Business
-
పెట్రోల్ మంటలు.. వంటింటికి సెగలు!
గత రెండు వారాలుగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతుండటంతో.. ద్రవ్యోల్బణంపై ఆందోళనలు పెరుగుతున్నాయి. మే 15 తర్వాత నాలుగు సార్లు ఇంధన ధరలు పెరగడంతో ప్రజల రోజువారీ ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.94.77 నుంచి రూ.102.12కు చేరగా, డీజిల్ ధర రూ.87.67 నుంచి రూ.95.2కు పెరిగింది. అదే సమయంలో సీఎన్జీ ధరలు కూడా కేజీపై సుమారు రూ.4 వరకు పెరిగింది.ధరల పెరుగుదలకు ప్రధాన కారణం మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు. ముఖ్యంగా అక్కడి యుద్ధ పరిస్థితులు ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. భారత్ చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడటంతో.. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగితే దేశీయంగా కూడా ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది.ఇంధన ధరల పెరుగుదల కేవలం వాహనదారులపై మాత్రమే కాదు, సాధారణ కుటుంబాలపై కూడా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే సరుకుల రవాణాకు ఇంధనం కీలకం. రైతుల నుంచి నగరాలకు వచ్చే కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల రవాణా ఖర్చులు పెరగడంతో వాటి ధరలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి.ఇప్పటికే వంటింటి ఖర్చులు పెరుగుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సన్ఫ్లవర్ ఆయిల్ ధర కేజీకి రూ.11.2 పెరిగింది. సోయా ఆయిల్, పామ్ ఆయిల్ ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. టమోటా ధర కిలోకు రూ.7కిపైగా పెరగగా, నెయ్యి ధరలు కూడా పెరిగాయి. ముఖ్యంగా వంటనూనెల విషయంలో భారత్ దిగుమతులపై ఆధారపడటం వల్ల ప్రపంచ మార్కెట్ ప్రభావం నేరుగా కనిపిస్తోంది.ఈ పరిస్థితుల్లో ప్రజలు ఒకేసారి రెండు రకాల భారాన్ని ఎదుర్కొంటున్నారు. ఒకవైపు ప్రయాణ ఖర్చులు పెరుగుతుండగా, మరోవైపు వంటింటి ఖర్చులు కూడా అధికమవుతున్నాయి. ఇంధన ధరలు ఇలాగే పెరుగుతూ ఉంటే సాధారణ జీవనం మరింత ఖరీదుగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: గడ్కరీ కీలక ప్రకటన.. వచ్చేస్తోంది కొత్త రకం స్టవ్! -
వచ్చేస్తోంది కొత్త రకం స్టవ్!
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కంటే వంటను చౌకగా చేయగల, కొత్త ఇథనాల్ ఆధారిత స్టవ్ టెక్నాలజీని ఆవిష్కరించారు. ఇది భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న బయోఫ్యూయల్ మిషన్లో మరో ప్రధాన ముందడుగును సూచిస్తుంది.నాగ్పూర్లో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ.. ఇథనాల్ ఆధారిత కొత్త స్టవ్ ద్వారా, వంట గ్యాస్ సిలిండర్ల కంటే తక్కువ ఖర్చుతోనే వంట చేయవచ్చని తెలిపారు. ఇది దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతికతగా పేర్కొన్నారు. ఇథనాల్ను నీటితో కలిపి మంటను ఉత్పత్తి చేయడం ద్వారా ఈ స్టవ్ పనిచేస్తుంది. ఇది సంప్రదాయ ఎల్పీజీ వంటి ఇంధనాల కంటే తక్కువ కాలుష్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి గృహ వినియోగానికి ఇది ఒక ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉంది.భారతదేశం చమురు అవసరాల కోసం.. సుమారు 87 శాతం దిగుమతులపైనే ఆధారపడుతుంది. ఈ పరిస్థితిని తగ్గించేందుకు ప్రభుత్వం ఇథనాల్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని పెంచుతోంది. ఇప్పటికే దేశంలో పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమం కలిపి వినియోగించడం కొనసాగుతోంది. 2014లో 1.5 శాతం నుంచి 2025 నాటికి దాదాపు 20 శాతానికి ఇథనాల్ వినియోగం పెరిగింది.ఇదీ చదవండి: పెరుగుతున్న ధరలు.. నిర్మలా సీతారామన్ హెచ్చరిక!ఇథనాల్ అనేది ప్రధానంగా.. చెరకు, మొక్కజొన్న, వ్యవసాయ వ్యర్థాల నుంచి ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఇది మండినప్పుడు కూడా తక్కువ కాలుష్యం విడుదలవుతుంది. అందువల్ల దీనిని పర్యావరణహిత ఇంధనంగానే పరిగణిస్తారు.ఈ కొత్త టెక్నాలజీ విజయవంతమైతే.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వంట గ్యాస్పై ఆధారపడటం చాలావరకు తగ్గుతుంది. ఇదే జరిగితే.. ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంది. అయితే దీనికోసం భారీ మొత్తంలో ఇథనాల్ ఉత్పత్తి అవసరం అవుతుంది. సరఫరా మాత్రమే కాకుండా.. భద్రత కూడా చాలా ముఖ్యం. ఇవన్నీ సాధ్యమైతేనే ప్రజలు దీనిని విశ్వసిస్తారు. వినియోగించడానికి ముందుకు వస్తారు. -
బంగారం మార్కెట్లో కొత్త దశ!
డిమాండ్ పెరుగుతుండటం, పాలసీల్లో మార్పులు మొదలైన అంశాల కారణంగా.. దేశీయంగా పసిడి, ఆభరణాల సెక్టార్ కీలక దశలోకి ప్రవేశిస్తోంది. పసిడి రేట్లు భారీగా పెరిగినప్పటికీ డిమాండ్ పటిష్టంగానే ఉంటోంది.స్వచ్ఛత, ధరల విషయంలో పారదర్శకత, విశ్వసనీయతకు కస్టమర్లు మరింత ప్రాధాన్యతనిస్తుండటంతో జ్యుయలరీ మార్కెట్ క్రమంగా కన్సాలిడేట్ అవుతోంది. గత ఐదేళ్లుగా సంఘటిత రిటైల్ విభాగం గణనీయంగా విస్తరించింది. రాబోయే రోజుల్లో మధ్యకాలికంగా ఈ రంగం పెట్టుబడులకు అనువుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ విభాగంలో వృద్ధి అవకాశాలకు పరిశీలించతగిన కంపెనీ.ఇదీ చదవండి: పెరుగుతున్న ధరలు.. నిర్మలా సీతారామన్ హెచ్చరిక! -
నిర్మలా సీతారామన్ హెచ్చరిక!
అమెరికా-ఇరాన్ యుద్ధం.. ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తూ, దేశంలో ఖర్చులను పెంచుతున్నాయి. ఈ తరుణంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మూడు ఎఫ్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. మూడు ఎఫ్లు - ఫ్యూయల్ (ఇంధనం), ఫర్టిలైజర్ (ఎరువులు), ఫారెక్స్ (విదేశీ మారక నిల్వలు).పెరిగిన ధరలు - ప్రజలపై భారం!ముంబైలో జరిగిన స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 37వ వార్షికోత్సవ కార్యక్రమంలో సీతారామన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎరువుల ధరలు ఊహకందని స్థాయికి చేరుకున్నాయి. కాగా ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతుండటంతో ప్రజలపై భారం మరింత పెరుగుతోంది. కేవలం 11 రోజుల్లోనే పెట్రోల్ ధర లీటర్కు రూ.7.38 వరకు పెరిగిందని ఆమె పేర్కొన్నారు.ఈ పరిస్థితికి ప్రధాన కారణం.. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి వద్ద ఏర్పడిన అంతరాయాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు సరఫరా దెబ్బతింటోంది. భారతదేశం తన చమురు అవసరాల్లో దాదాపు 85-90 శాతం దిగుమతులపై ఆధారపడుతుంది. అందువల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగితే.. భారత్పై నేరుగా ప్రభావం పడుతుంది.మోదీ పిలుపుప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ మారక నిల్వలను జాగ్రత్తగా ఉపయోగించాలని చెప్పారు. కాబట్టి, కొంతకాలం పాటు అవసరం లేని దిగుమతులను తగ్గించడం, విదేశీ ప్రయాణాలను వాయిదా వేయడం, కొంతకాలం బంగారం కొనుగోళ్లను తగ్గించడం వంటి సూచనలు ప్రజలకు, పరిశ్రమలకు ప్రధాని ఇచ్చారని సీతారామన్ గుర్తుచేశారు.ప్రస్తుతం భారతదేశంలో ఇంధన ధరల పెరుగుదల మాత్రమే సమస్య కాదు. ఎరువుల ధరలు భారీగా పెరగడం వల్ల వ్యవసాయ రంగంపై ప్రభావం చూపుతోంది. మరోవైపు బంగారం ధరలు పెరగడం కూడా దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెంచుతోందని ఆర్ధికమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ అంశాలన్నీ భారత ఆర్థిక వ్యవస్థకు సవాళ్లను సృష్టిస్తున్నాయని ఆమె వివరించారు.అనేక సమస్యలు ఒకేసారి!అమెరికా-ఇరాన్ యుద్ధ పరిస్థితుల ప్రభావం కేవలం రాజకీయ లేదా దౌత్య పరమైన అంశం కాదు, ఇది సాధారణ ప్రజల జీవితాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయని సీతారామన్ హెచ్చరించారు. ఇంధన ధరలు పెరగడం, సరుకు రవాణా ఆలస్యం కావడం, షిప్పింగ్ ఖర్చులు పెరగడం, పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకుల కొరత, ఎగుమతి ఆర్డర్లలో అనిశ్చితి వంటి అనేక సమస్యలు ఒకేసారి ఎదురవుతున్నాయని ఆమె చెప్పారు.పెరుగుతున్న ఇంధన ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే భారీ ఆదాయ నష్టాన్ని భరించిందని సీతారామన్ చెప్పారు. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం వల్ల ప్రభుత్వానికి లక్ష కోట్ల రూపాయలకు పైగా ఆదాయ నష్టం వచ్చినప్పటికీ ప్రజలపై భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇదే సమయంలో.. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSMEs) చెల్లింపుల సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు 45 రోజుల్లోపు బకాయిలను చెల్లించాలని ఆమె సూచించారు.ఇదీ చదవండి: ఉద్యోగాలపై AI ప్రభావం.. యువతకు పిచాయ్ సందేశం! -
‘వచ్చే పదేళ్లు మామూలుగా ఉండదు’
రాబోయే దశాబ్దం ప్రపంచ వాణిజ్యం, పరిశ్రమలకు అత్యంత సవాలుతో కూడుకున్నదని అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హెచ్చరించారు. ముంబైలో జరిగిన టెక్స్ప్రోసిల్ ఎక్స్పోర్ట్స్ అవార్డుల ప్రధానోత్సవంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దశాబ్దాల కాలంలోనే అత్యంత అనిశ్చిత స్థితిని ఎదుర్కొంటోందని, పెరుగుతున్న రక్షణవాదం, సుంకం రహిత అడ్డంకులు, వాతావరణ మార్పులు, సరఫరా గొలుసుల అస్థిరత వంటివి ఎగుమతిదారులు, తయారీదారులకు ప్రధాన ఆందోళనలుగా మారాయని ఆమె పేర్కొన్నారు.అయితే, ఇలాంటి సంక్షోభ సమయాలు భారతదేశానికి కొత్త అవకాశాలను కూడా సృష్టిస్తాయని ఆర్థిక మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లలో మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలు, సుస్థిరత, క్రాఫ్ట్ ఆధారిత తయారీ వంటి పోకడలు భారత్కు అనుకూలంగా ఉన్నాయన్నారు. గ్లోబల్ రిటైలర్లు తమ సోర్సింగ్ నిబంధనల్లో స్థిరత్వ ప్రమాణాలను తప్పనిసరి చేస్తున్నందున, ఎగుమతిదారులకు సుస్థిరత అనేది ఇకపై ఒక ఎంపిక కాదని, ఒక బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు.మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆటోమేషన్ వంటి సాంకేతికత ప్రపంచ వస్త్ర పరిశ్రమను వేగంగా మారుస్తూ, కార్మిక ఖర్చులను తగ్గిస్తోందని మంత్రి గుర్తుచేశారు. ఈ మారుతున్న వాతావరణంలో భారతీయ వస్త్ర ఎగుమతిదారులు అంతర్జాతీయంగా పోటీ పడాలంటే... నైపుణ్యాల పెంపు, ఆవిష్కరణలు, డిజైన్ సామర్థ్యాలపై దూకుడుగా పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ, దేశీయ పరిశ్రమలు ప్రపంచ డిమాండ్కు అనుగుణంగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని సీతారామన్ నొక్కి చెప్పారు. -
హైదరాబాద్ ఫార్మా కంపెనీ లాభం హైజంప్
హైదరాబాద్: ఫార్మాస్యూటికల్స్ రంగ కంపెనీ సాయి పేరెంటరల్స్ గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు ప్రకటించింది. క్యూ4 (జనవరి–మార్చి)లో నికర లాభం భారీగా జంప్చేసి రూ. 13 కోట్లను అధిగమించింది. అంతక్రితం ఏడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 1.6 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 74 కోట్ల నుంచి రూ. 201 కోట్లకు ఎగసింది.నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 6 కోట్ల నుంచి రూ. 29 కోట్లకు మెరుగుపడింది. పూర్తి ఏడాదికి నికర లాభం 45 శాతం వృద్ధితో రూ. 14 కోట్లను అధిగమించింది. 2024–25లో రూ. 10 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 159 కోట్ల నుంచి రూ. 381 కోట్లకు జంప్ చేసింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. -
ఉద్యోగాలపై AI ప్రభావం.. యువతకు పిచాయ్ సందేశం!
కృత్రిమ మేధస్సు (AI) గురించి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా యువతలో.. విద్యార్థుల్లో ఏఐ తమ ఉద్యోగాలపై ప్రభావం చూపుతుందేమో అనే భయం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.ఇటీవల 'హార్డ్ ఫోర్క్' అనే పాడ్కాస్ట్లో సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. యువతపై తనకు ఎంతో నమ్మకం ఉందని తెలిపారు. ఏఐ వల్ల మార్పులు వచ్చినా, కొత్త తరం ఆ సవాళ్లను స్వీకరించి మంచి భవిష్యత్తును నిర్మిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో జరగబోయే పట్టభద్రుల సభలో పిచాయ్ ప్రసంగించబోతున్నారు. ఈ సందర్భంగా.. పాడ్కాస్ట్ హోస్ట్ ఏఐ గురించి మాట్లాడితే.. విద్యార్థులు విమర్శిస్తే, ఏమని జవాబిస్తారు? అని సరదాగా ప్రశ్నించారు. 'ప్రతి తరం సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగింది. ఈ తరం కూడా అలాగే సవాళ్లను అధిగమించి మంచి ప్రపంచాన్ని నిర్మిస్తుంది' అని పిచాయ్ సమాధానం ఇచ్చారు.యువత, విద్యార్థులు ఏఐ ప్రభావాన్ని మాత్రమే అనుభవించరు. భవిష్యత్తులో ఏఐ అభివృద్ధిని ముందుకు నడిపించే ప్రధాన శక్తిగా కూడా మారతారు. వీళ్ళే AI పురోగతికి కారణమవుతారు, దాని ప్రభావాలను కూడా ఎదుర్కొంటారని పిచాయ్ వెల్లడించారు. యువత కొత్త అవకాశాలను సృష్టించే శక్తి కలిగిన వారని ఆయన స్పష్టం చేశారు.ఇటీవల చాలా కంపెనీలు.. ఉద్యోగులను తొలగించడానికి ప్రధాన కారణం ఏఐ అని చెబుతున్నారు. దీనివల్ల ఉద్యోగాల భద్రతపై మరింత ఆందోళన పెరిగింది. ముఖ్యంగా కొత్తగా చదువు పూర్తి చేసిన యువతలో నిరుద్యోగం కూడా పెరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు AI గురించి భయపడటం సహజమని పిచాయ్ అంగీకరించారు.టెక్నాలజీలో వచ్చే మార్పులు ఎప్పుడూ సమాజంలో భయాన్ని కలిగిస్తాయి. గతంలో వచ్చిన సాధారణ సాంకేతిక మార్పులకు కూడా ప్రజలు భయపడ్డారు. కానీ.. తరువాత అవే అభివృద్ధికి దోహదపడ్డాయని ఆయన గుర్తుచేశారు. AIను కూడా సరైన విధంగా ఉపయోగిస్తే మానవ సమాజానికి ఉపయోగకరంగా మారుతుందని చెప్పారు.ఏఐ వల్ల జరిగే నష్టాలను మాత్రమే కాకుండా.. ప్రయోజనాలను కూడా ప్రజలకు స్పష్టంగా చూపించాల్సిన బాధ్యత టెక్నాలజీ రంగంపై ఉందని సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. పరిశ్రమలు, కంపెనీలు, ప్రభుత్వాలు కలిసి బాధ్యతాయుతంగా AIని అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రజల నమ్మకాన్ని పెంచేందుకు ఇంకా చాలా పని చేయాల్సి ఉందని ఆయన అంగీకరించారు. -
రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్లో కొత్త పద్ధతి!
రైల్వే కౌంటర్లలో తత్కాల్ టికెట్ల కోసం గంటల తరబడి పడిగాపులు కాసే ప్రయాణికుల ఇబ్బందులకు స్వస్తి పలికేందుకు భారతీయ రైల్వే కీలక అడుగు వేసింది. పశ్చిమ మధ్య రైల్వే (WCR) పరిధిలోని ప్రతిష్టాత్మక కోటా డివిజన్ తన పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లలో వినూత్నమైన ‘టోకెన్ వ్యవస్థ’ను ప్రవేశపెట్టింది. తత్కాల్ బుకింగ్ ప్రక్రియలో పారదర్శకతను పెంచడం, కౌంటర్ల వద్ద తోపులాటలు, గందరగోళాన్ని నివారించడమే లక్ష్యంగా ఈ కొత్త నిబంధనలను అమలు చేయనున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న కోటా డివిజన్ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకుంది.కొత్త విధానం ఎలా పనిచేస్తుంది?కౌంటర్ల వద్ద క్యూ లైన్ల నిర్వహణను క్రమబద్ధీకరించేందుకు రైల్వే శాఖ ఒక స్పష్టమైన ప్రణాళికను రూపొందించింది. ప్రయాణికులు ముందుగా నిర్ణయించిన సమయానికి బుకింగ్ కార్యాలయానికి చేరుకోవాలి. కౌంటర్ సిబ్బంది నుండి కేటగిరీకి సంబంధించిన టోకెన్ను తీసుకోవాలి. టోకెన్ నంబర్ల వరుస క్రమం ఆధారంగానే ప్రయాణికులను కౌంటర్ వద్దకు అనుమతిస్తారు. మీ వంతు వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా తత్కాల్ టికెట్ పొందవచ్చు.టోకెన్ పంపిణీ సమయాలు ఇవే..తత్కాల్ బుకింగ్ ప్రారంభం కావడానికి ముందే కౌంటర్ల వద్ద ఈ టోకెన్ల పంపిణీ జరుగుతుంది. ఏసీ క్లాస్ (AC Classes) కేటగిరీ ప్రయాణికులకు ఉదయం 9:00 నుండి 9:25 వరకు టోకెన్లు ఇస్తారు. ఉదయం 10:00 గంటలకు తత్కాల్ బుకింగ్ ప్రారంభవుతుంది. ఇక స్లీపర్ క్లాస్ (Sleeper Class) ప్రయాణికులకు ఉదయం 9:30 నుండి 9:55 వరకు టోకెన్ పంపిణీ ఉంటుంది. ఉదయం 11:00 గంటలకు తత్కాల్ టికెట్ల బుకింగ్ ప్రారంభం మొదలవుతుంది. సాధారణ రైల్వే నిబంధనల ప్రకారం ప్రయాణ తేదీకి ఒక రోజు ముందే తత్కాల్ విండో తెరుచుకుంటుంది. కౌంటర్లతో పాటు ఐఆర్సీటీసీ (IRCTC) అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా డిజిటల్గా తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు.రైల్వే చార్ట్ తయారీలో మార్పులుప్రయాణికుల సౌకర్యార్థం రైలు బయలుదేరే సమయాన్ని బట్టి మొదటి రిజర్వేషన్ చార్ట్ తయారీ సమయాలను కూడా రైల్వే శాఖ ఇటీవల పునరుద్ధరించింది. ఉదయం 05:01 నుండి మధ్యాహ్నం 14:00 గంటల మధ్య బయలుదేరే రైళ్లకు ప్రయాణానికి ముందటి రోజు రాత్రి 20:00 గంటల (8:00 PM) లోపు మొదటి చార్ట్ సిద్ధం చేస్తారు. మధ్యాహ్నం 14:01 నుండి రాత్రి 23:59 వరకు, అర్ధరాత్రి 00:00 నుండి తెల్లవారుజామున 05:00 గంటల మధ్య బయలుదేరే రైళ్లకు రైలు ప్రయాణ సమయానికి కనీసం 10 గంటల ముందే మొదటి రిజర్వేషన్ చార్ట్ తయారు చేశారు.రైల్వే కౌంటర్ల వద్ద దళారుల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు, సాధారణ ప్రయాణికులకు సులభంగా టికెట్లు అందించేందుకు కోటా డివిజన్ తెచ్చిన ఈ టోకెన్ విధానం ఎంతో మేలు చేకూరుస్తుంది. ఇదే పద్ధతిని ఇతర రైల్వే డివిజన్లలోనూ అమలు చేస్తే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది. -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
సోమవారం ఉదయం లాభల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1,073.61 పాయింట్లు లేదా 1.42 శాతం లాభంతో 76,488.96 వద్ద, నిఫ్టీ 312.40 పాయింట్లు లేదా 1.32 శాతం లాభంతో 24,031.70 వద్ద నిలిచాయి.సుందరం బ్రేక్ లైనింగ్ లిమిటెడ్, రూబీ మిల్స్ లిమిటెడ్, కార్డ్స్ కేబుల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, రేవతి ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్, థాకర్ & కంపెనీ లిమిటెడ్ వంటివి లాభాలను పొందాయి. సూర్య రోష్ని లిమిటెడ్, సాన్స్టార్ లిమిటెడ్, ఎక్సెల్సాఫ్ట్ టెక్నాలజీస్ లిమిటెడ్, సతియా ఇండస్ట్రీస్ లిమిటెడ్, ప్రోస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
ఫాస్ట్ట్యాగ్ పనిచేయడం లేదా?: NHAI సూచనలివే..
భారతదేశంలోని జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులందరికీ ఫాస్ట్ట్యాగ్ తప్పనిసరి. టోల్గేట్స్ వద్ద వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి, వేగంగా ముందుకు వెళ్లడానికి ఎన్హెచ్ఏఐ ఫాస్ట్ట్యాగ్ విధానం ప్రవేశపెట్టింది. అయితే.. చాలామంది వాహనదారులు ఫాస్ట్ట్యాగ్ అకౌంట్లో సరిపడా బ్యాలెన్స్ ఉన్నప్పటికీ టోల్గేట్ల వద్ద ఆలస్యాన్ని ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం ఏమిటనే విషయాన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది.ఫాస్ట్ట్యాగ్లో ఉండే.. ఆర్ఎఫ్ఐడీ చిప్ టోల్ ప్లాజా స్కానర్లతో కమ్యూనికేట్ చేస్తుంది. ఈ చిప్ సరిగా పనిచేయకపోతే స్కానర్ ఫాస్ట్ట్యాగ్ను రీడ్ చేయలేవు. ఫలితంగా వాహనం టోల్గేట్ వద్ద ఎక్కువసేపు ఆగాల్సి వస్తుంది. దీంతో ట్రాఫిక్ పెరిగి పొడవైన క్యూలు ఏర్పడే అవకాశం ఉంటుంది.ఎన్హెచ్ఏఐ ప్రకారం ఫాస్ట్ట్యాగ్ దెబ్బతినడానికి మూడు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.ఒకటి.. వెహికల్ విండ్ షీల్డ్ తరచుగా శుభ్రం చేయడం. కొంతమంది గట్టిగా రుద్దడం లేదా కెమికల్స్ ఉపయోగించడం వల్ల ఫాస్ట్ట్యాగ్లోని ఆర్ఎఫ్ఐడీ చిప్ దెబ్బతింటుంది.రెండవది.. ఎండ, దుమ్ము, వర్షం వంటి వాతావరణ ప్రభావాలు. ఎక్కువకాలం ఫాస్ట్ట్యాగ్ ఇలాంటి పరిస్థితుల్లో ఉండటం వల్ల కూడా టోల్ ప్లాజా స్కానర్లు రీడ్ చేయలేవు.మూడవది.. పాతబడిన ఫాస్ట్ట్యాగ్లు. చాలా రోజుల పాటు ఉపయోగించిన ట్యాగ్లు సహజంగానే పనితీరును కోల్పోతాయి.Are you facing FASTag scanning issues at Toll Plazas? Your FASTag could be damaged causing delays at Toll Plazas. Contact your issuer bank today and get your FASTag replaced.@NHAI_Official @MORTHIndia pic.twitter.com/hdqCoARVp1— FASTagOfficial (@fastagofficial) May 4, 2026ఫాస్ట్ట్యాగ్ ఐదేళ్లకు పైబడితే లేదా తరచూ స్కాన్ సమస్యలు ఎదురైతే వెంటనే మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే టోల్ గేట్ల వద్ద అనవసర ఆలస్యం, ప్రయాణంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కొన్నిసార్లు డబుల్ డిడక్షన్ లేదా ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ సమస్యలు కూడా వస్తాయి.ఇదీ చదవండి: పెట్రోల్ కష్టాలకు చెక్.. వచ్చేస్తోంది కొత్త కారు!వాహనదారులు ఫాస్ట్ట్యాగ్ను జాగ్రత్తగా ఉపయోగించాలి. విండ్షీల్డ్ మీద ట్యాగ్ ఉన్న ప్రాంతాన్ని గట్టిగా రుద్దకూడదు. ఫాస్ట్ట్యాగ్ను వంచడం, తీసి మళ్లీ అతికించడం చేయకూడదు. ట్యాగ్పై ఇతర స్టిక్కర్లు లేదా సన్ ఫిల్మ్లు ఉండకూడదు. సమస్యలు కనిపించిన వెంటనే ఫాస్ట్ట్యాగ్ జారీ చేసిన బ్యాంకును సంప్రదించి కొత్త ట్యాగ్ తీసుకోవాలి. -
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి.. భారత్కు మాత్రం ఓ గుడ్న్యూస్
భారత ఎగుమతుల పర్ఫార్మన్స్ 2026 ఏప్రిల్లో ఆశాజనకంగా కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, వాణిజ్య అనిశ్చితులు నెలకొన్న సమయంలో కూడా భారత్ తన ఎగుమతి మార్కెట్లను విస్తరించడంలో ముందడుగు వేసినట్లు తాజా గణాంకాలు సూచిస్తున్నాయి.ప్రభుత్వం, పరిశ్రమల వర్గాలు కలిసి కొత్త మార్కెట్లను అన్వేషించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలితాలు ఇస్తున్నాయని ఈ గణాంకాలు చెబుతున్నాయి. వివిధ వాణిజ్య అవరోధాల మధ్య కూడా 2026 ఏప్రిల్లో భారత సరుకు ఎగుమతులు దాదాపు 14 శాతం పెరిగి 43.66 బిలియన్ డాలర్లకు చేరాయి.ఈ పెరుగుదలలో కొంత భాగం అంతర్జాతీయ ధరల పెరుగుదల వల్ల వచ్చినప్పటికీ, మరింత ముఖ్యమైన అంశం ఏమిటంటే.. భారత ఎగుమతిదారులు చేరుకుంటున్న మార్కెట్ల సంఖ్య గణనీయంగా పెరగడం.ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. గత ఏడాదిలో కనీసం 20 ఎగుమతి విభాగాలకు చెందిన ఉత్పత్తులు 17 లేదా అంతకంటే ఎక్కువ కొత్త దేశాలకు చేరాయి. ఉదాహరణకు, భారత హ్యాండ్లూమ్ ఉత్పత్తులు ఇప్పుడు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే అదనంగా 29 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.ఈ కొత్త మార్కెట్లలో ఎగుమతుల పరిమాణం ఇప్పటికీ చిన్న స్థాయిలోనే ఉన్నప్పటికీ, కొత్త మార్గాలను తెరవడం ఒక కీలక ముందడుగుగా భావిస్తున్నారు. ఇంజినీరింగ్ ఉత్పత్తులు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, ఆర్గానిక్ ఇనార్గానిక్ కెమికల్స్ వంటి భారత ప్రధాన ఎగుమతి రంగాలు గత ఏడాదితో పోలిస్తే 2026 ఏప్రిల్లో మెరుగైన వృద్ధిని నమోదు చేశాయి.మరో కోణంలోనూ మెరుగైన ప్రదర్శన ఇది ప్రస్తుతం ఉన్న సరఫరా వ్యవస్థల పునరుద్ధరణ సామర్థ్యాన్ని మాత్రమే కాదు, కొత్త సరఫరా గొలుసులు కూడా ఏర్పడుతున్నాయనే సంకేతాలను ఇస్తోంది. భారత ఎగుమతుల బలాన్ని అంచనా వేయడానికి మరో ప్రమాణం.. పెట్రోలియం ఉత్పత్తులు వాటి ధరల ప్రభావాన్ని పక్కనపెట్టి చూసే గణాంకాలు.ఈ కోణంలో కూడా భారత్ మెరుగైన ప్రదర్శనే చేసింది. 2026 ఏప్రిల్లో చమురుేతర ఎగుమతులు 9 శాతం పెరిగి దాదాపు 40 బిలియన్ డాలర్లకు చేరాయి. ముఖ్యంగా భారత సరుకు ఎగుమతుల వృద్ధి, దిగుమతుల వృద్ధిని మించి ఉండటం గమనార్హం.అయితే పశ్చిమాసియా సంక్షోభం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మార్చిలో వచ్చిన భారీ పడిపోయిన ధోరణి కొనసాగుతూ ఏప్రిల్లో పశ్చిమాసియాకు భారత ఎగుమతులు 28 శాతం తగ్గాయి. ఆ ప్రాంతం నుంచి దిగుమతులు కూడా సుమారు 32 శాతం పడిపోయాయి.ఇది భారత్కు అత్యంత కీలకమైన వాణిజ్య భాగస్వామ్య ప్రాంతం కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇతర ప్రాంతాల్లో వచ్చిన లాభాలు ఈ నష్టాలను పూర్తిగా భర్తీ చేయలేకపోతున్నాయి. ఇదే సమయంలో ‘సేఫ్ అసెట్’గా భావించే బంగారం దిగుమతులు ఏప్రిల్లో 82 శాతం ఎగసిపడ్డాయి.భారతీయులు బంగారం కొనుగోళ్లు తగ్గించాలని ప్రధాని పిలుపునివ్వడం, ప్రభుత్వం దిగుమతి సుంకాలను పెంచడం వెనుక ఇదే కారణమై ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. గ్లోబల్ ట్రేడ్ పవర్గా భారత్! మరో ముఖ్యమైన అంశం సేవారంగ ప్రాధాన్యం పెరుగుతుండటం. 2014లో భారత మొత్తం ఎగుమతుల్లో సేవారంగం వాటా 39 శాతం మాత్రమే ఉండగా, ప్రస్తుతం అది దాదాపు 49 శాతానికి చేరుకుంది. అయితే, ఇక్కడే ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ప్రత్యేకంగా కృత్రిమ మేధస్సు (AI) వేగంగా ఎదుగుతున్న నేపథ్యంలో ఐటీ సేవల రంగంలో భారత పోటీ సామర్థ్యం తగ్గితే అది పెద్ద దెబ్బ కావచ్చని సూచిస్తున్నారు. అయినప్పటికీ, వివిధ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం, ఎగుమతి గమ్యస్థానాలను విస్తరించడం వంటి ప్రభుత్వ చర్యలు ఫలిస్తున్నాయని తాజా గణాంకాలు చెబుతున్నాయి.ఇకపై వ్యయం, నాణ్యత, ఉత్పత్తి పరిమాణం పరంగా భారత ఎగుమతుల పోటీ సామర్థ్యాన్ని మరింత పెంచగలిగితే.. భారత్ నిజమైన గ్లోబల్ ట్రేడ్ పవర్గా ఎదిగే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. - వెబ్ డెస్క్ -
అమెరికా డాలర్కు చావేనా? ఇరాన్ ఏం చేసిందంటే..
ప్రముఖ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత, ఆర్థిక నిపుణుడు రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) ప్రపంచ ఆర్థిక ముఖచిత్రంలో రాబోయే ఒక భారీ మార్పుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో యుద్ధం కంటే కూడా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అమెరికా డాలర్కు పొంచి ఉందంటూ ఆయన హెచ్చరించారు.ఇరాన్ దేశం తన చమురు విక్రయాల కోసం అమెరికా డాలర్ స్థానంలో చైనా కరెన్సీ 'యువాన్' (Yuan)లో చెల్లింపులను స్వీకరించడం ప్రారంభించిందని, ఇది "పెట్రో డాలర్" (Petro-dollar) వ్యవస్థ అంతానికి నాంది కానుందని ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విటర్) వేదికగా పేర్కొన్నారు.'పెట్రో డాలర్'కు మరణ శాసనం?రాబర్ట్ కియోసాకి తన ట్వీట్లో ప్రపంచ ఆర్థిక చరిత్రలోనే ఇది అత్యంత కీలకమైన పరిణామమని అభివర్ణించారు."ఇరాన్ చమురు కోసం చైనా యువాన్ను అంగీకరించడం ప్రారంభించింది. దీని అర్థం ఏమిటి? మీ భవిష్యత్తుపై, అమెరికా డాలర్ భవిష్యత్తుపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? ఇరాన్తో యుద్ధం కంటే ఇది అత్యంత ఘోరమైన పరిస్థితి. అమెరికా డాలర్ అంతం కాబోతోందా?" అని కియోసాకి ప్రశ్నించారు.ఈ అంతర్జాతీయ మార్పుల వల్ల సామాన్యులు నష్టపోకుండా ఉండేందుకు, ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి కనీసం ఒక గంట సమయాన్ని కేటాయించాలని ఆయన కోరారు. మన పాఠశాలల్లో ఇలాంటి ముఖ్యమైన విషయాలను ఎప్పటికీ నేర్పరని ఆయన గుర్తుచేశారు.ప్రస్తుతం జరుగుతున్న ఈ భారీ ఆర్థిక సంక్షోభం గురించి ప్రముఖ బిలియనీర్, ఇన్వెస్టర్ రే డాలియో (Ray Dalio) మాత్రమే స్పష్టంగా వివరిస్తున్నారని కియోసాకి పేర్కొన్నారు. రే డాలియో నిర్వహించిన “ఇరాన్ జస్ట్ కిల్డ్ ది పెట్రో డాలర్” అనే పాడ్కాస్ట్ను తప్పకుండా వినాలని కియోసాకి ప్రజలకు సూచించారు."మీ జీవితంలో మీరు పెట్టే అత్యుత్తమ పెట్టుబడి... మీ ఆర్థిక విద్యపై పెట్టే పెట్టుబడే" అని కియోసాకి ట్వీట్లో స్పష్టం చేశారు.అసలు ఏమిటీ పెట్రో డాలర్ సంక్షోభం?గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా చమురు వ్యాపారం అంతా అమెరికా డాలర్లలోనే సాగుతోంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో డాలర్కు తిరుగులేని ఆధిక్యత లభించింది. అయితే, ఇటీవల కాలంలో అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటున్న ఇరాన్, రష్యా వంటి దేశాలతో పాటు చైనా కూడా డాలర్ రహిత వ్యాపారానికి (De-dollarization) తెరలేపాయి. చమురు వ్యాపారంలో చైనా యువాన్ వాడకం పెరిగితే, అది అమెరికా డాలర్ పతనానికి దారితీస్తుందనే ఆందోళనలు ప్రపంచ ఆర్థిక వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఆ ఆందోళనలనే రాబర్ట్ కియోసాకి తాజాగా తన ట్వీట్ ద్వారా మరోసారి ప్రపంచం దృష్టికి తీసుకువచ్చారు.WORSE THAN WAR in IRANDeath of the US Dollar?Iran began accepting payment for oil in Chinese Yuan. What does that mean to you and your future and the future of the US dollar?I strongly encourage you to invest about and hour in your financial education. I strongly…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 24, 2026 -
కస్టమర్ల ఇళ్లలో కెమెరాల కలకలం
బెంగళూరుకు చెందిన ప్రముఖ హోమ్ సర్వీసెస్ స్టార్టప్ ప్రోంటో ప్రస్తుతం సాంకేతిక, నైతిక వివాదంలో చిక్కుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలకు శిక్షణ ఇచ్చేందుకు కస్టమర్ల ఇళ్లలో వీడియోలను రికార్డ్ చేయడానికి తన సిబ్బందిని ఉపయోగించిందనే ఆరోపణలు సామాజిక మాధ్యమాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో టెక్ స్టార్టప్ ‘హ్యూమన్ ఆర్కైవ్’ వ్యవస్థాపకుడు రుషిల్ అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశాయి.నాడు ఎగతాళి చేశారు.. నేడు అదే చేస్తున్నారుభవిష్యత్తులో రాబోయే హ్యూమనాయిడ్ రోబోట్లు, ఫిజికల్ ఏఐ వ్యవస్థల శిక్షణ కోసం మానవ ప్రవర్తన, కదలికలు, రియల్ వరల్డ్ పరస్పర చర్యలను (ఉదాహరణకు: లైవ్లో ఇళ్లు శుభ్రం చేయడం, వంట చేయడం, వస్తువులను సర్దడం) రికార్డ్ చేసే పనుల్లో ‘హ్యూమన్ ఆర్కైవ్’ సంస్థ నిమగ్నమై ఉంది. ఈ అంశంపైనే కొన్ని నెలల క్రితం (జనవరిలో) తాను ప్రోంటో వ్యవస్థాపకురాలు అంజలి సర్దానాతో చర్చించానని రుషిల్ అగర్వాల్ పేర్కొన్నారు. ఆ సమయంలో ఆమె తన ఆలోచనను తీవ్రంగా ఎగతాళి చేసిందని ఆయన ఆరోపించారు.‘జనవరిలో నేను అంజలి సర్దానాతో మాట్లాడినప్పుడు ఆమె నన్ను చూసి నవ్వింది. ఇలాంటి డేటా సేకరిస్తున్నందుకు నన్ను ఒక తెలివితక్కువవాడిగా చిత్రీకరించింది. స్టార్టప్ వ్యవస్థాపకులను తక్కువ చేసి మాట్లాడటం ఆమెకు అలవాటు. కానీ ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ను పట్టుకోవడానికి వాళ్లే ఆపసోపాలు పడుతున్నారు’ అని రుషిల్ తీవ్రస్థాయిలో విమర్శించారు.ఏడాదిలో భారీ వాల్యుయేషన్.. కానీ..23 ఏళ్ల యువ పారిశ్రామికవేత్త అంజలి సర్దానా నేతృత్వంలోని ప్రోంటో అతి తక్కువ కాలంలోనే ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించింది. యూఎస్లోని జార్జ్టౌన్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థిని అయిన అంజలి గతంలో బైన్ క్యాపిటల్, 8వీసీ వంటి ప్రతిష్టాత్మక వెంచర్ సంస్థల్లో పనిచేశారు. ఏప్రిల్ 2025లో ప్రారంభమైన ఈ స్టార్టప్.. ఇళ్లు ఊడ్చడం, పాత్రలు కడగడం, వంటగది-బాత్రూమ్ క్లీనింగ్, లాండ్రీ వంటి సర్వీసుల కోసం కస్టమర్లను శిక్షణ పొందిన గృహ కార్మికులతో అనుసంధానిస్తుంది. ఇది ప్రారంభమైన ఏడాదిలోపే దీని వాల్యుయేషన్ 100 మిలియన్ డాలర్లకు చేరింది. అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన ‘కెమెరా వివాదం’ సంస్థ ప్రతిష్టను మసకబార్చేలా కనిపిస్తోంది.కెమెరాలు ఎందుకోసమంటే..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే ప్రోంటో కంపెనీ ఇళ్లలో కెమెరాలు పెట్టడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం. భవిష్యత్తులో మనుషులతో సంబంధం లేకుండా ఇళ్లలో స్వయంగా పనులు చేయగల హ్యూమనాయిడ్ రోబోట్లను తయారు చేయడానికి ఈ కెమెరా రికార్డింగులు అత్యంత కీలకం.అది పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే..కస్టమర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తడంతో ప్రోంటో సంస్థ అధికారికంగా స్పందించింది. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘కస్టమర్లు స్వచ్ఛందంగా అంగీకరించి ప్రత్యేకంగా అనుమతిస్తే తప్ప సిబ్బంది ఇళ్లకు కెమెరాలతో వెళ్లరు. ఈ అనుమతి ఒక్కసారికి మాత్రమే పరిమితం కాదు, ప్రతి బుకింగ్కు ముందు కస్టమర్ దీన్ని ధ్రువీకరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పైలట్ ప్రాజెక్ట్ కేవలం 0.1% మంది కస్టమర్ల వద్ద మాత్రమే నడుస్తోంది. దేశంలో అమలులో ఉన్న డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ (డీపీడీపీ) చట్ట నిబంధనలకు కట్టుబడే నెలల తరబడి కసరత్తు చేసి ఈ ప్రక్రియను రూపొందించాం’ అని సంస్థ తెలిపింది. ఏఐ, రోబోటిక్స్ రంగాన్ని మెరుగుపరచడమే దీని ముఖ్య ఉద్దేశమని, ఈ రంగంలో ఇలాంటి ప్రయోగాలు చేస్తున్న ఏకైక సంస్థ తమది మాత్రమే కాదని ప్రోంటో స్పష్టం చేసింది.ఇదీ చదవండి: స్థిరమైన రాబడి.. నమ్మకమైన పెట్టుబడి -
ఉగ్రదేశంలో ఊరట!
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల హెచ్చుతగ్గులు, ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల నడుమ పొరుగు దేశం పాకిస్థాన్ వినియోగదారులకు కొంత ఊరట లభించింది. పాక్లోని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. తాజా సవరణ ప్రకారం, పెట్రోల్ ధర లీటరుకు రూ.6, హై-స్పీడ్ డీజిల్ (హెచ్ఎస్డీ) ధర లీటరుకు రూ.6.80 మేర తగ్గాయి. ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు. పాక్ ప్రభుత్వం ఇంధన ధరలను తగ్గించడం ఇది వరుసగా రెండో వారం కావడం గమనార్హం. గత వారం కూడా అక్కడ పెట్రోల్, డీజిల్ ధరలను రూ.5 మేర తగ్గించారు.సవరించిన కొత్త ధరల పట్టికప్రభుత్వ తాజా నిర్ణయం తర్వాత పాకిస్థాన్లో లీటర్ ఇంధన ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.ఇంధనం రకంపాత ధర (లీటరుకు)తగ్గిన ధరప్రస్తుత ధర (లీటరుకు)పెట్రోల్రూ. 409.78రూ. 6.00రూ. 403.78హై-స్పీడ్ డీజిల్రూ. 409.58రూ. 6.80రూ. 402.78గమనిక: విలువ ఆధారంగా భారత రూపాయి, పాకిస్థాన్ రూపాయికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుందని గుర్తించాలి.(మే 25న 1 భారత రూపాయి=రూ.2.91 పాకిస్థాన్ రూపాయి)అంతకుముందు ఆకాశాన్నంటిన ధరలుఫిబ్రవరిలో ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా వివాదం ప్రారంభమైనప్పటి నుంచి పాకిస్థాన్ ఇంధన మార్కెట్ తీవ్ర అస్థిరతకు గురైంది. అప్పటి నుంచి పాక్ ప్రభుత్వం ప్రతి శుక్రవారం ధరలను సమీక్షిస్తోంది. గత కొన్ని నెలలుగా అక్కడ ధరలు ఏ స్థాయిలో పెరిగాయంటే..మార్చి 6: ఇరాన్ పరిణామాల నేపథ్యంలో తొలిసారిగా పెట్రోల్, డీజిల్ ధరలను ఏకంగా రూ.55 పెంచారు.ఏప్రిల్ 2: అంతర్జాతీయ ఒత్తిళ్ల కారణంగా పెట్రోల్ ధరల్లో 43 శాతం, డీజిల్ ధరల్లో 55 శాతం మేర భారీ వృద్ధిని ప్రకటించారు.ఈ వరుస పెంపుదల కారణంగా ఒకానొక దశలో ఇంధన ధరలు దాదాపు మూడు రెట్లు(గరిష్టంగా రూ.445 వరకు) పెరిగి ప్రజలపై తీవ్ర భారాన్ని మోపాయి.భారత్లో పరిస్థితి ఏంటి?అంతర్జాతీయంగా ముడి చమురు ధరల ప్రభావం భారతదేశంపై కూడా పడింది. అయితే, పాకిస్థాన్తో పోలిస్తే భారత్లో ఈ ధరల పెరుగుదల చాలా స్వల్పంగా, నియంత్రణలోనే ఉంది. ఇటీవలి కాలంలో నాలుగు విడతల సవరణల ద్వారా ఇంధన ధరలను మొత్తంగా సుమారు రూ.7 మేర పెంచారు. సోమవారం జరిగిన తాజా సవరణలో పెట్రోల్ ధరపై రూ.2.61, డీజిల్ ధరపై రూ.2.71 పెంచారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరల హెచ్చుతగ్గులను బట్టి రానున్న రోజుల్లో దేశీయ చమురు కంపెనీలు మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.ఇదీ చదవండి: స్థిరమైన రాబడి.. నమ్మకమైన పెట్టుబడి -
కియా కార్లపై ఆఫర్లు.. రూ.లక్షల్లో డిస్కౌంట్లు!
భారత ఆటోమొబైల్ రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన 'కియా ఇండియా' (Kia India) ఈ మే నెలలో సరికొత్త సేల్స్ ఆఫర్లతో కస్టమర్ల ముందుకు వచ్చింది. మారుతున్న మార్కెట్ పోటీని తట్టుకునేందుకు, స్టాక్ను క్లియర్ చేసేందుకు వీలుగా తన పూర్తి లైనప్లోని ఎంపిక చేసిన మోడళ్లపై కంపెనీ రూ. 2.70 లక్షల వరకు భారీ ప్రయోజనాలను, డిస్కౌంట్లను ప్రకటించింది.కొత్తగా ఎస్యూవీ (SUV) లేదా ఎంపీవీ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు ఈ నెల అద్భుతమైన అవకాశంగా నిలవనుంది. కంపెనీ అందిస్తున్న ఈ ప్రయోజనాలలో ఎక్స్ఛేంజ్ బోనస్లు, స్క్రాపేజ్ సపోర్ట్, లాయల్టీ రివార్డులు, కార్పొరేట్ డిస్కౌంట్లు ఉన్నాయి. మోడల్ వారీగా ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి..కియా కార్నివాల్ఈ నెలలో కియా లైనప్లో అత్యధిక డిస్కౌంట్ పొందుతున్న మోడల్ లగ్జరీ ఎంపీవీ 'కియా కార్నివాల్' (Kia Carnival). ఈ మోడల్పై రూ. 2 లక్షల వరకు భారీ ఎక్స్ఛేంజ్ సపోర్ట్ లభిస్తోంది. దీనికి అదనంగా స్క్రాపేజ్, కార్పొరేట్ బెనిఫిట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా గరిష్టంగా రూ. 2.70 లక్షల వరకు ఆఫర్ ఉంది. ప్రీమియం ఫ్యామిలీ కార్, విశాలమైన క్యాబిన్ కోరుకునే వారికి ఇది సరైన ఛాయిస్.కియా కారెన్స్ క్లావిస్ ఇటీవల మార్కెట్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న కారెన్స్ క్లావిస్ (Kia Carens Clavis) టర్బో-పెట్రోల్ వేరియంట్లపై రూ. 1.55 లక్షల వరకు ఆఫర్లు లభిస్తున్నాయి. టర్బో వేరియంట్లకు అదనంగా 5 సంవత్సరాల కాంప్లిమెంటరీ ఎక్స్టెండెడ్ వారంటీ ప్యాకేజీని కూడా కియా అందిస్తోంది. ఇదే మోడల్లోని డీజిల్, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ వెర్షన్లపై రూ. 85,000 వరకు మాత్రమే ప్రయోజనాలు లభిస్తాయి.కియా కారెన్స్ క్లావిస్ ఈవీ పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ MPV కొనుగోలు చేయాలనుకునే వారికి కారెన్స్ క్లావిస్ ఈవీ (Kia Carens Clavis EV)పై రూ. 2.15 లక్షల వరకు మొత్తం ప్రయోజనాలను అందిస్తోంది. ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్, కార్పొరేట్ స్కీమ్ల రూపంలో కస్టమర్లు ఈ ఆఫర్లను పొందవచ్చు.కియా సెల్టోస్ భారతదేశంలో కియా బ్రాండ్కు అత్యంత బలమైన సేల్స్ అందిస్తున్న మిడ్-సైజ్ ఎస్యూవీ'సెల్టోస్' (Kia Seltos)పై కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. గతేడాదికి చెందిన (Model Year 2025) ఇన్వెంటరీపై రూ. 95,000 వరకు గరిష్టంగా ఆఫర్లు ఉన్నాయి. సరికొత్త 2026 మోడళ్లపై డిస్కౌంట్ కొంత తక్కువగా (సుమారు రూ. 40,000 వరకు) ఉండే అవకాశం ఉంది. ఈ కారు హ్యుందాయ్ క్రెటా, టాటా సియెర్రా, మారుతి సుజుకి గ్రాండ్ విటారాలకు గట్టి పోటీనిస్తోంది.కియా సిరోస్సరికొత్తగా వచ్చిన సిరోస్ (Kia Syros) 2025 మోడల్ ఇన్వెంటరీపై రూ. 85,000 వరకు, అలాగే కొత్త 2026 మోడల్ యూనిట్లపై రూ. 50,000 వరకు తగ్గింపులను సొంతం చేసుకోవచ్చు.కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో దూసుకుపోతున్న సోనెట్ (Kia Sonet) మోడల్పై ఆఫర్లు కాస్త పరిమితంగా ఉన్నాయి. 2026 మోడల్ స్టాక్పై రూ. 35,000 వరకు, 2025 మోడల్ యూనిట్లపై రూ. 30,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి.స్టాండర్డ్ కియా కారెన్స్ రెగ్యులర్ కియా కారెన్స్ (Kia Carens) ఎంపీవీ మోడల్పై ఈ నెలలో రూ. 40,000 వరకు ఎక్స్ఛేంజ్, లాయల్టీ బోనస్లు అందుబాటులో ఉన్నాయి.అయితే ఈ డిస్కౌంట్లు, ఆఫర్లు అనేవి డీలర్షిప్ వద్ద ఉన్న స్టాక్ లభ్యత, నగరం (ప్రాంతం), కొనుగోలుదారు అర్హత ఆధారంగా మారుతుంటాయి. కాబట్టి ఖచ్చితమైన ఆన్-రోడ్ ధరలు, ఫైనల్ ఆఫర్ వివరాల కోసం కస్టమర్లు తమ సమీపంలోని అధీకృత కియా డీలర్షిప్ను సంప్రదించాల్సి ఉంటుంది. -
రూపాయి విలువ తగ్గింది కానీ.. బలహీనంగా లేదు!
గ్లోబల్ మార్కెట్లో డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ వరుసగా క్షీణిస్తున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి తరుగుదల తర్వాత రూపాయి విలువ వాస్తవానికి అది ఉండాల్సిన దానికంటే తక్కువ విలువకే (అండర్ వాల్యూ) ట్రేడ్ అవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కొన్ని విషయాలను పంచుకున్నారు.నామినల్, రీర్ పరంగా తగ్గిన రూపాయి!పశ్చిమాసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మానసికంగా అత్యంత కీలకమైన డాలర్కు 100 మార్కు వైపు రూపాయి పరుగెడుతున్న తరుణంలో గవర్నర్ మల్హోత్రా మాట్లాడుతూ.. ‘ఇటీవలి క్షీణతను గమనిస్తే రూపాయి విలువ అధికంగా లేదు(అండర్ వాల్యూ). నామమాత్రపు (నామినల్), రియల్ ఎఫెక్టివ్ ఎక్స్ఛేంజ్ రేట్ (రీర్) పరంగా చూస్తే రూపాయి ఇప్పుడు తక్కువ వాల్యూయేషన్లో ఉంది. అంతేగానీ బలహీనంగా లేదు’ అన్నారు.రీర్ అంటే..భారత వాణిజ్య భాగస్వామ్య దేశాల కరెన్సీల సమూహంతో (బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్) పోల్చి ద్రవ్యోల్బణాన్ని కూడా సర్దుబాటు చేసిన తర్వాత రూపాయి అసలు బలాన్ని లెక్కించేదే ఈ రీర్ (రియల్ ఎఫెక్టివ్ ఎక్స్ఛేంజ్ రేట్). దీని ప్రకారం ప్రస్తుతం రూపాయి బలహీనంగా లేదు, కేవలం తక్కువ విలువలో లభ్యమవుతోంది.ఆర్బీఐ లక్ష్యం స్థిరత్వమే!విదేశీ మారక ద్రవ్య మార్కెట్ (ఫారెక్స్ మార్కెట్)లో సెంట్రల్ బ్యాంక్ పాత్రపై గవర్నర్ మరోసారి స్పష్టత ఇచ్చారు. ఆర్బీఐ ఎప్పుడూ రూపాయికి ఒక నిర్దిష్ట స్థాయిని లేదా మార్పిడి రేటును లక్ష్యంగా పెట్టుకోదని ఆయన పునరుద్ఘాటించారు. మార్కెట్లో విపరీతమైన అస్థిరత (హై-వొలటాలిటీ)ను అరికట్టడానికి, ఊహాజనిత కదలికల వల్ల రూపాయి తీవ్రంగా నష్టపోకుండా కాపాడటానికి మాత్రమే ఆర్బీఐ జోక్యం చేసుకుంటుందని స్పష్టం చేశారు. రికార్డు కనిష్ట స్థాయిలకు రూపాయి పడిపోతున్న తరుణంలో దానిని స్థిరీకరించేందుకు ఆర్బీఐ డాలర్లను విక్రయిస్తూ మార్కెట్లో తన జోక్యాన్ని వేగవంతం చేసినట్లు గత వారమే రాయిటర్స్ సంస్థ కూడా నివేదించింది.బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్(బొప్)పై ధీమాపశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ భారతదేశ విదేశీ రంగానికి ఎలాంటి ఢోకా లేదని మల్హోత్రా భరోసా ఇచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థపై అనవసర ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. ‘ప్రభుత్వం, ఆర్బీఐ, ఇతర ఆర్థిక సంస్థలు అప్రమత్తంగా ఉండటం అవసరమే కానీ దేశ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ (బొప్-ఒక దేశం ప్రపంచంలోని ఇతర దేశాలతో జరిపే ఆర్థిక లావాదేవీలన్నింటినీ నమోదు చేసే వార్షిక లెక్కల చిట్టా) పరిస్థితి ఆందోళనకరంగా ఏమీ లేదు’ అన్నారు.ఇదీ చదవండి: స్థిరమైన రాబడి.. నమ్మకమైన పెట్టుబడి -
Income Tax: ఐటీఆర్ 4 సుగమ్ కూడా రెడీ
సుగమ్ దర్శనంలాగా సుగమ్ పోర్టల్లాగా సుగమ్ ఫారం. ఈ ఫారం నంబరు 4. సుగమ్ అనే పదానికి సులువు, సులభతరం అని అర్థంగా స్వీకరించాలి మనం. గత వారం సహజ్ గురించి తెలుసుకున్నాం. ఈ వారం సుగమ్ గురించి తెలుసుకుందాం.ఎవరు దాఖలు చేయొచ్చు 🔹 రెసిడెంటు వ్యక్తులు 🔹 హిందూ ఉమ్మడి కుటుంబాలు 🔹భాగస్వామ్య సంస్థలు ఏయే ఆదాయం ఉన్న వారు వేయాలి 🔹 జీతం లేదా పెన్షన్; రెండూ ఉన్న వాళ్లు 🔹 రెండు ఇళ్ల మీద ఆదాయ ఉన్న వారు 🔹 ఇతర ఆదాయాలు ఉన్న వారు. ఉదాహరణకు బ్యాంకు వడ్డీ, ఫ్యామిలీ పెన్షన్ 🔹 క్యాపిటల్ గెయిన్స్ – లాంగ్ – రూ. 1,25,000 దాటనివారు🔹 కొన్ని సెక్షన్ల ప్రకారం లెక్కలు రాసి, వేసి కచ్చితంగా ఇంత లాభం/నష్టం అని నిర్ధారించరు. బదులుగా ఒక నిర్దేశిత శాతం లేదా నిర్దేశిత ఆదాయం అని లెక్కిస్తారు. దీన్నే ఊహాజనిత ఆదాయం అంటారు. ఇది మూడు రకాలు.. (ఎ) టర్నోవరు రూ. 2 కోట్లు / నగదు వ్యవహారాలు 5 శాతం కన్నా తక్కువ ఉంటే రూ. 3 కోట్ల మీద, డిజిటల్ వసూళ్ల మీద 6 శాతం, మిశ్రమం అయితే 8 శాతం. వీళ్లు ఎటువంటి బుక్స్తో నిమిత్తం లేకుండా ఈ నిర్దేశిత శాతం మేరకు లాభాన్ని డిక్లేర్ చేసుకోవచ్చు. ఇది చిన్న వ్యాపారస్తుల కోసం ఉద్దేశించినది. (బి) నిర్దేశిత వృత్తి నిపుణులకు వారి వార్షిక టర్నోవరు రూ. 50,00,000 లోపల ఉంటే సగం, అంటే 50 శాతం లాభంగా డిక్లేర్ చేయొచ్చు. 95 శాతం వ్యవహారాలు డిజిటల్గా జరిగితే ఈ టర్నోవరు లిమిట్ రూ. 75,00,000 వరకు ఉంటుంది. (సి) వస్తువుల రవాణా చేసే వారికి, వారు నడిపే వాహనాల సంఖ్య 10 లోపల ఉంటేనే వర్తిస్తుంది. భారీ వాహనాల మీద టన్ను మోతకు రూ. 1,000 చొప్పున లెక్కిస్తారు. ఇతర వాహనాల మీద నెలకి రూ. 7,500.. టన్నుల మోతతో నిమిత్తం లేకుండా. పైన చెప్పిన మూడు రకాల/వర్గాల వారికి ఆయా ఆంక్షలకు లోబడి వర్తింపచేస్తే, అకౌంటుతో సంబంధం లేకుండా ఆదాయం డిక్లేర్ చేయొచ్చు. ఎవరు ఈ నాలుగో నంబర్ ఫారం వేయకూడదంటే.. 🔹 నాన్ రెసిడెంట్లు 🔹 లిమిటెడ్ భాగస్వామ్యాలు 🔹 కంపెనీ డైరెక్టరు 🔹 అన్లిస్టెడ్ ఈక్విటీ షేర్లలో ఇన్వెస్ట్మెంట్ ఆదాయం ఉన్న వారు 🔹 వ్యవసాయం మీద ఆదాయం రూ. 5,000 దాటని వారు 🔹 గత సంవత్సరం సర్దుబాటు నష్టాలను బదిలీ చేసే వారు 🔹 విదేశీ ఆదాయం/ఆస్తులు ఉన్నవారు ఇప్పుడు తెలిసింది కదా ఎవరు వేయొచ్చు.. ఎవరు వేయకూడదో.. ఇక రెడీ అవ్వండి వేయడానికి ఈ విధంగా. 🔹 మీరు పాత పద్ధతి/కొత్త పద్ధతి ఏదైనా ఎంచుకోవచ్చు 🔹 ఆన్లైన్లో పోర్టల్ ద్వారా వేయొచ్చు 🔹 ఆఫ్లైన్లో ఎక్సెల్, జెసన్ యుటిలిటీ ద్వారా వేయొచ్చు. టీడీఎస్ ఫారాలు, ఆదాయానికి, పన్నుకి సంబంధించిన డాక్యుమెంట్లు, సరి్టఫికెట్లు, కాగితాలు సవరించండి. 🔹 సమాచారం సమగ్రంగా, సరైనదిగా, సంపూర్ణంగా ఉండాలి సుమా. 🔹 కొత్త ఐటీఆర్ 4లో రెండు ఇళ్ల మీద ఆదాయం డిక్లేర్ చేయొచ్చు. అద్దె చేతికి రాకుంటే.. అంటే దాని బాకీలు/అద్దెల వివరాలు చెప్పవచ్చు. 🔹 విదేశీ ఆస్తులు/ఆదాయం సమాచారం ఇవ్వనవసరం లేదు. 🔹పాన్తో పాటు ఆధార్ కార్డు సమన్వయం కావాలి 🔹 టర్నోవరు ఆదాయాల్లో విషయాలు అన్నీ కాగితాల లెక్కలు, రిటర్నులు కావాలి. అక్కడ ఎటువంటి పొరపాటు చేయొద్దు. చివరిగా ఈ ఫారం కూడా ఎంతో స్నేహపూర్వకంగా ఉంటుంది. అందుకే ‘సుగమ్’ అన్నారు. -
టిక్కెట్ల రద్దు ఛార్జీల దోపిడీపై కేంద్రం సీరియస్
ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్లు(ఓటీఏ) వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న భారీ రద్దు చార్జీల (క్యాన్సిలేషన్ ఛార్జీలు) వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర చేసింది. విమానయాన సంస్థలు నిర్ణయించిన రుసుముల కంటే అదనంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్లు వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న టిక్కెట్ రద్దు ఛార్జీలపై సమగ్ర విచారణ జరపాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆదేశించారు. ఈ మేరకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖతో పాటు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) తక్షణమే రంగంలోకి దిగి అన్ని ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్ల విధానాలపై దర్యాప్తు చేపట్టాలని స్పష్టం చేశారు.పారదర్శకతకు పాతర.. చట్టప్రకారం చర్యలు!ఈ అంశంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ఆన్లైన్ బుకింగ్ సంస్థల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘విమానయాన సంస్థలు అధికారికంగా వసూలు చేసే ఛార్జీల కంటే ఎక్కువగా లేదా బుకింగ్ సమయంలో వినియోగదారులకు స్పష్టంగా వెల్లడించకుండా ఆన్లైన్ ప్లాట్ఫామ్లు ఇష్టారాజ్యంగా అదనపు రద్దు ఛార్జీలు వసూలు చేస్తున్నాయనే అంశంపై విచారణకు ఆదేశించాం. ఇటువంటి చర్యలు మార్కెట్లో పారదర్శకతను దెబ్బతీయడమే కాకుండా వినియోగదారుల నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తున్నాయి’ అని ప్రహ్లాద్ జోషి అన్నారు.ఒకవేళ విచారణలో ఈ ప్లాట్ఫామ్లు వినియోగదారుల హక్కులను ఉల్లంఘించినట్లు లేదా అక్రమ వ్యాపార పద్ధతులకు పాల్పడినట్లు తేలితే.. ‘వినియోగదారుల రక్షణ చట్టం-2019’ ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. అవసరమైతే బాధితుల తరఫున సీసీపీఏ ద్వారా ‘క్లాస్ యాక్షన్’ (ఉమ్మడి చట్టపరమైన చర్యలు) తీసుకునేందుకు కూడా వెనకాడబోమని స్పష్టం చేశారు.అసలు వివాదం ఎక్కడ మొదలైంది?భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) జాతీయ కార్యదర్శి తేజీందర్ బగ్గా చేసిన సోషల్ మీడియా పోస్ట్తో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నేరుగా ఎయిర్లైన్ సంస్థ ద్వారా బుక్ చేసుకునే టికెట్ రద్దు ఛార్జీలకు, థర్డ్-పార్టీ ఆన్లైన్ ట్రావెల్ యాప్ల ద్వారా బుక్ చేసుకునే ఛార్జీలకు మధ్య వ్యత్యాసం ఉంటోందని ఆయన ఆధారాలతో సహా పోస్ట్ చేశారు.విచారణ పరిధిలోకి అన్ని ప్లాట్ఫామ్లుకేవలం ఒక్క సంస్థపైనే కాకుండా దేశంలో సేవలందిస్తున్న అన్ని ప్రముఖ ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్ల (ఉదాహరణకు మేక్మైట్రిప్, ఈజ్మైట్రిప్, క్లియర్ట్రిప్, యాత్ర, అగోడా మొదలైనవి) రద్దు విధానాలు, వారు విధిస్తున్న హిడెన్ ఛార్జీలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరగనుందని మంత్రి జోషి పేర్కొన్నారు.ఇదీ చదవండి: స్థిరమైన రాబడి.. నమ్మకమైన పెట్టుబడి -
ఇంధన ధరల్లో వ్యత్యాసాలు
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న విలువ ఆధారిత పన్ను (వ్యాట్), అదనపు పన్నుల కారణంగా లీటర్ ఇంధనానికి వివిధ రాష్ట్రాల్లో వినియోగదారులు చెల్లిస్తున్న ధరల్లో భారీ తేడాలు కనిపిస్తున్నాయి. దేశంలోని 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఇంధన ధరలను విశ్లేషించగా.. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ధర అత్యధికంగా ఉండగా గుజరాత్లో అత్యల్పంగా నమోదైంది. అంతర్జాతీయంగా ముడిచమురు సంక్షోభాలు వెంటాడుతున్నప్పటికీ, ప్రపంచంలోనే భారత్లో ఇంధన ధరల పెంపు తక్కువగా ఉందని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి.రూ.115 దాటిన మూడు రాష్ట్రాలుఇటీవలి ధరల సవరణ తర్వాత దేశంలోని మూడు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.115 మార్కును దాటిపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాలు ఈ జాబితాలో ముందున్నాయి.ఆంధ్రప్రదేశ్ (రూ.117/లీటర్): దేశంలోనే ఇక్కడ ఇంధన ధరలు అత్యధికం. ఏపీ ప్రభుత్వం 31 శాతం వ్యాట్తో పాటు లీటరుకు రూ.4 చొప్పున అదనపు పన్ను, రోడ్ డెవలప్మెంట్ సెస్ విధిస్తోంది. దీనివల్ల ఇక్కడ ఎఫెక్టివ్ పన్ను రేటు దాదాపు 35 శాతానికి చేరుతోంది.తెలంగాణ (రూ.116కు చేరువుగా): తెలంగాణలో కూడా భారీగా వ్యాట్ వసూలు చేస్తుండటంతో లీటర్ పెట్రోల్ ధర రూ.116కు చేరువైంది. కేరళలో బేస్ వ్యాట్తో పాటు సామాజిక భద్రతా సెస్ (సోషల్ సెక్యూరిటీ సెస్) అదనంగా విధిస్తుండటంతో ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. మరోవైపు గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హరియాణా, గోవా, అస్సాం వంటి ఆరు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.104 లేదా అంతకంటే తక్కువగా ఉంది. ఈ ఆరు రాష్ట్రాలూ బీజేపీ పాలిత ప్రాంతాలు కావడం గమనార్హం.తాజాగా రేట్లు (ఈరోజు పెరిగిన పెట్రోల్పై రూ.2.61, డీజిల్ రూ.2.71పై కలిపి) ఢిల్లీ: పెట్రోల్ రూ.102.11, డీజిల్ రూ.95.12 ముంబై: పెట్రోల్ రూ.110.88, డీజిల్ రూ.97.48 హైదరాబాద్: పెట్రోల్ రూ.115.84, డీజిల్ రూ.103.76 కోల్కతా: పెట్రోల్ రూ.112.79, డీజిల్ రూ.99.47 చెన్నై: పెట్రోల్ రూ.108.14, డీజిల్ రూ.99.84 బెంగళూరు: పెట్రోల్ రూ.110.30, డీజిల్ రూ.98.44 పాట్నా: పెట్రోల్ రూ.112.88, డీజిల్ రూ.99.23 జైపూర్: పెట్రోల్ రూ.112.37, డీజిల్ రూ.97.94 తిరువనంతపురం: పెట్రోల్ రూ.114.72, డీజిల్ రూ.103.71 చండీగఢ్: పెట్రోల్ రూ.101.64, డీజిల్ రూ.89.90 విజయవాడ (ఏపీ): పెట్రోల్ రూ.117.96, డీజిల్ రూ.105.79 విశాఖపట్నం (ఏపీ): పెట్రోల్ రూ.116.44, డీజిల్ రూ.103.94 తిరుపతి(ఏపీలో): పెట్రోల్ రూ. 117.08పై, డీజిల్ రూ. 104.75 గమనిక: ధరల్లో ప్రాంతానుసారం స్వల్ప మార్పులు ఉండొచ్చు -
తగ్గుతున్న బంగారం ధరల్లో మార్పు.. తులం ఎంతంటే..
