breaking news
Corporate
-
ఎన్విడియా సీఈఓ జాకెట్ రూ.9 కోట్లు.. వేలంలో భారీ ధర
ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటైన ఎన్విడియా (NVIDIA) సీఈఓ జెన్సెన్ హువాంగ్ ధరించిన సిగ్నేచర్ నల్లటి టామ్ ఫోర్డ్ (Tom Ford) లెదర్ జాకెట్ వేలంలో సంచలన ధర పలికింది. న్యూయార్క్లో ప్రముఖ వేలంపాట సంస్థ సోథెబీస్ నిర్వహించిన వేలంలో ఈ జాకెట్ 9.6 లక్షల డాలర్లు (సుమారు రూ.9.2 కోట్లు)కు అమ్ముడైంది. ఇది ముందుగా అంచనా వేసిన 40,000–60,000 డాలర్ల విలువ కంటే దాదాపు 16 రెట్లు ఎక్కువ.సోథెబీస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ జాకెట్ కోసం ప్రపంచవ్యాప్తంగా 45 మంది పోటీపడ్డారు. సంస్థ ఆధునిక కలెక్టిబుల్స్ విభాగం అధిపతి బ్రహ్మ్ వాచ్టర్ దీన్ని "ఏఐ యుగాన్ని నిర్వచించిన ప్రముఖ వ్యక్తుల్లో ఒకరితో అత్యంత సన్నిహితంగా ముడిపడిన అరుదైన స్మారక వస్తువు"గా అభివర్ణించారు.జెన్సెన్ హువాంగ్ నల్లటి లెదర్ జాకెట్ ఆయన వ్యక్తిత్వానికి ప్రతీకగా మారింది. యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్కి నల్లటి టర్టిల్నెక్ స్వెటర్, మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్కి బూడిదరంగు టీ-షర్టు ఎలాగో హువాంగ్కు ఈ బ్లాక్ జాకెట్ అలాగే. ఆయన దాదాపు ప్రతి కీలక ఉత్పత్తి ఆవిష్కరణ, డెవలపర్ కాన్ఫరెన్స్, అంతర్జాతీయ వేదికలపై ఇదే తరహా జాకెట్లో కనిపిస్తుంటారు. 2021లో టైమ్ మ్యాగజైన్ ముఖచిత్రంపైనా ఇదే నలుపు జాకెట్తో మెరిశారు. వేలానికి వచ్చిన జాకెట్ను ఆయన 2023 అక్టోబర్లో తైవాన్లో జరిగిన హాన్ హై (ఫాక్స్కాన్) టెక్ డే కార్యక్రమంలో ధరించినదేనని ఫోటో మ్యాచింగ్ ద్వారా ధ్రువీకరించారు. జాకెట్పై హువాంగ్ సంతకాన్ని కూడా నిపుణులు ప్రామాణికంగా నిర్ధారించారు.ఎన్విడియా నాయకత్వంలో జెన్సెన్ హువాంగ్ కంపెనీని కృత్రిమ మేధ (AI) విప్లవానికి కేంద్రబిందువుగా నిలబెట్టారు. ఏఐ చిప్లకు పెరిగిన భారీ డిమాండ్తో ఎన్విడియా ప్రపంచంలోనే అత్యధిక మార్కెట్ విలువ కలిగిన పబ్లిక్ కంపెనీగా ఎదిగింది.ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తం ఆదాయాన్ని ఎడ్జ్ ఇన్స్టిట్యూట్ అనే లాభాపేక్షలేని సంస్థకు అందజేస్తున్నారు. సాంకేతికత, విజ్ఞానం, విద్య రంగాల్లో యువ ఆవిష్కర్తలకు ఫెలోషిప్లు, గ్రాంట్లు, పరిశోధన అవకాశాలు కల్పించేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు. -
రిలయన్స్ లాభాల రికార్డ్!
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్ (2026–27, క్యూ1)లో రూ. 23,196 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో లాభం రూ.30,783 కోట్లతో పోలిస్తే లాభం 25 శాతం తగ్గింది. అయితే, ఆ క్వార్టర్లో ఏషియన్ పెయింట్స్లోని రూ. 8,924 కోట్ల వాటా విక్రయం ద్వారా లభించిన అసాధారణ రాబడి కలిసి ఉండటం వల్ల వార్షికంగా లాభంలో తగ్గుదల నమోదైంది.ఈ వన్టైమ్ రాబడిని గనుక పక్కనబెడితే ఈ ఏడాది క్యూ1లో నికర లాభం దాదాపు 6.1 శాతం ఎగబాకి కొత్త రికార్డు నమోదు చేసినట్లు లెక్క. మొత్తం ఆదాయం రూ. 3.12 లక్షల కోట్లకు ఎగబాకింది. గతేడాది క్యూ1లో నమోదైన రూ. 2.48 లక్షల కోట్లతో పోలిస్తే 26 శాతం వృద్ధి చెందింది. ఆయిల్–టు–కెమికల్స్ (ఓ2సీ), రిటైల్, డిజిటల్ సరీ్వసుల వ్యాపారాల స్థిరమైన పనితీరు ఇందుకు ప్రధానంగా దోహదం చేసింది. కాగా, క్యూ1లో ఎబిటా 10.1 శాతం జంప్ చేసి రికార్డు స్థాయిలో రూ. 54,067 కోట్లను తాకింది.ఇతర ముఖ్యాంశాలివీ... క్యూ1లో ఓ2సీ బిజినెస్ ఎబిటా రూ.17,010 కోట్లకు చేరింది. 17.2 శాతం వృద్ధి చెందింది. రిలయన్స్ రిటైల్ నికర లాభం 14.2 శాతం తగ్గి రూ. 2,806 కోట్లకు చేరింది. ఆదాయం 8.6 శాతం పెరిగి రూ.79,745 కోట్లుగా నమోదైంది. ఎబిటా 1.1 శాతం తగ్గుదలతో రూ.6,309 కోట్లుగా ఉంది. కొత్తగా 252 స్టోర్లు జతయ్యాయి. దీంతో మొత్తం షోరూమ్ల సంఖ్య 20,169కి చేరింది. రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ ఆదాయం 11.6 శాతం పెరిగింది. క్యాంపా కోలా అమ్మకాలు రూ. 2,900 కోట్లుగా నమోదయ్యాయి. రిలయన్స్ ఆయిల్ అండ్ గ్యాస్ వ్యాపార ఎబిటా దాదాపు అదే స్థాయిలో రూ. 4,973 కోట్లుగా నమోదైంది. జూన్ క్వార్టర్లో కంపెనీ రూ.38,682 కోట్ల పెట్టుబడులు వెచ్చించింది. ఓ2సీ విస్తరణ, న్యూ ఎనర్జీ ప్రాజెక్టులతో పాటు కన్జూమర్ బిజినెస్ ఇన్ఫ్రాపై దీన్ని ఇన్వెస్ట్ చేసింది. జూన్ నాటికి నికర రుణ భారం రూ.1,22,914 కోట్లుగా ఉంది. ఫలితాల నేపథ్యంలో శుక్రవారం రిలయన్స్ షేరు ధర 2.6 శాతం లాభంతో రూ.1,327 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. -
అదృశ్య బంగారం.. దొరికితే అదృష్టమే!
జపాన్కు దక్షిణాన పసిఫిక్ మహాసముద్రంలోని అగ్నిపర్వత సముద్రగర్భ ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యధిక సాంద్రత కలిగిన "అదృశ్య బంగారం" (Invisible Gold)ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఆవిష్కరణ సముద్ర గర్భంలోని ఖనిజ సంపదపై ప్రపంచ దృష్టిని మళ్లీ ఆకర్షిస్తోంది. అయితే ఈ బంగారాన్ని తవ్వడం అంత సులభం కాదని, పర్యావరణ పరిరక్షణ కూడా పెద్ద సవాలేనని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.ఎక్కడ లభించింది?ఈ బంగారు నిల్వలు టోక్యోకు దక్షిణంగా సుమారు 350–360 కిలోమీటర్ల దూరంలో జపాన్ ప్రత్యేక ఆర్థిక మండలిలోని ‘హిగాషి-అయోగాషిమా నోల్ కాల్డెరా (Higashi-Aogashima Knoll Caldera)’ హైడ్రోథర్మల్ ఫీల్డ్లో గుర్తించారు. ఇది సముద్ర అడుగున ఉన్న క్రియాశీల అగ్నిపర్వత ప్రాంతం. ఇక్కడ 'బ్లాక్ స్మోకర్స్'గా పిలిచే హైడ్రోథర్మల్ వెంట్ల నుంచి అత్యంత వేడిగా ఉండే, ఖనిజాలతో నిండిన ద్రవాలు వెలువడుతుంటాయి. చల్లటి సముద్రజలాన్ని తాకగానే అవి ఘనీభవించి సల్ఫైడ్ నిక్షేపాలు, చిమ్నీ ఆకారపు నిర్మాణాలను ఏర్పరుస్తాయి. ఈ ప్రక్రియలో రాగి, జింక్, వెండి, బంగారం వంటి లోహాలు సహజంగానే కేంద్రీకృతమవుతాయి.కనిపించని బంగారాన్ని ఎలా గుర్తించారు?ఇప్పటి వరకు బంగారం సాధారణంగా చిన్న కణాలు లేదా రేణువుల రూపంలో ఉంటుందని భావించేవారు. కానీ ఈసారి శాస్త్రవేత్తలు ‘సెకండరీ అయాన్ మాస్ స్పెక్ట్రోమెట్రీ ’(SIMS) అనే అత్యాధునిక సాంకేతికతతో పరిశీలించగా, బంగారం ఎక్కువ భాగం ‘పైరైట్’ (Pyrite) అనే ఐరన్ సల్ఫైడ్ ఖనిజం స్ఫటిక నిర్మాణంలోనే అణు స్థాయిలో కలిసిపోయి ఉందని గుర్తించారు. అందువల్ల ఇది సాధారణ సూక్ష్మదర్శినితో కూడా కనిపించదు. దీనినే "ఇన్విజిబుల్ గోల్డ్"గా పేర్కొంటారు.రికార్డు స్థాయి సాంద్రతసైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్లో ఇటీవల ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఈ ప్రాంతంలోని పైరైట్లో బంగారం సాంద్రత గరిష్ఠంగా 1.9 శాతం (19,000 పీపీఎంకు పైగా)నమోదైంది. ఇప్పటివరకు ప్రపంచంలోని సముద్రగర్భ హైడ్రోథర్మల్ నిక్షేపాల్లో నమోదైన అత్యధిక స్థాయిల్లో ఇదొకటిగా పరిశోధకులు పేర్కొన్నారు.తవ్వకాలు సాధ్యమేనా?ఈ ప్రాంతం లోతు ఇతర సముద్రగర్భ ఖనిజ ప్రాంతాలతో పోలిస్తే తక్కువగా ఉండటం, ఖనిజ నిక్షేపాలు సమృద్ధిగా ఉండటం వల్ల భవిష్యత్తులో వాణిజ్యపరంగా మైనింగ్కు అనుకూల ప్రాంతంగా భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం పైరైట్లో అణు స్థాయిలో దాగి ఉన్న బంగారాన్ని భారీ స్థాయిలో, ఆర్థికంగా లాభదాయకంగా వెలికితీసే సాంకేతికత ఇంకా అందుబాటులో లేదు. అందువల్ల తక్షణ మైనింగ్ అవకాశాలు లేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.పర్యావరణంపై ఆందోళనలుహైడ్రోథర్మల్ వెంట్ల చుట్టూ భూమిపై మరెక్కడా కనిపించని ప్రత్యేక సముద్ర జీవవ్యవస్థలు ఉంటాయి. అరుదైన పురుగులు, క్రస్టేషియన్లు, స్పాంజ్లు, పగడాలు, చేపలు వంటి జీవులు ఈ తీవ్ర పరిస్థితుల్లోనే జీవిస్తాయి. ఇలాంటి ప్రాంతాల్లో మైనింగ్ ప్రారంభిస్తే ఈ సున్నితమైన జీవవ్యవస్థలు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉందని సముద్ర శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందుకే వాణిజ్య తవ్వకాల కంటే ముందుగా సమగ్ర పర్యావరణ అధ్యయనాలు, కఠినమైన రక్షణ చర్యలు అవసరమని వారు సూచిస్తున్నారు. -
సంపద సృష్టించడం ఎలా..?: కియోసాకి సలహా
ఒక వ్యక్తి ఎంత చదువుకున్నాడు అనే విషయం మాత్రమే.. అతని ఆర్థిక విజయాన్ని నిర్ణయించదని చెబుతారు రాబర్ట్ కియోసాకి. డబ్బును ఎలా అర్థం చేసుకుంటాడు, దాన్ని ఎలా ఉపయోగిస్తాడు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు అనేదే అతని ఆర్థిక స్థితిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. చాలా మంది జీవితంలో ఒకే విధంగా కష్టపడుతున్నప్పటికీ, కొందరు సంపదను సృష్టిస్తారు, మరికొందరు డబ్బు సమస్యలతోనే కొనసాగుతారు. దీనికి ప్రధాన కారణం వారి ఆలోచనా విధానం.చదువు మాత్రమే సంపదను ఇవ్వదుకియోసాకి ఈ భావనను 'పూర్ డాడ్' - 'రిచ్ డాడ్' అనే రెండు భిన్నమైన ఆలోచనా విధానాలతో పోల్చారు.పూర్ డాడ్ బాగా చదువుకున్న వ్యక్తి. ఆయనకు ఉన్నత విద్య ఉన్నప్పటికీ, డబ్బు విషయంలో సాధారణంగా చాలామంది ఆలోచించే విధంగానే ఆలోచిస్తారు. ఉద్యోగం, స్థిరమైన ఆదాయం, భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.మరోవైపు రిచ్ డాడ్ పెద్దగా చదువుకోకపోయినా.. డబ్బు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకున్నారు. ఆయన ఆదాయం వచ్చే మార్గాలను సృష్టించడం, ఆస్తులను పెంచుకోవడం వంటి విషయాలపై దృష్టి పెడతారు. అంటే దీని అర్థం చదువు అవసరం లేదని కాదు. విద్యతో పాటు ఆర్థిక అవగాహన కూడా చాలా ముఖ్యమని చెప్పడం.పెట్టుబడుల విషయంలో.. ఆలోచనలో తేడా!సాధారణంగా చాలామంది పెట్టుబడి పెట్టేటప్పుడు.. 'ఏ పెట్టుబడి సురక్షితమైనది?' అని అడుగుతారు. ఎందుకంటే నష్టం రాకుండా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఆర్థికంగా విజయవంతమైన వ్యక్తులు.. 'ఏ పెట్టుబడి నాకు ఆదాయం తెస్తుంది? దానిపై నాకు ఎంత నియంత్రణ ఉంటుంది? దాన్ని ఎలా పెంచుకోవచ్చు?' అని ఆలోచిస్తారు. అంటే ముఖ్యమైన విషయం కేవలం ఏ ఆస్తిలో పెట్టుబడి పెడుతున్నామన్నది కాదు. ఆ ఆస్తి గురించి మనకు ఎంత అవగాహన ఉందన్నదే అసలు విషయం.సేఫ్టీ కోసం వెతకడం vs జ్ఞానం సంపాదించడంపూర్ డాడ్.. 'ప్రమాదం వద్దు.. డబ్బును సురక్షితంగా ఉంచుకోవాలి' అని అనుకుంటారు. కానీ రిచ్ డాడ్ ఆలోచన 'ప్రమాదాన్ని తగ్గించుకోవాలంటే ముందుగా ఆ విషయం గురించి నేర్చుకోవాలి'. పెట్టుబడుల్లో రిస్క్ సహజం. కానీ అవగాహన లేకుండా పెట్టుబడి పెట్టడం మరింత ప్రమాదకరం. ఒక వ్యక్తి పెట్టుబడి పెట్టే రంగం గురించి తెలుసుకుంటే, సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం పెరుగుతుంది. తద్వారా ధనవంతులు అవుతారు. -
రూ.600 టికెట్కు.. రూ.10 వేల పరిహారం!
ప్రస్తుతం చాలామంది బస్ టికెట్లను దాదాపు ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటున్నారు. దీంతో ప్రయాణం చాలా సులభతరమైంది. అయితే కొన్నిసార్లు టికెట్ కన్ఫర్మ్ అయిన తరువాత కూడా చివరి నిమిషంలో క్యాన్సిల్ అవుతాయి. ఇది ప్రయాణికులకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. అలాంటి సంఘటనే హిమాచల్ ప్రదేశ్లో జరిగింది. వినియోగదారుల కమిషన్ దీనిని విచారించి కీలక తీర్పును వెల్లడించింది.2023 అక్టోబర్ 5న జయంత్ పాటియల్ అనే వ్యక్తి పాలంపూర్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు రెడ్బస్ ద్వారా రూ.600 చెల్లించి బస్ టికెట్ బుక్ చేసుకున్నాడు. రాత్రి 10:15 గంటలకు బస్సు బయలుదేరాల్సి ఉండటంతో, అతడు సమయానికంటే ముందే బోర్డింగ్ పాయింట్కు వెళ్ళాడు.బోర్డింగ్ పాయింట్ చేరుకున్న తరువాత బస్ ఆపరేటర్ అయిన భర్మణి ట్రావెల్స్ను సంప్రదించినప్పుడు, రాత్రి 10:15 గంటలకు షెడ్యూల్ ప్రకారం బస్సు ఏదీ లేదని చెప్పినట్లు జయంత్ పేర్కొన్నాడు. ఢిల్లీకి వెళ్లాల్సిన తమ చివరి బస్సు రాత్రి 8 గంటలకే వెళ్లిపోయిందని ఆపరేటర్ అతనికి తెలియజేసినట్లు వెల్లడించాడు.దీంతో షాక్కు గురైన జయంత్ వెంటనే రెడ్బస్ కస్టమర్ కేర్ను సంప్రదించారు. సమస్యను పరిశీలిస్తామని చెప్పిన కొద్ది నిమిషాల్లోనే రాత్రి 9:58 గంటలకు టికెట్ రద్దు చేసినట్లు, డబ్బు రీఫండ్ చేస్తున్నట్లు సందేశం వచ్చింది. అంటే.. బస్సు బయలుదేరడానికి కేవలం 17 నిమిషాల ముందు టికెట్ను క్యాన్సిల్ చేశారు. ఇది అతనికి చాలా ఇబ్బంది కలిగించింది.జయంత్ అత్యవసరంగా ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఉండటంతో మరో మార్గం వెతకాల్సి వచ్చింది. దాదాపు 40 కిలోమీటర్లు ప్రయాణించి సమీప విమానాశ్రయానికి చేరుకుని, మరుసటి రోజు ఉదయానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు. దీని కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేసినట్లు కూడా పేర్కొన్నాడు. దీంతో ఆయనకు అదనపు ఆర్థిక భారం పడటమే కాకుండా, తీవ్ర మానసిక ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి.ఈ ఘటనపై జయంత్ వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించి నష్టపరిహారం కోరారు. విచారణలో రెడ్బస్ తాము కేవలం ప్రయాణికులు, బస్సు ఆపరేటర్లను కలిపే ఆన్లైన్ ప్లాట్ఫామ్ మాత్రమేనని, బస్సు నడపడం తమ బాధ్యత కాదని వాదించింది. టికెట్ డబ్బు తిరిగి ఇచ్చామని తెలిపింది.అయితే కమిషన్ ఈ వాదనను అంగీకరించలేదు. ఒకసారి టికెట్ బుక్ చేసి, డబ్బు తీసుకుని, బుకింగ్ను కన్ఫర్మ్ చేసిన తర్వాత సేవ అందకపోతే బాధ్యత నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేసింది. మరోవైపు భర్మణి ట్రావెల్స్ కూడా బస్సు ఎందుకు నడపలేదనే విషయంపై ఎలాంటి వివరణ ఇవ్వకపోవడాన్ని కమిషన్ తప్పుపట్టింది.కమిషన్ రెడ్బస్, భర్మణి ట్రావెల్స్ రెండింటినీ బాధ్యులుగా నిర్ధారించింది. ప్రయాణికుడికి మానసిక వేదన, ఇబ్బందులకు రూ.5,000, కేసు ఖర్చులకు మరో రూ.5,000 చెల్లించాలని ఆదేశించింది. 30 రోజుల్లో డబ్బు చెల్లించకపోతే, ఫిర్యాదు చేసిన తేదీ నుంచి చెల్లించే వరకు ఏడాదికి 9 శాతం వడ్డీతో చెల్లించాలని కమిషన్ ఆదేశించింది.ఇదీ చదవండి: రేషన్ కార్డులో కీలక మార్పులు! -
విప్రో ఫలితాలు వీక్!
న్యూఢిల్లీ: దేశీ ఐటీ దిగ్గజం విప్రో నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్ (2026–27, క్యూ1)లో కంపెనీ రూ.3,352 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో రూ.3,330 కోట్లతో పోలిస్తే లాభం దాదాపు ఫ్లాట్గా నమోదైంది. కాగా, మొత్తం ఆదాయం 10.6 శాతం జంప్ చేసి రూ.24,479 కోట్లకు చేరింది. గతేడాది క్యూ1లో ఆదాయం రూ.22,135 కోట్లుగా ఉంది. సీక్వెన్షియల్గా లాభం డౌన్... క్రితం ఏడాది చివరి క్వార్టర్ (2025–26, క్యూ4)లో నమోదైన రూ. 3,501 కోట్లతో పోలిస్తే సీక్వెన్షియల్గా క్యూ1 లాభం 4.2 శాతం దిగజారింది. అయితే, మొత్తం ఆదాయం మాత్రం స్వల్పంగా 1 శాతం పెరిగింది. గతేడాది క్యూ4లో ఆదాయం రూ. 24,236 కోట్లుగా నమోదైంది. గైడెన్స్.. ప్చ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీ సేవల వ్యాపార ఆదాయ వృద్ధి అంచనాలు (గైడెన్స్) కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఆదాయం 2.57 బిలియన్ డాలర్ల నుంచి 2.63 బిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని కంపెనీ పేర్కొంది. దీని ప్రకారం సీక్వెన్షియల్గా ఆదాయ గైడెన్స్ మైనస్ 1.5 శాతం నుంచి ప్లస్ 0.5 శాతంగా లెక్కతేలుతుంది. ఇతర ముఖ్యాంశాలివీ... → ఐటీ సేవలకు సంబంధించిన ఆదాయం క్యూ1లో 2.61 బిలియన్ డాలర్లుగా నమోదైంది. సీక్వెన్షియల్గా 1.4 శాతం తగ్గగా, వార్షికంగా 1 శాతం పెరిగింది. → ఐటీ సేవల నిర్వహణ మార్జిన్ 16 శాతంగా నమోదైంది. సీక్వెన్షియల్గా 1.3 శాతం, వార్షికంగా 1.2 శాతం తగ్గింది. → కంపెనీ వాటాదారులకు రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ. 2 మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. దీనికి రికార్డు తేదీ ఈ నెల 27 కాగా, ఆగస్ట్ 14 లోపు చెల్లిస్తుంది. → ఈ ఏడాది జూన్ చివరి నాటికి కంపెనీ మొత్తం సిబ్బంది సంఖ్య 2,43,044కు చేరింది. మార్చి క్వార్టర్తో పోలిస్తే 888 మంది ఉద్యోగులు జతయ్యారు. ఉద్యోగుల వలసల రేటు (అట్రిషన్) 13.9 శాతంగా ఉంది. ఫలితాల నేపథ్యంలో విప్రో షేరు ధర గురువారం 1.83 శాతం లాభపడి రూ.178 వద్ద ముగిసింది.క్లయింట్లు టెక్నాలజీ ఆధునీకరణ స్థాయి నుంచి ఏఐ–ఆధారిత ఆపరేటింగ్ మోడల్స్ వైపు మళ్లుతున్నారు. దీనివల్ల నాణ్యత, ఉత్పాదకత మెరుగుపడుతుంది. దీనికి అనుగుణంగా విప్రో అందిస్తున్న కన్సల్టింగ్ ఆధారిత, ఏఐతో కూడిన విధానం వల్ల క్లయింట్లు తమ కీలక వ్యాపారంలో ఏఐని అమలు చేసేందుకు వీలవుతోంది. క్లయింట్లు తమ ఏఐ మార్పుల కోసం మాపై ఉంచుతున్న నమ్మకానికి, మా విస్తృత సామర్థ్యాలకు ఇది నిదర్శనం. – శ్రీని పల్లియా, విప్రో సీఈఓ, ఎండీ -
రూ.10 వేల కోట్ల కంపెనీకి బాస్.. హోమ్ లోన్ ఇవ్వని బ్యాంక్!
సొంతంగా ఒక కంపెనీని నిర్మించడం అనేది చాలా సాహసంతో కూడుకున్న పని, అది పెద్ద విజయం కూడా. అలాంటి వ్యక్తికి బ్యాంకు హోమ్ లోన్ ఇవ్వడం పెద్ద విషయం కాదని చాలామంది అనుకుంటారు. కానీ.. ఇక్కడ ఒక వ్యాపారవేత్తకు ఎదురైన సంఘటన మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఆ విషయాన్ని తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు.ఫిన్టెక్ సంస్థ రైజ్ (ధన్ పేరెంట్ కంపెనీ) వ్యవస్థాపకుడు ప్రవీణ్ జాధవ్ ఇటీవల హోమ్ లోన్ కోసం ఓ బ్యాంకును ఆశ్రయించారు. అయితే ఆయన దరఖాస్తును బ్యాంకు తిరస్కరించింది. కారణం ఏమిటంటే.. ఆయనను 'హై రిస్క్ బారోవర్'గా పరిగణించడం. దాదాపు 1.2 బిలియన్ డాలర్ల (రూ.10 వేల కోట్ల కంటే ఎక్కువ) విలువైన కంపెనీని నడుపుతున్న వ్యక్తికి కూడా ఈ పరిస్థితి రావడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది.తనకు ఎదురైనా అనుభవాన్ని ప్రవీణ్ జాధవ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన అతి తక్కువ సమయంలోనే తెగ వైరల్ అయింది. దీంతో పలువురు స్టార్టప్ వ్యవస్థాపకులు, వ్యాపారవేత్తలు కూడా తమకు ఎదురైన ఇలాంటి అనుభవాలను గురించి వెల్లడించారు.నిజానికి బ్యాంకులు ఎవరి కంపెనీ విలువ ఎంత ఉందో అనే విషయాలను పరిగణలోకి తీసుకుని లోన్స్ అందించవు. లోన్ తీసుకున్న వ్యక్తి దాన్ని క్రమం తప్పకుండా తిరిగి చెల్లించగలడా.. లేదా?, అనే అంశాన్నే ప్రధానంగా పరిశీలిస్తాయి. అందుకే గతంలో తీసుకున్న లోన్స్ హిస్టరీ, ఆదాయపు పన్ను రిటర్నులు, స్థిరమైన ఆదాయం వంటి వివరాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయి.Founder's life is hard!My home loan application got rejected by a top private bank - just because I am a founder.> 25 year of customer> ~800 CIBIL Score> 5x-6x of loan value in relationship with this bank> may be in top 0.1% of its customers by assets> and irony is this…— pj (@BeingPractical) July 14, 2026ఉద్యోగుల విషయంలో ఇది చాలా సులభం. ఎందుకంటే ప్రతి నెలా ఒకే తేదీకి జీతం వస్తుంది. శాలరీ స్లిప్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు చూసి వారి ఆదాయాన్ని సులభంగా అంచనా వేయవచ్చు. అందుకే వారికి హోమ్ లోన్ ప్రక్రియ కూడా చాలా వేగంగా లభిస్తుంది. కానీ వ్యాపారవేత్తల పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. వారి ఆదాయం ప్రతి నెల ఒకేలా ఉండదు. కంపెనీ లాభాలు, డివిడెండ్లు, షేర్ల విలువ ఆధారంగా ఆదాయం మారుతూ ఉంటుంది. చాలామంది స్టార్టప్ వ్యవస్థాపకులు కంపెనీ విలువ వేల కోట్ల రూపాయలు ఉన్నా, వ్యక్తిగతంగా తక్కువ జీతమే తీసుకుంటుంటారు. ఈ కారణంగా వారి ఆదాయాన్ని బ్యాంకులు స్థిరమైనదిగా పరిగణించకపోవచ్చు.ఈ ఘటనపై స్పందించిన బ్యాంక్బజార్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ రతి శెట్టి కూడా ఇదే విషయాన్ని వివరించారు. బ్యాంకులు ఆదాయం ఎంత స్థిరంగా ఉందో, తిరిగి చెల్లించే సామర్థ్యం ఎంత ఉందో మాత్రమే పరిశీలిస్తాయని చెప్పారు. అయితే సరైన ఆర్థిక పత్రాలు, పన్ను వివరాలు, ఆదాయ రికార్డులు సమర్పిస్తే.. వ్యాపారవేత్తలు కూడా రుణాలు పొందే అవకాశాలు మెరుగుపడతాయని ఆమె అభిప్రాయపడ్డారు. -
‘ఇక చమురు కాదు.. రానున్నది సరికొత్త యుద్ధం’
ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల దృష్టి ప్రస్తుతం బిట్కాయిన్, షేర్లు, చమురు, రిటైర్మెంట్ ఫండ్లపై ఉండగా, అసలు భవిష్యత్తును నిర్ణయించేది మాత్రం ‘నీరు (Water Rights)’ అని ప్రముఖ ఆర్థిక రచయిత, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత ‘రాబర్ట్ కియోసాకి’ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన తన ఫేస్బుక్ పోస్టులో నీటి హక్కుల ప్రాధాన్యాన్ని వివరిస్తూ ఆసక్తికరమైన విశ్లేషణను పంచుకున్నారు.కియోసాకి ప్రకారం.. ప్రపంచంలోని అత్యంత తెలివైన పెట్టుబడిదారులు ఇప్పటికే నీటి హక్కులపై దృష్టి పెట్టారని తెలిపారు. 2008 ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే అంచనా వేసిన ప్రముఖ ఇన్వెస్టర్ ‘మైఖేల్ బర్రీ’ ఎన్నో సంవత్సరాలుగా నీటి హక్కులను కొనుగోలు చేస్తున్నారని గుర్తుచేశారు. అలాగే అమెరికాలో 2.7 లక్షల ఎకరాలకు పైగా వ్యవసాయ భూమిని కలిగి ఉన్న బిల్ గేట్స్ లక్ష్యం కేవలం వ్యవసాయం కాదని, ఆ భూములకు అనుబంధంగా ఉన్న నీటి హక్కులను భద్రపరచుకోవడమేనని పేర్కొన్నారు. అదేవిధంగా ‘చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లాటర్-డే సెయింట్స్’ వాషింగ్టన్ రాష్ట్రంలో వేల ఎకరాల భూమిని కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం కూడా నీటి హక్కులేనని చెప్పారు.నీరు లేని భూమికి విలువే లేదు"నీరు లేని భూమి తక్కువ విలువైనది కాదు... పూర్తిగా విలువలేనిది" అని కియోసాకి వ్యాఖ్యానించారు. ప్రపంచంలోని మంచినీటిలో సుమారు 70 శాతం వ్యవసాయానికే వినియోగిస్తుండగా, వాతావరణ మార్పులు, భూగర్భ జలాల క్షీణత, పెరుగుతున్న జనాభా, పాతబడిన నీటి సరఫరా వ్యవస్థలు భవిష్యత్తులో తీవ్రమైన నీటి కొరతకు దారితీస్తాయని హెచ్చరించారు. అమెరికాలోని కాలిఫోర్నియా, అరిజోనా, టెక్సాస్, కొలరాడో నది పరివాహక ప్రాంతాల్లో ఈ సమస్య ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు.నీటినీ ట్రేడ్ చేస్తున్న వాల్ స్ట్రీట్కియోసాకి వెల్లడించిన వివరాల ప్రకారం.. అమెరికాలోని సీఎంఈ గ్రూప్ ఇప్పటికే వాటర్ ఫ్యూచర్స్ మార్కెట్ను ప్రారంభించింది. అంటే చమురు మాదిరిగానే నీటిని కూడా ఆర్థిక మార్కెట్లలో ట్రేడ్ చేస్తున్నారని చెప్పారు. కాలిఫోర్నియాలో కొన్ని ప్రాంతాల్లో భూమి కంటే దానికి సంబంధించిన నీటి హక్కులకే ఎక్కువ విలువ ఉందని పేర్కొన్నారు. పెట్టుబడి సంస్థలు వ్యవసాయ భూములను కొనుగోలు చేసి, కొంతకాలం రైతులకు లీజుకు ఇచ్చి, అనంతరం ఆ నీటి హక్కులను నగరాలకు విక్రయించి భారీ లాభాలు ఆర్జిస్తున్నాయని వివరించారు.ధనవంతుల పెట్టుబడుల వ్యూహం ఇదే!మధ్యతరగతి ప్రజలు మ్యూచువల్ ఫండ్లు, సాధారణ పెట్టుబడుల్లో డబ్బు పెడుతుంటే, ధనవంతులు మాత్రం భూమితో పాటు దానికి సంబంధించిన నీటి హక్కులను కొనుగోలు చేస్తున్నారని కియోసాకి అభిప్రాయపడ్డారు. నీటి కొరత పెరిగే కొద్దీ ఆ హక్కుల విలువ మరింత పెరుగుతుందని, తర్వాత వాటిని నగరాలకు విక్రయించడం లేదా లీజుకు ఇవ్వడం ద్వారా భారీ లాభాలు పొందుతున్నారని చెప్పారు.తన 'రిచ్ డాడ్' తనకు నేర్పిన ఒక ముఖ్యమైన సూత్రాన్ని కూడా కియోసాకి గుర్తుచేశారు. "ఏది లేకుండా ప్రపంచం జీవించలేదదో అలాంటి ఆస్తిని కొనుగోలు చేయి" అని తన గురువు చెప్పారని పేర్కొన్నారు. గత 100 సంవత్సరాల్లో ఆ ఆస్తి చమురైతే, రాబోయే 100 సంవత్సరాల్లో అది ‘నీరు’ అవుతుందని తన ఫేస్బుక్ పోస్టులో కియోసాకి అభిప్రాయపడ్డారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. -
అంత ఈజీ కాదు.. అందుకే కెనడా నుంచి వచ్చేశా!
అమెరికా, కెనడా, యూరప్ వంటి దేశాల్లో మంచి ఉద్యోగం సంపాదించి.. మంచి జీవితాన్ని గడపాలని చాలా మంది భారతీయులు కలలు కంటారు. ఈ కారణంగానే ప్రతి ఏటా వేలాదిమంది దేశం విడిచి వెళుతుంటారు. అయితే.. విదేశాల్లో జీవితం అందరికీ ఒకేలా ఉండదు అంటున్నారు వ్యాపారవేత్త 'హర్ష్ గుప్తా'. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.హర్ష్ గుప్తా సోషల్ మీడియాలో షేర్ చేసిన వివరాలు ప్రకారం.. తాను పర్మినెంట్ రెసిడెన్సీతో కెనడాలోని టొరొంటోకు వెళ్లారు. కానీ అక్కడ కేవలం 18 నెలలు మాత్రమే ఉండి, తిరిగి భారత్కు వచ్చేశారు. తాను తిరిగి ఇండియాకు ఎందుకు తిరిగి వచ్చారో.. చెప్పిన కారణాలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.ఉద్యోగంహర్ష్ గుప్తా చెప్పిన మొదటి కారణం ఉద్యోగాల గురించి. చాలామంది అనుకునేలా కెనడాలో మంచి ఉద్యోగం సులభంగా దొరకదు. ఒక్కో ఉద్యోగానికి వేల సంఖ్యలో దరఖాస్తులు చేసుకుంటారు, పోటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుందని వివరించారు. అందరూ అనుకునేలా జీతాలు పెద్ద స్థాయిలో ఉండవని, కొన్ని పెద్ద కంపెనీలు మాత్రమే ఎక్కువ జీతాలు ఇస్తాయని పేర్కొన్నారు.జీవన వ్యయంజీవన వ్యయం కూడా ఇబ్బందిగా ఉంటుందని హర్ష్ గుప్తా పేర్కొన్నారు. టొరొంటోలో చిన్న అపార్ట్మెంట్కే నెలకు దాదాపు రెండు లక్షల రూపాయల అద్దె చెల్లించాల్సి వచ్చిందని చెప్పారు. తాను నెలకు దాదాపు పది లక్షల రూపాయలు సంపాదించినప్పటికీ, అందులో సగం వరకు పన్నులకే వెళ్లిపోయేదని అన్నారు. అందుకే ఎక్కువ సంపాదించినా.. చేతిలో మిగిలేది అంతంత మాత్రమే అని వెల్లడించారు.ఆరోగ్య సేవలుఆరోగ్య సేవల విషయంలో కూడా మంచి అనుభవం రాలేదని ఆయన పేర్కొన్నారు. ఒక ఫ్యామిలీ డాక్టర్ను పొందడానికి ఆరు నెలలు ఎదురుచూడాల్సి వచ్చిందని, స్పెషలిస్ట్ డాక్టర్ను కలవడానికి ఇంకా ఎక్కువ సమయం పట్టేదని తెలిపారు. అందువల్ల ప్రభుత్వ వైద్య వ్యవస్థ గురించి బయట వినిపించేంత సౌకర్యం తనకు కనిపించలేదని హర్ష్ గుప్తా చెప్పారు.కెనడాలోని చలి వాతావరణం కూడా పెద్ద సమస్య అని హర్ష్ పేర్కొన్నారు. అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు ఎక్కువగా చలి ఉండటంతో బయట తిరగడం కష్టమవుతుందని, రోజంతా చలికోట్లు వేసుకోవాల్సి వస్తుందని చెప్పారు. ఈ కారణంగా చాలామందికి ఒంటరితనం, నిరుత్సాహం కూడా కలుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.హర్ష్ గుప్తా చెప్పిన విషయాలతో అందరూ ఏకీభవించలేదు. కొందరు నిజంగానే కెనడాలో ఇంటి అద్దెలు, పన్నులు, ఉద్యోగ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని చెప్పినప్పటికీ.. మరికొందరు మాత్రం కెనడాలో ప్రశాంతమైన జీవితం, మంచి భద్రత, పిల్లలకు మంచి విద్య, ఆరోగ్యకరమైన వాతావరణం లభిస్తాయని చెప్పారు. కుటుంబంతో జీవించడానికి కెనడా చాలా మంచి దేశమని మరికొందరు తమ అనుభవాలను పంచుకున్నారు. విదేశాలు కొందరికి విజయాన్ని అందిస్తే, మరికొందరికి అనేక ఇబ్బందులను కూడా చూపిస్తాయని ఇంకొందరు అన్నారు.ఇదీ చదవండి: ఇలా చేస్తే.. ట్రైన్ మొత్తం బుక్ చేసుకోవచ్చు! -
తండ్రి జ్ఞాపకార్థం.. రూ.100 కోట్లతో యూనివర్సిటీ!
ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్ అధినేత డాక్టర్ సుభాష్ చంద్ర తన తండ్రి, ప్రముఖ సామాజిక కార్యకర్త స్వర్గీయ నంద కిషోర్ గోయెంకా జ్ఞాపకార్థం ఒక ప్రతిష్టాత్మక విద్యా సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. 'శ్రీ నంద్ కిషోర్ గోయెంకా విశ్వవిద్యాలయం' పేరుతో మొత్తం 32 ఎకరాల విస్తీర్ణంలో రూ.100 కోట్ల భారీ వ్యయంతో ఈ యూనివర్సిటీని నిర్మించనున్నారు.యూనివర్సిటీ ముఖ్య విశేషాలుసామాజిక సేవపై ప్రత్యేక కోర్సు: నంద కిషోర్ గోయెంకా వారసత్వాన్ని, మానవీయ విలువలను రాబోయే తరాలకు అందించేలా ఈ విశ్వవిద్యాలయంలో 'సామాజిక సేవ మరియు దాతృత్వం' (Social Service and Philanthropy)పై ఒక ప్రత్యేక కోర్సును ప్రారంభించనున్నారు.పేద విద్యార్థులకు ప్రాధాన్యత: ఆర్థికంగా వెనుకబడిన, పేద విద్యార్థులకు ఈ యూనివర్సిటీలో తగిన స్థానం, ప్రాధాన్యత ఉంటుందని డాక్టర్ సుభాష్ చంద్ర స్పష్టం చేశారు.వచ్చే ఏడాది నుంచే ప్రారంభం: ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన విధి విధానాలను త్వరలోనే పూర్తి చేసి, వచ్చే ఏడాది నుంచే యూనివర్సిటీ విద్యా కార్యకలాపాలు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. -
ఉద్యోగానికి రిజైన్ చేయకుండానే ప్రపంచ యాత్ర
‘లక్షల రూపాయల ప్యాకేజీ ఉన్న కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసి ప్రపంచాన్ని చుట్టేయడానికి బయలుదేరాను’ అంటూ ప్రస్తుతం సోషల్ మీడియా రీల్స్లో చాలా మంది ఇన్ఫ్యుయెన్సర్లు చెప్పడం చూశాం. స్థిరమైన కెరీర్ను వదులుకుంటేనే కలలను సాకారం చేసుకోగలమనే ఒక భ్రమను ఈ ధోరణి సృష్టిస్తోంది. అయితే, ఈ నెరేటివ్ను సవాలు చేస్తూ తన ఫుల్టైమ్ 9-5 జాజ్ను కాపాడుకుంటూనే ప్రపంచాన్ని చుట్టేస్తున్న పంజాబ్కు చెందిన లైఫ్స్టైల్, ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ ఆనీ శర్మ సరికొత్త పంథాతో వార్తల్లో నిలిచారు.ఆనీ శర్మ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్న వివరాల ప్రకారం.. స్థిరమైన ఆదాయాన్ని, కెరీర్ను పణంగా పెట్టకుండానే ప్రయాణాల పట్ల ఉన్న అభిరుచిని ఎలా కొనసాగించవచ్చో నిరూపించారు. ఆమె అనుసరిస్తున్న వ్యూహాలు కొందరు వర్కింగ్ ప్రొఫెషనల్స్కు ఆదర్శంగా నిలుస్తున్నాయి.ముందస్తు ప్రణాళిక: ప్రతి పర్యటనను కొన్ని నెలల ముందే పక్కాగా ప్లాన్ చేసుకోవడం, బడ్జెట్ను క్రమశిక్షణతో నిర్వహించడం వల్ల ఖర్చులు అదుపులో ఉంటాయి.శాండ్విచ్ పద్ధతి: ఆమె సాధారణంగా 4-5 రోజుల చిన్న ట్రిప్స్ కాకుండా 10 రోజుల సుదీర్ఘ పర్యటనలను ఎంచుకుంటారు. రెండు వారాంతాలను కలుపుతూ మధ్యలో వచ్చే పనిదినాలను మేనేజ్ చేస్తారు.రిమోట్ వర్క్ వినియోగం: ఆమెకు ఉన్న రిమోట్ వర్క్ సౌలభ్యం దీనికి ఎంతో ఉపయోగపడుతోంది. పర్యటనలో ఉన్నప్పుడు వారాంతాల్లో స్థానిక ప్రాంతాలను అన్వేషిస్తూ పనిదినాల్లో రిమోట్గా ఆఫీస్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.అదనపు ఆదాయ వనరులు: ఉద్యోగ జీతంతో పాటు సోషల్ మీడియా కొలాబొరేషన్స్, బ్రాండ్ స్పాన్సర్షిప్స్ ద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తూ ప్రయాణ ఖర్చులను సమతుల్యం చేసుకుంటున్నారు.ఉద్యోగాలు వదిలేయండనే తోటివారి ఒత్తిడికు లోనుకావద్దని ఆనీ శర్మ హితవు పలికారు. రిమోట్ వర్క్ సంస్కృతిని, సమయాన్ని స్మార్ట్గా మేనేజ్ చేసుకుంటే కెరీర్ ఎదుగుదలను, వ్యక్తిగత సంతోషాన్ని సమతుల్యంగా ముందుకు తీసుకెళ్లవచ్చని ఆమె చెప్పారు.ఇదీ చదవండి: IRCTC వెబ్సైట్ కొత్త అవతారం.. అదిరిపోయే ఫీచర్లు -
మీ అంతరాత్మను కదిలించే పనే చేయండి!
ఆధునిక సాంకేతిక ప్రపంచాన్ని శాసిస్తున్న గూగుల్ మాతృసంస్థ ‘ఆల్ఫాబెట్’ సీఈఓ సుందర్ పిచాయ్ యువతకు, ముఖ్యంగా విద్యార్థులకు సందేశాన్ని ఇచ్చారు. సమాజం తమపై ఉంచే అంచనాలు, తల్లిదండ్రుల కోరికల కోసం కాకుండా తమను ఏ రంగం అయితే అమితంగా ఆకర్షిస్తుందో ఆ రంగంలోనే కెరీర్ను ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. ఇటీవల ప్రతిష్టాత్మక స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చేసిన ప్రసంగంలో ఆయన పంచుకున్న అంశాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విద్యార్థుల్లో చర్చకు దారితీశాయి.తల్లిదండ్రుల కలలు.. సమాజపు అంచనాలు వద్దు!‘మీ తల్లిదండ్రులు మీ నుంచి ఏం ఆశిస్తున్నారనే దానిపై లేదా మీ స్నేహితులు ఏం చేస్తున్నారనే దానిపై దృష్టి పెట్టకండి. సమాజం అంచనాలను పక్కనబెట్టండి. రాత్రి వేళల్లో కూడా రూమ్మేట్స్తో మీరు దేని గురించి అయితే ఉత్సాహంగా మాట్లాడుకుంటారో, మీ అంతరాత్మను ఏది కదిలిస్తుందో ఆ రంగంలోనే ముందుకు సాగండి’ అని పిచాయ్ ఉద్ఘాటించారు.భారతదేశంలో మెజారిటీ కుటుంబాలు ఇప్పటికీ పిల్లల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి సంప్రదాయ కోర్సులవైపే మొగ్గు చూపుతున్న తరుణంలో చెన్నైలోని ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి గూగుల్ అధినేతగా ఎదిగిన సుందర్ పిచాయ్ నోట ఈ మాటలు రావడం గమనార్హం.సుందర్ చెప్పే జీవిత సూత్రాలుఆశావాదాన్ని ఎంచుకోండి: ప్రపంచంలో ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ.. పరిస్థితులు మన నియంత్రణలో లేనప్పుడు వాటికి మనం ఎలా స్పందిస్తున్నామనేదే ముఖ్యం. ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండాలి.కఠిన సవాళ్లను స్వీకరించండి: గూగుల్ ‘క్రోమ్’ బ్రౌజర్ను ప్రారంభించిన కొత్తలో అప్పటి మైక్రోసాఫ్ట్ సీఈఓ స్టీవ్ బాల్మర్ దాన్ని చాలా చిన్న విషయంగా కొట్టిపారేశారు. అయినా వెనకడుగు వేయకుండా కష్టపడటం వల్లే నేడు క్రోమ్ ప్రపంచంలోనే నంబర్ వన్ బ్రౌజర్గా నిలిచింది. సవాళ్లను ఎదుర్కొంటేనే గుర్తింపు లభిస్తుంది.ఒత్తిళ్లతో నిర్ణయాలు తీసుకోవద్దు: పిచాయ్ తండ్రి ఏడాది జీతాన్ని పొదుపు చేసి తనను ఉన్నత చదువులకై అమెరికా పంపిన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. భారతీయ తల్లిదండ్రులు పిల్లల చదువు కోసం ఎన్నో త్యాగాలు చేస్తారని, అయితే అదే సమయంలో వారి ఆలోచనలను కూడా గౌరవించాల్సిన అవసరం ఉందని ఈ ప్రసంగంలో స్పష్టం చేశారు.ఇదీ చదవండి: IRCTC వెబ్సైట్ కొత్త అవతారం.. అదిరిపోయే ఫీచర్లు -
యూకే వీసా.. ఇండియన్స్కి గుడ్ న్యూస్
యునైటెడ్ కింగ్డమ్.. యూకే వెళ్లాలని, అక్కడ చదువుకోవాలని, ఉద్యోగం చేయాలని చాలామంది కలలు కంటుంటారు. అయితే ఆ అవకాశం అందరికీ దొరకదు. కానీ ఇప్పుడు యూకేలో ఉద్యోగం, ఉన్నత విద్య లేదా అంతర్జాతీయ అనుభవం కోసం ఎదురుచూస్తున్న భారత యువతకు మరో కీలక అవకాశం లభించింది. ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ (India Young Professionals Scheme - YPS) కింద 2026 సంవత్సరానికి సంబంధించిన రెండో, చివరి బ్యాలెట్ జూలై 21 నుంచి ప్రారంభం కానుంది.ఈ వీసా స్కీమ్ ప్రత్యేకత ఏమిటంటే.. ముందుగానే ఉద్యోగ ఆఫర్ లేదా యజమాని స్పాన్సర్షిప్ అవసరం లేకుండానే అర్హులైన భారతీయులు యూకేలో రెండేళ్ల వరకు నివసిస్తూ, ఉద్యోగం చేయడం లేదా చదువుకోవడం చేయవచ్చు. ఈ వివరాలను యూకే ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.జూలై 21 నుంచి 48 గంటలపాటు బ్యాలెట్యూకే ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారం బ్యాలెట్ జూలై 21, 2026 మధ్యాహ్నం 1:30 గంటలకు (IST)ప్రారంభమై, జూలై 23 మధ్యాహ్నం 1:30 గంటలకు ముగుస్తుంది. ఈ బ్యాలెట్లో నమోదు పూర్తిగా ఉచితం. అయితే బ్యాలెట్లో ఎంపికైన వారికి మాత్రమే తదుపరి వీసా దరఖాస్తు చేసే అవకాశం లభిస్తుంది. ఫలితాలను బ్యాలెట్ ముగిసిన రెండు వారాల్లోపు ఈమెయిల్ ద్వారా తెలియజేస్తారు.మొత్తం 3,000 వీసాలు..2026 సంవత్సరానికి ఈ పథకం కింద మొత్తం 3,000 వీసా స్థానాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఎక్కువ భాగం ఇప్పటికే ఫిబ్రవరిలో నిర్వహించిన తొలి బ్యాలెట్లో కేటాయించగా, మిగిలిన స్థానాలను ఇప్పుడు నిర్వహించే రెండో, చివరి బ్యాలెట్ ద్వారా భర్తీ చేయనున్నారు. అందుకే ఇది ఈ ఏడాది చివరి అవకాశం కానుంది.అర్హతలు ఇవే..ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు కింది అర్హతలు కలిగి ఉండాలి.భారతీయ పౌరుడు అయి ఉండాలి.వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.కనీసం బ్యాచిలర్ డిగ్రీ లేదా సమాన అర్హత ఉండాలి.యూకేలో ప్రారంభ ఖర్చులకు సరిపడా 2,530 పౌండ్లు (సుమారు రూ.3.27 లక్షలు) పొదుపు ఉన్నట్లు నిరూపించాలి.ఇతర వీసా అర్హతలను కూడా పూర్తి చేయాలి.దరఖాస్తు ఎలాగంటే..అర్హులైన అభ్యర్థులు యూకే ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో బ్యాలెట్లో నమోదు చేసుకోవాలి. నమోదు సమయంలో పూర్తి పేరు, పుట్టిన తేదీ, పాస్పోర్ట్ వివరాలు, పాస్పోర్ట్ స్కాన్ కాపీ, ఫోన్ నంబర్, ఈమెయిల్ వంటి వివరాలు సమర్పించాలి. నమోదు చేసిన సమాచారం పాస్పోర్ట్లోని వివరాలతో పూర్తిగా సరిపోవాలి.ఎంపికైతే ఏమి చేయాలి?బ్యాలెట్లో పేరు ఎంపికైన వారికి ఈమెయిల్ ద్వారా సమాచారం అందుతుంది. ఆ తేదీ నుంచి 90 రోజుల్లోపు వీసా కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. అలాగే వీసా ఫీజు, ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్చార్జ్ చెల్లించి, బయోమెట్రిక్ వివరాలు సమర్పించాలి. బ్యాలెట్లో ఎంపిక కావడం మాత్రమే వీసా మంజూరుకు హామీ కాదని, తుది పరిశీలన అనంతరం మాత్రమే వీసా జారీ అవుతుందని యూకే ప్రభుత్వం స్పష్టం చేసింది.ఎంత ఖర్చవుతుంది?వీసా దరఖాస్తు సమయంలో 340 పౌండ్లు వీసా ఫీజుతో పాటు 1,552 పౌండ్లు ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్చార్జ్ చెల్లించాలి. అదనంగా కనీసం 2,530 పౌండ్లు వ్యక్తిగత పొదుపు ఉన్నట్లు ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది.గుర్తుంచుకోవాల్సిన విషయాలుఒక్కో బ్యాలెట్కు ఒక్కసారి మాత్రమే నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ ఎంట్రీలు చెల్లవు. ఈసారి ఎంపిక కాకపోయినా అర్హత కొనసాగితే భవిష్యత్లో నిర్వహించే బ్యాలెట్లకు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ ఏడాదికి జూలై బ్యాలెట్నే చివరిదిగా యూకే ప్రభుత్వం ప్రకటించింది. అందువల్ల ఆసక్తి ఉన్న యువత ముందుగానే అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకుని నిర్ణీత గడువులో దరఖాస్తు చేసుకోవడం మంచిది. -
యూపీఐ ఉచిత సేవలకు బ్రేక్?
దేశంలో డిజిటల్ విప్లవానికి మారుపేరుగా నిలిచిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీల నిర్వహణలో త్వరలోనే ఒక కీలక మార్పు చోటుచేసుకోబోతోంది. గత ఐదేళ్లుగా ‘జీరో’గా ఉన్న మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) లేదా మర్చంట్ ఫీజును పెద్ద వ్యాపార సంస్థల లావాదేవీలపై తిరిగి పునరుద్ధరించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్బీఐ కసరత్తు చేస్తున్నాయి. దీనికి సంబంధించిన ముసాయిదా ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వం వద్ద తుది ఆమోదం కోసం వేచి ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.ఏమిటీ ప్రతిపాదన? ఎవరిపై ప్రభావం?పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ)తో పాటు బ్యాంకింగ్ రంగానికి చెందిన ప్రముఖులు కేంద్ర ప్రభుత్వానికి అందించిన సిఫార్సుల ప్రకారం.. ఈ కొత్త మర్చంట్ ఫీజు పరిధిలోకి కేవలం పెద్ద వ్యాపారాలు, ఈ-కామర్స్ దిగ్గజాలు మాత్రమే రానున్నాయి.వార్షిక టర్నోవర్ రూ.40 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ (జీఎస్టీ ఫైలింగ్స్ ఆధారంగా) ఉన్న పెద్ద మర్చంట్లు, లేదా రోజువారీ భారీ లావాదేవీలు జరిపే సంస్థలపైనే ఈ ఫీజు విధించే అవకాశం ఉంది.వార్షిక టర్నోవర్ రూ.40 లక్షల లోపు ఉండే చిన్న కిరాణా దుకాణాలు, వీధి వ్యాపారులకు దీని నుంచి పూర్తిగా మినహాయింపు ఉంటుంది.ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి బదిలీ చేసుకునే(పీర్-టు-పీర్) సాధారణ యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితంగానే కొనసాగుతాయి.గమనిక: ఈ విధానంలో ఒక కఠినమైన నిబంధనను కూడా చేర్చనున్నారు. పెద్ద వ్యాపారులు ఈ ఎండీఆర్ భారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగదారులపై రుద్దకూడదు. వ్యాపార నిర్వహణ వ్యయం కింద మర్చంట్లే దీన్ని భరించాల్సి ఉంటుంది.ఫీజు పునరుద్ధరణకు దారితీసిన కారణాలుకేంద్ర ప్రభుత్వం జనవరి 2020 నుంచి యూపీఐ, రూపే డెబిట్ కార్డ్ లావాదేవీలపై ఎండీఆర్ను పూర్తిగా రద్దు చేసింది. దీనివల్ల డిజిటల్ లావాదేవీలు ఊహించని స్థాయికి పెరిగినప్పటికీ ఫిన్టెక్ రంగానికి, బ్యాంకుల మౌలిక వసతుల నిర్వహణకు ఇది తీవ్ర ఆర్థిక భారంగా మారింది.నిపుణుల అంచనాల ప్రకారం.. యూపీఐ వ్యవస్థను సమర్థవంతంగా నడపడానికి, సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయడానికి ఏడాదికి దాదాపు రూ.10,000 కోట్లు అవసరం అవుతుండగా ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ కేవలం కొంత భాగాన్ని మాత్రమే భర్తీ చేస్తోంది.జీరో-ఎండీఆర్ విధానం వల్ల పేమెంట్ గేట్వేలు, బ్యాంకులు, ఫోన్పే, గూగుల్పే, పేటీఎం వంటి యాప్లకు స్థిరమైన ఆదాయం కరువైంది. ఇది కొత్త ఆవిష్కరణలకు అడ్డుకట్ట వేస్తోందని పార్లమెంటరీ కమిటీ కూడా గతంలో అభిప్రాయపడింది.పెద్ద వ్యాపారాలపై కనీసం 0.25-0.3% వరకు నామమాత్రపు ఎండీఆర్ విధించడం ద్వారా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత పటిష్టం చేయవచ్చని పరిశ్రమ వర్గాలు ప్రధాని నరేంద్ర మోదీకి సైతం లేఖ రాశాయి.పరిశ్రమపై పడే ప్రభావంఅమెజాన్, ఫ్లిప్కార్ట్, జొమాటో, స్విగ్గీ, జెప్టో వంటి పెద్ద సంస్థలు ఇప్పటికే వీసా, మాస్టర్కార్డ్ డెబిట్/ క్రెడిట్ కార్డ్ లావాదేవీల కోసం మర్చంట్ ఫీజులు చెల్లిస్తున్నాయి. కాబట్టి యూపీఐపై కూడా నామమాత్రపు ఫీజు విధిస్తే వారి వ్యాపారాలపై పెద్దగా ప్రభావం పడకపోవచ్చని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా, దీనివల్ల బ్యాంకులకు, థర్డ్ పార్టీ యాప్లకు తగిన ఆదాయం సమకూరి మరింత మెరుగైన సాంకేతికతను అందుబాటులోకి తెచ్చే వీలుంటుంది. ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాల నుంచి దీనిపై అధికారిక ప్రటకన రావడమే తరువాయి ఈ నిబంధనలు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయనే దానిపై త్వరలోనే స్పష్టత రానుంది.ఇదీ చదవండి: IRCTC వెబ్సైట్ కొత్త అవతారం.. అదిరిపోయే ఫీచర్లు -
ఆధార్ అందుకు పనికిరాదు! తేల్చేసిన హైకోర్టు
దేశంలో అన్నింటికీ ఆధార్ కార్డునే ఆధారంగా చాలా మంది పరిగణిస్తుంటారు. అయితే మోటారు ప్రమాద పరిహారం (Motor Accident Compensation) నిర్ణయించే సమయంలో బాధితుడి వయస్సును కేవలం ఆధార్ కార్డు ఆధారంగా నిర్ణయించరాదని ఛత్తీస్గఢ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఆధార్ ప్రధానంగా గుర్తింపు పత్రం మాత్రమేనని, అది పుట్టిన తేదీకి తుది, నిర్ధారిత ఆధారంగా పరిగణించలేమని పేర్కొంది.వయస్సు నిర్ధారణ కోసం జనన ధ్రువీకరణ పత్రం, పాఠశాల రికార్డులు, వైద్య పత్రాలు వంటి చట్టబద్ధమైన, విశ్వసనీయ ఆధారాలనే పరిగణనలోకి తీసుకోవాలని న్యాయస్థానం సూచించింది. ఈ తీర్పు గతంలో సుప్రీంకోర్టు వెల్లడించిన న్యాయసూత్రాలకు అనుగుణంగానే ఉందని కోర్టు పేర్కొంది.జస్టిస్ సచిన్ సింగ్ రాజ్పుత్ విచారించిన మూడు అనుబంధ మోటారు ప్రమాద అప్పీళ్లలో ఈ కీలక తీర్పు వెలువడింది. గాయపడిన రంజిత్ భుంజియా వయస్సును మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (MACT) కేవలం ఆధార్ ఆధారంగా 68 ఏళ్లుగా పరిగణించింది. దీంతో భవిష్యత్ ఆదాయ నష్టాన్ని లెక్కించేందుకు తక్కువ మల్టిప్లయర్ వర్తింపజేసి పరిహారాన్ని తగ్గించింది.అయితే హైకోర్టు పిటిషన్, వైద్య రికార్డులు, వైకల్య ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి బాధితుడి వయస్సు 61–65 సంవత్సరాల మధ్య ఉంటుందని నిర్ధారించింది. దాంతో పరిహారాన్ని రూ.96,400 నుంచి రూ.3.90 లక్షలకు పెంచింది. ఇదే ప్రమాదంలో మరణించిన మరో ఇద్దరు బాధితుల కుటుంబాలకు కూడా పరిహారాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ కేసులో బీమా కంపెనీల బాధ్యతపై కూడా హైకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది. ప్రీమియం చెల్లించిన సమయం నుంచి కాకుండా, బీమా పాలసీలో పేర్కొన్న తేదీ, సమయం నుంచే బీమా ఒప్పందం అమల్లోకి వస్తుందని తెలిపింది. కాబట్టి ప్రమాదం జరిగిన సమయంలో పాలసీ ఇంకా అమల్లోకి రాకపోతే, ప్రీమియం ముందే చెల్లించినా బీమా సంస్థపై బాధ్యత ఉండదని తీర్పులో పేర్కొంది.మరో ముఖ్యమైన అంశంగా, ఒకే మోటార్సైకిల్పై ముగ్గురు ప్రయాణించడం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనే అయినప్పటికీ, ఆ కారణం వల్లే ప్రమాదం జరిగిందని నిరూపించకపోతే దానిని "సహకార నిర్లక్ష్యం" (Contributory Negligence)గా పరిగణించి పరిహారం తగ్గించరాదని హైకోర్టు స్పష్టం చేసింది. ట్రాఫిక్ ఉల్లంఘనకు ప్రమాదంతో ప్రత్యక్ష సంబంధం ఉన్నప్పుడే పరిహారంపై ప్రభావం చూపుతుందని న్యాయస్థానం పేర్కొంది. -
ఈ రైలు ఎక్కాలంటే... ఆస్తులు అమ్ముకోవాల్సిందే!
