breaking news
Anakapalle
-
పాటిపల్లిలో పారిశ్రామిక అవసరాల కోసం సర్వే
మాట్లాడుతున్న తహసీల్దార్ సత్యనారాయణ మునగపాక: పాటిపల్లి పంచాయతీ పరిధిలో పారిశ్రామిక అవసరాల కోసం సర్వే చేపడుతున్నట్లు తహసీల్దార్ పి.సత్యనారాయణ తెలిపారు. సోమవారం పాటిపల్లి సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే నెంబర్లు 79, 112, 113లో ఉన్న సుమారు 600 ఎకరాల భూమిని వారం రోజులపాటు సర్వే చేస్తామన్నారు. ఆయా సర్వే నెంబర్ల పరిధిలోని రైతులు తమ పట్టాదారు పుస్తకాలతో అందుబాటులో ఉండాలన్నారు. సర్పంచ్ ఆడారి కృష్ణవేణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో గ్రామస్తులు పాల్గొన్నారు. -
నాలుగు రెట్లు పరిహారం చెల్లించాలని సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్వాసితుల నిరసన
కలెక్టరేట్ వద్ద నల్లరేగులపాలెం రైతుల నిరసన ప్రదర్శన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి జాబితాలో తప్పులను సవరణ చేసి, బహిరంగ మార్కెట్ విలువకు నాలుగు రెట్లు అధికంగా నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సబ్బవరం మండలం నల్లరేగులపాలెం గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రైతుల నుంచి సేకరిస్తున్న మెట్ట భూములను పల్లం భూములుగా నమోదు చేశారన్నారు. దాంతో తక్కువ నష్టపరిహారం నమోదైందని, పూర్వ కాలంగా సాగుచేసుకుంటున్న బంజరు భూములకు నష్టపరిహారం మంజూరు చేయాలని డీఆర్వోకు రైతు సంఘం మండల కార్యదర్శి గంటా శ్రీరామ్తో పాటు రైతులు వినతిపత్రం అందించారు. -
ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యార్థుల ఆందోళన
ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న వివిధ కళాశాలల విద్యార్థులు నర్సీపట్నం: ఫీజు రీయింబర్స్మెంట్ అమలులో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు భారీ ప్రదర్శన, ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఆర్డీవో వి.వి.రమణకు వినతిపత్రం అందజేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళను ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గౌతమ్, డివిజన్ ప్రెసిడెంట్ విజయ్ మాట్లాడుతూ రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించక విద్యార్థులు ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. హాస్టళ్లకు సొంత భవనాలు కల్పించాలన్నారు. డిగ్రీ మొదటి సంవత్సరం అడ్మిషన్స్ వెంటనే కల్పించాలన్నారు. శివపురంలో ఎక్కువగా హాస్టల్స్, కాలేజీలు ఉన్నందున విద్యార్థుల రక్షణ నిమిత్తం పోలీసు పెట్రోలింగ్ నిర్వహించాలని ఆర్డీవోను కోరారు. కార్యక్రమంలో 700 మంది విద్యార్థులు, నాయకులు వికాస్, సందీప్ గురూజీ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
డంపింగ్ యార్డుతో దుర్వాసన
● విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు వీరుయాదవ్ నిరసన అనకాపల్లి: పట్టణ నడిబొడ్డున డంపింగ్ యార్డును తక్షణమే తొలగించి, ప్రజారోగ్యాన్ని కాపాడాలని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు పాత్రపల్లి వీరుయాదవ్ డిమాండ్ చేశారు. స్థానిక జీవీఎంసీ జోనల్ కార్యాలయం వద్ద కొనసాగిస్తున్న డంపింగ్ యార్డు వద్ద ప్లకార్డుతో సోమవారం ఆయన నిరసన చేపట్టారు. జీవీఎంసీ జోనల్ అధికారులు అనధికారికంగా 12 ఏళ్లుగా కొనసాగిస్తున్న డంపింగ్ యార్డు తరలించకపోగా.. చికెన్ సెంటర్ల నుంచి తీసుకొచ్చిన కోళ్ల వ్యర్థాలను ఇక్కడే వేస్తున్నారన్నారు. దీనిపై జోనల్ కమిషనర్, సిబ్బంది మీనమేషాలు లెక్కించడం తగదన్నారు. ఇక్కడ డంపింగ్ యార్డు కొనసాగించడమే చట్టవిరుద్ధమన్నారు. తీవ్రమైన దుర్వాసన వెదజల్లడంతో ఉదయం ఐదు గంటల నుంచి ఇళ్లలోఉండలేకపోతున్నామని వాపోయారు. ఇలాగైతే వ్యాధుల బారిన పడి చనిపోయే పరిస్థితులు నెలకొంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై కలెక్టర్, ఎస్పీ, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి డంపింగ్ యార్డును తొలగించాలని కోరారు. -
వీధి దీపాల మాదిరిగా బెల్టు దుకాణాలు
వీధి దీపాల మాదిరిగా విస్తరించిన బెల్ట్ షాపులను తక్షణమే నిలిపివేసి కల్లుగీత కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ రాష్ట్ర కల్లు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో గీత కార్మికులు కలెక్టరేట్ గేటు వద్ద ఆందోళన చేపట్టారు. గ్రామాల్లో కళకళలాడే కల్లు దుకాణాలు పోయి కూటమి ప్రభుత్వంలో బెల్టు దుకాణాల ద్వారా కల్తీ మద్యం ఏరులై పారుతుందని విమర్శించారు. జిల్లాలో 3 వేల బెల్టు షా పుల ద్వారా గోవా, యానాం మద్యాన్ని విక్రయిస్తున్నారని ఆరోపించారు. వృత్తిని నమ్ముకుని ప్రాణాలకు తెగించి చెట్లు ఎక్కుతూ కుటుంబాలను పోషించుకుంటున్న గీత కార్మికుల పొట్ట కొట్టొదన్నారు. గుడి, బడి, చర్చి, దేవాలయాలు తేడా లేకుండా రేయింబవళ్లు మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్నారు. తాటికల్లును కేరళ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయన్నారు. మన రాష్ట్రంలో మాత్రం బీరు, బ్రాందీ, విస్కీలను ప్రోత్సహిస్తూ లక్షలాది గీత కార్మికుల కుటుంబాల ఉపాధిని దారుణంగా దెబ్బతీసిందని నాయకులు గంటా శ్రీరామ్, గోకాడ దేముడు, యర్రా దేముడు, బత్తిన నాగేశ్వరరావు, గండిబోయిన రాము విమర్శించారు. బెల్టు షాపులు తొలగించేందుకు వీఆర్ఏ, సచివాలయ పోలీసు, సర్పంచ్, ఎంపీటీసీలతో గ్రామ కమిటీలు వేయాలన్నారు. బెల్ట్ షాపులు పెట్టిన పంచాయతీల్లో సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేయాలంటూ పలు డిమాండ్లుతో కూడిన వినతిపత్రం అందజేశారు. ● మా పొట్ట కొట్టొద్దని కల్లు గీత కార్మికుల ఆందోళన -
మా పిల్లలకు చదువు చెప్పండి సారూ..
● కలెక్టర్ కార్యాలయం వద్ద చిన్నారులు, గిరిజనులు ఆందోళన కోటవురట్ల: మా ఊర్లో ప్రభుత్వ పాఠశాలను పెట్టండి.. రాకపోకల్లో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం.. మా ఊరికి రోడ్డెయ్యండి అంటూ గిరిజనులు ఆందోళన బాట పట్టారు. గొట్టివాడ శివారు అణుకు గిరిజన గ్రామస్తులు సీపీఎం ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ మేరకు సీపీఎం నాయకులు, గిరిజనులు తమ ఆవేదనను వినిపించారు. పీటీజీ కోందు తెగకు చెందిన 50 కుటుంబాలు అణుకులో నివసిస్తున్నాయని, మెయిన్రోడ్డు నుంచి తమ గ్రామానికి రావాలంటే గోతులు, గెడ్డలు, బండరాళ్లను దాటుకుని ఆరు కిలోమీటర్లు నడవాలన్నారు. గత ప్రభుత్వంలో గ్రావెల్ రోడ్డు నిర్మించగా, వర్షాల కారణంగా రోడ్డు మొత్తం శిథిలమైందని, దాంతో నడక కూడా నరకప్రాయమే అన్నారు. గర్భిణులు, వ్యాధులతో బాధపడేవారు, బడికి వెళ్లే చిన్నారులు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలు బడికి వెళ్లాలంటే రానుపోను 16 కిలోమీటర్లు నడవాల్సి వస్తోందని, దాంతో చాలా మంది బడి మానేసి ఇంటికే పరిమితమవుతున్నారని తెలిపారు. అధికారులు, ప్రభుత్వం స్పందించి తమ గ్రామానికి తారు రోడ్డు వేసి, గ్రామంలో పాఠశాలను ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదిర్శ జి.డేవిడ్రాజ్, గిరిజనులు మర్రి సూరిబాబు, తాంబేళ్ల సూరిబాబు, గెమ్మెల సురేష్, కొర్రా రాజుబాబు, గెమ్మెల సత్తిబాబు, పాంగి ఆశ, తాంబెళ్ల కవిత, గెమ్మెల బంగారమ్మ, తాంబేళ్ల లక్ష్మి, మర్రి చిలుకుచింత పాల్గొన్నారు. -
ఇష్టం లేని పెళ్లి.. వివాహిత ఆత్మహత్య
యలమంచిలి రూరల్: తల్లిదండ్రులు ఇష్టం లేని వివాహం చేశారన్న కారణంతో పట్టణంలోని పాతవీధిలో సలాది రూప (21) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఒక చేతిలో బిడ్దను పెట్టుకుని తల్లి బలన్మరణానికి పాల్పడడం స్థానికులను కలచివేసింది. ఘటనా స్థలాన్ని పరవాడ డీఎస్పీ వి.విష్ణుస్వరూప్, సీఐ ధనుంజయరావు పరిశీలించారు. పట్టణ ఎస్సై కె.సావిత్రి అందజేసిన వివరాలివి.. రాంబిల్లి మండలం పెదకలవలాపల్లికి చెందిన సలాది రూపను నాలుగేళ్ల క్రితం యలమంచిలి పట్టణం పాతవీధికి చెందిన గుంటుకు రాజుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు. మొదట్నుంచి రూపకు తల్లిదండ్రులు కుదిర్చిన వివాహం ఇష్టం లేదు. రూప తరచూ తల్లిదండ్రులతో ఈ విషయం చెప్పి బాధపడుతూ ఉండేది. అత్తింటివారు తనను బాగా చూసుకుంటున్నా మానసికంగా తాను ఇబ్బంది పడుతున్నట్టు చెబుతుండేదని మృతురాలి తల్లి నూకరత్నం పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో తన కుమార్తె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు అల్లుడు రాజు, ఇతర కుటుంబసభ్యులు తనకు తెలియజేశారని, విషయం తెలుసుకుని బంధువులతో కలిసి యలమంచిలి వచ్చామని, ఈ మేరకు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశామని మృతురాలి తల్లి నూకరత్నం తెలిపారు. అత్తింటివారిపై ఎలాంటి అనుమానం లేదని కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు ఎస్సై సావిత్రి మీడియాకు తెలిపారు. -
ఎస్పీ కార్యాలయానికి 40 అర్జీలు
అర్జీదారుల సమస్యలను వింటున్న ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్కు 40 అర్జీలు వచ్చాయి. అర్జీదారుల నుంచి ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్తి తగాదాలు, కుటుంబ సమస్యలు, చీటింగ్ వంటి వాటిపై అర్జీలు వచ్చాయన్నారు. చట్టపరిధిలో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆయా పోలీసు స్టేషన్ల ఎస్ఐలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.దేవప్రసాద్, ఎస్ఐ డి.వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
మాడుగులలో భారీ చోరీ
● ఇంట్లో బీరువా బద్దలు కొట్టి దోపిడీ ● 19.5 తులాల బంగారం, రూ.1.90 లక్షలు నగదు మాయం ● సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ, క్లూస్ టీం మాడుగుల రూరల్: మాడుగుల రాజవీధిలో కోడూరు లక్ష్మి ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు బద్దలు కొట్టి దొంగలు ఇంట్లో ప్రవేశించారు. బీరువాలో 19.5 తులాలు బంగారం, రూ. 1.90 లక్షలు అపహరించారు. సోమవారం ఉదయం ఇంటి తలుపులు తీసి వున్న విషయాన్ని ఇంటి పక్కన్న వున్న వారు లక్ష్మికి సమాచారం ఇవ్వడంతో బాధితురాలు చోరీ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ జి. నారాయణరావు, అనకాపల్లి డీఎస్పీ శ్రావణి, సీఐ పైడిపునాయుడుతో పాటు క్లూస్ టీమ్ సంఘటన స్థలానికి చేరుకుని ఇంట్లో చిందరవందరగా వున్న వస్తువులను పరిశీలించారు. లక్ష్మి కుటుంబ సభ్యుల ను విచారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా వుండగా ఈ నెల 1వ తేదీన లక్ష్మి తన కూతురుతో కలిసి మల్కాపురంలోని బంధువుల ఇంటికి వెళ్లింది. తర్వాత ఇంతవరకు ఆమె ఇంటికి రాలేదని, ఈలోగా ఆదివారం రాత్రి ఈ చోరీ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. -
కృష్ణా జెడ్పీ చైర్పర్సన్ హారికపై దాడి గర్హనీయం
● వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లోచల సుజాత అనకాపల్లి: కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారికపై కూటమి గుండాలు పోలీసుల సమక్షంలోనే దాడి చేయడం అత్యంత దారుణమని వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు లోచల సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రెడ్బుక్ పాలన సాగిస్తుందని ధ్వజమెత్తారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళా ప్రతినిధిపై టీడీపీ, జనసేన పార్టీ గుండాలు మూకుమ్మడిగా దాడి చేయడం హేయమన్నారు. రాష్ట్రంలో ఏదోఒక ప్రాంతంలో మహిళలు, చిన్నారుల పట్ల అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నారు. వీటిపై కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా లేదని విమర్శించారు. ఇదే వైఖరి అవలంబిస్తే రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. అధికారంలోకి రాకముందు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విద్యా శాఖ మంత్రి లోకేష్ అనేక హామీలు ఇస్తూ, ఆడవాళ్ల జోలికి వస్తే, అదే వాళ్లకు ఆఖరి రోజని, వారి తాట తీస్తామని, అనేక కల్లబొల్లి కబుర్లు చెప్పారన్నారు. అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో మహిళలపై రోజురోజుకూ అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయన్నారు. హోంమంత్రిగా సాక్షాత్తూ ఓ మహిళా ప్రతినిధి ఉండి కూడా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై కనీసం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందన్నారు. ఇప్పటికై నా రెడ్బుక్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
కలెక్టరేట్లో నిరసనలు, ఆందోళనలు
● పదే పదే ఫిర్యాదులు చేసినా చర్యలు శూన్యం ● అధికారుల తీరుపై అర్జీదారుల అసహనం ● పీజీఆర్ఎస్కు 309 అర్జీలు తుమ్మపాల: కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదులు పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతుల పరిష్కారంపై పలువురు అర్జీదారులు అధికారులను ప్రశ్నించారు. గతంలో ఇచ్చిన ఫిర్యాదులపై ఎటువంటి పరిష్కారం లేదని, భూముల ఆక్రమణ, రికార్డుల మార్పులపై ఫిర్యాదులు చేసినప్పటికి నిలువరించే పరిస్థితులపై అధికారులు కనీసం చొరవ చూపడం లేదని పలువురు అర్జీదారులు వాపోయారు. కలెక్టర్ విజయ కృష్ణన్ లేకపోవడంతో పీజీఆర్ఎస్ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన అధికారుల్లో కొన్ని శాఖల అధికారులు చుట్టపు చూపుగా వచ్చి వెళ్లిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా హామీలు పరిష్కారం లభించడం లేదంటూ కలెక్టరేట్ గేటు వద్ద పలు శాఖల సిబ్బందితోపాటు వివిధ వర్గాల ప్రజలు మండుటెండలో సైతం వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు. అనుమతులు తీసుకున్న వారికి తప్ప ఇతరులు నిరసనలు చేసేందుకు పోలీసులు అంగీకరించకపోవడంతో పలువురి అసహనం వ్యక్తం చేశారు. అయినప్పటికీ పలు సమస్యలపై ఉపాధి కూలీలు, వెలుగు వీవోఏలు, భూసేకరణ బాధితులు, ల్యాండ్ ఫూలింగ్ రైతులు, కల్లు గీత కార్మికుల నిరసనలు, ఆందోళనలతో కలెక్టరేట్ వేడెక్కింది. ●పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వచ్చిన అర్జీదారుల నుంచి కలెక్టరేట్ వేదికగా డీఆర్వో వై.సత్యనారాయణరావు, కేఆర్ఆర్సీ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ఎస్వీఎస్ సుబ్బలక్ష్మి, జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ వై.శ్రీనివాస్ అర్జీలు స్వీకరించారు. సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. అర్జీదారుల సమస్యలు తెలుసుకుని గడువులోగా పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి సమస్యలపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఈ వారం పీజీఆర్ఎస్లో మొత్తం 309 అర్జీలు నమోదయ్యాయి. పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. 1) డీ–పట్టా భూములను ఆన్లైన్ చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మంజూరయ్యేలా చూడాలని కోరుతూ ఎస్.రాయవరం మండలం పెద్దగుమ్మ లూరు దళిత రైతులు వినతి సమర్పించారు. 2) శతశాతం వికలాంగత్వం ఆధారంగా రూ.15 వేల పింఛన్ మంజూరు చేయాలంటూ వి.మాడుగుల మండలం ఎం.కోడూరు గ్రామానికి చెందిన దివ్యాంగుడు మెండేపు గోవింద పీజీఆర్ఎస్లో విన్నవించుకున్నాడు. 3) ఉపాధి హామీ పథకం కింద చెరువులో నాటిన కొబ్బరి మొక్కల పెంపకానికి కూలి చెల్లించకుండా టెక్నికల్ అసిస్టెంట్ ఆనందరావు దోచుకుని తమకు తీవ్ర అన్యాయం చేశారు. అతనిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని వడ్డాది గ్రామానికి చెందిన దివ్యాంగ వేతనదారులు లంక బాలకృష్ణ, మామిడి అప్పలకొండ కోరారు. గ్రామంలో మూడెకరాల ప్రభుత్వ భూమిలో కొబ్బరి మొక్కలు నాటి వాటి పెంపకం బాధ్యతలు తమకు అప్పగించారన్నారు. 4) వెలుగు విభాగంలో పనిచేస్తున్న వీవోఏలకు మూడేళ్ల కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ వెలుగు వీవోఏ సంఘం (సీఐటీయూ) ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. పీజీఆర్ఎస్లో సంబంధిత ఉద్యోగులు వినతి పత్రం సమర్పించారు. -
రోడ్డు పనులు అడ్డుకున్న ఫారెస్ట్ అధికారులు
మాకవరపాలెం: ఫారెస్ట్ భూమిలో రోడ్డు వేస్తున్నారంటూ అటవీశాఖ అధికారులు రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్నారు. ఈ పనులకు వినియోగించిన రెండు పొక్లెయిన్లను స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని రాచపల్లి రెవెన్యూలోని 300 ఎకరాల భూమి ఏపీఐఐసీ ఆధీనంలో ఉంది. దీంతోపాటు ఇదే రెవెన్యూలోని 737 సర్వే నంబర్లో మరో 450 ఎకరాలను పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించనున్నట్టు ఏపీఐఐసీ, రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పరిశ్రమలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు యరకన్నపాలెం నుంచి యలమంచిలి మండలంలో జాతీయ రహదారిని కలుపుతూ పెదపల్లికి రోడ్డును సైతం నిర్మిస్తామని ఇటీవల కలెక్టర్ విజయకృష్ణన్ వెల్లడించారు. ఈ మేరకు శనివారం సాయంత్రం నుంచి రోడ్డు చదును పనులు చేపట్టారు. 40 అడుగులకుపైగా వెడల్పుతో అర కిలోమీటర్ పొడవునా రోడ్డు చదును పనులు పూర్తి చేశారు. దీంతో ఫారెస్ట్ అధికారులు ఈ భూమి తమ దంటూ పనులను అడ్డుకున్నారు. పనులకు వినియోగించిన రెండు పొక్లెయిన్లను స్వాధీనం చేసుకున్నామని, మరో రెండు జేసీబీలను బలవంతంగా తీసుకువెళ్లిపోయారని కోటవురట్ల సెక్షన్ అధికారి వివేకానంద సోమవారం తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. రెవెన్యూ అధికారుల ఆదేశాలతోనే రోడ్డు పనులు చేపట్టినట్టు నిర్వాహకులు తెలిపారన్నారు. ఈ నేపథ్యంలో అటవీ, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించే వరకు రోడ్డు పనులు జరగనివ్వమన్నారు. ఆయన వెంట ఫారెస్ట్ బీట్ అధికారి నూకరాజు ఉన్నారు. రెండు పొక్లెయిన్లు స్వాధీనం పోలీసులకు ఫిర్యాదు -
టీడీపీ నేత నుంచి కాపాడండి
● వేరే చోటుకు బదిలీ చేయాలని హెచ్ఎం వేడుకోలు ● ఎంఈవోకు వినతిపత్రం ఎంఈవో జానుప్రసాద్కు వినతి పత్రం అందజేస్తున్న హెచ్ఎం రాము రోలుగుంట: మండలంలోని అర్ల పంచాయతీలో ఎంపీపీ పాఠశాల హెచ్ఎం బోనెల రాముని గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు పాడి శ్రీను తరచూ బెదిరిస్తున్నాడు. ఈ నెల 10న పాఠశాలలో పేరెంట్స్, టీచర్ సమావేశంలోనూ అతను రభస చేయడంతో పాటు హెచ్ఎం అంతు చూస్తానంటూ బెదిరించిన విషయం విదితమే. ఈమేరకు హెచ్ఎం ఈ నెల 12న పోలీసులకు, ఎంఈవోకు ఫిర్యాదు చేశా రు. ఎంఈవో జాను ప్రసాద్ సోమవారం అర్ల పాఠశాలకు వెళ్లి హెచ్ఎంను, స్థానికులను విచారణ చేశారు. శ్రీను నుంచి తనకు ప్రాణహాని ఉందని, వెంటనే తనను పాఠశాల మార్పు చేయాలని ఎంఈవోకు విజ్ఞప్తి చేశారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని ఎంఈవో తెలిపారు. -
ఉపాధి పనుల్లో కుల వివక్ష..
టీఏ తీరుపై దళిత మహిళల నిరసన ఉపాధి హామీ పథకం టీఏ తీరుపై వడ్డాది గ్రామ వేతనదారుల నిరసన కులాల ప్రాతిపదికన ఉపాధి పనులు కల్పించడంతో తమకు తక్కువ వేతనం వస్తుందని, టీఏ వి.రమణపై విచారణ చేసి న్యాయం చేయాలంటూ బుచ్చెయ్యపేట మండలం వడ్డాది గ్రామానికి చెందిన దళిత మహిళలు ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు భూసి కోటి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన చేశారు. ప్రభుత్వం కల్పించిన క్యూబిక్ మీటర్ లెక్కలు కాకుండా అధికంగా పనిచేయిస్తూ మండుటెండల్లో సైతం మహిళా దళిత కూలీలను ఉంచుతున్నారని వాపోయారు. చేసిన పనికి సరైన వేతనం దక్కకుండా చేస్తున్నారన్నారు. అతని తీరుపై మండల స్థాయి అధికారులు వచ్చి మందలించారని, అయినా మార్పు లేదని వాపోయారు. అతని తీరుపై ప్రశ్నించినందుకు వారం రోజుల పాటు 196 మంది వేతనదారులకు పని నిలిపివేసి రకరకాల సాకులతో ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. జిల్లా అధికారులు విచారణ చేపట్టి అతనిపై చర్యలు తీసుకుని, సరైన వేతనం చెల్లించాలని కోరారు. -
కష్టాల్లో పీచు పరిశ్రమ
● ప్రభుత్వ ప్రోత్సాహం కరువు ● కొబ్బరి పీచుతో పలు ఉత్పత్తుల తయారీ ● విశాఖ నుంచి చైనాకు ఎగుమతి ● వందలాది మందికి ఉపాధి ● జిల్లాలో 34 పీచు పరిశ్రమలు, 20 వేల ఎకరాల్లో కొబ్బరి సాగు ● విద్యుత్ సబ్సిడీ విడుదల చేయాలని కొబ్బరి పీచు యాజమాన్యాలు వినతి కొబ్బరి పీచు పరిశ్రమలు నష్టాల బాట పడుతున్నాయి. ప్రభుత్వం నుంచి వచ్చే విద్యుత్ సబ్సిడీతో పాటు ఇతర ప్రోత్సాహకాలు కరువయ్యాయి. కొబ్బరి పీచుతో తయారుచేసే ఉత్పత్తులు అనకాపల్లి జిల్లా నుంచి చైనాకు ఎగుమతి అవుతున్నాయి. విదేశాల్లో కొబ్బరి పీచు ఉత్పత్తులకు గిరాకీ ఉన్నా స్థానికంగా పరిశ్రమలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తగిన ప్రోత్సాహకాలు లేక యాజమాన్యాలు నష్టాలు చవి చూస్తున్నారు. సాక్షి, అనకాపల్లి : కొబ్బరి సాగు చేసే రైతు వృథాగా పడవేసే కొబ్బరి డొక్కులను పీచు పరిశ్రమలు కొనుగోలు చేసి వివిధ పీచు ఉత్పత్తులు తయారు చేస్తున్నాయి. అయితే విదేశాల నుంచి తగిన గిరాకీ ఉన్నా..సరిపడా పీచు ఉత్పత్తులను ఎగుమతి చేయలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఉన్న కొబ్బరి పీచు పరిశ్రమల యాజమాన్యం ప్రభుత్వం వచ్చే సబ్సిడీని, ప్రోత్సాహకాలను త్వరితగతిన అందించాలని కోరుతున్నారు. కొబ్బరి పీచుతో సోఫాసెట్లు, కార్పెట్లు, పరుపులు, తాళ్లు తయారు చేస్తారు. ఇలాంటి కొబ్బరి పీచు పరిశ్రమలు అనకాపల్లి జిల్లాలో యలమంచిలి, ఎస్.రాయవరం, రాంబిల్లి మండలాల్లో ఎక్కువగా ఉన్నాయి. వీటి ద్వారా రైతులకు అదనపు ఆదాయం..స్థానిక మహిళలకు ఉపాధి కూడా కలుగుతుంది. పీచుకు డిమాండ్ ఉంది..రైతు నుంచి ముడి సరుకు సమృద్ధిగా ఉంది. కానీ పీచు తయారీకి ఖర్చు ఎక్కువవుతోంది. ప్రభుత్వాలు విద్యుత్ సబ్సిడీ కల్పించి పరిశ్రమలను ఆదుకోవాలని యాజమానులు కోరుతున్నారు. చైనాకు ఎగుమతి.. అనకాపల్లి జిల్లా నుంచి చైనా దేశంతో పాటు చైన్నె, గుజరాత్, కోల్కత్తా లాంటి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. అనకాపల్లి జిల్లా నుంచి కొనుగోలు చేసి చైన్నె, విశాఖలో చైనాకు సంబంధించి ఏజెంట్ల ద్వారా పోర్టు నుంచి ఎగుమతి అవుతుంది. కొబ్బరి పీచుతో కృత్రిమ బొమ్మలు, ప్లైవుడ్, పరుపులు కూడా తయారు చేస్తారు. 15 వేల ఎకరాల్లో కొబ్బరి సాగు.. అనకాపల్లి జిల్లాలో 15 వేల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. ఇక్కడ కొబ్బరి పీచు పరిశ్రమల ద్వారా నెలకు 10 టన్నుల పీచు, తాళ్లు ఉత్పత్తి చేస్తూ పరోక్షంగా 3 వేల మంది వరకు ఉపాధి పొందుతున్నారు. పీచు పరిశ్రమలకు అవసరమైన కొబ్బరి డొప్పలను ట్రాక్టర్ లోడు రూ.4వేల నుంచి, రూ.5 వేల వరకు, లారీలోడు రూ.7వేల నుంచి రూ.8 వేల వరకు చెల్లించి కొనుగోలు చేస్తారు. పీచు తయారీకి కిలోకు రూ.8 వరకు ఖర్చవుతుంది. మిగిలిన పొట్టును ఇటుకల బట్టీలకు విక్రయిస్తుంటారు. పరిశ్రమ వద్దకు తెచ్చిన డొక్కను పీచుగా మార్చడానికి కనీసం నెల రోజుల వ్యవధి పడుతుంది. ఇటీవల స్థానికంగా కూడా వీటి వినియోగం పెరగడంతో 30 శాతం ఉత్పత్తులను ఇక్కడే ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం కొబ్బరి దిగుబడులు తగ్గడంతో కిలో ధర రూ.8 మాత్రమే ఉందని రైతులు పేర్కొంటున్నారు. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదాయంగా అందిస్తున్న కొబ్బరి పీచు తయారీని ప్రభుత్వం ప్రోత్సహించాల్సి ఉంది. కొబ్బరి పీచును నిల్వ చేసుకునేందుకు గోదాముల ఏర్పాటుకు ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించాలని, రాయితీలు ఇవ్వాలని పరిశ్రమల యాజమాన్యాలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక్కో కొబ్బరి కాయ నుంచి 80 గ్రాముల పీచు.. జిల్లాలో చిన్నాపెద్ద కలిపి 34 కొబ్బరి పీచు పరిశ్రమలు ఉండగా.. సగటున 350 గ్రాముల బరువు ఉన్న ఎండు కొబ్బరి కాయ నుంచి 80 గ్రాములు పీచు వస్తే.. కొబ్బరి పొట్టు 160 గ్రాముల వరకు వస్తోంది. ఏడాదికి 6వేల టన్నుల పొట్టు ఉత్పత్తి అవుతోందని అంచనా. అధిక ఈసీ ఉన్న కొబ్బరి పొట్టును నేరుగా వినియోగిస్తే మొక్కలు దెబ్బతింటాయి. దీంతో వివిధ పద్ధతులలో ఈసీ శాతం తగ్గించి కంపోస్టుగాను, బ్రిక్స్ రూపంలో తయారు చేసి ఎగుమతి చేస్తున్నారు. ఈసీ ఎక్కువగా ఉన్న పొట్టును ఇటుక బట్టీలకు టన్ను రూ.2,500 చొప్పున విక్రయిస్తుండగా తక్కువ ఈసీ ఉన్న పొట్టును టన్ను రూ.5 వేలకు విక్రయిస్తున్నారు. కొబ్బరి పొట్టు నాణ్యమైన సేంద్రియ ఎరువుగా తయారైతే, దాని ధర పొట్టు రూపంలో టన్ను రూ.14 వేల నుంచి రూ.20 వేల వరకు ధర ఉంది. జిల్లా వ్యాప్తంగా 34 పరిశ్రమలు ప్రధానంగా ఎస్.రాయవరం, రాంబిల్లి, అచ్యుతాపురం, యలమంచిలిలో పరిశ్రమలున్నాయి ఏడాదికి 6 టన్నుల పీచు తయారీ కొబ్బరి తాళ్లు, నార, మ్యాట్లుగా తయారీ సుమారుగా 3000 మంది ఉపాధి 12 వేల ఎకరాలకు పైగా కొబ్బరి తోటల సాగు రాయితీ కల్పించాలి.. కొబ్బరి పీచు పరిశ్రమలు పరిస్థితి బాలేదు. అప్పుల ఊబిలో కూరుపోయాం. వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్న కొబ్బరి పీచు పరిశ్రమలకు విద్యుత్ రాయితీ కల్పించాలి. జిల్లాలో మరిన్ని కొబ్బరి పీచు తయారీ పరిశ్రమలు ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. స్థానిక మహిళలకు ఉపాధి కలుగుతోంది. – కోలా జగదీష్, యాజమాని, కొరుప్రోలు గ్రామంపరిశ్రమలో కొబ్బరి పీచు నిల్వలు -
గత ఏడాది డిసెంబరు 24వ తేదీన స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సుందరకోట పంచాయతీకి విచ్చేశారు. అక్కడ జరిగిన గ్రామసభలో అర్ధంతరంగా ఆగిపోయిన గిరిజనుల అటవీ హక్కుపత్రాల పంపిణీ విషయాన్ని ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి స్పీకర్ వద్ద ప్రస్తావించారు. వాటితో పాటు సరుగుడు
● హక్కుపత్రాలు ఇంకెప్పుడిస్తారు...! ● గ్యాప్ ఏరియా భూముల్లో సాగు చేసే గిరిజనుల గోడు పట్టించుకోని కూటమి ప్రభుత్వం ● గత ప్రభుత్వంలో 580 మందికి పైగా హక్కుపత్రాల పంపిణీ అధ్యక్షా...అప్పుడే మరిచారా...! నాడు ఆశలు నెరవేర్చారు... గత వైఎస్సార్సీపీ హయంలో అటవీ హక్కు పత్రాలు పొందిన గిరిజనులందరికీ వైఎస్సార్ రైతు భరోసా పథకంలో పెట్టుబడి ఆర్థిక సాయం అందుకున్నారు, ఏళ్ల తరబడి గిరిజనులు సాగు చేసుకునే పోడు భూములకు అసలు పట్టాలు వస్తాయనే ఆశ గిరిజనులకు ఉండేది కాదు. అటువంటి దశలో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అదేశాల మేరకు అప్పటి ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ కృషితో పోడు భూములు సాగు చేసుకునే గిరిజనులకు నిబంధనల ప్రకారం పట్టాలు అందజేశారు. సరుగుడు, సుందరకోట పంచాయతీలో అసనగిరి, తొరడ, కొత్త దద్దుగుల, మాసంపల్లి , రామన్నపాలెం, అచ్చంపేట, యరకంపేట, రాజవరం, సిరిపురం, ముంతమామిడిలొద్దు, కొత్త లంకలు, బమ్మిడికలొద్దు, దద్దుగుల తదితర గ్రామాలు 1/70 యాక్టు పరిధిలో ఉన్నాయి. ఆ గ్రామాల గిరిజనులు గ్యాప్ ఏరియా భూముల్లో పోడు వ్యవసాయం చేసుకుంటారు. మొదట తరం గిరిజనులు కాలం చేసేయడంతో వారు వారసులు అయా భూములు సాగు చేస్తున్నారు. మేము ఉండగా హక్కు పత్రాలు ఇస్తారా...అంటూ గిరిజన పెద్దలు మదన పడుతున్నారు. నాతవరం : గిరిజనులు సాగుచేసే భూములకు పట్టాలు ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. గత ప్రభుత్వం హయాంలో వందలాది మంది గిరిజనులకు అటవీ హక్కు పత్రాలు ఇవ్వగా, ఆ తరువాత వచ్చిన ఎన్నికల కోడ్ కారణంగా మిగిలిన రైతులకు పట్టాల పంపిణీ నిలిచిపోయింది. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గిరిజనుల గోడును పూర్తిగా పెడచెవిన పెట్టింది... వివరాలివి. మండలంలో సరుగుడు, సుందరకోట పంచాయతీల్లో సుమారుగా 10వేల ఎకరాలకు పైగా గ్యాప్ ఏరియా భూమి ఉంది, బ్రిటిష్ హయంలో సైతం సర్వే చేయకపోవడంతో ఈ భూమి గ్యాప్ ఏరియా భూమిగా రెవెన్యూ రికార్డులో నమోదైంది. ఆయా భూముల్లో గిరిజనులు స్వాతంత్య్రం నాటి నుంచి తుప్పలు రాళ్లు తొలగించి పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గిరిజనులు సాగు చేసుకునే అటవీ పోడు భూములకు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయంలో సర్వే చేశారు. పోడు వ్యవసాయం చేసుకునే వారిని గుర్తించి రెండు దఫాలుగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న గిరిజనులకు సుమారుగా 589 మందికి అప్పటి నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ చేతుల మీదుగా అటవీ హక్కు పత్రాలు పంపిణీ చేశారు. అన్ని అర్హతలు ఉండి సర్వే చేసిన మరో 300మంది పైగా గిరిజన రైతులకు హక్కు పత్రాలు ఇవ్వడానికి అధికారులు జాబితా సిద్ధం చేశారు. ఇంతలో సార్వత్రిక ఎన్నికడ కోడ్ రావడంతో పట్టాల పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. అనంతరం కూటమి ప్రభుత్వం రాకతో ఈ అంశాన్ని అధికారులు పక్కన పడేసారు. ఈ నేపథ్యంలో గత ఏడాది డిసెంబరు 24వ తేదీన స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సుందరకోట పంచాయతీకి విచ్చేయగా, అక్కడ జరిగిన గ్రామసభలో ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి గిరిజనులకు హక్కు పత్రాలు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. సరుగుడు సుందరకోట పంచాయతీలో గ్యాప్ ఏరియా భూముల్లో పోడు వ్యవసాయం చేసుకునే రైతులకు కూడా సర్వే చేసి హక్కు పత్రాలు ఇవ్వాలని కోరారు. దీనికి స్పీకర్ స్పందించి వెంటనే చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. ఈ మేరకు సుందరకోట పంచాయతీలో గల గ్యాప్ ఏరియా భూములను ఫిబ్రవరిలో కలెక్టరు విజయకృష్ణన్ పరిశీలించారు. గ్యాప్ ఏరియా భూములతో పాటు గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములను సైతం నమోదు చేయాలని నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణ, సర్వే అధికారులను అదేశించారు, గ్యాప్ ఏరియా సర్వే యుద్ధప్రతిపాదికన పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని అధికారులకు అదేశించారు. ఈ సమయంలో కూడా స్థానిక ఎంపీటీసీ సభ్యుడు ఎంపీపీ లక్ష్మణమూర్తి కలెక్టర్ను కలిసి గిరిజనులు హక్కు పత్రాల కోసం విజ్ఞప్తి చేయగా, సర్వే పూర్తయ్యాక పట్టాలు పంపిణీ చేస్తామని కలెక్టర్ చెప్పారు. అయితే స్పీకర్, కలెక్టరు హామీ ఇచ్చిన నెలలు గడుస్తున్నా నేటికీ గిరిజనులకు ఎదురు చూపులు తప్పలేదు. హక్కు పత్రాల పంపిణీ జరగలేదు. సాక్షాత్తూ స్పీకర్ హామీ ఇచ్చినా నెరవేరకపోతే మా సమస్య ఇంకెవరికి చెప్పుకోవాలంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 384 మందిని గుర్తించాం. పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులను నిబంధనలు ప్రకారం 384 మందిని గుర్తించాం. ఆ జాబితా అటవీశాఖ అధికారులకు పాడేరు ఐటీడీఏకు నివేదించాం. అటవీశాఖ అధికారులు ఆమోదం తెలిపాక పాడేరు ఐటీడీఏ ద్వారా పాసుపుస్తకాలు వస్తాయి. రెవెన్యూ శాఖ పరంగా మేము జాప్యం చేయలేదు. అటవీశాఖలో జాప్యం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. గిరిజనులకు మేలు కోసం మా పని సకాలంలోనే చేసేయడం జరిగింది, –ఎ.వేణుగోపాల్, తహసీల్దార్, నాతవరం మండలంగతంలో రైతు భరోసా అందింది మాకు పట్టాలు పాసుపుస్తకాలు వస్తాయి అనుకోలేదు. అలాంటిది వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అటవీ హక్కు పత్రాలు ఇచ్చారు. హక్కు పత్రాలు పొందిన గిరిజనులందరికీ రైతు భరోసా పథకంలో పెట్టుబడి సాయం డబ్బులు ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో ఇంకా రైతు భరోసా డబ్బులు ఇవ్వలేదు. –బండి గంగరాజు, సరుగుడు గ్రామం గిరిజనులపై వివక్ష కూటమి ప్రభుత్వంలో గిరిజనులు తీవ్ర వివక్ష ఎదుర్కొంటున్నారు. అధిక శాతం గిరిజనులు వైఎస్సార్సీపీకి చెందిన ప్రజాప్రతినిధులు ఓటర్లు ఉన్నారు. దానిని దృష్టిలో పెట్టుకుని కూటమి నేతలు గిరిజనుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారు. హక్కు పత్రాల కోసం స్వయంగా గ్రామసభలో అందరి సమక్షంలోనే స్పీకరు అయ్యన్నపాత్రుడు దృష్టికి, తర్వాత ఈ ప్రాంతానికి వచ్చిన కలెక్టరు విజయకృష్ణన్కు ఈ సమస్య తీసుకెళ్లాను, త్వరలోనే పరిష్కరిస్తాను అన్నారు కానీ నేటికీ జరగలేదు. –సాగిన లక్ష్మణమూర్తి, ఎంపీపీ -
‘యాత కులస్తులను అవమానిస్తున్న కూటమి ప్రభుత్వం’
అనకాపల్లి: ఉత్తరాంధ్రలో ఉన్న యాత కులస్తులకు కీలక రాజకీయ పదవులు ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం అవమానిస్తుందని జిల్లా యాత సంక్షేమ సంఘం అధ్యక్షుడు పెంకే మారేష్ విమర్శించారు. స్థానిక నాయుళ్లువీధి సంఘం కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తరతరాలుగా యాత కులస్తులను అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల వరకే వాడుకుంటున్నారని, యాత కులస్తులను రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి పరిచే ఏ చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఉత్తరాంధ్రలోని యాత కులస్తుల్లో అక్షరాస్యత శాతం చాలా తక్కువన్నారు. పేదరికం, నిరుద్యోగం వారిని పట్టి పీడిస్తున్నాయన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తుర్తి అప్పారావు మాట్లాడుతూ బీసీఏలో 54 కులాల నుంచి 32 కులాలను అత్యంత వెనకబడిన కులాలుగా గుర్తించి వారి జీవన విధానాన్ని మెరుగుపరుస్తామని జారీ చేసిన జీవో నంబర్ 17ను తక్షణమే అమలు చేయాలని కోరారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం మాదిరిగా ఏపీలో 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలన్నారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పిల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎంబీసీలకు 15 శాతం రిజర్వేషన్ కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు కర్రి వెంకటరమణ, బత్తిని సత్యనారాయణ, ఒడిసెల సూరిబాబు, కట్ట అప్పారావు, రాముడు రమేష్, గేడి సంతోష్, తదితరులు పాల్గొన్నారు. -
చెస్ పోటీల విజేతలు భవన్, శ్రావ్యశ్రీ
విశాఖ స్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి అండర్–15 చదరంగం చాంపియన్షిప్ను కె.భవన్ (ఓపెన్ విభాగం), శ్రావ్యశ్రీ (బాలికల విభాగం) కై వసం చేసుకున్నారు. ఆల్ విశాఖ చెస్ సంఘం ఆధ్వర్యంలో బీవీకే కళాశాలలో ఈ పోటీలు జరిగాయి. ఓపెన్ విభాగంలో 200 మంది బాలురు, బాలికల విభాగంలో 99 మంది ఏడేసి రౌండ్ల పాటు జరిగిన ఈ పోటీల్లో తలపడ్డారు. ఓపెన్ విభాగంలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన భవన్ ఆరున్నర పాయింట్లతో విజేతగా నిలిచాడు. హర్ష కీర్తన, వినీల్ కార్తీక్, టి.నిశ్చల్ ఆరేసి పాయింట్లతో పోటీ ముగించారు. బాలికల విభాగంలో అనకాపల్లి జిల్లాకు చెందిన శ్రావ్యశ్రీ ఆరున్నర పాయింట్లతో విజేతగా నిలిచింది. శివసాయి దివ్య, ఆఫ్షీన్, గురువర్షిణి ఆరేసి పాయింట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఆయా కేటగిరీల్లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశారు. వీరంతా నవంబర్ 2వ తేదీ నుంచి ఉత్తరప్రదేశ్లో జరిగే జాతీయ అండర్–15 చదరంగం చాంపియన్షిప్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. -
‘కుబేర’ పైరసీ ప్రదర్శనపై ఫిర్యాదు
తగరపువలస: తాళ్లవలస తిరుమల విద్యాసంస్థల యాజమాన్యం చిట్టివలస క్యాంపస్ విద్యార్థుల కోసం ఆదివారం సాయంత్రం ‘కుబేర’సినిమాను ప్రదర్శించింది. ప్రస్తుతం ఈ చిత్రం తగరపువలసలోని తాతా థియేటర్లో ప్రదర్శించబడుతోంది. ఓటీటీలోకి ఇంకా విడుదల కాని ఈ సినిమాను క్యాంపస్ బయట, రోడ్డుపైనే రెండు స్క్రీన్లను ఏర్పాటు చేసి ప్రదర్శించడాన్ని థియేటర్ యాజమాని పరిమి గోపి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. తిరుమల యాజమాన్యం పైరసీకి పాల్పడిందని ఆరోపిస్తూ.. తమ సిబ్బందిని పంపి సినిమా ప్రదర్శనను నిలిపివేయించారు. అనంతరం ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన రెండు ప్రొజెక్టర్లు, రెండు స్క్రీన్లు, అలాగే పెన్డ్రైవ్లను స్వాధీనం చేసుకున్నారు. -
రాష్ట్రస్థాయి అండర్–16 ఫుట్బాల్ శిక్షణ తరగతులు ప్రారంభం
తగరపువలస: చిట్టివలస బంతాట మైదానంలో రాష్ట్రస్థాయి అండర్–16 ఫుట్బాల్ బాలుర జట్టుకు ఆదివారం శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కోటగిరి శ్రీధర్ సూచనల మేరకు, అనంతపురానికి చెందిన దాదా ఖలంధర్ జట్టుకు కోచ్గా వ్యవహరిస్తున్నారు. అసోసియేషన్ జిల్లా కార్యదర్శి అక్కరమాని చినబాబు, ఉపాధ్యక్షుడు రాజారావు, కోల చంద్రశేఖర్ 10 రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. శిక్షణ అనంతరం జట్టు ఈ నెల 26న మధ్యప్రదేశ్లోని బాలాఘాట్లో జరిగే ఆల్ ఇండియా అండర్–16 టోర్నమెంట్లో పాల్గొననుంది. -
కృష్ణా జెడ్పీ చైర్పర్సన్ హారికపై పచ్చమూక దాడులు దుర్మార్గం