దేశంలో బంగారం ధరలు మారిపోయాయి. గత మూడు రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు నేడు (Today Gold Rate) మళ్లీ పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో ఈరోజు కొనుగోలుదారులకు కాస్త నిరాశ తప్పడం లేదు.ఇక వెండి ధరలు (Today Silver Rate) మాత్రం ఈరోజు ఎటువంటి మార్పు లేకుండా నిలకడగా కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
తక్కువ ప్రీమియంలతో కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్
ఆరోగ్య బీమా సంస్థ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ తాజాగా వేల్యూ ప్లస్ పేరిట అందుబాటు ప్రీమియంలతో ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. మెట్రోయేతర మార్కెట్లు, అలాగే టియర్ 2, 3, 4 మార్కెట్లలో దాదాపు 20 శాతం తక్కువ ప్రీమియంలతో ఇది లభిస్తుంది. ఇండివిడ్యువల్, ఫ్యామిలీ ఫ్లోటర్లకు సంబంధించి రూ. 7.5 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు కవరేజీ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని సంస్థ ఎండీ ఆనంద్ రాయ్ తెలిపారు. వరుసగా 5 ఏళ్ల పాటు ఇన్–పేషంట్ క్లెయిమ్లేమీ లేకపోతే మొదటి ఏడాది కట్టిన బేస్ ప్రీమియంను వాపసు పొందవచ్చు. అత్యధిక సమ్ ఇన్సూర్డ్ ఆప్షన్లు, మెరుగైన హెల్త్కేర్ ప్రయోజనాల మేళవింపుతో కస్టమర్లకు ఆరోగ్య బీమాను మరింతగా అందుబాటులోకి తేవడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు సంస్థ తెలంగాణ బిజినెస్ హెడ్ కె.బీ.బీ శ్రీనివాస్ తెలిపారు.స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ తన 20 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానానికి గుర్తుగా ఈ ‘వేల్యూ ప్లస్’ ప్లాన్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. యువతను, చిన్న పట్టణాల ప్రజలను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు ఈ పాలసీలో పలు ప్రత్యేక ఫీచర్లను చేర్చారు. ఇందులో పాలసీ తీసుకున్న నాటి వయస్సు ఆధారంగానే ప్రీమియంను లాక్ చేసే 'ఫ్రీజ్ యువర్ ఏజ్' సదుపాయం ఉంది. దీనివల్ల మొదటి క్లెయిమ్ చేసే వరకు లేదా 55 ఏళ్లు వచ్చే వరకు ప్రీమియం ధరలు పెరగవు. దేశవ్యాప్తంగా 11,000కు పైగా నెట్వర్క్ ఆసుపత్రులలో నగదు రహిత (క్యాష్లెస్) చికిత్స పొందే వీలుంది. -
800 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:35 సమయానికి నిఫ్టీ(Nifty) 242 పాయింట్లు పెరిగి 23,961 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 813 పాయింట్లు లాభపడి 76,214 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.03బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 97.8 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.55 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.37 శాతం పెరిగింది.నాస్డాక్ 0.19 శాతం పుంజుకుంది.Today Nifty position 25-05-2026(time: 09:35 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్థిరమైన రాబడి.. నమ్మకమైన పెట్టుబడి
ఆర్థిక అనిశ్చితులు, మార్కెట్ హెచ్చుతగ్గుల మధ్య సామాన్యుడి నుంచి సీనియర్ సిటిజన్ వరకు ప్రతి ఒక్కరూ కోరుకునేది ఒక్కటే..పెట్టిన పెట్టుబడికి భద్రత, చేతికి అందే లాభంలో స్థిరత్వం. ఈ రెండింటికీ భారతీయ తపాలా శాఖ చిరునామాగా నిలుస్తోంది. రూపాయి పోగొట్టుకునే ప్రమాదం లేకుండా ప్రభుత్వ గ్యారెంటీతో మార్కెట్ కంటే మెరుగైన వడ్డీని అందించే పోస్టాఫీస్ టాప్-3 హై-రిటర్న్ స్కీముల పూర్తి సమాచారం మీకోసం...సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్)పెట్టుబడిదారుల సొమ్ముపై పోస్టాఫీసులో ప్రస్తుతం అత్యధిక వడ్డీని అందిస్తున్న పథకాల్లో ఇది మొదటి స్థానంలో నిలుస్తుంది. అరవై ఏళ్లు దాటిన వృద్ధులకు రిటైర్మెంట్ తర్వాత క్రమబద్ధమైన ఆదాయాన్ని, వారి జీవితకాల పొదుపుకు పూర్తి భద్రతను కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది.ప్రస్తుత వడ్డీ రేటు: 8.2% (ఇది ప్రతి త్రైమాసికానికి ఒకసారి ఖాతాదారునికి చెల్లిస్తారు. దీన్ని నిబంధనల ప్రకారం సవరించే అవకాశం ఉంటుంది).పెట్టుబడి పరిమితి: కనీసం రూ.1,000 నుంచి గరిష్టంగా రూ.30 లక్షల వరకు పెట్టుబడి(ఒకేసారి పెట్టాల్సి ఉంటుంది) పెట్టవచ్చు. కాలపరిమితి 5 ఏళ్లు (మరో 3 ఏళ్లు పొడిగించుకోవచ్చు).ఉదాహరణ..ఒకవేళ మీరు ఈ స్కీమ్లో రూ.10 లక్షలు ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే ప్రస్తుత 8.2% వడ్డీ రేటు ప్రకారం మీకు ప్రతి మూడు నెలలకు ఒకసారి రూ.20,500 వడ్డీ రూపంలో లభిస్తుంది. అంటే ఐదేళ్ల కాలపరిమితి ముగిసేసరికి మీరు కేవలం వడ్డీ రూపంలోనే రూ.4,10,000 పొందుతారు. గడువు ముగిశాక మీ రూ.10 లక్షల అసలు మీకు సురక్షితంగా తిరిగి వస్తుంది.సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై)మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆమె భవిష్యత్తు అవసరాల (ఉన్నత చదువులు, వివాహం) కోసం భారీ నిధిని సమకూర్చడానికి ఇది ఓ ఉత్తమమైన స్కీమ్. ‘బేటీ బచావో బేటీ పఢావో’ ప్రచారంలో భాగంగా ఆడపిల్లల ఆర్థిక స్వాలంబన కోసం తీసుకొచ్చిన ప్రత్యేక దీర్ఘకాలిక పొదుపు పథకం ఇది. 10 ఏళ్లలోపు వయసున్న ఆడపిల్లల పేరు మీద తల్లిదండ్రులు ఈ ఖాతా తెరవవచ్చు.ప్రస్తుత వడ్డీ రేటు: 8.2% (వార్షికంగా చక్రవడ్డీ లెక్కిస్తారు).పెట్టుబడి పరిమితి: ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. 15 ఏళ్ల పాటు డబ్బులు చెల్లించాలి. పాపకు 21 ఏళ్లు వచ్చేసరికి స్కీమ్ మెచ్యూర్ అవుతుంది.ఉదాహరణ..ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు గరిష్ట పరిమితి అయిన రూ.1.5 లక్షలు (నెలకు దాదాపు రూ.12,500) చొప్పున 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం ఆమెకు 21 ఏళ్లు వచ్చేసరికి ఏకంగా సుమారు రూ.70 లక్షల వరకు భారీ మెచ్యూరిటీ మొత్తం లభిస్తుంది. ఇందులో విశేషం ఏమిటంటే ఈ మెచ్యూరిటీ మొత్తంపై ఎలాంటి పన్ను ఉండదు.కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ)రూపాయి రిస్క్ లేకుండా తమ పెట్టుబడి రెట్టింపు కావాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. దీర్ఘకాలంలో స్థిరమైన రాబడితో పాటు పెట్టుబడి మొత్తాన్ని రెట్టింపు చేయడమే ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం. ఇందులో దేశంలోని ఏ వయోజనుడైనా ఒంటరిగా లేదా ఉమ్మడిగా(జాయింట్ అకౌంట్) పెట్టుబడి పెట్టవచ్చు.ప్రస్తుత వడ్డీ రేటు: 7.5% (చక్రవడ్డీ ఆధారంగా).పెట్టుబడి పరిమితి: కనీసం రూ.1,000 నుంచి ప్రారంభించవచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ప్రస్తుత నిబంధనల ప్రకారం 115 నెలల్లో (9 ఏళ్ల 7 నెలలు) మీ డబ్బు రెట్టింపు అవుతుంది.ఉదాహరణ..మీరు కిసాన్ వికాస్ పత్రలో రూ.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఎటువంటి మార్కెట్ రిస్క్ లేకుండా సరిగ్గా 115 నెలల తర్వాత మీ చేతికి రూ.10 లక్షలు అందుతాయి.పై స్కీముల్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి?పోస్టాఫీస్ స్కీముల్లో ఇన్వెస్ట్ చేయడం చాలా సులభం. మీ సమీపంలో ఉన్న ఏ పోస్టాఫీసునైనా సందర్శించి ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. మొదట మీకు కావలసిన స్కీమ్కు సంబంధించిన దరఖాస్తు ఫారమ్ను పోస్టాఫీసులో తీసుకోవాలి (లేదా ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు). ఫారమ్ను పూర్తిగా భర్తీ చేసి దానికి అవసరమైన ధ్రువపత్రాలను జత చేయాలి. ప్రారంభ పెట్టుబడి మొత్తాన్ని నగదు రూపంలో లేదా చెక్కు రూపంలో చెల్లించి ఖాతాను ప్రారంభించవచ్చు. ఇప్పటికే పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా, నెట్ బ్యాంకింగ్ ఉన్నవారు ఆన్లైన్ ద్వారా కూడా కొన్ని స్కీముల్లో నేరుగా ఇన్వెస్ట్ చేయవచ్చు.కావాల్సిన ముఖ్యమైన ధ్రువపత్రాలుపోస్టాఫీసులో ఖాతా తెరవడానికి కింది ప్రాథమిక పత్రాలు తప్పనిసరి.గుర్తింపు కార్డు: ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ లేదా పాస్పోర్ట్.చిరునామా రుజువు: ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ లేదా విద్యుత్ బిల్లు.ఇటీవలి కాలంలో తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు.ఎస్సీఎస్ఎస్ స్కీమ్ కోసం వయసు నిర్ధారించే సర్టిఫికేట్ లేదా రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందినట్లు ఆధారాలు.ఎస్ఎస్వై కోసం ఆడపిల్ల పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, తల్లిదండ్రుల కేవైసీ పత్రాలు.షేర్ మార్కెట్ హెచ్చుతగ్గులతో భయపడేవారికి, రిటైర్డ్ ఉద్యోగులకు, పిల్లల భవిష్యత్తు కోసం పక్కా ప్లాన్తో పొదుపు చేయాలనుకునే వారికి పోస్టాఫీస్ స్కీములు ఒక సురక్షితమైన ఆర్థిక రక్షణ కవచం. ఇందులో లభించే సెక్షన్ 80సీ పన్ను మినహాయింపులు అదనపు ప్రయోజనం. మీ ఆర్థిక లక్ష్యాలకు సరిపోయే స్కీమ్ను ఎంచుకుని, ఆర్థిక నిపుణుల సలహాతో ఇప్పుడే పెట్టుబడిని ప్రారంభించండి.ఇదీ చదవండి: ఆ ఒక్క ప్రశ్నతో సీనియర్ ఉద్యోగిపై వేటు! -
పశ్చిమాసియా పరిస్థితులే దిక్సూచి
ప్రధానంగా పశ్చిమాసియా పరిస్థితులు ఇకపై దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ను నిర్దేశించనున్నాయి. వీటికితోడు ముడి చమురు ధరలు, విదేశీ ఇన్వెస్టర్ల తీరు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలకు సైతం ప్రాధాన్యత ఉన్నట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వివరాలు చూద్దాం.. గత ఆర్థిక సంవత్సరం(2025–26)తోపాటు నాలుగో త్రైమాసిక(జనవరి–మార్చి) ఫలితాల సీజన్ దాదాపు ముగింపునకు రావడంతో దేశీ స్టాక్ మార్కెట్లను ఇకపై పశ్చిమాసియా పరిస్థితులు నిర్దేశించనున్నాయి. యూఎస్, ఇరాన్ మధ్య రోజుకోతీరుగా మారుతున్న యుద్ధ వాతావరణం లేదా చర్చలపై అవకాశాలు దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు స్టాక్ నిపుణులు పేర్కొంటున్నారు. వారాంతన యూఎస్ అత్యున్నత అధికారి మార్కో రూబియో రెండు దేశాల మధ్య చర్చులు పురోగతి సాధిస్తున్నట్లు వెల్లడించారు. కాగా.. మరోపక్క ఇటీవలే ముగిసిన యూ ఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ చైనా పర్యటన ప్రకటనలవరకే ఫలవంతమైనట్లు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఇవికాకుండా కొన్నేళ్లుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ పరిస్థితులు కొనసాగుతునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, భౌగోళిక పరిస్థితులు గ్లోబల్ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. 4 రోజులే ట్రేడింగ్ బక్రీద్ సందర్భంగా గురువారం దేశీ స్టాక్ మార్కెట్లకు సెలవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. కాగా.. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఇటీవల ముడిచమురు ధరలు మండుతున్నాయి. దీంతో ఎయిర్లైన్స్సహా పలు రంగాల ముడివ్యయాలు పెరుగుతున్నాయి. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ధరలకు రెక్కలొస్తున్నాయి. దీంతో ఆర్బీఐతోపాటు.. ఫెడరల్ రిజర్వ్(యూఎస్) తదితర పలుదేశాల కేంద్ర బ్యాంకుల పరపతి విధానాలు కఠినతరమయ్యే వీలున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఇది రుణాలకు డిమాండును తగ్గించడంతోపాటు.. కార్పొరేట్ల రుణ వ్యయాలు పెరిగేందుకు కారణంకానున్నట్లు అంచనా వేశారు. దీంతో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు యథాప్రకారం ఆటుపోట్లను చవిచూసే అవకాశమున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. రూపాయి ఎఫెక్ట్ భారత్ దిగుమతుల బిల్లును ప్రధానంగా చమురు, పసిడి ధరలు పెంచే సంగతి తెలిసిందే. ఇది వాణిజ్య లోటు పెరిగేందుకు దారి చూపుతోంది. దీనికితోడు ఇటీవల కొద్ది నెలలుగా దేశీ స్టాక్స్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) భారీ అమ్మకాలకు పాల్పడుతున్నారు. ఈ ప్రతికూల అంశాలన్నీ కొద్ది రోజులుగా దేశీ కరెన్సీని దెబ్బతీస్తు న్నాయి. దీంతో డాలరుతో మారకంలో రూపా యి ఏకంగా 96 స్థాయికి పడిపోయింది. ఆర్బీఐ చర్యల కారణంగా వారాంతాన కొంతమేర బలపడినప్పటికీ 94–95 స్థాయిలో కదులుతోంది. కాగా.. వా రాంతాన ఆర్బీఐ కొత్త రికార్డ్ నెలకొల్పుతూ ప్రభుత్వానికి రూ. 2.87 లక్షల కోట్ల డివిడెండ్ ప్రకటించడం సానుకూల అంశమని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ఇన్వెస్టర్ల ఫోకస్ యూఎస్, ఇరాన్ మధ్య చర్చలు, ముడిచమురు ధరలు, డాలరుతో రూపాయి మారకం విలువ, విదేశీ ఇన్వెస్టర్ల తీరు వంటి అంశాలపై ప్రధానంగా ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా, ఎన్రిచ్ మనీ సీఈవో పొన్మూడి ఆర్. పేర్కొన్నారు. ఆర్బీఐ భారీ డివిడెండ్ ప్రభుత్వ వ్యయాలకు దన్నునివ్వవచ్చని, లిక్విడిటీని పెంచే వీలున్నదని మిశ్రా అభిప్రాయపడ్డారు. చమురు ధరలు బలహీనపడటం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) ఏప్రిల్–జూన్(క్యూ1) ఫలితాలపై అంచనాలు, మరింత నిర్మాణాత్మక మార్కెట్లు తదితర అంశాలకు ప్రాధాన్యత ఉన్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు.గతవారం అక్కడక్కడే గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు భారీ ఆటుపోట్ల మధ్య స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 177 పాయింట్లు(0.23 శాతం) బలపడి 75,415 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 76 పాయింట్లు(0.32 శాతం) పుంజుకుని 23,719 వద్ద స్థిరపడింది. ఇక బీఎస్ఈ మిడ్ క్యాప్ 1 శాతం లాభపడగా.. స్మాల్ క్యాప్స్ ఫ్లాట్గా ముగిసింది. సాంకేతికంగా చూస్తే.. సుమారు రెండు వారాలుగా దేశీ స్టాక్మార్కెట్లు పరిమిత శ్రేణిలోనే కదులుతున్నాయి. తీవ్ర ఆటుపోట్లకు లోనవుతున్నప్పటికీ గత వారం సైతం పరిమితుల మధ్యే కదిలాయి. వెరసి సమీప భవిష్యత్లో మార్కెట్ల కదలికలపై స్పష్టమైన సంకేతాలు అందడంలేదని సాంకేతిక నిపుణులు చెబుతునన్నారు. ఫలితంగా ప్రధాన ఇండెక్సులు అటు ఎగువముఖంగా లేదా ఇటు దిగువ ముఖంగా బ్రేక్ సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. నిఫ్టీ 23,860–23,250 పాయింట్ల మధ్యే కదులుతోంది. 24,000 పాయింట్ల సమీపంలో రెసిస్టెన్స్ ఎదురవుతోంది. దీనిని అధిగమిస్తే 24,300వరకూ బలపడవచ్చు. 23,250 దిగువకు బలహీనపడితే.. 22,750– 22,350 పాయింట్ల వద్ద సపోర్ట్ లభించే వీలుంది. సెన్సెక్స్ 76,000–74,000 పాయింట్ల మధ్య కదులుతోంది. ఈ శ్రేణిని ఛేదించవలసి ఉంది. ఎగువన 77,000 పాయింట్ల వద్ద రెసిస్టెన్స్, దిగువన 73,000 వద్ద సపోర్ట్ కనిపించవచ్చు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
యాప్ల దా‘రుణాలు’... ట్రాప్లో పడితే అంతే!
రమేష్ నెలవేతనం రూ.12,000. కానీ, తను కట్టాల్సిన ఈఎంఐ రూ.46,700. మరి ఎలా చెల్లిస్తాడు? ఇదేమైనా సాధ్యమయ్యే పనేనా? వాస్తవానికి రమేష్ ఏ నూటికో వెయ్యికో ఒక్క కేసు కాదు. తక్కువ, మధ్యాదాయ వర్గాల్లో ఇపుడు ఎక్కువ మంది ఇంచుమించు ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు. డిజిటలైజేషన్ వల్ల ఎన్నో లాభాలున్నట్లే నష్టాలూ ఉన్నాయి. వాటి ప్రతిఫలమే ఈ రుణాల ఊబి. ఎందుకంటే ఒకప్పుడు రుణాలు కావాలంటే సవాలక్ష డాక్యుమెంట్లు పట్టుకుని బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగితే తప్ప వచ్చేది కాదు. ఇప్పుడైతే రుణ దాతలే ‘లోన్ కావాలా?’ అని ఫోన్లు చేసి అడగటమే కాక... మెయిల్స్, మెసేజీలతో హోరెత్తిస్తున్నారు. ఏదో ఒక బలహీన క్షణంలో అవసరాల్ని బేరీజు వేసుకోకుండా ఓకే బటన్ నొక్కేస్తే చాలు. నిమిషాల్లోనే కోరుకున్నంత రుణం బ్యాంక్ ఖాతాలలో వచ్చిపడుతోంది. తీర్చే స్థోమత ఉందా? లేదా అన్న పట్టింపు కూడా ఈ డిజిటల్ రుణదాతలకు అవసరం లేదు. పాన్, ఆధార్ ఇస్తే చాలు. నిమిషాల్లో రుణ దరఖాస్తును డిజిటల్గా ప్రాసెస్ చేసి, రుణం మంజూరు చేసేస్తున్నాయి. దీంతో ఒకే వ్యక్తి పలు యాప్ల నుంచి రుణం తీసుకోవటం సాధ్యమవుతోంది. తీరా కట్సాల్సి వచ్చినప్పుడే అసలు నొప్పి తెలుస్తోంది. ఆర్బీఐ ఇప్పటికే కఠిన నియంత్రణలు తెచ్చినా... ఈ రుణ యాప్స్ విపరీత మార్కెటింగ్కు తెరపడడం లేదు. ఇచ్చే వాడు ఏదో మార్గంలో ముక్కు పిండి వసూలు చేసుకుంటాడు. కాకపోతే తీసుకునే వారే విచక్షణతో నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నెన్నో ఉదంతాలు.. → ఓ కాంట్రాక్టు కార్మికుడు 13 మంది సభ్యుల కుటుంబానికి ఏకైక ఆధారం. వైద్య అత్యవసర పరిస్థితుల్లో మార్గం తోచక.. ఆరు డిజిటల్ లోన్ యాప్స్ నుంచి అందినంత రుణం పుచ్చుకున్నాడు. ఇప్పుడు ఆదాయానికి నాలుగు రెట్లు అధికంగా ఈఎంఐ కట్టలేక లబోదిబోమంటున్నాడు. → మానవ వనరుల విభాగంలో పనిచేసే ఒక ఎగ్జిక్యూటివ్ నెలసరి వేతనం రూ.25,000. 14 యాప్స్ నుంచి తీసుకున్న రుణాలు రూ.20 లక్షలు దాటేశాయి. → ఒక డ్రైవర్ నెలవారీ రూ.40,000 సంపాదిస్తున్నాడు. కానీ, అతడు తీర్చాల్సిన అప్పడు రూ.17 లక్షలు. ఐదు సంస్థల నుంచి ఈ రుణం తీసుకున్నాడు. → ఒక డెలివరీ ఎగ్జిక్యూటివ్ అయితే ఒకదాని తర్వాత ఒకటి చొప్పున 20 సంస్థల నుంచి ఏకంగా రూ.37 లక్షల రుణాలు వాడేసుకున్నాడు. బ్యాంక్లు, ఫైనాన్స్ సంస్థలు, డిజిటల్ లోన్ యాప్స్ ఇలా ఏ ఆఫర్నూ అతడు వదల్లేదు. → ఒక కంపెనీకి మేనేజర్ స్థానంలో ఉన్న వ్యక్తి కూడా సంఘటిత, అసంఘటిత సంస్థల నుంచి రూ.1.14 కోట్ల రుణ సాయాన్ని తీసుకున్నాడు. → నేడు ఈ తరహా రుణమిచ్చే, పుచ్చుకునే సంస్కృతి బలంగా విస్తరిస్తుండడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. తెలియకుండానే ట్రాప్లోకి.. → అత్యవసర వైద్యం, స్కూల్ ఫీజు చెల్లించాల్సిన గడువు సమీపించడం, ఇంటి అద్దె, క్రెడిట్ కార్డు బకాయి గడువు మించిపోతుండడం, చివరికి స్టాక్ మార్కెట్లో నష్టాల నుంచి బయటపడేందుకు సైతం యాప్స్ నుంచి రుణాలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. → సంప్రదాయ బ్యాంక్లు, టాప్ టైర్ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) రుణ దరఖాస్తులను ఆసాంతం విశ్లేషించిన తర్వాతే రుణ మంజూరును నిర్ణయిస్తుంటాయి. → కానీ, నడమంత్రపు సిరిని కోరుకుంటున్న లోన్ యాప్స్ మాత్రం సంప్రదాయ రక్షణ విధానాలను బైపాస్ చేస్తూ చిటికెలో రుణాలకు ఒకే చెబుతున్నాయి. తద్వారా మార్కెట్ విస్తరణే వాటి వ్యాపార మంత్రంగా మారిపోయింది. → పాన్ నంబర్తో ఎలాంటి తనఖా అవసరం లేకుండానే ఐదు నిమిషాల్లోపే రుణ మొత్తాన్ని మంజూరు చేస్తున్నాయి. → దీంతో అవసరంలో ఉన్న వారు, మరో మార్గం లేదన్నట్టు మొబైల్ ఫోన్ యాప్స్ ద్వారా శక్తికి మించి రుణాలను తీసుకుంటున్నారు. → తొలుత రూ.1,000 లేదా రూ.5,000తో మొదలైనా.. చివరికి రూ.లక్షలకు ఇది విస్తరిస్తోంది. చార్జీలతో బాదుడే బాదుడు → ఈ తరహా రుణాలకు అలవాటు పడ్డవారు ఇక ఆ సుడిగుండం నుంచి బయటపడడం కష్టమే. ఎందుకంటే ఇవి వసూలు చేసే చార్జీలు ఆ స్థాయిలో ఉంటున్నాయి. → ప్రాసెసింగ్ ఫీజు, ప్లాట్ఫారమ్ చార్జీలు, కన్వీనియన్స్ ఫీజు, జీఎస్టీ, స్టాంప్ డ్యూటీ ఇలా రకరకాల చార్జీలు లోన్ యాప్స్కు ఆదాయాన్ని తెచ్చి పెడుతుంటాయి. → సాధారణంగా ఈ రుణాలను 30 రోజుల్లోపే తీర్చేయాల్సి ఉంటుంది. లేదంటే రుణగ్రహీత కోలుకులేనంతగా మరిన్ని చార్జీల బాదుడు మొదలవుతుంది. ఈ బాదుడు నుంచి బయటపడేందుకు రుణదాతలు మరో యాప్ తలుపు తట్టి అప్పటికి గట్టెక్కేసే మార్గం వెతుక్కుంటున్నారు. అడ్డదారులు.. అడ్డగోలు విధానాలు → ఆర్బీఐ పర్యవేక్షణలోని బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలే రుణాలను మంజూరు చేయాల్సి ఉంటుంది. కనీసం పేమెంట్బ్యాంక్లు సైతం రుణాలివ్వడానికి లేదు. → కానీ, ఈ నిబంధనలను ఫిన్టెక్ కంపెనీలు బైపాస్ చేస్తున్నాయి. తాము నేరుగా రుణాలివ్వకుండా మధ్యవర్తిత్వంతో రుణగ్రహీతలపై దండెత్తుతున్నాయి. → ఒక యాప్ లేదా ఫిన్టెక్ ఒకటికి మించిన ఎన్బీఎఫ్సీలు, బ్యాంక్లతో టైఅప్ పెట్టుకుని, వాటి తరఫున రుణ వేదికగా మారుతోంది. → కస్టమర్లను ఆకర్షించడం, డేటాను విశ్లేషించడం, రుణం మంజూరు చేయించడం, దాన్ని వసూలు చేయడం తదితర పనులు చేస్తున్నాయి. → అసలు రుణం మంజూరు చేసేది బ్యాంకు లేదా ఎన్బీఎఫ్సీ అయితే.. మిగిలిన పనులన్నింటినీ ఇవి కానిచ్చేస్తున్నాయి. ఆర్బీఐ పర్యవేక్షణకు దూరంగా వ్యాపార వృద్ధి కోసం దూకుడుగా వ్యవహరించడం వీటి వంతు. → ఆర్బీఐ పర్యవేక్షణలోని బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీతో నేరుగా సంప్రదింపుల్లేకపోవడంతో రుణ గ్రహీత హక్కులకు రక్షణ లేకుండా పోతోంది. వారు బాధితులుగా మారుతున్నారు. → రూ.25,000 సంపాదించే వ్యక్తికి రూ.20 లక్షల రుణం ఎక్కడి నుంచి వస్తోంది? డెలివరీ సేవలతో కుటుంబాన్ని నెట్టుకొచ్చే వ్యక్తికి రూ.37 లక్షల రుణాలను యాప్స్ ఎలా మంజూరు చేస్తున్నాయి? → రుణ గ్రహీత పాన్ నంబర్ ఆధారంగా రుణ చరిత్రను సమగ్రంగా పరిశీలించి కదా అర్హతను తేల్చాలి? కానీ వాస్తవంలో ఇవేవీ లేకుండా ఒకటికి మించిన యాప్లు ఎడాపెడా రుణాలను ఇచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఎలా వసూలు చేసుకోవాలో వాటికి తెలుసు గనుక.బాదుడు ఇలా..రుణం మొత్తం రూ.10,000 ప్రాసెసింగ్ ఫీజు రూ.800 ప్లాట్ఫారమ్ చార్జీలు రూ.300 చేతికి వచ్చేది రూ.8900 14 రోజుల తర్వాత చెల్లించాల్సిన మొత్తం రూ.10,500→ చాలా రుణ యాప్స్ 30–40 శాతం వడ్డీ అంటూ ఊదరగొడుతుంటాయి. → కానీ, వాస్తవంగా రోజుకు 1% చొప్పున వసూలు చేస్తుంటాయి. అంటే వార్షిక వడ్డీ 365%. → ఈ ప్రకారం.. రూ.10,000 రుణానికి వారంలో రూ.10,700 చెల్లించాల్సి ఉంటుంది. → పెనాల్టీలు, ఆలస్యపు రుసుములు అదనం. → రూ.10,000 రుణానికి రూ.500 (10 శాతం) ప్రాసెసింగ్ ఫీజుగా తీసుకుంటున్నవీ ఉన్నాయి. ఎంతో వ్యత్యాసం రుణం రకం వార్షిక వడ్డీ రేటు(%) గృహ రుణం 8–10 వ్యక్తిగత రుణం 12–18 క్రెడిట్ కార్డు 36–42 డిజిటల్ లోన్ యాప్స్ 60– 365నట్లు బిగిస్తున్న ఆర్బీఐ → రుణ యాప్స్ అడ్డగోలు వ్యవహారాలు తెలియడంతో ఆర్బీఐ నిబంధనలను కఠినతరం చేసింది. → రుణానికి సంబంధించి కీలక సమాచార నివేదికను (కేఎఫ్ఎస్) రుణ గ్రహీతకు ఇవ్వాల్సిందేనని తేలి్చంది. → రుణ గ్రహీత కాంటాక్టులు, ఫైల్స్ యాక్సెస్ను కట్టడి చేసింది. → రుణాలను ఇస్తున్న బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. → కేంద్రం, దర్యాప్తు సంస్థలు చట్టవిరుద్ధమైన యాప్స్ను బ్లాక్ చేయించాయి. → అయినప్పటికీ కొత్తవి పుట్టుకొస్తూనే ఉంటున్నాయి. రుణ గ్రహీతలు విచక్షణతో వ్యవహరిస్తేనే బయటపడగలుగుతారు. తెలుగు రాష్ట్రాల్లో బాధితులు ఎక్కువే → ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు డిజిటల్ లెండింగ్ యాప్లకు గ్రోత్ సెంటర్లుగా మారాయనడంలో ఆశ్చర్యం అక్కర్లేదు. → స్మార్ట్ఫోన్ల వినియోగం అధికంగా ఉండడం, గిగ్ ఎకానమీ (తాత్కాలిక పనులతో కూడిన ఉపాధి అవకాశాలు) విస్తరిస్తుండడం, వినియోగ ధోరణి కొత్త పుంతలు తొక్కుతుండడం, స్టాక్ ట్రేడింగ్ పట్ల పెరుగుతున్న ఆసక్తి ఇలా ఎన్నో కారణాలున్నాయి. → ముఖ్యంగా హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లో లోన్ యాప్స్ విస్తరణ రాకెట్ వేగాన్ని తలపిస్తోంది. దాంతో మనదగ్గర బాధితులు ఎక్కువే. ఇవి డేంజర్ బెల్స్.. → ఆదాయంలో రుణ వాయిదాలు 40 శాతం మించడం. → ఒకే సమయంలో రుణాలు మూడుకు మించడం. → ఒక రుణం నుంచి బయటపడేందుకు మరో రుణాన్ని తీసుకోవడం. → రుణ విషయాలను రహస్యంగా ఉంచడం. విద్యావంతులదీ అదే దారి... → యాప్స్ ద్వారా ఎడాపెడా రుణాలు తీసుకుంటున్న వారిలో అందరూ పేదవారే అనుకోవటానికి లేదు. ఉన్నత విద్యావంతులు, వృత్తి నిపుణులు సైతం ఉంటుండడం ఆర్థిక క్రమశిక్షణ లేమిని సూచిస్తోంది. → కాంట్రాక్టు ఉద్యోగులు, తాత్కాలిక కార్మికులు, అసంఘటిత రంగంలోని కార్మికులు తదితర తక్కువ ఆదాయ వర్గాల వారు సులభంగానే ఈ లోన్ యాప్ ట్రాప్లో పడుతున్నారు. → వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డు రుణాలను ఇష్టారీతిన వాడేసిన విద్యావంతులు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, స్టాక్ మార్కెట్ డే ట్రేడర్లు, యువ వేతన జీవులు, క్రిప్టో ఇన్వెస్టర్లు సైతం ట్రేడింగ్లో చేతులు కాల్చుకుని.. లోన్ యాప్స్ను ఆశ్రయిస్తుండడం విస్మయం కలిగిస్తోంది. వసూళ్లలోనూ అరాచకం.. → డిజిటల్ యాప్ కదా రుణం తీసుకుని కట్టకపోయినా ఏం కాదులే? అనుకుంటే అంతకుమించిన అమాయకత్వం మరొకటి ఉండదు. వసూలు కోసం అవి అనుసరించే మార్గాలు తెలిస్తే వళ్లు జలదరిస్తుంది. → ఊళ్లల్లో వడ్డీ వ్యాపారుల గురించి వినే ఉంటారు. 5–10 రూపాయల వడ్డీతో రోజువారీ/నెలవారీ వసూలు చేసుకునే వారిని చూస్తే అప్పు తీసుకున్న వారు వణికిపోయే పరిస్థితి. ఇప్పుడు సంఘటిత ముసుగులోని లెండింగ్ యాప్లు, ఫిన్టెక్లు వీరిని మించి వ్యవహరిస్తున్నాయి. . → ఈ యాప్స్కు ఫోన్లోని కాంటాక్టులు, కాల్ లాగ్, ఫొటో గ్యాలరీలు, డివైజ్ను మానిటర్ చేసే రైట్స్ను రుణ గ్రహీతలు తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. → రుణాన్ని చెల్లించనప్పుడు రుణ గ్రహీత బంధువులకు ఫోన్ కాల్స్ వేధింపులు ఆరంభమవుతాయి. అంతేకాదు అతడు/ఆమె పనిచేసే యాజమాన్యానికీ మెస్సేజ్లు వెళతాయి. రుణ గ్రహీత ఫోన్లోని ఫొటోలను మారి్ఫంగ్ చేసి వాటి ఆధారంగా బెదిరింపులూ ఎదురుకావొచ్చు. → వాట్సాప్ గ్రూపుల్లోనూ డీఫేమ్ చేస్తాయి. ఇలా వీలైన ప్రతీ మార్గంలో రుణ గ్రహీతలను వెంటాడి, వేధించి వసూలు చేసుకోవడమే వాటికి తెలిసిన విద్య. -
సెంట్రల్ బ్యాంక్ ఆఫర్ నేడు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విండో నేడు(25న) రిటైల్ ఇన్వెస్టర్లు, ఉద్యోగులకు ఓపెన్ కానుంది. గత వారాంతాన సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి ఆఫర్కు 2.35 రెట్లు అధికంగా స్పందన లభించింది. తొలి రోజు(22న) రూ. 2,380 కోట్ల విలువైన బిడ్స్ దాఖలయ్యాయి. దీంతో ప్రభుత్వం గ్రీన్ షూ ఆప్షన్ను వినియోగించుకోవడం ద్వారా బ్యాంక్లో మొత్తం 8 శాతం వాటా విక్రయించనున్నట్లు దీపమ్ కార్యదర్శి అరునిష్ చావ్లా ఎక్స్లో పేర్కొన్నారు. ఓఎఫ్ఎస్లో భాగంగా ప్రభుత్వం తొలుత 4 శాతం వాటా ఆఫర్ చేసింది. అధిక స్పందన లభిస్తే మరో 4 శాతం వాటా సైతం విక్రయించనుంది. ఇందుకు ఫ్లోర్ ధర రూ. 31కాగా.. 8 శాతం వాటాకు ప్రభుత్వం రూ. 2,456 కోట్లు అందుకోనుంది. ప్రభుత్వం తొలుత 32.58 కోట్ల షేర్లు(4 శాతం వాటా) ఆఫర్ చేయగా.. సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి రూ. 2,380 కోట్ల విలువైన 76.86 కోట్ల షేర్లకు బిడ్స్ దాఖలయ్యాయి. సెంట్రల్ బ్యాంక్ ద్వారా ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27)లో తొలిసారి ఓఎఫ్ఎస్కు తెరతీసింది. తాజా ఓఎఫ్ఎస్ ద్వారా ప్రభుత్వం పబ్లిక్కు కనీస వాటా(25 శాతం) అంశంలో మరింత ముందుకెళ్లనుంది. ప్రస్తుతం బ్యాంక్లో ప్రభుత్వ వాటా 89.27 శాతంగా ఉంది. ఓఎఫ్ఎస్ తదుపరి 81.27 శాతానికి దిగిరానుంది. ఓఎఫ్ఎస్ ధర గురువారం ముగింపుతో పోలిస్తే 8.6% డిస్కౌంట్ కాగా.. శుక్రవారం షేరు 8% పతనమై రూ. 31.3 వద్ద ముగిసింది. -
భారీ రాబడులకు.. సిఫ్ సఫారీ!
ఈక్విటీల్లో మెరుగైన రాబడులకు సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్ ఒక చక్కని మార్గం. ఈక్విటీలకు మించి అధిక రాబడులు, ప్రత్యామ్నాయ సాధనాల్లో పెట్టుబడులకు ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్), పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ వంటి సర్వీసులు (పీఎంఎస్) సైతం ఉన్నాయి. కానీ, ఈక్విటీల్లోనే అధిక రిస్క్ తో మరింత రాబడి కోరుకునే వారి పరిస్థితి ఏంటి? ఈ తరహా ఇన్వెస్టర్ల కోసం స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (సిఫ్) సాధనం ఇటీవలే మార్కెట్ ప్రవేశం చేసింది. సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్–హెడ్జ్ ఫండ్ తరహా పెట్టుబడులకు మధ్య వారధిగా దీన్ని రూపొందించారు. కొంచెం పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే వారి కోసం వచ్చిన ఈ సాధనంతో సంపద సృష్టి సాధ్యమేనా..? బడా ఇన్వెస్టర్లు సైతం ఎందుకు ‘సిఫ్’పై మనసు పారేసుకుంటున్నారు? ఈ ఆసక్తికరమైన విషయాలు మీకోసం..స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (సిఫ్)లు సాధారణ మ్యూచువల్ ఫండ్స్ మాదిరి కావు. డెరివేటివ్స్ మార్కెట్లో (ఫ్యూచర్స్–ఆప్షన్స్) ఇవి లాంగ్–షార్ట్ వ్యూహాలను అనుసరిస్తాయి. డెట్ సెక్యూరిటీలు, ఈక్విటీ–డెట్ కలిసిన హైబ్రిడ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అసెట్ అలోకేషన్ విషయంలో చురుగ్గా వ్యవహరిస్తుంటాయి. అంటే వివిధ సాధనాల మధ్య కేటాయింపులను ఎప్పటికప్పుడు పరిస్థితులు, అవకాశాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తాయి. రంగాల వారీ పెట్టుబడులను వ్యూహాత్మకంగా మారుస్తుంటాయి. హెడ్జింగ్ విధానాలను కూడా అనుసరిస్తాయి. అంటే పెట్టుబడుల విలువ భారీగా పడిపోకుండా వ్యూహాలను ఆచరణలో పెడతాయి.తేడా ఏంటి? → సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్ అన్నవి మార్కెట్లు ర్యాలీ చేసినప్పుడే రాబడులను ఇవ్వగలవు. → సిఫ్లు మాత్రం మార్కెట్లు ఆటుపోట్లు, అస్థిరతలను చవిచూస్తున్న తరుణంలో లేదా మార్కెట్లు పడిపోతున్న తరుణంలోనూ షార్ట్సెల్లింగ్ విధానాలు, హెడ్జింగ్ వ్యూహాలతో రాబడులను ఇవ్వగలవు. → ఉదాహరణకు ఒక లాంగ్–షార్ట్ సిఫ్ 75–80 శాతం పెట్టుబడులను క్యాష్ మార్కెట్లో లాంగ్ పొజిషన్లకు కేటాయించి.. 20–25 శాతాన్ని డెరివేటివ్స్లో షార్ట్ పొజిషన్లపై పెట్టుబడిగా పెడుతుంది. → రిటైల్ ఇన్వెస్టర్లకు అనుకూలమైన ప్రత్యా మ్నాయ పెట్టుబడి సాధనంగా సిఫ్లను నిపుణులు అభివర్ణిస్తున్నారు.రాబడికి గ్యారంటీ లేదు..? రిస్కూ ఎక్కువే! → సిఫ్ల్లోనూ రిస్క్ చాలా ఎక్కువ. సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్ మాదిరే రాబడులకు ఎలాంటి హామీ ఉండదు. → ఎందుకంటే సిఫ్లు డెరివేటివ్స్లోనూ ఇన్వెస్ట్ చేస్తుంటాయి. పొజిషన్లలో తరచూ మార్పులు చేస్తుంటాయి. → ఫండ్ మేనేజర్ ప్రతిభ, రిస్క్ సామర్థ్యాలు, మార్కెట్ సైకిల్స్, నిర్వహణలో క్రమశిక్షణ ఇలాంటి అంశాలెన్నో రాబడులను నిర్ణయిస్తుంటాయి. → నిర్వహణ సరిగ్గాలేని సిఫ్లలో రాబడి తక్కువే ఉండొచ్చు. అదే సమయంలో నాణ్యమైన సిఫ్లు ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడులను అందించగలవు. → సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్ (లార్జ్/ఫ్లెక్సీ/మల్టీక్యాప్)లో రిస్క్ సిఫ్లతో పోల్చితే తక్కువే. కొంత రాబడుల పరంగానూ స్థిరత్వం ఉంటుంది. → ఎందుకంటే నాణ్యమైన కంపెనీలు, చక్కని యాజమాన్యం, ఆయా రంగాల్లో వ్యాపార అవకాశాల ఆధారంగా దీర్ఘకాల పెట్టుబడుల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. → సిఫ్లు దూకుడుగా ఏక కాలంలో ఒకటికి మించిన వ్యూహాలను అనుసరిస్తుంటాయి. కనుక రిస్క్ ఎక్కువే. → కానీ, దీర్ఘకాలంలో సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్ కంటే సిఫ్లు 3–8% మేర అధిక రాబడులను ఇవ్వగలవన్నది విశ్లేషకుల అంచనా. → సగటున 6 శాతం అధిక రాబడి వచ్చినా దీర్ఘకాలంలో సంపద సృష్టి పరంగా చెప్పుకోతగ్గంత వ్యత్యాసం ఉంటుంది. ఉదాహరణ: రూ.10 లక్షలు ఏటా 12 శాతం చొప్పున పెరిగితే 10 ఏళ్లలో రూ.31 లక్షలు అవుతుంది. అదే ఏటా 18 శాతం చొప్పున పెరుగుతూ పోతే పదేళ్లకు రూ.52 లక్షలు అవుతుంది.బడా ఇన్వెస్టర్లలో ఆసక్తి → కనీసం రూ.10 లక్షల నుంచి సిఫ్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కనుక మధ్యతరగతి రిటైల్ ఇన్వెస్టర్లకూ అందుబాటులోని మెరుగైన పెట్టుబడి సాధనమే అవుతుంది. → బడా ఇన్వెస్టర్లు సైతం సిఫ్లపై అమితాసక్తి చూపిస్తున్నారు. → ఏడాదిన్నరగా మార్కెట్లు ఎన్నో అస్థిరతలు చూస్తున్నాయి. అంతర్జాతీయంగా ఎన్నో అనిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు రాజ్యమేలుతున్నాయి. → రంగాల వారీ స్టాక్స్ ర్యాలీ ఎప్పటికప్పుడు మారిపోతోంది. లిక్విడిటీ ఆధారిత స్టాక్స్లో హెచ్చు, తగ్గులు భారీగా ఉంటున్నాయి. → ఈ పరిస్థితుల్లో కొనుగోలు చేసి, కొనసాగించడమ న్న సంప్రదాయ విధా→ కనీసం రూ.10 లక్షల నుంచి సిఫ్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కనుక మధ్యతరగతి రిటైల్ ఇన్వెస్టర్లకూ అందుబాటులోని మెరుగైన పెట్టుబడి సాధనమే అవుతుంది. → బడా ఇన్వెస్టర్లు సైతం సిఫ్లపై అమితాసక్తి చూపిస్తున్నారు. → ఏడాదిన్నరగా మార్కెట్లు ఎన్నో అస్థిరతలు చూస్తున్నాయి. అంతర్జాతీయంగా ఎన్నో అనిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు రాజ్యమేలుతున్నాయి. → రంగాల వారీ స్టాక్స్ ర్యాలీ ఎప్పటికప్పుడు మారిపోతోంది. లిక్విడిటీ ఆధారిత స్టాక్స్లో హెచ్చు, తగ్గులు భారీగా ఉంటున్నాయి. → ఈ పరిస్థితుల్లో కొనుగోలు చేసి, కొనసాగించడమ న్న సంప్రదాయ విధానం స్వల్పకాలంలో ఫలితాలనివ్వదు. సిఫ్లాంటివే మెరుగ్గా రాణించగలవు. → పెట్టుబడుల విలువ కరిగిపోకుండా ప్రభావవంతమైన విధానాలను సిఫ్లు పాటిస్తాయి. → పెట్టుబడిని కాపాడుతూనే మార్కెట్ల ర్యాలీలో మంచి రాబడులను అందిస్తుంటాయి. కనుక ఈ తరహా సమతూకం అన్నది అధిక విలువ కలిగిన ఇన్వెస్టర్లకు ఎంతో అవసరం. అందుకే బడా ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. → కానీ, రిటైల్ ఇన్వెస్టర్లకు సైతం సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్ కంటే మెరుగైన ప్రత్నామ్నాయం కాగలవు. అధిక రాబడి కోరుకునే వారు తమ రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా వీటికి కనీసం రూ.10 లక్షలు లేదంటే తమ పోర్ట్ఫోలియోలో 10–15 శాతం మించకుండా కేటాయింపులు చేసుకోవచ్చు.నం స్వల్పకాలంలో ఫలితాలనివ్వదు. సిఫ్లాంటివే మెరుగ్గా రాణించగలవు. → పెట్టుబడుల విలువ కరిగిపోకుండా ప్రభావవంతమైన విధానాలను సిఫ్లు పాటిస్తాయి. → పెట్టుబడిని కాపాడుతూనే మార్కెట్ల ర్యాలీలో మంచి రాబడులను అందిస్తుంటాయి. కనుక ఈ తరహా సమతూకం అన్నది అధిక విలువ కలిగిన ఇన్వెస్టర్లకు ఎంతో అవసరం. అందుకే బడా ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. → కానీ, రిటైల్ ఇన్వెస్టర్లకు సైతం సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్ కంటే మెరుగైన ప్రత్నామ్నాయం కాగలవు. అధిక రాబడి కోరుకునే వారు తమ రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా వీటికి కనీసం రూ.10 లక్షలు లేదంటే తమ పోర్ట్ఫోలియోలో 10–15 శాతం మించకుండా కేటాయింపులు చేసుకోవచ్చు.లిక్విడిటీ ఎక్కువే.. → సిఫ్లలో లిక్విడిటీ ఎక్కువ. అయినప్పటికీ, వీటిలో షార్ట్–టర్మ్ ట్రేడింగ్ను నిరుత్సాహపరచడానికి చాలా ఫండ్స్ మొదటి 6 నెలలు లేదా ఏడాదిలోపు పెట్టుబడులను ఉపసంహరించుకుంటే ‘ఎగ్జిట్ లోడ్’ విధిస్తున్నాయి. → ఏఐఎఫ్లలో పెట్టుబడి కొన్నేళ్ల పాటు లాకిన్ అవుతుంది. → సిఫ్లలో రోజువారీ, వారం, క్రమానుగత పెట్టుబడుల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. → కానీ, కనీసం ఐదేళ్లపాటు అయినా సిఫ్లలో పెట్టుబడి కొనసాగించినప్పుడే మెరుగైన రాబడులను చూడగలరన్నది విశ్లేషకుల అభిప్రాయం. → ప్రస్తుతానికి మార్కెట్లో 9 సిఫ్లే అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో మరిన్ని సంఖ్యలో, మరిన్ని వ్యూహాలతో అందుబాటులోకి రానున్నాయి. → మెరుగైన రిస్క్ నిర్వహణ, వైవిధ్యంతో కూడిన సిఫ్లను దీర్ఘకాలంలో కాస్త అదనపు రాబడికి మార్గంగా భావించొచ్చని విశ్లేషకుల అభిప్రాయం. → అంతిమంగా రాబడులు అన్నవి ఇన్వెస్టర్ల ధోరణి, క్రమశిక్షణపైనా ఆధారపడి ఉంటాయన్నది విస్మరించొచ్చు. రాబడులు ? సిఫ్లో రాబడులకు దీర్ఘకాల చరిత్ర లేదు. 2024లో సెబీ ఈ విభాగానికి పచ్చజెండా ఊపగా.. మొదటి సిఫ్.. క్వాంట్ లాంగ్–షార్ట్ ఫండ్ 2025 సెప్టెంబర్లో మార్కెట్లోకి వచ్చింది. ఎంత మేర ఆశించొచ్చు? ఫండ్ నిపుణుల అంచనాలు.. స్ట్రాటజీ వార్షిక రాబడి (విధానం) అంచనా (%లో) హైబ్రిడ్ లాంగ్–షార్ట్ సిఫ్ 10–16 ఈక్విటీ లాంగ్–షార్ట్ సిఫ్ 14–22 టాక్టికల్/సెక్టార్ రొటేషన్ సిఫ్ 18 డెట్ లాంగ్–షార్ట్ సిఫ్ 8–12– సాక్షి, వెల్త్ -
నన్ను జాబ్ నుంచి తొలగించండి.. మెటా ఉద్యోగిని
మెటా సంస్థ ఇటీవలే భారీ లేఆఫ్స్ ప్రకటించింది. ఈ జాబితాలో జూలీ బోన్ అనే ఉద్యోగిని కూడా ఉన్నారు. అయితే.. ఈమె తనకు తానుగానే ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు.. లింక్డ్ఇన్ పోస్ట్ ద్వారా వెల్లడించింది.జూలీ బోన్ కంపెనీలో జరుగుతున్న ఉద్యోగాల కోతల్లో తన పేరును కూడా చేర్చాలని స్వయంగా కోరినట్లు వెల్లడించింది. ఈమె సంస్థలో ఆరేళ్లు పనిచేసింది. అయితే ఇప్పుడు ఉద్యోగాన్ని వదులుకోవాలనుకోవడం ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయం కాదని పేర్కొంది. చాలా కాలంగా కంపెనీ లక్ష్యాలు, తన వ్యక్తిగత ఆశయాలు వేర్వేరు దారుల్లో సాగుతున్నాయని ఆమె భావించింది. అందుకే తన వ్యక్తిగత జీవితానికి సరైన సమయం వచ్చిందని భావించి ఉద్యోగాన్ని వదిలేయాలని నిర్ణయించుకుందన్నారు.అంతేకాకుండా.. తాను స్వచ్ఛందంగా బయటకు వస్తే సంస్థలో కొనసాగాలని కోరుకునే మరో ఉద్యోగికి అవకాశం దక్కవచ్చనే ఆలోచన కూడా తనలో ఉందని పేర్కొన్నారు. మెటాలో పని చేసిన కాలంలో ఏఐ ఆధారిత నైపుణ్యాలను కూడా నేర్చుకున్నానని జూలీ వెల్లడించింది. కొత్త ఆలోచనలను రూపొందించడానికి, కోడింగ్ సమస్యలను పరిష్కరించడానికి ఏఐ టూల్స్ ఉపయోగించడం నేర్చుకున్నానని తెలిపింది.ప్రస్తుతం మెటాలో 'AI-first' విధానం అమల్లో ఉందని, ఉద్యోగులు ఏఐ టెక్నాలజీకి అనుగుణంగా తమ నైపుణ్యాలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఉందని ఆమె వివరించింది. అయితే.. ఏఐ నేర్చుకోవడం మాత్రమే ఉద్యోగ భద్రతకు హామీ కాదని జూలీ అభిప్రాయపడ్డారు. ఉద్యోగులను రక్షించాలంటే.. సంస్థలు, ఉద్యోగులు కలిసి సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.టెక్నాలజీ ఎంత వేగంగా మారుతున్నా, మానవ సృజనాత్మకత, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సాంస్కృతిక అవగాహన వంటి అంశాలు ఎంతో ముఖ్యమని జూలీ నమ్మకం. మెటాలో చేసిన పనుల్లో ముఖ్యంగా బ్రాండ్ వాయిస్, లోకలైజేషన్ రంగాల్లో పనిచేయడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని ఆమె వెల్లడించారు.ప్రస్తుతం కొంత విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్న జూలీ, భవిష్యత్తులో సృజనాత్మకతకు, ఎడిటోరియల్ తీర్పుకు, స్పష్టమైన కమ్యూనికేషన్కు ప్రాధాన్యం ఇచ్చే సంస్థల్లో అవకాశాలను వెతుకుతానని వెల్లడించింది. మొత్తం మీద ఈమె వ్యాఖ్యలు.. ప్రస్తుతం ఏఐ ప్రభావం, ఉద్యోగ భద్రత, టెక్నాలజీ రంగంలో మారుతున్న పని సంస్కృతి వంటి అంశాలపై విస్తృత చర్చకు దారితీశాయి. -
యూపీఐ ఆటోపే.. ఎయిర్టెల్ బ్యాంక్ సత్తా!
డిజిటల్ బ్యాంకింగ్ సేవల సంస్థ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ 2025–26 ఆర్థిక సంవత్సరానికి 73 శాతం వృద్ధితో రూ.109 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని సాధించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2024–25)లో నికర లాభం రూ.63 కోట్లుగా నమోదైంది. మరోవైపు వార్షిక ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది.2024–25లో రూ.2,709 కోట్లుగా ఉన్న ఆదాయం.. 2025–26 నాటికి రూ.3,207 కోట్లకు చేరుకుంది. ఇదే సమయంలో బ్యాంక్ కస్టమర్ల డిపాజిట్ బ్యాలెన్స్ కూడా 26 శాతం వృద్ధితో రూ.4,612 కోట్లకు చేరింది.యూపీఐ ఆటోపేలో దూకుడు: ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో బ్యాంక్ అందిస్తున్న ‘సేఫ్ సెకండ్ అకౌంట్’ కు కస్టమర్ల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తోందని ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ పేర్కొంది. ‘యూపీఐ ఆటోపే’ మ్యాండేట్స్ విభాగంలో రెండో అతిపెద్ద ప్లేయర్గా బ్యాంక్ అవతరించింది. -
ఆర్థిక వ్యవస్థపై కియోసాకి సంచలన వ్యాఖ్యలు!
పెట్టుబడులకు సంబంధించిన విషయాలను గురించి చెప్పే రాబర్ట్ కియోసాకి.. కొంతమంది ఆర్ధిక నిర్ణయాలు, సాధారణ ప్రజల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి?, చివరికి వాళ్ల ఆర్ధిక పరిస్థితి ఎలా ఉంటుంది? అనే విషయాలను వివరాయించారు.ప్రపంచంలో అత్యంత ధనవంతులైన లేదా శక్తివంతులైన కొంతమంది వ్యక్తులు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు సాధారణ ప్రజల జీవితాలపై పెద్ద ప్రభావం చూపుతాయి. చాలామంది చిన్నప్పటి నుంచి చదువుకోవడం, మంచి ఉద్యోగం చేయడం, పన్నులు చెల్లించడం వంటి నియమాలను పాటిస్తూ జీవితం సాగిస్తారు. ఇవన్నీ పాటించినప్పటికీ.. ఆర్థికంగా స్వేచ్ఛ ఉండదు.డబ్బు వ్యవస్థపై నియంత్రణ ఉన్నవారు.. ఉదాహరణకు, బ్యాంకులు, పెద్ద పెట్టుబడిదారులు, ఆర్థిక సంస్థలు సాధారణ ప్రజల ఆదాయం, పొదుపు, అద్దె, రిటైర్మెంట్ వంటి విషయాలను పరోక్షంగా ప్రభావితం చేస్తారు. ఈ వ్యవస్థలో రెండు రకాల నియమాలు ఉన్నాయి. ఒకటి డబ్బును నియంత్రించే వారు, మరొకటి కష్టపడి పనిచేసే సాధారణ ప్రజలు.ఇదీ చదవండి: అందుకే 'వెండి'కి డిమాండ్: కొత్త ధరలు ఇలా..సాధారణ ప్రజలు చిన్ననాటి నుంచే ఒక వ్యవస్థలోకి ప్రవేశించి, దాని నియమాలను ప్రశ్నించకుండా అనుసరిస్తారు. ఇలా జీవితం గడిపి దాదాపు 40 సంవత్సరాలు ఉద్యోగం చేసినా.. ఎక్కడ మొదలయ్యారో దాదాపు అక్కడే ఉంటారని కియోసాకి అభిప్రాయపడ్డారు. నిజానికి పెట్టుబడులు, ఇతర వ్యాపారాలు చేసేవాళ్లు తొందరగా ధనవంతులు అవుతారు. ఉద్యోగం చేసి సాఫీగా జీవితం సాగించేవాళ్లకు, ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన నమ్మకం. -
అందుకే 'వెండి'కి డిమాండ్: కొత్త ధరలు ఇలా..
బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరల్లో కూడా మార్పు కనిపించింది. కేవలం వారం రోజుల్లో (మే 17 నుంచి 23 వరకు) రేట్లు తగ్గుతూ.. పెరుగుతూ.. వారాంతంలో స్థిరంగా ఉన్నాయి. ఈ కథనంలో ప్రస్తుతం వెండి రేటు ఎలా ఉంది?, ధరల తేడాకు ప్రధాన కారణం ఏమిటి? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.మే 17న (ఆదివారం) రూ.2,90,000 వద్ద ఉన్న సిల్వర్ రేటు మే 23 (శనివారం) నాటికి రూ.2,95,000 వద్దకు చేరింది. అయితే వారం మధ్యలో వెండి రేటు రూ.3 లక్షలకు కూడా చేరింది. చివరకు కొంత తగ్గుదల కనిపించింది.హైదరాబాద్, విజయవాడ, చెన్నైలలో కేజీ వెండి రేటు రూ.2.95 లక్షల వద్ద ఉండగా.. ఢిల్లీలో మాత్రం కేజీ సిల్వర్ ధర రూ.2.85 లక్షల వద్ద ఉంది. దీన్నిబట్టి చూస్తే దేశ రాజధాని నగరంలో సిల్వర్ రేటు తక్కువని స్పష్టమవుతోంది.వెండి ధరలు పెరగడానికి కారణం!మార్కెట్ డిమాండ్, సరఫరా: డిమాండ్ ఎక్కువగా ఉండి, సరఫరా తక్కువగా ఉన్నప్పుడు ధరలు పెరుగుతాయి. వెండిని ఆభరణాలుగా మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్స్, వైద్య పరికరాల్లో కూడా ఉపయోగిస్తారు. కాబట్టి ఇది కూడా రేటు పెరగడానికి కారణమైంది.పెట్టుబడులు: స్టాక్ మార్కెట్లలో రిస్క్ వద్దనుకుని, ఇతర మార్గాల్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి వెండి మంచి ఎంపిక. కాబట్టి పెట్టుబడిదారులు వెండిపై పెట్టుబడులు పెంచినప్పుడు కూడా ధరలు పెరుగుతాయి.అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు: యుద్ధాలు, దేశాల మధ్య వాణిజ్య సమస్యలు వెండి, ఇతర విలువైన లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి. ఇలాంటి సమయంలో లోహాల విలువ పెరుగుతుంది.వెండిని.. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా.. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడతాయి.ఇదీ చదవండి: పదేళ్ల కనిష్ఠానికి గోల్డ్ డిమాండ్.. కారణాలివే! -
పిల్లలకు విద్య, క్రీడలు అవసరం: నీతా అంబానీ
రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్పర్సన్ & వ్యవస్థాపకురాలు 'నీతా అంబానీ' విద్య, క్రీడలు ప్రతి చిన్నారి జీవితాన్ని మార్చగల శక్తివంతమైన సాధనాలని ముంబై ఇండియన్ జట్టుకు వివరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.'అందరికీ విద్య, క్రీడలు' అనే కార్యక్రమంలో నీతా అంబానీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా పేద, వెనుకబడిన కుటుంబాలకు చెందిన పిల్లలకు విద్యతో పాటు క్రీడల్లో అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ సందర్భంగా.. వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ను వీక్షించేందుకు దాదాపు 20 వేల మంది నిరుపేద పిల్లలను ఆహ్వానించారు. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఈ మ్యాచ్ చిన్నారులకు ఒక ప్రత్యేక అనుభూతిని అందించింది. క్రీడలు పిల్లల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, జట్టు భావన పెంచుతాయని నీతా అంబానీ పేర్కొన్నారు.“𝙔𝙤𝙪 𝙖𝙡𝙨𝙤 𝙨𝙢𝙞𝙡𝙚 𝙖𝙣𝙙 𝙢𝙖𝙠𝙚 𝙩𝙝𝙚 𝙘𝙝𝙞𝙡𝙙𝙧𝙚𝙣 𝙖𝙡𝙨𝙤 𝙨𝙢𝙞𝙡𝙚!”A special message to the squad from Mrs Nita Ambani ahead of today’s special Reliance Foundation #ESAMatchDay! 💙#MumbaiIndians #OneFamily pic.twitter.com/SOTmsrNnMS— Reliance Foundation (@ril_foundation) May 24, 2026 -
రూ.3.7 కోట్ల జాబ్.. AI భవిష్యత్తుపై అలర్ట్!