జపాన్ అంటే ప్రపంచానికి గుర్తొచ్చేది బుల్లెట్ రైళ్లు. గంటకు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే షింకాన్సెన్ రైళ్లు అక్కడి రవాణా వ్యవస్థకు ప్రతీకగా నిలిచాయి. అయితే అదే జపాన్లో వేగానికి పూర్తిగా భిన్నమైన తత్వంతో నడిచే ఓ విలాసవంతమైన రైలు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. అదే ‘సెవెన్ స్టార్స్ ఇన్ క్యుషు’ (Seven Stars in Kyushu). గమ్యస్థానానికి త్వరగా చేరుకోవడం కాదు.. ప్రయాణంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించడమే ఈ రైలు ప్రత్యేకత.2013 అక్టోబర్ 15న జేఆర్ క్యుషు (JR Kyushu) ప్రారంభించిన ఈ లగ్జరీ స్లీపర్ రైలు జపాన్లో తొలి క్రూయిజ్-శైలి విలాసవంతమైన రైలుగా గుర్తింపు పొందింది. 2022లో దీన్ని మరింత ఆధునికంగా పునర్నిర్మించి టీ రూమ్, బార్ లౌంజ్, సలోన్ వంటి కొత్త సౌకర్యాలను జోడించారు. ప్రపంచంలోని అత్యుత్తమ లగ్జరీ రైలు ప్రయాణాల్లో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది.క్యుషు అందాలను ఆస్వాదించే ప్రత్యేక యాత్రఈ రైలు ఫుకువోకాలోని హకాటా స్టేషన్ నుంచి బయలుదేరి మళ్లీ అక్కడికే చేరుతుంది. సీజన్ను బట్టి రెండు రకాల ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి.2 రోజులు – 1 రాత్రి: ఉత్తర క్యుషు ప్రాంతంలోని ప్రకృతి, స్థానిక వంటకాలు, గ్రామీణ సంస్కృతిని పరిచయం చేస్తుంది.4 రోజులు – 3 రాత్రులు: ఫుకువోకా, ఓయిటా, మియాజాకి, కగోషిమా, కుమామోటో, నాగసాకి తదితర ప్రాంతాల గుండా ప్రయాణిస్తూ అగ్నిపర్వతాలు, సముద్రతీరాలు, హాట్ స్ప్రింగ్స్, చారిత్రక పట్టణాలు, కళాకారుల గ్రామాలను చూపిస్తుంది. ప్రతి సీజన్కు అనుగుణంగా మార్గంలో స్వల్ప మార్పులు చేస్తారు.రూ.17 లక్షల వరకు టికెట్!ఈ రైలులో ప్రయాణం చాలా ఖరీదైన వ్యవహారమే. సామాన్యులు ఇందులో ప్రయాణించలేరు. 2 రోజుల ప్యాకేజీకి ఒక్కొక్కరికి సుమారు 7 లక్షల నుంచి 16 లక్షల యెన్ల వరకు (దాదాపు రూ.4 లక్షల నుంచి రూ.9.5 లక్షల వరకు) ఖర్చవుతుంది. అదే 4 రోజుల ప్యాకేజీ ఛార్జీ 13.5 లక్షల నుంచి 28.5 లక్షల యెన్ల వరకు (సుమారు రూ.8 లక్షల నుంచి రూ.17 లక్షల వరకు) ఉంటుంది.ఈ టికెట్లోనే లగ్జరీ వసతి, అన్ని భోజనాలు, పానీయాలు, స్థానిక విహారయాత్రలు, ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. సీజన్, క్యాబిన్ రకం ఆధారంగా ధరలు మారుతుంటాయి.కళ్లు చెదిరే ప్రత్యేకతలుఈ రైలులో ప్రయాణికుల సంఖ్య చాలా పరిమితం. కొద్దిమందికే అవకాశం ఉండటంతో ప్రతి అతిథికి వ్యక్తిగత సేవలు అందిస్తారు. ప్రముఖ డిజైనర్ ‘ఈజీ మిటూకా’ రూపొందించిన ఇంటీరియర్స్లో సంప్రదాయ జపనీస్ చెక్క కళ, చేతితో తయారు చేసిన ఫర్నిచర్, ఆధునిక సౌకర్యాల సమ్మేళనం కనిపిస్తుంది. పెద్ద గాజు కిటికీల ద్వారా పర్వతాలు, సముద్రతీరాలు, అడవులు, గ్రామీణ ప్రాంతాల అందాలను ప్రశాంతంగా వీక్షించేలా రైలు నెమ్మదిగా ప్రయాణిస్తుంది.ఫైవ్ స్టార్ హోటల్కు ఏమాత్రం తీసిపోని సూట్లుప్రతి సూట్లో విశాలమైన కిటికీలు, ప్రైవేట్ బాత్రూమ్, లాంజ్ స్పేస్, విలాసవంతమైన చెక్క అలంకరణలు ఉంటాయి. డీలక్స్ సూట్లలో మరింత విశాలమైన స్థలం, అద్భుతమైన వీక్షణలు, అధిక గోప్యత, ప్రీమియం ఫర్నిషింగ్స్ అందుబాటులో ఉంటాయి.రుచుల పండుగఈ రైలు ప్రయాణంలో భోజనం కూడా ప్రధాన ఆకర్షణే. క్యుషు ప్రాంతానికి చెందిన సీజనల్ సీఫుడ్, స్థానిక మాంసాహార వంటకాలు, తాజా వ్యవసాయ ఉత్పత్తులు, ప్రాంతీయ ప్రత్యేక వంటకాలు, జపనీస్ సాకేతో కూడిన మెనూను ప్రముఖ చెఫ్లు సిద్ధం చేస్తారు. ప్రతి సీజన్కు అనుగుణంగా మెనూ మారుతుంది.రైలు బయటా ప్రత్యేక అనుభూతులుప్రయాణంలో భాగంగా ప్రయాణికులను చారిత్రక దేవాలయాలు, సంప్రదాయ కుండల తయారీ గ్రామాలు, హాట్ స్ప్రింగ్ రిసార్టులు, కళాకారుల వర్క్షాప్లు, సాంస్కృతిక ప్రదర్శనలకు తీసుకెళ్తారు. దీంతో క్యుషు ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను దగ్గరగా అనుభూతి చెందే అవకాశం లభిస్తుంది.టికెట్ దొరకడం అంత ఈజీ కాదుఈ రైలుకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. ప్రతి ట్రిప్లో చాలా తక్కువ మంది మాత్రమే ప్రయాణించగలగడం వల్ల సాధారణ రిజర్వేషన్ కాకుండా అనేక సార్లు లాటరీ విధానంలో ప్రయాణికులను ఎంపిక చేస్తారు. అందుకే ఈ రైలులో ప్రయాణించడం ఎంతో అరుదైన అనుభవంగా భావిస్తారు.మొత్తంగా ‘సెవెన్ స్టార్స్ ఇన్ క్యుషు’ కేవలం ఒక రైలు కాదు.. జపాన్ ప్రకృతి, సంస్కృతి, ఆతిథ్యం, వంటకాల్ని ఒకే ప్రయాణంలో అనుభూతి చెందే విలాసవంతమైన జీవనశైలి. లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చినా, జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రయాణం చేయాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న లగ్జరీ ట్రావెల్ ప్రేమికులు కలలు కంటుండటానికి ఇదే కారణం. View this post on Instagram A post shared by Kara and Nate (@karaandnate) -
IRCTC వెబ్సైట్ కొత్త అవతారం.. అదిరిపోయే ఫీచర్లు
దేశంలో కోట్లాది మంది రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ ఊరటనిచ్చింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సరికొత్త ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) టికెట్ బుకింగ్ వెబ్సైట్ నేడు అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. గత వెబ్సైట్లో ఎదుర్కొన్న సాంకేతిక ఇబ్బందులు, తత్కాల్ సమయంలో సర్వర్ నిలిచిపోవడం వంటి సమస్యలకు చెక్ పెడుతూ అత్యాధునిక సాంకేతికతతో, క్లీన్ డిజైన్తో ఈ ప్లాట్ఫారమ్ను తీర్చిదిద్దారు.సామర్థ్యంలో రికార్డు స్థాయి వృద్ధిఈ నూతన పోర్టల్ ప్రధాన బలం దాని బుకింగ్, ప్రాసెసింగ్ సామర్థ్యం. పాత వెబ్సైట్లో నిమిషానికి కేవలం 32,000 టికెట్లు మాత్రమే బుక్ చేసుకునే వీలుండగా ఇప్పుడు అప్గ్రేడ్ చేసిన ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్ఎస్) ద్వారా నిమిషానికి ఏకంగా 1.5 లక్షలకు పైగా టికెట్లను ఎలాంటి అంతరాయం లేకుండా బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా పీఎన్ఆర్ స్టేటస్, రైళ్ల వివరాల ఎంక్వైరీ సామర్థ్యం నిమిషానికి 4 లక్షల నుంచి రికార్డు స్థాయిలో 40 లక్షలకు పెరిగింది. ఇది తత్కాల్ బుకింగ్ సమయంలో సర్వర్ క్రాష్ అయ్యే అవకాశాలను పూర్తిగా నివారిస్తుంది.ప్రయాణికులను ఆకట్టుకునే ఫీచర్లుసాధారణ సమయాల్లో టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు చికాకు కలిగించే క్యాప్చా వెరిఫికేషన్ను తొలగించారు. దీనివల్ల తత్కాల్ బుకింగ్ కూడా మరింత వేగంగా ముగుస్తుంది.విమాన ప్రయాణాల తరహాలోనే వివిధ తేదీల్లో ఉండే టికెట్ ధరలను సులభంగా పోల్చి చూసుకునేందుకు వీలుగా ఒక ప్రత్యేక క్యాలెండర్ను అందుబాటులోకి తెచ్చారు.ప్రయాణికులు అన్ని తరగతుల సీట్ల లభ్యతను వేర్వేరుగా కాకుండా ఒకే స్క్రీన్పై చూసి నిర్ణయం తీసుకోవచ్చు.కింగ్ సమయంలోనే ప్రయాణికులు తమకు నచ్చిన సీటు లేదా బెర్త్ను ఎంచుకునే అవకాశాన్ని కల్పించారు.దివ్యాంగులు, విద్యార్థులకు ఒకే వేదికదివ్యాంగులు, విద్యార్థులు, వైద్య అవసరాల కోసం ప్రయాణించే రోగులకు అందించే ప్రత్యేక రాయితీలు, సేవలను వేర్వేరు పోర్టల్స్ ద్వారా కాకుండా ఈ సరికొత్త వెబ్సైట్లో ఒకే ప్లాట్ఫారమ్ పరిధిలోకి తీసుకువచ్చారు. దేశంలోని అందరు ప్యాసింజర్లకు ఉపయోగపడేలా ఈ పోర్టల్ను ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తెచ్చారు. చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేయడానికి ఐఆర్సీటీసీ-ఐపే, యూపీఐ సాంకేతికతను మరింత పటిష్టం చేశారు.ఇదీ చదవండి: మళ్లీ సీన్ రివర్స్.. ధరల దడ -
ఉదయం 3:30 వరకు పబ్లు, రెస్టారెంట్లు ఓపెన్!
ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్ల ప్రత్యక్ష ప్రసారాల నేపథ్యంలో సిలికాన్ సిటీ బెంగళూరులో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టోర్నమెంట్కు సంబంధించిన సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ ఉన్న రోజుల్లో (జులై 14, 15, 19 తేదీలు) నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్లను రాత్రి 1 గంటకు బదులు తెల్లవారుజామున 3:30 గంటల వరకు తెరిచి ఉంచేందుకు బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. కర్ణాటక పోలీస్ చట్టం పరిధిలో ఈ తాత్కాలిక సడలింపు ఇచ్చారు. అయితే, ఈ ఉత్తర్వులు కేవలం ఆహార పదార్థాల (ఫుడ్) సరఫరాకేనా లేక మద్యం (లిక్కర్) విక్రయాలకు కూడా వర్తిస్తాయా అనే అంశంపై గందరగోళం నెలకొంది.నిర్ణయ నేపథ్యం ఏమిటి?ప్రస్తుతం అమెరికా, కెనడా, మెక్సికో దేశాల వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 2:30 గంటల వరకు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) బెంగళూరు ప్రతినిధులు కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ను కలిసి మ్యాచ్లు వీక్షించేందుకు వచ్చే కస్టమర్ల సౌకర్యార్థం నగరంలోని వ్యాపార వేళలను పొడిగించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి క్రీడాభిమానుల ఉత్సాహాన్ని గౌరవిస్తూనే ప్రజా భద్రత, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.లిక్కర్ అనుమతిపై సందిగ్ధత!పోలీస్ కమిషనరేట్ జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్లో ఆహార సేవలను తెల్లవారుజామున 3:30 గంటల వరకు పొడిగిస్తున్నట్లు స్పష్టంగా పేర్కొన్నారు. కానీ, మద్యం సరఫరా, విక్రయాలపై ఎలాంటి ప్రత్యేక ప్రస్తావన చేయలేదు. సాధారణ నిబంధనల ప్రకారం బెంగళూరులో రాత్రి 1 గంట తర్వాత మద్యం విక్రయించడం చట్టవిరుద్ధం. దీంతో పబ్లు, బార్ల యజమానులు ఈ ఉత్తర్వులపై సందిగ్ధత వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నుంచి స్పష్టమైన రాతపూర్వక అనుమతి లేదా నిబంధనల సడలింపు వస్తేనే తెల్లవారుజాము వరకు మద్యం సరఫరా చేయడానికి వీలవుతుందని వాదిస్తున్నారు.శాంతిభద్రతలపై పోలీసుల నిఘామరోవైపు రాత్రి వేళల్లో సమయాన్ని పొడిగించడం వల్ల నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కఠిన నిబంధనలను విధించారు. లైవ్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసే యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. ఫుట్బాల్ అభిమానులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నైట్లైఫ్ సంస్కృతికి భంగం కలగకుండా పోలీసులకు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఏదేమైనా ఈ నిర్ణయం బెంగళూరు నైట్లైఫ్కు సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తుందా లేక లిక్కర్ సందిగ్ధత వల్ల నీరుగారిపోతుందా అనేది ఎక్సైజ్ శాఖ ఇచ్చే తదుపరి స్పష్టతపైనే ఆధారపడి ఉంది.ఇదీ చదవండి: మళ్లీ సీన్ రివర్స్.. ధరల దడ -
రైళ్లలో దుప్పట్లు మాయం.. రైల్వే యాక్షన్ ప్లాన్ ఇదే!
భారతీయ రైల్వేలో ప్రయాణికులకు అందించే సౌకర్యాలు ఎంత విలాసవంతంగా మారుతున్నాయో, అంతే స్థాయిలో కొందరు ప్రయాణికుల బాధ్యత లోపిస్తోందనడానికి తాజా సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) నివేదిక ఒక నిదర్శనం. ఏసీ కోచ్లలో ప్రయాణించే వారు బెడ్షీట్లు, దుప్పట్లు, తువ్వాళ్లను దొంగిలిస్తుండటంతో గడిచిన నాలుగేళ్లలో (జనవరి 2022 నుంచి మే 2026 వరకు) రైల్వే శాఖకు ఏకంగా రూ.104.51 కోట్ల భారీ నష్టం వాటిల్లింది. గణాంకాల ప్రకారం, ప్రతి వెయ్యి మంది ఏసీ ప్రయాణికుల్లో ఒకరు రైల్వే వస్తువులను తమతో పాటు పట్టుకెళ్తున్నారు.మాయమైన వస్తువుల వివరాలురైల్వే పరిధిలోని 54 డివిజన్ల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. అత్యధికంగా ఫేస్ టవల్స్ (ముఖం తుడుచుకునే తువ్వాళ్లు) దొంగలిస్తున్నారు.ఫేస్ టవల్స్: 46.54 లక్షలుబెడ్షీట్లు (దుప్పట్లు): 41.13 లక్షలుపిల్లో కవర్లు: 23.59 లక్షలుబ్లాంకెట్లు: 12.95 లక్షలుదిండ్లు: 2.76 లక్షలు2022 నుంచి 2025 మధ్య కాలంలో ఈ తరహా చోరీలు ఏకంగా 56 శాతం పెరగడం గమనార్హం. డివిజన్ల వారీగా చూస్తే రాజస్థాన్లోని బికనీర్ డివిజన్ 25.76 లక్షల వస్తువుల నష్టంతో అగ్రస్థానంలో ఉండగా రాంచీ, ఢిల్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే, కొన్ని డివిజన్లు అద్భుతమైన నియంత్రణను ప్రదర్శించాయి. తిరుచిరాపల్లి, పాలక్కాడ్ డివిజన్లలో ఒక్క చోరీ కూడా నమోదు కాకపోవడం విశేషం.ఎవరిపై భారం?రైల్వే నిబంధనల ప్రకారం వస్తువుల బాధ్యత కాంట్రాక్ట్ ఏజెన్సీలదే. వస్తువులు పోయినప్పుడు ఆ నష్టాన్ని కాంట్రాక్టర్ల బిల్లుల నుంచి మినహాయిస్తారు. దురదృష్టవశాత్తూ ఆ కాంట్రాక్టర్లు రోజుకు కేవలం రూ.700 వరకు సంపాదించే అటెండెంట్ల జీతాల నుంచి ఈ మొత్తాన్ని (దిండుకు రూ.115, బ్లాంకెట్కు రూ.343 చొప్పున) కట్ చేస్తున్నారు. ప్రయాణికుల నిర్వాకానికి పేద కార్మికులు బలి కావడం ఆందోళనకరం.నియంత్రణకు రైల్వే సరికొత్త వ్యూహంకోచ్ మిత్ర యాప్: అటెండెంట్లు ఈ యాప్ ద్వారా ప్రయాణికుల బోర్డింగ్, డీ-బోర్డింగ్ సమయాలను ట్రాక్ చేస్తూ వస్తువుల పంపిణీని పర్యవేక్షిస్తున్నారు.30 నిమిషాల రూల్: ప్రయాణం ముగియడానికి 30 నిమిషాల ముందే బెడ్రోల్ వస్తువులను తిరిగి సేకరించేలా ప్యాకెట్లపై స్పష్టమైన మార్గదర్శకాలు ముద్రిస్తున్నారు.సీసీటీవీ, ఆకస్మిక తనిఖీలు: కోచ్లలో నిఘా పెంచడంతో పాటు అనుమానాస్పద ప్రయాణికుల లగేజీని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సాయంతో చట్టబద్ధంగా తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.మౌలిక వసతుల కల్పనపై పెట్టాల్సిన నిధులు ఇలాంటి ప్రత్యామ్నాయాలకు ఖర్చవుతుండటం శోచనీయం. ఇప్పటికైనా ప్రయాణికులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇదీ చదవండి: మళ్లీ సీన్ రివర్స్.. ధరల దడ -
మైండ్ రీడింగ్, ఎయిర్ టాక్సీ కంపెనీల్లో పెట్టుబడి
భారతీయ స్టార్టప్ విభాగంలో జొమాటో సహ-వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ వ్యాపార ప్రయాణం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు దేశంలో ఆహార డెలివరీ రంగాన్ని శాసించిన ఆయన ఇటీవల జొమాటో సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకుని భవిష్యత్తును మార్చగల అత్యాధునిక సాంకేతిక (డీప్ టెక్) రంగాలపై దృష్టి పెట్టారు. ప్రధానంగా హెల్త్-టెక్ (ఆరోగ్య సాంకేతికత), ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ (వైమానిక, రక్షణ) రంగాలలో ఆయన చేస్తున్న భారీ పెట్టుబడులు ఇప్పుడు కార్పొరేట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.మెదడు పనితీరును అంచనా వేసే ‘టెంపుల్’హెల్త్-టెక్ రంగంలో దీపిందర్ గోయల్ ‘టెంపుల్’ అనే వేరబుల్ టెక్నాలజీ (ధరించగలిగే పరికరం) స్టార్టప్ను ప్రారంభించారు. కేవలం ఆలోచనల స్థాయిలోనే ఈ స్టార్టప్ ‘ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ’ ఫండింగ్ రౌండ్ ద్వారా సుమారు 54 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.450 కోట్లు) పెట్టుబడులను ఆకర్షించింది. దీనితో ఈ కంపెనీ మార్కెట్ విలువ 190 మిలియన్ డాలర్లకు చేరింది.సాధారణ స్మార్ట్వాచ్లు లేదా ఫిట్నెస్ రింగ్లలా కాకుండా ఈ ‘టెంపుల్’ పరికరాన్ని నుదుటి భాగాన ధరించాల్సి ఉంటుంది. ఇది మెదడులోని రక్త ప్రసరణను నిరంతరం పర్యవేక్షిస్తూ ‘ఎంట్రోపీ’ అనే సరికొత్త బయోమార్కర్ ఆధారంగా మానసిక ఒత్తిడి, ఏకాగ్రత, నిద్ర, అలసట వంటి మెటబాలిక్ మార్పులను రియల్ టైమ్లో లెక్కిస్తుంది. అథ్లెట్లు, వ్యాపార దిగ్గజాలు, హై-పర్ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని దాదాపు 1,000 డాలర్ల ధరతో దీనిని మార్కెట్లోకి తీసుకురానున్నారు. దీనితో పాటు మానవ ఆయుష్షును పెంచే పరిశోధనలు చేసే ‘కంటిన్యూ రీసెర్చ్’ సంస్థలోనూ ఆయన గతంలోనే 25 మిలియన్ డాలర్ల సొంత పెట్టుబడి పెట్టడం విశేషం.ఆకాశ మార్గంలో ‘లాట్ ఏరోస్పేస్’భారతీయ విమానయాన రంగాన్ని కూడా గోయల్ విప్లవాత్మకంగా మార్చేందుకు సిద్ధమయ్యారు. జొమాటో మాజీ సీఓఓ సురభి దాస్తో కలిసి ఆయన ‘లాట్ ఏరోస్పేస్’ అనే సంస్థను స్థాపించి అందులో 20 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టారు. సాధారణ ఎయిర్ టాక్సీలలా కాకుండా చిన్న నగరాలను అనుసంధానించేందుకు కేవలం 24 మంది ప్రయాణించగల తక్కువ రన్వేతో ల్యాండింగ్, టేకాఫ్ కాగల ‘స్టొల్’ (Short Takeoff and Landing) విమానాలను ఈ సంస్థ తయారు చేస్తోంది.ఈ ప్రస్థానంలో భాగంగా ‘లాట్ ఏరోస్పేస్’ ఇటీవల గురుగ్రామ్కు చెందిన రక్షణ రంగ రోబోటిక్స్ స్టార్టప్ ‘షరంగ్ శక్తి’ని కొనుగోలు చేసింది. స్వదేశీ రక్షణ సామర్థ్యాలను పెంపొందించడం, అలాగే తదుపరి తరం పౌర విమానయాన సాంకేతికతను భారత్లోనే అభివృద్ధి చేయడం ఈ కొనుగోలు ముఖ్య ఉద్దేశమని గోయల్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: కోట్లు ఉన్నా కొరత భావనేనా? -
1600 నెంబర్లను బ్లాక్ చేయొద్దు.. ట్రాయ్ కీలక ఆదేశాలు
నియంత్రిత సంస్థలు, ప్రభుత్వం నుంచి ప్రజలకు సమాచారాన్ని చేరవేసేందుకు ఉద్దేశించిన 1600 నంబర్ సిరీస్ నుంచి వచ్చే ఫోన్ కాల్స్ని ఏ యాప్ కూడా బ్లాక్ చేయడానికి వీల్లేదని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ స్పష్టం చేసింది. అలాగే 140 నంబర్ సిరీస్తో వచ్చే ప్రమోషనల్ కాల్స్ని తమ నిర్వహణలోని డీఎన్డీ రిజిస్ట్రీ తప్ప ఇతరత్రా ఏ యాప్ కూడా బ్లాక్ చేయడానికి లేదని వివరణ ఇచ్చింది.నిర్దిష్ట సిరీస్ల నుంచి వచ్చే కాల్స్ని ట్రూకాలర్ యాప్ స్పామ్ కింద లేబులింగ్ చేస్తున్న నేపథ్యంలో ట్రాయ్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, 1600, 140 నంబర్ సిరీస్లు దుర్వినియోగమవుతున్నాయంటూ 5.25 లక్షల మంది పైగా యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వాటిని ట్యాగ్ చేయడం తప్పెలా అవుతుందని ట్రూకాలర్ సీఈవో రిషిత్ ఝున్ఝున్వాలా తెలిపారు. ఈ రెండు సిరీస్లలో రోజూ 5.1 కోట్లకు పైగా కాల్స్కి యూజర్లు అసలు స్పందించడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ట్రూకాలర్ యూజర్లు ప్రతి రోజూ 140 సిరీస్ నుంచి వచ్చే 4 లక్షల కాల్స్ని, 1600 సిరీస్కి చెందిన 1.25 లక్షల కాల్స్ని బ్లాక్ చేస్తున్నట్లు వివరించారు. -
హైదరాబాద్లో ప్రారంభమైన బ్రిక్స్ ఇండియా 2026 సమ్మిట్
హైదరాబాద్లోని మారియట్ హోటల్లో మూడు రోజుల పాటు జరిగే బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026ను కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో కలిసి తెలంగాణ కార్మిక శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. జూలై 14 నుంచి 16 వరకు జరిగే ఈ అంతర్జాతీయ సదస్సుకు బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా సహా 14 దేశాల నుంచి 110 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు.ప్రస్తుత కాలంలో ఏఐ, ఆటోమేషన్ వంటి సాంకేతిక మార్పులతో కార్మిక రంగం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందని మంత్రి వివేక్ తెలిపారు. ఈ నేపథ్యంలో కార్మికులకు సామాజిక భద్రత, నైపుణ్యాభివృద్ధి, నిరంతర శిక్షణ అందించడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. కార్మికుల భద్రత, హక్కుల పరిరక్షణతోనే పరిశ్రమల అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.ఈ సదస్సులో భవిష్యత్ ఉద్యోగాలు, స్కిల్ డెవలప్మెంట్, కార్మిక హక్కులు, సామాజిక భద్రత, ట్రేడ్ యూనియన్ల బలోపేతం వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. వివిధ దేశాల్లో అమలవుతున్న ఉత్తమ కార్మిక విధానాలను అధ్యయనం చేసి, భవిష్యత్ కార్యాచరణకు సిఫార్సులు రూపొందించడం ఈ సమావేశం ప్రధాన లక్ష్యమని తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం కూడా యువతకు నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతోందని మంత్రి చెప్పారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా యువతకు ఆధునిక శిక్షణ అందిస్తున్నామని, టామ్కామ్ ద్వారా జర్మనీ, జపాన్, యూరప్, మధ్యప్రాచ్య దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు. ఈ సదస్సుకు భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS) ఆతిథ్యం ఇస్తోంది. -
మోస్ట్ పవర్ఫుల్ విమెన్ 2026.. టాప్ 10 జాబితా ఇదే!
ఫార్చ్యూన్ ఇండియా 'మోస్ట్ పవర్ఫుల్ విమెన్ (ఎంపీడబ్ల్యూ) 2026' జాబితాను విడుదల చేసింది. ఇందులో వ్యాపారం, రాజకీయాలు, పారిశ్రామిక రంగం, స్టార్టప్ వంటి వివిధ రంగాల్లోని మహిళలు ఉన్నారు. టాప్ 10 జాబితాలో రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్పర్సన్ నీతా అంబానీ మొదటి స్థానంలో నిలిచారు.తరువాత స్థానాల్లో వరుసగా ''రోష్నీ నాడార్ మల్హోత్రా, రెడ్డి సిస్టర్స్ (శోభన కామినేని, సంగీతా రెడ్డి, ప్రీతా రెడ్డి, సునీతా రెడ్డి), సావిత్రి జిందాల్, డాక్టర్ ప్రీతి అదానీ, కిరణ్ మజుందార్-షా, ఇషా అంబానీ, ప్రియా నాయర్, బేలా బజారియా, లీనా నాయర్'' ఉన్నారు.➤రోష్నీ నాడార్ మల్హోత్రా: హెచ్సీఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్➤శోభన కామినేని, సంగీతా రెడ్డి, ప్రీతా రెడ్డి, సునీతా రెడ్డి: అపోలో హాస్పిటల్స్ యాజమాన్యం➤సావిత్రి జిందాల్: జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ ఛైర్పర్సన్➤డాక్టర్ ప్రీతి అదానీ: అదానీ ఫౌండేషన్ ఛైర్పర్సన్➤కిరణ్ మజుందార్-షా: బయోకాన్ వ్యవస్థాపకురాలు & చైర్పర్సన్➤ఇషా అంబానీ: రిలయన్స్ రిటైల్ డైరెక్టర్➤ప్రియా నాయర్: హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ ఎండీ & సీఈఓ➤బేలా బజారియా: నెట్ఫ్లిక్స్ చీఫ్ కంటెంట్ ఆఫీసర్➤లీనా నాయర్: షెనెల్ (ఫ్యాషన్ బ్రాండ్) సీఈఓముంబైలోని ఫోర్ సీజన్స్ హోటల్లో జరిగిన 16వ ఎడిషన్ అవార్డుల ప్రదానోత్సవంలో నీతా అంబానీ ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ.. ఒక తల్లిగా తన కుమార్తె ఇషా అంబానీ (రిలయన్స్ రిటైల్ డైరెక్టర్) కూడా ఈ పవర్ఫుల్ 100 మంది జాబితాలో చోటు దక్కించుకోవడం తనకు గర్వకారణంగా ఉందన్నారు. -
యూఎస్ మార్కెట్కు వన్ప్లస్ గుడ్బై?
ఒకప్పుడు తక్కువ ధరలో ఫ్లాగ్షిప్ ఫోన్ అంటే.. చాలామందికి ముందుగా గుర్తొచ్చేది వన్ప్లస్. ప్రీమియం ఫీచర్లను అందుబాటు ధరలో అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్రాండ్ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకోబోతోందనే వార్తలు టెక్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీశాయి.జర్మన్ వార్తా సంస్థ విన్ఫ్యూచర్ కథనం ప్రకారం, వన్ప్లస్ తన మాతృసంస్థ ఒప్పోతో కలిసి అమెరికా, యూరప్ మార్కెట్ల నుంచి పూర్తిగా వైదొలగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై మీడియాతో ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహించినట్లు సమాచారం. అయితే.. ఈ నిర్ణయానికి అసలు కారణం ఏమిటనే విషయాన్ని కంపెనీ ఇప్పటివరకు వెల్లడించలేదు.నెట్టింట్లో వైరల్ అవుతున్న వార్తలు వన్ప్లస్ అభిమానుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే భారత్లో మాత్రం తన వ్యవహారాలను కొనసాగించనుంది. దీనికి కారణం కంపెనీకి భారత్ అతిపెద్ద మార్కెట్ కావడమే. చైనాలో కూడా సంస్థ తన కార్యకలాపాలను యథావిధిగా జరపనుంది.ఇప్పటికే వన్ప్లస్ ఫోన్ ఉపయోగిస్తున్న వారికి కూడా కంపెనీ ఒక క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం.. వినియోగంలో ఉన్న ఫోన్లకు వాటి సపోర్ట్ గడువు పూర్తయ్యే వరకు సాఫ్ట్వేర్ అప్డేట్లు, సెక్యూరిటీ అప్డేట్లు, సర్వీస్ సెంటర్ సేవలు అందుబాటులోనే ఉంటాయని తెలిపింది. అయితే.. కొత్త ఫోన్ల విడుదల, లేటెస్ట్ స్టాక్ విక్రయం, స్థానిక మార్కెటింగ్ కార్యక్రమాలు మాత్రం నిలిచిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే యూరప్లోని కొన్ని దేశాల్లో వన్ప్లస్ అధికారిక వెబ్సైట్లలో ఫోన్ల స్టాక్ కూడా దాదాపు ఖాళీ అయిపోయినట్లు తెలుస్తోంది. -
బ్రాండ్ రేస్లో దేశీయ దిగ్గజాలు!
ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక మందగమనం వంటి ప్రతికూల పరిస్థితులున్నా భారతీయ బ్రాండ్లు తిరుగులేని వృద్ధిని నమోదు చేస్తున్నాయి. అంతర్జాతీయ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ దేశీయ మార్కెట్ సత్తాను ప్రపంచ వేదికపై చాటుతున్నాయి. ప్రముఖ బ్రాండ్ వాల్యుయేషన్ కన్సల్టెన్సీ సంస్థ ‘బ్రాండ్ ఫైనాన్స్’ తాజాగా విడుదల చేసిన ‘ఇండియా 100’ నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ జాబితాలో భారతదేశపు అత్యంత విలువైన బ్రాండ్గా టాటా గ్రూప్ మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.రూ.2.4 లక్షల కోట్ల మార్కుఈ నివేదిక ప్రకారం, టాటా గ్రూప్ బ్రాండ్ విలువ గతంతో పోలిస్తే 9 శాతం వృద్ధితో 28.6 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.2.39 లక్షల కోట్లు) చేరుకుంది. భారతీయ కార్పొరేట్ చరిత్రలోనే ఒక బ్రాండ్ విలువ 30 బిలియన్ డాలర్ల మైలురాయికి సమీపంగా చేరడం ఇదే తొలిసారి. స్టీల్, ఆటోమొబైల్స్, ఐటీ సర్వీసెస్, కన్స్యూమర్ గూడ్స్ వంటి విభిన్న రంగాల్లో టాటా గ్రూప్ సర్వీసులు అందిస్తుండడమే దీనికి కారణం.తర్వాతి స్థానాల్లో ఇవే..ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ 14.2 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో దేశంలోనే రెండో అత్యంత విలువైన బ్రాండ్గా తన స్థానాన్ని స్థిరపరుచుకుంది. కాగా, గతేడాది కాలంలో జరిగిన అతిపెద్ద కార్పొరేట్ విలీనం (HDFC Ltdతో HDFC Bank విలీనం) కారణంగా హెచ్డీఎఫ్సీ గ్రూప్ బ్రాండ్ విలువ పెరిగి ఏకంగా మూడో స్థానానికి (10.4 బిలియన్ డాలర్లు) ఎగబాకింది. ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ 10.1 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో నిలిచింది.దేశంలోని టాప్ 10 విలువైన బ్రాండ్లు ఇవే..ర్యాంక్కంపెనీ/బ్రాండ్ పేరుబ్రాండ్ విలువ (బి.డాలర్లలో)1టాటా గ్రూప్28.62ఇన్ఫోసిస్ 14.23హెచ్డీఎఫ్సీ గ్రూప్ 10.44ఎల్ఐసీ గ్రూప్10.15రిలయన్స్ ఇండస్ట్రీస్ 8.46ఎస్బీఐ గ్రూప్ 8.27భారతీ ఎయిర్టెల్7.78హెచ్సీఎల్ టెక్7.69లార్సెన్ అండ్ టూబ్రో7.210మహీంద్రా గ్రూప్6.6అత్యంత పటిష్టమైన బ్రాండ్గా తాజ్బ్రాండ్ విలువే కాకుండా వినియోగదారుల నమ్మకం, కార్పొరేట్ ప్రతిష్ట ఆధారంగా లెక్కించే ‘బ్రాండ్ స్ట్రెంత్ ఇండెక్స్’(బీఎస్ఐ)లో టాటా గ్రూప్నకు చెందిన హోటల్స్ బ్రాండ్ తాజ్ ప్రతిభ కనబరిచింది. 100కి 92.9 బీఎస్ఐ స్కోరుతో AAA+ రేటింగ్ సొంతం చేసుకుని దేశంలోనే అత్యంత పటిష్టమైన బ్రాండ్గా నిలిచింది.దూసుకుపోతున్న రంగాలు ఇవే..ఈ నివేదికలో అత్యధికంగా 61 శాతం వృద్ధిని నమోదు చేసుకుని టెలికాం రంగం ముందంజలో నిలిచింది. ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా వంటి సంస్థలు డిజిటల్ వినియోగం పెరగడంతో వేగంగా పుంజుకున్నాయి.దేశీయ బ్యాంకింగ్ బ్రాండ్ల విలువలో సగటున 26 శాతం వృద్ధి నమోదైంది. ఇండియన్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గరిష్ట వృద్ధిని సాధించాయి.టాటా గ్రూప్నకు చెందిన ఫ్యాషన్ రిటైల్ బ్రాండ్ వెస్ట్సైడ్ ఏకంగా 122 శాతం బ్రాండ్ విలువ వృద్ధితో భారతదేశంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న బ్రాండ్గా రికార్డు సృష్టించింది. ఆ తర్వాత స్థానాల్లో మథర్సన్ (86%), సొనాటా సాఫ్ట్వేర్ (83%) నిలిచాయి.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్పల్ప ఊరట -
టికెట్ ధరల బాదుడుపై కోర్టు సీరియస్!
విమాన చార్జీల నియంత్రణ, ప్రయాణికుల హక్కుల పరిరక్షణ దిశగా అత్యున్నత న్యాయస్థానం కీలక అడుగు వేసింది. ప్రైవేట్ విమానయాన సంస్థలు విధిస్తున్న ఏకపక్ష చార్జీల పెంపునకు అడ్డుకట్ట వేసేలా రూపొందించిన కొత్త విమానయాన నిబంధనలను రెండు వారాల్లోగా తమ ముందు ఉంచాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.రెండు వారాల్లోగా నివేదికజస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పౌర విమానయాన నియంత్రణ, ప్రయాణికులపై విధిస్తున్న అదనపు భారాలను సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త ఎస్.లక్ష్మీనారాయణన్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ నిబంధనల ముసాయిదాను పార్లమెంటులో ప్రవేశపెట్టారా లేదా అనే దానితో సంబంధం లేకుండా, ‘సీల్డ్ కవర్’ (రహస్య పత్రం) రూపంలో కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది.కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది స్పందిస్తూ.. ‘భారతీయ వాయుయాన్ అధినియం, 2024’ కింద నిబంధనల రూపకల్పన ఇప్పటికే పూర్తయిందని, ప్రస్తుతం వాటి అధికారిక అనువాద ప్రక్రియ జరుగుతోందని అది ముగియగానే పార్లమెంటు ముందు ఉంచుతామని ధర్మాసనానికి వివరించారు. దీనిపై కోర్టు స్పందిస్తూ పార్లమెంటు ఆమోదం కంటే ముందే కోర్టు పరిశీలన కోసం వాటిని అందజేయాలని ఆదేశించింది.చార్జీల దోపిడీపై కోర్టు ఆందోళనపండుగలు, ప్రత్యేక సెలవులు, కుంభమేళా వంటి భారీ ఈవెంట్ల సమయంలో ప్రైవేట్ ఎయిర్లైన్స్ విమాన చార్జీలను అడ్డగోలుగా పెంచేస్తున్నాయని (డైనమిక్ ప్రైసింగ్), ఇది ప్రయాణికులను తీవ్రంగా దోపిడీ చేయడమేనని గత విచారణల సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఉదాహరణకు, మహాకుంభ్ సమయంలో భోపాల్-ప్రయాగ్రాజ్ మార్గంలో వన్-వే విమాన చార్జీలు ఏకంగా 498 శాతం పెరిగి రూ.2,977 నుంచి రూ.17,796కి చేరిన విషయాన్ని పిటిషన్లో ప్రస్తావించారు.పారదర్శకతలేని విధానాలుపిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది రవీంద్ర శ్రీవాస్తవ వాదనలు వినిపిస్తూ విమాన చార్జీలు, లగేజీ రుసుములు, ఇతర అనుబంధ చార్జీలను నియంత్రించడానికి స్పష్టమైన చట్టబద్ధమైన అధికార సంస్థ లేకపోవడం వల్లే ఎయిర్లైన్స్ పారదర్శకత లేని విధానాలను అవలంబిస్తున్నాయని పేర్కొన్నారు. ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు ఉచిత చెక్ఇన్ బ్యాగేజీ పరిమితిని 25 కిలోల నుంచి 15 కిలోలకు తగ్గించి, అదనపు లగేజీపై భారీగా వసూలు చేయడం ద్వారా ప్రయాణికులకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చకుండా కేవలం అదనపు ఆదాయ వనరుగా మార్చుకున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు.కొత్త చట్టం - నిబంధనల అవశ్యకతబ్రిటిష్ కాలం నాటి ‘ఎయిర్క్రాఫ్ట్ యాక్ట్, 1934’ స్థానంలో సివిల్ ఏవియేషన్ రంగాన్ని ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘భారతీయ వాయుయాన్ అధినియం, 2024’ జనవరి 2025 నుంచి అమలులోకి వచ్చింది. అయితే, దీని పరిధిలో ప్రయాణికుల రక్షణ, ధరల నియంత్రణకు సంబంధించిన పూర్తి స్థాయి నిబంధనలు ఇంకా నోటిఫై కాలేదు. ప్రస్తుత చట్టాల ప్రకారం విమాన చార్జీలు పూర్తిగా మార్కెట్ శక్తుల ఆధారంగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల హక్కులను రక్షించేందుకు కఠినమైన మార్గదర్శకాలు అవసరమని సుప్రీంకోర్టు భావిస్తోంది.ఇదీ చదవండి: ఏఐ ఎందుకో వెనుకబడింది? -
హెచ్సీఎల్ టెక్ లాభం 20% అప్
న్యూఢిల్లీ: దేశీ ఐటీ దిగ్గజం హెచ్సీఎల్ టెక్ ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (2026–27, క్యూ1)లో రూ.4,624 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,843 కోట్లతో పోలిస్తే 20 శాతం జంప్ చేసింది. కంపెనీ మొత్తం ఆదాయం 14 శాతం ఎగసి రూ.34,579 కోట్లకు చేరింది. గతేడాది క్యూ1లో ఆదాయం రూ. 30,349 కోట్లుగా నమోదైంది. సీక్వెన్షియల్గానూ పెరుగుదల... గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్ (క్యూ4)లో నమోదైన రూ. 4,488 కోట్లతో పోలిస్తే సీక్వెన్షియల్గా క్యూ1లో లాభం 3% పెరిగింది. ఆదాయం 1.8% వృద్ధి చెందింది. స్థిరంగా గైడెన్స్... 2026–27 పూర్తి ఏడాది ఆదాయ వృద్ధి అంచనాలను (గైడెన్స్) హెచ్సీఎల్ టెక్ స్థిరంగా కొనసాగించింది. గైడెన్స్ 1–4% ఉండొచ్చని పేర్కొంది. సేవల విభాగం ఆదాయం 1.5–4.5% వృద్ధి చెందొచ్చని అంచనా వేసింది. ఇతర ముఖ్యాంశాలు.. → వాటాదారులకు రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.12 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. దీనికి ఈ నెల 17 రికార్డు తేదీ కాగా, 27న చెల్లిస్తుంది. → ఈ ఏడాది మార్చి ఆఖరితో పోలిస్తే జూన్ చివరి నాటికి 3,292 మంది ఉద్యోగులు తగ్గారు. మొత్తం సిబ్బంది సంఖ్య 2,23,889కి చేరింది. ఉద్యోగుల వలసల రేటు 12.7 శాతంగా నమోదైంది. కాగా, క్యూ1లో 1,056 మంది ఫ్రెషర్లను నియమించుకుంది. మార్చి క్వార్టర్లో 1,712 మంది ఫ్రెషర్లతో పోలిస్తే జాబ్ ఆఫర్స్ తగ్గాయి. కంపెనీ షేరు 5 శాతం జంప్ చేసి, రూ.1,221 వద్ద ముగిసింది.ఏఐ డేటా సెంటర్లపై రూ. 3,500 కోట్ల పెట్టుబడిభారత్లో ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటు కోసం రూ.3,500 కోట్ల మేర పెట్టుబడులు వెచ్చించేందుకు హెచ్సీఎల్ టెక్ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. డేటా సెంటర్ల కోసం నెలకొల్పే కొత్త అనుబంధ సంస్థల ద్వారా ఈ నిధులను ఇన్వెస్ట్ చేయనుంది. ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లో ఏఐ ఆధారిత సరీ్వసులు, సొల్యూషన్లకు పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా పూర్తి స్థాయిలో వ్యాపారావకాశాలను దక్కించుకోవడం కోసం ఫుల్–స్ట్యాక్ ఏఐ మార్కెట్లోకి అడుగుపెడుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ‘50 మెగావాట్ల సామర్థ్యం వరకు విస్తరించేలా ఏఐ డేటా సెంటర్లపై రూ.3,500 కోట్ల మేర వ్యూహాత్మక పెట్టుబడులు పెడతాం. ఏఐ డేటా సెంటర్ డిజైన్, ఏఐ క్లౌడ్ కార్యకలాపాలతో పాటు మా సాఫ్ట్వేర్ పోర్ట్ఫోలియోల్లో కంపెనీకి ఇప్పటికే ఉన్న సామర్థ్యాలకు ఈ ఇన్వెస్ట్మెంట్ తోడ్పాటునందిస్తుంది. తద్వారా పూర్తిస్థాయి సమగ్ర సేవలకు వీలవుతుంది’ అని హెచ్సీఎల్టెక్ వెల్లడించింది.ప్రపంచవ్యాప్తంగా కంపెనీల్లో ఆర్టీఫిషియల్ (ఏఐ) మార్పులు చోటుచేసుకుంటున్నాయి, ఈ కొత్త వృద్ధి అవకాశాలను కంపెనీ అందిపుచ్చుకుంటోంది. మా వైవిధ్యమైన పోర్ట్ఫోలియోతో క్లయింట్లకు టెక్నాలజీపరంగా వ్యాపార వ్యూహాలను రూపొందించుకోవడంలో తోడ్పడుతున్నాం. వర్ధమాన సాంకేతికతల్లో మా ఉద్యోగులకు నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు సంస్థలో ఏఐని అమలు చేస్తున్నాం. – రోష్ని నాడార్ మల్హోత్రా, హెచ్సీఎల్ టెక్ చైర్పర్సన్క్యూ1లో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 2.4 బిలియన్ డాలర్ల కొత్త ఆర్డర్లను దక్కించుకున్నాం. అడ్వాన్స్డ్ ఏఐ వ్యాపారం సీక్వెన్షియల్గా 10.6 శాతం, వార్షికంగా 62.1 శాతం చొప్పున ఎగబాకింది. క్లయింట్లు మా ఏఐ సేవల్ని ఎంచుకుంటున్నారనేందుకు ఇదే నిదర్శనం. నిర్వహణ సామర్థ్యంతో పాటు మార్జిన్ల వృద్ధి దన్నుతో మధ్యకాలికంగా మార్కెట్ వృద్ధిని మించి రాణించగలమన్న నమ్మకం కలుగుతోంది. – సి. విజయకుమార్, హెచ్సీఎల్ టెక్ సీఈఓ, ఎండీ -
ఇలా చేస్తే.. ట్రైన్ మొత్తం బుక్ చేసుకోవచ్చు!
పెళ్లి వేడుకలకు, ఆధ్యాత్మిక యాత్రలకు, కార్పొరేట్ టూర్లు లేదా పెద్ద కుటుంబాలతో కలిసి ప్రయాణించాలనుకునే వారికి ఇండియన్ రైల్వే ఒక ప్రత్యేకమైన సౌకర్యం అందిస్తోంది. ఫుల్ టారిఫ్ రేట్ (FTR) స్కీమ్ ద్వారా ప్రయాణికులు ఒక రైల్వే కోచ్ను లేదా అవసరమైతే పూర్తి రైలునే బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఎక్కువమందితో కలిసి ప్రయాణించాలనుకునే వారికి ఈ ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలంటే.. జర్నీ చేయాల్సిన తేదీకంటే ఆరు నెలల ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆన్లైన్ బుకింగ్ సేవను.. ప్రయోగాత్మకంగా వెస్ట్రన్ రైల్వే పరిధిలో ప్రారంభమయ్యే ప్రయాణికులకు మాత్రమే అందుబాటులో ఉంచారు. బుకింగ్ను IRCTC FTR పోర్టల్ ద్వారా లేదా ప్రయాణం ప్రారంభమయ్యే స్టేషన్లోని చీఫ్ బుకింగ్ సూపర్వైజర్ (CBS) లేదా స్టేషన్ మాస్టర్కు దరఖాస్తు చేసి చేయవచ్చు.ఆన్లైన్లో బుక్ చేయాలంటే.. ముందుగా ప్రయాణ వివరాలు, మార్గం, బుకింగ్ రకం వంటి సమాచారాన్ని నమోదు చేయాలి. దరఖాస్తు సమర్పించిన తర్వాత ఒక రిఫరెన్స్ నెంబర్, చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజు వివరాలు వస్తాయి. ఈ మొత్తాన్ని దరఖాస్తు చేసిన రోజుతో కలిపి ఆరు రోజుల్లోగా చెల్లించాలి. నిర్ణీత గడువులో చెల్లించకపోతే దరఖాస్తు ఆటోమేటిక్గా రద్దవుతుంది. మళ్లీ కొత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.ఆఫ్లైన్ బుకింగ్ కోసం ముందుగా.. స్టేషన్ మాస్టర్ లేదా చీఫ్ బుకింగ్ సూపర్వైజర్కు లిఖితపూర్వకంగా దరఖాస్తు ఇవ్వాలి. అధికారులు వివరాలను నమోదు చేసిన తర్వాత రిఫరెన్స్ నెంబర్ ఇస్తారు. ఆ తరువాత యూటీఎస్ కౌంటర్లో రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే ఎఫ్టీఆర్ నెంబర్ జారీ చేసి బుకింగ్ను పూర్తి చేస్తారు.ఈ స్కీమ్ కింద ఒక టూర్ ప్రోగ్రామ్కు సాధారణ రైలులో గరిష్టంగా 10 కోచ్ల వరకు రిజర్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ పూర్తిగా స్పెషల్ ట్రైన్ బుక్ చేయాలనుకుంటే గరిష్టంగా 24 కోచ్ల వరకు బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఇందులో రెండు సీటింగ్ కమ్ లగేజ్ కోచ్లు కూడా ఉంటాయి.రిజిస్ట్రేషన్ ఫీజు విషయానికి వస్తే.. ఒక కోచ్ను ఏడు రోజుల వరకు బుక్ చేయడానికి రూ.50,000 చెల్లించాలి. ప్రయాణం ఏడు రోజుల కంటే ఎక్కువ ఉంటే అదనంగా ప్రతి కోచ్కు రోజుకు రూ.10,000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి రైలును బుక్ చేయాలంటే కనీస రిజిస్ట్రేషన్ మొత్తం రూ.9 లక్షలు. ఇది కనీసం 18 కోచ్ల ఆధారంగా లెక్కిస్తారు. 18 కంటే ఎక్కువ కోచ్లు ఉంటే ప్రతి అదనపు కోచ్కు రూ.50,000 చెల్లించాలి.ఒకవేళ ప్రయాణికుడు లేదా రైల్వే శాఖ బుకింగ్ను రద్దు చేసినా, అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.. చీఫ్ కమర్షియల్ మేనేజర్ కార్యాలయం ద్వారా రీఫండ్ ప్రక్రియ జరుగుతుంది. -
పాక్ కంపెనీలో జాబ్.. రూ.2 కోట్ల ప్యాకేజీ!
కరాచీకి చెందిన ఒక కంపెనీ నుంచి తనకు మంచి జీతంతో కూడిన జాబ్ ఆఫర్ వచ్చిందని పేర్కొంటూ 21 ఏళ్ల టెకీ ఆదిత్య పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ఆన్లైన్లో చర్చనీయాంశమైంది. ఈ పోస్ట్ వైరల్ కావడంతో కొంతమంది ఆసక్తిగా స్పందించగా, మరికొందరు ఇది కేవలం సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ కోసం చేసిన ప్రయత్నమా?.. అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు.ఆదిత్య షేర్ చేసిన స్క్రీన్షాట్ ప్రకారం.. కరాచీ కేంద్రంగా పనిచేస్తున్న ఓ కంపెనీ తనకు సంవత్సరానికి 1.8 లక్షల నుంచి 2.2 లక్షల డాలర్ల వరకు బేస్ శాలరీ ఆఫర్ చేసిందని తెలిపాడు. భారత కరెన్సీలో ఈ వేతనం దాదాపు రూ.2 కోట్లు. కంపెనీ హెడ్ క్వార్టర్ కరాచీలో ఉన్నప్పటికీ, ఎక్కువ మంది ఉద్యోగులు యూకే టైమ్ జోన్ ప్రకారం పనిచేస్తారని ఆఫర్ వివరాల్లో ఉన్నట్లు వెల్లడించాడు.just received an onsite offer from a Karachi-based company.$180-220k base, visa sponsored, and the team operates in the UK timezone. should I go for it? pic.twitter.com/lCa8NdQVXF— aditya (@adxtyahq) July 12, 2026తనకు వచ్చిన ఈ ఆఫర్ను అంగీకరించి అక్కడికి వెళ్లాలా?, వద్దా? అని తన ఫాలోవర్లను అడుగుతూ ఆదిత్య తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు.ఈ పోస్ట్ అతి తక్కువ సమయంలోనే వైరల్ అయింది. ఈ పోస్టును చూసినవారిలో.. కొంతమంది నిజంగానే ఇది మంచి కెరీర్ అవకాశం కావచ్చని చెప్పారు. మరికొందరు మాత్రం ఆ ఆఫర్ నిజమా, కాదా? అనే సందేహాలు వ్యక్తం చేశారు. ఇంకొంతమంది ఇలాంటి పోస్టులు కేవలం ఎక్కువ లైక్లు, కామెంట్లు, వ్యూస్ కోసం చేసి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఇలాంటి అవకాశాలను అంగీకరించే ముందు కంపెనీ వివరాలు, ఉద్యోగ నిజమైనదా కాదా అనే విషయాలను పూర్తిగా పరిశీలించాలని సూచించారు. -
కొత్త రూపంలో IRCTC వెబ్సైట్!
ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే సమయంలో వచ్చే సమస్యలను నివారించడానికి తగిన చర్యలు తీసుకోనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఇప్పుడు భారతీయ రైల్వే.. ఐఆర్సీటీసీ వెబ్సైట్ను పూర్తిగా కొత్త రూపంలోకి తీసుకొస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.రైలు ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికీ ఐఆర్సీటీసీ వెబ్సైట్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తత్కాల్ టికెట్లు బుక్ చేసే సమయంలో వెబ్సైట్ నెమ్మదించడం, సర్వర్ సమస్యలు రావడం, టికెట్ బుక్ అయ్యేలోపు సీట్లు అయిపోవడం వంటి సమస్యలను చాలామంది ఎదుర్కొన్నారు. ఈ ఇబ్బందులకు పరిష్కారం చూపేందుకు భారతీయ రైల్వే ఐఆర్సీటీసీ వెబ్సైట్ను కొత్తగా మారుస్తోంది.జులై 15 నుంచి కొత్త వెర్షన్కొత్త వెబ్సైట్ బీటా వెర్షన్ 2026 జూలై 15 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. వేగంగా టికెట్ బుక్ చేసుకోవడం, సులభమైన నావిగేషన్, మెరుగైన పనితీరు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేస్తున్నారు.నిజానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐఆర్సీటీసీ వెబ్సైట్పై ప్రయాణికుల నుంచి లెక్కకుమించిన ఫిర్యాదులు అందాయి. అందులో ముఖ్యంగా తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో ఒకేసారి లక్షలాది మంది ప్రయత్నించడం వల్ల వెబ్సైట్ స్లో అవ్వడం, పేజీలు లోడ్ కాకపోవడం, ఎక్కువసార్లు క్యాప్చా అడగడం, సెషన్ టైమ్ అవుట్ కావడం వనవి ఉన్నాయి. కొత్త వెబ్సైట్ ఈ సమస్యలకు చెక్ పెట్టనున్నట్లు సమాచారం.మొబైల్ యాప్లో కూడా..కొత్త వెబ్సైట్ను ఐఆర్సీటీసీ, సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) కలిసి అభివృద్ధి చేస్తున్నాయి. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అనేక కొత్త ఫీచర్లను ఇందులో చేర్చారు. బీటా వెర్షన్ను టెస్ట్ చేసే సమయంలో వినియోగదారుల నుంచి వచ్చిన సూచనలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.కొత్త ఐఆర్సీటీసీ ఫీచర్లు రైల్వన్ మొబైల్ యాప్లో కూడా అందుబాటులోకి రానున్నాయి. అంటే వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ఏదైనా ప్రయాణికులకు ఒకే విధమైన అనుభవం లభిస్తుంది. వెబ్సైట్ మార్పులతో పాటు భారతీయ రైల్వే తన పాత ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS)ను కూడా అప్డేట్ చేస్తోంది. దాదాపు 40 ఏళ్ల నాటి ఈ వ్యవస్థ స్థానంలో అధిక ట్రాఫిక్ను నిర్వహించగల కొత్త సాంకేతిక వ్యవస్థను తీసుకురానున్నారు.🚨 The Ministry of Railways is launching a new version of the IRCTC website. 1. Ticket booking capacity increased from 32,000 to 1.5 lakh+ tickets per minute.2. PNR & train enquiry capacity increased from 4 lakh to 40 lakh+ enquiries per minute.3. Faster page loading and… pic.twitter.com/Ah2VbS3RK1— Indian Tech & Infra (@IndianTechGuide) July 13, 2026 -
టెక్కీలకు డైరెక్ట్ ఏసీ బస్
ఐటీ కారిడార్ బెంగళూరులో నిత్యం ట్రాఫిక్ నరకం చూసే టెక్కీలకు, ఉద్యోగులకు భారీ ఉపశమనం లభించింది. తుమకూరు నుంచి బెంగళూరు ఐటీ హబ్ ‘ఎలక్ట్రానిక్స్ సిటీ’ మధ్య ప్రయాణించే వందలాది మంది ఉద్యోగుల కోసం బెంగళూరు మహానగర రవాణా సంస్థ (బీఎంటీసీ) సరికొత్త ‘విస్తారా ఏసీ బస్సు’ సేవలను ప్రారంభించింది.బీఎంటీసీ లాంగ్ రూట్దాదాపు 101 కిలోమీటర్ల మేర సాగే ఈ ప్రత్యేక రూట్ ప్రస్తుతం బీఎంటీసీ నడుపుతున్న బస్సు సర్వీసులన్నింటిలోకి అత్యంత పొడవైనది కావడం విశేషం. గ్రేటర్ బెంగళూరు పరిధి దాటి సుమారు 40 కిలోమీటర్ల పరిధి వరకు బస్సులు నడుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడంతో.. స్థానికంగా ఉన్న శాటిలైట్ టౌన్స్ను అనుసంధానిస్తూ బీఎంటీసీ ఈ నిర్ణయం తీసుకుంది.‘ప్రజా డిమాండ్ను పరిగణనలోకి తీసుకుని ఈ సరికొత్త ఏసీ సర్వీస్ను ప్రారంభించాం. ప్రస్తుతం తుమకూరు - ఎలక్ట్రానిక్స్ సిటీ మధ్య ప్రయాణికుల ఆదరణ చాలా బాగుంది. గతంలో మేము నైలామంగళ, హోస్కోట్ మధ్య 80 కిలోమీటర్ల రూట్ను ప్రారంభించాం. ఇప్పుడు ఈ 101 కిమీ రూట్ మా నెట్వర్క్లోనే అతి పెద్దది’ అని బీఎంటీసీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ (ఆపరేషన్స్) జి.టి. ప్రభాకర్ రెడ్డి అన్నారు.ప్రయాణ సమయం, టైమింగ్స్ వివరాలుఈ సరికొత్త సర్వీస్ ద్వారా ప్రయాణికులకు నిత్యం 45 నిమిషాల నుంచి ఒక గంట వరకు ప్రయాణ సమయం ఆదా అవుతోంది. ఉదయం 7:45 గంటలకు తుమకూరులో బయలుదేరి, ఉదయం 9:45 గంటల వరకు ఎలక్ట్రానిక్స్ సిటీకి చేరుకుంటుంది. (ఆఫీస్ వేళలకు సరిగ్గా సరిపోయేలా రూపకల్పన చేశారు). ఎలక్ట్రానిక్స్ సిటీ నుంచి సాయంత్రం ఐటీ ఉద్యోగుల లాగ్-అవుట్ సమయానికి అనుగుణంగా సాయంత్రం 5:45 గంటలకు బయలుదేరి రాత్రి 9:00 గంటల కల్లా తుమకూరు చేరుకుంటుంది. వన్వే రూట్లో ప్రయాణ ఛార్జీ రూ.200గా నిర్ణయించారు. ప్రధాన స్టాపులు.. తుమకూరు, నేలమంగళ, మాదవర మీదుగా ‘నైస్ రోడ్’ ద్వారా నేరుగా ఎలక్ట్రానిక్స్ సిటీ చేరుకుంటుంది.ఇదీ చదవండి: కొనుగోలుదారులకు ఊరట.. దిగొచ్చిన బంగారం.. -
అమెరికా గడ్డపై అతిపెద్ద 'బంగారు గని' నిజమేనా?
ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు ఇన్వెస్టర్లలో తీవ్ర చర్చకు దారితీసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూఎస్ భూభాగంలో 1 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ. 84 లక్షల కోట్లు) విలువైన ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిక్షేపాన్ని వెలికితీసేందుకు ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నారంటూ ఆయన పేర్కొన్నారు.తనకు సన్నిహితుడైన ప్రముఖ పసిడి నిపుణుడు జిమ్ రిక్కార్డ్స్ సమాచారం ప్రకారం.. ఈ పథకం ద్వారా రాబోయే కొన్ని నెలల్లోనే 10 రెట్లు లాభాలు వచ్చే అవకాశం ఉందని కియోసాకి చెప్పుకొచ్చారు. అయితే, కియోసాకి పోస్ట్పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.అసలు నిజం ఏంటి?ఆర్థిక నిపుణుల విశ్లేషణ ప్రకారం.. ఈ పోస్ట్లో పేర్కొన్న "ట్రంప్ గోల్డ్ మైన్" అనేది కొత్తగా కనుగొన్నదేమీ కాదు. అలాస్కా ప్రాంతంలో ఎప్పటి నుంచో వివాదాల్లో ఉన్న 'డాన్లిన్ గోల్డ్' (Donlin Gold) లేదా 'పెబుల్ మైన్' (Pebble Mine) వంటి పాత మైనింగ్ ప్రాజెక్టులను ఉద్దేశించి ఈ ప్రచారం జరుగుతోంది. ఇవి పెద్ద నిక్షేపాలే అయినప్పటికీ, అధ్యక్షుడి ఒక్క ఆదేశంతో రాత్రికి రాత్రే బంగారం బయటకు వచ్చేసే పరిస్థితి లేదు. వీటికి ఎన్నో పర్యావరణ అనుమతులు, చట్టపరమైన చిక్కులు ఉన్నాయి.10 రెట్ల లాభాలు సాధ్యమేనా?కొద్ది నెలల్లోనే 10 రెట్లు లాభాలు వస్తాయనే వాదనను మార్కెట్ నిపుణులు తీవ్రంగా కొట్టిపారేస్తున్నారు. ఇదంతా జిమ్ రిక్కార్డ్స్ నడుపుతున్న ఒక ప్రీమియం ఫైనాన్షియల్ న్యూస్లెటర్ సబ్స్క్రిప్షన్లను అమ్ముకోవడానికి చేస్తున్న పబ్లిసిటీ స్టంట్ అని కొందరు ఆరోపిస్తున్నారు. బంగారం, మైనింగ్ రంగాలు చాలా అస్థిరంగా ఉంటాయని, తక్కువ సమయంలో ఇలాంటి అసాధారణ లాభాలు రావడం దాదాపు అసాధ్యమని వారు హెచ్చరిస్తున్నారు. -
డీమార్ట్ మూడు నెలల లాభం ఎంతంటే..
