Alluri Sitarama Raju
-
రిక్షా కార్మికుడి మృతదేహం లభ్యం
యలమంచిలి రూరల్ : ఐదు రోజుల క్రితం అనారోగ్యంతో మృత్యువాత పడిన 60 ఏళ్ల రిక్షా కార్మికుడు మృతదేహాన్ని పట్టణ పోలీసులు మంగళవారం రాంనగర్ రైల్వేగేటు సమీపంలో గుర్తించారు. ఇక్కడ పెదపల్లికి వెళ్లే రహదారి పక్కన తుప్పల్లో కుళ్లిపోయిన స్థితిలో వున్న మృతదేహం నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించి పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టణ ఎస్ఐ కె.సావిత్రి సిబ్బందితో అక్కడకు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. విచారణ జరపగా మృతుడు మున్సిపాలిటీ పరిధి మంత్రిపాలెం గ్రామానికి చెందిన రిక్షా కార్మికుడు చేపల సన్యాసిరావు(60)గా గుర్తించారు. అతనికి రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు ఉన్నాయని, ఈ నెల 12వ తేదీ నుంచి తన భర్త కనిపించకపోవడంతో అతని కోసం గాలిస్తున్నట్టు భార్య చేపల లక్ష్మి తెలిపింది. వ్యాధుల కారణంగా గుండెపోటు వచ్చి చనిపోయి ఉండొచ్చని పోలీసులకు తెలిపింది. ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ విలేకరులకు తెలిపారు. -
తీరంలో చేపలు మృత్యువాత
సాక్షి, అనకాపల్లి: పారిశ్రామిక ప్రాంతం అచ్యుతాపురం సెజ్ తీరంలో జలచరాలను కాలుష్యం కబళిస్తోంది. ఇక్కడ పూడిమడక ఉప్పుటేరు(మొగ) వద్ద సెజ్లో 200కుపైగా ఫార్మా కంపెనీల నుంచి వెలువడే వ్యర్థ రసాయనాలు నేరుగా సముద్రంలోకి కలవడంతో లక్షలాది చేపలు మృత్యువాత పడుతున్నాయి. పర్యావరణాన్ని కాపాడుతున్న అరుదైన ఆలివ్రిడ్లే తాబేళ్లు నశించిపోతున్నాయి. మంగళవారం ఉదయం ఫార్మా కంపెనీల నుంచి సముద్రంలోకి విడిచిపెట్టిన కలుషితమైన వ్యర్థ రసాయనాల వల్ల లక్షలాది చేపలు మృతి చెంది కుప్పలు తెప్పలుగా తీరంలో తేలాడాయి. ఇది ఈ రోజే కొత్తగా జరగలేదు. ఇలా తరుచూ జరగుతూనే ఉంటోందని స్థానిక మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా, పరిశ్రమ యాజమాన్యాలు పట్టించుకోవడంలేదు. ప్రభుత్వ అధికారుల్లో చలనం లేదు. పర్యవసానంగా 12,844 మత్స్యకార కుటుంబాల జీవనోపాధిపై దెబ్బపడుతోంది. శుద్ధి చేయకుండా సముద్రంలోకి వ్యర్థాలు.. అచ్యుతాపురం సెజ్లోని ఫార్మా కంపెనీలు రసాయన వ్యర్థాలను శుద్ధి చేయకుండా నేరుగా ఉప్పుటేరులోకి విడుదల చేస్తున్నాయని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఫార్మా కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలను ద్రవ రసాయన వ్యర్థాలను ఈటీపీ పద్ధతిలో, ఘన వ్యర్థాలను రీసైక్లింగ్ ప్రక్రియ ద్వారా శుద్ధి చేస్తారు. ఇది ఒక వంతు అయితే .. ఫార్మా కంపెనీలో ప్రమాదకరమైన వ్యర్థాలను వాటి స్వభావం ఆధారంగా విభజించి ఽశుద్ధి చేయాల్సి ఉంటుంది. వీటిపై కంపెనీ యాజమాన్యాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సురక్షితంగా శుద్ధి చేసి అప్పుడు సముద్రంలోకి వదిలివేయాలి. ఈ విధంగా చేయకపోవడం వల్ల మత్స్య సంపదకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీనిపై కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు, కలెక్టర్కు మత్స్యకారులు ఫిర్యాదులు చేశారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కనుమరుగవుతున్న ఆలివ్రిడ్లే తాబేళ్లు.. దేశంలోనే అరుదైన ఆలివ్రిడ్లే తాబేళ్లు తూర్పు తీరంలో విశాఖ–అచ్యుతాపురం తీరానికి వస్తుంటాయి. పర్యావరణాన్ని పరిక్షించే ఇవి ఒడిశా నుంచి వేలాది కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడ గుడ్లు పెట్టడానికి వస్తుంటాయి. ఏటా డిసెంబర్ నుంచి ఏప్రిల్లో తీరంలో గుడ్లు పెడుతుంటాయి. గతంలో మార్చిలో పూడిమడక తీర ప్రాంతానికి గుడ్లు పెట్టడానికి వచ్చిన ఆలివ్ రిడ్లే తాబేళ్లు వందలాది కలుషిత వ్యర్థ రసాయనాలకు గురై మృత్యువాత పడ్డాయి. పూడిమడక ఉప్పుటేరులో గుట్టలుగా తేలిన వైనం వ్యర్థ రసాయనాల వల్లే మృతి నేరుగా సముద్రంలోకి వదిలేస్తున్న ఫార్మా కంపెనీలు వేలాది మంది మత్స్యకారుల జీవనోపాధిపై దెబ్బ ఫార్మా యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందనే లేదు.. ఫార్మా కంపెనీల యాజమాన్యాల నిర్లక్ష్యంగా కారణంగా మత్స్యకారులకు జీవనోపాధి కోల్పోతున్నారు. తరుచూ పరిశ్రమల నుంచి కలుషిత, హానికరమైన వ్యర్థ రసాయనాలను నేరుగా సముద్రంలోకి వదలడంతో లక్షలాది చేపలు, చేప పిల్లలు చనిపోతున్నాయి. గతంలో చాలాసార్లు కలెక్టర్కు, మత్స్యకార అధికారులకు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేశాం. ఏదో జరిగినప్పుడు తూతూ మంత్రంగా వచ్చి చూసి వెళ్లిపోతున్నారు. ఆ తర్వాత దాని గురించి పూర్తిగా విస్మరిస్తున్నారు. యాజమాన్యాల శ్రేయస్సు కోసం ఆలోచన చేస్తున్నారే తప్ప.. వేటకు వెళ్లి జీవించే మత్స్యకారుల గురించి ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు. న్యాయం చేయకపోతే పోరాడక తప్పదు. – ఉమ్మిడి జగన్, మత్స్యకార నాయకుడు, పూడిమడక గ్రామం -
తమ్ముడి చేతిలో అన్న హతం
చీడికాడ: మద్యం మత్తులో చిన్న విషయం కాస్తా పెద్దపై సొంత అన్నయ్య ప్రాణం తీసే వరకు వెళ్లింది. ఈ దుర్ఘటన మండలంలోని తురువోలులో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్తుల సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన జోగా రాము (48), జోగా దేముళ్లు సొంత అన్నదమ్ములు. మంగళవారం సాయంత్రం గ్రామంలో ఒడ్డు పండగ చేసుకొని కళ్లానికి వెళ్లారు. తల్లి వద్ద పాలు తాగేస్తుందని మద్యం మత్తులో ఉన్న దేముళ్లు దూడపెయ్యిని కర్రతో కొట్టాడు. దీనిని మృతుడు రాము వారించాడు. దీంతో ఇరువురి మధ్య స్వల్ప తగాదా జరిగింది. తీవ్రమైన కోపంతో దేముళ్లు పాకలో ఉన్న నాటు తుపాకీ తెచ్చి అన్నపై కాల్పులు జరపగా రాము ఛాతి కింద గాయమైంది. కుటుంబ సభ్యులు ఆటోలో చోడవరం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో రాము మృతి చెందాడు. ఈ సమాచారం పోలీసుల వరకు చేరడంతో కె.కోటపాడు సీఐ పైడిపునాయుడు, మాడుగుల ఎస్ఐ నారాయణరావులు మంగళవారం రాత్రి గ్రామానికి వెళ్లి విచారించారు. అయితే రాము మృతికి కాల్పులు కారణం కాదని కుటుంబ సభ్యులు చెబుతూ ఎటువంటి ఫిర్యాదు ఇవ్వలేదని ఎస్ఐ నారాయణరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్లు చెప్పారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి వివరాలు తెలియజేస్తామని ఆయన చెప్పారు. మద్యం మత్తులో స్వల్ప వివాదం నాటుతుపాకీతో కాల్పులు -
యోగాంధ్రకు నిధుల కటకట
● గంటల వ్యవధిలోనే ఆవిరైన రూ.20 కోట్లు ● నిర్వహణకు మొత్తం రూ.75 కోట్లు అవసరం ● ఇప్పటికి వరకు సగం కూడా విడుదల చేయని ప్రభుత్వం ● మూడు రోజుల ముందు నిధుల కోసం అగచాట్లు ● 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం మహారాణిపేట: అంతర్జాతీయ యోగా దినోత్సవానికి కేవలం మూడు రోజులే మిగిలి ఉన్న వేళ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘యోగాంధ్ర–2025’కార్యక్రమానికి నిధుల లేమి వెంటాడుతోంది. కార్యక్రమ నిర్వహణకు మొత్తం రూ.75 కోట్లు అవసరమని జిల్లా యంత్రాంగం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపగా.. ఇప్పటివరకు కేవలం రూ.20 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. అదీ మంగళవారం విడుదలైన ఈ అరకొర నిధులు.. కేవలం గంటల వ్యవధిలోనే బిల్లుల చెల్లింపులకు ఆవిరైపోవడంతో ఖజానా మళ్లీ ఖాళీ అయింది. దీంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వచ్చీ రాగానే ఖర్చు విశాఖ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని నిర్ణయం మొదలు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ముఖ్యమంత్రి మొదలు అధికారుల వరకు గత నెల రోజులుగా సమీక్షలు చేస్తూ.. ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.. ఈ కార్యక్రమ నిర్వహణకు మొత్తం రూ.75 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే మంగళవారం కేవలం రూ.20 కోట్లు మాత్రమే విడుదల చేసింది ప్రభుత్వం. రూ.20 కోట్లు జిల్లా యంత్రాంగం ఖాతాలో పడిన నాలుగు గంటల్లోనే చెల్లింపులు జరిగాయి. అయితే, పేరుకుపోయిన బిల్లులతో పోలిస్తే ఇది నామమాత్రమే. చెల్లించాల్సిన ప్రతీ వంద రూపాయలకు కేవలం పది రూపాయలు అడ్వాన్స్గా చెల్లించి చేతులు దులుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. స్టేజీల నిర్మాణం, బారికేడ్లు, స్నాక్స్ ప్యాకెట్లు, నీళ్ల బాటిళ్లు వంటి అత్యవసర పనులకు సంబంధించిన కాంట్రాక్టర్లకు ఈ పాక్షిక చెల్లింపులు జరిపారు. మిగిలిన మొత్తం కోసం వారి నుంచి తీవ్ర ఒత్తిడి వస్తుండటంతో, తక్షణమే మిగతా నిధులు విడుదల చేయాలని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి మరోసారి లేఖ రాసింది. భారీ ఏర్పాట్లు.. అరకొర నిధులు ఒకవైపు నిధులు లేక ఇబ్బందులు పడుతున్నా, మరోవైపు కార్యక్రమ ఏర్పాట్లు మాత్రం సాగుతున్నాయి. సుమారు 5 లక్షల మంది పాల్గొంటారని అంచనా వేసి, బీచ్ రోడ్డులో తొక్కిసలాట జరగకుండా 326 ప్రత్యేక కంపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు. ప్రధాని, ముఖ్యమంత్రి ప్రసంగించేందుకు ప్రత్యేక వేదికలు సిద్ధమవుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం 2 లక్షల మ్యాట్లు, టీ–షర్టులు అందించగా, మరో 3 లక్షల మందికి అవసరమైన వాటిని రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చాల్సి ఉంది. దీనికి తోడు పాల్గొనే 5 లక్షల మందికి ఒక్కొక్కరికి రూ.100 విలువైన స్నాక్స్ ప్యాకెట్ అందించాలన్నా రూ.5 కోట్ల ఖర్చు తప్పదు. ఈ ఖర్చులన్నీ కాకుండా వీఐపీ, వీవీఐపీల బస, రవాణా వంటి అదనపు వ్యయాలు ఉన్నాయి. ఇప్పటికే జీవీఎంసీ, వీఎంఆర్డీఏ వంటి సంస్థలు తమ నిధులతో సుందరీకరణ, నిర్మాణ పనులు చేపడుతూ అదనపు భారం మోస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం అంచనా వ్యయంలో కనీసం సగం కూడా విడుదల చేయకపోవడంతో, ఇంత ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఎలా విజయవంతం చేయాలో తెలియక అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. -
గిరిజన గ్రామాల్లో జ్వరాల విజృంభణ
రావికమతం: మండలంలోని చీమలపాడు పంచాయతీ గిరిజన గ్రామాలైన రాయపాడు, చలిసింగం గ్రామాల్లో జర్వాలతో గిరిజనులు అల్లాడిపోతున్నారు. రాయపాడులో గేమ్మిల గంగ, సీదిరి నాయుడు, సేదరి చిలుకమ్మ, పాంగి రామారావు, గేమ్మిల అనిత, చిక్కడు అంజిలితో పాటు, అజయ్పురంలో పాంగి విజయ్కుమార్ సహా మరో ముగ్గురు జ్వరాలతో బాధపడుతున్నారు. వీరందరూ జర్వంతో పాటు నరాల నొప్పులతో సతమతమవుతున్నారు. ప్రస్తుతం కొత్తకోటలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యం కోసం ఒక్కో వ్యక్తి కనీసం రూ.3 వేలు నుంచి రూ.5 వేలు వరకు ఖర్చు చేయాల్చి వస్తోంది. ఇక్కడ గత నెలలో ప్రభుత్వ వైద్యాధికారులు వైద్య శిబిరం నిర్వహించారు. అయినా జ్వరాల తీవ్రత తగ్గలేదు. జీడితోటలో వచ్చిన ఫలసాయం మందులకే ఖర్చు చేయాల్చి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండ శిఖర పీవీటీజీ గ్రామాల్లో ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ ఇద్దరు, ముగ్గురు జ్వరాలతో బాధ పడుతున్నారు. చలిసింగం కొండ శిఖర గ్రామంలోనూ ఇటీవల వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. జ్వరాలు తగ్గుముఖం పట్టినా కీళ్ల నొప్పులు మాత్రం తగ్గడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. మరో వైపు రోడ్డు సౌకర్యం లేక వైద్యానికి ఆదివాసీలు నరకం చూస్తున్నారు. గిరిజన గ్రామాల్లో తరచూ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, వైద్యులు రాత్రి బస చేసి జ్వరాలు అదుపు చేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.గోవిందరావు, సంఘం నాయకులు పాంగి భాస్కరరావు, సీహెచ్.శంకర్రావు ఈ సందర్భంగా కోరారు. -
నిర్వాసితుల అభీష్టం మేరకే పునరావాసం
చింతూరు: నిర్వాసితుల అభీష్టం మేరకు వారు కోరుకున్న ప్రాంతంలోనే పునరావాసం కల్పించేందుకు చర్యలు చేపడతామని ఆర్అండ్ఆర్ అధికారి, ఐటీడీఏ పీవో అపూర్వభరత్ అన్నారు. మంగళవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ఆయన చింతూరుకు చెందిన పోలవరం పీడీఎఫ్ కమిటీ సభ్యులు, గిరిజనేతర నిర్వాసితులతో మాట్లాడారు. తమకు తాడువాయి, సూదికొండ ప్రాంతాలను చూపించారని, తిరువూరు, కృష్ణునిపాలెం ప్రాంతాల్లో స్థలాలను కూడా చూపించాలని నిర్వాసితులు పీవోను కోరారు. దీనిపై స్పందించిన ఆయన మాట్లాడుతూ తిరువూరు, కృష్ణునిపాలెం ప్రాంతంలో భూముల పరిశీలనకు కొంత సమయం పడుతుందన్నారు. తాడువాయిలో గతంలో చూసిన భూములు కాకుండా వేరే ప్రాంతంలో భూములు కాలనీల నిర్మాణాలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ స్థలాన్ని పరిశీలించేందుకు రవాణా సౌకర్యం కల్పించాలని, స్థలం నచ్చితే కాలనీల నిర్మాణానికి తమ సమ్మతి తెలియజేస్తామని నిర్వాసితులు పీవోను కోరారు. గురువారం బస్సు ఏర్పాటుచేసి నిర్వాసితులను తాడువాయిలోని స్థల సందర్శనకు తీసుకువెళ్లాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. ఐటీడీఏ పీవో అపూర్వభరత్ -
పీవో చొరవతో పాఠశాల రూపురేఖలు మార్పు
కూనవరం: చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్ చొరవతో కొండాయిగూడెం ఎంపీపీఎస్ పాఠశాల రూపురేఖలు మారిపోయాయి. వర్షానికి కారుతూ,శ్లాబ్ పెచ్చులు ఊడి పడుతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందేవారు. ఈ పరిస్థితిని పీవో అపూర్వభరత్కు గ్రామస్తులు వివరించారు. మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దీనిపై స్పందించిన పీవో ఈ విషయాన్ని సమరిటన్ ఫర్ది నేషన్ స్వచ్ఛంద సంస్థ అధినేత రామ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆయన సాఫ్ట్వేర్ సొల్యూషన్ వారి సహకారంతో రూ. 2 లక్షలు వెచ్చించి పాఠశాల భవనం సమస్యలు పరిష్కరించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఐటీడీఏ పీవో పునఃప్రారంభించారు. గ్రామస్తులు ఐటీడీఏ పీవోను, స్వచ్ఛంద సంస్థ రామ్ కుమార్ను సత్కరించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో యూత్లీడర్ కరక రాజకుమార్, సోడె ముత్తయ్య, రాజబాబు, కన్నారావు, శ్రీను, రాము, నాగరాజు పాల్గొన్నారు.స్వచ్ఛంద సంస్థ సహకారంతో సమస్య పరిష్కారం -
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి
జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్రముంచంగిపుట్టు: కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు.మండల కేంద్రం ముంచంగిపుట్టులో మంగళవారం వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పాంగి పద్మారావు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ మండల నేతలు,కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.హామీల అమలులో ప్రభుత్వం చేస్తున్న వంచనపై చర్చించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ చంద్రబాబు సంపద సృష్టించడం లేదని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారని తెలిపారు. విద్య,వైద్య,వ్యవసాయ రంగాలు నిర్వీర్యమయ్యాయన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రైతుల సంక్షేమానికి,పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేశారని చెప్పారు.ప్రసుత్త ప్రభుత్వం వైఎస్సార్సీపీ నేతలపై దాడులు,కేసులతోనే పరిపాలన చేస్తోందన్నారు. కార్యకర్తలు అధైర్యపడవద్దని, రాబోయే రోజులు మనవని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సీతమ్మ,వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జగబంధు, సర్పంచులు, ఎంపీటీసీలు,మండల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
6 కిలోల గంజాయి పట్టివేత
మాడుగుల: మండలంలో గరికి బంద గ్రామ సమీపంలో మంగళవారం మాడుగుల పోలీసు లు ఆరు కిలోలు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ నారాయణరావు కథనం ప్రకారం.. ముందస్తు సమాచారం ప్రకారం గరికి బంద వద్ద వాహనాలు తనిఖీలు చేశారు. పాడేరు నుంచి వస్తున్న స్కార్పియోను ఆపి తనిఖీ చేసి,. నలుగురు నిందితులతో పాటు 6 కిలోల గంజాయిని పట్టుకున్నారు. వాహనంతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకుని, నంద్యాల జిల్లా బేతంచర్ల ప్రాంతానికి చెందిన నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
అంగన్వాడీ సరకులు పట్టివేత
పాలిటెక్నిక్ కళాశాలప్రిన్సిపాళ్ల బదిలీ మురళీనగర్ (విశాఖ): రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు బదిలీలు నిర్వహించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని నర్సీపట్నం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ జీవీ రామచంద్రరావు గన్నవరం పాలిటెక్నిక్ కాలేజీకి బదిలీపై వెళ్లగా, ఆ స్థానంలో సింహాద్రిపురం పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ కె.తాతాజీని బదిలీ చేశారు. ప్రస్తుతం కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ కె.నారాయణరావు అతని ఒరిజినల్ స్థానం ఆముదాలవలస నుంచి శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీకి, ఆముదాలవలసకు శ్రీకాకుళం ప్రిన్సిపాల్ డాక్టర్ బి.జానకిరామయ్య బదిలీపై రానున్నారు. పాడేరు జీఎంఆర్ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ కె.సుజాత కాకినాడ ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కాలేజీకి బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో తాడిపత్రి నుంచి ఎం.హరిబాబు బదిలీపై రానున్నారు. వైద్య ఆరోగ్యశాఖలో.. మహారాణిపేట(విశాఖ): వైద్య ఆరోగ్య శాఖ బదిలీల్లో భాగంగా ఆంధ్రా మెడికల్ కాలేజీ, కేజీహెచ్లో మొత్తం 43 మందిని బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద్, డీసీఎస్ఆర్ఎంవో డాక్టర్ మెహర్కుమార్లు కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి, ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ డాక్టర్ లోకనాథం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి బదిలీ అయ్యారు. 12 మంది ప్రొఫెసర్లు, ముగ్గురు అసోసియేట్ ప్రొఫెసర్లు, 28 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు కూడా స్థాన చలనం కలిగింది. వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో 330 మందిని బదిలీ చేశారు. ఈ మేరకు ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ రాధాకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 250 మంది స్టాఫ్ నర్సులు, 80 మంది హెడ్ నర్సులు బదిలీ అయ్యారు. వైద్య ఆరోగ్యశాఖలో ఐదు కేడర్లలో 60 మంది స్థాన చలనం పొందారు.అడ్డతీగల: మండలంలోని తిమ్మాపురం–2 అంగన్వాడీ కేంద్రం నుంచి తరలిపోతున్న నిత్యావసర సరకులను స్థానికులు నాలుగురోజుల క్రితం పట్టుకున్నారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అంగన్వాడీ సెంటర్ నుంచి తరలిపోతున్న నిత్యావసరాలను పట్టుకున్న స్థానికులు గ్రామపెద్దలకు తెలియజేసి, ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు సూపర్వైజర్ అరుణలత సిబ్బందితో కలసి వెళ్లి స్థానికులు పట్టుకున్న అంగన్వాడీ సరకులను పరిశీలించారు. వీటిలో 70 కిలోల బియ్యం, 11 కిలోల కందిపప్పు, 60 కోడిగుడ్లు, రెండు వంట నూనె ప్యాకెట్లు ఉన్నట్టు గుర్తించారు. పట్టుకున్న సరకులను గ్రామపంచాయతీ ఆధీనంలో ఉంచారని, తరలింపునకు బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోలేదని తిమ్మాపురం వాసుల ఆవేదన -
రికార్డ్ లక్ష్యంగా యోగాంధ్రకు సన్నద్ధం
సాక్షి,పాడేరు: గిరిజన విద్యాలయాల్లో విద్యార్థులు యోగాలో ప్రతిభ చూపుతున్నారు. ఉత్తమ శిక్షణ పొందిన 21,800 మంది ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని ఏప్రిల్ 7న అరకులోయ వేదికగా 108 సూర్య నమస్కారాలను విజయవంతంగా ప్రదర్శించి వరల్డ్ రికార్డు సాధించారు. ఇదే స్ఫూర్తితో ఈనెల 21న విశాఖపట్నం ఆంధ్రా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ మైదానం వేదికగా పీఎం నరేంద్రమోదీ సమక్షంలో 25 వేల మంది గిరిజన విద్యార్థిని, విద్యార్థులు 108 సూర్య నమస్కారాలకు సిద్ధమవుతున్నారు. అరకులోయలో వరల్డ్ రికార్డు సాధించిన 21,800 మంది మిగిలిన 3,200 మంది విద్యార్థులు యోగా సాధనలో నిమగ్నమయ్యారు. పాడేరు ఐటీడీఏ పరిధిలోని గిరిజన విద్యాలయాల పీడీలు, పీఈటీలు వారికి ఉత్తమ శిక్షణ ఇస్తున్నారు. వీరిని ఈనెల 20న విశాఖ తరలించేందుకు 500 బస్సులు ఏర్పాటుచేశారు. పూర్తిస్థాయి సౌకర్యాలతో 13 చోట్ల వసతి ఏర్పాటుచేసినట్టు అధికారవర్గాలు తెలిపాయి. సాధనలో 25వేల మంది గిరిజన విద్యార్థులు నిమగ్నం పీఎం మోదీ సమక్షంలో విశాఖలో 21న ప్రదర్శన గిన్నిస్ రికార్డ్ లక్ష్యం 108 సూర్య నమస్కారాలతో గిన్నిస్ బుక్ అఫ్ రికార్డ్స్ లక్ష్యంగా విశాఖలో గిరిజన విద్యార్థులు యోగాసనాలు ప్రదర్శిస్తారు. ఏయూ ఇంజనీరింగ్ మైదానంలో పకడ్బందీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 25 వేలమంది గిరిజన విద్యార్థులకు పూర్తిస్థాయిలో వసతితో పాటు భద్రతా చర్యలు చేపడుతున్నాం. – ఏఎస్ దినేష్కుమార్, కలెక్టర్, పాడేరు -
ఇల్లా.. కొలనా..!
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం నిర్వాసితులకు నిర్మించిన కాలనీ ఇళ్లు కొలనులను తలపిస్తున్నాయి. శ్లాబ్లు నాసిరకంగా నిర్మించడం వల్ల నీరు నిలిచిపోయి లీకేజీల నుంచి గదుల్లోకి వచ్చేయడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల పర్యవేక్షణలోపం వల్ల పనులు ఇష్టారాజ్యంగా జరిగాయి. కనీసం మరమ్మతులైనా చేపట్టి మౌలిక వసతులు కల్పించాలని ప్రజాసమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రాలు అందజేసినా ప్రయోజనం లేకుండా పోయిందని నిర్వాసితులు వాపోతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ కోసం సర్వం త్యాగంచేసిన తమకు గత టీడీపీ ప్రభుత్వం నరకం చూపించిందని వారు ధ్వజమెత్తుతున్నారు. ● అధ్వానంగా పోలవరం నిర్వాసితుల పునరావాస కాలనీలు ● నాసిరకంగా పనులు ● శ్లాబ్ లీకేజీల నుంచి గదుల్లోకి వర్షం నీరు ● గత టీడీపీ ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా కట్టడాలు ● నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు ● త్యాగం చేసి నరకం చూస్తున్నామని బాధిత ప్రజల ఆవేదనరంపచోడవరం: పోలవరం ప్రాజెక్ట్ గిరిజన నిర్వాసితులకు నిర్మించిన కాలనీ ఇళ్ల నిర్మాణం నాసిరకంగా ఉండటంతో నరకం చూస్తున్నారు. దేవీపట్నం మండలం కొండమొదలు, తెలిపేరు, తాళ్లూరు, మెట్టగూడెం, తాటివాడ గ్రామాలు పోలవరం ప్రాజెక్ట్ ముంపులో కలిసిపోయాయి. వీళ్లకు 2017–18లో దేవీపట్నం మండలం ఇందుకూరుపేటకు సమీపంలో పెదబియ్యంపల్లిలో 110 ఇళ్లను అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్మించింది. వీటితోపాటు గుబ్బలంపాడు, రమణయ్యపేట గ్రామాలకు ఇందుకూరుపేటకు సమీపంలో కంబలంపాలెంలో సుమారు వందిళ్లు నిర్మించింది. ఇంజినీరింగ్ అధికారుల ఆధ్వర్యంలో నిర్మాణ పనులు జరిగాయి. ఒకొక్క ఇంటికి ప్రభుత్వం రూ.2.5 లక్షలు వెచ్చించింది. నిర్మాణ బాధ్యతను కాంట్రాక్టర్లకు అప్పగించిన ప్రభుత్వం పర్యవేక్షణను గాలికొదిలేసింది.తమ ఇళ్ల నిర్మాణాన్ని పర్యవేక్షణ చేసుకునే అవకాశం కూడా అధికారులు కనీసం తమకు కూడా ఇవ్వలేదని గిరిజన నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నాళ్లకే శిథిలం నిర్వాసితులు కాలనీలకు వచ్చి నాలుగేళ్లు దాటుతోంది. కాలనీలో ఇళ్ల నిర్మాణం నాసిరకంగా ఉండడంతో ఒకటి కాదు, రెండు కాదు అన్ని ఇళ్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. శ్లాబ్లు ఎత్తుపల్లాలుగా నిర్మించారు. దీంతో వర్షం వచ్చినప్పుడు నీరు శ్లాబ్పై ఉండిపోయి ఇంట్లోకి దిగిపోతోంది. ● బాత్రూమ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. బేసిన్తో సహా ఫ్లోరింగ్ కిందికి దిగిపోయింది. ఇంటి వరండా ఫ్లోరింగ్ పరిస్థితి అలాగే ఉంది. పెదబియ్యంపల్లి కాలనీలో పూర్తిస్థాయిలో రోడ్ల నిర్మాణం జరగలేదు. సుమారు కిలోమీటరు మేర సిమెంటు రోడ్డు నిర్మించాల్సి ఉంది. ● సితారం నిర్వాసితులకు ఇందుకూరుపేట సమీపంలో ఏర్పాటుచేసిన కాలనీలో మౌలిక వసతులు లేవు. ఇక్కడ సుమారు వంద కుటుంబాలకు అప్పటి ప్రభుత్వం కాలనీ ఇళ్లు నిర్మించింది. ఇప్పటికీ సిమెంటు రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం జరగలేదు. దండంగి కాలనీలో తాగునీటి సమస్య నెలకొంది. వాటర్ ట్యాంక్ల నిర్మాణంలో లోపం వల్ల పూర్తిస్థాయిలో అందరికీ నీరు అందడం లేదు. పల్లపు ప్రాంతంలో నిర్మించడం వల్ల ఎగువ ప్రాంతంలోని ఇళ్లకు నీరు సరఫరా కావడం లేదు. తాగునీటికి అవస్థలు పడుతున్నాం సత్యసాయి మంచినీటి పథకం నుంచి కనెక్షన్ ఇస్తామని దండంగి పునరావాస కాలనీలో ట్యాంకు ఏర్పాటు చేసి మూడు నెలలు అవుతోంది. నేటికీ పైపులైన్ కనెక్షన్ ఇవ్వలేదు. దీంతో నీటి కోసం చాలా ఇబ్బంది పడుతున్నాం. కాలనీకి వచ్చిన తరువాత మా గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకపోయింది. – మిర్తివాడ వీరపురెడ్డి, దండంగి కాలనీ, దేవీపట్నం మండలం వర్షం పడితే చాలా ఇబ్బంది ఇళ్ల శ్లాబ్లు లీక్ అవుతున్నందున వర్షం పడినప్పుడల్లా చాలా ఇబ్బందిగా ఉంటోంది. శ్లాబ్ లీకేజీల నుంచి నీరు గదుల్లోకి వచ్చేస్తోంది. మరమ్మతులు చేపట్టాలని అనేక సార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది.మరుగుదొడ్లు ఎందుకు పనిచేయకుండా పోయాయి. ఇళ్లు నిర్మించిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుని న్యాయం చేయాలి. – కోండ్ల సురేష్రెడ్డి, ఉపాధ్యక్షుడు, పీసా కమిటీ, పెదబియ్యంపల్లి కాలనీవినతులిచ్చినా..స్పందన శూన్యం కాలనీ ఇళ్ల శ్లాబ్లపై నీరు నిల్వ ఉండిపోయి కారిపోతుండటంతో ఇటీవల ఐటీడీఏ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కొండమొదలు నిర్వాసితులు ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా నిర్మించడం వల్ల నానా ఇబ్బందులు పడుతున్నామని, దీనిపై ఫిర్యాదు చేసినా అధికారుల నుంచి స్పందన కరువైందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంబలంపాలెంలో నిర్మించిన చినరమణయ్యపేట, గుబ్బలంపాడు నిర్వాసితులకు నిర్మించిన ఇళ్లు కూడా అధ్వానంగా ఉన్నాయని మాజీ ఎంపీపీ కొమరం పోశమ్మ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదు. -
డీపీఆర్వోగా బాలామాన్సింగ్ బాధ్యతల స్వీకరణ
సాక్షి,పాడేరు: జిల్లా పౌర సంబంధాలశాఖ అధికారిగా కె.బాలామాన్సింగ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన సిబ్బంది, అధికారులు అభినందనలు తెలిపారు. సాధారణ బదిలీల్లో భాగంగా శ్రీకాకుళం నుంచి ఆయన ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన పి.గోవిందరాజులను శ్రీకాకుళం డీపీఆర్వోగా ప్రభుత్వం బదిలీ చేసింది. బదిలీపై వెళ్తున్న పి.గోవిందరాజులను సమాచార,పౌరసంబంధాలశాఖ అధికారులు, ఉద్యోగులు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా గోవిందరాజులు మాట్లాడుతూ అందరి సహకారంతో గిరిజన ప్రాంతంలో సేవలందించడం సంతోషంగా ఉందన్నారు. అధికారులు, పాత్రికేయులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ పీఆరర్వో పి.రాములు, సీనియర్ సహాయకులు పి.శ్రీనివాసరావు, జూనియర్ సహాయకులు కె.సంధ్యారాణి, సిబ్బంది వరలక్ష్మి, పుష్ప, మోహన్ పాల్గొన్నారు. -
అబద్ధాలు, అరాచకాలే కూటమి పాలన
ముంచంగిపుట్టు: కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టి ఏడాదిగా అబద్ధాలు, అరాచకాలతో పాలన సాగిస్తోందని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర విమర్శించారు. మండల కేంద్రంలోని తన నివాసంలో మంగళవారం జగన్ అంటే నమ్మకం–చంద్రబాబు అంటే మోసం పేరుతో ముద్రించిన పుస్తకాన్ని ఎంపీపీ సీతమ్మ, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల నేతలతో కలిసి ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుభద్ర మాట్లాడుతూ ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చిన చంద్రబాబు, పవన్కల్యాణ్ ఆ తరువాత వాటిని విస్మరించి ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. అక్రమాలు, కేసులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు కూటమి పాలనలో పెరిగిపోతున్నాయని ఆమె ధ్వజమెత్తారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మొదటి ఏడాదిలోనే ఇచ్చిన నవరత్నాలు పథకాలను పూర్తి స్థాయిలో వైఎస్ జగనన్న అమలు చేశారన్నారు. కూటమి ప్రభుత్వంలో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేశామని, ఇకపై వాటి ఊసెత్తకూడదని సీఎం చంద్రబాబు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పాంగి పద్మారావు, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అరబీరు జగబంధు, సర్పంచులు రమేష్, బాబురావు, నీలకంఠం, గంగాధర్, నరసింగరావు, పార్వతమ్మ, ఎంపీటీసీలు సుబ్బలక్ష్మి, కమల, నోబ్బో, గణపతి తదితరులు పాల్గొన్నారు. గిరిజనులను మోసం చేసిన చంద్రబాబు: అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అరకులోయ టౌన్: ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చంద్రబాబు గిరిజనులను మోసం చేశారని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం విమర్శించారు. మంగళవారం ఆయన తన క్యాంప్ కార్యలయంలో మండలంలోని పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం పేరుతో ముద్రించిన వెన్నుపోటు పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాదారు. ఎన్నికలకు ముందు అరకులో జరిగిన బహిరంగ సభలో గిరిజన ప్రాంతంలో గిరిజన అభ్యర్థులకు ప్రత్యేక డీఎస్సీ నిర్వహించి పోష్టులు భర్తీ చేస్తానని, జీవో నంబర్ 3కు ప్రత్యామ్నాయంగా జీవో తీసుకువచ్చి శతశాతం ఉద్యోగాలు గిరిజన నిరుద్యోగ యువతకు ఇస్తానని మాటిచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని తుంగలో తొక్కారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పా లు, ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్, మండల పార్టీ అధ్యక్షులు స్వాభి రామూర్తి, మండల పార్టీ ఉపాధ్యక్షులు జి. ప్రకాష్, పల్టాసింగి విజయ్ కుమార్, ఎంపీటీసీలు దురియా ఆనంద్కుమార్, శత్రుఘ్న పాల్గొన్నారు. ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర ధ్వజం ముంచంగిపుట్టులో ‘వెన్నుపోటు’పుస్తకావిష్కరణ -
గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం డుడుమ నుంచి నీటి విడుదల
ముంచంగిపుట్టు: ఆంధ్రా– ఒడిశా సరిహద్దు ప్రాంతమైన డుడుమ జలపాతంలో కోల్కతా వాసి అనిమెస్దాస్ (27) గల్లంతై నాలుగు రోజులు గడుస్తున్నా నేటికీ ఆ యువకుడి ఆచూకీ లభ్యం కాలేదు. ఓడిఆర్ఎఫ్ బృందాలు గాలించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో మంగళవారం మాచ్ఖండ్ ప్రాజెక్టు అధికారుల ఆదేశాల మేరకు డుడుమ జలాశయం రెండు గేట్లు ఎత్తి గంటకు రెండు వేల క్యూసెక్కుల నీటి విడుదల చేశారు. నీటి ప్రవాహం పెరగడం వల్ల సొరంగంలోంచి బయటకు వచ్చే అవకాశం ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అనిమెస్దాస్ గల్లంతైన దగ్గర నుంచి ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు డుడుమ జలపాతం వద్ద నిరీక్షిస్తున్నారు. అక్రమ కట్టడాల కూల్చివేతలో అధికారుల నిర్లక్ష్యం● జాతీయ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదుచింతూరు: అక్రమ కట్టడాల కూల్చివేత ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అక్రమ కట్టడాలను కూల్చివేయాలన్న న్యాయస్థానాల ఆదేశాలను అధికారులు అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. 1/70 చట్టాన్ని ఉల్లంఘించి గిరిజనేతరులు విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని, జిల్లాలో కొంతమేర ఆక్రమణలు తొలగింపు ప్రక్రియ చేపట్టినా ఇతర ప్రాంతాల్లో తొలగింపు ప్రక్రియ ప్రారంభించలేదని ఆయన తెలిపారు. చట్టాలకు విరుద్ధంగా వలస గిరిజనేతరులకు ఏజెన్సీలో ఎన్వోసీలు, ధ్రువపత్రాలు జారీచేయడం వల్ల ఆదివాసీలు తమ భూములను కోల్పోతున్నారని ఆయన తెలిపారు. చింతూరు డివిజన్లో అధికారులు కొందరు వ్యక్తుల చెప్పుచేతల్లో నడుస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయాలన్నింటినీ జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు శ్రీను తెలిపారు. -
వెబ్ల్యాండ్లో నమోదు చేయాలి
● దేవదాయశాఖ జిల్లా అధికారి సుధారాణి కొయ్యూరు: జిల్లాలో దేవదాయ శాఖ ఆధీనంలో ఉన్న భూములను వెబ్ల్యాండ్లో నమోదుచేయాలని తహసీల్దార్లను కోరామని ఆశాఖ జిల్లా అధికారి (డీఈవో) ఎల్. సుధారాణి తెలిపారు. మంగళవారం ఆమె కొయ్యూరులో మల్లికార్జున స్వామి, గంగాలమ్మ, బూరుగులమ్మ తల్లి ఆలయాలను, దేవదాయశాఖ భూములను పరిశీలించారు. భూములకు సంబంధించి సమగ్ర వివరాలను ఆమె తెలుసుకున్నారు. అనంతరం ఆమె తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. తమ శాఖ భూములను వెబ్ల్యాండ్లో నమోదు చేయాలని తహసీల్దార్ కుమారస్వామిని కోరారు. కాకరపాడులో నిర్మిస్తున్న వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని పరిశీలించారు. ఆమె వెంట దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఉమాదేవి, జూనియర్ సహాయకులు చంద్రతేజ, జీసీసీ మాజీ చైర్మన్ ప్రసాద్, బీజేపీ నాయకుడు మేడిబోయిన చక్రరావు, పద్మరాజు, నాగేశ్వరరావు, సర్పంచ్ మాకాడ బాలరాజు పాల్గొన్నారు. -
రంపుల గిరిజనుల ఆందోళన
● ఎండీయూ వాహనాలతో రేషన్ పంపిణీ చేయాలని డిమాండ్గూడెంకొత్తవీధి: ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేయాలని పెదవలస పంచాయతీ రంపుల గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఎండీయూ వాహనాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని మంగళవారం వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం మండల అధ్యక్షుడు కొర్రా బాలయ్య మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మూలంగా గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం వచ్చి బియ్యం తీసుకువెళ్లడం కష్టంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
అల్లూరి జిల్లాలో ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
సాక్షి, అల్లూరి: అల్లూరి జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం.వివరాల ప్రకారం.. అల్లూరి జిల్లాలోని రంపచోడవరం ఏజెన్సీ మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం రాత్రి భారీ ఎన్ కౌంటర్ జరిగింది. కించకూరు-కాకవాడి గండి అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యులు ఉదయ్ మృతి ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల్లో మరో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు. -
బడి బాగుకోసం..