ఓపెన్ఏఐ కంపెనీ.. ఏఐ భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశాలపై పరిశోధనలు కొనసాగిస్తోంది. తాజాగా.. సంస్థ ప్రకటించిన ఒక ప్రత్యేక ఉద్యోగం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఉద్యోగానికి సంవత్సరానికి దాదాపు 4,45,000 డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 3.7 కోట్లు) జీతం ఇవ్వనున్నట్లు సమాచారం.ఓపెన్ఏఐ ప్రకటించిన ఈ జాబ్ సాధారణ AI అభివృద్ధికి సంబంధించినది కాదు. భవిష్యత్తులో ఏఐ మనుషుల సహాయం లేకుండానే తనను తాను మరింత తెలివిగా మార్చుకుంటే.. ఏమవుతుందనే ప్రశ్నకు సమాధానం కనుగొనే ప్రయత్నంలో భాగం. ఈ ఉద్యోగం ప్రిపేర్డ్నెస్ సేఫ్టీ టీమ్లో భాగం.ప్రిపేర్డ్నెస్ సేఫ్టీ టీమ్ అత్యంత శక్తివంతమైన ఏఐ వ్యవస్థలు భవిష్యత్తులో మానవాళికి ఎలాంటి ప్రమాదాలు కలిగించవచ్చో.. ముందుగానే అంచనా వేసి వాటికి రక్షణ మార్గాలు రూపొందిస్తుంది.ఈ ఉద్యోగ ప్రకటనలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అభ్యర్థులు కేవలం సాంకేతికంగా బలంగా ఉండడమే కాకుండా.. వ్యూహాత్మక ఆలోచన, సరైన తీర్పు వంటివి కలిగి ఉండాలని సంస్థ స్పష్టంగా వెల్లడించింది. ఎందుకంటే ఇక్కడ చేయాల్సిన పని ఏమిటంటే.. ప్రస్తుతం లేని, భవిష్యత్తులో ఏర్పడే ప్రమాదాల గురించి ముందుగానే ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది.ఇదీ చదవండి: ఆ టీమ్ వల్లే సమస్యలు.. అందుకే లేఆఫ్స్! -
పెట్రోల్ కష్టాలకు చెక్.. వచ్చేస్తోంది కొత్త కారు!
వియత్నాంకు చెందిన ఈవీ తయారీ సంస్థ విన్ఫాస్ట్.. భారతదేశంలో కొత్త తరం విన్ఫాస్ట్ VF8 ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. ఇది లేటెస్ట్ డిజైన్, అప్డేటెడ్ క్యాబిన్.. మెరుగైన టెక్నాలజీ వంటివి పొందుతుంది. కంపెనీ దీనికోసం మే 27 నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు జులై నుంచి ప్రారంభమవుతాయి.విన్ఫాస్ట్ VF8 మునుపటి మోడల్ కంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కారు ముందు భాగంలో వింగ్స్ ఆకారంలో ఉండే ఎల్ఈడీ డీఆర్ఎల్, వీ షేప్ లైటింగ్ ఎలిమెంట్తో అనుసంధానమై ఉంటాయి. దీనితో పాటు పెద్ద గ్లాస్-బ్లాక్ ఫేషియా కూడా ఉంటుంది. బంపర్లో పెద్ద ఎయిర్ ఛానెల్స్ కూడా ఉన్నాయి, ఇవి ఏరోడైనమిక్ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే.. ఇక్కడ 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. కాబట్టి ఇది మరింత స్పోర్టీ లుక్ అందిస్తుంది. వెనుక డిజైన్ను కూడా కనెక్టెడ్ V-ఆకారపు ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి.విన్ఫాస్ట్ VF8 పూర్తిగా కొత్త డిజైన్ క్యాబిన్ను పొందుతుంది. డాష్బోర్డ్లో 12.9 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే ఉంది. ఈ కారు కొత్త టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, స్టీరింగ్-కాలమ్పై అమర్చిన గేర్ సెలెక్టర్ను కూడా పొందుతుంది. ఎయిర్ ప్యూరిఫికేషన్తో కూడిన డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, మెమరీ ఫంక్షన్తో కూడిన పవర్డ్ ఫ్రంట్ సీట్లు, రిక్లైనింగ్ రియర్ సీట్లు, వైర్లెస్ కనెక్టెడ్ టెక్, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్, మరియు 8-స్పీకర్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్స్ ఎన్నో ఇందులో ఉన్నాయి.ఈ ఎలక్ట్రిక్ SUVలో ఏడీఏఎస్ ఫీచర్లు, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, హైవే అసిస్ట్, 360 డిగ్రీ కెమెరా సెటప్ కూడా ఉన్నాయి. ఈ కారులో 60.13 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఒక ఫుల్ ఛార్జితో 500 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఇందులో ఎలక్ట్రిక్ మోటారు.. 228 హార్స్ పవర్, 330 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. అయితే సంస్థ ఈ కారు ధరలను త్వరలోనే వెల్లడించనుంది.ఇదీ చదవండి: 2026 హోండా సిటీ: 27 కిమీ/లీ మైలేజ్! -
ఆలియా ఉన్న హోటల్.. ఒక్కరోజుకు రూ.8.6 లక్షలా?!
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సినిమా కార్యక్రమాలలో ఒకటి. ప్రతి సంవత్సరం ఫ్రాన్స్లోని అందమైన సముద్రతీర నగరం కేన్స్లో ఈ వేడుక ఘనంగా జరుగుతుంది. ఈ సందర్భంగా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ తారలు, దర్శకులు, ఫ్యాషన్ ప్రముఖులు రెడ్ కార్పెట్పై మెరిసిపోతారు. ఈ ఏడాది భారతీయ నటి అలియా భట్ ధరించిన సాఫ్ట్ బ్లష్ గౌన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సోషల్ మీడియాలో కూడా ఆమె ఫొటోలు విపరీతంగా వైరల్ అయ్యాయి.ఈ ఫెస్టివల్కు హాజరయ్యే ప్రముఖులు ఎక్కువగా దిగే హోటళ్లలో 'హోటల్ మార్టినెజ్' ఒకటి. ఇది కేవలం ఒక విలాసవంతమైన హోటల్ మాత్రమే కాదు, సినీ ప్రముఖుల అభిమాన కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. గతంలో దీపికా పదుకొనే, ఐశ్వర్య రాయ్ బచ్చన్, బెల్లా హడిడ్ వంటి ఎంతోమంది ప్రముఖులు ఈ హోటల్లో బస చేశారు.1929లో ప్రారంభమైన ఈ హోటల్.. అద్భుతమైన ఆర్ట్ డెకో శైలిలో ఉంది. దీని నిర్మాణం కేవలం 14 నెలల్లో పూర్తయింది. ఈ హోటల్లోని బాల్కనీల నుంచి సముద్రం కనిపిస్తుంది. ఈ కారణంగానే చాలామంది సినీ ప్రముఖులు ఇక్కడ ఉండటానికి ఇష్టపడతారు.2013లో ఈ హోటల్ను హయత్ కొనుగోలు చేసింది. ఆ తరువాత దీనిని 'ది అన్బౌండ్ కలెక్షన్ బై హయత్'లో విలీనం చేసింది. ఈ హోటల్ ఆతిథ్యానికి, సౌకర్యానికి, విలాసానికి ప్రతీకగా నిలిచింది.బౌలేవార్డ్ డి లా క్రోయిసెట్ అనే వీధిలో ఈ హోటల్ ఉంది. ఇక్కడ నుంచి పలైస్ డెస్ ఫెస్టివల్స్ అనే ఫిల్మ్ ఫెస్టివల్ ప్రధాన వేదికకు కొన్ని నిమిషాల దూరమే ఉంటుంది. అందువల్ల ఫెస్టివల్ సమయంలో ఇక్కడ భారీ రద్దీ కనిపిస్తుంది. హోటల్లోని గదులు సాధారణ డీలక్స్ రూమ్స్ నుంచి సముద్ర వీక్షణం కలిగిన విలాసవంతమైన సూట్స్ వరకు ఉంటాయి. ఫెస్టివల్ సమయంలో ధరలు మరింత పెరుగుతాయి. ఇక్కడ ఒక రాత్రి బస చేయడానికి గరిష్టంగా రూ.8.6 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం.సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా.. కార్పొరేట్ సమావేశాలు, పెళ్లిళ్లు, కుటుంబ విహార యాత్రల కోసం కూడా ఈ హోటల్ ఎంతో ప్రసిద్ధి చెందింది. దాదాపు శతాబ్దకాల చరిత్ర కలిగిన హోటల్ మార్టినెజ్.. ఇప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా విలాసానికి, ఫ్యాషన్కు, సినీ వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది.ఇదీ చదవండి: పదేళ్ల కనిష్ఠానికి గోల్డ్ డిమాండ్.. కారణాలివే! -
కోకాపేటలో కళ్లు చెదిరే భవనం.. సౌత్ఇండియాకే ‘టాప్’
హైదరాబాద్: నగర రియల్ ఎస్టేట్ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తూ కోకాపేట ఐటీ కారిడార్లో ‘ది స్కైవెన్’ (The Skyven) పేరిట సరికొత్త లగ్జరీ రెసిడెన్షియల్ టవర్ ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు ‘ఈ-ఇన్ఫ్రా’ మరియు ‘పింగ్లే వెంచర్స్ & రియాల్టీ’ (PVR) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ స్కైస్క్రాపర్ 63 అంతస్తులు, 755 అడుగులు అంటే దాదాపు పావు కిలోమీటరు (233 మీటర్లు) ఎత్తుతో దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన నివాస భవనంగా రికార్డు సృష్టించనుంది. కేవలం ఎత్తులోనే కాకుండా, నిర్మాణంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను పొందుపరిచిన దక్షిణ భారత దేశపు మొట్టమొదటి ‘AI-రెడీ’ స్మార్ట్ బిల్డింగ్ కూడా ఇదే కావడం విశేషం.ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పెంట్హౌస్లు, ఆకాశంలో విల్లా అనుభూతినిచ్చే ‘స్కై విల్లాస్’, లగ్జరీ 4BHK నివాసాలను అందుబాటులోకి తెస్తున్నారు. ఇక్కడ సాధారణ ప్రాజెక్టుల లాగా కాకుండా, నివాసాల సంఖ్య పరిమితంగా ఉండటం వల్ల ప్రతి నివాసికి లభించే లగ్జరీ సదుపాయాల వాటా (Amenity-to-Resident Ratio) చాలా ఎక్కువగా ఉంటుంది. భవన నిర్వహణ, విద్యుత్ ఆప్టిమైజేషన్, అత్యాధునిక 24x7 భద్రతా వ్యవస్థలను ఇక్కడి AI నెట్వర్క్ స్వయంచాలకంగా నియంత్రిస్తుంది.భవనం పైభాగంలో ఏర్పాటు చేస్తున్న ‘ది ఎవరెస్ట్’ రూఫ్టాప్ క్లబ్ ఈ ప్రాజెక్ట్కే ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇందులో నగర స్కైలైన్తో కలిసిపోయే ‘ఇన్ఫినిటీ పూల్’తో పాటు, హైదరాబాద్ నివాస మార్కెట్లోనే తొలిసారిగా నక్షత్రాలను వీక్షించేందుకు ‘స్టార్ అబ్జర్వేటరీ’, లగ్జరీ క్లబ్హౌస్, స్పా, మరియు హెలిప్యాడ్ వంటి ఐదు నక్షత్రాల వసతులను కల్పిస్తున్నారు. స్థిరమైన మార్కెట్, అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలతో దూసుకుపోతున్న హైదరాబాద్ గ్లోబల్ ప్రొఫెషనల్స్ను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ గగన విహారి రూపుదిద్దుకుంటోంది. -
స్టాక్ మార్కెట్ అలర్ట్: 3 రోజులు నో ట్రేడింగ్
వచ్చే వారం ట్రేడింగ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్న ఇన్వెస్టర్లు, ట్రేడర్లకు అలర్ట్. మే 25 నుండి మే 31 మధ్య భారతీయ స్టాక్ మార్కెట్లు పరిమిత రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. ఈ వారంలో శని, ఆదివారాలతో పాటు అదనంగా మరో రోజు కూడా మార్కెట్లు మూతపడనున్నాయి. దీంతో మొత్తం 3 రోజుల పాటు ట్రేడింగ్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి.సెలవులు ఇలా..కేంద్ర ప్రభుత్వం తాజాగా చంద్ర దర్శనం ఆధారంగా బక్రీద్ (ఈదుల్ అజ్హా) సెలవు దినాన్ని సవరించింది. మొదట ప్రకటించిన తేదీకి బదులుగా, మే 28 (గురువారం) నాడు అధికారిక సెలవుగా ఖరారు చేసింది. దీనిని అనుసరిస్తూ దేశీయ స్టాక్ ఎక్స్ఛేంజీలైన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లు మే 28న ట్రేడింగ్కు విరామం ప్రకటించాయి.ఆ తర్వాత మే 30 (శనివారం), మే 31 (ఆదివారం) వారాంతపు సెలవులు కావడంతో ఆ రోజుల్లోనూ మార్కెట్లు యథావిధిగా మూసివుంటాయి. ఫలితంగా వచ్చే వారంలో కేవలం 4 రోజులు (సోమ, మంగళ, బుధ, శుక్రవారాలు) మాత్రమే ట్రేడింగ్ సాగుతుంది.ఏయే విభాగాల్లో ట్రేడింగ్ బంద్?మే 28 గురువారం నాడు బక్రీద్ సందర్భంగా మార్కెట్లోని దాదాపు అన్ని ప్రధాన విభాగాలు పనిచేయవు. ఈక్విటీ సెగ్మెంట్, డెరివేటివ్స్ సెగ్మెంట్ (F&O), కరెన్సీ డెరివేటివ్స్ సెగ్మెంట్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్, కమోడిటీ డెరివేటివ్స్ సెగ్మెంట్ (MCX కూడా ఉదయం సెషన్ మూసివుంటుంది)లో కార్యకలాపాలు ఉండవు.గత వారం ఎలా ముగిసిందంటే?గత ట్రేడింగ్ వారంలో భారత మార్కెట్లు అత్యంత అస్థిరత మధ్య సాగినప్పటికీ, ముగింపులో సరికొత్త రికార్డుల వైపు దూసుకెళ్లాయి. నిఫ్టీ 50 (Nifty 50) గత వారంతో పోలిస్తే 1.50% వృద్ధితో 23,719 వద్ద ముగసింది. సెన్సెక్స్ (Sensex) 1.55% వృద్ధితో 75,415 దగ్గర స్థిరపడింది. కార్పొరేట్ కంపెనీల త్రైమాసిక ఫలితాల సానుకూలత, విదేశీ పెట్టుబడుల మద్దతుతో సూచీలు బలపడ్డాయి.వచ్చే వారం కేవలం నాలుగు రోజులే ట్రేడింగ్ అందుబాటులో ఉండటం, అందులోనూ గురువారం సెలవు రావడం వల్ల వీక్లీ డెరివేటివ్ కాంట్రాక్టుల ఎక్స్పైరీ (Expiry) బుధవారమే (మే 27) జరిగే అవకాశం ఉంది. కాబట్టి ట్రేడర్లు తమ పొజిషన్లను ముందుగానే ప్లాన్ చేసుకోవడం, అస్థిరతను గమనిస్తూ తగిన స్టాప్-లాస్లు నిర్వహించడం మంచిది. -
పసిడి ధరలు పైకి.. కిందకు.. వారంలో ఎంత మార్పు?
పసిడి ప్రియులకు, ఇన్వెస్టర్లకు గత వారం (మే 18 నుంచి మే 24 వరకు) ఉత్కంఠను రేకెత్తించింది. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాలు, రూపాయి విలువలో మార్పుల కారణంగా దేశీయంగా పసిడి ధరలు తీవ్ర అస్థిరతకు లోనయ్యాయి. వారం ప్రారంభంలో స్వల్పంగా తగ్గినప్పటికీ, వారం మధ్యలో భారీగా పుంజుకుని, వారాంతానికి మళ్లీ స్వల్పంగా దిగొచ్చాయి.ధరల హెచ్చుతగ్గుల విశ్లేషణతాజా గణాంకాల ఆధారంగా, హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో గడిచిన వారంలో 10 గ్రాముల 22 క్యారెట్ల, 24 క్యారెట్ల బంగారం ధరల ప్రయాణం ఎలా సాగిందో ఓసారి పరిశీలిద్దాం..వారం ప్రారంభంలో ఊరట: మే 18 సోమవారం నాడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,220 వద్ద నమోదు కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,43,200 వద్ద ట్రేడ్ అయింది. ఇది వినియోగదారులకు కొంత ఊరటనిచ్చినప్పటికీ, ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. మంగళవారం (మే 19) నుంచే పసిడి మళ్లీ వేగం పుంజుకుంది.రికార్డు స్థాయి పరుగు: మే 20, 21 తేదీల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా మే 21 నాటికి 24 క్యారెట్ల పసిడి దాదాపు రూ.1.60 లక్షల మార్కుకు చేరువగా (రూ.1,59,930) ఈ వారంలోనే అత్యంత గరిష్ఠ స్థాయిని తాకింది. అలాగే 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర కూడా రూ.1,46,600 కు చేరింది.వారాంతంలో స్వల్ప బ్రేక్: వారమంతా లాభాల్లో దూసుకుపోయిన పసిడి ధరలు శుక్ర, శనివారాల్లో (మే 22, 23) స్వల్పంగా దిగొచ్చాయి. శనివారం నాటికి 24 క్యారెట్ల ధర రూ.1,59,060 వద్దకు, 22 క్యారెట్ల ధర రూ.1,45,800 వద్దకు చేరింది.నేటి ధరలు ఇలా..ఈరోజు, మే 24 (ఆదివారం) మార్కెట్లో ఎలాంటి మార్పు లేకుండా ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,45,800 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.1,59,060 దగ్గర ఉన్నాయి.పసిడి ధరల హెచ్చుతగ్గులకు ప్రధాన కారణాలుగ్లోబల్ మార్కెట్ ఒత్తిడులు: అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ భయాల కారణంగా సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. దీంతో గ్లోబల్ స్పాట్ మార్కెట్లో డిమాండ్ పెరిగి స్థానిక మార్కెట్లపై ప్రభావం పడింది.యూఎస్ ఫెడ్ నిర్ణయాలు & డాలర్ ఇండెక్స్: అమెరికా కేంద్రీయ బ్యాంక్ (US Federal Reserve) వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాల సంకేతాలు, డాలర్ ఇండెక్స్లో వచ్చిన మార్పులు బంగారం ధరలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. వారం మధ్యలో డాలర్ స్వల్పంగా బలహీనపడటం బంగారానికి కలిసి వచ్చింది.లాభాల స్వీకరణ: గురువారం నాటికి ధరలు గరిష్ఠ స్థాయికి చేరడంతో ఇన్వెస్టర్లు అంతర్జాతీయ కమొడిటీ మార్కెట్లలో లాభాల స్వీకరణకు (Profit Booking) దిగారు. దీనివల్ల శుక్రవారం నుంచి ధరల్లో స్వల్ప కరెక్షన్ (తగ్గుదల) కనిపించింది.పెళ్లిళ్ల సీజన్ డిమాండ్: దేశీయంగా, తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో స్థానిక జ్యువెలర్ల నుంచి డిమాండ్ బలంగా ఉంది. ఇది కూడా ధరలు ఒకేసారి పడిపోకుండా నిలకడగా ఉండటానికి తోడ్పడింది. -
ఇల్లు కొనలేమేమో!! కొనుగోలుదారుల్లో భయాలు
ఆర్థిక వ్యవస్థలో నెలకుంటున్న అనిశ్చితి, అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు, నానాటికీ పెరుగుతున్న జీవన వ్యయాలు.. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యుడి నుంచి మధ్యతరగతి వరకు ఎవరైనా సరే ఆచితూచి ఖర్చు చేస్తారు. కానీ, భారత రియల్ ఎస్టేట్ మార్కెట్లో మాత్రం ఇందుకు భిన్నమైన వైరుధ్యం కనిపిస్తోంది.ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభాల నేపథ్యంలో భవిష్యత్తులో ఇళ్ల ధరలు మరింత ఆకాశాన్ని తాకుతాయనే భయంతో, కొనుగోలుదారులు ఇప్పుడే బడ్జెట్ను పెంచుకుని మరీ లగ్జరీ గృహాల వైపు చూస్తున్నారు.ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఆర్థిక జాగ్రత్త కంటే, భవిష్యత్తులో ఇల్లు కొనలేమేమోననే భయం, మెరుగైన జీవనశైలి అనే అంశాలే రియల్టీ రంగాన్ని నడిపిస్తున్నాయి.ఖర్చుల భారంప్రస్తుతం ఎగుమతి, దిగుమతుల రంగంలో ఉన్న అంతరాయాలు నిర్మాణ రంగాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి పరిసరాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు, షిప్పింగ్ రీరూటింగ్, గల్ఫ్ లింక్డ్ కార్గోలపై విధిస్తున్న యుద్ధ-ప్రమాద బీమా భారం లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనారాక్ (ANAROCK) తాజా నివేదిక ప్రకారం నిర్మాణ రంగంలో పెరిగిన ఖర్చులు ఇలా ఉన్నాయి..కంటైనర్ రవాణా ఖర్చులు: సరుకు రవాణా ఛార్జీలు, రీరూటింగ్ కారణంగా కంటైనర్కు అదనంగా రూ.2 లక్షల నుండి రూ.3.5 లక్షల వరకు భారం పెరిగింది.ఉక్కు ధరలు: గడిచిన కాలంలో స్టీల్ ధరలు టన్నుకు ఏకంగా 20% పెరిగి దాదాపు రూ.72,000కు చేరుకున్నాయి.దిగుమతులపై ప్రభావం: ముంబై, గురుగ్రామ్, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లోని లగ్జరీ టవర్లలో వాడే ప్రీమియం ఫిట్టింగ్స్, విదేశీ మార్బుల్స్, ప్రత్యేక నిర్మాణ సామాగ్రి ధరలు రవాణా అంతరాయాల వల్ల భారీగా పెరిగాయి."ఇప్పుడు కొనకపోతే భవిష్యత్తులో ఈ ధరలు మన బడ్జెట్కు అందనంత ఎత్తుకు వెళ్లిపోతాయి" అనే ఆలోచనే వినియోగదారులను ముందడుగు వేసేలా చేస్తోంది.మారిన కొనుగోలుదారుల ఆలోచనఒకప్పుడు కేవలం పెట్టుబడి కోసమే ఇళ్లను కొనేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ద్వంద్వ ఆదాయం (భార్యాభర్తలిద్దరూ సంపాదించే) కలిగిన పట్టణ కుటుంబాలు, ఎగువ మధ్యతరగతి వర్గాలు గృహాన్ని తమ సామాజిక హోదాకు, ఆర్థిక భద్రతకు నిదర్శనంగా భావిస్తున్నారు.ముంబై, బెంగళూరు, గురుగ్రామ్, హైదరాబాద్ నగరాల్లో కొనుగోలుదారులు కేవలం నాలుగు గోడల ఇల్లు కాకుండా విస్తారమైన పెద్ద గృహాలు, వెల్నెస్-ఫోకస్డ్, గ్రీన్ ప్రాజెక్ట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఆధునిక జీవనశైలి వసతులు ఉన్న వాటికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు.బ్రాండెడ్ బిల్డర్లకే జై!గతంలో ప్రాజెక్టులు మధ్యలో నిలిచిపోవడం, డెలివరీ ఆలస్యం కావడం వంటి చేదు అనుభవాల దృష్ట్యా కొనుగోలుదారులు ఇప్పుడు చాలా అప్రమత్తమయ్యారు. ధర కొంచెం ఎక్కువైనా సరే, నమ్మకమైన కార్పొరేట్ బ్రాండ్ల వైపే మొగ్గు చూపుతున్నారు. దీనినే మార్కెట్ వర్గాలు 'ట్రస్ట్ ప్రీమియం' అని పిలుస్తున్నాయి.వినియోగదారులు, ల్యాండ్ ఓనర్లు ఇప్పుడు డెవలపర్ల ఆర్థిక క్రమశిక్షణ, బ్యాలెన్స్ షీట్ బలం, గత ట్రాక్ రికార్డ్ను నిశితంగా పరిశీలిస్తున్నారు. డీఎల్ఎఫ్, ఎంబసీ డెవలప్మెంట్స్, సిగ్నేచర్ గ్లోబల్ వంటి దిగ్గజ సంస్థల విక్రయాలు పుంజుకోవడానికి ఈ బ్రాండ్ ఇమేజ్, విశ్వసనీయతే ప్రధాన కారణం.ప్రీమియం వర్సెస్ అఫోర్డబుల్భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు రెండుగా చీలిపోయింది. ఒకవైపు లగ్జరీ ఇళ్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంటే, మరోవైపు అందుబాటు గృహాల (Affordable Housing) అమ్మకాలు మందగించాయి. డీఎల్ఎఫ్ (డహ్లియాస్ ప్రాజెక్ట్) కేవలం ఒకే ఒక్క త్రైమాసికంలో 32 లగ్జరీ అపార్ట్మెంట్లను విక్రయించింది. ఎంబసీ డెవలప్మెంట్స్ దక్షిణ ముంబై లగ్జరీ ప్రాజెక్ట్ ప్రారంభించిన 45 రోజుల్లోనే రూ.800 కోట్ల ప్రీ-సేల్స్ సాధించింది. మార్కెట్ ట్రెండ్ ప్రీమియం వైపు మళ్లడంతో మహీంద్రా లైఫ్స్పేసెస్ వంటి పెద్ద కంపెనీలు తమ సరసమైన హౌసింగ్ ప్రాజెక్టుల విస్తరణను తగ్గించుకోవడం గమనార్హం. -
పేటీఎంలో బ్లాక్ డీల్.. చేతులు మారిన రూ.963 కోట్ల షేర్లు
న్యూఢిల్లీ: పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్లో 1.34 శాతం వాటా బ్లాక్ డీల్ ద్వారా చేతులు మారింది. గోల్డ్మన్ సాక్స్, సొసైటే జనరల్, సిటిగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ సహా పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, అలాగే సుందరం మ్యూచువల్ ఫండ్, నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ వంటి దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు ఈ షేర్లను కొనుగోలు చేశాయి.మొత్తం 85.98 లక్షల షేర్లను ఒక్కోటి సగటున రూ.1,120.65 ధరకు కొనుగోలు చేయగా, డీల్ విలువ రూ.963.60 కోట్లకు చేరింది. ఈ షేర్లను హాంకాంగ్కు చెందిన ప్రైవేట్ ఈక్విటీదారు ఎస్ఏఐఎఫ్ పార్ట్నర్స్, గురుగ్రామ్కు చెందిన వెంచర్ క్యాపిటల్ సంస్థ ఎలివేషన్ క్యాపిటల్లు విక్రయించాయి. ఈ లావాదేవీ అనంతరం వన్97 కమ్యూనికేషన్స్లో ఎస్ఏఐఎఫ్ పార్ట్నర్స్ వాటా 13.43% నుంచి 12.18 శాతానికి తగ్గింది. -
ఐపీఓకు దూత్ ట్రాన్స్మిషన్
ముంబై: ఆటో విడిభాగాల తయారీ సంస్థ దూత్ ట్రాన్స్మిషన్ పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమైంది. ఇందులో భాగంగా కంపెనీ సెబీకి సవరించిన ముసాయిదా పత్రాలు (యూడీఆర్హెచ్పీ) సమర్పించింది. దాఖలు చేసిన యూడీఆర్హెచ్పీ ప్రకారం.. ఈ ఐపీఓలో రూ.1,400 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది.అలాగే ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా ప్రమోటర్ కంపెనీలు మొత్తం 1.63 కోట్ల షేర్లను అమ్మకానికి పెట్టాయి. ఇందులో ‘బైన్ క్యాపిటల్’ దాదాపు 1.32 కోట్ల షేర్లను, ‘మంగళం క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్’ 31.18 లక్షల షేర్లను విక్రయించనున్నాయి. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను కంపెనీ అనుబంధ సంస్థల్లో పెట్టుబడులకు, కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు వినియోగించనుంది. మిగిలిన నిధులను ఇతర కంపెనీల కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు ఉపయోగించనున్నట్లు యూడీఆర్హెచ్పీలో పేర్కొంది.పబ్లిక్ ఇష్యూ పూర్తైన తర్వాత కంపెనీ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో లిస్ట్ కానున్నాయి. దూత్ ట్రాన్స్మిషన్ సంస్థ 1999లో ప్రారంభమైంది. ఆటోమొబైల్ రంగానికి అవసరమైన వైరింగ్ హార్నెస్లు, ఎల్రక్టానిక్ సెన్సర్లు, కనెక్టర్లు, జంక్షన్ బాక్సులు, డేటా కేబుళ్లు తదితర భాగాలను తయారు చేసి సరఫరా చేస్తోంది. గత ఆర్థిక సంవత్సరం(ఆర్థిక సంవత్సరం 2025–26)లో కంపెనీ కార్యకలాపాల ఆదాయం రూ.3,444.86 కోట్లకు చేరగా, నికర లాభం రూ.353.89 కోట్లుగా నమోదైంది. -
రక్షణాత్మక ధోరణి విడనాడాలి
న్యూఢిల్లీ: భారత్ అంతర్జాతీయ తయారీ కేంద్రంగా, ఆవిష్కరణలకు చిరునామాగా మారేందుకు పరిశ్రమ రక్షణాత్మక ధోరణి వీడి.. పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ)పై మరిన్ని నిధులను వెచ్చించాలని నీతి ఆయోగ్ సభ్యుడు రాజీవ్ గుబ సూచించారు. ప్రభుత్వం తన వంతుగా సంస్కరణల అజెండాను కొనసాగిస్తూ, విశ్వసనీయమైన పాలనను అందిస్తుందన్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, టారిఫ్ యుద్ధాల వంటి పరిస్థితుల నేపథ్యంలో బలమైన సరఫరా వ్యవస్థలు చర్చనీయాంశంగా మారినట్టు చెప్పారు. భారత్ యాపిల్ మాదిరి విజయగాధను ఎన్నో రెట్లు పునరావృతం చేయగలదంటూ.. వియత్నాం, ఇండోనేషియా, మెక్సికోతో పోటీపడుతూ ప్రపంచానికి తయారీ కేంద్రంగా అవతరించగలదని చెప్పారు. సీఐఐ నిర్వహించిన వార్షిక సదస్సులో పాల్గొన సందర్భంగా రాజీవ్గుబ ఈ అంశాలను ప్రస్తావించారు. మన దగ్గరే ఎంతో తక్కువ.. ‘‘ఆర్అండ్డీపై మన దేశంలో స్థూల వ్యయాలు చాలా తక్కువగా ఉన్న విషయం తెలుసు. చాలా కాలంగా జీడీపీలో 0.7 శాతం వద్దే ఉండిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్అండ్డీపై వెచ్చిస్తున్న సగటు 2.3 శాతంతో పోల్చితే ఎంతో తక్కువ. దక్షిణ కొరియా, ఇజ్రాయెల్ కంటే కూడా చాలా తక్కువ. మన దేశంలో చేస్తున్న 0.7 శాతం వ్యయాల్లోనూ సగం ప్రభుత్వం భరిస్తున్నదే. కనుక భారత పరిశ్రమలు ఆర్అండ్డీపై మరిన్ని పెట్టుబడులు పెట్టాలి. దీన్ని వ్యయాలుగా చూడొద్దు. టెక్నాలజీని దిగుమతి చేసుకోవడానికి బదులు దాన్ని ఇక్కడే ఆవిష్కరించుకోవాలి. ఇతర దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్టీఏ) చేసుకుంటున్నందున భారత కంపెనీలు అంతర్జాతీయ పోటీని సవాలుగా తీసుకోవాలి’’అని రాజీవ్ సూచించారు. -
‘భవ్య’ పారిశ్రామిక పార్కులకు కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ: దేశీయ తయారీ (ఉత్పాదక) రంగానికి ఊతమివ్వడం, ప్రపంచ స్థాయి పారిశ్రామిక మౌలిక వసతులను అభివృద్ధి చేయడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రూ.33,660 కోట్లతో చేపట్టిన ‘భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన’ (భవ్య) అమలు ప్రక్రియను వేగవంతం చేసింది. తొలి దశలో 50 ‘ప్లగ్ అండ్ ప్లే’ ఇండ్రస్టియల్ పార్కుల ఏర్పాటుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి నాలుగు నెలల వ్యవధిలో ప్రతిపాదనలు ఆహా్వనిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఈ పథకానికి సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోటీ ఆధారిత ‘ఛాలెంజ్ మోడ్’ విధానంలో తొలి రెండు నెలల్లో 20, తదుపరి రెండు నెలల్లో మరో 30 పార్కులను ఎంపిక చేస్తామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026–27) నుంచి ఆరేళ్ల కాలవ్యవధిలో పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)తో దేశవ్యాప్తంగా మొత్తం 100 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయనున్నారు. 100–1000 ఎకరాల విస్తీర్ణంలో (కొండ ప్రాంత రాష్ట్రాల్లో అయితే 25 ఎకరాలు) ఏర్పాటు చేసే గ్రీన్ఫీల్డ్, బ్రౌన్ఫీల్డ్ ప్రాజెక్టులకు మౌలిక వసతుల కల్పన కోసం ఎకరానికి గరిష్టంగా రూ.1 కోటి వరకు కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తుంది. అదే ప్రైవేట్ భాగస్వామ్యంతో కూడిన ప్రాజెక్టులకైతే ఎకరానికి రూ.50 లక్షల వరకు సాయం అందుతుంది. భూమి, నీరు, విద్యుత్ లభ్యతతో పాటు మల్టీమోడల్ కనెక్టివిటీ, డిజిటల్ సింగిల్ విండో క్లియరెన్స్ వంటి సదుపాయాల ఆధారంగానే రాష్ట్రాల ప్రతిపాదనలను పరిశీలిస్తారు. క్లస్టర్ ఆధారిత అభివృద్ధితో ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, గ్లోబల్ ఇన్వెస్టర్లకు ‘రెడీ–టు–యూస్’ ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్ అందుబాటులోకి రానుండగా, ఈ పథకం ద్వారా దేశంలో 15 లక్షల ప్రత్యక్ష ఉద్యోగావకాశాలు లభించనున్నాయని కేంద్రం అంచనా వేస్తోంది.రూపాయి విలువపై ప్రభుత్వం జోక్యం చేసుకోదు: పీయూష్ గోయల్ ఫారెక్స్ (విదేశీ మారి్పడి) రేట్ల నిర్ణయంలో కేంద్ర ప్రభుత్వం ఎంతమాత్రం జోక్యం చేసుకోదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. రూపాయి విలువ అనేది అంతర్జాతీయ పరిణామాలు, మార్కెట్ శక్తులు, గ్లోబల్ ఆర్థిక పరిస్థితులపైనే ఆధారపడి ఉంటుందని తెలిపారు. గత రెండు ట్రేడింగ్ సెషన్లలో డాలర్తో పోలిస్తే రూపాయి గణనీయంగా బలపడిందని, ఇవన్నీ మార్కెట్ ఆధారిత మార్పులేనని వివరించారు. ఎగుమతుల ప్రోత్సాహం, దిగుమతులపై ఆధారాధారపడటాన్ని తగ్గించడం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్టీఏలు), ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కరణలు దేశ పారిశ్రామికీకరణకు ఎంతగానో దోహదపడతాయని గోయల్ పేర్కొన్నారు. -
చిన్న కార్ల కోట.. బద్దలు కొట్టడం కష్టమే!
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఇప్పుడు స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ (ఎస్యూవీ) కార్ల హవా కొనసాగుతోంది. కొత్త కార్ల కొనుగోళ్లలో ఎస్యూవీలు భారతీయుల తొలి ప్రాధాన్యతగా మారుతున్నాయి. అయితే సెకండ్హ్యాండ్ (యూజ్డ్) కార్ల మార్కెట్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ ఇప్పటికీ హ్యాచ్బ్యాక్ కార్ల ఆధిపత్యమే నడుస్తోంది. దేశవ్యాప్తంగా అత్యధికంగా కొనుగోలు చేసే టాప్–10 యూజ్డ్ కార్ల జాబితాలో హ్యుందాయ్ క్రెటా మాత్రమే ఏకైక ఎస్యూవీగా చోటు దక్కించుకుంది. కార్స్ 24 – టీమ్–బీహెచ్పీ విడుదల చేసిన ‘గేర్స్ ఆఫ్ గ్రోత్ 2025’ నివేదికలో ఈ ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం...భారత్లో సెకండ్హ్యాండ్ ఎస్యూవీ కార్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. యూజ్డ్ కార్ల మార్కెట్లో 2023లో 15 శాతంగా ఉన్న ఎస్యూవీల వాటా.. 2025 నాటికి 32 శాతానికి చేరుకుంది. మరోవైపు, ఒకప్పుడు మార్కెట్ను శాసించిన సెడాన్ కార్ల వాటా 28% నుంచి 16 శాతానికి పడిపోయింది. మార్కెట్లో ఎస్యూవీల డిమాండ్ పెరుగుతున్నప్పటికీ, మోడళ్ల వారీగా చూస్తే హ్యాచ్బ్యాక్ కార్ల ఆధిపత్యం ఇంకా కొనసాగుతూనే ఉంది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్–10 యూజ్డ్ కార్లలో ఏకంగా ఏడు స్థానాలను హ్యాచ్బ్యాక్ కార్లే ఆక్రమించాయి. చిన్న కార్లదే ఆధిపత్యం.. స్విఫ్ట్ టాప్ కస్టమర్లు కొనుగోలు చేస్తున్న టాప్–10 యూజ్డ్ కార్లలో ఏడు హ్యాచ్బ్యాక్లు, రెండు సెడాన్లు, ఒకే ఒక్క ఎస్యూవీ మాత్రమే ఉన్నాయి. తక్కువ నిర్వహణ ఖర్చు, నమ్మకమైన పనితీరు, నగర రహదారులకు అనువుగా ఉండటం వంటి కారణాలతో హ్యాచ్బ్యాక్లు ఇప్పటికీ యూజ్డ్ కార్ల మార్కెట్కు వెన్నెముకలా నిలుస్తున్నాయి. ‘గేర్స్ ఆఫ్ గ్రోత్ 2025’ నివేదిక ప్రకారం మారుతీ సుజుకీ స్విఫ్ట్ 4.93 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత మారుతీ సుజుకీ వేగన్ ఆర్ (3.47%), హ్యుందాయ్ ఐ10 (3.46%) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అనంతరం హోండా సిటీ, మారుతీ స్విఫ్ట్ డిజైర్, మారుతీ సుజుకీ బాలెనో, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10, హ్యుందాయ్ ఎలైట్ ఐ20లు స్థానాలు దక్కించుకున్నాయి. సుమారు 2.05% వాటాతో తొమ్మిదో స్థానంలో హ్యుందాయ్ క్రెటా(ఎస్యూవీ) నిలవగా... పదో స్థానంలో రెనో క్విడ్ నిలిచింది. మొత్తం పది స్థానాల్లో ఏకంగా ఏడు స్థానాలను హ్యాచ్బ్యాక్ కార్లే కైవసం చేసుకోవడం చూస్తుంటే.. భారతీయులు సెకండ్హ్యాండ్ మార్కెట్లో ఖర్చు, వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని చిన్న కార్లకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. డిమాండ్ ఉంది.. కానీ సప్లై లేదు: గడిచిన రెండేళ్లలో సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఎస్యూవీల వాటా 15% నుండి 32% కి పెరిగింది. ఇదే సమయంలో సెడాన్ కార్ల వాటా 28% నుండి 16% కి పడిపోయింది. అంటే ఎస్యూవీలపై క్రేజ్ పెరిగిన మాట వాస్తవమే. కానీ, టాప్–10 లో ఎక్కువ ఎస్యూవీలు లేకపోవడానికి ప్రధాన కారణం ‘‘సప్లై కొరత’’. సాధారణంగా ఒకరు కొత్త కారు కొన్నాక, కొన్ని ఏళ్ల తర్వాతే దాన్ని అమ్ముతారు. ప్రస్తుతం మార్కెట్లో కొత్త ఎస్యూవీల ట్రెండ్ నడుస్తోంది, కానీ అవి యూజ్డ్ కార్ మార్కెట్లోకి రావడానికి మరికొంత సమయం పడుతుంది. అందుకే మార్కెట్లో తక్కువ సమయం వాడిన ఎస్యూవీల లభ్యత పరిమితంగా ఉంది. డిమాండ్ పెరిగినా.. సరఫరా కొరత గడిచిన రెండేళ్లలో యూజ్డ్ కార్ల మార్కెట్లో ఎస్యూవీల వాటా 15 శాతం నుంచి 32 శాతానికి పెరగడం.. ఈ విభాగంపై ఆసక్తి ఎంతగా పెరిగిందో చూపిస్తోంది. అయితే టాప్–10లో మరిన్ని ఎస్యూవీలు కనిపించకపోవడానికి ప్రధాన కారణం సరఫరా కొరతేనని నివేదిక విశ్లేíÙంచింది. సాధారణంగా కొత్త కారు కొనుగోలు చేసిన తర్వాత కొన్ని ఏళ్లకే అది సెకండ్హ్యాండ్ మార్కెట్లోకి వస్తుంది. ప్రస్తుతం కొత్త కార్ల మార్కెట్లో ఎస్యూవీలకు భారీ డిమాండ్ ఉన్నప్పటికీ.. అవి యూజ్డ్ కార్ల మార్కెట్లోకి పూర్తిస్థాయిలో రావడానికి ఇంకా సమయం పడుతోంది. ప్రస్తుతం మార్కెట్లో కొత్త ఎస్యూవీల ట్రెండ్ నడుస్తోంది, కానీ అవి యూజ్డ్ కార్ మార్కెట్లోకి రావడానికి మరికొంత సమయం పడుతుంది. అందుకే మార్కెట్లో తక్కువ సమయం వాడిన ఎస్యూవీల లభ్యత తక్కువగా ఉంది.ఇప్పటికీ హ్యాచ్బ్యాక్లే ‘బ్యాక్బోన్’ ‘గేర్స్ ఆఫ్ గ్రోత్ 2025’ నివేదిక ప్రకారం భారత యూజ్డ్ కార్ల మార్కెట్లో ఇప్పటికీ హ్యాచ్బ్యాక్లదే కీలక పాత్ర. ప్రస్తుతం మొత్తం మార్కెట్లో 52 శాతం వాటాతో హ్యాచ్బ్యాక్లు ప్రధాన ఆధారంగా కొనసాగుతున్నాయి. అయితే భవిష్యత్తులో ప్రస్తుతం కొత్తగా అమ్ముడవుతున్న ఎస్యూవీలు యూజ్డ్ కార్ల మార్కెట్లోకి ప్రవేశించే కొద్దీ.. టాప్–10 జాబితాలో మరిన్ని ఎస్యూవీలు చోటు దక్కించుకునే అవకాశముందని నివేదిక అంచనా వేసింది. ప్రస్తుతం మాత్రం హ్యాచ్బ్యాక్ల ఆధిపత్యం మధ్య టాప్–10లో నిలిచిన ఏకైక ఎస్యూవీగా క్రెటా ప్రత్యేక గుర్తింపు పొందింది.క్రెటా సృష్టించిన ప్రీమియం మ్యాజిక్ ప్రీమియం ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్, భద్రతా ప్రమాణాలు, బ్రాండ్పై నమ్మకం వంటి అంశాల కారణంగా హ్యుందాయ్ క్రెటా టాప్–10లో చోటు దక్కించుకుంది. ఎక్కువ సంఖ్యలో కొనుగోలు అవుతున్న కార్ల జాబితాలోనే కాకుండా, ప్రీమియం యూజ్డ్ కార్ల జాబితాలో కూడా క్రెటా ముందంజలో నిలుస్తోంది. హోండా సిటీ, టాటా నెక్సాన్, హ్యుందాయ్ ఎలైట్ ఐ20 వంటి మోడళ్లతో కలిసి క్రెటా ప్రీమియం విభాగంలో బలమైన డిమాండ్ను నమోదు చేసింది.కొత్త కార్ల మార్కెట్లో ఎన్నో ఏళ్లుగా నంబర్ వన్ ఎస్యూవీగా ఉన్న క్రెటా.. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ మార్కెట్లోనూ నమ్మకమైన బ్రాండ్గా అవతరించింది. -
పన్ను వివాదం.. కోట్లు విరాళం ఇచ్చిన సీఈఓ!
అమెరికాలో కొనసాగుతున్న పన్నుల వివాదం.. మధ్య సెర్గే బ్రిన్ తీసుకున్న నిర్ణయం టెక్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీసింది. ఓవర్పెయిడ్ సీఈఓ ట్యాక్స్ అని పిలుస్తున్న వివాదాస్పద పన్ను ప్రతిపాదనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న రాజకీయ కమిటీకి ఈయన 5 లక్షల డాలర్లు (సుమారు రూ.4.80 కోట్లు) విరాళంగా ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా.. వ్యాపార సంస్థలకు అనుకూలంగా భావిస్తున్న మరో పన్ను ప్రతిపాదనకు కూడా ఆర్థిక సహాయం చేస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి.ప్రస్తుతం శాన్ ఫ్రాన్సిస్కోలో రెండు ముఖ్యమైన పన్ను ప్రతిపాదనలు చర్చనీయాంశంగా మారాయి. అవి 'మెజర్ సీ, మెజర్ డి'. వీటిపై జూన్ 2న ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది.మెజర్ Cకు వ్యాపార వర్గాలు మద్దతు ఇస్తున్నాయి. ఈ ప్రతిపాదన ప్రకారం.. చిన్న వ్యాపార సంస్థలకు పన్ను మినహాయింపు పరిమితిని 5 మిలియన్ డాలర్ల నుంచి 7.5 మిలియన్ డాలర్ల వరకు పెంచుతారు. దీని వల్ల చిన్న కంపెనీలకు ఊరట లభిస్తుందని భావిస్తున్నారు. అయితే.. పెద్ద కంపెనీలపై పన్ను భారం కొంత పెరుగుతుంది. అయినప్పటికీ, నగర ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుతూనే చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడమే దీని లక్ష్యమని మద్దతుదారులు చెబుతున్నారు.ఇక మెజర్ D మాత్రం పెద్ద వివాదానికి దారితీసింది. దీనిని ఓవర్పెయిడ్ సీఈఓ ట్యాక్స్ అని పిలుస్తున్నారు. ఈ ప్రతిపాదన ప్రకారం కంపెనీల్లో సీఈఓల జీతాలు, సాధారణ ఉద్యోగుల జీతాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల ఆధారంగా లెక్కిస్తారు. అంతేకాకుండా.. పన్ను రేట్లు పెరగడంతో పాటు భవిష్యత్తులో వాటిని తగ్గించడం కూడా కష్టమవుతుంది.కార్మిక సంఘాలు, కొన్ని సంస్థలు మెజర్ డీ ప్రతిపాదనకు మద్దతు ఇస్తున్నాయి. ధనిక కంపెనీలు సమాజానికి తగిన పన్ను చెల్లించాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు. కానీ వ్యాపార వర్గాలు మాత్రం.. ఈ విధానం వల్ల కంపెనీలు నగరాన్ని విడిచి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే శాన్ ఫ్రాన్సిస్కోలో ఆఫిసులు ఖాళీ అవడం, కంపెనీలు ఇతర ప్రాంతాలకు మారడం వంటివి జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఈ పన్ను విధానం ఆర్థిక పరిస్థితిని మరింత దెబ్బతీస్తుందని కొందరు విమర్శిస్తున్నారు.సెర్గే బ్రిన్ కూడా అధిక పన్నుల విధానాలకు వ్యతిరేకంగా తన అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేశారు. 1979లో తన కుటుంబం సోవియట్ యూనియన్లోని సామ్యవాద పాలన నుంచి అమెరికాకు వలస వచ్చిందని గుర్తుచేసుకుంటూ, 'సోషలిజం సమాజాన్ని ఎలా దెబ్బతీస్తుందో నేను స్వయంగా చూశాను. కాలిఫోర్నియా కూడా అలాంటి పరిస్థితికి వెళ్లకూడదు' అని వ్యాఖ్యానించారు.కాగా.. బ్రిన్ ఇటీవల తన నివాసాన్ని సిలికాన్ వ్యాలీ నుంచి నెవాడాలోని లేక్ టాహో సమీప ప్రాంతానికి మార్చినట్లు సమాచారం. నెవాడాలో కాలిఫోర్నియా మాదిరిగా అధిక రాష్ట్ర పన్నులు లేకపోవడం కూడా ఈ నిర్ణయానికి కారణమని భావిస్తున్నారు.ఇదీ చదవండి: ఆ టీమ్ వల్లే సమస్యలు.. అందుకే లేఆఫ్స్! -
ఆ టీమ్ వల్లే సమస్యలు.. అందుకే లేఆఫ్స్!
అమెరికాకు చెందిన ప్రముఖ ఫిన్టెక్ సంస్థ బోల్ట్ తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా.. తన మొత్తం హ్యూమన్ రిసోర్సెస్ (HR) విభాగాన్ని తొలగించింది. అంతేకాకుండా, మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 30 శాతం మందిని కూడా ఉద్యోగాల నుంచి తీసివేసింది. ఈ నిర్ణయాన్ని కంపెనీ సీఈఓ రయాన్ బ్రెస్లో సమర్ధించడం మరింత సంచలనం సృష్టించింది.హెచ్ఆర్ విభాగం కంపెనీలో అసలు లేని సమస్యలను సృష్టిస్తోందని.. ఆ టీమ్ను తొలగించిన తర్వాత సమస్యలు కూడా మాయమయ్యాయని రయాన్ బ్రెస్లో పేర్కొన్నారు. కంపెనీని వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి, పనితీరు మెరుగుపరచడానికి ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.బోల్ట్ సంస్థను రయాన్ బ్రెస్లో 2014లో ప్రారంభించారు. ఇది చాలా తక్కువ కాలంలోనే అమెరికాలో అత్యంత వేగంగా ఎదిగిన ఫిన్టెక్ స్టార్టప్లలో ఒకటిగా మారింది. కానీ.. 2022లో ఆయన సీఈఓ పదవి నుంచి తప్పుకున్న తర్వాత సంస్థ విలువ తగ్గడం ప్రారంభమైంది. ఆ తరువాత అనేకసార్లు ఉద్యోగుల తొలగింపులు జరిగాయి. 2025లో తిరిగి కంపెనీ బాధ్యతలను బ్రెస్లో చేపట్టారు. తరువాత కీలక మార్పులు చేసారు.ప్రస్తుతం బోల్ట్ సంస్థలో కేవలం 100 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నట్లు సమాచారం. ఈ సంఖ్య గతంతో పోలిస్తే చాలా తక్కువ. అయినప్పటికీ, కంపెనీ పనితీరు మెరుగైందని బ్రెస్లో చెబుతున్నారు. కస్టమర్లకు వేగంగా సేవలు అందుతున్నాయని, ఉద్యోగుల పనితీరు కూడా మెరుగుపడిందని తెలిపారు.ఇదీ చదవండి: కుక్కను చూసుకుంటే.. వారానికి రూ.2.4 లక్షలు! -
వస్తున్నాయ్ కొత్త కార్లు!
ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి.. ఇతర కార్ల మాదిరిగానే ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలను అభివృద్ధి చేస్తోంది. ఈ వాహనాలను జూన్లో ఢిల్లీలో జరిగే ఒక కార్యక్రమంలో విడుదల చేయనున్నట్లు నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.నాగ్పూర్లో నిర్వహించిన 19వ రోజ్గార్మేళాలో గడ్కరీ మాట్లాడుతూ.. భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లు, ద్విచక్ర వాహనాలు, బస్సులు, ఎలక్ట్రిక్ ట్రాక్టర్ల వినియోగం చాలా సంతోషాన్ని ఇస్తోందని అన్నారు. ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల గురించి చెబుతూ.. తాను టయోటా హైక్రాస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనం ఉపయోగిస్తున్న విషయాన్ని వెల్లడించారు.ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 5) సందర్భంగా.. మారుతి సుజుకి ఇథనాల్తో నడిచే వాహనాలను విడుదల చేయనుందని గడ్కరీ చెప్పారు. టయోటా, టాటా, మహీంద్రా, సుజుకి వంటి కంపెనీలు ఇప్పటికే అటువంటి వాహనాలపై పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. ఫ్లెక్స్-ఫ్యూయల్తో నడిచే ద్విచక్ర వాహనాలు కూడా రావడం ప్రారంభమయ్యాయి. చమురు దిగుమతులను తగ్గించడానికి అందరూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ వాడకాన్ని తగ్గించుకోవాలని గడ్కరీ సూచించారు.మారుతి సుజుకి ఇప్పటికే ఫ్రాంక్స్, వ్యాగన్ ఆర్ ఆధారంగా రెండు ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్ (FFV) కాన్సెప్ట్లను ప్రదర్శించింది. ఫ్రాంక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాన్ని గత సంవత్సరం జపాన్ మొబిలిటీ షోలో ప్రదర్శించారు. దీనిని 2026లో మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.ఇవి E85 (85% ఇథనాల్ కలిపిన పెట్రోల్) వరకు ఇథనాల్ మిశ్రమాలపై నడుస్తుంది. వ్యాగన్ ఆర్ కూడా ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనంగా లాంచ్ కానుంది. ఆటో ఎక్స్పో 2023, భారత్ మొబిలిటీ ఎక్స్పో 2025 రెండింటిలోనూ ప్రదర్శించిన ఈ కార్లు దాదాపు ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయి.ఇదీ చదవండి: కుక్కను చూసుకుంటే.. వారానికి రూ.2.4 లక్షలు! -
ఇంటి బంగారం ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందా?
ప్రపంచంలోనే బంగారాన్ని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాలలో భారతదేశం ఒకటి. ప్రతీ సంవత్సరం మనం 700 నుంచి 800 టన్నుల బంగారం దిగుమతి చేసు కుంటున్నాం. క్రూడ్ ఆయిల్ తరువాత భారతదేశం బంగారం పైనే పెద్ద మొత్తంలో దిగుమతి వ్యయం భరిస్తున్నదంటే ఆర్థిక వ్యవస్థపై బంగారం ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏటా బంగారం దిగుమతులపై 55 నుంచి 72 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తుందని గణాంకాలు చెబుతున్నాయి. ఇది జాతీయ జీడీపీలో 1.6%కి సమానం. డబ్లు్యజీసీ (వరల్డ్ గోల్డ్ కౌన్సిల్) నివేదిక ప్రకారం భారతీయ కుటుంబాల వద్ద సుమారు 25,000 టన్నుల బంగారం (దేవాలయా లలోని నిల్వలను కలుపుకొని) నిల్వ ఉంది. దీని విలువ సుమారు 2.4 ట్రిలియన్ డాలర్లు. దాయాది దేశమైన పాకిస్తాన్ జీడీపీ కంటే మన బంగారం నిల్వలు 6 రెట్లు అధికం. అయితే బంగారం దిగుమతి వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై పడు తున్న భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ (జీఎమ్ఎస్)ను మరోసారి తెరపైకి తెచ్చింది. ఈ పథకం ద్వారా, వ్యక్తులు బ్యాంకు లాకర్లలో, ఇండ్లలో నిరుపయోగంగా నిల్వ ఉన్న బంగారాన్ని వడ్డీ సంపాదించే ఆస్తిగా మార్చుకోవచ్చు. ఆభర ణాల రూపంలో ఉన్న బంగారాన్ని కరిగించి స్వచ్ఛతను పరీక్షించిన పిదప కడ్డీ రూపంలో బ్యాంక్లో నిర్ణీత కాలానికి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. బ్యాంకులు ఈ బంగారాన్ని గోల్డ్ మెటల్ లోన్స్ (జీఎమ్ ఎల్) ద్వారా నగల వ్యాపారులకు లీజుకు ఇచ్చి, వడ్డీ వసూలు చేయడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందుతాయి. కేంద్రబ్యాంకులు కూడా కరెన్సీ స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి, ఆర్థిక నష్టాలను నిర్వహించడానికి బంగారు నిల్వలను నిర్ణీత పరిమాణంలో కలిగి ఉంటాయి. 2015లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టగా అంతగా విజయవంతం కాలేదనే చెప్పాలి. ఒక దశాబ్ద కాలంలో ఈ పథకం ద్వారా కేవలం 39 టన్నుల బంగారాన్ని మాత్రమే వాడుక లోకి తేవడం జరిగింది.వడ్డీ కంటే అభిరుచి మిన్నబంగారు నగదీకరణ పథకం అంతగా విజయవంతం కాకపోవ డానికి కారణం, బంగారం 75% ఆభరణాల రూపంలో ఉండటం. స్త్రీలు తమ అభిరుచులకనుగుణంగా చేయించు కున్న నగల అసలు రూపాన్ని బ్యాంకులు ఇచ్చే 2 నుంచి 3 శాతం వడ్డీ కోసం కోల్పోవ డానికి ఇష్టపడటం లేదు. శుభ కార్యాలలో స్టేటస్ చిహ్నంగా ఆభర ణాలను స్త్రీలు ధరించడం, కొన్ని కుటుంబాలలో ఆభరణాలు వారస త్వంగా రావడం లాంటి కారణాల వల్ల చాలా కుటుంబాలు ఆభర ణాలను తమ వద్ద భద్రపరుచుకోవడానికే మొగ్గు చూపుతున్నాయి. చాలా మధ్య తరగతి కుటుంబాలు వ్యక్తిగత అవసరాల కోసం ఆభర ణాలను తనఖా పెట్టి రుణాలు తీసుకోవడం కూడా ఈ పథకానికి ఒక పరిమితి. గ్రామీణ ప్రాంతాలలో ఈ పథకం గురించి అవగాహన లేకపోవడం, డిపాజిట్పై బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేటు ఆకర్షించే విధంగా లేకపోవడం, భవిష్యత్తులో బంగారం ధరల గురించి అనిశ్చితి లాంటివి ఈ స్కీమ్ విజయానికి ప్రతిబంధకాలు.దేశ ఆర్థిక స్థితిపై బంగారం దిగుమతుల భారం తగ్గించాలంటే బంగారంపై ఉన్న సెంటిమెంట్ను దేశ ఆర్థిక భద్రత వైపు మళ్లించడానికి ప్రభుత్వాలు అవగాహన కల్పించాలి. ప్రజలనుగోల్డ్ ఈటీ ఎఫ్, సావరిన్ గోల్డ్ బాండ్స్లో పెట్టుబడి పెట్టేలా ప్రోత్స హించాలి. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ బలపడ టానికి, దిగు మతులను తగ్గించి విదేశీ మారక ద్రవ్య నిలువలను పటిష్టం చేయ డానికి ప్రతి భారతీయుడు తనవంతుగా సహక రించాల్సి ఉంది.– డా.ఎం. డి. ఖ్వాజా మొయినుద్దీన్ స్టాక్ మార్కెట్ విశ్లేషకులు దేశ ఆర్థిక స్థితిపై బంగారం దిగుమతుల భారం తగ్గించాలంటే బంగారంపై ఉన్న సెంటిమెంట్ను దేశ ఆర్థిక భద్రత వైపు మళ్లించడానికి ప్రభుత్వాలు అవగాహన కల్పించాలి. -
పదేళ్ల కనిష్ఠానికి గోల్డ్ డిమాండ్.. కారణాలివే!
భారతదేశంలో బంగారు ఆభరణాలకు ఎప్పటి నుంచో.. ప్రత్యేక స్థానం ఉంది. పెళ్లిళ్లు, పండుగలు, కుటుంబ వేడుకలు వంటి ప్రతి ముఖ్యమైన సందర్భంలో బంగారం కొనడం ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది. అయితే.. ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరగడం వల్ల సాధారణ ప్రజలకు కొత్త ఆభరణాలు కొనడం కష్టంగా మారుతోంది. పసిడి తన మెరుపును కోల్పోలేదు కానీ అది మధ్యతరగతి, సాధారణ కుటుంబాల అందుబాటుకు దూరమవుతోంది.రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ తన నివేదికలో.. బంగారు ఆభరణాల అమ్మకాల తగ్గుతున్నట్లు తెలిసింది. ప్రజలు కొనుగోలు చేసే బంగారం బరువు తగ్గుతోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో బంగారం అమ్మకాల పరిమాణం సుమారు 8% తగ్గిందని, ఇంకా ఈ ఏడాది 13-15% వరకు తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఇది గత పదేళ్లలోనే కనిష్ట స్థాయి అని పేర్కొంది. దీనికి కారణం ధరల పెరుగుదల, దిగుమతి సుంకం పెంపు.భారతదేశంలో వినియోగించే బంగారం ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి అవుతుంది. ప్రభుత్వం ఇటీవల దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతం వరకు పెంచింది. దీని వల్ల బంగారం ధరలు మరింత పెరిగాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1,60,000 వరకు చేరింది. అందువల్ల ప్రజలు అవసరమైన ఆభరణాలకే పరిమితం అవుతున్నారు.అయితే.. బంగారం అమ్మకాల పరిమాణం తగ్గినా, దాని విలువ మాత్రం పెరుగుతోంది. ఎందుకంటే తక్కువ బంగారం కొనుగోలు చేసినా, అధిక ధర చెల్లించాల్సి వస్తోంది. ఈ కారణంగా జువెలరీ కంపెనీల ఆదాయం 20-25% వరకు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అంటే కంపెనీలు అమ్మే బంగారం బరువు తగ్గినా, అధిక ధరల వల్ల వారి ఆదాయం తగ్గడం లేదు.ఇదీ చదవండి: కుక్కను చూసుకుంటే.. వారానికి రూ.2.4 లక్షలు! -
హోండా తొలి ఎలక్ట్రిక్ కారు: లాంచ్ ఎప్పుడంటే?
జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం హోండా కార్స్ ఇండియా భారత మార్కెట్లో విస్తరణకు భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. పాపులర్ సెడాన్ మోడల్ సిటీలో ‘న్యూ సిటీ హైబ్రిడ్’ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.11.99 లక్షలు. ఇదే సమయంలో కంపెనీ.. ప్రీమియం ఎస్యూవీ ‘జెడ్ఆర్–వీ’ను భారత మార్కెట్కు పరిచయం చేసింది.ఈ సందర్భంగా హెచ్సీఐఎల్ ప్రెసిడెంట్, సీఈవో టకాషీ నకజిమా మాట్లాడుతూ, ఈ రెండు మోడళ్లతో కలిపి 2026–27 లో మొత్తం ఆరు వ్యూహాత్మక మోడళ్లను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ కొత్త లాంచ్లు భారత మార్కెట్లో హోండా బ్రాండ్ను మరింత బలోపేతం చేయడంతో పాటు, కంపెనీ అమ్మకాలలో రెండంకెల వృద్ధి సాధించడంలో దోహదపడతాయని ధీమా వ్యక్తం చేశారు. భారత్లో తొలి పూర్తి ఎలక్ట్రిక్ వాహనాన్ని 2026–27 ద్వితీయార్థంలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. 2030 నాటికి ఈవీలు, కాంపాక్ట్ ఎస్యూవీలు సహా పదికి పైగా కొత్త మోడళ్లను భారత్లో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. -
ఆర్బీఐ నుంచి రికార్డు స్థాయిలో డివిడెండ్ బదిలీ!
దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. 2026 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో రూ.2.87 లక్షల కోట్ల మిగులు నిధులను (డివిడెండ్) బదిలీ చేసేందుకు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం ఆమోదం తెలిపింది. ఈ భారీ బదిలీ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణకు అండగా నిలవనుంది.గత ఏడాది బదిలీ చేసిన రూ.2.68 లక్షల కోట్ల కంటే ఇది ఎక్కువైనప్పటికీ మార్కెట్ నిపుణుల అంచనాల కంటే స్వల్పంగా తక్కువ కావడం గమనార్హం. అదే సమయంలో, పెరిగిపోతున్న ప్రపంచ ఆర్థిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా తన కంటింజెంట్ రిస్క్ బఫర్ (భవిష్యత్తులో వచ్చే ఊహించని ఆర్థిక నష్టాలు, మార్కెట్ ఒడిదుడుకులు లేదా ప్రపంచ ఆర్థిక సంక్షోభాలను తట్టుకోవడానికి ఆర్బీఐ పక్కన పెట్టే అత్యవసర నిధి) కూడా ఆర్బీఐ గణనీయంగా పెంచింది.ఆర్థిక ఒత్తిళ్ల నడుమ వెసులుబాటుప్రస్తుతం అంతర్జాతీయంగా ముడి చమురు ధరల అస్థిరత, సబ్సిడీల భారం, మందగిస్తున్న ఆర్థిక వృద్ధి రేటు వంటి సవాళ్లను కేంద్రం ఎదుర్కొంటోంది. ఇలాంటి తరుణంలో ఆర్బీఐ నుంచి అందిన ఈ రికార్డు డివిడెండ్ ప్రభుత్వ ఖజానాకు గట్టి ఉపశమనాన్ని ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు (ముఖ్యంగా ఇరాన్పై అమెరికా యుద్ధం) కమ్ముకుంటున్న వేళ ద్రవ్యలోటును అదుపులో ఉంచడానికి ఈ నిధులు ఎంతవరకు సరిపోతాయనే అంశంపై ఆర్థికవేత్తల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇదీ చదవండి: మిడిల్ మేనేజ్మెంట్ అంతం? -
కుక్కను చూసుకుంటే.. వారానికి రూ.2.4 లక్షలు!
పెంపుడు జంతుల మీద ప్రేమ చూపించేవాళ్ల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. తమకు ఇష్టమైన కుక్కలు, పిల్లులు మొదలైనవాటి కోసం ఎంతైనా ఖర్చుపెట్టే రోజులు కూడా వచ్చేసాయి. ఇప్పుడు అమెరికాలో 'డాగ్ నానీ'లకు డిమాండ్ ఎక్కువైంది. ధనిక కుటుంబాలు తమ పెంపుడు కుక్కలను కుటుంబ సభ్యుల్లాగే చూసుకుంటూ ఉంటారు. కాబట్టి వాటిని చూసుకునే ప్రొఫెషనల్ కేర్టేకర్లను నియమించుకుంటున్నారు. అధికమొత్తంలో జీతాలు కూడా ఇస్తున్నారు.అమెరికాలో ఫుల్టైమ్ డాగ్ నానీలు వారానికి 2,500 డాలర్లకుపైగా, అంటే.. భారత కరెన్సీలో దాదాపు రూ.2.4 లక్షలు వరకు సంపాదిస్తున్నారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.కరోనా లాక్డౌన్ సమయంలో చాలా మంది ఇంటి నుంచే పని చేయడం వల్ల.. తమ పెంపుడు జంతువులతో ఎక్కువ సమయం గడిపారు. దీంతో వాటిపై అనుబంధం పెరిగింది. ఫలితంగా పెంపుడు జంతువుల సంరక్షణను కూడా చాలా బాధ్యతగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో ధనిక కుటుంబాలు తమ కుక్కల కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించుకోవడం సాధారణమవుతోంది.డాగ్ నానీల పని కేవలం కుక్కను బయటకు తీసుకెళ్లడం మాత్రమే కాదు. వాటికి సమయానికి ఆహారం పెట్టడం, వాకింగ్ చేయించడం, గ్రూమింగ్ అపాయింట్మెంట్లు బుక్ చేయడం, మందులు ఇవ్వడం, యజమానులు విదేశీ ప్రయాణాలకు వెళ్లినప్పుడు వెంట తీసుకెళ్లడం వంటి బాధ్యతలూ ఉంటాయి. కొందరు నానీలు యజమానులు ఇళ్లలోనే ఉంటారు. వారికి వసతి, భోజనం, ఆరోగ్య బీమా, ప్రయాణ ఖర్చులు కూడా యజమానులే భరిస్తున్నారు.కుక్కలను సంరక్షించడంలో అనుభవం ఉన్నవారు గంటకు 40 నుంచి 50 డాలర్లు సంపాదిస్తున్నారు. మరికొందరు రోజుకు 500 నుంచి 800 డాలర్ల వరకు సంపాదించుకుంటున్నట్లు సమాచారం. గతంలో బ్రిటన్లో ఒక కుటుంబం తమ పెంపుడు కుక్క కోసం సంవత్సరానికి లక్ష పౌండ్ల (రూ. కోటి కంటే ఏక్కువ) జీతంతో డాగ్ నానీ ఉద్యోగ ప్రకటన ఇచ్చి వార్తల్లో నిలిచింది.పెట్ కేర్ రంగం ఉత్తర అమెరికాలో వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం అక్కడ పెట్ సిట్టింగ్, జంతు సంరక్షణ సేవలకు సంబంధించిన లక్షలాది ఉద్యోగాలు ఉన్నాయని మార్కెట్ అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రత్యేక శిక్షణ పొందిన లేదా సర్టిఫికేషన్ ఉన్న కేర్టేకర్లు మరింత ఎక్కువ సంపాదించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద నగరాల్లో పెంపుడు జంతువుల పెంపకం పెరుగుతున్న కొద్దీ ఈ ఉద్యోగాలకు డిమాండ్ కూడా పెరుగుతోంది.ఇదీ చదవండి: రూ.50 వేల అప్పుతో మొదలై.. రూ.8,000 కోట్ల సామ్రాజ్యం! -
బంగారం, వెండిపై కియోసాకి కొత్త అంచనాలు!
ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్టర్, బెస్ట్ సెల్లర్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా భారీ ఆర్థిక సంక్షోభం (మార్కెట్ క్రాష్) రాబోతోందని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఆయన తన అధికారిక సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.ఈ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో బంగారం, వెండి ధరలు ఊహించని రీతిలో దూసుకుపోతాయని కియోసాకి అంచనా వేశారు.బంగారం, వెండిపై కియోసాకి అంచనాలు ఇవేప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు జిమ్ రిచర్డ్స్ అంచనాలను ప్రస్తావిస్తూ కియోసాకి ఈ వివరాలను పంచుకున్నారు.బంగారం ధర: ప్రస్తుతం మార్కెట్లో ఔన్స్ బంగారం ధర సుమారు 4,500 డాలర్లుగా ఉంటే... అది భవిష్యత్తులో ఏకంగా 1,00,000 (ఒక లక్ష) డాలర్లకు చేరుకుంటుందని జిమ్ రిచర్డ్స్ పేర్కొన్నట్లు కియోసాకి తెలిపారు.వెండి ధర: ప్రస్తుతం మార్కెట్లో ఔన్స్ వెండి ధర సుమారు 75 డాలర్లుగా ఉంది. అయితే రాబోయే రోజుల్లో ఇది 200 డాలర్లను తాకుతుందని తాను భావిస్తున్నట్లు కియోసాకి పేర్కొన్నారు."సంక్షోభంలోనూ ధనవంతులు కావచ్చు"భవిష్యత్తును ముందుగానే ఊహించి, దానికి తగ్గట్టుగా ముందస్తు చర్యలు (పెట్టుబడులు) తీసుకోగలిగినవారే అత్యుత్తమ ఇన్వెస్టర్లు అవుతారని కియోసాకి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు."రాబోయే ఆర్థిక సంక్షోభానికి మీరు బాధితులుగా మిగిలిపోవాల్సిన అవసరం లేదు. సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఈ సంక్షోభ సమయంలోనూ మీరు మరింత ధనవంతులు కావచ్చు. జాగ్రత్తగా ఉండండి" అంటూ ఆయన ఇన్వెస్టర్లకు పిలుపునిచ్చారు.సాధారణంగా ఆర్థిక వ్యవస్థలు సంక్షోభంలో పడినప్పుడు ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం, వెండి వైపు మొగ్గు చూపుతారు. ఈ నేపథ్యంలోనే కియోసాకి చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు అంతర్జాతీయ మదుపర్లలో చర్చనీయాంశంగా మారింది.Crash imminent.Jim Richard’s calls for gold to get to$ 100,000Today gold is at $4,500I think silver will hit $200 an ounceToday silver is at $75.What do you think?The best investors are able to see the future and take action. Remember you do not have to be a…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 23, 2026 -
‘ఇంటికి వచ్చేయండి.. భారత్ గర్వపడేలా చేద్దాం’
అమెరికాలో తాత్కాలిక వీసాలపై నివసిస్తూ గ్రీన్ కార్డుల కోసం దశాబ్దాలుగా నిరీక్షిస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు ప్రముఖ క్లౌడ్ సాఫ్ట్వేర్ దిగ్గజం జోహో సహ వ్యవస్థాపకుడు, చీఫ్ సైంటిస్ట్ శ్రీధర్ వెంబు మరోసారి విజ్ఞప్తి చేశారు. పరాయి దేశంలో అనిశ్చితి మధ్య కాలం వెళ్లదీసే కంటే స్వదేశానికి తిరిగి వచ్చి దేశ వృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ‘దయచేసి మాతృభూమికి తిరిగి వచ్చేయండి. ఇది కొంత కష్టంతో కూడుకున్నది. త్యాగంతో కూడినదే కావచ్చు.. కానీ, జీవితంలో ఆత్మగౌరవం అనేదే మీ మార్గాన్ని నిర్దేశించాలి. అంతా కలిసి భారత్ గర్వపడేలా చేద్దాం’ అంటూ ఆయన ఎక్స్ ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు.అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ఇటీవల గ్రీన్ కార్డ్ నిబంధనలపై చేసిన ఒక కఠినమైన ప్రకటనను ఉటంకిస్తూ శ్రీధర్ వెంబు ఈ వ్యాఖ్యలు చేశారు. ‘తాత్కాలికంగా యూఎస్లో ఉంటూ, గ్రీన్ కార్డ్ కోరుకునే ఏ విదేశీయుడైనా సరే.. దరఖాస్తు ప్రక్రియ కోసం ముందుగా తమ స్వదేశానికి తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. మా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలోని లొసుగులను వాడుకోవడానికి బదులు, చట్టం తన పని తాను చేసుకుపోయేందుకే ఈ విధానాన్ని తెచ్చాం. దేశ వలస విధానాన్ని దుర్వినియోగం చేసే కాలం ఇక ముగిసింది’ అని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ తెలిపింది.డీహెచ్ఎస్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా, ముఖ్యంగా అమెరికాలోని భారతీయ టెక్ ఉద్యోగుల్లో కలకలం రేపాయి. గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్లు, ఇమ్మిగ్రేషన్ అనిశ్చితి, హెచ్-1బీ వీసాదారుల భవిష్యత్తుపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలోనే శ్రీధర్ వెంబు స్పందిస్తూ భారతీయులకు స్వదేశీ పిలుపునిచ్చారు.నెటిజన్లలో భిన్నాభిప్రాయాలువెంబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గత దశాబ్ద కాలంలో భారతదేశంలో స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ, ఏఐ ఇండస్ట్రీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు అద్భుతంగా వృద్ధి చెందాయని పలువురు వెంబు వ్యాఖ్యలను సమర్థించారు. భారత్లోనే ఇప్పుడు అపారమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. భారతదేశంలో అమెరికా తరహా భారీ జీతాలు లేకపోవడం, అధిక పన్నులు, టాక్సిక్ వర్క్ కల్చర్, మౌలిక సదుపాయాల కొరత, జీవన ప్రమాణాలు ఆశించిన స్థాయిలో లేకపోవడాన్ని కొందరు ఎత్తి చూపారు.‘భారత్-ఫస్ట్’ వృద్ధి నమూనాశ్రీధర్ వెంబు కేవలం పిలుపునివ్వడమే కాకుండా స్వయంగా ‘భారత్-ఫస్ట్’ వృద్ధి నమూనాను అమలు చేసి చూపిస్తున్నారు. సిలికాన్ వ్యాలీ తరహా కేంద్రీకృత మోడల్ను వ్యతిరేకించే ఆయన సాంకేతికతను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని ఆకాంక్షిస్తున్నారు. ఆయన నాయకత్వంలో జోహో తన కార్యకలాపాలను పెద్ద నగరాలకే పరిమితం చేయకుండా తమిళనాడులోని తెన్కాసి వంటి చిన్న పట్టణాలకు విస్తరించింది.ఇదీ చదవండి: మిడిల్ మేనేజ్మెంట్ అంతం? -
‘బుల్లెట్ 650’ బండి వచ్చేస్తోంది..
భారతీయ రోడ్లపై దశాబ్దాలుగా రారాజుగా వెలుగొందుతున్న ‘రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్’ ఇప్పుడు మరింత శక్తిమంతమైన అవతారంలో వస్తోంది. దేశీయ మార్కెట్లో ప్రీమియం, హై-కెపాసిటీ బైక్లకు ఉన్న భారీ డిమాండ్ను అందిపుచ్చుకోవడానికి కంపెనీ తన సరికొత్త ‘బుల్లెట్ 650’ (Bullet 650) మోడల్ను తీసుకువస్తోంది. ఇప్పటికే డీలర్షిప్లకు బైక్ల రవాణా కూడా ప్రారంభమవడంతో, ఈ ఐకానిక్ బైక్ విడుదలపై బైక్ ప్రియుల్లో అంచనాలు భారీగా పెరిగాయి.మిలన్లో జరిగిన అంతర్జాతీయ ఆటో షో (EICMA 2025) తో పాటు, గోవాలో నిర్వహించిన మోటోవర్స్ 2025 వేదికపై ఈ బైక్ను కంపెనీ తొలిసారిగా ప్రదర్శించింది. అప్పటినుంచే ఆటోమొబైల్ రంగంలో దీనిపై విస్తృత చర్చ జరుగుతోంది.లాంచ్ ఎప్పుడు.. ధర ఎంత?రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 650 మోడల్ 2026 జూన్ లేదా జూలై మొదటి వారంలో అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది. దీని సుమారు రూ.3.40 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం కావచ్చని అంచనా. బుల్లెట్కే విలక్షణమైన సాంప్రదాయక లుక్, గంభీరమైన శబ్దం, నిటారుగా ఉండే రైడింగ్ పొజిషన్ను ఇందులోనూ కొనసాగించనున్నారు.విస్తరిస్తున్న 650 సీసీ పోర్ట్ఫోలియోఐషర్ మోటార్స్ లిమిటెడ్ FY26 ఆర్థిక ఫలితాల సమావేశంలో రాయల్ ఎన్ఫీల్డ్ సీఈవో బి. గోవిందరాజన్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. "మా ప్రణాళికల్లో ఉన్న బుల్లెట్ 650 మార్కెట్లోకి రావడానికి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రాథమిక ప్రక్రియలు ప్రారంభమయ్యాయి" అని ఆయన పేర్కొన్నారు.రాయల్ ఎన్ఫీల్డ్ లైనప్లో ఇప్పటికే ఇంటర్సెప్టర్, కాంటినెంటల్ జీటీ, సూపర్ మెటియోర్, షాట్గన్, బేర్ వంటి పాపులర్ 650 సీసీ బైక్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి అత్యంత పురాతన, నమ్మకమైన బ్రాండ్ అయిన ‘బుల్లెట్’ కూడా చేరబోతుండటం గమనార్హం. -
గ్రీన్ కార్డ్ విధానంపై ఇండస్ట్రీలో అలజడి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని వైట్ హౌస్ యంత్రాంగం తీసుకొచ్చిన సరికొత్త ఇమ్మిగ్రేషన్ విధానాలు ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో కలకలం రేపుతున్నాయి. చట్టబద్ధమైన గ్రీన్ కార్డ్ నిబంధనలను కఠినతరం చేస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అమెరికా టెక్ దిగ్గజాలు, సిలికాన్ వ్యాలీ పెట్టుబడిదారులు, ఇమ్మిగ్రేషన్ నిపుణులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్పులు అమెరికా ఆర్థిక పురోగతిని, అంతర్జాతీయంగా ఉన్న ఆవిష్కరణల సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.అమెరికా ఏఐ భవిష్యత్తుకే ముప్పుతాజా గ్రీన్ కార్డ్ మార్గదర్శకాల ప్రకారం, దరఖాస్తుదారులు అమెరికా వెలుపల నుంచే ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనిపై లింక్డ్ఇన్ సహ వ్యవస్థాపకుడు, మాజీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రీడ్ హాఫ్మాన్ సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రస్తుతం అమెరికా టెక్ ఎకోసిస్టమ్లో శ్రమిస్తున్న ఏఐ పరిశోధకులు, కీలక ఉద్యోగులు, అంతర్జాతీయ విద్యార్థులు ఇప్పుడు ఈ సుదీర్ఘ బ్యాక్లాగ్ ప్రక్రియ కోసం దేశాన్ని విడిచి వెళ్లాలా? ఇది టెక్ రంగానికే కాదు, మొత్తం అమెరికా వ్యాపార రంగానికి కోలుకోలేని హాని కలిగించే చర్య’ అని హాఫ్మాన్ విమర్శించారు.ప్రముఖ ఏఐ శాస్త్రవేత్త, కోర్సెరా సహ వ్యవస్థాపకుడు ఆండ్రూ ఎన్జీ సైతం ఈ విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. వైట్ హౌస్ తీసుకున్న ఈ నిర్ణయం చట్టబద్ధమైన వలసలపై జరుగుతున్న దాడిగా ఆయన అభివర్ణించారు. దీనివల్ల ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు, వైద్యులు, ఉపాధ్యాయుల కొరత ఏర్పడుతుందన్నారు. కృత్రిమ మేధ రంగంలో అమెరికా ప్రపంచ దేశాలతో పోటీపడే శక్తిని కోల్పోతుందని హెచ్చరించారు.స్టార్టప్లకు ముప్పుఅక్రమ వలసలను అరికట్టే చర్యలను తాము సమర్థిస్తామని, అయితే నైపుణ్యం కలిగిన కార్మికులను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని స్టార్టప్ వ్యవస్థాపకులు అభిప్రాయపడుతున్నారు. బూమ్ సూపర్సోనిక్ వ్యవస్థాపకుడు, సీఈఓ బ్లేక్ స్కోల్ స్పందిస్తూ..‘ఎంతో కష్టపడి పనిచేసే ప్రతిభావంతులు అమెరికాకు రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదు’ అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.ప్రస్తుతం అమెరికాలో చట్టబద్ధంగా ఉంటూ O1 లేదా H1B వీసాలపై పనిచేస్తున్న అత్యున్నత స్థాయి నిపుణులు, శాస్త్రవేత్తలు, బిలియన్ డాలర్ల కంపెనీల వ్యవస్థాపకులు ఇప్పుడు తమ పనిని ఆపేసి స్వదేశాలకు వెళ్లిపోవాలా? ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న బ్యాక్లాగ్ క్లియరెన్స్ కోసం వారు తమ దేశాల్లో వేచి ఉండటం అసాధ్యం. యుద్ధాలు, అంతర్గత కలహాల వల్ల తీవ్రంగా నష్టపోయిన దేశాల నుంచి వచ్చిన వలసదారులు, ప్రస్తుత పరిస్థితుల్లో తమ స్వదేశాలకు తిరిగి వెళ్లడం ప్రాణసంకటంగా మారుతుందని డేవిడోవ్ వెంచర్స్ ఫౌండర్, నిక్ డేవిడోవ్ గుర్తుచేశారు.చట్టసభ సభ్యుల ఆగ్రహంఈ కొత్త నిబంధన ఇప్పటికే తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను మరింత కుదేలు చేస్తుందని చట్టసభ ప్రతినిధి యెవెట్ క్లార్క్ మండిపడ్డారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్న కష్టజీవులను దేశం నుంచి తరిమికొట్టడమేనని, విచ్ఛిన్నమైన వ్యవస్థను ఈ నిర్ణయం మరింత సర్వనాశనం చేస్తుందని ఆమె విమర్శించారు.ఇదీ చదవండి: మిడిల్ మేనేజ్మెంట్ అంతం? -
మిడిల్ మేనేజ్మెంట్ అంతం?
సాంకేతిక ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సృష్టిస్తున్న ప్రకంపనలు ఉద్యోగ మార్కెట్ను తిరగరాస్తున్నాయి. నిన్నటివరకు ఏఐ కేవలం క్లిష్టమైన కోడింగ్ లేదా క్రియేటివ్ పనులను మాత్రమే ప్రభావితం చేస్తుందని భావించిన కార్పొరేట్ లోకానికి క్లౌడ్ ఫ్లేర్ సీఈఓ మాథ్యూ ప్రిన్స్ షాకింగ్ నిజాలను వెల్లడించారు. ఏఐ కాలగర్భంలో కలిసిపోయే ఉద్యోగాలు ఏవి? భవిష్యత్తులో మనుగడ సాగించే విభాగాలు ఏమిటి? అనే అంశాలపై ఆయన చేసిన విశ్లేషణ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టెక్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. కంపెనీ అద్భుతమైన వృద్ధి రేటుతో దూసుకుపోతున్నప్పటికీ తమ ఉద్యోగుల్లో ఏకంగా 20 శాతానికి పైగా సిబ్బందిని తొలగించామని ప్రిన్స్ ప్రకటించడం ఐటీ రంగాన్ని విస్మయానికి గురిచేసింది.ఆర్థిక సంక్షోభం కాదు.. ఏఐ తెచ్చిన మార్పు!సాధారణంగా ఏ కంపెనీ అయినా ఉద్యోగులను తొలగించిందంటే దానికి ఆర్థిక నష్టాలు లేదా వ్యాపార మందగమనం కారణం అవుతుంది. కానీ, క్లౌడ్ ఫ్లేర్ కథ వేరు. కంపెనీ 30 శాతానికి పైగా బలమైన వృద్ధి రేటును నమోదు చేస్తోంది. ఉచిత నగదు ప్రవాహం కూడా బలంగా ఉంది. మరి ఈ లేఆఫ్స్కు కారణం ఏమిటి? దీనికి సీఈఓ మాథ్యూ ప్రిన్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో స్పష్టతనిచ్చారు.‘అమెరికా వ్యాపార చరిత్రలోనే 30 శాతానికి పైగా వృద్ధి చెందుతున్న ఒక పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ తన ఉద్యోగుల్లో 20 శాతం కంటే ఎక్కువ మందిని తొలగించిన దాఖలాలు లేవు. ఇది ఆర్థిక పనితీరు వల్ల జరిగింది కాదు.. ఏఐ వల్ల కంపెనీ నిర్వహణ శైలిలో వస్తున్న మార్పుల వల్ల జరిగింది’ అన్నారు.టార్గెట్ మిడిల్ మేనేజ్మెంట్చాలామంది ఎగ్జిక్యూటివ్లు ఏఐ మొదట ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తుందనే విషయంలో తప్పుడు అంచనాలతో ఉన్నారని ప్రిన్స్ అభిప్రాయపడ్డారు. ‘ఏఐ ప్రాథమికంగా బిల్డర్లు (ఉత్పత్తులను తయారు చేసేవారు) లేదా సెల్లర్లు (విక్రయించేవారు) జోలికి వెళ్లడం లేదు. దానికి బదులు వ్యాపార పనితీరును అంచనా వేసే, పర్యవేక్షించే, నివేదికలు ఇచ్చే మెజర్మెంట్ (కొలత/పర్యవేక్షణ) పాత్రలను తుడిచిపెట్టేస్తోంది’ అన్నారు.ఏఐ పర్యవేక్షణ ఎందుకు సమర్థవంతమైనది?గతంలో కంపెనీలు తమ వ్యాపార నష్టాలను, పురోగతిని ప్రతి త్రైమాసికానికి ఒకసారి మాన్యువల్గా సమీక్షించేవి. కానీ ఇప్పుడు ఏఐ సాధనాలు నిరంతరాయంగా కార్యకలాపాలను ఆడిట్ చేయగలవు. గతంలో మానవ మేధస్సుకు కష్టతరమైన సామర్థ్యాలను ఏఐ క్షణాల్లో పూర్తి చేస్తోంది. ఏఐ పుణ్యమా అని పెద్ద టీమ్లను పర్యవేక్షించడం మేనేజర్లకు సులువైంది. దీనివల్ల మధ్యస్థాయి మేనేజ్మెంట్ అవసరం లేకుండా పోయింది. ‘గత వారం మేము తొలగించిన వారిలో ఎక్కువ మంది ఇలాంటి ‘మెజర్మెంట్’ పాత్రల్లో ఉన్నవారే’ అని ప్రిన్స్ స్పష్టం చేశారు.ఏఐ యుగంలో మనుగడ సాగించేవి ఇవే..మాథ్యూ ప్రిన్స్ విశ్లేషణ ప్రకారం.. ఏఐ ఎంత వేగంగా విస్తరించినప్పటికీ మార్కెట్లో స్థిరంగా నిలబడేవి, భవిష్యత్తులో కంపెనీలకు అత్యంత అవసరమయ్యేవి కేవలం రెండు పాత్రలు మాత్రమే.బిల్డర్లు: కొత్త ఉత్పత్తులు, సేవలు, సాంకేతికతలను సృష్టించేవారు (ఉదాహరణకు: డెవలపర్లు, డిజైనర్లు).సెల్లర్లు: క్లయింట్లతో సంబంధాలను పెంపొందించుకుంటూ కంపెనీ సేవలను మార్కెట్లోకి తీసుకెళ్లి విక్రయించేవారు.కంపెనీ వ్యూహాలకు అద్దం పడుతూ.. క్లౌడ్ ఫ్లేర్ ఈ వేసవిలో 1,111 పెయిడ్ ఇంటర్న్షిప్ల కోసం నోటిఫికేషన్ ఇవ్వగా ఏకంగా 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎంపికైన యువ ప్రతిభావంతులను ప్రిన్స్ ఏఐ-నేటివ్స్గా అభివర్ణించారు. వీరంతా ఉత్పత్తులను నిర్మించడం లేదా విక్రయించడం అనే అంశాలపైనే దృష్టి పెట్టనున్నారు.టెక్ ప్రపంచంలో మిశ్రమ స్పందనలుప్రిన్స్ చేసిన వ్యాఖ్యలు ఆన్లైన్లో చర్చకు దారితీశాయి. కొందరు నెటిజన్లు ఆయన విశ్లేషణను సమర్థిస్తున్నారు. సాంప్రదాయ కార్పొరేట్ నిర్మాణాల్లో ఉండే అనవసరమైన మధ్యస్థాయి బ్యూరోక్రసీని తగ్గించడానికి ఏఐ ఉపయోగపడుతుందని వారు వాదిస్తున్నారు. అయితే, నాణేనికి మరోవైపు ఉన్న ప్రమాదాన్ని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం ఏఐ ఇచ్చే కొలమానాలు, నంబర్లపైనే అతిగా ఆధారపడితే కంపెనీల్లో కొత్త ప్రయోగాలు, దీర్ఘకాలిక ఆవిష్కరణలు కుంటుపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: స్పేస్ ఎక్స్ ఐపీఓ.. మనోడి పంట పండింది! -
పసిడి పతనం.. రెండో రోజూ గుడ్న్యూస్
దేశంలో బంగారం ధరలు తగ్గుదల బాటపట్టాయి. పసిడి ధరలు నేడు (Today Gold Rate) వరుసగా రెండో రోజూ దిగివచ్చాయి. పుత్తడి ధరలు స్థిరంగా తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుదారులకు ఊరట కొనసాగుతోంది. ఇక వెండి ధరలు (Today Silver Rate) ఈరోజు ఎటువంటి మార్పు లేకుండా నిలకడగా కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
సంపాదనలో సగానికే పన్ను.. ఈ ఐటీ రూల్ తెలుసా?
ఈ రోజుల్లో ఉద్యోగాలతో పాటు ఫ్రీలాన్సింగ్, కన్సల్టెన్సీ సేవల ద్వారా ఆర్జించే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. అయితే, తాము సంపాదించిన మొత్తంపై భారీగా పన్ను కట్టాలేమోనని చాలామంది ఆందోళన చెందుతుంటారు. ఒకవేళ మీ వార్షిక ఆదాయం రూ. 75 లక్షల లోపు ఉండి, మీరు పన్ను ఆదా చేయాలనుకుంటే.. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 44ADA మీకు ఒక వరం లాంటిది. ఈ నిబంధన ప్రకారం మీ మొత్తం సంపాదనలో సగానికి సగం పన్ను మినహాయింపు లభిస్తుంది.అసలు 'సెక్షన్ 44ADA' అంటే ఏమిటి?సాధారణంగా వ్యాపారాలు చేసే వారికి 'ఊహాత్మక పన్ను విధానం' అందుబాటులో ఉండేది. కానీ, వృత్తినిపుణుల కోసం ప్రభుత్వం 'సెక్షన్ 44ADA' ను ప్రవేశపెట్టింది. ఈ నిబంధన ప్రకారం, అర్హులైన నిపుణుల వార్షిక సంపాదనలో 50 శాతాన్ని ఆఫీసు నిర్వహణ, ప్రయాణాలు, ఇంటర్నెట్, సిబ్బంది జీతాలు వంటి వృత్తిపరమైన ఖర్చుల కింద ప్రభుత్వం గుర్తిస్తుంది. మిగిలిన 50 శాతాన్ని మాత్రమే నికర లాభంగా (ఆదాయంగా) పరిగణించి, దానిపై మాత్రమే పన్ను లెక్కిస్తుంది.దీనివల్ల వృత్తి నిపుణులు పెద్ద పెద్ద అకౌంట్ పుస్తకాలను నిర్వహించాల్సిన పని లేదు. ఆడిటింగ్, కాగితపు పనుల తలనొప్పి లేకుండా చాలా సులభంగా ఐటీ రిటర్న్స్ (ITR) దాఖలు చేయవచ్చు.అయితే..మొత్తం వార్షిక సంపాదనలో నగదు రూపంలో తీసుకునే పేమెంట్లు 5% కంటే తక్కువ ఉండాలి. అంటే కనీసం 95% సంపాదన డిజిటల్ రూపంలో (బ్యాంక్ ట్రాన్స్ఫర్, UPI, చెక్కులు మొదలైనవి) వచ్చి ఉండాలి. ఒకవేళ క్యాష్ లావాదేవీలు 5% కంటే ఎక్కువగా ఉంటే, ఈ సెక్షన్ కింద గరిష్ట పరిమితి రూ. 50 లక్షలు మాత్రమే అవుతుంది.ఈ సెక్షన్ (44ADA) ఎంచుకునే వారు తమ పన్ను మొత్తాన్ని (Advance Tax) ప్రతి ఏటా మార్చి 15 లోపు ఒకే విడతలో పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. సాధారణ పన్ను విధానం లాగా 4 విడతల్లో కట్టే ఆప్షన్ వీరికి ఉండదు.ఎవరెవరు అర్హులు?ఈ ప్రత్యేక పన్ను ప్రయోజనాన్ని వ్యక్తులు, భాగస్వామ్య సంస్థలు మాత్రమే పొందగలవు. కానీ, లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్షిప్స్ సంస్థలకు ఈ నిబంధన వర్తించదు. ఈ నిబంధన కింద వైద్యులు, న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు, ఇంటీరియర్ డిజైనర్లు, టెక్నికల్ కన్సల్టెంట్లు, సృజనాత్మక రంగాల వారు అంటే సినిమా నటులు, దర్శకులు, గాయకులు, రైటర్లు, కెమెరామెన్లు, కాస్ట్యూమ్ డిజైనర్లు, ఎడిటర్లు, ఫ్రీలాన్సర్లు వంటి ఐటీ రిటర్న్స్ వేయవచ్చు.ఆదాయాన్ని ఎలా లెక్కిస్తారు?ఈ నిబంధన వల్ల పన్ను భారం ఎలా తగ్గుతుందో అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. కిరణ్ ఒక సాఫ్ట్వేర్ కన్సల్టెంట్. ఆయన ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 60 లక్షలు సంపాదించారు. ఆయనకు ల్యాప్టాప్ కొనుగోలు, ఆఫీస్ స్పేస్ అద్దె, ప్రయాణాల కోసం వాస్తవంగా అయిన ఖర్చు రూ. 15 లక్షలు అనుకుందాం.సాధారణ పన్ను విధానంలో అయితే కిరణ్ మొత్తం ఆదాయం (రూ. 60 లక్షలు) నుండి వాస్తవ ఖర్చులు (రూ. 15 లక్షలు) తీసివేస్తే, మిగిలిన రూ. 45 లక్షలపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.అదే సెక్షన్ 44ADA ప్రకారం ప్రభుత్వం కిరణ్ ఆదాయంలో నేరుగా 50% (అంటే రూ. 30 లక్షలు) ఖర్చుల కింద మినహాయిస్తుంది. మిగిలిన రూ. 30 లక్షలను మాత్రమే పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయంగా గుర్తిస్తుంది.దీనివల్ల కిరణ్కు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 45 లక్షల నుండి రూ. 30 లక్షలకు తగ్గి, చట్టబద్ధంగా భారీగా పన్ను ఆదా అవుతుంది.కనీస పేపర్ వర్క్తో, అకౌంటెంట్ల చుట్టూ తిరిగే పని లేకుండా పన్ను ఆదా చేసుకోవడానికి సెక్షన్ 44ADA ఒక అద్భుతమైన మార్గం. మీ వార్షిక ఆదాయం రూ. 75 లక్షల లోపు ఉంటే, ఐటీఆర్ దాఖలు చేసే ముందు ఈ నిబంధనను పరిశీలించి లబ్ధి పొందవచ్చు. -
SBI సమ్మె వాయిదా.. ఆ రెండు రోజులు బ్యాంక్ ఓపెన్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు పెద్ద ఉపశమనం లభించింది. ఈ నెల 25, 26 తేదీల్లో జరగాల్సిన దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె వాయిదా పడింది. ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ (AISBISF) ఈ సమ్మెను వాయిదా వేసినట్లు ఎస్బీఐ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది.ఈ మేరకు బ్యాంక్ ఒక కస్టమర్ అడ్వైజరీ (పత్రికా ప్రకటన) విడుదల చేసింది. మే 25, 26 తేదీలలో దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ శాఖలన్నీ యథావిధిగా పనిచేస్తాయని, బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదని స్పష్టం చేసింది.సమ్మెకు దారితీసిన కారణాలు ఏమిటి?సిబ్బంది కొరత, అవుట్సోర్సింగ్ విధానం, పెన్షన్ సమస్యలు, వేతన అసమానతలపై 'ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్' సుదీర్ఘకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం విఫలమైందని, కార్మిక హక్కులను కాలరాస్తోందని యూనియన్ గతంలో ఆరోపించింది. ఈ క్రమంలోనే ప్రధానంగా 16 డిమాండ్లతో కూడిన చార్టర్ను యాజమాన్యం ముందు ఉంచింది.ప్రధాన డిమాండ్లు ఇవే» ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. మెసెంజర్లు, ఆర్మ్డ్ గార్డుల నియామకాలు చేపట్టాలి.» ఆర్మ్డ్ గార్డుల కొరత వల్ల బ్రాంచ్లలో భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయి, వీటిని పరిష్కరించాలి.» శాశ్వత ఉద్యోగాలను అవుట్సోర్సింగ్కు ఇవ్వడాన్ని పూర్తిగా నిలిపివేయాలి.» నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) కింద ఉద్యోగులకు మరింత సౌలభ్యాన్ని కల్పించాలి.» 2019 తర్వాత రిక్రూట్ అయిన ఉద్యోగులకు ఇంటర్-సర్కిల్ బదిలీల అవకాశం కల్పించాలి. కెరీర్ ప్రొగ్రెషన్ ఫ్రేమ్వర్క్ను సమీక్షించాలి.» పరిశ్రమ వ్యాప్తంగా సెటిల్మెంట్లు జరుగుతున్నప్పటికీ, అధికారులు, క్లరికల్/సబార్డినేట్ స్టాఫ్ వేతన పెంపులో తీవ్ర అసమానతలు ఉన్నాయి. వాటిని సరిచేయాలి.వెనక్కి తగ్గిన యూనియన్ఈ సమ్మెను విజయవంతం చేయడం కోసం ఫెడరేషన్ ఇప్పటికే దేశవ్యాప్తంగా ధర్నాలు, నిరసన ప్రదర్శనలు, సోషల్ మీడియా ప్రచారాలు నిర్వహించింది. అంతేకాకుండా తమ సమస్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లకు కూడా విజ్ఞాపన పత్రాలు పంపింది.అయితే, సమ్మె తేదీలు దగ్గరపడుతుండటంతో ఎస్బీఐ యాజమాన్యం, ఉద్యోగ సంఘాల ప్రతినిధుల మధ్య జరిపిన చర్చలు సఫలమయ్యాయి. యాజమాన్యం సానుకూలంగా స్పందించడంతో ఫెడరేషన్ సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా కోట్ల మంది ఎస్బీఐ కస్టమర్లకు బ్యాంకింగ్ సేవల పరంగా ఎదురుకాబోయే పెద్ద అంతరాయం తప్పినట్లయింది. -
హైదరాబాద్లో టెస్లా.. రెడీ అవుతున్న షోరూం!
సాక్షి, హైదరాబాద్: టెస్లా.. ఎలక్ట్రిక్ కారు అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు. ఇప్పటికే భారత్లో ముంబై, న్యూఢిల్లీ, గురుగ్రామ్, బెంగళూరులో ఎక్స్పీరియెన్స్ సెంటర్లను తెరిచిన టెస్లా.. హైదరాబాద్లోనూ అడుగు పెడుతోంది. కొండాపూర్లో రెండు నెలల్లో సేల్స్, సర్వీస్ సెంటర్ సిద్ధం అవుతోందని సమాచారం.యూఎస్కు చెందిన ఈ సంస్థ భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా మోడల్–వై కారును ఇప్పటికే ప్రవేశపెట్టింది. ఆటోపైలెట్, ఫుల్ సెల్ఫ్–డ్రైవింగ్ వంటి అత్యాధునిక సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్లు కంపెనీ కార్ల ప్రత్యేకత. టెస్లా అంటే కేవలం కార్లు మాత్రమే కాదని, ఈ సంస్థ రాకతో హైదరాబాద్ రియల్టీకి పెద్ద బూస్ట్నిస్తుందని రియల్టీ రంగ నిపుణుడు కలిశెట్టి నాయుడు ‘సాక్షి’కి తెలిపారు.టెస్లా కార్లకు ఇక్కడి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందన్నారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల విషయంలో బెంగళూరును బీట్ చేశామని, హైనకెన్, లాంజా వంటి దిగ్గజ సంస్థలు హైదరాబాద్లో కొలువుదీరడానికి ఇక్కడి మౌలిక వసతులు కారణమన్నారు. టాప్–20 ఎన్బీఎఫ్సీలు అన్నీ హైదరాబాద్లో కార్యకలాపాలు సాగిస్తున్నాయని, ఒక్క భాగ్యనగరికే ఈ ఘనత సాధ్యమైందన్నారు.మంత్రి శ్రీధర్బాబుతో టెస్లా డెవలప్మెంట్ డైరెక్టర్ రజత్, ఇండియా జీఎం శరద్ అగర్వాల్ (ఎడమ నుంచి కుడికి) విస్తరణ చేపట్టండి.. మంత్రి శ్రీధర్బాబును టెస్లా బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ రజత్, ఇండియా జీఎం శరద్ అగర్వాల్ శుక్రవారం కలిశారు. హైదరాబాద్లో షోరూం ఏర్పాటు చేస్తున్నట్టు ఈ సందర్భంగా మంత్రికి తెలిపారు. దేశంలో ప్రస్తు తం కార్ల మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా సుమారు 4 శాతం మాత్రమే ఉందని, ఈ రంగంలో భారీ అవకాశాలు ఉన్నాయని కంపెనీ ప్రతినిధులకు మంత్రి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు, హైదరాబాద్ను క్లీన్ టెక్నాలజీ, ఆధునిక మొబిలిటీకి ప్రపంచస్థాయి కేంద్రంగా అభివృద్ధి చేసే సంకల్పంతో ఉందని పేర్కొన్నారు.తెలంగాణలో టెస్లా అనుబంధ పరిశ్రమల విస్తరణ అవకాశాలను పరిశీలించాలన్నారు. పరిశ్రమలు, సాంకేతిక రంగాల్లో పెట్టుబడులకు రాష్ట్ర ప్రభు త్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. సమావేశంలో ఐటీ సలహాదారు సాయికృష్ణ, టీజీఐఐసీ ఎండీ శశాంక, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, ప్రత్యేక కార్యదర్శి రఘురామశర్మ పాల్గొన్నారు. -
మూడు రిస్క్ లు పొంచి ఉన్నాయ్..
→ పశ్చిమాసియా సంక్షోభానికి ఇప్పుడప్పుడే తెరపడేలా లేదు. ఉద్రిక్తతలు మరింత ముదిరితే ముడి చమురు రేటు ఇప్పుడున్న 100 డాలర్ల స్థాయి నుంచి 140 డాలర్లకు ఎగబాకే ప్రమాదం ఉంది. బహుశా జూన్లోనే ఇది జరగవచ్చు. → దీనివల్ల భారత్ ఎకానమీపై తీవ్ర ప్రభావం తప్పదు. ముఖ్యంగా పెట్రో ధరలు మరింత ఎగబాకుతాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. మరోపక్క వృద్ధి మందగిస్తుంది. అయితే, ఈ సమస్య ఒక్క భారత్కే పరిమితం కాదు, ప్రపంచమంతా ఎదుర్కొంటున్నదే. వాస్తవానికి మన ఎకానమీ కాస్త మెరుగైన స్థితిలోనే ఉంది. → ప్రస్తుతం అధిక చమురు ధరల కంటే సరఫరాపరమైన అడ్డంకుల వల్లే భారత్కు అధిక నష్టం వాటిల్లుతోంది. క్రూడ్ ఒక్కటే కాదు, వంట గ్యాస్, ఎల్ఎన్జీ, ఎరువులు ఇలా అన్నింటికీ సప్లై షాక్ తగులుతోంది. ఒకవేళ పశ్చిమాసియా ఉద్రిక్తతలు త్వరలో శాంతించినప్పటికీ, సరఫరా వ్యవస్థ కుదుటపడేందుకు రెండు మూడు నెలలు పడుతుంది. → క్రూడ్ సెగతో ప్రభుత్వం పెట్రో ధరలను మరింత పెంచాల్సి వస్తుంది. రవాణా, తయారీ వ్యయాలు దూసుకెళ్తాయి. రాబోయే నెలల్లో ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుంది. రూపాయి మరింత బలహీనపడుతుంది. → డాలరుతో రూపాయి మారకం విలువ 100 స్థాయికి పడిపోతుండటంపై మరీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది ఒక సైకలాజికల్ నంబర్ మాత్రమే. ఎందుకంటే, కొన్ని అనవసర దిగుమతులను తగ్గించుకోవడం ద్వారా సర్దుబాటు చేసుకోవడానికి వీలుంది. → క్రూడ్ షాక్సహా భౌగోళిక రాజకీయ అనిశ్చితులను తట్టుకునేందుకు భారత్ వద్ద తగినన్ని విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు (దాదాపు 700 బిలియన్ డాలర్లు) ఉన్నాయి. అధిక దిగుమతుల బిల్లు వల్ల ఇవేమీ తరిగిపోవు, ఒకవేళ ఆర్బీఐ రూపాయి పతనాన్ని (తాజాగా 96.95ని తాకింది) అడ్డుకోవడం కోసం ఉపయోగిస్తేనే అవి వేగంగా కరిగిపోయే అవకాశం ఉంటుంది. → కాబట్టి, రూపాయికి దన్నుగా నిలిచేందుకు ఆర్బీఐ ఎట్టిపరిస్థితుల్లోనూ ఫారెక్స్ నిల్వలను వాడకూడదు. ఎగుమతులకు మద్దతివ్వాలంటే కరెన్సీ విలువను మార్కెట్ వర్గాలే నిర్ణయించేలా చూడాలి. → పశ్చిమాసియా సంక్షోభం తీవ్రమైతే ఆర్థికంగా బలహీన వర్గాలు, చిన్న వ్యాపారులను ప్రభుత్వం ఆదుకోవాలి. నగదు బదిలీలను మరింత పెంచడం, చిన్న సంస్థలకు మరిన్ని రుణాలివ్వడం, నగదు సరఫరా పెంపు ద్వారా మద్దతివ్వాలి. – గీతా గొపీనాథ్, హార్వర్డ్ యూనివర్సిటీ ఆర్థికవేత్త, ఐఎంఎఫ్ మాజీ డిప్యూటీ ఎండీ -
విరూపాక్ష ఆర్గానిక్స్కి ప్రతిష్టాత్మక గుర్తింపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం విరూపాక్ష ఆర్గానిక్స్కి తాజాగా ప్రతిష్టాత్మక త్రీ స్టార్ ఎక్స్పోర్ట్ హౌస్ గుర్తింపు లభించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఈ సర్టిఫికెట్ జారీ చేసింది. గ్లోబల్గా సంస్థ విశ్వసనీయతకి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. ప్రస్తుతం తమ కార్యకలాపాల్లో ఎగుమతుల వాటా దాదాపు నలభై శాతం ఉంటోందని సంస్థ ఎండీ చంద్రమౌళీశ్వర్ రెడ్డి గంగవరం తెలిపారు. దీన్ని యాభై శాతానికి పెంచుకోవడంపై దృష్టి పెట్టినట్లు వివరించారు. ప్రధానంగా యాంటీ అలెర్జిక్, యాంటీ ఫంగల్ వంటి ఔషధాల ఎగుమతులు అధికంగా ఉంటున్నట్లు ఆయన చెప్పారు. -
ఆర్బీఐ డివిడెండ్ బొనాంజా
ముంబై: అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులతో ద్రవ్య ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న కేంద్ర సర్కారుకు ఆర్బీఐ తీపి కబురు చెప్పింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2025–26) రికార్డు స్థాయిలో భారీ డివిడెండ్ను ప్రకటించింది. 2024–25 సంవత్సరానికి రూ.2.69 లక్షల కోట్ల డివిడెండ్ను అందించగా, 2025–26 సంవత్సరానికి 6.7 శాతం పెంచి రూ.2,86,588 కోట్లను ఇవ్వనుంది. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులతో సరఫరాలకు ఆటంకాలు ఏర్పడి, దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు భారంగా మారి, రూపాయి బలహీనపడిన తరుణంలో ఆర్బీఐ డివిడెండ్ ప్రభుత్వానికి ఊరటనివ్వనుంది. ఏటా ఆర్బీఐ తన మిగులు నిల్వల నుంచి ప్రభుత్వానికి డివిడెండ్ను ప్రకటిస్తుండడం తెలిసిందే. బడ్జెలో కేంద్ర సర్కారు పేర్కొన్న పన్నేతర ఆదాయం లక్ష్యంలో ఒక్క ఆర్బీఐ డివిడెండే ఈ ఏడాది 91 శాతంగా ఉండనుంది. అంతర్జాతీయంగా, దేశీయంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులను, రిస్క్ లను విశ్లేషించిన అనంతరం ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు డివిడెండ్పై నిర్ణయం తీసుకున్నారు. రూ.91.97 లక్షల కోట్లకు బ్యాలెన్స్ షీట్: రిస్క్ లకు, చట్టబద్ధమైన ఖాతాలకు కేటాయింపులు చేయడానికి ముందు ఆర్బీఐ నికర ఆదాయం 2025–26లో రూ.3.96 లక్షల కోట్లకు పెరిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.3.13 లక్షల కోట్లుగా ఉంది. బ్యాలెన్స్ షీటు 20.61% పెరిగి రూ.91,97,121 కోట్లకు చేరింది. ‘ఆకస్మిక రిస్క్లను ఎదుర్కొనే నిధి’ (సీఆర్బీ) కోసం బ్యాలెన్స్ షీటులో 4.5–7.5% మధ్య కేటాయింపులు నిర్వహించేందుకు సవరించిన ఎకనమిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ వీలు కల్పిస్తుందని ఆర్బీఐ తెలిపింది. దీంతో 2024–25లో సీఆర్బీకి 7.5%గా ఉన్న కేటాయింపులు 2025–26లో 6.5%కి తగ్గాయి. ఆర్బీఐ ప్రకటించిన రూ.2.87 లక్షల కోట్ల డివిడెండ్ ఈ ఏడాది ప్రభుత్వానికి ఊరటనిస్తుందని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. అయితే, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ఫలితంగా ప్రస్తుత సవాళ్లను ఇది పూర్తిగా భర్తీ చేయలేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. -
ఏఐ టూల్స్ తయారు చేసిన వారికే షాక్!
మెటా కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో, అక్కడి ఉద్యోగాలపై కొత్త చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ ప్రకారం.. మెటా ఉద్యోగులను మొదట్లో AI ఆధారిత టూల్స్ తయారు చేయడానికి ప్రోత్సహించారని, తరువాతే కొన్ని టీమ్స్లో ఉద్యోగ కోతలు జరిగాయని ఆరోపించారు.మెటాలో ఒక ఏఐ వీక్ నిర్వహించారు. ఆ సమయంలో ఉద్యోగులు తమ సాధారణ పనుల నుంచి కొంత విరామం తీసుకుని, కొత్త AI టూల్స్, ఐడియాలపై ప్రయోగాలు చేయాలని సూచించారట. కొన్ని ప్రోటోటైప్స్ తయారయ్యాయని, వాటిని తర్వాత పెద్ద ప్రాజెక్టులుగా అభివృద్ధి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ ఐడియాలు రూపొందించడంలో సహకరించిన కొంతమంది ఉద్యోగులు తరువాత ఉద్యోగ కోతలకు గురయ్యారని సమాచారం.My wife just got laid off by Meta. We knew the writing was on the wall. But I want to give a little background. Meta a couple months back had a company-wide AI week. During this week Meta halted all day-to-day work and required all employees to familiarize themselves with AI.…— Julian ☽ (@julianblacks_) May 20, 2026మెటా కంపెనీ ఏఐపై ఎక్కువ దృష్టి పెట్టడం నిజమే.. అని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. సంస్థ తన నిర్మాణాన్ని మరింత సరళంగా మార్చి, సమర్థవంతమైన ఏఐ టీమ్స్ను తయారు చేస్తోంది. ఈ మార్పుల వల్ల కొన్ని విభాగాల్లో ఉద్యోగ కోతలు, పునర్వ్యవస్థీకరణలు జరిగాయి. అంతే కాకుండా.. మెటా ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీలో కూడా భారీగా పెట్టుబడులు పెడుతోంది.ఇదీ చదవండి: రూ.50 వేల అప్పుతో మొదలై.. రూ.8,000 కోట్ల సామ్రాజ్యం!ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు.. టెక్ రంగంలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకవైపు ఉద్యోగులు ఏఐ టూల్స్ తయారీలో కీలక పాత్ర పోషిస్తుండగా, మరోవైపు అదే ఏఐ వల్ల వారి ఉద్యోగాలకే ముప్పు వస్తుందా? అనే ప్రశ్నలు పుడుతున్నాయి. ముఖ్యంగా ఇంజనీర్లు, డిజైనర్లు, అనలిస్టులు వంటి వైట్ కాలర్ ఉద్యోగాల్లో ఈ భయం ఎక్కువగా కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఇంకా ఎంతమంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందో చూడాలి. -
SBI అలర్ట్: వరుసగా 6 రోజులు బ్యాంకులు బంద్?
మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ఖాతా ఉందా? ఏదైనా ముఖ్యమైన పని మీద వచ్చే వారం బ్యాంకుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వార్త ఖచ్చితంగా మీ కోసమే. మే 23 (శనివారం) నుండి దేశవ్యాప్తంగా వరుసగా ఆరు రోజుల పాటు ఎస్బీఐ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో, కొన్ని వార్తా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి. వారాంతపు సెలవులు, సిబ్బంది సమ్మె, బక్రీద్ పండుగలు వరుసగా రావడం దీనికి కారణమని ప్రచారం జరుగుతోంది.అయితే, నిజంగానే 6 రోజులు బ్యాంకులు పూర్తిగా మూతపడతాయా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవుల జాబితా, తాజా పరిస్థితుల ప్రకారం అసలు వాస్తవాలేంటో ఇప్పుడు చూద్దాం.మే 23 నుండి మే 28 వరకు బ్యాంకుల పరిస్థితి ఇదీ..మే 23 (నాల్గవ శనివారం): దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూసివుంటాయి.మే 24 (ఆదివారం):సాధారణ వారాంతపు సెలవు.మే 25 & 26 (సోమ, మంగళవారాలు): సిబ్బంది సమ్మెతో ఎస్బీఐ శాఖల్లో అంతరాయం మే 27 (బుధవారం): బక్రీద్ సెలవు. హైదరాబాద్, విజయవాడ, న్యూఢిల్లీ, కోల్కతా, ముంబైతో పాటు దేశంలోని మెజారిటీ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు.మే 28 (గురువారం): బక్రీద్ సెలవు (రెండవ రోజు/కొన్ని ప్రాంతాల్లో) బెంగళూరు, చెన్నై, జైపూర్, పాట్నా వంటి కొన్ని నిర్దిష్ట నగరాల్లో మాత్రమే బ్యాంకులకు సెలవు ఉంటుంది.అయితే బక్రీద్ సెలవు అనేది తెలుగు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) మే 27న ఉంటుంది. మే 28న ఇక్కడ బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి. మే 25, 26 తేదీల్లో సిబ్బంది సమ్మె కారణంగా ఎస్బీఐ బ్రాంచ్లలో క్లెరికల్ సేవలకు అంతరాయం ఉంటుంది. ఇతర బ్యాంకులు (డిజిటల్ సేవలు, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ వంటి ప్రైవేట్ బ్యాంకులు) యథావిధిగా పనిచేస్తాయి.సమ్మెకు కారణాలు ఏమిటి?ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ (AISBISF) వివిధ డిమాండ్ల సాధనకై ఈ రెండు రోజులు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. సబ్-స్టాఫ్, ఆర్మ్డ్ గార్డుల ఖాళీలను భర్తీ చేయాలని, ఉద్యోగులపై పని ఒత్తిడిని తగ్గించాలని, అలాగే కస్టమర్లకు బీమా ఉత్పత్తులను బలవంతంగా అంటగట్టే ("మిస్-సెల్లింగ్") విధానాన్ని నిరసిస్తూ 16 డిమాండ్లతో ఎస్బీఐ స్టాఫ్ ఫెడరేషన్ ఈ సమ్మె నోటీసు ఇచ్చింది.ఎస్బీఐ విజ్ఞప్తిసిబ్బంది సమ్మె నేపథ్యంలో కస్టమర్లకు ఎస్బీఐ విజ్ఞప్తి చేసింది. బ్యాంకింగ్ సేవల కోసం ప్రత్యామ్నాయంగా కస్టమర్ సర్వీస్ పాయింట్లు, ఏంటీఎం, యోనో, యూపీఐ వంటి ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు ఉపయోగించుకోవాలని సూచించింది. అదే సమయంలో ఖాతాదారులకు అత్యవసర సేవలకు గానూ బ్యాంక్ శాఖల్లో అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్బీఐ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంది.pic.twitter.com/1B6bJTc9Co— State Bank of India (@TheOfficialSBI) May 22, 2026 -
బెంజ్ స్పెషల్ ఎడిషన్స్.. ధరలు ఇలా!
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్.. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే తమ రెండు ఎస్యూవీలు GLE, GLS కార్లను నైట్ ఎడిషన్ పేరుతొ లాంచ్ చేసింది. ఇవి లిమిటెడ్ ఎడిషన్ రూపంలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇవి చూడటానికి స్టాండర్డ్ వేరియంట్ కంటే కూడా భిన్నంగా ఉంటుంది.జీఎల్ఈ నైట్ ఎడిషన్ 300డీ 4మ్యాటిక్ ధర రూ. 1.05 కోట్లు, 450 4మ్యాటిక్ ధర రూ. 1.14 కోట్లుగా ఉంది. అయితే జీఎల్ఎస్ నైట్ ఎడిషన్ 450 4మ్యాటిక్ ధర రూ. 1.41 కోట్లు, 450d 4మ్యాటిక్ ధర రూ. 1.43 కోట్లు(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)గా ఉంది.ఈ ధరలు స్టాండర్డ్ మోడల్స్ కంటే కూడా ఎక్కువ.బెంజ్ నైట్ ఎడిషన్స్ రెండూ కూడా అబ్సిడియన్ బ్లాక్, ఆల్పైన్ గ్రే అనే రంగుల్లో లభిస్తుంది. లోపల రెండు మోడళ్లలోనూ బ్లాక్ నాప్పా లెదర్ అప్హోల్స్టరీ.. ఆంత్రాసైట్ ఓపెన్ పోర్ ఓక్ వుడెన్ ట్రిమ్ ఉన్నాయి. రెండు మోడళ్లలోనూ హెడ్స్ అప్ డిస్ప్లే స్టాండర్డ్గా వస్తుంది. కాగా ఇంజిన్, పనితీరులో ఎలాంటి మార్పులు లేదు.కేవలం బెంజ్ కంపెనీ మాత్రమే కాకుండా.. ఇతర ఆటోమొబైల్ సంస్థలు కూడా అప్పుడప్పుడు స్పెషల్స్ ఎడిషన్స్ లాంచ్ చేస్తుంటాయి. అయితే ఇలాంటి కార్లు పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టి వీటికి మార్కెట్లో డిమాండ్ కూడా కొంత ఎక్కువగా ఉంటుంది. -
అరబిందో ఫార్మా లాభం అదుర్స్
ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో సుమారు రూ. 921 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో నమోదైన రూ. 903 కోట్లతో పోలిస్తే 2 శాతం వృద్ధి చెందింది. ఆదాయం రూ. 8,382 కోట్ల నుంచి రూ. 8,853 కోట్లకు ఎగిసింది. సమీక్షాకాలంలో వ్యయాలు రూ. 7,150 కోట్ల నుంచి రూ. 7,677 కోట్లకు చేరాయి.పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను లాభం రూ. 3,503 కోట్లుగా నిల్చింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇది రూ. 3,484 కోట్లు. ఆదాయం రూ. 31,724 కోట్ల నుంచి రూ. 33,653 కోట్లకు చేరింది. యూరప్ వ్యాపార విభాగం 1 బిలియన్ యూరోల పైగా ఆదాయం నమోదు చేసినట్లు సంస్థ తెలిపింది. 2030 నాటికి క్యూరాటెక్ విభాగం ప్రధానంగా ఆంకాలజీ ఉత్పత్తులపై దృష్టితో అగ్రగామి బయోసిమిలర్స్ సంస్థల్లో ఒకటిగా ఎదుగుతుందని పేర్కొంది.పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై రూ. 400 కోట్లు కంపెనీ వెచ్చించింది. త్రైమాసికంతో పాటు పూర్తి ఆర్థిక సంవత్సరంలో పటిష్టమైన పనితీరు కనపర్చినట్లు అరబిందో ఫార్మా వైస్ చైర్మన్, ఎండీ కె. నిత్యానంద రెడ్డి తెలిపారు. నిర్వహణ సామర్థ్యాలతో పాటు అమ్మకాల పరిమాణం మెరుగుపడటం ఇందుకు దోహదపడినట్లు వివరించారు. -
కేంద్ర ప్రభుత్వానికి రూ.2.87 లక్షల కోట్లు..
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మండిపోతున్నాయి. దేశీయ ఆర్థిక వ్యవస్థపై ఈ చమురు వేడి తీవ్ర ప్రభావం చూపుతున్న తరుణంలో, కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఊరటనిచ్చే వార్త అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వానికి రూ.2.86,588.46 కోట్ల మిగులు నిధులను (డివిడెండ్) బదిలీ చేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం అందుకున్న రూ.2.7 లక్షల కోట్ల డివిడెండ్ కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన శుక్రవారం జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో ఈ నిధుల బదిలీకి బోర్డు ఆమోదం తెలిపింది.అంచనాల కంటే స్వల్పంగా తక్కువ..బ్లూమ్బెర్గ్ వంటి అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణ సంస్థలు ఈసారి ఆర్బీఐ దాదాపు రూ.3 లక్షల కోట్ల (31.2 బిలియన్ డాలర్లు) రికార్డు స్థాయి మిగులును ప్రభుత్వానికి బదిలీ చేయవచ్చని అంచనా వేశాయి. అయితే, ప్రస్తుత బదిలీ ఆ అంచనాల కంటే స్వల్పంగా తక్కువగా నమోదైంది.ఆదాయంలో భారీ వృద్ధిమే 22న ఆర్బీఐ విడుదల చేసిన అధికారిక మీడియా ప్రకటన ప్రకారం.. కేంద్ర బ్యాంక్ స్థూల ఆదాయం గత సంవత్సరంతో పోలిస్తే 26.42% పెరిగింది. రిస్క్ నిబంధనలకు ముందు ఆర్బీఐ ఖర్చులు 27.60% పెరిగాయి. రిస్క్ ప్రొవిజన్, చట్టబద్ధమైన నిధులకు బదిలీ చేయకముందు ఆర్బీఐ నికర ఆదాయం 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.3,13,455.77 కోట్లు ఉండగా.. 2026 ఆర్థిక సంవత్సరంలో అది రూ.3,95,972.10 కోట్లకు చేరింది. మార్చి 31, 2026 నాటికి రిజర్వ్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ పరిమాణం 20.61% వృద్ధితో రూ.91,97,121.08 కోట్లకు చేరుకుంది.రిస్క్ బఫర్ పెంపుప్రభుత్వానికి బదిలీ చేసే డివిడెండ్ను పెంచినప్పటికీ, భవిష్యత్తు సవాళ్లను తట్టుకునేందుకు ఆర్బీఐ తన 'కంటింజెంట్ రిస్క్ బఫర్' (ఆకస్మిక ప్రమాదాల నిధి) పరిమాణాన్ని భారీగా పెంచింది. 2026 ఆర్థిక సంవత్సరానికి గాను అత్యవసర నిధి కింద రూ.1,09,379.64 కోట్ల బదిలీకి బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మునుపటి సంవత్సరంలో ఈ కేటాయింపు కేవలం రూ.44,861.70 కోట్లుగా మాత్రమే ఉండటం విశేషం.ప్రస్తుతం దేశంలో ఇంధన ధరల పెరుగుదల వల్ల దిగుమతి బిల్లులు భారంగా మారాయి. దీనికి తోడు కరెంట్ ఖాతా లోటు (CAD) పెరగడం, విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు (FPIs) నిధులను ఉపసంహరించుకోవడం వంటి అంశాలు దేశ ఆర్థిక స్థితిపై ఒత్తిడి తెస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో ఆర్బీఐ నుంచి అందుతున్న ఈ భారీ డివిడెండ్.. కేంద్ర ప్రభుత్వానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక బలమైన రక్షణ కవచంలా (బఫర్గా) ఉపయోగపడనుంది.ఆర్బీఐకి ఈ ఆదాయం ఎలా వస్తుంది?సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం తన వివిధ రకాల పెట్టుబడులు, విదేశీ మారక నిల్వల (Forex Reserves) నిర్వహణ, కరెన్సీ నోట్ల ముద్రణ ద్వారా వచ్చే ఆదాయం నుండి తన ఖర్చులు, రిస్క్ నిధులను మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేస్తుంది. ఈ నిధులు ప్రభుత్వ బడ్జెట్ లోటును పూడ్చుకోవడానికి, సంక్షేమ కార్యక్రమాలకు ఎంతో కీలకంగా ఉంటున్నాయి. -
రూ.50 వేల అప్పుతో మొదలై.. రూ.8,000 కోట్ల సామ్రాజ్యం!