● జిల్లా ప్రథమ పౌరురాలికి రక్షణ కల్పించలేకపోవడం దారుణం ● దాడులకు తెగబడిన వారిని కఠినంగా శిక్షించాలి ● వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈర్లె అనురాధ ధ్వజందేవరాపల్లి : కృష్ణా జిల్లా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాలు పోలీసుల సమక్షంలోనే దాడికి తెగబడడం అత్యంత దుర్మార్గమని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి ఈర్లె అనురాధ తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు దేవరాపల్లి మండలం తారువలో ఆదివారం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళా ప్రజాప్రతినిధిపై టీడీపీ, జనసేన గూండాలు ముకుమ్మడిగా దాడి చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. కూటమి కార్యకర్తలు ఉన్మాదంతో దాడులు చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం ఆందోళన కలిగిస్తుందన్నారు. జిల్లా ప్రథమ పౌరురాలికే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం, ఇక సామాన్య మహిళలకు ఏ విధంగా రక్షణ కల్పిస్తుందన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే నెపంతో ఆగమేఘాలపై ఒక మహిళను జైల్లో పెట్టిన పోలీసులు, జెడ్పీ చైర్ పర్సన్, జిల్లా ప్రథమ పౌరురాలిపై దాడులు చేస్తే అదే మాదిరిగా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందన్నారు. కారులో వెళ్తున్న మహిళా ప్రజాప్రతినిధిని నడిరోడ్డుపై అడ్డగించి దాడికి పాల్పడితే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, హోంమంత్రి ఎందుకు స్పందించలేదని ఆమె ప్రశ్నించారు. మహిళా కమిషన్, డీజీపీ తక్షణమే స్పందించి దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఆడపిల్లలకు సైతం రక్షణ కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని విమర్శించారు. కాకినాడ జిల్లాలోని రంగరాయ వైద్య కళాశాలలో ల్యాబ్ అసిస్టెంట్ విద్యార్థినుల ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడంపై ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆమె ప్రశ్నించారు. -
అక్రమంగా మట్టి తరలింపు
● పొక్లెయిన్, ట్రాక్టర్లు సీజ్ కోటవురట్ల : అక్రమంగా తరలిస్తున్న మట్టి ట్రాక్టర్లను పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాలు ఇవి..పాత గొట్టివాడ ప్రాంతం నుంచి మట్టి తరలిపోతోందన్న విశ్వసనీయ సమాచారంతో ఆదివారం ఉదయం పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఒక పొక్లయిన్, మూడు ట్రాక్టర్లు పట్టుబడగా వాటిని సీజ్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. మట్టి తరలింపునకు సంబంధించి రెవెన్యూ, మైనింగ్ శాఖాధికారుల నుంచి ఎటువంటి అనుమతి లేనట్టు గుర్తించి తదుపరి చర్యల నిమిత్తం తహసీల్దారుకు సమాచారం ఇచ్చినట్టు ఎస్ఐ తెలిపారు. -
పోస్టల్ ఉద్యోగుల క్రికెట్ మ్యాచ్
పోస్టల్ శాఖ ఉద్యోగులు డైట్ కళాశాలలో క్రికెట్ ఆడుతున్న దృశ్యం అనకాపల్లి : క్రీడల ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చని డైట్ కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్ అన్నారు. స్థానిక జాతీయ రహదారి డైట్ కళాశాలలో పోస్టల్ శాఖ ఉద్యోగుల ఒక రోజు క్రికెట్ మ్యాచ్ను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. తపాల శాఖ ఉద్యోగులు ప్రతి ఏడాది క్రికెట్ మ్యాచ్లు అడడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోస్టల్ ఉద్యోగులు మానసిక ప్రశాంతతకు క్రికెట్ ఆడడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని ఆయన పేర్కొన్నారు. తపాలశాఖ యూనియన్ రీజియన్ అధ్యక్షుడు వై.బి.పలాసరావు మాట్లాడుతూ క్రీడల వలన మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. సుమారుగా 100 మంది క్రీడాకారుల పాల్గొడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తపాలశాఖ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. -
‘కోట’మెచ్చిన విశాఖ
కొమ్మాది: తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన మహానటుడు కోట శ్రీనివాసరావు. విలన్గా, విలక్షణ నటుడిగా, తండ్రిగా, రాజకీయ నాయకుడిగా, కామెడీ విలన్గా యావత్ తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కోటకు విశాఖతో విడదీయరాని అనుబంధం ఉంది. ప్రతిఘటన సినిమాతో విలన్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన కోట శ్రీనివాసరావు, విశాఖలో చిత్రీకరించిన ఈ సినిమాతోనే విలన్ పాత్రలకు ఒక కొత్త నిర్వచనం ఇచ్చారు. ఆ చిత్రం ఆయనను ‘విలన్ అంటే కోట శ్రీనివాసరావు’ అనే స్థాయికి తీసుకెళ్లింది. అప్పటి నుంచి అనేక సినిమాలు విశాఖలో చిత్రీకరించారు. విశాఖలో ఆయన నటించిన చిత్రాలలో ప్రతిఘటన, ఆలీ బాబా అరడజను దొంగలు, జంబలకిడిపంబ, ఆ ఒక్కటి అడక్కు, కర్తవ్యం, దొరబాబు, పోలీస్ బ్రదర్స్, లాఠీచార్జ్, రాజధాని, ఛత్రపతి, యోగి, బుజ్జిగాడు, గణేష్ వంటివి ఎన్నో ఉన్నాయి. విశాఖ అంటే ఎంతో ఇష్టం నగరానికి వచ్చినప్పుడు ఆయన ఎక్కువగా దసపల్లా, మేఘాలయ హోటళ్లలో బస చేసేవారని ఆయన సన్నిహితులు తెలిపారు. విశాఖ నగరం అంటే ఆయనకు ఎంతో ఇష్టమని, షూటింగ్ విరామ సమయాల్లో బీచ్కు వెళ్లి సేదతీరేవారని సినీ మిత్రులు గుర్తు చేసుకున్నారు. విశాఖ, అరకు ప్రాంతాల్లో ఆయన సినిమాలు షూటింగ్ జరిగాయి. వైజాగ్ ఫిల్మ్ సొసైటీ సంతాపం తాటిచెట్లపాలెం: విలక్షణ నటుడు, సుదీర్ఘకాలం తెలుగు సినీ పరిశ్రమకు సేవలందించి, ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న కోట శ్రీనివాసరావు మృతి పట్ల వైజాగ్ ఫిలిం సొసైటీ సంతాపం వ్యక్తం చేసింది. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని సొసైటీ సెక్రటరీ నరవ ప్రకాశరావు, అధ్యక్షుడు కాశీ విశ్వేశ్వరరావు, కార్యనిర్వాహక కార్యదర్శి బి.చిన్నారావు అన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు తెలుగు సినీ పరిశ్రమ ఓ మహానటుడిని కోల్పోయింది. ఏ పాత్ర వేసినా ఆ పాత్రకు న్యాయం చేసే ఏకై క నటుడు కోట శ్రీనివాసరావు. ఎస్.వీ రంగారావు, కై కాల సత్యనారాయణ, రావు గోపాలరావు వంటి దిగ్గజాల తర్వాత సినీ పరిశ్రమలో అంతటి లోటును తీర్చింది కోట శ్రీనివాసరావే. విశాఖలో సినిమా చిత్రీకరణ అంటే కోట ఎంతో ఉత్సాహంగా వచ్చేవారు. ఆయనతో పలు సినిమాల్లో నటించా. ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. – ప్రసన్న కుమార్, సినీ నటుడు, వైజాగ్ విలన్గా ప్రస్థానం ఇక్కడ నుంచే మొదలు బీచ్ అంటే చాలా ఇష్టం విశాఖ ఉమ్మడి జిల్లాల్లో ఎన్నో చిత్రాల షూటింగ్ -
రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
అనకాపల్లి: అనకాపల్లి–కశింకోట రైల్వే స్టేషన్ల మధ్య గుర్తు తెలియని రైలు ఢీకొని సుమారుగా 45 నుంచి 50 సంవత్సరాలు వయస్సుగల వ్యక్తి మృతిచెందినట్టు దువ్వాడ జీఆర్పీ ఎస్ఐ లక్ష్మి ఆదివారం చెప్పారు. మృతుడి ఎత్తు 5.3 అడుగులు, జుట్టు నలుపు రంగు కలరింగ్, తల నుజ్జునుజ్జు అయ్యి గుర్తు పట్టలేని విధంగా మృతి చెందినట్టు ఎస్ఐ చెప్పారు. మృతుని వద్ద ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేని పేర్కొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించడం జరిగిందని, మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 7382058996ను సంప్రదించాలని కోరారు. -
స్మార్ట్ మీటర్లు తొలగించకుంటే భారీ ఆందోళన
మునగపాక: రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను తొలగించకుంటే రైతులతో కలిసి భారీ ఆందోళన చేపడతామని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు హెచ్చరించారు. మండలంలోని వెంకటాపురంలో వ్యవసాయ క్షేత్రాల్లో ఏర్పాటు చేసిన స్మార్ట్మీటర్లను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించడంతో రైతులకు రూ.20 వేల నుంచి రూ.22 వేల వరకు విద్యుత్ బిల్లులు వస్తాయన్నారు. రైతులు గగ్గోలు పెడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్మీటర్లను ఏర్పాటు చేస్తుందన్నారు. ఒక్కో మీటరుకు రూ.13వేలు చొప్పున రైతుల నుంచి వసూలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందన్నారు. ఎన్నికల ముందు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ.. స్మార్ట్మీటర్లను వ్యతిరేకించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం పునరాలోచన చేసి స్మార్ట్ మీటర్ల తొలగింపు చేపట్టాలని, లేకుంటే రైతులతో కలిసి పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ, రైతులు కడియం కృష్ణ, గోవిందరావు, సుందరపు అప్పలరాజు, నీలకంఠారావు, చిన్ని అప్పారావు, మహాలక్ష్మీరావు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో శ్రావ్యశ్రీ ప్రతిభ
రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన శ్రావ్యశ్రీకి మెమెంటో అందజేస్తున్న దృశ్యం ఎస్.రాయవరం : రాష్ట్ర స్థాయి చెస్ చాంపియన్షిప్లో ఎస్.రాయవరం గ్రామానికి చెందిన భీమరశెట్టి శ్రావ్యశ్రీ ప్రథమ స్థానంలో నిలిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. విశాఖపట్నం బీవీకె కళాశాలలో ఈ నెల 12,13 తేదీల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అండర్ 15 బాలికల చదరంగలో రాష్ట్ర వ్యాప్తంగా 99 మంది పాల్గొన్నారని, అందులో ఎస్.రాయవరానికి చెందిన శ్రావ్యశ్రీ ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఈ మేరకు శ్రావ్యశ్రీని కుటుంబ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, స్నేహితులు అభినందించారు. -
‘ఇసుక దందా’పై అధికారుల దాడులు
కోటవురట్ల: ‘హోం మంత్రి ఇలాకాలో.. ఆగని ఇసుక దందా’శీర్షికన సాక్షిలో ఇటీవల ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. మైనింగ్, రెవెన్యూ, పోలీసు శాఖాధికారులు సంయుక్తంగా శనివారం దాడులు నిర్వహించారు. వరహనదిని పరిశీలించి పలు ప్రాంతాలలో ఇసుక నిల్వలపై దాడులు చేశారు. నదిలోకి వాహనాలు వెళ్లకుండా గాడి కొట్టించారు. తహసీల్దారు తిరుమలబాబు మాట్లాడుతూ సాక్షిలో వెలువడిన కథనంతో పూర్తి స్థాయిలో దాడులు నిర్వహించినట్టు తెలిపారు. ఇందులో గొట్టివాడకు చెందిన సుంకర నూకినాయుడు(బాబ్జీ) అనే వ్యక్తికి చెందిన సర్వే నంబరు 921 జిరాయితీ మెట్టభూమి మామిడి తోటలో రెండు ట్రాక్టర్ల అక్రమ ఇసుక నిల్వ ఉన్నట్టు గుర్తించామన్నారు. ఇసుక నిల్వలకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేవని నిర్ధారించామన్నారు. రాత్రి వేళల్లో సమీపంలోని వరాహనదిలో నుంచి అక్రమంగా ఇసుకను తవ్వి ఎడ్ల బళ్ల ద్వారా మామిడి తోటల్లోకి తరలించి అక్కడి నుంచి ట్రాక్టర్ల ద్వారా వేరే ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్టు తమ విచారణలో తేలిందని తెలిపారు. ఇదే సర్వే నంబరు మామిడి తోటలో గతంలో కూడా అనేక సార్లు అక్రమ ఇసుక నిల్వలు గుర్తించి హెచ్చరించామన్నారు. ఈ మేరకు 92/1 సర్వే నంబరు జిరాయితీ మెట్ట భూమి యజమాని సుంకర నూకినాయుడుపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. విచారణలో గుర్తించిన అంశాలను జిల్లా కలెక్టరుకు నివేదిక సమర్పిస్తున్నట్టు చెప్పారు. గొట్టివాడ పరిధిలో వరాహనదిలోకి వెళ్లకుండా ట్రెంచ్ కొట్టించి రెవెన్యూ అసిస్టెంట్లను కాపలా ఉంచుతామన్నారు. ఈ దాడుల్లో ఎస్ఐ రమేష్, రెవెన్యూ, మైనింగ్ అధికారులు పాల్గొన్నారు. -
ఉపాధి @ఐటీఐ
కంచరపాలెం: ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)ల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తున్నాయి. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు త్వరగా ఉపాధి పొందే కోర్సుల్లో ఐటీఐ ఒకటి. వీరికి వృత్తి పరమైన ప్రాధాన్యం అధికంగా ఉంటుంది. ప్రధానంగా జిల్లా విద్యార్థులు ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్తోపాటు ఐటీఐ చదివేందుకు అధిక ప్రాధాన్యమిస్తారు. వివిధ ట్రేడుల్లో ఐటీఐ కోర్సులు విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులు అప్రంటీస్ తర్వాత 18 ఏళ్లు నిండాక పరిశ్రమలు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. డాక్యార్డ్, ఆర్టీసీ, షిప్యార్డ్, రైల్వే, విద్యుత్, రక్షణ శాఖ వంటి వాటిల్లో సైతం ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చు. చదువులో ఒత్తిడి ఉండదు. ఆయా పరిశ్రమలు, సంస్థల్లో ఉద్యోగాలు పొందాలంటే విద్యార్థులకు సాంకేతిక రంగంపై స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలి. నైపుణ్యం ఉన్న వారికి తప్పకుండా ఉపాధి లభిస్తుంది. మరోవైపు స్కిల్ హబ్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు నైపుణ్య అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. ఉద్యోగం, ఉపాధితోపాటు స్వయం ఉపాధికి సైతం ఈ కోర్సులు ఎంతగానో దోహదపడతాయి. 22 ట్రేడ్ల్లో శిక్షణ విశాఖ జిల్లా పరిధిలో నాలుగు ప్రభుత్వ, 31 ప్రైవేట్ ఐటీఐల్లో 3,286 సీట్లు ఉన్నాయి. ఏడాది, రెండేళ్ల వ్యవధి ఉన్న 22 ట్రేడ్ కోర్సులు నిర్వహిస్తున్నారు. కొన్ని ట్రేడ్ల్లో 8వ తరగతి విద్యార్హతతో శిక్షణ ఇస్తున్నారు. అభ్యర్థుల సంఖ్యకు తగ్గట్టుగా ప్రభుత్వ ఐటీఐల్లోని పలు ట్రేడ్ల్లో సీట్ల సంఖ్య పెరిగితే అధికంగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయని పలువురు సూచిస్తున్నారు. ఏడాది కోర్సులు ప్లంబర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్(కోపా), కార్పెంటర్, మెకానికల్ డీజిల్, పీపీవో, స్టెనోగ్రఫీ, వెల్డర్. రెండేళ్ల కోర్సులు ఏవో కెమికల్, డీఎం సివిల్, డీఎం మెకానికల్, ఫిట్టర్, ఇన్స్ట్రుమెంటేషన్ మెకానికల్, మెకనిస్ట్, ఐసీ అండ్ టీఎస్ఎం, టర్నర్, ఆర్ అండ్ ఏసీ మెకానిక్, ఎంఎంటీఎం, పెయింటర్(జి), ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానికల్, ఐఎం కెమికల్, మెషినిస్ట్ మెకానిక్(ఎంఎం). 15 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రభుత్వ, ప్రైవేట్ పారిశ్రామిక శిక్షణ సంస్థల్లో మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తయింది. మిగులు సీట్ల కోసం ఈ నెల 15 నుంచి ప్రభుత్వ ఐటీఐల్లో రెండో విడత కౌన్సెలింగ్ జరగనుంది. ఆసక్తి గల విద్యార్థులు ముందుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని సమీపంలోని ఐటీఐకు వెళ్లి పలు ట్రేడ్ల్లో చేరవచ్చు. జూలై నెలాఖరు తేదీ లోపు ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేస్తారు. ఆగస్టు మొదటి వారం నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి. సంప్రదించాల్సిన ఐటీఐలు పాత ఐటీఐ, కంచరపాలెం న్యూ ఐటీఐ, గాజువాక ఐటీఐ, నరవ బాలికల ఐటీ, కంచరపాలెం ఇండస్ట్రియల్ ఏరియా ఏడాది కోర్సులు 7 రెండేళ్ల కోర్సులు 15 ప్రభుత్వ ఐటీఐల్లో సీట్లు 1,648 ప్రైవేట్ ఐటీఐల్లో సీట్లు 1,638 మొత్తం 35 ఐటీఐల్లో సీట్లు 3,286 వైబ్సైట్ iti.ap.gov.in పారిశ్రామిక వృత్తి విద్య శిక్షణతో మెండుగా ఉపాధి అవకాశాలు ఐటీఐల్లో చురుగ్గా ప్రవేశాలు పలు ట్రేడుల్లో అభ్యర్థుల చేరిక అందుబాటులో మిగులు సీట్లు -
జీ కోడూరు క్వారీ లీజు రద్దు చేయాలి
ఆందోళన చేస్తున్న చిరంజీవి తదితరులు మాకవరపాలెం: పంటలకు నష్టం కలిగించే క్వారీ లీజును రద్దు చేయాలని కులవ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరెల్లి చిరంజీవి డిమాండ్ చేశారు. కేవీపీఎస్ ఆధ్వర్యంలో జీకోడూరులో ఆదివారం రాత్రి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీకోడూరు రెవెన్యూలోని 332 సర్వే నంబర్లో 24 హెక్టార్లలో నల్లరాతి క్వారీ నిర్వహణకు లీజులు ఇచ్చారన్నారు. ఈ క్వారీ కారణంగా పక్కనే ఉన్న దళితుల భూములకు నష్టం వాటిల్లుతుందని తెలిపారు. క్వారీని నిర్వహించొద్దని ఇక్కడి దళిత రైతులు ఆందోళనలు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వారంతా శాంతియుతంగా నిరసన తెలిపేందుకు క్వారీ వద్ద వేసుకున్న పాకను ఈ తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారని, దీనిపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
నిండు గర్భిణికి తప్పని డోలీమోత
● ఆలస్యంగా వచ్చిన అంబులెన్స్ ● మార్గంలో తుప్పల్లోనే ప్రసవించిన గర్భిణి రోలుగుంట : మండలంలో గిరిజన గ్రామాలకు రహదారి సమస్య తీరక రవాణా సమస్యతో అర్ల గ్రామం నుంచి దిగువకు ఆస్పత్రికి డోలీమోతతో తీసుకొస్తున్న గర్భిణి మార్గంలోనే ప్రసవించిన సంఘటన ఆదివారం జరిగింది. అర్ల గ్రామానికి చెందిన పాంగి సాయికి నెలలు నిండి నొప్పులు రావడంతో ఆమె భర్త సుందర్రావు అంబులెన్స్కు సమాచారం ఇచ్చి కుటుంబ సభ్యులతో కలిసి భార్యను కొండ డిగువకు డోలీమోతతో నాలుగు కిలోమీటర్లు వై.బీ.పట్నం రోడ్డు వరకూ మోసుకుని వచ్చారు. అంబులెన్సు రావడం ఆలస్యం కావడంతో తోటి మహిళలు మార్గంలో తుప్పల్లోకి తీసుకెళ్లగా అక్కడే ప్రసవం జరిగింది. తరువాత అంబులెన్సు రావడంతో ఆమె బంధువులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.గోవిందరావు మాట్లాడుతూ గిరిజనుల సమస్య పరిష్కారంలో తగిన చర్యలు తీసుకోని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. లోసింగి, పెదగరువు , పీత్రుగెడ్డ తదితర గ్రామాల్లో పీవీటీజీ తెగకు చెందిన గిరిజనుల నివాస గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో వైద్యం, విద్య, రవాణాకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని, దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్కు, డీఈవో అప్పారావు నాయుడికి, పీవోకి ఫిర్యాదు చేశామన్నారు. దీంతో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, డీఈవో అప్పారావునాయుడు ఫిబ్రవరిలో ఆయా గ్రామాలు సందర్శించి సమస్యలు తెలుసుకున్నారని, ఆశా వర్కర్ని, అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేస్తామని, అలాగే రోడ్డు సమస్య తీరుస్తామని హామీ ఇచ్చి వెళ్లారని తెలిపారు. అయితే సమస్యలు మాత్రం పరిష్కారం కాకపోవడం బాధాకరమన్నారు. పాడేరు పీవో ఈ గ్రామాలు ఎందుకు సందర్శించడం లేదో అర్థం కావడం లేదని విమర్శించారు, ఇప్పటికై నా ఈ గ్రామాల రవాణా సదుపాయాలు మెరుగుపరిచి, గుర్తించిన సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండు చేశారు. -
బిల్లులు, వేతనాలు అందకే అసంతృప్తి
మహారాణిపేట: జిల్లా పరిషత్ జనరల్ ఫండ్స్ నుంచి గత 12 నెలలుగా అభివృద్ధి పనుల బిల్లులు విడుదల కాకపోవడం, అలాగే జెడ్పీటీసీలకు చాలా నెలల నుంచి గౌరవ వేతనం రాకపోవడం వంటి సమస్యలపై జెడ్పీటీసీలు అసంతృప్తితో ఉన్నారని జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె. సుభద్ర తెలిపారు. ఆదివారం సాయంత్రం జెడ్పీ బంగ్లాలో మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ఏడాది నుంచి దాదాపు రూ. 8.5 కోట్ల బిల్లులు సీఎఫ్ఎంఎస్ ద్వారా విడుదల కావాల్సి ఉందని చైర్పర్సన్ తెలిపారు. ఈ ఏడాది జూన్ చివరి వరకు పూర్తయిన పనులకు ఎలాంటి బిల్లులు మంజూరు కాలేదన్నారు. ఈ బిల్లులు ఎప్పుడు మంజూరవుతాయో తెలియని పరిస్థితి ఉండడంతో సభ్యులు ఆవేదన చెందుతున్నారని చెప్పారు. జెడ్పీటీసీల గౌరవ వేతనం కూడా పెండింగ్లో ఉండటం అసంతృప్తికి మరో ప్రధాన కారణమని వివరించారు. జగన్ నాయకత్వంలోనే పనిచేస్తాం జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులందరూ కలిసి చర్చించుకున్నారని, తమలో ఎలాంటి అసంతృప్తులు లేవని జె. సుభద్ర స్పష్టం చేశారు. వారంతా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోనే పని చేసేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నారన్నారు. సమన్వయ లోపం వల్ల చిన్నపాటి సమస్యలు ఉత్పన్నమైనా, వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకుంటామన్నారు. ఈ సమస్యల గురించి పార్టీ నాయకులకు అన్ని విషయాలను కూలంకషంగా వివరించినట్లు తెలిపారు. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఇతర నాయకులు ఈ విషయాన్ని పార్టీ అధినాయకత్వం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరగా బిల్లులు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని సుభద్ర పేర్కొన్నారు. ఈ సమస్య రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఉంని జెడ్పీటీసీలకు వివరించడంతో వారిలో ఉన్న అపోహలు తొలగాయని ఆమె చెప్పారు. పార్టీ సూచనల మేరకు శాసన మండలి ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ, ఇతర సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ప్రతి జెడ్పీటీసీతో వ్యక్తిగతంగా మాట్లాడినట్లు తెలిపారు. ఈ సమావేశం అనంతరం, జెడ్పీటీసీలు చైర్పర్సన్కు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్టు సుభద్ర పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న విషయాలను కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తాం జెడ్పీటీసీల సమస్యల పరిష్కారానికి కృషి మీడియాతో జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర -
గో ఆధారిత ఉత్పత్తులపై వర్క్ షాపు
పాయకరావుపేట: స్థానిక శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అనుబంధ సంస్థ స్పేసెస్ డిగ్రీ కళాశాలలో డిపార్టుమెంట్ ఆఫ్ జువాలజీ ఆధ్వర్యంలో గో ఆధారిత ఉత్పత్తులపై రెండు రోజుల వర్క్షాప్ ప్రారంభమైంది. గోపూజతో ప్రారంభమైన ఈ వర్క్ షాపులో పంచగవ్య ఉత్పత్తులు, గోఆధారిత వ్యవసాయ పద్ధతులు, ఉత్పత్తులపై అవగాహన కల్పించారు. మొదటి రోజు దంతమంజన్, ప్రమిదలు, ఫేస్ ప్యాక్, హెయిర్ ఆయిల్, షాంపూ, సబ్బులు, తదితర 20 రకాల ఉత్పత్తులను తయారు చేసే విధానంపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా శిక్షకులు – క్షేత్ర గో సేవ సంయోజక్ ఆకుతోట రామారావు మాట్లాడుతూ గోవు మన సంస్కృతిలో పవిత్రమైనదన్నారు. అది మన జీవన శైలికి పునాదిగా నిలిచిందని అటువంటి గో ఆధారిత ఉత్పత్తులు ఉపయోగించడం వల్ల ఆరోగ్యంగా ఉంటామన్నారు. గో సంస్కృతిని ప్రోత్సహించవలసిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఆంధ్ర ప్రాంత గోసేవ సంయోజక్ రాంజీ, ఆంధ్ర ప్రాంత శిక్షణ ప్రముఖ కృషి వడ్డీ, ఆంధ్ర ప్రాంత గోసేవ సహా సంయోజక్ ఓలేటి నారాయణ కుమార్, స్పేసెస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎ.రామకృష్ణరెడ్డి, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. -
రేపు కలెక్టరేట్ వద్ద కల్లు గీత కార్మికుల ధర్నా
మాడుగుల రూరల్: గ్రామాల్లో విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన బెల్టు షాపులను తక్షణమే తొలగించి, గీత కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14న కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్టు కల్లు గీత కార్మిక సంఘం మాడుగుల, చీడికాడ, మండలాలకు చెందిన అధ్యక్షుడు దొడ్డి నారాయణరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అక్రమ మద్యం గ్రామాల్లో ఏరులై పారుతుందన్నారు. ప్రతి గ్రామంలో గుడి, బడి, చర్చి, దేవాలయం అని చూడకుండా బెల్టు షాపులు ఏర్పాటు చేసి, మద్యం అమ్మకాలు సాగిస్తుందన్నారు. దీనివల్ల కల్లు విక్రయాలు జరగక, కల్లు గీత కార్మికులు ఉపాధి కోల్పోయారని, ఔషధ గుణాలు ఉన్న తాటికల్లును కేరళ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రోత్సహిస్తూ, లక్షలాది గీత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రసాయనాలతో తయారు చేసిన మద్యాన్ని ప్రోత్సహిస్తూ గీత కార్మికుల ఉపాధిని దెబ్బతీసిందని విమర్శించారు. ఎకై ్సజ్ సర్కిల్స్ పరిధిలో రూ.లక్షల్లో బెల్టు షాపులను వేలం వేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 3 వేల బెల్టుషాపులను వెంటనే తొలగించి, వాటిని నిర్వహిస్తున్న సర్పంచ్ల చెక్ పవర్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ధర్నా కార్యక్రమానికి జిల్లాలోని కల్లు గీత కార్మికులు హాజరు కావాలని కోరారు. -
ధర్మశ్రీకి కన్నబాబు ఆశీస్సులు
అచ్యుతాపురం: వైఎస్సార్ సీపీ యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజును శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ధర్మశ్రీ నియామకాన్ని అధిష్టానం ప్రకటించిన తర్వాత ఆయన పార్టీని బలోపేతం చేసే పని ప్రారంభించారు. ముందుగా కన్నబాబు స్వగృహానికి వెళ్లి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఒకరికొకరు శాలువాలు కప్పుకొని సత్కరించుకున్నారు. నిన్నటి వరకూ పార్టీ సమన్వయకర్తగా వ్యవహరించిన కన్నబాబును కలిసి ఆశీస్సులు తీసుకోవడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పార్టీని ఒకే తాటిపై తీసుకొచ్చేందుకు ఇటువంటి చర్యలు దోహదం చేస్తాయని సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. -
అధిక వడ్డీలు ఆశ చూపి కుచ్చుటోపీ
పాయకరావుపేట: అధిక వడ్డీలు ఆశచూపి వందలాది మంది ప్రజల వద్ద రూ.లక్షల్లో అప్పులు చేశాడు. ఆపై తిరిగి చెల్లించకుండా కోట్లాది రూపాయలు ఎగ్గొట్టి ఓ వ్యాపారి పరారయ్యాడు. ఈ సంఘటన మండలంలో సత్యవరంలో శనివారం చోటు చేసుకుంది. బాధితులు లబోదిబోమంటూ విలేకరుల వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి కథనం మేరకు.. సత్యవరం గ్రామానికి చెందిన పెదిరెడ్డి అప్పారావు కుమారుడు వెంకటేశ్వరరావు 30 సంవత్సరాలుగా గ్రామంలోనే భార్యాపిల్లలతో నివాసం ఉంటున్నాడు. అతను తొలుత తునిలో బట్టల షాపు, తర్వాత శ్రీనివాస జ్యువెలరీ షాపు పెట్టుకుని పలువురు కొనుగోలుదారులను ఆకర్షించాడు. వారితో నమ్మకం పెంచుకుని కొన్ని సంవత్సరాలుగా అధిక వడ్డీలు ఆశ చూపి రూ.లక్షల్లో రుణాలు తీసుకున్నాడు. వారికి ప్రతి నెలా వడ్డీలు చెల్లించేవాడు. దాంతో తుని, సత్యవరం, మాసాహేబుపేట, పెదరాంభద్రపురం, మంగవరం, తదితర గ్రామాలకు చెందిన 200 మందికి పైగా మహిళలు, పురుషుల వద్ద ప్రాంసరీ నోటులు రాసి ఇచ్చి డబ్బులు తీసుకున్నాడు. వితంతు, దివ్యాంగులు, వృద్ధాప్య పింఛనుదారుల నుంచి వడ్డీలు ఆశ చూపించి ప్రతి నెలా డబ్బులు కాజేసేవాడు. బంగారు వస్తువులు ఇస్తానని కొంతమంది వద్ద, వడ్డీ ఇస్తానని మరి కొంతమంది వద్ద నమ్మించి రూ.20 నుంచి రూ.25 కోట్ల వరకు కాజేసినట్లు తెలుస్తోంది. ప్రతి ఒక్కరి నుంచి రూ.లక్ష నుంచి రూ.25 లక్షల వరకు నమ్మించి కాజేశాడు. సత్యవరంలో రూ.15 కోట్ల వరకు డబ్బులు తీసుకున్నట్లు బాధితులు ప్రాంసరీ నోట్లు తెచ్చి చూపించారు. పరారైన వ్యక్తి రెండు నెలలుగా ప్రజలకు సమాధానం సక్రమంగా చెప్పకపోవడం, ఫోన్కు సమాచారం ఇవ్వకపోవడం, కనిపించకపోవడంతో బాధితులు ఆందోళనకు గురయ్యారు. వారం రోజులుగా వ్యక్తి కనిపించకుండా తునిలో బంగారం షాపు మూసివేసి ఉండటం గమనించి పలువురు బాధితులు లబోదిబోమంటున్నారు. ప్రజలను నమ్మించి మోసం చేసి పరారైన వ్యక్తి పెదిరెడ్డి వెంకటేశ్వరరావుపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరుగుతుందని, దీనిపై హోంమంత్రి స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. సత్యవరంలో రూ.25 కోట్ల మేర మోసం పరారైన వ్యాపారి వెంకటేశ్వరరావు లబోదిబోమంటున్న బాధితులు -
రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడి మృతి
రావికమతం: రోలుగుంట మండలం కంచుగుమ్మల గోపి దాబా వద్ద ఆర్అండ్బీ రోడ్డులో ఈ నెల 7న రాత్రి ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తాపడి తీవ్రంగా గాయపడిన యువకుడు నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం మృతి చెందాడు. బంధువులు కథనం మేరకు... రావికమతం మండలం టి.అర్జాపురం గ్రామానికి చెందిన ఆరి వెంకటేష్ (24) ఈ నెల 7న నర్సీపట్నం నుంచి తన స్వగ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలో కంచుగుమ్మల దాటిన తర్వాత గోపి దాబా దగ్గర ఆర్అండ్బీ రోడ్డు పూర్తిగా పాడై గోతులు ఏర్పడ్డాయి. వీటిని తప్పించబోయి బైక్ అదుపు తప్పి బోల్తాపడి అతడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కొత్తకోట ఎస్ఐ శ్రీనివాస్ జీపులో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం బంధువులు మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం తరలించగా పరిస్థితి విషమించటంతో విశాఖ కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఆర్థిక పరిస్థితి బాగోలేక పోవడంతో అక్కడ నుంచి అక్కడ శివాని ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ నుంచి శనివారం నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో టి.అర్జాపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య సహస్ర, రెండు సంవత్సరాల కుమారుడు రోహిత్ ఉన్నారు. -
సకాలంలో చికిత్స.. యువకుడికి ఊరట
గోపాలపట్నం: ఆర్పీఎఫ్ సిబ్బంది సకాలంలో స్పందించి గుండెనొప్పితో బాధపడుతున్న ఓ యువకుడికి వెంటనే చికిత్స అందేలా చర్యలు తీసుకోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. రైల్వే పొలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల జరిగిన గిరిప్రదక్షిణలో పాల్గొనేందుకు ఖరగ్పూర్ నుంచి వెలుపుల మనోహర్ విశాఖ వచ్చాడు. సింహాచలంలో ఉన్న బంధువుల ఇంట్లో ఉన్నాడు. గిరిప్రదక్షిణ అనంతరం శుక్రవారం రాత్రి షాలిమార్ ఎక్స్ప్రెస్లో విశాఖ నుంచి ఖరగ్పూర్కు బయలుదేరాడు. ట్రైన్ ఎక్కిన తరువాత కొద్దిసేపటికే ఏసీ బోగీలో ఉన్నా చెమటలు పట్టడంతో బంధువులకు సమాచారమందించాడు. వెంటనే సింహాచలం రైల్వే స్టేషన్కు చేరుకుని ఆర్పీఎఫ్ పోలీసులకు విషయం తెలియజేశారు. అదృష్టవశాత్తు రెడ్ సిగ్నల్ పడడంతో ఈ ట్రైన్ సింహాచలం రెండో నంబర్ ప్లాట్ఫారంపై ఆగింది. దీంతో హుటాహుటిన వీల్చైర్తో వెళ్లి బాధితుడిన ట్రైన్ దించారు. 108కు ఫోన్ చేసినా స్పందించక పోవడంతో ఏఎస్ఐ సీతారామ్ తన ద్విచక్రవాహనంపై గోపాలపట్నం బెహరా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించిన తరువాత అతని ఆరోగ్యం కుదుట పడింది. ఉదయం వరకు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి పంపించారు. సకాలంలో స్పందించి వైద్య సేవలు అందే విధంగా కృషి చేసిన రైల్వే పోలీసులకు మనోహర్, అతని బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. సత్వరం స్పందించిన ఆర్పీఎఫ్ -
ముగ్గురు యువకులను కాపాడిన లైఫ్గార్డ్స్
కాపాడిన యువకులతో లైఫ్గార్డ్స్ కొమ్మాది: ప్రముఖ పర్యాటక ప్రాంతం రుషికొండ బీచ్లో ముగ్గురు యువకులు కొట్టుకుని పోతుండగా లైఫ్గార్డ్స్ ప్రాణాలు కాపాడిన సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్కు చెందిన ఐదుగురు యువకులు శనివారం సాయంత్రం రుషికొండ బీచ్కు వచ్చారు. కాసేపు సరదాగా గడిపిన అనంతరం స్నానం చేసేందుకు సముద్రంలోకి దిగారు. అలల ఉధృతి ఎక్కువగా ఉండటంతో వీరిలో బి.శ్రీనివాసరావు, ఎం.రామ్, ఎ.శివ కొట్టుకుని పోతుండటంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న లైఫ్గార్డ్స్ ఎస్.నూకరాజు, ఎం.అమ్మోరు చిన్నప్పన్న, గురుమూర్తి, జి.దేవ గుర్తించారు. వారిని రక్షించి, తీరానికి తీసుకువచ్చారు. వారికి మైరెన్ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. లైఫ్గార్డ్స్ ను మైరెన్ సీఐ శ్రీనివాసరావు అభినందించారు. -
గుండె గుబిల్లు
●షాక్ కొట్టిన స్మార్ట్ మీటర్ నక్కపల్లి: కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ మీటర్లు వినియోగదారులకు షాకిస్తున్నాయి. ఎంత వ్యతిరేకించినప్పటికీ ప్రభుత్వం బలవంతంగా వీటిని అంటగట్టింది. ఫలితంగా వేలాది రూపాయల బిల్లులు రావడాన్ని చూసి వినియోగదారులు లబోదిబోమంటున్నారు. రాజయ్యపేట గ్రామంలో ఎరిపల్లి ముసిలి అనే వ్యక్తి నిర్మించిన షాపును ఇదే గ్రామానికి చెందిన శ్రీను అద్దెకు తీసుకున్నాడు. చిన్న బేకరీ షాపు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ దుకాణాన్ని వ్యాపార అవసరాల కోసం వినియోగిస్తుండటంతో ట్రాన్స్కో అధికారులు డిసెంబరులో కేటగిరి 2 కింద స్మార్ట్ మీటరు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరిలో తొలిసారి రూ.37 వేల బిల్లు వచ్చింది. వందల్లో వచ్చే బిల్లు వేలల్లో రావడంతో సరిచేయమని శ్రీను స్థానిక ట్రాన్స్కో ఉద్యోగి తేజ ద్వారా లెటర్ పెట్టుకున్నాడు. మార్చి నెలలో రూ.4 వేలు చెల్లిస్తే సరిపోతుందని చెప్తే ఫోన్ పే ద్వారా చెల్లించాడు. తదుపరి నెలలో రూ.10 వేలు, తర్వాత 20 వేలు, రూ.30 వేలు బిల్లులు వచ్చాయి. తాజాగా జూలై ఒకటో తేదీన అన్నీ కలిపి రూ.63 వేల బిల్లు చెల్లించాలని తన మొబైల్కు మెసేజ్ వచ్చిందని శ్రీను తెలిపాడు. ట్రాన్స్కో మళ్లీ ఫిర్యాదు చేయగా.. మీ అభ్యర్థన అప్రూవల్ కాలేదని, అందుకే సమస్య పరిష్కారం కాలేదని చెప్పారని శ్రీను తెలిపాడు. తాను ఎన్ని యూనిట్లు వినియోగిస్తున్నాను, ఎంత బిల్లు వస్తోందనే వివరాలు బిల్లు రూపంలో తెలియపరచడం లేదన్నాడు. తమలాంటి పేద వారికి స్మార్ట్మీటర్లు ఏర్పాటు చేసి వేలాది రూపాయలు వసూలు చేయడం ఎంత వరకు సమంజసమని వాపోతున్నాడు. గతంలో ఉన్న మీటరుకు నెలకు రూ. వెయ్యి నుంచి రూ.1200ల బిల్లు వచ్చేదని, ఇప్పుడు వేలల్లో వస్తోందని తెలిపాడు. ఇదంతా కూటమి ప్రభుత్వ నిర్వాకమే . విషయం తెలుసుకున్న సీపీఎం జిల్లా నాయకులు ఎం.కోటేశ్వరరావు, ఎం.అప్పలరాజు తదితరులు రాజయ్యపేట వెళ్లి బిల్లుల గురించి తెలుసుకున్నారు. షాపు ముందు బాధితుడితో కలసి స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ చార్జీలు పెంచడంతోపాటు, స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి ప్రజలపై మరింత భారం మోపిందన్నారు. అదానీ సంస్థ షిరిడీ సాయి ఎలక్ట్రికల్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ స్మార్ట్మీటర్లను వినియోగదారులకు బలవంతంగా అంటగడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రీ పెయిడ్ స్మార్ట్మీటర్లు బిగిస్తే వాటిని తొలగించి పగుల గొట్టాలని పిలుపునిచ్చారని, అధికారంలోకి వచ్చిన మూడు నెలలు తిరక్కుండానే స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయించారని మండిపడ్డారు. సీపీఎం మండల కన్వీనరు ఎం.రాజేష్, కాశీరావు, బైరాగి రాజు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. చిన్న బేకరీ షాప్నకు రూ.63 వేల బిల్లు బలవంతంగా అంటకడుతున్న స్మార్ట్ మీటర్లు లబోదిబోమంటున్న విద్యుత్ వినియోగదారులు -
సంచార చికిత్స కేంద్రాలతో మెరుగైన వైద్యం
● డీఎంహెచ్వో డాక్టర్ హైమావతి సంచార చికిత్స కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేస్తున్న డీఎంహెచ్వో డాక్టర్ హైమావతి తుమ్మపాల: సంచార చికిత్స కేంద్రాలతో గ్రామాల్లో మెరుగైన వైద్య సేవలందిస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హైమావతి తెలిపారు. మండలంలో వెంకుపాలెంలో సంచార చికిత్స కార్యక్రమాన్ని శనివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న సేవలపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. మందుల పంపిణీ, పలు రకాల సేవలపై రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు సంచార చికిత్స కేంద్రాల ద్వారా వైద్య పరిక్షలతోపాటు మందులు పంపిణీ చేస్తున్నామన్నారు. నిత్యం వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటున్నారని వారి సేవలను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. మెరుగైన వైద్యం కోసం పీహెచ్సీల ద్వారా ఉన్నత ఆస్పత్రులకు వైద్యులు సిఫార్సు చేస్తున్నారని, ఎటువంటి అనారోగ్య పరిస్థితులు ఏర్పడినా తక్షణమే పీహెచ్సీలకు వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో తగరంపూడి పీహెచ్సీ డాక్టర్ పావని, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
పాడేరులో ఇగ్నో అధ్యయన కేంద్రానికి సన్నాహాలు
ఎంవీపీ కాలనీ (విశాఖ) : అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) అధ్యయన కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ఇగ్నో డైరెక్టర్ డాక్టర్ ధర్మారావు శనివారం తెలిపారు. పాడేరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.చిట్టబ్బాయి ప్రతిపాదన మేరకు త్వరలోనే కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. శనివారం ఉషోదయ కూడలిలోని ఇగ్నో ప్రాంతీయ కార్యాలయంలో కేంద్రం ఏర్పాటుపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా డాక్టర్ ధర్మారావు మాట్లాడుతూ ఇగ్నో ద్వారా లక్షల మంది యువత ఉన్నత విద్యను అందిపుచ్చుకుంటున్నారన్నారు. పాడేరులో అధ్యయన కేంద్రం ఏర్పాటు చేస్తే గిరిజన యువతీ యువకుల ఉన్నత చదువుకు బాటలు పడతాయన్నారు. కేంద్రం ఏర్పాటుకు ప్రిన్సిపల్ చిట్టబ్బాయి ముందుకు రావడం పట్ల అభినందనలు తెలిపారు. త్వరలోనే ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చుతుందన్నారు. కార్యక్రమంలో పలువురు సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు. -
నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి
ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో తాగునీటి సమస్యలపై చర్చిస్తున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం : తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎ.రామస్వామి, డిప్యూటీ ఇంజినీర్ ఎం.జయరామ్, నాలుగు మండలాలకు చెందిన జేఈలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి నుంచే తాగునీటి వ్యవస్థను మెరుగుపరిస్తే వచ్చే ఏడాది వేసవిలో ఇబ్బందులు ఉండవని సూచించారు. ప్రతి గ్రామంలో తాగునీటి పరిస్థితిని సమగ్రంగా పరిశీలించాలని, సమస్యలు ఉన్న గ్రామాల్లో పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. అవసరమైన నిధులను తీసుకురావడానికి జిల్లా కలెక్టర్తో మాట్లాడతానని స్పీకర్ చెప్పారు. నీటి నిల్వలు తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషించాలన్నారు. సమగ్ర నివేదికను తయారు చేసి నివేదించాలని అధికారులకు సూచించారు. -
మేలు జాతి పశువుల కోసం..