న్యూఢిల్లీ: రిటైల్ చెయిన్ డీమార్ట్ మాతృ సంస్థ ఎవెన్యూ సూపర్మార్ట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 860 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత క్యూ1లో నమోదైన రూ. 773 కోట్లతో పోలిస్తే ఇది 11 శాతం అధికం. ఆదాయం రూ. 16,360 కోట్లతో పోలిస్తే 15 శాతం వృద్ధి చెంది రూ. 18,795 కోట్లకు చేరింది. లాభం మార్జిన్ 4.7 శాతం నుంచి 4.6 శాతానికి నెమ్మదించింది.సమీక్షా కాలంలో కొత్తగా మూడు స్టోర్స్ ప్రారంభించడంతో మొత్తం స్టోర్స్ సంఖ్య 503కి చేరుకుందని సంస్థ ఎండీ (బ్రిక్ అండ్ మోరా్టర్ విభాగం) అన్షుల్ అసాావా తెలిపారు. మరోవైపు అంతగా ఆదాయంలేని ఏడు నగరాల్లో కార్యకలాపాలు నిలిపివేసినట్లు ఆన్లైన్ ప్లాట్ఫాం డీమార్ట్ రెడీ సీఈవో విక్రమ్ దాసు తెలిపారు. జూన్ 30 నాటికి 11 నగరాల్లో డీమార్ట్ రెడీ కార్యకలాపాలు సాగిస్తోంది. -
స్మాల్, మిడ్ క్యాప్లలో పెట్టుబడి అవకాశాలు
చాలామంది ఇన్వెస్టర్లు మిడ్, స్మాల్–క్యాప్ షేర్లలో పెట్టుబడుల ద్వారానే ఎక్కువ సంపదను సృష్టించుకోగలుగుతుంటారు. ఎందుకంటే, లార్జ్–క్యాప్లతో పోలిస్తే ఈ విభాగంలో పెట్టుబడి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. నిఫ్టీ 100 ఇండెక్స్ పరిధితో పోలిస్తే నిఫ్టీ మిడ్స్మాల్క్యాప్ 400 ఇండెక్స్లో ఎక్కువ రకాల రంగాలు అందుబాటులో ఉన్నాయి. గత రికార్డులను చూసినా లార్జ్–క్యాప్ కంటే మిడ్, స్మాల్–క్యాప్ కంపెనీలే వేగంగా వృద్ధి చెందాయి. 2020–25 ఆర్థిక సంవత్సరాల మధ్య లార్జ్–క్యాప్ కంపెనీల ఆదాయ వృద్ధి 74 శాతంగా ఉంటే, మిడ్, స్మాల్–క్యాప్ కంపెనీల ఆదాయం దాదాపు 82 శాతం పెరిగింది. అలాగే లాభాల వృద్ధి విషయానికి వస్తే.. ఇదే కాలంలో లార్జ్–క్యాప్లో 211 శాతం వృద్ధి నమోదైతే, మిడ్, స్మాల్–క్యాప్ కంపెనీలు ఏకంగా 256 శాతం వృద్ధిని సాధించాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగంలోనూ వీటి హవా పెరిగింది. ఈ విభాగంలో ఉండే మిడ్–క్యాప్ కంపెనీల సంఖ్య 2021లో 63 ఉండగా, 2026 నాటికి 93కి చేరింది. అలాగే స్మాల్–క్యాప్ కంపెనీలు 5 నుంచి 25కి పెరిగాయి. గత 15 ఏళ్ల కాలంలో చూసుకుంటే, చాలా సందర్భాల్లో లార్జ్–క్యాప్ కంటే మిడ్, స్మాల్–క్యాప్ కంపెనీలే ఇన్వెస్టర్లకు మెరుగైన రిటర్న్స్ ఇచ్చాయి. ప్రస్తుతం ఇన్వెస్టర్లకు మిడ్, స్మాల్–క్యాప్ సెగ్మెంట్లలో పెట్టుబడి పెట్టడానికి ’స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్’ (IFS) మెరుగైన సాధనాలుగా నిలుస్తున్నాయి. ఇవి మ్యూచువల్ ఫండ్స్లాగే సెబీ నిబంధనల ప్రకారం పనిచేస్తాయి. కాకపోతే పోర్ట్ఫోలియో రూపకల్పనలో వీటికి పీఎంఎస్ తరహాలో ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది. ఈ ఫండ్స్ పరిధిలోని ’ఈక్విటీ ఎక్స్–టాప్ 100 లాంగ్–షార్ట్’ వ్యూహం పెద్ద కంపెనీలను పక్కన పెట్టి, పూర్తిగా మిడ్, స్మాల్–క్యాప్ షేర్లపైనే దృష్టి పెడుతుంది. అందుకే ఇది ఇన్వెస్టర్లకు మెరుగైన సాధనంగా ఉంటుంది.ప్రధానంగా నాలుగు సూత్రాలు.. ఇది ప్రధానంగా నాలుగు సూత్రాలపై నడుస్తుంది. కంపెనీల అకౌంటింగ్ పరిశీలన (ఫోరెన్సిక్స్), సముచిత ప్రైసింగ్, ఒకే ఇన్వెస్ట్మెంట్ శైలికి పరిమితం కాకపోవడం, బలమైన బిజినెస్ మోడల్స్ (కార్పొరేట్ గవర్నెన్స్) అనేవి ఈ సూత్రాలు. కేవలం వేగంగా పెరిగే కంపెనీలనే కాకుండా విశ్వసనీయమైన ప్రమాణాలు, వ్యాపారాన్ని విస్తరించే చాన్స్, స్థిరమైన సంపాదన ఉన్న కంపెనీలనే ఎంచుకుంటారు. అలాగే వాల్యూ ఇన్వెస్టింగ్ లేదా గ్రోత్ ఇన్వెస్టింగ్ అనే ఒకే రకమైన శైలికి కట్టుబడి ఉండకుండా, బిజినెస్ క్వాలిటీ, మీడియం–టర్మ్ లాభాల అవకాశాలను బట్టి పోర్ట్ఫోలియోను మారుస్తుంటారు. ఇక్కడ అధిక లాభాలు సాధించడానికి ఫ్లెక్సిబిలిటీ, బలమైన నమ్మకమే కారణం. ఈ ఫండ్ ఒకే రంగానికి పరిమితం కాదు. ఇండెక్స్ రూల్స్ తో సంబంధం లేకుండా, ఎక్కడ మంచి అవకాశాలు ఉంటే అక్కడికి నిధులను మళ్లిస్తుంది. ఈ వ్యూహం ద్వారా దాదాపు 35 నుంచి 45 షేర్లతో కూడిన నిర్దిష్ట పోర్ట్ఫోలియోను నిర్వహిస్తారు. వీటిలో ప్రతి షేరును క్షుణ్ణంగా స్టడీ చేసిన తర్వాతే ఎంపిక చేస్తారు. డబ్బులు ఇన్వెస్ట్ చేసే ముందే సదరు కంపెనీల అకౌంటింగ్ నాణ్యత, కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలు, మేనేజ్మెంట్ ట్రాక్ రికార్డ్ను పూర్తిగా స్క్రీన్ చేయడం ఇక్కడ మరో కీలకమైన అంశం. ఇన్ఫర్మేషన్ గ్యాప్స్, బిజినెస్ రిసు్కలు ఎక్కువగా ఉండే మిడ్, స్మాల్–క్యాప్ సెగ్మెంట్లో ఈ ముందస్తు పరిశీలన చాలా ముఖ్యం. ఇది కేవలం వ్యాల్యుయేషన్పరంగానే కాకుండా, అదనపు రక్షణ పొరలా పనిచేస్తూ రిస్క్ మేనేజ్మెంట్ను మెరుగుపరుస్తుంది. ఈ వ్యూహంలో భాగంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా 101 నుంచి 750 ర్యాంకుల మధ్య ఉన్న కంపెనీలకే 65 శాతానికి పైగా నిధులను కేటాయిస్తారు. దీనివల్ల ఫోకస్ అంతా మిడ్, స్మాల్–క్యాప్ పరిధిలోనే ఉంటుంది. మార్కెట్ పరిస్థితులను బట్టి మిడ్–క్యాప్, స్మాల్–క్యాప్ల మధ్య సమతుల్యత ఉండేలా ఎప్పటికప్పుడు పెట్టుబడుల విషయంలో మార్పులు, చేర్పులు చేస్తుంటారు. నిర్దిష్టంగా చెప్పాలంటే .. ప్రస్తుత మార్కెట్ వాతావరణం ఎస్ఐఎఫ్ పెట్టుబడులకు రెండు విధాలుగా సానుకూలంగా ఉంటోంది. ఒకటి వ్యాల్యుయేషన్లు అందుబాటులోకి రావడం కాగా రెండోది వైవిధ్యమైన పెట్టుబడి అవకాశాలు ఉండడం. క్రమశిక్షణ, ఫ్లెక్సిబిలిటీ, స్పష్టమైన వ్యూహంతో ఈ మార్కెట్ హెచ్చుతగ్గులను ఎదుర్కొనే ఫండ్స్ మాత్రమే లాంగ్–టర్మ్లో ఇన్వెస్టర్లకు స్థిరమైన, అల్ఫా లాభాలను అందించగలవు.ఇదే సరైన సమయం ఎందుకు అంటే మిడ్, స్మాల్–క్యాప్ (ఎస్ఎంఐడీ) షేర్లలో పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన సమయం అనడానికి ఒక స్పష్టమైన కారణం ఉంది. మార్కెట్లో వచ్చే కరెక్షన్లనేవి అంచనాలను, వ్యాల్యుయేషన్లను మళ్లీ దారికి తెస్తాయి. ఇటీవల మార్కెట్ కరెక్షన్ల వల్ల దాదాపు 75 శాతం మిడ్–క్యాప్ షేర్లు, అలాగే 82 శాతం స్మాల్–క్యాప్ షేర్లు వాటి 52 వారాల గరిష్టాల నుంచి 20 శాతానికి పైగా పతనమయ్యాయి. ఇలా మార్కెట్ పడటం అనేది కేవలం తాత్కాలిక ఒడిదొడుకు మాత్రమే కాదు, మార్కెట్ జోరులో ఓవర్ ప్రైస్ అయిన షేర్ల విలువను ఇది తగ్గిస్తుంది. స్వల్పకాలిక సెంటిమెంట్ను పక్కన పెట్టి ఆలోచించే ఇన్వెస్టర్లకు మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి ఇది మంచి చాన్స్. వ్యాల్యుయేషన్లు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. సెపె్టంబర్ 2024లో ఎస్ఎంఐడీ వ్యాల్యుయేషన్లు దాదాపు 39 రెట్లు పెరిగి పీక్ స్టేజ్కి చేరాయి. ఆ తర్వాత వచి్చన కరెక్షన్ల వల్ల ఇప్పుడు 25–30 రెట్ల మధ్యకు దిగివచ్చాయి. ఇదే గత ఐదేళ్ల యావరేజ్ కంటే తక్కువ స్థాయి. అంటే, వేగంగా ఎదుగుతున్న వ్యాపారాలలో భాగస్వామ్యం అయ్యే అవకాశాన్ని మార్కెట్ ఇప్పుడు చారిత్రక సగటు ధరలకే అందిస్తోంది. ఇది చాలా ముఖ్యమైన మార్పు. ఎందుకంటే ఈక్విటీల్లో రిటర్న్స్ అనేవి కంపెనీ సంపాదనతో పాటు, మనం ఎంత వ్యాల్యుయేషన్ వద్ద ఇన్వెస్ట్ చేశామనే దానిపై కూడా ఆధారపడి ఉంటాయి. మార్కెట్ పెరిగినా, తగ్గినా లాభపడేలా (లాంగ్, షార్ట్ పొజిషన్ల కలయిక ద్వారా) మిడ్, స్మాల్–క్యాప్ అవకాశాలను అందిపుచ్చుకునే వ్యూహాలు ఇప్పుడు కీలకంగా మారుతాయి. అలాంటి వాటిలో ’అల్టీవా ఈక్విటీ ఎక్స్–టాప్ 100 లాంగ్–షార్ట్ ఫండ్’ ఒకటి. ఈ వ్యూహం ప్రకారం సాధారణంగా 65 శాతం నుంచి 100 శాతం పెట్టుబడులను మిడ్, స్మాల్–క్యాప్ రంగంలోనే ఇన్వెస్ట్ చేస్తారు. అవసరాన్ని బట్టి డెరివేటివ్స్, షార్ట్ పొజిషన్ల ద్వారా రిస్క్ ను తగ్గిస్తూ, రిటర్న్స్ పెంచుకునే వీలుంటుంది.త్రిదీప్ భట్టాచార్య, ప్రెసిడెంట్–సీఐఓ (ఈక్విటీస్) ఎడెల్వీస్ అసెట్ మేనేజ్మెంట్ -
ఆఫీసా? రిసార్టా? రెండు నెలలకే ఇంటర్న్ కన్నీళ్లు
‘కార్పొరేట్ జీవితం అంటేనే ఒక యాంత్రికమైన నరకం.. అక్కడ స్నేహాలుండవు, కేవలం టార్గెట్లు మాత్రమే ఉంటాయి’ నేటి తరం యువతలో, ముఖ్యంగా చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాల్లోకి అడుగుపెట్టే విద్యార్థులలో ఉండే సాధారణ అభిప్రాయం ఇది. కానీ, ఒక రెండు నెలల అనుభవం ఆ ఆలోచనలను పూర్తిగా మార్చేయగలదా? అంతర్జాతీయ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ క్యాంపస్లో అడుగుపెట్టిన ఒక భారతీయ ఇంటర్న్కు సరిగ్గా ఇదే అనుభవం ఎదురైంది. కేవలం రెండు నెలల సమ్మర్ ఇంటర్న్షిప్ ముగించుకుని ఢిల్లీకి తిరుగుప్రయాణమైన సదరు ఇంటర్న్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పంచుకున్న భావోద్వేగ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.రిసార్ట్ను తలపించే క్యాంపస్.. వీడలేని బంధాలుసాధారణంగా ఇంటర్న్షిప్ అంటే ప్రాజెక్టులు, కోడింగ్, డెడ్లైన్లతో ముగిసిపోతుందని భావిస్తారు. కానీ మైక్రోసాఫ్ట్లో గడిపిన కాలం తనకు సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిందని ఆ ఇంటర్న్ పేర్కొన్నారు. ‘మైక్రోసాఫ్ట్లో నా సమ్మర్ ఇంటర్న్షిప్ నిన్నటితో ముగిసింది. కేవలం రెండు నెలల కాలంలోనే ఒక చోటును వదిలి వెళ్లడం ఇంత కష్టంగా ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. నా టీమ్మేట్స్, తోటి ఇంటర్న్స్తో కలిసి చేసిన హంగామాను నేను ఎంతగానో మిస్ అవుతున్నాను. ఒక అందమైన రిసార్ట్ను తలపించే క్యాంపస్లో ఇంతటి అద్భుతమైన వ్యక్తులతో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం’ అని ఆ ఇంటర్న్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.నెటిజన్ల స్పందనఈ పోస్ట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవగానే ముఖ్యంగా విద్యార్థులు, యువ ప్రొఫెషనల్స్ దీనికి కనెక్ట్ అయ్యారు. ‘చాలా రిలేటబుల్గా ఉంది. ఇటీవల నేను కూడా మూడు నెలల ఇంటర్న్షిప్ పూర్తి చేశాను, నాకూ ఇలాగే అనిపించింది’ అని ఒకరు కామెంట్ చేయగా.. మరికొందరు ‘మంచి వాతావరణం, తోడ్పాటు అందించే సహోద్యోగులు ఉంటే ఏ సంస్థ అయినా సొంత ఇల్లులాగే మారుతుంది’ అని అభిప్రాయపడ్డారు.my summer internship at microsoft ended yesterday. never thought leaving after just 2 months would hit this hard. gonna miss all the fun i had with my teammates and co-interns.so grateful to have worked with such amazing people on a campus that literally felt like a resort. i…— Ryuzaki (@ryuzaki2401) July 11, 2026కంపెనీల బ్రాండ్ వాల్యూ పెంచే సంస్కృతినేటి పోటీ ప్రపంచంలో ఐటీ కంపెనీలు కేవలం వ్యాపార లాభాలకే పరిమితం కావడం లేదు. ప్రతిభావంతులైన యువతను ఆకర్షించడానికి గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి సంస్థలు తమ ఆఫీస్ వాతావరణాన్ని అత్యంత ఆహ్లాదకరంగా మారుస్తున్నాయి. క్రీడలు, వినోదం, మెంటరింగ్ సిస్టమ్ (గైడెన్స్ ఇవ్వడం) వంటి వాటి ద్వారా ఉద్యోగులపై ఒత్తిడి లేకుండా చూస్తున్నాయి. ఈ మైక్రోసాఫ్ట్ ఇంటర్న్ కథనం నిరూపిస్తున్నది ఒక్కటే.. మంచి పని సంస్కృతి కేవలం ఉత్పాదకతను పెంచడమే కాదు, సంస్థ నుంచి బయటకు వచ్చే వ్యక్తులు జీవితాంతం ఆ బ్రాండ్కు అంబాసిడర్లుగా మారేలా బలమైన సానుకూల ముద్ర వేస్తుంది. నేటి స్టార్టప్లు, ఇతర కార్పొరేట్ సంస్థలు కూడా ఈ తరహా మానవీయ పని సంస్కృతిని అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇదీ చదవండి: బంగారం కొనాలా? వద్దా? -
ఆన్లైన్ రైలు టికెట్లు.. రైల్వే కీలక హెచ్చరిక
ఆన్లైన్లో రైలు టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు భారతీయ రైల్వే కీలక సూచనలు జారీ చేసింది. చాలామంది ప్రయాణికులు ఈ-టికెట్ను స్క్రీన్షాట్ తీసుకుని లేదా వాట్సాప్లో ఫార్వర్డ్ చేసుకుని అదే టికెట్గా భావిస్తూ ప్రయాణిస్తున్నారు. అయితే కేవలం వాట్సాప్ స్క్రీన్షాట్ లేదా ఫార్వర్డ్ చేసిన టికెట్ చిత్రం మాత్రమే ఉంటే అది చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రం కాదని రైల్వే స్పష్టం చేసింది.ఇటీవలి కాలంలో IRCTC, ఇతర అధికారిక బుకింగ్ ప్లాట్ఫారమ్ల ద్వారా ఈ-టికెట్ల బుకింగ్ విస్తృతంగా పెరగడంతో, టికెట్ వివరాలను కుటుంబ సభ్యులు, స్నేహితులతో వాట్సాప్లో పంచుకోవడం సాధారణంగా మారింది. అయితే ఈ పద్ధతి సమాచారాన్ని పంచుకోవడానికి మాత్రమేనని, టికెట్ తనిఖీ సమయంలో మాత్రం అసలు ఈ-టికెట్ లేదా అధికారిక ధ్రువీకరణ తప్పనిసరిగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.స్క్రీన్షాట్ ఎందుకు చెల్లదు?రైల్వే అధికారుల ప్రకారం స్క్రీన్షాట్లు లేదా వాట్సాప్లో ఫార్వర్డ్ చేసిన చిత్రాలను సులభంగా ఎడిట్ చేయడం, మార్పులు చేయడం సాధ్యమవుతుంది. అలాగే ఒకే చిత్రాన్ని ఎక్కువ మందికి పంపించే అవకాశం ఉండటంతో దుర్వినియోగానికి ఆస్కారం ఉంటుంది. టికెట్ ఎగ్జామినర్లు (TTE) ప్రయాణికుల వివరాలను అసలు బుకింగ్ రికార్డులతో సరిపోల్చి ధ్రువీకరిస్తారు. కేవలం స్క్రీన్షాట్ ఆధారంగా టికెట్ ప్రామాణికతను నిర్ధారించడం సాధ్యం కాదని అధికారులు పేర్కొంటున్నారు.ఏవి చెల్లుబాటు అయ్యే టికెట్లు?ప్రయాణ సమయంలో కింది వాటిలో ఏదో ఒకటి తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి.IRCTC Rail Connect యాప్ లేదా అధికారిక బుకింగ్ ప్లాట్ఫారమ్లో కనిపించే అసలు ఈ-టికెట్బుకింగ్ సమయంలో వచ్చిన అధికారిక SMSఈ-టికెట్ ప్రింటెడ్ కాపీవీటితో పాటు ఆధార్, ఓటర్ ఐడీ, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ వంటి ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డుటికెట్లో ఉన్న పేరు, ఐడీ కార్డులోని పేరుతో సరిపోవడం కూడా తప్పనిసరి.కేవలం వాట్సాప్ స్క్రీన్షాట్ మాత్రమే ఉంటే?టికెట్ తనిఖీ సమయంలో ప్రయాణికుడు అసలు ఈ-టికెట్ లేదా అధికారిక బుకింగ్ రుజువును చూపించలేక, కేవలం వాట్సాప్ స్క్రీన్షాట్ మాత్రమే చూపిస్తే చెల్లుబాటు అయ్యే టికెట్ లేనట్టుగా పరిగణించే అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో రైల్వే చట్టాల ప్రకారం జరిమానా విధించడం, కొత్త టికెట్ కొనుగోలు చేయాలని సూచించడం లేదా అవసరమైతే తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.టికెట్ను షేర్ చేయొచ్చా?ప్రయాణ వివరాలు తెలియజేయడానికి కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో టికెట్ సమాచారాన్ని వాట్సాప్లో పంచుకోవడంపై ఎలాంటి నిషేధం లేదు. అయితే ప్రయాణించే వ్యక్తి వద్ద మాత్రం అసలు ఈ-టికెట్ లేదా అధికారిక బుకింగ్ ధ్రువీకరణ తప్పనిసరిగా ఉండాలి. ఫార్వర్డ్ చేసిన చిత్రం కేవలం సమాచారానికే పరిమితం.ప్రయాణికులకు రైల్వే సూచనలుప్రయాణానికి ముందు IRCTC యాప్లో ఈ-టికెట్ అందుబాటులో ఉందో లేదో చూసుకోవాలి.బుకింగ్ కన్ఫర్మేషన్ SMSను డిలీట్ చేయకుండా సేవ్ చేసుకోవాలి.చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడీ తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి.మొబైల్ ఫోన్కు తగినంత చార్జ్ ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే ఈ-టికెట్ ప్రింట్ కూడా వెంట ఉంచుకోవడం మంచిది. -
మన తరఫున క్యూలో నిలబడి సేవ చేస్తారు!
‘జేబు నిండా సొమ్ముంది.. నచ్చిన వస్తువులన్నీ కొనే దమ్ముంది.. కానీ, అవన్నీ మోసుకుంటూ ఆ రద్దీలో ఎవరు నడుస్తారు బాబూ? వద్దులే!’ అని షాపింగ్ను వాయిదా వేసుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. షాపింగ్ చేయడం మీ వంతు అయితే ఆ బరువును మోయడం మా వంతు అంటూ సరికొత్త సేవలతో ముందుకు వచ్చింది ‘క్యారీమెన్’ అనే స్టార్టప్. న్యూక్లియర్ ఫ్యామిలీల కాలంలో షాపింగ్ బ్యాగులు మోసేందుకు తోడు దొరకడమే కష్టంగా మారిన తరుణంలో ఈ వెరైటీ ‘వెయిట్ లిఫ్టర్స్’ సేవలు ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో హాట్ టాపిక్గా మారాయి.స్వీయానుభవం నుంచే పుట్టిన ఆలోచన!ఢిల్లీలోని అత్యంత రద్దీ మార్కెట్లయిన లజ్పత్ నగర్, సరోజినీ నగర్, చాంద్నీ చౌక్ వంటి ప్రాంతాల్లో షాపింగ్ చేయడం ఒక ఎత్తైతే.. భారీ బ్యాగులు మోస్తూ గంటల తరబడి తిరగడం మరో ఎత్తు. ఈ క్రమంలో షాపింగ్ ఆనందం కాస్తా విరక్తిగా మారుతోందని ‘క్యారీమెన్’ వ్యవస్థాపకులు స్వయంగా గుర్తించారు. ఆ స్వీయానుభవం నుంచే ‘యూ షాప్.. వుయ్ క్యారీ’ అనే సరికొత్త కాన్సెప్ట్కు శ్రీకారం చుట్టారు.ఈ స్టార్టప్ ద్వారా బుక్ చేసుకునే ప్రత్యేక సహాయకులు కేవలం కస్టమర్ల బ్యాగులు మోయడానికే పరిమితం కావడం లేదు. షాపర్స్కు లగ్జరీ అనుభూతిని మిగులుస్తూ ఎక్కువ సేవలను అందిస్తున్నారు. ఫుడ్ స్టాల్స్ దగ్గర, బిల్లింగ్ కౌంటర్ల వద్ద కస్టమర్ల తరఫున ఈ సహాయకులే క్యూలో నిలబడతారు. షాపింగ్ ముగిసిన తర్వాత సరుకులతో సహా కస్టమర్లను మెట్రో స్టేషన్ లేదా వారి వాహనాల వరకు సురక్షితంగా చేరవేస్తారు. ఎండ/వాన నుంచి రక్షణకు గొడుగులు, మొబైల్ ఛార్జింగ్ కోసం పవర్ బ్యాంకులు, అలసిపోతే కూర్చోవడానికి మడత కుర్చీలు కూడా వీరు వెంట తెచ్చుకుంటారు.ఎవరికి ఎక్కువ ఉపయోగం?ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్న పిల్లలతో వచ్చే కుటుంబాలకు ఈ సేవలు కొండంత అండగా నిలుస్తున్నాయని సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ప్రస్తుతానికి ఈ సేవలు కేవలం గంటకు రూ.149 చార్జీతో లభిస్తుండటం విశేషం.దేశవ్యాప్త విస్తరణకు ప్రణాళికలుప్రస్తుతానికి దేశ రాజధాని ఢిల్లీలోని ప్రధాన మార్కెట్లలో పైలట్ ప్రాజెక్ట్గా అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంటున్న ‘క్యారీమెన్’ త్వరలోనే దేశంలోని ఇతర మెట్రో నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి ప్రాంతాలకు కూడా తమ సేవలను విస్తరించడానికి సన్నద్ధమవుతోంది. రాబోయే పండుగల సీజన్ నాటికి ఈ సేవలు మరింత విస్తృతం కానున్నాయి.ఇదీ చదవండి: 39 అత్యవసర ఔషధాల ధరల్లో మార్పు -
అతాను చక్రవర్తి ఆరోపణలపై మౌనం వీడిన కేకీ మిస్త్రీ!
దేశీయ బ్యాంకింగ్ రంగంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్పొరేట్ పాలనా వివాదంపై బ్యాంక్ తాత్కాలిక చైర్మన్ కేకీ మిస్త్రీ ఎట్టకేలకు మౌనం వీడారు. మాజీ నాన్-ఎగ్జ్యూటివ్ చైర్మన్ అతాను చక్రవర్తి తన రాజీనామా లేఖలో లేవనెత్తిన ఆరోపణలను నిరూపించడానికి నిర్వహించిన స్వతంత్ర చట్టపరమైన సమీక్షలో ఎటువంటి ఆధారాలు లభించలేదని బ్యాంక్ స్పష్టం చేసింది. ఈ ఏడాది ఎదుర్కొన్న అతిపెద్ద పాలనా వివాదంపై, బ్యాంక్ తాజా వార్షిక నివేదికలో భాగంగా కేకీ మిస్త్రీ వాటాదారులకు వివరణ ఇచ్చారు.మార్చి 18, 2026న చక్రవర్తి రాజీనామా చేసిన తర్వాత, ఆయన లేవనెత్తిన సమస్యలను పరిశీలించడానికి ప్రముఖ దేశీయ, అంతర్జాతీయ న్యాయ సంస్థలను బోర్డు రంగంలోకి దించింది. ఈ స్వతంత్ర సమీక్ష జూన్ 26, 2026న పూర్తయింది.బాహ్య సమీక్షలో లభించని ఆధారాలువార్షిక నివేదిక ప్రకారం, చక్రవర్తి లేఖలోని చిక్కులను నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఈ ప్రక్రియలో పారదర్శకత కోసం బోర్డు కొన్ని చర్యలు చేపట్టింది. ప్రయోజనాల వైరుధ్యం లేకుండా ఉండేందుకు కేవలం స్వతంత్ర డైరెక్టర్లతో కూడిన ప్రత్యేక కమిటీ పర్యవేక్షణలోనే ఈ సమీక్ష సాగింది. చక్రవర్తి రాజీనామాకు ముందు నాటి రెండేళ్ల కాలానికి సంబంధించిన బోర్డు పత్రాలు, అంతర్గత కమ్యూనికేషన్లను న్యాయ బృందాలు క్షుణ్ణంగా పరిశీలించాయి. ఇందులో భాగంగా ఇండిపెండెంట్ డైరెక్టర్లు, బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓ, సీనియర్ మేనేజ్మెంట్ బృందాన్ని విచారించారు.కార్పొరేట్ పాలనకే మొగ్గుకార్పొరేట్ పాలన, పారదర్శకతకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కట్టుబడి ఉంటుందని మిస్త్రీ స్పష్టం చేశారు. ఈ పరిణామాలు బ్యాంకుకు సవాలుతో కూడిన దశను సూచించినప్పటికీ సంస్థ తన అంతర్గత పాలనా చట్రాన్ని మరింత బలోపేతం చేసిందన్నారు. తన రాజీనామాకు ముందు జరిగిన ఏ బోర్డు చర్చల్లోనూ చక్రవర్తి నైతికతకు విరుద్ధమైన పద్ధతులను ఎత్తి చూపలేదని బోర్డు మునుపటి వైఖరిని పునరుద్ఘాటించింది.ఇదీ చదవండి: 39 అత్యవసర ఔషధాల ధరల్లో మార్పు -
అనిల్ అంబానీ గ్రూప్ కథ ముగిసినట్లేనా?
అనిల్ అంబానీ గ్రూప్నకు చెందిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి భారీ చర్యకు దిగింది. శనివారం నాటి తాజా ఉత్తర్వుల ప్రకారం గ్రూప్నకు చెందిన రూ.1,021 కోట్ల విలువైన తాజా ఆస్తులను ఈడీ తాత్కాలికంగా అటాచ్ చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద ఈ చర్యలు తీసుకున్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ తాజా జప్తుతో కలిపి ఈ గ్రూపునకు సంబంధించి ఇప్పటివరకు అటాచ్ చేసిన మొత్తం ఆస్తుల విలువ రికార్డు స్థాయిలో రూ.20,367 కోట్లకు చేరింది.తాజా జప్తులో ఉన్న ఆస్తులు ఇవే..ఈ ప్రొవిజనల్ అటాచ్మెంట్ ఆర్డర్లో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఆధీనంలో ఉన్న రిలయన్స్ పవర్ లిమిటెడ్ ఈక్విటీ షేర్లను, సాసన్ పవర్ లిమిటెడ్, రిలయన్స్ పవర్ లిమిటెడ్ల నుంచి రావలసిన కొన్ని రుణ వసూళ్ల (లోన్ రిలీవెబుల్స్) మొత్తాలను ఈడీ సీజ్ చేసింది. ఇటీవల ఈ గ్రూపునకు చెందిన ఈ-కాంప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాంగణాలతో పాటు దాని డైరెక్టర్ల నివాసాల్లో నిర్వహించిన సోదాల్లో లభించిన కీలక పత్రాలు, అనుమానాస్పద లావాదేవీల ఆధారంగా ఈ ఆస్తులను గుర్తించినట్లు ఈడీ స్పష్టం చేసింది.అసలు కేసు ఏమిటి? ప్రజాధనం ఎలా మళ్లింది?ఈ భారీ కుంభకోణం వెనుక ఉన్న మూలాలు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లలో ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల కన్సార్టియం ఇచ్చిన ఫిర్యాదుల మేరకు సీబీఐ ఈ కేసులను నమోదు చేసింది.ఈడీ దర్యాప్తులో తేలిన విషయాలురిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (RHFL), రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ (RCFL) సంస్థల ద్వారా బ్యాంకుల నుంచి సేకరించిన దాదాపు రూ.15,548 కోట్ల ప్రజా ధనాన్ని అనిల్ అంబానీ గ్రూప్ పక్కదారి పట్టించింది. గ్రూప్ నియంత్రణలో ఉన్న ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న డమ్మీ (షెల్) కంపెనీల నెట్వర్క్ ద్వారా ఈ నిధులను క్రమబద్ధంగా మళ్లించినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది.ఈ కేసులో ఇటీవలే సీబీఐ ముంబైలోని ప్రత్యేక కోర్టులో రూ.4,097 కోట్ల బ్యాంక్ మోసానికి సంబంధించి తొలి చార్జ్షీట్ను దాఖలు చేసింది. ఇందులో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ సంస్థలతో పాటు రిలయన్స్ క్యాపిటల్ మాజీ వైస్ చైర్మన్ అమితాబ్ ఝున్ఝున్వాలా వంటి కీలక అధికారుల పేర్లను చేర్చింది. ప్రస్తుతం ఈ కుంభకోణంలో మరికొంత మంది డైరెక్టర్లు, అనుబంధ సంస్థలు, ప్రభుత్వ అధికారుల పాత్రపై దర్యాప్తు సంస్థలు నిఘా పెట్టాయి. రాబోయే రోజుల్లో ఈ కేసులో మరిన్ని అరెస్టులు, జప్తులు జరిగే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.ఇదీ చదవండి: 39 అత్యవసర ఔషధాల ధరల్లో మార్పు -
‘ఫార్చ్యూన్ ఇండియా’ పవర్ఫుల్ మహిళగా నీతా అంబానీ టాప్
భారతదేశ ఆర్థిక, పారిశ్రామిక రంగాలను శాసిస్తున్న అత్యంత ప్రభావవంతమైన మహిళా లీడర్ల జాబితాలో రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్పర్సన్ నీతా అంబానీ ప్రథమ స్థానంలో నిలిచారు. ప్రతిష్టాత్మక సంస్థ ఫార్చ్యూన్ ఇండియా విడుదల చేసిన ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్ (ఎంపీడబ్ల్యూ) 2026’ జాబితాలో ఆమె మొదటిస్థానం కైవసం చేసుకున్నారు. ఇటీవల ముంబైలోని ఫోర్ సీజన్స్ హోటల్లో జరిగిన 16వ ఎడిషన్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆమె ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ.. ఒక తల్లిగా తన కుమార్తె ఈషా అంబానీ (రిలయన్స్ రిటైల్ డైరెక్టర్) కూడా ఈ పవర్ఫుల్ 100 మంది జాబితాలో చోటు దక్కించుకోవడం తనకు గర్వకారణంగా ఉందన్నారు.అధికారం అంటే ఇతరులను సాధికారులను చేయడమే!అత్యున్నత పురస్కారాన్ని స్వీకరించిన అనంతరం సదస్సులో నీతా అంబానీ చేసిన ప్రసంగం ఆలోచింపజేసేలా సాగింది. ప్రస్తుత సమాజానికి హార్డ్ పవర్ కంటే మానవీయ విలువలతో కూడిన ‘సాఫ్ట్ పవర్’ అవసరమని ఆమె నొక్కిచెప్పారు. ‘నా దృష్టిలో నిజమైన అధికారం అంటే ఇతరులను సాధికారులను చేయడమే. నేడు ప్రపంచానికి కఠినమైన ఆధిపత్యం వద్దు.. కరుణ, సానుభూతి, ప్రకృతి, జీవకోటి పట్ల అపారమైన గౌరవంతో కూడిన సాఫ్ట్ పవర్ కావాలి. పిల్లలను మనం నమ్మినప్పుడు వారు సాధించలేనిదంటూ లేదు’ అని నీతా అంబానీ అన్నారు.దేశవ్యాప్తంగా విద్యా, ఆరోగ్య, క్రీడా, గ్రామీణాభివృద్ధి రంగాల్లో రిలయన్స్ ఫౌండేషన్ ఇప్పటివరకు 10 కోట్ల (100 మిలియన్లు) మందికి పైగా జీవితాలను ప్రభావితం చేసిందని, అందులో 2.9 కోట్ల మంది పిల్లలు ఉన్నారని ఈ సందర్భంగా నిర్వాహకులు కొనియాడారు.సదస్సులోని ముఖ్య చర్చలుభారత ఆర్థిక వృద్ధికి దిక్సూచిగా మారిన 100 మంది మహిళా శక్తిమూర్తులతో కూడిన ఈ 2026 జాబితా ఆవిష్కరణలో దేశంలోని బిజినెస్, ఫైనాన్స్, టెక్నాలజీ, పబ్లిక్ పాలసీ రంగాల లీడర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్యానెల్ డిస్కషన్లలో పలు కీలక అంశాలు వ్యక్తమయ్యాయి.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వేగవంతమైన సాంకేతిక మార్పులు పరిశ్రమలను మారుస్తున్నప్పటికీ పట్టుదల, కస్టమర్ ఫోకస్, మానవ నిర్ణయాధికారమే శాశ్వత విజయానికి మూలమని బిజినెస్ లీడర్లు స్పష్టం చేశారు.మహిళా సాధికారత అంటే కేవలం బ్యాంక్ ఖాతాలు కలిగి ఉండటం కాదు. సంపద సృష్టి, కుటుంబ ఆర్థిక ప్రణాళికల్లో మహిళలు చురుకైన భాగస్వాములు కావాలని ఫైనాన్స్ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడ్డారు.‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలో సురక్షితమైన పని వాతావరణం, బలమైన కన్స్యూమర్ బ్రాండ్లు, మహిళలు-పిల్లల్లో సరైన పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని సదసులో తెలిపారు. -
రూ.13,000తో రూ.20,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యం
విజయానికి డిగ్రీలు అక్కర్లేదు. కేవలం పట్టుదల, వ్యాపార దార్శనికత ఉంటే చాలని నిరూపించిన పారిశ్రామికవేత్త ఆర్జీ చంద్రమోగన్. గణితంలో ఫెయిల్ అయి నెలకు కేవలం రూ.65 జీతానికి అప్రెంటిస్గా పనిచేసిన ఒక సాధారణ యువకుడు.. నేడు దేశంలో ప్రముఖ ప్రైవేట్ డెయిరీ సామ్రాజ్యానికి అధిపతిగా ఎదగడం ఒక అద్భుత ప్రయాణం. కేవలం రూ.13,000 ప్రారంభ పెట్టుబడితో మొదలైన ఆయన వ్యాపారం నేడు దాదాపు రూ.20,000 కోట్ల మార్కెట్ విలువ కలిగిన ‘హాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్’గా రూపాంతరం చెందింది.వైఫల్యం నుంచి పాఠాలుతమిళనాడులోని గ్రామీణ కుటుంబంలో జన్మించిన చంద్రమోగన్ బాల్యం ఒడిదుడుకులతో సాగింది. కుటుంబ వ్యాపారం దెబ్బతినడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దీనికి తోడు, పాళయంకోట్టైలోని సెయింట్ జేవియర్స్ కళాశాలలో ప్రీ-యూనివర్శిటీ కోర్సు చదువుతున్న సమయంలో ఆయన గణితంలో ఫెయిలవ్వడంతో చదువు ఆగిపోయింది. ఆ తర్వాత చెన్నైకి 160 కిలోమీటర్ల దూరంలోని విలుప్పురంలోని ఒక కలప డిపోలో నెలకు రూ.65 జీతానికి అప్రెంటిస్గా చేరారు. అక్కడ శారీరక శ్రమ చేస్తూ ఆర్డర్లు తీసుకునే క్రమంలోనే.. సొంతంగా ఏదైనా సాధించాలనే బలమైన వ్యాపార కాంక్ష చిగురించింది.రూ.13,000తో ‘అరుణ్’ బ్రాండ్సొంత వ్యాపారం ప్రారంభించాలనే కొడుకు ఆశయానికి తండ్రి అండగా నిలిచారు. కుటుంబానికి ఉన్న పూర్వీకుల భూమిని రూ.13,000కు విక్రయించి పెట్టుబడి పెట్టారు. ఎలాంటి అధికారిక వ్యాపార ప్రణాళికలు లేదా ఇన్వెస్టర్ల సాయం లేకుండా 1970లో చెన్నైలోని రాయపురంలో 250 చదరపు అడుగుల చిన్న అద్దె గదిలో చంద్రమోగన్ తన వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించారు. నలుగురు ఉద్యోగులు, ఒక ప్రాథమిక ఐస్ తయారీ యంత్రంతో రోజుకు 10,000 ఐస్ క్రీమ్ల సామర్థ్యంతో ‘అరుణ్’ (Arun Icecreams) బ్రాండ్ పుట్టింది. ప్రారంభ రోజుల్లో చంద్రమోగన్ స్వయంగా చెన్నై వీధుల్లో తోపుడు బండిపై ఐస్ క్రీమ్లు అమ్మడం గమనార్హం.ఐస్ క్రీమ్ నుంచి డెయిరీ వైపు అడుగులుదాదాపు దశాబ్దం పాటు ఐస్ క్రీమ్ రంగంలో నిలదొక్కుకున్న చంద్రమోగన్ కేవలం సీజనల్ వ్యాపారమైన ఐస్ క్రీమ్ల కంటే నిత్యం డిమాండ్ ఉండే పాలు, పాల ఉత్పత్తుల రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని గుర్తించారు. అప్పటికే అసంఘటితంగా ఉన్న భారతీయ డెయిరీ మార్కెట్ను క్రమబద్ధీకరించేందుకు 1980ల్లో పాల ప్రాసెసింగ్లోకి అడుగుపెట్టారు.కంపెనీ క్రమంగా వెన్న, నెయ్యి, పెరుగు వంటి ఉత్పత్తులను జోడించి విస్తరించింది. వేగవంతమైన లాభాల కంటే.. నమ్మకమైన సరఫరా గొలుసు ఏర్పాటు, రైతులు, రిటైలర్లతో బలమైన సంబంధాలు, పంపిణీ నెట్వర్క్ బలోపేతం పైనే ఆయన దృష్టి సారించారు. ఈ దీర్ఘకాలిక వ్యూహమే ‘హాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్’ను దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ డెయిరీ సంస్థగా నిలబెట్టింది.గ్లోబల్ బిలియనీర్ల జాబితాలో స్థానంఐదు దశాబ్దాల కృషి ఫలితంగా హాట్సన్ ఆగ్రో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.20,000 కోట్ల మార్కును దాటింది. ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం చంద్రమోగన్ నికర ఆస్తి విలువ 1.6 బిలియన్ డాలర్లు. ఆయన 2023లో భారత ధనవంతుల జాబితాలో 99వ స్థానంలో, 2026 నాటికి ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 2,481వ స్థానంలో నిలిచారు. పాడి పరిశ్రమకు చేసిన విశేష సేవలకు గానూ 2018లో ఇండియన్ డెయిరీ అసోసియేషన్ నుంచి ‘ప్యాట్రాన్ అవార్డు’ (పోషక అవార్డు) అందుకున్నారు.ఇదీ చదవండి: 39 అత్యవసర ఔషధాల ధరల్లో మార్పు -
39 అత్యవసర ఔషధాల ధరల్లో మార్పు
దేశంలో సామాన్యుడి వైద్యభారాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిరంతరం వాడాల్సిన అత్యవసర మందుల ధరలను నియంత్రిస్తూ జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్పీపీఏ) సరికొత్త ఉత్తర్వులు జారీ చేసింది. మధుమేహం (డయాబెటిస్), రక్తపోటు (బీపీ), గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సకు ఉపయోగించే 39 కీలక ఔషధాల (న్యూ డ్రగ్ ఫార్ములేషన్స్) రిటైల్ ధరలపై ఎన్పీపీఏ గరిష్ఠ పరిమితిని (క్యాపింగ్) విధించింది. డ్రగ్స్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ (డీపీసీఓ), 2013 నిబంధనల ప్రకారం ఇటీవల జారీ చేసిన ఈ అధికారిక నోటిఫికేషన్లు తక్షణమే అమలులోకి రానున్నాయి.కీలక సవరణలు.. ధరల వివరాలుఎన్పీపీఏ తాజా ఉత్తర్వుల ప్రకారం, నిత్యం ప్రజలు ఉపయోగించే విటమిన్లు, అత్యవసర ఇంజెక్షన్ల ధరలను ఈ క్రింది విధంగా నిర్ణయించారు:కాల్షియం, విటమిన్ D3 మాత్రలు: ఎముకల పుష్టికి, విటమిన్లోప నివారణకు విస్తృతంగా వాడే ఈ మాత్రల గరిష్ఠ రిటైల్ ధరను అన్ని పన్నులతో కలిపి ఒక టాబ్లెట్కు రూ.8.93గా స్థిరీకరించారు.యాంటీ-రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్: పిచ్చి కుక్కలు లేదా ఇతర జంతువులు కరిచినప్పుడు అత్యవసరంగా ఇచ్చే ఈ ప్రాణరక్షక ఇంజెక్షన్ (150 IU/ml) ధరను రూ.119.48గా సవరించారు.కార్డియాక్, బీపీ ఔషధాలు: గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాలను తగ్గించే క్లోపిడోగ్రెల్ + ఆస్పిరిన్ + అటోర్వాస్టాటిన్ క్యాప్సూల్ ధరను ఒక్కోదానికి రూ.6.37గా, హైపర్టెన్షన్ చికిత్సకు వాడే అమ్లోడిపైన్ + బైసోప్రోలోల్ + టెల్మిసార్టాన్ టాబ్లెట్ ధరను రూ.14.74గా నిర్ణయించారు.జీవనశైలి జబ్బుల బాధితులకు ఊరటభారతదేశంలో వైద్య ఖర్చులు చాలా ఎక్కువ. ముఖ్యంగా ఇంట్లో వృద్ధులు లేదా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్న కుటుంబాలకు నెలవారీ మందుల బిల్లులు పెద్ద భారంగా మారుతున్నాయి. తాజా నిర్ణయం ద్వారా బీపీ, షుగర్, హెచ్ఐవీ, శ్వాసకోశ సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్ల ఔషధాల ధరలు నియంత్రణలోకి రావడం వల్ల మధ్యతరగతి, పేద కుటుంబాల బడ్జెట్కు పెద్ద ఊరట లభించనుంది.ఇదీ చదవండి: నిప్పుల కొలిమిలో నగరాలు -
కలుషిత ఆహారం.. స్విగ్గీ ఇన్స్టామార్ట్కు నోటీసులు
ప్రముఖ క్విక్-కామర్స్ ప్లాట్ఫారమ్ స్విగ్గీ ఇన్స్టామార్ట్కు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) షాక్ ఇచ్చింది. వినియోగదారుల నుంచి వచ్చిన నాణ్యత ఫిర్యాదుల నేపథ్యంలో సంస్థకు ఫుడ్ రెగ్యులేటర్ ఏకంగా 9 నోటీసులను జారీ చేసింది. కాలం చెల్లిన, కలుషితమైన, సురక్షితంకాని ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై ఈ నోటీసులు అందినట్లు జాతీయ మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి.లోపభూయిష్ట సేవలు.. కస్టమర్ల ఆగ్రహంఇటీవలి కాలంలో క్విక్ కామర్స్ యాప్ల ద్వారా నిమిషాల వ్యవధిలో నిత్యావసరాలు, ఆహార పదార్థాలను డెలివరీ పొందే ధోరణి మెట్రో నగరాల్లో విపరీతంగా పెరిగింది. అయితే, వేగంగా డెలివరీ చేయాలనే తపనలో నాణ్యతా ప్రమాణాలను గాలికొదిలేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.స్విగ్గీ ఇన్స్టామార్ట్ ద్వారా ఆర్డర్ చేసిన వస్తువులలో కొన్ని ప్రధాన లోపాలు ఉన్నట్లు వినియోగదారులు ఫిర్యాదులు చేశారు. అందులో..ఎక్స్పైరీ డేట్ ముగిసిన పాలు, బ్రెడ్, ప్యాక్డ్ ఫుడ్స్ సరఫరా చేయడం.కొన్ని ప్యాకెట్లలో పురుగులు రావడం, కూరగాయలు/పండ్లు కుళ్లిపోయి ఉండటం.నిల్వ ఉంచే ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఆహార భద్రతకు ముప్పు వాటిల్లడం.నోటీసుల్లో ఏముంది?వినియోగదారుల రక్షణ చట్టాలు, ఆహార భద్రత చట్టాల ప్రకారం ఈ లోపాలపై వివరణ ఇవ్వాల్సిందిగా ఫుడ్ రెగ్యులేటర్ స్విగ్గీ యాజమాన్యాన్ని ఆదేశించింది.1. పంపిణీ కేంద్రాల్లో(డార్క్ స్టోర్స్) నిల్వ పద్ధతులు ఎలా ఉన్నాయి?2. క్వాలిటీ చెకింగ్ కోసం ఎలాంటి నిబంధనలు పాటిస్తున్నారు?3. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకునే చర్యలు ఏమిటి?ఈ విధమైన తొమ్మిది నోటీసులకు సంబంధించి స్విగ్గీ ఇన్స్టామార్ట్ నిర్దేశిత గడువులోగా అధికారిక వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోతే భారీ జరిమానాలతో పాటు సదరు డార్క్ స్టోర్ల లైసెన్సులను రద్దు చేసే అవకాశం కూడా ఉందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు.వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలిఈ నేపథ్యంలో వినియోగదారులు ఆన్లైన్లో ఆహార పదార్థాలు, నిత్యావసరాలు ఆర్డర్ చేసేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వస్తువు డెలివరీ అయిన వెంటనే ప్యాకెట్పై ఉన్న ఉత్పత్తి తేదీ, ఎక్స్పైరీ తేదీలను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి. ఎలాంటి లోపాలున్నా వెంటనే సదరు ప్లాట్ఫారమ్తో పాటు జాతీయ వినియోగదారుల హెల్ప్లైన్ లేదా ఎఫ్ఎస్ఎస్ఏఐకి ఫిర్యాదు చేయవచ్చు.ఇదీ చదవండి: నిప్పుల కొలిమిలో నగరాలు -
యువతకు అలర్ట్.. రాబర్ట్ కియోసాకి పోస్ట్!
బంగారం, వెండి, బిట్కాయిన్ గురించి చెప్పే 'రాబర్ట్ కియోసాకి' (Robert Kiyosaki) ఏఐ గురించి, ఉద్యోగాల గురించి వివరించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో.. దాని ప్రభావం ఉద్యోగాలపై కూడా అంతే వేగంగా కనిపిస్తోంది. ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు ఏఐ టెక్నాలజీని తమ పనుల్లో ఉపయోగించడం మొదలెట్టేశాయి. దీన్నిబట్టి చూస్తే రాబోయే రోజుల్లో ఉద్యోగాలు గణనీయంగా తగ్గుతాయని నిపుణులు పేర్కొన్నారు. అమెరికా మాజీ వాణిజ్య శాఖ మంత్రి కూడా ఇదే విషయాన్ని వెల్లడించిందని కియోసాకి పేర్కొన్నారు.అమెరికా మాజీ వాణిజ్య శాఖ మంత్రి అభిప్రాయం ప్రకారం.. 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న యువ ఉద్యోగులు రాబోయే కాలంలో ఏఐ ప్రభావానికి గుయారవుతారు. నిరుద్యోగం బాగా పెరిగిపోతుంది. అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్స్, డేటా విశ్లేషణ వంటివన్నీ కూడా ఏఐ చేతుల్లోకి వెళ్లిపోయే అవకాశం ఉంది. అనేక కంపెనీల సీఈఓలు కూడా ఈ మార్పుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.అమెరికా వద్ద ఏఐ అభివృద్ధికి కావలసిన స్పష్టమైన వ్యూహం ఉన్నప్పటికీ.. ఈ మార్పుల వల్ల ప్రభావితమయ్యే ఉద్యోగులను ఎలా సిద్ధం చేయాలనే దానికి కావాల్సిన ప్రణాళిక లేదని పేర్కొన్నారు. కాబట్టి యువత ఉద్యోగాల కోసం ప్రభుత్వాలు లేదా ఇతర కంపెనీల మీద ఆధారపడకుండా.. తమ భవిష్యత్తును తామే సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.జాబ్ చేస్తున్నవారు సైతం కేవలం ఒక ఉద్యోగంపై మాత్రమే ఆధారపడకుండా.. కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, ఏఐతో ఎలా కలిసి పనిచేయాలి అనే విషయాలను నేర్చుకోవాలి. అవసరమైతే సొంతంగా కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించడం ముఖ్యమని చెబుతున్నారు. మొత్తం మీద ఏఐ ఉద్యోగాలకు ముప్పు తెస్తుందని స్పష్టంగా తెలుస్తోంది. -
విమానం ఆలస్యమైతే.. ఇవి ఉచితం!
వర్షాకాలంలో భారీ వర్షాల కారణంగా.. విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. దీంతో కొన్నిసార్లు విమానాలు ఆలస్యంగా బయలుదేరడం లేదా పూర్తిగా రద్దు కావడం వంటి పరిస్థితులు ఎదురవుతాయి. అలాంటి సమయంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతాయి. అయితే.. విమానం ఆలస్యమైనా లేదా రద్దైనా ప్రయాణికులకు కొన్ని ప్రత్యేకమైన హక్కులు లభిస్తాయి. ఈ హక్కులను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తన ప్యాసింజర్ చార్టర్లో స్పష్టంగా పేర్కొంది.విమానం ఆలస్యమైతే..నిర్ణీత సమయానికి విమానాశ్రయానికి చేరుకుని చెక్-ఇన్ పూర్తి చేసి ఉంటే, విమానం ఆలస్యమైన సమయాన్ని బట్టి ఎయిర్లైన్ సంస్థ ఉచితంగా భోజనం, తాగునీరు లేదా ఇతర రిఫ్రెష్మెంట్లు అందించాలి. ప్రయాణ సమయం, ఆలస్యమైన గంటలను బట్టి ఈ సౌకర్యాలు అందించాలని నిబంధనలు చెబుతున్నాయి.రీఫండ్ ఎంపికదేశీయ విమానం ఆరు గంటలకు పైగా ఆలస్యమవుతుందని ముందే తెలిసినప్పుడు, ఎయిర్లైన్ సంస్థ కనీసం 24 గంటల ముందే ప్రయాణికులకు సమాచారం ఇవ్వాలి. అలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులు ప్రత్యామ్నాయ విమానాన్ని ఎంచుకోవచ్చు, లేదా పూర్తి టికెట్ మొత్తాన్ని రీఫండ్గా పొందవచ్చు.ఒకవేళ ఎయిర్లైన్ సంస్థ సరైన సమయంలో ప్రయాణికులకు సమాచారం ఇవ్వకపోతే లేదా అదే టికెట్పై బుక్ చేసిన కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అయ్యేలా జరిగితే, కేవలం రీఫండ్ మాత్రమే కాకుండా అదనంగా పరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది.ప్రత్యామ్నాయ విమానం కోసం ప్రయాణికులు విమానాశ్రయంలో వేచి ఉండాల్సి వస్తే.. ఆ సమయంలో కూడా భోజనం, రిఫ్రెష్మెంట్లు ఉచితంగా అందించాల్సిన బాధ్యత ఎయిర్లైన్ సంస్థదే. అయితే.. టికెట్ బుక్ చేసుకునే సమయంలో సరైన మొబైల్ నెంబర్, ఈమెయిల్ వివరాలు ఇవ్వాలి. ఎందుకంటే విమానం ఆలస్యానికి సంబంధించిన వివరాలు ఇక్కడ పంచుకుంటారు. సరైన వివరాలు ఇవ్వని సమయంలో విమానం రద్దు లేదా ఆలస్యం గురించి సమాచారం అందకపోయినా, ఆర్థిక పరిహారం కోరే హక్కు ఉండదు. -
ఐటీ ఉద్యోగులకు మంచి రోజులు
గత కొంతకాలంగా మందగమనంతో (స్లోడౌన్) సాగిన దేశీయ ఐటీ రంగ నియామకాల్లో ఎట్టకేలకు కదలిక వచ్చింది. ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (క్యూ1) ఊహించని విధంగా 9,000 మందికి పైగా కొత్త ఉద్యోగులను చేర్చుకోవడంతో ఐటీ రంగంలో మళ్లీ మంచి రోజులు మొదలయ్యాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. టీసీఎస్ చూపిన ఈ భారీ సానుకూల ధోరణి తర్వాత ఇప్పుడు మార్కెట్ నిపుణులు, ఉద్యోగార్థుల దృష్టి ఇతర అగ్రశ్రేణి కంపెనీలైన ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, విప్రోల నియామక ప్రణాళికలపై పడింది.నాలుగేళ్లలో లేనంత గరిష్టానికి..ప్రస్తుత క్వార్టర్ (Q1FY27)లో టీసీఎస్ ఏకంగా 9,279 మంది నెట్ ఉద్యోగులను అదనంగా చేర్చుకుంది. ఇది గత నాలుగేళ్లలోనే అత్యుత్తమ త్రైమాసిక నియామక రికార్డు కావడం విశేషం. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (Q4FY26)తో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ. ముఖ్యంగా డొమైన్ నిపుణులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అనుభవజ్ఞులైన లాటరల్ హైరింగ్పై (అనుభవజ్ఞుల రిక్రూట్మెంట్) టీసీఎస్ దృష్టి పెట్టింది. అంతర్జాతీయ సంస్థ యాక్సెంచర్ ఇటీవలి త్రైమాసికంలో దాదాపు 12,000 మందిని చేర్చుకున్న విధానాన్ని పోలి ఉండటంతో భారత ఐటీ రంగం రికవరీ బాట పట్టిందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ నువామా విశ్లేషించింది. ప్రస్తుతం టీసీఎస్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,13,069 కి చేరింది.మిగిలిన ఐటీ దిగ్గజాల స్థితిఇన్ఫోసిస్ తన గత ఇన్వెస్టర్ల సమావేశంలో ఈ ఆర్థిక సంవత్సరంలో (FY27) సుమారు 20,000 మంది ఫ్రెషర్లను (కాలేజీల నుంచి కొత్తగా పాసైన వారు) నియమించుకుంటామని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం (FY26) లో కూడా ఇదే సంఖ్యలో ఫ్రెషర్లను తీసుకుంది. అయితే, FY26 చివరి త్రైమాసికం (Q4) లో కంపెనీ ఉద్యోగుల సంఖ్య నెట్గా 8,440 మేర తగ్గింది.హెచ్సీఎల్ టెక్నాలజీస్హెచ్సీఎల్ టెక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్పష్టమైన నియామక గైడెన్స్ను (ముందస్తు అంచనా) ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయినప్పటికీ, గత క్వార్టర్ (Q4FY26) వరకు కంపెనీ నియామకాలను కొనసాగించింది. గత త్రైమాసికంలో 1,712 మంది ఫ్రెషర్లను చేర్చుకుంది. ప్రస్తుతం కంపెనీ మొత్తం సిబ్బంది సంఖ్య 2,27,181 గా ఉంది.విప్రోవిప్రో ప్రస్తుతం నియామకాల విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరిస్తోంది. భారీ ఎత్తున నియామకాల ప్రకటనలు చేయనప్పటికీ మార్చి 1 నుంచి ఉద్యోగులకు వేతన పెంపును ప్రకటించింది. ఇది రాబోయే రోజుల్లో కంపెనీ లాభాల మార్జిన్లపై స్వల్ప ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. గత క్వార్టర్ ముగిసే సమయానికి కేవలం 136 మంది మాత్రమే కొత్తగా చేరడంతో విప్రో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,42,156 వద్ద నిలిచింది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ లాంచ్! -
ఇండిగోకు డీజీసీఏ హెచ్చరిక
దేశీయ విమానయాన రంగంలో అగ్రగామిగా ఉన్న ఇండిగో ఎయిర్లైన్స్కు గగనతల నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) హెచ్చరిక జారీ చేసింది. విమానాల్లో కార్గో నిర్వహణ, ప్రమాదకర వస్తువుల రవాణాకు సంబంధించిన ప్రామాణిక కార్యాచరణ విధానాల (ఎస్ఓపీ) ఉల్లంఘనలపై ఈ హెచ్చరిక లేఖ పంపింది. ‘ఎయిర్క్రాఫ్ట్ (క్యారేజ్ ఆఫ్ డేంజరస్ గూడ్స్) రూల్స్, 2026’ నిబంధనలను విస్మరించడంపై డీజీసీఏ అసంతృప్తి వ్యక్తం చేసింది.ఆడిట్లో బయటపడిన లోపాలుఈ ఏడాది జనవరిలో ఇండిగోకు చెందిన ఒక విమానం ల్యాండ్ అయిన తర్వాత గ్రౌండ్పై కార్గో (సరుకులు) కింద చిందినట్లు (స్పిల్లేజ్) అధికారులు గుర్తించారు. ఈ ఉదంతంపై డీజీసీఏ నిశితంగా పరిశీలించి ఇండిగో కార్గో విభాగంలో ప్రత్యేక ఆడిట్ నిర్వహించింది. ఈ తనిఖీల్లో విమానయాన భద్రతా నిబంధనలు, ప్రమాదకర వస్తువుల హ్యాండ్లింగ్ ప్రొసీజర్లలో తీవ్ర లోపాలు ఉన్నట్లు తేలింది. దీనిపై పూర్తి వివరణ ఇస్తూ భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా తీసుకున్న చర్యలపై ‘యాక్షన్ టేకెన్ రిపోర్ట్’ (ఏటీఆర్) సమర్పించాలని డీజీసీఏ ఆదేశించింది. ఈ హెచ్చరిక లేఖను ఎయిర్లైన్స్ జులై 8న అందుకుంది.స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఆలస్యంగా సమాచారంఈ భద్రతాపరమైన పరిణామానికి సంబంధించి సెబీ ఎల్ఓడీఆర్ రెగ్యులేషన్ 30 ప్రకారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ ఆలస్యంగా సమాచారం ఇచ్చింది. ఈ జాప్యం వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని కేవలం సంస్థలోని అంతర్గత కమ్యూనికేషన్ లోపం వల్లే నియంత్రణ సంస్థల లేఖ వివరాలను స్టాక్ మార్కెట్లకు సకాలంలో వెల్లడించలేకపోయామని కంపెనీ సెక్రటరీ, చీఫ్ కాంప్లయన్స్ ఆఫీసర్ నీరజా శర్మ స్పష్టం చేశారు.కార్యకలాపాల పరంగా ఎలాంటి ప్రభావం లేదుఈ హెచ్చరిక లేఖ వల్ల ఇండిగో విమాన సర్వీసులపై గానీ, సంస్థ ఆర్థిక పరిస్థితిపై గానీ ఎలాంటి ప్రతికూల ప్రభావం పడబోదని యాజమాన్యం వెల్లడించింది. డీజీసీఏ కేవలం హెచ్చరిక లేఖ మాత్రమే ఇచ్చిందని, ప్రస్తుతానికి ఎలాంటి జరిమానా , సర్వీసులపై ఆంక్షలు విధించలేదని పేర్కొంది. నిబంధనల ప్రకారం భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేస్తామని ప్రకటించింది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ లాంచ్! -
ఆటోమొబైల్ దిగ్గజం వోక్స్వ్యాగన్ వినూత్న ప్రయోగం : 100 గొర్రెలతో..!
జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ వోక్స్వ్యాగన్ (Volkswagen) వినూత్ర ప్రయోగం విశేషంగా నిలుస్తోంది. పోలాండ్లోని పోజ్నాన్ (Poznań) నగరంలో ఉన్న తన తయారీ ప్లాంట్లో ఒక సరికొత్త, పర్యావరణహితమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అక్కడున్న 31,000 కంటే ఎక్కువ సోలార్ ప్యానెళ్ల కింద పెరిగే గడ్డిని తొలగించేందుకు సాంప్రదాయ మెకానికల్ యంత్రాలకు (Lawnmowers) బదులుగా 100 గొర్రెల మందను రంగంలోకి దించింది. దీనివల్ల ఇంధన ఖర్చులు, నిర్వహణ సమస్యలు తగ్గడమే కాకుండా, సౌర ఫలకాల నీడ వల్ల గొర్రెలకు వేడి నుంచి ఉపశమనం లభిస్తుందని భావిస్తోంది.ఐరోపాలోనే అతిపెద్ద ఆన్-సైట్ సోలార్ ప్యానల్ వ్యవస్థలలో ఒకటి.పోజ్నాన్ ప్లాంట్లో ఉన్న 18.3 మెగావాట్ (MW) సోలార్ ప్లాంట్ ఇది వోక్స్వ్యాగన్ ఫ్యాక్టరీకి అవసరమైన వార్షిక విద్యుత్తులో 25 శాతం వరకు అందిస్తుంది. ఇక్కడి ప్యానెళ్ల కింద గడ్డి విపరీతంగా పెరగడం వల్ల నిర్వహణ కష్టంగా మారింది. దీంతో యంత్రాల వాడకాన్ని తగ్గించి,సహజంగా గడ్డిని తొలగించేందుకు గొర్రెలతో మేపుతున్నారు. ఇది యంత్రాల వల్ల వచ్చే కర్బన ఉద్గారాలను, ఖర్చులను తగ్గిస్తుంది.గివ్ అండ్ టేక్ పాలసీదీని వల్ల అటు కంపెనీకి లాభం, ఇటు గొర్రెలకు చక్కటి ఆహారం, చల్లదని వస్తుందని భావిస్తోంది. అంటే ఎండ ఎక్కు వున్నపుడు సోలార్ ప్యానెళ్లు గొర్రెలకు చల్లని నీడను ఇస్తూ, వడదెబ్బ తగలకుండా కాపాడతాయి. అలాగే ప్యానెళ్ల కింద ఏపుగా పెరిగిన గడ్డిని శుభ్రంగా మేసేయడం వల్ల ఫ్యాక్టరీకి నిర్వహణ భారం తగ్గుతుంది. ఈ వినూత్న ప్రయోగంలో వోక్స్వ్యాగన్ సంస్థ పోజ్నాన్ యూనివర్సిటీ ఆఫ్ లైఫ్ సైన్సెస్తో చేతులు కలిపింది. జంతు సంరక్షణ, ఆరోగ్యం రక్షణతోపాటు, నేల నాణ్యత, జీవవైవిధ్యం (biodiversity), కీటకాల పెరుగుదలను ప్రోత్సహిస్తుందని పరిశోధకులు చెబు తున్నారు. ఇదీ చదవండి : 20 రోజుల్లోనే కొడుకు, తండ్రిని కోల్పోయాను : న్యాయం చేయండి!గొర్రెల యజమాని ఏమన్నారంటేగొర్రెల యజమాని జస్టినా నోవాక్-గజెక్ మాట్లాడుతూ.. గొర్రెలు భయపడితే గుంపులుగా ఒకేచోట ఉండి పోతాయని, కానీ ఇక్కడ అవి చిన్న చిన్న సమూహాలుగా విడిపోయి ప్రశాంతంగా మేస్తున్నాయని చెప్పారు. దీన్ని బట్టి ఆ జంతువులు అక్కడ చాలా సురక్షితంగా భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. పర్యావరణానికి నష్టం రాకుండా, కార్బన్ ఉద్గారాల బెడద లేకుండా ఆధునిక పరిశ్రమలు ప్రకృతితో కలిసి ఎలా ప్రయాణించ వచ్చో చెప్పడానికి ఈ "సోలార్ ప్యానెల్స్ + గొర్రెల పెంపకం" ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తోంది. ఇదీ చదవండి: 5 రకాల ఫుడ్స్ కంప్లీట్ బంద్ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గింది -
నాలుగు ఫ్లాట్లకు రూ. 180 కోట్లు : ఈ డీల్ ఎవరిదో తెలుసా?
ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్లో జరిగిన భారీ డీల్ హాట్ టాపిక్గా నిలిచింది. ఆస్క్ (ASK) వెల్త్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ గ్రూప్ మాజీ డైరెక్టర్ భారత్ షా కుటుంబం ముంబైలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన వర్లీ ప్రాంతంలో నాలుగు లగ్జరీ అపార్ట్మెంట్లను కొనుగోలు చేసింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 'కల్పతరు వన్' (Kalpataru One) ప్రాజెక్ట్లో జరిగిన ఈ డీల్ మొత్తం విలువ దాదాపు రూ. 180 కోట్లు. రియల్ ఎస్టేట్ విక్రయాల వృద్ధి నెమ్మదించిందనే ఆందోళనలు ఉన్నప్పటికీ, ముంబై, ఢిల్లీ NCR వంటి ప్రధాన నగరాల్లోని లగ్జరీ ప్రాజెక్టులలో భారీ లావాదేవీలు,ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది జరిగిన అతిపెద్ద నివాస ప్రాపర్టీ లావాదేవీలలో ఇది ఒకటిగా నిలిచింది.రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ 'జాప్కీ' (Zapkey) సేకరించిన రిజిస్ట్రేషన్ పత్రాల ద్వారా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. భరత్ షా భార్య ప్రీతి షా, కుమార్తె కిన్నారి షా లిస్టెడ్ డెవలపర్ కల్పతరు లిమిటెడ్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్లోని 34వ, 35వ అంతస్తులలోని అపార్ట్మెంట్లను కొనుగోలు చేశారు. రెరా (RERA) నిబంధనల ప్రకారం ఈ నాలుగు ఫ్లాట్ల మొత్తం కార్పెట్ ఏరియా 17,689 చదరపు అడుగులు (అంటే ఒక్కో అపార్ట్మెంట్ దాదాపు 4,422 చదరపు అడుగులు). చదరపు అడుగు ధర సుమారు రూ. 1.01 లక్షలుగా పలికింది.రూ. 9 కోట్ల స్టాంప్ డ్యూటీమహిళల పేరిట ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయడం వల్ల మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 1శాతం రాయితీ లభించినప్పటికీ, ఈ డీల్ కోసం రూ. 8.97 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. ఈ ఇళ్లతో పాటు 16 కార్ పార్కింగ్ స్లాట్లు కూడా కేటాయించబడ్డాయి. అంతేకాదు ఈ-క్లినికల్ వర్క్స్ (eClinicalWorks) సీఈఓ గిరీష్ నవాని భార్య రాధి నవాని, వర్లీ సీ ఫేస్లోని 'నమన్ క్షానా' ప్రాజెక్ట్లో ఒక అపార్ట్మెంట్ను రూ. 162 కోట్లకు కొనుగోలు చేశారు. ఇదీ చదవండి : 20 రోజుల్లోనే కొడుకు, తండ్రిని కోల్పోయాను : న్యాయం చేయండి! -
రైలు ప్రయాణికులకు అలర్ట్.. అలాంటి టికెట్ చెల్లదు!
డిజిటల్ అన్రిజర్వ్డ్ టికెట్లను ఉపయోగించే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే కీలక సూచనలు జారీ చేసింది. రైల్ వన్ (Rail One) యాప్ ద్వారా బుక్ చేసిన అన్రిజర్వ్డ్ టికెట్లను.. టికెట్ తనిఖీ సమయంలో తప్పనిసరిగా అదే యాప్లో ఒరిజినల్ రూపంలో చూపించాలని వెల్లడించింది.టికెట్కు సంబంధించిన స్క్రీన్షాట్, ఫొటో, పీడీఎఫ్ కాపీ లేదా వాట్సాప్లో ఫార్వర్డ్ చేసిన కాపీలు చెల్లుబాటు కావని రైల్వే అధికారులు తెలిపారు. డిజిటల్ టికెట్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.ఇండియన్ రైల్వే ఈ సూచనలు చేయడానికి కారణం ఇటీవల కోర్బా-విశాఖపట్నం లింక్ ఎక్స్ప్రెస్ రైలులో చోటు చేసుకున్న ఘటనే. కోర్బా నుంచి రాయ్పూర్కు ప్రయాణిస్తున్న ఓ మహిళ తన టికెట్ను వాట్సాప్లో వచ్చిన స్క్రీన్షాట్ రూపంలో టికెట్ తనిఖీ అధికారికి చూపించారు. అయితే ఆ టికెట్ను ఆమె సోదరుడు రైల్ వన్ యాప్ ద్వారా బుక్ చేసి, స్క్రీన్షాట్ను ఆమెకు పంపినట్లు తెలిసింది. అయితే.. విచారణలో టికెట్ రైలు బయలుదేరిన తర్వాత బుక్ చేసినట్లు, అలాగే అది ఆమె రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లో లేకపోవడంతో అధికారులు దానిని చెల్లని టికెట్గా ప్రకటించి నిబంధనల ప్రకారం జరిమానా విధించారు.రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. డిజిటల్ అన్రిజర్వ్డ్ టికెట్ చెల్లుబాటు కావాలంటే, దానిని బుక్ చేసిన అదే మొబైల్ ఫోన్లో, అదే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్లోని రైల్ వన్ యాప్లో అందుబాటులో ఉండాలి. ఇతరులకు పంపిన కాపీలు లేదా స్క్రీన్షాట్లు ప్రయాణానికి పనికిరావు.అంతే కాకుండా.. అన్రిజర్వ్డ్ డిజిటల్ టికెట్ను రైలు బయలుదేరే ముందే బుక్ చేయాలని రైల్వేలు స్పష్టం చేశాయి. రైలు స్టేషన్ నుంచి బయలుదేరిన తర్వాత తీసుకున్న టికెట్, యాప్లో కనిపించినా కూడా చెల్లదని పేర్కొన్నాయి. కాబట్టి ముందుగా టికెట్ బుక్ చేసుకోవాలి. ప్రయాణికులు టికెట్ బుక్ చేసిన మొబైల్ ఫోన్ను ప్రయాణ సమయంలో తమ వెంట ఉంచుకోవాలని, ఫోన్లో తగినంత ఛార్జింగ్ ఉండేలా చూసుకోవాలి. -
దిగ్గజ కంపెనీ లేఆఫ్స్.. ఉద్యోగులకు 39 వారాల వేతనం!
ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ ఇటీవల సుమారు 4,800 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇది సంస్థలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 2.1 శాతం. ప్రస్తుతం కంపెనీ ఏఐ రంగంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించడంతో పాటు, ఖర్చులను తగ్గించడంలో భాగంగా ఈ చర్యలను చేపట్టింది.మైక్రోసాఫ్ట్ ఉద్యోగాల కోతలో 'ఎక్స్బాక్స్' గేమింగ్ విభాగం ఎక్కువ ప్రభావితమైంది. ఇందులో మొదటి విడతలోనే 1,600 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. అంతేకాకుండా.. ఎక్స్బాక్స్ తనకు చెందిన నాలుగు గేమింగ్ స్టూడియోలను విక్రయించాలని, మరో స్టూడియోతో కూడా విడిపోవాలని నిర్ణయించింది.ఇదిలా ఉండగా.. జాబ్ కోల్పోయిన ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ సెవరెన్స్ ప్యాకేజీ ప్రకటించింది. ఉద్యోగి కంపెనీలో ఎంతకాలం పనిచేశాడు?, ఏ స్థాయిలో ఉన్నాడు? అనే విషయాల ఆధారంగా వారికి 60 రోజుల నుంచి 39 వారాల వరకు వేతనం చెల్లించనుంది. దీంతోపాటు.. కొంతకాలం వరకు ఆరోగ్య బీమా, కంపెనీ షేర్లకు సంబంధించిన ప్రయోజనాలను కూడా కొనసాగించనుంది. ఈ నిర్ణయం ఉద్యోగులు కొత్త అవకాశాలు వెతుక్కోవడానికి కొంత సహాయపడుతుంది.ఎక్స్బాక్స్ అధిపతి ఆశా శర్మ ఉద్యోగులకు పంపిన సందేశంలో ప్రస్తుతం సంస్థ ఆర్థిక పరిస్థితి ఆశించినంత బాగా లేదని తెలిపారు. ఇతర గేమింగ్ సంస్థలతో పోలిస్తే తమ లాభాలు చాలా తక్కువగా ఉన్నాయని వెల్లడించారు. అయితే.. ఉద్యోగులను తొలగించడం అనేది వారి పనితీరును బట్టి తీసుకున్న నిర్ణయం కాదని, సంస్థ భవిష్యత్తు.. అభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినదని ఆమె స్పష్టం చేశారు.ఇదీ చదవండి: మస్క్ ప్రసంశలు.. AI రంగంలో వారే టాప్!మైక్రోసాఫ్ట్ తీసుకున్న లేఆఫ్స్ నిర్ణయం ప్రపంచ ఐటీ రంగంలో జరుగుతున్న మార్పులకు ఒక స్పష్టమైన ఉదాహరణ. ఏఐ వంటి కొత్త సాంకేతిక రంగాల్లో ముందంజలో ఉండేందుకు కంపెనీలు తమ వ్యాపార విధానాలను మార్చుకుంటున్నాయి. ఉద్యోగుల తొలగింపులు బాధాకరమైనవే అయినప్పటికీ, సంస్థ భవిష్యత్తు అభివృద్ధి, పోటీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
టీసీఎస్ బోణీ బాగుంది!