హుకుంపేట మండలం శోభకోట పంచాయతీ ఈదులగొంది మండల పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడు ఎల్లేటి శ్రీనివాసరావు సాటి ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన పనిచేస్తున్న పాఠశాలకు పక్కా భవనం లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ఆయన సమస్య పరిష్కారానికి సంకలి్పంచారు. ఆయన సొంత నిధులతో పాటు స్నేహితుల సహకారంతో రూ.లక్ష సమకూర్చారు. ఈ నిధులకు గ్రామస్తుల శ్రమదానం జోడించి పాఠశాలకు సొంత భవనం సమకూర్చారు. హుకుంపేట: పాఠశాలకు వసతి సమస్య పరిష్కరించేందుకు ఓ ఉపాధ్యాయుడు సొంత నిధులు వెచ్చించారు. దీనికి గ్రామస్తులు శ్రమదానం జోడించి భవన నిర్మాణాన్ని పూర్తిచేసి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. వసతి సమస్యను తాత్కాలికంగా పరిష్కరించుకున్నారు. అల్లూరి జిల్లా హుకుంపేట మండలంలోని శోభకోట పంచాయతీ ఈదులగొంది చిన్న గ్రామం. ఇక్కడ పీవీటీజీ సామాజిక వర్గానికి చెందిన గిరిజనులు జీవిస్తున్నారు. ఇక్కడి పాఠశాలలో 18 మంది విద్యార్థులు చదువుతున్నారు.పక్కా భవనం లేకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు పలుసార్లు ఉన్నతాధికారులను కోరినా ఫలితం లేకపోయింది. గ్రామస్తులంతా శ్రమదానంతో మట్టిగోడలు నిర్మించి రేకులతో షెడ్డు ఏర్పాటుచేసుకుని తాత్కాలికంగా వసతి సమస్య కల్పించారు. ఈ నేపథ్యంలో ఇదే పాఠశాలకు రెండేళ్ల క్రితం వచ్చిన ఉపాధ్యాయుడు ఎల్లేటి శ్రీనివాసరావు విద్యార్థులు ఎదుర్కొంటున్న వసతి సమస్యను గుర్తించారు.సమస్య పరిష్కరించేందుకు ఆయన సంకల్పించారు. ఇందుకు ఆయన స్నేహితులైన ఉపాధ్యాయుడు రాజేంద్ర తదితరులు ఆర్థిక సహకారం అందించారు. మొత్తంమీద భవన నిర్మాణానికి ఉపాధ్యాయుడు రూ.లక్ష వరకు నిధులు సమకూర్చారు. దీనికి గ్రామస్తులు శ్రమదానం జోడించారు. పాఠశాల భవనాన్ని నిర్మించి వసతులు కల్పించారు.ఆదర్శంగా తీసుకోవాలి ఈదులగొంది గ్రామంలో పాఠశాల సమస్య తెలుసుకున్న ఉపాధ్యాయుడు సొంత డబ్బులుతో పాఠశాల నిర్మించడం గొప్ప విషయం. అనేక ప్రాంతాల్లో ఈ సమస్య వెంటాడుతుంది. మిగతా ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకోవాలి. – ఈశ్వరరావు, ఎంఈవో–2 -
ఆదివాసీ గ్రామంలో పోలీసు సేవలు
గొలుగొండ: అల్లూరి పార్కుకు 8 కి.మీ. దూరంలో ఉన్న చుక్కపనుకులు ఆదివాసీ గిరిజన గ్రామాన్ని పోలీసులు సోమవారం కాలినడకన సందర్శించారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు, రూరల్ సీఐ రేవతమ్మ, కృష్ణదేవిపేట ఎస్ఐ తారకేశ్వర్రావు తదితరులు కాలినడనక సుమారు 3 గంటలపాటు నడిచి గ్రామానికి చేరుకున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి డీఎస్పీ వివరాలు తెలుసుకున్నారు. పోడు వ్యవసాయం చేసుకుంటూ 10 సంవత్సరాల నుంచి 14 కుటుంబాల వారం ఇక్కడ జీవిస్తున్నామని, ఏ కష్టం వచ్చినా కృష్ణదేవిపేట అడవుల గుండా నడిచివెళ్లాల్సిందేనన్నారు. వైఎస్సార్పీపీ ప్రభుత్వ హయాంలో సమకూర్చిన విద్యుత్ సదుపాయం తప్ప ఎటువంటి మౌలిక వసతులు లేవని గిరిజనులు తెలిపారు. సేవా కార్యక్రమాలు కృష్ణదేవిపేట హోమియో వైద్యాధికారి హేమలత గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు. గ్రామంలో మహిళలకు రెండు చీరలు, మగవారికి పంచెలు, గొడుగులు అందజేశారు. డీఎస్పీ శ్రీనివాసరావు యువతకు వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు. ఇక్కడి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని, ఏ కష్టం వచ్చినా కృష్ణదేవిపేట ఎస్ఐకి తెలియపరచాలన్నారు. దట్టమైన అడవిలో నడిచి వెళ్లిన అధికారులు -
గిరిజన సాధికారతే లక్ష్యం
ఐటీడీఏ పీఓ కట్టా సింహాచలం గంగవరం : జనభగిదరి అభియాన్ లక్ష్యం గిరిజన సాధికారత లక్ష్యమని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం అన్నారు. కుసుమరాయి గ్రామంలో జరిగిన ధర్తి భగిధరి అభియాన్ కార్యక్రమం అవగాహన సదస్సులో ఐటీడీఏ పీఓ కట్టా సింహాచలం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిర్సా ముండా 150 వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 16 నుండి 30వ తేదీ వరకు 15 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గిరిజన సంక్షేమశాఖ మిషన్ లక్ష్యాలను పీఓ వివరించారు. గిరిజన గ్రామాలకు రహదారులు, గ్రామాల్లో తాగునీటి సౌకర్యాలు, గృహ సముదాయాలు, విద్యా, వైద్య సదుపాయాలు వంటి మౌలిక సౌకర్యాలు కార్యచరణ చేయడం జరుగుతుందన్నారు. ఏజెన్సీలోని గిరిజన మారుమూల గ్రామాలకు మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ధర్తి ఆబ జన భగిదరి అభియాన్ ద్వారా గిరిజనులకు అవగాహన కల్పించినట్టు రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కట్టా సింహాచలం తెలిపారు. రంపచోడవరం డివిజన్లో 211 గ్రామాలు ముందుగా గుర్తించడం జరిగిందని అడ్డతీగల మండలంలో 7 గ్రామాలు, దేవిపట్నం మండలంలో 11 గ్రామాలు, గంగవరం మండలంలో 47 గ్రామాలు, మారేడుమిల్లి మండలంలో 40 గ్రామాలు, రాజమ్మంగి మండలంలో 14 గ్రామాలు, రంపచోడవరం మండలంలో 23 గ్రామాలు, వైరామవరం మండలంలో 67 గ్రామాలు మౌలిక సదుపాయాలు కల్పనకు ముందుగా గుర్తించినట్టు ఆయన తెలిపారు. అలాగే సబ్ ప్లాన్ ఏరియాలో రౌతులపూడి మండలంలో ఒక గ్రామం, శంఖవరం మండలంలో మూడు గ్రామాలు, ప్రత్తిపాడు మండలంలోని రెండు గ్రామాలు గుర్తించడం జరిగిందన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో, సిబ్బందితో కమిటీలు వేయడం జరిగిందని ఈ కమిటీలు గుర్తించిన గ్రామాల్లో వివిధ గిరిజన తెగలకు అవగాహన సదస్సుల ద్వారా అవగాహన కల్పించినట్టు చెప్పారు. ఈనెల 15వ తారీకు నుండి ఈనెల 30వ తారీకు వరకు అవగాహన సదస్సులలో అర్హులైన లబ్ధిదారులకు ఆధార్ కార్డులు, ఆయుష్మాన్ భారత్ కార్డులు, పీఎం ఆవాస్ యోజన పథకంలో పక్కా గృహాలు, పాఠశాలల నిర్మాణాలు, ఏకలవ్య మోడల్ పాఠశాలల నిర్మాణాలు, వైద్య ఆరోగ్య సేవలు అందించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని పీఓ అన్నారు. ఆముదాలబంద సర్పంచ్ పాయం రాజులమ్మ, ఎంపీడీవో వై.లక్ష్మణరావు, ఉపాధి ఏపీఓ ప్రకాశ్, డిప్యూటీ ఎంపీడీవో నరసింగరావు, వెలుగు ఏపీఎం షణ్ముఖరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రెండు బైక్లు ఢీకొని ఆరుగురు యువకులకు తీవ్రగాయాలు
వై.రామవరం : మండలంలోని పనసలపాలెం, చవిటిదిబ్బలు గ్రామాల మధ్య ప్రధాన రహదారిలో ఆదివారం రాత్రి ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్లు ఢీకొని ఆరుగురు యువకులు తీవ్రగాయాల పాలయ్యారు. ఎస్ఐ బి.రామకృష్ణ తెలిపిన వివరాలివి. మండలంలోని పి.యర్రగొండ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు బైక్పై పి.యర్రగొండ వైపు వెళుతుండగా అడ్డతీగలకు చెందిన మరో ముగ్గురు యువకులు వై.రామవరం నుంచి అడ్డతీగల వైపు వెళుతూ పనసలపాలెం గ్రామ శివారు ఒక టర్నింగులో ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. వారిని స్థానిక సీహెచ్సీకి తరలించగా ప్రాథమిక చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో, మెరుగైన వైద్యసేవల కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేశారు. ఆదివారం అర్ధరాత్రి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి 108లో తరలించారు. ఘటనపై ఎస్ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో ఎంఎల్సీ చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
90 మంది ఉపాధ్యాయులకు బదిలీలు
చింతపల్లి: మండలంలో వివిధ పాఠశాలలు నుంచి బదిలీపై వెళ్తున్న 90 మంది ఉపాధ్యాయులు ఆ ఉత్తర్వులను ఎంఈవో ప్రసాద్కు సోమవారం అందజేశారు. ఈ విద్యా సంవత్సంలో ఉపాధ్యాయ బదిలీల కౌన్సెలింగ్ ఇటీవల నిర్వహించారు. ఈ నెల 11 నుంచి 15 వరకూ ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ ఆన్లైన్ కౌన్సెలింగ్లో పాల్గొన్న వారికి ఆదివారం సాయంత్రానికి విద్యాశాఖ బదిలీ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు సోమవారం బదిలీ అయిన ఉపాధ్యాయులు ఎంఈవో వద్ద రిలీవ్ ఉత్తర్యులు తీసుకుని నూతన పాఠశాలలో చేరారు. ఈ మండలంలో విధులు నిర్వహిస్తున్న 37 మంది ఉపాధ్యాయులకు స్థాన చలనం కాగా మైదాన ప్రాంతం నుంచి 57 మంది ఉపాధ్యాయులు నూతనంగా మండలానికి వచ్చి విధుల్లో చేరారు. -
విద్యాలయాలా.. వ్యాపార కేంద్రాలా?
గుర్తింపు రద్దు చేయాలి నిబంధనలు పాటించని ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలపై అధికారులు చర్యలు తీసుకోవాలి. పాఠశాలల్లోనే అధిక ధరలకు పుస్తకాలు, యూనిఫాం విక్రయిస్తున్న విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలి. పుస్తక వ్యాపారాన్ని విద్యాశాఖ అధికారులు ఎందుకు కట్టడి చేయడం లేదో వారికే తెలియాలి. ప్రైవేటు విద్యా సంస్థల్లో పుస్తకాలు, అధిక ఫీజుల వసూళ్లపై చర్యలు తీసుకోవాలని డీఈవోకు ఫిర్యాదు చేశాం. అయినప్పటికీ స్పందన లేదు. –మైలపల్లి బాలాజీ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు చర్యలు తీసుకోవాలి జిల్లాలో ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల నిర్వాహకులు పలు రకాల ఫీజులతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నారు. ప్రతి ఏటా ఫీజులు ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించడంలేదు. ఫీజుల వివరాలను నోటీసు బోర్డుల్లో డిస్ ప్లే చేయడం లేదు. సామగ్రి కొనక తప్పని పరిస్థితిని సృష్టిస్తున్నారు. విద్యాశాఖ అధికారులు తక్షణమే తనిఖీలు చేసి నిబంధనలు పాటించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి. –బి.బాబ్జీ, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ● ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో అంతులేని దోపిడీ ● అధిక ధరలకు పుస్తకాలు, యూనిఫాం, సామగ్రి విక్రయాలు ● తడిసి మోపెడవుతున్న ఖర్చులు ● చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులుయలమంచిలి రూరల్: జిల్లాలో 500కు పైగా ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలు, కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న చిన్న చిన్న బడ్జెట్ స్కూళ్లు మినహాయిస్తే మిగతా అన్ని విద్యా సంస్థల్లో విద్యా వ్యాపారం మూడు పూవులు, ఆరు కాయలుగా సాగుతోంది. ఒకవైపు అధిక ఫీజులతో సతమతమవుతున్న మధ్యతరగతి వర్గాల వారు ఈ ఏడాది భారీగా పెంచిన పుస్తకాల ధరలతో షాకవుతున్నారు. కొన్ని కార్పొరేట్ సంస్థల యాజమాన్యాలు సొంత సిలబస్ పేరుతో పుస్తకాలు ముద్రించి విద్యార్థులకు పంపిణీ చేస్తున్నాయి. ప్రభుత్వం ముద్రించిన పుస్తకాల ధరలు వందల్లో ఉంటే, ప్రైవేటు విద్యాసంస్థలు ముద్రించిన పుస్తకాల ధరలు వేలల్లో ఉంటున్నాయి. జిల్లాలో అనకాపల్లి, యలమంచిలి, చోడవరం, అచ్యుతాపురం, పాయకరావుపేట, నర్సీపట్నం సహా మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీల్లో నిర్వహిస్తున్న పలు ప్రైవేటు పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు, ఇతర సామగ్రి అమ్ముతున్న నిర్వాహకులు 1 నుంచి 5 తరగతి వరకు పుస్తకాలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. 6 నుంచి 10 తరగతులకు రూ.7,500 నుంచి రూ.10,500 వరకు వసూలు చేస్తున్నారు. ఇక ఇంటర్మీడియట్కైతే ఈ దోపిడీ మ రింత ఎక్కువగా ఉంటోంది. నీట్, ఐఐటీ, ఐఏఎస్, ఒలింపియాడ్, సీ బ్యాచ్, ఎం బ్యాచ్, టెక్నో వంటి పేర్లతో అదనంగా వసూలు చేస్తున్నారు. బడి బస్సు ల ధరలనూ అడ్డగోలుగా పెంచేస్తున్నారని.. మరో గ త్యంతరం లేక వారు అడిగినంత చెల్లించాల్సి వస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూపర్ మార్కెట్ తరహాలో.. జిల్లాలో పాఠశాలలు పునఃప్రారంభం అయిన నేపథ్యంలో పేరొందిన ఐదు యాజమాన్యాలకు చెందిన కార్పొరేట్ విద్యాసంస్థల బ్రాంచీలన్నీ సూపర్ మార్కెట్లను తలపిస్తున్నాయి. విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలు, యూనిఫాం, ఇతర సామగ్రితో స్టోర్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు సంబంధించిన అన్ని వస్తువులూ తమ వద్దే కొనుగోలు చేయాలని హుకుం జారీ చేయడంతో గత్యంతరం లేక తల్లిదండ్రులు వారికి వేలాది రూపాయలు కుమ్మరిస్తున్నారు. ఇదంతా విద్యాశాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. రెండ్రోజుల క్రితం భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) నాయకులు యలమంచిలి కోర్టు పేటలో ఉన్న ఒక కార్పొరేట్ విద్యాసంస్థలోకి వెళ్లి అక్కడ బుక్ స్టోర్ను పరిశీలించారు. ఇది స్కూలా.. పుస్తకాల దుకాణమా అని నిలదీయడంతో అక్కడ మహిళా సిబ్బంది సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. అనకాపల్లి రెవెన్యూ కార్యాలయం ఎదురు వీధిలో ఉన్న ఒక కార్పొరేట్ కాలేజీ ఎదుట శనివారం ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆందోళనకు దిగారు. పుస్తకాలు విక్రయాలను అడ్డుకోవాలని, విద్యాసంస్థ దోపిడీని అరికట్టాలని నినాదాలు చేస్తూ విద్యాసంస్థ నేమ్ బోర్డులను ధ్వంసం చేశారు. ఇంత జరుగుతున్నా జిల్లా విద్యాశాఖ అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. -
అసనగిరి వాసులకు మళ్లీ అస్వస్థత
నాతవరం: కలుషిత ఆహారం ఘటనలో మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. సోమవారం నాతవరం పీహెచ్సీలో వైద్య సేవలు అందించారు. నాతవరం మండలం సుందరకోట పంచాయతీ శివారు అసనగిరి గ్రామానికి చెందిన 12 మంది, కాకినాడ జిల్లా రవతలపూడి మండలం రాఘవట్నం చెందిన 16 మంది కుటుంబ సభ్యులు కలిసి ఈ నెల 14న రాత్రి పాడేరు మోదకొండమ్మ దర్శనానికి వెళ్లారు. అక్కడ పులిహోర తిని మార్గమధ్యంలో పలు చోట్ల మంచినీరు తాగారు. ఈ నెల15న పాడేరులో అస్వస్థతకు గురవడంతో స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్సా అందించారు. ఆరోగ్యం కుదుటపడటంతో అదే రోజు రాత్రికి స్వగ్రామాలకు వచ్చేశారు. అసనగిరిలో వీరికి మరలా అస్వస్థత కావడంతో సోమవారం మధ్యాహ్నం ఆటోల్లో నాతవరం పీహెచ్సీకి తీసుకొచ్చారు. అక్కడ వైద్యాధికారులు ప్రసన్న, ఎం.రాజేష్నాయుడు వైద్య సేవలు అందించారు. వీరిలో బూటారి దుర్గా సాయిని మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ కేజీహెచ్కు తీసుకెళ్లారు. మిగతా వారిని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా వారు నిరాకరించారు. వైద్యాధికారి వెంటనే తహసీల్దార్, పోలీసులకు సమాచారం ఇచ్చారు. తహసీల్దార్ ఎ. వేణుగోపాల్, వైద్యాధికారి రాజేష్నాయుడు గిరిజనులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినప్పటికీ వారు అంగీకరించలేదు. దాంతో పోలీసులు బందోబస్తుతో రెండు అంబులైన్సులో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఏరియా ఆస్పత్రిలో అసనగిరి గ్రామానికి చెందిన పాండవుల గంగాభవాని, వెలగల వరలక్ష్మి, వెంకట్, కాసుబాబు, బూటారి ములసమ్మ, వెలగల వెంకయ్యమ్మ, రాజు, చల్లా లక్ష్మి, చల్లా ప్రసాద్, బూటారి అనిల్, బూటారి లక్ష్మి చికిత్స పొందుతున్నారని వైద్యాధికారులు తెలిపారు. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి వెళ్లేందుకు నిరాకరణ నాతవరం పీహెచ్సీ నుంచి పోలీసు బందోబస్తుతో తరలింపు -
విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి
● పీవో కట్టా సింహాచలం రంపచోడవరం: విద్యార్థుల ఆరోగ్యంపై ఉపాధ్యాయులు శ్రద్ధ చూపాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం అన్నారు. మండలంలోని నల్గొండ గిరిజన సంక్షేమ బాలిక ఆశ్రమ పాఠశాలను సోమవారం ఆయ న ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థినుల తో మాట్లాడి, పుస్తకాలు, ఇతర సామగ్రి అందా యా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు చేప్పే పాఠాలను అర్థం చేసుకుని, బాగా చదవాలన్నారు. పాఠశాల తెరిచిన తరువాత ఎంత మంది విద్యార్థినులు వచ్చారో ఆరా తీశారు.రైల్వేస్టేషన్లో గేట్ నంబర్ 3 మూసివేత తాటిచెట్లపాలెం: విశాఖపట్నం రైల్వేస్టేషన్లో చేపట్టనున్న అభివృద్ధి, నిర్మాణ పనుల నిమి త్తం గేట్ నంబర్ 3 ను సోమవారం నుంచి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ తెలిపారు. ఈ గేటు ద్వారా సౌత్ ఎండ్లో ఉన్న 6–8 ప్లాట్ఫామ్లకు కూడా రాకపోకలు సాగించే విధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. అయితే ఈ గేట్ ద్వారా ప్లాట్ఫాం 2, 3లకు మాత్రం రాకపోకలు యథావిధిగా కొనసాగుతాయి. మిగిలిన ప్లాట్ ఫామ్లకు చేరుకోవాల్సిన ప్రయాణికులు స్టేషన్లో ఉన్న ఇతర రెండు గేట్లను, లిఫ్ట్లను ఉపయోగించుకోవాలని సూచించారు. -
చంద్రబాబు పాలనలో రైతులకు తీరని అన్యాయం
రాజవొమ్మంగి : దేశానికి అన్నం పెట్టే రైతన్నకు సీఎం చంద్రబాబు నాయుడు పాలనలోతీరని అన్యాయం జరుగుతోందని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. మండలంలోని జడ్డంగి గ్రామంలో జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం పుస్తకాన్ని సోమవారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వ హయాంలో ఈ పాటికే అన్నదాతకు రైతుభరో సా పేరిట పెట్టుబడి సాయం అందేదని చెప్పా రు. జూన్ మొదటి వారంలోనే రైతు భరోసా కేంద్రాల ద్వారా 90 శాతం రాయితీపై నాణ్యమైన వరి విత్తనాలు రైతులకు పంపిణీ చేసేవారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో రైతులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారని తెలిపారు. మండలంలోని రైతు భరోసా కేంద్రాల ద్వారా నేటికీ రైతులకు సబ్సిడీపై వరి విత్తనాలు పంపిణీ చేయలేదన్నారు. రైతు ఇబ్బందులకు గురవుతున్నా అధికార యంత్రాగానికి చీమ కుట్టినట్టు కూడా లేదని తెలిపారు. ఏడాది పాలనలో అన్ని వర్గాల ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజమెత్తారు. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయకుండా హామీలను తుంగలో తొక్కారని చెప్పారు. జడ్డంగి సర్పంచ్ కొంగర మురళీకృష్ణ, వైస్ ఎంపీపీ జుర్రా రాజేశ్వరి, నాయకులు కామేష్, దుర్గాప్రసాద్, నాగులాపల్లి కుశరాజు, వీరబాబు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి -
విస్తృతంగా పోలీస్ తనిఖీలు
వై.రామవరం: సరిహద్దు ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారుల్లో, మండల కేంద్రం వై.రామవరంలో సోమవారం నిర్వహించిన సంతలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించా రు. సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలున్నాయన్న సమాచారంతో సీఐ నరసింహమూర్తి ఆదేశాల మేరకు స్థానిక ఎస్ఐ బి.రామకృష్ణ ఆధ్వర్యంలో డాగ్స్క్వాడ్తో తనిఖీలు జరిపారు. వారపు సంతకు సరిహద్దు ప్రాంతం నుంచి వచ్చివెళ్లే వాహనాలలో ప్రయాణిస్తున్న వారిని, వాటిలో రవాణా చేస్తున్న సామగ్రిని పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు, అపరిచితులపై నిఘా ఉంచారు. -
సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
● ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం రంపచోడవరం: అర్జీదారుల సమస్యల పరిష్కారాని కృషి చేయాలని స్థానిక ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం అధికారులను ఆదేశించారు. ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 71 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ సమస్యలను సత్వరం పరిష్కరించాలన్నారు. స్థానిక ఎస్టీ కాలనీలో పాత పద్ధతిలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ప్రాథమిక పాఠశాలను కొనసాగించాలని ముర్ల వెంకటేష్రెడ్డి, పల్లాల భాగ్యవతి, లోత స్వర్ణవిజయ అర్జీ అందజేశారు. వై. రామవరం మండలం బొబ్బిలోవ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మించాలని పల్లాల సోమిరెడ్డి, అందాల బొబ్బిల రెడ్డిలు విజ్ఞప్తి చేశారు. ఇదే మండలంలో ఎగువ ప్రాంతం బొడ్డగండి గ్రామంలో కమ్యూనిటీ భవనం నిర్మించాలని,మంగంపాడు పీహెచ్సీ వైద్యాధికారులకు, సిబ్బందికి, ఉపాధ్యాయులకు నివాస గృహాలు నిర్మించాలని సరం కోటఅబ్బాయిరెడ్డి పీవోకు అర్జీ అందజేశారు. -
హామీలను తుంగలో తొక్కిన చంద్రబాబు
అరకులోయటౌన్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలోతొక్కి సీఎం చంద్రబాబునాయు డు ప్రజలను వంచించారని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం పేరుతో ముద్రించిన పుస్తకాన్ని సోమవారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించాలన్న లక్ష్యంతో పనిచేశారన్నారు. ఇచ్చిన హామీలకు మించి మేలు చేశారని చెప్పారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తానని ఊదరగొట్టి, తరువాత విస్మరించారన్నారు. 87 లక్షల మందికి రూ.15వేల చొప్పున తల్లికి వందనం పథకం నిధులు మంజూరు చేయవలసి ఉండగా భారీగా కోత విధించారని చెప్పారు. పథకం అమలులో అవకతవకలు జరిగాయన్నారు.37 పేర్ల తో ఒక తల్లి ఖాతాలో, 17పేర్లతో మరో తల్లి ఖాతా లో సొమ్ము జమచేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్టీసెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, యూత్ వింగ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణిక్య, ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్, పార్టీ మండలాల అధ్యక్షులు స్వాభి రామూర్తి, కొర్రా సూర్యనారాయణ, అరకు నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు పూర్ణిమ, సర్పంచ్ గుమ్మ నాగేశ్వరరావు, నియోజకవర్గం ఎస్టీ సెల్ అధ్యక్షుడు రేగబోయిన స్వామి, పార్టీ మండలాల ఉపాధ్యక్షులు జి.ప్రకాష్, గణపతి, జిల్లా మేధావి విభాగం అధ్యక్షుడు కిల్లో రాజరమేష్, నాయకులు బాక సింహాచలం, శెట్టి మోహన్రావు, ఎస్.నందీశ్వరరావు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం -
పునరావాసం అవస్థల మయం
తొందరగా తేల్చాలి పునరావాసం విషయంలో అధికారులు ఏదో ఒకటి తొందరగా తేల్చితే బాగుంటుంది. ఇప్పటికే మూడు ప్రాంతాలను చూపించారు. పరిహారం ఇవ్వడంతో పాటు పునరావాసం త్వరితగతిన చేపడితే మంచిది. సమావేశాలు, స్థలాల పరిశీలనలతో కాలయాపన జరుగుతోంది. – బొజ్జా పోతురాజు, చింతూరు వరదలకు ముందే పునరావాసం కల్పిస్తారనుకున్నా ప్రతి ఏడాది వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మా గ్రామాన్ని ఫేజ్1–బిలో కలిపారు. కాగా ఈ ఏడాది వరదలకు ముందే మాకు పరిహారం అందచేసి పునరావాసం కల్పిస్తారని అనుకున్నా. కాగా ఇంతవరకు స్థలాల ఎంపికే ఇంకా ఒక కొలిక్కిరాలేదు. ఈ ఏడాది కూడా మాకు వరదముప్పు తప్పేలాలేదు. – నరెడ్ల ఉమామహేశ్వరరావు, చింతూరు తిరువూరు ప్రాంతాన్ని కూడా చూపించాలి అధికారులు ముందుగా మాటిచ్చిన ప్రకారం తిరువూరు ప్రాంతాన్ని కూడా నిర్వాసితులకు చూపించాలి. ఇప్పటికి మూడు ప్రాంతాలు చూపించారు. తిరువూరు ప్రాంతాన్ని కూడా చూసిన అనంతరం పునరావాసానికి ఏది బాగుంటుందో పరిశీలించి అధికారులను మా నిర్ణయం తెలియచేస్తాం. – పయ్యాల నాగేశ్వరరావు, చింతూరు పోలవరం నిర్వాసితులు పునరావాసం కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.. ప్రభుత్వం మాత్రం వారితో దోబూచులాడుతోంది. స్థలాల పరిశీలన ముందుకుసాగడం లేదు. నిర్వాసితులు కోరుకుంటున్న ప్రాంతాలను చూపించడంలో అధికారులు కాలయాపనచేస్తున్నారు. దీంతో నిర్వాసితులు తీవ్ర నిరాశనిస్పృహలకు గురవుతున్నారు. ఈ ఏడాది కూడా వరద ముప్పు తప్పేలా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు త్వరితగతిన పనులు పూర్తి చేసి, తమను ముంపుముప్పు నుంచి తప్పించాలని వేడుకొంటున్నారు. చింతూరు: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ముంపునకు గురవుతున్న తమకు పునరావాసం కల్పించడంపై ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని నిర్వాసితులు వాపోతున్నారు. స్థలాల పరిశీలనతోనే పోలవరం అధికారులు కాలయాపన చేస్తున్నారే తప్ప పునరావాస ప్రక్రియ పూర్తి స్థాయిలో ముందుకు సాగడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది వరదలకు ముందే పునరావాసం కల్పిస్తారని ఎంతో ఆశతో ఎదురుచూసిన తమకు నిరాశే మిగిలిందని ఆందోళన చెందుతున్నారు. స్థలాల ఎంపికపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడంతో తమకు ఎప్పుడు పునరావాస కల్పిస్తారో తెలియడం లేదని నిర్వాసితులు అంటున్నారు. ఫేజ్1–బిలో 32 గ్రామాలకు.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఫేజ్1–బిలో అదనంగా 32 గ్రామాలను చేర్చారు. కూనవరం మండలంలో 3,983 కుటుంబాలు, వీఆర్పురం మండలంలో 5,141 కుటుంబాలు, చింతూరు మండలంలో 3,380 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. ఇప్పటికే ఆయా గ్రామాల్లో అవార్డు ఆర్అండ్ఆర్ గ్రామసభలు పూర్తిచేసిన అధికారులు చివరగా నిర్వహించే డ్రాఫ్ట్ ఆర్అండ్ఆర్ గ్రామసభలకు సన్నద్ధమవుతున్నారు. కాగా నిర్వాసితులకు పరిహారం అందించే విషయంపై పెద్దగా ఇబ్బందులు లేకున్నా పునరావాసం క ల్పించే విషయంలో స్థలాల ఎంపిక మాత్రం అధికారులకు సవాల్గా మారుతోంది. 32 గ్రామాల్లోని గిరిజనులకు మరో ప్రాంతంలోని షెడ్యూల్ ఏరియాలో, గిరిజనేతరులకు నాన్ షెడ్యూల్ ఏరియాలో పునరావాసం కల్పించాల్సి ఉంది. దీనికోసం ఆయా ప్రాంతాల్లో స్థలాలు ఎంపికచేసి కాలనీల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. గిరిజనులకు ఇలా.. గిరిజనులకు ముందుగా ఎటపాక, కూనవరం మండలాల్లో గతంలో నిర్మించిన కాలనీల్లో పునరావాసం కల్పించాలని భావించినా వారికి ఇవ్వాల్సిన భూమి కి భూమి విషయంలో సాగుభూముల లభ్యత లేకపోవడంతో ఈ ప్రాంతాల్లో పునరావాస ప్రక్రియను విరమించుకున్నారు. దీంతో వారికి రంపచోడవరం డివిజన్లోని గంగవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి ప్రాంతాల్లో పునరావాసం కల్పించేందుకు అధికారులు స్థలాలను పరిశీలించారు. గిరిజనేతరులకు.. 32 గ్రామాల్లోని గిరిజనేతరులకు నాన్ షెడ్యూల్ ఏరియాలో పునరావాసం కల్పించేందుకు గాను గతంలో అధికారులు ఏలూరు జిల్లా తాడువాయి, తూర్పుగోదావరి జిల్లా యాదవోలు ప్రాంతాలను చూపించారు. కొంతమంది తాడువాయి ప్రాంతం వైపు మొగ్గుచూపారు. కాగా తమకు తాడువాయితో పాటు తూర్పు గోదావరి జిల్లా గోకవరం సమీపంలోని కృష్ణునిపాలెం, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ప్రాంతాల్లో పునరావాసం కల్పించాలని చాలామంది గిరిజనేతర నిర్వాసితులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఇటీవల నిర్వాసితులతో నిర్వహించిన అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో గిరిజనేతరులకు గోకవరం సమీపంలోని సూదికొండ, మల్లవరంతో పాటు తాడువాయి, తిరువూరు ప్రాంతా ల్లో స్థలాలు చూపిస్తామని అధికారులు తెలిపారు. దీనిలోభాగంగా అధికారులు బస్సులను ఏర్పాటుచేసి గిరిజనేతర నిర్వాసితులకు కేవలం సూదికొండ, తాడువాయి ప్రాంతాలను మాత్రమే చూపించారు. ఇతర ప్రాంతాలు కూడా చూపించాలని డిమాండ్ తమకు నాలుగు ప్రాంతాలు చూపిస్తామని చెప్పిన అధికారులు సూదికొండ, తాడువాయి ప్రాంతాలను మాత్రమే చూపించారని, తమకు ఇచ్చిన మాట ప్రకారం ఇతర ప్రాంతాలను కూడా చూపించాలని, వాటిలో తమకు నచ్చిన ప్రాంతాన్ని ఎంచుకుంటామని గిరిజనేతర నిర్వాసితులు అంటున్నారు. కాగా 32 గ్రామాల్లోని గిరిజనేతర నిర్వాసితుల్లో అత్యధికంగా తిరువూరు ప్రాంతంపె ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే తిరువూరు ప్రాంతంలో స్థలాల లభ్యతపై అధికారులు స్పష్టమైన వైఖరి చెప్పకపోవడంతో కొంతమంది నిర్వాసితులు స్వయంగా తిరువూరు ప్రాంతానికి వెళ్లి పునరావాసానికి యోగ్యంగా ఉండే భూములను పరిశీలించి అక్కడి రైతులతో మాట్లాడుతున్నారు. తిరువూరు సమీపంలోని అంజనాపురం, జల్లికుంట, పోలిశెట్టిపాడు, కుమ్మరికుంట్ల తదితర ప్రాంతాల్లో మంచి భూములు ఉన్నాయని, విక్రయించేందుకు రైతులు కూడా సిద్ధంగా ఉన్నారని, ఆ భూములను ప్రభుత్వం కొనుగోలు చేసి తమకు అక్కడ పునరావాస కల్పించాలని గిరిజనేతర నిర్వాసితులు కోరుతున్నారు. ఈ విషయంపై ఆర్అండ్ఆర్ అధికారులను కలిసి తమకు తిరువూరు ప్రాంతంలో పునరావాసం కల్పించేలా చర్యలు చేపట్టాలని కోరేందుకు వారు సిద్ధమవుతున్నారు. స్థలాలు చూపడంలో తీవ్ర జాప్యం ఆవేదన వ్యక్తం చేస్తున్న పోలవరం బాధితులు నిర్వాసితులు కోరుకున్న ప్రాంతాల గురించి పట్టించుకోని అధికారులు ఈ ఏడాది కూడా వరద ముప్పు తప్పదని ఆందోళన -
తీర ప్రాంతాల్లో సండే సందడి
పరవాడ (అనకాపల్లి): ముత్యాలమ్మపాలెం, తిక్కవానిపాలెం తీర ప్రాంతాలు పర్యాటకులతో సందడిగా మారాయి. అనకాపల్లి, విశాఖ ఉమ్మడి జిల్లాల నలుమూలల నుంచి సందర్శకులు తరలివచ్చారు. తీర ప్రాంతాలకు చేరుకున్న సందర్శకులు తిక్కవానిపాలెంలో సముద్ర తీరంలో నిర్మించిన ఎన్టీపీసీ జెట్టీదిగువన విడిదిచేసి తీరంలో సహజ సిద్ధంగా వెలసిన ఇసుక దిబ్బలు, పచ్చిక బయళ్లలో ఆట పాటలతో సరదాగా గడిపారు. వెంట తెచ్చుకున్న అల్పాహారాలు, బిరియానీలతో తీరంలోని జీడి తోటలు, విడిది గొడుగుల కింద సహపంక్తి భోజనాలు చేశారు. సాయం సంధ్య వరకు సముద్ర స్నానాలు చేసి, అలలతో సయ్యాటలాడారు. చీకటి పడ్డ వేళ ఆనందంగా తిరుగుముఖంపట్టారు. -
జెండా కొండ అందాలు అద్భుతం
హుకుంపేట: అత్యంత ఎత్తయిన సీతమ్మ పర్వతం, జెండాకొండ అందాలు అద్బుతమని కలెక్టర్ దినేష్కుమార్ అన్నారు. ఆదివారం ఆయన మండలంలోని ఆయా ప్రాంతాలను కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సందర్శించారు. మండలంలోని తడిగిరి పంచాయతీ బరెంగ్బంద వరకు వాహనంలో వెళ్లారు. అక్కడి నుంచి సీతమ్మ పర్వతానికి మూడు కిలోమీటర్ల మేర ప్రకృతి అందాలను తిలకిస్తూ కాలినడకన వెళ్లారు. చల్లటి వాతావరణంలో కొంతసేపు గడిపాడు. తేనెపట్టు గుహలు, థింసారాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీతమ్మ పర్వతాన్ని పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై ప్రత్యేకదృష్టి సారిస్తామన్నారు. అనంతరం కొండ దిగువనున్న బరెంగ్బందలో ఆల్పహారంగా రాగి జావను గిరిజనులతో కలిసి తాగారు. తడిగిరి నుంచి బరెంగ్బంద వరకు అధ్వానంగా మార్గం ఉండటంపై ఆయన స్పందించారు. రోడ్డు మంజూరుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కూడా రాజుబాబు, సర్పంచ్ పెనుమల రంజిత్కుమార్, జిల్లా వ్యవసాయ సలహామండలి మాజీ సభ్యుడు ముత్యంగి విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. కలెక్టర్ దినేష్ కుమార్ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సందర్శన -
కలుషిత ఆహారం తిని14 మంది భక్తులకుతీవ్ర అస్వస్థత
● పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలింపు ● ఆరోగ్యం మెరుగుపడటంతో డిశ్చార్జ్ పాడేరు : కలుషిత ఆహారం తిన్న 14 మంది భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం పాడేరు ఘాట్లో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా నాతవరం ప్రాంతానికి చెందిన 20 మంది భక్తులు ఆదివారం పాడేరు ఘాట్లోని మోదకొండమ్మ అమ్మవారి పాదాలను దర్శించుకునేందుకు వచ్చారు. ఇంటివద్ద తయారుచేసి తీసుకువచ్చిన పులిహోర తినడంతో 14 మంది అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులతో బాధపడుతున్న వారిని హుటాహుటిన స్థానిక సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. వెంటనే వారికి వైద్యసేవలు కల్పించారు. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో 14 మందిని డిశ్చార్జ్ చేసినట్టు డీఎంహెచ్వో డాక్టర్ జమాల్బాషా తెలిపారు. -
చెస్ పోటీల్లో విజేతలు కృష్ణ, సాత్విక
విశాఖ స్పోర్ట్స్: విశాఖ జిల్లా అండర్–15 చదరంగం పోటీల్లో కృష్ణ, సాత్విక విజేతలుగా నిలిచారు. ఆల్ విశాఖ చెస్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జట్టు ఎంపిక పోటీలు నిర్వహించగా ఓపెన్లో 146 మంది, బాలికలు 59 మంది పాల్గొన్నారు. ఓపెన్లో ఏడు రౌండ్లు నిర్వహించగా బాలికలకు ఆరు రౌండ్లు నిర్వహించారు. ఓపెన్లో పి.కృష్ణ ఆరున్నర పాయింట్లతో విజేతగా నిలవగా ఆరేసి పాయింట్లతో ఉద్ధవ్ లక్ష్మణ్, పి.అనిరుథ్ తర్వాత స్థానాల్లో నిలిచారు. బాలికల్లో పి.సాత్విక ఆరు పాయింట్లతో విజేతగా నిలవగా ఎం.దివ్యవర్షిణి, అఫ్ణీన్ ఐదేసి పాయింట్లతో తర్వాత స్థానాల్లో నిలిచారు. తొలి రెండు స్థానాల్లో నిలిచిన కృష్ణ, ఉద్ధవ్, సాత్విక, దివ్య జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. అంతర్ జిల్లాల అండర్–15 చదరంగం పోటీలు జూలై 12,13వ తేదీల్లో విశాఖలోనే జరగనున్నాయి. -
ఊపిరి
అరుదైన ప్రాణులకుచుక్కల జింక పిల్ల అడవి కుక్క పిల్లలు అంతరించిపోతున్న జాతుల విశేషాలివి.. ఈ జూలో పునరుత్పత్తి అవుతున్న కొన్ని ముఖ్యమైన అంతరించిపోతున్న జాతులు, వాటి ప్రత్యేకతలు ఇప్పుడు తెలుసుకుందాం.. ● అడవి కుక్కలు(ఆసియాటిక్ వైల్డ్ డాగ్స్): ఇవి వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లోని షెడ్యూల్–1 కిందకు వస్తాయి. ఇందిరా గాంధీ జూ పార్కులో వీటి పునరుత్పత్తి కేంద్రం ఉంది. వీటి ఎత్తు సుమారు 50 సెం.మీ., శరీరం పొడవు 90 సెం.మీ., తోక పొడవు 40–45 సెం.మీ. ఉంటుంది. ● కృష్ణ జింక(బ్లాక్బక్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువుగా గుర్తింపు పొందిన ఈ జింకలు, తమ మెలితిరిగిన కొమ్ములతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కృష్ణ జింక షెడ్యూల్–1 జాబితాలో ఉంది ● మూషిక జింక(మౌస్ డీర్): షెడ్యూల్–1 జాబితాలోని ఈ జింక శరీరం పొడవు 50–60 సెం.మీ., బరువు 3–4 కిలోలు ఉంటుంది. ప్రపంచంలోని అతి చిన్న జింక జాతులలో ఇది ఒకటి. చూడటానికి చిన్నగా, సున్నితంగా ఉండే ఈ జీవి కూడా షెడ్యూల్–1 జాబితాలో ఉంది. ● కనుజు : ఇది కూడా షెడ్యూల్–1 జాబితాలో ఉంది. మగ కనుజులకు చెట్ల కొమ్మల మాదిరిగా ఉండే కొమ్ములు 3.5 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. ● నీలి ఎద్దు( నీల్గై): ఆసియా జింక జాతులలో అతి పెద్దదైన నీల్గై షెడ్యూల్–2 జాబితాలో ఉంది. దీని గొంతు భాగం తెల్లగా ఉంటుంది. మగ నీల్గైకి 13 సెం.మీ. జుట్టు ఉంటుంది. ఆడవి 200 కిలోలు, మగవి 250 కిలోల వరకు బరువు వరకు పెరుగుతాయి. ● రెడ్ నెక్డ్ వాలబీ: ఈ జాతి జీవుల పునరుత్పత్తి ఎంతో ఆసక్తికరం. రెడ్నెక్డ్ వాలబీ గర్భం దాల్చిన 30 రోజుల్లో పిల్లకు జన్మిస్తుంది. తర్వాత ఆ పిల్ల తల్లి పొట్ట కింద సంచిలో సుమారు 7 నెలల పాటు పెరిగి, తల్లి పాలు తాగుతుంది. 12 నెలల తర్వాత స్వతంత్రంగా జీవించడం మొదలుపెడుతుంది. ఆరిలోవ: వాతావరణ కాలుష్యం, వేటగాళ్ల ఉచ్చులు, క్రూర మృగాల దాడి, మారుతున్న పర్యావరణ పరిస్థితుల కారణంగా ఎన్నో వన్యప్రాణి జాతులు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. ఒకప్పుడు సజీవంగా ఉన్న జాతులు నేటి తరానికి టీవీల్లో, పుస్తకాల్లో మాత్రమే కనిపించే పరిస్థితి నెలకొంది. వాటి ఉనికే ప్రశ్నార్థకమవుతున్న ఈ తరుణంలో నగరంలోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్కు ఒక ఆశాకిరణంగా నిలుస్తోంది. అంతరించిపోతున్న అరుదైన వన్యప్రాణులకు పునరుత్పత్తి కేంద్రంగా మారి, వాటి వంశాన్ని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడి సంరక్షకుల కృషితో గత ఎనిమిది నెలల్లోనే 12 అంతరించిపోతున్న జాతులకు చెందిన 46 పిల్లలు ఊపిరిపోసుకున్నాయి. వన్యప్రాణి సంరక్షణలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాయి. రింగ్టైల్డ్ లెమూర్స్ 8 నెలలు.. 46 బుల్లి ప్రాణులు గడిచిన ఎనిమిది నెలలకాలంలో ఇందిరా గాంధీ జూ పార్కులో 12 రకాల వన్యప్రాణులకు 46 పిల్లలు పుట్టాయి. ఇందులో అడవి కుక్కలు–14, కృష్ణ జింక (రాష్ట్ర జంతువు) –9, చుక్కల జింక–7, కనుజు–5, నీల్ గై–3, బార్కింగ్ డీర్–2, మౌస్ డీర్–1, బెంగాల్ ఫాక్స్–1, ఇండియన్ గ్రే వోల్ఫ్–1, అడవి దున్న (బైసన్)–1, రెడ్–నెక్డ్ వాలబీ–1, రింగ్టైల్డ్ లెమూర్–1 ఉన్నాయి. అరుదైన జీవులకు అభయం విశాఖ జూ పార్కు ఇప్పుడు కేవలం జంతు ప్రదర్శనశాల మాత్రమే కాదు.. అంతరించిపోతున్న జీవజాతులకు ఒక సురక్షితమైన ఆవాసం, పునరుత్పత్తి కేంద్రం. వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972 ప్రకారం షెడ్యూల్–1 జాబితాలోని అనేక జీవులు ఇక్కడ విజయవంతంగా తమ సంతతిని పెంచుకుంటున్నాయి. జింక పిల్లలు, అడవి దున్నలు, అడవి కుక్కల పిల్లలు, నీల్గై, రెడ్నెక్డ్ వాలబీ, బెంగాల్ ఫాక్స్, ఇండియన్ గ్రే వోల్ఫ్, రింగ్టైల్డ్ లెమూర్స్ వంటి జాతులకు చెందిన చిట్టి ప్రాణులు తమ ఎన్క్లోజర్లలో తల్లుల వెంట ఉత్సాహంగా తిరుగుతూ సందర్శకులను అలరిస్తున్నాయి. ఈ అద్భుతమైన దృశ్యాలు జూకి వచ్చే వారికి కనువిందు చేయడమే కాకుండా, అంతరించిపోతున్న జాతులను పరిరక్షించడం ఎంత అవసరమో తెలియజేస్తున్నాయి. వెటర్నరీ వైద్యులు, యానిమల్ కీపర్ల నిరంతర పర్యవేక్షణలో ఈ ఘనత సాధ్యమైంది. తల్లి పాలు తాగుతున్న బార్కింగ్ డీర్ పిల్ల వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు జూ పార్కులో వన్య ప్రాణుల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాం. ఇటీవల పునరుత్పత్తి అయిన పలు రకాల జాతుల పిల్లలను ఇక్కడ సంరక్షకులు, జూ వెటర్నరీ వైద్యులు, సిబ్బంది, యానిమల్ కీపర్లు ప్రత్యేక శ్రద్ధతో సంరక్షిస్తున్నారు. అంతరించిపోతున్న జాతుల సంతతి జూలో గణనీయంగా పెరుగుతోంది. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం వీటికి ఎలాంటి హాని కలిగించినా చట్టరీత్యా నేరమవుతుంది. – జి.మంగమ్మ, జూ క్యూరేటర్ ●తల్లితో కనుజు పిల్ల -
మా టీచర్ భవనం నిర్మించారు
మాకు పాఠశాల భవనం లేకపోవడం వల్ల గతంలో చాలా ఇబ్బందులు పడ్డాం. మా తల్లిదండ్రులు నిర్మించిన మట్టిగోడ షెడ్డులో చదువుకునేవాళ్లం. మా సమస్య గుర్తించిన ఉపాధ్యాయుడు భవనం కట్టించడం ఎంతో ఆనందంగా ఉంది. – మర్రి లావణ్య, విద్యార్థిని రుణపడి ఉంటాం మా గ్రామంలో పాఠశాలకు భవనం లేకపోయినప్పటికీ మా సమస్యను గుర్తించి సొంత డబ్బులతో భవనం నిర్మించడం గొప్ప విషయం. మా పిల్లల భవిష్యత్కోసం ఆలోచన పెట్టిన మా ఉపాధ్యాయుడికి రుణపడి ఉంటాం. – మర్రి శైలు, విద్యార్థి తల్లి, ఈదులగొంది అవస్థలు బాధించాయి గ్రామంలో విద్యార్థులు, తల్లిదండ్రులు పడుతున్న బాధను కళ్లారా చూశా. పాఠశాలకు భవనం లేకపోవడంతో ఎంతో బాధించింది. తనవంతు సాయంగా నిర్మించాలని సంకల్పించా. స్నేహితులు సహకారం అందించారు. – ఎల్లేటి శ్రీనివాసరావు, ఉపాధ్యాయుడు ఆదర్శంగా తీసుకోవాలి ఈదులగొంది గ్రామంలో పాఠశాల సమస్య తెలుసుకున్న ఉపాధ్యాయుడు సొంత డబ్బులుతో పాఠశాల నిర్మించడం గొప్ప విషయం. అనేక ప్రాంతాల్లో ఈ సమస్య వెంటాడుతుంది. మిగతా ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకోవాలి. – ఈశ్వరరావు, ఎంఈవో–2 -
పథకాలు అందరికీ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి
డుంబ్రిగుడ(హుకుంపేట): సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అధికారులకు సూచించారు. మండలంలోని కొంతిలి గ్రామంలో నిర్వహించిన జన్ జాతీయ గౌరవ్ వర్ష్ వేడుకల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని, ప్రభుత్వం ద్వారా అందే ప్రతి సంక్షేమ పథకాలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందేలా కృషి చేయాలన్నారు. చాలా మంది గిరిజనులకు అక్షరాస్యత లేకపోవడంతో సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారన్నారు. అలాంటి వారిని గుర్తించి సంక్షేమ పథకాలు అందేలా అధికారులు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఆదేశించారు. తల్లికి వందనం పథకానికి చాలా మందికి అర్హత ఉన్నా అందకపోవడానికి కారణం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా అధికారులు కృషి చేయాలని సూచించారు. కొయితిలి, హుకుంపేట సర్పంచ్లు రేగం రమేష్, పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు.అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం -
పెళ్లయిన నెల రోజులకే మృత్యు ఒడికి..
రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల దుర్మరణం గాజువాక: వివాహమైన నెల రోజులకే ఒక జంట మృత్యు ఒడికి చేరింది. కాళ్ల పారాణి ఆరకముందే విధి ప్రమాదరూపంలో కబళించింది. నగరంలో సరదాగా షికారు చేసి వద్దామనుకొని బయల్దేరిన కొత్త జంట రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. గాజువాక ట్రాఫిక్ పోలీసులు అందించిన వివరాలివి.. కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన జొన్నాడ సాయి(27), పెదగంట్యాడ మండలం గంగవరం గ్రామానికి చెందిన శాలిని (25) గాజువాకలోని యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్లో ల్యాబ్ టెక్నీషియన్లుగా పని చేస్తున్నారు. వీరిద్దరూ ప్రేమించుకొని నెల రోజుల కిందట పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం శ్రీహరిపురంలో ఒక అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం ల్యాబ్కు సెలవు కావడంతో షికారు కోసం నగరంలోకి వెళ్లేందుకు ద్విచక్రవాహనంపై బయల్దేరారు. ములగాడ మీదుగా పోర్టు రోడ్లోని మారుతీ సర్కిల్ వద్ద వెనుకనే వస్తున్న ఒక ట్రాలర్ వారిని ఢీకొని ఈడ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో సాయి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. తీవ్ర గాయాలపాలైన శాలినిని షీలానగర్లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స ప్రారంభించే సమయానికి మృతి చెందిందని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టు నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు సీఐ కోటేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఇదే రోడ్డులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయిల్ ట్యాంకర్ కింద పడి ఇద్దరు నేవీ వైద్యులు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.. 24 గంటల వ్యవధిలో నలుగురు మృత్యువాత పడటం.. వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. -
అడవిగేదె హల్చల్
● బస్సుకు అడ్డంగా ఉండటంతోఆందోళనకు గురైన ప్రయాణికులు సీలేరు: అంతర్ రాష్ట్ర రహదారిలో సప్పర్ల రెయిన్గేజ్ వద్ద ఆదివారం తెల్లవారుజామున అడవిదున్న హల్చల్ చేసింది. భఽధ్రాచలం నుంచి సీలేరు మీదుగా విశాఖపట్నం వెళ్లే ఆర్టీసీ బస్సుకు అడ్డంగా ఉండడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రోడ్డుపై సుమారు ఐదు నిమిషాలు ఉండటంతో ఫొటోలు, వీడియోలు తీశారు. ఇదే ప్రదేశంలో ఐదు నెలల క్రితం బెంగాల్ టైగర్ రోడ్డు దాటుతూ కనిపించడంతో ఈ ప్రాంత గిరిజనులు ఇప్పటికే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి అడవి దున్న ప్రత్యక్షమైంది. ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అడవి జంతువులకు ఎటువంటి హాని కలిగించవద్దని అటవీ సిబ్బంది సూచించారు. -
గల్లంతైన పర్యాటకుడి కోసం గాలింపు
రెండో రోజు లభ్యం కాని ఆచూకీముంచంగిపుట్టు: ఆంధ్రా– ఒడిశా సరిహద్దు ప్రాంతమైన డుడుమ జలపాతంలో శనివారం గల్లంతైన పర్యాటకుడి ఆచూకీ రెండో రోజు ఆదివారం కూడా లభ్యం కాలేదు. డుడుమ సందర్శనకు వచ్చిన కోల్కతాకు చెందిన పర్యాటకుడు అనిమేస్దాస్ (27) శనివారం జలపాతంలో ప్రమాదవశాత్తూ పడి గల్లంతవడం తెలిసిందే. ఆదివారం ఉదయం నుంచి లంతాపుట్టుకు చెందిన అగ్నిమాపక సిబ్బంది, కొర్రాపుట్టుకు చెందిన ఓడీఆర్ఏఎఫ్ బృందం, మాచ్ఖండ్ ఎస్ఐ శుక్రమాడి ఆధ్వర్యంలో విస్తృతంగా గాలింపు చేపట్టారు. జలపాతం దిగువ భాగంలో సోరంగాలు ఉండడం వల్ల గాలింపునకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పర్యాటకుడు లోపల ఇరుక్కుపోయి ఉండొచ్చునని మాచ్ఖండ్ ఎస్ఐ శుక్రమాడి అభిప్రాయపడ్డారు. అనిమేస్దాస్ ఆచూకీ లభ్యంకాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. -
‘ప్రధాని’ కార్యక్రమానికి పైసల్లేవ్.!
● ఆర్భాటమే గానీ..నిధులివ్వని కూటమి సర్కార్ ● 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం ● ప్రధాని మోదీ, ఇతర ప్రముఖుల రాక ● ఈ వేడుకల నిర్వహణకు రూ.75 కోట్ల్ల అంచనా ● యోగా భారమంతా స్థానిక సంస్థలకే! మహారాణిపేట: జిల్లాలో ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని(యోగాంధ్ర) అంగరంగ వైభవంగా, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లక్ష్యంగా నిర్వహించాలని నిర్ణయించినా.. అందుకు అవసరమైన నిధుల కోసం అధికార యంత్రాంగం తీవ్రంగా కుస్తీ పడుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి మరో ఐదు రోజులే సమయం ఉన్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని తెలుస్తోంది. రూ. 75 కోట్ల అంచనా.. సాయం సున్నా! ఆర్.కె.బీచ్ నుంచి భీమిలి వరకు ఏకంగా ఐదు లక్షల మందితో యోగాసనాలు చేయించి గిన్నిస్ రికార్డు నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కార్యక్రమ నిర్వహణ మీద సమీక్షలు, ప్రాంతాల పర్యటనలు జరిగాయి. ఈ కార్యక్రమానికి సుమారు రూ.75 కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే ఇంతటి భారీ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక చేయూత అందలేన్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఒక లేఖ పంపినప్పటికీ, ఆ నిధులు మాత్రం ఇప్పటికీ విడుదల కాలేదని సమాచారం. దీంతో మొత్తం ఆర్థిక భారం జీవీఎంసీ, వీఎంఆర్డీలపై పడుతోంది. బీచ్రోడ్డులో 500 కంపార్ట్మెంట్ల నిర్మాణం వంటి పనులను ఈ సంస్థలు తమ నిధుల నుంచే చేపడుతున్నాయి. మొత్తానికి యోగా భారమంతా స్థానిక సంస్థలపైనే పడుతోంది.. కేంద్రం ఇచ్చినా.. రాష్ట్రం చేయూతనివ్వదే.. యోగాలో పాల్గొనే వారికి కేంద్ర ప్రభుత్వం మ్యాట్లు, టీ షర్ట్స్ ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. ముందు అనుకున్న ప్రకారం రెండు లక్షల మ్యాట్లు, టీ–షర్టులు పంపింది. ప్రస్తుతం వాటి డీకోడింగ్ జరుగుతోంది. అయితే పాల్గొనే వారి సంఖ్యను ఐదు లక్షలకు పెంచడంతో మరో మూడు లక్షల మ్యాట్లు, టీ–షర్టులు అదనంగా అవసరమయ్యాయి. ఒక్కో మ్యాట్ ఖరీదు రూ.340 చొప్పున ఈ మూడు లక్షల మ్యాట్ల కొనుగోలుకే సుమారు రూ.10 కోట్లు ఖర్చవుతుంది. దీనికి తోడు కార్యక్రమంలో పాల్గొనే ఐదు లక్షల మందికి అందించే స్నాక్స్ ప్యాకెట్(కేక్, బిస్కెట్, అరటిపండు, వాటర్ బాటిల్, గ్లూకోజ్ ప్యాకెట్) కోసం మరో రూ.5 కోట్లు అవసరం. ఈ అదనపు భారాన్ని ఎవరు మోయాలన్న దానిపై స్పష్టత కొరవడింది. వీటికి అదనంగా ప్రధాని, వీఐపీలు, వీవీఐపీల బస, ప్రయాణ ఏర్పాట్లు, వేదికల నిర్మాణం వంటి ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ప్రతిష్టాత్మక కార్యక్రమానికి సమయం దగ్గర పడుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో, ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఎలా విజయవంతం చేయాలా అని జిల్లా యంత్రాంగం తలలు పట్టుకుంటోంది. -
ప్రశ్నిస్తేనే అవినీతి తగ్గుముఖం
అనకాపల్లి: బాధ్యత, విషయ పరిజ్ఞానంతో సరైన ప్రశ్నలు సంధిస్తే ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి, అధికార దుర్వినియోగం తగ్గుతుందని ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి రాష్ట్ర సలహా కమిటీ సభ్యుడు, ఆర్టీఐ జిల్లా కమిటీ సభ్యుడు కాండ్రేగుల వెంకటరమణ తెలిపారు. గ్రీన్ క్లబ్ 11వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం స్థానిక గవరపాలెం గౌరీ గ్రంథాలయంలో ‘సామాజిక సమస్యలు – పరిష్కార మార్గాలు – ఆన్లైన్ వేదికలు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సేవల్లో తీవ్ర జాప్యం, అవినీతి, అధికార దుర్వినియోగం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని వాపోయారు. ప్రభుత్వ శాఖల సేవలపై ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉండాలని కోరారు. పౌరుల హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వ సిటిజన్ చార్టర్లు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ప్రతి శాఖ నిర్దేశిత గడువులో సమస్యలను పరిష్కరించాలన్నారు. అధికార దుర్వినియోగం సామాజిక న్యాయానికి అడ్డుగోడగా నిలుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రజలు డిజిటల్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. న్యాయపరమైన చర్యలు కంటే ముందు సమస్యల పరిష్కారానికి ఫిర్యాదుల కోసం సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకోవాలన్నారు. గ్రీన్ క్లబ్ వ్యవస్థాపకుడు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కొణతాల ఫణిభూషణ్ శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొగ్రాం కో–ఆర్డినేటర్ కాండ్రేగుల సత్యనారాయణ, క్లబ్ ప్రతినిధులు పెంటకోట ఉమా మహేశ్వరరావు, బీరా వినోద్కుమార్, రావూరి అనిత, నైశెట్టి సత్తిబాబు, యల్లపు సూరిఅప్పారావు, మాణిక్యం ఆనంద్, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి రాష్ట్ర సలహా కమిటీ సభ్యుడు వెంకటరమణ -
బాగుకోసం..
హుకుంపేట మండలం శోభకోట పంచాయతీ ఈదులగొంది మండల పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడు ఎల్లేటి శ్రీనివాసరావు సాటి ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన పనిచేస్తున్న పాఠశాలకు పక్కా భవనం లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ఆయన సమస్య పరిష్కారానికి సంకల్పించారు. ఆయన సొంత నిధులతో పాటు స్నేహితుల సహకారంతో రూ.లక్ష సమకూర్చారు. ఈ నిధులకు గ్రామస్తుల శ్రమదానం జోడించి పాఠశాలకు సొంత భవనం సమకూర్చారు. ఓ ఉపాధ్యాయుడి తపనహుకుంపేట: పాఠశాలకు వసతి సమస్య పరిష్కరించేందుకు ఓ ఉపాధ్యాయుడు సొంత నిధులు వెచ్చించారు. దీనికి గ్రామస్తులు శ్రమదానం జోడించి భవన నిర్మాణాన్ని పూర్తిచేసి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. వసతి సమస్యను తాత్కాలికంగా పరిష్కరించుకున్నారు. మండలంలోని శోభకోట పంచాయతీ ఈదులగొంది చిన్న గ్రామం. ఇక్కడ పీవీటీజీ సామాజిక వర్గానికి చెందిన గిరిజనులు జీవిస్తున్నారు. ఇక్కడి పాఠశాలలో 18 మంది విద్యార్థులు చదువుతున్నారు. పక్కా భవనం లేకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు పలుసార్లు ఉన్నతాధికారులను కోరినా ఫలితం లేకపోయింది. గ్రామస్తులంతా శ్రమదానంతో మట్టిగోడలు నిర్మించి రేకులతో షెడ్డు ఏర్పాటుచేసుకుని తాత్కాలికంగా వసతి సమస్య కల్పించారు. ఈ నేపథ్యంలో ఇదే పాఠశాలకు రెండేళ్ల క్రితం వచ్చిన ఉపాధ్యాయుడు ఎల్లేటి శ్రీనివాసరావు విద్యార్థులు ఎదుర్కొంటున్న వసతి సమస్యను గుర్తించారు. సమస్య పరిష్కరించేందుకు ఆయన సంకల్పించారు. ఇందుకు ఆయన స్నేహితులైన ఉపాధ్యాయుడు రాజేంద్ర తదితరులు ఆర్థిక సహకారం అందించారు. మొత్తంమీద భవన నిర్మాణానికి ఉపాధ్యాయుడు రూ.లక్ష వరకు నిధులు సమకూర్చారు. దీనికి గ్రామస్తులు శ్రమదానం జోడించారు. పాఠశాల భవనాన్ని నిర్మించి విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించారు. టైల్స్తో మరుగుదొడ్లు నిర్మించారు. భవన నిర్మాణానికి సొంత నిధులు స్నేహితుల సహకారంతో రూ.లక్ష సమకూర్చిన టీచర్ శ్రమదానం జోడించిన ఈదులగొంది గిరిజనులు సమష్టి కృషితో సమస్య పరిష్కారం ప్రభుత్వ భవన నిర్మాణానికి కృషి గ్రామంలో పాఠశాల భవనం లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లాం. 2014లో భవనం మంజురైనప్పటికీ నిర్మాణం ప్రారంభ దశలోనే ఆగిపోయింది. పక్కా భవన నిర్మాణానికి కృషి చేస్తాం – సోమేలి చెల్లయ్య, డిప్యూటీ డీఈవో, పాడేరు -
ఏడాది పాలనలో అంతా మోసమే
పాడేరు : ఏడాది కాలంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు ధ్వజమెత్తారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై వైఎస్సార్సీపీ ముద్రించిన వెన్నుపోటు పుస్తకాన్ని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగంతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, అఘాయిత్యాలు అన్నీఇన్నీ కావన్నారు. ప్రజలు నిలువునా మోసపోయారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఒక్క పథకం కూడా సక్రమంగా అమలు చేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాది పాటు గడువు ఇచ్చినా పథకాలు అమలు చేయలేకపోయిందన్నారు. ఇదేమిటని పశ్నిస్తే తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ మోసాలు, అన్యాయాలు, అక్రమాలపై వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేయాలన్నారు. కూటమి ప్రభుత్వ మోసాలపై ఈనెల 16న నియోజకవర్గ స్థాయిలో, 17న మండల స్థాయిలో వెన్నుపోటు పుస్తకాలను ఆవిష్కరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు సీదరి రాంబాబు, మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, నియోజకవర్గ మహిళ విభాగం అధ్యక్షురాలు కిల్లో ఊర్వశిరాణి, ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, అరకు నియోజకవర్గ మహిళ విభాగం అధ్యక్షురాలు సమిడ వెంకటపూర్ణిమ, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య, యువజన విభాగం మాజీ జిల్లా అధ్యక్షుడు అశోక్, గ్రీవెన్ సెల్ జిల్లా అధ్యక్షుడు సందడి కొండబాబు, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు కూడా సుబ్రమణ్యం, కిల్లు కోటిబాబు, దన్నేటి పలాసి రాంబాబు, బోనంగి రమణ, పాంగి నర్సింగరావు పాల్గొన్నారు. అక్రమాలు, అఘాయిత్యాలు అన్నీ ఇన్నీకావు హామీలను తుంగలో తొక్కిన కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు ధ్వజం ‘వెన్నుపోటు’ పుస్తకం ఆవిష్కరణ -
ప్రజల్లోకి చంద్రబాబు మోసాలు
● నేడు జగన్ అంటే నమ్మకం– చంద్రబాబు అంటే మోసం పుస్తకావిష్కరణ ● అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అరకులోయ టౌన్: చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈనెల 16వ తేదీ సోమవారం అరకులోయలో జగన్ అంటే నమ్మకం–చంద్రబాబు అంటే మోసం పేరిట ముద్రించిన పుస్తకాలను ఆవిష్కరిస్తామని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తెలిపారు. తన క్యాంప్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. నియోజకవర్గ పరిధిలోని జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, జిల్లా కార్యవర్గ నాయకులు, వివిధ విభాగాల అధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. -
ఘనంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం
సాక్షి, పాడేరు: ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని కలెక్టరేట్లో శనివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశాల మేరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెడ్ క్రాస్ సోసైటీ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావు ప్రారంభించారు. రక్తదాతల దినోత్సవ స్పూర్తిదాత కార్ల్ లాండ్ స్టినార్ చిత్రపటానికి ఎస్డీసీతో పాటు రెడ్ క్రాస్ సోసైటీ ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్డీసీ లోకేశ్వరరావు మాట్లాడుతూ ఆస్ట్రేలియా దేశానికి చెందిన కార్ల్ లాండ్ స్టినార్ 1901లో మొట్టమొదటి సారిగా మానవరక్తాన్ని వర్గీకరించి, నోబుల్ విజేతగా నిలిచారన్నారు. ప్రతి ఏటా ఆయన జయంతి జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. ప్రజలంతా రక్తదానానికి ముందుకు వచ్చి ప్రాణదాతలుగా నిలవాలన్నారు. రెడ్క్రాస్ సోసైటీ గిరిజన ప్రాంతాల్లో విశేష సేవలందిస్తుందన్నారు. రక్తదానం చేసి తోటి మనుషుల ప్రాణాలు కాపాడుతున్న రక్తదాతలంతా అభినందనీయులన్నారు. అనంతరం 27వసారి రక్తదానం చేసిన సంతోష్కుమార్, 17వసారి రక్తదానం చేసిన ఓ.సుమన్లకు ప్రశంసాపత్రాలు, మెమెంట్లను అందజేశారు. అలాగే రక్తదాన శిబిరం కూడా విజయవంతమైంది. ఉపాధ్యాయులు, పోలీసులతో పాటు రెడ్క్రాస్ సోసైటి ప్రతినిధులు రక్తదానం చేశారు.10 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. కార్యక్రమంలో బ్లడ్బ్యాంకు ఇన్చార్జి డాక్టర్ రాఘవేంద్ర, రెడ్క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొర్రా నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.గౌరిశంకర్, కోశాధికారి పి.సుర్యారావు, సభ్యులు జయలక్ష్మి, న్యాయవాది టి.ప్రసాద్నాయుడు, రవి, కో–ఆర్డినేటర్ సత్యనారాయణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఆక్రమణల తొలగింపులో ప్రేక్షకపాత్ర
పాడేరు : జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంతో పాటు ఏజెన్సీలోని ప్రధాన కేంద్రాల్లో 1/70 చట్టానికి తూట్లు పొడుస్తూ అక్రమ కట్టడాలు, ఆక్రమణలు పెచ్చుమీరుతున్నాయని, వీటిని అరికట్టాల్సిన అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్య్సరాస విశ్వేశ్వరరాజు ధ్వజమెత్తారు. ఆక్రమణల తొలగింపులో కలెక్టర్, సబ్ కలెక్టర్ తీరుకు నిరసనగా శనివారం పాడేరు పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలోని ఆర్ఆండ్బీ క్వార్టర్ల ఎదురుగా ప్రధాన రహదారిపై వైఎస్సార్సీపీ నేతలు, స్థానికులతో కలిసి ఆయన బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాడేరు పట్టణంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో పలుచోట్ల ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాలను కాపాడుతామని, రహదారికి ఇరు వైపులా వంద అడుగుల మేర రహదారి విస్తరణ చేపడుతామని ప్రకటించిన కలెక్టర్ దినే ష్కుమార్ మొదటి వారంలో కొన్ని ఆక్రమణల తొలగింపు చేపట్టారన్నారు. దీంతో స్థానికులతో పాటు గిరిజన సమాజం కలెక్టర్ చర్యలను ఎంతో హర్షించాయన్నారు. కానీ ఉన్నట్టుండి రెండో వారం నుంచి సీన్ రివర్స్ అయిందన్నారు. కఆక్రమణల తొలగింపులో కొంతమంది కూటమి నేతలు జోక్యం చేసుకుని నిలుపుదల చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇదేమిటని అడిగితే సెలవు దినాలు కావడంతో తొలగింపు సాధ్యం కాలేదని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. కలెక్టర్ హైకోర్టు ఆదేశాలు పాటించకుండా రోజుకో మాట మాట్లాడి ప్రజలను ఆయోమయానికి గురి చేస్తున్నారన్నారు. రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా యని కలెక్టర్ చెప్పడం సరికాదన్నారు. ఏ రాజకీయ పార్టీ నాయకులు ఒత్తిళ్లు తెస్తున్నారో కలెక్టర్ బహి ర్గతం చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ ద్వంద్వ వైఖరి విడనాడాలన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు తక్షణమే ఆక్రమణలను తొలగించి 100 అడుగుల మేర రహదారి విస్తరణ చేపట్టాలని లేకుంటే ప్రజలతో కలిసి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు సీదరి రాంబాబు, మహిళ విభాగం జిల్లా అద్యక్షురాలు కురుసా పార్వతమ్మ, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు వనుగు బసవన్న దొర, సర్పంచ్లు వంతాల రాంబాబు, ఎంపీటీసీ సభ్యుడు లకే రామకృష్ణపాత్రుడు, వైఎస్సార్సీపీ నేతలు కూడా సుబ్రమణ్యం, శరభ సూర్యనారాయణ, మినుముల కన్నాపాత్రుడు, ముదిలి సత్యనారాయణ, సుదర్శన్ పాల్గొన్నారు. పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు ధ్వజం కలెక్టర్, సబ్ కలెక్టర్ తీరుకు నిరసనగా ప్రధాన రహదారిపై బైఠాయింపు ఇప్పటికై నా స్పందించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరిక -
తల్లికి వందనంపై మాట తప్పిన సర్కారు
● రూ.15వేలు ఇస్తామని రూ.13వేలు జమ సరికాదు ● ఎస్ఎఫ్ఐ విమర్శ ● ఐటీడీఏ వద్ద నిరసన పాడేరు : ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం కింద ఒక్కో విద్యార్థికి రూ.15వేల చొప్పున జమ చేయాలని, రూ.2వేలు కోత విధించడం సరికాదని ఎస్ఎఫ్ఐ జిల్లా అద్యక్షుడు కార్తిక్ శ్రీను విమర్శించారు. శనివారం ఎస్ఎఫ్ఐ నాయకులు ఐటీడీఏ గేటు ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీని ఏడాది తర్వాత అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రూ.15 వేలు ఎందుకు జమ చేయలేదని ప్రశ్నించారు. లేనిపోని నిబంధనల పేరుతో తల్లికి వందనం పథకంలో కోత విధించడం సరికాదన్నారు. గత ప్రభుత్వం షరతులు విధిస్తే ప్రశ్నించిన టీడీపీ నేతలు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదన్నారు. గ్రామాల్లో 2.5 లక్షలు, పట్టణాల్లో రూ.3లక్షల లోపు ఆదాయం ఉన్న కుటుంబాలన్నింటికి తల్లికి వందనం వర్తింపజేయాలన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు కూడా ఈ పథకం అందజేయాలని ఆయన కోరారు. విద్యా విధానాన్ని దెబ్బతీసే చర్యలను కూటమి ప్రభుత్వం విరమించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి పాంగి చిన్నారావు పాల్గొన్నారు. చింతపల్లి: తల్లికి వందనం పథకాన్ని అర్హులైన అందరికి వర్తింపజేయాలని కోరుతూ జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి జీవన్ కృష్ణ శనివారం చింతపల్లిలో ర్యాలీ నిర్వహించారు. ఎలాంటి షరతులు లేకుండా వెంటనే తల్లుల ఖాతాల్లో రూ.15వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొదట రూ.15వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పడం సరికాదన్నారు. దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కూటమి ప్రభు త్వం ఇచ్చిన హామీలు నిలుపుకోవడం లేదన్నారు. చింతపల్లి మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు -
తప్పుడు సమాచారంతో నిలిపివేత
ప్రతీ ఇంట్లో చదువుకుంటున్న పిల్లలందరికీ తల్లికి వందనం ఇస్తామని చంద్రబాబు చెప్పడంతో ఎంతో సంతోషించాం. మా ఇద్దరి పిల్లలు సాయి, ఉదయ్లకు రూ.30 వేలు వస్తుందని ఆశపడ్డా. నగదు జమచేశామని ప్రభుత్వం చెప్పడంతో ఖాతా చూసుకున్నా. నిధులు జమకాకపోవడంతో ఆరాతీయగా 300 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగిస్తున్నందున జమకాలేదన్నారు. పేద కుటుంబం కావడంతో నిజానికి ఎప్పుడూ అన్ని యూనిట్ల విద్యుత్ వినియోగించలేదు. తప్పుడు సమాచారంతో నిలిపివేయడం సరికాదు. – చింతల దేవి, టేకులబోరు, కూనవరం మండలం -
అక్షరజ్ఞానం కల్పించాలని గిరిజనుల వినతి
గూడెంకొత్తవీఽధి: పిల్లలు చదువుకునేందుకు పాఠశాల లేక అక్షరానికి దూరమవుతున్నారని జెర్రెల పంచాయతీ కన్నీరుశిల్ప,గడిమామిడి,గునుకురాయి గిరిజనులు కోరుతున్నారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ పిల్లల భవిషత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే పాఠశాలతో పాటు అంగన్వాడీ కేంద్రం ఏర్పాటుకు కలెక్టర్ దినేష్కుమార్, ఇన్చార్జి పీవోపీవో అభిషేక్ గౌడ్ చర్యలు తీసుకోవాలని వారు కోరారు. లేకుంటేచదువుకు దూరమైపోతారని వాపోయారు.గతంలో అనేక సార్లు పాఠశాల ఏర్పాటుచేయాలని వినతులు ఇచ్చినా సందించలేదని ఆయా గ్రామాలకు చెందిన కొర్రా బాలన్న, వంతల బాలకృష్ణ, సన్యాసిరావు, లక్ష్మయ్య,చిన్నయ్య, చిన్నారావు ఆవేదన వ్యక్తం చేశారు. -
మాటిచ్చి.. మోసగించి..
కూటమి ప్రభుత్వం మాట తప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి తూట్లు పొడిచింది. ఇంట్లో చదువుకునే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకంలో రూ.15 వేలు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం నిబంధనల పేరిట కోత విధించింది. అర్హులైన తల్లులు, విద్యార్థులకు వెన్నుపోటు పొడిచింది. అర్హుల ఖాతాల్లో జమకాని తల్లికి వందనం నగదు ● నిబంధనల పేరిట పథకం అమలుకు తూట్లు ● మాట తప్పిన కూటమి ప్రభుత్వం ● అర్హులు 1.75లక్షల మందికి పైమాటే ● 1,56,182 మందికి మాత్రమే ప్రభుత్వం జమ ● సుమారు 18 వేల మందికి పైగా కోత నయాపైసా జమ కాలేదు ఐదుగురు పిల్లలు. ప్రభుత్వ పాఠశాలల్లో వేర్వేరు తరగతులు చదువుతున్నారు. ఉచిత విద్యుత్ను పొందుతున్నాం. జగనన్న సీఎంగా ఉన్నప్పడు అమ్మ ఒడి పథకంలో నగదు పొందా. ప్రస్తుత కూటమి ప్రభుత్వం హామీ మేరకు ఐదుగురు పిల్లలకు రూ.13 వేల చొప్పున మొత్తం రూ.65 వేలు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని ఆశపడ్డా. మినుములూరు మీసేవా కేంద్రంలోని బ్యాంక్ ఖాతాను పరిశీలించగా నగదు జమకాలేదని తేలింది. గ్రామసచివాలయానికి శనివారం సెలవు కావడంతో సిబ్బంది సోమవారం రమ్మన్నారు. – మర్రి దేవి, సల్దిగెడ్డ, మినుములూరు పంచాయతీ, పాడేరు మండలం అందరికీ ఇవ్వలేదు మాది పేద కుటుంబం. ముగ్గురు సంతానం. వారంతా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. వీరిలో ఇద్దరికి మాత్రమే తల్లికి వందనం నగదు బ్యాంక్ ఖాతాలో జమ అయింది. నా రెండో కుమార్తె పుంకురు సమీరా పాడేరు మండలం కందమామిడి జీటీడబ్ల్యూ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఈమెకు సంబంధించిన తల్లికి వందనం నగదు బ్యాంక్ ఖాతాలో జమ కాలేదు. ఇచ్చిన హామీ మేరకు కుటుంబంలో అర్హులందరికీ జమ చేయాలి. – పుంకురు కుమార్, బోసుబెడ, అరకులోయ మండలం సాక్షి,పాడేరు: జిల్లాలో తల్లికి వందనం పథకం అమలు గందరగోళంగా మారింది. ఎన్నికలకు ముందు ‘నీకు 15వేలు, నీకు 15వేలు, ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికి రూ.15వేలు చొప్పున తల్లికి వందనం ఇస్తాం’ అంటూ చేసిన ప్రకటనలు ప్రచారానికే పరిమితమయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి సంవత్సరం ఈ పథకాన్ని అమలు చేయకపోవడంతోనే నిరాశ మొదలైంది. తాజాగా రెండో ఏడాది పాఠశాలలు తిరిగి తెరిచే రోజున ‘తల్లికి వందనం’ డబ్బులు తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో వారంతా ఆనందపడ్డారు. అందరికీ జమకాకపోవడంతో నిరాశ మిగిల్చింది. నిబంధనలను సాకుగా చూపి మొండిచెయ్యి చూపిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన మాటకు కట్టుబడి.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమ్మ ఒడి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు జేసింది. 2022–23లో ఇంటికి ఒకరు చొప్పున జిల్లాలో 1,01,170 మంది విద్యార్థులకు అమ్మ ఒడి ఆర్థిక సాయాన్ని వారి తల్లుల ఖాతాల్లో జమచేసింది. అయితే కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం అమలు జేస్తామని, ఒకొక్కరికి రూ.15వేల చొప్పున ఆర్ధిక సాయం అందిస్తామని ప్రకటించింది. గత విద్యా సంవత్సరంలో తల్లికి వందనం పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేయకుండా పంగనామం పెట్టింది. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ,ప్రజల డిమాండ్తో ఎట్టకేలకు తల్లికి వందనంను అమలుజేసినప్పటికి నిబంధనల పేరుతో చాలామంది తల్లులకు జాబితాలో చోటు లేకుండా పోయింది. అర్హులు 1.75లక్షలమంది ఉన్నా.. జిల్లాలో ఒకటి నుంచి టెన్త్ వరకు విద్యార్థుల సంఖ్య సుమారు 1.75 లక్షలు దాటే ఉంది. 90శాతం గిరిజన కుటుంబాలు జిల్లాలో ఉన్నాయి. ప్రతీ కుటుంబంలోను విద్యార్థులు ఉన్నారు. జిల్లాలోని 2913 ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వతరగతి వరకు 1,69,175 మంది విద్యార్ధులు చదువుతున్నారని గణాంకాల్లో విద్యాశాఖ పేర్కొంది. ఇంటర్ విద్యార్థులు, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరినీ కలుపుకుంటే మొత్తం 2 లక్షల వరకు ఉంటారు. అయితే జిల్లాలో 1,52,053 తల్లులకు చెందిన 1,56,182 మంది విద్యార్థులు తల్లికి వందనం పథకానికి అర్హులని, వీరందరికీ అమలు అవుతోందని విద్యాశాఖ చెబుతోంది. వీటికి సంబంధించిన జాబితాలను గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచింది. నగదు జమకాక.. తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హుల్లో చాలామంది ఖాతాల్లో నగదు జమకాలేదు. వీరంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమ్మ ఒడి పథకం లబ్ధిపొందారు. అప్పట్లో వీరందరికీ ఖాతాల్లో నగదు జమ అయింది. వీరికి ప్రస్తుత ప్రభుత్వంలో శనివారం మధ్యాహ్నం వరకు నగదు జమకాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. శనివారం గ్రామసచివాలయాలు, బ్యాంకులకు సెలవు కావడంతో అందుబాటులో ఉన్న ఏటీఎంలకు వెళ్లి చెక్ చేసుకున్నారు. అర్హుల్లో చాలామందికి జమకాకపోవడంతో ఉసూరుమన్నారు. -
10 కిలోల గంజాయితో ఇద్దరు అరెస్టు
అనకాపల్లి టౌన్ : పట్టణంలోని గూడ్స్ షెడ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తుల నుంచి 10 కిలోల గంజాయి, రెండు సెల్ఫోన్లు, రూ.2,250 నగదు స్వాధీనం చేసుకున్నట్టు పట్టణ సీఐ విజయ్కుమార్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 13న పట్టణ ఎస్ఐ ఈశ్వరావు ఆధ్వర్యంలో గస్తీ తిరుగుతున్న పోలీసులకు రైల్వేస్టేషన్ గూడ్స్షెడ్ వద్ద సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు బైక్పై గంజాయి తీసుకువస్తూ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారని తెలిపారు. వారిని వెంబడించి పట్టుకున్నామన్నారు. వీరిలో జి.మాడుగుల మండలం కోడాపల్లి గ్రామానికి చెందిన రామన్ ప్రభాకర్ ఏజెన్సీ ప్రాంతంలో 10 కేజీల గంజాయిని రూ.20 వేలకు కొని తన స్నేహితుడైన తమిళనాడులోని మధురై మండలం ఉసిలంపట్టి గ్రామానికి చెందిన జయవీరన్ కారుతి వీర దేవరతో కలిసి అనకాపల్లి రైల్వే స్టేషన్లో గంజాయిని దించడానికి ఒప్పందం చేసుకున్నాడని తెలిపారు. రామన్ ప్రభాకర్పై అరకు పోలీస్స్టేషన్లో కేసులు ఉండగా, రెండో నిందితుడు వీర దేవర్కు తమిళనాడులో గంజాయి కేసులో నిందితుడిగా ఉన్నాడన్నారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరచనున్నట్టు సీఐ తెలిపారు. -
క్యాన్సర్కు కళ్లెం
విశాఖలో అడ్వాన్స్డ్ క్యాన్సర్ కేర్ యూనిట్ విశాఖ సిటీ: క్యాన్సర్ కర్కశమైనది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ కబళిస్తోంది. అటువంటి మహమ్మారి పీచమనడానికి విశాఖలో అడ్వాన్స్డ్ క్యాన్సర్ కేర్ బ్లాక్ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర, ఒడిశా రాష్ట్రాల క్యాన్సర్ బాధితులకు వైద్య సేవలు అందిస్తున్న అగనంపూడి ప్రాంతంలో ఉన్న హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్(హెచ్బీసీహెచ్ఆర్సీ)లో నూతన భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తూర్పు భారత దేశంలోనే అత్యుత్తమ స్పెషలైజ్డ్ క్యాన్సర్ చికిత్సా కేంద్రాల్లో ఒకటిగా నిలిచేలా దీన్ని తీర్చిదిద్దనున్నారు. ప్రధానంగా పీడియాట్రిక్, హెమటోలింఫాయిడ్(శిశు, రక్త) క్యాన్సర్ల చికిత్స, పరిశోధనలకు సంబంధించి అతి పెద్ద కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. క్యాన్సర్ రోగులకు అనేక సేవలు ఈ కొత్త బ్లాక్ ద్వారా క్యాన్సర్ రోగులకు అనేక వైద్య సేవలు అందనున్నాయి. ఇందులో ఇంటెన్సివ్ కీమోథెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, అధునాతన రేడియేషన్ థెరపీ, కార్ టీ–సెల్ థెరపీ లాంటి అధునాతన ఇమ్యునోథెరపీలు, మూడు లీనియర్ యాక్సిలరేటర్లు, ఎంఆర్ఐ, సీవీటీ అండ్ పెట్ స్కాన్లతో పాటు అత్యంత ఆధునిక మెడికల్ ఇమేజింగ్, డయాగ్నోస్టిక్స్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే ఇందులో 14 బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ గదులు, 14 ఐసీయూలు, 5 ఆపరేటింగ్ థియేటర్లు, పరిశోధనల కోసం ప్రయోగశాలలు, చికిత్స ప్లానింగ్, శిక్షణ కోసం జాయింట్ డిస్కషన్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. పీడియాట్రిక్, హెమటోలింఫాయిడ్ క్యాన్సర్లకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్స, బ్లడ్ సెంటర్, పౌష్టికాహారం, పునరావాసం లాంటి సేవలు అందనున్నాయి. -
అనారోగ్యంతో చికిత్స పొందుతున్న హెచ్సీకి ఆర్థిక సాయం
అనకాపల్లి: అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి పోలీస్స్టేషన్లో హెచ్సీగా విధులు నిర్వహిస్తున్న ఓ.గణేశ్వరరావు అనారోగ్యం కారణంగా విశాఖ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శక్తి వెల్ఫేర్ అసోసియేషన్ 1990 బ్యాచ్ నుంచి అసోసియేషన్ అధ్యక్షుడు కె.అనిల్, ప్రధాన కార్యదర్శి ముబారక్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గణేశ్వరరావుకు శనివారం రూ.20వేలు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1990 బ్యాచ్కు చెందిన సహా ఉద్యోగులు ఏ రకమైన కష్టాల్లో ఉన్నా ఆదుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పూర్ణ, వెంకటేశ్వర్లు, రామారావు, మూర్తి, శ్రీను పాల్గొన్నారు. -
ఆర్థిక సంఘ నిధులను దారి మళ్లించిన చంద్రబాబు
అరకులోయ టౌన్: గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధులను తల్లికి వందనం పథకానికి దారి మళ్లించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే గ్రామ పంచాయతీల ఖాతాలో ఆ నిధులు జమ చేయాలని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మౌలిక సదుపాయాలకోసం కేంద్రం గ్రామ పంచాయతీ లకు కేటాయించిన 15వ ఆర్థిక సంఘ నిధులు 446.49 కోట్లు గ్రామ పంచాయతీల ఖాతాలో జమ చేయాలన్నారు. లేకుంటే తాగునీరు, శానిటేషన్, తదితర అభివృద్ధి పనులు గ్రామాల్లో నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థిక సంఘం నిధులు దారి మళ్లించిందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు ప్రజలకు ఇప్పుడు సమాధానం చెప్పాలన్నారు. పుస్తకావిష్కరణకు తరలిరండి జిల్లా కేంద్రమైన పాడేరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు అధ్యక్షతన జరిగే పుస్తకావిష్కరణ కార్యక్రమానికి అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు తరలిరావాలని ఎమ్మెల్యే మత్స్యలింగం పిలుపు నిచ్చారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహాన్ రెడ్డి పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం ఏడాది పాలన వైఫల్యాలను ఎండకడుతూ జరిగే పుస్కకావిష్కరణ కార్యక్రమానికి నియోజకవర్గ పరిధిలోని జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, జిల్లా కార్యవర్గ నాయకులు, వివిధ విభాగాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. తల్లికి వందనం పథకానికి కేటాయింపు రూ. 446.49 కోట్లు వెంటనే పంచాయతీ ఖాతాల్లో జమ చేయాలి అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్ -
ఆశలు తీరకుండానే.. అనంతలోకాలకు..
