Anakapalle
-
వేసవి తాపానికి కార్యాచరణ
డాబాగార్డెన్స్ (విశాఖ): జీవీఎంసీ అన్ని జోన్ల పరిధిలో 198 చలివేంద్రాలు, 52 గ్రీన్ షెల్టర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని జీవీఎంసీ అదనపు కమిషనర్ పి.నల్లనయ్య తెలిపారు. బుధవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో హీట్ వేవ్స్ యాక్షన్ ప్లాన్పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి దృష్ట్యా జీవీఎంసీ పరిధిలో ఏర్పాటు చేయనున్న చలివేంద్రాల్లో తాగునీటితో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లను ప్రజలకు అందివ్వనున్నట్లు తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి జీవీఎంసీ యంత్రాంగాన్ని సంప్రదిస్తే చలివేంద్రం ఏర్పాటుకు సహకరిస్తామని, ఆ కేంద్రాల్లో మజ్జిగ పంపిణీ చేయాలని సూచించారు. పారిశుధ్య కార్మికులు ఉదయం 5.30 నుంచి 10.30 వరకు, తిరిగి సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టామని, భవన యజమానులు భవన నిర్మాణ కార్మికులకు వారు పనిచేసిన చోట చల్లని తాగునీరు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు. పక్షులు, పశువుల రక్షణ దిశగా నీటి తొట్లను ఏర్పాటు చేసేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రస్తుతం జలాశయాల్లో జూలై వరకు సరిపడినంత నీరు సమృద్ధిగా ఉందని పర్యవేక్షక ఇంజనీర్ ఏడుకొండలు తెలిపారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్లు, సహాయక వైద్యాధికారులు, నీటి సరఫరా విభాగం ఇంజనీర్లు, జేఆర్ నగర్ నివాసిత సంక్షేమ సంఘం ప్రతినిధి కేఎస్ఆర్ మూర్తి, స్వచ్ఛ విశాఖ అంబాసిడర్ డీఎస్ ఆనంద్, గ్రీన్ క్లైమేట్ ఆర్గనైజేషన్ ప్రతినిధి జేవీ రత్నం తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
సింహాచలం: చందనోత్సవం సందర్భంగా భక్తులకు సేవలందించే స్వచ్ఛంద సంస్థలకు సింహాచలం దేవస్థానం ఈవో జె.వెంకటరావు, పోలీసులు, జీవీఎంసీ హెల్త్ విభాగం అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. దేవస్థానం పరిపాలన కార్యాలయంలో బుధవారం స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో జె.వెంకటరావు మాట్లాడుతూ.. క్యూల్లో భక్తులకు ఆహార పదార్థాలు, పానీయాలు పంపిణీ చేసేటప్పుడు క్యూలను స్తంభింపజేయకూడదని స్పష్టం చేశారు. ఆహార పదార్థాలు పంపిణీ చేసే ప్రాంతంలో పారిశుధ్య బాధ్యత సంబంధిత సంస్థదేనని.. ఏమాత్రం చెత్త పేరుకుపోయినా వెంటనే తొలగించాలని ఆదేశించారు. పారిశుధ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సదరు సంస్థలను అక్కడి నుంచి పంపించివేస్తామన్నారు. చందనోత్సవం ప్రసాదాల పేరుతో కొన్ని సంస్థలు బయట చందాలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో హెచ్చరించారు. ఫుడ్ సేఫ్టీ అధికారి చక్రవర్తి మాట్లాడుతూ.. భక్తులకు అందించే ఆహారం నాణ్యంగా, వేడిగా ఉండాలని, ఫుడ్ పాయిజన్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వలంటీర్లు తప్పనిసరిగా చేతి గ్లౌజులు ధరించాలన్నారు. జీవీఎంసీ అధికారి రాజారావు కుమార్ మాట్లాడుతూ.. ఆహార పంపిణీలో ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలని, కేవలం పర్యావరణహిత వస్తువులనే వినియోగించాలని తెలిపారు. గోపాలపట్నం సీఐ సన్యాసినాయుడు మాట్లాడుతూ.. అనుమతి పొందిన సంస్థల ప్రతినిధులను మాత్రమే జాబితా ప్రకారం స్టాళ్ల వద్దకు అనుమతిస్తామని, వాహన పాసులను కూడా రికార్డులు పరిశీలించిన తర్వాతే జారీ చేస్తామని వెల్లడించారు. సమావేశంలో అడవివరం ఆరోగ్య కేంద్రం డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ రామిరెడ్డి, దేవస్థానం ఎస్డీసీ మధులత, సూపరింటెండెంట్ నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. -
రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలి
అరకులోయ టౌన్: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు రేగం చాణక్య డిమాండ్ చేశారు. మహిళల మనోభావాలు దెబ్బతీసేలా, వారిని కించపరిచేలా ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన కథనాలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా వ్యతిరేక కథనాలపై నిరసన బుధవారం అరకులోయ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వైఎస్సార్సీపీ నాయకులు భారీ నిరసన చేపట్టారు. రాధాకృష్ణ ప్రసారం చేసిన కథనాలు మహిళలను అవమానించేలా ఉన్నాయని మండిపడుతూ, ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రతులను దహనం చేశారు. తన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకుని మహిళా లోకానికి ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అవి కొత్త పలుకులు కాదు.. చెత్త పలుకులు! ఈ సందర్భంగా రేగం చాణక్య మాట్లాడుతూ.. రాధాకృష్ణ చెప్పేవి ‘కొత్త పలుకులు’ కావని, అవి ‘చెత్త పలుకులు’ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మహిళలను ఎవరు దూషించినా కఠిన చర్యలు తీసుకుంటామని గొప్పలు చెప్పే మంత్రి నారా లోకేష్, హోం మంత్రి అనిత.. రాధాకృష్ణ వ్యవహారంలో ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని వీడి, తక్షణమే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్ కుమార్, అరకులోయ, డుంబ్రిగుడ మండల పార్టీ అధ్యక్షులు రామ్మూర్తి, పాంగి పరశురాం, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాంగి నాగేశ్వరరావు, మండల యువజన విభాగం అధ్యక్షుడు బోయి కిరణ్ కుమార్, మండల కార్యదర్శి గుంజిడి ప్రసాద్, సుంకరమెట్ట గ్రామ కమిటీ అధ్యక్షుడు కొర్రా అర్జున్ పాల్గొన్నారు. -
మహిళలను కించపరిస్తే సహించం
పాడేరు: మహిళా లోకాన్ని కించపరుస్తూ, సభ్య సమాజం తలదించుకునేలా ‘కొత్త పలుకులు’ పేరిట ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారని వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మండిపడ్డారు. రాధాకృష్ణ తక్షణమే మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలంతా ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆమె హెచ్చరించారు. బుధవారం పాడేరులోని తన నివాసంలో పార్టీ మహిళా నాయకులతో కలిసి ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ..రాధాకృష్ణ జర్నలిజం ముసుగులో బ్రోకరిజం చేస్తున్నారని, కేవలం చంద్రబాబు నాయుడి మెప్పు కోసమే వైఎస్సార్సీపీ మహిళా నాయకురాళ్లను ఉద్దేశించి నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. 70 ఏళ్లు పైబడిన వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించడం సరికాదన్నారు. గతంలో సాక్షి కార్యాలయంపై టీడీపీ నాయకులు దాడి చేసినప్పుడు గుర్తుకు రాని రాజ్యాంగ విలువలు, ఇప్పుడు వైఎస్సార్సీపీ శ్రేణులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే గుర్తుకు వస్తున్నాయా? అని ఆమె ప్రశ్నించారు. తమ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించిన ‘మావిగన్’ (విశాఖ–విజయవాడ–గుంటూరు కారిడార్) అంశంపై ప్రజల్లో చర్చ జరుగుతోందని, కేవలం రూ. 20 వేల కోట్లతో 110 కిలోమీటర్ల మేర రాజధానిని అభివృద్ధి చేసే అవకాశం ఉన్నప్పటికీ, గత ప్రభుత్వం రూ. 2 లక్షల కోట్లతో అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ఈ చర్చను పక్కదారి పట్టించేందుకే మహిళలపై వ్యక్తిత్వ హననానికి దిగుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. అనంతరం రాధాకృష్ణ వైఖరికి వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షురాలు కిల్లో ఊర్వశిరాణి, ఎంపీటీసీ సభ్యురాలు గిడ్డి విజయలక్ష్మి, జిల్లా వ్యవసాయ సలహా మండలి మాజీ చైర్పర్సన్ ఎం. సరస్వతి, మాజీ పీఏసీఎస్ అధ్యక్షురాలు లకే రామసత్యవతి తదితరులు పాల్గొన్నారు. -
ఈఎస్ఐసీ జాయింట్ డైరెక్టర్గా రవికుమార్
సీతంపేట (విశాఖ) : కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) విశాఖపట్న ం ఉప ప్రాంతీయ కార్యాలయం జాయింట్ డైరెక్టర్ గా కె.ఆర్.రవికుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కోయంబత్తూరు ఉప ప్రాంతీయ కార్యాలయం నుంచి ఆయన విశాఖకు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖపట్నం ఉప ప్రాంతీయ కార్యాలయం పరిధిలో 2025 మార్చి 31 నాటికి 18,705 మంది యజమానుల వద్ద మొత్తం 15,03,306 మంది లబ్ధిదారులు ఈ పథకం కింద ఉన్నట్లు వెల్లడించారు. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలు ఈ విశాఖ ఉప ప్రాంతీయ కార్యాలయ పరిధిలోకి వస్తాయని వివరించారు. లబ్ధిదారులకు మెరుగైన సేవలే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. -
మహిళలకు క్షమాపణ చెప్పాల్సిందే..
ఆయనది జర్నలిజం కాదు బ్రోకరిజం విశాఖలో ఆంధ్రజ్యోతి–ఏబీఎన్ కార్యాలయం ఎదుట భారీ నిరసన మహిళలను కించపరిచే రాతలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ పోలీసుల అడ్డంకుల మధ్య కొనసాగిన శాంతియుత ఆందోళన నిరసన ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, సమన్వయకర్త లు కరణం ధర్మశ్రీ, కె.కె.రాజు, వాసుపల్లి గణేష్, పార్టీ శ్రేణులుఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తీరుపై వైఎస్సార్సీపీ నేతల ఆగ్రహం మహారాణిపేట: జర్నలిజం విలువలను తుంగలో తొక్కి, బ్రోకరిజమే వృత్తిగా మార్చుకున్న ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ తీరుపై వైఎస్సార్సీపీ శ్రేణులు కన్నెర్ర చేశాయి. ‘కొత్త పలుకులు’ పేరుతో ఆయన రాస్తున్న ‘చెత్త పలుకులు’ మహిళా లోకాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ విశాఖలోని ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని పార్టీ నేతలు బుధవారం ముట్టడించాయి. వైఎస్సార్సీపీ విశాఖ, అనకాపల్లి జిల్లాల అధ్యక్షులు కె.కె.రాజు, బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో పోర్టు హాస్పిటల్ జంక్షన్ వద్ద భారీ ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్ కార్యాలయం వైపు దూసుకువెళ్తున్న పార్టీ శ్రేణులను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నప్పటికీ, నేతలు రహదారిపై బైఠాయించి రాధాకృష్ణ వైఖరిని పార్టీ నేతలు ఎండగట్టారు. రాధాకృష్ణ తన రాతల ద్వారా మహిళలను కించపరిచారని, తక్షణమే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏబీఎన్, ఆంధ్రజ్యోతి పత్రికలు కేవలం చంద్రబాబు అజెండాను అమలు చేసే సాధనాలుగా మారాయని, బాబు నోటి నుంచి వచ్చే మాటలనే వీరు రాతలుగా రాస్తున్నారని ఆరోపించారు. ఆ రాతలు అత్యంతం నీచం : మాజీ ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు వేమూరి రాధాకృష్ణ ఇటీవల రాసిన కథనాలు అత్యంత నీచంగా ఉన్నాయి. మహిళలను అవమానించేలా రాయడం అసహ్యకరం. వారి గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్న ఈ రాతలపై రాధాకృష్ణ వెంటనే మహిళా లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. మీడియా వేదికలను ఉపయోగించుకుని సమాజంలో విభేదాలు సృష్టించడం సరికాదు. కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ల మెప్పు కోసమే రాధాకృష్ణ ఇలాంటి కథనాలు రాస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం జర్నలిజాన్ని దుర్వినియోగం చేయడం ప్రజాస్వామ్యానికి చేటు. మహిళల మనోభావాలను దెబ్బతీసినందుకు ఆంధ్రజ్యోతి పత్రికలోనే క్షమాపణ చెబుతూ స్పష్టమైన వివరణ ప్రచురించాలి. అసత్య ప్రచారాలు ఆయన నైజం : మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్ జర్నలిస్టుగా సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సిన వేమూరి రాధాకృష్ణ, తప్పుడు ఆరోపణలు, అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఈ తప్పుడు ప్రచారాలకు వ్యతిరేకంగా మేము శాంతియుత నిరసనలు కొనసాగిస్తాం. రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే ప్రాజెక్టులపై విషప్రచారం చేయడం దారుణం. దేశంలోనే అతిపెద్ద స్కామ్ అమరావతి ప్రాజెక్ట్ అయితే, మరోవైపు మావిగన్ ప్రాజెక్ట్ రాష్ట్రానికి అతిపెద్ద గ్రోత్ కారిడార్గా నిలుస్తుంది. అమరావతిలో కేవలం రూ. 4 వేలకే అయ్యే పనులకు రూ. 14 వేలు ఖర్చు చేస్తూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో రియల్ ఎస్టేట్ ప్రయోజనాలే కనిపిస్తే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేశారు. రాజకీయ విమర్శల పేరుతో వ్యక్తిగత దూషణలు చేయడం జర్నలిజం విలువలకు విరుద్ధం. అంతా ముక్తకంఠంతో ఖండించాలి: వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ‘వేమూరి రాధాకృష్ణ చేస్తున్న రాతలు పూర్తిగా అసత్యాలతో కూడినవి. ప్రజలను తప్పుదారి పట్టించేలా కథనాలు రాయడం జర్నలిజం విలువలకు తిలోదకాలు ఇవ్వడమే. మీడియా తన బాధ్యతను గుర్తుంచుకుని వ్యవహరించాలి. ఇలాంటి బాధ్యతారాహిత్య రాతలను సమాజం ముక్తకంఠంతో ఖండించాలి. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు కొనసాగితే ప్రజాస్వామ్యయుతంగా బలమైన ప్రతిఘటన ఎదురవుతుంది. అది బూతుల కరపత్రం: మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ దెయ్యాలు వేదాలు వల్లించినట్లు రాధాకృష్ణ తనకు తోచినట్లు రాతలు రాస్తున్నారు. ఎల్లో మీడియాలో ఆయన ఒక ’ఎల్లో టెర్రరిస్ట్’. ఆంధ్రజ్యోతి అనేది ఒక బూతుల కరపత్రంలా మారింది. కేవలం చిల్లర కోసం రాధాకృష్ణ ఇన్ని వేషాలు వేస్తున్నారు. మహిళా లోకాన్ని కించపరిచిన ఆయనను రాజకీయంగా భూస్థాపితం చేసేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారు. మహిళల గౌరవానికి భంగం : మాజీ ఎంపీ బి.సత్యవతి రాధాకృష్ణ వ్యాఖ్యలు యావత్ మహిళా లోకాన్ని కించపరిచేలా ఉన్నాయి. ఆయన వెంటనే మహిళలకు తక్షణమే క్షమాపణ చెప్పాలి. అదే పత్రికలో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
వివరాల సేకరణలో కచ్చితత్వం ముఖ్యం
అధికారులకు సూచనలిస్తున్న కేంద్ర కార్యదర్శి డాక్టర్ సౌరభ్ గార్గ్ మహారాణిపేట(విశాఖ): భారత ప్రభుత్వ కేంద్ర గణాంక, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ సౌరభ్ గార్గ్ బుధవారం నగరంలోని జాతీయ గణాంక కార్యాలయాన్ని సందర్శించారు. త్వరలో ప్రారంభం కానున్న నేషనల్ హౌస్హోల్డ్ ఇన్కమ్ సర్వే ఫీల్డ్ వర్క్ను ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం సర్వే అమలు విధానంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సౌరభ్ గార్గ్ మాట్లాడుతూ.. సర్వే నిర్వహణలో కచ్చితత్వం, సమగ్రత, పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. దేశవ్యాప్తంగా చేపట్టనున్న ఈ సర్వే విజయవంతం కావడానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం ఈ సర్వేలో పాల్గొని, నిక్కచ్చిగా సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డి.సతీష్, జాయింట్ డైరెక్టర్ రజత్, అసిస్టెంట్ డైరెక్టర్ పి. రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ముఖ ఆధారిత హాజరులో మనదే మొదటి స్థానం
నాతవరం : ఉపాధి హామీ పథకంలో ముఖఅధారిత హాజరు రాష్ట్రంలోనే మనం మొదట స్థానంలో ఉన్నామని ఉమ్మడి జిల్లా డ్వామా ప్రాజెక్టు అధికారి సిహెచ్.నిర్మలాదేవి అన్నారు. మండలంలో బుధవారం చెర్లోపాలెం గ్రామంలో ఉపాధి హామీ పథకంలో చేస్తున్న పనులను తనిఖీలు చేశారు. పనిచేసే మస్తరు హాజరు పట్టికను పరిశీలించి వేతనదారులతో మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో ఇబ్బందుల గురించి కూలీలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత గ్రామపెద్దలతో సమావేశమై ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి పలు విషయాలను డ్వామా ప్రాజెక్టు అధికారి దృష్టికి మాజీ సర్పంచ్ బాబులునాయుడు తీసుకెళ్లారు. ఈ పథకంలో పనిచేసిన కూలీ డబ్బులు సకాలంలో రావడం లేదని కొందరు ఆమె దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహత్మాగాంధీ ఉపాధి పథకం పేరు ఈనెల వరకు మాత్రమే ఉంటుందన్నారు. వచ్చే నేల మే నుంచి కేంద్ర ప్రభుత్వం ఈపథకం పేరు మార్పు చేస్తుందన్నారు. ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంలో పని చేసే కూలీలకు హాజరు ముఖ ఆధారితలో రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లా మొదట స్థానంలో, అనకాపల్లి జిల్లా రెండో స్థానంలో ఉందన్నారు. ముఖ అధారిత హాజరు కారణంగా ఉపాఽధి హామీ పఽథకంలో ఎలాంటి అవకతవకలు జరిగేందుకు ఆవకాశం లేదన్నారు. వచ్చే నెల నుంచి ఆ పథకంలో అనేక మార్పులు వస్తాయని వాటిపై ఇప్పటికే క్షేత్ర స్థాయిలో సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా జల ధార జలహారతి కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, డిప్యూటీ ఎంపీడీవో మూర్తిబాబు, పంచాయతీ కార్యదర్శి లోవరాజు, ఉపాధి హామీ పథకం ఏపీడీ చిన్నారావు, ఏపీవో దాసరి కొండాజీ పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
బుచ్చెయ్యపేట: ప్రజాస్వాయ్యాన్ని ఖూనీ చేసేలా చంద్రబాబు ప్రభుత్వ పాలన సాగుతోందని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఏబీఎన్లో కొత్త పలుకు పేరుతో మహిళల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం విశాఖలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి వెళ్తున్న పాడేరు ఎమ్మెల్యేను బుచ్చెయ్యపేటలో పోలీసులు అడ్డగించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యేతో పాటు వైఎస్సార్సీసీ మండల నాయకులు రోడ్డుపై బైఠాయించారు. చంద్రబాబు ప్రభుత్వానికి,పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరావు మాట్లాడుతూ రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ సోషల్ మీడియా,వైఎస్సార్ కాంగ్రెస్సీపీ కార్యకర్తలు,నాయకులపై చంద్రబాబు ప్రభుత్వం కేసులు పెడుతోంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. కూటమి నేతలు అనుచిత వ్యాఖ్యలు,దాడులు చేస్తుంటే పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి నాయకులకు, పచ్చ మీడియాకు త్వరలోనే తగిన బుద్ధి చెబుతామని తెలిపారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు జోగా కొండబాబు,జెడ్పీటీసీ దొండా రాంబాబు,వైస్ ఎంపీపీ గొంపా చినబాబు,మాజీ సర్పంచ్లు పెదిరెడ్ల మాణిక్యం,సుంకరి గాంధీ,గొంపా అప్పారావు,కోవెల ఈశ్వరరావు,జెర్రిపోతుల రామారావు,రాము తదితరులు పాల్గొన్నారు. -
నేలరాలిన మామిడి రైతు ఆశలు
చోడవరం : మామిడి, జీడిమామిడి పంటలకు దెబ్బమీద దెబ్బ తగిలింది. సీజన్ ప్రారంభం నుంచీ పొగమంచు విపరీతంగా పడడంతో ఈసారి మామిడి పూతే అంతంతమాత్రంగా పూచింది. పిందె దశ నుంచి కాయ దశకు వచ్చి ఇప్పుడు పక్వాని వచ్చిన సమయంలో మంగళ, బుధవారాల్లో ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం కురవడంతో పంట చాలా మేర దెబ్బతింది. దీనితో మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చోడవరం నియోజకవర్గంతోపాటు పరిసర ప్రాంతాల్లో సుమారు 20 వేల ఎకరాల్లో మామిడి సాగు జరుగుతుంది. ఈ ఏడాది మొదట్లో పూత బాగా వచ్చినప్పటికీ వర్షాలు కురవకపోవడంతో పొగమంచు కమ్ముకుంది. మంచువల్ల చాలామేర పూత రాలిపోయింది. దీనితో ఆలస్యంగా పిందెలు వచ్చాయి. అందుకే ఉగాది పండగకు ఆశించిన మామిడి కాయలు దిగుబడి కాక చాలా గిరాకీగా అమ్మాయి. 50శాతమే ఇప్పుడు తోటల్లో కాయలు ఉన్నాయి. కనీసం ఆ పంటైనా చేతికి వస్తే పెట్టుబడులైనా వస్తాయని రైతులు ఆశించారు. ఇప్పుడు కాయదశ నుంచి పక్వానికి చేరుకున్న సమయంలో ఒక్కసారిగా భారీ ఈదురుగాలులతో కురిసిన వర్షం మామిడి రైతులను నిండా ముంచేసింది. పెద్ద ఎత్తున గాలులు వీయడంతో కాయదశలో ఉన్న మామిడి పంట చాలా మేర నేలరాలిపోయింది. చోడవరం, అనకాపల్లి, మాడుగుల, దేవరాపల్లి, కె.కోటపాడు, బుచ్చెయ్యపేట ప్రాంతాల్లో ఉన్న తోటల్లో మామిడికాయలు నేలరాలిపోయింది. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి తోటలు లీజుకు తీసుకున్న రైతులు, స్వతహాగా తోటలు కాపు కాస్తున్న రైతులు ఈ అకాల వర్షం, గాలులతో తీవ్రంగా నష్టపోయారు. గాలులు గట్టిగా వీయడంతో నేలరాలిన కాయలన్నీ పగిలి పోయాయి. కనీసం అమ్మకానికి కూడా వీలులేకుండా పంటనష్టం జరిగింది. ఈ సీజన్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న మామిడి రైతుల ఆశలు నిరాశలయ్యాయి. పెట్టుబడి పోయింది గాలివానకు పెట్టుబడి కూడా పోయింది. నేను తోటకూరపాలెం గ్రామంలో 3 ఎకరాల మామిడి తోట లీజుకి తీసుకున్నాను. ఈ ఏడాది ఏదో కొంత పంట పండింది. ఇప్పుడిప్పుడే కాయదశ నుంచి పక్వానికి చేరింది. కాయ పెరుగుతున్న సమయంలో ఒక్కసారిగా గాలివాన వచ్చింది. గాలి భీకరంగా రావడంతో చెట్లకు ఉన్న కాయంతా నేలరాలిపోయింది. సుమారు రూ.లక్షా 40వేలు పెట్టుబడి పెట్టాను. పంట చాలా వరకు రాలిపోయింది. దీంతో పెట్టుబడి కూడా వచ్చేలా లేదు. ఈ రాలిపోయి దెబ్బతిన్న కాయలు ఎవరూ కొనరు, తెగనమ్ముకోవడం తప్ప చేసేదేం లేదు. బాధిత మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. – వెంకటరమణ, మామిడిరైతు, తోటకూరపాలెం -
స్మార్ట్కిచెన్ నిర్ణయం విరమించాలి
దేవరాపల్లి: స్మార్ట్ కిచెన్ పేరిట ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించి మిడ్డే మీల్స్ కార్మికుల పొట్ట కొట్టొదని ఏపీ వ్యవసాయ కార్మిక జిల్లా ఉపాధ్యక్షుడు డి. వెంకన్న, సీఐటీయూ మండల కార్యదర్శి బి.టి. దొర కోరారు. మండల విద్యాశాఖ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు బుధవారం చేపట్టిన నిరసన కార్యక్రమంలో వారు పాల్గొని మద్దతు ప్రకటించారు. బిల్లులు, వేతనాలు సక్రమంగా సకాలంలో ఇవ్వక పోయినా అప్పులు చేసి మరీ భోజనం అందిస్తున్న కార్మికులను తొలగించే ప్రయత్నం చేయడం అత్యంత దారుణమన్నారు. ఏళ్ల తరబడి పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్న నిర్వహకులకు మెనూ చార్జీలు, వేతనాలు పెంచి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ కిచెన్ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని, లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం స్థానిక ఎంఈవో ఈశ్వరరావుకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కోలా మేరీరత్నం, పల్లి రాములమ్మ, సింగంపల్లి మహాలక్ష్మీ, రాయి సన్యాసమ్మ, గాలి గంగమ్మ, దాసరి రాము, పులిగా రమణమ్మ, కంచి మహాలక్ష్మీ తదితర మిడ్డే మీల్స్ నిర్వాహకులు పాల్గొన్నారు. దేవరాపల్లి ఎంఈవో కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న మీడ్డే మీల్స్ నిర్వాహకులు ఎంఈవో ఈశ్వరరావుకు వినతి పత్రం అందజేస్తున్న మధ్యాహ్న భోజన పధకం నిర్వాహకులు -
అడ్డుకోవడం అన్యాయం
అనకాపల్లి: మహిళల పట్ల ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసన తెలిపేందుకు బుధవారం విశాఖ వెళుతున్న వైఎస్సార్సీపీ అనకాపల్లి నాయకులను పట్టణ పోలీసులు అడ్డుకోవడం అన్యాయమని వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు అన్నారు. స్థానిక ఉడ్పేట నుంచి వైఎస్సార్సీపీ నాయకులు విశాఖకు వెళుతున్న సమయంలో పట్టణ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంలో జరిగే నిరసన కార్యక్రమానికి అనుమతి లేదని, వెళితే కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. శాంతియుత వాతావరణంలో నిరసన తెలపకుండా పోలీసులతో అణిచివేయాలనుకోవడం మూర్ఖత్వమన్నారు. ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన నీచపు వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని, మహిళలకు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జె.రమేష్ మాట్లాడుతూ ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం సిగ్గుపడేలా ఉన్నాయని, ఆయనపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 84వ వార్డు ఇన్చార్జి కె.రాఘవ, 82వ వార్డు ఇన్చార్జి అల్లు త్రినాథ్, మాజీ కౌన్సిలర్ నడిశెట్టి మధు, పార్టీ సీనియర్ నాయకులు ఉగ్గిన అప్పారావు, కోన ఉమా, లక్కోజు రాంబాబు, తంగేళ్ల రామకృష్ణ, చింతా రాంజీ, రేబాక స్వామి, సత్తిబాబు, కొంకీ శ్రీరాంమ్మూర్తి,గుండా రమేష్ గుప్తా, కాండ్రేకుల శ్రీనివాసరావు,సతీష్ రెడ్డి, దేశెట్టి బసవేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన రైతులకు ఆర్థిక భద్రతే లక్ష్యం
మహారాణిపేట(విశాఖ): గిరిజన రైతులు సేకరించే అటవీ ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులకు సరైన ధరలు అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. బుధవారం విశాఖలో గిరిజన సహకార సంస్థ(జీసీసీ) కార్యకలాపాలపై ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లోని కొనుగోలు కేంద్రాలు, డి.ఆర్.డిపోలు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. గిరిజనుల వద్ద సేకరించిన ఉత్పత్తులకు ఆన్లైన్ ద్వారా నగదు జమ చేయాలని, తద్వారా పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు. అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని, కాఫీ కొనుగోళ్లు పెంచి రైతులకు ప్రోత్సాహం అందించాలని కోరారు. గిరిజన రైతులకు ఆర్థిక భద్రత, మార్కెట్ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. అటవీ ఉత్పత్తుల సేకరణ, మార్కెటింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధిపై మంత్రి సమీక్షించారు. గిరిజన కుటుంబాల ఆదాయం పెంచే దిశగా మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా జీసీసీలో పనిచేస్తున్న 33 మంది సేల్స్మెన్కు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తూ, వారికి నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్, మేనేజింగ్ డైరెక్టర్ శోభిక, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
వీసీ కుర్చీలో ఎంపీ దర్జా
ప్రొటోకాల్కు పాతర, ఏయూ ప్రతిష్టకు దెబ్బవిశాఖ సిటీ : ఆంధ్ర విశ్వవిద్యాలయం మరోసారి వివాదాల కేంద్రమైంది. శతాబ్ది ఉత్సవాల నిర్వహణపై సమీక్ష సమావేశం సందర్భంగా గీతం యూనివర్సిటీ అధినేత, విశాఖ ఎంపీ శ్రీభరత్ ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీసింది. ప్రొటోకాల్ను తుంగలో తొక్కి ఏకంగా వైస్ చాన్సలర్ సీటులో కూర్చోవడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. సాక్షాత్తూ రాష్ట్ర గవర్నర్ నియమించే అత్యున్నత పదవికి ఇవ్వాల్సిన గౌరవాన్ని గాలికొదిలేసి, ఆ సీటులో తిష్టవేసి సమీక్ష నిర్వహించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. వర్సిటీ ప్రతిష్టను మంటగలిపేలా విశాఖ ఎంపీ శ్రీభరత్ వ్యవహరించిన తీరు ఇప్పుడు విద్యావేత్తలను, మేధావులను విస్మయానికి గురిచేస్తోంది. అధికార దర్పంతో ఎంపీ ఏ విశ్వవిద్యాలయానికై నా వైస్ చాన్సలర్ పదవి అత్యున్నతమైనది. ఆ కుర్చీ కేవలం చాన్సలర్ హోదాలో ఉన్న గవర్నర్ లేదా నియమితులైన వీసీకి మాత్రమే పరిమితం. ఇది దశాబ్దాల సంప్రదాయం. కానీ, శతాబ్ది ఉత్సవాల సమీక్ష పేరుతో వర్సిటీలోకి అడుగుపెట్టిన ఎంపీ శ్రీభరత్.. ప్రొటోకాల్ను తుంగలో తొక్కి ఏకంగా వీసీ కుర్చీనే ఆక్రమించేశారు. సాక్షాత్తూ రాష్ట్ర గవర్నర్ నియమించే అత్యున్నత పదవికి ఇచ్చే గౌరవం ఇదేనా? అని విద్యావేత్తలు మండిపడుతున్నారు. వీసీ ప్రొఫెసర్ రాజశేఖర్ పక్కన సాధారణ కుర్చీలో అసహాయంగా కూర్చుని ఉండగా, ఎంపీ ఆసీటులో తిష్టవేసి సమీక్ష నిర్వహించడం వర్సిటీ స్వయంప్రతిపత్తిని అపహాస్యం చేయడమే. గవర్నర్ హితవు గుర్తులేదా? ఏయూ శతాబ్ది ఉత్సవాల ప్రారంభానికి విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్.. ‘విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలకు తావులేకుండా పారదర్శక పాలన సాగాలి’ అని హితవు పలి కారు. ఆ మాటల పచ్చబొట్టు చెరిగిపోకముందే, ఎంపీ తన రాజకీయ ప్రతాపాన్ని వీసీ గదిలో ప్రదర్శించడం విశేషం. సోషల్ మీడియాలో వైరల్.. విమర్శల వెల్లువ ప్రస్తుతం ఎంపీ శ్రీభరత్ వీసీ కుర్చీలో కూర్చున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. గత ఎంపీలు ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడలేదని విద్యావేత్తలు గుర్తుచేస్తున్నారు. గత ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ సీఎండీని కలిసినప్పుడు పక్కన కూర్చుని మాట్లాడిన ఫొటోలను, ఇప్పుడు శ్రీభరత్ అధికార కుర్చీని ఆక్రమించిన ఫొటోలను పోల్చుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారులను తన అడుగులకు మడుగులు వత్తించుకునే స్థాయికి దిగజారడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. అధికార బలం ఉందన్న గర్వంతో వ్యవస్థలను కించపరిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. అలవాటుగా మారిన ’కుర్చీ’ లాట శ్రీభరత్కు ఇలాంటి ‘అధికార దర్పం’ కొత్తేమీ కాదు. గతంలో విశాఖ స్టీల్ప్లాంట్ సందర్శన సమయంలోనూ ఆయన ఇలాగే వ్యవహరించారు. దేశ రాష్ట్రపతి ద్వారా నియమితులయ్యే సీఎండీ స్థానానికి ఒక ప్రత్యేకమైన ప్రొటోకాల్ ఉంటుంది. కేంద్ర సంయుక్త కార్యదర్శి హోదాలో ఉండే సీఎండీ సీటులో ఎంపీ కూర్చుని రివ్యూ చేయడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. సీఎండీ అతుల్భట్ను పక్కన కూర్చోబెట్టుకుని ఆర్డర్లు వేయడం చూసి అక్కడి ఉన్నతాధికారులు ముక్కున వేలేసుకున్నారు. శతాబ్ది ఉత్సవాల వేళ సమున్నత గౌరవంతో వెలగాల్సిన ఆంధ్ర విశ్వవిద్యాలయం.. ఇప్పుడు రాజకీయ అహంకారానికి వేదికై ంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఒక ప్రైవేట్ వర్సిటీ అధినేత, ప్రజాప్రతినిధి హోదాలో ఉన్న వ్యక్తి.. రాజ్యాంగబద్ధమైన పదవులకు ఇవ్వాల్సిన కనీస గౌరవాన్ని విస్మరించారు. ‘కుర్చీ’ కనిపిస్తే చాలు.. అది ఎవరిదన్న విజ్ఞత మరిచి ‘నేనే బాస్’ అన్నట్లు ప్రవర్తించడం ఇప్పుడు విశాఖలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. -
పోలీస్ స్పోర్ట్స్ మీట్లో పతకాల పంట
పతకాలు సాధించిన క్రైం కానిస్టేబుల్ గొర్లె శ్రీనివాసరావును అభినందిస్తున్న డీఎస్పీ శ్రావణి అనకాపల్లి: విశాఖ ఉమ్మడి జిల్లా పోలీస్ యాన్యువల్ క్రీడాపోటీల్లో జిల్లాలో కశింకోట పోలీస్స్టేషన్లో క్రైమ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న గొర్లె శ్రీనివాసరావు 100, 200 మీటర్స్, డిస్కస్ త్రోలో బంగారు పతకాలు 400 మీటర్స్ లో కాంస్య పతకం,, జావిలిన్ , షార్ట్పుట్లో రజత పతకాలు సాధించారు. జిల్లా ఫాస్టెస్ట్ రన్నర్గా పోటీల్లో నిలిచారు. పోటీల్లో గెలుపొందిన గొర్లె శ్రీనివాసరావును స్థానిక కొత్తూరు డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ ఎం.శ్రావణి మంగళవారం అభినందించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రానున్న రోజుల్లో మరిన్ని పతకాలు సాధించాలని కోరారు. కార్యక్రమంలో సీఐ స్వామినాయుడు పాల్గొన్నారు. దేవరాపల్లి: జిల్లా పోలీస్ వార్షిక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్లో దేవరాపల్లి మండలంలో స్పెష ల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ విధులు నిర్వర్తిస్తున్న రెడ్డి మహేష్కుమార్ సత్తా చాటారు. విశాఖపట్నంలోని కై లా సగిరి సమీపంలోని ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ గ్రౌండ్లో మూడు రోజులుగా జరుగుతున్న పోలీస్ వార్షిక స్పోర్ట్స్ మీట్లో బ్యాడ్మింటన్లో సింగిల్, డబుల్స్లో రెండు గోల్డ్ మెడల్స్, కబడ్డీలో బ్రాంచ్ మెడల్ సొంతం చేసుకున్నారు. విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్ శెట్టి, ఎస్పీ తుహీన్ సిన్హా ఇతర పోలీస్ ఉన్నతాధికారుల చేతుల మీదుగా మహేష్కుమార్ పతకాలు, మెమెంటోలు అందుకున్నారు. మహేష్కుమార్ను పలువురు పోలీస్ అధికారులు, సహచర ఉద్యోగులు అభినందించారు. -
నిర్లక్ష్యంతో ముప్పు
సాక్షి, అనకాపల్లి : ఎండాకాలంలో భానుడు భగ్గుమంటున్నాడు. ఈ ఏడాది మార్చి నెల ప్రారంభం నుంచే అధికంగా ఉష్టోగ్రతలు నమోదవుతన్నాయి. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది అధికంగానే ఉష్టోగ్రతలు ఉంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు ఇప్పటికే హెచ్చరించారు. అగ్గిలా మండే ఎండలకు తోడు అగ్నిప్రమాదాలు సంభవిస్తే ఆస్తి, ప్రాణనష్టాలు సంభవించే పరిస్థితులు ఎదురవుతాయి. ముఖ్యంగా మార్చి నుంచి జూన్ వరకు నాలుగు నెలల వరకూ ప్రజలతో పాటు అగ్ని మాపక సిబ్బంది ఆప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేసవిలో జరిగే అగ్ని ప్రమాదాలపై ప్రజలను ఆప్రమత్తం చేసేందుకు ఏటా ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. జిల్లాలో 8 అగ్ని మాపక కేంద్రాలు ఉన్నప్పటికీ పెద్ద ప్రమాదాలు సంభవించినప్పుడు నిమిషాల వ్యవధిలోనే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయే అవకాశం ఉంటుంది. పారిశ్రామిక ప్రాంతం..ప్రమాదాల నిలయం జిల్లాలో పారిశ్రామిక ప్రాంతమైన పరవాడ, రాంబిల్లి, అచ్యుతాపురం, కశింకోట మండల పరిధిలో ఒక వైపు పరిశ్రమలు, మరో వైపు ప్రజలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు జిల్లా వ్యాప్తంగా 560 అగ్నిప్రమాదాలు సంభవించాయి. వీటిలో రూ.10 లక్షలకు పైగా నష్టం సంభవించిన ప్రమాదాలు 2 అత్యంత ప్రమాదకరమైనవి కాగా..40 మీడియం ఫైర్ కాల్స్ (రూ.2 లక్షల నుంచి రూ.10ల క్షల లోపు ), 489 చిన్నపాటి అగ్ని ప్రమాదాలు సంభవించాయి. జిల్లా వ్యాప్తంగా జరిగిన 610 అగ్ని ప్రమాదాల్లో రూ.232 కోట్ల వరకు ఆస్తి నష్టం సంభవిం చగా, రూ.289 కోట్ల ఆస్తిని అగ్నిమాపక సిబ్బంది కాపాడగలిగారు. ఈ ప్రమాదాల్లో 32 మంది ప్రాణాలు కోల్పోగా, 19 మందిని అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలకు తెగించి కాపాడగలిగారు. అలాగే ఈ ప్రమాదాల్లో 20 పశువులు చనిపోగా, ఒక దాన్ని సిబ్బంది కాపాడారు. రెస్క్యూ చేస్తుండగా 18 మంది చనిపోగా..ముగ్గురిని కాపాడగలిగారు. అవగాహన కోసమే వారోత్సవాలు అగ్ని ప్రమాదాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రభుత్వం ఏటా అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహి స్తోంది. ఈ వారోత్సవాల్లో భాగంగా, విధి నిర్వహణలో మృతి చెందిన సిబ్బందికి నివాళులర్పించడం, బస్టాండ్, మార్కెట్లు, సినిమా థియేటర్లు, మురికివాడల్లో అగ్ని మాపక నియంత్రణ పరికరాల వినియోగం, అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన, ఎల్పీజీ స్టోరేజీ, పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా ఆసుపత్రిల్లో వైద్యులు, ఇతర సిబ్బందికి అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఎలా తమని తాము కాపాడుకోవాలనే అంశంపై అవగాహన కల్పిస్తున్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అవగాహన కల్పిస్తున్న దృశ్యం(ఫైల్) విస్తృతంగా అవగాహన.. జిల్లాలో సెజ్ ప్రాంతంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో..సేప్టీ ఆడిట్లో భాగంగా ప్రతీ నెలా అవగాహన కార్యక్రమం నిర్వహిస్తాం. మీ ప్రాంతంలో ఏ ప్రమాదం జరిగిన తక్షణమే ఆయా పరిధిలో ఉన్న ఫైర్స్టేషన్లకు సమచారం ఇవ్వాలని కోరారు. వేసవిలో ప్రతీ ఒక్కరూ అత్యంత జాగ్రత్తంగా ఉండాలని సూచించారు. – వెంకట రమణ, జిల్లా అగ్నిమాపక అధికారి● గ్యాస్ స్టౌను సిలిండర్ కన్నా ఎత్తులో ఉంచి వాడాలి. ● అదనపు సిలిండర్ను వాడుతున్న సిలిండర్కు దూరంగా ఉంచాలి. ● మండే వస్తువులు గ్యాస్ సిలిండర్కు దూరంగా ఉంచాలి. ● చిన్నారులకు అగ్గిపెట్టెలు, లైటర్లు అందుబాటులో ఉంచరాదు. ● వంట పూర్తయిన వెంటనే రెగ్యులేటర్ ఆపివేయాలి. ● ఐఎస్ఐ మార్కు ఉన్న ఎల్పీజీ సురక్ష ట్యూబులనే వాడాలి. ● గ్యాస్ లీక్ అవుతున్న అనుమానం వస్తే కిటికీలు, తలుపులు వెంటనే తెరవాలి. ● ఆ సమయంలో ఎలక్ట్రికల్ స్విచ్ ఆన్ ఆఫ్ చేయకూడదు. ● ఒక ఎలక్ట్రిక్ పాయింట్ వద్ద ఎక్కువ ప్లగ్లు పెట్టరాదు. ● ఇల్లు వదిలి దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు విద్యుత్ మెయిన్ ఆఫ్ చేయాలి. ● విద్యుత్ పరికరాలకు నిప్పు అంటుకుంటే మెయిన్ ఆఫ్ చేసి పొడి ఇసుక లేదా డ్రై కెమికల్ పౌడర్ను నిప్పు మీద చల్లాలి. ● కాల్చిన సిగరెట్లు, బీడీలు, అగ్గిపుల్లలు ఆర్పి పారేయాలి. ● దుస్తులకు నిప్పు అంటుకుంటే పరుగెత్తరాదు. నేలపై దొర్లాలి లేదా దుప్పటి చుట్టుకోవాలి. ● కాలిన శరీర భాగాల మీద చల్లని నీరు పోయాలి. ● గడ్డివాములను నివాస గృహాలకు దూరంగా వేసుకోవాలి. ● కార్మికులు పనిచేసే స్థలాల్లో కనీసం రెండు ఫైర్ ఎగ్జిట్లు ఏర్పాటు చేయాలి. జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలు దూరం... -
పేరు లేని ప్రశంస సంతకం లేని గౌరవం
విశాఖ సిటీ: వందేళ్ల ఉత్తరాంధ్ర విద్యా కుసుమ ఘన వైభవం పాలకుల చేతుల్లో అభాసుపాలవుతోంది. శతాబ్ది ఉత్సవాల వేళ దేదీప్యమానంగా వెలిగిపోవాల్సిన ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారుల నిర్లక్ష్యంతో వెలవెలబోతోంది. శత జయంతి పండగను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన పాలకులు.. తూతూ మంత్రం వ్యవహారంగా మార్చేశారు. శతాబ్ది ఉత్సవాల పేరుతో ఏడాది క్రితం నుంచి సమీక్షలు, సమావేశాల పేరుతో హడావుడి చేసిన అధికారులు.. ఇప్పుడు కార్యక్రమాల నిర్వహణలో ఘోరంగా విఫలమవుతున్నారు. మంగళవారం జరిగిన శతాబ్ది సాహితీ మహోత్సవం ఇందుకు నిదర్శనం. కవులను, కళాకారులను గౌరవించాల్సిన చోట వారికి అవమానం జరగడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. పేర్లు, సంతకాలు లేకుండా ప్రశంసాపత్రాలు శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఏయూలోని శ్రీ రామనేని కోదండ రామయ్య భవనంలో శతాబ్ది సాహితీ మహోత్సవాన్ని నిర్వహించారు. దీనికి అనేక మంది కవులు, అవధానులు తరలివచ్చారు. భాషాభిమానంతో వచ్చిన వారికి ఏయూ అధికారులు ఇచ్చిన బహుమతి చూసి అందరూ అవాక్కయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి అందజేసిన ప్రశంసా పత్రాలపై కనీసం గ్రహీత పేరు కూడా లేకపోవడం గమనార్హం. ఎవరి పేర్లు లేకుండా ఖాళీగా ‘ఫిల్ ఇన్ ద బ్లాంక్’ అన్నట్లు పత్రాలు అందజేయడంపై అందరూ విస్తుపోయారు. పేర్లు లేకపోగా.. అలాగే ఆ పత్రాలపై కనీసం వైస్ ఛాన్సలర్ సంతకం కానీ, ఇటు తెలుగు విభాగాధిపతి సంతకం కానీ లేకపోవడం మరింత విశేషం. ఖాళీ కాగితాలను చేతిలో పెట్టి పంపించడం పట్ల సాహితీవేత్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర అవమానంగా భావిస్తున్నారు. నిర్లక్ష్యానికి పరాకాష్ట ఈ శతాబ్ది ఉత్సవాల కోసం 2025 నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పాలకులు గొప్పలు చెప్పుకున్నారు. తీరా సమయం వచ్చేసరికి కనీసం ఒక సర్టిఫికెట్ కూడా సరిగ్గా సిద్ధం చేయలేని స్థితిలో ఉండడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం. అతిథులకు ఇచ్చే గౌరవ పత్రాలపై బాధ్యతాయుతమైన అధికారుల సంతకాలు లేకపోవడం ఏయూ చరిత్రలోనే ఒక మాయని మచ్చగా మిగిలిపోనుంది.దిగజారుతున్న ప్రతిష్ట ఏయూ శతాబ్ది ఉత్సవాలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పూర్వ విద్యార్థులు గర్వపడేలా ఉండాలి. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రతి కార్యక్రమంలోనూ ఏదో ఒక వివాదం తలెత్తుతూనే ఉంది. రాజకీయ జోక్యం ఒకవైపు, అధికారుల అలసత్వం మరోవైపు వర్సిటీని పట్టి పీడిస్తున్నాయి. శతాబ్ది ఉత్సవాల నిర్వహణలో ఇంతటి ఘోర తప్పిదాలు జరుగుతున్నా ఉన్నతాధికారులు స్పందించకపోవడం గమనార్హం. ఇప్పటికై నా పాలకులు మేల్కొని, మిగిలిన కార్యక్రమాలనైనా గౌరవప్రదంగా నిర్వహించాలని విద్యావేత్తలు కోరుతున్నారు. -
ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో వినూత్నంగా వ్యర్థాల నిర్వహణ
తుమ్మపాల : అన్ని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో ’నెట్ జీరో హెల్తీ క్యాంపస్’ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని, జిల్లాలో 20 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించినట్టు కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల ప్రిన్సి పాళ్లు, సంబంధిత జిల్లా అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హాస్టళ్లలో వ్యర్థాల నిర్వహణను మెరుగుపరచడం, ’జీరో వేస్ట్’ (వ్యర్థాలు లేకుండా చేయడం) లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల కంపోస్ట్ పిట్లు, సోక్ పిట్లు, కిచెన్ గార్డెన్స్ వంటి పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. జూన్ 2026 నుండి జూలై 2027 మధ్యలో ఈ పనులన్నీ పూర్తి చేసి, క్యాంపస్లను ’నెట్ జీరో’గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. హార్టికల్చర్ శాఖ, జిల్లా అధికారులు, కేజీబీవీ పాఠశాలల ప్రిన్సిపాళ్లు కీలక పాత్ర పోషించాలన్నారు. కిచెన్ వ్యర్థాల నుంచి ఎరువును తయారు చేసేలా డీకంపోజింగ్ యూనిట్లు, చెత్త సేకరణకు టూ–బిన్ విధానాన్ని అమలు చేయడం, వర్షపు నీటి సంరక్షణ ద్వారా భూగర్భ జలాలను రీఛార్జి చేయడం, మురుగు నీటి నిర్వహణకు సోక్ పిట్స్ ఏర్పాటు చేయడం, విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు, పరిశుభ్రమైన వంటశాలలు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించడం వంటి అంశాలపై సమీక్షించారు. -
చట్టాలపై అవగాహనతోనే మహిళలకు రక్షణ
సబ్బవరం: న్యాయ పరిజ్ఞానం మహిళలకు ఆత్మవిశ్వాసాన్ని, శక్తిని ఇస్తుందని.. చట్టాలపై అవగాహన ఉంటే పని ప్రదేశాల్లో ఎదురయ్యే లైంగిక వేధింపులను అడ్డుకోవడం సులభమవుతుందని కేంద్ర సమాచార కమిషన్ కమిషనర్ సుధారాణి రేలంగి అన్నారు. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, నిషేధం, పరిష్కారానికి ఉద్దేశించిన ‘పోష్’చట్టం–2013 అమలుపై మంగళవారం దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో దక్షిణ ప్రాంతీయ న్యాయ సమీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కార్యాలయాల్లో అనుచిత వ్యాఖ్యలు, అసభ్య ప్రవర్తన మహిళల గౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా వారి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోష్ చట్టం.. నివారణ, నిషేధం, పరిష్కారం అనే మూడు ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తుందని ఆమె వివరించారు. అంతర్జాతీయ చట్టాల స్ఫూర్తితో రూపొందిన ఈ చట్టాన్ని మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు వర్సిటీ ఉపకులపతి ఆచార్య సూర్యప్రకాశరావు ప్రారంభోపన్యాసం చేస్తూ.. ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకు మహిళల స్థానంలో వచ్చిన మార్పులను, పోష్ చట్టం నేపథ్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమాన్ని రెండు విభాగాలుగా నిర్వహించారు. మొదటి సెషన్లో పోష్ చట్టంలోని నిబంధనలు, సంస్థాగత వ్యవస్థలపై చర్చించగా.. రెండో సెషన్లో చట్టం అమలులో ఎదురవుతున్న సవాళ్లు, కొత్త సమస్యలపై నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ముగింపు సమావేశంలో రాష్ట్ర న్యాయ విభాగం కార్యదర్శి డాక్టర్ ప్రతిభ రాణి ఆన్లైన్ ద్వారా ప్రసంగించారు. మహిళలు ప్రతిచోటా భద్రత కోసం పోరాడాల్సి రావడం సమాజ దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో జాతీయ మహిళా కమిషన్ సభ్యులు, విశాఖ బార్ అసోసియేషన్ న్యాయవాదులు, ఆంధ్ర విశ్వవిద్యాలయం, డీఎస్ఎన్ఎల్యూ అధ్యాపకులు, పలువురు నిపుణులు పాల్గొన్నారు. కార్యక్రమ సమన్వయకర్తలుగా డాక్టర్ భాగ్యలక్ష్మి, డి.షెర్లీ హెప్సిభా వ్యవహరించారు. కేంద్ర సమాచార కమిషనర్ సుధారాణి రేలంగి -
విశాఖ చేరుకున్న జయపతాక స్వామీజీ
నేడు 550 మందితో అప్పన్న దర్శనం కొమ్మాది/ఏయూక్యాంపస్: అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం(ఇస్కాన్) ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు, ప్రపంచవ్యాప్తంగా భక్తియోగం, శ్రీకృష్ణ తత్వాన్ని ప్రచారం చేస్తున్న పరమపూజ్య జయపతాక స్వామి మహారాజ్ మంగళవారం నగరానికి చేరుకున్నారు. బుధవారం ఉదయం జయపతాక స్వామీజీ 550 మంది సన్యాసులతో కలిసి శ్రీలక్ష్మీనృసింహ స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం లోక కల్యాణం, ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ఇస్కాన్ భక్తులతో కలిసి భారీ ఆధ్యాత్మిక ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీ ఆర్.కె. బీచ్ నుంచి ప్రారంభమై పార్క్ హోటల్ వరకు కొనసాగుతుంది. సాయంత్రం ఎంజీఎం పార్క్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సంగీత విభావరి, భజన, కీర్తన కార్యక్రమాల్లో స్వామీజీ పాల్గొంటారు. అలాగే ఇస్కాన్లో రెండు రోజుల పాటు శ్రీకృష్ణ లీలలపై ఆయన ఆధ్యాత్మిక ప్రవచనాలు చేయనున్నారు. ఈ కార్యక్రమాల్లో నగరవాసులు, భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని ఇస్కాన్ విశాఖపట్నం అధ్యక్షుడు సాంబాదాస్ ప్రభూజీ కోరారు. -
వేసవి సెలవుల్లో పారాహుషార్
అనకాపల్లి : ఈ ఏడాది విద్యార్థులకు పరీక్షలు ముగిసాయి, వేసవి సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో, విద్యార్థులు, చిన్న పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ తుహిన్ సిన్హా మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సెలవుల్లో సరదా కోసం పిల్లలు ప్రమాదకరమైన జలాశయాల వద్దకు వెళ్లకుండా చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. పిల్లలు సరదాగా ఈత కొట్టడానికి, స్నానాల కోసం సమీపంలోని చెరువులు, బావులు, కాలువలు, సముద్ర తీరం, నీటి కుంటల వద్దకు వెళ్లే అవకాశం ఉంటుందని, నీటి లోతు తెలియక, ప్రవాహ వేగానికి లోనై ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయే ముప్పు ఉంటుందని, అందువల్ల తల్లిదండ్రులు పిల్లలను ఒంటరిగా అటువైపు వెళ్లనివ్వకూడదన్నారు. పిల్లలు ఇంటి వద్ద ఉన్న సమయంలో వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో ఉంటున్నారు అనే విషయాలను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, మధ్యాహ్నం వేళల్లో పిల్లలు బయటకు వెళ్లకుండా ఇళ్లలోనే ఉండేలా జాగ్రత్తలు వహించాలన్నారు. నీటి ప్రమాదాల వల్ల కలిగే నష్టాలను, గతంలో జరిగిన విషాద సంఘటనలను పిల్లలకు వివరించి వారిలో అవగాహన పెంచాలన్నారు. సెలవుల్లో పిల్లలను ఆటపాటలు, కథల పుస్తకాలు చదవడం, వేసవి శిక్షణ శిబిరాల వైపు మళ్లించడం ద్వారా వారి సమయాన్ని సురక్షితంగా ఉపయోగకరంగా గడిపేలా చూడాలన్నారు. సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులు, స్థానికులు అలల ఉధృతిని గమనించాలని, హెచ్చరిక బోర్డులు ఉన్న చోట నీటిలోకి దిగరాదని సూచించారు. జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని, ఏదైనా అత్యవసర పరిస్థితి, ప్రమాదం సంభవిస్తే వెంటనే డయిల్ 100/112కు లేదా స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలన్నారు. -
విధులకు వెళ్తుండగా విషాదం
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణంబైక్ షోరూమ్ ఉద్యోగి మృతి పెందుర్తి: బీఆర్టీఎస్ రహదారిలోని పెందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలవగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలివి. సాలూరుకు చెందిన ఎం.పోలిరాజు (45) చినముషిడివాడలో తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆయన పెందుర్తిలోని ఒక బైక్ షోరూమ్లో ఆడిట్ విభాగంలో పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు తన ద్విచక్ర వాహనంపై చినముషిడివాడ నుంచి పెందుర్తి బయలుదేరారు. ప్రభుత్వ కళాశాల దాటిన తర్వాత చర్చి సమీపంలోకి వచ్చేసరికి బైక్ అదుపుతప్పి రోడ్డు దాటుతున్న లక్ష్మణ్ అనే వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పోలిరాజు వాహనంపై నుంచి కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లారు. స్థానికులు వెంటనే స్పందించి ఆయనను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలిరాజుకు భార్య కృష్ణవేణి, పిల్లలు ఉన్నారు. పెందుర్తి సీఐ కె.వి. సతీష్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విధి నిర్వహణ కోసం ఉత్సాహంగా ఇంటి నుంచి బయలుదేరిన వారిని మృత్యువు రోడ్డు ప్రమాద రూపంలో కబళించింది. మంగళవారం సబ్బవరం, పెందుర్తి మండలాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఒకరు పంచాయతీ స్వీపర్ కాగా, మరొకరు షోరూమ్ ఉద్యోగి. విధులకు వెళ్తూ మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోవడంతో ఆయా కుటుంబాల్లో పెను విషాదం నెలకొంది.‘ పంచాయతీ స్వీపర్ దుర్మరణం సబ్బవరం: మండలంలోని గొల్లలపాలెం శివారు అమరపిన్నివానిపాలేనికి చెందిన కొమ్ము దుర్గాలు (65) బోలెరో వాహనం ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందారు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. దుర్గాలు గొల్లలపాలెం పంచాయతీలో స్వీపర్గా పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు ఆయన కాలినడకన బయలుదేరారు. అదే సమయంలో పెందుర్తి మండలం రాంపురం గ్రామానికి చెందిన చిట్టిబోయిన గణేష్ తన ద్విచక్ర వాహనంపై కూర్మన్నపాలెం వెళ్తుండగా.. దుర్గాలు లిఫ్ట్ అడగడంతో అతడిని బైక్పై ఎక్కించుకున్నాడు. మార్గమధ్యలో ఒక మలుపు వద్ద ఎదురుగా వేగంగా వచ్చిన బోలెరో వాహనం బైక్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ రోడ్డుపై పడిపోగా, దుర్గాలు తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ నడుపుతున్న గణేష్కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన బోలెరో వాహనం డ్రైవర్ ఆపకుండా అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు ఆ వాహనం నంబర్ను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జి.రామచంద్రరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లిలోని ఆస్పత్రికి తరలించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. దుర్గాలుకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. పోలిరాజు మృతదేహం, గాయపడ్డ లక్ష్మణ్ -
వాన వాన.. వడగండ్ల వాన..
