breaking news
Bapatla
-
గుండెలు చెది‘రాయి’ గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం
బల్లికురవ/నరసరావుపేట టౌన్/సాక్షి, అమరావతి: గ్రానైట్ క్వారీలో రాయి తీస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. రాయి మీద పడి ఆరుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన బాపట్ల జిల్లా బల్లికురవ మండలం ఈర్లకొండ వద్ద ఉన్న సత్యకృష్ణ గ్రానైట్ క్వారీలో ఆదివారం జరిగింది. ఈ ఘటనలో ఒడిశా రాష్ట్రం నుంచి వచ్చి పనిచేస్తున్న నలుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయాలపాలయ్యారు. వీరిలో ఇద్దరు నరసరావుపేట వైద్యశాలకు తరలిస్తుండగా మృతిచెందారు.పోలీసుల కథనం ప్రకారం.. బల్లికురవ సమీపంలోని ఈర్లకొండ వద్ద సత్యకృష్ణ గ్రానైట్ క్వారీ ఉంది. ఈ క్వారీలో ముడి రాయిని తీసి ఎగుమతి చేస్తుంటారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం సుమారు 10.30 గంటల సమయంలో క్వారీలో రాయి తీసేందుకు తొమ్మిది మంది కూలీలు జాకీలతో పనిచేస్తున్నారు. ఉన్నట్టుండి తీసే రాయికి పై భాగంలో ఉన్న రాయి దొర్లి కార్మికుల మీద పడింది. దీంతో ఒడిశా రాష్ట్రానికి చెందిన టుకున దలాయ్ (37), బనమల చెహ్రు (30), భాస్కర్ బిషోయ్ (40), సంతోస్ గౌడ్ (36) అక్కడికక్కడే మృతిచెందారు. ఎం.సుదర్శన్, కె.నాయక్, శివాగౌడ, దండా బడత్యా (48), ముస్సా జనా (43) తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిని నరసరావుపేట వైద్యశాలకు తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో దండా బడత్యా, ముస్సా జనా మృతిచెందారు. మిగిలిన ముగ్గురు నరసరావుపేటలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలాన్ని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడీ, మైనింగ్ డీడీ రాజశేఖర్, ఏడీ రామచంద్ర పరిశీలించారు. ప్రమాద కారణాలను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం నాలుగు మృతదేహాలను అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు, రెండు మృతదేహాలు నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. వీఆర్వో అశోక్ ఫిర్యాదు మేరకు బల్లికురవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల సంఖ్యపై అనుమానాలు? క్వారీలో ప్రమాదం జరిగిన సమయంలో ఆరు జాకీలతో జాకీకి ముగ్గురు వంతున డ్రిల్లింగ్ పనులు చేస్తున్నట్లు సమాచారం. కానీ అధికారులు మాత్రం అక్కడ పనిచేస్తున్నది తొమ్మిది మంది మాత్రమేనని, అందులో ఆరుగురు మృతిచెందారని ప్రకటిస్తున్న నేపథ్యంలో మిగిలిన కార్మికులు ఏమయ్యారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మృతుల సంఖ్య విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై విచారణకు సీఎం ఆదేశం క్వారీ ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. ప్రమాదంపై బాపట్ల జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. న్యాయ విచారణ చేయాలి: సీపీఎం ప్రమాదంపై సీపీఎం రాష్ట్ర కమిటీ తీవ్ర ది్రగ్భాంతి వ్యక్తం చేసింది. మృతులకు సంతాపం వ్యక్తం చేస్తూ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు. ప్రమాదానికి గల కారణాలపై న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని, గాయపడిన వారికి సరైన వైద్యంతోపాటు రూ.10 లక్షల సహాయం అందించాలని కోరారు. క్వారీలో సరైన భద్రతా చర్యలు చేపట్టని యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ క్వారీ నిర్వహణకు ప్రభుత్వం అనుమతి లేదన్న వార్తలు మరింత ఆందోళన కల్గిస్తున్నాయన్నారు.మృతుల కుటుంబాలకు రూ.14 లక్షల చొప్పున పరిహారం గ్రానైట్ క్వారీ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేస్తున్నట్టు బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి చెప్పారు. క్వారీ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రమాదం జరిగినప్పుడు క్వారీలో మొత్తం 16 మంది ఒడిశా రాష్ట్ర కూలీలు పనిచేస్తున్నారని తెలిపారు.వర్షం పడడం వల్ల ప్రమాదం జరిగిందని వివరించారు. నలుగురు అక్కడికక్కడే మరణించగా, ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృత్యువాత పడ్డారని, ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, మిగిలిన వారు స్వల్పంగా గాయపడ్డారని కలెక్టర్ వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.14లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.పదిలక్షల చొప్పున పరిహారం క్వారీ యాజమాన్యం నుంచి ఇప్పిస్తామని వెల్లడించారు. స్వల్పంగా గాయపడిన వారికీ ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున క్వారీ నిర్వాహకుల నుంచి ఆర్థిక సాయం అందేలా చూస్తామన్నారు. ఘటనపై విచారణకు మైనింగ్ శాఖను ఆదేశించినట్టు వెల్లడించారు. మృతదేహాలను స్వగ్రామాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. క్షతగాత్రులు పూర్తిగా కోలుకునే వరకు అన్ని ఖర్చులూ ప్రభుత్వమే భరించనున్నట్టు వివరించారు. -
జీజీహెచ్లో ఉచితంగా వైద్యం
గుంటూరు జీజీహెచ్లో ఆర్థోపెడిక్ సమస్యలకు రోజూ ఓపీ విభాగంలో ఉచిత సేవలు అందిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి క్యాజువాలిటీలో 24 గంటలూ వైద్యులు అందుబాటులో ఉండి, ఎమర్జన్సీ ఓటీలో ఆపరేషన్లు చేస్తున్నారు. రోజూ 300 మంది ఓపీ విభాగంలో వైద్య సేవలు పొందుతున్నారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ఆధునిక వసతులు సాధారణ, ఎమర్జెన్సీ ఆపరేషన్లు పదికిపైగా నిత్యం చేస్తున్నారు. – డాక్టర్ యశస్వి రమణ, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, సూపరింటెండెంట్ ● -
జాగ్రత్తలతో ఎముకలు పదిలం
ఆధునిక జీవనశైలితో చిన్న వయస్సులోనే స్పయిన్ సమస్యలు వస్తున్నాయి. నడుంనొప్పి, మెడనొప్పి వంటి సమస్యలు యువతలో కనిపించటం చాలా ఆందోళనకరం. రోజూ గుడ్డు, పాలు, రాగిజావ, పాలకూర వంటి సమతుల ఆహారంతోపాటు రోజూ వ్యాయామం చేయాలి. ఊబకాయం లేకుండా చూసుకోవాలి. జంక్ఫుడ్, స్మోకింగ్కు దూరంగా ఉండాలి. మహిళలు 40 సంవత్సరాలు దాటితే తప్పనిసరిగా ఎముకల ఆరోగ్యంపై దృష్టి సారించి ప్రత్యేక ఆహారం తీసుకోవాలి. – డాక్టర్ జె.నరేష్బాబు, సీనియర్ స్పైన్ సర్జన్, గుంటూరు -
రాయే.. మృత్యువాయే
అద్దంకి/ బల్లికురవ: పొట్టచేతపట్టుకుని గ్రానైట్ క్వారీలో పనిచేసేందుకు పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన ఆరుగురు కార్మికులు గ్రానైట్ రాయి మీదపడి ప్రాణాలు వదిలారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలై మృత్యువుతో పోరాడుతున్నారు. బల్లికురవ సమీపంలోని చెన్నునల్లి–అనంతవరం రహదారిలో ఉన్న టీడీపీ సానుభూతి పరుల క్వారీ అయిన ఈర్లకొండ సత్యకృష్ణ క్వారీలో ఆదివారం ఉదయం ఈ ఘోర ప్రమాదం జరిగింది. సంఘటన సుమారు ఉదయం 10.30 గంటలకు జరగ్గా, గంట తరువాత స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అయితే ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఎవరినీ అనుమతించలేదు. దాంతో అక్కడ ఇంకా కొంతమంది మృతిచెంది ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లతోనే మీడియాను అనుమతించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు 70 మందికి పైగా మృతి బల్లికురవ, సంతమాగులూరు ప్రాంత క్వారీల్లో ఇప్పటివరకూ దాదాపు 70 మందికి పైగా బతుకు తెరువు కోసం రాష్ట్రాలు దాటి వచ్చి పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. ఇలాగే వదిలేస్తే మరికొంత మంది కార్మికుల ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఇప్పటికై నా క్వారీల యజమానులు కార్మికులకు భద్రతా పరికరాలు ఇవ్వడంతోపాటు, నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చు. అలాగే మైనింగ్ శాఖ క్వారీలపై నిరంతర నిఘాతో పర్యవేక్షణ చేస్తేనే మరో ప్రమాదం జరగకుండా చూసుకునే అవకాశం ఉంది. భద్రతా చర్యలు గాలికి.. క్వారీల్లో నిపుణుడైన మేనేజరు (ఫస్ట్క్లాస్) మేట్ పర్యవేక్షణలో కార్మికులు రాయిని తీయాల్సి ఉంది. క్వారీల్లో మ్యాగజైన్/బ్లాస్టింట్ మెటీరియల్ను జాగ్రత్తగా దాచే విధానం ఉండాలి. అక్రమ నిల్వలతో బ్లాస్టింగ్ చేయడంతో అదీ ప్రమాదాలకు దారితీస్తోంది. బ్లాస్టింగ్ మెటీరియల్ నిల్వలకు అనుమతులు తీసుకోవాల్సి ఉంది. దాని విషయంలో అనుమతులున్న క్వారీలను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ఒక్కో క్వారీలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు 100 నుంచి 150 వరకు ఉంటారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా వీరిచేత పనులు చేయిస్తుండడంతో తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. చరిత్రలోనే భారీ ప్రమాదం ఈ ప్రాంతంలో క్వారీల చరిత్రలోనే ఈ ఘటన భారీ ప్రమాదంగా నిలుస్తోంది. ఇప్పటికై నా అధికారులు, ప్రజా ప్రతినిధులు భద్రతా పరంగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని వామపక్షాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మృతిచెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలి అద్దంకి రూరల్: బల్లికురవ మండలంలోని గ్రానైట్ క్వారీ ప్రమాదంలో మృతి చెందిన ఆరుగురు కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జి పానెం చిన హనిమిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. పొట్టకూటి కోసం ఒడిశా నుంచి వచ్చిన కార్మికులు మృతి చెందడం బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. క్వారీలో గ్రానైట్ రాయి పడి ఆరుగురు దుర్మరణం కనీస భద్రతా చర్యలు పాటించకపోవడమే ప్రమాదానికి కారణం సకాలంలో ప్రాథమిక వైద్యం అందక పెరిగిన మృతుల సంఖ్య మృతదేహాలను గ్రానైట్ టిప్పర్లో తీసుకొచ్చి ఆస్పత్రి దగ్గర పడేసిన వైనం ప్రమాదాలు జరిగినప్పుడే స్పందిస్తున్న అధికారులు ఒక్క బల్లికురవ పరిసర క్వారీల్లో ఇప్పటికి వరకు 70 మందికిపైగా మృతి -
యుక్తవయస్సులోనే కీళ్ల అరుగుదల
ఆధునిక జీవనశైలి వల్ల యుక్త వయస్సులోనే కీళ్లు అరిగిపోతున్నాయి. ముందుగా గుర్తిస్తే ఆపరేషన్ లేకుండా తగ్గించవచ్చు. బీఎంఆర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్టుకు చెందిన ఉన్నతి ఫౌండేషన్ ద్వారా గతంలో గుంటూరు జీజీహెచ్లో వంద మందికి ఉచితంగా మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేశాం. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు, హెల్త్ ఇన్సూరెన్సు కార్డుల ద్వారా సాధారణ ప్రజలకు ఉచితంగా మోకీళ్ల మార్పిడి ఆపరేషన్ చేస్తున్నాం. – డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, సీనియర్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, గుంటూరు -
రాష్ట్ర ఫోర్ బాల్ టోర్నమెంట్ ప్రారంభం
నరసరావుపేట ఈస్ట్: గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తిని అలవరచుకోవటం ద్వారా జీవితంలో ఉన్నతంగా ఎదగవచ్చని కే–రిడ్జి పాఠశాల చైర్మన్ నాతాని వెంకటేశ్వర్లు తెలిపారు. పాఠశాల క్రీడా మైదానంలో ఆదివారం రాష్ట్రస్థాయి అండర్–14, అండర్–19 బాలబాలికల ఫ్లోర్ బాల్ చాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీలను ప్రారంభించిన నాతాని మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఏదో ఒక క్రీడలో ప్రావీణ్యం సాధించాలని సూచించారు. క్రీడల ద్వారా శారీరక, మానసిక దృఢత్వంతోపాటు క్రమశిక్షణ అలవడుతుందని తెలిపారు. తద్వారా విద్యలోనూ రాణించగలరని తెలిపారు. కాగా, పోటీలలో పాల్గొనేందుకు 16 జిల్లాల నుంచి 250 మంది బాలబాలికలు, జట్లు అధికారులు హాజరయ్యారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కోమటినేని నాసరయ్య, జిల్లా ఫోర్ బాల్ కార్యదర్శి కిషోర్బాబు, ఏపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.సురేంద్ర, వివిధ జిల్లాల కార్యదర్శులు పాల్గొన్నారు. పోటీలను ఆరంభించిన కే–రిడ్జి చైర్మన్ నాతాని -
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
చీరాల రూరల్: రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం చీరాల రైల్వేస్టేషన్ వద్ద దక్షిణ యార్డు ప్రాంతంలో చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్ఐ సీహెచ్ కొండయ్య తెలిపిన వివరాల మేరకు.. సుమారు 35 సంవత్సరాలు వయస్సు కలిగిన ఓ వ్యక్తి రైల్లో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. మృతుడి శరీరంపై పింక్, బ్లాక్ రంగు కలిగిన గళ్ల చొక్కా, బాంబే స్టైల్స్ టీఎన్ఎల్ అనే లేబుల్ ఉన్నట్లు చెప్పారు. బ్లూ కలర్, బ్లాక్ రంగు కలిగిన స్టోర్స్ బెల్ట్ చెప్పులు ధరించి ఉన్నాడని తెలిపారు. మృతుని వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుని వివరాలు తెలిసినవారు 94406 27646 ఫోను నంబర్కు తెలపాలని సూచించారు. -
క్షతగాత్రులను నరసరావుపేట తరలింపు
నరసరావుపేట టౌన్: ప్రకాశం జిల్లా బల్లికురవ గ్రానైట్ క్వారీ ప్రమాదంలో ఆదివారం తీవ్రంగా గాయపడ్డవారిని నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మార్గమధ్యంలో ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా చస్సనిమ్మకాడి గ్రామానికి చెందిన దండ బడత్య(48), దుగాన్ గ్రామానికి చెందిన ముస్సా జనా(43)లు మృతి చెందారు. శివరాం గౌడ్, ఆలోక్ నాయక్, సుధీర్ దులైలకు తీవ్రగాయాలయ్యాయి. అదేవిధంగా సుభాష్మాలిక్, దుబానాయక్, శాంతా నాయక్, ఎస్.వెంకయ్య, పవిత్ర బెహ్రలకు స్వల్పగాయాలయ్యాయి. ఏరియా వైద్యశాల్లో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం పల్నాడు రోడ్డులోని జీబీఆర్ ప్రైవేటు వైద్యశాలకు క్షతగాత్రులను తరలించారు. రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. విషయం తెలుసుకున్న బాపట్ల జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి, చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, నరసరావుపేట ఆర్డీఓ మధులత, బల్లికురవ, నరసరావుపేట తహసీల్దార్లు రవినాయక్, వేణుగోపాల్, సంతమాగులూరు సీఐ వెంకట్రావు మృతదేహాలను సందర్శించారు. ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాదం తీరును కలెక్టర్ బాధితులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యసేవలు అందించాలని డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డిని కలెక్టర్ కోరారు. -
ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి దుర్మరణం
మేదరమెట్ల: స్కూటీని ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టడంతో వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన కొరిశపాడు మండలంలోని మేదరమెట్ల–అనమనమూరు రోడ్డు మలుపు వద్ద ఆదివారం జరిగింది. అనమనమూరు గ్రామానికి చెందిన పైఎద్దు ఏడుకొండలు (32) మేదరమెట్ల వచ్చి స్కూటీపై స్వగ్రామం వెళ్తున్నాడు. అనమనమూరు రోడ్డు మలుపు వద్దకు రాగానే ఎదురుగా ఇసుక లోడు ట్రాక్టర్ స్కూటీని ఢీకొంది. అదుపు తప్పిన ట్రాక్టర్ పక్కనే ఉన్న కాలువలోకి బోల్తా కొట్టింది. ఏడుకొండలు కూడా కాలువలో పడిపోవడంతో ట్రాక్టర్లోని ఇసుక పూర్తిగా అతనిపై పడింది. ఏడుకొండలు ఊపిరాడక అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యాడు. సమాచారం తెలుసుకున్న మేదరమెట్ల ఎస్ఐ మహ్మద్ రఫీ ఘటనా స్థలానికి చేరుకొని ట్రాక్టర్ను పక్కకు తీయించారు. కేసు నమోదు చేసి ఏడుకొండలు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏడుకొండలుకు భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. -
పెద్ద రైతులకు ఎక్కువ నష్టం
పెద్దరైతులు ఎక్కువ మొత్తంలో అప్పులు చేసి సాగు చేశారు. ఆ స్థాయిలోనే ఒత్తిడి అధికంగా ఉంది. ఇటు అమ్ముడు పోతుందో లేదో తెలీదు. అది ఎంత ధరకు అమ్ముడౌతుందో తెలీదు. కాని ప్రైవేటుగా తెచ్చిన అప్పులోళ్లకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు. యాప్లో నాపేరు రిజిస్టర్ చేసి సుమారు 50 రోజులైంది. నా తర్వాత రిజిస్టర్ చేసుకున్న అధికార పార్టీ వారివి ముందుగానే వచ్చాయి. ఇదెక్కడి న్యాయం. కేంద్రం తెరిచి ఉన్నప్పుడు అధికార పార్టీ నేతల బ్యాక్గ్రౌండ్ సిఫార్సులకు ప్రాధాన్యం ఇచ్చి వారినుంచే కొనుగోళ్లు చేశారు. తీరా కేంద్రం మూతపడ్డాకా ఇప్పుడు సన్నా, చిన్నకారు రైతులంటూ చెప్పడం ఎంతవరకు సమంజసం. – ఘంటా మురళి, పొగాకు రైతు, జాలాది ఆదుకోవడం అంటే ఇదేనా..? రూ.22 వేల చొప్పున కౌలుకు తీసుకుని సాగు చేశా. ఎకరానికి రూ.2 లక్షల ఖర్చు అయింది. వర్షాల నుంచి రక్షణకు లక్ష పెట్టి పట్టాలు కొనాల్సి వచ్చింది. వారం నుంచి కేంద్రం ఉండటం లేదు. రోజు కేంద్రం వద్ద కాపాల కూర్చొని వస్తున్నాం. కొంటారో లేదో ఏమీ తెలియకుండా పోయింది. పర్చూరు సమావేశానికి వెళ్లాను. పొగాకు రైతులకు అక్కడ నాయకులు, రైతులకు ఇచ్చిన హామీకి, కేంద్రంలో అధికారులు కొనుగోలు చేస్తున్న దానికి పొంతన లేకుండా పోయింది. కొనుగోలు కేంద్రంలో ఎక్కువగా కేజీ రూ.60, రూ.90 రేటు ఎక్కువగా వేస్తున్నారు. రూ.120 ధర చాలా తక్కువగా వేయడంపై రైతులు అల్లాడుతున్నారు. –పెరవలి నాగేశ్వరరావు, పొగాకు రైతు, సొలస ● -
ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక
నరసరావుపేట ఈస్ట్: ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయుల సంఘం పల్నాడు జిల్లా శాఖ అధ్యక్షుడిగా రామిశెట్టి గోవిందరాజులు (జెడ్పీ హైస్కూల్, కాకాని), ప్రధాన కార్యదర్శిగా రెడ్డి శ్రీనివాసరెడ్డి (జెడ్పీ హైస్కూల్, వెన్నాదేవి), కోశాధికారిగా పులిపాటి శ్రీనివాసరావు (జెడ్పీ హైస్కూల్, తూబాడు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘం సర్వసభ్య సమావేశం, సంఘం పల్నాడు జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికను ఆదివారం ప్రకాష్నగర్లోని శ్రీతిలక్ మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించారు. సంఘం గౌరవాధ్యక్షునిగా కొండా శ్రీనివాసరావు (సంతగుడిపాడు), రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా బి.ఎం.సుభాని (రొంపిచర్ల), ఏ.శ్రీనివాసరెడ్డి (75 తాళ్లూరు), ఎస్.విజయలక్ష్మి (కోటప్పకొండ), జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎం.రామారావు (బొగ్గరం), జిల్లా కేంద్రం సెక్రటరీగా వై.హనుమంతరావు (గోగులపాడు), మీడియా ప్రతినిధిగా వి.వెంకటరావు (సాతులూరు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా సంఘం గుంటూరుజిల్లా అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు, పరిశీలకునిగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు జి.శ్రీనివాసరావు వ్యవహరించారు. నూతన అధ్యక్ష, కార్య దర్శులు గోవిందరాజులు, శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర నాయకత్వం, సంఘం సభ్యుల సహకారంతో ప్రధానోపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. -
పశ్చిమ డెల్టాకు 7,508 క్యూసెక్కులు విడుదల
దుగ్గిరాల: విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి 7,508 క్యూసెక్కులు ఆదివారం విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. బ్యారేజి వద్ద 12 అడుగులు నీటి మట్టం ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవెల్కి 316, బ్యాంక్ కెనాల్కు 1,791, తూర్పు కాలువకు 749, పశ్చిమ కాలువకు 281, నిజాపట్నం కాలువకు 487, కొమ్మూరు కాలువకు 2,980, బ్యారేజి నుంచి సముద్రంలోకి 77,750 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.6న జాబ్ మేళా గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 6న మంగళగిరిలోని వీటీజేఎం – ఐవీటీఆర్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కొండా సంజీవరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, డిప్లొమా, ఫార్మసీ, పీజీ విద్యార్హతలు కలిగిన 18 నుంచి 35 ఏళ్ల వయసు గల నిరుద్యోగ యువతీ, యువకులు మేళాకు రావచ్చన్నారు. రెస్యూమ్, విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, ఆధార్, పాస్పోర్ట్ సైజు ఫొటోతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలని తెలిపారు. వివరాలకు జి.వి.ఎస్. సాయి కుమార్– 80745 97926, షేక్ బాజీ – 77805 88993, పి.శ్రావణి – 93473 72996లను సంప్రదించాలని సూచించారు. యజమానులకు సెల్ఫోన్లు అప్పగింత నగరంపాలెం: మొబైల్ ఫోన్లను జాగ్రత్తగా వాడాలని జిల్లా ఎస్పీ సతీష్కుమార్ అన్నారు. రూ.50 లక్షల విలువైన 250 సెల్ఫోన్లను నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్లో ఆదివారం యజమానులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటివరకు 3,115 ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు తిరిగి అందజేశామని అన్నారు. సెల్ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్ వెబ్సైట్ ద్వారా లేదా 86888 31574 నంబర్కు, 1930 నేషనల్ సైబర్ క్రైం హెల్ప్లైన్కు సమాచారం అందించాలని చెప్పారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మొబైల్ఫోన్ల ద్వారా అధికంగా ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయని అన్నారు. ఈ క్రమంలో ఫోన్లను అజాగ్రత్తతో పోగొట్టుకోవద్దని సూచించారు. సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఐటీ కోర్ సీఐ నిషార్బాషా, హెడ్ కానిస్టేబుల్ కిషోర్, కానిస్టేబుళ్లు శ్రీధర్, మానస, సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ కరీముల్లాను అభినందించారు. దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన భక్తుల రద్దీ మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగింది. శ్రావణ మాస శుభ ముహూర్తాల వేళ ఒక్కటైన నూతన వధూవరులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తెల్లవారుజామున ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమంలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి నిర్వహించే విశేష కుంకుమార్చనలోనూ ఉభయ దాతలు పాల్గొన్నారు. మధ్యాహ్నం అమ్మ వారికి మహా నివేదన నిమిత్తం అరగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేయడంతో రద్దీ మరింత పెరిగింది. మహానివేదన అనంతరం తిరిగి దర్శనాలు ప్రారంభం కాగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. భక్తులతో సర్వ దర్శనంతోపాటు రూ.100, రూ.300, రూ.500 క్యూలైన్లు కిటకిటలాడాయి. ఎండ వేడిమి, ఉక్కపోతతో క్యూలైన్లో భక్తులు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. అక్కడ కూలర్లు ఉన్నా వాటిని ఫ్యాన్లుగానే వినియోగించడంపై సిబ్బందిని భక్తులు ప్రశ్నించారు. -
భార్యను నమ్మించి ఉసురుతీసిన భర్త
నరసరావుపేట టౌన్: భర్తపై పెట్టుకున్న నమ్మకమే ఆమె పాలిట ఉరితాడైంది. పోలీస్ గడప తొక్కితే తన గడపలో కాపురం కుదుటపడుతుందని భావించిన ఆమెకు అవే ఆఖరి ఘడియలుగా మారాయి. మద్యానికి బానిసైన భర్త, భార్యను నమ్మకంగా తీసుకెళ్లి కడతేర్చిన ఘటన నరసరావుపేటలో ఆదివారం వెలుగు చూసింది. వివరాలు.. కంభంపాలేనికి చెందిన తొరటి మేరీ(29), సత్తెనపల్లి మండలం గార్లపాడుకు చెందిన జొన్నలగడ్డ రమేష్ను ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసుకుంది. రమేష్ ఆటో నడుపుతూ ఉంటాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిసైన రమేష్, భార్యను అనుమానిస్తూ వేధిస్తూ ఉండేవాడు. శనివారం పోలీస్ స్టేషనుకు వెళ్లి ఫిర్యాదు చేస్తానని భర్తను బెదిరించింది. తాను కూడా వస్తానని ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని స్టేషనుకు తీసుకెళ్లకుండా రావిపాడు రోడ్డు వైపు తీసుకెళ్లాడు. ఈ విషయాన్ని తల్లి కోటమ్మకు మేరీ ఫోన్ చేసి చెప్పింది. కొద్దిసేపటి తర్వాత ఇద్దరి సెల్ఫోన్లు స్విచ్ ఆఫ్ అని రావటంతో అనుమానం వచ్చిన కోటమ్మ వన్టౌన్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో అదృశ్యం కేసు నమోదు చేశారు. రమేష్ను అదుపులోకి తీసుకుని విచారించగా, నేరం అంగీకరించాడు. చున్నీతో గొంతు బిగించి హత్య.. భార్యను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని శనివారం భర్త రమేష్ నకరికల్లు నుంచి కారంపూడి వెళ్లే మార్గంలో రైల్వే ట్రాక్ పక్కన నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె గొంతుకు చున్నీ బిగించి కాలుతో నొక్కి దారుణంగా హత్య చేశాడు. రమేష్ ఇచ్చిన సమాచారంతో ఆదివారం వన్టౌన్ సీఐ ఎం.విజయ్ చరణ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని గుర్తించి, పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. భర్త వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకున్న వైనం నమ్మకంగా తీసుకెళ్లి చున్నీతో హత్య చేసిన భర్త నరసరావుపేటలో వెలుగు చూసిన దారుణం -
పోలీసుల అదుపులో బంగారం దొంగలు
– చోరీ సొత్తు కోసం పోలీసుల ప్రయత్నం రొంపిచర్ల: మండలంలోని సంతగుడిపాడు గ్రామంలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగిన చోరీ కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సంతగుడిపాడు గ్రామానికి చెందిన రామాల ప్రసన్నారెడ్డి ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో దొంగలు ఇంటి పైకప్పు కత్తిరించి ఇంట్లోకి ప్రవేశించి 20 సవర్ల బంగారం, రూ.50 వేల నగదు దొంగిలించారు. ఇంటి యజమాని ప్రమాదానికి గురై అసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. యజమానులు ఇంట్లో లేకపోవడాన్ని అదునుగా చూసుకొని దొంగతనానికి పాల్పడ్డారు. యజమాని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. ఆయినప్పటికీ తనకు న్యాయం జరగలేదని తాను నష్టపోయిన సొమ్మును రికవరీ చేయించాలని పోలీస్ ఉన్నతాధికారులకు స్పందనలో తెలియజేశారు. అప్పటి నుంచి పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ముమ్మరం చేశారు. లభ్యమైన క్లూ ఆధారంగా అనుమానిత దొంగలను అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో దొంగిలించిన బంగారాన్ని ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో తనఖాపెట్టి కొంత రుణాన్ని పొందినట్లు తెలుసుకున్నారు. తాకట్టు ఉంచిన కొన్ని రోజుల తర్వాత వేరే వారితో డబ్బులు కట్టించి బంగారాన్ని విడిపించినట్లు ఒప్పుకున్నారు. ఆ బంగారాన్ని మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకున్నట్లు నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. విద్యుదాఘాతంతో రైతు మృతి బొల్లాపల్లి: తెగి పడిన విద్యుత్ వైర్ తగిలి రైతు మృతి చెందిన సంఘటన బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల గ్రామ పొలాల్లో జరిగింది. బండ్లమోటు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన భూక్యా తాహసీల్ నాయక్ (50)కి రెండెకరాల సొంత భూమి ఉంది. తన పొలంలో పత్తి పంట సాగు చేశాడు. పొలం చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఆదివారం తన భార్యతోపాటు కూలీలను తీసుకుని పొలానికి పత్తి విరుపు కోసం వెళ్లారు. పొలాన్ని ఆనుకుని ఉన్న 11 కె.వి, ఎల్టీ విద్యుత్ లైన్లు ఉన్నాయి. ఎల్టీ విద్యుత్ లైన్ వైరు తెగి పొలం చుట్టూ ఏర్పాటుచేసిన సోలార్ ఫెన్సింగ్ వైర్పై పడింది. నాయక్ ఇది గమనించలేదు. పొలంలోకి వెళ్లేందుకు ఫెన్సింగ్ తొలగిస్తుండగా తెగిపోయిన విద్యుత్ వైరు కాలికి తగిలింది. షాక్కు గురై రైతు తహసీల్ నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతనికి భార్య నలుగురు సంతానం ఉన్నారు. భార్య మంగబాయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు బండ్లమోటు ఎస్సై ఎ.బాలకృష్ణ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. అధికారుల తప్పిదం వల్లే ప్రమాదం ఒకే స్తంభానికి ఎల్టీ, 11 కేవీ విద్యుత్ వైర్లు విద్యు త్శాఖ ఏర్పాటు చేసిందని, నిబంధన ప్రకారం పైన 11 కేవీ విద్యుత్ లైన్ ఉండాలని కింద ఎల్టీ విద్యు త్ వైర్లు ఏర్పాటు చేయాలని కానీ అలా చేయలేదని, వైర్లు తెగిపడి ప్రమాదం జరిగి రైతు మృతి చెందాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు ఇప్పటికై నా నిర్లక్ష్యాన్ని వీడి విద్యుత్ లైన్లు సక్రమంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఆరోగ్య అస్థి.. నిజమైన ఆస్తి!
మనిషి ఏ పని చేయాలన్నా శరీరంలోని ఎముకలు పటిష్టంగా ఉండాలి. ఆధునిక జీవన శైలి వల్ల ఆర్థోపెడిక్ సమస్యల బారిన పడుతున్న వారి సంఖ్య ఏటా పెరిగిపోతోంది. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2012 నుంచి ప్రతి ఏడాది ఆగస్టు 4న దేశంలో ‘బోన్ అండ్ జాయింట్ డే’ను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న కథనం. గుంటూరు మెడికల్ : గుంటూరుకు చెందిన రోహిత్ పదో తరగతి చదువుతున్నాడు. ఇటీవల కాలంలో ఆటలాడుతూ కింద పడటంతో చెయ్యి విరిగింది. తల్లిదండ్రులు ఆర్థోపెడిక్ వైద్యుల వద్దకు రోహిత్ను తీసుకెళ్లారు. ఏసీ తరగది గదుల్లో ఉండటం, చదువుల ఒత్తిడిలో సమతుల ఆహారం కూడా తీసుకోకపోవడం, ముఖ్యంగా క్యాల్షియం సరిపడా ఉంటే ఫుడ్ తీసుకోకపోవడం వల్లే కొద్దిపాటి దెబ్బలకే ఎముకలు విరిగిపోతున్నాయని వెల్లడించారు. సమస్యలకు కారణాలివీ.... ఆధునిక జీవన శైలి వల్ల ఎక్కువ మంది ఏసీలకే పరిమితమై కొంతసేపు కూడా సూర్యరశ్మి సోకకుండా గదుల్లోనే ఉండిపోతున్నారు. దీంతో విటమిన్ ‘డి’ లోపంతో ఎముకల పటుత్వం తగ్గిపోతోంది. ఫాస్ట్ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం వల్ల కూడా ఊబకాయం పెరిగిపోయి ఆర్థోపెడిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. వయస్సు పైబడిన వారు సహజసిద్ధంగా తమ శరీరంలో తగ్గిపోయే కాల్షియాన్ని తిరిగి భర్తీ చేసుకోవడం లేదు. ఇదీ ఆర్థోపెడిక్ సమస్యలకు కారణం అవుతోంది. స్మోకింగ్ వల్ల కూడా కాల్షియం స్థాయి పెరగకుండా ఎముకల అరుగుదల జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఆర్థోపెడిక్ సర్జన్లు 350 మంది ఉన్నారు. రోజూ ఒక్కో వైద్యుడి వద్దకు 50 మంది పలు సమస్యలతో చికిత్స పొందుతున్నారు. ఏటికేడు పెరుగుతున్న ఆర్థోపెడిక్ సమస్యలు సమతుల ఆహారం, వ్యాయామంతో మేలు మారిన జీవనశైలితో యువతలోనూ కీళ్ల సమస్యలు అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు నేడు ‘బోన్ అండ్ జాయింట్ డే’ గుంటూరు జీజీహెచ్ ఆర్థోపెడిక్ ఓపీ కేసుల వివరాలు ఏడాది ఓపీ రోగుల సంఖ్య 2020 24,569 2021 33,567 2022 47,814 2023 49,678 2024 51,096 -
తరంగ గానానికే సంపత్ జీవితం అంకితం
అద్దంకి: తరంగ గానానికే శ్రీకృష్ణ సంపత్కుమార్ జీవితం అంకితమైందని విశ్లేషకుడు వారణాసి రఘురామశర్మ పేర్కొన్నారు. తరంగ గాన లోకంలో అపూర్వమైన ప్రతిభను ప్రదర్శిస్తున్న ఘోరకవి శ్రీకృష్ణ సంపత్ కుమార్కు పుట్టంరాజు బుల్లెయ్య, రామ లక్ష్మమ్మల విస్తృత కళా పురస్కారం అందజేశారు. పురస్కార ప్రదాన కార్యక్రమం స్థానిక పుట్టంరాజు కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించారు. పద్య కవి డీవీఎం సత్యనారాయణ అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. చప్పిడి వీరయ్య సభాహ్వానం పలికారు. పురస్కార గ్రహీత సంపత్ కుమార్ గురించి వారణాసి రఘురామశర్మ సభకు పరిచయం చేశారు. సంపత్ తరంగ గానంలో జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడిగా సత్యనారాయణ అభివర్ణించారు. శింగరకొండ నరసింహక్షేత్రం, నారాయణ తీర్థుల వారికి గల సంబంధాన్ని పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి వివరించారు. పోలూరి వెంకట శివరామ ప్రసాద్ శ్రీకష్ణలీలా తరంగిణి వైభవాన్ని విశ్లేషిస్తూ ఉపన్యసించారు. ఎన్వీఎల్ హనుమంతరావు, నారాయణ బాలసుబ్రహ్మణ్యం, యూవీ రత్నం తదితరులు సంపత్ తరంగ సేవలను ప్రశంసించారు. పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, శైలజ దంపతులు ఘోరకవిని సత్కరించారు. కార్యక్రమంలో కార్యదర్శి కేవీ పోలిరెడ్డి, కోశాధికారి చుండూరి మురళీ సుధాకరరావు, నిమ్మరాజు నాగేశ్వరరావు, యు. దేవపాలన, జి.దివాకరదత్తు, మోటుపల్లి రామదాసు, మలాది శ్రీనివాసరావు, షేక్ మస్తాన్, కూరపాటి రామకోటేశ్వరరావు, ఆర్టిస్టు బాలు, శ్రీమన్నారాయణ, మక్కెన వెంకటేశ్వర్లు, పి.అంకయ్య తదితరులు పాల్గొన్నారు. విశ్లేషకుడు వారణాసి రఘురామశర్మ ఘోరకవి శ్రీకృష్ణ సంపత్కుమార్కు పురస్కారం ప్రదానం -
నిర్లక్ష్యంతో ఇద్దరి మృతి
దాదాపు పది టన్నుల బరువైన రాయి మీద పడటంతో నలుగురు కార్మికులు అక్కడికక్కడే నుజ్జునుజ్జు అయ్యారు. వారి ముఖాలు కూడా సరిగా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. మృతుల్లో మరో ఇద్దరు దండ బడత్య, ముస్సా జనా తీవ్రగాయాల పాలై ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశారు. తక్షణం ప్రాథమిక వైద్యం అందకనే వారిద్దరూ మృతిచెందారని వైద్య వర్గాల ద్వారా తెలుస్తోంది. వీరిద్దరితో పాటు గాయాలపాలైన ఎం.సుదర్శన్, కె.నాయక్, శివా గౌడ్లను నరసరావుపేటకు తరలించే సమయంలో అంబులెన్స్లో కాకుండా క్వారీకి సంబంధించిన వాహనాల్లోనే తరలించారు. ఘటనా స్థలంలో మృతిచెందిన నలుగురి మృత దేహాలను నిర్లక్ష్యంగా గ్రానైట్ టిప్పర్లో ఆస్పత్రికి తీసుకురావడం విమర్శలకు తావిస్తోంది. ఇంత పెద్ద దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన తమ క్వారీలో పనిచేసిన కార్మికుల మృతదేహాలను వెంట ఉండి తీసుకుని రావాల్సిన క్వారీ నిర్వాహకులు అమాన వీయంగా టిప్పర్ బాడీలో మార్చూరీకి తరలించడం యాజమాన్యం నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేస్తోంది. -
కేంద్రం నిర్వహణ ఎన్ని రోజులు..
ఈ ఏడాది జూన్ 20వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో జిల్లా పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. యడ్లపాడు మండలం మైదవోలు– వంకాయలపాడు పంచాయతీల్లోని స్పైసెస్ పార్కులో దీనిని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. 38 రోజులు మాత్రమే కేంద్రం పనిచేసింది. ఈ కేంద్రం ద్వారా 258 మంది రైతుల నుంచి రూ.6,12,75,170 విలువైన 6821 బేళ్లు(5727 క్వింటాళ్ల)ను బయ్యర్లు కొనుగోలు చేశారు. వీటిలో హెచ్డీఆర్ (రూ.12 వేలు) రకం 589 బేళ్లు, హెచ్డీఎం (రూ.9 వేలు) రకం 2651 బేళ్లు, హెచ్డీఎక్స్ (రూ.6 వేలు) రకం 3581 బేళ్లు ఉన్నాయి. బీటీ రోడ్డు పక్కనే నిల్వ చేసుకున్న పొగాకు చెక్కులు -
ప్రపంచ జంప్రోప్ పోటీలకు తెనాలి బాలిక
తెనాలి: జపాన్లో జూలై 25వ తేదీ నుంచి జరుగుతున్న వరల్డ్ జంప్రోప్ చాంపియన్షిప్–2025లో స్థానిక వెస్ట్బెర్రీ స్కూల్కు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని కె.యుక్తాశ్రీ తలపడుతోంది. ఇంటర్నేషనల్ జంప్ రోప్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలు ఆగస్టు 5వ తేదీ వరకు కొనసాగుతాయి. వివిధ దేశాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. భారత్ తరఫున యుక్తాశ్రీ జట్టులోకి ఎంపికై ందని స్కూల్ ప్రిన్సిపాల్ టీవీ సుబ్రహ్మణ్యం అన్నారు. గతేడాది నేపాల్లో ఇటీవల జరిగిన ఇండో–నేపాల్ జంప్ రోప్ చాంపియన్షిప్ పోటీల్లోనూ యుక్తాశ్రీ సత్తా చాటింది. ఎల్ఆర్ఎస్ గ్రూప్ ఈవెంట్లో బంగారు పతకాన్ని పొందింది. 20 సెకన్ల డబుల్ అండర్ ఈవెంట్లోనూ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఉత్సాహంగా జూడో పోటీలు మంగళగిరి: మండలంలోని యర్రబాలెం డాన్బాస్కో స్కూలులో ఆదివారం జిల్లా స్థాయి జూడో పోటీలు ఉత్సాహంగా సాగాయి. జిల్లా జూడో అసోషియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలలో ఎం.గురుతేజ (30 కేజీల విభాగంలో), డి.రేవంత్బాబు (35), జి.ప్రసాద్(40), ఎస్.యశ్వంత్ (45), సీహెచ్ లక్ష్మి (50), పి.నాగచరణ్ (55), కె. గౌతమ్ (60), పి.నాగచరణ్ (65), కె.దుర్గాప్రసాద్, టి. ఫ్రాన్స్జాకబ్ (66), ఎస్. దివ్యశ్రీ, (38), ఎం.ప్రశాంత్ దయ(32), సీహెచ్ శివనాగజ్యోతి (36), డి.పార్వతి (40), పి.పావని (44), ఎస్కే అప్సన (48), టి.విజయలక్ష్మి (52), వై,అమూల్య, జి.మధురిమ (57 కేజీల విభాగం)లో విజయం సాధించారు. ఈ మేరకు సంఘ అధ్యక్షుడు ఎ. శ్రీహరి నాయుడు తెలిపారు. కార్యక్రమంలో బి.కిరణ్, పీఈటీ రాజు, కోచ్ నాగదుర్గ, కిరణ్ కుమార్, జి.సాంబశివరావు, సబ్ జూనియర్ సెలెక్టెడ్ స్టేట్ టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
రైతుల పక్షాన మాట్లాడడం తప్పా?
