వహించిన జిల్లా సీనియర్ అథ్లెటిక్ ఎంపికల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎంపికల్లో జిల్లా నలుమూల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లా జట్టు ఎంపిక చేసి మే నెలలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ క్రీడా మైదానంలో జరిగే ఏపీ స్టేట్ అథ్లెటిక్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో శాప్ అథ్లెటిక్స్ కోచ్లు వెంకటేశ్వరరావు, శివారెడ్డి, జిల్లా అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్, సభ్యులు కే అరుణ్కుమార్, నాని తదితరులు పాల్గొన్నారు. కారు ఢీకొని వృద్ధురాలి మృతి మార్టూరు: కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈఘటన గురువారం మధ్యాహ్నం స్థానిక జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. మృతురాలి సమీప బంధువుల వివరాల మేరకు.. కోలలపూడి గ్రామానికి చెందిన చేటూరి సుబ్బరావమ్మ (65) స్థానిక కూరగాయల మార్కెట్ ఎదురుగా రహదారి దాటే ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో ఒంగోలు నుంచి గుంటూరు వైపు వెళ్తున్న కారు సుబ్బారావమ్మను ఢీ కొట్టింది. దీంతో వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. సుబ్బరావమ్మను స్థానికులు 108 సాయంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించే క్రమంలో సుబ్బరావమ్మ మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రమాదానికి కారణమైన వాహన యజమాని మార్టూరు వెలుపల కారు వదిలి పరారయ్యాడు. కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నారు. డ్వాక్రా గ్రూప్ లీడర్ అరెస్ట్ దాచేపల్లి : పొదుపు డబ్బులను దుర్వినియోగం చేసిన డ్వాక్రా గ్రూప్ లీడర్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు. దాచేపల్లిలోని యాసిన్ పొదుపు గ్రూప్ సభ్యులు ఎస్బీఐ బ్యాంక్లో తీసుకున్న రూ.15లక్షల రుణానికి సంబంధించి ప్రతి నెల రూ.50వేలు బ్యాంక్లో అప్పు కింద జమ చేసేందుకు గ్రూప్ లీడర్ సయ్యద్ నూర్జహాన్ అప్పగించారని, ఈ క్రమంలో గ్రూప్ సభ్యులు బ్యాంక్లో అప్పు కింద చేసేందుకు ఇచ్చిన డబ్బులను నూర్జహాన్ సొంతానికి వాడుకుని, దుర్వినియోగం చేసిందని గ్రూప్ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. నూర్జహాన్పై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు వెల్లడించారు. -
నీట్, పాలిసెట్ పకడ్బందీగా నిర్వహించాలి
బాపట్ల: నీట్, పాలిసెట్ పరీక్షలు జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. పరీక్షల నిర్వహణపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం గురువారం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. నీట్ మే నెల మూడో తేదీన జరగనుందని, హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 11 గంటలకు కేంద్రంలో ఉండాలన్నారు. భగీరథుడిలా పట్టుదలతో పని చేయాలి భగీరథుని జీవిత చరిత్ర ఆదర్శమని, లక్ష్యాలను సాధించడానికి ఆయనలా పట్టుదలతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతి సందర్భంగా గురువారం జిల్లా కలెక్టరేట్లో మహర్షి చిత్ర పటానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్ నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ -
దేశం గర్వించేలా క్రీడల్లో ఎదగాలి
మంగళగిరి టౌన్: దేశం గర్వించేలా క్రీడల్లో ఎదగాలని ఇందుకోసం పట్టుదలతో కూడిన సాధన ఎంతో అవసరమని అంతర్జాతీయ మహిళా రెజ్లర్, రియో ఒలంపిక్స్ పతక విజేత సాక్షి మాలిక్ సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో గురువారం ఉద్గమ్ 2026 పేరిట జాతీయ స్థాయి క్రీడోత్సవాలను సాక్షి మాలిక్ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. తాను 12వ ఏట నుంచి రెజ్లింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టానని, ఎప్పటికై నా ఒలంపిక్స్లో పతకం సాధించాలని కోరిక ఉండేదని వెల్లడించారు. 2016 రియో ఒలింపిక్స్లో ఆ కోరిక నెరవేరిందని, భారత జాతీయ పతాకం అంతర్జాతీయ క్రీడావేదికపై ఎగురుతుంటే కలిగే ఆనందం వర్ణించలేనిదన్నారు. ఎంచుకున్న క్రీడారంగంలో లక్ష్యాన్ని నిర్దేశించుకుని కఠోర శ్రమ, సాధనతో దానిని అధిగమించాలని క్రీడాకారులకు సూచించారు. వర్సిటీ వైస్ చాన్స్లర్ ఆచార్య సతీష్కుమార్ మాట్లాడుతూ ఎస్ఆర్ఎంలో వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని, విద్యార్థులు చదువులతో పాటు క్రీడా రంగంలో రాణించాలన్నారు. వర్శిటీ క్రీడాకారులు ఆదిత్య, అనామిక, ముబాసినాలకు వర్శిటీ తరఫున రూ. 20 లక్షల ప్రోత్సాహక పారితోషికాన్ని అందజేశారు. వీరు ఇటీవల జరిగిన ఆలిండియా ఇంటర్ యూనివర్శిటీ అథ్లెటిక్స్ పోటీల్లో బంగారు పతకాలు కై వసం చేసుకున్నారని పేర్కొన్నారు. అనంతరం సాక్షి మాలిక్, గౌరవ అతిథిగా హాజరైన అర్జున్ అవార్డు గ్రహీత సత్యవ్రత్లను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను ప్రదానం చేశారు. వర్శిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వినాయక్, అసోసియేట్ డైరెక్టర్ సుస్మితా సింగ్, వర్శిటీ స్పోర్ట్స్ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్ -
ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్లు
నగరంపాలెం: ఐపీఎల్కి సంబంధించి క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడే 15 మందిని లాలాపేట, పాతగుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.2 లక్షలు, 13 సెల్ఫోన్లను సీజ్ చేశారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో కేసుల వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ముందస్తు సమాచారంతో బుధవారం రాత్రి ఏటుకూర్రోడ్డు చాకలిగుంట ఒకటో వీధిలోని ఓ ఇంట్లో లాలాపేట పోలీసులు తనిఖీలు చేపట్టారు. మొబైల్ఫోన్లతో గ్రూప్లుగా క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్నారని గుర్తించి, 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ బెట్టింగ్లో ఇస్లావత్ జయరామ్నాయక్ నిర్వాహాకుడు అని విచారణలో వెల్లడైందన్నారు. ఆన్లైన్ వెబ్సైట్లో లాగినై, అనంతరం మిగతా బెట్టింగ్ రాయుళ్లకు లాగిన్ సృష్టించి, ఇచ్చేవాడని చెప్పారు. వారిలో ఇస్లావత్ జయరామ్నాయక్, గుమనంపాటి రామారావు, తోట గీతవెంకటగోపీనాథ్, షేక్.చిన్న జిన్నాసాహెబ్, పాలపర్తి గోపికృష్ణ, నేలకుర్తి నాగయ్య, భోగ్యం హనుమంతురావు, షేక్.షుకుర్, షేక్.నాగుల్మీరా, కుటాల వెంకట్, దార్ల కోటేశ్వరరావును అరెస్ట్ చేసి, పది సెల్ఫోన్లు, రూ.1.25 లక్షలు సీజ్ చేశామని చెప్పారు. అలాగే నందివెలుగురోడ్లో గురువారం చిన్నారి కిళ్లీ దుకాణంలో పాతగుంటూరు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో షేక్.రియాజ్, సుర చిన్నకేశవులు అలియాస్ చిన్నారి, తుమ్మూరు రవీంద్రనాధ్కుమార్రెడ్డి అలియాస్ రవి, బల్ల వెంకటేశ్వరరెడ్డిలను అరెస్ట్ చేసి, రూ.75 వేలు, మూడు సెల్ఫోన్లు, ఒక బుక్ స్వాధీనం చేసుకున్నారని అన్నారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లకు సంబంధించి ఓవర్కు ఎన్ని పరుగులు తీస్తారనే అంశాలపై ఫ్యాన్సీ బెట్టింగ్లు నిర్వహించేవారని అన్నారు. విద్యానగర్లో ఉంటున్న రియాజ్ బెట్టింగ్ నిర్వహకుడని, అతని ద్వారా చిన్నకేశవులు, రవీంద్రనాధ్, బల్ల వెంకటేశ్వరరెడ్డిలు బెట్టింగ్లు వేస్తారని చెప్పారు. ఈ కేసులు చేధించిన తూర్పు డీఎస్పీ షేక్. అబ్దుల్అజీజ్, సీఐలు ఏవీ.శివప్రసాద్ (లాలాపేట పీఎస్), కె.వెంకటప్రసాద్ (పాతగుంటూరు పీఎస్), ఎస్ఐలు షేక్.హసీం, అబ్దుల్రెహమాన్, కానిస్టేబుళ్లు కిరణ్కుమార్, పి.శంకర్, షేక్.మీరావలి, కె.బాబురావు, జిల్లా టాస్క్ఫోర్స్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి, ప్రశంస పత్రాలు అందించారు. 15 మంది అరెస్ట్ -
టౌన్ ప్లానింగ్ అస్తవ్యస్తం!
చీరాల అర్బన్: చీరాల మున్సిపాల్టీ టౌన్ ప్లానింగ్ విభాగం అస్తవ్యస్తంగా తయారయ్యింది. ప్లాన్ అప్రూవల్కు అదనపు పైసలు చెల్లించాల్సి వస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందులో ప్రభుత్వ ఖజానాకు ఎంత, ఇతరుల జేబుల్లోకి ఎంత అనే కోణంలో చర్చించుకుంటున్నారు. చిన్న గృహాల నుంచి బహుళ అంతస్తుల భవనాల వరకు ప్లాన్ అప్రూవల్ కావాలంటే ప్రభుత్వ నిబంధనల మేరకు రుసుం చెల్లించాలి. ఆ నిబంధనలకు లోబడి నిర్మాణాలు జరగాలి. అందుకు ఎవరు వ్యతిరేకం కాదు. ఎక్కడన్నా ఒకటి అరా నిబంధనలను అతిక్రమిస్తే తరువాత ప్రభుత్వ పరంగా కల్పించే వెసులుబాటుతో రుసుం చెల్లించి క్రమబద్ధీకరించుకుంటారు. అదే బీపీఎస్..... అయితే .. చీరాలలో బీపీఎస్తో పాటు ఈపీఎస్, పీపీఎస్ రుసుంలు కూడా చెల్లించాల్సి వస్తోందని చెప్పుకుంటున్నారు. పలు చోట్ల సెల్లార్లును ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. వీటిపై అధికారులు చర్యలు చేపట్టక పోవటంతో ప్రజల్లో సంబంధీకులు చులకన అవుతున్నారు. తొలుత అడ్డు చెప్పరు ... తరువాత నిబంధనలు అంటారు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతుంటే ప్లాన్ అప్రూవల్ సమయంలో చెప్పాలి. ఒక వేళ ఆన్లైన్లో అప్రూవల్ పొందారు. మా దృష్టికి రాలేదని చెప్పే అధికారులు, సిబ్బంది కనీసం నిర్మాణ ప్రాథమిక దశలో పక్కాగా చెప్పాలి. అది సరైనదైతే ఇబ్బంది లేదని, నిబంధనలు అతిక్రమిస్తే సక్రమం కాదని చెప్పాలి. అయితే అలా చెప్పరు. సగం, మూడొంతుల నిర్మాణం పూర్తయ్యాక నిబంధనల పేరుతో కొర్రీలు వేసి వ్యక్తి గత ప్రయోజనాలను ఆశిస్తున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. వీటి వెనుక రాజకీయ కోణం ఉందనే గుస గుసలు వినిపిస్తున్నాయి. బీపీఎస్తో పాటు ఇపీఎస్, పీపీఎస్ చెల్లించాల్సిందే! నిబంధనలను అతిక్రమించి చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించుకునేందుకు కొన్ని సమయాల్లో ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తుంది. అదే బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం). అయితే అంతకన్నా ముందు పీపీఎస్ (పొలిటికల్ పీనలైజేషన్ స్కీమ్), ఇపీఎస్ (ఎంప్లాయీస్ పీనలైజేషన్ స్కీం) రుసుంలు కూడా చెల్లించాల్సి వస్తుందని చెప్పుకుంటున్నారు. దీంతో నిర్మాణ వ్యయం తడిసి మోపెడవుతోందని వాపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్ల వినియోగం పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పలు బహుళ అంతస్తుల భవనాల్లో సెల్లార్లను నిబంధనల మేరకు వినియోగించటం లేదు. ప్రధానంగా కొన్ని ఆసుపత్రులు, కొన్ని వ్యాపార సముదాలకు సంబంధించిన నిర్మాణాల్లో సెల్లార్లును నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్నారు. ఇది బహిరంగ రహస్యం. వీటిపై ఎందుకు చర్యలు చేపట్టరో సంబంధీకులకే తెలియాలి. పైసా వసూళ్లు.. అందుకు కారణం -
బాధ్యతలు స్వీకరించిన సూర్యసాయి ప్రవీణ్ చంద్
తాడికొండ: సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ (ఫుల్ అడిషనల్ చార్జి)గా జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్ గురువారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. రాయపూడిలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం 1వ ఫ్లోర్లోని తన చాంబర్లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఆయనకు కమ్యూనికేషన్స్ విభాగ జాయింట్ డైరెక్టర్ జి.రామరాజు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రవీణ్ చంద్కు సీఆర్డీఏ కమిషనర్ వి.విజయ రామరాజు, అడిషనల్ కమిషనర్లు ఎ.భార్గవ తేజ, కొల్లాబత్తుల కార్తీక్, ఆఫీస్ మేనేజ్మెంట్ డైరెక్టర్ వల్లభనేని శ్రీనివాసరావు, ఐటీ విభాగ డైరెక్టర్ బి.మల్లికార్జున రెడ్డి, ఇతర ముఖ్య అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. పొన్నూరు: స్వర్ణపురి పట్టణంలో వేంచేసియున్న సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత సాక్షి భావనారాయణ స్వామివారి బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి ప్రతినిధులు శిఖాకొల్లి గురునాథరావు, కాట్రగడ్డ రామచంద్రరావు, గుడివాడ పవన్, ధరణికోట పద్మావతి, ఆకురాతి అనూరాధ, ఊటుకూరి బాజీ శిరీష, కూరాకుల సత్యనారాయణ, సింహాద్రి వెంకటలక్ష్మి, పరాశరం రంగవల్లి, పొన్నూరు బాలగంగాధర తిలక్ తదితరులు పర్యవేక్షించారు. నకరికల్లు: మండలంలోని అడ్డరోడ్డు గ్రామంలో వేంచేసి ఉన్న అభయాంజనేయ స్వామి వార్షిక తిరునాళ్ల గురువారం కనుల పండువగా జరిగింది. ధర్మకర్త కాళంగి వెంకట నర్సింహారావు, అర్చకులు వినుకొండ కొండమాచార్యులు ఆధ్వర్యంలో 25వ వార్షిక వేడుకలు ఘనంగా జరిపించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ స్వామి వారికి లక్ష తమల పాకులతో అర్చన చేశారు. స్వామి వారిని విశేషంగా అలంకరించారు. పలు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రాత్రికి స్వామి వారి గ్రామోత్సవం జరిగింది. రేపల్లె: రేపల్లె మండలంలోని బేతపూడిలో 2023 సంవత్సరంలో సంభవించిన అకాల వర్షాలతో దెబ్బతిన్న మొక్కజొన్న పంట పరిహారం ఎంపికలో జరిగిన అవకతవకలపై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు గురువారం విచారణ చేపట్టారు. బేతపూడి గ్రామంతో పాటు వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఈ విచారణ చేశారు. అప్పట్లో పనిచేసిన ఎంపీఈవోలు, పలువురు బాధిత రైతుల నుంచి వివరాలు సేకరించారు. గుంటూరు వ్యవసాయ కమిషనర్ కార్యాలయ జాయింట్ డైరెక్టర్ ఎన్సీహెచ్ బాలు నాయక్, రేపల్లె సహాయ వ్యవసాయ సంచాలకులు అద్దేపల్లి లక్ష్మిలు పంట నష్టపరిహార నివేదికలను పరిశీలించారు. బేతపూడి గ్రామంలోని పలువురు రైతులతో మాట్లాడారు. రైతుల నుంచి వివరాలను సేకరించి నివేదిక తయారు చేశారు. నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు జాయింట్ డైరెక్టర్ బాలూనాయక్ తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అవయవదానంతో ఐదుగురి జీవితాల్లో వెలుగులు