బుచ్చెయ్యపేట : బుచ్చెయ్యపేట మండలంలో వర్షం దంచి కొట్టింది. ముత్యాల తలంబ్రాలు పోసినట్టుగా వడగళ్ల వాన కురిసింది. బుచ్చెయ్యపేట, దిబ్బిడి, నేతవానిపాలెం, కందిపూడి, కేపీ ఆగ్రహారం, ఐయితంపూడి, కొమళ్లపూడి తదితర గ్రామాల్లో గుప్పెడంత వడగళ్లు పడడం ఆశ్చర్యం గొలిపింది. ఇంటి ముందు ఉన్న గోళాలు, కుండీల్లో వడగళ్లు పోగులుగా చేరాయి. రోడ్డుపై పెద్దపెద్ద వడగళ్లు పడడంతో పలువురు ఇళ్లల్లోకి పరుగులు తీశారు. వడగళ్ల వానతో మామిడి కాయలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. -
హెల్త్ సూపర్వైజర్ పుష్పరాజ్ను సస్పెండ్ చేయాలి
అనకాపల్లి: దేవరాపల్లి పీహెచ్సీ పరిధిలో గర్సింగి గ్రామ సచివాలయ హెల్త్ సెక్రటరీ రాజ్యలక్ష్మి ఆత్మహత్యా యత్నానికి కారకులైన హెల్త్ సూపర్వైజర్ పుష్పరాజ్ను వెంటనే అరెస్టు చేసి విధులు నుంచి తొలగించాలని ప్రజా సంఘాల నాయకులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి.వి.శ్రీనివాసరావు మాట్లాడారు. డబ్బు మదంతో పుష్పరాజు బెదిరింపులు చేసి తోటి ఉద్యోగులపై ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహించారు. అక్రమంగా డబ్బులు వసూళ్లకు పాల్పడటంతోపాటు మహిళా ఉద్యోగులపై శారీరకంగా మానసికంగా వేధింపులకు పాల్పడుతున్నాడని, ఇటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగంలో కొనసాగించటానికి వీలులేదన్నారు. ఐద్వా మహిళా సంఘం జిల్లా కార్యదర్శి డి.డి. వరలక్ష్మి, గిరిజన సమాఖ్య అల్లూరి సీతారామరాజు జిల్లా నాయకుడు రాధాకృష్ణ, శ్రామిక మహిళా నాయకురాలు నారాయణమ్మ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గంటా శ్రీరామ్ మాట్లాడుతూ ఇతర ఆరోగ్య సిబ్బందిని వేధింపులకు గురిచేస్తున్న హెల్త్ సూపర్వైజర్ పుష్పరాజుపై మండల అభివృద్ధి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆయన ఆగడాలు మరింత మితిమీరుతున్నాయని ఆరోపించారు. గిరిజనురాలైన రాజ్యలక్ష్మిని కులదూషణతోపాటు లైంగిక వేధింపులకు పాల్పడటంతో ఆత్మహత్యకు యత్నించి పాడేరు ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని వాపోయారు. ఘటనపై విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని ముందస్తుగా అనారోగ్యం పేరుతో హాస్పిటల్లో చేరడం విడ్డూరంగా ఉందన్నారు. చర్యలు తీసుకోని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించారు. -
● నేల కొరిగిన హోర్డింగ్.. ● నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు
అనకాపల్లి టౌన్: పట్టణంలో మంగళవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈ సమయంలో వీచిన ఈదురు గాలుల ధాటికి ఒక్కసారిగా హోర్డింగ్, కటౌట్లు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. గవరపాలెం పార్స్ సెంటర్, విజయరామరాజు పేట అండర్ బ్రిడ్జి, శారదానగర్, ఆర్టీసీ కాంప్లెక్స్ తదితర ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. వర్షం బీభత్సంతో నాలుగురోడ్ల జంక్షన్లో బస్టాప్ ముందర ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్, జీవీఎంసీ కార్యాలయం మేడపైన ఉన్న కటౌట్లు నేలకొరిగాయి. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ప్రదేశంలో నిత్యం బస్లు, ఆటోల కోసం ప్రయాణికులు వేచి ఉంటారు. వర్షం వల్ల జన సంచారం లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఇక వర్షం కారణంతో రాత్రి 7 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. -
ఆరోగ్యానికి కలసికట్టుగా...
అనకాపల్లి : కరోన వంటి విపత్తుల తరువాత మానవుని జీవనశైలిలో అనేక మార్పులు సంభవించాయని, రహదారులపై జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల వివిధ రకాలైన వ్యాధులు బారినపడే అవకాశాలు ఉన్నాయని డీఎంహెచ్వో ఎం.హైమావతి అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది ప్రభుత్వం ‘ఆరోగ్యానికి కలిసికట్టుగా–విజ్ఞానానికి అండగా నిలబడదాం’ నేపథ్యం పురస్కరించుకుని స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రి నుంచి క్రీడామైదానం వరకూ మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రంగులు కలిసిన ఆహారం, రసాయనాలతో మాగబెట్టిన మామిడి, అరటి, బొప్పాయి వంటి పండ్లుని తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం అని, సహాజసిద్ధమైన ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వడం, రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిదన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ రవి, డీసీహెచ్ఎస్ శ్రీనివాసరావు, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి చంద్రశేఖర్దేవ్, వైద్యు సిబ్బింది తదితరులు పాల్గొన్నారు. -
రూ.3.86 కోట్లు
‘దక్షిణ కోస్తా జోన్’కుసాక్షి, విశాఖపట్నం: గత రెండు బడ్జెట్లతో పోలిస్తే, ఈ సారి ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం రైల్వే కేటాయింపులు చేపట్టింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రైల్వే బోర్డు తాజాగా కన్సాలిడేటెడ్ బడ్జెట్ వివరాలను విడుదల చేసింది. విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్తో పాటు, వాల్తేరు డివిజన్ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని కేంద్రం కీలక కేటాయింపులు చేసింది. ప్రధానంగా విశాఖపట్నం రైల్వే స్టేషన్ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దడంతో పాటు, రద్దీగా ఉండే మార్గాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిచ్చింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. వాల్తేరు డివిజన్ పరిధిలో పెండింగ్లో ఉన్న పలు ప్రాజెక్టులు ఇక పట్టాలెక్కనున్నాయి. కేటాయింపుల వివరాలు ఇలా.. విజయనగరం–కొత్తవలస మూడో లైన్: వాల్తేరు డివిజన్లో అత్యంత రద్దీగా ఉండే విజయనగరం–కొత్తవలస సెక్షన్లో 34.7 కిలోమీటర్ల మేర మూడో రైల్వే లైన్ నిర్మాణానికి ఈ బడ్జెట్లో రూ.299.83 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం కూడా ఇదే కావడం విశేషం. ఈ లైన్ అందుబాటులోకి వస్తే సరకు రవాణా రైళ్ల వేగం పెరగడమే కాకుండా, ప్రయాణికుల రైళ్ల ఆలస్యానికి చెక్ పడనుంది. విశాఖ స్టేషన్ ఆధునికీకరణ, భద్రత: విశాఖపట్నం రైల్వే స్టేషన్ పరిధిలో భద్రతను మెరుగుపరచడానికి, రైళ్ల వేగాన్ని పెంచడానికి ‘ఆటోమేటిక్ సిగ్నలింగ్’వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రూ.49.24 కోట్లు కేటాయించారు. దీని వల్ల స్టేషన్ పరిధిలో రైళ్ల రాకపోకల సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. ఎలక్ట్రిక్ లోకో షెడ్ విస్తరణ: దక్షిణ కోస్తా రైల్వే జోన్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో, విశాఖ నుంచి నడిచే రైళ్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ప్రస్తుతం 200 ఇంజిన్ల సామర్థ్యం ఉన్న విశాఖ ఎలక్ట్రిక్ లోకో షెడ్ను 225కు పెంచనున్నారు. ఈ పనుల కోసం రూ.20.82 కోట్లు కేటాయించారు. దీనివల్ల ఇంజిన్ల నిర్వహణ మరింత సులభతరం కానుంది. జోన్ ప్రధాన కార్యాలయానికి నిధులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి బడ్జెట్లో చేయూత లభించింది. జోనల్ కార్యాలయ భవన నిర్మాణం, ప్రహరీ వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాల కోసం రూ.3.86 కోట్లు కేటాయించారు. మరికొన్ని.. ●పలాస–విశాఖపట్నం–దువ్వాడ సెక్షన్లో సుమారు 72 కిలోమీటర్ల మేర ట్రాక్ ఆధునికీకరణ పనులకు రూ.87.93 కోట్లు కేటాయించారు. ఇది రైళ్ల ప్రయాణ వేగాన్ని పెంచడానికి దోహదపడుతుంది. ●వాల్తేరు డివిజన్ పరిధిలోని వివిధ స్టేషన్లలో పాత సిగ్నలింగ్ వ్యవస్థ మార్పునకు రూ.31.26 కోట్లు, ఎఫ్అండ్ జీ క్యాబిన్ల ఆధునికీకరణకు రూ.27.41 కోట్లు కేటాయించారు. ●విశాఖ కోచింగ్ డిపోలో రన్నింగ్ రూమ్, క్రూ లాబీ అప్గ్రెడేషన్ కోసం రూ.4.90 కోట్లు కేటాయించారు. ●విశాఖపట్నం న్యూ గూడ్స్ కాంప్లెక్స్ వద్ద సౌకర్యాల మెరుగుదలకు రూ.21.84 కోట్లు కేటాయించారు. ఇది సరకు రవాణా ఆదాయాన్ని పెంచేందుకు దోహదపడనుంది. -
బార్ అసోసియేషన్ ఎన్నికల సందడి
కోర్టులో ఎన్నికల ప్రచారం చేస్తున్న అభ్యర్థులు విశాఖ లీగల్ : జిల్లా కోర్టులో ఈనెల 10న జరగనున్న న్యాయవాదుల సంఘం (బార్ అసోసియేషన్) ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి, సంయుక్త కార్యదర్శి పదవులకు పోటీచేస్తున్న అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రధాన పదవులకు పోటీ చేస్తున్న సీనియర్ న్యాయవాదులు తమ మేనిఫెస్టోను ప్రకటిస్తూ ఓటు కోసం అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయవాదులు సాంకేతికతను అందిపుచ్చుకునే విధంగా తమ వంతు చేయూతనిస్తామని, జూనియర్ న్యాయవాదులకు శిక్షణ, చట్టాలు, కోర్టు నియమావళి వంటి అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ప్రధానంగా అధ్యక్ష పదవికి నమ్మి సన్యాసిరావు, శిష్టల శ్రీనివాసమూర్తి (వాసు), ఎంఎస్ మాధవ్, కార్యదర్శి పదవికి వి.గోవిందరావు, విఎస్ఎ రవీంద్రనాథ్, ఎ.వెంకట సోమేశ్వరరావు, వి.వెంకట సుధాకర్ పోటీలో ఉన్నారు. ఎన్నికల రోజు రాత్రి 11 గంటలకు తుది ఫలితాలను ప్రకటిస్తామని ఎన్నికల అధికారి ఎ.ప్రభాకర్ రెడ్డి తెలిపారు. -
ఆకట్టుకున్న పారిశ్రామిక సామర్థ్యం ఎక్స్పో
కశింకోట: జిల్లా స్థాయి పారిశ్రామిక సామర్థ్యం ఎక్స్పో ప్రాజెక్టుల పోటీలో అచ్యుతాపురం మండలం హరిపాలెం హైస్కూలు విద్యార్థుల ప్రాజెక్టుకు ప్రథమ బహుమతి లభించింది. కశింకోటలోని డీపీఎన్ జెడ్పీ హైస్కూలులో ప్రాజెక్టుల ప్రదర్శన నిర్వహించారు. దీనిలో ఎస్.రాయవరం మండలం గుడివాడ హైస్కూలుకి విద్యార్థుల ప్రాజెక్టుకు ద్వితీయ బహుమతి లభించింది. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు తయారు చేసిన పది వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించి ఆహూతులను ఆశ్చర్యచకితులను చేశారు. పర్యావరణం పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, నీటి సంరక్షణ, గ్రామీణాభివృద్ధి వంటి అంశాలపై ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో రూపొందించిన ప్రాజెక్టులు ప్రదర్శించారు. తక్కువ ఖర్చుతో సామాజిక సమస్యల పరిష్కారానికి అనువైన ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ఈ సందర్భంగా జిల్లా సైన్స్ అధికారి దాడి కాళిదాసు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల నిర్వహణ ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, సమస్యల పరిష్కార నైపుణ్యాలు పెంపొందుతాయన్నారు. భవిష్యత్లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా విజేతలకు జ్ఞాపికలు, బహుమతులు అందజేశారు. జిల్లా మేనేజర్ నారాయణరావు, పాఠశాల హెచ్ఎం ఎన్.వి.జె. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
భర్త కళ్లెదుటే.. భార్య దుర్మరణం
పెదగంట్యాడ : భర్త కళ్లెదుటే భార్య దుర్మరణం పాలైన హృదయ విదారకమైన సంఘటన గాజువాక దరి శ్రీనగర్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. గాజువాక ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాలివి. శ్రీహరిపురం ప్రాంతానికి చెందిన గురిబిల్లి జోగిరెడ్డి, గురిబిల్లి శాంతమ్మ (43) భార్యాభర్తలు. వీరిద్దరూ సోమవారం వ్యక్తిగత పనులపై ద్విచక్ర వాహనంపై శ్రీనగర్ వస్తుండగా.. గాజువాక పోలీస్స్టేషన్ సిగ్నిల్ పాయింట్ దాటిన తర్వాత వెనుక నుంచి వస్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొంది. దీంతో శాంతమ్మ వాహనంపై నుంచి కిందపడిపోయింది. లారీ ఆమె తలపై నుంచి వెళ్లిపోవడంతో తల భాగం నుజ్జునుజ్జయింది. తన కళ్లెదుటే భార్య దుర్మరణం చెందడంతో భర్త కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు అక్కడి వారిని కలచివేసింది. సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్న గాజువాక పోలీసులు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. గాజువాక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రైతులతో ఏపీఐఐసీ చెలగాటం
నక్కపల్లి : ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లుంది. మండలంలో పలువురు రైతుల పరిస్థితి. బల్క్ డ్రగ్పార్క్, స్టీల్ప్లాంట్ కోసం భూసేకరణ రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తోంది. తమ సమస్య పరిష్కరించాలంటూ సోమవారం రైతులు ఇచ్చిన అర్జీలను ఏపీఐఐసీ అధికారులు తీసుకోవడానికి నిరాకరించారంటూ రాజయ్యపేట రైతులు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తోందంంటూ ఆరోపిస్తున్నారు. కంపెనీల కోసం గుర్తించిన భూముల క్రయ విక్రయాలపై కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ భూములు ఏపీఐఐసీ వారు తీసుకుని నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ వాపోతున్నారు. తమ భూములపై ఉన్న ఆంక్షలు తొలగిస్తే వేరొకరికి విక్రయిస్తామని లేదా ప్రభుత్వానికే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, తమకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. వివరాల్లోకి వెళ్తే రాజయ్యపేట సర్వేనెంబరు270,270/1ఈ,270/1డీ,271,272, 243/14,15లలో సుమారు10 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని 2017లో ప్రభుత్వం ఎకరా రూ.18 లక్షల చొప్పున సేకరించడానికి నిర్ణయించింది. ఈ భూములు ప్రభుత్వానికి ఇచ్చేందుకు రైతులు సిద్ధపడ్డారు. అధికారులు మాత్రం భూములు తీసుకోకుండా వాటిపై క్రయ విక్రయాలు జరగకుండా సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఆంక్షలు విధించారు. మా భూములు సేకరించి నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని, రైతులు మైలపల్లి మహేష్, మైలపల్లి బైరాగి రాజు, బి.అప్పలరాజు, డి. వీర్రాజు, వాసుపల్లి రాము తదితరులు చెబుతున్నారు. నక్కపల్లిలో ఏర్పాటు చేసిన ఏపీఐఐసీ జోనల్ కార్యాలయానికి వెళ్లి అర్జీ పెట్టుకుంటే జోనల్ మేనేజర్ నుంచి అనుమతి వస్తేనే తీసుకుంటామని చెబుతున్నారని రైతులు తెలిపారు. భూములు ఎప్పటిలోగా తీసుకుంటారో లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని, లేదా అవసరం లేని పక్షంలో భూముల క్రయవిక్రయాలపై ఆంక్షలు తొలగిస్తూ జీవో విడుదల చేయాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. ఆంక్షలు తొలగిస్తే మా భూములు వేరొకరికి అమ్ముకుంటామంటూ వారు ప్రాధేయపడుతున్నారు. ఇదే విషయంపై సోమవారం రాజయ్యపేట వచ్చిన ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నర్సింహరావు, డిప్యూటీ జోనల్ మేనేజర్ రాజశేఖర్లకు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా వారు తీసుకోవడానికి నిరాకరించారని రైతులు తెలిపారు. కూటమి ప్రభుత్వం రాజయ్యపేటలో రైతులను ఇబ్బందులకు గురిచేయడం తగదని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. -
ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు దోహదం
విజేతలకు బహుమతులు అందజేస్తున ఐజీ గోపినాథ్ జట్టి, అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా ఆరిలోవ : పోలీసులకు పని ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు, వ్యాయామం ఎంతగానో దోహదపడతాయని విశాఖ రేంజ్ ఐజీ గోపినాఽథ్ జట్టి తెలిపారు. అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విశాలాక్షినగర్ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు మైదానంలో మూడు రోజుల పాటు జరిగిన పోలీస్ వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ సంబరాలు సోమవారం ముగిశాయి. ఈ ముగింపు ఉత్సవాల్లో ఐజీ పాల్గొని విజేతలను అభినందించారు. అనకాపల్లి, పరవాడ, నర్సీపట్నం, సబ్ డివిజన్లతో పాటు ఆర్మడ్ రిజర్వ్ విభాగానికి చెందిన పోలీస్ అధికారులు, సిబ్బంది ఈ మీట్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాతో కలిసి బహుమతులు అందజేశారు. అనంతరం ఐజీ గోపినాథ్ మాట్లాడుతూ పోలీసులు పని ఒత్తిడిని అధిగమించి మానసిక ఉల్లాసం పొందేందుకు యోగా, వ్యాయామం, క్రీడలను తమ దైనందని జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. అనకాపల్లి ఎస్పీ తుమిన్ సిన్హా మాట్లాడుతూ పోలీసులు మరింత ఉత్సాహంతో పనిచేసి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. అదనపు ఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
అర్జీల వెల్లువ
తుమ్మపాల: జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వచ్చిన అర్జీదారులతో కలెక్టరేట్ కిక్కిరిసింది. ఈ వారం కుప్పలు తెప్పలుగా అర్జీలు వచ్చి పడ్డాయి. ప్రధానంగా భూ సమస్యలపై అర్జీలు అధికంగా వచ్చాయి. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం–1, 2లో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ల కార్యక్రమంలో విజయ కృష్ణన్తోపాటు జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో వై.సత్యనారాయణరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లకు వచ్చే అర్జీదారుల సమస్యలను అధికారులు వ్యక్తిగతంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రతి అర్జీ గడువులోపల చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ వారం పీజీఆర్ఎస్– 131, రెవెన్యూ క్లినిక్– 150 అర్జీలు మొత్తం 281 అర్జీలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో పీజీఆర్ఎస్, ఎన్ఏవోబీ, ప్రత్యేక ఉప కలెక్టర్లు ఎస్. సుబ్బలక్ష్మి, మనోరమ, ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి, జిల్లా ఎక్త్సెజ్ అధికారి వి.సుధీర్, సీపీవో జి.రామారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. డిగ్రీ చదువులకు సంకటం పరవాడలో డిగ్రీ కళాశాల ఏర్పాటుతోపాటు నక్కపల్లి డిగ్రీ కళాశాలకు భవన నిర్మాణం వెంటనే చేపట్టాలంటూ ఏఐఎస్ఎఫ్ నాయకులు పీజీఆర్ఎస్లో కలెక్టర్కు వినతిపత్రం అందించారు. ఏఐఎస్ఎఫ్ ఆద్వర్యంలో ఇక్కడ చేపట్టిన ధర్నా కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఫణింద్ర కుమార్ మాట్లాడుతూ పరవాడలో అనేక పరిశ్రమలు ఉన్నప్పటికీ, అక్కడి విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులో లేకపోవడం అత్యంత విచారకరమన్నారు. పరిశ్రమలకు పెద్ద ఎత్తున స్థలాల కేటాయించి శంకుస్థాపనలు చేస్తున్న ప్రభుత్వాలు విద్యార్థులు చదువుకోవడానికి కళాశాల భవనాలు నిర్మించకపోవడం సిగ్గుచేటన్నారు. ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు డిగ్రీ చదవాలంటే అనకాపల్లి, గాజువాక, విశాఖపట్నం వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రత్యేకంగా విద్యార్థినుల విషయంలో ఈ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పంపడానికి తల్లిదండ్రులు భయపడటం వల్ల, అనేకమంది విద్యార్థినులు మధ్యలోనే చదువు ఆపేస్తున్నారన్నారు. నక్కపల్లి డిగ్రీ కళాశాల మంజూరై ఐదేళ్లవుతున్నా ఇప్పటివరకు భవన నిర్మాణానికి స్థలం కేటాయించలేదని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ఒంటి పూట తరగతులు నిర్వహించడం శోచనీయమన్నారు. ఉపాధి పనులు చేపట్టాలని కలెక్టర్కు వినతి మాకవరపాలెం: మండలంలోని మామిడిపాలెం పంచాయతీలో ఉపాధి పనులు చేపట్టాలని సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్కు గ్రామస్తులు వినతిపత్రం అందించారు. గ్రామంలో గత ఏడాదిగా పనులు చేయడం లేదని వాపోయారు. పంచాయతీ పరిధిలోని మామిడిపాలెం, అడిగర్లపాలెం, పోతలూరులో ఉపాధి వేతనదారులు పనులు లేక ఖాళీగా ఉంటున్నామన్నారు. వీఆర్పీని నియమించలేదన్నారు. 120 మందికి ఒక మేట్ ఉండటం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అధికారులు స్పందించి మేట్ల సంఖ్యను పెంచడంతోపాటు ఉపాధి పనులు ప్రారంభించాలని కోరినట్టు మాజీ సర్పంచ్ బుడ్డా రమణ తెలిపారు. రోడ్డు నిర్మాణంలో కాలువలను పూడ్చవద్దని నిరసన అనకాపల్లి –అచ్యుతాపురం రోడ్డు విస్తరణలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న సాగునీటి కాలువలను పూడ్చివేసి వందల ఎకరాల భూములను బీడుగా మార్చవద్దని కోరుతూ మునగపాక, తోటాడ, నాగులాపలి, ఓంపోలు, తోటాడ, మునగపాక, తిమ్మరాజుపేట, హరిపాలెం, తదితర గ్రామాల రైతులు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. ప్రస్తుతం ఉన్న కాలువలను రోడ్డు విస్తరణలో కలిపేస్తున్నప్పటికి సాగునీటి కాలువకు అదనపు భూ సేకరణ చేపట్టకపోవడం సరికాదన్నారు. కాలువలు నిర్మాణం చేపట్టకపోతే పంటల సాగు పూర్తిగా నిలిచిపోతుందని, వ్యవసాయ భూములు కొర్నుగా మిగిలిపోతాయని, రైతులు వ్యవసాయాన్ని వదిలి పరిశ్రమలకు కూలీలుగా పోవాల్సిన పరిస్థితులు దాపురిస్తాయన్నారు. రోడ్డు విస్తరణపై సమగ్ర విచారణ జరిపించి, కొత్త కాలువలు నిర్మించుటకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, ప్రస్తుతం ఉన్న కాలువలు ధ్వంసం చేస్తూ నిర్మాణాలు చేపడుతున్న గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్కు వినతిపత్రం అందించారు. -
గీతం ఆక్రమిత భూములపై చర్యలు తీసుకోవాలి
మహారాణిపేట: గీతం విశ్వవిద్యాలయ యాజమాన్యం ఆక్రమించిన అసైన్డ్ ప్రభుత్వ భూములపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ ఇంటెలెక్చువల్ ఫోరం విశాఖ జిల్లా అధ్యక్షుడు దేవరకొండ మార్కండేయులు, వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పాకా సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో వారు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. రుషికొండ ప్రభుత్వ భూముల వినియోగంపై కూడా సమగ్ర విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. గీతం విశ్వవిద్యాలయం యాజమాన్యం ఆక్రమించిన 54.79 ఎకరాల ప్రభుత్వ భూములు ఎండాడ, భీమిలి మండలాల పరిధిలోని రుషికొండ ప్రాంతంలో సర్వే నంబర్లు 15, 16, 19, 20లలో ఉన్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ ల్యాండ్స్ యాక్ట్ 1977 ప్రకారం ప్రభుత్వం కేటాయించిన భూములను కొనడం లేదా అమ్మడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. రుషికొండ ప్రాంతంలో పర్యాటక శాఖకు చెందిన భూమిలో గతంలో ప్రభుత్వ అవసరాల కోసం గెస్ట్ హౌస్ నిర్మాణం జరిగితే, అప్పట్లో కూటమి నాయకులు తీవ్ర విమర్శలు చేసి, దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం ఆ భవనాలు కూటమి ప్రభుత్వ హయాంలోనే ఉన్నప్పటికీ, వాటిని ప్రజల అవసరాలకు వినియోగించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని పాకా విమర్శించారు. ఆ భవనాలను కొందరు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది ప్రభుత్వ ఆస్తుల దుర్వినియోగానికి దారితీస్తుందని మార్కండేయులు హెచ్చరించారు. గిన్ని రాధాకృష్ణ, విజయ్ భాస్కర్, సుగుణ కుమార్, హరి పట్నాయక్, రామకృష్ణారెడ్డి, మద్ది లక్ష్మణరావు, వెంకటరమణ, పిల్లా అప్పారావు, పైడిరాజు, బీసీ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లు అప్పలస్వామి, చుక్కా అప్పారావు, బోరా రామిరెడ్డి, వీర రాఘవులు, రాజా చంద్రశేఖర్, మహమ్మద్ సలీమ్, వన్టౌన్ దాసరి విజయ భాస్కరరెడ్డి, ఎం.డి.జాఫర్ అలీ, జిల్లా ప్రధాన కార్యదర్శి పేరం రామకృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పీజీఆర్ఎస్లో వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు -
ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్ఎస్కు 65 అర్జీలు
అర్జీదారుల సమస్యను వింటున్న అదనపు ఎస్పీ మోహనరావు అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్కు 65 అర్జీలు వచ్చాయి. అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వారివారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టపరిధిలో ఉన్న సమస్యలను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. భూ తగాదాలు–28, కుటుంబ కలహాలు– 5, మోసపూరిత వ్యవహారాలు–2, ఇతర విభాగాలకు చెందినవి – 30 అర్జీలు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
నూకాంబిక సన్నిధిలో నిత్య విద్యానంద భారతిస్వామి
నిత్య విద్యానంద భారతి స్వామికి నూకాంబిక అమ్మవారి చిత్రపటాన్ని అందజేస్తున్న ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్ అనకాపల్లి : గుంటూరు చెందిన ఆదిపరాశక్తి క్షేత్ర నిర్వాహకులు నిత్య విద్యానంద భారతిస్వామి సోమవారం గవరపాలెం నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భారతి స్వామికి ఆలయ చైర్మన్ చైర్మన్ పీలా నాగశ్రీను (గొల్ల బాబు), ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్ అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు సూరే సతీష్ కుమార్, దాడి రవికుమార్ పొలిమేర స్వాతి ఆనంద్కుమార్, మారిశెట్టి శంకరరావు, కాండ్రేగుల రాజారావు, మజ్జి జానకి శ్రీనివాసరావు, కొడుకుల శ్రీకాంత్, వడ్డాది మంగ, కోనేటి సూర్యలక్ష్మి, పైడిరాజు, యరవ్రరపు సంతోషి కుమారి నాగేష్ పాల్గొన్నారు. -
కంటెయినర్లలో పశువుల అక్రమ రవాణా
నక్కపల్లి : కంటైనర్లలో పశువులను కుక్కి అక్రమంగా రవాణా చేస్తున్నట్టు నక్కపల్లి పోలీసులకు సమాచారం అందడంతో వేంపాడు టోల్గేట్ వద్ద కంటైనర్ను పట్టుకున్నారు. విజయనగరం జిల్లా మానాపురం నుంచి విజయవాడ సమీపంలో ఉన్న హనుమాన్ జంక్షన్ వద్దకు కంటైనర్లో రెండు అరలను ఏర్పాటు చేసి 48 ఎద్దులను ఉంచి రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. ఈ కంటైనర్ను పట్టుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి కొత్తవలసలో ఉన్న గోశాలకు తరలించినట్టు సీఐ జె.మురళి తెలిపారు. కాగా ఇదేవిధంగా నిత్యం 30 నుంచి 40 కంటైనర్లలో పశువులు కబేళాకు తరలిపోతున్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప ఈ అక్రమ రవాణా పోలీసుల కంట పడడం లేదు. పోలీసుల కళ్లు కప్పడానికి లారీలు, వ్యాన్లు బదులుగా పశువుల రవాణాకు కంటైనర్లను ఉపయోగిస్తున్నారు. విజయనగరం జిల్లా కొత్తవలస కేంద్రంగా ఈ పశురవాణా ఏళ్ల తరబడి జరుగుతోంది. కంటైనర్లో 40 నుంచి 50 గోవులను కుక్కి ఊపిరి ఆడకుండా చేసి వందల కిలోమీటర్ల దూరం మేత గాని, తాగడానికి నీళ్లు గాని ఇవ్వకుండా హింసిస్తూ కబేళాకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో కొన్ని పశువులు మృత్యువాత కూడా పడుతున్నాయి. అధికార పార్టీ నేతలు, వారి పీఏల కనుసన్నల్లో... ఈ పశువులను రవాణా చేసే వ్యక్తి అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకులను, వారి వద్ద పనిచేసే పీఏలను, అనుచరులను గుప్పెట్లో పెట్టుకుని నెలవారీ మామూళ్లు చెల్లిస్తూ కంటైనర్లను పట్టుకోకుండా జాగ్రత్త పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పశు మాఫియాలో రెండు వర్గాల మధ్య విభేదాల కారణంగా ఒక వర్గానికి చెందిన కంటైనర్లను మరో వర్గానికి చెందిన వారు పోలీసులకు ఫిర్యాదు చేసి పట్టించడం జరుగుతోంది. అలాగే ఈ వ్యవహారంలో కీలక శాఖ మంత్రి వద్ద ప్రైవేటు పీఏగా పనిచేస్తున్న వ్యక్తి ప్రమేయం ఉందన్న ఆరోపణలు రావడంతో కొద్దిరోజుల పాటు పశురవాణా నిలిచిపోయింది. తాజాగా మళ్లీ పశు రవాణా ప్రారంభమైంది. తప్పుడు సర్టిఫికెట్లతో... ఈ అక్రమ రవాణాలో పశుసంవర్ధక శాఖ ప్రమేయంపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. పశువుల మాఫియా వద్ద కూలీలుగా పనిచేసే వారి ఆధార్ కార్డులను ఉపయోగించి వారే రైతులు, వారే కూలీలు, కొనేది వారే, అమ్మేది వారే అన్నట్టు సర్టిఫికెట్లు సంపాదించి పశువులను మేపుకొనేందుకే తరలిస్తున్నట్టు సర్టిఫికెట్లు సంపాదిస్తున్నారు. వాటిని చూపించి అక్రమంగా రవాణా చేస్తూ కబేళాకు తరలిస్తున్నారు. -
మద్యం మత్తులో భార్యపై దాడి
యలమంచిలి రూరల్ : మద్యం మత్తులో భార్యపై భర్త దాడి చేయడంతో భార్య మృతి చెందిన ఘటన యలమంచిలి పట్టణానికి సమీపంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణ ఎస్ఐ తెలిపిన వివరాలివి. అల్లూరి జిల్లా జి.మాడుగుల మండలం ఈదులబయలు గ్రామానికి చెందిన వంతల కుమారి (40) ఏడాది క్రితం భర్తతో విభేదాల కారణంగా ఇద్దరు పిల్లలు, భర్తను వదిలేసి దూరంగా ఉంటోంది. అల్లూరి జిల్లా పాడేరు మండలం చీడిమెట్ట గ్రామానికి చెందిన మర్రి కామేష్తో కుమారికి పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ వివాహం చేసుకుని యలమంచిలి సమీపంలో ఎర్రవరం వద్ద 16వ నెంబరు జాతీయ రహదారి పక్కనున్న ఒక తుక్కు దుకాణంలో ఖాళీ మద్యం సీసాలు వేరు చేసే పని చేస్తున్నారు. దుకాణ యజమాని ప్రతి ఆదివారం వీరికి ఖర్చుల కోసం రూ.1000 అదనంగా ఇస్తూంటారు. గత ఆదివారం వీరిద్దరూ యజమాని ఇచ్చిన వెయ్యి రూపాయలతో మద్యం తాగారు. అదే సమయంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో భర్త కామేష్ ఆమె ముఖంపై పిడికిలితో బలంగా గుద్దాడు. ఆమె తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీనిపై తుక్కు దుకాణం యజమాని కాకి అప్పారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. కుమారి మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచినట్టు తెలిపారు. -
విలేకరిపై చర్య తీసుకోవాలని వినతి
తహసీల్దారుకు ఫిర్యాదు చేస్తున్న మాజీ సర్పంచ్ పావని కోటవురట్ల : పాత్రికేయ ముసుగులో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని యండపల్లి మాజీ సర్పంచ్ గుడివాడ పావని తహసీల్దారు తిరుమలబాబు, ఎస్ఐ రమేష్కు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ నెల 2వ తేదీన గ్రామ దేవత నూకాంబిక అమ్మవారి జాతర నిర్వహిస్తుండగా రాఘవులు అనే విలేకరి తనను డబ్బులు డిమాండ్ చేశాడని, ఇవ్వకపోతే ఇబ్బందులు పడతారని బెదిరించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. మీడియాను అడ్డం పెట్టుకుని డబ్బుల కోసం వేధిస్తున్న అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తహసీల్దారు తిరుమలబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి పెట్ల రాంబాబు, నాయకులు పైల నాని, చీకట్ల వెంకట్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
దాహం.. దాహం
