Sangareddy
-
కార్పొరేట్ల లాభాలకే పెద్దపీట
రాజకీయ విశ్లేషకుడు పాపారావుసంగారెడ్డి ఎడ్యుకేషన్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేసి కార్మికుల సంక్షేమానికి కోతలు విధించిందని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పాపారావు అన్నారు. సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కేబుల్ కిషన్ భవన్లో ‘కేంద్ర బడ్జెట్– కార్మిక వర్గంపై ప్రభావం‘అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కార్మిక వర్గం క్షేమంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. సంపద సృష్టించే కార్మిక వర్గానికి ఆదాయంలో వాటా దక్కడం లేదని వాపోయారు. పెట్టుబడిదారులకు రాయితీలు ఇవ్వడం ద్వారానే సంపద పెరుగుతుందనే భ్రమలో పాలకులు ఉన్నారని ఎద్దేవా చేశారు. దేశంలోని కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వం కోట్ల రూపాయల రాయితీలు, రుణాల మాఫీ చేస్తూ వచ్చినప్పటికీ ఉత్పత్తి 75శాతానికి మించి జరగలేదని వివరించారు. అందుకే 14 రకాల ఉత్పత్తి సంబంధిత ఇన్సెంటివ్లను రద్దు చేస్తున్నట్టుగా కేంద్రం ప్రకటించిందని గుర్తు చేశారు. మధ్యతరగతి కుటుంబాలకు రూ.12లక్షల ఆదాయపన్ను రాయితీ ఇచ్చినంత మాత్రాన వారి ఆదాయాలు పెరగవని చెప్పారు. పన్ను రాయితీ వెనుక కూడా కార్పొరేట్ శక్తుల లాభాలు దాగి ఉన్నాయని విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో పేదలకు జరిగిన అన్యాయంపై సెమినార్లు, సదస్సులు నిర్వహించి ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. వివిధ సంఘాల నాయకులు మల్లేశం, సాయిలు, రామచంద్రం, జయరాజు, నరసింహులు పాల్గొన్నారు. -
ఉద్యోగాల నుంచి తొలగించడం సరికాదు
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్ సంగారెడ్డి ఎడ్యుకేషన్: జిల్లాలోని ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో నాలుగేళ్లుగా పని చేస్తున్న కార్మికులను ఆకస్మాత్తుగా తొలగించడం సరికాదని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ డిమాండ్ చేశారు. కార్మికులను డ్యూటీలోకి తీసుకోవాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం కేవల్కిషన్ భవన్ నుంచి కలెక్టరేట్ వరకు కార్మికులకు మద్దతుగా సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లిఖార్జున్ మాట్లాడుతూ.. ఎంఆర్ఎఫ్ యాజమాన్యం కార్మికులను భయభ్రాంతులకు గురి చేసి ఉద్యోగం నుంచి తొలగించడం దుర్మార్గమన్నారు. సమస్యలు పరిష్కరించమని అడిగితే ఉద్యోగం నుంచి ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. తక్షణమే కార్మికులను డ్యూటీలోకి తీసుకొని కార్మికులందరిని పర్మినెంట్ చేయాలన్నారు. అనంతరం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్కు వినతిపత్రం అందజేశారు. ధర్నాలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మల్లేశం, సాయిలు సీఐటీయూ జిల్లా నాయకులు రాజయ్య, ప్రవీణ్ కుమార్, మహిపాల్తో పాటు పరిశ్రమ కార్మికులు పాల్గొన్నారు ., -
తాగునీటికి ముందస్తు చర్యలు
● సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాం ● కలెక్టర్ వల్లూరు క్రాంతి సంగారెడ్డి జోన్: వేసవి కాలంలో తాగు నీటి సమస్యలు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి శాంతికుమారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్తో పాటు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ..జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు ఇప్పటికే అనేక చర్యలు చేపట్టామని, మరింత సమర్థంగా అమలు చేయడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించామని తెలిపారు. జహీరాబాద్, నారాయణఖేడ్ వంటి ప్రాంతాలలో వేసవి ప్రారంభమయ్యే దశలోనే తాగునీటి కొరత ఎదురయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తించి, తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. నీటి ఎద్దడి ఎదుర్కొనే గ్రామాల్లో ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. అందులో భాగంగా మోటార్లు, పైప్లైన్లు, హ్యాండ్పంపుల మరమ్మతులు చేపట్టడం, గ్రామాల్లో తాగునీటి సరఫరా మెరుగుపరిచే చర్యలు తీసుకుంటామని చెప్పారు. నీటి అవసరాలను తీర్చేందుకు సింగూరు ప్రాజెక్టు జలాలను సమర్థవంతంగా వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అడిషనల్ కలెక్టర్ మాధూరి, ట్రైనీ కలెక్టర్ మనోజ్, జిల్లా అధికారులు సాయిబాబా, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
చెత్తను తగలబెడుతున్నారు
● వాయుకాలుష్యంతో సతమతమవుతున్నాం ● కొల్లూరువాసుల ఆగ్రహం రామచంద్రాపురం(పటాన్చెరు): రోడ్లపై చెత్తను తగలబెడితే చర్యలు తప్పవని హెచ్చరించే అధికారులు.. డంపింగ్ యార్డులో చెత్తను తగలబెడుతూ వాయుకాలుష్యానికి కారకులవుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో చెత్త డంపింగ్ యార్డు కోసం గత ప్రభుత్వం ఐదెకరాల భూమిను కేటాయించింది. దానితో పాటు కోటి రూపాయల అంచనాతో ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎఫ్ఎస్టీపీ) నిర్మించారు. కానీ అది ఇంత వరకు ప్రారంభోత్సవానికి నోచుకోవడంలేదు. దానితో పాటు రూ.25లక్షలతో కాంపోస్ట్ షెడ్, రూ.25లక్షలతో డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్ను నిర్మించారు. ఇన్ని సదుపాయలున్న తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలం చెందుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తడి చెత్త, పొడి చెత్తతో ఎరువులను తయారు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉన్నతాధికారులు చెబుతున్నా.. స్థానిక అధికారులు పట్టించుకున్న పాపానపోవడం లేదు. డంపింగ్ యార్డు పరిసరాల ప్రాంతంలో నివసించే వారు నిత్యం వాయుకాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి తమ సమస్యను పరిష్కారించాలని స్థానికులు కోరుతున్నారు. -
17 ఏళ్ల కల సాకారమైన వేళ..
ఎట్టకేలకు డీఎస్సీ 2008 అభ్యర్థులకు పోస్టింగ్ ● అభ్యర్థుల్లో వెల్లివెరిసిన ఆనందం ● జిల్లాలో 67 మందికి ప్రయోజనం సదాశివపేట రూరల్(సంగారెడ్డి): సుదీర్ఘ నిరీక్షణ.. ఎగతెగని పోరాటం.. 17 ఏళ్లకు ఉద్యోగం వరించింది. 2008లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావడంతో అభ్యర్థులు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకొని పరీక్ష రాశారు. కానీ తమకంటే తక్కువ అర్హత ఉన్నవారికి ఉద్యోగాలు ఇవ్వడంతో కోర్టు మెట్లు ఎక్కారు. నేడు న్యాయస్థానం ఆదేశాల మేరకు కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగాలు పొందారు. సుదీర్ఘ పోరాటానికి ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలను చేపడుతుంది. డీఎస్సీ 2008 నోటిఫికేషన్ ఆధారంగా అర్హత సాధించిన వారిలో ఎస్జీటీ (సెకండరీ గ్రేడ్ టీచర్) పోస్టులను 70 శాతం బీఎడ్, డీఎడ్ అభ్యర్థులతో భర్తీ చేయగా, మిగిలిన 30 శాతం డీఎడ్ అభ్యర్థులతో భర్తీ చేశారు. దీన్ని సవాల్ చేస్తూ కౌన్సెలింగ్కు హాజరై ఉద్యోగాలు పొందని బీఎడ్ అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లారు. తమ కంటే తక్కువ అర్హత ఉన్న డీఎడ్ అభ్యర్థులకు 30 శాతం ఎస్జీటీ పోస్టులను రిజర్వ్ చేయడాన్ని సవాల్ చేశారు. అప్పటి నుంచి పోరాడుతుండగా నేటికి తెరపడింది. వారికి నియామక పత్రాలను అందజేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. జిల్లాలో 67 మంది న్యాయస్థానం ఆదేశాలతో జిల్లాలో ఎస్జీటీ కేటగిరిలో డీఎస్సీ 2008 అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగాలు ఇచ్చారు. ఇటీవల కలెక్టరేట్లో నిర్వహించిన కౌన్సిలింగ్కు హాజరైన వారందరికీ ఆయా మండలాల్లో ఖాళీగా ఉన్న ఎస్జీటీ పోస్టులను భర్తీ చేశారు. వీరికి నెలకు రూ.31,040 వేతనంతో నియమించగా ఆయా పాఠశాలల్లో విధుల్లో చేరారు. -
కేసీఆర్ను కలిసిన జెడ్పీ మాజీ చైర్మన్
సంగారెడ్డి: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను మంగళవారం ఉమ్మడి మెదక్ జిల్లా జెడ్పీ మాజీ చైర్మన్ బాలయ్య కలిశారు. కేసీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ కేసీఆరే సీఎం అవుతారని చెప్పారు. ఆయనతో పాటు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పల్లె సంజీవయ్య ఉన్నారు. జీవితాలు నాశనం చేసుకోవద్దు భరోసా కేంద్రం ఇన్చార్జి మహేశ్వరి జోగిపేట(అందోల్): విద్యార్థుల జీవితాలను మలుపుతిప్పేది ఇంటర్మీడియేట్ అని.. ఈ రెండు సంవత్సరాలు ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మంచి భవిష్యత్ను పొందవచ్చని సంగారెడ్డి పోలీసుశాఖ భరోసా కేంద్రం ఇన్చార్జి మహేశ్వరి అన్నారు. మంగళవారం జోగిపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. విద్యార్థులకు సెల్ఫోన్ల వినియోగం వల్ల కలిగే లాభాలు, నష్టాలను వివరించారు. సోషల్ మీడియా వల్ల జరుగుతున్న నేరాలు ప్రతిరోజు పత్రికలు, టీవీల్లో చూస్తున్నారని, అందుకు విద్యార్థులు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆన్లైన్ గేమింగ్ వల్ల యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలిపారు. అపరిచిత వ్యక్తులతో చాటింగ్ చేయొద్దని సూచించారు. కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి ఓబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండు సంగారెడ్డి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచడమే కాకుండా తమిళనాడు తరహాలో చట్టబద్ధత కల్పించాలని ఓబీసీ ఉద్యోగ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపల్లి పాండు డిమాండ్ చేశారు. మంగళవారం సంగారెడ్డిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్లో తీర్మానం ద్వారానే చట్టబద్ధత కలుగుతుందని , విద్యా, ఉద్యోగ రాజకీయాల్లో ఆర్టికల్ 9 ప్రకారం చట్టబద్ధత కల్పించాలన్నారు. గత ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గించి తీరని అన్యాయం చేసిందని, ఈ ప్రభుత్వమైనా బీసీలకు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు జగదీష్, యువత జిల్లా అధ్యక్షులు జి.రమేష్ కుమార్, జిల్లా యువత నాయకులు నిఖిల్, కార్తీక్, కురువ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మల్లయ్య తదితరులు ఉన్నారు. పంచాయతీ కార్యదర్శిపై వేటు కంది (సంగారెడ్డి): కంది మండల పరిధిలోని తుంకిల్ల తండా పంచాయతీ కార్యదర్శి రేఖను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ క్రాంతి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో సదాశివపేట మండలం వెల్లూరు గ్రామపంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన ఆమె పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారని ఫిర్యాదులు అందాయి. విచారణలో నిజమని తేలడంతో కలెక్టర్ వేటు వేశారు. -
అమీన్పూర్లో స్కిల్ యూనివర్సిటీ
విధులకు గైర్హాజరైతే వేటు వేయండిపటాన్చెరు: అమీన్పూర్లో తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ, నవోదయ పాఠశాల ఏర్పాటు కానుంది. ఈ మేరకు ఆర్అండ్బీ శాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన మంగళవారం అమీన్పూర్లోని సర్వే నంబర్ 993లో ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించారు. స్కిల్ యూనివర్సిటీ కోసం 15 ఎకరాలు, అలాగే నవోదయ పాఠశాల ఏర్పాటు కోసం మరో 25 ఎకరాలు స్థలాన్ని కేటాయించే అవకాశం ఉంది. స్కిల్ యూనివర్సిటీ, నవోదయ పాఠశాల ఏర్పాటు కోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వం భూములను పరిశీలించినట్లు హరిచందన తెలిపారు. త్వరలో ఇవి అమల్లోకి రానున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఆమెతో పాటు జిల్లా అడిషనల్ కలెక్టర్ మాధురి, ఆర్డీవో రవీందర్ రెడ్డి, ఇన్చార్జి తహసీల్దార్ హరీష్ చంద్రప్రసాద్, కమిషనర్ జ్యోతిరెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్ మహేష్దత్ సంగారెడ్డి జోన్: ఎన్నికల విధులకు హాజరు కాని ఉద్యోగులను సస్పెండ్ చేయాలని నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్ బి.మహేశ్దత్ ఏక్కా ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లాలోని ఎమ్మెల్సీ ఎన్నికల నోడల్ అధికారులు, ఏఆర్ఓ అధికారులతో ఎన్నికల విధులపై సమీక్ష నిర్వహించారు. అంతకు ముందు తారా డిగ్రీ కళాశాలలోని పోలింగ్ కేంద్రాన్ని, అంబేద్కర్ స్టేడియంలోని డీఆర్సీ సెంటర్ను కలెక్టర్ క్రాంతితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ సాధారణ ఎన్నికలకు ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎన్నికలకు ఎంతో తేడా ఉంటుందన్నారు. ఎన్నికల నిర్వహణను సవాల్గా తీసుకొని పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. ఓటర్లు, అభ్యర్థులు ఉన్నత విద్యావంతులు ఉంటారని తెలిపారు. అభ్యర్థులు నిబంధనలపై అవగాహన కలిగి ఉంటారని వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, అదనపు ఎస్పీ సంజీవరావు, ట్రైనీ కలెక్టర్ మనోజ్, ఆర్డీఓ రవీందర్రెడ్డి పాల్గొన్నారు.నవోదయ పాఠశాల కూడా.. స్థలాన్ని పరిశీలించిన ఆర్అండ్బీ కార్యదర్శి హరిచందన -
ఇదీ గ్రామ చరిత్ర
బాబుల్గాం గ్రామం ముందుగా నిజామాబాద్ జిల్లా పరిధిలో ఉండేది. ఈ గ్రామం ప్రజలు అప్పటి మండల కేంద్రం జుక్కల్కు వెళ్లేందుకు అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చేది. కౌలాస్నాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో పుట్టిల ద్వారా వెళ్లాల్సి వచ్చేది. రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలంటే సుమారు 40 కి.మీటర్ల చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో ఈ గ్రామానికి అధికారులు రావాలన్నా.. గ్రామస్తులు వివిధ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలన్నా అనేక ఇబ్బందులు తప్పేవి కావు. పుట్టిల్లో ప్రయాణించే సమయంలో పలుమార్లు ప్రమాదాలు జరిగిన ఘటనలు ఉన్నాయి. ఈ గ్రామంలో పాఠశాలలు, ఆరోగ్య కేంద్రం నిర్వహణ సరిగా ఉండేది కాదు. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే సమయంలో ఈ గ్రామాన్ని సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోకి మార్చింది. కొత్త మండలాల ఏర్పాటులో భాగంగా కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ను కూడా కొత్త మండలం చేసింది. ఈ పెద్దకొడప్గల్ తమకు దగ్గర అవుతుందని బాబుల్గాం గ్రామస్తులు డిమాండ్ చేయడంతో ఈ గ్రామాన్ని సంగారెడ్డి జిల్లా నుంచి తొలగించి, పెద్ద కొడప్గల్ మండలం (కామారెడ్డి)లో చేర్చారు. రెవెన్యూ పరంగా రికార్డులను కూడా ఆ జిల్లా అధికార యంత్రాంగానికి అప్పగించారు. కానీ పంచాయతీరాజ్ గెజిట్ ప్రకారం ఇంకా సంగారెడ్డి జిల్లా పరిధిలోనే కొనసాగుతుండటం గమనార్హం. -
బాబుల్గాం.. అటా ఇటా!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి– కామారెడ్డి జిల్లాల సరిహద్దు గ్రామం బాబుల్గాం సమస్య ఇంకా పూర్తి స్థాయిలో తీరలేదు. కర్నాటక సరిహద్దుల్లోని కంగ్టి మండలం పరిధిలో ఉన్న ఈ మారుమూల గ్రామంలో ఇప్పటికీ రెండు జిల్లాల అధికార యంత్రాంగం పాలన కొనసాగుతుండటం గమనార్హం. ఈ గ్రామంలోని భూములు, ఇతర రెవెన్యూశాఖ పరంగా పాలనంతా కామారెడ్డి జిల్లా అధికార యంత్రాంగం పరిధిలోకి మారింది. కానీ పంచాయతీరాజ్ పాలన విషయానికి వస్తే మాత్రం ఇప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో ఆ జిల్లాకు మారలేదు. పంచాయతీ గెజిట్లో కూడా ఇంకా సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉంది. ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభను కూడా ఈ బాబుల్గాంలో సంగారెడ్డి అధికార యంత్రాంగమే నిర్వహించింది. కాగా, రాష్ట్ర ప్రణాళిక శాఖ సోమవారం తెలంగాణ అట్లాస్ (తెలంగాణ రాష్ట్ర స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్) –2024ను విడుదల చేసింది. కామారెడ్డి జిల్లా జుక్కల్ (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గం పరిధిని కామారెడ్డితో పాటు, సంగారెడ్డి జిల్లాలో కూడా ఉందని ఈ అట్లాస్లో పేర్కొంది. ఈ గ్రామంలో ఎన్నికలు ఎవరు జరపాలి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఓటరు జాబితా, రిజర్వేషన్ల ఖరారు, పోలింగ్ కేంద్రాల గుర్తింపు వంటి ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఏ జిల్లా అధికారులు జరపాలనే దానిపై ఇటీవల తర్జన భర్జన జరిగింది. పంచాయతీరాజ్ గెజిట్ ప్రకారం ఈ గ్రామం సంగారెడ్డి జిల్లాలో ఉండగా, ఈ ఎన్నికల ఏర్పాట్లు మాత్రం కామారెడ్డి జిల్లా అధికార యంత్రాంగం చేసింది. టీ–పోల్ వెబ్సైట్లో కూడా సంగారెడ్డి జిల్లా పరిధిలోంచి తొలగించి కామారెడ్డి జిల్లా పరిధిలోనే మార్చారు. అసెంబ్లీ ఆమోదంతోనే.. ఈ గ్రామం పూర్తి స్థాయిలో కామారెడ్డి జిల్లాలోకి వెళ్లాలంటే పంచాయతీరాజ్ గెజిట్లో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం అసెంబ్లీ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఈ గ్రామం రెండు జిల్లాల పరిధిలో ఉన్నట్లు రికార్డులు చూపుతోంది. అలాగే జుక్క ల్ (కామారెడ్డి జిల్లా) అసెంబ్లీ నియోజకవర్గం పరిధి సంగారెడ్డి జిల్లాలో కూడా ఉన్నట్లు చూపుతోంది. రెవెన్యూ పరంగా కామారెడ్డి జిల్లా.. పంచాయతీరాజ్ గెజిట్లో సంగారెడ్డిలోనే.. రెండు జిల్లాల మధ్య నలుగుతున్న గ్రామం -
బాల్య వివాహాలను నివారిద్దాం
జహీరాబాద్: బాల్య వివాహాలను నివారించాల్సి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి లలితకుమారి అన్నారు. మంగళవారం జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో బాల్యవివాహాల నివారణపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ స్థాయిలో బాల్య వివాహాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, పంచాయతీ కార్యదర్శులు, వీఓ లీడర్లపై ఉందన్నారు. 18 సంవత్సరాలు నిండని బాలిక, 21 సంవత్సరాలు నిండని యువకుడికి వివాహం చేస్తే శిక్షార్హులు అవుతారన్నారు. అత్యవసరమైన సమయంలో మహిళలు హెల్ప్లైన్ నం.181, చైల్డ్ హెల్ప్లైన్ నెం.1098, పోలీసు హెల్ప్లైన్ నెం.100కు కాల్ చేసి వారి సహాయం తీసుకోవచ్చని సూచించారు. బాల్య వివాహాలు, అక్రమ రవాణా, దత్తత మిషన్ వాత్సల్య పథకాల గురించి వివరించారు. -
కొత్త రకం శనగతో అధిక దిగుబడులు
జగదేవ్పూర్(గజ్వేల్): రైతులు ఎన్బీ ఈజీ 47 కొత్త రకం శనగను సాగు చేసుకోవాలని, దీంతో అధిక దిగుబడులు సాధించవచ్చని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త పల్లవి, కో ఆర్డినేటర్ విజయ్ తెలిపారు. మండల కేంద్రమైన జగదేవ్పూర్, అలిరాజ్పేట గ్రామంలో రైతుల పొలాల్లో వ్యవసాయ శాఖ సహకారంతో క్షేత్రస్థాయి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ రకం శనగను సాగు చేస్తే నిటారుగా పెరగడమే కాకుండా కాయ పైకి వస్తుందని, మెషిన్ హార్ వెస్టింగ్ చేసుకోవడానికి అనువుగా ఉంటుందన్నారు. ఎండు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకొని 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుందన్నారు. అనంతరం ఎనుగుల శ్రీనివాస్రెడ్డి రైతు పొలంలో వేసిన ధనియాల సాగును పరిశీలించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వసంతరావు, ఏఈఓ కవిత, రైతులు పాల్గొన్నారు.ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త పల్లవి -
పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు
నర్సాపూర్: పోలింగ్ కేంద్రం వద్ద నిబంధనల మేరకు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి ఎస్ఐ లింగంకు సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఎస్పీ మంగళవారం పరిశీలించారు. పట్టణంలోని ప్రభుత్వం జూనియర్ కాలేజీలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేయనున్న పోలింగ్ కేంద్రాలను, ఓటరు జాబితాను పరిశీలించారు. ఎస్ఐ, మండల ఆర్ఐ ఫైజల్ పోలింగ్ స్టేషన్ల వివరాలను ఎస్పీకి వివరించారు. అనంతరం పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. స్టేషన్లో పలు రికార్డులు పరిశీలించి కేసులను త్వరగా ఛేదించాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పెట్రోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలని ఎస్ఐకి సూచించారు. పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ శివ్వంపేట(నర్సాపూర్): మండల కేంద్రమైన శివ్వంపేట ఉన్నత పాఠశాలలోని ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాన్ని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి మంగళవారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. అనంతరం పోలీస్స్టేషన్లో రికార్డులు పరిశీలించారు. ఆయన వెంట సీఐ రంగక్రిష్ణ, ఎస్ఐ మధుకర్రెడ్డి ఉన్నారు.ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి -
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
టేక్మాల్(మెదక్): చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు వలలో చిక్కుకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని బొడ్మట్పల్లిలో సోమ వారం రాత్రి చోటు చేసుకుంది. ఏఎస్ఐ దయానంద్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన చీలపల్లి లక్ష్మయ్య(59) రజక వృత్తితోపాటు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తరచుగా చేపలు పట్టేందుకు వాగుల్లోకి, కుంటల్లోకి వెళ్లేవాడు. 14న ఉదయం ఇంటి నుంచి వెళ్లి రాత్రి అయినా తిరిగి రాలేదు. ఆచూకీ కోసం బంధువులు, వ్యవసాయ పొలాల వద్ద వెతుకుతుండగా 17న రాత్రి గుండువాగు గడ్డపై లక్ష్మయ్య బట్టలు, సెల్ఫోన్, చెప్పులు కనిపించాయి. వాగులోకి పరిశీలించి చూడగా లక్ష్మయ్య మృతదేహం కనిపించింది. చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు వలలో చిక్కుకొని మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య చీలపల్లి పోచమ్మ మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చికిత్స పొందుతూ యువకుడు పుల్కల్(అందోల్): ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని పుల్కల్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీస్ల కథనం మేరకు.. పుల్కల్ గ్రామానికి చెందిన బోయిని నవీన్ (25) సోమవారం రాత్రి కడుపునొప్పి భరించలేక ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సంగారెడ్డి ఆస్పత్రికి తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. పుల్కల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మనస్తాపంతో ఉరేసుకొని ఆత్మహత్య
తంప్లూర్లో వ్యక్తి టేక్మాల్(మెదక్): ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్మకు పా ల్పడిన ఘటన టేక్మాల్ మండలంలోని తంప్లూర్లో మంగళవారం చోటు చేసుకుంది. ఏఎస్ఐ దయానంద్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన చాకలి అశోక్ (38), వెంకట్రావు పేటకు చెందిన వెంకటలక్ష్మీకి 20 ఏళ్ల కింద వివాహం జరిగింది. వీరిద్దరూ హైదరాబాద్లో నివాసముంటున్నారు. వీరిద్దరి మధ్య కుటుంబ విషయంలో కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. 16న దంపతులిద్దరూ తంప్లూర్ గ్రామానికి వచ్చారు. అదే రోజు మధ్యాహ్నం ఇంటి వద్ద గొడవ జరగడంతో వెంకటలక్ష్మీ హైదరాబాద్ వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన అశోక్ సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి చాకలి పోచయ్య మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నార్సింగ్లో యువకుడు పాపన్నపేట(మెదక్): ఉరేసుకొని యువకుడు ఆత్మ హత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని నార్సింగిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు.. మధ్యప్రదేశ్ కు చెందిన సంజీవ్ కుమార్ (25) ఉపాధి నిమిత్తం రాష్ట్రానికి వచ్చి కామారెడ్డికి చెందిన శ్రీలత అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు. కొంత కాలంగా పాపన్నపేట మండలం నార్సింగి గ్రామంలో వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. మద్యం తాగొద్దని చెప్పినా వినకపోవడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న భార్య శ్రీలత ఘటనా స్థలికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. -
వివాహేతర సంబంధంతో హత్యాయత్నం
● మహిళ భర్తపై దాడికి పాల్పడ్డ యువకుడు ● అరెస్ట్ చేసి రిమాండ్కు తరలింపు సిద్దిపేటకమాన్: మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న యువకుడు ఆమె భర్తపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు యువకుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. సిద్దిపేట టూటౌన్ సీఐ ఉపేందర్ కథనం మేరకు.. ఐల శ్రీధర్, భార్య ఇద్దరు పిల్లలతో కలిసి గుండ్ల చెరువులో నివాసం ఉంటున్నాడు. శ్రీధర్ పట్టణంలోని ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన మెరుగు శ్రావణ్ (21) సదరు మహిళతో కొద్ది రోజులుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. దీనికి గాను అడ్డు తొలగించుకోవాలని శ్రవణ్తో కలిసి భర్త శ్రీధర్ను చంపడానికి పథకం వేసింది భార్య. గత నెల 11న రాత్రి పని ముగించుకొని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న శ్రీధర్ను శ్రావణ్ లిఫ్ట్ అడిగాడు. ఇద్దరూ బైక్పై వెళ్తున్న క్రమంలో నర్సాపూర్ చౌరస్తా సమీపంలో యువకుడి ఇద్దరు స్నేహితులు వీరి వెనుకాలే వచ్చారు. ముగ్గురూ కలిసి శ్రీధర్ను కిడ్నాప్ చేసి కాళ్లు, చేతులు కట్టేసి దాడి చేశారు. మళ్లీ రెండోసారి గత నెల 20న శ్రీధర్పై దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితుడు శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా 12న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణ అనంతరం ప్రధాన నిందితుడు మెరుగు శ్రావణ్ను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
బైక్ను ఢీకొట్టిన బొలేరో వాహనం
కల్హేర్(నారాయణఖేడ్): కామారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సిర్గాపూర్ మండలం అంతర్గామ్కు చెందిన మహిళ మృతి చెందింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. అంతర్గామ్కు చెందిన సంగయ్య, శకుంతల(55) దంపతులు బైక్పై మంగళవారం కామారెడ్డి జిల్లా పిట్లం మండలం పెద్దకోడప్గల్ గ్రామంలోని బంధువుల ఇంటికి బయల్దేరారు. చిన్నకోడప్గల్ వద్ద సంగారెడ్డి–నాందేడ్ 161 నేషనల్ హైవేపై వెనుక నుంచి బొలేరో వాహనం వీరి బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా అంబులెన్స్లో స్థానికులు పిట్లం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో శకుంతల మృతి చెందింది. సంగయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పిట్లం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కామారెడ్డి జిల్లాలో సిర్గాపూర్ మండలానికి చెందిన మహిళ మృతి -
పోషకాల లోపం.. ఎదుగుదలపై ప్రభావం
ఆరబెడుతూ నీటి తడులు అందించాలివ్యవసాయ అధికారులుదుబ్బాకటౌన్: సాగు భూమిలో పోషకాల లోపంతోనే వరి నాటు వేసిన తర్వాత ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుందని రాయపోల్ మండల వ్యవసాయ అధికారి నరేశ్ తెలిపారు. మంగళవారం రాయపోల్ మండల పరిధిలోని రాంసాగార్ గ్రామంలో వరి పొలాలను, రైతుల పంట నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు సాగు చేసే వరి పంటలో చౌడు భూమిలో వరి ఎర్రబారి వేసిన కర్ర వేసినట్లు ఉండి పొలం అంతా బుడబుడగా ఉండి వరి వేర్లు నల్లగా మారి భూమి లోపలి పోషకాలు తీసుకోకపోవడంతో జింక్, ఇతర పోషకాల లోపాలు కనిపిస్తున్నాయన్నారు. నివారణకు 19.19.19 ఒక కేజీ ఎకరానికి + జింక్ సల్ఫేట్ 400–500 గ్రాములు ఎకరానికి రెండు సార్లు పిచికారీ చేసి, పొలం బాగా నెర్రలు వచ్చే లాగా ఆరబెట్టాలన్నారు. ప్రస్తుతం యాసంగి కాలంలో జింక్ లోపాలు ఎక్కువ కనిపించే అవకాశం ఉందని, జింక్ నివారణ కోసం జింక్ సల్ఫేట్ 2.5 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రవీణ్, స్వర్ణలత, రైతులు, తదితరులు పాల్గొన్నారు.వరి పంటను పరిశీలించిన వ్యవసాయాధికారులు దుబ్బాక: ఎవరికీ రాకూడ ని కష్టం.. ఎర్రబడి చచ్చిపోతున్న వరి చేలు పేరిట సాక్షిలో ప్రచురితమైన కథనానికి వ్యవసాయాధికారులు స్పందించారు. మంగళవారం వ్యవసాయాధికారులు జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించి వరి పంటలను పరిశీలించారు. దుబ్బాక మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్, ఏఈఓ మనోజ్ఞ పట్టణంలోని కేసుగారి స్వామి, గుండెల్లి శ్రీనివాస్రెడ్డితోపాటు పలువురు రైతుల పంటలను పరిశీలించారు. నాట్లేసి 45 రోజులు గడుస్తున్నా వరిపంటలు ఎదుగుదల లేకుండా కుళ్లిపోయి, ఎర్రబడి చచ్చిపోతుండడాన్ని గమనించారు. మొగిపురుగు, వాతావరణ పరిస్థితులు, భూములు తడి ఆరకుండా ఉండడంతోపాటు జింక్ తదితర సమస్యలతో పంటలకు నష్టం జరుగుతుందని గమనించారు. మొగి పురుగు ఎక్కువగా ఆశించిన పంటలకు కార్టాప్ 4 జీ గుళికలు లేదా క్లోరంత్రానిలిప్రోలే లేదా బరోజ్ వంటి మందులు వేసుకోవాలన్నారు. వరి పంటలను ఆరబెడుతూ నీటి తడులు అందించాలి. పలు సస్యరక్షణ చర్యలను రైతులకు సూచించారు. -
తూప్రాన్లో కార్డెన్ సెర్చ్
సరైన పత్రాలు లేని 92 బైకులు, 5 ఆటోలు సీజ్ తూప్రాన్: అనుమానిత వ్యక్తులు కనిపించినా, అసాంఘిక కార్యక్రమాలు జరిగినా తమ దృష్టికి తేవాలని తూప్రాన్ డీఎస్పీ వెంకట్రెడ్డి తెలిపారు. మంగళవారం తూప్రాన్ మున్సిపాల్టీ పరిధిలోని డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద డీఎస్పీ ఆధ్వర్యంలో 7 బృందాలతో కలిసి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో సరైన ధ్రువపత్రాలు లేని 92 బైకులు, 5 ఆటోలు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ వాహనాలకు సంబంధించిన పత్రాలను చూపి తమ వాహనాలను తీసుకెళ్లాలని సూచించారు. రేషన్ బియ్యం పట్టివేతరామచంద్రాపురం(పటాన్చెరు): తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు శివారులో రేషన్ బియ్యం పట్టుకున్నట్లు కొల్లూరు ఇన్స్పెక్టర్ రవీందర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా మో కిల నుంచి రింగ్రోడ్డు మీదుగా కర్నూలు తరలిస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో రింగ్రోడ్డుపై రేషన్ బియ్యం తరలిస్తున్న లారీను పట్టుకొని 34 టన్నులు స్వాధీ నం చేసుకున్నట్లు తెలిపారు. మంగళవారం సివిల్ సప్లయ్ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. దాబాలో తనిఖీలు సదాశివపేట రూరల్ (సంగారెడ్డి): మండలంలోని నందికంది శివారులోని రాజస్థానీ దాబాలో మంగళవారం ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. రాజస్థాన్ కు చెందిన లక్ష్మణ్ రామ్ సదాశివపేట పట్టణంలో నివాసం ఉంటూ సొంత గ్రామం నుంచి పాపి స్ట్రా పౌడర్ కొని దాబా చుట్టుపక్కల వినియోగదారులకు అధిక ధరలకు అమ్ముతున్నాడు. నమ్మదిన సమాచారం మేరకు తనిఖీ చేసి 518 గ్రాముల పౌడర్, ఫోన్ను స్వాధీనం చేసుకొని యజమాని లక్ష్మణ్ అదుపులోకి తీసుకున్నామని ప్రొహిబిషన్, ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ మెదక్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. తనిఖీల్లో ఎన్ఫోర్స్మెంట్ మెదక్ డివిజన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రావు, సీఐ వీణా రెడ్డి, ఎస్ఐ అనిల్ కుమార్, సిబ్బంది అలీం, సతీష్ మోహన్, గోపాల్, ప్రహ్లద్, తదితరులు పాల్గొన్నారు. యూనివర్శిటీకి భాగ్యరెడ్డి వర్మ పేరు పెట్టాలి మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మల్లేశం జోగిపేట(అందోల్): జోగిని వ్యవస్థను పూర్తిగా రూపుమాపడంలో కీలక భూమిక పోషించిన వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ అని జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు ఎ.మల్లేశం అన్నారు. మంగళవారం జోగిపేటలోని హౌసింగ్ బోర్డు కార్యాలయంలో భాగ్యరెడ్డి వర్మ 86వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భాగ్యరెడ్డి వర్మ జీవితకాలమంతా అంటరానితనం, అసమానతలు, బాలికలకు విద్యా సౌకర్యాలు కల్పించడానికి కృషి చేసారన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు మేతరి కరుణాకర్, మండల అధ్యక్షుడు బహుజన ప్రసాద్, ఉపాధ్యక్షుడు రాజు, మున్సిపల్ అధ్యక్షుడు గోపాల్, లక్ష్మణ్, అరుణ్కుమార్ పాల్గొన్నారు. -
పన్ను వసూళ్లలో వేగం పెంచాలి
సంగారెడ్డి జోన్: గ్రామాల్లో ఇంటి పన్ను వసూళ్లలో వేగం పెంచి వందశాతం పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి పంచాయతీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి మండల ప్రత్యేక అధికారులు, మండల పరిషత్ అధికారులు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ పన్ను చెల్లింపు అవసరాన్ని తెలియజేయాలన్నారు. గ్రామాల్లో ఇంటి యజమానులు, ఇంటి పన్ను చెల్లించేందుకు ముందుకు రావాలని కోరారు. రేషన్ కార్డుల వెరిఫికేషన్ పూర్తిగా పారదర్శకంగా జరగాలని అర్హులైన వారికి మాత్రమే రేషన్ సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణానికి సంబంధించి పూర్తి సమాచారం అధికార యంత్రాగణానికి అందుబాటులో ఉండాలన్నారు. మండల ప్రత్యేకాధికారులు, పాఠశాలలను, గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలను క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, డీపీఓ సాయిబాబా, ట్రైనీ కలెక్టర్ మనోజ్, సంబంధిత జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి -
పెరిగిన బియ్యం కోటా
సిద్దిపేటరూరల్: కొత్త రేషన్కార్డుల మంజూరు జిల్లాలో పంపిణీ చేసే బియ్యం కోటా ఈనెల నుంచి పెరిగింది. పదేళ్ల కాలంలో నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ లేకపోవడంతో ప్రస్తుత ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేసింది. దీంతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అర్హులైన లబ్ధిదారుల కల నెరవేరింది. జిల్లాలో మొదటి విడతగా 888 కుటుంబాల వారు అర్హత సాధించినట్లు వివరాలను వెల్లడించారు. వారందరికీ ఫిబ్రవరి నుంచే రేషన్ బియ్యం అందజేస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో రేషన్ పంపిణీ చేసే బియ్యం అదనంగా 12 మెట్రిక్ టన్నులకు పెరిగింది. జిల్లాలో ఇప్పటి వరకు గ్రామసభలు, ప్రజాపాలన కేంద్రాల్లో స్వీకరిస్తున్న దరఖాస్తుల్లో నూతన రేషన్కార్డులు, చేర్పులు, తొలగింపు వంటి వాటికి సంబంధించి 74 వేల 272 దరఖాస్తులు వచ్చాయి. ఈ మేరకు సంబంధిత అధికార యంత్రాంగం సర్వే పూర్తి చేయడంతో పాటుగా అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది. మరి కొంతమంది మంజూరు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.కొత్త కార్డు వచ్చింది ప్రభుత్వ చేపట్టిన ఇంటింటి సర్వే సమయంలో నూతన రేషన్కార్డు కోసం దరఖాస్తు అందించాను. గత నెలలో నా పేరు మీద నూతన రేషన్కార్డు వచ్చింది. చాలా రోజులుగా రేషన్కార్డు కోసం ఎదురుచూస్తున్నాం. ఇప్పటికై నా రావడం చాలా సంతోషంగా ఉంది. దీంతో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను పోందెందుకు అవకాశం ఉంది. – పుల్లగూర్ల తేజ, రాఘవాపూర్ అర్హులందరికీ అందిస్తాం జిల్లాలో ఇటీవల 888 నూతన రేషన్ కార్డులు మంజూరు చేయడంతోపాటు 1,900 మంది పేర్లను రేషన్ కార్డుల్లో కొత్తగా చేర్చాం. వీరికి బియ్యం అందించడం జరుగుతుంది. కొత్త కార్డులు రావడం, పాత కార్డుల్లో మార్పులు, చేర్పులు జరగడంతో జిల్లాలో ఈ నెల రేషన్ బియ్యం కోటా 12 మెట్రిక్ టన్నులకు పెరిగింది. తమ వద్ద ఉన్న దరఖాస్తులను పరిశీలించడం జరుగుతుంది. – తనూజ, జిల్లా సివిల్ సప్లయ్ అధికారి888 నూతన కార్డులుజిల్లాలో కొత్తగా 888 కుటుంబాలకు ప్రభుత్వం రేషన్ కార్డులను మంజూరు చేసింది. ఈ మేరకు చాలా మందికి లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే కార్డు ఉండి అందులో పిల్లల పేర్లు లేకుండా చాలా మంది ఉన్నారు. ఇందులో కొత్తగా 1,900 మందిని వారి పాత కార్డుల్లో చేర్చారు. వీరందరికీ ఈనెల నుంచి బియ్యాన్ని అందించాల్సి ఉండగా అదనంగా 12 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం పడుతుంది. జిల్లా వ్యాప్తంగా పెండింగ్ ఉన్న దరఖాస్తుల్లోనూ అర్హులను గుర్తిస్తే ఈ కోటా మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది.లబ్ధిదారుల్లో సంతోషంఎన్నో ఏళ్లుగా నిలిచిన రేషన్ కార్డుల ప్రక్రియ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ముందుకు కదలడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలన్నింటికీ రేషన్ కార్డే ప్రామాణికం కావడంతో జిల్లాలో కార్డులేని వారు దశాబ్ద కాలంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు కాక, ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు అందక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రుణాలు పొందలేక ఎన్నో అవస్థలు పడ్డారు. ఈ క్రమంలో జిల్లాకు కొత్తగా 888 మందికి కొత్త కార్డులు రావడంతో తమకు కూడా ప్రభుత్వ పథకాలు వస్తాయనే నమ్మకం అర్హులైన దరఖాస్తుదారుల్లో ఏర్పడింది. 888 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు పాత కార్డుల్లో చేర్పులతో పెరిగిన లబ్ధిదారులు ప్రతీనెల 12 మెట్రిక్ టన్నుల బియ్యం అదనం నేటికీ కొనసాగుతున్న దరఖాస్తుల పరిశీలన లబ్ధిదారుల్లో సంతోషంజిల్లాలో రేషన్ వివరాలు : రేషన్ దుకాణాలు 684రేషన్ కార్డులు 2,92,131 అంత్యోదయ కార్డులు 18341 మొత్తం లబ్ధిదారులు 8,95,467 అన్నపూర్ణ కార్డులు 82నెలవారీగా పంపిణీ చేయాల్సిన బియ్యం 5,720 మెట్రిక్ టన్నులు -
విందుకు వెళ్లి వస్తుండగా..
● బస్సు ఢీకొని ఇద్దరు యువకుల మృతి ● కోహీర్ మండలం సేడెగుట్ట తండా వద్ద ఘటన జహీరాబాద్: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ సంఘటన కోహీర్ మండలం సిద్దాపూర్ తండా సమీపంలో తాండూరు రహదారిపై ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. కోహీర్ పోలీసుల కథనం ప్రకారం.. జహీరాబాద్ మండలం అర్జున్నాయక్ తండాకు చెందిన రాథోడ్ శంకర్(25), జాటోతు పవన్(26) రాత్రి సేడెగుట్ట తండాలో జరిగిన జాతర విందులో పాల్గొన్నారు. అనంతరం సమీపంలోని సిద్ధాపూర్ తండాకు చెందిన బంధువుల ఇంటికి వెళుతున్న క్రమంలో తాండూరు నుంచి జహీరాబాద్ వెళుతున్న నైట్హాల్ట్ ఆర్టీసీ బస్సు గొటిగార్పల్లి ఫారెస్టు మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న మోటారు సైకిల్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాథోడ్ శంకర్ అక్కడికక్కడే మరణించాడు. తీవ్రంగా గాయపడిన పవన్ను వైద్యం నిమిత్తం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలొదిలాడు. మృతులు సెంట్రింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు యువకుల మరణంతో అర్జున్నాయక్ తండాలో విషాదం అలుముకుంది. కోహీర్ పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. -
ప్రతి పనికి పైసా.. ఏ కైసా?