ముంబై: ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) జోరుతో ఐటీ కంపెనీల వృద్ధికి గండి పడుతుందన్న ఆందోళనల నేపథ్యంలో... దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ మెరుగైన ఆర్థిక ఫలితాలతో బోణీ కొట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్ (2026–27, క్యూ1)లో రూ.13,349 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో రూ.12,760 కోట్లతో పోలిస్తే లాభం 4.6% పెరిగింది. కాగా, కొన్ని అసాధారణ అంశాలను మినహాయిస్తే, క్యూ1లో లాభం 8.5% వృద్ధితో రూ.13,849 కోట్లుగా నమోదైనట్లు కంపెనీ పేర్కొంది. మొత్తం ఆదాయం 14% జంప్ చేసి రూ.72,275 కోట్లకు ఎగబాకింది. గతేడాది క్యూ1లో ఆదాయం రూ. 63,437 కోట్లుగా నమోదైంది. సీక్వెన్షియల్గా చూస్తే... గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి (క్యూ4)లో టీసీఎస్ రూ.13,718 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. దీంతో పోలిస్తే సీక్వెన్షియల్గా ఈ క్యూ1లో లాభం 2.7% తగ్గింది. ఆదాయం 70,698 కోట్ల నుంచి 2.23% వృద్ధి చెందింది. డివిడెండ్ రూ.12 టీసీఎస్ వాటాదారులకు రూ. 1 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.12 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. దీనికి జూలై 15 రికార్డు తేదీగా నిర్ణయించింది. జూలై 31న చెల్లింపు జరుగుతుంది.ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలు... → క్యూ1లో కంపెనీ 9.5 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులను దక్కించుకుంది. ఇందులో ఎస్కేఎఫ్తో కుదుర్చుకున్న 800 మిలియన్ డాలర్ల ఏఐ ఆధారిత మెగా డీల్ కూడా ఉంది. → వార్షికంగా రూ.2.6 బిలియన్ డాలర్ల ఏఐ ఆదాయాన్ని ఆర్జించింది. మార్చి క్వార్టర్తో పోలిస్తే 13.6 శాతం వృద్ధి నమోదైంది. → ఆపరేటింగ్ లాభాల మార్జిన్ 24 శాతానికి తగ్గింది. మార్చి క్వార్టర్లో ఇది 25.3 శాతంగా ఉంది. కొత్త పెట్టుబడులు, వేతనాల పెంపు దీనికి ప్రధాన కారణం. → ఏఐ ఎకోసిస్టమ్ను విస్తరించడానికి ఆంత్రోపిక్, మిస్ట్రాల్తో వ్యూహాత్మక భాగస్వామ్యాలను కుదుర్చుకున్నట్లు కంపెనీ సీఎఫ్ఓ ఆర్తి సుబ్రమణియన్ వెల్లడించారు. → కన్జూమర్ బిజ మినహా అన్ని రంగాల ఆదాయాలు పెరిగాయి. బీఎఫ్ఎస్ఐ 2.4%, లైఫ్ సైన్సెస్–హెల్త్కేర్ 3.5%, ఎనర్జీ–రిసోర్సెస్–యుటిలిటీస్ 6.9% వృద్ధి చెందాయి. → ప్రాంతాల వారీగా చూస్తే, లాటిన్ అమెరికా (–2,1%), యూకే (0.6%) ఆదాయాలు తగ్గాయి. ఉత్తర అమెరికా 2%, యూరప్ 4.3 శాతం, ఆసియా పసిఫిక్ 2.5 శాతం చొప్పున పెరుగుదల నమోదైంది. బీఎస్ఎన్ఎల్తో భారీ డీల్ రద్దయినప్పటికీ, భారత్ నుంచి ఆదాయం 22.9 శాతం ఎగబాకడం విశేషం. → క్యూ1లో 9,279 మంది ఉద్యోగులు జతయ్యారు. నాలుగేళ్లలో ఒకే క్వార్టర్లో అత్యధిక నియామకాలు ఇవే కావడం గమనార్హం. దీంతో జూన్ 30 నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 5,93,798కి చేరింది. ఐటీ సేవల్లో ఉద్యోగుల వలసల రేటు (ఆట్రిషన్) 13.6 శాతంగా నమోదైంది. టీసీఎస్ షేరు అర శాతం నష్టంతో రూ.2,048 వద్ద క్లోజైంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా కొంతమంది క్లయింట్లు ప్రాజెక్టులను వాయిదా వేయడంతో క్యూ1లో డిమాండ్ కాస్త మందగించింది. అయితే, ప్రస్తుత క్యూ2లో మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది. భౌగోళికపరమైన, స్థూల ఆర్థిక ప్రతికూలతలు నెలకొన్నప్పటికీ.. కంపెనీ వృద్ధి పథంలో కొనసాగుతోందనేందుకు క్యూ1 ఫలితాలే నిదర్శనం. ఏఐ, ఆధునీకరణ, సైబర్ సెక్యూరిటీ, సావరీన్ క్లౌడ్తో పాటు ప్లాట్ఫామ్ సరళీకరణపై కస్టమర్లు పెట్టుబడుల జోరు పెంచారు. మా పటిష్టమైన కొత్త డీల్స్, ఎకోసిస్టమ్ భాగస్వామ్యాల విస్తరణ, కొత్త క్లయింట్లను జత చేసుకోవడంలో మెరుగుదల వంటివి వృద్ధి నిలదొక్కుకోవడానికి దోహదం చేస్తోంది. – కె. కృతివాసన్, టీసీఎస్ సీఈఓ, ఎండీ -
విమాన ప్రయాణాలు పెరిగాయ్..
న్యూఢిల్లీ: దేశీయంగా మే నెలలో 1.53 కోట్ల మంది విమాన ప్రయాణాలు చేశారు. ఇది గతేడాది మే తో పోలిస్తే 9.49 శాతం, ఈ ఏడాది ఏప్రిల్తో పోలిస్తే 11 శాతం అధికం. మే నెలలో ఇండిగో మార్కెట్ వాటా 64.9 శాతానికి తగ్గగా, ఎయిరిండియా గ్రూప్ 25.6 శాతానికి పెరిగింది. ఆకాశ ఎయిర్ వాటా పెద్దగా మార్పేమీ లేకుండా 5.8 శాతంగానే కొనసాగగా, స్పైస్జెట్ మాత్రం 2.5 శాతానికి క్షీణించింది.జనవరి–మే మధ్య కాలంలో దేశీ విమానయాన సంస్థలు 7.29 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఒక నివేదికలో పేర్కొంది. ఈ సంఖ్య వార్షికంగా 1.91 శాతం, నెలవారీగా 9.49 శాతం మేర వృద్ధి చెందినట్లు వివరించింది. 10 కీలక విమానాశ్రయాల్లో సమయపాలన (ఓటీపీ) విషయానికొస్తే 82.8 శాతంతో ఇండిగో అగ్రస్థానంలో ఉండగా, ఆకాశ ఎయిర్, ఎయిరిండియా గ్రూప్ వరుసగా 78.3 శాతం, 74.5 శాతంతో తదుపరి స్థానాల్లో ఉన్నాయి. స్పైస్జెట్ ఓటీపీ 26.5 శాతంగా ఉంది.మే నెలలో విమానాల రద్దుతో 63,723 మందిపై ప్రభావం పడగా, పరిహారం..ప్రయాణికులకు సదుపాయాల కల్పన కోసం ఎయిర్లైన్స్ రూ. 70.32 లక్షలు వెచ్చించాయి. -
ఎల్రక్టానిక్స్ ముడి వస్తువులకు సుంకాల మినహాయింపు
న్యూఢిల్లీ: ఎల్రక్టానిక్స్ తయారీలో కీలకమైన డిస్ప్లే అసెంబ్లీలు, లిథియం అయాన్ సెల్స్, ఇండక్షన్ కాయిల్ మాడ్యూల్స్కి బేసిక్ కస్టమ్స్ సుంకాల (బీసీడీ) నుంచి మినహాయింపునిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, వేరబుల్స్, స్మార్ట్ టీవీల్లాంటి ఎల్రక్టానిక్ డివైజ్లను దేశీయంగా తయారు చేసేలా ప్రోత్సహించేందుకు ఇది దోహదపడనుంది.డిస్ప్లే అసెంబ్లీలు, మాడ్యూల్స్పై మినహాయింపు 2029 మార్చి 31 వరకు వర్తిస్తుందని కేంద్రం ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. దేశీయంగా లిథియం అయాన్ సెల్ తయారీలోకి మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడగలదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. బ్యాటరీ గిగాఫ్యాక్టరీలు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీదార్లు, కన్జూమర్ ఎల్రక్టానిక్స్ కంపెనీలు, డేటా సెంటర్లు మొదలైనవి గణనీయంగా లబ్ధి పొందగలవని పేర్కొన్నాయి. -
స్టైలిష్ లుక్.. రోజంతా కంఫర్ట్.. మార్కెట్లోకి కొత్త శాండల్స్!
ప్రస్తుతం ఫ్యాషన్ అంటే కేవలం దుస్తులు మాత్రమే కాదు.. మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ప్రతి అంశం అందులో భాగమైంది. ముఖ్యంగా ఫుట్వేర్ విషయంలో యువత స్టైల్తో పాటు సౌకర్యానికీ ప్రాధాన్యం ఇస్తోంది. ఈ మారుతున్న ఫ్యాషన్ ధోరణులను దృష్టిలో ఉంచుకుని దేశంలోని ప్రముఖ యువ ఫుట్వేర్ బ్రాండ్ స్పార్క్స్ (Sparx) కొత్త ‘చంకీ సోల్ శాండల్స్’ కలెక్షన్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.అంతర్జాతీయ ఫ్యాషన్ ట్రెండ్ల స్ఫూర్తితో రూపొందించిన ఈ శాండల్స్ ఆకర్షణీయమైన డిజైన్తో పాటు రోజంతా సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించారు. నగరాల్లో రోజువారీ ప్రయాణాలు, వీకెండ్ ట్రిప్స్, వెకేషన్లు లేదా సాధారణ వినియోగం.. ఇలా అన్ని సందర్భాల్లో ఉపయోగించుకునేలా వీటిని డిజైన్ చేశారు. మందంగా ఉండే చంకీ సోల్, స్పోర్టీ లుక్, బలమైన మెటీరియల్, ఆధునిక రంగుల కలయిక ఈ కలెక్షన్కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. జీన్స్, కార్గో ప్యాంట్లు, షార్ట్స్ వంటి దుస్తులకు కూడా సులభంగా మ్యాచ్ అయ్యేలా వీటిని రూపొందించారు.శాండల్స్లో అడ్జస్టబుల్ స్ట్రాప్స్ ఉండటంతో పాదాలకు సరైన ఫిట్ లభిస్తుంది. మెరుగైన కుషనింగ్, తక్కువ బరువుతో రూపొందించడంతో ఉదయం నుంచి రాత్రి వరకు ధరించినా సౌకర్యంగా ఉంటాయని కంపెనీ తెలిపింది. స్టైల్ కోసం కంఫర్ట్ను, కంఫర్ట్ కోసం స్టైల్ను వదులుకోవాల్సిన అవసరం లేకుండా ఈ కొత్త కలెక్షన్ను రూపొందించామని స్పార్క్స్ వెల్లడించింది. -
హైదరాబాద్లో ‘నేషన్వైడ్’ జీసీసీ
ఇన్సూరెన్స్ దిగ్గజం ’నేషన్వైడ్’ హైదరాబాద్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటు చేసినట్టు బుధవారం ప్రకటించింది. అమెరికా వెలుపల సంస్థ ఏర్పాటు చేసిన మొట్టమొదటి అంతర్జాతీయ క్యాంపస్ ఇదే కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా సంస్థకు ఇది నాల్గవ సాంకేతిక హబ్. మారుతున్న వ్యాపార అవసరాలకు అనుగుణంగా వేగవంతమైన నిర్ణయాలు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు సంస్థ ’గ్లోబల్ 24/7 ఆపరేటింగ్ మోడల్’ విధానాన్ని ఎంచుకుంది.ఇందులో భాగంగా హైదరాబాద్ కేంద్రం కీలక పాత్ర పోషించనుంది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డేటా ఇంజనీరింగ్, అప్లికేషన్ సపోర్ట్ వంటి అత్యాధునిక డిజిటల్ సామర్థ్యాలను ఇక్కడి నుంచే పెంపొందించనున్నారు. ఈ సందర్భంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రపంచంలోనే బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాలకు హైదరాబాద్ అత్యుత్తమ గమ్యస్థానంగా మారిందన్నారు. ప్రపంచంలోని టాప్-10 బీఎఫ్ఎస్ఐ దిగ్గజాల్లో 9 సంస్థలు ఇప్పటికే హైదరాబాద్ నుంచి తమ కార్యకలాపాలను నడిపిస్తున్నాయని గుర్తుచేశారు. ఇప్పుడు ప్రముఖ అమెరికన్ ఇన్సూరెన్స్ సంస్థ ’నేషన్వైడ్’ను తెలంగాణ గ్లోబల్ వాల్యూ సెంటర్స్ జాబితాలోకి స్వాగతించడం సంతోషంగా ఉందన్నారు. -
పుస్తకం మార్చేసిన జీవితం.. స్కూల్ డ్రాపవుట్ నుంచి బిలియనీర్గా..
విజయం సాధించాలంటే.. మంచి చదువు, ఉన్నత విద్య, ఆ తర్వాత మంచి ఉద్యోగం.. చాలామంది అనుసరించే మార్గం ఇదే. కానీ భారతదేశంలోని అతిపెద్ద రిటైల్ బ్రోకరేజ్ సంస్థ అయిన జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ ప్రయాణం మాత్రం దీనికి పూర్తి భిన్నం. ఎందుకంటే.. పాఠశాల చదువును మధ్యలోనే నిలిపివేసిన ఆయన, ఎలాంటి డిగ్రీ లేకుండానే దేశంలోని అత్యంత విజయవంతమైన యువ పారిశ్రామికవేత్తల్లో ఒకరిగా ఎదిగారు.కోట్ల రూపాయల సంపదను సృష్టించిన నిఖిల్ కామత్ జీవితంలో అత్యంత ప్రభావం చూపిన పాఠం వ్యాపారం కాదు.. ఒక పుస్తకం అని తెలిస్తే తప్పకుండా చాలామంది ఆశ్చర్యపోతారు.సుమారు 34 ఏళ్ల వయసులో నిఖిల్ కామత్, పులిట్జర్ అవార్డు గ్రహీత ఎర్నెస్ట్ బెకర్ రచించిన 'ది డినయల్ ఆఫ్ డెత్' (The Denial of Death) పుస్తకాన్ని చదివారు. మనిషి జీవితానికి పరిమితి ఉందనే వాస్తవాన్ని మాత్రమే కాకుండా.. అతని ఆశయాలు, లక్ష్యాలు, నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తుందో ఈ పుస్తకం వివరిస్తుంది.ఈ పుస్తకం చదివిన తరువాత నిఖిల్ కామత్ ఒక సాధారణ లెక్క వేసుకున్నారు. సగటు మనిషి ఆయుష్షును ఆధారంగా తీసుకుని తనకు ఇంకా దాదాపు 36 సంవత్సరాల జీవితం మాత్రమే మిగిలి ఉందని అంచనా వేశారు. అది డబ్బు లెక్క కాదు.. సమయం లెక్క. అదే ఆయన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. "డబ్బు కంటే సమయమే జీవితంలో అత్యంత విలువైన ఆస్తి" అనే భావనను ఆయన మరింత బలంగా అర్థం చేసుకున్నారు. అప్పటి నుంచి విజయాన్ని కొలిచే విధానం, నిర్ణయాలు తీసుకునే తీరు, జీవితానికి ఇచ్చే ప్రాధాన్యత అన్నీ మారిపోయాయని ఆయన పలుమార్లు చెప్పారు.ఆలోచనా విధానాన్ని మార్చిన పుస్తకాలునిఖిల్ కామత్ అభిప్రాయం ప్రకారం, పుస్తకాలు కేవలం విజ్ఞానాన్ని మాత్రమే కాదు.. మనుషులను, సమాజాన్ని, మనల్ని మనం అర్థం చేసుకునే దృక్పథాన్ని కూడా అందిస్తాయి. ఆయన సూచించిన పుస్తకాలలో మోర్గాన్ హౌసెల్ రాసిన ది సైకాలజీ ఆఫ్ మనీ ముఖ్యమైనది. డబ్బు సంపాదించడంలో తెలివితేటల కంటే సహనం, క్రమశిక్షణ, భావోద్వేగాల నియంత్రణ ఎంతో కీలకమని ఈ పుస్తకం వివరిస్తుంది.ర్యాన్ హాలిడే రచించిన 'స్టిల్నెస్ ఈజ్ ది కీ' పుస్తకం.. ఒత్తిడి, అనిశ్చితి మధ్య ప్రశాంతంగా ఆలోచించే వ్యక్తులే సరైన నిర్ణయాలు తీసుకుంటారని చెబుతుంది. రిచర్డ్ డాకిన్స్ రచించిన 'ది సెల్ఫిష్ జీన్' మానవ ప్రవర్తన వెనుక ఉన్న పరిణామ సిద్ధాంతాన్ని వివరిస్తే, ఇసాబెల్ విల్కర్సన్ రచించిన 'కాస్ట్' సమాజంలో అసమానతలు, సామాజిక వ్యవస్థలపై లోతైన విశ్లేషణను అందిస్తుంది.పుస్తకాలు నేర్పే జీవిత పాఠాలుఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే.. నిఖిల్ కామత్ కథను చూసి చదువు అవసరం లేదని భావించడం సరైంది కాదు. ఆయన ప్రయాణం చెప్పే అసలు సందేశం ఏమిటంటే.. నేర్చుకోవడం అనేది పాఠశాల లేదా కళాశాలతో ముగిసిపోదు. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి, పుస్తకాలు చదివే అలవాటు, విభిన్న అంశాలపై అవగాహన పెంచుకోవడం వ్యక్తిగత వికాసానికి ఎంతో అవసరం. తరగతి గదిలో నేర్చుకోలేని ఎన్నో జీవన పాఠాలను పుస్తకాలు నేర్పగలవని ఆయన గట్టిగా నమ్ముతారు.డబ్బు కాదు.. సమయమే అసలు సంపదవిజయవంతమైన వ్యాపారవేత్తలను చూసినప్పుడు వారు ఎక్కడ పెట్టుబడులు పెట్టారు? ఎలా బిలియనీర్లు అయ్యారు? అనే ప్రశ్నలే ఎక్కువగా వినిపిస్తాయి. కానీ నిఖిల్ కామత్ ఎక్కువగా మాట్లాడేది మరో పెట్టుబడి గురించి.. అదే సమయం.డబ్బు కోల్పోతే తిరిగి సంపాదించవచ్చు, వ్యాపారాన్ని మళ్లీ నిర్మించవచ్చు. కానీ ఒకసారి గడిచిపోయిన సమయాన్ని మాత్రం ఎవరూ తిరిగి తీసుకురాలేరు. అందుకే జీవితంలో నిజంగా విలువైన వాటిపై దృష్టి పెట్టాలని, నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగాలని ఆయన సూచిస్తున్నారు.ఇదీ చదవండి: మరో పవర్ఫుల్ AI మోడల్ వచ్చేసింది! -
కార్పొరేట్ అగ్రపీఠంపై మిలీనియల్స్ జైత్రయాత్ర!
భారతీయ కార్పొరేట్ కంపెనీల్లో సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా అత్యున్నత నిర్ణయాధికారాలు కలిగిన ‘సీ-సూట్’ (C-Suite - CEO, CFO, CMO, CTO.. వంటి కీలక పదవులు) స్థానాలను యువత వేగంగా చేజిక్కించుకుంటోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఎగ్జిక్యూటివ్లలో మిలీనియల్స్ (యువతరం) ఏకంగా 55 శాతం వాటాతో అతిపెద్ద లీడర్షిప్ గ్రూప్గా అవతరించారు. ప్రముఖ ప్రొఫెషనల్ నెట్వర్క్ లింక్డ్ఇన్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. గత ఏడేళ్లలో సీ-సూట్ విభాగంలో మిలీనియల్స్ ప్రాతినిధ్యం 14.5 శాతం పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత వ్యాపార నిర్ణయాలను శాసిస్తున్న తరుణంలో ఈ మార్పు ప్రాధాన్యత సంతరించుకుంది.మారుతున్న కెరీర్ ముఖచిత్రంగతంలో ఒకే పరిశ్రమలో ఏళ్ల తరబడి పనిచేసిన అనుభవం ఉన్నవారికే లీడర్షిప్ పాత్రలు దక్కేవి. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. సీ-సూట్ నాయకుల్లో ఒకే పరిశ్రమకు పరిమితమైన వారి సంఖ్య గతంలో 80 శాతం ఉండగా ఇప్పుడది 58 శాతానికి పడిపోయింది. అంటే.. వివిధ సంస్థలు, విభిన్న రకాల వ్యాపారాలు, మల్టిపుల్ ఫంక్షన్స్లో అనుభవం ఉన్నవారికే కంపెనీలు పట్టం కడుతున్నాయి.మరోవైపు, ఏఐ రాకతో కార్పొరేట్ రంగంలో కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతోందని 84 శాతం మంది లీడర్లు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్లు (సీఎంఓ) అత్యధికంగా 94 శాతంతో ఈ మార్పును బలంగా నమ్ముతున్నారు. అంతేకాదు, వ్యాపార నిర్ణయాలు తీసుకోవడంలో 84 శాతం మంది లీడర్లు ఏఐ టూల్స్ ఇచ్చే ఇన్పుట్స్ను కీలకంగా వాడుతుండటం గమనార్హం.మార్కెట్ కంటే వేగంగా నేర్చుకోవాలి!‘భారత కార్పొరేట్ నాయకత్వం ఇప్పుడు అత్యంత సవాలుతో కూడిన దశలోకి ప్రవేశించింది. ఏఐ యుగంలో పాత రూల్ బుక్స్ కాలంచెల్లుతుంది. స్పష్టమైన రోడ్ మ్యాప్ లేకపోయినా లీడర్లు వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో వ్యాపార వ్యూహాలకు సాంకేతికత, ప్రతిభను జోడిస్తున్నవారే సఫలమవుతున్నారు. మార్కెట్ మారుతున్న వేగంతో సమానంగా లీడర్లు నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి’ అని లింక్డ్ఇన్ ఇండియా కంట్రీ మేనేజర్ కుమారేష్ పట్టాభిరామన్ తెలిపారు.వేగం పెంచాలనే ఒత్తిడిటెక్నాలజీ మారుతున్న వేగానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం ఇప్పుడు లీడర్లకు పెద్ద పరీక్షగా మారింది. దాదాపు ఐదింటిలో నలుగురు (79%) సీ-సూట్ లీడర్లు.. ఏఐ వల్ల కలిగే పూర్తి ఫలితాలను అంచనా వేయడానికి ముందే దానిని వ్యాపారాల్లో వేగంగా అమలు చేయాలనే ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ ఒత్తిడి సీఎంఓల్లో 82 శాతం, సీటీఓల్లో 81 శాతంగా ఉంది. అలాగే, తీవ్రమైన అనిశ్చితి మధ్య అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకోవడమే తమ ముందున్న అతిపెద్ద సవాలని 39 శాతం మంది లీడర్లు (ముఖ్యంగా 46% మంది సీఎంఓలు, 43% మంది సీఈఓలు) అంగీకరిస్తున్నారు.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప మార్పు -
ఎస్బీఐ నుంచి మెగా ఐపీఓకు రంగం సిద్ధం
దేశీయ మ్యూచువల్ ఫండ్ రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ‘ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్' ఐపీఓకు సర్వం సిద్ధం చేసింది. రూ.11,692.91 కోట్ల అంచనాతో వస్తున్న ఈ పబ్లిక్ ఇష్యూకు సంబంధించిన ప్రైస్ బ్యాండ్ను కంపెనీ అధికారికంగా ప్రకటించింది. 2026 సంవత్సరంలోనే దేశీయ ప్రాథమిక మార్కెట్లో భారీ ఐపీఓగా ఇది రికార్డు సృష్టించబోతోంది. ఈ మెగా ఐపీఓకు సంబంధించిన వివరాలు కొన్ని కింద చూద్దాం.రూ.545 - రూ.574 గా ప్రైస్ బ్యాండ్ ఖరారుస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ అయిన ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ తన ఐపీఓ ధరల శ్రేణిని ఒక్కో షేరుకు రూ.545-రూ.574 గా నిర్ణయించింది. అప్పర్ ప్రైస్ బ్యాండ్ వద్ద లెక్కగడితే ఈ కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా రూ.1.17 లక్షల కోట్లకు చేరనుంది.అయితే, ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో జరుగుతోంది. దీని ద్వారా ప్రమోటర్లు 20 కోట్లకు పైగా షేర్లను విక్రయిస్తున్నారు. ఇందులో ఎలాంటి ఫ్రెష్ ఇష్యూ (తాజా షేర్ల జారీ) లేదు. కాబట్టి, ఐపీఓ ద్వారా వచ్చే నిధులన్నీ విక్రయించే వాటాదారులకే వెళ్తాయి తప్ప కంపెనీ ఖాతాలోకి చేరవని గమనించాలి.రిటైల్ పెట్టుబడిదారులకు కనీస పెట్టుబడి ఎంత?సాధారణ రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కంపెనీ కనీస లాట్ పరిమాణాన్ని 26 షేర్లుగా నిర్ణయించింది. ఒక లాట్ కోసం దరఖాస్తు చేయాలంటే అప్పర్ ప్రైస్ బ్యాండ్ (రూ.574) ప్రకారం రిటైల్ పెట్టుబడిదారునికి కనీసం రూ.14,924 అవసరమవుతాయి. గరిష్టంగా ఇన్వెస్టర్లు 26 షేర్ల మల్టిప్లైస్లో మరిన్ని లాట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప మార్పుపెట్టుబడిదారుల యాంకర్ బుక్ ఓపెనింగ్ జులై 13.సబ్స్క్రిప్షన్ ప్రారంభం జులై 14.సబ్స్క్రిప్షన్ ముగింపు జులై 16.షేర్ల కేటాయింపు ఖరారు జులై 17 (అంచనా).రిఫండ్లు, నిధుల అన్బ్లాకింగ్: జులై 20డీమ్యాట్ ఖాతాల్లోకి షేర్ల జమ: జులై 20 -
జీరో కమీషన్ పాలసీపై ఫ్లిప్కార్ట్ నిర్ణయం
దేశీయ ఈ-కామర్స్ రంగంలో తీవ్ర పోటీ నెలకొన్న తరుణంలో ఫ్లిప్కార్ట్ విక్రేతలకు (సెల్లర్లు) బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్లాట్ఫామ్పై వ్యాపారాన్ని మరింత సులభతరం చేయడంతోపాటు విక్రేతలకు మరిన్ని లాభాలను చేకూర్చే లక్ష్యంతో తన ‘జీరో-కమీషన్’ విధానాన్ని విస్తరిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు కేవలం రూ.1,000 లోపు ధర గల ఫ్యాషన్ ఉత్పత్తులకే పరిమితమైన ఈ జీరో కమీషన్ నిబంధనను ఇకపై ధరతో నిమిత్తం లేకుండా అన్ని రకాల ఫ్యాషన్ ఉత్పత్తులకు వర్తింపజేస్తున్నట్లు వెల్లడించింది.90,000 మంది విక్రేతలకు ఉపశమనంఫ్లిప్కార్ట్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఫ్యాషన్ విభాగంలో వ్యాపారం చేస్తున్న సుమారు 90,000 మందికి పైగా యాక్టివ్ విక్రేతలు నేరుగా లబ్ధి పొందనున్నారు. గతంలో రూ.1,000 దాటిన ఉత్పత్తులపై కంపెనీకి కమీషన్ చెల్లించాల్సి వచ్చేది. కానీ తాజా నిర్ణయంతో, విక్రేతలు తాము అమ్మే ప్రతి ఫ్యాషన్ ప్రొడక్ట్పై పూర్తి మార్జిన్లను (లాభాలను) తామే నిలుపుకునే అవకాశం లభించింది. ఇది ఎంఎస్ఎమ్ఈలు, స్థానిక బ్రాండ్లు, తయారీదారులకు పెద్ద ఊరటనిచ్చే అంశం.దీర్ఘకాలిక పెట్టుబడే లక్ష్యంఈ వ్యూహాత్మక మార్పుపై ఫ్లిప్కార్ట్ ఫ్యాషన్ వైస్ ప్రెసిడెంట్ కపిల్ తిరానీ మాట్లాడుతూ.. ‘మా వ్యాపార భాగస్వాముల ప్రయోజనాలకే ఎల్లప్పుడూ మొదటి ప్రాధాన్యం ఇస్తాం. ఈ సెల్లర్-ఫస్ట్ చొరవను మొత్తం ఫ్యాషన్ విభాగానికి విస్తరించడం ద్వారా మా అమ్మకందారులకు మరిన్ని ప్రయోజనాలు చేకూరుస్తాం. దీనివల్ల విక్రేతలు సరికొత్త ఆవిష్కరణలు చేయడం, ప్రొడక్ట్ రేంజ్ను విస్తరించడం, తమ సొంత బ్రాండ్ బిల్డింగ్పై మరింత నమ్మకంతో పెట్టుబడులు పెట్టడానికి వీలవుతుంది’ అన్నారు.ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధర.. తులం ఎంతంటే.. -
విజింజం పోర్టులో అదానీ వాటా విక్రయంపై కమిటీ
దేశీయ నౌకాయాన రంగంలో వ్యూహాత్మకమైన విజింజం అంతర్జాతీయ పోర్టులో అదానీ గ్రూప్ తన 49 శాతం వాటాను ఉపసంహరించుకోవాలని భావిస్తున్న తరుణంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదిత వాటా విక్రయం వల్ల రాష్ట్ర ప్రయోజనాలపై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశంపై సమగ్రంగా అధ్యయనం చేసేందుకు కేరళ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వీడీ సతీశన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు.రాష్ట్ర ప్రయోజనాలే పరమావధికేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి సతీశన్ విలేకరులతో మాట్లాడారు. విజింజం పోర్టు కేరళ ఆర్థిక ప్రగతికి కీలకమన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే ఎలాంటి నిర్ణయాన్నీ ప్రభుత్వం తీసుకోబోదని ఆయన స్పష్టం చేశారు. మీడియాలో కథనాలు వచ్చేంత వరకు అదానీ గ్రూప్ తలపెట్టిన ఈ వాటా బదిలీ వ్యవహారం తమ ప్రభుత్వ దృష్టికి రాలేదని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ షిప్పింగ్ దిగ్గజం ఎంఎస్సీ గ్రూప్తో అదానీ సంస్థ దాదాపు ఏడాది కాలంగా ఈ వ్యవహారంపై చర్చలు జరుపుతోందనే నిజాన్ని ప్రభుత్వం ఆ తర్వాతే గుర్తించిందని ఆయన వెల్లడించారు.‘వాటా బదిలీకి సంబంధించిన ప్రతిపాదనను అదానీ గ్రూప్ సెబీకి సమర్పించిన రోజే.. ముందస్తుగా రాష్ట్రానికి సమాచారం ఇవ్వకపోవడంపై అసంతృప్తిని తీవ్రంగా వ్యక్తం చేశాం. ఆ తర్వాతే కన్సెషన్ ఒప్పంద నిబంధనల ప్రకారం వాటా బదిలీకి ముందస్తు అనుమతి ఇవ్వాలని కోరుతూ అదానీ గ్రూప్ అధికారికంగా ప్రభుత్వం వద్దకు వచ్చింది’ అని ముఖ్యమంత్రి అన్నారు.గుత్తాధిపత్యం అసాధ్యంవిపక్ష నేత పినరయి విజయన్ చేస్తున్న విమర్శలను ముఖ్యమంత్రి పూర్తిగా కొట్టిపారేశారు. విజయన్ అసలు కన్సెషన్ అగ్రిమెంట్ (రాయితీ ఒప్పందం) చదవకుండానే గుడ్డిగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ డీల్ వల్ల ఎమ్మెస్సీ గ్రూప్ గుత్తాధిపత్యం ఏర్పడుతుందన్న వాదనలో వాస్తవం లేదన్నారు. ఏ ఒక్క సంస్థా దీనిపై పూర్తి ఆధిపత్యం చలాయించలేదని సీఎం స్పష్టం చేశారు.కేంద్ర అనుమతులు వస్తేనే డీల్ పూర్తి!ప్రస్తుతానికి వాటా బదిలీ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, కాబట్టి రాయితీ ఒప్పందాన్ని అదానీ గ్రూప్ ఉల్లంఘించిందని చెప్పలేమని సీఎం వివరించారు. ఈ లావాదేవీ ముగియాలంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి మాత్రమే సరిపోదని.. దీనికి అనేక రకాల భద్రతా, వ్యూహాత్మక కోణాలు ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు.ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధర.. తులం ఎంతంటే.. -
ఇన్సూరెన్స్ కంపెనీకి రూ.20 లక్షల జరిమానా
వాహన బీమా క్లెయిమ్లను సాంకేతిక కారణాలు, చిన్నపాటి లొసుగుల సాకుతో తిరస్కరించే కార్పొరేట్ కంపెనీల ధోరణికి వినియోగదారుల కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ‘కారు డ్యామేజ్ అయిన విధానం, యజమాని చెబుతున్న కథనానికి సరిపోలడం లేదు’ అనే కారణంతో క్లెయిమ్ను తిరస్కరించిన ప్రముఖ బీమా సంస్థ బజాజ్ అలియాంజ్కు కోర్టు భారీ జరిమానా విధించింది. పాలసీ నిబంధనల ప్రకారం వాహన యజమానికి రూ.20 లక్షల పరిహారంతో పాటు అదనపు ఖర్చులు చెల్లించాలని ఆదేశిస్తూ చండీగఢ్ వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరమ్ తీర్పును వెలువరించింది.అసలు ఏం జరిగిందంటే..?నగరానికి చెందిన విక్రమ్జీత్ సింగ్ అనే కారు యజమాని తన లగ్జరీ కారుకు బజాజ్ అలియాంజ్ సంస్థ నుంచి బీమా పాలసీ తీసుకున్నారు. కారు ప్రమాదానికి గురైనప్పుడు, నష్టపరిహారం కోసం ఆయన కంపెనీకి క్లెయిమ్ దరఖాస్తు చేసుకున్నారు. అయితే, బీమా సంస్థ నియమించిన సర్వేయర్ కారును పరిశీలించి ప్రమాదం జరిగిన తీరుకు, కారుపై ఉన్న డ్యామేజ్ గుర్తులకు పొంతన లేదంటూ నివేదిక ఇచ్చారు. ఈ సాకుతో కంపెనీ క్లెయిమ్ను పూర్తిగా తిరస్కరించింది. న్యాయం కోసం సదరు యజమాని వినియోగదారుల ఫోరమ్ను ఆశ్రయించారు. తన కారుకు ఇన్సూరెన్స్ రక్షణ ఉన్నప్పటికీ కంపెనీ ఉద్దేశపూర్వకంగానే తన క్లెయిమ్ తిరస్కరించిందని కోర్టుకు వివరించారు.కోర్టు ఆగ్రహం..రెండు వైపుల వాదనలు విన్న వినియోగదారుల ఫోరమ్.. బీమా కంపెనీ వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టింది. టెక్నికల్ గ్రౌండ్స్ను చూపిస్తూ నమ్మకంగా ఉంటున్న కస్టమర్లను ఇబ్బంది పెట్టడం సరికాదని స్పష్టం చేసింది. ‘బీమా కంపెనీలు కేవలం ప్రీమియంలు వసూలు చేయడానికే పరిమితం కాకూడదు. కస్టమర్ నిజంగా నష్టపోయినప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత వాటిపై ఉంది. సర్వేయర్ నివేదికను సాకుగా చూపి క్లెయిమ్ను తిరస్కరించడం వినియోగదారుల హక్కులను కాలరాయడమే’ అని కోర్టు తెలిపింది.ఫోరమ్ జారీ చేసిన ఉత్తర్వులుపాలసీ ఐడీవీ (ఇన్స్యూర్డ్ డిక్లేర్డ్ వ్యాల్యూ) నిబంధనల ప్రకారం వాహన యజమానికి రూ.20 లక్షల క్లెయిమ్ మొత్తాన్ని తక్షణమే చెల్లించాలి.వినియోగదారుడు అనుభవించిన మానసిక క్షోభకు నష్టపరిహారంగా, కస్టమర్ను ఇబ్బందులకు గురిచేసినందుకు గానూ రూ.50,000 అదనంగా చెల్లించాలి.కోర్టులో వ్యాజ్యం నడిపినందుకు అయ్యే ఖర్చుల కింద మరో రూ.10,000 యజమానికి అందజేయాలి.కంపెనీలు క్లెయిమ్స్ తిరస్కరించినప్పుడు చాలామంది వాహనదారులు వెనకడుగు వేస్తుంటారు. కానీ, సరైన ఆధారాలు ఉండి కంపెనీ వైపు లోపాలు ఉంటే వినియోగదారుల ఫోరమ్ల ద్వారా న్యాయం ఎలా పొందవచ్చో చెప్పడానికి ఈ తీర్పు ఒక ఉదాహరణగా నిలుస్తుందని లీగల్ నిపుణులు పేర్కొంటున్నారు.ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధర.. తులం ఎంతంటే.. -
ట్రిలియనీర్ హోదా కోల్పోయిన మస్క్: ఎందుకంటే?
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. కేవలం మూడు వారాల క్రితం ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా చరిత్ర సృష్టించిన ఈయన.. ఇప్పుడు ఆ హోదాను కోల్పోయారు. దీనికి కారణం స్పేస్ఎక్స్ (SpaceX) షేర్ల ధర భారీగా పడిపోవడమే.నిజానికి 2026 జూన్ 12న స్పేస్ఎక్స్ నాస్డాక్లో ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టింది. ఒక్కో షేర్ ధరను 135 డాలర్లుగా నిర్ణయిస్తే.. లిస్టింగ్ రోజే అది 150 డాలర్లకు చేరుకుంది. ఆ తర్వాత కూడా పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందన రావడంతో షేర్ ధర మరింత పెరిగింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ దాదాపు 2.8 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో మస్క్ వ్యక్తిగత సంపద కూడా గణనీయంగా పెరిగి 1.4 ట్రిలియన్ డాలర్లను దాటింది. తద్వారా ఈయన ప్రపంచంలో తొలి ట్రిలియనీర్గా రికార్డు సృష్టించారు.అయితే.. మస్క్ ఆనందం మూణ్నాళ్ల ముచ్చట అయింది. జూన్ నెలలో పొందిన ట్రిలియనీర్ హోదా.. జులై ప్రారంభం నాటికి పోయింది. ఎందుకంటే స్పేస్ఎక్స్ షేర్లు గరిష్ఠ స్థాయి నుంచి 30 శాతానికి పైగా పడిపోయాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువలో వందల బిలియన్ డాలర్లు ఆవిరయ్యాయి. ట్రిలియనీర్ హోదా కోల్పోయినా.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మాత్రం మస్క్ కొనసాగుతున్నారు. -
SBI మేనేజర్ జీతం రూ.35 లక్షలా?
ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఎస్బీఐ (SBI) మేనేజర్ ఫారం-16 వైరల్ కావడంతో నెట్టింట్లో పెద్ద చర్చ మొదలైంది. ఆ ఫారం-16లో ఆయన వార్షిక వేతనం రూ.35.24 లక్షలు అని ఉండటంతో చాలామంది ఆశ్చర్యపోయారు. ప్రభుత్వ బ్యాంకులో పనిచేసే ఉద్యోగికి ఇంత పెద్ద జీతమా? అనే సందేహం అందరిలోనూ కలిగింది. అయితే.. ఈ సంఖ్య వెనుక ఉన్న అసలు నిజం తెలుసుకుంటే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని అర్థమవుతుంది.వైరల్ అయిన పోస్టు ప్రకారం, ఉద్యోగి ఎనిమిది సంవత్సరాల క్రితం ఎస్బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్ (PO)గా చేరి, ప్రస్తుతం స్కేల్-3 మేనేజర్ స్థాయికి ఎదిగారు. ఫారం-16లో కనిపిస్తున్న రూ.35.24 లక్షలు ఆయనకు ప్రతి నెల వచ్చే జీతం కాదు. అది మొత్తం సంవత్సరానికి సంబంధించిన గ్రాస్ శాలరీ మాత్రమే.ఈ గ్రాస్ శాలరీలో ప్రతి నెల వచ్చే జీతంతో పాటు, నాలుగు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే లభించే.. లీవ్ ఫేర్ కన్సెషన్ (LFC) ఎన్క్యాష్మెంట్, లీవ్ ఎన్క్యాష్మెంట్ వంటి ప్రత్యేక ప్రయోజనాలు కూడా కలిపి ఉన్నాయి. అందుకే మొత్తం జీతం.. చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఇది ప్రతి సంవత్సరం లేదా ప్రతి నెల వచ్చే ఆదాయం మాత్రం కాదని స్పష్టమవుతోంది.అంతేకాదు, ఫారం-16లో కనిపించే మొత్తం డబ్బు ఉద్యోగి చేతికి కూడా రాదు. ప్రతి నెలా ఆదాయపు పన్ను, ఎన్పీఎస్ (NPS), ఈపీఎఫ్ (EPF) వంటి తప్పనిసరి కోతలు ఉంటాయి. వీటితో పాటు హోమ్ లోన్, కారు లోన్, బైక్ లోన్ వంటి నెలవారీ ఈఎంఐలు కూడా జీతం నుంచి కట్ అవుతాయి. కాబట్టి.. బ్యాంకు ఖాతాలో జమయ్యే టేక్ హోమ్ శాలరీ గ్రాస్ శాలరీతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది.ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. కొందరు, ఫారం-16 చూసి మాత్రమే ఎవరి జీతాన్ని అంచనా వేయడం సరైంది కాదు. నిజంగా ఉద్యోగి చేతికి ఎంత వస్తుందో కూడా చూడాలి అని అభిప్రాయపడ్డారు. మరికొందరు మాత్రం, ఏమైనా సరే, సంవత్సరానికి రూ.35 లక్షలకు పైగా ప్యాకేజ్ అనేది మంచి జీతమే అని వ్యాఖ్యానించారు. ఇంకొందరు మేనేజర్ ప్రాథమిక వేతనం సుమారు రూ.11-12 లక్షలే అయినప్పటికీ, ఇతర అలవెన్సులు.. ప్రయోజనాలతో కలిపి సంవత్సరానికి మంచి ఆదాయం వస్తుందని తెలిపారు.People often say that SBI employees have a "settled life"but this Scale 3 Manager's salary slip might completely change your perspective.Eight years ago, a young man joined State Bank of India as a Probationary Officer.Today, he is a Scale 3 Manager, and his Form 16 for FY… pic.twitter.com/Iy7TJOkUJI— Pooja (@poojaofficial5) July 5, 2026 -
ట్రాఫిక్ కష్టాలపై క్రిస్ గోపాలకృష్ణన్ ఆవేదన
భారత సిలికాన్ వ్యాలీగా పిలవబడే బెంగళూరు నగరంలో ట్రాఫిక్ కష్టాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరినీ ఈ ట్రాఫిక్ నరకం వేధిస్తోంది. తాజాగా, ఐటీ దిగ్గజం ‘ఇన్ఫోసిస్’ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ బెంగళూరు నగర ట్రాఫిక్ దుస్థితిపై చర్చకు దారితీసింది.కారణాలివే..క్రిస్ గోపాలకృష్ణన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా నగరం అంతా ఎదుర్కొంటున్న సమస్యను పంచుకున్నారు. ‘బెంగళూరు సిటీలో కేవలం 31 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి నాకు ఈ రోజు దాదాపు రెండున్నర గంటల సమయం పట్టింది. రోజురోజుకూ పరిస్థితి మరింత దిగజారుతోంది. విపరీతమైన ట్రాఫిక్ రద్దీ, అధ్వాన్నమైన రోడ్ల పరిస్థితి, డ్రైవర్లలో క్రమశిక్షణ లేకపోవడమే దీనికి ప్రధాన కారణాలు’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ఐటీ రంగానికి చెందిన ప్రముఖుడి నుంచే ఇలాంటి స్పందన రావడంతో బెంగళూరు ఐటీ కారిడార్లో ప్రయాణించే వేలాది మంది ఉద్యోగులు, పౌరులు తమ ఆవేదనను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు.‘వర్క్ ఫ్రమ్ హోమ్’ డిమాండ్గోపాలకృష్ణన్ పోస్ట్పై స్పందిస్తూ నెటిజన్లు తమ అనుభవాలను ఏకరువు పెడుతున్నారు. ఒక నెటిజన్ తనకు ఇటీవల 28 కిలోమీటర్ల ప్రయాణానికి దాదాపు మూడు గంటల సమయం పట్టిందని, బెంగళూరు ట్రాఫిక్ ప్రయాణం ఒక పీడకలగా మారిందని వాపోయారు. నగరంలో మౌలిక సదుపాయాలు మెరుగవుతాయనే నమ్మకం లేదని, అందువల్ల ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు మళ్లీ పూర్తిస్థాయిలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్లు ఇవ్వాలని పలువురు సూచిస్తున్నారు.పరిష్కారాలు ఇవే..ఈ దీర్ఘకాలిక సమస్యకు కేవలం రోడ్ల విస్తరణ మాత్రమే సరిపోదని, ప్రయాణికులతో పాటు ప్రభుత్వం కూడా ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని నిపుణులు, పౌరులు కోరుతున్నారు. ఐటీ సంస్థలు తమ సిబ్బందిని వ్యక్తిగత వాహనాల్లో కాకుండా మెట్రో, బీఎంటీసీ బస్సు సర్వీసులను ఉపయోగించేలా ప్రోత్సహించాలని పౌరులు డిమాండ్ చేస్తున్నారు. నగరంలో ఏళ్ల తరబడి సాగుతున్న ఫ్లైఓవర్ పనులు, కొత్త మెట్రో కారిడార్ల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను కోరుతున్నారు. ఇవి పూర్తయితేనే కొంతవరకు ఉపశమనం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: కలెక్టర్ల జీతభత్యాల మాటేంటి? -
హైదరాబాద్లో నెస్లే బిజినెస్ సొల్యూషన్స్ జీసీసీ
న్యూఢిల్లీ: స్విస్ కన్జూమర్ గూడ్స్ దిగ్గజం నెస్లేలో భాగమైన నెస్లే బిజినెస్ సొల్యూషన్స్ (ఎన్బీఎస్) హైదరాబాద్లో తమ కొత్త గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను (జీసీసీ) ఏర్పాటు చేయనుంది. టెక్నాలజీ, ప్రాసెస్ సొల్యూషన్స్ సంస్థ జెన్ప్యాక్ట్తో కలిసి నెస్లే బిజినెస్ సర్వీసెస్ ఇండియా దీన్ని నెలకొల్పనుంది.కంపెనీ తన వ్యాపార సేవలను మరింత సరళంగా అందించేందుకు, నిర్దిష్ట ప్రమాణాలను పాటించేందుకు అవసరమైన ఆటోమేషన్, ఏఐ మొదలైన అంశాల్లో జెన్ప్యాక్ట్ తోడ్పాటు అందిస్తుంది. పటిష్టమైన టెక్నాలజీ వ్యవస్థ, మౌలిక సదుపాయాలు ఉండటంతో పాటు భారత్లో జీసీసీలకు హబ్గా ఎదుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ను ఎంచుకున్నట్లు ఎన్బీఎస్ హెడ్ లూకా ఫిషెరా తెలిపారు. -
ఇక సహకార జీవిత బీమా సంస్థ
న్యూఢిల్లీ: సహకార రంగంలో జీవిత బీమా కంపెనీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. బీమా రంగంలో కూడా సహకార సంస్థలు వృద్ధి చెందడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. ఎరువులకు సంబంధించిన కోఆపరేటివ్ ఇఫ్కో ఇప్పటికే జాయింట్ వెంచర్ (ఇఫ్కో–టోకియో) ద్వారా బీమా రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తోందని సహకార శాఖ ఐదో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయంగా 26 జీవిత బీమా సంస్థలు ఉన్నాయి.మరోవైపు, కోఆపరేటివ్ మోడల్గా ప్రవేశపెక్టిన భారత్ ట్యాక్సీ సేవలను వచ్చే రెండేళ్లలో 500 నగరాలకు విస్తరించనున్నట్లు మంత్రి వివరించారు. ప్రస్తుతం ఢిల్లీ, లక్నో, చండీగఢ్, ముంబై తదితర నగరాల్లో ఇవి అందుబాటులో ఉండగా.. త్వరలో రాంచీ, పాట్నా, భోపాల్ మొదలైన నగరాల్లోనూ ప్రవేశపెట్టనున్నట్లు షా చెప్పారు. భారత్లో 30 కోట్ల మంది పైగా సభ్యులతో 8.5 లక్షల పైచిలుకు సహకార సంఘాలు ఉన్నాయి. కోఆపరేటివ్ రంగంలో మానవ వనరుల సమస్యను పరిష్కరించేందుకు గుజరాత్లోని ఆనంద్లో ఏర్పాటు చేస్తున్న త్రిభువన్ సహకారి యూనివర్సిటీ తోడ్పడుతుందని మంత్రి చెప్పారు. బ్యాంకింగ్, డెయిరీ, మార్కెటింగ్ తదితర విభాగాల్లో ఈ వర్సిటీ నిపుణులను తయారు చేస్తుందని వివరించారు. -
వినియోగదారులను ముంచే ‘ఉత్తుత్తి’ ప్రకటనలు
మార్కెట్లో లభించే ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులపై రంగురంగుల లేబుళ్లు, ఆకర్షణీయమైన ప్రకటనలు చూసి మోసపోతున్న వినియోగదారుల రక్షణే ధ్యేయంగా దేశీయ ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) కఠిన చర్యలకు ఉపక్రమించింది. నిబంధనలను ఉల్లంఘిస్తూ, వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ప్రొడక్ట్ లేబుళ్లపై తప్పుడు వాదనలు చేసినందుకు గాను దేశంలోని మూడు ప్రముఖ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు ఎఫ్ఎస్ఎస్ఏఐ నోటీసులు జారీ చేసింది.ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006 (ఎఫ్ఎస్ఎస్ యాక్ట్) ప్రకారం వారిపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వడానికి ఏడు రోజుల గడువు విధించింది. ఈ జాబితాలో ప్రముఖ డైరీ బ్రాండ్ హెరిటేజ్ ఫుడ్స్ కూడా ఉండటం గమనార్హం.‘ఫ్రెష్ పన్నీర్’, ‘హెల్తీ’ పదాలపై హెరిటేజ్కు నోటీసులుప్రముఖ డైరీ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ విక్రయిస్తున్న ‘హెరిటేజ్ ఫ్రెష్ పన్నీర్’ ఉత్పత్తిపై ఎఫ్ఎస్ఎస్ఏఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.‘ఫ్రెష్’ అనే పదంపై అభ్యంతరం: ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనలలోని షెడ్యూల్ V ప్రకారం... ఒక ఉత్పత్తికి ‘ఫ్రెష్’ (తాజా) అనే పదాన్ని వాడటానికి కొన్ని కఠినమైన షరతులు ఉన్నాయి. హెరిటేజ్ పన్నీర్ ఆ షరతులను పూర్తిగా సంతృప్తి పరచడం లేదని, తద్వారా ఇది వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఉందని రెగ్యులేటర్ స్పష్టం చేసింది.‘హెల్తీ హ్యాపీనెస్’ ట్రేడ్మార్క్ వివాదం: బ్రాండ్ పేరు లేదా ట్రేడ్మార్క్లో ‘హెల్తీ’ (ఆరోగ్యకరమైనది) అనే పదాన్ని ఉపయోగించడంపై కూడా అభ్యంతరం వ్యక్తమైంది. ఇది ‘ఎఫ్ఎస్ఎస్ (అడ్వర్టైజింగ్ అండ్ క్లెయిమ్స్) రెగ్యులేషన్స్, 2018’లోని రూల్ 8 (3) కు విరుద్ధం. ఈ పదం వల్ల ఆ ఉత్పత్తి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనే తప్పుడు అభిప్రాయం వినియోగదారుల్లో కలుగుతుందని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది.‘100% ఆర్గానిక్’ అంటూ డియా ఫుడ్స్ మాయాజాలం!హాజెల్ నట్ చాక్లెట్ను మార్కెట్ చేస్తున్న డియా ఫుడ్స్ సంస్థపై కూడా ఎఫ్ఎస్ఎస్ఏఐ చర్యలు చేపట్టింది. ఈ ప్రొడక్ట్పై కంపెనీ చేసిన ‘ఆల్ నేచురల్’, ‘100% ఆర్గానిక్’, ‘శాకాహారి (వేగన్)’ వాదనలు చట్ట విరుద్ధమని తేలింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్లో ఈ ఉత్పత్తికి సంబంధించి సేంద్రీయ (ఆర్గానిక్) ఆహారం లేదా శాకాహారి (వేగన్) గుర్తింపు కోసం ముందస్తు అనుమతులు తీసుకోలేదు. అయినప్పటికీ ప్యాకెట్పై ‘100% ఆర్గానిక్’ అని ముద్రించడం తీవ్రమైన ఉల్లంఘన కిందకే వస్తుంది.అంతేకాకుండా, మే 28, 2026న FSSAI జారీ చేసిన అడ్వైజరీ ప్రకారం.. ఆహార చట్టాల కింద ‘100%’ అనే పదానికి ఎలాంటి అధికారిక నిర్వచనం లేదా ప్రస్తావన లేదు. కాబట్టి ‘100% ఆర్గానిక్’ అనే వాదన ముమ్మాటికీ వినియోగదారులను మోసం చేయడమేనని రెగ్యులేటర్ తేల్చి చెప్పింది.సిప్జర్ న్యూట్రాస్యూటికల్స్..సిప్జర్ (Sipzer) సంస్థ విక్రయించే జ్యూస్ క్యాప్సూల్స్ లేబులింగ్, ప్రమోషన్లలో అక్రమాలు జరిగినట్లు FSSAI గుర్తించింది. ఈ కంపెనీ లేబుల్పై రాసిన ప్రతి అక్షరాన్నీ రెగ్యులేటర్ తూర్పారబట్టింది.FSSAI అప్రూవ్డ్?: కంపెనీ తన ప్యాకింగ్పై ‘FSSAI ఆమోదించబడింది’ (FSSAI Approved) అని ముద్రించుకుంది. నిజానికి FSSAI ఏ బ్రాండ్నూ ప్రత్యేకంగా ఆమోదించదు. కేవలం ప్రమాణాల లైసెన్స్ మాత్రమే ఇస్తుంది. ఈ లోగోను చూసి జనం ఇది ప్రభుత్వ సర్టిఫైడ్ ప్రొడక్ట్ అని నమ్మే ప్రమాదం ఉంది.శాస్త్రీయ ఆధారాలు లేవు: ‘మీ రోగనిరోధక శక్తిని పెంచండి’, ‘మీ శరీర విషాలను తొలగించండి’ వంటి భారీ డైలాగులకు కంపెనీ వద్ద ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.ప్యాకెట్ పైన టమోటా, దోసకాయ, బ్రోకలీ, క్యాబేజీ, కొత్తిమీర చిత్రాలను ముద్రించారు. కానీ, లోపల ఉన్న పదార్థాల జాబితాలో వీటి ప్రస్తావనే లేదు.లేబుల్పై విటమిన్-ఇ, విటమిన్-సి ఉన్నట్లు ప్రకటించినా విటమిన్-ఇ ఎంత ఉందో రాయలేదు. విటమిన్-సి కేవలం 0.1% మాత్రమే ఉంది. అలాగే, రోజువారీ అవసరాలకు ఇది ఎంత మేర తోడ్పడుతుందో తెలిపే ‘ఆర్డీఏ’ (Recommended Dietary Allowance) శాతాన్ని కూడా పేర్కొనలేదు.అధికారిక ఆర్గానిక్ సర్టిఫికేషన్ గుర్తులు కానీ లేకుండానే ‘సేంద్రీయ కూరగాయలతో తయారు చేయబడింది’ అని రాయడం నిబంధనల ఉల్లంఘనే.ఇదీ చదవండి: కుదేలైన దక్షిణాది తేయాకు ఉత్పత్తి! -
కుదేలైన దక్షిణాది తేయాకు ఉత్పత్తి!
భారతదేశంలో ఈ ఏడాది మే (2026) నెలలో దేశవ్యాప్త తేయాకు ఉత్పత్తిలో గణనీయమైన క్షీణత నమోదైంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో నెలకొన్న తీవ్ర వాతావరణ పరిస్థితులు, రుతుపవనాల ముందు కురవాల్సిన వేసవి వర్షాల్లో భారీ లోటు దేశీయ టీ ఉత్పత్తిని దెబ్బతీశాయి. టీ బోర్డు విడుదల చేసిన తాజా అధికారిక గణాంకాల ప్రకారం.. మే 2026లో దేశవ్యాప్త తేయాకు ఉత్పత్తి 3.54 శాతం తగ్గి 131.60 మిలియన్ కిలోలకు పరిమితమైంది.25 శాతం పతనమైన ఉత్పత్తిఈ సీజన్లో ఉత్తర భారత దేశం ఎంతోకొంత నిలదొక్కుకున్నప్పటికీ దక్షిణాది రాష్ట్రాలు మాత్రం వర్షాభావ పరిస్థితులతో తీవ్రంగా నష్టపోయాయి. మే నెలలో దక్షిణాదిలో తేయాకు ఉత్పత్తి ఏకంగా 25 శాతం పడిపోయి 19.88 మిలియన్ కిలోలకు పరిమితమైంది. గత ఏడాది ఇదే కాలంలో ఇక్కడ 26.57 మిలియన్ కిలోల ఉత్పత్తి రావడం గమనార్హం.రాష్ట్రాల వారీగా దక్షిణాది పరిస్థితిదక్షిణాదిలోనే అత్యధికంగా టీ ఉత్పత్తి చేసే తమిళనాడులో ఈసారి పరిస్థితి దారుణంగా ఉంది. గత ఏడాది మే నెలలో 19.04 మిలియన్ కిలోలుగా ఉన్న ఉత్పత్తి ఈ ఏడాది 28 శాతం క్షీణించి 13.63 మిలియన్ కిలోలకు పడిపోయింది.కేరళలో కూడా లోటు వర్షాల ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఉత్పత్తి 16 శాతం తగ్గి 5.86 మిలియన్ కిలోలకు (గతంలో 7.03 మిలియన్ కిలోలు) చేరింది.కర్ణాటకలో సైతం ఉత్పత్తి 0.50 మిలియన్ కిలోల నుంచి 0.39 మిలియన్ కిలోలకు పడిపోయింది.ఉత్తరాదిలో స్వల్ప ఊరటదక్షిణాదితో పోలిస్తే ఉత్తర భారతదేశంలో పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంది. గత ఏడాది మే నెలలో నమోదైన 109.86 మిలియన్ కిలోలతో పోలిస్తే, ఈసారి ఉత్తరాది ఉత్పత్తి స్వల్పంగా పెరిగి 111.72 మిలియన్ కిలోలకు చేరింది. దేశంలోనే అత్యధికంగా టీ ఉత్పత్తి చేసే అస్సాంలో మే నెల ఉత్పత్తి స్వల్పంగా తగ్గి 64.70 మిలియన్ కిలోలుగా (మే 2025లో 65.04 మిలియన్ కిలోలు) నమోదైంది. ఇందులో అస్సాం లోయ ప్రాంతంలో ఉత్పత్తి 61.83 మిలియన్ కిలోలకు తగ్గగా, కాచర్ ప్రాంతంలో మాత్రం స్వల్పంగా పెరిగి 2.87 మిలియన్ కిలోలకు చేరింది. పశ్చిమ బెంగాల్లో ఇక్కడ టీ ఉత్పత్తి 5 శాతం పెరిగి 42.69 మిలియన్ కిలోలకు (గతంలో 40.68 మిలియన్ కిలోలు) చేరింది. డూయర్స్, తెరాయ్ ప్రాంతాలు మంచి వృద్ధిని కనబరిచినప్పటికీ ప్రపంచ ప్రసిద్ధి చెందిన డార్జిలింగ్ ప్రాంతంలో మాత్రం ఉత్పత్తి స్వల్పంగామే 2026 గణాంకాలు ఇలా..ప్రాంతంమే 2025 ఉత్పత్తి (మి.కిలోల్లో)మే 2026 ఉత్పత్తి (మి.కిలోల్లో)మార్పుభారతదేశం (మొత్తం)136.42131.60-3.54%ఉత్తర భారతదేశం109.86111.72+1.69%దక్షిణ భారతదేశం26.5719.88-25.17%తమిళనాడు19.0413.63-28.41%కేరళ7.035.86-16.64% -
ఒక్క ప్రశ్నతో ఉద్యోగం పోయింది!
జాబ్ ఇంటర్వ్యూ కోసం వెళ్లే అభ్యర్థులు సాధారణంగా అడిగే ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు సిద్ధం చేసుకుంటారు. కానీ ఇంటర్వ్యూ ముగిసే సమయంలో ''మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?'' అని అడిగితే ఎలా స్పందించాలి? అనే విషయంపై చాలామంది పెద్దగా దృష్టి పెట్టరు. ఇలాంటి సంఘటనే ఒక ఇండియన్ ప్రొడక్ట్ మేనేజర్కు ఎదురైంది. దీంతో అతడు ఉద్యోగం సైతం కోల్పోవాల్సి వచ్చింది.కెనడాలో పనిచేస్తున్న ఇండియన్ ప్రొడక్ట్ మేనేజర్ కరణ్ గోగ్నా ఇటీవల తనకు ఎదురైనా ఒక అనుభవాన్ని లింక్డ్ఇన్లో షేర్ చేశారు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.కరణ్ గోగ్నా ఓ యూజ్డ్ కార్ల స్టార్టప్ కంపెనీలో ప్రిన్సిపల్ ప్రొడక్ట్ మేనేజర్ ఉద్యోగానికి దరఖాస్తు చేశారు. ఇంటర్వ్యూలోని అన్ని దశలను విజయవంతంగా పూర్తి చేశారు. హెచ్ఆర్ ఆయన డాక్యుమెంట్లను తీసుకోవడంతో.. ఉద్యోగం దాదాపు ఖాయమైందని భావించారు. అయితే.. ఆఫర్ లెటర్ ఇవ్వడానికి ముందు కంపెనీ సీఈఓతో ఒక చివరి సమావేశం ఏర్పాటు చేశారు.సీఈఓతో సమావేశం బాగా జరిగిందని, ఉద్యోగం వస్తుందని నమ్మకం కలిగిందని కరణ్ తెలిపారు. చివర్లో సీఈఓ ''మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?'' అని అడిగారు. దానికి కరణ్, ''మీ కంపెనీ భవిష్యత్తులో టూ-వీలర్ మార్కెట్లోకి కూడా ప్రవేశించాలని ఆలోచిస్తోందా?'' అని ప్రశ్నించారు.అయితే.. సీఈఓ దానికి నేరుగా సమాధానం చెప్పకుండా, ''మీ అభిప్రాయం ఏమిటి? మేం ఆ మార్కెట్లోకి వెళ్లాలా?'' అని తిరిగి ప్రశ్నించారు. ఇలాంటి ప్రశ్న ఒకటి ఎదురవుతుందని ఊహించని కరణ్ ''కంపెనీ వ్యాపారం గురించి పూర్తిగా అధ్యయనం చేశానని, కానీ టూ-వీలర్ మార్కెట్ గురించి ఎలాంటి అభిప్రాయం లేదని తెలిపారు''. దీంతో ఆ సమయంలో తడబడి స్పష్టతలేని సమాధానం ఇచ్చానని అంగీకరించారు.మరుసటి రోజు హెచ్ఆర్ నుంచి ఫోన్ వచ్చి, కంపెనీ మరో అభ్యర్థిని ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ కరణ్ ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు. ''ఇంటర్వ్యూకు వెళ్లేవారు సమాధానాల కోసం ఎంత సిద్ధమవుతారో, చివర్లో అడిగే ప్రశ్నల కోసం కూడా అంతే సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు''.ఎందుకంటే అభ్యర్థి అడిగే చివరి ప్రశ్న, అతని ఆలోచనా విధానం, వ్యాపార అవగాహన, విశ్లేషణ సామర్థ్యాన్ని ఇంటర్వ్యూవర్కు తెలియజేసే చివరి అవకాశం అవుతుందని పేర్కొన్నారు. దీనిపై నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందించారు. చాలామంది తమకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చెప్పారు. -
వినియోగదారులకు బిగ్ షాక్.. మళ్లీ పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు!
న్యూఢిల్లీ: భారత్లో ఫోన్ వినియోగదారులకు భారీ షాక్ తగలనుంది. త్వరలో మొబైల్ రీఛార్జ్ బిల్లులు (టెలికాం టారిఫ్లు) మరో 12శాతం నుండి 15శాతం వరకు పెరిగే అవకాశం ఉందని సెంట్రమ్ ఇన్స్టిట్యూషనల్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. టెలికాం మార్కెట్లో పోటీదారుల సంఖ్య తగ్గి, కొన్ని ప్రధాన కంపెనీల ఆధిపత్యం పెరగడంతో ధరల పెంపునకు అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని ఈ నివేదిక పేర్కొంది.నెట్వర్క్ అప్గ్రేడ్ల కారణంగా వినియోగదారులు వేగంగా 2జీ నుండి 4జీ,5జీ నెట్వర్క్లకు మారుతుండటంతో జూన్ త్రైమాసికంలో ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ల సగటు ఆదాయం 1 నుండి 1.5 శాతం పెరిగే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది.మార్కెట్ విశ్లేషణల ప్రకారం.. వొడాఫోన్ ఐడియా కంపెనీ తన చందాదారులను కోల్పోతుండగా, ఆ వాటాను జియో, ఎయిర్టెల్ దక్కించుకుంటున్నాయి. ఈ త్రైమాసికంలో జియో కొత్తగా 70 లక్షల మంది, ఎయిర్టెల్ 50 లక్షల మంది చందాదారులను చేర్చుకునే అవకాశం ఉండగా, వొడాఫోన్ ఐడియా కేవలం 2 లక్షల మంది వినియోగదారులను మాత్రమే పొందే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం జియో, ఎయిర్టెల్ కంపెనీలు దేశంలోని 90 శాతానికి పైగా జిల్లాల్లో తమ 5జీ సేవలను విస్తరించగా, వొడాఫోన్ ఐడియా సుమారు 100 నగరాల్లో 5జీ నెట్వర్క్ను అందుబాటులోకి తెచ్చి, దానిని మరింత విస్తరించే పనిలో పడింది. కాగా, వొడాఫోన్ ఐడియా చెల్లించాల్సిన ఏజీఆర్ బకాయిల భారం రూ.25వేల కోట్లకు తగ్గినట్లు నివేదిక వెల్లడించింది. రాబోయే రోజుల్లో 4జీ, 5జీ నెట్వర్క్ల వాడకం మరింత పెరగనుండటంతో వినియోగదారుల డేటా వినియోగం కూడా భారీగా కొనసాగుతుందని నివేదిక స్పష్టం చేసింది. -
రూ.2.3 కోట్ల జాబ్.. అందుకే వదిలేశాడు!