వేసవి ఆరంభంలోనే నీటి ఎద్దడి మొదలైంది. ఎండల తీవ్రత ఎక్కువగా కావడంతో జిల్లాలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. బోరుల్లో, నదుల్లో, బావుల్లో, చెరువుల్లో నీటి వనరులు అడుగంటాయి. ఏజెన్సీని అనుకుని ఉన్న మండలాల్లో శివారు గిరిజన గ్రామాల్లో బిందెడు నీటి కోసం 3 నుంచి 4 కిలోమీటర్ల మేర మండుటెండలో నడుచుకుంటూ వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. దాహార్తి తీర్చండి సారూ..అంటూ మొరపెట్టుకుంటున్నారు.సాక్షి, అనకాపల్లి : జిల్లాలో నాతవరం, గొలుగొండ, రోలుగుంట, రావికమతం, మాడుగుల, దేవరాపల్లి, చీడికాడ మండల పరిధిలో ఉన్న శివారు గిరిజన గ్రామాలలో గుక్కెడు నీటి కోసం గిరిజన ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో గిరిజనులంతా సొంతంగా బావి తవ్వుకున్నారు. వేసవి రావడంతో ఆ బావిలో నీళ్లు కూడా అడుగంటాయి. మరికొన్ని గిరిజన గ్రామాల్లో బురద నీరే గత్యంతరం లేని పరిస్థితుల్లో వడకట్టుకుని తాగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత అధికార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని, గిరిజన మహిళలు బిందెలతో నిరసన తెలియజేస్తున్నారు. చోడవరం నియోజకవర్గం...రావికమతం మండలం కొత్తకోట పంచాయతీలో దేవతమ్మవీధితో పాటు మరో రెండు కాలనీల్లో వాటర్ సమస్యతో దళితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జల్జీవన్ మిషన్ ద్వారా రూ.6 కోట్లు మంజూరు చేశారు. 15 రోజుల పాటు నీళ్లు ఇచ్చినా తరువాత నుంచి వాటర్ రావడం లేదు. ఆ గ్రామంలో రెండు రోజులకొకసారి స్నానాలు కూడా చేసే పరిస్థితిలో ప్రజలు లేరు. రోలుగుంట మండలంలో పలు గిరిజన గ్రామాల్లో నీటి సమస్య ప్రారంభమైంది. గొలుగొండ మండలంలో గిరిజన గ్రామాలు అనంతసాగర్, అంటిమానజోరులు, కచిమి, డొంకాడ, రాజుపేట, డోన్పాలెం, వడపర్తి, జమ్మవరం, పొగచొట్లపాలెం, వెంకటాపురం, నల్లంకి, పెసరాడ గ్రామాల్లో నీటి సమస్య నెలకొంది. ●పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాలకు తాగునీటి ఎద్దడి నివారణ దిశగా వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సుమారుగా రూ.35 కోట్లతో మెగా ప్రాజెక్టు నిర్మించాలని తలపెట్టారు. ఏలేరు కాలువ నుంచి నీటిని పేటకు తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. పైపులైను ద్వారా వచ్చిన నీటిని నిల్వచేసి అక్కడ నుంచి మూడు మండలాల పరిధిలో 140 గ్రామాలకు రక్షిత తాగునీటిని అందించే దిశగా పనులు మొదలు పెట్టారు. అనంతరం కూటమి ప్రభుత్వం వచ్చి మూలన పడేసింది. 2017లో మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పనులు ప్రారంభమైనా మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిగా మూలన పడకేసింది. ●కె.కోటపాడు మండలంలో ఆనందపురం గ్రామంలో తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గ్రామంలో జల్జీవన్ మిషన్ నిధులు రూ.30 లక్షలతో 40 వేల లీటర్ల మంచినీటి పఽథకానికి అనుమతులు మంజూరు అయ్యాయి. దీంతో మంచినీటి పఽథకం నిర్మాణంకు పనులు ప్రారంభించిన తరువాత కూటమి పార్టీల నేతలు శ్మశానవాటికలో ట్యాంక్ నిర్మాణాన్ని చేపడుతున్నట్టు కోర్టును ఆశ్రయించి పనులు జరగకుండా అడ్డుపడ్డారు. దీంతో 3 ఏళ్లుగా మంచినీటి పథకం నిర్మాణం అసంపూర్తిగా నిలిచింది. గ్రామంలో తాత్కాలికంగా నిర్మాణం చేపట్టిన 10 వేల లీటర్ల మినీ రక్షిత మంచినీటి పథకం ద్వారానే అరకొరగా నీటిని అందిస్తున్నారు. ఆనందపురం నుంచి కె.కోటపాడు వెళ్లే మార్గంలో ఉన్న ఇళ్లకు మాత్రం నేటికీ కుళాయిల ఏర్పాటు లేదు. దీంతో సుమారు 60 కుటుంబాల వారు బోరు నీటిపైనే ఆధారపడాల్సి వస్తుంది. వేసవికాలం కావడంతో చేతిబోర్ల వెంట నీరు అంతంత మాత్రంగానే వస్తుందని ఆయా ప్రాంతాల్లో గల మహిళలు చెబుతున్నారు. 40 వేల లీటర్ల మంచినీటి పఽథకాన్ని పూర్తి చేసి పూర్తి స్థాయిలో గ్రామంలో కుళాయిలు ఏర్పాటు చేసి తాగునీటి కష్టాలు తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. ●మాడుగుల, దేవరాపల్లి, చీడికాడ మండల పరిధిలో 55 గిరిజన గ్రామాలు ఉన్నాయి. మాడుగుల మండలంలో వాపర్తి, రాజంపేట గ్రామాల్లో 150 మంది గిరిజనులు నివాసం ఉంటారు. చీడికాడ మండలంలోని కోనాం శివారు బందవీధి గిరిజన గ్రామంలో గిరిజనులు తాగునీటి సమస్య ఉంది. దేవరాపల్లి మండలంలో చింతలపూడి పంచాయతీ మదనగరువు గ్రామంలో తాగునీటి సమస్య ఉంది. ●నాతవరం మండలంలో 31 గ్రామ పంచాయతీలో మొత్తం 457 చేతి బోర్లు 120 తాగునీటి పథకాలు ఉన్నాయి. కొండ మీద ఉన్న గిరిజన గ్రామాల్లో తాగునీటి పథకాలు నిర్మాణాలు పూర్తయినా.. ఇంటింటా కుళాయి కనెక్షన్లు ఇవ్వడంలో జాప్యం జరుగుతుంది. సుందరకోట గిరిజన పంచాయతీలో కుళాయిలు ప్రారంభించినా కొన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య వెంటాడుతూనే ఉంది. ●బుచ్చెయ్యపేట మండలంలో గత ప్రభుత్వ హయాంలో 68 మంచినీటి పనులు, 26 ట్యాంకులు మంజూరు కాగా కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలైనా సగం పనులు కూడా పూర్తి కాలేదు. గున్నెంపూడిలో మంచినీటి ట్యాంకు, పైపులైన్ పనులు పూర్తి కాకపోవడంతో తాగునీటి కష్టాలు పడుతున్నారు. తక్షణమే తాగునీటి సమస్య పరిష్కరించాలి గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. వేసవి ప్రారంభంలోనే తాగునీటి సమస్య నెలకొనడంతో వచ్చే నెలలో పరిస్థితి మరింత దారుణంగా ఉండనుంది. అధికారులు తూతూ మంత్రంగా వచ్చి చూసిపోతున్నారు. రావికమతం మండలంలో మేజర్ పంచాయతీ కొత్తకోటతో పాటు జిల్లా వ్యాప్తంగా గిరిజన గ్రామాల్లో, ఇతర గ్రామాల్లో నీటి సమస్య ఉంది. అధికారులకు మొర పెట్టుకున్నా ఫలితం లేదు. – కె గోవిందరావు, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు జిల్లాలో మోగుతున్న ప్రమాద ఘంటికలు తాగునీటి చెరువుల్లో, బావుల్లో అడుగంటిన నీటి వనరులు ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రారంభమైన తాగునీటి కష్టాలు గుక్కెడు మంచి నీరు కోసం జనం నానాపాట్లు గిరిజన గ్రామాల్లో 4 కిలోమీటర్ల దూరం నుంచి తెచ్చుకోవాల్సిన దుస్థితి నిర్వహణ లోపంతో అధ్వానంగా మారిన నీటి పథకాలు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కార దిశగా ఆలోచన చేయని చంద్రబాబు ప్రభుత్వం జిల్లాలో 16,059 చేతి పంపులు, 2.64 లక్షల కుళాయి కనెక్షన్లు -
చందనోత్సవానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు
మహారాణిపేట: గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి సమస్యలు తలెత్తకుండా శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి చందనోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో కీలక శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, ఉత్సవంలో నిర్వహించే సంప్రదాయ కార్యక్రమాలపై దేవస్థానం ఈవో జె. వెంకటరావు, ఆలయ పండితులు వివరించారు. అనంతరం అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన కలెక్టర్ శాఖల వారీగా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. భద్రతా ఏర్పాట్లను పోలీస్ శాఖ పర్యవేక్షించగా, రవాణా సౌకర్యాల విషయంలో ఏపీఎస్ ఆర్టీసీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రూ.1500, రూ.1000 టికెట్లపై పికప్, డ్రాప్ పాయింట్ల వివరాలు స్పష్టంగా ముద్రించాలని పేర్కొన్నారు. వాహనాల కోసం పరిమిత సంఖ్యలో మాత్రమే పాసులు జారీ చేయాలని ఆదేశించారు. భక్తులకు తాగునీరు, పారిశుధ్యం, మరుగుదొడ్లు, వైద్య సేవలు వంటి మౌలిక సదుపాయాలను మెరుగ్గా కల్పించాలని చెప్పారు. అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మద్యం దుకాణాలను తాత్కాలికంగా మూసివేయడంపై గతంలో అమలు చేసిన నిబంధనలను పాటించాలని తెలిపారు. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, ఇతర అవసరమైన వసతుల ఏర్పాటు విషయంలో సంబంధిత శాఖలు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. దాతలు నిర్వహించే అన్నదాన కేంద్రాలను ఫుడ్ సేఫ్టీ అధికారులతో తనిఖీ చేసి ఆహార నాణ్యతను నిర్ధారించాలని ఆదేశించారు. అన్ని ఏర్పాట్లు 17వ తేదీ నాటికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో డీఆర్వో ఎం.విశ్వేశ్వరనాయుడు, భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్, జీవీఎంసీ సిఎం నరేశ్, ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు, ఈపీడీసీఎల్ ఎస్ఈ శ్యాంబాబు, డీఎంహెచ్వో పి.జగదీశ్వరరావు పాల్గొన్నారు. -
పన్నుల వసూళ్ల్లలో విశాఖ టాప్
ఆరిలోవ: వాణిజ్య పన్నుల శాఖ విశాఖపట్నం డివిజన్–1 మార్చి నెలలో అన్ని రకాల పన్నుల వసూళ్లు రాష్ట్రంలోనే అత్యధికంగా జరిగినట్లు ఆ శాఖ సంయుక్త కమిషనర్ పి.బి.వల్లి తెలిపారు. విశాఖ డివిజన్–1 పరిధిలో భీమిలి, చినవాల్తేరు, డాబాగార్డెన్స్, ద్వారకానగర్, కురుపాం మార్కె ట్, సిరిపురం, సూర్యాబాగ్ సర్కిళ్లతో పాటు ఒక ప్రత్యేక సర్కిల్ ఉన్నాయన్నారు. జీఎస్టీ, నెలవారీ రిటర్న్ ఫైలింగ్, ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్ ప్లాన్, పాత బకాయిల వసూళ్లు ద్వారా ఈ ఏడాది మార్చి నెలలో రూ.158.59 కోట్లు ఆదాయం లభించిందన్నారు. ఇది రాష్ట్రంలోనే అత్యధికమని తెలిపారు. గత ఏడాది మార్చి(2025)లో రూ.150.71 కోట్లు లభించిందన్నారు. డివిజన్లో 2024–25 ఆర్థిక సంవత్సరంలో వార్షిక ఆదాయం రూ.1,733.59 కోట్లు కాగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.1,845.39 కోట్లు ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు. -
లలితా పీఠంలో గణపతి పూజలు
సీతంపేట(విశాఖ): సంకట హర చతుర్ధి సందర్భంగా ఆదివారం లలితానగర్ లలితా పీఠంలో విజయగణపతికి పంచామృతాభిషేకం, అర్చన, ప్రత్యేక అలంకరణ, విశేష పూజలు నిర్వహించారు. పీఠం అర్చకుల మంత్రోచ్ఛారణల మధ్య దూప దీప నైవేద్యం, గణేశ స్త్రోత్రం, వ్రత కథ చదివారు. అనంతరం పీఠం దర్బారు హాల్లో శాస్త్రోక్తంగా హరిద్రా గణపతి హోమం నిర్వహించారు. ఈ హోమం వల్ల కార్యసిద్ధి, విఘ్నాల నివారణ, ఐశ్వర్యం, వివాహ సంబంధ సమస్యల పరిష్కారం, విద్య, బుద్ధి వృద్ధి, వ్యాపార పురోగతి, ఆరోగ్యం, విజయం లభిస్తాయని అర్చకులు తెలిపారు. పీఠం మేనేజర్ మన్నవ కృష్ణసేన్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
నేడు టెన్త్ ‘స్పాట్’ కేంద్రాలకు నల్లబ్యాడ్జీలతో హాజరు
ఫ్యాప్టో జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్అనకాపల్లి: రాష్ట్రంలోని ఉద్యోగ,ఉపాధ్యాయుల ఆర్థిక,ఆర్థికేతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 6న టెన్త్ స్పాట్ వ్యాల్యుయేషన్ కేంద్రాలకు ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీల తో హాజరుకానున్నట్టు ఫ్యాప్టో జిల్లా ప్రధాన కార్యదర్శి వై.సుధాకర్ తెలిపారు. స్థానిక నర్సింగరావుపేట ఫ్యాప్టో కార్యాలయంలో ఆదివారం జరిగి న సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దశల వారీగా ఉద్యమాలు చేసినప్పటికీ చంద్రబా బు ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేకుండా పోయిందన్నారు. దీంతో ఈ నెల 6న టెన్త్ స్పాట్ వ్యాల్యుయేషన్ కేంద్రాలకు ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో హాజరుకానున్నారని, 9న స్పాట్ కేంద్రాల వద్ద నిరసన, 25, 26, 27 తేదీల్లో విజయవాడలో రిలే నిరహారదీక్షలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు దుర్గాప్రసాద్, ఐ.వి.రామిరెడ్డి, కార్యవర్గ సభ్యులు వి.శ్రీలక్ష్మి, వై.శ్రీనివాసరావు, కె.పరదేశి తదితరులు పాల్గొన్నారు.పీఎం ఇంటర్న్షిప్కు దరఖాస్తుల ఆహ్వానం అనకాపల్లి: ప్రధాన మంత్రి ఇంటర్న్షిప్ పథకం మూడో దశలో భాగంగా పలు కంపెనీల్లో ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఎన్.గోవిందరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అర్హులైన యువతీయువకులు వెంటనే ఆన్లైన్లో నమోదు చేసుకో వాలని పేర్కొన్నారు. ఇంటర్న్షిప్ ద్వారా యువ తకు ప్రాక్టికల్ అనుభవంతో పాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించనున్నట్టు తెలిపారు. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి, 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ విద్యార్హత కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.12లక్షల లోపు ఉండాలని, ఎంపికై న వారికి నెలకు రూ.9వేల వరకు స్టైఫండ్ అందజేయనున్నట్టు తెలిపారు. ఇంటర్న్షిప్ 6 నుంచి 9 నెలల వరకు ఉంటుందని, మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1800 116090లో గాని, జిల్లా నైపుణ్యాభివృద్ధి కార్యాలయంలో గాని సంప్రదించవచ్చని పేర్కొన్నారు. -
17న నూకాంబిక జాతర
దేవరాపల్లి: మండలంలోని ఎం.అలమండలో నూకాంబిక అమ్మవారి జాతర (ఒడ్డు పండగ)ను ఈ నెల 17న భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు మాజీ సర్పంచ్లు దాడి జగన్, పోతల లక్ష్మీశంకర్ తెలిపారు. గ్రామ పెద్దలు, ప్రజలతో పండగ ఏర్పాట్లపై ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరు జిల్లాల నుంచి వచ్చే సుమారు 70కు పైగా మహిళా కోలాట బృందాలు ఉదయం నుంచి రాత్రి వరకు ఈ పండగలో ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు చెప్పారు. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన బృందాలను విజేతలుగా ప్రకటించి బహుమతులను అందజేస్తామని తెలిపారు. మధ్యాహ్నం భారీ ఎత్తున ఎడ్ల పరుగు పోటీ నిర్వహించి విజేతలకు నగదు బహుమతులను అందజేస్తామన్నారు. దేవతామూర్తుల వేషధారణలతో అమ్మవారి ఊరేగింపు నిర్వహించనున్నట్టు చెప్పారు. అదే రోజు రాత్రి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వారు తెలిపారు. -
అలలపై విద్యుత్ కాంతులు
సాగర తీరాన ఆదివారం రాత్రి ఒక అద్భుత దృశ్యం పర్యాటకులను కట్టిపడేసింది. సముద్ర అలలపై రంగురంగుల విద్యుత్ దీపాలతో జిగేల్మంటూ కనిపిస్తున్న ఈ ఓడ కేవలం అలంకారానికే పరిమితం కాదు, తీర రక్షణలో దీని పాత్ర అత్యంత కీలకం. ప్రతి ఏటా తీర ప్రాంతంలో జరిగే భూకోతను అరికట్టేందుకు, సముద్ర గర్భంలోని ఇసుకను తవ్వి తిరిగి తీరానికి చేర్చే ‘డ్రెడ్జింగ్’ ప్రక్రియలో ఈ నౌకను వినియోగిస్తారు. రాత్రి వేళ తన విధి నిర్వహణలో భాగంగా విద్యుత్ కాంతులతో వెలుగులీనుతున్న ఈ డ్రెడ్జర్, చీకటి సముద్రంపై ఒక అందమైన దీపంలా మెరుస్తూ చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. – ఫొటో : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
వేధింపులకు పాల్పడిన హెల్త్ సూపర్వైజర్ను అరెస్టు చేయాలి
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు అనకాపల్లి: దేవరాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గరిశింగి సచివాలయంలో ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్న జి.రాజ్యలక్ష్మిని వేధింపులకు గురిచేసి, ఆమె ఆత్మహత్యాయత్నం చేయడానికి కారణమైన హెల్త్ సూపర్ వైజర్ పుష్పరాజును అరెస్టు చేయాలని ఏపీ యునైటెడ్ గ్రామ, వార్డు హెల్త్ సెక్రటరీస్ అసోసియేషన్ సభ్యులు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి.వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశా రు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడారు. ఏఎన్ఎం రాజ్యలక్ష్మిని వేధింపులకు గురిచేయడంతో పాటు హెల్త్ సెక్రటరీలపై కూడా పుష్పరాజు దురుసుగా ప్రవర్తించాడని తెలిపారు.ఆత్మహత్యకు యత్నించిన రాజ్యలక్ష్మి పాడేరు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందన్నారు. దీనికి కారణమైన పుష్ప రాజు సస్పెండ్ చేసి, అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తు న ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. -
ఓటీపీ మాయ
గ్యాస్ సరఫరాలోమహారాణిపేట: విశాఖ నగరంలో వంట గ్యాస్ బుకింగ్లో ఓటీపీ మాయాజాలం నడుస్తోంది. ఆన్లైన్ బుకింగ్ ప్రక్రియ అక్రమాలకు నిలయంగా మారింది. ఓటీపీ వచ్చి వారం రోజుల తర్వాత గ్యాస్ వస్తోందని ఏజెన్సీలు చెబుతున్నాయి. పది పదిహేను రోజులైనా రాకపోవడంతో సిలిండర్ పట్టుకుని వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూ కడుతున్నారు. అక్కడకు వెళ్లినా ఇంకా మీ గ్యాస్ రాలేదని ఏజెన్సీల నుంచి సమాధానం వస్తోంది. దీంతో గ్యాస్ బుక్ చేసిన వినియోగదారులకు సరఫరా ఎగ్గొట్టి సిలిండర్లను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొరత లేదని చెప్తున్నా.. నగరంలో హెచ్పీసీఎల్, భారత్, ఐవోసీ గ్యాస్ కంపెనీలు వంట గ్యాస్, కమర్షియల్ గ్యాస్ సరఫరా చేస్తున్నాయి. కమర్షియల్ గ్యాస్ సరఫరాపై ఆంక్షలు విధించడంతో ఆచూతూచి సరఫరా చేస్తున్నారు. దీంతో విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. విశాఖలో మొత్తం 62 గ్యాస్ ఏజెన్సీల్లో 8 లక్షల 90 వేల డొమెస్టిక్ కనెక్షన్లు ఉన్నాయి. నేటికి లక్షా 65 వేల మందికి పైగా గ్యాస్ బుక్ చేశారు. వీరికి గతంలో ఓటీపీ నెంబర్ వచ్చాక ఒకట్రెండు రోజుల్లోనే సిలిండర్ వచ్చేదని, ఇప్పుడు ఓటీపీ వచ్చి 10–15 రోజులవుతున్నా.. సిలిండర్ డెలివరీ కావట్లేదని వినియోగదారులు వాపోతున్నారు. వంట గ్యాస్కు ఎలాంటి కొరత లేదని జిల్లా అధికారులు చెబుతున్నా.. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఏజెన్సీలపై తీవ్ర ఒత్తిడి వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ మీద ప్రభుత్వం ఇప్పటికే పలు అంక్షలు విధించింది. 40 శాతం మేర సరఫరా తగ్గించారు. ఇప్పుడు డొమెస్టిక్ గ్యాస్పై కూడా ఆంక్షలు వస్తాయన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బుకింగ్కు బుకింగ్కు మధ్య కనీసం 25 రోజుల వ్యవధి ఉండాలి. దీంతో ఖాళీ సిలిండర్లున్నవారు, ఒకట్రెండు వారాల్లో సిలిండర్ ఖాళీ అవుతుందనుకునేవాళ్లు తమ గడువు తీరిన వెంటనే బుకింగ్ చేస్తున్నారు. దీంతో ఏజెన్సీలపై ఒత్తిడి పెరుగుతోంది. పెరుగుతోన్న బుకింగ్ జాబితా వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా పలు ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్ల నుంచి జిల్లాకు సాధారణ స్థాయిలోనే సిలిండర్లు సరఫరా అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మూడు నెలల గణాంకాలను పరిశీలిస్తే రోజుకు 18 వేలు చొప్పున సిలిండర్లు వస్తున్నాయి. యుద్దం నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులతో ప్రస్తుతం రోజుకు 25 వేల వరకు అందిస్తున్నారు. ఇప్పటికే లక్షా 65 వేల సిలిండర్లకు బుకింగ్ ఉంది. ఈ జాబితా రోజు రోజుకూ పెరుగుతోంది.గ్యాస్ ఏజెన్సీ వద్ద క్యూ కట్టిన వినియోగదారులుడొమెస్టిక్ సిలిండర్ పక్కదారి? మరోవైపు డొమెస్టిక్ సిలిండర్లు టీ, టిఫిన్ దుకాణాలు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, హోటళ్ల బాట పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల అధికారుల దాడుల్లో దొరికిన సిలిండర్లు ఈ ఆరోపణలను నిజం చేస్తున్నాయి. గ్యాస్ ఏజెన్సీలు, డెలివరీ బాయ్స్ కుమ్మకై ్క.. డొమెస్టిక్ సిలిండర్ల బుకింగ్లు తామే జరిపి, సిలిండర్లను బహిరంగ మార్కెట్లో వాణిజ్య వినియోగదారులకు రెండింతలు, మూడింతల ధరకు విక్రయిస్తున్నారన్న విమర్శలున్నాయి. కొందరు వినియోగదారులు తాము బుక్ చేయకుండానే తమ మొబైళ్లకు ఓటీపీలు వస్తున్నాయని, తమ సిలిండర్లను హోటళ్లు, రెస్టారెంట్లకు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు. -
ఆరోగ్యశ్రీ నిలిపివేతతో మరణాలు
అనకాపల్లి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ (ఆరోగ్యశ్రీకి ) ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో కార్పొరేట్ ఆసుపత్రులు అత్యవసర ఆపరేషన్లు నిలిపివేయడం వల్ల పేద రోగులు మరణాలు సంభవిస్తున్నాయని, వీటిని ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాలని సీపీఐ జిల్లా సీనియర్ నాయకుడు వై.ఎన్.భద్రం అన్నారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంకు విద్య, వైద్యం పట్ల చిత్తశుద్ధి లేదని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మూడుసార్లు ఆరోగ్యశ్రీని సేవలు నిలిపివేయడం, రోగులు చనిపోవడం జరుగుతూనే ఉందని ఓట్లు దండుకునే పథకాలకు నిధులు మంజూరు చేస్తున్న ప్రభుత్వం పేద రోగుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించడం అన్యాయమన్నారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని పగడ్బందీగా అమలు చేసి చికిత్స అనంతరం భృతిని అందజేసేదని కానీ దానికి భిన్నంగా కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ వారికి అప్పగించడం వల్ల పేద వైద్య విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీని ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించాలని ప్రభుత్వం కుట్ర చేస్తున్నట్టు తెలుస్తుందని, అదే జరిగితే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు తప్పకుండా ఇంటికి పంపిస్తారన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవలు పునరుద్ధరించి పేద రోగులకు సేవలు అందించాలని లేకుంటే వారి ఆగ్రహాన్నికి గురికాక తప్పదన్నారు. ఆరోగ్యశ్రీని పునరుద్ధరించకుంటే ప్రజల తరఫున సీపీఐ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో సీపీఐ అనకాపల్లి జోనల్ కార్యదర్శి తాకాసి వెంకటేశ్వరరావు, సభ్యులు శ్రీరామదాసు అబ్బులు, కోరుబిల్లి శంకరరావు పాల్గొన్నారు.అవి ప్రభుత్వ హత్యలేనని సీపీఐ ధ్వజం -
మిట్టల్ కోసం చంద్రబాబు సర్కార్
సోమవారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026● రైతుల భూముల్లో ఏపీఐఐసీ దౌర్జన్యం ● నష్టపరిహారం చెల్లించకుండా కొబ్బరి తోటల ఽతొలగింపు ● అడ్డుకున్న రైతుపై పోలీసు కేసు బరితెగింపునక్కపల్లి: మిట్టల్ స్టీల్ప్లాంట్కు భూములు అప్పగించే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం అత్యుత్సాహం చూపించడంతో పాటు బరితెగిస్తోంది. నష్టపరిహారం చెల్లించకుండా రైతులనుంచి బలవంతంగా భూములు లాక్కొంటోంది. ఏపీఐఐసీ ఽఅధికారులను పంపించి రైతులపై దౌర్జన్యానికి పాల్ప డుతోంది. రైతుల భూముల్లో కొబ్బరి, జీడిమామిడి తోటలు తొలగిస్తోంది. ఏపీఐఐసీ దౌర్జన్యాన్ని అడ్డుకుంటున్న తమపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారంటూ రైతులు వాపోతున్నారు. మిట్టల్స్టీల్ప్లాంట్కు భూములు కేటాయించే విషయంలో ప్రభుత్వం ఏపీఐఐసీని అడ్డంపెట్టుకుని చేస్తున్న దౌర్జన్యాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. బాధిత రైతులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో బుచ్చిరాజుపేటలో సర్వేనంబరు 210/1లో యలమంచిలి చిన అప్పారావుకు 30 సెంట్ల భూమి ఉంది. ఈ భూమి పూర్వీకులనుంచి సంక్రమించింది. ఈ భూమిలో కొబ్బరి తోటలు వేసి వచ్చిన ఫలసాయంతో కుటుంబాన్ని పోషించుకున్నాడు. అప్పారావు కొద్దిసంవత్సరాల క్రితం మరణించాడు.అతని కుమారుడు రమేష్ తన తండ్రి ద్వారా వచ్చిన భూమిని సాగుచేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ భూమిని ప్రభుత్వం పరిశ్రమల స్థాపన కోసం ఏపీఐఐసీ ద్వారా సేకరించింది. భూసేకరణ కోసం నోటిఫికేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ పర్చేజింగ్ పేరుతో కొనుగోలు చేస్తున్నారు. గతంలో 2010లో ఏపీఐఐసీ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి సేకరించిన భూములకు ఎకరాకు రూ.18లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించారు. ఆ భూముల్లో ఉన్న జీడి,మామిడి, కొబ్బరి తోటలకు అదనంగా పరిహారం చెల్లించారు. ప్రస్తుతం యలమంచిలి అప్పారావుకు చెందిన భూమిని నోటిఫికేషన్లో పేర్కొనకుండా 2018లో డైరెక్ట్ పర్చేజింగ్ ద్వారా కొనుగోలుకు చర్యలు చేపట్టారు. ఎకరాకు రూ.18లక్షల చొప్పున ధర నిర్ణయించి 10సెంట్ల భూమికి నష్టపరిహారం కింద 2018 సంవత్సరం అక్టోబర్ 2న రూ.1.98 లక్షలు చెల్లించారు. మిగిలిన 20 సెంట్ల భూమికి నష్టపరిహారం చెల్లించలేదు. నష్టపరిహారం చెల్లించాలని అప్పారావు ఏపీఐఐసీ అధికారులకు పలు పర్యాయాలు వినతి పత్రాలు ఇచ్చాడు. తిరిగి, తిరిగి అనారోగ్యం పాలై అప్పారావు 2018లో మరణించాడు. తర్వాత ఇతని కుమారుడు యలమంచిలి రమేష్.. ఏిపీఐఐసీ వారు కొనుగోలు చేసిన భూమికి నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ అధికారుల చుట్టూతిరుగుతున్నాడు. 2021 సంవత్సరం డిసెంబర్ 13న ఒకసారి, 2024 సంవత్సరం సెప్టెంబర్ 17న మరోసారి కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్లో దరఖాస్తు ఇచ్చాడు. ఇంతలో అప్పారావుకు చెల్లించాల్సిన నష్టపరిహారం ఏపీఐఐసీ అధికారులు సర్వేనంబరు 191లో భూమి కలిగిన దూళి నూకరాజు అనే వ్యక్తి పేరున గల శిరీష కంపెనీ వారిపేరున జమ చేసినట్లు చావు కబురు చల్లగా చెప్పారు. తమ భూమికి వేరొకరి పేరున నష్టపరిహారం ఎలా జమ చేస్తారని అప్పారావు కొడుకు రమేష్ అధికారులను నిలదీస్తున్నప్పటికీ ఏపీఐఐసీ అధికారులు మాత్రం స్పందించడం లేదు. ఈవ్యవహారం గడచిన ఏడేళ్లనుంచి నడుస్తోంది. 20 సెంట్ల భూమి మాత్రం అప్పారావు కుటుంబం సాగులోనే ఉంది. ఇటీవల మిట్టల్స్టీల్ప్లాంట్కు శంకుస్థాపన చేయడంతో ఈ భూములను తక్షణమే ఖాళీ చేసి స్టీల్ప్లాంట్కు అప్పగించాలని ప్రభుత్వం నుంచి ఒత్తిడి రావడంతో ఆగమేఘాల మీద రెండు రోజుల క్రితం అప్పారావుకు చెందిన 20 సెంట్ల భూమిలో ఉన్న కొబ్బరి చెట్లను ఏపీఐఐసీ అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకుండా తొలగించారు. దీన్ని అడ్డుకునేందుకు వెళ్లిన అప్పారావు కుమారుడు రమేష్, ఇతని బంధువైన జి.బాబూరావు తదితరులపై దౌర్జన్యానికి పాల్పడటమే కాకుండా బాధితరైతులపై అక్రమ కేసులు బనాయించారు. ఇలా మరో పది మంది రైతుల వరకూ నష్ట పరిహారం చెల్లించకుండా ఏపీఐఐసీ అధికారులు దౌర్జనంగా భూములు లాక్కొంటున్నట్టు తెలిసింది. మిట్టల్స్టీల్ ప్లాంట్కు భూములు అప్పగిండచం కోసం నష్టపరిహారం చెల్లించకుండా తమ భూములను దౌర్జన్యంగా లాక్కొంటున్నారంటూ బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అఽధికారాన్ని అడ్డంపెట్టుకుని బలవంతంగా భూములు లాక్కొంటోందని, ఒకరికి చెల్లించాల్సిన నష్టపరిహారం మరొకరికి చెల్లిస్తోందని, దీన్ని ప్రశ్నించిన తమపై పోలీసు కేసులు పెడుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. ఏపీఐఐసీ అధికారుల తీరు చాలా దారుణంగా ఉందని వారు వాపోతున్నారు. అన్యాయంగా తమ భూముల్లో కొబ్బరి తోటలు తొలగించారంటూ ఆరోపిస్తున్నారు. రెండేళ్ల నుంచి రేటు పెంచి నేరుగా రైతులనుంచి కొనుగోలు చేసే భూములకు ఆయా పరిధిలో మార్కెట్ విలువను బట్టి ఎకరాకు రూ.36లక్షల వరకు చెల్లిస్తున్నారని, తమకు మాత్రం నోటిఫికేషన్లో నిర్ణయించిన ధర మాత్రమే చెల్లిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కేసులు పెట్టి తమను భయబ్రాంతులకు గురిచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తమ భూమికి నష్టపరిహారం చెల్లించాలంటూ అప్పారావు కుమారుడు రమేష్ పెట్టుకున్న అర్జీబుచ్చిరాజుపేటలో అప్పారావుకు చెందిన భూమిలో ఏపీఐఐసీ అధికారులు దౌర్జన్యంగా తొలగించిన కొబ్బరి చెట్లు ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు నాగరాజునర్సీపట్నం: డప్పు కళాకారుడైన దళితుడిపై చేయి చేసుకున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు ఎం.నాగరాజు డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నిజనిర్ధారణ కమిటీ విచారణ ప్రారంభించిందని చెప్పారు. స్థానిక అబిద్సెంటర్లో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహానికి ఆదివారం ఆయన పూలమాల వేసి నివాళుల ర్పించారు. అనంతరం మాట్లాడుతూ అమ్మవారి జాతరలో డప్పుకొట్టిన కళాకారుడిపై స్పీకర్ చేయిచేసుకోవడం దారుణమన్నారు. సమాజానికి స్పీకర్ ఇచ్చే సందేశం ఇదేనా అని ప్రశ్నించారు. స్పీకర్ కొడుతుంటే అక్కడే ఉన్న పోలీసులు పేక్షకపాత్ర వహించటం తగదన్నారు. తప్పును కప్పి పుచ్చుకునేందుకు బాధితుడితో బలవంతంగా స్టేట్మెంట్ ఇప్పించారని ఆరోపించారు. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించడంతో పాటు సుప్రీంకోర్టుకు వెళ్తామని తెలిపారు. స్పీకర్ స్థాయి వ్యక్తులు ఈ విధంగా వ్యవహరించడం వల్లే సమాజంలో దళితులపై దాడులు నానాటికి పెరుగుతున్నాయన్నారు. ఈ ఘటనను అన్ని వర్గాల వారు ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.సురేష్, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు మల్లిబాబు, ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ అధ్యక్షుడు చిందాడ నూకేశ్వరరావు, నియోజకవర్గ కన్వీనర్ లోకేష్, ఎంఎస్పీ నియోజకవర్గ కన్వీనర్ ఎం.సతీష్ తదితరులు పాల్గొన్నారు.అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు నాగరాజు, నాయకులున్యాయమూర్తి నరేష్ దంపతులకు అమ్మవారి చిత్రపటాన్ని అందజేస్తున్న ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్ తదితరులుఅన్యాయంగా భూములు లాక్కొంటున్నారు మా కుటుంబానికి చెందిన 30 సెంట్ల భూమిని ఏపీఐఐసీ వారు నేరుగా కొనుగోలు చేశారు. మా నాన్న బతికి ఉన్నప్పుడు కేవలం 10 సెంట్లకు మాత్రమే నష్టపరిహారం చెల్లించారు. మిగిలిన భూమికి నష్టపరిహారం ఇవ్వాలని ఏడేళ్లనుంచి నేను దరఖాస్తు చేస్తూ ఏపీఐఐసీ అధికారుల చుట్టూ తిరుగుతున్నాను. మాకు ఇవ్వాల్సిన డబ్బులు వేరొకరి ఖాతాలో జమ చేశామని చెబుతున్నారు. ఇదెక్కడి అన్యాయం. వారి ఖాతాలో వేసిన డబ్బులు వాపసుతీసుకుని మా ఖాతలో వేయాలని కోరుతున్నా పట్టించుకోకపోగా రెండు రోజుల క్రితం దౌర్జన్యంగా మా భూమిలో కొబ్బరి తోటలు తొలగించారు.అడ్డుకున్న మాపై పోలీసు కేసులు పెట్టారు. ఇది చాలా అన్యాయం. భయపెట్టి బలవంతంగా భూములు లాక్కొవాలని చూస్తున్నారు. – యలమంచలి రమేష్, బాధిత రైతు -
నూకాంబిక సన్నిధిలో కూచిపూడి వైభవం
అనకాపల్లి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అనకాపల్లి నూకాంబికా అమ్మవారి జాతర మహోత్సవాలు ఆదివారం అంబరాన్ని తాకుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో కూచిపూడి నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విశాఖపట్నంకు చెందిన ‘సిరి డ్యాన్స్ అకాడమీ’ వ్యవస్థాపకురాలు, ప్రముఖ నృత్య గురువు స్వర్ణ టీచర్ ఆధ్వర్యంలో చిన్నారులు ప్రదర్శించిన నాట్య విన్యాసాలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. శాసీ్త్రయ నృత్య రీతులతో అలరించిన చిన్నారులు కూచిపూడి నృత్యంలోని ప్రాశస్త్యాన్ని చాటిచెబుతూ చిన్నారులు చేసిన ప్రదర్శనలు అత్యంత నిష్ణాతులైన కళాకారులను తలపించాయి. సంప్రదాయబద్ధమైన వేషధారణతో, ముఖంలో నవరసాలను పలికిస్తూ వారు చేసిన అభినయం చూపరులను కట్టిపడేసింది. గణపతి ప్రార్థనతో మొదలైన ఈ నృత్యోత్సవం, అమ్మవారి స్తోత్రాలు, తరంగం వంటి క్లిష్టమైన నృత్య రీతులతో కొనసాగింది. చిన్నారులు లయబద్ధమైన పాదముద్రలతో, చేతి ముద్రలతో కూచిపూడి సొగసును వేదికపై ఆవిష్కరించారు. అభినందనల జల్లు ఆ బాల కళాకారుల కళ్లలోని మెరుపు, దేహ కదలికల్లోని నృత్య సౌరభం అమ్మవారి సన్నిధిలో ఒక అద్భుత దృశ్యకావ్యాన్ని ఆవిష్కరించాయని అతిథులు అభినందించారు. అకాడమీ వ్యవస్థాపకురాలు స్వర్ణ టీచర్ను, ఆమె శిష్య బృందాన్ని ఆలయ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ప్రముఖ గాయకులు మల్లికార్జున, గోపిక పూర్ణిమ కూడా వీరిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
ఆంధ్రాకు!