● వరికూటి అశోక్బాబుపై దాడి హేయం ● మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబురేపల్లె: అమ్మ అన్నం పెట్టదు... అడుక్కు తిననివ్వదన్న చందంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరు ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పేర్కొన్నారు. రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబును ఆదివారం అంబటి రాంబాబు పరామర్శించారు. అనంతరం వైద్యశాల ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. కాల్వలలో పూడికలు తీయటానికి ప్రభుత్వానికి మనసు రావటం లేదని, తాము తీసుకుంటామని ఆ ప్రాంత ప్రజలు, రైతులు కోరుతున్నా అనుమతులు ఇవ్వటం లేదన్నారు. రైతుల సమస్యలపై పోరాడుతున్న వరికూటి అశోక్బాబు గత మూడు రోజులుగా రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో దీక్ష చేస్తుంటే అటు పాలకులకు గానీ, ఇటు అధికారులకుగానీ చీమకుట్టినట్లయినా లేదన్నారు. రైతుల పక్షాన మాట్లాడడమే ఆయన చేసిన తప్పా అని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్లు బాధ్యత వహించాలి భట్టిప్రోలు నుంచి కనగాల వరకు మురుగు కాలువల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్క, తూటికాడ తొలగించాలని అశోక్బాబు ధర్నా చేస్తే అతనిపై పోలీసులు జులం ప్రదర్శించటం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా అనేక పోరాటాలు, ఆందోళనలు చేపడుతున్న అశోక్బాబుకు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలుస్తున్నారన్నారు. రేపల్లె పట్టణ సీఐ మల్లికార్జునరావు అధికారిగా కాకుండా కూటమి కార్యకర్తగా వ్యవహరిస్తున్నాడని, భవిష్యత్లో ఇబ్బందులు పడక తప్పదని హెచ్చరించారు. అశోక్బాబుపై వ్యక్తిగత దాడి చేయటం సీఐ అవివేకానికి నిదర్శనం అన్నారు. అశోక్బాబుకు ఏమైనా జరిగితే చంద్రబాబు, లోకేష్లు బాధ్యత వహించాలన్నారు. ఆయన వెంట పార్టీ పట్టణ, మండల కన్వీనర్లు కరేటి శేషగిరిరావు, మేడికొండ అనిల్, జిల్లా అధికారి ప్రతినిధి కేవీ కృష్ణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు చదలవాడ శ్రీనివాసరావు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ చిత్రాల ఓబేదు, నాయకులు చిమటా బాలాజీ, బొర్రా శ్రీనివాసరావు, యార్లగడ్డ మదన్మోహన్,వీసం నాగలక్ష్మి, సజ్జా పద్మావతి, లియాకత్ బాషా తదితరులు ఉన్నారు. -
పొగాకు కొనుగోళ్లు బంద్
యడ్లపాడు: పొగాకు కొనుగోళ్లు నిలిచిపోయాయి. కొనుగోళ్లు కేంద్రం ఏర్పాటు ముణ్నాళ్ల ముచ్చటగా మిగింది. రైతన్న ఆశ ఆవిరైంది. మండలంలోని స్పైసెస్పార్కులో ఏర్పాటు చేసిన నల్లబర్లీ రకం పొగాకు కొనుగోలు కేంద్రం వారం రోజులుగా మూతపడింది. పొగాకు బేళ్లతో ప్రస్తుతం ఉన్న వేర్హౌసింగ్ గోదాము నిండుకుందని, మరో గోదాము చూసే వరకు కొనుగోళ్లు నిలిపి వేసినట్లు అధికారులు చెబుతున్నారు. యాప్లో నమోదు చేసుకున్నా... పంట అమ్మకం కోసం గ్రామ సచివాలయంలో సీఎం యాప్లో నమోదు చేసుకుని నెలలు గడుస్తున్నా.. కొనుగోలు తేదీ ఖారరు కావడం లేదు. నెలల తరబడి పొగాకు బేళ్లు అమ్ముడు కాక, తమ ఇళ్లల్లో ఉంచుకునే జాగా లేక రోడ్ల వెండి, పంట పొలాల్లో పరదాలు కప్పి నిల్వ చేసుకున్నారు. ఒకవైపు అప్పులు భారం, మరోవైపు వర్షానికి పొగాకు తడుస్తుందనే భయం.. అన్నింటికీ మించి ఎప్పుడు ఎంతకు అమ్ముడు పోతుందోననే ఆందోళనతో రైతులు మానసిక వేదనకు గురవుతున్నారు. టీడీపీ నేతల సిఫార్సులకే తొలి ప్రాధాన్యం రైతులకు కేంద్రం వద్దకు ఎప్పుడు, ఎంత మోతాదులో తీసుకురావాలో ముందస్తు సమాచారాన్ని ఫోన్కు ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తామని జిల్లా కలెక్టర్ కొనుగోలు కేంద్రం ప్రారంభం సందర్భంగా ప్రకటించారు. కానీ ముందస్తు నమోదు చేసుకున్న వారికంటే ముందుగా నేతల సిఫార్సుతో అధికార పార్టీ వారివి కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు వాపోతున్నారు. సీఎం యాప్లో నమోదు చేసి 40–50 రోజులు దాటినా నేటికీ తమ పేర్లు రాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు యడ్లపాడులోని పొగాకు కేంద్రాన్ని సందర్శించి ఇంత మందకోడిగా కొంటే ఎలా అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. చిలకలూరిపేట మార్కెట్యార్డులోని కేంద్రం వద్ద కమ్మవారిపాలెంకు చెందిన రైతు కిలారు పుల్లారావు తన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించలేదంటూ ఆవేదనతో తెచ్చిన బేళ్లనుంచి 10 కేజీల పొగాకును కేంద్ర వద్ద కాల్చిన విషయం తెలిసిందే. అధికారులు ఏమంటున్నారంటే... ఈ విషయంపై పొగాకు బయ్యర్లను, వ్యవసాయ అధికారులను వివరణకు కోరగా తాజాగా చిన్న, సన్నకారు రైతుల నుంచి పొగాకు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. యాప్లో ముందుగా నమోదు చేసుకున్నా వారిలో 20 క్వింటాళ్లలోపు వారివే కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నాం. ఆ తర్వాత 30 క్వింటాళ్లు, 40, 50, 70, 100 ఇలా వరుస క్రమంలో కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. కొత్తగా సత్తెనపల్లిలో కేంద్రం ఏర్పాటు చేశాం. త్వరలో యడ్లపాడు పరిధిలో కొనేందుకు గోదాముల్ని చూస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. గోదాములు నిండాయని కేంద్రం మూసివేత అనుకూల గోదాము లభించాక ఏర్పాటు చేస్తామని ప్రకటన అప్పటి వరకు సత్తెనపల్లి కేంద్రంలో కొనుగోలు చేస్తామని అధికారుల వెల్లడి -
‘కార్పొరేట్’లకు కారుచౌకగా భూములు
తాడేపల్లి రూరల్: కార్పొరేట్ సంస్థలకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రూ.కోట్ల విలువైన భూములను కారుచౌకగా కట్టబెడుతోందని సీపీఎం మండిపడింది. ఈ మేరకు ఆ పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి వై.నేతాజీ ఆరోపించారు. ఆదివారం రాజధాని డివిజన్ కమిటీ సమావేశాన్ని ఉండవల్లిలోని పార్టీ కార్యాలయంలో కుంభ ఆంజనేయులు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన వై. నేతాజీ మాట్లాడుతూ.. రాజధాని అమరావతిలో ప్రభుత్వ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం 63 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్ధలు, ప్రైవేటు సంస్ధలకు భూములు కేటాయించారన్నారు. ఇప్పటికీ 55 సంస్థలు అసలు నిర్మాణ పనులే ప్రారంభించలేదని విమర్శించారు. రాజధాని రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో అభివృద్ధి పనులు ఎప్పుడు ప్రారంభిస్తారో తెలపాలని కోరారు. పనులు చేపట్టని ఆయా సంస్థలకు కేటాయించిన భూముల వద్ద నిరసన కార్య క్రమాలు చేపడతామని హెచ్చరించారు. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు ప్రజలపై భారాన్ని మోపారని విమర్శించారు. ప్రజా సమస్యలను వదిలేసి కార్పొరేట్ సంస్థల చుట్టూ పాలకులు ప్రదక్షిణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో పార్టీ రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం.రవి, డివిజన్ నాయకులు టి.బక్కిరెడ్డి, ఎం.భాగ్యరాజు, జె.నవీన్ ప్రకాష్, పేరం బాబూరావు, గైరబోయిన నాగేశ్వరరావు, అత్తలూరి వీర వెంకయ్య, పార్వతి, కె.రామకృష్ణ, షేక్ఖాదర్ బాబా తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ తీరుపై సీపీఎం మండిపాటు పాలనను గాలికొదిలేసి వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తోందని ఆగ్రహం -
అన్నీ గుర్తు పెట్టుకుంటాం: అంబటి రాంబాబు
సాక్షి, బాపట్ల: రేపల్లె ఆసుపత్రిలో వైఎస్సార్సీపీ నేత వరికూటి అశోక్బాబు దీక్ష కొనసాగుతోంది. ఆయన్ను ఆదివారం.. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడుతూ.. అశోక్ బాబు ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా మారిందన్నారు. ‘‘రైతుల సమస్య పరిష్కారం అయ్యే వరకు నిరాహార దీక్ష విరమించనని అశోక్ బాబు అంటున్నారు. మూడు రోజుల నుంచి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా దీక్ష చేస్తున్నారు’’ అని అంబటి రాంబాబు చెప్పారు.‘‘వేమూరు నియోజకవర్గంలో రైతులంతా కలిసి కాలువలో గుర్రపు డెక్కతో తమ పడుతున్న ఇబ్బందిని అశోక్ బాబు దృష్టికి తీసుకువచ్చారు. ఆయన కాలువలో గుర్రపు డెక్క తొలగించాలంటూ రెండు రోజులు పాటు అక్కడే దీక్ష చేశారు. అధికారులు స్పందించట్లేదు. కనీసం కాలువల్లో గుర్రపు డెక్క కూడా తీయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. కాలువలో గుర్రపు డెక్క ప్రభుత్వం తొలగించాలి. ప్రభుత్వానికి చేతకాకపోతే గుర్రపు డెక్క తొలగించడానికి రైతులకు అవకాశం ఇవ్వాలి’’ అని అంబటి రాంబాబు అన్నారు.రేపల్లె టౌన్ సీఐ మల్లికార్జునరావు.. అశోక్బాబు పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. అశోక్బాబు పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించాడు. అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడిన అధికారులను కచ్చితంగా మేము గుర్తుపెట్టుకుంటాం’’ అని అంబటి రాంబాబు హెచ్చరించారు. -
గ్రానైట్ క్వారీ ప్రమాదంపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
సాక్షి,తాడేపల్లి: బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలోని గ్రానైట్ క్వారీ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మృతి చెందడంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.గ్రానైట్ క్వారీ అంచు విరిగిపడి ఒడిశాకు చెందిన కార్మికులు,పొట్టకూటి కోసం వచ్చి మృతి చెందడం బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బల్లికురవ మండలంలోని ఓ గ్రానైట్ క్వారీలో ఆదివారం దయం బండరాయి జారి పడటంతో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 16 మంది గాయపడ్డారు. మృతులను ఒడిశాకు చెందిన వారిగా గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
బీజేపీ ప్రభుత్వం ఏ సమస్య పరిష్కరించలేదు
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు చిలకలూరిపేట: కేంద్రంలో 11 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క సమస్య పరిష్కరించలేదని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు విమర్శించారు. పట్టణంలోని కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో శనివారం సీపీఐ ఏరియా మహాసభ నిర్వహించారు. ముప్పాళ్ల మాట్లాడుతూ రైతులు ఆప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు అధికారం లేనప్పుడు ఒక విధంగా అధికారం వచ్చిన తర్వాత మరోవిధంగా ఉంటారని విమర్శించారు. ఇచ్చిన హామీల మేరకు పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో మూ డు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు నివా స స్థలం ఇవ్వాలన్నారు. సీపీఐ కార్యదర్శివర్గ సభ్యు డు జంగాల అజయ్కుమార్ మాట్లాడుతూ ఆనా డు లోకేష్ స్మార్ట్ మీటర్లు బద్ధలు కొట్టమని చెప్పా రని ఇప్పుడు అందుకు విరుద్ధంగా స్మార్ట్ మీటర్లు కొనసాగిస్తున్నారని విమర్శించారు. పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.మారుతీవరప్రసాద్ మాట్లాడుతూ సీపీఐ జిల్లా ద్వితీయ మహాసభలు ఈనెల 7, 8 తేదీలలో వినుకొండలో నిర్వహిస్తున్నామని 7వ తేదీ మధ్యాహ్నం వేలాదిమంది ప్రజలతో భారీ ప్రదర్శ న, శివయ్య స్థూపం వద్ద బహిరంగసభ జరుగుతుందని, సభలను విజయవంతం చేయాలని కోరారు. నూతన కార్యవర్గ ఎంపిక... సీపీఐ ఏరియా కార్యదర్శిగా తాళ్లూరి బాబురావు, సహాయ కార్యదర్శిగా బొంతా ధనరాజ్, పట్టణ కార్యదర్శిగా చెరుకుపల్లి నిర్మలతో పాటు 11 మంది ఏరియా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. -
గొర్రెలు, మేకల పెంపకం సంఘానికి అన్యాయం
సంతమాగులూరు(అద్దంకి): కూటమి ప్రభుత్వం గొర్రెలు, మేకల పెంపక సంఘానికి రూపాయి కేటాయించలేదని ఆ సంఘ రాష్ట్ర కార్యదర్శి పెద్దబ్బాయి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే పూర్తిగా అమలు చేయలేదని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం 7వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని రాష్ట్ర కార్యదర్శి కిలారి పెద్దబ్బాయి పిలుపునిచ్చారు. శనివారం బాపట్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బల్లికురవ, సంతమాగులూరు మండలాల్లోని కొప్పెరపాడు, ఎస్ఎల్ గుడిపాడు, ఎంకే పాలెం, మామిళ్ళపల్లి తదితర గ్రామాల్లో పర్యటించి, మహాసభల కరపత్రాలు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ ఆగస్టు 17 ,18 వ తేదీల్లో ఒంగోలులో రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వృత్తి రక్షణ, వృత్తిదారుల సంక్షేమం కోసం ఈ మహాసభల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెంపకందార్లు ఎదుర్కొంటున్న సమస్యలు చర్చించి సమగ్ర కార్యాచరణ రూపకల్పన చేయబోతున్నట్లు తెలియజేశారు. రాష్ట్రంలో వ్యవసాయానికి అనుబంధంగా గొర్రెల పెంపకం జీవనాధారంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో రెండు కోట్ల 21 లక్షల గొర్రెల మేకల సంపద ఐదువేలకు పైగా పెంపకం దార్ల సహకార సంఘాలు, సుమారు నాలుగు లక్షల కుటుంబాలపైగా ఈ రంగంపై ఆధారపడి బతుకుతున్నారన్నారు. గ్రామీణ స్థాయిలో సొసైటీల్లో జిల్లా స్థాయిలో యూనియన్లు, రాష్ట్రాల్లో ఫెడరేషన్ ఏర్పాటు చేసినా, వాటికి తగిన నిధులు ప్రభుత్వాలు కేటాయింపు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ సమాజానికి బలమైన నాణ్యమైన, పౌష్టికాహారం అందిస్తున్న కీలకమైన రంగాన్ని ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం అన్యాయన్నారు. బీమా పథకాలు సరిగా అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మందులు, టీకాలు, డీ వార్మింగ్ కోసం బడ్జెట్లో నిధులు పెంచాల్సిన అవసరం ఉందని నా బార్డు ద్వారా 50% సబ్సిడీ రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలన్నారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి తోట తిరుపతిరావు, రాష్ట్ర బాధ్యులు పూసపాటి వెంకట్రావు, బాపట్ల జిల్లా సంఘం కార్యదర్శి బుర్రి ఆంజనేయులు, చిమట సైదులు, పెద సింగరయ్య, తదితరులు పాల్గొన్నారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి పెద్దబ్బాయి -
రైతులను ఆదుకోవడంలో కూటమి సర్కార్ విఫలం
బాపట్లటౌన్: రైతులను ఆదుకోవడంలో కూటమి సర్కారు ఘోరంగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ పి.రాంబాబు విమర్శించారు. శనివారం పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పొగాకు రైతులను ఆదుకోవడంలో కూటమి సర్కారు విఫలమైందన్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం 20 మిలియన్ టన్నుల పొగాకునే రైతుల నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఒక్కొక్క రైతు నుంచి 20 కింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయాలని తీర్మానించడంతో మిగతా పొగాకు ఎవరు కొంటారు ఎప్పటికీ కొంటారనే రైతులు లబోదిబోమంటున్నారన్నారు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 56 మంది పొగాకు రైతులు మృతి చెందారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చల్లా రామయ్య, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షులు మరుప్రోలు కొండలురెడ్డి, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు జోగి రాజా, బీసీ సెల్ నాయకులు శాయిల మురళి, తన్నీరు అంకమ్మరావు, పిల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోని వైనం వైఎస్సార్ సీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ పాలెపోగు రాంబాబు -
తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిన బళ్ళారి
నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిన మహోన్నత వ్యక్తి బళ్ళారి రాఘవ అని జిల్లా ఎస్పీ సతీష్కుమార్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో శనివారం బళ్ళారి రాఘవ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సతీష్కుమార్ మాట్లాడుతూ తెలుగు నాటక రంగానికి కొత్త ఒరవడిని తీసుకొచ్చిన ప్రఖ్యాత సాహితీవేత్త, నాటకకారుడు అని అన్నారు. ఆయన రచించిన రఘునందన, హరిశ్చంద్ర, ద్రౌపది వంటి క్లాసిక్ నాటకాలకు నాట్యరంగంలో చరిత్రాత్మక స్థానం దక్కాయని చెప్పారు. తెలుగు నాటక రంగానికి నూతన శైలిని పరిచయం చేశారని పేర్కొన్నారు. నాటక ప్రదర్శనల్లోని పాత్రల్లో జీవం పోసే మేటి నటుడిగా పేరు గడించారని అన్నారు. కార్యక్రమంలో ఏఓ అద్దంకి వెంకటేశ్వరరావు, సూపరింటెండెంట్లు శంకరరావు, సుభాషిణి, ఎంటీ ఆర్ఐ శ్రీహరిరెడ్డి పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
బళ్లారి రాఘవ జీవితం స్ఫూర్తిదాయకం
ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్ బాపట్ల: ప్రముఖ0 రంగస్థల నటుడు, సామాజిక సంస్కర్త బళ్లారి రాఘవ జయంతిని పురస్కరించుకొని బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ గంగాధర్గౌడ్, , ఆర్డీవో గ్లోరియా, డిప్యూటీ కలెక్టర్ నాగిరెడ్డి, తహసీల్దార్ షేక్ షాలీమా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని రాఘవ చిత్రపటానికి పూలమాల వేశారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ బళ్లారి రాఘవ కేవలం నటుడేగాక సామాజిక విలువలకు ప్రాధాన్యమిచ్చిన కళాకారుడని పేర్కొన్నారు. భావోద్వేగాలకు, వాస్తవికతకు ప్రాధాన్యమిచ్చిన ఆయన నాటకాలు సమాజాన్ని చైతన్యపరిచేలా ఉన్నాయని కొనియాడారు. కళను వినోదంగా కాకుండా సామాజిక మార్పు కోసం వేదికగా వాడిన ఘనత రాఘవదేనన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. -
న్యాయమైన హక్కులను కాపాడాలి
గుంటూరు వెస్ట్: ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవచూపాలని ఫ్యాప్టో జిల్లా చైర్మన్ కె.నరసింహారావు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక కలెక్టరేట్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల, పెన్షనర్ల దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం శోచనీయమన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు రావాల్సిన ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర కార్యక్రమాల నుంచి విముక్తి కలిగించాలన్నారు. బదిలీ అయిన ఉపాధ్యాయులకు తక్షణమే జీతాలు చెల్లించాలన్నారు. 12వ పీఆర్సీ, మధ్యంతర భృతి, కారుణ్య నియామ కాలు, సీపీఎస్ రద్దు, మున్సిపల్ ఉపాధ్యాయుల జీపీఎఫ్ సమస్యలను పరిష్కరించాలన్నారు. అంతర్ జిల్లాల బదిలీలు చేపట్టడంతోపాటు ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలని తెలిపారు. 18 రకాల డిమాండ్ల సాధన కోసం ధర్నా నిర్వహిస్తున్నామని నరసింహారావు తెలిపారు. అనంతరం డీఆర్వో షేక్ ఖాజావలికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వీరాంజనేయులు, కో–చైర్మన్ బి.సత్యం, రాజశేఖర్, జి.వేళాంగిణి, తిరుమలేష్, పెదబాబు తదితరులు పాల్గొన్నారు. ఫ్యాప్టో జిల్లా చైర్మన్ నరసింహారావు -
ముగ్గురిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు
పొన్నూరు: ఆర్థిక లావాదేవీల విషయంలో ఏర్పడిన వివాదంలో ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పలు సెక్షన్లతో కేసు నమోదు చేసినట్లు పొన్నూరు పట్టణ ఎస్ఐ శ్రీహరి తెలిపారు. మునిపల్లె గ్రామానికి చెందిన గొడ్డేటి శ్యాంకుమార్కు వట్టికూటి సత్య సాయిబాబు, వట్టికూటి వెంకట రామానాయుడు, గుత్తికొండ రాజేష్లకు ధాన్యానికి సంబంధించిన సుమారు రూ.40 లక్షల బాకీ విషయంలో వివాదం నెలకొంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని నేపథ్యంలో శ్యాంకుమార్ జిల్లా ఎస్పీ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఏడాది మే 8వ తేదీన ఆ ఫిర్యాదు రూరల్ పోలీస్స్టేషన్లో విచారణకు రావడంతో పోలీసుస్టేషన్ ఎదుట ఇరువర్గాలు మాట్లాడుకునే క్రమంలో వాగ్వాదం జరిగింది. తనను కులం పేరుతో దూషించారని శ్యాంకుమార్ ఫిర్యాదు చేశాడు. స్టేషన్ బయట రోడ్డుపై జరగడంతో శ్యాంకుమార్ ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ మెకానిక్ మృతి అద్దంకి: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టిన ఘటనలో ట్రాక్టర్ మెకానిక్ మృతి చెందాడు. ఈ ఘటన పట్టణంలోని కలవకూరు రహదారిలో శనివారం జరిగింది. అందిన సమాచారం మేరకు బల్లికురవ మండలం వల్లాపల్లి గ్రామానికి చెందిన అల్లా ఉద్దీన్ (45)ట్రాక్టర్ మెకానిక్గా పని చేస్తున్నాడు. ఇతను అద్దంకి పట్టణంలో ఒక షెడ్ ఏర్పాటు చేసుకుని ట్రాక్టర్లు రిపేర్ చేస్తుంటాడు. ప్రతి రోజూ అద్దంకి వచ్చి రాత్రికి తిరిగి వెళుతుంటాడు. ఈ క్రమంలో అద్దంకి నుంచి బైక్పై స్వగ్రామం వెళుతుండగా కలకూరు రహదారిలో కారు, బైక్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో మెకానిక్ మృతి చెందాడు. మృతునికి భార్య ఫాతిమా బీ, ఇద్దరు పిల్లలున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి ● పాఠశాలల్లో విద్యార్థి సంఘాల ప్రవేశాన్ని నిషేధించిన ఉత్తర్వులు దహనం చేసిన ఏఐఎస్ఎఫ్ లక్ష్మీపురం(గుంటూరువెస్ట్): విద్యార్థుల హక్కులను హరించేలా పాఠశాలల్లో విద్యార్థి సంఘాలు, ఇతర రాజకీయ పార్టీలు ప్రవేశించకుండా నిషేధిస్తూ ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన ఉత్తర్వులను అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ తీవ్రంగా ఖండించారు. గుంటూరు కొత్తపేట భగత్ సింగ్ విగ్రహం సర్కిల్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ ఉత్తర్వులు విద్యార్థి హక్కులపై దాడిగా భావిస్తూ, తక్షణమే వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు చెప్పడతామని హెచ్చరించారు. మిరప పంటకు బీమా గడువు పొడిగింపు నరసరావుపేట రూరల్: మిరప సాగుచేసే రైతులకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం గడువు తేదీని పెంచినట్టు పల్నాడు జిల్లా ఉద్యానశాఖ అధికారి ఐ.వెంకట్రావు శనివారం తెలిపారు. మిరప సాగు చేసే రైతులు ఎకరాకు రూ.360లు ప్రీమియం చెల్లించినట్టయితే బీమా మొత్తం రూ.90వేలు వర్తిస్తుందని వివ రించారు. పంటల సాగు కోసం బ్యాంకుల నుంచి రుణాలు పొందే వారికి బ్యాంకులే ప్రీమి యం వసూలు చేసి బీమా కంపెనీకి చెల్లి స్తాయని తెలిపారు. బ్యాంకు రుణం పొందిన వారికి ఈనెల 31వ తేదీ వరకు గడువు పొడిగించినట్టు తెలిపారు. పంట రుణాలు తీసుకోని రైతులు తమ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్, పోస్ట్ ఆఫీస్ల ద్వారా ఆన్లైన్లో ప్రీమియం చెల్లించవచ్చని సూచించారు. -
తల్లిదండ్రుల చెంతకు తప్పిపోయిన బాలుడు
● గంటల వ్యవధిలోనే కేసు ఛేదించిన పోలీసులు ● క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగింత కారంచేడు: ఇంటి వద్ద ఆడుకుంటూ బయటకు వచ్చిన నాలుగు సంవత్సరాల బాలుడు తప్పిపోయాడు. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు, బంధువులు కారంచేడు పోలీస్లకు సమచారం అందించారు. రంగంలోకి దిగిన కారంచేడు ఎస్ఐ షేక్ ఖాదర్బాషా తమ సిబ్బందితో మూడు టీంలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గంటల వ్యవధిలోనే బాలుడిని క్షేమంగా వారి తల్లిదండ్రులకు అప్పగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన వివరాలు... కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామానికి చెందిన చింతా సుబ్బారావు తన కుమారుడు ఎప్పటిలాగానే ఆడుకుంటూ బయటకు వచ్చాడు. ఎవరూ గమనించకపోడవంతో బాలుడు కుంకలమర్రు–చీరాల మధ్య షటిల్ సర్వీస్గా తిరిగే పల్లెవెలుగు బస్సు ఎక్కేశాడు. బస్సులో ప్రయాణికులు, కండక్టర్ కూడా గమనించలేదు. చీరాలలో బస్సు దిగిన బాలుడు మరలా చిలకలూరిపేట వైపు వెళ్లే పల్లె వెలుగు బస్సు ఎక్కి పర్చూరులో దిగాడు. ఈ విషయం జరిగిన వెంటనే బాలుని అమ్మమ్మ పొత్తూరి కాంతమ్మ మరికొంత మంది వెతుకుతూ ఉండగా అదే గ్రామానికి చెందిన మరియమ్మ అనే మహిళ బాలుడు బస్సు ఎక్కడం గమనించానని తెలిపింది. వెంటనే వారు కారంచేడు ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. ఎస్ఐ బాలుడి ఫొటోను సోషల్మీడియా, సమీప పోలీస్స్టేషన్లకు అందించారు. అది గమనించిన పర్చూరు ఎస్ఐకి బాలుడు కనిపించడంతో వెంటనే కారంచేడు ఎస్ఐకి సమాచారం అందించారు. ఉదయం 11 గంటల సమయంలో మిస్ అయిన బాలుడిని ఒంటి గంటకు కనుగొని తల్లిదండ్రులకు అప్పగించారు. కేవలం గంటల వ్యవధిలోనే బాలుడిని అప్పగించారు. బాలుడి ఆచూకీ కోసం కృషి చేసిన ఎస్ఐ షేక్ ఖాదర్బాషా, పోలీస్ సిబ్బందిని బాపట్ల ఎస్పీ తుషార్డూడీ ప్రత్యేకంగా అభినందించారు. -
వరికూటి ఉద్యమానికి బాసటగా రైతులు
బాపట్ల జిల్లావ్యాప్తంగా ఉన్న పరిస్థితిని ఎత్తిచూపి ఇప్పటికే కాలువలకు నీరు విడుదల అయినందున తక్షణం అన్ని ప్రాంతాల్లోనూ పూడికతీత పనులు చేపట్టాలని వైఎస్సార్ సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయినా అధికారులు స్పందించకపోవడంతో పది రోజుల కిందట నేరుగా కాలువలోకి దిగి పరిస్థితిని అధికారుల కళ్లకు కట్టారు. ఆ తర్వాత కాలువలు శుభ్రం చేయకపోతే ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు. అంతటితో వదలక సమస్య పరిష్కరించకపోతే నిరవధిక నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. శుక్రవారం రేపల్లె ఇరిగేషన్ కార్యాలయం ఎదుట దీక్షకు దిగారు. పనులు చేసి లేదా చేస్తామని హామీ ఇచ్చి, తక్షణం పనులు మొదలుపెట్టి వరికూటితో దీక్ష విరమింప చేయాలే తప్ప అవేమీ చేయకుండా పోలీసులు వచ్చి అశోక్బాబును చుట్టుముట్టి బలవంతంగా ఎత్తుకెళ్లి పిడిగుద్దులతో కుళ్లపొడిచి సృహతప్పి పడిపోయేలా దాడి చేశారు. పార్టీలకతీతంగా రైతులకు న్యాయం చేయమని అడిగితే పోలీసులను పెట్టి కొట్టించడంపై రైతుల్లో తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. పార్టీలకతీతంగా అన్నదాతలు కొందరు ప్రత్యక్షంగా మరికొందరు పరోక్షంగా వరికూటికి మద్దతుగా నిలుస్తున్నారు. -
నాగార్జునకొండకు పోటెత్తిన పర్యాటకులు
విజయపురి సౌత్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండకు శనివారం పర్యాటకులు పోటెత్తారు. నాగార్జునసాగర్ డ్యాం 18 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో ఆంధ్రా–తెలంగాణ రాష్ట్రాల నుంచి పర్యాటకులు సాగర్కు చేరుకొని డ్యాం గేట్లు తిలకించిన అనంతరం నాగార్జునకొండకు చేరుకున్నారు. నాగసిరి, అగస్త్య లాంచీలలో కొండకు వెళ్లారు. దీంతో లాంచీస్టేషన్కు రూ.1,00,450 ఆదాయం చేకూరినట్లు టూరిజం అధికారులు తెలిపారు. కొండలోని మ్యూజియంలో ఉన్న బుద్ధుడి ప్రతిమలు, రాతి సామగ్రి, మట్టి కుండలు, 9 అడుగుల బుద్ధుని పాలరాతి విగ్రహం, మహాస్తూపం, అశ్వమేధ యాగశాల, స్నానాల గట్లు, బోది వృక్షం చూసి తన్మయత్వం చెందారు. అనంతరం పచ్చని కొండల మధ్య ఉన్న అనుపు, యాంపీ స్టేడియం, శ్రీరంగనాథస్వామి దేవాలయం, అనంతరం 60 అడుగుల ఎత్తు నుంచి జాలువారే ఎత్తిపోతల జలపాతాన్ని తిలకించారు. నాగార్జునసాగర్ డ్యాంపై గేట్ల నుంచి నీటిని విడుదల చేస్తుండటంతో నూతన బ్రిడ్జి, పాత వంతెన, లాంచీస్టేషన్, కృష్ణవేణి పుష్కర్ఘాట్ ప్రాంతాలు సందర్శకులతో కిటకిటలాడాయి. లాంచీస్టేషన్ వద్ద నాగార్జునకొండకు వెళ్ళి వస్తున్న పర్యాటకులు సాగర్ క్రస్ట్గేట్ల వద్ద సెల్ఫీలు దిగుతున్నసందర్శకులు -
అత్యధిక కేసులు పరిష్కారమయ్యేలా కృషి చేయాలి
రేపల్లె: సెప్టెంబర్ 13వ తేదీన జరిగే జాతీయ లోక్అదాలత్లో అత్యధిక కేసులు పరిష్కారమయ్యేలా పోలీసు అధికారులు కృషి చేయాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వి.దివ్యసాయి తెలిపారు. పట్టణంలోని సబ్కోర్టు హాలులో శనివారం కోర్టు పరిధిలోని పోలీసుస్టేషన్ల అధికారులతో సమావేశం నిర్వహించారు. దివ్యసాయి మాట్లాడుతూ పరిష్కరించదగిన కేసులను, రాజీ మార్గాన్ని ఎంచుకున్న కక్షిదారుల కేసులను, క్రిమినల్, సివిల్ ప్రీలిటిగేషన్ వంటి కేసులు లోక్ అదాలత్లో పరిష్కారమయ్యేలా పనిచేయాలని తెలిపారు. లోక్ అదాలత్లతో కక్షిదారులకు సమయం, డబ్బు ఆదా అవుతాయన్నారు. కక్షిదారులు తమ సమస్యలను లోక్అదాలత్లో పరిష్కరించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వి.గీతాభార్గవి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జీ.వెంకటగిరిధర్, సెక్రటరీ యు.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి దివ్యసాయి -
రేపల్లెలో బాలుడు కిడ్నాప్
రేపల్లె: బాలుడిని కిడ్నాప్ చేసిన నిందితుడిని రేపల్లె పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి గంటల వ్యవధిలో పట్టుకున్నారు. బాలుడిని తల్లికి అప్పగించారు. కేసు వివరాలను పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు శనివారం వెల్లడించారు. రేపల్లె పట్టణానికి చెందిన ఉప్పాల శ్రీలక్ష్మి, ప్రసాద్లకు ఆరేళ్ల కిందట వివాహమైంది. వీరికి 4 సంవత్సరాల బాలుడు భాను సిద్ధార్థ ఉన్నాడు. మనస్పర్థల కారణంగా భార్యాభర్తలు కొద్దికాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. పట్టణంలోని మూడో వార్డుకు చెందిన ముమ్మలనేని చరణ్ తనతో సహజీవనం చేయాలంటూ కొంత కాలంగా శ్రీలక్ష్మిని వేధిస్తున్నాడు. శ్రీలక్ష్మి నిరాకరించటంతో ఆమె కుమారుడిని కిడ్నాప్ చేసేందుకు చరణ్ పథకం పన్నాడు. భాష్యం స్కూలులో ఎల్కేజీ చదువుతున్న భానుసిద్ధార్థ శుక్రవారం సాయంత్రం స్కూలు నుంచి ఆటోలో ఇంటికి వెళ్తున్న క్రమంలో బలవంతంగా ఆటో నుంచి సిద్ధార్థను తీసుకుని చరణ్ పరారయ్యాడు. తల్లి శ్రీలక్ష్మి ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి నిందితుడు చరణ్ కోసం గాలింపు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిందితుడు విజయవాడలో ఉన్నట్లు గుర్తించారు. విజయవాడ బస్టాండ్లో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసి బాలుడిని సురక్షితంగా తల్లికి అప్పగించారు. గంటల వ్యవధిలో కేసును ఛేదించటంతో బాపట్ల ఎస్పీ తుషార్ డూడీ తమ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ మల్లికార్జునరావు, ఎస్ఐ రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. తల్లి ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడి గుర్తింపు విజయవాడలో అరెస్టు సురక్షితంగా తల్లి వద్దకు బాలుడిని చేర్చిన పోలీసులు -
రైతు సంక్షేమంతోనే దేశం సంక్షేమం
రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ రేపల్లె: రైతు సంక్షేమంతోనే దేశ సంక్షేమమన్న దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. పట్టణంలోని మార్కెట్ యార్డు కార్యాలయ ఆవరణలో శనివారం అన్నదాత సుఖీభవ నగదును రైతులకు పంపిణీ చేసి అనంతరం మాట్లాడారు. పథకం కింద ఎవరికై నా సందేహం ఉంటే 155251 కాల్ సెంటర్కు ఫోన్ చేసి పరిష్కారం చేసుకోవచ్చన్నారు. అనంతరం జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ వెంకట మురళి చేతుల మీదగా అన్నదాత సుఖీభవ నగదును విడుదల చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో నేలపు రామలక్ష్మి, తహసీల్దార్ ఎం.శ్రీనివాసరావు, ఏడీఏ అద్దేపల్లి లక్ష్మి, మున్సిపల్ చైర్పర్సన్ కట్టా మంగ, టీడీపీ నాయకులు పంతాని మురళీధరరావు, అనగాని శివప్రసాద్, గూడపాటి శ్రీనివాసరావు, జీవీ నాగేశ్వరరావు, మేకా వెంకట శివరామకృష్ణ, జీపీ రామారావు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ డెల్టాకు 7,508 క్యూసెక్కులు విడుదల దుగ్గిరాల: విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి శనివారం 7,508 క్యూసెక్కులు విడుదల చేసినట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవెల్కు 316, బ్యాంక్ కెనాల్కు 1,807, తూర్పు కాలువకు 749, పశ్చివ కాలువకు 283, నిజాంపట్నం కాలువకు 488, కొమ్మూరు కాలువకు 2,900 క్యూసెక్కులు విడుదల చేశారు. ఇక బ్యారేజీ నుంచి 1,89,625 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. వైభవంగా శ్రీనివాస కల్యాణం నగరంపాలెం(గుంటూరు వెస్ట్): స్థానిక ఆర్.అగ్రహారం కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శనివారం శ్రీనివాస కల్యాణం, పుష్పయాగం వైభవంగా నిర్వహించారు. కన్యకా పరమేశ్వరి భక్త బృందం, వామనాశ్రమ స్వామిజీ వారి ఆధ్వర్యంలో చేపట్టారు. వామనాశ్రమ స్వామీజీ మాట్లాడుతూ శ్రీనివాస కల్యాణం వల్ల వివాహా పవిత్రత, కుటుంబ విలువలు తెలుస్తాయని చెప్పారు. వేద పండితులు (తిరుపతి) శాస్త్రోక్తంగా కల్యాణం నిర్వహించారు. ప్రముఖ ప్రవచనకర్త అనంతలక్ష్మి (హైదరాబాద్) శ్రీనివాస వైభవాన్ని భక్తులకు తెలిపారు. అనంతరం స్వామిజీ భక్తులను ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందించారు. తటపర్తి రాంబాబు, నేరెళ్ల హరి, ఎల్ఎస్ఆర్.ఆంజనేయులు, మహంకాళి శ్రీనివాసరావు, బాపారావు, రఘు, జుజ్జూరు శ్రీనివాసరావు. త్రిపురమల్లు వాణి పాల్గొన్నారు. దర్గాలో నిర్మాణాలు కూల్చివేత పెదకాకాని: బాజీబాబా దర్గాలో శిథిలావస్థకు చేరిన గదుల నిర్మాణాలను వక్ఫ్బోర్డు అధికారులు పొక్లయిన్తో కూల్చివేయించారు. గత నెల 28న గుంటూరు జిల్లా పెదకాకాని బాజీబాబా దర్గాను సందర్శించిన వక్ఫ్బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ శిథిలావస్థకు చేరిన గదులు కూలితే భక్తులకు ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున ఆ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాల మేరకు దర్గా ఈఓ శనివారం షెడ్డును కూల్చివేయించారు. త్వరలో మాస్టర్ ఫ్లాన్ రూపొందించి నూతనంగా గదులను నిర్మించడం జరుగుతుందని ఈఓ తెలిపారు. -
ప్రశ్నిస్తే దాడులా..?
అన్నదాతల కష్టాలు తీర్చాలని కోరితే దాడులు చేసి కొడతారా? ఇదేమి దుర్మార్గం. ప్రభుత్వం వ్యవహరించే తీరిదేనా? అంటూ జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. సాగునీటి కాలువల్లో పూడిక పేరుకుపోయి, గుర్రపు డెక్క పెరిగి నీటిపారుదల సక్రమంగా లేదు. ఫలితంగా రైతులు ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంటను కోల్పోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ వేమూరు సమన్వయకర్త వరికూటి అశోక్బాబు దీక్ష చేపట్టారు. సమస్యను పరిష్కరించకపోగా ప్రభుత్వం భౌతికదాడులకు దిగింది. పచ్చనేతల ఆదేశాలతో అశోక్బాబుపై పోలీసులు దాడికి తెగబడడాన్ని ప్రజాస్వామికవాదులు ఖండిస్తున్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, బాపట్ల: జిల్లా వ్యాప్తంగా కృష్ణా, సాగర్ కాలువలతోపాటు చెరువులు, కుంటల కింద కాలువలు గుర్రపు డెక్క, తూటికాడ, పూడికతో నిండిపోయాయి. ఒకవైపు కాలువలకు నీరువదిలినా పంట పొలాలకు నీరు చేరే పరిస్థితి లేదు. ఎన్నికల సమయంలో రైతులపక్షమంటూ మాటలు చెప్పి అధికాంలోకి వచ్చిన కూటమి ఏరుదాటాక బోడిమల్లన్న చందంగా వ్యవహరిస్తూ.. ఏపని చేయక వంచనకు పాల్పడుతోంది. కాలువల్లో పూడిక తీయకపోతే సమీపంలో ఉండే పొలాలు తప్ప దూరంగా ఉన్న పంట పొలాలకు నీరు చేరే పరిస్థితి లేదు. వేమూరు నియోజకవర్గంలోని భట్టిప్రోలు మండలంలో గంగోలు కాలువలో మూడు కిలోమీటర్లమేర గుర్రపు డెక్క, తూటికాడ పెరిగింది. వేమూరు మండలం జంపని డ్రెయిన్లతోపాటు అన్ని కాలువల్లో ఇదే పరిస్థితి. రెండువారాల కిందట మండలంలోని చంపాడు వద్ద కాలువలోని తూటికాడలో ఇరుక్కొని పోతుమర్రికి గ్రామం రైతుకు చెందిన మూడు గేదెలు మృతిచెందాయి. ముందుకు కదిలే దిక్కు లేదు.. రేపల్లె నియోజకవర్గంలోని రేపల్లె, నగరం, నిజాంపట్నం, చెరుకుపల్లి మండలాల పరిధిలోని వాడమురుగు డ్రెయిన్, జగజ్జేరు కాలువ, రేపల్లె ఓల్డు కోర్సు, న్యూకోర్సు, ఆర్ఎం డ్రెయిన్, బీఎం డ్రెయిన్లలో పూడికతోపాటు గుర్రపు డెక్క, తూటికాడ పెరిగింది. కాలువలకు నీటిని విడుదల చేసినా సక్రమంగా పంటలకు చేరే పరిస్థితి లేదు. బాపట్ల నియోజకవర్గంలో తూర్పు శాంప్, నల్లమడ, తుంగభద్ర, భీమునికుంటవాగు, మరుపురోలువారిపాలెం స్ట్రెయిట్కట్ ప్రధాన కాలువలతోపాటు వాటి పరిధిలోని పంటకాలువలు మొత్తం పూడిక, తూటికాడ, గుర్రెపుడెక్క, నాచుతో నిండిపోయాయి. అరకొరగా పనులు అద్దంకి నియోజకవర్గం పరిధిలో సంతమాగులూరు మొదలుకొని కొరిశపాడు మండలం పమిడిపాడు వరకు అద్దంకి బ్రాంచ్ కెనాల్, పర్చూరు ప్రాంతంలోని పర్చూరు బ్రాంచ్ కెనాల్ పరిధిలోని సాగర్ కాలువల పరిధిలో కొంతమేర కాలువ పూడికతీత లైనింగ్ పనులు చేసినా మిగిలిన పనులు పెండింగ్లో ఉన్నాయి. వీటితోపాటు కాలువల్లో డ్రాపుల రిపేరు పనులను ప్రభుత్వం పట్టించుకోలేదు. చీరాల నియోజకవర్గ పరిధిలోనూ కాలువల ఆధునికీకరణ పనులు పెండింగ్లో ఉన్నాయి. చివరి ఆయకట్టులో పూడికతీత పనులనూ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఏడాదిగా కాలువలను పట్టించుకోని ప్రభుత్వం పెరిగిపోయిన గుర్రపు డెక్క, తూటికాడ పంట కాలువల్లో పేరుకుపోయిన పూడిక పంటలకు నీరందక ఇబ్బందులు పడుతున్న రైతులు కాలువలు పూడిక తీసి రైతులను ఆదుకోవాలంటూ పది రోజులుగా ఆందోళన ప్రభుత్వం స్పందించకపోవడంతో నిరవధిక దీక్షకు దిగిన వరికూటి వరికూటిపై దాడిచేసి కొట్టిన పోలీసులు ప్రభుత్వ తీరుపై సర్వత్రా ఆగ్రహం ఆస్పత్రిలో కొనసాగుతున్న అశోక్కుమార్ దీక్ష పోలీసులు దౌర్జన్యం చేసి దాడికి తెగబడినా అశోక్బాబు ఆస్పత్రిలోనే దీక్షను కొనసాగిస్తున్నారు. కాలువలు బాగుచేసి రైతులను ఆదుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు కార్యకర్తలు వరికూటికి మద్దతుగా నిలిచి ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారు. ఈ ఉద్యమం మరింత ఉధృతంగా కాకముందే ప్రభుత్వం తప్పు తెలుసుకొని తక్షణం సాగునీటి కాలువల్లో పూడిక తొలగించే పనులకు శ్రీకారం చుట్టాలని జిల్లా రైతాంగం కోరుతోంది. కొనసాగుతున్న దీక్ష -
మధ్యవర్తిత్వంపై ముగిసిన 40 గంటల శిక్షణ
గుంటూరు లీగల్: సుప్రీం కోర్టు మీడియేషన్, కన్సలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ న్యూఢిల్లీ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, గుంటూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్రాష్ట్ర హైకోర్టు ఎంపిక చేసిన ప్లాపస్ చైర్మన్న్లు, మెంబెర్స్కు మధ్యవర్తిత్వంపై 40 గంటల శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ అధ్యక్షత వహించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్చార్జి చైర్మన్, ఒకటో జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.ఏ.ఎల్.సత్యవతి మాట్లాడుతూ 40 గంటల శిక్షణను విజయవంతంగా పూర్తి చేసినందుకు అందరికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ప్లాపస్ చైర్మన్ జి.రజిని మాట్లాడుతూ శిక్షకులు మీడియేషన్పై అవగాహన కల్పించారని, ఓర్పు, నైపుణ్యంతో అన్ని అనుమానాలను నివృత్తి చేశారని కృత/్ఞతలు తెలిపారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా చైన్నె నుంచి శిక్షణ కోసం నియమించిన న్యాయవాది, సీనియర్ ట్రైనర్ రత్నతార, న్యాయవాది, సీనియర్ ట్రైనర్ సత్యారావు, గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.ఏ.ఎల్. సత్యవతి, గురజాల పదో అదనపు జిల్లా జడ్జి జి.ప్రియదర్శిని సత్కరించారు. -
రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ పురస్కార దరఖాస్తుల స్వీకరణకు గడువు
గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఈనెల 8వ తేదీలోపు దరఖాస్తు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అర్హులైన ఉపాధ్యాయులు దాఖలు చేసిన ప్రతిపాదనలను డివిజినల్ స్థాయిలో ఉప విద్యాశాఖాధికారి చైర్మన్గా నలుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీ జిల్లాస్థాయి కమిటీకి ఈనెల 12వ తేదీలోపు విధిగా సమర్పించాలని ఆదేశించారు. జిల్లాస్థాయి కమిటీ ద్వారా ఉపాధ్యాయుల తుది జాబితాను రాష్ట్రస్థాయి కమిటీకి ఈనెల 16లోపు సమర్పించాల్సి ఉందని తెలిపారు. ఈనెల 8వ తేదీ తరువాత సమర్పించే దరఖాస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబడవని స్పష్టం చేశారు. హత్య కేసులో వ్యక్తికి యావజ్జీవ శిక్ష గుంటూరు లీగల్: భార్య హత్య కేసులో భర్తకు యావజ్జీవ శిక్ష, రూ.3 వేలు జరిమానా విధిస్తూ రెండో అదనపు జిల్లా కోర్టు జడ్జి వై.నాగరాజా శుక్రవారం తీర్పునిచ్చారు. వివరాలు.. అగతవరప్పాడుకు చెందిన తోట ఏడుకొండలు కుమార్తె శారద(26)ను అదే గ్రామానికి చెందిన గవిరిబోయిన శివశంకర్తో 2009 మే 6న వివాహం జరిపించారు. శివశంకర్, ఆర్మీలో పనిచేస్తున్నాడు. శివశంకర్ సెలవులో ఇంటికి వచ్చిన సమయంలో, అతడి కుటుంబ సభ్యుల ప్రభావంతో భార్య శారదపై అనుచిత ఆరోపణలు చేయడంతో వివాదం చోటుచేసుకుంది. ఈ వివాదం పెద్దల మధ్య రాజీ కుదిరినా, ఆ తరువాత శారద తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. అప్పట్లో నెలకి శివశంకర్ రూ.3000 చెల్లించడానికి అంగీకరించగా, శారద రూ.6,000 అడిగిన నేపథ్యంలో ఘర్షణ చోటుచేసుకుంది. 2015 జూలై 26 న శివశంకర్ తన భార్య శారదపై కత్తితో దాడి చేసి ఆమెను హత్య చేశాడు. ఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మల్లేశ్వరి అనే మహిళ గాయపడింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో విచారించిన రెండవ అదనపు జిల్లా కోర్టు జడ్జి మొదటి నిందితుడు గవిరిబోయిన శివశంకర్ను యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.3వేలు జరిమానా విధించారు. రెండో నిందితురాలు గవిరిబోయిన సుబ్బమ్మ మృతి చెందడంతో కేసు ముగించారు. రెండు లారీలు ఢీకొని డ్రైవర్లకు గాయాలు వినుకొండ: వినుకొండ మండలం చీకటిగలపాలెం మోడల్ స్కూల్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మూడు లారీలు ఒకదానికొకటి ఢీకొనగా ఇద్దరు లారీ డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు... తెల్లవారుజామున ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు మొదట ఢీకొన్నాయి. వాటిని వెనుక నుంచి వేగంగా వస్తున్న మరో లారీ ఢీకొనడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ ఘటనలో లారీల ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యాయి. స్థానికులు 108కి సమాచారం తెలపడంతో గాయపడిన ఇద్దరు డ్రైవర్లను ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రమాదానికి గురైన వాహనాలను సంఘటనా స్థలం నుంచి పక్కకు జరిపించారు. డ్రైవర్లను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసుకుని దార్యప్తు చేస్తున్నారు. కేవలం రూపాయికే బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఫ్రీడమ్ నరసరావుపేట: భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) సరికొత్త ఫ్రీడం ప్లాన్, కేవలం రూ.1తో 30 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత కాలింగ్, రోజుకు 2 జీబి డేటా, రోజుకు 100 మెసేజ్లు, ఉచిత సిమ్కార్డు ఇవ్వబడుతుందని గుంటూరు బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ శ్రీ సప్పరపు శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియచేశారు. ఎం.యన్.పి. వినియోగదారులకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని, కావున అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, సిమ్ కార్డు కావలసిన వారు దగ్గరలోని బీఎస్ఎన్ఎల్ సేవా కేంద్రాన్ని సంప్రదించవలసినదిగా కోరారు. -
స్మార్ట్ మీటర్లు రద్దు చేయండి
జె.పంగులూరు: స్మార్ట్ మీటర్లు వెంటనే రద్దు చేయాలని, విద్యుత్ చార్జీల నిలువు దోపిడీ ఆపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గంగయ్య డిమాండ్ చేశారు. ప్రమాదకర స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలనే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పంగులూరు ప్రధాన కూడలిలో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి గంగయ్య మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి పార్టీలు కరెంటు చార్టీలపై బాదుడే, బాదుడు కార్యక్రమం చేసిందన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన తరువాత సార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి ప్రజలను బాదుతున్నారన్నారు. సంవత్సర కాలంలో కరెంట్ బిల్లులు పెరిగిపోయి జనం గగ్గోలు పెడుతున్నా, కూటమి ప్రభుత్వం కరెంటు చార్టీలు పెంచలేదంటూ మోసగిస్తోందన్నారు. ఆదాయం పెరగక, కరెంటు బిల్లులు కట్టలేక జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆదనపు లోడు పేరుతో డెవలప్మెంట్ చార్టీలు, వినియోగదారుల డిపాజిట్ల సాకుతో వేల రూపాయలు దొడ్డిదారిని వసూలు చేస్తూనే ఉన్నారన్నారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఈ పాటికే ప్రభుత్వ కార్యాలయాల్లో, దుకాణాలలో స్మార్ట్ మీటర్లు బిగించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు రాయిని వినోద్బాబు, తలపనేని రామారావు, ఆదుమ్ సాహేబ్, సుధాకర్, పి. ఏలియా తదితరులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి గంగయ్య డిమాండ్ -
బీజామృతంతో విత్తనశుద్ధి చేస్తే తెగుళ్లు దూరం
నరసరావుపేట రూరల్: బీజామృతంతో విత్తన శుద్ధి చేసి విత్తడం వలన మొక్కలకు తెగుళ్లు నుంచి తట్టుకునే శక్తి పెరుగుతుందని ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కె.అమలకుమారి తెలిపారు. ప్రకృతి వ్యవసాయ జిల్లా కార్యాలయంలో శుక్రవారం సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. అరుణకుమారి మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న సమయంలో రైతులు వరి నారుమళ్లకు సిద్ధమవుతున్నారని తెలిపారు. మంచి విత్తనం నాటితే మంచి దిగుబడి వస్తుందని ఖర్చు కూడా తగ్గుతుందని తెలిపారు. విత్తనాలు నాటే ముందు విత్తన శుద్ధి చేసి నాటడం వలన మొక్కలకు తెగుళ్లు నుంచి తట్టుకునే శక్తి పెరుగుతుందని వివరించారు. రైతులకు బీజామృతంతో విత్తన శుద్ధి వలన కలిగే లాభాలను వివరించాలని తెలిపారు. వరి, కూరగాయలు, మిరపతోపాటు ఏ రకమైన విత్తనాలైనా సరే బీజామృతంతో విత్తన శుద్ధి చేస్తే అనేక రకాల ఉపయోగాలు ఉంటాయని తెలిపారు. వ్యవసాయం చేసే రైతులు స్వయంగా విత్తన శుద్ధి చేసుకోవచ్చని వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ డీపీఎం ప్రేమ్రాజ్, ఎన్ఎఫ్ఏ నందకుమార్, సైదయ్య, మేరి, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల బాధలు పట్టవా ?