సాక్షి, అనకాపల్లి: మేలు జాతి పశువులు వృద్ధి చెందేలా లింగ నిర్ధారిత వీర్యం అభివృద్ధికి కేంద్ర పశుసంవర్థక శాఖ అడుగులు వేస్తోంది. జిల్లాలో పాడి పశువుల సంఖ్యను పెంచి అన్నదాతకు ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే గుజరాత్లో గల న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) సహకారంతో మేలు జాతి వీర్యం తక్కువ ధరకు అందించి అన్నీ పెయ్యదూడలు పుట్టేలా వీర్యం పంపిణీ చేస్తోంది. రూ.150కే లింగ నిర్ధారిత పశు వీర్యం ఇంజక్షన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉమ్మడి విశాఖ జిల్లావ్యాప్తంగా తొలి విడతలో 4,330 డోసులను అధికారులు సిద్ధం చేశారు. మొత్తం 50 వేల డోసులు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. లింగ నిర్ధారిత వీర్యం ఇంజక్షన్ల పంపిణీని ఈ నెల 15న ప్రారంభించనున్నారు. గేదెలు, ఆవులకు ఆడ దూడలు మాత్రమే పుట్టేలా చేయడమే దీని ఉద్దేశం. దీనివల్ల 90 శాతం అధిక పాలసార గల పెయ్యదూడలు పుట్టేందుకు అవకాశం ఉంటుంది. పెయ్యదూడ పెరిగి మూడున్నరేళ్లకు గర్భం దాల్చేనాటికి దాని విలువ రూ.లక్షకు చేరుతుంది. అప్పట్నుంచి ఏటా ఒక్కో పెయ్యదూడను ఈనుతుంది. పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఈనెల 15న 498 కృత్రిమ గర్భధారణ కేంద్రాల్లో లింగ నిర్ధారిత వీర్యం పంపిణీ ప్రారంభించనున్నామని పశుగణాభివృద్ధి జిల్లా కార్యనిర్వాహణాధికారి బెహరా ప్రసాదరావు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి నాటికి ఈ కార్యక్రమం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. గుజరాత్ ఎన్డీబీ సహకారంతో లింగ నిర్ధారిత వీర్యం అభివృద్ధి 15 నుంచి 498 కృత్రిమ గర్భధారణ కేంద్రాల్లో వీర్యం పంపిణీ ఈ ఇంజక్షన్ ద్వారా 90 శాతం పెయ్యదూడలు పుట్టే అవకాశం -
కష్టాల ఖరీఫ్
మాడుగుల/బుచ్చెయ్యపేట ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చాయి, ఖరీఫ్ పంటలకు ఢోకా లేదని అన్నదాతలు ఆనందించారు. వారం రోజులు వరుసగా చినుకులు రాలడంతో రైతు సేవా కేంద్రాల నుంచి తీసుకున్న ఖరీఫ్ వరి విత్తనాలతో నారు వేశారు. వారం రోజులు దాటినా మొలకలు రాకపోవడంతోనే కష్టాలు మొదలయ్యాయి. ఇంతలో వర్షాలు ఆగిపోయి మళ్లీ ఎండలు మొదలయ్యాయి. కాడెద్దుల సవ్వడితో ముంగారు వర్షాలతో ఆనందంతో సేద్యం చేయాల్సిన వ్యవసాయదారులు ఈ ఏడాది నాటిన వరి నారు ఎండిపోవడంతో ఉసూరుమంటున్నారు. మరోపక్క రెండో దఫా వేసిన వరి విత్తనాలు ఇంకా మొలకలు రావడంలేదు. ఖరీఫ్ సీజన్ దాటిపోతుందన్న కంగారు మొదలయ్యింది. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు కారుమబ్బుల వైపే చూస్తున్నారు. కానీ చినుకు రాలలేదు.. ఆశ తీరలేదని సాగునే నమ్ముకున్న రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. జిల్లాలోని 20 మండలాల్లో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. ఆగిన వర్షం.. ఆశలు ఆవిరి ఈ ఏడాది జూన్లో సాధారణ వర్షపాతం 141.3 మిల్లీమీటర్లు కాగా 162 మి.మీ. నమోదైంది. దీంతో వరి నారుమడులు సిద్ధం చేసుకుని సగానికి పైగా రైతులు వరి విత్తనాలు వేసుకున్నారు. మరికొంతమంది జూలై మొదటి వారంలో వేసుకోవాలనుకున్నారు. ఇంతలో వర్షాలు ఆగిపోవడంతో వాన చినుకు కోసం ఎదురుచూస్తున్నారు. జూలై నెల సాధారణ వర్షపాతం 235.8 మి.మీ. కాగా 12వ తేదీ వరకు 76 మి.మీ. వర్షపాతం నమోదైందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యవసాధికారి మోహనరావు ‘సాక్షి’తో మాట్లాడుతూ జూన్లో వరుసగా కురిసిన వర్షాలతో విత్తనాలు నాటడం ఆలస్యమైందని, వర్షాలు తగ్గాక మొలక శాతం పెరిగిందని చెప్పారు. ఇంతలో ఎండల వల్ల ప్రతికూల వాతావరణం ఏర్పడిందన్నారు. ఈనెల 15వ తేదీలోగా వరి నారు వేసుకుంటే దిగుబడులు బాగుంటాయని, కానీ వాతావరణం అనుకూలించక వరి నారు వేయడం ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ఎక్కడైనా పూర్తి స్థాయిలో మొలక రాకకోతే కేపీ సీడ్స్ వారికి తెలియజేసి విత్తనం అందజేస్తామన్నారు. ఎర్రవాయి ప్రాంతంలో బీటలు వారిన భూమి ఎర్రవాయి ప్రాంతంగా గుర్తింపు పొందిన బుచ్చెయ్యపేట మండలంలో పంట పొలాలు ఎక్కువ నీరు ఉన్నా, ఎక్కువగా ఎండకాసినా తట్టుకోలేవు. తేలికపాటి ఇసుక రేగడి భూములు అవ్వడంతో తడి పొడిగా ఉండాలి. గత నెల వర్షాలు కురవడంతో బుచ్చెయ్యపేట మండలంలోని పలు గ్రామాల్లో రైతులు జూలై నెల ఆరంభం నుంచి వరి ఆకుమడులు వేశారు. ఇప్పుడు వాటికి తగినంత నీరు అందడం లేదు. వారం రోజులుగా వేసవిని తలపిస్తున్న రీతిలో ఎండ కాస్తోంది. బుచ్చెయ్యపేట, కందిపూడి, అయితంపూడి, దిబ్బిడి, ఎల్బి పురం, బంగారుమెట్ట, లోపూడి, శింగవరం, పీడీ పాలెం, లూలూరు, పెదమదీన తదితర గ్రామాల్లో వరి ఆకుమడులు సరిగా నాటక ఆకు ఎదుగుదల లేదు. పలు గ్రామా ల్లో భూమి బీటలు వారి వేసిన ధాన్యం భూమిలోనే ఉండిపోయి మొలకెత్తడం లేదు. వచ్చిన లేత ఆకు ఎండకు వడలిపోతోంది. దీంతో పలువురు రైతులు డీజిల్ ఇంజిన్తో నీరు తోడి కిలోమీటర్ల పొడవున ప్లాస్టిక్ పైపుల ద్వారా నీటిని తరలించి ఆకుమడులు ఎండిపోకుండా కాపాడుకుంటున్నారు. ఆకు మడి తడపడానికి రూ.500 నుంచి 1,000ల వరకు అదనపు ఖర్చు అవుతుందని రైతులు వాపోతున్నారు. ముందుగా రుతుపవనాలు పలకరించినా ఫలితం లేకపోయిందని నిరాశ చెందుతున్నారు. మందగించిన రుతుపవనాలు 20 మండలాల్లో కరువు ఛాయలు నాటిన నారు ఎండిపోతున్న దైన్యం డ్రమ్ములతో ఆకుమడులు తడుపుతున్న రైతులు రైతు సేవా కేంద్రాల్లో ఇచ్చిన వరి విత్తనాలతో తగ్గిన మొలక శాతం రెండో దఫా సొంత విత్తనాలు వేసుకున్న రైతులు అవి కూడా ఎండకు ఆవిరైపోతున్నాయంటూ ఆవేదన జిల్లాలో ఖరీఫ్ సాగు లక్ష్యాలు అన్ని పంటల సాగు2.1 లక్షల ఎకరాలు వరి సాగులక్షా 50 వేల ఎకరాలు వరి విత్తనాల పంపిణీ23 వేల క్వింటాళ్లు ముందుగానే వరుణుడు కరుణించాడని ఆనందించారు. అన్నదాతలు ఉత్సాహంగా విత్తనాలు నాటారు. ఆశించిన స్థాయిలో మొలకలు రాలేదు. ఇంతలో వర్షాలు ఆగిపోయి జూలై నెలలో మండు వేసవిని తలపించేలా ఎండలు మండిపోవడం మొదలైంది. నేల బీటలు వారి వరి ఆకుమడులు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో పదును తగ్గకుండా రైతులు ఆకుమడులను రక్షించుకునే పనిలో పడ్డారు. నీరు తెచ్చుకొని నారు తడుపుతున్నారు. కరువు ఛాయలు కనిపించడంతో ఆందోళన చెందుతున్నారు. ఆరంభంలోనే కష్టాలు మొదలు పది రోజుల కిందట వరి ఆకు వేశాను. వారం రోజులుగా వర్షాలు లేకపోగా ఎండలు మండిపోతున్నాయి. వరి ఆకుమడికి నీరందక భూమిలో పదును లేక సరిగా నాటకపోగా వచ్చిన లేత ఆకు ఎండవేడికి వడలిపోతుంది. ప్లాస్టిక్ పైపుల ద్వారా నీరు తోడి ఆకుమడిని తడుపుతున్నాం. ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే మాకు నీటి కష్టాలు వచ్చాయి. – గాడి చిరంజీవి, కందిపూడి, బుచ్చెయ్యపేట మండలం ఎండిపోతున్న వరి నారు ఈ ఏడాది ముందుగా వర్షాలు అనుకూలించాయని ఆనందించాము. దుక్కులు చేసి విత్తనాలు వేశాము. రైతు సేవా కేంద్రాల్లో అందజేసిన విత్తనాల నుంచి 40 శాతం మాత్రమే మొలకలు రావడంతో మళ్లీ విత్తనం వేసుకున్నాం. గత నాలుగు రోజులుగా మండుతున్న ఎండలకు రెండో దఫా వేసిన విత్తనం కూడా మొలక రాలేదు. ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. – పర్రే రామునాయుడు, గాదిరాయి, మాడుగుల మండలం -
టీడీఆర్ బాండ్లతో దళారులకు మేలు
మునగపాక: పూడిమడక రోడ్డు విస్తరణ బాధితులకు న్యాయం చేయకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు, విశాఖ నగర 78వ వార్డు కార్పొరేటర్ బి.గంగారాం హెచ్చరించారు. పూడిమడక రోడ్డు విస్తరణ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన 24 గంటల దీక్ష శనివారం ముగిసింది. దీక్షలో కూర్చొన్న వారికి ఆయన నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా గంగారాం మాట్లాడుతూ నిర్వాసితులకు టీడీఆర్ బాండ్లు ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. గతంలో అధికారులు ఇచ్చిన హామీలో భాగంగా నిర్వాసితులకు పరిహారాన్ని నేరుగా నగదు రూపంలో చెల్లించాల్సిందేనన్నారు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం బాధితులకు మెరుగైన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. టీడీఆర్ బాండ్లు వల్ల దళారులకు మేలు చేకూరుతుందని విమర్శించారు. నిర్వాసితులను మోసం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ధ్వజమెత్తారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఆలోచన చేసి నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. లేకుంటే 14 గ్రామాలకు చెందిన నిర్వాసితుల కుటుంబాలతో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్.శంకరరావు, నిర్వాసితుల సంఘ కన్వీనర్ ఆర్.రాము, సీపీఎం నాయకులు ఎస్.బ్రహ్మాజీ, కర్రి అప్పారావు, రామ సదాశివరావు, కన్నుంనాయుడు, నాగిరెడ్డి సత్యనారాయణ, కూండ్రపు సోమునాయుడు, పెంటకోట సత్యనారాయణ, కడారి అప్పారావు, కాండ్రేగుల బాబూరావు, తదితరులు పాల్గొన్నారు. పూడిమడక రోడ్డు విస్తరణ బాధితులకు న్యాయం చేయాలి విశాఖ 78వ వార్డు కార్పొరేటర్ గంగారాం డిమాండ్ ముగిసిన సీపీఎం నేతల 24 గంటల దీక్ష -
విశాఖకు మరోసారి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు
డాబాగార్డెన్స్: విశాఖ మహానగరం మరోసారి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుకు ఎంపికై ంది. ప్రతి సంవత్సరం కేంద్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా వివిధ ప్రమాణాల ఆధారంగా ఈ అవార్డులను అందజేస్తుంది. ఈసారి విశాఖ మహానగరానికి ‘స్పెషల్ కేటగిరీ మినిస్టీరియల్ అవార్డు ’దక్కింది. ఈ నెల 17న దేశ రాజధాని ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా నిర్వహించిన ఈ సర్వేలో పట్టణాల్లోని పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, పౌరుల సహకారం, సుస్థిర పరిష్కారాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ ప్రమాణాల మేరకు విశాఖ స్పెషల్ కేటగిరీలో అవార్డును దక్కించుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నగర పౌరులు, అధికారులు, పారిశుద్ధ్య సిబ్బందిని అభినందించింది. ఈ అవార్డు పరిశుభ్రతపై అవగాహన మరింత పెంచేందుకు దోహదపడుతుందని అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా.. విశాఖపట్నం ఈకో–విజయ్ కార్యక్రమం ద్వారా పర్యావరణ సుస్థిరత, పరిశుభ్రతలో రాణిస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పరిశుభ్రతలో విశాఖ అద్వితీయమైన ప్రగతి సాధించింది. 2020, 2021లో దేశంలోనే 9వ ర్యాంకు సాధించింది. 2022లో 4వ ర్యాంకుకు ఎగబాకింది. 2023 స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో అదే స్థానాన్ని నిలబెట్టుకుని టాప్–5లో నిలిచింది. -
ధర్మశ్రీకి అభినందనలు
ధర్మశ్రీని అభినందిస్తున్న అమర్నాథ్, వైఎస్సార్సీపీ నాయకులు, జెడ్పీటీసీలు చోడవరం: ప్రభుత్వ మాజీ విప్ కరణం ధర్మశ్రీని వైఎస్సార్సీపీ యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ధర్మశ్రీని పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ విశాఖలో శుక్రవారం అభినందించారు. రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షురాలు కె.భాగ్యలక్ష్మి, మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, అనకాపల్లి పార్లమెంటు పరిశీలకురాలు, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి, జీసీసీ మాజీ చైర్పర్సన్ స్వాతిరాణి, రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు, పలువురు జెడ్పీటీసీ సభ్యులు అభినందనలు తెలిపారు. -
డీసీసీబీలో ఆకర్షణీయంగా రుణాలు
రైతులకు రుణాల చెక్కును అందిస్తున్న డీసీసీబీ చైర్మన్ తాతారావు, సీఈవోలు ఎస్.రాయవరం: గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యమని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఉమ్మడి విశాఖ జిల్లా చైర్మన్ కోన తాతరావు అన్నారు. అడ్డురోడ్డు డీసీసీబీ బ్యాంకులో స్వయం సహాయక సంఘాలకు రూ.5.03 కోట్ల రుణాలను శుక్రవారం మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాతారావు మాట్లాడుతూ జాతీయ బ్యాంకులు కన్నా మెరుగైన సేవలు అందించాలన్న సదుద్దేశంతో డీసీసీబీ పని చేస్తుందన్నారు. రైతులు ఏ పంట వేసినా రుణాలు అందజేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. డీసీసీబీ సీఈవో డి.వి.ఎస్.వర్మ మాట్లాడుతూ రూ.2400 కోట్ల రుణాల టర్నోవర్తో రూ.2 కోట్ల లాభంతో బ్యాంకు సేవలు అందిస్తుందన్నారు. ఇటీవల నియమితులైన పీఏసీఎస్ చైర్ పర్స్న్లు గుర్రం వెంకటరామకృష్ణ, గెడ్డం కన్నబాబు, వెలగా శ్రీనివాసరావు, రెడ్డి పవన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరు గంజాయి నిందితుల అరెస్ట్
అనకాపల్లిటౌన్: అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి రైలు మార్గంలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ టి.వి.విజయకుమార్, ఎస్ఐ డి.ఈశ్వరరావు తెలిపారు. స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. పట్టణ ఎస్ఐ డి.ఈశ్వరరావుకు అందిన సమాచారం మేరకు అనకాపల్లి రైల్వే స్టేషన్ గూడ్స్ రోడ్ జంక్షన్ వద్ద ఇద్దరూ అనుమానుతుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న మూడు బ్యాగులను తనిఖీ చేయగా 12 కిలోల గంజాయి బయటపడింది. ఏజెన్సీలో గంజాయి కొనుగోలు చేసి మహారాష్ట్రలో విక్రయించడానికి తీసుకెళ్తున్నట్లు సీఐ చెప్పారు. ఇద్దరు వ్యక్తులను కోర్టులో హాజరు పర్చగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు. -
సంక్షేమంతో ప్రభుత్వంపై భారం
నర్సీపట్నం: ప్రజల్లో చైతన్యంతో పాటు మార్పు రాకపోతే ఈ రాష్ట్రాన్ని ఎవరు బాగు చేయలేరని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. వ్యవసాయశాఖ, అనుబంధ శాఖలు వ్యవసాయ మార్కెట్ యార్డు అవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన వ్యవసాయ యంత్రీకరణ ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు కారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడి, అభివృద్ధి కుంటుపడి భవిష్యత్ తరాలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద ఏటా రూ.10 వేలు కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. ఇంత వ్యయం నీటి పారుదలపై చేస్తే సాగు అభివృద్ధి చెందుతుందన్నారు. తల్లిదండ్రులు పిల్లలను కనడంపై ఎంత శ్రద్ధ చూపుతారో అంతే శ్రద్ధ వారి విద్యపై చూపాలన్నారు. ఇటీవల నిర్వహించిన జాబ్ మేళాకు 1300 మంది నిరుద్యోగ యువతీ, యువకులు హాజరైతే, వారిలో 348 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారన్నారు. వారిలో 73 మంది మాత్రమే విధుల్లో చేరారని, మరో 77 మంది ఫోన్ ఎత్తలేదన్నారు. మరో 27 మంది తమకు కంపెనీ దూరమైందని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. యువత ఆలోచన విధానం ఇలా ఉంటే రాష్ట్ర ఎలా బాగుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల వల్ల అభివృద్ధి ఆగిపోతే అన్ని రంగాల్లోనూ రాష్ట్రం అథోగతి పాలవుతుందన్నారు. ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న యంత్ర పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వచ్చే ఏడాదికి నర్సీపట్నం నియోజకవర్గాన్ని వ్యవసాయ రంగంలో ప్రథమ స్థానానికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. రూ.2 లక్షలు చెల్లిస్తే రూ.10 లక్షలు విలువ చేసే పురుగు మందు స్ప్రే డ్రోన్లు మండలానికి రెండు చొప్పున మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, ఆర్డీవో వి.వి.రమణ, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి మోహన్రావు, కౌన్సిలర్ సిహెచ్.పద్మావతి, జెడ్పీటీసీ సుకల రమణ, తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆలోచనల్లో మార్పు రావాలి స్పీకర్ అయ్యన్నపాత్రుడు మార్కెట్ యార్డులో వ్యవసాయ యాంత్రీకరణ ప్రదర్శన -
గంజాయి రవాణాపై మరింత నిఘా
● ఎస్పీ తుహిన్ సిన్హాదేవరాపల్లి/కె.కోటపాడు: గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు నిఘాను మరింత పటిష్టం చేయాలని ఎస్పీ తుహిన్ సిన్హా పోలీసులకు సూచించారు. దేవరాపల్లి పోలీస్స్టేషన్ను, కె.కోటపాడు మండలం ఎ.కోడూరు స్టేషన్ను ఆయన శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. పెండింగ్లో ఉన్న కేసుల పురోగతిపై ఆరా తీశారు. 2025లో నమోదైన రెండు హత్య కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని సీఐ పి.పైడిపునాయుడు, ఎస్ఐ టి.మల్లేశ్వరరావులకు సూచించారు. గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై కరపత్రాలు ముద్రించి ప్రజలకు పంపిణీ చేసి అవగాహన కల్పించాలన్నారు. అనంతరం శ్రీరాంపురం వై జంక్షన్ సమీపంలోనే పోలీస్ చెక్పోస్టును పరిశీలించారు. నేరాల నియంత్రణలో కీలక పాత్ర పోషించే సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించామని ఎస్పీ ఈ సందర్భంగా స్థానిక విలేకర్లకు చెప్పారు. జిల్లాలో 5 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు లక్ష్యం కాగా ఇప్పటి వరకు సిఎస్ఆర్ నిధులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకారంతో ప్రధాన కూడళ్లు, ప్రధాన రహదారుల్లో 2500 వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. కె.కోటపాడు సీఐ పైడపునాయుడు, ఎ.కోడూరు ఎస్ఐ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
పింఛనుదార్ల ఇబ్బందులు తొలగిస్తాం
● ఖజానా శాఖ రాష్ట్ర డైరెక్టర్ మోహన్రావుఅనకాపల్లి: జిల్లా ఖజానా శాఖా కార్యాలయాన్ని ఆ శాఖ రాష్ట్ర డైరెక్టర్ ఎన్.మోహన్రావు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పే బిల్లో సీఎఫ్ఎంఎస్ ప్రతి మూడు నెలలకు పాస్వర్డ్ మార్పు చేయడం వలన పింఛనుదారులు ఇబ్బంది పడుతున్నారని, ఆరు మాసాలకు మార్చే విధంగా చర్యలు చేపడతామన్నారు. కుటుంబ పింఛను పొందుతున్న వారిలో భార్య జనన తేదీ మార్పు విషయంలో ఇబ్బందులను పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పింఛనుదారుల సంఘం జిల్లా బ్రాంచి అధ్యక్షుడు వడ్డాది జగన్నాథరావు, కార్యదర్శి బి.ఎల్.ఎన్.శర్మలు శాలువాలతో ఎన్.మోహనరావును సత్కరించారు. జిల్లా ఖజానాధికారి వి.ఎల్.సుభాషిణి, సంఘం కోశాధికారి కె.సత్యారావు, విశ్రాంత జిల్లా విద్యాశాఖాధికారి కె.వి.గౌరీపతి తదితరులు పాల్గొన్నారు. -
అహీర్ రెజిమెంట్ ఏర్పాటు కోసం యాత్ర
కె.కోటపాడు : భారత సైన్యంలో అహీర్(యాదవ) రెజిమెంట్ను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో అఖిత భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో రెజంగలా పవిత్ర కలశ యాత్రను నిర్వహిస్తున్నట్లు మహాసభ రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.మహేశ్వరియాదవ్ తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 13న బిహార్లో ప్రారంభమైన ఈ యాత్ర కె.కోటపాడు మీదుగా అనకాపల్లి వైపు శుక్రవారం సాగింది. అఖిల భారత ఉత్తరాంధ్ర జోన్ కన్వీనర్ పల్లా రాజేష్ యాదవ్ ఆధ్వర్యంలో కె.కోటపాడులో ఈ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మహేశ్వరియాదవ్ మాట్లాడుతూ 1962లో చైనాతో జరిగిన యుద్ధంలో 120 మంది అహీర్ వీర సైనికులు పోరాటం చేసి లడక్ చుగుల్ హైర్ పీల్డును కాపాడారన్నారు. ఈ యుద్ధంలో 114 మంది అహీర్ వీరులు(యాదవ) వీర మరణం పొందినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం రాష్ట్ర నాయకులు ఆంజనేయమూర్తి యాదవ్, బొట్టా రామారావు, దూళి రంగనాయకులు యాదవ్, మునిస్వామి యాదవ్, షేశపాణియాదవ్, పల్లా రామమూర్తి పాల్గొన్నారు. -
నోటు పుస్తకాలను సకాలంలో సరిదిద్దాలి
కశింకోట: విద్యార్థుల నోట్ పుస్తకాలనుసకాలంలో సరిదిద్ది లోపాలను సరి చేయాలని విద్యా శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు(ఆర్జేడీ) విజయ భాస్కర్ ఉపాధ్యాయులకు సూచించారు. కశింకోటలోని బాలికోన్నత పాఠశాలను, తేగాడ గ్రామంలోని మోడల్ స్కూల్, కేజీబీవీని జిల్లా విద్యా శాఖ అధికారి జి.అప్పారావునాయుడు, ఉప విద్యా శాఖ అధికారి పి.అప్పారావుతో కలిసి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా టెన్త్ చదువుతున్న విద్యార్థుల సెక్షన్కు వెళ్లి నోట్ పుస్తకాలు ఉపాధ్యాయులు సవ్యంగా దిద్దారా? లేదా? అనే విషయాన్ని పరిశీలించారు. గణితం, పీఎస్, ఎన్ఎస్ వంటి పాఠ్యాంశాల నోట్ పుస్తకాలు బాగా సరి దిద్దినప్పటికి మిగిలిన పాఠ్యాంశాల నోట్ పుస్తకాలను సరిదిద్దకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. సిలబస్ ప్రకారం పాఠాలు జరిగాయా? లేదా? అనే విషయాన్ని, విద్యార్థుల చదువు తీరును విద్యార్థులను ప్రశ్నించి పరిశీలించారు. టెన్త్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేయాలన్నారు. మధ్యాహ్న భోజనంపై ఫిర్యాదులు వస్తే సహించం అనంతరం మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ తీరును పరిశీలించారు. భోజనం సరిపడినంత మేర విద్యార్థులకు అందించడం లేదని తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని, ఇకపై ఫిర్యాదులు వస్తే సహించేది లేదని ఆర్జేడీ హెచ్చరించారు. సరిపడినంతగా సరకులు, బియ్యం సరఫరా కావడం లేదా? అని భోజన పథకం నిర్వాహకులను ప్రశ్నించారు. ఎండీఎం రికార్డులను, స్టాక్ రిజిస్టార్ను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో సహపంక్తి భోజనాలు చేసి, ఆహార పదార్థాల రుచి చూశారు. వారానికి 36 పీరియడ్స్ తప్పనిసరి అనంతరం ఉపాధ్యాయులతో ఆర్జేడీ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఉపాధ్యాయులు వారానికి తప్పనిసరిగా 36 పీరియడ్స్ పాఠ్యాంశాలను బోధించాలన్నారు. పాఠశాలకు ఉదయం 9 గంటలలోగా హాజరు కావాలన్నారు. ప్రతి రోజూ ఉదయం, మధ్యాహ్నం ప్రారంభంలోను, ముగిసే సమయంలోను ఆన్లైన్ హాజరు నమోదు చేసుకోవాలన్నారు. విద్యార్థుల ఆన్లైన్, ఆఫ్లైన్ హాజరు ఒకేలా ఉండేలా చూడాలన్నారు. ఎంఈవో కె.ఎస్.ఎన్.మూర్తి, విద్యా కమిటీ అధ్యక్షుడు ఆళ్ల శ్రీనివాసరావు, ఉపాధ్యాయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బడిఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్చాలి బడిఈడు పిల్లలను శత శాతం పాఠశాలల్లో చేర్చి చదివేలా సత్వర చర్యలు తీసుకోవాలని ఆర్జేడీ విజయ భాస్కర్ మండల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. విద్యా శాఖ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా బడిఈడు పిల్లలు ఎంత మంది ఉన్నారనే విషయమై రికార్డులను పరిశీలించి ఆరా తీశారు. కార్యాలయ పని తీరును పరిశీలించి పలు సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఈవోలు సురేష్కుమార్, మూర్తి, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్జేడీ విజయ భాస్కర్ కశింకోట బాలికోన్నత పాఠశాల సందర్శన -
ప్రొటోకాల్కు విరుద్ధంగా వేదికపై కార్పొరేషన్ చైర్మన్లు
మాట్లాడుతున్న ఎంపీపీ గొర్లి సూరిబాబు, అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ పీలా గోవింద్ అనకాపల్లి టౌన్: స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన 17వ సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్లు బత్తుల తాతయ్యబాబు, పీలా గోవింద, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ, స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ పచ్చికూర రాములు వేదికపై కూర్చున్నారు. అనుకోని అతిథులను వేదికపై చూడడంతో మండల పరిషత్ అధికారులు అవాక్కయ్యారు. వెంటనే తేరుకున్నా ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయారు. సమావేశంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు అడిగిన ప్రశ్నలకు ఎంపీపీ బదులు చెప్పేలోపే పీలా గోవింద్ తనదైన శైలిలో బదులిచ్చేవారు. వాస్తవానికి ప్రజల నుంచి ఎన్నికై న సభ్యులు మాత్రమే వేదికపై కూర్చోవాలి. కానీ అందుకు విరుద్ధంగా కూటమి నాయకులు అధికార బలంతో సమావేశ వేదికపై కూర్చోవడంతో చివరిలో వారికి సన్మానాలు కూడా చేసి గౌరవించారు. -
హోంమంత్రి ఇలాకాలో ఆగని ఇసుక దందా!
కోటవురట్ల: హోంమంత్రి అనిత సొంత నియోజకవర్గంలో ఇసుక దోపిడీ ఆగడం లేదు. కొంత కాలంగా నిశ్శబ్ధంగా ఉన్న వరాహ నది మళ్లీ ఘోషిస్తోంది. ఇసుక దొంగలు మళ్లీ రెచ్చిపోతున్నారు. అడ్డదారిలో అక్రమ సంపాదనకు అలవాటు పడిన ఇసుక మాఫియా మళ్లీ చేతివాటం చూపిస్తోంది. మండలంలో వరహనదిలో ఇసుక చోరీకి గురవుతోంది. వాస్తవానికి నదిలో తవ్వకాలకు సరిపడినంత ఇసుక అందుబాటులో లేదు. ఇంతకు మించి తవ్వకాలు జరిపితే భూగర్భ జలాలు అడుగంటి సాగునీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. వ్యవసాయ మోటార్లు మూలకు చేరే అవకాశం ఉంది. ఇవన్నీ పట్టని ఇసుక దొంగలు డబ్బే లక్ష్యంగా దోపిడీకి తెరదీశారు. మండలంలోని గొట్టివాడ, పందూరు, కై లాసపట్నం పరిధిలోని వరాహనదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. గతంలో పందూరు ప్రాంతంలో ఇసుక వేలం నిర్వహించి మూడు నెలల పాటు ఇసుక తవ్వకాలు జరిపారు. గొట్టివాడలో ఓ టీడీపీ నేత తన పలుకుబడిని ఉపయోగించి ఏకధాటిగా నాలుగు నెలల పాటు ఇసుకను దోచేశాడు. ఈ నాలుగు నెలల్లో సుమారు రూ.కోటి సంపాదించినట్టు ఆ నోటా ఈ నోటా జిల్లా అంతా వ్యాపించింది. ఈ విషయం హోం మంత్రి చెవికి చేరడంతో చెడ్డపేరు వస్తోందని మండల స్థాయి నాయకులపై అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. దాంతో కొంత కాలంగా ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. వారం రోజులుగా షరామామూలు.. మళ్లీ తాజాగా వారం రోజులుగా తవ్వకాలు మొదలైనట్టు తెలుస్తోంది. మరో రూ.కోటి లక్ష్యంగా సదరు నేత రంగంలోకి దిగి ఇసుక వ్యాపారం మళ్లీ మొదలెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. నదిలోని ఇసుకను నాటు బళ్లు, ట్రాక్టర్ల ద్వారా రహస్య స్థావరాలకు తరలించి అక్కడి నుంచి లారీల ద్వారా విశాఖ, రాజమండ్రి, కాకినాడ ప్రాంతాలకు పంపి విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. గొట్టివాడలో మామిడి తోటలు, కొండ ప్రాంతాలలో ఇసుకను నిల్వ చేసి లారీల ద్వారా కె.వెంకటాపురం మార్గంలో తరలిస్తున్నట్టు సమాచారం. ఇసుక అక్రమ తవ్వకాలపై కూటమిలో లుకలుకలు రావడంతో అధికారులకు ఫిర్యాదు వరకు వెళ్లినట్టు తెలుస్తోంది. గురువారం రాత్రి నదిలో నుంచి ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను స్థానికులు అడ్డుకున్నట్టు సమాచారం. అధికారులకు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో తిరిగి వాటిని విడిచిపెట్టినట్టు తెలుస్తోంది. కై లాసపట్నం గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు కూడా ఇసుకను దోచేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. చీకటి పడితే చాలు ట్రాక్టర్లు, నాటు బళ్లను నదిలోకి పంపి ఇసుకను తరలించుకుపోతున్నారు. కై లాసపట్నం పరిధిలో పలు రహస్య ప్రాంతాలలో ఇసుకను నిల్వ చేసి లారీల ద్వారా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత భారీ స్థాయిలో ఇసుక దోపిడీ జరుగుతున్న మైనింగ్ శాఖాధికారుల జాడ లేకపోవడం గమనార్హం. దీనిపై తహసీల్దారు తిరుమలబాబును వివరణ కోరగా.. ఇసుక నిల్వ చేసినట్టు తన దృష్టికి వచ్చిందని, సిబ్బందిని పంపి ఇసుకను సీజ్ చేసేందుకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు. నదిలోకి ట్రాక్టర్లు, నాటు బళ్లు దిగకుండా గాడి కొట్టిస్తామన్నారు. వరాహ నదిలో యథేచ్ఛగా తవ్వకాలు తోటల్లో నిల్వ చేసి, అక్రమ రవాణా -
దళిత భూముల కేసులో సీపీఎం, ప్రజాసంఘాల నాయకులకు ఊరట
● కేసును కొట్టేసిన కోర్టుచోడవరం: దళిత భూముల వివాదం కేసులో సీపీఎం, ప్రజాసంఘాల నాయకులకు కోర్టులో ఊరట కలిగింది. ప్రజాసంఘాల నాయకులపై పెట్టిన కేసులను కొట్టేస్తూ చోడవరం అడిషినల్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ సూర్యకళ శుక్రవారం తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళితే...కె.కోటపాడు మండలం కె.సంతపాలెం గ్రామంలో 1970లో దళితులకు ఇచ్చిన 18 ఎకరాల అసైన్డ్ భూమిని అదే గ్రామానికి చెందిన కొందరు ఆక్రమించుకోవడంతో బాధిత దళితులకు న్యాయం చేయాలంటూ 2018లో సీపీఎం, ప్రజాసంఘాల నాయకులు అప్పటి తహసీల్దార్ను ప్రశ్నించడంతో కేసు నమోదు చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి డి.వెంకన్నతోపాటు గీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి యర్రా దేముడు, సిఐటియు మండల కార్యదర్శి జి.తాతాలు, ఈర్లె నాయుడుబాబులతోపాటు స్థానికులు నిమిడి తల్లి సింహాచలం, ఏగాటి లింగరాజులపై 352 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి వాదనలు పూర్తికావడంతో ప్రజాసంఘాల నాయకులపై పెట్టిన కేసులను కొట్టివేస్తూ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు చెప్పారని న్యాయవాదులు సీతా వెంకటరావు, గండి నాయన్బాబు, గాడి ప్రసాద్ తెలిపారు. -
పరిశ్రమల్లో భద్రత డొల్ల
● ఫార్మా కార్మికుల ప్రాణాలకేదీ రక్షణ? ● ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే తరచూ ప్రమాదాలు ● రెండు వారాల క్రితం పరవాడ ఎస్ఎస్ ఫార్మాలో ప్రమాదం ● మూడు రోజుల క్రితం లూపిన్ కంపెనీలో ఘటన ● గుట్టుచప్పుడు కాకుండా దాచిన యాజమాన్యం సాక్షి, అనకాపల్లి: పరవాడ సెజ్లో పలు ఫార్మా కంపెనీల్లో భద్రతా ప్రమాణాలు కొరవడ్డాయి. తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు జరిగి కొంతమంది కార్మికులు మృత్యువాత పడుతున్నారు. మరికొందరు క్షతగాత్రులవుతున్నారు. ప్రమాదాలు సంభవించినా అధికారుల సహకారంతో యాజమాన్యాలు బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నాయి. ఈనెల 8న పరవాడ జేఎన్ ఫార్మాలో ఉన్న లూపిన్ పరిశ్రమలో ప్రమాదం జరిగింది. ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. వారిలో పి.లక్ష్మణ్కుమార్ అనే కార్మికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ప్రమాదం బయటకు పొక్కకుండా కంపెనీ యాజమాన్యం దాచిపెట్టింది. ప్రశ్నార్థకంగా కార్మికుల భద్రత ‘పరవాడ–అచ్యుతాపురం’ స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజ్)లో ఫార్మా పరిశ్రమల్లో తరుచూ ప్రమాదాల్లో భయోత్పాతాన్ని సృష్టిస్తున్నాయి. భద్రతా ప్రమాణాలు ఏమాత్రం పాటించడం లేదు. సాహితీ, ఎసెన్షియా, జేఎన్ ఫార్మాసిటీలో సినర్జీన్, ఎస్ఎస్ ఫార్మా, రెండు రోజుల క్రితం లూఫిన్ ఫార్మా కంపెనీ.. ఇలా వరుస ప్రమాదాలు కార్మికుల కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు తప్ప అధికార యంత్రాంగం పరిశ్రమల్లో భద్రతపై దృష్టి పెట్టిన దాఖలా లేదు. అచ్యుతాపురం, పరవాడ సెజ్లలో 130కి పైగా ఫార్మా కంపెనీలు ఉన్నాయి. పలు కంపెనీలు భద్రతా ప్రమాణాలను పాటించడం లేదు. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో సెజ్, నాన్ సెజ్ పరిధిలో 19 అత్యంత ప్రమాదకర పరిశ్రమలు ఉండగా..192 ప్రమాదకరమైన పరిశ్రమలు, 56 రెడ్ కేటగిరీ పరిశ్రమలు, 82 ఫార్మా సిటీలో ఔషధ పరిశ్రమలున్నాయి. ఈ కంపెనీల్లో దాదాపుగా 30,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఫార్మా కంపెనీల్లో 10కు పైగా ప్రమాదాలు జరిగాయి. వేర్వేరు ప్రమాదాల్లో ఇప్పటి వరకు 40 మందికి పైగా కార్మికులు, ఉద్యోగులు మృతి చెందారు. 120 మందికిపైగా క్షతగాత్రులుగా మారారు. మరుసటి రోజు తెలిసింది లూపిన్ ఫార్మా ప్రమాదం గురించి ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ వివరణ కోరగా.. తమకు ఈ ప్రమాదం జరిగిన మరుసటి రోజు సమాచారం వచ్చిందని చెప్పారు. పోలీసులతో కలిసి ఈ ఘటనపై ఆరా తీశామన్నారు. ప్రస్తుతం లూపిన్ ఫార్మాలో అస్వస్థతకు గురైన కార్మికుడు కిమ్స్ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. మొక్కుబడిగా తనిఖీలు ఈ ప్రమాదాలపై కఠినంగా వ్యవహరించాల్సిన అధికారులు మొక్కుబడిగా తనిఖీలు చేసి చేతులు దులిపేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఫ్యాక్టరీల ఇన్స్పెక్టర్లు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, కార్మిక, అగ్నిమాపక శాఖల అధికారులు ఏడాదిలో కనీసం నాలుగు పర్యాయాలు తనిఖీలు చేయాల్సి ఉన్నా ఆ విధంగా జరగడం లేదు. నిపుణులైన ఉద్యోగులు అధిక ఉష్టోగ్రత కారణంగా రియాక్టర్లు పేలిపోకుండా, ఇతరత్రా అగ్ని ప్రమాదాలకు అవకాశం లేకుండా పర్యవేక్షించాల్సి ఉంటుంది. కానీ ఫార్మా కంపెనీల్లో నిపుణులులేకపోవడం వల్లే తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
టీడీఆర్ బాండ్లు వద్దు.. పరిహారంపై మాట మార్చొద్దు
మునగపాక: పూడిమడక రోడ్డు విస్తరణ బాధితులకు టీడీఆర్ బాండ్లు కట్టబెట్టవద్దని, ఇచ్చిన మాట ప్రకారం పరిహారం నగదు రూపంలో అందించాలన్న ఉద్యమం ఉధృతమైంది. ఈ డిమాండ్తో సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం మునగపాకలో 24 గంటల నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ.. అనకాపల్లి జాతీయ రహదారి నుంచి అచ్యుతాపురం వరకు 14 కిలోమీటర్ల మేర రహదారిని విస్తరిస్తామంటూ ఇచ్చిన హామీలో భాగంగా బాధితులకు న్యాయం జరగడం లేదన్నారు. బాధితులకు నష్టపరిహారాన్ని నేరుగా నగదు రూపంలో అందజేస్తామని చెప్పిన ప్రభుత్వం నేడు మాట మార్చి టీడీఆర్ బాండ్లు ఇస్తామంటూ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాము అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని.. అయితే అధికారులు గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభల ద్వారా ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందేనన్నారు. 2013 భూ సేకరణ చట్టప్రకారం మెరుగైన పరిహారం అందించాలన్నారు. ఇళ్లు కోల్పోతున్న బాధితులకు నగదుతోపాటు ఇళ్ల స్థలాలు, ఉద్యోగాలు కల్పించాలన్నారు. 24 గంటల దీక్షలో సీపీఎం నేతలు గనిశెట్టి సత్యనారాయణ, సదాశివరావు, కర్రి అప్పారావు, కాండ్రేగుల ఆదిబాబు, దాడి శ్రీరామమూర్తి, రొంగలి రాము, ఎస్.బ్రహ్మాజీ, శంకరరావు, కన్నుంనాయుడు, సోమునాయుడు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు దీక్ష ముగుస్తుంది. శుక్రవారం రాత్రి దీక్షాధారులు శిబిరంలోనే నిద్రించారు. నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు రాజీ లేని పోరాటం పూడిమడక రోడ్డు విస్తరణ బాధితులకు న్యాయం చేయాలి మునగపాకలో 24 గంటల దీక్షకు దిగిన సీపీఎం నేతలు -
కూటమి పాలనలో బిచ్చమెత్తుకోవలసిందే..