● ట్రాన్స్కోలో లంచం షరా మామూలే.. ● ఫిర్యాదు చేసిన వారిపై వేధింపులుపటాన్చెరు: విద్యుత్శాఖలో ప్రతీ పనికి లంచం షరా మామూలుగా మారింది. ఎంతో కొంత ముట్ట చెప్పంది ఏ పనీ ముందుకు సాగడం లేదు. ఇవ్వకపోతే వినియోగదారులను ముప్పు తిప్పలు పెడుతూ.. మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. దళారులను విద్యుత్ సంస్థల ఇంజనీరింగ్ అధికారులు అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అపార్టుమెంట్లు, కొత్త వెంచర్లకు విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్లు మంజూరుకు రూ.లక్షల్లో లంచం డిమాండ్ చేస్తున్నారని సమాచారం. పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారిన గ్రామాల్లో ఆక్యుపెన్సీ, ఎన్ఓసీల పేరిట విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. అడిగినంత చెల్లిస్తే పంచాయతీ అనుమతితో కూడిన భవనాలకు అప్పటికప్పుడు విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నారు. ప్రజాప్రతినిధులు ఫోన్ చేసినా స్పందించని అధికారులు, దళారులు ద్వారా వెళితే మాత్రం పనులు పూర్తిచేస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతంలో లైన్మెన్ దర్శనం కూడా సామాన్యులకు కష్టంగా మారింది. విద్యుత్ సంస్థల్లో అయా పోస్టింగ్ల కోసం పెద్దఎత్తున పైరవీలు చేసి ఇక్కడకు బదిలీపై వస్తున్నారు. క్షేత్రస్థాయిలో తమ వారికి పోస్టింగ్లు ఇచ్చిన రాష్ట్రస్థాయి అధికారులు వాటాలు తీసుకుంటున్నారని బహిరంగ చర్చ జరుగుతుంది. అధికారులపై ఫిర్యాదులు అందినప్పుడు విచారణ చేయాల్సిన విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు ఇచ్చిన వారిని ఇబ్బంది పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇవీ రేట్లు.. కొత్త మీటరు కోసం రూ. ఆరు నుంచి రూ. పది వేలు, ప్యానల్ బోర్ల కోసం రూ.45 వేలు, అపార్ట్మెంట్ ట్రాన్స్ఫార్మర్ కోసం రూ.1.5 నుంచి రూ. 2లక్షలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వెంచర్లలో విద్యుత్ కనెక్షన్లు, వైర్లు వేసేందుకు అనుమతి, ఇతర పనుల కోసం రూ. కోట్లలో డిమాండ్ చేస్తున్నారు. పటాన్చెరులో ఓ భారీ వెంచర్లో విద్యుత్ కనెక్షన్ కోసం కేవలం లంచం సొమ్మునే రూ. ఏడు కోట్ల వరకు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. నా దృష్టికి రాలేదు నా దృష్టికై తే ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. ఎవరైనా ఇబ్బంది పడితే తనకు ఫిర్యాదు చేయవచ్చు. ఎలాంటి అవినీతికి తావు లేని వ్యవస్థ ఇప్పుడు అందుబాటులో ఉంది. ఆన్లైన్ ద్వారానే కస్టమర్లు తమకు కావాల్సిన సేవలను పొందవచ్చు. ఆఫీసుకు రానవసరం లేదు. దళారులను ఆశ్రయించాల్సిన పనే లేదు. నేను ఇటీవలే బదిలీపై వచ్చాను. వినియోగదారులకుకు ఎలాంటి ఇబ్బంది లేని సేవలు అందించేందుకు కృషి చేస్తా. – సంజీవ్, ఏడీఈ, టీజీఎస్పీడీసీఎల్ -
ఇష్టంతో కష్టపడి చదవండి
ప్రజావాణిలో రెవెన్యూ సమస్యలే అధికం రామచంద్రాపురం(పటాన్చెరు): విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదివితే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలరని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సోమవారం సాయంత్రం బీహెచ్ఈఎల్ (భెల్) టౌన్షిప్లోని జిల్లా పరిషత్ పాఠశాలను ఆమె సందర్శించారు. పాఠశాల ఆవరణలో ఉన్న రెసిడెన్షియల్ బ్రిడ్జ్ స్కూల్, అందులోని కంప్యూటర్, సైన్స్ ల్యాబ్, వంటగదిని పరిశీలించారు. పాఠశాలలోని సమస్యలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. నీటి సమస్య, విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేవని, అదే విధంగా తరగతి గదులల్లో విద్యార్థులు కూర్చునేందుకు టేబుల్, బల్లలు సరిపడా లేవని ఉపాధ్యాయులు కలెక్టర్కు వివరించారు. స్పందించిన ఆమె.. భెల్ యాజమాన్యంకు సీఎస్ఆర్ నిధుల కింద సమస్యలను పరిష్కారించాలని కోరుతూ లేఖ రాయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లును ఆదేశించారు. అనంతరం పరీక్షలకు సిద్ధమవుతున్న పదవతరగతి విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షల సమయం దగ్గర పడుతుందని దానిని దృష్టిలో పెట్టుకొని కష్టపడి చదివి ప్రతి విద్యార్థి 10కి10 జీపీఏ సాధించాలని ఆకాంక్షించారు. భవిష్యత్లో ఏ ఉద్యోగం చేయాలో ఇప్పుడే నిర్ణయించుకుని అందుకు అనుగుణంగా కష్టపడి చదువుకోవాలని సూచించారు. జీవితంలో పదోతరగతి టర్నింగ్ పాయింట్ అని చెప్పారు. తరగతి గదిలో చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె కోరారు. పదవతరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, ఎంఈఓ పీపీ రాథోడ్, తహసీల్దార్ సంగ్రాంరెడ్డి, ప్రధానోపాధ్యాయులు రాములు, ఆర్ఐ శ్రీకాంత్ పాల్గొన్నారు. సంగారెడ్డి జోన్: ప్రజావాణిలో రెవెన్యూకు సంబంధించిన దరఖాస్తులే అధికంగా వస్తున్నాయి. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వారితో కలెక్టర్ వల్లూరు క్రాంతి అర్జీలు స్వీకరించారు. మొత్తం 43 అర్జీలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో రెవెన్యూకు సంబంధించిన సమస్యలే అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి అర్జీని పరిశీలించి, తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన సమస్యలపై అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని, పరిష్కారం ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. కాగా కార్యక్రమంలో డీఆర్ఓ పద్మజా రాణి, జెడ్పీ సీఈవో జానకిరెడ్డి, డీపీవో సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే ఉన్నత లక్ష్యాలను ఎంచుకోండి విద్యార్థులకు కలెక్టర్ క్రాంతి ఉద్బోధ భెల్ జిల్లా పరిషత్ పాఠశాల సందర్శన మేడం.. మాకు సార్లు కావాలి‘‘మేడం.. హిందీ, పీఈటీ సార్లు లేరు. మాకు ఉపాధ్యాయులు కావాలి..’’అని రెసిడెన్షియల్ బ్రిడ్జ్ స్కూల్ (ఆర్బీఎస్) విద్యార్ధులు కలెక్టర్ క్రాంతిని వేడుకున్నారు. సోమవారం సాయంత్రం భెల్ టౌన్షిప్లోని జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించి తిరిగి వెళ్లే సమయంలో క్రీడా ప్రాంగణంలో ఆడుకుంటున్న రెసిడెన్షియల్ బ్రిడ్జ్ స్కూల్ విద్యార్థులను పిలిచి మాట్లాడారు. ఎలా చదువుకుంటున్నారు.. మీకేమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగారు. తమకు హిందీ, పీఈటీ సార్లు లేరని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జెడ్పీ పాఠశాలలో ఉన్న పీఈటీ ఉపాధ్యాయుడు ఈ విద్యార్థులను కూడా ఆడిస్తే ఏమవుతుందని ప్రశ్నించారు. ఈ సమస్యను పరిష్కారించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లను కలెక్టర్ ఆదేశించారు. దాంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయండి: కలెక్టర్ -
ఇక సివిల్ పనులు
బోరంచ పంప్హౌస్ నిర్మాణంలో ముందడుగు ● హరీశ్ పాదయాత్ర నేపథ్యంలో కీలక నిర్ణయం ● ప్రతిపాదిత స్థలం వద్ద ఐదెకరాలు లీజుకు తీసుకున్న కాంట్రాక్టు కంపెనీ ● సిమెంట్ పనుల ప్రారంభానికి సమాయత్తం బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనుల ప్రగతిలో కీలక ముందడుగు పడుతోంది. ఈ భారీ సాగునీటి ప్రాజెక్టు పంప్హౌస్ నిర్మాణానికి సంబంధించి సివిల్ పనులను ప్రారంభించేందుకు కాంట్రాక్టు కంపెనీ సమాయత్తమవుతోంది. ఈ మేరకు పంప్హౌస్ సమీపంలోని ఐదు ఎకరాల ప్రైవేటు భూమిని లీజుకు తీసుకుంది. సివిల్ పనులకు సంబంధించిన మెటీరియల్ను డంప్ చేయనుందని నీటి పారుదలశాఖ వర్గాలు చెబుతున్నాయి. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అందోల్, నారాయణఖేడ్తో పాటు, మెదక్జిల్లాలోని కొన్ని మండలాల పరిధిలో 1.65 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించడమే లక్ష్యంగా ఈ బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి బీఆర్ఎస్ సర్కార్ శ్రీకారం చుట్టిన విషయం విదితమే. ఈ పనుల్లో భాగంగా మనూరు మండలం బోరంచ వద్ద మొదటి పంప్హౌస్ను నిర్మించి.. సింగూరు జలాశయం నుంచి బ్యాక్ వాటర్ను 8 టీఎంసీల ఎత్తిపోసేలా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఇందుకోసం ఈ బోరంచ వద్ద ఈ పంప్హౌస్ నిర్మిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ పంప్హౌస్ కోసం ఎర్త్ వర్క్ జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే ఈ పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాల పనులను వేగవంతం చేయాలనే డిమాండ్తో బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధమవుతోంది. ఇటీవల మాజీ మంత్రి హరీశ్రావు నివాసంలో జిల్లా ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ కీలక నేతలు సమావేశమై ఈ సాగునీటి పథకాల సాధన కోసం పోరాటం చేయాలని నిర్ణయించింది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని హరీశ్రావు పిలుపునిచ్చారు. ఈ ఎత్తిపోతల పథకాల ఆయకట్టు ఉన్న నియోజకవర్గాల్లో పాదయాత్ర కూడా చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నీటిపారుదలశాఖ ఈ పంప్హౌస్కు సంబంధించిన సివిల్ పనులను ప్రారంభిస్తోంది. త్వరలోనే కాంట్రాక్టు కంపెనీ ఈ పనులకు సంబంధించిన మెటీరియల్ను మోహరించనుందని నీటి పారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రెండు పంప్హౌస్లు ఈ ఎత్తిపోతల పథకం కోసం రెండు పంప్హౌస్లను నిర్మిస్తున్నారు. మనూరు మండలం బోరంచ వద్ద మొదటి పంప్హౌస్ కాగా, రెండో పంప్హౌస్ రాంతీర్థ్ (కంగ్టి మండలం) వద్ద నిర్మించనున్నారు. బోరంచ వద్ద మొత్తం 12 పంపులను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఎనిమిది పంపుల ద్వారా సాగునీటిని రాణాపూర్కు తరలిస్తారు. అక్కడి నుంచి గ్రావెటీ కెనాల్ ద్వారా పంట పొలాలకు సాగునీటిని పారించేలా దీన్ని డిజైన్ చేశారు. రెండు పంపుల ద్వారా దూదుగొండ (మెదక్ జిల్లా రేగోడ్ సమీపంలో)కు నీటిని లిఫ్ట్ చేస్తారు. మరో రెండు పంపులు ద్వారా లింగంపల్లి (వట్పల్లి మండలం) వరకు ఎత్తిపోయనున్నారు. అక్కడి నుంచి గ్రావెటీ కెనాల్ ద్వారా నీటిని ఆయకట్టుకు తరలిస్తారు. సుమారు రూ.15 కోట్ల మేరకు పనులు బసవేశ్వర ఎత్తిపోతల పథకం నిర్మాణ అంచనా వ్యయం రూ.1,774 కోట్లు కాగా, ఇందులో కాంట్రాక్టర్ చేసే పనుల విలువ రూ.1,478 కోట్లు. ఇప్పటి వరకు రూ.15 కోట్ల మేర పనులకు నీటిపారుదలశాఖ ఎంబీ రికార్డు చేయగా, మరో ఐదు కోట్ల మేరకు పనులు జరిగాయని ఆశాఖ అధికారులు చెబుతున్నారు. సివిల్ పనులు ప్రారంభిస్తాంబోరంచ పంప్హౌస్కు సంబంధించి సివిల్ పనులను అతికొద్ది రోజుల్లోనే ప్రారంభిస్తాం. ఈ సివిల్ పనుల ప్రారంభానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను కాంట్రాక్టు కంపెనీ చేపట్టింది. పంప్హౌస్ వద్ద క్యాంపు ఏర్పాటు చేసేందుకు కాంట్రాక్టు కంపెనీ చర్యలు చేపట్టింది. –జలందర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ -
20న ఉచిత మెగా వైద్య శిబిరం
జహీరాబాద్: ఈనెల 20వ తేదీన జహీరాబాద్లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు సామాజిక సేవకులు ఇమ్రాన్ మొహియొద్దీన్, వైద్యులు ఎండీ నవాజ్అలీ, క్యాన్సర్ సర్జన్ రాజేందర్ బైశెట్టి తెలిపారు. నీలం ఆస్పత్రి సహకారంతో ఈ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు వారు చెప్పారు. ప్రముఖ వైద్యులతో మెగా ఉచిత వైద్య శిబిరంలో క్యాన్సర్, గుండె, గైనిక్, పీడియాట్రిక్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఓరల్ స్క్రీనింగ్, బ్రెస్ట్ స్క్రీనింగ్, థైరాయిడ్ స్క్రీనింగ్ తదితర ఖరీదైన పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామన్నారు. ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. -
బీమా డబ్బుల కోసం బావ హత్య
● బామ్మర్ది సహా మరొకరు అరెస్టు ● అమీన్పూర్లో ఘటన పటాన్చెరు టౌన్: బీమా డబ్బుల కోసం సొంత బావను హత్య చేశాడు. సీఐ కథనం ప్రకారం.. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం లింగాయపల్లి సొమ్ల తండాకు చెందిన భానోత్ గోపాల్ బతుకుదెరువు కోసం పదేళ్ల కిందట భార్య లక్ష్మి, పిల్లలతో కలిసి అమీన్పూర్కు వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 14న రాత్రి గోపాల్ చెత్త పారివేసి వస్తానని ఇంట్లోంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు వెతుకుతుండగా 15న సాయంత్రం అమీన్పూర్ శ్మశానవాటిక వెనుక మృతదేహమై కనిపించాడు. మృతుడి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో భాగంగా.. గోపాల్ బామ్మర్ది నరేశ్ నాయక్, నరేశ్ మేనమామ దేవిసింగ్ను పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా.. తామే హత్య చేశామని అంగీకరించారని సీఐ తెలిపారు. ఏడాది కిందట గోపాల్ నాయక్ పేరు మీద నరేశ్, దేవిసింగ్ బ్యాంకు రుణంతో జేసీబీ తీసుకున్నారు. గోపాల్ నాయక్పై రిస్క్ ఇన్సూరెన్స్తోపాటు రూ.29 లక్షలు ఎల్ఐసీ ఇన్సూరెన్స్ చేయించారు. జేసీబీ వ్యాపారం సరిగా నడవకపోవడంతో అప్పులు చేసిన నరేశ్.. బావ చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని భావించాడు. 14న పథకం ప్రకారం మద్యం సేవిద్దామని గోపాల్ నాయక్ను అమీన్పూర్ శ్మశానవాటిక వద్దకు నరేశ్ పిలిచాడు. అక్కడే నరేశ్ మేనమామ దేవిసింగ్ సాయంతో బావను చున్నీతో ఉరి వేసి హత్య చేశాడు. అనారోగ్యంతో సాధారణంగా మృతి చెందాడని నమ్మించే ప్రయత్నం చేసేందుకు చూశారు. ఫోన్ చేసి పిలవడంతో ఇద్దరిని అనుమానించిన పోలీసులు.. తమదైన శైలిలో విచారణ చేపట్టి టేక్మాల్ మండలం షాబాద్ తండాకి చెందిన నరేశ్ నాయక్, వెంకట్రావు తండాకి చెందిన దేవి సింగ్ సోమవారం రిమాండ్కు తరలించారు. -
సంగమేశ్వర, బసవేశ్వరకు అధిక నిధులు కేటాయించాలి
నారాయణఖేడ్: సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజు డిమాండ్ చేశారు. కుడి, ఎడమ కాల్వలను ఏర్పాటుచేసి అధిక శాతం రైతుల భూములకు సాగునీరు అందించాలని కోరారు. సోమవారం నియోజకవర్గంలోని మంజీరా తీరం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నారాయణఖేడ్ వెనుకబడిన ప్రాంతం కాబట్టి సాగునీటిని అందిస్తే పంటలు బాగా పండి వ్యవసాయ అభివృద్ధికి అవకాశం ఉందని అన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాణిక్, నాయకులు సాయిలు, రమేష్, అశోక్, నర్సింహులు, ప్రవీణ్, అరుణ్, దత్తు, బాబురావు, ఎల్లయ్య పాల్గొన్నారు.కాంగ్రెస్ ఓబీసీ విభాగ సమావేశంలో ఎమ్మెల్యే నారాయణఖేడ్: హైదరాబాద్ గాంధీభవన్లో సోమవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగం సమావేశంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షులు కెప్టెన్ అజయ్సింగ్ యాదవ్ను ఎమ్మెల్యే శాలువాతో సన్మానించారు. అసైన్డ్ భూముల పరిశీలన జహీరాబాద్ టౌన్: మొగుడంపల్లి మండలం పర్వతాపూర్ గ్రామ పరిధిలో గల అసైన్డ్ భూములను ట్రైనీ కలెక్టర్ మనోజ్ సోమవారం పరిశీలించారు. గతంలో పర్వతాపూర్ పరిధిలో గల ప్రభుత్వ భూములను నిరుపేదల జీవనోపాధి కోసం ఇచ్చారు. విలువైన అసైన్డ్ భూముల గురించి ఆర్డీఓ రాంరెడ్డి, తహసీల్దార్ హసీనా బేగం ద్వారా తెలుసుకుని, రైతులతో ఆయన మాట్లాడారు. గ్రామ పరిధిలో ప్రభుత్వ, పట్టా భూముల విస్తీర్ణం గురించి కూడా ఆయన తెలుసుకున్నారు. అటవీ భూముల స్థితిగతుల గురించి కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఆర్డీఓ రాంరెడ్డి, తహసీల్దార్ హసీనా బేగం, ఆర్ఐ సాయికిరణ్లు ఉన్నారు. హరీశ్ ప్రకటనతో కదిలిన అధికారులు మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ జోగిపేట(అందోల్): బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు పాదయాత్ర ప్రకటనతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చిందని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. ఈ మేరకు సంగమేశ్వర, బసవేశ్వర పథకాలు పనులు ప్రారంభిస్తామని ఇరిగేషన్ అధికారులు హరీశ్రావుకు ఫోన్లు చేసి చెబుతున్నారని చెప్పారు. జోగిపేటలోని పార్టీ కార్యాలయంలో సోమవారం కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో దుష్టపాలన కొనసాగుతోందని మండిపడ్డారు. అనాలోచిత నిర్ణయాలతో ప్రజలను, రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను నెరవేర్చింది కేసీఆరేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ పి.జైపాల్రెడ్డి, మాజీ ఎంపీపీ బాలయ్య, రామాగౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ పి.నారాయణ, అందోలు, పుల్కల్ మండల పార్టీల అధ్యక్షులు లక్ష్మికాంతరెడ్డి, విజయ్కుమార్, పట్టణ అధ్యక్షుడు సార శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన జేసీబీ
ఐదుగురికి స్వల్ప గాయాలు సిద్దిపేటఅర్బన్: ఆర్టీసీ బస్సును జేసీబీ ఢీకొట్టిన ఘటన సిద్దిపేటలోని రంగధాంపల్లి వద్ద సోమవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. సిద్దిపేట నుంచి హన్మకొండకు ఆర్టీసీ బస్సు వెళ్తుంది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న జేసీబీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని ఐదుగురు ప్రయాణిలకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జేసీబీ డ్రైవర్ రవిశంకర్ కుమార్ అజాగ్రత్తగా నడిపి బస్సును ఢీకొట్టాడని డ్రైవర్ ప్రభాకర్ త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు విద్యార్థుల ఎంపిక
సిద్దిపేటరూరల్: రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు చింతమడక పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎంపికై నట్లు పాఠశాల యాజమాన్యం సోమవారం తెలిపారు. పాఠశాలలో 9వ తరగతికి చెందిన శ్రీలాస్య, వైష్ణవి జిల్లా అథ్లెటిక్స్ పోటీల్లో 400 మీటర్స్ పరుగుపందెంలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి రాజిరెడ్డి, ఉపాధ్యాయ బృందం విద్యార్థులను అభినందించారు. నిందితుడిని పట్టించిన కాల్డేటా ● ప్రాణం తీసిన వివాహేతర సంబంధం ● పెట్రోల్ పోసి నిప్పంటించి మహిళ హత్య మెదక్ మున్సిపాలిటీ: అదృశ్యమైన వివాహిత దారుణహత్యకు గురికాగా.. కాల్డేటా హంతకుడిని పట్టించింది. వివాహేతర సంబంధంతో మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించి హతమార్చిన ఘటనకు సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు. మెదక్ పట్టణ సీఐ నాగరాజు కథనం మేరకు.. మెదక్ పట్టణంలోని ఫతేనగర్లో నివసించే మంగలి రేణుక(45) స్థానికంగా ఓ ఆస్పత్రిలో స్వీపర్గా పనిచేస్తుంది. 6న సదరు మహిళ కనిపించకుండా పోవడంతో ఆమె కుమారుడు శ్రీనాథ్ 8న పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు మహిళ సెల్ఫోన్ కాల్ డేటాను పరిశీలించగా చిన్నశంకరంపేట మండలం ఎస్.కొండాపూర్ గ్రామానికి చెందిన బత్తుల యేసు ఆఖరి కాల్ ఉంది. దాని ఆధారంగా అతడిని పట్టుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయట పడింది. రేణుకతో వివాహేతర సంబంధం కలిగి ఉన్న బత్తులయేసు 6న ఎస్.కొండాపూర్ అడవి ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. అక్కడే ఆమైపె పెట్రోల్పోసి నిప్పంటించి హతమార్చాడు. నేరం ఒప్పుకోవడంతో ఆదివారం నిందితుడిని అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. 15 మేకలు సజీవ దహనం ● మరో పదింటికి గాయాలు ● నాదులాపూర్లో పాకకు నిప్పు వట్పల్లి(అందోల్): మేకల పాకకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో 15 మేకలు సజీవ దహనమయ్యాయి. ఈ ఘటన అందోలు మండల పరిధిలోని నాదులాపూర్ గ్రామంలో ఆదివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కలాలి రమేశ్ తనకున్న 25 మేకలను ఎప్పటిలాగే ఆదివారం ఇంటి వెనుకాల ఉన్న పాకలో కట్టేశాడు. అర్థరాత్రి పూట మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల వారు గమనించి రమేశ్కు తెలిపారు. ఇరుగుపొరుగు వారి సాయంతో మంటలార్పే ప్రయత్నం చేసినా 15 మేకలు చనిపోగా, మరో 10 మేకలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సుమారు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మేకల పోషణే జీవనాధారంగా చేసుకొని జీవిస్తున్న తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. వెటర్నరీ అధికారులు మృతి చెందిన మూగజీవాలను పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి ఇస్తామని తెలియజేశారు. బాధితులు జోగిపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