గుంటూరు వెస్ట్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో విద్యనభ్యసిస్తున్న దళిత, బహుజన విద్యార్థులను కూటమి ప్రభుత్వం దారుణంగా అవమానిస్తుందని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సీహెచ్ వినోద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత నాలుగు రోజుల నుంచి క్షేత్ర స్థాయిలో జిల్లా వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్స్ను సందర్శించామన్నారు. మంచినీరు అపరిశుభ్రంగా ఉందన్నారు. మరుగుదొడ్లు దుర్వాసనగా ఉన్నా పిల్లలు అలానే నెట్టుకొస్తున్నారన్నారు. అన్నంలో బొద్దింకలు వస్తున్నాయని తెలిపారు. రుచిశుచీ లేని ఆహారాన్ని పెట్టడానికి మనస్సు ఎలా వచ్చిందన్నారు. మెస్ బిల్లులు, కాస్మొటిక్ చార్జీలు వెంటనే విడుదల చేయాలన్నారు. మౌలిక వసతులపై స్పదించకపోతే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టల్స్ కోసం ఖర్చు చేయడం లేదనే విషయాన్ని గుర్తించాలన్నారు. రానున్న రోజుల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్గదర్శకంలో రాజీలేని పోరాటాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు రవీంద్ర నాయుడు, గుంటూరు పశ్చిమ, తూర్పు నియోజకవర్గ అధ్యక్షులు అజయ్, సాజిద్, పొన్నూరు నియోజకవర్గ అధ్యక్షుడు గోపి, జిల్లా నాయకులు భాను, కిరణ్లు పాల్గొన్నారు. -
ముందస్తు జాగ్రత్తలతో డెంగీ నివారణ
సత్తెనపల్లి: ముందస్తు జాగ్రత్తలతో దోమల ద్వారా వ్యాప్తి చెందే డెంగీ, చికున్ గున్యా, మలేరియా, బోద , మెదడువాపు వ్యాధులను నివారించవచ్చునని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి. రవి అన్నారు. సత్తెనపల్లి మండలం కొమెరపూడి గ్రామంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా జిల్లా మలేరియా అధికారి రవీంద్ర రత్నాకర్ తో కలిసి శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి మాట్లాడుతూ దోమల నివారణ చర్యలను క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలు దోమలు పుట్టకుండా అలాగే కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. మురుగునీరు ప్రవహించేటట్లు చర్యలు చేపట్టాల్సిందిగా పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరరావుకు సూచించారు. క్షేత్ర స్థాయిలో నీటి నిల్వలను పరిశీలించి సూచనలు చేశారు. జిల్లా మలేరియా అధికారి రవీంద్ర రత్నాకర్ మాట్లాడుతూ దోమలను నివారించాలంటే నీటి నిల్వలు లేకుండా చేయాలన్నారు. వారానికి ఒకసారి నీటి నిల్వలను తొలగించి ఆరబెట్టి మళ్లీ నీరు పట్టుకోవాలని, (ఫ్రైడే డ్రై డే పాటించాలని), పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజలందరూ దోమ తెరలు వాడుకోవాలన్నారు. పీహెచ్సీ వైద్యురాలు డాక్టర్ పి గౌతమి ఆధ్వర్యంలో బావులలో, నీటి కుంటల్లో దోమ లార్వాలను తినే గంబుషియా చేప పిల్లలను వదిలారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి కె. వెంకటేశ్వరరావు, సత్తెనపల్లి రూరల్ సబ్ యూనిట్ ఆఫీసర్ షేక్ సుభాన్ బేగ్, ఆరోగ్య విస్తరణాధికారి పిట్టల శ్రీనివాస రావు, ఆరోగ్య పర్యవేక్షకులు ఎండీ రెహమాన్, ఎమ్ఎల్హెచ్పీ వైశాలి, ఆరోగ్య కార్యకర్తలు పి.సౌరితేజ, జి నరసింహారావు, ఆశా కార్యకర్తలు, తదితరులు ఉన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రవి -
కృష్ణా నదిలో వరద తగ్గుముఖం
కొల్లూరు: కృష్ణా నదికి నీటి విడుదలను తగ్గిస్తుండటంతో వరద తగ్గుముఖం పట్టింది. ప్రకాశం బ్యారేజ్కు ఎగువ ప్రాజెక్టుల నుంచి వరద విడుదల తగ్గుతుండటంతో బ్యారేజ్ నుంచి సముద్రంలోకి వదిలే నీటి పరిమాణం సైతం తగ్గుతూ వస్తుంది. గురువారం 2.61 లక్షల క్యూసెక్కుల నీటిని బ్యారేజ్ నుంచి దిగువకు విడుదల చేసిన అధికారులు క్రమక్రమంగా ఎగువ నుంచి వచ్చి చేరే నీరు ఆధారంగా సముద్రంలోకి నీటి విడుదలను తగ్గించుకుంటూ వస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి కృష్ణా నదికి వరద నీటి విడుదల 1.90 లక్షల క్యూసెక్కులకు పడిపోయింది. వరద తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎండుతున్న వరి నారుమడులునగరం: ఖరీఫ్ ఆరంభంలోనే రైతులు సాగు నీటి సమస్య ఎదుర్కొంటున్నారు. వరుణుడుపై భారం వేసి పోసిన నారును రక్షించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. తొలుత వర్షాల రాకతో నగరం, ఆరేపల్లి, సజ్జావారిపాలెం గ్రామాలలో వరి నారు మడులు పోశారు. తర్వాత వాతావరణంలో మార్పులతో మొలకలు వచ్చిన నారుమళ్లకు నీరు కరువైంది. గాలులు వీయడంతో వడ బడుతున్నాయి. రైతులు ఇంజిన్ల సాయంతో నారు మడులకు నీరు అందిస్తున్నారు. -
గుర్రపు డెక్క తొలగించకపోతే నిరాహార దీక్ష
వేమూరు: భట్టిప్రోలు నుంచి రేపల్లె డ్రైన్ వరకు గుర్రపు డెక్క పూర్తిగా తొలగించక పోతే నిరాహార దీక్ష చేస్తానని వైఎస్సార్సీపీ వేమూరు నియోజక వర్గం ఇన్చార్జి వరికూటి అశోక్బాబు పేర్కొన్నారు. భట్టిప్రోలు మండలం అద్దేపల్లి వెళ్లు మురుగు కాలువల్లో ఇరిగేషన్ అధికారులు గుర్రపు డెక్క తొలగింపు పనులు శుక్ర వారం ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మురుగు కాలువల్లో గుర్రపు డెక్క వల్ల మురుగు నీరు పారుదల కాక పోవడంతో అధిక వర్షాలు వల్ల గతేడాది 2500 ఎకరాలు దెబ్బతినడం జరిగిందన్నారు. కనగాల ప్రాంతంలో పెరవలి, పెరవలి పాలెం గ్రామాలకు చెందిన 1500 ఎకరాలు మునిగి పోవడం జరిగిందన్నారు. గత నెలల్లో కురిసిన వర్షాలు వల్ల వెద సాగు పద్ధతి పూర్తిగా మునిగి పోవడం జరిగిందన్నారు. గత నెల 19న మురుగు కాలువల్లో దిగి ఇరిగేషన్ అధికారులు గుర్రపు డెక్క తొలగించాలని నిరసన వ్యక్తం చేయడం జరిగిందన్నారు. గురువారం మురుగు కాలువల్లో గర్రపు డెక్క తొలగించాలని జల దీక్ష చేయడం జరిగిందన్నారు. ఇరిగేషన్ అధికారులు సక్రమంగా స్పందించక పోవడంతో వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద ధర్నా చేయడంతో ఇరిగేషన్ డి ఈ వచ్చి మురుగు కాలువల్లో గుర్రపు డెక్క తొలగించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. దీంతో ధర్నా విరమించు కోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పడమటి శ్రీనివాసరరావు, నియోజ వర్గం రైతు విభాగం అధ్యక్షులు గోపాల రాము, సయ్యద్ సిరాజ్, పసుపులేటి శివరామ ప్రసాద్, జంగం వాసు, వేల్పూరి నాగేశ్వరరావు, వేల్పూరి చిన్నారి, సయ్యద్ నవీ, జల్లి జోషి కాంత్, కౌతవరపు పద్మావతి, కౌతవరపు శ్రీనివాసరరావు, యన్నం సురేష్, దాసరి కిరణ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ వేమూరు నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోక్బాబు -
హైర్ బస్సు డ్రైవర్ల నిరసన
చీరాల అర్బన్: ఆర్టీసీ డిపోలో ఆన్కాల్ రిక్రూట్మెంట్లో హైర్ బస్సు డ్రైవర్లకు ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం డిపోలోని హైర్ బస్సుల డ్రైవర్లు నిరసన తెలిపారు. హైర్ బస్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద బస్సులు నిలిపివేసి నిరసన చేపట్టారు. సీఐటీయూ కార్యదర్శి ఎం.వసంతరావు మాట్లాడుతూ చీరాల డిపోలో 40 హైర్ బస్సులు నడుస్తున్నాయని, వీటిని నమ్ముకొని 90 మంది డ్రైవర్లు గత 15 సంవత్సరాలుగా ఆన్కాల్ విధుల్లో కొనసాగుతున్నారన్నారు. ఇటీవల నిర్వహించిన ఆన్కాల్ రిక్రూట్మెంట్లో హైర్ బస్సుల డ్రైవర్ల దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోకుండా కొత్త వ్యక్తులను ఎంపిక చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇతర డిపోల్లో హైర్ బస్ డ్రైవర్లకు ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంటే చీరాలలో మాత్రం అందుకు భిన్నంగా చేస్తున్నారన్నారు. సమస్య పరిష్కరించకుంటే సమ్మె చేస్తామన్నారు. డ్రైవర్ల మెరుపు సమ్మె కారణంగా బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పశ్చిమ డెల్టాకు 6,830 క్యూసెక్కులు విడుదల దుగ్గిరాల: విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి శుక్రవారం 6,830 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజి వద్ద 12 అడుగులు నీటి మట్టం ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవెల్కి 290 క్యూసెక్కులు, బ్యాంక్ కెనాల్ 1,725, తూర్పు కాలువ 688, పశ్చివ కాలువ266, నిజాంపట్నం కాలువ 490, కొమ్మూరు కాలువకు 2,640 క్యూసెక్కులు విడుదల చేశారు. 1,89,625 క్యూసెక్కులు సముద్రంలోకి పంపుతున్నారు. బస్సులు నిలిపివేసి నినాదాలు -
ఉపాధిలో అవినీతి మస్టర్లు
ఉపాధి హామీ పనుల్లో తవ్వేకొద్దీ అవినీతి బయటకు వస్తోంది. కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు అక్రమ సొమ్ములో వాటాలు అందుతున్నాయనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. పచ్చనేతలూ అందిన కాడికి మింగేస్తున్నారు. రూ.కోట్ల మేరకు ప్రజాధనం అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లిపోతోంది. సాక్షి ప్రతినిధి, బాపట్ల: బల్లికురవ మండలం మల్లాయిపాలెంకు చెందిన సర్వలత ముండ్లమూరు మండలంలో టీచర్గా పనిచేస్తున్నారు. ఆమె ఉపాధి పనికి వెళుతున్నట్లు (జాబ్ కార్డు నంబరు 50136) మస్టర్ వేశారు. ఆమె ఖాతాకు డబ్బులు మళ్లించారు. ఇదే గ్రామానికి చెందిన మార్క్ రెండు సంవత్సరాలుగా చైన్నెలో ఉంటున్నా (జాబ్ కార్డు నంబరు 50192) ఉపాధి పని చేస్తున్నట్లు చూపిస్తున్నారు. దివ్యాంగురాలు నాగిపోగు సైదమ్మ, (జాబ్కార్డు నంబర్ 040 653), అంగన్వాడీ టీచర్ సత్యవతి (జాబ్ కార్డు నంబర్ 040 566) వంటి సంబంధం లేని పేర్ల మీద మస్టర్లు వేస్తున్నారు. 80 సంవత్సరాల బండి జయమ్మ, (జాబ్కార్డ్ నంబర్ 040 431), దివ్యాంగుడు బండి నాగరాజు (జాబ్కార్డ్ నంబర్ 50118)లు సైతం ఉపాధి పనులకు వెళుతున్నట్లు చూపారు. వారి పేరున డబ్బులు డ్రా చేస్తున్నారు. బ్యాంకు ఉద్యోగానికి కోచింగ్ తీసుకుంటున్న గాయత్రి (జాబ్కార్డు నంబర్ 50 131), సాఫ్ట్వేర్ ఉద్యోగి మణికంఠ (జాబ్కార్డు నంబర్ 50 148), లాయర్ ప్రసాద్ (జాబ్కార్డు నంబర్ 040 369).. ఇలా చెప్పుకొంటూ పోతే జాబితా చాలా పెద్దగానే ఉంది. సగానికిపైగా అవినీతే... ఒక్క మల్లాయిపాలెం మాత్రమే కాదు... జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. ఈ గ్రామంలోనే 70 మందికి పైగా ఫేక్ మస్టర్లు వేస్తున్నట్లు మాజీ సర్పంచ్ అబ్బారెడ్డి బాలకృష్ణ ఉన్నతాధికారులకు స్వయంగా ఫిర్యాదు చేసినా స్పందన శూన్యం. ఇదే మండలంలోని కొప్పరప్పాడు, వైదన, ఎస్ఎల్ గుడిపాడు, కూకట్లపల్లి, కొమ్మినేనివారి పాలెం, మల్లాయిపాలెం, వేమవరం గ్రామాల పరిధిలో రూ. 12 కోట్ల విలువచేసే 645 పనులు జరిగాయి. సగానికిపైగా అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొప్పరప్పాడు గ్రామసభలో అక్రమాలు వెలుగు చూడగా, మూడు రోజుల క్రితం జిల్లా సంయుక్త కలెక్టర్ నాగిరెడ్డి కొమ్మినేనివారిపాలెం, వైదన, ఎస్ఎల్ గుడిపాడుల్లో తనిఖీలు నిర్వహించారు. గత ప్రభుత్వంలో చేసిన కాలువ, చెరువు, కుంటల పూడికతీత పనులను కొత్తగా రికార్డు చేసి బిల్లులు స్వాహా చేసినట్లు ఆయన విచారణలో బయటపడింది. ఆగ్రహించిన సంయుక్త కలెక్టర్.. మండలంలో జరిగిన మొత్తం పనులపై నివేదిక ఇవ్వాలని తహసీల్దారును ఆదేశించారు. ఒక్క బల్లికురవ మండలమే కాదు అద్దంకి నియోజకవర్గంతోపాటు వేమూరు, రేపల్లె, బాపట్ల, చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లోనూ అక్రమాలు జరిగాయి. కృష్ణా సాగునీటి కాలువలు ఉన్న రేపల్లె, వేమూరు, బాపట్ల నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు సమాచారం. అద్దంకి, రేపల్లె, వేమూరు, బాపట్లలో అక్రమాలు పర్చూరు, చీరాలల్లోనూ పథకంలో అదే తీరు పాత పనులకు రికార్డుల సృష్టి కుప్పలు తెప్పలుగా ఫేక్ మస్టర్లు ఇప్పటికే కృష్ణా, సాగర్ కాలువలకు నీళ్లు పనుల తనిఖీ లేదు.. అక్రమం బయటకు రాదు వాటాల కోసం డ్వామా పీడీ వెంపర్లాట కనీసం పట్టించుకోని ఉన్నతాధికారులు చేసిన పనులు చూపితేనే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బిల్లులు అన్ని స్థాయిల వారికి వాటాలు ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, పీఆర్ఏఈలు, ఏపీవో, డ్వామా జిల్లా అధికారి వరకూ అవినీతిలో వాటాలు తీసుకుంటున్నారు. స్థానిక పచ్చనేతకు కూడా వాటాలు వెళుతున్నాయి. ఫిర్యాదులు చేసినా డ్వామా జిల్లా అధికారి స్పందించడం లేదు. పైగా అక్రమాలను మరింతగా ప్రోత్సహిస్తున్నట్లు డ్వామా అధికార వర్గాల్లోనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చేసిన పని మేరకు కొలతలు చూసి డబ్బులు ఇస్తే వాస్తవంగా పనిచేసిన కూలీలకు గిట్టుబాటు అవుతుంది. కానీ ఫేక్మస్టర్లకు డబ్బులు ఇస్తుండడంతో నిజంగా పనిచేసిన పేదలు నామమాత్రపు కూలీతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది.పచ్చ నేతలకు ఇవ్వాల్సిందే... వాస్తవానికి ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి కొత్త వారిని నియమించుకోవాలంటే గ్రామ పంచాయతీ తీర్మానం అవసరం. జిల్లాలోని చాలా పంచాయతీల్లో వైఎస్సార్సీపీకి చెందిన సర్పంచ్లు ఉండటంతో పచ్చ నేతలు ఒక్కొక్కరి వద్ద రూ. 2 లక్షలు తీసుకొని దందా చేస్తున్నారు. ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి సీనియర్ మేట్ల పేరుతో కొత్తవారిని నియమించుకున్నారు. ఈ మేరకు ఫేక్ మస్టర్ల డబ్బుల్లో సగం స్థానిక పచ్చ నేతకు ఫీల్డ్ అసిస్టెంట్లు చెల్లిస్తున్నారు. అక్రమాలు వెలుగుచూసినా.. ఉన్నతాధికారులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం రూ. లక్ష వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగు చూసే అవకాశముంది. -
9 నుంచి శంకర్విలాస్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేత
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): శంకర్విలాస్ బ్రిడ్జిపై ఈ నెల 9 నుంచి రాకపోకలు పూర్తిగా నిలిపివేసి కూల్చివేత పనులు చేపడుతున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, అధికారులతో కలిసి నగరంలో అభివృద్ధి పనులపై సమావేశం నిర్వహించారు. ● ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణ పనుల్లో భాగంగా ప్రస్తుతం 2 పిల్లర్స్ కాంక్రీట్ పూర్తి అయ్యాయని, 9 నుంచి కూల్చివేత పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 135 స్ట్రక్చర్లు ఉండగా వాటిలో 74 మంది అంగీకారం తెలిపారని, వారికి నష్ట పరిహారం ఇచ్చి నిర్మాణాలు తొలగించామన్నారు. ● నందివెలుగు రోడ్లోని ఆర్ఓబీ పనులు 10 రోజుల క్రితమే ప్రారంభమయ్యాయని, 8 నెలల్లో పూర్తి చేసేలా చూస్తామన్నారు. ● మణిహోటల్ సెంటర్లో కల్వర్ట్ నిర్మాణం చేయాల్సినందున ఆర్ అండ్ బీ అధికారులు రెండు రోజుల్లో అంచనాలు సిద్ధం చేసి, తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ● ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 పనులకు 7న టెండర్లు ఓపెన్ అవుతాయని, అనంతరం పనులు వేగంగా జరిగేలా చూస్తామన్నారు. ● శారదాకాలనీ రోడ్, బ్రాడీపేట, నెహ్రూనగర్ రోడ్ల విస్తరణకు, ఎల్సీ నం.3 గేటు దగ్గర ఆర్ఓబీ పనులు ప్రారంభిస్తే ట్రాఫిక్ సమస్యలు రాకుండా ఆటో నగర్, అగతవరప్పాడులను కనెక్ట్ చేసేలా రోడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ● పీవీకే నాయుడు మార్కెట్కు గతంలో చేసిన డిజైన్లు ఎవరికి నచ్చలేదు కనుక రివైజ్డ్ డిజైన్లను నిర్ణయించాలన్నారు. ● నల్లపాడు చెరువు, బొంగరాలబీడు కార్మిక శాఖ స్థలాలను నగరపాలక సంస్థకు కేటాయిస్తూ నిర్ణయం జరిగిందన్నారు. త్వరలో పూర్తి స్థాయి అనుమతులు వచ్చాక కార్యాచరణ చేపడతామన్నారు. ● అసంపూర్తిగా ఉన్న గోరంట్ల వాటర్ ట్యాంక్ నిర్మాణ కాంట్రాక్టర్ని తొలగించి, నూతన కాంట్రాక్టర్కు పనులు కేటాయించడానికి చర్యలు తీసుకుంటున్నామని, నగరంలో మరమ్మతులకు గురైన రిజర్వాయర్ల పనులకు టెండర్లు పిలవడం జరిగిందన్నారు. ● శిథిలావస్థకు చేరిన బీఆర్ స్టేడియం రిజర్వాయర్ స్థానంలో రూ.2 కోట్లతో నిర్మాణానికి పనులు ప్రారంభం కానున్నాయన్నారు. ● రెడ్డిపాలెం రోడ్ విస్తరణ గతంలో మాస్టర్ ప్లాన్కి భిన్నంగా జరిగినందున, సరిచేయాల్సి ఉందని, 3 వంతెనల వద్ద వర్షం కురిసినప్పుడు నీరు నిలుస్తున్నందున, శాశ్వత పరిష్కారం కోసం సుమారు 2 వందల ఆక్రమణలు తొలగించి, వారికి పునరావాసం కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ● శారదా కాలనీ రోడ్ విస్తరణలో ప్రభావిత 22 మంది భవన యజమానులకు రూ.50.22 లక్షల నష్ట పరిహార చెక్కులను అందించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. కూల్చివేత పనులు ప్రారంభం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ -
ఆన్లైన్ గోల్మాల్!
●వేటపాలెం: స్మార్ట్ఫోన్ డబ్బు లాగేస్తోంది. ఎంతో విజ్ఞానాన్ని పంచే ఆన్లైన్ యువతను ఆత్మహత్యల వైపు నడిపిస్తోంది. చీరాల నియోజవర్గం పరిధిలో పేద , మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా జీవిస్తుంటారు. ఎక్కువ మంది యువత వ్యసనాల బారిన పడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రధానంగా 15 నుంచి 40 ఏళ్ల లోపు వారు ఆన్లైన్ జూదాలకు బానిసలు అవుతున్నారు. చిన్నతనం నుంచి తల్లిదండ్రులు మొబైల్ ఫోన్లు వారి పిల్లలకు అందుబాటులో ఉంచడమే దీనికి ప్రధాన కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొదటగా మొబైల్లో సాధారణ ఆన్లైన గేమ్స్కు బానిసలవుతున్నారు. ఆ తరువాత క్రమేపీ ఆన్లైన్ జూదాలకు అలవాటు పడుతూ తల్లిదండ్రులకు భారంగా మారుతున్నారు. చీరాల ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు నిత్యం చోటు చేసుకుంటూనే ఉన్నాయి. బ్లాక్మెయిల్ చేస్తూ.. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల యుగం నడుస్తోంది. చేతిలో ఫోన్, నెట్ అందుబాటులో ఉండటంతో ఆన్లైన్లో ఆటలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. రూ.వందలతో మొదలై రూ.వేలు, రూ.లక్షలు చేతులు మారిపోతున్నాయి. ఫోన్ యాప్ల ద్వారా రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకుంటే.. వారికి సంబంధించిన బంధువులు, మిత్రులకు సదరు కంపెనీల నిర్వాహకులు అసభ్యంగా ఉండే చిత్రాలను మార్ఫింగ్ చేసి పంపుతున్నారు. పలువురు పరువు కాపాడుకునేందుకు ఆప్పు చేసి రుణాలు తిరిగి చెల్లిస్తున్నారు. మరికొందరు బలవన్మరణాలకు యత్నిస్తున్న సంఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. సులభంగా డబ్బు సంపాదించాలని.. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో కొందరు యువకులు ఆన్లైన్ బెట్టింగ్లు, రమ్మీ, లోడో, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ఆడుతున్నారు. మొదట సరదాగా మొదలు పెట్టి చివరకు అప్పులు ఊబిలో కూరుకుపోతున్నారు. దీనికి తోడు ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు చాలానే ఉన్నాయి. వీటితో సింగిల్ నెంబర్ గేమ్కు బానిసలవుతున్నారు. సైబర్ నేరగాళ్లు వీరి ఖాతాలను హ్యాక్ చేసి భారీగా డబ్బంతా లాగేస్తున్నారు. బాధితులు ఎందరో.. తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి పిల్లలు, యువకులపై వారి తల్లిదండ్రులు నిత్యం ఓ కన్నేసి ఉంచాలి. వారికి అనవసరంగా డబ్బు, సెల్ ఫోన్లు ఇవ్వడం మంచిది కాదు. ఆన్లైన్లో వివిధ రకాల మోసపూరిత గేమ్స్ ఉంటాయి. వాటికి అలవాటు పడి బెట్టింగ్లపై దృష్టి సారిస్తున్నారు. సరదాగా జూదం అంటూ ఆ తర్వాత వ్యసనంగా మార్చుకుంటున్నారు. అలాంటి వారిని మాకు అప్పగిస్తే కౌన్సిలింగ్ ద్వారా మార్పు తీసుకొస్తాం. సాంకేతిక పరిజ్ఞానంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆన్లైన్ జాదగాళ్ల ఆట కట్టడి చేసేలా చర్యలు చేపడుతున్నాం. – జనార్దన్, ఎస్సై, వేటపాలెం ఇంటర్నెట్లో గేమ్లకు బానిసలవుతున్న యువత చీరాల నియోజకవర్గంలో జోరుగా బెట్టింగ్లు రూ.లక్షలు పోగొట్టుకుంటున్న యువత డబ్బు ఎర వేస్తున్న ప్రైవేట్ రుణ యాప్లు నగదు తిరిగి చెల్లించకుంటే బాధితులకు టార్చర్ అప్పులపాలై ఆస్తులు విక్రయించాల్సిన దుస్థితి ఇంజినీరింగ్ కళాశాలలో అధ్యాపకుడుగా పనిచేస్తూ.. ఆన్లైన్ జూదానికి ఆలవాటు పడి దాదాపు రూ.5 లక్షలు పోగొట్టుకున్నారు. వేటపాలేనికి చెందిన ఒక వ్యాపారవేత్త కుమార్తె ఇంజినీరింగ్ చదువుతూ ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని తన బ్యాంకు ఖాతా నుంచి రూ. 50 వేలు పోగొట్టుకుంది. వేటపాలెం గడియార స్తంభం సెంటర్లో బడ్డీ కొట్టు నడుపుకొనే వ్యక్తి సింగిల్ నెంబర్ జూదం వ్యసనంగా మారడంతో అప్పుల పాలయ్యాడు. మోసపోయిన వారిలో పోలీసులకు ఫిర్యాదు చేసేవారు తక్కువగా ఉంటున్నారు. విషయం చెప్పుకొంటే పరువు పోతుందని.. లోలోన బాధ అనుభవించేవారే ఎక్కువగా ఉంటున్నారు. -
ఐటీ విభాగం సంయుక్త కార్యదర్శిగా సుబ్బరామయ్య
పర్చూరు(చినగంజాం): పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లు మండలం దుద్దుకూరు గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ రాయని సుబ్బ రామయ్య వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఐటీ విభాగంలో స్థానం పొందారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి గురువారం విడుదలైన ఐటీ రాష్ట్ర కమిటీలో ఆయనకు రాష్ట్ర ఐటీ విభాగం సంయుక్త కార్యదర్శిగా స్థానం దక్కింది. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు.సుదర్శన స్వామికి ప్రత్యేక పూజలుతాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై గురువారం సుదర్శన స్వామికి ప్రత్యేక పూజలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి మంగళాశాసనాలతో సుదర్శన పెరుమాళ్ తిరునక్షత్రం సందర్భంగా ఉదయం 9 గంటలకు సుదర్శన స్వామికి అభిషేకం, దృష్టి దోష నివారణ, దుష్ట గ్రహ దోష నివారణ, ఆయురారోగ్యాభివృద్ధికి సర్వరక్షాకర హోమం నిర్వహించామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో సుదర్శన పెరుమాళ్ల అనుగ్రహాన్ని పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆయన పేర్కొన్నారు.ఎయిమ్స్లో ఆన్లైన్ సేవలకు అంతరాయం45 నిమిషాల తర్వాత పునరుద్ధరణతాడేపల్లి రూరల్: మంగళగిరి ఎయిమ్స్లో గురువారం ఆన్లైన్ సేవలకు అంతరాయం కలిగింది. దీంతో ఓపీ దగ్గర భారీగా రోగులు నిలబడి ఆందోళన చేశారు. వెంటనే ఆసుపత్రి సిబ్బంది మాన్యువల్గా సేవలను అందించారు. 45 నిమిషాల అనంతరం ఆన్లైన్ సేవలను పునరుద్ధరించడంతో రోగులు ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తెల్లవారుజామునే వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ప్రతిరోజు వేల మంది వస్తున్నారు. నెలకు రెండు, మూడు సార్లు ఇదే పరిస్థితి ఏర్పడుతోందని అక్కడి సిబ్బంది తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధి డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ ఆన్లైన్ సేవలు నిలిచిపోయిన వెంటనే మాన్యువల్ సేవలు అందజేశామని తెలిపారు. ఎక్కువ మంది రావడంతో కొంత ఇబ్బంది పడ్డామని పేర్కొన్నారు. అయితే సాధ్యమైనంత త్వరగా ఆన్లైన్ సేవలను పునరుద్ధరించినట్లు ఆయన పేర్కొన్నారు.జిల్లా అథ్లెటిక్ క్రీడాకారుల జట్ల ఎంపికగుంటూరు వెస్ట్ (క్రీడలు): చీరాలలో ఈ నెల 9, 10 వ తేదీల్లో జరగనున్న అండర్–18, 20 యువతీ యువకుల అంతర్ జిల్లాల అథ్లెటిక్ పోటీల్లో పాల్గొనే జట్లను ఎంపిక చేసినట్లు అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారులు వయస్సు ధ్రువీకరణ పత్రంతోపాటు ఆధార్ కార్డుతో శుక్రవారం స్థానిక బీఆర్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని సూచించారు. పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టు సభ్యులు 9వ తేదీ ఉదయం 6 గంటలకు చీరాలలోని వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కాలేజీలోని క్రీడా మైదానంలో రిపోర్ట్ చేయాలన్నారు. -
కృష్ణమ్మకు పోటెత్తిన వరద
కొల్లూరు : కృష్ణా నదిలో వరద పరవళ్లు తొక్కుతూ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు సముద్రంలోకి నీటిని విడుదల చేయడంతో మండలంలోని కృష్ణా నది జలకళను సంతరించుకొంది. బుధవారం 87 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేయగా... పైనుంచి వరద నీరు అధికంగా వచ్చి చేరుతుండటంతో గురువారం మధ్యాహ్నానికి క్రమంగా నీటి విడుదల స్థాయిని పెంచుతూ 2.61 లక్షల క్యూసెక్కులకు పెంచడంతో నీటిని సముద్రంలోకి వదిలారు. నదిలో నీటి ఉద్ధృతి పెరగడంతో మండలంలోని పెసర్లంక అరవింద వారధి సమీపంలోని నక్కపాయ గండి ద్వారా వరద నీరు లోతట్టు ప్రాంతాలలోకి పరవళ్లు తొక్కుతూ చొచ్చుకొని పోతోంది. నీటి ప్రవాహం అధికంగా ఉన్న కారణంగా నక్కపాయ ప్రాంతంలో కొల్లూరు కరకట్ట దిగువున ఉన్న లోతట్టు పంట పొలాలతోపాటు ఇటుక బట్టీలలోకి వరదనీరు వచ్చి చేరుతోంది. అయితే ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజ్కు వస్తున్న వరద నీరు క్రమక్రమంగా తగ్గుతుండటంతో ఆర్సీ అధికారులు శుక్రవారం సాయంత్రానికి నీటి విడుదల పరిమాణాన్ని తగ్గించి 2.49 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న వరదల కారణంగా ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో నదీ తీర ప్రాంత ప్రజలు, రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. వరదల తీవ్రత అధికమైతే పంటలను కోల్పోతామన్న ఆందోళనకు గురైన రైతాంగంలో నీటి విడుదల తగ్గుతుండటంతో ఆనందం వ్యక్తం అవుతోంది. లోతట్టు ప్రాంతాలలోకి చేరుతున్న నీరు ప్రకాశం బ్యారేజ్ నుంచి 2.61 లక్షల క్యూసెక్కులు విడుదల క్రమంగా తగ్గుతున్న వరద నీటి విడుదల -
చేనేతను నిర్లక్ష్యం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
చీరాలలో కార్మికుల ర్యాలీ చీరాల: అధికారికంగా జులై 31ను చేనేత దినోత్సవంగా ప్రకటించాలని జాతీయ చేనేత నాయకులు, చేనేత ఉద్యమకారులు మాచర్ల మోహనరావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. రాష్ట్ర చేనేత జన సమాఖ్య ఆధ్వర్యంలో మండలంలోని జాండ్రపేటలోని శ్రీచౌడేశ్వరి దేవాంగ కల్యాణ మండపంలో గురువారం చేనేత సభను నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తీవ్ర మార్కెట్ సంక్షోభం ఎదుర్కొంటున్న చేనేత పరిశ్రమపై ప్రస్తుతం ఉన్న ఐదు శాతం జీఎస్టీని వచ్చే సెప్టెంబర్ నుంచి 12 శాతానికి పెంచుతున్నట్లు కౌన్సిల్ ప్రకటించడం దారుణం అన్నారు. సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దేవన వీరనాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కనీసం రూ.వెయ్యి కోట్లు నిధులు కేటాయించడంతోపాటు చేనేత కార్మికులకు పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేవాంగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీరక సురేంద్ర మాట్లాడుతూ చేనేత పరిశ్రమపై ఉన్న జీఎస్టీ రద్దు చేయకపోవడం వలన మూలాధారమైన నూలు ధరలు అసాధారణంగా పెరగడంతో చేనేత ఉత్పత్తి మందగించి కార్మికుల పనిదినాలు తగ్గిపోవడంతో ఆత్మహత్యలు పెరుగుతున్నాయని అన్నారు. అనంతరం దేశాయిపేట నుంచి జాండ్రపేట వరకు రాష్ట్ర చేనేత జన సమాఖ్య ఆధ్వర్యంలో చేనేత పరిరక్షణ ర్యాలీ నిర్వహించారు. చీరాలలో చేనేత పార్కు ఏర్పాటు చేయాలని, చేనేత వృత్తి భద్రత కల్పించాలని, చేనేతపై జీఎస్టీని ఎత్తివేయాలని కార్మికులు నినాదాలు చేశారు. కార్యక్రమంలో చేనేత నాయకులు దామర్ల శ్రీకృష్ణ, సీపీఐ నాయకులు బత్తుల శామ్యూల్, బిసి ఫెడరేషన్ నాయకులు ఊటుకూరి వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ చుండూరు వాసు, చీరాల నియోజకవర్గ అభివృద్ధి సాధన సమితి నాయకులు శీలం రవికుమార్, దేవన హేమసుందరరావు, గుంటూరు మల్లికార్జున్, సజ్జా శ్రీనివాసరావు, వావిలాల దాశరఽథి, మునగాల వెంకటేశ్వర్లు, ఓరుగంటి రెడ్డి రిజర్వేషన్ సమితి నాయకులు మేడిబోయిన వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ నేత ‘వరికూటి’ జలదీక్ష
వేమూరు: మురుగు కాలువల్లో గుర్రపు డెక్క పేరుకుపోయి నీటి పారుదల కావడం లేదని, వర్షాలు కురిస్తే 3,000 ఎకరాలు మునిగిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి, వేమూరు నియోజకవర్గం సమన్వయకర్త వరికూటి అశోక్బాబు పేర్కొన్నారు. గుర్రపు డెక్క తొలగించాలని కోరుతూ భట్టిప్రోలులోని మురుగు కాలువల్లో గురువారం ఆయన జలదీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలువల్లో గుర్రపు డెక్క పేరుకుపోయిందన్నారు. గత నెలల్లో కురిసిన వర్షాలకు నీటి పారుదల లేక రైతులు వెద సాగు పద్ధతిలో చేసిన పంట మునిగిపోయిందని తెలిపారు. వేమూరు మండలం పోతుమర్రులోని రేపల్లె డ్రెయిన్లో గుర్రపు డెక్కలోకి దిగి నాలుగు గేదెలు మునిగి పోయి మృతి చెందాయని తెలిపారు. జూలై 19న మురుగు కాలువల్లో దిగి గుర్రపు డెక్క తొలగించాలని నిరసన వ్యక్తం చేశామని గుర్తు చేశారు. అయినా అధికారులు స్పందించక పోవడంతో మరోసారి జల దీక్ష చేపట్టినట్లు తెలిపారు. మట్టిని బొక్కుతున్న కూటమి నాయకులు కూటమి నాయకులు నియోజకవర్గంలోని చెరువుల్లో మట్టి అమ్ముకుంటున్నారని విమర్శించారు. ఇసుకను హైదరాబాద్ వరకు తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. గుర్రపు డెక్క తొలగించే వరకు దీక్ష కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. జలదీక్ష చేస్తున్న ప్రాంతానికి డ్రెయినేజీ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ కల్యాణబాబు వచ్చి అశోక్బాబుతో మాట్లాడారు. గుర్రపు డెక్క తొలగించేందుకు, మురుగు కాలువ మరమ్మతుల కోసం ప్రభుత్వానికి రూ.20 లక్షలకు అంచనాలు పంపామని తెలిపారు. గుర్రపు డెక్క మందు కూడా పిచికారీ చేసినట్లు చెప్పారు. పది గంటల్లోపు తొలగిస్తామని ఆయన అశోక్బాబుకు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అనుమతి ఇస్తే రైతులు చందాలు వేసుకొని వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో భట్టిప్రోలు నుంచి రేపల్లె డ్రెయిన్ వరకు గుర్రపు డెక్క తొలగిస్తామని, దీనికి అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం, అధికారులు స్పందించకపోతే దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహం వద్ద ధర్నా చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు పటమటి శ్రీనివాసరరావు, దాది సుబ్బారావు, గొట్టిపాటి శ్రీనివాసరావు, అనపురెడ్డి రఘురామిరెడ్డి, రైతు విభాగం నాయకులు గాదె శివరామకృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షులు ఈద శ్రీనివాసరెడ్డి, బీసీ సెల్ అధ్యక్షులు గవిని శ్రీనివాసరావు, నియోజకవర్గం అధ్యక్షులు గోపాలం రాము, భట్టిప్రోలు ఎంపీపీ లలితకుమారి, దాట్ల మోహన్రెడ్డి, పెరికల పద్మారావు, షేక్ హుస్సేన్, బొల్లెదు ప్రతాప్, జల్లి జోషి కాంత్, పెద్దబుజ్జి, సిరాజ్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గుర్రపు డెక్క తొలగించాలని డిమాండ్ -
శాసనాల ఖిల్లా.. మన జిల్లా
అద్దంకి: నూతనంగా ఏర్పడిన బాపట్లజిల్లా శాసనాలకు ఖిల్లాగా నిలుస్తోంది. క్రీస్తు పూర్వం నుంచి, వివిధ రాజవంశాల వారు బాపట్ల ప్రాంతాన్ని ఏలినట్లుగా ఆధారాలు లభిస్తున్నాయి. ఆయా కాలాల్లో వేసిన రాతి శాసనాలు బయట పడటం వలన ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆయా శాసనాలను బట్టి ఈ ప్రాంతాన్ని చోళులు, పల్లవులు, గజపతులు, కాకతీయులు, చాళుక్యులు, విజయనగర రాజులు, రెడ్డి రాజులు ఏలినట్లు తెలుస్తోంది. ఆ నిలువెత్తు సాక్ష్యాలుగా ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. బౌద్ధ, జైన మతాలకు సైతం ఈ ప్రాంతంలో పరిఢవిల్లినట్లు ధర్మవరం, భట్టిప్రోలు ప్రాంతాల్లోని ఆనవాళ్లు చెబుతున్నాయి. క్రీస్తు పూర్వం నుంచే.. బాపట్ల ప్రాతంలోని పట్టణాలు, గ్రామాలు క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచే ఉన్నట్లుగా చిన్నగంజాం, పెద్దగంజాం, భట్టిప్రోలులోని బౌద్ధ స్థూపం చెబుతోంది. ధర్మవరం, అద్దంకి, ధేనువకొండ, మణికేశ్వరం, పేరాయిపాలెం ప్రాంతాల్లో క్రీస్తుపూర్వం 9 నుంచి 5వ శతాబ్దం నాటి రాతి సమాధులు (రాక్షసగూళ్లు) లభించాయి. అద్దంకి మండలంలోని నాగులపాడు గ్రామంలోని చెరువులో 7వ శతాబ్దంలో అయ్యమాపయ్య వేయించిన దాన శాసనం, బల్లికురవ మండలంలోని కూకట్లపల్లిలో 12వ శతాబ్దం నాటి చోళుల శాసనం, పర్చూరు మండలంలోని ఉప్పుటూరు, నూతలపాడు, చెరుకూరులోని త్రివిక్రమ దేవాలయంలోని దాన శాసనం, బాపట్లలోని భావన్నారాయణ స్వామి ఆలయంలోని చోళుల శాసనాల ద్వారా లభించింది. అద్దంకిలో తొలి తెలుగు పద్యశాసనం అద్దంకిలో పండరంగడు క్రీస్తుశకం 848లో తన గురువుకు 8 పుట్ల అట్ల పట్టు నేల దానం చేసిన సమయంలో వేయించిన తొలి తెలుగు పద్య శాసనం ఉంది. కొణిదెనలో 11, 12, 13వ శతాబ్దం నాటి మూడు శాసనాలు, కుమార సంభవం కర్త చోళ మహారాజు నన్నే చోళుడు వేయించిన 11వ శతాబ్దం నాటి శాసనం శివాలయంలో లభించింది. దేశంలోనే తొలిసారిగా చిన్నగంజాం మోటుపల్లి రేవు నుంచి సమగ్ర వర్తక వ్యాపారం కోసం వేయించిన అభయ శాసనం, ఓడల ద్వారా సుగంధద్రవ్యాలు, గుర్రాలు, వజ్రాల ఎగుమతి, దిగుమతులు చేసే వ్యాపారంపై 13వ శతాబ్దంలో కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని శాసనంలో రకరకాలైన వస్తువులపై రాయితీ కల్పిస్తూ వేసిన శాసనం, 14వ శాతాబ్దంలో వేయించిన అనపోతారెడ్డి వేయించిన శాసనం ఇలాంటివే. ఇవి తెలుగు, తమిళభాషల్లో ఉన్నాయి. ఈ రేవు నుంచి సన్నని నూలు వస్త్రాలు, రవెల్లాలు(నేత) దిగుమతి చేసుకునే వారు. అద్దంకి, రావూరులో గజపతుల 16వ శతాబ్దం నాటివి, మోటుపల్లి, పమిడిపాడులో విజయనగర రాజులు, తక్కెళ్లపాడు, పోతవరంలో పంట మల్లారెడ్డి, కుందుర్రులో కృష్ణదేవరాయలు, చుండూరులో అచ్యుత రాయలు, బొల్లాపల్లి, మణికేశ్వరంలో సదాశివరాయుడు, ధర్మవరంలో గొల్కొండ నవాబు వేయించిన శాసనాల ద్వారా ఆయా కాలాల్లో రాజ వంశాలు ఈ ప్రాంతాన్ని ఏలినట్లు ధ్రువపడుతోంది. ఎన్నో రాజవంశాలు పాలించిన పురాతన ప్రాంతంగా ప్రసిద్ధి నిదర్శనంగా నిలుస్తున్న పలు ఆనవాళ్లు బౌద్ధ, జైన మతాలకు ఆలవాలం మ్యూజియం ఏర్పాటు చేయాలి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బయటపడిన శాసనాల ప్రతులను, వివిధ రకాల వస్తువులను భావితరాలకు తెలిసేలా ఏర్పాట్లు అవసరం. సందర్శకుల కోసమైనా పురావస్తు శాఖ మ్యూజియం ఏర్పాటు చేయాల్సి ఉంది. అప్పుడు మన పూర్వ చరిత్ర పదిలంగా ఉంటుంది. – జ్యోతి చంద్రమౌళి, శాసనాల పరిశోధకుడు -
పప్పు లేదు.. బియ్యంతోనే సరి !
● ఆగస్టులో కూడా అందని కందిపప్పు ● లబోదిబోమంటున్న కార్డుదారులు ● పండుగల నెలలో కూడా కనికరం లేని కూటమి సర్కార్ చీరాల టౌన్: ఆగస్టులో పండుగలు ఎక్కువగా ఉన్నాయి. వినాయకచవితి, కృష్ణాష్టమి, వరలక్ష్మీ వ్రతం తదితర ముఖ్యమైన పండుగలు ఉన్నా పేదలపై కూటమి సర్కార్కు కనికరం కూడా లేదు. పండుగ రోజు పప్పు వండుకునేందుకు కూడా అవకాశం లేదు. కార్డుదారులకు ఈ నెల కూడా కందిపప్పును కూడా అందించలేకపోతోంది. ప్రస్తుతం కూటమి సర్కార్ అధికారం చేపట్టినప్పటి నుంచి బియ్యం, పంచదారతో పంపిణీతోనే మమ అనిపిస్తోంది. తూతూమంత్రంగా రేషన్ పంపిణీ కూటమి ప్రభుత్వం అనేక హామీలతో అధికారంలోకి వచ్చింది. సూపర్ సిక్స్ పథకాల అమలు ఊసే లేదు. రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కనీసం కందిపప్పును కూడా అందించలేక పోతోంది. ఆగస్టులో కూడా కేవలం బియ్యం, పంచదారతోనే సరిపెట్టనుంది. జిల్లాలో 4,88,000 రేషన్ కార్డులు బాపట్ల జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో 4,88,000 రేషన్ కార్డులు ఉన్నాయి. ఏడు ఎంఎల్ఎస్ పాయింట్లు నుంచి జిల్లాలోని 1,123 రేషన్ దుకాణాల ద్వారా సరుకులు అందిస్తారు. జిల్లావ్యాప్తంగా 7000 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు, గోధుమ పిండి కూడా అందించాలి. అయితే, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బియ్యంతోనే సరిపెట్టింది. పండుగలు అధికంగా ఉన్న ఆగస్టులో కూడా కూటమి ప్రభుత్వం బియ్యం, పంచదారతోనే సరిపెట్టనుంది. వైఎస్సార్ సీపీ పాలనలో ఇంటి దగ్గరకే సరుకులు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఎండీయూ వాహనాల ద్వారా కార్డుదారుల ఇంటి దగ్గరకు బియ్యం, పంచదార, కందిపప్పు, గోధుమపిండి పంపిణీ చేశారు. ఇంటి ముందుకే రేషన్ సరుకులు రావడంతోనే వృద్ధులు, దివ్యాంగులు ఆనందించారు. ఎన్నికల ప్రచారంలో కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే నిత్యావసర సరుకులు అన్నీ పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది. అధికారం చేపట్టిన తర్వాత కందిపప్పు, గోధుమ పిండికి కోత విధించింది. కంటి తుడుపు చర్యగా జిల్లాలోని కార్డుదారులకు అరకిలో చొప్పున 2300 టన్నుల పంచదారతోనే సరిపెడుతోంది. ప్రభుత్వం విడుదల చేయలేదు ప్రభుత్వం ప్రస్తుతానికి బియ్యం, పంచదారనే అందిస్తోంది. కందిపప్పు ఇవ్వడం లేదు. ఈ నెలకు సరిపడా ఎంఎస్ఎల్ పాయింట్ల నుంచి బియ్యం, పంచదారను రేషన్ దుకాణాలకు పంపించాం. కందిపప్పు వస్తే కార్డుదారులకు అందిస్తాం. –బాషా, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, బాపట్ల -
పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట
అవనిగడ్డ: పెళ్లికి పెద్దలు అభ్యంతరం చెప్పడంతో ఆలయంలో పెళ్లి చేసుకున్న ఓ ప్రేమజంట పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే స్థానిక ఆరో వార్డుకు చెందిన చింతలపూడి నాగవర్ధన్, బాపట్ల జిల్లా రేపల్లె ఏడో వార్డుకు చెందిన తోట సాయి మౌనిక కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి మౌనిక తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పడంతో గురువారం మోపిదేవి మండల పరిధిలోని పెదప్రోలు అద్దంకి నాంచారమ్మ అమ్మవారి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఈ ప్రేమజంట స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ని ఆశ్రయించడంతో ఇరువురు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ కోసం సమాచారం ఇచ్చారు. మౌనిక తల్లిదండ్రులు రాకపోవడంతో నాగవర్ధన్ తల్లిదండ్రులను పిలిపించి వారికి అప్పగించారు. విద్యుత్ షాక్తో ఎలక్ట్రీషియన్ మృతి వేమూరు: జంపని గ్రామానికి చెందిన వ్యక్తి విద్యుత్ షాక్తో మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం... వేమూరు మండలం జంపని గ్రామానికి చెందిన గుంటూరు ధనబాబు(25) కరెంట్ పని చేస్తాడు. బుధవారం సాయంత్రం చిలకా సుబ్బారావు ఇంటిలో పని చేస్తుండగా షాక్ కొట్టింది. దీంతో తెనాలి ప్రభుత్వం వైద్యశాలకు తీసుకెళ్లారు. వైద్యసేవలు అందిస్తుండగా ధనబాబుమృతి చెందినట్లు ఎస్ఐ శ్రీనివాసరావు గురువారం తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. ఏడు మండలాల్లో తేలికపాటి వర్షం కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు ఏడు మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. అత్యధికంగా పెదకాకాని మండలంలో 6 మిల్లీమీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా మంగళగిరి మండలంలో మిల్లీమీటరు వర్షం పడింది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. గుంటూరు పశ్చిమలో 3.2 మి.మీ., తాడికొండ 3.2, దుగ్గిరాల 2.8, గుంటూరు తూర్పు 2.4, తుళ్లూరు మండలంలో 2.2 మి.మీ చొప్పున వర్షం పడింది. నేడు భ్రమరాంబకు పసుపు కొమ్ములతో అలంకరణ పెదకాకాని: శ్రీ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో శ్రీ భ్రమరాంబ అమ్మవారు పసుప కొమ్ములు ప్రత్యేక అలంకారంలో శుక్రవారం భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రావణమాసంలో రానున్న శుక్రవారాల్లో భ్రమరాంబ అమ్మవారిని చీరలు, గాజుల అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుందని డీసీ గోగినేని లీలాకుమార్ తెలిపారు. -
సాగర్ సొగసు చూడతరమా..!