గుంటూరు మెడికల్: ఆమె మరణించినా తన అవయవాలతో ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. బ్రెయిన్ డెడ్ అయిన మహిళ నుంచి గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పటల్ వైద్యులు అవయవాలు సేకరించి పలువురికి అమర్చి నూతన జీవితాలు ప్రసాదించారు. వివరాలు... బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామానికి చెందిన ఆకురాటి రత్నకుమారి (65) బ్రెయిన్ స్ట్రోక్కు గురైంది. కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఈ నెల 19వ తేదీన గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పటల్లో అడ్మిట్ చేయించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఆమె కోలుకోకపోవడంతో ఈ నెల 21న బ్రెయిన్ డెడ్గా వైద్యులు నిర్ధారించారు. రత్నకుమారి కుటుంబసభ్యులకు జీవన్దాన్ ట్రస్టు కో ఆర్డినేటర్లు అవయవ దానం గురించి వివరించారు. వారు కూడా దానం చేయడానికి ముందుకు వచ్చారు. లివర్, ఒక కిడ్నీని గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పటల్లో, విజయవాడ విజయ హాస్పటల్లో చికిత్స పొందుతున్న రోగికి మరో కిడ్నీ, ఎల్వీప్రసాద్ కంటి ఆసుపత్రికి నేత్రాలు పంపించారు. తద్వారా ఐదుగురికి నూతన జీవితాలు ప్రసాదించారు. ఈ సందర్భంగా ఆస్టర్ రమేష్ హాస్పటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతినేని రమేష్బాబు మాట్లాడుతూ అవయవదానం అత్యంత గొప్ప మానవ సేవ అని పేర్కొన్నారు. సీఆర్డీఏ ఏసీగా బాధ్యతలు స్వీకరించిన కె.కార్తీక్ తాడికొండ: సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్గా కొల్లాబత్తుల కార్తీక్ బాధ్యతలు చేపట్టారు. రాయపూడిలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం 3వ ఫ్లోర్లోని ఆయన చాంబర్లో బుధవారం శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు తొలుత సీఆర్డీఏ కమ్యూనికేషన్స్ విభాగ జాయింట్ డైరెక్టర్ జి.రామరాజు స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కార్తీక్కు కమిషనర్ వి.విజయ రామరాజు, అడిషనల్ కమిషనర్ ఎ.భార్గవ తేజ, ఆఫీస్ మేనేజ్మెంట్ డైరెక్టర్ వల్లభనేని శ్రీనివాసరావు, ఐటీ విభాగ డైరెక్టర్ బి. మల్లికార్జున రెడ్డి, ఇతర ముఖ్య అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరులో మోడల్ లా సెట్ గుంటూరు లీగల్: ఈ నెల 26వ తేదీన ఏపీ బీసీ అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఉచిత మోడల్ లా సెట్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో అఫీషియల్ రిసీవర్ పి.టి.కోటేశ్వరరావు, మాజీ గవర్నమెంట్ ప్లీడర్ పోకల వెంకటేశ్వర్లు, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ పీపీ పల్లపు కృష్ణ, గుంటూరు బార్ అసోసియేషన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ కొండవీటి శ్రీనివాసరావులు ఆవిష్కరించారు. న్యాయవాది పల్లపు కృష్ణ మాట్లాడుతూ గుంటూరు శ్యామలానగర్లో ఉన్న మాంటిస్సోరి ఇంగ్లిష్ మీడియం స్కూల్ లో ఆదివారం ఉదయం 10 గంటలకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు బార్ అసోసియేషన్ లైబ్రరీ సెక్రటరీ రాజేష్ లింగం, న్యాయవాదులు కె.వీరభాస్కర్, ఓర్సు జనార్దన్రావు పాల్గొన్నారు. -
బాపట్ల
గురువారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.4920 టీఎంసీలు. ప్రాజెక్టు సామర్థ్యం 45.77 టీఎంసీలు. నిమ్మకాయల ధరలు తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో బుధవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.8,000, గరిష్ట ధర రూ.12,500, మోడల్ ధర రూ.10,000 వరకు పలికింది. ఈవీఎం గోడౌన్ తనిఖీ నరసరావుపేట: స్థానిక మార్కెట్ యార్డులో ఈవీఎం గోడౌన్ను పార్టీల ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టరు డాక్టర్ కృతికా శుక్లా బుధవారం తనిఖీ చేశారు. జంగా వెంకట కోటయ్య 7జెడ్పీ వార్షిక బడ్జెట్తో సంబంధం లేకుండానే భవిష్యత్తులో చెల్లింపులు జరిపేందుకు ప్రణాళిక లేకుండా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో రూ.44.73 కోట్ల విలువైన పనులకు చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా ఏకపక్షంగా గతంలో అనుమతులు ఇచ్చేశారు. ఈ వ్యవహారానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వైఎస్సార్ సీపీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులు ప్రస్తుత సర్వసభ్య సమావేశంలోనూ అదే విధానాన్ని కొనసాగించారు. రొంపిచర్ల జెడ్పీటీసీ సభ్యుడు పిల్లి ఓబుల్రెడ్డి ఈ విషయమై గట్టిగా తన గళం వినిపించారు. కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులకు మించి రూ.38 కోట్ల పనులు ముందస్తుగా అనుమతులు ఇవ్వడంతో జెడ్పీని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేశారని అన్నారు. దీనిపై తాము గత సమావేశాల్లోనూ అభ్యంతరం చెప్పామని, జెడ్పీటీసీలతో చర్చించకుండా ఏకపక్షంగా అనుమతులు ఇవ్వడం సరికాదన్నారు. ఈ నిధులతో సంబంధం లేకుండా రూ.38 కోట్లు, గత మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి జెడ్పీ సాధారణ నిధుల నుంచి రూ.2,35,15,668 తోపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన రూ.4.38 కోట్లను కలుపుకొని రూ.44.73 కోట్ల పనులకు చైర్పర్సన్ ఏకపక్షంగా అనుమతులు ఇచ్చేశారన్నారు. నిధుల లభ్యత లేకుండా ఇలా చేస్తే భవిష్యత్తులో పూర్తయిన పనులకు ఏ విధంగా చెల్లింపులు జరుపుతారని ఓబుల్రెడ్డి ప్రశ్నించారు. దీంతోపాటు రూ.32 కోట్ల మేరకు స్టాంప్ డ్యూటీ సర్చార్జ్ నిధులు విడుదల చేయని టీడీపీ సర్కారు తీరుపై జెడ్పీటీసీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ. 44.73 కోట్ల ముందస్తు అనుమతులకు ఆమోదం గుంటూరు ఎడ్యుకేషన్ జెడ్పీటీసీ సభ్యుల అంగీకారం లేకుండా ముందస్తు అనుమతులు ఇచ్చేసిన పనులకు జెడ్పీ సర్వసభ్య సమావేశం ఆమోదం తెలిపింది. నిధులు లేకుండా రూ.కోట్ల విలువైన పనులను ఇష్టారాజ్యంగా కేటాయించేస్తూ, జెడ్పీ ఖజానాకు తీవ్ర ఆర్థిక భారంగా మారిన విధానాన్ని అడ్డుకునేందుకు వైఎస్సార్ సీపీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులు శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ టీడీపీ ప్రజా ప్రతినిధులు అంతా ఒక్కటై ఆమోదింప చేసుకున్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మూడు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధికారులు, జెడ్పీటీసీ సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. పిడుగురాళ్లలో జూన్ నుంచి ఓపీ సేవలు పిడుగురాళ్ల వైద్య కళాశాలలో జూన్ నుంచి ఓపీ సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు చెప్పారు. పలువురు జెడ్పీటీసీ సభ్యులు అడిగిన ప్రశ్నలపై ఆయన స్పందిస్తూ గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా నిర్మించిన మెడికల్ కళాశాలను ఇప్పుడు అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ఇందులో రెండు ప్రభుత్వాల సహకారం ఉందన్నారు. జూన్లో అకడమిక్ తరగతులు ప్రారంభం అవుతాయని చెప్పారు. సమస్యలపై గళమెత్తిన ప్రజాప్రతినిధులు ప్రజల ఇబ్బందులపై సభ్యుల నిలదీత పిడుగురాళ్ల జెడ్పీటీసీ సభ్యుడు జంగా వెంకట కోటయ్య మాట్లాడుతూ గత ఐదేళ్లలో 15వ ఆర్థిక సంఘం నుంచి జెడ్పీకి వచ్చిన నిధులు, పూర్తి చేసిన పనులతోపాటు రద్దు చేసిన పనుల వివరాలు చెప్పాలని అడిగారు. దీనిపై జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు సమాధానమిస్తూ రూ.180 కోట్ల పనులు మంజూరు చేశామని, ఇప్పటి వరకు రూ.142 కోట్లు వచ్చాయని చెప్పారు. మిగిలిన రూ.38 కోట్ల పరిస్థితి ఏంటని నిలదీయడంతో పీఆర్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెబుతారంటూ సమాధానం దాటవేశారు. వర్క్ ఆర్డర్ ఇచ్చి ఏడాది ముగిసినా ప్రారంభం కాని పనులను రద్దు చేయాలని చట్టంలో స్పష్టంగా ఉందని, ఆ విధంగా రద్దు చేసిన పనులకు సైతం నిధులు కేటాయించినట్లు చూపుతున్నారని కోటయ్య నిలదీశారు. అధికారులు సరైన సమాధానం చెప్పలేదు. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఇరువురు జెడ్పీటీసీలను వారించారు. నిధుల విషయమై చర్చ ముగించాలని సూచించారు. మరో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా... జెడ్పీటీసీ సభ్యులను మాట్లాడనీయలేదు. దీంతో చేసేది లేక వారు మౌనం వహించారు. అజెండా ఆమోదించినట్లుగా ప్రకటించుకున్న చైర్పర్సన్ సమావేశాన్ని ముగించారు. జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ, పల్నాడు జేసీ సంజనా సింహ, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్ బాబు, వేగెశ్న నరేంద్రవర్మ, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. -
రెండు నూతన బస్సు సర్వీసులు ప్రారంభం
బాపట్ల: ఒంగోలు నుంచి తెనాలి, తెనాలి నుంచి ఒంగోలు వరకు (చీరాల, బాపట్ల, చెరుకుపల్లి మార్గంగా) ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసులను బుధవారం ప్రారంభించినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి సిహెచ్.విమల బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెనాలి బస్టాండ్ నుంచి ప్రతి రోజు ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు ఒంగోలు రెండు సర్వేసులు బయలుదేరుతాయని చెప్పారు. ఒంగోలు బస్టాండ్ నుంచి ప్రతి రోజు ఉదయం 10 గంటలకు, సాయంత్రం 6 గంటలకు తెనాలికి రెండు సర్వేసులు నడపడం జరుగుతుందని వివరించారు. తెనాలి నుంచి ఒంగోలు వరకు(చీరాల, బాపట్ల, చెరుకుపల్లి మార్గంగా) ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈసౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. బాపట్ల: జనగణన– 2027పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈనెల 26న (ఆదివారం) బాపట్లలో 5కే రన్్ నిర్వహించనున్నట్లు డీఆర్ఓ గంగాధర్ గౌడ్ తెలిపారు. సెల్ఫ్ ఎన్యుమరేషనన్ పై ప్రజలకు చైతన్యం కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని చెప్పారు. కార్యక్రమ ఏర్పాట్లపై బుధవారం డీఆర్వో చాంబర్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. 18 ఏళ్లు పైబడిన యువతీ యువకులు, విద్యార్థులు ఈ రన్లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశాల మేరకు సంబంధిత శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెనాలిరూరల్: రైలు కింద పడి తెనాలిలోని పినపాడు రైల్వే గేట్ వద్ద బుధవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. పట్టణ ముత్తెంశెట్టిపాలెం మల్లాది వారి వీధికి చెందిన కోటపాటి కళ్యాణ్ చక్రవర్తి(53) వందే భారత్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జీఆర్పీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. ఎస్ఐ ఎల్.సరస్వతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వినుకొండ: కోర్టు వారెంట్ను అమలు చేసేందుకు వెళ్లిన పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిపై వినుకొండ పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం, ఆవులమంద గ్రామానికి చెందిన పిడతల అనూషకు, పిడతల పూల రంగయ్యతో వివాహం జరిగింది. వీరిద్దరి మధ్య తలెత్తిన విభేదాల కారణంగా, ప్రస్తుతం వినుకొండలోని శాలివాహన నగర్లో నివాసం ఉంటున్న అనూష స్థానిక కోర్టులో భర్తపై భరణం కేసు దాఖలు చేశారు. ఈ కేసులో నిందితుడైన పూల రంగయ్య కోర్టుకు హాజరుకాకపోవడంతో, వినుకొండ కోర్టు అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్లోని ముషీరాబాద్ పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న పూల రంగయ్యపై వారెంట్ను అమలు చేసేందుకు వినుకొండ పోలీసు స్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుళ్లు సుబ్బారావు, సత్యరావు హైదరాబాద్ వెళ్లారు. అక్కడ పూల రంగయ్య పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తూ ప్రవర్తించారు. ప్రభుత్వ విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకున్నందుకు గాను హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వినుకొండ ఎస్హెచ్ఓ బి.ప్రభాకర్ కేసు నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు పూల రంగయ్యను అరెస్ట్ చేసి తదుపరి చర్యలు చేపట్టారు. -
వైఎస్సార్ సీపీ శ్రేణులపై అక్రమ కేసులకు నిరసన
కొల్లూరు: చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసులు అమాయక ప్రజలపై అక్రమ కేసులు బనాయిస్తూ అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు నిరసన గళమెత్తారు. సోషల్ మీడియా నియోజకవర్గ కన్వీనర్ బాణాల తనీష్బాబు అరెస్టు వ్యవహారంలో పోలీసులు మఫ్టీలో వచ్చి చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే ప్రశ్నించిన పాపానికి 32 మందిపై అక్రమంగా కేసులు పెట్టడం, అరెస్టు చేసి రిమాండ్కు తరలించడంపై బుధవారం కొల్లూరు పోలీసు స్టేషన్ వద్ద శాంతియుత నిరసనకు దిగారు. పోలీసులు చినపులివర్రు ఘటనలో 32 మందిపై నమోదు చేసిన కేసులో బాణాల తనీష్బాబును ఏ1గా, వరికూటి అశోక్బాబును ఏ2గా పేర్కొన్నారు. పోలీసులు అక్రమంగా కేసులు బనాయించి శ్రేణులను భయభ్రాంతులకు గురిచేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. వారి తరఫున న్యాయ పోరాటం చేస్తామని, అవసరమైతే ఎంతవరకై నా వెళతామంటూ పోలీసు స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. మధ్యాహ్నం 12 .30 నుంచి రాత్రి 8 గంటల వరకు నిరసన తెలిపారు. పోలీసులు చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలేవీ? సోషల్ మీడియాలో ప్రశ్నించిన వ్యక్తిని అరెస్టు చేసేందుకు చట్టాన్ని అతిక్రమించిన పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడంపై వరికూటి ప్రశ్నల వర్షం కురిపించారు. మఫ్టీలో తెల్లవారుజామున బెడ్రూమ్లోకి చొరబడిన పోలీసులపై బాధితురాలు బాణాల అనూష కొల్లూరు ఎస్ఐ కోటేశ్వరరావు, మరో నలుగురు సిబ్బందిపై ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకపోవడం దారుణమన్నారు. దొంగల్లా ఇళ్లలోకి చొరబడితే ప్రశ్నించిన అమాయకులపై కేసులు నమోదు చేయడం ఏ చట్టంలో ఉందని నిలదీశారు. వందలాది మంది పోలీసు బలగాలతో చినపులివర్రును ముట్టడించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. చెట్టుకొకరు.. పుట్టకొకరు అయ్యేలా చేయడం ఏ చట్టం పరిధిలోకి వస్తుందని ప్రశ్నించారు. అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ నాయకులు వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సమక్షంలోనే పోలీసుల కళ్లెదుటే కొట్టుకొని, పోలీసులపైన సైతం దాడి చేస్తే ఒక్క కేసు కూడా నమోదు చేయలేదన్నారు. పోలీసు వ్యవస్థను కొందరు పచ్చ పార్టీకి కొమ్ముకాస్తున్న పోలీసులు భ్రష్టుపట్టిస్తున్నారని విమర్శించారు. చినపులివర్రు ఘటనలో 32 మందిపై నమోదైన కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బుధవారం తెనాలిలో జడ్జ్ ముందు హాజరుపర్చడంతో వారికి రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో అశోక్బాబు కార్యకర్తలకు అండగా తనను సైతం అరెస్టు చేయాలని చేపట్టిన నిరసనతో పోలీసులు దిగొచ్చారు. కేసులు ఉన్న ఏ1 బాణాల తనీష్బాబు మినహా అశోక్బాబుతో కలిపి 28 మందికి 41ఏ నోటీసులు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. తనీష్ కేసు వ్యవహారం కొలిక్కి వచ్చే వరకు తాను సైతం నోటీసు స్వీకరించేది లేదని ఆయన తేల్చి చెప్పడంతో మిగిలిని 27 మందికి పోలీసులు నోటీలసులు జారీ చేయడంతో నిరసనను ఆయన విరమించారు. నిరసన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు వై. అశ్వని, నాయకులు గాదె శివరామకష్ణా రెడ్డి, పడమట శ్రీనివాసరావు, పెరికల పద్మారావు, కూచిపూడి మోషే, ఆళ్లమూడి మధు, గరిక రమేష్, గాజుల శ్రీనివాసరావు, ఈమని శంకర్, వివిద మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