● కలెక్టరేట్ వద్ద విద్యార్థుల ఆందోళన ● తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిస్థాయిలో విడుదల చేయాలని డిమాండ్ ● విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని నినాదాలు ● లోకేష్ డౌన్డౌన్ అంటూ ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థుల నిరసనతుమ్మపాల: విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేస్తామన్నారు.. ఎన్నెన్నో హామీలు ఇచ్చారు.. తీరా అధికారంలోకి వచ్చాక విద్యారంగాన్ని తూట్లు పొడుస్తున్నారంటూ కూటమి ప్రభుత్వం తీరుపై విద్యార్థులు తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు. తల్లి కి వందనం, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు సక్రమంగా ఇవ్వడం లేదని, ఇలా అయితే తమకు భిక్షాటన తప్పదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ఆవరణలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో ప్రభుత్వ కళాశాలలతోపాటు నారాయణ, శ్రీచైతన్య సహా పలు ప్రైవేటు కళాశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, నారా లోకేష్ డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు. స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్, తల్లికి వందనం పూర్తిస్థాయిలో విడుదల చేయకుండా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థుల సర్టిఫికెట్లు కళాశాలల్లోనే ఉంచుకుంటున్నారని, చదువు పూర్తయిన విద్యార్థులకు ఉన్నత విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చినా సర్టిఫికేట్లు లేక తీవ్రంగా బాధపడుతున్నారని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బాబ్జీ, కార్యదర్శి జి.ఫణీంద్రకుమార్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు అందించాల్సిన రూ.6400 కోట్లు విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థులను మోసం చేసిందని, జీవో నెం.77 రద్దు చేయాలని, డిగ్రీ ప్రవేశాలు తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని, అవసరమైతే ‘చలో అమరావతి’కి పిలుపునిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంతకుముందు కలెక్టరేట్లో విద్యార్థుల సమస్యలపై వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో నారాయణ, శ్రీచైతన్య, శ్రీకన్య, యలమంచిలి, తుని, పాయకరావుపేట ప్రభుత్వ ఐటీఐ, జూనియర్ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. -
●భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి
ధ్యానమూలం గురుమూర్తిః పూజమూలం గురుపదం మంత్రమూలం గురుర్వాక్యం మోక్షమూలం గురుకృపా.. జిల్లాలో గురుపౌర్ణమి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. జిల్లాలోని షిర్డీ సాయి ఆలయాల్లో పెద్ద ఎత్తున పూజలు జరిగాయి. బలిఘట్టం పాకలపాడు గురువుగారు ఆశ్రమంలో గురుపౌర్ణమి పూజలు వైభవంగా జరిగాయి. పౌర్ణమి పూజలు ఆచరించడం ద్వారా జాతక దోషాలు తొలగితాయని భక్తుల విశ్వాసం. అలాగే కొత్తపెంట దేవానంద స్వామీజీ ఆశ్రమంలో ఘనంగా గురుపౌర్ణమి పూజలు నిర్వహించారు. మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు దేవానంద స్వామీజీని దర్శించుకున్నారు. -
అడ్డురోడ్డులో సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్
అడ్డురోడ్డు సీసీ కెమెరా కంట్రోల్ రూమ్ను పరిశీలిస్తున్న హోంమంత్రి ఎస్.రాయవరం: రోడ్డు ప్రమాదాలు , నేరాలు నివారణకు జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అడ్డురోడ్డు సర్కిల్ కార్యాలయంలో 100 సీసీ కెమెరాలు నిర్వహణ కంట్రోల్ రూం గురువారం ప్రారంభించారు. పాయకరావుపేట తాండవ జంక్షన్ నుంచి ధర్మవరం అగ్రహారం వరకు ప్రధాన జంక్షన్లలో జాతీయ రహదారిపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. వీటికి అడ్డురోడ్డు సర్కిల్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. అనంతరం మహిళల భద్రత కోసం అవసరమయ్యే 10 ఈవీ ద్విచక్ర వాహనాలను మంత్రి ప్రారంభించారు. అంతకు ముందు జిల్లా ఎస్పీ తుహిన్సిన్హా మాట్లాడుతూ జిల్లా అంతా నేరాలు అదుపునకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. -
ఇదేం మెహర్బానీ...!
పేరెంట్స్ మీటింగ్లో తన కుమారుడు జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న హోంమంత్రి అనిత మండల కేంద్రం నక్కపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం జరిగిన పేరెంట్స్ మీటింగ్ లో హోంమంత్రి అనిత కుమారుడు నిఖిల్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం చర్చనీయాంశం అయింది. కళాశాలలో జరిగిన పేరెంట్స్ మీటింగ్కు హోంమంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. ఇదే రోజు మంత్రి కొడుకు పుట్టినరోజు కావడంతో స్థానిక కూటమి నాయకులు మంత్రి మెప్పు కోసం అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇదే సమావేశం పక్కన ప్రత్యేకంగా పుట్టినరోజు వేడుకలు ఏర్పాటు చేశారు. మంత్రి అనిత తన కొడుకుతో విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమం చూసి పేరెంట్స్ ముక్కున వేలేసుకున్నారు. పేరెంట్స్ మీటింగ్కు అని పిలిచి మంత్రి కుమారుడి పుట్టినరోజు సంబరాలు నిర్వహించుకుంటారా..? అంటూ అసహనం వ్యక్తం చేశారు. -
రోజూ పిల్లలకు ఇదే భోజనం పెడుతున్నారా...!
అనకాపల్లి టౌన్: గాంధీనగరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం ద్వారా అందించే భోజనం బాగోలేదని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు మధ్యాహ్న భోజన సమయంలో గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ రేషన్ బియ్యం వండి విద్యార్థులకు పెడుతున్నారని విమర్శించారు. ఈ విషయం పేరెంట్, టీచర్స్ మీటింగ్కు రావడం వల్ల తెలిసిందన్నారు. ప్రతి రోజూ ఇలాంటి భోజనమే పెడుతున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే కొందరు మండల విద్యాశాఖాధికారికి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన విద్యాశాఖాధికారి కోటేశ్వరావు స్వయంగా స్కూల్కి వెళ్లి భోజన పథకం తీరును పరిశీలించారు. భోజనం రుచి చూసి నాణ్యతపై ఆందోళన వ్యక్తం చేశారు. నిర్వాహకులను పిలిచి పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ గతంలో పలుమార్లు హెచ్చరించామని, తల్లిదండ్రులతో కూడిన కమిటీ తీర్మానం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. -
మొక్కుబడిగా..
●పేరెంట్స్ మీటింగ్వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దితే..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్లక్ష్యం చూపడంతో మళ్లీ సర్కారు విద్య గాడి తప్పింది. దీనికి దృష్టాంతాలుగా ప్రభుత్వం ఎంతో ప్రచారం చేసి నిర్వహించిన విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాల్లో పలు పాఠశాలల్లోని సమస్యలను తల్లిదండ్రులు ప్రస్తావించారు..నక్కపల్లి ఉద్ధండపురంలో జెడ్పీ ఉన్నత పాఠశాలలో గత ప్రభుత్వంలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయగా, అది ఇప్పుడు పనిచేయడం లేదంటూ ఆ గ్రామ ఎంపీటీసీ బచ్చల రాజు పేరెంట్ మీటింగ్లో ప్రస్తావించారు.. అనకాపల్లి టౌన్లోని గాంధీనగరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగోలేదని పేరెంట్స్ మీటింగ్కు హాజరైన పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు మధ్యాహ్న భోజన సమయంలో ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యత లేకుండా రేషన్ బియ్యం వండి విద్యార్ధులకు పెడుతున్నారని, ఈ విషయం పేరెంట్, టీచర్స్ మీటింగ్కు రావడం వల్ల తెలిసిందని మండిపడ్డారు... సాక్షి, అనకాపల్లి : జిల్లాలో 1955 పాఠశాలలు, 134 జూనియర్ కళాశాలల్లో గురువారం మెగా పీటీఎం సమావేశాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు, పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నిర్వహించిన ఈ మెగా సమావేశాలు మొక్కుబడిగా జరిగాయి. పాఠశాల అభివృద్ధికి కావలసిన మౌలిక వసతుల కల్పన, విద్యార్థుల చదువు, భవిష్యత్తు, ఆరోగ్యం తదితర అంశాలపై తల్లిదండ్రులతో చర్చ జరుగుతుందన్నారు. ప్రచారార్భాటం తప్ప ఆచరణ కొరవడింది. నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం ఏఎల్ పురం గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, నక్కపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హోంమంత్రి అనిత పాల్గొన్నారు. పరవాడ మండలం లంకెలపాలెం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర పాల్గొన్నారు. మునగపాక మండలం పాతిపల్లి గ్రామం ఏపీ మోడల్ స్కూల్లో జిల్లా విద్యాశాఖ అధికారి జి.అప్పారావు నాయుడు, జిల్లా నైపుణ్యాభివృద్ధిశాఖ అధికారి ఆర్.గోవిందరావు పాల్గొన్నారు. -
ఫ్యూజ్ పోయినా డబ్బులివ్వాల్సిందే...!
● రాత్రిపూట కరెంటు పోతే జాగరణ చేయాల్సిందే.. ● నిత్యం కరెంటు కోత...బిల్లుల పేరిట వాత ● విద్యుత్శాఖ తీరుపై వినియోగదారుల ధ్వజం సదస్సులో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు కోటవురట్ల: విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఫ్యూజ్ పోతే వేసినందుకు ఎంత చెల్లించాలని విద్యుత్ వినియోగదారులు అధికారులను ప్రశ్నించారు. కై లాసపట్నం విద్యుత్ సబ్ స్టేషన్లో వినియోగదారుల సదస్సును గురువారం నిర్వహించారు. విద్యుత్ ట్రాన్స్కో ఎస్ఈ జి.ప్రసాద్ వినియోగదారుల సమస్యలపై ఆరా తీయగా వినియోగదారులు ఆగ్రహంతో అధికారులపై ప్రశ్నల దాడి చేశారు. జెడ్పీటీసీ సిద్ధాబత్తుల ఉమాదేవి మాట్లాడుతూ మండలంలో విద్యుత్ శాఖాధికారులు, సిబ్బంది తీరు అధ్వానంగా ఉందన్నారు. దీనిపై జెడ్పీ సమావేశంలో కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ను ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. రోజులో కనీసం ఐదారుసార్లు అనధికారిక విద్యుత్ కోత ఉంటోందని, రైతులు, గృహ వినియోగదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రతి ఐదు నిమిషాలకు విద్యుత్ సరఫరా ఫ్లక్సేషన్ అవుతోందని, ఇంత అధ్వానమైన విద్యుత్ సరఫరాను గత ప్రభుత్వంలో ఎపుడూ చూడలేదన్నారు. మాజీ ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు మాట్లాడుతూ అధికారులు అంతులేని నిర్లక్ష్యంతో పనిచేస్తున్నారని, లోపం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. రైతు తుమ్మలపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ విద్యుత్ ఫ్యూజ్ పోయినా డబ్బులు ఇవ్వందే మీ సిబ్బంది పనిచేయరని ఆరోపించారు. పొలాల్లో విద్యుత్ తీగెలు కిందికి వేలాడి రైతుల పాలిట ప్రాణసంకటంగా ఉన్నాయని, కనీస నిర్వహణ కూడా చేయడం లేదన్నారు. సమస్య ఉందని ఫోన్ చేసినా ఎవరూ ఫోన్ ఎత్తరని, రాత్రి పూట కరెంట్ పోతే రాత్రంతా జాగరణ చేయాల్సిందే అన్నారు. ఈ సదస్సులో వైఎస్సార్సీపీ నాయకుడు సిద్ధాబత్తుల సత్యనారాయణ పాల్గొన్నారు. -
స్వామీ.. నీ సన్నిధి చేరి..
సింహాచలం: ఆషాఢ శుద్ధ చతుర్దశి పురస్కరించుకుని జరిగిన సింహగిరి ప్రదక్షిణ మహోత్సవం గురువారంతో దిగ్విజయంగా ముగిసింది. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని స్మరిస్తూ బుధవారం చేపట్టిన 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అశేష జనసందోహంతో కొనసాగింది. సింహాచలంలోని తొలి పావంచా వద్ద ప్రదక్షిణ ప్రారంభించిన భక్తులు సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేసి తిరిగి తొలిపావంచా వద్దకు చేరుకున్నారు. అక్కడ స్వామి సన్నిధిలో కొబ్బరికాయ కొట్టి తమ ప్రదక్షిణను ముగించారు. పలువురు భక్తులు సింహగిరికి వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. సింహగిరిపై జన జాతర ఒక పక్క 32 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేసి స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు.. మరో పక్క ఆలయ ప్రదక్షిణలకు వచ్చిన భక్తులతో గురువారం సింహగిరి భక్త జనజాతరగా మారింది. దేవస్థానం అంచనాల ప్రకారం.. ఈ సారి గిరి ప్రదక్షిణలో సుమారు 8 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. గురువారం ఒక్క రోజే 68 వేల మంది భక్తులు సింహగిరిపై స్వామిని దర్శించుకోగా, బుధవారం 42 వేల మంది దర్శనం చేసుకున్నారు. అలాగే సుమారు 5 వేల మంది భక్తులు ఆలయ ప్రదక్షిణల్లో పాల్గొన్నారు. తెల్లవారుజాము నుంచే దర్శనాలు గిరి ప్రదక్షిణ చేసి సింహగిరికి వచ్చిన భక్తుల సౌకర్యార్థం దేవస్థానం అధికారులు గురువారం తెల్లవారుజామున 3.30 గంటల నుంచే స్వామి దర్శనాలకు అనుమతించారు. తొలుత ఉదయం 5.30 గంటల నుంచి దర్శనాలు కల్పిస్తామని ప్రకటించినప్పటికీ.. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు భక్తులకు దర్శనాలు కల్పించారు. భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించే ఉద్దేశంతో ఉదయం 4.30 గంటల నుంచి రూ.100, రూ.300 టికెట్ల క్యూల్లో కూడా భక్తులను ఉచితంగా పంపించారు. ఆలయ నీలాద్రి గుమ్మం దగ్గర నుంచే లఘు దర్శనం కల్పించి, అంతరాలయ దర్శనాన్ని నిలిపివేశారు. విశేషంగా ఆలయ ప్రదక్షిణలు ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని సింహగిరిపై గురువారం ఆలయ ప్రదక్షిణలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులను ఆలయ ప్రదక్షిణలకు అనుమతించారు. అచంచల భక్తితో గిరి ప్రదక్షిణపూర్తి చేసిన భక్తులు పౌర్ణమి వేళ విశేషంగా ఆలయ ప్రదక్షిణలు లక్షలాదిగా తరలివచ్చిన భక్త జన సందోహం నృసింహుని స్మరణతో మార్మోగిన గిరి మార్గం ముఖ్యాంశాలు కొండ దిగువ పాత గోశాల జంక్షన్ నుంచి పాత అడవివరం వరకు ఉన్న మార్గం భక్తులతో కిక్కిరిసింది. గిరి ప్రదక్షిణ పూర్తి చేసి తొలిపావంచాకు చేరుకునే భక్తులు, ప్రదక్షిణ పూర్తి చేసుకుని ఇళ్లకు చేరుకునే భక్తులతో రద్దీ నెలకొంది. గిరి ప్రదక్షిణ ముగించుకుని కొబ్బరికాయలు కొట్టే భక్తులతో తొలిపావంచా గురువారం మధ్యాహ్నం వరకు కిటకిటలాడింది. మెట్ల మార్గంలో కేవలం సింహగిరికి వెళ్లే భక్తులను మాత్రమే అనుమతించారు. కొండ దిగువకు మెట్ల మార్గంలో అనుమతించలేదు. సింహగిరి నుంచి దిగువకు, దిగువ నుంచి కొండపైకి దేవస్థానం 50 ఉచిత బస్సులను నడిపింది. 32 కిలోమీటర్ల ప్రదక్షిణ చేసి సింహగిరి వచ్చిన భక్తులను ఆలయ ఉత్తర రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన వంతెన కింద నుంచి దర్శనానికి, దక్షిణ రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన వంతెన దిగువ నుంచి దర్శన అనంతరం బయటకు పంపించారు. ఆలయ నీలాద్రి గుమ్మం వద్ద నాలుగు లైన్లలో ర్యాంపులు ఏర్పాటు చేసి దర్శనాలు కల్పించారు. సింహగిరిపై అడవివరం ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. భక్తులు కొట్టిన కొబ్బరికాయలతో తొలి పావంచా వద్ద పెద్ద ఎత్తున కుప్ప ఏర్పడింది. సింహగిరిపై అన్నప్రసాద భవనంలో కదంబం, దద్దోజనం ప్రసాదాన్ని భక్తులకు అందజేశారు. సింహగిరిపై బస్టాండ్లో తీవ్ర రద్దీ నెలకొంది. కొండ దిగువకు వెళ్లే ఆర్టీసీ బస్సులన్నీ భక్తుల రద్దీతో నిండిపోయాయి. అలాగే కొండ దిగువ పాతగోశాల జంక్షన్ వద్ద తీవ్ర రద్దీ నెలకొంది. తొలిపావంచా వద్ద పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం వద్దకు వచ్చిన చాలా మంది భక్తులు తమ బంధువులు కనిపించడం లేదని పోలీసుల సహాయం కోరారు. సెల్ఫోన్ సిగ్నల్స్ సరిగా లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. గిరి ప్రదక్షిణ చేసిన చాలా మంది భక్తులు అడవివరంలోని తొలిపావంచా వద్ద మెట్లపై, రహదారి పక్కన ఉన్న ఖాళీ ప్రదేశాల్లో, పలు కల్యాణ మండపాల హాళ్లలో నిద్రించి, ఆ తర్వాత తమ గ్రామాలకు తరలివెళ్లారు. -
తాళ్లపాలెం పీహెచ్సీలో డీఎంహెచ్వో తనిఖీ
రికార్డులు తనిఖీ చేస్తున్న జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి హైమావతి కశింకోట: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యధిక శాతం సంస్థాగత ప్రసవాలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి ఎం.హైమావతి ఆదేశించారు. మండలంలోని తాళ్లపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆమె ఆకస్మికంగా సందర్శించారు. కేంద్రం పని తీరును, రికార్డులు, నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలు శత శాతం సాధించాలని వైద్య, ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. వైద్యాధికారి ఎస్. సుమ, డిప్యూటీ ఆరోగ్య విస్తరణాధికారి ఎం.ఎస్.వి. ప్రసాద్, సీసీ లక్ష్మీనారాయణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఐఐటీలో సీటు సాధించిన విద్యార్థికి అభినందన
సతీష్ను అభినందిస్తున్న ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాడుగుల : మండలంలో కింతలి హైస్కూల్లో చదివిన పాసింబిల్లి సతీష్ ముంబై ఐఐటీలో సీటు సాధించాడు. దీంతో సతీష్తో పాటు తల్లిదండ్రులును, తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశంలో భాగంగా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గురువారం దుశ్శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాళ్లపురెడ్డి వెంకట రాజారామ్, సర్పంచ్ మైచర్ల భవాణి, ఎంపీటీసీ నాయుడు, ఎంఈవో దేముడమ్మ, పుప్పాల రమేష్, ఉండూరు దేముడు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కూటమి నేతల మద్దతుతో ప్రభుత్వ భూమి ఆక్రమణ
● కలెక్టరుకు వైఎస్సార్సీపీ నేత ఫిర్యాదుతో కదిలిన అధికారులు గుమ్మడిగొండలో ప్రభుత్వ భూమిలో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డు నాతవరం: కూటమి నేతల మద్దతుతో కొందరు ఆక్రమించుకున్న ప్రభుత్వ స్థలంలో రెవెన్యూ అధికారులు గురువారం హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. మండలంలో గుమ్మడిగొండ పంచాయతీ సర్వే నంబరు 102/2లో ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిలో గత ప్రభుత్వం జగనన్న లేఅవుట్ వేసి ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు అధికారులు నిర్ధారించారు. అందులో పేదలకు ఇళ్ల నిర్మాణం చేయకూడదంటూ అప్పటి కూటమి నేతలు వివాదం సృష్టించి కోర్టును ఆశ్రయించారు. కోర్టు వివాదంతో ఈ భూమిలో అప్పట్లో ఇళ్ల నిర్మాణం చేయకుండా మరో చోట స్థలాలు కేటాయించారు. ప్రస్తుతం ఈ భూమిలో పలువురు మొక్కలు నాటి ఆక్రమణకు పూనుకున్నారు. ఈ విషయంపై ఎంపీటీసీ సభ్యులు సుర్ల పాప, వైఎస్సార్సీపీ నాయకుడు సుర్ల అచ్చియ్యనాయుడు కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. నాతవరం తహసీల్దార్ వేణుగోపాల్ రెండు రోజుల క్రితం ఆ భూమిని పరిశీలించారు. భూమిని ఆక్రమించుకున్న వ్యక్తిని పిలిచి తమ వద్ద ఏమైనా రికార్డులు ఉంటే చూపించాలన్నారు. అతని వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఈ భూమిలో ఎటువంటి పనులు చేపట్టరాదన్నారు. ఈ మేరకు రెవెన్యూ సిబ్బంది అందరి సమక్షంలో గురువారం హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. -
కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు
నక్కపల్లి: ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్ది సదుపాయాలను కల్పిస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. గురువారం ఆమె నక్కపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో పాల్గొన్నారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేరెంట్స్, టీచర్స్తో సమావేశాలు నిర్వహిస్తూ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందన్నారు. విద్యార్థుల ప్రగతిని తెలియజేయడంతోపాటు వారి సమస్యలను తల్లిదండ్రుల ద్వారా తెలుసుకుని పరిష్కరించేందకు ఈ సమావేశాలు దోహదపడతాయన్నారు. సన్నబియ్యంతోనే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్నట్టు చెప్పారు. గంజాయి వ్యాపారాలు చేస్తున్న వారికి సంక్షేమ పథకాలు రద్దు చేస్తున్నామన్నారు. విద్యార్థుల విషయంలో బాధ్యతగా ఉండాలి గొలుగొండ: విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చాలా బాధ్యతగా ఉండాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. ఏఎల్పురం జిల్లా పరిషత్ హైస్కూల్లో జరిగిన పేరెంట్స్, టీచర్స్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు ఇంటి వద్ద సెల్ఫోన్లు ఇవ్వొద్దని తల్లిదండ్రులకు సూచించారు. విద్యార్థుల భవిష్యత్తును పూర్తిగా ఉపాధ్యాయులపై పెట్టకుండా తల్లిదండ్రులు కూడా ఇంటి వద్ద తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణ, సర్పంచ్ లోచల సుజాత, నర్సీపట్నం జనసేన ఇన్చార్జి రాజాన సూర్యచంద్ర, మాజీ జెడ్పీటీసీ, మాజీ ఎంపీపీ తారకవేణుగోపాల్, అడిగర్ల అప్పలనాయుడు, హెచ్ఎం కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. హోం మంత్రి అనిత నక్కపల్లి జెడ్పీ పాఠశాలలో పీటీఎం -
బ్రిటిష్ సైనికాధికారుల సమాధుల పరిరక్షణకు చర్యలు
నర్సీపట్నం : నర్సీపట్నం మెయిన్ రోడ్లో ఉన్న బ్రిటిష్ సైనిక అధికారుల సమాధుల ప్రాంతాన్ని గురువారం సీనియర్ సివిల్ జడ్జి పఠాన్ షీయాజ్ ఖాన్ పరిశీలించారు. అల్లూరి సీతారామరాజు పోరాట పటిమకు చిహ్నంగా ఉన్న ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించి మండల న్యాయ సేవాధికార సంస్థకు అందిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే రెవెన్యూ, మున్సిపల్ అధికారుల నుండి కోర్టు వారు వివరాలు సేకరించారు. తాజాగా సమాచారం కోసం పురావస్తుశాఖకు కోర్టు వారు నోటీసు జారీ చేయడంతో ఆ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పాల్గుణరావు గురువారం నర్సీపట్నం విచ్చేశారు. పురావస్తుశాఖ అసిస్టెంట్ డైరెక్టర్, మున్సిపల్ కమిషనర్ సురేంద్ర, సర్వేయర్ల తో సీనియర్ సివిల్ జడ్జి ఆ సమాధుల ప్రాంతాన్ని పరిశీలించారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు సమాధుల ప్రాంతం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుకు తగు చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. -
రైల్వే స్టేషన్లో క్యాప్సూల్ హోటల్
● పీపీపీ విధానంలో అభివృద్ధి.. అందుబాటులోకి 88 క్యాప్సూల్ బెడ్లు ● 3 గంటల వరకు రూ.200, రోజుకు రూ.400 వసూలు ● రైలు ప్యాసింజర్లతో పాటు బయటి వారు వినియోగించుకునే సౌకర్యం ● డిమాండ్ను బట్టి మరిన్ని స్టేషన్లలో ఏర్పాటుకు ఆలోచన ● వాల్తేరు డీఆర్ఎం లలిత్ బొహ్రావిశాఖ సిటీ : విశాఖ రైల్వేస్టేషన్లో సరికొత్త సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా క్యాప్సూల్ హోటల్ సిద్ధమైంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్(పీపీపీ) విధానంలో ప్లాట్ఫాం నెంబర్–1, గేట్ నెంబర్–3 వద్ద మొదటి అంతస్తులో ఏర్పాటు చేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోనే తొలిసారిగా ఈ తరహా క్యాప్సూల్ హోటల్ను విశాఖలోనే అందుబాటులోకి తీసుకొచ్చామని వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బొహ్రా తెలిపారు. గురువారం డీఆర్ఎం చాంబర్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. రైల్వే స్టేషన్లో వసతి సౌకర్యాలకు మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం స్టేషన్లో ఉన్న రిటైరింగ్ రూమ్స్ సరిపోక ప్రయాణికులు బయట హోటల్స్కు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో రైలు ప్రయాణికులకు, పర్యాటకులకు అందుబాటు ధరలో సౌకర్యవంతమైన వసతి కల్పించాలన్న ఉద్దేశంతో సరికొత్తగా క్యాప్సూల్ హోటల్ను ఏర్పాటు చేశారు. ఈ తరహా హోటల్స్ ప్రస్తుతం ముంబై, హైదరాబాద్ వంటి రైల్వేస్టేషన్లలో మాత్రమే ఉన్నాయి. పీపీపీ విధానంలో అభివృద్ధి విశాఖ రైల్వే స్టేషన్లో కూడా ఆధునిక హంగులు, అందుబాటు ధరలతో క్యాప్సూల్ హోటల్ను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. పీపీపీ విధానంలో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఈ–యాక్షన్ నిర్వహించారు. ఇందులో శ్రీ మహాలక్ష్మి ఏజెన్సీ అనే సంస్థ ఐదేళ్ల కాలానికి ప్రాజెక్టును దక్కించుకుంది. రైల్వేస్టేషన్ మొదటి అంతస్తులో అధికారులు స్థలాన్ని కేటాయించారు. సదరు కాంట్రాక్టు సంస్థ ఇక్కడ క్యాప్సూల్ హోటల్ను అభివృద్ధి చేసింది. ఇందులో 73 సింగిల్ బెడ్లు, 15 డబుల్ బెడ్లు మొత్తంగా 88 బెడ్లను ఏర్పాటు చేసింది. మహిళల కోసం 18 బెడ్లు, ప్రత్యేక సౌకర్యాలు కల్పించింది. రైల్వే ప్రయాణికులతో పాటు పర్యాటకులు, బయట వ్యక్తులకు కూడా ఈ హోటల్లో వసతి పొందే సౌలభ్యాన్ని కల్పించారు. 3 గంటలలోపు రూ.200 ఈ కొత్త క్యాప్సూల్ హోటల్లో అన్ని రకాల సౌకర్యాలతో పాటు అనేక సదుపాయాలు కల్పించారు. అతిథులకు ఉచిత వైఫై, 24 గంటలు వేడి నీళ్ల సౌకర్యం, పర్యాటకుల కోసం ట్రావెల్ డెస్క్తో పాటు ఇన్హౌస్ స్నాక్ బార్ను ఏర్పాటు చేశారు. ఇందులో సింగిల్ బెడ్కు 3 గంటలలోపు రూ.200, 3 నుంచి 24 గంటల వరకు రూ.400 వసూలు చేయనున్నారు. అలాగే డబుల్ బెడ్కు మూడు గంటలలోపు రూ.300, 3 నుంచి 24 గంటలలోపు అయితే రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా ఈ బెడ్స్ను బుక్ చేసుకునే సదుపాయం లేదని డీఆర్ఎం తెలిపారు. డిమాండ్ను బట్టి ఆ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. -
15 టన్నుల బియ్యం స్వాధీనం
● వ్యాన్లో కాకినాడ పోర్టుకు తరలిస్తుండగా పట్టివేత ● పీడీఎస్ బియ్యంగా అంగీకరించిన యజమానియలమంచిలి రూరల్ : యలమంచిలి మున్సిపాలిటీ నుంచి అక్రమంగా విదేశాలకు తరలించేందుకు కాకినాడ పోర్టుకు తీసుకెళ్లడానికి ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన బియ్యాన్ని లోడు చేసిన వాహనాన్ని యలమంచిలి రూరల్ పోలీసులు గురువారం తెల్లవారుజామున స్వాధీనపర్చుకున్నారు. ఇందుకు బాధ్యులుగా తెరువుపల్లి న్యూ వెంకటేశ్వర రైసు మిల్లు యజమాని నక్కపల్లి మండలం చందనాడ గ్రామానికి చెందిన బాలం కొండబాబు, ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా బొరిగుమ మండలం జయంతగిరి గ్రామానికి చెందిన వ్యాన్ డ్రైవర్ సదారక్ హరిజన్లను అదుపులోకి తీసుకున్నారు. యలమంచిలి రూరల్ ఎస్ఐ ఎం.ఉపేంద్ర విలేకరులకు తెలిపిన వివరాలివి. యలమంచిలి మున్సిపాలిటీ పరిధి తెరువుపల్లి న్యూ వెంకటేశ్వర రైసు మిల్లులో బుధవారం రాత్రి ఓడీ 10ఏఏ 5409 రిజిస్ట్రేషన్ నంబరు గల వ్యాన్లో చౌక దుకాణాల వ్యవస్థ ద్వారా పేదలకు సరఫరా కావాల్సిన సుమారు 15 టన్నుల బియ్యాన్ని 300 బస్తాల రూపంలో లోడ్ చేశారు. ఈ సమాచారాన్ని అందుకున్న కొందరు మీడియా ప్రతినిధులు, యలమంచిలి రూరల్ పోలీసులు రైసు మిల్లు వద్దకు చేరుకుని పరిశీలించగా అప్పటికే రేషన్ బియ్యాన్ని వ్యానులో లోడ్ చేసి తరలించడానికి సిద్ధం చేసిన విషయాన్ని గుర్తించారు. వ్యాన్లో తరలిస్తున్న బియ్యం పీడీఎస్ బియ్యంగా తమకు అనుమానం ఉందని,పోలీసు సిబ్బంది యజమానిని అడగ్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదంటూ చెప్పి వ్యాన్ డ్రైవర్ను అక్కడ్నుంచి పరారైపోమని చెప్పగా అతను వ్యాన్ తాళాలు పట్టుకుని పరారయ్యాడు. వాహనాన్ని స్వాధీనపర్చుకోవడానికి ప్రయత్నించిన పోలీసులకు రైసు మిల్లు యజమాని సహాయ నిరాకరణ చేశాడు. దీంతో పోలీసులు సుమారుగా నాలుగు గంటలు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. రైసు మిల్లు యజమాని,మరొకరు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొద్ది సేపటికి యలమంచిలి రూరల్ ఎస్ఐ ఎం.ఉపేంద్ర సైతం రైసు మిల్లు వద్దకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. గురువారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో బియ్యం లోడుతో ఉన్న వ్యాన్ను యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రాథమిక విచారణ అనంతరం రైసు మిల్లు యజమాని వ్యాన్లో ఉన్నది చౌక దుకాణాల ద్వారా పంపిణే చేసే బియ్యంగా అంగీకరించాడు. దీనిపై కేసు నమోదు చేసిన అనంతరం ఈ సమాచారాన్ని పోలీసులు స్థానిక తహసీల్దార్కు అధికారికంగా అందజేశారు. ఈ మేరకు యలమంచిలి మండలం పౌరసరఫరాల డీటీ వ్యాన్లో ఉన్న బియ్యం బస్తాల్లో ర్యాండంగా మూడు కేజీల శాంపిళ్లను సేకరించి, పీడీఎస్ బియ్యమా? కాదా? అని నిర్ధారించడానికి జిల్లా పౌరసరఫరాల అధికారికి పంపించారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. యలమంచిలి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నా పౌరసరఫరాల శాఖ అధికారులు మామూళ్లకు తలొగ్గి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు బలంగా ఉన్నాయి. -
‘బాబు’ మోసాలను ఎండగడదాం!