ప్రపంచంలోని చాలా దేశాల్లో ఆర్ధిక అస్థిరత నెలకొన్న సమయంలో.. 'దేశీ బ్లింగ్' అనే షో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమైంది. స్టాక్ మార్కెట్ పతనం, బంగారం కొనుగోళ్లపై ఆంక్షలు ప్రారంభమైన వేళ ఇలాంటి ఒక కార్యక్రమం ప్రసారం కావడం చాలామంది విమర్శలకు గురవుతోంది. ఎందుకంటే ఈ ప్రోగ్రాం మొత్తం అతి విలాసవంతమైన జీవితం, బంగారం, డబ్బు, ఆడంబరాల చుట్టూనే తిరుగుతుంది.దేశీ బ్లింగ్ కార్యక్రమంలో కనిపించే వ్యక్తులలలో సతీష్ సన్పాల్, ఆయన భార్య తబిందా సన్పాల్ కూడా ఉన్నారు. వీరి జీవితం చాలా విలాసవంతం. నిజానికి సతీష్ భారతదేశంలో పుట్టి పెరిగినప్పటికీ.. దుబాయ్ వెళ్లి వేలకోట్ల సామ్రాజ్యం స్థాపించారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ నుంచి దుబాయ్కు వెళ్లినప్పుడు తనదగ్గర చాలా తక్కువ మొత్తం మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఇప్పుడు తాను దుబాయ్లో బిలినీయర్ అని గర్వంగా చెప్పుకుంటున్నారు.40 కేజీల బంగారం!ఈ కార్యక్రమంలో సతీష్ సన్పాల్ బంగారం పట్ల వారికున్న అభిరుచిని చెప్పుకొచ్చారు. ఇప్పటికే 40 కిలోల బంగారం తనవద్ద ఉందని టబిందా సన్పాల్ పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం తన భర్త తనకు 3 కిలోల బంగారం కొనిస్తాడని కూడా వెల్లడించింది. వారి ఇంట్లో బంగారు ఆభరణాలతో నిండిన ప్రత్యేక గది ఉందని, అది ఒక పెద్ద జ్యువెలరీ షోరూమ్లా కనిపిస్తుందని చెప్పారు.తమ కుమార్తె ఇసాబెల్లా కోసం బంగారు పాత్రలు వాడటం, మొదటి పుట్టినరోజుకు 24 క్యారెట్ బంగారంతో ప్రత్యేక దుస్తులు తయారు చేయించడం వంటి విషయాలు వెల్లడించారు. వీరు బుర్జ్ ఖలీఫాలో నివాసం ఉంటున్నారు. ఇవన్నీ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి.ఏడాది కుమార్తె కోసం రోల్స్ రాయిస్తమ ఏడాది పాప కోసం గులాబీ రంగులో ఉన్న కస్టమైజ్ రోల్స్ రాయిస్ కొన్న విషయం కూడా ఈ షోలో వెల్లడించారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా విలాసానికి ప్రతీకగా మార్చడం ఈ కుటుంబ జీవనశైలిలో స్పష్టంగా కనిపిస్తుంది. అంతే కాకుండా సతీష్ తన స్నేహితులతో గడపడానికి ప్రత్యేకంగా యాచ్ కొనుగోలు చేసి పార్టీలకు ఉపయోగించడం కూడా షోలో వెల్లడించారు.ఎవరీ సతీష్ సన్పాల్?సతీష్ సన్పాల్ వ్యాపార జీవితం కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. నిజానికి ఈయన ఎనిమిదో తరగతి వరకే చదివి, చిన్న వయసులోనే వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. మొదట తన తల్లి నుంచి రూ.50,000 అప్పుగా తీసుకుని కిరాణా దుకాణం ప్రారంభించాడు. అది చాలా తక్కువ కాలంలోనే విఫలమైపోయింది.ఆ తరువాత దుబాయ్ వెళ్లి.. ప్రారంభంలో స్టాక్ మార్కెట్ రంగంలోకి అడుగుపెట్టాడు. ఆ తరువాత దీని గురించి అవగాహన పెంచుకున్నాడు. ఇలా.. 2018లో అనక్స్ హోల్డింగ్ ప్రారంభించాడు. ఇది క్రమంగా భారీ వ్యాపార సమ్మేళనంగా మారింది. ఈ సంస్థకు దుబాయ్ రియల్ ఎస్టేట్, ఆర్థిక మార్కెట్లు, హాస్పిటాలిటీ, మీడియా వంటి అనేక రంగాలలో భాగస్వామ్యం ఉంది. కాగా ఈయన నికర విలువ మొత్తం రూ.8,000 కోట్ల కంటే ఎక్కువ అని సమాచారం.ఇదీ చదవండి: ఉద్యోగం పోయింది.. ఈఎంఐ కట్టలేని స్థితి నుంచి విజయం! -
2026 హోండా సిటీ: 27 కిమీ/లీ మైలేజ్!
హోండా కార్స్ ఇండియా దేశీయ మార్కెట్లో.. 2026 సిటీ లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ.12 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది స్టాండర్డ్ మోడల్ కంటే.. ఎక్కువ అప్డేట్స్ పొందుతుంది.2026 హోండా సిటీ కారు వోక్స్వ్యాగన్ విర్టస్, స్కోడా స్లావియా, హ్యుందాయ్ వెర్నా వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండనుంది. ఇది కొత్త ఫ్రంట్ ఫాసియా, హనీకూంబ్ గ్రిల్కు ఇరువైపులా కొత్త హెడ్ల్యాంప్ డిజైన్, ఒక లైట్ స్ట్రిప్ ఉన్నాయి. ఈ కారులో హుడ్, గ్రిల్ మధ్యలో బ్రాండ్ యొక్క కొత్త లోగో కూడా ఉంది. అయితే డోర్ హ్యాండిల్స్, కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్తో ఈ సెడాన్ తన సిల్హౌట్ను అలాగే నిలుపుకుంది.సెడాన్ వెనుక భాగం స్మోక్డ్ టెయిల్లైట్స్, వర్టికల్ రిఫ్లెక్టర్ యూనిట్లతో అప్డేట్ అయింది. అంతేకాకుండా.. ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్తో బూట్ లిడ్ ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా ఉంది. బంపర్ వెనుక భాగాన్ని కూడా రీడిజైన్ చేశారు. ఈ అప్డేట్లకు అనుగుణంగా క్రిస్టల్ బ్లాక్ పెర్ల్, రేడియంట్ రెడ్ మెటాలిక్, అబ్సిడియన్ బ్లూ పెర్ల్, ప్లాటినం వైట్ పెర్ల్, లూనార్ సిల్వర్ మెటాలిక్, మీటరాయిడ్ గ్రే మెటాలిక్ వంటి రంగులలో 2026 హోండా సిటీ అందుబాటులో ఉంది.ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. కొత్త హోండా సిటీ ఇప్పుడు ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లేకు సపోర్ట్ చేసే పెద్ద 10.25-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ పొందుతుంది. స్టీరింగ్ వీల్ డిజైన్, అలాగే ఫిజికల్ బటన్స్ అమరిక మునుపటి మాదిరిగానే ఉన్నాయి. సన్రూఫ్, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, 8 స్పీకర్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్, ఫుట్వీల్ లైటింగ్ వంటివాటితో పాటు.. 360-డిగ్రీ కెమెరా, ఆరు ఎయిర్బ్యాగ్లు, హిల్ హోల్డ్ అసిస్ట్, ఏడీఏఎస్ ఫీచర్లు కూడా ఉన్నాయి.హోండా సిటీ ఫేస్లిఫ్ట్ 1.5-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్తో కొనసాగుతోంది. ఇది 121 హార్స్ పవర్, 145 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ ఆరు-స్పీడ్ మాన్యువల్ లేదా CVT గేర్బాక్స్ ఎంపికలతో లభిస్తుంది. హైబ్రిడ్ వెర్షన్లో ఎలక్ట్రిక్ సపోర్ట్తో కూడిన 1.5-లీటర్ ఇంజన్ ఉంది, ఇది 126 hp పవర్, 253 Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ హైబ్రిడ్ పవర్ట్రెయిన్ 27.26 కిమీ/లీ వరకు మైలేజీని అందిస్తుంది. -
నైకా లాభం.. నాలుగు రెట్లు
ప్రయివేట్ రంగ సంస్థ ఎఫ్ఎస్ఎన్ ఈకామర్స్ వెంచర్స్ గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం నాలుగు రెట్లు జంప్చేసి రూ. 79 కోట్లకు చేరింది. సౌందర్య విభాగం అమ్మకాలు పుంజుకోవడం, ఫ్యాషన్ బిజినెస్ నష్టాలు తగ్గడం ఇందుకు సహకరించాయి. అంతక్రితం ఏడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 19 కోట్లు ఆర్జించింది.నైకా బ్రాండ్ ఈరిటైల్ కంపెనీ మొత్తం ఆదాయం సైతం 28 శాతం ఎగసి రూ. 2,648 కోట్లను అధిగమించింది. అంతక్రితం క్యూ4లో రూ. 2,062 కోట్ల టర్నోవర్ అందుకుంది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నైకా నికర లాభం మూడు రెట్లు పెరిగి రూ. 204 కోట్లను తాకింది. 2024–25లో రూ. 72 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 7,950 కోట్ల నుంచి రూ. 10,022 కోట్లకు బలపడింది. సౌందర్య విభాగ ఆదాయం 26 శాతం ఎగసి రూ. 9,139 కోట్లను దాటింది.ఓ మహిళ 50 ఏళ్ల వయసులో ప్రారంభించిన బిజినెస్కోటక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ విభాగానికి మేనేజింగ్ డైరెక్టర్గా దాదాపు 20 ఏళ్ల పాటు విజయవంతమైన కెరీర్ను కొనసాగించిన ఫాల్గునీ నాయర్ (Falguni Nayar), 2012లో తన 50 ఏళ్ల వయసులో ఆ ఉన్నత ఉద్యోగాన్ని వదిలేశారు. భారతదేశంలో విశ్వసనీయమైన బ్యూటీ రిటైలర్ అవసరమని గుర్తించి, ఎంతో రిస్క్తో కూడుకున్న నిర్ణయాన్ని తీసుకుంటూ 'నైకా' (FSN E-Commerce Ventures) సంస్థను స్థాపించారు. ఐఐఎం అహ్మదాబాద్లో చేసిన ఎంబీఏ చదువు, బ్యాంకింగ్ రంగంలో సంపాదించిన లోతైన మార్కెట్ అవగాహన ఆమె వ్యాపార విజయానికి బలమైన పునాదిగా నిలిచాయి.నైకా మొదట ఆన్లైన్ బ్యూటీ స్టోర్గా ప్రారంభమైనప్పటికీ.. మార్కెట్లో నకిలీ ఉత్పత్తులు ఎక్కువగా ఉన్న కాలంలో "100% ఒరిజినల్" అనే హామీతో వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకుంది. ఇన్ఫ్లూయెన్సర్ల ప్రమోషన్లు, ట్యూటోరియల్స్, రివ్యూల వంటి 'కంటెంట్ + కామర్స్' వ్యూహంతో కస్టమర్లను ఆకర్షిస్తూ దేశవ్యాప్తంగా ఆఫ్లైన్ స్టోర్స్ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 'నైకా ఫ్యాషన్' పేరుతో దుస్తులు, యాక్సెసరీల రంగంలోకి కూడా వ్యాపారాన్ని విజయవంతంగా విస్తరించింది.2021లో నైకా ఐపీఓ (IPO) భారత మార్కెట్లో ఒక సరికొత్త రికార్డు సృష్టించడంతో, ఫాల్గునీ నాయర్ భారతదేశంలోనే స్వయంకృషితో బిలియనీర్ అయిన ఇద్దరు మహిళల్లో ఒకరిగా నిలిచారు. సాంప్రదాయకంగా పురుషుల ఆధిపత్యం ఉన్న వ్యాపార రంగంలో బిలియన్ డాలర్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన ఆమె కథ.. సొంత కలలను నిజం చేసుకోవడానికి వయసు ఎప్పటికీ అడ్డంకి కాదని నిరూపిస్తూ ఎంతోమందికి, ముఖ్యంగా మహిళలకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తోంది. -
మోదీ గిఫ్ట్.. 'మెలొడీ' పెంపునకు సిద్ధం!
ఇటలీ ప్రధాని జార్జియా మెలొనీకి ప్రధాని నరేంద్ర మోదీ ’మెలొడీ’ టాఫీలను బహుకరించడం వైరల్ కావడంతో వాటికి డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. దీనితో ఉత్పత్తిని కూడా పెంచుకోవడంపై కసరత్తు చేస్తున్నట్లు పార్లే ప్రోడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ మయాంక్ షా తెలిపారు. బ్రాండ్ చరిత్రలోనే ఇది అత్యంత భారీ ప్రచార కార్యక్రమం అని ఆయన పేర్కొన్నారు.స్వదేశీ బ్రాండ్ వృద్ధి చెందేందుకు మోదీ ఒక చక్కని అవకాశం కల్పించారన్నారు. వివిధ మాధ్యమాల ద్వారా మెలొడీని మరింత ప్రాచుర్యంలోకి తేవడంపై దృష్టి పెట్టనున్నట్లు పేర్కొన్నారు. మెలొడీ ప్రస్తుతం దాదాపు 100 దేశాల్లో అందుబాటులో ఉన్నట్లు వివరించారు. పంపిణీదారుల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ బట్టి చూస్తుంటే మెలొడీకి వినియోగదారుల్లో డిమాండ్ అనూహ్య స్థాయిలో భారీగా పెరిగినట్లు తెలుస్తోందన్నారు. -
సెబీలోనూ వర్క్ ఫ్రమ్ హోమ్: ఎవరికి.. ఎన్ని రోజులు?
దేశంలో ఇంధన పొదుపును ప్రోత్సహించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునకు కార్పొరేట్, ప్రభుత్వ రంగాలు సానుకూలంగా స్పందిస్తున్నాయి. ప్రధాని విజ్ఞప్తి చేసిన పక్షం రోజుల వ్యవధిలోనే, ప్రముఖ మార్కెట్ రెగ్యులేటర్ ‘సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా’ (SEBI) తమ జూనియర్ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (WFH) సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, గ్రేడ్ 'ఎ' నుండి గ్రేడ్ 'సి' వరకు ఉన్న ఉద్యోగులకు వారానికి ఒక రోజు ఇంటి నుండి పనిచేసే అవకాశాన్ని సెబీ కల్పించినట్లు 'ఎన్డీటీవీ ప్రాఫిట్' పేర్కొంది. ఇరాన్ యుద్ధం కారణంగా తలెత్తిన అంతర్జాతీయ ఇంధన ద్రవ్యోల్బణ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు, తాత్కాలిక చర్యల్లో భాగంగా సెబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇంధన పరిరక్షణ చొరవలో భాగంగా సెబీ మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఇందులో భాగంగా అంతర్గతంగా నిర్వహించే పలు కార్యక్రమాలను వాయిదా వేయాలని భావిస్తోంది. ఉద్యోగుల అనవసర ప్రయాణాలను, హోటల్ బస ఖర్చులను గణనీయంగా తగ్గించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.కేవలం ప్రభుత్వ రంగానికి చెందిన సెబీ మాత్రమే కాకుండా, దేశీయ బ్యాంకింగ్ దిగ్గజాలు సైతం ప్రధాని పిలుపునకు మద్దతుగా నిలుస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) ట్రెజరీ కార్యకలాపాలు, క్రెడిట్ అండర్ రైటింగ్, రిస్క్ మేనేజ్మెంట్, ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్, ఐటీ సేవలు వంటి కీలక విభాగాల్లోని ఎంపిక చేసిన సిబ్బందికి వారానికి రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించింది. అలాగే హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ (HDFC Securities) కూడా ఇప్పటికే తమ ఉద్యోగుల కోసం 'హైబ్రిడ్ వర్కింగ్ మోడల్'ను అమలుల్లోకి తెచ్చింది. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 326.42 పాయింట్లు లేదా 0.43 శాతం లాభంతో 75,509.78 వద్ద, నిఫ్టీ 64.60 పాయింట్లు లేదా 0.27 శాతం లాభంతో 23,719.30 వద్ద నిలిచాయి.జాన్ కాకరిల్ ఇండియా లిమిటెడ్, మనాలి పెట్రోకెమికల్స్ లిమిటెడ్, టాల్బ్రోస్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ లిమిటెడ్, ట్రాన్స్వారంటీ ఫైనాన్స్ లిమిటెడ్, బిర్లా ప్రెసిషన్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఎస్ఎమ్ఎస్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, ఎలక్ట్రోథర్మ్ (ఇండియా) లిమిటెడ్, గణేశ ఎకోస్ఫియర్ లిమిటెడ్, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, ఎస్.కె.ఎం. ఎగ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ (ఇండియా) లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
ఎల్ఐసీ నుంచి రెండు కొత్త సేవింగ్స్ ప్లాన్లు
దేశీయ ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. తన పొదుపు (Savings) పోర్ట్ఫోలియోను మరింత బలోపేతం చేసే క్రమంలో సరికొత్తగా రెండు బీమా ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘ఎల్ఐసీ న్యూ జీవన్ సతీ - సింగిల్ ప్రీమియం’ (LIC's New Jeevan Sathi – Single Premium), ‘ఎల్ఐసీ న్యూ జీవన్ సతీ - లిమిటెడ్ ప్రీమియం’ (LIC's New Jeevan Sathi – Limited Premium) పేరుతో వీటిని తీసుకువచ్చినట్లు సంస్థ శుక్రవారం ప్రకటించింది. ఈ రెండు ప్లాన్లు కూడా జూన్ 1 నుండి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.ప్లాన్ల ప్రత్యేకతలు, ప్రయోజనాలుఈ రెండు పాలసీలు నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ వ్యక్తిగత పొదుపు పథకాలు. అంటే, వీటికి షేర్ మార్కెట్ హెచ్చుతగ్గులతో ఎలాంటి సంబంధం ఉండదు. మార్కెట్ నష్టాల భయం లేకుండా స్థిరమైన, కచ్చితమైన ముందస్తు అంచనాతో కూడిన ఆర్థిక ప్రణాళికను (Guaranteed Savings) కోరుకునే వారికి ఇవి సరైన ఎంపిక.పాలసీ ముగిసిన తర్వాత (Maturity) లేదా పాలసీదారునికి ఏదైనా జరిగితే (Death Benefit) వచ్చే ప్రయోజనాలు ముందే నిర్ణయించబడి, గ్యారెంటీగా అందుతాయి. కస్టమర్ల నగదు ప్రవాహం, ఆర్థిక ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రీమియం చెల్లించేందుకు రెండు వేరియంట్లను తెచ్చారు. ఈ ప్లాన్లను కేవలం భారతీయ మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా రూపొందించారు.ప్రీమియం చెల్లింపు ఇలా..పాలసీదారులు తమ వీలును బట్టి రెండు రకాలుగా ప్రీమియం చెల్లించవచ్చు. సింగిల్ ప్రీమియం ప్లాన్: ఇందులో పాలసీ తీసుకునే సమయంలోనే ఒకేసారి మొత్తం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పదే పదే కట్టే అవసరం ఉండదు.లిమిటెడ్ ప్రీమియం ప్లాన్: ఇందులో పాలసీ కాలపరిమితి అంతా కాకుండా, నిర్ణీత పరిమిత సంవత్సరాల పాటు (ఉదాహరణకు 5 లేదా 10 ఏళ్లు) మాత్రమే ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది.పాలసీదారు వయస్సు, ఎంచుకునే హామీ మొత్తం (Sum Assured) ఆధారంగా నిర్దిష్ట ప్రీమియం ధరలు జూన్ 1న ఎల్ఐసీ అధికారికంగా విడుదల చేస్తుంది. -
రూ.3.8 లక్షల నుంచి రూ.27 లక్షల ప్యాకేజీ: ఇలా..
నిబద్దతతో.. కష్టపడి పని చేస్తే.. తప్పకుండా సక్సెస్ వస్తుందని అందరూ చెబుతుంటారు. కొందరు దీనిని నిజం చేసుకుంటారు. ఇలాంటి కోవకు చెందిన పూణేకు చెందిన టెకీ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన యువ టెకీ.. కష్టపడి పనిచేసే తత్వం, పట్టుదల, నమ్మకంతో ఎలా జీవితాన్ని మార్చుకున్నాడో వెల్లడించారు. ఇందులో రూ.3.8 లక్షల వార్షిక వేతనంతో ప్రారంభమైన అతని ప్రయాణం చివరకు రూ. 27 లక్షల ప్యాకేజీ వరకు చేరిందని స్పష్టం చేశారు.పూణేలోని ఒక కాలేజీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసిన టెకీ.. కాలేజీ ప్లేస్మెంట్ల సమయంలో దాదాపు 30 నుంచి 35 ఇంటర్వ్యూలలో విఫలమయ్యాడు. వరుసగా ఎదురైన తిరస్కారాలు అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి. అయినప్పటికీ.. అతనికి కోడింగ్పై ఉన్న ఆసక్తి మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. చివరకు అతనికి ఒక కంపెనీలో రూ.3.8 లక్షల ప్యాకేజీతో ఉద్యోగ అవకాశం వచ్చింది.జాబ్ వచ్చింది కానీ.. కరోనా కారణంగా జాయినింగ్ చాలా ఆలస్యమైంది. 2020లో వచ్చిన ఆఫర్కు 2021 ఫిబ్రవరిలో మాత్రమే జాయిన్ అయ్యే అవకాశం దొరికింది. మొదటి ఆరు నెలలు జీతం సుమారు రూ.20 వేలు ఉండేది, చేరే తేదీ వరకు కూడా పని చేసే ప్రదేశం గురించి స్పష్టంగా తెలియదని టెకీ పేర్కొన్నారు.మొదటి ఉద్యోగంలోనే ఒకటిన్నర సంవత్సరాలు పని చేసి, చివరికి 6 లక్షల వార్షిక ప్యాకేజీతో మరో కంపెనీకి మారాడు. ఆ సంస్థలో ఒక సంవత్సరం తర్వాత నాకు 25 శాతం జీతం పెంపు లభించింది. కంపెనీ స్థిరంగానే ఉండేది, కానీ కొత్త విషయాలను నిర్మించడంలో పెద్దగా ఉత్సాహం లేదని నేను గ్రహించాడు. అలాంటి సమయంలోనే నెలకు రూ.45 వేల జీతంతో తన స్నేహితుడి స్టార్టప్లో చేరాలని నిర్ణయించుకున్నాడు. ఆ జీతం అంతకు ముందు వచ్చేదానికంటే చాలా తక్కువ.What Helped Me Grow from 3.5 to 27 as a Flutter Developerby u/Presence_Small in developersIndiaస్నేహితులతో కలిసి మొదటి నుంచి ఉత్పత్తులను తయారు చేయాలనే ఆలోచన తనకి బాగా నచ్చింది. నిజానికి.. అక్కడ ఉద్యోగిగా చేరకముందే, తాను ఆ పనిని ఇష్టపడటం వల్ల రాత్రిపూట వారి స్టార్టప్ కోసం పార్ట్టైమ్గా పని చేసేవాడు. ఆ దశలోనే చాలా నేర్చుకున్నాడు. సున్నా నుంచి ఉత్పత్తి వరకు ఉత్పత్తులను ఎలా నిర్మించాలి, క్లయింట్లతో ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఒత్తిడి, గడువులను ఎలా ఎదుర్కోవాలి, నాయకత్వం, యాజమాన్యం వంటి వాటితో పాటు.. నిర్ణయాలు తీసుకోవడం వంటివి కూడా తెలుసుకున్నాడు.కొంతకాలం తర్వాత.. మళ్లీ ఉద్యోగ మార్పు కోసం సిద్ధమయ్యాడు. ఈసారి అతను ఇంటర్వ్యూలకు బాగా ప్రిపేర్ అయ్యాడు. అయినప్పటికీ.. మొదట్లో రూ.12 లక్షల నుంచి రూ.13 లక్షలు వేతనంతో ఆఫర్లు ఇచ్చే కంపెనీల్లో తిరస్కరణ ఎదురైంది. కారణం కొన్ని టెక్నికల్ విషయాల్లో లోతైన అవగాహన లేకపోవడం, ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండటం. కానీ ఈసారి అతను నిరుత్సాహపడలేదు. తన తప్పులను గుర్తించి మరింత కష్టపడ్డాడు. మరో 10 నుంచి 15 ఇంటర్వ్యూలు ఇచ్చి చివరకు మూడు కంపెనీల ఏడాదికి రూ. 15 లక్షల ప్యాకేజీ ఆఫర్లు పొందాడు.ఇదీ చదవండి: ఉద్యోగం పోయింది.. ఈఎంఐ కట్టలేని స్థితి నుంచి విజయం!ఇదిలా ఉండగా.. ఒక కంపెనీ వ్యవస్థాపకుడు నా ప్రొఫైల్ చూసి నేరుగా సంప్రదించాడు. చివరకు రూ.27 లక్షల జీతంతో ఉద్యోగ అవకాశం వచ్చింది. ఒకప్పుడు ఆప్టిట్యూడ్ రౌండ్స్ కూడా క్లియర్ చేయలేక ఇబ్బంది పడ్డ వ్యక్తి, తర్వాత కంపెనీ వ్యవస్థాపకులే సంప్రదించే స్థాయికి ఎదగడం నిజంగా గొప్ప విషయం. దీన్నిబట్టి చూస్తే.. విజయానికి పట్టుదల, కృషి, నేర్చుకునే తపన ముఖ్యమని స్పష్టంగా తెలుస్తోంది. -
స్పేస్ ఎక్స్ ఐపీఓ.. మనోడి పంట పండింది!
ప్రపంచ అంతరిక్ష రంగ ముఖచిత్రాన్ని మార్చేసిన స్పేస్ ఎక్స్ ఐపీఓ దిశగా అడుగులు వేస్తోంది. మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం, పబ్లిక్ ఇష్యూ తర్వాత ఈ సంస్థ మార్కెట్ విలువ ఏకంగా 2 ట్రిలియన్ డాలర్లు (రూ.165 లక్షల కోట్ల పైమాటే) మైలురాయిని తాకే అవకాశం ఉంది. సాధారణంగా స్పేస్ ఎక్స్ అనగానే ప్రపంచమంతా ఎలాన్ మస్క్ పేరే వినబడుతుంది. కానీ, లైమ్లైట్కు దూరంగా ఉంటూ ఆధునిక సాంకేతిక చరిత్రలోనే అతిపెద్ద సంపద సృష్టికి కేంద్ర బిందువుగా మారిన ఒక భారతీయ సంతతి వ్యక్తి కథ ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ అయింది. ఆయనే ఆంటోనియో గ్రేసియాస్.ఎవరీ ఆంటోనియో గ్రేసియాస్?సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో యాక్టివ్గా ఉంటూ సందడి చేయడం గ్రేసియాస్ శైలి కాదు. ఆయన నిశ్శబ్దంగా ఉండే వ్యూహకర్త. స్పేస్ ఎక్స్ ఐపీఓ ఫైలింగ్స్ వెల్లడించిన అధికారిక వివరాల ప్రకారం.. గ్రేసియాస్, ఆయన పెట్టుబడి సంస్థ ‘వాలోర్ ఈక్విటీ పార్టనర్స్’ సంయుక్తంగా స్పేస్ ఎక్స్లో 7.3 శాతం వాటాను కలిగి ఉన్నాయి. స్పేస్ ఎక్స్ వాల్యుయేషన్ అంచనాల ప్రకారం 2 ట్రిలియన్లకు చేరితే గ్రేసియాస్ వాటా విలువ మాత్రమే 128 బిలియన్ డాలర్లు (సుమారు రూ.10.6 లక్షల కోట్లు) అవుతుంది. ఈ సంపద ప్రపంచంలోని ఎన్నో బ్లూ-చిప్ కంపెనీల మార్కెట్ క్యాపిటల్ కంటే, పలు చిన్న దేశాల జీడీపీ కంటే ఎక్కువ కావడం గమనార్హం.ఆ మూలాలు గోవాలోనే..ఆంటోనియో గ్రేసియాస్ తండ్రి భారతదేశంలోని గోవా నుంచి అమెరికాకు వలస వెళ్లి డెట్రాయిట్లో న్యూరో సర్జన్గా స్థిరపడ్డారు. తల్లి స్పానిష్ ఫార్మసిస్ట్. అమెరికాలోనే పుట్టి పెరిగిన గ్రేసియాస్ జార్జ్ టౌన్ యూనివర్సిటీలో ఎకనామిక్స్, చికాగో యూనివర్సిటీలో లా చదివారు. జపాన్లోని వాసెడా యూనివర్సిటీలోనూ ఉన్నత విద్య అభ్యసించారు. 1995లో లా స్కూల్లో ఉన్నప్పుడే ‘ఎంజీ క్యాపిటల్’ను స్థాపించారు. ఇదే తర్వాతి కాలంలో ‘వాలోర్ ఈక్విటీ పార్టనర్స్’గా రూపాంతరం చెందింది.మస్క్ - గ్రేసియాస్ బంధం2008 కాలంలో ప్రైవేట్ అంతరిక్ష రంగంపై పెట్టుబడి పెట్టడం అంటే అప్పట్లో అదొక పిచ్చి ప్రయోగం. రాకెట్లు వరుసగా పేలిపోతున్న తరుణంలో నాసా ఒప్పందాలు కూడా భవిష్యత్తుకు గ్యారెంటీ ఇవ్వని రోజుల్లో గ్రేసియాస్ మస్క్ను నమ్మి పెట్టుబడి పెట్టారు. టెస్లా, స్పేస్ ఎక్స్, తాజాగా ఎక్స్ఏఐ... ఇలా మస్క్ సామ్రాజ్యంలోని ప్రతి కీలక మలుపులోనూ గ్రేసియాస్ భాగస్వామ్యం ఉంది.ఇటీవలి బ్లూమ్బెర్గ్ నివేదికల ప్రకారం, మస్క్కు చెందిన ఎక్స్ఏఐ మౌలిక సదుపాయాల విస్తరణకు వాలోర్ ఈక్విటీ భారీగా నిధులు సమకూర్చింది. అత్యంత ఖరీదైన ఏఐ చిప్స్, డేటా సెంటర్ పరికరాలను తానే స్వయంగా కొనుగోలు చేసి వాటిని ఎక్స్ఏఐ సంస్థకు లీజుకు ఇచ్చే వినూత్న వ్యూహాన్ని గ్రేసియాస్ అమలు చేశారు. ఈ ఆర్థిక ఒప్పందాల ద్వారానే 2025, 2026 ప్రారంభ త్రైమాసికాల నాటికి వందల మిలియన్ల డాలర్ల లీజు చెల్లింపులు వాలోర్ ఖాతాలోకి చేరడం విశేషం.ఇదీ చదవండి: బంగారం ధరలు కాస్త కూల్! -
‘ఉనికిలోలేని సమస్యలు సృష్టిస్తున్నారు’
కార్పొరేట్ ప్రపంచంలో సాధారణంగా ఉద్యోగుల తొలగింపులు, క్రమశిక్షణా చర్యలు అన్నీ హ్యూమన్ రిసోర్సెస్ (హెచ్ఆర్) విభాగం పర్యవేక్షణలోనే జరుగుతుంటాయి. కానీ, ఒక ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలో మాత్రం సీఈఓ ఏకంగా మొత్తం హెచ్ఆర్ విభాగానికే షాక్ ఇచ్చారు. ఉనికిలో లేని సమస్యలను సృష్టిస్తూ, కంపెనీ ప్రగతిని అడ్డుకుంటున్నారనే సంచలన ఆరోపణతో ఆ విభాగంలోని సిబ్బంది మొత్తాన్ని ఇంటికి పంపించేశాడు. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ప్రముఖ పేమెంట్స్ ఫిన్టెక్ స్టార్టప్ ‘బోల్ట్’లో జరిగిన ఈ ఊహించని పరిణామం ప్రస్తుతం కార్పొరేట్ వర్గాల్లో చర్చకు దారితీసింది. కంపెనీ పునర్నిర్మాణంలో భాగంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు బోల్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) ర్యాన్ బ్రెస్లో స్పష్టం చేశారు.11 బిలియన్ల నుంచి 300 మిలియన్లకు పతనం!ఒకప్పుడు ఇన్వెస్టర్ల హాట్ ఫేవరెట్గా వెలిగిన ‘బోల్ట్’ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కంపెనీ మార్కెట్ విలువ క్షీణించడమే ఈ భారీ మార్పులకు ప్రధాన కారణం. 2022 నాటికి కంపెనీ విలువ గరిష్ఠంగా సుమారు 11 బిలియన్ డాలర్లు (రూ.91,000 కోట్లకు పైగా)కు చేరింది. అయితే ప్రస్తుత మార్కెట్ విలువ కేవలం 300 మిలియన్ డాలర్లు (దాదాపు 97% పతనం)గా ఉంది. ఈ తీవ్ర పతనం నుంచి కంపెనీని గట్టెక్కించేందుకు సీఈఓ ర్యాన్ బ్రెస్లో కఠిన సంస్కరణలను ప్రతిపాదించారు.ఉనికిలో లేని సమస్యలుకంపెనీ నుంచి హెచ్ఆర్ విభాగాన్ని పూర్తిగా తొలగించడంపై ర్యాన్ బ్రెస్లో ఘాటుగా స్పందించారు. హెచ్ఆర్ బృందం లేనిపోని సమస్యలను సృష్టించిందని, విచిత్రంగా ఆ విభాగాన్ని తొలగించిన మరుక్షణమే ఆ సమస్యలన్నీ మాయమైపోయాయని ఆయన పేర్కొన్నారు. హెచ్ఆర్ విభాగానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు బోల్ట్ సంస్థ కేవలం ఒక చిన్న పీపుల్ ఆపరేషన్స్ బృందాన్ని మాత్రమే నిర్వహిస్తోందని ఫార్చ్యూన్ నివేదిక వెల్లడించింది.చర్చనీయాంశంగా మారిన సీఈఓ వ్యాఖ్యలు‘కంపెనీ వృద్ధి దశలో ఉన్నప్పుడు ఉద్యోగులు చాలా సౌకర్యవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. దీనివల్ల ఉత్పాదకత దారుణంగా పడిపోయింది. సంస్థ అంతటా తాము దేనికైనా అర్హులమనే భావన పెరిగిపోయింది. నైపుణ్యం ఉన్నట్లు నటించేవారే కానీ, వాస్తవానికి కష్టపడి పనిచేసేవారు కాదు. నేను మొదట పోరాడాల్సింది ఈ అసమర్థ సంస్కృతిపైనే. అందుకే చాలా మందికి లేఆఫ్స్ ఇచ్చాం’ అని బోల్ట్ సీఈఓ ర్యాన్ బ్రెస్లో చెప్పారు.లీడర్షిప్ టీమ్ కూడా అవుట్!కంపెనీని తిరిగి పాత స్టార్టప్ తరహా వేగవంతమైన పని సంస్కృతిలోకి తీసుకురావడానికి బ్రెస్లో పాత యాజమాన్యం నియమించిన ఉద్యోగులకు 60 రోజుల గడువు ఇచ్చారు. కొత్తగా మారుతున్న ఏఐ ఆధారిత నిర్మాణానికి అనుగుణంగా మారాలని సూచించారు. అయితే, ఈ పరివర్తనలో దాదాపు 99 శాతం మంది ఉద్యోగులు, మేనేజర్లు విఫలమయ్యారని బ్రెస్లో వెల్లడించారు. క్షేత్రస్థాయిలో కష్టపడకుండా, భారీగా డబ్బులు ఖర్చు పెట్టే కార్పొరేట్ లగ్జరీకి వారు అలవాటు పడ్డారని చెప్పారు. కానీ ఇప్పుడు కంపెనీ దగ్గర అంత బడ్జెట్ లేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో దాదాపు మొత్తం లీడర్షిప్ బృందాన్ని తొలగించి స్క్రాచ్ నుంచి కొత్త యాజమాన్యాన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: బంగారం ధరలు కాస్త కూల్! -
ఆన్లైన్ రిటైల్ మాయాజాలం
దేశీయ ఆన్లైన్ రిటైల్ రంగంలో చోటుచేసుకుంటున్న విపరీత పరిణామాలు, నకిలీ ఉత్పత్తుల అక్రమ రవాణా, అడ్డగోలు ధరల తగ్గింపు (ప్రిడేటరీ ప్రైసింగ్) విధానాలు సాంప్రదాయ చిరు వ్యాపారుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే లక్షలాది మంది జీవనోపాధి దెబ్బతినడంతోపాటు ప్రభుత్వ ఆదాయానికి, వినియోగదారుల నమ్మకానికి గండి పడుతుందని నిపుణులు, విధానకర్తలు హెచ్చరిస్తున్నారు.హైదరాబాద్లో గురువారం ‘ఫెడరేషన్ ఆఫ్ రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ (ఫ్రాయ్)-తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో ‘ఆధునిక మార్కెట్లలో అక్రమ వ్యాపారాల నిరోధం’ అనే అంశంపై ఉన్నత స్థాయి సదస్సు నిర్వహించారు. తెలంగాణవ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది సూక్ష్మ, చిన్న, మధ్య తరహా రిటైలర్లకు ప్రాతినిధ్యం వహిస్తూ 10 లక్షల మందికి పైగా వ్యాపారుల జీవనోపాధి కోసం పోరాడుతున్న ఫ్రాయ్ ఈ వేదికపై పలు కీలక అంశాలను లేవనెత్తింది.ఈ-కామర్స్, క్విక్ కామర్స్ చాటున ‘నకిలీ’ల దందానిమిషాల వ్యవధిలోనే వస్తువులను చేరవేసే ‘క్విక్ కామర్స్’, ‘ఈ-కామర్స్’ ప్లాట్ఫామ్లు నేడు మార్కెట్ను శాసిస్తున్నాయి. నిత్యావసరాలు, కిరాణా సామాగ్రి, సౌందర్య సాధనాల నుంచి మొదలుకొని వేల రూపాయల విలువైన ప్రీమియం మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు అన్నీ నిమిషాల్లో ఇంటికి వస్తున్నాయి. అయితే, ఇదే వేగవంతమైన డెలివరీ వ్యవస్థ అక్రమ, నిషేధిత, నకిలీ ఉత్పత్తుల సరఫరాకు కీలకంగా మారుతోందని వ్యాపార సంఘాలు ఆరోపించాయి.భారీ డిస్కౌంట్లు, ఫ్లాష్ సేల్స్ పేరుతో వినియోగదారులను ఆకర్షిస్తూ, క్వాలిటీ కంటే తక్కువ ధరకే ప్రాధాన్యత ఇచ్చేలా మార్కెట్ను తప్పుదోవ పట్టిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. బలహీనమైన పర్యవేక్షణ వ్యవస్థల వల్ల నకిలీ వస్తువులు సులభంగా మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయని రిటైలర్లు ఆవేదన వ్యక్తం చేశారు.సామాజిక సంక్షోభంగా మార్కెట్ అసమతుల్యతరోజుకు 14 నుంచి 18 గంటల పాటు కష్టపడుతూ నమ్మకమే పెట్టుబడిగా వ్యాపారం చేసే స్థానిక కిరాణా, చిరు వ్యాపారులు ఈ అడ్డగోలు పోటీని తట్టుకోలేకపోతున్నారు. ఇది కేవలం వ్యాపార నష్టానికి సంబంధించిన అంశం మాత్రమే కాదని, లక్షలాది కుటుంబాల మనుగడకు సంబంధించిన సామాజిక సమస్య అని సదస్సులో నిపుణులు అభిప్రాయపడ్డారు. సాంకేతికతను స్వాగతిస్తున్నప్పటికీ మార్కెట్ పోటీ అనేది పారదర్శకంగా, అందరికీ సమాన అవకాశాలు కల్పించేదిగా ఉండాలని స్పష్టం చేశారు.ప్రముఖుల అభిప్రాయాలుతక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి‘అక్రమ వ్యాపారాలు, అడ్డగోలు మార్కెట్ విధానాలు ప్రామాణికంగా వ్యాపారం చేసే చిరు వ్యాపారులను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. నకిలీ వస్తువుల నెట్వర్క్ వల్ల వినియోగదారుల్లో నమ్మకం సడలుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కఠినమైన నిబంధనలు అమలు చేయాలి. అక్రమ నెట్వర్క్లపై సమన్వయంతో చర్యలు తీసుకుంటూ వ్యాపారుల హక్కులను కాపాడాలి’ అని తెలంగాణ రాష్ట్ర మైనారిటీల కమిషన్ ఛైర్మన్ తారిఖ్ అన్సారీ అన్నారు.వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి‘నకిలీ ఉత్పత్తుల చెలామణి అనేది కేవలం ఆర్థిక నష్టమే కాదు, ప్రజారోగ్యానికి, భద్రతకు కూడా పెను ముప్పు. డిజిటల్ ప్లాట్ఫామ్లు వేగంగా విస్తరిస్తున్న తరుణంలో సైబర్ రిస్క్లు, నకిలీ సరఫరా గొలుసులపై అవగాహన లోపించింది. భారీ డిస్కౌంట్లకు ఆకర్షితులై మోసపోవద్దు. దశాబ్దాలుగా నమ్మకమైన సేవలు అందిస్తున్న స్థానిక చిరు వ్యాపారుల పాత్ర ఆర్థిక వ్యవస్థలో కీలకం. అక్రమ వ్యాపారాల అడ్డుకట్టకు ప్రజలు, అధికారులు సమన్వయంతో ముందడుగు వేయాలి’ అని హైదరాబాద్ సెంట్రల్ జోన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) ఆర్.సంజయ్ కుమార్ అన్నారు.సాంప్రదాయ వ్యాపార సంస్కృతికే ముప్పు‘స్థానిక కిరాణా దుకాణాలు కేవలం వ్యాపార కేంద్రాలు కావు. భారతీయ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక. నేడు క్విక్ కామర్స్, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ల దూకుడు, అడ్డగోలు ధరల తగ్గింపు విధానాలు మార్కెట్ను అతలాకుతలం చేస్తున్నాయి. చిన్న వ్యాపారుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే తరతరాలుగా స్వయం ఉపాధితో బతుకుతున్న కోట్లాది కుటుంబాల సాంప్రదాయ వ్యాపార సంస్కృతి నాశనమయ్యే ప్రమాదం ఉంది’ అని ఫ్రాయ్ వైస్ ప్రెసిడెంట్ (ఆల్ ఇండియా ఫ్రాయ్), ప్రెసిడెంట్ (తెలంగాణ చాప్టర్, ఫ్రాయ్) మహమ్మద్ సలావుద్దీన్ దఖ్నీ అన్నారు.ఇదీ చదవండి: బంగారం ధరలు కాస్త కూల్! -
బంగారం ధరలు కాస్త కూల్!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
440 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:51 సమయానికి నిఫ్టీ(Nifty) 117 పాయింట్లు పెరిగి 23,774 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 448 పాయింట్లు లాభపడి 75,643 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.26బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 104.04 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.56 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.17 శాతం పెరిగింది.నాస్డాక్ 0.09 శాతం పుంజుకుంది.Today Nifty position 22-05-2026(time: 09:51 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
కృత్రిమ మేధతో ఉద్యోగాలు ఊడుతాయా?
ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) ప్రకంపనలు సృష్టిస్తోంది. దీని పుణ్యమా అని భవిష్యత్తులో ఐటీ సహా పలు రంగాల్లో భారీగా ఉద్యోగాల కోత తప్పదనే ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో.. సిలికాన్ వ్యాలీలోని గ్లీన్ కంపెనీ వ్యవస్థాపకుడు, భారతీయ సంతతికి చెందిన అరవింద్ జైన్ భిన్నమైన, అత్యంత సానుకూల దృక్పథాన్ని వినిపించారు. ఏఐ ఎప్పటికీ మానవ సిబ్బందిని భర్తీ చేయలేదని, బదులుగా వారి పనితీరును, సామర్థ్యాలను మరింత మెరుగుపరుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఏఐ-ఆధారిత ఎంటర్ప్రైజ్ సెర్చ్ ప్లాట్ఫామ్ గ్లీన్ సీఈఓ అయిన అరవింద్ జైన్.. ‘ఫార్చ్యూన్’ నిర్వహించిన వర్క్ప్లేస్ ఇన్నోవేషన్ సమ్మిట్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.భర్తీ చేసేంత లేదు..ప్రస్తుతం కార్పొరేట్ ప్రపంచంలో ఏ ఉద్యోగాలను ఏఐతో భర్తీ చేయవచ్చనే చర్చ విస్తృతంగా సాగుతోందని, అయితే క్షేత్రస్థాయిలో వాస్తవాలు వేరేలా ఉన్నాయని అరవింద్ జైన్ పేర్కొన్నారు. ‘నా ఉద్దేశం ప్రకారం.. భవిష్యత్తులో ఎప్పటికీ ఏఐ ఏ మానవ సిబ్బందినీ భర్తీ చేయదు. ఇది వాస్తవానికి మనల్ని మరింత సమర్థులుగా మారుస్తుంది. అత్యున్నత నాణ్యతతో కూడిన పనులు చేయడానికి వీలు కల్పిస్తుంది. మేము ప్రపంచంలోని అతిపెద్ద సంస్థలతో కలిసి పని చేస్తున్నాం. ప్రస్తుతానికైతే సాంకేతికత కారణంగా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు’ అని అరవింద్ జైన్ తెలిపారు.ఉద్యోగులకు ఏఐ ఒక కో-పైలట్లాగా పనిచేయాలని ఆయన ప్రతిపాదించారు. రోజువారీగా సాగే రొటీన్, పునరావృత పనులను ఏఐకి అప్పగించడం ద్వారా.. మానవులు తమ ఆలోచనా శక్తి, సృజనాత్మకత, సమస్యల పరిష్కారం వంటి కీలకమైన అంశాలపై మరింత దృష్టి పెట్టవచ్చని ఆయన విశ్లేషించారు.దిగ్గజాల హెచ్చరికలుభవిష్యత్ శ్రామిక శక్తిపై అరవింద్ జైన్ వ్యక్తంచేసిన అంచనాలు, ప్రస్తుత అంతర్జాతీయ వ్యాపార వర్గాల సెంటిమెంట్కు పూర్తిగా విరుద్ధంగా ఉండటం గమనార్హం. ప్రపంచ స్థాయి దిగ్గజాలు ఇప్పటికే ఏఐ ముప్పుపై హెచ్చరిస్తున్నారు. ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడీ.. రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే ఏఐ కారణంగా దాదాపు సగం వరకు వైట్-కాలర్ ఉద్యోగాలు తుడిచిపెట్టుకుపోతాయని పదేపదే హెచ్చరించారు. జేపీ మోర్గాన్ అధినేత జేమీ డిమోన్, ఫోర్డ్ సీఈఓ జిమ్ ఫార్లీ.. అమెరికా సహా అంతర్జాతీయంగా వైట్-కాలర్ ఉద్యోగాలను ఏఐ ఆక్రమించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: రూ.100 అనేది కేవలం సంఖ్యే.. ఒత్తిడి వద్దు! -
రూ.100 అనేది కేవలం సంఖ్యే.. ఒత్తిడి వద్దు!
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికన్ డాలర్తో రూపాయి మారకం విలువ రికార్డు స్థాయికి పడిపోతోంది. ఈ క్రమంలోనే డాలర్కు రూపాయి విలువ ఏకంగా 97 మార్కుకు చేరువ కావడంతో దేశీయ ఆర్థిక వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగారియా తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు ఒక ఆసక్తికరమైన సూచన చేశారు.డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 100 మార్కును తాకుతుందనే మానసిక ఒత్తిడి లేదా భయంతో ఆర్బీఐ తన విధానపరమైన నిర్ణయాలను తీసుకోకూడదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్(గతంలో ట్విట్టర్)లో ఆయన పోస్ట్ చేశారు.‘డాలర్ ధర రూ.100 చేరుతుందనే కంగారుతో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. 99, 101 లాగే 100 కూడా ఒక మామూలు సంఖ్య మాత్రమే. ప్రస్తుతం ఉన్న చమురు సమస్యల నేపథ్యంలో రూపాయి విలువ సహజంగానే తగ్గడానికి అనుమతించడమే దేశానికి మంచిది’ అని ఆయన అభిప్రాయపడ్డారు.స్వల్పకాలికం.. దీర్ఘకాలికంచమురు కొరత లేదా ధరల పెరుగుదల సంక్షోభం ఎంతకాలం కొనసాగుతుందనే అంశాన్ని బట్టి ఆర్బీఐ వ్యూహం ఉండాలని, అయితే ఏ పరిస్థితిలోనైనా రూపాయిని బలవంతంగా రక్షించే ప్రయత్నం చేయకూడదని పనగారియా స్పష్టం చేశారు. ఆయన విశ్లేషణ ప్రకారం..సంక్షోభం స్వల్పకాలికమైతే (3 నెలల నుంచి ఏడాది)..చమురు సంక్షోభం తాత్కాలికమే అయితే ఇప్పుడు రూపాయి క్షీణించినప్పటికీ భవిష్యత్తులో చమురు దిగుమతి బిల్లు తగ్గినప్పుడు అది మళ్లీ పుంజుకుంటుంది. పైగా, రూపాయి విలువ తక్కువగా ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి విదేశీ పెట్టుబడులు భారత మార్కెట్ వైపు వేగంగా తరలివస్తాయి. దీనివల్ల కరెన్సీ విలువ సహజంగానే గణనీయంగా కోలుకుంటుంది.సంక్షోభం దీర్ఘకాలికమైతే (కొన్నేళ్ల పాటు సాగితే)..ఒకవేళ ఈ అంతరాయం ఎక్కువ కాలం కొనసాగితే ఆర్బీఐ తన వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలను (ఫారెక్స్ రిజర్వ్స్) ఖర్చు చేసి రూపాయిని రక్షించాలని చూడటం సరైన నిర్ణయం కాదని పనగారియా అన్నారు. ‘ఇలాంటి స్థితిలో రూపాయి పడిపోవడాన్ని అంగీకరించకుండా వేరే ఏ మార్గాన్ని ఎంచుకున్నా అది నష్టపోవడమే అవుతుంది. రూపాయిని కాపాడుకునే ప్రయత్నంలో నిల్వలు పూర్తిగా అడుగంటిపోయేలా చేస్తే భవిష్యత్తులో మరింత నష్టపోవాల్సి ఉంటుంది’ అని హెచ్చరించారు.‘బ్యాండ్-ఎయిడ్’ పరిష్కారాలు వద్దు..రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి గతంలో ఉపయోగించిన డాలర్ డినామినేటెడ్ బాండ్లు లేదా ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) డిపాజిట్లపై అధిక వడ్డీ ఇవ్వడం వంటి చర్యలను పనగారియా తీవ్రంగా వ్యతిరేకించారు. ఇవి కేవలం తాత్కాలిక ‘బ్యాండ్ ఎయిడ్’ పరిష్కారాలు మాత్రమేనని కొట్టిపారేశారు. ఇవి అత్యంత ఖరీదైన సాధనాలని, వీటి వల్ల వచ్చే లాభాలు కేవలం సంపన్న విదేశీ భారతీయులకే బదిలీ అవుతాయని, దేశ ఆర్థిక వ్యవస్థపై భారం పెరుగుతుందని విమర్శించారు. ఎప్పటికైనా రూపాయి విలువ రూ.100 మార్కు దాటక తప్పదని, దానికి ఇప్పుడే సిద్ధం కావాలని సూచించారు.Dear @RBI: Do not let the psychology of Rs 100 per dollar determine your policy response. 100 is just a number, like 99 and 101. Whether the oil shortage is short-lived or long-lived, the right response at this moment is to let the rupee depreciate. 1/6— Arvind Panagariya (@APanagariya) May 21, 2026ఇది 2013 నాటి సంక్షోభం కాదు!దేశం తీవ్ర స్థూల ఆర్థిక ఒత్తిడిని, కరెన్సీ సంక్షోభాన్ని ఎదుర్కొన్న 2013 నాటి పరిస్థితులతో ప్రస్తుత పరిస్థితిని పోల్చలేమని పనగారియా స్పష్టం చేశారు. అప్పట్లో దేశంలో ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయిలో (10% పైగా) ఆందోళనకరంగా ఉంది. ఆర్బీఐ తీసుకున్న వివేకవంతమైన ద్రవ్య విధానాల వల్ల ప్రస్తుతం ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంది. అందువల్ల, కరెన్సీ విలువ తరుగుదల (డిప్రిసీయేషన్) కారణంగా వచ్చే స్వల్ప ద్రవ్యోల్బణ ఒత్తిడిని లేదా షాక్ను తట్టుకునే బలమైన స్థితిలో ప్రస్తుత భారత ఆర్థిక వ్యవస్థ ఉందని ఆయన భరోసా ఇచ్చారు.ఇదీ చదవండి: ఆ ఒక్క ప్రశ్నతో సీనియర్ ఉద్యోగిపై వేటు! -
జూలైలో జెప్టో ఐపీవో..!
న్యూఢిల్లీ: క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ జెప్టో పబ్లిక్ ఇష్యూపై కన్నేసింది. జూలై 31కల్లా ఇష్యూ చేపట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా రూ. 11,000 కోట్లు సమీకరించే వీలున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే క్విక్ కామర్స్ దిగ్గజాలు జొమాటో(ఎటర్నల్), స్విగ్గీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన నేపథ్యంలో జెప్టో ఐపీవోకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నెల మొదట్లో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి జెప్టోకు అనుమతి లభించిన సంగతి తెలిసిందే. కంపెనీ గోప్యతా విధానంలో దరఖాస్తు చేయడంతో మరోసారి అప్డేటెడ్ ప్రాస్పెక్టస్ను సెబీకి దాఖలు చేయవలసి ఉంటుంది. 2025 డిసెంబర్లో తొలుత సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించింది. క్విక్ కామర్స్ విభాగంలో ప్రస్తుతం జెప్టో 61 పట్టణాలలో 1,255 డార్క్ స్టోర్లను నిర్వహిస్తోంది. 2025 అక్టోబర్లో కంపెనీ 45 కోట్ల డాలర్లు(రూ. 3,758 కోట్లు) సమీకరించింది. 2023 ఆగస్ట్లోనే యూనికార్న్ హోదా పొందిన కంపెనీ 7 బిలియన్ డాలర్ల విలువలో ఈ పెట్టుబడులు సమకూర్చుకుంది. -
అసంఘటిత రంగంలో ఉపాధి జోరు!
న్యూఢిల్లీ: వ్యవసాయేతర అసంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయి. 2026 జనవరి–మార్చి కాలంలో మొత్తం సంస్థల సంఖ్య 9.16 కోట్లకు దూసుకెళ్లింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే 16.69 శాతం మేర సంస్థలు పెరిగినట్టు జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) విడుదల చేసిన నివేదిక పేర్కొంది. క్రితం ఏడాది మార్చి నాటికి సంస్థల సంఖ్య 7.85 కోట్లుగానే ఉంది. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు (కార్మీకుల సంఖ్య) 15.17 కోట్లకు పెరిగాయి. వ్యవసాయేతర అసంఘటిత రంగంలో పరిస్థితులపై ఎన్ఎస్వో 2025 నుంచి ప్రతీ త్రైమాసికానికి నివేదిక విడుదల చేస్తుండడం గమనార్హం. నివేదికలోని అంశాలు.. → ఈ రంగంలో మొత్తం ఉపాధి అవకాశాలు 15.51 శాతం వార్షిక వృద్ధితో 15.17 కోట్లకు చేరాయి. ముఖ్యంగా గ్రామీణ కార్మీక శక్తిలో 21.65 శాతం పెరుగుదల కనిపించగా, పట్టణాల్లో ఇది 10.39 శాతం మేర వృద్ధి చెందింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఈ రంగం చేదోడుగా ఉంటున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. → గ్రామీణ ప్రాంతాల్లో సంస్థల సంఖ్య 20.46 శాతం పెరగ్గా.. పట్టణాల్లో వృద్ధి 12.59 శాతంగా ఉంది. → మొత్తం కార్మీకులలో వ్యాపారాలను సొంతంగానే నిర్వహించుకునే యజమానుల వాటా 58.29 శాతం నుంచి 60.97 శాతానికి మెరుగుపడింది. వేతనంపై పనిచేసే కార్మీకుల వాటా స్వల్పంగా 26.86 శాతం నుంచి 24.77 శాతానికి తగ్గింది. → మహిళా కార్మీకుల వాటా 29 శాతానికి విస్తరించింది. గతేడాది కంటే స్వల్పంగా మెరుగుపడింది. సమ్మిళిత ఆర్థిక వృద్ధి, మహిళా సాధికారతకు ఈ రంగం తోడ్పడుతోంది. → చాలా సంస్థలు తాత్కాలిక కార్మికులు, వలస కార్మికులు, హెల్పర్లపై ఈ రంగం ప్రధానంగా ఆధారపడుతోంది. ప్రధానంగా వ్యవసాయ పనుల్లేని సమయంలో కార్మీకులకు ఈ సంస్థలు ఉపాధినిస్తున్నాయి. → గ్రామీణ సేవల్లోనూ అసంఘటిత సంస్థల వృద్ధి మెరుగ్గా ఉంది. ఈ సంస్థల సంఖ్య జనవరి–మార్చి త్రైమాసికంలో 24.82 శాతం పెరగ్గా, కార్మీకుల సంఖ్య 31.13 శాతం పెరిగింది. సొంత కాళ్లపై నిలబడే ఔత్సాహిక వ్యాపారవేత్తలు పెరుగుతున్నట్టు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. → వ్యవసాయేతర అసంఘటిత సంస్థలు డిజిటల్ సాంకేతికతను సైతం అందిపుచ్చుకుంటున్నాయి. 81% సంస్థలు ఇంటర్నెట్ను వ్యాపార అవసరాల కోసం వినియోగిస్తున్నాయి. → సుమారు 81 శాతం వ్యాపార సంస్థలు నగదు రహిత డిజిటల్ చెల్లింపులను స్వీకరిస్తున్నాయి. ఇందులో ఆన్లైన్ బ్యాంకింగ్, యూపీఐ, పీవోఎస్ తదితర సాధనాలున్నాయి. → ఈ రంగంలోని దాదాపు 41.37 శాతం సంస్థలు ఏదో ఒక రూపంలో ప్రభుత్వం వద్ద తమ పేర్లను నమోదు చేసుకున్నాయి. అసంఘటిత రంగం క్రమంగా వ్యవస్థీకృతంగా మారుతుండడాన్ని ఇది సూచిస్తోంది. → మొత్తం 1,72,845 సంస్థల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఎన్ఎస్వో ఈ నివేదికను రూపొందించింది. -
మూడేళ్లలో కొత్తగా వంద ఔట్లెట్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్యారడైజ్ బిర్యానీ దేశవ్యాప్తంగా కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. వచ్చే మూడేళ్లలో కొత్తగా 100 ఔట్లెట్స్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ ఎండీ అభీక్ మిత్ర వెల్లడించారు. తొలి దశలో బెంగళూరు, చెన్నై నగరాల్లోనూ, తదుపరి దశల్లో ముంబై, పుణె, ఢిల్లీ నగరాల్లో వీటిని ప్రారంభించనున్నట్లు వివరించారు. ప్రస్తుతం 57 ఔట్లెట్స్ ఉన్నాయి. విస్తరణ కోసం వచ్చే ఆరు నెలల్లో రూ. 100 కోట్లు సమీకరిస్తున్నట్లు సంస్థ ప్రమోటర్ అయిన సమారా క్యాపిటల్ ఎండీ నిలయ్ ప్రతీక్ తెలిపారు. ఇందులో సుమారు 50 శాతాన్ని తాము సమకూర్చనుండగా, మరో 40–50 శాతాన్ని బైటి నుంచి సేకరించనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత ఔట్లెట్స్ విస్తరణ, కొత్త ఔట్లెట్స్ ఏర్పాటుతో వచ్చే మూడేళ్లలో సుమారు రూ. 520 కోట్ల ఆదాయాలను లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం సంస్థ ఆదాయం సుమారు రూ. 300 కోట్లుగా ఉన్నట్లు తెలిపారు. -
క్యాడ్ కట్టడికి అస్త్రాలున్నాయ్
న్యూఢిల్లీ: ప్రస్తుత పరిస్థితుల్లో విస్తరిస్తున్న కరెంటు ఖాతా లోటు (క్యాడ్)ను కట్టడి చేసేందుకు పలు చర్యలను పరిశీలిస్తున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ‘‘పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. ప్రభుత్వానికి సంబంధించి అన్ని శాఖలూ ఒక బృందంగా పనిచేస్తున్నాయి. పలు చర్యలను పరిశీలిస్తున్నాం. అంతర్జాతీయంగా నెలకొన్న సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో విజేతగా అవతరిస్తామన్న నమ్మకం, ధైర్యం, దృఢ విశ్వాసంతో ఉన్నాం’’అని మంత్రి పేర్కొన్నారు. కరెంట్ ఖాతా లోటు డిసెంబర్ త్రైమాసికంలో 13.2 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. జీడీపీలో ఇది 1.3 శాతానికి సమానం. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో క్యాడ్ 11.3 బిలియన్ డాలర్లుగానే ఉంది. కానీ, గత ఆర్థిక సంవత్సరం (2025–26)లో ఏప్రిల్–డిసెంబర్ కాలంలో క్యాడ్ 30.1 బిలియన్ డాలర్లకు (జీడీపీలో ఒక శాతం) తగ్గడాన్ని గమనించొచ్చు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో ఇది 36.6 బిలియన్ డాలర్లు (జీడీపీలో 1.3 శాతం)గా ఉంది. వస్తు, సేవల ఎగుమతులతో పోల్చితే దిగుమతులు, చెల్లింపుల విలువ పెరిగినప్పుడు ఏర్పడేదే కరెంటు ఖాతా లోటు. రూపాయి–దిగుమతుల ప్రభావం.. ముఖ్యంగా ఒకవైపు రూపాయి విలువ క్షీణిస్తుండడం.. మరోవైపు ముడి చమురు, బంగారం, వెండి దిగుమతుల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుండడంకరెంటు ఖాతా లోటు విస్తరణకు దారితీస్తోంది. 2025–26లో పసిడి దిగుమతుల విలువ 24 శాతం పెరిగి 71.98 బిలియన్ డాలర్లకు చేరింది. వెండి దిగుమతులు 150 శాతం పెరిగి 12 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే బంగారం దిగుమతులు 81 శాతం పెరిగి 5.62 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఫలితంగా ఏప్రిల్లో క్యాడ్ మూడు నెలల గరిష్ట స్థాయి అయిన 28.38 బిలియన్ డాలర్లకు పెరిగిపోవడం గమనార్హం. రూపాయి సైతం ఆల్టైమ్ కనిష్ట స్థాయి (డాలర్తో 96.80)కి పడిపోవడం చూస్తూనే ఉన్నాం. కరెన్సీ విలువ క్షీణత, ఏఐ తరహా భారీ వృద్ధి అవకాశాలున్న కంపెనీలు భారత్లో లేకపోవడం, ఈక్విటీల అధిక వ్యాల్యూషన్లతో విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను క్రమంగా భారత్ నుంచి తరలించుకుపోతుండడం రూపాయి విలువను హరిస్తోంది. దీంతో పసిడి, వెండి దిగుమతులను తగ్గించేందుకు ప్రభుత్వం ఇటీవలే దిగుమతి సుంకాలు పెంచడంతోపాటు పలు నియంత్రణలు విధించింది. ఆభరణాల కొనుగోళ్లు వాయిదా వేసుకోవాలని, విదేశీ ప్రయాణాలు మానుకోవాలని, చమురు వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రధాని మోదీ పిలుపునివ్వడం తెలిసిందే. ప్రధాని పట్ల విశ్వాసం ఉన్న వారి ఆచరణతో దేశానికి ఎంతో కొంత మేలు జరుగుతుందని మంత్రి గోయల్ అభిప్రాయపడ్డారు. గల్ఫ్ దేశాల సమాఖ్యతో (జీసీసీ) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై మొదటి విడత చర్చలు 2026 ద్వితీయ ఆరు నెలల కాలంలో కార్యరూపం దాలుస్తాయని చెప్పారు. -
ఐటీసీ లాభం రూ. 5,470 కోట్లు
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో రూ. 5,470 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 21,018 కోట్ల నికర లాభం సాధించింది. క్యూ4లో ప్రొడక్టుల విక్రయ ఆదాయం రూ. 23,626 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు రూ. 17,348 కోట్లుగా నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది(2024–25) క్యూ4లో ఇవి రూ. 14,279 కోట్లుకాగా.. విమ్కో, శ్రేష్ట నేచురల్ బయోప్రొడక్ట్స్ విలీనం పూర్తయినట్లు ఐటీసీ వెల్లడించింది. దీంతో ఫలితాలు పోల్చతగదని పేర్కొంది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 8 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. ఇందుకు ఈ నెల 27 రికార్డ్ డేట్కాగా.. ఇప్పటికే(ఫిబ్రవరిలో) రూ. 6.5 చెల్లించిన సంగతి తెలిసిందే. పూర్తి ఏడాదికి రూ. 92,339 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. డైరెక్టర్, స్వతంత్ర డైరెక్టర్గా 2026 డిసెంబర్ 20 నుంచి మరో ఐదేళ్లపాటు బాధ్యతలు నిర్వహించేందుకు హేమంత్ భార్గవను బోర్డు ఎంపిక చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేరు బీఎస్ఈలో యథాతథంగా రూ. 308 వద్ద ముగిసింది. -
ఐ(పి)టీ స్టాక్స్..