శాప్ ఫుట్బాల్, బాక్సింగ్ జిల్లా జట్లు ఎంపిక
నరసరావుపేట ఈస్ట్: సతైనపల్లి రోడ్డులోని డీఎస్ఏ స్టేడియంలో బుధవారం శాప్ లీగ్ పోటీల్లో భాగంగా ఫుట్బాల్, బాక్సింగ్ జిల్లా జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు అండర్–15, యూత్ అండర్–21 బాలబాలికలకు ఫుట్బాల్, అలాగే అండర్– 15, అండర్– 19 బాలబాలికలకు బాక్సింగ్ పోటీలను నిర్వహించి జిల్లా జట్లు ఎంపిక చేశారు. నాదెండ్ల: ఓ పక్క అప్పుల బాధ, మరోపక్క కుటుంబ కలహాల నేపధ్యంలో ఒడిషా కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గణపవరం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు ఒడిషా రాష్ట్రం భద్రక్జిల్లా కాన్ప్డ్ గ్రామానికి చెందిన నిదానిధర్దాస్ (46) భార్య అలియాదాస్, తమ్ముడు జలంధర్తో కలిసి గ్రామంలోని చవిటిపాలెంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ స్ధానిక స్పిన్నింగ్ మిల్లుల్లో కూలిపనులు చేసుకుని జీవిస్తున్నారు. కొంతకాలంగా పరిశ్రమల్లో పనులు లేకపోవటంతో అప్పుల సమస్యల్లో చిక్కుకున్నారు. ఆర్థిక విషయాల్లో భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. బుధవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు నమోదు చేసుకున్నారు. భార్య అలియాదాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నరసరావుపేట టౌన్ : ఇంటి తాళాలు పగులగొట్టి గృహంలోకి చొరబడిన దుండగులు బీరువాను ధ్వంసం చేశారు. నగదు, విలువైన వస్తువులు లభ్యం కాకపోవటంతో వెనుతిరిగారు. ప్రకాష్నగర్లో బుధవారం వెలుగు చూసిన చోరీ యత్నం సంఘటనకు సంబంధించి వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాష్నగర్ జిల్లా రిజిస్టార్ కార్యాలయం వెనుక ప్రాంతంలో నివాసం ఉంటున్న రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి యలవర్తి రాంప్రసాద్ కుటుంబ సభ్యులతో మూడు రోజుల క్రితం షిరిడి యాత్రకు వెళ్తూ ఇంటికి తాళాలు వేసి వెళ్లాడు. బుధవారం ఉదయం ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు విషయాన్ని వన్టౌన్ పోలీసులకు తెలియజేశారు. సీఐ ఫిరోజ్ ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడకు చేరుకొని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. ఇంటి కింద, పై అంతస్తులోని రెండు తలుపుల తాళాలను పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. బీరువాను ధ్వంసం చేసి, అందులోని సామాన్లను చిందరవందరుగా పడేసి ఉండటాన్ని గమనించారు. షిరిడి యాత్రలో ఉన్న ఇంటి యజమానితో సీఐ మాట్లాడారు. ఇంట్లో విలువైన వస్తులు, నగదు ఏమీ లేవని చెప్పటంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకొని ప్రాథమిక ఆధారాలు, వేలిముద్రలను సేకరించారు. గృహ సమీపంలోని సీసీ పుటేజ్లను పరిశీలించి నిందితుల ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేశారు. మాచర్ల రూరల్: కుటుంబ కలహాల నేపథ్యంలో విద్యార్థి పురుగుమందు తాగి మృతి చెందిన సంఘటన మండలంలోని తాళ్లపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఎల్లాల వెంకటేశ్వర్లు (22) పట్టణంలోని ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తల్లి చిన్నతనంలో మృతిచెందగా, తండ్రి గోవిందు ఉన్నాడు. ఇంట్లో ఏర్పడిన చిన్న వివాదంతో గడ్డి మందు తాగి తండ్రితో చెప్పాడు. వెంటనే మాచర్ల ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం నిమిత్తం మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్కి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు విజయపురిసౌత్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య
తాడేపల్లిరూరల్: తాడేపల్లి మండల పరిధిలోని పెనుమాక గ్రామం టిడ్కో గృహ సముదాయంలో నివాసముండే ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు బుధవారం కేసు నమోదు చేశారు. సీఐ వీరేంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం ఉండవల్లి సెంటర్కు చెందిన త్రివేణి (23) కి దుగ్గిరాల మండలం మంచికలపూడికి చెందిన రవికుమార్కు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఏడు సంవత్సరాల పాప ఉంది. ఐదు సంవత్సరాల క్రితం త్రివేణి భర్తతో విభేదాలు రావడంతో విడిపోయి కొంతకాలం ఉండవల్లి సెంటర్లోని తల్లి ఇంటి వద్ద నివాసముండి ప్రస్తుతం పెనుమాకలో టిడ్కో హౌస్లో నివాసముంటూ హైకోర్టు వద్ద జిరాక్స్ షాపులో పనిచేస్తోంది. ఈ క్రమంలో జూనియర్ లాయర్గా పనిచేస్తున్న విక్కీ అనే యువకుడు పరిచయం అయ్యాడు. కొంతకాలం తరువాత పరిచయం కాస్తా ప్రేమగా మారి ఇద్దరూ సన్నిహితంగా ఉంటున్నారు. ఇటీవల కాలంలో విక్కీ మరో యువతిని ప్రేమిస్తున్నాడని త్రివేణి అనుమానం పెంచుకుంది. విక్కీ తనతో మాట్లాడకపోవడంతో మనస్తాపం చెందిన త్రివేణి ఆమె నివాసముండే ప్లాట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జరిగిన సంఘటనపై తల్లి రాజకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వీరేంద్ర తెలిపారు. -
పోరాడుదాం.. శక్తిని చాటుదాం..
పెడన: సమస్యలపై ప్రజాపోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని, చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాన్ని ప్రజలకు వివరించడానికి వైఎస్సార్ సీపీలోని ప్రతి మహిళా కూడా ఒక ఆదిపరాశక్తిగా మారాలని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి పిలుపునిచ్చారు. బుధవారం కృష్ణాజిల్లా పెడనలో ఐదు జిల్లాల వర్కింగ్ ప్రెసిడెంట్, ఉమ్మడి కృష్ణాజిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన వైఎస్సార్ సీపీ మహిళల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు చెందిన మహిళా నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రతినిధులు, ఆయా విభాగాలకు చెందిన మహిళా నాయకులు తొలుత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జగనన్నను సీఎం చేయడమే లక్ష్యం.. సభను ఉద్దేశించి వరుదు కల్యాణి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో వైఎస్సార్సీపీని బలోపేతం చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. అందరి ఆలోచనలు, సూచనలు, సలహాలు తీసుకుని, రానున్న కాలంలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేయడమే లక్ష్యంగా ముందుకు అడుగులు వేద్దామన్నారు. జగనన్న మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా ఎంత చక్కటి పరిపాలన అందించారో స్వయంగా చూశామన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా ఎవరిపై ఆధారపడకుండా ఇచ్చిన ప్రతి పథకం కూడా మహిళల పేరు మీద ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు చేస్తున్న అరాచాకాలపై ఒక చిరుతపులిలా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి.. మహిళలపై చంద్రబాబుకు చిన్నచూపని, అందుకు నిదర్శనం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా బిల్లు విషయంలో చంద్రబాబునాయుడు రెండు నాలుకల ధోరణియేనని వరుదు కల్యాణి దుయ్యబట్టారు. మహిళా బిల్లును వ్యతిరేకించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో టీడీపీ ఎంపీలు విందులు, వినోదాల్లో పాల్గొనడం గమనిస్తే మహిళా బిల్లును వ్యతిరేకించారనే విషయం తేటతెల్లమవుతుందన్నారు. మావిగన్ ప్రతిపాదన అద్భుతం.. మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ ప్రాంతాలను అనుసంధానిస్తూ పోర్టు, విమానాశ్రయం, పరిశ్రమలున్న ప్రాంతాలను అనుసంధానం చేస్తూ మావిగన్ను రాజధానిగా చేస్తే బాగుంటుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రతిపాదన బ్రహ్మాండంగా ఉందనే విషయాన్ని ప్రజలు గుర్తించారని వరుదు కల్యాణి అన్నారు. అమరావతి వెనుక అవినీతి నెలకొందనే విషయాన్ని ప్రశ్నిస్తున్నందుకు డైవర్స్ పొలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో కృష్ణాజిల్లా మహిళా అధ్యక్షురాలు, మాజీ మేయర్ శీలం భారతి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, రాష్ట్ర మహిళా సెక్రటరీ పేరం త్రివేణిరెడ్డి, స్టేట్ మహిళా విభాగం సమాచార విభాగం అధ్యక్షురాలు సంపత్తి విజిత, మహిళా విభాగం జాయింట్ సెక్రటరీ కందుకూరి జ్యోతి, జాయింట్ సెక్రటరీ మునుపురి హరీష్య, గుంటూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు బూరెల్లా నాంచారమ్మ, బాపట్ల జిల్లా మహిళా అధ్యక్షురాలు అశ్వినిరెడ్డి, గన్నవరం జెడ్పీటీసీ అన్నవరపు ఎలిజబెత్ రాణి, చీరాల నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు మద్దులూరి సీతామాలక్ష్మి, పల్నాడు జిల్లా మహిళా అధ్యక్షురాలు పమిడిమల్ల గీతా వసంతి, పెడన నియోజకవర్గ నాయకురాలు మైలా రత్నకుమారి, రాజులపాటి వాణి తదితరులు పాల్గొన్నారు. -
రిలే నిరాహార దీక్ష జయప్రదం చేయండి
ఫ్యాప్టో పల్నాడు జిల్లా శాఖ పిలుపు నరసరావుపేట ఈస్ట్: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర ఫ్యాప్టో సంఘం పిలుపు మేరకు విజయవాడ ధర్నా చౌక్లో తలపెట్టిన రిలే నిరాహార దీక్షల్లో భాగంగా ఈనెల 27వ తేదీన జరగనున్న దీక్షలో పల్నాడు జిల్లా నుంచి ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఫ్యాప్టో పల్నాడు జిల్లా చైర్మన్ ఎల్.వి.రామిరెడ్డి తెలిపారు. జిల్లా విద్యాశాఖాధికారి రామారావు నరసరావుపేట ఈస్ట్: జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో ఖాళీగా ఉన్న ఏఎల్ఎస్ కో–ఆర్డినేటర్ పోస్ట్ను డిప్యూటేషన్ ఆధారంగా భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాల విద్యాశాఖలో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు 5 సంవత్సరాలు, ఎస్జీటీలు 8 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలని తెలిపారు. అలాగే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి పీజీ డిగ్రీ కలిగి ప్రకటన తేదీ నాటికి 55 సంత్సరాల వయస్సు లోపు కలిగి, ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలన్నారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను అవసరమైన ధ్రువపత్రాలతో కలిపి ఈనెల 22 నుంచి 28వ తేదీ వరకు కార్యాలయంలో అందచేయాలని కోరారు. అసంపూర్తిగా, గడువు దాటిన తరువాత అందిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోబడవని స్పష్టం చేసారు. సత్తెనపల్లి: భార్య పుట్టింటికి వెళ్ళిందని భర్త యాసిడ్ తాగి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన మంగళవారం రాత్రి వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామానికి చెందిన మన్నేటి గోపీకృష్ణ, భార్య ఆదిలక్ష్మి మధ్య మనస్పర్ధలు రావడంతో ఇరువురు గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఆదిలక్ష్మి అచ్చంపేట మండలం చెరుకుంపాలెంలోని పుట్టింటికి వెళ్లడంతో గోపికృష్ణ యాసిడ్ ఆత్మహత్యకు యత్నించాడు. మంగళవారం రాత్రి 11:45 గంటలకు చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. పిడుగురాళ్ల: స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించేందుకు డబ్బుల కోసం వెళ్లి వస్తూ ప్రమాదవశాత్తు యువకుడు మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన పట్టణంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి మీద చోటు చేసుకుంది. వివరాల ప్రకారం...పిడుగురాళ్లకు చెందిన హసనెన్, అల్లాబడేలు ద్విచక్ర వాహనంపై కొండమోడులోని వీరమ్మ కాలనీలోని అల్లాబడే నాయనమ్మ ఇంటికి స్నేహితుడి పుట్టిన రోజు సందర్భంగా డబ్బులు తీసుకొనివచ్చేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా పిడుగురాళ్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి మీద విద్యుత్ పోల్కు తగిలి షేక్ హసనెన్(19) అక్కడిక్కడే మృతి చెందగా అల్లాబడేకి తీవ్ర గాయాలయ్యాయి. పట్టణంలోని ఓప్రైవేటు వైద్యశాలలో చికిత్స నిర్వహించి మెరుగైన చికిత్స కోసం నర్సరావుపేట తరలించారు. పట్టణ ఎస్ఐ శివనాగరాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
26 నుంచి నృసింహస్వామి జయంత్యుత్సవాలు
మంగళగిరి టౌన్: మంగళగిరి నగరంలో వేంచేసియున్న శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంత్యుత్సవాలు ఈనెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 26 ఆదివారం నుంచి మే 1వ తేదీ వరకు స్వామివారి జయంతి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగనున్నాయి. 26వ తేదీ సాయంత్రం 6 గంటలకు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఋత్విగ్వరణమ్, రక్షాబంధనం, మృత్సంగ్రహణం, అంకురారోపణ, 27వ తేదీ ఉదయం 8 గంటలకు విష్వక్సేన, పుణ్యాహవచనం, అగ్నిప్రతిష్ట, నారసింహ మూలమంత్ర హోమం, సాయంతం 6 గంటలకు కుంభార్చన, నారసింహ హోమం, రాత్రి 7 గంటలకు శ్రీవారి గరుడ సేవ, 28వ తేదీ ఉదయం సుదర్శన నారసింహ హోమం, రాత్రి సహస్ర దీపాలంకరణ సేవ, 29వ తేదీ ఉదయం లక్ష పుష్పార్చన, రాత్రి చతుర్వేద పారాయణం 30వ తేదీ ఉదయం విశేష అలంకారం, మే 1వ తేదీ మహాపూర్ణాహుతి, శాంతి కళ్యాణం, స్వామివారి గ్రామోత్సవం తదితర కార్యక్రమాలు జరుగనున్నాయని ఆలయ అధికారులు తెలిపారు. -
అర్జీలను వెంటనే పరిష్కరించాలి
బాపట్ల పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ పేర్కొన్నారు. బుధవారం రాత్రి జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ కంప్యూటర్ సెక్షన్ నుంచి ఫోన్ ద్వారా అర్జీదారులతో మాట్లాడారు. అర్జీ పరిష్కారమైందా వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలో సమస్య పరిష్కారం చేస్తామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ఎస్డీసీ లవన్న తదితరులు పాల్గొన్నారు. అడ్వెంచర్ టూరిజం అమలుకు అనుమతులు బీచ్ల వద్ద సీఆర్జెడ్, పర్యావరణ నిబంధనలు అనుసరించి అడ్వెంచర్ టూరిజం అమలుకు అనుమతులు రావడం జిల్లా చరిత్రలోనే ప్రథమమని జిల్లా కలెక్టర్ తెలిపారు. పర్యాటక రంగం అభివృద్ధిపై స్థానిక కలెక్టరేట్లో బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. సూర్యలంక బీచ్లో అడ్వెంచర్ టూరిజం స్పోర్ట్స్ వారంలోనే ప్రారంభిస్తామని ప్రకటించారు. నిర్వహణకు టెండర్లు పిలువగా ఐదుగురు ఆపరేటర్లు వచ్చారని తెలిపారు. బీచ్ల వద్ద జూన్ ఒకటో తేదీ నుంచి పూర్తిగా ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తామని తెలిపారు. పర్యాటక శాఖ అధికారి అలీ ఆస్గర్, బీచ్ సూపర్వైజర్లు, తదితరులు పాల్గొన్నారు. స్వదేశీ దర్శన్ పనులు వేగంగా చేపట్టాలి స్వదేశీ దర్శన్ అభివృద్ధి పనులు వేగంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణంపై అనుబంధ శాఖల అధికారులు, ఎంఓయూలు కుదుర్చుకున్న సదరు పారిశ్రామికవేత్తలతో బుధవారం స్థానిక కలెక్టరేట్ నుంచి ఆయన వీక్షణ సమావేశం ద్వారా భేటీ అయ్యారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ -
పట్టాలు తప్పిన జీఆర్పీ
బాపట్లబుధవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026● కార్యాలయంలో ఎప్పుడు చూసినా ఖాళీ కుర్చీలే దర్శనం ● మనుగడలో లేని ఫోన్ నంబర్లతో దర్శనం ఇస్తున్న బోర్డులు ● ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించి విసుగు చెందుతున్న బాధితులు రెప్పపాటులో రూ. 18 లక్షలు చోరీ 7తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో మంగళవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.8500, గరిష్ట ధర రూ.14,500, మోడల్ ధర రూ.11,000 వరకు పలికింది. ఫిరంగిపురం: నుదురుపాడు కాశీవిశ్వేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం శంకర జయంతిని పురస్కరించుకొని చండీహోమం నిర్వహించి పూర్ణాహుతి గావించారు. -
రైతు ఆదాయం పెంచే దిశగా కృషి చేయాలి
– జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ గుంటూరు వెస్ట్: రైతు ఆదాయం పెంచే దిశగా ప్రాథమిక రంగాల శాఖలు పని చేయాలని జిల్లా కలెక్టర్ సీఎం.సాయికాంత్ వర్మ పేర్కొన్నారు. వివిధ ప్రాథమిక రంగాల శాఖాధికారులతో మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అవసరం మేరకు పంటల విధానాన్ని మార్పు చేసి అధిక ఆదాయం వచ్చే దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పంటల వారీగా వస్తున్న ఆదాయాన్ని పరిశీలించాలని, ఉత్తమ మార్కెటింగ్ విధానాలను అనుసరించాలని తెలిపారు. సమావేశంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.పద్మావతి, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్ర బాబు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు సత్యనారాయణ చౌదరి, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ టి.నరసింహారెడ్డి పాల్గొన్నారు. – ఏఎన్యూలో మరో మాయాజాలం సాక్షి ప్రతినిధి, గుంటూరు: పరీక్ష రోజునే కేంద్రాన్ని మార్చి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. ఏఎన్యూ పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షల్లో తొలుత రేపల్లె ప్రాంతంలోని నాలుగు కళాశాలలకు బాపట్లలోని ఒక సెంటర్ను పరీక్ష కేంద్రంగా కేటాయించారు. పరీక్ష జరిగిన ఈ నెల 21వ తేదీన సెంటర్ను మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్లలోని సెంటర్కు బదులుగా మరో సెంటర్ను కేటాయించారు. గతంలో వీటిలో ఒక కళాశాలకు సెల్ఫ్ సెంటర్ను కేటాయించేవారు. ఇలా మార్చటంలో ఔచిత్యం ఏంటో వర్సిటీ అధికారులకే తెలియాలి. 21వ తేదీన పరీక్ష ఉండగా, అదే రోజున సెంటర్ మార్చినట్లు ఉత్తర్వులు ఇవ్వడం వర్సిటీ పనితీరుకు నిదర్శనం. మార్చిన సెంటర్లో హాల్ టికెట్లను పరీక్షా కేంద్రంలోనే అందజేశారు. నూతనంగా మార్చిన కేంద్రంలో కేటాయించిన కొన్ని కళాశాలల్లో గతంలో పీజీ కోర్సులను తొలగించినట్లు సమాచారం. ఒక కళాశాల కోసమే ఇతర కళాశాలలను కూడా మార్చినట్లు, విద్యార్థులు లేకపోయినా సెంటర్ కేటాయించినట్లు సమాచారం. ఏఎన్యూ పీజీ నాలుగో సెమిస్టర్ పొలిటికల్ సైన్స్ విద్యార్థుల హాల్ టికెట్లలో తప్పిదాలు చోటుచేసుకున్నాయి. ఏప్రిల్ నెలలో పరీక్షలు జరుగుతుండగా, జూన్ నెలలో పరీక్షలు అన్నట్లు ‘6’ నెలగా ముద్రించారు. వారాల వివరాలు కూడా తప్పుగా ముద్రించడం గమనార్హం. గుంటూరుమెడికల్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గుంటూరు శాఖ ఆధ్వర్యంలో ఐ.ఎస్.సి.సి.ఎం సహకారంతో ఏబీజీ అనాలసిస్పై వైద్యులకు నిరంతర వైద్య విద్యా కార్యక్రమం (సీఎంఈ) నిర్వహిస్తున్నట్లు ఐఎంఏ గుంటూరు శాఖ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ టి.సేవ కుమార్, డాక్టర్ బి.సాయికృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 23వ తేదీ సాయంత్రం జి.ఎం. ఏ బిల్డింగ్లో నిర్వహించే కార్యక్రమంలో వైద్య నిపుణులు డాక్టర్ కె.ఉదయ్, డాక్టర్ వై.విశ్వజ్యోతి ప్రసంగిస్తారన్నారు. గుంటూరు నగర వైద్యులందరూ ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగాకోరారు. తాడేపల్లి రూరల్ : గుంటూరు జిల్లా సీతానగరం విజయకీలాద్రిపై వేంచేసిన యున్న శ్రీ విఘ్న విమోచక హనుమాన్కు మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ విజయకీలాద్రి దివ్య క్షేత్రంపై ఉన్న 27 అడుగుల ఏకశిలా మూర్తి శ్రీ విఘ్న విమోచక హనుమాన్ విగ్రహానికి గులాబీ పూలతో విశేష సహస్రనామార్చన నిర్వహించామని తెలిపారు. సినిమా కొరియెగ్రాఫర్ శేఖర్ మాస్టర్ సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారని తెలిపారు. -
భూసారం పెంచుకోవాలి
కర్లపాలెం: సాగు భూములలో పచ్చిరొట్ట పైర్లను పెంచటం ద్వారా భూసారం పెంచుకోవాలని బాపట్ల జిల్లా వ్యవసాయాధికారి విజయనిర్మల తెలిపారు. కర్లపాలెం మండలంలోని చింతాయపాలెంలో ఏవో సుమంత్కుమార్ ఆధ్వర్యంలో పచ్చిరొట్ట ఎరువులపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో ఆమె మాట్లాడుతూ పంటలు పండించేందుకు కేవలం రసాయనిక ఎరువులనే వినియోగించటంతోపాటు పచ్చిరొట్ట ఎరువులు, సేంద్రియ ఎరువులు వినియోగించాలని రైతులకు తెలిపారు. జీవన ఎరువులైన అజటో బాక్టీరియం, ఆజోస్పిరిల్లం వినియోగించటం ద్వారా రసాయనిక ఎరువుల వినియోగాన్ని బాగా తగ్గించుకోవచ్చునని చెప్పారు. 15 నుంచి 30 లోపు రకాల విత్తనాలు కలిగిన కిట్లు రైతు సేవా కేంద్రాలలో అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. అనంతరం కర్లపాలెంలోని పలు ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. -
అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన అవసరం
రాష్ట్ర ఫైర్ సర్వీసెస్ సౌత్ రీజియన్ ఏడీ జ్ఞానసుందరం చీరాల: అగ్నిప్రమాదాల నివారణపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, సరైన జాగ్రత్తలు పాటిస్తే ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని రాష్ట్ర ఫైర్ సర్వీసెస్ సౌత్ రీజియన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్.జ్ఞానసుందరం పేర్కొన్నారు. అగ్నిమాపక వారోత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం స్థానిక ఐటీసీ కంపెనీలో అగ్ని ప్రమాదాల నివారణపై జరిగిన వర్క్షాపులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఫైర్ సర్వీసెస్ సౌత్ రీజియన్ ఏడీ మాట్లాడుతూ.. వారం రోజులపాటు నిర్వహించిన కార్యక్రమాలను వర్క్షాపులో వివరించారు. గృహాలు, పరిశ్రమలు, పెట్రోలు బంకులు, హాస్పిటళ్లు, సినిమా హాళ్లలో అగ్ని నిరోధకాలు తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. విద్యుత్, గ్యాస్ కారణంగా సంభవించే ప్రమాదాల్లో ఎక్కువగా ప్రాణ, ఆస్తి నష్టం చోటుచేసుకుంటోందన్నారు. తమ సిబ్బంది ఇచ్చే సూచనలు పాటిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చని చెప్పారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోగా అందుబాటులో ఉన్న అగ్ని నిరోధకాలతో మంటలు అదుపు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం అగ్నిమాపక పరికరాల గురించి వివరించారు. కార్యక్రమంలో ఐటీసీ వైస్ ప్రెసిడెంట్ కేఎన్రావు, జిల్లా అగ్నిమాపక అధికారి కె.వినయ్, చీరాల సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి వీవీ రామకృష్ణ, ఐటీసీ జీఎం శ్యామ్సుందర్, ఈహెచ్ఎస్ సీనియర్ మేనేజర్ ఎంఎస్ఎన్ రెడ్డి, జిల్లాలోని వివిధ కంపెనీల ప్రతినిధులు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. -
అర్జీలు పునరావృతం కాకుండా చూసుకోవాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్బాపట్ల : స్థానిక కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 164 అర్జీలు నమోదయ్యాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు అర్జీల ద్వారా తమ సమస్యలను కలెక్టర్కు వివరించారు. తన పరిధిలో ఉన్న వాటికి అక్కడికక్కడే ఆయన పరిష్కారమార్గం చూపగా, కొన్నింటిని పరిశీలనకు, మరికొన్నిటిని విచారణకు ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి అధికారులు తమ వంతుగా బాధ్యతతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. మూస పద్ధతిలో విధులు నిర్వహించడం మాని సృజనాత్మకతతో పనిచేయాలన్నారు. పీజీఆర్ఎస్లో నమోదైన ప్రతి అర్జీని పరిశీలించి, పరిష్కరించాలన్నారు. బాపట్ల జిల్లాలో అడ్వెంచర్స్ స్పోర్డ్స్ అడ్వెంచర్స్ స్పోర్డ్స్ బాపట్ల జిల్లాలో ప్రారంభించడం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతోందని కలెక్టర్ అన్నారు. పర్యాటక రంగంగా ప్రాచుర్యంలోకి బాపట్ల జిల్లా చరిత్ర మారిన రోజుగా ఆయన అభివర్ణించారు. ఈ విజయం ఏ ఒక్కరిది కాదని, జిల్లా యంత్రాంగమంతా కలిసి పనిచేయడం ద్వారా సాధ్యమైందన్నారు. అధికారులందరినీ ఆయన ప్రత్యేకంగా అభినందించారు. త్వరలో సూర్యలంక బీచ్లోను అడ్వెంచర్ స్పోర్డ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి చేసిన ఈ ప్రాంతంలో పర్యాటకుల సంరక్షణ కోసం 13 మంది జిల్లా అధికారులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. స్థానిక మత్స్యకారులకు ఉద్యోగాలు కల్పించే అంశంలో ప్రాధాన్యత ఉంటుందన్నారు. బీచ్ వద్ద పారిశుద్ధ్యం, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్వహణ సమర్థంగా ఉండాలన్నారు. బాపట్ల, చీరాల, వేటపాలెం బీచ్ లలో ప్రత్యేక పారిశుద్ధ్య సమావేశాలు నిర్వహించాలని డీపీఓను ఆదేశించారు. బీచ్ మేనేజ్మెంట్ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. ఆ ప్రాంతాలలో ప్లాస్టిక్ నిషేధం పక్కాగా అమలు చేయాలన్నారు. చెక్పోస్టులు ఏర్పాటు చేసి ప్లాస్టిక్ పదార్థాలను నియంత్రించాలన్నారు. జనపనార సంచులు తయారీపై పొదుపు మహిళలకు శిక్షణ ఇచ్చి, యూనిట్లను ఏర్పాటు చేయించాలన్నారు. బీచ్లలో సర్వే ల్యాండ్స్ అధికారులు సమగ్రంగా సర్వేలు చేయాలన్నారు. సీఆర్ జెడ్ భూములు, ప్రభుత్వ భూములు, పట్టా భూములకు స్పష్టంగా హద్దులు నిర్ణయించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో జి.గంగాధర్గౌడ్, కలెక్టర్ లవన్న, డీపీఓ ప్రభాకరరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
విజయకీలాద్రిపై మండలాభిషేక మహోత్సవాలు
తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీల్రాదిపై వేంచేసి ఉన్న 27 అడుగుల ఏకశిల విఘ్న విమోచక హనుమంతునికి మండలాభిషేక మహోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి స్వీయ పర్యవేక్షణలో ఉదయం 9 గంటలకు 108 కలశాలతో అభిషేక మహోత్సవం, అనంతరం విశేష అర్చనలు, తీర్థ ప్రసాద గోష్ఠి అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో మైహోమ్ గ్రూప్స్ అధినేత జూపల్లి రామేశ్వరరావు, కుమారి దంపతులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్ని స్వామివారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. బాపట్ల: న్యూఢిల్లీలో ఈనెల 21న జరిగే 18వ సివిల్ సర్వీసెస్ డే వేడుకల్లో భాగంగా నిర్వహించే జాతీయ స్థాయి ఐఏఎస్ అధికారుల వర్క్షాప్నకు బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఎంపికయ్యారు. కేంద్ర పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం ఆధ్వర్యంలో జరిగే ఈ వర్క్షాప్లో దేశవ్యాప్తంగా అమలవుతున్న ఉత్తమ పరిపాలనా విధానాలు, వినూత్న కార్యక్రమాలపై చర్చించనున్నారు. రాష్ట్రం తరఫున ఎంపికై న అధికారుల జాబితాలో బాపట్ల కలెక్టర్కు చోటు దక్కడం విశేషం. కలెక్టర్ ఢిల్లీ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసి, ఆ కాలాన్ని ఆన్ డ్యూటీగా పరిగణించింది. నరసరావుపేట రూరల్: మే నెలలో జిల్లా వ్యాప్తంగా కిసాన్ మేళాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వ్యవసాయ అధికారులకు సూచించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కిసాన్ మేళా, అభ్యుదయం కార్యక్రమాలపై సోమవారం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ వ్యవసాయంలో అధునాతన పద్ధతులు, ప్రకృతి వ్యవసాయం, యాంత్రీకరణ, బ్యాంక్ సబ్సిడీ రుణాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ కిసాన్ మేళాలను నియోజకవర్గ, మండల స్థాయిలో నిర్వహించాలని తెలిపారు. మండలానికో ఒక ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ క్లస్టర్ అభివృద్ధి చేసి ఎఫ్పీవోలతో అనుసంధానం చేసే ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. ఒక్కో క్లస్టర్కు రూ.3కోట్లు వరకు, సబ్సిడీతో రూ.5కోట్లు వరకు రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు. ఉచిత ప్రసాద వితరణకు విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న ఉచిత ప్రసాద వితరణకు విజయవాడ మాచవరానికి చెందిన గోవి పాండురంగారావు, కోటేశ్వరి రూ. 1,01,116 విరాళాన్ని అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 526.30 అడుగులకు చేరింది. ఇది 161.0148 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 450 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
వైభవంగా శివపార్వతుల కల్యాణం
అమృతలూరు(భట్టిప్రోలు): అమృతలూరు మండలం గోవాడలో ప్రసిద్ధి గాంచిన శైవక్షేత్రమైన గంగా పార్వతి సమేత బాలకోటేశ్వరస్వామి దేవాలయంలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న మహా కుంభాభిషేకం సోమవారంతో ముగిసింది. దేవాలయ అర్చకులు చావలి శ్రీధర్శర్మ పండిత బృందం హోమ కార్యక్రమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశాయి. అనంతరం దేవాలయాల శిఖరాలకు విద్యా పీఠం పీఠాధిపతి పజ్ఞానంద సరస్వతి (బాల స్వామిజీ) మహా కుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం అంగరంగ వైభవంగా శివపార్వతుల కల్యాణం నిర్వహించారు. సుమారు 10 వేల మంది భక్తులు పాల్గొని తిలకించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు, అన్న ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం వేద పండితులు, దాతలు, కార్యకర్తలను సత్కరించారు. కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ పావులూరి రమేష్, కార్యనిర్వాహణాధికారి మంతెన విఠల్ శ్రీనివాసవర్మ, మంతెన అనుపమ, పావులూరి సుబ్బారావు, గడ్డిపాటి శ్రీనివాసరావు (వాసు), నిర్వాహకులు ఉప్పల పద్మజ, అరుణ, తమ్మన సాంబశివరావు, నన్నపనేని పద్మ, పావులూరి వరలక్ష్మి, ఆర్యవైశ్య అన్నదాన సత్రం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ఆగలేం..అమ్ముకోలేం !