కొల్చారం(నర్సాపూర్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మండల కేంద్రానికి సమీపంలోని మెదక్–నర్సాపూర్ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి చోటు చసుకుంది. ఎస్ఐ మహమ్మద్ గౌస్ కథనం మేరకు.. కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కన్నారం గ్రామానికి చెందిన బసవన్నగారి రాజేందర్ (25) హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ అక్కడే నివాసముంటున్నాడు. రెండురోజుల కిందట గ్రామానికి వచ్చిన రాజేందర్ ఆదివారం ఉదయం మెదక్ పట్టణంలో పని నిమిత్తం వెళ్లి తిరిగొస్తున్నాడు. మండల కేంద్రానికి సమీపంలోని లోతు వాగు మలుపు వద్దకు రాగానే హైదరాబాద్ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు రాజేందర్ బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చికిత్స పొందుతూ యువకుడు తూప్రాన్: పురుగు మందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన తూప్రాన్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సోమవారం ఎస్ఐ శివానందం తెలిపిన వివరాల ప్రకారం.. తూప్రాన్ మండలం మల్కాపూర్కు చెందిన మామిండ్ల కనకరాజు(30) తల్లిదండ్రులు, భార్యాపిల్లలతో కలిసి ఉంటూ వ్యవసాయం చేస్తున్నాడు. కనకరాజుకు అప్పులు కావడంతో తీర్చలేక మనస్తాపం చెంది 9న ఇంట్లో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం ఆర్వీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స అయిపోయాక 15న ఇంటికి తీసుకొచ్చారు. 16న సాయంత్రం మరోసారి అస్వస్థతకు గురి కావడంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు. -
దాడి కేసులో ఇద్దరు రిమాండ్
తీవ్ర గాయాలై ఆస్పత్రిలో మృతి చెందిన మహిళమునిపల్లి(అందోల్): మహిళపై దాడి చేసి ఆమె మృతికి కారుకులైన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఎస్ఐ రాజేశ్ నాయక్ కథనం మేరకు.. మండలంలోని అంతారం గ్రామానికి చెందిన దూదేకుల మోమ్మద్ ఇస్మాయిల్ అదే గ్రామానికి చెందిన వీరారెడ్డి, విజయరెడ్డికి చెందిన ఇంటి ఎదుట ఖాళీ స్థలంలో మూత్ర విసర్జన చేశాడు. దీంతో ఇద్దరూ కలిసి ఇస్మాయిల్పై దాడి చేశారు. తండ్రి అరుపులకు అలియ బేగం వచ్చి ఆపుతుండగా ఆమె పై కూడా దాడి చేశారు. దీంతో తీవ్ర గాయాలైన ఆమెను సంగారెడ్డిలోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ 16న బేగం మృతి చెందింది. మహిళపై దాడి చేసి మృతికి కారణమైన వీరారెడ్డి, విజయరెడ్డిని సోమవారం మండలంలోని బుదేరాలో కొండాపూర్ సీఐ వెంకటేశం, ఎస్ఐ రాజేశ్ నాయక్ పట్టుకొని రిమాండ్ తరలించినట్లు తెలిపారు. -
సీసీఐలో వెయ్యి క్వింటాళ్ల దళారుల పత్తి
హుస్నాబాద్రూరల్: హుస్నాబాద్లోని నాలుగు కాటన్ మిల్లులో నాలుగు సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయగా అధికారులు వెయ్యి క్వింటాళ్లు దళారుల పత్తిని గుర్తించారు. ఇక్కడ బోగస్ రైతుల పేరున దళారులు నాసిరకం పత్తి విక్రయిస్తున్నారని సాక్షిలో పక్షం రోజుల కింద ‘సీసీఐలో సిత్రాలు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు మరుసటి రోజే కాటన్ మిల్లులను తనిఖీ చేయడంతో దళారుల దందా మూడు రోజులు ఆగి మరుసటి రోజు నుంచి కొనసాగింది. సోమవారం జిల్లా వ్యవసాయ అధికారి రాధ, మార్కెటింగ్ అధికారి నాగరాజు, ఏడీఏ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వారు ఇప్పటికే గుర్తించిన మీర్జాపూర్ గ్రామంలోని 12 మంది బోగస్ రైతులను కలిశారు. మాందాపూర్లో నలుగురు, హుస్నాబాద్ కస్టర్ పరిధిలో ఇద్దరు మొత్తం 18 మంది బోగస్ రైతులు ఉన్నట్లు తేల్చారు. 18 మంది పేరున వ్యాపారులు 1,000 క్వింటాళ్లు విక్రయించి దళారులు రూ.15 లక్షల లాభాలను పొందారు. ఈ దందాకు సహకరించిన అధికారులకు, కంప్యూటర్ ఆపరేటర్లకు, రాజకీయ నాయకులకు దళారులు రూ.5 లక్షల వరకు కమీషన్ల కింద పంపిణీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. పంట వేయని రైతుల పేరున ధ్రువీకరణలు హుస్నాబాద్ కాటన్ మిల్లు వ్యాపారులు మెదక్, సంగారెడ్డి, కరీంనగర్, జనగామ జిల్లాల నుంచి నాసిరకం పత్తిని క్వింటాల్కు రూ.6 వేల చొప్పున కొనుగోలు హుస్నాబాద్ సీసీఐ కేంద్రాలకు తరలించారు. బోగస్ రైతుల పేరున ధ్రువీకరణ పత్రాలు తయారు చేసే వరకు పత్తి వాహనాలను మిల్లులో పక్కన పార్కింగ్ చేసి పెట్టారు. హుస్నాబాద్, మహ్మదాపూర్, మీర్జాపూర్ వ్యవసాయ క్లస్టర్ పరిధిలోని ఏఈఓలకు తెలువకుండానే 18 మంది రైతులకు బోగస్ ధ్రువీకరణ పత్రాలను సృష్టించారు. మా సంతకాలను ఫోర్జరీ చేసినట్లు ఏఈఓ లు ఏడీఏకు ఫిర్యాదు చేశారు. దీనిపై మార్కెట్ కార్యాలయంలో విచారణ జరిపిన అధికారులకు ఏఈఓల సంతకాలు ఫోర్జరీ చేసి బోగస్ రైతుల పేరున ధ్రువీకరణ పత్రాలు ఇచ్చినట్లు గుర్తించారు. మండల వ్యవసాయ అధికారి నాగరాజు దగ్గర ఉండాల్సిన రసీదు బుక్ నుంచే ధ్రువీకరణ పత్రాలు వెళ్లినట్లు డీఏఓ రాధిక వెల్లడించారు. మార్కెటింగ్ అధికారులతో కలిసి విచారణ చేసి కలెక్టర్కు నివేదిక ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రూ.15 లక్షలు వ్యాపారులకు లాభం కమీషన్ల పేరుతో రూ.5 లక్షలు పంపకం 18 మంది బోగస్ రైతులను గుర్తించిన అధికారులు -
కష్టం
కుళ్లిపోయి.. చచ్చిపోతున్న వరిఎ‘వరి’కీ రాకూడని● నాట్లేసి 45 రోజులు గడుస్తున్నా ఎదుగుదల లేని పంట ● జిల్లాలో పెద్ద ఎత్తున సాగు ● ఏ మందులు వాడినా దక్కని ఫలితం ● దున్ని.. మళ్లీ నాట్లేస్తున్న రైతులు ● పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులుమొగిపురుగు, వాతావరణ పరిస్థితులే కారణమంటున్న శాస్త్రవేత్తలు, అధికారులునాట్లేసి 45 రోజులు గడుస్తున్నా ఎదుగుదల లేని పంటదుబ్బాక: యాసంగిలో వరి పంట వేసిన రైతులకు మొదట్లోనే కష్టాలు మొదలవుతున్నాయి. ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని.. అప్పులు తె చ్చి.. పుట్టెడు పెట్టుబడులు పెట్టి వరి పంట సాగు చేస్తే చేతికొస్తుందన్న గ్యారంటీ లేక జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చెందుతున్నారు. వానా కాలంలో మొగి పురుగు రోగం, భారీ వర్షాలతో పంటలు దెబ్బతిని దిగుబడులు రాక రైతులకు పెట్టుబడులు మీద పడ్డాయి. ఈ యాసంగిలోనైనా పంట బాగా పండుతాయన్న గంపెడాశతో పెద్ద ఎత్తున వరి పంటలు సాగు చేశారు. తీరా వరినాట్లు వేసి నెలరోజులు గడుస్తున్నా పంట పచ్చబడటం లేదు. మరోసారి నాట్లు మొక్క ఎదగకుండా ఎర్రబడి కుళ్లిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలు వేసినప్పటి నుంచి రకరకాల మందులు చేసినా.. వివిధ రకాల క్రిమి సంహారక మందులు చల్లినా పంట కోలుకోవడం లేదు. ఎదుగుదల లేకుండా కుళ్లిపోతూ మొక్కలు చచ్చిపోయి పొలాల్లో పెద్ద గ్యాబులు (ఖాళీ స్థలాలు) ఏర్పడుతున్నాయి. వ్యవసాయాధికారులు..డాట్ సెంటర్ సైంటిస్టులు సైతం జిల్లాలో ఎర్రబడి ఎదుగుదల లేని వరి పంటలను పరిశీలిస్తున్నారు. చాలా మంది రైతులు వేసిన వరినాట్లు కుళ్లిపోయి చనిపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వేసిన నాటును దున్నేసి మళ్లీ నాట్లు వేశారు. 3 లక్షలకు పై చిలుకు ఎకరాల్లో సాగు.. జిల్లాలో చెరువులు, కుంటల్లో నీరు సమృద్ధిగా ఉండటంతో ఈ యాసంగిలో రైతులు పెద్ద ఎత్తున వరి సాగు చేశారు. ఈసారి 3.50 లక్షల ఎకరాల్లో సాగు అవుతుందని వ్యవసాయాధికారుల అంచనా ఉండగా ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా ఎకరాల్లో సాగు పూర్తి అయ్యింది. ఇంకా వరి నాట్లు వేస్తూనే ఉన్నారు. ఇష్ట మొచ్చిన మందులు పంట ఎదుగుదల లేకుండా ఎర్రగా మారి కుళ్లిపోతుండటంతో రైతులు రకరకాల మందులను , గులకలను తెచ్చి ఇష్టం మొచ్చినట్లుగా చల్లుతున్నారు. ఫర్టిలైజర్ దుకణాల్లో వారు ఏ మందులు ఇస్తే అవి తెచ్చి స్ప్రే చేస్తున్నారు. పుట్టెడు అప్పులు తెచ్చి ఎన్ని మందులు చల్లినా ఫలితం లేకపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణ పరిస్థితులే కారణం వరి పంటలు కుళ్లిపోతూ ఎదుగుదల లేకపోవడానికి మొగి పురుగు ఉధృతి, వాతావరణ పరిస్థితులే కారణమంటూ వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. జిల్లాలో పలు వరి పంటలను డాట్ సెంటర్ శారస్త్రవేత్తలతోపాటు వ్యవసాయాధికారులు పరిశీలించారు..ఈ సందర్భంగా వారు పలు సూచనలు రైతులకు ఇచ్చారు.తీసుకోవాల్సిన జాగ్రత్తలు రైతులు పొలాల్లో ఎక్కువ నీరు నిల్వ ఉంచకుండా అరబెడుతూ నీరు పెట్టాలి ఇష్టం వచ్చిన మందులు చల్లవద్దు ఎండ తీవ్రత పెరిగితే యధావిధిగా పంటలు కోలుకుంటాయి. మొగిపురుగు నివారణకు 4జీ గుళికలు వేసుకోవాలి. ఫర్టిలైజర్ల డీలర్లకు కూడా ఏ మందులు పడితే అవి ఇవ్వొద్దని తాము సూచించిన మందులే రైతులకు ఇవ్వాలని చెబుతున్నాం రైతులు వ్యవసాయ అధికారుల సూచనల మేరకే మందులు వేసుకోవాలి. లేకుంటే పంటకు ఫలితం ఇవ్వక పోవడమే కాకుండా ఆర్థికంగా నష్టం వాటిల్లుతుంది. -
తాగడానికి డబ్బులు ఇవ్వలేదని..
తూప్రాన్: మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని కోపోద్రికుడైన భర్త భార్యను కొట్టి చంపాడు. ఈ ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. సీఐ రంగాకృష్ణ కథనం మేరకు.. మధ్యప్రదేశ్కు చెందిన భార్యాభర్తలు ఆదివాసి అశోక్, భార్య శివకాలి బతుకుదెరువు కోసం మూడు నెలల కిందట మెదక్ జిల్లా తూప్రాన్కు వచ్చి పోతరాజుపల్లిలో నివాసం ఉంటున్నారు. మద్యానికి బానిసైన అశోక్ నిత్యం డబ్బుల కోసం భార్యని వేధించేవాడు. ఆదివారం రాత్రి డబ్బుల కోసం భార్యతో గొడవకు దిగాడు. ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో కోపోద్రికుడై కట్టెతో విచక్షణారహితంగా భార్యను కొట్టడంతో తీవ్ర గాయాలై మృతి చెందింది. ఉదయం చుట్టుపక్కల వారు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ శివానందంతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి అశోక్ను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశామని తెలిపారు. భార్యను కొట్టి చంపిన భర్త తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో ఘటన -
తునికి ఆలయం వేలం పాట వాయిదా
కౌడిపల్లి(నర్సాపూర్): పాత బకాయిలు వసూలు చేసే వరకు వేలం పాటను ఆపాలని తునికి గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో వేలం పాట వాయిదా పడింది. ఈ ఘటన మండలంలోని తునికి నల్ల పోచమ్మదేవి ఆలయం వద్ద సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తునికి నల్లపోచమ్మ దేవి ఆలయం జాతర వచ్చే నెలలో జరుగనుంది. అధికారులు కొబ్బరికాయలు, దుకాణాలు, టెంట్ సామగ్రి అద్దెతోపాటు వాహనాల పార్కింగ్కు వేలంపాటను ఆలయ ఇన్చార్జి ఈఓ రంగారావు, పరిశీలకులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. దీంతో మాజీ కో ఆప్షన్ సభ్యుడు రహీం, మాజీ ఆలయ కమిటీ చైర్మన్లు చెల్ల మల్లేశం, శ్రీనివాస్రెడ్డి, గోపాల్రెడ్డి, మాజీ సర్పంచ్ సాయిలు, మాజీ ఉపసర్పంచ్లు మాణిక్య రెడ్డి, శేఖర్, గ్రామస్తులు వేలం పాటను అడ్డుకున్నారు. గతేడాది వేలం పాట ద్వారా ఆలయానికి రూ.44 లక్షలు ఆదాయం రాగా, ఇందులో రూ.4.90 లక్షలు బకాయి ఉన్నట్లు తెలిపారు. అలాగే నాలుగేళ్లకు సంబంధించి రూ.30 లక్షల వరకు పలువురు బకాయి పడినట్లు అధికారులు తెలిపారు. బకాయిలు చెల్లించని వారికి నోటీసులు జారీ చేసి కేసులు వేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. స్పందించిన ఇన్చార్జి ఈఓ రంగారావు బకాయిదారులకు నోటీసులు ఇస్తామని, స్పందించకపోతే పోలీస్లకు ఫిర్యాదు చేస్తామని వేలం పాటను వాయిదా వేశారు. 24న తిరిగి వేలం పాటను నిర్వహిస్తామని ఈఓ తెలిపారు. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ వెంకట్రెడ్డి గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. పాత బకాయిలు వసూలు చేయాలని గ్రామస్తుల డిమాండ్ నోటీసులు ఇస్తామన్న ఈఓ -
541 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
జహీరాబాద్: అక్రమంగా పక్క రాష్ట్రాలకు రెండు లారీల్లో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు చిరాగ్పల్లి ఎస్ఐ రాజేందర్రెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు.. మొగుడంపల్లి మండలంలోని మాడ్గి గ్రామ శివారులోని రాష్ట్ర సరిహద్దులో గల రవాణా చెక్ పోస్టు వద్ద సోమవారం సివిల్ సప్లయ్ శాఖ అధికారులు వాహనాల తనిఖీ చేపట్టారు. రెండు లారీల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గుర్తించారు. హైదరాబాద్ నుంచి కర్ణాటకకు లారీలో 266 క్వింటాళ్లు, హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు లారీలో 275 క్వింటాళ్ల బియ్యం తరలిస్తుండగా పట్టుకున్నాం. ఈ సందర్భంగా ఆయా లారీల యజమానులు మన్సూర్, జాకీర్, లారీ డ్రైవర్లు ఎం.డీ పాష, భీమయ్యలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
శుభకార్యానికి వచ్చి.. కారు ప్రమాదంలో బాలుడు మృతి
మిరుదొడ్డి(దుబ్బాక): బంధువుల ఇంట్లో శుభకార్యానికి వచ్చి సరదాగా వాగు పరిసరాలను, వ్యవసాయ పొలాలను తిలకిద్దామని వెళ్లిన బాలుడు కారు బోల్తా పడటంతో మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ నలుగురిలోని 17 ఏళ్ల మైనర్ బాలుడు అతివేగంగా కారు నడపడంతోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాలలో సోమవారం చోటు చేసుకుంది. మిరుదొడ్డి పోలీసుల కథనం మేరకు.. హైదరాబాద్లోని మల్లాపూర్కు చెందిన లేగల నరేందర్, సుజాత దంపతులు వారి పిల్లలు జయ రక్షిత్ (14), జశ్వంత్తో కలిసి అల్వాలలోని తమ బంధువులైన బొమ్మ జ్యోతి గృహ ప్రవేశం కార్యక్రమానికి వచ్చారు. అలాగే కరీంనగర్ పట్టణానికి చెందిన ఏదుల రవిశంకర్, స్వప్న దంపతులు వారి పిల్లలు యశ్వంత్, అమ్ములుతో హాజరయ్యారు. సోమవారం సరదాగా అల్వాల శివారులోని కోదండరాముడి ఆలయం, కూడవెల్లి వాగు పరిసరాలు, వ్యవసాయ పొలాలను తిలకించడానికి జయ రక్షిత్, జశ్వంత్, యశ్వంత్, అమ్ములు కలిసి కారులో బయలు దేరారు. ఇందులోని 17 ఏళ్ల మైనర్ బాలుడు జశ్వంత్ కారు నడుపుతున్నాడు. ఎరుకలి వాడ సమీపంలోకి రాగానే మలుపు వద్ద కారు అతివేగంగా వస్తూ అదుపుతప్పి బోల్తా పడింది. రెండు పల్టీలు కొట్టడంతో కారులోని జయ రక్షిత్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానికుల సహాయంతో 108 ద్వారా సిద్దిపేట జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జశ్వంత్, యశ్వంత్ల పరిస్థితి విషమంగా మారడంతో సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుడు మల్లం రవి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మరో ముగ్గురు పిల్లలకు తీవ్ర గాయాలు అతివేగంగా వచ్చి బోల్తాపడ్డ కారు వాహనాన్ని నడిపిన 17 ఏళ్ల బాలుడు మిరుదొడ్డి మండలం అల్వాలలో ఘటన -
విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధం
మెదక్ మున్సిపాలిటీ: విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధమైన ఘటన మెదక్ పట్టణంలోని కుమ్మరిగల్లిలో సోమవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకులు, స్థానికుల కథనం మేరకు .. మెదక్ పట్టణం కుమ్మరి గడ్డకి చెందిన కుమ్మరి సంతోష్ ఇంట్లో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. సంతోష్ మెడికల్ ల్యాబ్ ఏర్పాటు కోసం సమకూర్చుకున్న రూ.4 లక్షల నగదు, 15 తులాల బంగారు ఆభరణాలు, ఫ్యాషన్ ప్రో బైక్, ఫ్రిడ్జ్, టీవీ, తదితర సామగ్రి కాలి బూడిదయ్యాయి. సంతోష్, అతడి భార్యకు సంబంధించి విద్యార్హత సర్టిఫికెట్లు అన్నీ కాలిపోయాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వచ్చి మంటలార్పారు. అయితే అప్పటికే ఇంట్లోని సామగ్రి పూర్తిగా కాలిపోయింది. రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఘటనా స్థలాన్ని సందర్శించి పంచనామా నిర్వహించారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు సంతోష్ విజ్ఞప్తి చేశాడు. బైక్, ఇంట్లోని సామగ్రి, సర్టిఫికెట్లు కాలి బూడిద రూ.20 లక్షల ఆస్తినష్టం -
ఇద్దరు అదృశ్యం
పరిశ్రమలో పని చేస్తున్న యువకుడు మనోహరాబాద్(తూప్రాన్): పరిశ్రమలో పని చేస్తున్న యువకుడు అదృశ్యమైనట్లు ఎస్ఐ సుభాష్గౌడ్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. మహారాష్ట్ర సోలాపూర్ జిల్లాకు చెందిన తానాజీ పాలిమార్ స్టీల్ పరిశ్రమలో వెల్డర్గా పని చేస్తున్నాడు. 9న బయటకు వెళ్లిన ఇంటికి రాలేదు. తానౌజీ అన్న గోపాల్కు ఇంటి యజమానులు సమాచారం అందించగా చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. గోపాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మతి స్థిమితం లేని వృద్ధురాలు సిద్దిపేటకమాన్: మతి స్థిమితం సరిగా లేని వృద్ధురాలు అదృశ్యమైన ఘటనపై సిద్దిపే ట పట్టణంలో చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ ఉపేందర్ కథనం మేరకు.. సిద్దిపేట ఆదర్శనగర్కు చెందిన శీలం లక్ష్మీ (90) స్థానికంగా కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది. లక్ష్మీ తరచూ కాలనీలో తిరుగుతూ రాత్రికి ఇంటికి చేరుకునేది. శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. లక్ష్మీ మనవరాలు జ్యోతి ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
డంపింగ్యార్డ్పై నిరసనల వెల్లువ
బైక్ ర్యాలీతో నిరసనజిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీ పారానగర్ డంపింగ్ యార్డ్ ఏర్పాటు వ్యతిరేక ఆందోళన కార్యక్రమాలు 12వ రోజుకు చేరుకున్నాయి. మండలంలోని గ్రామ గ్రామాల్లో సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిరసన ర్యాలీలు, రిలే నిరాహార దీక్షల కార్యక్రమాలకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి హాజరై మద్దతు తెలిపారు. డంపింగ్యార్డ్ ఏర్పాటు చేయాలని చూస్తే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆమె ఈ సందర్భంగా హెచ్చరించారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా గుమ్మడిదల నుంచి అన్నారం వరకు ఆందోళనకారులు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జేఏసీ సభ్యులు రైతులు మహిళలు యువకులు, పాల్గొన్నారు. మద్దతిచ్చిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి -
ఇంటర్ విద్యార్థులకు మరోసారి అవకాశం
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఇటీవలే ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలకు గైర్హాజరైన జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు విద్యాశాఖ మరోసారి అవకాశం కల్పిస్తున్నట్లు ఇంటర్మీడియెట్ జిల్లా అధికారి గోవిందరాం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు జరుగనున్నాయని తెలిపారు. ఈ పరీక్షలు సంగారెడ్డిలోని బాలుర జూనియర్ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయన్నారు. గైర్హాజరైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
పూర్తిస్థాయిలో రైతు భరోసా
ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి డిమాండ్ నారాయణఖేడ్: రైతు భరోసాను పూర్తిస్థాయిలో రైతులందరికీ అందించాలని ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటివరకు 3 ఎకరాల వరకు రైతుల ఖాతాల్లో నగదు జమచేశామని ప్రభుత్వం చెబుతున్నా 60 శాతం మందికి కూడా అందలేదన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...నాగల్గిద్ద మండలంలో 13 వేల ఎకరాలకుగాను 8 వేల ఎకరాలకు మాత్రమే నగదు జమ చేశారన్నారు. శేరిదామరిగిద్దలో గిరిజనులకు సంబంధించి 525 ఎకరాలున్నా ఒక ఎకరానికి కూడా డబ్బులు అందలేదన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏమైనా సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింపజేసేవాడినని, కానీ, ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్కు చెందిన ఎంపీ, ఎమ్మెల్యే ఉన్నా రైతులను ఏమాత్రం పట్టించుకోవడంలేదని విమర్శించారు. రైతుల ఖాతాల్లో రైతుభరోసా డబ్బులను జమచేయాలని, లేనిపక్షంలో భారీ ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. నేడు రక్తదాన శిబిరం మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 11 గంటలకు ఖేడ్ ప్రాంతీయ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ఖేడ్ బీఆర్ఎస్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. బీఆర్ఎస్, అనుబంధ సంఘాల బాధ్యులు, నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరింది. -
ఎంపీ బీబీ పాటిల్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
జహీరాబాద్ టౌన్: పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గెలిపించాలని కోరుతూ మాజీ ఎంపీ. బీబీపాటిల్ ఆదివారం జహీరాబాద్ పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి పట్టభద్రులను కలిశారు. ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తుందని, అందువల్ల బీజేపీ బలపరిచిన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆయన వెంట బీజేపీ నియోజకవర్గం కన్వీనర్ జగన్నాథ్, నాయకులు శ్రీనివాస్గౌడ్, గొల్ల భాస్కర్, సుధీర్ బండారీ, మల్లికార్జున్ పాటిల్, శోభారాణి తదితరులు ఉన్నారు. మల్లన్న జాతరకు రండి చేగుంట(తూప్రాన్): మండలంలోని ఇబ్రహీంపూర్ మల్లన్న జాతరకు రావాలని కోరుతూ మంత్రి పొన్నం ప్రభాకర్కు హైదరాబాద్లో ఆదివారం నాయకులు ఆహ్వానపత్రిక అందజేశారు. ఈనెల 23న భ్రమరాంబ సహిత మల్లికార్జునస్వామి సప్తమ వార్షికోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు నవీన్, ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. -
బ్యాంకుకు వెళ్తున్నట్లు చెప్పి..