జగదాంబ: విధి వక్రించింది. శనివారం సాయంత్రం కాన్వెంట్ జంక్షన్ వంతెన సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు నేవీ యువ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. సౌమ్య సతీష్ అసాతి (35), మేఘా రావత్ (30) అనే ఇద్దరు అధికారులు షీలానగర్ నుంచి నగరానికి తమ బైక్పై వస్తుండగా.. కాన్వెంట్ జంక్షన్ వద్ద ఎదురుగా దూసుకొచ్చిన ఆయిల్ ట్యాంకర్ వారి జీవితాలను విషాదంలో ముంచేసింది. ట్యాంకర్ను తప్పించుకునే ప్రయత్నంలో బైక్ అదుపుతప్పి నేరుగా దాని కింద పడింది. నిమిషాల వ్యవధిలోనే వారి కలలు, ఆశలు చిన్నాభిన్నమైపోయాయి. ఈ ప్రమాదంలో వారి శరీరం ఛిద్రమై, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ దృశ్యం చూసిన వారికి గుండె తరుక్కుపోయింది. సమాచారం అందుకున్న హార్బర్ స్టేషన్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించి, ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశ సేవలో నిమగ్నమైన యువ అధికారులు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం అందరినీ కలచివేసింది. వారి కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగిల్చింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు నేవీ అధికారుల దుర్మరణం -
నిరాశకు గురయ్యా
నలుగురు పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. గత ప్రభుత్వంలో అమ్మ ఒడి సాయం పొందా. ప్రస్తుత ప్రభుత్వంలో తల్లికి వందనం పథకం నిబంధనల ప్రకారం నలుగురు పిల్లలకు రూ.52వేలు బ్యాంకు ఖాతాలో జమకావాల్సి ఉంది. ఇందుకు సంబంధించి నా సెల్ఫోన్కు ఎటువంటి సమాచారం రాలేదు. బ్యాంకు ఖాతా పరిశీలించుకోగా, నగదు పడలేనట్టు చూపుతోంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నలుగురు పిల్లలకు నగదు జమ అవుతుందని ఆశపడ్డా. అర్హత ఉన్నా పడకపోవడంతో నిరాశకు గురయ్యా. – మర్రి గీత, సల్దిగెడ్డ మినుములూరు పంచాయతీ -
ఏజెన్సీలో భారీ వర్షం
సాక్షి,పాడేరు: ఏజెన్సీలోని పాడేరుతో పాటు పలు మండలాల్లో శనివారం భారీ వర్షం కురిసింది.మధ్యాహ్నం 12గంటల నుంచి వాతావరణం చల్లబడింది. హుకుంపేట, పాడేరు మండలాల్లో సుమారు 2గంటల పాటు కుండపోతగా కురిసిన భారీ వర్షంతో జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. పాడేరు ఘాట్లో భారీ వర్షం కురవడంతో వాహనచోదకులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జి.మాడుగుల: మండలంలో పలు ప్రాంతాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రోడ్లు జలమయమయ్యాయి. పాడేరు–జి.మాడుగుల, చింతపల్లి, నుర్మతి, మద్దిగరువు, సొలభం,గడుతూరు పెదలోచలి, వంజరి, గెమ్మెలి, లువ్వాసింగి మార్గాల్లో వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. -
కిలో గంజాయి స్వాధీనం
● ఇద్దరు యువకుల అరెస్టు మోతుగూడెం: డొంకరాయి పోలీస్ స్టేషన్ పరిధిలో కేజీ గంజాయితో ఇద్దరు యువకులు పట్టుబడినట్టు శనివారం ఎస్ఐ శివకుమార్ తెలిపారు. డొంకరాయి గ్రామ శివారులో అనుమానంగా సంచరిస్తున్న ఇద్దరు యువకులను విచారించగా వారి వద్ద కేజీ గంజాయి పట్టుబడిందన్నారు. వీరు కరీంనగర్ పట్టణానికి చెందిన లకావత్ శివాజీ, బానోతు ఆనంద్గా గుర్తించి కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. చింతూరు సీఐ తెల్లం దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని ఆయన పేర్కొన్నారు. -
వాగులో ఇద్దరు యువకుల గల్లంతు
రంపచోడవరం: మారేడుమిల్లి ప్రాంతంలోని వాలమూరు వాగులో (పాములేరు వాగు) ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. విజయవాడకు చెందిన ఆరుగురు యువకులు విహారయాత్రకు మారేడుమిల్లి ప్రాంతానికి వచ్చారు. దీనిలో భాగంగా వారు ఇక్కడికి సుమారు పది కిలోమీటర్ల దూరంలోని పర్యాటక ప్రాంతమైన వాలమూరు వాగులో శనివారం స్నానాలకు దిగారు. వీరిలో సాధిష్ (23), కటకం రవితేజ (30) ప్రమాదానికి గురయ్యారు. వాగు ప్రవాహానికి కొట్టుకుపోయి గల్లంతయ్యారు. దీంతో స్నేహితులు గాలింపు చేపట్టినా ఎటువంటి ఆచూకీ లభ్యం కాలేదు. వాగులో దిగవద్దని హెచ్చరించినా వారు పట్టించుకోలేదని స్థానికులు తెలిపారు. వాగు వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేసినా లక్ష్యపెట్టకుండా ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారని వారు వాపోయారు. ఇలావుండగా గల్లంతైన సాధిష్ ఫొటోగ్రాఫర్గా, రవితేజ విజయవాడలో ట్రావెల్స్ ఏజెన్సీ నిర్వహిస్తున్నారని వారి స్నేహితులు వెల్లడించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న మారేడుమిల్లి సీఐ గోపాలకృష్ణ, గుర్తేడు ఎస్ఐ పార్థ సారధి సంఘ టన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు ము మ్మరం చేశారు. ఈ సంఘట నపై కేసు నమోదు చేసి చేసినట్లు తెలిపారు. డుడుమ జలపాతంలో ఒకరు.. ముంచంగిపుట్టు: ఆంధ్రా ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో ఉన్న డుడుమ జలపాతం వద్ద పర్యాటకుడు గల్లంతయ్యాడు. కోల్కతాకు చెందిన అనిమేస్దాసు (27), భువనేశ్వర్లో ఉంటున్న వరుసకు అన్నయ్య, వదిన కుటుంబంతో కలిసి పర్యాటక ప్రాంతాల సందర్శనకు వచ్చారు. దీనిలో భాగంగా వారు శుక్రవారం ఒడిశాలోని కొర్రాపుట్టు జిల్లాలోని దేవ్మాలి, గాలిగబ్ధర్, కొలబ్ డామ్లను సందర్శించారు. అక్కడి నుంచి శనివారం డుడుమ జలపాతం వద్దకు వచ్చారు. వ్యూపాయింట్ వద్ద ఫ్యామిలీతో ఫొటోలు తీసుకున్నారు. అక్కడి నుంచి జలపాతం దిగువ భాగం చూసేందుకు 550 అడుగుల లోయలోకి మెట్ల మార్గం ద్వారా చేరుకున్నారు. అక్కడి నుంచి వారు చెరోవైపు వెళ్లారు. కాసపటికే కేకలు వినిపించాయి. చూసేసరికి అనిమేస్దాసు చెప్పులు మాత్రమే కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. స్థానికులు వెంటనే గాలింపు చేపట్టినా అతని ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో లంతాపుట్టు అగ్నిమాపక సిబ్బంది, మాచ్ఖండ్ ఎస్ఐ శుక్రమాడి, పోలీసు సిబ్బంది, ఒడిశా పంచాయతీ అధికారులు గల్లంతైన ప్రాంతానికి చేరుకున్నారు. సాయంత్రం వరకు గాలించినా ప్రయోజనం లేకపోయింది. ఆదివారం ఉదయం మళ్లీ గాలింపు చేపడతామని మాచ్ఖండ్ ఎస్ఐ వివరించారు. స్నానం చేస్తుండగా ప్రమాదం విహారయాత్రలో అపశ్రుతి గాలింపు చేపట్టినా లభ్యం కాని ఆచూకీ ఆందోళన చెందుతున్న స్నేహితులు -
ఏటా 3 వేల మందికి చికిత్స అందించేలా..
ఐసీఐసీఐ ఫౌండేషన్ బ్లాక్ ఫర్ చైల్డ్ అండ్ బ్లడ్ క్యాన్సర్ భవనాన్ని 8 అంతస్తుల్లో సుమారు 3.9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఈ కొత్త భవనంలో 555 పకడలు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం అగనంపూడిలో ఉన్న హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో గత మూడేళ్లుగా రోజూ కొత్తగా సుమారు 200 మంది పీడియాట్రిక్ క్యాన్సర్ రోగులు, 350–400 మంది హెమటోలింఫాయిడ్ క్యాన్సర్ పేషంట్లు వైద్య సేవలు పొందుతున్నారు. కొత్త బ్లాక్ అందుబాటులోకి వచ్చిన తర్వాత బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్తో పాటు ప్రస్తుత వైద్య సేవలను గణనీయంగా విస్తరించేందుకు, అలాగే ఇమ్యునోథెరపీకి వెసులుబాటు కలగనుంది. మరో 3 వేల మంది క్యాన్సర్ రోగులకు చికిత్స అందించే అవకాశం ఉంటుంది. ఈ కొత్త బ్లాక్ల్లో అధునాతన వైద్య సదుపాయాలు, పరిశోధన విభాగాలు ఉండనున్నాయి. పెరుగుతున్న క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 2027 నాటికి ఈ కొత్త బ్లాక్ను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి
రాజవొమ్మంగి: మండలంలోని అప్పన్నపాలెం గ్రామానికి చెందిన ముర్ల భీమరాజు (38) కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ శనివారం మరణించాడు. భీమరాజు మూడు రోజుల క్రిందట బైక్పై స్వగ్రామం వెళ్తు మండలంలోని సూరంపాలెం వద్ద వాహనం అదుపుతప్పి స్వీయ ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం కాకినాడ జీజీహెచ్కు తరలించగా పరిస్థితి విషమించి మృతి చెందినట్టు స్థానికులు చెప్పారు. భీమరాజుకు భార్య, నలుగురు పిల్లలున్నారు. గిరిజనుడు అయిన భీమరాజు నాలుగు రోజుల క్రిందట అమలాపురంలో జరిగిన డీఎస్సీ పరీక్షకు హాజరై తిరిగి స్వగ్రామం వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాజవొమ్మంగి ఎస్ఐ నరసింహమూర్తి తెలిపారు. కుటుంబ పెద్ద మృతి చెందడంతో కుటుంబంలో విషాదం అలముకొంది. -
టీఎంసీకి ఐసీఐసీఐ రూ.550 కోట్లు విరాళం
ఈ భారీ క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి ఐసీఐసీఐ బ్యాంక్ భారీ విరాళాన్ని టాటా మెమోరియల్ సెంటర్(టీఎంసీ)కు ప్రకటించింది. బ్యాంకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధులు రూ.550 కోట్లతో ఈ అడ్వాన్స్డ్ క్యాన్సర్ కేర్ని నిర్మిస్తోంది. దేశంలో క్యాన్సర్ కేర్కు సంబంధించి విశాఖ, నవీ ముంబై, న్యూ చండీగఢ్లో కొత్తగా మూడు టీఎంసీ కేంద్రాల ఏర్పాటుకు ఐసీఐసీఐ బ్యాంక్ రూ.1,800 కోట్లు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో రూ.550 కోట్లతో విశాఖలో శిశు, రక్త క్యాన్సర్ చికిత్సకు తూర్పు దేశంలోనే అతిపెద్ద అత్యుత్తమ మెడికల్ టెక్నాలజీతో అధునాతన ఆస్పత్రి నిర్మాణానికి పూనుకున్నారు. -
జాతీయ రహదారిపై కారు దగ్ధం
గాజువాక: షీలానగర్ జాతీయ రహదారిపై ఓ కారులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కారు ఇంజిన్లో నుంచి పొగ వచ్చి ఒక్కసారిగా దట్టమైన మంటలు వ్యాపించాయి. కారులో ప్రయాణిస్తున్న తండ్రి, కుమార్తె ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు అందించిన వివరాలివీ.. అనకాపల్లి జిల్లా ఉమ్మలాడకు చెందిన ఎల్.ఎన్.వి.ప్రభాకర్ శనివారం తిరుపతి దర్శనం కోసం బయల్దేరాల్సి ఉంది. ఎన్ఏడీ కొత్తరోడ్లోని తమ బంధువుల ఇంట్లో ఉన్న కుమార్తెను తీసుకొని వెళ్లడం కోసం వచ్చిన ఆయన కుమార్తెతో కలిసి కారులో ఉమ్మలాడకు బయల్దేరారు. షీలానగర్ జంక్షన్కు వచ్చేసరికి కారు ఇంజిన్లో నుంచి పొగ రావడం గమనించారు. అప్రమత్తమైన ఆయన తనతోపాటు కుమార్తెను కారులో నుంచి దించేశారు. క్షణాల్లోనే దట్టమైన మంటలు వ్యాపించడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఆటోనగర్ నుంచి అగ్నిమాపక సిబ్బంది శకటంతో వచ్చి మంటలను ఆర్పివేశారు. -
వైద్య విద్యార్థుల రక్తదానం
సాక్షి,పాడేరు: స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులు రక్తదానంలో పాల్గొన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం పురస్కరించుకుని వైద్య కళాశాలలో శుక్రవారం నిర్వహించిన వైద్య శిబిరంలో15 మంది వైద్య విద్యార్ధులు రక్తదానం చేశారు. ఈసందర్భంగా వారిని డీఎంహెచ్వో డాక్టర్ జమాల్బాషా, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హేమలతాదేవి అభినందించారు. సేకరించిన రక్తాన్ని పాడేరు బ్లడ్బ్యాంకుకు తరలించారు.ఈ కార్యక్రమంలో బ్లడ్బ్యాంకు ఇన్చార్జి డాక్టర్ రాఘవేంద్ర, రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ ఎస్.గంగరాజు, ప్రధాన కార్యదర్శి జి.గౌరిశంకర్,కోశాధికారి పల్టాసింగి సూర్యారావు, సభ్యులు తమర్భ ప్రసాద్నాయుడు, సంజీవరావు, రవి, జిల్లా కోఆర్డినేటర్ సత్యనారాయణ, పలువురు వైద్యులు పాల్గొన్నారు. -
కలెక్టర్ సమక్షంలో బహిరంగ విచారణ చేయాలి
చింతపల్లి: ఆదివాసీ ట్రస్టు పేరిట మోసపోయిన బాధితులకు కలెక్టర్ దినేష్కుమార్ వారికి న్యాయం చేయాలని గిరిజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్, ట్రస్టు బాధితులు సంఘం జిల్లా నాయకుడు చిక్కుడు అశోక్ డిమాండ్ చేశారు. చింతపల్లి సమీపంలో గల అంతర్ల గ్రామంలో ఆదివాసీ ట్రస్టు ప్రధాన కార్యాలయం ఎదుట ట్రస్టు బాధిత సభ్యులతో శుక్రవారం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఇటీవల ట్రస్టు చైర్మన్ చేసిన మోసానికి బాధితులు ధర్నా, ర్యాలీలు కార్యక్రమాలను చేపట్టి కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. దీనిపై స్పందించిన కలెక్టర్ విచారణకు ఆదేశించారన్నారు. దీంలో శుక్రవారం విచారణ బృందం కేవలం చైర్మన్ బాలంపడాల్ తో పాటు 11మంది ట్రస్టు సభ్యులతో మాత్రమే విచారణ చేపట్టడాన్ని తప్పు పడుతున్నామన్నారు. కేవలం ఒక ఐడికి 12,200లతో నెలకు 3వేలు చొప్పున జీవిత కాలం చెల్లిస్తానని నమ్మబలకడంతో ఎంతో మంది గిరిజనులు తమకు ఉన్నటువంటి ఆస్తుపాస్తులను అమ్మి ఈ ట్రస్టుకు లక్షలాది రూపాయలు చెల్లించారన్నారు. ఇదే విషయమై అనేక సమావేశాలలో బహిరంగంగానే ప్రకటించారన్నారు. ట్రస్టు చైర్మ్న్ చేసిన మోసాన్ని పరిగనణలోనికి తీసుకుని పోలీసులు సుమోటాగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.కిందిస్థాయి ఉద్యోగులతో కాకుండా చింతపల్లి కేంద్రంగా కలక్టర్ సమక్షంలో విచారణ చేపడితే బాధితులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లేకుంటే ట్రస్టు బాధితులతో కలసి కలక్టరేట్ను ముట్టడిస్తాయని హెచ్చరించారు. ట్రస్టు వైస్ చైర్మన్ కయ్యం చిన్నబ్బాయి, పంచాయతీ కార్యదర్శి వండలం బాలయ్య, గిరిజన సంఘం నాయకులు ధనుంజయ్, చిరంజీవి, సత్యనారాయణ, రాంబాబు, విష్ణుమూర్తి, ట్రస్టు బాధితులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి యోగా పోటీలకు 13 మంది ఎంపిక
సాక్షి,పాడేరు: స్థానిక తలారిసింగి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం జిల్లా స్థాయి యోగా పోటీలను నిర్వహించారు. యోగా నోడల్ అధికారి, ఎస్డీసీ లోకేశ్వరరావు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి జగన్మోహనరావు పర్యవేక్షణలో జిల్లా స్థాయి యోగా పోటీలు జరిగాయి. మూడు ఐటీడీఏల పరిధిలో 13ఆంశాల్లో యువతీ,యువకులు,పలు పాఠశాలల విద్యార్ధులు యోగా చేశారు. వీటిలో 13మంది రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి. -
యోగా సాధనకు4.62 లక్షల మంది నమోదు
● జేసీ అభిషేక్ గౌడ సాక్షి,పాడేరు: ఈనెల 14వతేదీ నుంచి 21వ తేదీ వరకు జిల్లాలోని అన్ని సచివాలయాల పరిధిలో యోగా సాధన కార్యక్రమాలు విజయ వంతంగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎ.జే.అభిషేక్గౌడ ఆదేశించారు.శుక్రవారం ఆయన జిల్లా, మండల అధికారులతో పాటు యోగా ట్రైనర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 4.62లక్షల మంది యోగా సాధనకు నమోదు చేసుకున్నారని, 3,292 యోగా కేంద్రాలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. అన్ని కేంద్రాల్లోను యోగా సాధన జరగాలన్నారు. జిల్లా, డివిజన్, మండల, గ్రామస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులంతా దగ్గరగా ఉన్న సచివాలయాల్లో యోగా సాధన చేయాలని కోరారు. యోగా సాధనకు సంబంధించిన ఫొటోలను నోట్ కేమ్ యాప్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యోగా నోడల్ అధికారి ఎం.వి.ఎస్.లోకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యాన పంటల సాగుపై గిరి రైతులకు ప్రోత్సాహం
చింతపల్లి; గిరిజన ప్రాంతంలో ఉపాధి హామీ పథకం ద్వారా గిరిజన రైతులకు ఉద్యానవన పంటల సాగుకు పోత్సాహిస్తున్నట్టు అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ లాలం సీతయ్య అన్నారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో చింతపల్లి, గూడెం కొత్తవీధి మండలాల ఉపాధి హామీ పథకం అధికారులు, సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ ఈ రెండు మండలాల పరిధిలో గిరిజన రైతులు గంజాయి సాగుకు పూర్తిగా నిలువరించడంతో పాటు ప్రభుత్వం ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించే విధంగా అన్ని చర్యలు చేపడుతుందన్నారు. ఇందులో భాగంగా గిరి రైతులకు అనతి కాలంలోనే పంట దిగుబడులతో పాటు ఆదాయాన్నిచ్చే పండ్ల మొక్కలు పంపిణీకి చర్యలు చేపట్టిందన్నారు. ఈ మేరకు రైతులకు సిల్వర్ ఓక్, డ్రాగన్ఫ్రూట్, అవకాడో, సపోటా, మామిడి, సీతాఫలం, జీడిమామిడి, మిరియాలు తదతర మొక్కలను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. అంతే కాకుండా మూడేళ్లు పాటు సాగుకు సంబంధించి ప్రోత్సాహాలను అందించనున్నట్టు చెప్పారు. ఈ వార్షిక సంవత్సరంలో చింతపల్లి మండలంలో 3వేల మంది రైతులతో 2,036 ఎకరాల్లోను, గూడెం కొత్తవీధిలో మరో 3వేలు మంది రైతులతో 2,500 ఎకరాల్లో ఈ ఉద్యానవన పంటలు సాగుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఆ దిశగా రైతులను సిద్ధం చేయాలని ఏపీడీ సీతయ్య సూచించారు . చింతపల్లి, జీకే వీధి ఏపీవోలు రాజు, రాంప్రసాద్ పాల్గొన్నారు. -
రోడ్డు విస్తరణ వంద అడుగులు చేయాల్సిందే
సాక్షి,పాడేరు: హైకోర్టు ఆదేశాల మేరకు పాడేరుతో పాటు ఏజెన్సీ వ్యాప్తంగా అక్రమణలు తొలిగించి 100 అడుగుల మేర రోడ్లను విస్తరించాలని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు శుక్రవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు రాజకీయ నాయకుల జోక్యం, ఆదిపత్యం సరైంది కాదన్నారు. 1/70 భూ బదలాయింపు నిషేధ చ ట్టం అమల్లో ఉందని, జిల్లాలోని 5వ షెడ్యూల్ ప్రాంత పరిధిలో ప్రధాన కేంద్రాల్లో రోడ్ల విస్తరణ, అక్రమణలు తొలగించి వంద అడుగుల మేర రోడ్డును వెడల్పు చేయాలన్నారు. జిల్లా కేంద్రం పాడేరులో నిత్యం ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతుందన్నారు.అత్యవసర సమయంలో 108, అంబులెన్స్ల్లో రోగులను పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించేందుకు ట్రాఫిక్ సమస్య వల్ల తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. దీనివల్ల ,సత్వర వైద్యానికి విఘాతం ఏర్పడుతుందన్నారు. గిరిజన ప్రాంత ప్రజలంతా పట్టణంలో రోడ్ల అభివృద్ధిని కోరుకుంటున్నారన్నారు.పట్టణ ప్రాంత అభివృద్ధికి భవిష్యత్ కార్యచరణ చూసుకుని పలు రాజకీయ పార్టీల నేతలంతా రోడ్ల విస్తరణకు మద్దతు ఇవ్వాలన్నారు. గిరిజన ప్రాంతాల్లోని రాజకీయ పార్టీల నేతలు రోడ్లపైకి వచ్చి స్వచ్ఛందంగా వైఖరి వెల్లడించాలన్నారు.ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా రోడ్డు అక్రమణలు తొలగింపు, రోడ్డు విస్తరణ పనులు ఆగకుండా కలెక్టర్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే స్థానిక గిరిజనులు, ఆదివాసీ సంఘాలతో కలిసి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు డిమాండ్ అభివృద్ధికి రాజకీయ నేతలు అడ్డుతగలడం సరికాదని హితవు హైకోర్టు ఆదేశాలు అమలుచేయకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరిక -
పోస్టల్ పథకాలతో ఆర్థిక భరోసా
ముంచంగిపుట్టు: పోస్టల్ శాఖలో పొదుపు ఖాతాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించి, ఖాతాలు తెరిస్తే కలిగే ఆర్థిక భరోసాపై అవగాహన కల్పించాలని అరకు సబ్ డివిజనల్ పోస్టల్ ఐపీవో లక్ష్మీకిషోర్ సిబ్బందికి తెలియజేశారు. ముంచంగిపుట్టు మండల కేంద్రంలో బీపీఎంలు, ఏబీపీఎంలతో శుక్రవారం పోస్టల్ సేవలపై గిరిజన గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అరకు సబ్ డివిజన్ ఐపీవో లక్ష్మీకిషోర్ మాట్లాడుతూ గ్రామాల్లో ఇంటింటికి వె వెళ్లి పోస్టల్ శాఖలో ఉన్న పొదుపు ఖాతాలపై వివరిస్తూ అవగాహన కల్పించాలని.ప్రజలంతా నిత్యం అందుబాటులో ఉండే పోస్టాఫీసులను వినియోగించుకొని పోస్టల్ సేవలు పొందేలా పని చేయాలని, ఎస్బీ, ఆర్డి, సుకన్య, ఆర్పిఎల్ఐ, పిఎల్ఐ, బీమా, ఐపిపిబి వంటి ఖాతాలు తెరిస్తే పొందే లబ్ధిని తెలియజేయాలని సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలనంటే ఖాతాలకు ఎన్పీసీఎల్ లింక్ చేసుకునేలా సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. ఎంవో శ్రీను, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు ,అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు పాల్గొన్నారు.అరకు పోస్టల్ ఐపీవో లక్ష్మీకిషోర్ -
610 మంది ఇళ్ల డాక్యుమెంట్ల అందజేత
కూనవరం: పోలవరం నిర్వాసితులు ఇంటి వాల్యూ అవార్డు గ్రామ సభను సద్వినియోగం చేసుకోవాల ని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నసరయ్య కోరారు. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో శుక్రవారం టేకుల బోరు, ఉదయ భాస్క ర్ కాలనీ, సినిమాహాల్ సెంటర్లో ఉన్న ఇళ్లకు సంబంధించి ఇంటి వ్యాల్యూ అవార్డు గ్రామసభను ఆయన ఆధ్వర్యంలో నిర్వహించారు. సుమారు 610 మంది తమ ఇంటి విలువకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులకు అందజేశారు. 15 మంది మాత్రం తమ ఇళ్లకు తక్కువ వాల్యూ వచ్చిందని రీ సర్వేకు దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె. శ్రీనివాసరావు, సర్పంచ్ హేమంత్, ఎంపీటీసీ సాంబశివరావు, పోలవరం సిబ్బంది చిన్నబాబు, రామారావు, సురేష్, గీత, ప్రసాద్, రాజు పాల్గొన్నారు. -
కిరండూల్ సెక్షన్లో రైల్వే జీఎం పర్యటన
తాటిచెట్లపాలెం: ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ శుక్రవారం రాయగడ డివిజన్ రైల్వే మేనేజర్ అబితాబ్ సింఘాల్తో కలసి కిరండూల్ సెక్షన్లో పర్యటించారు. ఈ సందర్భంగా దమన్జోడి–కిరండూల్ సెక్షన్ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను సమీక్షించారు. ట్రాఫిక్, ప్రయాణికుల సదుపాయాలను జీఎం పరిశీలించారు. దమన్జోడి, జగదల్పూర్, కిరండూల్ స్టేషన్లు, రైల్వే కాలనీల్లో పర్యటించారు. అక్కడ ఆధునికీకరించిన ప్రయాణికుల సౌకార్యలను పరిశీలించారు. ప్రయాణికుల సలహాలు, అభిప్రాయాలను తీసుకున్నారు. అనంతరం విండో ట్రయలింగ్ తనిఖీల ద్వారా డబ్లింగ్ పనులు, మలుపులు, వంతెనలు, టన్నెల్స్, వివిధ భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పర్యటనలో వాల్తేర్ డివిజన్ ఏడీఆర్ఎం(ఇన్ఫ్రా) ఇ.శాంతారం, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజినీర్ బి.ఎస్.రాజకుమార్, చీఫ్ ట్రాక్ ఇంజినీర్ కె.ధనుంజయరావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
విద్యార్థులందరికీ ఇంటర్లో అడ్మిషన్లు
ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కార్తీక్ శ్రీను డిమాండ్ పాడేరు : ఏపీ గిరిజన గురుకుల కళాశాలల్లో రెండు దఫా కౌన్సెలింగ్ నిర్వహించి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరికీ ఇంటర్లో అడ్మిషన్లు కల్పించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కార్తీక్ శ్రీను, జిల్లా సహాయ కార్యదర్శి దర్శి చిన్నారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం వారు పాడేరులో గిరిజన సంక్షేమ శాఖ ఇన్చార్జి డీడీ కమలకు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏటా గిరిజన గురుకులాలు, కాలేజ్ ఆఫ్ ఎక్వ్లెన్స్ల్లో తక్కువ మంది విద్యార్ధులకు ప్రవేశం కల్పిస్తున్నారని, దీంతో చాలామంది పేద గిరిజన విద్యార్ధులకు ఇంటర్లో ప్రవేశాలు దొరకడం లేదన్నారు. పాడేరు ఐటీడీఏ పరిధిలోని 11 మండలాల్లో బాలికల కోసం కేవలం మూడు మాత్రమే గిరిజన బాలికల గురుకుల కళాశాలలు ఉన్నందున గిరిజన విద్యార్థినులకు సీట్లు దొరకడం లేదన్నారు. అదనంగా బాలికల గిరిజన గురుకుల కళాశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ అడ్మిషన్ ఫీజులు తగ్గించాలన్నారు. గిరిజన గురుకుల కళాశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గిరిజన విద్యార్థులకు ఉచితంగా యూనిఫాం, పుస్తకాలను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అన్ని విద్యా సంస్థల్లో గిరిజన విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం హెల్త్ వలంటీర్లను నియమించాలన్నారు. విద్యార్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను గడువులోగా పరిష్కరించాలని లేని పక్షంలో విద్యార్థులతో కలిసి ఎస్ఎఫ్ఐ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని హెచ్చరించారు. -
సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టు
అరకులోయ టౌన్: సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు సీఎం చంద్రబాబుకు చెంపపెట్టు అని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పేర్కొన్నారు. శుక్రవారం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాక్షి టీవీ డిబేట్లో విశ్లేషకులు వ్యాఖ్యలు చేస్తే కొమ్మినేనిపై కేసు ఎలా పెడతారని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించిందన్నారు. కొమ్మినేనికి, సాక్షి టీవీకి ఎటువంటి సంబంధం లేకపోయినా వాటిని ఆపాదిస్తూ టీడీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా అలజడి సృష్టించారని అన్నారు. కుట్రపూరితంగా వ్యవహరించి రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాలపై దాడి చేశారని, తక్షణమే వారిని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏడాది కూటమి పాలనలో అక్రమ అరెస్టులు, కేసులతో నియంత పాలన సాగుతోందని, కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టులో కనీస నిబంధనలు పాటించలేదన్న విషయం సుప్రీంకోర్టు తీర్పుతో స్పష్టమైందన్నారు. కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం వదిలి, అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమ్మిడి ఆశోక్, వైఎస్సార్సీపీ నేత కిరణ్ పాల్గొన్నారు. సాక్షి కార్యాలయాలపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి.. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం -
సేవల్లో స్ఫూర్తి
వైద్యపరంగా వెనుకబడిన గిరిజన ప్రాంతాల్లోని గిరిజనులకు అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందించడంలో కీలకపాత్ర పోషిస్తూ ప్రాణదీప్తిగా నిలుస్తోంది పాడేరు రెడ్క్రాస్ సొసైటీ. ప్రజల్లో చైతన్యం నింపుతూ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ రోజురోజుకు సేవలను విస్తరిస్తోంది. పాడేరు కేంద్రంగా సేవలందిస్తూ జిల్లావ్యాప్తంగా 68 రక్తదాన శిబిరాలు నిర్వహించి 2624 యూనిట్ల రక్తాన్ని సేకరించింది.ప్రాణదీప్తి.. రక్తబంధువు కనీస వయసు 18 నుంచి 65 సంవత్సరాల వరకు రక్తదానం చేయవచ్చు. బరువు కనీసం 45 నుంచి 55 కిలోలు ఉండాలి. ఒక మనిషి ఒకసారి 350 మిల్లీలీటర్ల రక్తం ఇవ్వొచ్చు. 50 కిలోల బరువు పైబడి ఉన్నవారు 450 మి.లీ రక్తం ఇవ్వవచ్చు. శరీర ఉష్ణోగ్రత 37 నుంచి 98 డిగ్రీల కంటే ఎక్కువ ఉండకూడదు. హృదయ స్పందన 60 నుంచి 100 ఉండాలి. రక్తపోటు 100 నుంచి 140, డయాస్టోల్ 60 నుంచి 90 ఉండాలి. తీవ్రమైన శ్వాసకోస వ్యాధులు ఉండకూడదు. హిమోగ్లోబిన్ కనీసం 12.5 నుంచి 38 వరకు ఉండాలి. ఓ నెగిటివ్ గ్రూప్కు డిమాండ్ ఏ పాజిటివ్, ఏ నెగిటివ్, బీ పాజిటివ్, బీ నెగిటివ్, ఏబీ పాజిటివ్, ఏబీ నెగిటివ్, ఓ పాజిటివ్, ఓ నెగిటివ్ ఇలా ఎనిమిది రక్త గ్రూపులు ఉన్నా.. ఓ నెగిటివ్ చాలా అరుదుగా లభిస్తుంది. సుమారుగా ప్రతి 10 మందిలో ఒకరికి మాత్రమే ఉంటుంది. ● ఆదర్శంగా రెడ్క్రాస్ సొసైటీ సేవలు ● అత్యవసర పరిస్థితుల్లో కీలకపాత్ర ● విజయవంతంగా 68 రక్తదాన శిబిరాల నిర్వహణ ● జిల్లావ్యాప్తంగా 2,624 యూనిట్ల సేకరణ ● నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సాక్షి, పాడేరు: రెడ్క్రాస్ సొసైటీ సేవలు ఇక్కడ అందుబాటులో లేనప్పుడు ఏజెన్సీ ఆస్పత్రుల్లోని రోగులకు రక్తం అవసరం ఉంటే విశాఖలోని కేజీహెచ్కు రిఫర్ చేసేవారు. మైదాన ప్రాంత బ్లడ్బ్యాంకుల నుంచి రక్తాన్ని సేకరించి స్థానికంగా ఉండే బ్లడ్ స్టోరేజీ పాయింట్లలో భద్రపరిచేవారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందుబాటులో లేక ఇబ్బందులు పడేవారు. వైఎస్సార్సీపీ హయాంలో.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రెడ్ క్రాస్ సొసైటీ సేవలను 2022లో ఇక్కడికి విస్తరించింది. పాడేరు కేంద్రంగా రక్తదాన శిబిరాలు నిర్వహించి పెద్ద ఎత్తున సేకరణ చేపట్టింది. చైతన్యం పెరగడంతో రక్తదానం చేసేందుకు యువతీ యువకులు ముందుకు వస్తున్నారు.రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రక్తదాన శిబిరాలు విజయవంతం చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఎంతో శ్రమిస్తోంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోని ఎన్ఎస్ఎస్ విభాగం, వలంటీర్లు రక్తదానంపై విస్తృత ప్రచారం చేయడం రక్తసేకరణలో రెడ్క్రాస్ సొసైటీకి ఎంతో ఉపకరిస్తోంది. జిల్లావ్యాప్తంగా 68 రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్తదాతల నుంచి 2624 యూనిట్లు సేకరించింది. నాలుగు చోట్ల బ్లడ్ బ్యాంకులు: బ్లడ్ స్టోరేజీ పాయింట్ల స్థాయి నుంచి బ్లడ్ బ్యాంక్ స్థాయికి సేవలు విస్తరించాయి. జిల్లాలో పాడేరు జిల్లా ఆస్పత్రి, అరకులోయ, రంపచోడవరం, చింతూరు ఏరియా ఆస్పత్రుల్లో గత ప్రభుత్వంలోనే బ్లడ్ బ్యాంక్లు ఏర్పాటయ్యాయి. ఈ నాలుగు ఆస్పత్రుల్లో రక్తం క్యూరేషన్తో పాటు రక్తం నిల్వలను భద్రపరిచి జిల్లా వ్యాప్తంగా అత్యవసర సమయంలో రోగులకు సరఫరా జరుగుతోంది. చింతపల్లి, ముంచంగిపుట్టు, కూనవరం సీహెచ్సీల్లో కూడా బ్లడ్స్టోరేజ్ పాయింట్లు ఏర్పాటు అయ్యాయి. యువకులకు అభినందన పాడేరు ప్రాంతానికి చెందిన జి.సంతోష్కుమార్, ఎస్.వికాస్ అనే యువకులు 26 సార్లు రక్తదానం చేశారు. అలాగే పి.రాజు 18సార్లు, ఒ.సుమన్ 17 సార్లు రక్తదానం చేశారు. వీరందరినీ పాడేరు వైద్య కళాశాలలో శుక్రవారం ఘనంగా సత్కరించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ హేమలతాదేవి, డీఎంహెచ్వో డాక్టర్ జమాల్బాషా వారిని అభినందించారు. ఉత్తమసేవా పత్రాలను అందజేశారు.రక్తదానం చేయాలంటే.. పూర్తిస్థాయిలో రక్త నిల్వలు జిల్లా ఆస్పత్రిలోని బ్లడ్బ్యాంకులో నిరంతరం రక్తం నిల్వలు అందుబాటులో ఉంటున్నాయి. రెడ్ క్రాస్ సొసైటీ శిబిరాలలో సేకరించిన రక్తాన్ని స్థానికంగా గర్భిణులు, రక్తహీనత రోగులకు అత్యవసర పరిస్థితుల్లో వినియోగిస్తున్నాం. బ్లడ్ బ్యాంకులో కనీసం 10 యూనిట్ల వరకు పలు గ్రూప్ల రక్తం నిల్వ ఉంటుంది. – డాక్టర్ విశ్వమిత్ర, సూపరింటెండెంట్, జిల్లా సర్వజన ఆస్పత్రి ప్రజల్లో చైతన్యం పెరిగింది జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం పెరిగింది. రక్తదానంపై ఉన్న ఆపోహలను పక్కనబెట్టి రక్తదాన శిబిరాలకు యువకులు, విద్యార్ధులు, అధికారులు, ఉద్యోగులు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. రెడ్ క్రాస్ సొసైటీ పాడేరులో ఏర్పాటు చేసిన నాటి నుంచి కలెక్టర్ అధ్యక్షతన రక్తదాన శిబిరాలతో పాటు సేవా కార్యక్రమాలు విస్తృతమయ్యాయి. – గౌరీశంకర్రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, రెడ్క్రాస్ సొసైటీ, పాడేరు -
జిల్లా ఆస్పత్రి ఆవరణలో గిరిజనుడి మృతదేహం
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు పాడేరు: నిత్యం రద్దీగా ఉండే పాడేరు జిల్లా ఆస్పత్రి ఆవరణలో అనుమానాస్పద స్థితిలో ఓ గిరిజనుడి మృతదేహం లభ్యమైంది. శుక్రవారం ఉదయం మృతదేహాన్ని చూసిన ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది విషయాన్ని పోలీసులకు చేరవేశారు. సీఐ దీనబంధు నేతృత్వంలో పోలీసు సిబ్బంది జిల్లా ఆస్పత్రికి చేరుకొని మృతదేహం జేబులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా అతడి వివరాలు సేకరించారు. జి.మాడుగుల మండలం నుర్మతి పంచాయతీ పెద్ద జాగీరు గ్రామానికి చెందిన మసాడ నడపయ్య(50)గా ఆయనను గుర్తించారు. మృతుడు పాడేరు పట్టణంలోని సుండ్రుపుట్టులో నివసిస్తున్న కుమార్తె వద్ద గత కొన్ని రోజులుగా ఉంటున్నట్లు తెలిసింది. గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయానికి బాగానే ఉన్న వ్యక్తి ఆస్పత్రి ఆవరణలో శవమై కనిపించడంతో అతడి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. వారి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ఎం.విశ్వేశ్వరరాజు ఆస్పత్రిలో పరామర్శించారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు అంబులెన్స్ సమకూర్చారు. -
ట్రాన్స్ఫార్మర్ల చోరీ కేసుల్లో ముగ్గురి అరెస్టు
సబ్బవరం: ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు మండలాల్లో గత రెండేళ్లుగా ఏపీఈపీడీసీఎల్కు చెందిన 42 ట్రాన్స్ఫార్మర్లను చోరీ చేసిన కేసుల్లో ముగ్గురు నిందితులను స్థానిక పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సబ్బవరం పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పరవాడ డీఎస్పీ విష్ణుస్వరూప్ వివరాలు వెల్లడించారు. విశాఖపట్నంలోని మర్రిపాలెంకు చెందిన గరికిపాటి సాయికిరణ్,పట్నాల రాజేశ్వరరావు,మహారాణిపేటకు చెందిన నెల్ల సాయిప్రసాద్ అనే ముగ్గురు యువకులతో పాటు మరో ఇద్దరు కలిసి 2023 నవంబర్ నుంచి 2025 జూన్ వరకూ ఉమ్మడి విశాఖ జిల్లాలోని సబ్బవరం, ఆనందపురం, పెందుర్తి, అచ్యుతాపురం, చోడవరం, కశింకోట, యలమంచిలి, భీమిలి మండలాల్లోని ఏపీఈపీడీసీఎల్కు చెందిన ట్రాన్స్ఫార్మర్లను చోరీ చేశారు. ఎనిమిది మండలాల్లో 42 ట్రాన్స్ఫార్మర్లు చోరీ చేయగా, అత్యధికంగా సబ్బవరం మండలంలో 15 ట్రాన్స్ఫార్మర్లు అపహరించినట్టు డీఎస్పీ తెలిపారు. చోరీ చేసిన ట్రాన్స్ఫార్మర్ల నుంచి కాపర్ వైర్ను తొలగించి, అమ్మేశారని తెలిపారు.ఈ విధంగా వారు విక్రయించిన 190 కిలోల కాపర్ వైర్ను రికవరీ చేసినట్టు చెప్పారు. చోరీ చేసిన ట్రాన్స్ఫార్మర్ల విలువ రూ.54 లక్షల వరకూ ఉంటుందన్నారు.ఈ కేసుల్లో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని డీఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ జి.రామచంద్రరావు,ఎస్ఐలు సింహాచలం, దివ్యలతో పాటు మిగిలిన సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. 190 కిలోల కాపర్ వైర్ స్వాధీనం డీఎస్పీ విష్ణు స్వరూప్ -
టీడీపీ కార్యకర్తతో ఎలా పుస్తకాలు పంపిణీ చేయిస్తారు?