విజయపురిసౌత్: నాగార్జున సాగర్కు కొత్తనీరు వచ్చి నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరటంతో జలాశయం కొత్త అందాలను సంతరించుకుంది. గత మూడు రోజులుగా సాగర్ ప్రాజెక్టు 26 క్రస్ట్గేట్లు నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. అంతేకాకుండా నిండుకుండలా కనపడుతున్న సాగర్లో జలాశయం మీదుగా లాంచీలో నాగార్జునకొండకు వెళ్లటం పర్యాటకులకు మరుపురాని అనుభూతిగా మిగిలిపోతుంది. దీంతో నిత్యం రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది పర్యాటకులు తరలివస్తారు. ఈ నేపఽథ్యంలో సాగర్ చుట్టుపక్కల సందర్శినీయ స్థలాలపై ప్రత్యేక కథనం.. ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ఇది సాగర్ ప్రధాన డ్యాం దిగువ ప్రాంతంలో ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ఉంటుంది. ఈ జలవిద్యుత్ కేంద్రాన్ని సాగర్ జెన్కో ఎస్ఈ అనుమతి తీసుకొని సందర్శించాల్సి ఉంటుంది. భక్తుల కోర్కెలు తీర్చే సాగర్మాత నాగార్జునకొండకు వెళ్లాలంటే విజయపురిసౌత్లోని లాంచీస్టేషన్ నుంచి 14 కి.మీ.దూరం కృష్ణానదిలో ప్రయాణం చేయాలి. కొండకు చేరుకునేందుకు లాంచీలో 45 నిమిషాల సమయం పడుతుంది. నాగార్జునకొండ ప్రపంచంలోనే రెండవ ఐలాండ్ మ్యూజియం. నాగార్జున సాగర్ పరిధిలోని విజయపురిసౌత్లో లాంచీస్టేషన్ నుంచి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు లాంచీలు పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి. పెద్దలకు లాంచీ టిక్కెట్టు ధర రూ.200, పిల్లలకు రూ 150, మ్యూజియం, మాన్యుమెంట్ సందర్శనకు రూ.30, మ్యూజియం సందర్శనకు 15 సంవత్సరాలలోపు చిన్నారులకు ఉచితం. విజ్ఞాన విహార యాత్రకు గ్రూపుగా వచ్చే విద్యార్థులకు లాంచీ టిక్కెట్పై 15 శాతం రాయితీ పర్యాటకశాఖ ఇస్తుంది. అలాగే పార్టీలకు, పంక్షన్లకు శాంతిసిరి గంటకు రూ.10,000లు, అగస్త్య లాంచీ గంటకు రూ.8,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు లాంచీస్టేషన్ ఫోన్ 9705188311 నెంబర్ను సంప్రదించవచ్చు. గత ఆనవాళ్లకు చిరునామా అనుపు నాగార్జునసాగర్ 7కి.మీ. దూరంలో అనుపు పర్యాటక కేంద్రం ఉంది. ఇక్కడ ఆనాటి నాగార్జున విశ్వ విద్యాలయం, ఇక్ష్వాకుల కాలం నాటి యాంపీ స్టేడియం ఆనవాళ్లు ఉన్నాయి. కృష్ణానది లోయలో లభించిన రంగనాథస్వామి దేవాలయాన్ని అదే రాతితో అనుపులోని కృష్ణానది తీరంలో నిర్మించటం విశేషం. నిండుకుండలా సాగర్ జలాశయం చరిత్రకు సాక్ష్యం నాగార్జున కొండ మనసుదోచే ఎత్తిపోతల చరిత్రకు ప్రతిరూపం నాగార్జునకొండ చూపరుల మనస్సుదోచే ఎత్తిపోతల ఇది సాగర్ నుంచి మాచర్లకు వవెళ్ళే రహదారిలో 14కిలో మీటర్ల దూరంలో ఉంది. చంద్రవంక వాగుపై సహజసిద్ధంగా ఏర్పడిన జలపాతం ఇది. 7 0అడుగుల పై నుంచి జాలువారే నీటి దృశ్యం పర్యాటకుల మనస్సు దోచుకుంటుంది. జలపాతం చూసేందుకు పెద్దలకు రూ.30, పిల్లలకు రూ.20 టికెట్ ధరను టూరిజంశాఖ వసూలు చేస్తుంది. ఇక్కడ పర్యాటకుల సౌకర్యార్ధం రాత్రి బస చేసేందకు 8 రూములు ఉన్నాయి. 5 ఏసీరూమ్లు, 3 నాన్ఏసీ రూములు ఉన్నాయి. ఏసీ రూమ్ ధర రూ.1,600, నాన్ఏసీ రూ.వెయ్యి. ఇతర వివరాలకు ఎత్తిపోతల మేనేజర్ దత్తకుమార్ ఫోన్నెంబర్ 94414 53115 నెంంబరులో సంప్రదించవచ్చు. విజయపురిసౌత్లోని కృష్ణానది తీరంలో వేంచేసియున్న సాగర్మాత దేవాలయానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తుంటారు. భక్తుల కోర్కెలు తీర్చే చల్లనితల్లిగా సాగర్మాతకు విశిష్టమైన పేరు ఉంది. ఇక్కడ నెలకొల్సిన జపమాల క్షేత్రం రాష్ట్రంలోనే ప్రత్యేకతను నెలకొంది. -
యంత్రాంగానికి అప్రమత్తత ముఖ్యం
● జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి ● రెవెన్యూ అధికారులతో సమావేశం బాపట్ల: వరదలు వస్తే తక్షణమే నివారణ, సహాయక చర్యలకు అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. విపత్తు నిర్వహణ, నిర్మూలన, ముందస్తు ప్రణాళిక అంశాలపై ఆర్డీవోలతో గురువారం ఆయన సమావేశం నిర్వహించారు. విపత్తుల నిర్వహణపై సూక్ష్మ స్థాయిలో సమగ్ర ప్రణాళిక ఉండాలని కలెక్టర్ చెప్పారు. కృష్ణానది వరద అకస్మాత్తుగా వస్తే ముంపు, ప్రభావిత ప్రాంతాల వివరాలు, జనాభా వంటివి సేకరించాలన్నారు. తీర ప్రాంతంలో ఉన్న బాపట్ల జిల్లాకు తుపాను హెచ్చరికలు వస్తే ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో గుర్తించాలన్నారు. దెబ్బతినే గృహాలు, ప్రాంతాలపై నివేదిక సిద్ధం చేయాలన్నారు. భారీ వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాలు, జలమయం అయ్యే గృహాల వివరాలు ముందస్తుగా గుర్తించాలన్నారు. వరద, తుపాను, భారీ వర్షాలకు నష్టాలు, ముందస్తుగా తీసుకోవలసిన చర్యలపై వేరువేరుగా ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. లంక గ్రామాలకు పొంచి ఉన్న ముప్పు కృష్ణానది ఎగువ ప్రాంతాలలో వర్షాలు అధికంగా కురవడం, డ్యాములలోకి వరద నీరు చేరుతుందన్నారు. ఈ నేపథ్యంలో వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నందున్న లంక గ్రామాలకు ప్రమాదం పొంచి ఉందన్నారు. 14 నివాస ప్రాంతాలు మునిగే అవకాశం ఉందన్నారు. కృష్ణానది కరకట్ట బలహీనంగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గండ్లు పడే అవకాశం ఉన్న ప్రాంతాలలో ఇసుక బస్తాలతో బలోపేతం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆ ప్రాంతాలలో గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులు, చిన్నారులను గుర్తించి వివరాలు పంపాలన్నారు. మర బోట్లు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. పునరావాస కేంద్రాలు ముందుస్తుగా గుర్తించాలన్నారు. మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు, పది రోజులు భోజన సదుపాయాలు అందించేలా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. సహాయక చర్యలకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి 30 కుటుంబాలకు ఒక ఉద్యోగి అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. నివాస ప్రాంతానికి ఒక మండల అధికారిని నియమించాలన్నారు. ఈ సమావేశంలో ఇన్చార్జి సంయుక్త కలెక్టర్, డీఆర్ఓ జి.గంగాధర్ గౌడ్, ఆర్డీవోలు గ్లోరియా, చంద్రశేఖర్, రామలక్ష్మి, సీపీఓ షాలెంరాజు, సంబంధిత విభాగం పర్యవేక్షకుడు షేక్ షఫీ, తదితరులు పాల్గొన్నారు. -
మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి వినూత్న శిక్ష
మూడు రోజులు కోర్టు పరిసరాలను శుభ్రం చేయాలని ఆదేశించిన న్యాయమూర్తి చీరాల రూరల్: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన 10 మందికి బాపట్ల జిల్లా చీరాల అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జె.కాత్యాయని వినూత్నమైన శిక్ష విధించారు. మూడు రోజులపాటు కోర్టు పరిసరాలను పరిశుభ్రం చేయాలని గురువారం ఆదేశించారు. చీరాల వన్టౌన్ సీఐ సుబ్బారావు తెలిపిన వివరాల మేరకు... చీరాల పట్టణంలోని అనేక ప్రాంతాల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 10 మందిని అదుపులోకి తీసుకుని కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసు విచారించిన న్యాయమూర్తి కాత్యాయని నిందితులు ఒక్కొక్కరు రూ.10,000 జరిమానా చెల్లించాలని, జరిమానా చెల్లించని పక్షంలో జైలు శిక్ష అనుభవించాలని తీర్పుచెప్పారు. అయితే, ఈ కేసులోని నిందితులందరూ కూలి పనులు చేసుకునేవారిమని, తమ వద్ద డబ్బులు కట్టేంత ఆర్థిక స్థోమత లేదని న్యాయమూర్తిని వేడుకోవడంతో స్పందించారు. మానవతా దృక్పథంతో ఆలోచించి నిందితులందరూ మూడు రోజుల పాటు కోర్టు ప్రాంగణాన్ని పరిశుభ్రం చేయాలని ఆదేశించారు. వారిలో పరివర్తన రావాలనే ఉద్దేశంతోనే కోర్టు పరిసరాలను శుభ్రం చేయిస్తున్నామని, కోర్టుకు వచ్చే కక్షిదారులు కూడా వారిని చూసి మార్పు చెందుతారని న్యాయమూర్తి అన్నారు. అయితే, ఇటువంటి కేసులలో పట్టుబడి మళ్లీ కోర్టుకు వస్తే ఈసారి కచ్చితంగా జైలుకు పంపిస్తానని న్యాయమూర్తి హెచ్చరించారు. మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలపాలై జీవితాలను పాడుచేసుకోవద్దని న్యాయమూర్తి హితవు పలికారు. -
రక్తదానం ప్రాణ దానంతో సమానం
లక్ష్మీపురం: ప్రతి ఒక్కరూ సేవా భావం కలిగి ఉండాలని, రక్తదానం చేయడం అంటే ఒక ప్రాణాన్ని కాపాడటమే అని గుంటూరు రైల్వే డివిజనల్ మేనేజర్ సుధేష్ట సేన్ అన్నారు. నగరంపాలెంలోని జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో గల రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సెంటర్లో గుంటూరు రైల్వే డివిజన్ కార్యాలయ సిబ్బందితో రక్తదాన శిబిరం నిర్వహించారు. ముందుగా డీఆర్ఎం శిబిరాన్ని ప్రారంభించి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వచ్ఛందంగా చిన్నతనం నుంచి రక్తదానం చేస్తున్నట్లు తెలిపారు. క్రమం తప్పకుండా దాతగా ఉన్నానని చెప్పారు. యువతీ, యువకులంతా క్లిష్టమైన వైద్య, అత్యవరసర పరిస్థితుల్లో ప్రాణాలను రక్షించే శక్తి ఉన్న గొప్ప లక్ష్యంలో చేరాలని కోరారు. గుంటూరు రైల్వే డివిజన్ అభివృద్ధితో పాటు ఇలాంటి సామాజిక సేవా కార్యాక్రమాలు నిర్వహించడంలో ముందంజలో ఉండాలని సూచించారు. అనంతరం డివిజన్ పరిధిలో 74 మంది సిబ్బంది, అధికారులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం ఎం.రమేష్కుమార్, సీనియర్ డివిజనల్ పర్సన్ ఆఫీసర్ షహబాజ్ హనూర్, సీనియర్ డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్ అమూల్యా బి. రాజ్, సీనియర్ డివిజనల్ మెటీరియల్స్ మేనేజర్ కార్తికేయ గాడఖ్, డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కమలాకర్బాబు, సీనియర్ డివిజనల్ సేఫ్టీ ఆఫీసర్ విజయ కార్తి, అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ శైలేష్కుమార్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వైద్య అధికారి డాక్టర్ మేడూరి భాస్కరరావు, జిల్లా సమన్వయకర్త రసూల్ పాల్గొన్నారు. రక్తదానం చేసిన డీఆర్ఎం సుధేష్ట సేన్ -
సైబర్ నేరాల కట్టడికి బ్యాంకర్లు సహకరించాలి
చీరాల అర్బన్: అభివృద్ధి చెందుతున్న సాంకేతికను సైబర్ నేరగాళ్లు నిరంతరం ఉపయోగించుకుంటూ సామాన్య ప్రజలను మోసం చేస్తున్నారని డీఎస్పీ ఎండీ మొయిన్ ఆందోళన వ్య్తం చేశారు. నేరాల నియంత్రణకు బ్యాంకు మేనేజర్లు వారి బ్యాంకుల్లో భద్రతా నియమాలను సక్రమంగా పాటిస్తే చోరీలను కొంత వరకు అరికట్టవచ్చన్నారు. బుధవారం స్థానిక బాపనమ్మ కల్యాణ మండపంలో డీఎస్పీ అధ్యక్షతన సైబర్ నేరాల, దొంగతనాల నియంత్రణపై బ్యాంకు మేనేజర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. నకిలీ ఫోన్లు, ఎస్ఎంఎస్లు, మెయిల్స్ ద్వారా ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం పొందుతున్నారన్నారు. వ్యక్తిగత వివరాలు వారి చేతిలోకి వెళ్లగానే ఖాతాల్లోని నగదు ఖాళీ చేస్తున్నారని తెలిపారు. బ్యాంకుల నుంచి ఫోన్ చేస్తున్నామని చెబితే వాటిని విశ్వసించ వద్దన్నారు. బ్యాంకుల నుంచి ఫోన్ చేస్తే నేరుగా బ్యాంకుకు వెళ్లి వారితో మాట్లాడాలన్నారు. బ్యాంకు ఖాతా వివరాలను, ఏటీఎం పిన్ నంబర్లు, సీవీవీ నెంబర్లు ఇతరులకు చెప్పవద్దని సూచించారు. వీటిని అరికట్టేందుకు బ్యాంకులు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాంకుల్లో సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా, వీడియో రికార్డింగ్ వ్యవస్థలు పనిచేస్తున్నాయా, అలారం, ఎమర్జెన్సీ బటన్లు స్థిరంగా పనిచేస్తున్నాయనే అంశాలపై ప్రశ్నించారు. బ్యాంకుల్లో 24 గంటలు పనిచేసే సీసీ కెమెరాలు తప్పకుండా ఉండాలన్నారు. సమావేశంలో బ్యాంకు మేనేజర్లు, సీఐలు నాగభూషణం, శేషగిరిరావు, ఎస్సైలు రాజ్యలక్ష్మి, వెంకటేశ్వర్లు, జనార్దన్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఏఐతో రైల్వే డివిజన్ అభివృద్ధికి కృషి
లక్ష్మీపురం: ఆర్టిఫీషియల్ ఇంటల్జెన్స్ (ఏఐ)తో రైల్వే డివిజన్ను మరింత ఆధునాత పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గుంటూరు రైల్వే డివిజన్ డీఆర్ఎం సుధేష్ట సేన్ అన్నారు. పట్టాభిపురంలోని డీఆర్ఎం కార్యాలయంలో బుధవారం ఏఐపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆమె మాట్లాడారు. సిబ్బంది అంతా డివిజన్ అభివృద్ధే లక్ష్యంగా శ్రద్ధతో, ప్రణాళికాబద్ధంగా పని చేయాలని తెలిపారు. నూతన హంగులు, అధునాతన పద్ధతులు, కొత్త దనంతో ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు. ఆయా విభాగాధిపతులు సమర్థమైన పనితీరుతో డివిజన్ మొదటి స్థానంలో ఉండేలా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం రమేష్కుమార్, ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు.డీఆర్ఎం సుథేష్ట సేన్ -
3న బాల్ బ్యాడ్మింటన్ పోటీలు
గుంటూరు వెస్ట్ (క్రీడలు): గుంటూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా జూనియర్ , సబ్ జూనియర్, సీనియర్ పురుషులు, మహిళల జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తామని జిల్లా అధ్యక్షుడు ఈ.శివశంకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల 3వ తేదీ ఉదయం 8 గంటలకు స్థానిక ఎన్జీఓ క్లబ్లో పోటీలు జరుగుతాయన్నారు. పోటీలకు వచ్చే వారు ఆధార్ కార్డుతో పాటు వయస్సు ధృవీకరణ పత్రాన్ని తీసుకురావాలన్నారు. వివరాలకు 93477 85888 నెంబర్లో సంప్రదించాలన్నారు. జంట హత్యల కేసులో నిందితుల అరెస్టు నరసరావుపేట టౌన్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో నిందితులను నరసరావుపేట వన్టౌన్ పోలీసులు అరెస్టు చేసి బుధవారం రిమాండుకు తరలించారు. ఆర్థిక వివాదాల నేపథ్యంలో ఈనెల 23న పట్టణంలోని కోర్టు భవనాల ఎదుట శ్రీనిధి గ్రాండ్ హోటల్ వద్ద బెంగళూరుకు చెందిన తండ్రి కొడుకులు కె.వీరస్వామిరెడ్డి, కె.వి.ప్రశాంతరెడ్డిలను కిడ్నాప్ చేసి బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం పాతమాగులూరు వద్ద అనిల్ రెడ్డి, బాదం మాధవరావు, గడ్డం రఘురాంరెడ్డి తదితరులు హతమార్చినట్లు కేసు నమోదయింది. కిడ్నాప్ జరిగిన ప్రదేశం నరసరావుపేట, హత్య జరిగిన ప్రదేశం బాపట్ల జిల్లా పాతమాగులూరు కావడంతో, దర్యాప్తు ప్రక్రియ క్లిష్టతరంగా మారింది. పోలీసు ఉన్నతాధికారులు రెండు కేసులను నరసరావుపేట వన్టౌన్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, నరసరావుపేట డీఎస్పీ కె.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీఐలు ఎం.వి.చరణ్, హైమారావు, బి.సుబ్బానాయుడు, పి.రామకృష్ణల నేతృత్వంలో ఎస్ఐలు హరిబాబు, వంశీకృష్ణలు ప్రత్యేక బృందాలుగా ముంబయి వెళ్లి మూడు రోజుల వ్యవధిలోనే ప్రధాన నిందితులైన బాపట్ల జిల్లా సంతమాగులూరు గ్రామానికి చెందిన బాదం మాధవరెడ్డి, గడ్డం రఘురాంరెడ్డి, గడ్డం నాగిరెడ్డి, గడ్డం గోపిరెడ్డి, గడ్డం ఇంద్రసేనారెడ్డిలను ఈనెల 27వ తేదీ ఉదయం 10 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పట్టణానికి తెచ్చి బుధవారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు మొత్తం 13 మందిని నిందితులుగా పేర్కొన్నారు. గతంలో అనిల్ రెడ్డిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. ఇంటర్ విద్య సంస్కరణలపై అవగాహన అవసరం నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మీడియెట్ విద్యా విధానంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఇంటర్మీడియెట్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ జె.పద్మ తెలిపారు. పల్నాడుజిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి కార్యాలయంలో బుధవారం జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్తో ఇంటర్ విద్య సంస్కరణలపై అవగాహన సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆర్జేడీ జె.పద్మ మాట్లాడుతూ, విద్యార్థులకు ప్రతి వారాంతంలో పోటీ పరీక్షలు నిర్వహించాలనీ, ప్రశ్నాపత్రాలను ఇంటర్ బోర్డు అందిస్తుందన్నారు. తరగతి గదుల్లో విద్యార్థులతో పాటు అధ్యాపకులు సైతం మొబైల్ ఫోన్లు వినియోగించకూడదని స్పష్టం చేశారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ ఎఫ్ఆర్ఎస్ యాప్లో హాజరు నమోదు చేయాలని తెలిపారు. అధ్యాపకులు డ్రెస్కోడ్ పాటించాలన్నారు. జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి ప్రతినెలా రెండు కళాశాలలను ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించాలని సూచించారు. గుంటూరు ఆర్ఐఓ సునీత మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణతా శాతం పెరగటంతో ప్రవేశాలు సైతం పెరిగాయని తెలిపారు. అధ్యాపకులు నాణ్యమైన విద్యా బోధన అందించాలని కోరారు. డీఐఈఓ ఎం.నీలావతిదేవి మాట్లాడుతూ, అధ్యాపకులు ప్రతి ఒక్క విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కలిగి ఉండాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో విద్యార్థుల పురోగతిపై చర్చించాలని కోరారు. -
‘సీనియర్ సిటిజన్ల’ చట్టంపై అవగాహన అవసరం
జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు నరసరావుపేట: తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టం, 2007పై విసృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా విభిన్న ప్రతిభావంతుల, సీనియర్ సిటిజెన్స్, ట్రాన్స్జెండర్ శాఖ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టం, 2007, ట్రాన్స్ జెండర్ హక్కుల చట్టం 2019 అమలుపై ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, విభిన్న ప్రతిభావంతులు, సీనియర్ సిటిజన్స్, ట్రాన్స్ జెండర్ల సంక్షేమ శాఖ ఏడీ దుర్గా భాయ్, వరలక్ష్మి, లాయర్ శిరీష పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు, పిల్లల మధ్య సఖ్యత లేని కారణంగా వారి మధ్య వివాదాలు తలెత్తుతున్నాయన్నారు. అన్నివర్గాల కుటుంబాల్లోనూ ఇటువంటి పరిస్థితి చూస్తున్నామన్నారు. తల్లిదండ్రుల, వృద్ధుల సంరక్షణలో ఆయా కుటుంబ సభ్యుల బాధ్యత వహించాల్సి ఉందని, తల్లిదండ్రులతో సహా ఎవరైనా సీనియర్ సిటిజన్ తన సొంత సంపాదన నుంచి లేదా అతని సొంత ఆస్తి నుంచి తనను తాను కాపాడుకోలేక పోయినప్పుడు ప్రాథమికంగా ఆర్డీఓ అధ్యక్షతన ఉన్న ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఆర్డీఓ ద్వారా నోటీసులు అందించి విచారణ చేసి సమస్యను సానుకూలంగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. వయోవృద్ధులు, తల్లిదండ్రులను, నిర్లక్ష్యం వహించే కుమారులు, కుమార్తెలపైన చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే అరవింద బాబు మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్ హక్కుల చట్టం 2019 ద్వారా ట్రాన్స్ జెండర్లకు హక్కులు కల్పించడం జరిగిందన్నారు. లాయర్ శిరీష పలు సూచనలు, సలహాలు అందించారు. మానవ అక్రమ రవాణాపై అవగాహన సదస్సు నరసరావుపేట టౌన్: మానవ అక్రమ రవాణాపై పట్టణంలోని పెద్ద చెరువు 9వ లైన్లో గల బాలుర సంక్షేమ వసతి గృహంలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో ప్రధాన సీనియర్ సివిల్ అధికారి కె. మధుస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు వ్యక్తులు చిన్నపిల్లలను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారన్నారు. వెట్టి చాకిరి, యాచకత్వం, తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాల కోసం బాలురను వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు అపరిచితులను నమ్మ వద్దన్నారు. దీనిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే హాస్టల్ వార్డెన్ దృష్టికి తీసుకురావాల్సిందిగా ఆయన సూచించారు. ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లు, హాస్టల్ వార్డెన్లు, విద్యార్థులు, టూటౌన్ పోలీసులు పాల్గొన్నారు. -
భర్త చిత్రహింసలపై ఫిర్యాదు
నగరంపాలెం: ఎమ్మెల్యే వద్ద ఉంటున్న భర్త చిత్రహింసలకు గురి చేస్తున్నాడని భార్య వాపోయింది. పొన్నూరు మండలం ఆలూరు గ్రామానికి చెందిన పేర్ల వెంకటేశ్వరమ్మ, ఆమె తల్లి నంబూరు లక్ష్మి బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయం (డీపీఓ)లో మళ్లీ ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. ఈ క్రమంలో వెంకటేశ్వరమ్మ మీడియాతో మాట్లాడారు. ఎనిమిదేళ్ల కిందట పౌల్రాజుతో ప్రేమ వివాహామైంది. భర్త పంచాయతీరాజ్లో పనులకెళ్తూ, ప్రస్తుతం ఎమ్మెల్యే వద్ద ఉంటున్నాడు. పాండ్రపాడులోని రెండెకరాల పొలంలో ఎకరాన్ని ఆరేళ్ల కిందట రూ.19 లక్షలకు విక్రయించాడు. మిగతా ఎకరం కూడా విక్రయించేందుకు నాపై ఒత్తిడి తీసుకొస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిసై హింసకు గురిచేస్తున్నాడు. ఈనెల 11న మరణాయుధంతో దాడికి పాల్పడగా, ప్రాణాలతో బయటపడ్డాను. కుమార్తె సేవిత భర్త వద్దనే ఉంటుంది. ప్రస్తుతం నా భర్త, మరో రౌడీషీటర్తో కలసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. గత నెల్లో డీపీఓ ఆవరణలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అతనిపై ఫిర్యాదిచ్చినా పట్టించుకోలేదు. ప్రస్తుతం మళ్లీ బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. దీంతో చేసేది లేక మరలా ఫిర్యాదు చేసేందుకు వచ్చామని బాధితురాలు వెంకటేశ్వరమ్మ, ఆమె తల్లి లక్ష్మి వాపోయారు. పాపను నాకు అప్పగించాలని, భర్త నుంచి రక్షణ కల్పించాలని భార్య వెంకటేశ్వరమ్మ మీడియా ఎదుట వేడుకుంది. -
ఉచిత బస్సు తరువాత జాతర వాతావరణం
ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): మహిళలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా ఉచిత బస్సు అంశంపై నెల్లూరు జోన్ పరిధిలోని గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాల అధికారులతో గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని కార్యాలయంలో బుధవారం ఎండీ ద్వారకా తిరుమలరావు, చైర్మన్ నారాయణ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళల ప్రయాణం ఏర్పాలయ్యాక కొద్ది రోజులు జాతర వాతావరణం ఉంటుందని తెలిపారు. ఆర్టీసీ పరిధిలో ఉచిత బస్సుల సౌకర్యం కల్పించేందుకు విధి విధానాలు, సంసిద్ధత, సౌకర్యాల కల్పనపై అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తిస్థాయిలో ఆపరేషన్ చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలని పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు ఎటువంటి ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాలేదని తెలిపారు. త్వరలో జరిగే క్యాబినెట్ సమావేశం అనంతరం పూర్తిస్థాయిలో అధికారికంగా వెలువడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణం ఉంటుందని, వారు ఆధార్, పాన్కార్డు వంటి గుర్తింపు కార్డులు కలిగి ఉండాలని ఆయన సూచించారు. ఆర్టీసీ ఎండీ నుంచి డీఎం వరకు సమష్టిగా కృషి చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే 1050 బస్సులు రానున్నట్లు తెలిపారు. అధికారికంగా ఆదేశాలు రానప్పటికీ, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, డీలక్స్, సిటీ బస్సుల్లో ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. అవకాశం ఉన్న వరకు ఎక్కడ నుంచైనా రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు తిరిగే అవకాశం ఇస్తున్నామని, సిబ్బందికి కూడా కొద్దిగా పని పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆర్టీసీ చైర్మన్ నారాయణ మాట్లాడుతూ త్వరలోనే మార్గదర్శకాలు రానున్నాయని తెలిపారు. కార్యక్రమంలో నెల్లూరు జోన్ పరిధిలో ఈడీలు, ఆర్ఎం, డీఎంలు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు. -
గ్రామాల అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి
జెడ్పీ సీఈవో జ్యోతిబసు గుంటూరు ఎడ్యుకేషన్: గ్రామ పంచాయతీల స్థాయిలో అభివృద్ధి ప్రణాళికను రూపొందించాలని జెడ్పీ సీఈవో వి. జ్యోతిబసు తెలిపారు. జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం ఉప మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో పాటు మండలానికి ఐదుగురు చొప్పున ఎంపిక చేసిన గ్రామ పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. పంచాయతీ అభివృద్ధి ప్రణాళికకు సంబంధించి పీఏఐ పోర్టల్పై సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఈవో జ్యోతిబసు మాట్లాడుతూ పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ 2.0 వెర్షన్ (పీఏఐ పోర్టల్)కు సంబంధించిన అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకుని, సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో స్వచ్ఛ సర్వేక్షణ్ అమలు తీరు, తెన్నులపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. కార్యక్రమంలో డీపీఎం డి. రవీంద్రబాబు, అధికారులు పాల్గొన్నారు. -
అసంపూర్తి పనులపై అసంతృప్తి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల తీరుపై దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మాస్టర్ ప్లాన్లో భాగంగా చేపట్టిన పలు అభివృద్ధి పనులు, దాతల సహకారంతో నిర్మించిన యాగశాలను బుధవారం ఆయన పరిశీలించారు. తొలుత కనకదుర్గనగర్కు చేరుకున్న రామచంద్రమోహన్, ఆలయ ఈవో శీనానాయక్, దేవస్థానం ఇంజినీరింగ్ అధికారులు వెలివేటెడ్ క్యూకాంప్లెక్స్ను పరిశీలించారు. మాస్టర్ ప్లాన్లో చూపిన విధంగా నిర్మాణాలు జరుగుతున్నాయా అని ఇంజినీరింగ్ అధికారులను ప్రశ్నించారు. అనంతరం మహా మండపం వద్ద నిర్మిస్తున్న అన్నదాన, ప్రసాదాల పోటు పనులను పరిశీలించారు. ఇంజినీరింగ్ పనుల్లో అర్చకుల జోక్యం తగదు ఆలయ ప్రాంగణంలో దాతల సహకారంతో నిర్మించిన యాగశాలను కమిషనర్ పరిశీలించారు. యాగశాల పక్కనే నిర్మిస్తున్న పూజా మండపాల పనులను పరిశీలించారు. ఆలయ నిర్మాణాలు, అభివృద్ధి పనుల్లో కొంతమంది అర్చకులు జోక్యం చేసుకుంటున్నారని, ఇంజినీరింగ్ పనులలో వారి సలహాలు అవసరం లేదని, ఎవరి పనులు వారు చేసుకుంటే బాగుంటుందని సున్నితంగా మందలించారు. ఆలయంలో జరుగుతున్న పనులు సకాలంలో పూర్తి చేసేలా కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని ఈవో శీనానాయక్కు సూచించారు. మహా మండపం 7వ అంతస్తులోని చైర్మన్ చాంబర్లో దేవదాయ శాఖ ఇంజినీరింగ్ అధికారులు, దుర్గగుడి ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దసరా నాటికి పనులు పూర్తి చేయాలని సూచించారు.దుర్గమ్మ సన్నిధిలో అభివృద్ధి పనులను పరిశీలించిన దేవదాయ శాఖ కమిషనర్ -
నేషనల్ తైక్వాండోలో పతకాలు
వేటపాలెం: స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థులు నేషనల్ తైక్వాండో పోటీల్లో సత్తా చాటి కాంస్య, రజత పతకాలు సాధించినట్లు ప్రధానోపాధ్యాయురాలు దేవరకొండ సరోజిని బుధవారం తెలిపారు. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు విజవాడలో తైక్వాండో నేషనల్ ఓపెన్ పోటీలు జరిగాయి. హైస్కూల్లో చదువుతున్న అక్కాచెల్లెళ్లు యార్లగడ్డ లక్ష్మీప్రియ, లాస్యప్రియ విజేతలుగా నిలిచి కాంస్య, రజత పతకాలు సాధించినట్లు తెలిపారు. విద్యార్థులను వ్యాయామ ఉపాధ్యాయుడు జె. దేవభిక్షం ఉపాధ్యాయిని జె. శ్రావణి అభినందించారు. -
ర్యాంపులు, వీల్ చైర్లు ఏర్పాటు చేయాలి
చీరాల: డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో దివ్యాంగుల కోసం ర్యాంపులు, వీల్చైర్లు ఏర్పాటు చేయాలని కోరుతూ నవ్యాంధ్ర వికలాంగుల సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ కాలేషా బుధవారం డీఎస్పీ ఎండీ మొయిన్కు వినతిపత్రం అందించారు. ఈ మేరకు గుంటూరు రేంజ్ ఐజీ ఆదేశాలిచ్చినా అమలుకు నోచుకోలేదన్నారు. ఈ విషయంపై పలుమార్లు వినతిపత్రాలు అందించినా స్పందన లేదన్నారు. జాతీయ దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం ఇది దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనన్నారు. రాష్ట్ర కార్యదర్శి ఎస్.రమేష్, జిల్లా అధ్యక్షులు ఇరుపని వెంకటేశ్వర్లు, పి.అనిల్నాయుడు, జి.రవితేజ తదితరులు పాల్గొన్నారు. -
జెడ్పీ చైర్పర్సన్ అమెరికా పయనం
వైస్ చైర్మన్కు అప్పగించని బాధ్యతలు గుంటూరు ఎడ్యుకేషన్: జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా వ్యక్తిగత పనులపై విదేశాలకు వెళ్లారు. అనారోగ్యంతో వైద్యం చేయించుకునేందుకు అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు. జెడ్పీ చైర్పర్సన్ స్థానికంగా అందుబాటులో లేని సమయంలో వైస్ చైర్మన్కు బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. అయితే, హెనీ క్రిస్టినా బాధ్యతలను ఎవ్వరికీ అప్పగించ లేదు. దీనిపై అధికారులను వివరణ కోరగా చైర్పర్సన్ విదేశాలకు వెళ్లిన విషయం వాస్తవమేనని తెలిపారు. వైభవంగా నరనారాయణ జయంతి తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని విజయకీలాద్రి దివ్య క్షేత్రంపై నరనారాయణ జయంతిని బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న జీయర్స్వామి మంగళా శాసనాలతో నరనారాయణ జయంతి సందర్భంగా ఉదయం 7 గంటలకు అష్టాక్షరీ మహామంత్ర జపం, శ్రీకృష్ణుడికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ, ప్రసాదాలు స్వీకరించారని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ డెల్టాకు 6,034 క్యూసెక్కులు విడుదల దుగ్గిరాల: విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి పశ్చిమ డెల్టాకు 6,034 క్యూసెక్కులను బుధవారం విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద 12 అడుగులు నీటి మట్టం ఉందని తెలిపారు. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవెల్కి 246, బ్యాంక్ కెనాల్ 1356, తూర్పు కాలువకు 650, పశ్చివ కాలువకు 227, నిజాంపట్నం కాలువకు 450, కొమ్మూరు కాలువకు 1780 క్యూసెక్కులు వదిలినట్లు పేర్కొన్నారు. బ్యారేజీ నుంచి సముద్రంలోకి 71,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. లారీ ఢీకొని విద్యార్థి మృతి పట్నంబజారు: ప్రభుత్వ బియ్యం సరఫరా చేసే లారీ ఢీకొని తొమ్మిదో తరగతి విద్యార్థి మృతి చెందిన సంఘటన గుంటూరు నగరంలో బుధవారం చోటు చేసుకుంది. ఈస్ట్ ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆనందపేటకు చెందిన షేక్ షాహిద్ అహ్మద్ (13) కొత్తపేటలోని భాష్యం స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఉదయం స్కూల్కు వెళుతున్న క్రమంలో పెన్ను కోసం తండ్రి ద్విచక్ర వాహనంపై ఒక్కడే బయటకు వచ్చాడు. ఈ సమయంలో గుంటూరు నుంచి తెనాలి వెళుతున్న రేషన్ బియ్యం ఢీకొట్టింది. దీంతో షాహిద్ అహ్మద్ అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి షబ్బీర్ అహ్మద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎల్ఆర్ఎస్ స్కీంను సద్వినియోగం చేసుకోవాలి నెహ్రూనగర్: రాష్ట్ర ప్రభుత్వం అనధికార లే ఔట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ పథకం–2020ని పొడిగించిందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకంలో రాష్ట్రంలో జూన్ 30, 2025 వరకు వేసిన అనధికార లే ఔట్లను, ప్లాట్లను నిర్ణీత అపరాధ రుసుం చెల్లించి క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించిందని తెలిపారు. లైసెన్సుడ్ సర్వేయర్, ఇంజినీర్లు, ఆర్కిటెక్చర్లు ద్వారా అనధికార లే ఔట్లో ఉన్న స్థలానికి ప్లాను తయారు చేసుకొని, అపరాధ రుసుములో 50 శాతం (లేదా కనిష్టంగా రూ.10 వేలు) చెల్లించి, జూలై 26 నుంచి 90 రోజులలోపు (అక్టోబర్ 24లోపు) ఆన్లైన్లో http://rrdtcp.ap.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ పథకంలో 45 రోజులలోపు పూర్తి రుసుం చెల్లించిన వారికి 10 శాతం, 45 నుంచి 90 రోజుల్లో చెల్లిస్తే 5 శాతం రాయితీ లభిస్తుందన్నారు. గడువు అనంతరం మిగిలిన లేఔట్లు/ప్లాట్లకు విద్యుత్ సరఫరా, నీటి సరఫరా, డ్రైయినేజీ అనుమతించబడవని తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖ యొక్క నిషేధ ఆస్తుల రిజిస్టర్లో నమోదు చేస్తారని చెప్పారు. లావాదేవీలు అనుమతించబడవని ఆయన స్పష్టం చేశారు. -
ప్రకాశం బ్యారేజ్కు పోటెత్తిన వరద నీరు
తాడేపల్లి రూరల్: ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. పలు వాగులు నుంచి వరద నీరు ప్రకాశం బ్యారేజ్ వద్దకు అధిక మొత్తంలో వచ్చి చేరింది. జేఈ రమేష్ వరద నీటిని బుధవారం దిగువకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగార్జున సాగర్, శ్రీశైలం నుంచి నీరు విడుదల చేశారన్నారు. ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లలో 50 గేట్లకు ఒక అడుగు మేర, 20 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 60,270 క్యూసెక్కులను దిగువకు విడుదల చేశామని తెలిపారు. కృష్ణా పశ్చిమ డెల్టా, తూర్పు డెల్టా, రైవస్, బందరు కాలువలకు 16,729 క్యూసెక్కులు విడుదల చేశామని పేర్కొన్నారు.మానవ అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు బాపట్ల: మానవ అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జేసీ గంగాధర్గౌడ్ పేర్కొన్నారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ, సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ (సిఫార్డ్) స్వచ్ఛంద సంస్థ సమన్వయంతో కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో బుధవారం సమావేశం నిర్వహించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ రాధా మాధవి అధ్యక్షత వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం, సిఫార్డ్ సంస్థ డైరెక్టర్ కె.రవి ప్రదీప్, బాపట్ల మండల పరిషత్ అధికారి బాబురావు, ఆర్పీఎఫ్ సీఐ చంద్రశేఖర్, డీసీపీఓ పి.పురుషోత్తమరావు, బాలల సంరక్షణ అధికారి జి.కృష్ణ, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సాయి జ్యోతి పాల్గొన్నారు. -
‘ఉపాధి హామీ’ అక్రమాలపై విచారణ
బల్లికురవ: బోగస్ మస్టర్లలో చేసిన పనులను పదే పదే చూపిస్తూ ఉపాధి హామీ సిబ్బంది అవినీతి అక్రమాలకు పాల్పడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని జిల్లా సంయుక్త కలెక్టర్ నాగిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి మండలంలో రూ.12 కోట్లతో నిర్వహించిన 645 పనులకు సంబంఽధించి సామాజిక తనిఖీలో అవినీతి బహిర్గతమైంది. ఈ మేరకు పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలపై కలెక్టర్ ఆదేశాల మేరకు సంయుక్త కలెక్టర్ బుధవారం మండలంలో విచారణ నిర్వహించారు. కొమ్మినేనివారిపాలెంలో నిర్వహించిన పనులకు సంబంధించి సామాజిక తనిఖీ పూర్తయినా ఒక్క పనినీ అధికారులు చూపకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైదన, ఎస్ఎల్ గుడిపాడులో నిర్వహించిన పనుల్లో అక్రమాలపై ప్రశ్నించారు. చేసిన పనులనే పదే పదే చూపుతున్నా, పర్యవేక్షించాల్సిన అధికారులు కార్యాలయాలకే పరిమితం అయ్యారా? అని ప్రశ్నించారు. మీడియా ప్రతినిధుల వద్దనున్న బోగస్ మస్టర్ల వివరాలను తెలుసుకున్నారు. అంగన్వాడీలు, ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, చదువుకునే విద్యార్థులు, 80 సంవత్సరాలకు పైబడిన వృద్ధులకు మస్టర్లు వేసి సొమ్ము స్వాహా చేసినట్లుగా గుర్తించారు. మండలంలోని 21 పంచాయతీల్లో నిర్వహించిన పనులపై ప్రత్యేక నివేదికను తయారు చేసి పంపాలని తహసీల్దార్ రవి నాయక్ను ఆదేశించారు. రికవరీ చేయాలని తెలిపారు. ఎంపీడీఓ పాండురంగస్వామి, ఏపీవో రమాదేవి పాల్గొన్నారు. కేజీబీవీల తనిఖీ విద్యతోనే ఉన్నత స్థాయికి ఎదగాలని బాపట్ల జిల్లా సంయుక్త కలెక్టర్, సర్వ శిక్ష అభియాన్ ఏపీసీ నాగిరెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక కస్తూర్బా గాంఽధీ గురుకుల బాలికల విద్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. బాలికల వద్దనన్న ట్యాబ్లను పరిశీలించారు. అనంతరం వారిని వివిధ ప్రశ్నలు అడిగి, సమాధానాలు రాబట్టారు. విద్యార్థులకు అందుతున్న వసతుల గురించి ప్రిన్సిపాల్ కె. సరళకుమారిని అడిగి తెలుసుకున్నారు. అదనపు గదుల నిర్మాణాన్ని సకాలంలో పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటే బెడ్లు, మంచాలు ఏర్పాటు చేయిస్తామని చెప్పారు. -
అవినీతికి పాల్పడిన మెప్మా సిబ్బందిపై చర్యలు
రేపల్లె: నకిలీ గ్రూపులు సృష్టించి బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన మహిళలను మోసం చేసిన మెప్మా సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ చెప్పారు. పట్టణంలోని 21వ వార్డులో 2023 సంవత్సరంలో పలువురు ఆర్పీలు నకిలీ గ్రూపులను సృష్టించి, వివిధ బ్యాంకుల ద్వారా రూ.2 కోట్ల రుణాలను తీసుకుని గ్రూపు సభ్యులను మోసగించిన ఘటనపై విచారణ చేసి సభ్యులకు న్యాయం చేయాలని కోరుతూ ఇటీవల బాపట్లలో జరిగిన గ్రీవెన్స్లో జిల్లా కలెక్టర్ వెంకట మురళీకి సీపీఎం, ఐద్వాల ఆధ్వర్యంలో బాధిత మహిళలు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ బుధవారం రేపల్లె పట్టణానికి విచ్చేసి 21వవార్డులో బాధిత మహిళలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. అవినీతికి సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టామని పేర్కొన్నారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు తమ సమస్యలను వివరించారు. తమ ప్రమేయం లేకుండా గ్రూపులను ఏర్పాటు చేసి ఆర్పీలు రుణాలు పొందటం వల్ల చెల్లింపులు కోరుతూ బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయని వాపోయారు. తాము పొందని రుణాలను ఎలా చెల్లించాలని ప్రశ్నించారు. తమ పేర్లపై వివిధ బ్యాంకులలో రుణాలు పొందినట్లు నమోదై ఉండటంతో గ్రూపు రుణాలు పొందేందుకు అవకాశం లేకుండా పోయిందన్నారు. దీంతోపాటుగా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాల లబ్ధి బ్యాంకు అకౌంట్లో జమ అయినప్పటికీ రికవరీ పేరుతో మేనేజర్లు జమ చేసుకుంటున్నారన్నారు. కూలీనాలీ చేసుకుని జీవించే తమకు బ్యాంకు రుణాలు ఇప్పించి సమస్యను పరిష్కరించాలని పలువురు మహిళలు వాపోయారు. దీంతో స్పందించిన పీడీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ సమస్యపై బ్యాంకర్లతో మాట్లాడి సంక్షేమ పథకాల లబ్ధి ఖాతాదారులకు చేరేలా చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత మహిళలకు డ్వాక్రా సేవలు అందేలా కృషి చేస్తామని చెప్పారు. సమావేశంలో సీపీఎం పట్టణ కార్యదర్శి మణిలాల్ మాట్లాడుతూ పేద మహిళల ప్రమేయం లేకుండా అవినీతికి పాల్పడిన మెప్మా సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత మహిళలకు కొత్త గ్రూపులు ఏర్పాటు చేసి సాధ్యమైన త్వరలో రుణాలు మంజూరు చేయటంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి చేరేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోరాటాలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఐద్వా నాయకులు నాంచారమ్మ, ధనమ్మ, ఎస్కే ఆశ, జహీరా, షబానా, బాధిత మహిళలు తదితరులు పాల్గొన్నారు. డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ -
అనధికార లేఔట్లు క్రమబద్ధీకరణ చేసుకోవాలి
బాపట్లఅర్బన్: బావుడా పరిధిలో ఉన్న అనధి కార లే ఔట్లను క్రమబద్ధీకరణ చేసుకోవాలని బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్లానింగ్ అధికారి శోభన్బాబు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిబంధనల ప్రకారం 30 జూన్ 2025లోపు రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు, లే ఔట్లను క్రమబద్ధీకరించుకోవాలని తెలిపారు. అనధికారిక లేఔట్లపై స్పందిస్తూ పైన తెలిపిన తేదీ ప్రకారం ఒక ప్లాట్ అయినా అమ్మకం జరిగి ఉండాలన్నారు. జూలై 26వ తేదీ నుంచి 90 రోజుల్లోగా క్రమబద్ధీకరణకి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రధానంగా ఎల్ఆర్ఎస్ 2020లో దరఖాస్తు చేయని వారితోపాటు, అనధికారిక లేఔట్లలో ప్లాట్ ఉన్నవారు, లేఔట్లను అభివృద్ధి చేసిన వారు అర్హులవుతారని పేర్కొన్నారు. సంబంధిత లేఔట్లలో ఓపెన్ స్పేస్ లేకపోతే సాధారణ రుసుముతోపాటుపాటు 14 శాతం ఓపెన్ స్పేస్ చార్జీలు కూడా చెల్లించాలన్నారు. అక్టోబరు 24వ తేదీలోపు దరఖాస్తు చేయకపోతే లేఔట్లలో, ప్లాట్లలో భవిష్యత్తులో భవన నిర్మాణాలు అనుమతులు ఇవ్వబోమన్నారు. ఇలాంటి స్థలాల క్రయవిక్రయాలకు వీల్లేకుండా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో నిషేధిత భూముల జాబితాలో నమోదు చేస్తామని వివరించారు. రేపల్లె, బాపట్ల పురపాలక సంఘం, బావుడా ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. -
ముంపు ప్రాంత వాసులను ఆదుకుంటాం
కొల్లూరు: కృష్ణా నదికి ఎగువ నుంచి వరదలు వస్తున్న తరుణంలో పరివాహక ప్రాంత వాసులను అన్నివిధాలా ఆదుకుంటామని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి బుధవారం 87 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఆయన కొల్లూరు మండల పరిషత్తు కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. రేపల్లె ఆర్డీఓ రామ లక్ష్మితో కలసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముందస్తు జాగ్రత్తలపై యంత్రాంగానికి పలు సూచనలు చేశారు. గురువారం మధ్యాహ్నం సమయానికి 3 లక్షల నుంచి 3.50 లక్షల క్యూసెక్కులకు వరద చేరుకునే అవకాశం ఉందన్నారు. కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల పరిధిలో 67 కిలోమీటర్ల పొడవున ఉన్న కృష్ణా కుడి కరకట్టకు యుద్ధప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టాలని ఆర్సీ యంత్రాంగాన్ని ఆదేశించారు. గతేడాది చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో 11.47 లక్షల క్యూసెక్కుల వరద నీరు రావడంతో కరకట్ట రక్షణ విషయంలో త్రుటిలో గండం నుంచి గట్టెక్కగలిగామని, ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఒకటి లేదా రెండు కిలోమీటర్లకు ఓ పర్యవేక్షణ అధికారిని నియమించి కట్ట పటిష్టత విషయంలో స్థానికులతో కలిసి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మూడు నెలలకు అవసరమైన నిత్యావసర సరకులను ఆయా గ్రామాలకు తరలించాలని ఆదేశించారు. కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల పరిధిలో 30 గ్రామాల వారికి సరకుల కోసం బోట్లను అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ, ఆల్మట్టి నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు ఉన్న డ్యామ్ల నుంచి విడుదలవుతున్న నీటి పరిమాణాన్ని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ప్రజల రక్షణకు చర్యలు చేపడుతున్నామన్నారు. సమావేశంలో తహసీల్దార్ బి.వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ కె.నరసింహారావు, వేమూరు సీఐ పీవీ ఆంజనేయులు, ఆర్సీ ఏఈలు విజయ్రాజు, నాగేశ్వర నాయక్, వివిధ శాఖల జిల్లా, మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి ప్రస్తుత నీటి విడుదలతో ముప్పు లేదు సంబంధిత యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి కృష్ణా కరకట్ట బలోపేతం చేయాలని యంత్రాంగానికి ఆదేశం -
సక్రమంగా బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు
బాపట్ల: బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలులో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని ఏపీఎస్డబ్ల్యూసీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ రాష్ట్ర మేనేజింగ్ డైరెక్టర్ సునీత పేర్కొన్నారు. బాపట్ల, చీరాల, పర్చూరు మండలాలలో బుధవారం ఆమె విస్తృతంగా పర్యటించారు. బాపట్ల పట్టణంలోని మార్కెట్ యార్డులో గోదామును ఆమె పరిశీలించారు. చీరాల మార్కెట్ యార్డు గోదాము, కొనుగోలు కేంద్రం, పర్చూరు మండలంలో కొనసాగుతున్న కొనుగోలు కేంద్రం, మార్కెట్ యార్డు గోదాము, ఎస్డబ్ల్యూసీ గోదాములను కూడా పరిశీలించారు. బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాలు, గోదాములలో నిల్వ చేసిన పొగాకు వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న బ్లాక్ బర్లీ పొగాకును భద్రంగా నిల్వ చేయాలని ఎండీ సునీత తెలిపారు. రైతుల నుంచి పొగాకు కొనుగోలు చేసే సమయంలో అధికారులు తేమ శాతాన్ని కచ్చితంగా పరిశీలించాలన్నారు. మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న పొగాకును ఎప్పటికప్పుడు గోదాములలో భద్రపరచాలని తెలిపారు. గోదాముల నిల్వ సామర్థ్యం ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. నిల్వ పెరిగితే పొరుగు జిల్లాలకు తరలించాలని పేర్కొన్నారు. ముందస్తుగానే గోదాములను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఆమె వెంట మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ కరుణశ్రీ , జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి రమేష్ బాబు, తదితరులు ఉన్నారు. -
పెండింగ్ మెస్ బిల్లులు విడుదల చేయాలి
బాపట్లఅర్బన్: ప్రభుత్వ హాస్టళ్లలో పెండింగ్లో ఉన్న మెస్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు యల్లావుల సోహిత్ డిమాండ్ చేశారు. పట్టణంలోని బీసీ హాస్టల్లో విద్యార్థులకు అందుతున్న మౌలిక సదుపాయాలపై ఆరా తీసేందుకు మంగళవారం హాస్టళ్లను పరిశీలించారు. జిల్లా అధ్యక్షులు సోహిత్ మాట్లాడుతూ పట్టణంలో విద్యార్థులతో కలిసి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నామన్నారు. హా స్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల సమస్య లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. జిల్లాలో చాలా హాస్టళ్ల భవనాలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. చాలా హాస్టల్లో విద్యార్థులకు సరిప డా గదులు లేక ఒక్కొక్క గదిలో 20 నుంచి 30 మంది విద్యార్థులు ఉంటున్న పరిస్థితిని గమనించామని తెలిపారు. హాస్టల్స్కు పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే ప్రత్యక్ష ఆందోళన చేస్తామని తెలిపారు. హాస్టల్స్ను తనిఖీ చేసిన వారిలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ షేక్ పర్వేజ్ తదితరులు ఉన్నారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు సోహిత్ బీసీ హాస్టల్ సందర్శన భోజనం నాణ్యత పరిశీలన -
తీర భూములపై పచ్చ గద్దలు
సాక్షి ప్రతినిధి,బాపట్ల: బాపట్ల మండలం పాండురంగాపురం సముద్ర తీరప్రాంతంలో చీరాలకు చెందిన టీడీపీ నేత బుర్ల వెంకట్రావు ప్రభుత్వ, అసైన్డ్ భూములను కబ్జాచేసి వాటికి పట్టాలు పుట్టించడమేకాక సదరు భూములను గుంటూరులోని మరో పచ్చ ప్రజాప్రతినిధికి చెందిన భ్రమర ఇన్ఫ్రాకు ధారాదత్తం చేసి కోట్లు ఆర్జించినట్లు తొమ్మిది గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఆరోపించారు. పచ్చనేత భూ దాహం కారణంగా రెండు వేలబోట్లు సముద్రంలోకి వెళ్లే దారిలేదని, దానివల్ల భృతి కోల్పోయి పస్తులుండాల్సి వస్తోందని మత్స్యకారులు ఆవేదన చెందారు. న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామంటూ ఆక్రమిత భూముల వద్ద భైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ విషయం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జిల్లా కలెక్టర్ వెంకట మురళి చొరవతో మత్స్యకారుల గొడవ తాత్కాలికంగా సర్దుమణిగినా తీరంలో పచ్చనేతల భూ ఆక్రమణల వ్యవహారం మరో మారు వెలుగు చూసింది. ఒక్క బుర్ల వెంకట్రావు ఎపీసోడే కాదు బాపట్ల మండల పరిధిలో పలువురు పచ్చనేతలు వారి అనుమాయుల భూకబ్జాల వ్యవహారం శృతిమించింది. కూటమి అధికారంలోకి రావడంతో పచ్చ కబ్జాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. తీర ప్రాతంలో టూరిజం పెరిగి ఎకరం రూ.మూడు నుంచి రూ.5కోట్లు పలుకుతుండడంతో కనిపించిన స్థలాన్నల్లా పచ్చనేతలు ఆక్రమిస్తున్నారు. ప్రభుత్వ భూములతోపాటు అసైన్డ్ భూములను వదలి పెట్టడంలేదు. తొలుత కబ్జాచేసి గతంలో వేరొకరి వద్ద కొన్నట్లు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టిస్తున్నారు. వాటిని చూపి కబ్జా స్థలాలను అమ్మే స్తున్నారు. కొన్నింటిని ఏకంగా రిజిస్ట్రేషన్లు కూడా చేస్తున్నారు. అధికారులకు డబ్బులు ముట్టజెప్పి ఆన్లైన్ చేసుకుంటున్నారు. ఫేక్ పట్టాలను ఇతర ప్రాంతాల నుంచి భూములు, స్థలాలను కొనేవారికి చూపి ఆక్రమిత భూములను అమ్మకానికి పెట్టి కోట్లు కొల్లగొడుతున్నారు. మండలంలోని సూర్యలంక మొదలుకొని రామచంద్రాపురం, దాన్వాయిపేట, కృపానగన్, పాండురంగాపురం, ఓడరేవు ప్రాంతాల వరకూ తీరంలో ప్రభుత్వ, అసైన్డ్ భూముల కబ్జాలకు అంతులేకుండా పోయింది. రామచంద్రాపురం ప్రాంతంలో చీరాల మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు ఏకంగా సముద్రం అలల వరకూ తీరాన్ని ఆక్రమించి కంచె నిర్మించారు. మత్స్యకారులు చేపలు ఆరబోసేందుకు వేసుకున్న ప్లాట్ఫారంను ధ్వంసం చేశారు. ప్రశ్నించిన మత్స్యకారులను బెదిరించారు. అలల వరకూ తమదేనని హెచ్చరించారు. బోట్లు ఎక్కడ పెట్టుకోవాలో తెలియడంలేదని మత్స్యకారులు సాక్షితో వాపోయారు. తీరంలో పచ్చనేతల దౌర్జన్యాలు కోకొల్లలు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. తీరం భక్షక దళం సీఆర్జెడ్ తీరంలో సీఆర్జెడ్ కీలకమైన వ్యవస్థ. తీర ప్రాంతంలో ఎంత దూరం వరకూ ఉంటుందో వారే చెప్పాలి. ఒకరకంగా వారు తీరం రక్షణదళం. కానీ ఇక్కడ సీఆర్జెడ్ తీరం భక్షక దళంలా మారిందన్న ఆరోపణలున్నాయి. తీర ప్రాంతాన్ని అలల వరకూ కబ్జా చేస్తున్నా వారు కన్నెత్తి చూడడంలేదు. వాస్తవానికి సీఆర్జెడ్ నిబంధనల ప్రకారం సముద్రం ఎంతవరకు ఉంటుందో వారు స్పష్టత నివ్వడంలేదు. తీరంలో ఒక్కో దగ్గర ఒక్కోలా నిబంధనలు ఉంటాయని మాత్రమే చెప్పి తప్పించుకుంటున్నారు. తీరం అలల దాకా దాకా పచ్చనేతలు భూములు ఆక్రమించినా సీఆర్జెడ్ పట్టించుకోవడంలేదు. బాపట్ల జిల్లాలో తీరం మొత్తాన్ని కబ్జాల మయంగా మార్చడం వెనుక సీఆర్జెడ్ అధికారుల పాత్రవుందని, అందిన కాడికి దండుకొని కబ్జాదారులకు అండగా నిలుస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే బాపట్ల మండలం సూర్యలంక మొదలు వేటపాలెం మండలం పొట్టిసుబ్బయ్యపాలెం ప్రాంతం వరకూ తీరప్రాతం కబ్జాకు గురైంది. సీఆర్జెడ్ నిబంధనలకు పాతరేసి రోడ్లు ఇతర దుకాణాలు నిర్మించారు. ఆక్రమిత స్థలాల్లో రిసార్ట్లు వెలిశాయి. సీవ్యూ కోసం రిసార్ట్లవారు తీరం రక్షణ కోసం పెంచిన మడ, సర్వి, ఇతర మొక్కలను తొలగించి వేశారు. అయినా సీఆర్జెడ్ స్పందించే పరిస్థితి లేకుండా పోయింది. బాపట్ల తీరంలో ఉన్న వందలాది ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములు టూరిజం పెరగడంతో పెరిగిన భూముల విలువ కూటమి అధికారంలోకి రావడంతో తీరం భూములపై పచ్చనేతల కన్ను ఇప్పటికే అడవి పంచాయతీలో భూములను స్వాధీనం చేసుకున్న పచ్చనేతలు నకిలీ పట్టాలు పుట్టించి ఆక్రమణలు కొందరు ఫేక్ అగ్రిమెంట్లతో భూముల కబ్జా మరికొందరు వేరే సర్వే నంబర్లు వేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న వైనం కిందిస్థాయి రెవెన్యూ అధికారుల సహకారంతో భూ కబ్జాలు ఆక్రమిత భూములను విక్రయిస్తున్న పచ్చముఠాకలెక్టర్ గారూ..తీరప్రాంతంలో భూ కబ్జాలకు కొందరు రెవెన్యూ అధికారులే సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అక్రమాల ఆరోపణలు శృతిమించడంతో వేటపాలెం తహసీల్దారు పార్వతిని కలెక్టర్ సరెండర్ చేసినట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరిగింది. ఈ ఘటన మిగిలిన రెవెన్యూ అధికారుల్లో కొంత భయం కలిగించింది. అదే తరహాలో అక్రమాలకు తెగబడుతున్న మిగిలిన అధికారులపైనా చర్యలకు దిగితే తీరం కబ్జా కాకుండా ఆగే అవకాశముంది. బాపట్ల మండలం మొదలు చినగంజాం వరకూ తీరంలో ఆక్రమణలు శృతిమించాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలకు దిగితే తీరాన్ని కాపాడవచ్చు. తద్వారా పర్యాటకాన్ని అభివృద్ధి వైపు నడిపించవచ్చు. అలా కాకుండా పచ్చనేతల కబ్జాలను చూస్తూ పోతే తీరం మొత్తం కబ్జా కోరల్లో చిక్కుకునే అవకాశముంది. సమర్దులైన అధికారుల కమిటీతో తీరంపై విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది. -
యోగా పోటీల్లో సత్తా చాటాలి
చిలకలూరిపేటటౌన్/యడ్లపాడు: జాతీయస్థాయి యోగా ప్రదర్శన పోటీల్లో పతకాల సాధనే లక్ష్యంగా క్రీడాకారులు కృషి చేయాలని చిలకలూరిపేట పురపాలక కమిషనర్ పి.శ్రీహరిబాబు చెప్పారు. చిలకలూరిపేట మండలంలోని మద్దిరాల పీఎంశ్రీ జవహర్ నవోదయ విద్యాలయం మంగళవారం యోగా క్రీడాకారులతో కళకళ లాడింది. జేఎన్వీ పరిధిలో జరిగే ప్రాంతీయస్థాయి యోగా ప్రదర్శన పోటీలకు మద్దిరాల నవోదయ విద్యాలయం వేదికగా నిలిచింది. దక్షిణ భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఇటీవల జరిగిన క్లస్టర్ స్థాయి యోగా పోటీల్లో విజేతలు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. తరలివచ్చిన 278 మంది విద్యార్థులు 29వ తేదీ నుంచి వరుసగా మూడు రోజులు పాటు పోటీలు జరగనున్నాయి. ఇందుకోసం ఐదు రాష్ట్రాలకు చెందిన 278 మంది క్రీడాకారులు, తమ పీఈటీలు, ఎస్కార్ట్లతో తరలివచ్చారు. మున్సిపల్ కమిషనర్ ిపి.శ్రీహరిబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి యోగా ప్రదర్శన పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. అట్టహాసంగా ప్రారంభమైన ఈ పోటీలకు అధ్యక్షత వహించిన విద్యాలయ ప్రిన్సిపాల్ ఎన్.నరసింహారావు స్వాగతోపన్యాసం చేశారు. ధనలక్ష్మి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ లింగయ్య చౌదరి, నవోదయ విశ్రాంత సహాయ కమిషనర్ ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. తొలుత విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ముందుగా మద్దిరాల పీఎంశ్రీ జేఎన్వీ విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యాలయ వైస్ ప్రిన్సిపాల్ పి.శ్రీనివాసరావు వందన సమర్పణ చేశారు. అనంతరం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన జేఎన్వీల విద్యార్థులు యోగా ప్రదర్శనలు చేశారు. కార్యక్రమంలో జేఎన్వీ అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. మద్దిరాల పీఎంశ్రీ జేఎన్వీలో దక్షిణ భారత యోగా ప్రదర్శన పోటీలు ప్రారంభం ఐదు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన విద్యార్థులు -
ఉన్నపళంగా పొమ్మంటే ఎలాగయ్యా!