మహిళ అదృశ్యం వర్గల్(గజ్వేల్): బ్యాంకులో డబ్బులు తీసుకునేందుకు వెళ్లిన మహిళ ఆచూకీ తెలియకుండాపోయింది. వర్గల్ మండలం అనంతగిరిపల్లి లో చోటుచేసుకున్న ఈ ఘటనపై ఆదివారం మిస్సింగ్ కేసు నమోదైంది. గౌరారం ఏఎస్ఐ పోచాగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. అనంతగిరిపల్లికి చెందిన దార యాదమ్మ(40) భర్త కొంతకాలం క్రితం మృతిచెందాడు. ఆమె కూలీ పని చేస్తున్నారు. శనివారం ఉదయం బ్యాంకులో డబ్బుల కోసం వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి వెళ్లారు. ఆ తరువాత ఇంటికి తిరిగిరాలేదు. ఆమె కుమారుడు సాయికుమా ర్ తల్లి నంబర్కు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్లో ఉంది. దీంతో ఆందోళనకు గురై తల్లి జాడ కోసం అంతటా వెతికినప్పటికీ ఫలితం దక్కలేదు. ఆదివారం గౌరారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ పేర్కొన్నారు. వ్యక్తి అదృశ్యంశివ్వంపేట(నర్సాపూర్): వ్యక్తి కనిపించకుండా పోయిన సంఘటన ఆదివారం మండలంలోని తాళ్లపల్లిగడ్డ తండాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన ధనావత్ రాంచందర్ ఈనెల 11న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని, అతని భార్య విజయ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.1.72 లక్షల ఆస్తి పన్ను వసూలు
జిన్నారం (పటాన్చెరు): బొల్లారం మున్సిపాలిటీలో ఆస్తి పన్ను వసూళ్ల ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని కమిషనర్ మధుసూదన్రెడ్డి తెలిపారు. పారిశ్రామికవాడలోని జెనెక్స్ లేబొ రేటరీ పారిశ్రామికవేత్తలు రూ.1.72లక్షలను చెక్కు రూపంలో మున్సిపల్ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ...జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు బృందాలను ఏర్పాటు చేసి స్పెషల్ డ్రైవ్ చేపట్టామన్నారు. ఆస్తి పన్ను చెల్లింపుల్లో నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే నోటీసులు అందించి ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరించారు. ఏప్రిల్ నెల ఆరంభానికి ముందే ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఆర్వో నర్సింలు, వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు రఘురాం రెడ్డి, అలీ, సునీత, తదితరులు పాల్గొన్నారు. పొగాకు ఆరోగ్యానికి హానికరం: విష్ణువర్ధన్రెడ్డి నారాయణఖేడ్: పొగాకు ఉత్పత్తుల వినియోగం ఆరోగ్యానికి హానికరమని జిల్లా పొగాకు నియంత్రణ విభాగం సూపర్వైజర్ విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ఖేడ్లోని రాజీవ్చౌక్, బసవేశ్వర చౌక్, బస్టాండ్ ప్రాంతాల్లో ఆదివారం ప్రచారం నిర్వహించారు. పొగాకు ఉత్పత్తులైన బీడీ, చుట్ట, సిగరెట్, జరదా, తంబాకు, పాన్మసాలా లాంటివి వినియోగించకూడదని సూచించారు. వాటి వాడకం వల్ల హైపర్టెన్షన్, నోటి క్యాన్సర్, శ్వాసకోస, గుండె సంబంధిత వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయడం సెక్షన్ 4 ప్రకారం నేరం అని అందుకు రూ.200 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఐఎంఏ నూతన కార్యవర్గం ఎన్నిక సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) నూతన కార్యవర్గం ఎన్నికై ంది. సంగారెడ్డిలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఐఎంఏ కార్యవర్గ సభ్యుల సమక్షంలో ఎన్నికలను నిర్వహించారు. అధ్యక్షుడిగా కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఆనంద్, ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్, ఉష, సంయుక్త కార్యదర్శిలుగా సురేశ్ కుమార్, జ్యోతి, హరినాథ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్య వర్గం సభ్యులు మాట్లాడుతూ... సంగారెడ్డి కొత్త కార్యవర్గం సభ్యత్వం పెంపుదల చేస్తామన్నారు. ఉచిత వైద్య శిబిరాలు, నైతిక వైద్య ప్రవర్తన ప్రోత్సాహం, ప్రజారోగ్య అవగాహన కార్యక్రమాలు, ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సంగారెడ్డి సీనియర్ వైద్యులు శ్రీహరి, విజయనిర్మల, శ్రీధర్,వెంకట్, స్వామిదాస్, రహీమ్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా తపస్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య జహీరాబాద్: ఎమ్మెల్సీగా తనను గెలిపిస్తే ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని తపస్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య అన్నారు. జహీరాబాద్లోని అతిథి బ్యాంకెట్హాల్లో ఆదివారం నిర్వహించిన ఉపాధ్యాయుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కరీంనగర్–మెదక్– నిజామాబాద్–ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానన్నారు. ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. సీపీఎస్రద్దు–పాత పెన్షన్ విధానం పునరుద్ధరణకుగాను ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని హామీనిచ్చారు. సమావేశంలో తపస్ జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి, రాష్ట్ర కార్యదర్శి బస్వరాజ్, నర్సింహారెడ్డిలతోపాటు ఆయా మండలాల బాధ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
24నుంచి హరీశ్ పాదయాత్ర!
జహీరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి సాగునీటిని అందించి బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు వీలుగా మంజూరు చేసిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను సాధించేందుకు మాజీమంత్రి హరీశ్రావు పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం పార్టీ నేతలు రూట్ మ్యాప్, తేదీలను ఖరారు చేశారు. ఈ విషయాన్ని పార్టీ నేతలు ధ్రువీకరించారు. ఆయా పథకాల పనులు ప్రారంభించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని, పాదయాత్ర ద్వారా వాటిని సాధించుకోవడమే లక్ష్యంగా హరీశ్రావు పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. నారాయణఖేడ్ నియోజకవర్గానికి సాగునీటిని అందించేందుకు వీలుగా బసవేశ్వర పథకానికి అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భూమిపూజ చేశారు. ఈ పథకాన్ని సాధించేందుకు గాను ఈనెల 24న బోరంచ లోని పోచమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించి అక్కడి నుంచి నారాయణఖేడ్ వరకు సుమారు 15 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించనున్నారు. మూడు నియోజకవర్గాలకు సాగునీటికోసం... జహీరాబాద్, సంగారెడ్డి, అందోల్ నియోజకవర్గాలకు సాగు నీటిని అందించేందుకు వీలుగా సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. ఈ పథకాన్ని సాధించేందుకు వీలుగా మండల కేంద్రమైన ఝరాసంగంలోని శ్రీ కేతకీ సంగమేశ్వర ఆలయంలో హరీశ్రావు ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి 15 కిలోమీటర్లు పాదయాత్ర ద్వారా జహీరాబాద్ చేరుకుంటారు. పాదయాత్ర అనంతరం ఆయా నియోజకవర్గం కేంద్రాల్లో బహిరంగ సభ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 2021లో ఆయా ప్రాజెక్టులకు అనుమతులు లభించాయి. 21 ఫిబ్రవరి 2022లో నారాయణఖేడ్లో నిర్వహించిన కార్యక్రమంలో అప్పటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. ఆయా పథకాలకు గాను రూ.4,500 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సింగూరుకు నీటిని మళ్లించి 20 టీఎంసీల వినియోగంతో 3.84లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు రెండు ఎత్తిపోతల పథకాలను గత ప్రభుత్వం చేపట్టింది. సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి గాను 6,293 ఎకరాల భూమి అవసరం అవుతుందని, రూ.2,653 కోట్ల మేర నిధులు అవసరం అవుతాయని అంచనా వేశారు. 115 గ్రామాల్లో 1,03,259 ఎకరాలకు... జహీరాబాద్, అందోల్, సంగారెడ్డి నియోజకవర్గాల్లోని 11 మండలాలకు చెందిన 231 గ్రామాల్లోని 2.19లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని 5 మండలాల పరిధిలోని 115 గ్రామాల్లో 1,03,259 ఎకరాలకు సాగు నీటిని అందించాలని ప్రతిపాదించారు. అందోల్ నియోజకవర్గంలోని రెండు మండలాల పరిధిలో 66 గ్రామాలకు చెందిన 65,816 ఎకరాలకు, సంగారెడ్డి నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలో 50 గ్రామాల్లోని 49,925 ఎకరాలకు సాగు నీరందించాలని నిర్ణయించారు. ఇందు కోసం 12 టీఎంసీల నీటిని ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. నారాయణఖేడ్ నియోజకవర్గానికి సాగు నీటిని అందించేందుకు గాను బసవేశ్వర ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. ఈ పథకం కింద 8 టీఎంసీల నీటితో 1,65లక్షల ఎకరాలకు నీటిని అందించాలని ప్రతిపాదించారు. ఇందు కోసం రూ.1,774కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు.14 జూన్ 2021లో సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి సంబంధించి అందోల్ నియోజకవర్గంలోని కంకోల్లో సంప్హౌజ్, 21 జూన్ బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి సంబంధించిన సంప్హౌస్ నిర్మాణానికి, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆయా పథకాలకు గ్రహణం పట్టింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయా ప్రాజెక్టుల విషయంలో ఇటీవల ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్లో జహీరాబాద్ ప్రాంత నేతల సమావేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విషయం తెలిసిందే. అవసరం అయితే ఉద్యమాన్ని చేపట్టి ఆయా ప్రాజెక్టులను సాధిస్తానని ప్రభుత్వానికి హెచ్చరిక సైతం జారీ చేశారు.బసవేశ్వర కోసం బోరంచ నుంచి ఖేడ్ వరకు.. సంగమేశ్వర కోసం మార్చి 1న కేతకీ ఆలయం నుంచి జహీరాబాద్ వరకు పథకాలను సాధనే లక్ష్యంగా.. ఇప్పటికే పార్టీ నేతలతో సమావేశం స్థానిక నేతలతో హరీశ్రావు భేటీ సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను ముందుకు తీసుకెళ్లే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని హరీశ్రావు విమర్శించారు. ఈనెల 14న హైదరాబాద్లో ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కె.మాణిక్రావు, చింతా ప్రభాకర్, సునీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్లతో సమావేశమయ్యారు. ఈ ప్రాజెక్టులపై ప్రభు త్వం కావాలని తాత్సారం చేస్తోందని ఆరోపించారు. పాదయాత్ర చేపట్టేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
పోలీసులకు దొంగల అప్పగింత
శివ్వంపేట(నర్సాపూర్): మండలంలోని పెద్ద గొట్టిముక్కుల శివారులోని భవ్యస్ ఫార్మా కంపెనీలో స్క్రాప్ను దొంగిలిస్తున్న వారిని కంపెనీ యజమాని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. శనివారం రాత్రి నలుగురు వ్యక్తులు కంపెనీలోకి చొరబడి స్క్రాప్, ఐరన్ రాడ్లు, కేబుల్ వైర్లను దొంగిలించి గోడపై నుంచి బయటకు వేస్తుండగా కంపెనీ యజమాని సీసీ కెమెరాలో గమనించాడు. వెంటనే సెక్యూరిటీని అప్రమత్తం చేశాడు. అనంతరం కంపెనీ వద్దకు చేరుకొని సిబ్బందితో కలిసి దొంగలను పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. రెండు బైకులను సైతం అప్పగించారు. కొద్ది రోజులుగా కంపెనీ నడవడం లేదు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలకు చెందిన ముగ్గురు.. అందులో ఒకరు బీహార్కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. వీరు చుట్టుపక్కల గ్రామాల్లో వ్యవసాయ బోర్ల వద్ద స్టార్టర్లు కేబుల్ వైర్లు దొంగిలించారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ యజమాని ఫిర్యాదు మేరకు నలుగురిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
నేనూ ఇస్తూ.. ఇతరులతో ఇప్పిస్తాను
నా మిత్రుడు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. అప్పుడు అత్యవసర సమయంలో ఎవరిని అడిగిన రక్తం ఇచ్చేందుకు ముందుకు రాలేదు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రావద్దని బ్లడ్ డోనర్స్ క్లబ్ను ప్రారంభించాను. రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి నేను రక్తం ఇవ్వడంతోపాటు, స్నేహితులతో రక్తదానం చేయిస్తుంటాను. – బంగారు కృష్ణ, సంగారెడ్డి బ్లడ్ డోనర్స్ క్లబ్ అధ్యక్షుడు ఆపద వస్తే.. వచ్చేస్తాడు జోగిపేట ఆర్డీఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తూ స్వచ్ఛందగా రక్తదానం చేస్తున్నాను అత్యవసరంలో ఎవరు ఫోన్ చేసిన లేదా గ్రూప్లో మెసేజ్ పెట్టిన నాకు సంబంధించిన బ్లడ్ అయితే వెళ్లి ఇస్తాను. వేరే గ్రూప్ ఏదైనా అయితే నా స్నేహితులతో ఇప్పిస్తాను. ఇప్పటివరకు ఇరవై సార్లు రక్తమిచ్చాను. – కిషోర్, ప్రభుత్వ ఉద్యోగి ఎనిమిది సార్లు రక్తమిచ్చాను ఒక ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాను. ఆపదలో ఉన్న వారికీ రక్తదానం చేస్తే సంతృప్తిగా ఉంటుంది. మా క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతి రక్తదాన శిబిరంలో పాల్గొంటాను. నాతో పాటు కంపెనీలో పని చేసే వారితో కూడా రక్తదానం చేయిస్తుంటాను. ఇప్పటి వరకు 8 సార్లు బ్లడ్ డొనేట్ చేశాను. –సాయికుమార్ పుల్కల్ మండలం, బస్వాపూర్ -
116 టన్నుల ఇసుక డంపులు స్వాధీనం
ముగ్గురిపై కేసు నమోదుకొండపాక(గజ్వేల్): అక్రమంగా ఇసుకను డంపు చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. సిద్దిపేట టాస్క్ఫోర్స్, కుకునూరుపల్లి పోలీసులు సంయుక్తంగా ఆదివారం దాడిచేసి మూడు చోట్ల అక్రమ డంపులను స్వాధీనం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కొండపాక మండలంలోని రవీంద్రనగర్ శివారులో రాజీవ్ రహదారికి సమీపాల్లో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ కథనం ప్రకారం.. రవీంద్రనగర్కు చెందిన తులశం పోశయ్య, కొమిరి మహేశ్, బోదాస్ నరేశ్ కొంతకాలంగా రాజీవ్ రహదారికి సమీపంలోని రహస్య ప్రదేశాలలో అక్రమంగా ఇసుకను డంపు చేస్తూ ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులతో కలిసి మూడు చోట్ల దాడులు చేసి 116 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. అనుమతులు లేకుండా ఇసుకను, మట్టిని, మొరం, రేషన్ బియ్యాన్ని రవాణా చేసే వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. గ్రామాల్లో పేకాట, గంజాయి తదితర మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు గుర్తిస్తే తమకు సమాచారం అందించాలని కోరారు. -
రైల్వే ఓవర్బ్రిడ్జి పనుల్లో వేగం