రంపచోడవరం: రాజ్యాంగబద్దంగా ఎటువంటి పదవీ లేకపోయినా పసుపు చొక్కా వేసుకుంటే చాలు ప్రొటోకాల్ పాటిస్తూ ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు చేస్తారా అంటూ అధికారుల తీరుపై ఎంపీపీ బందం శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక గిరిజన సంక్షేమ బాలిక ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం టీడీపీ కార్యకర్త సలాది బాపిరాజు అనే వ్యక్తి చేతులమీదుగా పాఠశాల హెచ్ఎం పుస్తకాలు, బ్యాగులు పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలతో పాటు ఎంపీపీ, జెడ్పీటీసీలకు ఆహ్వానం లేకపోవడం తగదన్నారు. ఏ అర్హతతో సదరు టీడీపీ కార్యకర్తతో పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేయించారో అధికారులు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై హెచ్ఎం, విద్యాశాఖ అధికారులపై జిల్లా కలెక్టర్, గిరిజన సంక్షేమ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఆమె స్పష్టం చేశారు. అధికారుల తీరుపై ఎంపీపీ బందం శ్రీదేవి మండిపాటు కలెక్టర్, టీడబ్ల్యూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరిక -
సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి
● డీఆర్వో పద్మలత ● 105 వినతుల స్వీకరణ పాడేరు : వివిధ సమస్యలపై ప్రజల నుంచి స్వీకరించిన వినతులను సంబంధిత శాఖల అధికారులు నిశితంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డీఆర్వో కె. పద్మలత అన్నారు. స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో శుక్రవారం మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం నిర్వహించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావుతో కలిసి ఆమె పలు ప్రాంతాల నుంచి అర్జీదారుల నుంచి 105 వినతులను స్వీకరించారు. పక్కా గృహాలు మంజూరు చేయాలని, బీటీ రోడ్లు నిర్మించాలని, తాగునీటి సమస్య పరిష్కారించాలని, ఏకలవ్య, గిరిజన గురుకుల పాఠశాలల్లో గిరిజన విద్యార్ధులకు సీట్లు ఇప్పించాలని, వంతెనలు నిర్మించాలని తదితర సమస్యలపై వినతులు అందాయి. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ జమాల్బాషా, డ్వామా పీడీ విద్యసాగర్, సర్వే, లాండ్స్ ఏడీ దేవేంద్రుడు, ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు రమేష్కుమార్రావు, పరిశ్రమల శాఖ ఏడీ రమణరావు, పశుసంవర్థక శాఖ ఏడీ డాక్టర్ నర్శింహులు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి బీఎస్ఎస్ నంద్ పాల్గొన్నారు. -
రంగురాళ్ల తవ్వకాలకు భారీ స్కెచ్
సాక్షి, అనకాపల్లి: నర్సీపట్నం రేంజ్ పరిధిలో గల గొలుగొండ కరక క్వారీలో లభ్యమయ్యే రంగురాళ్ల అక్రమ తవ్వకాలకు భారీ స్కెచ్ వేశారు. ఈ రంగురాళ్లకు దేశంలోనే అత్యంత గిరాకీ ఉంటుంది. కరక క్వారీలో అలెక్స్ (సిసలైన పచ్చ వైఢూర్యం) లభ్యమవుతుంది. రంగురాళ్ల తవ్వకాలు చేపట్టేందుకు ఎన్నో ఏళ్లుగా అక్రమార్కుల ముఠా ఎదురుచూస్తోంది. టీడీపీ ప్రభుత్వం వస్తేనే వీరికి అనుకూలంగా ఉంటుంది. ఈ పరిసర ప్రాంతంలోకి ఎవరైనా అక్రమార్కులు ప్రవేశించాలంటే అటవీ శాఖ అధికారుల అనుమతి తప్పనిసరి. అందుకే గార్డు స్థాయి నుంచి ఫారెస్ట్ రేంజ్ అధికారి వరకూ ఇటీవల బదిలీలలో మార్పు చేసుకున్నారు. ఇప్పుడు డీఎఫ్వోగా తమకు అనుకూలమైన వ్యక్తిని రప్పించేందుకు కూటమి ఎమ్మెల్యే కుమారుడి సిఫార్సు లేఖతో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అతని సిఫార్సుతోనే ఫారెస్ట్ రేంజ్ అధికారిని తెచ్చుకున్నారు. ఇప్పుడు జిల్లా ఫారెస్ట్ అధికారిని కూడా మార్చేందుకు తీవ్ర ప్రయత్నం జరుగుతోంది. అనుకూలస్తులనే తెచ్చుకున్నారు..! ఈ నెల 9వ తేదీన కరక క్వారీ ప్రాంత గార్డు అయిన నవీన్, ఫారెస్ట్ రేంజ్ అధికారి లక్ష్మీనరసింహలకు ఐదేళ్ల కాలపరిమితి ముగియకపోయినా బదిలీ చేయించి, తమకు అనుకూలంగా ఉండే వారిని తెచ్చుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక్కడకు గార్డుగా వచ్చిన వ్యక్తి స్థానిక కూటమి నేతలకు బాగా పరిచయస్తుడు. ఇక్కడకు కొత్తగా వచ్చిన ఫారెస్ట్ రేంజ్ అధికారి కూడా ఈ ప్రాంత కూటమి నాయకులకు సుపరిచితుడు. ఏడాది క్రితం కేడీ పేటలో డీఆర్వోగా పనిచేసి ప్రమోషన్పై పాడేరు డివిజన్లో ఫారెస్ట్ రేంజ్ అధికారిగా పదోన్నతిపై వెళ్లారు. మళ్లీ నర్సీపట్నం ఫారెస్ట్ రేంజ్ అధికారిగా బదిలీపై వచ్చేశారు. కూటమి పాలనలో అక్రమార్కుల ఆటలు తారస్థాయికి చేరాయి. ఏడాది కాలంలో ఇసుక, గ్రావెల్, లేటరైట్, మైనింగ్ వంటి ప్రభుత్వ సంపదను దోచుకోవడమే కాక.. ఇప్పుడు ఏకంగా రంగురాళ్లపైనే కన్నేశారు. ఇందుకోసం అటవీ శాఖలో కింది నుంచి పై వరకు తమకు అనుకూలంగా ఉన్నవారిని నియమించుకుంటున్నారు. నేడో రేపో డీఎఫ్వోగా అస్మదీయుడినే నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గొలుగొండ కరక క్వారీ దోచుకునేందుకు పన్నాగం అడ్డుకుంటారన్న అనుమానంతో అటవీ అధికారుల మార్పు డీఎఫ్వోను మార్చేందుకు కూటమి ఎమ్మెల్యే కుమారుడి సిఫార్సు లేఖ ఏసీబీ ట్రాప్లో చిక్కిన అధికారిని తెచ్చుకునేందుకు యత్నాలు అవినీతి అధికారికి అందలం! ప్రస్తుతం అనకాపల్లి జిల్లా డీఎఫ్వోగా పనిచేస్తున్న శామ్యూల్ను మార్పు చేసి కూటమి ఎమ్మెల్యే కుమారుడి సిఫార్స్ లేఖతో తనకు అనుకూలంగా పనిచేసే అధికారిని తెచ్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అవినీతికి మారుపేరు అయిన ఒక అధికారిని తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సదరు అధికారి గతంలో విజయనగరంలో రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ ట్రాప్లో చిక్కారు. గతంలో శ్రీకాకుళంలో కూడా ఇతని మీద ఒక ఏసీబీ కేసు ఉంది. రంగురాళ్ల తవ్వకాలకు అడ్డు లేకుండా అలాంటి వ్యక్తిని నర్సీపట్నం తీసుకొస్తున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. ఆయన వీఎంఆర్డీ డీఎఫ్వోగా రావటానికి భారీ ముడుపులు ఇచ్చి ప్రయత్నం చేసినప్పటికీ.. ఏసీబీ కేసు ఉండటం వలన సంస్థ తీసుకోవటానికి ఇష్టపడలేదు. సదరు అధికారి ప్రస్తుతం విజయవాడలో పనిచేస్తున్నారు. బదిలీ జీవో నేడో, రేపో రానున్నట్లు సమాచారం. -
యోగాతో మంచి ఆరోగ్యం
● ఎస్డీసీ అంబేడ్కర్ రంపచోడవరం: ప్రతీ వ్యక్తి రోజు 40 నిమిషాల పాటు యోగా చేయడం వల్ల మంచి ఆరోగ్యం పొందవచ్చని ఎస్డీసీ పి.అంబేడ్కర్ అన్నారు. గురువారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో విద్యార్థులు, అధికారులు, సిబ్బందితో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ఏడు మండలాల్లో ఈ నెల 21 వరకు ప్రఽభుత్వ ఆదేశాల మేరకు యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. యోగా వల్ల కలిగే ప్రయోజనాలను అందరికీ వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏజెన్సీ డీఈవో వై. మల్లేశ్వరరావు, ఎంపీడీవో శ్రీనివాసరావు, శివకుమార్, భవాని, పోతురాజు పాల్గొన్నారు. -
మొక్కుబడి
కూటమి ప్రభుత్వ చర్యలపై విద్యార్థుల ఉసూరుపంపిణీలో ఘోరంగా విఫలం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పాఠశాలల ప్రారంభం రోజునే పుస్తకాలు, బ్యాగులు, ఇతర కిట్లు అన్ని పంపిణీ జరిగేది. ఈ విద్యాసంవత్సరం ప్రారంభం రోజునే విద్యా కిట్లు పంపిణీలో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. బ్యాగులు లేకుండా పుస్తకాలు ఇస్తే వాటిని విద్యార్థులు ఎలా తీసుకువెళ్తారో విద్యాశాఖమంత్రి లోకేష్కు తెలియాలి. విద్యారంగంపై కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం సరికాదు. – లోచలి వరప్రసాద్, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం, పాడేరుసాక్షి,పాడేరు: ప్రభుత్వ పాఠశాలలు తెరిచే రోజునే విద్యార్థులకు కిట్లు పంపిణీ చేస్తామన్న కూటమి ప్రభుత్వం ప్రకటన ప్రచారానికే పరిమితమైంది. జిల్లావ్యాప్తంగా పుస్తకాలు మినహా బ్యాగులు, యూనిఫాం, బెల్టులు, బూట్లు, సాక్సులు పంపిణీ చేసిన పరిస్థితులు కనిపించలేదు. గత ప్రభుత్వంలో ముందు చూపుతో.. గత విద్యాసంవత్సరంలో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముందు చూపుతో అలోచించి మే నెల నాటికే విద్యా కానుక కిట్లను అందుబాటులోకి తెచ్చింది. వీటిని పాఠశాలల ప్రారంభం రోజునే బ్యాగులతో పాటు పుస్తకాలు, విద్యార్థులకు అవసరమైన సామగ్రిని కూటమి ప్రభుత్వం పంపిణీ చేసింది.అ యితే ఈఏడాది మాత్రం పాఠశాలల ప్రారంభం రోజున విద్యార్థులు విద్యా కిట్లను పొందలేక పోయారు. హాజరుశాతం తక్కువగా ఉన్నప్పటికీ వచ్చిన వారికి చాలాచోట్ల పుస్తకాలు మాత్రమే పంపిణీ చేశారు. పాఠశాలలకు పుస్తకాలు తరలింపులోను జాప్యం ఏర్పడింది. ఎమ్మార్సీ సెంటర్లకు పరిమితం.. జిల్లా వ్యాప్తంగా 2,913 పాఠశాలల్లో 1,69,175 మంది విద్యార్థులు చదువుతున్నారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పాఠశాలల ప్రారంభం రోజునే బ్యాగులు, పుస్తకాలు, ఇతర మెటీరియల్ కిట్లను పొందేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో విద్యార్ధులు ఉసూరుమన్నారు. మొత్తం విద్యార్థులు 1,69,175మందికి సరిపడ బ్యాగులను ప్రభుత్వం అందుబాటులోకి తేలేకపోయింది. ఇప్పటివరకు 44 వేల బ్యాగులు, 44,800 యూనిఫారం, 24,886 బూట్లు, 24,886 సాక్సులు, 1,31,673 బెల్టులు మాత్రమే జిల్లాకు చేరాయి. పూర్తిస్థాయిలో కిట్లు రాకపోవడంతో ఇవన్నీ మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీ సెంటర్లకు పరిమితం అయ్యాయి. కిట్లు పూర్తిస్థాయిలో వచ్చిన తరువాత వాటిని విద్యార్థులకు అందజేయాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు. పూర్తిస్థాయిలో రావడానికి కనీసం వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురుకుల విద్యాలయాల్లో విద్యార్థుల హాజరుశాతం తక్కువగానే ఉంది. వారికి కూడా కిట్లు అందలేదు.విద్యావ్యవస్థకు అధిక ప్రాధాన్యమిచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు చేపట్టి గాడిలో పెట్టింది. స్కూళ్లు ప్రారంభం నుంచి విద్యార్థులకు అన్ని సౌకర్యాలుఅందుబాటులోకి తెచ్చి విద్యాప్రమాణాల మెరుగుకు ప్రణాళికపరంగా చర్యలు చేపట్టింది. కూటమి ప్రభుత్వం చర్యలు మాత్రంఇందుకు భిన్నంగా ఉన్నాయి. పాఠశాలలు పునః ప్రారంభ రోజునుంచే విద్యార్థులకు కష్టాలుమొదలయ్యాయి. విద్యామిత్ర కిట్లు పంపిణీ చేస్తామని ప్రకటించినప్పటికీ వీటి జాడ కానరాలేదు. పుస్తకాల పంపిణీ అరకొరగా సాగింది. సన్నబియ్యంతోనాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తామని చెప్పినా చాలాపాఠశాలల్లో విద్యార్థులు ముద్దయిన అన్నం తినాల్సి వచ్చింది. ముద్దవుతున్న సన్నబియ్యం కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సన్నబియ్యం నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటిని పాఠశాలలకు జీసీసీ ద్వారా ప్రభుత్వం పంపిణీ చేసింది. వీటితో సిద్ధం చేసిన అన్నం ముద్దగా ఉంటోంది. పాడేరు మండలం రాములపుట్టు పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కూరలు, సాంబారు బాగున్నప్పటికీ ముద్దయిన అన్నం తినేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. సాక్షి పరిశీలనలో చాలా పాఠశాలల్లో ఇదే కనిపించింది. దేవీపట్నం మండలం సీతారాం ఎంపీపీ పాఠశాలలో విద్యార్ధులకు యూనిఫాం, బూట్లు పంపిణీ కాలేదు అరకులోయ మండలం బోసుబెడ పాఠశాల, అరకు పట్టణంలోని ఉన్నత పాఠశాలల్లో బ్యాగులు, పుస్తకాలు,ఇతర సామగ్రి పంపిణీ జరగలేదు. డుంబ్రిగుడ మండలంలోని కిల్లోగుడ, అరకు, డుంబ్రిగుడ ఉన్నత పాఠశాలల్లో పుస్తకాలు, ఇతర సామగ్రి పంపిణీ చేయలేదు. పెదబయలు మండలం గోమంగి ప్రాథమిక పాఠశాలలో పుస్తకాలు మాత్రమే పంపిణీ చేశారు. బ్యాగులు, బూట్లు,ఇతర సామగ్రి పంపిణీ కాలేదు. సన్నబియ్యం పంపిణీ కాకపోవడంతో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు తమ వద్ద ఉన్న బియ్యంతో పిల్లలకు ఆహారం తయారు చేశారు. అరకొరగా పుస్తకాల పంపిణీ సరఫరా కాని బ్యాగులు, బూట్లు ముద్దయిన సన్నబియ్యం తల్లుల ఖాతాల్లో జమకాని తల్లికి వందనం నగదు కూటమి ప్రభుత్వ ప్రకటన ప్రచారానికే పరిమితం -
మునగపాకలో తీరని విషాదం
మునగపాక : కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలుస్తాడనుకున్న కుమారుడు ఫార్మా ప్రమాదంలో మృతి చెందడంతో మునగపాకలో విషాదం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మునగపాక మధ్య వీధిలో నివాసం ఉంటున్న శరగడం కుమార్(25)కు గత సంవత్సర క్రితం వివాహం జరిగింది. కుమార్ 8 నెలల క్రితం పరవాడలోని ఎస్ఎస్ ఫార్మాలో సేప్టీ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తూ వచ్చాడు. ఈ నెల 11న రాత్రి విధి నిర్వహణలో ఉండగా వెలువడిన విష వాయువులను పీల్చడంతో కుమార్ అస్వస్థతకు గురవడంతో వెంటనే అతనిని విశాఖ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కుమార్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మునగపాక గ్రామంలో విషాదం నెలకొంది. కుమార్ తండ్రి రామకృష్ణ గత 7 సంవత్సరాల క్రితం మృతి చెందగా తల్లి లక్ష్మి నాలుగు నెలల క్రితం చనిపోయింది. కుమార్ తమ్ముడు సౌత్ ఆఫ్రికాలో ఉద్యోగం చేస్తున్నాడు. భర్త కుమార్ మృతి చెందాడన్న విషయం తెలియడంతో భార్య మాధురి కన్నీటిపర్యంతమైంది. ఎంతో భవిష్యత్ ఉన్న కుమార్ ఫార్మా ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబానికి పెద్ద దిక్కు ఎవరంటూ ఆవేదన చెందుతున్నారు. అందరితో సఖ్యతగా ఉండే కుమార్ ఫార్మా ప్రమాదంలో మృతి చెందడాన్ని స్థానికులు, స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉండగా మృతుడు కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని కంపెనీ యాజమాన్యంతో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్, కర్రి సాయికృష్ణ, పెంటకోట విజయ్ తదితరులు చర్చలు జరిపారు. కుమార్ అంత్యక్రియలు శనివారం మునగపాకలో నిర్వహించనున్నారు. కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోయిన వైనం -
ఏయూ మీడియా అసోసియేట్ డీన్గా సాల్మన్ బెన్నీ
మద్దిలపాలెం (విశాఖ): ఆంధ్రా యూనివర్సిటీ ఔట్రీచ్, బ్రాండింగ్ అండ్ మీడియా అసోసియేట్ డీన్గా ఆంగ్ల విభాగం ఆచార్యుడు డాక్టర్ ఎన్. సాల్మన్ బెన్నీ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రెస్ అండ్ మీడియా రిలేషన్స్ డైరెక్టర్, జర్నలిజం ఆచార్యుడు చల్లా రామకృష్ణ ఆచార్య బెన్నీకి బాధ్యతలు అప్పజెప్పారు. ఈ సందర్భంగా ఆచార్య రామకృష్ణ మాట్లాడుతూ ఆచార్య బెన్నీ ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయం బ్రాండింగ్ నూతన ఒరవడిని సాధిస్తుందన్నారు. అనంతరం ఆచార్య బెన్నీని ఘనంగా సత్కరించారు. పత్రికా సంబంధాల అధికారిగా, మీడియా రిలేషన్స్ డైరెక్టర్గా 33 ఏళ్లుగా ఆచార్య రామకృష్ణ అందించిన సేవలను బెన్నీ కొనియాడారు. 2006లో కామన్వెల్త్ నుంచి బెస్ట్ పీఆర్వోగా కెనడాలో రామకృష్ణ అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం జర్నలిజం విభాగం బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్గా ఆయన వ్యవహరిస్తున్నారు. -
ఉలికిపాటు
పరవాడ: అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో జరుగుతున్న వరుస ప్రమాదాలతో ఫార్మా ఉద్యోగులు, కార్మికులు ఉలికి పడుతున్నారు. తరచూ ఫార్మా పరిశ్రమల్లో చోటుచేసుకుంటున్న అగ్ని ప్రమాదాలు, గ్యాస్ లీక్ ఘటనలతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎస్ఎస్ ఫార్మా పరిశ్రమలో సాల్వెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లో గురువారం తెల్లవారు జామున జరిగిన గ్యాస్ లీకేజీ ఘటనలో పరిశ్రమలో సేఫ్టీ మేనేజర్గా పనిచేస్తున్న హదారాబాద్కు చెందిన పరిమి చంద్రశేఖర్(32), షిప్ట్ సేఫ్టీ అఫీసర్గా పనిచేస్తున్న అనకాపల్లి జిల్లా మునగపాకకు చెందిన శరగడం కుమార్(25) మృత్యువాత పడ్డారు. హెల్పర్గా పనిచేస్తున్న ఒడిశాకు చెందిన బైడు బైసాల్(37) ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వరుస ప్రమాదాలతో భయాందోళన ● గతంలో సినర్జీన్ యాక్టివ్ పరిశ్రమలో జరిగిన బాయిలర్ పేలుడు ఘటనలో జార్ఖండ్కు చెందిన ముగ్గురు, ఒడిశాకు చెందిన ఒకరు, విజయనగరానికి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ● రక్షిత్ డ్రగ్స్ ఫార్మాలో గత డిసెంబర్లో ప్రొడక్షన్ బ్లాక్లో హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ లీకై న ఘటనలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికులు దేవిబాగ్, ఉగ్రేసర్గౌడ్లు అస్వస్దతకు గురయ్యారు. ● గత ఏప్రిల్లో అపిటోరియా పరిశ్రమ యూనిట్–6లో నైట్రోజన్ గ్యాస్ పీల్చడంతో విజయనగరం జిల్లా గంట్యాడ మండలం సిరిపురం గ్రామానికి చెందిన ఆళ్ల గోవింద్ మృతి చెందాడు. ● ఆల్కలీ మెటల్ ఫార్మా పరిశ్రమలో ఏప్రిల్లో జరిగిన మరో ఘటనలో మిథైల్ నైట్రేట్ గ్యాస్ లీకై విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం గొల్లపేటకు చెందిన సీహెచ్.రమణ(32) మృతి చెందాడు. మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ● అదే నెలలో ఠాగూర్ లేబొరేటరీస్ పరిశ్రమలో రియాక్టర్ను శుభ్రం చేస్తున్న క్రమంలో రియాక్టర్ వాల్వ్ నుంచి విడుదలైన విషవాయువును పీల్చడం వల్ల కె.సింహచలం అనే కాంట్రాక్టు కార్మికుడు అస్వస్దతకు గురయ్యాడు. అనంతరం ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ● మెట్రెకమ్ పరిశ్రమలో ఖాళీ రసాయన డబ్బాలు, వ్యర్ధాల వల్ల ప్రమాదం నెలకొంది. యాజమాన్యం వెంటనే స్పందించడంతో కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎస్ఎస్ ఫార్మా గ్యాస్ లీక్ ఘటనతో కలకలం గత ప్రమాదాల నుంచి నేర్చుకోని యాజమాన్యం ప్రభుత్వ ఉదాసీనతే కారణమన్న ఆరోపణలు -
నూతన సంస్కరణలపై రైతులకు అవగాహన
గంగవరం : పంటల సాగు వ్యయాన్ని తగ్గించడం, నూతన ఆవిష్కరణలపై రైతులకు అవగాహన కల్పించేందుకు వికసిత్ కృషి సంకల్ప అభియాన్కు ప్రభుత్వం శ్రీకారం చుటిందని పందిరిమామిడి పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ కె.రాజేంద్రప్రసాద్, కె.వీరాంజనేయులు తెలిపారు. గురువారం కుసుమరాయి గ్రామంలో పందరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రం డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, రాజమండ్రి భారతీయ వాణిజ్య పంటల పరిశోధన సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఆముదాలబంద సర్పంచ్ పాయం రాజమ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వీరితోపాటు శాస్త్రవేత్త కె.సుమన్ కల్యాణ్ రైతులకు పలు సూచనలు చేశారు. సీటీఆర్ఐ శాస్త్రవేత్తలు డాక్టర్ కస్తూరి, కృష్ణ డాక్టర్ రవిశంకర్, మండల వ్యవసాయాధికారి విశ్వనాథ్, గ్రామసచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. సీనియర్ శాస్త్రవేత్తలు రాజేంద్రప్రసాద్, వీరాంజనేయులు సదస్సు నిర్వహించిన పందిరిమామిడి శాస్త్రవేత్తలు -
రక్తదాన శిబిరానికివిశేష స్పందన
21 యూనిట్ల సేకరణపాడేరు రూరల్: జిల్లా కేంద్రం పాడేరులోని కాఫీ హౌస్ అతిథి గృహంలో జిల్లా పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రపంచ రక్తదాతల దినోత్సవం పురస్కరించుకుని ఇండియాన్ రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో నిర్వహించారు. ఈ శిబిరాన్ని డీఆర్వో పద్మలత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జమాల్బాషా, పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ నరసింహులు ప్రారంభించారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన పశుసంవర్థక శాఖ ఉద్యోగులు 21 యూనిట్లు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ షేక్ షరీఫ్, డాక్టర్ రాఘవేంద్ర, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ గంగరాజు, కార్యదర్శి గౌరీశంకర్, కోశాధికారి సూర్యారావు, సభ్యులు ప్రసాధ్నాయుడు పాల్గొన్నారు. -
రైల్వే ఆస్పత్రిలో ఆధునిక పరికరాల ప్రారంభం
తాటిచెట్లపాలెం(విశాఖ): ఈస్ట్కోస్ట్ రైల్వే, వాల్తేర్ డివిజన్, డివిజనల్ రైల్వే ఆస్పత్రిలో రైల్వే ఉద్యోగులు, సిబ్బంది సౌకర్యార్థం అధునాతన పరికరాలను డీఆర్ఎం లలిత్ బోరా గురువారం ప్రారంభించారు. ఫిజియోథెరపీ యూనిట్లో ఇథైలిన్ ఆకై ్సడ్ స్టెరిలైజర్, అడ్వాన్స్డ్ లేజర్ మెషీన్లను ఆయనతోపాటు, ఈకార్వో ప్రెసిడెంట్ జ్యోత్స్న బోరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అధునాతన పరికరాల సాయంతో రైల్వే ఉద్యోగులకు మరింత సుఖవంతమైన, శ్రేయస్కరమైన వైద్యసదుపాయాలను అందించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ డి.శరత్బాబు, ఏడీఆర్ఎం(ఇన్ఫ్రా) ఇ.శాంతారాం, ఇతర అధికా రులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కూలిన ఉక్కు దీక్ష శిబిరం షెడ్
కూర్మన్నపాలెం: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల దీక్ష శిబిరం షెడ్ కూలిపోయింది. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి తాటాకులతో నిర్మించిన షెడ్డు నేలమట్టమైంది. దీంతో కార్మికులు తమ నిరసనను శిబిరం వెలుపల కొనసాగించాల్సి వచ్చింది. విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం 2021 ఫిబ్రవరి 12న అఖిలపక్ష కార్మిక సంఘాలు రిలే నిరాహార దీక్షలను ప్రారంభించాయి. ఈ దీక్షల కోసం తాటాకులతో ఈ షెడ్డును నిర్మించారు. సుమారు ఐదేళ్లు కావస్తున్నందున ఎండకు ఎండి, వానలకు తడిసి షెడ్డు ఎప్పుడైనా కూలిపోయే పరిస్థితికి చేరుకుంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి షెడ్డు కూలిపోయింది. అయితే ఆందోళనకారులు, కార్మిక సంఘాలు మళ్లీ షెడ్డు నిర్మిస్తాయా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఇటీవల పోలీసులు శిబిరాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని అక్కడే కూర్చున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు తిరిగి షెడ్డు నిర్మాణానికి అనుమతిస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. -
కొత్తగా కళ్లు తెరిచెనే.!
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కు లో రెండు జంతువుల పిల్లలు సందడి చేస్తున్నాయి. ఇటీవల గర్భం దాల్చిన రెడ్–నెక్డ్ వాలబీ, మౌస్ డీర్ ఒక్కో పిల్లకు జన్మనిచ్చాయి. ప్రస్తుతం తల్లీపిల్లలు రెండూ ఆరోగ్యంగా ఉన్నాయి. మౌస్ డీర్ పిల్ల తన తల్లితో కలిసి ఎన్క్లోజర్లో చురుకుగా తిరుగుతూ సందర్శకులకు కనువిందు చేస్తోంది. మరోవైపు రెడ్–నెక్డ్ వాలబీ పిల్ల ఇంకా తన తల్లి పొట్టభాగంలోని సంచిలోనే సురక్షితంగా ఉంది. సాధారణంగా రెడ్–నెక్డ్ వాలబీ గర్భం దాల్చిన 30 రోజుల్లోనే పిల్లకు జన్మనిస్తుంది. పుట్టినప్పటి నుంచి ఆ పిల్ల సుమారు ఏడు నెలల పాటు తల్లి సంచిలోనే ఉండి పాలు తాగుతూ పెరుగుతుంది. దాదాపు 12 నెలల వయసు వచ్చాక పూర్తిగా బయటకు వచ్చి స్వతంత్రంగా జీవించడం ప్రారంభిస్తుంది. ఈ రెండు పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయని జూ క్యూరేటర్ మంగమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. జూలో జంతువుల పునరుత్పత్తి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని, కొన్ని నెలల కిందట కూడా పలు జంతువులు పిల్లలకు జన్మనిచ్చాయని ఆమె పేర్కొన్నారు. జూ సంరక్షకులు వాటికి నిరంతరం ప్రత్యేక సేవలు అందిస్తున్నారని వివరించారు. -
చిన్నప్పటి నుంచి విద్యాబుద్ధులు నేర్పించాలి
చింతూరు: చిన్నారులకు చిన్నప్పటి నుంచి విద్యాబుద్ధులు నేర్పాలని స్థానిక ఐటీడీఏ పీవో అపూర్వభరత్ సూచించారు. అంగన్వాడీ పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా ఎర్రంపేట–2 అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ చిన్నారులకు అంగన్వాడీ స్థాయినుంచి నాణ్యమైన విద్యతోపాటు మంచి పౌష్టికాహారం అందించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం అందిస్తున్న సేవలను పిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం ఆయన చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో విజయగౌరి, సిబ్బంది పాల్గొన్నారు.చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ -
బాల కార్మికులు లేని సమాజమే లక్ష్యం
విశాఖ లీగల్ : బాల కార్మికులు లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విశ్రాంత ప్రిన్సిపల్ జడ్జి, లోక్ అదాలత్ న్యాయమూర్తి జి.వల్లభ నాయుడు అన్నారు. ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా కార్మిక శాఖ, జిల్లా విద్యాశాఖ, యాక్సిస్టివ్ జస్టిస్ ఫర్ చిల్డ్రన్ అప్ హోల్డ్ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలలు బాల కార్మికులుగా మారడానికి తల్లిదండ్రులు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారన్నారు. నిరక్షరాస్యత, వలస వెళ్లడం, ఇంటి పనులకు పెట్టడం, ఆర్థిక పరిస్థితుల వల్ల బాలలు బాల కార్మికులుగా మారుతున్నారని తెలిపారు. డిప్యూటీ కమిషనర్ లేబర్ సునీత మాట్లాడుతూ బాల కార్మికులను రెస్క్యూ చేయడంలో తమ సమస్త డిస్టిక్ టాస్క్ ఫోర్స్ సభ్యులు విశేషంగా కృషి చేస్తున్నామన్నారు. తిరిగి రిహాబ్లేట్ చేయడం కోసం బాలల సంక్షేమ సమితి, ఇతర డిపార్టుమెంటు, స్వచ్ఛంద సేవా సంస్థలు విశేషంగా కృషి చేస్తున్నాయన్నారు. మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ పి.పుష్యరాగం మాట్లాడుతూ చదువుకోవలసిన బాలలు పనిలోకి వెళ్లడం విచారకరమన్నారు. యాక్సిస్ టు జస్టిస్ అప్ హోల్డ్ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ జి.డేవిడ్ రాజు మాట్లాడుతూ తమ సంస్థ గత సంవత్సరం లేబర్ డిపార్టుమెంటు, మిగిలిన సంస్థలతో కలిసి 2012 మందిని రిస్క్ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రభుత్వ అధికారిణి మమత పాల్గొన్నారు -
తీరంలో మద్యం ఏరులు
ఏయూక్యాంపస్: పర్యాటక ప్రాంతం సాగర తీరంలో భద్రతా లోపానికి అద్దం పడుతున్నాయి ఈ చిత్రాలు. చీకటి పడితే మందుబాబులకు నిలయంగా తీర ప్రాంతం మారుతోంది. దీంతో ఇక్కడ మద్యం ఏరులై పారుతోంది. నిత్యం రాత్రి వేళల్లో సాగర తీరాన మందుబాబులు చేరి విచ్చలవిడిగా పార్టీలు చేసుకుంటున్నారు. విద్యుత్ దీపాలు సరిగా లేకపోవడం, నిర్మానుష్యంగా పరిసరాలు మారిపోవడంతో మద్యం ప్రియులు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. బీచ్ రోడ్డులోని నోవాటెల్ హోటల్ ఎదురుగా ఉన్న తీర ప్రాంతం నుంచి ఆర్.కె.బీచ్ వరకు ఉన్న అనేక ప్రాంతాల్లో తాగిపడేసిన మద్యం సీసాలు నిత్యం దర్శనమిస్తున్నాయి. తగినంత పోలీసు నిఘా లేకపోవడం, పూర్తిస్థాయిలో విద్యుత్ లైట్లు లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఈ నెల 21న విశాఖ సాగర తీరం వేదికగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో తీర ప్రాంతంలో విద్యుత్ దీపాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడం, భద్రతను పెంచడం, అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేయడం ఎంతో అవసరం. ఈ దిశగా పోలీసులు, జీవీఎంసీ సమష్టిగా దృష్టి సారించాల్సిన అవసరముందని నగరవాసులు, సందర్శకులు సూచిస్తున్నారు. మందుబాబులకు అడ్డాగా తీర ప్రాంతం ఎక్కడ చూసినా వైన్ బాటిళ్ల దర్శనం -
విశేషంగా ఆర్జిత సేవలు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి గురువారం ఆర్జిత సేవలు విశేషంగా జరిగాయి. ఉదయం 7 నుంచి స్వర్ణపుష్పార్చన ఘనంగా జరిపారు. ఆలయ బేడామండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం నిర్వహించారు. 108 స్వర్ణ సంపెంగలతో అష్టోత్తర శతనామావళి పూజ చేశారు. ఉభయదాతలకు స్వామివారి ప్రసాదం, శేషవ స్త్రాలను అందించారు. వైభవంగా నిత్యకల్యాణం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి నిత్యకల్యాణం వైభవంగా జరిగింది. ఆలయ బేడామండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను కొలువుంచి ఉదయం 9.30 నుంచి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని నిర్వహించారు. ఉభయదాతలకు స్వామివారి అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రాలను అందించారు. -
ఈఎస్ఐ ఆస్పత్రిలో ‘అల్ట్రా సౌండ్’ సేవలు
సింథియా : హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో సింధియాలోని కార్మిక బీమా ఆసుపత్రిలో రోగుల సౌకర్యార్థం అల్ట్రా సౌండ్ 2డి ఎకో స్కాన్ పరికరాలను గురువారం ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి హెచ్ఎస్ఎల్ ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ హేమంత్ ఖత్రీ , ఆయన సతీమణి వందన ఖత్రీ ముఖ్య అతిథులుగా హాజరై పరికరాలను ప్రారంభించారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో మహిళల కోసం ఏర్పాటు చేసిన సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది మహిళలకు క్యాన్సర్ వ్యాక్సిన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హేమంత్ ఖత్రీ మాట్లాడుతూ కార్మిక బీమా ఆస్పత్రికి అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్ అందించడం అత్యంత అవసరమని గుర్తించి, ఉద్యోగుల సహకారంతో దీనిని అందించగలిగామని అన్నారు. ఈ పరికరాలు షిప్యార్డ్ కార్మికులతో పాటు పరిసర ప్రాంతాల ఉద్యోగులకు కూడా ఉపయోగపడాలని ఆయన ఆకాంక్షించారు. అదేవిధంగా నేటి మానవ జీవన విధానాలలో మార్పుల వల్ల మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ఇప్పించడం ఎంతో గొప్ప విషయమని ఆయన అభిప్రాయపడ్డారు. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మహిళల్లో బ్రెస్ట్, బోన్ క్యాన్సర్, గర్భాశయ సమస్యల నుంచి రక్షించుకోవచ్చునని ఆయన వివరించారు. కార్యక్రమంలో షిప్యార్డ్ డైరెక్టర్ రాకేష్ ప్రసాద్, ఈఎస్ఐ ఆస్పత్రి సూపరింటెండెంట్ రమణమూర్తి, షిప్యార్డ్ గుర్తింపు యూనియన్ కార్మిక నాయకులు శ్రీరామ్మూర్తి, కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఉక్కు కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని వినతి
తుమ్మపాల: తొలగించిన స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజాన దొరబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లోని డీఆర్వో వై.సత్యనారాయణరావుకు వినతిపత్రం అందించి కార్మికుల సమస్యలను వివరించారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ చర్చల్లో ఎట్టి పరిస్థితిలోని కాంట్రాక్ట్ కార్మికులను తొలగించమని చెప్పి నిబంధనలకు విరుద్ధంగా తొలగించడం బాధాకరమన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ సమ్మె చేస్తే యాజమాన్యం వేధిస్తుందని ఆరోపించారు. కార్మికులను తొలగించడంతో ఆయా కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు కె.త్రినాథ్, కోరిబిల్లి శంకరరావు, సిహెచ్.రమణ, ఫణీంద్ర, సత్యనారాయణ పాల్గొన్నారు. -
సీఆర్ఎంటీలకు కలవరం
● వీరిని బోధన నుంచి దూరం చేస్తున్న విద్యాశాఖ ● 2012 నుంచి సేవలందిస్తున్న రిజర్వ్ మొబైల్ టీచర్లు ● క్లస్టర్ లెవెల్ అకడమిక్ టీచర్స్ విధానాన్ని ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నర్సీపట్నం: రాష్ట్ర విద్యాశాఖ అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్లకు (సీఆర్ఎంటీలు) శాపంగా మారాయి. బదిలీలు, ప్రమోషన్లు చేయగా మిగిలిన ఉపాధ్యాయులను క్లస్టర్ లెవెల్ అకడమిక్ టీచర్లుగా వినియోగించుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుండడంతో సీఆర్ఎంటీలు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వం సీఆర్ఎంటీల సేవలకు పెద్దపీట వేసింది. 2012 నుంచి విధులు నిర్వర్తిస్తున్న వీరి సేవలను బోధనకు ఉపయోగించుకునేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం జీవో నెంబరు 65 ద్వారా క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్ వ్యవస్థను తీసుకువచ్చింది. ఈ జీవో ప్రకారం సీఆర్పీ విధానం రద్దయి సీఆర్ఎంటీ విధానం ప్రస్తుతం అమల్లో ఉంది. అలా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న 260మంది సీఆర్ఎంటీలు టీచర్లు సెలవు పెడితే విద్యార్థులకు పాఠాలు బోధించేవారు. వీరు విద్యాశాఖలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. కూటమి ప్రభుత్వ సీఆర్ఎంటీలను ఇంటికి సాగనంపేందుకు పూనుకుందని, అందుకే బదిలీలు జరగగా మిగిలిన ఉపాధ్యాయులను తమ స్థానంలో నియమించేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోందని సీఆర్ఎంటీలు ఆందోళన చెందుతున్నారు. తమ సేవలను మరింత వినియోగించుకోవాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. మా సేవలను మరింత వినియోగించుకోవాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రభుత్వ తీసుకొచ్చిన క్లస్టర్ లెవెల్ అకడమిక్ టీచర్ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకుని, రాష్ట్రంలో పనిచేస్తున్న 3,300 మంది సీఆర్ఎంటీలకు తగు న్యాయం చేయాలి –పూడి వెంకట్రావు, ఏపీ సీఆర్ఎంటీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
వసతులిలా..చదువులెలా?