ఒడిశాకు..కొసరుదక్షిణ కోస్తా రైల్వే జోన్ సరిహద్దుల విభజనలో బోర్డు ‘తొండాట’ కేవలం 7 స్టేషన్లను మాత్రమే విశాఖ డివిజన్లో కలిపినట్లు ప్రకటన రూ.వేల కోట్ల ఆదాయం ఇచ్చే కేకే లైన్పై పట్టు విడవని ఒడిశా కేంద్రంపై ఒత్తిడి తేవడంలో కూటమి ఎంపీల మౌనం రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్సార్సీపీ ఎంపీల పోరాటంరాయగడ డివిజన్ పరిధి వాల్తేరులోని అత్యంత కీలకమైన కొత్తవలస–బచెలి (కేకే లైన్), కూనేరు–తేరువలి జంక్షన్, సింగాపూర్–కోరాపుట్ జంక్షన్, పర్లాకిమిడి–గుణుపూర్ స్టేషన్ల మధ్య ఉన్న సుమారు 680 కిలోమీటర్ల సెక్షన్. విశాఖపట్నం డివిజన్ పరిధి పలాస–విశాఖపట్నం–దువ్వాడ, కూనేరు–విజయనగరం, నౌపడ జంక్షన్–పర్లాకిమిడి, బొబ్బిలి జంక్షన్–సాలూరు, సింహాచలం నార్త్–దువ్వాడ బైపాస్, వడ్లపూడి–దువ్వాడ, విశాఖ స్టీల్ ప్లాంట్–జగ్గయ్యపాలెం స్టేషన్ల మధ్య ఉన్న సుమారు 410 కిలోమీటర్ల సెక్షన్.సాక్షి, విశాఖపట్నం : దశాబ్దాల కాలంగా ఉత్తరాంధ్ర ప్రజలు కంటున్న కల ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’. ఈ కల నెరవేరే సమయం ఆసన్నమైనా, ఆ సంతోషం ఉత్తరాంధ్ర ప్రజల్లో కనిపించడం లేదు. రైల్వే బోర్డు అనుసరిస్తున్న ‘సరిహద్దుల విభజన’ విధానమే ఇందుకు ప్రధాన కారణం. విశాఖపట్నం కేంద్రంగా కొత్త జోన్ వస్తుందని సంబరపడే లోపే, ఆ జోన్కు గుండెకాయ లాంటి ‘వాల్తేరు డివిజన్’ను ముక్కలు చేసి, అత్యంత కీలకమైన ప్రాంతాలను ఒడిశాలోని రాయగడ డివిజన్కు కట్టబెట్టే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. తాజాగా కేవలం ఏడు స్టేషన్లను మాత్రమే విశాఖ డివిజన్లో కలుపుతూ రైల్వే బోర్డు జారీ చేసిన ఉత్తర్వులు, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనన్న విమర్శలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. విభజన రాజకీయం.. వాల్తేరుపై వేటు 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం.. 2019 ఫిబ్రవరిలో విశాఖపట్నం కేంద్రంగా ’దక్షిణ కోస్తా రైల్వే జోన్’ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఈ ప్రకటనతో పాటే శతాబ్ద కాలపు చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్ను విభజిస్తున్నట్లు వెల్లడించడంతో అప్పట్లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. వాల్తేరు డివిజన్ను యథాతథంగా కొనసాగించాలని వైఎస్సార్సీపీ ఎంపీలు రైల్వే మంత్రికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కేంద్రం, 2019 ఆగస్టులో వాల్తేరు డివిజన్ పేరును ‘విశాఖపట్నం డివిజన్’గా మారుస్తామని హామీ ఇచ్చి అమలు చేసింది. కానీ ఆ తర్వాత కూడా కీలకమైన కేకే లైన్ను రాయగడ డివిజన్లోనే చేర్చింది. దీనిని మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న వైఎస్సార్సీపీ.. కేంద్రానికి, రైల్వే బోర్డుకు విన్నవిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో డివిజన్ విభజన అంశాన్ని కేంద్రం కొంతకాలం వాయిదా వేసింది. అనంతరం 2025 జనవరి 8న విశాఖలోని ముడసర్లోవలో జోన్ ప్రధాన కార్యాలయానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ప్రతిపాదిత దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో వాల్తేరు డివిజన్ను విడగొడుతూ అధికార పరిధిని ఖరారు చేశారు. ఏడు స్టేషన్ల ‘బిచ్చం’.. కూటమి ఎంపీల మౌనం తాజాగా రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామేశ్వర్ మీనా ఉత్తర్వుల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాలోని పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు ఉన్న పలాస, సుమ్మాదేవి, మందస రోడ్డు, బారువ, సోంపేట, జాడుపూడి, ఇచ్ఛాపురం స్టేషన్లను మాత్రమే విశాఖ డివిజన్లో కలుపుతున్నారు. మరోవైపు కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన ఎంపీల మౌనం విస్మయానికి గురిచేస్తోంది. రాష్ట్ర ఆదాయానికి మూలాధారమైన కేకే లైన్ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవడంలో వీరు పూర్తిగా విఫలమవుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సైతం ఈ విషయంలో మిన్నకుండిపోయారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇకనైనా కళ్లు తెరవకుంటే.. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ ఇప్పుడు తుది దశకు చేరుకుంది. సరిహద్దుల నిర్ణయంలో గనుక ఇప్పుడు వెనక్కి తగ్గితే, భవిష్యత్తులో విశాఖ జోన్ ఆర్థికంగా నిలదొక్కుకోవడం అసాధ్యం. కేవలం ఏడు స్టేషన్ల బదిలీతో సంతృప్తి చెందితే, వేల కోట్ల ఆదాయాన్ని పొరుగు రాష్ట్రానికి ధారపోసినట్లే అవుతుంది. ఈ అంశంలో వైఎస్సార్సీపీ ఎంపీలు నిరంతరం పోరాటం చేస్తున్నప్పటికీ, అధికార కూటమి ఎంపీల నుంచి స్పందన లేకపోవడం రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారింది.చేజారుతున్న ‘బంగారు బాతు’ వివాదమంతా కొత్తవలస – కిరండూల్ (కేకే లైన్) చుట్టూనే తిరుగుతోంది. ఛత్తీస్గఢ్లోని గనుల నుంచి ఇనుప ఖనిజాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్, పోర్టుకు తరలించే ఈ మార్గం భారత రైల్వేలోనే అత్యధిక ఆదాయం ఇచ్చే సెక్షన్లలో ఒకటి. ఈ ఒక్క లైన్ ద్వారానే ఏడాదికి సుమారు రూ. 9 వేల కోట్ల ఆదాయం వస్తుంది. ప్రస్తుతం ఈ ఆదాయం ఒడిశా కేంద్రంగా ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వేకు వెళ్తోంది. కొత్త జోన్ వస్తే ఈ ఆదాయం ఏపీకి చెందుతుందన్న భయంతో, ఒడిశా ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఈ లైన్ను రాయగడ డివిజన్లో కలిపించుకుంది. రైల్వే బోర్డు కూడా ఒడిశా ఒత్తిళ్లకు తలొగ్గి, లాభసాటి మార్గాలను అక్కడ ఉంచి.. కేవలం ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండి, నిర్వహణ ఖర్చులు భారమయ్యే స్టేషన్లను మాత్రమే ఆంధ్రాకు కేటాయిస్తోంది. -
జగ్జీవన్రామ్ ఆశయ సాధనకు పాటుపడాలి
మునగపాక: దళితజాతి సముద్దరణ కోసం తపించిన మహోన్నత వ్యక్తి బాబూ జగ్జీవన్రామ్ ఒక్కరే అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కొనియాడారు. స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధానమంత్రి జగ్జీవన్రామ్ జయంతి కార్యక్రమం ఆదివారం మునగపాకలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జగ్జీవన్రామ్ చిత్రపటానికి ప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ప్రసాద్ మాట్లాడుతూ అంటరానితనానికి వ్యతిరేకంగా విద్యార్థి దశ నుంచే ఉద్యమాలు చేసి జన చైతన్యం తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఆయన ఆశయ సాధనకు అందరూ పాటుపడాలన్నారు. అంబేడ్కరిజమ్ పునాది అసోసియేషన్ కన్వీనర్ రాజాన బుజ్జిబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కోనపల్లి రామ్మోహనరావు, పెంటకోట సారథి, ఎస్సీ సెల్ విభాగం మండల అధ్యక్షుడు దిమ్మల శివ, పెంటకోట శ్రీనివాసరావు, ఆడారి రమణబాబు,కాండ్రేగుల రాజు, భీశెట్టి ఈశ్వరరావు పాల్గొన్నారు. నాగులాపల్లి జగ్జీవన్రామ్ కాలనీలో జరిగిన జయంతి కార్యక్రమంలో అనకాపల్లి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ దొడ్డి శ్రీనివాసరావు జగ్జీవన్రామ్కు నివాళులర్పించారు. ఎంపీటీసీ చిందాడ దేవి, పొలమరశెట్టి నాగు,గోసాల గోవింద, పొలమరశెట్టి నూకాలయ్య, డొక్కా శివకుమార్, రాజు పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ -
మహిళను మోసగించి, సజీవ దహనానికి యత్నం
కూర్మన్నపాలెం (విశాఖ): కల్లబొల్లి కబుర్లతో ఓ మహిళను నమ్మించి, ఆమెను శారీరకంగా లొంగదీసుకోవడమే కాకుండా, ఏకంగా ఆమెను అంతం చేయాలనే క్రూర ఆలోచనతో ఇంటికి నిప్పు పెట్టిన అమానుష ఘటన వడ్లపూడి అప్పికొండ కాలనీలో కలకలం రేపింది. దువ్వాడ సీఐ కె.మల్లేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. భర్త మరణించిన ఓ మహిళ తన కుమారుడితో కలిసి వడ్లపూడిలో నివాసముంటోంది. ఈ క్రమంలో రాంబిల్లి మండలం రాజుపాలేనికి చెందిన సాయికృష్ణ అనే వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో సహజీవనం చేసిన సాయికృష్ణ, ఆ తర్వాత ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్ట్ చేయగా, ఐదు నెలలుగా జైల్లో ఉన్న సాయికృష్ణ ఇటీవలే విడుదలయ్యాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా సాయికృష్ణ బుద్ధి మార్చుకోకుండా, శుక్రవారం రాత్రి పుష్ప ఇంటికి వెళ్లి ఆమెను బ్లాక్మెయిల్ చేసి శారీరకంగా అనుభవించాడు. శనివారం రాత్రి కూడా ఆమెతో ఘర్షణకు దిగి అక్కడి నుండి వెళ్లిపోయాడు. అయితే ఆమైపె కక్ష పెంచుకున్న నిందితుడు ఆదివారం తెల్లవారుజామున మళ్లీ వచ్చి ఇంటి బయట ఉన్న ఎలక్ట్రిక్ స్కూటీపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ఒక్కసారిగా మంటలు వ్యాపించి స్కూటీతో పాటు ఇంట్లోని సామగ్రి కూడా తగులబడింది. మంటలను గమనించిన ఇరుగుపొరుగు వారు వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు సకాలంలో చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. అదృష్టవశాత్తూ స్థానికుల చొరవతో పుష్ప, ఆమె కుమారుడు పెను ప్రమాదం నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. లేనిపోతే సజీవ దహనం అయ్యేవారని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు సాయికృష్ణకు అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నట్లు విచారణలో తేలింది. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించగా, ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఈ కిరాతక ఘటనపై కేసు నమోదు చేసిన సీఐ మల్లేశ్వరరావు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.ఇంటికి నిప్పుపెట్టిన వైనం -
అత్యున్నత త్యాగానికి సెల్యూట్
సింథియా: తోటి మనిషి ప్రాణాన్ని కాపాడటం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన తూర్పు నావికాదళ పెట్టీ ఆఫీసర్, దివంగత దీపక్ కుమార్ వీరోచిత త్యాగానికి భారతావని అత్యున్నత పురస్కారంతో నివాళులర్పించింది. మానవత్వంతో ఆయన చూపిన అసాధారణ ధైర్యసాహసాలకు గుర్తింపుగా భారత రాష్ట్రపతి ప్రకటించిన ‘సర్వోత్తమ జీవన్ రక్షా పతకాన్ని’ ఏప్రిల్ 1న ముంబైలో జరిగిన నావికా దళ పురస్కార వేడుకలో ప్రదానం చేశారు. భారత నావికాదళ అధిపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును దీపక్ కుమార్ సతీమణి రౌషానీ కుమారి కన్నీటి పర్యంతమవుతూ అందుకున్నారు. ఆ వేదికపై ఉన్న ప్రతి ఒక్కరూ దీపక్ కుమార్ చేసిన త్యాగాన్ని తలచుకుని నిశ్శబ్దంగా నివాళులర్పించారు. ఏం జరిగిందంటే? 2024, సెప్టెంబర్ 14న అనకాపల్లి జిల్లా దేవరాపల్లి సమీపంలో గల సరియా జలపాతం వద్ద ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. జలపాతంలో ఒక్కసారిగా పెరిగిన నీటి ఉధృతికి ఒక వ్యక్తి కొట్టుకుపోతుండగా, ఏమాత్రం ఆలోచించకుండా దీపక్ కుమార్ నీటిలోకి దూకారు. ప్రాణాలకు తెగించి ఆ వ్యక్తిని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయితే, వరద ఉధృతి అత్యంత బలంగా ఉండటంతో ఇద్దరూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి వీరమరణం పొందారు. దీపక్కుమార్ చేసిన ఈ మహోన్నత త్యాగం భారత నావికాదళం అత్యున్నత సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఆయన అకుంఠిత ధైర్యానికి భారత నావికాదళం వందనం చేస్తూ, ఈ అవార్డు ద్వారా దేశం ఆయన వీరోచిత గాథను శాశ్వతంగా స్మరించుకుంటుందని తెలిపారు. -
సకలజీవులపై ప్రేమ, కరుణ కలిగి ఉండాలి
బయ్యవరం వద్ద పాదయాత్ర ముగించి ధ్యానం చేస్తూ విశ్రమిస్తున్న దిగంబర జైన ముని ఆచార్య ప్రముఖ్ సాగర్ జి మహారాజ్ కశింకోట: సకల జీవుల పట్ల ప్రేమ, గౌరవం,కరుణ కలిగి ఉండాలని దిగంబరజైన ముని ఆచార్య ప్రముఖ్ సాగర్జి మహారాజ్ ఉద్బోధించారు. మండలంలోని బయ్యవరం గ్రామానికి దిగంబర జైన మునులైన సాగర్జి మహారాజ్ సహా ప్రభాకర్ సాగర్ చేపట్టిన మంగళ అహింస పాద యాత్ర శనివారం సాయంత్రం చేరింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సకల జీవుల పట్ల ప్రేమ, గౌరవం,కరుణ కలిగి ఉండాలనే సందేశాన్ని బోధించడానికి దేశ వ్యాప్తంగా పాదయాత్రలు చేస్తున్నామన్నారు. గత ఏడాది నవంబర్ 30న కోల్కత్తా నుంచి చేపట్టిన పాద యాత్ర కర్నాటకలోని బెంగళూరుకు వచ్చే జులై వరకు సాగనుందన్నారు. ప్రతి రోజు సుమారు 25 కిలో మీటర్లు యాత్ర చేస్తున్నట్టు చెప్పారు. -
వైఎస్సార్సీపీ హయాంలోనే గ్రామాభివృద్ధి
చోడవరం: వైఎస్సార్సీపీ హయాంలోనే అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాయని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. పంచాయతీ సర్పంచ్ల పదవీ ముగిసిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని 91 మంది సర్పంచ్లను శనివారం ఘనంగా సత్కరించారు. చోడవరంలో జరిగిన సన్మాన సభలో చోడవరం, బుచ్చెయ్యపేట, రావికమతం, రోలుగుంట మండలాల నుంచి వివిధ గ్రామాల సర్పంచ్లు, మండల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం వైఎస్సార్సీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నెరవేర్చారన్నారు. పంచాయతీలను బలోపేతం చేస్తూ గ్రామ సచివాలయ వ్యవస్థను తెచ్చారన్నారు. అన్ని శాఖల సచివాలయ ఉద్యోగులు సర్పంచ్ల పర్యవేక్షణలో పనిచేసే మహోన్నత విధానాన్ని తెచ్చారన్నారు. సచివాలయ వ్యవస్థలో వలంటీర్లను తెచ్చి సంక్షేమ పథకాలన్నీ నేరుగా ప్రజల ఇంటి వద్దకే అందించేలా చేశారని కొనియాడారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగకుండా ప్రతీ పని వలంటీర్ల ద్వారా సచివాలయంలోనే జరిగేలా ఒక కొత్త వ్యవస్థను తెచ్చి దేశ చరిత్రలో రికార్డు సృష్టించిన ఘనత జగన్మోహన్రెడ్డిదే అన్నారు. ప్రతీ పంచాయతీలో రూ. 2.5 కోట్లతో పంచాయతీ భవనాలు, సచివాలయం, కమ్యూనిటీ ఆస్పత్రి, రైతు భరోసా కేంద్రం కట్టించి, ఆయా కార్యాయాల్లోనే పూర్తి స్థాయిలో ప్రజలు సేవలు అందించారన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ ఐదేళ్లపాటు గ్రామ స్థాయిలో ప్రజలకు ఎంతో సేవలు అందించిన సర్పంచ్లకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంటు పరిశీలకురాలు శోభా హైమావతి, చోడవరం నియోజకవర్గ పరిశీలకుడు గండి రవికుమార్, రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు, సంయుక్త కార్యదర్శి దొండ రాంబాబు, జెడ్పీటీసీ పోతల శ్రీనివాసరావు, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు నాగులాపల్లి రాంబాబు, ఎంపీపీలు గాడి కాసు, పైల రాజు, యర్రంశెట్టి శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీలు బైన ఈశ్వరరావు, దొండా నారాయణమూర్తి, శరగడం నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
స్పీకర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి
నర్సీపట్నం: జాతరలో దళితుడిని కొట్టిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు బహిరంగ క్షమాపణ చెప్పాలని విదసం విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు డిమాండ్ చేశారు. పండగలో డప్పు కొట్టడానికి వచ్చిన దళితుడిని స్పీకర్ చెంప పగల గొట్టడాన్ని నిరసిస్తూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో శనివారం నర్సీపట్నం అబిద్ సెంటర్లోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ వద్ద ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేల మంది సమక్షంలో దళితుడిని బహిరంగంగా కొట్టడం స్పీకర్ అహంకారానికి నిదర్శనమన్నారు. పండగలో ప్రజలంతా సంతోషంతో ఉంటే, దళితులను లక్ష్యంగా చేసుకుని దాడికి దిగడం అమానుషమన్నారు. తప్పును సరిదిద్దుకోకుండా బాధితుడిని బెదిరించి రాజకీయ ప్రకటన ఇప్పించడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. తమకు రాజకీయాలు అనవసరమని, తప్పు ఎవరు చేసినా చట్టం ముందు అందరూ సమానమే అన్నారు. నేతల నాగేశ్వరరావు మాట్లాడుతూ అయ్యన్నపాత్రుడుకు దళితులను అవమానించటం పరిపాటిగా మారిందన్నారు. పదవి ఉంటే నేల మీద నిలబడు అన్నారు. మట్ల అప్పారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విదసం నాయకులు లావణ్య, గోడి వెంకటేశ్వరరావు, అల్లంపల్లి ఈశ్వరరావు, ఈరెల్లి సుదీర్కుమార్, చెక్క రాంబాబు, తాతబాబు తదితరులు పాల్గొన్నారు. స్పీకర్ దళితుడిని కొట్టడం అమానుషం: కె.వి.పి.ఎస్ నర్సీపట్నం: అమ్మవారి జాతరలో డప్పు కొట్టడానికి వచ్చిన దళితుడిని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కొట్టడం అమానుషమని కె.వి.పి.ఎస్. నాయకులు పేర్కొన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ ఈ విధంగా దాడి చేయటం దారుణమన్నారు. స్పీకర్ వంటి వ్యక్తుల వల్లే దళితులపై దాడులు నానాటికీ పెరుగుపోతున్నాయన్నారు. తక్షణమే స్పీకర్ అయ్యన్న బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
మునగపాక ఎంపీపీగా కృష్ణవేణి ఎన్నిక
మునగపాక: స్థానిక మండల పరిషత్ అధ్యక్షురాలిగా ఉమ్మలాడ ఎంపీటీసీ మొల్లేటి కృష్ణవేణి ఎన్నికయ్యారు. ఇటీవల ఎంపీపీ మళ్ల జయలక్ష్మి, వైస్ ఎంపీపీలు బోజా లక్ష్మితో పాటు చిందాడ దేవీలపై వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు అవిశ్వాసం ప్రకటించడంతో అప్పటి ఆర్డీవో ఆయీషా సమక్షంలో అవిశ్వాసం నెగ్గిన విషయం తెలిసిందే. దీంతో నూతన ఎంపీపీ ఎన్నికను శనివారం తన కార్యాలయంలో ఎంపీడీవో ఉషారాణి నిర్వహించారు. ఎంపీపీగా ఉమ్మలాడ ఎంపీటీసీ మొల్లేటి కృష్ణవేణి పేరును మునగపాక ఎంపీటీసీ–2 సూరిశెట్టి రమణ ప్రతిపాదించగా ఇతర వైఎస్సార్సీపీ సభ్యులు బలపరిచారు. సమావేశానికి మొత్తం 13 మంది సభ్యులు హాజరుకాగా వారిలో 11 మంది కృష్ణవేణికి అనుకూలం, మరో ఇద్దరు సభ్యులు వ్యతిరేకం ప్రకటించినట్టు ఎంపీడీవో తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ సూపరింటెండెంట్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎంపీపీగా ఎంపికై న కృష్ణవేణి నారాయణరావు దంపతులను ఇతర ఎంపీటీసీలంతా ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు పెంటకోట స్వామి సత్యనారాయణ,ఎంపీటీసీలు సూరిశెట్టి రమణ,బోడకుర్తి గణేష్, మద్దాల వీరునాయుడు,కాండ్రేగుల కిరణ్కుమార్,మళ్ల కాశీ సురేష్, ఇల్లా శిరీషా, కాండ్రేగుల వెంకటలక్ష్మి, బొడ్డేడ హైమావతి, కర్రి సంజీవి,శరగడం అప్పలనరసమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ఆగిఉన్న లారీనీ ఢీకొన్న వ్యాన్
ప్రమాదవివరాలు తెలుసుకుంటున్న ఎస్ఐ సన్నిబాబు, (ఇన్సెట్) రామ్మూర్తి మృతదేహం నక్కపల్లి: జాతీయరహదారిపై వెదుళ్లపాలెం జంక్షన్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డుప్రమాదంంలో ఒక వ్యక్తి మరణించగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ఐ సన్నిబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం గింజేరి గ్రామానికి చెందిన సుమారు 10 మంది వ్యాన్లో ఒంగోలు వెళ్లారు.అక్కడ ఫంక్షన్ చూసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. వీరు ప్రయాణిస్తున్న వ్యాన్ నక్కపల్లి సమీపంలో వెదుళ్లపాలెం జంక్షన్ వద్ద రోడ్డుపక్కన పార్క్చేసిన ఉన్న లారీని వెనుకనుంచి ఢీకొంది. ఈఘటనలో వ్యాన్లో డ్రైవర్ పక్కన కూర్చొన్న రాజాన రామ్మూర్తి(60) తీవ్రగాయాలతో అక్కడికక్కడే మరణించాడు.వ్యాన్లో ఉన్న ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలోవిజయనగరం జిల్లా ఎస్.కోట మండలం కొట్టాంకు చెందిన దండుపాటి శాంతి, ఇదే మండలం చామలపల్లిగ్రామానికి చెందిన జుత్తాడ దేవి,కొత్తవలస మండలం ముమ్మలోడుపాలెంకు చెందిన మంతిన దుర్గమ్మ, చామలపల్లి గ్రామానికి చెందిన రాపర్తి రామలక్ష్మి,గింజేరి గ్రామానికి చెందిన నానిపల్లి లక్ష్మి ఉన్నారు. వీరికి నక్కపల్లి ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించి విశాఖ కేజీహెచ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
తిరుమల పవిత్రతను కాపాడాలి
● టీటీడీ చైర్మన్ను పదవి నుంచి తొలగించాలంటూ వైఎస్సార్సీపీ నాయకుల నిరసన ● వెంకన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు ● భారీగా హాజరైన పార్టీ శ్రేణులు అసాంఘిక, అనైతిక చర్యలకు పాల్పడి తిరుమల పుణ్యక్షేత్రం పవిత్రతను దెబ్బ తీసిన బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ పదవి నుంచి తప్పించాలని వైఎస్సార్ సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఆయనను ఆ పదవి నుంచి తొలగించి, తిరుమల పవిత్రను కాపాడాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడును చైర్మన్ పదవి నుంచి తొలగించాలంటూ నినాదాలు చేశారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన టీటీడీ చైర్మన్ బిఆర్.నాయుడును విధుల నుంచి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి దేమునిగుమ్మం వేంకటేశ్వరస్వామి ఆలయంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, మాజీ ఎంపీ బి.వి.సత్యవతి, మాడుగుల వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైఎస్సార్సీపీ శ్రీకాకుళం, మన్యం జిల్లాల రీజనల్కోఆర్డినేటర్, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, వైఎస్సార్ సీపీ జోన్–1 మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ అనురాధ, చోడవరం వేంకటేశ్వరస్వామి ఆలయంలో మాజీమంత్రి, వైఎస్సార్సీపీ ఉభయగోదావరి జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్, చోడవరం నియోజకవర్గం సమన్వయకర్త గుడివాడ అమర్నాఽథ్,ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కంబాలజోగులు, వైఎస్సార్సీపీ రాష్ట్రకార్యదర్శి వీసం రామకృష్ణ, యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో సమన్వయకర్త కరణం ధర్మశ్రీ తదితరులు, నర్సీపట్నంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో వైఎస్సార్సీపీ నర్సీపట్నం సమన్వయ కర్త ఉమాశంకర్ గణేష్ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. – సాక్షి నెటవర్క్ రాంబిల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో కొబ్బరికాయలు కొడుతున్న వైఎస్సార్సీపీ యలమంచిలి నియోజకవర్గ సమన్వకర్త కరణం ధర్మశ్రీ, పార్టీ నాయకులు బీఆర్ నాయుడిని తొలగించాలంటూ ప్లకార్డులతో ఉపమాకలో నిరసన వ్యక్తం చేస్తున్న పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు పార్టీ నాయకులతో కలిసి ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే, నర్సీపట్నం సమన్వయకర్త ఉమాశంకర్ గణేష్ -
లాడ్జీలో కర్ణాటక వ్యక్తికి తీవ్ర గాయాలు
నర్సీపట్నం: పట్టణంలోని లాడ్జీలో కర్ణాటక వ్యక్తి తీవ్ర గాయాల పాల య్యాడు. అతడితోపాటు వచ్చిన వారు బి.ఎన్.సాగర్ పేరు మీద లాడ్జిలో రూమ్ తీసుకున్నారు. రెండు రోజులుగా నలుగురు కలిసి ఉంటున్నారు. శనివారం రాత్రి రూమ్లో బీరు సీసాలు పడి ఉన్నాయి. వారిలో ఒకరిపై దాడి జరిగింది. దాడికి గురైన వ్యక్తి అపసార్మక స్థితిలో పడి ఉన్నాడు. లాడ్జీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్షతగాత్రుడితో దిగిన బి.ఎన్.సాగర్, మరో ఇద్దరు రూమ్ నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాలతో ఉన్న వ్యక్తిని పోలీసులు సమీపంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై కృష్ణమూర్తి తెలిపారు. -
ఎన్టీఆర్ ఆస్పత్రికి నిర్లక్ష్య సుస్తీ..!
సాక్షి, అనకాపల్లి: జిల్లా కేంద్రం అనకాపల్లిలో గల ఎన్టీఆర్ ఆస్పత్రిలో సకాలంలో సక్రమంగా వైద్య సేవలు అందకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం, రెండు గంటల పాటు విద్యుత్ సరఫరాను నిలిపివేయడం, సకాలంలో వైద్యం అందకపోవడంతో ఈ ఆస్పత్రిలోని ఎన్ఎన్సీయూ వార్డులో చికిత్స పొందుతున్న మూడు రోజుల పసికందు ప్రాణాలు శుక్రవారం గాలిలో కలిసిపోయాయి. సకాలంలో వైద్య సేవలందని ఘటనలు తరచూ జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. గతంలో కూడా చాలాసార్లు విద్యుత్ సమస్యలతో ఆస్పత్రిలో అవుట్ పేషెంట్లు ఇబ్బందులకు గురయ్యారు. ఈ ఆస్పత్రికి అనకాపల్లి, చోడవర ం, మాడుగుల, పాయకరావుపేట, నర్సీపట్నం, యలమంచిలి నియోజకవర్గాల నుంచి వైద్యం కోసం రో గులు వస్తుంటారు. చంద్రబాబు ప్రభుత్వ పాలనలో ఆస్పత్రిలో సేవలు నానాటికీ తీసి కట్టుగా మారాయి. వైద్యులు లేరని సూపరింటెండెంట్ ప్రభుత్వానికి లేఖ రాసినా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇష్టారాజ్యం... అడిగేవారే లేకపోవడంతో వైద్యులు, సిబ్బంది ఇష్టారాజ్యమైంది. చుట్టపుచూపుగా వచ్చిపోతున్నారన్న ఆరోపణలున్నాయి. ఆస్పత్రిలో తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోతుండడంతో రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. గత వారం రోజులుగా విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నా అధికారులు పట్టించుకోలేదు. జనరేటర్ సదుపాయం ఉన్నా..10 నిమిషాల పాటే పనిచేస్తుంది. మందుల కొరత, పారామెడికల్ సిబ్బంది కొరత పట్టిపీడిస్తోంది. గత ప్రభుత్వంలో కొనుగోలు చేసిన స్కానింగ్ యంత్రం నిర్వహణ ఖర్చులకు కూడా చంద్రబాబు సర్కార్ నిధులు కేటాయించలేదు. ఓపీ ఫుల్... వైద్యం నిల్ జిల్లా ఆస్పత్రికి వచ్చే రోగులు సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రోజువారీ సగటున 500 నుంచి 600 వరకూ ఓపీ నమోదు అవుతోంది. వారికి తగ్గట్టుగా ఆస్పత్రిలో సదుపాయాలను మెరుగుపరచలేదు. వైద్యపరికరాలు, మందులు, వీల్చైర్లు, ఇతర మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉంది. వైద్యుల కొరత కారణంగా రోగులు గంటల తరబడి పడిగాపులు కాయవలసివస్తోంది. ఓపీలో చూపించుకుని వైద్యుడి సలహామేరకు వార్డులో చేరితే ఏమాత్రం ఎమర్జెన్సీఅయినా తక్షణమే కేజీహెచ్కి వెళ్లిపోవాలని రిఫర్ చేస్తున్నారు. గైనిక్ రోగులకు చిన్నపాటి ఎమర్జెన్సీ ఉన్నా కేజీహెచ్కు పంపుతున్నారు. ఆర్థిక స్థోమత ఉన్నవారు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు. నాడు చేసిన అభివృద్ధే... వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ‘నాడు–నేడు’లో భాగంగా ఎన్టీఆర్ ఆస్పత్రి ఆధునికీకరణ, మౌలిక వసతుల కల్పనకు రూ.1.5 కోట్లు మంజూరయ్యాయి. గత ప్రభుత్వంలో సీఎస్ఆర్ నిధులతో రూ.1.85 కోట్లతో సిటీస్కాన్ యంత్రం కొనుగోలు చేశారు.ఆ తరువాత ఆస్పత్రిలో జరిగిన అభివృద్ధి పనులు దాదాపు శూన్యమని చెప్పొచ్చు. సిబ్బంది ఏరీ ? నడవలేని స్థితిలో ఉన్న రోగులను తీసుకెళ్లేందుకు వీల్చైర్లున్నా వాటిని తోసేందుకు తగిన సిబ్బంది లేరు. దీంతో రోగి బంధువులే వార్డు బాయ్లుగా మారాల్సివస్తోంది. వైద్యులు, స్టాఫ్ నర్సులు, వైద్య సిబ్బంది కొరత, తగిన మందులు, సౌకర్యాలు, వసతులులేక రోగులు ఇక్కట్లకు గురవుతున్నారు. ఏసీ సౌకర్యం లేకపోవడంతో స్కానింగ్, ఎక్స్రే యంత్రాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. ఆల్ట్రా స్కానింగ్ రూంలో ఒక్కరే రేడియాలజిస్టు అందుబాటులో ఉన్నారు. నెలవారీ చెకప్లో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన గర్భిణులను సైతం మూడు గంటలకు పైగా స్కానింగ్ సెంటర్ల వద్ద పడిగాపులుకాయాల్సి వస్తోంది. 42 మంది వైద్యులకు గాను 32 మాత్రమే అందుబాటులో ఉన్నారు. జనరల్ మెడిసిన్ విభాగంలో ముగ్గురికి గాను ఇద్దరు మాత్రమే ఉన్నారు. పీడియాట్రిక్ వైద్యులు ఒక్కరూ కూడా లేరు. ఎన్ఎన్సీయూ వార్డులో చిన్న పిల్లల వైద్యులు ఇద్దరు ఉండాలి, ప్రస్తుతం రెండు పోస్టులూ ఖాళీగా ఉన్నాయి. ఇద్దరు అనస్థీషియా వైద్యులకు గాను ఒకరు మాత్రమే అందుబాటులో ఉన్నారు. కంటి వైద్య నిపుణులు ఇద్దరికిగాను, ఒక్కరే ఉన్నారు. సైకియాట్రిస్ట్ వైద్యులు లేరు.స్టాఫ్ నర్సులు, పారామెడికల్ స్టాఫ్ 510 మంది ఉండాలి. వీరు రెండు షిఫ్ట్లలో విధులు నిర్వహించా లి. కానీ ప్రస్తుతం 215 మంది మాత్రమే పనిచేస్తు న్నారు. కాంట్రాక్ట్, రెగ్యులర్ స్టాఫ్ నర్సులు 56 మంది పనిచేస్తున్నారు. ఆస్పత్రిలో సర్జికల్ గ్లౌజులు, కాటన్, ఐవి క్యానల్, స్కానింగ్ జల్, కొన్ని రకాల సర్జికల్ పరికరాలు,ఫాంటాప్ ఇంజక్షన్ల కొరత ఎక్కువగా ఉంది.జిల్లా కేంద్రం అనకాపల్లిలో గల ఎన్టీఆర్ ప్రభుత్వ ఆస్పత్రి పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో రోగుల సేవకు దూరమవుతోంది. ఇక్కడ సమస్యలు తిష్టవేశాయి. నిరుపేదలు వైద్య కోసం నానా అవస్థలు పడుతున్నారు. సకాలంలో వైద్యం అందకపోవడం..వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. తరచూ ఏదో ఒక వివాదంతో ఈ ఆస్పత్రి వార్తల్లో నిలుస్తోంది. -
స్పీకర్ తక్షణమే రాజీనామా చేయాలి
నర్సీపట్నం: నియోజకవర్గ కేంద్రం నర్సీపట్నంలో జరిగిన మరిడమ్మ పండగలో డప్పు కళాకారుడైన దళితుడిపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు దాడి చేయడం దుర్మార్గమని, తక్షణమే స్పీకర్ పదవికి రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ డిమాండ్ చేశారు. దళితుడుపై దాడిని నిరసిస్తూ పార్టీ నాయకులతో కలిసి ఆయన స్థానిక అబిద్సెంటర్ లోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహానికి శనివారం క్షీరాభిషేకం చేసి, స్పీకర్ క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ పోలీసుల సమక్షంలో కొట్టడం మరీ దుర్మార్గమన్నారు. స్పీకర్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకు పెట్టలేదని ఆయన పోలీసులను ప్రశ్నించారు. కాలు తొక్కడం వల్లే స్పీకర్ కొట్టారని బాధితుడితో బలవంతంగా వీడియో రిలీజ్ చేయించారన్నారు. కాలు తొక్కితే కొట్టేస్తారా అని గణేష్ ప్రశ్నించారు. రాజ్యాంగ పదవిలో ఉంటూ చట్టాలను గౌర వించాల్సిన స్పీకర్ ఇలాంటి చర్యలకు పాల్పడటం సిగ్గు చేటన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు, సహాయ కార్యదర్శి పెట్ల అప్పలనాయుడు, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు ఏకా శివ, ఎంపీపీ సుర్ల రాజేశ్వరి,జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు,మాజీ మున్సిపల్ వైస్చైర్మన్లు కోనేటి రామకృష్ణ, తమరాన అప్పలనాయుడు, మాకవరపాలెం ఎంపీపీ రుత్తల సర్వం, మాజీ ఎంపీపీ రుత్తల సత్యనారాయణ, రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు ఈరెల్లి సుదీర్కుమార్, పార్టీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షురాలు లోచల సుజాత, గొలుగొండ ఎంపీపీ గజ్జలపు మణికుమారి, మాజీ కోఆప్షన్ సభ్యులు షేక్ రోజా, 17వ వార్డు ఇన్చార్జి అల్లంపల్లి లావణ్య, పార్టీ టౌన్ యూత్ అధ్యక్షులు అల్లంపల్లి ఈశ్వరరావు, మట్ల చంటి, పట్టణ మహిళా అధ్యక్షురాలు కణితి అన్నపూర్ణ, ముస్లిం కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ షేక్ ఉన్నీషాబేగం, మాజీ కౌన్సిలర్లు జగదీశ్వరి, కర్రి చైతన్య, సుర్ల నాయుడు, తమరాన శ్రీను, కొణతాల వరలక్ష్మి పాల్గొన్నారు. -
ఏఎన్ఎం ఆత్మహత్యాయత్నంపై విచారణ
దేవరాపల్లి: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గరిశింగి సచివాలయంలో ఏఎన్ఎంగా విధులు నిర్వర్తిస్తున్న జి.రాజ్యలక్ష్మి పాడేరులో శుక్రవారం ఆత్మహత్యకు యత్నించిన ఘటనపై జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి (డీఐవో) చంద్రశేఖర్దేవ్ స్థానిక పీహెచ్సీలో శనివారం విచారణ జరిపారు. పీహెచ్సీ వైద్యాధికార్లు ఈ.పూజ్యమేఘన, డి.వనజల నుంచి ఆయన వివరాలను సేకరించారు. స్థానిక పీహెచ్సీ హెల్త్ సూపర్వైజర్ పుష్పరాజ్ వేధింపులకు గురి చేయడంతోనే తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిసింది. హెల్త్ సూపర్వైజర్ వేధింపులపై ఇటీవల స్థానిక ఎంపీడీవోకు సైతం ఏఎన్ఎం రాజ్యలక్ష్మి ఫిర్యాదు చేసినట్లు స్థానిక పీహెచ్సీ వైద్యులు తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు సూపర్వైజర్ను అదే రోజు మరో సబ్సెంటర్కు తాత్కాలింగా మార్పు చేశామని స్థానిక పీహెచ్సీ వైద్యాధికారి పూజ్యమేఘన తెలిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న హెల్త్ సూపర్వైజర్ పుష్పరాజ్ను సైతం ప్రశ్నించారు. ఆత్మహత్యకు యత్నించిన రాజ్యలక్ష్మి ఆరోగ్య పరిస్థితిని పాడేరు వైద్యులు, బంధువులను అడిగి తెలుసుకుంటున్నామని డీఐవో చంద్రశేఖర్దేవ్ తెలిపారు. ఆమె ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిన అనంతరం పూర్తి స్థాయిలో విచారణ చేపడతామన్నారు. కాగా ఎనిమిది నెలలు క్రితం ఆమె బదిలీపై దేవరాపల్లి పీహెచ్సీకి వచ్చారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే శిశువు మృతి
అనకాపల్లి: చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం, వైద్యుల కొరత, విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో మూడురోజుల శిశువు మృతి చెందిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ఆరోపించారు. ఆస్పత్రిలో ఈనెల 3వ తేదీ రాత్రి వైద్యుల కొరత, విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా కశింకోటలోని గవరపేట వీధికి చెందిన వేగి శ్రీనివాసరావు, తులసి దంపతుల మూ డు రోజుల శిశువు మృతిచెందిన విషయం తెలిసిందే. శిశువు మృతికి కారణాలు బహిర్గతం చేయాలని, మరణానికి కారణమైన వైద్యుడిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రి ఆవరణలో శనివారం వైఎస్సార్సీపీ నాయకులు, శిశువు కుటుంబ సభ్యులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ నిరుపేద రోగులు చికిత్స పొందే ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన సదుపాయాలు కల్పించకపోవడం అన్యాయమన్నారు.శిశువు మృతి ప్రభుత్వ హత్యగానే భావిస్తున్నామని, ప్రభుత్వ నిర్లక్ష్యం, విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడం తదితర కారణాలతోనే శిశువు మృతిచెందిందని చెప్పా రు. మృతికి గల కారణాలు సూపరింటెండెంట్కు తెలిసినప్పటికీ నోరు మెదపడం లేదన్నారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆస్పత్రి వైద్యులు లేరని, ఎస్ఎన్సీయూ వార్డు లో శిశువును పరీక్షించేందుకు వైద్యులు లేరని సూపరింటెండెంట్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అనారోగ్యానికి గురైన శిశువును ఉదయం 9.30 గంటలకు చిన్నపిల్లల వైద్యుడికి చూపించగా ఏమీ పరవాలేదని చెప్పారని, మధ్యాహ్నం పరిస్థితి విషమించడంతో చికిత్స చేయడానికి వైద్యుడు లేకపోవడం వల్లే మరణించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో జరిగిన అన్నివిషయాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందని తెలిపారు. మాజీ ఎంపీ బి.వి. సత్యవతి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆస్పత్రి వైద్యులు ఓ మాతృమూర్తికి తీవ్ర అన్యాయం చేశారన్నారు.సరైన పద్ధతిలో బిడ్డకు పాలు ఇవ్వకపోవడం వల్లే ఊపిరితిత్తుల్లోకి చేరి మరణించినట్టు చిన్నపిల్లల వైద్యులు చెప్పడం దారుణమన్నారు. డీసీహెచ్ఎస్, సూపరింటెండెంట్ న్యాయం చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మలసాల కుమార్రాజా, ఆస్పత్రి మాజీ డైరెక్టర్ మూనూరు శ్రీను, వైఎస్సార్సీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు దండా జ్ఞానదీప్, 80,81,84 వార్డుల ఇన్చార్జ్లు కె.ఎం.నాయుడు, బి.శివ, కె.రాఘవ, మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు మర్రిపల్లి శోభ, ఎంపీపీ గొర్లి సూరిబాబు, పార్టీ సీనియర్ నాయకులు కొణతాల మురళీకృష్ణ, బుదిరెడ్డి దేముడుబాబు, కలగలక్ష్మిగున్నయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా పోలీస్ వార్షిక క్రీడా సంబరాలు
పరుగు పోటీలో పాల్గొన్న పోలీస్ అధికారులు ఆరిలోవ(విశాఖ తూర్పు): అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని విశాలాక్షినగర్ ఆర్మ్డ్ రిర్వ్డ్ పోలీస్ మైదానంలో శనివారం పోలీస్ వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథి అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇలాంటి క్రీడా పోటీలు పోలీస్ విభాగంలో ఐపీఎస్ స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకు ఒకే వేదికపైకి తీసుకువస్తుందని తెలిపారు. తోటి సిబ్బందితో పరిచయాలు పెంచుకొని సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి దోహదపడతాయన్నారు. ఆయా పోటీల్లో అనకాపల్లి, పరవాడ, నర్సీపట్నం, సబ్ డివిజన్లతోపాటు ఆర్మ్డ్ రిజర్వ్డ్ విభాగానికి చెందిన పోలీస్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ చూపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
స్పీకర్ అయ్యన్నపాత్రుడిపై అట్రాసిటీ కేసు పెట్టాలి
ఆరిలోవ: దళిత డప్పు కళాకారుడు నాగులాపల్లి రాందాస్పై దాడి చేసిన స్పీకర్ అయ్యన్నపాత్రుడుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి జిల్లా ఎస్సీ విభాగం పరిశీలకుడు అల్లంపల్లి రాజుబాబు డిమాండ్ చేశారు. పోలీసులు సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలన్నారు. మద్దిలపాలెంలో పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వంలో దళితులపై దాడులు, హత్యలు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. నిన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు నర్సీపట్నంలో మరిడిమాండ జాతరలో దళిత డప్పుకళాకారుడి చెంపపై కొట్టారు..మొన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆకివీడులో దళిత పేటలో శ్రీరామనవమి వేడుకలో 300 మంది కిరాయి రౌడీలతో దళితలపై దాడులు చేయించి, వీరిలో 57 మంది దళిత యువకులపై హత్యాయత్న కేసులను బనాయించారన్నారు. ఇద్దరూ గౌరవమైన రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి దళితలపై దాడులకు పాల్పడడం హేయమన్నారు. ఇటీవల దళితుడైన మంద సాల్మాన్ హత్య చేశారని, రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు, దళిత మహిళపై సదరు ఎమ్మెల్యే అనుచరుడు నడిరోడ్డుపై దాడికి పాల్పడ్డాడని వాపోయారు. ప్రభుత్వం తీరు మారకుంటే వచ్చే ఎన్నికల్లో దళితులంతా తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. -
ఆశ్రమ భూమి కబ్జాకు టీడీపీ నేతలు యత్నం!