దేవరాపల్లి : కూటమి ఏడాది పాలనలో ఎన్నికల హామీలను అమలు చేయకుండా చంద్రబాబు సహా ఆ పార్టీల నేతలు చేసిన మోసాలను ఇంటింటికి వెళ్లి ప్రజల వద్ద ఎండగడదామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు తారువలోని వైఎస్సార్ ఆడిటోరియంలో గురువారం ‘బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ’కార్యక్రమంపై వైఎస్సార్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముందుగా పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, పార్టీ పార్లమెంట్ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, పార్లమెంట్ పరిశీలకురాలు శోభా హైమావతి తదితరులు ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ పేరిట చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెచ్చే క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ 2.0లో పార్టీ కార్యకర్తలకు తొలి ప్రాధాన్యత కల్పిస్తామని వైఎస్ జగన్ భరోసా కల్పించారన్నారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా తామంతా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలను మోసగించగా.. వైఎస్ జగన్ మాత్రం మేనిఫెస్టోలోని నవరత్న పథకాలతో పాటు చెప్పనవి ఎన్నో పథకాలను గత ప్రభుత్వ హయాంలో అమలు చేశారని గుర్తు చేశారు. కూటమి పార్టీలను గెలిపించి తప్పు చేశామని ప్రజలు పశ్చాతాపం పడుతున్నారని, రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగన్ గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వైఎస్ జగన్ రూపకల్పన చేసిన అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనంగా పేరు మార్చి తన కుమారుడు రూపకల్పన చేశారని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబులా నిస్సుగ్గుగా అబద్దాలు చెప్పే నాయకుడు ఈ భూప్రపంచంలో ఎక్కడా ఉండరని ఎద్దేవా చేశారు. ముఖ పరిచయం లేని సీఎం రమేష్ను ఎంపీగా గెలిపిస్తే, దర్జాగా ఈ ప్రాంతంలో వ్యాపారాలు చేసుకుంటున్నారన్నారు. జరిగిన నష్టంపై అవగాహన కల్పించాలి.. మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ చంద్రబాబు నయవంచనను, వైఫల్యాలను గ్రామ స్థాయిలో కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కూటమి ఏడాది పాలనలో ప్రతి ఇంటికి జరిగిన నష్టంపై కూటమి నేతలను నిలదీసేలా ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. చంద్రబాబు మాయ మాటలు నమ్మి మోసపోయామని ప్రజలు గ్రహించారని, జగన్ పర్యటనకు ఉప్పెనలా తరలివస్తున్న జనమే ఇందుకు నిదర్శనమన్నారు. వైఎస్ జగన్కు వస్తున్న జనాదరణను చూసి కూటమి నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని చెప్పారు. బాబు మోసగాడు... పవన్ వేషగాడు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయకుండా చంద్రబాబు మోసగాడిలా, పవన్ వేషగాడిలా మిగిలిపోయారని విమర్శించారు. చంద్రబాబు లాంటి చీటర్ దేశంలోనే లేరని విమర్శించారు. పార్టీలకు అతీతంగా పథకాలు అందించి జగన్ మగాడిలా, మొనగాడిలా నిలిచారన్నారు. రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో సైతం జగన్ నామస్మరణం చేస్తున్నారన్నారు. కూటమి నేతల మోసాలను ఎండగట్టేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు. ఏడాదిలోనే కూటమిపై తీవ్ర వ్యతిరేకత పార్లమెంట్ పరిశీలకురాలు శోభా హైమావతి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలుకు చంద్రబాబు, పవన్కల్యాణ్ సంతకాలతో కూడిన బాండ్ ఇచ్చి ప్రజలకు పంగనామాలు పెట్టారన్నారు. నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలు, ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్ ప్రయాణం పథకాలు అమలు చేయకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్నారు. దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈర్లె అనురాధ, జిల్లా యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పి.వెంకటేష్, సీడీసీ చైర్మన్ సుంకరి శ్రీను, మాడుగుల, కె.కోటపాడు ఎంపీపీలు తాళ్లపురెడ్డి రాజారామ్, దేవరాపల్లి, మాడుగుల జెడ్పీటీసీలు కర్రి సత్యం, కిముడు రమణమ్మ, పార్టీ మండల అధ్యక్షులు బూరె బాబూరావు, గొల్లివిల్లి రాజుబాబు, వేమవరపు రామధర్మజ, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వరదపురెడ్డి లలితానాయుడు, వైస్ ఎంపీపీలు పంచాడ సింహాచలంనాయుడు, ఆర్వీకే నాయుడు తదితర్లు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నేతల పిలుపు తారువలో నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం పాల్గొన్న అమర్నాథ్, బూడి, ధర్మశ్రీ, శోభా హైమావతి బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ కూఆర్ కోడ్ ఆవిష్కరణ -
విద్యుత్షాక్తో యువకుడి మృతి
మాడుగుల రూరల్: డి.గోటివాడ గ్రామంలో విద్యుత్షాక్తో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన తెలియవచ్చింది. గ్రామానికి చెందిన బొబ్బాది శివాజీ (22) గురువారం ఉదయం తన పొలంలో పామాయిల్ కొమ్మలు నరుకుతుండగా, చెట్టు పక్కన్న వేలాడుతున్న విద్యుత్ వైర్లు తగిలి షాక్ కొట్టడంతో శివాజీ విద్యుత్ షాక్కు గురియ్యారు. వెంటనే అతనిని కుటుంబ సభ్యులు మాడుగుల ప్రభుత్వ ఆస్పత్రికి వైద్యం కోసం తరలిస్తుండగా, మార్గ మధ్యంలోనే మృతిచెందాడు. కాగా ఈ ఘటనపై ఇంతవరకూ ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
మా భూములకు రక్షణ కల్పించండి
● ఆర్డీవో కార్యాలయం ఎదుట గిరిజనుల బైటాయింపునర్సీపట్నం : మా భూములను కాపాడాలంటూ మాడుగుల మండలం, గదబూరు గ్రామానికి చెందిన గిరిజన కుటుంబాబు గురువారం ఆర్డీవో కార్యాలయం ఎదుట బైటాయించి ప్లకార్డులతో నిరసన తెలిపారు. ‘ఆర్డీవో గారూ.. మా భూములకు రక్షణ కల్పించండి’ అంటూ నినాదాలు చేశారు. గిరిజన కుటుంబాలకు సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు కె.జనార్దన్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగులో ఉన్న గిరిజనులకు ప్రభుత్వం అటవీహక్కుల చట్టం ప్రకారం పట్టాలు మంజూరు చేసిందన్నారు. 30 ఏళ్లుగా జీడిమామిడి తోటలను సాగు చేసుకుని ఫలసాయం అనుభవిస్తున్నారన్నారు. భూ మాఫియాదారులు జేసీబీలతో జీడి చెట్లను నేలమట్టం చేశారన్నారు. దీనిపై తహసీల్దార్కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు. ఆర్డీవోకు ఇప్పటికే రెండు పర్యాయాలు ఫిర్యాదు చేసినా స్పందనలేదన్నారు. ఎస్ఐకి గిరిజనులు ఫిర్యాదు చేస్తే భూ మాఫియా జోలికి వెళ్ల వద్దని భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. గిరిజనులకు ఈ జీడితోటలు తప్ప వేరే జీవనోపాధి లేదని, ఆర్డీవో స్పందించి భూ మాఫియా నుంచి తమ భూములకు రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. -
రేషన్ డిపోలు, పాఠశాలలు ఆకస్మిక తనిఖీ
● తూకం, సీల్ సరిగా లేని రేషన్ డిపోపై కేసు నమోదుకు ఆహార కమిషన్ సభ్యుడు ఆదేశాలుఅనకాపల్లి టౌన్ : పట్టణంలోని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు బి.కాంతారావు విస్తృతంగా గురువారం పర్యటించారు. పలు రేషన్ డిపోలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు తనిఖీలు నిర్వహించారు. గాంధీనగరంలో రేషన్ డిపోని తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. గుండాల జంక్షన్లోని రేషన్ డిపోలో తూనిక యంత్రం లైసెన్స్, సీల్ సక్రమంగా లేని కారణంగా కేసు నమోదు చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. గవరపాలెం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లలకు అందుతున్న పౌష్టికాహారాన్ని పరిశీలించి తగు సూచనలు చేశారు. మరో అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి పిల్లలకు అందించే పౌష్టికాహారం విషయంలో ఎటువంటి తప్పిదాలు చేయరాదని సూచించారు. గవరపాలెం పార్కుసెంటర్ పక్కన్న ఉన్న ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం రికార్డును తనిఖీ చేసి, లోపాలను సరిదిద్దుకోవాలని సూచించారు. వేల్పులవీధిలో ఉన్న టౌన్ గర్ల్స్ హైస్కూల్ను సందర్శించారు. మధ్యాహ్న భోజనం రుచి చూసి, సాంబారు పల్చగా ఉండడం చూసి నిర్వాహకులను హెచ్చరించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్, లీగల్ మెట్రాలజీ, విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు. -
చాతుర్మాస్య మహావ్రతం ప్రారంభం
● కొత్తపెంటలో సద్గురు దేవానంద స్వామిజీ ఆశ్రమంలో సందడి ● పలు జిల్లాల నుంచి హాజరైన సాధువులు ● దేవానంద స్వామీజి సమాధిని దర్శించుకున్న మాజీ డిప్యూటీ సీఎం బూడిదేవరాపల్లి : కొత్తపెంటలోని సద్గురు దేవానంద సరస్వతీ స్వామీజీ ఆశ్రమంలో గురుపౌర్ణమిని పురస్కరించుకొని చాతుర్మాస్య మహావ్రతం పూజలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ చాతుర్మాస్య మహావ్రత ఆధ్యాత్మిక కార్యక్రమం నవంబర్ 5 (కార్తీక పౌర్ణమి) వరకు సుమారు నాలుగు నెలల పాటు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే తొలిరోజు జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి దేవానంద స్వామీజీని దర్శించుకున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి సాధు సత్పురుషులు, పీఠాధిపతులు హాజరై ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశారు. దేవానంద స్వామీజీని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు దర్శించుకొన్నారు. సద్గురు దేవానంద స్వామీజీ వారి 25వ పుణ్యతిథి రజతోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ వ్రత కాలంలో ప్రతి రోజు పూజా కార్యక్రమాలు, భగవద్గీత పారాయణం, పఠనలు, ప్రవచనాలు, ధ్యానధారణలు తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు దివ్య జీవన్ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. -
న్యాయమూర్తికి ఘనంగా వీడ్కోలు సత్కారం
చోడవరం : స్థానిక 9వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి కె.రత్నకుమార్ బదిలీ కావడంతో ఆయనకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. రత్నకుమార్ విశాఖపట్నం 12వ అదనపు జిల్లాకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. చోడవరం 9వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తిగా కాకినాడను నుంచి హరినారాయణను బదిలీ చేశారు. ఈ సందర్భంగా రత్నకుమార్కు వీడ్కోలు సభను నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కామిరెడ్డి వెంకటరావు అధ్యక్షతన ఈ వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. 10వ అదనపు జిల్లా న్యాయమూర్తి నరేష్, చోడవరం సబ్ జడ్జి గౌరీశంకర్ , ఫస్ట్ క్లాస్ అదనపు జిల్లా మెజిస్ట్రేట్ సూర్యకళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రత్నకుమార్ను బార్ అసోసియేషన్ శాలువాలు, పూలదండలతో ఘనంగా సత్కరించి, వీడ్కోలు పలికారు. చోడవరం బార్ అసోసియేషన్ సహకారం మరువలేనిదని న్యాయమూర్తి రత్నకుమార్ అన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి చీపురపల్లి సూర్యనారాయణ, ప్రతినిధులు ఉగ్గిన వెంకట్రావు, అల్లు గిరిధర్, కాండ్రేగుల డేవిడ్, కె.భాస్కర్దాస్, గూనూరు లక్ష్మీనారాయణ, ఎన్.సుబ్బలక్ష్మి, జి.వి.పి రాజు, గోవిందు, పప్పల రమణమూర్తి, వరలక్ష్మి, సత్యవతి, అప్పర్ల పాల్గొన్నారు. -
హైడ్రోపవర్ ప్రాజెక్ట్లు వద్దేవద్దు
● గిరిజనులకు చాలా నష్టం ● తక్షణమే సర్వే నిలిపివేసి, అనుమతులు రద్దు చేయాలి ● పలువురు సభ్యుల డిమాండ్ ● ఉమ్మడి విశాఖ జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ప్లకార్డులతో నిరసన మహారాణిపేట (విశాఖ): అనంతగిరి మండలం గుజ్జలి, చిట్టంవలసలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ల నిర్మాణం వల్ల ఏజెన్సీ ప్రాంతానికి ముప్పు నెలకొనడమే కాకుండా పర్యావరణం, రైతులకు నష్టం జరగనున్న దృష్ట్యా ప్రాజెక్టుల సర్వే నిలిపివేసి, అనుమతులను తక్షణమే రద్దు చేయాలని తీర్మానించారు. బుధవారం జెడ్పీ సమావేశ మందిరంలో చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. అనంతగిరి జెడ్పీటీసీ (సీపీఎం) డి.గంగరాజు మాట్లాడుతూ ఏజెన్సీలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ల నిర్మాణం చట్ట విరుద్ధమన్నారు. వీటివల్ల చాలా నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు గిరిజన చట్టాలను ఉల్లంఘించడంతోపాటు 1/70 చట్టానికి తూట్లు పొడుస్తున్నారని చెప్పారు. ప్రాజెక్ట్ల ఏర్పాటుపై బుధవారం నిర్వహించిన గ్రామసభలపై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల అనకాపల్లి జిల్లా రైవాడ జలాశయం నీరు కూడా కలుషితం అవుమవుతుందని, దీనివల్ల ఇటు రైతులు అటు విశాఖ నగరానికి తాగునీటికి ఇబ్బందులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ల వల్ల గిరిజనులకు ఎంతోనష్టం జరుగుతుందన్నారు. ఈ ప్రాజెక్ట్ రద్దు చేయాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కోరారు. దీనిపై ఏఎస్సార్ జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ మాట్లాడుతూ అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకొని గ్రామ సభలు నిర్వహించి, తీర్మానాలు చేసిన తరువాత మాత్రమే ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ల నిర్మాణం విరమించాలని ప్లకార్డులతో పలువురు సభ్యులు నిరసన తెలిపారు. ఉచిత విత్తనాలు అందించాలని, రైతు భరోసాకు సంబంధించి రైతుల సంఖ్య గతంలో కన్నా ఇప్పుడు తగ్గడానికి కారణాలు తెలియజేయాలని పలువురు సభ్యులు కోరారు. రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలి అచ్యుతాపురం జెడ్పీటీసీ లాలం రాంబాబు, కోఆప్షన్ సభ్యుడు సత్యనారాయణ మాట్లాడుతూ అనకాపల్లి – అచ్యుతాపురం రోడ్డు విస్తరణ పనులు సంవత్సరాల తరబడి జరుగుతున్నాయని, దీనివల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ పనులు వెంటనే పూర్తి చేసేందుకు కలెక్టరు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే చెప్పిన పనులే కాకుండా ప్రజల అవసరాలను కూడా అధికారులు పట్టించుకోవాలన్నారు. అనకాపల్లి జిల్లా కలెక్టరు విజయకృష్ణన్ మాట్లాడుతూ స్వయంగా పనులను పర్యవేక్షించి త్వరలో పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. కేజీహెచ్లో సరిగా అందని వైద్య సేవలు గిరిజనులకు కేజీహెచ్లో సరైన వైద్యం అందడం లేదని, ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.లక్షలు వసూలు చేస్తున్నారని అనంతగిరి జెడ్పీటీసీ గంగరాజు అందోళన వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి వివరాలు అందజేస్తేవిచారణ చేస్తామని విశాఖపట్నం జిల్లా కలెక్టర్హరేందిర ప్రసాద్ చెప్పారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, గిరిజన ప్రాంతాల నుంచి కేజీహెచ్కు వచ్చే రోగులకు సరైన వైద్య సేవలు అందించాలని జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర సూచించారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి మాట్లాడుతూ అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. సంఘ సమావేశాలు, సర్వ సభ్య సమావేశాలు వేర్వేరుగా నిర్వహించాలని పలువురు సభ్యులు కోరగా అందుకు జెడ్పీ చైర్పర్సన్ అంగీకరించారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి, కె.రాజ్ కుమార్, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. -
గురువులపై ‘మెగా’ భారం
● మెగా పేరెంట్స్– టీచర్స్ మీటింగ్ నిర్వహణకు నిధుల కొరత ● ఆర్భాటంగా నిర్వహించాలని ఆదేశాలు ● ఉపాధ్యాయులకు వదిలిన చేతి చమురు ● ప్రభుత్వ గొప్పల కోసం టీచర్లపై భారం ● అరకొర నిధులు.. హెచ్ఎంల జేబుకు చిల్లు! పాఠశాలల్లో ‘మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ’ నిర్వహణ ఉపాధ్యాయులకు భారంగా మారింది. సమావేశాల కోసం కనీసం రూ.7 వేల నుంచి రూ.30 వేల వరకు పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను బట్టీ ఖర్చవుతుందని అంచనా. అయితే ఇందుకు సంబంధించిన నిధులను ప్రభుత్వం అరకొరగా విడుదల చేయడంతో ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో చాలా మంది ఉపాధ్యాయుల బ్యాంకు ఖాతాలో బుధవారం వరకు కూడా నగదు జమ కాలేదు. మీటింగ్ నిర్వహణకు డబ్బులు ఎక్కడి నుంచి తేవాలంటూ వారు తలలు పట్టుకుంటున్నారు. అనకాపల్లి టౌన్: గిన్నిస్ బుక్ఆఫ్ రికార్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం పడుతున్న తాపత్రయం గురువులు, విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఇటీవల యోగాంధ్ర పేరిట నిర్వహించిన కార్యక్రమంలో పడిన కష్టాలను మరవకముందే గురువుల నెత్తిన మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ పేరిట ప్రభుత్వం మరో భారాన్ని మోపింది. ఇందుకోసం కేటాయించిన అరకొర నిధులు కూడా ఇంతవరకు పలువురు హెచ్ఎంల బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. దీంతో చేతి చమురు వదిలించుకోవాల్సిన పరిస్థితి వస్తోందని హెచ్ఎంలు లోలోపల మదనపడుతున్నారు. గురువారం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం) నిర్వహించాల్సి ఉంది. కష్టపడి మీటింగ్ ఏర్పాటు చేయడంతోపాటు చేతి డబ్బులు కూడా ఖర్చు చేయాలా అంటూ హెచ్ఎంలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం. ప్రతి పాఠశాల, కళాశాలల్లో తల్లిదండ్రుల సమావేశాల నిర్వహణకు రూ.7 వేల నుంచి రూ.30వేల వరకు ఖర్చు అవుతుంది. సమావేశాలకు వచ్చే తల్లిదండ్రులు, వారి పిల్లలకు మాంసాహారంతో కూడిన భోజనం అందించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఉదయం స్నాక్స్,టీ, వాటర్ బాటిళ్లు కూడా పంపిణీ చేయాల్సి ఉంది. వీటన్నింటిని ఉపాధ్యాయ వర్గాలు కొనుగోలు చేశాయి. అలాగే టెంట్లు, కుర్చీలను కూడా అద్దెకు తెచ్చుకుంటున్నారు. ఖర్చులు అధికంగా ఉంటుండడంతో ఆ సొమ్మంతటిని ప్రభుత్వం చెల్లించకపోతే ఆర్థికంగా నష్టపోతామని పలువురు ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఈ విషయం అధికారుల వద్ద చెప్పుకున్నా ఫలితం ఉండదని, వారిలో వారే గుసగుసలాడుకుంటున్నారు. జిల్లాలో 2,11,781 మంది విద్యార్థులు జిల్లాలో 2,232 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 1,87,000 మంది విద్యార్థులు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్, మున్సిపల్, కేజీబీవీ, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ పాఠశాలలు తదితర వాటితో పాటు ప్రైవేట్, అన్ ఎయిడెడ్ సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పాఠశాలలున్నాయి. అలాగే 134 జూనియర్ కళాశాలలున్నాయి. వీటిలో 24,781 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటన్నింటిలోనూ పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహించాలి. తల్లిదండ్రులను సంతోషపెట్టే విధంగా ఉపాధ్యాయులు మెలగాలి. ఈ మేరకు కార్యక్రమ నిర్వహణకు హెచ్ఎంలు సిద్ధమయ్యారు. మౌలిక సౌకర్యాలను పక్కనబెట్టి.. మెగా పేరెంట్స్– టీచర్స్ మీటింగ్ ఇటు ఉపాధ్యాయులు అటు తల్లిదండ్రులకు తలనొప్పి తెస్తోంది. బడులు తెరిచి నెల రోజులు కావస్తున్నా ఏ పాఠశాలలో కూడా పూర్తిస్థాయిలో యూనిఫామ్, షూస్, బెల్ట్లు, పుస్తకాలు అందించలేదు. కొద్ది మందికి మాత్రమే యూనిఫామ్స్ అందజేసి ప్రభుత్వం చేతులు దులుపుకొంది. దీంతో తల్లిదండ్రుల నుంచి ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ విద్యాసంవత్సరంలో కొత్తగా చేరిన విద్యార్థులకు ప్రభుత్వం మొండి చెయ్యి చూపించింది. ఇప్పటికే వివిధ కారణాలతో తల్లికి వందనం ఆపేయడంతో తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. చదువులకు దూరం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత చదువు కన్నా ప్రచార ఆర్భాటాల కార్యక్రమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. మొన్న యోగాంధ్ర పేరుతో వారం రోజుల పాటు చదువులకు దూరమయ్యారని, ఇప్పడు పనికి రాని మీటింగ్లతో వారం రోజుల పాటు చదువులు చెప్ప లేదని వారు వాపోతున్నారు. ఈ మెగా కార్యక్రమం కేవలం ప్రచార ఆర్భాటానికే పనికి వస్తుందని పలువురు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. -
స్మరిస్తూ..
అడుగులో అడుగేస్తూ..అప్పన్ననుసింహాచలం: ఆషాఢ చతుర్దశిని పురస్కరించుకుని బుధవారం సింహగిరి ప్రదక్షిణ వైభవంగా జరిగింది. 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఉదయం 6 గంటల నుంచే చేరుకున్న భక్తులు కొండదిగువ తొలిపావంచా వద్ద కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. ఈసారి కూడా అధిక సంఖ్యలో యువత గిరి ప్రదక్షిణ చేశారు. తొలిపావంచా వద్ద ప్రారంభమైన భక్తుల గిరి ప్రదక్షిణ అడవివరం, పైనాపిల్కాలనీ, సెంట్రల్ జైలు, హనుమంతవాక, విశాలాక్షినగర్, జోడుగుళ్లపాలెం, తెన్నేటి పార్కు, అప్పుఘర్, ఎంవీపీకాలనీ, సీతమ్మధార, నరసింహనగర్, డీఎల్బీ క్వార్టర్స్, కప్పరాడ, మురళీనగర్, మాధవధార, అర్అండ్బీ కార్యాలయం, లక్ష్మినగర్, కుమారి కల్యాణమండపం, ప్రహ్లాదపురం మీదుగా సింహాచలం చేరుకోవడంతో ముగిసింది. వైభవంగా రథయాత్ర కొండదిగువ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి తొలిపావంచా వద్ద బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు రథోత్సవం ప్రారంభమైంది. దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు రథంలో ఉన్న స్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్గజపతిరాజు జెండా ఊపి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఆ సమయానికి తొలిపావంచా వద్దకు చేరుకున్న లక్షలాది మంది భక్తులు స్వామినామస్మరణ చేస్తూ రథాన్ని అనుసరించారు. తొలిపావంచా నుంచి ప్రారంభమైన రథయాత్ర అడవివరం, పైనాపిల్కాలనీ, సెంట్రల్ జైల్, హనుమంతవాక, విశాలాక్షినగర్, జోడుగుళ్లపాలెం, తెన్నేటిపార్కు, అప్పుఘర్, ఎంవీపీ కాలనీ, వెంకోజీపాలెం, సత్యం జంక్షన్, ఎన్ఏడీ కొత్తరోడ్డు, గోపాలపట్నం, ప్రహ్లాదపురం మీదుగా తిరిగి సింహాచలం చేరుకుంది. రథోత్సవం ప్రారంభోత్సవంలో ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, గణబాబు తదితరులు పాల్గొన్నారు. రథోత్సవంలో పులివేషాలు, తప్పెటగుళ్లు, కేరళ డ్రమ్స్, కాళీ వేషాలు విశేషంగా అలరించాయి. స్వచ్ఛంద సంస్థల సాయం గిరి ప్రదక్షిణని పురస్కరించుకుని కలెక్టర్ హరేందిర ప్రసాద్, దేవస్థానం ఈవో వి.త్రినాథరావు ఆధ్వర్యంలో అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. గిరిప్రదక్షిణ జరిగే 32 కిలోమీటర్ల కొండచుట్టూ 30 ప్రదేశాల్లో భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు స్టాల్స్ ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 32 చోట్ల వైద్య శిబిరాలు, 18 అంబులెన్సులు, రెండు సూపర్ స్పెషాల్టీ వైద్య బృందాలు అందుబాటులో ఉంచి భక్తులకు వైద్య సేవలు, మందులు అందజేశారు. జీవీఎంసీ 109 ప్రదేశాల్లో 400 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేసింది. గిరి ప్రదక్షిణ జరిగే ప్రాంతంలో తాగునీరు అందుబాటులో ఉంచింది. పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. దారిపొడవునా స్వచ్ఛంద సంస్థలు భక్తులకు ఆహార పదార్థాలు, స్నాక్స్, పానీయాలు అందజేశాయి. 32 కి.మీ కాదు.. 44 కి.మీ. నడిచారు వీఐపీ, వీవీఐపీ వారిపై ఉన్న శ్రద్ధ సామాన్య భక్తులపై లేదంటూ పోలీసులపై, ప్రభుత్వంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఐపీలకు నేరుగా తొలి పావంచా వద్దకు అనుమతించి.. సామాన్య భక్తుల వాహనాలను మాత్రం ఐదారు కిలోమీటర్ల దూరంలోనే నిలిపివేశారు. దీంతో తొలిపావంచా వరకు నడిచి.. అక్కడి నుంచి 32 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేసి.. మళ్లీ వాహనాల కోసం ఐదారు కిలోమీటర్లు నడిచి.. వాహనాల వద్దకు చేరుకోవాల్సి వచ్చింది. దీంతో దాదాపు 44 కిలోమీటర్లకు వరకు భక్తులు నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమతా కాలేజ్ వద్ద భక్తుల రద్దీ తప్పెటగుళ్లు గిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు ఉదయం 6 గంటల నుంచే ప్రదక్షిణ ప్రారంభించిన భక్తులు మధ్యాహ్నం 2 గంటలకు పుష్పరథం ప్రారంభం మెడికల్ క్యాంపుల ఏర్పాటు మహారాణిపేట: గిరి ప్రదక్షిణ సందర్భంగా డీఎంహెచ్వో డాక్టర్ పి.జగదీశ్వరరావు ఆధ్వర్యంలో మొత్తం 32 పాయింట్లలో మెడికల్ క్యాంపులను నిర్వహించారు. అవసరమైన 23 ప్రాంతాల్లో అంబులెన్సులను సిద్ధం చేశారు. -
ప్రభుత్వం మారాక వేధింపులు మొదలయ్యాయి...
మధ్యాహ్న భోజన కార్మికుల ఆవేదనకోటవురట్ల: 15 ఏళ్లుగా ఇక్కడ వంట చేస్తున్నాం..ప్రభుత్వం మారిన దగ్గరి నుంచి మా పరిస్థితి దారుణంగా మారిపోయింది. వంట ఏజెన్సీ ఎలాగూ మార్చేసుకున్నారు. మమ్మల్ని కూడా తీసెయ్యాలని టార్గెట్ పెట్టుకున్నారు. మాకు మేము పని మానేయాలనే ఉద్దేశ్యంతో మాపై నిందలు వేస్తూ వేధిస్తున్నారు. ఆ నిందలు, తిట్లు భరించలేకపోతున్నాం.. ఇక ఇక్కడ పని చేయలేం అంటూ పాములవాకలోని కిల్లాడ రామ్మూర్తినాయుడు జెడ్పీ హైస్కూల్లో పని చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు ఆవేదన చెందారు. విషయంలోకి వెళ్తే జెడ్పీ హైస్కూల్లో అదే గ్రామానికి చెందిన సుర్ల చంటి, మేడపరెడ్డి రాజు, కూండ్రపు సత్యవతి, ఇందల సన్యాసమ్మ మధ్యాహ్న భోజన పథకంలో 15 ఏళ్లుగా వంట కార్మికులుగా పని చేస్తున్నారు. అయితే కొద్ది కాలంగా తమపై వేధింపులు మొదలయ్యాయని, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి హెచ్ఎం లక్ష్మీనారాయణ తమను వినరాని విధంగా దూషిస్తున్నారని ఆరోపించారు. గుడ్లు, బియ్యం, పప్పులు అన్నీ లెక్కగా ఇస్తున్నా తాము దొంగతనం చేస్తున్నామని ఆరోపిస్తూ దారుణంగా తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై హెచ్ఎం లక్ష్మీనారాయణను వివరణ కోరగా పిల్లలకు పెడుతున్న గుడ్లు, అన్నం తక్కువ వస్తోందని, ఇదేంటని ప్రశ్నిస్తే తనపై తిరగబడుతున్నారని, వారిని దూషించలేదని చెప్పారు. -
నేడే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2.0
● బడి పండగకు ముస్తాబైన పాఠశాలలు, కళాశాలలు ● జిల్లాలో 2232 పాఠశాలలు, 134 జూనియర్ కళాశాలల్లో జరగనున్న కార్యక్రమాలు అనకాపల్లి: జిల్లాలో పాఠశాలల్లో, జూనియర్ కళాశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు గురువారం ఘనంగా నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ విజయకృష్ణన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పేరెంట్స్, టీచర్స్ సమావేశాలు పండగ వాతావరణంలో జరుగుతుందని, జిల్లాలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ పెద్ద ఎత్తున నిర్వహించదానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా రెండో ఏడాది పేరెంట్స్ టీచర్స్ మీట్ జరుగుతుందని, గత ఏడాది కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే జరిగిన ఈ కార్యక్రమాలు ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల్లో, జూనియర్ కళాశాలల్లో నిర్వహించడం విశేషమన్నారు. జిల్లా వ్యాప్తంగా 2232 పాఠశాలల నుంచి సుమారు 1,87,000 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలసి హాజరుకానున్నారు. జిల్లాలో 134 జూనియర్ కళాశాలల నుంచి 24,781 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులతో సహా హాజరు కానున్నారని పేర్కొన్నారు. స్వయంగా విద్యార్థులే ఆహ్వానాలను అందించడం, ఆహ్వానం తో పాటు ఒక ఫార్మాట్ను కూడా ఇవ్వడం , తల్లిదండ్రులు ఆ ఫార్మాట్పై వారి అభిప్రాయాన్ని రాసి తిరిగి సమర్పించేలా రూపొందించామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధికి కావలసిన మౌలిక వసతుల కల్పన, విద్యార్థుల చదువు, భవిష్యత్తు, ఆరోగ్యం తదితర అంశాలపై తల్లిదండ్రులతో, ఉపాధ్యాయులతో చర్చ జరుగుతుందన్నారు. టీచర్, స్టూడెంట్, పేరెంట్స్తో సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థి గత ఏడాది సాధించిన ప్రతిభను, ఈ ఏడాది సాధించవలసిన దాని గురించి చర్చ జరుగుతుందని ఆమె చెప్పారు. -
బల్క్డ్రగ్పార్క్కు అదనంగా భూములు
● 790 ఎకరాల సేకరణకు కేబినెట్ ఆమోదం ● రైతుల నుంచి వ్యతిరేకత నక్కపల్లి: మండలంలో ఏర్పాటు కానున్న బల్క్డ్రగ్ పార్క్కు అదనంగా భూములు కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 790 ఎకరాలు సేకరించేందుకు బుధవారం జరిగిన రాష్ట్రమంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఇప్పటికే బల్క్ డ్రగ్ పార్క్ కోసం ప్రభుత్వం రెండు వేల ఎకరాలు కేటాయించింది. నక్కపల్లి మండలంలో విశాఖ చైన్నె ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణంలో భాగంగా పరిశ్రమల స్థాపన కోసం ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా వేంపాడు, చందనాడ, రాజయ్యపేట, డిఎల్పురం, అమలాపురం, గ్రామాల్లో 4,500 ఎకరాలు సేకరించిన విష యం తెలిసిందే. వీటిలో బల్క్డ్రగ్ పార్క్ కోసం గత ప్రభుత్వ హయాంలోనే రెండు వేల ఎకరాలను కేటాయించారు. ఏపీఐఐసీ సేకరించిన భూముల్లో మరో 2,400 ఎకరాలను ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ ఇండియా స్టీల్ప్లాంట్కు కేటాయించారు. బల్క్డ్రగ్పార్క్కు మరో 790 ఎకరాలు అవసరం కానుంది. దీంతో పెదతీనార్లలో 600 ఎకరాలు, సీహెచ్ఎల్పురంలో 190 ఎకరాలు సేకరించేందుకు ఏపీఐఐసీ నిర్ణయించి ఈమేరకు ప్రభుత్వ ఆమోదానికి పంపింది. బుధవారం జరిగిన కేబినెట్సమావేశంలో ఈ భూములు సేకరించేందుకు ఆమోదం తెలిపింది. రైతులంతా భూములు ఇచ్చేందుకు తీవ్రవ్యతిరేకత చూపుతున్నారు. రైతుల నిరసన, ఆందోళన పట్టించుకోకుండా మంత్రిమండలి భూసేకరణకు అమోదం తెలపడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎకరాకు రూ.37 లక్షలు చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారు. భూసేకరణకు రైతులు ససేమిరా అంటున్నారు. నోటిఫికేషన్ విడుదల చేయకుండా నేరుగా డైరెక్ట్ పర్జేజ్పేరుతో రైతులనుంచి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోంది. ఇలా కొనుగోలు చేస్తే రైతులకు కేవలం నష్టపరిహారం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఎటువంటి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాల్సిన అవసరం లేదు. భూములిచ్చిన రైతులు ఆర్అండ్ఆర్ ప్యాకేజీకింద రూ.25 లక్షలు నష్టపరిహారం డిమాండ్ చేస్తున్నారు.2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని కోరుతున్నారు. -
జాడలేని వరుణుడు
పెందుర్తి: ఏటా ఆషాడ చతుర్దశి నాడు ‘గోవింద’నామస్మరణతో గిరి చుట్టూ తిరిగే సింహాద్రి అప్పన్న భక్తులను వరుణుడు పలకరించడం పరిపాటి. ఎంతలా అంటే గిరి ప్రదక్షిణ రోజు తప్పకుండా వర్షం పడుతుంది అన్నంతగా భక్తుల్లో నాటుకుపోయింది. కానీ ఈ ఏడాది భక్తులకు వరుణుడు మొహం చాటేశాడు. బుధవారం ఉదయం నుంచీ భానుడు నిప్పులు కురిపించాడు. దాదాపు 30 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రతతో భక్తులు ఆపసోపాలు పడ్డారు. అయితే ప్రతీ ఏడాది లాగే సాయంత్రానికి వర్షం పడుతుందన్న ఆశతో ఎదురుచూసిన భక్తులకు నిరాశే ఎదురైంది. రోజంతా చుక్క వాన కాదు కదా కనీసం ఎక్కడా మేఘావృతం కూడా కనిపించలేదు. -
సౌకర్యాలపై జీవీఎంసీ కమిషనర్ ఆరా
అల్లిపురం: గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులకు అందుతున్న సౌకర్యాలను జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పర్యవేక్షించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం సిటీ ఆపరేషన్స్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను బుధవారం అదనపు కమిషనర్ ఎస్ఎస్ వర్మ, పర్యవేక్షక ఇంజినీర్లు పీవీ సత్యనారాయణ రాజు, గోవిందరావులతో కలసి పరిశీలించారు. నడక మార్గంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్కు హెల్ప్లైన్ ద్వారా వచ్చిన ఫిర్యాదులపై ఆరా తీశారు. లుంబినీ పార్కు, వెంకోజీపాలెం వద్ద ఏర్పాటు చేసిన తాగునీటి పాయింట్లను సందర్శించారు. ప్రసాద వితరణ చేపడుతున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. ఎప్పటికప్పుడు వ్యర్థాలను శుభ్రం చేయాలని పారిశుధ్య కార్మికులను ఆదేశించారు. -
పెద్దేరు నదిలో గల్లంతైన మృతదేహం లభ్యం
చోడవరం: పెద్దేరు నదిలో జన్నవరం వంతెన సమీపంలో గల్లంతైన వ్యక్తి మృతదేహం బుధవారం లభ్యమైంది. కె.కోటపాడు మండలం, చౌడువాడ గ్రామానికి చెందిన ఎస్. సన్యాసిరావు (35) చోడవరం మండలం జన్నవరం గ్రామంలో తన బంధువులు ఒకరు మృతిచెందడంతో అతని అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చారు. పెద్దేరు నది ఒడ్డున స్మశాన వాటికలో అంత్యక్రియలు అనంతరం స్నానంచేసేందుకు పక్కనే ఉన్న పెద్దేరు నదిలో అందరితోపాటు సన్యాసిరావు కూడా దిగారు. ప్రమాదశాత్తు నదిలో మునిగిపోయి గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, చోడవరం పోలీసులు ప్రమాదస్థలానికి వచ్చి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. మృతుడు సన్యాసిరావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటి యజమాని మృతిచెందడంతో భార్య, కుటుంబసభ్యులు బోరున విలపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
లాయర్ల కేసుతో బీఎన్ రోడ్డు పనులు ప్రారంభం
● నాసికరంగా చేపడుతున్న పనులు ● పత్తాలేని ఆర్అండ్బీ అధికారులు బుచ్చెయ్యపేట: భీమునిపట్నం, నర్సీపట్నం(బీఎన్) రోడ్డు గోతుల పూడ్చివేత పనులు ప్రారంభమయ్యాయి. ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు శిథిలమై గోతులు పడ్డ బీఎన్ రోడ్డును బాగు చేయాలని ఆందోళనలు, ధర్ణాలు చేపట్టారు. మూడు రోజుల కిందట చోడవరం కోర్టులో బీఎన్ రోడ్డు పనులు చేపట్టాలని ప్రముఖ లాయర్లు కోర్టులో ఫిటిషన్ వేశారు. ఆర్అండ్బీ అధికారులకు, గుత్తేదారులకు కోర్టు అంక్షింతలు వేస్తుందన్న భయంతో ముందుగానే బీఎన్ రోడ్డులో గోతులను కప్పే పనులు చేపట్టారు. అయితే రోడ్డు గోతుల పూడ్చివేత పనులు నిబంధనలు ప్రకారం చేయడం లేదని విమర్శిస్తున్నారు. వడ్డాది, బంగారుమెట్ట, ఎల్బీ పురం, శింగవరం తదితర గ్రామాల వద్ద పెద్ద పెద్ద గోతుల్లో పొక్లెయిన్తో మట్టి వేసి గోతులను కప్పేస్తున్నారు. మట్టిపై తూతూ మంత్రంగా రాయి బుగ్గి వేసి రోడ్డు పనులు చేస్తున్నారు. ఆర్అండ్బీ అధికారులు పరివేక్షణ లేకుండా గుత్తేదార్లు చోడవరం, మాడుగుల ఫరిధిలో ఉన్న బీఎన్ రోడ్డులో పనులు చేపడుతున్నారు. దీనివల్ల ఏ మాత్రం వర్షం కురిసినా మరలా బురదలా రోడ్డు మారి గోతులు పడుతుందని పలువురు వాహనదారులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిధులు వృధా కాకుండా పటిష్టంగా ఆర్అండ్బీ రోడ్డులో పనులు చేపట్టాలని పలువురు ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు. -
అర్లిలో భూసర్వే అడ్డగింత
● సాగులో ఉన్న భూములకు పట్టాలను ఇప్పిస్తారని చెబితే విశ్వసించాం ● ఇప్పుడు భూములు తీసుకుంటామంటే ఎలా? ● ఆవేదన వ్యక్తం చేసిన అన్నదాతలు ● గ్రామ సభ నిర్వహించిన తరువాతే సర్వేకు అంగీకరిస్తామని తేల్చిచెప్పిన రైతులు కె.కోటపాడు: ఎస్ఈజెడ్ పేరిట రెవెన్యూ అధికారులు ఆర్లి రెవెన్యూలో నిర్వహిస్తున్న భూ సర్వేను బుధవారం గ్రామస్తులు, మహిళలు అడ్డుకున్నారు. సర్వే ఎందుకు నిర్వహిస్తున్నారో తెలియజేయాలని, భూముల వివరాలను ఎందుకు నమోదు చేస్తున్నారో చెప్పాలని వీఆర్వో, సర్వేయర్లను డిమాండ్ చేశారు. తమ భూముల వివరాలను నమోదు చేసేందుకు అంగీకరించబోమని వారు స్పష్టం చేశారు. గ్రామసభ నిర్వహించిన తరువాత సర్వే జరపాలి తప్ప, గ్రామసభ జరగకుండా ఈ విధంగా రైతుల భూముల వివరాలను నమోదు చేయడం తగదన్నారు. సాగులో ఉండి, పట్టాలు లేని రైతులకు పట్టాలు మంజూరు చేసేందుకు ఇది వరకూ ఈ ప్రాంతానికి వచ్చిన ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ హామీ ఇచ్చారని, ఇప్పుడు ఈ భూములను సర్వే చేసి, ఎస్ఈజెడ్కు కేటాయిస్తే ఏ విధంగా తామంతా జీవనం సాగించాలని మహిళలు కాళ్ళ నాగమణి, బోళెం నారాయణమ్మ, యడ్లంకి పైడమ్మ, మునగపాక లక్ష్మి, రుత్తుల పార్వతి, దమ్ము లక్ష్మి, తాళ్ళ పార్వతి సిబ్బందిని ప్రశ్నించారు. మా భూములను లాక్కుంటే రోడ్డుపై పడవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేటాయించిన డీపట్టా భూములను తామంతా తాతముత్తాతల నుంచి లక్షలాది రూపాయలు వెచ్చించి సాగుకు అనుకూలంగా తీర్చిదిద్దుకున్నట్టు మాజీ సర్పంచ్ బోళెం కృష్ణారావు, బోళెం కాసుబాబు, రుత్తుల పాత్రుడు, కక్కల అప్పలనాయుడు తెలిపారు. ఎటువంటి సమాచారం లేకుండా బలవంతంగా సర్వేను చేపట్టి వివరాలను నమోదు చేయడం తగదన్నారు. సాగులో ఉన్న ఈ భూములపై హక్కులను వదులుకోవాలంటే మా కుటుంబాల పరిస్థితి ఏంటని రెవెన్యూ అధికారుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేను అడ్డుకున్న సమాచారాన్ని సిబ్బంది రెవెన్యూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. సర్వే ప్రాంతం వద్దకు కె.కోటపాడు సీఐ పైడపునాయుడు, కె.కోటపాడు ఇన్చార్జ్ ఎస్ఐ లక్ష్మీనారాయణ చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది ఈ ప్రాంతంలో సర్వేను చేపడుతున్నారని, సహకరించాలని గ్రామస్తులను కోరారు. గ్రామసభ నిర్వహించకుండా సర్వే చేయడం తగదని గ్రామస్తులు పోలీసులకు తెలపడంతో గ్రామసభను నిర్వహించిన తరువాతే సర్వే చేపట్టే చర్యలను తీసుకోవాలని రెవెన్యూ సిబ్బందికి సీఐ పైడపునాయుడు తెలిపి వెళ్లిపోయారు. -