సాక్షి,పాడేరు: వేసవి సెలవుల అనంతరం జిల్లాలో పాఠశాలలు గురువారం తెరచుకోనున్న నేపథ్యంలో విద్యార్థులకు అవస్థలు తప్పే పరిస్థితులు కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి విద్యావ్యవస్థపై తీవ్ర నిర్లక్ష్యం నెలకొంది. గత విద్యాసంవత్సరంలో అనేక ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యల మధ్య చదువులు కొనసాగించాల్సిన దుస్థితిని విద్యార్థులు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన ముందస్తు చర్యలు కానరావడం లేదు. – గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాడు–నేడు రెండవ విడతలో 967 పాఠశాలల అభివృద్ధికి చర్యలు చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే వీటి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. చాలా పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాల సమస్యలు నెలకొన్నాయి. మరోవైపు జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ఇప్పటికీ పూర్తికాలేదు. మరో ఐదు రోజుల వరకు ఉపాధ్యాయుల బదిలీల గడువు పెంచడంతో గందరగోళం నెలకొంది. పూర్తిస్థాయిలో రాని కిట్లు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పూర్తిస్థాయిలో కిట్లు అందుబాటులోకి తేవడంలోను కూటమి ప్రభుత్వం విఫలమైంది. జిల్లాలోని 2,913 ప్రభుత్వ పాఠశాలల్లో 1,69,175మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికి నోటు, పాఠ్యపుస్తకాలను అందుబాటులో తెచ్చినప్పటికీ ఇతర కిట్లు మాత్రం అరకొరగానే జిల్లాకు సరఫరా జరిగింది.విద్యార్థులు 1,69,175 మందికి గాను, 1,31,673 బెల్టులు, 44 వేల బ్యాగులు, 44,800 యూనిఫాం, 24,886 బూట్లు,సాక్సుల కిట్లు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. పాఠశాలల ప్రారంభం తొలిరోజే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పుస్తకాలతో పాటు అన్ని కిట్లు పంపిణీ చేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించినప్పటికీ గురువారం జిల్లాలో పుస్తకాలకే పరిమితం అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం 967 పాఠశాలల్లో వెంటాడుతున్న అసౌకర్యాలు పూర్తిస్థాయిలో జిల్లాకు చేరని విద్యార్థుల కిట్లు పూర్తికాని ఉపాధ్యాయుల బదిలీలు ‘నాడు–నేడు’ నిలిపివేతతో ఇబ్బందులు గుత్తులపుట్టు ప్రాథమిక పాఠఽశాలలో నాడు–నేడు పనులు నిలిపివేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్ల పనులు కూడా సగానికి పరిమితమ య్యాయి.పాఠశాలలో సమస్యలు నెలకొంటే తమ పిల్లల చదువులకు ఇబ్బందిగా మారుతుంది. పూర్తిస్థాయిలో పాఠఽశాలను అభివృద్ధి చేయాలి. – డి.పాపిటిరాజు, గుత్తులపుట్టు, పాడేరు మండలంజిల్లాలో పాఠశాలల వివరాలు ప్రాథమిక : 2551 ప్రాథమికోన్నత : 91 ఉన్నత : 271 మొత్తం పాఠశాలలు : 2,913 బాలురు : 82,757 బాలికలు : 86,418 మొత్తం విద్యార్థులు : 1,69,175 -
రోడ్డున పడ్డ ఉద్యోగులు
కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో వలంటీర్లు, 108 ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ టీచర్లు, ఆశా కార్యకర్తల ధర్నాలు, నిరసనలతో విశాఖ హోరెత్తిపోతోంది. ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని 108 ఉద్యోగులు.. విధుల్లోకి తీసుకొని రూ.10 వేలు వేతనం ఇవ్వాలని వలంటీర్లు.. సమస్యలు పరిష్కరించాలంటూ ఆశ వర్కర్ల నిరసనలు.. ఆకలి కేకలతో అలమటిస్తూ పెండింగ్ జీతాల కోసం ఆయాల పొలికేకలు.. ఎండీయూ వాహనాలు రద్దు చేయడంతో రోడ్డున పడ్డ 702 మంది ఆపరేటర్లు, హెల్పర్ల ఆర్తనాదాలు.. ఇలా చంద్రబాబు ఏడాది పాలనలోనే అన్ని వర్గాల నుంచి అసహనం కట్టలు తెంచుకుంటోంది. -
మోకాళ్లకు అరుదైన శస్త్ర చికిత్స
రంపచోడవరం: స్థానిక ఏరియా ఆస్పత్రిలో మొదటిసారిగా మోకాళ్లకు అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. గంగవరం మండలం నెల్లిపూడి గ్రామానికి చెదిన మల్లపు మంగ అనే మహిళ ఎడమ కాలుకు ఆర్థ్దోపెడిక్ వైద్య నిపుణులు సుధాకర్, ప్రదీప్, మత్తు వైద్యులు రోహిణి సంయుక్తంగా శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ టీవీ శేషారెడ్డి మాట్లాడుతూ మోకాళ్ల నొప్పితో బాధపడుతున్న మంగ గత మూడు రోజుల క్రితం తమ ఆస్పత్రికి వచ్చినట్టు చెప్పారు. ఆమె మోకాళ్లకు ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు విజయవంతంగా శస్త్ర చికిత్స చేశారన్నారు. వైద్య బృందాన్ని స్థానిక ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం అభినందించారు. సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ చింతూరు: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ప్రజలు విన్నవించుకున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ ఆదేశించారు. బుధవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన డివిజన్లోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలకు సంబంధించి 66 అర్జీలు స్వీకరించారు. వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. -
హామీలన్నీ గాలికి..
సూపర్ సిక్స్ పేరుతో బూటకపు హామీలు గుప్పించి ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చడానికి ఖజానా ఖాళీ అయిపోయిందని కుంటి సాకులు చెబుతున్నారు. ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తానని, ఉచిత బస్సు ప్రయాణమని మాయమాటలు చెప్పారు. ప్రతి రైతుకు ఏడాదికి పెట్టుబడి సాయం కింద రూ.20 వేలు ఇస్తామని చెప్పి అన్నదాతకు వెన్నుపోటు పొడిచారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ, పెండింగ్ డీఏలు అన్నీ ఇస్తామని చెప్పి బుట్టలో వేసుకుని ఇప్పుడు నిలువునా ముంచారు. ఇలా విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు అందరికీ పంగనామాలు పెట్టారు. -
పంగనామాలు
అందరికీకూటమి ఏడాది పాలన అంతా మోసం, దగా సూపర్ సిక్స్ హామీలకు మంగళం స్టీల్ప్లాంట్ కార్మికుల గోడుపట్టదా? ఉక్కు పరిశ్రమను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం నెమ్మదిగా ఉద్యోగులకు వీఆర్ఎస్ పేరుతో ఇంటికి పంపిస్తోంది. కాంట్రాక్టు కార్మికులపై వేటు వేసింది. దీంతో వేలాది మంది కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గత ఏడాది కాలంగా కార్మికులు రోడ్డెక్కి ఆందోళనలు, ర్యాలీలు, నిరాహార దీక్షలు చేస్తున్నా.. ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్గానీ వారి గోడును పట్టించుకున్న దాఖలాలు లేవు. తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు నిరసనలు చేపడుతుంటే.. వారి ఆందోళనలను అణిచివేయడానికి పోలీసులను ప్రయోగిస్తుండడం గమనార్హం. -
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు
సాక్షి,పాడేరు: కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రాష్ట్రవ్యాప్తంగా బాలికలు, మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు, దౌర్జన్యాలను నిరసిస్తూ జిల్లా కేంద్రం పాడేరులో వైఎస్సార్సీపీ మహిళా విభాగం బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ మహిళా వ్యతిరేక విధానాలపై ఆమె ఆధ్వర్యంలో మహిళా నేతలంతా స్థానిక పాతబస్టాండ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. బాలికలు, మహిళలకు రక్షణ కల్పించాలని, రెడ్ బుక్ రాజ్యాంగానికి స్వస్తి చెప్పి, డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగం అమలుజేయాలని కోరుతూ డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వ మహిళా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్వతమ్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో మహిళలపై ఆరాచకాలు చాలా ఎక్కువగా జరగడం దారుణమన్నారు. హోంమంత్రి మహిళ అంటే ఎంతో సంతోషపడ్డామని, అయితే ఆమె కూడా మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్నారని విమర్శించారు. చిన్నారుల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు ఆత్యాచారాలకు గురవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బాలికలు, మహిళలు అన్యాయానికి గురవుతున్నా తోటి మహిళగా హోంమంత్రికి పరామర్శించే తీరిక కూడా లేకపోవడం బాధాకరమని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి పాలనలో బాలికలు, మహిళలకు సంపూర్ణ రక్షణ ఉండేదని, నేటి కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ కరువై, తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కనబెట్టి బాలికలు, మహిళలకు అన్ని విధాలుగా రక్షణ కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. అరకు, పాడేరు నియోజకవర్గాల మహిళా విభాగం అధ్యక్షులు సమిడ పూర్ణిమాదేవి, కిల్లో ఉర్వశిరాణి, పాడేరు వైస్ ఎంపీపీ కుంతూరు కనకాలమ్మ, ఎంపీటీసీలు గిడ్డి విజయలక్ష్మి, సీహెచ్.మీనా, లకే రామకృష్ణపాత్రుడు, సర్పంచ్లు బీమాలమ్మ, వంతాల సీతమ్మ, మాదెల రమణమ్మ, కూడా సుబ్రహ్మణ్యం, లకే రామసత్యవతి, కోడా సుశీల, వరలక్ష్మి, నీలమ్మ పాల్గొన్నారు. రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం: అనంతగిరి(డుంబ్రిగుడ): రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని అనంతగిరి ఎంపీపీ శెట్టి నీలవేణి ధ్వజమెత్తారు. బుధవారం ఆమె ఆధ్వర్యంలో కాశీ పట్నంలో మహి ళలు ఆందోళన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహా నికి వినతి పత్రం అందజేసి నిరసన తెలిపారు. అంబేడ్కర్ఱ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తోందని, మహిళలకు రక్షణ కల్పించాల్సిన ప్రభు త్వం వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని విమర్శించారు. వైఎస్సార్సీపీ మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. హోంమంత్రిగా మహిళ ఉన్నా దారుణంగా అరాచకాలు రెడ్బుక్ రాజ్యాంగంతో మరింత అన్యాయం వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ -
హోంమంత్రిగా మహిళ ఉన్నా అరాచకాలు దారుణం
సాక్షి, పాడేరు: రాష్ట్రంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు, దౌర్జన్యాలపై అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో మహిళలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. బుధవారం వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో పాడేరు పాత బస్టాండ్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద భారీ ప్రదర్శన నిర్వహించారు. పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మహిళా వ్యతిరేక విధానాలు, రెడ్బుక్ రాజ్యాంగంపై ధ్వజమెత్తారు. బాలికలు, మహిళలకు రక్షణ కల్పించాలని, అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలుజేయాలని కోరుతూ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. హోంమంత్రి మహిళ అయి ఉండి కూడా మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్నారని కురుసా పార్వతమ్మ విమర్శించారు. కూటమి పాలనలో చిన్నారులు, మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారని అన్నారు. అయినా, తోటి మహిళగా హోంమంత్రికి బాధితులను పరామర్శించే కనీస దయ కూడా లేకుండాపోయిందని దుయ్యబట్టారు. -
ఐఐఏఎం బిజినెస్ స్కూల్లో విదేశీ విద్య
ఎంవీపీకాలనీ: ఐఐఏఎం(ఇంటిగ్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్) బిజినెస్ స్కూల్ విదేశీ విద్యను అందించేందుకు ఇండో గల్ఫ్ మేనేజ్మెంట్ అసోసియేషన్(ఐజీఎంఏ)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఎంవీపీకాలనీలోని ఐఐఏఎం బీ–స్కూల్లో బుధవారం ఇరు సంస్థల ప్రతినిధులు ఎంవోయూ పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా ఐఐఏఎం కార్యదర్శి, డీన్ డాక్టర్ సుంకరి రవీంద్ర మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో యువతకు నాణ్యమైన విద్యను అందించి.. అంతర్జాతీయ ఉద్యోగ, వ్యాపార అవకాశాలను అందుబాటులోకి తేవడమే లక్ష్యమన్నారు. ఐఐఏఎం బీ–స్కూల్ డైరెక్టర్ జనరల్ ఆచార్య కృష్ణమోహన్ మాట్లాడుతూ సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఏఐ టెక్నాలజీలకు సంబంధించిన కోర్సులు ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయన్నారు. విద్యార్థులు ఏడాది పాటు దుబాయ్లో విద్యనభ్యసించాల్సి ఉంటుందన్నారు. ఈ కోర్సులకు అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ ఆమోదం ఉందన్నారు. ఐజీఎంఏ అధ్యక్షుడు డాక్టర్ మోహన్లాల్ అగర్వాల్ మాట్లాడుతూ అంతర్జాతీయ అవకాశాలను యువతకు చేరువ చేసేందుకు ఈ ఎంవోయూ ఎంతగానో తోడ్పడుతుందన్నారు. విశాఖతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా డిజిటల్ యుగంలో సర్వీస్ మార్కెటింగ్, మేనేజ్మెంట్ విద్య విశిష్టత, కార్పొరేట్ అవసరాలు, ఏఐ సాంకేతిక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన్ని ఐఐఏఎం బీస్కూల్ ప్రతినిధులు సత్కరించారు.ఇండో గల్ఫ్ మేనేజ్మెంట్ అసోసియేషన్తో కుదిరిన ఒప్పందం -
అంతర్ రాష్ట్ర మహిళల బ్లైండ్ క్రికెట్ విజేత ఒడిశా
ఉక్కునగరం: ఉక్కు స్టేడియంలో జరిగిన అంతర్ రాష్ట్ర మహిళల బ్లైండ్ క్రికెట్ చాంపియన్షిప్ను ఒడిశా జట్టు కై వసం చేసుకుంది. ఎన్టీపీసీ సింహాద్రి సహకారంతో క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ (సీఏబీఏపీ), క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ కేరళ (సీఏబీకే) సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన టోర్నమెంట్లో ఢిల్లీ, ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్ జట్లు పాల్గొన్నాయి. బుధవారం జరిగిన ఫైనల్స్లో ఒడిశా జట్టు మొదట బ్యాటింగ్కు దిగింది. 15 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆంధ్రప్రదేశ్ జట్టు 15 ఓవర్లలో 80 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఒడిశా జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్కు డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి హాజరై క్రీడాకారులను అభినందించారు. ముగింపు కార్యక్రమంలో ఎన్టీపీసీ ఈడీ సమీశ్ శర్మ, హెచ్ఆర్ బి.బి.శర్మ ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు ట్రోఫీలు, బహుమతులు అందజేశారు. ఇండియన్ బ్లైండ్ క్రికెట్ మాజీ కెప్టెన్ అజయ్కుమార్ రెడ్డి, కో–ఆర్డినేటర్లు అమ్మి నాయుడు, నరేశ్ పాల్గొన్నారు. రన్నరప్గా ఆంధ్రప్రదేశ్ జట్టు -
ఘనంగా లక్ష్మీ హోమం
డాబాగార్డెన్స్ (విశాఖ): బురుజుపేటలో వెలసిన కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో జ్యేష్ట పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం శ్రీచక్ర నవ వర్ణార్చన, లక్ష్మీ హోమం జరిపారు. ఈ పూజలో నలుగు రు ఉభయ దాతలు పాల్గొన్నారు. ప్రతి నెల పౌర్ణమి రోజున నిర్వహించే ఈ ప్రత్యేక పూజలో పాల్గొనే ఆసక్తి గల భక్తులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టౌన్ కొత్తరోడ్డు బ్రాంచ్, అకౌంట్ నంబరు 060810011006681, ఐఎఫ్ఎస్సీ కోడ్ యూబీఐఎన్ 0806081లో పూజా రుసుం చెల్లించాలి. ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసిన భక్తుల వివరాలు, పూజ జరిపించాల్సిన వారి పేరు, గోత్రనామాలు, పూర్తి చిరునామా, ఫోన్ నంబరును endow& eokanaka@gov.in మెయిల్కు పంపాలి. లేదా aptemples.ap. gov.inలో నమోదు చేసుకోవచ్చు. -
ఉక్కు ఉద్యోగులను ఢీకొట్టిన సీఐఎస్ఎఫ్ వాహనం
ఇద్దరికి గాయాలుఉక్కునగరం: స్టీల్ప్లాంట్లోని ఈడీ (వర్క్స్) బిల్డింగ్ ఎదురుగా ఉన్న మిల్స్ కూడలి వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఇద్దరు ఉద్యోగులు గాయపడ్డారు. సీఐఎస్ఎఫ్ వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వివరాలివి. వడ్లపూడి ప్రాంతానికి చెందిన సీరాపు సత్తిబాబు, నెమలికంటి రామారావు స్టీల్ప్లాంట్లోని వైర్ రాడ్ మిల్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఉదయం ‘ఏ’షిఫ్ట్ విధులకు హాజరయ్యేందుకు వారిద్దరూ ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మిల్స్ కూడలి వద్ద మలుపు తిరుగుతుండగా అదే సమయంలో సెంట్రల్ స్టోర్స్ జంక్షన్ వైపు నుంచి వేగంగా వస్తున్న సీఐఎస్ఎఫ్ వాహనం వారి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయి. సత్తిబాబు పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని నగరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రా మారావుకు ఉక్కు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. స్టీల్ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉపాధ్యాయుల సహనానికి పరీక్ష
ఆరిలోవ: ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్జీటీ ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్లో రెండో రోజూ గందరగోళం నెలకొంది. సాంకేతిక లోపాలు, అధికారుల జాప్యంతో బుధవారం కూడా ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎస్జీటీ ఉపాధ్యాయల బదిలీ కోసం మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మాన్యువల్ కౌన్సెలింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదటి రోజు సాంకేతిక సమస్యలతో అంతా గందరగోళంగా మారింది. దీంతో మొదటి రోజు కౌన్సెలింగ్ పూర్తిగా రద్దు కాగా, రెండో రోజు ఉదయం నుంచి రాత్రి వరకు పడిగాపులు కాయడంతో వారి సహనం నశించి అధికారులను నిలదీశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం 1 నుంచి 300 వరకు కౌన్సెలింగ్ జరగాల్సి ఉండగా ఉపాధ్యాయులు ఉదయం 10 గంటలకే చేరుకున్నారు. కానీ కౌన్సెలింగ్ ఆలస్యంగా మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమైంది. ప్రక్రియ నత్తనడకన సాగడంతో మధ్యాహ్నం 2.40 గంటలకు కేవలం 20 మందికి, మధ్యాహ్నం 3.30 గంటలకు 50 మందికి, సాయంత్రం 7.45 గంటలకు 210 మందికి మాత్రమే పూర్తయింది. మిగిలిన 90 మంది కౌన్సెలింగ్ ఆలస్యం కావడంతో.. అప్పటి వరకు నిరీక్షించిన ఉపాధ్యాయుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వారు ఉమ్మడి జిల్లాల డీఈవోల వద్దకు వెళ్లి, అధికారులు కావాలనే తమను ఇబ్బంది పెడుతున్నారంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు మరోసారి సాంకేతిక సమస్యనే కారణంగా చెప్పినా వారు శాంతించలేదు. చివరకు మిగిలిన వారికి కౌన్సెలింగ్ పూర్తయ్యే సరికి రాత్రి 11 గంటలు దాటింది. పాఠశాలల తొలిరోజే టీచర్ల గైర్హాజరు! మరోవైపు గురువారం పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. నేడు మరో 500 మందికి కౌన్సెలింగ్ నిర్వహిస్తుండటంతో, వారంతా తొలిరోజు పాఠశాలలకు గైర్హాజరు కావడం ఖాయంగా కనిపిస్తోంది. మొదటి రోజు సాంకేతిక లోపంతో కౌన్సెలింగ్ రద్దు కావడం, రెండో రోజు ఈ జాప్యం జరగడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. గురువారం 301 నుంచి 800 వరకు ఎస్జీటీ ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని విశాఖ డీఈవో ఎన్. ప్రేమకుమార్ తెలిపారు. ఉపాధ్యాయులు ఉదయం 9 గంటలకు కౌన్సెలింగ్కు హాజరుకావాలని ఆయన సూచించారు. రెండో రోజూ బదిలీల కౌన్సెలింగ్లో గందరగోళం -
కేంద్రం పథకాలతో సమగ్ర గిరిజనాభివృద్ధి సాధ్యం
సాక్షి,పాడేరు: సమగ్ర గిరిజనాభివృద్ధి లక్ష్యంగా ప్రధానమంత్రి దర్తీ ఆబా జంజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ (పీఎం జుగా)దోహదపడుతుందని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ తెలిపారు.బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఎం జుగా, పీఎం జన్మన్ పథకాలపై ఈనెల 15 నుంచి 30 వరకు జిల్లాలోని 518 గ్రామ సభల ద్వారా గిరిజనులకు అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుజేస్తున్న పథకాలతో గిరిజన సాధికారతకు కృషి చేస్తామన్నారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వ పథకాలు అమలుజేస్తామన్నారు. ప్రభుత్వ పథకాల అమలుతీరు పర్యవేక్షణకు తన అధ్యక్షతన ఐటీడీఏ పీవోలు, పలుశాఖల అధికారులతో జిల్లా కమిటీలు, ఎంపీడీవోల అధ్యక్షతన మండల స్థాయిలో పలువురు అధికారులతో మండల కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. పాఠశాలలకు దూరంగా ఉన్న గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతితో కూడిన భోజన సదుపాయం కల్పనకు 22 వసతి గృహాల నిర్మాణానికి జిల్లాకు ఎస్ఎస్ఏ నిధులు రూ.6,896 లక్షలు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. పాడేరు, రంపచోడవరం డివిజన్లలో రెండు మల్టీపర్పస్ మార్కెటింగ్ కేంద్రాలు మంజూరయ్యాయన్నారు. వీటిలో ఒకొక్కదానికి రూ.కోటి వెచ్చిస్తున్నట్టు చెప్పారు. రంపచోడవరం డివిజన్లో కేంద్రాన్ని ఆకుమామిడికోటలో నిర్మిస్తామన్నారు. పాడేరు డివిజన్లో 1,12,873 మందికి, రంపచోడవరం డివిజన్లో 25,14 6మందికి అటవీ హక్కుల చట్టం కింద భూములు పంపిణీ చేశామని చెప్పారు. పాడేరు డివిజన్లో రెండు వేల మందికి, రంపచోడవరం పరిధిలో 1496 మందికి కొత్తగా పట్టాలు ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ డాక్టర్ అభిషేక్గౌడ, సబ్కలెక్టర్ సౌర్యమన్పటేల్ పాల్గొన్నారు. గిరిజన గ్రామాలకు మౌళిక వసతులు: రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం రంపచోడవరం: గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి ప్రధానమంత్రి దర్తీ ఆబా జంజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ పథకంపై గిరిజనులకు అవగాహన కల్పిస్తామని స్థానిక ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం అమలు చేయడానికి ఏజెన్సీలో 211 గ్రామాలను ముందుగా గుర్తించడం జరిగిందన్నారు. అడ్డతీగల మండలంలో 7 , గంగవరం మండలంలో 47, దేవీపట్నం మండలంలో 11, మారేడుమిల్లి మండలంలో 40, రాజవొమ్మంగి మండలంలో 14, రంపచోడవరం మండలంలో 23, వై.రామవరం మండలంలో 67 గ్రామాలు ఉన్నట్లు తెలిపారు. అలాగే సబ్ ప్లాన్ఏరియాలోని ప్రత్తిపాడు మండలంలో రెండు గ్రామాలు, శంకవరం మండలంలో మూడు, రౌతులపూడి మండలంలో ఒక గ్రామాన్ని గుర్తించినట్లు తెలిపారు. ఆయా గ్రామాల్లో వివిధ శాఖల అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ నెల 15 నుంచి 30 వరకు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, యువతకు ఉపాధి అవకాశాలు వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారని తెలిపారు అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి గిరిజన గ్రామాల అభివృద్దికి కృషి చేయాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పై అవగాహన కల్పించేందుకు గ్రామసభలు కలెక్టర్ దినేష్కుమార్ -
దైవ దర్శనానికి వెళ్లొస్తూ..
జగదాంబ/బుచ్చెయ్యపేట: బుచ్చెయ్యపేట మండలం ఆర్.శివరాంపురంలో అంతులేని విషాదం అలుముకుంది. భార్య ఆరోగ్యం కోసం కేజీహెచ్కు బయలుదేరిన ఆ కుటుంబ ప్రయాణం అర్ధాంతరంగా ముగిసింది. ఈ క్రమంలో దైవదర్శనం అనంతరం తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడటంతో.. భార్య అక్కడికక్కడే కన్నుమూయగా, భర్త పరిస్థితి విషమంగా ఉంది. కన్నవారి కోసం ఆ పసిపిల్లల ఎదురుచూపులు, వారి ఆలనా పాలనా చూడాల్సిన నాన్నమ్మ గుండెలవిసేలా రోదించడం గ్రామస్తులను కంటతడి పెట్టించింది. దేవర చిలుకనాయుడు దివ్యాంగుడు. కాళ్లు చచ్చుబడ్డా.. ఆత్మవిశ్వాసాన్ని చంపుకోలేదు. ఎనిమిదేళ్ల కిందట దిబ్బిపాలేనికి చెందిన కృష్ణకుమారి (33)ని వివాహం చేసుకున్నాడు. గ్రామంలో చిన్న పాన్షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్న చిలుకనాయుడికి భార్యే చేదోడు వాదోడుగా ఉండేది. వారికి ఇద్దరు కుమార్తెలు యువశ్రీ(4), హాత్విక(8 నెలలు) ఉన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణకుమారిని ప్రతి నెలా కేజీహెచ్కు తీసుకొస్తున్నాడు చిలుకనాయుడు. బుధవారం ఉదయం కూడా తన మూడు చక్రాల స్కూటీపై భార్య, చిన్న కూతురు హాత్వికతో కలిసి శివరాంపురం నుంచి బయలుదేరాడు. ఈ క్రమంలో వీరు ఇసుకకొండ సత్యనారాయణ స్వామి దర్శనానికి ఘాట్ రోడ్డులో వెళ్లి తిరిగి వస్తున్నారు. పూర్ణామార్కెట్ సమీపంలో మొదటి మలుపు వద్ద స్కూటీ బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. అదుపుతప్పిన వాహనం వేగంగా గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కృష్ణకుమారి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. చిలుకనాయుడు తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్కూటీలో ముందు కూర్చున్న 8 నెలల హాత్విక పక్కనే ఉన్న ఇసుక దిబ్బపై పడటంతో ప్రాణాలతో బయటపడింది. ఆ పసిపాప ఏడుపు విని చలించిపోయిన ఓ మహిళా వ్యాపారి, చిన్నారిని దగ్గరకు తీసుకుని సపర్యలు చేసింది. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించింది. ప్రస్తుతం కేజీహెచ్లో చికిత్స పొందుతున్న చిలుకనాయుడు పరిస్థితి విషమంగా ఉందని, 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. తల్లి మృతి.. తండ్రికి సీరియస్ అనాథలైన పసిపాపలు స్కూటీ బ్రేకులు ఫెయిల్.. దివ్యాంగుడి కుటుంబంలో తీవ్ర విషాదం -
మోదీ పాలన స్వర్ణయుగం
● బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజు సాక్షి,పాడేరు: ప్రధానమంత్రి నరేంద్రమోదీ 11ఏళ్ల పాలన స్వర్ణయుగమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజు అన్నారు.11ఏళ్ల సేవా సుపరిపాలన, వికసిత్ భారత్ 2047 కార్యక్రమంపై సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు. వన్ధన్ వికాస కేంద్రాల ద్వారా గిరిజన మహిళలకు స్వయం ఉపాధి పథకాలు అందుబాటులోకి వచ్చాయని, తద్వారా ఎంతో ఆర్థిక లబ్ధి చేకూరుతోందన్నారు. పీవీటీజీలకు పీఎం జన్మన్ పథకం వరమని,పెద్ద ఎత్తున పక్కాగృహాల నిర్మాణం జరుగుతుందన్నారు.జల్జీవన్మిషన్తో తాగునీటి పథకాలు నిర్మితమవుతున్నాయన్నారు. గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర కాఫీ బోర్డు డైరెక్టర్ కురుసా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల సంపూర్ణ అభివృద్ధికి కృషి చేస్తుండడం సంతోషంగా ఉందన్నారు.అరకు కాఫీకి ఆర్గానిక్ బ్రాండ్గా ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చిందన్నారు.ఈ కార్యక్రమంలో ట్రైకార్ డైరెక్టర్ కూడా కృష్ణారావు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు మఠం శాంతకుమారి, జిల్లా ఇన్చార్జి పుట్టా గంగయ్య, ప్రధాన కార్యదర్శి సల్లా రామకృష్ణ, మైనారిటీ మోర్చా రాష్ట్ర ప్రతినిధి పెనుమాక రవికుమార్ తదితరులు పాల్గొన్నారు -
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
సాక్షి,పాడేరు: జిల్లాలోని పలు ఇంజనీరింగ్శాఖల పరిధిలో రూ.728 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభ శిలాఫలకాలను కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ బుధవారం ఆవిష్కరించారు. స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో సుపరిపాలన–స్వర్ణాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హమీ పథకం అమలులో జిల్లా అగ్రస్థానంలో నిలిచిందన్నారు. జిల్లాలో రూ.600 కోట్ల ఉపాధి హమీ పనులకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. రానున్న మూడేళ్లలో లక్ష ఎకరాల్లో కాఫీ సాగు విస్తరించేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారన్నారు. కిలో కాఫీ గింజలను రూ.525 ధరతో విక్రయించామన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ డాక్టర్ అభిషేక్గౌడ,ఎస్డీసీ లోకేశ్వరరావు,ఆర్టీసీ చైర్మన్ ఎస్.దొన్నుదొర, గిరిజన సంక్షేమశాఖ ఈఈ కె.వేణుగోపాల్, ఎస్ఎంఐ ఈఈ రాజేశ్వరరావు, ఆర్అండ్బీ ఈఈ బాలసుందరబాబు పాల్గొన్నారు. -
ఉచిత కార్పొరేట్ విద్యకు మంగళం
విద్యా హక్కు చట్టం(ఆర్టీఈ)లో భాగంగా పేద పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో అందించాల్సిన 25 శాతం సీట్లకు యాజమాన్యాలు మంగళం పాడుతున్నాయి. ఉచిత సీట్లు ఇవ్వలేమని తల్లిదండ్రులకు తెగేసి చెప్పేస్తున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమలైన ఈ విధానం, ఇప్పుడెందుకు అమలు చేయట్లేదంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఆరిలోవ(విశాఖ): గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆర్టీఈ కింద ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు ఫీజు లేకుండా ఉచితంగా కేటాయించే వెసులుబాటు కల్పించింది. ప్రతి పాఠశాల యాజమాన్యం వారి పాఠశాలకు 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పిల్లలకు ఒకటో తరగతిలో నాలుగో వంతు సీట్లు కేటాయించాలి. ఉచితంగా చేర్చుకున్న విద్యార్థుల ఫీజుల్ని ఆయా పాఠశాలలకు ప్రభుత్వమే చెల్లించేంది. పట్టణ ప్రాంతాల పాఠశాలలకు ఏడాదికి ఒక్కో విద్యార్థికి రూ.16 వేలు, గ్రామీణ ప్రాంతాల్లోనైతే రూ.8 వేలు చెల్లించేది. ప్రస్తుతం రెండేళ్లుగా అలాంటి విద్యార్థులకు సంబంధించిన ఫీజులు బకాయిలు ఉండిపోయాయనే నెపంతో కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పిల్లల్ని ఈ ఏడాది చేర్చుకోవడంలేదు. చేర్చుకోలేమని తెగేసి చెప్తున్నారు తమకు బకాయిలు ఏళ్ల తరబడి ఉన్నాయని, అందుకే మీ పిల్లల్ని మా పాఠశాలలో చేర్చుకోబోమంటూ కొన్ని యాజమాన్యాలు తెగేసి చెప్తున్నాయి. ఉచిత సీటుకు ప్రభుత్వం ఇచ్చే డబ్బులు తక్కువ కావడం వల్లే ప్రైవేట్ పాఠశాలలు తప్పించుకుంటున్నాయనే విమర్శలున్నాయి. ఏడాదికి నగరంలోని కొన్ని యాజమాన్యాలు ఒకటో తరగతి విద్యార్థికే రూ.లక్ష వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయి. అలాంటపుడు రూ.16 వేలకే సీటిచ్చి లాభాలు కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. గ్రీవెన్స్లో ఫిర్యాదు యాజమాన్యాల తీరుతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎంత బ్రతిమాలినా పాఠశాలల యాజమాన్యాలు అంగీకరించకపోవడంతో జిల్లా కలెక్టర్కు సోమవారం గ్రీవెన్స్లో కొందరు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తమ పిల్లల్ని సీతమ్మధారలో ఉన్న శ్రీది ప్రెసిడెన్షియల్ స్కూల్శ్రీలో ఆర్టీఈ కింద చేర్చుకోవడంలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే పరిస్థితి నగరంతో పాటు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఉండటంతో తల్లిదంద్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉచిత సీట్లు ఇవ్వలేమన్నారు మేం సీతమ్మధార ప్రాంతంలో నివాసం ఉంటున్నాం. ఇక్కడున్న ది ప్రెసిడెన్షియల్ స్కూల్కు మా ఇంటి నుంచి కిలో మీటర్ మాత్రమే దూరం. ఈ దూరాన్ని బట్టి మొదటి ప్రాధాన్యతలో మా పిల్లలకు ఆ పాఠశాలలో సీట్లు ఇవ్వాలి. ఆర్టీఈ సీట్లు కోసం అవసరమైన పత్రాలు అందించాం. కానీ మాకు ప్రభుత్వం నుంచి బకాయిలు ఉన్నాయని, మేం మీ పిల్లలకు సీట్లు ఇవ్వలేమని చెప్పారు. ఎవరికై నా ఫిర్యాదు చేసుకోండి అని ఆ పాఠశాల నిర్వాహకులు అన్నారు. దీంతో కలెక్టర్కు ఫిర్యాదు చేశాం. కలెక్టర్ మా పిల్లలకు న్యాయం చేయాలని, ఆ పాఠశాలలో ఆర్టీఈ సీట్లు కేటాయించాలని కోరుతున్నాం. –బి.సంతోష్, సీహెచ్.ధనలక్ష్మి, ఎన్.దేవి, డి.లక్ష్మీప్రసన్న, సీహెచ్ యశోదకృష్ణ ప్రైవేట్ పాఠశాల్లో పేద పిల్లలకు సీట్లు కేటాయించని యాజమాన్యాలు కలెక్టర్కు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు -
అయోమయం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2024–25లో తల్లికి వందనం నిధులు తల్లుల ఖాతాల్లో జమ చేయలేదు. దీనివల్ల ఒకొక్కరికి రూ.15 వేల చొప్పున 1,78,887 మంది విద్యార్థులు ఆర్థిక లబ్ధి కోల్పోయారు. తల్లికి వందనంబుధవారం శ్రీ 11 శ్రీ జూన్ శ్రీ 2025అరకు రేంజ్ ఆఫీసర్శ్రీనివాసరావు బదిలీ అరకులోయ టౌన్: అరకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావుకు బదిలీ అయింది. ఆయనను విజయనగరం సా మాజిక అడవుల పరిరక్షణ, నిర్వహణ విభాగానికి బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన అరకు పైనరీ, ఎకో పార్కును ఆదర్శవంతంగా తీర్చిదిద్ది అటవీశాఖకు ఆదాయ వనరులను మెరుగుపరిచారు. ఆయన స్థానంలో ఎవ్వరినీ నియమించలేదు.ఈ ఏడాది అమలుపై కానరాని స్పష్టతగతేడాది జమ చేయక తల్లుల్లో నిరాశ దాటవేత ధోరణితోకూటమి ప్రభుత్వం విధి విధానాలు ప్రకటించని పాలకులు తల్లికి వందనం పథకం అమలు చేయాలని కోరుతూ పిల్లలతో గిరిజన తల్లులుగత ప్రభుత్వంలో చేకూరిన లబ్ధి సంవత్సరం లబ్ధి మొత్తం (రూ.కోట్లలో) 2020–21 1,51,603 151.08 2021–22 1,51,603 151.08 2022–23 1,51,603 151.08 2023–24 1,51,575 151.75 ముంచంగిపుట్టు: కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని వాయిదాలు వేసుకుంటూ వస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో నీకు రూ.15 వేలు.. నీకు రూ.15వేలు అంటూ ప్రచారం చేసిన చంద్రబాబు అధికారం చేపట్టిన తరువాత తొలిఏడాదిలో ఏఒక్కరికి కూడా జమ చేయలేదు. ఈ ఏడాది పాఠశాలలు తెరిచేనాటికి వందనం పథకం అమలు చేస్తామని చంద్రబాబు, మంత్రులు ప్రకటనలు చేస్తున్నా ఇప్పటికీ దీనిపై ఇప్పటికీ స్పష్టత కనిపించడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు చదువుకు చేయూత అందుతుందని, కొంతమేర ఖర్చుల భారం తగ్గుతుందని ఆశిస్తున్న వారికి ప్రభుత్వం తీరు నిరాశ కలిగిస్తోంది. విధి విధానాలేవీ? పథకానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికీ విధి విధానాలను ప్రకటించలేదు. ఆర్థికశాఖ సైతం ఈ పథకం అమలుకు ఎటువంటి సూచనలు చేయలేదు. ఈ ఏడాదైనా తల్లికి వందనం ఉంటుందా.. లేకపోతే ఎగనామం పెడతుందా అనే అనుమానాలు తల్లిదండ్రుల్లో నెలకొన్నాయి. ఎన్పీసీఐ లింక్ కోసం పరుగులు తల్లికి వందనం పథకానికి విధి విధానాలు అధికారికంగా నేటికి విడుదల కాలేదు. కానీ పథకం అమలు కావాలంటే విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాను ఆధార్ నంబరు ఎన్పీసీఐతో లింక్ చేసుకోవాలని ప్రచారం జరుగుతోంది. దీంతో విద్యార్థుల తల్లులు ఆధార్ కేంద్రాలు, బ్యాంక్, పోస్టాఫీసులు, గ్రామ, వార్డు సచివాలయాలకు పరుగులు పెడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరీక్షించి ఎన్పీసీఐకి లింక్ చేసుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటివరకు ఎన్పీసీఐతో లింక్ చేసుకోని వారు సుమారు 15 వేల మంది వరకు ఉన్నారని సమాచారం. ఈ ఏడాది ఎగనామమేనా? ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. నేటికి తల్లికి వందనం పథకంపై ఎటువంటి మార్గదక్శకాలు ప్రభుత్వం జారీ చేయలేదు. బీపీఎల్ కుటుంబాలకు చెందిన తల్లులకు ఏడాదికి రూ.15వేలు అందిస్తారా లేక విద్యార్థులకు 75శాతం హాజరు నిబంధన పెడతారా, అమలు చేస్తారా.. చేయరా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.రేషన్ వాహనాల రద్దుతో తీవ్ర ఇబ్బందులు రంపచోడవరం: కూటమి ప్రభుత్వం రేషన్ వాహనాలు రద్దు చేయడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ నియోజకర్గ కన్వీనర్ పండా రామకృష్ణదొర ఆరోపించారు. ఈ నెల గిరిజనులు కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లి రేషన్ తెచ్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇలాంటి ఇబ్బందులను తొలగించేందుకే రేషన్ వాహనాలను ఏర్పాటు చేశారని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం రేషన్ వాహనదారులకు ఉపాధి లేకుండా చేశారని ఆరోపించారు. వృద్ధులు, వికలాంగులు రేషన్ పొందేందుకు ఇబ్బందులు పడుతున్నందున ఏజెన్సీ ప్రాంతంలో రేషన్ వాహనాలు పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు.● తీవ్ర ఇబ్బంది పడిన టీచర్లు ● కనీస ఏర్పాట్ల కరువు ● అధికారుల నిలదీత ● సాంకేతిక లోపం అంటూ నేటికి కౌన్సెలింగ్ వాయిదా న్యూస్రీల్పోలవరం ‘ఆర్అండ్ఆర్’లో పనిచేసేందుకు దరఖాస్తుల ఆహ్వానం రంపచోడవరం: పోలవరం ప్రాజెక్టు ఆర్అండ్ఆర్ కార్యాలయంలో పనిచేసేందుకు రిటైర్డ్ తహసీల్దార్ల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు రంపచోడవరం సబ్ కలెక్టర్ కేఆర్ కల్పశ్రీ తెలిపారు. తాత్కాలిక పద్ధతిపై పనిచేసేందుకు రిటైర్డ్ తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రిటైర్డ్ సివిల్ ఇంజనీర్ల నియామకానికి సంబంధంచి ఎనిమిది పోస్టులు ఖాళీ ఉన్నట్లు తెలిపారు. రంపచోడవరం, ఎటపాక, చింతూరు, ఏలూరు జిల్లా కేఆర్పురం, పోలవరం ఆర్అండ్ఆర్ కార్యాలయాల్లో పనిచేసేందుకు ఆర్అండ్ఆర్ కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తామన్నారు. ధరఖాస్తులను ధవళేశ్వరం ఆర్అండ్ఆర్ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేట్వ్ కార్యాలయంలో స్వయంగా అందజేయాలని తెలిపారు.గత ప్రభుత్వంలో ఏటా క్రమం తప్పకుండా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాటి సీఎం జగన్మోహన్రెడ్డి అమ్మఒడి పథకాన్ని క్రమం తప్పకుండా అమలు చేశారు. రూ.15 వేల చొప్పున తల్లుల ఖాతాల్లో జమచేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్న తేడా లేకుండా బీపీఎల్ కుటుంబాలందరికీ లబ్ధి చేకూర్చారు. చదువుకు అయ్యే అదనపు ఖర్చులు ఈ సొమ్ముతో ఒడ్డెక్కి పోయేవి. పిల్లల చదువుకు ఎంతో దోహదపడేవని గత ప్రభుత్వంలో మేలును గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబు మాటలు నమ్మి మరోసారి మోసపోయామని విద్యార్థుల తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. స్పష్టత ఇవ్వని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎంతమంది ఉంటే అంతమందికి రూ.15వేల చొప్పున ఇస్తామని చెప్పడంతో నమ్మి ఓటు వేశాం. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిపోయింది. మొదటి సంవత్సరం అమలు చేయలేదు. రెండో ఏడాది వచ్చేసింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. రూ. 30వేలు ఖాతాలో జమకావాలి. మరికొన్ని రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది కూడా తల్లికి వందనం పడుతుందో లేదో స్పష్టత లేదు. – కొర్రా సువర్ణ, బురుసింధిపుట్టు, ముంచంగిపుట్టు మండలం డ్రాపవుట్స్ పెరిగే అవకాశం తల్లికి వందనం అమలు చేయకపోవడం అన్యాయం.ఎన్నికల ముందు ఇంటిలో ఎంత మంది విద్యార్థులు ఉంటే అంత మందికి రూ.15వేల చొప్పున ఇస్తామన్న మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలి.చంద్రబాబు పాలన తల్లికి నిల్..తండ్రికి ఫుల్ అన్న చందంగా ఉంది.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో డ్రాప్ అవుట్లు తగ్గించడం కోసం అమ్మ ఒడి పథకాన్ని వైఎస్ జగన్ తెచ్చారు.ఇప్పుడు చంద్రబాబు నిర్వాకం వల్ల మళ్లీ డ్రాప్ ఔట్స్ పెరిగే అవకాశం ఉంది. జల్లిపల్లి సుభద్ర, ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్రూ.30 వేలు వస్తుందనిఆశపడ్డా మాకు ఇద్దరు సంతానం. వీరిలో ఒకరు 8, మరొకరు 4వ తరగతి చదువుతున్నారు. ప్రభు త్వం తల్లికి వందనం పథకం ద్వారా రూ.15వేల చొప్పున రూ.30వేలు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నా. గత ఏడాది వేస్తారని నమ్మి మోసం పోయా. ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాదైనా తల్లికి వందనం అమలు చేసి నగదు జమ చేస్తారని భావిస్తున్నా. ఈ ఏడాదైనా వేయకపోతే మోసపోయినట్టే. – ముఖి పద్మ, కరిముఖిపుట్టు, ముంచంగిపుట్టు మండలం -
విద్వేషం.. విధ్వంసం
సాక్షి, అనకాపల్లి: హామీలు గాలికొదిలేశారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల వేధింపులే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారు. ఆస్తులు విధ్వంసమైనా, ప్రాణాల మీదకు వచ్చినా.. ప్రతిపక్షం నుంచి వచ్చిన ఫిర్యాదు అంటే పోలీసులు పట్టించుకోవడం మానేశారు. ఏడాది కూటమి పాలనలో ఉమ్మడి విశాఖ జిల్లాలో 100 మందిపై కేసులు నమోదు చేశారు. ఇద్దరిపై హత్యాయత్నం చేశారు. 11 మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై 44 అక్రమ కేసులు పెట్టారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల పంటలు, ఇళ్లు ధ్వంసం చేశారు. స్పీకర్ ఇలాకాలో దాడులు, దౌర్జన్యాలు.. సాక్షాత్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడి నియోజకవర్గమైన నర్సీపట్నంలో దాడులు, దౌర్జన్యాలు, హత్యాయత్నాలు ఎక్కువగా జరిగాయి. నియోజకవర్గంలో ఇసుక దోపిడీని అడ్డుకున్నందుకుగానూ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్తోపాటు 44 మందిపై అక్రమ కేసులు బనాయించారు. కొద్ది రోజుల క్రితం వైఎస్సార్సీపీ యూత్ లీడర్ అల్లంపల్లి ఈశ్వర్రావుపై రౌడీలతో హత్యకు యత్నించారు. ఆయన అతి కష్టం మీద ప్రాణాలు దక్కించుకున్నారు. చిటెకెల కన్నపై కేసు నమోదు చేసి ఆయన ఇళ్లను కూల్చేశారు. వైబీ పట్నానికి చెందిన చుక్కా రాంబాబుపై దాడి చేశారు. చీడిగొమ్మల గ్రామంలో టీడీపీ నేతలు దాడి చేయగా, 12 మంది వైఎస్సార్సీపీ యువతపై కేసులు నమోదు చేశారు. జూలై 9వ తేదీన మాకవరపాలెం మండలం రాశిపల్లి శివారు ఎరకన్నపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్ కొల్లి అప్పలనాయుడుపై 50 మందికి పైగా టీడీపీ గూండాలు కర్రలతో దాడి చేశారు. దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన అతని తమ్ముడు రామారావు, తల్లిదండ్రులపై కూడా కర్రలతో దాడి చేశారు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మాకవరపాలెంలోని టీడీపీ కార్యకర్త లక్ష్మణ్ను వైఎస్సార్సీపీ నేతలు మందలించారు. ఈ వీడియోను ఇటీవల ఒక టీడీపీ నేత ట్విట్టర్లో పెట్టి వైఎస్సార్సీపీ నేతలు రుత్తల సత్యనారాయణ, సర్పంచ్లు బొడ్డు గోవిందరావు, మాకిరెడ్డి అయ్యప్ప, పార్టీ నేత బండారు గాంధీపై అక్రమ కేసులు పెట్టి అర్ధరాత్రి పోలీస్స్టేషన్కు తరలించారు. దీనిపై న్యాయస్థానం మొట్టికాయలు పెట్టడంతో తోక ముడిచారు. హోంమంత్రి నియోజకవర్గంలో.. పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల గ్రామ శివారు మర్రిచెట్టు ప్రాంతంలో మాడెం వరలక్ష్మి ఇంటి ముందు స్థలాన్ని ఆక్రమించేందుకు టీడీపీకి చెందిన జవ్వాది ఈశ్వరరావు, జవ్వాది రమేష్, బత్తుల అప్పారావు, బత్తుల నరసింహమూర్తి, పబ్బు తుర్రయ్య దాడి చేశారు. మహిళల దుస్తులు చింపి అసభ్యకరంగా దూషించారు. దాడి చేయడమే కాకుండా బాధిత మహిళలపై టీడీపీ వారు కేసులు కూడా పెట్టారు. నాతవరం మండలం డి.ఎర్రవరంలో ధ్వంసమైన పంట కూటమి ఏడాది పాలనలో వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు, దౌర్జన్యాలు ఉమ్మడి విశాఖ జిల్లాలో 100 మందిపై కేసులు, ఇద్దరిపై హత్యాయత్నం 11 మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై 44 అక్రమ కేసులు వైఎస్సార్సీపీ సానుభూతిపరుల పంట నాశనం.. ఇళ్లు ధ్వంసం ఇసుక దోపిడీని అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే పెట్ల గణేష్తోపాటు 44 మందిపై కేసులు సోషల్మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు విశాఖ తూర్పు నియోజకవర్గం మద్దిలపాలేనికి చెందిన వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ బోస రమణారెడ్డిపై వివిధ జిల్లాల్లోని పొదిలి, దర్శి, ఇచ్ఛాపురం, నీలకంఠాపురం, పార్వతీపురం పోలీస్స్టేషన్లలో ఆరు కేసులు నమోదు చేశారు. ఒక స్టేషన్ తర్వాత మరో స్టేషన్కు తిప్పి తీవ్రంగా వేధించారు. ఆయన డిసెంబర్ నెలలో విడుదలయ్యారు. విశాఖ జిల్లా గాజువాక మండలం గొల్లజగ్గరాజుపేటలో నివాసముంటున్న బోడి వెంకటేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవనన్ కల్యాణ్, మంత్రి లోకేష్లపై అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ మొత్తం 17 కేసులు నమోదు చేశారు. ఆయనను తొలుత 2024 నవంబర్ 3న అరెస్టు చేశారు. మొత్తం 115 రోజులపాటు రిమాండ్లో ఉన్నారు. బాపట్ల జిల్లా మార్టూరు స్టేషన్లో సీఐ సీహెచ్ శేషగిరిరావు 15 నిమిషాల్లో 4 వేల గుంజీలు తీయమని ఇబ్బంది పెట్టారు. రాజాం, చినమేరంగి (కురుపాం), విశాఖలో దువ్వాడ, టూటౌన్, పరవాడ, సబ్బవరం, మహారాణిపేట, రేపల్లె, పెదకూరపాడు, పాతగుంటూరు, కృష్ణపట్నం, చీరాల, మార్టూరు, గుంటూరు, బాపట్ల, లావేరు, కర్నూల్, కడప, విజయవాడ, మైలవరం, మంచిలీపట్నంలలో కేసులు నమోదు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లిలో కండిషన్ బెయిల్ మంజూరు చేశారు. ఈ కేసులో మరో ముగ్గురు సోషల్ మీడియా యాక్టివిస్ట్లు ప్రసాద్ సిద్దు, గోపిరాజు వంకా, సదరం జ్ఞానేష్లపై మార్టూరు పోలీస్స్టేషన్లో కేసులు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. విశాఖకు చెందిన సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్పై విశాఖలోనే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మొత్తం 21 కేసులు నమోదు చేశారు. కేసులు, విచారణ అంటూ రెండు నెలలు పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు. మొదట 2024 ఆగస్టు 31న పోలీసులు అరెస్టు చేశారు. అతని కుటుంబ సభ్యులు హైకోర్టుకు వెళ్లడంతో బెయిల్ లభించింది. మళ్లీ 2024 నవంబర్లో కొత్త కేసులు పెట్టి అరెస్టు చేశారు. విశాఖ సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న సమయంలో బాపట్లలో కూడా మరో కేసు నమోదు చేశారు. దీంతో జైలు నుంచి నేరుగా బాపట్లకు తీసుకువెళ్లి విచారించారు. ఇలా అతడిపై రాష్ట్రంలో అనేక జిల్లాల్లో కేసులు పెట్టి వేధింపులకు గురిచేశారు. ప్రస్తుతం బెయిల్ మంజూరు చేశారు. -
వాల్తేర్ లోకోకు రెండో స్థానం
తాటిచెట్లపాలెం: ఇటీవల బనారస్ లోకోమోటివ్ వర్క్స్ లో నిర్వహించిన ‘బ్యూటీ కాంటెస్ట్ ఫర్ ఎలక్ట్రికల్ లోకోమోటివ్స్’ పోటీలలో విశాఖ ఎలక్ట్రికల్ లోకో షెడ్కు ద్వితీయ స్థానం లభించింది. వాల్తేరు డివిజన్, డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోరా నేతృత్వంలో సీనియర్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ బి. షణ్ముఖరావు పర్యవేక్షణలో విశాఖపట్నం ఎలక్ట్రికల్ లోకో షెడ్ సిబ్బంది ఈ విజయాన్ని సాధించారు. వారు డబ్ల్యూ ఏపీ –7 లోకోమోటివ్ 37419 ను ఆధునీకరించి, అనేక అధునాతన సౌకర్యాలతో, మార్పులతో ఈ పోటీలలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని జోనల్ రైల్వేల నుంచి మొత్తం 13 లోకోలు ఈ పోటీలలో పాల్గొనగా, విశాఖపట్నం ఎలక్ట్రికల్ లోకో షెడ్ ఆధునికీకరించిన లోకోకు రెండో స్థానం దక్కింది. ఈ సందర్భంగా వాల్తేరు డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోరా ఎలక్ట్రికల్ లోకో షెడ్ సిబ్బంది, అధికారులను అభినందించారు. -
ఘనంగా మోదమ్మ అనుపు ఉత్సవం
సాక్షి, పాడేరు: మోదకొండమ్మ తల్లి ఉత్సవాలను మండలంలోని గుత్తులపుట్టు, నక్కలపుట్టు, తుంపాడ గ్రామాల్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఈనెల 8 నుంచి మూడు రోజులపాటు సతకంపట్టు వద్ద భక్తులు పూజలు చేశారు. మంగళవారం ఉత్సవాలు ముగిసిన సందర్భంగా ఆయా గ్రామాల్లో అనుపు ఉత్సవం వైభవంగా నిర్వహించారు. దీనిలో భాగంగా అమ్మవారి విగ్రహాలను పురవీధుల్లో ఊరేగించారు.శక్తివేషాలు, తీన్మార్, ఒడియా బ్యాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గుత్తులపుట్టు, నక్కలపుట్టు, తుంపాడ గ్రామాల్లో ఘనంగా నిర్వహణ ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు -
ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ గందరగోళం
ఆరిలోవ (విశాఖ): ఉమ్మడి విశాఖ జిల్లాల సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ) బదిలీలకు సంబంధించి మంగళవారం నిర్వహించాల్సిన మాన్యువల్ కౌన్సెలింగ్ గందరగోళంగా మారింది. కొన్ని రోజులుగా ధర్నాలు, నిరసనలతో తమ సమస్యలను వినిపించిన ఎస్జీటీలకు కౌన్సెలింగ్ ప్రక్రియ తీవ్ర అసౌకర్యాన్ని కలిగించింది. విద్యాశాఖ అధికారులు సరైన సౌకర్యాలు కల్పించకపోవడం, కౌన్సెలింగ్లో తీవ్ర జాప్యం జరగడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం జరిగిన ఈ కౌన్సెలింగ్కు అర్హులైన 1 నుంచి 500 మంది ఉపాధ్యాయులను పిలవగా, వారంతా మధ్యాహ్నం 2 గంటలకే హాజరయ్యారు. అయితే కౌన్సెలింగ్ ప్రక్రయ గంటల తరబడి ఆలస్యమవుతూ వచ్చింది. దీంతో సహనం కోల్పోయిన ఉపాధ్యాయుల్లో గందరగోళం నెలకొంది. అధికారులను నిలదీశారు. కౌన్సెలింగ్ జరుపుతారా లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు సాంకేతిక లోపం తలెత్తిందని పేర్కొంటూ కౌన్సెలింగ్ను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు రాత్రి 9 గంటలకు ప్రకటించారు. అప్పటివరకు నిరీక్షించిన ఉపాధ్యాయులు ఈ ప్రకటనతో తీవ్ర నిరాశకు గురయ్యారు. కనీసం హాజరైన ఉపాధ్యాయులకు కూర్చోవడానికి కుర్చీలు కూడా ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. దూర ప్రాంతాల నుంచి చంటి పిల్లలతో సహా హాజరైన కొందరు ఉపాధ్యాయులు రాత్రివేళ తీవ్ర అవస్థలు పడ్డారు. నగరానికి దగ్గరగా ఉన్నవారు ఇళ్లకు చేరుకోగా, దూర ప్రాంతాల నుంచి వచ్చినవారు వసతి కోసం ల్యాడ్జీలను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బుధవారం ఉదయం 9 గంటలకు 1 నుంచి 300 మందికి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. అయితే విద్యా శాఖ అధికారులు కావాలనే ఇబ్బంది పెడుతున్నారంటూ ఉపాధ్యాయుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. బుధవారం జరగాల్సిన కౌన్సెలింగ్ అయినా సక్రమంగా జరుపుతారో లేదో అని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉపాధ్యాయులు నిరాశతో వెనుదిరిగారు. కనీస వసతులు లేకపోవడంపై ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులు -
సోషల్ మీడియాలోదుష్ప్రచారంపైపోలీసులకు ఫిర్యాదు
పాడేరు : తనపై ఓ ప్రభుత్వ ఉద్యోగి సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారని, తక్షణమే ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ సీనియర్ నేత కూడా సుబ్రహ్మణ్యం పోలీసులను కోరారు. ఈ మేరకు మంగళవారం పాడేరు సీఐ దీనబంధుకు ఫిర్యాదు చేశారు. ఇటీవల గిరిజన ప్రాంతంలో జరుగుతున్న పలు అన్యాయాలు, అక్రమాలపై తాను ప్రశ్నిస్తుంటే కొంతమందికి గిట్టడం లేదని తెలిపారు. దీంతో తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఓ ప్రభుత్వ ఉద్యోగి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారన్నారు. ఈ విషయంపై తాను కోర్టులో ప్రత్యేక కేసు వేస్తానని చెప్పారు. ఫిర్యాదు చేసిన వారిలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్కుమార్ ఉన్నారు. -
నేడు అప్పన్నకు మూడో విడత చందనం సమర్పణ
సింహాచలం: జ్యేష్ఠ పౌర్ణమిని పురస్కరించుకుని సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారికి బుధవారం మూడో విడత చందన సమర్పణ కార్యక్రమం జరగనుంది. తెల్లవారుజామున అర్చకులు ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఇప్పటికే సిద్ధం చేసిన మూడు మణుగుల (సుమారు 125 కిలోలు) పచ్చి చందనంలో మంగళవారం వైదికులు పలు రకాల సుగంధ ద్రవ్యాలను కలిపి సమర్పణకు సిద్ధం చేశారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు కరి సీతారామాచార్యులు, ఉప ప్రధానార్చకుడు సాతులూరి నరసింహాచార్యులు, అర్చకుడు అప్పాజీ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మూడో విడత చందన సమర్పణ కారణంగా బుధవారం అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహించనున్నారు. -
మొండి జాంగుడలో కలకలం
అనంతగిరి (డుంబ్రిగుడ/అరకులోయ టౌన్): తాను ఎంతోగానో ప్రేమించిన యువతి త్వరలోనే పెళ్లి చేసుకోనున్న తరుణంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీంతో ఆందోళనకు గురైన యువకుడు తనకేమైనా అవుతోందేమోనన్న భయంతో గొంతుకోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనఅనంతగిరి మండల కేంద్రానికి అత్యంత సమీపంలో ఉన్న మొండి జాంగుడ గ్రామంలో మంగళవారం కలకలం రేపింది. అనంతగిరి ఎస్ఐ డి. శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతగిరి పంచాయతీ మొండి జాంగుడ గ్రామానికి చెందిన జన్ని రాంబాబు ఆదే పంచాయతీ లక్ష్మీపురం గ్రామానికి చెందిన నందుల నీలమ్మ అనే యువతి ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను తన ఇంటికి తీసుకువచ్చి ఎనిమిది నెలలుగా సహజీవనం చేస్తున్నాడు. త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించాడు. అయితే ఏమైందో తెలియదు గాని మంగళవారం ఉదయం జామంగు గ్రామంలో ఇంటివద్ద నీలమ్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉంది. దీనిని చూసిన యువకుడు జన్ని రాంబాబు ఒక్కసారిగా తీవ్రమానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ పరిస్థితుల్లో పెద్దలు ఏమంటారోనని ఆందోళనలో గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించినట్టు ఎస్ఐ తెలిపారు. స్థానికులు గుర్తించి వెంటనే యువకుడిని అనంతగిరి పీహెచ్సీకి తరలించి వైద్యసేవలు అందించారు. మెరుగైన వైద్య సేవల నిమిత్తం ఎస్కోట ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు సేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. అనుమానాస్పదస్థితిలో యువతి మృతి భయంతో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించిన యువకుడు -
మమ్మేలు మాతల్లి.. గంగమ్మ తల్లి
ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ కోరుతూ మత్స్యకారుల పూజలు మహారాణిపేట: ప్రకృతి విపత్తుల నుంచి నుంచి మత్స్యకారులను, వారి బోట్లు, వేట సామగ్రిని రక్షించాలని కోరుతూ ఫిషింగ్ హార్బర్ ఆవరణలో గంగమ్మ తల్లికి మత్స్యకారులు మంగళవారం విశేష పూజలు జరిపారు. గంగమ్మతల్లితోపాటు సముద్రుడికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ నెల 14న అర్ధరాత్రి దాటాక బోట్లు చేపల వేటకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ పండగను ఘనంగా నిర్వహించారు. ఏపీ మరపడవల సంఘం అధ్యక్షుడు ఎం.లక్ష్మణరావు దంపతులు గంగమ్మ తల్లికి పసుపు కుంకుమలు, ఇతర పూజా ద్రవ్యాలు సమర్పించారు. కార్యక్రమంలో మరపడవల సంఘం గౌరవ అధ్యక్షుడు పీసీ అప్పారావు, ప్రధాన కార్యదర్శి ఎస్.నర్సింగరావు, కార్యదర్శి మున్నం బాలాజీ, నాయకులు గరికిన పరుశురాముడు, ఎస్ రాము, గరగయ్య, జి.రాజేష్, పుక్కళ్ల ఈశ్వరరావు, ఎ.చిన్న, పెద్ద, మహిళలు, మత్స్యకారులు పాల్గొన్నారు. కోలాహలంగా హార్బర్ ప్రాంతం గంగమ్మతల్లి పూజలతో హార్బర్ ప్రాంతంలో సందడి నెలకొంది. గంగమ్మ తల్లి ఆలయ వ్యవస్థాపక పూజారి శర్మ పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి వర్షం పడుతున్నప్పటికి భక్తులు వెరవకుండా గంగమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. హార్బర్లో వేంచేసిన గంగమ్మ తల్లి ఆలయంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పూజలు నిర్వహించారు. -
బాల్య వివాహాల నివారణకు పటిష్ట చర్యలు
కలెక్టర్ దినేష్కుమార్సాక్షి,పాడేరు: జిల్లా వ్యాప్తంగా బాల్య వివాహాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. సుండ్రుపుట్టు అంగన్వాడీ కేంద్రంలో బాల్య వివాహాల నిర్మూలన, బాలికల విద్య, పౌష్టికాహారం,కిశోర బాలికల వికాసం, కెరీర్ గైడెన్స్పై మంగళవారం ఐసీడీఎస్ నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. కిషోర వికాసం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామన్నారు. బాల్య వివాహలతో ఏర్పడే అనర్ధాలను గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు. అనంతరం అంగన్వాడీ చిన్నారులతో కలెక్టర్ అక్షరాభ్యాసం చేయించారు.ఈ కార్యక్రమంలో సీడీపీవో ఝాన్సీరాణి, జిల్లా బాలల సంరక్షణ అధికారి సద్దు, ఎంపీడీవో రతన్తేజ, ఎంఈవో–2 సరస్వతి, ఈవోపీఆర్డీ రమేష్ పాల్గొన్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించండి రైతులు అధిక దిగుబడులు సాధించే లక్ష్యంగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ నుంచి వ్యవసాయ,అనుబంధ శాఖల అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్గానిక్ వ్యవసాయానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రానున్న రోజుల్లో రైతులు రసాయన ఎరువులు వినియోగం పూర్తిగా తగ్గించాలన్నారు. ఖరీఫ్లో రైతులకు సకాలంలో విత్తనాలు పంపిణీ చేయాలన్నారు. కాఫీ,మిరియం పంట కోతలు అనంతరం చేపట్టాల్సిన పనులపై సమీక్షించారు. కాఫీ రైతులకు అవసరమైన టార్పాలిన్లు, బేబీ పల్పర్యూనిట్టు, నిచ్చెనలు, కల్యాల నిర్మాణాల వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు. కూరగాయల పెంపకం విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.మారేడుమిల్లి, వై.రామవరం మండలాల్లో పైనాపిల్ పండ్ల తోటల సాగు, చింతూరు డివిజన్లో మల్బరి సాగును విస్తరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రంపచోడవరం ఐటీడీఏ పీవో సింహాచలం, జిల్లా వ్యవసాయ, ఉద్యానవనశాఖ అధికారులు ఎస్బీఎస్ నందు, రమేష్కుమార్రావు, పశుసంవర్ధకశాఖ ఏడీ నరసింహులు, పట్టుపరిశ్రమశాఖ అఽధికారి అప్పారావు పాల్గొన్నారు. -
సోలార్ యూనిట్ల పరిశీలన
రాజవొమ్మంగి: మండలంలో పలు ఆదివాసీ కుటుంబాలకు పీఎం జన్మన్ పథకంలో ఏర్పాటు చేసిన సోలార్ యూనిట్ల పనితీరును ఏపీఈపీడీసీఎల్ డీఈఈ గాబ్రియేల్ మంగళవారం పరిశీలించారు. మండలంలోని కొమరాపురం పరిసర అటవీ ప్రాంతాలు, వ్యవసాయక్షేత్రాల్లో నివసిస్తున్న 58 కుటుంబాలకు సోలార్ యూనిట్లను గతంలో ఏర్పాటుచేశారు. వీటి పనితీరు, వినియోగాన్ని ఆయన పరిశీలించారు. ఒకొక్క యూనిట్కు రూ.70 వేలు ఖర్చయిందన్నారు. సోలార్ యూనిట్లు ఏర్పాటైన తరువాత తమ జీవితాల్లో వెలుగులు వచ్చాయని ఆదివాసీ మహిళలు రాజయమ్మ, పార్వతమ్మ తదితరులు ఆనందం వ్యక్తం చేశారు. అడవి జంతువుల నుంచి పంటలను కాపాడుకోగలుగుతున్నామన్నారు. ఇదిలా వుండగా రాజవొమ్మంగిలోని 33/11 కేవీ విద్యుత్ స్టేషన్ను పరిశీలించిన డీఈఈ. సిబ్బందికి భద్రతాపరమైన సూచనలు ఇచ్చారు. ఆయన వెంట అడ్డతీగల ఏడీ దివాకర్, రాజవొమ్మంగి ఏఈ అబ్బాయిదొర, ఇంజనీర్లు పోలేశ్వర్రావు, శ్రీనివాస్, రాజేష్, రాఘవరెడ్డి ఉన్నారు. -
నయన మనోహరం.. వెంకన్న నౌకా విహారం
డాబాగార్డెన్స్: నిత్యం పాలకడలిలో పవళించి ముల్లోకాలను బ్రోచే నారాయణుడు వేంకటేశుడై జలధిలో విహరించిన మనోహర దృశ్యం సాగరతీరంలో ఆవిష్కృతమైంది. ఈ దివ్య ఘట్టాన్ని తిలకించి భక్తజనకోటి మురిసింది. పోర్టు ప్రాంతంలోని శృంగమణి పర్వతంపై ఉన్న వేంకటేశ్వరస్వామి తిరుకల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఐదో రోజు మంగళవారం సాయంత్రం తెప్పోత్సవం ఘనంగా సాగింది. ఉదయం సుప్రభాతసేవ, ఆరాధన హోమాలు, బలిహరణం, తీర్థగోష్ఠి జరిపారు. సాయంత్రం 4 గంటలకు స్వామి వారి ఉత్సవ ప్రతిమలను పల్లకిలో మెట్లమార్గం మీదుగా కిందికి తీసుకొచ్చారు. అనంతరం దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులు, పలువురు ప్రముఖులు స్వామివారి పల్లకిని మేళతాళాలు, అర్చకస్వాముల వేదమంత్రాల నడుమ తెప్పోత్సవానికి సిద్ధంగా ఉన్న నౌక వరకూ మోసుకెళ్లారు. శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామిని వివిధ రకాల పుష్పాలు, విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించిన నౌక మీదకు తీసుకెళ్లారు. భక్తులు ప్రయాణించే లాంచీలు అనుసరించగా స్వామి కాసేపు తెప్పపై సాగర విహారం చేశారు. అనంతరం స్వామిని తిరిగి ఆలయానికి తీసుకువెళ్లారు. ఆనందోత్సాహాల నడుమ జరిగిన ఈ తెప్పోత్సవం భక్తులను పరవశింపజేసింది. నౌకా విహారంలో ఆలయ ఈవో శ్రీనివాస్, ప్రధానాచార్యులు శ్రీనివాస జగన్నాథాచార్యులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. నేటి కార్యక్రమాలు వార్షిక తిరు కల్యాణోత్సవంలో భాగంగా బుధవారం ఉదయం 8 నుంచి 11 వరకు పూర్ణాహుతి, చూర్ణోత్సవం, సముద్రస్నానం(చక్రస్నానం), సాయంత్రం 6 గంటలకు ఆరాధన చూర్ణోత్సవం(దొంగల దోపు ఉత్సవం), ధ్వజావరోహణం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఘనంగా పోర్టు వేంకటేశ్వరస్వామి తెప్పోత్సవం సముద్రంలో విహరిస్తున్న వేంకటేశ్వర స్వామిశ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి -
ఘనంగా పాణిహాటి మహోత్సవం
భీమునిపట్నం: భీమిలి సాగరసంగమం సమీపంలో హరేకృష్ణ మూమెంట్(గంభీరం) ఆధ్వర్యంలో సోమవారం పాణిహాటి మహోత్సవ కార్యక్రమాన్ని భక్తులు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవం ముందుగా సామూహిక సంకీర్తనలతో ప్రారంభమైంది. అనంతరం బలరామకృష్ణుని విగ్రహాలకు పాలు, వివిధ నదుల నుంచి సేకరించిన జలాలు, పంచామృతాలు, పూలతో విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరేకృష్ణ మూమెంట్ అధ్యక్షుడు డాక్టర్ నిష్కించిన భక్త దాస మాట్లాడుతూ ఈ ఉత్సవానికి ఒక ప్రత్యేక చరిత్ర, గుర్తింపు ఉన్నాయని వివరించారు. హరేకృష్ణ మూమెంట్ వ్యవస్థాపకులు శ్రీచైతన్య మహాప్రభువు, నిత్యానంద ప్రభువులు కోల్కతా సమీపంలోని పాణిహాటి గ్రామం వద్ద కృష్ణతత్వాన్ని అన్ని ప్రాంతాలకు విస్తరింపజేశారన్నారు. అందులో భాగంగా గంగానది తీరంలో ఈ ఉత్సవాన్ని నిర్వహించగా.. అప్పటి నుంచి దీనిని నదీ తీరాల వద్ద నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు గోస్తని నది తీరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. అందరూ చక్కని జీవన ప్రయాణాన్ని సాగించాలంటే కృష్ణతత్వాన్ని అనుసరించాలని భక్త దాస సందేశమిచ్చారు. అంబరీష్ దాసతో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు. -
బయో డైవర్సిటీ పార్కులో శ్రీగంధం చెట్ల నరికివేత
బీచ్రోడ్డు: పెదవాల్తేరులోని బయో డైవర్సిటీ పార్కులో 23 ఏళ్ల వయసున్న మూడు శ్రీగంధం చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు నరికేశారు. ఈ దొంగలు పార్కు కంచెను తొలగించి, ఆరు నుంచి ఏడు అడుగుల పొడవైన కలప దుంగలను దొంగిలించారు. పార్కు నిర్వాహకుడు రామమూర్తి సోమవారం ఉదయం చెట్లు నరికివేయడాన్ని గుర్తించారు. వెంటనే మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది కేవలం గంధపు చెట్ల దొంగతనం కాదని, పార్కును నాశనం చేయడానికి చేసిన ప్రయత్నంగా కనిపిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. చెట్లను నరికిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించి, పార్కును రక్షించాలని పోలీసులను కోరారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
ఈదురుగాలులతో ఆటోపై కూలిన విద్యుత్ స్తంభం
● త్రుటిలో తప్పిన ప్రమాదం ● నుజ్జనుజ్జయిన ఆటో డుంబ్రిగుడ: మండలం కేంద్రంలోని కళాశాల రోడ్డులో సోమవారం చిన్నపాటి గాలులతో నీలగిరి చెట్టు కొమ్మ విరిగిపడి విద్యుత్ తీగలపై పడింది. దీన్ని ప్రభావంతో విద్యుత్తు స్తంభం నేలకొరిగి ఆటోపై పడింది. దీంతో గ్రామానికి చెందిన కమ్మిడి గురుకృష్ణ అనే గిరిజన నిరుద్యోగ యువకుడి ఆటో నుజ్జనుజ్జయ్యింది. ప్రతి రోజు ఈ మార్గంలో కళాశాల విద్యార్థులతో పాటు గ్రామస్తులు రాకపోకలు సాగిస్తుంటారు. వాస్తవానికి ఆటోలో గ్రామ పిల్లలు కూర్చునేవారు అయితే గ్రామంలో చిన్న పాటి కార్యక్రమం జరుగుతుండటంతో అందరు అక్కడ ఉన్న తరుణంలో ఈ సంఘటన జరిగింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్ధానికులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. రోడ్డుపై పడ్డ చెట్టును గ్రామస్తుల సాయంతో తొలగించి, విద్యుత్తుని పునరుద్దరించారు. ఆటోతో ఉపాధి పొందుతున్న తనకు ఆటో మరమ్మత్తులు చేసుకునేందుకు ప్రభుత్వం అధికారులు స్పందించి నష్ట పరిహారం అందించాలని బాధితుడు కమ్మిడి గురుకృష్ణ చెబుతున్నారు. -
ఇవి ఈతపండ్లే. నమ్మండి
గూడెంకొత్తవీధి: ఇంత వరకు ఎరుపు రంగులో ఉండే ఈతపండ్లను చూసి ఉంటాం. అయితే ఇప్పుడు నేరేడుపండ్ల మాదిరిగా నలుపు రంగులో ఉన్న ఈతపండ్లు కూడా వస్తున్నాయి. వాటిని చూసిన చాలా మంది నేరుడుపళ్లుగా భావించారు. తీరా అవి ఈతపళ్లని తెలియడంతో ఆశ్చర్యపోయారు. ఇవి సోమవారం ఆర్వీ నగర్ సంతలో దర్శనమిచ్చాయి. గ్లాసు పండ్లను రూ.20కి విక్రయించారు. వాటిని కొనుగోలు చేసేందుకు చాలా మంది పోటీ పడ్డారు. ఈత పండ్లు నేరేడు పండ్ల ఆకారంలో నల్లగా ఉన్నాయని రుచికరంగా ఉన్నాయని పలువురు చెప్పారు. -
ఆర్టీసీ పార్సిల్ సర్వీస్లో బట్టల మూట మాయం
సీలేరు : రాజమండ్రికి చెందిన ఓ బట్టల వ్యాపారి మారుమూల గిరిజన గ్రామాలు తిరుగుతూ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే వ్యాపారి 50 వేల రూపాయలు బట్టలమూట మాయమవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే రాజమండ్రికి చెందిన మహమ్మద్ షరీఫ్ అనే వ్యాపారి ఈ నెల 7న రాజమండ్రి ఆర్టీసీ పార్సిల్ కౌంటర్ వద్ద సీలేరుకు బుక్ చేసి, అదేరోజు బస్కు పంపించారు. అప్పటికే సీలేరులో వ్యాపారం చేస్తున్న మహమ్మద్ అలీ బస్సు దగ్గరకు వెల్లి బట్టల మూట ఇవ్వాలని డ్రైవర్ను అడగగా బస్సులో మూట ఏమీ లేదని, రాజమండ్రిలో ఇవ్వలేదని చెబుతూ దానికి సంబంధించిన రసీదును తీసుకోండి అని ఇచ్చాడు. మూట ఇవ్వకుండా రశీదును ఎలా ఇచ్చారని డ్రైవరును ప్రశ్నించగా సదరు డ్రైవరు దురుసుగా ప్రవర్తించాడని ఆరోపించారు. రాజమండ్రి పార్సిల్ కౌంటర్లో సీలేరు బస్సుకు మూట వేసినట్టు సీసీ కెమెరాలో రికార్డు అయిందని, కానీ సీలేరుకు ఆ బట్టల మూట రాలేదని బాధితుడు వాపోయాడు. దీనిపై సంబంధిత ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించలేదని తక్షణమే ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బాధితుడు మహమ్మద్ షరీఫ్ డిమాండ్ చేశారు. -
ఆదివాసీ ట్రస్ట్ చైర్మన్ పై చర్యలు తీసుకోవాలని ఆందోళన
చింతపల్లి: తక్కువ పెట్టుబడితో ఎక్కువగా లాభాలు వస్తాయని గిరిజనుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేసిన ఆదివాసీ ట్రస్ట్ చైర్మన్ బాలం పడాల్పై చర్యలు తీసుకోవాలని ట్రస్ట్ కార్యదర్శి వండలం బాలయ్య,వైస్ చైర్మన్ చిన్నబాయి,గిరిజన సంఘం మండల నాయకులు సాగిన చిరంజీవి ఆధ్వర్యంలో తహఽసీల్దారు కార్యాలయం ఎదుట పలువురు సోమవారం ఆందోళన చేశారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించి, ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు. అంతకుముందు జరిగిన సమావేశంలో ఆదివాసీ ట్రస్ట్ కార్యదర్శి బాలయ్య, వైస్ చైర్మన్ చిన్నబ్బాయి, సీపీఎం నాయకుడు పాండి ధనుంజయ మాట్లాడుతూ 2024లో కోరాబు బాలం పడాల్ సేవా కార్యక్రమాలు చేస్తూ ట్రస్ట్ను ఏర్పాటు చేశారన్నారు.ట్రేడింగ్ మార్కెట్ పేరిట రూ.12,220 చెల్లించిన వారికి జీవితాంతం నెలకు రూ.3 వేల చొప్పున ఇస్తామని, రూ.1,000 చెల్లిస్తే ఆరు నెలల తరువాత రూ.లక్ష చెల్లిస్తామని చైర్మన్ బాలం పడాల్ నమ్మబలికి చెప్పి మోసం చేశారని వారు ఆరోపించారు. ఇలా నగదు చెల్లించిన వందలాది మంది గిరిజనులు మోసపోయారని తెలిపారు.తక్కువ మందికి మాత్రమే నెలకు రూ.మూడు వేల చొప్పున చెల్లించి ఎక్కువ మందిని మోసం చేశారన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని వారంతా ఆందోళన చేపట్టారు. ఈ విషయమై చైర్మన్ బాలంపడాల్ను వివరణకోరగా ట్రస్ట్కు సభ్యులు భారీగా విరాళాలు ఇచ్చారని, ఆ ట్రస్ట్ కార్యదర్శి బాలయ్య, వైస్ చైర్మన్ చిన్నబ్బాయిల వ్యక్తిగత ఖాతాల్లో రూ.80 లక్షలు, నగదు రూపంలో రూ.58.20లక్షలు ఉన్నాయని చెప్పారు. అవి చెల్లించమని అడిగితే కావాలనే తనపై నిందలుమోపుతున్నారని తెలిపారు. ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. -
అయోమ‘యోగాంధ్ర’