● నెల రోజుల్లో పూర్తి ● రూ.90కోట్లతో నిర్మాణం ● ముమ్మరంగా సాగుతున్న బీటీ పనులుజహీరాబాద్: పట్టణంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో ఎట్టకేలకు వేగం పుంజుకుంది. బ్రిడ్జిపై బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. నెల రోజుల్లో పనులన్నీ పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధం కానుందని రోడ్డు భవనాల (ఆర్అండ్బీ) శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు అంచనా రూ.90కోట్లు కాగా, అందులో రూ.50 కోట్లు భూ సేకరణ కోసం కేటాయించారు. రూ.40 కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టారు. ఇప్పటివరకు రూ.23కోట్ల మేర నిధులు విడుదలైనట్లు అధికారులు వివరించారు. బ్రిడ్జి పైభాగంలో ప్లాస్టరింగ్తోపాటు వైరింగ్, విద్యుత్ స్తంభాల బిగింపు వంటి ఎలక్ట్రిక్ ఫిక్సేషన్ పనులు చేపట్టాల్సి ఉంది. ఇందుకోసం అంచనాలతో ప్రతిపాదనలు పంపాల్సి ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. బ్రిడ్జి నిర్మాణం కోసం 17వేల క్యూబిక్ మీటర్ల మట్టిని ఉపయోగించారు. మట్టికి సంబంధించి మైనింగ్ శాఖకు రాయల్టీ చెల్లించాల్సి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. బ్రిడ్జి వద్ద నుంచి బీదర్ క్రాస్ రోడ్డు వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కాగా, డివైడర్ పనులు కొనసాగుతున్నాయి. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడకుండా పనులు పర్యవేక్షిస్తున్నట్లు ఏఈఈ సంధ్య తెలిపారు. నెల రోజుల్లో పనులన్నీ పూర్తి అవుతాయని, ప్రారంభోత్సవానికి సిద్ధం చేయన్నుట్లు తెలిపారు. ఆరేళ్లకు మోక్షం రైల్వే ఓవర్బ్రిడ్జి చేపట్టిన ఆరేళ్లకు నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయి. స్థానిక లెవెల్ క్రాసింగ్ మీదుగా హైదరాబాద్, సికింద్రాబాద్ల నుంచి నాందేడ్, పూర్ణ, షిర్డీ, పర్లీ, లాతూర్ ప్రాంతాలతోపాటు బెంగళూరు, తిరుపతి, కాకినాడ ప్రాంతాలకు ఎక్స్ప్రెస్ రైళ్ల రాకపోకలు సాగిస్తున్నాయి. అంతేకాకుండా గూడ్స్ రైళ్లు సైతం ఎక్కువగా వచ్చి పోతుంటాయి. నిత్యం ఎంతో రద్దీగా ఉండే ఈ మార్గంలో రైలు వచ్చిన ప్రతీసారి గేట్లు మూసివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. పట్టణ ప్రజలతోపాటు అంతర్రాష్ట్ర రాకపోకలు సాగించే ప్రయాణికులు రైలు వచ్చిన ప్రతీసారి రైల్వే గేటు వద్ద కనీసం 20 నుంచి 30 నిమిషాల పాటు ఆగాల్సి వస్తోంది. కష్టాలను దూరం చేసేందుకు వీలుగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో రూ.90కోట్లు మంజూరు చేయగా అదే ఏడాది ఆగస్టు 30న ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో రైల్వే ఓవర్బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టారు. శాశ్వతంగా తీరనున్న కష్టాలు రైల్వే ఓవర్బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తయ్యి వినియోగంలోకి వస్తే వాహన చోదకుల కష్టాలు శాశ్వతంగా తొలగనున్నాయి. జహీరాబాద్–పర్లీ తదితర ప్రాంతాలకు అనునిత్యం 36 రైళ్ల వరకు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో తరచూ రైల్వేగేటు మూసి ఉంచడంతో ట్రాఫిక్ స్తంభించి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేని పరిస్థితి ఉంది. బ్రిడ్జి పనులు పూర్తిచేసి వినియోగంలోకి వస్తే ప్రజలు, ప్రయాణికుల కష్టాలు శాశ్వతంగా తీరనున్నాయి. -
రెండు కార్లు ఢీ : ఒకరి మృతి
గజ్వేల్రూరల్: ఎదురెదురుగా రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని గజ్వేల్–పిడిచెడ్ మార్గంలో ఆదివారం చోటు చేసుకుంది. గజ్వేల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొల్గూరుకు చెందిన వెంకటేష్తో పాటు అతని బంధువులైన గొట్టిముక్కలకు చెందిన వెంకటేశ్ (40), నాని, సాయిగౌడ్లు గజ్వేల్ నుంచి కారులో కొల్గూరు వైపు వస్తున్నారు. బయ్యారం చౌరస్తా మీదుగా మేథినీపూర్ వచ్చేందుకు బయలుదేరగా గజ్వేల్–పిడిచెడ్ మార్గంలో ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో గొట్టిముక్కులకు చెందిన వెంకటేష్ తీవ్ర గాయాలకు గురై మృతి చెందాడు. ప్రమాద విషయం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రామాయంపేటలో మరొకరు.. రామాయంపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. ఎస్ఐ బాల్రాజ్ కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన కాస నవీన్ (28) శనివారం రాత్రి రోడ్డుపై నడుచుకుంటు వెళ్తుండగా.. వెనుకనుంచి అతివేగంగా వచ్చిన బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నవీన్ను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి.. అక్కడి నుంచి నుంచి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్ఐ బాల్రాజ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చికిత్స పొందుతూ గుర్తు తెలియని వృద్ధుడు మృతి
కొండపాక(గజ్వేల్): గుర్తుతెలియని వృద్ధుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వెలికట్ట గ్రామ శివారులోని రైల్వే బ్రిడ్జి కింద ఆదివారం ఉదయం గుర్తు తెలియని వృద్ధుడు (65) అపస్మారక స్థితిలో ఉండగా స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు వృద్దుడిని 108 అంబులెన్సులో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీస్థితి విషమించడంతో గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని ఒంటిపై తెలుపు రంగు షర్టు, బూడిద రంగు ప్యాంట్ ధరించి తెల్లటి గడంతో ఉన్నాడన్నారు. మృత దేహాన్ని గాంధీ ఆస్పత్రిలో భద్రపరిచినట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తండ్రి మృతిపై అనుమానం
పటాన్చెరు టౌన్: తండ్రి మృతిపై అనుమానం ఉందని కుమారుడు ఫిర్యాదు చేసిన సంఘటన అమీన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలం లింగాయపల్లి సొమ్ల తండాకు చెందిన బానోత్ గోపాల్ 10 సంవత్సరాల క్రితం భార్య లక్ష్మి, పిల్లలతో కలిసి అమీన్పూర్కు వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో 14 రాత్రి గోపాల్ చెత్త పడేసి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు గోపాల్ కోసం స్థానికంగా వెతుకుతుండగా 15వ తేదీ సాయంత్రం అమీన్పూర్ గ్రేవీ యార్డ్ వెనుక ఉన్న రాళ్లలో గోపాల్ మృతదేహం కనిపించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తండ్రి మృతిపై అనుమానం ఉందని కుమారుడు బానోత్ సుధీర్ ఆదివారం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాదంలో గడ్డివాము, స్ప్రింక్లర్లు దగ్ధం బెజ్జంకి(సిద్దిపేట): బెజ్జంకి శివారులోని డబుల్ బెడ్రూం ఇళ్ల సమీపంలో ఆదివారం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. వ్యవసాయ భూములలో ఎలాంటి పంటలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని పోతారం శివారు వరకు వ్యవసాయ భూములలో మంటలు వ్యాపించి కట్కూరు శంకర్కు చెందిన గడ్డివాము దగ్ధమైంది. ప్రశాంత్కు చెందిన ఆయిల్ పామ్ చెట్లు, స్ప్రింక్లర్ పైపులు దగ్ధమయ్యాయి. సకాలంలో రైతులు మంటలను ఆర్పివేశారు. వ్యక్తిపై కేసు నమోదు సిద్దిపేటరూరల్: మెడలో నుంచి బంగారు గొలుసు తస్కరించేందుకు యత్నించిన గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదైంది. ఈ ఘటన పోలిస్స్టేషన్ పరిధిలోని ఆదివారం చోటు చేసుకుంది. చిన్నగుండవెల్లికి చెందిన మంద శంక రవ్వ ఆదివారం తన వ్యవసాయ భావి వద్దకు వెళ్లి మధ్యాహ్నం సమయంలో ఇంటికి వెళ్తోంది. ఈ క్రమంలో శంకరవ్వకు ఎదురుగా గ్రామం నుంచి బైక్పై వస్తున్న గుర్తు తెలియని వ్యక్తి సిద్దిపేటకు ఎలా వెళ్ళాలి అని అడగడంతో వివరాలు చెప్పింది. దీంతో వెళ్లిపోయినట్లు నటించిన వ్యక్తి మళ్లీ శంకరవ్వ వద్దకు వచ్చి మెడలో ఉన్న 3 తులాల బంగారు గొలుసుని లాక్కునే ప్రయత్నం చేశాడు. దీంతో గట్టిగా అరవడంతో అటుగా వెళ్తున్న గ్రామస్థులు అక్కడికి వచ్చారు. గమనించిన దొంగ బైక్పై పారిపోయాడని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అపూర్వరెడ్డి తెలిపారు. నూరేళ్ల వృద్ధుడు మృతి జహీరాబాద్ టౌన్: మండలంలోని అల్గోల్ గ్రామంలో నూరేళ్ల వయస్సు ఉన్న వృద్ధుడు మృతి చెందాడు. సి. పెంటారెడ్డి(100) భార్య నలుగురు సంతానం. ముగ్గురు ఆడపిల్లలు ఒక కొడుకు. కుమారుడు మృతి చెందగా కోడలు మనవళ్లు హైదరాబాద్లో ఉంటున్నారు. ఆయనకు ఉర్దూ, తెలుగు భాషలపై మంచి పట్టు ఉంది. గ్రామస్తులతో స్నేహపూర్వకంగా ఉంటూ దేశ స్వాతంత్య్రం, నిజాంరాజు గురించి ప్రజలకు వివరించే వారు. రోడ్డుపై వెళ్తున్న సమయంలో అదుపుతప్పి కిందపడ్డాడు. అప్పటి నుంచి మంచం పట్టి మృతి చెందాడు. -
బోరు మోటారు వేసేందుకు వెళ్లి..
● ప్రమాదవశాత్తు బావిలో పడి రైతు మృతి ● తున్కిబొల్లారంలో ఘటన ములుగు(గజ్వేల్): కౌలుకు తీసుకున్న పొలం వద్ద బోరు మోటారు వేసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి కౌలు రైతు మృతి చెందిన ఘటన మండలం తున్కిబొల్లారంలో శనివారం చోటుచేసుకుంది. మృతుడు మామిడ్యాల ఆర్అండ్ఆర్ కాలనీ వాసి. ఎస్ఐ విజయ్కుమార్ కథనం ప్రకారం.. ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన బొమ్మ యాదగిరి(55)కి భార్య యాదమ్మ, కొడుకు నాగరాజు ఉన్నారు. పొరుగునే ఉన్న తున్కిబొల్లారంలో కొంత భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటున్నాడు. శనివారం భార్య, కొడుకుతో కలసి పొలం వద్దకు వెళ్లిన యాదగిరి బోరు మోటారు వేసి వస్తానని చెప్పి బావివద్దకు వెవెళ్లాడు. అతను తిరిగి రాకపోవడంతో భార్య, కొడుకు పరిసర ప్రాంతాల్లో వెతికినప్పటికీ జాడ తెలియలేదు. బోరు బావి గడ్డమీద యాదగిరి తువాల కనపడటంతో అతను ప్రమాదవశాత్తు బావిలో పడి ఉంటాడని వెతికారు. బావిలో యాదగిరి మృతదేహం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ప్రమాదవశాత్తు డివైడర్ను...
కంగ్టి(నారాయణఖేడ్): ప్రమాదవశాత్తు డివైడర్కు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. కంగ్టి మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ప్రమాద ఘటన వివరాలిలా ఉన్నాయి. మహారాష్ట్రలోని దెగ్లూర్ తాలుకా భూతన్హిప్పర్గా గ్రామానికి చెందిన అశోక్పాటిల్(58) కంగ్టి మండలంలోని తుర్కవడ్గాం గ్రామంలో బంధువుల పెళ్లి నిశ్చితార్థం కోసం ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. తిరుగుప్రయాణంలో వేగంగా డివైడర్ను ఢీ కొట్టి రోడ్డుపై పడ్డాడు. దీంతో తలకు తీవ్రగాయమై రక్తస్రావం కావడంతోపాటు అక్కడికక్కడే స్థలంలోనే మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఖేడ్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు. -
భయం వీడు.. విజయం తోడు
ఆత్మస్థైర్యమే తొలి గెలుపు తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో ప్రథమ స్థానంలో నిలవాలంటూ పిల్లలపై ఒత్తిడి, లక్ష్యాన్ని నిర్దేంశిచకూడదు. ప్రశాంత వాతావరణంలో చదివే ఏర్పాటు చేయాలి. పరీక్షల సమయంలో ప్రతీ విద్యార్థి కనీసం ఆరుగంటల నుంచి ఎనిమిది గంటలు నిద్ర పోయేలా చూడాలి. పరీక్షల సమయంలో పిల్లలను జంక్ పుడ్కు దూరంగా ఉంచాలి,శాఖాహర భోజనం ఉండేలా చూడాలి. ఆత్మస్థైర్యమే విద్యార్థుల తొలి గెలుపు. – డాక్టర్ విజయ్, మానసిక వైద్యులు సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రిసంగారెడ్డి క్రైమ్: విద్యార్థి జీవితంలో 10వ తరగతి, ఇంటర్ కీలక మలుపు. ప్రస్తుతం వార్షిక పరీక్షలకు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో కొంతమంది విద్యార్థులు ఒత్తిడికి లోనవుతున్నారు. పరీక్ష అంటే భయం, వచ్చిన మార్కులపై నిరాశ, చదివిన అంశాలు గుర్తుకు ఉండటం లేదని భావన , ఇతర విద్యార్థులతో పోలిస్తే తము వెనుకబడి పోతున్నాం ఆలోచనలతో ఉంటున్నారు. ఈ క్రమంలో క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. భయాన్ని పక్కన పెట్టి మీకు ఎంత తెలుసో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి.. ఫెయిలైతే జీవితం అక్కడితో ఆగిపోదని.. ధైర్యంగా ప్రణాళికతో ముందుకు సాగితే విజయం మీ సొంతం అవుతుందని మానసిక వైద్య నిపుణులు విద్యార్థులకు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలి చదువు విషయంలో తరగతిలో ఉపాధ్యాయులు, ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలి.వార్షిక పరీక్షల సమయంలో తమ పిల్లలను చెడు ఆలోచనలకు దూరంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ప్రతీ విద్యార్థికి ఒకటి, రెండు సబ్జెక్ట్లపై ఇష్ట ముంటుంది వాటిని వేగంగా చదివేస్తే మిగిలిన వాటికి సమయం దొరుకుతుందని పిల్లలకు అర్థమయ్యే విధంగా టీచర్లు, తల్లిదండ్రులు వివరించాలి. సమాజంలోని మహనీయులను మార్గదర్శకత్వంగా తోసుకోవాలని తమ పిల్లల్లో స్ఫూర్తి నిప్పాలి. సోషల్ మీడియాకు దూరంగా పరీక్షలు పూర్తయేవరకు పిల్లలను సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలి. ఫోన్ లేదా కంప్యూటర్ అతి వినియోగాన్ని కట్టడి చేయాలి. పరీక్షల సమయంలో తల్లిదండ్రులు పిల్లల ముందు టీవీ గాని, ఫోన్ గాని ఎట్టి పరిస్థితుల్లో వాడరాదు. తమ పిల్లలకు ఇంట్లో చదువుకునే విధంగా ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పాలి. టెలీ మానస్ సేవలు ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు టెలీ మానస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం టెలీమానస్ పేరుతో టోల్ ఫ్రీ నంబర్లు 14416, 18008914416 అందుబాటులోకి తీసుకొచ్చారు. వార్షిక పరీక్షల సమయంలో ఈ నంబర్లకు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఫోన్ చేస్తే మానసిక స్థైర్యాన్ని పెంపొందించి సూత్రాలు, పరీక్షల సమయంలో భయబ్రాంతులకు గురికాకుండా చిట్కాలను నిపుణులు ఫోన్లో గాని, తమ సెక్షన్లో వివరిస్తారు. ఇంటర్, పదో విద్యార్థులకు కౌన్సెలింగ్ టెలీమానస్తో ఆత్మవిశ్వాసం నింపుతున్న నిపుణులు -
మూర్చవ్యాధి భరించలేక వ్యక్తి ఆత్మహత్య
ములుగు(గజ్వేల్): మూర్చవ్యాధి భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. ఈ ఘటన ములుగు మండలం బండమైలారంలో చోటుచేసుకుంది. ఎస్ఐ విజయ్కుమార్ కథనం ప్రకారం.. బండమైలారం గ్రామానికి చెందిన తుడుం శేఖర్ కొంతకాలంగా మార్చవ్యాధితో బాధపడుతుండేవాడు. దీంతో మధ్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో 12న రాత్రి స్థానిక రేషన్ దుకాణం వద్ద శేఖర్ వాంతులు చేసుకుంటుండగా గ్రామస్తులు గమనించి అతడి భార్య లతకు తెలిపారు. వెంటనే ఆమె అక్కడికి చేరుకొని ప్రశ్నించగా మూర్చవ్యాధి, ఆరోగ్య సమస్యలను తట్టుకోలేక పురుగుల మందును తాగినట్లు శేఖర్ చెప్పాడు. దీంతో అతడిని వెంటనే గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా అక్కడి వైద్యులు సూచించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శేఖర్ శనివారం రాత్రి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
డీసీఎంను ఢీకొట్టిన కారు, ఒకరి మృతి
నలుగురికి తీవ్ర గాయాలుకొండపాక(గజ్వేల్): డీసీఎం వాహనాన్ని వెనుక నుంచి ఓ కారు ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని తిమ్మారెడ్డిపల్లి శివారులో ఆదివారం చోటు చేసుకుంది. కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్లోని జగద్గిరిగుట్ట(ప్రగతినగర్)లో ముగ్గురు అన్నదమ్ములు చంద వెంకటేశ్, భీమయ్య, సురేశ్ నివాసం ఉంటున్నారు. వారు సెంట్రింగ్ కాంట్రాక్టు పనులు చేసుకొంటూ జీవనం సాగిస్తుంటారు. ఈ నెల 13న భీమయ్య కుమారుడి వివాహం జరిగింది. కొమురంభీం జిల్లా కౌటులం గ్రామంలో వివాహ అనంతరం జరిగే కార్యక్రమం నిమిత్తం అన్నదమ్ముల కుటుంబ సభ్యులు, వారి బంధువులు వేర్వేరు కార్లలో ఆదివారం ఉదయం బయలు దేరారు. ఈ క్రమంలో మండలంలోని తిమ్మారెడ్డిపల్లి శివారులో రాజీవ్ రహదారి ప్రక్కన ముందు ఆగిన ఓ డీసీఎంను వెనుక నుంచి ఢీకొట్టారు. దీంతో కారు డ్రైవరు ప్రక్క సీట్లో కూర్చున్న చంద సురేశ్ అక్కడిక్కడే మృతి చెందగా మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకొని అక్కడికి చేరిన పోలీసులు క్షతగాత్రులను అంబులెన్సులో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సదాశివపేటకు చెందిన డీసీఎం డ్రైవరు మన్సూర్ అలీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆపద్బాంధవులు!