రెండు దశాబ్దాలుగా అటు ఉపాధి కల్పనలోనూ.. ఇటు దేశీ స్టాక్ మార్కెట్ల పెట్టుబడుల్లోనూ ఆధిపత్యంవహిస్తూ వచ్చిన సాఫ్ట్వేర్ రంగం ఇటీవల కొద్ది రోజులుగా గాడి తప్పుతోంది. దీంతో స్టాక్ మార్కెట్లలో కొద్ది వారాలుగా ఐటీ స్టాక్స్లో అమ్మకాలే అధికంగా నమోదవుతున్నాయి. ప్రధానంగా ఫండ్స్ పెట్టుబడుల్లో సాఫ్ట్వేర్ రంగానికి ఉన్న ప్రాధాన్యత మసకబారుతోంది... సుమారు ఏడాది కాలంగా పలు ప్రతికూలతలతో సాఫ్ట్వేర్ రంగం కుదేలవుతోంది. ఐటీ సేవలకు డిమాండ్ మందగించడం, వ్యయ నిర్ణయాలలో క్లయింట్ల ఆలస్యం వంటి అంశాలు ప్రాజెక్టులు, డీల్స్పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. దీంతో కంపెనీల ఫలితాలు సైతం నీరసిస్తున్నాయి. ఇదే సమయంలో పులిమీద పుట్రలాగా ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్సహా గూగుల్(జెమినై), డీప్సీక్, తదితర ఏఐ దిగ్గజాలు మొత్తం ప్రపంచ ఐటీ రంగ ముఖ చిత్రాన్నే మార్చివేస్తున్నాయి. ఏఐతో అభివృద్ధి చేసిన క్లాడ్ తదితర టూల్స్.. కోడింగ్, టెస్టింగ్, డీబగ్గింగ్ తదితర సంప్రదాయ సర్వీసులను అత్యంత వేగంగా పూర్తి చేస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్సహా పలు టెక్ దిగ్గజాలలో అమ్మకాలకు తెరలేచింది. ప్రధానంగా సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రాతోపాటు.. మధ్యస్థాయి కంపెనీల స్టాక్స్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. కొన్ని విభాగాలలో ఏఐ సానుకూల ప్రభావం చూపుతున్నప్పటికీ ప్రా జెక్టులు, ధరలు వంటి కీలక అం శాలలో సవాళ్లు ఎదురుకానున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. 6.7 శాతానికి డౌన్ ఏఐ ప్రకంపనల నేపథ్యంలో కొద్ది నెలలుగా మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు ఐటీ రంగంలో పెట్టుబడులపట్ల విముఖత చూపుతున్నారు. అంతేకాకుండా పెట్టుబడులను తగ్గించుకుంటున్నారు. 2025 ఏప్రిల్తో పోలిస్తే మొత్తం ఈక్విటీ రంగంలో ఫండ్స్ పెట్టుబడులు 1.8 శాతం క్షీణించాయి. 2026 ఏప్రిల్కల్లా ఐటీ రంగంలో ఎంఎఫ్ల పోర్ట్ఫోలియో 8ఏళ్ల కనిష్టానికి చేరినట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదికలో పేర్కొంది. నిజానికి గత 18 నెలలుగా ఐటీ స్టాక్స్ నీరసిస్తూ వస్తున్నాయి. 2024 డిసెంబర్లో నమోదైన గరిష్టం నుంచి చూస్తే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 36% పతనమైంది. దేశీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ తదితరాల ఫలితాలు ఆకట్టుకోకపోగా.. భవిష్యత్ అంచనాలు(గైడెన్స్) ఆసక్తిని కలిగించకపోవడం దీనికి కారణమవుతోంది. నువామా ఆల్టర్నేటివ్ అండ్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ వివరాల ప్రకారం మిరాయ్, హెచ్డీఎఫ్సీ, కొటక్ తదితర ఫండ్స్ పెట్టుబడులను తగ్గించుకోగా.. ఆదిత్య బిర్లా ఎస్ఎల్, ఐసీఐసీఐ ప్రు తదితరాలు హోల్డింగ్స్ పెంచుకున్నాయి. కారణాలున్నాయ్.. మూడు నెలలక్రితం పశ్చిమాసియాలో తలెత్తిన యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ధరలకు ఆజ్యం పోస్తోంది. ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కొన్ని దేశాల మిలటరీ వ్యయాలను పెంచింది. ఈ నేపథ్యంలో పలు దేశాల రిజర్వ్ బ్యాంకుల పరప తి విధానాలు ప్రభావితంకానున్నాయి. అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థలకు సైతం సవాళ్లు ఎదురుకానున్నాయన్న భయాలు పెరుగుతున్నాయి. మరోపక్క ఇటీవల వేగంగా దూసుకువస్తున్న ఏఐ సేవలు ఐటీ ప్రాజెక్టుల రూపురేఖలను మార్చివేయడంతోపాటు ఉపాధి అవకాశాలపైనా తీవ్ర ప్రభావం చూపనున్న అంచనాలు వీటికి జత కలిశాయి. వెరసి ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం కలవరపడుతోంది. అయితే ఇదే సమయంలో విప్లవాత్మక ఏఐ సేవలకు తెరతీస్తున్న చాట్ జీపీటీ, ఆంత్రోపిక్సహా.. చిప్ దిగ్గజం ఎన్విడియా సంచలనాలు సృష్టిస్తుండటం గమనార్హం! ఈ నేపథ్యంలో ఆంత్రోపిక్, ఎన్విడియా కంపెనీల విలువ రోజురోజుకీ బలపడుతుంటే.. గ్లోబల్ టెక్ దిగ్గజాలు యాపిల్, మైక్రోసాఫ్ట్ తదితరాల విలువ వెనకబడుతోంది!! ఇందుకు దేశ, విదేశీ పెట్టుబడుల తీరు ప్రభావం చూపుతోంది!– సాక్షి, బిజినెస్ డెస్క్ -
ట్రంప్ షేర్ లావాదేవీల కలకలం.. వైట్హౌస్ను కుదిపేస్తున్న వివాదం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారీ వివాదంలో చిక్కుకున్నారు. రోజుకు రెండు, మూడు సార్లు షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే సాధారణ ఇన్వెస్టర్లకంటే భిన్నంగా, ట్రంప్ వైట్హౌస్లో కూర్చొని రోజుకు సగటున 40 సార్లు ట్రేడింగ్ చేశారన్న ఆరోపణలు ఇప్పుడు అమెరికా రాజకీయ, ఆర్థిక వర్గాలను కుదిపేస్తున్నాయి. కేవలం 90 రోజుల్లోనే 3,700కు పైగా షేర్ లావాదేవీలు జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది.Bloomberg నివేదికల ప్రకారం, 2026 జనవరి నుంచి మార్చి మధ్య ట్రంప్ లేదా ఆయన సలహాదారులు భారీ స్థాయిలో షేర్ల కొనుగోలు, అమ్మకాల లావాదేవీలు నిర్వహించారు. ముఖ్యంగా Microsoft, NVIDIA, Oracle, Boeing, Amazon, Meta వంటి దిగ్గజ కంపెనీల్లో కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. ఒక్క ఫిబ్రవరి 10న మాత్రమే మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ షేర్లను 5 మిలియన్ నుంచి 25 మిలియన్ డాలర్ల వరకు అమ్మినట్లు సమాచారం.అధ్యక్షుడా? హెడ్జ్ ఫండ్ బాసా? ఈ స్థాయి ట్రేడింగ్ చూసి వాల్ స్ట్రీట్ నిపుణులే ఆశ్చర్యానికి గురయ్యారు. అమెరికా ప్రభుత్వ నైతిక ప్రమాణాల కార్యాలయానికి సమర్పించిన వందల పేజీల ఆర్థిక వివరాలు ఈ వ్యవహారాన్ని బయటపెట్టాయి. పలువురు మార్కెట్ నిపుణులు ఇది సాధారణ వ్యక్తిగత పెట్టుబడి ఖాతా లాగా కనిపించడం లేదని, భారీ అల్గోరిథమిక్ ట్రేడింగ్ నిర్వహించే హెడ్జ్ ఫండ్ తరహాలో ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.అయితే అసలు వివాదం ఇక్కడి నుంచే మొదలైంది. ఒక దేశాధ్యక్షుడు ప్రభుత్వ విధానాలతో నేరుగా ప్రభావితమయ్యే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ఎంతవరకు సమంజసం? అన్న ప్రశ్న ఇప్పుడు అమెరికాలో హాట్ టాపిక్గా మారింది. ఉదాహరణకు NVIDIA సంస్థ చైనాకు ఏఐ చిప్లు ఎగుమతి చేయాలంటే అమెరికా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అలాగే బోయింగ్ కంపెనీ ప్రభుత్వ రక్షణ ఒప్పందాలపై ఆధారపడి ఉంటుంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి కంపెనీలపై ప్రభుత్వం యాంటీ ట్రస్ట్ విచారణలు, ఏఐ నియంత్రణలపై నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటుంది. అలాంటి సమయంలో ఒకవైపు ప్రభుత్వ విధానాలు రూపొందిస్తూ, మరోవైపు అదే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం “కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్” కిందికి వస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.గత అమెరికా అధ్యక్షులు George H. W. Bush, Bill Clinton తమ ఆస్తులను “బ్లైండ్ ట్రస్ట్”లలో ఉంచి ఇలాంటి ఆరోపణలకు తావివ్వకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ట్రంప్ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. ట్రంప్ సంస్థల నిర్వహణలో ఆయన కుటుంబ సభ్యుల పాత్ర కొనసాగుతోందని, కొన్ని ఆర్థిక దాఖలాల్లో ఆలస్యానికి జరిమానాలు కూడా చెల్లించారని సమాచారం.ఆటోమేటెడ్ అల్గోరిథమ్స్ ద్వారా జరిగిందా? ఇంత భారీ స్థాయిలో ట్రేడింగ్ సాధ్యమా? లేదంటే ఆటోమేటెడ్ అల్గోరిథమ్స్ ద్వారా జరిగిందా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఇది పూర్తిగా అల్గోరిథమిక్ ట్రేడింగ్ అని నిరూపించే ఆధారాలు లేవని తెలుస్తోంది. అయినప్పటికీ, కేవలం మూడు నెలల్లో వేల లావాదేవీలు జరగడం అమెరికా మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.ఈ వివాదానికి మరింత ఊపిరి పోసింది ఇరాన్ అంశం. ఇరాన్తో చర్చలు పురోగమిస్తున్నాయని ట్రంప్ ప్రకటించే ముందు కొందరు ఇన్వెస్టర్లు భారీ స్థాయిలో ఫ్యూచర్స్ మార్కెట్లో బెట్టింగ్ పెట్టారని సమాచారం. ట్రంప్ ప్రకటన తర్వాత చమురు ధరలు పడిపోగా, అమెరికా మార్కెట్లు భారీగా ఎగిశాయి. ఈ టైమింగ్ అనుమానాలకు తావిచ్చినా, ట్రంప్కు నేరుగా సంబంధం ఉందని నిరూపించే ఆధారాలు లేవు.ఇదిలా ఉండగా ట్రంప్ అల్లుడు Jared Kushner పేరు కూడా ఈ చర్చల్లో వినిపిస్తోంది. మధ్యప్రాచ్య దేశాలతో దౌత్య చర్చలు జరుపుతూనే, గల్ఫ్ పెట్టుబడిదారులతో ఆర్థిక సంబంధాలు కొనసాగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆయన సంస్థ Affinity Partners సౌదీ అరేబియా సహా గల్ఫ్ సంపద నిధులతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.అయితే వైట్ హౌస్ ఈ ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చింది. ట్రంప్ పెట్టుబడులను స్వతంత్ర ఆర్థిక సంస్థలే నిర్వహిస్తున్నాయని, ఆయన గానీ, కుటుంబ సభ్యులు గానీ నేరుగా ట్రేడింగ్లో పాల్గొనడం లేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ, ఒక అమెరికా అధ్యక్షుడు ప్రభుత్వ నిర్ణయాలతో ప్రభావితమయ్యే కంపెనీల్లో ఈ స్థాయిలో దూకుడుగా ట్రేడింగ్ చేయడం నైతికంగా సరైనదేనా? అన్న ప్రశ్న మాత్రం అమెరికాలో పెద్ద రాజకీయ చర్చకు దారితీస్తోంది. - వెబ్ డెస్క్ -
మారుతి సుజుకి కొత్త ధరలు.. జూన్ నుంచే అమల్లోకి!
ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి తన అన్ని మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. సవరించిన ధరలు జూన్ 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. మోడల్, వేరియంట్ను బట్టి తమ వాహనాల ధరలు రూ. 30,000 వరకు పెరుగుతాయని కంపెనీ తెలిపింది.ఆటోమొబైల్ పరిశ్రమపై ప్రభావం చూపుతున్న ముడిసరుకుల ఖర్చుల నిరంతర పెరుగుదల, కొనసాగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగానే ధరలు పెంచడం జరిగిందని మారుతి సుజుకి వెల్లడించింది. ఈ ప్రభావంలో కొంత భాగాన్ని భరించేందుకు గత కొన్ని నెలలుగా తాము తగిన చర్యలు చేపడుతున్నప్పటికీ.., ప్రస్తుత ప్రతికూల వ్యయ వాతావరణం కారణంగా ధరల భారాన్ని పాక్షికంగా వినియోగదారులపై మోపడం తప్పడం లేదని కంపెనీ తెలిపింది.వినియోగదారులపై భారాన్ని వీలైనంత వరకు తగ్గించడానికి తాము ప్రయత్నించామని, అయితే తమ పోర్ట్ఫోలియోలోని అన్ని మోడళ్లలో ఈ పెరుగుదల వేర్వేరుగా ఉంటుందని మారుతి సుజుకి తెలిపింది. కాగా.. మహీంద్రా, టాటా మోటార్స్, హ్యుందాయ్ మోటార్ ఇండియా వంటి కంపెనీలు ఇప్పటికే వాహనాల ధరల పెంపును అమలు చేశాయి. -
సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ కోసం.. ఎయిర్టెల్ కొత్త సర్వీస్!
భారతి ఎయిర్టెల్ కంపెనీ తమ వినియోగదారులకు మరింత మెరుగైన మొబైల్ నెట్వర్క్ అనుభవాన్ని అందించేందుకు ''ఎయిర్టెల్ ప్రయారిటీ పోస్ట్పెయిడ్'' అనే కొత్త సర్వీస్ ప్రారంభించింది. చాలామంది జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో అంటే.. మార్కెట్లు, ట్రాఫిక్ జామ్లు లేదా పెద్ద ఈవెంట్లు జరిగే ప్రాంతాల్లో, వీడియో కాల్స్ నిలిచిపోవడం, ఫోటోలు అప్లోడ్ కావడంలో ఆలస్యం, లేదా ఈమెయిల్స్ డౌన్లోడ్ కాకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఎయిర్టెల్ ఈ కొత్త సేవను తీసుకొచ్చింది.ఎయిర్టెల్ ప్రయారిటీ పోస్ట్పెయిడ్ సర్వీస్ అనేది ప్రత్యేకంగా పోస్ట్పెయిడ్ వినియోగదారుల కోసం తీసుకొచ్చారు. దీనిద్వారా నెట్వర్క్ రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో కూడా వినియోగదారులకు స్థిరమైన.. వేగవంతమైన ఇంటర్నెట్ అనుభవం లభిస్తుంది. దీనికి కారణం ఎయిర్టెల్ తమ 5జీ నెట్వర్క్లో చేసిన లేటెస్ట్ టెక్నికల్ అప్గ్రేడ్. ఈ సాంకేతికతను స్లైసింగ్ అని పిలుస్తారు.స్లైసింగ్ అనేది ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే ఉపయోగంలో ఉన్న నెట్వర్క్ టెక్నాలజీ. ఇప్పుడు అదే సదుపాయాన్ని ఎయిర్టెల్ భారతదేశంలో కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సేవను పొందడం చాలా సులభం. ఇప్పటికే ఎయిర్టెల్ పోస్ట్పెయిడ్ వినియోగదారులైతే ఈ సదుపాయం ఆటోమేటిక్గా అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ప్రీపెయిడ్ వాడుతున్న వారు ఎయిర్టెల్ యాప్ ద్వారా లేదా సమీప ఎయిర్టెల్ స్టోర్కి వెళ్లి తమ కనెక్షన్ను పోస్ట్పెయిడ్గా మార్చుకోవచ్చు.అయితే.. ఈ సేవను పూర్తిగా ఉపయోగించాలంటే వినియోగదారుల వద్ద 5G సపోర్ట్ ఉన్న స్మార్ట్ఫోన్ ఉండాలి. అలాగే ఫోన్లో తాజా సాఫ్ట్వేర్ అప్డేట్ ఉండటం అవసరం. ఫోన్లో అప్డేట్ పెండింగ్లో ఉంటే, సెట్టింగ్స్లో నోటిఫికేషన్ కనిపిస్తుంది. అదనంగా ఎయిర్టెల్ యాప్ ద్వారా కూడా ఫోన్ ఈ సేవకు సిద్ధంగా ఉందో లేదో తెలుసుకోవచ్చు.Entering our priority era 💅 https://t.co/GfN7Qzzkrg— airtel India (@airtelindia) May 19, 2026 -
ఉద్యోగాల కోతలు.. జుకర్బర్గ్ వివరణ
టెక్ రంగంలో ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే మెటా కంపెనీ భారీ స్థాయిలో ఉద్యోగాల పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. ఈ ప్రభావం 8000 ఉద్యోగులపై పడింది. మరో 7000 మంది ఉద్యోగులను కొత్త టీమ్స్కు మార్చింది. అంతే కాకుండా ఖాళీగా ఉన్న 6000 పోస్టులను కూడా భర్తీ చేసే యోచన లేదని సంస్థ స్పష్టం చేసింది.ఈ పరిణామాల తరువాత మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఉద్యోగులకు ఒక మెమో పంపించారు. అందులో.. ఈ ఏడాది పెద్ద స్థాయి ఉద్యోగ కోతలు ఉండవని స్పష్టం చేశారు. అంటే ప్రస్తుత ఉద్యోగ కోతల తరువాత సంస్థ ఉద్యోగులను తొలగించే ఆలోచనలో లేదని తెలుస్తోంది.మార్క్ జుకర్బర్గ్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక కారణాలను కూడా వివరించారు. కంపెనీ కమ్యూనికేషన్ విషయంలో కొంత స్పష్టత లోపించిందని ఆయన అంగీకరించారు. ఉద్యోగులకు సరైన సమాచారం ఇవ్వడంలో మరింత మెరుగుదల అవసరం ఉందని చెప్పారు. ఏఐ సాంకేతికత భవిష్యత్తును పూర్తిగా మార్చబోతుందని అన్నారు. సంస్థల మధ్య పోటీ తీవ్రంగా ఉందని, కంపెనీలు నిరంతరం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని సూచించారు. ఏఐను మానవ జీవితంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చే టెక్నాలజీగా ఆయన అభివర్ణించారు.ఇదీ చదవండి: ఉద్యోగం పోయింది.. ఈఎంఐ కట్టలేని స్థితి నుంచి విజయం!ఉద్యోగం కోల్పోయిన వారికి సంస్థ 16 వారాల ప్రాథమిక వేతనంతో పాటు, సంస్థలో పనిచేసిన ప్రతి సంవత్సరానికి అదనంగా రెండు వారాల వేతనాన్ని సీవెరన్స్ ప్యాకేజీగా అందిస్తుంది. ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు 18 నెలల పాటు ఉచిత ఆరోగ్య సంరక్షణ కవరేజీని కొనసాగిస్తారు. యూఎస్ వెలుపల ఉన్న ఉద్యోగులకు వారి దేశాల నిబంధనలను బట్టి దాదాపు ఇలాంటి ప్రయోజనాలే అందుతాయి. -
లోన్ ఏజెంట్ల ఆగడాలకు చెక్.. ఆర్బీఐ కొత్త డ్రాఫ్ట్ రూల్
ఢిల్లీ: బ్యాంక్ వినియోగదారులకు ఆర్బీఐ శుభవార్త చెప్పింది. లోన్ ఏజెంట్ల ఆగడాలకు చెక్ పెడుతూ ఆర్బీఐ కొత్త డ్రాఫ్ట్ బిల్ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనలు అతిక్రమిస్తే బ్యాంకులపై ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకోనుంది. రికవరీ ఏజెంట్లు, బ్యాంకు ఉద్యోగుల ప్రవర్తనపై కఠిన నియమాలు అమలు చేయాలని ఆర్బీఐ సూచించింది.బ్యాంకులు బోర్డు ఆమోదించిన రికవరీ, కలెక్షన్ పాలసీని అమలు చేయాలితప్పుగా రికవరీ చేస్తే నష్టపోయిన రుణం తీసుకున్న వారికి బ్యాంకులు పరిహారం చెల్లించాలిరికవరీ ఏజెంట్లకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాకింగ్ సర్టిఫికేషన్ తప్పనిసరిబ్యాంకులు తమ వెబ్సైట్, యాప్లలో రికవరీ ఏజెన్సీల వివరాలు ప్రకటించాలిమొదటి రికవరీ ఏజెంట్ సందర్శనకు ముందు రుణదాతలకు (లోన్ ఎవరైతే తీసుకుంటారో వారికి) సమాచారం ఇవ్వాలిరికవరీ ఏజెన్సీ మార్పు లేదా రద్దు జరిగితే వెంటనే లోన్ తీసుకున్న వినియోగదారులకు తెలపాలిఫిర్యాదులు పరిష్కారం కాని పరిస్థితిలో రికవరీ కేసులు ముందుకు కొనసాగించకూడదు రికవరీ ఏజెంట్ల కాల్స్ రికార్డు చేసి కనీసం ఆరు నెలలు భద్రపరచాలికఠిన రికవరీ పద్ధతులను ప్రోత్సహించే ఇన్సెంటివ్లు నిషేధంరుణగ్రహిత ఆస్తి స్వాధీనం చేసుకునే ముందు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలిఫైనాన్స్ చేసిన డివైస్ను ఫోన్,ల్యాప్ట్యాప్ ఇతర వస్తువులు 90 రోజుల బకాయి తర్వాత మాత్రమే డిసేబుల్ చేయాలిడివైస్ యాక్సెస్ పరిమితం చేయడానికి 21 రోజుల నోటీసు, అదనంగా 7 రోజుల నోటీసు తప్పనిసరితప్పుగా డివైస్ బ్లాక్ చేస్తే గంటకు రూ.250 పరిహారం చెల్లించాలి.రికవరీ ఏజెంట్లు ఐడీ కార్డు, అనుమతి డాక్యుమెంట్లు వెంట తీసుకెళ్లాలి.రికవరీ కాల్స్, లోన్ తీసుకున్న వ్యక్తులను ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే కలవాలిరికవరీ ఫిర్యాదుల కోసం ప్రత్యేక గ్రివెన్స్ సెల్ ఏర్పాటు చేయాలి.మరణం లేదా వివాహం వంటి సందర్భాల్లో రుణదాతల్ని సంప్రదించరాదు’ అని ఆర్బీఐ తన కొత్త డ్రాఫ్ట్ బిల్లులో పేర్కొంది. కాగా, ఆర్బీఐ తాజా డ్రాఫ్ట్ లోన్ రికవరీ నియమాలు మే 20, 2026న విడుదలయ్యాయి. ఈ డ్రాఫ్ట్పై ప్రజలు, బ్యాంకులు, ఇతర స్టేక్హోల్డర్లు తమ అభిప్రాయాలను మే 31, 2026లోపు సమర్పించాలి. తుది అమలు జూలై 1, 2026 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది -
కొత్త పల్సర్ ఎన్160 లాంచ్: ధర ఎంతంటే?
బజాజ్ ఆటో దేశీయ విఫణిలో 'పల్సర్ ఎన్160' కొత్త వేరియంట్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 1,22,000 (ఢిల్లీ ఎక్స్-షోరూమ్). ఈ బైక్ దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత బజాజ్ డీలర్షిప్లలో అందుబాటులో ఉంది.బజాజ్ కొత్త పల్సర్ ఎన్160.. స్టాండర్డ్ సిరీస్ కంటే కూడా ప్రీమియం లుక్, మెరుగైన ఫీచర్స్ పొందుతుంది. ఇందులో అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ వంటివి ఉన్నాయి. ఇవి మరింత మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తాయి. గోల్డ్ కలర్ USD ఫోర్కులు, ABS టెక్నాలజీ వంటివి ఉన్నాయి.సాధారణ టెలిస్కోపిక్ ఫోర్క్ సెటప్తో పోలిస్తే.. USB ఫోర్క్లను జోడించడం వల్ల మోటార్సైకిల్కు మరింత ప్రీమియం ఫ్రంట్-ఎండ్ లుక్ వస్తుంది. బ్రేకింగ్, కార్నరింగ్ లోడ్ల కింద మెరుగైన దృఢత్వాన్ని అందిస్తుంది. ABS బ్రేకులు రైడర్లకు మరింత బలమైన భద్రతను అందిస్తాయి.ఇదీ చదవండి: సరికొత్త ఎలక్ట్రిక్ బైక్.. 15 రోజుల్లో 25వేల బుకింగ్స్!ఇకపోతే ఇంజిన్లో ఎలాంటి మార్పులు చేయలేదు. కాబట్టి ఈ వేరియంట్లో స్టైలింగ్ అండ్ రైడర్ సౌకర్యంపై స్పష్టంగా దృష్టి పెట్టారు. ఈ వేరియంట్లో మీకు LED ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్, USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ మరియు రైడర్, పిలియన్కు ఎక్కువ స్థలాన్ని అందించే సింగిల్-సీట్ సెటప్ కూడా లభిస్తాయి. పనితీరులో ఎలాంటి మార్పు ఉండదు. -
తగ్గిన ఓలా ఎలక్ట్రిక్ నష్టం.. తొలిసారి పాజిటివ్ క్యాష్ ఫ్లో
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ ఓలా ఎలక్ట్రిక్ గత ఆర్థిక సంవత్సరం (2025–26) నాలుగో త్రైమాసికం (క్యూ4)లో రూ.500 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని ప్రకటించింది. అయితే, అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో నమోదైన రూ.870 కోట్ల నష్టంతో పోలిస్తే ఈసారి నష్టం 42.5 శాతం తగ్గింది. ఆదాయం 57 శాతం క్షీణించి రూ.611 కోట్ల నుంచి రూ.265 కోట్లకు దిగజారింది.ఆదాయం తగ్గినా, స్థూల మార్జిన్లు మెరుగయ్యాయి. ఇవి వార్షిక ప్రాతిపదికన 13.7% నుంచి 38.5 శాతానికి చేరాయి. పీఎల్ఐ ప్రోత్సాహకాలు, మెరుగైన స్థూల మార్జిన్లు, కఠినమైన వ్యయ నియంత్రణ కారణంగా కంపెనీ చరిత్రలో తొలిసారిగా కార్యకలాపాల నగదు ప్రవాహం పాజిటివ్గా మారి క్యూ4లో రూ.91 కోట్లుగా నమోదైంది. ఆటోమొబైల్ వ్యాపారం నుంచి రూ.213 కోట్ల ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో, రూ.173 కోట్ల ఫ్రీ క్యాష్ ఫ్లో (ఎఫ్సీఎఫ్) నమోదయ్యాయి.మార్చి త్రైమాసికంలో మొత్తం 20,256 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను కంపెనీ విక్రయించింది. ఇక పూర్తి 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ మొత్తం రూ.2,253 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా.. రూ.1,833 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఓలా ఎలక్ట్రిక్ మొత్తం 1,73,794 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను డెలివరీ చేసింది. -
IPL వెలుగులో బెట్టింగ్ ‘చీకటి ఆట’!
ఐపీఎల్ (IPL) సీజన్ను ఆసరాగా చేసుకుని భారతీయ క్రికెట్ అభిమానులను పెద్ద ఎత్తున ముంచేస్తున్న ఒక భారీ అక్రమ బెట్టింగ్ నెట్వర్క్ను ప్రముఖ సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ 'క్లౌడ్సెక్' (CloudSEK) బట్టబయలు చేసింది. క్లోన్-స్క్రిప్ట్ ప్లాట్ఫారమ్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డీప్ఫేక్స్, హ్యాక్ చేసిన ప్రభుత్వ వెబ్సైట్లు, మనీ లాండరింగ్ నెట్వర్క్ల సహాయంతో ఈ ముఠా ఇంతటి భారీ దోపిడీకి పాల్పడుతున్నట్లు సంస్థ తన తాజా పరిశోధనలో వెల్లడించింది.గత వారమే ఐపీఎల్ వీక్షకులను లక్ష్యంగా చేసుకుని నడుస్తున్న నకిలీ స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్లను గుర్తించిన క్లౌడ్సెక్, తాజాగా ఈ అక్రమ బెట్టింగ్ ఎకానమీ వెనుక ఉన్న చీకటి ప్రపంచాన్ని పూర్తిగా మ్యాప్ చేసింది.పరిశోధనలో తేలిన దిగ్భ్రాంతికర నిజాలు1,200కు పైగా నకిలీ డొమైన్లు: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అక్రమ బెట్టింగ్ ప్లాట్ఫారమ్లను ప్రోత్సహించడానికి 1,200 కంటే ఎక్కువ వెబ్సైట్ డొమైన్లు యాక్టివ్గా పనిచేస్తున్నట్లు క్లౌడ్సెక్ గుర్తించింది.ఒక్క బ్యాకెండ్.. 25 వెబ్సైట్లు: పరిశోధకులు ఒక అక్రమ ప్లాట్ఫారమ్ అడ్మిన్ ప్యానెల్ను యాక్సెస్ చేయగా, కేవలం ఒకే ఒక్క బ్యాకెండ్ సిస్టమ్ నుండి 25కు పైగా వేర్వేరు బెట్టింగ్ వెబ్సైట్లను నడుపుతున్నట్లు తేలింది. దీని ద్వారా యూజర్ల డిపాజిట్లు, బెట్టింగులు, విత్డ్రా రిక్వెస్ట్లను నిందితులు పూర్తిగా నియంత్రిస్తున్నారు.రూ. 4.65 కోట్ల విత్డ్రా నిరాకరణ: మే 2025 నుండి మే 2026 మధ్య కాలంలో, ఈ ఒక్క ప్లాట్ఫారమ్లోనే వినియోగదారులు చేసుకున్న 9,300 లకు పైగా డబ్బు విత్డ్రా రిక్వెస్ట్లను ఏజెంట్లు ఉద్దేశపూర్వకంగా తిరస్కరించారు. ఇది సాంకేతిక లోపం కాదు, కేవలం ఒకే ఒక్క క్లిక్తో యూజర్ల సొమ్మును నొక్కేసే ప్రక్రియ. దీని విలువ సుమారు రూ.4.65 కోట్లు ఉంటుందని అంచనా.మనీ మ్యూల్ నెట్వర్క్: నిందితులు బిజినెస్ పేరుతో రిజిస్టర్ అయిన కొన్ని బ్యాంక్ ఖాతాలను ఉపయోగిస్తున్నారు. యూజర్లు డిపాజిట్ చేసే డబ్బును ఈ ఖాతాల ద్వారా ఇతర చోట్లకు మళ్లించి, అసలు సూత్రధారులు ఎవరో దొరకకుండా జాగ్రత్తపడుతున్నారు.క్రికెటర్ల పేరిట డీప్ఫేక్ వీడియోలు: భారతీయ క్రికెటర్లు, ప్రముఖ కంటెంట్ క్రియేటర్ల ముఖాలను, వాయిస్లను ఏఐ (AI) డీప్ఫేక్ టూల్స్ ద్వారా క్లోన్ చేసి.. వారు ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నట్లు నకిలీ వీడియోలను సృష్టిస్తున్నారు. వీటిని ఇన్స్టాగ్రామ్ రీల్స్, టెలిగ్రామ్ ఛానల్స్లో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు.ప్రభుత్వ వెబ్సైట్ల హ్యాకింగ్: ప్రజల్లో నమ్మకాన్ని చూరగొనడానికి పలు భారతీయ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లను (.gov.in) కూడా హ్యాక్ చేసి, వాటిలో ఈ అక్రమ బెట్టింగ్ లింకులను (Backlinks) చొప్పించారు. గూగుల్ సెర్చ్లో ప్రభుత్వ సైట్లకు ఉండే గుర్తింపును వాడుకుని యూజర్లను బురిడీ కొట్టిస్తున్నారు.ఐపీఎల్ బెట్టింగ్ వ్యసనంలో పడి సామాన్యులు భారీగా నష్టపోవడమే కాకుండా, ఆ తర్వాత వారిని టార్గెట్ చేస్తూ నకిలీ లోన్ యాప్ల ద్వారా కూడా వేధింపులకు గురిచేస్తున్నట్లు క్లౌడ్సెక్ నివేదిక స్పష్టం చేసింది. క్రికెట్ అభిమానులు ఇలాంటి అనధికారిక, అక్రమ బెట్టింగ్ సైట్లకు దూరంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
పెంట్హౌస్ కోసం రూ.45 కోట్లు: ఎవరు కొన్నారంటే?
సాధారణంగా సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు ఎప్పటికప్పుడు ఖరీదైన వాహనాలు, విలాసవంతమైన భవనాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్జీ చిన్న కుమారుడు తారిఖ్ ప్రేమ్జీ, సెంట్రల్ బెంగళూరులో ఒక పెంట్హౌస్ కొనుగోలు చేశారు. దీని విలువ రూ.45.71 కోట్లు.తారిఖ్ ప్రేమ్జీ పెంట్హౌస్ కోసం భారీ మొత్తంలో ఖర్చు చేసినట్లు, రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ జాప్కీ ద్వారా లభించిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాలు ద్వారా తెలిసింది. కార్పెట్ ఏరియా 7,065 చదరపు అడుగులు, సూపర్ బిల్ట్-అప్ ఏరియా 10,602 చదరపు అడుగులుగా ఉంది. చదరపు అడుగుకు సుమారుగా రూ. 43,123 చెల్లించినట్లు తెలుస్తోంది.ఈ ఏడాది బెంగళూరులో జరిగిన అతిపెద్ద లగ్జరీ రియల్ ఎస్టేట్ డీల్స్లో ఒకటిగా నిలుస్తుందని జాప్కీ సహ వ్యవస్థాపకుడు సందీప్ రెడ్డి అన్నారు. నగరంలో రిచ్మండ్ టౌన్, ఇంద్రానగర్, కోరమంగళ వంటి ప్రాంతాలతో పాటు సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్లో ఉన్న హై-ఎండ్ అపార్ట్మెంట్లకు డిమాండ్ పెరుగుతోంది.ఇదీ చదవండి: ఉద్యోగం పోయింది.. ఈఎంఐ కట్టలేని స్థితి నుంచి విజయం!అజీమ్ ప్రేమ్జీ భారతదేశంలో దిగ్గజ వ్యాపారవేత్తలలో ఒకరు మాత్రమే కాకుండా.. ప్రముఖ దాతృత్వవేత్త కూడా. ఈయన స్థాపించిన అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ ద్వారా విద్య, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలకు భారీగా నిధులు అందిస్తున్నారు. వీరి కుటుంబం నిర్వహించే ఇన్వెస్ట్మెంట్ ఆర్మ్ అనేక రంగాల్లో పెట్టుబడులు పెడుతోంది. తారిఖ్ కూడా కుటుంబ వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా ఉంటూ, వివిధ బోర్డు స్థాయి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
స్టాక్ మార్కెట్లోకి హైదరాబాద్ ఈవీ కంపెనీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తాజా ఇంటర్నేషనల్తో రివర్స్ మెర్జర్ అనంతరం హైదరాబాద్కి చెందిన కమర్షియల్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ కెటో మోటర్స్ .. బీఎస్ఈలో లిస్టయింది. దేశవ్యాప్తంగా ఉత్పత్తి సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు, ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కార్యకలాపాలను విస్తరించే క్రమంలో ఇదొక కీలక మైలురాయని సంస్థ డైరెక్టర్ వెంకటేష్ చల్లా తెలిపారు.దేశీయంగా వాణిజ్య ఎలక్ట్రిక్ వాహనాల రంగం పరివర్తనలో తమ సంస్థ అర్ధవంతమైన పాత్రను పోషించగలదని పేర్కొన్నారు. కంపెనీ తెలంగాణలో తలపెట్టిన రూ. 300 కోట్లతో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ ప్రాజెక్టు, అర్బనోవా కేఈ9 పేరిట తొమ్మిది మీటర్ల ఎలక్ట్రిక్ బస్ ప్లాట్ఫాంను ఆవిష్కరించడం తదితర పరిణామాల నేపథ్యంలో సంస్థ లిస్టింగ్ ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఫండ్స్ పెట్టుబడులకు థర్డ్పార్టీ చెల్లింపులు
మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులకు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో థర్డ్పార్టీ (ఇన్వెస్టర్ పేరిట మరొకరు) చెల్లింపులను అనుమతించే ప్రతిపాదనను సెబీ తీసుకొచ్చింది. ప్రస్తుత నిబంధనల కింద మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలంటే ఇన్వెస్టర్ తన బ్యాంక్ ఖాతా నుంచే ఆ మొత్తాన్ని బదిలీ చేయగలరు. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నుంచి వచ్చిన సూచనలతో సెబీ ఈ కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చింది.ఉదాహరణకు ఉద్యోగి తరఫున పెట్టుబడులకు యాజమాన్యం చెల్లింపులు చేయొచ్చు. వేతనం నుంచి ఈ మేరకు యాజమాన్యం మినహాయించుకుంటుంది. అలాగే, అస్సెట్ మేనేజ్మెంట్ సంస్థలు (ఏఎంసీలు) మ్యూచువల్ ఫండ్ పంపిణీదారులకు కమీషన్ను నగదు రూపంలో కాకుండా మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ల రూపంలో చెల్లింపులు చేసేందుకూ ఈ ప్రతిపాదన వీలు కల్పించనుంది. అలాగే, ఇన్వెస్టర్లు తమ చందాలో లేదా రాబడిలో కొంత మొత్తాన్ని సామాజికాభివృద్ధికి అందించే ప్రతిపాదనను కూడా సెబీ చేసింది. జూన్ 10 వరకు వీటిపై అభిప్రాయాలు తెలియజేయాలని కోరింది. -
ఉద్యోగం పోయింది.. ఈఎంఐ కట్టలేని స్థితి నుంచి విజయం!
ఒకప్పుడు నెలకు రూ.5 లక్షల జీతం తీసుకుంటూ.. పెద్ద కంపెనీలో డైరెక్టర్ స్థాయిలో పనిచేసిన వ్యక్తి, ఒక్కసారిగా ఉద్యోగం కోల్పోయి జీవితంలో తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొన్నాడు. ఆ తరువాత ఎదురైన ఇబ్బందులే అతన్ని జీవితంలో సక్సెస్ సాధించేలా చేశాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.గౌరవ్ కవాత్రా అనే వ్యక్తి 2018లో ఆయన ఒక చైనా మల్టీనేషనల్ కంపెనీలో డైరెక్టర్గా పనిచేశారు. ఆ సమయంలో నెలకు రూ.5 లక్షల జీతం ఉన్నప్పటికీ.. రూ. 2 కోట్ల హౌస్ లోన్ ఉండేది. ప్రతి నెల జీతం వస్తుండడంతో ఈఎంఐ చెల్లించడానికి ఇబ్బంది ఉండేది కాదు. ఇలాంటి సమయంలో అనుకోకుండా.. సంస్థ అతన్ని ఉద్యోగం నుంచి తొలగించింది.అనుకోకుండా ఉద్యోగం పోవడంతో కవాత్రాకు ఏం చేయాలో అర్థం కాకుండా పోయింది. జీవితంలో అత్యంత కష్టమైన రోజులు ప్రారంభమయ్యాయి. కొత్త ఉద్యోగం కోసం ఆయన అనేక ప్రయత్నాలు చేశారు. ఎన్నో తిరస్కరణలకు గురయ్యారు. నిరాశ, భయం, ఆర్థిక ఒత్తిడి కవాత్రాను మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇలాంటి సమయంలో రాత్రిళ్లు నిద్రపోయేవాడు కాదు. తీవ్ర ఆందోళనతో రోజుకు 12 నుంచి 15 సిగరెట్లు తాగేవాడు. ఆ అలవాటును మానుకోవడానికి ఆయనకు ఎనిమిదేళ్లు పట్టిందని చెప్పారు.ఉద్యోగం లేకుండా ఉన్నప్పుడు.. తన కుమార్తె అడిగిన కొన్ని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చిందని కవాత్రా తన బాధను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. పొరుగువారు.. ఇంట్లో కూర్చొని ఉన్న తనను చూసినప్పుడు తాను మరింత అవమానంగా ఫీలయ్యేవాడినని చెప్పారు.అయితే.. ఈ అనుభవం అతని జీవితానికి ఒక పాఠం నేర్పింది. పెద్ద కంపెనీలో ఉద్యోగం, అధిక జీతం ఇవన్నీ శాశ్వత భద్రత కాదని కవాత్రా గ్రహించారు. నేను నా జీవితాన్ని ఒక కార్పొరేట్ లోగోకు బానిసలా మార్చుకున్నాను, అని ఆయన అన్నారు. డిగ్రీలు ఒక స్థాయి వరకు మాత్రమే ఉపయోగపడతాయని, కానీ నైపుణ్యాలు జీవితాంతం విలువనిస్తాయని ఆయన గుర్తించారు.ఈ సంక్షోభం తర్వాత.. ఆయన తనలో కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకున్నారు. మార్కెటింగ్ ఎలా చేయాలి, ప్రజలను ఎలా నిర్వహించాలి, వ్యాపారాన్ని ఎలా నడపాలి వంటి విషయాలను నేర్చుకున్నారు. క్రమంగా ఆయన కన్సల్టింగ్ రంగంలో అడుగుపెట్టి తన కెరీర్ను తిరిగి నిర్మించుకున్నారు.ఇదీ చదవండి: దిగ్గజ కంపెనీ లేఆఫ్స్.. 8,000 మందిపై ప్రభావం!ప్రస్తుతం ఆయన దేశంలోని అనేక పెద్ద ప్రాజెక్టులకు సలహాదారుగా పనిచేసినట్టు చెబుతున్నారు. రూ.6,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు సలహాలు ఇచ్చారని, 19 రాష్ట్రాల్లో 65 కంపెనీలతో కలిసి పనిచేశారని పేర్కొన్నారు. ఒకప్పుడు ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి, ఇప్పుడు అనేక మందికి మార్గదర్శకుడిగా మారడం.. ఆయన ప్రయాణంలో గొప్ప విజయం అనే చెప్పాలి. -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 196.63 పాయింట్లు లేదా 0.26 శాతం నష్టంతో 75,121.76 వద్ద, నిఫ్టీ 19.10 పాయింట్లు లేదా 0.081శాతం నష్టంతో 23,639.90 వద్ద నిలిచాయి.ఎలక్ట్రోథర్మ్ (ఇండియా) లిమిటెడ్, జెనెసిస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇండో బోరాక్స్ & కెమికల్స్ లిమిటెడ్, గో ఫ్యాషన్ (ఇండియా) లిమిటెడ్, వీవర్క్ ఇండియా మేనేజ్మెంట్ లిమిటెడ్ వంటి సంస్థలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఈప్యాక్ డ్యూరబుల్స్ లిమిటెడ్, సోమి కన్వేయర్ బెల్టింగ్స్ లిమిటెడ్, జూబిలెంట్ ఫుడ్వర్క్స్ లిమిటెడ్, డిజిడ్రైవ్ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్, వండర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
థాయ్లాండ్లో హాయిగా.. ఇక కొన్ని రోజులే!!
బ్యాంకాక్: భారతదేశంతో సహా దాదాపు 90 దేశాల ప్రయాణికులకు గతంలో కల్పించిన 60 రోజుల వీసా రహిత (Visa-Free) బస సదుపాయాన్ని ఉపసంహరించుకోవాలని థాయ్లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2024లో ప్రవేశపెట్టిన ఈ పొడిగించిన వీసా రహిత బస పథకాన్ని రద్దు చేయడానికి థాయ్ క్యాబినెట్ అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు 'న్యూస్ రిఫార్మ్' సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.నిర్ణయానికి కారణాలు» ఇటీవలి కాలంలో విదేశీ పౌరులకు సంబంధించిన వరుస నేరాలే ఈ కఠిన నిర్ణయానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. » విదేశీయులు పాల్గొంటున్న మాదకద్రవ్యాల నేరాలు, లైంగిక అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్) కేసులు పెరిగిపోవడం.» సరైన అనుమతులు లేకుండా హోటళ్లు, పాఠశాలలతో కూడిన వ్యాపారాలను చట్టవిరుద్ధంగా నిర్వహించడం.» కొంతమంది సందర్శకులు ఈ పొడిగించిన వీసా రహిత పద్ధతిని తమ అక్రమ కార్యకలాపాల కోసం దుర్వినియోగం చేస్తున్నట్లు థాయ్ అధికారులు గుర్తించారు.భారతీయ ప్రయాణికులకు ఏం మారనుందంటే..ఈ తాజా నిర్ణయంతో భారతీయ ప్రయాణికులు 2024లో తాత్కాలిక 60 రోజుల మినహాయింపు రాకముందు ఉన్న పాత నిబంధనల్లోకి మారిపోతారు. మునుపటి ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం, భారతీయ పాస్పోర్ట్ హోల్డర్లకు ఇకపై థాయ్లాండ్లో గరిష్టంగా 30 రోజులు మాత్రమే వీసా లేకుండా ప్రవేశించడానికి, బస చేయడానికి అనుమతి ఉంటుంది.పర్యాటక రంగం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావంథాయ్లాండ్ జీడీపీలో పర్యాటక రంగం వాటా 10% కంటే ఎక్కువ. ఇది అక్కడి స్థానిక ఆర్థిక వ్యవస్థకు కీలకమైన చోదకశక్తిగా ఉంది. ప్రభుత్వం ఈ సంవత్సరం సుమారు 3.35 కోట్ల మంది అంతర్జాతీయ సందర్శకులను స్వాగతించాలని భావిస్తోంది. ఇది గత సంవత్సరం నమోదైన దాదాపు 3.3 కోట్ల మంది రాకపోకల కంటే స్వల్ప వృద్ధి. థాయ్లాండ్ పర్యాటక, క్రీడల మంత్రిత్వ శాఖ నుండి అందిన తాజా డేటా ప్రకారం, 2026 మొదటి త్రైమాసికంలో విదేశీ రాకపోకలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే సుమారు 2.3% నుండి 3.4% వరకు తగ్గాయి. -
ఆ ఒక్క ప్రశ్నతో సీనియర్ ఉద్యోగిపై వేటు!
‘సార్, తర్వాత ఏం చేయాలో చెప్పండి?’-ఏదైనా ఆఫీసులో ఒక ఉద్యోగి తన పైఅధికారిని అడిగే అత్యంత సాధారణ ప్రశ్న ఇది. కానీ, నోయిడాకు చెందిన ఒక ప్రముఖ స్టార్టప్ సీఈవోకు మాత్రం ఈ ప్రశ్న తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఎంతలా అంటే, ఆ ప్రశ్న అడిగినందుకు ఏకంగా ఒక సీనియర్ ఉద్యోగినే కొలువులోంచి తొలగించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ లింక్డ్ఇన్ వేదికగా కార్పొరేట్ కార్యాలయ సంస్కృతి, నాయకత్వ లక్షణాలపై చర్చకు దారితీసింది. ఆస్ట్రాలజీ స్టార్టప్ ‘ఇన్స్టాఆస్ట్రో’ వ్యవస్థాపకుడు, సీఈవో నితిన్ వర్మ స్వయంగా లింక్డ్ఇన్లో షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు కార్పొరేట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.‘నిన్ను ఉద్యోగంలో పెట్టుకుంది ఇందుకేనా?’లింక్డ్ఇన్ పోస్ట్లో నితిన్ వర్మ ఈ సంచలన నిర్ణయాన్ని పంచుకుంటూ, తానే స్వయంగా ఆ సీనియర్ ఉద్యోగిని ఎందుకు తొలగించాల్సి వచ్చిందో వివరించారు. ‘నేను ఒక ఉద్యోగిని తొలగించాను. ఎందుకంటే అతను నా దగ్గరకు వచ్చి.. సార్, తర్వాత ఏం చేయాలో చెప్పండి అని అడిగాడు’ అని వర్మ రాసుకొచ్చారు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను గుర్తుచేసుకుంటూ.. ‘నేను వెంటనే అతని పనితీరును, ధోరణిని ప్రశ్నించాను. దానికి ఆ ఉద్యోగి సార్, నాకంటే మీకే బాగా తెలుసు కదా అని సమాధానమిచ్చాడు. అప్పుడు నేను.. అసలు నిన్ను ఈ ఉద్యోగంలోకి ఎందుకు నియమించుకున్నట్లు? అని అడిగాను’ అని వర్మ పేర్కొన్నారు.పూర్తి స్వేచ్ఛ ఇచ్చినా..సదరు ఉద్యోగిని ఒక నిర్దిష్ట విభాగానికి పూర్తి బాధ్యుడిగా, స్వతంత్రంగా వ్యవహరించడానికి భారీ ప్యాకేజీతో నియమించుకున్నట్లు సీఈవో స్పష్టం చేశారు. కంపెనీ రోజువారీ కార్యకలాపాల్లో తాను జోక్యం చేసుకోకూడదనే ఉద్దేశంతోనే ఆ నియామకం జరిగిందని తెలిపారు. సదరు సీనియర్ నిపుణుడికి మొదటి రోజు నుంచే ఎలాంటి మైక్రో మేనేజ్మెంట్, అప్రూవల్ చెయిన్ లేకుండా పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు చెప్పారు. వ్యవస్థాపకులు లేదా మేనేజర్ల నుంచి నిరంతరం సూచనల కోసం వేచి చూడకుండా.. సమస్యలను ముందుగానే గుర్తించి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడమే సీనియర్ ఉద్యోగుల బాధ్యత అని వర్మ వాదించారు.అది వ్యక్తిగతంగా రావాల్సింది!కార్యాలయంలో ఓనర్షిప్ (కంపెనీని తనదిగా భావించి పనిచేసే యాజమాన్య మనస్తత్వం) అనేది కాలక్రమేణా నాయకులు ఉద్యోగులకు నేర్పించే నైపుణ్యం కాదని, అది వ్యక్తిగతంగా రావాల్సిన మనస్తత్వమని వర్మ అభిప్రాయపడ్డారు. ‘మీరు యాజమాన్య బాధ్యతను ఎవరికీ బలవంతంగా ఇవ్వలేరు. ఉంటే వారే ఆ బాధ్యతతో ముందుకు పరిగెడతారు, లేదంటే వారు దానిని ఎప్పటికీ చేరుకోలేరు. యాజమాన్య బాధ్యత లేని స్వేచ్ఛ కేవలం గందరగోళానికి దారితీస్తుంది. ఏం ఆలోచించాలో కూడా నేనే చెప్పాల్సి వస్తే.. అలాంటి వ్యక్తులతో నేను సంస్థను నిర్మించలేను’ అని సీఈవో నితిన్ వర్మ స్పష్టం చేశారు.నెటిజన్ల స్పందనఈ పోస్ట్ వైరల్ కావడంతో లింక్డ్ఇన్ వినియోగదారులు, హెచ్ఆర్ నిపుణులు సీఈవో నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఒక సీనియర్ నిపుణుడికి కూడా కంపెనీ ప్రాధాన్యతలు, భవిష్యత్తు వ్యూహాలపై స్పష్టత అవసరమని వాదిస్తున్నారు. ఎంత సీనియర్ అయినా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు వ్యవస్థాపకుడి విస్తృత వ్యూహానికి అనుగుణంగా ఉండాలని భావిస్తారు. అందుకోసమే చర్చలు జరుపుతారు అని కొందరు చెబుతున్నారు. సీనియర్లకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినప్పుడు, ప్రతి చిన్న విషయానికి అనుమతులు లేదా స్పష్టత కోసం వ్యవస్థాపకుడిపై ఆధారపడకూడదని ఇంకొందరు అంటున్నారు.ఇదీ చదవండి: భారత్లో మరో స్టోర్కు సన్నాహాలు! -
తొలగించిన ఆ 8 వేల మందికి మెటా ఇచ్చేది ఇదే..
టెక్ దిగ్గజం 'మెటా' (Meta) పెద్ద ఎత్తున పునర్నిర్మాణ ప్రక్రియను చేపడుతూ, దాదాపు 8,000 మంది ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది. ఇది కంపెనీ మొత్తం శ్రామిక శక్తిలో 10 శాతానికి సమానం. ఈ ఏడాది మార్చి ముగిసే నాటికి మెటాలో సుమారు 78,000 మంది ఉద్యోగులు ఉన్నారు. టెక్ పరిశ్రమలో ఈ లేఆఫ్లు తీవ్ర సంచలనం సృష్టించినప్పటికీ, తొలగించిన ఉద్యోగుల కోసం మెటా ప్రకటించిన తొలగింపు ప్యాకేజీ (Severance Package) అందరి దృష్టిని ఆకర్షించింది. బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం అమెరికా ఉద్యోగులకు లభించే ప్రయోజనాలు ఇలా ఉన్నాయి..బేస్ పే: 16 వారాల ప్రాథమిక వేతనంతో పాటు, సంస్థలో పనిచేసిన ప్రతి సంవత్సరానికి అదనంగా రెండు వారాల వేతనాన్ని సీవెరన్స్ ప్యాకేజీగా అందిస్తారు.ఆరోగ్య సంరక్షణ: ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు 18 నెలల పాటు ఉచిత ఆరోగ్య సంరక్షణ కవరేజీని కొనసాగిస్తారు.అంతర్జాతీయ ఉద్యోగులు: యూఎస్ వెలుపల ఉన్న ఉద్యోగులకు వారి దేశాల నిబంధనలను బట్టి ఇలాంటి ప్రయోజనాలే అందుతాయి.ఏఐ బృందాల్లోకి పునర్వ్యవస్థీకరణఉద్యోగాల కోతతో పాటు కంపెనీ అంతర్గతంగా మరో పెద్ద మార్పు చేపట్టింది. కొత్తగా ఏర్పాటు చేసిన ఏఐ-కేంద్రీకృత బృందాల్లోకి 7,000 మందికి పైగా ఉద్యోగులను బదిలీ చేస్తున్నట్లు మెటా చీఫ్ పీపుల్ ఆఫీసర్ జానెల్ గేల్ ప్రకటించారు. ఈ తొలగింపులు, అంతర్గత బదిలీల వల్ల మెటాలోని మొత్తం శ్రామిక శక్తిలో 20% మంది ప్రభావితం కానున్నారు."మేము ఇప్పుడు వేగంగా, ఎక్కువ యాజమాన్య బాధ్యతలతో దూసుకుపోగల చిన్న బృందాలతో కూడిన నిర్మాణంతో పనిచేసే దశకు చేరుకున్నాము" అని రాయిటర్స్ పరిశీలించిన ఒక మెమోలో జానెల్ గేల్ పేర్కొన్నారు.వ్యూహాత్మక మార్పులు - భారీ ఖర్చులుఅంతర్గత పని విధానం, ఉత్పత్తులు రెండింటిలోనూ 'ఏఐ ఏజెంట్లను' కేంద్ర బిందువుగా మార్చే ప్రయత్నంలో భాగంగానే మెటా ఈ వ్యూహాత్మక మార్పులు చేస్తోంది. ఇందుకోసం ఏఐ(AI)లో పెట్టుబడులను భారీగా పెంచుతోంది. కొత్త ఏఐ డేటా సెంటర్ల నిర్మాణం, అధిక మెమరీ ధరల కారణంగా ఈ ఏడాది మెటా మూలధన వ్యయాలు ఏకంగా 145 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని కంపెనీ తెలిపింది.మరోవైపు, 2026 ద్వితీయార్థంలో మెటా మరిన్ని ఉద్యోగ కోతలను ప్రకటించే అవకాశం ఉందని అంచనా. అయితే దీని సమయం, పరిధిపై ఇంకా స్పష్టత లేదు. కాగా, మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ గత కొన్ని ఏళ్లుగా మేనేజ్మెంట్ స్థాయిలను తగ్గించే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగానే 2022, 2023 లలో ఇప్పటికే 20,000 ఉద్యోగాలను తగ్గించారు. -
ఏఐ బూమ్ ఒక బుడగ.. అయినా నష్టం లేదు!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హడావిడి ఒక ‘బుడగ’ (బబుల్) లాంటిదేనన్న ఆందోళనలపై అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ భిన్నంగా స్పందించారు. ఒకవేళ ఇది బబుల్ అయినప్పటికీ దాని గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్ని ఏఐ కంపెనీలు విఫలమైనప్పటికీ ఈ రంగంలోకి వస్తున్న భారీ పెట్టుబడులు శాశ్వత సాంకేతిక ప్రయోజనాలను అందిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘ప్రస్తుతం ఏఐ రంగంలోకి వస్తున్న మూలధన పెట్టుబడిదారులుగానీ, విధాన రూపకర్తలుగానీ ఆందోళన చెందాల్సిన పనిలేదని స్పష్టం చేశారు.పెట్టుబడులు.. ఫలితాలు..‘ఏఐలో వస్తున్న మార్పులు ఒక బుడగగా మారినప్పటికీ మీరు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ బబుల్ మార్కెట్లో వస్తున్న భారీ పెట్టుబడులు చాలావరకు మెరుగైన ఫలితాలందించేందుకు మళ్లిస్తున్నారు’ అని బెజోస్ పేర్కొన్నారు.ప్రస్తుతం టెక్ మార్కెట్లో ఏఐ మౌలిక సదుపాయాలపై భారీ వ్యయం జరుగుతోంది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలు ఈ ఏడాది ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఏకంగా 700 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేయనున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో మార్కెట్ స్థిరత్వంపై చర్చ నడుస్తోంది.మార్కెట్లో ఉన్న విపరీతమైన క్రేజ్ కారణంగా బలహీనమైన వ్యాపార నమూనాలు ఉన్న స్టార్టప్లు కూడా సులభంగా నిధులను ఆకర్షిస్తున్నాయనే వాస్తవాన్ని బెజోస్ అంగీకరించారు. ‘ఈ తరుణంలో మంచి ఆలోచనలకు, చెడు ఆలోచనలకు మధ్య తేడాను ఎలా గుర్తించాలో పెట్టుబడిదారులు ఇంకా నేర్చుకోలేదు. అది పెద్ద తప్పేం కాదు, ఎందుకంటే కొన్ని మంచి ఆలోచనలు సాధించే భారీ విజయాలు.. ఓడిపోయిన మిగతా అన్ని సంస్థల నష్టాలను భర్తీ చేస్తాయి’ అని బెజోస్ విశ్లేషించారు.పారిశ్రామిక చక్రాలు..పారిశ్రామికంగా ఇలాంటి చక్రాలు(ఇండస్ట్రియల్ సైకిల్స్) చాలా అవసరమన్నారు. ఇవే సాంకేతికతను వేగంగా ముందుకు నడిపిస్తాయని ఆయన స్పష్టం చేశారు. దీనికి ఉదాహరణగా 1990ల నాటి బయోటెక్నాలజీ బూమ్ను ఆయన గుర్తుచేశారు. ఆ సమయంలో మార్కెట్ మితిమీరిన ఉత్సాహం వల్ల కొందరు పెట్టుబడిదారులు ఆర్థికంగా దెబ్బతిన్నప్పటికీ.. ఆ కాలంలో కనుగొన్న ఎన్నో మందులు నేటికీ మానవాళికి ఉపయోగపడుతున్నాయని వివరించారు.ఇదీ చదవండి: భారత్లో మరో స్టోర్కు సన్నాహాలు! -
భారత్లో మరో స్టోర్కు సన్నాహాలు!
ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ భారత మార్కెట్ వైపు శరవేగంగా దూసుకెళ్తోంది. దేశంలో ప్రీమియం స్మార్ట్ఫోన్లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని తన రిటైల్ నెట్వర్క్ను భారీగా విస్తరిస్తోంది. ముంబై, ఢిల్లీల్లో ఇప్పటికే స్టోర్లను విజయవంతంగా నడుపుతున్న యాపిల్ తాజాగా ఐటీ హబ్ బెంగళూరులో తన రెండో అధికారిక రిటైల్ స్టోర్ను ప్రారంభించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది.యాపిల్ తన అధికారిక కెరీర్ పేజీలో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన వివరాలను ఉంచడంతో ఈ విస్తరణ ప్లాన్ వెలుగులోకి వచ్చింది. కంపెనీ తన వెబ్సైట్లో బెంగళూరు ఈస్ట్ పరిధిలో పలు ఉద్యోగ ఖాళీలను జాబితాను విడుదల చేసింది. ఇందులో కస్టమర్-ఫేసింగ్ ఎగ్జిక్యూటివ్లు, టెక్నికల్ స్పెషలిస్టులు, మేనేజ్మెంట్ స్థానాలకు సంబంధించిన లీడర్షిప్ పాత్రలు ఉన్నాయి. ఉద్యోగ ప్రకటనలో బెంగళూరు ఈస్ట్ అని స్పష్టంగా పేర్కొనడం వల్ల.. ఈ కొత్త స్టోర్ ప్రముఖ ఐటీ కారిడార్ అయిన వైట్ఫీల్డ్-మహదేవపుర ప్రాంతంలోని ఫీనిక్స్ మార్కెట్సిటీ మాల్లో ఏర్పాటయ్యే అవకాశం ఎక్కువగా ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.దేశవ్యాప్తంగా విస్తరణ..గత కొన్ని నెలలుగా యాపిల్ దేశంలోని ప్రధాన నగరాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ముంబైలోని బోరివలిలో రెండో స్టోర్, ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని నోయిడాలో మరొక స్టోర్ ఏర్పాటుకు సంబంధించిన ప్రకటనలు వచ్చిన కొద్ది నెలలకే బెంగళూరు ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం గమనార్హం. మరోవైపు, హైదరాబాద్లోనూ కొద్ది నెలల క్రితం ఇలాంటి ఉద్యోగ పోస్టింగ్లు కనిపించాయి. తాజా అంచనాల ప్రకారం హైదరాబాద్ స్టోర్ 2026 చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. బెంగళూరు రెండో స్టోర్ 2027 ప్రారంభంలో ప్రారంభం కావచ్చు.ఇదీ చదవండి: ఐఐటీ-బీ.. ఆఫర్లు తగ్గినా.. పెరిగిన ప్యాకేజీలు! -
బంగారం ఎందుకింతలా పెరుగుతోంది?