నెహ్రూనగర్: అభివృద్ధి పనులకు తాము వ్యతిరేకం కాదని.. ఇప్పుడు ఉన్న ఫళంగా నోటీసులు ఇళ్లు ఖాళీ చేయాలని చెప్పడం ఎంత వరకు సమంజమని, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కేటాయించిన స్థలాలను చూపించి.. మా ఇళ్లను పడగొట్టండి అంటూ నల్లపాడు చెరువు కట్ట నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నల్లపాడు చెరువు కట్ట నివాసితులు ఆందోళన నిర్వహించారు. తమ గోడు విన్నవించుకునేందుకు వస్తే అధికారులు తమపై మండిపడుతూ, బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూకుమ్మడి ఆత్మహత్యలే గతి 18 సంవత్సరాలకు పైబడి ఊరికి దూరంగా కనీస మౌలిక వసతులు లేకపోయినప్పటికీ, రూ.వేల అద్దెలు చెల్లించే స్థోమత లేక చిన్న ఇళ్లు నిర్మించుకుని కూలీ పనులు చేసుకుంటూ తాము జీవిస్తున్నామని, ఆ ఇళ్లను ఖాళీ చేయాలంటూ జీఎంసీ అధికారులు రెండు సార్లు నోటీసులు జారీ చేశారని వాపోయారు. ఇళ్లు ఖాళీ చేయడంలో తమకు అభ్యంతరం లేదని.. కానీ గత ప్రభుత్వ హయాంలో కొర్నెపాడు దగ్గర ఇచ్చిన స్థలాలను తమకు చూపించి ఇళ్లు తొలగించాలని వారు ప్రాధేయపడ్డారు. ఉన్న ఫలంగా మమ్మల్ని ఖాళీ చేయాలని ఆదేశిస్తే ఎక్కడికి వెళ్లి బతకాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయం చూపకుండా తమ ఇళ్లను తొలగించాలని చూస్తే మూకుమ్మడి ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప మాకు గత్యంతరం లేదని వాపోయారు. టిడ్కో ఇళ్లల్లో నివాసం కల్పించాలి ప్రస్తుతం కొర్నెపాడులో తమకు ఇచ్చిన స్థలాల్లో రైతులు పంట పండిస్తున్నారని.. అవి తమకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదని.. అడవి తక్కెళ్లపాడు, వెంగళాయపాలెంలో ఖాళీగా ఉన్న టిడ్కో ఇళ్లల్లో తమకు నివాసం ఉండేందుకు అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు. స్థలాలు చూపించి మా ఇళ్లు పడగొట్టండి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నల్లపాడు చెరువు కట్ట నివాసితుల ఆందోళన -
నల్లబర్లీ కొనుగోలులో జాప్యం తగదు
ఇంకొల్లు(చినగంజాం): నల్లబర్లీ పొగాకు కొనుగోలు విషయంలో ప్రభుత్వం జాప్యం చేయడం తగదని రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి వి.కృష్ణయ్య అన్నారు. పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు మండలాల్లో రాష్ట్ర రైతు సంఘం, జిల్లా రైతు సంఘం నాయకులు మంగళవారం పర్యటించారు. అనంతరం ఇంకొల్లు యూటీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కృష్ణయ్య మాట్లాడారు. పొగాకు సాగు చేసిన రైతుల వద్ద నుంచి 40 రోజులుగా పొగాకు కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రైవేట్ కంపెనీలు, ప్రభుత్వం మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో 35 శాతం మాత్రమే ఇప్పటి వరకు కొనుగోలు చేశారన్నారు. రైతులు వద్ద 65 శాతం పొగాకు నిల్వలు ఇంకా మిగిలి ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం మార్క్ఫెడ్ అధికారులు కొనుగోలు నెమ్మదిగా కొనసాగించడం వలన షెడ్యూల్ పేరుతో జాప్యం జరగుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రభుత్వం ఆగస్టు 20వ తేదీ నాటికి నల్లబర్లీ పొగాకు కొనుగోలు పూర్తి చేయాలని ప్రకటించిందని దాంతో రైతుల్లో ఆందోళన మరింత పెరిగిందన్నారు. ప్రభుత్వ ప్రకటనలను అవకాశంగా తీసుకున్న పొగాకు కంపెనీలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. ఉప్పుటూరు గ్రామంలో దక్కన్ కంపెనీ రైతుల వద్ద రూ.6500కి కొనుగోలు చేసి అనంతరం నాణ్యత లేదని క్వింటాకు రూ. వెయ్యి తగ్గించారన్నారు. మార్క్ఫెడ్ ద్వారా 25 మిలియన్లు పొగాకు కొనుగోలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటికి కేవలం 5 మిలియన్ కేజీలు కూడా కొనుగోలు చేయలేదన్నారు. అదేవిధంగా పొగాకు కొనుగోలు చేసిన 48 గంటలలో రైతుల బ్యాంక్ అకౌంట్లో నగదు జమ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు 40 రోజులు పూర్తి అయినా జమకాలేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు చివరి వరకు పొగాకు కొనుగోలు చేయకుంటే ఆందోళన తీవ్ర తరం చేస్తామన్నారు. జిల్లా కార్యదర్శి తలపనేని రామారావు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం సాఫ్ట్వేర్ను క్వింటాల రూపంలో రూపకల్పన చేశారని అలా కాకుండా 500 చెక్కులను రూపకల్పన చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా రైతు సంఘం కార్యదర్శి పి.కొండయ్య, నాయకులు వరికోటి శ్రీనివాసరెడ్డి, డేవిడ్, భానుస్రసాద్ పాల్గొన్నారు. రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి వి.కృష్ణయ్య 65 శాతం పొగాకు నిల్వలు రైతులు వద్ద పేరుకుపోయాయంటూ ఆవేదన 48 గంటల్లో రైతుల అకౌంట్లో నగదు జమ చేస్తామనే హామీ ఏమైంది? రైతుల వద్ద చివరి కాడ వరకు పొగాకు కొనుగోలు చేయకుంటే ఆందోళన -
పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక కృషి
గుంటూరు వెస్ట్: జిల్లాలో పర్యావరణ పరిరక్షణ పెంపొందించేందుకు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో గాలి నాణ్యతను మరింతగా పెంపొందించేందుకు జాతీయ క్లీన్ ఎయిర్ కార్యక్రమాలు నిర్వహించేందుకు సంబంధిత శాఖలు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ మిని సమావేశ మందిరంలో జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులుతో కలిసి నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జీఎంసీ పరిధిలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ను జిల్లా స్థాయి అమలు కమిటీలు నిర్వహించాలన్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గుంటూరు నగరానికి 2011–15 మధ్య గాలి నాణ్యతా డేటా ఆధారంగా నాన్ అసైన్మెంట్ నగరాల్లో ఒకటిగా గుర్తించిందన్నారు. జాతీయ కాలుష్యాన్ని గుర్తించేందుకు జాతీయ క్లీన్ఎయిర్ ప్రోగ్రామ్ను రూపొందించారని పేర్కొన్నారు. రానున్న పది సంవత్సరాల్లో గాలిలో కాలుష్యాన్ని 70 నుంచి 80 శాతం తగ్గించే లక్ష్యంతో పచ్చదనాన్ని పెంపొందించే కార్యక్రమాలు చేపట్టేందుకు నిధులు మంజూరు చేస్తుందన్నారు. దీనిలో భాగంగా 2019–20, 2024–25 వరకు గుంటూరు నగరానికి మొత్తం ఎన్సీ ఏపీ కింద రూ. 20.51 కోట్లు నిధులు మంజూరయ్యాయన్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి క్లీన్ సిటీ రూ.2.73 కోట్ల అంచనాలతో ప్రతిపాదించిన పనులను నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం సకాలంలో పూర్తి చేయాలన్నారు. గాలి నాణ్యతా ప్రమాణాలు పెంపొందించేందుకు అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. శంకర్ విలాస్ బ్రిడ్జి కూ ల్చడం, నూతన బ్రిడ్జి నిర్మాణ క్రమంలో జీజీహెచ్, ట్రావెల్స్ బంగ్లాలో వద్ద ఉన్న నేషనల్ ఎయిర్ మానిటరింగ్ ప్రోగ్రామ్ ద్వారా ఏర్పాటు చేసిన స్టేషన్లను ప్రత్యామ్నాయ ప్రాంతాలకు మార్చాలన్నారు. సమావేశంలో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్వీరాన్మెంట్ ఇంజినీర్ ఎం.డి.నజీనా బేగం, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం జయలక్ష్మి, డీఎస్ ఆర్.చంద్రమౌళి పాల్గొన్నారు. రైల్వే సిగ్నల్ కంట్రోలు కార్యాలయం ప్రారంభం దుగ్గిరాల: నూతన కార్యాలయంలో మంగళవారం రైల్వే సిగ్నల్ కంట్రోలు వ్యవస్థను రైల్వే ఉన్నతాధికారులు ప్రారంభించారు. సూమారు మూడు సంవత్సరాలు నుంచి ఆధునికీకరణ పనులతో పాటు మూడో లైను నిర్మాణ పనులు నిర్వహిస్తున్నారు. పనులు పూర్తి కావడంతో అత్యంత ఆధునిక సాంకేతిక విధానం కలిగిన కార్యాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి -
ప్రభుత్వ కార్యక్రమాల అమలులో సాంకేతిక పరిజ్ఞానం కీలకం
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేసే క్రమంలో అవసరమైన డేటా ను రూ పొందించడంలో సాంకేతిక పరిజ్ఞానం కీలకమని జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు అన్నారు. మంగళవారం జెడ్పీ సమావేశ మందిరంలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (ఆర్జీఎస్ఏ) కార్యాచరణ ప్రణాళిక 2025–26 రూపకల్పనలో భాగంగా ట్రైనింగ్ మేనేజ్మెంట్ పోర్టల్, ప్రగతి పోర్టల్పై మండల స్థాయిలోని సాంకేతిక సిబ్బందికి శిక్షణ కల్పించారు. ఈ సందర్భంగా సీఈవో జ్యోతిబసు మాట్లాడుతూ టీఎంపీ, ప్రగతి పోర్టల్, ప్రగతి యాప్ వినియోగించే పద్ధతి, సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించారు. శిక్షణకు సంబంధించిన అంశాలను పోర్టల్లో నమో దు చేయాలని సూచించారు. శిక్షణ కార్యక్రమాలు సమర్థంగా నిర్వహించడంలో సాంకేతికపరమైన పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా పోస్ట్, ప్రీ అసెస్మెంట్, ఆధార్ ఆథెంటిఫికేషన్, ఈ–సర్టిఫికెట్ డౌన్లోడ్ వంటి అంశాలను పూర్తి చేసేందుకు ప్రతి ఉద్యోగికి శిక్షణ కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో రీసోర్స్ పర్సన్లు రవీంద్రబాబు, కె.నాగేశ్వరరావు, కరీముద్దీన్, అనురాధ, ఏవో ప్రతాప్ పాల్గొన్నారు. పోలీసుల అదుపులో మద్యం అమ్మకం దారులు తాడికొండ: ‘మద్యం మత్తులో యువకుల ఘర్ష ణ’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి పోలీసులు స్పందించారు. తాడికొండలోని మద్యం దుకాణంలో రాత్రి వేళ అమ్మకా లు చేస్తున్న వ్యక్తిని సోమవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి దాదాపు 80కి పైగా మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. -
ఉద్యోగుల ప్రయోజనాలు సాధించేందుకు రాజీపడం
గుంటూరు మెడికల్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలను సాధించేందుకు ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడబోమని ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ అన్నారు. మంగళవారం గుంటూరులో గుంటూరు వైద్య కళాశాల ఎదురుగా ఉన్న ఏపీ ఎన్జీజీవో సంఘ సాంస్కృతిక సమావేశ భవనాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా విద్యా సాగర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన జీపీఎఫ్, ఏపీ జీఎల్ఐ, సరండర్ లీవ్ బకాయిలు కొంత మేరకు కూటమి ప్రభుత్వం చెల్లించిందన్నారు. మిగిలిన వాటిని చెల్లించేందుకు రాష్ట్ర నాయకులతో కృషి చేస్తుందని తెలిపారు. గుంటూరులో ఎన్జీవో ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దారని అభినందించారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా ఎన్జీవో ప్రాంగణాలను ఉద్యోగులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలన్నారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు గుంటూరు జిల్లా మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. ఏపీ ఎన్జీజీవో ప్రధాన కార్యదర్శి డి.వి.రమణ మాట్లాడుతూ ఉద్యోగ నాయకుల సమష్టి కృషితో ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు సాధించుకుంటామన్నారు. జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి శ్యామ్సుందర్ శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ నాగూర్ షరీఫ్, రాష్ట్ర నాయకులు సుబ్బారెడ్డి, రామ్ప్రసాద్, రంజిత్నాయుడు, తదితరులు మాట్లాడారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ సమక్షంలో నూతన సాంస్కృతిక భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సంఘ గుంటూరు నగర అధ్యక్షుడు సూరి, కార్యదర్శి కళ్యాణ్కుమార్, సంఘ నేతలు సత్యనారాయణరెడ్డి, శరత్బాబు, కృష్ణారెడ్డి, రామకృష్ణ, రాంబాబు, జానీబాషా, వెంకటరెడ్డి, నాగేశ్వరరావు, సుకుమార్, శ్రీవాణి, విజయలక్ష్మి, శివజ్యోతి, రాధారాణి, తదితరులు పాల్గొన్నారు. -
ప్రసన్నతబాబుకు విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ పురస్కారం
రేపల్లె: చేతి రాతతో బైబిల్ను రచించిన రేపల్లె పట్టణానికి చెందిన ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ గంజిదేవ వరప్రసన్నత బాబు విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ నుంచి పురస్కారం పొందారు. పట్టణంలోని 20వవార్డుకు చెందిన వరప్రసన్నత బాబు ఆంధ్ర బ్యాంక్లో విధులు నిర్వహిస్తు ఖాళీ సమయాలలో చేతి రాత ద్వారా బైబిలును రచించారు. బైబిలును ప్రచురించారు. ఈ బైబిలు గ్రంథంను ఏఈఎల్సీ సంస్థ ప్రతినిధులు ఆవిష్కరించి పలు చర్చిలకు బహూకరించారు. విషయం గుర్తించిన వరల్డ్ రికార్డ్స్ సంస్థ అవార్డుతో వరప్రసన్నతబాబును ఇటీవల హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో సత్కరించారు. -
రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్న కూటమి ప్రభుత్వం
బాపట్ల: రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టేస్తుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మోదుగుల బసవపున్నారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మోదుగుల మాట్లాడారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నప్పటికి సంక్షేమం అనే మాట ఏనోటా వినిపించటం లేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమం..అభివృద్ధి రెండు కళ్ళులా చూశారన్నారు. నేడు ప్రజలు కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను తట్టుకోలేక పోతున్నారన్నారు. అన్ని రంగాల్లో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర కార్యదర్శిగా తనకు అవకాశం కల్పించిన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహరెడ్డికి, నాయకులు వై.వి.సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, లేళ్ళ అప్పిరెడ్డి, కోన రఘుపతికి కృత్తజ్ఞతలు తెలిపారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మోదుగుల -
బీభత్సం సృష్టించిన కారు
నరసరావుపేట టౌన్: అతివేగంగా వచ్చిన కారు ఢీకొని ద్విచక్ర వాహనదారులతో పాటు నడిచి వెళ్తున్న బాలికకు తీవ్రగాయాలైన సంఘటన సోమవారం రాత్రి పట్టణంలో చోటు చేసుకుంది. వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యలమంద గ్రామానికి చెందిన ఎ. మరియదాసు, బూదాల బాబురావులు ద్విచక్ర వాహనంపై ప్రకాష్నగర్ సెయింట్ జోసఫ్ స్కూల్ వైపు నుంచి 60 అడుగుల రోడ్డుకు వెళ్తున్నారు. పక్కనే మరో ద్విచక్ర వాహనంపై నవీన్ అనే వ్యక్తి వస్తున్నాడు. ఆ సమయంలో అతి వేగంగా వచ్చిన ఏపీ 11 ఏఎస్ 1638 నంబర్ గల కారు రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొంది. సంఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు కారును వెంబడించటంతో కారు అతివేగంగా రివర్స్ చేస్తూ అప్పుడే ట్యూషన్ నుంచి వస్తున్న బాలిక షేక్ ఆయేషాను ఢీకొట్టింది. సంఘటనలో బాలిక ఎడమ చేయి విరిగింది. క్షతగాత్రులు నలుగురిని ఏరియా వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న వన్టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి కారణమైన కారును స్టేషన్కు తరలించారు. ఈ మేరకు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఎం.వి. చరణ్ మంగళవారం తెలిపారు. కారు నడిపిన నిందితుడు పట్టణానికి చెందిన మైనర్ బాలుడు షేక్ సుభానిగా గుర్తించారు. మైనర్కు కారు నడిపేందుకు ఇచ్చిన ఓనర్పై కూడా కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులపైకి దూసుకెళ్లి.. బాలికను ఢీకొట్టి నలుగురికి గాయాలు కారు డ్రైవర్ మైనర్ బాలుడిగా గుర్తింపు -
వెయిట్ లిఫ్టింగ్లో అంగలకుదురు విద్యార్థుల సత్తా
తెనాలిరూరల్: దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో సోమవారం జరిగిన రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మండలంలోని అంగలకుదురు జెడ్పీ హైస్కూలు విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. 60 కిలోల విభాగంలో బి.దివ్య, 70 కిలోల విభాగంలో జి.అఖిల, 105 కిలోల విభాగంలో ఎం.బాలాజీ రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం కై వసం చేసుకున్నారు. అలానే 83 కిలోల విభాగంలో టి.హేమచంద్, 90 కిలోల విభాగంలో వై. శ్రీశశాంక్ తృతీయ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వ్యాయామోపాధ్యాయులు వేమూరి శరత్బాబు, పులివర్తి రాజులను పాఠశాల హెచ్ఎం ఎన్.అనురాధ, ఉపాధ్యాయులు, గ్రామస్తులు మంగళవారం అభినందించారు. -
సమన్వయంతో పనిచేస్తే ప్రమాదాల నివారణ
నరసరావుపేట: రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలైన రెవెన్యూ, రవాణా, ఆర్అండ్బీ, నేషనల్ హైవేస్, ఆరోగ్య శాఖలు పోలీసు శాఖతో సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు, ఎస్పీ కె.శ్రీనివాసరావు సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ‘డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ’ సమావేశానికి కలెక్టర్ చైర్మన్ హోదాలో హాజరై, ప్రమాదాల నివారణకు పలు సూచనలు చేశారు. గుర్తించిన బ్లాక్ స్పాట్లలో సంబంధిత డిపార్టుమెంట్ అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని, ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసేవారిపై కఠినంగా వ్యవహరించాలని, ద్విచక్ర వాహనాలు నడిపే వారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించేలా చూడాలని కోరారు. యూ టర్న్ దగ్గర సైన్ బోర్డులు, రేడియం స్టిక్కర్లు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రొంపిచర్ల వద్ద హైవేపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అక్కడ ప్లైఓవర్ నిర్మాణానికి అవకాశాలను పరిశీలించాలని ఇంజినీరింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ కోరారు. అనంతరం నోడల్ అధికారి ఈ–డార్ యాప్ పై అవగాహన కల్పించారు. ఆర్టీఓ వి.సంజీవ కుమార్, ఆర్అండ్బీ ఈఈ, ఆర్టీసీ ఆర్.ఎం, నేషనల్ హైవే అధికారులు పాల్గొన్నారు. గంజాయి హాట్స్పాట్లపై నిఘా పెట్టండి.. నరసరావుపేట: జిల్లావ్యాప్తంగా గుర్తించిన గంజాయి హాట్స్పాట్లపై పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని, మాదక ద్రవ్యాల కార్యకలాపాల్లో ఉన్న అనుమానితుల నివాస ప్రాంతాలను అధికారులు తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు, జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు ఆదేశించారు. మంగళవారం తన కార్యాలయంలో జిల్లా మాదక ద్రవ్యాల నిరోధక సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో అసంపూర్తిగా నిర్మించిన భవనాలు, ఖాళీగా వదిలివేసిన భవనాలలో కార్యకలాపాలపై నిఘా ఉంచాలన్నారు. ఎన్డీపీఎస్ చట్టం కింద ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదై, గంజాయి సరఫరా చేస్తూ, అమ్ముతూ దొరికిన వారి ఆస్తులు జప్తు చేస్తామన్నారు. మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించేందుకు స్కూళ్లస్థాయి నుంచి విశ్వవిద్యాలయాల వరకు అన్ని విద్యా సంస్థలలో ఈగిల్ క్లబ్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. డీ–అడిక్షన్ సెంటర్లు పునరావాస సహాయం కోసం అవుట్రీచ్ ప్రణాళికలను సిద్ధం చేయా లన్నారు. అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కలువ రవీంద్ర, డీఎంహెచ్ఓ డాక్టర్ రవి, డీసీహెచ్ఎస్ డాక్టర్ ఎం.ప్రసూన, సైకియాట్రిస్ట్ డీజీపీఎస్ రాజు, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమాధికారి ఎం.ఉమాదేవి, డీపీఓ ఎస్వి.నాగేశ్వర నాయక్, డీసీజీఎస్డబ్ల్యూఎస్ ఏపీ గోపిరెడ్డి, జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ సునీత తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేట కలెక్టర్ పి.అరుణ్బాబు జిల్లా ఎస్పీతో కలిసి ‘డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ’ సమావేశం నిర్వహణ -
మద్యం షాపు వద్ద వ్యక్తి మృతి
పోలీసుల చొరవతో ప్రాణం పదిలంకారంచేడు: మద్యం తాగేందుకు వచ్చిన వ్యక్తి ఒక్కసారిగా గుండెపోటుతో మృతి చెందిన సంఘటన మంగళవారం కారంచేడులో జరిగింది. ఎస్ఐ షేక్ ఖాదర్బాషా తెలిపిన వివరాల మేరకు.. బాపట్ల మండలం నరసాయపాలేనికి చెందిన వాసుమళ్ల అనిల్ (42) తన భార్య కృపారాణితో కలసి కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామంలో తమ బంధువు అంత్యక్రియల కు హాజరయ్యారు. అనంతరం బంధువులతో కలసి మద్యం తాగేందుకు వైన్ షాపునకు వచ్చాడు. మద్యం కొనుగోలు సమయంలో ఒక్కసారిగా ముందుకు పడిపోయి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వచ్చి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అక్కడికి చేరుకున్న భార్య కృపారాణి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదుచేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం చీరాలకు పంపించామన్నారు. మృతునికి భార్యతోపాటు, కుమార్తె, కుమారుడు ఉన్నారు. తండ్రి మరణ వార్త విన్న కుమార్తె మానస ఒక్కసారిగా కుప్పకూలింది. ఆమెను కారంచేడు పీహెచ్సీ వైద్య సిబ్బంది పరీక్షించి మెరుగైన వైద్యం కోసం చీరాల ఆస్పత్రికి తరలించారు. -
ఖైదీలకు క్షయ వ్యాధిపై అవగాహన
గుంటూరు మెడికల్: టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గుంటూరులోని జిల్లా జైలులో 250 మంది ఖైదీలకు క్షయ వ్యాధిపై అవగాహన కల్పించి స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి డాక్టర్ దాసరి శ్రీనివాసులు మాట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, దగ్గినప్పుడు కళ్లెతోపాటు రక్తం పడడం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే క్షయ వ్యాధిగా భావించి పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని, నిర్ణీత కాల వ్యవధి ఉన్న మందుల కోర్సు వాడడం ద్వారా క్షయ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చు అన్నారు. క్షయ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి గాలి ద్వారా వ్యాపిస్తుందని, దగ్గే సమయంలో నోటికి కర్చీఫ్ పెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా జైలు సూపరింటెండెంట్ ఎ.బి.శాంతరాజు, వైద్య అధికారిణి డాక్టర్ లక్ష్మీసుధ, సిబ్బంది నాగజ్యోతి, స్వరూప, రాంబాబు, సాంబశివరావు, నాగమణి, సంధ్యారాణి పాల్గొన్నారు. -
సుబ్రమణ్యేశ్వరునికి నాగపంచమి విశేష పూజలు
అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతి అమరేశ్వరాలయంలో మంగళవారం నాగపంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాలయంలోని సుబ్రమణ్యేశ్వరస్వామికి విశేషపూజలు నిర్వహించారు. స్వామివారికి భక్తుల సమక్షంలో అర్చకులు శంకరమంచి రాజేష్శర్మ మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం సుబ్రమణ్వేశ్వరునికి విశేషాలంకారం చేసి భక్తులకు దర్శనం కల్పించి తీర్ధప్రసాదాలు అందజేశారు. అనంతరం అమరేశ్వరున్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు. సుబ్రమణ్యేశ్వరుని పూజలలో పలు గ్రామాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొ న్నారు. విజయకీలాద్రిపై ఘనంగా గరుడ పంచమి తాడేపల్లిరూరల్: సీతానగరంలోని విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై మంగళవారం గరుడ పంచమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న జీయర్స్వామి మంగళ శాసనాలతో ఉదయం 9 గంటలకు గరుత్మంతునికి పంచామృతాలతో అభిషేకం, 10 గంటలకు సంతాన ప్రాప్తి కోసం గరుడ హోమం ఘనంగా నిర్వహించామని అన్నారు. పద్మావతి అమ్మవారి మాస తిరునక్షత్ర సందర్భంగా పద్మావతి అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. 75 త్యాళ్లూరు పీఎంశ్రీ ఉన్నత పాఠశాల జాతికి అంకితం పెదకూరపాడు: జాతీయ స్థాయిలో పల్నాడు జిల్లాలో ఉత్తమ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం ‘జాతీయ విద్యా విధానం’ ఎన్ఈపీ–2020 ఐదో వార్షికోత్సవం సందర్భంగా భారత్ మండపం న్యూ ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మంద్ర ప్రధాన్ జాతికి అంకితం చేయగా స్థానికంగా పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.చంద్రకళ, సమగ్ర శిక్ష ఏపీసీ ఆర్.రమేష్, ఏఎంవో పూర్ణచంద్ర రావు అంకితం చేశారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని పాఠశాలల్లో 75 త్యాళ్లూరు హైస్కూల్ ఉండటం విశేషం. డీఈఓ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో నాణ్యమైన, గుణాత్మకమైన విద్య, మౌలిక సదుపాయాల కల్పనకు పీఎంశ్రీ పథకం ఎంతగానో దోహదపడుతుందని, ఇది పాఠశాలలకు ఒక వరం లాంటిదని అన్నారు. న్యూఢిల్లీ నుంచి ప్రసారమైన వివిధ కార్యక్రమాలను విద్యార్థులు, అధికారులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వీక్షించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఎస్ఎంసీ చైర్పర్సన్ బి.చంద్రకుమారి, మండల విద్యాశాఖ అధికారి టి.సత్యనారాయణ ప్రధానోపాధ్యాయులు ఎ.శ్రీనివాసరెడ్డి, ఏఈ అనుముల శ్రీనివాసరెడ్డి, క్లస్టర్ సీఆర్ఎంటి శివ తదితరులు పాల్గొన్నారు. నేడు శివాలయంలో హుండీ కానుకల లెక్కింపు పెదకాకాని: శివాలయంలో హుండీ కానుకలు లెక్కింపు కార్యక్రమం బుధవారం జరుగుతుందని ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. పెదకాకాని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో దేవదాయశాఖ ఆదేశాల మేరకు నియమించిన అధికారి సమక్షంలో ఉదయం 9 గంటలకు హుండీలను తెరిచి కానుకలు లెక్కించడం జరుగుతుందన్నారు. ఆలయ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన లెక్కింపు కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు పాల్గొంటారన్నారు. కానుకల లెక్కింపులో భక్తులు పాల్గొనవచ్చని తెలిపారు. -
ఉద్దేశపూర్వకంగానే నాపై అభియోగాలు
పట్నంబజారు: ఎటువంటి ఆధారాలు లేకుండా తనపై అభియోగాలు మోపడం ఆశ్చర్యానికి గురి చేసిందని ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం ఆవేదన వ్యక్తం చేశారు. సిద్ధార్థనగర్లోని ఆయన కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బాపట్ల జిల్లా ఎస్పీకి వేముల మల్లికార్జునరావు తనపై ఫిర్యాదు చేశాడని, వ్యాపారంలో లావాదేవీల విషయంలో తానేదో ద్రోహం చేశానని చెప్పడం సబబు కాదని తెలిపారు. 2023 జులైలో గ్రానైట్ ఫ్యాక్టరీకి సంబంధించి మల్లికార్జునరావుతో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. తమ కంటే ముందే మల్లికార్జునరావు, ప్రేమ రాజు అనే వ్యక్తికి అగ్రిమెంట్ చేసి రూ. 60లక్షల వరకు తీసుకున్నాడని, ఆ తర్వాతే తన కుమారుడు మల్లికార్జునరావు వద్ద ఫ్యాక్టరీని లీజుకు తీసుకున్నట్లు ఏసురత్నం వివరించారు. ఈ క్రమంలో ఫ్యాక్టరీకి సంబంధించి వివాదం తన వద్దకు వచ్చిన నేపథ్యంలో ఇద్దరి మధ్యా సఖ్యత కుదిర్చి రూ 2.40కోట్లకు అగ్రిమెంట్ చేసుకున్నామని తెలిపారు. దానిలో భాగంగానే ప్రేమరాజుకు సుమారు 60లక్షల వరకు అప్పు ఉంటే, చాలా వరకు చెల్లించినట్లు వివరించారు. అప్పులు చెల్లించే క్రమంలో అగ్రిమెంట్లో స్పష్టంగా అనుకున్న గడువులోగా ఫ్యాక్టరీని అప్పగించాలని, లేనిపక్షంలో చెల్లించిన డబ్బులకు రూ. 2వడ్డీ ఇవ్వాలని స్పష్టంగా రాసుకున్నట్లు చెప్పారు. అనుకున్న సమయానికి తిరిగి డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన మల్లికార్జునరావు తనపై అభియోగాలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడని చెప్పారు. నాలుగు నెలల నుంచి పట్టాభిపురం పోలీసులు ఫోన్ చేస్తున్నా రావడం లేదని, ఒక్కసారిగా బయటకు వచ్చి తనపై ఫిర్యాదు చేయటం ఏంటని ఏసురత్నం ప్రశ్నించారు. తమ వద్ద అన్ని విధాలుగా రికార్డెడ్ ఎవిడెన్స్లు ఉన్నాయని, దీనిపై తాను కూడా జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం ఆవేదన ఆరోపణలు రుజువు చేయాలని ఆగ్రహం -
పుట్ట గొడుగుల పెంపకంపై శిక్షణ తరగతులు
గుంటూరు రూరల్: నగర శివారుల్లోని లాంఫాం నందున్న కృషి విజ్ఞాన కేంద్రంలో సోమవారం గ్రామీణ యువతకు పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారం రోజుల పాటు జరిగే ఈ శిక్షణ తరగతుల ప్రారంభానికి కేవీకే ప్రధాన శాస్త్రవేత్త ఎం.యుగంధర్కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ, యువకులకు స్వయం ఉపాధిపై శిక్షణ ఇచ్చి, వారి ఉన్నతికి కృషిచే స్తున్నామని తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కోర్స్ డైరెక్టర్, సీనియర్ శాస్త్రవేత్త ఎం. గంగాదేవి పాలపుట్ట, ఆయిస్టర్, వరిగడ్డి, బటన్ పుట్టగొడుగుల సాగు, వాటి జీవిత చక్రాన్ని వివరించారు. అనంతరం విద్యార్థులకు శిక్షణ కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జేఎన్ఎం పుణ్యవతి, కేవీకే శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో పంచ్ జ్యోతిర్లింగ్ యాత్ర ●ఆగస్టు 16 నుంచి 24వ తేదీ వరకు నిర్వహణ ●వివరాలు వెల్లడించిన ఏరియా మేనేజర్ ఎం.రాజా లక్ష్మీపురం: ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సీటీసీ) ఆధ్వర్యంలో సికింద్రాబాద్ నుంచి పంచ్ జ్యోతిర్లింగ్ దర్శన్తో అంబేడ్కర్ యాత్రను నిర్వహించనున్నట్లు ఏరియా మేనేజర్ ఎం.రాజా సోమవారం తెలిపారు. యాత్ర ఆగస్టు 16 నుంచి 24వ తేదీ వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. జ్యోతిర్లింగ దర్శనాలలో ప్రధానంగా నాగపూర్లో అంబేడ్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించిన దీక్షా భూమి స్తూపం, శ్రీ స్వామినారాయణ మందిరం, ఉజ్జయిన్ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, అంబేడ్కర్ జన్మస్థలం, నాసిక్ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం, పూణేలో భీమ శంకర్ జ్యోతిర్లింగం, ఔరంగాబాద్లో గ్రిష్ణేశ్వర జ్యోతిర్లింగం దర్శన ఉంటుందని వివరించారు. యాత్ర సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ మీదుగా సాగుతుందని తెలిపారు. ఒక్కో వ్యక్తికి స్లీపర్ క్లాస్ పెద్దలయితే నాన్ ఏసీ గద్దుల్లో హోటల్ వసతి, నాన్ ఏసీ వాహనంతో కలిపి రూ.14,700, త్రీ ఏసీ అయితే ఏసీ గది, నాన్ ఏసీ వాహనంతో కలిపి రూ.22,900 ఉంటుందని వివరించారు. టూ ఏసీ అయితే ఏసీ గది, ఏసీ వాహనంతో కలిపి రూ.29,900, పిల్లలు 5 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల లోపు వారికి స్లీపర్ క్లాస్ రూ.13,700, త్రీ ఏసీ రూ.21,700, టూ ఏసీ రూ.28,400 ఉంటుందని తెలిపారు. యాత్రికులకు ప్రతి రోజు ఉదయం టీ, అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం (శాఖాహారం మాత్రమే), ప్రయాణ బీమా, వృత్తిపరమైన, స్నేహపూర్వక పర్యటన ఎస్కార్ట్ సేవలు, రైలులో భద్రత, అవసరమైన సహాయం కోసం ఐఆర్సీటీసీ మేనేజర్లు టూర్ అంతటా ప్రయాణిస్తారని తెలియజేశారు. అన్ని రకాల పన్నులు వర్తిస్తాయని తెలిపారు. యాత్ర కోసం ఐఆర్సీటీసీ రైల్వే రిటైరింగ్ రూమ్, విజయవాడ రైల్వే స్టేషన్, ఫోన్ నంబర్ 9281495848ను సంప్రదించాలని ఆయన సూచించారు. -
అంగన్వాడీ కేంద్రాలకు కూరగాయల విత్తనాలు పంపిణీ
రేపల్లె: చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ క్రాఫ్ట్ ట్రస్ట్ సహకారంతో బాలల రక్షణ కమిటీల ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాలలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు న్యూట్రి కిచెన్ గార్డెన్ కార్యక్రమంలో భాగంగా పలు రకాల కూరగాయల విత్తనాలను ఐసీడీఎస్ సూపర్వైజర్ సునీత సోమవారం పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రాలలో ఖాళీగా ఉన్న ప్రదేశాలలో విత్తనాలు నాటడంతో కేంద్రాలకు అవసరమైన కూరగాయలు పండించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. తక్కువ ఖర్చుతో అధిక పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను ఫౌండేషన్ వారు అందించటం అభినందనీయమన్నారు. మండలంలోని చోడాయపాలెం, బొబ్బర్లంక, పెనుమూడి, విశ్వేశ్వరం, పిరాట్లంక, తుమ్మల, కారుమూరు, నల్లూరుపాలెం గ్రామాలలోని అంగన్వాడీ కేంద్రాలకు న్యూట్రీ కిచెన్ గార్డెన్ విత్తనాలు పంపిణీ చేశారు. ప్రోగ్రామ్ మేనేజర్ ఎన్.శ్రీనివాసరావు, అంగన్వాడీలు, ఆయాలు పాల్గొన్నారు. -
గంజాయి విక్రయ ముఠా అరెస్ట్
తెనాలి రూరల్: పట్టణంలో గంజాయిను విక్రయిస్తున్న ముఠాని తెనాలి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. 13 మంది నుంచి రూ. 3.15 లక్షల విలువైన 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తెనాలి డీఎస్పీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వివరాలు వెల్లడించారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో రూరల్ సీఐ ఆర్. ఉమేష్ సిబ్బందితో కలిసి అంగలకుదురు గ్రామ శివారు ఐస్ ఫ్యాక్టరీ ప్రాంతంలోని నిమ్మ తోటలలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ముఠా జల్సాలకు అలవాటు పడి ఒడిశా నుంచి కొనుగోలు చేసి ఇక్కడ అమ్ముతోంది. సంగం జాగర్లమూడికి చెందిన అబ్దుల్ రషీద్, పట్టణంలోని సీఎం కాలనీకి చెందిన షేక్ నాగూర్, ముత్తెంశెట్టివారిపాలేనికి చెందిన రాహుత్ సాల్మన్ అలియాస్ కాటరాజు, పట్టణ పినపాడు గేట్ సమీపంలో నివసించే బలసాని ప్రభాస్ అలియాస్ పండు (మైనర్), ప్రత్తిపాడుకు చెందిన షేక్ గౌస్, ఒడిశాకి చెందిన (ప్రస్తుతం గుంటూరు మండలం దాసరిపాలెంలో ఉంటున్న) బసంతి నాయక్ అలియాస్ సమీర్ నాయక్, విజయవాడ గొల్లపూడికి చెందిన గొర్ల వెంకటేష్, తెనాలి మండలం నందివెలుగు గ్రామానికి చెందిన షేక్ నసీరుద్దీన్, పట్టణంలోని గంగానమ్మపేటకు చెందిన నూనె విజ్ఞమణికుమార్ సాయి అలియాస్ గని, అయితానగర్కు చెందిన గుంజి నాగమల్లేశ్వరరావు, జొన్నాల సాయిసిద్ధు(మైనర్), పట్టణంలోని ప్యాడిసన్పేటకు చెందిన పల్లె సిద్ధు(మైనర్), గంగానమ్మపేటకు చెందిన కనపర్తి రాజా(మైనర్)లు పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఉన్నారు. ముఠాలో కొందరిపై ఇప్పటికే రౌడీ షీట్లు, సస్పెక్ట్ సీట్లు ఉన్నట్లు ఎస్పీ చెప్పారు. గంజాయి గురించి తెలిస్తే వెంటనే 1972 ఈగల్ నంబర్కి సమాచారం ఇవ్వాలని ఆయన ప్రజల్ని కోరారు. కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన రూరల్ పోలీసులకు ప్రత్యేక ప్రోత్సాహాలను జిల్లా ఎస్పీ సతీష్ అందజేశారు. సమావేశంలో డీఎస్పీ బి. జనార్దనరావు, రూరల్ సీఐ ఉమేష్, ఎస్ఐ ఆనంద్, కొల్లిపర ఎస్ఐ కోటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. 21 కిలోల సరకు స్వాధీనం 13 మంది అరెస్ట్ నిందితుల్లో నలుగురు మైనర్లు -
గంజాయి కేసులో ముగ్గురికి జైలు
తీర్పు వెల్లడించిన గుంటూరు–1 ఏడీజే కోర్టు న్యాయమూర్తి బాపట్లటౌన్: గంజాయి క్రయ, విక్రయాలకు పాల్పడిన ముగ్గురికి నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ గుంటూరు–1 ఏడీజే కోర్టు న్యాయమూర్తి సోమవారం తీర్పు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే... కర్లపాలెం మండల పరిధిలోని చేపల మార్కెట్ సమీపంలోని రాజీవ్నగర్ కాలనీకి చెందిన దాసరి శ్రీనివాసరావు, ఏలూరు పట్టణానికి చెందిన గాలం పాపారావు, విశాఖపట్నం జిల్లా రొల్లగుంట మండలం చెన్నగోపాలపట్టణం గ్రామానికి చెందిన అప్పలనాయుడు పోతురాజులకు జైలు శిక్ష విధించారు. బాపట్ల జిల్లా కర్లపాలెం గ్రామంలోని రాజీవ్ నగర్ రోడ్డులోని చేపల మార్కెట్ సమీపంలో ఒక ఇంటిలో దాసరి శ్రీనివాసరావు, తోకల పిచ్చయ్య(మృతుడు)లు గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో 2014 డిసెంబర్ 30న అప్పటి బాపట్ల రూరల్ సర్కిల్ సీఐ వి.మల్లికార్జునరావు దాడి చేశారు. ఇరువురిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా గంజాయి సరఫరా చేస్తున్న ఏలూరు పట్టణానికి చెందిన గాలం పాపారావు, విశాఖపట్నం జిల్లా రోల్లగుంట మండలం చెన్నగోపాలపట్నం గ్రామానికి చెందిన పోతురాజు అప్పలనాయుడులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీరి నుంచి భారీ మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు ప్రథమ అదనపు జిల్లా న్యాయస్థానంలో కేసు విచారణకు రావడంతో జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు బాపట్ల రూరల్ సర్కిల్ సీఐ హరికృష్ణ, కర్లపాలెం ఎస్సై రవీంద్రలు కేసు ట్రైల్ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ, సరైన రీతిలో సాక్ష్యం చెప్పే విధంగా సాక్షులకు తర్ఫీదు ఇచ్చారు. కోర్టు విధులు నిర్వహించిన కానిస్టేబుల్ కె.శివాజీ సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న గుంటూరు–1 ఏడీజే కోర్టు న్యాయమూర్తి విఎల్ఏ సత్యవతి ముగ్గురు నిందితులు ఒక్కొక్కరికి 4 సంవత్సరాలు జైలుశిక్ష, రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. కురగల్లులో ఇరువర్గాల మధ్య ఘర్షణ తాడేపల్లి రూరల్ : మంగళగిరి మండల పరిధిలోని కురగల్లులో సోమవారం ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇందులో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో బంధువులు వైద్యం నిమిత్తం ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. కురగల్లులో పక్క పక్కనే నివిసించే తోట రామారావు, తోట వెంకటేశ్వరరావుల మధ్య ఇంటి దారి విషయంలో పాత గొడవలు ఉన్నాయి. రామారావుకు వత్తాసు పలుకుతూ వెళ్లిన బొర్లా శ్రీనివాసరావుపై వెంకటేశ్వరరావు దాడి చేశాడు. ఈ ఘర్షణలో శ్రీనివాసరావు తలకు తీవ్ర గాయమైంది. ఆసుపత్రిలో చికిత్స అనంతరం మంగళగిరి రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు శ్రీనివాసరావు తెలిపాడు. లే అవుట్లలో ఇళ్ల నిర్మాణాల వేగం పెంచాలి కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి గుంటూరు వెస్ట్: జిల్లాలోని వివిధ లే అవుట్లలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ మినీ సమావేశ మందిరం నుంచి సోమవారం అధికారులతో వీడియో సమావేశం ద్వారా మాట్లాడారు. పూర్తయిన ఇళ్లు, నిర్మాణంలో ఉన్న వాటిని ప్రతి వారం లక్ష్యాలు నిర్దేశించుకుని పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ఆప్షన్–1, 2లో ఆర్థిక సాయం పొందిన వారు వీలైనంత వేగంగా నిర్మాణాలు పూర్తి చేయాలని ఆమె తెలిపారు. పేదలను ఆదుకునే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన పీ–4 కార్యక్రమంపై గ్రామ సభలు, దాతల మ్యాపింగ్, నీడ్ అసిస్మెంట్ సర్వే సకాలంలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గుర్తించిన బంగారు కుటుంబాలను విశ్లేషించిన లక్ష్యాల మేరకు దాతలతో మ్యాపింగ్ను ఆగస్టు 10లోపు పూర్తి చేయాలని ఆమె చెప్పారు. తల్లికి వందనం పథకంలో నగదు పొందని లబ్ధిదారులు ఇచ్చిన అర్జీల సర్వే వెంటనే పూర్తి చేయాలని తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా పశువుల పాకల నిర్మాణం, దాణా సాగు, ఉద్యాన పంటల సాగుకు గ్రామాల వారీగా ఎంపీడీవోలు వెంటనే ప్రతిపాదనలు తెలపాలని ఆమె ఆదేశించారు. సమావేశంలో సీపీఓ శేషశ్రీ , హౌసింగ్ పీడీ ప్రసాద్, డ్వామా పీడీ శంకర్ పాల్గొన్నారు. ధర్మస్థల ఘటనలపై దర్యాప్తు వేగవంతం చేయాలి లక్ష్మీపురం: కర్ణాటకలోని మంజునాథ దేవాలయం ధర్మస్థలలో వందలాది మంది యువతులు, మహిళలపై అత్యాచారం, హత్యోదంత ఘటనలు భయానకంతో పాటు తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ)జిల్లా కార్యదర్శి రెంటాల కుమారి అన్నారు. గుంటూరు కొత్తపేటలోని సీపీఐ జిల్లా కార్యాలయం మల్లయ్య లింగంభవన్ నుంచి భగత్ సింగ్ విగ్రహం వరకు సోమవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో మహిళలు, యువతులపై హత్యలు, అత్యాచారాల పరంపర మనసును కలిచి వేస్తోందని తెలిపారు. ఆశ్రమాలు, ఆలయాలు ఆధ్యాత్మిక చింతన, భక్తి పేరుతో మహిళలను వంచిస్తున్నాయని ఆరోపించారు. సమాజంలో పలువురు పెద్ద మనుషులుగా, మత గురువులుగా చలామణి అవుతూ మహిళల మాన ప్రాణాలను హరించివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వం ఆలస్యంగా ప్రత్యేక దర్యాప్తు బందాన్ని ఏర్పాటు చేసిందని విమర్శించారు. మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మెత్స దుర్గాభవాని మాట్లాడుతూ బీజేపీ నాయకులే మంజునాథ్ దేవాలయం ట్రస్టీలుగా ఉన్నారని, వారి కనుసన్నల్లోనే ఈ అరాచకాలన్నీ జరిగాయని తెలుస్తోందన్నారు. ధర్మస్థల ఉదంతంపై దర్యాప్తును వేగవంతం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. -
అర్జీలు పునరావృతం కాకుండా చూడాలి
ఎస్పీ తుషార్ డూడీ బాపట్లటౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అర్జీలు పునరావృతం కాకుండా చూడాలని ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 60 మంది అర్జీదారులు ఎస్పీ కార్యాలయానికి చేరుకొని తమ సమస్యలను ఎస్పీకి వివరించారు. బాధితుల సమస్యలు తెలుసుకున్న ఎస్పీ వాటిని వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లాలోని పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అర్జీదారుల సమస్యలను చట్ట పరిధిలో విచారించి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. వివిధ సమస్యలతో పోలీస్ కార్యాలయాలకు వచ్చే బాధితులకు భరోసాగా పోలీస్ శాఖ ఉండాలన్నారు. అర్జీలను పూర్తిస్థాయిలో విచారించి శాశ్వతంగా పరిష్కారం చూపాలన్నారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అధికంగా కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఆస్తి తగాదాలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీల మోసాలకు సంబంధించిన అర్జీలే అధికంగా వస్తున్నాయని పోలీసు అధికారులు ఎస్పీకి వివరించారు. కార్యక్రమంలో బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు, చీరాల డీఎస్పీ మొయిన్, రేపల్లె డీఎస్పీ శ్రీనివాసరావు, పీజీఆర్ఎస్ సెల్ సీఐ శ్రీనివాసరావు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
దళిత సర్పంచ్పై సీఐ దాడి దుర్మార్గం
పర్చూరు(చినగంజాం): కారంచేడు మండలం దగ్గుబాడు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్, దళితుడు గేరా రవీంద్రనాథ్ ఠాగూర్పై సీఐ దాడి దుర్మార్గమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలెపోగు రాంబాబు పేర్కొన్నారు. సీఐ తీరుని నిరసిస్తూ సోమవారం దళిత నాయకులు సమావేశమయ్యారు. రాంబాబు మాట్లాడుతూ కారంచేడు పోలీస్స్టేషన్లో రౌడీషీట్ ఉన్న కారణంగా రవీంద్రనాథ్ ఠాగూర్ ఈనెల 19వ తేదీ శనివారం పోలీస్ నిబంధనలకు అనుగుణంగా కౌన్సెలింగ్కు హాజరయ్యారని తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కూర్చొనే గదిలో ఆయన కుర్చీ వెనుక ఉన్న అంబేడ్కర్ చిత్రపటాన్ని తొలగించి సీఎం, డిప్యూటీ సీఎం, స్థానిక ఎమ్మెల్యే చిత్రపటాలను పెట్టాలని సీఐ హెచ్చరించినట్లు తెలిపారన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు పెట్టే విషయంలో ప్రభుత్వ అధికారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, ఒక ప్రజాప్రతినిధికి అతని ఆసక్తిపై ఆధారపడి ఉంటుందని, అప్పటికే సదరు చిత్రపటాలను తన గదిలో ఎదురుగా పెట్టుకున్నాడని ఆ విషయాన్ని ఉద్దేశించి అతనిపై చేయిచేసుకోవడం సమంజసం కాదన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఇటువంటి సంస్కృతిని ప్రోత్సహించ లేదని, లా అండ్ ఆర్డర్ను అతిక్రమించిన వారిపై పోలీస్లు చేయిచేసుకోవడం సమర్థనీయం కాదన్నారు. ఈ విధంగా చిత్రపటాలను పెట్టే అంశాలను రాజకీయం చేయడం తగదని, రాజకీయ ప్రలోభాలకు, స్థానిక నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు ఈ విధంగా ప్రవర్తించడం సరైన విధానం కాదన్నారు. సమావేశంలో దగ్గుబాడు సర్పంచ్ గేరా రవీంద్రనాథ్ ఠాగూర్, గేరా స్వరాజ్ కుమార్, కూరాకుల ఇస్సాక్, గుజ్జనగుండ్ల చిన్న తదితర దళిత నాయకులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలెపోగు రాంబాబు -
గోవుల సంరక్షణలో అశ్రద్ధ పనికిరాదు!