● అత్యవసర సమయాల్లో రక్తదానం చేస్తున్న యువత ● ఐదు వందల మంది సభ్యులు.. రెండు వేల మందికి రక్తదానం ● ఆదర్శగా నిలుస్తున్న సంగారెడ్డి బ్లడ్ డోనర్స్ క్లబ్ సంగారెడ్డి రూరల్: మానవ సేవే మాధవ సేవ అన్న సూక్తిని ఆదర్శంగా తీసుకుని రక్తదానం చేస్తూ ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నారు ఆ యువకు లు. వాట్సాప్లో ఓ గ్రూపును ఏర్పాటు చేసుకుని ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు సంగారెడ్డి బ్లడ్ డోనర్స్ క్లబ్ సభ్యు లు. సంగారెడ్డి పట్టణానికి చెందిన జనజాగృతి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు బంగారు కృష్ణ సంగారెడ్డి బ్లడ్ డోనర్స్ క్లబ్ను 2019లో ప్రారంభించారు. పన్నెండు మందితో ప్రారంభించిన ఈ క్లబ్లో ప్రస్తుతం 500 మందికి పైగా బ్లడ్ డోనర్లు ఉన్నారు. ఎవరికైనా రక్తం అత్యవసరమైతే ఈ వాట్సాప్ గ్రూపులో పోస్టు చేస్తే చాలు అందుబాటులో ఉన్న వారు వచ్చి రక్తదానం చేస్తున్నారు. ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడుతున్నారు. ఇలా సుమారు ఆరు సంవత్సరాలుగా ఈ సేవ చేస్తున్నారు. రక్తం ఎంతో విలువైనది. ఒక యూనిట్ రక్తంతో ఒకరి ప్రాణాలు కాపాడచ్చు. ప్రమాదంలో గాయపడ్డ వారికి, గర్భిణులకు రక్తం ఎంతో అవసరం. క్లిష్ట పరిస్థితుల్లో ఆయా గ్రూప్ రక్తం అందుబాటులో లేకపోతే ప్రాణాలే పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది. అలాంటి సమయంలో మేమున్నామంటూ బ్లడ్ డోనర్స్ క్లబ్ యువత ముందుకొచ్చి రక్తదానం చేస్తూ ప్రాణాలను నిలబెడుతోంది.అపోహలు వద్దు.. ప్లాస్మాదానం కూడా.. కరోనా మహమ్మారి అనేక మంది ప్రాణాలను బలితీసుకుంటున్న రోజుల్లో కూడా డోనర్స్ క్లబ్ సభ్యులు రక్తదానం చేశారు. ఈ వైరస్ బారిన పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ప్లాస్మాదానం చేసి ఎంతో మంది ప్రాణాలు కాపాడారు.కొందరు రక్తం ఇస్తే అనారోగ్యం పాలవుతా రని అనుమానాలు పెట్టు కుంటారు. ఇవన్నీ అపో హలు మాత్రమే. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి నాలుగు నెలలకు ఒకసారి బ్లడ్ డొనేట్ చేయవచ్చు. డొనేట్ చేసిన వెంటనే బ్లడ్ ఉత్పత్తి అవుతుంది. ఏలాంటి వ్యాధులు, అనారోగ్య సమస్యలు ఉండవు. –డాక్టర్ అనిల్కుమార్, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ -
తాళం వేసిన ఇంట్లో చోరీ
చేర్యాల(సిద్దిపేట): తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటన మండల పరిధిలోని ముస్త్యాలలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కేసిరెడ్డి బాల్రెడ్డి ఇంటికి తాళంవేసి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్లో ఉంటున్న కుమారుడి వద్దకు వెళ్లారు. ఆదివారం ఉదయం ఇంటితాళం పగులగొట్టి ఉందన్న సమాచారం స్థానికుల ద్వారా తెలుసుకున్న ఆయన వచ్చి చూడగా ఇంట్లోని బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారని గమనించిన ఆయన వెంటనే చేర్యాల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. చోరీలో 5 గ్రాముల బంగారు ఉంగరం, రూ.10 వేల నగదు చోరీకి గురైనట్లు బాధితుడు తెలిపాడు. అదే గ్రామంలో మరో ఇంటి తాళం కూడా పగులగొట్టినట్లు సమాచారం. ఆ ఇంట్లో ఎలాంటి వస్తువులు చోరీకి గురికాకపోవడంతో ఫిర్యాదు చేయలేదు. -
ఆర్నెల్లు పొడిగింపు
పీఏసీఎస్ల పదవీకాలం పెంపుపై ప్రభుత్వం ఉత్తర్వులుపునర్వ్యవస్థీకరణ అనంతరం ఎన్నికలు నారాయణఖేడ్: జిల్లా సహకార సంఘాల పాలకవర్గాల (పీఏసీఎస్ –ప్యాక్స్) పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఆరునెలలపాటు పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం జీవో నం 74 జారీ చేసింది. దీంతో జిల్లాలో డీసీసీబీ పరిధిలోని 37, స్టేట్ బ్యాంకు పరిధిలోని 16 పీఏసీఏస్లు కలిపి మొత్తం 53 ప్రాథమిక సహకార సంఘాల పాలకవర్గాల పదవీకాలం పెంచినట్లైంది. ఇటీవల పీఏసీఎస్లు, డీసీసీబీ పాలకవర్గాలు రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి ద్వారా పదవీకాలం పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై ప్రభుత్వానికి వచ్చిన నివేదిక మేరకు మరో ఆరునెలలపాటు వీరి పదవీకాలం పెంచుతూ ఉత్తర్వులు వెలువరించింది. సహకార సంఘాలు వ్యవసాయ ఉత్పత్తులు, సరఫరా, మార్కెటింగ్ వ్యూహాలు వేగంగా జరుగుతున్న తరుణంలో పీఏసీఎస్ల పునర్వ్యవస్థీకరణ అవసరం అని సహకార సంఘాల డైరెక్టర్ ప్రభుత్వానికి నివేదించారు. సేవా ప్రాంతం, వ్యాపార టర్నోవర్, వ్యాపార సామర్థ్యం, ఆర్థిక సాధ్యత, సేవల డెలివరి తదితర అంశాలపై రాష్ట్రంలోని పీఏసీఎస్ల పునర్వ్యవస్థీకరణ కోసం ప్రతిపాదనలు పంపించాలని డీసీసీబీలు, డీసీవోలు, సీఈవోలకు సహకార సంఘాల రిజిస్ట్రార్ నివేదించారు. పీఏసీఎస్ల పునర్నిర్మాణంకు సమగ్ర పథకాన్ని తయారు చేశాక పీఏసీఎస్లు, డీసీసీబీలు టీజీసీఏబీలకు ఎన్నికలు నిర్వహించాలని సహకార సంఘాల రిజిస్ట్రార్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. పై అంశాలను పరిశీలించిన పాలకవర్గాల పదవీకాలాన్ని ఆరునెలలపాటు పొడిగించింది. పీఏసీఎస్ల పునర్వ్యవస్థీకరణ పీఏసీఎస్లను పెంచి వాటిని బలోపేతం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఒక్కో పీఏసీఎస్ల పరిధిలో గ్రామాల సంఖ్య అధికంగా ఉండటం, రెండు మండలాలు కలిపి ఒక పీఏసీఎస్లు ఉండటం, మండలాలు, జిల్లాలు పునర్వ్యవస్థీకరణ అయిన దృష్ట్యా పీఏసీఎస్లను ప్రభుత్వం విస్తరించనుంది. జిల్లాలో మరో 8 నూతన పీఏసీఎస్లు నాగల్గిద్ద, తడ్కల్, నిజాంపేట్, హత్నూర, జహీరాబాద్, వడ్డేపల్లి, మునిపల్లి, ఆత్మకూర్, వట్పల్లిల్లో ఏర్పాటుకు ప్రతిపాదించారు. 2020 ఫిబ్రవరి రెండో వారంలో సహకార సంఘాల ఎన్నికల ను నిర్వహించారు. సాధారణంగా పాలక వర్గాల పదవీకాలం ఆరునెలల సమయం ఉండగానే ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. కానీ, పీఏసీఎస్లను బలోపేతం చేయడం, అవసరం మేర కొత్తవి ఏర్పాటు చేసి ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తుంది. ఈ దృష్ట్యా వీరి పదవీకాలం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
అంకితభావంతో విధులు నిర్వర్తించాలి
జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ సంగారెడ్డి జోన్: పోలీసు అధికారులు అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ సూచించారు. జిల్లా పరేడ్గ్రౌండ్లో శనివారం ‘వార్షిక పునరుశ్చరణ మొబిలైజేషన్’శిక్షణ కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించారు. పరేడ్కు హాజరై పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...జిల్లాలో విధులు నిర్వహిస్తున్న 305 మంది ఆర్ముడ్ రిజర్వ్ అధికారులు, సిబ్బందికి 15 రోజుల పాటు ప్రాథమిక శిక్షణను గుర్తు చేస్తూ, ప్రతీ రోజు ఉదయం ఫిజికల్ ట్రైనింగ్, పరేడ్, మాబ్ ఆపరేషన్, లాఠీ డ్రిల్, ఆయుధాలపై శిక్షణ, నాకాబందీలో పాటించాల్సిన మెలుకువలు, మారుతున్న సమా జానికి అనుగుణంగా విధి నిర్వహణలో ఏవిధంగా నడుచుకోవాలని, వృత్తిరీత్యా నైపుణ్యతపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. -
నిధులు సద్వినియోగం చేసుకోవాలి
సంగారెడ్డి జోన్: ప్రభుత్వం కేటాయించిన నిధులను సమర్థవంతంగా సద్వినియోగం చేసుకుని, మౌలిక వసతులు మెరుగుపరచుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్లో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, మండల విద్యాశాఖ అధికారులతో ఎంపిక చేసిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో పాఠశాలల అభివృద్ధి పనులపై శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...పీఎంశ్రీ పథకం కింద జిల్లాలో 44 పాఠశాలలు ఎంపికయ్యాయన్నారు. మంజూరైన నిధులతో ఆ పాఠశాలల్లో క్రీడలు,నైపుణ్యాభి వృద్ధి, తరగతి గదుల నిర్మాణం, కిచెన్ గార్డెన్, ఫీల్డ్ విజిట్, ఎల్ఈడీ లైటింగ్, లైబ్రరీ అభివృద్ధి, మరుగుదొడ్లు, తాగునీటి వసతి, ల్యాబ్ ఏర్పాట్లు వంటి తదితర అభివృద్ధి పనులకు వినియోగించాలని అధికారులకు సూచించారు. ఈ అభివృద్ధి పనులను నిర్దేశిత కాలవ్యవధిలో నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో డీఈవో వెంకటేశ్వర్లు, ఈఈపీ ఆర్ జగదీశ్, ఎంఈవోలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.కలెక్టర్ వల్లూరు క్రాంతి -
కాలినడక కాలచక్రం
ఒకప్పుడు ఎంతదూరమైనా బడికి కాలినడకనో సైకిళ్లపైనో వెళ్లొచ్చేవారు. ఇప్పుడు ఆటో రిక్షాలు, బస్సులు, సొంత వాహనాల్లో వెళ్తున్నారు. పుస్తకాలను ఒకప్పుడు వస్త్రాలతో లేదా గోనెసంచిలతో కుట్టిన బ్యాగుల్లోనో, సిల్వర్ బాక్స్ల్లోనో బడికి తీసుకెళ్లేవారు. కానీ, ఇప్పుడు అనేక ఆకర్షణీయమైన స్కూల్ బ్యాగుల్లో తీసుకెళ్తున్నారు. గ్రౌండ్లో ఆటల దగ్గర్నుంచి మొబైల్లోనే ఆటలాడుకునే దశకు వచ్చింది పరిస్థితి. విద్యార్థులు బడికి వెళ్లేక్రమంలో కాలక్రమేణా వచ్చిన మార్పులపై ‘సాక్షి’ప్రత్యేక కథనం.8లో -
ఎమ్మెల్సీ బరి.. పార్టీల గురి
● ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీజేపీ ● ప్రచారం జోరు పెంచిన అభ్యర్థులు ● పట్టభద్రుల ఎమ్మెల్సీకి 56, ఉపాధ్యాయకు 15 మంది పోటీ ఉదయం, సాయంత్రం ప్రచారం పాఠశాలలో తరగతులు కొనసాగుతున్న సమయాల్లో అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించొద్దని ఎన్నికల సంఘం నిబంధన పెట్టింది. దీంతో అభ్యర్థులు ఉదయం, సాయంత్రం సమయాల్లో ఉపాధ్యాయ ఓటర్లను కలిసి తమకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరుతున్నారు. అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు సమ్మేళనాలు నిర్వహిస్తూ ఓటు అభ్యర్థిస్తున్నారు. మేనిఫెస్టోలు సైతం ప్రకటిస్తున్నారు. సాయంత్రం గెట్ టు గెదర్ నిర్విహిహంచి దావత్లతో మచ్చిక చేసుకుంటున్నారు. పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈనెల 27వ తేదీన పోలింగ్ జరగనుండటం.. ప్రచారానికి మరో 10 రోజులే గడువు ఉండడంతో అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీకి 56 మంది, ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 15 మంది పోటీ చేస్తున్నారు. సాక్షి, సిద్దిపేట: పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ నుంచి డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి, కాంగ్రెస్ నుంచి నరేందర్రెడ్డి, బహుజన సమాజ్ పార్టీ నుంచి ప్రసన్న హరికృష్ణ, ఇండిపెండెంట్ అభ్యర్థిగా యాదగిరి శేఖర్రావు, దేవునూరి రవీందర్తో పాటు మరో 51 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బీజేపీ నుంచి మల్క కొమురయ్య, పీఆర్టీయూ నుంచి వంగ మహేందర్రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, ప్రైవేట్ స్కూల్ టీచర్స్ మద్దతుతో జగ్గు మల్లారెడ్డితో పాటు 11 మంది బరిలో నిలిచారు. శనివారం హుస్నాబాద్లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ పాల్గొన్నారు. సిద్దిపేటలో బీజేపీ నాయకులతో ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ సమావేశం నిర్వహించి ప్రచారం తీరును అడిగి తెలుసుకున్నారు. 25 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జి బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్ర నాయకత్వం జిల్లాల వారీగా ఇన్చార్జిలను ప్రకటించింది. టీచర్స్ ఎమ్మెల్సీకి రంగారెడ్డి అర్బన్ అధ్యక్షుడు ఎస్. మల్లారెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన నాయకుడు బాణాల లక్ష్మారెడ్డిని నియమించింది. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నాయకులకు బాధ్యతలు అప్పగించింది. స్థానిక నాయకులకు 25 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిని నియమించారు. ప్రతి ఓటరును నాలుగు సార్లు కలిసి పోలింగ్ బూత్ వరకు తీసుకువచ్చే బాధ్యత వీరిదే. కాంగ్రెస్ పార్టీ ప్రతి 50 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిని, నియోజకర్గ వారీగా ఇన్చార్జిలను నియమించింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంగ మహేందర్రెడ్డి సైతం పీఆర్టీయూ నాయకులకు బాధ్యతలు అప్పగించారు. గత ఆరు నెలల నుంచే వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు పలు సంఘాలు మద్దతు ప్రకటించి ప్రచారంలో పాల్గొంటున్నాయి. ఎక్కువ ఓట్లు ఉన్న ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహిస్తూ మద్దతు కూడగడుతున్నారు. -
అదృశ్యమైన వ్యక్తి.. పొలంలో శవమై
చిన్నశంకరంపేట(మెదక్): అదృశ్యమైన వ్యక్తి గ్రామంలోని ఓ పంట పొలంలో మృతదేహమై కనిపించాడు. ఈ ఘటన చిన్నశంకరంపేట మండలం చందాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పేట ఎస్ఐ నారాయణగౌడ్ కథనం మేరకు.. మండలంలోని చందాపూర్ గ్రామానికి చెందిన తుడుం రాజు(35) శుక్రవారం ఇంటి నుంచి బయటికి వెళ్లి రాత్రి అయినా తిరిగి రాలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో అనుమానంతో కుటుంబ సభ్యులు చిన్నశంకరంపేట పోలీస్స్టేషన్లో శనివారం సీసీ కెమెరాలను పరిశీలించారు. సీసీ కెమెరాల్లో అంబాజీపేట వైపు నడుచుకుంటూ వెళ్లినట్లు గుర్తించారు. అటువైపు వెతుకుతుండగా పంటపొలంలో బోర్లా పడి మృతి చెందిన కనిపించాడు. భార్య మహేశ్వరి ఫిర్యాదు మేకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
బంజారాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం
పటాన్చెరు: నియోజకవర్గంలోని బంజారాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ బోధనలు నేటి తరానికి అనుసరణీయమని ఆయన తెలిపారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎంపీపీ సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ...సొంత నిధులతో నియోజకవర్గ పరిధిలోని రాళ్ల కత్వ, ఐలాపూర్, వెలిమెల, కొల్లూరు తాండలలో సేవాలాల్ మహారాజ్ దేవాలయాలను నిర్మించామన్నారు. కార్యక్రమంలో అమీనపూర్ మాజీ జెడ్పీటీసీ సుధాకర్రెడ్డి, మండల విద్యాధికారులు పి.పి.రాథోడ్, నాగేశ్వర్ నాయక్, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సురేశ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి -
ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు
నారాయణఖేడ్: సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాలను నారాయణఖేడ్లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి స్వగృహం ఆవరణలో కాంగ్రెస్, జీఎంఆర్ ఫౌండేషన్, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి ఈ వేడుకల్లో సాధు సంతుల రాష్ట్ర ప్రతినిధి సంగ్రామ మహారాజ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి పాల్గొని పూజలు చేశారు. అనంతరం రాజీవ్ చౌక్వరకు శోభాయాత్ర నిర్వహిచి సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి నివాళులర్పించారు. జర్నలిస్టు కాలనీలోని భవానీ మాత ఆలయంలో భోగ్బండార్, పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. దేవిదాస్ మహారాజ్, జీఎంఆర్ ఫౌండేషన్ బాధ్యులు గుర్రపు మశ్చందర్, సేవాలాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్ చౌహాన్, మాజీ జెడ్పీటీసీ రవీందర్నాయక్, గిరిజన సంఘాలు, ఉద్యోగ సంఘాల నాయకులుపాల్గొన్నారు. -
ఆర్థిక ‘సహకారం’ లేదు
డబ్బుల్లేక కొట్టుమిట్టాడుతున్నసహకార సంఘాలు ● సిబ్బందికి జీతాలివ్వలేని దుస్థితి ● సీ, డీ గ్రేడ్లకు దిగజారిన26 పీఏసీఎస్లు ● 2024 ఆడిట్ నివేదికలోవెలుగులోకి ఆర్థిక పరిస్థితిసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: అన్నదాతలకు అండగా నిలవాల్సిన సహకార సంఘాలు (పీఏసీఎస్) ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. కనీసం ఆయా సంఘాల్లో పనిచేస్తున్న ఇద్దరు, ముగ్గురు ఉద్యోగులు, సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని స్థాయికి పీఏసీఎస్లు దిగజారిపోయాయి. జిల్లాలో సుమారు సగానికి పైగా సహకార సంఘాలది ఇదే పరిస్థితి. జిల్లావ్యాప్తంగా మొత్తం 53 సహకార సంఘాలున్నాయి. ఈ సహకార సంఘాల ఆర్థిక లావాదేవీలపై ఏటా సహకార శాఖ ఆడిట్ ప్రక్రియను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా 2023–24 ఆర్థిక ఏడాదికి సంబంధించి ఈ 53 సంఘాల ఆడిట్ ప్రక్రియ గత నెలలో పూర్తయింది. అయితే 53 సహకార సంఘాల్లో ఏకంగా 25 సంఘాలు సీ గ్రేడ్లో కొనసాగుతున్నాయి. ఈ సంఘాలు కొన్నేళ్లుగా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. పటాన్చెరు మండలం భానూరు సహకార సంఘం ఆర్థిక పరిస్థితి ఏకంగా సీ గ్రేడ్ నుంచి డీ గ్రేడ్కు పడిపోవడం గమనార్హం. గతేడాది డీ గ్రేడ్లో కొనసాగిన కోహీర్ మండలం బిలాల్పూర్ సహకార సంఘం మాత్రం ఒక మెట్టు ఎక్కి సీ గ్రేడ్కు చేరింది. ఇలా సీ, డీ గ్రేడ్లలో ఉన్న సంఘాలు నష్టాల్లో కొనసాగుతున్నట్లు. ఇక ఏ గ్రేడ్లో ఆరు సంఘాలుండగా, బీ గ్రేడ్లో 21 సహకార సంఘాలు కొనసాగుతున్నట్లు తేలింది. ఆర్థిక లావాదేవీల ఆధారంగా గ్రేడింగ్.. ఆయా సహకార సంఘాల ఆర్థిక పరిస్థితులను బట్టి ప్రభుత్వం గ్రేడింగ్ ఇస్తుంది. ఆ సంఘం ఆ ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు, రైతులకు పంట రుణాల మంజూరు, ఆ రుణాల రికవరీ, ఎరువులు, విత్తనాలు వంటి వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల అమ్మకం, ధాన్యంసేకరణ వంటి కార్యకలాపాలతో ఆయా సంఘాలకు కొంత ఆదాయం వస్తుంది. ఇలా వచ్చిన ఆదాయంతో సిబ్బంది జీతభత్యాలు, సంఘం అభివృద్ధికి వినియోగించాల్సి ఉంటుంది. కానీ, ఈ కార్యకలాపాలేవీ లేకపోవడంతో ఈ సంఘాలు ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కలేకపోతున్నాయి. ధాన్యం సేకరణ ఉన్న సంఘాలుకొంత మెరుగు.. ఏటా ఖరీఫ్, రబీ కొనుగోలు సీజన్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన సహకార సంఘాలు కొంత మేరకు ఆర్థికంగా బలపడతాయి. ఈ కొనుగోళ్లకు సంబంధించి కమీషన్ రూ.లక్షల్లో వస్తుంది. ఇలా ధాన్యం సేకరణ వంటి కార్యకలాపాలకు కొనసాగిన సంఘాల ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. దీంతో ఆయా సంఘాల్లోని ఉద్యోగులు, సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్నాయి. ఆర్థిక సంక్షోభంలో ఉన్న సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు నాలుగైదు నెలలకు ఒకసారి కూడా వేతనాలు అందడం లేదు. అలాగే ఆయా సంఘాల్లోని పాలకవర్గం పీఏసీఎస్ అభివృద్ధి కోసం కొంత చొరవ చూపి వ్యాపార లావాదేవీలు నిర్వహించిన సంఘాలు కూడా ఆర్థిక ఇక్కట్ల నుంచి కొంత గట్టెక్కాయి. కానీ, పాలకవర్గం నిర్లక్ష్యానికి తోడు కార్యకలాపాలు లేని సంఘాలు ఇంకా ఆర్థిక సంక్షోభంలోనే కొనసాగుతున్నాయి. ఏ–గేడ్ర్లో ఉన్న సంఘాలివే.. జిల్లాలో ఏ గ్రేడ్లో ఉన్న సంఘాలను పరిశీలిస్తే.. ఇస్మాయిల్ఖాన్పేట్ (సంగారెడ్డి మండలం), కసాల (హత్నుర), బొక్కస్గాం (నారాయణఖేడ్), మాచిరెడ్డిపల్లి (కోహీర్), తెల్లాపూర్ (రామచంద్రాపురం), ఝరాసంఘం సహకార సంఘాలు లాభాల్లో కొనసాగుతున్నట్లు సహకారశాఖ నిర్వహించిన ఆడిట్లో తేలింది. -
ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలి
ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంగారెడ్డి రూరల్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఈనెల 17న ప్రతీ ఒక్కరు మొక్క నాటాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో శనివారం ఆయన మొక్క నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...హరితహారం పేరుతో తెలంగాణను ఆకుపచ్చగా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. అంతరించిపోతున్న అడవులను కాపాడే బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని తెలిపారు. మండల పార్టీ అధ్యక్షులు చక్రపాణి, నాగరాజ్ గౌడ్, విఠల్,నర్సింలు, గోవర్ధన్ రెడ్డి, పాల్గొన్నారు. కదం తొక్కిన మహిళలు 11వ రోజుకు చేరిన ‘ప్యారానగర్’నిరసన దీక్షలు జిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని ప్యారానగర్ డంపింగ్ యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు 11వ రోజుకు చేరాయి. మహిళలు శనివారం పెద్ద సంఖ్యలో పాల్గొని ఆందోళన చేపట్టారు. ఆటోర్యాలీ, ఎడ్లబండ్ల ర్యాలీలతో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళలు డంపింగ్యార్డు నిర్మాణ పనులు అడ్డుకునేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. డంపింగ్యార్డు ఏర్పాటును ప్రభుత్వం విరమించేదాక తమ పోరాటం ఆపేదిలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు, మహిళలు, రైతులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆ స్థాయి రేవంత్కు లేదు బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్గౌడ్ సంగారెడ్డి ఎడ్యుకేషన్: ప్రధాని నరేంద్ర మోదీ అగ్ర కులస్తుడంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్గౌడ్ మండిపడ్డారు. సంగారెడ్డిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ బీసీగా కన్వెర్ట్ అయ్యారని సీఎం రేవంత్రెడ్డి మాట్లాడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని ప్రధాని మోదీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీల ఐక్యత వల్లనే దేశంలో వివిధ రాష్ట్రాలలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, బీసీల గురించి మాట్లాడే నైతికహక్కు రేవంత్కు లేదన్నారు. బీసీల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని, బీసీ హాస్టళ్లలో వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు. బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన రిజర్వేషన్ల హామీని వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ భాను ప్రకాశ్, జిల్లా ఉపాధ్యక్షుడు రాములు, జిల్లా కార్యదర్శి నాగరాజ్, ఓబీసీ మోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు. డంపింగ్ యార్డ్ రద్దు చేయాలిసీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు సంగారెడ్డి ఎడ్యుకేషన్: ప్రజాభిప్రాయానికి వ్యతిరేకమైన ప్యారానగర్ డంపింగ్యార్డ్ను రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని కేవల్ కిషన్ భవన్లో శనివారం జరిగిన సీపీఎం నాయకుల జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా పర్యావరణానికి నష్టం కలిగే విధంగా ప్యారానగర్ డంపింగ్ యార్డ్ నిర్మాణం చేపట్టడం సరైంది కాదన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో ప్రజలను సమీకరించి పోరాటాలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మాణిక్యం, రాజయ్య, రాంచందర్, నర్సింలు, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో వృద్ధుడు మృతి
చిలప్చెడ్(నర్సాపూర్): అనుమానాస్పద స్థితిలో వృద్ధుడు మృతి చెందిన ఘటన చిలప్చెడ్ మండలం చిట్కుల్ శివారులో గల చాముండేశ్వరి ఆలయ ఆవరణలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ నర్సింలు కథనం మేరకు.. హైదరాబాద్ గుడి మల్కాపూర్కు చెందిన పతంగే జగన్నాథరావు(60) 12న ఇంటి నుంచి స్కూటీపై వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు టప్పాచబూతర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం చిట్కుల్ శివారులో గుర్తు తెలియని శవం లభ్యం కావడంతో చిలప్చెడ్ పోలీసులు, టప్పాచబూతర్ స్టేషన్ సిబ్బందికి విష యం తెలుపగా కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి వచ్చి జగన్నాథరావుగా గుర్తించారు. మృతుడి కుమారుడు సంతోష్ మాట్లాడుతూ.. మూడు నెలల కిందట జగన్నాథరావు భార్య వరలక్ష్మి మృతి చెందగా అస్థికలు మంజీరా నదిలో కలిపామన్నారు. భార్య మృతితో మనస్తాపం చెంది, అదే స్థలానికి వచ్చి విషం తాగి పొలంలో పడి మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
79 డ్రంకెన్ డ్రైవ్ కేసులు
సిద్దిపేట సీపీ అనురాధ సిద్దిపేటకమాన్: పోలీసు కమిషనరేట్ పరిధిలో శనివారం రాత్రి ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించి డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు సీపీ అనురాధ తెలిపారు. పట్టుబడిన వాహనదారులపై 79 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తరచుగా ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించి, డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో వన్ టౌన్ సీఐ వాసుదేవరావు, టూటౌన్ సీఐ ఉపేందర్, త్రీ టౌన్ సీఐ విద్యాసాగర్, రూరల్ సీఐ శ్రీను, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
హత్య చేసి.. దహనం చేశా..!