కదంతొక్కిన కార్మికలోకం
నర్సీపట్నం: లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కార్మిక హక్కులు, కనీస వేతనాలు, ఇతర సామాజిక చట్టాలు తేవాలన్న డిమాండ్తో నిర్వహించిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నర్సీపట్నంలో బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో వివిధ ప్రజాసంఘాలు, వామపక్ష పార్టీలు భారీ ర్యాలీ నిర్వహించాయి. అబిడ్స్ జంక్షన్ నుంచి ఆర్డీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ కొనసాగింది. మానవహారంగా ఏర్పడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలేపల్లి వెంకటరమణ మాట్లాడుతూ బీజేపీ మూడోసారి అధికారం చేపట్టిన తరువాత సంపద సృష్టికర్తలైన కార్మికులను, రైతులను పట్టించుకోవడం లేదన్నారు. నల్ల చట్టాలను అమలు చేస్తున్నారని విమర్శించారు. విశాఖ స్టీల్, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్మిక కుటుంబాలను వీధిన పడేస్తున్నారని ఆరోపించారు. 12 గంటల పనిదినాలను అమలు చేస్తున్నారన్నారు. ఇప్పటికే ఎల్ఐసీ, బ్యాంకుల ఉద్యోగులు పని గంటల భారంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరకు చట్టం చేయాలన్నారు. ఆశా, మిడ్డేమీల్, అంగన్వాడీ కార్యకర్తలపై యాప్ల భారం పెంచుతున్నారని, సమ్మెకాలం ఒప్పందాలను అమలు చేయటం లేదని, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులకు, స్కీమ్ వర్కర్లకు సంక్షేమ పథకాలను అమలు చేయటం లేదన్నారు. 104,108 యాజమాన్యాలు ఉద్యోగులకు కార్మిక చట్టాలను అమలు చేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ యూనియన్ రీజినల్ నాయకుడు పి.సాయికిరణ్, గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పి.ధనార్జన్, ఎల్ఐసీ బ్రాంచ్ యూనియన్ నాయకుడు కె.కె.వి. పడాల్, ఏజెంట్లు అసోసియేషన్ నాయకుడు వి.శ్రీరామ్మూర్తి, ఎస్డబ్ల్యూఎఫ్ జిల్లా అధ్యక్షుడు యు.కె.రావు, పలు సంఘాల నాయకులు వి.సామ్రాజ్యం, అరుణ, ఒమ్మి నూకరాజు, కె.రామకృష్ణ, సత్తిబాబు, శివ, కె.నానాజీ, బాబురావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు, సీపీఐ నాయకులు జి.గురుబాబు, కె.లక్ష్మి, రాధాకృష్ణ, శ్రీరామ్మూర్తి, చిన్ననాయుడు, మేకా సత్యనారాయణ, శివలంక కొండలరావు, శ్రీనివాసరావు, భాస్కరరావు, భవాని తదితరులు పాల్గొన్నారు. లేబర్ కోడ్స్ చట్టాలను రద్దు చేయాలిఅనకాపల్లి టౌన్: కేంద్ర ప్రభుత్వం దొడ్డి దారిన తీసుకు వచ్చిన లేబర్ కోడ్స్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా బుధవారం పలు కార్మిక సంఘాలు అనకాపల్లి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించాయి. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజాన దొరబాబు ఆధ్వర్యంలో సీపీఐ కార్యాలయం నుంచి నాలుగురోడ్ల జంక్షన్, ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు చట్టాలను రద్దు చేయాలని, యథావిధిగా కార్మిక చట్టాలను కొనసాగించాలని, భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు త్రినాఽథ్, భద్రరావు, వీరాచారి, చైతన్య, వియ్యపు రాజు తదితరులు పాల్గొన్నారు. చోడవరం బస్టాప్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు కోన లక్షణ్ మాట్లాడుతూ ముఠా కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐతో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ఏఐటీయూసీ నాయకుడు వైఎన్ భద్రం మాట్లాడుతూ ఆటో కార్మికులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఆటో కార్మికులకు వాహనమిత్ర పథకం కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామన్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు శ్రీరామదాసు అబ్బులు,మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు బంగారు రవి, రిక్షా కార్మికుల సంఘం నాయకులు సూదికొండ మాణిక్యాల రావు తదితరులు పాల్గొన్నారు. -
రైతుల పక్షాన ప్రశ్నిస్తే అడ్డంకులు సృష్టించడం దారుణం
దేవరాపల్లి: రైతుల పక్షాన నిలబడి ప్రశ్నిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి పర్యటనలకు అడ్డంకులు సృష్టించడం దారుణమని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. దేవరాపల్లి మండలం తారువ లో బుధవారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మామిడి రైతుల కష్టాలను తెలుసుకునేందుకు వెళ్లిన వైఎస్ జగన్కు అడుగడుగునా ఆటంకాలు సృష్టించడం సిగ్గుచేటన్నా రు. గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోలేని చంద్రబాబు ప్రభుత్వం..రైతు సమస్యలపై ప్రశ్నించేవారి గొంతును నొక్కాలని చూడటం సమంజసం కాదని తీవ్రంగా మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు రైతులు, ప్రజలు, కార్యకర్త లు రాకుండా పోలీసులు చెక్పోస్టులను పెట్టి అడ్డుకోవడంతో పాటు నోటీసులు జారీ చేసి, రౌడీ షీట్లు తెరుస్తామంటూ భయానక పరిస్థితులు సృష్టించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. వరి, మిర్చి, పొగాకు రైతు లు గిట్టుబాటు ధర లేక దయనీయ పరిస్థితులు ఎదు ర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను పరామర్శించేందకు పర్యటిస్తున్న వైఎస్ జగన్కు వస్తు న్న జనాదరణ చూసి జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని అవాంతరాలు సృష్టిస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, ప్రతిపక్ష నాయకుడిగా పార్టీ కార్యక్రమా లు నిర్వహించుకునే పరిస్థితి లేదన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలను అడ్డుకోవడంపై పెట్టిన శ్రద్ధను రైతు సమస్యలను పరిష్కరించడంపై ప్రభు త్వం పెడితే బాగుండేదన్నారు. రైతులపై దాడులు చేసి అవమానకరంగా మాట్లాడటం మంచిపద్ధతి కాదని, వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ పర్యటిస్తే కూటమి ప్రభుత్వానికి భయమెందుకు ? పోలీసులను అడ్డం పెట్టుకొని ఆటంకాలు సృష్టించడం సిగ్గుచేటు కూటమి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ధ్వజం -
సైడ్ లైట్స్
● గిరి ప్రదక్షిణ ప్రారంభించేందుకు ఉదయం 6 గంటల నుంచే భక్తులు సింహాచలం చేరుకున్నారు. ఉదయం 11 గంటల నుంచి ఒక్కసారిగా రద్దీ పెరిగింది. మధ్యాహ్నం రెండు గంటలకు రథోత్సవం ప్రారంభం సమయానికి తొలిపావంచా నుంచి పాత అడవివరం జంక్షన్ వరకు ఇసుకేస్తే రాలనంతగా భక్తులు బీఆర్టీఎస్ రోడ్డులో కిక్కిరిశారు. ● ఉదయం 6 గంటలకే గిరి ప్రదక్షిణ ప్రారంభించిన పలువురు భక్తులు సాయంత్రానికే తిరిగి సింహాచలం చేరుకున్నారు. వారందరికీ రాత్రి 9 గంటల వరకు స్వామి దర్శనాలు అందజేశారు. ● తొలిపావంచా వద్దకు వెళ్లలేని భక్తులు రోడ్లపైన, బీఆర్టీఎస్ రోడ్డును ఆనుకుని ఏర్పాటుచేసిన గోడపైన కొబ్బరికాయలు కొట్టారు. దీంతో తొలిపావంచా వద్ద రోడ్డుపైనే కొబ్బరికాయచెక్కల కుప్ప పెద్ద ఎత్తున ఏర్పడింది. ● భక్తులు కొట్టిన కొబ్బరి చెక్కలు తరలించేందుకు క్రేనులు, లారీలు ఏర్పాటు చేశారు. ● దేవస్థానం బస్టాండ్లో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. అయినా తప్పిపోయిన వాళ్ల బంధువులు అక్కడికి వెళ్లడానికి ఇబ్బందులు పడ్డారు. ● తొలిపావంచా ఎదురుగా మధ్యాహ్నం నుంచి కొండపైకి వెళ్లే ఆర్టీసీ బస్సులు పెద్ద ఎత్తున నిలపడంతో.. అక్కడకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ● పారిశుధ్య నిర్వాహణలో జీవీఎంసీ దారుణంగా విఫలమైంది. భక్తుల రద్దీ తక్కువగా ఉన్నప్పుడు కొద్దిపాటి చెత్తను ఎప్పటికప్పుడు ఎత్తిన జీవీఎంసీ సిబ్బంది.. సాయంత్రం భక్తుల రద్దీ పెరిగేసరికి చేతులెత్తేశారు. మేయర్, అధికారుల పర్యవేక్షణ లోపంతో ఎక్కడిక్కడే చెత్త పేరుకుపోయింది. ● 32 కిలోమీటర్లతో పాటు ట్రాఫిక్ ఆంక్షల కారణంగా మరో పది కిలో మీటర్లు అదనంగా నడిచిన భక్తులు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడ్డారు. ● గిరి ప్రదక్షిణలో మూడేళ్ల నుంచి ఐదేళ్లలోపు పిల్లలు తప్పిపోకుండా వారి చేతులకు ఏఐ ట్యాగ్లు వేశారు. గత ప్రభుత్వం హయాంలో ఈ విధానాన్ని అమలు చేయగా, ఈ ఏడాది కూడా అధికారులు కొనసాగించారు. చోరుల చేతివాటం గిరి ప్రదక్షిణ వేళ చోరులు చేతివాటం ప్రదర్శించారు. సింహచలం తొలి పావంచ మొదలుకొని అడవివరం, ఆరిలోవ, హనుమంతవాక, నగరంలో పలు చోట్ల మహిళల మెడలో బంగారు ఆభరణాలతో పాటు సెల్ఫోన్లు, నగదు దొంగిలించినట్లు ఆయా ప్రాంతాల్లోని పోలీసులకు బాధితులు ఫిర్యాదులు చేశారు. -
నీటి వసతి ఉంటే అయిల్పామ్ సాగు మేలు
నాతవరం: ఆయిల్ పామ్ తోటలు సాగు చేయడం ద్వారా అన్ని విధాలుగా బాగుంటుందని వైఎస్సార్సీపీ సినియర్ నేత రాష్ట్ర అయిల్ ఫామ్ కార్పోరేషన్ మాజీ డైరెక్టరు పైల పోతురాజు అన్నారు. మండల కేంద్రంలో బుధవారం ఆయిల్పామ్ తోటల విస్తరణ మహోత్సవం సందర్భంగా అయిల్పామ్ తోటలు సంఘం జిల్లా అద్యక్షుడు పి.వి.సీతారామరాజు ఆధ్వర్యంలో రైతులు సమావేశం నిర్వహించారు. పోతురాజు మాట్లాడుతూ తాను 1997 సంవత్సరం నుంచి అయిల్పామ్ తోటలు సాగు చేస్తున్నారన్నారు. గత వైఎస్సార్సీపీ హయాంలో కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టరుగా పని చేశానని, ఆ సమయంలో ఆయిల్పామ్ ధర బాగుందన్నారు. ప్రస్తుతం ఇతర వ్యవసాయ పంటలతో పోల్చుకుంటే అయిల్పామ్ తోటలు సాగు చేయడం లాభదాయకమన్నారు. కూలీల సమస్యతో పాటు దళారులు ఉండరని మార్కెట్ సదుపాయం ఉంటుందని తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షుడు సీతారామరాజు మాట్లాడుతూ నీటి వసతి ఉన్న భూములలో అయిల్పామ్ తోటలు వేసేందుకు అసక్తి చూపాలని తోటలో అంతర పంటలు వేయాలన్నారు. పంతాంజలి సంస్థ మేనేజర్ చంద్రశేఖర్, కె.రమేష్ యాంత్రీకరణ, ఎరువుల వాడకం, గెలల కోత తదితర అంశాలపై రైతులకు వివరించారు. తాండవ ప్రాజెక్టు మాజీ చైర్మన్ పారుపల్లి కొండబాబు, వల్సంపేట సర్పంచ్ ఇట్టంశెట్టి శ్యామల, వైఎస్సార్సీపీ సీనియర్ నేత శ్రీనివాస్ పామాయిల్ కంపెనీ అసిస్టెంటు మేనేజరు నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
850 కిలోల గంజాయి స్వాధీనం
అనకాపల్లి/సూళ్లూరుపేట: రాష్ట్రంలోని రెండు వేర్వేరు జిల్లాల్లో 850 కిలోల గంజాయిను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. పదిమందిని అరెస్టు చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిపోలీస్ స్టేషన్ పరిధి వెదుళ్లపాలెం జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒడిశా నుంచి కర్ణాటకకు బొలేరో వాహనంలో తరలిస్తున్న 840 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నక్కపల్లి పోలీస్స్టేషన్ సీఐ కె.కుమారస్వామి ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీచేస్తుండగా, ఒక బొలెరో వాహనంలో 20 బ్యాగుల్లో 840 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. దాని విలువ రూ.42 లక్షలు ఉంటుందన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం మామిడిపాలేనికి చెందిన సుక్రీ అర్జున్, డేగలపాలేనికి చెందిన వంతల సురేశ్, పెద్దపేటకు చెందిన కొదమ నాగరాజు, పాంగి అర్జునరావు కలిసి ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లా అటవీప్రాంతాల్లో గంజాయి కొనుగోలుచేసి «డౌనూరు చెక్ పోస్ట్ వద్ద పోలీసులను తప్పించుకుని నర్సీపట్నం తీసుకొచ్చారని తెలిపారు. అక్కడ నుంచి కర్ణాటకకు తరలించేందుకు పెద్దపేటకు చెందిన పాంగి అర్జునరావు, చింతపల్లికి చెందిన వంతల సురేశ్, రోలుగుంటకు చెందిన కైసర్ల దివాకర్, నక్కపల్లికి చెందిన యలమంచిలి రమణ సిద్ధమవుతుండగా పట్టుకున్నట్టు తెలిపారు. సుక్రీ అర్జున, కొదమ నాగరాజులను త్వరలో పట్టుకుంటామని చెప్పారు. సూళ్లూరుపేటలో ఆరుగురు అరెస్ట్ తిరుపతి జిల్లా సూళ్లూరుపేట కేంద్రంగా గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు చేస్తున్న ఆరుగురిని బుధవారం పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 10 కిలోల గంజాయి, నాలుగు సెల్ఫోన్లు, బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్ను స్వాదీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మురళీకృష్ణ మాట్లాడుతూ షార్కు వెళ్లే మార్గంలోని చెంగాళమ్మ లేఅవుట్కు చెందిన కంపా చంద్రకాంత్ (28), విజయవాడ ఆర్ఆర్ పేటకు చెందిన అంకాల భరత్ కౌశల్ అలియాస్ కౌశిక్ (28), తడమండలం వెండ్లూరుపాడుకు చెందిన బూరగ తేజ (23), సూళ్లూరుకు చెందిన మొండెం శైలేష్ (21), తడమండలం అనపగుంటకు చెందిన పరింగి నరేంద్ర (30), సూళ్లూరు నాగరాజపురానికి చెందిన వేనాటి శ్రీ (20)ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు చెప్పారు. గంజాయి విలువ రూ.2 లక్షలు ఉంటుందన్నారు. -
ఆత్మహత్యాయత్నం చేసిన వివాహిత మృతి
అచ్యుతాపురం రూరల్ : భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసిన రుత్తల హేమలక్ష్మి(32) చికిత్స పొందుతూ మృతి చెందినట్టు అచ్యుతాపురం ఎస్ఐ సుధాకర్రావు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. లాలం కోడూరు గ్రామానికి చెందిన హేమలక్ష్మి, భర్త రుత్తల శ్రీను అచ్యుతాపురం మండలం భోగాపురం గ్రామంలో ఒక అపార్ట్మెంట్లో నివాసముంటున్నారు. భర్త వేధింపులు తాళలేక ఆమె ఆదివారం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే ఆమెను విశాఖలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అచ్యుతాపురం ఎస్ఐ తెలిపారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ఏపీఐఐసీ భూములు పరిశీలించిన బీడీఎల్ ప్రతినిధులు
బీడీఎల్ ప్రతినిధులతో మాట్లాడుతున్న తహసీల్దార్ వెంకటరమణ మాకవరపాలెం: ఏపీఐఐసీ ఆధీనంలో ఉన్న భూములను మంగళవారం భారత్ డైనమిక్ లిమిటెడ్(బీడీఎల్) ప్రతినిధులు పరిశీలించారు. మండలంలోని రాచపల్లి రెవెన్యూలో 300 ఎకరాల భూమి ఏపీఐఐసీ ఆధీనంలో ఉంది. దీనిని పరిశ్రమల స్థాపనకు కేటాయించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం బీడీఎల్ ప్రతినిధులు రా మన్నపాలెం ప్రాంతంలో ఉన్న భూముల్లో పర్యటించారు. వారికి స్థానిక తహసీల్దార్ వెంకటరమణ భూముల వివరాలను తెలియజేశారు. విశాఖ–నర్సీపట్నం ప్రధాన రహదారి నుంచి ఈ భూముల్లోకి వెళ్లే రహదారులను కూడా పరిశీలించారు. -
అమర్నాథ్ పర్యటనతో గతుకుల రోడ్డుకు మోక్షం
రోలుగుంట: వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పర్యటనతో రోలుగుంట వద్ద భీమిలి– నర్సీపట్నం రోడ్డులో ప్రమాదకర గోతులకు మోక్షం కలిగింది. ఈ రోడ్డు అభివృద్ధికి మోకాలడ్డుతూ వచ్చిన టీడీపీ నాయకులు ప్రస్తుతం అధికారంలో ఉన్నా బాగు చేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో కొత్త చెరువు మలుపు నుంచి పీఏసీఎస్ వరకూ ఈ రోడ్డులో ప్రమాదకర గోతుల్లో వాహనదారులు సర్కస్ ఫీట్లు చేయాల్సి వచ్చేది. అదుపు తప్పి వాహనాలు బోల్తా పడితే గాయాల పాలయ్యేవారు. ఇదిలా వుంటే ఈ నెల 6న రోలుగుంటలో పార్టీ మండల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశ స్థలం వరకూ పార్టీ నాయకులు, కార్యకర్తలు బైకు ర్యాలీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ ర్యాలీలో ఏ విధమైన ప్రమాదాలకు తావులేకుండా పీఏసీఎస్ నుంచి సమావేశం ఏర్పాటు చేసిన ఆర్సీఎం చర్చి వరకూ గోతుల పూడ్చే పనులను ఈ నెల 5, 6 తేదీల్లో పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు చెట్టుపల్లి వెంకట్రావు చేయించారు. వైఎస్సార్సీపీ నాయకులు తమ సొంత నిధులతో గోతులు పూడ్చటంతో వాహన చోదకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాంతో ప్రతిపక్ష పార్టీకి క్రెడిట్ రావడంతో టీడీపీ నాయకులు మేల్కొని మంగళవారం మరికొన్ని గోతులు పూడ్చే పనులు చేపట్టారు. ఏదేమైనప్పటికీ ఈ సమస్య మెరుగుకు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పర్యటన ఎంతో మేలు చేసిందని స్థానికులు, వాహనచోదకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ● సొంత నిధులతో బాగు చేసిన వైఎస్సార్సీపీ నాయకులు -
చికిత్స పొందుతూ క్షతగాత్రుడు మృతి
కశింకోట: కశింకోట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ఐ కె.లక్ష్మణరావు మంగళవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. స్థానిక గ్రామీణ వికాస బ్యాంకు వద్ద తేగాడ వైపు వెళుతున్న బైక్ను వెనుక నుంచి టాటా ఏస్ వాహనం ఈ నెల 3న ఢీకొంది. దీంతో బైక్ నడుపుతున్న తేగాడకు చెందిన మామిడి బాబు(58) తీవ్రంగా గాయపడడంతో అనకాపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య చిన్ని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
నిర్వాసితులకు న్యాయం చేయాలి
● ఆర్డీవోకు వైఎస్సార్సీపీ నేతల వినతినక్కపల్లి: బల్క్ డ్రగ్ పార్క్, స్టీల్ప్లాంటు ఏర్పాటు కోసం ఏపీఐఐసీకి భూములు ఇచ్చిన నిర్వాసితులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించాలని వైఎస్సార్సీపీ నాయకులు మంగళవారం నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణను కోరారు. కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీవోను కలిశారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయలేదన్నారు. నిర్వాసిత కుటుంబాల్లో మేజర్లయిన మహిళలు, పురుషులకు సమానంగా ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.25 లక్షల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలన్నారు. ఇంటి స్థలంతో పాటు, ఇల్లు నిర్మాణానికి రూ.10 లక్షలు ఇవ్వాలని కోరారు. డీఫారం, ప్రభుత్వ సాగు భూముల్లో ఉన్న ఫలసాయానికి నష్ట పరిహారం చెల్లించాలని కోరారు. ప్రకటించిన లబ్ధిదారుల జాబితాలను పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని, అనర్హులను తొలగించి అర్హులను చేర్చాలని ఆర్డీవోకు విజ్ఞప్తి చేశారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తే పనులు చేపట్టేందుకు సహకరిస్తామని నాయకులు హామీ ఇచ్చారు. అనంతరం వీసం రామకృష్ణ విలేకర్లతో మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని చాలా రోజుల నుంచి నిర్వాసితులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం, ఏపీఐఐసీ పట్టించుకోలేదని ఆరోపించారు. పోలీసుల సాయంతో నిర్వాసితులను బెదిరించి పనులు కొనసాగిస్తున్నారన్నారు. అభివృద్ధిని అడ్డుకోకూడదన్న ఉద్దేశంతోనే వైఎస్సార్సీపీ శాంతియుతంగా పోరాటం చేస్తోందన్నారు. కేసులకు భయపడే ప్రసక్తి లేదని, మత్స్యకారులకు, నిర్వాసితులకు అండగా ఉద్యమిస్తామన్నారు. గతంలో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం పోరాటం చేసిన కూటమి నేతలు ఇప్పుడు ముఖం చాటేశారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పడు ఓట్ల కోసం రాజకీయాలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గోసల కాసులమ్మ, వైస్ ఎంపీపీ వీసం నానాజీ, సర్పంచ్లు భార్గవ్, ఎంపీటీసీ తిరుపతిరావు, గోవిందు, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు, తళ్ల అప్పలస్వామి, తదితరులు పాల్గొన్నారు. -
● ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థుల ర్యాలీ, మానవహారం ● మంత్రి లోకేశ్, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
ఫీజు బకాయిల కోసం ఆందోళన బాట యలమంచిలి రూరల్: పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు రూ.6400 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో యలమంచిలి పట్టణంలో మంగళవారం విద్యార్థులు ఆందోళనబాట పట్టారు. పట్టణంలో వైఎస్సార్ కూడలి వద్ద మానవహారం నిర్వహించిన విద్యార్థులు అక్కడి నుంచి ప్రధాన రహదారిపై తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. యువగళం పాదయాత్ర సమయంలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారంలోకి రాగానే ఫీజులు, హాస్టళ్ల నిర్వహణ బకాయిలు విడుదల చేస్తామని, జీవో నంబరు 77ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి ఏడాది దాటుతున్నా ఇప్పటి వరకు హామీ నెరవేర్చలేదని ఆరోపిస్తూ విద్యార్థి సంఘం నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బ్యానర్లు ప్రదర్శించి నిరసన తెలిపారు. అనంతరం యలమంచిలి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన కొనసాగించిన విద్యార్థులనుద్దేశించి ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాబ్జీ, ఫణీంద్ర మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా వ్యవహరించడం ప్రజాప్రతినిధులకు తగదన్నారు. కళాశాలలకు ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదన్నారు. కొందరు విద్యార్థులు సర్టిఫికెట్లు రాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పీజీ విద్యార్థులకు ఫీజులు ఎగ్గొట్టే జీవో నంబరు 77ను రద్దు చేయాలన్న డిమాండ్తో ఈ నెల 11న జిల్లాల కలెక్టరేట్ల వద్ద మహా ధర్నా చేయనున్నట్టు వారు తెలిపారు. దీనిని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ వినయ్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కమిటీ సభ్యుడు కె.మణికంఠ, వివిధ ప్రైవేటు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. -
పారిశుధ్య సమస్యకు తొలి ప్రాధాన్యం
●నూతన జోనల్ కమిషనర్ చక్రవర్తి అనకాపల్లి టౌన్: పారిశుధ్య సమస్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తానని జీవీఎంసీ నూతన జోనల్ కమిషనర్ కె.చక్రవర్తి తెలిపారు. ఆయన మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పనిచేసిన అనుభవం ఉందని, అనకాపల్లి పట్టణంలోని పరిస్థితులు తనకు తెలసునన్నారు. సమస్యలపై ప్రజలు తనను నేరుగా కలవచ్చన్నారు. ఇక్కడి ప్రజా ప్రతినిధులు, ప్ర జల సహకారంతో పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానన్నారు. విశాఖపట్నంలో వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఆయన డిప్యుటేషన్పై జోనల్ కమిషనర్గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు మాతృశాఖ నుంచి అనుమతి లభించింది. -
ఎన్టీఆర్ ఆస్పత్రి కార్మికుల తొలగింపునకు కూటమి కుట్ర
● మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ విల్లూరి పైడారావు అనకాపల్లి: చాలీచాలని జీతాలతో ఎన్టీఆర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను విధుల నుంచి తొలగించడం అన్యాయమని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, ఎన్టీఆర్ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ మాజీ మెంబర్ విల్లూరి పైడారావు తెలిపారు. ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక గవరపాలెంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ వైద్యాలయంలో ఇప్పటికే ముగ్గురు పారిశుధ్య కార్మికులను తొలగించారన్నారు. మిగిలిన 9 మందిని తొలగించడానికి కుట్ర పన్నుతున్నారన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా శానిటేషన్ వర్కర్లను మార్చవద్దని కోరారు. ప్రస్తుత కొత్త అడ్వైజరీ కమిటీ సభ్యుడు కాంట్రాక్టర్ని బెదిరించి తన మనుషుల్ని వేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యేతో ఆస్పత్రి అధికారికి చెప్పడం అన్యాయమన్నారు. ప్రజా సంఘాల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చిన్ని యాదవ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్యాలయాన్ని రాజకీయాల వేదికగా మార్చొద్దన్నారు. అడ్వైజరీ కమిటీ సభ్యులు వైద్యాలయాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేయాలన్నారు. అంబేడ్కర్ సేవా సమితి జిల్లా కోఆర్డినేటర్ బండి అప్పారావు మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్యాలయంపై పూర్తి దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కొల్లి చిన్నప్పారావు, బొడ్డు సోమరాజు, ఆడారి బుచ్చిరాము, పల్లా సత్య అప్పారావు, వాసుపల్లి తాతయ్యలు, కుంచావారి చిన్ను, కాండ్రేగుల రామలింగేశ్వరరావు, దాడి నూక అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయ భూములు సెజ్కు ఇచ్చేది లేదు
● సీపీఎం నాయకులతో కలిసి ఆర్లి గ్రామస్తుల నిరసనకె.కోటపాడు: మండలంలోని ఆర్లి గ్రామంలో వ్యవసాయ భూములను సెజ్కు కేటాయించొద్దని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు డి.వెంకన్న తెలిపారు. మంగళవారం ఆర్లిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి స్థానిక సచివాలయం వద్ద సెజ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సెజ్ ఏర్పాటుకు రెవెన్యూ అధికారులు రహస్య సర్వేలు చేపట్టడాన్ని వెంకన్న తప్పుబట్టారు. ఎస్ఈజెడ్కు స్థలం కేటాయింపులు ఏ జోన్ (రెడ్, ఆరెంజ్, గ్రీన్) కిందకు వస్తాయో..ముందుగా వివరించాలని కోరారు. కె.కోటపాడు, దేవరాపల్లి, చీడికాడ, మాడుగుల, చోడవరం నియోజకవర్గాలు కాలుష్య రహిత జీవనం సాగిస్తున్నారన్నారు. ఇప్పుడు కంపెనీల ఏర్పాటుతో ఈ ప్రాంతం కాలుష్యమయ్యే పరిస్థితి ఏర్పడనుందని ఆందోళన వ్యక్తం చేశారు. యువతకు ఉపాధి కల్పిస్తామని నమ్మించి విషం చిమ్మే కంపెనీలను తీసుకువచ్చి ప్రజల ప్రాణాలను, పొలాలను నాశనం చేయొద్దన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు యర్రా దేముడు, గండి నాయినిబాబు, రొంగలి ముత్యాలనాయుడు, స్థానికులు ఆర్.ఎ.పాత్రుడు, రుత్తల గోవింద, బోళెం కాసుబాబు, ఎం.సోమేష్, నాగేష్, పైడిరాజు పాల్గొన్నారు. -
ఖైనీ, గుట్కా అమ్మకాలపై పోలీసుల దాడులు
నర్సీపట్నం: టౌన్, రూరల్ పోలీసులు మంగళవారం పాన్ షాప్లపై మెరుపుదాడులు నిర్వహించారు. నీలంపేట, గబ్బాడ, చెట్టుపల్లి గ్రామాల్లోని పాన్షాపుల్లో రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ సిబ్బందితో కలిసి తనిఖీలు చేచేశారు. గుట్కా, ఖైనీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని షాపు యజమానులపై కేసులు నమోదు చేశారు. నర్సీపట్నం టౌన్లోని పాన్షాపుల్లో సీఐ గోవిందరావు, ఎస్ఐ రమేష్, సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఖైనీ, గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. పాఠశాలలు, కాలేజీలకు వంద మీటర్లలోపు నిషేధిత మత్తు పదార్థాలు అమ్మితే శిక్షార్హులు అవుతారని సీఐ రేవతమ్మ వ్యాపారులను హెచ్చరించారు. -
సంపద తయారీ కేంద్రాలతో అదనపు ఆదాయం
వెంకటాపురంలో పర్యటిస్తున్న జిల్లా పరిషత్ సీఈవో నారాయణమూర్తి మునగపాక: సంపద తయారీ కేంద్రాల ద్వారా పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూరుతుందని జిల్లా పరిషత్ సీఈవో నారాయణమూర్తి తెలిపారు. మండలంలోని వెంకటాపురంలో మంగళవారం ఆయన పర్యటించారు. గ్రామంలో పారిశుధ్యం అమలు తీరుతో పాటు సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. ఇంటి ముందు నీటి నిల్వలు లేకుండా చూడాలన్నారు. చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా బుట్టలో వేసుకోవాలన్నారు. సర్పంచ్ సుందరపు తాతాజీ, ఎంపీడీవో ఎం.ఉషారాణి, ఈవోఆర్డీ సోమరాజు, పంచాయతీ కార్యదర్శి బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
ఏర్పాట్లు ఇలా..
● సింహాచలంలోని తొలిపావంచా వద్ద బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు దేవస్థానం అనువంశిక ధర్మకర్త అశోక్గజపతిరాజు కొబ్బరికాయ కొట్టి రథం ప్రారంభిస్తారు. ● అక్కడ భక్తులు కొబ్బరి కాయలు కొట్టేందుకు 45 క్యూలు, 100 ఇనుమ గడ్డర్లు ఏర్పాటు చేశారు. ● అడవివరం–హనుమంతవాక బీఆర్టీఎస్ మార్గంలో రెండో టోల్గేట్ వద్ద నుంచి ప్రదక్షిణ ప్రారంభించే భక్తుల సౌకర్యార్ధం కొబ్బరికాయలు కొట్టేందుకు 20 ఇనుమ గడ్డర్లు ఏర్పాటు చేశారు. అక్కడ స్వామివారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేశారు. ● 177 శాశ్వత మరుగుదొడ్లకు అదనంగా మరో 500 తాత్కాలిక మరుగుదొడ్లు జీవీఎంసీ ఏర్పాటు చేసింది. ● వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు షిఫ్ట్కి 640 మంది చొప్పున మూడు షిఫ్ట్లకు 1,920 మంది కార్మికులను ఏర్పాటు చేశారు. ● ప్రతీ 200 మీటర్లకు ఒకటి చొప్పున మొత్తం 132 తాగునీటి పాయింట్లు జీవీఎంసీ ఏర్పాటు చేసింది. ● అప్పుఘర్ వద్ద 5 బోట్లు, 60 మంది గజ ఈతగాళ్లు, హైపవర్ లైటింగ్ ఏర్పాటు చేశారు. ● 32 చోట్ల వైద్య శిబిరాలు, 18 అంబులెన్సులు, రెండు సూపర్ స్పెషాల్టీ వైద్య బృందాలు ఏర్పాటు చేశారు. ● 32 ప్రదేశాల్లో 200 వాట్స్ సామర్థ్యం కలిగిన 750 విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. 9 జనరేటర్లు అందుబాటులో ఉంచారు. ● నగర సీపీ శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో 2,460 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ● ప్రతీ ఆరు కిలోమీటరుకు ఒక బృందం చొప్పున మూడు షిప్టుల్లో ఆరు బృందాలను కలెక్టర్ హరేందిర ప్రసాద్ నియమించారు. డిప్యూటీ కలెక్టర్ ర్యాంకు అధికారి పర్యవేక్షణలో ఒక్కో బృందంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్, ఫైర్, పోలీస్, వైద్య, విద్య, విద్యుత్, రెవెన్యూ, జీవీఎంసీ, ఆర్అండ్బీ, రవాణాశాల అధికారులు, సిబ్బంది ఉంటారు. ● 9వ తేదీ ఉదయం 6 నుంచి 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ● భక్తులకు అందుబాటులో టోల్ ఫ్రీనెంబరు 1800–4250–0009, 0891–2507225లను ఏర్పాటు చేశారు. ● కొండదిగువ తొలిపావంచా, అడవివరం, పాతగోశాల జంక్షన్, అప్పుఘర్, మాధవధారలో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టంలు ఏర్పాటు చేశారు. ● జోడుగుళ్లపాలెం వద్ద సముద్రస్నానాలకు అనుమతి ఇవ్వలేదు. ● లుంబిని పార్క్ వద్ద తాత్కాలిక స్నానపు గదులు, టాయ్లెట్లు, తాగునీరు ఏర్పాటు చేశారు. ● గిరి ప్రదక్షిణ మార్గంలో పాఠశాలలు, కల్యాణ మండపాల్లో మొత్తం 14 చోట్ల విశ్రాంతి ప్రాంతాలను గుర్తించారు. ● 10న సింహగిరిపై అన్నప్రసాద భవనంలో కదంబం, దద్దోజనం అన్నప్రసాదంగా అందజేస్తారు. ● ఉచిత, రూ.100, రూ..300 దర్శనాల క్యూలను ఏర్పాటు చేశారు. ● భక్తుల కోసం సుమారు లక్ష లడ్డులను విక్రయానికి సిద్ధం చేశారు. -
రేగుపాలెం పీహెచ్సీలో డీఎంహెచ్వో తనిఖీ
రేగుపాలెం పీహెచ్సీలో రికార్డులు తనిఖీ చేస్తున్న డీఎంహెచ్వో హైమావతి యలమంచిలి రూరల్: మండలంలోని రేగుపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యారోగ్యాధికారి ఎం.హైమావతి మంగళవారం తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ఓపీకి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు. ఆస్పత్రిలో రికార్డులు, శస్త్ర చికిత్సలు చేసే గది, ఫార్మసీలను పరిశీలించారు. ఆశా వర్కర్లతో జరుగుతున్న సమావేశాన్ని సందర్శించిన ఆమె.. ఆశా వర్కర్ల సేవలు ఎంతో కీలకమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలకు సంబంధించిన వివరాలను యాప్లో నమోదు చేసే విధానంపై అవగాహన కల్పించాలని ఆస్పత్రి సిబ్బందికి సూచించారు. పీహెచ్సీల్లో శస్త్రచికిత్సలు చేయాలని, అప్పుడే ప్రజలకు నమ్మకం కలుగుతుందన్నారు. ఆస్పత్రి వైద్యురాలు రోహిణీశివ, ఎంపీహెచ్ఈవో జమ్ము శ్రీనివాసరావు, ఆస్పత్రి సిబ్బంది లీలావతి, మాణిక్యం, నూకరత్నం పాల్గొన్నారు. -
11న వ్యవసాయ యాంత్రీకరణ మేళా
రైతులకు సూచనలిస్తున్న మోహన్రావు నర్సీపట్నం: పెదబొడ్డేపల్లి మార్కెట్ యార్డులో ఈ నెల 11న వ్యవసాయ యాంత్రీకరణ మేళాను ఏర్పాటు చేసినట్టు జిల్లా వ్యవసాయశాఖ అధికారి మోహన్రావు తెలిపారు. వ్యవసాయశాఖ ఏడీఏ కార్యాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. మేళా ఏర్పాటుకు అవసరమైన యార్డులోని ప్రదేశాన్ని మార్కెట్ యార్డు చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, వైస్ చైర్మన్ చిటికెల కన్నయ్యనాయుడు, ఏడీఏ శ్రీదేవి, యార్డు సెక్రటరీ భువనేశ్వరితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఖరీఫ్ సాగుకు అవసరమైన 23 వేల క్వింటాళ్ల వరి విత్తనాలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. 33 వేల టన్నుల యూరియాను సిద్ధం చేశామన్నారు. 11 డ్రోన్లు మంజూరయ్యాయని, వీటిలో 7 డ్రోన్లను రైతులకు అందజేశామన్నారు. ప్రకృతి సాగుపై మొగ్గు చూపాలి మాకవరపాలెం: ప్రకృతి సాగుపై రైతులు మొగ్గు చూపాలని జిల్లా వ్యవసాయ అధికారి మోహన్రావు సూచించారు. పొలం పిలుస్తోందిలో భాగంగా మండలంలోని నారాయణరాజుపేటలో మంగళవారం ఆయన పర్యటించారు. పాయకరావుపేట ఏడీ ఉమాప్రసాద్, ఏవో అప్పారావు, సిబ్బంది పాల్గొన్నారు. -
మత్స్యకారుడు ఎల్లాజీ కుటుంబాన్ని ఆదుకోవాలి
● మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు డిమాండ్నక్కపల్లి: ఇటీవల పూడిమడక తీరంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుడు ఎల్లాజీ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్సీపీ పాయకరావుపేట సమన్వయకర్త కంబాల జోగులు డిమాండ్ చేశారు. మంగళవారం నక్కపల్లిలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ వేటకు వెళ్లిన మత్స్యకారుడు గల్లంతయితే తక్షణమే నష్టపరిహారం చెల్లించాల్సి ఉందన్నారు. ఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా ఇంత వరకు సరైన గాలింపు చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు. ఎల్లాజీ క్షేమంగా ఉన్నాడో లేడో గుర్తించాలని, ఏడేళ్ల వరకు ఎటువంటి డెత్ సర్టిఫికెట్ జారీ చేయడం కుదరదని చట్టం చెబుతున్నట్టు పోలీసులు అంటున్నారన్నారు. అప్పటి వరకు గల్లంతైన వ్యక్తిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబం ఎలా బతుకుతుందని జోగులు ప్రశ్నించారు. అవసరమైతే మత్స్యకారుల విషయంలో చట్టసవరణ చేయాలన్నారు. తోటి మత్స్కకారులతో పాటు, గ్రామస్తులతో మాట్లాడి బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ, జెడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మ, సీనియర్ నాయకులు మణిరాజు, పాపారావు, ఈశ్వరరావు, నానాజీ, తదితరులు పాల్గొన్నారు. -
జోహార్ వైఎస్సార్