చదువు పూర్తయ్యాక మంచి ప్యాకేజీతో జాబ్ వస్తే ఎవరు మాత్రం వద్దనుకుంటారు. కానీ ఐఐటీ బాంబే నుంచి కంప్యూటర్ సైన్స్లో గోల్డ్ మెడల్ సాధించిన వివేక్ శర్మ అనే యువకుడు, అమెరికాలో లభించిన భారీ వేతన ఉద్యోగ అవకాశాన్ని తృణప్రాయంగా వదులుకున్నాడు. ఇంతకీ ఆ యువకుడు జాబ్ ఎందుకు వదులుకున్నాడు? దీనికి గల కారణాలు ఏమిటనేది ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.వివేక్కు శాన్ఫ్రాన్సిస్కోలోని ఒక స్టార్టప్ సంస్థ నుంచి సంవత్సరానికి దాదాపు 240000 డాలర్ల (సుమారు రూ.2.3 కోట్లు) వేతనంతో జాబ్ ఆఫర్ వచ్చింది. వీసా స్పాన్సర్షిప్, రీలొకేషన్ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉండటంతో జీవితం ఉన్నత స్థాయికి చేరుకుంటుందని భావించాడు. అయితే.. అదే సమయంలో అతని తండ్రికి గుండెపోటు రావడం, తల్లి క్యాన్సర్తో బాధపడుతున్న పరిస్థితి ఏర్పడింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కుటుంబాన్ని వదిలి విదేశాలకు వెళ్లడం కంటే తల్లిదండ్రుల పక్కన ఉండటం ముఖ్యమని భావించిన వివేక్, ఆ ఉద్యోగాన్ని వదులుకున్నాడు.Meet Vivek Sharma, a https://t.co/Ws1j7hoGgc Computer Science gold medalist from IIT Bombay, who left a $240,000-a-year (₹2.9 crore) US job to run a small grocery store beneath his house and take care of his parents by staying close to them.Coming from a simple… pic.twitter.com/7RwTepkL73— Vikas Alwys (@VikasAlwys) July 4, 2026జాబ్ వదులుకోవడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితులు కఠినంగా మారడంతో, అతను తన ఇంటి కిందనే చిన్న కిరాణా దుకాణం ప్రారంభించాడు. ఈ వ్యాపారం ద్వారా కుటుంబ అవసరాలను తీర్చుకుంటూ, తల్లిదండ్రుల సంరక్షణను కొనసాగించాడు. ఐఐటీ బాంబే వంటి ప్రతిష్టాత్మక సంస్థలో చదివిన వ్యక్తి ఇలా సాధారణ వ్యాపారం చేయడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది.పరిస్థితులు మెరుగుపడిన తర్వాత, వివేక్ తన పనిని విస్తరించాడు. దుకాణాన్ని నిర్వహించడంతో పాటు పేద పిల్లలకు కోడింగ్ బోధించడం, రాత్రిపూట ఫ్రీలాన్స్ సాఫ్ట్వేర్ ప్రాజెక్టులు చేయడం ప్రారంభించాడు. తన నైపుణ్యాన్ని సమాజ సేవకు ఉపయోగిస్తూ, కుటుంబ బాధ్యతలను కూడా నిర్వహించాడు.కొన్ని సంవత్సరాల తర్వాత అదే అమెరికన్ కంపెనీ మళ్లీ అతనిని సంప్రదించి, ఈసారి రిమోట్గా పని చేసే అవకాశం కల్పించినట్లు సమాచారం. దీంతో అతను తన స్వస్థలమైన కాన్పూర్లోనే ఉండి టెక్నాలజీ, బోధన, కుటుంబ బాధ్యతలను సమన్వయం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: జియో రూ.448 Vs ఎయిర్టెల్ రూ.469 ప్లాన్.. ఏది బెస్ట్? -
థాయ్లాండ్ వెళ్లేవారికి కొత్త రూల్స్.. ముఖ్యంగా ‘క్యాష్’
భారతీయ పర్యాటకులకు అత్యంత ఇష్టమైన విదేశీ గమ్యస్థానాల్లో థాయ్లాండ్ ఒకటి. అయితే తాజాగా అక్కడి ప్రవేశ నిబంధనలు కఠినతరం కావడంతో ప్రయాణానికి ముందు అవసరమైన పత్రాలు, వీసా, ఇతర షరతులను తప్పనిసరిగా పరిశీలించాలని బ్యాంకాక్లోని భారత రాయబార కార్యాలయం సూచించింది. జూలై 2న విడుదల చేసిన తాజా అడ్వైజరీలో భారతీయులు థాయ్లాండ్కు బయలుదేరే ముందు పాటించాల్సిన కీలక మార్గదర్శకాలను వెల్లడించింది. ఇటీవల భారతీయ పాస్పోర్ట్దారులకు అమల్లో ఉన్న వీసా-రహిత ప్రవేశ విధానంలో మార్పులు వచ్చిన నేపథ్యంలో ఈ సూచనలు జారీ చేసినట్లు పేర్కొంది.రాయబార కార్యాలయం సూచనల ప్రకారం.. థాయ్లాండ్ చేరుకునే తేదీ నుంచి కనీసం ఆరు నెలల గడువు ఉన్న చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ తప్పనిసరి. అలాగే కన్ఫర్మ్ అయిన రిటర్న్ విమాన టికెట్, హోటల్ బుకింగ్, స్పష్టమైన ట్రావెల్ ఇటినరరీ (ప్రయాణ ప్రణాళిక) వెంట ఉండాలి. ప్రయాణికులు దేశంలో అడుగుపెట్టే 72 గంటల ముందు థాయ్లాండ్ డిజిటల్ అరైవల్ కార్డ్ (TDAC)ను ఆన్లైన్లో తప్పనిసరిగా పూర్తి చేయాలి. దానికి సంబంధించిన క్యూఆర్ కోడ్ను ఇమ్మిగ్రేషన్ తనిఖీల సమయంలో చూపించాల్సి ఉంటుంది.వీసా, నగదు నిబంధనలుప్రయాణ ఉద్దేశానికి అనుగుణంగా సరైన వీసా పొందాలని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ముఖ్యంగా వీసా ఆన్ అరైవల్ (VOA) లేదా వర్తించే ప్రవేశ సదుపాయాన్ని వినియోగించే ప్రయాణికులు ఒక్కొక్కరు కనీసం 20,000 థాయ్ బాట్లు (సుమారు రూ.57,000–58,000) నగదు వెంట ఉంచుకోవాలని సూచించింది. అవసరమైతే దీనికి సంబంధించిన ఆధారాలను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడిగే అవకాశం ఉందని హెచ్చరించింది.ఉద్యోగం కోసం వెళ్తుంటే జాగ్రత్తథాయ్లాండ్లో ఉద్యోగం పొందిన వారు పర్యాటక వీసా లేదా వీసా ఆన్ అరైవల్పై దేశంలోకి ప్రవేశించకూడదని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఉపాధి కోసం వెళ్లేవారు ముందుగానే తగిన వర్క్ లేదా సంబంధిత వీసా తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే స్థానిక ఇమ్మిగ్రేషన్ నిబంధనల ఉల్లంఘనగా పరిగణించే అవకాశం ఉంది. అలాగే థాయ్లాండ్ మీదుగా మరో దేశానికి వెళ్లే ట్రాన్సిట్ ప్రయాణికులు తమ తుది గమ్యస్థానానికి అవసరమైన వీసాలు, టికెట్లు, ఇతర పత్రాలను కూడా వెంట ఉంచుకోవాలని సూచించింది.ముఖ్యమైన చెక్లిస్ట్ ఇదే..చేరుకునే తేదీ నుంచి కనీసం 6 నెలల గడువు ఉన్న పాస్పోర్ట్.కన్ఫర్మ్ అయిన రిటర్న్ టికెట్.ధ్రువీకరించిన హోటల్ బుకింగ్.పూర్తి ప్రయాణ ప్రణాళిక.ప్రయాణానికి 72 గంటల ముందు పూర్తి చేసి TDAC క్యూఆర్ కోడ్ప్రయాణ ఉద్దేశానికి తగిన వీసావెంట కనీసం 20,000 థాయ్ బాట్ల నగదు.ఇమ్మిగ్రేషన్ కౌంటర్కు వెళ్లే ముందు అన్ని పత్రాలను సిద్ధంగా ఉంచుకోవడం.గ్రూప్గా వెళ్లినా ప్రతి ప్రయాణికుడు తన సొంత పత్రాలు కలిగి ఉండడం.ఉద్యోగం కోసం వెళ్తుంటే టూరిస్ట్ ఎంట్రీ సదుపాయాలను ఉపయోగించకపోవడం.ట్రాన్సిట్ ప్రయాణికులు తుది గమ్యస్థానానికి సంబంధించిన అన్ని పత్రాలు వెంట ఉంచుకోవడం.ప్రయాణానికి ముందు తాజా ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, వీసా అర్హతలు, అవసరమైన పత్రాలను మరోసారి ధ్రువీకరించుకోవాలని భారత రాయబార కార్యాలయం భారతీయ పౌరులకు సూచించింది. దీంతో థాయ్లాండ్లో ప్రవేశ సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా, ప్రయాణం సాఫీగా సాగుతుందని పేర్కొంది.Advisory for Indian nationals visiting Thailand. pic.twitter.com/wEAMyH7H0D— India in Thailand (@IndiainThailand) July 2, 2026 -
ప్రపంచంలో మన పాస్పోర్ట్ ఎంత పవర్ఫుల్ అంటే..
ప్రపంచ పాస్పోర్ట్ల బలాన్ని కేవలం వీసా-రహిత ప్రయాణంతోనే కాకుండా, విదేశాల్లో నివసించే అవకాశాలు, పెట్టుబడులు, జీవన నాణ్యత వంటి అంశాల ఆధారంగా అంచనా వేసే ‘గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ (Global Passport Index–GPI) 2026’ నివేదిక విడుదలైంది. ఈ ఏడాది కూడా యూరప్ దేశాలే ఆధిపత్యం చాటగా, టాప్-10లో తొమ్మిది స్థానాలను యూరోపియన్ దేశాలు కైవసం చేసుకున్నాయి. ఆసియా నుంచి సింగపూర్ మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కించుకుంది.ఏమిటీ గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్?గ్లోబల్ సిటిజన్ సొల్యూషన్స్ రూపొందించే ఈ సూచీ, సాధారణ పాస్పోర్ట్ ర్యాంకింగ్లకు భిన్నంగా ఉంటుంది. ఎక్కువ దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశాన్ని మాత్రమే కాకుండా, పాస్పోర్ట్ కలిగిన వ్యక్తికి ప్రపంచవ్యాప్తంగా లభించే మొత్తం ప్రయోజనాలను అంచనా వేస్తుంది. ఇందులో మొబిలిటీ (50 శాతం), పెట్టుబడి అవకాశాలు (25 శాతం), జీవన నాణ్యత (25 శాతం) అనే మూడు ప్రధాన విభాగాల్లో మొత్తం 14 సూచికలను పరిగణనలోకి తీసుకుంటారు. ఇందుకోసం ప్రపంచ బ్యాంక్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ వంటి అంతర్జాతీయ సంస్థల గణాంకాలను ఉపయోగిస్తారు.టాప్-10 శక్తివంతమైన పాస్పోర్ట్లు1. స్వీడన్2. స్విట్జర్లాండ్3. ఫిన్లాండ్4. జర్మనీ5. నెదర్లాండ్స్, 6. డెన్మార్7. ఐర్లాండ్8. యునైటెడ్ కింగ్డమ్9. నార్వే10. సింగపూర్భారత్ పరిస్థితి ఎలా ఉందంటే..?గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026లో 200 దేశాల్లో భారత్ 125వ స్థానంలో నిలిచింది. మొబిలిటీ విభాగంలో 135వ స్థానం, జీవన నాణ్యతలో 118వ స్థానం నమోదు చేసింది. గత కొన్నేళ్లలో అనేక దేశాలు తమ పౌరులకు అంతర్జాతీయ ప్రయాణ సౌలభ్యాన్ని మరింత విస్తరించగా, ఆ వేగంతో భారత్ పురోగతి సాధించలేదని ఈ నివేదిక సూచిస్తోంది.అయితే, కేవలం వీసా-రహిత ప్రయాణ అవకాశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకునే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారత్ ప్రస్తుతం 80వ స్థానంలో ఉంది. తాజా జూలై 2026 అప్డేట్ ప్రకారం భారత పాస్పోర్ట్ కలిగిన వారు 56 దేశాలకు వీసా-ఫ్రీ లేదా వీసా-ఆన్-అరైవల్ సౌకర్యంతో ప్రయాణించగలరు. ఈ దేశాల్లో ఎక్కువ భాగం ఆఫ్రికా, ఆసియా, కరేబియన్, పసిఫిక్ ప్రాంతాలకు చెందినవే. అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, చాలా యూరోపియన్ దేశాలకు మాత్రం భారతీయులు ఇప్పటికీ ముందస్తు వీసా పొందాల్సి ఉంటుంది. -
నెలకు రూ.4 లక్షలు.. ఫ్రీగా థాయ్లాండ్ ట్రిప్!
ఇంటర్న్షిప్లు అనుభవాన్ని సంపాదించుకోవడానికి విద్యార్థులకు లభించే అవకాశాలు. కానీ కొందరికి అవే జీవితాన్ని మార్చే మలుపులుగా మారిపోతాయి. అలాంటి ఒక ఆసక్తికరమైన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఫస్ట్ ఇయర్ చదువుతున్న కాలేజ్ స్టూడెంట్ 'సిద్ధార్థ్ దుబే' టాప్మేట్ అనే టెక్ స్టార్టప్లో సేల్స్ ఇంటర్న్గా చేరాడు. అతనికి ఎలాంటి అనుభవం లేకపోయినా.. తన ప్రతిభతో నెలకు రూ.4 లక్షల స్టైపెండ్ అందుకున్నాడు. అంతే కాకుండా.. కంపెనీ ఖర్చులతో థాయ్లాండ్ ట్రిఫ్ను గిఫ్ట్గా గెలుచుకున్నాడు.ఐఐటి పూర్వ విద్యార్థి, టాప్మేట్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన దినేష్ సింగ్.. సిద్ధార్థ్ దుబే స్టోరీని లింక్డ్ఇన్ పోస్ట్లో షేర్ చేసిన తరువాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ పోస్ట్ చాలా వేగంగా వైరల్ అయింది.దినేశ్ సింగ్ తన పోస్టులో వివరిస్తూ.. సిద్ధార్థ్ తన టీమ్లో అతి చిన్న వయస్సు వాడైనప్పటికీ.. పెద్ద అనుభవం లేనప్పటికీ అతనిలో ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్, ఆత్మవిశ్వాసం, కొత్త వ్యక్తులతో మాట్లాడి వారి అవసరాలను అర్థం చేసుకుని నమ్మకాన్ని ఏర్పరచగల సామర్థ్యం అతన్ని ప్రత్యేకంగా నిలిపాయి. గత నెలలో అత్యధిక సేల్స్ సాధించినట్లు పేర్కొన్నారు. అతని పనితీరు చూసి కంపెనీ అతనికి స్పెషల్ గిఫ్ట్గా పూర్తిగా ఖర్చులు భరించి థాయిలాండ్ ట్రిప్ కూడా ఇచ్చింది.ఈ కథ చాలా మందికి ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తోంది. కేవలం డిగ్రీలు లేదా సర్టిఫికెట్లు మాత్రమే కాదు, మనం మాట్లాడే విధానం, ఆలోచన, ప్రవర్తన కూడా కెరీర్లో పెద్ద మార్పు తీసుకురాగలవు. సోషల్ మీడియాలో కూడా దీనిపై చాలా మంది స్పందించారు. కొందరు ఇది 'టాలెంట్ + అవకాశం' కలిసిన ఉదాహరణ అని చెప్పగా, మరికొందరు 'ప్రతిభకు వయసుతో పనిలేదని' వ్యాఖ్యానించారు. -
ఏటీఎఫ్ సబ్సిడీ.. మాకొద్దులే!
పశ్చిమాసియా ప్రభావంతో పెరుగుతున్న ఇంధన ధరల భారం నుంచి ఎయిర్లైన్స్కి ఊరట కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన ధరల స్థిరీకరణ పథకానికి ఆదరణ కరువైంది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో దీన్ని ఉపయోగించుకోవడంపై విమానయాన సంస్థలేవీ ఆసక్తి చూపలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.వివరాల్లోకి వెళ్తే .. ప్రభుత్వం రూ. 10,000 కోట్లతో జెట్ ఫ్యూయల్ రేట్ల స్థిరీకరణ పథకాన్ని ప్రకటించింది. ఎయిర్లైన్స్ ఇందులో స్వచ్ఛందంగా చేరొచ్చు. దీని ప్రకారం మూడేళ్ల పాటు పన్నులు మొదలైనవన్నీ కలిపి లీటరుకు రూ. 115 రేటు (ఢిల్లీ ధర) చొప్పున చెల్లించి కొనుక్కునేలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉంటుంది.సబ్సిడీపై విక్రయించడం వల్ల ఆయిల్ కంపెనీలకు నష్టాలేవైనా వాటిల్లితే ప్రభుత్వం దాన్ని భర్తీ చేస్తుంది. ఈ స్కీములో చేరని కంపెనీలు మార్కెట్ ధరలను చెల్లించి కొనుక్కోవాల్సి ఉంటుంది. పథకాన్ని ప్రకటించిన జూన్ 3 నాడు రేట్లు సుమారు రూ. 142 స్థాయిలో ఉండగా రూ. 115 రేటును ప్రతిపాదించారు. కానీ ప్రస్తుతం ఆ రెండింటి కన్నా ఏటీఎఫ్ ధర గణనీయంగా తగ్గి రూ. 110 స్థాయికి తగ్గింది. రూ. 38 వేల కోట్లకు ఎయిర్లైన్స్ నష్టాలు నిర్వహణ వ్యయాలు పెరిగిపోవడం, డాలరుతో రూపాయి మారకం విలువ పడిపోవడం తదితర అంశాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీ విమానయాన సంస్థల పనితీరుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. 2026–27లో ఎయిర్లైన్స్ నష్టాలు ఏకంగా రూ. 36,000–38,000 కోట్లకు పెరగనున్నాయి. రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. వాస్తవానికి 2027 ఆర్థిక సంవత్సరంలో నష్టాలు రూ. 11,000–12,000 కోట్లకు తగ్గుతాయని ముందుగా అంచనా వేసినప్పటికీ, ఆ తర్వాత పరిస్థితులు మారిపోయినట్లు వివరించింది. -
ఉచితంగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్!
భారతదేశంలో ఆధార్ ప్రతి పౌరుడికి ఒక ముఖ్యమైన గుర్తింపు పత్రంగా మారింది. ముఖ్యంగా పిల్లల కోసం ఆధార్ వివరాలు సరిగ్గా ఉండటం చాలా అవసరం. కాబట్టి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) 5 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ చేయాలని చెబుతోంది.పిల్లలు పెరుగుతున్న కొద్దీ వారి వేలిముద్రలు, కంటి (ఐరిస్) నమూనాలు, ముఖ ఆకృతి కొంత మారుతుంది. అందువల్ల చిన్న వయస్సులో తీసుకున్న బయోమెట్రిక్ వివరాలు కాలక్రమేణా సరైన గుర్తింపును ఇవ్వకపోవచ్చు. ఈ సమస్యను నివారించడానికి యూఐడీఏఐ ఈ అప్డేట్ను తప్పనిసరి చేసింది. దీనివల్ల ఆధార్ వివరాలు మరింత ఖచ్చితంగా ఉంటాయి.ఈ బయోమెట్రిక్ అప్డేట్ ముఖ్యంగా విద్యార్థులకు చాలా అవసరం. ఎందుకంటే వీరికి స్కూల్, కాలేజీల్లో ప్రవేశాలు లేదా పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి.. ప్రభుత్వ స్కాలర్షిప్లు, ఇంటర్న్షిప్లు, ఫెలోషిప్లకు ఆధార్ ఆధారిత గుర్తింపు అవసరం అవుతుంది. అలాగే ప్రభుత్వ పథకాలు పొందడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి పిల్లల ఆధార్ వివరాలు అప్డేట్లో ఉండటం అవసరం.యూఐడీఏఐ ప్రకారం.. 5 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు ఈ తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ ప్రస్తుతం ఉచితంగా అందుబాటులో ఉంది. ఈ సదుపాయం 2026 సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుంది. ఈ గడువులోపు అప్డేట్ చేయించుకుంటే ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు.ఈ బయోమెట్రిక్ అప్డేట్ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పిల్లలతో కలిసి సమీపంలోని ఆధార్ సేవా కేంద్రం లేదా నమోదు కేంద్రానికి వెళ్లాలి. అక్కడ పిల్లల వేలిముద్రలు, ఐరిస్ స్కాన్, ఫోటో తీసి అప్డేట్ చేస్తారు. కొన్ని నిమిషాల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది.Mandatory Biometric Updates (MBU) are required on attaining the age of 5 & 15 years. Ensure your child's Aadhaar remains updated and accurate.UIDAI is running a special drive and MBU is now free between the age of 5-17 till 30 September 2026.Locate your nearest Aadhaar… pic.twitter.com/5yi4qYF7l0— Aadhaar (@UIDAI) July 4, 2026 -
ఏఐ ఫర్ గుడ్ గ్లోబల్ కమిషన్లో అంబానీ, మిట్టల్
ఇంటర్నేషనల్ టెలీకమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) చొరవతో ఏర్పాటైన ఏఐ ఫర్ గుడ్ గ్లోబల్ కమిషన్లో దేశీ కార్పొరేట్ దిగ్గజాలకు చోటు దక్కింది. వ్యవస్థాపక సభ్యులు, 44 మంది కమిషనర్ల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ, భారతి ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు, చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ ఉన్నారు.ఈ కమిషన్కి రువాండా అధ్యక్షుడు పాల్ కగామే, సేల్స్ఫోర్స్ సీఈవో మార్క్ బెనియాఫ్లు కో–చెయిర్గా వ్యవహరిస్తారు. వాస్తవ ప్రపంచపు సవాళ్లను పరిష్కరించడంలో ఏఐ సామర్థ్యాలను వినియోగంలోకి తేవడానికి, దానిపై అవగాహన, నమ్మకాన్ని పెంచడానికి ఈ కమిషన్ పని చేస్తుంది. ఫౌండింగ్ మెంబర్గా సునీల్ మిట్టల్ని ప్రతిపాదించడంపై భారతి ఎంటర్ప్రైజెస్ హర్షం వ్యక్తం చేసింది. -
దేశంలో తొలి గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ ప్రారంభం!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్లోని.. బలోత్రా జిల్లాలోని పచ్పద్ర ప్రాంతంలో దేశంలోని తొలి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ-పెట్రోకెమికల్ సముదాయాన్ని ప్రారంభించారు. ఇది దేశ ఇంధన, పెట్రోకెమికల్ రంగంలో కొత్త అధ్యాయంగా నిలిచింది. ఈ సముదాయం భారతదేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడంతో పాటు దేశీయ పారిశ్రామికాభివృద్ధికి కీలకంగా మారనుంది.ఈ రిఫైనరీని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL), రాజస్థాన్ ప్రభుత్వం సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను రూ. 79,450 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడితో ఏర్పాటు చేశారు. దీని సామర్థ్యం సంవత్సరానికి 9 మిలియన్ మెట్రిక్ టన్నులు. అదనంగా ఏడాదికి 2.4 మిలియన్ మెట్రిక్ టన్నుల పెట్రోకెమికల్ ఉత్పత్తులను తయారు చేసే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది.ఈ ప్రాజెక్టు ద్వారా భారతదేశం దిగుమతులపై ఆధారపడే అవసరం తగ్గి, దేశీయంగా పెట్రోకెమికల్ ఉత్పత్తుల తయారీ పెరుగుతుంది. దీనివల్ల దేశ ఇంధన భద్రత మరింత బలోపేతం అవుతుంది. అంతే కాకుండా.. ఈ రిఫైనరీ ఆధారంగా ఇక్కడ పెట్రోకెమికల్, ప్లాస్టిక్ పార్క్ అభివృద్ధి చెందనుంది. దీనివల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమలు ఏర్పడి స్థానిక ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి. ఈ ప్రాజెక్టు వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. దీంతో రాజస్థాన్ రాష్ట్రం ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందనుంది.#WATCH | Balotra, Rajasthan | Prime Minister Narendra Modi flags off refinery production tankers from the Greenfield Refinery-cum-Petrochemical Complex, developed as a joint venture between Hindustan Petroleum Corporation Limited (HPCL) and the Rajasthan Government, which PM Modi… pic.twitter.com/YHAZSdihQE— ANI (@ANI) July 4, 2026 -
పాల కల్తీపై ఎఫ్డీఏ ఉక్కుపాదం
పాల కల్తీని పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా పాలు, పాల ఉత్పత్తుల విక్రయాలపై కఠినమైన ఉత్తర్వులను జారీ చేసింది. జులై 3 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధనలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పాల వ్యాపారాలకు వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో సింథటిక్ పాలు, పాల కల్తీ, రవాణాలో జరుగుతున్న పలు ఉల్లంఘనలను గుర్తించిన మహారాష్ట్ర ప్రభుత్వం.. ప్రజారోగ్య రక్షణే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకుంది. కల్తీదారుల పట్ల ప్రభుత్వం ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అవలంబిస్తోందని ఎఫ్డీఏ హెచ్చరించింది.కొత్త మార్గదర్శకాలు..పాశ్చరైజ్డ్ పాలను కేవలం సీల్ చేసిన, సరిగ్గా లేబుల్ చేయబడిన, ట్యాంపర్-స్పష్టమైన (ఎవరూ మార్చడానికి వీలులేని) ప్యాకేజింగ్లో మాత్రమే విక్రయించాలి.పాలు ఎక్కడి నుంచి సేకరించారు? ఎవరికి సరఫరా చేశారు? అనే పూర్తి రికార్డులను నిర్వహించడం తప్పనిసరి. డైరీ ఫార్మ్ (వ్యవసాయ స్థాయి) నుంచి చివరి వినియోగదారుడికి అమ్మే వరకు ప్రతి దశను ట్రాక్ చేసేలా రికార్డులు ఉండాలి.పాలను నిల్వ చేయడానికి, రవాణా చేయడానికి కేవలం ఫుడ్-గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్లను మాత్రమే ఉపయోగించాలి. ప్లాస్టిక్ లేదా ఇతర నాణ్యత లేని పాత్రల వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు.పాలు, పాల ఉత్పత్తుల నిర్వహణ, పంపిణీ ప్రక్రియల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే వార్షిక వైద్య ఫిట్నెస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.ముడి పాలపై ప్రత్యేక హెచ్చరికమార్కెట్లో వినియోగదారులకు నేరుగా విక్రయించే ముడి పాలు ప్యాకెట్లు లేదా కంటైనర్లపై ‘ఉపయోగించడానికి ముందు తప్పనిసరిగా వేడి చేయండి’ అనే హెచ్చరికను ప్రముఖంగా ప్రదర్శించాలని ఎఫ్డీఏ ఆదేశించింది.రూ.10 లక్షల వరకు జరిమానా!ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించి పాల కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. నిబంధనల ప్రకారం, కల్తీకి పాల్పడిన వారికి రూ.10 లక్షల వరకు జరిమానా విధించడంతో పాటు చట్టపరమైన క్రిమినల్ చర్యలు కూడా ఉంటాయని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ తప్పులు చేయకండి! -
అన్ని జానర్ల డేటా నిలిపివేతకు కేంద్రం ఆదేశం!
భారతీయ టెలివిజన్ ప్రసార రంగంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. దేశంలోని టీవీ ఛానెళ్ల భవితవ్యాన్ని, ప్రకటనల మార్కెట్ను శాసించే టెలివిజన్ రేటింగ్లను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (ఎంఐబీ) ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా అమలులోకి వచ్చిన ‘టెలివిజన్ రేటింగ్స్ పాలసీ, 2026’ ప్రకారం.. బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) అధికారికంగా తన లైసెన్స్ను పునరుద్ధరించుకునే వరకు అన్ని రకాల జానర్ల టీవీ రేటింగ్ల ప్రచురణను పూర్తిగా నిలిపివేయాల్సి ఉంటుంది.గతంలో కేవలం న్యూస్ ఛానెళ్లకు మాత్రమే పరిమితమైన ఈ రేటింగ్స్ నిలిపివేత విధానాన్ని ఇప్పుడు జనరల్ ఎంటర్టైన్మెంట్ (జీఈసీ), స్పోర్ట్స్, సినిమాలు, ప్రాంతీయ ఛానెళ్లతో సహా అన్ని విభాగాలకు విస్తరించడం దేశీయ ప్రసార, ప్రకటనల పరిశ్రమల్లో ఆందోళన కలిగిస్తోంది.ఆదేశాలు ఏం చెబుతున్నాయి?కేంద్ర మంత్రిత్వ శాఖ జారీ చేసిన తాజా ఆదేశాల ప్రకారం.. ‘బార్క్’ సంస్థను పూర్తిగా మూసివేయడం లేదు. అయితే, నవీకరించబడిన కొత్త నియంత్రణ ఫ్రేమ్వర్క్కు సంస్థ పూర్తిగా అనుగుణంగా ఉందో లేదో ధ్రువీకరించే వరకు రేటింగ్ కార్యకలాపాలు, డేటా ప్రచురణను నిలిపివేయాలని స్పష్టం చేసింది.బార్క్ బ్యాక్-ఎండ్ వ్యవస్థలు యథావిధిగా పనిచేస్తాయని గమనించాలి. అవి ప్రేక్షకుల వ్యుయర్షిప్ డేటాను సేకరిస్తూనే ఉంటాయి. కానీ, మంత్రిత్వ శాఖ తన సమ్మతి సమీక్షను (Compliance Review) పూర్తి చేసి కొత్త విధానం కింద తాజా లైసెన్స్ మంజూరు చేసే వరకు ఎలాంటి గణాంకాలను బహిరంగంగా ప్రచురించడానికి వీల్లేదు.టెలివిజన్ రేటింగ్ వ్యవస్థలో పారదర్శకతను మెరుగుపరచడానికి, పాలనను సరిదిద్దడానికి, ప్రేక్షకుల మెజర్మెంట్లో కచ్చితత్వాన్ని పెంచడానికి ఈ ‘టెలివిజన్ రేటింగ్స్ పాలసీ, 2026’ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని రేటింగ్ ఏజెన్సీలు సవరించిన ఈ గైడ్లైన్స్కు లోబడి తమ లైసెన్సులను పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది.న్యూస్ ఛానల్స్ నుంచి అన్ని జానర్ల వరకు..టెలివిజన్ రంగంలో రేటింగ్స్ సస్పెన్షన్ అనేది పూర్తిగా కొత్త విషయమేమీ కాదు. గతంలో టీఆర్పీ డేటా తారుమారు అవుతోందనే ఆరోపణలు, సమగ్రతపై ఆందోళనల నేపథ్యంలో న్యూస్ ఛానెల్ రేటింగ్స్పై కొంతకాలం పాటు స్తంభింపజేశారు. కానీ, తాజా ఆదేశం టెలివిజన్ రంగాన్ని పూర్తిగా ప్రభావితం చేయనుంది. వినోదం, క్రీడలు, సినిమాలు, ప్రాంతీయ కంటెంట్తో సహా ప్రతి ఒక్క జానర్ను దీని పరిధిలోకి తీసుకొచ్చారు.ఇదీ చదవండి: బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ తప్పులు చేయకండి! -
బ్రాండ్ల రేటింగ్లో ‘టాటా టీ’ టాప్!
వినియోగదారుల కొనుగోలు ఆసక్తి ఆధారంగా ‘టీఆర్ఏ రీసెర్చ్’ విడుదల చేసిన తాజా ఇండెక్స్లో ‘టాటా టీ’ అగ్రస్థానంలో నిలిచింది. ఈ రేటింగుల్లో టాటా టీ 455 పాయింట్లతో మొదటి స్థానాన్ని దక్కించుకోగా.. బ్రిటానియా (380.3 పాయింట్లు), ప్రభుత్వ రంగ ఎస్బీఐ (283.8 పాయింట్లు) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అత్యధిక వృద్ధి సాధించిన టాప్–10 బ్రాండ్లలో ఆసుస్ ల్యాప్టాప్స్, గ్లూకాన్ డి, రేమండ్, వివో, శామ్సంగ్ టీవీలు, రిలయన్స్ జియో, శామ్సంగ్ మొబైల్ ఫోన్లు చోటు దక్కించుకున్నాయి.మరోవైపు, ప్రముఖ వాచీల బ్రాండ్ ‘టైటాన్’ ఏకంగా 552 పాయింట్లు కోల్పోయి తీవ్ర క్షీణతను నమోదు చేయగా.. హోండా మోటార్సైకిల్స్, డైకిన్ ఏసీలపై కూడా వినియోగదారుల ఆసక్తి తగ్గింది. పశి్చమాసియాలో ఉద్రిక్తతలు తగ్గి క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో ‘ఆయిల్ అండ్ గ్యాస్’ విభాగం 77 శాతం క్షీణించింది. అలాగే, మాస్టర్ కార్డ్ తిరిగి ఇండెక్స్లోకి ప్రవేశించడం వల్ల ‘క్రెడిట్ కార్డ్ నెట్వర్క్’ విభాగంలో ఏకంగా 523.7 శాతం వృద్ధి నమోదైంది.సీజనల్ ట్రెండ్స్ ప్రభావం రుతుపవనాల ప్రభావంతో వినియోగదారుల కొనుగోలు ప్రాధాన్యతలు మారాయని టీఆర్ఏ నివేదిక తెలిపింది. వర్షాల వల్ల ‘టాటా టీ’, గ్లూకాన్ ‘డి’లకు డిమాండ్ పెరిగింది. చల్లబడిన వాతావరణంతో ఏసీలు (డైకిన్), టూ–వీలర్ల (హోండా) అమ్మకాలు మందగించాయి. అయితే, మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకుని బ్రిటానియా మాత్రం బలమైన వృద్ధిని కనబరిచింది. వినియోగదారులు కేవలం బ్రాండ్లను గుర్తించడమే కాకుండా, వాటిని కొనేందుకు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారనేది ఈ ‘బైయింగ్ ఇంటెంట్’ సూచిస్తుందని టీఆర్ఏ రీసెర్చ్ సీఈఓ ఎన్. చంద్రమౌళి పేర్కొన్నారు.ఇదీ చదవండి: బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ తప్పులు చేయకండి! -
నీతా అంబానీకి ప్రతిష్ఠాత్మక అవార్డు!
రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ ఛైర్పర్సన్, వ్యవస్థాపకురాలు అయిన నీతా అంబానీ అమెరికాలో ప్రత్యేక గౌరవాన్ని అందుకున్నారు. ఫ్లోరిడాలోని టాంపా నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (AAPI) ఆమెకు హ్యూమానిటేరియన్ అవార్డు ప్రదానం చేశారు.ఈ అవార్డును ప్రధానంగా ఆరోగ్యం, విద్య, క్రీడలు, సంస్కృతి, సమాజ అభివృద్ధి వంటి రంగాల్లో అసాధారణ సేవలు చేసిన వ్యక్తులను గౌరవించడానికి ఇస్తారు. నీతా అంబానీ ఈ రంగాల్లో చేసిన సేవలను గుర్తించి ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందించారు. ముఖ్యంగా సామాజిక సేవ, దాతృత్వ కార్యక్రమాలు, ప్రజల సంక్షేమం కోసం ఆమె చూపిన నిబద్ధతను ఈ సందర్భంగా ప్రశంసించారు.ఇదే కార్యక్రమంలో.. టాంపా మేయర్ జేన్ కాస్టర్, నీతా అంబానీకి ‘కీ టు ది సిటీ ఆఫ్ టాంపా’ను బహూకరించారు. ఇది అమెరికా అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన పౌర పురస్కారాలలో ఒకటి. సేవలను, వ్యక్తిత్వానికి, మానవతా దృక్పథం వంటి వాటికి గౌరవంగా 'ఈ నగరం మీకు స్వాగతం పలుకుతోంది' అనే సంకేతంగా ఈ గుర్తింపును ఇస్తారు.Reliance Foundation, Founder and Chairperson Mrs. Nita Ambani received the AAPI Humanitarian Award in Tampa, Florida, presented by the American Association of Physicians of Indian Origin. The award recognizes her extraordinary contributions to healthcare, education, sport,… pic.twitter.com/dDnqXEUUQd— Reliance Industries Limited (@RIL_Updates) July 3, 2026 -
రైల్వే రికార్డ్.. రైలెక్కిన 63.81 కోట్ల మంది
దేశ ఆర్థిక వృద్ధికి ఇంజిన్గా నిలుస్తూ భారతీయ రైల్వే జూన్ 2026లో సరకు రవాణా, ప్రయాణికుల సేవల్లో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. అధిక సరకు లోడింగ్, పెరిగిన ప్రయాణికుల రద్దీ, ఆధునిక సేవల విస్తరణతో సౌకర్యవంతమైన ప్రయాణానికి, సరకు రావాణా వృద్ధికి మొత్తంగా ఆర్థిక వృద్ధికి రైల్వే తోడ్పడుతోంది.ప్రయాణికుల రద్దీలోనూ జోరు జూన్ 2026లో ప్రయాణికుల రద్దీ సైతం స్థిరంగా పెరిగింది. గతేడాది ఇదే నెలలో 62.37 కోట్ల మంది ప్రయాణించగా, ఈసారి 63.81 కోట్ల మంది రైళ్లలో ప్రయాణించారు. స్వల్ప, దూర ప్రయాణాలకు ప్రయాణికులను చేరవేసే నాన్–సబర్బన్ విభాగంలో 3.9 శాతం వృద్ధి నమోదైంది. ప్రయాణికుల సంఖ్య 28.90 కోట్ల నుంచి 30.04 కోట్లకు పెరిగింది. సబర్బన్ విభాగంలోనూ 0.9శాతం వృద్ధితో 33.46 కోట్ల నుంచి 33.77 కోట్లకు చేరినట్లు రైల్వే వివరించింది.ప్రీమియం రైలు సేవల విస్తరణతో భారతీయ రైల్వే ప్రయాణికుల సేవలను ఆధునీకరిస్తోంది. వందేభారత్ సరీ్వసుల సంఖ్య 164కు చేరింది. సామర్థ్య పెంపు, కార్యాచరణ సామర్థ్యం మెరుగుదల, ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని చేపట్టే కార్యక్రమాల ద్వారా సమర్థవంతమైన లాజిస్టిక్స్, నమ్మదగిన ప్రయాణికుల సేవలు, ఆధునిక రైల్వే మౌలిక సదుపాయాలను అందించడానికి భారతీయ రైల్వే కట్టుబడి ఉందని కేంద్ర రైల్వే శాఖ వెల్లడించింది. జూన్ 2026లో భారతీయ రైల్వే 142.21 మిలియన్ టన్నుల సరకు రవాణా చేసింది. గతేడాది ఇదే నెలలో 136.71 మిలియన్ టన్నులు రవాణా కాగా, ఈసారి 4 శాతం వృద్ధి నమోదైంది. సరకు రవాణా ద్వారా జూన్ 2025తో పోలిస్తే సుమారు రూ.430 కోట్ల అదనపు ఆదాయం వచి్చంది, ఇది 3 శాతం ఎక్కువ అని కేంద్ర రైల్వే శాఖ గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రధాన వస్తువుల్లో గణనీయమైన వృద్ధి కనిపించింది. ఎరువుల లోడింగ్ 19.1శాతం, ఇతర వస్తువుల రవాణాలో 17.3 శాతం వృద్ధి సాధించింది. ఇనుప ఖనిజం(9.4 శాతం), దేశీయ బొగ్గు(4.9శాతం), క్లింకర్ (7.2 శాతం) రవణాలోనూ వృద్ధిని కనబర్చింది. ఇది ఆర్థిక వ్యవస్థలోని ప్రధాన రంగాల నుంచి కొనసాగుతున్న డిమాండ్ను ప్రతిబింబిస్తోందని మంత్రిత్వశాఖ తెలిపింది. మొదటి త్రైమాసికంలో 419.08 మిలియన్ టన్నుల సరకు లోడ్ 2026–27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో రైల్వే 419.08 మిలియన్ టన్నుల సరకును లోడ్ చేసింది. 2025–26 ఇదే కాలంలో 413.05 మిలియన్ టన్నులు కాగా, ఈసారి స్వల్ప వృద్ధి నమోదైంది. ఇనుప ఖనిజం లోడింగ్ 7.44 శాతం, క్లింకర్ 6.54 శాతం, ఇతర వస్తువుల రవాణా 12.16% పెరిగినట్లు రైల్వేశాఖ పేర్కొంది. వేసవి కాలంలో థర్మల్ పవర్ స్టేషన్ల అవసరాలను తీర్చేందుకు గతేడాది జూన్తో పోలిస్తే ఈ జూన్లో పవర్ ప్లాంట్లకు 7 శాతం ఎక్కువ దేశీయ బొగ్గును రైల్వే సరఫరా చేసింది. దీంతో దేశవ్యాప్తంగా నిరంతర విద్యుత్ ఉత్పత్తికి సహకారం అందినట్లు హర్షం వ్యక్తం చేసింది. -
ఉద్యోగాలపై సైబర్ సెక్యూరిటీ దిగ్గజం నికేష్ అరోరా సంచలన వ్యాఖ్యలు
భారతీయ అమెరికన్ బిలియనీర్ సీఈఓ, సైబర్ సెక్యూరిటీ దిగ్గజం 'పాలో ఆల్టో నెట్వర్క్స్' (Palo Alto Networks) సీఈఓ నికేష్ అరోరా AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐ టెక్నాలజీ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, రాబోయే మూడేళ్లలో కార్పొరేట్ కంపెనీల్లోని కొన్ని కీలక విభాగాల్లో ఉద్యోగుల సంఖ్య సగానికి పడిపోయే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా మార్కెటింగ్, హెచ్ఆర్ (HR), ఫైనాన్స్ విభాగాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.అదే సమయంలో ఏఐ పరిజ్ఞానం ఉన్న ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతోందని అన్నారు.సగానికిపైగా ఆ ఉద్యోగాలు మాయంఒక పాడ్కాస్ట్లో నికేష్ అరోరా మాట్లాడుతూ మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్ వంటి జనరల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ (G&A) విభాగాలలో ప్రాసెస్ మేనేజ్మెంట్ (నిర్వహణ ప్రక్రియలు) ఎక్కువగా ఉంటుందన్నారు. భవిష్యత్తులో రాబోయే అధునాతన ఏఐ అప్లికేషన్ల ద్వారా ఈ పనులను మరింత తెలివిగా, సులువుగా చేయవచ్చని పేర్కొన్నారు.ప్రస్తుతం కంపెనీలు వాడుతున్న సాస్ (SaaS - సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్) అప్లికేషన్లకు సొంత అభిప్రాయాలు ఉండవు. కానీ రాబోయే ఏఐ అప్లికేషన్లు స్వతంత్రంగా (Autonomous) వ్యవహరిస్తాయి. ఉదాహరణకు, ఒక మార్కెటింగ్ కాపీని చూసి అది బాగోలేదని చెప్తూ, బ్రాండ్కు తగినట్లుగా ఎలా మార్చాలో ఏఐ స్వయంగా సూచించగలదు. దీనివల్ల సగటు ఉద్యోగి మరింత స్మార్ట్గా పనిచేయగలుగుతాడు. ఫలితంగా, ఎక్కువ మంది ఉద్యోగుల అవసరం ఉండదు. ప్రస్తుతం తమ కంపెనీ మార్కెటింగ్ విభాగంలో ఉన్న 600 మంది సిబ్బందిని ఏఐ సహాయంతో సగానికి తగ్గించే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు.ఇదీ చదవండి: నాడు డెలివరీ బాయ్.. నేడు రెండు AI స్టార్టప్స్కు ఫౌండర్!డిమాండ్ ఉండే ఉద్యోగాలు ఏవి?ఏఐ యుగంలో కొన్ని ఉద్యోగాలు కోల్పోయినప్పటికీ, టెక్నికల్ , సేల్స్ లాంటి మరికొన్ని విభాగాలకు డిమాండ్ పెరుగుతుందని కూడా అరోరా చెప్పుకొచ్చారు. కంపెనీ ప్రొడక్ట్స్ చాలా బాగున్నప్పుడు, వాటిని ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందికి చేరవేయడానికి సేల్స్, టెక్నికల్ సిబ్బంది అవసరం పెరుగుతుందన్నారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను సమర్థవంతంగా ఉపయోగించగలిగే (AI Savvy) ఉద్యోగులకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది.ఇదీ చదవండి: రూ. 10 లక్షలకు ముంచేశారు, రోజంతా స్టేషన్లోనే : నటి ఆవేదనఉద్యోగులకు హెచ్చరికప్రస్తుతం కార్పొరేట్ సంస్థల్లోని 90శాతం మంది ఉద్యోగులకు AIపై సరైన అవగాహన/పరిజ్ఞానం లేకపోవడమే అతిపెద్ద సవాలని నికేష్ అరోరా అభిప్రాయపడ్డారు. ఇది డార్విన్ సిద్ధాంతం లాంటి సమయం. ఇక్కడ ఎవరు అత్యుత్తమంగా రాణిస్తారో వారే నిలబడతారు. కాబట్టి ఉద్యోగులు స్వయంగా ఏఐ సాంకేతికతను నేర్చుకుని అప్డేట్ అవ్వాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.ఇదీ చదవండి: రూ. 10 లక్షలకు ముంచేశారు, రోజంతా స్టేషన్లోనే : నటి ఆవేదనఒకప్పుడు గూగుల్ సంస్థలో అత్యధిక జీతం తీసుకునే ఉద్యోగిగా రికార్డు సృష్టించిన నికేష్ అరోరా, ఐఐటీ (BHU) వారణాసి పూర్వ విద్యార్థి. ప్రస్తుతం ఆయన నేతృత్వం వహిస్తున్న పాలో ఆల్టో నెట్వర్క్స్ మార్కెట్ విలువ దాదాపు 287 బిలియన్ డాలర్లుగా ఉంది. కాగా గత రెండేళ్లుగా ఏఐ పునర్నిర్మాణం కారణంగా మెటా (Meta), అమెజాన్ (Amazon), ఒరాకిల్ (Oracle), కాగ్నిజెంట్ లాంటి వంటి దిగ్గజ సంస్థలు వేలాది మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: అయోధ్యరాముడి విరాళాల గోల్మాల్ : స్పందించిన ఆర్ఎస్ఎస్ -
రూ.2 కోట్లు సంపాదించే ఉద్యోగిని ఇంత సిల్లీగా తొలగించారా?
అమెరికాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ మోటార్ కంపెనీ రూ.2 కోట్లు సంపాదించే ఓ ఉద్యోగిని కేవలం 1.95 డాలర్లు (సుమారు రూ.186) విలువైన కుకీని దొంగిలించాడనే ఆరోపణతో తొలగించడం తీవ్ర చర్చకు దారితీసింది. అయితే అతడు కుకీకి డబ్బులు చెల్లించినట్లు బ్యాంకు రికార్డులు నిరూపించడంతో కంపెనీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన అమెరికాలో కార్యాలయాల్లో అమలవుతున్న జీరో-టాలరెన్స్ విధానాలు, సెల్ఫ్-చెక్అవుట్ వ్యవస్థల విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.కెంటకీ రాష్ట్రంలోని లూయిస్విల్లేలో ఉన్న కెంటకీ ట్రక్ ప్లాంట్లో 11 సంవత్సరాలుగా ఎలక్ట్రిషియన్గా పనిచేసిన 60 ఏళ్ల కర్ట్ క్రోమ్ (Kurt Kromm) ఈ ఘటనకు కేంద్రబిందువయ్యాడు. ఈ ప్లాంట్లో ఫోర్డ్ సూపర్ డ్యూటీ పికప్ ట్రక్కులు, ఎక్స్పెడిషన్ ఎస్యూవీ, లింకన్ నావిగేటర్ వంటి వాహనాలు తయారవుతాయి.క్రోమ్ చెప్పిన వివరాల ప్రకారం, మే నెలలో రాత్రి షిఫ్ట్లో పనిచేస్తున్న సమయంలో రక్తంలో చక్కెర స్థాయి తగ్గడంతో క్యాంటీన్లోని సెల్ఫ్-సర్వీస్ కియోస్క్ వద్ద గ్రాండ్మాస్ చాక్లెట్ చిప్ కుకీ కొనుగోలు చేశాడు. మొదటి కియోస్క్లో కార్డు స్వైప్ చేసినప్పుడు లావాదేవీ విఫలమైనట్లు సందేశం కనిపించడంతో, పక్కనే ఉన్న మరో కియోస్క్లో మళ్లీ చెల్లించి కుకీ తీసుకున్నానని తెలిపాడు.వీడియో ఆధారంగా దొంగతనం ఆరోపణవారం రోజులకు అతడిని అధికారుల కార్యాలయానికి పిలిచి, సీసీటీవీ వీడియోలో కుకీకి చెల్లించకుండా తీసుకెళ్లినట్లు కనిపిస్తోందని, అందువల్ల ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు తెలియజేశారు. తన వద్ద ఎలాంటి వివరణ తీసుకోకుండా ప్లాంట్ నుంచి బయటకు పంపించారని క్రోమ్ ఆరోపించాడు. యూనియన్ ప్రతినిధులు క్షమాపణ చెప్పాలని సూచించినప్పటికీ, తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పి నిరాకరించాడు. గతేడాది తన సంపాదన 2 లక్షల డాలర్లని (రూ .1.9 కోట్లు), ఆఫీస్ క్యాంటీన్కే సుమారు 1,200 డాలర్లు (రూ .1.14 లక్షలు) ఖర్చు చేశానని, దొంగతనం చేయాల్సిన అవసరం తనకేంటని క్రోమ్ ప్రశ్నించారు.బ్యాంకు స్టేట్మెంట్తో బయటపడిన నిజంఇంటికి వెళ్లిన తర్వాత తన బ్యాంకు ఖాతాను పరిశీలించగా 1.95 డాలర్ల డెబిట్ లావాదేవీ విజయవంతంగా నమోదైనట్లు గుర్తించాడు. ఆ ఆధారాలను ఫోర్డ్ యాజమాన్యానికి, యూనియన్కు పంపించాడు. అనంతరం కియోస్క్ నిర్వహించే అరామార్క్ (Aramark) కూడా చెల్లింపు జరిగినట్లు ధ్రువీకరించింది. దీంతో ఫోర్డ్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని తిరిగి ఉద్యోగంలో చేరాలని ఆహ్వానించింది.అయితే అప్పటికే క్రోమ్ తన ఇంటికి సమీపంలో మరో ఉద్యోగంలో చేరేందుకు అంగీకరించాడు. గతంలో ఫోర్డ్లో పొందిన గంటకు 48 డాలర్ల వేతనం కంటే ఎక్కువగా కొత్త సంస్థలో 52.51 డాలర్లు, అదనంగా గంటకు 10 డాలర్ల బోనస్ లభించడంతో తిరిగి ఫోర్డ్లో చేరలేదు. ఉద్యోగం కోల్పోయిన ఐదు వారాల కాలానికి ఫోర్డ్ అతనికి బకాయి వేతనాన్ని కూడా చెల్లించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.ఫోర్డ్ స్పందనవ్యక్తిగత ఉద్యోగుల వ్యవహారాలపై వ్యాఖ్యానించబోమని ఫోర్డ్ పేర్కొన్నప్పటికీ, "కొన్ని సందర్భాల్లో వ్యవహారాన్ని మరింత మెరుగ్గా నిర్వహించాల్సి ఉండేదని తర్వాత తెలుస్తుంది. మా ఉద్యోగులతో న్యాయంగా వ్యవహరించాలనే లక్ష్యమే మా దృష్టి" అని సంస్థ ప్రతినిధి వెల్లడించారు. ఈ ఘటన అనంతరం ఇలాంటి వివాదాలను పరిష్కరించే విధానాలను పునఃసమీక్షిస్తున్నట్లు కూడా సమాచారం. -
హైదరాబాద్లో జీతాలు ఎక్కువ.. జాబ్లు తక్కువ!
సాక్షి, సిటీబ్యూరో: అన్నీ ఉన్నా నిరుద్యోగుల ముంగిట శని అన్నట్టుగా ఉంది హైదరాబాద్ నగర పరిస్థితి. ఓ వైపు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతూ, ఉద్యోగులకు అత్యధిక జీతాలు అందించే సిటీ ఉపాధి కల్పనలో మాత్రం చేతులెత్తేస్తోంది. ఈ వైరుధ్యాన్ని వెల్లడించాయి కేంద్ర గణాంకాల శాఖ (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన తొలి ‘నగర స్థాయి కారి్మక మార్కెట్ నివేదిక’ వెల్లడించింది. 46 నగరాలతో పోలిస్తే.. దాదాపు 10 లక్షలకు పైగా జనాభా ఉన్న దేశంలోని 46 నగరాలతో పోలిస్తే.. హైదరాబాద్ ఉద్యోగాల నాణ్యత, వేతనాలు, ఉత్పాదకతలో ముందంజలో ఉంది. ఆశించిన స్థాయిలో నిరుద్యోగ నిర్మూలన జరగలేదని యువత ఉపాధి సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయని తేల్చింది. హైదరాబాద్లో ప్రస్తుతం నిరుద్యోగ రేటు 6.8 శాతంగా నమోదైంది. ఇది మిలియన్ ప్లస్ నగరాల సగటు 4.9 శాతం కంటే ఎక్కువ. బెంగళూరు (2.8%), సూరత్ (1%), హౌరా (0.8%), రాజ్కోట్ (0.3%) వంటి నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో నిరుద్యోగం చాలా అధికంగా ఉంది. ఉద్యోగ నాణ్యతలో మేటి.. ఉద్యోగాల నాణ్యత పరంగా హైదరాబాద్కు మంచి స్థానం దక్కింది. నగరంలోని ఉద్యోగుల్లో 62.1 శాతం మంది రెగ్యులర్ వేతన ఉద్యోగాల్లో ఉండగా, మిలియన్ ప్లస్ నగరాల సగటు 58.5 శాతంగా ఉంది. ఇది హైదరాబాద్లో స్థిరమైన ఉద్యోగాల అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే దానికి నిదర్శనంగా నిలుస్తోంది. రెగ్యులర్ వేతన ఉద్యోగుల సగటు నెలవారీ ఆదాయం రూ.31,153 కాగా, మిగిలిన నగరాల సగటు రూ.28,808 మాత్రమే. స్వయం ఉపాధి పొందుతున్న వారి సగటు నెలవారీ ఆదాయం రూ.30,075, రోజువారీ కూలీల సగటు వేతనం రూ.784గా నమోదైంది. ఉపాధి.. ఏదీ..? లేబర్ ఫోర్స్ పారి్టసిపేషన్ రేట్ హైదరాబాద్లో 55.5 శాతంగా నమోదై, మిగతా నగరాల సగటు 52.4 శాతం కంటే ఎక్కువగా ఉంది. అంటే ఉద్యోగాల కోసం ప్రయతి్నంచేవారి సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, అందరికీ ఉపాధి లభించడం లేదని నివేదిక పేర్కొంది. యువత పరిస్థితి కూడా ఆందోళన కలిగిస్తోంది. 15 నుంచి 29 ఏళ్ల వయసు యువతలో 25.1 శాతం మంది ఉద్యోగంలో కానీ విద్యార్జనలో గానీ లేరు. ఇందులో యువతుల శాతం 37.3 ఉండగా, యువకుల శాతం 12.6 మాత్రమే ఉండటం గమనార్హం. -
నాడు డెలివరీ బాయ్.. నేడు రెండు AI స్టార్టప్స్కు ఫౌండర్!
ఎక్కడో మారు మూలగ్రామంలో పుట్టిన ఒక సాధారణ యువకుడు రెండు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టార్టప్ల అధినేతగా ఎదగడం అంటే మాటలు కాదు. ఈ సక్సెస్ వెనుక ఎంతో కఠోర శ్రమ, అంతకుమించిన పట్టుదల చాలా అవసరమని, జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను దాటుకుంటూ ముందుకు సాగాలే కానీ, అనుకోని విజయాలను అందుకోవచ్చని 28 ఏళ్ల సూరజ్ బిస్వాస్ (Suraj Biswas) స్ఫూర్తిదాయకమైన కథ ద్వారా మనకు అవగతమవుతుంది.భారతదేశంలోని అందరికీ ఒకే విధానం అనే విద్యా వ్యవస్థపై తనకున్న తీవ్ర నిరాశే 2021లో తన స్టార్టప్ను నిర్మించడానికి ఎలా ప్రేరణగా నిలిచింది అంటారు. సూరజ్. జీవనోపాధి కోసం జొమాటో రైడర్గా షిఫ్టులు చేస్తూ, తన భారీ టెక్ ఆశయాలను సమతుల్యం చేసుకుంటూ, ఒక డెలివరీ బాయ్ని సీరియస్గా తీసుకోడానికి నిరాకరించిన పెట్టుబడిదారుల ముందు ఈ రోజు టెక్ వ్యవస్థాపకుడిగా సగర్వంగి నిలబడ్డాడు. పశ్చిమ బెంగాల్లోని నాదియా జిల్లాకు చెందిన చక్దహా అనే ఒక చిన్న పట్టణంలో సూరజ్ జన్మించారు. సాధారణంగా స్టార్టప్ వ్యవస్థాపకులు పుట్టుకొచ్చే మేజర్ సిటీలు లేదా నేపథ్యం తనది కాదని ఆయన గర్వంగా చెబుతారు. కోల్కతాలోని గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఆయన జెనెటిక్స్ (Genetics) లో బీఎస్సీ పూర్తి చేశారు. చిన్నప్పుడు డాక్టర్ కావాలనేది ఆయన కల, కానీ పరిస్థితుల ప్రభావంతో ఆ దారి మారింది. డిగ్రీ పూర్తయ్యాక, తన తదుపరి లక్ష్యం ఏమిటో ఆలోచించుకునే లోపు ఆర్థిక అవసరాల కోసం జొమాటోలో డెలివరీ బాయ్గా చేరారు.అదే పునాది నగరమంతా తిరుగుతూ ఆహారాన్ని డెలివరీ చేస్తున్న సమయంలోనే ఆయనలో ఒక ఆలోచన మొదలైంది. ప్రస్తుతం ఉన్న విద్యావ్యవస్థను గమనించినప్పుడు, వేర్వేరు సామర్థ్యాలు ఉన్న విద్యార్థులందరినీ ఒకే పద్ధతిలో చదవమని ఎలా ఒత్తిడి చేస్తారనే ప్రశ్న ఆయనలో తలెత్తింది. "వ్యవస్థ ప్రతి మనిషిని ఒకేలా చూస్తోంది. అందరికీ ఒకే కొలత (One size fits all) అన్నట్టుగా ఉంది. కానీ ఈ ప్రపంచంలో ఇద్దరు మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు," అంటారు సూరజ్.ఈ ఆలోచన విద్యావ్యవస్థ నుండి టెక్నాలజీ వైపు మళ్లింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన AI టెక్నాలజీ, మనుషుల నమూనాలను గుర్తిస్తుందే తప్ప ప్రతి ఒక్క వ్యక్తి ప్రత్యేకతను, వారి జీవక్రియలను ఎందుకు అర్థం చేసుకోలేకపోతోంది? అనే ప్రశ్న ఆయన మెదడులో రేగింది. దీనికి పరిష్కారంగానే 2021లో ఎలాంటి పెట్టుబడిదారులు ఆఫీస్ లేదా భాగస్వాములు, లేకుండానే 'అసెస్లీ' (Assessli) అనే స్టార్టప్ను స్థాపించారు. ఆ తర్వాత 'డాట్స్-ఇన్' (Dots-in) అనే మరో సంస్థను కూడా ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన ఈ రెండు కంపెనీలకు వ్యవస్థాపకుడిగా , సీఈఓగా వ్యవహరిస్తున్నారు.ఎన్నో సవాళ్లుతన ఆలోచనను వ్యాపారంగా మార్చడం అంత సులువు కాలేదంటారు సూరజ్. ఒక చిన్న పట్టణం నుండి వచ్చి, పెద్దగా గుర్తింపు లేని కాలేజీలో చదివి, బైక్పై ఫుడ్ డెలివరీ చేసే వ్యక్తి చెప్పే ఐడియాలను మొదట్లో ఎవ్వరూ నమ్మలేదు, సీరియస్గా తీసుకోలేదు. దీనికి తోడు ఏఐ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి సంవత్సరాల పరిశోధన, మౌలిక వసతులు అవసరం. తక్షణ లాభాల కోసం ఆశపడకుండా మార్కెట్లో గుర్తింపు వచ్చే వరకు పట్టుదలతో నిలబడటం పెద్ద సవాలుగా మారింది.కోలుకోలేని విషాదంతన స్టార్టప్ కల సాకారమవుతున్న సమయంలోనే సూరజ్ జీవితంలో ఒక పెద్ద విషాదం చోటుచేసుకుంది. ఇళ్లల్లో రంగులు వేసే (House Painter) ఆయన తండ్రి, తన కొడుకు భవిష్యత్తు కోసం జీవితాంతం కష్టపడ్డారు. ఐఎస్ఐ కోల్కతా (ISI Kolkata) గ్రాంట్ ఫార్మాలిటీస్ పూర్తయిన రెండు రోజులకే, అంటే 2024,జనవరిలో ఆయన కన్నుమూశారు. ఆయన త్యాగానికి ప్రతిఫలంగా తాను అందుకున్న విజయాన్ని తండ్రికి చూపించ లేకపోయాననే బాధ సూరజ్ను తీవ్రంగా కలిచివేసింది. ఇందుకోసం తన తల్లిదండ్రుల విజయాన్ని చూడలేకపోయిన ప్రతీ బిడ్డ కోసం 'ఇన్డాట్స్' (Indots) అనే ఒక సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు.అలా తండ్రి రుణం తీర్చుకున్నట్టుగా భావిస్తున్నారు.ఇదీ చదవండి: ఉద్యోగం Vs సంసారం : సింగిల్ మదర్ సునీత సక్సెస్ స్టోరీలక్ష్యాలను సాధించడానికి సరైన సమయం కోసం వేచి చూడకండి. విజయం అనేది కేవలం ప్రతిభపైనే ఆధారపడి ఉండదు, సవాళ్లను ఎదుర్కొంటూ, భయాన్ని వీడి ముందుకు సాగేతత్వంలో ఉంటుంది. మనం ఎక్కడ పుట్టామనేది దాన్ని బట్టి భవిష్యత్తును నిర్ణయించలేం. చిన్న గ్రామంనుంచి వచఇచనా, బైక్పై ఫుడ్ డెలివరీ చేసినా, అవేవీ తన ఎదుగుదలను ఆపలేక పోయాయి. పట్టుదలగా సాగితే ఆకాశమే హద్దు అంటారు సూరజ్ బిశ్వాస్. ‘‘నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను. నేను జీవశాస్త్రం వైపు, శరీరం ఎలా పనిచేస్తుంది, మనసు ఎలా పనిచేస్తుంది అనే విషయాలను అర్థం చేసుకోవడం వైపు ఆకర్షితుడయ్యాను. కానీ విచిత్రంగా, ఎల్బిఎం (LBM) అనేది ఆ కల అత్యంత ఉన్నతమైన రూపంగా మారింది. నేను ఎప్పుడూ డాక్టర్ కాలేను, కానీ ఆరోగ్యం, ప్రవర్తన, మానవ సామర్థ్యాన్ని మానవాళి అర్థం చేసుకునే విధానాన్ని పెద్ద ఎత్తున మార్చగల విజ్ఞానాన్ని నిర్మిస్తున్నాను.” అని గర్వంగా చెబుతారు.ఇదీ చదవండి: Citizenship16 పత్రాలిచ్చినా; సిటిజెన్షిప్పై గౌహతి కోర్టు సంచలన తీర్పు -
ఆ దేశంలో మాదిరి అయితే.. లీవ్లు కష్టమే!
ఐరోపాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీని తిరిగి వృద్ధి బాట పట్టించేందుకు ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం 34 అంశాలతో కూడిన భారీ సంస్కరణల ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో ఉద్యోగుల అనారోగ్య సెలవులపై కఠిన నిబంధనలు, మధ్యతరగతి కుటుంబాలకు పన్ను రాయితీలు, పెన్షన్ వ్యవస్థలో మార్పులు, బ్యూరోక్రసీ తగ్గింపు వంటి కీలక నిర్ణయాలు ఉన్నాయి. ఈ ప్రతిపాదనలను ఈ ఏడాది చివరికల్లా పార్లమెంట్లో ఆమోదింపజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఇక నుంచి డాక్టర్ సర్టిఫికెట్ తప్పనిసరిప్రస్తుతం జర్మనీలో ఉద్యోగులు కొన్ని సందర్భాల్లో తొలి మూడు రోజుల వరకు డాక్టర్ను ప్రత్యక్షంగా కలవకుండానే అనారోగ్య సెలవు పొందే అవకాశం ఉంది. కొత్త సంస్కరణల ప్రకారం, ఉద్యోగి మొదటి రోజు నుంచే వైద్యుడి ధ్రువీకరణ పత్రం (మెడికల్ సర్టిఫికెట్) సమర్పించాలని యజమాని కోరే హక్కు ఉంటుంది. అలాగే ఫోన్ ద్వారా అనారోగ్య సెలవు ధ్రువీకరణ పొందే విధానానికీ ముగింపు పలకనున్నారు. దేశంలో అనారోగ్య సెలవుల రేటు అసాధారణంగా పెరగడం ఉత్పాదకతను దెబ్బతీస్తోందని మెర్జ్ ప్రభుత్వం వాదిస్తోంది.మధ్యతరగతికి పన్ను ఊరటసంస్కరణల్లో భాగంగా తక్కువ, మధ్య ఆదాయ కుటుంబాలకు ఆదాయపు పన్నులో భారీ ఉపశమనం కల్పించనున్నారు. 2028 నాటికి పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత, ఇద్దరు పిల్లలు ఉన్న, ఏడాదికి 60 వేల యూరోలు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఉన్న కుటుంబానికి సుమారు 600 యూరోలు పన్ను ఆదా అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. మొత్తం మీద సంవత్సరానికి సుమారు 10 బిలియన్ యూరోల పన్ను ఉపశమనం కల్పించనున్నట్లు వెల్లడించింది.పెన్షన్ వ్యవస్థలో కీలక మార్పులువృద్ధాప్య జనాభా పెరుగుతున్న నేపథ్యంలో పెన్షన్ వ్యవస్థను దీర్ఘకాలికంగా నిలబెట్టేందుకు పదవీ విరమణ వయస్సును ఆయుర్దాయానికి అనుగుణంగా దశలవారీగా పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం ముందుకు తెచ్చింది. దీంతో భవిష్యత్తులో ఉద్యోగులు చెల్లించే పెన్షన్ చందాలపై అధిక భారం పడకుండా చూడడమే లక్ష్యమని తెలిపింది.రెడ్టేప్కు కత్తెరవ్యాపారాలకు అడ్డంకిగా మారిన అనవసర అనుమతులు, రిపోర్టింగ్ నిబంధనలు, డాక్యుమెంటేషన్ ప్రక్రియలను సరళీకృతం చేయనున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో డిజిటలైజేషన్కు ప్రాధాన్యం ఇస్తూ పరిపాలనా వ్యయాన్ని తగ్గించే చర్యలకూ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.ఎందుకు ఈ సంస్కరణలు?గత రెండేళ్ల ఆర్థిక మందగమనం, అధిక ఇంధన ధరలు, చైనా కంపెనీల పోటీ, తగ్గిన ప్రైవేట్ పెట్టుబడులు, వృద్ధాప్య జనాభా, అంతర్జాతీయ వాణిజ్య ఒత్తిళ్ల నేపథ్యంలో జర్మనీ ఆర్థిక వ్యవస్థ సవాళ్లు ఎదుర్కొంటోంది. 2026లో కేవలం 0.5 శాతం వృద్ధినే ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సంస్కరణలు తీసుకొచ్చినట్లు మెర్జ్ పేర్కొన్నారు. -
మెటా కలలు కల్లలైన వేళ
కృత్రిమ మేధ సాంకేతికతలో అగ్రగామిగా నిలవాలని భావించిన సోషల్ మీడియా దిగ్గజం మెటాకు భారీ షాక్ తగిలింది. వేలాది మంది ఉద్యోగుల తొలగింపు, అంతర్గత పునర్నిర్మాణం తర్వాత కూడా తాము ఆశించిన స్థాయిలో ఏఐ ఏజెంట్ల అభివృద్ధి సాగడం లేదని మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ బహిరంగంగానే అంగీకరించారు. సంస్థలో జరిగిన భారీ మార్పులు ఆశించినంత సాఫీగా సాగలేదని, ఏఐ ఏజెంట్ల అభివృద్ధి పథం గత నాలుగు నెలలుగా నెమ్మదించిందని ఆయన అంతర్గత సంభాషణల్లో పేర్కొనడం ఇప్పుడు సిలికాన్ వ్యాలీలో చర్చనీయాంశంగా మారింది.ఏఐ కోసం భారీ కోతలు.. అయినా తప్పని నిరాశకంపెనీని పూర్తిగా ఏఐ కేంద్రీకృత సంస్థగా మార్చాలనే పట్టుదలతో మెటా ఇటీవల తన గ్లోబల్ వర్క్ఫోర్స్లో దాదాపు 10 శాతం (సుమారు 8,000 మంది) ఉద్యోగులపై వేటు వేసింది. అలాగే గతంలో భర్తీ చేయాలనుకున్న 6,000 ఖాళీలను రద్దు చేసింది. మరోవైపు, సుమారు 7,000 మంది ఉద్యోగులను కొత్త ఏఐ బృందాల్లోకి మార్చింది. ఇంతటి భారీ మార్పులు చేసినప్పటికీ ఫలితాలు మాత్రం ఆశాజనకంగా లేవని జుకర్బర్గ్ వ్యాఖ్యానించారు.రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ‘కనీసం నాలుగు నెలలుగా ఏజెంటిక్ డెవలప్మెంట్ మేము ఊహించిన విధంగా వేగవంతం కాలేదు’ అని జుకర్బర్గ్ పేర్కొన్నారు. వినియోగదారుల తరఫున స్వయంగా పనులు చేయగల అధునాతన సాధనాలనే ఏఐ ఏజెంట్లు అంటారు. వీటి అభివృద్ధి మందగించడం మెటా వ్యూహాలకు పెద్ద అడ్డంకిగా మారింది.అసంతృప్తిలో ఉద్యోగులుఏఐ మౌలిక సదుపాయాల కోసం మెటా ఈ ఏడాది ఏకంగా 145 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేయాలని అంచనా వేసింది. మరెక్కడా లేని విధంగా నిధులను ఏఐ వైపు మళ్లిస్తున్నప్పటికీ అంతర్గత పునర్నిర్మాణం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. ఈ ఏడాది మార్చిలో అప్లైడ్ ఏఐ విభాగాన్ని ఏర్పాటు చేసి ఇతర విభాగాల నుంచి 6,500 మంది ఇంజినీర్లు, ప్రొడక్ట్ మేనేజర్లను ఇందులోకి మార్చారు. అయితే, ఈ ఆకస్మిక మార్పులపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.ఇదీ చదవండి: బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ తప్పులు చేయకండి! -
ఆడిట్ కమిటీలో ఎండీ సభ్యుడిగా ఉంటే ఏం జరగొచ్చు!
కార్పొరేట్ రంగంలో పారదర్శకతకు, సమర్థవంతమైన నిర్వహణకు ఆడిట్ కమిటీ (ఏసీ) కీలకం. కంపెనీల చట్టం, సెబీ నిబంధనల ప్రకారం ఆడిట్ కమిటీలో మెజారిటీ సభ్యులు స్వతంత్ర డైరెక్టర్లు అయి ఉండాలి. అలాగే కమిటీ చైర్మన్ తప్పనిసరిగా స్వతంత్ర డైరెక్టరే కావాలి. ఆయనకు ఆర్థిక విషయాలపై పూర్తి అవగాహన ఉండాలి (చార్టర్డ్ అకౌంటెంట్ కానవసరం లేదు). అయితే, కమిటీలోని మిగిలిన సభ్యులుగా ఎవరిని నియమించాలనే విషయమై భిన్నమైన పద్ధతులు వాడుకలో ఉన్నాయి. కొందరు నాన్-ఎగ్జిక్యూటివ్ నాన్-ఇండిపెండెంట్ డైరెక్టర్లను నియమిస్తే, మరికొందరు మేనేజింగ్ డైరెక్టర్ లేదా హోల్-టైమ్ డైరెక్టర్లను సభ్యులుగా ఉంచుతారు. ఇంకొన్ని కంపెనీలు కేవలం స్వతంత్ర డైరెక్టర్లతోనే కమిటీని ఏర్పాటు చేస్తాయి.ఈ నేపథ్యంలో ఆడిట్ కమిటీలో కంపెనీ ఎండీ సభ్యుడిగా ఉండటం మంచిదా? లేదా కేవలం ఆహ్వానితుడిగా (ఇన్వైటీ) ఉండటం శ్రేయస్కరమా? అనే అంశంపై కార్పొరేట్ విశ్లేషకుల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. దీనికి సంబంధించిన అంశాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.సభ్యుడిగా ఎండీ: ప్రయోజనాలు - సవాళ్లుకంపెనీల చట్టం ప్రకారం ఎండీ అనే వ్యక్తి కేవలం ఒక డైరెక్టర్ మాత్రమే కాదు, సంస్థ రోజువారీ నిర్వహణ బాధ్యతలను భుజాన వేసుకునే కీలక వ్యక్తి. ఆయనను ఆడిట్ కమిటీలో సభ్యుడిగా చేర్చడం వల్ల కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఎదురవుతాయి.ఆడిట్ కమిటీ ఎజెండాలోని చాలా అంశాలకు ఎండీ లేదా సీఎఫ్ఓ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎండీ స్వయంగా సభ్యుడిగా ఉంటే చర్చలు వేగంగా సాగుతాయి.కంపెనీ ఆర్థిక నివేదికలపై ఎండీ సంతకం చేస్తారు. ఇన్వెస్టర్లు, అనలిస్టుల సమావేశాలను ఆయనే నడిపిస్తారు. అలాంటప్పుడు ఆడిట్ కమిటీలో సభ్యుడిగా కూర్చున్నప్పుడు ప్రయోజనాల ఘర్షణ వచ్చే అవకాశం ఉంది.ఉదాహరణకు: ఏదైనా ఆస్తి విలువ తగ్గింపు విషయంలో స్టాట్యూటరీ ఆడిటర్లు, స్వతంత్ర డైరెక్టర్లు ఏకీభవించారనుకుందాం. కానీ ఎండీ మాత్రం వ్యాపార దృక్పథంతో అది అవసరం లేదని భావిస్తే.. సభ్యుడిగా ఆయన తన అభ్యంతరాన్ని ఎలా రికార్డు చేస్తారు? అక్కడ మెజారిటీ నిర్ణయమే చెల్లినప్పటికీ సభ్యుడిగా ఉన్న ఎండీకి అది కొంత ఇబ్బందికరమైన పరిస్థితే.ఆహ్వానితుడిగా (ఇన్వైటీ) ఉంటే కలిగే వెసులుబాటుఎండీ సభ్యుడిగా కాకుండా కేవలం ఆహ్వానితుడిగా కమిటీ సమావేశాలకు హాజరైతే సమీక్షలు మరింత పారదర్శకంగా సాగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఎండీ కేవలం ఆహ్వానితుడిగా ఉన్నప్పుడు ఆడిటర్లు ఎలాంటి సంకోచం లేకుండా సంస్థలోని లోటుపాట్లను, గ్రే-ఏరియాలను (సందేహాస్పద అంశాలను) కమిటీ ముందు ఉంచగలరు.ఆహ్వానితుడిగా ఎండీ తన పరిధిలోని అంశాలపై స్పష్టమైన వివరణ ఇవ్వడానికి కట్టుబడి ఉంటారు. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం.. చాలా లిస్టెడ్ కంపెనీలు సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగులను కేవలం ఆహ్వానితులుగా పిలుస్తూ ఎజెండా ప్రకారం వారి నుంచి సమాధానాలు రాబట్టే పద్ధతిని పాటిస్తున్నాయి.కొన్ని ప్రముఖ లిస్టెడ్ కంపెనీల్లో నిర్వహించిన సర్వే ప్రకారం.. మెజారిటీ సంస్థలు ఎండీని ఆడిట్ కమిటీలో సభ్యుడిగా కాకుండా ఆహ్వానితుడిగా ఉంచడానికే మొగ్గు చూపుతున్నాయి. ఇది చర్చలు నిష్పాక్షికంగా సాగడానికి దోహదపడుతుందని తేలింది.ఇదీ చదవండి: బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ తప్పులు చేయకండి! -
హైదరాబాద్ కంపెనీ రూ.1,300 కోట్ల డీల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆస్ట్రేలియాలోని ప్రముఖ ఫార్మసీ చెయిన్కి ఔషధాలు సరఫరా చేసే దిశగా తమ అనుబంధ సంస్థ నూమెడ్ ఫార్మా ఒప్పందాన్ని పునరుద్ధరించుకున్నట్లు సాయి పేరెంటరల్స్ వెల్లడించింది. ఈ డీల్ విలువ సుమారు రూ. 1,300 కోట్లు ఉంటుందని తెలిపింది.ఏడున్నరేళ్ల వ్యవధికి ఇది వర్తిస్తుందని, మరో మూడేళ్లు పొడిగించుకునే వీలుంటుందని వెల్లడించింది. ఏటా 12 కొత్త ప్రోడక్టులు జత అవుతుండటం వల్ల కాంట్రాక్టు విలువ, పరిధి పెరుగుతుందని వివరించింది. అంతర్జాతీయంగా ఫార్మా కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ఇది ఉపయోగపడుతుందని సాయి పేరెంటరల్స్ ఎండీ అనిల్ కుమార్ కరుసాల తెలిపారు. -
పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు (OMCs) తీవ్ర ఆర్థిక భారం ఎదుర్కొన్నాయి. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీని వినియోగదారులకు తక్కువ ధరలకు విక్రయించడం వల్ల జూన్ 30 నాటికి ఆయా చమురు మార్కెటింగ్ సంస్థలకు మొత్తం రూ.74,781 కోట్ల నష్టం వాటిల్లిందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు.మీడియాతో మాట్లాడిన ఆయన, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఇటీవల తగ్గుముఖం పట్టినా, ప్రస్తుతం రిఫైనరీల్లో ప్రాసెస్ చేస్తున్న చమురు రెండు నెలల క్రితం అధిక ధరలకు కొనుగోలు చేసినదేనని వివరించారు. సాధారణంగా చమురు సంస్థలు కనీసం రెండు నెలల ముందుగానే క్రూడ్ ఆయిల్ను కొనుగోలు చేస్తాయని, ప్రస్తుతం వినియోగంలో ఉన్న నిల్వలు ఏప్రిల్–మే నెలల్లో ధరలు అత్యధికంగా ఉన్న సమయంలో సేకరించినవేనని చెప్పారు.ఇదీ చదవండి: ఈవీ ఛార్జింగ్కు సగం ఇళ్లు సిద్ధంగా లేవు!పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై స్పందించిన మంత్రి, ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు మరికొన్ని వారాలు స్థిరంగా తక్కువ స్థాయిలో కొనసాగితేనే ధరల సమీక్షపై ఆలోచించవచ్చని స్పష్టం చేశారు. ప్రస్తుతం చమురు ధరలు తగ్గినా, పాత అధిక ధరల నిల్వలు పూర్తిగా వినియోగమైన తర్వాతే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సంకేతమిచ్చారు.భారత్లో పరిమిత పెరుగుదలే..పశ్చిమాసియా సంక్షోభం సమయంలో అభివృద్ధి చెందిన దేశాల్లో పెట్రోల్ ధరలు సగటున సుమారు 20 శాతం, భారత్కు పొరుగు దేశాల్లో దాదాపు 35 శాతం వరకు పెరిగాయని పూరి తెలిపారు. అయితే భారతదేశంలో పెట్రోల్ ధరల పెరుగుదల కేవలం 5.58 శాతానికి మాత్రమే పరిమితమైందని, అదనపు భారాన్ని చమురు సంస్థలే భరించాయని పేర్కొన్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 1.07 లక్షల ఇంధన విక్రయ కేంద్రాల్లో ఎక్కడా సరఫరా అంతరాయం లేకుండా ఇంధనం అందించగలిగామని చెప్పారు.నయారా ధరల తగ్గింపుపై వివరణప్రైవేట్ ఇంధన విక్రయ సంస్థ నయారా ఎనర్జీ జూలై 1 నుంచి పెట్రోల్పై లీటరుకు రూ.5, డీజిల్పై రూ.3 తగ్గించడం గురించి కూడా మంత్రి స్పందించారు. సంక్షోభ సమయంలో నయారా తన ధరలను ముందుగానే పెంచిందని, ఇప్పుడు ఆ పెంపును మాత్రమే వెనక్కి తీసుకుందని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఆ సమయంలో వినియోగదారులపై పూర్తి భారం మోపకుండా ధరలను నియంత్రించాయని ఆయన పేర్కొన్నారు.చమురు ధరలే కీలకంఇరాన్కు సంబంధించిన ఉద్రిక్తతల సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్కు 110 డాలర్లకు పైగా చేరడంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు భారీ అండర్రికవరీని భరించాల్సి వచ్చింది. అనంతరం అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు సడలడంతో జూన్ ద్వితీయార్ధం నుంచి ముడి చమురు ధరలు తగ్గడం ప్రారంభమైంది. అయితే ఈ తగ్గుదల ప్రభావం దేశీయ ఇంధన ధరల్లోనూ ప్రతిబింబించాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని చమురు రంగ వర్గాలు భావిస్తున్నాయి.ఇది చదివారా? పొల్యూషన్ సర్టిఫికెట్పై వాహనదారులకు ఊరట! -
టాటా సన్స్ లిస్టింగ్పై తేలని ఉత్కంఠ
టాటా గ్రూప్ హోల్డింగ్ సంస్థ ‘టాటా సన్స్’ ఐపీఓ మార్కెట్లోకి రావాలా వద్దా అనే అంశంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తుది నిర్ణయం తీసుకోనుంది. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (CoR) సరెండర్ దరఖాస్తులపై కేంద్ర బ్యాంక్ స్పష్టత ఇచ్చింది. కేవలం పత్రాలు సమర్పించినంత మాత్రాన ఎన్బీఎఫ్సీల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ స్వయంచాలకంగా రద్దు కాదని, ఆ రద్దు దరఖాస్తును ఆమోదించే లేదా తిరస్కరించే పూర్తి హక్కు తమకు ఉందని ఆర్బీఐ స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో, టాటా సన్స్ దాఖలు చేసిన ‘కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ’ (సీఐసీ) లైసెన్స్ సరెండర్ దరఖాస్తుపై ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒకవేళ ఆర్బీఐ ఈ దరఖాస్తును ఆమోదించే వరకు టాటా సన్స్పై స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అవ్వాలనే నిబంధనలు యథాతథంగా అమలులో ఉంటాయి.‘పరోక్ష నిధుల స్వీకరణ’పై కొత్త సర్క్యులర్ప్రభుత్వ నిధులను పరోక్షంగా స్వీకరించడంపై నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ ఆర్బీఐ మరో కీలక సర్క్యులర్ను జారీ చేసింది. దీని ప్రకారం.. ప్రభుత్వ నిధులకు ప్రత్యక్షంగా యాక్సెస్ లేకుండా ప్రభుత్వ నిధులు పొందే అసోసియేట్లు లేదా గ్రూప్ సంస్థల ద్వారా నిధులు అందుకుంటే దాన్ని 'పరోక్ష నిధుల స్వీకరణ'గా పరిగణిస్తారు.సెంట్రల్ బ్యాంక్ మొదట ఏప్రిల్ 29 నాటి సర్క్యులర్లో ఈ నిబంధనను చేర్చింది. అయితే జూన్ 24న ఎన్బీఎఫ్సీల కోసం విడుదల చేసిన మార్గదర్శకాల్లో ‘నిధులకు పరోక్ష అవకాశం’ను స్పష్టంగా నిర్వచించలేదు. కాబట్టి, ఏప్రిల్ 29 నాటి నిర్వచనాన్ని పునరుద్ఘాటించేందుకే ఆర్బీఐ జూన్ 30న తాజా నోటిఫికేషన్ను జారీ చేసినట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈ కొత్త మార్గదర్శకాలు జులై 1 నుంచి అమల్లోకి వచ్చాయి.టాటా సన్స్కే ఎందుకీ సమస్య?టాటా సన్స్ 2024లోనే తనకున్న అన్ని అప్పులను పూర్తిగా తిరిగి చెల్లించింది. టాటా మోటార్స్, టాటా స్టీల్ వంటి కొన్ని ప్రముఖ లిస్టెడ్ సంస్థలకు టాటా సన్స్లో వాటాలు ఉన్నాయి. ఈ గ్రూప్ సంస్థల ద్వారా టాటా సన్స్కు నిధులకు పరోక్ష అవకాశం ఉన్నందున, కేంద్ర బ్యాంక్ దీనిని ‘కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ’గానే పరిగణిస్తోంది.లిస్టింగ్ వివాదం నేపథ్యంఆర్బీఐ 2022లో ‘అప్పర్ లేయర్’ ఎన్బీఎఫ్సీల జాబితాను విడుదల చేస్తూ వారు మూడేళ్ల వ్యవధిలో (సెప్టెంబర్ 2025 నాటికి) స్టాక్ మార్కెట్లో తప్పనిసరిగా లిస్ట్ కావాలని గడువు విధించింది. ఈ లిస్టింగ్ నిబంధనల నుంచి మినహాయింపు పొందడానికి టాటా సన్స్ 2024లో తన సీఓఆర్ను సరెండర్ చేయడానికి దరఖాస్తు చేసుకుంది. గత వారం ఆర్బీఐ విడుదల చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం.. రూ.1 లక్ష కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఆస్తి పరిమాణం ఉన్న ఏ ఎన్బీఎఫ్సీ అయినా అప్పర్ లేయర్ విభాగంలోకే వస్తుందని పునరుద్ఘాటించింది.టాటా సన్స్ ఆస్తి పరిమాణం నిర్దేశిత పరిమితి కంటే చాలా ఎక్కువగా ఉండటం, పైగా పరోక్ష నిధుల స్వీకరణ నిర్వచనం పరిధిలోకి వస్తుండటంతో.. ఆర్బీఐ ఆ సంస్థ లైసెన్స్ సరెండర్ దరఖాస్తును ఆమోదిస్తుందా లేదా తిరస్కరించి లిస్టింగ్కు ఆదేశిస్తుందా అనేది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఒకవేళ ఆర్బీఐ దరఖాస్తును తిరస్కరిస్తే టాటా సన్స్ దేశీయ స్టాక్ మార్కెట్లలో మెగా ఐపీఓగా రావాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు యూటర్న్! -
‘నేనేం స్కూల్ స్టూడెంట్ని కాదు సార్’
ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో మేనేజర్లు, ఉద్యోగుల మధ్య సంబంధాలు ఏ స్థాయికి చేరుకున్నాయో అద్దం పట్టే సంఘటన ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అనారోగ్య సెలవు (సిక్ లీవ్) అడిగినందుకు సదరు ఉద్యోగిని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ డిమాండ్ చేసిన బాస్కు ఒక జెన్ జీ ఉద్యోగి ఇచ్చిన సమాధానం ఇప్పుడు ఆన్లైన్లో చర్చకు దారితీసింది.అసలేం జరిగిందంటే..?ఎక్స్ వేదికగా వైరల్ అవుతున్న ఒక వాట్సాప్ చాట్ స్క్రీన్షాట్ ప్రకారం.. ఒక ఉద్యోగి తన మేనేజర్కు మెసేజ్ చేస్తూ, ‘సార్ నహీ ఆ పావంగా, ఫీవర్ బడ్ గయా హై’(సార్.. నేను రాలేను, నాకు జ్వరం ఎక్కువైంది) అని సమాచారం ఇచ్చాడు. దీనికి బాస్ స్పందిస్తూ, ‘చలో డాక్టర్ కే పాస్ చల్తే హై’(డాక్టర్ వద్దకు వెళ్తున్నావా) అని బదులిచ్చాడు. ప్రస్తుతానికి తాను ట్యాబ్లెట్ వేసుకుని విశ్రాంతి తీసుకుంటున్నానని, అవసరమైతేనే డాక్టర్ వద్దకు వెళ్తానని ఉద్యోగి స్పష్టం చేశాడు. అయితే, అంతటితో ఆ సంభాషణ ముగియలేదు.‘డైరెక్టర్ సర్ నే కహా హై జో భీ బిమార్ హో ఉస్సే డాక్టర్ కి ప్రిస్క్రిప్షన్ లో’(అనారోగ్యంతో సెలవు అడిగే ప్రతి ఒక్కరి నుంచి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ సేకరించాలని డైరెక్టర్ గారు ఆదేశించారు) అంటూ మేనేజర్ ఒత్తిడి తెచ్చాడు.మేనేజర్ మాటలకు సదరు జెన్ జీ ఉద్యోగి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఘాటుగా సమాధానమిచ్చాడు. ‘మై స్కూల్ స్టూడెంట్ నహీ హూన్ సర్. లీవ్ రెహ్తీ హై, లీవ్ మై’ (నేను స్కూల్ స్టూడెంట్ని కాదు సార్. నాకు సెలవు అందుబాటులో ఉంది, అందుకే తీసుకుంటున్నాను) అని తేల్చిచెప్పాడు. అంతటితో ఆగకుండా ఒకవేళ ప్రిస్క్రిప్షన్ అంత తప్పనిసరి అయితే, కంపెనీ డైరెక్టరే స్వయంగా డాక్టర్ కాబట్టి తన పేరు మీద ఆయన్నే ఒక ప్రిస్క్రిప్షన్ రాసుకోమనాలని సూచించాడు. అంతేకాకుండా, తన తల్లిదండ్రులు సంతకం చేసిన లీవ్ లెటర్లు తన వద్ద లేవని, ప్రస్తుతానికి తాను విశ్రాంతి తీసుకుంటున్నందున ఇకపై వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్లకు స్పందించనని చాటింగ్ను ముగించాడు.నెటిజన్ల స్పందనఈ స్క్రీన్షాట్ సోషల్ మీడియాలో షేర్ అయిన కొద్దిసేపట్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించింది. ‘భారతీయ మేనేజర్లు తమ కింద పనిచేసేవారిని ఉద్యోగులుగా కాకుండా, బానిసలుగా భావిస్తారు. జెన్ జీ ఉద్యోగి ఇచ్చిన ప్రతిస్పందన అద్భుతం’ అంటూ కొందరు సదరు యువకుడికి మద్దతుగా నిలిచారు. కంపెనీలు ఉద్యోగులకు వార్షిక సెలవులు కేటాయించినప్పుడు, ఒక రోజు అనారోగ్య సెలవు కోసం కూడా మెడికల్ సర్టిఫికెట్లు అడగడం వారిపై నమ్మకం లేకపోవడాన్ని సూచిస్తుందని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: బెంగళూరు ఐటీ కారిడార్లో ఘోరం -
బెంగళూరు ఐటీ కారిడార్లో ఘోరం
ఐటీ ఉద్యోగుల పిల్లల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన డేకేర్ సెంటర్లో అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఐటీ రాజధాని బెంగళూరులో కలకలం రేపింది. ప్రముఖ ఐటీ దిగ్గజం క్యాప్జెమిని బెంగళూరు క్యాంపస్లోని డేకేర్ సెంటర్లో రెండు నుంచి మూడేళ్ల వయసున్న పసిబిడ్డలను తీవ్రంగా వేధించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో లీక్ కావడంతో ఐటీ వర్గాలతో పాటు ప్రజల్లో చర్చకు దారితీసింది.బాత్రూమ్లో బంధించి..జిల్లా పిల్లల సంరక్షణ యూనిట్ (డీసీపీయూ) అధికారి తిలకేష్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లోని అంశాలు కీలక విషయాలు వెల్లడించాయి. అందులోని వివరాల ప్రకారం.. పిల్లలు ఏడుస్తున్న సమయంలో సంరక్షకులు వారిని ఓదార్చాల్సింది పోయి శారీరకంగా బెదిరింపులకు గురిచేశారు. తల్లి పాలు కూడా మరువని పసిబిడ్డల నోటిలో బలవంతంగా నీరు పోశారు. వెస్ట్రన్ టాయిలెట్ కమోడ్లపై పిల్లలను బలవంతంగా కూర్చోబెట్టి బాత్రూమ్ లోపల వేసి తాళాలు పెట్టారు. వాట్సాప్లో హల్చల్ చేసిన వీడియోల ప్రకారం.. పిల్లలను భయపెట్టడానికి ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్ లోపల కూడా ఉంచినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.ఐదుగురు మహిళా కేర్టేకర్లపై కేసు నమోదుఈ అమానుష ఘటనపై జూన్ 29న బెంగళూరులోని హెచ్ఏఎల్ పోలీస్ స్టేషన్లో అధికారికంగా కేసు నమోదైంది. జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ) చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు మహిళా సంరక్షకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.స్పందించిన క్యాప్జెమినిఈ ఉదంతంపై తీవ్ర దుమారం రేగడంతో క్యాప్జెమిని యాజమాన్యం తక్షణమే స్పందించింది. జులై 1న కంపెనీ అధికారిక ప్రకటన విడుదల చేస్తూ బ్రూక్ఫీల్డ్ పరిధిలోని హెచ్ఏఎల్ క్యాంపస్లో ఉన్న ఆన్-క్యాంపస్ డేకేర్ సదుపాయాన్ని తాత్కాలికంగా వెంటనే మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ‘క్యాప్జెమిని సంస్థకు తన ఉద్యోగులు, వారి కుటుంబాల ఆరోగ్యం, భద్రత, శ్రేయస్సే అత్యంత ప్రధానం. ఈ ఘటనకు సంబంధించి వాస్తవాలను నిర్ధారించేందుకు దర్యాప్తు జరుపుతున్న అధికారులకు మేము పూర్తిస్థాయిలో సహకరిస్తున్నాం. ముందు జాగ్రత్త చర్యగా బెంగళూరు ఆన్-క్యాంపస్ డేకేర్ సదుపాయాన్ని తక్షణమే తాత్కాలికంగా మూసివేస్తున్నాం’ అని కంపెనీ అధికారిక ప్రతినిధి చెప్పారు.ఇదీ చదవండి: బంగారం ధరలు కూల్ఆఫ్! -
30 ఏళ్లలోపే వ్యాపార సామ్రాజ్యాలు..
భారత స్టార్టప్ ఎకోసిస్టమ్ యువతరం వైపు మరింతగా అడుగులు వేస్తోందని ‘అవెండస్ వెల్త్–హురున్ ఇండియా అండర్30 లిస్ట్ 2026’ (Avendus-Hurun India U30 List 2026 102) స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 30 ఏళ్లలోపు వయస్సున్న 102 మంది యువ పారిశ్రామికవేత్తలు, నవ తరం వ్యాపార వారసులను ఈ జాబితా గుర్తించింది. గత ఏడాది 80 మందితో పోలిస్తే ఈసారి జాబితాలో చోటు దక్కించుకున్న వారి సంఖ్య 28 శాతం పెరగడం విశేషం. ఈ యువ నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థల మొత్తం విలువ సుమారు రూ.2.9 లక్షల కోట్లుగా నమోదైంది. ఈ జాబితా ‘అవెండస్ వెల్త్–హురున్ ఇండియా’ వివిధ వయసు క్యాటగిరీల సిరీస్లో తొలి భాగం కాగా, తరువాత అండర్35, అండర్40 జాబితాలు కూడా విడుదల కానున్నాయి.స్వయం ప్రతిభతో ఎదిగినవారే అధికంఈ ఏడాది జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో 84 శాతం మంది ఫస్ట్ జనరేషన్ ఎంట్రాప్రెన్యూర్లు. కుటుంబ వ్యాపారాల వారసుల కంటే స్వయంగా సంస్థలను ప్రారంభించి విజయవంతం చేసిన యువతే ఎక్కువగా ఉండటం భారత స్టార్టప్ రంగంలో వస్తున్న మార్పుకు నిదర్శనంగా నిలిచింది. జాబితాలో చోటు పొందిన వారి సగటు వయస్సు 28 సంవత్సరాలు కావడం మరో విశేషం.డీప్టెక్, ఏఐ, స్పేస్టెక్ హవాఈసారి జాబితాలో ప్రతి నలుగురిలో ఒకరు డీప్టెక్ లేదా హార్డ్టెక్ రంగాలకు చెందినవారే. మొత్తం 27 మంది ఈ విభాగాల నుంచి ఎంపికయ్యారు. ఇందులో ఏఐ & మెషిన్ లర్నింగ్కు చెందినవారు 8 మంది, ఈవీ & ఆటో కాంపోనెంట్స్ రంగానికి చెందినవారు ఏడుగురు, స్పేస్ టెక్ నుంచి ఆరుగురు, ఏరోస్పేస్ & డిఫెన్స్ నుంచి నలుగురు, సైబర్ సెక్యూరిటీ నుంచి ఇద్దరు ఉన్నారు. ఏఐ ఆధారిత స్టార్టప్ల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే దాదాపు రెట్టింపైంది.20 ఏళ్లకే జాతీయ గుర్తింపుఈ ఏడాది జాబితాలో అత్యంత పిన్న వయస్కులు 20 ఏళ్ల ఒంకార్ సింగ్ బాత్రా (Apolink), ధ్రవ్య షా (Supermemory). వీరిద్దరూ ఒకరు స్పేస్టెక్, మరొకరు ఏఐ రంగాల్లో స్టార్టప్లను నిర్మిస్తున్నారు. గత ఏడాది అత్యంత చిన్న వయస్కులు 22 ఏళ్ల వారు కాగా, ఈసారి ఆ రికార్డు 20 ఏళ్లకు చేరింది.మహిళా పారిశ్రామికవేత్తల ముద్రఈ ఏడాది ఆరుగురు మహిళా పారిశ్రామికవేత్తలు జాబితాలో చోటు సంపాదించారు. అంజలి సర్దానా (Pronto), శ్రేయా మిట్టల్, రియా మిట్టల్ (Cava Athleisure), దేవికా ఘోలాప్ (OptraSCAN), దేవాంశి కేజ్రీవాల్ (Skillmatics), సురమ్యా జైన్ (RAS Luxury Skincare) ఇందులో ఉన్నారు. వీరిలో నలుగురు తొలిసారిగా జాబితాలోకి వచ్చారు.బెంగళూరు అగ్రస్థానంస్టార్టప్ల కేంద్రంగా బెంగళూరు తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఈసారి 21 మంది యువ వ్యాపారవేత్తలు అక్కడి నుంచే ఎంపికయ్యారు. గత ఏడాది ఈ సంఖ్య కేవలం 7 మాత్రమే. అదే సమయంలో మెట్రో నగరాల వెలుపల నుంచి 40 మంది యువ వ్యాపారవేత్తలు ఎంపిక కావడం దేశవ్యాప్తంగా పారిశ్రామిక విస్తరణకు సంకేతంగా నిలిచింది.బిట్స్ పిలానీ మరోసారి టాప్విద్యాసంస్థల పరంగా బిట్స్ పిలానీ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాది ఏడుగురు ఉండగా, ఈసారి ఆ సంస్థ పూర్వ విద్యార్థుల సంఖ్య 11కు పెరిగింది.జెప్టో, భారత్పే ముందంజఅండర్30 జాబితాలోని టాప్-10 సంస్థలు కలిపి 3.5 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు సమీకరించాయి. ఇందులో జెప్టో (Zepto) ఒక్కటే 2.3 బిలియన్ డాలర్లు, భారత్పే(BharatPe) సుమారు 650 మిలియన్ డాలర్లు సమీకరించి అగ్రస్థానాల్లో నిలిచాయి. మొత్తం జాబితాలోని యువ పారిశ్రామికవేత్తలు కలిపి 75 వేల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నారు.లింక్డ్ఇన్లో ఆదిత్ పాలిచా హవాజెప్టో సహవ్యవస్థాపకుడు ఆదిత్ పాలిచాకు లింక్డ్ఇన్లో సుమారు 3.77 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా, అదే ఈ జాబితాలో అత్యధికం. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన వై కాంబినేటర్, గూగుల్ వంటి సంస్థలతో పాటు అనేక ప్రముఖ ఇన్వెస్టర్ల మద్దతు ఈ యువ సంస్థలకు లభించడం విశేషం. పిక్సెల్, జెప్టో, బోల్డ్ కేర్ వంటి స్టార్టప్లు అత్యధిక పెట్టుబడిదారులను ఆకర్షించిన సంస్థలుగా నిలిచాయి.భారత స్టార్టప్ రంగంలో కొత్త ధోరణిఈ ఏడాది నివేదికలో ప్రధానంగా కనిపించిన మార్పు సాఫ్ట్వేర్ ఆధారిత స్టార్టప్ల నుంచి డీప్టెక్, స్పేస్టెక్, ఎలక్ట్రిక్ వాహనాలు, డిఫెన్స్ టెక్నాలజీ వంటి హార్డ్టెక్ రంగాల వైపు యువ వ్యవస్థాపకులు వేగంగా మళ్లడం. దీంతో భారత స్టార్టప్ ఎకోసిస్టమ్ మరింత సాంకేతికత ఆధారిత, ప్రపంచ స్థాయి పోటీకి సిద్ధమవుతోందని నివేదిక విశ్లేషించింది. -
మైక్రోసాఫ్ట్లో మరోసారి ఉద్యోగాల కోత?
ప్రపంచ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోమారు భారీగా ఉద్యోగాల తొలగింపునకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఖర్చులను నియంత్రించడమే లక్ష్యంగా పెట్టుకున్న కంపెనీ, త్వరలోనే కొత్త రౌండ్ లే-ఆఫ్స్ను ప్రకటించవచ్చని ప్రముఖ మీడియా సంస్థ బిజినెస్ ఇన్సైడర్ అంచనా వేసింది. ముఖ్యంగా కంపెనీకి చెందిన ఎక్స్బాక్స్ గేమింగ్ విభాగంతో పాటు సేల్స్, కన్సల్టింగ్ విభాగాల్లోని వేలాది ఉద్యోగాలపై ఈ ప్రభావం పడనుందని పేర్కొంది.గత ఏడాది (2025) మే నెలలో 6,000 మందిని, జులైలో సంస్థ మొత్తం సిబ్బందిలో 4 శాతానికి సమానమైన 9,000 మంది ఉద్యోగులను మైక్రోసాఫ్ట్ తొలగించిన సంగతి తెలిసిందే. అయితే, గత ఏడాదితో పోలిస్తే ఈసారి జరగబోయే కోతలు కొంత తక్కువగానే ఉండవచ్చని సమాచారం. కంపెనీకున్న మొత్తం 2,20,000 మంది ఉద్యోగుల్లో ఈ తాజా లే-ఆఫ్స్ ప్రభావం 2.5% కంటే తక్కువగానే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే నిర్ణయం?సాధారణంగా మైక్రోసాఫ్ట్ తన కొత్త ఆర్థిక సంవత్సరాన్ని జులై 1 నుంచి ప్రారంభిస్తుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే వారం నాటికి ఈ ఉద్యోగాల కోతపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. అయితే, ఈ గడువులో స్వల్ప మార్పులు ఉండవచ్చు. ఈ ప్రక్రియలో ప్రభావితమయ్యే కొంతమంది ఉద్యోగులకు అంతర్గతంగా వెంటనే కొత్త బాధ్యతలను అప్పగించే యోచనలో కూడా కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది.ఏఐపై పెరుగుతున్న ఖర్చుఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతపై మైక్రోసాఫ్ట్ భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఏఐ అప్లికేషన్లు, సాఫ్ట్వేర్ సేవల విస్తరణకు వ్యయం పెరుగుతుండటంతో ఇతర విభాగాల్లో ఖర్చులను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు భవిష్యత్తులో ఏఐ సాఫ్ట్వేర్ సాంకేతికత వల్ల కొన్ని సంప్రదాయ సాఫ్ట్వేర్ సేవల అవసరం తగ్గుతుందనే ఆందోళనలతో అమెరికా స్టాక్ మార్కెట్ నుంచి కంపెనీపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే గత నెలలో మైక్రోసాఫ్ట్ స్టాక్ సుమారు 17 శాతం మేర క్షీణించింది.గేమింగ్ విభాగంలో రీసెట్ వ్యూహంమైక్రోసాఫ్ట్ ఎక్స్బాక్స్ గేమింగ్ విభాగంలో ఈ మార్పులు ఊహించినవేనని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎక్స్బాక్స్ నూతన సీఈఓ ఆశా శర్మ ఇటీవల ఉద్యోగులకు పంపిన అంతర్గత మెమోలో.. వ్యాపారాన్ని సరికొత్తగా రీసెట్ చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ రీస్ట్రక్చరింగ్లో భాగంగానే గేమింగ్ విభాగంలో ఉద్యోగాల కోత విధిస్తున్నట్లు స్పష్టమవుతోంది.స్వచ్ఛంద పదవీ విరమణ అస్త్రంగత ఏడాదితో పోలిస్తే ఈసారి లే-ఆఫ్స్ ప్రభావం తగ్గడానికి కంపెనీ ప్రవేశపెట్టిన స్వచ్ఛంద పదవీ విరమణ కార్యక్రమం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలోనే అమెరికాలోని ఉద్యోగుల కోసం మైక్రోసాఫ్ట్ ఒక ప్రత్యేక బై-అవుట్ ఆఫర్ను ప్రకటించింది. వయస్సు, సర్వీస్ కాలం ఆధారంగా రూపొందించిన ఈ పథకానికి అమెరికాలోని సంస్థ మొత్తం వర్క్ఫోర్స్ (1,25,000 మంది)లో సుమారు 7 శాతం (దాదాపు 9,000 మంది) ఉద్యోగులు అర్హత సాధించారు.కంపెనీ అంచనాలకు అనుగుణంగానే అర్హులైన వారిలో మూడింట ఒక వంతు మంది ఉద్యోగులు ఈ స్వచ్ఛంద విరమణను ఎంచుకున్నారు. ఫలితంగా సంస్థకు సహజంగానే ఉద్యోగుల సంఖ్య తగ్గింది. అయితే, కమీషన్ ఆధారిత వేతనాలు పొందే సేల్స్ ఉద్యోగులకు మాత్రం ఈ వీఆర్ఎస్ ఆఫర్ వర్తించలేదని కంపెనీ అంతర్గత పత్రాల ద్వారా వెల్లడైంది. అందుకే ఇప్పుడు నేరుగా సేల్స్, కన్సల్టింగ్ విభాగాల్లో ఉద్యోగాల తగ్గింపునకు మైక్రోసాఫ్ట్ సిద్ధమవుతోంది.ఇదీ చదవండి: బంగారం ధరలు ఢమాల్! -
మస్క్ హెచ్చరిక.. టిమ్ కుక్ షాక్!
కృత్రిమ మేధస్సు (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. అయితే ఈ సాంకేతిక విప్లవం కొత్త అవకాశాలను మాత్రమే కాదు, కొత్త సవాళ్లను కూడా తీసుకొస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మెమరీ చిప్ల కొరత తీవ్రమవడంతో యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామం వినియోగదారులపై నేరుగా ప్రభావం చూపుతోంది.యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఈ పరిస్థితిని 'వందేళ్లలో ఒకసారి వచ్చే వరద'తో పోల్చారు. గత 40 ఏళ్లలో ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, తాను ఇప్పటివరకు చూసిన వాటిలో ఇదే అతిపెద్ద ధరల పెరుగుదల అని చెప్పారు. దీన్నిబట్టి చూస్తే.. ప్రస్తుతం మెమరీ చిప్ల కొరత ఎంత తీవ్రంగా ఉందో స్పష్టమవుతోంది.ఈ సమస్యకు ప్రధాన కారణం ఏఐ రంగం వేగంగా విస్తరించడం. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు భారీ డేటా సెంటర్ల నిర్మాణానికి వందల బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడం. ఈ డేటా సెంటర్లకు అధిక సామర్థ్యం గల మెమరీ చిప్లు అవసరం అవుతున్నాయి. ఫలితంగా చిప్ తయారీ సంస్థలు తమ ఉత్పత్తిని ఎక్కువగా ఏఐ సర్వర్ల కోసం కేటాయిస్తున్నాయి. దీంతో ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్ఫోన్ల వంటి వినియోగదారుల ఉత్పత్తులకు అవసరమైన మెమరీ చిప్ల సరఫరా తగ్గిపోయింది.ప్రస్తుతం DRAM (యాప్లు పనిచేయడానికి ఉపయోగించే మెమరీ), NAND (ఫొటోలు, వీడియోలు, ఫైళ్లను నిల్వ చేసే స్టోరేజ్ చిప్లు) ధరలు గత ఏడాదితో పోలిస్తే దాదాపు నాలుగు రెట్లు పెరిగాయి. ఈ భారీ ధరల పెరుగుదల కారణంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ వ్యయం కూడా గణనీయంగా పెరిగింది.ఈ పరిస్థితుల్లో యాపిల్ చాలా కాలం వరకు అదనపు ఖర్చును వినియోగదారులపై మోపకుండా భరించింది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి సాధ్యం కాకపోవడంతో కంపెనీ మ్యాక్బుక్, ఐమ్యాక్, ఐప్యాడ్, హోమ్ప్యాడ్, యాపిల్ టీవీ వంటి ఉత్పత్తుల ధరలను 15 నుంచి 25 శాతం వరకు పెంచింది.ఉదాహరణకు, మ్యాక్బుక్ ఎయిర్ ధర 200 డాలర్లు పెరిగి 1,299 డాలర్లకు చేరగా, మ్యాక్బుక్ ప్రో ధర 300 డాలర్లు పెరిగి 1,999 డాలర్లకు చేరింది. అలాగే ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రో ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. మైక్రోసాఫ్ట్ కూడా తన Xbox గేమింగ్ కన్సోళ్ల ధరలను 100 నుంచి 150 డాలర్ల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. అంటే మెమరీ చిప్ల కొరత ప్రభావం మొత్తం టెక్నాలజీ పరిశ్రమపైనే పడుతోంది.ఈ సమస్యను పరిష్కరించాలంటే మెమరీ చిప్ల ఉత్పత్తిని భారీగా పెంచాలని ఎలాన్ మస్క్ సూచించారు. భవిష్యత్తులో ఏఐ అభివృద్ధికి మెమరీ చిప్లే అతిపెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. అందుకే టెస్లా, స్పేస్ఎక్స్, ఇంటెల్ కలిసి అత్యాధునిక చిప్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రణాళికను కూడా ప్రకటించారు.ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్కు భారీ నష్టం.. కారణం ఇదేనా? -
మైక్రోసాఫ్ట్కు భారీ నష్టం.. కారణం ఇదేనా?
మైక్రోసాఫ్ట్ ప్రపంచంలోనే అత్యంత విలువైన టెక్నాలజీ కంపెనీలలో ఒకటి. అయితే.. ఇటీవల ఈ కంపెనీ షేర్లు భారీగా పడిపోవడం పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురి చేసింది. జూన్ నెలలో మాత్రమే మైక్రోసాఫ్ట్ షేర్లు దాదాపు 17 శాతం పడిపోగా, కంపెనీ మార్కెట్ విలువలో 570 బిలియన్ డాలర్లకు (రూ.53.9 లక్షల కోట్లు) పైగా తగ్గుదల నమోదైంది. డిసెంబర్ 2000 తర్వాత సంస్థకు ఇదే అతిపెద్ద నెలవారీ క్షీణత కావడం గమనార్హం.కంపెనీకి ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణం.. కృత్రిమ మేధస్సు (AI)పై మైక్రోసాఫ్ట్ పెడుతున్న భారీ పెట్టుబడులు. గత కొన్నేళ్లుగా సంస్థ డేటా సెంటర్లు, ఏఐ చిప్స్, క్లౌడ్ సర్వీసులు, అలాగే కోపైలెట్ వంటి ఏఐ ఉత్పత్తుల అభివృద్ధి కోసం బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తోంది. ఈ పెట్టుబడులు భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇస్తాయని కంపెనీ నమ్ముతున్నప్పటికీ, పెట్టుబడిదారులు మాత్రం ఆ లాభాలు ఎప్పుడు వస్తాయనే విషయంలో ఆందోళన చెందుతున్నారు.ఇటీవల విడుదలైన త్రైమాసిక ఫలితాల్లో అజూర్ క్లౌడ్ సేవల వృద్ధి మార్కెట్ అంచనాల కంటే కొంత తక్కువగా ఉండడం కూడా పెట్టుబడిదారుల్లో నిరాశను కలిగించింది. అంతేకాకుండా.. రాబోయే నెలల్లో కూడా కంపెనీ భారీ స్థాయిలో పెట్టుబడులు కొనసాగిస్తామని ప్రకటించింది. దీంతో ఖర్చులు పెరుగుతున్నా, లాభాలు మాత్రం అదే వేగంతో పెరగడం లేదనే భావన మార్కెట్లో ఏర్పడింది.ఏఐ అనేది మైక్రోసాఫ్ట్కు ఒక గొప్ప అవకాశం అయినప్పటికీ, అదే సమయంలో ఒక సవాలుగా కూడా మారింది. భవిష్యత్తులో ఏఐ కారణంగా సంప్రదాయ సాఫ్ట్వేర్లపై డిమాండ్ తగ్గే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే ఏఐ రంగంలో ముందుండాలంటే కంపెనీ నిరంతరం భారీగా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఈ రెండు అంశాలు ప్రస్తుతం పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.అయితే.. ఈ షేర్ పతనాన్ని అందరూ ప్రతికూలంగా చూడడం లేదు. కొంతమంది ప్రముఖ పెట్టుబడిదారులు, విశ్లేషకులు కొనుగోలుకు ఇది మంచి అవకాశమని భావిస్తున్నారు. గతంలో 2008 ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే అంచనా వేసి ప్రసిద్ధి చెందిన పెట్టుబడిదారు మైఖేల్ బరీ కూడా మైక్రోసాఫ్ట్ షేర్లపై దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టడం మార్కెట్లో చర్చనీయాంశమైంది. ఆయన నిర్ణయం వల్ల కంపెనీ షేర్లు కొంత మేర కోలుకున్నాయి.మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, మైక్రోసాఫ్ట్ ఆదాయం రాబోయే సంవత్సరాల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఏఐ రంగంలో కంపెనీకి ఉన్న బలమైన స్థానం వల్ల దీర్ఘకాలంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఇంకా ఉన్నాయి. అయితే ఇప్పుడు పెట్టుబడిదారులు కేవలం భారీ పెట్టుబడులు పెట్టడాన్ని కాకుండా, వాటి ద్వారా నిజంగా ఎంత లాభం వస్తుందో చూడాలని కోరుకుంటున్నారు.మైక్రోసాఫ్ట్ షేర్లు పడిపోవడం అంటే ఏఐ భవిష్యత్తు బలహీనపడిందని అర్థం కాదు. ఇది పెట్టుబడిదారుల ఆలోచనా విధానంలో వచ్చిన మార్పుకు సంకేతం మాత్రమే. ఒకప్పుడు ఏఐలో పెట్టుబడి పెడితే చాలు అనుకునే మార్కెట్, ఇప్పుడు ఆ పెట్టుబడుల వల్ల లాభాలు వస్తున్నాయా? అనే ప్రశ్నకు సమాధానం కోరుతోంది. అందుకే మైక్రోసాఫ్ట్కు ప్రస్తుతం ఎదురవుతున్న సవాలు ఏఐలో ముందుండటం మాత్రమే కాదు, ఆ పెట్టుబడులను స్థిరమైన లాభాలుగా మార్చి పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మళ్లీ గెలుచుకోవడం కూడా. ఇదీ చదవండి: నా అంచనా తప్పింది.. కియోసాకి ట్వీట్! -
టెక్కీల ఆత్మగౌరవాన్ని కాలరాస్తున్న సీఈఓ!
సాఫ్ట్వేర్ రంగం అంటేనే విలాసవంతమైన జీవితం, లక్షల్లో జీతాలు అనుకునే వారికి ఐటీ పరిశ్రమలోని మరో చీకటి కోణం షాక్కు గురిచేస్తోంది. ప్రాజెక్ట్ డెడ్లైన్ల పేరిట ఉద్యోగుల మానసిక ప్రశాంతతను హరిస్తూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న ఒక టాక్సిక్ (విషపూరిత) సీఈఓ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వారాంతాలతో (ఆదివారాలు) కలిపి రోజుకు 14 గంటల పాటు గొడ్డుచాకిరీ చేయించుకోవడమే కాకుండా.. ఉద్యోగుల విద్య, సామర్థ్యం, చివరికి వారి కుటుంబాలను లాగుతూ వ్యక్తిగత దూషణలకు దిగుతున్న ఒక సీఈఓ దారుణ ప్రవర్తనను ఓ సాఫ్ట్వేర్ డెవలపర్ రెడ్డిట్ వేదికగా పంచుకున్నారు.ఆ ప్రాజెక్ట్ ముగిసేలోపే ఇంకోదానికి..కంపెనీలో చేరినప్పటి నుంచి తనకు ఎదురవుతున్న నరకాన్ని సదరు టెక్కీ సుదీర్ఘ పోస్ట్లో వివరించారు. సంస్థలో జాయిన్ అయినప్పటి నుంచి ఒక ప్రాజెక్ట్ పూర్తికాకముందే మరో దానికి మారుస్తున్నారని, దీనివల్ల దేనిపైనా స్పష్టత లేకుండా పోతోందని పేర్కొన్నారు. ‘గత నెల రోజులుగా నేను ఒక క్లయింట్-ఫేసింగ్ డేటా-మ్యాపింగ్ ప్రాజెక్ట్లో బృందంతో కలిసి పని చేస్తున్నాను. మా కంపెనీ సీఈఓనే మాకు మేనేజర్గా వ్యవహరిస్తున్నారు. ఆయనే మాకు ఒక నిర్దిష్ట లాజిక్ ఇచ్చారు. అందుబాటులో ఉన్న డేటాను బట్టి మేము ఆ లాజిక్ను వర్తింపజేసి, విశ్లేషణను పూర్తి చేసి అవుట్పుట్ సమర్పించాం. తీరా చూస్తే, ఆ మ్యాపింగ్ తప్పని క్లయింట్ చెప్పారు’ అని టెక్కీ తెలిపారు.ఉద్యోగులపై నింద!కంపెనీకి క్లయింట్ ఇచ్చిన డేటానే అసంపూర్ణంగా ఉన్నప్పటికీ సీఈఓ మాత్రం మొత్తం నిందను బృందంపైనే నెట్టేసినట్లు డెవలపర్ ఆరోపించారు. ‘గత వారం రోజులుగా మీటింగుల్లో ఆయన ప్రవర్తన చాలా వ్యక్తిగతంగా, అవమానకరంగా మారింది. ఇది ఇక పనికి సంబంధించిన ఫీడ్బ్యాక్ కాదు. మా విద్య, సామర్థ్యాలు, కుటుంబాలు, విలువపై ఆయన దాడి చేస్తున్నారు. మేము సాంకేతిక పరిమితులను వివరించడానికి ప్రయత్నించినా లేదా ఇప్పటికే పూర్తి చేసిన పనిని చూపించినా ఆయన అసలు వినడం లేదు’ అన్నారు. బృందంలోని వారందరినీ ఉద్యోగాల్లోంచి తీసేస్తానంటూ సదరు సీఈఓ నిరంతరం బెదిరింపులకు పాల్పడుతున్నట్లు టెక్కీ వాపోయారు.ఆదివారాలూ వదలకుండా 14 గంటల చాకిరీఈ సంస్థలో పని గంటలు ఊహకందని విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆదివారాలతో సహా నిరంతరం పని చేయించుకుంటున్నారని తెలిపారు. ‘ఇటీవలే మా టీమ్ మొత్తం ఆదివారం కూడా రాత్రి దాకా పని చేసింది. కానీ సోమవారం ఉదయం మీటింగ్కు వచ్చిన సీఈఓ.. మేము అసలు మాట వినడం లేదని, సరిగా పని చేయడం లేదని మమ్మల్ని నిందించారు. నేను మానసికంగా, శారీరకంగా పూర్తిగా అలసిపోయాను. కనీసం విశ్రాంతి తీసుకోవడానికి, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి లేదా మరో ఉద్యోగానికి ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కూడా నాకు సమయం దొరకడం లేదు’ అని సదరు టెక్కీ తెలిపారు. ఈ ప్రతికూల వాతావరణంలో కొనసాగాలా లేక రాజీనామా చేయాలా అని ఆన్లైన్ కమ్యూనిటీని సలహా కోరారు.నెటిజన్ల సలహాఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారడంతో ఐటీ నిపుణులు, సోషల్ మీడియా వినియోగదారులు సదరు సీఈఓ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఆ ఉద్యోగాన్ని వదిలేయాలంటూ టెక్కీకి మద్దతుగా నిలిచారు. ‘ఆ సీఈఓకు వ్యక్తిత్వ సమస్య ఉంది. బహుశా అతనికి థెరపీ అవసరం. ఆర్థికపరమైన కట్టుబాట్లు లేకపోతే అక్కడ ఒక్క క్షణం కూడా ఉండటం వృథా’ అని ఒక యూజర్ స్పందించారు. ‘మీరు వెంటనే రాజీనామా చేయండి’ అని మరో యూజర్ చెప్పారు.కార్పొరేట్ రంగంలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి చర్చ జరుగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇలాంటి నరకప్రాయమైన మేనేజ్మెంట్ సంస్కృతి ఇంకా కొనసాగుతూనే ఉందనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని, ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి సాధించే విజయాలు ఏ కంపెనీకైనా శాశ్వతం కాదనే సత్యాన్ని సంస్థలు గ్రహించాలని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: బంగారం ధరలు ఢమాల్! -
హైదరాబాద్లో ‘ఫిరాన్’ తయారీ కేంద్రం
హైదరాబాద్: కాక్పిట్, ఇంటర్ఫేస్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను తయారు చేసే ఫిరాన్ టెక్నాలజీ గ్రూప్ భారత్లో తొలి తయారీ కేంద్రాన్ని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని జీఎంఆర్ ఏరోస్పేస్ పార్కులో ఉన్న జీఎంఆర్ ఏవియేషన్ సెజ్లో ప్రారంభించింది.ఏరో స్పేస్, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాల్లో దిగ్గజంగా పేరుగాంచిన ఫిరాన్ టెక్నాలజీ (Firan Technology Group).. భారత్లో తయారీ కేంద్రాన్ని ప్రారంభించడం దేశీయ ఏరోస్పేస్ రంగంలో మరో మైలురాయి అని జీఎంఆర్ ఎయిర్పోర్టు ల్యాండ్ డెవలప్మెంట్ సీఈఓ అమన్కపూర్ అన్నారు. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలన్నీ తమ సెజ్లో ఉన్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.చదవండి: తెలుగు రాష్ట్రాల్లోకి గోద్రెజ్ నింజా -
రూ.9.3 కోట్లు ప్యాకేజీని వదులుకుని.. ఏఐ వైపు అడుగులు
సాంకేతిక ప్రపంచాన్ని కుదిపేస్తోన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవం.. కేవలం సరికొత్త ఆవిష్కరణలకే కాదు, ఐటీ నిపుణుల ఆలోచనా ధోరణిలో వస్తోన్న మార్పులకు కూడా వేదికవుతోంది. నెలకు లక్షల జీతం, చేతినిండా స్టాక్ ఆప్షన్లు, గూగుల్ లాంటి గ్లోబల్ టెక్ కంపెనీలో సురక్షితమైన ఉద్యోగం... సగటు ఉద్యోగి కల ఇది. కానీ, ఏటా దాదాపు రూ.9.3 కోట్ల భారీ ప్యాకేజీని సైతం కాదనుకుని ఏఐ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సిలికాన్ వ్యాలీలో హాట్ టాపిక్గా మారింది.గూగుల్లో అకౌంట్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసిన 41 ఏళ్ల యూసఫ్ ఇమ్రాన్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతంగా ఏఐ స్టార్టప్ను ప్రారంభించారు. ఏఐ టెక్నాలజీ సామాన్యులకు కూడా అద్భుతమైన అవకాశాలను అందిస్తోందంటూ ఆయన పంచుకున్న అనుభవాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.రూ.9.3 కోట్ల ప్యాకేజీ.. ఎలా సాధ్యమైంది?సేల్స్ రంగంలో దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న ఇమ్రాన్ 2020లో గూగుల్ సంస్థలో చేరారు. క్లయింట్లకు గూగుల్ ‘ఏఐ మెషిన్ లెర్నింగ్’ సొల్యూషన్స్ను చేరవేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన బేసిక్ శాలరీ దాదాపు 1,70,000 డాలర్లు (సుమారు రూ.1.6 కోట్లు) కాగా, కస్టమర్ డీల్స్ ద్వారా వచ్చిన కమీషన్లే ఆయన ఆదాయాన్ని పెంచాయి. డబ్ల్యూ2 ఎర్నింగ్స్(అలవెన్స్లు) ద్వారా గతేడాది ఆయన వార్షిక సంపాదన దాదాపు 9,86,000 డాలర్లు (సుమారు రూ. 9.3 కోట్లు)గా ఉంది.‘నాకు ఐదేళ్ల వయసున్నప్పుడు మా కుటుంబం బంగ్లాదేశ్ నుంచి న్యూయార్క్కు వలస వచ్చింది. ఆ వలసదారుల కష్టపడే తత్వమే నన్ను ఈ స్థాయికి చేర్చింది. మార్కెట్ అవసరాలు, ఏఐ టెక్నాలజీపై పట్టు సాధించడం వల్లే నేను అంతటి కమీషన్లు సాధించగలిగాను’ అని ఇమ్రాన్ పేర్కొన్నారు.భారీ జీతాన్ని వదులుకోవడానికి కారణంమార్కెట్లో ఓపెన్ ఏఐ (ChatGPT), ఆంత్రోపిక్ (Claude) వంటి సంస్థలు సృష్టిస్తున్న సంచలనాలు ఇమ్రాన్లో ఫోమో (ఎక్కడ తాను వెనుకబడిపోతానో అనే ఆందోళన)ను రేకెత్తించాయి. గూగుల్ సురక్షితమైనదే అయినప్పటికీ భవిష్యత్తు అంతా ఏఐ స్టార్టప్లదేనని, వాటిలో ఈక్విటీ (భాగస్వామ్యం) కలిగి ఉండటం లాభదాయకమని ఆయన భావించారు. మరోవైపు, గూగుల్లో ఇటీవలి కాలంలో జరిగిన ఉద్యోగుల తొలగింపులు కూడా ఆయన ఆలోచనా విధానాన్ని మార్చాయి. ఎంత ప్రతిభావంతులైనా కార్పొరేట్ కొలువుల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో సొంతంగా రిస్క్ తీసుకోవడమే ఉత్తమమని ఇమ్రాన్ నిర్ణయించుకున్నారు.రాత్రిపూట ఏఐ సాధన..సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినప్పటికీ ఇమ్రాన్ వెనకడుగు వేయలేదు. పగలు ఉద్యోగం చేస్తూనే.. రాత్రులు, వారాంతాల్లో చాట్జీపీటీ, క్లాడ్, జెమిని వంటి ఏఐ టూల్స్ సాయంతో కోడింగ్ నేర్చుకుంటూ ప్రాజెక్ట్లు డిజైన్ చేశారు. ఈ క్రమంలోనే గత ఏప్రిల్లో గూగుల్కు గుడ్ బై చెప్పి ‘మాంగోస్టీన్ స్టూడియో’ అనే స్టార్టప్ను ప్రారంభించారు. ఇది సేల్స్ నిపుణుల కోసం ప్రత్యేక ఏఐ ఆధారిత టూల్స్ను రూపొందిస్తుంది. ఆవేశంతో కాకుండా పూర్తి ఆర్థిక ప్రణాళికతోనే ఇమ్రాన్ ఉద్యోగాన్ని వదిలేసినట్లు ఇమ్రాన్ చెప్పారు.ఇదీ చదవండి: బంగారం ధరలు ఢమాల్! -
జులైలో బ్యాంక్ హాలిడేస్: 12 రోజులు సెలవు!
జూలై 2026 సమీపిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా బ్యాంక్ ఖాతాదారులు తమ పనులను ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నెలకు సంబంధించిన సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసింది. ఇందులో ప్రాంతీయ పండుగలు, జాతీయ స్థాయి ఆచారాలు, అలాగే ప్రతి వారం వచ్చే వారాంతపు సెలవులు కూడా ఉన్నాయి.జూలై 6న మిజోరాంలో ఎంహెచ్ఐపీ డే సందర్భంగా బ్యాంకులకు సెలవుజూలై 9న మేఘాలయలో బెహ్ డెయిన్ఖ్లామ్ పండుగ కారణంగా బ్యాంకులు పనిచేయవుజూలై 16న ఒడిశా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో రథయాత్ర, హరేలా వంటి పండుగల కారణంగా బ్యాంక్ సేవలు రద్దుజూలై 17న మేఘాలయలో యూ తిరోత్ సింగ్ వర్ధంతిజూలై 18న సిక్కింలో డ్రుక్పా త్షే-జి బౌద్ధ పండుగజూలై 22న త్రిపురలో ఖార్చి పూజ సందర్భంగా బ్యాంకులకు సెలవుఇవి కాకుండా ప్రతి ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి. 2026 జూలైలో ఆదివారాలు జూలై 5, 12, 19, 26 తేదీలకు వస్తాయి. అలాగే రెండో శనివారం జూలై 11, నాలుగో శనివారం జూలై 25న కూడా బ్యాంక్ కార్యకలాపాలు ఉండవు. మొత్తం మీద బ్యాంకులకు 12 రోజులు సెలవులన్నమాట.ఈ సెలవుల కారణంగా బ్యాంక్ బ్రాంచ్ సేవలు అందుబాటులో ఉండకపోయినా, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం కొనసాగుతాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, డెబిట్ మరియు క్రెడిట్ కార్డులు, అలాగే ఏటీఎం సేవలు సాధారణంగా పనిచేస్తాయని రిజర్వ్ బ్యాంక్ సూచించింది. -
దాతృత్వంపై ఎలాన్ మస్క్ ట్వీట్!