దేశంలో బంగారం ధరలు ఆగకుండా పెరుగుతున్నాయి. పసిడి ధరలు నేడు (Today Gold Rate) వరుసగా మూడో రోజూ ఎగిసి హ్యాట్రిక్ కొట్టేశాయి. దీంతో కొనుగోలుదారులకు నిరాశ తప్పలేదు. గడిచిన మూడు రోజుల్లో దాదాపు రూ.4000 దాకా బంగారం ధరలు ఎగిశాయి. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా ఈరోజు పెరుగుదలను నమోదు చేశాయి.ఈరోజు బంగారం ధరలు భారీగా పెరగడానికి అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలోని కొన్ని కీలక పరిణామాలు ప్రధాన కారణాలుగా నిలిచాయి. ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్లో అమెరికా డాలర్ విలువ, బాండ్ ఈల్డ్స్ స్వల్పంగా బలహీనపడటంతో, సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. దీనికి తోడు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు , ద్రవ్యోల్బణం భయాలు మార్కెట్లలో అనిశ్చితిని పెంచాయి.దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:38 సమయానికి నిఫ్టీ(Nifty) 78 పాయింట్లు పెరిగి 23,736 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 169 పాయింట్లు లాభపడి 75,484 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.19బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 105.7 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.58 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 1.08 శాతం పెరిగింది.నాస్డాక్ 1.54 శాతం పుంజుకుంది.Today Nifty position 21-05-2026(time: 09:38 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఢిల్లీ-ఎన్సీఆర్లో ‘చక్కా జామ్’
జాతీయ రాజధాని ప్రాంతం (ఢిల్లీ-ఎన్సీఆర్)లో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పేలా లేవు. పెరుగుతున్న ఇంధన ధరలు, నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా రవాణా ఛార్జీలను పెంచాలనే ప్రధాన డిమాండ్తో గురువారం (మే 21) నుంచి మూడు రోజుల పాటు భారీ ‘చక్కా జామ్’(రవాణా బంద్) నిరసన ప్రారంభమైంది. వాణిజ్య వాహన సంఘాలు పిలుపునిచ్చిన ఈ సమ్మె మే 23 వరకు కొనసాగనుంది. టాక్సీ ఆపరేటర్లు, ఆటో-రిక్షా డ్రైవర్లతో పాటు పలు రవాణా కమ్యునిటీ డ్రైవర్లు విధులకు దూరంగా ఉండాలని నిర్ణయించడంతో ఢిల్లీ వ్యాప్తంగా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడనుంది.68 యూనియన్లు.. 4 లక్షల టాక్సీలు..ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్, యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్స్కు చెందిన దాదాపు 68కి పైగా అనుబంధ యూనియన్లు ఈ మూడు రోజుల ఆందోళనలో భాగస్వామ్యం కానున్నాయి. దాదాపు నాలుగు లక్షల మంది రిజిస్టర్డ్ టాక్సీ యజమానులు సమ్మెలో పాల్గొంటున్నారని, ప్రయాణికులను చేరవేసే సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు అసోసియేషన్లు ప్రకటించాయి.ప్రభావితం కానున్న సేవలుఈ సమ్మె కారణంగా సాధారణ ఆటో-రిక్షాలు, కమర్షియల్ టాక్సీ సర్వీసులతో పాటు ప్రముఖ యాప్ ఆధారిత క్యాబ్ ప్లాట్ఫామ్లైన ఓలా, ఉబెర్ సేవలకు తీవ్ర అంతరాయం కలగనుంది. అయితే, ఢిల్లీ మెట్రో, డీటీసీ బస్సుల రాకపోకలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు.డిమాండ్లు ఇవే..ఈ వారం ప్రారంభంలోనే ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జిత్ సింగ్ సంధు, ముఖ్యమంత్రి రేఖా గుప్తాలకు తమ డిమాండ్లతో కూడిన లేఖలను పంపింది. అందులో తెలిపిన వివరాల ప్రకారం..గత 15 ఏళ్లుగా టాక్సీ ఛార్జీలను పెంచలేదని, తక్షణమే ఛార్జీలను సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో నడుస్తున్న వాణిజ్య వాహనాలపై ఉన్న ఆంక్షలను సమీక్షించాలి. ‘గత దశాబ్దంన్నర కాలంగా ఛార్జీల నిర్మాణం మారలేదు. కానీ సీఎన్జీ ధరలు, పర్మిట్లు, ఇన్సూరెన్స్ ఖర్చులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. పదేపదే చర్చలు జరిపినా ప్రభుత్వం మా సమస్యలు పట్టించుకోవడం లేదు’ అని చాలక్ శక్తి యూనియన్ ఉపాధ్యక్షుడు అనుజ్ కుమార్ రాథోడ్ ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం దిగిరాకపోతే..ట్రావెల్ ఆపరేటర్ల డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. రాబోయే రెండు వారాల్లోగా ప్రభుత్వం ఛార్జీల సవరణను ప్రకటించకపోతే ఈ నిరసనను మరింత ఉధృతం చేస్తామని రవాణా సంస్థల ప్రతినిధులు హెచ్చరించారు.ఇదీ చదవండి: ఐఐటీ-బీ.. ఆఫర్లు తగ్గినా.. పెరిగిన ప్యాకేజీలు! -
శామ్సంగ్ వేతన వివాదానికి తాత్కాలిక బ్రేక్
ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు గ్లోబల్ సెమీకండక్టర్ (చిప్) సరఫరా గొలుసును కుదిపేస్తుందని భావించిన శామ్సంగ్ కార్మిక సమ్మె ముప్పు తాత్కాలికంగా తొలగిపోయింది. యాజమాన్యంతో కుదిరిన తాత్కాలిక వేతన ఒప్పందం నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున ప్రారంభం కావాల్సిన ప్రణాళికాబద్ధమైన సమ్మెను నిలిపివేస్తున్నట్లు శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రధాన కార్మిక సంఘం (యూనియన్) ప్రకటించింది.బుధవారం రాత్రి వరకు ఇరు పక్షాల మధ్య చర్చలు పదే పదే విఫలమవడంతో సమ్మె ఖాయమని అందరూ భావించారు. అయితే, దక్షిణ కొరియా కార్మిక మంత్రి కిమ్ యంగ్-హూన్ వ్యక్తిగతంగా రంగంలోకి దిగి మధ్యవర్తిత్వం వహించడంతో చర్చలు మళ్లీ పుంజుకున్నాయి. చివరి నిమిషంలో యాజమాన్యం, యూనియన్ ఒక అంగీకారానికి వచ్చాయి. మరింత మెరుగైన కార్మిక సంబంధాలను నిర్మించడానికి ఇరుపక్షాలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ తాత్కాలిక ఒప్పందంపై దాదాపు 48,000 మంది యూనియన్ సభ్యులు మే 22 నుంచి 27 వరకు ఓటింగ్ (రాటిఫికేషన్) జరపనున్నారు.ఉద్యోగుల అసంతృప్తి ఎందుకంటే..శామ్సంగ్ దక్షిణ కొరియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యాలయాల్లో ఒకటిగా పేరుపొందింది. అయితే, తమ ప్రధాన చిన్న ప్రత్యర్థి సంస్థ అయిన ఎస్ కే హైనిక్స్ ఇస్తున్న వేతనాలతో పోలిస్తే శామ్సంగ్ ఉద్యోగుల జీతాలు తక్కువగా ఉండటం వారిలో అసంతృప్తిని రగిల్చింది. కంపెనీలోని వివిధ వ్యాపార విభాగాల మధ్య బోనస్లను పంచే విధానంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా భారీగా లాభాలు ఆర్జించే మెమరీ వ్యాపార విభాగం, నష్టాల్లో నడుస్తున్న లాజిక్ చిప్ విభాగం మధ్య పనితీరు బోనస్లను ఎలా కేటాయించాలనే దానిపై యాజమాన్యానికి, యూనియన్కు మధ్య వివాదం నడిచింది. నష్టపోయే విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా లాభాల వాటా సక్రమంగా దక్కాలన్నది వారి డిమాండ్.బోనస్లపై ఉన్న 50% గరిష్ట పరిమితిని రద్దు చేయాలని, బోనస్లను నేరుగా కంపెనీ సాధించే ఆపరేటింగ్ లాభాలతో ముడిపెట్టాలని ఉద్యోగులు పట్టుబట్టారు. వేతనాలు, సామూహిక బేరసారాలపై యాజమాన్యంతో జరిపిన చర్చలు పలుమార్లు విఫలమయ్యాయి. దాంతో ఇటీవల ప్రపంచవ్యాప్త సరఫరాకు ముప్పు తెచ్చేలా 18 రోజుల పాటు ప్రణాళికాబద్ధమైన సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే చివరి నిమిషంలో కార్మిక మంత్రి మధ్యవర్తిత్వంతో తాత్కాలిక ఒప్పందం కుదిరి సమ్మె విరమించుకున్నారు.ఇదీ చదవండి: ఐఐటీ-బీ.. ఆఫర్లు తగ్గినా.. పెరిగిన ప్యాకేజీలు! -
ట్రంప్ పర్యటన ముగిసిన కొన్ని గంటల్లోనే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన ముగిసిన కొద్ది గంటల్లోనే చైనా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ అమెరికన్ టెక్ దిగ్గజం ఎన్విడియా రూపొందించిన అధునాతన గేమింగ్ చిప్పై చైనా ప్రభుత్వం నిషేధం విధించింది. ఎన్విడియా ఫ్లాగ్షిప్ గేమింగ్ జీపీయూకు చెందిన చైనా-ఫ్రెండ్లీ వెర్షన్ ‘RTX 5090D V2’ గ్రాఫిక్స్ కార్డే లక్ష్యంగా బీజింగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్రిటన్కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మే 15న చైనాలో తన అధికారిక పర్యటనను ముగించారు. ఈ పర్యటనలో ఆయన చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ అయ్యారు. అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ పర్యటనలో ట్రంప్ వెంట ఎన్విడియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెన్సెన్ హువాంగ్తో సహా పలువురు సీనియర్ యూఎస్ వ్యాపార దిగ్గజాలు కూడా ఉన్నారు. అయితే, ఈ హై-ప్రొఫైల్ పర్యటన ముగిసిన వెంటనే చైనా ఈ నిషేధాస్త్రాన్ని ప్రయోగించడం చర్చకు దారితీసింది.RTX 5090D V2 ప్రత్యేకత ఏంటి?అమెరికా విధించిన కఠినమైన ఎగుమతి పరిమితులకు లోబడి చైనా మార్కెట్ కోసమే ఎన్విడియా ప్రత్యేకంగా రూపొందించిన మోడల్ ఈ RTX 5090D V2. ఇది కంపెనీకి చెందిన టాప్-ఎండ్ RTX 5090 సవరించిన వెర్షన్. అమెరికా నిబంధనలకు అనుగుణంగా దీని మెమరీ, బ్యాండ్విడ్త్ సామర్థ్యాలను తగ్గించారు. ప్రాథమికంగా ఇది చైనీస్ గేమర్స్, డిజిటల్ క్రియేటర్లను దృష్టిలో ఉంచుకుని తయారు చేసినప్పటికీ ఎన్విడియా శక్తివంతమైన బ్లాక్వెల్ ఆర్కిటెక్చర్ దీనికి అనుసంధానమై ఉండటంతో చైనా పరిశోధకులు దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి కూడా ఉపయోగిస్తున్నారు. సెమీకండక్టర్ టెక్నాలజీ పరంగా అమెరికాపై ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గించుకోవాలనే చైనా వ్యూహంలో భాగంగానే ఈ చిప్ను బ్లాక్లిస్ట్లో పెట్టినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.అలీబాబా కొత్త ఏఐ చిప్ఇదే తరుణంలో అమెరికాకు గట్టి కౌంటర్ ఇస్తూ చైనా టెక్ దిగ్గజం అలీబాబా సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్ ‘జెన్వు ఎమ్890’ను ఆవిష్కరించింది. ఈ కొత్త చిప్ తన మునుపటి మోడల్ కంటే ఏకంగా మూడు రెట్లు మెరుగైన పనితీరును కనబరుస్తుందని ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ఏఎఫ్పీ తెలిపింది. జెన్వు సిరీస్లో భాగంగా కంపెనీ ఇప్పటికే 5,60,000 కంటే ఎక్కువ చిప్లను సరఫరా చేసినట్లు వెల్లడించింది. చైనా మార్కెట్లో ఎన్విడియా భవిష్యత్తుపై తీవ్ర అనిశ్చితి నెలకొన్న సమయంలోనే అలీబాబా ఈ ప్రకటన చేయడం చాలా కచ్చితమైన వ్యూహం అని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: ఐఐటీ-బీ.. ఆఫర్లు తగ్గినా.. పెరిగిన ప్యాకేజీలు! -
పునరుత్పాదక ఇంధన రంగంలోకి భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశ పునరుత్పాదక ఇంధన రంగం (సోలార్, పవన విద్యుదుత్పత్తి కేంద్రాల స్థాపన) పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించనుంది. వచ్చే ఐదేళ్లలో ఈ రంగంలోకి 110–120 బిలియన్ డాలర్ల (రూ.11.52 లక్షల కోట్లు) మేర పెట్టుబడులు రానున్నట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా వెల్లడించింది. 7 లక్షల ఎకరాల భూ సమీకరణ కోసమే సుమారు 10–15 బిలియన్ డాలర్ల (రూ.96,000–1,44,000 కోట్లు) పెట్టుబడులు అవసరమని తెలిపింది. 2025 చివరికి పునరుత్పాదక విద్యుదుత్పత్తి కేంద్రాల స్థాపిత సామర్థ్యం 250 గిగావాట్లకు చేరుకున్నట్టు తెలిపింది. 2015 నాటికి ఉన్న 80 గిగావాట్లతో పోలి్చతే మూడు రెట్లు పెరిగినట్టు వెల్లడించింది. 2026 మార్చి నాటికి స్థాపిత సామర్థ్యం 275 గిగావాట్లకు చేరినట్టు పేర్కొంది. 2030 నాటికి 270–300 గిగావాట్ల సోలార్, పవన విద్యుదుత్పత్తి సామర్థ్యం అదనంగా తోడు కానున్నట్టు కొలియర్స్ ఇండియా నివేదిక అంచనా వేసింది. 2026–2030 కాలంలో 6.5 లక్షల ఎకరాలు ఒక్క సోలార్ ఇన్స్టాలేషన్లకే అవసరమవుతుందని.. మిగిలిన 50వేల ఎకరాలు పవన విద్యుత్కు కావాల్సి వస్తుందని పేర్కొంది. 500 మెగావాట్ల లక్ష్యం సాధ్యమే సోలార్ ప్రాజెక్ట్ల ఏర్పాటు కోసం ఒక్కో మెగావాట్కు రూ.3–4 కోట్లు, పవన విద్యుత్ ప్రాజెక్ట్ల (భూమిపై)కు సంబంధించి ఒక మెగావాట్ సామర్థ్యం కోసం రూ.8–9 కోట్ల పెట్టుబడి అవసరం అవుతుందని కొలియర్స్ ఇండియా తెలిపింది. దేశీయంగా తయారీ సామర్థ్యాలు మరింత మెరుగుపడుతున్నందున 2030 నాటికి భారత్ 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన విద్యుదుత్పత్తి లక్ష్యాన్ని సులభంగానే చేరుకుంటుందని భావిస్తున్నట్టు పేర్కొంది. అప్పటికి ఒక్క సోలార్ ప్రాజెక్టుల సామర్థ్యమే 400–450 గిగావాట్ల మేర ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం 146 గిగావాట్ల సామర్థ్యం మేర ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగుతున్నట్టు తెలిపింది. పునరుత్పాదక విద్యుత్ రంగం శరవేగంగా విస్తరిస్తుండడం రియల్ ఎస్టేట్ రంగానికి అవకాశాలు కలి్పస్తుందని.. ముఖ్యంగా భూ సమీకరణ, పునరుత్పాదక ఆధారిత పారిశ్రామిక పార్కుల్లో అవకాశాలు ఉంటాయని అంచనా వేసింది. -
భారత్ వృద్ధి అంచనా 6.4 శాతానికి కట్
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితులు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో 2026 సంవత్సరానికి భారత్ జీడీపీ వృద్ధి రేటు అంచనాను ఐక్యరాజ్యసమితి (యూఎన్) స్వల్పంగా తగ్గించింది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో గత అంచనా 6.6 శాతాన్ని 6.4 శాతానికి తగ్గించింది. అయినప్పటికీ ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. పశ్చిమాసియా సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పశ్చిమాసియా సంక్షోభం మరో షాక్గా ఈ నివేదిక అభివరి్ణంచింది. ఇది ప్రపంచ వృద్ధిని మందగింపజేయడంతోపాటు, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లను, అనిశ్చితులను పెంచినట్టు వివరించింది. ప్రస్తుత ప్రపంచ ప్రతికూల సవాళ్ల నుంచి భారత్కూ మినహాయింపు లేదని యూఎన్ గ్లోబల్ ఎకనామిక్ మానిటరింగ్ విభాగం సీనియర్ ఆర్థికవేత్త ఇంగో పిట్టర్లే వ్యాఖ్యానించారు. ‘‘భారత్ ఇంధనాన్ని భారీగా దిగుమతి చేసుకుంటోంది. విదేశాల నుంచి వచ్చే రెమిటెన్స్లపై ప్రభావం తదతర ఒత్తిళ్లు సైతం నెలకొన్నాయి. అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితుల కఠినతరంతో మానిటరీ పాలసీ మరింత సంక్లిష్టంగా మారింది’’ అని పిట్టర్లే వివరించారు. ఈ పరిస్థితుల్లో ఆర్బీఐ, ఆర్థిక శాఖ ఎలా స్పందిస్తాయన్నదే కీలకమన్నారు. ప్రపంచ జీడీపీ వృద్ధి అంచనా సైతం తగ్గింపు 2026 సంవత్సరానికి గాను ప్రపంచ స్థూల జీడీపీ వృద్ధి రేటు అంచనాను సైతం 2.5 శాతానికి యూఎన్ తగ్గించింది. జనవరిలో వేసిన అంచనా కంటే 0.2 శాతం తక్కువ కావడం గమనార్హం. అంతేకాదు, కరోనా మహమ్మారికి ముందున్న సాధారణ వృద్ధి రేటు కంటే ఇది చాలా తక్కువని ఈ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. బలంగానే ఆర్థిక మూలాలు.. భారత్ వృద్ధి 2025లో ఉన్న 7.5 శాతం నుంచి 2026లో 6.4 శాతం తగ్గడమన్నది ప్రధానంగా ఇంధన దిగుమతి వ్యయాలు పెరిగిపోవడం వల్లేనంటూ.. భారత ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. దేశీయంగా వినియోగ డిమాండ్, ప్రభుత్వ మూలధన వ్యయాలు, సేవల రంగ ఎగుమతుల్లో చక్కని పనితీరు కారణంగా భారతదేశంలో నిర్మాణాత్మకంగా బలమైన వృద్ధి కనిపిస్తున్నట్టు పేర్కొంది. తిరిగి 2027 సంవత్సరంలో ఆర్థిక వృద్ధి రేటు 6.6 శాతానికి పుంజుకుంటుందని అంచనా వేసింది. దిగుమతి చేసుకునే దేశాలకు వ్యయాలు పెరిగినప్పుడు ఎగుమతులు కూడా సమస్యలు ఎదుర్కోవచ్చని యూఎన్ డైరెక్టర్ ఆఫ్ ఎకనమిక్ అనలైసిస్ శంతను ముఖర్జీ అభిప్రాయపడ్డారు. రవాణా ఖర్చులు, లాజిస్టిక్స్ వ్యయాలు, డీజిల్ వంటి ఇంధన ధరలు పెరిగినప్పుడు వ్యాపార వ్యయాలు పెరిగిపోయే ప్రమాదం ఉందన్నారు. ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లాగే ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్కు ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉందన్నారు. అయితే, ప్రస్తుతమున్న మిగులు నిల్వలు కరిగిపోయే లోపే ఈ షాక్లను ఎంత సమర్థవంతంగా అధిగమించగలదన్న దానిపైనే ఇది ఆధారపడి ఉంటుందని చెప్పారు. -
మౌలిక రంగాల జోరు
న్యూఢిల్లీ: ఉక్కు, సిమెంటు, విద్యుదుత్పత్తి దన్నుతో ఎనిమిది కీలక మౌలిక రంగాల గ్రూప్ ఉత్పాదకత ఏప్రిల్లో మరింత మెరుగ్గా వృద్ధి చెందింది. రెండు నెలల గరిష్ట స్థాయి 1.7 శాతానికి చేరింది. గతేడాది ఏప్రిల్లో మౌలిక రంగ వృద్ధి 1 శాతంగాను, ఈ ఏడాది మార్చిలో 1.2 శాతంగాను నమోదైంది. తాజా సమీక్షాకాలంలో బొగ్గు, ముడి చమురు, నేచురల్ గ్యాస్, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువుల రంగాల వృద్ధి మైనస్లోకి జారిపోయింది. ఉక్కు, సిమెంటు, విద్యుత్ ఉత్పత్తి వృద్ధి ఏప్రిల్లో వరుసగా 6.2 శాతం, 9.4 శాతం, 4.1 శాతంగా ఉంది. లో బేస్ ఎఫెక్ట్, ఎరువుల ఉత్పత్తి పెరగడం ద్వారా మే నెలలో మౌలిక రంగం వృద్ధి మరింత మెరుగ్గా 3 శాతం నమోదు కావొచ్చని ఇండియా రేటింగ్స్ డైరెక్టర్ మేఘా ఆరోరా తెలిపారు. -
మ్యూచువల్ ఫండ్స్పై రుణాలిస్తాం
సాక్షి, బిజినెస్ డెస్క్: యువ రిటైల్ ఇన్వెస్టర్లు తక్కువ రిటర్నులు వచ్చే బ్యాంకు డిపాజిట్ల కన్నా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వైపు మొగ్గు చూపే ధోరణి పెరుగుతోంది. దీనితో బ్యాంకులకు వస్తున్న డిపాజిట్లపరమైన వ్యాపారం తగ్గుముఖం పడుతోంది. ప్రజల పొదుపు విధానాలు మారుతున్న నేపథ్యంలో యువ కస్టమర్లను ఆకర్షించేందుకు, రుణాల వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు కొత్త రూటును ఎంచుకుంటున్నాయి. డిజిటల్ విధానంలో ఫండ్స్పై రుణాలివ్వడం మొదలుపెట్టాయి. ప్రభుత్వ రంగ దిగ్గజం కెనరా బ్యాంక్ గతేడాదే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ వ్యాపార విభాగాన్ని మరింతగా విస్తరిస్తోంది. సౌత్ ఇండియన్ బ్యాంక్ ఇటీవల మార్చిలో దీన్ని ప్రవేశపెట్టింది. అటు కరూర్ వైశ్యా బ్యాంక్, సీఎస్బీ బ్యాంక్ కూడా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తేవడంపై కసరత్తు చేస్తున్నాయి. నెలా, రెణ్నెల్లలో దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు కరూర్ వైశ్యా బ్యాంక్ వర్గాలు తెలిపాయి. ఇలా ఫండ్స్పై లోన్ విధానంలో అధిక వడ్డీ రేట్లు ఉండే వ్యక్తిగత రుణాలను తీసుకోవాల్సిన అవసరం లేకుండా రుణగ్రహీతలు తమ దగ్గరున్న ఫండ్ యూనిట్లను తనఖాగా ఉంచి లోన్ తీసుకోవచ్చు. అదే సమయంలో తమ పెట్టుబడులను నష్టానికి అమ్ముకోవాల్సిన అవసరం కూడా ఉండదు. 35 ఏళ్ల లోపు వారి పొదుపులో సింహభాగం వాటా మ్యూచువల్ ఫండ్స్దే ఉంటోందని కరూర్ వైశ్యా బ్యాంక్ వర్గాలు తెలిపాయి. ఆర్థిక అత్యవసరాల కోసం ఇలా ఫండ్స్పై రుణాలు లభిస్తే, తక్కువ లాభాలకో లేదా నష్టాలకో యూనిట్లను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండదు కాబట్టి కస్టమర్లు ఈ విధానం వైపు మళ్లుతున్నారని పేర్కొన్నాయి. మ్యూచువల్ ఫండ్స్పై రుణాలనేవి ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్నాయని, మార్కెట్ ఆధారిత ఫండ్స్కి ప్రాధాన్యం పెరిగే కొద్దీ వీటికి మరింత ఆదరణ లభించగలదని మార్కెట్ వర్గాలు తెలిపాయి. సంక్లిష్ట ప్రక్రియ .. ఫండ్స్పై రుణాలివ్వడమనేది సంక్లిష్టమైన ప్రక్రియ. తనఖా ఉంచిన ఫండ్ యూనిట్లను పక్కన పెట్టేలా మార్క్ చేసేందుకు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలతో బ్యాంకులు కలిసి పని చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వివిధ వ్యవస్థలను అనుసంధానం చేసేందుకు బ్యాంకులు డిజిటల్ మౌలిక సదుపాయాలను విస్తృతంగా వినియోగిస్తున్నాయి. సాధారణంగా డిపాజిట్ల విలువలో 80–90% వరకు బ్యాంకులు రుణాలిస్తాయి. ఫండ్ యూనిట్లు ఒడిదుడుకులకు లోనవుతుంటాయి. కాబట్టి వాటి విలువ లో 50 శాతమే రుణం ఇచ్చే అవకాశం ఉంటోంది.రూ. 82 లక్షల కోట్లకు ఫండ్స్.. దేశీ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) గత దశాబ్దకాలంగా అనేక రెట్లు పెరిగింది. మ్యుచువల్ ఫండ్స్ అసోసియేషన్ యాంఫీ గణాంకాల ప్రకారం 2016లో ఏప్రిల్ ఆఖరు నాటికి రూ. 14 లక్షల కోట్లుగా ఉన్న ఏయూఎం ఈ ఏడాది ఏప్రిల్ ఆఖరు నాటికి దాదాపు ఆరు రెట్లు ఎగిసి రూ. 82 లక్షల కోట్లకు చేరింది. 2025–26 ఆర్థిక సర్వే ప్రకారం కుటుంబాల వార్షిక పొదుపులో ఈక్విటీ, మ్యుచువల్ ఫండ్స్ వాటా 2012 ఆర్థిక సంవత్సరంలో కేవలం 2 శాతమే ఉండగా, 2025 ఆర్థిక సంవత్సరం నాటికి ఇది ఏకంగా 15.2 శాతానికి పెరిగింది. అదే సమయంలో బ్యాంకు డిపాజిట్ల వాటా 58 శాతం నుంచి 35 శాతానికి తగ్గింది. -
మార్కెట్లో ‘మెలొడీ’ సందడి!
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలొనీకి పార్లే ‘మెలొడీ’ టాఫీలను బహూకరించడం బుధవారం సోషల్ మీడియాలో సందడికి దారితీసింది. భారత్ నుంచి టాఫీ ఎగుమతులు ఈ సందర్భంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో టాఫీలు తదితర కన్ఫెక్షనరీ ఉత్పత్తుల ఎగుమతులు గత 12 ఏళ్లలో ఏకంగా 166 శాతం ఎగిసినట్లు కేంద్ర వాణిజ్య శాఖ పేర్కొంది. 2013–14లో రూ. 49.68 కోట్లుగా ఉన్న ఎక్స్పోర్ట్స్ 2025–26 నాటికి రూ. 132 కోట్లకు చేరినట్లు తెలిపింది. పరిమాణంపరంగా 6,652 టన్నుల నుంచి 10 శాతం వృద్ధి చెంది 7,357 టన్నులకు పెరిగినట్లు పేర్కొంది. ఇటలీ, అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా తదితర 74 దేశాలకు ఎగుమతవుతున్నాయి. ‘భారత టాఫీల గాథ నిజంగానే వీనులవిందైనది. 2013–14 నుంచి ఏకంగా 166 శాతం ఎగిసింది’ అని ఈ సందర్భంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గో యల్ బుధవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గతంలో టాఫీల ఎగుమతులు అంతగా లేని యూ రప్, గల్ఫ్ దేశాలకు కూడా పెరగడం భారత కన్ఫెక్షనరీల నాణ్యత, ప్యాకేజింగ్ ప్రమాణాలపై అంతర్జాతీయంగా పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనమని వా ణిజ్య శాఖ తెలిపింది. ‘చాలా చక్కని టాఫీ– మెలొ డీని బహూకరించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు’ అంటూ మెలోనీ సోషల్ మీడియాలో వీడి యో పోస్ట్ చేశారు. ఇరువురు ప్రధానుల పేర్లు కలిసేలా మెలొడీ పదం ఉండటంతో మీమ్స్ వైరల్ అయ్యాయి. మెలొడీకి జోష్.. మెలొడీ చాక్లెట్లకు ఒక్కసారిగా ఎక్కడలేని పాపులారిటీ రావడంపై వాటిని తయారు చేసే పార్లే ప్రోడక్ట్స్ హర్షం వ్యక్తం చేసింది. ‘1983 నుంచి బంధాలను తీపి చేస్తున్నాం’ అనే క్యాప్షన్తో ఇన్స్ట్రాగాంలో మోదీ, మెలొనీ వీడియోని షేర్ చేసింది. ‘పార్లే మెలొడీని అంతర్జాతీయ వేదికపైకి చేర్చినందుకు ధన్యవాదాలు‘ అంటూ ఎక్స్లో పోస్ట్ చేసింది. ‘భారతీయ ఉత్పత్తులను అంతర్జాతీయంగా ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు ఒక చక్కని మార్గం’ అంటూ పార్లే ప్రోడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ మయాంక్ షా పేర్కొన్నారు. ‘పార్లే’ షేర్ల కోసం ఎగబడ్డ ఇన్వెస్టర్లు... మెలొడీ చాక్లెట్లను తయారు చేసేది పార్లే అనే కంపెనీ అని తెలియడంతో ఆ సంస్థ షేర్లను కొనడానికి ఇన్వెస్టర్లు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీనితో పార్లే ఇండస్ట్రీస్ అనే సంస్థ షేరు 5 శాతం ఎగిసి అప్పర్ సర్క్యూట్ రూ. 5.25ని తాకింది. 8.57 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే.. ఆ చాక్లెట్లను తయారు చేసేది పార్లే ప్రోడక్ట్స్ అనే కంపెనీ. అది స్టాక్ మార్కెట్లో కనీసం లిస్ట్ కూడా కాలేదు. కాకపోతే ‘ఆ పార్లే’..‘ఈ పార్లే’ ఒకటేనని ఇన్వెస్టర్లు పొరబడటమనేది పార్లే ఇండస్ట్రీస్కి బాగా కలిసి వచ్చింది. -
‘దేశం కోసం బంగారం అమ్మేయండి’
భారతదేశం తన అవసరానికి మించి బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. దీనికి పరిష్కారం ప్రభుత్వ విధానాల్లో కంటే, ప్రజల లాకర్లలోనే ఉందని ఆనంద్ రాథి వెల్త్ జాయింట్ సీఈఓ ఫిరోజ్ అజీజ్ అభిప్రాయపడ్డారు. భారతీయ కుటుంబాలు తమ వద్ద ఉన్న బంగారంలో కేవలం 2 నుండి 4 శాతం వరకు విక్రయించాలని ఆయన కోరారు. ఇది త్యాగం కాదు, దేశం కోసం చేసే ఒక రకమైన "ఆర్థిక దేశభక్తి" అని ఆయన అభివర్ణించారు.భారత్లో సమస్యగా బంగారం భారతీయ కుటుంబాల వద్ద సమిష్టిగా దాదాపు 4 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ.4 కోట్ల కోట్లు) విలువైన బంగారం ఉంది. ఇందులో చాలా వరకు వాడకుండా లాకర్లలో ఖాళీగా పడి ఉంది. ఇక కొన్నేళ్ల క్రితం వరకు 35 బిలియన్ డార్లుగా ఉన్న భారతదేశ వార్షిక బంగారం దిగుమతులు, ఇప్పుడు ఏకంగా 75 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇది కరెంట్ ఖాతా లోటు (CAD) పెరగడానికి, రూపాయి విలువ క్షీణించడానికి ప్రధాన కారణమవుతోంది.పోయిన విదేశీ పెట్టుబడుల కంటే ఎక్కువఇటీవల విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FII) భారత మార్కెట్ నుండి రూ.1,68,000 కోట్లు (17–18 బిలియన్ డాలర్లు) ఉపసంహరించుకోవడం పెద్ద చర్చనీయాంశమైంది. కానీ, మన దేశ బంగారం దిగుమతి బిల్లు దీని కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఉండటం గమనార్హం.100 గ్రాముల విక్రయంతో వచ్చే మార్పుఈ ప్రతిపాదన ఎంత ఆచరణాత్మకమైనదో చెప్పడానికి అజీజ్ కొన్ని లెక్కలను వివరించారు. ఒక కుటుంబం తమ వద్ద ఉన్న బంగారంలో కేవలం 100 గ్రాములను (ప్రస్తుత ధరల ప్రకారం సుమారు రూ.15-16 లక్షలు) విక్రయిస్తే ఎలాంటి మార్పు వస్తుందో చూడండి.. ఆనంద్ రాథి సంస్థ పరిధిలోని 13,800 కుటుంబాలు ఇలా చేస్తేనే దాదాపు రూ.2,500–3,000 కోట్ల బంగారం తిరిగి మార్కెట్లోకి వస్తుంది.ఇదే విధంగా దేశంలోని సంపన్న కుటుంబాలన్నీ చేస్తే, బంగారం దిగుమతులను సులభంగా 40 బిలియన్ డాలర్ల వరకు తగ్గించవచ్చు. ప్రజలు విక్రయించే బంగారం ఆభరణాలు, పారిశ్రామిక అవసరాల కోసం మార్కెట్లో పునర్వినియోగంలోకి వస్తుంది. తద్వారా కొత్తగా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం తప్పుతుంది.ఇది త్యాగం కాదు... లాభాల స్వీకరణ !బంగారం ధరలు ప్రస్తుతం చారిత్రక గరిష్టాల వద్ద ఉన్నాయి. ఈ సమయంలో కొంత బంగారాన్ని విక్రయించడం అనేది దేశానికి మేలు చేయడంతో పాటు, వ్యక్తిగతంగా స్మార్ట్ పోర్ట్ ఫోలియో నిర్వహణ (లాభాలను ఖాతాలో వేసుకోవడం) అవుతుందని అజీజ్ పేర్కొన్నారు."ఈక్విటీ మార్కెట్లలో లాభాలు స్వీకరించినట్లే, బంగారంలోనూ భారీ ర్యాలీ వచ్చింది. కాబట్టి మీ బంగారంపై 3-4% లాభాలను దేశం కోసం బుక్ చేసుకోండి" అని ఆయన పిలుపునిచ్చారు.గడిచిన 10 ఏళ్ల కాలంలో బంగారం రూపాయి పరంగా కేవలం 8.5% వార్షిక రాబడిని మాత్రమే ఇచ్చింది. దీని కంటే 'సుకన్య సమృద్ధి యోజన' (8.25% వడ్డీ, పన్ను రహితం) వంటి ఇతర పొదుపు పథకాలు పన్నులన్నీ పోనూ మెరుగైన లేదా సమానమైన లాభాలను అందిస్తున్నాయని ఆయన గుర్తుచేశారు.ప్రభుత్వానికీ విజ్ఞప్తిఈ ప్రచారంలో భాగంగా బంగారం విక్రయించిన రశీదులను సమర్పించాలని అజీజ్ ప్రజలను కోరుతున్నారు. దీని ద్వారా తగినంత మద్దతును కూడగట్టి, బంగారం విక్రయాలపై మూలధన లాభాల పన్ను (Capital Gains Tax) నుండి తాత్కాలిక మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి పిటిషన్ వేయాలని ఆయన భావిస్తున్నారు. -
ఎయిర్టెల్ కొత్త 'ప్రయారిటీ పోస్ట్పెయిడ్' 5జీ ప్లాన్లు
ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ తన పోస్ట్పెయిడ్ వినియోగదారుల కోసం సరికొత్త 'ప్రయారిటీ పోస్ట్పెయిడ్' (Priority Postpaid) సేవలను అధికారికంగా ప్రకటించింది. అత్యాధునిక '5G స్లైసింగ్' (5G Slicing)సాంకేతికత ఆధారంగా పనిచేసే ఈ సర్వీస్ ద్వారా వినియోగదారులు నెట్వర్క్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా అత్యంత వేగవంతమైన, అంతరాయం లేని ఇంటర్నెట్ అనుభవాన్ని పొందవచ్చు. భారతదేశంలో ఈ తరహా 5G స్లైసింగ్ సేవలను తీసుకొచ్చిన మొదటి సంస్థగా ఎయిర్టెల్ నిలిచింది.ఈ సరికొత్త సేవలు ఎయిర్టెల్లోని అన్ని పోస్ట్పెయిడ్ ప్లాన్లపైనా అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే ఉన్న పోస్ట్పెయిడ్ కస్టమర్లకు ఈ ప్రయారిటీ ప్రయోజనాలు ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతాయి. ఒకవేళ ప్రీపెయిడ్ వినియోగదారులు ఈ ప్లాన్లలోకి మారాలనుకుంటే ఎయిర్టెల్ యాప్ ద్వారా లేదా సమీపంలోని ఎయిర్టెల్ స్టోర్ను సందర్శించి సులభంగా అప్గ్రేడ్ చేసుకోవచ్చు.ధరల విషయానికి వస్తే.. సింగిల్ యూజర్ కోసం రూ.449 (ప్లస్ జీఎస్టీ) ప్లాన్ అందుబాటులో ఉండగా, ఫ్యామిలీ ప్లాన్లు రూ.699 నుంచి రూ.1749 వరకు ఉన్నాయి. ఈ ప్లాన్ల ద్వారా అన్లిమిటెడ్ కాల్స్, డేటాతో పాటు ఫాస్ట్లేన్ టెక్నాలజీ, స్పామ్ ప్రొటెక్షన్ లభిస్తాయి. అంతేకాకుండా ప్లాన్లను బట్టి ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్స్టార్, యాపిల్ టీవీ+, నెట్ఫ్లిక్స్ వంటి ప్రముఖ ఓటీటీ సబ్స్క్రిప్షన్లు కూడా ఉచితంగా లభిస్తాయి.ఈ సేవలు 5G SA (Standalone) సపోర్ట్ చేసే అన్ని స్మార్ట్ఫోన్లలోనూ పనిచేస్తాయి. వినియోగదారులు తమ ఫోన్ సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసుకోవడం ద్వారా ఈ హై-స్పీడ్ కనెక్టివిటీని ఆస్వాదించవచ్చు. కస్టమర్లు తమ ఫోన్ అర్హతను మొబైల్ సెట్టింగ్స్లో లేదా ఎయిర్టెల్ యాప్లోకి లాగిన్ అయి సులభంగా చెక్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. -
కడపలో ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ కొత్త బ్రాంచ్
ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్కు చెందిన అగ్రగామి హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ 'ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్' (ఏబీహెచ్ఎఫ్ఎల్), దేశవ్యాప్తంగా తన నెట్వర్క్ను విస్తరించే వ్యూహంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని కడపలో కొత్త బ్రాంచ్ను ప్రారంభించింది. ఈ కొత్త బ్రాంచ్తో కలిపి ఆంధ్రప్రదేశ్లో ఏబీహెచ్ఎఫ్ఎల్ మొత్తం బ్రాంచ్ల సంఖ్య 13కి చేరింది.వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో తన కార్యకలాపాలను బలోపేతం చేసుకోవడానికి, కస్టమర్లకు మరింత చేరువవడానికి ఈ విస్తరణ దోహదపడుతుందని కంపెనీ భావిస్తోంది. జీతం పొందే ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందే నిపుణులు, ఇతర వ్యాపారస్తులు, కొత్తగా ఆదాయం ఆర్జిస్తున్న వర్గాల కోసం వారి అవసరాలకు తగ్గట్టుగా ఏబీహెచ్ఎఫ్ఎల్ వివిధ రకాల గృహ రుణాలను అందిస్తోంది.ఈ కొత్త బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా కస్టమర్ల కోసం ఏబీహెచ్ఎఫ్ఎల్ ఒక ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. 2026 మే 20 నుండి మే 31 వరకు ఎలాంటి లాగిన్ ఫీజు (జీరో లాగిన్ ఫీజ్) లేకుండా, రూ. 50 లక్షల వరకు అక్కడికక్కడే రుణాలు మంజూరు (స్పాట్ లోన్ సాంక్షన్) చేయనున్నారు. దీనివల్ల కస్టమర్లకు తక్కువ ఖర్చుతో, వేగంగా రుణాలు పొందే అవకాశం లభిస్తుంది. -
HDFC బ్యాంక్ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’
భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ (HDFC) బ్యాంక్ తన ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. ఎంపిక చేసిన విభాగాల ఉద్యోగులకు 'వర్క్ ఫ్రమ్ హోమ్'(WFH) విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. దీని ప్రకారం.. అర్హులైన ఉద్యోగులు వారానికి రెండు రోజుల పాటు ఇంటి నుండి లేదా రిమోట్గా పని చేయడానికి బ్యాంక్ అనుమతినిచ్చింది.ఈ కొత్త పాలసీ తక్షణమే అమలులోకి వచ్చిందని, ప్రాథమికంగా 30 రోజుల పాటు దీన్ని పరిశీలించి, ఫలితాల ఆధారంగా ఈ విధానాన్ని కొనసాగించేది.. లేనిది నిర్ణయించినట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అధికారాలు వెల్లడించారు. ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో.. ఇంధనాన్ని పొదుపు చేసేందుకు కార్పొరేట్ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్, వర్చువల్ సమావేశాలను ప్రోత్సహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.వీరికే వర్క్ ఫ్రమ్ హోమ్..బ్యాంకు మౌలిక సదుపాయాలకు సంబంధించిన రెండు ప్రధాన విభాగాలలోని ఉద్యోగులకు ఈ హైబ్రిడ్ వర్క్ మోడల్ వర్తిస్తుంది. బిజినెస్ ఎనేబుల్ ఫంక్షన్లు అంటే ట్రెజరీ ఆపరేషన్స్, క్రెడిట్ అండర్ రైటింగ్ & రిస్క్, ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్, ఐటీ (IT) సేవలు వంటి కీలక కార్యాచరణ విభాగాల్లో పని చేసే ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అందుబాటులో ఉంటుంది. అలాగే కార్పొరేట్ ఎనేబుల్ ఫంక్షన్లు అయిన హ్యూమన్ రీసోర్సెస్ (HR), ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, లీగల్ & కాంప్లయన్స్, అలాగే సెక్రటేరియల్, బోర్డు విధులు నిర్వహించే అధికారులు కూడా రిమోట్ వర్క్ విధానంలో పనిచేస్తారు.అయితే కస్టమర్లతో నేరుగా లావాదేవీలు జరిపే బ్యాంక్ బ్రాంచ్లు (శాఖలు), ఇతర ఫ్రంట్-ఆఫీస్ కార్యకలాపాల్లో నిమగ్నమైన ఉద్యోగుల పని విధానంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. ఆయా విభాగాలు ఎటువంటి అంతరాయం లేకుండా యథావిధిగా కొనసాగుతాయని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్పష్టం చేసింది. -
ఎన్ఎంఐఎంఎస్ డిగ్రీ కోర్సులకు రిజిస్ట్రేషన్లు
భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే విద్యకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఎస్వీకేఎం వారి నార్సీ మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ (ఎన్ఎంఐఎంఎస్) మల్టీ డిసిప్లైనరీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను రూపొందించింది. విద్యార్థులను పరిశ్రమ-ఆధారిత పాఠ్యాంశాలు, అనుభవపూర్వకమైన అభ్యాసం,విమర్శనాత్మక ఆలోచన, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, వాస్తవ-ప్రపంచ అనుభవం కోసం సిద్ధం చేసే ఒక అండర్ గ్రాడ్యుయేట్ అభ్యాస వ్యవస్థను తయారు చేసినట్లు ఎన్ఎంఐఎంఎస్ తెలిపింది.2026—27 విద్యా సంవత్సరానికి గానూ ఎన్ఎంఐఎంఎస్ ముంబై, నవి ముంబై, శిర్పూర్, బెంగళూరు, హైదరాబాదు, ఇండోర్, చండీఘడ్, అహ్మదాబాద్ లోని తమ ప్రాంగణాలలో అండర్ గ్రాడ్యుయేట్ అవకాశాలను అందిస్తోంది. ఎన్పిఏటి (కామర్స్), ఎన్సిఈటి (ఇంజనీరింగ్ & ఫార్మసీ), ఎన్ఎల్ఏటి (లా), ఎన్డిఏటి (డిజైన్), ఎంఎస్టి (మ్యాథమాటిక్స్, స్టాటిస్టిక్స్ & డేటా సైన్సెస్) సహా ఎంచుకున్న కోర్స్ ఆధారంగా వివిధ ప్రవేశ పరీక్షల ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు పేర్కొంది. ఈ రిజిస్ట్రేషన్లకు గడువు మే 26న ముగుస్తుంది. -
"ఏవియేషన్ రంగానికి చిరునామాగా హైదరాబాద్"
సాక్షి, హైదరాబాద్: వైమానిక, అంతరిక్ష, రక్షణ, డీప్టెక్ రంగాల్లో హైదరాబాద్ వ్యూహాత్మక కేంద్రంగా ఎదుగుతోందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు తెలిపారు. అమెరికా విమానయాన సంస్థ సౌత్వెస్ట్ హైదరాబాద్లో తన గ్లోబల్ ఇన్నొవేషన్ సెంటర్ (జీఐసీ)ని ఏర్పాటు చేయడం కూడా ఈ విషయాన్నే ధ్రువీకరిస్తోందని ఆయన అన్నారు.హైటెక్ సిటీ ప్రాంతంలో బుధవారం సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్ జీఐసీ కేంద్రాన్ని ఆవిష్కరించిన మంత్రి మాట్లాడుతూ పాతికేళ్ల క్రితమే దేశంలోనే తొలి విమానాశ్రయ నిర్మాణానికి పీపీపీ మోడల్ను ఎంచుకోవడంతో హైదరాబాద్లో వైమానిక రంగానికి పునాది పడిందని తెలిపారు. డీఆర్డీవో, ఆర్సీఐ, డీఎంఆర్ఎల్ వంటి దిగ్గజ రక్షణ రంగ సంస్థలకు కేంద్రమైన హైదరాబాద్ అత్యాధునిక ఇంజినీరింగ్, సృజనలకు కేంద్రంగా అవతరిస్తోందని అన్నారు. గత ఏడాది కాలంలోనే అంతర్జాతీయ కంపెనీలు బోలెడు హైదరాబాద్లో తమ తొలి ఇన్నొవేషన్ సెంటర్ ఏర్పాటు చేశాయని అన్నారు.సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్ ఎగ్జిక్యుటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ లారెన్ వుడ్స్ మాట్లాడుతూ... ‘‘ఇంజినీరింగ్, అనలిటిక్స్, ఇన్నొవేషన్లకు సంబంధించినంత వరకూ హైదరాబాద్లో అద్భుతమైన నైపుణ్యం అందుబాటులో ఉంది. అందుకే మేము మా తొలి ఇన్నొవేషన్ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము’’ అని వ్యాఖ్యానించారు. ఏఐ, డేటా, నెక్స్ట్ జనరేషన్ ఇంజినీరింగ్లతోపాటు బిజినెస్ ఆపరేషన్లను కూడా ఈ కేంద్రం నుంచి నడపనున్నట్లు తెలిపారు.వెయ్యి మందికి కొలువులు...సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్ జీఐసీలో ప్రస్తుతం 170 మంది పనిచేస్తూండగా.. దశలవారీగా వెయ్యి మంది వరకూ ఉద్యోగాలు పొందుతారని సంస్థ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ లారెన్ వుడ్స్ ‘సాక్షి.కాం’కు తెలిపారు. ఈ కేంద్రంలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారే ఉద్యోగాలు పొందుతారని, ప్రస్తుతానికి విదేశీయులను నియమించే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ పరిసరాల్లోని యూనివర్శిటీలు, తెలంగాణ ప్రభుత్వ స్కిల్ వర్శిటీతోనూ కలిసి పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్ దాదాపు పదేళ్లుగా మెషీన్ లెర్నింగ్పై దృష్టి పెట్టిందని, సంస్థ కార్యకలాపాల నిర్వహణలో ప్రస్తుతం ఏఐ కూడా తన వంతు పాత్ర పోషిస్తోందని తెలిపారు. హైదరాబాద్ జీఐసీ ద్వారా సమీప భవిష్యత్తులోనే మరిన్ని ఉపయోగకరమైన ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తామన్నారు.తొలి టికెటింగ్ మెషీన్ మాదే..సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్లో సృజనకు ఎప్పుడూ పెద్దపీట వేస్తామని, ప్రపంచంలోనే మొట్టమొదటి ఆటోమెటిక్ టికెటింగ్ మెషీన్ను వినియోగించిన సంస్థ తమదేనని కంపెనీ వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ ఇన్నొవేషన్ హెడ్ (ఇండియా) కల్లెపల్లి కృష్ణ తెలిపారు. 1971లో ఈ టికెటింగ్ మెషీన్ను ప్రారంభిస్తే 1994లోనే అత్యాధునిక రిజర్వేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. ఉత్తర అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమ సంస్థ భవిష్యత్తులో భారత్లోనూ ఎగిరే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కృత్రిమ మేధ అనేది ప్రస్తుతం ఏ కంపెనీకైనా ఇతర కంపెనీలపై అడ్వాంటేజ్ ఇచ్చేదేనని, అందుకే సౌత్వెస్ట్ కూడా ఈ రంగంలో తగిన చర్యలు తీసుకుంటోందని వివరించారు. -
పెట్రోల్ ధరలు ఇంకా పెరుగుతాయా? ఇలాగైతే...
గడిచిన ఐదు రోజుల వ్యవధిలో చమురు సంస్థలు రెండు సార్లు పెట్రోలియం ఉత్పత్తుల రిటైల్ ధరలను పెంచాయి. నాలుగేళ్ల తర్వాత ఈ పెంపు ఇదే మొదటిసారి కాగా.. చమురు సంస్థలు మాత్రం తమ నష్టాలను పూడ్చుకునేందుకు ధరల పెంపు ఒక్కటే మార్గమని చెబుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాక.. ఏ క్షణమైనా పెట్రోధరల బాదుడు ఉంటుందని అంతా ఊహించినా.. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలు, ఆర్థిక పరిస్థితులు మున్ముందు పెట్రో కష్టాలు తప్పవనే సంకేతాలిస్తున్నాయి.కర్ణుడి చావుకు కారణాలనేకం అన్నట్లుగా.. ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరగడానికి వేర్వేరు కారణాలున్నాయి. విదేశీ మారక వ్యయం పెరగడం, రూపాయి విలువ విపరీతంగా నేలచూపు చూడడం.. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు.. ఇలా అన్నివైపుల నుంచి ముప్పు ముంచుకొస్తుండడంతో.. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా దేశ ప్రజలకు పొదుపు మంత్రాన్ని బోధించారు.ప్రధాని వ్యాఖ్యలు దేశం ఎదుర్కోబోయే లోతైన సమస్యలకు దర్పణం పడుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. మన దేశంలో పెట్రోధరలు అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా పెరగడానికి ప్రధాన కారణం.. మనవద్ద తగిన స్థాయిలో పెట్రోలియం, గ్యాస్ నిల్వలు లేకపోవడమే..! నిజానికి 1991 ఆర్థిక సంక్షోభం తర్వాత ఇంధన భద్రతపై అంతటా ఆందోళనలు మొదలయ్యాయి. దాని ఫలితంగానే భారత్ తన ఇంధన నిల్వలకు 39 మిలియన్ బ్యారెళ్ల సామర్థ్యంతో వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను ఏర్పాటు చేసింది. దీన్నే స్ట్రాటెజిక్ పెట్రోలియం రిజర్వ్స్స్ అని అంటారు. 2000 సంవత్సరం తర్వాత దీనికి అధికారిక రూపాన్నిచ్చారు.పెరుగుతున్న పెట్రోలియం అవసరాలుభారత్లో పెట్రోలియం అవసరాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం రోజుకు సగటున 5.5 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురును భారత్ వినియోగిస్తోంది. ఈ లెక్కన.. దేశంలో ఉండే పెట్రోలియం రిజర్వ్స్ వారం రోజుల అవసరాలకే సరిపోతాయి. ఇక చమురు సంస్థల వద్ద ఉన్న నిల్వలు, దిగుమతి కవరేజీని కలిపితే.. మొత్తం నిల్వలు 70 రోజుల అవసరాలను మాత్రమే తీర్చగలుగుతాయి.నిజానికి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వాహన మార్కెట్గా ఉంది. అమెరికా, చైనా తర్వాత భారత్ ఆ స్థానాన్ని ఆక్రమించింది. ఈ రెండు దేశాలతో పోలిస్తే.. భారత్ ఎక్కువగా ఇంధన భద్రత ముప్పును ఎదుర్కొనే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. 1973 చమురు సంక్షోభం తర్వాత అమెరికా భారీ స్థాయిలో వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అక్కడి SPR సామర్థ్యం 714 మిలియన్ బ్యారెళ్లు. ఇది భారత నిల్వల కంటే దాదాపు 18 రెట్లు ఎక్కువ. చైనాలో ఈ సామర్థ్యం 900 మిలియన్ బ్యారెళ్లకు చేరింది.ఈ రెండు దేశాలతో పోలిస్తే.. వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల విషయంలో భారత్ చాలా వరకు వెనకబడి ఉంది. ఇప్పటికిప్పుడు లెక్కలను పరిశీలించినా.. అమెరికా వద్ద ప్రస్తుతం 400 మిలియన్ బ్యారెళ్ల మేర రిజర్వ్స్ ఉన్నాయి. అయితే.. రోజుకు 13 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తితో అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా ఉంది. చైనా అలా కాదు. ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడి ఉంది. అయితే.. కష్టకాలమొచ్చినా తట్టుకునేలా చైనా నిల్వలున్నాయి.మన దేశంలో పరిస్థితి భిన్నంచైనా ప్రభుత్వం గనక.. చమురు వినియోగాన్ని తగ్గించాలని పిలుపునిస్తే.. పౌరులు తూచా తప్పకుండా పాటిస్తారు. మన దేశంలో పరిస్థితి భిన్నంగా ఉంది. LPG, LNG నిల్వల పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. దేశంలో సుమారు 1.4 లక్షల టన్నుల LPG నిల్వ సామర్థ్యం మాత్రమే ఉంది. కానీ రోజువారీ వినియోగం మాత్రం భారీగా పెరుగుతోంది. LNG విషయంలోనూ భారత్ ప్రధానంగా పెట్రోనెట్ LNG, BPCL రీగ్యాసిఫికేషన్ టెర్మినళ్ల వద్ద ఉన్న నిల్వలపైనే ఆధారపడుతోంది. ఎరువుల తయారీలో కీలకమైన ఈ ఇంధనానికి దేశంలో భూగర్భ నిల్వ వ్యవస్థ లేదు. అమెరికా, చైనా వంటి దేశాలు భూగర్భ LNG నిల్వలపై భారీగా పెట్టుబడులు పెట్టాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఐరోపా సమాఖ్య కూడా రష్యా గ్యాస్పై ఆధారపడడాన్ని తగ్గించుకుని, కొత్త వ్యూహాలను అందిపుచ్చుకుంది.చమురుకు సంబంధించిన భారీ నిల్వలు ఉండటం వల్ల అభివృద్ధి చెందిన దేశాలు సరఫరా అంతరాయాల సమయంలో అంతర్జాతీయ స్పాట్ మార్కెట్లో అధిక ధరలు చెల్లించకుండా దీర్ఘకాలిక ఒప్పందాలతో తమ అవసరాలను భద్రపరుచుకోగలుగుతున్నాయి. చైనా అయితే అమెరికా ఆంక్షలను కూడా పక్కన పెట్టి.. రష్యా నుంచి పెద్దమొత్తంలో చమురు కొనుగోలు చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ కూడా మరింత వ్యూహాత్మకంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అయితే.. ప్రస్తుత ప్రపంచ పరిణామాలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నేపథ్యంలో భారత్లో చమురు ధరలు మరింత పెరిగే ప్రమాదాలు లేకపోలేదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. -వెబ్డెస్క్ -
ఈవీలకు మారే ఉద్యోగులకు హైదరాబాద్ ఐటీ కంపెనీ ఆఫర్
ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు , హైదరాబాద్కు చెందిన టెక్ సంస్థ అజా కన్సల్టింగ్ సర్వీసెస్ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) కొనుగోలు చేసే తమ ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ప్రకటించింది.ఈవీ కార్లు కొనుగోలు చేసే ఉద్యోగులకు రూ.10 వేల ప్రోత్సాహకం, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసే వారికి రూ.5 వేల ప్రోత్సాహకం అందజేస్తామని ఆ కంపెనీ సీఈఓ ఫణిరాజ్ జలిగామ ప్రకటించారు. పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో పర్యావరణ హితమైన ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది.ఇటీవల ఇజ్రాయెల్–ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయని, దాంతో ప్రధాన మంత్రి కార్ పూలింగ్ను ప్రోత్సహించడంతో పాటు పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి ఈవీలకు మారాలని, ప్రజా రవాణా వ్యవస్థను విస్త్రృతంగా వినియోగించాలని పిలుపునిచ్చారని ఫణిరాజ్ తెలిపారు. ఇంధన వినియోగాన్ని తగ్గించడం ద్వారా దేశ విదేశీ మారక నిల్వలను ఆదా చేయవచ్చన్నారు.ప్రధాని విజన్కు అనుగుణంగా ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు సంస్థలో ‘గ్రీన్ పాలసీ’ /‘ఈవీ పాలసీ’ను అమలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఉద్యోగులు స్వచ్ఛమైన, ఇంధన పొదుపు కలిగిన రవాణా మార్గాలను ఎంచుకునేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. -
పడిలేచిన స్టాక్ మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. బెంచ్ మార్క్ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ ట్రేడింగ్ చివరి గంటలో అన్ని ఇంట్రాడే నష్టాలను పూడ్చుకుని లాభాల్లోకి వచ్చేశాయి.నిఫ్టీ 50 ఇండెక్స్ 41 పాయింట్లు లేదా 0.17 శాతం పెరిగి 23,659 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ ఇండెక్స్ 23,690.90 వద్ద గరిష్టం, 23,397.30 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది.బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 117.54 పాయింట్లు లేదా 0.16 శాతం పెరిగి 75,318.39 వద్ద ట్రేడింగ్ సెషన్ ను ముగించింది. ఈ ఇండెక్స్లో గరిష్టం 75,406.18 పాయింట్లు, కనిష్టం 74,529.41 వద్ద నమోదైంది.హిందాల్కో ఇండస్ట్రీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఆటో నిఫ్టీ 50లో టాప్ గెయినర్లుగా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.49 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 0.04 శాతం పెరిగాయిరంగాల వారీగా, నిఫ్టీ ఆయిల్ & గ్యాస్, నిఫ్టీ ఆటో మెరుగైన పనితీరు కనబరిచాయి. నిఫ్టీ మీడియా, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ చాలా క్షీణించాయి. -
పసిడి పరుగు, కానీ వారి జీవితాలు ఛిద్రం
బంగారం ధరలు పెరగడంతో గిరాకీలు లేక స్వర్ణకారుల ఉపాధి దెబ్బతిన్నది. ఆర్థికంగా ఉన్నవారు జ్యువెల్లరీ షాపుల్లో ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారు. స్వర్ణకారుల దగ్గర ఆభరణాలు చేయించుకునేది సామాన్య ప్రజలు మాత్రమే. అయితే బంగారం ధర పెరగడంతో వారికి అందని ద్రాక్షగా మారింది. దీంతో పని లేక స్వర్ణకారులు కుటుంబ పోషణకు వాచ్మెన్లు, సేల్స్బాయ్గా పనిచేస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపక పోవడంతో దీనావస్థలో జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. మెదక్ కలెక్టరేట్: ఒకప్పుడు మెదక్ గోల్డ్ బజార్ నిత్యం వినియోగదారులతో కిటకిటలాడేది. హైదరాబాద్తోపాటు పరిసర జిల్లాల ప్రజలు ఇక్కడే బంగారం కొనుగోలు చేయడంతోపాటు పలు రకాల నగలు చేయించుకునేవారు. వందలాది స్వర్ణకారులు కులవృత్తితో తమ కుటుంబాలను పెంచి పోషించుకునేవారు. కాగా పెరిగిన పసిడి ధరలతో ప్రస్తుతం వినియోగదారులు లేక వెలవెలబోతుంది. పనులు కరువు.. బంగారం ధరలు పెరగడంతో గిరాకీల్లేక స్వర్ణకారులు దుకాణాలను మూసివేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 50 వరకు దుకాణాలు మూతపడినట్లు సమాచారం. ప్రభుత్వం ప్రత్యామ్నాయం కల్పించకపోవడంతో దర్జాగా బతికిన స్వర్ణకారులు పలు చోట్ల జీతాలకు పనిచేస్తున్నారు. గత్యంతరం లేక కుటుంబ పోషణకు వాచ్మెన్లు, సేల్స్బాయ్గా ఉద్యోగం చేస్తున్నారు. ఆరు నెలల క్రితం నరేశ్చారి అనే స్వర్ణకారుడు పనులు దొరక్క కుటుంబ పోషణకు చేసిన అప్పులు భారమై ఆత్మహత్య చేసుకున్నాడు. రోడ్డున పడిన అతని కుటుంబాన్ని తోటి స్వర్ణకారులు ఆదుకున్నారు. అంతేకాని ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని స్వర్ణకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రోజు కూలీ కూడా రావట్లేదు.. రోజంతా కూర్చుంటే కనీసం వంద రూపాయలు రావడం లేదు. నెల వచ్చేసరికి దుకాణ కిరాయిలు మీద పడుతున్నాయి. మరోవైపు కుటుంబ పోషణ భారంగా మారుతోంది. దీంతో అప్పులు పెరిగాయి. ఫలితంగా దుకాణం మూసివేయాల్సి వచ్చింది. గతంలో ఎంతో దర్జాగా బతికిన తాను గత్యంతరం లేక కుటుంబ పోషణకు ఓ వెంచర్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాను. –శ్రీనివాసచారి, మెదక్, స్వర్ణకారుడు 350 దుకాణాలు.. మెదక్ గోల్డ్ బజార్లో మొత్తం 350 దుకాణాలు ఉన్నాయి. 50 జ్యూవెల్లరీ షాపులు, 300 స్వర్ణకారుల దుకాణాలు ఉన్నాయి. వీటిపై ఆధారపడి సుమారు వెయ్యి కుటుంబాలు జీవిస్తున్నాయి. నిత్యం పెరుగుతూ నిలకడలేని బంగారం ధరలతో స్వర్ణకారులకు గిరాకీలు తగ్గిపోయాయి. సామాన్య ప్రజలు అందుకోలేని స్థాయికి పసిడి ధరలు వెళ్లిపోయాయి. స్వర్ణకారుల దగ్గర నగ, నట్రా చేయించుకునేది సామాన్య ప్రజలే. అయితే ఎక్కువ డబ్బులున్న వారు జ్యువెల్లరీ షాపులకే వెళ్తుండగా, సామాన్యులు చిన్న చిన్న ఆభరణాలు చేయించుకునేందుకు స్వర్ణకారుల వద్దకు వచ్చేవారు. దీంతో వారికి ఉపాధి లభించేది. ప్రస్తుతం పని లేక ఇబ్బందులు పడుతున్నారు. -
భగ్గుమంటున్న బంగారం ధర.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
ఐఐటీ-బీ.. ఆఫర్లు తగ్గినా.. పెరిగిన ప్యాకేజీలు!