అనకాపల్లి: జిల్లాలోని ఎస్ రాయవరం మండలం గెడ్డపాలెంలో టిడిపి నేతల దౌర్జన్యం చేశారు. ఆశ్రమానికి చెందిన 3.48 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు టీడీపీ నేతలు యత్నించారు. ఈ భూ వివాదం కోర్టులో ఉండగా భూమిలోకి దౌర్జన్యంగా వెళ్లారు టీడీపీ నేతలు ఎరకయ్య సతీష్, వారి అనుచరులు. ఈ భూ కబ్జాను స్థానిక మహిళలు అడ్డుకునే యత్నం చేశారు. అయితే మహిళలు అని చూడకుండా టీడీపీ నేతలు బూతులతో రెచ్చిపోయారు. దీనిపై ఎస్ రాయవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు పట్టించుకోలేదు. అదే సమయంలో టీడీపీ నేతలకు వత్తాసు పలికారు పోలీసులు. -
గడ్డివాము, పశువుల పాకలు దగ్ధం
మంటలను అదుపులోకి తెస్తున్న అగ్నిమాపక సిబ్బంది నాతవరం: గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మండలంలోని ఎం.బి.పట్నంలో గడ్డివాము, పశువుల పాకలు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన వి.రాజుబాబు తన పొలంలో పశువుల మకాం వద్ద గడ్డి వాము, పాకలు వేసుకున్నాడు. శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న నర్సీపట్నం అగ్నిమాపక కేంద్రం ఎస్ఐ అప్పలస్వామి, సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలను అదుపు చేశారు. గడ్డి వాము, పశువుల పాకలు దగ్ధమవడంతో రూ. 50 వేలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా. -
సింహగిరిపై ‘దొంగల’ వేట
సింహాచలం: ‘మీరు స్వామి వారి దర్శనానికి వచ్చి ఆయన ఉంగరాన్నే దొంగిలిస్తారా? మర్యాదగా ఇచ్చేయండి.. లేదంటే పోలీసులకు అప్పగిస్తాం’ అంటూ అర్చకులు గద్దిస్తుంటే, భక్తులు బిత్తరపోయారు. నిష్కల్మషమైన భక్తితో కొండెక్కిన తమను ‘దొంగలు’ అనడమేమిటి? పైగా చేతులకు తాళ్లు కట్టి బంధించడమేమిటి? అని ఆవేదనతో కన్నీటి పర్యంతమయ్యారు. కానీ, అదంతా ’దొంగ–పోలీస్’ ఆటలా సాగే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఘట్టమని తెలిసి చివరకు ఆనంద డోలికల్లో మునిగిపోయారు. అసలేం జరిగింది? : సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామివార్షికకల్యాణోత్సవా ల్లో భాగంగా శుక్రవారం ఉదయం ‘వినోదోత్సవం’ కనువిందుగా జరిగింది. గురువారం రాత్రి జరిగిన మృగయోత్సవంలో (వేట ఉత్సవం) స్వామివారి ఉంగరం పోయిందని, అది భక్తులే తీశారని అర్చకు లు సరదాగా నిలదీసే ఘట్టమే ఈ ఉత్సవ విశేషం. బంధీలుగా వీఐపీలు.. సామాన్యులు రాజగోపురం వద్ద స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామి ఏడు పరదాల చాటున వేంజేసి ఉండగా.. ప్రధానార్చకులు కరి సీతారామాచార్యులు స్వామివారి దూతగా మారి.. చేతిలో కర్ర, తాడు పట్టుకుని భక్తులను బంధించి తీసుకువచ్చారు. గాజువాకకు చెందిన వ్యాపారవేత్త సాగర్, ఇంజనీరింగ్ విద్యార్ధి ప్రణతి, విశాఖకు చెందిన ఫిజియోథెరపిస్టు రేష్మి, విజయనగరానికి చెందిన ఆమె సోదరి భార్గవి, ఒడిశాలోని జాజ్పూర్కి చెందిన ప్రభుత్వ వైద్య విద్యార్థులు, శ్రీహరిపురానికి చెందిన భరత్, హేమ, తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు కుమారుడు సిద్ధార్థ, కోడలు నిత్య, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, జర్నలిస్టుల సంఘం జాతీయ కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, పలువురు నూతన దంపతులతోపాటు దేవస్థానం ఈవో జె.వెంకటరావు దంపతులను కూడా వదలకుండా తాళ్లతో బంధించి స్థానాచార్యుల ముందు ప్రవేశపెట్టారు. సీసీ కెమెరా సాక్ష్యం ఉంది.. ఇచ్చేయండి! స్థానాచార్యులు రాజగోపాల్ భక్తులను ప్రశ్నించిన తీరు అత్యంత సహజంగా సాగింది. ‘మీరు దొంగతనం చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో ఉన్నాయి’ అని ఆయన గర్జించడంతో భక్తులు హడలిపోయారు. భక్తుల చేతికి ఉన్న ఉంగరాలు చూపిస్తూ.. ‘ఇదే స్వామివారి ఉంగరం’ అని అర్చకులు నిలదీయడంతో చాలామంది భక్తులు ఆవేశంతో, మరికొందరు బాధతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ట్విస్ట్ ఏమిటంటే: అందరినీ బంధించిన ప్రధానార్చకుడిని, అందరినీ ప్రశ్నించిన స్థానాచార్యుడిని, ఏఈవోలను కూడా చివర్లో తాళ్లతో బంధించడం ఈ ఉత్సవంలో హైలైట్గా నిలిచింది. పరదా వెనుక దొరికిన ‘నిజమైన’ దొంగ భక్తుల విచారణ ముగిసిన తర్వాత, స్వామివారి పల్లకీకి ఉన్న ఏడు పరదాలను ఒక్కొక్కటిగా తొలగించారు. ఆశ్చర్యంగా ఆఖరి పరదా చాటునే స్వామివారి ఉంగరం లభ్యమైంది. అంటే దొంగ మరెవరో కాదు.. ఆ స్వామివారే అని తేలడంతో భక్తులంతా ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయారు. తమను దొంగలుగా పట్టుకోవడం కూడా ఆ నృసింహుడి లీలగా భావించి భక్తులు పులకించిపోయారు. -
కలెక్షన్ల కలకలం
హెడ్ నర్సుల పోస్టింగ్ల్లోసీఎంవోకు ఫిర్యాదు 13న కమిటీ విచారణ మహారాణిపేట: వైద్య ఆరోగ్యశాఖలో ఇటీవల జరిగిన హెడ్ నర్సుల పదోన్నతులు, పోస్టింగ్ల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ప్రక్రియలో భారీగా అక్రమాలు జరిగాయని, పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ రాధారాణి ఆధ్వర్యంలో ఇటీవల హెడ్ నర్సులకు పదోన్నతులు కల్పించి, పలు ఆస్పత్రుల్లో పోస్టింగ్లు జారీ చేశారు. అయితే ఈ పదోన్నతులు, పోస్టింగ్ల వెనుక లక్షలాది రూపాయల అవినీతి జరిగిందని విశాఖ సిటిజెన్ ఫోరం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బీవీకే బాబ్జీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పదోన్నతులు పొందిన పలువురు నర్సుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారని ఆయన తన లేఖలో ఆరోపించారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి అందిన ఈ ఫిర్యాదుపై స్పందించిన ఉన్నతాధికారులు, దీనిపై సమగ్ర విచారణ జరపాల్సిందిగా కలెక్టర్ను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ ఆ ఫిర్యాదును కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణికి పంపించారు. అయితే హెడ్ నర్సుల పదోన్నతుల వ్యవహారం తన పరిధిలోకి రాకపోవడంతో.. సూపరింటెండెంట్ ఆ లేఖను తిరిగి వైద్య ఆరోగ్యశాఖ రీజినల్ డైరెక్టర్కు బదిలీ చేశారు. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు.. వైద్య ఆరోగ్యశాఖ రీజినల్ ట్రైనింగ్ సెంటర్ (మేల్) ప్రిన్సిపాల్ డాక్టర్ మీనాక్షిని విచారణ అధికారిగా నియమించారు. ఈ నెల 13న ఈ వ్యవహారంపై డాక్టర్ మీనాక్షి పూర్తి స్థాయిలో విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. ఆ ముగ్గురే కీలకం.. ముఖ్యమంత్రికి అందిన ఫిర్యాదులో ఏపీ ప్రభుత్వ నర్సుల సంఘం నాయకులపై తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. నర్సుల సంఘం జిల్లా అధ్యక్షురాలు గంగాభవాని, కార్యదర్శి వరలక్ష్మి, ఈసీ సభ్యురాలు గౌరి.. పదోన్నతి పొందిన మొత్తం 30 మంది నర్సుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సదరు 30 మంది నర్సులతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ముగ్గురు నాయకురాళ్లను కూడా విచారణ అధికారి ప్రత్యేకంగా ప్రశ్నించనున్నారు. అంతేకాకుండా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు తమ రోజువారీ విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదని కూడా ఫిర్యాదులో ఆరోపించారు. వీరికి కేటాయించిన వార్డుల్లో డ్యూటీలు చేయకుండా, నిత్యం క్లాక్ రూమ్లోనే ఉంటూ అక్కడి నుంచే సెటిల్మెంట్లు చేస్తున్నారని విమర్శించారు. నర్సింగ్ సూపరింటెండెంట్ అండదండలతోనే.. మిగతా నర్సులందరికీ ఎప్పటికప్పుడు డ్యూటీలు మారుస్తున్నప్పటికీ, వీరు మాత్రం ఏళ్ల తరబడి ఒకే వార్డులో తిష్టవేశారని ఫిర్యాదులో ఆక్షేపించారు. నర్సింగ్ సూపరింటెండెంట్ పద్మావతి అండదండలతోనే వీరు ఇలా రెచ్చిపోతున్నారని, ఎవరికై నా తమకు అనుకూలమైన డ్యూటీలు లేదా మంచి పోస్టింగ్లు కావాలంటే వీరిని కలిసి అడిగినంత ఇచ్చుకుంటే.. పద్మావతిని మేనేజ్ చేసి డ్యూటీలు వేయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కాగా ఈ ఆరోపణలపై ఏపీ ప్రభుత్వ నర్సుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గంగాభవాని, వరలక్ష్మి స్పందిస్తూ.. తమకు సంబంధిత అధికారుల నుంచి ఇంకా ఎలాంటి నోటీసులు రాలేదని, విచారణ అధికారి కోరితే అన్ని వివరాలు అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. -
పలు రైళ్లు దారి మళ్లింపు
తాటిచెట్లపాలెం: ఈస్ట్రన్ రైల్వే పరిధిలో జరుగుతున్న నిర్వహణ పనుల కారణంగా ఈ మార్గంలో నడిచే పలు రైళ్లను ఏప్రిల్ నుంచి జూన్ 30వ తేదీ వరకు దారి మళ్లిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం పవన్కుమార్ తెలిపారు. ● ఏప్రిల్ 6, 13, 20, 27, మే 4, 11, 18, 25, జూన్ 1, 8, 15, 22, 29వ తేదీల్లో తాంబరం–సిల్ఘాట్ టౌన్(15629) నాగోన్ ఎక్స్ప్రెస్, తిరుగు ప్రయాణంలో ఏప్రిల్ 3,10,17,24, మే 1,8,15,22,29 జూన్ 5,12,19,26వ తేదీల్లో సిల్ఘాట్ టౌన్–తాంబరం(15630) నాగోన్ ఎక్స్ప్రెస్లు మళ్లించబడిన మార్గంలో వయా అసన్సోల్, అండల్, సయింథియా మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ● ఈ నెల 2,9,16,23,30 మే 7,14,21,28, జూన్ 4,11,18,25వ తేదీల్లో తాంబరం–న్యూ టిన్సుకియా (15929) ఎక్స్ప్రెస్, తిరుగు ప్రయాణంలో ఈ నెల 6,13,20,27 మే 4,11,18,25 జూన్ 1,8,15,22,29వ తేదీల్లో న్యూ టిన్సుకియా–తాంబరం(15930)ఎక్స్ప్రెస్లు మళ్లించబడిన మార్గంలో వయా అసన్సోల్, అండల్, సయింథియా మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ● ఈ నెల 8,15,22,29 మే 6,13,20,27 జూన్ 3,10,17,24వ తేదీలల్లో డాక్టర్ ఎంజీఆర్ చైన్నె సెంట్రల్–న్యూ జల్పయ్గురి (22611) సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, తిరుగు ప్రయాణంలో ఈ నెల10,17,24 మే 1,8,15,22,29 జూన్ 5,12,19,26వ తేదీల్లో న్యూ జల్పయ్గురి–డాక్టర్ ఎంజీఆర్ చైన్నె సెంట్రల్ (22612) సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు మళ్లించబడిన మార్గంలో వయా అసన్సోల్, అండల్, సయింథియా మీదుగా రాకపోకలు సాగిస్తాయి. ● ఈ నెల 4,11,18,25 మే 2,9,16,23,30 జూన్ 6,13,20,27వ తేదీల్లో ఎస్ఎంవీటి బెంగళూరు–కామాఖ్య (12551)ఎక్స్ప్రెస్, తిరుగు ప్రయాణంలో ఈ నెల 8,15,22,29 మే 6,13,20,27 జూన్ 3,10,17,24వ తేదీల్లో కామాఖ్య– ఎస్ఎంవీటీ బెంగళూరు (12552) ఎక్స్ప్రెస్లు మళ్లించబడిన మార్గంలో వయా అసన్సోల్, అండల్, సయింథియా మీదుగా రాకపోకలు సాగిస్తాయి. -
విశాఖ వేదికగా నౌకాదళ గర్జన
ఐఎన్ఎస్ తారాగిరి, అరిధామన్లను జాతికి అంకితం చేసిన రక్షణ మంత్రి తారాగిరి వార్షిప్ని జాతికి అంకితం చేస్తున్న రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ మహారాణిపేట(విశాఖ): విశాఖలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన సందర్భంగా భారత నౌకాదళానికి చెందిన కీలక ప్రాజెక్టులు ముందుకు సాగాయి. ప్రాజెక్ట్–17ఏలో భాగమైన అత్యాధునిక యుద్ధనౌక ఐఎన్ఎస్ తారాగిరిని జాతికి అంకితం చేశారు. 75 శాతం పైగా స్వదేశీ సాంకేతికతతో నిర్మితమైన ఈ నౌక దేశ సముద్ర భద్రతను బలోపేతం చేయడంలో కీలకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. అదే సమయంలో అత్యంత రహస్యంగా విశాఖ షిప్బిల్డింగ్ సెంటర్లో అణు శక్తితో నడిచే జలాంతర్గామి అరిధామన్ను కూడా నౌకాదళానికి సమర్పించారు. అరిహంత్ శ్రేణిలో మూడో ఈ సబ్మైరెన్ సుమారు 7,000 టన్నుల సామర్థ్యంతో, 80 శాతం స్వదేశీ సాంకేతికతతో నిర్మితమై, కే–4 క్షిపణులను మోసుకెళ్లగలదు. దీని ద్వారా భారతదేశం తన ‘న్యూక్లియర్ ట్రయాడ్’ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది. పర్యటనలో భాగంగా ఐఎన్ఎస్ డేగా వద్ద కేంద్ర మంత్రికి కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిషోర్, సీపీ శంఖబ్రత బాగ్చి, కోస్ట్గార్డ్, నేవీ అధికారులు స్వాగతం పలికారు. -
మంత్రి పదవి కోసం ఉత్తరాంధ్రకు వెన్నుపోటు
సాక్షి, అనకాపల్లి: మంత్రి పదవి కోసం... చంద్రబాబు, లోకేష్ మొప్పు పొందాలని విశాఖకు వెన్నుపోటు పొడుస్తావా అంటూ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఉమ్మడి పశ్చిమ గోదావరి రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల ఓట్లతో గద్దెనెక్కానన్న విశ్వాసం కూడా లేకుండా విశాఖను రాజధానిగా ప్రకటించిన మాజీ వైఎస్ జగన్మోహన్రెడ్డిపై గంటా అనుచిత వ్యాఖ్య లు చేయడం సిగ్గుచేటన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నాడు మూడు రాజధానులకు స్వాగతమని, నేడు అమరావతికే జై కొడతావా అంటూ మండిపడ్డారు. విశాఖ ప్రాంతానికి చెందిన వాడివి కాకపోయి నా తమ ప్రాంత ప్రజలు మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఒక్కసారి ఎంపీగా గెలిపించి రాజకీయ భిక్ష పెడితే.. అదే ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తావా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరా వతి పేరిట చంద్రబాబు అవినీతికి పార్లమెంట్లో చట్టం చేస్తున్నట్లుగా ఉందంటూ ఎద్దేవ చేశారు. ముంపు ప్రాంతమైన అమరావతి రాజధానికే రూ.2 లక్షల కోట్లు ఖర్చుచేస్తే.. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత రాత్రికి రాత్రే అమరావతికి పారిపోయి వచ్చారు.. పదేళ్ల పాటు ఉమ్మడి ఏపీ ఆదాయంతో రాజధాని ఏర్పాటు చేయాలనే నిబంధనను మరిచిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్థం కోసం ఆ నాడు తాత్కాలిక భవనాల పేరిట హడావుడి చేశారన్నారు. నాడు, నేడు వైఎస్సార్సీపీ స్టాండ్ ఒక్కటేనని, అమరావతి రాజధానితో పాటు అభివృద్ధి వికేంద్రీకరణే తమ సిద్ధాంతమన్నారు. అమరావతి రాజధానికి తాము వ్యతిరేకం కాదని, అమరావతి పేరిట జరుగుతున్న అవినీతికి మాత్రమే వైఎస్సార్సీపీ వ్యతిరేకమన్నారు. తమ ప్రభుత్వంలో కూడా అమరావతితో పాటు విశాఖ, కర్నూల్ మూడు రాజధానుల ఏర్పాటు చేయాలనుకున్నామని చెప్పారు. విశాఖ రాజధాని కాకుంటే మావిగన్ పేరిట మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలతో కలిసి రాజధాని చేస్తే తక్కువ ఖర్చుతో రాజధానిని నిర్మించుకుందామని తమ నాయకుడు ప్రతిపాదన తీసుకొచ్చారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రూ.2 లక్షల కోట్లు అమరావతి రాజధానికే ఖర్చు చేస్తే.. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల అభివృద్ధి నిలిచిపోతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పరిపాలనా కేంద్రీకృతంతో ప్రాంతాల మధ్య విభేదాలు రాకుండా మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నదే వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష అని స్పష్టం చేశారు. మంత్రి పదవిపై వ్యామోహంతో.. లోకేష్ మొప్పు కోసం టీడీపీ ఎమ్మెల్యే గంటా చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని విశాఖ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ అమర్నాథ్ డిమాండ్ చేశారు. లేకుంటే ఉత్తరాంధ్ర ప్రజలు తగిన బుద్ధి చెబుతారంటూ హెచ్చరించారు. -
పట్టుదలకు ప్రతిరూపం లలిత శ్రీ.. ప్రతిభకు నిదర్శనం బిందు
పెదగంట్యాడ: గాజువాక ప్రాంతానికి చెందిన ఇద్దరు మహిళా న్యాయవాదులు జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికై సరికొత్త చరిత్ర సృష్టించారు. పట్టుదల ఉంటే ఏ వయసులోనైనా విజయం సాధించవచ్చని ధర్మాల లలిత శ్రీ నిరూపించగా, యువ న్యాయవాది కొట్టాన బిందు తొలి అడుగుల్లోనే అత్యున్నత శిఖరాన్ని అధిరోహించారు. వివాహమైన 15 ఏళ్ల తర్వాత జడ్జిగా లలిత శ్రీ ధర్మాల లలిత శ్రీ ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం. వివాహమైన 15 ఏళ్ల తర్వాత ఆమె ఉన్నత చదువులపై దృష్టి సారించారు. ముందుగా పీజీ పూర్తి చేసి, ఆపై ఎల్ఎల్బీ పట్టా పొందారు. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే సివిల్ జడ్జి పరీక్షలకు సిద్ధమయ్యారు. కేవలం రెండో ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై తన కలని సాకారం చేసుకున్నారు. తొలి అడుగులోనే విజయం సాధించిన బిందు : జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ సీనియర్ న్యాయవాది ఎం. శాంతి కుమార్తె కొట్టాన బిందు కూడా జడ్జిగా ఎంపికయ్యారు. సబ్బవరంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ పూర్తి చేసిన ఈమె, సీనియర్ న్యాయవాది వెన్నెల ఈశ్వరరావు వద్ద జూనియర్ లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. వృత్తిలో రాణిస్తూనే జూనియర్ సివిల్ జడ్జిగా విజయం సాధించారు. గాజువాక బార్ అసోసియేషన్ నుంచి ఒకేసారి ఇద్దరు మహిళలు న్యాయమూర్తులుగా ఎంపిక కావడంపై బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు యశోధర వేదమణి హర్షం వ్యక్తం చేశారు. కొట్టాన బిందు ధర్మాల లలితాశ్రీ జూనియర్ సివిల్ జడ్జిలుగా ఇద్దరు మహిళలు -
బస్సుపై దాడి
విషయం తెలిసిన వెంటనే పోతురెడ్డిపాలెం, పురుషోత్తపురం గ్రామస్తులు తీవ్ర ఆగ్రహంతో ప్రమాదానికి కారణమైన ప్రైవేట్ ట్రావెల్ బస్సుపై కర్రలు,రాళ్లతో దాడులు చేశారు.బస్సు అద్దాలు పగులగొట్టి బీభత్సం సృష్టించారు.దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సమీప పొలాల్లోకి పరుగులు తీశారు.అనంతరం నెమ్మదిగా తెల్లవారుజామున హైవే చేరుకుని,ఆటోల్లో అడ్డురోడ్డుకు వెళ్లారు.అక్కడి నుంచి వేర్వేరు బస్సుల్లో గమ్యస్థానాలకు పయనమయ్యారు. -
మృత్యువులోనూ వీడని స్నేహ బంధం
యలమంచిలి మండలం పోతురెఢ్డిపాలెం హైవే కూడలి వద్ద దుర్ఘటన యలమంచిలి రూరల్: నిశిరాత్రి..పోతురెడ్డిపాలెం హైవే రక్తసిక్తమైంది.అమ్మవారి జాతరను తిలకించి బైక్పై వెళ్తున్న ముగ్గురు స్నేహితులను మృత్యువు పొట్టనపెట్టుకుంది.కలిసి,మెలిసి పెయింటర్లుగా పనిచేస్తున్న ముగ్గురు యువకులు తమ జీవితం రంగులమయం కావాలని ఎన్నో కలలుకన్నారు.ఏ ఒక్కరికి పెయింటింగ్ పని దొరికినా ముగ్గురు కలిసి చేసుకునేవారు.తమలో ఒకరిని ఇంటి వద్ద బైక్పై డ్రాప్ చేసేందుకు వెళ్లిన ఆ ముగ్గురిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. వీరు ప్రయాణిస్తున్న బైక్ను ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. మరణంలోనూ మేము ఒకరినొదిలి మరొకరం ఉండలేమంటూ ఆ ముగ్గురూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ ఘోర దుర్ఘటన మూడు నిరుపేద కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.యలమంచిలి రూరల్ పోలీసులు,బాధిత కుటుంబ సభ్యులు,స్థానికులు తెలిపిన వివరాలు ఇవి... యలమంచిలి మండలం పోతురెడ్డిపాలెం హైవే కూడలి వద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు.పురుషోత్తపురంలో గురువారం రాత్రి జరిగిన గొల్లమారెమ్మతల్లి పండగను తిలకించిన ముగ్గురు స్నేహితులు బైక్పై పక్కనున్న పోతురెడ్డిపాలెం గ్రామానికి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. హైవే కూడలి వద్ద విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ ఎలక్ట్రిక్ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.పురుషోత్తపురం గ్రామానికి చెందిన బంగారు నాని(24),ఏటికొప్పాకకు చెందిన ఇల్లపు గోవింద్(25),పోతురెడ్డిపాలెం గ్రామానికి చెందిన బంగారు దుర్గాప్రసాద్(16) పెయింటర్లుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. గొల్లమారెమ్మతల్లి పండగకు ఈ ముగ్గురూ వెళ్లారు. పండగలో ఆనందంగా గడిపిన అనంతరం దుర్గాప్రసాద్ను పోతురెడ్డిపాలెంలో దింపిరావడం కోసం బైక్పై బంగారు నాని,గోవింద్,దుర్గాప్రసాద్ అర్ధరాత్రి సమయంలో బయల్దేరారు.వీరు బయల్దేరిన ఐదు నిమిషాలకే ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు యలమంచిలి ప్రభుత్వాస్పత్రిలో మృతి చెందాడు. లిప్తపాటులో...మృత్యుకాటు పండగలో ఆనందంగా గడిపిన అనంతరం దుర్గాప్రసాద్ను పోతురెడ్డిపాలెంలో డ్రాప్ చేసి రావడానికి ముగ్గురు యువకులు ఒకే బైకుపై పురుషోత్తపురం నుంచి బయలుదేరారు. పోతురెడ్డిపాలెం హైవే కూడలి వద్ద సర్వీసు రోడ్డులోకి వెళ్లడానికి హైవేను దాటుతున్న సమయంలో అవతల రహదారిపై వస్తున్న లారీని గమనించిన యువకులు దానికంటే ముందుగానే పోతురెడ్డిపాలెం గ్రామానికి వెళ్లే సర్వీసు రోడ్డులోకి వెళ్లేందుకు బైక్ను ముందుకు నడిపారు సరిగ్గా అదే సమయంలో లారీకి ఎడమ వైపు నుంచి ట్రావెల్ బస్సు అతివేగంగా రావడంతో బైక్ వెనుక భాగాన్ని ఢీకొంది.వెంటనే ఇద్దరు యువకులు ఎగిరి బస్సు ముందున్న అద్దాలకు ఢీకొని, రోడ్డుపై పడిపోయారు.ముగ్గురు యువకుల తల భాగాలపై తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందారు. పెళ్లయిన నాలుగు నెలలకే.. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఏటికొప్పాకకు చెందిన ఇల్లపు గోవింద్కు నాలుగు నెలల కిందటే వివాహమైనట్టు కుటుంబసభ్యులు తెలిపారు.ప్రమాద విషయం తెలియగానే గోవింద్ భార్య దుర్గ,తల్లిదండ్రులు అప్పారావు,భవానీ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.గోవిందు పురుషోత్తపురంలో అత్తవారింటికి పండగ నిమిత్తం వచ్చి విగతజీవిగా మారాడు.బంగారు నానికి భార్య కుమారి మూడేళ్లలోపు వయసున్న కుమార్తె,కుమారుడు ఉన్నారు. నాని మృతదేహాన్ని చూసి కుమారి గుండెలవిసేలా రోదించింది. తండ్రి మరణించిన విషయం కూడా తెలియని పిల్లలు అమాయకంగా దిక్కులు చూస్తుంటే అక్కడున్నవారు కంటతడి పెట్టారు.ఇటీవల ఉగాది పండగకు నాని కొనుగోలు చేసిన డ్యూక్ బైకే ప్రాణాలు తీసిందంటూ విలపించారు. మరొక మృతుడు బంగారు దుర్గాప్రసాద్ 7వ తరగతి వరకు చదువుకుని పెయింటింగ్ పనులు చేస్తూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు.మృతి చెందిన కుమారుడిని చూసి అతని తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.ఏం పాపం చేశామని ఈ రంపపు కోత అంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. -
గిరిజన యువతి ఆత్మహత్య
ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతోనే దేవరాపల్లి: ఓ యువకుడు ప్రేమ పేరుతో నమ్మించి, పెళ్లికి నిరాకరించడంతోనే తీవ్ర మనస్తాపం చెందిన గిరిజన యువతి దూసరి లక్ష్మి (22) ఆత్మహత్య చేసుకుంది. దేవరాపల్లిలో గత నెల 30న అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ శివారు కొరపర్తికి చెందిన గిరిజన యువతి లక్ష్మి ఆత్మహత్య చేసుకున్న సంగతి విధితమే. ఈ కేసుకు సంబంధించిన వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లో శుక్రవారం సాయంత్రం సీఐ కె.కృష్ణ, స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణతో కలిసి అనకాపల్లి ఇన్చార్జి డీఎస్పీ ఈ.శ్రీనివాసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనంతగిరి మండలం కొరపర్తి గ్రామానికి చెందిన దూసరి లక్ష్మి దేవరాపల్లిలోని ఓ ప్రైవేటు క్లినిక్లో ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తోంది. దేవరాపల్లికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ కొల్లి లోకేష్ (24)కు ఐదేళ్ల క్రితం లక్ష్మితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడు. అయితే ఆమె పెళ్లి ప్రస్తావన తీసుకురాగా, నిందితుడు లోకేష్ మీది తక్కువ కులం అని, పెళ్లి చేసుకోవడం కుదరదని నిరాకరించాడు. ప్రియుడు నమ్మించి మోసగించడాన్ని తట్టుకోలేని లక్ష్మి తీవ్ర మనస్తాపంతో గత నెల 30న తాను నివాసం ఉంటున్న ఇంటిలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి దూసరి పెంటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే గిరిజన యువతిని వంచించి ఆత్మహత్యకు కారకుడైన లోకేష్ను రైవాడ జలాశయం సమీపంలో శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు లోకేష్పై ఎస్సీఎస్టీ అట్రాసిటీ, ఆత్మహత్యకు ప్రేరేపించడం, పెళ్లి చేసుకుంటానని మోసగించడానికి సబంధించిన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని ఇన్చార్జి డీఎస్పీ చెప్పారు . నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్టు ఆయన తెలిపారు. -
వీసీసీఐ ఆధ్వర్యంలో స్పీకర్ మీట్
ఏయూక్యాంపస్: విశాఖపట్నం చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(వీసీసీఐ) ఆధ్వర్యంలో శుక్రవారం బీచ్ రోడ్డులోని ఒక హోటల్లో స్పీకర్ మీట్ కార్యక్రమం నిర్వహించారు. గూగుల్ ఇండియా కస్టమర్ ఎంగేజ్మెంట్ విభాగాధిపతి మైత్రేయి గణపతి కీలకోపన్యాసం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కస్టమర్ ఎంగేజ్మెంట్ను బలోపేతం చేయడం, కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఏఐ టెక్నాలజీ పాత్రను వివరించారు. అభివృద్ధి చెందుతున్న డిజిట్ ప్రపంచంలో ఎంసెస్ఎంఈలు, పరిశ్రమల వాటాదారులకు ఎంతో ఉపయుక్తంగా ఈ ప్రసంగం నిలచింది. వీసీసీఐ అధ్యక్షుడు ఎం.సుదర్శన్ స్వామి ప్రారంభోపన్యాసం అందించారు. మ్యాపిల్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో శివ్కుమార్ మాట్లాడుతూ సాంకేతికత స్వీకరించడం, ఆవిష్కరణలు, భవిష్యత్కు సిద్ధమైన వ్యాపార వ్యూహాలను వివరించారు. డబ్ల్యూఎన్ఎస్ ఉపాధ్యక్షుడు ఆర్.ఎల్.నారాయణ మోడరేటర్గా నిర్వహించిన రెండో సెషన్లో కృష్ణ మోహన్, నీరజ్ సార్ధా, కీర్తన ఆనంద్, రాజేష్ పూసర్ల, పవన్ తదితరులు వ్యాపార విస్తరణ వ్యవస్థలకు సంబంధించిన విభిన్న అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ చర్చలో పాల్గొన్నారు. వీసీసీఐ కార్యదర్శి పి.రాజేష్ వందన సమర్పణ చేశారు. -
సంక్షోభంలోనూ సడలని ఉక్కు సంకల్పం
● పడిలేచిన కెరటంలా.. విశాఖ సిటీ : సవాళ్లు ఎదురైనప్పుడే అసలైన సత్తా బయటపడుతుంది. విశాఖ స్టీల్ప్లాంట్ విషయంలో ఇది అక్షరాలా నిజమైంది. ఒకవైపు ప్రైవేటీకరణ నీడలు, మరోవైపు నిధుల కొరత, ఇంకోవైపు ఉద్యోగులపై వీఆర్ఎస్ ఒత్తిళ్లు.. ఇన్ని ప్రతికూలతల మధ్య విశాఖ స్టీల్ ప్లాంట్ ’పడిలేచిన కెరటం’లా విస్మయకర రీతిలో పుంజుకుంది. నష్టాల సాకుతో పరిశ్రమను ప్రైవేటుకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్న వేళ, తన సామర్థ్యాన్ని గణాంకాలతో సహా నిరూపించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి నుంచి విక్రయాల వరకు ఉహకందని వృద్ధిని నమోదు చేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను సంస్థ ఆదాయం, ఉత్పత్తి గణాంకాలు సరికొత్త మైలురాళ్లను అధిగమించాయి. కష్టాలు చుట్టుముట్టినా.. గత కొన్నేళ్లుగా విశాఖ స్టీల్ ప్లాంట్ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. నిధుల కొరత వల్ల ముడిసరుకు సేకరణ భారంగా మారింది. దీనికి తోడు ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఉద్యోగుల్లో మానసిక ఆందోళన కలిగించింది. నష్టాల పేరుతో ప్లాంట్ సామర్థ్యాన్ని తగ్గించే ప్రయత్నాలు జరిగినా, అక్కడి కార్మికులు మాత్రం తమ సంకల్పాన్ని వదలలేదు. తక్కువ వనరులతోనే ఎక్కువ ఉత్పత్తిని సాధిస్తూ సత్తా చాటుకుంటున్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకుని అమ్మకాల్లో దూసుకుపోయారు. ఉత్పత్తిలో అజేయమైన వృద్ధి విశాఖ స్టీల్ ప్లాంట్ మునుపెన్నడూ లేని విధంగా ఉత్పత్తిలో గణనీయమైన వృద్దిని నమోదు చేసింది. ఒకవైపు వనరుల లేమితో సతమవుతున్నప్పటికీ.. 52 శాతం వృద్ధిని సాధించింది. గతేడాది హాట్ మెటల్ ఉత్పత్తి 3.91 మిలియన్ టన్నుల నుంచి 5.95 మిలియన్ టన్నులకు పెరిగింది. అలాగే లిక్విడ్ స్టీల్ ఉత్పత్తిలో కూడా భారీ పురోగతి కనిపిస్తోంది. గత ఏడాది 3.75 మిలియన్ టన్నుల ఉత్పత్తి కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో అది 5.69 మిలియన్ టన్నులకు చేరుకుంది. క్రూడ్ స్టీల్ ఉత్పత్తి కూడా 51 శాతం వృద్ధిని నమోదు చేయడం ప్లాంట్ పనితీరుకు నిదర్శనం. ఆదాయ ప్రవాహం.. పెరిగిన అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో విశాఖ స్టీల్ ప్లాంట్ టర్నోవర్ రూ.22,311 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఏడాది రూ.18,288 కోట్లుగా ఉంది. అంటే కేవలం ఏడాది కాలంలోనే ఆదాయం 22 శాతం మేర పెరగడం విశేషం. కేవలం ఆదాయం మాత్రమే కాకుండా, అమ్మకాల పరిమాణంలో కూడా 27 శాతం వృద్ధి కనిపించింది. గత ఏడాది 3.49 మిలియన్ టన్నుల అమ్మకాలు జరగ్గా.. ఈసారి అది 4.42 మిలియన్ టన్నులకు పెరిగింది. ఇది సంస్థ మార్కెట్ విస్తరణను స్పష్టం చేస్తోంది. ప్రైవేటీకరణ వాదనకు ఇదే సమాధానం విశాఖ స్టీల్ తన ఉత్పత్తుల నాణ్యతను పెంచడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. దేశీయంగా మౌలిక సదుపాయాల కల్పన పెరగడం వల్ల ఉక్కుకు డిమాండ్ పెరిగింది. ఈ అవకాశాన్ని విశాఖ స్టీల్ అందిపుచ్చుకుని సరఫరాను వేగవంతం చేసింది. దీనివల్ల సంస్థ లాభదాయకత కూడా మెరుగుపడింది. ఈ రికార్డు వెనుక ప్లాంట్ వ్యూహాత్మక నిర్వహణ కీలక పాత్ర పోషించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాలను సాధించాలని ఆర్ఐఎన్ఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత రికార్డులు స్టీల్ప్లాంట్ ప్రాముఖ్యతను మరోసారి చాటిచెప్పాయి. నష్టాల పేరుతో ప్రైవేటీకరణ నిర్ణయం తప్పని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి. ప్లాంట్కు సొంత గనులు కేటాయిస్తే.. ఇది దేశంలోనే అత్యంత లాభదాయకమైన సంస్థగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ నమోదు చేసిన వృద్ధి వివరాలు విభాగం గత ఏడాది ప్రస్తుత ఏడాది వృద్ధి శాతం వార్షిక టర్నోవర్ రూ.18,288 కోట్లు రూ.22,311 కోట్లు 22 శాతం హాట్మెటల్ ఉత్పత్తి 3.91 మి.ట 5.95 మి.ట 52 శాతం లిక్విడ్ స్టీల్ ఉత్పత్తి 3.75 మి.ట 5.69 మి.ట 51.7 శాతం అమ్మకాల పరిమాణం 3.49 మి.ట 4.42 మి.ట 27 శాతం విశాఖ ఉక్కు రికార్డుల మోత ఉత్పత్తిలో 52 శాతం వృద్ధి అమ్మకాల్లో 27 శాతం పెరుగుదల వార్షిక టర్నోవర్ రూ.22,311 కోట్లు వార్షిక వృద్ధి 22 శాతం -
కాపర్ వైరు దొంగ అరెస్టు
అచ్యుతాపురం రూరల్: సెజ్ పరిసర ప్రాంతాల్లో కాపర్ వైరు చోరీ చేసిన ఓ వ్యక్తిని అచ్యుతాపురం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ ఏడాది జనవరి, మార్చి నెలల్లో సెజ్ పరిధిలో ఉన్న మెగా ఇంజినీరింగ్ కంపెనీలో రూ.1.50 లక్షల విలువైన వైరును గాజువాకలోని కణితి రోడ్డుకు చెందిన గడ్డిపాటి తిలక్ కుమార్ చోరీ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ వైరును విక్రయించగా వచ్చిన నగదుతో ఓ కారు కొనుగోలు చేసినట్టు వారు చెప్పారు. ఆ కారులో దర్జాగా వచ్చి చోరీలకు పాల్పడుతున్నట్టు వారు తెలిపారు. ఇతనిపై ఇప్పటికే గాజువాక, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం పరిధిలో పలు పోలీసు స్టేషన్లలో చోరీ కేసులు నమోదైనట్టు ఎస్ఐ సుధాకర్ తెలిపారు. -
మౌనిక హత్య కేసుపై జ్యూడిషియల్ విచారణ జరపాలి
కంచరపాలెం: గాజువాకలో గత నెల 29న దారుణ హత్యకు గురైన దళిత మహిళ పోలిపల్లి మౌనిక ఘటనపై ఉన్నత స్థాయి జ్యూడిషియల్ విచారణ జరపాలని పలు ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం తాటిచెట్లపాలెం సంజీవయ్య కాలనీ–1లో మహిళా, దళిత సంఘాలు, స్థానిక కాలనీ యూత్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మి మాట్లాడుతూ.. మౌనికను అత్యంత కర్కశంగా హతమార్చిన నేవీ ఉద్యోగి రవీంద్ర పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోందని మండిపడ్డారు. నిందితుడికి నేర చరిత్ర లేదని, మృతదేహాన్ని ఏం చేయాలో పాలుపోక లొంగిపోయాడని పోలీసులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఒకవైపు నిందితుడు కిటికీలోంచి వెళ్లి తలుపు తీశాడని చెబుతూనే, మరోవైపు పరస్పర విరుద్ధమైన స్టేట్మెంట్లు ఇవ్వడం వెనుక అసలు నిజాన్ని దాచే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. మృతురాలు దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడమే ఈ నిర్లక్ష్యానికి కారణమని నేతలు ధ్వజమెత్తారు. పోలీసుల దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, వాస్తవాలు వెలుగులోకి రావాలంటే తక్షణమే జ్యూడిషియల్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా నాయకురాలు అనురాధ, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ప్రతినిధి బేగం, సీఎమ్మెస్ నేత లలిత, చింతాడ సూర్యం, న్యాయవాదులు గిరిధర్, పద్మ, దళిత సంఘాల నాయకులు కొత్తపల్లి వెంకటరమణ, పీవోడబ్ల్యూ ప్రతినిధులు, స్థానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.మహిళ, దళిత ప్రజాసంఘాల నేతల డిమాండ్ -
చంద్రబాబు పాలనలోరైతుల పరిస్థితి దుర్భరం
●రైతు సంఘాల నాయకులు వెంకన్న , దొరసమావేశంలో మాట్లాడుతున్న వెంకన్న, దొర దేవరాపల్లి: చంద్రబాబు ప్రభుత్వంలో అన్నదాతల పరిస్థితి దుర్భరంగా మారిందని, వారు పండించిన పంటలకు కనీస మార్కెట్ సౌకర్యం కల్పించడం లేదని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి. వెంకన్న, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బి.టి. దొర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో వ్యవసాయ సంఘం ముఖ్య నాయకులతో శుక్రవారం నిర్వహించిన సమాశంలో వారు మాట్లాడారు. ఈ ఏడాది గిరిజన రైతులు పండించిన జీడి పంటకు మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయారన్నారు. జీడి పంటకు పూత దశలో టీదోమ తెగులు సోకి పూర్తిగా దెబ్బతిందని చెప్పారు. జీడి రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ మూతపడటంతో చెరకు పండించిన రైతులు ఆ భూముల్లో ఇతర పంటలు సాగు చేసేవారని, మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో ఇప్పుడు ఖాళీగా విడిచి పెట్టేస్తున్నారని చెప్పారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం వారి సమస్యలను గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతలు, వ్యవసాయ కార్మికులు, గిరిజనుల సమస్యలపై ఈ నెల 19న దేవరాపల్లిలో జిల్లా సదస్సు నిర్వహించనున్నట్టు వెంకన్న, దొర తెలిపారు. ఈ సదస్సుకు జిల్లా వ్యాప్తంగా కూలీలు, గిరిజన రైతులు అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కె. ఈశ్వరరావు, సీహెచ్. చినదేముడు, డి. శంకర్, ఎం.ఎర్రునాయుడు, జె.ఈశ్వరరావు, పోతురాజు, దేముడు తదితర్లు పాల్గొన్నారు. -
బైక్ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
యలమంచిలి రూరల్: అనకాపల్లి జిల్లా లో గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత చోటుచేసుకున్న ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. యలమంచిలి మండలం పోతురెడ్డిపాలెం కూడలి వద్ద జాతీయ రహదారిపై బైక్ను ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో పురుషోత్తపురం గ్రామానికి చెందిన బంగారు నాని (24), ఏటికొప్పాకకు చెందిన ఇల్లపు గోవిందు (25), పోతిరెడ్డిపాలేనికి చెందిన బంగారు దుర్గాప్రసాద్ (16) మృత్యువాత పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోతురెడ్డిపాలెం హైవే కూడలి వద్ద రోడ్డు దాటుతున్న ద్విచక్ర వాహనాన్ని విశాఖపట్నం నుంచి విజయవాడకు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు యలమంచిలి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు రూరల్ ఎస్ఐ ఎం.ఉపేంద్ర తెలిపారు. పురుషోత్తపురంలో గురువారం రాత్రి గొల్లమారెమ్మ తల్లి పండగ జరిగింది. స్నేహితులైన ఇల్లపు గోవింద్, బంగారు నాని, బంగారు దుర్గాప్రసాద్ పండగకు వెళ్లారు. అనంతరం దుర్గాప్రసాద్ను పోతురెడ్డిపాలెంలో డ్రాప్ చేసి రావడానికి ముగ్గురూ కలిసి ఒకే బైకుపై పురుషోత్తపురం నుంచి బయలుదేరారు. పోతురెడ్డిపాలెం హైవే కూడలి వద్ద సర్వీసు రోడ్డులోకి వెళ్లడానికి రోడ్డు దాటుతుండగా వీరు ప్రయాణిస్తున్న బైక్ను విజయవాడ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. రోడ్డు దాటే క్రమంలో లారీని గమనించిన యువకులు బస్సును గమనించలేదు. కేవలం రెండు సెకన్లలో రోడ్డు దాటతారనగా.. బస్సు బైకు వెనుక భాగాన్ని ఢీకొంది. బంగారు నాని ఇటీవల ఉగాది పండగకు కొత్త ద్విచక్ర వాహనం కొనుగోలు చేశాడు. అమ్మవారి పండగలో ఆనందంగా గడిపి ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రమాదానికి గురి కావడం, ముగ్గురు యువకులూ ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ప్రమాద విషయం తెలిసిన గ్రామస్తులు ప్రమాద స్థలంలో బస్సు అద్దాలను కర్రలు, రాళ్లతో ధ్వంసం చేశారు. దీంతో బస్సులో ప్రయాణికులు భయాందోళనతో సమీపంలో పొలాల్లోకి పరుగులు తీశారు. యలమంచిలి సీఐ ధనుంజయరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు యువకుల మృతితో పురుషోత్తపురం, పోతురెడ్డిపాలెం గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. -
దళితుడిపై అయ్యన్న దాడి
సాక్షి, అనకాపల్లి/మునగపాక: డప్పు కొడుతున్న దళితుడిపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నాలుగు రోజుల క్రితం జరిగిన మరిడిమాంబ అమ్మవారి జాతరలో 60 ఏళ్లు పైబడి ఉన్న దళిత డప్పు కళాకారుడుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేయి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నర్సీపట్నానికి చెందిన దళిత డప్పు కళాకారుడు నాగులపల్లి రామదాసు తోటి కళాకారులతో కలిసి పండగలో డప్పు కొడుతుండగా..ఒక్కసారిగా అయ్యన్న ఆగ్రహంతో ఊగిపోయారు. వృద్ధుడు అని కూడా చూడకుండా రామదాసుపై చేయి చేసుకున్నారు. చెంప చెళ్లుమనిపించడమే కాకుండా పరుష పదజాలంతో తీవ్రంగా దూషించారు. ఆ సమయంలో సీఐ గఫూర్తో పాటు ఎస్ఐలు అక్కడే ఉన్నా ప్రేక్షకపాత్ర వహించడం గమనార్హం. ఇదిలా ఉండగా తన కాలు తొక్కినందుకే అయ్యన్న కొట్టాడని బాధితుడితో బలవంతంగా చెప్పించడం కొసమెరుపు.స్పీకర్ అయ్యన్నను అరెస్టు చేయాలి: కేవీపీఎస్ డిమాండ్సాక్షి, అమరావతి: దళిత డప్పు కళాకారుడిపై దాడి చేసిన అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) అధ్యక్షుడు ఓ.నల్లప్ప, ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి శుక్రవారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మరిడితల్లి పండగలో డప్పు కొడుతుండగా దళితుడైన నాగులాపల్లి రామదాసును పోలీసుల సమక్షంలోనే అయ్యన్నపాత్రుడు చెంపదెబ్బ కొట్టడం దారుణమన్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన స్పీకర్ స్థాయి వ్యక్తి విచక్షణ కోల్పోతే ఎలా? అని ప్రశ్నించారు. ఈ చర్యకు పాల్పడిన స్పీకర్పై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలన్నారు. విధి నిర్వహణలో ఉండి కూడా నివారించని పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నల్లప్ప, మాల్యాద్రి డిమాండ్ చేశారు. అయ్యన్న క్షమాపణ చెప్పాలి నర్సీపట్నంలో జరిగిన మరిడిమాంబ జాతరలో దళిత వృద్ధ డప్పు కళాకారుడిని అయ్యన్న చెంప దెబ్బ కొట్టారు. తక్షణమే ఆ దళిత డప్పు కళాకారుడికి అయ్యన్నపాత్రుడు క్షమాపణ చెప్పాలి. కూటమి పార్టీల నాయకులకు దళితులంటే చిన్నచూపు. ఈ ఘటనపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలి. – డాక్టర్ బూసి వెంకటరావు, విదసం ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ దాడి అమానుషండప్పు కళాకారుడిపై అయ్యన్నపాత్రుడు దాడి చేయడం అమానుషం. సమాజంలో దళితులను గౌరవించాల్సింది పోయి అగౌరవపరచడం అయ్యన్నకు తగదు. కళాకారులను ప్రోత్సహించాల్సింది పోయి దాడి చేయడం సరైన సంప్రదాయం కాదు. తక్షణమే అయ్యన్నపాత్రుడు దళితులకు క్షమాపణ చెప్పాలి.– యల్లబిల్లి కొండబాబు, డప్పు కళాకారుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడుఅయ్యన్న దిష్టిబొమ్మ దహనంకోవెలకుంట్ల: దళితుడిపై అయ్యన్నపాత్రుడు దాడి చేయడాన్ని ఖండిస్తూ శుక్రవారం రాత్రి నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో దళిత సంఘాల నేతలు నిరసన తెలిపారు. అయ్యన్నపాత్రుడి దిష్టిబొమ్మను దహనం చేశారు. వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి దండు మధుబాబు, గ్రేటర్ రాయలసీమ మాలమహానాడు అధ్యక్షుడు కోగిల ప్రసాద్ మాట్లాడుతూ..దళితులపై అహంకారపూరిత వైఖరి ప్రదర్శిస్తూ దాడి చేయడం హేయమన్నారు. టీడీపీ పాలనలో రాష్ట్రంలో రోజూ ఏదో ఒక చోట దళితులపై దాడులు, దౌర్యన్యాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దళితుడిపై దాడి చేసిన అయ్యన్నపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అయ్యన్నపాత్రుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. -