ఘనంగా మహానేత జయంతి వేడుకలు ఊరూరా సేవా కార్యక్రమాలతో నివాళులర్పించిన అభిమానులు, వైఎస్సార్సీపీ శ్రేణులు సాక్షి, అనకాపల్లి/అనకాపల్లి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు మంగళవారం జిల్లా అంతటా ఘనంగా జరిగాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి.. పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. పలుచోట్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. పేదలకు దుస్తులు, నిత్యావసర సరకులు అందించారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనకాపల్లి రింగ్రోడ్డులోని పార్టీ కార్యాలయం, చోడవరం, బుచ్చెయ్యపేటల్లో జరిగిన జయంతి వేడుకల్లో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. పేదల గుండెల్లో దేవుడు వైఎస్సార్ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి, నిరుపేదల గుండెల్లో గుడి కట్టుకున్న దేవుడని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. అనకాపల్లి రింగ్రోడ్డులోని పార్టీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అమర్నాథ్.. పార్లమెంట్ సమన్వయకర్త కరణం ధర్మశ్రీతో కలిసి మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ ఏళ్లు గడిచినా దివంగత మహానేత వైఎస్సార్పై ప్రజల్లో ఉన్న అభిమానం చెక్కు చెదరలేదన్నారు. మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ వంటి సేవలు, పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. అనకాపల్లి రూరల్, కశింకోట మండలంలోని పలు గ్రామాల్లో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్కుమార్, ఎంపీపీలు గొర్లి సూరిబాబు, కలగా లక్ష్మీ గున్నయ్యనాయుడు, జెడ్పీటీసీ దంతులూరి శ్రీధర్రాజు, పార్టీ అనకాపల్లి, కశింకోట మండల అధ్యక్షులు పెదిశెట్టి గోవిందు, మలసాల కిశోర్ తదితరులు పాల్గొన్నారు. పేదలకు సేవా కార్యక్రమాలు●మాజీ మంత్రి, పీఏసీ సభ్యుడు బూడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో దేవరాపల్లి మండలం తెనుగుపూడి గ్రామంలో గల వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. దేవరాపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మీ, జెడ్పీటీసీ కర్రి సత్యం, పార్టీ మండల అధ్యక్షుడు బూరే బాబురావు పాల్గొన్నారు. కె.కోటపాడు మండలం ఎ.కోడూరులో రాష్ట్ర వైఎస్సార్సీపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి ఈర్లె అనురాధ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఎంపీపీ రెడ్డి జగన్మోహన్ పాల్గొన్నారు. ●యలమంచిలి టౌన్లో ఎంపీపీ బోదెపు గోవిందు, పార్టీ పట్టణ అధ్యక్షుడు బొద్దపు యర్రయ్యదొర ఆధ్వర్యంలో, ఏటికొప్పాకలో జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు ఉద్దండం త్రినాథరావు, సీనియర్ నాయకుడు సేనాపతి రాము ఆధ్వర్యంలో జయంతి వేడుకలు జరిగాయి. మునగపాక మండలంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో, అచ్యుతాపురంలో పార్టీ మండల అధ్యక్షుడు దేశంశెట్టి శంకర్రావు ఆధ్వర్యంలో జయంతి వేడుకలు జరిగాయి. ప్రభుత్వ ఆస్పత్రిల్లో పండ్లు పంపిణీ చేశారు. జెడ్పీటీసీ లాలం రాము, ఎంపీపీ కోన సంథ్యా బుజ్జి పాల్గొన్నారు. ●మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ నర్సీపట్నం మున్సిపల్ స్టేడియం వద్ద గల వైఎస్సార్ విగ్రహాన్ని నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ సీనియర్ నేత చింతకాయల సన్యాసిపాత్రుడు, మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ●పాయకరావుపేట సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు నక్కపల్లి, ఎస్.రాయవరంలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పాయకరావుపేటలో పార్టీ మండల అధ్యక్షులు చిక్కాల రామారావు ఆధ్వర్యంలో రైతులు, వృద్ధ దంపతులు పోసిన పెద్ద అప్పారావు, చిన్నమ్మలను సన్మానించారు. జెడ్పీటీసీ లంక సూరిబాబు, ఎంపీపీ ఇసరపు పార్వతీ తాతారావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు ధనిశెట్టి మహేష్, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి కె.కె.ఆర్.ఎస్.లత, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దగ్గుపల్లి సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. నక్కపల్లిలో కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ వైఎస్సార్కు నివాళులర్పించారు. 100 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కోటవురట్లలో కాకినాడ పార్లమెంటు పరిశీలకుడు సూర్యనారాయణరాజు, రాష్ట్ర కార్యదర్శి దత్తుడు శీతబాబు, సిద్దాపతులు సత్యనారాయణ పాల్గొన్నారు. బుచ్చెయ్యపేట: చోడవరం టౌన్ గాంధీగ్రామం, బుచ్చెయ్యపేటల్లో జరిగిన వైఎస్సార్ జయంతి వేడుకల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు, సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్, మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ పాల్గొన్నారు. బుచ్చెయ్యపేటలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. చోడవరంలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏరువాక సత్యారావు, జెడ్పీటీసీలు మారిశెట్టి శ్రీకాంత్, దొండా రాంబాబు, ఎంపీపీ గాడి కాసు అప్పారావు, వైస్ ఎంపీపీలు దొండా లలితా నారాయణమూర్తి, గొంపా చినబాబు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ కోవెల జనార్దనరావు, బుచ్చెయ్యపేట మండల అధ్యక్షుడు కె.అచ్చింనాయుడు తదితరులు పాల్గొన్నారు -
కలెక్టర్కు హస్త కళాకారులసమస్యల ఏకరువు
హస్త కళాకారులతో మాట్లాడుతున్న కలెక్టర్ విజయ కృష్ణన్ యలమంచిలి రూరల్: కలెక్టర్ విజయ కృష్ణన్ ఎదుట ఏటికొప్పాక హస్త కళాకారులు తమ సమస్యలపై ఏకరువు పెట్టారు. 50 ఏళ్లకే సా మాజిక భద్రత పింఛన్ ఇచ్చి ఆదుకోవాలని, రాయితీ రుణాలు ఇప్పించాలని వారంతా ఆమె ను కోరారు. మంగళవారం ఏటికొప్పాకలో హ స్త కళాకారులతో కలెక్టర్ ముఖాముఖి సమావేశమయ్యారు. లక్కబొమ్మల తయారీ కోసం అ తి ముఖ్యమైన అంకుడు కర్ర తెచ్చుకోవడానికి అటవీ శాఖ ఆంక్షలతో ఎదురవుతున్న ఇబ్బందులు చెప్పుకున్నారు. 16వ నంబరు జాతీయ రహదారి నుంచి ఏటికొప్పాక గ్రామానికి వెడల్పు రహదారి వేస్తే పర్యాటకులు ఎక్కువగా వస్తారన్నారు. పెట్టుబడి లేకపోవడంతో ఆర్థిక వనరుల కోసం స్థానిక వ్యాపారులపై ఆధారపడడం వల్ల తాము ఎదగలేకపోతున్నామన్నారు. ఇక్కడి హస్త కళాకారుల స్థితిగతులపై నివేదిక తయారు చేయాలని పరిశ్రమలు శాఖ జీఎం, యలమంచిలి ఎంపీడీవో, మరికొందరు అధికారులను కలెక్టర్ ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ హస్త కళాకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తహసీల్దార్ కె.వరహాలు, కాండ్రకోట చిరంజీవి, అధికారులు పాల్గొన్నారు. -
ఎస్పీ కార్యాలయానికి 35 అర్జీలు
అర్జీదారులతో మాట్లాడుతున్న ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కార వేదికకు 35 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా అర్జీదారుల నుంచి ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చట్టపరిధిలో సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఆస్తి తగాదాలు, కుటుంబ సమస్యలు, మోసాలు, వంటి వాటిపై అర్జీలు వచ్చాయని చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు, ఎస్ఐ డి.వెంకన్న, అర్జీదారులు పాల్గొన్నారు. -
సందడిగా లాఫింగ్ క్లబ్ ‘కామెడీ కింగ్స్’ కార్యక్రమం
ఆనంద్రాజ్ను సత్కరిస్తున్న వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్ అనకాపల్లి: నువ్వులు మానవ శరీరానికి ఎంతో ఉత్సహాన్ని కలిగిస్తుందని, నిత్యం జీవితంలో నవ్వడం ప్రకృతి ఇచ్చిన వరంలాంటిదని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్ అన్నారు. స్థానిక గవరపాలెం మళ్ల జగన్నాథం కల్యాణమండపంలో లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ‘కామెడీ కింగ్స్’ కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి నిర్వహించగా, సౌత్ ఇండియా ఫేమస్ యాక్టర్ ఆనంద్రాజ్ను శాలువాతో సత్కరించి, మెమెంటో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతినెలా మొదటి ఆదివారం నవ్వుల కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. అంతకుముందు యాక్టర్ ఆనంద్రాజ్ తన నటించిన చిత్రాల్లో కామిడీని వినిపించి నవ్వుల జల్లులు కురిసేలా చేశారు. ఈ కార్యక్రమంలో లాఫింగ్ క్లబ్ అధ్యక్షుడు విల్లూరి వీరసంతోష్, ఉపాధ్యక్షుడు బుద్ద ప్రవీణ్కుమార్, 80వ వార్డు ఇన్ఛార్జ్ కెం.ఎ.నాయుడు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. -
రేపే గిరి ప్రదక్షిణ
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనసింహస్వామి కొలువైన సింహగిరి ప్రదక్షిణ (గిరి ప్రదక్షిణ) బుధవారం జరగనుంది. లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేసి కలెక్టర్ హరేందిర ప్రసాద్, దేవస్థానం ఈవో వి.త్రినాథరావు ఆధ్వర్యంలో అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తులు సేద తీరేందుకు 29 ప్రాంతాల్లో స్టాళ్లు, 31 చోట్ల వైద్య శిబిరాలు, 12 ప్రదేశాల్లో 17 అంబులెన్సులు, 5 ప్రదేశాల్లో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి ప్రతీ స్టాల్ వద్ద మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు కదలనున్న రథం కొండదిగువ స్వామి తొలిపావంచా వద్ద నుంచి బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు స్వామి మూలవిరాట్, ఉత్సవమూర్తులు కొలువుదీరిన ప్రచార రథం బయలుదేరుతుంది. రథంతోపాటు గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులంతా ఆ సమయానికి తొలిపావంచా వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. పుష్పరథం తిరిగే మార్గం తొలిపావంచా, అడవివరం, పైనాపిల్కాలనీ, సెంట్రల్జైల్, హనుమంతవాక, విశాలాక్షినగర్, జోడుగుళ్లపాలెం, తెన్నేటి పార్కు, అప్పుఘర్, ఎంవీపీ కాలనీ డబుల్రోడ్డు, మద్దిలపాలెం, సత్యం జంక్షన్, ఎన్ఏడీ కొత్తరోడ్డు, గోపాలపట్నం, ప్రహ్లాదపురం మీదుగా తిరిగి సింహాచలం చేరుకుంటుంది. భక్తులు ప్రదక్షిణ చేసే మార్గం తొలిపావంచా, అడవివరం, పైనాపిల్కాలనీ, సెంట్రల్జైల్, హనుమంతవాక, విశాలాక్షినగర్, జోడుగుళ్లపాలెం, తెన్నేటి పార్కు, అప్పుఘర్, ఎంవీపీకాలనీ, సీతమ్మధార, నరసింహనగర్, పోర్టు డీఎల్బీ క్వార్టర్స్, కప్పరాడ, మురళీనగర్, మాధవధార, ఆర్అండ్బీ కార్యాలయం, లక్ష్మీనగర్, కుమారి కల్యాణమండపం, ప్రహ్లాదపురం మీదుగా తిరిగి సింహాచలం చేరుకోవాలి. దర్శన సమయాలు 9వ తేదీన ఉదయమే గిరి ప్రదక్షిణ ప్రారంభించి అదే రోజు రాత్రికి తిరిగి సింహాచలం చేరుకునే భక్తులకు రాత్రి 10 గంటల వరకు దర్శనాలు లభిస్తాయి. 10వ తేదీ ఉదయం 5.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు నిర్విరామంగా దర్శనాలు అందజేస్తారు. తిరిగి సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనాలు లభిస్తాయి. సింహగిరిపై 10న ఆలయ ప్రదక్షిణలు చేసే భక్తులను తెల్లవారుజామున 3 గంటల నుంచి అనుమతిస్తారు. ఉచిత ప్రయాణం 10వ తేదీ ఉదయం 3 గంటల నుంచి భక్తుల రద్దీ ముగిసే వరకు కొండపై నుంచి దిగువకు, దిగువ నుంచి కొండపైకి 50 ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేశారు. దేవస్థానం బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. ఏర్పాట్లు ఇలా.. ●తొలిపావంచా వద్ద భక్తులు కొబ్బరికాయలు కొ ట్టేందుకు 45 క్యూలు, 100 ఇనుప గద్దర్లు సిద్ధం చే స్తున్నారు. అడవివరం నుంచి హనుమంతవాక వెళ్లే బీఆర్టీఎస్ మార్గంలోని రెండో టోల్గేట్ వద్ద 20 ఇనుప గద్దర్లు, 10 క్యూలు ఏర్పాటు చేస్తున్నారు. ●గిరి ప్రదక్షిణ మార్గంలో దాదాపు 40 ప్రాంతాల్లో 400 తాత్కాలిక మరుగుదొడ్లను జీవీఎంసీ ఏర్పాటు చేస్తోంది. దేవస్థానం ఏర్పాటు చేసే అన్ని స్టాళ్లలో జీవీఎంసీ మంచినీరు సరఫరా చేస్తోంది. ●అప్పుఘర్ వద్ద స్నానాలు ఆచరించే భక్తుల సౌకర్యార్థంతాత్కాలిక మరుగుదొడ్లు, వైద్యశిబిరం, రెండు జనరేటర్లు, కమాండ్ కంట్రోలింగ్ సిస్టం ఏర్పాటు చేస్తున్నారు. 60 మంది గజ ఈతగాళ్లను మూడు షిప్టుల్లో విధులు నిర్వహించే విధంగా ఏర్పాటు చేశారు. ●మాధవధార వద్ద 60 తాత్కాలిక మరుగుదొడ్లు, ఒక వైద్య శిబిరం, 50 ఎల్ఈడీ లైట్లు, ఒక జనరేటర్, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం సిద్ధం చేస్తున్నారు. ●10న ఆలయ ప్రదక్షిణలకు గాను ఉత్తర రాజగోపురం, దక్షిణ రాజగోపురం వద్ద వంతెనలను సిద్ధం చేస్తున్నారు. ●10వ తేదీన సింహగిరికి వచ్చే భక్తుల కోసం 10,800 రన్నింగ్ ఫీట్ మేర క్యూలను ఏర్పాటు చేశారు. ఒకేసారి సుమారు 9 వేల మంది క్యూల్లో వేచి ఉండవచ్చు. ●9, 10 తేదీల్లో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు తొలిపావంచా వద్ద పుష్పరథం ప్రారంభం 10న ఉదయం 5.30 గంటల నుంచి దర్శనాలు గిరి ప్రదక్షిణ మ్యాప్ -
అన్నదాత సుఖీభవ వర్తింపజేయాలి
●ఆర్డీవో కార్యాలయం వద్ద మోకాళ్లపై గిరిజనుల నిరసన ఆర్డీవో కార్యాలయం వద్ద మోకాళ్లపై నిరసన తెలియజేస్తున్న గిరిజన రైతులు నర్సీపట్నం: డీపట్టా భూములకు అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ రోలుగుంట మండలం పనసలపాడు, రావికమతం మండలం, గర్నికం, కొవ్వుగుంట, కొట్నాబెల్లి గిరిజనులు సోమవారం ఆర్డీవో కార్యాలయం వద్ద మోకాళ్లపై నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.గోవిందరావు మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో 70 మంది గిరిజనులు, 16 మంది దళితులు జీడి, మామిడి తోటలపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. బ్యాంకు రుణాలు పొంది ఉన్నారన్నారు. గిరిజనులకు అన్యాయం చేసి స్థానికేతరులైన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పట్టాలు ఇచ్చారని విమర్శించారు. కలెక్టరుకు సైతం ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు లేవన్నారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో గిరిజనుల పేర్లు లేకుండా చేశారన్నారు. వెబ్ ల్యాండ్లో పేర్లు లేకపోవడంతో బ్యాంకు రుణాలు, ఎరువులు, విత్తనాలు ఇవ్వలేదన్నారు. అధిక వడ్డీలకు ప్రైవేటు రుణాలు తీసుకొని పంటలకు పెట్టుబడి పెడుతున్నారన్నారు. ఇప్పటికై నా ఆర్డీవో పరిశీలన చేసి అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపజేయాలన్నారు. అనంతరం ఏవో సుధాకర్కు వినతిపత్రం అందజేశారు. కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సిహెచ్. సూరిబాబు, గిరిజన సంఘం నాయకులు ఎస్ శంకర్రావు, నాగరాజు, గేమిలా చిన్నబ్బాయి, ఎద్దుల రాజు పాల్గొన్నారు. -
సహకార సంఘాల రుణ వితరణ భేష్
● రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు, గృహ నిర్మాణ శాఖమంత్రి పార్థసారథి మాడుగుల రూరల్: డీసీసీబీ ద్వారా రూ.140 కోట్ల రుణాలు అందజేసి, 97 శాతం రికవరీ సాధించడం శుభ పరిణామని రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఆధ్వర్యంలో, స్థానిక డీసీసీబీ బ్రాంచి సారథ్యంలో మాడుగుల టీటీడీ కళ్యాణమండపంలో సోమవారం ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన రుణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. రైతులకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని, ఇందులో భాగంగా రైతులకు బకాయిపడ్డ రూ.1635 కోట్లు చెల్లించామని, పొగాకు రైతుల నుంచి 2 కోట్ల కిలోలను పొగాకు కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయించామని అన్నారు. డీసీసీబీ చైర్పర్సన్ కోన తాతారావు మాట్లాడుతూ సహకార రంగంలో గతంలో ఒక ఎకరానికి రూ.5 లక్షల రుణం అందిస్తే, ఇపుడు రూ.7 లక్షలకు పెంచామన్నారు. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాల ద్వారా ఎంతో అభివృద్ధి చేశామన్నారు. అనంతరం 120 మంది లబ్ధిదారులకు రూ.2.58 కోట్లు చెక్కులను, కారుణ్య నియామకం పొందిన వారికి నియామకపు ఉత్తర్వులు అందజేశారు. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ తాతయ్యబాబు, డీసీసీబీ సీఈవో వర్మ, జిల్లా వ్యవసాయాధికారి, నియోజకవర్గ ప్రత్యేకాధికారి బి.మోహన్రావు, డీసీసీబీ బ్రాంచి మేనేజర్ కె.మహేశ్వరావు, డీసీసీబీ డీజీఎం బొడ్డేడ శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్మన్ పుప్పాల అప్పలరాజు, తహసీల్దార్ రమాదేవి, వెలుగు ఏపీఎంవో రమామణి పాల్గొన్నారు. -
క్షేత్రస్థాయిలో పర్యటించి అర్జీలను పరిష్కరించాలి
● కలెక్టర్ విజయ కృష్ణన్ ● పీజీఆర్ఎస్కు 370 అర్జీలు అనకాపల్లి: పీజీఆర్ఎస్కు ప్రతి వారం వచ్చే అర్జీలకు అధికారులు వ్యక్తిగతంగా క్షేత్ర స్థాయి పర్యటనలు చేసి పరిష్కరించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్కు అర్జీలు పోటెత్తాయి. ఈ వారం జిల్లా నలుమూలల నుంచి 370 మంది అర్జీదారులు వచ్చారు. వారి అర్జీలు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి తీసుకున్న అర్జీల గురించి వెంటనే సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఒకే విషయంపై ఎక్కువసార్లు అర్జీలు వచ్చినట్లయితే అటువంటివి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఎక్కడైనా సమస్య ఉన్నట్లయితే అర్జీదారుతో సంబంధిత శాఖాధికారులు స్వయంగా వెళ్లి పరిష్కార మార్గాలకు చర్యలు తీసుకోవాలన్నారు. నిర్ణీత సమయంలో అర్జీలు పరిష్కరించాలని ఆమె దిగువ స్థాయి అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై. సత్యనారాయణరావు, కేకేఆర్ఆర్సీ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ఎస్ సుబ్బలక్ష్మి, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి జి.రామారావు, జిల్లా గ్రామీణ అభివృద్ధి, డ్వామా పథక సంచాలకులు శచీదేవి, పూర్ణిమ దేవి, జిల్లా పంచాయతీ అధికారి ఇ.సందీప్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం. హైమావతి, జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి వి.సుధీర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సెజ్ పునరావాస గ్రీన్ బెల్ట్ కాపాడండి అచ్యుతాపురం రూరల్: సెజ్ పునరావాస కాలనీని ఆనుకుని ఉన్న గ్రీన్ బెల్ట్ కాపాడాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్కు సోమవారం వైఎస్సార్సీపీ నాయకులు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెజ్ కాలనీ చుట్టు పక్కల కాలుష్య కారక పరిశ్రమలు ఉన్నాయన్నారు. ప్రజలు కాలుష్యం బారిన పడకుండా గ్రీన్ బెల్ట్ కోసం 20 సంవత్సరాల క్రితం మొక్కలు నాటినట్లు తెలిపారు. అవి చెట్లుగా మారి 4300 కుటుంబాలు ఒకింత కాలుష్య బారిన పడకుండా ఉన్నాయన్నారు. ప్రస్తుతం రాంబిల్లి మండలం కృష్ణంపాలెం గ్రామాన్ని ఈ ప్రాంతానికి తరలించేందుకు సెజ్ కాలనీ చుట్టు ఉన్న గ్రీన్ బెల్ట్లో చెట్లను తొలగిస్తున్నారని, దాని కారణంగా కాలనీ వాసులందరూ అనేక రకాల పరిశ్రమలు, ఫార్మా వ్యర్థ కాలుష్యం బారిన పడి అనారోగ్యానికి గురయ్యే అవకాశముందని వాపోయారు. ఇంకా 500 మంది లబ్ధిదారులకు ఇంటి స్థలాలు కేటాయించాల్సి వస్తే సురక్షిత ప్రాంతం కోసం వేసి చూస్తున్నామన్నారు. ఎంత సంపాదించినా ఆరోగ్యం లేని జీవతం వ్యర్థమని ఆవేదన చెందారు. అధికారులు వెంటనే స్పందించి వేల కుటుంబాలు జీవిస్తున్న సెజ్ పునరావాస కాలనీ కాలుష్యం బారిన పడకుండా తగు చర్యలు చేపట్టాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో వియ్యపు కృష్ణ, లాలం శ్రీనువాసరావు దిబ్బపాలెం–2 ఎంపీటీసీ నీరుకొండ అశోక్ కుమార్, పోలవరపు ఉస్తాలు, గాడి గణేష్ సీనియర్ నాయకులు పిల్లి రమణ, జాగారపు శ్రీనువాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఉమ్మడి విశాఖ జిల్లా సమగ్రాభివృద్ధికి వైఎస్సార్ హయాంలోనే అడుగులు మహానేత మరణంతో కుంటుపడిన అభివృద్ధి వైఎస్ జగన్ హయాంలో పరుగులు నేడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి
కొన్ని లక్షల జీవితాలను మార్చిన ఒకే ఒక సంతకంమంచితనానికి మరో పేరు, మానవత్వానికి ప్రతిరూపం, చిరునవ్వుకు చిరునామా, అచ్చతెలుగు పంచెకట్టుకు వన్నె తెచ్చిన రైతు బాంధవుడు, తెలుగుదనానికి నిండైన రూపం.. ఆయనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆయన మదిలో మెదిలితే రైతన్నకు కొండంత ధైర్యం. అక్కాచెల్లెమ్మలకు భరోసా.. విద్యార్థి లోకానికి ‘నేనున్నానంటూ’ వెన్నుతట్టి ప్రోత్సహించిన అనుభూతి. ఉమ్మడి విశాఖ జిల్లాలో మారుమూల ప్రాంతాలను సైతం అభివృద్ధి చేసి జిల్లాపై చెరగని ముద్ర వేశారు. ఇప్పుడు ఆయన అందించిన అభివృద్ధి ఫలాలు కళ్ల ముందు కదలాడుతున్నాయి. మంగళవారం రాజన్న జయంతి సందర్భంగా ఆయన చేపట్టిన అభివృద్ధి, సంక్షేమాన్ని గుర్తుచేసుకుందాం. – సాక్షి, విశాఖపట్నంఐటీకి ఆద్యుడు విశాఖను ఐటీ హబ్గా మార్చాలని వై.ఎస్.రాజశేఖరరెడ్డి సంకల్పించారు. దీనికోసం నగరంలోని మూడు కొండల కింద ఉన్న 100 ఎకరాల ప్రాంతాన్ని గుర్తించి, కనీసం 100 ఉద్యోగాలు కల్పించే ఐటీ కంపెనీలకు మౌలిక సదుపాయాలతో ప్లాట్లు అందించారు. దాదాపు 200 కంపెనీలు ముందుకురాగా, 70 శాతం కార్యకలాపాలు ప్రారంభించాయి. సత్యం, విప్రో వంటి పెద్ద కంపెనీలు కూడా ఇక్కడ శాఖలను విస్తరించాయి. వైఎస్సార్ మరణానంతరం విశాఖ ఐటీ ప్రగతి కుంటుపడింది. టీడీపీ హయాంలో కంపెనీలకు రాయితీలు అందకపోవడంతో అవి వెనక్కి వెళ్లిపోయాయి. సుమారు పదేళ్ల పాటు విశాఖ ఐటీ రంగం స్తంభించిపోయింది. 2019లో వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించడం, ఐటీ కంపెనీల స్థాపనకు ప్రోత్సాహం, అదానీ డేటా సెంటర్ శంకుస్థాపన వంటి చర్యలతో తిరిగి ఐటీ అభివృద్ధి పుంజుకుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఐటీ అభివృద్ధి కేవలం మాటలకే పరిమితమైంది. వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి విశాఖ జిల్లా తీవ్ర సంక్షోభంలో ఉంది. తాగునీటి సమస్య, అచ్యుతాపురం సెజ్, పరవాడ ఫార్మాసిటీ, గంగవరం పోర్టు భూసేకరణ వివాదాలు పరిష్కారం కాకుండా ఉన్నాయి. అలాగే స్టీల్ప్లాంట్, బీహెచ్పీవీ, షిప్యార్డులు నష్టాల్లో కూరుకుపోయి ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో 2005 జనవరిలో వైఎస్సార్ విశాఖలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. విశాఖ నగరంలో తాగునీటి సమస్యకు పరిష్కారం చూపారు. అచ్యుతాపురం, ఫార్మా సెజ్లకు భూముల ధరలు నిర్ణయించి, పునరావాస ప్యాకేజీలు ప్రకటించారు. నష్టాల్లో ఉన్న స్టీల్ప్లాంట్ను గట్టెక్కించి, రెండో దశ విస్తరణకు నిర్ణయం తీసుకున్నారు. బీహెచ్పీవీని బీహెచ్ఈఎల్లో విలీనం చేయాలని, షిప్యార్డు ను రక్షణ శాఖలో విలీనం చేసి పునరుజ్జీవింపచేయాలని నిర్ణయించారు. గ్రేటర్ హోదా కల్పన ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న మహా విశాఖ ప్రతిపాదనలకు వైఎస్సార్ ముఖ్యమంత్రి కాగానే కార్యరూపం ఇచ్చారు. 2005 నవంబర్ 22న విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కు గ్రేటర్ హోదా కల్పించారు. దీంతో విస్తీర్ణం 111 చ.కి.మీ. నుంచి 540 చ.కి.మీ.లకు పెరిగింది. వైఎస్సార్ మరణానంతరం జీవీఎంసీ వార్డుల విస్తరణ నిలిచిపోయింది. వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరో 10 పంచాయతీలను విలీనం చేసి, జీవీఎంసీని ప్రస్తుతం 98 వార్డులుగా విస్తరించారు. దేశంలోని టాప్ నగరాల్లో విశాఖ ఒకటిగా... వైఎస్సార్ చొరవతో విశాఖ జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ పునర్నిర్మాణ పథకం (జేఎన్ఎన్యూఆర్ఎం) కిందకు వచ్చింది. దేశవ్యాప్తంగా ఈ పథకం అమలైన 63 నగరాల్లో వైజాగ్ ఒకటి. ఈ పథకం ద్వారా విశాఖకు రూ.1885 కోట్ల విలువైన అభివృద్ధి పనులు మంజూరయ్యాయి. బీఆర్టీఎస్ కారిడార్లు, ఫ్లై ఓవర్లు, తాగునీరు, భూగర్భ మురుగునీటి వ్యవస్థతో సహా 20కి పైగా కీలక ప్రాజెక్టులు ఆయన హయాంలోనే ప్రారంభమయ్యాయి. గోడు చెప్పిన వారందరికీ గూడు నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చాలనే సంకల్పంతో వైఎస్సార్ రాజీవ్ గృహకల్ప పథకాన్ని ప్రారంభించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు మంజూరు చేసి, నగర పరిధిలో లక్షకు పైగా పునరావాస కాలనీలను నిర్మించారు. రాజీవ్ గృహకల్ప ద్వారా రూ.650 కోట్లతో 15,320 ఇళ్లు, జేఎన్ఎన్యూఆర్ఎం ద్వారా రూ.600 కోట్లతో 15 వేల గృహాలు, వాంబే కింద రూ.400 కోట్లతో 9 వేల ఇళ్లు నిర్మించారు. యువతకు ఉపాధి.. భవితకు పునాది 2008 జనవరి 2న వైఎస్సార్ ఉపాధి పథకాన్ని ప్రారంభించి, యువతకు 13 అంశాల్లో శిక్షణ ఇచ్చి, 70 శాతం ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన మరణానంతరం ఈ పథకానికి గ్రహణం పట్టింది. చంద్రబాబు హయాంలో నిరుద్యోగం పెరిగింది. తిరిగి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి లక్షలాది ఉద్యోగాలను అందించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ పేరుతో కాలయాపన చేస్తోంది. అంతర్జాతీయ హోదా ఆయన ఘనతే రూ.100 కోట్లు ఖర్చు చేసి విశాఖ విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించిన ఘనత వైఎస్సార్దే. దీంతో అంతర్జాతీయ సర్వీసులు పెరిగాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ పాలనలో రాయితీలు నిలిపివేయడంతో సర్వీ సులు రద్దయ్యాయి. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. కార్గో సర్వీసులు కూడా మొదలయ్యాయి. ఆయన హయాంలోనే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శంకుస్థాపన జరిగింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం విశాఖ విమాన సర్వీసులపై సవతితల్లి ప్రేమ కురిపిస్తోందని ఆరోపణలున్నాయి. విమ్స్ ఏర్పాటుకు శ్రీకారం ఉత్తరాంధ్ర ప్రజలకు నిమ్స్ తరహా వైద్య సేవలు అందించే లక్ష్యంతో వైఎస్సార్ 2006లో విమ్స్ ఆస్పత్రికి శ్రీకారం చుట్టారు. రూ.250 కోట్లతో 2007లో శంకుస్థాపన జరిగి, 2009 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన మరణానంతరం పనులు మందగించాయి. చంద్రబాబు ప్రభుత్వం విమ్స్ను ప్రైవేటుపరం చేయాలని ప్రయత్నించగా వైఎస్సార్సీపీ అడ్డుకుంది. అనంతరం వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా చేసిన అభివృద్ధితో ప్రస్తుతం విమ్స్ ఉత్తరాంధ్రలో పెద్ద ఆస్పత్రిగా భాసిల్లుతోంది. ఏలేరు నీటిని తీసుకొచ్చింది రాజన్నే... గోదావరి జలాలను విశాఖ, ఉత్తరాంధ్ర అవసరాలకు మళ్లించే లక్ష్యంతో వైఎస్సార్ పోలవరం ఎడమ కాలువ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా, ఏలేరు నీటిని మళ్లించడం ద్వారా స్టీల్ప్లాంట్కు ఎదురయ్యే నీటి సమస్యను పరిష్కరించారు. ఆయన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేశారు. గిరిజనానికి బాసటగా.. విశాఖ ఏజెన్సీలో కాఫీ ప్లాంటేషన్ ప్రాజెక్టును వైఎస్సార్ తీసుకొచ్చి, రూ.144 కోట్లు కేటాయించి 60 వేల మంది గిరిజనులకు ఉపాధి కల్పించారు. పోడు వ్యవసాయాన్ని నేరంగా భావించే కాలంలో, వైఎస్సార్ 2009 జులై 12న అటవీ హక్కుల గుర్తింపు చట్టం ద్వారా గిరిజనులకు హక్కు పత్రాలు పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఆయన మరణానంతరం భూ పంపిణీ జరగలేదు. తిరిగి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సాగు చేస్తున్న గిరిజనులకు హక్కు పత్రాలు అందజేశారు. -
మువ్వల ప్రసాద్ కుటుంబానికి రూ.5 లక్షల సాయం
మువ్వల చిన్నకు రూ.5 లక్షల చెక్కు అందజేస్తున్న కలెక్టర్ విజయ కృష్ణన్ అనకాపల్లి: విశాఖ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తూ 2020లో మరణించిన జగన్నాథపురానికి చెందిన మువ్వల ప్రసాద్ కుటుంబానికి కలెక్టర్ విజయ కృష్ణన్ రూ.5 లక్షల చెక్కు అందజేశారు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మృతుడు ప్రసాద్ తల్లి చిన్న ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించింది. ఈ మేరకు సోమవారం తన కార్యాలయంలో మువ్వల చిన్నకు రూ.5 లక్షల చెక్కును అందజేశారు. జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు పాల్గొన్నారు. -
క్రిమిసంహారక మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
కోటవురట్ల: మండలంలోని రాజుపేట శివారు రామన్నపాలేనికి చెందిన పీతల వరహాలబాబు(42) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాలు ఇవి.. మద్యానికి బానిసై అతడు తరచూ భార్యా పిల్లలతో గొడవపడేవాడు. మేకల మందలోని మేకలను అమ్మేసి మద్యం వ్యసనానికి బానిసయ్యాడు. ఇదే విషయమై ఆదివారం రాత్రి భార్య, పిల్లలతో గొడవపడ్డాడు. మనస్తాపం చెంది సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో మేకల మంద దొడ్డిలో పురుగుల మందు తాగి తన కుమారుడికి ఫోన్ చేసి ‘మీ అందరినీ ఇబ్బంది పెడుతున్నాను, ఇక మీకు నా బాధ ఉండదు’ అంటూ తాను పురుగుల మందు తాగిన విషయాన్ని చెప్పాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని స్థానిక సీహెచ్సీకి తరలించగా పరిస్థితి విషమించడంతో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. భార్య గంగ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించారు. -
రహదారి నిర్మాణంలో పక్షపాతం
అనకాపల్లి మండలంలో కె.ఎన్.ఆర్.పేట వార్డు సచివాలయం నుంచి మేతపేటలో కొత్తగా సిమెంట్ రోడ్డు నిర్మించారు. అయితే ఎలుగుబంటి అప్పారావు ఇంటి నుంచి పెంకుటిళ్లు దగ్గర పదడుగులు రహదారి వేయవలసి ఉన్నప్పటికీ ఆరు అడుగులు మేర అసంపూర్తిగా వేశారు. రోజూ చెత్త వాహనాలు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్టర్కు పూర్తి స్థాయిలో బిల్లులు కూటమి నేతలు చెల్లించారు. దీనిపై నాలుగు సార్లు కలెక్టర్కు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కావడం లేదు. – ఎలుగుబంటి సత్యారావు, కె.ఎన్.ఆర్.పేట, అనకాపల్లి మండలం ● -
నేడు వైఎస్సార్ జయంతి
● సేవా కార్యక్రమాలతో ఘన నివాళి అర్పించాలి ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ పిలుపు చోడవరం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను మంగళవారం అన్ని గ్రామాల్లో ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చోడవరం నియోజకవర్గంతోపాటు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో వైఎస్సార్కు నివాళులు అర్పించడంతోపాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన కోరారు. -
సహచరుడి పాడె మోసిన స్పీకర్
నాతవరం: ఏఎంసీ మాజీ చైర్మన్ లాలం అచ్చిరాజు అంత్యక్రియల్లో స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు పాల్గొని కడ వరకు పాడె మోశారు. మండలంలో మర్రిపాలెం పంచాయతీ శివారు వెన్నలపాలెం గ్రామానికి చెందిన అచ్చిరాజు అనారోగ్యంతో మరణించాడు. సోమవారం ఆయన అంత్యక్రియల్లో స్పీకరు అయ్యన్నపాత్రుడు తన భార్య పద్మావతి, కుమారులు విజయ, రాజేష్లతో కలిసి పాల్గొన్నారు. శ్మశానం వరకు పాడె మోసి అచ్చిరాజుపై ఉన్న మమకారాన్ని గుర్తు చేసుకున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి తన వెంట నడిచిన వ్యక్తిని కోల్పోవడం బాధాకరమన్నారు. టీడీపీ మండలాధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ మండల కోఆప్షన్ సభ్యుడు షేక్ రజాక్, ఏఎంసీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, మాజీ చైర్మన్ అడిగర్ల అప్పలనాయుడు, తాండవ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కరక సత్యనారాయణ, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు లాలం కాశీనాయుడు, రాజాన వీర సూర్యచంద్ర, మాజీ ఎంపీపీలు పారుపల్లి కొండబాబు, నేతల విజయకుమార్ పాల్గొన్నారు. -
గ్రామసభ నిర్వహించకుండా భూసేకరణ తగదు
● సీపీఎం నాయకుడు యర్రా దేముడుకె.కోటపాడు: గ్రామసభ తీర్మానం లేకుండా ఎస్ఈజెడ్కు భూ సేకరణకు యత్నిస్తుండడం అన్యాయమని సీపీఎం నాయకుడు, ప్రజా సంఘాల కన్వీనర్ యర్రా దేముడు తెలిపారు. మండలంలోని ఆర్లి గ్రామంలో సోమవారం రైతులను, గ్రామస్తులను ఆయన కలిసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు మాట్లాడుతూ ఆర్లి గ్రామ పరిసర ప్రాంతాల్లో రెండు వేల ఎకరాల భూమిని కూటమి ప్రభుత్వం దౌర్జన్యంగా తీసుకునేందుకు యత్నిస్తుందన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎక్కడైనా ప్రభుత్వ అవసరాలకు రైతుల నుంచి భూమి తీసుకున్నట్లయితే ముందుగా గ్రామసభ పెట్టి అంగీకారం తీసుకోవాలన్నారు. భూములు తీసుకున్నట్లయితే అప్పటి మార్కెట్ ధరకు నాలుగు రెట్లు అదనంగా పరిహారం రైతులకు ఇవ్వాలన్నారు. భూమి కోల్పోయిన రైతుకు ఉపాధి, చెట్లుకు, పశుపోషణకు ఎంత పరిహారం ఇస్తారో ముందుగానే స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఎటువంటి గ్రామసభలు లేకుండా భూసేకరణ సర్వే చేపట్టొద్దని రెవెన్యూ సిబ్బందికి తెలిపారు. లేని పక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు బోళెం కాసుబాబు, రుత్తుల పాత్రుడు, ఎస్.రమణ, కర్రి నూకరాజు, కక్కల చెంచు తదితరులు పాల్గొన్నారు. -
కలప దొంగల మాయాజాలం
● పోలవరం ఎడమ కాల్వ గట్లపై 50 కిలోమీటర్ల మేర విలువైన కలప స్మగ్లింగ్ ● అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్న టేకు, అకేషియా, యూకలిప్టస్ చెట్లు ● టింబర్ డిపోలు, ప్లై వుడ్ పరిశ్రమలకు విక్రయిస్తున్న కేటుగాళ్లు ● కళ్ల ముందే రూ.లక్షల విలువైన కలప తరలిపోతున్నా పట్టని యంత్రాంగం ●రాత్రికి రాత్రే చెట్లు మాయంయలమంచిలి రూరల్: పోలవరం ఎడమ ప్రధాన కాల్వ గట్లపై ఉన్న విలువైన టేకు, అకేషియా, యూకలిప్టస్ చెట్లు అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. రెండు దశాబ్దాల కాలం నాటి ఈ చెట్లను కొందరు స్మగ్లర్లు దర్జాగా నరికించి వాహనాలతో వారికి కావాల్సిన ప్రాంతానికి యథేచ్ఛగా తరలించుకుపోతున్నారు. తమ కళ్ల ముందే ఇదంతా జరుగుతున్నా పోలవరం ఎడమ ప్రధాన కాల్వ పనుల పర్యవేక్షక అధికారులు గానీ, అటవీ, రెవెన్యూ, ఇతర శాఖల యంత్రాంగం కానీ పట్టించుకోకపోవడంతో విలువైన కలప అక్రమ రవాణా నిరాటంకంగా కొనసాగుతోంది. యలమంచిలి డివిజన్ కేంద్రంగా 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కృషితో పోలవరం ఎడమ ప్రధాన కాల్వ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కాల్వ నిర్మాణం కోసం ప్రభుత్వ, ప్రైవేటు, జిరాయితీ భూములను సేకరించారు. జిల్లాలో పాయకరావుపేట నుంచి తాళ్లపాలెం వరకు 6, 7 ప్యాకేజీలుగా పనులు జరుగుతున్నాయి. సుమారు 50 కిలోమీటర్ల పొడవున్న పోలవరం ఎడమ ప్రధాన కాల్వకు రెండు వైపులా గట్లపై విలువైన అకేషియా, టేకు, యూకలిప్టస్ చెట్లు వందల సంఖ్యలో ఉండేవి. ఇటీవల ఈ చెట్లపై అక్రమార్కుల కన్ను పడింది. రాత్రి, పగలు తేడా లేకుండా చెట్లను యంత్రాలతో నరికి, వ్యాన్లు, ఇతర వాహనాలతో కర్రల మిల్లులు, వ్యాపారులకు విక్రయించుకొని జేబులు నింపుకుంటున్నారు. కోట్లాది రూపాయల అక్రమార్జన యలమంచిలి, తాళ్లపాలెం, అడ్డురోడ్డు, పాయకరావుపేట ప్రాంతాలకు చెందిన కొందరు స్మగ్లర్లు కూలీలతో పోలవరం గట్లపై విలువైన చెట్లను నరికించి అమ్ముకోవడం ద్వారా లక్షలాది రూపాయలను అక్రమంగా ఆర్జించారని సమాచారం. అకేషియా చెట్లు కేవలం ప్రభుత్వ, అటవీ భూముల్లోనే ఎక్కువగా పెరుగుతాయి. టన్ను అకేషియా కలప ధర నాణ్యత బట్టి రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు ఉంటుంది. యూకలిప్టస్ (నీలగిరి) రకం టన్ను రూ.4 వేల వరకు పలుకుతోంది. ఇక బొలేరో వాహనంతో 4 టన్నులు, ట్రాక్టర్తో 6 టన్నులు, టాటా ఏస్ లాంటి చిన్న వాహనాలతో 1.5 టన్నుల నుంచి 2 టన్నుల వరకు కలప రవాణా చేస్తున్నారు. ఒకసారి అకేషియా కలప తరలిస్తే వాహనాన్ని బట్టి రూ.15 వేల నుంచి రూ.42 వేల వరకు కొల్లగొట్టొచ్చు. పోలవరం కాల్వకు రెండు వైపులా గట్లపై ఉన్న అకేషియా, నీలగిరి చెట్లన్నీ దాదాపుగా నరికివేతకు గురయ్యాయి. నరికించిన చెట్ల మాను, కొమ్మలకు సైతం ధర పలుకుతోంది. ప్రస్తుతం కొన్ని చోట్ల మాత్రమే చెట్లు కనిపిస్తున్నాయి. అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో వీటిని కూడా అక్రమార్కులు క్రమంగా తరలించుకుపోయే అవకాశం కనిపిస్తోంది. యలమంచిలి, అనకాపల్లి, అడ్డురోడ్డు, పాయకరావుపేట ప్రాంతాల్లో టింబరు డిపోల యజమానులు, కొందరు రద్దు కర్రల వ్యాపారులు, కార్పెంటర్లు కూడా అక్రమంగా నరికిన కలప కొనుగోలు చేస్తున్నారు. సిబ్బంది కొరత, పర్యవేక్షణ లోపం కలప స్మగ్లర్లకు బాగా కలిసివస్తోందనే చెప్పాలి. మా దృష్టికొస్తే చర్యలు పోలవరం ఎడమ ప్రధాన కాల్వ గట్లపై విలువైన చెట్లను అక్రమంగా నరికి, రవాణా చేస్తున్నారన్న విషయం మొదటిసారిగా తెలిసింది. మా సిబ్బంది పోలవరం ఎడమ ప్రధాన కాల్వ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తారు. రాత్రి సమయాల్లో తరలించుకుపోతే మేము ఏం చేయగలం. ఎవరైనా అలాంటివి మా దృష్టికి తీసుకొస్తే వెంటనే స్పందిస్తాం. అంతేకానీ ప్రత్యేకంగా చెట్ల నరికివేతపై నిఘా పెట్టలేం. –జి.రామకోటేశ్వర్రావు, ఈఈ, యలమంచిలి డివిజన్ -
సబ్సిడీపై పశుగ్రాస విత్తనాలు
● కలెక్టర్ విజయకృష్ణన్ ● పశుగ్రాస వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ అనకాపల్లి: జిల్లాలో ఈ నెల 14వ తేదీ వరకు జరిగే పశుగ్రాస వారోత్సవాలలో రైతులకు సబ్సిడీపై పశుగ్రాస విత్తనాలు, జొన్న, మొక్కజొన్న, పిల్లి పెస ర పంపిణీ చేయనున్నట్టు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. కలెక్టరేట్లోని తన కార్యాలయంలో సో మవారం పశుగ్రాస వారోత్సవాల వాల్ పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ ప్రతి గ్రామంలోని రైతు సేవా కేంద్రాల్లో పచ్చి మేత ప్రాముఖ్యత, శాసీ్త్రయ పద్ధతిలో పశుగ్రాసం పెంచే విధానాలు, పశుగ్రాసం నిల్వ చేసే పద్ధతుల గురించి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఐదు నుంచి ఆరు లీటర్లు పాలిచ్చే పశువులను పచ్చి మేతతోనే పోషించవచ్చన్నారు. పచ్చిమేతలో విటమిన్ ఏ శాతం ఎక్కువగా ఉండడంతో పశువులు ఆరోగ్యంగా ఉండి సకాలంలో ఎదకురా వడంతో పాటు పాల దిగుబడి బాగా పెరుగుతుందన్నారు. పశుగ్రాసాలను అన్ని ప్రాంతాల్లో అన్ని మాసాల్లో సాగు చేయవచ్చన్నారు. మిశ్రమ పంటగా కూడా సాగు చేసుకోవచ్చని చెప్పారు. వరి కో సిన తరువాత భూమిలో ఉండే తేమతో జనుము, పిల్లి పెసర సాగు చేసుకోవచ్చన్నారు. జొన్న రకాలను 50 శాతం పూత దశలో తప్పక కోయాలని, లేత దశలో కోస్తే హైడ్రోసైనిక్ యాసిడ్ అనే విష ప దార్థం విడుదలై హాని కలిగిస్తుందని సూచించారు. డీఆర్వో సత్యనారాయణరావు, కేకేఆర్ఆర్సీ ప్రత్యేక ఉప కలెక్టర్ సుబ్బలక్ష్మి, జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి డాక్టర్ రామ్మోహనరావు పాల్గొన్నారు. -
అడుగడుగునా గుంతలు.. ప్రమాదాల పుంతలు