ప్రపంచవ్యాప్తంగా ఐటీ, టెక్నాలజీ రంగాల్లో ఒడిదొడుకులు ఉన్నప్పటికీ దేశీయ ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - బాంబే’ (ఐఐటీ-బీ) తన సత్తాను చాటుకుంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన వార్షిక ప్లేస్మెంట్ నివేదికను ఐఐటీ బాంబే తాజాగా విడుదల చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి మొత్తం ఉద్యోగ ఆఫర్ల సంఖ్య స్వల్పంగా తగ్గినప్పటికీ విద్యార్థులకు లభించిన సగటు, మధ్యస్థ వేతన ప్యాకేజీలు మాత్రం 10 శాతానికి పైగా పెరగడం విశేషం. జులై 2024 నుంచి జూన్ 2025 మధ్య రెండు విడతలుగా ఈ ప్లేస్మెంట్ ప్రక్రియ సాగింది.తగ్గిన ఆఫర్లు.. పెరిగిన డిమాండ్ఈ ఏడాది ప్లేస్మెంట్ సీజన్లో విద్యార్థులు మొత్తం 1,422 ఉద్యోగ ఆఫర్లను అంగీకరించారు. ఇందులో అంతర్జాతీయ కంపెనీలు ఆఫర్ చేసిన 65 గ్లోబల్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఐఐటీ-బీలో ఈసారి రిజిస్టర్ చేసుకున్న విద్యార్థుల సంఖ్య స్వల్పంగా 2% పెరిగి 2,469 కి చేరింది. వీరిలో 2,040 మంది విద్యార్థులు రెండు దశల్లోనూ క్రియాశీలకంగా పాల్గొన్నారు. అయితే, కొన్ని గ్లోబల్ కంపెనీలు నియామకాల్లో ఆచితూచి వ్యవహరించడంతో మొత్తం ఆఫర్ల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే సుమారు 3.5% మేర తగ్గింది. భారీ ప్యాకేజీలు సాధించిన విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉద్యోగం సాధించిన వారి సగటు వార్షిక వేతనం రూ.26.45 లక్షలుగా ఉంది.రంగాల వారీగా నియామకాలుఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాలు ఎప్పటిలాగే సింహభాగాన్ని ఆక్రమించగా.. కన్సల్టింగ్, ఫైనాన్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ప్రొడక్ట్ మేనేజ్మెంట్ రంగాలు గట్టి పోటీనిచ్చాయి.రంగంకంపెనీల సంఖ్యలభించిన ఆఫర్లుఇంజినీరింగ్ విభాగం96429ఐటీ124393గమనిక: ఐటీ రిక్రూటర్లలో 99 కంపెనీలు కేవలం కోర్ సాఫ్ట్వేర్ పాత్రల కోసమే విద్యార్థులను ఎంపిక చేసుకున్నాయి.బీటెక్, కంప్యూటర్ సైన్స్దే జోరుకోర్సుల వారీగా చూస్తే బీటెక్, డ్యూయల్ డిగ్రీ విద్యార్థులకు కంపెనీల నుంచి భారీ డిమాండ్ వ్యక్తమైంది. బీటెక్కు సంబంధించి దాదాపు 82 శాతం ప్లేస్మెంట్ రేటు నమోదైంది. డ్యూయల్ డిగ్రీ పరంగా 80 శాతం మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు.72 శాతానికి పైగా ఎంటెక్ విద్యార్థులు ప్లేస్మెంట్లు పొందారు. అత్యంత డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో రిజిస్టర్ చేసుకున్న 277 మంది విద్యార్థులలో 258 మంది అత్యుత్తమ ప్యాకేజీలు పొందారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాలు కూడా మెరుగైన ప్లేస్మెంట్ గణాంకాలను నమోదు చేశాయి.పీహెచ్డీల చూపు.. స్టార్టప్ల వైపు!ఇతర రెగ్యులర్ కోర్సులతో పోలిస్తే పీహెచ్డీ విద్యార్థుల ప్లేస్మెంట్ గణాంకాలు తక్కువగా ఉన్నాయి. అయితే దీనికి కారణం ఉద్యోగాలు లేకపోవడం కాదు; గ్రాడ్యుయేటింగ్ పరిశోధకులు కార్పొరేట్ ఉద్యోగాల కంటే పోస్ట్-డాక్టోరల్ ఫెలోషిప్లు, సొంతంగా స్టార్టప్ వెంచర్లను ప్రారంభించడానికే మొగ్గు చూపడం వల్లనేనని నివేదిక స్పష్టం చేసింది.ఇదీ చదవండి: అంకెల్లో పెరిగినా.. చేతిలో సున్నా! -
270 పాయింట్లు పడిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:59 సమయానికి నిఫ్టీ(Nifty) 73 పాయింట్లు తగ్గి 23,544 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 274 పాయింట్లు నష్టపోయి 74,919 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.36బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 110.78 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.66 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.67 శాతం పడిపోయింది.నాస్డాక్ 0.84 శాతం నష్టపోయింది.Today Nifty position 20-05-2026(time: 09:59 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
యశ్వంత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు
మహారాష్ట్రకు చెందిన సహకార బ్యాంకింగ్ రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సామాన్య డిపాజిటర్ల ప్రయోజనాలే పరమావధిగా పనిచేసే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), నిబంధనలు ఉల్లంఘించిన బ్యాంకులపై చర్యలు చేపడుతోంది. మహారాష్ట్ర, ఫాల్టాన్కు చెందిన ‘యశ్వంత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్’ లైసెన్స్ను రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మంగళవారం పని వేళలు ముగిసినప్పటి నుంచి ఈ బ్యాంక్ ఎలాంటి బ్యాంకింగ్ కార్యకలాపాలు (డిపాజిట్లు స్వీకరించడం, రుణాల చెల్లింపులు వంటివి) నిర్వహించకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది.లైసెన్స్ రద్దుకు కారణాలుబ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949లోని కీలక నిబంధనలను పాటించడంలో యశ్వంత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ పూర్తిగా విఫలమైందని ఆర్బీఐ పేర్కొంది. ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంక్ వద్ద ప్రస్తుతం ఉన్న ఆర్థిక వనరులు, సంపాదన సామర్థ్యం దాని ప్రస్తుత డిపాజిటర్లకు పూర్తి స్థాయిలో చెల్లింపులు చేయడానికి సరిపోవు. బ్యాంక్ భవిష్యత్తులో లాభాల్లోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఇలాంటి స్థితిలో ఈ బ్యాంకును ఇంకా కొనసాగనిస్తే అది సామాన్య డిపాజిటర్ల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని ఆర్బీఐ చెప్పింది.తదుపరి చర్యలుబ్యాంకును శాశ్వతంగా మూసివేయడానికి తగిన ఉత్తర్వులు జారీ చేయాలని, అలాగే బ్యాంకు ఆస్తుల అమ్మకం, బాధ్యతల నిర్వహణ కోసం ఒక సమర్థవంతమైన ‘లిక్విడేటర్’(ఒక సంస్థ పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయి మూతపడే స్థితికి చేరినప్పుడు దాని లిక్విడేషన్ ప్రక్రియను నిర్వహించడానికి ప్రభుత్వం లేదా కోర్టు నియమించే ఒక అధికారిక వ్యక్తి)ను నియమించాలని మహారాష్ట్ర సహకార కమిషనర్, సహకార సంఘాల రిజిస్ట్రార్ను ఆర్బీఐ కోరింది.డిపాజిటర్లకు లభించే రక్షణ ఎంత?బ్యాంక్ లైసెన్స్ రద్దు అయినప్పటికీ డిపాజిటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్బీఐ భరోసా ఇచ్చింది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) చట్టం ప్రకారం ప్రతి డిపాజిటర్కు రక్షణ లభిస్తుంది. లిక్విడేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ప్రతి డిపాజిటర్ తన డిపాజిట్ మొత్తానికి గానూ గరిష్టంగా రూ.5,00,000 వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మొత్తాన్ని పొందేందుకు చట్టబద్ధమైన అర్హత కలిగి ఉంటారు. డీఐసీజీసీ ఇప్పటికే సంబంధిత డిపాజిటర్లకు రూ.106.96 కోట్ల మొత్తాన్ని ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ కింద చెల్లించడం గమనార్హం.ఇటీవలి కాలంలో ఆర్థిక మూలాలు బలహీనంగా ఉన్న, నిబంధనలు పాటించని అర్బన్, రూరల్ కో-ఆపరేటివ్ బ్యాంకులపై ఆర్బీఐ కఠిన వైఖరి అవలంబిస్తోంది. యశ్వంత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు కూడా ఇందులో భాగమే. అయితే, ఐదు లక్షల లోపు డిపాజిట్లు ఉన్న ఖాతాదారులకు పూర్తి డబ్బు వెనక్కి వస్తుండటం ఇక్కడ ఊరట కలిగించే అంశం.ఇదీ చదవండి: అంకెల్లో పెరిగినా.. చేతిలో సున్నా! -
డిజిటల్ భారత్లో మైక్రోసాఫ్ట్ మెగా ప్లాన్
భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి భారీ ఊపునిచ్చేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ రంగం సిద్ధం చేసింది. దేశంలోనే తన అత్యంత భారీ డేటా సెంటర్ను 2026లోనే అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు రాయిటర్స్ వెల్లడించింది. టెక్నాలజీ హబ్గా మారుతున్న హైదరాబాద్ నగరంలోనే ఈ సదుపాయం ఏర్పాటు కాబోతోందని మైక్రోసాఫ్ట్ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ అధికారికంగా ధ్రువీకరించారు. ఇది భారతదేశంలో మైక్రోసాఫ్ట్ నిర్మించబోయే అత్యంత భారీ, వ్యూహాత్మక డేటా సెంటర్ కానుంది.క్లౌడ్, ఏఐ సేవలకు భారీ డిమాండ్భారత్లో మైక్రోసాఫ్ట్ సేవల విస్తరణపై పునీత్ చందోక్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం దేశంలో అజూర్ క్లౌడ్ సేవలకు విపరీతమైన ఆదరణ ఉంది. దీనితో పాటు నెలకు 30 డాలర్ల ధర కలిగిన కంపెనీ ప్రతిష్టాత్మక ‘కోపైలట్ 365 ఏఐ అసిస్టెంట్’ వినియోగం భారత్లో శరవేగంగా పుంజుకుంటోంది’ అని పేర్కొన్నారు.ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ మార్కెట్లలో భారత్ అగ్రగామిగా ఉంది. ఇక్కడి భారీ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య, నైపుణ్యం కలిగిన సాంకేతిక ప్రతిభను దృష్టిలో ఉంచుకుని మైక్రోసాఫ్ట్ తన ఏఐ పురోగతిని మరింత బలోపేతం చేస్తోంది. కాగా, మైక్రోసాఫ్ట్ ప్రత్యర్థులైన ఆల్ఫాబెట్ (గూగుల్), అమెజాన్లు సైతం భారతీయ ఏఐ, క్లౌడ్ మార్కెట్లో దూకుడుగా విస్తరిస్తుండటం గమనార్హం.వేల కోట్ల పెట్టుబడిభారత మార్కెట్పై మైక్రోసాఫ్ట్ నమ్మకానికి ఇక్కడి పెట్టుబడులే నిదర్శనం. ఆసియాలోనే అతిపెద్ద పెట్టుబడిగా భావిస్తున్న 17.5 బిలియన్ డాలర్లను భారతదేశంలో ఇన్వెస్ట్ చేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ గత ఏడాది చివర్లో ప్రకటించింది. ఇది 2025లో ప్రకటించిన 3 బిలియన్ డాలర్ల వాగ్దానానికి అదనపు పెట్టుబడి కావడం విశేషం. ఈ భారీ నిధుల్లో సింహభాగం హైదరాబాద్ ఫెసిలిటీతో కూడిన డేటా సెంటర్ మౌలిక సదుపాయాల విస్తరణకే మళ్లించనున్నారు. డేటా సెంటర్ నిర్మాణ ప్రణాళికలను ప్రస్తావిస్తూ.. తమ ప్రాజెక్ట్ పనులు అత్యంత వేగంగా, అనుకున్న సమయం కంటే ముందే పూర్తి చేసేలా అడుగులు వేస్తున్నామని చందోక్ స్పష్టం చేశారు. అయితే, రాబోయే ఈ సదుపాయం కచ్చితమైన సామర్థ్యం ఎంత అనే వివరాలను ఆయన ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు.ఇదీ చదవండి: అంకెల్లో పెరిగినా.. చేతిలో సున్నా! -
ఆరు నెలల గరిష్టానికి నిరుద్యోగం
న్యూఢిల్లీ: నిరుద్యోగం ఏప్రిల్లో స్వల్పంగా పెరిగింది. మార్చిలో ఉన్న 5.1 శాతం నుంచి 5.2 శాతానికి చేరింది. 2025 ఏప్రిల్లోనూ 5.1 శాతంగానే ఉండడం గమనార్హం. 15 ఏళ్ల వయసుకు మించి పనిచేసే జనాభాకు సంబంధించి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వివరాలను కేంద్ర ప్రణాళిక, కార్యక్రమాల అమలు శాఖ శుక్రవారం విడుదల చేసింది. చివరిగా 2025 అక్టోబర్లోనూ 5.2 శాతం స్థాయిలో నిరుద్యోగం నమోదైంది. ⇒ పట్టణాల్లో నిరుద్యోగం కాస్తంత దిగొచ్చింది. మార్చిలో ఉన్న 6.8 శాతం నుంచి ఏప్రిల్లో 6.6 శాతానికి తగ్గింది. ⇒ గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 4.3 శాతం నుంచి 4.6 శాతానికి పెరిగింది. ⇒ 2025 ఏప్రిల్తో పోల్చితే మాత్రం గ్రామీణ, పట్టణ నిరుద్యోగంలో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంది. ⇒ పట్టణ పురుషుల్లో నిరుద్యోగం మార్చిలో 5 శాతంగా ఉంటే, ఏప్రిల్లో 5.1 శాతానికి చేరింది. గ్రామీణ పురుషుల్లో నిరుద్యోగం 4.7 శాతం నుంచి 4.4 శాతానికి తగ్గింది. ⇒ దేశవ్యాప్తంగా మహిళలకు సంబంధించి నిరుద్యోగ రేటు 5.3 శాతం నుంచి 5.4 శాతానికి పెరిగింది. గ్రామీణ మహిళల్లో 4.4 శాతం నుంచి 4.1 శాతానికి తగ్గగా.. పట్టణ మహిళల్లోనూ 9 శాతం నుంచి 8.5 శాతానికి తగ్గుముఖం పట్టింది. ⇒ కార్మికుల భాగస్వామ్య రేటు ఏప్రిల్లో 55 శాతానికి పరిమితం అయింది. మార్చిలో ఇది 55.4 శాతంగా ఉంది. -
ఇక యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా
న్యూఢిల్లీ: ఉద్యోగులు తమ భవిష్య నిధిని (పీఎఫ్) వేగంగా ఉపసహరించుకునేందుకు వీలుగా యూపీఐ పేమెంట్ గేట్వే త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ సదుపాయాన్ని పరీక్షించడం పూర్తయిందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. మెరుగైన సేవల దిశగా ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) ఎన్నో చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈపీఎఫ్వో సభ్యులు యూపీఐ పేమెంట్ గేట్వే ద్వారా ఉపసంహరించుకునే మొత్తం, వారి బ్యాంక్ ఖాతాలకు వెంటనే జమ అవుతుందని చెప్పారు. ఈపీఎఫ్ ఖాతాకు లింక్ చేసిన యూపీఐ పిన్ను నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. నిబంధనల మేరకు భవిష్యనిధిలో కొంత మేర బ్యాలన్స్ను తప్పకుండా కొనసాగించాల్సి ఉంటుంది.అది పోను మిగిలిన మొత్తాన్ని యూపీఐ సాయంతో వేగంగా ఉపసంహరించుకునే దిశగా ఈపీఎఫ్వో అడుగులు వేస్తున్నట్టు మంత్రి వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. నూతన సదుపాయంతో ఏడు కోట్ల మంది ఈపీఎఫ్వో సభ్యులకు నిధుల ఉపసంహరణ సులభతరం కానుంది. ప్రస్తుత విధానంలో సభ్యులు ఉపసంహరణ కోసం క్లెయిమ్ దాఖలు చేసి, నిర్ణీత సమయం పాటు నిరీక్షించాల్సి వస్తోంది.ఆటో–సెటిల్మెంట్ విధానంలో మానవ ప్రమేయం లేకుండా ఎలక్ట్రానిక్ రూపంలో క్లెయిమ్ల పరిష్కారానికి మూడు రోజుల సమయం పడుతోంది. ఈపీఎఫ్వో వాట్సాప్ సేవలను నెలలో ప్రారంభించనున్నట్టు మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. సభ్యులు ఈపీఎఫ్వో వాట్సాప్ నంబర్కు హాయ్ అని టైప్ చేసి పంపించడం ద్వారా పీఎఫ్ ఖాతాలో ఎంత ఉంది? చివరి ఐదు లావాదేవీలు తదితర సమాచారాన్ని పొందొచ్చని చెప్పారు. పెండింగ్ కేసులకు పరిష్కారం నిధి ఆప్కే నికత్ కార్యక్రమం ద్వారా కన్జ్యూమర్ కోర్టుల్లో అపరిష్కృతంగా ఉండిపోయిన కేసులను గుర్తించి, చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి మాండవీయ తెలిపారు. దీంతో 2025 ఏప్రిల్ 1 నాటికి 31,036 కేసులు ఉండగా, 2026 ఏప్రిల్ 1 నాటికి 27,639కు తగ్గినట్టు చెప్పారు. -
క్రెడిట్ కార్డుల హవా
ముంబై: దేశంలో ఒకవైపు క్రెడిట్ కార్డు లావాదేవీలు దేశంలో శరవేగంగా పెరుగుతుంటే.. మరోవైపు డెబిట్ కార్డు లావాదేవీలు అదే స్థాయిలో తగ్గిపోతున్నాయి. 2021లో 216 కోట్లుగా ఉన్న క్రెడిట్ కార్డ్ లావాదేవీలు 2025 నాటికి 570 కోట్లకు పెరిగాయి. సుమారు 2.6 రెట్లు వృద్ధి నమోదైంది. 2021లో రూ. 8.9 లక్షల కోట్లుగా ఉన్న లావాదేవీల విలువ 2025 నాటికి రూ. 23.2 లక్షల కోట్లకు చేరినట్టు ఆర్బీఐ విడుదల చేసిన డేటా స్పష్టం చేస్తోంది. ఐదేళ్ల కాలంలో క్రెడిట్ కార్డ్ లావాదేవీల్లో 27 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదైంది. నివేదికలోని అంశాలు.. ⇒ డెబిట్ కార్డు లావాదేవీల సంఖ్య 2021లో 408.7 కోట్లుగా ఉంటే, 2025 నాటికి 133.6 కోట్లకు పడిపోయాయి. ⇒ డెబిట్ కార్డు లావాదేవీల విలువ రూ. 7.4 లక్షల కోట్ల నుంచి రూ. 4.5 లక్షల కోట్లకు తగ్గింది. ⇒ యూపీఐ, డిజిటల్ వాలెట్లు, క్రెడిట్ కార్డుల వాడకం వేగంగా పెరగడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. అయితే, ఇప్పటికీ క్రెడిట్ కార్డుల కంటే డెబిట్ కార్డులే ఎక్కువ మంది చేతుల్లో ఉన్నాయి. ⇒ ప్రైవేటు రంగ బ్యాంకులు క్రెడిట్ కార్డు మార్కెట్లో తమ వాటాను 2021 చివరికి ఉన్న 67.7 శాతం నుంచి 2025 చివరికి 71.1 శాతానికి పెంచుకున్నాయి. ⇒ ఇక క్రెడిట్కార్డు మార్కెట్లో ప్రభుత్వరంగ బ్యాంకులు తమ వాటాను స్వల్పంగా 23.5 శాతం నుంచి 23.9శాతానికి పెంచుకున్నాయి. ⇒ విదేశీ బ్యాంకుల వాటా 9.3 శాతం నుంచి 3.8కి పడిపోయింది. ⇒ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు డిసెంబర్ 2025 నాటికి మొత్తం 14 లక్షల క్రెడిట్ కార్డులను జారీ చేశాయి.డిజిటల్ చెల్లింపుల విస్తరణ ⇒ 2016తో పోలిస్తే 2025 నాటికి డిజిటల్ చెల్లింపుల లావాదేవీల సంఖ్య 33 రెట్లు పెరగ్గా, వాటి విలువ దాదాపు మూడు రెట్లు అధికమైంది. ⇒ ముఖ్యంగా గత ఐదేళ్లలో డిజిటల్ చెల్లింపులు సంఖ్యా పరంగా నాలుగు రెట్లకు పైగా పెరిగాయి. ⇒ 2025 జూన్లో 6,782 లక్షలుగా ఉన్న క్యూఆర్ కోడ్లు, డిసెంబర్ 2025 నాటికి 7,313 లక్షలకు పెరిగాయి. ⇒ డిజిటల్ చెల్లింపులను స్వీకరించే ఛానళ్లను పరిశీలిస్తే.. గతేడాది జూన్–డిసెంబర్ మధ్య యూపీఐ క్యూఆర్ కోడ్లు, క్రెడిట్ కార్డులు, వ్యాలెట్లలో ఎక్కువ వృద్ధి కనిపించగా, పీవోఎస్ టెరి్మనళన్లు, ఏటీఎంలు, మైక్రో ఏటీఎంల వినియోగం తగ్గింది.⇒ యూపీఐ, డిజిటల్ వాలెట్లు, క్రెడిట్ కార్డుల వాడకం వేగంగా పెరగడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. అయితే, ఇప్పటికీ క్రెడిట్ కార్డుల కంటే డెబిట్ కార్డులే ఎక్కువ మంది చేతుల్లో ఉన్నాయి. ⇒ ప్రైవేటు రంగ బ్యాంకులు క్రెడిట్ కార్డు మార్కెట్లో తమ వాటాను 2021 చివరికి ఉన్న 67.7 శాతం నుంచి 2025 చివరికి 71.1 శాతానికి పెంచుకున్నాయి. ⇒ ఇక క్రెడిట్కార్డు మార్కెట్లో ప్రభుత్వరంగ బ్యాంకులు తమ వాటాను స్వల్పంగా 23.5 శాతం నుంచి 23.9శాతానికి పెంచుకున్నాయి. ⇒ విదేశీ బ్యాంకుల వాటా 9.3 శాతం నుంచి 3.8కి పడిపోయింది. ⇒ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు డిసెంబర్ 2025 నాటికి మొత్తం 14 లక్షల క్రెడిట్ కార్డులను జారీ చేశాయి. -
భారత్లో రూ. 5,700 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఫుడ్, బెవరేజెస్ దిగ్గజం పెప్సీకో 2030 నాటికి భారత్లో రూ. 5,700 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయ నుంది. ప్రధానంగా ఆహారోత్పత్తుల తయా రీ సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం ఈ మొత్తా న్ని వెచ్చించనున్నట్లు సంస్థ ఇండియా, సౌత్ ఏషి యా సీఈవో జాగృత్ కొటేచా తెలిపారు. మధ్యప్రదేశ్లోని కాన్సెంట్రేట్స్ ప్లాంటులో, అస్సాం..తమిళనాడులోని స్నాక్స్ ప్లాంట్లపై ఇన్వెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు. తమిళనాడులో ఇటీవలే స్థలాన్ని కూడా సేకరించినట్లు పేర్కొన్నారు. ప్రజల ఆదాయాలు, వినియోగం స్థిరంగా పెరుగుతున్న భారత్ తమకు టాప్ 13 మార్కెట్లలో ఒకటని ఆయ న చెప్పారు.గతేడాది (2025)లో రూ. 9,789 కోట్ల ఆదాయంపై రూ. 905 కోట్ల లాభం ఆర్జించినట్లు జాగృత్ తెలిపారు. వరుసగా రెండో ఏడాది కూడా పటిష్టంగా రెండంకెల స్థాయిలో వృద్ధి చెందినట్లు వివరించారు. ఫుడ్ సెగ్మెంట్లో 11 శాతం వృద్ధి సాధించినట్లు పెప్సీకో ఇండియా, సౌత్ ఏషియా సీఎఫ్వో సవిత బాలచంద్రన్ తెలిపారు. వాతావరణం కారణంగా శీతల పానీయాల విభాగానికి కొంత ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయని, పోటీ కూడా పెరిగిందని చెప్పారు. అయినప్పటికీ రెండు విభాగాలు మెరుగ్గా రాణించినట్లు పేర్కొన్నారు. -
రూపాయి మరో కొత్త కనిష్టం..
ముంబై: భగ్గుమంటున్న క్రూడాయిల్ రేట్లు, విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం, డాలరు బలపడుతుండటం లాంటి ప్రతికూల పరిణామాలతో రూపాయి మారకం విలువ వేగంగా కరిగిపోతోంది. మంగళవారం డాలరుతో పోలిస్తే మరో 50 పైసలు క్షీణించి సరికొత్త ఆల్టైమ్ కనిష్టం 96.70కి పతనమైంది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 96.20తో పోలిస్తే మరింత తక్కువగా 96.38 వద్ద ప్రారంభమైన రూపాయి ట్రేడింగ్ .. ఇంట్రాడేలో 96.27కి పెరిగింది. కానీ అది నిలబెట్టుకోలేక చివరికి 50 పైసలు క్షీణతతో ముగిసింది. దీనితో గత ఎనిమిది సెషన్లలో 2.64 శాతం (రూ. 2.48) మేర పతనమైనట్లయింది. తద్వారా ఆసియాలోనే అత్యధికంగా పతనమైన కరెన్సీగా నిల్చింది. డాలరు బలపడటం, అమెరికా ట్రెజరీ ఈల్డ్లు పెరుగుతుండటం, అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటంలాంటి అంశాలు రూపాయిపై ఒత్తిడిని పెంచుతున్నాయని మిరే అసెట్ షేర్ఖాన్ రీసెర్చ్ అనలిస్ట్ అనుజ్ చౌదరి తెలిపారు. అయితే, పసిడి, వెండిపై దిగుమతులపై ఆంక్షలు, ఆర్బీఐ జోక్యంతో కనిష్ట స్థాయిల్లో రూపాయికి కొంత మద్దతు లభించవచ్చని పేర్కొన్నారు. స్పాట్ మార్కెట్లో 96–96.60 శ్రేణిలో తిరుగాడవచ్చని వివరించారు. -
వడ్డింపే తరువాయి!
సాక్షి, బిజినెస్ డెస్క్: అసలే నిత్యావసరాల ధరల మంట.. ఆపై పెట్రో పోటుతో అల్లాడుతున్న ప్రజలకు మరో గండం పొంచి ఉన్నట్టే కనిపిస్తోంది. పశ్చిమాసియా యుద్ధం... ఆఖరికి బ్యాంకుల్లో రుణాలు తీసుకునే వారినీ వదిలేట్లు లేదు. కొండెక్కిన క్రూడాయిల్ సెగతో ద్రవ్యోల్బణం ఎగబాకుతుండటం... రూపాయి అంతకంతకూ పడిపోతున్న నేపథ్యంలో త్వరలోనే రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) వడ్డీ రేట్లు పెంచొచ్చనేది ఆర్థిక నిపుణుల అంచనా. ఇదే జరిగితే గృహ, వాహన, పర్సనల్, కార్పొరేట్ లోన్లు భారమవుతాయి. దీంతో నెలవారీ వాయిదాలు (ఈఎంఐలు) ఎగబాకుతాయి. మరోపక్క, వడ్డీ రేట్ల పెంపుతో వినియోగం తగ్గి.. ఎకానమీ వృద్ధి మరింత మందగించే అవకాశాలున్నట్లు విశ్లేషకులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు! మోదీ పొదుపు వార్నింగ్ తర్వాత అటు బంగారం, వెండిపై సుంకాల మోత, దిగుమతి ఆంక్షలు... పెట్రో వాతతో షాకిచ్చిన సర్కారుకు ఇక ఆర్బీఐ కూడా జతయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 5న తీసుకోబోయే సెంట్రల్ బ్యాంక్ పాలసీ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ముడిచమురు బ్యారెల్ 100 డాలర్ల పైకి దూసుకెళ్లి, గత రెండున్నర నెలలుగా దాదాపు అదే స్థాయిలో కదలాడుతోంది. మన బంగారం, క్రూడ్ అవసరాల్లో 85 శాతం మేర దిగుమతులపైనే ఆధారపడుతుండటంతో దిగుమతుల బిల్లు భారమై రూపాయి మరింత బక్కచిక్కింది. ప్రస్తుతం సరికొత్త ఆల్టైమ్ కనిష్టం 96.60కి పడిపోయింది. విదేశీ ఇన్వెస్టర్ల తిరోగమనంతో డాలర్లు ఎగిరిపోతున్నాయి. ఈ విపత్కర పరిణామాలతో మన ఫారెక్స్ నిల్వలు కరిగిపోతున్నాయి. మరోపక్క, పెట్రోలు, డీజిల్ ధరల పెంపుతో (వారంలోపే దాదాపు రూ.4 చొప్పున రెండు సార్లు) ద్రవ్యోల్బణం ఎగబాకుతోంది. దీంతో ఆర్బీఐ మళ్లీ వడ్డీరేట్లు పెంచవచ్చని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత బాండ్ మార్కెట్ ట్రెండ్.. రేట్ల పెంపు సిగ్నల్ ఇస్తున్నట్లు చెబుతున్నారు. బాండ్ రాబడులు (ఈల్డ్స్) గత రెండు నెలల్లో ఎగబాకడం (10 ఏళ్ల ప్రామాణిక ట్రెజరీ బాండ్ ఈల్డ్ 6.25 శాతం నుంచి 7.06 శాతానికి జంప్ చేసింది) చూస్తుంటే.. చమురు ధరల సెగతో ద్రవ్యోల్బణం ఎగబాకి, రూపాయి మరింత బలహీన పడుతుందన్న ఆందోళనలకు అద్దంపడుతోందని విశ్లేషిస్తున్నారు. గతేడాది 1.25 శాతం తగ్గింపు... ధరలు అదుపులో ఉండటంతో... జీడీపీ వృద్ధికి ఊతమిచ్చేందుకు 2025 ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు ఆర్బీఐ నాలుగు విడతల్లో రెపో రేటును 1.25 శాతం తగ్గించింది. దీంతో ఈ కీలక పాలసీ రేటు 6.5 శాతం గరిష్ట స్థాయి నుంచి 5.25 శాతానికి చేరింది. బ్యాంకులు కూడా దీన్ని రుణగ్రహీతలకు బదలాయించడంతో అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లు దిగొచ్చాయి. కానీ పశ్చిమాసియా యుద్ధం మొదలైన తర్వాత క్రూడ్ రేట్లు భగ్గుమనడం, రూపాయి భారీ పతనం, ద్రవ్యోల్బణం పెరుగుదల రిసు్కలతో ఆర్బీఐ అప్పటి నుంచీ పాలసీ రేట్లను యథాథంగానే కొనసాగిస్తోంది. అవసరమైతే రేట్లను తగ్గించేలా తటస్థ (న్యూట్రల్) విధానాన్ని కూడా మార్చలేదు. తీరా చూస్తే, ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. కాగా, చివరిసారిగా ఆర్బీఐ రెపో రేటును 2023 ఫిబ్రవరిలో పావు శాతం పెంచింది. ఈ ఏడాది పెంపు.. రెండు విడతలు రూపాయి పతనం, ధరల పెరుగుదలకు అడ్డకట్ట పడాలంటే తదుపరి పాలసీ భేటీలో వడ్డీ రేట్ల పెంపు ‘దాదాపు అనివార్యం’గా కనిపిస్తోందని బ్రోకరేజి దిగ్గజం ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ తాజా నివేదికలో పేర్కొంది. ఒకవేళ క్రూడ్ రేటు 100 డాలర్ల పైనే కొనసాగితే (ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ 110 డాలర్ల వద్ద ట్రేడవుతోంది) పాలసీ భేటీతో సంబంధం లేకుండా సడన్గా వడ్డీ రేట్ల షాక్కు కూడా అవకాశం ఉందంటోంది. అయితే, ప్రస్తుతానికి ఆర్బీఐ అప్రమత్త ధోరణితోనే వ్యవహరించవచ్చని, రానున్న పాలసీలో సమీక్షలో తక్షణం వడ్డీ రేట్ల పెంపు వంటి కఠిన చర్యలకు దిగే అవకాశం లేదని చాయిస్ వెల్త్ సీఈవో నికుంజ్ సరాఫ్ అభిప్రాయపడ్డారు. రానున్న రెండు మూడు నెలల్లో ద్రవ్యోల్బణం గణాంకాలు, స్థూల ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా చర్యలు ఉంటాయన్నారు. ఇందన సెగకు తోడు ఎల్నినో (వర్షాభావం) రిసు్కల నేపథ్యంలో ద్రవ్యోల్బణం మరింత ఎగబాకడంతో పాటు ఆర్థిక వృద్ధి మందగించే ప్రమాదం ఉందని హెచ్ఎస్బీసీ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ వడ్డీ రేట్లను మరీ తీవ్రంగా పెంచకపోవచ్చని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్వితీయార్ధంలో రెండు విడతల్లో అర శాతం రెపో రేటు పెంపునకు ఆస్కారం ఉందని పేర్కొంది. ధరాఘాతం.. ఎల్నినో ఆజ్యం! వాణిజ్య గ్యాస్ రేట్ల భారీ పెరుగుదలతో ఇప్పటికే ఆహార ధరలకు రెక్కలొచ్చాయి. మరోపక్క, అధిక క్రూడ్ ధరల కారణంగా ముడి వస్తువులు భారంగా మారడంతో ఎఫ్ఎంసీజీ, వాహన, వినియోగ వస్తువులు, ఎల్రక్టానిక్స్ సహా పలు కంపెనీలు రేట్ల పెంపునకు తెరతీశాయి. ఇక తాజాగా పెట్రో పోటు.. ఇంధన ద్రవ్యోల్బణాన్ని మరింత ఎగదోస్తోంది. అన్ని రంగాల్లో రవాణా, ఇన్పుట్ వ్యయాలు పెరగడంతో నిత్యావసర వస్తువులు చుక్కలు చూపిస్తున్నాయి. ఏప్రిల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.48 శాతానికి చేరగా, టోకు ధరల ద్రవ్యోల్బణం భగ్గుమంది. మార్చిలో 3.88 శాతం నుంచి ఏప్రిల్లో ఏకంగా 48 నెలల గరిష్ట స్థాయికి (8.3 శాతం) దూసుకెళ్లింది. రూపాయి పతనం ఇలాగే కొనసాగితే, రాబోయే వారాల్లో విడతల వారీగా మరో రూ.10 పెంపు తప్పకపోవచ్చని అంచనా వేసింది. దీనివల్ల జూన్ నాటికి రిటైల్ ద్రవ్యోల్బణం 4.4 శాతానికి ఎగబాకే రిస్కు ఉందని తెలిపింది. ఇదే జరిగితే ఆర్బీఐ నిర్దేశిత 4 శాతం (2% అటుఇటుగా) పరిమితిని దాటేసే ప్రమాదం ఉంది. ఇదిలా ఉంటే, పులిమీద పుట్రలా ఈ ఏడాది సూపర్ ఎల్నినో ఆందోళనలు వణికిస్తున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో వర్షాలు గనుక సరిగ్గా కురవకపోతే ఆహార ధరలు మరింత భగ్గుమంటాయని హెచ్ఎస్బీసీ హెచ్చరించింది. గృహ రుణంపై ఈఎంఐ ఎంత పెరుగుతుందంటే... గడిచిన ఏడాది కాలంలో గృహ రుణాలపై వడ్డీ రేటు 9.5% గరిష్ట స్థాయి నుంచి 7.5% వరకు దిగొచ్చింది. ఆర్బీఐ గనుక త్వరలో పావు శాతం రెపో రేటును పెంచి, దీన్ని బ్యాంకులు నేరుగా కస్టమర్లకు వర్తింపజేస్తే... హోమ్లోన్ వడ్డీ రేటు కూడా ఎగబాకుతుంది. వడ్డీ రేట్ల పెంపునకు ముందు ఒక వ్యక్తి 20 ఏళ్ల కాలానికి 7.75% వడ్డీ రేటుతో రూ.50 లక్షల రుణం తీసుకుంటే, ఈఎంఐ రూ. 41,047 పడుతుంది. పావు శాతం వడ్డీ రేట్ల పెంపు తర్వాత ఇది రూ.41,822కు పెరుగుతుంది. అంటే, ఒక్కో ఈఎంఐపై రూ.775 అదనంగా చెల్లించాల్సి వస్తుందన్న మాట! ఒకవేళ ఈఎంఐ పెరగకుండా అలాగే కొనసాగిస్తే, రుణ వ్యవధి మరో 8–10 నెలలు పెరుగుతుంది. ఆమేరకు అధిక వడ్డీ కట్టాల్సి ఉంటుంది. -
నేను అడ్వైజర్ కాదు.. పెట్టుబడులు మీ ఇష్టం
పెట్టుబడులకు సంబంధించిన విషయాలతో పాటు.. ఆర్థికపరమైన సమాచారం వెల్లడించే రాబర్ట్ కియోసాకి తొలిసారి ఘాటుగా స్పదించారు. తాను ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదని, ఇతరులకు పెట్టుబడులపై సలహాలు ఇవ్వడం లేదని అన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నేను ఆర్ధిక సలహాదారుని కారు.. అయితే నా పేరును ఉపయోగించి, కొందరు వ్యక్తులు.. నేను చెప్పినట్లు పెట్టుబడులకు సంబంధించిన విషయాలను చెబుతున్నారు. వారికి నా లాయర్ ద్వారా నోటీసులు పంపించాను. నా పేరు వాడి తప్పుడు సమాచారం వ్యాప్తి చేయవద్దని హెచ్చరించాను.I AM NOT A FINANCIAl ADVISORMy attorney has sent a “Cease and Decist” notice to someone or group who is using my name to state investments I recommend.Please be aware I will always share with you what I am investing in and why.I do not recommend anyone invest in what I am…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 19, 2026నేను ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాడో, ఎందుకు పెడుతున్నాడో మాత్రమే చెబుతాను. నేను ఎవరిని ఇక్కడే పెట్టుబడులు పెట్టండి అని ఎప్పుడు చెప్పలేదని కియోసాకి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా తాను బంగారం, వెండి, బిట్కాయిన్, ఏథీరియం వంటి వాటిలో పెట్టుబడులు పెడుతున్నాను అని చెప్పారు. నాకు 401(k), లేదా IRA వంటి రిటైర్మెంట్ సేవింగ్స్ ఖాతాలు లేవని.. స్టాక్స్ లేదా బాండ్స్లో కూడా పెట్టుబడి పెట్టడం లేదని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహానేను ఏం చేస్తున్నానో చెబుతాను. కానీ ఇతరులు వాటిని తప్పకుండా అనుసరించాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యక్తి తన ఆర్థిక నిర్ణయాలను తన ఫైనాన్షియల్ అడ్వైజర్ సహాయంతో తీసుకోవడం మంచిది. కియోసాకి మాటలను బట్టి చూస్తే.. ఎవరుపడితే వారు చెప్పినమాటలు విని పెట్టుబడి పెడితే నష్టపోయే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. -
Vodafone Idea: రూ.లక్ష కోట్లు సమీకరణపై ఆశలు
వచ్చే మూడేళ్లలో అవసరమయ్యే రూ. 1 లక్ష కోట్లను సమకూర్చుకునేందుకు కొత్త రుణాలు, ట్యాక్స్ రిఫండ్లు, ప్రమోటర్ల నుంచి మరిన్ని పెట్టుబడులపై టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐ) భారీగా ఆశలు పెట్టుకుంది. మార్కెట్లో నిలబడే దిశగా నెట్వర్క్ని మెరుగుపర్చుకునేందుకు కంపెనీ దాదాపు రూ. 45,000 కోట్లు వెచ్చించనుంది. అలాగే, వచ్చే మూడేళ్లలో స్పెక్ట్రం చార్జీల కింద సంస్థ రూ. 49,000 కోట్లు, రుణభారానికి సంబంధించిన వడ్డీల కోసం మరో రూ. 5,000-6,000 కోట్లు చెల్లించాల్సి రానుంది.అయితే.. మరింత రుణాన్ని ఈక్విటీ కింద మార్చాల్సిన అవసరం లేకుండానే తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించగలమని వీఐ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ తేజస్ మెహతా తెలిపారు. తాము రూ. 25,000 కోట్ల నిధులతో పాటు మూడేళ్ల వ్యవధిలో రూ. 60,000 కోట్ల వరకు ఎబిటాను సాధించగలమని ఆయన పేర్కొన్నారు. ఇక ట్యాక్స్ రిఫండ్ కింద మరో రూ. 10,000 కోట్లు రావాల్సి ఉంటుందని వివరించారు.కొత్త ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాకేజీలు..పోస్ట్పెయిడ్ కస్టమర్ల కోసం కొత్తగా మరిన్ని ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాకేజీలను ఆవిష్కరించినట్లు వీఐ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అవనీష్ ఖోస్లా తెలిపారు. ఇవి 7 రోజులు, 14 రోజులు, 21 రోజుల కాలవ్యవధితో లభిస్తాయని వివరించారు. దీనితో మొత్తం 1 రోజు నుంచి 30 రోజుల వరకు వేలిడిటీతో 17 రకాల ప్యాక్లను అందిస్తున్నట్లవుతుందన్నారు. -
దిగ్గజ కంపెనీ లేఆఫ్స్.. 8,000 మందిపై ప్రభావం!
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ మాతృ సంస్థ మెటా (Meta) త్వరలో, భారీ స్థాయిలో ఉద్యోగ కోతలు చేపట్టబోతోందని వచ్చిన సమాచారం.. టెక్ ప్రపంచంలో చర్చకు దారితీసింది. ఈసారి కంపెనీ సుమారు 10 శాతం మందిని తొలగించే అవకాశం ఉంది.మెటా కంపెనీ సుమారు 8,000 మంది ఉద్యోగులను తొలగించనుంది. 2025 చివరి నాటికి సంస్థలో పనిచేసేవారి సంఖ్య సుమారు 78,000గా ఉండేది. దీన్నిబట్టి చూస్తే లేఆఫ్స్ ప్రభావం సుమారు 10 శాతం ఉద్యోగులపై పడుతుందని స్పష్టమవుతోంది. ఇదే సమయంలో కొత్త నియామకాలను కూడా నిలిపివేస్తున్నట్లు సమాచారం. దీనికి ప్రధాన కారణం.. ఖర్చులు తగ్గించడమే కాకుండా, కంపెనీని కొత్త దిశగా మలచడానికి తీసుకుంటున్న నిర్ణయాలు అని తెలుస్తోంది.మెటా ఇప్పుడు తన సంస్థ నిర్మాణాన్ని పూర్తిగా మార్చుకోవడంలో భాగంగా.. పెద్ద పెద్ద టీమ్లకు బదులుగా చిన్న, వేగంగా పనిచేసే టీమ్లను ఏర్పాటు చేయాలని చూస్తోంది. కంపెనీ ఇప్పుడు పూర్తిగా ఏఐ కేంద్రంగా మారుతోంది. సంస్థ భవిష్యత్ పెట్టుబడుల్లో భారీ భాగాన్ని ఏఐ డేటా సెంటర్లు, చిప్లు, మోడల్ ట్రైనింగ్ వంటి రంగాల్లో పెట్టనున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: అమెరికాలో ఏఐపై పెరుగుతున్న వ్యతిరేకత!కంపెనీ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా.. ఉద్యోగుల తొలగింపు మాత్రమే కాదు, 7000 మంది కొత్త ఏఐ ఆధారిత ప్రాజెక్ట్ల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ మార్పులు ఉద్యోగుల్లో అసంతృప్తిని కూడా పెంచుతున్నాయి. దీంతో కంపెనీ అంతర్గత వాతావరణం కొంత ఒత్తిడిగా మారిందని నివేదికలు చెబుతున్నాయి. కొత్తగా ప్రవేశపెట్టిన కొన్ని AI టూల్స్ ఉద్యోగుల పనిని ట్రాక్ చేస్తాయన్న భయం కూడా ఉంది. కంపెనీ మాత్రం వాటిని కేవలం AI శిక్షణ కోసం మాత్రమే ఉపయోగిస్తున్నామని వివరణ ఇస్తోంది. -
పెరిగిన వంట నూనె ధరలు.. కారణం ఇదే!
వంటనూనెల దిగుమతులు 2025–26 నూనెల సీజన్లో (నవంబర్–ఏప్రిల్) 13 శాతం పెరిగి 7.94 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. ముఖ్యంగా పామాయిల్ దిగుమతులు భారీగా పెరిగినట్టు సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్ఈఏ) ప్రకటించింది. అంతక్రితం సంవత్సరం ఇదే కాలంలో దిగుతులు 7.04 మిలియన్ టన్నులుగా ఉన్నాయి.విలువ పరంగా చూస్తే రూ.73,000 కోట్ల నుంచి రూ.87,000 కోట్లకు చేరాయి. మొత్తం నూనెల దిగుమతుల్లో వంటనూనెలు 7.82 మిలియన్ టన్నులుగా ఉంటే, 1,21,000 టన్నులు నాన్ ఎడిబుల్ నూనెలు ఉన్నాయి. పామాయిల్ దిగుమతులు దాదాపు రెట్టింపై 3.97 మిలియన్ టన్నులకు చేరాయి. సోయాబీన్, సన్ఫ్లవర్ నూనెల దిగుమతులు 3.85 మిలియన్ టన్నులకు తగ్గాయి.పామాయిల్ ధరలు 14–15 శాతం, సోయాబీన్, సన్ఫ్లవర్ నూనెల ధరలు 17–22 శాతం మేర పెరిగాయి. ముఖ్యంగా డాలర్తో రూపాయి విలువ పడిపోవడంతో దిగుమతి ఖర్చులు భారీగా పెరిగాయి. మే చివరికి దేశంలో మొత్తం నూనె నిల్వలు 2.12 మిలియన్ టన్నులకు చేరాయి. -
కార్ల కొనుగోలుదారులపై డబుల్ ఇంపాక్ట్
సొంత కారు కొనానుకునే మధ్యతరగతి వినియోగదారుడిపై త్వరలోనే డబుల్ ఇంపాక్ట్ పడబోతోంది. వాహనంలో ఎలాంటి సాంకేతిక మార్పులు చేయకపోయినా.. పేపర్పై కనిపించే మైలేజీ (లేదా రేంజ్) గణనీయంగా తగ్గిపోనుంది. అదే సమయంలో కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. భారత ఆటోమొబైల్ రంగంలో అత్యంత కీలకమైన మార్పునకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.ప్రస్తుతం దేశంలో వాడుకలో ఉన్న ‘మాడిఫైడ్ ఇండియన్ డ్రైవింగ్ సైకిల్’(ఎంఐడీసీ) స్థానంలో మరింత కఠినమైన అంతర్జాతీయ ప్రమాణాల గుర్తింపు పొందిన ‘వరల్డ్వైడ్ హార్మోనైజ్డ్ లైట్ వెహికల్స్ టెస్ట్ ప్రొసీజర్’ (డబ్ల్యూఎల్టీపీ) విధానాన్ని 2027 ఏప్రిల్ 1 నుంచి ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీనికి తోడు, ఇంధన సామర్థ్యాన్ని మరింత కఠినతరం చేసే కేఫే-3 (కార్పొరేట్ యావరేజ్ ఫ్యుయెల్ ఎకానమీ) నిబంధనలను కూడా ప్రభుత్వం అదే సమయంలో అమలు చేయనుంది. ఈ జంట నిర్ణయాల వల్ల పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వాహనాల సర్టిఫైడ్ సామర్థ్యం ఏకంగా 10 నుంచి 20 శాతం వరకు పడిపోనుంది.మైలేజీ లెక్కలు ఎలా మారనున్నాయంటే?పరిశ్రమ నిపుణుల ప్రకారం.. ఈ కొత్త టెస్టింగ్ విధానం వల్ల వాహనాల నిజమైన సామర్థ్యం ఏమీ తగ్గిపోదు. ప్రస్తుత టెస్టింగ్ విధానం కంటే డబ్ల్యూఎల్టీపీ విధానం రోడ్డుపై వాహనం నడిపే నిజమైన (రియల్ వరల్డ్) పరిస్థితులకు అత్యంత దగ్గరగా ఉంటుంది. ఫలితంగా సర్టిఫైడ్ మైలేజీ గణాంకాలు మారుతాయి.పెట్రోల్ కార్లు: ప్రస్తుతం లీటరుకు 25 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే పెట్రోల్ కారు కొత్త ప్రమాణాల ప్రకారం 21 నుంచి 22 కిలోమీటర్లకు పరిమితం కానుంది.ఎలక్ట్రిక్ వాహనాలు: ఒకసారి చార్జ్ చేస్తే 500 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీలు చెబుతున్న ఈవీల రేంజ్.. కొత్త నిబంధనల ప్రకారం 430 - 450 కిలోమీటర్లకు పడిపోనుంది. ‘వాహనం మోడల్, దాని కాన్ఫిగరేషన్ను బట్టి అధికారిక ఇంధన సామర్థ్య గణాంకాలు 10 నుంచి 20 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది’ అని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ క్లీన్ ట్రాన్స్పోర్టేషన్(ఐసీసీటీ) ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ భట్ అన్నారు.ఆటోమొబైల్ సంస్థల ముందు జంట సవాళ్లుఒకేసారి కేఫే-3, డబ్ల్యూఎల్టీపీ నియమాలను తీసుకురావడం వాహన తయారీదారులకు సవాలుగా మారనుంది.కేఫే-3 నిబంధన: కంపెనీలు విక్రయించే మొత్తం వాహనాల సగటు కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల పరిమితిని ఇది మరింత తగ్గిస్తుంది.డబ్ల్యూఎల్టీపీ విధానం: ఉద్గారాలను లెక్కించే పద్ధతినే ఇది పూర్తిగా మార్చేస్తుంది. ల్యాబ్లలో కాకుండా.. గరిష్ట వేగం, వేగవంతమైన యాక్సిలరేషన్, నిజమైన రోడ్డు పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఉద్గారాలను లెక్కిస్తారు. దీనివల్ల కేఫే-3 లక్ష్యాలను అందుకోవడం కంపెనీలకు మరింత భారంగా మారుతుంది.ఏయే కార్ల ధర ఎంత పెరగొచ్చు?కొత్త ఉద్గారాల నిబంధనలను అందుకోవడానికి కార్ల కంపెనీలు అధునాతన సాంకేతికతను జోడించాల్సి ఉంటుంది. ఫలితంగా వాహనాల తయారీ వ్యయం పెరిగి ఆ భారం వినియోగదారుడిపై పడనుంది.కార్ల విభాగంఆవశ్యక సాంకేతిక మార్పులుపెరగనున్న అంచనా ధర (రూపాయల్లో)ఎంట్రీ-లెవల్ చిన్న కార్లుఅప్గ్రేడెడ్ ఇంజిన్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్, కొత్త ఫ్యూయల్ ఇంజెక్టర్లు, సెన్సార్లు30,000 - 50,000ప్రీమియం హాచ్బ్యాక్, కాంపాక్ట్ ఎస్యూవీగ్యాసోలిన్ పార్టిక్యులేట్ ఫిల్టర్లు, క్యాటలిటిక్ కన్వర్టర్లు, మైల్డ్-హైబ్రిడ్ వ్యవస్థలు40,000 - 1,00,000పెద్ద ఎస్యూవీ, ఎంపీవీభారీ సాంకేతిక మార్పులు, అధునాతన ఉద్గార నియంత్రణ వ్యవస్థలు1,20,000 - 2,00,000‘డబ్ల్యూఎల్టీపీ విధానం వల్ల అధికారిక మైలేజీ గణాంకాలు తగ్గి ఉద్గారాల నమోదు పెరుగుతుంది. దీనివల్ల కేఫే-3 నిబంధనలను పాటించడం కంపెనీలకు మరింత వ్యయప్రయాసలతో కూడుకున్న పనిగా మారుతుంది’ అని మొబిలిటీ, ఎనర్జీ ట్రాన్సిషన్ నిపుణుడు రణ్ధీర్ సింగ్ విశ్లేషించారు. -
అమెరికాలో ఏఐపై పెరుగుతున్న వ్యతిరేకత!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో అమెరికా ముందంజలో ఉంది. అయితే.. ఇక్కడి యువతలో ఏఐ పట్ల వ్యతిరేక భావనలు పెరుగుతున్నాయి. ఇది విచిత్రమైన పరిస్థితిలా కనిపించినప్పటికీ.. దీని వెనుక ఆర్థిక, సామాజిక, రాజకీయ కారణాలు ఉన్నాయి. ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే.. కేవలం AI గురించే కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న దీర్ఘకాలిక మార్పులను కూడా పరిశీలించాలి.ఏఐ మీద వ్యతిరేఖ భావన ఏర్పడటానికి ప్రధాన కారణం.. కృత్రిమ మేధ వల్ల కంపెనీలు ఉద్యోగాల కోత. చాలా సంస్థలు ఏఐ టెక్నాలజీ కోసం ఉద్యోగాలు తగ్గిస్తున్నట్లు ప్రకటనలు కూడా చేశాయి. నిజానికి కంపెనీలు కూడా ఖర్చులు, ఆర్థిక మందగమనం, మార్కెట్ ఒత్తిడులు వంటివి ఎదుర్కొంటున్నాయి.AI కారణం అందుకే..సంస్థలు AIని కారణంగా చూపడం.. వాటికి రెండు విధాలుగా ఉపయోగపడుతోంది. ఒకటి.. ఉద్యోగాల కోతలను సమర్థించుకోవచ్చు. రెండోది.. మేము భవిష్యత్ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్నాం.. అనే ఇమేజ్ పొందవచ్చు. దీంతో సాధారణ ప్రజల్లో ఏఐ అంటే ఉద్యోగాలను తీసేసే యంత్రం అనే భయం పెరుగుతోంది.ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే.. 2008-09 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అస్థిరత పెరిగింది. అప్పటి నుంచి ధనిక-పేద అంతరం, అప్పుల భారం, ఉద్యోగ భద్రతలేమి వంటి సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. టెక్నాలజీ రంగం మాత్రమే వృద్ధి చెందుతున్నప్పటికీ, ఆ వృద్ధి సమాజంలోని అందరికీ సమానంగా ప్రయోజనం కలిగించలేదు.టెక్నాలజీ విప్లవంఒకప్పుడు స్మార్ట్ఫోన్ విప్లవం, ముఖ్యంగా ఐఫోన్ వచ్చిన తర్వాత మొబైల్ రంగం ప్రపంచాన్ని మార్చేసింది. కానీ ఆ టెక్నాలజీ విప్లవం కూడా ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని అడ్డుకోలేకపోయింది. అదే విధంగా AI కూడా అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. AI ఉత్పాదకతను పెంచగలదు, కొత్త సేవలను సృష్టించగలదు. కానీ.. ప్రపంచ ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం, రాజకీయ విభజనలు వంటి లోతైన సమస్యలను అది ఒక్కటే పరిష్కరించలేదు.How is it that in the US, the AI leader, a good part of the population, even a lot of college students, have come to hate AI? It does not help that companies are blaming job losses on AI, which is both convenient and as an added bonus, makes a company look visionary.The layoffs…— Sridhar Vembu (@svembu) May 19, 2026మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ప్రపంచం, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన ఆర్థిక, రాజకీయ వ్యవస్థలనే అనుసరిస్తోంది. అమెరికా ఆధిపత్యం, గ్లోబల్ ట్రేడ్, డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వంటివి దశాబ్దాలుగా ప్రపంచాన్ని నడిపించాయి. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థ క్రమంగా బలహీనపడుతోంది. చైనా ఎదుగుదల, యుద్ధాలు, సరఫరా గొలుసు సమస్యలు, ఇంధన సంక్షోభాలు వంటివన్నీ కలిసి ప్రపంచాన్ని కొత్త దిశలోకి నెడుతున్నాయి.మార్పునకు అవకాశంచరిత్రను పరిశీలిస్తే.. ప్రతి టెక్నాలజీ విప్లవం మొదట్లో భయాలను సృష్టించింది. పరిశ్రమల విప్లవం సమయంలో కూడా యంత్రాలు ఉద్యోగాలను నాశనం చేస్తాయని భావించారు. కానీ తరువాత కొత్త రంగాలు, కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. AI విషయంలో కూడా అదే జరగవచ్చు. ముఖ్యంగా ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పరిశోధన రంగాల్లో AI భారీ మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంది అనేది వాస్తవం.ఇదీ చదవండి: భారత్ vs అమెరికా: ఇదీ.. వర్క్ కల్చర్లో తేడా! -
హైదరాబాద్లో ఐసాల్వ్డ్ విస్తరణ
సాక్షి, హైదరాబాద్: మానవ వనరుల నిర్వహణ రంగంలో ప్రసిద్ధి చెందిన అమెరికన్ కంపెనీ ‘ఐసాల్వ్డ్’ హైదరాబాద్లో తన కార్యకలాపాలను భారీగా విస్తరించింది. సుమారు 400 మంది ఉద్యోగులకు అవసరమైన కేంద్రాన్ని మంగళవారం ఆవిష్కరించింది. అమెరికాలో రెండు లక్షల సంస్థలకు చెందిన సుమారు 90 లక్షల మంది ఉద్యోగుల వ్యవహారాలు చూసే ఐసాల్వ్డ్ ఇకపై హైదరాబాద్ కేంద్రంగా సరికొత్త టెక్నాలజీల ఆవిష్కరణ చేపట్టనుంది.కంపెనీ ప్రధాన సాఫ్ట్వేర్ ఉత్పత్తి ‘పీపుల్స్ క్లౌడ్’ ఆధునికీకరణ మొదలుకొని ‘బెట్టర్ బెనిఫిట్స్’, ‘మార్కెట్ప్లేస్’ల నిర్వహణ, కస్టమర్ సపోర్ట్ వ్యవహారాలను ఇండియా కేంద్రం నుంచి నిర్వహించనున్నామని కంపెనీ జనరల్ మేనేజర్ యోగేశ్ మోరె తెలిపారు. కంపెనీ ఆపరేషన్స్లో కృత్రిమ మేధ కూడా కీలకపాత్ర పోషిస్తోందని ఆయన చెప్పారు. హెచ్ఆర్ వ్యవహారాలకు సంబంధించిన మెయిళ్లను చదివి ఆయా సమస్యల పరిష్కారానికి ఏఐ ఒక పద్ధతిని సూచిస్తే... వాటిని ఇంజినీర్లు పరిశీలించి ఓకే చేస్తారని, తద్వారా సంక్లిష్టమైన వ్యవహారాలను కూడా సులువుగా చక్కబెట్ట వచ్చునని ఆయన వివరించారు. ఐసాల్వ్డ్ ఏడాదికి 22 - 25 సీఏజీఆర్తో వృద్ధి చెందుతోందని తెలిపారు.అంతకు ముందు తెలంగాణ ప్రభుత్వ స్పీడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సెల్ ప్రోగ్రామ్ డైరెక్టర్ వల్లభి ‘ఐసాల్వ్డ్’ కార్యాలయాన్ని రిబ్బన్ కత్తిరించి ఆవిష్కరించారు. ఐసాల్వ్డ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రగ్యా గుప్తా, చీఫ్ పీపుల్ ఆఫీసర్ అఈమ మోషేర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వల్లభి మాట్లాడుతూ ఐసాల్వ్డ్లో 65 శాతం జెండర్ డైవర్సిటీ ఉండటం తన దృష్టిని ఆకర్శించిందని తెలిపారు. కంపెనీల్లో ఈ స్థాయి జెండర్ డైవర్సిటీ ఉంటం చాలా అరుదని అన్నారు. ఐసాల్వ్డ్ సంస్థ అమెరికా తరువాత అతిపెద్ద కార్యాలయ ఏర్పాటుకు హైదరాబాద్ను ఎంచుకోవడం సంతోషకరమైన విషయమని అన్నారు.హైదరాబాద్ అంతర్జాతీయ సంస్థల జీసీసీ కేంద్రంగా వేగంగా ఎదుగుతోందని, ఇంజినీరింగ్తోపాటు కృత్రిమ మేధ రంగంలోనూ హైదరాబాద్ను గ్లోబల్ కేపిటల్గా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వివరించారు. తగిన మౌలిక సదుపాయాలు, పాలన అందించడం, బిజినెస్కు తగ్గ వాతావరణాన్ని అభివృద్ధి చేసిన నేపథ్యంలో ఐసాల్వ్డ్ లక్ష్యాలు కూడా నెరవేరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: అంకెల్లో పెరిగినా.. చేతిలో సున్నా! -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
మంగళవారం ఉదయం లాభాల బాటపట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 114.19 పాయింట్ల (0.15 శాతం నష్టం) నష్టంతో 75,200.85 వద్ద, నిఫ్టీ 31.95 పాయింట్ల నష్టంతో (0.14 శాతం నష్టం) 23,618.00 వద్ద నిలిచాయి.డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, స్టాలియన్ ఇండియా ఫ్లోరోకెమికల్స్ లిమిటెడ్, రిషబ్ ఇన్స్ట్రుమెంట్స్ లిమిటెడ్, ఆటోలైన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, కిర్లోస్కర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. డిజిటైడ్ సొల్యూషన్స్ లిమిటెడ్, రామ ఫాస్ఫేట్స్ లిమిటెడ్, యునైటెడ్ ఫుడ్బ్రాండ్స్ లిమిటెడ్, డైమైన్స్ & కెమికల్స్ లిమిటెడ్, నియోజెన్ కెమికల్స్ లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
సరికొత్త ఎలక్ట్రిక్ బైక్.. 15 రోజుల్లో 25వేల బుకింగ్స్!
ఓబెన్ ఎలక్ట్రిక్ ఇటీవల దేశీయ మార్కెట్లో లాంచ్ చేసిన 'ఓబెన్ రోర్ ఈవో' కేవలం 15 రోజుల్లో 25వేల బుకింగ్స్ సొంతం చేసుకుంది. కంపెనీ మొదటి వెయ్యిమంది కస్టమర్లకు మాత్రమే రూ.99,999 వద్ద ఈ బైకును విక్రయించింది. ఈ తరువాత దీని ధరను 1,24,999 (ఎక్స్-షోరూమ్) రూపాయలకు పెంచింది. డెలివరీలు జూన్ నెలలో ప్రారంభం కానున్నాయి.రోర్ ఈవో బైక్ 3.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది 180 కి.మీ రేంజ్ అందిస్తుంది. కేవలం మూడు సెకన్లలో 0 నుంచి 400 కిమీ వరకు వేగవంతం అయ్యే ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 110 కిమీ. కంపెనీ ఎనిమిదేళ్ల బ్యాటరీ వారంటీని అందిస్తుంది.ఓబెన్ రోర్ ఈవోలో 'ఫాల్ అలర్ట్ విత్ ఎమర్జెన్సీ అసిస్ట్' అనే ఫీచర్ ఉంది. ఇది వాహనం కింద పడటాన్ని గుర్తించి, ఓబెన్ యాప్ ద్వారా హెచ్చరికలను జారీ చేస్తుంది. అవసరమైతే ఎమర్జెన్సీ కాంటాక్ట్లకు తెలియజేస్తుంది. అదనపు భద్రతా ఫీచర్లలో.. యూనిఫైడ్ బ్రేక్ అసిస్ట్ (UBA), డ్రైవర్ అలర్ట్ సిస్టమ్ (DAS), సెక్యూర్ ఛార్జ్, మరియు మెరుగైన స్థిరత్వం కోసం వెడల్పాటి వెనుక టైరు ఉన్నాయి.ఈ బైకులో 5 అంగుళాల కలర్ TFT డిస్ప్లే ఉంది. ఇది నావిగేషన్, రైడ్ డేటా, కాల్, టెక్స్ట్, మ్యూజిక్ కోసం స్మార్ట్ అలర్ట్లను అందిస్తుంది. ఈ బైక్ పొడవైన సీటును కలిగి ఉండటం వల్ల.. రైడర్, పిలియన్ ఇద్దరూ మంచి రైడింగ్ అనుభూతిని పొందుతారు. సీటు కింద, సీటు అండర్-సీట్ స్టోరేజ్, ట్యాంక్ పాడ్ స్టోరేజ్తో పాటు డ్యూయల్ USB ఛార్జింగ్ పోర్ట్లతో కలిపి మొత్తం 10 లీటర్ల స్టోరేజ్ లభిస్తుంది.25,000 bookings in just 15 days. And we’re only getting started.The Rorr EVO isn’t following the future of riding, it’s leading it.25,000 riders have already made the switch to power, precision, and pure electric performance.The movement is growing. Are you riding in?🔗… pic.twitter.com/sKWIC03eqf— Oben Electric (@ObenElectric) May 18, 2026 -
భారీగా పెరిగిన వెండి ఆభరణ ఎగుమతులు!
రత్నాభరణాల ఎగుమతుల రంగం ఏప్రిల్లో ప్రతికూలతలను చవిచూసింది. పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులతో ఎగుమతులు ఢీలా పడ్డాయి. క్రితం ఏడాది ఏప్రిల్తో పోల్చి చూసినప్పుడు ఎగుమతులు 9 శాతం తగ్గి 2,226 మిలియన్ డాలర్లకు (రూ.20,825 కోట్లు సుమారు) పరిమితమయ్యాయి. ఈ వివరాలను రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) వెల్లడించింది. క్రితం ఏడాది ఏప్రిల్లో ఎగుమతులు 2,448 మిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. ఏప్రిల్లో కట్, పాలిష్డ్ వజ్రాల ఎగుమతులు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 19.65 శాతం తగ్గి 890.91 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి.ల్యాబ్లో తయారు చేసిన వజ్రాల ఎగుమతులు సైతం 15 శాతానికి పైనే క్షీణించి 93.28 మిలియన్ డాలర్లకు చేరాయి.బంగారం ఆభరణాల ఎగుమతులు ఏకంగా 21.77 శాతం తగ్గి 841.54 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. సాధారణ బంగారం ఆభరణాల ఎగుమతులు 342 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఏప్రిల్తో పోల్చితే 47 శాతం తక్కువ. స్టడెడ్ (రాళ్లు పొదిగిన) బంగారం ఆభరణాల ఎగుమతులు మాత్రం 16 శాతం వృద్ధి చెంది 500 మిలియన్ డాలర్లకు చేరాయి. ఇక వెండి ఆభరణాల ఎగుమతులు ఏకంగా 444 శాతం ఎగసి 268 మిలియన్ డాలర్లకు చేరాయి. క్రితం ఏడాది ఇదే నెలలో వీటి ఎగుమతులు 49 మిలియన్ డాలర్లుగానే ఉండడం గమనార్హం. -
ఫోన్పే, గూగుల్పే తరహాలో 'వియోనా పే'
డిజిటల్ పేమెంట్స్, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ వ్యవస్థను మరింత విసృ్తతం చేసేందుకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఫిన్టెక్ కంపెనీ వియోనా (VIYONA) సిద్ధమైంది. ఫోన్పే, గూగుల్ పే మాదిరిగా ఇంకో సంస్థ డిజిటల్ పేమెంట్స్ నిర్వహిస్తుందన్నమాట. వియోనా ఇందుకు తగ్గట్టుగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సర్టిఫికెట్ను సంపాదించింది. ఫలితంగా యూపీఐ పేమెంట్స్ జారీ చేసేందుకు, ఐఎంపీఎస్ ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ను చేసేందుకు వీలేర్పడుతుంది. అలాగే బ్యాంకుల మధ్య డిజిటల్ లావేదేవీలకూ వియోన వేదిక కానుంది.బ్యాంకింగ్, పేమెంట్స్కు సంబంధించిన విషయాల్లో వియోనా రెండేళ్లుగా విస్తరిస్తూ వస్తోంది. కలెక్షన్స్తోపాటు చెల్లింపులు, చెల్లింపుల ప్రక్రియలను వివిధ బ్యాంకుల మధ్య ఇంటిగ్రేషన్ సాధించడం దీనికి కారణం. తాజాగా ఎన్పీసీఐ సర్టిఫికేషన్ రావడంతో సంస్థ వ్యాపారులను సంపాదించుకోవడం మరింత సులువైంది.యూపీఐ పేమెంట్స్ స్వీకరణ, చెల్లింపుల సామర్థ్యం పొందిన నేపథ్యంలో సంస్థ కార్యకలాపాలు విస్తరించనున్నాయి. ‘‘ఐఎంపీఎస్తోపాటు బ్యాంకుల మధ్య లావాదేవీలు కూడా సాధ్యమవుతూండటం వల్ల రియల్ టైమ్ ఫండ్ ట్రాన్స్ఫర్లు, మర్చెంట్ సెటిల్మెంట్ వ్యవస్థలను ఏర్పాటు చేయగలం. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సౌకర్యాలు అందించగలం’’ అని సంస్థ ఛైర్మన్ యార్లగడ్డ రవీంద్రనాథ్ తెలిపారు. ‘‘వియోనా పే’’ ద్వారా డిజిటల్ చెల్లింపులను మరిన్ని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించగలమని చెప్పారు. వ్యాపారులకు డబ్బులు చెల్లించడం మొదలుకొని గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ పేమెంట్స్ను స్వీకరించే మౌలిక సదుపాయాల కల్పన వరకూ ఆరు రకాల సేవలను త్వరలోనే అందించేందుకు కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది.అంతేకాకుండా.... కనెక్టెడ్ బ్యాంకింగ్, డిజిటల్ ఆన్బోర్డింగ్ సిస్టమ్ల కోసం కూడా కొన్ని కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే వియోనా పే ప్లాట్ఫార్మ్పై వంద మంది భాగస్వాములు ఉన్నారు. అలాగే వెయ్యికిపై విద్యా సంస్థలకు ఉపయోగపడేలా వియోనా ఫిన్టెక్ ‘క్యాంపస్ ప్రో’ పేరుతో ఒక ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ను రూపొందించింది. ‘‘గ్రామ్ పే’’ ద్వారా సుమారు ఐదు వేల మంది వ్యాపారులను డిజిటల్ పేమెంట్ల క్షేత్రంలోకి తీసుకురాగలిగామని సంస్థ తెలిపింది.