నిందితుడిని సంగారెడ్డి పోలీసులకు అప్పగింత దొరకని మృతదేహం ఆనవాళ్లుపోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడురోడ్డుపై బైఠాయింపు విషయం తెలుసుకున్న దశరథ్ కుటుంబీకులు, బంధువులు నిజాంపేట్– ఖేడ్ 161బీ జాతీయ రహదారిపై బైఠాయించారు. మృతదేహన్ని అప్పగించాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. కాగా, వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే.. గోపాల్ చెప్పినట్లు మృతదేహం ఆనవాళ్లు లభించకపోవడం.. అసలు దశరథ్ హత్యకు గురయ్యాడా లేదా అనేది పోలీసులు నిర్ధారణకు రాలేకపోతున్నారు. మిస్సింగ్ కేసు ఇంకా మిస్టరీగానే ఉంది. ఈ కేసుపై విచారణ జరుపుతున్నామని, త్వరలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు.నారాయణఖేడ్: ‘‘నేను దశరథ్ను హత్య చేసి.. దహనం చేశా.. అందుకే మీ ముందు లొంగిపోతున్న’అని ఓ వ్యక్తి పోలీసులకు చెప్పడం కలకలం సృష్టించింది. నిందితుడు నిర్భయంగా, నేరుగా వచ్చి తానే హత్య చేశానంటూ ఒప్పుకోవడంతో పోలీసులు కంగుతిన్నారు. ఈ సంఘటన నారాయణఖేడ్ పోలీస్స్టేషన్లో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నిజాంపేట్ మండలం నాగ్ధర్ రాంచందర్ తండాకు చెందిన దశరథ్ (30) సంగారెడ్డిలోని గణేష్ ఫ్యాక్టరీలో లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం ఇంటికి వెళుతున్నానని చెప్పి తన యజమాని బైక్ తీసుకొని బయలుదేరి అదృశ్య మయ్యాడు. దీంతో తన భర్త కనిపించడం లేదంటూ దశరథ్ భార్య సంగారెడ్డి రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలాఉండగా.. దశరథ్ను తానే హత్య చేసి కాల్చి వేశానంటూ నారాయణఖేడ్ మండలం మేఘ్యానాయక్ తండాకు చెందిన గోపాల్.. ఖేడ్ పోలీస్టేషన్లో లొంగిపోయాడు. అతను చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు తండాల శివారులు, అటవీ ప్రాంతాల్లో వెతికినా ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. నిందితుడు గోపాల్ను సంగారెడ్డి రూరల్ పోలీసులకు అప్పగించినట్లు ఖేడ్ ఎస్ఐ శ్రీశైలం తెలిపారు. -
మ్యాట్రిమోనీ పేరుతో అమ్మాయిని మోసం చేసి
● పెళ్లి చేసుకుంటానని రూ.5.50 లక్షలు తీసుకున్న వైనం ● పోలీసుల అదుపులో నిందితుడు చేర్యాల(సిద్దిపేట): మ్యాట్రిమోనీ పేరు చెప్పి అమ్మాయిలతో పరిచయం పెంచుకొని డబ్బులు తీసుకొని మోసం చేస్తున్న నిందితుడిని చేర్యాల పోలీసులు అరెస్టు చేశారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లోని సీఐ కార్యాలయంలో సీఐ శ్రీను కేసు వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా బేతంచెర్లకు చెందిన గుమ్మనా వివేకానంద రెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక అమ్మాయికి మ్యాట్రిమోనీ పేరుతో లింకు పంపించాడు. లింక్ ఓపెన్ చేసి అతడితో మాట్లాడిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. తర్వాత అత్యవసరంగా డబ్బులు అవసరమున్నాయని, త్వరలోనే తిరిగిస్తానని చెప్పి విడతల వారీగా రూ.5,50,000 తీసుకున్నాడు. తర్వాత ఫోన్ స్విచ్ఛాప్ చేసుకున్నాడు. అనుమానం వచ్చిన అమ్మాయి పెళ్లి పేరుతో మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు ప్రారంభించి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు పంిపినట్లు సీఐ తెలిపారు. -
క్రమం తప్పకుండా బడికి
మా కాలంలో గురువులను తల్లిదండ్రులను గౌరవించే వాళ్లం. వాళ్లకు ఎదురు తిరిగే వాళ్లం కాదు. బడికి క్రమం తప్పకుండా వెళ్లాం. గురువులంటే చాలా భయంగా ఉండేది. తరగతి గదిలో గురువు చెప్పిన పాఠాలు విని మరుసటి రోజున చెప్పే వాళ్లం. అప్పుడు చేతిలో చిల్లి గవ్వ ఉండేది కాదు. సెలవు రోజుల్లో కూలి పనికి వెళ్లే వాళ్లం. – కట్కూరి రాంచంద్రం, పూర్వ విద్యార్థి ల్యాండ్ ఫోన్లో మాట్లాడేది నేను హైదరాబాద్లో వెటర్నరీ కోర్సు చేసేటప్పుడు మా తల్లిదండ్రులతో మాట్లాడాలంటే ఎక్కడైనా ల్యాండ్ ఫోన్ ఉంటే మాట్లాడే వాడిని. ఫోన్ అందుబాటులో లేకపోతే పోస్టుకార్డు ద్వారా మా తల్లిదండ్రులకు లేఖ రాసే వాడిని. – భద్రయ్య, పూర్వ విద్యార్థిసైకిల్పై బడికి వచ్చే వాడిని మాది చెల్లాపూర్ గ్రామం నేను దుబ్బాకలో చదువుకునేటప్పుడు బడికి కాలినడకన మా స్నేహితులతో కలిసొచ్చే వాళ్లం. అప్పుడప్పుడూ మా నాన్న సైకిల్పై బడిలో దింపేవాడు. నేను ఇంటర్ చేసేటప్పుడు గంటకు ఒక్క రూపాయి కిరాయితో సైకిల్పై వచ్చే వాడిని. – పరుశరాములు, పూర్వ విద్యార్థి, చెల్లాపూర్ గ్రామం -
కాలచక్రం
కాలినడక.. ● నాడు నడుచుకుంటూ, సైకిల్, రిక్షాలపై బడికి.. ● నేడు ఆటోలు, బస్సులు, కార్లు, బైక్లపై.. ● యూనిఫామ్స్ లేకుండా స్కూల్కి.. ● బట్టతో కుట్టినవి, బియ్యం బస్తాలతో బ్యాగులు ● ప్రస్తుతం మార్కెట్లో వైరెటీగా.. ● పూర్తిగా మారిన విద్యార్థుల స్కూల్ దశమారుతున్న కాలానుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకూ పెరిగిపోతుంది. ఫలితంగా ఇటు విద్యలోనూ అటు విద్యార్థుల్లోనూ అనేక మార్పులు వచ్చాయి. గతంలో ఐదారు గ్రామాలకు కలిపి ఒకే పాఠశాల ఉండగా.. కిలో మీటర్ల మేర కాలినడకన వెళ్లేవారు. బస్సులు, ఆటోలు, బైక్లు ఉండేవి కాదు. సైకిల్ ఉంటే తల్లిదండ్రులు తమ పిల్లలను కూర్చోబెట్టుకొని పాఠశాలలో దింపేవారు. లేదా రిక్షాలో వెళ్లే వారు. కానీ, నేడు అంతా మారింది. కార్లు, ఆర్టీసీ బస్సులు, ఆటోలు, సొంత బైక్లపై వెళ్తున్నారు. విద్యార్థుల పాఠశాల దశలో అప్పటికీ, ఇప్పటికీ మారిన తీరుతెన్నులపై సాక్షి ప్రత్యేక కథనం. – చెక్కపల్లి రాజమల్లుదుబ్బాకరూరల్యూనిఫామ్లు ఉండేవి కాదు: నాడు పాఠశాలకు వెళ్లాలంటే సివిల్ డ్రెస్సులోనే వెళ్లేవారు. అక్కడక్కడ చిరిగి పోయిన డ్రెస్సులు వేసుకునే వారు. విద్యార్థుల హెయిర్ స్టైల్ పొడవాటి జుట్టు ఉండేది. ఎలాంటి మార్పు ఉండేది కాదు. చెప్పులు వేసుకుని పాఠశాలకు వెళ్లేవారు. నేడు విద్యార్థుల్లో పూర్తిగా మార్పు వచ్చింది. రకరకాల డ్రెస్సులు, హెయిర్ స్టైల్స్ చేసుకుంటున్నారు. డ్రెస్ కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి విద్యార్థులు పాఠశాలకు యూనిఫామ్, షూస్ ధరించి వెళ్తున్నారు. బట్ట బ్యాగ్లు, గోనె సంచి బ్యాగ్లు : విద్యార్థులు తమ పుస్తకాలను బ్యాగ్లో పెట్టుకొని వెళ్లాలంటే బట్టతో కుట్టిన బ్యాగ్లు, గోనె సంచితో కుట్టిన బ్యాగ్లను వాడేవారు. నేడు రక రకాల బ్యాగులు మార్కెట్లోకి వచ్చాయి. జిప్పులు, బొమ్మలు ఉన్న బ్యాగులు కొంటున్నారు. పుస్తకాల బరువు తగ్గట్లు పెద్ద పెద్ద బ్యాగులు కొంటున్నారు. వాహనాలపై పాఠశాలకు : నేడు విద్యార్థులకు అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి. పాఠశాలకు వెళ్లాలంటే బస్సులు, ఆటోలు, బైక్లు సౌకర్యంగా ఉన్నాయి. నర్సరీ దశ నుంచి విద్యార్థులు వాహనాలపై పాఠశాలకు వెళ్తున్నారు. ప్రస్తుతానికి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ల్యాండ్ ఫోన్లు, పోస్టుకార్డులు : నాడు విద్యార్థులు పట్టణ ప్రాంతాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తే ల్యాండ్ ఫోన్ల ద్వారా కుటుంబీకులతో మాట్లాడేవారు. లేకుంటే పోస్టుకార్డు ద్వారా తమ ఇంటికి సమాచారం తెలిపే వారు. నేడు విద్యార్థులు సెల్ ఫోన్లలో మాట్లాడుతున్నారు. మాజీ సీఎం కేసీఆర్ కాలినడకన బడికి : మాజీ సీఎం కేసీఆర్ది సిద్దిపేట జిల్లా, చింతమడక స్వగ్రామం. చింతమడక దుబ్బాకకు ఎనిమిది కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. అంత దూరం నుంచి సైకిల్పై పాఠశాలకు వచ్చేవారు. ఆయన తీపి గుర్తుగా దుబ్బాకలో పెద్ద పాఠశాల భవనాన్ని కట్టించారు. దానికి కేసీఆర్ స్కూల్గా నామకరణం చేశారు. ఒక్క రూపాయికే సైకిల్ కిరాయి: ఆ రోజుల్లో ఇంటర్ విద్యార్థులకు బస్సు సౌకర్యం ఉండేది కాదు. గంటకు ఒక్క రూపాయి ఇచ్చి సైకిల్ కిరాయి తీసుకొని కాలేజీకి వెళ్లే వారు. నేడు విద్యార్థులు కాలేజీకి వెళ్లాలంటే బైక్లపైనా, కార్లలో వెళ్తున్నారు. ఇంటి వద్ద ఆటలు : గతంలో విద్యార్థులు పాఠశాల నుంచి రాగానే ఇంటి వద్ద క్రికెట్, చిర్రగోనె, గోలిల ఆట, బొంగురం, ఆట, కబడ్డీ, వ్యవసాయ పొలాల వద్ద నీటి కుండిలో ఆటలు ఆడేవారు. నేడు సెల్ఫోన్లు రావడంతో ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు.పిల్లలను సైకిల్పై బడికి తీసుకెళ్తున్న తండ్రి బస్సు ఎక్కుతున్న విద్యార్థులుసైకిల్, రిక్షాలపై పాఠశాలకు : నాడు విద్యార్థులకు బస్సులు, ఆటోలు, బైక్లు లేకపోవడంతో కాలి నడకనే పాఠశాలకు వెళ్లేవారు. గ్రామం నుంచి పాఠశాలకు ఐదారు కిలో మీటర్ల దూరంలో ఉండేది. కొంత మంది విద్యార్థులు కాలినడకన వెళ్లేవారు. సైకిల్ ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలో దింపేవారు. కొంత మంది తల్లిదండ్రులు తమ పిల్లలను కిరాయి రిక్షాలో పంపేవారు. మరికొందరు ఆట్లో వెళ్లేవారు. -
ద్విచక్ర వాహనాలు చోరీ
సిద్దిపేటకమాన్: పార్క్ చేసిన బైక్ దొంగతనానికి గురైన ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ ఉపేందర్ కథనం మేరకు.. సిద్దిపేట పట్టణం హనుమాన్ నగర్కు చెందిన పొర్ల చరణ్ స్థానికంగా వ్యాపారం చేస్తుంటాడు. వ్యక్తిగత పని నిమిత్తం బయటకు వెళ్లిన చరణ్ పట్టణంలోని ఎస్ఎల్ కాంప్లెక్స్ వద్ద 6న బైక్ పార్క్ చేసి వెళ్లాడు. తిరిగి మరుసటి రోజు వచ్చి చూడగా కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా దొరకలేదు. శనివారం బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దంతన్పల్లిలో.. శివ్వంపేట(నర్సాపూర్) : పార్క్ చేసిన బైక్ దొంగతనానికి గురైన ఘటన మండల పరిధి దంతన్పల్లిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మధుకర్రెడ్డి కథనం మేరకు.. గ్రామానికి చెందిన గొల్ల రాములు శుక్రవారం సాయంత్రం హోండా బైక్పై పొలం వద్ద వెళ్లాడు. బైక్ పార్కింగ్ చేసి పంటను చూసి వచ్చే సరికి కనిపించలేదు. చుట్టు పక్కల వెతికినా కనిపించలేదు. గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారని శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. పేకాటరాయుళ్లపై కేసు రేగోడ్(మెదక్): పేకాట స్థావరంపై దాడి చేసి పలువురిపై కేసు నమోదు చేసిన ఘటన మండల కేంద్రమైన రేగోడ్లో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ పోచయ్య కథనం మేరకు.. మండలంలోని కొత్వాన్పల్లి రోడ్డు సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం వచ్చింది. పేకాట స్థావరంపై దాడి చేయగా ముగ్గురు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి రూ.1,600 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు చెప్పారు. దొంగల బీభత్సం– ఇంట్లో 28 తులాల బంగారం,రూ.1.60 లక్షల నగదు అపహరణ వట్పల్లి(అందోల్): గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చొరబడి దొంగతనానికి పాల్పడిన ఘటన అందోలు మండల పరిధిలోని ఎర్రారం గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన శేషారెడ్డి పటాన్ చెరు సమీపంలోని ఇంద్రేశం వద్ద గల కళాశాలలో చదువుతున్న కూతురి ఆరోగ్యం బాగాలేదని చూడటానికి శుక్రవారం ఇంటికి తాళం వేసి వెళ్లాడు. కూతురిని ఆస్పత్రిలో చికిత్స చేయించి, బంధువుల ఫంక్షన్కు వెళ్లి 14న సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు. ఇంటి తాళం పగులగొట్టి ఉండగా లోపలికి వెళ్లి చూశాడు. దొంగలు బీరువా తెరచి అందులోని 28 తులాల బంగారం రూ.1.60 లక్షల నగదు, 16 తులాల వెండిని ఎత్తుకెళ్లారు. వెంటనే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ లు ప్రవీణ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి లకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ అనిల్ కుమార్, ఎస్ఐ పాండు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. బాధితుడు జోగిపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. -
మాపై కేసులు పెట్టడం సరికాదు
● వీరన్నపేట గ్రామస్తులు ● పాఠశాల స్థలం విషయంలో కోర్టుకు హాజరుచేర్యాల(సిద్దిపేట): పాఠశాల స్థలం విషయమై మండల పరిధిలోని వీరన్నపేటకి చెందిన పలువురు చేర్యాల కోర్టుకు హాజరయ్యారు. శనివారం కోర్టు ఆవరణలో వారు మాట్లాడుతూ.. 20 ఏళ్ల కిందట పాఠశాల భవనం నిర్మాణం కోసం గ్రామానికి చెందిన తరిగొప్పుల ఐలుమల్లు, బాలమ్మ దంపతుల నుంచి కుల సంఘాల ఆధ్వర్యంలో చందాలు వసూలు చేసి 2 ఎకరాల 5 గుంటల భూమి కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఆ స్థలంలోనే పాఠశాల భవన నిర్మాణం, క్రీడా ప్రాంగణం, మూత్రశాలల నిర్మాణంతోపాటు పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రెవెన్యూ రికార్డుల్లో 1 ఎకరం 26 గుంటల భూమి పాఠశాల పేరిట ఉండగా మిగిలిన 19 గుంటల భూమి అమ్మిన వారి పేరు మీదనే వస్తుందన్నారు. తమ పేరిట ఉన్న భూమి కోసం భార్యాభర్తలు ఇద్దరూ మా ఐదుగురిపై కోర్టులో కేసు వేశారని పేర్కొన్నారు. పాఠశాల భూమితో మాకు ఎలాంటి సంబంధం లేదని, అది కేవలం పాఠశాల భవన నిర్మాణం కోసం కొనుగోలు చేసిందన్నారు. కోర్టుకు హాజరైన వారిలో మాజీ సర్పంచ్ కొండపాక భిక్షపతి, మాజీ ఎంపీటీసీ ఆరెళ్ల పాపయ్య, కొండాపురం మధు, పైస లింగం, సూర్న బీరుమల్లు ఉన్నారు. -
ఆటోను ఢీకొట్టిన కారు
– నలుగురికి గాయాలు నారాయణఖేడ్: ఆటోను కారు ఢీకొట్టడంతో ఇద్దరు విద్యార్థులతోపాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటప జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. క్షతగాత్రుల కథనం మేరకు.. నిజాంపేట వైపు నుంచి ఖేడ్ వైపు వస్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న కారు ఢీకొని బోల్తా పడింది. ప్రమాదంలో ఆటలో ప్రయాణిస్తున్న జూకల్ శివారులోని సాంఘీక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో చదువుతున్న మనూరు మండలం రాణాపూర్కు చెందిన వంశీ, చాప్టా(కె)కు చెందిన సచిన్తోపాటు ఖేడ్ పట్టణానికి చెందిన జ్యోతి, ర్యాలమడుగుకు చెందిన ఆటో డ్రైవర్ నారాయణకు గాయాలు అయ్యాయి. అటుగా వస్తున్న మున్సిపల్ మాజీ చైర్మన్ నజీబ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నగేశ్ క్షతగాత్రులను ఆటోల్లో ఖేడ్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. గురుకులం ప్రిన్సిపాల్ లింగారెడ్డి ఆస్పత్రిని సందర్శించి విద్యార్థుల ఆరోగ్యపరిస్థితిని తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిసదాశివపేట రూరల్ (సంగారెడ్డి): ఎదురుగా వస్తున్న కారును ఆటో ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు.ఈ ఘటన మండలంలోని కంభాలపల్లి శివారులో శనివారం చోటు చేసుకుంది. సదాశివపేట సీఐ మహేశ్ గౌడ్ కథనం మేరకు.. మునిపల్లి మండలంలోని మేల సంఘం గ్రామానికి చెందిన ఏర్పుల నాగరాజ్(28) ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. ఇతను వికారాబాద్ జిల్లా మోమిన్ పేట గ్రామంలో మేకల అంగడీకి వెళ్లాడు. మేకలను కొనుగోలు చేసి గ్రామానికి ఆటోలో తమ్ముడు మల్లేశ్తో కలిసి వస్తుండగా కంబాలపల్లి శివారులో ఆటో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగరాజుకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. తమ్ముడికి తీవ్ర గాయాలు కావడంతో సంగారెడ్డి ప్రభుత్వాత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బొలెరో వాహనం బోల్తా – గొర్రెల వ్యాపారి మృతి – నలుగురికి స్వల్ప గాయాలు దుబ్బాకరూరల్: బొలెరో వాహనం బోల్తా పడి గొర్రెల వ్యాపారి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని హబ్సిపూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్ కథనం మేరకు.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ గ్రామానికి చెందిన వజ్జ ఐలయ్య(74) గొర్రెల వ్యాపారం చేస్తాడు. శనివారం తెల్లవారుజామున నిజామాబాద్ జిల్లా నవీపేటలో జరిగే గొర్రెల, మేకల సంతకు భయ్య లక్ష్మణ్కు చెందిన బొలెరో వాహనంలో లింగన్న, ఈరన్న, రమేశ్తో కలిసి బయల్దేరాడు. హబ్సిపూర్ గ్రామ శివారులోకి రాగానే వాహనం బోల్తా పడింది. ఐలయ్య తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీస్లు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాహన డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కారును ఢీకొట్టిన లారీ చిన్నశంకరంపేట(మెదక్): కారును వెనుక నుంచి లారీ ఢీకొట్టిన ఘటన నార్సింగి మండలం సంకాపూర్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. నార్సింగి ఎస్ఐ అహ్మద్ మొహినొద్దీన్ కథనం మేరకు.. శుక్రవారం రాత్రి మేడ్చల్ జిల్లా అల్వాల్కు చెందిన డబిల్పురం నిహల్ బంధువులతో కలిసి కారులో కాశీ నుంచి జాతీయ రహదారిపై వస్తున్నాడు. ఇదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతోపాటు కారును కొద్ది దూరం లాక్కుపోయింది. ఈ ఘటనలో కారు దిబ్బతినగా ఆరుగురు ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. దీంతో లారీ డ్రైవర్ వాహనాన్ని వదిలేసి పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. -
సంగారెడ్డిలో దారుణం.. కూతురితో చనువుగా ఉంటున్నాడని..
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. తన కూతురితో చనువుగా ఉంటున్నాడని యువకుడిని తండ్రి హత్య చేశాడు. మెగ్యానాయక్ తండాలో 9 తరగతి చదువుతున్న తన కూతురితో చనువుగా ఉండటంతో దశరథ్(26)పై తండ్రి కక్ష పెంచుకున్నాడు. యువకుడిని హత్య చేసి నిజాంపేట మండల శివారు అటవీప్రాంతంలో మృతదేహాన్ని తగలబెట్టినట్టు సమాచారం.అనంతరం నిందితుడు గోపాల్ నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. మృతదేహం కోసం దశరథ్ కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించారు. దశరథ్ నాలుగు రోజుల నుంచి కనిపించకుండా పోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు. తన భర్త కనిపించడం లేదంటూ దశరథ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.