మొక్కజొన్న రైతుల ఆవేదన ‘మోంథా’ పరిహారమేదీ? చీరాల అర్బన్: రైతు సంక్షేమానికి పెద్ద పీట వేసినట్లు చంద్రబాబు సర్కారు చేస్తున్న ప్రచారం ఉత్తిదేనని తేలిపోయింది. పాలకుల మాటలు కోటలు దాటుతున్నాయి కానీ మద్దతు ధర విషయంలో రైతులకు ఎలాంటి ఉపశమనం లభించడం లేదు. మొక్కజొన్న క్వింటా మద్దతు ధర రూ.2,400గా చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. ఇంత వరకు ఒక్క క్వింటా కూడా రైతుల నుంచి కొనుగోలు చేయలేదు. గతేడాది అక్టోబర్లో మోంథా తుఫాన్ పరిహారం ఇంత వరకు అందించలేదు. దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరరంగా మారింది. ఇటు దళారులకు తక్కువ ధరకే పంటను తెగనమ్ముకోలేక, అటు పంట ఉత్పత్తిని నిల్వ చేసుకునే దారిలేక రైతులు సతమతం అవుతూ.. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు మాటలతో మాయ చేస్తున్నారని మండిపడుతున్నారు. మాటల్లో పండగ.. చేతల్లో దండగ చంద్రబాబు పాలనలో వ్యవసాయం మాటల్లోనే పండగ.. చేతల్లో దండగ అన్న తీరులో ఉంటోంది. పంటలకు గిట్టుబాటు ధర అటుంచితే కనీస మద్దతు ధర కూడా పూర్తి స్థాయిలో అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో గత ఖరీఫ్లో 1,27,000 హెక్టార్లలో, రబీలో 1,78,000 హెక్టార్లలో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేశారు. అందులో రబీలో 51,700 హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేశారు. పంటను కాపాడుకునే క్రమంలో తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. పంట చేతికొచ్చింది. అమ్ముదామంటే కనీసం మద్దతు ధర కూడా లేదు. కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యాపారులకు క్వింటా రూ.1,710 నుంచి రూ.1,740 మధ్య విక్రయిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధర ప్రకటిస్తే సరిపోతుందా? మద్దతు ధర కల్పించడంతోపాటు పంట ఉత్పత్తులను కొనుగోలు చేసే విషయంలో బాబు సర్కారు తీరు శనగలు తిని చేయి కడిగేసుకున్నట్లుగా ఉందని రైతులు విమర్శిస్తున్నారు. ‘కేంద్రానికి లేఖ రాశాం. క్వింటా రూ.2,400కు కొనుగోలు చేస్తామని ప్రకటించాం. దీంతో తమ పనైపోయిందన్న భావనలో సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యేలు ఉన్నార’ని రైతులు మండిపడుతున్నారు. యుద్ధప్రాతిపదికన మొక్కజొన్నలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వపరంగా మా వంతు కృషి మేం చేస్తున్నాం. మొక్కజొన్న క్వింటా రూ.2,400 మద్దతు ధర ప్రకటించారు. కొనుగోళ్లకు సంబంధించి కార్యాచరణ జరుగుతోంది. ఇన్పుట్ సబ్సి డీ కూడా పంట నష్టపోయిన రైతులకు అందాల్సి ఉంది. – విజయనిర్మల, డీఏఓ, బాపట్ల ప్రైవేట్ వ్యాపారులు మొక్కజొన్న క్వింటా రూ.1,710కి కొనుగోలు చేస్తున్నారు. ఆ ధరకు విక్రయిస్తే నష్టాలే మిగులుతాయి. నాలుగు ఎకరాలు సొంతంగా, నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగుచేశాం. పెట్టుబడికి తెచ్చిన అప్పులు చెల్లించాల్సి ఉంది. నష్టాలు మూట కట్టుకోలేక తప్పనిసరి పరిస్థితుల్లో గోడౌన్లో నిల్వ చేస్తున్నా. వెంటనే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. – సుధాకర్, చెరుకూరు, పర్చూరు మండలం మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని మొక్కజొన్న సాగు చేశా. దిగుబడి ఒకింత పర్వాలేదు. అయితే ధర లేదు. మద్దతు ధర రూ.2,400 అని చెబుతున్నారు. ఎప్పుడు కొంటారో తెలీదు. పరిస్థితి బాగా లేదు. మా బంధువు క్వింటా రూ.1,740కి ప్రైవేట్ వ్యాపారికి అమ్మాడు. – పవన్, శాంతినగర్, చీరాల గత ఏడాది మోంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు దాదాపు అన్ని పంటలు దెబ్బతిన్నాయి. కొన్ని పాక్షికంగా, కొన్ని పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. పంట నష్టపరిహారం అంచనాకు కేంద్ర బృందం రాక ఆలస్యమైంది. వాస్తవానికి జరిగిన నష్టం కొంతయితే, నమోదు గోరంతగా ఉందని రైతులు అప్పట్లోనే విమర్శించారు. మొత్తం మీద జిల్లాలో 18,609 మంది రైతులకు సంబంధించి 12,700 హెక్టార్లలో పంట నష్టం సంభవించిందని నమోదు చేశారు. అందుకుగాను రూ.2,395 లక్షల మేర నష్టపరిహారం(ఇన్పుట్ సబ్సిడీ) అందించాల్సి ఉంటుందని అంచనా వేశారు. కానీ పంట నష్టపరిహారం నేటికీ అందలేదు. -
ఆసుపత్రిపై అర్ధరాత్రి దాడి
గుంటూరు రూరల్: అర్ధరాత్రి ఆసుపత్రిపై దాడిచేసి ఆసుపత్రిలోని సామగ్రిని పగలగొట్టి రోగులను సైతం భయబ్రాంతులకు గురిచేసిన సంఘటన నల్లపాడు పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బాధితుడు, ఆసుపత్రి వైద్యుడు గొర్రె వెంకటశ్రీనివాసరావు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. వైద్యుడు శ్రీనివాసరావు సంక్రాంతి బాలమౌనిక అనే మహిళ వద్ద ఇన్నర్ రింగ్రోడ్డు రెడ్డిపాలెం సమీపంలోని బిల్డింగ్ను 2021లో ఆరు సంవత్సరాల లీజు ప్రాతిపదికన అగ్రిమెంట్ చేసుకుని అద్దెకు తీసుకుని ఆసుపత్రిని నిర్వహిస్తున్నాడు. అగ్రిమెంట్ ప్రకారం బాధితుడికి నవంబర్ 25, 2027 వరకూ ఆ బిల్డింగ్పై హక్కు ఉంది. ఈ క్రమంలో గత ఏడాది డిసెంబర్నుంచి అల్లడి ప్రసాద్ అనే వ్యక్తి ఆసుపత్రికి వచ్చి పలుమార్లు ఆసుపత్రి బిల్డంగ్ను ఖాళీ చేసి వెళ్లిపోవాలని బిల్డింగ్ తనదని బెదిరించాడని తెలిపాడు. దీనిపై అప్పట్లో నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు ఇరువురిని పిలిపించి మాట్లాడారని తెలిపాడు. కానీ అల్లడి ప్రసాద్ ఖాళీ చేయాలని మరలా బెదిరిస్తూనే ఉన్నాడని ఫిర్యాదులో తెలిపాడు. ● ఆదివారం అర్థరాత్రి సమయంలో సుమారు 50 మంది వ్యక్తులు ముఖాలకు మాస్క్లు ధరించి ఆసుపత్రిపై దాడిచేసి ఆసుపత్రిలో కనిపించిన వస్తువులను పగలగొట్టి, ఆపరేషన్ థియేటర్, ఇతర స్కానింగ్ పరికరాలు, డాక్టర్ చాంబర్ తదితరాలను ధ్వంసం చేశారని తెలిపారు. సీసీ కెమెరాల హార్డ్ డిస్క్లు సైతం పీకేసి తీసుకెళ్లారని ఫిర్యాదు చేశారు. దాడిచేసిన వ్యక్తులు ఆసుపత్రిలో తన చాంబర్లో ఉన్న రూ 5 లక్షల నగదును, ఆసుపత్రిలోని సుమారు రూ.80 లక్షల వరకు విలువ చేసే వస్తువులను లారీలపై వేసుకుని దోచుకు వెళ్ళారని ఫిర్యాదు చేశారు. గండ్రగొడ్డళ్ళు, మారణాయుధాలతో దాడిచేసి ఆసుపత్రిలోని రోగులను సైతం భయబ్రాంతులకు గురిచేశారని ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి సిబ్బందిని సైతం అల్లడి ప్రసాద్, అతని అనుచరులు అల్లడి అనిల్కుమార్, వెంకటేశ్వర్లు తదితరులు దాడిచేసి వెంటనే ఖాళీ చేయాలని మారణాయుధాలతో బెదిరించాడని ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా అల్లడి అనిల్కుమార్ను, వెంకటేశ్వర్లును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితులనుంచి తనకు ప్రాణహాని ఉందని, పోలీసులు నిందితులపై చర్యలు తీసుకుని తన ఆసుపత్రిని, తనను రక్షించాలని వైద్యుడు కోరాడు. కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు. గతంలో పలుమార్లు నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ శ్రీనివాస్ నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, నిందితులు జనసేన నాయకులు కావటంతో పోలీసులు సైతం పట్టించుకోవటంలేదని బాధితుడు వాపోయాడు. నిందితులనుంచి తమ సిబ్బందికి, తనకు ప్రాణ హాని ఉందని జిల్లా ఎస్పీకి, జిల్లా కలెక్టర్కు, ఐజీ, డీజీపీ కార్యాలయాలకు ఫిర్యాదు చేశాడు. -
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
తెనాలి రూరల్: క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.10 వేల నగదు, ఎనిమిది సెల్ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతోపాటు నిందితుల ఖాతాల్లోని రూ.3.61 లక్షలను ఫ్రీజ్ చేయించారు. తెనాలి రూరల్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ బి.జనార్ధనరావు వివరాలు వెల్లడించారు. కొల్లిపర మండలం అత్తోట గ్రామంలోని పాఠశాల సమీపంలో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని ఎస్ఐ ఎన్సీ ప్రసాద్కు ఆదివారం వచ్చిన సమాచారంతో తన సిబ్బందితో కలసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఇద్దరు ప్రధాన నిర్వాహకులతోపాటు బెట్టింగ్లో పాల్గొన్న మరో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన ప్రధాన సూత్రధారి ఆన్లైన్ యాప్ ద్వారా బెట్టింగ్ లింక్ను అత్తోటలోని వ్యక్తులకు పంపి ఐడీ, పాస్వర్డ్ చెప్పేవాడు. దాని ఆధారంగా లాగిన్ అయి బెట్టింగ్కు పాల్పడుతున్నా రు.ప్రధాన సూత్రధారి మినహా మిగిలిన నిందితులను అత్తోట గ్రామానికి చెందిన బొల్లిముంత అవి నాష్, యర్రు ప్రవీణ్, దాసరి రమేష్, బొల్లిముంత రమేష్, బొల్లిముంత శంతన్, బొల్లిముంత ఉమామహేశ్వరరావులుగా గుర్తించారు. నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు వీరి ఖాతా ల్లోని నగదును ఫ్రీజ్ చేయించినట్టు డీఎస్పీ తెలిపారు. -
తీరంలో ఇసుక దిబ్బల తొలగింపుపై ఫిర్యాదు
వేటపాలెం: రామాపురం సముద్రతీరంలో ఇసుక దిబ్బల తొలగింపుతో తమ జీవనాధారానికి భంగం కలుగుతుందని మత్స్యకారులు ఆదివారం జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. ఇదే విషయాన్ని ప్రభుత్వ అధికారులకు, ముఖ్యమంత్రికి ఆన్లైన్లో... కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఈ– మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. రామాపురం పరిధిలో సముద్ర అలల నుంచి 200 మీటర్లలో నో డెవలప్మెంట్ జోన్ పరిధిలో అడ్వెంచర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించడాన్ని మత్స్యకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నో డెవలప్మెంట్ జోన్ ప్రధానంగా తీర ప్రాంత పర్యావరణాన్ని రక్షించడం, తుపాన్లు, సునామీల నుంచి కాపాడటానికి ఇసుక తిన్నలు ఉంటాయి. అలాగే మత్స్యకారులు జీవనాధారాన్ని పరిరక్షించకుండా అందుకు భిన్నంగా అక్రమంగా రిసార్ట్స్ నిర్మాణం, రియల్ ఎస్టేట్ వెంచర్ల ఏర్పాటు, ఇసుక తిన్నెలు తొలగించడం వల్ల తీర ప్రాంత పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. తీరం వెంట మడ అడవులను పెంచడానికి మత్స్యకారులను ప్రోత్సహించాల్సిన అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం రాష్ట్ర తీరప్రాంత నిర్వహణ అథారిటీ అధికారులు చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నో డెవలప్మెంట్ జోన్లో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలను నిలిపివేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తమ ఫిర్యాదుల్లో వారు పేర్కొన్నారు. అడ్వెంచర్ స్పోర్ట్స్కు ఆటంకం కలిగిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. పోలీసులు బెదిరిస్తున్నారని వారు ఆరోపించారు. వెంటనే విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని మత్స్యకారులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించిన మత్స్యకారులు -
మహంకాళి ఆలయ అభివృద్ధికి రూ.1.50 కోట్లు విరాళం
దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయం అభివృద్ధికి చిలువూరు గ్రామానికి చెందిన రంగంశెట్టి జగదీష్ రూ.కోటీ యాభై లక్షలు విరాళంగా అందజేశారు. ఈ మేరకు అంగీకారపత్రాన్ని ఆలయ ఈవో కె.సునీల్కుమార్, ధర్మకర్త రంగప్రసాద్కి అందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలయ అనివేటి మండపం, ప్రాకారం, పడమర వైపు రాజగోపురం నిర్మాణానికి సీజీఎఫ్ ద్వారా రూ.ఆరు కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఈవో తెలిపారు. తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రిపై విఘ్న విమోచక హనుమంతుని మండలాభిషేక మహోత్సవాలు సోమవారం నుంచి నిర్వహించనున్నట్లు జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి స్వీయ పర్యవేక్షణలో మహోత్సవాలు ఈనెల 22వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. తొలిరోజు ఉదయం 9 గంటలకు విఘ్న విమోచక హనుమంతునికి 108 కలశాలతో అభిషేక మహోత్సవం, విశేష అర్చనలు, అనంతరం తీర్థ ప్రసాదగోష్ఠి, సాయంత్రం 7 గంటలకు పల్లకీ సేవ, హనుమ అష్టోత్తర శతనామార్చన, హనుమాన్ చాలీసా పారాయణ, తీర్థ ప్రసాదగోష్ఠి కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు తిరుమంజన సేవ, విశేష అలంకరణ, అష్టోత్తర శతనామార్చన, రామానుజ సూత్తందాది, సాయంత్రం తిరువీధి ఉత్సవం, జగదాచార్యులు, భగవద్రామానుజులు అనుగ్రహించిన గద్యత్రయ పారాయణ, అనంతరం తీర్థ ప్రసాద గోష్ఠి కార్యక్రమాలు నిర్వహించబడతాయని, భక్తులు పైకార్యక్రమాలలో పాల్గొని హనుమంతుని అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు. వేటపాలెం: అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో వేటపాలేనికి చెందిన గాత్రం ఉమామహేశ్వరరావు ట్రిపుల్ జంప్ఽ కాంపిటిషన్లో గోల్డ్ మెడల్ సాధించారు. ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు బ్యాంకాక్ దేశంలో థాయిలాండ్ అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్ పోటీలు జరిగాయి. 49 ప్లస్ వయస్సులో ఉమామహేశ్వరరావు జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో తన సత్తా చాటుతున్నారు. అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన ఉమాను స్నేహితులు అభినందించారు. మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి వివిధ సేవా టికెట్ల ద్వారా రూ.7,55,030 ఆదాయం వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆదివారం వెల్లడించారు. స్వామివారి సేవా టికెట్ల ద్వారా రూ.3,86,53, లడ్డూ ప్రసాదం ద్వారా రూ.1,26,665, స్వామి వారికి డొనేషన్లు రూపంలో రూ.1,73,217, కల్యాణ కట్ట టికెట్ల ద్వారా రూ. 28,800, దర్శనం ద్వారా రూ.33,900 కలిపి మొత్తం రూ.7,55,030 ఆదాయం వచ్చిందన్నారు. -