రాయితీపై కొరమీను చేపల పెంపకం
కొరమీను చేప పిల్లలు విడుదలకు భూమి పూజ చేస్తున్న ప్రజాప్రతినిధులు అధికారులు నాతవరం : చేపల పెంపకానికి ప్రభుత్వం రాయితీపై యూనిట్లు మంజూరు చేస్తుందని ఎంపీడీవో శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలో గురువారం మూడు కొరమీను చేప పిల్లలు పెంపకం యూనిట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ వెలుగు పథకంలో కొరమీను చేపల పెంపకం కోసం రాయితీపై మూడు యూనిట్లు మంజూరు చేశామన్నారు. యూనిట్కు రూ.4 లక్షల 41వేలు కాగా అందులో రూ.లక్షా 35వేలు సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఈ యూనిట్ ఏర్పాటు చేసుకునే లబ్ధిదారుకు వ్యవసాయ భూమి, విద్యుత్, బోరు సదుపాయం ఉండాలన్నారు. యూనిట్ ఏర్పాటు చేసేందుకు బ్యాంకు ద్వారా రుణం ఇస్తామన్నారు. కొరమీను ఏడాదికి మూడు విడతలుగా పంట వస్తుందన్నారు. కార్యక్రమంలో వెలుగు ఏపీఎం కనకరాజు, జిల్లా మహిళా సమాఖ్య సంఘం అధ్యక్షురాలు కోరుబిల్లి మణి, నాతవరం, గన్నవరం పీఏసీఎస్ పర్సన్ ఇంచార్జిలు అపిరెడ్డి మాణిక్యం, సింగంపల్లి సన్యాసిదేముడు తదితరులు పాల్గొన్నారు. -
సోలార్ ప్లాంట్ పేరుతో భూసేకరణ ఆపాలి
తుమ్మపాల: సోలార్ పవర్ ప్లాంట్ పేరుతో భూసేకరణ ఆపాలంటూ చీడికాడ మండలం జి.కొత్తపల్లి, అడవుల అగ్రహారం, బైలపూడి, చిన్నగోగాడ గ్రామాల ప్రజలు కలెక్టరేట్ గేటు వద్ద సీపీఎం ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. అనంతరం జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి ఆర్ దేముడు నాయుడు మాట్లాడుతూ జి. కొత్తపల్లిలో సర్వే నంబరు 166,167లో 40 ఎకరాలు, అడవుల అగ్రహారంలో సర్వే నంబరు 63లో 55 ఎకరాలు, బైలపూడిలో సర్వే నంబరు 122లో 60 ఎకరాలు, చిన్న గోగాడలో సర్వే నంబరు2లో 70 ఎకరాలు మొత్తం 225 ఎకరాలకు సాగు నిమిత్తం 65 ఏళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం డీ పట్టా ఇచ్చిందన్నారు. 320 మంది పేద రైతు కుటుంబాలు తాతలు, తండ్రుల నాటి నుంచి సాగు చేసుకుంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీ ఈపీడీసీఎల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 57.97 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ని నిర్మించనున్నట్లు ప్రకటించిందన్నారు. జీడి, మామిడి, పామాయిల్, నువ్వులు, వేరుశనగ వంటి పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేద రైతులు నుంచి భూములు తీసుకుంటే వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రైతుల భూములు లాక్కోవద్దని, సోలార్ పవర్ ప్లాంట్కి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో ఏ అగ్రహారం సర్పంచ్ సలారి గంగశేషు, మాజీ ఎంపీపీ కొల్లి అప్పలనాయుడు, గంటా మాచిరాజు, కన్నబాబు నాగరాజు, చలుగు శ్రీనువాస్, రైతులు పాల్గొన్నారు. -
అధినేతతో ఆత్మీయ కలయిక
నర్సీపట్నం : మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని తాడేపల్లి కార్యాలయంలో గురువారం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మర్యాద పూర్వకంగా కలిసారు. నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్టు గణేష్ తెలిపారు. తుమ్మపాల: జడ్పీ వైస్ చైర్పర్సన్ భీశెట్టి సత్యవతి, ఆమె కుమారుడు వైఎస్సార్సీపీ నియోజకవర్గ నాయకుడు భీశెట్టి జగన్ తాడేపల్లిలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్రెడ్డిని గురువారం మర్యాదపూర్వకంగా కలిసారు. దుశ్శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై ఆయనతో చర్చించినట్లు తెలిపారు. జిల్లాలో సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. -
భూసేకరణ జరపకుండా సాగునీటి కాల్వల తవ్వకాలు
మునగపాక : రైతుల నుంచి ఎటువంటి భూమి సేకరించకుండా, ప్రత్యామ్నాయం చూపకుండా ప్రస్తుతం ఉన్న సాగునీటి కాలువలను ఎలా తవ్వేస్తారంటూ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ధ్వజమెత్తారు. రైతులకు ప్రత్యామ్నాయం చూపించి సాగునీటి కాలువ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. అంతవరకు పనులు జరగకుండా చూడాలని తహసీల్దార్ సత్యనారాయణను కోరారు. వివరాలివి. పూడిమడక రోడ్డు విస్తరణలో భాగంగా మునగపాక మండలం గంగాదేవిపేట నుంచి మున గపాక జంక్షన్ వరకు వచ్చే మార్గంలో ఇరువైపులా సాగునీటి కాలువలు ఉండేవి. రహదారి విస్తరణలో ప్రస్తుతం ఉన్న కాలువల ద్వారా వేలాది ఎకరాల పంట పొలాలకు సాగునీరు అందుతూ వచ్చేది. అయితే విస్తరణలో భాగంగా ప్రస్తుతం ఉన్న సాగునీటి కాలువలో రిటైనింగ్ వాల్ నిర్మించే క్రమంలో పొక్లెయిన్ ద్వారా పనులు జరుగుతున్నాయి. విషయం తెలుసుకున్న స్థానిక రైతులు సమస్యను వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆయన గురువారం సంబంధిత ప్రాంతాన్ని పరిశీలించారు. రైతులకు జరుగుతున్న అన్యాయం గుర్తించి సమస్యను తహసీల్దార్ సత్యనారాయణ దృష్టికి తీసుకువచ్చారు. ఎటువంటి ప్రత్యామ్నాయం చూపకుండా ప్రస్తుతం ఉన్న సాగునీటి కాలువలను తవ్వేసే కార్యక్రమం ఎలా చేపడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారి విస్తరణకు తాము సమ్మతమేనని అయితే అధికారుల నిర్లక్ష్యం కారణంగా పంటలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం ఆలోచన లేకుండా రైతులకు నష్టం వాటిల్లేలా పనులు చేపట్టడం సరికాదన్నారు. దీంతో స్పందించిన తహసీల్దార్ సత్యనారాయణ సంబంధిత అధికారులతో మాట్లాడి రైతులకు సాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జెడ్పీటీసీ సభ్యుడు పెంటకోట స్వామి సత్యనారాయణ, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు, రైతు సంఘ అధ్యక్ష, కార్యదర్శులు ఆడారి మహేష్, దాడి శివ, సీపీఎం నేత ఎస్.బ్రహ్మాజీ, రైతులు పాల్గొన్నారు. -
నాణ్యత డొల్ల
పాయకరావుపేట: పట్టణంలో రూ.5.20 కోట్లతో విస్తరిస్తున్న మెయిన్ రోడ్డు నిర్మాణంలో నాణ్యత లోపిస్తోందని వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి దగ్గుపల్లి సాయిబాబా, ఉప సర్పంచ్ జగతా భవానీశ్రీనివాస్, పట్టణ శాఖ అధ్యక్షుడు ధనిశెట్టి మహేష్ విమర్శించారు. పట్టణంలో దగ్గుపల్లి సాయిబాబా కార్యాలయంలో గురువారం వారు మాట్లాడుతూ వీఎంఆర్డీఏ నిధులతో చేపట్టిన విస్తరణ పనుల్లో అధికారుల పర్యవేక్షణ లేదన్నారు. కరెంటు లేకుండానే రాత్రిపూట పనులు చేపడుతున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మిగిలిన మూడేళ్ల పాటు మనుగడ ఉండేలా రోడ్డు నిర్మిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఆ తర్వాత ఎలా పోయినా పర్వాలేదన్నట్లు కాంట్రాక్టర్లు, కూటమి నాయకుల వ్యవహారశైలి ఉందన్నారు. పూర్తిగా కూటమి నాయకుల కనుసన్నల్లోనే పనులు జరగడం వల్ల నాణ్యత లోపించిందన్నారు. ఎస్టిమేషన్లో పేర్కొన్న విధంగా మెటీరియల్ను సముపాళ్లలో వినియోగించడం లేదన్నారు. 20 ఎంఎం, 40 ఎంఎం, క్రషర్ చిప్స్ బూడిద వేయాల్సి ఉండగా, బూడిద మాత్రమే వేస్తున్నారన్నారు. సరిగ్గా రోలింగ్ చేయడం లేదన్నారు. రోడ్డు విస్తరణ చేసేందుకు హోం మంత్రి నిర్ణయించినప్పుడు పాయకరావుపేట పట్టణాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని స్వాగతించామన్నారు. రోడ్డుపై చిరువ్యాపారులకు న్యాయం చేయలేదన్నారు. వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇంతవరకు చూపలేదన్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వంలో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించి ఆపేశారన్నారు. కోర్డు వివాదం కారణంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విస్తరణను పక్కన పెట్టి కొత్త రోడ్డు నిర్మించామన్నారు. అదే సమయంలో రోడ్డుకు ఇరువైపులా వేసిన బెర్మ్లను ఇప్పుడు తొలగిస్తున్నారన్నారు. తవ్వకాల్లో వచ్చిన గ్రావెల్ను అనధికార లేఅవుట్లకు తరలిస్తున్నారన్నారు. హోం మంత్రి ఈ రెండు విషయాలపై దృష్టి సారించాలన్నారు. నాసిరకం పనులపై విచారణ జరిపించాలని, బెర్మ్ తవ్వకాల్లో వచ్చిన గ్రావెల్ను తరలిస్తున్న అనధికార లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాసిరకం పనులపై క్వాలిటీ కంట్రోలు, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో వార్డు సభ్యులు కొప్పిశెట్టి మోహన్, పిరాది రాజు, తుమ్మలపల్లి సతీష్, బీసీ సెల్ అధ్యక్షుడు కేశనకుర్తి సత్తిబాబు, కోనేటి పద్మారావు, పోసిన వీరబాబు, కె. రంగ తదితరులు పాల్గొన్నారు. -
8న ‘అనకాపల్లి’ సినిమా రిలీజ్
అనకాపల్లి: అనకాపల్లి సినిమాను ఈనెల 8న దేశవ్యాప్తంగా విడుదల చేయడం జరుగుతుందని సినీదర్శకుడు నక్కిన త్రినాథ్ అన్నారు. స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ‘అనకాపల్లి’ సినిమాను అనకాపల్లి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించడం జరిగిందన్నారు. అనకాపల్లిపై ఉన్న అభిమానంతో సినిమాను తీయడం జరిగిందని, ఇక్కడ ప్రజలు ఎక్కువగా సినిమాన్ని ఆదరించడమే కాకుండా దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని పదర్శించి, అనకాపల్లి పేరును చాటడం జరుగుతుందన్నారు. విక్రమ్ సహదేవ్ హీరోగా సంధ్య వశిష్ట హీరోయిన్గా తారక్ కొండప్ప విలన్గా నటించడం జరిగిందన్నారు. అంతకుముందు సంధ్య వశిష్ట, తారక్ కొండప్పలు సినిమా షూటింగ్లో వారి అనుభవాలను వివరించారు. కార్యక్రమంలో భవ్యశ్రీ డెవలపర్ అధినేత, గవరపాలెం కనకదుర్గమ్మవారి ఆలయ శాశ్వత చైర్మన్ కాండ్రేగుల శ్రీరామ్, ఆలయ వ్యవస్థాపకుడు పి.వి.రమణ, సహనిర్మాత కుమార్రాజా, నూకాంబిక దేవస్థానం మాజీ చైర్మన్ కొణతాల మురళీకృష్ణ పాల్గొన్నారు. -
బడ్జెట్ నిధులు సక్రమంగా వినియోగించండి
తుమ్మపాల : రాష్ట్ర బడ్జెట్ను దృష్టిలో పెట్టుకొని ప్రజా ప్రతినిధులు, అధికారులు కార్యక్రమాలను రూపొందించుకోవాలని, కేటాయించిన నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని జిల్లా ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గురువారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, ఏపీ ఫైనాన్స్ శాఖ సెక్రటరీ డి.రోనాల్డ్ రోస్, కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా, ఎమ్మెల్యేలతో కలిసి 2026–27 బడ్జెట్ – ఔట్ రీచ్ అవగాహన సదస్సు నిర్వహించారు. అభివృద్ధి ప్రాజెక్టులు, సూపర్ సిక్స్ పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను, చేసిన బడ్జెట్ కేటాయింపులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలకు, అధికారులకు సూచించారు. హోంశాఖ మంత్రి అనిత మాట్లాడుతూ ప్రతి అధికారి జిల్లా అభివృద్ధిపై జవాబుదారీగా ఉండాలని, వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ లోపం వల్ల నిధులు వృథా కాకూడదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, సుందరపు విజయ్ కుమార్, బండారు సత్యనారాయణమూర్తి, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు పాల్గొన్నారు. తలసరి ఆదాయంలో జిల్లాకు 13 స్థానం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 99శాతం జీతాలు, వడ్డీలు, పెన్షన్లకే సరిపోతోందని జిల్ల ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆస్తులు, అప్పుల కేటాయింపులో ఆదాయం తెలంగాణకు, అప్పులు ఏపీకి కేటాయింపు జరిగిందని, అయినప్పటికీ అన్ని సమస్యలు ఎదురొడ్డి ముందుకు నడుస్తున్నామన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ.3.87 లక్షల కోట్లు ఉంటే, ఏపీ తలసరి ఆదాయం రూ.2.60 లక్షల కోట్లు మాత్రమే అన్నారు. రాష్ట్రంలో జిల్లాల వారీగా తలసరి ఆదాయంలో అనకాపల్లి జిల్లా 13వ స్థానంలో ఉందన్నారు. -
ఐఐఎం విశాఖకు అంతర్జాతీయ గుర్తింపు
గంభీరంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రాంగణంతగరపువలస: ఆనందపురం మండలం గంభీరం గల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్–విశాఖపట్నం(ఐఐఎంవీ)కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. యునైటెడ్ కింగ్డమ్ కేంద్రంగా పనిచేసే బిజినెస్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ నుంచి ఐదేళ్ల కాలానికి గాను ఐఐఎంవీ అక్రిడిటేషన్ను దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాపార విద్యలో నాణ్యత, సామాజిక ప్రభావాన్ని గుర్తించే ఈ అక్రిడిటేషన్ను పొందిన దేశంలోని అతికొద్ది సంస్థల్లో ఐఐఎంవీ ఒకటిగా నిలవడం విశేషం. ఈ సందర్భంగా ఐఐఎంవీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం.చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఈ గుర్తింపు అంతర్జాతీయ ప్రమాణాల పట్ల తమకున్న నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. నాణ్యమైన విద్య, బాధ్యతాయుతమైన నిర్వహణ, నిరంతర అభివృద్ధి అనేవి తమ సంస్థ మూల విలువలని, ఈ అక్రిడిటేషన్ వాటిని మరింత ప్రతిబింబిస్తోందన్నారు. ఈ గుర్తింపుతో గ్లోబల్ స్థాయిలో ఐఐఎంవీ ప్రతిష్ట మరింత పెరుగుతుందని, తద్వారా విదేశీ భాగస్వామ్యాలు, విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలు, అంతర్జాతీయ పరిశోధనలకు కొత్త అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
యువకుడిని రక్షించిన మైరెన్ పోలీసులు
నీటమునిగిన శ్రీనివాస్తో మైరెన్ పోలీసులు ఎస్.రాయవరం : రేవుపోలవరం తీరంలో సముద్రంలో మునిగిపోతున్న యువకుడిని గస్తీ నిర్వహిస్తున్న పెంటకోట మైరెన్ పోలీసులు కాపాడి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఈ సంఘటన మేరకు మైరెన్ ఏఎస్ఐ ఎం.కృష్ణ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మాకవరపాలెం మండలం జి.కోడూరు గ్రామానికి చెందిన చవ్వాకుల శ్రీనివాస్ గురువారం 10వ తరగతి చివరి రోజు పరీక్ష రాసి స్నేహితులతో కలిసి సుమారు 10 మంది రేవు పోలవరం తీరానికి వచ్చారు. వీరిలో నలుగురు స్నేహితులు స్నానం కోసం సముద్రంలోనికి దిగారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పెద్ద అలరావడంతో శ్రీనివాస్ మునిగిపోయాడు. అది గమనించిన మైరెన్ పోలీసులు హెచ్ఎస్ పి.అప్పలరాజు, శ్రీను, కానిస్టేబుల్ చినబాబు కలసి సముద్రంలోనికి దిగి శ్రీనివాస్ను ఒడ్డుకు చేర్చారు. స్వల్ప అస్వస్థతతో తీరంలో నుంచి బయటపడిన శ్రీనివాస్ను చూసి స్నేహితులు ఊపిరి పీల్చుకున్నారు. శ్రీనివాస్ ఆరోగ్యం నిలకడగా ఉండడంతో స్వగ్రామానికి పంపారు. -
కుంచవానిపాలెంలో వ్యక్తి అనుమానాస్పద మృతి
మునగపాక : మండలంలోని కుంచవానిపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందినట్టు ఎస్ఐ పి.ప్రసాదరావు తెలిపారు.ఇందుకు సంబందించిన వివరాలను ఆయన గురువారం విలేకరులకు తెలిపారు. కుంచవానిపాలెం గ్రామానికి చెందిన పుచ్చ పారిపల్లి (38) ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగానే బుధవారం పనులు ముగించుకొని ఇంటికి చేరుకొని రాత్రి నిద్రపోయాడు. తెల్లవారు లేచి చూసేసరికి పారిపల్లి మృతి చెంది ఉండడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అనుమానాస్పద మృతిగా గుర్తించి కేసు నమోదు చేశారు. పారిపల్లి మృతదేహాన్ని అనకాపల్లి వందపడకల ఆసుపత్రికి పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ ప్రసాదరావు తెలిపారు. -
ప్పం ట్టాల్సిందే..!
తట్టెడు మట్టికీ సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : తట్టెడు మట్టికీ తలవంచాల్సిందే.. పిక్కెడు రాయికీ పిండుకోవాల్సిందే.. ఉమ్మడి విశాఖ జిల్లాలో ’రాయల్టీ’ పేరిట ఏఎంఆర్ సంస్థ సాగిస్తున్న అక్రమ వసూళ్లు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. సొంత పొలంలో మట్టి తీసినా, సొంత ఇంటికి రాయి తెచ్చినా.. ఎక్కడ చిన్న ఇసుక కుప్ప కనిపించినా.. ప్రైవేటు సంస్థ ప్రతినిధులు స్కానర్లు పట్టుకుని వాలిపోతున్నారు. లోడును బట్టి వందల రూపాయల నుంచి వేల రూపాయల వరకూ వసూలు చేస్తున్నారు. మైనింగ్ శాఖ అండతో గ్రామగ్రామాన చెక్పోస్టులు పెట్టి సాగిస్తున్న ఈ ’దోపిడీ’ పర్వంపై జనాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. చెక్పోస్టులు.. ఫ్లైయింగ్ స్క్వాడ్ల దందా వాస్తవానికి గతంలో రాయల్టీ వసూలు బాధ్యతను మైనింగ్ శాఖే నిర్వహించేది. అయితే, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బాధ్యతను జిల్లాల వారీగా ప్రైవేట్ కంపెనీలకు అప్పగించారు. ఇందుకోసం మైనింగ్ శాఖ టెండర్లను ఆహ్వానించగా.. విశాఖ జిల్లాలో ఈ టెండర్ను ఏఎంఆర్ సంస్థ దక్కించుకుంది. టెండర్ పొందినప్పటి నుంచి సంస్థ ఎక్కడికక్కడ చెక్పోస్టులను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక వాహనాలతో ఫ్లైయింగ్ స్క్వాడ్ పేరుతో గ్రామాల్లో తిరుగుతోంది. ఎక్కడైనా చిన్న ట్రాక్టర్లో మట్టి కనిపించినా, ఎర్రపిక్క కనిపించినా రాయల్టీ చెల్లించాల్సిందేనంటూ ఒత్తిడి తెస్తోంది. తమ సొంత పొలంలో నుంచి మట్టిని తీసుకెళుతున్నా ఎందుకు డబ్బులు ఇవ్వాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇక వసూలు చేసే మొత్తాన్ని స్కానర్ ద్వారా సేకరిస్తున్నప్పటికీ, ఆ వివరాలను మైనింగ్ శాఖకు క్రమం తప్పకుండా సమర్పిస్తున్నారా లేదా అన్నది స్పష్టంగా తెలియడం లేదనే విమర్శలు ఉన్నాయి. వసూలైన డబ్బులు కంపెనీ ఖాతాలోకే వెళుతున్నాయా, లేక సొంత ఖాతాలకు మళ్లుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా, వసూలు చేస్తున్న రాయల్టీకి సరైన బిల్లులు ఇస్తున్నారా అనే అంశాన్ని కూడా మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మీద మైనింగ్ శాఖ మౌనంతో ఏఎంఆర్ సంస్థ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాయల్టీ వసూలు పేరుతో రుబాబు..! రాయల్టీ వసూలు బాధ్యతను దక్కించుకున్న ఏఎంఆర్ సంస్థ ఎక్కడికక్కడ చెక్పోస్టులను ఏర్పాటు చేసుకుంది. చెక్పోస్టుల వద్ద ప్రత్యేకంగా సిబ్బందిని నియమించింది. అక్కడ పనిచేసే సిబ్బంది క్వారీల నుంచి వచ్చే వాహనాల లోడ్ను గమనిస్తూ, అదనపు లోడు ఉంటే అదనపు రాయల్టీని ముక్కుపిండి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ‘ఫ్లైయింగ్ స్క్వాడ్’ పేరుతో జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ, ఎక్కడైనా ఇంటి అవసరాల కోసం మట్టిని తరలిస్తున్నా రాయల్టీ చెల్లించాల్సిందేనంటూ వాలిపోతున్నారు. ఇంటి నిర్మాణం కోసం కొద్దిపాటి పిక్క తీసుకున్నా వందల్లో రాయల్టీ చెల్లించాలంటూ ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక రైతులు తమ సొంత పొలంలో నుంచి మట్టిని తవ్వుకుని ఇంటి నిర్మాణం కోసం తరలిస్తున్నా అక్కడికక్కడే సిబ్బంది చేరుతున్నారు. రాయల్టీ కట్టాల్సిందేనంటూ చెబుతూ, ఎంత మొత్తం చెల్లించాలనే విషయాన్ని స్కానర్ ద్వారా చూపించి వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ ‘మాకు సంబంధం లేదు’ అంటూ తప్పుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాయల్టీ పేరుతో ఏఎంఆర్ రుబాబు ఇంటి నిర్మాణం కోసం పిక్కకు రొక్కం లెక్క ఉమ్మడి జిల్లాలో ఇష్టారాజ్యంగా చెక్పోస్టుల ఏర్పాటు ఫ్లైయింగ్ స్క్వాడ్లతో గ్రామాల్లో వేట ట్రాక్టర్ కనిపిస్తే స్కానర్ ఓపెన్ రూ.వందల నుంచి రూ.వేల వరకూ వసూళ్లు సొంత పొలం మట్టికీ రాయల్టీ తప్పదా..? మైనింగ్ శాఖ మౌనంతో విమర్శలకు తావు -
తేగాడ కేజీబీవీలో కేంద్ర బృందం
తేగాడలోని కస్తూర్భాగాంధీ విద్యాలయంలో పరిశీలిస్తున్న కేంద్ర అధ్యయన బృందం కశింకోట : మండలంలోని తేగాడ వద్ద ఉన్న కస్తూర్భాగాంధీ విద్యాలయాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రొనాల్డ్ రోజ్ బృందం గురువారం సందర్శించింది. ఈ సందర్భంగా వ్యర్థాలను అరికట్టడానికి ప్రయోగాత్మకంగా జిల్లాలోని వసతి గృహాలు, కస్తూర్భాగాంధీ విద్యా సంస్థలతోపాటు ఇక్కడ కూడా ఏర్పాటు చేసిన కంపోస్టు ఎరువు తయారీ, వర్షం నీరు, వాడుక నీరు నివారణ కోసం నిర్మించిన ఇంకుడు గొయ్యి, కూరగాయలు పండించేందుకు ఏర్పాటు చేసిన కిచెన్ గార్డెన్లను బృందం పరిశీలించింది. వాటి నిర్వహణ తీరును అధ్యయనం చేసి సంతృప్తి వ్యక్తం చేసింది. విద్యార్థులతో ఈ కార్యక్రమం అమలుపై ఉన్న అవగాహన గురించి బృందం చర్చించింది. విద్యార్థులు, ఉపాధ్యాయులను అభినందించింది. ఈ సందర్భంగా రోనాల్డ్ రోజ్ కస్తూర్భా విద్యా సంస్థ ఆవరణలో మొక్కలు నాటారు. బృందంలో ఏపీ ప్రిన్సిపల్ కార్యదర్శి రొనాల్డ్ రోజ్ , డీఈవో అప్పారావునాయుడు, ఎంఈవోలు సురేష్కుమార్, రమణశ్రీ, ఎంపీడీవో సిహెచ్.చంద్రశేఖర్రావు పాల్గొన్నారు. -
కోర్టు స్టే ఇచ్చినా బేఖాతరు
నర్సీపట్నం : నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువులో సృష్టి క్షేత్రం పేరుతో చేస్తున్న అక్రమ నిర్మాణాలపై హైకోర్టు స్టే విధించింది. కోర్టు అదేశాలను అమలు చేయాల్సిన అధికార యంత్రాగం కనీసం పట్టించుకోలేదు. స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడి ఆధ్వర్యంలో చేపట్టిన సృష్టి క్షేత్రం అక్రమ నిర్మాణాలను సవాలు చేస్తూ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ హైకోర్టును ఆశ్రయించారు. పెద్ద చెరువులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని కోర్టు ఆదేశించింది. ఈ పిల్పై ప్రతివాదులుగా ఉన్న జలవనరులు, కలెక్టర్తో పాటు స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 17కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే కోర్టు ఆదేశాలు ఇచ్చి 24 గంటలు గడుస్తున్నా ఇరిగేషన్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. చెరువు మధ్యలో వేస్తున్న రోడ్డు నిర్మాణానికి వినియోగిస్తున్న మిషనరీ ఇంకా అక్కడే ఉంది. ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను అమలు చేసేందుకు వెనకాడుతున్న ఇరిగేషన్ అధికారుల వైఖరిని కోర్టు దృష్టికి తీసుకువెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే సిద్ధమవుతున్నట్టు తెలిసింది. -
గడ్డివాము దగ్ధం
నాతవరం : మండల కేంద్రానికి చెందిన వైఎస్సార్సీపీ నేత గుడివాడ వెంకటరమణకు చెందిన గడ్డివాముకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో కాలిబూడిదైంది. నాతవరం గ్రామ సమీపంలో రెవెన్యూ పరిధిలో సర్వే నెంబరు 336లో సుమారుగా మూడు ఎకరాలు 60 సెంట్లు వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిలో వ్యవసాయం సాగు చేసుకుంటూ పశువులు పాకలు వేసుకుని పాడి పరిశ్రమ నడుపుతున్నారు. గేదెలు, ఆవులు కలిపి 15పైగా పశువులు ఉన్నాయి. పాడి పరిశ్రమ నడుపుతున్న వెంకటరమణ పశువులకు ఏడాది కాలం పాటు మేతకు అవసరమైన ఇటీవల ఆరు ట్రాక్టర్లు ఎండిగడ్డి కొనుగోలు చేసి తన పశువుల మకాం వద్ద నిల్వ చేసుకున్నాడు. ఎప్పటి మాదిరిగా బుధవారం సాయంత్రం వరకూ పశువుల సంరక్షణ చూసి ఇంటికి వచ్చేశారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో గడ్డి వాము తగలబడడం చూసి స్థానికులు సమాచారం అందించారు. వెంకటరమణ వెంటనే పశువుల మకాం వద్దకు వెళ్లి చూసేసరికి పెద్ద మంటలతో గడ్డివాములు కాలిపోతుంది. నర్సీపట్నం అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక వాహనం వచ్చి మంటలను అదుపు చేసిందన్నారు. సమీపంలో ఉన్న పశువులు పాకలు, పశువులకు ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడ్డారు. ఇటీవల పాడి పశువుల మేత కోసం సుమారుగా లక్ష రూపాయలతో కొనుగోలు చేసి నిల్వ చేసుకున్న గడ్డివాము పూర్తిగా కాలిపోయిందని బాధితుడు వెంకటమణ ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటరమణ నాతవరం గ్రామంలో వైఎస్సార్సీపీలో కీలకంగా పని చేస్తుంటాడు. వెంకటరమణ గడ్డివామును ఎవరో కావాలనే తగులబెట్టి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఘటనపై బాధితుడు వెంకటరమణ గురువారం తహసీల్దార్ చందనరేఖకు ఫిర్యాదు చేశారు. -
అయ్యన్నపాత్రుడి సృష్టి క్షేత్రంపై స్టే
సాక్షి, అమరావతి/నర్సీపట్నం (అనకాపల్లి జిల్లా): స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం మునిసిపాలిటీ పరిధిలోని పెద చెరువును ఆక్రమించి ‘సృష్టి క్షేత్రం’ పేరుతో చేస్తున్న నిర్మాణాలపై హైకోర్టు స్టే విధించింది. పెద చెరువులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని ఆదేశించింది. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని నిర్దేశించింది. అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడి ఆధ్వర్యంలో చేపట్టిన నిర్మాణాలను సవాలు చేస్తూ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర గణేష్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పెద చెరువు కట్ట బలోపేతం, సుందరీకరణ పనులు నిర్వహించవచ్చని హైకోర్టు తెలిపింది. అయితే సుందరీకరణ పనులు చేపట్టే ముందు అందుకు సంబంధించిన కార్యాచరణను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్లతో పాటు వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా ఉన్న అయ్యన్న పాత్రుడికి సైతం నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 17కు వాయిదా వేసింది. చెరువు ఆక్రమణ దారుణం: పొన్నవోలు వాదనలుస్పీకర్గా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అయ్యన్నపాత్రుడు రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉన్న పెద చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం దారుణమని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఉమా శంకర గణేష్ హైకోర్టులో ఇటీవల పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ, ‘పెద చెరువు కింద 345.25 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. అయితే అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడి నేతృత్వంలోని ఈ చెరువు మధ్యలో నిర్మాణాలు చేపడుతున్నారు. చెరువును కొంత మేర పూడ్చి ఇక్కడ భారీ శివపార్వతుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. శివ పార్వతుల విగ్రహాల ఏర్పాటునకు పిటిషనర్ వ్యతిరేకం కాదు. చెరువు సమీపంలో ఉన్న చారిత్రక దేవస్థానంలో విగ్రహాలను ఏర్పాటు చేస్తే ఎవరికీ అభ్యంతరం లేదు. పంటలకు ప్రాణాధారంగా ఉన్న చెరువును పూడ్చేసి విగ్రహాలను ఏర్పాటు చేయడంపైనే అభ్యంతరం. గతంలో ఇదే చెరువు సమీపంలో ప్రైవేటు వ్యక్తులు నిర్మాణాలు చేస్తుంటే అధికారులకు లేఖ రాసి మరీ అడ్డుకున్న అయ్యన్నపాత్రుడు, ఇప్పుడు తానే తన కుమారుడితో కలిసి చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేస్తుండటం దారుణం. ఈ నేపథ్యంలో అయ్యన్న నేతృత్వంలో జరుగుతున్న చెరువు ఆక్రమణను అడ్డుకోవాలి’ అని అభ్యర్థించారు. నీటి వనరులను పరిరక్షించాలని సుప్రీంకోర్టుతో సహా పలు హైకోర్టులు చాలా తీర్పులు వెలువరించాయని తెలియజేశారు. ప్రభుత్వ వాదనలు తప్పని ఆధారాలతో నిరూపణఅనంతరం ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) సింగమనేని ప్రణతి స్పందిస్తూ, చెరువులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడం లేదన్నారు. కేవలం చెరువు కట్టల బలోపేతం, పూడికతీత, సుందరీకరణ పనులను మాత్రమే చేపడుతున్నామన్నారు. ఎలాంటి స్టే ఇవ్వొద్దని కోరారు. ఈ సమయంలో సుధాకర్రెడ్డి స్పందిస్తూ, చెరువు మధ్యలో నిర్మిస్తున్న నిర్మాణాలకు సంబంధించి అయ్యన్నపాత్రుడు, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్న భూమి పూజ ఫొటోలను ధర్మాసనం ముందుంచారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం, పెద చెరువులో చేస్తున్న నిర్మాణాలపై స్టే విధించింది. రైతుల హర్షం: ఉమా శంకర గణేష్ స్పీకర్ తలపెట్టిన అక్రమ నిర్మాణాలపై ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో మమ్మల్ని çకలిశారు. దీంతో వారికి అండగా నిలిచాం. హైకోర్టు తాజా ఆదేశాలతో రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తోంది. -
పింఛన్లు పంపిణీ చేసిన హోం మంత్రి
నక్కపల్లి: మండలంలో అప్పలపాయకరావుపేట, నక్కపల్లి గ్రామాల్లో బుధవారం హోం మంత్రి వంగలపూడి అనిత సామాజిక భద్రతా పింఛన్లను పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ నేతన్నలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. దీనివల్ల కరెంటు బిల్లుల భారం నుంచి ఉపశమనం పొందవచ్చన్నారు. చేనేత కార్మికురాలితో కలిసి నక్కపల్లిలో మగ్గం నేశారు. వారి నుంచి చీర కొనుగోలు చేశారు. అనంతరం నక్కపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలసి మధ్యాహ్న భోజనం చేశారు. భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామున్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఏపీఐఐసీ పునరావాస కాలనీలో నిర్వాసితుల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి కొప్పిశెట్టి వెంకటేష్, పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జ్ కొప్పిశెట్టి బుజ్జి, ఎంపీడీవో చైతన్య, నాయకులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ నాయకులపై కేసు కొట్టివేత
చోడవరం : వైఎస్సార్సీపీ నాయకులకు కోర్టులో ఊరట లభించింది. ఆ పార్టీ నాయకులపై పెట్టిన అక్రమ కేసును చోడవరం కోర్టు కొట్టివేస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. 12 మంది వైఎస్సార్సీపీ నాయకులపై పెట్టిన కేసు నిరాధారమైనదంటూ నిర్దోషులుగా పేర్కొంటూ వారిపై పెట్టిన కేసును కోర్టు కొట్టేసింది. వివరాల్లోకి వెళితే... 2018లో వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్పోర్టులో ఒక యువకుడు కోడి కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై ఆందోళన చెందిన చోడవరం వైఎస్సార్సీపీ నాయకులు తమ అధినేతపై జరిగిన హత్యాయత్నానికి పాల్పడిన వారిని శిక్షించాలంటూ శాంతియుతంగా చోడవరం పట్టణంలో నిరసన తెలిపారు. ఈ నిరసనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోయినప్పటికీ అప్పటి టీడీపీ ప్రభుత్వం పోలీసులపై ఒత్తిడి తెచ్చి స్థానిక వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు, చోడవరం జెడ్పీటీసీ మారిశెట్టి విజయశ్రీకాంత్, చోడవరం ఉపసర్పంచ్ పుల్లేటి వెంకట్రావు,బిసీసెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పల్లా నర్సింగరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంపలి ఆనంద్, జిల్లా ప్రతినిధి జ్యోతుల రమేష్, సోషల్ మీడియా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పందిరి శ్రీనివాసరావు, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి ఓరుగంటి నెహ్రూ, జిల్లా ప్రతినిధి వడ్డాది నర్సింహమూర్తి, మండల బీసీసెల్ అధ్యక్షుడు సూరిశెట్టి నాగదుర్గగోవింద, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు శరగడం నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షురాలు అల్లాడ భవానీతో సహా 12 మందిపై అక్రమంగా కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి 9సంవత్సరాలు పాటు వాయిదాలకు కోర్టుకు తిరిగిన ఆ పార్టీ నాయకులకు కోర్టులో ఎట్టకేలకు ఊరట లభించింది. వైఎస్సార్సీపీ నాయకుల తరపున ఆ పార్టీ లీగల్ అడ్వయిజర్ కాండ్రేగుల డేవిడ్ కోర్టులో వాదనలు వినిపించారు. అప్పటి తహసీల్దార్, ఇద్దరు ఎస్ఐలు, పలువురు కానిస్టేబుళ్లు ఈ విచారణలో కోర్టుకు హాజరయ్యారు. చోడవరం జుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి స్వర్ణ ఈ కేసును విచారణ చేసి తుది తీర్పు చెప్పారు. నిందితులపై మోపబడిన ఆరోపణలు రుజువు కాకపోవడంతో వారిని నిర్దోషులుగా పరిగణిస్తూ న్యాయమూర్తి కేసును కొట్టివేశారని నిందితుల తరపు న్యాయవాది కాండ్రేగుల డేవిడ్ చెప్పారు. ఈ సందర్భంగా వారంతా డెవిడ్కు కృతజ్ఞతలు తెలిపారు. తమపై టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టినప్పటికీ న్యాయమే గెలిచిందని వైఎస్సార్సీపీ నాయకులు అన్నారు. -
వాల్తేరులో సరికొత్త మైలు రాళ్లు
సాక్షి, విశాఖపట్నం : భారతీయ రైల్వేలో వాల్తేరు విభాగం మునుపెన్నడూ లేని విధంగా చరిత్రాత్మక విజయాలను నమోదు చేస్తూ ప్రగతి పథంలో దూసుకుపోతోందని డీఆర్ఎం లలిత్ బోహ్రా తెలిపారు. వాల్తేరు డీఆర్ఎం కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో వాల్తేరు ప్రగతి వివరాలను వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అద్భుతమైన పనితీరును కనబరిచిన ఈ విభాగం, దేశవ్యాప్తంగా అత్యధిక ఆదాయం గడించిన విభాగాల్లో ఐదో స్థానాన్ని కై వసం చేసుకుని తన ప్రత్యేకతను చాటుకుందని తెలిపారు. ప్రధానంగా సరుకు రవాణాలో 85.1 మిలియన్ టన్నుల రికార్డు స్థాయి లక్ష్యాన్ని చేరుకోవడమే కాకుండా, మునుపటి ఏడాదితో పోలిస్తే 17.25 శాతం వృద్ధిని నమోదు చేసి సరికొత్త అధ్యాయాన్ని లిఖించామన్నారు. వాల్తేరు డీఆర్ఎం ఇంకా ఏం చెప్పారంటే.. ఆర్థిక రికార్డులు.. కార్యకలాపాల జోరు వాల్తేరు విభాగం ఈ ఏడాది మొత్తం రూ.11,598 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇది గతేడాదితో పోలిస్తే 17 శాతం అధికం. ముఖ్యంగా సరుకు రవాణా, రవాణా నిర్వహణలో 150 మిలియన్ టన్నుల మైలురాయిని దాటి అగ్రగామిగా నిలిచింది. ప్రయాణికుల రాకపోకలు కూడా గణనీయంగా పెరిగాయి. సుమారు 3.34 కోట్ల మంది ప్రయాణికులు వాల్తేరు రైల్వే సేవలను వినియోగించుకోగా, గత 21 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ప్రయాణికుల విభాగం ద్వారా రూ.881.37 కోట్ల ఆదాయం సమకూరింది. క్యాటరింగ్, పార్కింగ్, ప్రకటనలు, టికెట్ తనిఖీల ద్వారా కూడా భారీగా ఆదాయం ఆర్జించాం. శరవేగంగా స్టేషన్ల నవీకరణ పనులు వాల్తేరు డివిజన్ పరిధిలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 15 రైల్వే స్టేషన్లను ఆధునీకరించేందుకు ఎంపిక చేశాం. విశాఖపట్నం ప్రాంతంలో రైలు ఫ్లైఓవర్లు, అదనపు లైన్ల నిర్మాణం, స్టేషన్ల నవీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రయాణికుల సౌకర్యం కోసం విశాఖపట్నం స్టేషన్లో స్లీపింగ్ పాడ్స్, విశాఖలో 220, విజయనగరంలో 24 డిజిటల్ స్క్రీన్లు, అత్యాధునిక వెయిటింగ్ హాల్స్ ఏర్పాటు చేశాం. పండగలు, సెలవుల రద్దీని తట్టుకునేందుకు 300కు పైగా ప్రత్యేక రైళ్లు, 400 అదనపు కోచ్లను నడిపాం. విశాఖపట్నం నుంచి తిరుపతి, చర్లపల్లి వెళ్లే ప్రత్యేక రైళ్లను క్రమబద్ధీకరించారు. అరకు, కొరాపుట్ కాఫీ బ్రాండ్లను ప్రోత్సహించడానికి ఆయా స్టేషన్లలో ప్రత్యేక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ప్లాటినం రేటింగ్ కలిగిన హరిత రైల్వే స్టేషన్గా విశాఖపట్నం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. భద్రతలో రాజీపడే ప్రసక్తే లేదు వాల్తేరు విభాగం సాంకేతికత వినియోగంలోనూ ముందుంది. భద్రత, నిఘా కోసం విశాఖ స్టేషన్లో ‘ఆర్క్ అర్జున్’ అనే కృత్రిమ మేధస్సుతో పనిచేసే రోబోను ప్రవేశపెట్టాం. ఇది నేరస్తులను గుర్తించడంలో, ప్రయాణికులకు మార్గనిర్దేశం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. భద్రతా పరంగా అప్రమత్తంగా వ్యవహరించిన సిబ్బందికి ప్రత్యేక అవార్డులు అందజేయడమే కాకుండా, సిబ్బంది నైపుణ్యాన్ని పెంచేందుకు శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. మౌలిక వసతుల విస్తరణ రైలు ప్రయాణాన్ని మరింత వేగవంతం చేసేందుకు మౌలిక సదుపాయాల విస్తరణపై విభాగం దృష్టి సారించాం. ఈ ఏడాది జనవరి నాటికి 380 కిలోమీటర్లకు పైగా డబుల్ లైన్ పనులను పూర్తి చేసి ప్రారంభించడం ఒక పెద్ద విజయం. దీనివల్ల రైళ్ల రాకపోకల్లో జాప్యం తగ్గడమే కాకుండా, సరుకు రవాణా సామర్థ్యం కూడా పెరుగుతుంది. పార్లమెంట్లో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించినట్లుగా.. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ త్వరలో రాబోతుందని డీఆర్ఎం స్పష్టం చేశారు. -
హోంగార్డు కుటుంబానికి రూ.4.24 లక్షల సాయం
హోంగార్డు వెంకటరావు భార్య నీలిమకు చెక్కు అందజేస్తున్న ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి: పోలీస్ శాఖలో హోంగార్డులు ఒక భాగమేనని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డు డి.వి.వెంకటరావు భార్య నీలిమకు రూ.4,24,120 చెక్కును బుధవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖ ఆర్.ఐ.ఎన్.ఎల్ స్టీల్ ప్లాంట్లో డిప్యూటేషన్పై విధులు నిర్వర్తిస్తూ, అనారోగ్యంతో మరణించిన వెంకటరావు కుటుంబానికి అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మిగిలిన హోంగార్డులు ఒక రోజు గౌరవ వేతనాన్ని అందజేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎ.ఓ సి.హెచ్.తిలక్ బాబు, ఆఫీస్ సూపరింటెండెంట్ దేవరాజు, జూనియర్ అసిస్టెంట్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా మరిడమ్మ జాతర
నర్సీపట్నం: మూడేళ్లకోసారి నిర్వహించే పట్టణ ప్రజల ఇలవేల్పు మరిడమ్మ జాతర కనులపండువగా జరిగింది. రెల్లివీధి నుండి అమ్మను గరగలు నృత్యం, వివిధ కాగితపు పువ్వుల అలంకరణతో తీసుకువచ్చారు. ఊరేగింపులో వివిధ రకాల కళాకారులు, వేషదారుణలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. తీన్మార్ డప్పులు, అమ్మవారి శక్తి అవతారాలతో కళాకారులు, వివిధ రకాల డప్పు వాద్యకారులు ఊరేగింపులో పాల్గొన్నారు. దారిపొడవునా ప్రజలు ఊరేగింపును తిలకించడానికి బారులు తీరారు. రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఈ ఊరేగింపు సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ను మళ్లించారు. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబ సభ్యులు ఊరేగింపులో పాల్గొన్నారు. -
లేబర్ కోడ్స్ రద్దు చేయాలి
గోవాడ ఫ్యాక్టరీ వద్ద ధర్నా చేస్తున్న కార్మికులు చోడవరం: కార్మికులను నష్టం కలిగించే లేబర్ కోడ్స్ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ సీఐటీయు ఆధ్వర్యంలో గోవాడ సుగర్ఫ్యాక్టరీ గేటు వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా సీఐటీయు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసనకు పిలుపు ఇవ్వడంతో దీనిలో భాగంగా గోవాడ ఫ్యాక్టరీ వద్ద కార్మికులు ధర్నా చేశారు. లేబర్ కోడ్స్ను రద్దు చేసి గతంలో ఉన్న 29 కార్మిక చట్టాలను యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులను నష్టం కలిగించే చట్టాలను కేంద్రం తీసుకొచ్చిందని, వెంటనే వీటిని రద్దు చేయాలని సీఐటీయు జిల్లా అధ్యక్షుడు వి.వి.శ్రీనివాసరావు, గోవాడ సుగర్స్ కార్మిక సంఘం నాయకులు శరగడం రామునాయుడు డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాల వల్ల గోవాడ సుగర్ ప్యాక్టరీలో కార్మికులు, రైతులకు తీరని నష్టం కలిగిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణంలో రైతులు, కార్మికులకు రావలసిన బకాయిలను చెలించాలని వారు డిమాండ్చేశారు. ఈ ఆందోళనలో నాయకులు ఎస్.వి నాయుడు, రాయి సూరిబాబు, రామకుమార్ పాల్గొన్నారు. -
అంతిమయాత్రకు కష్టాలెన్నో...