ప్రపంచ కుబేరుడు, ప్రముఖ వ్యాపారవేత్త 'ఎలాన్ మస్క్' జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకెంజీ స్కాట్ చేస్తున్న దాతృత్వ కార్యక్రమాలపై చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమయ్యాయి.అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకెంజీ స్కాట్ చేసిన భారీ దాతృత్వ కార్యక్రమం సమాజానికి మేలు చేయడం కంటే కీడు చేస్తున్నాయని మస్క్ అభిప్రాయపడ్డారు.మెకెంజీ స్కాట్ ఇప్పటివరకు సుమారు 26.3 బిలియన్ డాలర్లకు పైగా వివిధ చారిటీలకు అందించారు. ఇది వ్యక్తిగత స్థాయిలో చూస్తే.. చరిత్రలోనే అత్యంత పెద్ద దానాలలో ఒకటిగా నిలిచింది. ఆమె 2019లో జెఫ్ బెజోస్తో విడాకులు తీసుకున్న తరువాత.. వచ్చిన అమెజాన్ వాటా సంపదలో ఎక్కువ భాగాన్ని సమాజ సేవ కోసం వినియోగించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే 'యీల్డ్ గివింగ్' పేరుతో ఆమె ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,700కు పైగా నాన్ప్రాఫిట్ సంస్థలకు సహాయం చేశారు. వీటిలో హోవార్డ్ యూనివర్సిటీతో పాటు పలు వాతావరణ, సామాజిక అభివృద్ధి సంస్థలు ఉన్నాయి.Sadly, yes— Elon Musk (@elonmusk) June 28, 2026అయితే.. ఈ విస్తృత దానాలపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ, అవి సమాజానికి హానికరంగా మారుతున్నాయని పేర్కొన్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఒక యూజర్ చేసిన వ్యాఖ్యకు సమాధానంగా ఆయన స్పందించడం, ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. దీనిని చాలా మంది మెకెంజీ స్కాట్ దానాలపై పరోక్ష విమర్శగా భావించారు.ఇక 2024లో కూడా మస్క్ చేసిన ఒక పోస్ట్ ఈ చర్చను మరింత పెంచింది. అప్పట్లో ''మాజీ భార్యలు తమ మాజీ భర్తలను ద్వేషిస్తూ.. చేసే దానాలు పాశ్చాత్య నాగరికత క్షీణతకు కారణాలలో ఒకటి' అనే అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యానించారు. ఆ పోస్ట్లో తాను ఎవరి పేరును ప్రస్తావించకపోయినా, అది మెకెంజీ స్కాట్ను ఉద్దేశించి చేసినదేనని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీయడంతో తరువాత ఆ పోస్ట్ తొలగించడం జరిగింది.ఎవరెన్ని విధాలుగా మాట్లాడినా, విమర్శించినా.. మెకెంజీ స్కాట్ మాత్రం తన దాతృత్వ విధానాన్ని కొనసాగిస్తూ, సమాజంలో వెనుకబడిన వర్గాలకు సహాయం చేయడమే తన లక్ష్యమని చెబుతున్నారు. ఆమె 'నా సంపద పూర్తిగా అయిపోయే వరకు దానం చేస్తూనే ఉంటాను' అని గతంలో ప్రకటించారు. అయితే.. ఎలాన్ మస్క్ వ్యాఖ్యలు దాతృత్వం ప్రభావం సమాజంపై ఎలా ఉంటుందనే విషయంపై కొత్త చర్చను దారితీసాయి. -
క్రేజీ ఆలోచనలతోనే సరిహద్దుల్లేని విజయాలు
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అసాధారణ విజయాల వెనుక ఉన్న అసలు రహస్యం బయటపడింది. గూగుల్లో పిచాయ్తో కలిసి పనిచేసిన అగ్రశ్రేణి టెక్ నిపుణులు, ‘రూబ్రిక్’, ‘గ్లీన్’ సంస్థల సహ వ్యవస్థాపకుడు అరవింద్ జైన్ ఇటీవల ఫార్చ్యూన్ మ్యాగజైన్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రపంచం వెర్రి ఆలోచన అని కొట్టిపారేసిన క్రోమ్ బ్రౌజర్ ప్రాజెక్ట్ను పిచాయ్ ఎలా విజయతీరాలకు చేర్చారో, ఆయన పనితీరు నుంచి తాను నేర్చుకున్న పాఠాలేమిటో జైన్ వివరించారు.భారతదేశంలోని ఒక చిన్న పట్టణం నుంచి అమెరికాకు వెళ్లిన అరవింద్ జైన్ ప్రారంభంలో గూగుల్లో చేరినప్పుడు తీవ్రమైన ఆత్మన్యూనతా భావానికి లోనైనట్లు అంగీకరించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన అత్యంత నిపుణులైన సహోద్యోగుల మధ్య తానొక ‘మోసగాడిలా’ (అర్హత లేకపోయినా వచ్చినట్లు) భావించానని చెప్పారు. అయితే, ఆ ప్రతిభావంతుల మధ్య కొందరు మాత్రమే ఎందుకు అత్యున్నత శిఖరాలకు చేరుకుంటున్నారనే విషయాన్ని ఆయన గమనించడం ప్రారంభించారు. అలా ఆయన దృష్టిని ఆకర్షించిన అగ్రగామి నాయకుడే సుందర్ పిచాయ్.‘నేను, సుందర్ గూగుల్లో చాలా కాలం కలిసి పని చేశాం. కంపెనీలో ఒక సాధారణ ఉద్యోగిగా చేరినప్పటి నుంచి సుందర్ నాకు తెలుసు. గూగుల్లో బెస్ట్ స్కూల్స్ నుంచి వచ్చిన ఎందరో మేధావులు ఉన్నా వారందరూ ఉన్నతంగా రాణించలేకపోయారు. అప్పుడే అసలు విజయ సూత్రం ఏంటో తెలుసుకోవాలనుకున్నాను. చాలా కాలం కిందట ఆన్లైన్ బ్రౌజర్ల విభాగం పూర్తిగా మైక్రోసాఫ్ట్ గుత్తాధిపత్యంలో ఉండేది. అప్పటికే నెట్స్కేప్ వంటి దిగ్గజాలు విఫలమవడంతో గూగుల్ క్రోమ్ ప్రాజెక్టుపై పెద్దగా నమ్మకం లేదు. దాంతో నేను కూడా ఇది చాలా చెడ్డ ఆలోచన అని భావించాను. ఎందుకంటే నేను అంత లోతుగా ఆలోచించలేకపోయాను’ అని జైన్ పేర్కొన్నారు.అప్పట్లో మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టీవ్ బాల్మర్ సైతం క్రోమ్ను ఒక సాధారణ ‘రౌండింగ్ ఎర్రర్’ (లెక్కలోకి తీసుకోనవసరం లేని పొరపాటు) అని బహిరంగంగా కొట్టిపారేశారు. అందరూ అసాధ్యం అనుకున్నచోటే పిచాయ్ తన పట్టుదల, ఆత్మవిశ్వాసంతో క్రోమ్ను ముందుకు నడిపారు. ఫలితంగా 2012 నాటికి క్రోమ్ ప్రపంచంలోనే అత్యంత విస్తృతంగా ఉపయోగించే బ్రౌజర్గా అవతరించి ప్రత్యర్థులను వెనక్కి నెట్టింది. ఈ విజయమే ఆగస్టు 2015లో పిచాయ్ గూగుల్ సీఈఓగా ఎదగడానికి బలమైన పునాది వేసింది.పిచాయ్ విజయ సూత్రాలుఅరవింద్ జైన్ విశ్లేషణ ప్రకారం, సుందర్ పిచాయ్ శైలి నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు ఇవే..కేవలం కష్టపడి పనిచేయడం మాత్రమే సరిపోదు, లక్ష్యం పట్ల విపరీతమైన పట్టుదల ఉండాలి.గూగుల్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్ల తరహాలోనే పిచాయ్ మనసులో సాధ్యసాధ్యాలపై ఎలాంటి పరిమితులు లేవు.ప్రతి ఒక్కరూ తెలివితక్కువది, బహుశా వాస్తవాలకు దూరంగా ఉందని భావించే పనిని మనం చేయబోతున్నాం అని నమ్మినప్పుడే మ్యాజిక్ జరుగుతుంది.రూబ్రిక్, గ్లీన్ సంస్థలతో జైన్ సంచలనాలుసుందర్ పిచాయ్ నుంచి నేర్చుకున్న ఈ క్రేజీ థాట్స్ పాఠాలే అరవింద్ జైన్ను తదుపరి కాలంలో ఒక విజయవంతమైన బిలియనీర్గా మార్చాయి. తాను గూగుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జైన్ స్థాపించిన క్లౌడ్ డేటా మేనేజ్మెంట్ కంపెనీ రూబ్రిక్, 2024లో న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో సుమారు 5.6 బిలియన్ డాలర్లతో లిస్ట్ అయింది. అనంతరం ఆయన ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ 'గ్లీన్' ప్రస్తుతం 7.2 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీగా దూసుకుపోతోంది.జెన్-జీ నుంచి నిరంతర అభ్యాసంప్రస్తుతం ఇంతటి అంతర్జాతీయ స్థాయి విజయాన్ని అందుకున్నప్పటికీ జైన్ తన సంస్థల్లోని యువతరం(జెన్ జీ) నుంచి నిరంతరం నేర్చుకుంటూనే ఉన్నానని తెలిపారు. యువత సరికొత్త దృక్పథాలను, వినూత్న ఆలోచనలను తీసుకువస్తుందని, నేటి వేగవంతమైన టెక్ ప్రపంచంలో అప్డేట్గా ఉండటానికి వారి ఆలోచనలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.ఇదీ చదవండి: పసిడి పరుగుకు పగ్గాలు.. దిగొచ్చిన ధరలు -
లీగల్ రివ్యూను ప్రశ్నించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మాజీ ఛైర్మన్
దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో ఇటీవలి పరిణామాలు కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తన రాజీనామాపై బ్యాంక్ యాజమాన్యం జరిపించిన చట్టపరమైన సమీక్షను బ్యాంక్ మాజీ ఛైర్మన్ అతాను చక్రవర్తి ప్రశ్నించారు. ఈ సమీక్ష అంతా ఒక పద్ధతి ప్రకారం జరిగిందే తప్ప, ఇందులో వాస్తవాలు లేవని ఆరోపించారు. ఇటీవల ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను పంచుకున్నారు.న్యాయ సంస్థల నివేదికపై అసంతృప్తితన రాజీనామా ప్రకటనను సమీక్షించడానికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నియమించిన బాహ్య న్యాయ సంస్థలు (External Law Firms) సమర్పించిన నివేదికను అతాను చక్రవర్తి తప్పుపట్టారు. ఈ నివేదిక కేవలం ‘పరిమిత పరిధి/షరతులతో కూడిన నివేదిక’ అన్నారు. అంతర్గత అధికారుల ఇంటర్వ్యూల నుంచి సేకరించిన కొన్ని అంశాలు, బోర్డు సమావేశాల మినిట్స్పైనే ఈ నివేదిక ప్రధానంగా దృష్టి సారించిందని విమర్శించారు. బ్యాంక్లోని కొన్ని వ్యాపార పద్ధతులకు, తన వ్యక్తిగత విలువలకూ మధ్య వచ్చిన వైరుధ్యం వల్లే తాను రాజీనామా చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. అయితే, న్యాయ సంస్థలు ఈ ప్రాథమికాంశాన్ని వదిలేసి కేవలం కొన్ని అంశాలపైనే దృష్టి పెట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమీక్ష కోసం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ‘వాడియా గాంధీ’, ‘విల్సన్ సోనీ’ అనే న్యాయ సంస్థలను నియమించినట్లు తెలుస్తోంది.బోర్డు తీరుపై ప్రశ్నలు‘నా నియామకం, రాజీనామా రెండూ కంపెనీల చట్టం, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టానికి లోబడే జరిగాయి. అలాంటప్పుడు ఈ సమీక్ష దేనికి? సమీక్ష కోసం న్యాయవాదులను నియమించడానికి గల నిబంధనలు లేదా చట్టపరమైన ఫ్రేమ్వర్క్ ఏమిటో చెప్పాలని నేను బోర్డును పదేపదే కోరాను. కానీ, నా అభ్యర్థనలను బోర్డు పట్టించుకోలేదు. ఆ నిబంధనలను నాతో పంచుకోలేదు’ అని అతాను చక్రవర్తి అన్నారు.ఈ చట్టపరమైన నివేదికలను ఆయన అనవసరమైనవిగా కొట్టిపారేశారు. తన పదవీకాలంలో జరిగిన ‘ఏటీ-1 బాండ్ మిస్సెల్లింగ్’ కేసుపై బ్యాంక్ వేగంగానే స్పందించిందని చెప్పారు. అయితే, బోర్డు రూమ్ విషయాలు బోర్డు రూమ్లోనే ఉండాలనే నియమానికి కట్టుబడి తన రాజీనామాకు దారితీసిన నిర్దిష్ట వ్యాపార పద్ధతులు ఏమిటనేది మాత్రం ఆయన వెల్లడించలేదు.త్వరలో కొత్త ఎండీ, సీఈఓఈ వివాదాల నడుమే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన కార్పొరేట్ గవర్నెన్స్ను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. బ్యాంకుకు శాశ్వత ఛైర్మన్ నియామకాన్ని వేగవంతం చేయడంతో పాటు ప్రస్తుత ఎండీ, సీఈఓ శశిధర్ జగదీషన్ను తిరిగి నియమించే కసరత్తును ముమ్మరం చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. త్వరలోనే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నూతన ఛైర్మన్ ఎవరనేది అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇది బ్యాంక్ భవిష్యత్తు వ్యూహాలకు ఎంతో కీలకం కానుంది.ఇదీ చదవండి: పసిడి పరుగుకు పగ్గాలు.. దిగొచ్చిన ధరలు -
రూ.45 లక్షల ప్యాకేజీ.. నెలాఖరుకు చేతిలో సున్నా!
సంవత్సరానికి రూ.45 లక్షల భారీ ప్యాకేజీ.. సమాజంలో గౌరవప్రదమైన పొజిషన్.. కానీ, నెలాఖరు వచ్చేసరికి చేతిలో రూపాయి మిగలడం లేదు! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది బెంగళూరులో నివసిస్తున్న ఒక సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ పరిస్థితి. గతేడాది మ్యూచువల్ ఫండ్ కన్సల్టెంట్ అన్షుమన్ శర్మతో సూర్య అనే టెక్కీ మాట్లాడిన పాత ఇంటర్వ్యూ క్లిప్ ఇప్పుడు మళ్లీ సామాజిక మాధ్యమం ఎక్స్లో వైరల్గా మారింది.గత 14 ఏళ్లుగా బెంగళూరులో స్థిరపడిన సూర్య.. తన భార్య, మూడున్నరేళ్ల బాబుతో కలిసి నివసిస్తున్నాడు. ఏడాదికి రూ.45 లక్షల ప్యాకేజీ ఉన్నప్పటికీ పన్నుల చెల్లింపుల తర్వాత ప్రతి నెలా అతని చేతికి వచ్చే నికర జీతం రూ.2,45,000. ఈ భారీ మొత్తం చేతికి వస్తున్నా పొదుపు చేయడం తనకు చాలా కష్టంగా మారిందని సూర్య వాపోయాడు.ఒక ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ..‘ప్రస్తుతం నేను ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఏంటంటే.. నెలాఖరు వచ్చేసరికి నా డబ్బు ఎక్కడికి వెళ్తుందో నాకే అర్థం కావడం లేదు. చేతిలో ఏమీ మిగలడం లేదు. పెళ్లయి బాబు పుట్టిన తర్వాత ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. దీనివల్ల నా సిప్ పెట్టుబడులను కూడా పెంచలేకపోతున్నాను’ అని చెప్పాడు.ఖర్చుల లెక్కలు ఇవే..సూర్య తన నెలవారీ ఖర్చుల వివరాలను కన్సల్టెంట్కు వివరించగా అందులో సింహభాగం హోమ్లోన్కే వెళ్తున్నట్లు చెప్పారు. అతని నెలవారీ ఖర్చుల విభజన ఇలా ఉంది.హోమ్ లోన్ ఈఎంఐ: రూ. 63,000 (ఇది అతని నికర ఆదాయంలో 30% కంటే తక్కువలోనే ఉండటం గమనార్హం)కుమారుడి స్కూల్ ఫీజు: రూ.11,000 (దీనికి అదనంగా రూ.3 లక్షల ప్రవేశ రుసుము ఉంది)ఆహారం, కిరాణా సామాగ్రి: రూ. 12,000ఇతర గృహ ఖర్చులు: రూ. 20,000షాపింగ్, ట్రిప్పులు, ఔటింగ్స్: రూ.32,000నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలుఈ ఇంటర్వ్యూ క్లిప్ ఎక్స్లో రీపోస్ట్ అవ్వడమే ఆలస్యం.. నెటిజన్లు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు. ‘భారతదేశంలో ద్రవ్యోల్బణం కంటే పేలవమైన ఆర్థిక ప్రణాళికే పెద్ద సమస్య. నెలకు రూ.2.45 లక్షలు సంపాదిస్తూ కేవలం షాపింగ్, ట్రిప్పుల కోసమే రూ.32 వేలు ఖర్చు చేయడం ఏంటి? బాబు నర్సరీ ఫీజులకే అంత పెడుతుంటే ఇక డబ్బు ఎలా మిగులుతుంది?’ అని ఒక యూజర్ చెప్పారు. మరోవైపు, ఈ వాదనను వ్యతిరేకిస్తూ కొంతమంది సూర్యకు మద్దతుగా నిలిచారు. ‘ఇందులో తప్పు పట్టడానికి ఏముంది? ఒక వ్యక్తి కష్టపడి సంపాదిస్తూ, తన పిల్లలకు మంచి చదువు చెప్పించి, కాస్త విలాసాల కోసం ఖర్చు పెట్టుకుంటే తప్పేంటి?’ అని కౌంటర్ ఇచ్చారు.ఈ బెంగళూరు టెక్కీ ఉదంతం కేవలం ఒక్కరి సమస్య కాదు. భారతదేశంలోని మెట్రో నగరాల్లో అధిక వేతనాలు పొందుతున్న మెజారిటీ ఐటీ ఉద్యోగుల మానసిక, ఆర్థిక పరిస్థితికి ఇది అద్దం పడుతోంది. ఆదాయం పెరిగే కొద్దీ దానికి అనుగుణంగా జీవన ప్రమాణాలు, ఖర్చులు పెంచుకుంటూ పోవడాన్ని ఆర్థిక పరిభాషలో ‘లైఫ్స్టైల్ ఇన్ఫ్లేషన్’ అంటారు. రూ.45 లక్షల ప్యాకేజీ ఉన్నా ఏమీ మిగలడం లేదు అనే భావన కలగడానికి కారణం.. భవిష్యత్తు కోసం చేసే పొదుపును ముందే పక్కన పెట్టకుండా, ఖర్చులు పోగా మిగిలినదాన్ని దాచుకుందాం అనుకోవడమేనని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: పసిడి పరుగుకు పగ్గాలు.. దిగొచ్చిన ధరలు -
గార్డెన్ సిటీ 'గార్బేజ్ సిటీ'గా మారిందా?
ఒకప్పుడు దేశ విదేశీయులను ఆకర్షించిన గార్డెన్ సిటీ (ఉద్యాన నగరం) బెంగళూరు.. ఇప్పుడు అస్తవ్యస్త ప్రణాళికలు, కాంక్రీట్ జంగిల్గా మారుతున్న వైనంతో తన ఉనికిని కోల్పోతోందా? బయోకాన్ వ్యవస్థాపకురాలు, ప్రముఖ పారిశ్రామికవేత్త కిరణ్ మజుందార్షా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చేసిన తాజా వ్యాఖ్యలు ఐటీ కారిడార్లో చర్చకు దారితీశాయి. బెంగళూరును ఆమె నేరుగా గార్బేజ్ సిటీ(చెత్త నగరం) అని సంబోధించడం, అక్కడి పట్టణ ప్రణాళిక వైఫల్యాలను ఎండగట్టడం ఐటీ నిపుణులు, సామాన్య ప్రజల్లో చర్చకు తెరలేపింది.గ్రాఫిక్ చిత్రం ఏం చెబుతోంది?నగర రోడ్ల దుస్థితిని వివరిస్తూ కిరణ్ ఒక ఆసక్తికరమైన గ్రాఫిక్ చిత్రాన్ని షేర్ చేశారు. ‘మన గార్డెన్ సిటీని ప్రతిబింబించేలా మన రోడ్లను ఈ విధంగా రూపొందించాలి, ప్లాన్ చేయాలి. దురదృష్టవశాత్తు పచ్చదనం తగ్గుతూ చెత్త నగరంగా మారింది’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ గ్రాఫిక్ ఎలివేటెడ్ రోడ్ కారిడార్కు సంబంధించిన రెండు విభిన్న వెర్షన్లను పోల్చి చూపించింది.మనం నిర్మించింది (What We Built): కాంక్రీట్ విస్తరణతో కూడిన ప్రస్తుత దుస్థితి. రోడ్ల విస్తరణ పేరుతో చెట్లను పూర్తిగా తొలగించడం, పాదచారుల ఫుట్పాత్లు, సర్వీస్ రోడ్లను తుడిచిపెట్టడం, ప్రజలకు కనీస సౌకర్యాలు లేకుండా చేయడం ఇందులో కనిపించింది.మనం నిర్మించాల్సింది (What We Could Have Built): పర్యావరణ అనుకూల ప్రణాళిక. అదే కారిడార్లో పాత చెట్లను కాపాడుకుంటూనే సైక్లింగ్ ట్రాక్లు, విశాలమైన ఫుట్పాత్లు, వీధి దీపాలు, బెంచీలు, చెత్త డబ్బాలు వంటి ఆధునిక పౌర సౌకర్యాలతో తిరిగి రూపకల్పన చేయవచ్చని ఆ చిత్రం చూపించింది.నెటిజన్ల స్పందనఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారడమే కాకుండా, నగర పౌరుల నుంచి తీవ్ర స్పందన తీసుకొచ్చింది. బెంగళూరులో క్షీణిస్తున్న మౌలిక సదుపాయాలకు పేలవమైన ప్రణాళిక, బలహీనమైన పాలన, అవినీతి, అధికారుల జవాబుదారీతనం లేకపోవడమే కారణమని నెటిజన్లు ఏకిపారేశారు. ‘ఈ నగరాన్ని దోచుకోవడానికి నిర్వాహకులు, రాజకీయ నాయకులు చేతులు కలిపారు. ఐరన్, సిమెంట్ మొదలైన వాటిలో ఎక్కువ కమీషన్లు దండుకోవచ్చు కాబట్టే కాంక్రీట్ రోడ్లపై ఆసక్తి కనబరుస్తారు. వారు నాటిన చెట్లలో కమీషన్లు రావు కదా!’ అని ఒక యూజర్ స్పందించారు.This is how we need to design & plan our roads that reflects our garden city image. Unfortunately it’s now a garbage city with shrinking greenery pic.twitter.com/EG29LPZd2j— Kiran Mazumdar-Shaw (@kiranshaw) June 27, 2026మరికొందరు నెటిజన్ల అభిప్రాయాలు ఇలా..భారతీయ నగరాలు ఏమాత్రం నిలకడగా లేవు. అంతర్జాతీయ నగరాల మాదిరిగా పన్నులు, ఖర్చులు వసూలు చేస్తారు. కానీ కనీస సౌకర్యాలు లేక పేద దేశంగా జీవించాల్సి వస్తోంది. సిగ్గుచేటు.ఉన్నవాటిని సరిగ్గా నిర్వహించడం, చట్టాలను కఠినంగా అమలు చేస్తే చాలు. ప్రజలు సహనం కోల్పోయారు, ఎవరూ ఏ నియమాన్ని పాటించడం లేదు. గార్డెన్ సిటీ చెత్త నగరంగా మారుతున్న విషయం ప్రభుత్వానికి, అడ్మినిస్ట్రేషన్కు తెలియదా?మొత్తం బడ్జెట్ నుంచి కమీషన్లు ఎలా పొందాలో ప్రభుత్వ ఉద్యోగులు, నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. బాధ్యత, జవాబుదారీతనం లేనంత వరకు ఏదీ మెరుగుపడదు. బెంగళూరు అభివృద్ధి కోసం ఎవరైనా నిజాయితీగా ప్లాన్ చేస్తారని ఆశించడం అత్యాశే. -
ప్రపంచ కుబేరుడి విజయ గాథ!
ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన ఎలాన్ మస్క్ తన 55వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. సాంకేతికత, అంతరిక్ష పరిశోధనలు, ఎలక్ట్రిక్ వాహనాలు, కృత్రిమ మేధ (AI) వంటి రంగాల్లో చూపిన దూరదృష్టి ప్రపంచవ్యాప్తంగా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. వ్యాపారవేత్తగా మాత్రమే కాకుండా.. భవిష్యత్ సాంకేతిక ప్రపంచాన్ని రూపొందిస్తున్న వ్యక్తిగా కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.బాల్యం, విద్యఎలాన్ మస్క్ 1971 జూన్ 28న దక్షిణాఫ్రికాలో జన్మించారు. చిన్నప్పటి నుంచే కంప్యూటర్లు, టెక్నాలజీపై ఆసక్తి పెంచుకున్న ఆయన 1989లో ఉన్నత విద్య కోసం కెనడాకు వెళ్లారు. అనంతరం అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీకి చేరినప్పటికీ, కేవలం రెండు రోజుల్లోనే దాన్ని వదులుకుని వ్యాపార రంగంలో అడుగుపెట్టారు.వ్యాపార ప్రస్థానం ప్రారంభం1995లో తన సోదరుడితో కలిసి 'జిప్2' అనే ఆన్లైన్ సిటీ గైడ్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థను 1999లో విక్రయించడంతో మస్క్కు భారీ ఆర్థిక లాభం వచ్చింది. అయితే ఆ డబ్బును ఖర్చు చేయకుండా మరో వినూత్న ఆలోచనకు పెట్టుబడిగా పెట్టారు. ఆ తర్వాత 'X.com' అనే ఆన్లైన్ ఆర్థిక సేవల సంస్థను ప్రారంభించారు. తరువాత అది 'కాన్ఫినిటీ' సంస్థతో విలీనం చెంది ప్రపంచ ప్రఖ్యాత 'పేపాల్'గా మారింది. పేపాల్ను ఈబే కొనుగోలు చేయడంతో మస్క్కు వందల మిలియన్ల డాలర్లు లభించాయి.సాంకేతిక రంగంలో విప్లవాత్మక ప్రయాణంపేపాల్ ద్వారా సంపాదించిన సంపదను మస్క్ కొత్త ఆవిష్కరణల కోసం వినియోగించారు. అంతరిక్ష ప్రయాణాన్ని చౌకగా మార్చాలనే లక్ష్యంతో స్పేస్ఎక్స్ను స్థాపించారు. అదే సమయంలో విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లాను ప్రపంచంలోనే అగ్రస్థానానికి తీసుకెళ్లారు. అనంతరం ట్విట్టర్ను కొనుగోలు చేసి దానికి 'X'గా పేరు మార్చారు. కృత్రిమ మేధ అభివృద్ధి కోసం xAI సంస్థను కూడా స్థాపించారు.రిస్క్ తీసుకునే ధైర్యమే విజయ రహస్యంఎలాన్ మస్క్ విజయానికి ప్రధాన కారణం కొత్త ఆలోచనలను అమలు చేయడంలో ఆయన చూపిన ధైర్యం. ఇతరులు వెనుకడుగు వేసే పరిస్థితుల్లో కూడా ఆయన భారీ పెట్టుబడులు పెట్టి కొత్త అవకాశాలను సృష్టించారు. అందుకే ఆయన వ్యాపార ప్రయాణాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది యువ పారిశ్రామికవేత్తలు ఆదర్శంగా తీసుకుంటున్నారు.ఎలాన్ మస్క్ ప్రయాణం విజయాలతో పాటు వివాదాలకు కూడా వేదికైంది. రాజకీయ వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్టులు, వ్యాపార నిర్ణయాల కారణంగా పలుమార్లు విమర్శలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కొత్త సాంకేతిక ఆవిష్కరణలపై ఆయన దృష్టి మాత్రం మారలేదు. -
134 కోట్లకు టెలికం చందాదారులు
కొత్త టెలికం కస్టమర్లను ఆకర్షించడంలో ఎప్పటి మాదిరే ఎయిర్టెల్ ముందుంది. మే నెలలో 29.8 లక్షల మంది కొత్త సబ్స్క్రయిబర్లను (చందాదారులు/కస్టమర్లు) సొంతం చేసుకుంది.ఇందులో 29.26 లక్షల మంది మొబైల్ విభాగం నుంచి రాగా, 53,809 మంది కస్టమర్లు ఫిక్స్డ్లైన్ వినియోగదారులుగా ఉన్నారు. రిలయన్స్ జియో నెట్వర్క్ కిందకు 22.55 లక్షల మంది కొత్తగా వచ్చి చేరారు. ఇందులో 21.54 లక్షల మంది మొబైల్ విభాగం నుంచి రాగా, మిగిలిన వారు ఫిక్స్డ్ లైన్ విభాగం నుంచి ఉన్నారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ అంబానీ దుర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున తిరుమలలోని శ్రీవారి ఆలయంలో నిర్వహించిన సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ అధికారులు సంప్రదాయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికి, దర్శనానంతరం వేద పండితుల ఆశీర్వచనం అందజేశారు. అలాగే శ్రీవారి తీర్థప్రసాదాలు అందించి సత్కరించారు.అనంత్ అంబానీ అంతకుముందు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానాలకు భారీ విరాళాన్ని ప్రకటించారు. రూ.27.5 కోట్లతో 25 ఎలక్ట్రిక్ బస్సులను అందించనున్నట్లు వెల్లడించారు. ఆ బస్సుల నిర్వహణ, డ్రైవర్ల జీతభత్యాలు కూడా తామే భరిస్తామన్నారు.ఈ 25 ఎలక్ట్రిక్ బస్సులను నడిపే 50 మంది బస్సు డ్రైవర్ల జీతభత్యాలు చెల్లించడంతో పాటు, తిరుమలలో ఛార్జింగ్ స్టేషన్ను రిలయన్స్ ఏర్పాటు చేయనుంది. గుజరాత్లోని వంతారా తహరాలో టీటీడీ గోశాలను ఆధునికీకరించేందుకు అంగీకారం తెలినట్లుగా తెలుస్తోంది. -
ఏఐ.. రూ.450 లక్షల కోట్లు
ఏఐ. ఓ అనూహ్యమైన ఎకానమీని సృష్టిస్తోంది. ఈ రెండక్షరాల చుట్టూ అల్లుకున్న ఆర్థిక వ్యవస్థ... వచ్చే పదేళ్లలో ఏకంగా 5 ట్రిలియన్ డాలర్ల (రూ.450 లక్షల కోట్లు) వ్యాపార అవకాశాల్ని అందించబోతోంది. ఇక ఈ ఎకోసిస్టమ్లో ఎదిగే కంపెనీల విలువైతే దీనికి వందరెట్ల పైనే ఉంటుందన్నది ఇన్వెస్ట్మెంట్ నిపుణుల అంచనా. బహుశా! పారిశ్రామిక విప్లవం తరవాత ప్రపంచం చవిచూస్తున్న అతిపెద్ద మార్పు ఇదే కావచ్చు. ఏఐ ఎంతవేగంగా మారుతోందంటే... ఇపుడిది చాట్బోట్లకో, సాఫ్ట్వేర్ ఆటోమేషన్కో పరిమితం కాదు. తయారీ, విద్య, వైద్యం, ఫైనాన్స్, వ్యవసాయం, లాజిస్టిక్స్, డిఫెన్స్, శాస్త్రీయ పరిశోధన.. ఇలా అన్నిటికీ వెన్నెముకే. ఇపుడు పోటీ మెరుగైన ఏఐ మోడల్ను సృష్టించడానికి కాదు. మొత్తం ఏఐ వ్యవస్థను చేతుల్లో ఉంచుకోవటానికి. సెమీ కండక్టర్ల నుంచి డేటా సెంటర్లు, క్లౌడ్ ఇన్ఫ్రా, డిజిటల్ ట్విన్స్, అటానమస్ సిస్టమ్స్, పారిశ్రామిక ఏఐ, రోబోటిక్స్... ప్లస్ నైపుణ్యం ఎవరి చేతుల్లో ఎక్కువ ఉంటాయన్నదే నియంత్రణాధికారానికి నిదర్శనం. ఈ అధికారం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, కార్పొరేట్లు బిలియన్ల డాలర్లను కుమ్మరిస్తున్నాయి. ప్రస్తుత పరిశ్రమల్ని మార్చటంతో పాటు కొత్త పరిశ్రమల్ని సృష్టించే ఏఐ వల్ల 2030 నాటికి ప్రపంచ జీడీపీ 15 ట్రిలియన్ డాలర్లు జతపడుతుందన్నది ఆర్థిక నిపుణుల అంచనా. ఈ నేపథ్యంలో అసలు ఏఐ ఎన్ని రకాలు? వీటి అవసరాలేంటి? ఆ అవసరాలను అల్లుకుని ఎదుగుతున్న కంపెనీలేంటి? వాటి వ్యాపారమెంత? విలువెంత? అంతర్జాతీయ దిగ్గజాలెవరు? లాభపడే కంపెనీలేంటి?ఇదీ.. ఏఐ సామ్రాజ్య స్వరూపంచిప్ అండ్ సిలికాన్ (సెమీ కండక్టర్లు, జీపీయూలు, నెట్వర్కింగ్ సిలికాన్)ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (సర్వర్లు, స్టోరేజీ, కూలింగ్, విద్యుత్తు) క్లౌడ్ అండ్ ప్లాట్ఫామ్స్ (కంప్యూటింగ్, క్లౌడ్, మెషీన్ లెర్నింగ్ ఆపరేషన్స్, హోస్టింగ్ఫౌండేషన్ మోడల్స్ (లార్జ్ మోడల్స్, ట్రెయినింగ్, మరింత మెరుగుపరచటంఏఐ అప్లికేషన్లు (ఎంటర్ప్రైజ్ ఏఐ, వినియోగదారుల ఏఐ, పారిశ్రామిక ఏఐ తదితరాలు)ఏఐ ఏజెంట్లు అండ్ అటానమీ (స్వతంత్ర వ్యవస్థలు, ఏజెంట్లు, రోబోటిక్స్)సాక్షి, బిజినెస్ -
వైదొలగనున్న కోటక్ బ్యాంక్ సీఈవో వాస్వానీ
ముంబై: కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ, సీఈవో అశోక్ వాస్వానీ తన పదవి నుంచి తప్పుకోనున్నారు. ప్రస్తుత మూడేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత పునర్నియామకాన్ని కోరే యోచన లేదని ఆయన బోర్డుకు తెలియజేసినట్లు సంస్థ వెల్లడించింది. ఇందుకు బోర్డు ఆమోదముద్ర వేసినట్లు వివరించింది. 2024 జనవరి 1న కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ, సీఈవోగా బాధ్యత లు చేపట్టిన వాస్వానీ పదవీకాలం ఈ ఏడాది (2026) డిసెంబర్ 31తో ముగియనుంది. వాస్వానీ గతంలో బార్క్లేస్, సిటీ గ్రూప్ తదితర అంతర్జాతీయ సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అటు తర్వాత అప్పటి కోటక్ మహీంద్రా బ్యాంకు సీఈవో దీపక్ గుప్తా స్థానంలో చేరారు. రేసులో కాశ్యప్, అనూప్ సాహా: అశోక్ వాస్వానీ వారసుణ్ని ఎంపిక చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లు సమాచారం. వాస్వానీ స్థానంలో బాధ్యతలు తీసుకునేందుకు కీలకమైన ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. కోటక్ బ్యాంక్లో చిరకాలంగా వివిధ హోదాల్లో పని చేసిన పరితోష్ కాశ్యప్ గతేడాదే హోల్ టైమ్ డైరెక్టరుగా నియమితులయ్యారు. ఆయన హోల్సేల్ బ్యాంకింగ్ బిజినెస్ని పర్యవేక్షిస్తున్నారు. ఆయనతో పోలిస్తే బ్యాంకులో అనూప్ సాహా కొంత కొత్త వారు. గతంలో బజాజ్ ఫైనాన్స్ సీఈవోగా పని చేశారు. ప్రస్తుతం హోల్ టైమ్ డైరెక్టరుగా కన్జూమర్ బ్యాంకింగ్, మార్కెటింగ్ తదితర విభాగాలను పర్యవేక్షిస్తున్నారు. -
ఐటీ ఆదాయాలకు ఏఐ బూస్ట్
న్యూఢిల్లీ: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవల రంగంలో దాదాపు పావు శాతం పైగా కంపెనీలు కృత్రిమ మేథ (ఏఐ)పై ప్రయోగాలు చేసే దశ నుంచి వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం వైపు మళ్లాయి. తద్వారా ఆ సంస్థలు ఇప్పటికే ఏఐ సర్వీసుల ద్వారా 10–12 బిలియన్ డాలర్ల ఆదాయాలను ఆర్జిస్తున్నాయి. దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ న్యూయార్క్ సిటీలో నిర్వహించిన సీఈవోల సదస్సులో పరిశ్రమ దిగ్గజాలు ఈ మేరకు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఏఐ వినియోగం పెరగడం వల్ల సంప్రదాయ ఐటీ సేవలకు ప్రాధాన్యం తగ్గిపోతుందన్న ఆందోళనలను వారు తోసిపుచ్చారు. ఐటీ వల్ల ఉత్పాదకత పెరుగుతుందని, పదే పదే పునరావృతమయ్యే పనులను చేయడం తగ్గుతుందని వివరించారు.. ఏఐ గవర్నెన్స్, అప్లికేషన్ల ఆధునీరణ, సైబర్సెక్యూరిటీ మొదలైన వాటికి డిమాండ్ పెరుగుతుందని నాస్కామ్ తెలిపింది. ఏఐలో శిక్షణ పొందిన ప్రొఫెషనల్స్ 20 లక్షల మంది పైగా ఉండగా, అధునాతన ఏఐలో ట్రైనింగ్ తీసుకున్న వారు లక్ష నుంచి రెండు లక్షల మంది ఉంటారని పేర్కొంది. ప్రస్తుతం 85 శాతం టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్స్ వద్ద ఏజెంటిక్ ఏఐ ప్లాట్ఫాంలు ఉన్నట్లు వివరించింది. ఏజెంటిక్ ఏఐతో టెక్ సేవలకు డిమాండ్ ఏజెంటిక్ ఏఐతో సైబర్సెక్యూరిటీ, గవర్నెన్స్, కార్యకలాపాల ఆధునీకరణ తదితర విభాగాల్లో డిమాండ్ నెలకొంటుందని నాస్కామ్ తెలిపింది. దీనితో 2030 నాటికి టెక్నాలజీ సర్వీసులపై 300 – 400 బిలియన్ డాలర్ల మేర అదనంగా వెచ్చించే అవకాశం ఉందని వివరించింది. ఏఐని వినియోగంలోకి తెచ్చే క్రమంలో టెక్నాలజీని బాధ్యతాయుతంగా విస్తరించేందుకు కంపెనీలకు స్పెషలిస్ట్ పార్ట్నర్లు అవసరమవుతారని నాస్కామ్ ప్రెసిడెంట్ రాజేశ్ నంబియార్ తెలిపారు. మోడల్స్, అప్లికేషన్స్, డేటా ప్లాట్ఫామ్లు, సైబర్సెక్యూరిటీ నియంత్రణలు, పరిశ్రమ వ్యవస్థలు మొదలైన వాటన్నింటినీ అనుసంధానించే విశ్వసనీయమైన మోడల్ని రూపొందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇదంతా కూడా సురక్షితంగా, సమర్ధవంతంగా జరిగేలా చూడటంలోనే ఐటీ సర్వీసుల అసలు సామర్థ్యాలు బైటపడతాయని చెప్పారు. రాబోయే రోజుల్లో సిబ్బంది సంఖ్యను పెంచుకోవడం కాకుండా డొమైన్ సంబంధ సొల్యూషన్స్ కనుగొనడం, ఫలితాలను కచ్చితంగా డెలివర్ చేయడంపైనే ఐటీ పరిశ్రమ వృద్ధి ఆధారపడి ఉంటుందని నంబియార్ తెలిపారు. బిజినెస్ ప్రాసెస్ సర్వీసులనేవి పనులను రొటీన్గా చేయడం కాకుండా తెలివిగా పూర్తి చేసే విధానాలకు మళ్లుతాయని కాగి్నజెంట్ సీఈవో ఎస్ రవి కుమార్ తెలిపారు. -
పర్సిస్టెంట్ సిస్టమ్స్ చేతికి నగారో
న్యూఢిల్లీ: భారత ఐటీ దిగ్గజం పర్సిస్టెంట్ సిస్టమ్స్ అంతర్జాతీయంగా భారీ కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. జర్మనీకి చెందిన ప్రముఖ డిజిటల్ ఇంజినీరింగ్ సంస్థ నగారో ఎస్ఈను పూర్తిగా స్వా«దీనం చేసుకోనున్నట్లు ప్రకటించింది. తమ అనుబంధ సంస్థ గెలాక్సీ జర్మనీ హోల్డింగ్ ఎస్ఈ .. నగారో షేర్ల పూర్తిగా కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం ఒక్కో షేరుకు 81 యూరోల చొప్పున నగదు రూపంలో ఆఫర్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ డీల్ విలువ సుమారు 1.3 బిలియన్ డాలర్లుగా ఉంటుందని, 2027 మార్చి ఆఖరు నాటికి పూర్తి కావొచ్చని అంచనా. ఈ వ్యూహాత్మక విలీనంతో సుమారు 2.9 బిలియన్ డాలర్ల (రూ.24 వేల కోట్లకు పైగా) వార్షిక ఆదాయ సామర్థ్యంతో ప్రపంచ ఏఐ ఆధారిత డిజిటల్ ఇంజినీరింగ్ రంగంలో అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటిగా పర్సిస్టెంట్ అవతరించనుంది. పర్సిస్టెంట్–నగారోకి ఉమ్మడిగా ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లో 46 వేల మంది పైగా ఐటీ ఉద్యోగులు ఉంటారు. వీరిలో అత్యధికంగా 37 వేల మంది భారత్లో, ఉత్తర అమెరికాలో 3,500 మంది, యూరప్లో సుమారు 3,000 మంది ఉంటారని సంస్థ తెలిపింది. ఈ లావాదేవీకి సంబంధించి ఇరు సంస్థలు ఇప్పటికే బిజినెస్ కాంబినేషన్ అగ్రిమెంట్పై సంతకాలు చేశాయి. -
భారత్లో ఓపెన్ఏఐకి కొత్త బాస్.. ఎవరీ ప్రభ్జీత్ సింగ్?
కృత్రిమ మేధస్సు (AI) రంగంలో ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఓపెన్ఏఐ.. భారత్లో తన కార్యకలాపాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా 'ప్రభ్జీత్ సింగ్'ను నియమించింది.ప్రభ్జీత్ సింగ్ ఈ ఏడాది సెప్టెంబర్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. భారత్లో AI వినియోగాన్ని మరింత విస్తరించడంతో పాటు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ విభాగాలు కృత్రిమ మేధస్సు ప్రయోజనాలను పొందేలా భాగస్వామ్యాలను అభివృద్ధి చేయడంపై ఆయన దృష్టి సారించనున్నారు.ప్రభ్జీత్ సింగ్కు టెక్నాలజీ రంగంలో విశేష అనుభవం ఉంది. గత 11 సంవత్సరాలుగా ఉబెర్లో పనిచేసిన ఆయన, చివరి ఆరేళ్లు ఆ రైడ్-హెయిలింగ్ ప్లాట్ఫామ్కు భారతదేశం - దక్షిణాసియా అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రైడ్-హెయిలింగ్ మార్కెట్లలో ఒకటైన భారతదేశం, బంగ్లాదేశ్, శ్రీలంకలలో కంపెనీ మొబిలిటీ వ్యాపారానికి ఆయన నాయకత్వం వహించి, దాని విస్తరణకు మార్గనిర్దేశం చేశారు.ఐఐటి ఖరగ్పూర్, ఐఐఎం అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి అయిన సింగ్, మెకిన్సీ & కంపెనీలో అసోసియేట్ పార్టనర్గా పనిచేసి, అంతకుముందు ఉబర్లో చేరారు. కార్పొరేట్ నాయకత్వానికి ఆయన చేసిన విశేష సేవలకు గాను, 2022లో ఐఐఎం అహ్మదాబాద్ వారి యంగ్ అలూమ్ని అచీవర్స్ అవార్డుతో ఆయనను సత్కరించారు. -
భారత్ ట్యాక్సీ.. అమిత్ షా కీలక ప్రకటన!
కేంద్ర మంత్రి అమిత్ షా గుజరాత్లోని గాంధీనగర్లో భారత్ ట్యాక్సీ సేవలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ ట్యాక్సీని అడ్డుకునేందుకు కొన్ని ప్రైవేట్ క్యాబ్ సేవల సంస్థలు పోటీకి దిగుతున్నాయని ఆరోపించారు.భారత్ ట్యాక్సీ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయంటూ వస్తున్న వార్తలు పూర్తిగా తప్పుదోవ పట్టించేవేనని అమిత్ షా స్పష్టం చేశారు. తమ లక్ష్యం ఇతర కంపెనీలకు నష్టం కలిగించడం కాదని.. డ్రైవర్లు, ప్రయాణికులకు న్యాయమైన సేవలు అందించడమేనని చెప్పారు. భారత్ ట్యాక్సీ విజయవంతం కాకుండా అడ్డుకునేందుకే కొన్ని సంస్థలు తాత్కాలికంగా తక్కువ ఛార్జీలు, డ్రైవర్లకు అధిక కమిషన్లు ఇస్తున్నాయని ఆరోపించారు.కొన్ని ప్రైవేట్ క్యాబ్ సంస్థలు మొదట నష్టాలను భరిస్తూ మార్కెట్లో పోటీదారులను తొలగించి, ఆ తర్వాత తమ ఇష్టానుసారం ఛార్జీలు నిర్ణయించే విధానాన్ని అనుసరిస్తున్నాయని అమిత్ షా అన్నారు. అయితే భారత్లో సహకార భావన ఎంతో బలంగా ఉందని, ఇలాంటి వ్యూహాలు ఎక్కువ కాలం పనిచేయవని ఆయన అన్నారు.భారత్ ట్యాక్సీ సేవలను ప్రస్తుతం గుజరాత్లోని అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్కోట్, ద్వారక, సోమనాథ్ మొదలైన మొత్తం 14 ప్రధాన నగరాల్లో ప్రారంభించారు. ఈ సేవలు టూ వీలర్స్, త్రీ వీలర్స్, ఫోర్ వీల్ ట్యాక్సీలు అనే మూడు విభాగాల్లో అందుబాటులో ఉంటాయి.భారత్ ట్యాక్సీ ప్రత్యేకత ఏమిటంటే.. ఇది దేశంలోనే తొలి సహకార సంఘాల ఆధ్వర్యంలో నడిచే, డ్రైవర్ల యాజమాన్యంలోని రైడ్-హైలింగ్ ప్లాట్ఫామ్. ఇందులో డ్రైవర్ల నుంచి ఎలాంటి కమిషన్ వసూలు చేయరు. ప్రయాణికుడు చెల్లించిన మొత్తం ఛార్జీ నేరుగా డ్రైవర్కే అందుతుంది. దీంతో డ్రైవర్ల ఆదాయం పెరగడంతో పాటు, వారికి ఆర్థిక భద్రత కూడా లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది.భారత్ ట్యాక్సీ విస్తరణపై కూడా అమిత్ షా కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది జూలై 31లోపు నాగ్పూర్, పుణే, ముంబై, లక్నో, చండీగఢ్, జైపూర్, కోల్కతా వంటి ప్రధాన నగరాల్లో సేవలు ప్రారంభిస్తామని, అలాగే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 500కు పైగా నగరాలు, పట్టణాలకు భారత్ ట్యాక్సీ సేవలను విస్తరిస్తామని ప్రకటించారు.అంతే కాకుండా.. 'సహకార్ సే సమృద్ధి' అనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన నినాదాన్ని రవాణా రంగంలో కూడా విజయవంతం చేయాలన్నదే తమ లక్ష్యమని అమిత్ షా పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇదే సహకార నమూనాను మరిన్ని రంగాల్లో కూడా విస్తరిస్తామని వెల్లడించారు. -
జాబ్ ఇంటర్వ్యూకు 11 గంటల స్లాట్ వద్దా? కెరీర్ కోచ్ సూచనపై చర్చ
ఉద్యోగ ఇంటర్వ్యూలో విజయాన్ని నిర్ణయించేది కేవలం ప్రతిభ, సన్నద్ధత మాత్రమే కాదు.. ఇంటర్వ్యూ సమయం కూడా కొంత ప్రభావం చూపుతుందని ఓ కెరీర్ కోచ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. సైమన్ ఇంగారి అనే కెరీర్ కోచ్ తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్టులో, అభ్యర్థులకు ఇంటర్వ్యూ సమయాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉంటే ఉదయం 11 గంటల స్లాట్ను వీలైనంత వరకు నివారించాలని సూచించారు. అయితే, ఈ అభిప్రాయంపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.ఇంగారి అభిప్రాయం ప్రకారం.. ఉదయం 11 గంటల స్లాట్ సాధారణంగా ఆ రోజులో మొదటి రెండు ఇంటర్వ్యూ స్లాట్ల తర్వాత వస్తుంది. దీంతో అప్పటికే ఇంటర్వ్యూయర్లు పలువురు అభ్యర్థులను చూసి ఉండటంతో కొత్త అభ్యర్థిని ముందున్న వారితో పోల్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అలాగే భోజన విరామం సమయం దగ్గరపడుతుండటంతో కొన్నిసార్లు ఇంటర్వ్యూలు త్వరగా ముగించాలనే ఆలోచన కూడా ఇంటర్వ్యూయర్లలో ఉండవచ్చని వివరించారు.అంతేకాకుండా, ముందుగా షెడ్యూల్ చేసిన ఇంటర్వ్యూలు ఎక్కువసేపు కొనసాగితే 11 గంటల స్లాట్లో ఉన్న అభ్యర్థులకు ఆలస్యం ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పారు. చివరి నిమిషంలో సమావేశాలు, షెడ్యూల్ మార్పులు వంటి కారణాలతో కూడా ఈ సమయానికి అంతరాయాలు ఎక్కువగా ఏర్పడే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంటర్వ్యూ బాగా సాగుతున్నప్పటికీ సమయాభావం వల్ల చర్చను కొనసాగించే అవకాశాలు తగ్గిపోవచ్చని, అవసరమైన ఫాలోఅప్ చర్చలు కూడా భోజనం తర్వాతకు వాయిదా పడే అవకాశం ఉంటుందని తెలిపారు.దీని బదులుగా ఉదయం 8 గంటల నుంచి 9.30 గంటల మధ్య ఇంటర్వ్యూ స్లాట్ లభిస్తే దానిని ఎంచుకోవాలని ఇంగారి సూచించారు. ఆ సమయంలో ఇంటర్వ్యూయర్లు తాజాగా ఉండటంతో పాటు సమావేశాల ఒత్తిడి తక్కువగా ఉంటుందని, ప్రశాంత వాతావరణంలో ఇంటర్వ్యూ జరిగే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని పేర్కొన్నారు.అయితే ఈ సూచనపై నెటిజన్లు ఏకీభవించలేదు. ఇంటర్వ్యూలో విజయాన్ని నిర్ణయించేది సమయం కాదని, అభ్యర్థి సన్నద్ధత, నైపుణ్యాలు, కమ్యూనికేషన్, ఆత్మవిశ్వాసమే కీలకమని చాలామంది యూజర్లు వ్యాఖ్యానించారు. కొందరు తాము 11 గంటల స్లాట్లోనే ఇంటర్వ్యూకు హాజరై ఉద్యోగాలు సాధించామని తెలిపారు. మరోవైపు, ఇంటర్వ్యూలు నిర్వహించే అనుభవం ఉన్న కొందరు రిక్రూటర్లు తమ షెడ్యూల్ బిజీగా ఉండటంతో సమయానికి అంత ప్రాధాన్యం ఇవ్వబోమని వెల్లడించారు.హెచ్ఆర్ నిపుణుల అభిప్రాయం కూడా ఇదే దిశగా ఉంది. ఇంటర్వ్యూ సమయం కొంతమేర ప్రభావం చూపినా, సబ్జెక్ట్ పరిజ్ఞానం, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్, సంస్థ గురించి అవగాహన, ఆత్మవిశ్వాసం వంటి అంశాలే తుది ఎంపికలో ప్రధాన పాత్ర పోషిస్తాయని వారు చెబుతున్నారు. అందువల్ల ఇంటర్వ్యూ సమయం కంటే, అభ్యర్థి పూర్తి స్థాయిలో సిద్ధమై హాజరవడం విజయానికి మరింత కీలకమని నిపుణులు సూచిస్తున్నారు.If HR asks you to choose when to be interviewed, don't choose 11:00 AM.Here's why :— Simons (@Simon_Ingari) June 26, 2026 -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు లీగల్ క్లీన్ చిట్..
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు స్వతంత్ర న్యాయ సమీక్షలో ఊరట లభించింది. మాజీ పార్ట్టైమ్ ఛైర్మన్ అతాను చక్రవర్తి రాజీనామా సందర్భంగా చేసిన పాలన, నైతికతకు సంబంధించిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లభించలేదని రెండు బాహ్య న్యాయ సంస్థలు తేల్చాయి.అమెరికాకు చెందిన ‘విల్సన్ సోన్సిని గుడ్రిచ్ & రొసాటి’ (సంక్షిప్తంగా విల్సన్ సోన్సిని)తో పాటు భారతీయ న్యాయ సంస్థ ‘వాడియా ఘండి & కో’ నిర్వహించిన మూడు నెలల సమీక్షలో బోర్డు సమావేశాల మినిట్స్, కమిటీ రికార్డులు, అధికారిక కమ్యూనికేషన్లు, సంబంధిత పత్రాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించినప్పటికీ చక్రవర్తి చేసిన ఆరోపణలకు మద్దతుగా ఎలాంటి సమకాలీన ఆధారాలు కనిపించలేదని బ్యాంకు స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది.బ్యాంకు తెలిపిన వివరాల ప్రకారం.. సమీక్షలో భాగంగా స్వతంత్ర డైరెక్టర్లు, కమిటీ చైర్మన్లు, ఎండీ-సీఈవో శశిధర్ జగదీశన్తో పాటు సీనియర్ మేనేజ్మెంట్ సభ్యులను ఇంటర్వ్యూ చేశారు. వేలాది పత్రాలు, బోర్డు ఎజెండాలు, సమావేశ మినిట్స్ను పరిశీలించారు. అతాను చక్రవర్తిని కూడా పలుమార్లు విచారణలో పాల్గొనాలని కోరినా, చివరకు ఆయన ఇంటర్వ్యూకు హాజరుకాలేదని బ్యాంకు వెల్లడించింది.మార్చిలో తన రాజీనామా లేఖలో బ్యాంకులో గత రెండేళ్లుగా చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు తన వ్యక్తిగత విలువలు, నైతిక ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నాయని చక్రవర్తి పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దుబాయ్ శాఖకు సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించారు. అయితే ఈ అంశాలపై కూడా అధికారిక రికార్డుల్లో ఆయన అభ్యంతరాలు నమోదు చేసినట్లు లేదా బోర్డు నిర్ణయాలపై అసమ్మతి వ్యక్తం చేసినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని న్యాయ సమీక్ష స్పష్టం చేసింది.బోర్డు స్థాయిలో చర్చించిన అన్ని అంశాలు నిర్దేశిత పాలనా విధానాలకు అనుగుణంగానే నిర్వహించబడ్డాయని, ఎలాంటి కీలక లోపాలు గుర్తించలేదని బ్యాంకు పేర్కొంది. ఈ నివేదికను ఆడిట్ కమిటీ, అనంతరం బోర్డు పరిశీలించనుంది.జగదీశన్ పదవీకాలం పొడిగింపునకు మార్గం సుగమంఈ న్యాయ సమీక్షతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీ, సీఈవో శశిధర్ జగదీశన్ పదవీకాల పొడిగింపు ప్రక్రియకు మార్గం సుగమమైంది. ఆయన ప్రస్తుత పదవీకాలం అక్టోబర్లో ముగియనుండగా, మరోసారి నియామకానికి తనను అందుబాటులో ఉంచినట్లు గతంలో వెల్లడించారు. బోర్డు ఆమోదం అనంతరం సంబంధిత ప్రతిపాదనను ఆర్బీఐకి పంపనున్నారు.చక్రవర్తి ఆకస్మిక రాజీనామా తర్వాత పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొని, బ్యాంకు మార్కెట్ విలువలో సుమారు రూ.1 లక్ష కోట్లకుపైగా క్షీణత నమోదైంది. అనంతరం ఆర్బీఐ బ్యాంకు పాలనపై నమ్మకం వ్యక్తం చేయగా, ఇప్పుడు స్వతంత్ర న్యాయ సమీక్ష కూడా ఎలాంటి పాలనా లోపాలు లేవని తేల్చడంతో ఈ వివాదానికి తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
రూ.7 వేల కోట్ల వేతనం.. ఎవరీ శంఖ్ మిత్ర?
ప్రపంచ కార్పొరేట్ రంగంలో ఇండియన్స్ ప్రతిభ మరోసారి వెలుగులోకి వచ్చింది. భారతీయ మూలాలున్న శంఖ్ మిత్ర ప్రపంచంలోనే రెండో అత్యధిక వేతనం పొందిన సీఈఓగా గుర్తింపు పొందారు. ఈ జాబితాలో మొదటి స్థానంలో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఉండగా, ఆయన తర్వాతి స్థానాన్ని శంఖ్ మిత్ర దక్కించుకోవడం విశేషం.అమెరికాకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అయిన 'వెల్టవర్'కు మిత్రా ప్రధాన కార్యనిర్వాహక అధికారిగా (CEO) బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2025 సంవత్సరానికి ఈయన మొత్తం 821 మిలియన్ డాలర్లు (సుమారు రూ.7,000 కోట్లకు పైగా) వేతనంగా అందుకున్నారు. ఇది గత దశాబ్దంలో ప్రపంచంలోని పబ్లిక్ కంపెనీల సీఈఓలకు ఇచ్చిన అత్యంత భారీ వేతన ప్యాకేజీల్లో ఒకటిగా నిలిచింది.శంఖ్ మిత్రకు లభించిన మొత్తం వేతనంలో దాదాపు 99 శాతం స్టాక్ అవార్డుల రూపంలోనే ఉంది. ముఖ్యంగా 2025 అక్టోబర్లో కంపెనీ ఆయనకు 789 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను ప్రోత్సాహకంగా కేటాయించింది. ఆ షేర్ల విలువ ఏడాది చివరినాటికి 1 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. దీంతో ప్రపంచంలో అత్యధిక పారితోషికం పొందిన సీఈఓల జాబితాలో ఆయన రెండో స్థానంలో నిలిచారు.శంఖ్ మిత్ర వేతనం ప్రపంచంలోని పలువురు ప్రముఖ కంపెనీల సీఈఓల కంటే చాలా ఎక్కువగా ఉంది. గోల్డ్మాన్ సాక్స్ సీఈఓ డేవిడ్ సోలోమన్ 119 మిలియన్ డాలర్లు, పాలో ఆల్టో నెట్వర్క్స్ సీఈఓ నికేశ్ అరోరా 100 మిలియన్ డాలర్లు మాత్రమే వేతనంగా పొందారు. వీరందరినీ అధిగమించి శంఖ్ మిత్ర ప్రత్యేక గుర్తింపు సాధించారు.శంఖ్ మిత్ర భారతదేశంలోని కోల్కతాకు చెందినవారు. ఆయన తన ఇంజినీరింగ్ విద్యను జాదవ్పూర్ విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. అనంతరం అమెరికాలోని కొలంబియా బిజినెస్ స్కూల్లో అప్లైడ్ వ్యాల్యూ ఇన్వెస్టింగ్లో ఎంబీఏ పూర్తి చేసి అంతర్జాతీయ ఆర్థిక రంగంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.తన వృత్తి జీవితాన్ని ప్రైస్వాటర్హౌస్కూపర్స్ (PwC)లో ప్రారంభించిన శంఖ్ మిత్ర, తరువాత ఫిడెలిటీ ఇన్వెస్ట్మెంట్స్, సిటాడెల్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ వంటి ప్రముఖ సంస్థల్లో సీనియర్ విశ్లేషకుడిగా పనిచేశారు. అనంతరం మిలీనియం మేనేజ్మెంట్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పోర్ట్ఫోలియో మేనేజర్గా సేవలందించారు.2016లో వెల్టవర్ సంస్థలో చేరిన ఆయన, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్, వైస్ చైర్మన్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వంటి కీలక పదవులను విజయవంతంగా నిర్వహించారు. చివరకు 2020 అక్టోబర్లో కంపెనీ సీఈఓగా, డైరెక్టర్ల బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు. ఇప్పుడు అత్యధిక వేతనం పొందుతున్న సీఈఓల జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. -
వంతారాకు చేరిన 'మణికీ'.. ఆ ఏనుగుకు ఇక దీర్ఘకాలిక చికిత్సలు
జామ్నగర్: దాదాపు 48 ఏళ్ల వయసున్న ఏనుగు 'మణికీ' జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఎన్నో సంవత్సరాలుగా కాలికి తీవ్ర వైకల్యం, వయోభారంతో వచ్చిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మణికీని అత్యాధునిక వైద్య చికిత్స కోసం గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న ‘వంతారా’కు తరలించారు. ఇకపై ఆ ఏనుగుకు దీర్ఘకాలిక వైద్య సంరక్షణతో పాటు శాశ్వత ఆవాసం కూడా కల్పించనున్నారు.మణికీ ముందు ఎడమ కాలులో చాలా కాలంగా ఉన్న వైకల్యం కారణంగా నడక తీవ్రంగా దెబ్బతింది. దీనికి తోడు ఇన్ఫెక్షన్తో కూడిన గాయాలు, ఒక కంటిలో చూపు మందగించడం, డీహైడ్రేషన్, శరీర బలహీనత వంటి సమస్యలు ఏనుగు ఆరోగ్యాన్ని మరింత క్లిష్టంగా మార్చాయి.అస్సాంలో చికిత్స కోసం తరలిస్తుండగా మణికీ తీవ్ర నొప్పితో కుంటుకుంటూ రహదారిపై నడుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. జంతు సంక్షేమ కార్యకర్తలు, పౌరులు, పలు సంస్థలు ఆ ఏనుగుకు తక్షణ వైద్య సహాయం అందించాలని ప్రభుత్వాలను కోరాయి. పిటిషన్లు దాఖలు చేయడంతో మణికీ పరిస్థితి జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.మణికీకి ప్రత్యేక వైద్య చికిత్స అవసరమని గుర్తించిన దాని యజమాని రుచి చేతియా, బాధిత వన్యప్రాణుల రక్షణ, సంరక్షణ కోసం సుప్రీంకోర్టు నియమించిన కమిటీకి లేఖ రాసి వంతారాకు తరలించేందుకు అనుమతి కోరారు. అనంతరం కమిటీతో పాటు అస్సాం, గుజరాత్ ప్రభుత్వాల నుంచి అవసరమైన అనుమతులు లభించడంతో ఆ ఏనుగును సురక్షితంగా జామ్నగర్కు తరలించారు.అత్యాధునిక చికిత్స.. దీర్ఘకాలిక సంరక్షణవంతారాలోని అత్యాధునిక వెటర్నరీ ఆసుపత్రిలో మణికీకి సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించి, దీర్ఘకాలిక చికిత్స అందించనున్నారు. ప్రారంభ దశలో నొప్పి నివారణ చికిత్స, హైడ్రోథెరపీ, ఆక్యుపంక్చర్, ఇన్ఫెక్షన్తో ఉన్న గాయాలకు ప్రత్యేక వైద్యం, పోషకాహార పునరుద్ధరణ వంటి చర్యలు చేపట్టనున్నట్లు వంతారా ప్రతినిధులు తెలిపారు.అలాగే కాలుపై ఒత్తిడి తగ్గేలా మెత్తని నేల, సహజమైన మట్టి వాతావరణం, నీటిలో విశ్రాంతి తీసుకునేందుకు కుంటలు, సహజంగా ఆహారం వెతుక్కునే అవకాశం, ఇతర ఏనుగుల సాన్నిధ్యం వంటి అనుకూల వాతావరణాన్ని కూడా కల్పించనున్నారు. దీంతో మణికీ ఆరోగ్య పునరుద్ధరణకు అవసరమైన శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.వంతారా ప్రతినిధులు మాట్లాడుతూ, మణికీ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ప్రత్యేక వైద్య పర్యవేక్షణ అత్యవసరమని నిర్ధారణ అయిందన్నారు. చికిత్స ప్రక్రియలో సహకరించిన సంబంధిత ప్రభుత్వ శాఖలకు, సుప్రీంకోర్టు కమిటీకి, అలాగే యజమాని రుచి చేతియాకు కృతజ్ఞతలు తెలిపారు.మణికీ రక్షణ కథనం ప్రజల చొరవ, జంతు సంక్షేమ సంస్థల కృషి, ప్రభుత్వాల సమన్వయం కలిసి ఒక జంతువు జీవితాన్ని ఎలా మార్చగలవో చూపించింది. ఎన్నో రోజులుగా బాధతో సాగిన ఆ ఏనుగు ప్రయాణానికి ఇప్పుడు ముగింపు పలుకుతూ, చికిత్స, సంరక్షణ, ప్రశాంతతతో కూడిన కొత్త జీవితానికి వంతారా వేదికగా మారింది.వంతారా గురించి..వంతారా అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ స్థాపించిన ప్రపంచ స్థాయి జంతు సంక్షేమ, సంరక్షణ కేంద్రం. గాయపడిన, అనారోగ్యంతో ఉన్న అడవి జంతువులను రక్షించడం, వైద్య చికిత్స అందించడం, పునరావాసం కల్పించడం, దీర్ఘకాలిక సంరక్షణ అందించడం దీని ప్రధాన లక్ష్యం. ప్రపంచంలోనే అతిపెద్ద ఏనుగుల ఆసుపత్రుల్లో ఒకటిగా ఉండటమే కాకుండా అత్యాధునిక మల్టీ స్పెషాలిటీ వన్యప్రాణి ఆసుపత్రులను నిర్వహిస్తూ, శాస్త్రీయ విధానాలతో జంతు సంరక్షణ కార్యక్రమాలను చేపడుతోంది. ప్రభుత్వాలు, వివిధ భాగస్వామ్య సంస్థలతో కలిసి వన్యప్రాణుల సంరక్షణకు వంతారా సేవలందిస్తోంది. -
‘ఎయిర్పోర్ట్ సిటీ’లపై రూ. 20 వేల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: భారీ స్థాయిలో చేపడుతున్న ఎయిర్పోర్ట్ సిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టులపై అదానీ ఎయిర్పోర్ట్ (ఏఏసీఎల్) తొలి దశలో రూ. 20,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేయనుంది. ఇందులో అత్యధికంగా 70 శాతాన్ని ముంబై, నవీ ముంబైలో పెట్టుబడులు పెట్టనుంది. ఈ ప్రాంతంలో కంపెనీ చేతిలో దాదాపు 440 ఎకరాల స్థలం ఉంది.ఏఏసీఎల్ అయిదు రాష్ట్రాల్లో ఆరు విమానాశ్రయాలవ్యాప్తంగా 655 ఎకరాల్లో సిటీ ప్రాజెక్టులను చేపడుతోంది. మెట్రో, పట్టణ ప్రాంత రవాణా నెట్వర్క్లతో విమానాశ్రయాలను అనుసంధానం చేసేలా వీటిలో హోటళ్లు, ఆఫీసులు, రిటైల్, ఎంటర్టైన్మెంట్, కన్వెన్షన్ సెంటర్లు మొదలైనవి ఏర్పాటవుతాయి. ముంబై, నవీ ముంబై, అహ్మదాబాద్, లక్నో, జైపూర్, గౌహతి ఎయిర్పోర్టులు ఈ జాబితాలో ఉన్నాయి. -
అమెజాన్ పెట్టుబడుల బూస్ట్
న్యూఢిల్లీ: భారత్లో దీర్ఘకాలిక విస్తరణ వ్యూహంలో భాగంగా టెక్ దిగ్గజం అమెజాన్ కృత్రిమ మేధ (ఏఐ), క్లౌడ్ సదుపాయాలను మరింత పటిష్టం చేసుకోవడంపై దృష్టి పెడుతోంది. ఇందుకోసం తాజాగా 13 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 1.23 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు ప్రకటించింది. దీనితో 2026–30 మధ్య కాలంలో భారత్లో అమెజాన్ పెట్టుబడులు 48 బిలియన్ డాలర్లకు చేరనున్నాయి. గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అనంతరం కంపెనీ సీఈవో ఆండీ జస్సీ ఈ విషయాలు వెల్లడించారు. వ్యాపార వృద్ధికి సంబంధించి భారత్ తమకు కీలక మార్కెట్లలో ఒకటిగా ఉంటోందని ఆయన చెప్పారు. దేశీయంగా ఈ–కామర్స్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) విభాగాలవ్యాప్తంగా కస్టమర్ల నుంచి డిమాండ్ పటిష్టంగా ఉంటోందని జస్సీ వివరించారు. డిజిటల్ వినియోగం, క్లౌడ్–ఏఐ సర్వీసులకు డిమాండ్ పెరుగుతుండటంతో భారత్లో పలు గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజాలు ఇన్వెస్ట్ చేస్తున్న నేపథ్యంలో అమెజాన్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘భారత్లో అమెజాన్ రికార్డు స్థాయిలో 48 బిలియన్ డాలర్ల పెట్టుబడులను స్వాగతిస్తున్నాను. యువతకు దీనితో కొత్త అవకాశాలు లభిస్తాయి‘ అని ఎక్స్లో ప్రధాని మోదీ పోస్ట్ చేశారు. ‘వికసిత్, ఆత్మనిర్భర్ భారత్ సాకారంపై ప్రధాని మోదీ విజన్ మాకు స్ఫూర్తిదాయకం. భారత వృద్ధి గాథలో మేము దీర్ఘకాలిక భాగస్వామిగా ఉండాలని కోరుకుంటున్నాం’ అని జస్సీ పేర్కొన్నారు. 20 ఏళ్లలో 88 బిలియన్ డాలర్లు.. తాజా ఇన్వెస్ట్మెంట్స్ కూడా కలిపి 2010–2030 మధ్య కాలంలో భారత్లో 88 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులు పెట్టినట్లవుతుందని అమెజాన్ తెలిపింది. ఈ ఏడాది కొత్తగా 20 ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు, 100 లాస్ట్–మైల్ డెలివరీ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది. ప్రధానంగా టియర్ 3, టియర్ 4 నగరాల్లో ఇవి రానున్నట్లు తెలిపింది. అలాగే, తమ ఈ–కామర్స్, క్విక్ కామర్స్ నెట్వర్క్కి దన్నుగా ఉంటున్న వేల మంది డెలివరీ ఏజెంట్ల సంక్షేమం కోసం ’సమ్మాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు అమెజాన్ తెలిపింది. భారత్లో కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి 1.2 కోట్ల చిన్న వ్యాపారాలను డిజిటైజ్ చేసినట్లు, 20 బిలియన్ డాలర్లకు పైగా ఈ–కామర్స్ ఎగుమతులు, 28 లక్షల ఉద్యోగాలకు తోడ్పాటు అందించినట్లు అమెజాన్ వివరించింది. అలాగే కోటి మంది భారతీయులకు క్లౌడ్ నైపుణ్యాల్లో శిక్షణ కల్పించినట్లు పేర్కొంది. నిమిషాల్లో డెలివరీ సేవల నెట్వర్క్ను భారీగా విస్తరించే దిశగా 300 పైగా నగరాల్లో అమెజాన్ నౌ సర్వీసులను అందుబాటులోకి తేనున్నట్లు వివరించింది.హైదరాబాద్, ముంబై డేటా సెంటర్ల విస్తరణ.. తాజా పెట్టుబడులతో హైదరాబాద్, ముంబైలోని ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ల సామర్థ్యాన్ని పెంచుకోనున్నట్లు అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది. అంకుర సంస్థలు, ఎంటర్ప్రైజ్లు .. ఆవిష్కరణలను వేగవంతం చేసేందుకు, భారీగా కార్యకలాపాలను విస్తరించేందుకు, అంతర్జాతీయంగా కస్టమర్లకు సేవలందించేందుకు ఉపయోగపడే ఏఐ చిప్లు, మేనేజ్డ్ ఏఐ సర్వీసులు, సురక్షితమైన క్లౌడ్ టెక్నాలజీలు, డెవలపర్ టూల్స్ను మరింత అందుబాటులోకి తేనున్నట్లు వివరించింది. 2030 నాటికి 38 లక్షల కొలువుల కల్పనకు, 80 బిలియన్ డాలర్ల ఈ–కామర్స్ ఎగుమతులకు ఈ పెట్టుబడులు తోడ్పడనున్నట్లు తెలిపింది. 1.5 కోట్ల చిన్న వ్యాపారాలకు, నలభై లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏఐ ప్రయోజనాలు అందుబాటులోకి రాగలవని వివరించింది. నేషనల్ హెల్త్ అథారిటీ, గవర్నమెంట్ ఈ–మార్కెట్ప్లేస్, అపోలో టైర్స్, డెల్హివెరీ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఫిజిక్స్వాలా మొదలైనవి తమ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసులను ఉపయోగించుకుంటున్నట్లు అమెజాన్ పేర్కొంది. -
భారీగా పెరిగిన పాస్పోర్ట్ ఛార్జీలు!