తాడేపల్లి రూరల్ : గోవుల సంరక్షణలో అశ్రద్ధ పనికిరాదని, జిల్లాలోని ఏ గోశాలలోనూ ఇంతటి దారుణమైన పరిస్థితి లేదని జిల్లా పశు సంవర్ధక శాఖ జేడీ సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. యర్రబాలెంలోని శ్రీ కృష్ణానంద ఆశ్రమం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోశాల నిర్వహణపై పలువురు సామాజిక మాద్యమాల ద్వారా ఫిర్యాదుతో ఆయన మంగళగిరి కమిషనర్ అలీమ్ బాషా, తహసీల్దార్ దినేష్ రాఘవేంద్రలతో కలసి గోశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ డైరెక్టర్ సత్యనారాయణ గోశాల నిర్వాహకులు సతీష్ను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో కలసి గోశాల ఆవరణను పరిశీలించారు. ఓ షెడ్డులో గో మూత్రం, పేడతో నిండిపోయి దుర్వాసన రావడాన్ని గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు మృత్యువాత పడిన గోవులపై ఆరా తీశారు. ప్రస్తుత వర్షాకాలంలో గోవులు అనారోగ్యం బారిన పడే ప్రమాదముందని తెలిపారు. ఎండా కాలంలోనూ మృత్యువాత పడే ప్రమాదం ఉందని, జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. గోశాల అస్తవ్యస్త నిర్వహణపై నివేదిక సిద్ధం చేసిన ప్రభుత్వానికి పంపనున్నట్లు జేడీ సత్యనారాయణ తెలిపారు. యర్రబాలెం గోశాలను తనిఖీ చేసిన జేడీ అపరిశుభ్రతపై ఆగ్రహం -
బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు వేగం పెంచాలి
బాపట్ల: బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అధికారులను ఆదేశించారు. బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలుపై అధికారులు, బయ్యర్లతో జిల్లాస్థాయి కమిటీ సమావేశం సోమవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో 13 పొగాకు కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయన్నారు. గడిచిన వారంలో 1,765 టన్నులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ప్రతిరోజూ 325 మంది రైతుల నుంచి 650 టన్నులకు తగ్గకుండా పొగాకు కొనుగోలు చేయాలని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకుని పొగాకు కంపెనీలు విస్తృతంగా కొనుగోలు ప్రక్రియలో పాల్గొనాలన్నారు. కంపెనీల నిర్ణయాలు, లక్ష్యాలు అధికంగా ఉండేలా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ప్రస్తుతం 24 కంపెనీలు పొగాకును కొనుగోలు చేస్తున్నాయని తెలిపారు. అన్ని కంపెనీలు కలిపి మొత్తం 32 వేల మెట్రిక్ టన్నుల పొగాకును రైతుల నుంచి మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసినట్లు వివరించారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన పొగాకు 4.40 లక్షల మెట్రిక్ టన్నుల వరకు నిల్వ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. మరో 2.0 లక్షల మెట్రిక్ టన్నుల పొగాకు నిల్వ చేయడానికి పొరుగు జిల్లాల్లో గోదాములను పరిశీలిస్తున్నామన్నారు. పొగాకు కొనుగోలు ప్రక్రియకు రెండు నెలలు గడువు ఇవ్వాలని కంపెనీల ప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఆగస్టు 31వ తేదీ వరకు 2,500 మంది రైతుల నుంచి కొనుగోలు చేయడానికి షెడ్యూల్ ఇచ్చామన్నారు. బాపట్ల జిల్లాలో 13,777 మంది రైతుల పేర్లు యాప్లో నిక్షిప్తం చేశామన్నారు. ముందుగా చిన్న, సన్న కారు రైతుల నుంచి పొగాకు కొనుగోలు చేస్తున్నామన్నారు. నాలుగు రోజుల్లో ఆయా కొనుగోలు కేంద్రాలలో కంపెనీలు కొనుగోలు వివరాలపై నివేదిక ఇవ్వాలన్నారు. పొగాకు కొనుగోలు లక్ష్యాలు మరింత పెంచేలా నిర్ణయాలు ప్రకటించాలన్నారు. పొగాకు కొనుగోలు చేసే సమయంలో అధికారులు తేమ శాతాన్ని 20 కంటే మించకుండా పరిశీలించాలన్నారు. బ్లాక్ బర్లీ పొగాకు పంటను సాగు చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సమావేశంలో జిల్లా ఇన్చార్జి సంయుక్త కలెక్టర్, డీఆర్వో జి గంగాధర్గౌడ్, మార్క్ఫెడ్ డీఎం కరుణశ్రీ, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ లవన్న, పొగాకు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి ఇసుక సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి టీబీ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార కిట్స్ పంపిణీ టీబీ వ్యాధిగ్రస్తులు సంపూర్ణ ఆహారం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి సూచించారు. టీబీ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార కిట్స్ను సోమవారం అందించారు. జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ విజయమ్మ మాట్లాడుతూ జిల్లాలో 1056 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు రెండు నెలలకు సరిపడే 11 రకాల పౌష్టికాహార కిట్స్ను అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎయిడ్స్ నివారణ అధికారి డాక్టర్ షేక్ మొహమ్మద్ సాదిక్, జాతీయ క్షయ నిర్మూలన సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో ఇసుక సరఫరాకు ఇబ్బందిలేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానంలో భాగంగా ఐవీఆర్ఎస్లో ప్రజాభిప్రాయ సేకరణపై వచ్చిన ప్రతికూలతపై జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఇసుకను ఇంటికి వద్దకు చేర్చడంలో టన్నుకు ఎంత వసూలు చేస్తున్నారో సంబంధిత వివరాలను ఇసుక కొనుగోలు చేసిన వ్యక్తులతో జిల్లా కలెక్టర్ నేరుగా ఫోన్లో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ వసూలు చేస్తున్నట్లు వారు జిల్లా కలెక్టర్ వివరించారు. జిల్లాలో గాజుల్లంక బీచ్ నుంచి మాత్రమే ఇసుకను సరఫరా చేస్తున్నామని, ప్రస్తుతం అక్కడ లారీలు వెళ్లేందుకు ఇబ్బందికర పరిస్థితులు ఉండటం వలన ఇతర ప్రాంతాల నుంచి ఇసుక సరఫరా చేస్తున్నందున ధరలో మార్పు వచ్చిందని కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్కు వివరించారు. గాజుల్లంక బీచ్ నుంచి ఇసుక సరఫరాకు సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గాజుల్లంక బీచ్లో 20 వేల టన్నులు మాత్రమే ఇసుక నిల్వ ఉందని, ఈ నిల్వలు రెండు నెలలకు మాత్రమే సరిపోతాయని అధికారులు కలెక్టర్కు వివరించారు. ఇసుక కొరతను అధిగమించేందుకు ఇతర జిల్లాల నుంచి ఇసుకను బాపట్లకు తరలించి నిల్వ చేసేందుకు చర్యలు తీసుకోవాలని గనుల శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ గంగాధర్గౌడ్, గనుల శాఖ ఏడీ డి.రామచంద్ర, రవాణా శాఖ అధికారి పరంథామరెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
అరుదైన కళతో భారత్కు శుభాకాంక్షలు
3 గ్రాముల చెస్బోర్డు తయారు చేసిన చీరాల స్వర్ణకారుడు చీరాల అర్బన్: ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్ పోటీల్లో చరిత్ర సృష్టించిన 19 ఏళ్ల క్రీడాకారిణి దివ్య దేశ్ముఖ్కు సోమవారం ఓ స్వర్ణ కళాకారుడు తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన స్వర్ణకారుడు నక్కా వెంకటేష్ తనకున్న అరుదైన కళతో వెండి, బంగారాన్ని ఉపయోగించి మూడు గ్రాముల బరువు, 3.3 సెంటీమీటర్లతో అతి సూక్ష్మమైన చెస్ బోర్డు తయారు చేశా రు. ఇక బియ్యం గింజ సైజులో రాజు, రాణిలు, అదే విధంగా ఆవగింజ సైజులో భటులు, గుర్రాలు, ఏనుగులను తయారు చేసి దేశంపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.ఈ చదరంగం కిట్ అంతా కేవలం రెండు రూపాయల కాయిన్ సైజులో ఉండడం అందరినీ ఆశ్చర్యాన్ని గురిచేస్తోంది. చెస్ ప్రపంచ కప్ ఫైనల్లో కోనేరు హంపి, దివ్య దేశ్ముఖ్ ఇద్దరు భారతీయ మహిళలు తలపడడంతో ఇక చాంపియన్ షిప్ ఇప్పటికే ఇండియా ఖాతాలో పడిపోయిందని, తాను తయారు చేసిన సూక్ష్మ చెస్ బోర్డును ఫైనల్లో తలపడిన ఇరువురు క్రీడాకారులకు అంకితం చేస్తానని వెంకటేష్ చెప్పారు. గతంలో కూడా జాతీయ పతాకాలు, అమరవీరుల స్థూపాలు, ఆలయాలు, వరల్డ్కప్ ఇలా అనేక సూక్ష్మ కళారూపాలను తయారు చేశానని తెలిపారు. -
వైద్య సిబ్బందికి నియామక ఉత్తర్వులు
గుంటూరుమెడికల్: ఉమ్మడి గుంటూరు జిల్లా లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఫార్మసిస్టులు– 20, ల్యాబ్ టెక్నీషియన్లు–3, డేటా ఎంట్రీ ఆపరేటర్లు–16, ఎల్జీఎస్లు–47 పోస్టులకు సోమవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. డీఎంహెచ్ ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, ఉద్యోగాలకు ఎంపికై న వారికి నియామక పత్రాలు అందజేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని సూచించారు. ఆరోగ్య కేంద్రా ల్లో ప్రజలకు అందుబాటులో ఉండి, వైద్య సేవలు నిరంతరంగా అందించాలని తెలిపారు. కార్యక్రమంలో బాపట్ల డీఎంహెచ్ఓ డాక్టర్ విజయమ్మ, జిల్లామ్యూనైజేషన్ అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ్బాబు, పరిపాలనా అధికారి లక్ష్మీకుమారి, ఆఫీస్ సూపరింటెండెంట్ భక్తవత్సలం, అకౌంట్ ఆఫీసర్ కృష్ణకుమారి, డీపీఓ సైమన్ రాజు పాల్గొన్నారు. నేడు జీజీహెచ్లో ఓపీ ఆన్లైన్ సేవలకు అంతరాయం గుంటూరుమెడికల్: గుంటూరు జీజీహెచ్లో ఏబీడీఎం ఈ– హాస్పిటల్ ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఓపీ, లేబరేటరీ, ఇన్ పేషంట్ సేవలను డిజిటల్ విధానంలో చేపడుతున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం వాడుతున్న ఏబీడీఎం వర్షన్ నెక్ట్స్జెన్ మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మైగ్రేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. దీని వల్ల సాయంత్రం 9 గంటల వరకు ఆన్లైన్ సేవలకు అంతరాయం ఏర్పడుతుందని వెల్లడించారు. రోగులకు ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ విషయాన్ని సిబ్బంది, రోగులు గమనించి ఆసుపత్రి అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. కురగల్లులో ఘర్షణ తాడేపల్లిరూరల్: మంగళగిరి మండల పరిధిలో ని కురగల్లులో సోమ వారం ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇందులో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో బంధువులు వైద్యం నిమిత్తం ఎయి మ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. కురగల్లులో పక్క పక్కనే నివసించే తోట రామారావు, తోట వెంకటేశ్వరరావుల మధ్య ఇంటి దారి విషయంలో పాత గొడవలు ఉన్నాయి. రామారావుకు వత్తాసు పలుకుతూ వెళ్లిన బొర్లా శ్రీనివాసరావుపై వెంకటేశ్వరరావు దాడి చేశాడు. ఈ ఘర్షణలో శ్రీనివాసరావు తలకు గాయమైంది. -
విద్యార్థుల మెదడుకు పదును
● శాసీ్త్రయ పరిశోధనల దిశగా ప్రోత్సాహం ● విద్యార్థి విజ్ఞాన్ మంథన్ పరీక్ష ద్వారా ఎంపిక ● పరిశోధనలు, ప్రయోగాలపై ఆసక్తి కనబర్చే విద్యార్థులకు పుష్కల అవకాశాలు ● పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఉపకార వేతనాలు ● హైస్కూల్ స్థాయి విద్యార్థులకు ఆన్లైన్లో మొదలైన రిజిస్ట్రేషన్లు గుంటూరు ఎడ్యుకేషన్/సత్తెనపల్లి: విద్యార్థుల మెదడుకు పదును పెట్టి భావి శాస్త్రవేత్తలుగా వారిని తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (వీవీఎం) పేరిట జాతీయస్థాయి సైన్స్ ప్రతిభా పరీక్షను ఏటా దేశవ్యాప్తంగా అక్టోబర్లో నిర్వహిస్తోంది. ఇందులో ప్రతిభ చూపిన వారికి ఉపకార వేతనాలు ఇస్తోంది. ఆన్లైన్ పరీక్షకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. వీవీఎం 2025–26 ముఖ్యాంశాలు జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఆర్టీ) జాతీయ స్థాయిలో నిర్వహించనున్న వీవీఎం సైన్స్ ప్రతిభా పరీక్షకు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, స్టేట్ బోర్డు నుంచి గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి 11వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులు. పరీక్షను ఇంగ్లిష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, బెంగాలీ, ఒడియా, అస్సామీ భాషల్లో నిర్వహించనున్నారు. విద్యార్థులను పరిశోధన, ప్రయోగాల వైపు ప్రోత్సహించడం దీని లక్ష్యం. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు నగదు బహుమతులతో పాటు ఉన్నత చదువుల కోసం కేంద్ర ప్రభుత్వం ఉపకార వేతనాలు మంజూరు చేయనుంది. శాస్త్ర, పరిశోధనలకు ప్రోత్సాహం విద్యార్థుల్లో విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తిని పెంపొందించడం, సంప్రదాయ యుగం నుంచి ఆధునిక యుగం వరకు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన సహకారాల గురించి పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అవగాహన కల్పించడం వీవీఎం ముఖ్య ఉద్దేశం. వర్క్షాప్లు, కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు ఆచరణాత్మక శిక్షణ అందించి, శాసీ్త్రయ దృక్పథం ఉన్న విద్యార్థులను గుర్తించడానికి పోటీ పరీక్షలను నిర్వహిస్తోంది. శాసీ్త్రయ రంగంలో ముందుకు తీసుకెళ్లడంతో పాటు పరిశోధనల దిశగా విద్యార్థులను సిద్ధం చేసేందుకు మార్గదర్శకులను అందించడం లక్ష్యం. రాష్ట్ర, జాతీయ స్థాయిలో విజయవంతమైన విద్యార్థులను గుర్తించి, వారిని సత్కరించడం, దేశంలోని వివిధ పరిశోధన, అభివృద్ధి సంస్థలకు విజేతల కోసం ఎక్స్పోజర్ సందర్శనలను నిర్వహించడం ముఖ్యమైన అంశాలుగా ఉన్నాయి. పరీక్షకు రిజిస్ట్రేషన్ అక్టోబర్లో జరగనున్న ఆన్లైన్ పరీక్షకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. విద్యార్థుల తాము చదువుతున్న పాఠశాల హెచ్ఎం, ప్రిన్సిపాల్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలి. విద్యార్థులు వ్యక్తిగతంగానూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వివిధ దశల్లో జరగనున్న వీవీఎం ప్రతిభా పరీక్ష సిలబస్, సబ్జెక్టు పరమైన సందేహాలు నివృత్తి, రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలకు vvm. org. in సైట్లో బ్రోచర్, నోటిఫికేషన్ పరిశీలించాలి. -
ప్రజా సమస్యలపై స్పందించకుంటే చర్యలు
● అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి ● పీజీఆర్ఎస్లో వచ్చే వినతులు వెంటనే పరిష్కరించాలి ● కలెక్టర్ జె.వెంకటమురళి బాపట్ల: జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు ఏమాత్రం అలసత్వం చూపినా సహించబోమని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని బాపట్ల జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి హెచ్చరించారు. సోమవారం బాపట్ల కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలు నేరుగా స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతిపత్రాన్ని తక్షణమే పరిష్కరించేలా పూర్తి బాధ్యతతో వ్యవహరించాలన్నారు. మొత్తం 200 వినతులు అందగా, పలు సమస్యలకు తన సమక్షంలోనే పరిష్కారం చూపారు. మిగిలిన వినతులను సంబంధిత శాఖలకు పంపించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ స్థాయిలో పరిష్కారానికి సంబంధించిన విషయాలను రాష్ట్రానికి నివేదించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంపై రాష్ట్రస్థాయిలో నిర్వహించిన సమీక్షలో బాపట్ల జిల్లా 19వ స్థానంలో నిలవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే సమీక్షలో జిల్లా స్థానం మెరుగుపడకపోతే, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏ ఒక్క అధికారిని కూడా ఉపేక్షించబోమని, తగిన కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ గంగాధర్గౌడ్, ఆర్డీఓ గ్లోరియ, డీఆర్డిఏ పీడీ శ్రీనివాస్, అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు. -
బాపట్ల
అమ్మవార్లకు తిరునక్షత్రం పూజలు సత్తెనపల్లి: వడ్డవల్లి శ్రీ రామాలయం, శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం శ్రీ గోదాదేవి, శ్రీలక్ష్మీ అమ్మవార్లకు తిరునక్షత్రం పూజలు నిర్వహించారు.గోవాడలో శ్రావణ పూజలు అమృతలూరు(భట్టిప్రోలు): అమృతలూరు మండలం గోవాడలో కొలువైన శ్రీ బాలకోటేశ్వరస్వామి దేవాలయంలో సోమవారం శ్రావణ పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. గోదాదేవి జన్మదిన వేడుకలు మాచర్ల: మాచర్ల శ్రీ కోదండరామాలయంలో సోమవారం గోదాదేవి అమ్మవారి జన్మది న వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.మంగళవారం శ్రీ 29 శ్రీ జూలై శ్రీ 20257 -
డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల
పెదకాకాని(ఏఎన్యు): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది ఏప్రిల్– మే నెలల్లో నిర్వహించిన డిగ్రీ కోర్సుల రెండో సెమిష్టర్ పరీక్ష ఫలితాలను సోమవారం వీసీ ఆచార్య కె. గంగాధరరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏసీఈ ఏ. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పరీక్షలకు అన్ని కోర్సుల నుంచి 9991 మంది హాజరు కాగా, 5642 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ఉత్తీర్ణత 56.47 శాతంగా ఉందన్నారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్ల ద్వారా పొందవచ్చని సూచించారు. పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు రీ వాల్యుయేషన్, పర్సనల్ వెరిఫికేషన్, జవాబు పత్రాల ఫొటోస్టాట్ కాపీలకు ఆగస్టు 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఫీజు వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరచామని చెప్పారు. వెబ్సైట్ను పరిశీలించి సకాలంలో పరీక్ష ఫీజు చెల్లించాలని ఆయన కోరారు.కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య కె. రత్నషీలామణి, డిగ్రీ పరీక్షల కోఆర్డినేటర్ ఆచార్య కృష్ణారావు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ ఎ. శివప్రసాదరావు, పరీక్షల విభాగం నోడెల్ ఆఫీసర్ ఆర్. ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు. -
పల్నాట నెత్తుటి తూటా
ఒకప్పుడు కక్షలతో రగిలిన పల్నాడు గడ్డపై గత ఐదేళ్లలో శాంతి, సామరస్యం వెల్లివిరిశాయి. సంక్షేమ పథకాలు చేతికంది, పిల్లలు ఉన్నత చదువులవైపు మళ్లడంతో అక్షర చైతన్యం పెరిగింది. పల్లె సీమలలో ఆరోగ్యకర వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హత్యా రాజకీయాలు పురివిప్పాయి. తాజాగా రియల్టర్ల మర్డర్లతో కిడ్నాపింగ్, రివాల్వర్ సంస్కృతి ప్రవేశించింది. పల్నాడును భయం గుప్పెట్లోకి నెట్టేసింది. జంట హత్యల కేసులో పోలీసుల తీరు అధికార టీడీపీ అడుగులకు మడుగులొత్తడంతో తమకు న్యాయం జరిగేనా అంటూ బాధితులు ఆవేదన చెందుతున్నారు.నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో జరిగిన జంట హత్యల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో జరిగిన ఈ హత్యల వెనుక కూటమి ప్రజాప్రతినిధుల సహకారం ఉన్నట్టు స్పష్టమవుతోంది. బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు కే వీరాస్వామిరెడ్డి, కేవీ ప్రశాంత్రెడ్డి తండ్రీకొడుకులు. గత బుధవారం చెల్లని చెక్కు కేసులో నరసరావుపేట కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చిన వారిని కోర్టు ఎదుట కిడ్నాప్ చేసి బాపట్ల జిల్లా పాతమాగులూరు వద్ద హత్య చేసిన విషయం తెలిసిందే. నిందితులు నిత్యం రద్దీగా ఉండే ప్రదేశంలో కిడ్నాప్ చేసేందుకు సాహసించిన తీరు, హత్యలు చేసిన వైనాన్ని పరిశీలిస్తే ప్రభుత్వంలోని పెద్దల అండ చూసుకొని బరితెగించినట్టు తెలుస్తోంది. కేసు నమోదులో కూడా పోలీసుల నిర్లక్ష్యం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది. నరసరావుపేటలో కిడ్నాప్ చేసిన దుండగులు 20 నిమిషాల వ్యవధిలోనే ఇద్దర్నీ హత్య చేశారు. ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మృతుల తరఫు న్యాయవాది నాగభూషణ్ ఇచ్చిన ఫిర్యాదుతో నరసరావుపేట వన్టౌన్ పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. మృతదేహాలు పాతమాగులూరులో లభ్యమైన కారణంగా సంతమాగులూరు పోలీసులు అక్కడ మర్డర్ కేసు నమోదు చేశారు.సాధారణంగా కంటిన్యూషన్ అఫెన్స్ జరిగినప్పుడు సంఘటన ప్రారంభమైన స్టేషన్ పరిధిలో నమోదైన కిడ్నాప్ కేసును మర్డర్ కేసుగా మార్చి దర్యాప్తు చేయాలి. కానీ జంట హత్యల కేసులో మాత్రం గత కేసులకు భిన్నంగా రెండు జిల్లాల పరిధిలోని పోలీసులు ఆయా స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. ఇద్దరు స్టేషన్ అధికారుల మధ్య సమన్వయం లోపిస్తే కేసు నీరుగారే ప్రమాదం ఉంది. జంట హత్యల కేసులో ప్రభుత్వం ప్రారంభంలోనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మృతుల తరఫు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసుల తప్పిదాన్ని ఎత్తిచూపుతూ కేసు దర్యాప్తును సీబీఐకు బదిలీ చేయాలని హైకోర్టును ఆశ్రయించే ఆలోచన ఉన్నట్లు సమాచారం. మాధవరెడ్డి టీడీపీ నాయకుడే.. పట్టపగలు కోర్టు ప్రాంగణం ఎదుట ఇద్దర్ని అందరూ చూస్తుండగా కిడ్నాప్ చేసి అతి దారుణంగా హతమార్చడం రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం, పోలీసుల తీరుపై వస్తున్న విమర్శలను మరుగునపెట్టి.. ఎప్పటిలాగే ఈ ఘటనను కూడా వైఎస్సార్సీపీ నెత్తిన రుద్దేందుకు కుట్ర జరుగుతోంది. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న బాదం మాధవరెడ్డి గతంలో కొంత కాలం వైఎస్సార్సీపీలో ఉన్న విషయాన్ని ప్రచారం చేస్తున్నారు. అయితే మాధవరెడ్డి ప్రస్తుతం ఏ పారీ్టలో ఉన్నాడు? గత సాధారణ ఎన్నికల్లో ఏ పార్టీ కోసం పని చేశాడు? ఎవరి అండదండలతో ఇంత దారుణానికి ఒడిగట్టాడనే అంశాలను పరిశీలిస్తే అన్ని వేళ్లూ కూటమి ప్రభుత్వం వైపే చూపిస్తున్నాయి. సాధారణ ఎన్నికలకు ముందు 2023 సెపె్టంబర్ 10వ తేదీన అప్పటి ప్రతిపక్షనేత చంద్రబాబును కలసి మద్దతిచ్చిన ఫొటోలను ప్రధాన నిందితుడు మాధవరెడ్డి తన సోషల్ మీడియాలో పెట్టుకున్నాడు. ఆ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.దీంతోపాటు యువగళం పాదయాత్ర సమయంలో లోకేష్ కు స్వాగతం పలుకుతూ మాధవరెడ్డి ఫొటోలతో అతని అనుచరులు వేసిన ఫ్లెక్సీలు ఏ పార్టీ వాడో చెప్పకనే చెబుతున్నాయి. ఈ వాస్తవాలను మరుగున పరిచేందుకు కొన్ని పచ్చ పత్రికలు పదేళ్ల క్రితం మాధవరెడ్డి ఉన్న పార్టీ ప్రస్తావన తీసుకువచ్చి ప్రభుత్వానికి మచ్చ లేకుండా చేసేందుకు తెగ ప్రయతి్నస్తున్నాయి. టీడీపీ నేతల అండ చూసుకుని మాధవరెడ్డే స్వయంగా కిడ్నాప్, హత్యల ఘటనలో పాల్గొన్నట్టు అర్థమవుతోంది. తండ్రీకొడుకులను మాధవరెడ్డి బలవంతంగా కారులో ఎక్కిస్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజీలలో నిక్షిప్తమయ్యాయి.టీడీపీ నేతలతో సంబంధాలు.. నరసరావుపేటలో కిడ్నాప్ చేసిన తండ్రీకొడుకులను బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం పాతమాగులూరు పరి«ధిలో హత్య చేయడం వెనుక ముందస్తు వ్యుహం ఉందన్న ప్రచారం జరుగుతోంది. సంతమాగులూరు గ్రామానికి చెందిన నిందితుడు బాదం మాధవరెడ్డికి బాపట్ల, ప్రకాశం జిల్లాలలో అధికార పార్టీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. పల్నాడు జిల్లా పరిధి దాటగానే బాపట్ల జిల్లా ప్రారంభమైన 200 మీటర్ల దూరంలో రియల్ ఎస్టేట్ వెంచర్లో హత్యలు చేశారు. ముందస్తు పక్కా ప్రణాళిక ప్రకారం అక్కడి నుంచి పరారయ్యారు. -
ప్లేట్లెట్లపై అపోహలు వీడండి
ఎలాంటి జ్వరం వచ్చినా ప్లేట్లెట్స్ తగ్గటం సహజం. అంతమాత్రానికే ఊరికే రోగులు కంగారు పడకూడదు. సాధారణంగా రక్తంలో 2 లక్షల నుంచి 4.5 లక్షల ప్లేట్లెట్స్ ఉంటాయి. వీటి సంఖ్య 40 వేల కన్నా తక్కువగా ఉన్నప్పటికీ ప్రమాదం లేదు. డెంగీ మొదటి దశలో జ్వరం, తీవ్రమైన ఒళ్లు నొప్పులు, తలనొప్పి, కళ్లు ఎర్రగా మారతాయి. రెండో దశలో ప్లేట్లెట్స్ తగ్గటం, జ్వరం, వాంతులు, కాళ్ల వాపులు వస్తాయి. మూడో దశలో బీపీ తక్కువగా ఉండటం, ప్లేట్లెట్స్ తగ్గటం, శరీరంపై మచ్చలు ఏర్పడతాయి. నాలుగో దశలో రోగికి కామెర్లతోపాటుగా షాక్లోకి వెళతాడు. బీపీ తగ్గడంతోపాటు కిడ్నీల పనితీరు కూడా తగ్గిపోయి, శరీరంపై ఎర్రటి దద్దుర్లు ఏర్పడతాయి. అవి పగిలి రక్తం బయటకు వస్తుంది. మూత్రంలో, దగ్గు తున్నప్పుడు కళ్లె ద్వారా రక్తం పడిపోతూ ఉంటే అప్పుడు ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి ఉంటుంది. నాలుగో దశను డెంగీ హెమరేజ్ షాక్ సిండ్రోమ్ అంటారు. మొదటి మూడు దశలలో ఎలాంటి భయాందోనలు చెందాల్సిన పనిలేదు. – డాక్టర్ కోగంటి కల్యాణ్ చక్రవర్తి, జ్వరాల స్పెషలిస్ట్, గుంటూరు. -
అప్రమత్తతతో డెంగీకి చెక్
గుంటూరు మెడికల్: డెంగీ జ్వరం... ఈ మాట వినగానే జిల్లా ప్రజల్లో వణుకు పుడుతుంది. గతంలో అధికంగా కేసులు జిల్లాలోనే నమోదవ్వడంతో హెల్త్ ఎమర్జన్సీ సైతం ప్రకటించారు. డెంగీ జ్వరంతో మరణాలు కూడా సంభవించాయి. సాధారణంగా కొన్ని జ్వరాలు వచ్చిన కొద్దిరోజుల్లోనే తగ్గిపోతాయి. కొన్ని సరైన జాగ్రత్తలు తీసుకోని పక్షంలో ప్రాణాలు సైతం పోయే ప్రమాదం ఉంది. సాధారణంగా వర్షాలు కురిసే సమయంలో జ్వరాలు వస్తుంటాయి. కానీ మండుటెండల్లోనూ కేసులు నమోదవ్వడంతో ప్రజల్లో ఆందోళన ప్రారంభమైంది. ముఖ్యంగా సరైన అవగాహన లేకపోవడంతో పలువురు ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో ప్లేట్లెట్స్ పేరిట జ్వర బాధితుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. డెంగీపై కొద్దిపాటి అవగాహనతో జాగ్రత్తలు తీసుకుంటే దాని బారిన పడకుండా ఉండొచ్చు. ఇవీ.. లక్షణాలు పగటి పూట కుట్టే ఎడిస్ ఈజిస్ట్ అనే దోమకాటు వల్ల డెంగీ జ్వరం వస్తుంది. వాంతులు, తలనొప్పి, కంటి గుడ్డు కదిలినప్పుడు నొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, వాంతి అయినట్లు భ్రాంతి కల్గడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. ఒంటిపై ఎర్రటి గుల్లలు ఏర్పడతాయి. ప్లేట్లెట్స్ తగ్గిపోయి ఒక్కోసారి రక్తస్రావం జరుగుతుంది. ఎలీసా పద్ధతిలో రక్త పరీక్ష చేసి వ్యాధిని నిర్ధారణ చేస్తారు. అపోహలతో ప్రాణాల మీదకు.. డెంగీపై ప్రజలకు అవగాహన లేకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో ప్లేట్లెట్స్ పేరిట రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. కొంత మంది బొప్పాయి రసం తాగితే, బొప్పాయి తింటే ప్లేట్లెట్స్ పెరుగుతాయనే అపోహల్లో ఉంటున్నారు. దీంతో ఆస్పత్రులకు వెళ్లకుండా ఇళ్లలోనే ఉంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. డెంగీపై అవగాహనతో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే జ్వరం బారిన పడకుండా ఉండొచ్చు. పట్టణాల్లో కేసులు అధికం గ్రామీణ ప్రాంతాల్లో కంటే మున్సిపాలిటీలు, గుంటూరు కార్పొరేషన్ పరిధిలోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది గుంటూరు నగరంలో 31 కేసులు నమోదయ్యాయి. నగరంలోని భాగ్యనగర్, బొంగరాలబీడు , బృందావన్ గార్డెన్స్, గోరంట్ల, కోబాల్డ్పేట, గుండారావుపేట, గుంటూరువారితోట, శారదాకాలనీ, ఆర్.అగ్రహారం, వసంతరాయ పురం, శ్రీనివాసరావు తోట, పాత గుంటూరు, ఎన్జీఓ కాలనీ, మంగళదాస్ నగర్, లాంచెస్టర్రోడ్, ఐపీడీకాలనీ, గుంటూరువారితోట, లాలాపేట, తదితర ప్రాంతాల్లో డెంగీ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో బాధితుల వివరాలు సంవత్సరం బాధితుల సంఖ్య 2021 447 2022 168 2023 375 2024 432 2025 50 (జూన్ వరకు) జిల్లాలో 50 కేసులు నమోదు అపోహలతో ప్రాణాలు పోయే ప్రమాదం కొద్ది జాగ్రత్తలతో జ్వరానికి అడ్డుకట్ట డెంగీ పేరుతో ప్రైవేటు వైద్యుల దోపిడీ దోమలు పెరిగే ప్రదేశాలివీ.. మంచినీటిని నిల్వ చేసే ప్రదేశంలో, వాడి పారేసిన వస్తువులు, నిలువ ఉండే నీటిలో దోమ పిల్లలు పురుగుల మాదిరి కదులుతూ ఉంటాయి. నీటిని నిల్వచేసే డ్రమ్ములు, తొట్టెలు, గాబులు, రుబ్బురోళ్లు, వాడి పారేసిన టైర్లు, టీ కప్పులు, ప్లాస్టిక్ కప్పులు, కొబ్బరి చిప్పలు, బొండాలు, ఫ్రిజ్, ఎయిర్ కూలర్ల వెనుక భాగాల్లో, పూల కుండీలు, ఓవర్ హెడ్ ట్యాంకులు, నీటి సంపుల్లో ఈ దోమ లార్వాలు పెరుగుతాయి. -
కలిసికట్టుగా సమస్యలపై పోరాటం
అద్దంకి: నూర్బాషాలందరూ కలిసికట్టుగా ఉంటే సమస్యలపై పోరాటంతో విజయాలు సాధించవచ్చని రాష్ట్ర నూర్ బాషా యువజన సంఘం అధ్యక్షుడు దూదేకుల పెద మస్తాన్ అన్నారు. ఆదివారం పట్టణంలోని షాదీఖానాలో సమావేశం నిర్వహించారు. పట్టణ నూర్ బాషా దూదేకుల కమిటీ అధ్యక్షుడిగా షేక్ మదీనాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో మస్తాన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూర్ బాషా దూదేకుల ఆర్థిక సంస్థ ఏర్పాటు చేయడం సంతోషమని చెప్పారు. రానున్న రోజుల్లో ఏకతాటిపై ఉండి సమస్యల పరిష్కారం చేయాలన్నారు. రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రెటరీ దూదేకుల దావూద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మనకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నారు. పిల్లలకు సర్టిఫికెట్లో లోపాలు జరుగుతున్నాయని వివరించారు. నూతన కమిటీకి అభినందనలు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర యువజన ఉపాధ్యక్షులుగా కొటికలపూడి శ్రీనును, అద్దంకి యూత్ అధ్యక్షుడిగా ఎలిల్ సాహెబ్, ప్రధాన కార్యదర్శిగా షైక్ సైదా వలి, కె.మీరావలి, ఉపాధ్యక్షులుగా అహమ్మద్, షేక్ అంజయ్య, గౌరవ అధ్యక్షులుగా వేల్పూరి మస్తాన్ వలిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ అజిజ్, ఎంప్లాయీస్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ సర్పరాజ్, రాష్ట్ర కార్యదర్శి అహ్మద్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుభాని, సంఘ పెద్దలు పాల్గొన్నారు. -
వినియోగదారుల హక్కుల పరిరక్షణ కార్యాలయం ప్రారంభం
తాడేపల్లి రూరల్ : మంగళగిరి పట్టణ పరిధిలోని ఎన్ఎస్ఆర్ ప్లాజాలో జిల్లా వినియోగదారుల హక్కుల పరిరక్షణ ఫోరం కార్యాలయాన్ని ఆదివారం రాష్ట్ర అధ్యక్షుడు కూడారి తిరుపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో వినియోగదారులు పడుతున్న సమస్యలకు పరిష్కారం, హక్కులపై ఫోరం అవగాహన కల్పిస్తోందని తెలిపారు. వినియోగదారులు తమకు జరిగిన నష్టంపై మంగళగిరిలో నూతనంగా ప్రారంభించిన జిల్లా కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఫోరం జిల్లా అధ్యక్షుడు బొమ్ము జస్వంత్రెడ్డి, జిల్లా యూత్ విభాగం అధ్యక్షుడు టి.రవికుమార్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రియారెడ్డి, యూత్ జిల్లా ఇన్చార్జి షేక్ రిజ్వాన్, యూత్ వింగ్ ప్రతినిధి రాజ్కుమార్ పాల్గొన్నారు. యోగాలో లిమిట్లెస్ సెంటర్ విద్యార్థులకు పతకాలుగుంటూరు వెస్ట్ (క్రీడలు): యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ అమరావతి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎన్జీఓ కాలనీలోని సుమేధ స్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి యోగసన పోటీల్లో తమ విద్యార్థులు పతకాలు సాధించారని యోగా టీచర్ వంగా వెంకటేష్ తెలిపారు. 10–14 ఏళ్ల వయస్సు విభాగంలో గోహితకు కాంస్యం, 18–28 ఏళ్ల విభాగంలో పి.భార్గవికి స్వర్ణం, కాంస్యం, 28–35 ఏళ్ల విభాగంలో వి.వెంకటేష్కు రెండు స్వర్ణాలు, 35–45 ఏళ్ల విభాగంలో రేణుక రెండు బంగారు పతకాలు సాధించారన్నారు. యోగాసనాలతోపాటు ఆహార అలవాట్లు మార్పు చేసుకుంటే చక్కని ఆరోగ్యం సొంతం అవుతుందని తెలిపారు. విజేతలకు, పోటీల్లో పాల్గొన్న వారికి లిమిటెస్ ఫిట్నెస్ సెంటర్ అధినేత నీలిమ అభినందనలు తెలిపారు. వైభవంగా గిరిజా కల్యాణం నగరంపాలెం: స్థానిక ఆర్.అగ్రహారంలోని శ్రీకన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆదివారం గిరిజా కల్యాణం వైభవంగా నిర్వహించారు. వామనాశ్రమ స్వామిజీ మాట్లాడుతూ గిరిజా కల్యాణం నిర్వహించడం వల్ల వివాహ దోషాలు తొలగిపోతాయని అన్నారు. త్వరగా పెళ్లిళ్లు జరిగేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో త్వరగా పెళ్లిళ్లు కావాలని ఆశీర్వదించారు. గిరిజా కల్యాణాన్ని వేద పండితులు (శ్రీకాళహస్తి) శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం దాదాపు 200 మంది యువతీ, యువకులకు తీర్థప్రసాదాలు అందించారు. తటపర్తి రాంబాబు, నేరెళ్ల హరి, ఎల్ఎస్ఆర్ ఆంజనేయులు, గుడివాడ రవీంద్ర, కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ నిడమానూరు సురేష్, త్రిపురమల్లు వాణి పాల్గొన్నారు. సుబ్బారాయుడి సన్నిధిలో భక్తుల రద్దీ మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం భక్తులతో కోలాహలంగా మారింది. శ్రావణమాసం ఆదివారం కావడంతో తెలుగు ఉభయ రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం నిండిపోయింది. ఆలయం లోపల, వెలుపల కూడా క్యూలైనులో భక్తులు గంటల తరబడి నిరీక్షించారు. భక్తుల వాహనాలతో పార్కింగ్ ప్రదేశం, ప్రధాన రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ఆలయలో నాగపుట్ట, నాగమల్లి వృక్షం, పొంగళ్లశాల వద్ద భక్తుల రద్దీ ఏర్పడింది. ఆలయ డీసీ దాసరి శ్రీరామ వరప్రసాదరావు, ఆలయ అధికారులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
మంత్రి గారూ... సమస్యలు పరిష్కరించండి !