బుచ్చెయ్యపేట: మేజర్ పంచాయతీ వడ్డాదిలో శ్మశానానికి వెళ్లేందుకు రహదారి సౌకర్యం లేక పలువురు అవస్థలు పడుతున్నారు. గ్రామంలో కొత్తూరు రెల్లివీధికి చెందిన కొత్తపల్లి రాజు అనారోగ్యంతో బుధవారం మృతి చెందాడు. వీరి శ్మశానం మెయిన్ రోడ్డును ఆనుకుని ఉన్న పెద్దేరు కస్పా కాలువ అవతల ఉంది. కాలువపై నుండి వెళ్లేందుకు రహదారి సౌకర్యం లేక కుటుంబ సభ్యులు రాజు మృతదేహంతో కాలువలోకి దిగి అవస్థలు పడ్డారు. మోకాళ్ల లోతు నీటిలో నుంచి దిగి శ్మశానానికి చేరుకుని దహన సంస్కారాలు పూర్తి చేశారు. ఎవరైనా మృతి చెందితే ఈ రోజుతో ఆయనకు కష్టాలు పోయాయి సంతోషంతో దహన సంస్కారాలు చేయాలంటారు. కానీ శ్మశానంకు వెళ్లే రహదారి సౌకర్యం లేక అంతిమయాత్రకు నానా కష్టాలు తప్పడం లేదని పలువురు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు గ్రామాల్లో అవసరం లేకపోయినా పంట పొలాలకు లే అవుట్లకు ప్రభుత్వ నిధులతో రోడ్లు వేస్తున్న అధికారులు అవసరం ఉన్న చోట మాత్రం రోడ్డు సదుపాయం కల్పించడం లేదని, నాయకులు ఎక్కడ చెబితే అక్కడే రోడ్లు వేస్తున్నారు తప్ప ప్రజాప్రయోజనాలు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. -
కార్మికులకు సంక్షేమ పథకాల పునరుద్ధరణ
మాట్లాడుతున్న సహాయ కార్మికాధికారి సూర్యనారాయణ చోడవరం: కార్మికులకు అన్ని సంక్షేమ పథకాలు అందించేందుకు చర్యలు తీసుకున్నామని కార్మిక శాఖ సహాయ కార్మికాధికారి పి. సూర్యనారాయణ అన్నా రు. బుధవారం చోడవరంలో సబ్బవరం, దేవరాపల్లి, కె.కోటపాడు, చీడికాడ, బుచ్చెయ్య పేట, రావికమతం, మాడుగుల మండలాలకు చెందిన కార్మిక సంఘాలతో ఆయన సమావేశమయ్యారు. గత నెల నుంచి సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరించామ న్నారు. కార్మికుల కుమార్తెల వివాహానికి రూ.40 వేలు, ప్రసూతి ఖర్చులకు రూ. 20వేలు, సహజ మరణానికి రూ.60వేలు, దహన ఖర్చులకు రూ. 20వేలు ఇచ్చే పథకాలు పునరుద్ధరించామన్నారు. -
పటిష్ట చర్యలు
ప్రభుత్వ భూముల పరిరక్షణకు● సీఎంఓ కార్యాలయం, పీజీఆర్ఎస్ దరఖాస్తులపై ప్రత్యేక శ్రద్ధ ● రెవెన్యూ అధికారుల సమీక్షలో కలెక్టర్ విజయకృష్ణన్తుమ్మపాల: ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. బుధవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమెతో పాటు జాయింట్ కలెక్టర్ ఽశౌర్యమాన్ పటేల్ అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న భూముల తాలూక తాజా పరిస్థితులను తెలుపుతూ నివేదికలు సమర్పించాలని, సంక్షిష్ట పరిస్థితులకు సంబంధించి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పట్టాదార్ పాస్పుస్తకాలు పంపిణీ, రీ సర్వే, వెబ్ ల్యాండింగ్ పోర్టింగ్, తదితర అంశాలపై నిర్వహించాల్సిన విధి విధానాల గురించి ప్రస్తావించారు. మ్యుటేషన్ల ప్రక్రియలో జాప్యాన్ని నివారించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జీవో నెం. 30 ప్రకారం అందరికీ ఇల్లు కార్యక్రమంపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సీఎంవో కార్యాలయం నుంచి, పీజీఆర్ఎస్లో వచ్చిన దరఖాస్తులపై అధికారులు స్వయంగా పరిశీలించి చర్యలు చేపట్టాలన్నారు. 22(ఏ) పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కోర్టు కేసుల విషయంలో అధికారుల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. చౌక ధరల దుకాణాలు, పెట్రోలు బంకులను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలన్నారు. చౌక ధరల దుకాణాలకు మహిళలు పిల్లలు వచ్చినట్లయితే ముందుగా వారికి సరుకులు పంపిణీ చేయాలని, మంచి నీరు ఏర్పాటు చేయాలని, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో చర్చించి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లాలో గ్యాస్ కొరత లేదని, గ్యాస్ ఏజెన్సీలలో ముందస్తు బుకింగ్స్ లేకుండా చూడాలని, గ్యాస్ సిలిండర్లను డోర్ డెలివరీ ద్వారా మాత్రమే అందజేయాలని, గ్యాస్ గోడౌన్ వద్ద ఎటువంటి డెలివరీలు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. గనులు క్వారీలపై అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. ఫైర్ క్రాకర్ యూనిట్లకు సంబంధించిన తనిఖీ నివేదికలను సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వై. సత్యనారాయణ రావు, ఆర్డీవోలు వి.వి. రమణ, షేక్ ఆయేషా, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, పలువురు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
కోసం వలన చేత
గురువారం శ్రీ 2 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026విద్యా కుసుమాల నిలయం, దేశానికే గర్వకారణమైన ఆంధ్ర విశ్వవిద్యాలయం నేడు ప్రైవేటు శక్తుల చేతిలో పతనం.. రాష్ట్రపతి ప్రారంభించిన రక్షణ కేంద్రానికి గ్రహణం.. ఆదాయం ఇచ్చే అక్షయ పాత్రను.. అప్పనంగా చిత్తుకాగితం చేసిన వైనం.. ’చేతికొచ్చిన బంగారాన్ని చెరువులో పారేసినట్టు’.. సొంత ప్రతిష్టను బలిపీఠం ఎక్కిస్తున్న పాలకులు.. ప్రశ్న ఒకటే.. ఏయూ భవితవ్యం.. ప్రైవేటు శక్తుల బతుకుదెరువా? ● ఏయూ డిఫెన్స్ స్టడీస్ సెంటర్కు మంగళం ● ప్రైవేటు వర్సిటికీ లబ్ధి చేకూర్చడమే పాలకవర్గం లక్ష్యం? ● ఏకపక్ష నిర్ణయాలతో అభాసుపాలుఇదీ ఏయూలో పాలన ప్రైవేటు హితం కోసం.. వర్సిటీకి రిక్తంసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : విశాఖ గడ్డపై విద్యా వినీలాకాశంలో ధ్రువతారగా వెలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం.. నేడు ప్రైవేటు శక్తుల కబంధ హస్తాల్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది. ‘గీతం వలన.. గీతం కోసం.. గీతం చేత..’ అన్న చందంగా సాగుతున్న ప్రస్తుత పాలన, వర్సిటీ గౌరవాన్ని గంగలో కలిపేస్తోంది. సాక్షాత్తూ భారత రాష్ట్రపతి ప్రారంభించిన రక్షణ అధ్యయన కేంద్రానికే మంగళం పాడి, రూ.15 కోట్ల ఆదాయాన్ని ఇచ్చే అక్షయపాత్రను చిత్తుకాగితంలా పారేసిన వైనంపై మేధావుల నుంచి ఆగ్రహం పెల్లుబుకుతోంది. అగ్నివీరులకు మార్గదర్శిగా, దేశ రక్షణ దళాలకు విద్యా గనిగా పేరుగాంచిన ఏయూని కుప్పకూల్చి.. ఆ శిథిలాల మీద ప్రైవేటు సామ్రాజ్యానికి రెడ్ కార్పెట్ వేస్తున్న పాలకుల తీరుపై నిరసన వ్యక్తమవుతోంది. రాష్ట్రపతి ప్రారంభించిన కేంద్రానికి గ్రహణం ఏయూ రక్షణ అధ్యయన కేంద్రాన్ని 2018లో అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సెంటర్ అతి తక్కువ కాలంలోనే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. దేశ సరిహద్దుల్లో కాపలా కాసే సైనికులు, అధికారులు తమ విధుల్లో ఉంటూనే.. ఉన్నత చదువులు అభ్యసించడానికి, రిటైర్మెంట్ తర్వాత మెరుగైన ఉపాధి పొందేందుకు ఈ కేంద్రం వారధిలా నిలిచింది. భారత వైమానిక, నౌకా, భూసేనలతో పాటు ఐఎన్ఎస్ సంస్థలు, కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ ఫేర్ వంటి అత్యున్నత రక్షణ విభాగాలతో ఏయూ బలమైన ఒప్పందాలు చేసుకుంది. దీనివల్ల వేలాది మంది రక్షణ సిబ్బంది పీహెచ్డీలు, డిగ్రీలు పూర్తి చేసి వర్సిటీ ప్రతిష్టను పెంచడమే కాకుండా, వర్సిటీ ఖజానాకు సుమారు రూ.15 కోట్ల ఆదాయాన్ని కూడా సమకూర్చారు. అగ్నివీర్లకు మార్గదర్శి.. నేడు అగమ్యగోచరం దేశంలో అగ్నివీర్లకు శిక్షణ ఇచ్చేందుకు ఎంపికై న మొదటి విశ్వవిద్యాలయంగా ఏయూ రికార్డు సృష్టించింది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా 7 వేల మందికి పైగా సైనికులు ఇక్కడ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. న్యాక్ గుర్తింపులో ఈ కేంద్రం ప్రదర్శించిన ‘బెస్ట్ ప్రాక్టీసెస్’కు 400 కి 400 మార్కులు రావడం విశేషం. ఇంతటి అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉన్న కేంద్రాన్ని, 2023లో సెనేట్ ఆమోదంతో పూర్తిస్థాయి స్కూల్గా మార్చాలని నిర్ణయించారు. అయితే, కొత్త పాలన వచ్చిన తర్వాత పరిస్థితి తలకిందులైంది. ఏయే కారణాలతో ఈ కేంద్రాన్ని మూసివేశారో అర్థం కాక విద్యార్థులు, నిపుణులు తలలు పట్టుకుంటున్నారు. ఈ పరిణామాల వల్లే సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ నిరంజన్ తన పదవికి రాజీనామా చేయగా, సమన్వయకర్తగా ఉన్న ఉజ్వల్ వంటి నిపుణులు వర్సిటీని వీడాల్సి వచ్చింది. -
నూకాంబిక సన్నిధిలో చాగంటి
అనకాపల్లి: గవరపాలెం నూకాంబిక అమ్మవారిని బుధవారం ఆధ్యాత్మిక ప్రవచన చక్రవర్తి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. అంతకుముందు ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణని ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను, ఆలయ సహాయ కవిమిషనర్ యాళ్ల శ్రీధర్లు పూర్ణకుంభంతో స్వాగతించారు. అనంతరం ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ చాగంటి కోటేశ్వరరావును శాలువాతో సత్కరించి, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం స్థానిక ఎన్టీఆర్ క్రీడామైదానంలో నూకాంబిక అమ్మవారి నెల పండగ జాతరలో భాగంగా కోటేశ్వరరావు ప్రవచనం చేశారు. -
సెజ్ హామీ.. నెరవేరదేమీ?
నాతవరం: స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గాంధీనగరం సమీపంలో ఎస్ఈజెడ్ (సెజ్) ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా నేటికీ అమలు కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024 నవంబరులో నర్సీపట్నం తుని మధ్య అర్అండ్బీ రోడ్డు పనులకు భూమి పూజ చేసేందుకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు, కలెక్టర్ విజయకృష్ణన్ విచ్చేశారు. కార్యక్రమం అనంతం ఏర్పాటు చేసిన సభలో అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ గాంధీనగరం ప్రాంతంలో ఎస్ఈజెడ్ ఏర్పాటు చేస్తానన్నారు, నర్సీపట్నం, తుని మధ్య అర్అండ్బీ రోడ్డును అనుకుని గాంధీనగరం ప్రాంతంలో 100 ఎకరాలు తక్కువ లేకుండా భూమి సేకరిస్తే సీఎం చంద్రబాబుతో మాట్లాడి సెజ్ ఏర్పాటు చేస్తానని కలెక్టర్ సమక్షంలో హామీ ఇచ్చారు. ఇక్కడ ఎస్ఈజెడ్ ఏర్పాటు చేసిన తర్వాత అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజనులు పండించే వ్యవసాయ ఉత్పత్తులను ఇక్కడకు తరలిస్తామన్నారు. ఈ ప్రాంతంలో వ్యవసాయ సెజ్ ఏర్పాటు చేయడం వల్ల అనకాపల్లి జిల్లాలో మైదాన ప్రాంత రైతులతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో గిరిజనులు పండించే అన్ని రకాల ఉత్పత్తులకు గిరాకీ ఉండే విధంగా చేసుకోవచ్చునన్నారు. మైదాన ప్రాంత రైతులకు తోడు గిరిజన ప్రాంత రైతుల ఉత్పత్తులను సెజ్లో నిల్వ చేసి, ఇతర మార్కెట్లకు తరలిస్తే అధిక ఆదాయం వస్తుందని ఊరించారు. మన ప్రాంతంలో రైతులు పండించే వ్యవసాయ ఉత్పత్తులకు ఇతర రాష్ట్రాలలో గిరాకీ ఉందన్నారు. అక్కడ మార్కెట్లో ప్రజలకు అనుగుణంగా ఉండే విధంగా ఆయా ఉత్పత్తులు తయారు చేసేందుకు సెజ్ ఎంతో ఉపయోడపడుతుందన్నారు. గాంధీనగరం ప్రాంతంలోనే ఎస్ఈజెడ్ ఏర్పాటు చేయడం వల్ల ఉత్పత్తులను తుని రైల్వే స్టేషన్కు, జాతీయ రహదారికి, విశాఖపట్నం ఎయిర్పోర్డుకు తరలించేందుకు రవాణాతో పాటు రోడ్డు మార్గం బాగుంటుందన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు సభలో ఇచ్చిన హామీ మేరకు అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లు ఎన్.దినేష్కుమార్, విజయ్కృష్ణన్ 2025 ఫిబ్రవరి 17న గాంధీనగరం ప్రాంతంలో భూములను స్వయంగా పరిశీలించారు. ఇక్కడ సెజ్ ఏర్పాటుకు 100 ఎకరాలకు పైగా భూమి కావాలి. అందులో ప్రభుత్వ భూమి ఎంత ఉంది, జిరాయితీ భూమి ఎంత, డీఫారం భూమి ఎంత? అనే విషయమై క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. ఇక్కడ సెజ్ ఏర్పాటుకు అవసరమైన భూమి సేకరణ చేయాలని ఇద్దరు కల్టెక్టర్లు నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణను ఆదేశించారు, గాంధీనగరం సమీపంలో అధికంగా పెడిమికొండలో అటవీశాఖకు చెందిన భూములు ఉన్నాయి. అటవీశాఖ భూములు తీసుకుంటే దానికి బదులుగా ఇదే మండలంలో సరుగుడు సుందరకోట ప్రాంతంలో వేలాది ఎకరాలు గ్యాప్ ఏరియా భూములు ఉన్నాయి. వాటిలో కొంత భూమి అటవీశాఖకు ఇచ్చేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇక్కడ సెజ్ ఏర్పాటు చేయడం వల్ల మైదాన, ఏజెన్సీ ప్రాంత వ్యవసాయ రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పీకర్ స్వయంగా ప్రకటించారు. ఇలా ప్రజలకు ఆశ చూపించి 15 నెలలు గడుస్తున్నా సెజ్ ఏర్పాటుపై అడుగు ముందుకు పడలేదు. -
పంచాయతీల్లో అధికారుల పాలన
సాక్షి, అనకాపల్లి: పల్లెల్లో ప్రత్యేకాధికారుల పాలన రానుంది. గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం ఈ నెల 2వ తేదీ గురువారంతో ముగుస్తుంది. ఈ మేరకు ఎన్నికలు జరిగే వరకు పంచాయతీలు ప్రత్యేక అధికారులను పాలనలోకి వెళతాయి. ఈ మేరకు ఆయా అధికారులతో జాబితాను తయారీ చేసింది. ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మండల ఎడ్యుకేషన్, మండల అగ్రికల్చర్ అధికారులు, సీడీపీఓ అధికారులు ఇతర మండల స్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించారు. ఒక్కో అధికారికి రెండు నుంచి మూడు, నాలుగు వరకూ పంచాయతీల బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయా పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించాలని జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. గజిటెడ్ హోదా కలిగిన అధికారులను గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులుగా నియమించాలని పంచాయతీరాజ్ శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు మండల అభివృద్ధి అధికారులు మండలాల్లో పనిచేస్తున్న గజిటెడ్ హోదా కలిగిన, మండల అధికారులతో జిల్లాలో 216 మంది అధికారులతో జాబితాలను తయారు చేశారు. ఈ మేరకు వివరాలను సిద్ధం చేశారు. జిల్లా పంచాయతీ అధికారి సందీప్ ప్రత్యేక అధికారుల జాబితాను సిద్ధం చేసి, ఆమోదం కోసం కలెక్టర్కు పంపించారు. ఈ జాబితా ఆమోదం పొందినట్లు సమాచారం. అధికారికంగా ఈ నెల 3వ తేదీన విడుదల చేయనున్నారు. పంచాయతీల పాలకవర్గాలకు ఎన్నికలు జరిగే వరకు, లేదా ఆరు నెలలపాటు ప్రత్యేక అధికారుల పాలన ఉంటుంది. 646 పంచాయతీలకు ప్రత్యేకాధికారులు జిల్లాలో 24 మండలాల పరిధిలో మొత్తం 646 గ్రామ పంచాయతీలున్నాయి. 2021 ఫిబ్రవరి రెండు, మూడు వారాల్లో (అప్పట్లో ఉమ్మడి జిల్లా) నాలుగు దశల్లో పంచాయతీల పాలకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. గెలుపొందిన సర్పంచులు, వార్డు సభ్యులు ఏప్రిల్ రెండో తేదీన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ నెల రెండో తేదీతో ఐదేళ్ల పదవీ కాలం పూర్తవుతుంది. పంచాయతీల పునర్విభజన, కొత్త పంచాయతీల ఏర్పాటు ప్రక్రియ పూర్తి కాలేదు. ఇంకా కుటుంబ సర్వే, బీసీ జనాభాగణన, ఇతర కారణాల వల్ల ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నిర్వహణను కొద్ది నెలలపాటు వాయిదా వేస్తున్నట్టు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 646 పంచాయతీలకు గానూ 216 మంది అధికారులను నియమిస్తూ జాబితా సిద్ధం చేశారు. సర్పంచ్లపై కూటమి కక్ష సాధింపు ఇప్పటివరకు గ్రామ అవసరాల కోసం సర్పంచులు స్వేచ్ఛగా చెక్కులు జారీ చేసే అవకాశం ఉండేది. అయితే నిధుల దుర్వినియోగం జరుగుతుందనే అనుమానంతో ప్రభుత్వం ఈ అధికారాలను పరిమితం చేసింది. ఇకపై సర్పంచులు జారీ చేసే ప్రతి చెక్కును డీఎల్డీఓ ఆమోదించడం తప్పనిసరి. పంచాయతీ కార్యదర్శులు నేరుగా చెక్కులను ప్రాసెస్ చేయకుండా డీఎల్డీవోల అనుమతి పొందిన తర్వాతే నిధులు విడుదయ్యేలా నిబంధనలు మార్చారు. జిల్లాలో అత్యధిక గ్రామ పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారు సర్పంచ్లు ఉండడంతో వారిని ఇబ్బంది పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నేటితో ముగియనున్న సర్పంచ్ల పదవీ కాలం ప్రత్యేక అధికారుల నియామకానికి కసరత్తు పూర్తి మండల స్థాయి అధికారులకూ బాధ్యతలు ఎన్నికలు జరిగే వరకూ అధికారుల పాలనే జిల్లాలో మొత్తం 646 పంచాయతీల్లో 216 అధికారులు ఇప్పటికే మున్సిపాలిటీల్లో ప్రత్యేక పాలన ఎన్నికలకు వెళ్లే యోచనలో లేని ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్ల జాబితా సిద్ధం పంచాయతీ సర్పంచ్ల గడువు ఈ నెల 2తో ముగియనుంది. మూడో తేదీ నుంచి ప్రత్యేకాధికారుల పాలన ఉంటుంది. ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్ల జాబితా ఉన్నతాధికారుల ఆమోదం కోసం పంపించాం. శుక్రవారం ఉదయం జాబితా ప్రకటిస్తాం. 24 మండలాల్లో ఉన్న ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవోలు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, మండల ఎడ్యుకేషన్, మండల అగ్రికల్చర్ అధికారులు, సీడీపీఓ అధికారులను నియమించడం జరిగింది. – సందీప్, జిల్లా పంచాయతీ అధికారి, అనకాపల్లి జిల్లా -
గిరిజన యువతి మృతిపై పోలీసుల విచారణ
దేవరాపల్లి : మండల కేంద్రంలో సోమవారం రాత్రి అనంతగిరి మండలం కొరపర్తికి చెందిన గిరిజన యువతి దూసరి లక్ష్మి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం విచారణ చేపట్టారు. అనకాపల్లి ఇన్చార్జి డీఎస్పీ ఈ.శ్రీనివాసులు, కె.కోటపాడు సీఐ కె.కృష్ణ, స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ ఘటనా స్థలాన్ని మంగళవారం పరిశీలించారు. యువతి ఉరి వేసుకున్న గదిలో క్లూస్ టీమ్ సిబ్బంది ఆధారాలు సేకరించారు. దేవరాపల్లికి చెందిన యువకుడు కొల్లి లోకేష్ ప్రేమ పేరుతో వంచించి మోసం చేయడాన్ని తట్టుకోలేక తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని తండ్రి పెంటయ్య ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారని ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, మృతురాలి కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు మంళవారం స్థానిక పోలీస్స్టేషన్కు అధిక సంఖ్యలో తరలివచ్చి లక్ష్మి మృతికి కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎస్టీ కులానికి చెందిన యువతి కావడంతోనే సదరు యువకుడు పెళ్లికి నిరాకరించాడని, దీనిని తట్టుకోలేక తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుందని మృతురాలి బంధువులు ఆరోపించారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలుస్తూ తల్లిదండ్రులను ఇద్దరు తమ్ముళ్లు, చెల్లిని పోషిస్తున్న లక్ష్మి మృతితో ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న మాట్లాడుతూ గిరిజన యువతి మృతిపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ రక్షణ చట్టం కింద పరిహారం, బాధిత కుటుంబానికి రూ.25 లక్షల నష్ట పరిహారం, రెండు ఎకరాల భూమి, కుటుంబ సభ్యుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కె.కోటపాడు సీహెచ్సీలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మంగళవారం సాయంత్రం కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. -
15 కిలోల గంజాయి పట్టివేత
గంజాయిని పట్టుకున్న సెక్యూరిటీ వింగ్ (ఆర్ఐ) టీం పెందుర్తి: ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి నగరానికి తరలిస్తున్న గంజాయిని పెందుర్తి రైల్వే స్టేషన్ వద్ద సెక్యూరిటీ వింగ్(ఆర్ఐ) టీం పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు పెందుర్తి ప్రాంతంలో ఆర్ఐ బృందం తనిఖీలు నిర్వహించింది. నార్కోటిక్ డాగ్ సహాయంతో రైల్వే స్టేషన్ వద్ద 4 ప్యాకెట్లలో 15 కిలోల గంజాయిని గుర్తించారు. గంజాయితో పాటు తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మేడపై నుంచి పడి యువకుడు మృతి
అచ్యుతాపురం రూరల్ : ప్రమాదవశాత్తూ మేడపై నుంచి పడి అలబాని రామకృష్ణ (22) అనే యువకుడు మృతి చెందిన సంఘటన అచ్యుతాపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. లారస్ పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న రామకృష్ణ అచ్యుతాపురం వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే దారిలో ఉన్న మనోహర్ హాస్టల్లో మూడో అంతస్తులో నివాసం ఉంటున్నాడు. మంగళవారం ఉదయం సుమారు 5.30 గంటల సమయంలో మూడో అంతస్తుపై నుంచి పడిపోవడం చుట్టుపక్కల వారు కొద్ది సేపటికి గమనించి 108 ఆంబులెన్స్ ద్వారా అచ్యుతాపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం 3 గంటల సమయంలో రామకృష్ణ మృతి చెందాడు. ఘటనపై తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ చంద్రశేఖర్రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
కందిపప్పు కలేనా.. రాగులు గతమేనా?
మహారాణిపేట: పేదల ఆహార భద్రతకు అండగా ఉండాల్సిన రేషన్ దుకాణాలు ఇప్పుడు అరకొర సరఫరాలతోనే సరిపెట్టుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 22 నెలలు దాటినా, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పూర్తి స్థాయిలో నిత్యావసరాలు అందకపోవడం కార్డుదారుల్లో అసంతృప్తిని పెంచుతోంది. ఎన్నికల ముందు రేషన్ ద్వారా విభిన్న నిత్యావసరాలు అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ప్రస్తుతం బియ్యం, పంచదారకే పరిమితమవుతోందని ప్రజలు విమర్శిస్తున్నారు. అప్పుడప్పుడు మాత్రమే కందిపప్పు, రాగులు పంపిణీ చేస్తూ ‘మూన్నాళ్ల ముచ్చట’గా మార్చేసిందనే ఆవేదన వ్యక్తమవుతోంది. పిండితో సరిపెడుతున్న సర్కార్ బియ్యం, పంచదార తప్ప మరేమీ ఇవ్వకుండానే కాలం గడిపేస్తున్న చంద్రబాబు సర్కార్, తాజాగా పట్టణ ప్రాంతాల్లో రూ. 20లకే గోధుమ పిండి ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటోంది. అయితే, గ్రామీణ ప్రజలకు ఈ సౌకర్యం లేకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పోషకాహారం పేరిట చేస్తున్న ఈ హడావుడి, క్షేత్రస్థాయిలో కేవలం కొందరికి మాత్రమే అందుతోంది. జిల్లాలో పరిస్థితి ఇలా... డీఎస్ఓ పరిధిలో మధురవాడ, ఆనందపురం, భీమిలి, పద్మనాభం, పెందుర్తి ప్రాంతాలు ఉండగా, జిల్లాలో 5.12 లక్షల తెలుపు కార్డులు, 600కు పైగా చౌకధరల దుకాణాలు ఉన్నాయి. అయినప్పటికీ సరఫరా లోపాలు సరిచేయడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేదల ఆశలు... ఇంకా నిరీక్షణలోనే.. గడప గడపకు రేషన్ అని చెప్పిన పాలకులు, ఇప్పుడు రేషన్ షాపుల్లో సరుకులకే కత్తెర వేస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ధరల నేపథ్యంలో, రేషన్ దుకాణాలపై ఆధారపడే కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కందిపప్పు, రాగులు వంటి అవసరమైన వస్తువులు అందకపోవడంతో పేదల భోజనంలో పోషకాహారం తగ్గిపోతోంది. ఇప్పటికై నా అధికారులు, పాలకులు స్పందించి కందిపప్పు, వంటనూనె వంటి నిత్యావసరాలను పునరుద్ధరించాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.రాగులు మున్నాళ్ల ముచ్చటే.. రాగులు మూడు కిలోలు ఇస్తామని చెప్పి చివరకు ఒక కిలోకే పరిమితం చేయడం కార్డుదారుల్లో అసంతృప్తిని పెంచింది. అంతేకాకుండా రాగులు ఇచ్చినప్పుడు బియ్యం కోటాలో కోత విధించడం మరో సమస్యగా మారింది. అది కూడా జనవరి నెల వరకే ఇచ్చారు. ఈనెల రాగులకు ఇండెంట్ పెట్టలేదు. అంటే ఈ నెల ఒక్క కిలో పంపిణీ చేసే అవకాశం లేదు.రేషన్ దుకాణాల్లో నిత్యావసరాల కోసం ఎదురు చూసే కార్డుదారులకు నిరాశే మిగులుతోంది. ఎన్నికల హామీల్లో చెప్పిన కందిపప్పు, రాగులు ఇప్పుడు మూన్నాళ్ల ముచ్చటగా మిగిలిపోగా, నెలల తరబడి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లో అమాంతం పెరిగిన ధరల మధ్య రేషన్పై ఆధారపడే పేదలు కందిపప్పు, రాగుల కోసం కళ్లప్పగించి ఎదురుచూస్తుండటం పరిస్థితి తీవ్రతను చూపుతోంది. కందిపప్పు కోసం కళ్లప్పగింత గత ప్రభుత్వ హయాంలో ప్రతి కార్డుదారుడికి నెలకు ఒక కిలో కందిపప్పు అందించేవారు. ప్రస్తుతం అది గతస్మృతిగా మారింది. ఏప్రిల్లో కూడా కందిపప్పు పంపిణీ చేసే సూచనలు కనిపించడం లేదు. ఇందుకు సంబంధించి ఇండెంట్ కూడా పెట్టకపోవడం గమనార్హం. మార్కెట్లో కందిపప్పు ధరలు రూ.150 నుంచి రూ.180 వరకు పెరగడంతో, సాధారణ ప్రజలకు కొనుగోలు భారంగా మారింది. దీంతో రేషన్ ద్వారా తక్కువ ధరకు లభించే కందిపప్పుపైనే అనేక కుటుంబాలు ఆధారపడుతున్నాయి. -
నిందితుడు రవీంద్రను ఉరితీయాలి
మహారాణిపేట: ‘నా బిడ్డను అత్యంత క్రూరంగా హత్య చేశాడు. ఈ కష్టం పగవారికి కూడా రాకూడదు’అంటూ మౌనిక తండ్రి పొలిపల్లి వేణుగోపాల్ కన్నీటిపర్యంతమయ్యారు. మంగళవారం కేజీహెచ్ మార్చురీ వద్ద తన కుమార్తె మృతదేహాన్ని చూసి ఆయన బోరున విలపించారు. తన కుమార్తెను హత్య చేసిన చింతాడ రవీంద్రను ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. హత్య జరిగిన సమయంలో మౌనిక ఒంటిపై ఉన్న సుమారు రెండు తులాల బంగారు ఆభరణాలు మాయమయ్యాయని వేణుగోపాల్ తెలిపారు. ఈ కేసుపై ప్రభుత్వం, పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించి, తమ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని వేడుకున్నారు. -
● ఈపీడీసీఎల్లో వినూత్న కార్యక్రమం ● డయల్ యువర్ సీఎండీకి వినతుల వెల్లువ ● ఫోన్ కాల్స్ ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్న అధికారులు
సాక్షి, విశాఖపట్నం: ఒక ఫోన్ నంబర్.. 8 వారాలు.. 11 జిల్లాలు.. 11 సర్కిళ్లు.. 345 ఫిర్యాదులు.. వచ్చిన ప్రతి ఫిర్యాదు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు.. మొత్తంగా వినూత్నంగా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ప్రారంభించిన ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమానికి స్పందన వస్తోంది. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి స్వయంగా ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 9 నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి సోమవారం ఫిర్యాదులు తీసుకొని వాటిని పరిష్కరించేందుకు సంబంధిత విభాగాధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. 345 ఫిర్యాదులు.. 35 పెండింగ్ ఇప్పటివరకు 8 వారాల పాటు డయల్యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటివరకు 345 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 310 ఫిర్యాదులను ఈపీడీసీఎల్ అధికారులు పరిష్కరించారు. ఫోన్లో ఫిర్యాదు చేసిన కొద్ది రోజులకే విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది ఆ గ్రామానికి రావడంతో ఈ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెరుగుతూ వస్తోంది. ఎక్కువగా లోవోల్టేజీ సమస్యపై ఫిర్యాదులు అందుతున్నాయి. ఇప్పటివరకు 76 వరకూ లోవోల్టేజీ ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులను ఆపరేషన్స్ డైరెక్టర్ సూర్యప్రకాష్ పర్యవేక్షిస్తూ.. పరిష్కరిస్తున్నారు. 76 ఫిర్యాదుల్లో 62 పరిష్కరించారు. లోవోల్టేజీని అధిగమించేందుకు... 43 ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు మార్చారు. లోవోల్టేజ్ ఉన్న ప్రాంతంలో 7.5 కి.మీ మేర పాత కండక్టర్లు మార్చడం విశేషం. మిస్డ్ కాల్స్పైనా దృష్టి పెడుతున్నాం.. ఈ కార్యక్రమానికి వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకూ ఫిర్యాదులు తీసుకుంటున్నాం. ఒక ఫిర్యాదు తీసుకున్న సమయంలో ఏవైనా మిస్డ్ కాల్స్ ఉంటే.. 11.30 గంటల తర్వాత ఆ నంబర్లకు ఫోన్ చేసి.. ఫిర్యాదులు స్వీకరిస్తున్నాం. ప్రతి సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించాం. విద్యుత్ అంతరాయాలు, వోల్టేజ్ సమస్యలు, కొత్త సర్వీస్ కనెక్షన్ జాప్యం, విద్యుత్ పునరుద్ధరణ, ట్రాన్స్ఫార్మర్ల మార్పిడి వంటి అంశాలను నేరుగా నా దృష్టికి తీసుకురావొచ్చు. –పృథ్వీతేజ్ ఇమ్మడి, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ -
ఇంటి బడ్జెట్ తలకిందులు గల్ఫ్ యుద్ధం సాకుతో నిత్యావసర ధరల మంట పెరిగిన వంటనూనె, పప్పుదినుసుల ధరలు జిల్లాలో కొనసాగుతున్న గ్యాస్ ఇబ్బందులు రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లలోనూ పెంచుతున్న ధరలు పాఠశాలలు, హాస్టళ్లలో భోజన వంటకు ఇక్కట్లు
అనకాపల్లి: రాగల ఐదురోజులలో ఆకాశం మేఘావృతమై పొడిగా ఉంటుందని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ విభాగం శాస్త్రవేత్త వి.గౌరీ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026అర్హులకు ఓటు హక్కు కల్పించండి విశాఖ లీగల్ : విశాఖ న్యాయవాదుల సంఘం నూతన ఎన్నికలకు సంబంధించి చాలా మంది న్యాయవాదులు ఓటు హక్కును కోల్పోయారు. సరైన సమాచారం లేని కారణంగా పలువురు న్యాయవాదులు తాము చెల్లించవలసిన సభ్యత్వ రుసుము చెల్లించలేదు. ఈనెల 23లోపు సభ్యత్వ రుసుం చెల్లించాలని న్యాయవాద సంఘం గడువు విధించింది. ఈ లోపు న్యాయవాదులు క్రీడా సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహించడంతో పలువురు న్యాయవాదులు తమ సభ్యత్వం చెల్లించలేకపోయారు. మార్చి 23వ తేదీ లోపు సభ్యత్వ రుసుం చెల్లించలేని వారికి ఓటు హక్కు లేదని ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించింది. దీనికి సంబంధించి సీనియర్ న్యాయవాది పాక సత్యనారాయణ మాట్లాడుతూ న్యాయవాదులందరికీ ఓటు హక్కు కల్పించడం కనీస ధర్మమని పేర్కొన్నారు. సభ్యత్వ రుసుము గడువు ఈనెల 6వ తేదీ వరకు పెంచాలని కోరారు. ఈ విషయంలో ఎన్నికల అధికారులకు సరైన ఆదేశాలు ఇవ్వాలని.. అవసరమైతే సర్వసభ్య సమావేశం నిర్వహించాలని సూచించారు. విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎంకే శ్రీనివాస్, కార్యదర్శి లాలం పార్వతి నాయుడు మాట్లాడుతూ అర్హులైన అందరి న్యాయవాదులకు ఓటు హక్కు కలిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సాక్షి, అనకాపల్లి : పశ్చిమాసియాలో నెల రోజులుగా జరుగుతున్న యుద్ధం పేద, సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అక్కడి యుద్ధ మేఘాలు మన వంటింట్లో సెగలు పుట్టిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో, ఇక్కడ అన్ని రకాల వస్తువుల ధరలు అమాంతం ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒక వైపు నిత్యవసర ధరలు పెరగడం..మరో వైపు గ్యాస్ ట్రబుల్తో జిల్లా ప్రజలు బాధపడుతున్నారు. వంట నూనె నుంచి పప్పుదినుసుల వరకూ అన్నింటిపై ఆ ప్రభావం పడింది. వంటనూనె రేట్లు పెరగడంతో వినియోగదారులు, రెస్టారెంట్లు, హోటల్స్లో, పాస్ట్ఫుడ్ సెంటర్లలో రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. మరోవైపు పాఠశాలలు, హాస్టళ్లలో భోజన వంటకు గ్యాస్ ట్రబుల్తో ఇబ్బందులు పడుతున్నారు. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు ఒక్కసారిగా పెరిగిన ధరలను చూసి షాక్కు గురవుతున్నారు. యుద్ధం ఎక్కడో జరుగుతుంటే, మన దగ్గర ధరలు పెరగడమేమిటని ప్రశ్న ఉత్పన్నమైనా పెరిగిన రేట్లతో జేబులకు చిల్లులు పడుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, ఇటు ప్రభుత్వ పన్నుల పోటు, పెరుగుతున్న నిత్యావసర ధరలు.. మధ్యలో వ్యాపారుల మాయాజాలం.. వెరసి సామాన్యుడి జేబు ఖాళీ అవుతోంది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే రేట్లు పెరగడం ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ధరల పెరుగుదల గృహిణుల బడ్జెట్ను తలకిందులు చేస్తోంది. గ్యాస్ రేట్లు పెరగడం కొరత ఏర్పడడంతో వాటికి ప్రత్యామ్నాయమైన కట్టెలు, బొగ్గులు రేట్లు కూడా గ్రామాల్లో పెరిగాయి. ధరల మంటకు కారణాలు ఇవే.. గల్ఫ్, పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా పశ్చిమాసియా దేశాల నుంచి దిగుమతి అయ్యే నిత్యవసర వస్తువులు, వంట నూనె, గ్యాస్ సరఫరా గొలుసు తీవ్రంగా దెబ్బతింది. దీంతో దిగుమతులు తగ్గి మార్కెట్లో అనుకోని విధంగా ధరలు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం నిత్యావసరాలపై ఇటీవల విధించిన 12 శాతం ట్యాక్స్ ధరలు భగ్గుమనడానికి మరో కారణమైంది. పండగల సీజన్ కావడంతో మార్కెట్లో వంట నూనెలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. కృత్రిమ కొరతతో సామాన్యుల నిలువుదోపిడీ అంతర్జాతీయ కారణాలను సాకుగా చూపి స్థానిక వ్యాపారులు నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. మార్కెట్లో డిమాండ్ పెరగడాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు వ్యాపారులు, పాత స్టాక్ను గోదాముల్లో బ్లాక్ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసిన పాత స్టాక్ను సైతం పెరిగిన కొత్త ధరలకే విక్రయిస్తూ వినియోగదారుల జేబులు గుల్ల చేస్తున్నారు. ఇదే అదనుగా రిటైర్ వ్యాపారులు కిరాణా వస్తువులను కూడా పెంచారు. ఇంత జరుగుతున్నా పౌరసరఫరాలు, విజిలెన్స్ అధికారుల పర్యవేక్షణ కొరవడడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో రోజుకు గృహ, వాణిజ్య అవసరాల నిమిత్తం పామాయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ 10 వేల కేజీల నూనె వినియోగం జరుగుతున్నట్టు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో 50 శాతం పామాయిల్, 40 శాతం సన్ఫ్లవర్ ఆయిల్, 10 శాతం ఇతర నూనెలు వాడుతున్నారు. అయితే పామాయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ రేట్లు రూ.6 నుంచి రూ.10 పెరిగాయి.పామాయిల్లో రూ.90 –115 నుంచి రూ.120–140 వరకూ పెరిగింది.సన్ఫ్లవర్ ఆయిల్ రూ. 140–160 నుంచి రూ.166–178 వరకూ పెరిగింది. ●జిల్లాలో 300 వరకూ ఆయిల్ మిల్లులు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా అనకాపల్లి, నర్సీపట్నం, యలమంచి, పాయకరావుపేట, చోడవరం, సబ్బవరం, ఎస్.రాయవరంలో ఎక్కువగా ఉన్నాయి. వీటిలో వేరుశనగ, నువ్వుల నూనెలు తయారవుతాయి. ఇవి మిల్లుల ద్వారా 3 వేల కేజీలకు పైగా వినియోగం అవుతున్నాయి. జిల్లాలో పెరిగిన ధరల వివరాలు ఇలా...వంటింటికి ధరల సెగ -
పరుగు పోటీల్లో కండక్టర్ సత్తా
పద్మనాభం: గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈ నెల 30, 31 తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి శాప్ లీగ్ మాస్టర్స్ అథ్లెటిక్ పోటీల్లో అనంతవరం గ్రామానికి చెందిన కొండిమాని రాంబాబు అద్భుత ప్రతిభ కనబరిచారు. సింహాచలం ఆర్టీసీ డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఆయన, ఈ క్రీడల్లో రెండు బంగారు పతకాలు సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. విశాఖ జిల్లా తరపున 35, 45 సంవత్సరాల పురుషుల విభాగాల్లో రాంబాబు పాల్గొన్నారు. 100 మీటర్ల పరుగు పందెం, 4x100 మీటర్ల రిలే పరుగు పందెంలో బంగారు పతకాలను సాధించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వం, ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మరిన్ని జాతీయ స్థాయి పతకాలు సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. కండక్టర్గా విధి నిర్వహణలో ఉంటూనే క్రీడల పట్ల ఆయన చూపుతున్న ఆసక్తిని పలువురు అభినందించారు. -
లక్ష్యానికి మించి పన్నులు వసూలు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ పరిధిలో ఆస్తి, ఖాళీ జాగా పన్నుల వసూళ్లు ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని మించి నమోదయ్యాయి. నగరంలో 6 లక్షలకు పైగా ఆస్తి/ఖాళీ జాగా అసెస్మెంట్లు ఉండగా, 2025–26 ఆర్థిక సంవత్సరానికి మంగళవారం రాత్రి 9 గంటల సమయానికి రూ.620.08 కోట్లు ఆస్తి పన్ను వసూలైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 50 శాతం వడ్డీ రాయితీ కారణంగా ప్రజలు, సంస్థలు భారీగా పన్నులు చెల్లించడంతో వసూళ్లు గణనీయంగా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం (2024–25)లో రూ.510.15 కోట్లు వసూలవగా, ఈసారి రూ.109.93 కోట్లు అధికంగా వచ్చింది. అదనపు కమిషనర్ (రెవెన్యూ), డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ), జోనల్ కమిషనర్లు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది సమన్వయంతో చేసిన కృషి ఫలితంగానే ఈ స్థాయి వసూళ్లు సాధ్యమయ్యాయని కమిషనర్ తెలిపారు. రాత్రి 12 గంటల వరకు అన్ని సౌకర్య కేంద్రాలు పనిచేస్తుండటంతో వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. సకాలంలో ఆస్తిపన్ను చెల్లించి నగరాభివృద్ధికి తోడ్పడిన ప్రజలకు జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్ కృతజ్ఞతలు తెలిపారు. -
ఉపాధ్యాయినుల సమస్యలపై యూటీఎఫ్ వినతి
అనకాపల్లి : మహిళా ఉపాధ్యాయులకు ఉన్నత పాఠశాలల్లో ప్రత్యేక స్టాఫ్ రూమ్స్, మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ, ఏప్రిల్ 1న స్థానిక నెహ్రూచౌక్ వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఒక రోజు నిరాహర దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వత్సవాయి శ్రీలక్ష్మి, గొంది చిన్నబ్బాయ్ అన్నారు. జీవీఎంసీ విలీన గ్రామమైన కె.ఎన్.ఆర్.పేటలో యూనియన్ ఆధ్వర్యంలో డీఈఓకు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు పుస్తకాలు తీసుకురావడం, ప్రశ్నపత్రాలు తీసుకు రావడం లాంటి పనుల నుంచి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలన్నారు. మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు తదితర సమస్యల నుంచి రక్షణార్ధం జిల్లా స్థాయిలో ఒక ప్రొటెక్షన్ సెల్ను ఏర్పాటు చేయాలన్నారు. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి జిల్లా స్థాయిలో స్ట్రెస్ మేనేజ్మెంట్ కౌన్సిలర్లను ఏర్పాటు చేయాలన్నారు. తల్లిదండ్రులను అత్తమామాలను చూసుకోవడానికి పది రోజులు ప్రత్యేక సెలవులు మంజూరు చేయాలని, మహిళా ఉద్యోగులకు ఉచిత న్యాయ సలహా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. -
ఆంగ్లభాష ప్రాముఖ్యత పెరుగుతోంది
అనకాపల్లి : ఆంగ్లభాష ప్రాముఖ్యత నేటి ఆధనిక ప్రపంచంలో ప్రచండ వేగంతో దూసుకుపోతుందని డీఈవో గిడ్డి అప్పారావు నాయుడు అన్నారు. జీవీఎంసీ విలీన గ్రామమైన కె.ఎన్.ఆర్.పేటలో ఏపీ ఎంఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న ఆంగ్ల అధ్యాపకుడు విల్లూరి ఉమామహేశ్వరరావు రచించిన ‘ట్రాన్స్మ్యుటేషన్ ఆఫ్ హిస్టరీ లిటరేచర్’ పుస్తకాన్ని మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పుస్తక సాహిత్యం ద్వారా ఆంగ్ల భాషాభివృద్ధి చేసుకోవాలనుకునే వారికీ, ఆంగ్లభాష వ్యక్తీకరణని అభివృద్ధి చేసుకోదలచుకునే వ్యక్తులకు క్లుప్తంగా ఆంగ్లభాషపై మంచి పట్టు సంపాదించుకుని తనదైన శైలిలో ఆంగ్లంలో భావప్రకటన చేయదలచుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. స్కూళ్లు, కళాశాలల విద్యార్థులు, ఇతర వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పుస్తక రచయిత డాక్టర్ విల్లూరి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో భారతీయుల స్థితిగతులు, వారి జీవన ప్రమాణాలు, వారు ఎదుర్కొన్న సవాళ్లు తదితర విషయాలను, వివిధ రకాల రచయితల రచనా పటిమను పరిగణనలోనికి తీసుకుంటూ రాసిన పుస్తకం ఆద్యంతం ఆసక్తిగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు అప్పారావు, కిషోర్, సాయిరామ్. పలాసరావు(పోస్టల్ డెవలప్మెంట్ ఆఫీసర్), కాళిదాస్, టి.లక్ష్మీనాయుడు పాల్గొన్నారు. -
సురక్షిత విశాఖే లక్ష్యంగా పనిచేద్దాం
అల్లిపురం: నగరంలో ప్రజల భద్రతను మెరుగుపరచడం, సామాజిక అంశాలపై అవగాహన కల్పించడం, సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడంలో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు భాగస్వాములు కావాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి కోరారు. పోలీస్ కమిషనర్ కార్యాలయ సమావేశ మందిరంలో నగరానికి చెందిన సుమారు 35 మంది ఇన్ఫ్లూయెన్సర్లతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖ, సోషల్ మీడియా ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే సమాజంలో గణనీయమైన మార్పు తీసుకురావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. నిరుత్సాహంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో ధైర్యం నింపడం, ఆన్లైన్ గ్యాంబ్లింగ్, చిట్ఫండ్ మోసాలు, ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయడం, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై యువతకు అవగాహన కల్పించడం, హెల్మెట్ ధారణ ఆవశ్యకత, రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకోవడం, పోలీస్ శాఖ ప్రవేశపెట్టిన స్పీడ్ లేజర్ గన్స్ పనితీరుపై సమాచారం అందించడం తదితర అంశాలపై వీడియోలు, సందేశాల రూపంలో విస్తృత ప్రచారం కల్పించాలని సీపీ కోరారు. అనంతరం ఇన్ఫ్లూయెన్సర్ల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఇన్ఫ్లూయెన్సర్లకు సీపీ శంఖబ్రత బాగ్చి పిలుపు -
రూ.3 కోట్ల ప్రభుత్వ భూమికి స్కెచ్?