ఎస్.రాయవరం: అవి రహదారులు కావు.. ప్రమాదాలకు ఆహ్వానం పలికే నీటి తటాకాలు. ఎప్పుడు ఏ ఆపద ముంచుకొస్తుందోనని నిత్యం భయపెట్టే నరకదారులు. అడ్డురోడ్డు నుంచి కోటవురట్ల మండల శివారు నూకాంబిక గుడి వరకు ఇదే దుస్థితి నెలకొందని జనం గగ్గోలు పెడుతున్నారు. ఈ రోడ్డు నిర్మాణ పనులను కాంట్రాక్టర్ పలుమార్లు ప్రారంభించి వదిలేయడంతో మరింత అధ్వానంగా మారింది. ఎన్నికల ముందు నాటి తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత పాదయాత్ర చేసి నాటి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికలయ్యాక ఏకంగా హోం మంత్రి అయ్యారు. సంక్రాంతి నాటికి రోడ్ల రూపురేఖలు మారుస్తామన్నారు. రూ.24 కోట్లు కేటాయిస్తూ పనులు ప్రారంభిస్తున్నామని దార్లపూడి వద్ద శంకుస్థాపన కూడా చేశారు. అయినప్పటికీ రోడ్డు పనులు చేపట్టలేకపోయారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డుపై గోతులు నూతుల్లా మారాయని, ఏమాత్రం ఆదమరచినా నీట మునగాల్సిందేనని భయపడుతున్నారు. రాత్రుళ్లు ఈ రోడ్డుపై ప్రయాణం అత్యంత ప్రమాదకరంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. జిల్లా అధికారులు స్పందించి, తాత్కాలిక చర్యలైనా చేపట్టాలని వాహన చోదకులు కోరుతున్నారు. -
సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి
అనకాపల్లి: సుప్రీం కోర్టు ఆదేశాలు మేరకు నేషనల్ హెల్త్ మిషన్(ఎన్హెచ్ఎం)లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఏపీ ఎన్హెచ్ఎం జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జయరాజు, చైర్మన్ థయామణి డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ రహదారి సీఐటీయూ కార్యాలయంలో జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి అనంతరం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 22 వేల మంది ఉద్యోగులు నేషనల్ హెల్త్ మిషన్లో 198 కేడర్లలో 15 ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో శ్రమ దోపిడీకి గురవుతున్నారని వాపోయారు. ఎన్నికల హామీ మేరకు మినిమం టైం స్కేలు, ఒకే కేడర్ – ఒకే వేతనం అమలు చేయాలన్నారు. సమాన సౌకర్యాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. వీటి సాధన కోసం అవసరమైతే ప్రత్యక్ష పోరాటానికి సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఏపీ ఎన్హెచ్ఎం జేఏసీ హానరరీ చైర్మన్, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.వి.నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని దేశ వ్యాప్తంగా ఈ నెల 9న తలపెట్టిన సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల ఫెడరేషన్ అధ్యక్షురాలు శిరీష మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు వి.వి. శ్రీనివాసరావు, పెంటయ్య, బీఎన్రాజు తదితరులు పాల్గొన్నారు.● ఏపీ ఎన్హెచ్ఎం జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జయరాజు, చైర్మన్ థయామణి -
స్టోన్ క్రషర్ లీజ్ రద్దు చేయాలని నిరసన
మాకవరపాలెం మండలం జి.కోడూరులో సర్వే నంబర్ 332లో కొండ పోరంబోకు ఆనుకుని 98 ఎకరాల్లో 13 బీసీ, 23 ఎస్సీ కుటుంబాలు తమ పూర్వీకుల నుంచి నివసిస్తున్నాయి. ఇక్కడ 2018 ఫిబ్రవరి 21న 24 హెక్టార్లలో అప్పటి టీడీపీ ప్రభుత్వం 20 సంవత్సరాల కాలవ్యవధికి రాధాకృష్ణ కనస్ట్రక్షన్కు క్వారీ లీజు మంజూరు చేసింది. సదరు సంస్థ 2020 మే 9వ తేదీన టీడీపీకి నేతకు సబ్ లీజ్కు ఇచ్చింది. ఈయన నడుపుతున్న స్టోన్ క్రషర్ వల్ల 36 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని, తక్షణమే నిలుపుదల చేయాలని మాకవరంపాలెం తహసీల్దార్కు బాధితులు ఫిర్యాదులు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదు. దీనిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని జి.కోడూరు గ్రామం మాదిగ సంఘం ప్రతినిధులు ధర్నా చేపట్టారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు వెంకటపల్లి జాన్ మార్కు, జి.కోడూరు మాదిగ సంఘం ప్రతినిధి ఎ.అప్పారావు, తదితరులు పాల్గొన్నారు. -
మెగా లోక్ అదాలత్లో 1076 కేసుల పరిష్కారం
చోడవరం : స్థానిక కోర్టుల సముదాయంలో శనివారం జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. 9వ ఏడీజే కోర్టు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, జూనియర్ ప్రిన్సిపల్ సివిల్ కోర్టు, అదనపు సివిల్ జడ్జి కోర్టుల పరిధిలో పలు కేసులను పరిష్కరించారు. ఈ లోక్ అదాలత్లో అన్ని విభాగాలకు చెందిన 1076 కేసులను పరిష్కరించారు. అత్యధికంగా ఎస్టీసీ కేసులు 946 పరిష్కరించారు. అనంతరం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా 9వ ఏడీజే కోర్టు న్యాయమూర్తి రత్నకుమార్ మాట్లాడుతూ చట్టాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. సీనియర్ సివిల్ జడ్జి గౌరీశంకరరావు మాట్లాడుతూ చిన్ని చిన్న తగాదాలకు కోర్టులకు ఎక్కకుండా రాజీమార్గంలో పరిష్కరించుకోవాలన్నారు. జూనియర్ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి సూర్యకళ, చోడవరం, కె.కోటపాడు సీఐలు అప్పలరాజు, కోటేశ్వరరావు పాల్గొన్నారు. -
పెంపుడు కుక్కలకు రేబిస్ టీకాలు
పశువైద్యాధికారులతో మాట్లాడుతున్న జిల్లా పశువైద్యశాఖ అధికారి రామ్మోహనరావు అనకాపల్లి: పెంపుడు కుక్కలకు ఉచితంగా రేబిస్ వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నట్టు జిల్లా పశువైద్యశాఖ అధికారి డాక్టర్ వి.రామ్మోహనరావు తెలిపారు. ఆదివారం జునోసిస్ డే వేడుకలను పురస్కరించుకుని స్థానిక గాంధీనగరం జిల్లా ఆస్పత్రి ఆవరణలో శనివారం జిల్లాలో అన్ని మండలాలకు చెందిన పశు వైద్యాధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెంపుడు కుక్కలకు రేబిస్ వ్యాధి సోకకుండా టీకాలు వేయించాలన్నారు. కార్యక్రమంలో పశు వైద్యులు తదితరులు పాల్గొన్నారు. -
15న మున్సిపల్ కార్మికుల ‘చలో విజయవాడ’
అనకాపల్లి: మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగంలో కార్మికులకు జీవో నంబర్ 36 ప్రకారం కేటగిరీల వారీగా వేతనాలు పెంచాలని జీవీఎంసీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కోన లక్ష్మణ డిమాండ్ చేశారు. స్థానిక జోనల్ కార్యాలయం వద్ద యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం జోనల్ కమిషనర్ బి.వి.రమణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ మాట్లాడుతూ మున్సిపల్ పర్మినెంట్ కార్మికులకు పెండింగ్ డీఏలు, రిటైర్డ్ కార్మికులకు గ్రాట్యుటీ సత్వరం విడుదల చేయాలన్నారు. ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బందికి కనీస వేతనాలు అందని ద్రాక్షగా మారాయని మండిపడ్డారు. ఒకవైపు సంక్షేమ పథకాలు అందక, మరోవైపు పిల్లల ఉన్నత చదువులు, కుటుంబ పోషణ, రవాణా ఖర్చులు పెరిగి ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు. ప్రభుత్వ రంగ సంస్థలోనే కేటగిరీల వారీగా వేతనాలు అందకపోతే, ప్రైవేట్ సంస్థల్లో కార్మికులకు కనీస వేతన చట్టాలు ఏ రకంగా అమలవుతాయని ప్రశ్నించారు. జోన్ పరిధిలో ఇంజినీరింగ్, నీటి సరఫరా, టౌన్ ప్లానింగ్, స్కూల్ స్వీపర్లు, పార్కు కూలీల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరుతూ ఈ నెల 15న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు నిమ్మకాయల నర్సింహమూర్తి, ఎర్రంశెట్టి అప్పలరాజు, బంగారి రవి, సోమధుల శ్రీనివాస్, సింగపల్లి అజయ్, ఎర్రం శెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఇన్చార్జి ఎంపీపీగా గోవిందరావు ప్రమాణస్వీకారం
ఎస్.రాయవరం: స్థానిక ఇన్చార్జి ఎంపీపీగా బొలిశెట్టి గోవిందరావు మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడ ఎంపీపీగా ఎన్నికై న కేసుబోయిన వెంకటలక్ష్మి వ్యక్తిగత కారణాలతో ఇటీవల రాజీమానాచేయడంతో ఆమె స్థానంలో వైస్ ఎంపీపీ గోవిందరావుకు ఇన్చార్జ్ ఎంపీపీగా బాధ్యతలు అప్పగించారు. వైఎస్సార్సీపీ పాయకరావుపేట నియోజకవర్గ ఇన్చార్జ్ కంబాల జోగులు , మండలంలో నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన వైఎస్సార్ సీపీ శ్రేణులు గోవిందరావుకు అభినందనలు తెలిపారు. దుశ్శాలువాలు, పుష్పగుచ్ఛాలు, గజమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్సార్సీపీ పాయకరావుపేట నియోజకవర్గ ఇన్చార్జ్ కంబాల జోగులు మాట్లాడుతూ గోవిందరావు మండల ప్రజల సంక్షేమానికి కృషి చేయడంతోపాటు పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటారని చెప్పారు. కూటమినేతలు ప్రలోభాలకు గురిచేసినా ఎస్.రాయవరం మండలం వైఎస్సార్ సీపీ శ్రేణులు ఐక్యతతో ఉన్నారంటే దానికి కారణం బొలిశెట్టి గోవిందరావునేనని చెప్పారు. అంతకుముందు గోవిందరావు మాట్లాడుతూ కష్టపడిన వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని చెప్పారు. అనంతరం కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ గోవిందురావును సత్కరించారు. ఈ సందర్భంగా వైభవ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కాకర దేవి, సర్పంచ్ల సంఘ అధ్యక్షుడు కర్రి సత్యనారాయణ,సర్పంచ్లు ధూళి శ్రీనివాసరావు, శానాపతి శ్రీరాములు, పాలపర్తి పాపారావు, కోశెట్టి వెంకటరమణ,గాడి అప్పలనరసింహా,భూపతి అప్పారావు, చోడిపల్లి శ్రీనివాసరావు, ఎంపీటీసీలు బాలం సూరిబాబు,శానాపతి రాము, కేసుబోయిన వెంకటలక్ష్మి,బైపా శ్రీనివాసరావు,వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మధువర్మ, జిల్లా కమిటీ సభ్యులు కొణతాల శ్రీనివాసరావు,మండల యూత్ అధ్యక్షుడు నల్లపరాజు వెంకటరాజు,నాయకులు బొలిశెట్టి శ్రీనివాసరావు, అల్లాడ నాగరాజు,చేకూరి శ్రీరామచంద్రరాజు, దాట్ల రామురాజు,శిగటాపు జోగిరాజు, ఇళ్ల సత్యనారాయణ,వియ్యపు రమణ,వెలగా శ్రీనివాసరావు,చొప్పా రాజు, గుర్రం నానాజీ,కాసెపు అప్పన్న,కర్రి శ్రీను, ఉద్దడం సూర్యనారాయణ,అద్దేపల్లి బొజ్జన్న, నాగంబోయిన శ్రీనివాసరావు,శేషు,బొండా దివాణం,మందగుదుల వెంకటరమణ, ,కనికళ్ల అమ్మాజి, కర్రి వరహాలరావు,పిట్ల నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
సెజ్ కాలనీలో ఆటిజం శిక్షణ కేంద్రం
అచ్యుతాపురం రూరల్: సెజ్ పునరావాస కాలనీలో ఆటిజం సపోర్ట్ శిక్షణ కేంద్రం ప్రారంభించనున్నట్లు యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ తెలిపారు. శనివారం ఆయనతోపాటు రాష్ట్ర సమగ్ర శిక్షణ ఆటిజం కేంద్రాల నిపుణులు శ్రీరామ్ కమల్ మనోజ్ ఇక్కడ కాలనీని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటిజం శిక్షణ కేంద్రంలో ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, ఒకేషనల్ ట్రైనింగ్ శిక్షణ, లెర్నింగ్ సపోర్ట్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ మ్యాథ్స్ రోబోటిక్ ల్యాబ్స్, అడ్వాన్స్డ్ ఫిజియో, న్యూరో ఎబిలిటీ, రీహాబిలిటేషన్ థెరపీ అందిస్తారన్నారు. దివ్యాంగ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి హైడ్రో థెరపీ, ఈత కొలను ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఆటిజం, దివ్యాంగ విద్యార్థులకు శిక్షణ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల డిజిటల్ విద్య రాష్ట్ర రిసోర్స్ పర్సన్ బి.మహాలక్ష్మినాయుడు పాల్గొన్నారు. -
బీమాతో ధీమా
● తక్కువ ప్రీమియంతో కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలు ● గ్రామస్థాయి జన సురక్ష పేరిట పథకాలు ● మూడు నెలల కాలంలో ప్రీమియం చెల్లించేలా అవగాహన సదస్సులు మునగపాక: చిన్న ప్రీమియం.. అందరికీ పేద్ద రక్షణ అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. పలు పథకాలను అమలు చేస్తూ ప్రజలకు చేదోడు వాదోడుగా నిలుస్తోంది. తక్కువ ఫ్రీమియంతో బీమా సదుపాయం దక్కించుకునేలా గ్రామ స్థాయి జన సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టింది. మూడు నెలల కాలంలో అర్హులందరితో ప్రీమియం చెల్లించేలా గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఇలా..... ప్రధానమంత్రి సురక్ష బీమా పథకానికి లబ్ధిదారు ఏడాదికి రూ.20 ప్రీమియం చెల్లించాలి. ఇలా చెల్లించిన వారికి ప్రమాద బీమా కింద రూ.2 లక్షలు అందుతుంది. ఈ పథకం తీరు తెన్నులు ఇలా.. మరణం లేదా శాశ్వత పూర్తి వైకల్యం సంభవించినట్లయితే రూ.2 లక్షల ప్రమాద బీమా కింద సాయం అందుతుంది. శాశ్వత, పాక్షిక వైకల్యానికి రూ.లక్ష బీమా సాయం అందుతుంది. సంవత్సరానికి కేవలం రూ.20 ప్రీమియంగా చెల్లించాలి. 18 నుంచి 70 సంవత్సరాల వయస్సు కలిగిన వారు అర్హులుగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా పథకం ఇలా.. ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది. ఏడాదికి రూ.436 ప్రీమియం చెల్లిస్తే రూ.2 లక్షల మేర జీవిత బీమా యోజన కింద అందజేస్తారు. వయస్సు 18 నుంచి 50 సంవత్సరాల వారికే ఈ పథకం కింద అర్హులుగా నిర్ణయించారు. అటల్ పెన్షన్ పథకం ఇలా... కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన అటల్ పెన్షన్ విధానం అమలు తీరు ఇలా ఉంది. 60 సంవత్సరాల వయస్సు తర్వాత నెలకు రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు కనీస హామీ పెన్షన్. చందాదారుడు మరణిస్తే జీవిత భాగస్వామికి అదే పెన్షన్ లభిస్తుంది. చందాదారుడు, అతని జీవిత భాగస్వామి మరణించినట్లయితే తర్వాత నామినీ 60 సంవత్సరాల వయస్సు వరకు సేకరించిన పెన్షన్ సంపదను అందుకుంటారు. 18 నుంచి 40 సంవత్సరాల వయస్సున్న పౌరులు ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. 3 నెలల ఆర్థిక చేరిక కేంద్రీకృత ప్రయత్నం... కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన జన సురక్ష కార్యక్రమం మూడు నెలల పాటు అమలు జరిగేలా చర్యలు చేపట్టారు. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు అర్హులైన వారు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ మూడు నెలల కాలంలో ప్రీమియం చెల్లించిన వారికి మాత్రమే బీమా పథకాలు అమలులోకి తీసుకువస్తున్నారు. భారత ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం ఆదేశాల మేరకు ఈ జన సురక్షను అందుబాటులోకి తీసుకువచ్చారు. గ్రామ సంఘాల ద్వారా జన సురక్షపై అవగాహన.. వెలుగు కార్యాలయం అధికారులు గ్రామ జన సురక్ష కార్యక్రమంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. డ్వాక్రా సంఘ సభ్యులకు సురక్ష కార్యక్రమం ద్వారా జరిగే మేలును ఎప్పటికప్పుడు వివరిస్తున్నారు. ఎంత ప్రీమియం చెల్లిస్తే బీమా పథకాలు అందుతాయన్న విషయమై సందేహాలను నివృత్తి చేస్తున్నారు. చిన్న ప్రీమియం అందరికీ పెద్ద రక్షణ అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి గ్రామ సురక్ష పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. గ్రామాల్లో డ్వాక్రా మహిళలకు ఈ పథకం తీరుతెన్నులపై అవగాహన కల్పిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. వయస్సు ప్రామాణికంగా తీసుకొని ప్రీమియం చెల్లించేలా చర్యలు చేపడుతున్నాం. వై.బాలరాజు, వెలుగు ఏపీఎం -
చెరకు ఉత్పత్తులను వృద్ధి చేయడమే లక్ష్యం
గిరిజన రైతులకు చెరకు ఉత్పత్తి, సాగుపై శిక్షణ ఇస్తున్న శాస్త్రవేత్తలు తుమ్మపాల: గిరిజన ప్రాంతాల్లో చెరకు ఉత్పత్తులను మరింత వృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యమని ప్రాంతీయ పరిశోధన స్థానం సహ సంచాలకుడు డాక్టర్ సిహెచ్.ముకుందరావు, ప్రధాన శాస్త్రవేత్త చెరకు డాక్టర్ బి.ఆదిలక్ష్మి అన్నారు. అఖిలభారత సమన్వయ సంస్థ ఆధ్వర్యంలో చెరకు గిరిజన ఉప ప్రణాళిక కింద ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఈ నెల 1 నుంచి 5 వరకు గిరిజన రైతులకు చెరకు సాగు విధానాల సాంకేతిక పరిజ్ఞానంపై ప్రధాన శాస్త్రవేత్త (తెగుళ్లు) డాక్టర్ వి.చంద్రశేఖర్, ప్రధాన శాస్త్రవేత్త పురుగుల విభాగం డాక్టర్ బి.భవానీ శిక్షణ నిర్వహించారు. బెల్లం తయారీ, విలువ ఆధారిత ఉత్పత్తులపై శిక్షణ ఇచ్చామని తెలిపారు. 25 మంది గిరిజన రైతులు వివిధ ఉన్నత శ్రేణి ప్రాంతాల రైతులు శిక్షణ పొందారన్నారు. చెరకు జ్యూస్ వేసుకునే బకెట్లు, ఎరువులు వేసుకునే పాత్రలు, చెరకు నరికే కత్తులు, వర్మి కంపోస్టు కోకోపీట్, ఎన్రిచ్డ్ మెన్యూర్ బయో ఫెర్టిలైజర్స్, కేజీ బెల్లం అచ్చులు రైతులకు పంపిణీ చేశారు. -
మాజీ ఎమ్మెల్యే గణేష్కు పరామర్శ
మాజీ ఎమ్మెల్యే గణేష్ను పరామర్శిస్తున్న మాజీ మంత్రి, పార్టీ అధ్యక్షుడు అమర్నాథ్, ఎమ్మెల్యేలు, నాయకులు నర్సీపట్నం: మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ను మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజు శనివారం పరామర్శించారు. ఐదు రోజులుగా విష జ్వరంతో బాధపడుతున్న గణేష్ విశాఖ మెడికవర్ హాస్పిటల్లో వైద్యం పొందుతున్నారు. ఈ మేరకు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పరామర్శలో వైఎస్సార్సీపీ నాయకుడు శరగడం చిన అప్పలనాయుడు, యలమంచిలి ఎంపీపీ గోవింద్, తదితరులు ఉన్నారు. -
దేవరాపల్లి స్కూల్ మూసివేతకు కూటమి నేతల కుట్ర
● రూ.కోట్ల విలువు చేసే స్థలంపై కన్ను ● సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకన్న దేవరాపల్లి: స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో మెయిన్ స్కూల్ మూసివేతకు కూటమి నేతలు కుట్రలు పన్నుతున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న విమర్శించారు. దేవరాపల్లిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రూ. కోట్ల విలువ చేసే పాఠశాల స్థలంపై కొందరు కూటమి నేతలు కన్నేశారని ఆరోపించారు. పథకం ప్రకారం 3,4,5 తరగతులను ఎస్సీ కాలనీలో పాఠశాలకు పంపించేసి, ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన మెయిన్ స్కూల్ను 1,2 తరగతులకే పరిమితం చేసి ఫౌండేషన్ స్కూల్గా మార్చేశారన్నారు. దీన్ని ఒకటి రెండేళ్లు పాటు కొనసాగించి పిల్లలు లేరన్న సాకుతో మూసి వేయా లని కుయుక్తులు పన్నుతున్నారన్నారు. దీంతో పలువురు పేద విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరుకుల కాలనీ, కొరుప్రోలు వీధి చెందిన 3,4,5 తరగతుల విద్యార్థులు రోజూ రానుపోను ఆటోకు రూ. 20 చెల్లించి ఎస్సీ కాలనీలో మోడల్ స్కూల్కు వెళ్లాల్సి వస్తోందన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి మెయిన్ స్కూల్ను బేసిక్ ప్రైమరీ స్కూల్గా మార్పు చేసి, పేద పిల్లల చదువులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. -
లోక్ అదాలత్తో సత్వర పరిష్కారం
లోక్ అదాలత్ కార్యక్రమంలో మాట్లాడుతున్న పదో అదనపు జిల్లా జడ్జి నరేష్ అనకాపల్లి టౌన్: కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్లు ఉపకరిస్తాయని, లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని పదో అదనపు జిల్లా జడ్జి నరేష్ తెలిపారు. స్థానిక కోర్టు ప్రాంగణంలో శనివారం లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుకోకుండా ఎదురైన గొడవలతో కేసులు పెట్టుకుని కాలంతో పాటు ఆర్థికంగా నష్టపోకూడదని వివరించారు. కోర్టు చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృథా చేసుకోకుండా లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కక్షిదారుల ప్రయోజనం కోసం సుప్రీంకోర్టు ఈ అదాలత్ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో సబ్ కోర్టు న్యాయమూర్తి నాగేశ్వరరావు, అడిషనల్ సబ్ కోర్టు న్యాయమూర్తి రామకృష్ణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిల్లా హర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
1,114 కేసులు పరిష్కారం
యలమంచిలిలో లోక్ అదాలత్ నిర్వహిస్తున్న సీనియర్ సివిల్ జడ్జి విజయ యలమంచిలి రూరల్: జాతీయ లోక్ అదాలత్లో భాగంగా శనివారం స్థానిక న్యాయస్థానాల సముదాయంలో సీనియర్ సివిల్ జడ్జి పి.విజయ అధ్యక్షతన నిర్వహించిన లోక్ అదాలత్లో 1,114 కేసులు పరిష్కారమయ్యాయి.వివిధ కేసుల్లో కక్షిదారులకు రూ.1,66,67,280 చెల్లింపులు జరిగాయి. న్యాయమూర్తులు జి.స్పందన, కె.రమేష్,బార్ అసోసియేషన్ అధ్యక్షుడు టి.సత్యనారాయణ,లోక్ అదాలత్ సభ్యులు డి.వెంకటరావు, పి.వి.రమణ,పలువురు న్యాయవాదులు,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
పెంచిన ట్రూ అప్ చార్జీలను రద్దు చేయాలి
అనకాపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని, స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేస్తామని ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రాజాన దొరబాబు అన్నారు. పెంచిన విద్యుత్ చార్జీలను, స్మార్ట్ మీటర్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువగళం పేరుతో పాదయాత్ర చేసినప్పుడు నారా లోకేష్ స్మార్ట్ మీటర్లను బద్దలు కొట్టాలని ఇచ్చిన పిలుపు ఏమైందని ఆయన ప్రశ్నించారు. స్మార్ట్ మీటర్లు బిగించడంపై ఉన్న శ్రద్ధను సూపర్ సిక్స్ పథకాలు అమలు పై పెట్టాలని ఆయన తెలిపారు. అదానీతో చేసుకున్న సోలార్ విద్యుత్ ఒప్పందం వల్ల రాష్ట్రంపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుందని, తక్షణమే ఈ ఒప్పందం రద్దు చేయాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రకటనలు ఇచ్చి న కూటమి నాయకులు ఇప్పుడు ఎందుకు ఒప్పందం రద్దు చేయలేదో అర్థం కావడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పరమేశ్వరి, జి.ఫణింద్ర కుమార్, అనకాపల్లి మండల కార్యదర్శి వియ్యపురాజు, జిల్లా సమితి సభ్యులు గొర్లె దేముడు బాబు, నాయకులు కోరిబిల్లి శంకరరావు, కాసుబాబు,పోతురాజు,సత్తిబాబు,త్రినాథ్,సత్యనారాయ ణ, ఎం.సూరిబాబు, ఈశ్వరరావు,బుజ్జి పాల్గొన్నారు. -
గిరి ప్రదక్షిణకు పటిష్ట ఏర్పాట్లు
● విశాఖ కలెక్టర్ హరేందిర ప్రసాద్ మహారాణిపేట: శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించే సింహాచలం గిరి ప్రదక్షిణ మహోత్సవాన్ని సమన్వయంతో విజయవంతం చేద్దామని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అన్నారు. కలెక్టరేట్లో శనివారం జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరి ప్రదక్షిణకు 5–6 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున పటిష్టమైన పోలీస్ బందోబస్తు, క్యూలు, రద్దీ ప్రదేశాల్లో తోపులాటలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రతి 200 మీటర్లకు ఒకటి చొప్పున 132 తాగునీటి పాయింట్లు, 500 మరుగుదొడ్లు, ఆరు కంట్రోల్ రూమ్లు, ఐదు చోట్ల పబ్లిక్ అడ్రస్ సిస్టం, 13 పార్కింగ్ ప్రాంతాలు, 50 ఉచిత బస్సు సర్వీసులు, 18 నెట్వర్కింగ్ ఆసుపత్రులకు అనుసంధానంగా 32 వైద్య శిబిరాలు, 18 అంబులెన్సులు సిద్ధం చేసినట్లు చెప్పారు. రద్దీ ప్రాంతాల్లో 190 ఎల్ఈడీ దీపాలు, నిరంతర విద్యుత్ సరఫరా కోసం 9 జనరేటర్లు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా 9, 10 తేదీల్లో మద్యం దుకాణాలు మూసివేత, అప్పుఘర్ వద్ద 5 బోట్లు, 60 మంది గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారని కలెక్టర్ వెల్లడించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యేలు రామకృష్ణబాబు, విష్ణుకుమార్ రాజు, రమేష్బాబు, వంశీకృష్ణ, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ తదితర ప్రజా ప్రతినిధులు సూచించారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రచార రథం ప్రారంభం దేవస్థానం ఈవో త్రినాథరావు మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు తొలిపావంచా వద్ద అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు ప్రచార రథాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. ఆ రోజు రాత్రి 10 నుంచి 11 గంటల మధ్యలో రథం ఆలయానికి చేరుకుంటుందని, స్వామి పవళింపు సేవ, ఇతర లాంఛనాల అనంతరం 10వ తేదీ ఉదయం 5 గంటలకు స్వామి దర్శనాలు ప్రారంభమవుతాయని చెప్పారు. దర్శనాలు సాయంత్రం 4 గంటల వరకు, తిరిగి 5.30 నుంచి 7 గంటల వరకు కొనసాగుతాయని వెల్లడించారు. దేవదాయ శాఖ ఇన్చార్జి కమిషనర్ రామచంద్రమోహన్, సీపీ శంఖబ్రత బాగ్చి, డీసీపీలు అజిత, మేరీ ప్రశాంతి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
10న మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం
వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న కలెక్టర్ విజయ కృష్ణన్ తుమ్మపాల: జిల్లాలోని 1955 పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఈనెల 10 మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం, తల్లికి వందనం పథకం అమలుపై నియోజకవర్గ, మండల అధికారులతో ఆమె శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలలకు చెంది 2.12 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్లతో ఆయా విద్యాలయాల్లో సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలన్నారు. పాఠశాలలను, జూనియర్ కళాశాలలను సుందరంగా అలంకరించి, విద్యార్థులు, తల్లిదండ్రులను మర్యాదపూర్వకంగా ఆహ్వానించి పండగ వాతావరణంలో సమావేశం జరుపుతామని చెప్పారు. విద్యార్థి తల్లి పేరుతో ఒక మొక్క నాటడం ఈ ఏడాది థీమ్గా తీసుకున్నట్టు తెలిపారు. పాఠశాల ఆవరణలో గానీ, ఇంటి వద్ద గానీ మొక్క నాటవచ్చని చెప్పారు. విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు జరిపి, వారి ఆరోగ్య స్థితిపై 10న రిపోర్ట్ ఇస్తారన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి ప్రజా ప్రతినిధులను కూడా ఈ సమావేశాలకు ఆహ్వానించనున్నట్టు చెప్పారు. పూర్వ విద్యార్థులు, అక్కడే చదివి ఉన్నత స్థానాల్లో నిలిచిన గొప్ప వ్యక్తులను కూడా ఆహ్వానించి, సన్మానించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా విద్యా ర్థులకు, తల్లిదండ్రులకు పలు పోటీలు నిర్వహించనున్నట్టు చెప్పారు. బాలికల రక్షణ, సైబర్ క్రైమ్, ఆరోగ్యం,డ్రగ్స్,గంజాయి నిర్మూలనపై అవ గాహ న కల్పించనున్నట్టు తెలిపారు. ఏర్పాట్ల పర్యవేక్షణకు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలను నియమిస్తామని చెప్పారు. జిల్లా స్థాయిలో డీఆర్వో ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేయనున్నట్టు ఆమె తెలిపారు. డీఆర్వో వై.సత్యనారాయణరావు, సీపీవో జి.రామారావు, డీవీఈవో వినోద్ బాబు పాల్గొన్నారు. -
అడుగడుగునా నిలదీత
● పి.ధర్మవరంలో హోంమంత్రికి ఎదురైన అనుభవం ● సుపరిపాలనపై ప్రజల్లో అసంతృప్తి ఎస్.రాయవరం: సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో అధికార పార్టీ నాయకులకు అడుగడుగునా నిలదీతలు, అసంతృప్తులు ఎదురవుతున్నాయి. ఎస్.రాయవరం మండలం పి.ధర్మవరంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హోంమంత్రి వంగల పూడి అనితకు ఈ అనుభవం ఎదురైంది. తమకు వృద్ధాప్య పింఛను రాలేదని, తల్లికివందనం పథకం వర్తించలేదని, గ్రామంలో వీధి రోడ్లు, కాలువలు అధ్వానంగా ఉన్నా పట్టించుకునే నాథుడే లేడని పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్రాంతి పండగ లోగా రోడ్లన్నీ బాగు చేస్తామని, కొత్తరోడ్లు వేస్తామంటూ హామీలు ఇచ్చారని, అలాగే అర్హులైన వారందరికీ పింఛన్లు, తల్లికి వందనం పథకం ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికీ తల్లికి వందనం ఇస్తామంటూ ప్రచారం చేశారని, అందరికీ మాటెలా ఉన్నా ఒక్కరికి కూడా ఈ పథకం కింద ఆర్థిక సాయం అందలేదని పలువురు మహిళలు వాపోయారు.గ్రామంలో సమస్యలు రాజ్యమేలుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్నారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలన్నీ అర్హులందరికీ అందజేస్తామన్నారు. ఇది తెలుసుకోవడం కోసమే సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. తల్లికివందనం పథకం వర్తించని వారు సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేస్తే పరిశీలించి మంజూరు చేస్తామన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలు మంత్రిని, టీడీపీ నాయకులను నిలదీసే సన్నివేశాలు, ప్రశ్నిస్తున్న అంశాలను ఫొటోలు, వీడియోలు తీయకుండా టీడీపీ నాయకులు జాగ్రత్త పడుతున్నారు. టీడీపీలో గ్రూపుల గోల ఇక టీడీపీకి సంబంధించి గ్రూపుల పోరుకూడా మంత్రి ముందుకు వచ్చింది. పార్టీ కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలు ఉంటే పార్టీకి సంబంధించిన సమాచారం కేవలం ఒక వ్యక్తికి మాత్రమే తెలియజేయడం ఎంతవరకు సమంజసమని పలువురు కార్యకర్తలు మంత్రిని ప్రశ్నించారు. ఇలా అయితే పార్టీకి నష్టం జరుగుతుందని, అందరినీ కలుపుకొని పోయేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తూతూ మంత్రంగా.. బుచ్చెయ్యపేట : మండలంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం తూతూ మంత్రంగా సాగింది. మంగళాపురం, కుముదాంపేట, విజయరామరాజుపేట, పి.భీమవరం, చిన అప్పనపాలెం గ్రామాల్లో ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్ రాజు నాయకులతో కలిసి గ్రామాల్లో పర్యటించారు. నాయకులంతా ఫొటోలకు ఫోజులివ్వడానికే పోటీపడ్డారు. -
బిల్లులు రాక.. పనులు సాగక
● ‘ఉపాధి’లో పెండింగ్ బిల్లులు రూ.132 కోట్లు ● నిధుల కోసం కాంట్రాక్టర్ల నిరీక్షణ ● పేరుకుపోయిన ‘పల్లె పండగ’ పనుల బకాయిలు ● పలు చోట్ల అసంపూర్తిగా నిలిచిపోయిన పనులు ● మిగిలిన పనులు చేసేందుకు ఆసక్తి చూపని కాంట్రాక్టర్లు సాక్షి, అనకాపల్లి: ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్తో జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులకు చెల్లింపులు జరగడం లేదు. కొద్ది నెలలుగా బిల్లులు మంజూరు కావడం లేదు. అధికారులు బిల్లులు అప్లోడ్ చేస్తున్నా.. నిధులు రావడం లేదు. దీంతో రూ.132 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి. అప్పులు చేసి మరీ కాంట్రాక్టర్లు సీసీ రోడ్లు, ఇతర పనులు చేపట్టారు. బిల్లులు ఎప్పుడొస్తాయో తెలియక కాంట్రాక్టర్లు లబోదిబో మంటున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఉన్నతాధికారులు కోరుతున్నా కాంట్రాక్టర్లు సహకరించడం లేదు. చెల్లింపులు లేకపోతే ఎలా పనులు చేస్తామని వారు ప్రశ్నిస్తున్నారు. మిగిలిన పనులను అసంపూర్తిగా వదిలేశారు. నాలుగు నెలలు దాటినా.. గత ఏడాది అక్టోబర్ 14వ తేదీ నుంచి ‘పల్లె పండగ’ పేరిట గ్రామ సభలు నిర్వహించి, సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఇతర నిర్మాణాలను చేపట్టేందుకు వినతులు స్వీకరించారు. అప్పటి నుంచి ఫిబ్రవరి 15వ తేదీ నాటికి పూర్తయిన పనుల బిల్లులను తొలిదశలో అధికారులు అప్లోడ్ చేశారు. నాలుగు నెలలు దాటినా కాంట్రాక్లర్లకు తొలి దశ నిధులు విడుదల కాలేదు. కొన్ని చోట్ల బిల్లులు విడుదల కాకపోవడంతో కాంట్రాక్టర్లు అసంపూర్తిగానే పనులు నిలిపివేశారు. గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం కోసం వేసిన రాళ్లు, కంకర, ఇసుక వర్షాలకు కొట్టుకుపోయి రహదారులు అస్తవ్యస్తంగా మారుతున్నాయి. అసంపూర్తిగా పనులు... ఉపాధి హామీ పథకం బిలుల్లు రాకపోవడంతో సబ్బవరం, నర్సీపట్నం, నాతవరం, రావికమతం, చోడవరం,నక్కపల్లి, కశింకోట, రోలుగుంట, గొలుగొండ, దేవరాపల్లి మండలాల్లో పల్లె పండగ పనులను కాంట్రాక్టర్లు అసంపూర్తిగా నిలిపివేశారు. కొన్ని చోట్ల మందకొడిగా సాగుతున్నాయి. పనులు పూర్తి చేయాలంటూ ఇంజినీర్లు నోటీసులు జారీ చేస్తున్నా బిల్లులు విడుదలైతేనే పనులు చేపడతామని కాంట్రాక్టర్లు ఖరాఖండీగా చెప్పేస్తున్నారు. గత ప్రభుత్వంలోనే మేలు.. కూటమి ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు ‘పల్లె పండగ’ పనులు చేయడానికి పోటీ పడ్డారు. కానీ బిల్లులు అందకపోవడంతో డీలా పడ్డారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే త్వరగా బిలుల్లు వచ్చేవని చెబుతున్నారు. ఇప్పటికై నా జిల్లాకు చెందిన మంత్రి, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని పెండింగ్ బిల్లులు చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వారు కోరుతున్నారు. కాగా పెండింగ్ బిల్లుల విషయాన్ని పీఆర్ ఈఈ వద్ద ప్రస్తావించగా.. రోడ్ల పనులు ఒకింత నెమ్మదిగా జరుగుతున్న మాట వాస్తవమేనని, అయితే పూర్తిగా నిలిచిపోలేదన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. త్వరలో నిధులు విడుదలవతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలో 166 కిలోమీటర్ల పొడవున 1,354 రోడ్ల నిర్మాణ పనులకు రూ.143 కోట్లు ఖర్చు చేసినట్టు అధికారులు బిల్లులు అప్లోడ్ చేశారు. ఇంతవరకు రూ.11 కోట్లు మాత్రమే చెల్లింపులు జరిగాయి. ఇంకా రూ.132 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత గత ఏడాది నవంబరు నుంచి ‘పల్లె పండగ’ పేరుతో సీసీ రోడ్లు, డ్రైనేజీ, రోడ్ల మరమ్మతులు వంటి నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపొనెంట్ కింద 189 కిలోమీటర్ల పొడువుగల 1,734 రోడ్ల నిర్మాణ పనులు మంజూరయ్యాయి. పంచాయతీరాజ్ ఇంజినీర్ల పర్యవేక్షణలో పనులు ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం కాబట్టి బిల్లులు త్వరగా మంజూరవుతాయన్న ఉద్దేశంతో కాంట్రాక్టర్లు పోటీపడి మరీ గ్రామాల్లో పనులు చేపట్టారు. ఫిబ్రవరి 15వ తేదీ నాటికి జిల్లాలో 166 కిలోమీటర్ల పరిధిలో 1,354 రోడ్ల నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. వీటికి సంబంధించి రూ.143 కోట్లు విడుదల చేయాలంటూ ఉపాధి హామీ పథకం వెబ్సైట్లో బిల్లులు అప్లోడ్ చేశారు. మార్చి నెలాఖరునాటికి నిధులు విడుదల కావాల్సి ఉంది. కానీ జూలై నెల కూడా వచ్చేసింది. ఇంకా నిధులు విడుదల కాలేకపోవడంతో కాంట్రాక్టర్ మిగిలిన పనులు నిలిపివేశారు. -
గిరి ప్రదక్షిణ ఏర్పాట్లలో మళ్లీ అదే నిర్లక్ష్యం
● తొలిపావంచా వద్ద కూలిన షెడ్ ● మారని ఇంజినీరింగ్ అధికారుల తీరు ● తప్పిన పెను ప్రమాదం సింహాచలం: ఈ నెల 9, 10 తేదీల్లో జరగనున్న గిరి ప్రదక్షిణ ఉత్సవ ఏర్పాట్లలో భాగంగా సింహాచలం కొండదిగువ తొలి పావంచా వద్ద నిర్మిస్తున్న తాత్కాలిక షెడ్ శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడ భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన దేవస్థానం ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యాన్ని మరోసారి బహిర్గతం చేసింది. సింహాచలంలోని కొండ దిగువ తొలిపావంచాకి ఒక విశిష్టత ఉంది. గిరి ప్రదక్షిణ రోజుల్లో ఇక్కడే కొబ్బరికాయ కొట్టి భక్తులు నడక ప్రారంభిస్తారు. 32 కిలోమీటర్లు ప్రదక్షిణ చేసి తిరిగి ఇక్కడే కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణ ముగిస్తారు. ఆ రోజు తొలి పావంచా వద్ద నెలకునే రద్దీ అంతా ఇంతా కాదు. వీరి సౌకర్యార్థం తొలిపావంచా పక్కనే ఉన్న అర ఎకరం విశాల ప్రాంగణంలో దాదాపు 20 క్యూలను ఏర్పాటు చేశారు. భక్తులు ఎండ, వాన నుంచి రక్షణ పొందేందుకు రెండు రోజులుగా ఈ షెడ్లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ పనులను ఇంజినీరింగ్ పర్యవేక్షించకుండా పూర్తిగా కాంట్రాక్టర్పైనే వదిలేశారు. పైగా ఈసారి రాష్ట్రంలోని పలు దేవస్థానాల నుంచి 20 మంది వరకు ఇంజినీరింగ్ అధికారులను డిప్యూటేషన్పై ఇక్కడకు రప్పించారు. అయితే నిర్మాణ పనుల నాణ్యతను పర్యవేక్షించడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది చందనోత్సవం రోజున గోడకూలి ఏడుగురు మరణించిన ఘటన నుంచి కూడా అధికారులు పాఠాలు నేర్చుకోలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన దేవస్థానం ఈవో వి.త్రినాథరావు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రూ.5.80 లక్షల విలువైన ఈ పనులను కేఎస్ఆర్ సప్లయర్స్ అనే కాంట్రాక్టర్కు అప్పగించగా, వారు మరో సబ్–కాంట్రాక్టర్తో పనులు చేయిస్తున్నట్లు తెలిసింది. క్రేన్ సహాయంతో పనులు చేస్తుండగా షెడ్ కూలిందని ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా.. భక్తుల భద్రత దృష్ట్యా, కూలిన షెడ్ను పూర్తిగా తొలగించాలని, ఇకపై ఎలాంటి షెడ్లు ఏర్పాటు చేయకుండా కేవలం క్యూలు మాత్రమే కొనసాగించాలని ఈవో ఆదేశించారు. ఉత్సవాల సమయంలో ఇదే ఘటన జరిగి ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేదని పలువురు భక్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రైవాడ జలాశయంలో చేపల వేట నిషేధం
● జిల్లా మత్స్యశాఖ అధికారి విజయ రైవాడ జలాశయం దేవరాపల్లి: రైవాడ జలాశయంలో చేపల వేటను వచ్చేనెల 31 వరకు నిషేధించినట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి జి. విజయ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆమె పత్రికా ప్రకటన విడుదల చేశారు. చేపల సంతానోత్పత్తి సమయం కావడంతో ఈ నెల ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చిన చేపల వేట నిషేధం ఆగస్టు నెలాఖరు వరకు కొనసాగుతుందన్నారు. నిబంధనలను అతిక్రమించి వేట సాగిస్తే లైసెన్స్ రద్దు చేయడంతో పాటు అపరాధ రుసుం విధిస్తామని ఆమె హెచ్చరించారు.