జె.పంగులూరు: మండలంలోని చందలూరు గ్రామంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సుపరిపాలన తొలి అడుగు’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఇంటింటికీ వెళ్లి సుపరిపాలన కరపత్రాలను గ్రామస్తులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానికులు సమస్యలు ఏకరువు పెట్టారు. బీసీ కాలనీలో కొంత మంది మహిళలు తాగునీరు సక్రమంగా రావడం లేదని మంత్రి రవికుమార్కు తెలిపారు. ఇదే కాలనీలో యనమల అంజమ్మ గ్యాస్ డబ్బులు తనకు రావడం లేదని, రూ.20 మాత్రమే ఖాతాలో జమవుతున్నాయని తెలిపింది. కొనుగోలు కేంద్రానికి పొగాకు చెక్కులు తీసుకొని పొతే నాణ్యత పేరుతో వెనక్కి కొడుతున్నారని రైతు కర్రి బ్రహ్మయ్య మంత్రి ముందు వాపోయాడు. అనంతరం చందలూరులో నూతనంగా నిర్మించిన ఎన్టీర్ కళావేదిక వద్ద జరిగిన సభలో మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ చందలూరు గ్రామ అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారు. ఇప్పటికే రూ.30 లక్షలతో అంతర్గత సిమెంట్ రోడ్డు నిర్మించినట్లు చెప్పారు. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని వెల్లడించారు. బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు నెరవేరుస్తామని తెలిపారు. అనంతరం 10 మంది వికలాంగులకు మూడు చక్రాల స్కూటీలు అందించారు. నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించారు. చందలూరు సీఏసీఎస్ అధ్యక్షులుగా బెల్లంకొండ శ్రీధర్బాబు, సభ్యులుగా వట్టెం శేషయ్య, మాగులూరు సుబ్బారావు మంత్రి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కర్రి వెంకట సుబ్బారావు, పెంట్యాల రాధాకృష్ణ, ఎంపీటీసీ సభ్యులు వాసవి, మురకొండ సుబ్బారావు, కుక్కపల్లి ఏడుకొండలు, చింత సహాదేవుడు, పార్టీ మండల అధ్యక్షుడు రావూరి రమేష్ బాబు, గరిమిడి జగన్మోహనరావు పాల్గొన్నారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్కు గ్రామస్తుల విన్నపం -
టైప్రైటింగ్ పరీక్షలకు 54 మంది హాజరు
రేపల్లె: స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ మంగళగిరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టైప్ రైటింగ్ పరీక్షలు పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. ఇంగ్లిష్ లోయర్కు 30 మంది, హయ్యర్ పరీక్షకు 15 మంది, జూనియర్ గ్రేడ్కు ఏడుగురు, తెలుగు హయ్యర్కు ఒకరు, లోయర్కు ఒకరు చొప్పున మొత్తం 54 మంది హాజరైనట్లు పరీక్షల చీప్ సూపరింటెండెంట్, కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.చంద్రశేఖర్ తెలిపారు. జిల్లా ఫ్లోర్ బాల్ ఎంపిక పోటీలు వినుకొండ: పల్నాడు జిల్లా ఫ్లోర్బాల్ అండర్ –14, 19 బాలబాలికల ఎంపిక పోటీలు పట్టణంలోని లయోలా పాఠశాలలో నిర్వహించినట్లు పల్నాడు జిల్లా ఫ్లోర్ బాల్ ప్రధాన కార్యదర్శి ఎం.కిశోర్బాబు తెలిపారు. పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు ఆగస్టు 3న నరసరావుపేటలోని కె–రిజ్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో లయోలా స్కూల్ హెచ్ఎం అభినా ష్, జిల్లా కార్యదర్శి కిశోర్, పీఈటీలు ఏడుకొండలు, కోటేశ్వరమ్మ, రవితేజ, వివిధ పాఠశాలల నుండి 100మంది బాలబాలికలు పాల్గొన్నారు. తైక్వాండో పోటీల్లో 15 మందికి బంగారు పతకాలు తెనాలి అర్బన్: గుంటూరు జిల్లా తైక్వాండో చాంపియన్షిప్లో తెనాలి కేఎస్ఆర్ అకాడమి విద్యార్థులు 15 మందికి బంగారు, ఆరుగురికి వెండి, ఇద్దరికి కాంస్య పతకాలు లభించినట్లు కోచ్ కొక్కిలిగడ్డ శ్రీనివాసరావు తెలిపారు. పోటీలను రేపల్లెలో ఈ నెల 19,20 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. వీరందరూ త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు వివరించారు. ఆదివారం అకాడమి ఆవరణలో క్రీడాకారులకు పతకాలు పంపిణీ చేసి అభినందించారు. కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు ఈదర వెంకట పూర్ణచంద్, వీరవల్లి మురళి, కుర్రా శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
గుంటూరు ఎడ్యుకేషన్: పంచాయతీరాజ్ విశ్రాంత ఉద్యోగుల అపరిష్కృత సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంటు అండ్ ఇంజినీరింగ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు టీఎంబీ బుచ్చిరాజు డిమాండ్ చేశారు. ఆదివారం జెడ్పీ సమావేశ మందిరంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. బుచ్చిరాజు మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖలోని విశ్రాంత ఉద్యోగులు, ఇంజినీరింగ్ అధికారుల అపరిష్కృత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది పంచాయతీరాజ్ విశ్రాంత ఉద్యోగులు, ఇంజనీర్లు పెన్షన్, మెడికల్ రీ–యింబర్స్మెంట్ వంటి అంశాల్లో వేతన విభజన చట్టాల ముసుగులో జరుగుతున్న వర్గీకరణ కారణంగా ఇబ్బందులు పడుతూ, నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ దారుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి గానూ అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య పిలుపుతో ప్రధానికి ఒక వినతి పత్రాన్ని పంపనున్నట్లు తెలిపారు. రిటైర్డ్ పంచాయతీరాజ్ ఉద్యోగుల ఇంజినీర్ల వేతన సవరణ, బకాయిలు, డీఏలు, మెడికల్ రీ–యింబర్స్మెంట్ వంటి అంశాల్లో అన్యాయం జరుగుతోందని వివరించారు. 12వ వేతన సవరణ పూర్తి స్థాయిలోఅమలు చేయడంతో పాటు 35 శాతం ఐఆర్ మంజూరు చేయాలని ఆయన కోరారు. 12వ పీఆర్సీలో చట్టబద్ధత కల్పించి, 11 పీఆర్సీలో అమలు చేసిన విధంగా అదనపు పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. జీవో 315ను సవరించి, భార్యాభర్తలకు కుటుంబ పెన్షన్ వర్తించేలా మార్పులు చేయాలని సూచించారు. యూజీసీ స్కేల్స్ పరిధిలోకి వచ్చే పెన్షన్దారులకు అదనపు పింఛన్, 10వ పీఆర్సీ తరహాలో రిఫండ్ డెత్ రిలీఫ్ అమలు పర్చాలని కోరారు. పీఆర్సీ, డీఏ బకాయిలతో పాటు ఉద్యోగుల హెల్త్ స్కీం క్లెయిమ్స్ను చెల్లించాలని డిమాండ్ చేశారు. మెడికల్ రీ–యింబర్స్మెంట్ పూర్తిగా ఈహెచ్ఎస్ కింద చెల్లించాలని, ఆరోగ్య బీమా కార్డులను పరిమితులు లేకుండా అందరికీ జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. పెన్షన్దారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డైరెక్టరేట్ వెంటనే ఏర్పాటు చేయడంతో పాటు అమరావతిలో భవనం నిర్మించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. సమస్యల పరిష్కారానికి మంత్రులతో పాటు ఉన్నతాధికారులను కలుస్తామని తెలిపారు. సమావేశంలో సంఘ అసోసియేట్ ప్రెసిడెంట్ షేక్ రియాజ్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి యు.కూర్మారావు, కోశాధికారి బి.శివరామకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.శ్రీనివాసరావు, ఎం.వి.రంగాచారి, వి.వెంకటేశ్వరరావు, 13 జిల్లాల కార్యవర్గ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, రాష్ట్ర సంఘ నాయకులు పాల్గొన్నారు. పీఆర్ విశ్రాంత ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బుచ్చిరాజు -
స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆగస్టు 5న ధర్నా
బాపట్ల: ప్రభుత్వ భూములను బడా కంపెనీలకు కట్టబెట్టే పనిలో కూటమి ప్రభుత్వం ఉందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవి అన్నారు. ఆదివారం బాపట్లలోని పుచ్చలపల్లి సుందరయ్య ప్రజాసంఘాల జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు టి కృష్ణమోహన్ అధ్యక్షత వహించారు. రమాదేవి మాట్లాడుతూ విద్యుత్ స్మార్ట్మీటర్లు, విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా వచ్చే నెల 5న విద్యుత్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో నల్లబర్లీ పొగాకు కొనుగోలులో పేద రైతు కౌలు రైతులకు ప్రాధాన్యత ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఏడాది కూటమి ప్రభుత్వ పని తీరును పరిశీలిస్తే మంత్రులు దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు ప్రజలకు అందుబాటులో లేకుండాపోయారని విమర్శించారు. ప్రభుత్వంలోని ప్రతి స్థాయిలో అవినీతి అడుగడుగునా రాజ్యమేలుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజావ్యతిరేక చర్యలు, పెరిగిన ధరలు, విద్యుత్ చార్జీల మోత, స్మార్ట్మీటర్ల ప్రమాదం వంటి సమస్యలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఆండ్రా మాల్యాద్రి, పార్టీ జిల్లా కార్యదర్శి సీహెచ్ గంగయ్య, టి కృష్ణమోహన్, సీహెచ్ మజుందర్, ఎన్ బాబురావు, సీహెచ్ మణిలాల్, కొండయ్య పాల్గొన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు రమాదేవి -
బుల్లెట్ అదుపు తప్పి ముగ్గురికి గాయాలు
యడ్లపాడు: జాతీయ రహదారిపై తిమ్మాపురం వద్ద బైపాస్ రహదారిపై ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల తెలిపిన వివరాలు.. మేడికొండూరు మండలం పాలడుగుకు చెందిన దొప్పలపూడి హనుమానాశాస్త్రి, దండా గోపి, మరొక వ్యక్తి కలిసి బుల్లెట్పై చిలకలూరిపేట నుంచి గుంటూరు వైపు ఆదివారం వెళ్తున్నారు. తిమ్మాపురం వంతెనపైనా మలుపు వద్దకు రాగానే వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ప్రమాదంలో బుల్లెట్పై ఉన్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వాహనం కూడా ధ్వంసమైంది. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని 108లో గుంటూరు సమగ్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలోని సీసీ కెమెరా ఫుటేజ్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. వాహనంపై కూర్చున్న వారిలో మధ్యలో ఉన్న వ్యక్తి బుల్లెట్ హ్యాండిల్ పట్టుకున్నట్లుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. క్రీడాకారిణి జెస్సీ రాజ్కు మంత్రి అభినందనలు తాడేపల్లి రూరల్: మంగళగిరికి చెందిన యువ స్కేటింగ్ క్రీడాకారిణి జెస్సీ రాజ్కు ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఉండవల్లిలోని ఆయన కార్యాలయం నుంచి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఏషియన్ రోలర్ స్కేటింగ్ సోలో డ్యాన్స్ సబ్ జూనియర్ విభాగంలో జెస్సీ రాజ్ సిల్వర్ మెడల్ సాధించినందుకు మంత్రి నారా లోకేష్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారని పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికపై భారత జెండాను రెపరెపలాడించి, దేశానికి గర్వకారణంగా నిలిచిన ఆమె భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించినట్లు ప్రకటనలో వారు పేర్కొన్నారు. -
వేతనాలు అందక ఉపాధ్యాయులకు అవస్థలు
గుంటూరు ఎడ్యుకేషన్: బదిలీ అయిన ఉపాధ్యాయులకు రెండు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు కె.బసవలింగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కోర్టు వద్ద ఉన్న సంఘ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రీ–అపోర్షన్మెంట్ గురైన ఉపాధ్యాయులతో పాటు అప్ గ్రేడ్, డీ–గ్రేడ్ అయిన ఉన్నత పాఠశాలల్లోని వేలాది మంది ఉపాధ్యాయులకు మే, జూన్ నెలలకు సంబంధించిన వేతనాలు అందని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఫలితంగా బ్యాంకు, వ్యక్తిగత రుణ చెల్లింపులు, కుటుంబ ఖర్చులు భారంగా మారాయని పేర్కొన్నారు. విధులకు డెడ్లైన్ విధించి, ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేస్తున్న విద్యాశాఖాధికారులు వేతనాల చెల్లింపుల్లో ఎందుకు జాప్యం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఆగస్టు మొదటి వారంలో వేతనాలు చెల్లించాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఉపాధ్యాయ ఖాళీల్లో డీఎస్సీ నియామకాలు చేపట్టే వరకు అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించాలని కోరారు. ఇంటర్మీడియట్ తరగతులు బోధిస్తున్న ప్లస్ టూ పాఠశాలల్లోని సబ్జెక్ట్ టీచర్స్ ఖాళీల్లో పీజీ అర్హత గల ఉపాధ్యాయులను తాత్కాలికంగా నియమించి, విద్యా ప్రమాణాలు పడిపోకుండా చూడాలని తెలిపారు. గతంతో పోల్చితే యాప్స్ భారం పెరిగిందని, తక్షణమే వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కటీ ఆన్లైన్లో నమోదు చేయమంటూ, ఉపాధ్యాయులను బోధనకు దూరం చేయడం తగదని ఖండించారు. ఏపీటీఎఫ్ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాలీద్ మాట్లాడుతూ 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్ను నియమించి, 30శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ బకాయిలు రూ.25వేల కోట్ల మేరకు పేరుకుపోయాయని, మూడేళ్లుగా చెల్లింపులు లేక సరెండర్ లీవ్ బిల్స్ మూలన పడ్డాయని తెలిపారు. తక్షణమే ఆయా బకాయిలను చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్హత గల ఎస్జీటీ, పీఈటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతులు కల్పించాలని కోరారు. ఎంఈవోల బదిలీలు చేపట్టి, కామన్ సర్వీస్ రూల్స్ ప్రకారం ఖాళీగా ఉన్న ఎంఈవో పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నాడు–నేడు పనులను పూర్తి చేయాలని కోరారు. పలు పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, బూట్లు సరిపడా విద్యార్థులకు అందలేదని, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సమావేశంలో ఏపీటీఎఫ్ జిల్లా నాయకులు జి.దాస్, ఎస్.ఎస్.ఎన్ మూర్తి, బి.సాయి లక్ష్మి, పి.నాగశివన్నారాయణ, జిల్లా కౌన్సిలర్లు గురుమూర్తి, ముని నాయక్, షేక్ షూకూర్, సుబ్బారావు పాల్గొన్నారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.బసవలింగారావు -
ఆట్యా– పాట్యా జిల్లా జట్టు ఎంపిక
నకరికల్లు: పల్నాడు జిల్లా ఆట్యా– పాట్యా అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలబాలికల జిల్లా జట్ల ఎంపికలు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో ఆదివారం నిర్వహించారు. జిల్లాలోని పలు ఉన్నతపాఠశాలల నుంచి క్రీడాకారులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. న్యాయనిర్ణేతలు 15 మంది బాలికలు, 15 మంది బాలురను పల్నాడు జిల్లా జట్టులో ఎంపిక చేశారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు రాణించి రాష్ట్రస్థాయిలో ప్రతిభను చాటాలని ఆట్యా–పాట్యా అసోసియేషన్ పల్నాడు జిల్లా అధ్యక్షురాలు చింతా సామ్రాజ్యం అన్నారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు ఆగస్ట్ 9, 10వ తేదీలలో ఒంగోలులో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో పీఎంసీ చైర్మన్ కాసా మల్లికార్జునరావు, ఫిజికల్ డైరెక్టర్లు చింతా పుల్లయ్య, జి.ఝాన్సీరాణి, తిరుమలబాయి, పి.తిరుపతిరావు, పెద్ద వెంకటేశ్వర్లు, అశోక్, పి.ఆంజనేయులు, షేక్.నాగూర్వలి, దరియావలి, వెంకటరమణ పాల్గొన్నారు. బాలికల జట్టులో.. బి.సౌజన్య(వాగ్దేవి జూనియర్ కాలేజ్, నరసరావుపేట), షేక్ నజ్మ(వాగ్దేవి జూనియర్ కాలేజ్, నరసరావుపేట), షేక్ సుహానా మస్తాని(శ్రీ చైతన్య కళాశాల), కె.వైష్ణవి(జెడ్పీ హెచ్ఎస్, ఎస్.బి.పురం), డి.రంగ మహాలక్ష్మి(జెడ్పీహెచ్ఎస్, నకరికల్లు), సీహెచ్ విజయ(జెడ్పీహెచ్ఎస్, నకరికల్లు), ఎం.స్నేహ(శ్రీచైతన్య), ఎం.దివ్యసన్నిధి(జెడ్పీహెచ్ఎస్, కావూరు), షేక్.జి.సాధిక(జెడ్పీహెచ్ఎస్, నకరికల్లు), టి.లిఖిత(జెడ్పీహెచ్ఎస్, నకరికల్లు), బి.మేఘన(ఏపీ మోడల్స్కూల్, దేచవరం), కె.బుజ్జి(ఏపీ మోడల్ కాలేజ్, దేచవరం), బి.ప్రమీల(జెడ్పీహెచ్ఎస్, కావూరు), పి.దీక్షిత(సింధూ స్కూల్), బి.స్వాతి ప్రియ(సింధూ స్కూల్) ఎంపికయ్యారు. బాలుర జట్టులో.. షేక్ ఇస్మాయిల్(ఏపీ మోడల్ స్కూల్, దేచవరం), పి.వరప్రసాద్(జెడ్పీహెచ్ఎస్, ఎస్.బి.పురం), ఎం.వి.సాయిప్రదీప్(ఆక్స్ఫర్డ్ విట్, నరసరావుపేట), కె.శ్రీనివాస్(వాగ్దేవి జూనియర్ కళాశాల, నరసరావుపేట), టి.మణిదీప్(జెడ్పీహెచ్ఎస్, ఎస్.బి.పురం), షేక్ జాన్సైదా(ఆక్స్ఫర్డ్ విట్, నరసరావుపేట), ఆర్.లక్ష్మీనారాయణ(తిరుమల ఆక్స్ఫర్డ్), జి.లక్ష్మీప్రశాంత్(జెడ్పీహెచ్ఎస్, ఎస్.బి.పురం), ఎస్.సాయితేజ(ఆక్స్ఫర్డ్ విట్), బి.మణికంఠ(జెడ్పీహెచ్ఎస్, నకరికల్లు), షేక్ నబిరసూల్(జడ్పీహెచ్ఎస్,నకరికల్లు), డి.కోటేశ్వరరావు(జెడ్పీహెచ్ఎస్, నకరికల్లు), వై.అఖిల్(జెడ్పీహెచ్ఎస్, నకరికల్లు), డి.శ్రీవెంకట అతులిత్(సింధూ స్కూల్), డి.ప్రసూన్(జెడ్పీహెచ్ఎస్, కావూరు) ఎంపికయ్యారు. ప్రతిజట్టులో అదనంగా స్టాండ్బైలో ఐదుగురు చొప్పున ఎంపిక చేశారు. -
కూటమి మోసాన్ని ఇంటింటికీ వివరించాలి
ఇంకొల్లు(చినగంజాం): చంద్రబాబు ప్రజలను హామీలతో నమ్మించి మోసం చేయడం దారుణమని వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి బండారు ప్రభాకరరావు అన్నారు. సుబ్బారెడ్డిపాలెంలో ఆదివారం మండల కన్వీనర్ చిన్ని పూర్ణారావు అధ్యక్షతన ‘బాబు ష్యూరిటీ– మోసం గ్యారెంటీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రభాకరరావు మాట్లాడుతూ ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత పాలనపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన క్యూఆర్ కోడ్ను ప్రతి వ్యక్తి చూపించి, దాని ద్వారా సమాచారాన్ని ప్రజలు తెలుసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం గ్రామంలో నాయకులతో కలిసి క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కార్మిక విభాగం అధ్యక్షుడు తన్నీరు సూరిబాబు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు నూతలపాటి బలరాం, మైనార్టీ సెల్ విభాగం అయేషా బుడే, లతీఫ్, షంషుద్దీన్, సుభాని, కోటి, శ్రీరాములు, గుంటూరు శ్రీను, కరుణాకర్, చిట్టిబాబు, జిల్లా కార్యదర్శి రామకృష్ణారెడ్డి, హరేరామిరెడ్డి, ప్రసంగి, సర్పంచ్ సురేష్ రెడ్డి, నాయకులు అంజిరెడ్డి, పోలిరెడ్డి, సురేష్, ప్రభాకరరెడ్డి, శివనాగిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, శివఫణీంద్రరెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి బండారు ప్రభాకరరావు -
జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు
జిల్లా వ్యాప్తంగా 210 మందిక్రీడాకారులు హాజరు చినగంజాం: మండలంలోని కడవకుదురు జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికల కార్యక్రమాన్ని బాపట్ల జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పీ అరుణ్కుమార్ ప్రారంభించారు. అండర్ 14, 16, 18, 20 విభాగాల్లో బాలురు, బాలికలకు సంబంధించి ఎంపికలు నిర్వహించారు. జిల్లాలోని చీరాల, బాపట్ల, కడవకుదురు, ఖాజీపాలెం, పిట్టలవానిపాలెం, చెరుకుపల్లి, చినగంజాం, వేటపాలెం, పందిళ్లపల్లి ప్రాంతాల నుంచి సుమారు 210 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. లాంగ్ జంప్, హై జంప్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో, షాట్పుట్, పరుగు, నడక వంటి పలు క్రీడలకు సంబంధించిన ఎంపికలు నిర్వహించారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ కోమట్ల స్వామిరెడ్డి, కార్యదర్శి ఎం.వెంకటరెడ్డి, అథ్లెటిక్ కోచ్ కె. అనంత కుమార్రెడ్డి, పీడీ శ్రీనివాసరెడ్డి, బి.లలిత, లక్ష్మీ నారాయణ, మారుతి, మాలతి, సాంబశివరావు, ఉదయభాస్కర్, పలువురు సీనియర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ నుంచి మొగల్ జాన్ను సస్పెండ్ చేయాలి
దొడ్లేరు(క్రోసూరు): మండలంలోని దొడ్లేరు గ్రామంలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో రైతులు నష్టపోయిన బంగారాన్ని ఇప్పించాలంటూ రైతుల పక్షాన పోరాటం చేస్తున్న కౌలు రైతు సంఘం నాయకుడు హనుమంతరావుపై దాడి చేయటాన్ని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి. కృష్ణయ్య ఖండించారు. అధికార పార్టీకి చెందిన క్రోసూరు మండల అధ్యక్షుడు మొగల్ జాన్ దాడి చేయటం చూస్తుంటే అధికార తెలుగుదేశం ప్రభుత్వం రైతుల పక్షాన పనిచేస్తుందా లేక దొంగల పక్షాన పనిచేస్తుందా అని ప్రశ్నించారు. అటువంటి వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. సీపీఎం నాయకులపై దాడులు చేస్తే వెన్నుచూపరని సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు నిరంతర పోరాటం సాగిస్తారన్నారు. ఆదివారం దొడ్లేరు గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. సీపీఎం జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్ మాట్లాడుతూ దొడ్లేరు గ్రామస్తులు అనంతవరం మీదగా క్రోసూరు వెళ్లడానికి, ఆవులువారిపాలెం మీదుగా బెల్లకొండ వెళ్లడానికి పలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గతంలో నిలిచిపోయిన రోడ్డు పనులను వెంటనే పునరుద్ధరించాలని ఆర్ అండ్ బీ అధికారులను కలిసి గ్రామ ప్రజల సమస్యలను విన్నవించామన్నారు. సాగర్ కాలవ నీళ్లు చివరి ఆయకట్టు రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కౌలు రైతులకు షరతులు లేకుండా రుణాలు కల్పించాలని, అన్నదాత సుఖీభవ నిధులు వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు వై. రాధాకృష్ణ, వై.గోపాలరావు గద్దె చలమయ్య, ఆంజనేయులు నాయక్, జి మల్లేశ్వరి, డి విమల. పి మహేష్, అచ్చంపేట క్రోసూరు మండలాల రైతు సంఘం నాయకులు, హనుమంతరావు ఆవుల ఆంజనేయులు, ఆర్. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య డిమాండ్ దొడ్లేరులో ప్రదర్శన, రాస్తారోకో -
ఉచితంగా నిర్ధారణ పరీక్షలు
జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డెంగీ నిర్ధారణ పరీక్షలు కిట్ ద్వారా ఉచితంగా నిర్వహిస్తున్నాం. కేసులు నిర్ధారణ జరిగితే సమాచారం ఇవ్వాలని, ప్లేట్లెట్స్ పేరుతో భయపెట్టవద్దని ప్రైవేటు వైద్యులందరికీ ఆదేశాలు జారీ చేశాం. ప్రతిరోజూ వైద్య సిబ్బందిని ప్రైవేటు ఆస్పత్రులకు పంపించి వివరాలు సేకరిస్తున్నాం. దోమల నివారణ చర్యల్లో భాగంగా గంబూషియా చేప పిల్లలను నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో వదిలాం. కేసులు నమోదైన ప్రాంతంలో యాంటీ లార్వా పద్ధతులు, ఫాగింగ్ చేస్తున్నాం. దోమల పెరుగుదలకు అపరిశుభ్రమైన వాతావరణమే ముఖ్య కారణం. దీన్ని దృష్టిలో పెట్టుకుని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మురుగు, వర్షపునీరు నిల్వలేకుండా చూసుకోవాలి. దోమల నుంచి రక్షణకు ఉదయం, సాయంత్రం సమయాల్లో తలుపులు, కిటికీలు మూసి ఉంచాలి. నిద్రించే సమయంలో తప్పనిసరిగా దోమ తెరలు వాడటం చాలా మంచిది. –డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి, గుంటూరు. -
మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ అన్నారు. ఏపీ ఎన్జీఓ మహిళా విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గాంధీనగర్లోని ఎన్జీఓ హోంలో చైర్పర్సన్ వి.నిర్మల కుమారి అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన విద్యాసాగర్ మాట్లాడుతూ.. ఎన్జీఓలో ఉన్న వివిధ శాఖల ఉద్యోగుల సంఘాలలో మహిళా ఉద్యోగ సంఘం కీలకపాత్ర పోషించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న మహిళా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను తన దృష్టికి తీసుకురావాలన్నారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ వినియోగంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను గుర్తించి వాటిని సవరించి, స్పష్టత కలిగించే ఉత్తర్వులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.వి.రమణ, రాష్ట్ర మహిళా విభాగం కన్వీనర్ పి.మాధవి, కోశాధికారి శివలీల, కో కన్వీనర్ వి.వి.లలితాంబ, రాష్ట్ర కార్యదర్శి బి.తులసిరత్నం, వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు. 582 అడుగులకు చేరిన సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 582.90 అడుగులకు చేరింది. ఇది 291.3795 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 511, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 29,151, ఎస్ఎల్బీసీకి 1,800 క్యూసెక్కులు విడుదల అవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 93,115 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
క్రైస్తవుల రక్షణ కోసం పటిష్ట చట్టం తేవాలి
నరసరావుపేట: భారత రాజ్యాంగం ప్రకారం లౌకిక రాజ్యాంగం మేరకు క్రైస్తవ మైనార్టీల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చట్టం రూపొందించి వారిని ఆదుకోవాలని సామాజికవేత్త, జాతీయ క్రైస్తవ, దళిత నాయకుడు డాక్టర్ గోళ్ళమూడి రాజ సుందరబాబు పేర్కొన్నారు. శనివారం స్థానిక బాపనయ్యనగర్ బేతేలు చర్చిలో యూపీఎఫ్ జిల్లా కార్యవర్గం, నేషనల్ క్రిస్టియన్ బోర్డు జిల్లా కార్యవర్గాల ఆధ్వర్యంలో పాస్టర్ల సమావేశం నిర్వహించారు. దీనిలో ముఖ్యవక్తగా గోళ్లమూడి పాల్గొని ప్రసంగిస్తూ 2023లో మణిపూర్లో 65వేల కుటుంబాలను మారణ హోమానికి గురిచేసిన సంఘటనపై క్రైస్తవులు దేశంవ్యాప్తంగా భయాందోళనకు గురయ్యారన్నారు. ఈ ఏడాది మార్చిలో రాష్ట్రంలో ప్రపంచ సువార్తికుడు పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపైనా ఆందోళనలు వ్యక్తమయ్యాయన్నారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా చర్చిలు, పాస్టర్లపై దాడులు పెరిగాయన్నారు. పాస్టర్లు స్వేచ్ఛగా సువార్త ప్రకటించుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. సమావేశానికి సత్తెనపల్లికి చెందిన షాలోమ్ చర్చి వ్యవస్థాపకులు పాస్టర్ సుధీర్ కుమార్ అధ్యక్షత వహించారు. యూపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆర్సీ రావు, మాజీ అధ్యక్షుడు జీవరత్నం, నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ జిల్లా అధ్యక్షుడు పి.సుబ్బారావు(జోసఫ్) మాట్లాడారు. వివిధ చర్చిల పాస్టర్లు పాల్గొన్నారు. పలు క్రైస్తవ సంఘాల డిమాండ్ -
రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి
గుంటూరు రూరల్: నగర శివారులోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానం నందు శనివారం జూలై నెలకు సంబంధించిన శిక్షణ, సందర్శన వర్క్షాప్ను నిర్వహించారు. కార్యక్రమానికి లాంఫాం ఏడీఆర్ దుర్గాప్రసాద్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో వివిధ డివిజన్ల ఏడీఏలు వ్యవసాయ స్థితిగతులు వివరించారు. శాస్త్రవేత్తలు పత్తి, కంది పంటల కట్ ఆఫ్ డేట్స్, వివిధ ప్రాతాలకు అనువైన వరి రకాలు, నేరుగా విత్తన వరిలో కలుపు యాజమాన్యం, జీవన ఎరువుల వినియోగం, ఎండు తెగులును తట్టుకునే కంది రకాలు, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలు వంటివి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్లో పంట వేయకుండా ఖాళీగా ఉంచి అనంతరం శనగ వేయదలచిన రైతులు స్వల్పకాలిక అపరాలు సాగు చేపట్టవచ్చని తెలిపారు. డీఏవో నాగేశ్వరరావు మాట్లాడుతూ ఏటీఎంఏ సహకారంతో వ్యవసాయశాఖ, యూనివర్సిటీ ఆధ్వర్యంలో రైతులకు ఉపయోగకరమైన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సీజన్ ప్రారంభమైన సందర్భంగా విస్తరణ కార్యక్రమాలు, క్షేత్ర సందర్శనలు చేపట్టాలన్నారు. నానో ఎరువులు వినియోగం, డ్రోన్ల ద్వారా పురుగు మందుల పిచికారి, జీవన ఎరువుల పనితీరు, మెషీన్ హార్వెస్ట్ను అనుకూలమైన వ్యవసాయ యాజమాన్య పద్ధతులు రైతులకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా డీఏవో శివకుమారి, వివిధ పంటల ప్రధాన శాస్త్రవేత్తలు, వివిధ డివిజన్ల ఏడీఏలు, కేవీకే, డాట్, ఉద్యాన, పరిశోధన శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. -
మాదక ద్రవ్యాలతో జీవితం అంధకారం
– జిల్లా ఎకై ్సజ్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు ఖాజీపాలెం(కర్లపాలెం): మత్తు పదార్థాలకు బానిసలు అయితే జీవితమే అంధకారం అవుతుందని బాపట్ల జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ ఆఫీసర్ బి.వెంకటేశ్వర్లు చెప్పారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల అనర్థాలపై పిట్టలవానిపాలెం మండలంలోని ఖాజీపాలెం కేవీఆర్, ఎంకేఆర్ కాలేజీలో శనివారం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వ్యక్తులతోపాటు సమాజంపై కూడా డ్రగ్స్ వల్ల తీవ్ర దుష్ప్రభావం ఉంటుందని చెప్పారు. ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ పి.గీతిక మాట్లాడుతూ ఆల్కహాల్, డ్రగ్స్ అనేవి చాలా ప్రమాదకరమైనవని చెప్పారు. డ్రగ్స్ను తరిమేద్దాం –ఆరోగ్యకర సమాజాన్ని నిర్మిద్దాం అని విద్యార్థులతో నినాదాలు చేయించారు. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్ అధికారులు సాదిక్, దేబోరా, సైక్రియాట్రిస్ట్ సందీప్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎరుకల జాతి జిల్లా అధ్యక్షుడి నియామకం వేమూరు: రాష్ట్ర కమిటీ ఆదేశాలు మేరకు ఎరుకల జాతి బాపట్ల జిల్లా అధ్యక్షులు బాలిక శిమన్నారాయణ ఎంపిక చేసినట్లు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.చిరంజీవి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వేమూరు మండల గ్రామానికి చెందిన శిమన్నారాయణ నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేసి, అభినందనలు తెలిపారు. హత్య కేసులో ఇద్దరు అరెస్ట్ రేపల్లె: మండలంలోని పేటేరు గ్రామంలో ఈ నెల 11వ తేదీన జరిగిన వ్యక్తి హత్య కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పట్టణ సీఐ మల్లికార్జునరావు తెలిపారు. పట్టణంలోని సర్కిల్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. పేటేరులోని చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రం వద్ద వ్యక్తి హత్యకు గురయ్యాడు. మద్యం తాగే విషయంలో గొడవలో నిజాంపట్నం మండలం కూచినపూడి గ్రామానికి చెందిన గున్నం వెంకటేశ్వర్లు, గున్నం వరదయ్యలు కలిసి శ్రీను అనే వ్యక్తిని సీసా గాజుతో హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. వరదయ్య, వెంకటేశ్వర్లు ప్రస్తుతం తెనాలిలో ఉంటుందన్నారని పేర్కొన్నారు. శ్రీను వివరాలు తెలియరావాల్సి ఉందన్నారు. నిందితులను కోర్టుకు హాజరుపరచగా, 15 రోజులు రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు. -
పెండింగ్ కేసుల్లో అరెస్ట్లు త్వరితగతిన చేయాలి
నగరంపాలెం: పెండింగ్ కేసుల్లో అరెస్ట్లను త్వరితగతిన చేయాలని జిల్లా ఎస్పీ సతీష్కుమార్ అన్నారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్లో శనివారం అర్ధ వార్షిక నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కేసుల విచారణలో పోలీసుల చర్యలు వేగవంతంగా ఉండాలని తెలిపారు. తద్వారా న్యాయస్థానాల్లో నిందితులకు శిక్షలు ఖరారవుతాయని అన్నారు. ఎప్పటికప్పుడు కేసులకు సంబంధించి సమాచారం సీసీటీఎన్ఎస్లో నమోదు చేయాలన్నారు. గడువులోగా చార్జిషీట్లను కోర్టుల్లో దాఖలు చేయాలని చెప్పారు. జిల్లాలో 170 మంది రౌడీషీటర్లపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు. వారిలో పీడీ యాక్ట్ పెట్టాల్సిన వారిని గుర్తించి చర్యలు చేపట్టాలని అన్నారు. డ్రోన్ల సాయంతో నగర, శివారు ప్రాంతాలు, శిథిలావస్థకు చేరిన భవనాలు, ముళ్లపొదలపై నిఘా ఉంచాలన్నారు. తద్వారా అసాంఘిక కార్యక్రమాలను కట్టడి చేయాలని చెప్పారు. విధుల్లో పోలీస్ అధికార, సిబ్బంది విధిగా బాడీ వార్న్ కెమెరాలు ధరించాలని స్పష్టం చేశారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ బర్కత్ అలీ మాట్లాడుతూ పోక్సో, ఇతర కేసుల్లో చార్జిషీట్లల్లో తప్పులు దొర్లకుండా దాఖలు చేయాలని అన్నారు. న్యాయ సలహాలకై తమను సంప్రదించాలని చెప్పారు. న్యాయస్థానాల్లో బాధితులకు న్యాయం అందించేందుకు పోలీస్, న్యాయశాఖ ఐక్యంగా పనిచేయాలన్నారు. నిందితులకు శిక్షల ఖరారులో ప్రముఖంగా వాదించిన ఎండీ బర్కత్అలీ, ఏపీపీ కె.రమేష్, డీసీఆర్బీ సీఐ బి.నరసింహారావు, పలు కేసుల్లో సమగ్ర దర్యాప్తు చేపట్టి సాక్ష్యాధారాలను సేకరించిన అప్పటి డీఎస్పీలు కె.రవికుమార్, వై.జెస్సీ ప్రశాంతి, సీఐలు పి.సుధాకర్రావు, నారాయణస్వామి, వీరయ్యచౌదరి, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, జి.సంధ్యారాణి, పోలీస్ సిబ్బందికి ప్రశంసా పత్రాలను జిల్లా ఎస్పీ అందించారు. సమావేశంలో జిల్లా ఏఎస్పీ ఏటీవీ రవికుమార్ (ఎల్/ఓ), జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
ఇంటర్ సంస్కరణలపై అవగాహన అవసరం
నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మీడియేట్ విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని ఈ విద్యా సంవత్సరం నుంచి సంస్కరణలను అమలు చేస్తున్నట్టు జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి ఎం.నీలావతిదేవి తెలిపారు. ఇంటర్మీడియెట్ విద్యా సంస్కరణలపై శనివారం హార్డ్ కళాశాలలో అవగాహన సమావేశం నిర్వహించారు. పల్నాడుజిల్లా పరిధిలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో నీలావతిదేవి మాట్లాడుతూ, విద్యార్థులను జాతీయస్థాయి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా తీర్చిదిద్దటమే లక్ష్యంగా సిలబస్ రూపకల్పన జరిగిందని తెలిపారు. అలాగే అన్ని రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకునేలా సిలబస్ ఉంటుందని తెలిపారు. జాతీయస్థాయిలో మేధావులు, నిపుణులు, విద్యావేత్తలు, తల్లిదండ్రుల సూచనల మేరకు సంస్కరణల అమలుకు కార్యాచరణ తీసుకవస్తున్నట్టు వివరించారు. దుర్గి ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ కె.వేణు ఇంటర్ బోర్డు ప్రవేశ పెట్టిన నూతన సిలబస్, నూతన సబ్జెక్స్ కాంబినేషన్పై అవగాహన కల్పించారు. సమావేశంలో దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ టి.జె.చంద్రశేఖర్ పాల్గొన్నారు. జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి ఎం.నీలావతిదేవి -
పేదరిక నిర్మూలనకు చేయూత
చీరాల: పీ 4 ద్వారా గుర్తించిన బంగారు కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తెచ్చేలా ఆర్థిక చేయూత ఇవ్వాలని కలెక్టర్ వెంకటమురళి అన్నారు. పీ 4, సూర్య ఘర్, చేనేతల అభివృద్ధి అంశాలపై శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పేదరికంలో జన్మించిన అంబేడ్కర్కు సహాయం అందించడంతోనే ఆయన ఉన్నత విద్యనభ్యసించి, మహనీయుడిగా ఎదిగి రాజ్యాంగాన్ని రచించారన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని మార్గదర్శిలు సహాయం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. చెరుకుపల్లిలో నిరుపేదలైన 10 యానాది కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు తెలిపారు. చీరాల నియోజకవర్గంలో 8405 బంగారు కుటుంబాలు ఉండగా 4400 కుటుంబాలకు 402 మార్గదర్శిలను అనుసంధానించామని వివరించారు. మిగిలిన వారికి మార్గదర్శిలను గుర్తించాలన్నారు. చేనేతల ఆర్థిక అభివృద్ధికి విరివిగా రుణాలు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. మానవతా దృక్పథంతో చేనేతలందరికీ ముద్ర రుణాలు మంజూరు చేయాలని తద్వారా చేనేతల జీవనోపాధి పెరుగుతుందన్నారు. అలానే పర్యావరణానికి ఎలాంటి నష్టం లేని సౌర విద్యుత్ కోసం రుణాలు ఇవ్వాలన్నారు. 1695 దరఖాస్తులు రాగా 327 యూనిట్లు మంజూరు చేయడం ఏమిటని ప్రశ్నించారు. కుప్పడం పట్టుచీరలకు జాతీయ గుర్తింపు అవార్డు లభించడంతో చేనేత రంగం మరింత అభివృద్ధి కానుందన్నారు. ఈ గుర్తింపును చేనేతలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కుప్పడం చీరాల ప్రత్యేకతను ప్రపంచానికి చాటిచెప్పేందుకు బాపట్ల, చీరాల, వాడరేవు, సూర్యలంక బీచ్ల వద్ద ఓడీపీఓ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. స్కానర్ ఏర్పాటు ద్వారా చీరాల కుప్పడం చీరల చరిత్ర తెలుసుకునేలా ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తామన్నారు. చీరాల మండలం దేవాంగపురిలో 26 ఎకరాల విస్తీర్ణంలోని హ్యాండ్లూమ్ పార్కును హ్యాండ్లూమ్ ఎంఎస్ఎంఏగా ప్రభుత్వం అభివృద్ధి చేయడానికి అంగీకరించిందని తెలిపారు. జిల్లా ప్రజలకు గర్వకారణం చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య మాట్లాడుతూ కుప్పడం చీరలకు జాతీయ అవార్డు రావడం జిల్లా ప్రజలకు గర్వకారణంగా ఉందన్నారు. అలాంటి చేనేతల వృత్తికి అవసరమైన రుణాలు విరివిగా అందించాలన్నారు. సూర్యఘర్ పథకం కింద ఆగస్టు 15లోగా వెయ్యి గృహాలకు సౌర విద్యుత్ అందించాలన్నారు. అనంతరం స్థానిక చేనేత కళాకారులను సత్కరించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు అందుకున్న కలెక్టర్ను చీరాల ఎమ్మెల్యే, చేనేత కార్మికులు కలిసి సత్కరించారు. మెప్మా పరిధిలోని 30 డ్వాక్రా సంఘాలకు రూ.6 కోట్లు రుణాల, వెలుగులోని 40 డ్వాక్రా సంఘాలకు రూ.7 కోట్లను చెక్కుల రూపంలో కలెక్టర్ పంపిణీ చేశారు. ముందుగా చేనేతరంగం అభివృద్ధికి ఎంతో కృషి చేసిన ప్రగడ కోటయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమావేశంలో చీరాల ఆర్డీఓ టి.చంద్రశేఖర్నాయుడు, మున్సిపల్ చైర్మన్ ఎం.సాంబశివరావు, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, సీపీఓ షాలెంరాజు, చేనేత జౌళి శాఖ ఏడీ రఘునంద, పలు శాఖ అధికారులు పాల్గొన్నారు. కుప్పడం పట్టుచీరకు దక్కిన అవార్డు చేనేత కళాకారులకు అంకితం చీరాల, బాపట్ల తీర ప్రాంతంలో ఓడీపీఓ స్టాల్స్ ఏర్పాటు హ్యాండ్లూమ్ పార్కుతో చేనేతలకు ప్రోత్సాహం కలెక్టర్ వెంకటమురళి -
మిషన్ గ్రీన్ గుంటూరు లోగో డిజైన్లకు ఆహ్వానం
నెహ్రూనగర్: స్వచ్ఛ గుంటూరు – క్లీన్ గుంటూరు కాన్సెప్ట్లో మిషన్ గ్రీన్ గుంటూరు నినాదంతో లోగో కోసం డిజైన్లను ఆహ్వానిస్తున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బెస్ట్ డిజైన్గా ఎంపికై న డిజైనర్కు నగదు బహుమతి, ప్రశంసా పత్రాన్ని అందిస్తామని చెప్పారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఈ సీజన్లో దశలవారీగా 5 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యంతో వార్డులవారీగా కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పర్యావరణహిత గుంటూరే లక్ష్యంగా పచ్చదనం పెంపు, పారిశుద్ధ్య పనులలో మెరుగుదల, వ్యర్థాలను తడిపొడిగా వేరు చేసి తీసుకోవడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం, విక్రయం నిషేధం, నగరంలోకి వచ్చే ప్రధాన మార్గాలు, జంక్షన్లు, ఐలాండ్స్, పార్క్లు, డివైడర్లపై పచ్చదనం పెంపు వంటి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఆగస్ట్ ఒకటవ తేదీ నుంచి ప్రత్యేక డ్రైవ్ మోడ్లో క్షేత్రస్థాయి నుంచి అమలుకు కృషి చేస్తామని తెలిపారు. అందులో భాగంగా చేపట్టిన మిషన్ గ్రీన్ గుంటూరుని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా డిజైన్లు ఆహ్వానిస్తున్నామన్నారు. సెల్ఫ్ డిక్లరేషన్, పేరు, ఫోన్ నంబర్ తదితర వివరాలతో ఆగస్ట్ 15వ తేదీలోపు నగరపాలక సంస్థ వాట్సాప్ నంబర్ 98499 08391కు పంపవచ్చని తెలిపారు. ఆగస్ట్ 15 అనంతరం ఉత్తమ డిజైన్ ఎంపిక ఉంటుందన్నారు. ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ గుంటూరు ఎడ్యుకేషన్: బదిలీలు జరిగి రెండు నెలలు కావస్తున్నా ఉపాధ్యాయులకు ఇప్పటి వరకు వేతనాలు చెల్లించకపోవడం సరికాదని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖరరావు, ఎం.కళాధర్లు అన్నారు. వేతన చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ శనివారం డీఈవో కార్యాలయం ఎదుట యూటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. నాయకులు మాట్లాడుతూ డీఏలు, పీఆర్సీపై ప్రభుత్వం నోరు మెదపటం లేదన్నారు. రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల జీతాల విషయంలో తాత్సారం తగదన్నారు. ప్రభుత్వం స్పందించి జీతాలు చెల్లించాలని పేర్కొన్నారు. రోజూ రకరకాల అప్లోడ్ పనులతో టీచర్లను బోధనకు దూరం చేస్తున్నారని, ఇది పరోక్షంగా ప్రభుత్వ విద్యను కాలరాయడమే అన్నారు. అనంతరం డీవైఈవో ఏసురత్నంకు వినతి పత్రం సమర్పించారు. నిరసన ప్రదర్శనలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు సీహెచ్ ఆదినారాయణ, జి.వెంకటేశ్వరరావు, ఎం.గోవిందు, బి.ప్రసాదు, ఆడిట్ కమిటీ సభ్యులు ఎం.కోటిరెడ్డి, కె.ప్రేమ్ కుమార్, గుంటూరు నగర అధ్యక్షుడు ఎం. చిన్నయ్య, మండల శాఖ నాయకులతోపాటు బదిలీ అయిన ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
చోరీ కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్
కర్లపాలెం: మండల పరిధిలోని దమ్మనవారి పాలెంలో బంగారు, వెండి ఆభరణాల చోరీ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 141 గ్రాముల బంగారం, అర కేజీ వెండి, రూ.5 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. బాపట్ల రూరల్ సీఐ హరికృష్ణ, కర్లపాలెం ఎస్ఐ రవీంద్ర చాకచక్యంగా దర్యాప్తు చేసి వారిని అరెస్ట్ చేశారని బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు. శనివారం కర్లపాలెం పోలీస్స్టేషన్లో డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ.. దమ్మనవారిపాలెం గ్రామానికి చెందిన పిట్టు పెద వెంకటరెడ్డి కుటుంబం ఈ నెల 17వ తేదీన ఇంటికి తాళాలు వేసి ఊరికి వెళ్లినట్లు తెలిపారు. 21వ తేదీన వారి ఇంటి వెనుక తలుపులు తెరిచి ఉన్నట్లు ఆయన తమ్ముడు గమనించి సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. 22వ తేదీన వెంకటరెడ్డి వచ్చి చూడగా బీరువాలోని బంగారు, వెండి ఆభరణాలు, నగదు చోరీ అయినట్లు గుర్తించారన్నారు. పాత నేరస్తులే చోరీకి పాల్పడ్డారని పోలీసులు తెలుసుకున్నారని చెప్పారు. నిందితులు బాపట్ల మార్కెట్ యార్డ్ సమీపంలో సంచరిస్తుండగా అరెస్ట్ చేశారని తెలిపారు. రాజమహేంద్రవరం పరిధి కొల్లమూరు గ్రామానికి చెందిన జనదివ్యశేఖర్, పురంపుల్లతి వీధికి చెందిన లంక హర్షవర్ధన్, బాపట్ల మండలం మరుప్రోలువారిపాలెంకు చెందిన మరుప్రోలు నాగేంద్రరెడ్డిలను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. వీరు పాత నేరస్తులని, జైలులో పరిచయాల మేరకు బయటకు వచ్చిన తరువాత చోరీలు చేస్తున్నట్లు చెప్పారు. చోరీ సొత్తు పూర్తిగా రికవరీ చేసినట్లు వివరించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. కేసును ఛేదించిన అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ అభినందించారని వివరించారు. వారికి వ్యక్తిగత రివార్డులు అందిస్తామని తెలిపారు. 141 గ్రాముల బంగారు, అర కేజీ వెండి నగలు స్వాధీనం -
కొరవడిన సంతోషం
సంక్షేమంలోసంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు సమస్యల స్వాగతంరాష్ట్రంలో పేదరికం ఉండకూడదు..అందుకోసమే పీ–4 తీసుకొచ్చామని కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉండే వసతి గృహాల గురించి పట్టించుకోవడం లేదు. కప్పుకునేందుకు దుప్పట్లు లేక చలికి గజగజలాడుతున్నారు. మరుగుదొడ్లకు తలుపులు లేక కూర్చోలేక అవస్థలు పడుతున్నారు. కడుపునిండా తిండి తిందామంటే కంచంలో భోజనం ఉండదు. చివరకు తాగేందుకు నీరు లేక అవస్థలు పడుతున్నారు. ఏళ్ల కిందట నిర్మించిన హాస్టల్ భవనాలు శిథిలావస్థకు చేరాయి. నెలలు తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో వార్డెన్లు అప్పుల పాలవుతున్నారు. ‘సాక్షి’ బృందం శనివారం జిల్లాలోని పలు హాస్టల్స్ను విజిట్ చేయగా పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయి. బాపట్లటౌన్: బాపట్ల జిల్లాలో ఎస్సీ హాస్టల్స్ మొత్తం 27 ఉండాల్సి ఉండగా వాటిల్లో విద్యార్థులు లేక రెండు వసతి గృహాలు మూతపడ్డాయి. ప్రస్తుతం ఉన్న 25 వసతిగృహాల్లో 1475 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. జిల్లాలో ఎస్టీ ఇంటిగ్రేటెడ్ వసతిగృహం 01, ఆశ్రమ పాఠశాల 01, గురుకుల పాఠశాలలు 06, కళాశాల వసతిగృహాలు 2 చొప్పున మొత్తం 10 వసతి గృహాలు ఉన్నాయి. వాటిల్లో మొత్తం 850 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో మొత్తం 42 వసతి గృహాలు ఉండగా వాటిల్లో 15 వసతి గృహాల్లో విద్యార్థులు లేక మూతపడ్డాయి. ప్రస్తుతం 27 వసతి గృహాల్లో 915 మంది విద్యార్థులు విధ్యనభ్యసిస్తున్నారు. వాటిల్లో 8 కళాశాల వసతిగృహాలు, 19 పాఠశాలల వసతిగృహాలు ఉన్నాయి. పత్తాలేని డీపీసీ ప్రస్తుతం మార్కెట్లో పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా ఏడాదికి ఒకసారి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన డీపీసీ (డిస్ట్రిక్ పర్చేజ్ కమిటీ) సమావేశం జరగాలి. ఈ సమావేశంలో ప్రస్తుతం మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకొని వాటి ఆధారంగా వసతిగృహాలకు సరఫరా చేసే నిత్యావసర వస్తువులకు ధరలను నిర్ణయించాల్సి ఉంటుంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్కసారైనా డీపీసీ సమావేశం నిర్వహించిన దాఖలాలు లేవు.గత ప్రభుత్వంలో ఉన్న పాతధరల ప్రకారమే బిల్లులు చెల్లిస్తున్నారు. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో చాలీచాలనీ బిల్లులతో వార్డెన్లు మెనూను సక్రమంగా పాటించడకుండా వారికిష్టమొచ్చినట్లు వంటలు చేస్తున్నారు. దీంతో విద్యార్థులు వసతిగృహాల్లోని భోజనం తినటం మానేసి వారే భోజనం తయారుచేసుకొని తినే దుర్భర పరిస్థితి జిల్లాలో నెలకొంది. చాలాచోట్ల పిల్లలు సాయంత్రం సమయంలో బయటనుంచి భోజనం, కూరలు తెచ్చుకొని తింటుంటుంగా మరికొన్ని చోట్ల సమీపంలోని అన్న క్యాంటీన్, భోజనం హోటళ్లకు వెళ్లి కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి దాపరించింది. సమస్యలు కేరాఫ్... బాపట్ల గిరిజన కళాశాల వసతిగృహం పట్టణంలోని గిరిజన కళాశాల వసతి గృహం సమస్యలకు కేరాఫ్గా మారింది. కళాశాలలో 33 మంది విద్యార్థులు ఉన్నట్లు రికార్డుల్లో రాసుకున్నారు. వాస్తవంగా అక్కడ 12 మంది మాత్రమే ఉన్నారు. వసతిగృహంలోని కిటికీలకు ఒక్కదానికి కూడా మెస్లు లేవు. దీంతో దోమలు విద్యార్థుల కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. వాచ్మెన్, స్వీపర్, వంట మనిషి ఒకే వ్యక్తి వ్యవహరిస్తున్నారు. విద్యార్థులు పడుకునే గదిని కనీసం ఊడిచే నాథుడులేరు. అపరిశుభ్ర వాతావరణంలోనే విద్యార్థులు పడుకుంటున్నారు. వంటగదిలో చెత్త పేరుకుపోయింది. గ్రైండర్ నెలల తరబడి కడిగిన దాఖలాలు లేవు. దుర్ఘంధం వెదజల్లుతుంది. వసతిగృహం చుట్టూ ముళ్ల చెట్లు పెరిగి విషసర్పాలకు అవాస కేంద్రంగా మారింది. మురుగునీరు వసతిగృహం చుట్టూ నిలిచి దోమలకు అవాస కేంద్రాలుగా మారాయి. వసతిగృహంలో మొత్తం 10 మరుగుదొడ్లు ఉండగా వాటిల్లో ఒక్కటి కూడా సక్రమంగా పనిచేయటం లేదు. దీంతో విద్యార్థులు కిలోమీటర్ల మేర సైకిళ్లపై బహిర్బూమికి వెళ్తున్నారు. వంట ఉచికరంగా లేక విద్యార్థులు ప్రతి రోజూ ప్రైవేట్ హోటల్స్, వంట వచ్చిన విద్యార్థులు ఇక్కడే వంటచేసుకుంటూ పొట్ట నింపుకుంటున్నారు. స్నానాల గదిలో ఒక్కగదికి కూడా డోర్ సక్రమంగా లేదు.అద్దంకి : గురుకుల, సాంఘిక సంక్షేమ, కేజీబీవీ, వసతి గృహాల్లో విద్యార్థులు అరకొర వసతులతో కాలం వెళ్లదీస్తున్నారు. వసతి గృహాల్లో సరైన వసతులు లేకవంటూ ప్రభుత్వానికి, ఆ శాఖల అధికారులకు హైకోర్టు మొట్టికాయలు వేసిన నేపథ్యంలో శనివారం ‘సాక్షి’ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని వసతి గృహాల్లో విజిట్ చేసింది. నియోజకవర్గంలోని బల్లికురవ, సంతమాగులూరుగలోని ఏల్చూరు గ్రామాల్లో కేజీబీవీలున్నాయి. వాటిలో బల్లికురవ కేజీబీవీలో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకూ చదివే 270 మంది విద్యార్థులున్నారు. బెడ్లు, డార్మిటరీలు లేవు. ఏల్చూరు కేజీబీవీని గదుల కొరత వేధిస్తోంది. పడుకునేందుకు, చదువుకునేందుకు ఒకే గుదులు వినియోగించుకోవాల్సి వస్తుంది. కేజీబీవీలకు మెయిటెనెంన్స్ నిధులు ఇవ్వడం లేదు. దాంతో ఏదైనా రిపేర్ వస్తే ప్రిన్సిపాల్స్ సొంత నిధులతో చేయించుకునే దుస్థితి ఉంది. అద్దంకి పట్టణంలో రెండు ఎస్సీ, ఒకటి పాలిటెక్నిక్ విద్యార్థుల కోసం ఒక హాస్టల్ ఉంది. ఇందులోనూ కిటికీలకు డోర్లు లేవు. కళాశాల ఇచ్చిన మంచాలు ఉన్నా, బెడ్లు లేవు. మరుగుదొడ్లు మరమ్మతుల్లో ఉన్నందున కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకే వెళ్తున్నారు. ఒక ఎస్సీ బాలుర వసతి గృహానికి సొంత భవనం లేదు. కేఆర్కే మినహా మిగిలిన అన్ని వసతి గృహాల్లో టాయిలెట్స్ సరిపడా ఉన్నాయి. జె. పంగులూరు మండలంలోని ముప్పవరంలో రెండు వసతి గృహాలున్నాయి. ఒకటి అద్దె భవనంలో నడుస్తోంది. ఇక్కడ వసతులు బాగానే ఉన్నా, బెడ్లు మంచాలు లేవు. వసతి గృహాల్లో పిల్లలకు సరిపడా దుప్పట్లు ఇవ్వలేదు. కొరిశపాడు మండలంలోని మేదరమెట్లలో ఒక వసతి గృహం ఉంది. ఇక్కడ పిల్లలకు ఒకే దుప్పటి ఇచ్చారు. బెడ్లు, మంచాలు లేవు. మరమ్మతులకు నోచని వాటర్ ప్లాంట్ రేపల్లె నియోజకవర్గంలోని గురుకులంలో వాటర్ప్లాంట్ మరమ్మతులకు గురికావడంతో తాగునీటి కోసం విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెరుకుపల్లి మండలం కావూరు, నిజాంపట్నం మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు నేలపై కూర్చొని భోజనం చేస్తున్నారు. రేపల్లె పట్టణంలోని ఎస్సీ బాలుర వసతి గృహం భవనం మరమ్మతులకు గురైంది. శ్లాబ్ పెచ్చులూడి చువ్వలు బయటపడ్డాయి. విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. అధ్వానంగా మరుగుదొడ్లు వేమూరు నియోజకవర్గంలోని వేమూరు, కొల్లూరు, వెల్లటూరు, భట్టిప్రోలు, అమర్తలూరు, చుండూరు మండలాల్లో గతంలో ప్రభుత్వ వసతిగృహాలు ఉండేవి. వాటిల్లో కొల్లూరు, వెల్లటూరు హాస్టల్ తొలగించారు. వేమూరు బీసీ బాలికల హాస్టల్, భట్టిప్రోలు బీసీ హాస్టల్లో చదువుతున్న పిల్లల గురించి పట్టించుకోవడం లేదు. వర్షాకాలంలో పిల్లలు పడుకునేందుకు సౌకర్యాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. వసతిగృహానేల మీదేనే నిద్ర ఖర్చులు కొండంత...ఇచ్చేది గోరంత ఖర్చులు రోజురోజుకు పెరిగిపోతున్నా వసతి గృహాల్లోని వార్డెన్లకు మాత్రం గతంలో వలే పాత రేట్లు ప్రకారం బిల్లులు నమోదు చేస్తున్నారు. ఇచ్చేది అరకొర అయినా సకాలంలో అందించకపోవడంతో వార్డెన్లు అప్పుల పాలవుతున్నారు. ఒక్కొ విద్యార్థికి సగటున రోజుకు రూ.46 నుంచి రూ.50లోపు చెల్లిస్తున్నారు. వీటిల్లో ప్రతి రోజూ ఒక్కో విద్యార్థికి పాలు, మజ్జిగ, టిఫిన్ కింద ఇడ్లీ, చట్నీ, పల్లీ చిక్కీ, సాయంత్రం స్నాక్స్గా బఠానీ గుగ్గిళ్లు, రాగి జావ, రాత్రి భోజనంలో కూర, సాంబారు, వారంలో మూడురోజులపాటు చికెన్, రోజుకోక రకం పండ్లు అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.80 నుంచి రూ.100 ఖర్చు అవుతుంది. ప్రభుత్వం చాలీచాలనీ బిల్లులు చెల్లించడంతో వార్డెన్లు అవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 62 వసతిగృహాలు హాస్టల్స్లో 3240 మంది విద్యార్థులకు వసతి అప్పుల ఊబిలో వార్డెన్లు వసతిగృహాల్లో విద్యార్థులే వంట మాస్టర్లు, స్వీపర్లు కనీస వసతులు కరువు అస్తవ్యస్తంగా మరుగుదొడ్లు మల,మూత్రాలకు బహిర్భూమికి వెళ్తున్న విద్యార్థులు -