కొరత కృత్రిమం.. అంతా అక్రమం
నరసరావుపేట టౌన్: జిల్లాలో గ్యాస్ కొరత పేరుతో నెలకొన్న పరిస్థితులు సాధారణ సరఫరాకు అంతరాయం కాదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవైపు హోటళ్లు, టీ స్టాళ్లు, చిన్న వ్యాపార సంస్థలు గ్యాస్ కొరతతో మూతపడుతున్నాయి. మరో వైపు అదే గ్యాస్ అధిక ధరల్లో బ్లాక్లో సులభంగా లభించటం ఆరోపణలకు బలాన్ని చేకూర్చుతోంది. ఇది కృత్రిమంగా సృష్టించిన సంక్షోభం అనే అభిప్రాయం వ్యాపార వర్గాల్లో పెరుగుతోంది. యుద్ధ పరిస్థితులను బూచిగా చూపి కొన్ని గ్యాస్ ఏజెన్సీలు కృత్రిమ కొరతను సృష్టించాయన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. సరఫరాలో అంతరాయం ఉందన్న ప్రచారంతో బహిరంగ మార్కెట్లో గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఈ అవకాశాన్ని అనుకూలంగా మార్చుకున్న కొంత మంది గ్యాస్ ఏజెన్సీ వారు దళారులతో కలిసి బ్లాక్ మార్కెట్కు తెరతీశారు. ప్రస్తుతం కమర్షియల్ గ్యాస్ సిలిండర్పై రూ.1000 నుంచి రూ.1500 వరకు అదనంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ భారీ ధరలతో హోటళ్లు, టీ స్టాళ్లు, చిన్న వ్యాపార సంస్థలు తీవ్ర ఆర్థిక భారాన్ని మోస్తున్నాయి. కొందరు వ్యాపారాలను నెట్టుకొస్తుండుగా, మరి కొందరు దుకాణాలను మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది. వివాహాల సీజన్ కావటంతో క్యాటరింగ్ రంగానికి గ్యాస్ సిలిండర్లు అత్యవసరం. దీంతో అధిక ధరలైనా చెల్లించి సిలిండర్లు కొనుగోలు చేయక తప్పని పరిస్థితి. వారి డిమాండ్ను ఆసరా చేసుకున్న అక్రమార్కులు భారీగా సిలిండర్లను నిల్వ చేసి బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. ఏడున్నర వేలకుపైగా దుకాణాలు మూసివేత గ్యాస్ కొరతతో జిల్లాలో వేల వ్యాపార సంస్థలు ఇప్పటికే మూతబడ్డాయి. సరిపడా గ్యాస్ అందుబాటులో లేకపోవటంతో కొందరు ప్రత్యామ్నాయంగా కట్టెలు, డీజిల్, ఎలక్ట్రిక్ పొయ్యిలను వినియోగిస్తున్నారు. అయితే వినియోగం పెరగటంతో కట్టెల రేటు పెరిగింది. దీంతో వ్యాపారాల్లో నష్టాలు చవిచూసి నిర్వాహకులు దుకాణం తెరిచేందుకు సాహసించడం లేదు. జిల్లాలో మొత్తం 10,300 హోటళ్లు ఉండగా అందులో 2,600 వరకు మూతపడ్డాయి. అదే విధంగా 25,500 టీస్టాళ్లు ఉండగా అందులో 5,000 వరకు మూసేశారు. భోజన హోటళ్లు, ప్రైవేటు వసతి గృహాల నిర్వాహకులు గ్యాస్ అందుబాటులో లేకపోవటంతో పూర్తిగా కట్టెల పొయ్యిపైనే వంటకాలు చేస్తూ మెనూను కుదించారు. అక్రమ ఏజెన్సీలపై చర్యలేవి? ఇటీవల నరసరావుపేట పట్టణంలో భారీగా కమర్షియల్ సిలిండర్లు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టిఫిన్ బండి యజమాని అక్రమంగా శ్రీనివాసనగర్లోని తన ఇంటిలో వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్లను నిల్వ ఉంచాడనే సమాచారంతో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. 18 సిలిండర్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అధికారులు లోతైన విచారణ జరపకపోవటం, నామమాత్రపు కేసు పెట్టి చేతులు దులుపుకోవటం విమర్శలకు తావిస్తోంది. సత్తెనపల్లి రోడ్డులో క్యాటరింగ్ నిర్వాహకుడి కార్కానాపై పౌరసరఫరాల శాఖ అధికారులు 20 రోజుల క్రితం దాడులు నిర్వహించారు. దాడుల్లో 25 కమర్షియల్ సిలిండర్లను గుర్తించారు. సిలిండర్లు అన్ని సీజ్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేస్తామని మొదట అధికారులు నానా హడావుడి చేశారు. చివరకు నిర్వాహకుడి నుంచి రూ.లక్ష లంచం తీసుకొని కేసును నీరుగార్చారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు కొన్ని టీస్టాళ్ల వద్దకు తనిఖీలకు వెళ్లిన అధికారులు గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తుండటాన్ని గుర్తించి వారి వద్ద నుంచి బెదిరించి నగదు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ప్రభుత్వ భూముల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి
రేపల్లె: ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని, ఆక్రమణల నివారణే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ భూములను, నిరుపయోగంలో ఉన్న ప్రభుత్వ భవనాలను ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ... భూముల స్థితిగతులు, రికార్డులు, భౌగోళిక పరిమితులను సమీక్షించారు. ఎక్కడైనా ఆక్రమణలు ఉన్నాయా అనే అంశంపై అధికారుల నుంచి ఆరా తీశారు. భూముల వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని, అవసరమైన చోట్ల సర్వేలు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆస్తులను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ఈ తనిఖీ చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని, ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూముల పరిరక్షణకు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వ ఆస్తులను సక్రమంగా వినియోగించేందుకు అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎం.శ్రీనివాసరావు, ఆర్ఐ రాంబాబు, సర్వేయర్లు, వీఆర్ఓలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
సర్కారు డొంక తిరుగుడు
గోవాడ(తెనాలి): ఉమ్మడి గుంటూరు జిల్లాలో కోటప్పకొండ తర్వాత అంత వైభవంగా మహాశివరాత్రి తిరునాళ్ల జరిగే ప్రసిద్ధ శైవక్షేత్రం గోవాడలోని శ్రీబాలకోటేశ్వరస్వామి దేవస్థానం. అక్కడ ఏటా తిరునాళ్ల జరిగే డొంక రోడ్డు ప్రదేశాన్ని రాష్ట్రప్రభుత్వం ఎంఎఎస్ఎంఈ పార్కు నిర్మాణానికి కట్టబెట్టటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. గ్రామ పంచాయతీ అభ్యంతరం చెప్పినా, ప్రజలు అభ్యర్థించినా ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో అధికారులు ఆ స్థలాన్ని ఏపీఐఐసీకి అప్పగించారు. ఆగమేఘాలపై అక్కడ నిర్మాణ పనులనూ ఆరంభించారు. ప్రజల అభ్యంతరాలు/ఆందోళనల నేపథ్యంలో తాత్కాలికంగా పనులను నిలుపుదల చేశారు. నిర్మాణ సామగ్రిని మాత్రం తొలగించలేదు. నిబంధనలకు విరుద్ధంగా డొంకరోడ్డును ఎంఎస్ఎంఈ పార్కుకు కేటాయించటం, అధికారుల అత్యుత్సాహంపై విచారణ చేయాలని స్థానికులు శనివారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు రాతపూర్వక ఫిర్యాదు అందజేశారు. ఉత్సవాలకు ఎంతో కీలకం బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని అమృతలూరు మండలంలో గోవాడ గ్రామం ఉంది. అక్కడి శ్రీబాలకోటేశ్వరస్వామి దేవస్థానానికి విశేష చారిత్రక ప్రాముఖ్యత ఉంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఏటా అక్కడ 15 రోజులపాటు ఉత్సవాలు జరుగుతాయి. అందుకోసం పలు అన్నదాన సత్రాలు వెలిశాయి. చివరి మూడురోజులు తిరునాళ్ల మరింత ప్రత్యేకమైంది. గోవాడ–కావూరు డొంకరోడ్డు వెంట జరిగే మూడు రోజుల తిరునాళ్లకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మూడు లక్షల మంది వస్తారని అంచనా ఉంది. తిరునాళ్ల ఏర్పాట్లపై రేపల్లె ఆర్డీఓ అధ్యక్షతన కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. తిరునాళ్లకు దాదాపు 500 దుకాణాలు ఏర్పాటు అవుతాయి. డొంకరోడ్డు సరిపోక స్టాల్స్ నిర్వాహకులు సమీప రైతుల స్థలాల్లోనూ సర్దుకుంటారు. ఏడురోజుల పశుప్రదర్శన కూడా మరో ఆకర్షణ. వివిధ ప్రాంతాల నుంచి తిరునాళ్ల స్పెషల్ బస్సులు ఆర్టీసీ నడుపుతుంది. ఇంతటి కీలకమైన డొంకరోడ్డు గోవాడ, చెరుకుపల్లి మండల గ్రామం కావూరు మధ్య ఉంది. గోవాడ పరిధిలో సర్వే నెం.605/ఏ, 605/బీ, 606, 758/ఏ, 758/బీ, 758/సీ లోని దాదాపు 4 కి.మీ.వరకు 40–80 అడుగుల వెడల్పుతో ఉండే ఈ డొంకరోడ్డుకు ఇరువైపులా పంటకాల్వలు ఉన్నాయి. రోడ్డు దిగువన మంచినీటి పథకం పైప్లైన్ కూడా ఉందని చెబుతున్నారు. గోవాడ, కావూరే కాకుండా, పరిసర గ్రామాలకు చెందిన రైతులు ఏడాదంతా వ్యవసాయ పనులకు ఈ డొంక రోడ్డును ఎక్కువగా వినియోగిస్తుంటారు. అధికారుల అత్యుత్సాహం గోవాడ డొంకరోడ్డు భూమిలో కొంత భాగాన్ని 1943లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం సైనికుడికి కేటాయించింది. దీనిపై స్థానికుల నుంచి తీవ్ర అభ్యంతరం రావటంతో ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అదే డొంక రోడ్డు ప్రాంతాన్ని పేదల ఇళ్ల స్థలాలకు ప్రతిపాదించినా తర్వాత ఆ ప్రాంత ప్రాముఖ్యతను గుర్తించి, ముందుకు వెళ్లలేదు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం, మొత్తం డొంక రోడ్డు ప్రదేశాన్ని సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమల స్థాపనకు అవసరమైన ఎంఎస్ఎంఈ పార్కుకు కేటాయించింది. డొంకరోడ్డును ఇతర ఏ అవసరాలకు కేటాయించరాదనే నిబంధనతో భూమి స్వభావాన్ని కూడా మార్చి బంజరు భూమిగా చూపించారని అధికారులపై ఆరోపణలున్నాయి. అంతేకాకుండా గతేడాది గోవాడ పంచాయతీ ఎంఎస్ఎంఈ పార్కుకు అనుమతిస్తూ తీర్మానించినా, మరికొద్ది నెలల్లోనే ఆ తీర్మానాన్ని రద్దు చేసుకుంది. అయినప్పటికీ అమృతలూరు తహసీల్దారు పంచాయతీ తీర్మానాన్ని పట్టించుకోకుండా ఏపీఐఐసీకి అప్పగించటం, సంబంధిత కాంట్రాక్టు సంస్థ పనులను ఆరంభించారు. దీనిపై ఏపీఐఐసీ జోనల్ మేనేజరు అత్యుత్సాహం చూపారని, కాంట్రాక్టు సంస్థ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కూడా స్థానికులు తమ ఫిర్యాదులో ఆరోపించారు. దీనిపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి జిల్లా కలెక్టరుతో మాట్లాడినట్టు తెలిసింది. మరోవైపు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా లేఖ ఇచ్చారని చెబుతున్నారు. అయినా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా లేదంటున్నారు. -
అంకమ్మకు జలబిందెలతో అభిషేకం
రాజుపాలెం: మండల కేంద్రంలోని రాజుపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ అంకమ్మ వారి ఆలయ జీర్ణోద్ధరణ, వాయు ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా ఆదివారం అధిక సంఖ్యలో మహిళా భక్తులు జలబిందెలతో తరలివచ్చి అభిషేకం నిర్వహించారు. ముందుగా వెయ్యిన్నొక్క మంది మహిళలు జలబిందెలు తలపై పెట్టుకుని బ్యాండ్మేళాలతో అమ్మవారి దేవాలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి జలబిందెలతో అభిషేకాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రధాన అర్చకుడు అరవపల్లి ఫణికేశవ శర్మ తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ కమిటీ వారు భక్తులకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు. -
న్యూడ్ కాల్స్ కేసులో ముగ్గురు అరెస్ట్