మధురవాడ: ప్రభుత్వ భూముల ఆక్రమణలకు అక్రమార్కులు తెగబడుతున్నారు. మధురవాడ పరిధిలో కోట్లాది రూపాయల విలువైన భూమిని కొట్టేయడానికి నియోజకవర్గ ముఖ్యనేత పేరును వాడుకుంటూ దర్జాగా పనులు సాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కబ్జాదారులకు అధికార పార్టీ అండదండలు ఉండటంతోనే రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. రూ.3 కోట్లు విలువ చేసే భూమి విశాఖ రూరల్ మండలం, మధురవాడ రెవెన్యూ గ్రామం సర్వే నంబర్ 388 పరిసరాల్లో ఈ దందా సాగుతోంది. మధురవాడ హైవే నుంచి ఐటీ సెజ్కు వెళ్లే మార్గంలో, వికలాంగుల కాలనీ వద్ద అదానీ డేటా సెంటర్ రోడ్డును ఆనుకుని ఉన్న సుమారు 500 గజాల ప్రభుత్వ భూమిపై అక్రమార్కుల కన్ను పడింది. ఇక్కడ గజం ధర బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.60 వేల వరకు పలుకుతోంది. అంటే సుమారు రూ.3 కోట్ల విలువైన ఈ భూమిని హస్తగతం చేసుకునేందుకు పక్కా పథకం రచించారు. గతంలో అక్రమంగా నిర్మించిన షెడ్లకు ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలోని తుప్పలను తొలగించి, కొండ భూమిని చదును చేసే పనులు మొదలుపెట్టారు. ఇంత దర్జాగా ప్రభుత్వ భూమిని ఆక్రమణకు తెరలేపడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణ పనుల్లో జీవీఎంసీ వాహనం ఈ కబ్జా పర్వంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భూ ఆక్రమణను అడ్డుకునేందుకు వచ్చిన గ్రేడ్–2 వీఆర్వో, అక్కడ జరుగుతున్న పనులను నిలిపివేయించారు. భూమిని చదును చేస్తున్న పొక్లెయిన్ను సీజ్ చేసి తహసీల్దార్ కార్యాలయానికి తరలించేందుకు ప్రయత్నించగా.. అది జీవీఎంసీ శానిటేషన్ విభాగానికి చెందిన వాహనమని తేలడంతో విస్తుపోయారు. అదే సమయంలో అధికార పార్టీకి చెందిన ఒక ప్రముఖ నేత నుంచి ‘సదరు వ్యక్తులు మనవారే.. వదిలేయండి’అంటూ హుకుం జారీ కావడంతో అధికారి వెనక్కి తగ్గినట్లు సమాచారం. ప్రభుత్వ భూమిని ఆక్రమించడానికి ఏకంగా ప్రభుత్వ వాహనాన్నే వాడటం చూస్తుంటే, ఈ వ్యవహారం ఎంతటి స్థాయి వ్యక్తుల కనుసన్నల్లో జరుగుతుందో అర్థమవుతోంది. అసలు సూత్రధారులు ఎవరు? అసలు అక్రమార్కుల పనులకు జీవీఎంసీ వాహనాన్ని పంపిన అధికారులు ఎవరు? ఈ కబ్జా వెనుక జీవీఎంసీలోని ఉన్నతాధికారుల ప్రమేయం ఉందా.. లేక ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకే ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ వాహనాన్ని ఉపయోగించారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. -
రెండు బైక్ల ఢీ... ఇద్దరు యువకుల మృతి
డుంబ్రిగుడ : మండలంలోని గోరాపూర్ రైల్వేస్టేషన్ సమీపంలోని ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్లు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఎస్ఐ ఎల్.సురేష్ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అరకులోయ మండలం మాదల పంచాయతీ తోటవలస గ్రామానికి చెందిన కిల్లో జోషప్(23) అనే గిరిజన యువకుడు బంధువుల ఇంటి నుంచి స్వగ్రామానికి బయలుదేరగా, హుకుంపేట మండల గడుగుపల్లి గ్రామానికి చెందిన మువ్వల శ్రీను(28) అనే యువకుడు తన స్నేహితుడితో చటువాలో జరుగుతున్న పండగను చూసేందుకు బయలుదేరారన్నారు. గోరాపూర్ రైల్వేస్టేషన్ సమీపంలో కిలోమీటరు దూరంలో రాత్రి వేళ రెండు బైకులు బలంగా ఢీ కొన్నాయని చెప్పారు. సంఘటన స్థలంలోనే శ్రీను మృతి చెందగా, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న జోషప్ అంబులెన్స్లో తరలిస్తుండగా మార్గమధ్యంలో యండపల్లివలసలో మృతి చెందారని ఎస్ఐ తెలిపారు. వారితో పాటు మరొకరు గాయాలతో ఉండగా ఆసుపత్రిలో చేర్పించారని తెలిపారు. మృతదేహాలను అరకులోయ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి పంచనామా నిర్వహించి మృతుల కుటుంబ సభ్యులకు మంగళవారం అప్పగించడం జరిగిందన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతి చెందిన మువ్వల శ్రీను, (ఫైల్) -
దేవస్థానం సొసైటీ ఎన్నికల్లో హరి ప్యానెల్ గెలుపు
సింహాచలం: శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం హౌస్ బిల్డింగ్ సొసైటీ ఎన్నికలు ప్రహ్లాదపురంలోని సొసైటీ కల్యాణమండపంలో మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహించారు. మొత్తం 206 ఓట్లకు 168 ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారి నిరంజన్ పట్నాయక్ తెలిపారు. 9 మంది సభ్యులకు గాను పోటీలో 14 మంది(రిటైర్డ్ ఉద్యోగులు, ప్రస్తుతం విధుల్లో నిలిచిన ఉద్యోగులు) నిలిచారు. వీరిలో డి.వి.ఎస్.రామరాజు(హరి) ప్యానెల్ విజయం సాధించింది. డి.వి.ఎస్.రామరాజు, గొడవర్తి శ్రీనివాసాచార్యులు, సుంకర సన్యాసిరావు(తాతాజీ), టీపీఎన్ మూర్తి, వై.అప్పారావు, ముగ్గు వరహాలరావు, లంక సూరిబాబు, కోరాడ శ్రీనివాస సాయి, గెడ్డపు సన్యాసి విజయం సాధించారు. బుధవారం అధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకోనున్నారు. -
స్టీల్ప్లాంట్ తల్లీ.. ఇక సెలవు
● ఓ కార్మికుడి వీడ్కోలు స్టీల్ప్లాంట్ మెయిన్ గేటు వద్ద నమస్కారం చేస్తున్న అప్పలరాజు ఉక్కునగరం: విశాఖ ఉక్కు కర్మాగారం రుణం తీర్చుకోలేనిదని స్టీల్ప్లాంట్ కార్మికుడు గొందేశి అప్పలరాజు అన్నారు. స్టీల్ప్లాంట్ రోల్షాప్ అండ్ రిపేర్ షాప్ విభాగానికి చెందిన జనరల్ ఫోర్మెన్ అప్పలరాజు వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ద్వారా మంగళవారం పదవీ విరమణ చేశారు. విభాగంలో సహోద్యోగుల మధ్య జరిగిన కార్యక్రమాల అనంతరం ఆయన ఇంటికి బయల్దేరారు. స్టీల్ప్లాంట్ నుంచి బయటకు వచ్చిన అప్పలరాజు ఉద్వేగానికి లోనయ్యారు. స్టీల్ప్లాంట్ మెయిన్ గేటుకు నమస్కారం చేసి కన్నీటి పర్యంతమయ్యారు. 35 ఏళ్ల తన సేవలను పూర్తి చేసుకుని వెళ్లడం బాధగా ఉందన్నారు. తన కన్న తల్లి తర్వాత తల్లి లాంటి స్టీల్ప్లాంట్ తనకు మంచి జీవితం, కుటుంబాన్ని ఇచ్చిందన్నారు. స్టీల్ప్లాంట్ రుణం తీరుకోలేనిదంటూ భావోద్వేగానికి లోనయ్యారు. సహోద్యోగులు ఆయనను ఓదార్చి ఇంటికి పంపించారు. -
ఐదు నెలలుగా విద్యుత్ మీటర్ కోసం...
సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకుని చీకట్లోనే నివాసముంటున్నామని, నూతన విద్యుత్ మీటర్కు ఫీజు కట్టి ఐదు నెలలు అవుతున్నా విద్యుత్ శాఖ సిబ్బంది మీటర్ వేసి విద్యుత్ సౌకర్యం కల్పించడం లేదని, తక్షణమే తమకు విద్యుత్ సౌకర్యం కల్పించాలంటూ మాడుగుల మండలం చింతలూరు గ్రామానికి చెందిన భార్యభర్తలు గుడేపు దుర్గాలు, లక్ష్మి పీజీఆర్ఎస్లో వినతి అందించారు. రజక వృత్తి చేసుకుంటూ జీవనం సాగించే తాము చీకట్లోనే నివాసముండాల్సి వస్తుందని, చుట్టుపక్కల అందరికీ అందించిన విద్యుత్ సౌకర్యం తమకు కూడా అందించి న్యాయం చేయాలని ఆమెను కోరారు. –గుడేపు లక్ష్మి -
అర్జీల్లో భూ సమస్యలే అధికం
తుమ్మపాల :సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం–1, 2లో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ల కార్యక్రమంలో కలెక్టర్ విజయకృష్ణన్, జేసీ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో వై.సత్యనారాయణరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పీజీఅర్ఎస్కు 167, రెవిన్యూ క్లినిక్లో 181 మొత్తం 348 అర్జీలు వచ్చినట్టు కలెక్టర్ తెలిపారు. ప్రత్యేక ఉప కలెక్టర్లు మనోరమ, రామ మాణి, మెప్మా పీడీ కె.సరోజిని, ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మైనింగ్ అధికారులపై ఫిర్యాదు చింతలూరులో గ్రాంట్ ఆర్డర్ లేకుండా 3 వేల క్యూబిక్ మీటర్ల అక్రమ మైనింగ్పై విచారణ కోరుతూ నర్సీపట్నం మైనింగ్ అధికారులకు చేసిన ఫిర్యాదుపై ముందు తేదీలతో తప్పుడు నివేదికలు ఇచ్చి, ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్లను ఉద్దేశపూర్వకంగా నిరాకరించడం, గ్రామస్తులను మోసం చేసి సంతకాలు సేకరించడంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మాడుగుల మండలం చింతలూరుకు చెందిన మెలిపాక మణికంఠ కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 379–1లో అక్రమాలపై చేసిన ఆరు ఫిర్యాదులను నీరు గార్చడానికి మైనింగ్ అధికారులు, క్వారీ నిర్వాహకులు కలిసి నేరపూరిత చర్యలకు పాల్పడారని వారిపై చర్యలు తీసుకోవాలని, మైనింగ్ అధికారుల ప్రమేయం లేకుండా స్వతంత్ర టాస్క్ఫోర్స్ కమిటీతో పునర్విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
కౌమార దశలో గర్భధారణతో దుష్ప్రభావాలు
తుమ్మపాల : కౌమార దశలో గర్భం దాల్చడం వల్ల కలిగే అనర్ధాలను వివరిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కలెక్టర్ విజయకృష్ణన్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ‘కౌమార దశలో గర్భధారణ – కారణాలు, దుష్ప్రభావాలు అవగాహన‘ గోడ పత్రికలను ఆమెతో పాటు జేసీ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో వై.సత్యనారాయణరావు ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ బాలికల విద్యను ప్రోత్సహించడం, అనుమానాస్పద సంఘటనలపై తక్షణమే అధికారులకు ఫిర్యాదు చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించగలమన్నారు. జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారి సూర్యలక్ష్మి, డీఎంహెచ్వో హైమావతి, సిబ్బంది పాల్గొన్నారు. జీరో పావర్టీ పీ4 తొలి వార్షికోత్సవాన్ని కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తిరుపతి పద్మావతీ మహిళా యూనివర్సిటీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టరేట్లో నిర్వహించారు. -
‘క్రేజీ’ స్కూళ్లు
యలమంచిలి రూరల్ : జిల్లా కేంద్రం అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, పాయకరావుపేట, యలమంచిలి, అచ్యుతాపురం, అడ్డురోడ్డు సహా జిల్లాలో దాదాపుగా అన్ని మండల కేంద్రాలు, పెద్ద పంచాయతీల్లో ప్రైవేటు స్కూళ్లలో అడ్మిషన్ల దందా మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల స్థాయిలోనే ఐఐటీ, నీట్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ల పేరుతో విద్యార్థులపై మితిమీరిన ఒత్తిడి పెంచుతున్నారు. తల్లిదండ్రులపై అదనపు ఫీజుల భారం మోపుతున్నారు. కార్పొరేట్ స్థాయి వసతులు, అంతర్జాతీయ ప్రమాణాలు అంటూ రంగురంగుల బ్రోచర్లు చూపిస్తూ సామాన్య తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి యాజమాన్యాలు. తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు తమ కళ్ల ముందే నిబంధనలు ఉల్లంఘన జరుగుతున్నా మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేట్కు సలామ్ కార్పొరేట్ శక్తులు విద్యను వ్యాపారంగా మార్చేశాయి. జిల్లాలో కార్పొరేట్, కొన్ని బడా ప్రైవేటు యాజమాన్యాలు అనుమతుల్లేకపోయినా ధనదాహంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఎల్కేజీ, యూకేజీ తరగతులు నిర్వహిస్తున్నా అటువైపు అధికారులు కన్నెత్తయినా చూడడానికి సాహసించడం లేదు. నిబంధనల ప్రకారం ఎల్కేజీ, కేజీ, యూకేజీ తరగతుల నిర్వహణకు అనుమతులు ఇవ్వరు. కానీ ప్రైవేటు పాఠశాలల్లో ఈ తరగతుల నిర్వహణ నిరాటంకంగా కొనసాగిపోతోంది. విద్యాశాఖ అధికారుల తీరుతో యాజమాన్యాలు ఆడిందే ఆట..పాడిందే పాట అన్న చందంగా వాటి నిర్వహణ సాగుతోంది. సమాచారం నిల్ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో కిండర్ గార్డెన్ స్కూళ్ల వివరాలు నమోదైన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. కార్యాలయ అధికారులు తమకు తగిన సమాచారం లేదంటున్నారు. మరోవైపు కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లలో నిబంధనలు బేఖాతరు చేస్తూ అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తున్నా నేటికీ ఒక్క స్కూల్పై కూడా చర్యలు చేపట్టలేదంటేనే కార్పొరేట్ యాజమాన్యాలతో వారికి ఉన్న బంధం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో అనుమతులు లేకుండానే ప్రైమరీ, ఉన్నత పాఠశాలలను నిర్వహిస్తున్నారు. ప్రైవేటు స్కూళ్ల దోపిడీ అనుమతుల్లేకుండా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతుల నిర్వహణ పుట్టగొడుగుల్లా కిండర్ గార్డెన్ స్కూళ్లు విద్యాసంవత్సరం ముగియకుండానే అడ్మిషన్లు ప్రారంభం తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ యాజమాన్యాలు తనిఖీలు మరిచిన విద్యాశాఖ అధికారులు -
కోర్టు ఆదేశాలు ధిక్కరణ
చెరువు గర్భంలో మరలా పనులు చేస్తున్న దృశ్యం గొలుగొండ: మండలంలోని సీహెచ్ నాగాపురం చెరువు గర్భంలో శ్మశాన వాటిక పనులు చేయకూడదని కోర్టు ఇచ్చిన ఆదేశాలను అధికారులు ధిక్కరించారు. మళ్లీ పనులు చేయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో శ్మశాన వాటిక ఉంది. ఆ స్థలాన్ని వదిలేసి కూటమి నేతలు రైతులకు ఉపయోగపడే చెరువు గర్భంలో శ్మశాన వాటిక పనులు చేస్తున్నారు. ప్రస్తుతం చెరువు గర్భంలో ఏర్పాటు చేస్తున్న శ్మశాన వాటిక పాఠశాలకు ఆనుకుని ఉండటం వల్ల విద్యార్థులు భయాందోళనకు గురవుతారని ప్రజలు ఆర్నెల్ల క్రితం వ్యతిరేకించారు. దీంతోపాటు రైతులు ఇబ్బందులు పడే అవకాశముందని గ్రామస్తులు, పంచాయతీ పాలకులు కోర్టును ఆశ్రయించారు. దాంతో చెరువు గర్భంలో పనులు నిలుపుదల చేయాలని నాలుగు నెలలు క్రితం కోర్టు ఎంపీడీవో, పీఆర్, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు అధికారులు పనులు నిలుపుదల చేశారు. మళ్లీ రెండు రోజుల నుంచి గుట్టుచప్పుడు కాకుండా పనులు చేయడంపై గ్రామస్తులు ఆగ్రహిస్తున్నారు. కోర్టు ఆదేశాలు ధిక్కరించి పనులు చేస్తున్న అధికారులుపై జిల్లా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. -
ఇసుక తవ్వకాలు చేస్తే క్రిమినల్ కేసులు
మాకవరపాలెం: అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేస్తే క్రిమినల్ కేసులు తప్పవని తహసీల్దార్ ముజీబ్ స్పష్టం చేశారు. సాక్షిలో సోమవారం తవ్వుకో.. అమ్ముకో శీర్షికన వచ్చిన కథనంతో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. దీనిపై స్పందించిన తహసీల్దార్ మాట్లాడుతూ జంగాపల్లి సర్పానదిని ఆనుకుని నిర్వహిస్తున్న తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవన్నారు. ఈ ప్రాంతంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపట్టడం, ఇసుకను తరలించడం చేస్తే క్రిమినల్ కేసులు పెడతామన్నారు. అలాగే జీ.కోడూరు, జంగాలపల్లి గ్రామ రెవెన్యూ అధికారులను ఇసుక తవ్వకాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలిచ్చామన్నారు. ఇకపై ఆ ప్రాంతంలో ఇసుక తవ్వకాలు చేస్తే ఆ రెండు గ్రామాల వీఆర్వోలపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2న వాటర్ స్పోర్ట్స్ పోటీలు అనకాపల్లి : జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి వాటర్ స్పోర్ట్స్ పోటీలు ఏప్రిల్ 2న ముత్యాలమ్మపాలెం బీచ్లో సబ్ జూనియర్–15 జూనియర్–18 బాలబాలికలకు నిర్వహించడం జరుగుతుందని సంస్థ జిల్లా అధికారి పూజారి శైలజ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు ఏప్రిల్ 10, 11 తేదీల్లో ఎన్టీఆర్ జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్లడం జరుగుతుందన్నారు. జిల్లా స్థాయి సైకిలింగ్ పోటీలలో ఎంపికైన బాలబాలికలు ఏప్రిల్ 4, 5 తేదీల్లో ఎన్టీఆర్ జిల్లాలో రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్ల్లడం జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్లు 933277778, 8125416870లను సంప్రదించాలన్నారు. -
రాయి పిక్కలు ఏరుకున్నా టాక్స్ కట్టాల్సిందేనా..?
రావికమతం : గ్రావెల్, రాయి ఏదైనా తెచ్చుకోవాలంటే మైనింగ్ సిబ్బందికి డబ్బులు కట్టాల్సిందే.. లేదంటే కుదరదంటున్నారు మైనింగ్ సిబ్బంది. మండలంలో గర్నికంలో ఇంటి నిర్మాణానికి రాయి పిక్కలను తీసుకొస్తుండగా ఏఎంఆర్ సంస్థ మైనింగ్ సిబ్బంది అడ్డుకోవడంపై మహిళలు తిరగబడ్టారు. కొండ ప్రాంతంలో రాయి పిక్కలు ఏరుకొని తీసుకొస్తుండగా టాక్స్ కట్టమనడం ఎంత వరకు సమంజసం.. అంటూ మైనింగ్ కంపెనీ సిబ్బందిని ప్రశ్నించారు. ఈ విషయమై సోమవారం గర్నికం గ్రామస్తులు, సర్పంచ్ భర్త నూకరాజు ిమైనింగ్ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెంధిన కొందరు మహిళలు పక్కా ఇళ్లు నిర్మించుకుంటున్నారు. గచ్చులు చేయడానికి రాయి పిక్క అవసరం కావడంతో సమీపంలో గల మెట్ట ప్రాంతంలో చిన్న రాయి పిక్కలను పోగుచేసుకొని వాటిని ట్రాక్టర్లో వేసి తీసుకెళుతుండగా ఏఎంఆర్ మైనింగ్ సంస్థ సిబ్బంది టాక్స్ కట్టాలని అడ్డుకున్నారు. ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఇస్తుంటే , రాయి పిక్కలకు ట్యాక్స్ కట్టడం ఏంటని ప్రశ్నించారు. దీంతో సర్పంచ్ భర్త నూకరాజు తదితరులు అక్కడికి చేరుకొని మైనింగ్ సంస్థను తప్పు బట్టారు. రాయి పిక్కలకు కూడా ట్యాక్స్ కట్టాలని ఉందా , ఉంటే అందుకు సంబంధించిన జీవో చూపించాలని నిలదీశారు. ప్రతి దానికి ట్యాక్స్ కట్టాల్సి వస్తే సామాన్యులు ఎలా బతకాలి... అని కూటమి ప్రభుత్వం సంపద సృష్టించడం అంటే ఇదేనా? అంటూ మహిళలు వాపోయారు. -
లీజు విధానం... ఆలయ భూముల ఆక్రమణలకు ఊతం
జిల్లాలో హిందు దేవాలయాల భూముల ఆక్రమణలపై విచారణ చేపట్టి భూములను రక్షించడంతో పాటు శిథిలావస్థలో ఉన్న ఆలయాలను పునఃనిర్మాణం చేయాలని బీజేపీ జనతా వారధి కోకన్వీనర్ జిల్లా ఉపాధ్యక్షుడు దొగ్గా ఈశ్వరప్రసాద్ కలెక్టర్కు వినతిపత్రం అందించారు. ప్రైవేటు భూములు దేవాలయ భూముల జాబితాలో కలిసిపోయాయనే నెపంతో వందల ఎకరాల దేవాలయ భూములను ఆక్రమించేస్తున్నారని, దీంతో పాటు 33 ఏళ్ల పాటు దేవాలయ భూముల లీజు విధానం సరైంది కాదని అధికారులు పునఃపరిశీలన చేయాలన్నారు. జీవో నెం.139ను పూర్తిగా రద్దు చేయాలని, ఆక్రమణను రెగ్యులరైజ్ చేయడం నిలిపివేయాలని, దేవాలయాల ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికే ఖర్చుచేసేలా చట్టం చేయాలని డిమాండ్ చేశారు. దింతో పాటు ఏళ్ల తరబడి సంచార జాతులగా నివాసముంటున్న కుటుంబాలను గుర్తించి వారికి కులధ్రువీకరణ పత్రాలు అందించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని మరో వినతి పత్రం అందించారు. –దొగ్గా ఈశ్వరప్రసాద్ -
అధికారుల అండతో అక్రమ రిజిస్ట్రేషన్లు
రిజిస్టర్డ్ దస్తావేజు ద్వారా కొనుగోలు చేసిన భూమిని తన పేరున కాకుండా రెవెన్యూ అధికారులు రీసర్వేలో ఇతరుల పేరున ఆన్లైన్ చేయడంతో తన భూమిపై అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, తక్షణమే రిజిస్ట్రేషను జరగకుండా నిలిపివేసి తన పేరున ఆన్లైన్ చేయాలంటు కశింకోట మండలం అచ్చెర్ల గ్రామానికి చెందిన కర్రి రాజేశ్వరి రెవెన్యూ క్లినిక్లో ఫిర్యాదు చేశారు. దస్తావేజు నెం.2199/2023 దిన ఉన్నప్పటికీ 2024లో జరిగిన రీసర్వేలో ఇతరుల పేరున వీఆర్వో ఆన్లైన్ చేయడం దారుణమని, తక్షణమే విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరారు. –కర్రి రాజేశ్వరి -
సరదా కోసం వెళ్తే.. ప్రాణం పోయింది
ఆనందపురం: గంభీరం రిజర్వాయర్లో ఆదివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాలివి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం కాగిత గ్రామానికి చెందిన మలిరెడ్డి నితిన్ (20), తగరపువలసలోని అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్డీ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. మధురవాడలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉంటున్న నితిన్.. మధ్యాహ్నం హాస్టల్ అధికారులకు సమాచారం ఇవ్వకుండా తన స్నేహితులతో కలిసి ఆటోలో రిజర్వాయర్ సందర్శనకు వెళ్లాడు. స్నేహితులు ఈతకు దిగగా, నితిన్ ఒడ్డున ఉన్న సిమెంట్ గోడపై కూర్చున్నాడు. ఈ క్రమంలో అదుపు తప్పి నీటిలో పడిపోయాడు. గమనించిన స్నేహితులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అపస్మారక స్థితిలో నితిన్ను బయటకు తీసి, 108కు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని నితిన్ను పరీక్షించి.. అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. మృతుడి సోదరుడు, ఐసీఐసీఐ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్గా పనిచేస్తున్న మలిరెడ్డి దీక్షిత్ ఫిర్యాదు మేరకు ఆనందపురం పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం కేజీహెచ్లో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. చేతికి అందొచ్చిన కుమారుడు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆ కుటుంబంలో విషాద చాయలు అలముకున్నాయి. ఎస్ఐ పి.శివ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రౌడీలతో భూ ఆక్రమణకు యత్నం
పూర్వం నుంచి తమ ఆక్రమణలో ఉన్న పీడబ్ల్యూడీ భూమిలో పెంచుకున్న జీడిమామిడి, పనస చెట్లను దౌర్జన్యంగా నరికివేసి తన భూమిలోకి అక్రమంగా చొరబడి ఆక్రమించేందుకు ప్రయత్నించిన విషయమై తహసీల్దార్ ఇచ్చిన ఎండార్స్మెంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయడం లేదని, దీంతో ఆక్రమణదారులు రౌడీలతో తమపై దాడులకు దిగుతున్నారని, వారి నుంచి తమకు రక్షణ కల్పించడంతో పాటు నా భూమిని రక్షించాలంటూ అనకాపల్లి మండలం దిబ్బపాలెం గ్రామానికి చెందిన భార్యభర్తలు కాండ్రేగుల సత్యవతి, సూర్యారావు ఫిర్యాదు చేశారు. చెట్ల నరికివేతపై పోలీసులు కేసు నమోదు చేసేలా ఆదేశించాలని పీజీఆర్ఎస్లో కలెక్టర్ను కోరారు. – కాండ్రేగుల సూర్యారావు -
చదువుకొనగ రా రమ్మని..!
విద్యా సంవత్సరం ముగియకముందే జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలు మితిమీరుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ, ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండానే వచ్చే విద్యాసంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించడం, ఎల్కేజీ, యూకేజీ తరగతులు నిర్వహిస్తూ తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తున్నాయి. కిండర్గార్డెన్ స్కూళ్లు.. వేల కొద్దీ ఫీజులు ఫిర్యాదులొస్తే చర్యలు జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా ఎల్కేజీ, యూకేజీ వంటి తరగతులు నిర్వహిస్తున్నట్టు గానీ, కిండర్ గార్డెన్ స్కూళ్ల నిర్వహణపై గానీ ఫిర్యాదులొస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. ప్రైవేటు స్కూళ్లు ప్రభుత్వ నిబంధనలు తప్పకుండా పాటించాలి. ప్రైవేటు పాఠశాలలు సక్రమంగా నిర్వహించేందుకు తరచూ తనిఖీలు చేస్తున్నాం. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు. –గిడ్డి అప్పారావు నాయుడు, డీఈవో జిల్లాలో 122 మంది ప్రైవేటు స్కూళ్లు ఉండగా వాటిలో సుమారుగా 58 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో చాలా పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక జిల్లాలో 150కి పైగా కిండర్ గార్డెన్ స్కూళ్లు ఎటువంటి అనుమతులు లేకుండానే నడుస్తున్నాయి. ఈ స్కూళ్లు విధిగా ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉంది. కానీ ఈ పాఠశాలల్లో వేలకొద్దీ ఫీజులు గుంజుతున్నారు. ఇదంతా విద్యాశాఖ అధికారులకు తెలిసినా ‘ఫిర్యాదు వస్తేనే స్పందిస్తాం...’ అన్నట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రైవేటు, కార్పొరేటు యాజమాన్యాల ప్రలోభాలకు తలొగ్గుతున్న అధికారులు వారికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నారు. అధిక ఫీజులు, పుస్తకాల పేరిట దోపిడీ జరుగుతున్నా మిన్నకుండిపోతున్నారు. అర్హత లేని టీచర్లతో తక్కువ వేతనాలకు బోధన చేయిస్తూ ఏటా రూ.కోట్లలో లాభాలు ఆర్జిస్తున్నారు. మునగపాకలో ఇటీవల ఓ ప్రైవేటు విద్యాసంస్థ అనుమతుల్లేకుండా ముందస్తు ప్రవేశాలు చేపడుతుండడంపై ఏఐఎస్ఎఫ్ నేతలు ఆందోళన నిర్వహించారు. చర్యలు తీసుకోవాలని డీఈవోకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇస్తున్నా ప్రయోజనం ఉండడం లేదు. -
ఉరేసుకుని గిరిజన యువతి ఆత్మహత్య
దేవరాపల్లి: గిరిజన యువతి దూసరి లక్ష్మి(22) సోమవారం రాత్రి దేవరాపల్లిలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ శివారు కొరపర్తి గ్రామానికి చెందిన పెంటయ్య, జమ్ములమ్మ దంపతుల ఇద్దరు కుమార్తెలు దేవరాపల్లిలో ఐదేళ్లగా నివసిస్తున్నారు. పెద్ద కుమార్తె లక్ష్మి స్థానిక ప్రైవేటు మెడికల్ ల్యాబ్లోను, చిన్న కుమార్తె భవాని సెల్ దుకాణంలోను పని చేస్తున్నారు. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో తన అక్క ఫ్యాన్కు ఉరేసుకొని చనిపోతున్నట్లు వేరొక వ్యక్తి ఫోన్ ద్వారా తెలుసుకున్న చెల్లెలు భవాని వెంటనే తాము అద్దెకుంటున్న గదికి పరుగులు తీసింది. అప్పటికే అక్క చున్నీతో ఉరేసుకొని విగతజీవిగా ఉండటాన్ని చూసి బోరున విలపించింది. ఈమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని మృతురాలి చెల్లెలు భవాని చెప్పినట్లు తెలిసింది. స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతిరాలి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని కె.కోటపాడు సీహెచ్సీకి తరలిస్తున్నట్లు తెలిపారు. గిరిజన యువతి ఆత్మహత్యతో దేవరాపల్లిలోపాటు కొరపర్తిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ఎస్పీ కార్యాలయంలో 64 ఫిర్యాదులు
ఆర్జీదారుల సమస్యలను వింటున్న ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి : ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్కు 64 ఆర్జీలు వచ్చాయి. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు ఎస్పీ తుహిన్ సిన్హాకు వివరించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల వేదికలో వచ్చి అర్జీలు పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. భూ తగాదాలు–31, కుటుంబ కలహాలు–2, మోసపూరిత వ్యవహారాలు–5, ఇతర విభాగాలకు చెందినవి–26 వచ్చినట్టు తెలిపారు. చట్టపరిధిలో ఉన్న సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు, సిబ్బంది పాల్గొన్నారు. డ్వామా పీడీ పూర్ణిమాదేవి బదిలీ తుమ్మపాల : జిల్లా నీటి యాజమాన్య సంస్థ డ్వామా పీడీ ఆర్.పూర్ణిమాదేవిని బదిలీ చేస్తూ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశి భూషణ్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అనకాపల్లి జిల్లా నుంచి పార్వతీపురం మన్యం జిల్లా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు అధికారిగా ఆమెకు బదిలీ అయ్యింది. ఎండీఎంను ప్రైవేటుపరం చేయొద్దని ధర్నా రోలుగుంట: మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు సోమవారం స్థానిక ఎంఈవో కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకురాలు కె.ప్రసన్న మాట్లాడుతూ స్మార్ట్ కిచిన్ పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం ప్రయివేటుపరం చేస్తోందన్నారు. ఈ పథకం కింద జిల్లాలో నాలుగు వేల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉందన్నారు. ఈ పథకాన్ని కొనసాగిస్తూ నెలకు రూ.10 వేల గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ నాయకుడు ఈరెల్లి చిరంజీవి, ఎండీఎం మండల నాయకులు అమ్మాజి, రమ, వరహాలమ్మ, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. -
బెట్టింగ్ల ఉచ్చులో పడొద్దు
అనకాపల్లి: అత్యాశకు పోయి జీవితాలను నాశనం చేసుకోవద్దని, ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ తుహిన్ సిన్హా అదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్ నిర్వాహకులపై ఆన్లైన్ బుకీలపై ప్రత్యేక పోలీస్ బృందాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేశామన్నారు. బెట్టింగ్ నిర్వహించినా, ప్రోత్సహిహించినా, పాల్గొన్నా ఏపీ జూద చట్టం ప్రకారం అరెస్టు చేయడం జరుగుతుందన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చనే ఆశతో బెట్టింగ్ యాప్ల ఉచ్చులో పడవద్దన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. -
ఇమ్మానుయేలు సంస్థ హాస్టల్లో అగ్నిప్రమాదం
● ప్రమాద సమయంలో లేని విద్యార్థులు ● తప్పిన పెనుప్రమాదం మాకవరపాలెం: హాస్టల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సమయంలో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని కొండల అగ్రహారంలో ఇమ్మానుయేలు సంస్థ నిర్వహిస్తున్న హాస్టల్లో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ ఉమ్మడి జిల్లాకు చెందిన 80 మంది విద్యార్థులు ఉంటున్నారు. వీరంతా నిత్యం ఉదయం తామరంలో సంస్థకు చెందిన ఎడ్యుకేషన్ క్యాంపస్లోని స్కూల్కు బస్సుపై వెళ్లి తిరిగి సాయంత్రం హాస్టల్కు చేరుకుంటారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మూడు అంతస్థులు కలిగిన హాస్టల్ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో స్థానికులు గమనించిన వెంటనే స్పందించి మంటలు చెలరేగిన గదుల్లో ఎవరూ లేకపోవడంతో రెండో అంతస్థులో ఉన్న పది మంది విద్యార్థులను బయటకు తీసుకువచ్చారు. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే ప్రతి ఆదివారం ఈ విద్యార్థులంతా హాస్టల్కు సమీపంలో సంస్థకు చెందిన చర్చికు వెళతారు. ఆదివారం కూడా సుమారు 70 మంది వరకు చర్చికి వెళ్లడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇదే అగ్నిప్రమాదం రాత్రి వేళలో జరిగితే ఎందరో విద్యార్థులు మృత్యువాత పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత జరిగి నా గాయపడేవారన్నారు. ఈ సంఘటనలో హాస్టల్లో ఉన్న ఒక బైక్తోపాటు విద్యార్థుల పుస్తకాలు, బట్టలు ఉంచిన పెట్టెలు కాలిపోయాయి. విద్యార్థులంతా క్షేమంగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నా రు. కాగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. హాస్టల్ను పరిశీలించిన ఎంఈవో హాస్టల్ను ఎంఈవో మూర్తి పరిశీలించారు. ఈ సందర్భంగా మంటలు చెలరేగిన హాస్టల్ భవనం, కాలిపోయిన విద్యార్థులు పెట్టెలను పరిశీలించారు. హాస్టల్లో ఉంటున్న విద్యార్థుల సంఖ్యను తెలుసుకున్నారు. నివేదికను డీఈవోకు అందజేశామని, విద్యార్థులను ఇక్కడి నుంచి తామరంలో ఇమ్మానుయేలు సంస్థకు చెందిన మరో హాస్టల్కు తరలించామని తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. -
మరణంలోనూ వీడని స్నేహం
ఉమ్మలాడ శారదానదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు మృతి మునగపాక: వారిద్దరూ ప్రాణ స్నేహితులు.. ఎక్కడకు వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్లేవారు. చివరకు శారదానదిలో స్నానానికి వెళ్లి ఒకేసారి మృతి చెందారు. ఈ ఘటన మండలంలోని ఉమ్మలాడలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆదివారం ఇక్కడ శారదానదిలో స్నానానికి వెళ్లిన ఇద్దరూ మునిగిపోయి మృతి చెందారు. ఎస్ఐ పి.ప్రసాదరావు తెలిపిన వివరాలు ప్రకారం.. అనకాపల్లి మండలం కొత్తూరు పంచాయతీ పరిధి ముత్రాసు కాలనీకి చెందిన చింతా రోహిణ్కుమార్ (26), తాడి హర్షవర్దన్ (24) అనకాపల్లిలోని వేర్వేరు చోట్ల పనులు చేసుకుంటూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. ఇరువురు కలిసి సమీపంలోని ఉమ్మలాడ శారదానదిలో స్నానానికి వెళ్లారు. స్నానానికి వెళ్లిన ఇద్దరూ నదిలో ఒక్కసారిగా మునిగిపోయారు. గమనించిన స్థానికులు మునగపాక పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీసి అనకాపల్లి రెండొందల ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. కాగా అందివస్తారనుకున్న కొడుకులు నదిలో మునిగిపోయి ఇలా విగతజీవులుగా మారడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రసాదరావు తెలిపారు. -
ఇదేం ‘పచ్చ’పాతం
● దేవరాపల్లి పార్కులో శిలాఫలకాల ఏర్పాటులో ప్రొటోకాల్కు తూట్లు ● గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిర్మాణ పనులకు శ్రీకారం ● శంకుస్థాపన చేసి, శిలాఫలకం ఆవిష్కరించిన అప్పటి డిప్యూటీ సీఎం బూడి ● తాజాగా పార్కు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఏర్పాటు చేసిన అధికారులు ● శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని మూలన పడేసిన వైనం దేవరాపల్లి: మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పార్కులో శంకుస్థాపన శిలాఫలకాన్ని ఏర్పాటు చేయకుండా మూలన పడేయడం వివాదస్పదమైంది. తాజాగా పార్కు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఏర్పాటు చేసిన వీఎంఆర్డీఏ అధికారులు శంకుస్థాపన శిలాఫకం ఏర్పాటులో పక్షపాత వైఖరిని ప్రదర్శించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో... స్థానిక పోలీస్స్టేషన్కు ఎదురుగా శిథిలావస్థకు చేరుకుని దశాబ్దాలుగా అధ్వానంగా ఉన్న ఇరిగేషన్ క్వార్టర్స్ను తొలగించి ఆహ్లాదకర పార్కు, యోగా భవనం, వాకింగ్ ట్రాక్ నిర్మించాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు సంకల్పించారు. అప్పట్లోనే వీఎంఆర్డీఏ నుంచి రూ. 75 లక్షలు మంజూరు చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి, నిర్మాణ పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. సగం పనులను సైతం అప్పట్లోనే పూర్తి చేశారు. సార్వత్రిక ఎన్నికల కోడ్ రావడంతో నిర్మాణ పనులకు ఆటంకం ఏర్పడింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మిగిలిన పనులను పూర్తి చేసింది. ఈ నెల 13న పార్క్ను స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్తో కలిసి ప్రారంభించారు. పైలాన్ నిర్మించి ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఏర్పాటు చేసిన అధికారులు, పార్కు నిర్మాణ సమయంలో వేసిన శంకుస్థాపన శిలాఫలకాన్ని యోగా భవనంలో మూలన విడిచిపెట్టడం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పారదర్శకంగా వ్యవహరించాల్సిన అధికారులు కూటమి నేతల మెప్పు కోసమే ఇలా వ్యవహరించారని స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రారంభోత్సవ శిలాఫలకంలో పేర్లు రాయించడంలోను వీఎంఆర్డీఏ అధికారులు ప్రొటోకాల్కు తూట్లు పొడిచారు. ఎంపీపీ, జెడ్పీటీసీ పేర్లు లేకుండా చేసి ప్రొటోకాల్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ప్రొటోకాల్ పాటించకుండా పక్షపాతంగా వ్యవహరించిన వీఎంఆర్డీఏ అధికారుల తీరుపై కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. -
మంచినీటి కోసం గిరిజనుల అవస్థలు
దేవరాపల్లి: మండలంలోని చింతలపూడి పంచాయతీ శివారు మదనగురువులో గిరిజనులు మంచినీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. తాగునీటి సదుపాయం లేకపోవడంతో గ్రామానికి దూరంగా ఉన్న గెడ్డలో ఊట నీరే తమకు శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కలెక్టర్ స్పందించి తక్షణమే తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం చేతులు జోడించి వేడుకున్నారు. వీరికి సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న, మండల కార్యదర్శి బి.టి. దొర మద్దతు పలికారు. అటవీ ప్రాంతంలో జీవిస్తున్న గిరిజనులను అడవి జంతువుల కంటే హీనంగా చూస్తున్నారని సీపీఎం నాయకులు విమర్శించారు. గిరిజనులను ఉద్ధరించేందుకు అడవి బాట పట్టిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు ఇక్కడ కష్టాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. గెడ్డలో కలుషిత నీరు తాగడం వల్ల మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ తదితర విష జ్వరాల బారినపడుతున్నారని వాపోయారు. ప్రభుత్వ పాలకులు యుద్ధప్రాతిపదికన స్పందించి మంచినీటి సదుపాయం కల్పించాలని, లేకుంటే వచ్చే నెల 2న కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని బాధిత గిరిజనులు హెచ్చరించారు. కార్యక్రమంలో పాంగి కన్నయ్య, పాంగి రామన్న, మామిడి చిన్నయ్య, పాంగి పెద భీమన్న, పాంగి చిన బీరాజు, పాంగి సన్యాసమ్మ, పి. దేముడమ్మ, సూకురి లక్ష్మి, మామిడి సీతమ్మ తదితరులు పాల్గొన్నారు.ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కరించాలి నిరసన -
కమ్యూనిటీ ప్రాంతాల అభివృద్ధికి చర్యలు
ఎంవీపీకాలనీ: నగరంలోని కమ్యూనిటీ ప్రాంతాల అభివృద్ధికి త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఆదివారం ఎంవీపీకాలనీలోని అప్పుఘర్, వాసవానిపాలెం సాగర తీర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్లూమ్బర్గ్ ఫిలాంత్రోపీస్ 2025–2026 మేయర్స్ చాలెంజ్కు ప్రపంచవ్యాప్తంగా ఎంపికై న 24 నగరాల్లో విశాఖ ఒకటిగా నిలవడం గర్వకారణమన్నారు. ఈ విజయం ఫలితంగా నగరంలో ‘వి–పుల్’(విశాఖ–ప్రజాముఖి అర్బన్ లివింగ్ ల్యాబ్) కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున కమ్యూనిటీ ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. పర్యటనలో భాగంగా శివగణేష్నగర్, వాసవానిపాలెంలోని మత్స్యకారులతో మాట్లాడి, ఆయా ప్రాంతాల్లోని సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చించారు. పారిశుధ్యం, తాగునీరు, రోడ్లు, కాలువల మరమ్మతులతో పాటు గ్రీన్ బెల్ట్లను అభివృద్ధి చేయాలని మత్స్యకార గ్రామాల పెద్దలు కమిషనర్కు విన్నవించారు. ‘వి–పుల్’ద్వారా ప్రజా భాగస్వామ్యంతో ఈ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు జీవీఎంసీ సిద్ధంగా ఉందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. జెడ్సీ శివప్రసాద్, వైద్యాధికారి ప్రసాదరావు, పలువురు వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్