యలమంచిలి రూరల్: యోగాంధ్ర పేరిట ప్రభుత్వం చేస్తున్న హంగామా అధికారులు, ఉద్యోగులను అయోమయానికి, తీవ్ర అవస్థలకు గురిచేస్తోంది. రాష్ట్రంలో యోగాంధ్ర కార్యక్రమం అమలవుతున్న తీరు సుబ్బి పెళ్లి ఎంకి చావుకొచ్చిందన్నట్టుంది. నెల రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రజలను భాగస్వాములను చేయాలని సచివాలయ ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. జిల్లాలో పురపాలక సంఘాలు, నగర పంచాయతీలతోపాటు సచివాలయాల పరిధిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఏ ఒక్కర్నీ వదలడం లేదు. కొద్ది రోజులుగా మిగతా విషయాలు పక్కన పెట్టి కేవలం యోగా మంత్రం జపిస్తున్నారు. దీంతో అధికారులు తీవ్రంగా నలిగిపోతున్నారు. యోగాంధ్ర యాప్ రిజిస్ట్రేషన్ల నుంచి గ్రామ, మండల స్థాయి పోటీల నిర్వహణ వరకూ ఎంపీడీవో, తహసీల్దార్ స్థాయి అధికారులకు టార్గెట్లు నిర్ణయించారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఈ లక్ష్యాలను ఎలా చేరుకోగలమంటూ అధికారులు మధనపడిపోతున్నారు. గ్రామ సెక్రటరీలు, అంగన్వాడీ కార్యకర్తలు, సచివాలయ ఉద్యోగులు, మండల స్థాయి అధికారులు, యోగాంధ్ర మాస్టర్ ట్రైనీలు ఇలా అందరిపైనా తీవ్ర పనిభారం, ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటి వరకూ రిజిస్ట్రేషన్లు, యోగా ప్రొటోకాల్ ఆసనాల శిక్షణను అధికారులు నయానో, భయానో పూర్తి చేశారు. ఇవేం పోటీలు జిల్లా స్థాయిలో యోగా పోటీలకు సంబంధించి 10 నుంచి 18 సంవత్సరాలు, 19 నుంచి 35 సంవత్సరాలు, 35 ఏళ్లు పైబడి అంటూ మూడు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి 50 ఏళ్లు పైబడిన కేటగిరీ ఇవ్వకపోవడంతో, యోగాలో అనుభవం, ఆసక్తి ఉన్న ఆ వయస్సు గ్రూపునకు చెందిన కొందరు 35 ఏళ్ల వయస్సున్న వారితో పోటీ పడే పరిస్థితి ఏర్పడిందని వారంతా పోటీల్లో పాల్గొనడానికి ఆసక్తి కనబర్చడం లేదు. నిరంతరం సాధన చేసే వారు, యోగా శిక్షణ కేంద్రాల్లో శిక్షణ పొందే వారు మాత్రమే వేయగల ఆసనాలను మాత్రమే పోటీల జాబితాలో పొందుపర్చడంతో ఆ జాబితాను చూసిన వారందరూ విస్మయం చెందుతున్నారు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నవారిని సైతం పోటీల్లో అభ్యర్థులుగా చేర్చడంతో.. క్లిష్టతరమైన ఆసనాలు వేయలేమని, తమ పేర్లను తొలగించాలని వారు కోరుతున్నారు. కానీ పోటీలో ఎక్కువమంది పాల్గొన్నట్టు చూపించేందుకు అధికారులు తంటాలు పడుతున్నారు. చిన్న పిల్లలకు ఆకర్ణ ధనురాసనం, బకాసనం, 19 నుంచి 35 సంవత్సరాల విభాగంలో మత్స్యేంద్రాసనం, జిల్లా స్థాయిలో విభక్త పశ్చిమోత్తాసనం వంటి ఆసనాలు వేయాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో పూర్ణ మత్స్యేంద్రాసనం, ఓంకారాసనం, కర్ణ పీడాసనం ఇచ్చారు. సచివాలయ ఉద్యోగులతోపాటు యోగా మాస్టర్ ట్రైనీలు, ఎంపీడీవోలు గ్రామాల్లోకి వెళ్లి పోటీల్లో పాల్గొనాల్సిందిగా అందరినీ ప్రాధేయపడవలసి వస్తోంది. మండల స్థాయి పోటీలను ఏదోలా మమ అన్పించినప్పటికీ జిల్లా స్థాయి పోటీలకు వెళ్లేవారిని పంపించడం కష్టతరమేనని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వెబ్తోనే టైం సరి యోగాంధ్ర కార్యక్రమం కోసం ప్రతి రోజూ కలెక్టర్ నుంచి ఆయుష్ విభాగం అధికారులు, పలు శాఖల జిల్లా స్థాయి అధికారులు గూగుల్ మీట్, వెబెక్స్ నిర్వహిస్తుండడంతో గంటల కొద్దీ సమయం వృథా అవుతోందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు కిందిస్థాయి ఉద్యోగులను గ్రామాల్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై దృష్టి పెట్టాలంటున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని మూడు రోజులపాటు ఎటువంటి శ్రమ లేకుండా చేపట్టామని అధికారులు చెబుతుండడం గమనార్హం. అప్పటి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. కానీ ఇపుడు యోగాంధ్ర కార్యక్రమం కోసం నెల రోజులపాటు నరకయాతన పడుతున్నామని అధికారులు తమ అంతర్గత సంభాషణల్లో తలలు పట్టుకుంటున్నారు. యోగాసనాలు నేలపై వేయకూడదు. మ్యాట్లు, లేదా కార్పెట్లు వంటివి ఉండాలి. కానీ యోగాంధ్ర కోసం అధికారుల మాట కాదనలేక కటిక నేలపై కూడా ఆసనాలు చేస్తున్న ఫొటోలు అప్లోడ్ చేస్తున్నారు. యోగాంధ్ర కార్యాచరణతో చాలా పని ఒత్తిడితో సచివాలయం నుంచి మండల స్థాయి ఉద్యోగులంతా నరకం చూస్తున్నారు. చివరకు రోజూ కార్యాలయంలో రాత్రి 10 గంటల వరకూ కూడా పనిచేయాల్సిన దుస్థితి ఏర్పడిందని అధికారులు తీవ్రంగా మధనపడుతున్నారు. యోగా మానసిక, శారీరక ఆరోగ్యానికి దివ్య ఔషధం... ఒత్తిడి నుంచి దూరం చేస్తుంది... కానీ అధికారులు, ఉద్యోగులు మాత్రం గత పక్షం రోజులుగా ‘యోగాంధ్ర’ ఒత్తిడితో నలిగిపోతున్నారు. ఒక పక్క శిక్షణ కార్యక్రమాలు... మరో పక్క ఫొటోలను అప్లోడ్ చేయడం...ఇంకో పక్క అభ్యర్థులను ఒప్పించే, టార్గెట్లను పూర్తిచేసే పనులు, సర్వేలు, టెలీకాన్ఫరెన్స్లు ఇలా తలకు మించిన పనులతో సతమతమవుతున్నారు. కింది స్థాయి నుంచి ఒకటే హైరానా పడుతున్నారు.... సాధ్యం కాని ఆసనాలతో పోటీలకు ఎలా సిద్ధం చేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. సాధ్యం కాని ఆసనాలతో పోటీలు ఎలా ? యోగాంధ్ర కార్యక్రమానికి మే 21 నుంచి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖ కేంద్రంగా ఐదు లక్షల మందితో నిర్వహించాలని నిర్ణయించారు. ప్రధాని మోదీ కూడా హాజరవుతుండడంతో ఎలాగైనా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో అధికారులు, ఉద్యోగులకు క్షణం తీరిక లేకుండా చేస్తోంది. యోగాంధ్ర ఎన్రోల్మెంట్, మాస్టర్ ట్రైనీల రిజిస్ట్రేషన్, యోగా ప్రొటోకాల్ ఆసనాలను పూర్తి చేసినప్పటికీ, జిల్లా స్థాయి యోగాసనాల పోటీల నిర్వహణ మాత్రం మా వల్ల కాదని చేతులెత్తేస్తున్నారు. ఎందుకంటే సాధ్యం కాని, అలవాటు లేని ఆసనాలతో పోటీలు నిర్వహించాలని అధికారులు మార్గదర్శకాల్లో పేర్కొనడంతో, కొత్తగా యోగా నేర్చుకున్న తాము ఈ ఆసనాలను ఎలా వేయగలమంటూ పోటీల్లో పాల్గొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. తీవ్ర స్థాయిలో ఉద్యోగులపై పని ఒత్తిడి యోగాంధ్ర సర్వే, లక్ష్యాలు, టెలీకాన్ఫరెన్సులతో తిప్పలు సాధ్యం కాని ఆసనాలతో పోటీ ఎలా అంటున్న ప్రజలు -
సాక్షి కార్యాలయాలపై దాడులు సరికాదు
పలు పోలీస్స్టేషన్లలో జర్నలిస్టుల ఫిర్యాదు సాక్షి,పాడేరు: రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాలపై టీడీపీ దాడులకు పాల్పడడం సరికాదని జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. సాక్షి కార్యాలయాలపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పాత్రికేయులు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. పాడేరులో సీఐ దీనబంధుకు ఫిర్యాదు చేయగా... అరకులోయలో ఎస్ఐ గోపాలరావుకు, హుకుంపేట, రాజవొమ్మంగి, డుంబ్రిగుడ పోలీస్స్టేషన్లలో సిబ్బందికి ఫిర్యాదులు అందజేశారు. కొందరు వ్యక్తులు చేపట్టిన రాజకీయ ప్రేరేపిత దాడులు, ఇతర నేర చర్యలపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి, కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సాక్షి మీడియా విశాఖ యూనిట్ బ్రాంచ్ మేనేజర్ వర్రి చంద్రారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కార్యాలయం ఎదుట అనుమతి లేకుండా గుంపులుగా చేరి దాడులకు పాల్పడ్డారని, వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
మానవ అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు
సాక్షి,పాడేరు: మానవ అక్రమ రవాణాకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ హెచ్చరించారు.సోమవారం కలెక్టరేట్లో విజిలెన్స్,మానటరింగ్ సమావేశాన్ని నిర్వహించారు.మానవ అక్రమ రవాణా,వెట్టిచాకిరీ నిర్మూలన,కార్మిక చట్టాల అమలుపై అధికారులతో సమీక్షించారు. కార్మిక చట్టాల ప్రచార వాల్పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలబాలికలతో పనులు చేయించకూడదన్నారు.జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు పనులకు వెళ్లే కార్మికులను గుర్తించాలని సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జేసీ అభిషేక్గౌడ,జిల్లా కార్మికశాఖ అధికారి సుజాత,డీఎస్పీ సహబాజ్ అహమ్మద్,డీఆర్డీఏ పీడీ మురళీ,ఎల్డీఎం మాతునాయుడు,జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి జనార్ధనరావు,జిల్లా చైల్డ్ ప్రొటక్షన్ అధికారి సాధు తదితరులు పాల్గొన్నారు. వర్షాకాలంలో ఇసుక సేకరణ నిషేధం గోదావరి ఇసుక రీచ్ల నుంచి వర్షాకాలంలో ఇసుక సేకరణ నిషేధిస్తున్నట్టు కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ తెలిపారు. సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్టోబర్ 15వరకు గోదావరి రీచ్ల నుంచి ఇసుక సేకరణ నిలిపివేస్తున్నట్టు చెప్పారు.స్థానిక అవసరాలకు స్థానికంగా ఉన్న జలపాతాలు,గెడ్డల వద్ద ఇసుకను సేకరించవచ్చని తెలిపారు.ఎటపాక మండలం గుండాల ఇసుక రీచ్ వద్ద 1.19లక్షల టన్నుల ఇసుక నిల్వ ఉందని చెప్పారు. వి.మాడుగుల,కొత్తవలస,బొబ్బిలి,నర్సీపట్నం వద్ద ఇసుక నిల్వలు అందుబాటులో ఉన్నాయని,వినియోగదారులు కొనుగోలు చేసుకోవచ్చని ఆయన తెలిపారు.ఈ సమావేశంలో జేసీ అభిషేక్గౌడ, మైన్స్ ఏడీ ఎం.ఆనంద్,భూగర్భ జలాలశాఖ డీడీఎం మురళీధర్,ఎస్ఎంఐ డీఈఈ నాగేశ్వరరావు,ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ నీలిమా తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ దినేష్కుమార్ -
తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆదివాసీల ధర్నా
మాడుగుల రూరల్ : శంకరం పంచాయతీ శివారు కృష్ణంపాలెం గ్రామానికి సంబంధించి ప్రభుత్వ బంజరు భూములను స్థానిక ఆదివాసీలకు కేటాయించాలని కోరుతూ సోమవారం ర్యాలీ నిర్వహించారు. మాడుగుల గాంధీ పార్కు నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. తహసీల్దారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, తహసీల్దారు రమాదేవికి వినతిపత్రం అందజేశారు. శంకరం పంచాయతీ శివారు కృష్ణంపాలెంలో సర్వే నంబరు 188–3 లో గల భూమిని ఆదివాసీలకు కేటాయించాలని, సివిల్ కేసుల్లో ఆదివాసీలను ప్రతిసారి పోలీసుస్టేషన్కు పిలిపించి పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తహసీల్దారుకు అందజేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్ఐ, ఇతర సిబ్బందితో మాట్లాడుతానని తహసీల్దార్ వారికి హామీ ఇచ్చారు. -
వరించిన రబీ
దిగుబడి ఆశాజనకం ఈఏడాది రబీలో వరిపంట దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి.అర ఎకరంలో రెండవ పంటగా వరిని సాగుచేశాను.పంట కోతలు చేపట్టి నూర్పులు చేయగా 15బస్తాల ధాన్యం రావడం సంతోషంగా ఉంది.అఽధికంగా కురిసిన వర్షాలు పంట ఎదుగుదలకు మేలు చేశాయి. – మర్రి చంద్రశేఖర్, గిరిజన రైతు, గుర్రగరువు, పాడేరు మండలంసాక్షి,పాడేరు: రైతన్న పంట పండింది. రబీ సీజన్లో ధాన్యం దిగుబడి బాగా వచ్చింది. సమృద్ధిగా నీరు ఉండడంతో రెండో పంట రైతుల ఇంట సిరులు కురిపించింది. ఈ ఏడాది దుక్కిపనులు నుంచి నారుమడుల తయారీ,వరినాట్లు పనులన్నీ జోరుగా సాగాయి. రబీ సాగుకు నీరు సమృద్ధిగా ఉండడంతో పాటు వాతావరణ పరిస్థితులు అనుకూలించాయి.పంట ఎదుగుదల సమయంలో ఏప్రిల్,మే నెలల్లో విస్తారంగా కురిసిన వర్షాలు వరిపంటకు ఎంతో మేలు చేశాయి. జిల్లా వ్యాప్తంగా 2,361 హెక్లార్లలో ఈ ఏడాది రబీలో వరిసాగు చేశారు. పాడేరు డివిజన్ పరిఽధిలో గిరిజన రైతులు తిండి గింజల అవసరాలకు రెండవ పంటగా వరి సాగుచేస్తుండగా,రంపచోడవరం,చింతూరు డివిజన్ల పరిధిలో వాణిజ్య అవసరాలకు వరి సాగుచేస్తారు. గిరిజన రైతులు రబీలో వరిని సాగు చేయడం పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తోంది. తమ వద్ద ఉన్న సంప్రదాయ ఎంటీయూ 1021 విత్తనాలనే సాగుకు వినియోగిస్తారు. తక్కువ సమయంలో అంటే 125 నుంచి 130రోజుల వ్యవధిలో పంట దిగుబడికి రావడంతో ఉత్సాహంగా కోతలు,వెనువెంటనే ధాన్యం నూర్పులు చేపడుతున్నారు.చింతూరు,రంపచోడవరం డివిజన్ పరిధిలో ఎకరానికి 40 బస్తాలు,పాడేరు డివిజన్లో 30 బస్తాలు దిగుబడులు వస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.పంట దిగుబడులు ఆశాజనకంగా ఉండడంతో రబీ వ్యవసాయం సిరులు కురిపిస్తోంది. హుషారుగా పంట కోతలు, నూర్పులు ఆశాజనకంగా దిగుబడులు జిల్లాలో 2,361 హెక్టార్లలో సాగు -
రాజకీయ సిఫార్సులకే పెద్దపీట?
● ఉమ్మడి విశాఖలో బదిలీల దుమారం ● ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి నో బదిలీ ● పెందుర్తిలో బాబ్జీకి భంగపాటు? మహారాణిపేట: ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో జరిగిన రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల ఉద్యోగుల బదిలీలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఏళ్ల తరబడి ఒకే చోట పాతుకుపోయిన, ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు తహసీల్దార్లకు స్థానచలనం కల్పించకపోవడం, అదే సమయంలో కీలకమైన పోస్టులను భర్తీ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ బదిలీల ప్రక్రియలో కూటమి ఎమ్మెల్యేల సిఫార్సులకే పెద్దపీట వేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా రెవెన్యూ శాఖలో జరిగిన తహసీల్దార్ల బదిలీలలో రాజకీయ జోక్యం స్పష్టంగా కనిపిస్తోంది. పెందుర్తి తహసీల్దార్ బదిలీ విషయంలో అక్కడి ఎమ్మెల్యే పంతం నెగ్గించుకున్నారు. ఈ విషయంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ సిఫార్సులను పరిగణలోకి తీసుకోలేదని సమాచారం. భీమిలి ఎమ్మెల్యే సిఫార్సు మేరకే ఆనందపురం తహసీల్దార్ను బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఎక్కువ సంవత్సరాలు పనిచేసిన కారణంగా గాజువాక తహసీల్దార్ బదిలీ జరిగింది. అయితే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు అధికారులను కదపకపోవడం గమనార్హం. వీరితో పాటు డిప్యూటీ తహసీల్దార్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బందితో కలిపి రెవెన్యూ శాఖలో మొత్తం 62 మందిని బదిలీ చేశారు. పంచాయతీరాజ్లో 75 మందికి స్థానచలనం జిల్లా పరిషత్లో కూడా భారీగా బదిలీలు జరిగాయి. జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి మొత్తం 75 మంది ఉద్యోగులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఐదుగురు ఎంపీడీవోలు, ఐదుగురు పరిపాలనాధికారులు, 4 సీనియర్ అసిస్టెంట్లు, 11 మంది జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు టైపిస్టులు, 12 మంది రికార్డు అసిస్టెంట్లు, 30 మంది ఆఫీస్ సబార్డినేట్లు, ఆరుగురు నైట్ వాచ్మెన్లు ఉన్నారు. జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర పాల్గొన్నారు.బదిలీ అయిన రెవెన్యూ అధికారులు వీరే.. మండలం/స్థానం తహసీల్దార్/ కేటాయించిన స్థానం సూపరింటెండెంట్ పేరు పెందుర్తి ఎం.ఆనందకుమార్ అనకాపల్లి జిల్లా ములగాడ ఎం.భుజంగరావు అనకాపల్లి జిల్లా కలెక్టరేట్(అల్లూరి) బి.నాగరాజు అనకాపల్లి జిల్లా కలెక్టరేట్(అల్లూరి) ిసీహెచ్ తిరుమలరావు అనకాపల్లి జిల్లా కలెక్టరేట్(అల్లూరి) ఎం.భాస్కరఅప్పారావు అనకాపల్లి జిల్లా అల్లూరి జిల్లా టి.రామకృష్ణ పెందుర్తి మండలం అల్లూరి జిల్లా ఎంవీవీపసాద్ ల్యాండ్ ప్రొటెక్షన్(విశాఖ) కలెక్టరేట్(అనకాపల్లి) బీవీ రాణి మెజిస్టీరియల్ సెక్షన్(విశాఖ) అచ్యుతాపురం జి.జనార్ధన్ అల్లూరి జిల్లా ఆనందపురం పి.శ్యాంప్రసాద్ కోఆర్డినేషన్ సెక్షన్(విశాఖ) (ఆనందపురం హెచ్డీటీ ఎల్.చేతన్ కుమార్ ఇన్చార్జి తహసీల్దార్గా నియామకం) గాజువాక టి.శ్రీ వల్లి వీఎంఆర్డీఏ (గాజువాక హెచ్డీటీ బి.శ్రీనివాసరావు ఇన్చార్జి తహసీల్దార్గా నియామకం) సీతమ్మధార ఎం.రమేష్ను ములగాడ (సీతమ్మధార హెచ్డీటీ ఎస్.ఎ.త్రినాథరావు ఇన్చార్జి తహసీల్దార్గా నియామకం) -
కష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు
సాక్షి, పాడేరు: విద్యార్థులంతా ప్రణాళికాబద్ధంగా కష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ అన్నారు. ఈ ఏడాది టెన్త్,ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు విద్యాశాఖ ఆధ్వర్యంలో స్థానిక వి.ఆర్.పంక్షన్హాల్లో సోమవారం షైనింగ్ స్టార్స్ అవార్డులు ప్రదానం చేశారు. టెన్త్లో అత్యధిక మార్కులు సాధించిన 72 మందికి, ఇంటర్లో 19 మందికి ప్రతిభా పురస్కారాలతో పాటు మెడల్స్, రూ.20వేల చెక్లను అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్మించుకోవాలన్నారు. టెన్త్,ఇంటర్తోనే చదువులు ఆపవద్దని తెలిపారు.ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థులు ప్రోత్సహించాలన్నారు.పిల్లల బలాలు,బలహీనతలపై దృష్టి పెట్టాలని చెప్పారు. విద్యార్థులకు కేరీర్ గైడెన్స్పై కూడా అవగాహన కల్పిస్తామన్నారు.91మంది టెన్త్,ఇంటర్ విద్యార్థులకు అవార్డులు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.ఈ విద్యాసంవత్సరంలోను టెన్త్,ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అధ్యాపకులు,ఉపాధ్యాయులు,విద్యార్థులంతా కృషి చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో జేసీ డాక్టర్ అభిషేక్గౌడ,సబ్కలెక్టర్ సౌర్యమన్పటేల్,మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి,డీఈవో బ్రహ్మాజీరావు,సర్వశిక్ష ఏపీసీ స్వామినాయుడు,ఇన్చార్జి డీడీ రజనీ,ఎంపీపీ రత్నకుమారి,జీసీసీ డైరెక్టర్లు బొర్రా నాగరాజు,గంగులయ్య,ఇంటర్మీడియెట్ జిల్లా అఽధికారి శంకరరావు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ దినేష్ కుమార్ 91 మంది విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానం -
సింహాచలం దేవస్థానం ఈవో బదిలీ
సింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఈవో వి. త్రినాథరావును ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన్ని దేవదాయశాఖ రాజమహేంద్ర వరం మల్టీ జోన్–1 రీజనల్ జాయింట్ కమిషనర్గా నియమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి వి.వినయ్చంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే సింహాచలం దేవస్థానానికి కొత్త ఈవో నియమితులయ్యే వరకు త్రినాథరావే ఇన్చార్జి ఈవోగా కొనసాగాలని ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. త్రినాథరావు 2024 సెప్టెంబర్ 22 నుంచి సింహాచలం దేవస్థానం ఈవోగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 1 నుంచి మే 31 వరకు వ్యక్తిగత కారణాలతో సెలవులో ఉన్న ఆయన, గత నెల 26వ తేదీనే తిరిగి విధుల్లో చేరారు. కాగా, తనను సింహాచలం దేవస్థానం నుంచి బదిలీ చేయాలని త్రినాథరావే దేవదాయశాఖకు దరఖాస్తు చేసుకున్నందువల్లే ఈ బదిలీ జరిగిందని ప్రచారం జరుగుతోంది. -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం రంపచోడవరం: ప్రతి రోజు యోగా చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం అన్నారు. రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం ఎదుట సోమవారం యోగాంధ్ర కార్యక్రమాన్ని పీవో ప్రారంభించారు. మెయిన్ రోడ్డు సెంటర్లో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, సిబ్బందితో యోగా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పీవో మాట్లాడుతూ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గ్రామ, పంచాయతీ, మండల స్థాయిల్లో యోగాపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించే విధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. ఈ నెల 21 వరకు యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్డీసీ పి.అంబేడ్కర్, ఏపీవో డి.ఎన్.వి. రమణ, డీఎల్డీవో కోటేశ్వరరావు, ఏవో రమణి, తహసీల్దార్ పి.రామకృష్ణ, ఏడీఏ సీహెచ్.కె.వి. చౌదరి తదితరులు పాల్గొన్నారు. అరకులోయటౌన్: ప్రతి రోజు యోగా చేయడం వల్ల ఆరోగ్యవంతులుగా ఉండవచ్చని అరకు నియోజకవర్గం ప్రత్యేక అధికారి, గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ఉప కలెక్టర్ ఎం.వి.ఎస్. లోకేశ్వరరావు తెలిపారు. యోగాంధ్రలో భాగంగా సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం నుంచి నిర్వహించిన యోగాంధ్ర ర్యాలీని లోకేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడి ఆస్పత్రుల ఖర్చులు తగ్గుతాయన్నారు.ఈ ర్యాలీ పెదలబుడు గ్రామ సచివాలయం వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో ఇన్చార్జీ ఎంపీడీవో సత్యనారాయణ, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
మంత్రి లోకేశ్కు గురువుల నిరసన సెగ
సాక్షి, పార్వతీపురం మన్యం: విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్కు పార్వతీపురం మన్యం జిల్లాలో గురువుల నుంచి నిరసన ఎదురైంది. షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు మంత్రి సోమవారం పార్వతీపురం వచ్చారు. స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేశారు. లోకేశ్ పర్యటన విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు,ఆయనను కలిసి వినతి పత్రం అందించాలని నిర్ణయించారు. ఎస్జీటీలకు మాన్యువల్ విధానంలోనే బదిలీల విషయమై మంత్రిని కలిసి విన్నవించేందుకు ప్రయత్నించారు. కుదరకపోవడంతో రెండు బృందాలుగా టీచర్లు మంత్రి కాన్వాయ్ను అడ్డుకునేందుకు వేచి చూశారు. చివరికి మంత్రి లోకేశ్ ను ఉపాధ్యాయులు కలిశారు. తమ డిమాండ్లు వినిపించారు. -
సాగు భారం
రైతుకు గ్రామస్థాయిలో వ్యవసాయ పరిజ్ఞానం అందించాలన్న లక్ష్యంతో గతవైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో లక్ష్యానికి దూరమవుతున్నాయి. జిల్లాకు 344 కేంద్రాలు మంజూరు కాగా వీటిలో 150 మాత్రమే వినియోగంలో ఉన్నాయి. ఇవి కూడా ఆశయానికి తగ్గట్టుగా సేవలు అందించలేకపోతుండటంతో రైతులకు భరోసా కరువైంది. భరోసా దూరం..రంపచోడవరం: పంచాయతీ స్థాయిలో అన్ని రకాల సేవలు ఒకే చోట అందించాలనే లక్ష్యంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సచివాలయాలు, పక్కనే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా ఒకొక్క ఆర్బీకే భవన నిర్మాణానికి రూ. 50 లక్షలు వెచ్చించింది. రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించింది. రైతులకు వ్యవసాయ విజ్ఞానాన్ని అందించే పుస్తకాలు, శాస్త్రవేత్తల సూచనల కోసం స్మార్ట్ టీవీలను ఏర్పాటుచేసింది. అంతే కాకుండా విత్తనాలు, ఎరువులు పొందేందుకు కియోస్క్ మిషన్లు ఏర్పాటు చేసింది. విత్తనం నాటే దగ్గర నుంచి.. పంట కొనుగోలు వరకు కావాల్సినవన్నీ అందుబాటులోకి తెచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. తమకు సక్రమంగా సేవలు అందడం లేదని రైతులు వాపోతున్నారు. పెట్టుబడి సాయం ఏదీ? వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా రైతులకు రూ.13,500 పెట్టుబడి సాయం అందించేది. అయితే కూటమి ప్రభుత్వం దీనికి అన్నదాత సుఖీభవగా పేరు మార్చింది. ఇప్పుడు రూ. 20 వేలు అందిస్తామని చెప్పి నేటికీ రైతుల ఖాతాల్లో జమ చేయలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సాగు పెట్టుబడికి ఎటువంటి ఇబ్బందులు ఉండేవి కావని, కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కష్టాలు మొదలయ్యాయని వారు ఆవేదన చెందుతున్నారు. ఏ రకం విత్తనం కావాలో తెలుసుకోకుండానే.. ఈ ఏడాది జిల్లాలో ఖరీఫ్కు సంబంధించి గిరిజన రైతులకు 90శాతం రాయితీపై 22,644 క్వింటాళ్ల వరి విత్తనాలు ఇచ్చేందుకు వ్యవసాయశాఖ ప్రతిపాదనలు పెట్టింది. తమకు ఏరకం విత్తనాలు అవసరమనేది తెలుసుకోకుండానే ప్రతిపాదనలు పంపడం వల్ల ఏంటి ఉపయోగమని రైతులు ప్రశ్నిస్తున్నారు. ● గత ప్రభుత్వంలో తాము ఆర్బీకేలకు వెళ్లి కావాల్సిన రకం విత్తనాలు, ఎరువులు కియోస్క్ మిషన్లో స్వయంగా నమోదు చేసుకునే వారమని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కియోస్క్ మిషన్లు నిరుపయోగంగా మారాయి. ● రైతుల విజ్ఞానం కోసం ఏర్పాటు చేసిన స్మార్ట్ టీవీలు సరిగ్గా వినియోగానికి నోచుకోలేదు. గత ప్రభుత్వంలో రైతులు సమయం దొరికినప్పుడు ఆర్బీకేలకు వచ్చి టీవీలో వ్యవసాయ సూచనలు తెలుసుకుని విజ్ఞానం పొందే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నిరుపయోగంగా అగ్రి ల్యాబ్ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏజెన్సీ ప్రధాన కేంద్రం రంపచోడవరంలో నిర్మించిన అగ్రి ల్యాబ్ నిరుపయోగంగా మారింది. దీని నిర్మాణానికి రూ.2కోట్లు వెచ్చించింది. విత్తనాలు, ఎరువు, పురుగు మందులు నాణ్యతను పరీక్షించేందుకు ఈ ల్యాబ్ను అందుబాటులోకి తెచ్చింది. ● రాష్ట్రంలో వివిధ పాంతాల నుంచి వచ్చిన శాంపిళ్లను వీటిలో పరీక్షించి నాణ్యతను నిర్థారించేవారు. నాణ్యత లోపంతో ఉన్న ఎరువు, విత్తనాలు, పురుగు మందులు విక్రయించే వారిపై చర్యలు తీసుకునేందుకు ఈ ప్రక్రియ ఎంతో దోహద పడేది. ఏడాది కాలంలో ఈ ల్యాబ్లో పరీక్షలు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. వ్యవసాయ శాఖ ఏడీ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో అగ్రి ల్యాబ్లోనే ఏడీ కార్యాలయం నిర్వహిస్తున్నారు. ఆశయానికి దూరంగా ఆర్బీకేలు అందని పెట్టుబడి సాయం భూసార పరీక్షలకు నోచుకోని అగ్రిల్యాబ్లు నిర్వీర్యమే లక్ష్యంగా పాలన కూటమి ప్రభుత్వంలో అన్నదాతకు ఆసరా కరువుప్రభుత్వ సహకారం అవసరం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు అనేక సేవలు పొందే వారు. ప్రస్తుతం అరకొరగా సేవలు అందుతున్నా యి. రైతులకు ఆధునిక సాంకేతిక సేవలు అందినప్పుడే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. ఆర్బీకేల్లో రైతులకు సేవలు తూతూమంత్రంగానే అందుతున్నాయి. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభు త్వం స్పందించాలి. రైతులకు అవసరమైన అన్నిరకాల సాయం అందించగలిగితేనే సాగు ముందుకు సాగుతుంది. – మడకం పోతురాజు, రైతు,దేవరాతిగూడెంరైతులకు అందని సేవలు తామరపల్లిలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్లాలి. అక్కడ వ్యవసాయం కోసం తెలుసుకునేందుకు ప్రస్తుతం ఎటువంటి పుస్తకాలు, టీవీలు అందుబాటులో లేవు. రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు పొందే అవకాశం లేకుండా చేశారు. అధికారులు తమకు నచ్చిన విధంగా ప్రతిపాదనలు పెట్టి విత్తనాలు పంపిణీ చేసే పరిస్థితి. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో రైతులకు ఉపయోగం లేకుండా ఉన్నాయి. – శారపు బాపిరాజుదొర, రైతు, గోపవరం, రంపచోడవరం మండలం -
చెరువులో స్నానానికి దిగి మృత్యువు పాలైన ముగ్గురు చిన్నారులు తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చారు. వీరిలో ఇద్దరు అన్నదమ్ముల సంతానం కావడంతో ఆయా కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. వారిని ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. ఈ ఘటనతో మండలంలోని బిల్లాపుట్టు, గం
డుంబ్రిగుడ : మండలంలోని పోతంగి పంచాయతీ బిల్లాపుట్టుకు చెందిన అన్నదమ్ములు గుంట కమందన్, గుంట రామదాస్కు చెందిన కుమారులు గుంట సాయికిరణ్(14), గుంట భానుతేజ్ (14) వారం రోజుల క్రితం ఇదే మండలంలోని గుంటసీమ పంచాయతీ గంగవలస గ్రామంలోని మేనత్త, మేనమామ ఇంటికి వెళ్లారు. వీళ్లు ఇదే గ్రామానికి చెందిన కొర్ర ధన్యారావు కుమారుడు కొర్ర సుశాంత్తో కలిసి ఆదివారం ఉదయం 10 గంటలకు సమీప అటవీప్రాంతానికి వెళ్లారు. అక్కడి నుంచి మామిడిపళ్లు తీసుకుని వస్తుండగా మార్గం మధ్యలో జంగమయ్య గుడి పక్కనున్న చెరువులోకి స్నానానికి దిగారు. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులో 10 నుంచి 12 అడుగుల లోతున నీరు చేరడంతో ముగ్గురు ప్రమాదానికి గురయ్యారు. నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. వారిని రక్షించేందుకు పరిసర ప్రాంతీయులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రమాద సమాచారం తెలుసుకున్న గుంటసీమ సర్పంచ్ గుమ్మ నాగేశ్వరరావు, స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను బయటకు తీశారు. ఈమేరకు ఎస్ఐ కె.పాపినాయుడు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అరకు ఏరియా ఆస్పత్రికి అంబులెన్సులో తరలించారు. పాడేరు డీఎస్పీ సహబాజ్ అహ్మద్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ● గుంట కమందన్కు సాయికిరణ్తోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గుంట బలరామ్కు కుమారుడు భానుతేజ్తోపాటు కుమార్తె ఉంది. సాయికిరణ్, భానుతేజ్ మృతితో ఈ రెండు కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. మృతులు ముగ్గురు వేర్వేరు పాఠశాలల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. సాయికిరణ్ అరకులోయలోని పాఠశాలలో చదువుతుండగా భానుతేజ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని గిరిజన గురుకుల పాఠశాల, కొర్రా సుశాంత్ మండలంలోని గుంటసీమలోని ప్రభుత్వ బాలుర ఆశ్రమ పాఠశాలలోను చదువుతున్నారు. కూలికి వెళ్తేనే గడిచేది.. చెరువులో మునిగి మృతి చెందిన ముగ్గురు చిన్నారులకు చెందిన కుటుంబాలది దయనీయ పరిస్థితి. రోజు వారీగా కూలీకి వెళ్తేనే తప్ప.. పూట గడవని పరిస్థితి బాధిత తల్లిదండ్రులది. సుశాంత్ తండ్రి వ్యవసాయ కూలీకాగా సాయికిరణ్, భానుతేజ్ తండ్రులు ఓ ప్రైవేటు గ్యాస్ ఏజెన్సీలో కార్మికులుగా పనిచేస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ తల్లిదండ్రులకు చిన్నారులను చెరువు రూపంలో మృత్యువు దూరం చేసి తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ప్రభుత్వం ఆదుకోవాలి చెరువులో స్నానానికి దిగి మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని ఎంపీ తనూజరాణి, అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీలో ఉన్న ఎంపీని బాధిత కుటుంబీకులతో సర్పంచ్ నాగేశ్వరరావు ఫోన్లో మాట్లాడించారు. అనంతరం ఆమె అరకు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్తో మాట్లాడారు. పోస్టుమార్టం త్వరగా పూర్తి చేసిన చిన్నారుల మృతదేహాలను అంబులెన్సులో వారి స్వగ్రామాలకు తరలించాలని ఎంపీ ఆదేశించారు. ముగ్గురు చిన్నారుల మృతితో గంగవలస, బిల్లాపుట్టులో విషాదం స్నానానికి దిగడంతో ప్రమాదం మృతుల్లో ఇద్దరు అన్నదమ్ముల సంతానం పుట్టెడు దుఃఖంలో బాధిత కుటుంబాలు ఆర్థికసాయం అందించి ఆదుకోవాలి: అరకు ఎంపీ తనూజరాణి, ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం -
పౌష్టికాహారం, వ్యాయామంతో మంచి ఆరోగ్యం
రంపచోడవరం: మంచి ఆరోగ్యాన్ని పొందడం మన చేతుల్లోనే ఉందని, ఇందుకు మంచి పౌష్టికాహరం తీసుకుంటే వ్యాయామం చేయాలని సివిల్ జడ్జి టీవీ రాఘవేంద్రరావు అన్నారు. రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో రంపచోడవరంలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పిల్లలు అనారోగ్యం కలిగించే వాటికి దూరంగా ఉండాలని, చెడు వ్యసనాల బారిన పడవద్దని సూచించారు. వైద్య శిబిరంలో సుమారు 400 మందికి వైద్య సేవలు అందించినట్లు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞేయనందజీ మహరాజ్ తెలిపారు. స్వామి ప్రజ్ఞనాధనంద మహరాజ్, స్వామి లోకమయనంద మహరాజ్లు వైద్యశిబిరంలో రోగులకు అందుతున్న సేవలను పర్యవేక్షించారు. వైద్యులు జీవీ రామారావు, కస్తూరి సుబ్రమణ్యం, టీవీ సుబ్బారావు, దాసరి ఉమా మహేష్, ఎస్. సంపత్కుమార్, జీఎస్ఎల్ వైద్యులు సేవలు అందించారు. అవసరమైన వారికి రక్త పరీక్షలు నిర్వహించారు. వైద్య శిబిరంలో 87 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించి పది మందిని కంటి ఆపరేషన్ల కోసం వేమగిరి పరమహంస యోగానంద నేత్రాలయానికి తరలించారు.సివిల్ జడ్జి రాఘవేంద్రరావు -
నేటికీ తెరచుకోని డిపో
సీలేరు: గూడెం కొత్తవీధి మండలం దుప్పిలవాడ పంచాయతీ బూసుకొండ సబ్ డిపో నుంచి నిత్యావసర సరుకులు పంపిణీ చేయకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల ఒకటి నుంచి ఎండీయూ వ్యవస్థను నిలిపివేసి డీఆర్ డిపోల ద్వారా సరుకులు పంపిణీకి కూటమి ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించినప్పటికి నేటికి మారుమూల ప్రాంతాలకు సరుకులు పంపిణీ చేయలేదు. మండలంలోని దుప్పిలవాడ పంచాయతీ బూసుకొండ జీసీసీ డిపో నుంచి ఇప్పటికీ సరుకులు పంపిణీ జరగకపోవడంతో కార్డుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని పరిధిలో వలసగెడ్డ, వలసగెడ్డ కాలనీ, శాండికొరి, పులిగొప్ప తదితర గ్రామాల ప్రజలు ఉన్నారు. తమకు రేషన్ సరకులు పంపిణీ చేసేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. రేషన్ సరుకులకు నోచుకోని ‘బూసుకొండ’ రేషన్ కార్డుదారులు పంపిణీకి చర్యలు తీసుకోవాలని డిమాండ్ -
విద్యాశాఖ తీరుపై ఎస్జీటీల కన్నెర్ర
విశాఖ డీఈవో కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన టీచర్లు ఆరిలోవ (విశాఖ): విద్యాశాఖలో బదిలీల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై గురువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకో నిబంధన, గంటకో సవరణ, తొలుత ఇచ్చిన హామీని విస్మరించడపై నిరసన గళం వినిపించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని సెకండరీ గ్రేడ్ టీచర్లు(ఎస్జీటీ) ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విశాఖ జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని ఆదివారం ముట్టడించారు. నగరంతో పాటు గ్రామీణ, గిరిజన ప్రాంతాల నుంచి వందల మంది టీచర్లు ఉదయం 9 గంటలకే డీఈవో కార్యాలయానికి చేరుకొని కదం తొక్కారు. వెబ్ కౌన్సెలింగ్ వద్దు.. మాన్యువల్ కౌన్సెలింగే ముద్దు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి, ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక స్టీరింగ్ కమిటీ నాయకులు మాట్లాడుతూ ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ చేపడతామని చెప్పి, ఇప్పుడు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామనడం ఆక్షేపణీయమన్నారు. గతంలో విద్యాశాఖా మంత్రి లోకేశ్ మాన్యువల్ కౌన్సెలింగ్ అని మాటిచ్చి, ఇప్పుడు మాట మార్చడం సరికాదన్నారు. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా వందల ఆప్షన్లు ఇవ్వడం కష్టమన్నారు. మాన్యువల్ ద్వారా అయితే అవసరమైన వాటిలో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుందన్నారు. ఉపాధ్యాయులు అభిప్రాయాలు, సూచనలను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్జేడీ కె.విజయభాస్కర్, డీఈవో ఎన్.ప్రేమకుమార్లకు వినతి పత్రాలు అందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ నాయకులు డి.గోపినాఽథ్, ఇమంది పైడిరాజు, టి.చిన్నబ్బాయి, టి.రామకృష్ణారావు, అరుణ్కుమార్, వీరభద్రరావు, సూర్యనారాయణ పాల్గొన్నారు. మాట మార్చిన అధికారులు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బదిలీల కౌన్సెలింగ్లో మాన్యువల్ విధానం అవలంబిస్తామని విద్యా శాఖాధికారులు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని తుంగలో తొక్కుతున్నారు. ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు మాన్యువల్ కౌన్సెలింగ్ కోరుకుంటున్నారని, ఇంతమంది కోరుతున్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాల్సిన కౌన్సెలింగ్ విధానాన్ని పక్కనబెట్టి, ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్న వెబ్ కౌన్సెలింగ్ను అమలు చేయడం సరికాదు. – డి.గోపీనాథ్, పీఆర్టీయూ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు -
కేజీహెచ్సూపరింటెండెంట్గా వాణి
మహారాణిపేట: కేజీహెచ్ నూతన సూపరింటెండెంట్గా డాక్టర్ ఐ. వాణి నియమితులయ్యారు. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖలో అడిషనల్ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)గా పదోన్నతి పొందిన డాక్టర్ వాణి, ప్రస్తుతం కేజీహెచ్లో సీనియర్ ప్రొఫెసర్గా, గైనిక్ విభాగాధిపతి (హెచ్ఓడీ)గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టీ. కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు కేజీహెచ్ సూపరింటెండెంట్గా పనిచేసిన డాక్టర్ పి. శివానంద్ 16 నెలల పాటు ఈ పదవిలో ఉన్నారు. ఆశ్రమ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు అచ్యుతాపురం రూరల్: స్థానిక ఇంటిగ్రేటెడ్ ఆశ్రమ పాఠశాలలో ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు నిర్వాహకులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దివ్యాంగులు, అనాథలు, నిరుపేదలకు ఒకటి నుంచి పదో తరగతి వరకూ ఉచితంగా విద్య, వసతి సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఇంటర్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9989719158, 7032054123 నంబర్లను సంప్రదించాలన్నారు.