తెనాలిరూరల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన న్యూడ్ కాల్స్ దందా కేసులో ఎట్టకేలకు నిందితులైన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులలో తల్లి, కొడుకులు కూడా ఉండటం విశేషం. స్థానిక త్రీ టౌన్ పోలీసుస్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ బి.జనార్దనరావు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక పాండురంగపేట జనావాసాల మధ్య ఓ ఇంట్లో మహిళలు న్యూడ్ కాల్స్ మాట్లాడుతూ సొమ్ము చేసుకుంటున్నారన్న సమాచారంతో ఈనెల 16న త్రీ టౌన్ పోలీసులు దాడి చేశారు. ఆ సమయంలో బోడపాటి అనూరాధ, మహమ్మద్ షహనాజ్లను అదుపులోకి తీసుకున్నారు. చుట్టుపక్కల వారిని విచారించారు. ఆన్లైన్ వేదికగా ఓ యాప్లో ‘స్ట్రిప్ టాక్’ పేరిట ఉన్న పోర్టల్లో ‘స్వీటీ క్యూటీ’ పేరుతో లాగిన్ అయ్యి ఇరువురు మహిళలు ముఖానికి మాస్క్తో ఫోన్లో వీడియో కాల్ మాట్లాడుతూ, అవతలి వ్యక్తుల నుంచి నగదు అందిన సమాచారంతో వారి కోరిక మేరకు న్యూడ్గా ఫోన్లో మాట్లాడుతున్నారు. యాప్ నిర్వాహకులు ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కొంత నగదును మహిళల ఖాతాకు జమ చేస్తున్నారు. రెండు నెలల కిందట అద్దెకు తీసుకొని ఉంటున్న ఇంటిలో ఈ తతంగం నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న సమాచారంతో ఈ కేసులో కీలకంగా వ్యవహరించి, యాప్ డౌన్లోడ్ చేయడంలో సహకరించిన అనూరాధ కుమారుడు హేమంత్ సాయి పరారయ్యాడు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను ఆదివారం అరెస్ట్ చేశారు. వదంతులు నమ్మవద్దుఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా అనేక వదంతులు విస్తరించాయని, వందలాది మంది మహిళలు ఇలా అక్రమంగా సంపాదిస్తున్నారని వచ్చిన వదంతుల్లో వాస్తవం లేదని డీఎస్పీ చెప్పారు. అనూరాధ కుటుంబం గతంలో ఉపాధి కోసం విజయవాడ ఈడ్పుగల్లుకు వెళ్లగా అక్కడ తన స్నేహితురాలు విజయలక్ష్మి, ఆమె కుమారుడు తులసి ద్వారా ఈ యాప్ వివరాలు తెలుసుకుందని చెప్పారు. అనూరాధ, ఆమె కుమారుడు హేమంత్ సాయి యాప్ వినియోగం అక్కడే నేర్చుకున్నారని, ఇంజినీరింగ్ చదువుతూ మధ్యలోనే చదువు ఆపేసి హేమంత్సాయి ప్రేమవివాహం చేసుకున్నాడని తెలిపారు. తల్లి, భార్యతో కలసి విజయవాడలో ఉంటుండగా, ఈ న్యూడ్ కాల్స్ వ్యవహారం నచ్చక కోడలు విభేదించి తెనాలి వచ్చేసిందని తెలిపారు. హేమంత్ సాయి వచ్చి భార్యతో కలిసి తెనాలిలో ఉంటున్నాడు. కొద్ది రోజులు వ్యవధిలోనే అనూరాధ కూడా ఒంటరిగా ఉండలేక తిరిగి తెనాలి చేరిందని చెప్పారు. వేరుగా ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్న అనూరాధకు షహనాజ్ పరిచయం కావడంతో ఇరువురు కలిసి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. అనూరాధ తిరిగి తెనాలి చేరటం, అక్రమార్జనకు పాల్పడటం ఇష్టంలేని కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసిందని డీఎస్పీ చెప్పారు. ఈ కేసులో విజయవాడ వ్యక్తుల ప్రమేయం, యాప్ వివరాలు, దానిలో జరుగుతున్న అక్రమాలపై ఉన్నతాధికారులకు నివేదించి, తదుపరి సాంకేతిక సహకారంతో విచారణ కొనసాగిస్తామ చెప్పారు. సోషల్ మీడియా ప్రచారాలలో వాస్తవం లేదని, ప్రధాన నిందితుడు పరారీలో ఉండటంతో జాప్యం జరిగినట్లు చెప్పారు. -
మహా కుంభాభిషేకం మహా శక్తి సంపన్నం
అమృతలూరు(భట్టిప్రోలు): అమృతలూరు మండలం గోవాడలో ప్రసిద్ధ క్షేత్రమైన గంగాపార్వతి సమేత బాలకోటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న మహా కుంభాభిషేకం 4వ రోజైన ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. పెనుగొండలోని శ్రీ విద్యాపీఠం పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి (బాలస్వామి) ముఖ్య అతిథిగా హాజరై అనుగ్రహ భాషణం చేశారు. బాలస్వామి మాట్లాడుతూ మహా కుంభాభిషేకంలో కుంభ శాంతి చేసి దేవాలయాన్ని పునర్జీవింప చేసి నెగిటివ్ ఎనర్జి తొలగి మహాశక్తి వంతం అవుతుందని అన్నారు. మహా కుంభాభిషేకం మహా శక్తి సంపన్నం అని పేర్కొన్నారు. ఆలయ చైర్మన్ పావులూరి రమేష మాట్లాడుతూ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా విచ్చేసి సోమవారం 10 గంటలకు జరుగు మహా కుంభాభిషేకం తిలకించి తీర్ధ ప్రసాదాలు, అన్న ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. దేవాలయ ప్రధాన అర్చకులు చావలి శ్రీధర్శర్మ ఆధ్వర్యంలో పండిత బృందం యజ్ఞాలు, యాగాలు ఘనంగా నిర్వహించారు. దేవాలయ కార్యనిర్వాహణాధికారి మంతెన విఠల్ శ్రీనివాస వర్మ కార్యక్రమాలను పర్యవేక్షించారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్ పావులూరి సుబ్బారావు, గుంటూరు, కృష్ణా జిల్లాల టీటీడీ దాససాహిత్య ప్రాజెక్ట్ అధ్యక్షులు గట్టిపాటి శ్రీనివాసరావు, ఆధ్యాత్మికవేత్త పావులూరి వరలక్ష్మి, ఆలపాటి రమాదేవి, ఉప్పల పద్మ, అరుణ, నన్నపనేని పద్మ, సువర్ణ, హరే శ్రీనివాస దాససాహిత్య ప్రాజెక్ట్ భజన సంఘాలు, ఆర్యవైశ్య అన్నదాన సత్రం కమిటీ బృంద సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ విద్యాపీఠం పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామి గోవాడలో 4వ రోజు కొనసాగిన మహాకుంభాభిషేకం -
లివర్ను ఇలా కాపాడుకోవాలి..
ఆల్కాహాల్ వల్ల లివర్ దెబ్బతింటుంది కాబట్టి మద్యం జోలికి వెళ్లవద్దు. కొవ్వు పదార్థాలు, వేపుళ్లు అతిగా తినవద్దు. ఉప్పు, చక్కెర , రెడ్మీట్ ఎక్కువ మోతాదులో తీసుకోవద్దు. పచ్చని ఆకు కూరలు తినటం వల్ల లివర్ను శుభ్రంగా ఉంచుతాయి. ఆలీవ్ ఆయిల్స్, వాల్నట్స్, గ్రీన్ టీ, ఆపిల్ పండ్లు, వెల్లులి పాయలు, పసుపు లివర్కు మేలు చేస్తాయి. విటమిన్ సి ఎక్కువగా తీసుకుంటే కాలేయం వద్ద పేరుకుపోయే కొవ్వును నియంత్రణ చేస్తుంది. రోజూ నీటిని ఎక్కువగా తాగటం వల్ల కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. – డాక్టర్ షేక్ నాగూర్ బాషా, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, గుంటూరు జీజీహెచ్ -
లివర్ క్యాన్సర్కు దారితీస్తాయి...
లివర్ క్యాన్సర్లు రావటానికి హెపటైటిస్– బీ, హెపటైటిస్–సీ వ్యాధులే కారణం. కామెర్ల వ్యాధి(జాండీస్) సోకిన వారు తప్పనిసరిగా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి. శరీరంలో హెపటైటిస్ వైరస్ ఆరు నెలల కంటే ఎక్కువ కాలం ఉంటే క్రానిక్ హెపటైటిస్కు దారి తీసి కొన్నేళ్ల తరువాత లివర్ దెబ్బతినటానికి కారణమవుతుంది. దీని వల్ల లివర్ క్యాన్సర్, లివర్ ఫెయిల్యూర్, లివర్ సిరోసిస్ వస్తుంది. –డాక్టర్ బైరపనేని స్రవంతి, క్యాన్సర్ వైద్య నిపుణురాలు, గుంటూరు -
ఉచితంగా వైద్యసేవలు...
గుంటూరు జీజీహెచ్లో లివర్ జబ్బులకు అత్యాధునిక వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నాం. లివర్ జబ్బులను ముందస్తుగానే గుర్తించి చికిత్స అందించేందుకు జీజీహెచ్లో ప్రత్యేకంగా లివర్ను దెబ్బతిసే వైరస్లకు ప్రత్యేకంగా స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. హెపటైటిస్–బీ వైరస్ నియంత్రణ కోసం ప్రతినెలా రూ.2000 ఖరీదు చేసే మందులు ఉచితంగా ఇస్తున్నాం. హెపటైటిస్–సీ జబ్బులకు ఉచితంగా రూ. 20,000 ఖరీదు చేసే మందులు ఉచితంగా ఇస్తున్నాం. లివర్ మార్పిడి ఆపరేషన్లు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. –డాక్టర్ అనుముల కవిత, గ్యాస్ట్రో ఎంట్రాలజీవిభాగాధిపతి, గుంటూరు జీజీహెచ్ -
జేఎన్టీయూఎన్ కాకాని క్యాంపస్కు అటానమస్ హోదా
నరసరావుపేటరూరల్: జేఎన్టీయూఎన్ ఇంజినీరింగ్ కళాశాల క్యాంపస్కు అటానమస్ హోదా కల్పించనున్నట్టు జేఎన్టీయూకె వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ సీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. కళాశాల వార్షికోత్సవ, క్రీడోత్సవాలు శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా ప్రొఫెసర్ సీఎస్ఆర్కే ప్రసాద్, ఎఫెక్ట్రానిక్స్ సంస్థ సీఈఓ దాసరి రామకృష్ణ హాజరయ్యారు. సీఎస్ఆర్కె ప్రసాద్ మాట్లాడుతూ జేఎన్టీయూఎన్ కాకాని క్యాంపస్లో రాబోవు విద్యా సంవత్సరం నుంచి పీజీ కోర్సులను ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యా, క్రీడా విభాగాల్లో ప్రతిభ కనభర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సిహెచ్ శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వైఎస్ కిషోర్బాబు, ఫిజికల్ ఎడ్యుకేషన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జీపీ రాజు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు రూరల్: 2018 జూలై నెలనుంచి పెండింగ్లో ఉన్న పీఆర్సీ, డీఆర్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఇంజినీరింగ్ విభాగం రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది, ఇంజనీరింగ్ విభాగం రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం నగరంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుచ్చిరాజు మాట్లాడుతూ సంఘం బలోపేతం, పెన్షనర్ల సంక్షేమం, ప్రభుత్వంతో సానుకూల సమన్వయం వంటి విషయాలను వివరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూర్మరావు సంఘం కార్యకలాపాలను వివరించారు. -
మార్టూరులో రాష్ట్రస్థాయి నాటిక పోటీలు
మార్టూరు: మండల కేంద్రం మార్టూరులో ఈనెల 24, 25, 26 తేదీల్లో ఉభయ తెలుగు రాష్ట్రస్థాయి నాటికల పోటీలు నిర్వహించనున్నట్లు శ్రీకారం కళాపరిషత్ అధ్యక్షుడు డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు తెలిపారు. స్థానిక ఎఫర్ట్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సృజనాత్మక సంస్కృతి సమితి ఆధ్వర్యంలో మార్టూరు రోటరీ క్లబ్, శ్రీకారం కళాపరిషత్లు సంయుక్తంగా 16వ రాష్ట్రస్థాయి నాటికల పోటీలు స్థానిక మద్ది సత్యనారాయణ కంపెనీ ఆవరణలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ● మొదటి రోజైన 24వ తేదీ శుక్రవారం రాత్రి 7:30 కు అరవింద ఆర్ట్స్ తాడేపల్లి వారి ‘దేవుణ్ణి చూశా’ నాటిక, రాత్రి 9:30 నిమిషాలకు కళానికేతన్ వీరన్నపాలెం వారి ‘దీపం కింద చీకటి’ నాటిక, రాత్రి 10:30 నిమిషాలకు విజయవాడ సాంస్కృతిక సమితి వారి ‘మమ్మల్ని బతకనివ్వండి’ నాటికలు ప్రదర్శిస్తారు. ● రెండో రోజు శనివారం రాత్రి 7:30కు యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్ విజయవాడ వారి ‘ధర్మో రక్షతి’ నాటిక, రాత్రి 9. 30 నిమిషాలకు శ్రీకృష్ణ ఆర్ట్స్ కల్చరల్ ఆర్గనైజేషన్ గుడివాడ వారి ‘ద్వార బంధాల చంద్రయ్య నాయుడు’ నాటిక, రాత్రి 10 గంటల 30 నిమిషాలకు హర్ష క్రియేషన్స్ విజయవాడ వారి ‘చెరిగిపోని చిరునామా’ నాటికలు ప్రదర్శిస్తారు. ● చివరి రోజు ఆదివారం రాత్రి 7:30 కు అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి సుహాన నాటిక రాత్రి 9:30కు గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారి ‘అమ్మ చెక్కిన బొమ్మ’ నాటిక రాత్రి 11. 30 నిమిషాలకు బీవీకే క్రియేషన్స్ కాకినాడ వారి ‘కన్నీటికి విలువెంత’ నాటికలు అనంతరం బహుమతి ప్రదానం ఉంటుందని సాంబశివరావు తెలిపారు. మార్టూరు పరిసర గ్రామాల ప్రేక్షకులు కార్యక్రమానికి విరివిగా హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎఫర్ట్ డైరెక్టర్ జేవీ మోహన్రావు, మార్టూరు రోటరీ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.ఏప్రిల్, 24, 25, 26 తేదీల్లో రాష్ట్రస్థాయి పోటీలు -
కాలేయం వ్యాధులపై అప్రమత్తం