విలువైన కార్డులు అప్పగింత
బల్లికురవ: విలువైన ఏటీఎం కార్డులు, చెక్ బుక్కులు, డిజిటల్ ప్యానెళ్లు పొగొట్టుకున్న వ్యక్తి వివరాలు తెలుసుకుని అప్పగించడంతో శనివారం ఎస్సై వై. నాగరాజు అభినందించారు. పల్నాడు జిల్లా పిట్టంబండ గ్రామానికి చెందిన ఆర్. బాలాజీసింగ్ వృత్తి రీత్యా డిజిటల్ పేమెంట్ ప్యానెళ్ల వ్యాపారంచేస్తున్నాడు. పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాలో బైక్పై తిరుగుతుంటాడు. విధి నిర్వహణలో భాగంగా శనివారం మేదరమెట్ల – నార్కెట్పల్లి నామ్ రహదారిలోని కొప్పరపాడు గ్రామం మీదుగా వరపల్ల వెళుతుండగా మార్గ మధ్యంలో విలువైన బుక్స్, కార్డులు, ప్యానెళ్లు, పాస్బుక్లు, చెక్బుక్కుల బ్యాగ్ బైకుపై నుంచి కిందపడింది. కొప్పరపాడు గ్రామానికి చెందిన దివ్యాంగుల సంఘ అధ్యక్షుడు దమ్ము అంజయ్య బైక్పై బల్లికురవ వెళుతూ బ్యాగ్ గమనించి.. దానిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఎస్సైకి అప్పగించారు. వివరాలు సేకరించి.. బాధితుడిని పిలిపించి అప్పగించారు. ఎంతో విలువైన తన బ్యాగ్ను అప్పగింటం పట్ల బాలాజీ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. పిచ్చికుక్క దాడిలో వ్యక్తి మృతి మార్టూరు: పిచ్చికుక్క దాడిలో గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మండలంలోని కోలల పూడి గ్రామంలో శనివారం జరిగింది. బాధిత కుటుంబ వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కోలల పూడి గ్రామంలో ఈనెల మొదటి వారంలో ఓ పిచ్చికుక్క 12 మంది వ్యక్తులపై విచక్షణారహితంగా దాడి చేసింది. దాడిలో గాయపడిన వారిలో కొందరు మార్టూరు, మరికొందరు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. వారిలో స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన గాలి యేసులు (65) చికిత్స చేయించుకున్నప్పటికీ గత నాలుగు రోజులుగా పరిస్థితి విషమించడంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న యేసులు శుక్రవారం రాత్రి మృతి చెందగా.. శనివారం మృతదేహాన్ని కొలలపూడి తరలించారు. -
కారు కాలువలో పడి విద్యార్థి మృతి
అమర్తలూరు (వేమూరు) : కారు అదుపు తప్పి కాలువలో పడిన ఘటనలో జూపూడి పవన్ (18) అనే విద్యార్థి మృతి చెందాడు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఎస్ఐ రవితేజ కథనం మేరకు.. విజయవాడలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదువుతున్న ఏడుగురు విద్యార్థులు శనివారం అద్దెకు తీసుకున్న కారులో ఒంగోలులోని జూపూడి పవన్ ఇంటికి వెళ్లారు. తిరిగి బాపట్ల బీచ్కు వెళ్లి, విజయవాడ బయలు దేరారు. ఈ క్రమంలో అమర్తలూరు మండలం ప్యాపర్రు, యలవర్రు రోడ్డు వద్దకు వచ్చేసరికి కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి కాలువలో పడి పోయింది. కారులో ఉన్న విద్యార్థులు అద్దాలు పగలు కొట్టుకొని బయటకు వచ్చారు. అప్పటికి పవన్ మృతి చెందాడు. మిగిలిన ఆరుగురికి గాయాలయ్యాయి. వీరంతా విజయవాడ నగరానికి చెందిన విద్యార్థులని ఎస్ఐ తెలిపారు. పవన్ తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. అలరించిన గరికపాటి ప్రవచనాలు నరసరావుపేట: స్థానిక పాతూరులోని శ్రీ పట్టాభి రామస్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం ఆధ్యాత్మిక తరంగణి, శ్రీ నాగసరపు సుబ్బరాయ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన వేదాంత భేరీ ప్రవచనానికి మహా సహస్రావధాని, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ గరికపాటి నరసింహారావు హాజరై ప్రవచనాలు వినిపించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, ట్రస్టు చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్తాలు డాక్టర్ గరికపాటిని ఘనంగా సన్మానించారు. పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పత్తి పంటకు బీమా గడువు పొడిగింపు
నరసరావుపేట రూరల్: వాతావరణ ఆధారిత పంటల బీమా పథకంలో పత్తి పంటకు బీమా గడువు ఈనెల 31వ తేదీ వరకు పొడిగించినట్టు జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు శనివారం తెలిపారు. భారత ప్రభుత్వ రంగ బీమా సంస్థ అగ్రికల్చర్ ఇన్యూరెన్స్ కంపెనీ ద్వారా జిల్లాలో పంటల బీమా అమలులో ఉందని తెలిపారు. రైతులు పత్తి పంటపై అమలవుతున్న బీమా పథకంలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. రుణాలు తీసుకున్న రైతులు బ్యాంకుల ద్వారా నమోదు చేయబడతారని తెలిపారు. రుణాలు తీసుకోని రైతులు మీ సేవా కేంద్రాలు, ఇన్సూరెన్స్ ఏజెంట్లు , క్రాప్ ఇన్సూరెన్స్ యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. గ్రామ సచివాలయంలో వీఏఏ, వీహెచ్ఏ, వీఎస్ఏలను సంప్రదించి నమోదు చేసుకోవాలని తెలిపారు. వాతావరణ సంబంధిత ప్రమాదాల సమయంలో పంటలకు కలిగే నష్టాన్ని బీమా ద్వారా పొందే అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని కోరారు. ప్రత్యేక పీజీఆర్ఎస్లో 38 అర్జీలు స్వీకరణ నరసరావుపేట: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీల కోసం శనివారం కలెక్టర్ పి.అరుణ్బాబు అధ్యక్షతన ప్రత్యేక ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి 38 అర్జీలు స్వీకరించారు. వీటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ సంబంధిత శాఖలకు ఆయా ఫిర్యాదులను అందజేశారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, డీఆర్ఓ ఏకా మురళి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. రూ.2.75 కోట్ల విలువైన 20 పనులకు పౌడా ఆమోదం నరసరావుపేట: జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రూ.2.75 కోట్లతో చేసే 20 పనులకు పల్నాడు జిల్లా అర్బన్ డెవలప్మెంట్ కమిటీ (పౌడా) ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. శనివారం కలెక్టరేట్లో పౌడా వైస్ చైర్మన్, జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే అధ్యక్షతన అభివృద్ధి, ప్రణాళికా కార్యకలాపాలపై అథారిటీ నాల్గవ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరు అజెండాలపై చర్చించి ఏకగ్రీవంగా ఆమోదం తెలియచేశారు. దీనిలో అథారిటీ సభ్యులు డీటీసీపీ అసిస్టెంట్ డైరెక్టర్ బి.సునీత, రోడ్లు, భవనాల శాఖ ఇంజినీర్ టి.రవీంద్రబాబు, ఏపీ సీపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జి.రాంబాబు, జిల్లా పర్యాటక అధికారి నాయుడమ్మ, కాలుష్య నియంత్రణ మండలి విభాగ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా పారిశ్రామిక కేంద్ర కార్యదర్శి ఎం.నవీన్కుమార్ పాల్గొన్నారు. 581 అడుగులకు చేరిన సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్:నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 581.30 అడుగులకు చే రింది. ఇది 286.7635 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 511, ఎస్ఎల్బీసీకి 1,800 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 1,20,339 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
బర్లీ రైతుకు బాబు వెన్నుపోటు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: రైతుల అనుమానమే నిజమైంది. రైతులు పండించిన మొత్తం పొగాకు కొనుగోలు చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మాటమార్చి ఒక్కొక్క రైతు నుంచి 20 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని మంత్రివర్గం తీర్మానం చేయడంపై పొగాకు రైతులు మండిపడుతున్నారు. ఇందులో టీడీపీకి చెందిన రైతులు కూడా ఉండడం గమనార్హం. మాట మార్చిన ప్రభుత్వం రైతులు పండించిన మొత్తం బ్లాక్ బర్లీ పొగాకు కొంటామని చెప్పిన కూటమి ప్రభుత్వం మాటమార్చింది. ఇప్పడు ఒక్కొక్క రైతు నుంచి 20 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానించి అన్నదాతలను నిలువునా ముంచింది. వాస్తవానికి బ్లాక్ బర్లీ సాగుచేసిన రైతుల్లో 95 శాతం మంది 4 ఎకరాల నుంచి 40 ఎకరాల వరకూ పొగాకు పంటను సాగుచేశారు. మూడు ఎకరాలలోపు పొగాకు సాగుచేసిన వారు నామమాత్రంగానే ఉన్నారు. ఈ ఏడాది ఎకరానికి 17 క్వింటాళ్ల దిగుబడి వచ్చినట్లు జిల్లా వ్యవసాయశాఖ అంచనా కట్టింది. ఈ లెక్కన 1.50 ఎకరాలలోపు సాగుతోనే 20 క్వింటాళ్ల బ్లాక్ బర్లీ దిగుబడి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఒక్కొక్క రైతు నుంచి 1.50 ఎకరాలలో పండిన పొగాకునే కొంటానని చెప్పింది. ఒకవైపు టొబాకో కంపెనీలు మొక్కుబడిగా కొనుగోలు చేసి చేతులు దులుపుకుంటుండడంతో రైతులు పండించిన మిగిలిన పొగాకును ఎవరు కొనుగోలు చేస్తారో ప్రభుత్వం చెప్పలేదు. రైతులను నిలువునా ముంచిన బాబు మంత్రివర్గ నిర్ణయం చూస్తే బ్లాక్ బర్లీ రైతులను నిలువునా వంచించినట్లే కనపడుతోంది. ఆది నుంచి రైతులకు చంద్రబాబు ప్రభుత్వం మాటపై అపనమ్మకమే. ప్రతిపక్షనేత వైఎస్.జగన్మోహన్రెడ్డి ఒత్తిళ్లకు తలొగ్గి మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వం ఆలస్యంగానైనా 12 కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనుగోళ్లు మొదలు పెట్టింది. కొనుగోళ్లలో వివక్ష కనిపించినా ఆలస్యంగానైనా అందరి పొగాకు కొంటారని రైతులు భావించారు. చివరకొచ్చే సరికి ప్రభుత్వం ఏదొక సాకుచెప్పి తప్పించుకుంటుందని మిగిలిన రైతులతోపాటు రైతు సంఘాలు అనుమానిస్తూనే ఉన్నాయి. ఇప్పు డు వారు అనుమానించినట్లే జరిగింది. ఒక్కొక్క రైతు నుంచి 20 క్వింటాళ్ల కొనుగోలు మెలికతో ప్రభుత్వం పొగాకు కొనుగోళ్ల నుంచి తప్పించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి తమ లక్ష్యం 14 వేల టన్నులేనని మార్క్ఫెడ్ చెబుతోంది. ఇప్పటికే దాదాపు 4 వేల టన్నులు కొన్నామని, మరో 10వేల టన్నులు మాత్రమే కొంటామ ని చెప్పి చేతులు దులుపుకుంది. ఈ లెక్కన ప్రభుత్వం ప్రకటనకు చేతలకు పొంతన లేదని స్పష్టమవుతోంది. రైతుల ఖాతాల్లో జమ కాని డబ్బు వాస్తవానికి ఈ ఏడాది జిల్లాలో 53,067 ఎకరాల్లో రైతులు బ్లాక్ బర్లీ సాగు చేశారు. ఒక్క పర్చూరు నియోజకవర్గంలోనే 52,989 ఎకరాల్లో బర్లీ సాగైంది. అద్దంకి నియోజకవర్గంలో 78 ఎకరాలలో మాత్రమే పొగాకు సాగుచేశారు. వ్యవసాయశాఖ అంచనా ప్రకారం ఎకరాకు 17 క్వింటాళ్ల దిగుబడి అనుకుంటే మొత్తం 90 వేల టన్నుల దిగుబడి వచ్చింది. రైతులతో బ్లాక్ బర్లీ సాగుచేయించిన టొబాకో కంపెనీలు 30 వేల టన్నులలోపే కొనుగోళ్లు చేసి చేతులు దులుపుకున్నాయి. రైతుల వద్ద ఇంకా 50 వేల టన్నులకు పైగా పొగాకు ఉన్నట్లు తెలుస్తోంది. మార్క్ఫెడ్ 40 రోజులలో 3,700 టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది. అదికూడా పచ్చపార్టీ నేతలు చెప్పిన రైతుల పొగాకు మాత్రమే కొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ నిర్ణయంపై పొగాకు రైతుల ఆగ్రహం పండించిన పంట మొత్తం కొంటామన్న ప్రభుత్వం నేడు ఒక్కో రైతు నుంచి 20 క్వింటాళ్లే కొంటామని మెలిక జిల్లాలో 53,067 ఎకరాల్లో బర్లీ సాగు అధికారిక అంచనాల ప్రకారం 90 వేల టన్నుల దిగుబడి ఇప్పటివరకూ మార్క్ఫెడ్ ద్వారా కొన్నది 3,700 టన్నులే మరో 10 వేల టన్నులే లక్ష్యం అంటున్న మార్క్ఫెడ్ మిగిలిన పొగాకు ఎవరు కొంటారు? ఎమ్మెల్యే ఏలూరి ఏమంటారో? రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మొదలు కొని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వరకూ రైతు పండించిన ప్రతి పొగాకు మట్ట కొంటామని, ఆందోళన చెందాల్సిన అవసరంలేదని బల్లగుద్ది చెప్పారు. ఒక్కొక్క రైతు నుంచి 20 క్వింటాళ్లు మాత్రమే కొంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం తేల్చి చెప్పడంతో ఇన్నాళ్లూ పొగాకు మొత్తం ప్రభుత్వం కొంటుందని బాకా ఊదిన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతోపాటు ఆయన అనుచరగణం గొంతులో పచ్చివెళక్కాయ పడింది. ఇక నుంచి రైతులకు ఏం చెప్పాలో అర్థంకాక ఏలూరి తలపట్టుకున్నట్లు ఆయన అనుచరులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం సొంత పార్టీ రైతులకూ ఆగ్రహం తెప్పిస్తోంది. -
కొత్తపేటకు ఎన్నికల కళ
వేటపాలెం: ఎట్టకేలకు నాలుగేళ్ల నిరీక్షణ తరువాత కొత్తపేట పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటర్ల జాబితాలు, పోలింగ్ బూత్లతో సహా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల తేదీ ఖరారు చేయాల్సి ఉంది. కొత్తపేటలో 11,500 మంది ఓటర్లు, 16 వార్డులు, 32 పోలింగ్ బూత్లున్నాయి. 2020లో ఆధిపత్యం కోసం తెలుగుదేశం నాయకులు చేసిన ఘనకార్యం వల్ల చీరాల నియోజకవర్గంలో 23 గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ ఎన్నికల నిలిచి పోయాయి. వేటపాలెం మండల పరిధిలో మొత్తం తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉండగా వేటపాలెం, దేశాయిపేట, కొత్తపేట వంటి మేజర్ పంచాయతీలు. వీటి పరిధిలో 16 శివారు గ్రామాలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2021 ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వహించారు. అయితే చీరాల రూరల్, వేటపాలెం మండలాల పరిధిలోని 23 గ్రామ పంచాయతీలు ఐదేళ్లుగా పంచాయతీ ఎన్నికలకు నోచుకోలేదు. నాడు వేటపాలెం పరిధిలోని రామన్నపేట పంచాయతీకీ మాత్రమే ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలోనే కొనసాగుతున్నాయి. గ్రామ పంచాయతీల పునర్విభజన ... చీరాల రూరల్ మండల పరిధిలోని గ్రామ పంచాయతీల పునర్విభజన జరిగాయి. కొత్తగా రెండు గ్రామ పంచాయతీలకు ప్రదిపాధనలు పంపారు. అదేవిధంగా వేటపాలెం మండలంలో ఉన్న తొమ్మిది గ్రామ పంచాయతీలను పునర్విభజన చేసి అదనంగా మరో మూడు పంచాయతీలకు ప్రతిపాదనలు సిద్ధం చేసి నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పట్లో ఇది గిట్టని టీడీపీ నాయకులు పునర్విభజనపై హైకోర్టులో 2020లో కేసు వేశారు. దీంతో ఎన్నిలు నిలిచిపోయాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి పంచాయతీల పునర్విభజనపై హైకోర్టులో కేసులు వేసిన అప్పటి టీడీపీ నేతలు కోర్టులో కేసులు తొలగిపోవడంతో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం మిగిలిన పంచాయతీల సంగతేమిటి? హైకోర్టులో వేసిన కేసుల కారణంగా చీరాల నియోజకవర్గ పరిధిలో 2021 నుంచి 23 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిలిచి పోయాయి. అయితే దీనిపై ఆరు నెలల క్రితం కొత్తపేటవాసులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. కోర్టు తీర్పు రాగానే కొత్తపేట పంచాయతీ పరిధిలోని కొందరు గ్రామ పంచాయతీకి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. దీనిపై కోర్టు ఆరు నెలల్లో కొత్తపేట పంచాయతీకి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఎన్నికల కమిషనర్ జూన్ 17 తేదీ నాటికి ఓటర్ల జాబితాలు, బూత్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. మరి చీరాల నియోజకర్గ పరిధిలో మిగిలిన 22 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఎప్పడు జరుగుతాయో చూడాల్సిందే. -
బగళాముఖి దీక్షలు ప్రారంభం
చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలోని బగళాముఖి అమ్మవారి ఆలయంలో భక్తులు శుక్రవారం అమ్మవారి మాలధారణ చేశారు. ఈ సందర్భంగా ఈవో నరసింహమూర్తి మాట్లాడుతూ శ్రావణమాసంలో అమ్మవారి భక్తులు బగళాముఖి దీక్ష తీసుకుని నియమ నిష్ఠలతో పూజలు నిర్వహిస్తారని తెలిపారు. శ్రావణమాసం ప్రారంభం రోజున అమ్మవారి ఆలయంలో 11మంది భక్తులు దీక్ష చేపట్టారు. దీక్ష తీసుకునే భక్తులకు మాలలు, దుస్తులు ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. శుక్రవారం సందర్భంగా బగళాముఖి అమ్మవారికి విశేష అలంకరణలు చేసి పూజలు నిర్వహించారు.అంగన్వాడీ పోస్టులకు ఇంటర్వ్యూలు బాపట్ల: ఐసీడీఎస్లోని అంగన్వాడీల ఉద్యోగాలకు జిల్లా జేసీ జి.గంగాధర్గౌడ్ అధ్యక్షతన శుక్రవారం స్థానిక కలెక్టరే ట్లో ఇంటర్వ్యూలు జరిగాయి. నాలుగు కార్యకర్తల పోస్టులకు 12 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అలాగే 49 ఆయా పోస్టులకు ఇంటర్వ్యూలు జరగ్గా 95 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మహిళ శిశు సంక్షేమ శాఖ పీడీ రాధామాధవి, సీడీపీఓలు పాల్గొన్నారు. బోల్తాపడిన క్యాబేజీ లారీ మేదరమెట్ల: బెంగళూరు నుంచి విజయవాడకు క్యాబేజీ లోడుతో వెళుతున్న ఐషర్ లారీ బోల్తాపడిన సంఘటన కొరిశపాడు మండలం మేదరమెట్ల తమ్మవరం బ్రిడ్జిపై శుక్రవారం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో లారీ ఫ్లైఓవర్ బ్రిడ్జిపైకి వచ్చి డివైడర్ను ఢీ కొట్టి బోల్తాపడింది. డ్రైవర్కు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పారిపోగా కేసు నమోదు చేసినట్లు మేదరమెట్ల పోలీసులు తెలిపారు. ముగ్గురి ప్రాణాలు కాపాడిన డ్రోన్ చీరాల: చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో శుక్రవారం ముగ్గురు యువకులు అలల తాకిడికి కొట్టుకుపోగా రూరల్ ఎస్సై చంద్రశేఖర్, పోలీస్ సిబ్బంది, గజ ఈతగాళ్లను అప్రమత్తం చేసి ప్రాణాలు కాపాడారు. మార్టూరు మండలం కోలలపూడి గ్రామంలో అంకాలమ్మ తల్లి కొలుపుల సందర్భంగా గ్రామానికి చెందిన వెయ్యి మంది సముద్ర స్నానాలు చేసేందుకు వచ్చారు. వారిలో ముగ్గురు యువకులు సముద్రంలో ఎక్కువ లోతుకు వెళ్లి అలల తాకిడికి కొట్టుకుపోయారు. డ్రోన్ సహాయంతో యువకులను గుర్తించిన రూరల్ ఎస్సై చంద్రశేఖర్ వెంటనే విధుల్లో ఉన్న పోలీసులు, గజ ఈతగాళ్లను అప్రమత్తం చేశారు. స్పందించిన వారు నీటిలో కొట్టుకుపోతున్న ముగ్గురినీ కాపాడారు. ఎస్సై చంద్రశేఖర్ యువకులకు కౌన్సెలింగ్ నిర్వహించి వారితో పాటు వచ్చిన గ్రామస్తులకు క్షేమంగా అప్పగించారు. విద్యార్థులకు సైకిళ్లు పంపిణీసంతమాగులూరు(అద్దంకి): కొమ్మాలపాడు మక్కెనవారిపాలెం గ్రామాల్లోని 453 మంది విద్యార్థులకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శుక్రవారం సైకిళ్లు పంపిణీ చేశారు. 46 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందించారు. అదే విధంగా మక్కెనవారిపాలెం గ్రామంలో రూ.30 లక్షలతో నిర్మించిన సీసీ రహదారులు, సీసీ డ్రైన్లను ప్రారంభించారు. ఆ తరువాత సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
ఆర్టీసీని బలోపేతం చేసేందుకు కృషి
బాపట్ల: రాష్ట్రంలో ఆర్టీసీ సంస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రవాణా, క్రీడలశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి అన్నారు. ఏపీఎస్ఆర్టీసీ బాపట్ల డిపోను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శుక్రవారం సందర్శించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉన్న అతిపెద్ద సంస్థ ఏపీఎస్ఆర్టీసీ సంస్థ అని తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. త్వరలో మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతామని చెప్పారు. ఏపీఎస్ఆర్టీసీ సంస్థకు పూర్వ వైభవం తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాపట్ల డిపోను మోడల్గా తయారు చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. బస్టాండ్లో మరుగుదొడ్ల కాంప్లెక్స్ను నిర్మించడానికి, సిమెంట్ రహదారులు నిర్మిస్తామని చెప్పారు. బాపట్ల డిపోకు త్వరలో కొత్త బస్సులు కేటాయిస్తామని చెప్పారు. బాపట్ల నుంచి తిరుపతి, శ్రీశైలం బెంగళూరు ప్రాంతాలకు ప్రత్యేక బస్ సర్వీసులను నడపనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు నైట్ అలవెన్స్ రూ.130కి పెంచామని చెప్పారు. ఆర్టీసీ కార్గో సేవలను ఇంటింటికీ డెలివరీ చేసే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. బాపట్ల డిపోలో ఉత్తమ సేవలందించిన ఏడుగురు సిబ్బందికి మంత్రి ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలోఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మరాజు, బుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్గౌడ్, ఏపీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగేంద్రప్రసాద్, జిల్లా ప్రజా రవాణా రవాణా అధికారి డి.సామ్రాజ్యం, బాపట్ల డిపో మేనేజర్ పి.శ్రీమన్నారాయణ, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్రెడ్డి, తహసీల్దార్ సలీమా తదితరులు పాల్గొన్నారు.మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి -
జల్సాలకు అలవాటుపడి బైకులు చోరీ
నగరంపాలెం: జల్సాలు చేయడానికి సొమ్ము కోసం ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న తొమ్మిది మంది సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్కుమార్ తెలిపారు. సుమారు రూ.25 లక్షల విలువైన 34బైకులను వారి నుంచి స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. గుంటూరులోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్లో శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఇటీవల గుంటూరు తూర్పు, పశ్చిమ సబ్ డివిజన్లలోని పట్టాభిపురం, పాత గుంటూరు, నగరంపాలెం, తాడికొండ పీఎస్ల పరిధిలో ఎక్కువ గా బైకు చోరీలు జరిగాయని ఫిర్యాదులు రావడంతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాల ఫుటేజీలు, పాత నేరస్తుల కదలికలు, సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి సారించామని చెప్పా రు. అనుమానితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేశామని అన్నారు. ఈ కేసులో ఇద్దరు మైనర్లు (కేవీపీ కాలనీ 4వ వీధి, శ్రీనివాసరావు పేట వాసులు)తోపాటు అక్కిశెట్టి ఆకాష్ (ఎల్ఐసీ కాలనీ), ఉప్పు రాకేష్ (స్తంభాలగరువు), మడుగుల రవితేజ (కేవీపీ కాలనీ), షేక్ అషీరు (పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామం), కోన వెంకటగోపీ (లక్ష్మీనగర్ రెండో వీధి), టి.రాజేష్, బోయపాటి జయసాయి (తాడికొండ మండలం మోతడక గ్రామం ఎస్టీ కాలనీ)లను అరెస్ట్ చేశామని వివరించారు. అందరూ 27 ఏళ్లలోపు వారే... అరెస్ట్ అయిన వారందరూ 27 ఏళ్లలోపు వయస్సు వారే. వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. రవితేజ, ఆకాష్లు చోరీలకు ఆజ్యం పోశారు. వీరంతా ముఠాగా ఏర్పడి కొంతకాలంగా గుంటూరు నగర పరిధిలోని ఇళ్ల ఎదుట, మార్కెట్ ప్రదేశాలు, ఆసుపత్రులు, ప్రార్థన స్థలాల వద్ద నిలిపి ఉంచిన బైకులను దొంగిలించారు. తర్వాత ఆ బైక్లను విక్రయించి సొమ్ము చేసుకునేవారు. వీరిలో ఒకరిద్దరు పాత నేరస్తులు ఉన్నారు. బైకులను కొనుగోలు చేసిన వారిని కూడా అరెస్ట్ చేస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. చోదకుల నిర్లక్ష్యం వల్లే వాహన చోరీలు జరగుతున్నాయని అన్నారు. పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. వాహనాలకు హ్యాండిల్ లాక్, వీల్ లాక్లను బిగించుకోవాలని చోదకులకు సూచించారు. కేసు దర్యాప్తులో ప్రతిభ చూపిన జిల్లా ఏఎస్పీ కె.సుప్రజ (క్రైం), డీఎస్పీలు శివాజీరాజు (సీసీఎస్), అబ్దుల్ అజీజ్ (తూర్పు), అరవింద్ (పశ్చిమ), సీఐలు, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. ఇద్దరు మైనర్లు సహా తొమ్మిది మంది నిందితులు అరెస్ట్ రూ.25 లక్షల ఖరీదైన ద్విచక్ర వాహనాలు స్వాధీనం కేసు వివరాలు వెల్లడించిన గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్కుమార్ -
విపత్తులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి
బాపట్ల: తుపాను హెచ్చరికల నేపథ్యంలో విపత్తును ఎదుర్కోవడానికి అధికారులు సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. విపత్తు నిర్వహణ, నిర్మూలన ప్రణాళికపై కలెక్టర్ జిల్లా, మండల స్థాయి అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎగువ ప్రాంతాలలో అధికంగా వర్షాలు కురుస్తున్నందున కృష్ణానది వరద విపత్తును దృష్టిలో ఉంచుకోవాలని చెప్పారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విపత్తును ఎదుర్కోవడానికి ముందస్తుగా ప్రణాళిక రూపొందించాలన్నారు. ప్రస్తుతం ఆలమట్టి, శ్రీశైలం, నాగార్జునసాగర్, కృష్ణా బ్యారేజి 90 శాతం నిండుగా ఉండడంతో ఎగువ నుంచి వరద వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కృష్ణానది కరకట్టపై నివాసముంటున్న గృహాల సర్వే చేయాలన్నారు. కరకట్టకు గండ్లు పడకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక, కంకర బస్తాలు సిద్ధం చేసుకుని కట్టను బలోపేతం చేయాలన్నారు. మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. తీర ప్రాంత మండలాలలో గుడిసెలు, సిమెంటు రేకుల ఇళ్లను ముందస్తుగా గుర్తించాలని కలెక్టర్ చెప్పారు. తీరానికి పది కిలోమీటర్ల మేర తుపాను ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. గర్భిణులు, వృద్ధులు, మంచం పట్టిన వారు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు, చిన్నారులను గుర్తించి వివరాలు సిద్ధంగా ఉంచాలన్నారు. పునరావాస కేంద్రాల ఏర్పాటు, గ్యాస్ సిలిండర్, డీజిల్, కిరోసిన్, జనరేటర్లు, చెట్లు తొలగించడానికి యంత్రాలు, తదితర యంత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు, విద్యుత్ స్తంభాల పునరుద్ధరణకు ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. సమావేశంలో డీఆర్ఓ జి గంగాధర్గౌడ్, ఆర్డీఓలు, జిల్లా అధికారులు, వీక్షణ సమావేశం ద్వారా మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలి స్వాతంత్ర దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం ఏర్పాట్లపై ముందస్తు సమావేశం శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి అధికారులు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. పోలీస్ కవాతు మైదానాన్ని ముస్తాబు చేయాలని, జిల్లా ప్రగతి, అభివృద్ధిని చాటి చెప్పేలా శకటాల ప్రదర్శన ఉండాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. విశేష సేవలు అందించిన ఉద్యోగులను ప్రశంసాపత్రాలతో సత్కరించడానికి అర్హులైన వారిని గుర్తించాలన్నారు. స్వాతంత్య్ర సమరయోధులను సత్కరించడానికి ఆహ్వానించాలన్నారు. వైద్య శిబిరాలు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో డీఆర్వో జి.గంగాధర్గౌడ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సామాజిక వెనుకబాటులో ఉన్న వారిని ఆదరించాలి సామాజిక వెనుకబాటులో ఉన్న ఎస్టీలు, విభిన్న ప్రతిభావంతులను ఆదరించాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. ఎస్టీలు, విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్న్స్ కార్యక్రమం శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు కలెక్టర్కి అర్జీలు అందజేశారు. తన పరిధిలోని వాటికి కలెక్టర్ తక్షణమే పరిష్కార మార్గం చూపారు. మిగిలిన నగదు ప్రభుత్వానికి చెల్లించాలి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీలో మిగిలిన నగదును ప్రభుత్వానికి తక్షణమే తిరిగి చెల్లించాలని కలెక్టర్ వెంకట మురళి ఆదేశించారు. అలా చెల్లించకుండా ఉన్న వారికి తక్షణమే చార్జి మెమోలు జారీ చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో జి గంగాధర్ గౌడ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి వృద్ధాప్యంలో తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత పిల్లలదే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత పిల్లలపై ఉందని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. వృద్ధుల పోషణ, సంరక్షణ చట్టం అమలు తీరుపై అవగాహన కార్యక్రమం శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులను చూడకుండా దూరంగా ఉంచితే పోషణ ఖర్చు కింద వారికి నెలకు రూ.10వేలు ఇవ్వాలన్నారు. డబ్బులు ఇవ్వకుండా నిలిపివేస్తే మూడు నెలలు జైలు శిక్ష ఉంటుందన్నారు. కార్యక్రమంలో డీఆర్వో జి గంగాధర్గౌడ్, వృద్ధుల సంక్షేమ శాఖ అధికారి సువార్త, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఏ నాగధీర భద్రాచారి పాల్గొన్నారు. -
అంతర్ జిల్లాల దొంగలు అరెస్ట్
మేదరమెట్ల: వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న అంతర్ జిల్లాలకు చెందిన ఇద్దరి దొంగలను కొరిశపాడు పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. చీరాల డీఎస్పీ మొయిన్ మేదరమెట్లలోని అద్దంకి రూరల్ సీఐ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఈనెలలో కొరిశపాడు గ్రామంలోని హోటల్ నిర్వాహకురాలి మెడలో బంగారు చైన్ లాక్కొని పారిపోయిన ఇద్దరు దొంగలను పట్టుకోవడం కోసం ఓ టీంను ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే కొరిశపాడుకు చెందిన మేకల హరీష్, గుంటూరు సంజీవ్నగర్కు చెందిన షేక్ యాసిన్లను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వీరు గత నెలలో వేమూరు పోలీసు స్టేషన్ పరిధిలో ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని పోయారు. వీరి వద్ద నుంచి కొరిశపాడులో పోయిన 28 గ్రాముల బంగారు గొలుసు, వేమూరులో పోయిన 30 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఓ మోటారు బైక్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. విలాసవంతమైన జీవితానికి బెట్టింగులకు, చెడు వ్యసనాలకు బానిసలైన వీరు ఖర్చుల కోసం వివిధ ప్రదేశాల్లో ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు. పర్చూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో చైన్స్నాచింగ్లకు రెక్కీలు నిర్వహించినట్లు విచారణలో తేలింది. దొంగలను పట్టుకోవడంలో కృషి చేసిన సీఐ మల్లికార్జునరావు, కొరిశపాడు, మేదరమెట్ల, జె.పంగులూరు ఎస్ఐలు సురేష్, మహ్మద్ రఫీ, వినోద్బాబుతో పాటు వెంకటేష్, నాగరాజు, మత్తయ్య కానిస్టేబుల్స్ను రివార్డులతో డీఎస్పీ అభినందించారు. -
బంగారు ఆభరణాలు చోరీ
లక్ష్మీపురం: ఇంట్లో శుభకార్యం జరుగుతున్న నేపథ్యంలో దాచి పెట్టిన 92 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ అయిన ఘటన పై అరండల్పేట పోలీసులు శుక్రవారం రాత్రి కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. గుంటూరు నగరంలోని కొరిటెపాడు హనుమయ్యనగర్ ప్రాంతానికి చెందిన సుబ్రహ్మణేశ్వర అనే వ్యక్తి భవన నిర్మాణ పని చేస్తుంటారు. జూన్ నెలలో కుమారుడు వివాహం ఉన్నందున కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. జూన్ 21న ఇంట్లో బీరువాలో 92 గ్రాముల బంగారు ఆభరణాలు భద్రపరిచి, వివాహ పనుల్లో ఉండి పోయారు. అయితే శుభకార్యం అయిన తరువాత ఈ నెల 23వ తేదీన చూసే సరికి ఆభరణాలు కనిపించలేదు. దీంతో శుక్రవారం అరండల్పేట పోలీసులకు సమాచారం తెలియజేయగా ఎస్సై సుబ్బారావు, సిబ్బంది వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్టీమ్ ఆధారాలను సేకరించింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కౌలు అర్జీలు పరిష్కరించేందుకు కృషి
జీఆర్ఎం నోడల్ అధికారి పి.జయశ్రీ తాడికొండ: రాజధాని అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యలు, వార్షిక కౌలు అర్జీలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని గ్రీవెన్స్ రీడ్రెస్సల్ మేనేజ్మెంట్ అధికారి పి.జయశ్రీ అన్నారు. తుళ్లూరులోని సీఆర్డీఏ కార్యాలయంలో శుక్రవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఇటీవల రైతుల బ్యాంకు ఖాతాలకు జమ అయిన 11వ ఏడాది వార్షిక కౌలుకు సంబంధించిన సమస్యల గురించి పలువురు తమ అర్జీలను పి.జయశ్రీకి అందజేశారు. సాధ్యమైనంత వేగంగా పరిష్కరిస్తామని ఆమె తెలిపారు. జమ కాని వారికి రానున్న 15 రోజులలో జమయ్యేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రతి శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అర్జీలను రైతులు ఇచ్చి, కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 54 ఫిర్యాదులు వచ్చాయి. స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు బి. సాయి శ్రీనివాస నాయక్, ఎం.శేషిరెడ్డి, పి. పద్మావతి, జి. రవీందర్, జి. భీమారావు, ఏజీ చిన్నికృష్ణ, సీఆర్డీఏ సర్వే విభాగ అసిస్టెంట్ డైరెక్టర్ జి.పాండురంగారావు రామకృష్ణన్, సామాజిక సంక్షేమ విభాగ అధికారి శ్రీనివాసరావు, డెవలప్మెంట్ ప్రమోషన్ జోనల్ జాయింట్ డైరెక్టర్ సి.హెచ్. మధుసూదనరావు, తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు గుంటూరు లీగల్: మహిళపై లైంగిక దాడి చేసిన కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ.57 వేల జరిమానా విధిస్తూ ఐదవ అదనపు జిల్లా సెషన్ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. వివరాల ప్రకారం.. తాడేపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని సీతానగరం కరకట్ట వద్ద జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో బాధితురాలి ఫిర్యాదు మేరకు 2021 జూన్ 19న కేసు నమోదు చేశారు. ముగ్గుర్ని నిందితులుగా పరిగణించారు. వారిలో రామలింగం ప్రసన్నరెడ్డి అలియాస్ వెంకట్ పరారీలో ఉన్నాడు. మరో నిందితుడు షేక్ హబీబ్ అలియాస్ హనిగుండు మృతి చెందాడు. ఇంకో నిందితుడు సిరు కృష్ణకిషోర్ అలియాస్ కృష్ణను దోషిగా కోర్టు పేర్కొంది. విచారణ అనంతరం అతడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ.57 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి నీలిమ తీర్పు వెలువరించారు. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లపు కృష్ణ బాధితురాలి తరఫున వాదనలు వినిపించారు. అప్పటి సీఐ శేషగిరిరావు కేసు దర్యాప్తు చేయగా, డీఎస్పీ జె.రాంబాబు చార్జిషీట్ ఫైల్ చేశారు. కోర్టు లైజన్ కానిస్టేబుల్ బి.శ్రీనునాయక్, అప్పటి తాడేపల్లి కోర్టు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టారు. మహిళకు న్యాయం జరిగేలా చూసిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ అభినందించారు. బస్సులో బంగారు గొలుసు అద్దంకి రూరల్: బస్సులో దొరికి బంగారుపు చైనును ప్రయాణికులకు అందజేసిన కండక్టర్, డ్రైవర్ను డీఎం రామ్మోహన రావు శుక్రవారం అభినందించారు. సాయంత్రం దర్శి నుంచి అద్దంకి వచ్చిన బస్సులో కండక్టర్ ఏ. సుజాత, డ్రైవర్ యం. గిరిరాజులకు 12 గ్రాముల బంగారపు చైను దొరికింది. కాగా డ్రైవర్, కండక్టర్లు డిపో మేనేజర్ రామ్మోహనరావు సమక్షంలో అన్ని వివరాలు కనుగొని ప్రయాణికులు చంద్రకళ, చెన్నమ్మలకు అందజేశారు. చైనుకు లాకెట్ ఉండాలని చెప్పటంతో మళ్లీ బస్సులో వెతకగా లాకెట్ కూడా దొరకడంతో అదికూడా అప్పగించారు. -
అన్ని వర్గాలకు అందుబాటులో దూరవిద్య
గుంటూరు ఎడ్యుకేషన్: సమాజంలోని అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే వైవిధ్యమైన దూరవిద్య కోర్సులను ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయం (ఇగ్నో) అందిస్తోందని ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ పి.శరత్చంద్ర అన్నారు. శుక్రవారం ఎన్జీవో కాలనీలోని మహాత్మాగాంధీ కళాశాలలో ఇగ్నో కోర్సులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శరత్చంద్ర మాట్లాడుతూ దేశంలో అత్యధిక మంది విద్యార్థులు, అనేక కోర్సులతో విద్యను అభ్యసిస్తున్న ఉన్నతమైన విశ్వ విద్యాలయంగా ఇగ్నో గుర్తింపు పొందినట్లు చెప్పారు. విజయవాడ ప్రాంతీయ కేంద్రంగా మన రాష్ట్రంలోని 15 జిల్లాలకు ఇగ్నో సేవలు అందిస్తోందని, డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమా సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. సివిల్స్ స్థాయికి తగిన పాఠ్య ప్రణాళికతో కూడిన అంశాలు ఇగ్నో ప్రత్యేకతలు అని, ఒకే విద్యా సంవత్సరంలో ఒక రెగ్యులర్ కోర్సుతో పాటు దూరవిద్యా విధానంలో ఆన్లైన్లో మరొక కోర్సు అభ్యసించే వీలుందని తెలిపారు. కార్యక్రమంలో గౌతమి విద్యాసంస్థల చైర్మన్ కనుమర్ల గుండారెడ్డి, ప్రిన్సిపాల్ పి. ఉదయ్కిరణ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పొగాకు కొనుగోలులో అవకతవకలు నివారించాలి ప్రభుత్వానికి రైతు సంఘాల నేతలు డిమాండ్ లక్ష్మీపురం: రాష్ట్రంలో పొగాకు కొనుగోలులో అవకతవకలు నివారించాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె.ప్రభాకర్ రెడ్డిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలను పెంచాలని, నాణ్యత పేరుతో తెచ్చిన పొగాకును బయ్యర్లు వెనక్కి పంపకుండా చూడాలన్నారు. గుంటూరు బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో శుక్రవారం పొగాకు రైతుల సంఘం నాయకుల సమావేశం డాక్టర్ కొల్లా రాజమోహన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంపెనీలు పొగాకు కొనకపోవడంతో ఆందోళన చేపట్టడం వలన మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని తెలిపారు. కానీ గుంటూరు జిల్లాలో 50 కిలోమీటర్ల దూరం వెళ్లి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. సగం కూడా కొనుగోలు చేయకుండా బయ్యర్లు తిప్పి పంపుతున్నట్లు, ప్రైవేటు వారికి ఉపయోగపడేలా ఇలా చేస్తున్నట్లు ఆరోపించారు. దీంతో అయినకాడికి విక్రయించి రైతులు తీవ్రంగా నష్టపోతున్నట్లు చెప్పారు. ఇప్పటికే 8 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. ఆందోళనలు, వినతిపత్రాల సమర్పణ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఎం.హరిబాబు, కొల్లా రాజమోహన్, కంచుమాటి అజయ్, టి.రామారావు, జె.జయంతి బాబు, పి.శివాజి, పి.రామారావు, కె.గణేశ్ బాబు, పి.వి. జగన్నాథం, కె.విఠల్ రెడ్డి, బిక్కి శ్రీనివాసరావు, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నైపుణ్యంతో కూడిన విద్యాబోధన అవసరం
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థి కేంద్రంగా నైపుణ్యంతో కూడిన విద్యాబోధనను ఉపాధ్యాయులకు సాగించాలని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు సూచించారు. సదరన్ ప్రైవేట్ లెక్చరర్, టీచర్ ఆర్గనైజేషన్ (ఎస్పీఎల్టీఓ) ఆధ్వర్యంలో శుక్రవారం ఏటీ అగ్రహారంలోని జీకేఆర్ హైస్కూల్లో ప్రైవేటు ఉపాధ్యాయులకు మనోవిజ్ఞాన నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ఉత్తమ ఉపాధ్యాయుడికి ఉండాల్సిన లక్షణాలను వివరించారు. తరగతి గదిలో విద్యార్థి కేంద్రీకృత విద్యా బోధన జరగాలన్నారు. ఉపాధ్యాయుడే విద్యార్థికి లక్ష్య నిర్దేశకుడిగా వ్యవహరించాలని పేర్కొన్నారు. విజయవాడలోని ఎడ్యుకేషనల్ టీచర్ రీసెర్చ్ కౌన్సెలింగ్ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.రామశేషాద్రిరావు మాట్లాడుతూ మనోవిజ్ఞాన నైపుణ్య కౌన్సెలింగ్ విధానం ద్వారా ఉపాధ్యాయులు తరగతి గదిలో విద్యార్థుల మానసిక స్థితిని గమనించి, అందుకు అనుగుణంగా విద్యాబోధన సాగించాలని సూచించారు. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనపర్చాలన్నారు. జీకేఆర్ స్కూల్ డైరెక్టర్ జి.జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల మానసిక స్థితిలో మార్పులను తీసుకురావడంతోపాటు వృత్తి నైపుణ్యాన్ని పెంపొదించుకోవడంలో శిక్షణ తరగతులు దోహదం చేస్తాయన్నారు. కార్యక్రమంలో ఎస్పీఎల్టీఓ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పి.నాగయ్య, కార్యదర్శి ఎం.రాకేష్, కళాశాల విభాగ అధ్యక్షుడు కావూరి గోవిందరాజులు, జిల్లా, రాష్ట్ర స్థాయి సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు -
అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి
దాడులు చేస్తే అది సివిలైజేషనా? తాడేపల్లి రూరల్ : ‘మంత్రి నారా లోకేశ్ రెడ్బుక్ రాజ్యాంగం అంటూ మాట్లాడుతుంటే.. డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ మాత్రం వాటిని అమలు చేసేందుకు విశ్వప్రయత్నం చేస్తూ ప్రజలను, తన అభిమానులను రెచ్చగొడుతున్నారు. వీరా మనల్ని పరిపాలించేది.. ’ అంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి, మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరు కనకరావులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ తన సినిమా ఈవెంట్లో అభిమానులను రెచ్చగొట్టేలా మాట్లాడటంపై శుక్రవారం రాత్రి తాడేపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ‘‘సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లకు మీరు భయపడాల్సిన అవసరం లేదు.. దాడి చేయండి.. కొట్టండి.. మీకు నచ్చిన విధంగా దాడి చేయండి.. అది సివిలైజేషన్’ అంటూ పవన్కళ్యాణ్ రెచ్చగొట్టడం దారుణం’’ అన్నారు.పర్చూరు(చినగంజాం):పర్చూరు నియోజకవర్గంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావుతో కలిసి శుక్రవారం జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ముందుగా పర్చూరు బొమ్మల సెంటర్లో ఎన్టీఆర్, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పర్చూరులోని నెహ్రూ కాలనీ, నాగులపాలెంలో పాల్గొని సూపర్ సిక్స్ పథకాలు అందుతున్నాయా అనే విషయమై ప్రజలతో మాట్లాడారు. పర్చూరులో రూ.కోటితో నిర్మించిన సీసీ రోడ్లు, నాగులపాలెం గ్రామంలో రూ.60 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీ్త్ర నిధి చెక్కులు పంపిణీ అనంతరం పర్చూరు మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అధ్యక్షతన నిర్వహించిన సభలో పాల్గొని రూ.4 కోట్ల సీ్త్ర నిధి చెక్కులను స్వయం సహాయక గ్రూపులకు అందజేశారు. అగ్రికల్చర్ డ్రోన్ను మంత్రి కేశవ్, ఎంఎల్ఏ సాంబశివరావు ప్రారంభించారు. అనంతరం పర్చూరు మార్కెట్ యార్డులో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులతో పొగాకు కొనుగోలు తీరును అడిగి తెలుసుకున్నారు. పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఏలూరి ఇంకొల్లు మండలం ఇడుపులపాడు గ్రామంలో పొగాకు కొనుగోలు కేందాన్ని పర్చూరు శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు శుక్రవారం ప్రారంభించారు. అనంతరం కొనుగోలు కేంద్రంలో రైతులు తెచ్చిన పొగాకును పరిశీలించారు. చీరాల శాసనసభ్యుడు ఎం.మాలకొండయ్య, మార్క్ఫెడ్ డీఎం కరుణశ్రీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లవన్న ఆర్డీఓ గ్లోరియా, మార్కెట్ కమిటీ చైర్మన్ గుంజి వెంకటరావు, వైస్ చైర్మన్ శంకరశెట్టి చిరంజీవి, పార్టీ మండల అధ్యక్షుడు షంసుద్దీన్, నాయుడు హనుమంతరావు, తిరుమలశెట్టి శ్రీహరి, పొద వీరయ్య పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నాయకుల ఆగ్రహం డిప్యూటీ సీఎం వ్యాఖ్యలకు ఖండన పోలీస్స్టేషన్లో నేతల ఫిర్యాదు