గుంటూరు మెడికల్: గుంటూరు సంగడిగుంటకు చెందిన సాకేత్ ప్రైవేటు ఉద్యోగిగా జీవనం సాగిస్తున్నాడు. కంపెనీ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునే ప్రయత్నంలో సకాలంలో ఆహారం తీసుకోకుండా హోటల్స్లో ఫాస్ట్ ఫుడ్స్ తీసుకుంటూ కాలం గడుపుతున్నాడు. తోటి సహచరులతో కలిసి మద్యానికి అలవాటు పడి అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యులు పరీక్షలు చేసి మద్యం సేవించటం వల్ల కాలేయానికి తీవ్ర ఇబ్బంది ఏర్పడిందని నిర్ధారించారు. మద్యానికి స్వస్తిపలికి వైద్యుల సలహాలతో మందులు వాడని పక్షంలో ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు. ఇలా ఎంతో మంది లివర్ సమస్యలతో బాధపడుతూ చికిత్స కోసం వైద్యులను సంప్రదిస్తున్నారు. అతి పెద్ద గ్రంథి కాలేయం కాలేయం (లివర్) మన శరీరంలో అతి పెద్ద గ్రంథి. లివర్ పనిచేయకపోతే అనేక రోగాలు శరీరాన్ని చుట్టుముడతాయి. ఆధునిక జీవనశైలి వల్ల నేడు అనేక మంది లివర్ వ్యాధుల బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రజలు లివర్ వ్యాధులను సకాలంలో గుర్తించి వైద్యం చేయించని పక్షంలో లివర్ క్యాన్సర్గా మారుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 20 లక్షల మంది లివర్ జబ్బులతో ప్రతి ఏడాది చనిపోతున్నారు. 2030 నాటికి లివర్ జబ్బులు 35 శాతం పెరుగుతాయి. లివర్ వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది ఏప్రిల్ 19న వరల్డ్ లివర్ డే నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి ’ అందిస్తున్న ప్రత్యేక కథనం. లివర్ బాధితులు... గుంటూరు జీజీహెచ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఓపీ వైద్యవిభాగంలో 300 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 130 మంది లివర్ సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతున్నవారు. ప్రతి ఏడాది 4000 మందికి పైగా వివిధ రకాల సమస్యలతో గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యవిభాగంలో చికిత్స పొందారు. వీరిలో ఎక్కువ శాతం మంది లివర్ సంబంధిత సమస్యలున్న వారేనని వైద్యులు తెలిపారు. లివర్ చేసే పనులు... మనం తినే ఆహారాన్ని జీర్ణం చేయటం, జీర్ణక్రియకు దోహదపడే పైత్యరసాన్ని ఉత్పత్తి చేయటం, శరీరంలోని కొవ్వు, చక్కెర, ప్రోటీన్ శాతాన్ని నియంత్రిస్తుంది. శరీరం జబ్బు బారిన పడకుండా రక్షణ కల్పించటం, రక్త శుద్ధి చేయటం, శరీరంలోని విషాలను హరించటం చేస్తుంది. మనలో ప్రవేశించే హానికర పదార్థాలను తొలగించటం, ఆహారాన్ని శక్తి రూపంలోకి మార్చటం, వివిధ హార్మోన్ల విడుదలను నియంత్రణలో పెట్టడం, రక్తం గడ్డ కట్టడానికి, గాయాలు త్వరగా మానటానికి కావాల్సిన ఎంజైమ్స్ను ఉత్పత్తి చేయటం వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తుంది. కాలేయ సమస్యలకు ముఖ్యకారణాలు మత్తు పదార్థాలు సేవించటం, పొగతాగటం, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం, ఇన్ఫెక్షన్స్ వల్ల కాలేయ సమస్యలు వస్తాయి. లైంగిక సంబంధాలు, ఒకరికి వాడిన సూదిని మరొకరికి వాడటం వల్ల హెపటైటిస్ బీ, సీ వ్యాధులు సోకుతాయి. కలుషిత రక్తమార్పిడి, కలుషిత నీరు తాగటం వల్ల, కలుషిత ఆహారం తీసుకోవటం వల్ల హెపటైటిస్ ఎ, ఇ వ్యాధులొస్తాయి. శారీరక వ్యాయామం లేకపోవటం, స్థూలకాయం వల్ల కొవ్వు పెరిగి కాలేయంపై పేరుకుపోతుంది. నూనె వస్తువులు ఎక్కువగా తినటం, పిజ్జాలు, బర్గర్స్లు, ఫాస్ట్ఫుడ్ వల్ల లివర్ వ్యాధులు వస్తాయి. శరీరానికి హానిచేసే మందులు ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా కాలేయ సమస్యలు తలెత్తుతాయి. మన రోగ నిరోధక శక్తి మనవైపే ప్రతికూలంగా పనిచేయటానికి అవకాశం ఉన్నప్పుడు , వంశపారంపర్యంగా కాలేయ వ్యాధులు వస్తాయి. తెల్లగా ఉండే కళ్లు పసుపు పచ్చగా, గోళ్లు పసుపు రంగులో మారితే కామెర్ల సమస్యలు ఉన్నట్లు భావించి వైద్యపరీక్షలు చేయించుకోవాలి. కాలేయ సమస్యలను ముందస్తుగా గుర్తించి సకాలంలో వైద్యం చేయని పక్షంలో లివర్ క్యాన్సర్గా మారే ప్రమాదం ఉంది. -
బేస్బాల్ పోటీల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్
ఇంకొల్లు(చినగంజాం): రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీల్లో రాణిస్తే క్రీడాకారులకు మంచి భవిష్యత్ ఉంటుందని ఆంధ్రప్రదేశ్ బేస్బాల్ జాయింట్ కార్యదర్శి వేమారెడ్డి అన్నారు. మండలంలోని డీవీఆర్ సైనిక్ స్కూల్ క్రీడా మైదానంలో ఆదివారం బాపట్ల జిల్లా సబ్ జూనియర్ బాలబాలికల బేస్బాల్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర బేస్ బాల్ జాయింట్ కార్యదర్శి వేమారెడ్డితో పాటు డీవీఆర్ సైనిక్ స్కూల్ డైరెక్టర్ గోరంట్ల సుబ్బారావులు హాజరై జిల్లా జట్టు ఎంపిక పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వేమారెడ్డి మాట్లాడుతూ జిల్లా జట్టులో ఎంపికై న క్రీడాకారులు మే నెల 5 నుంచి 7 వ తేదీ వరకు కర్నూలు జిల్లాలోని గోనెగండ్ల జెడ్పీ హైస్కూల్లో నిర్వహించే సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా బేస్ బాల్ కార్యదర్శి కే శ్రీను, అజయ్ కుమార్, నరేష్, వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బేస్బాల్ ఎంపిక పోటీలు -
గరికపాటికి లీగల్ నోటీసు
తెనాలి: ఆధ్యాత్మికవేత్త గరికపాటి నరసింహారావు ప్రవచనాలు వ్యక్తిగతంగా తనకు ఇష్టమేనని, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను చులకనగా చేసి మాట్లాడటం సరి కాదని హైకోర్టు న్యాయవాదులు పెరికల డేనియల్, వేములపల్లి శ్రీనివాస్ అన్నారు. పట్టణ అయితానగర్లో ఆదివారం తన కార్యాలయం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం డేనియల్, శ్రీనివాస్ మాట్లాడారు. గరికపాటి నరసింహారావు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తెనాలి క్లయింట్ బొప్పూరి పవన్కుమార్ అభ్యర్థనతో తాము లీగల్ నోటీసు పంపినట్టు వారు తెలిపారు. తన న్యాయవాది ద్వారా ఆయన తిరుగు సమాధానం ఇచ్చారని కూడా చెప్పారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) ప్రకారం వాక్స్వాతంత్య్రానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయని చెప్పారు. వీరితో మరో న్యాయవాది గజ్జ శ్రీనివాస్ గౌడ్ కూడా ఉన్నారు. ఈతకు వెళ్లి యువకుడు మృతి పట్నంబజారు: స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన యువకుడు మృతి చెందిన ఘటన గుంటూరు నగరంలో చోటుచేసుకుంది. పాత గుంటూరు పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... సీతానగర్కు చెందిన పొదుకూరి లోకేష్ (19) అదే ప్రాంతంలోని కాళికామాత తల్లి ఆలయంలో సేవలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో మణిపురం ఓవర్ బ్రిడ్జి సమీపంలోని ఒక ఖాళీ స్థలంలో ఉన్న నీళ్లకుంట వద్దకు ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో లోకేష్తో కలిసి మరో ఇద్దరు ఈతకు దిగారు. నీటి కుంట లోతు అంచనా వేయలేని లోకేష్ లోపలకు దిగిన క్రమంలో ఈత కొట్టలేక అందులో కూరుకుపోయాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్ని మాపక శాఖ రెస్క్యూ టీం సిబ్బంది కోటేశ్వరరావు మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం పాత గుంటూరు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మానవ సంబంధాలపై మొబైల్స్ తీవ్ర ప్రభావం
నగరంపాలెం: మొబైల్ ఫోన్లల్లో అవసరం లేనివి తొలగించినట్లు(డెలిట్) నేడు బంధాలు– మానవ సంబంధాలు తొలగించుకునే అంశాలుగా మారిపోతున్నాయని అభ్యుదయ రచయితల సంఘం(అరసం) జాతీయ అధ్యక్షులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. మురుగుడు శ్రీహరి రచించిన శ్రీహరి సిత్రాలు ఛాయా చిత్ర కవితా సంపుటి ఆవిష్కరణ సభ ఆదివారం నిర్వహించారు. పుస్తకాన్ని పెనుగొండ ఆవిష్కరించారు. గుళ్లపల్లి సుబ్బారావు సేవా సంస్థ సౌజన్యంతో మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ నిర్వహణలో బృందావన్గార్డెన్న్స్ వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఆడిటోరియంలో ఆలయ సహాయ కార్యదర్శి వూటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. సభకు డాక్టర్ పట్టాభి కళాపీఠం వ్యవస్థాపకులు డాక్టర్ తూములూరి రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించారు. పెనుగొండ మాట్లాడుతూ వందేళ్ల అనుబంధాలను క్షణాల్లో తెంచుకుంటున్న తీరుపై ఈ పుస్తక రచయిత తెగిపోతున్న బంధాలు పేరుతో కవిత్వం రాయడంపై హర్షం వ్యక్తం చేశారు. సభకు అధ్యక్షత వహించిన తూములూరి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ సిరా చుక్క మౌనం వహిస్తే, సారా చుక్క రాజ్యమేలుతుందని అన్నారు. కవులు మౌనం వీడాలని, సామాజిక సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ కవిత్వం రాయాలని ఆకాంక్షించారు. మల్లెతీగ సంపాదకుడు కలిమిశ్రీ మాట్లాడుతూ కవిత్వంలో ఎన్నో కొత్త ప్రక్రియలు రంగప్రవేశం చేస్తున్నాయని అన్నారు. ఛాయాచిత్ర కవిత్వం అనే కొత్త ప్రక్రియతో కవిత్వమై పుస్తకంగా మనముందుకొచ్చిన శ్రీహరిని ప్రోత్సహించడం మనందరి కర్తవ్యమని పేర్కొన్నారు. పుస్తకాన్ని సుప్రసిద్ధ కవి కోసూరి రవికుమార్ పరిచయం చేశారు. సభలో మోదుగుల రవికృష్ణ, ఆధ్యాత్మిక రచయిత పచ్చిపులుసు సూర్యనారాయణ, బండికల్లు వెంకటేశ్వర్లు ఫౌండేషన్ వ్యవస్థాపకులు బండికల్లు జమదగ్ని, గుళ్లపల్లి రాఘవేంద్రరావు, కావూరి రవికుమార్ పాల్గొన్నారు. అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ -
AP: రైలులో దోపిడీ దొంగల బీభత్సం
సాక్షి, బాపట్ల జిల్లా: రైలులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. బెంగుళూరు- నరసాపురం(07154) స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలులో నాలుగు కోచ్ల్లో చోరీకి పాల్పడ్డారు. ఎస్7, ఎస్11, ఎస్12, ఎస్13 కోచ్లలో ప్రయాణికుల నుండి సుమారు 11 తులాలు బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. బాపట్ల- అప్పికట్ల మధ్య ఘటన జరిగింది. అప్పికట్లలో రైలు అపి దుండగులు దిగిపోయారు. విజయవాడ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ నెల ఏప్రిల్ 15న మహారాష్ట్రలోని మన్వత్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో కాకినాడ-సాయినగర్ షిర్డీ ఎక్స్ప్రెస్(17206)లో దోపిడీ దొంగలు చెలరేగిపోయిన సంగతి తెలిసిందే. సిగ్నల్ వ్యవస్థను దెబ్బతీసిన దొంగలు.. రైలును ఆపి, మహిళా ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాలను దోచుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రైళ్లలో దోపిడీలు వరసగా జరగడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. రాత్రి సమయంలో దోపిడీ దొంగలు టార్గెట్ చేస్తున్నారుజ ఇటీవల సికింద్రాబాద్, నెల్లూరు, గూడూరు ప్రాంతాల్లో దోపిడీ ఘటనలు వెలుగుచూశాయి. -
జల వనరులే భావితరాలకు సిరులు
జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్ కొల్లూరు: నీటి వనరులు అంతరించిపోతున్న తరుణంలో జల సంరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలని జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్ కోరారు. శనివారం మండలంలోని అనంతవరంలో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర, జలధార – జల హారతి కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో నిర్వహించిన గ్రామ సభలో ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ నీటి వృథాను అరికట్టడానికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. మొంథా తుపాను నష్టపరిహారం సైతం త్వరలో రైతుల ఖాతాల్లో జమ అవుతుందన్నారు. అనంతవరం పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న కూడలిలో ప్రభుత్వ యంత్రాంగం, విద్యార్థులతో కలసి స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ప్రదర్శనగా స్థానిక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో కలసి మొక్క నాటారు. అనంతరం డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో రేపల్లె ఆర్డీఓ బి. శ్రీదేవి, ఇన్చార్జి డీఎంహెచ్ఓ రత్నమన్మోహన్, డీపీఓ కేఎల్ ప్రభాకరరావు, డీఆర్డీఏ పీడీ బి. శింగయ్య, డ్వామా పీడీ పి. పద్మ, ఎంపీడీఓ ఎ. స్పందన, తహసీల్దార్ బి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. డొంక రోడ్లలో రవాణా దిగువ రైతుల హక్కు పంట ఉత్పత్తుల తరలింపు కోసం తరతరాలుగా అందుబాటులో ఉంటున్న డొంక రోడ్ల విషయంలో ఒకరిద్దరు రైతులు అడ్డంకులు సృష్టించి ఇతరులను ఇబ్బంది పెట్టడం పద్ధతి కాదని జిల్లా కలెక్టర్ అన్నారు. శనివారం అనంతవరం జిల్లా పరిషత్తు పాఠశాలలో నిర్వహించిన గ్రామసభలో ఆయనకు రైతులు ఈ సమస్యను వివరించారు. దీనిపై కలెక్టర్ స్పందించి, పొలాలకు ఉన్న బాటలలో రాకపోకలను అడ్డగించడం వల్ల మిగిలిన వారు అవస్థలు పడతారని తెలిపారు. అనంతరం కొల్లూరు శివారు కేటీ కాలనీ సమీపంలో బళ్ల బాట కోసం ఆందోళన చేస్తున్న రైతులు తమ సమస్యను కలెక్టర్కు మొర పెట్టుకున్నారు. పరిష్కరించాలని రేపల్లె ఆర్డీఓ బి. శ్రీదేవిని ఆయన ఆదేశించారు. అనంతవరంలో ఖరీప్లో వరి సాగు చేసి కేళీలతో పంట నష్టానికి గురైన రైతులు తమకు సంబంధిత విత్తన కంపెనీ నుంచి పరిహారం అందకపోవడంపై కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఎస్సీ శ్మశాన వాటికకు స్థల కేటాయింపు, 20 ఏళ్ల క్రితం కేటాయించిన ఇళ్ల స్థలాలలో మెరకలు, ఇతర మౌలిక వసతుల కల్పన, డ్రైనేజ్ల నిర్మాణం, విద్యుత్తు స్తంభాల ఏర్పాటు, చెరువు కట్టల బలోపేతం, డొంక రోడ్ల మరమ్మతులు వంటి సమస్యలపై కలెక్టర్కు గ్రామస్తులు వినతిపత్రాలు అందజేశారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను శాఖల వారీగా పరిష్కరిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. తహసీల్దార్ బి.వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ అమతలూరి స్పందన పాల్గొన్నారు.