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) 1980 పాస్పోర్ట్ నిబంధనల ప్రకారం ఫీజులను సవరించారు. 2026 జులై 1 నుంచి కొత్త ఫీజులు అమల్లోకి రానున్నాయి. అంటే కొత్తగా పాస్పోర్ట్ కోసం అప్లై చేసేవారు ఎక్కువ ఫీజును చెల్లించాల్సి ఉంటుందన్న మాట.36 పేజీల పాస్పోర్ట్ కోసం ఇప్పుడు రూ.2,500, తత్కాల్ కేటగిరీ కింద రూ.500060 పేజీల పాస్పోర్ట్ కోసం రూ.3,500, తత్కాల్ ప్రాసెసింగ్ కింద రూ. 6,000పాస్పోర్ట్ పోయినప్పుడు లేదా డ్యామేజ్ అయినప్పుడు రీప్లేస్మెంట్ ఖర్చులు కూడా పెరిగాయి. 36 పేజీల పాస్పోర్ట్ రీప్లేస్మెంట్కు సాధారణంగా రూ.5,000, తత్కాల్లో రూ.7,500 చెల్లించాలి. 60 పేజీల రీప్లేస్మెంట్ కోసం రూ.6,000 నుంచి రూ.8,500 వరకు ఫీజు నిర్ణయించారు.ఇతర పాస్పోర్ట్ సంబంధిత సేవలకూ కొత్త ఛార్జీలు నిర్ణయించారు. ఉదాహరణకు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్, సరెండర్ సర్టిఫికేట్లు, గ్లోబల్ ఎంట్రీ ప్రోగ్రామ్ వెరిఫికేషన్, ఇతర సర్టిఫికేట్లతో సహా, పాస్పోర్ట్కు సంబంధించిన వివిధ సేవల కోసం భారతదేశంలో రూ.750 ఫీజు ఉండగా, ఐడెంటిటీ సర్టిఫికెట్కు రూ.1,000 చెల్లించాలి. విదేశాల్లో అవసరమయ్యే ఎమర్జెన్సీ సర్టిఫికెట్ కోసం 15 డాలర్లు, ఐడెంటిటీ సర్టిఫికెట్ కోసం 50 డాలర్ల ఫీజు నిర్ణయించారు. అయితే ఈ సేవలకు తత్కాల్ సౌకర్యం ఉండదు.కొత్త నిబంధనల ప్రకారం పెద్దల పాస్పోర్ట్ 10 సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుంది. మైనర్ల పాస్పోర్ట్ అయితే 5 సంవత్సరాలు లేదా పాస్పోర్ట్ హోల్డర్కు 18 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు, ఈ రెండింటిలో ఏది ముందుగా వస్తే అంతవరకు చెల్లుబాటులో ఉంటాయి.ఇదీ చదవండి: EPFO సేవలకు బ్రేక్.. చందాదారులకు అలర్ట్! -
EPFO సేవలకు బ్రేక్.. చందాదారులకు అలర్ట్!
ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) చందాదారులకు ఒక ముఖ్యమైన సమాచారం అందించింది. సిస్టమ్ను మరింత వేగంగా, సమర్థవంతంగా మార్చేందుకు జూన్ 26 నుంచి జూన్ 28 (మూడు రోజులు) వరకు పోర్టల్లో చాలా సేవలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో వెల్లడించింది.ఈ సమయంలో కొత్త ఈపీఎఫ్ క్లెయిమ్ చేయడం, క్లెయిమ్ల ప్రాసెసింగ్ వంటి సేవలు అందుబాటులో ఉండవు. అంటే.. ఈ మూడు రోజుల్లో పీఎఫ్ డబ్బులు విత్డ్రా చేయాలని లేదా ట్రాన్స్ఫర్ చేయాలని ప్లాన్ చేస్తున్నవారు కాస్త వేచి ఉండాల్సిందే.సేవలు నిలిచే సమయంజూన్ 26, 2026: రాత్రి 12 గంటల నుంచిజూన్ 28, 2026: రాత్రి 11:59 వరకుజూన్ 29 నుంచి సేవలు మళ్లీ ప్రారంభంఈ సమయంలో కొత్త క్లెయిమ్లు చేయలేరు. అంతేకాదు, ఇప్పటికే పెండింగ్లో ఉన్న క్లెయిమ్ల ప్రాసెసింగ్ కూడా తాత్కాలికంగా ఆగిపోతుంది. అయితే క్లెయిమ్లు రద్దు కావని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. అవి కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం మాత్రమే ఉంది. అవసరమైతే సహాయం కోసం EPFO హెల్ప్లైన్ నంబర్ 14470 అందుబాటులో ఉంటుంది. ఈ తాత్కాలిక అంతరాయం వల్ల ఇబ్బంది కలిగినా, భవిష్యత్తులో సేవలు మరింత వేగంగా అందించడానికే ఈ అప్గ్రేడ్ చేస్తున్నామని సంస్థ తెలిపింది.⚠️ Important NoticeServices on Member Portal, Employer Portal & UMANG App will remain temporarily unavailable from 26–30 June 2026 due to scheduled system migration.The upgraded system will deliver faster, more reliable and secure services.#EPFOWithYou #HumHainNa pic.twitter.com/U2VoJVLVEC— EPFO (@officialepfo) June 25, 2026 -
భీమ్ యాప్ కొత్త రికార్డు..ఏడాదిలో మూడు రెట్లు!
ఎన్పీసీఐ భీమ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎన్బీఎస్ఎల్) రూపొందించిన 'భీమ్ (BHIM) పేమెంట్స్ యాప్', గత 12 నెలల్లో పటిష్టమైన వృద్ధిని నమోదు చేసింది. 2025 జూన్, 2026 మే నెల మధ్య కాలంలో ఈ యాప్ ద్వారా లావాదేవీల పరిమాణం మూడు రెట్లకు పైగా పెరిగింది. ఈ యాప్లో నెలవారీ లావాదేవీల సంఖ్య 2025 జూన్లో 7.964 కోట్లుగా ఉండగా, 2026 మే నెల నాటికి అది ఏకంగా 24.4 కోట్లకు చేరుకుంది.ఒక్క 2026 మే నెలలోనే ఈ ప్లాట్ఫామ్ ద్వారా రూ. 26,952 కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. దేశవ్యాప్తంగా రోజువారీ అవసరాల కోసం డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రజలు గణనీయంగా వినియోగిస్తున్నారనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది.జాతీయ ధోరణికి అనుగుణంగానే తెలంగాణలో కూడా భీమ్ యాప్ వృద్ధి నమోదైంది. ఇక్కడ సైతం 2025 జూన్ నుంచి 2026 మే మధ్య లావాదేవీల పరిమాణం మూడు రెట్లు పెరిగింది. 2026 మే నెలలో ఈ యాప్ ద్వారా రాష్ట్రంలో జరిగిన మొత్తం మర్చంట్ లావాదేవీలలో నిత్యావసరాలు 23.9% శాతం వాటాతో మొదటి స్థానంలో ఉండగా, ఫుడ్ అవుట్లెట్స్ (18.1%), క్విక్ కామర్స్ (11.6%) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.ఇవే కాకుండా డెయిరీ అండ్ బేకరీలు (3.2%), పెట్రోల్ బంకులు (2.8%), ఈ-కామర్స్ (2.2%), ప్రభుత్వ సేవలు (2.0%) ఇతర ముఖ్యమైన కేటగిరీలుగా ఉన్నాయి. ఇది రోజువారీ ఖర్చులలో డిజిటల్ చెల్లింపుల ప్రాధాన్యతను స్పష్టం చేస్తోంది. వీటితో పాటు యూపీఐ లైట్, యూపీఐ ఆధారిత రూపే క్రెడిట్ కార్డ్ వంటి సరికొత్త పేమెంట్ విధానాలను కూడా రాష్ట్ర ప్రజలు విస్తృతంగా వాడుతున్నారు.యాప్లోని ముఖ్యమైన ఫీచర్లుయూపీఐ సర్కిల్: ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమకు నమ్మకమైన వ్యక్తులకు నెలకు గరిష్టంగా రూ. 15,000 పరిమితితో, 5 సంవత్సరాల కాలవ్యవధి వరకు తమ ఖాతా నుంచి పేమెంట్స్ చేసుకునే అధికారాన్ని ఇవ్వవచ్చు. దీనికోసం అవతలి వారికి ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతా లేదా యూపీఐ ఐడీ ఉండాల్సిన అవసరం లేదు. దీనివల్ల కుటుంబ సభ్యులు, సిబ్బంది రోజువారీ ఖర్చులను, అన్ని లావాదేవీలను పర్యవేక్షించడం సులువవుతుంది.స్ప్లిట్ ఎక్స్పెన్సెస్: స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి హోటల్కు వెళ్లినప్పుడు, రూమ్ అద్దెలు కట్టినప్పుడు లేదా గ్రూప్ కొనుగోళ్లు చేసినప్పుడు ఆ బిల్లును అందరూ సమానంగా పంచుకుని, నేరుగా యాప్ ద్వారానే ఎవరి వాటా వారు సులభంగా చెల్లించవచ్చు.ఫ్యామిలీ మోడ్: కుటుంబ సభ్యులందరినీ ఒకే చోట చేర్చి, ఉమ్మడి ఖర్చులను ట్రాక్ చేయడానికి మరియు నిర్దిష్ట బిల్లుల చెల్లింపులను కేటాయించడానికి ఇది ఉపయోగపడుతుంది. దీనితో తమ ఖర్చులు ఒకే చోట కనిపించడం వల్ల కుటుంబ ఆర్థిక ప్రణాళిక సులువవుతుంది.స్పెండ్స్ అనలిటిక్స్: ఈ డ్యాష్బోర్డ్ యూజర్ యొక్క నెలవారీ ఖర్చుల విధానాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఖర్చులను ఆటోమేటిక్గా కేటగిరీల వారీగా విభజించి చూపడం ద్వారా, ఎలాంటి క్లిష్టమైన లెక్కలు లేకుండానే బడ్జెట్ను మేనేజ్ చేసుకోవచ్చు.యూపీఐ లైట్ ఆటో-టాప్ అప్: యూపీఐ లైట్ వాలెట్లోని బ్యాలెన్స్ రూ. 200 కంటే తగ్గినప్పుడు, ఈ ఫీచర్ ఆటోమేటిక్గా వాలెట్ను రీఛార్జ్ చేస్తుంది.యూపీఐ బేస్డ్ రూపే క్రెడిట్ కార్డ్: యూజర్లు తమ రూపే క్రెడిట్ కార్డ్ను యూపీఐకి లింక్ చేయడం ద్వారా క్రెడిట్ ఆధారిత లావాదేవీలను సులభంగా జరుపుకోవచ్చు.ఫారెక్స్ పేమెంట్స్: విదేశీ కరెన్సీ (ఫారెక్స్) అవసరమైన వారు భీమ్ యాప్ ద్వారానే నేరుగా బుక్ చేసుకోవచ్చు. వివిధ బ్యాంకుల ధరలను పోల్చి చూసి నచ్చిన ఆప్షన్ను ఎంచుకోవచ్చు. ఈ కరెన్సీని నగదు రూపంలో లేదా డిజిటల్ కరెన్సీ రూపంలో పొందే వీలుంది. -
మోదీని కలిసిన అమెజాన్ సీఈఓ: కీలక ప్రకటన!
ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థల్లో ఇండియా ఒకటి. అందుకే.. దిగ్గజ సంస్థలు భారత మార్కెట్పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. తాజాగా అమెజాన్ కూడా అదే బాటలో మరో అడుగేసింది.అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ తన భారత పర్యటన సందర్భంగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా.. 2030 నాటికి భారతదేశంలో ఏఐ, క్లౌడ్ మౌలిక సదుపాయాల విస్తరణ కోసం అదనంగా 13 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే అమెజాన్ 2025 డిసెంబర్లో 35 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించింది.కొత్త పెట్టుబడులను ప్రకటించిన నేపథ్యంలో ఆండీ జాస్సీ మాట్లాడుతూ.. "మేము దశాబ్దానికి పైగా కాలంగా భారతదేశంలో పనిచేస్తున్నాం. ఈ కామర్స్, క్లౌడ్, ఏఐ రంగాల్లో అద్భుతమైన వృద్ధిని చూశాం. అందుకే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరింత పెట్టుబడి పెడుతున్నాం" అని చెప్పారు.అమెజాన్ లక్ష్యం.. కేవలం వ్యాపారం పెంచుకోవడం మాత్రమే కాదు. భారతదేశంలో చిన్న వ్యాపారాలను డిజిటల్ ప్రపంచంలోకి తీసుకురావడం, ఉద్యోగాలను సృష్టించడం, ఎగుమతులను పెంచడం, ఏఐ సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం కూడా.అమెజాన్ పెట్టుబడులతో 2030 నాటికి భారతదేశంలో.. 38 లక్షలకు పైగా ఉద్యోగాలకు మద్దతు లభించనున్నాయి. 80 బిలియన్ డాలర్ల ఈ-కామర్స్ ఎగుమతులకు సహకారం, 1.5 కోట్ల చిన్న వ్యాపారాలు ఏఐ ప్రయోజనాలు పొందనున్నారు. పైగా 40 లక్షల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏఐ ప్రయోజనాలను అందించనుంది.ఇదీ చదవండి: భారీగా తగ్గిన మస్క్ సంపద: కారణం ఇదే!అమెజాన్ కంపెనీ తన పెట్టుబడిలో భారీ మొత్తాన్ని ఏఐ, క్లౌడ్ రంగానికే కేటాయించనుంది. ఇందులో భాగంగా.. హైదరాబాద్, ముంబైలలో ఉన్న ఏడబ్ల్యుఎస్ డేటా సెంటర్లను మరింత విస్తరించనుంది. దీని వల్ల భారతీయ కంపెనీలు తమ డేటాను దేశంలోనే భద్రంగా నిల్వ చేసుకోవడంతో పాటు అత్యాధునిక ఏఐ టెక్నాలజీలను ఉపయోగించుకోగలుగుతాయి.ఇప్పటికే అనేక భారతీయ సంస్థలు ఏడబ్ల్యుఎస్ సేవలను ఉపయోగిస్తున్నాయి. ఇందులో బ్యాంకులు, స్టార్టప్లు, ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. మొత్తం మీద అమెజాన్ తాజా ప్రకటన.. భారత ఆర్థిక వ్యవస్థకు, ఉద్యోగ అవకాశాలకు, సాంకేతిక అభివృద్ధికి కొత్త ఊపునిచ్చే అవకాశం ఉంది. ఇది ''డిజిటల్ ఇండియా'' లక్ష్యాలను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే మరో కీలక అడుగుగా చెప్పవచ్చు.Really enjoyed my meeting with Prime Minister @narendramodi about what’s ahead for Amazon in India.We’ve been serving customers, sellers, developers, startups, and enterprises in India for more than a decade and just getting started. Shared that we’re investing $48 billion… pic.twitter.com/CSiwPTiEBh— Andy Jassy (@ajassy) June 25, 2026 -
వెయ్యి మైక్రో ఫుల్ఫిల్మెంట్ కేంద్రాలకు ‘ఫ్లిప్కార్ట్ మినిట్స్’
బెంగళూరు: దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్కు చెందిన క్విక్ కామర్స్ సర్వీస్ ‘ఫ్లిప్కార్ట్ మినిట్స్’ ప్రారంభమై రెండేళ్లు కూడా పూర్తికాకముందే దేశవ్యాప్తంగా 1,000 మైక్రో ఫుల్ఫిల్మెంట్ కేంద్రాల మైలురాయిని చేరుకుంది. 2024 ఆగస్టులో ప్రారంభమైన ఈ సర్వీస్ ప్రస్తుతం 130కుపైగా నగరాలు, 8,000కుపైగా పిన్కోడ్లకు విస్తరించింది. నెట్వర్క్ విస్తరణతో గత ఏడాదితో పోలిస్తే ఆర్డర్ల సంఖ్య ఐదు రెట్లు పెరిగింది.ప్రత్యేకంగా టైర్-2, టైర్-3 నగరాల్లో ఫ్లిప్కార్ట్ మినిట్స్కు విశేష ఆదరణ లభిస్తోంది. అంబాలా, ఆరా, బొకారో, దర్భంగా, జోర్హాట్, ఒంగోలు, పూర్ణియా, సహర్సా, తెనాలి వంటి నగరాల్లో డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఈ విభాగాల్లో వ్యాపారం గత ఏడాదితో పోలిస్తే 42 రెట్లు విస్తరించినట్లు సంస్థ వెల్లడించింది. గత ఏడాదిలోనే 90కుపైగా కొత్త నగరాలను తన నెట్వర్క్లో చేర్చుకుంది.సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. జెన్-జీ వినియోగదారులు అత్యంత వేగంగా పెరుగుతున్న కస్టమర్ వర్గంగా నిలిచారు. ప్రస్తుతం మొత్తం వినియోగదారుల్లో 40 శాతానికి పైగా ఈ వర్గానికే చెందినవారు. కేవలం నిత్యావసర వస్తువులకే పరిమితం కాకుండా ఎలక్ట్రానిక్స్, బ్యూటీ, వెల్నెస్, లైఫ్స్టైల్ ఉత్పత్తులను కూడా వేగంగా ఆర్డర్ చేస్తున్నారు. పండ్లు, కూరగాయల విభాగంలో సగటు ఆర్డర్ విలువ 30 శాతం పెరగగా, పునరావృత కొనుగోళ్లు 20 శాతానికి పైగా వృద్ధి చెందాయి. ప్రస్తుతం 250కుపైగా ఉత్పత్తి విభాగాల్లో సేవలు అందిస్తోంది.ఫ్లిప్కార్ట్ మినిట్స్ 500కుపైగా డీ2సీ బ్రాండ్లతో భాగస్వామ్యం కలిగి ఉండగా, ‘సమర్థ్ కృషి’ కార్యక్రమం ద్వారా 3,000కుపైగా రైతులను మార్కెట్తో అనుసంధానిస్తోంది. అలాగే విద్యుత్ వాహనాల వినియోగాన్ని రెట్టింపు చేసి, 10 శాతానికి పైగా డెలివరీలను గ్రీన్ డెలివరీలుగా నిర్వహిస్తున్నట్లు సంస్థ తెలిపింది. -
‘ట్రెంట్’లో ముగింపునకు నోయల్ టాటా శకం
న్యూఢిల్లీ: రిటైల్ సంస్థ ‘ట్రెంట్’ ప్రస్థానంలో నోయల్ టాటా శకం ముగింపునకు చేరింది. ఈ ఏడాది నవంబర్లో ఆయనకు 70 ఏళ్లు నిండుతాయి. దీంతో ట్రెంట్ చైర్మన్గా తప్పుకోనున్నారు. కంపెనీ చైర్మన్గా 74వ ఏజీఎం (వాటాదారుల సమావేశం) తనకు చివరిదంటూ ప్రకటించారు. బెంగళూరులో ఒక స్టోర్తో మొదలు పెట్టగా, నేడు దేశవ్యాప్తంగా 1200పైగా స్టోర్లతో దిగ్గజ రిటైల్ సంస్థల్లో ఒక్కటిగా ట్రెంట్ ఎదగడంలో ప్రధాన పాత్ర అంతా నోయల్ టాటాదేనని చెప్పుకోవాలి.ట్రెంట్ కింద జూడియో, వెస్ట్సైడ్, స్టార్ బజార్ తదితర గొలుసు దుకాణ సంస్థలు నడుస్తున్నాయి. కంపెనీ ఏజీఎంలో భాగంగా వాటాదారులను ఉద్దేశించి నోయల్ టాటా ప్రసంగించారు. వాటాదారులు, ఉద్యోగులు, భాగస్వాములకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. దీర్ఘకాలంలో విలువ సృష్టించడంలోనూ.. స్పష్టమైన దృష్టితో, బలమైన, చెక్కుచెదని రిటైల్ ప్లాట్ఫామ్గా ట్రెంట్ అవతరించినట్టు చెప్పారు. 2014లో బాధ్యతలు.. తన తల్లి సిమోన్ టాటా ఏర్పాటు చేసిన ట్రెంట్లో 2010 ఆగస్ట్ 19న బోర్డు సభ్యుడిగా నోయల్ టాటా చేరారు. లాక్మే వ్యాపారాన్ని హిందుస్థాన్ యూనిలీవర్కు విక్రయించిన అనంతరం సిమోన్ టాటా ట్రెంట్ను ఏర్పాటు చేశారు. 1998 బెంగళూరులోని కమర్షియల్ స్ట్రీట్లో వెస్ట్సైడ్ స్టోర్తో ఇది అవతరించింది. ఎఫ్కే కవరణ రిటైర్మెంట్తో 2014 మార్చి 31న సంస్థ చైర్మన్ బాధ్యతలు నోయల్ టాటా చేతికి వెళ్లాయి.నేడు 321 పట్టణాల్లో 1,286 స్టోర్లను నిర్వహిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.20,074 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయాన్ని, రూ.1,721 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. సంస్థ ఇంకా ఆరంభ దశలోనే ఉందంటూ, దీర్ఘకాలంలో వృద్ధి అవకాశాల పట్ల నమ్మకాన్ని నోయల్ టాటా వ్యక్తం చేశారు. భారత్లోనే కాకుండా, విదేశాల్లోనూ తమ బ్రాండ్ల విక్రయాలకు చక్కని అవకాశాలున్నట్టు చెప్పారు. తద్వారా అంతర్జాతీయంగానూ విస్తరించనున్నట్టు ఆయన సందేశమిచ్చారు. -
అందుకు పాస్పోర్ట్ ప్రూఫ్ కాదు
భారతీయ పాస్పోర్ట్ అనేది ప్రధానంగా అంతర్జాతీయ ప్రయాణం కోసం జారీ చేసే పత్రం మాత్రమేనని, దానిని భారత పౌరసత్వానికి తుది రుజువుగా పరిగణించరాదని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) స్పష్టం చేసింది. 14వ పాస్పోర్ట్ సేవా దివస్ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో అధికారులు ఈ వివరణ ఇచ్చారు. ఇటీవల పాస్పోర్ట్, ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు వంటి పత్రాలు పౌరసత్వానికి ఆధారమా కాదా అనే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.అధికారుల ప్రకారం, పాస్పోర్ట్ జారీకి ముందు వివిధ ప్రభుత్వ సంస్థల ద్వారా విస్తృత స్థాయిలో ధ్రువీకరణ ప్రక్రియ నిర్వహించినప్పటికీ, దాని ప్రధాన ఉద్దేశం విదేశీ ప్రయాణాలను సులభతరం చేయడం, విదేశాల్లో వ్యక్తి జాతీయతను నిర్ధారించడం మాత్రమే. అందువల్ల పాస్పోర్ట్ను పౌరసత్వ ధ్రువీకరణ పత్రంగా చూడరాదని వారు స్పష్టం చేశారు.మరి పౌరసత్వానికి ఆధారం ఏమిటి?భారత పౌరసత్వం 1955 పౌరసత్వ చట్టం ప్రకారం జననం, వంశపారంపర్యం, నమోదు, సహజీకరణ (నేచురలైజేషన్) లేదా భూభాగ విలీనాల ద్వారా లభిస్తుంది. పౌరసత్వ ధ్రువీకరణ పత్రం (Citizenship Certificate) ఉంటే దాన్ని ప్రత్యక్ష ఆధారంగా పరిగణిస్తారు. అయితే ప్రతి భారతీయుడి వద్ద అలాంటి పత్రం ఉండదు. జనన ధ్రువీకరణ పత్రం, తల్లిదండ్రుల పౌరసత్వానికి సంబంధించిన రికార్డులు, నమోదు లేదా నేచురలైజేషన్ పత్రాలు వంటి ఆధారాలు పరిస్థితులను బట్టి పౌరసత్వ నిర్ధారణలో ఉపయోగపడతాయి.సుప్రీంకోర్టు కూడా గతంలో ఆధార్ కార్డు కేవలం గుర్తింపు పత్రమేనని, అది పౌరసత్వానికి రుజువు కాదని స్పష్టం చేసింది. ఇదే విధంగా ఓటరు గుర్తింపు కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలు కూడా స్వతంత్రంగా పౌరసత్వాన్ని నిర్ధారించవని న్యాయపరమైన అభిప్రాయాలు ఉన్నాయి.వేగవంతమైన పాస్పోర్ట్ సేవలుపాస్పోర్ట్ సేవల్లో దేశవ్యాప్తంగా గణనీయమైన పురోగతి సాధించినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం అనేక సాధారణ దరఖాస్తులు ఐదు పని దినాల్లోనే పూర్తి అవుతున్నాయి. పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో దరఖాస్తుదారులు గడిపే సగటు సమయం 45 నిమిషాల కంటే తక్కువకు తగ్గినట్లు అధికారులు తెలిపారు.దేశవ్యాప్తంగా ప్రస్తుతం 545 పాస్పోర్ట్ సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయి. మరో 20 కేంద్రాలను ఈ ఏడాది ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2027 నాటికి ప్రతి లోక్సభ నియోజకవర్గంలో కనీసం ఒక పాస్పోర్ట్ సేవా కేంద్రం అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతోంది. మారుమూల ప్రాంతాల్లో ప్రత్యేక మొబైల్ బృందాల ద్వారా సేవలను విస్తరిస్తోంది.ఈ-పాస్పోర్ట్లుగత ఏడాది నుంచి చిప్ ఆధారిత ఈ-పాస్పోర్ట్ల జారీని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. బయోమెట్రిక్ సమాచారంతో కూడిన ఎలక్ట్రానిక్ చిప్లు, అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) ప్రమాణాలకు అనుగుణంగా ఉండటంతో భద్రత మరింత బలపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటివరకు కోట్ల సంఖ్యలో ఈ-పాస్పోర్ట్లు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
చమురు ధరలు తగ్గినా.. పెట్రోల్, డీజిల్ ఇలా..
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గినా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ఉపశమనం కనిపించలేదు. అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుముఖం పట్టడం, చమురు సరఫరాపై ఉన్న ఆందోళనలు సడలడం వల్ల బ్రెంట్ క్రూడ్ ధర యుద్ధానికి ముందు స్థాయికి చేరుకుంది. గురువారం ట్రేడింగ్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు సుమారు 72.5 డాలర్ల వద్ద, అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ 69 డాలర్లకు సమీపంలో ట్రేడయ్యాయి.అయితే ఈ పరిణామాల ప్రభావం దేశీయ ఇంధన ధరలపై ఇంకా పడలేదు. ప్రభుత్వ చమురు మార్కెటింగ్ సంస్థలు (ఓఎంసీలు) జూన్ 25న కూడా పెట్రోల్, డీజిల్ ధరలను యథాతథంగా కొనసాగించాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.102.12, డీజిల్ ధర రూ.95.20గా కొనసాగుతున్నాయి.గత నెలలో పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఎగసిపడటంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగు విడతల్లో పెరిగాయి. మే 15 నుంచి మే 25 మధ్య పెట్రోల్పై మొత్తం రూ.7.35, డీజిల్పై రూ.7.53 వరకు పెంపు జరిగింది. దీంతో నాలుగేళ్ల తర్వాత ఢిల్లీలో పెట్రోల్ ధర మళ్లీ రూ.100 మార్కును దాటింది.అయితే తాజాగా చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో వినియోగదారులు ధరల కోత కోసం ఎదురుచూస్తున్నారు. కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇటీవల స్పందిస్తూ, తక్కువ ధరలకు కొనుగోలు చేసిన ముడి చమురు రిఫైనరీలకు చేరిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలపై సానుకూల ప్రభావం కనిపించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే తుది నిర్ణయం అంతర్జాతీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.ప్రధాన నగరాల్లో ఇంధన ధరలుహైదరాబాద్లో పెట్రోల్ రూ.115.73, డీజిల్ రూ. 103.82ఢిల్లీలో పెట్రోల్ రూ.102.12, డీజిల్ రూ. 95.20ముంబైలో పెట్రోల్ రూ.111.21, డీజిల్ రూ. 97.83కోల్కతాలో పెట్రోల్ రూ.113.51, డీజిల్ రూ. 99.82చెన్నైలో పెట్రోల్ రూ.108.01, డీజిల్ రూ. 99.66బెంగళూరులో పెట్రోల్ రూ.110.89, డీజిల్ రూ. 98.80చమురు ధరలు మరింత కాలం తక్కువ స్థాయిలో కొనసాగితే, చమురు సంస్థలపై ఉన్న ఒత్తిడి తగ్గి దేశీయ ఇంధన ధరల్లోనూ తగ్గుదల వచ్చే అవకాశముందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ప్రస్తుతం మాత్రం వినియోగదారులకు వెంటనే ఉపశమనం లభించే సూచనలు కనిపించడం లేదు. -
300 నగరాలకు ‘అమెజాన్ నౌ’ విస్తరణ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 300 నగరాలకు తన క్విక్ కామర్స్ సర్వీస్ ‘అమెజాన్ నౌ’ను విస్తరించనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. ఈ విస్తరణతో భారతదేశంలోనే అతిపెద్ద ‘నిమిషాల్లో డెలివరీ’ నెట్వర్క్ను నిర్మించాలన్న లక్ష్యంతో సంస్థ ముందుకు సాగుతోంది. ప్రారంభించినప్పటి నుంచి ప్రతి త్రైమాసికంలో అమెజాన్ నౌ ఆర్డర్లు రెట్టింపు అవుతున్నాయని, దీంతో ఇది అమెజాన్ ఇండియా చరిత్రలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ-కామర్స్ వ్యాపార విభాగంగా నిలిచిందని కంపెనీ తెలిపింది.ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, పుణె, హైదరాబాద్, అమృత్సర్, కొచ్చి తదితర 15కు పైగా మెట్రో, నాన్-మెట్రో నగరాల్లో అమెజాన్ నౌ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే 5 కోట్లకు పైగా వినియోగదారులకు ఈ సేవ చేరువైంది. కిరాణా వస్తువులు, పండ్లు, కూరగాయలు, ఫ్రోజెన్ ఫుడ్, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, ఫ్యాషన్, బ్యూటీ ఉత్పత్తులు, చిన్న గృహోపకరణాలు, కిచెన్ వస్తువులు తదితర వేలాది ఉత్పత్తులను నిమిషాల్లోనే వినియోగదారులకు అందిస్తోంది. భారత్ పర్యటనకు వచ్చిన కంపెనీ సీఈఓ ఆండీ జెస్సీ ముంబైలోని అమెజాన్ మైక్రో ఫుల్ఫిల్మెంట్ సెంటర్ను సందర్శించారు.దేశవ్యాప్తంగా వినియోగదారుల అవసరాలను మరింత వేగంగా తీర్చేందుకు మైక్రో ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు, అర్బన్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్ల నెట్వర్క్ను విస్తరించాలని అమెజాన్ యోచిస్తోంది. ప్రస్తుతం లక్షల సంఖ్యలో ఉత్పత్తులను అదే రోజు లేదా మరుసటి రోజు డెలివరీ చేయగల సామర్థ్యాన్ని సంస్థ కలిగి ఉందని వెల్లడించింది.ఇదే సందర్భంగా డెలివరీ అసోసియేట్ల సంక్షేమం కోసం ‘సమ్మాన్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా అమెజాన్ ప్రారంభించింది. ఇటీవల ప్రకటించిన 30 కోట్ల డాలర్ల పెట్టుబడిలో భాగాన్ని ఈ కార్యక్రమం విస్తరణకు వినియోగించనుంది. ఇందులో డెలివరీ సిబ్బంది పిల్లలకు విద్యా స్కాలర్షిప్లు, ఆరోగ్య, జీవిత బీమా, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రాప్యత, ఆర్థిక చేరిక కార్యక్రమాలు, రోడ్డు భద్రతా చర్యలు వంటి పలు ప్రయోజనాలు అందించనున్నారు. అలాగే ఈ ఏడాదిలో ‘ఆశ్రయ్’ విశ్రాంతి కేంద్రాల సంఖ్యను 250కు పెంచి, పరిశ్రమలోని అన్ని డెలివరీ అసోసియేట్లకు అందుబాటులో ఉంచనున్నట్లు అమెజాన్ వెల్లడించింది. -
పసిడి, వెండి వెనకడుగు
న్యూఢిల్లీ: బంగారం, వెండి మళ్లీ నష్టాల బాట పట్టాయి. డాలర్ బలపడడం వీటిల్లో అమ్మకాలకు దారితీసింది. అధిక వడ్డీ రేట్లు కొనసాగుతాయన్న అంచనాలు, యూఎస్ డాలర్ బలంగా ఉండడం వంటివి పసిడి, వెండిలో అమ్మకాలకు దారితీసినట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ వెల్లడించారు. పసిడి 10 గ్రా.కు రూ.3,000 తగ్గి రూ.1,49,300 స్థాయికి పరిమితమైంది.వెండి అయితే కిలోకి ఏకంగా రూ.10,500 నష్టపోయి రూ.2,35,000 స్థాయికి దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 70 డాలర్లు పడిపోయి (2 శాతం) 4,121 స్థాయికి, వెండి 4 శాతం నష్టంతో 62.27 డాలర్ల స్థాయికి దిగొచ్చాయి. అమెరికా–ఇరాన్ మధ్య చర్చల్లో పురోగతితో ముందు రోజు పసిడి, వెండి లాభపడగా, తిరిగి వడ్డీరేట్లపై ప్రతికూల అంచనాలతో అమ్మకాలు ఎదురైనట్టు కోటక్ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ ఏవీపీ కేనత్ చైన్వాలా వివరించారు. -
IRCTC చైర్మన్ రాజీనామా
1990 బ్యాచ్కు చెందిన ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసెస్ అధికారి సంజయ్ కుమార్ జైన్, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు.సంజయ్ కుమార్ జైన్ రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది, కానీ ఆయన 2026 జూలై 20 వరకు తన పదవిలో కొనసాగుతారు. 2024 ఫిబ్రవరి 14న ఐఆర్సీటీసీ సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన జైన్ నాయకత్వంలో.. సంస్థ టికెట్ బుకింగ్, పర్యాటక సేవలు, క్యాటరింగ్తో సహా వివిధ రంగాలలోకి విస్తరించింది.విలక్షణమైన మార్కెటింగ్ కార్యక్రమాల ద్వారా విలాసవంతమైన రైలు 'మహారాజాస్ ఎక్స్ప్రెస్'కు ఒక కొత్త కోణాన్ని ఇవ్వడంలో జైన్ కీలక పాత్ర పోషించారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో విమానాశ్రయ లాంజ్ల తరహాలో భారతదేశపు మొట్టమొదటి 'ఎగ్జిక్యూటివ్ లాంజ్'ను ప్రారంభించడంలో కూడా ప్రమేయం కీలకం. ఈయన నాయకత్వంలో ఐఆర్సీటీసీ పర్యాటక వ్యాపారం భారీగా వృద్ధి చెందింది.జైన్ చేసిన సేవలకు గాను, రైల్వే మంత్రిత్వ శాఖ ఆయనను రెండుసార్లు సత్కరించింది. భారతీయ రైల్వేలో అత్యున్నత పురస్కారమైన 'రైల్వే మంత్రి పురస్కారం' ఆయన విశిష్ట సేవలకు గాను ప్రదానం చేశారు. -
టెలికం కంపెనీలకు రూ.1.05 లక్షల కోట్లు!
టెలికం కంపెనీలు ఆదాయం పరంగా మార్చి క్వార్టర్లో మరో రికార్డు నమోదు చేశాయి. మార్చి త్రైమాసికంలో రూ.1.05 లక్షల కోట్ల స్థూల ఆదాయాన్ని ఇవి ఆర్జించాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో (రూ.98,250 కోట్లు) పోల్చితే 6.9 శాతం అధికంగా ఆదాయాన్ని సమకూర్చుకున్నట్టు ట్రాయ్ విడుదల చేసిన డేటా స్పష్టం చేస్తోంది.సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) మార్చి క్వార్టర్లో 9.45 శాతం పెరిగి రూ.86,716 కోట్లకు చేరింది. ఇది అంతకుముందు ఏడాది ఇదే కాలంలో రూ.79,226 కోట్లుగా ఉంది. ప్రభుత్వానికి చెల్లించిన లైసెన్స్, స్పెక్ట్రమ్ ఫీజులు కూడా కలిపినదే ఏజీఆర్. మొత్తం ఏజీఆర్లో 83.59 శాతం వాటా టాప్-3 సంస్థలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాల నుంచే సమకూరింది.ఇందులో రూ.32,468 కోట్లతో రిలయన్స్ జియో అగ్రస్థానంలో ఉంది. రూ.28,773 కోట్లతో భారతీ ఎయిర్టెల్, రూ.8,195 కోట్లతో వొడాఫోన్ ఐడియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్ ఏజీఆర్ మాత్రం 6.19 శాతం తగ్గి రూ.2,101 కోట్లుగా ఉంది. ఎంటీఎన్ఎల్ ఏజీఆర్ రూ.333 కోట్లుగా నమోదైంది. ప్రభుత్వానికి లైనెన్స్ ఫీజుల ఆదాయం 9.41 శాతం పెరిగి రూ.6,936 కోట్లు, స్పెక్ట్రమ్ వినియోగ చార్జీ 1.68 శాతం పెరిగి రూ.1,017 కోట్లు సమకూరింది. -
మెటా షాక్.. ఉద్యోగుల డేటా లీక్!
ప్రముఖ టెక్ దిగ్గజం మెటా (Meta) మరోసారి ప్రైవసీ అండ్ సెక్యూరిటీ సమస్యల కారణంగా వార్తల్లో నిలిచింది. కంపెనీ, ఉద్యోగుల కంప్యూటర్ యాక్టివిటీని ట్రాక్ చేసి ఏఐ ట్రైనింగ్ కోసం ఉపయోగిస్తున్న ఒక ప్రాజెక్ట్ను తాత్కాలికంగా నిలిపివేసింది. దీనికి కారణం.. ఉద్యోగులకు సంబంధించిన సున్నితమైన సమాచారం మొత్తం కంపెనీ అంతటా అందుబాటులోకి వచ్చినట్లు తెలియడమే.మెటా కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో తన AI సిస్టమ్స్ను మెరుగుపరచడానికి మోడల్ క్యాపబిలిటీ ఇనిషియేటివ్ (MCI)ను తీసుకొచ్చింది. దీనిద్వారా ఉద్యోగులు రోజూ కంప్యూటర్లో చేసే పనుల డేటాను సేకరించేవారు. ఉదాహరణకు కీబోర్డ్ టైపింగ్, మౌస్ కదలికలు, క్లిక్స్ సమాచారం వంటివి.ప్రైవేట్ చాట్స్ లీక్ఇక్కడొచ్చిన సమస్య ఏమిటంటే.. లీకైన డేటాలో ఉద్యోగుల ప్రైవేట్ చాట్స్, పనితీరుకు సంబంధించిన సమాచారం, ట్రాన్స్క్రిప్షన్లు వంటివి ఉండటం, ఇవి సంస్థలో పనిచేసే అందరికి కనిపించడం. దీంతో కంపెనీ వెంటనే ప్రాజెక్ట్ను ఆపేసింది. అయితే.. ఈ లీక్పై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కంపెనీ అధికార ప్రతినిధులు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు డేటా దుర్వినియోగం జరిగినట్లు ఆధారాలు లేవని చెప్పారు. అయినప్పటికీ పూర్తి విచారణ కోసం ప్రోగ్రామ్ను నిలిపివేస్తున్నామని స్పష్టం చేశారు. అయితే ఈ సమస్య సీరియస్ ఇష్యూ కేటగిరీలోకి వస్తుందని పలువురు పేర్కొన్నారు.ప్రస్తుతం ఈ ఘటన ఉద్యోగుల్లో అసంతృప్తిని కలిగించింది. ఎందుకంటే.. మొదట ఈ డేటా పూర్తిగా సురక్షితంగా ఉంటుందని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు అది అందరికీ కనిపించడం పెద్ద తప్పిదమని వారు విమర్శించారు. కాగా.. ఇటీవల కాలంలో మెటా ఏఐ సిస్టమ్స్కు సంబంధించిన మరికొన్ని సెక్యూరిటీ సమస్యలు కూడా బయటపడ్డాయి. ఇందులో ఇన్స్టాగ్రామ్ ఖాతాలు హ్యాక్ కావడం వంటివి ఉన్నాయి.ఏఐ ప్రాజెక్ట్ ఉద్దేశ్యంనిజానికి మెటా ఈ ఏఐ ప్రాజెక్ట్ ప్రారంభించడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే.. మనుషులు కంప్యూటర్ను ఎలా వాడతారో ఏఐకి నేర్పించడం. తద్వారా ఏఐ ఏజెంట్లు రోజువారీ పనుల్లో మరింత సహాయం చేయగలవు అని కంపెనీ భావించింది. కానీ ఇప్పుడు లీక్ సమస్య తెరమీదకు రావడంతో ప్రాజెక్ట్ ఆగిపోయింది.ఇదీ చదవండి: మెటా కీలక నిర్ణయం.. భారతీయుడికి వాట్సాప్ పగ్గాలు! -
మెటా కీలక నిర్ణయం.. భారతీయుడికి వాట్సాప్ పగ్గాలు!
ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలలో ఒకటైన మెటా.. భారతీయ ఫిన్టెక్ సంస్థలో సుమారు 900 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 8,550 కోట్లు) పెట్టుబడి పెట్టినట్లు ప్రకటించింది. ఈ ఒప్పందంతో పాటు క్రెడ్ ఫౌండర్ 'కునాల్ షా'ను వాట్సాప్ కొత్త అధిపతిగా నియమితులయ్యారు. ఏడేళ్లుగా ఈ మెసేజింగ్ ప్లాట్ఫామ్కు నాయకత్వం వహించిన విల్ క్యాత్కార్ట్ (Will Cathcart) స్థానాన్ని ఆయన భర్తీ చేయనున్నారు.మెటా సంస్థ క్రెడ్లో సుమారు 20 శాతం మైనారిటీ వాటాను పొందనుంది. ఈ డీల్ తర్వాత క్రెడ్ కంపెనీ విలువ సుమారు 4.5 బిలియన్ డాలర్లు (రూ. 43,239 కోట్లు)గా అంచనా వేశారు. ఈ నిధులు కొత్త షేర్ల కొనుగోలు, ఇప్పటికే ఉన్న షేర్ల కొనుగోలు రూపంలో సమకూరుతున్నాయి.ఈ ఒప్పందంలో.. అత్యంత ఆసక్తికరమైన అంశం కునాల్ షా కొత్త బాధ్యత. ఆయన క్రెడ్ సీఈఓ పదవి నుంచి తప్పుకుని మెటా గ్లోబల్ లీడర్షిప్ టీమ్లో చేరనున్నారు. వాట్సప్ను తదుపరి దశకు తీసుకెళ్లడం, ప్రకటనలు, సబ్స్క్రిప్షన్ సేవలు, ఏఐ ఆధారిత ఫీచర్ల ద్వారా ఆదాయాన్ని పెంచడం ఆయన ప్రధాన బాధ్యతలుగా ఉంటాయి. కాగా వాట్సప్ను గత ఏడు సంవత్సరాలుగా నడిపించిన విల్ క్యాథ్కార్ట్, మెటాలోనే కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టులపై పనిచేయనున్నారు.కునాల్ షా వైదొలగడంతో, 2020 నుంచి కంపెనీ ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న మిటెన్ సంపత్ తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. భవిష్యత్తులో స్టాక్ మార్కెట్లో లిస్టింగ్కు సిద్ధమవుతున్న నేపథ్యంలో క్రెడ్ కొత్త శాశ్వత నాయకత్వ నిర్మాణంపై పనిచేస్తోంది.ఇదీ చదవండి: హెచ్చరిక.. వెలుగులోకి కొత్త స్కామ్!2018లో ప్రారంభమైన CRED మొదట క్రెడిట్ కార్డు బిల్లులను సమయానికి చెల్లించే వినియోగదారులకు రివార్డులు అందించే ప్లాట్ఫారమ్గా మొదలైంది. తర్వాత ఇది చెల్లింపులు, లోన్స్, ఇన్సూరెన్స్, సంపద నిర్వహణ, లైఫ్స్టైల్ సేవలు వంటి అనేక రంగాలకు విస్తరించింది. ప్రస్తుతం క్రెడ్కు 1.7 కోట్లకు పైగా నెలవారీ యాక్టివ్ సభ్యులు ఉన్నారు. భారతదేశంలోని మొత్తం క్రెడిట్ కార్డు బిల్ చెల్లింపుల్లో 40 శాతానికి పైగా ఈ ప్లాట్ఫారమ్ ద్వారా జరుగుతున్నట్లు కంపెనీ తెలిపింది.It’s been a minute. 2015–2018- Exited FreeCharge. Spent time learning and investing.- Pondered about: Why can't trust be rewarded? Started with $1M of personal capital.- Launched CRED to reward people for paying credit card bills on time.2019–2025- Built a system run by a…— Kunal Shah (@kunalb11) June 22, 2026 -
జపాన్ వెళ్లాలంటే ఇక మరింత ఖర్చు..
జపాన్కు వెళ్లాలనుకునే విదేశీ ప్రయాణికులకు అదనపు భారం పడనుంది. దాదాపు 48 ఏళ్ల తర్వాత తొలిసారిగా జపాన్ ప్రభుత్వం వీసా ఫీజులను భారీగా పెంచాలని నిర్ణయించింది. కొత్త రుసుములు జూలై 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నిర్ణయంతో సింగిల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎంట్రీ వీసాల ఖర్చు ఐదు రెట్లు పెరగనుంది.ప్రస్తుతం సింగిల్ ఎంట్రీ వీసాకు 3,000 యెన్లు వసూలు చేస్తుండగా, జూలై నుంచి అది 15,000 యెన్లకు పెరగనుంది. అలాగే మల్టిపుల్ ఎంట్రీ వీసా ఫీజు 6,000 యెన్ల నుంచి 30,000 యెన్లకు చేరుకోనుంది. భారత కరెన్సీలో చూస్తే సింగిల్ ఎంట్రీ వీసా ఖర్చు సుమారు రూ.1,750 నుంచి రూ.8,750 వరకు, మల్టిపుల్ ఎంట్రీ వీసా రూ.3,500 నుంచి రూ.17,500 వరకు పెరగనుంది.జపాన్ విదేశాంగ మంత్రి తొషిమిత్సు మొతెగి మాట్లాడుతూ, 1978లో నిర్ణయించిన వీసా ఫీజులు ఇప్పటి ద్రవ్యోల్బణం, మారకపు విలువల మార్పులను ప్రతిబింబించడం లేదని తెలిపారు. పెరుగుతున్న పరిపాలనా వ్యయాలు, బలహీనపడిన యెన్, విదేశీ సందర్శకుల సంఖ్యలో భారీ వృద్ధి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అయితే ఈ పెంపు వల్ల పర్యాటకుల రాకపై తక్షణ ప్రభావం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది.కోవిడ్ అనంతరం జపాన్లో పర్యాటక రంగం వేగంగా పుంజుకుంది. బలహీనమైన యెన్ కారణంగా విదేశీయులకు జపాన్ ప్రయాణం చౌకగా మారడంతో అంతర్జాతీయ సందర్శకుల సంఖ్య రికార్డు స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో వీసా ఫీజులను ఇతర జీ-7 దేశాల స్థాయికి అనుగుణంగా పెంచాలని జపాన్ ప్రభుత్వం నిర్ణయించింది.ఇదిలా ఉండగా, విదేశీయుల నివాస సంబంధిత దరఖాస్తులపై కూడా ప్రభుత్వం అధిక రుసుములు విధించేందుకు చట్టసవరణలు చేపట్టింది. శాశ్వత నివాస అనుమతి దరఖాస్తుల గరిష్ట రుసుము 10,000 యెన్ల నుంచి 300,000 యెన్ల వరకు పెంచే అవకాశం ఉంది. అలాగే నివాస హోదా మార్పు, గడువు పొడిగింపు వంటి సేవలపై గరిష్ట రుసుమును 100,000 యెన్ల వరకు పెంచే ప్రతిపాదనలు ఆమోదం పొందాయి.అయితే భారతీయుల విషయంలో ఈ కొత్త ఫీజులు పూర్తిగా వర్తిస్తాయా లేదా అన్న అంశంపై ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతం భారతదేశంలో జపాన్ వీసాల కోసం ప్రత్యేక రుసుము విధానం అమల్లో ఉండటంతో, జపాన్ రాయబార కార్యాలయం లేదా వీసా సేవా సంస్థల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
నీతా అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్.. 130 ఎకరాల్లో కోస్టల్ రోడ్ గార్డెన్స్
ముంబై నగరాన్ని పచ్చదనంతో నింపే బృహత్తర ప్రాజెక్ట్కు రిలయన్స్ ఫౌండేషన్ శ్రీకారం చుట్టింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)లో రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ ‘ముంబై కోస్టల్ రోడ్ గార్డెన్స్’ ప్రాజెక్ట్ పురోగతిని వెల్లడించారు. నగర తీరప్రాంతంలో 130 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాజెక్ట్ను ముంబై భవిష్యత్తుకు అంకితమైన దీర్ఘకాలిక పర్యావరణ పెట్టుబడిగా ఆమె అభివర్ణించారు.ఈ గార్డెన్స్లో 60,000కు పైగా చెట్లు, లక్షలాది పొదలను నాటే ప్రణాళిక ఉంది. ఇప్పటికే సుమారు 15,000 చెట్ల నాటే పనులు ప్రారంభమైనట్లు రిలయన్స్ ఫౌండేషన్ తెలిపింది. ముంబై కోస్టల్ రోడ్ వెంట విస్తరించే ఈ హరిత ప్రదేశం నగరానికి కొత్త ‘గ్రీన్ లంగ్’గా మారనుంది.ప్రాజెక్ట్లో నీడనిచ్చే వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లు, ఓపెన్ పార్కులు, పబ్లిక్ జిమ్లు, పిల్లల ఆట స్థలాలు, కళా-సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రత్యేక ప్రాంగణాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్, కబడ్డీ, బాస్కెట్బాల్, పికిల్బాల్ వంటి క్రీడలకు ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ముంబై వాసులు పిల్లాపాపలతో గడిపేలా ‘ట్రీ మ్యూజియం’ వంటి ప్రత్యేక ఆకర్షణలు కూడా ఉండనున్నాయి.ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన న్యాయపరమైన అడ్డంకులు కూడా ఇటీవల తొలగిపోయాయి. ముంబై కోస్టల్ రోడ్కు ఆనుకుని అభివృద్ధి చేయనున్న 130 ఎకరాల ప్రజా ప్రదేశాల రూపకల్పనకు సంబంధించి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పనులు మరింత వేగం పుంజుకునే అవకాశం ఏర్పడింది. ఈ విస్తీర్ణంలో అధిక భాగం ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉండే పార్కులు, ఉద్యానవనాలు, సైకిల్ ట్రాక్లు, ప్రొమెనేడ్లుగా అభివృద్ధి చేయనున్నారు.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల్లో అనూహ్య మార్పు..ప్రపంచ ప్రఖ్యాత నగరాలకు సెంట్రల్ పార్క్, హైడ్ పార్క్, బొటానిక్ గార్డెన్స్ ఎలా గుర్తింపుగా నిలిచాయో, అదే తరహాలో కోస్టల్ రోడ్ గార్డెన్స్ ముంబైకు కొత్త చిహ్నంగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నీతా అంబానీ పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్యం, నగర జీవన నాణ్యతను మెరుగుపరచే ఈ ప్రాజెక్ట్ ముంబై అభివృద్ధి చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.A new green heart for the city of Mumbai. At the Reliance AGM, Mrs. Nita Ambani shared the vision and first glimpses of the upcoming Coastal Road Gardens. Spread over 130 acres with more than 60,000 trees, the Gardens will feature green walking trails, children's play areas,… pic.twitter.com/JvC8B35a1a— Reliance Foundation (@ril_foundation) June 22, 2026 -
భారత్కు సొంత ‘డీప్సీక్’ ఉండాలి
న్యూఢిల్లీ: కొత్త తరం టెక్నాలజీపై పట్టు సాధించాలన్నా, అంతర్జాతీయంగా పోటీపడాలన్న భారత్ తనకంటూ సొంతంగా ’డీప్సీక్’లాంటి ఏఐ మోడల్ని తయారు చేసుకుని తీరాలని బ్రోకరేజ్ దిగ్గజం బెర్న్స్టైన్ ఒక నివేదికలో స్పష్టం చేసింది. అలా జరగని పక్షంలో అమెరికా లేదా చైనాకు చెందిన ఏఐ మోడల్స్పై ఆధారపడాల్సి ఉంటుందని పేర్కొంది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో ఇలా మరో దేశంపై ఆధారపడటం వల్ల రిస్క్ లు తప్పవని హెచ్చరించింది. లేటెస్ట్ ఏఐ మోడల్స్ అందరికీ అందకుండా అమెరికా ఇటీవల ఆంక్షలు విధించడమనేది గ్లోబల్గా ఏఐ రేసులో కీలక మలుపని అభివర్ణించింది. అధునాతన లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని (ఎల్ఎల్ఎం) దేశాలు.. వ్యాపారపరమైన లాభాలు తెచ్చిపెట్టే సాఫ్ట్వేర్గా కాకుండా వ్యూహాత్మక అసెట్స్గా పరిగణిస్తుండటాన్ని ఇది సూచిస్తోందని కూడా నివేదిక వివరించింది. ఈ నేపథ్యంలో భారత్ విదేశీ ఏఐ మోడల్స్పై ఆధారపడుతూ, కేవలం అప్లికేషన్ డెవలప్మెంట్పైనే దృష్టి పెట్టే పక్షంలో భవిష్యత్ తరపు టెక్నాలజీపై నియంత్రణ కోల్పోయే ముప్పు తలెత్తుతుందని బెర్న్స్టైన్ పేర్కొంది. ‘వేరే వాళ్ల దగ్గరనుంచి అప్పుగా తీసుకున్న మోడల్స్ ఆధారంగా భారత్ తన ఏఐ భవిష్యత్తును తీర్చిదిద్దుకోలేదు. విదేశీ ఎల్ఎల్ఎంల ఆధారంగా అప్లికేషన్లను తయారు చేసేటువంటి ప్రస్తుత వ్యూహం వల్ల భౌగోళిక రాజకీయపరమైన రిస్క్ లను ఎదుర్కొనాల్సి వస్తుంది‘ అని స్పష్టం చేసింది. ఏఐ.. కొత్త తరం ఫైటర్ జెట్.. కృత్రిమ మేధ మోడల్స్ని మిలిటరీ అసెట్స్గా బెర్న్స్టైన్ అభివర్ణించింది. సెమీకండక్టర్ పరికరాలు, గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ల (జీపీయూ) నుంచి వినూత్న ఏఐ మోడల్స్ వరకు అధునాతన సాంకేతికతలపై ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో ‘ఏఐ అనేది కొత్త తరం ఫైటర్ జెట్‘లాంటిదని పేర్కొంది. ఫౌండేషనల్ మోడల్స్ని వివిధ దేశాలు కేవలం సాఫ్ట్వేర్ ఉత్పత్తులుగా కాకుండా వ్యూహాత్మక వనరులుగా పరిగణిస్తున్నాయని వివరించింది. దేశ భద్రత, ఇతర దేశాలపై ఆర్థికంగా పైచేయి సాధించే కోణంలో వాటిని కాపాడుకోవడంపై దృష్టి పెడుతున్నాయని నివేదిక తెలిపింది. -
క్రెడ్తో మెటా మెగా డీల్
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం మెటా నుంచి రూ. 8,550 కోట్లు సమీకరిస్తున్నట్లు దేశీ ఫిన్టెక్ సంస్థ క్రెడ్ వెల్లడించింది. రూ. 38,819 కోట్ల వేల్యుయేషన్తో (4.03 బిలియన్ డాలర్ల) చేపట్టిన నిధుల సమీకరణ అనంతరం కంపెనీ వేల్యుయేషన్ సుమారు రూ. 43,239 కోట్లకి (4.5 బిలియన్ డాలర్లు) చేరుతుంది. క్రెడ్లో మెటా మైనారిటీ వాటాదారుగా ఉంటుంది. తాజాగా సమీకరించిన నిధులను వ్యాపార విస్తరణ కోసం కంపెనీ ఉపయోగించుకోనుంది. ఈ మెగా డీల్ ప్రకారం క్రెడ్ వ్యవస్థాపకుడు కునాల్ షా.. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హోదా నుంచి తప్పుకుంటారు. మెటాలో భాగమైన మెసేజింగ్ ప్లాట్ఫాం వాట్సాప్కి అంతర్జాతీయంగా సారథ్యం వహిస్తారు. గ్లోబల్గా మెటా లీడర్షిప్ టీమ్లో ఆయన భాగమైనప్పటికీ.. క్రెడ్లో వ్యక్తిగతంగా తన వాటాలను అట్టే పెట్టుకోనున్నారు. క్రెడ్లో 2020 నుంచి స్ట్రాటెజీ, ఫైనాన్స్ హెడ్గా వ్యవహరిస్తున్న మితేన్ సంపత్ తక్షణం తాత్కాలిక సీఈవోగా నియమితులయ్యారు. 2018లో ప్రారంభమైన క్రెడ్ని ప్రస్తుతం నెలవారీగా 1.7 కోట్ల మంది సభ్యులు ఉపయోగిస్తున్నారు. దేశీయంగా క్రెడిట్ కార్డ్ బిల్లుల చెల్లింపుల్లో 40 శాతానికి పైగా లావాదేవీలను ప్రాసెస్ చేస్తోంది. రుణాల వ్యాపార విభాగం ఏయూఎం రూ. 24,000 కోట్లకి చేరుకుంది.గ్లోబల్ భారతీయ సీఈవోల లిస్టులో చోటు.. వాట్సాప్ సీఈవోగా వ్యవహరించనున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా దిగ్గజ కంపెనీలకు సారథ్యం వహిస్తున్న భారతీయుల జాబితాలో కునాల్ షా కూడా చేరినట్లవుతుంది. ఇప్పటికే టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్కి నేతృత్వం వహిస్తున్న సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ తదితరుల సరసన ఆయన కూడా చేరతారు. ఈ ఏడాది తొలినాళ్లలో మైక్రోసాఫ్ట్ గేమింగ్ సీఈవోగా ఆశా శర్మ నియమితులయ్యారు. గతేడాది అక్టోబర్లో ఏఐ దిగ్గజం ఆంథ్రోపిక్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసరుగా రాహుల్ పాటిల్ చేరారు. అలాగే 2023లో యూట్యూబ్ సీఈవోగా నీల్ మోహన్, కాగ్నిజెంట్ సీఈవో ఎస్ రవి కుమార్ చేరారు. టీమ్ క్రెడ్.. మీరంతా కూడా పది రెట్లు వృద్ధి చెందాలని ఆశిస్తున్నాను. నా విషయానికొస్తే.. అంతర్జాతీయంగా వాట్సాప్కి నేతృత్వం వహించేందుకు నేను మెటాలో చేరుతున్నాను. – కునాల్ షా, క్రెడ్ ఫౌండర్, సీఈఓభారత్లో అత్యంత ముఖ్యమైన టెక్నాలజీ కంపెనీల్లో ఒకటిగా క్రెడ్ని షా తీర్చిదిద్దారు. కోట్లాది ప్రజలు, వ్యాపారాలకు అత్యుత్తమ సేవలందించేలా వాట్సాప్ని తీర్చిదిద్దేందుకు షాతో కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నాను. – మార్క్ జుకర్బర్గ్, మెటా సీఈవో -
ఇండియన్ రైల్వే కొత్త రూల్స్!
ఇండియన్ రైల్వే ప్రయాణికులకు భద్రత కల్పించడంతో పాటు, క్రమశిక్షణ, నియమాల అమలు విషయంలో మరింత కఠినంగా వ్యవహరించనుంది. రైళ్లలో ప్రయాణించే ప్రతి ఒక్కరూ నియమాలను తప్పనిసరిగా పాటించాలనే ఉద్దేశంతో కొత్తగా కొన్ని నిబంధనలు ప్రవేశ పెట్టడమే కాకుండా.. పాత నియమాలను మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించాయి.స్మోకింగ్ చేస్తే..రైళ్లలో స్మోకింగ్ పూర్తిగా నిషేధం. రైల్వే ప్రాంగణం, కోచ్లలో స్మోకింగ్ చేయడం చట్టవిరుద్ధం. ఇటీవల కొన్ని ఘటనల్లో ప్రయాణికులు రైలులో స్మోకింగ్ చేయడం లేదా ప్రమాదకర పదార్థాలు తీసుకెళ్లడం వల్ల ప్రమాదాలు జరిగినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో.. కొత్త చట్టాల ప్రకారం, స్మోకింగ్ చేస్తూ పట్టుబడిన వారికి రూ.2,000 వరకు జరిమానా విధించనున్నారు.లేడీస్ కంపార్ట్మెంట్లో ప్రయాణిస్తే..మహిళలకు ప్రత్యేకంగా కేటాయించిన బోగీల్లో (లేడీస్ కంపార్ట్మెంట్) పురుషులు ప్రయాణిస్తే రూ.2,500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మహిళల భద్రతను పెంచడం, వేధింపులు, అనవసర ప్రవేశాలను అరికట్టడం లక్ష్యంగా పెట్టుకుని ఈ నియమాన్ని అమలు చేశారు. రైల్వే భద్రతా సిబ్బంది (RPF), టికెట్ చెకింగ్ సిబ్బంది (TTE) రాత్రి వేళలు, రద్దీ సమయాల్లో మరింత కఠినంగా తనిఖీలు నిర్వహించనున్నారు.రైళ్లలో అక్రమంగా వస్తువులు అమ్మడం, భిక్షాటన చేయడం కూడా చట్ట విరుద్ధమే. ఇలాంటివారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో వీరికి జైలు శిక్షతో పాటు జరిమానాలు కూడా విధించే అవకాశం ఉంది.టికెట్ లేకుండా ప్రయాణిస్తే..టికెట్ లేకుండా ప్రయాణిస్తే ఇకపై కనీస జరిమానా రూ.250 నుంచి రూ.500కు పెంచారు. అంటే, ఎవరైనా సరైన టికెట్ లేకుండా ప్రయాణిస్తే వారికి టికెట్ ఛార్జీతో పాటు అదనంగా కనీసం రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన తప్పుడు టికెట్తో ప్రయాణించేవారికి కూడా వర్తిస్తుంది.२०/०६/२०२६ पासून दंडाच्या रकमा वाढविण्यात आल्या आहेत. तपासणीदरम्यान टीटीई (TTE) व आरपीएफ (RPF) यांना सहकार्य करण्याची प्रवाशांना विनंती आहे.१) तिकीटाशिवाय प्रवास – ₹५००/-२) दुसऱ्याच्या तिकीटावर प्रवास – ₹५००/-३) बेकायदेशीर फेरीविक्री (हॉकिंग) – ₹२०००/-४) मद्यधुंद अवस्थेत… pic.twitter.com/NgooB891AJ— DRM Mumbai CR (@drmmumbaicr) June 22, 2026 -
ఈట్ ఫాస్ట్, ఒక్కో నిమిషానికి గంట ఎక్కువ : షాకింగ్ కంపెనీ నోటీసు
కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగుల కష్టాలు, పనివిధానం గురించి ఇప్పటికే అనేక అంశాలు చర్చనీయాంశమైనాయి. ఉద్యోగుల వర్క్ కల్చర్, ఒత్తిడిపై అనేక కథనాలు చాలానూ చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఒక వివాదాస్పద ఆఫీస్ నోటీసుసోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టోరీ ఏంటంటే..ఉద్యోగులు లంచ్ బ్రేక్ కోసం ఎక్కువ సమయం తీసుకుంటే వారికి పెనాల్టీ విధిస్తామంటూ ఒక ఆఫీస్ బోర్డుపై పెట్టిన నోటీసు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది పని సంస్కృతి (workplace culture) , ఉద్యోగుల హక్కులపై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.ఇంతకీ నోటీసులో ఏముంది?ఈ నోటీసు ఏ కంపెనీకి చెందిందో స్పష్టంగా లేదు కానీ, అందులోని నిబంధనలు మాత్రం చాలా కఠినంగా ఉన్నాయి. దీని ప్రకారం ఉద్యోగులకు కేటాయించిన 30 నిమిషాల లంచ్ బ్రేక్ సమయం దాటితే, ఆ అదనపు సమయానికి బదులుగా జీతం లేని అదనపు గంటలు (unpaid work hours) పని చేయాల్సి ఉంటుంది. లంచ్ బ్రేక్ 30 నిమిషాల కంటే ఒక నిమిషం ఎక్కువైనా సరే... దానికి బదులుగా సాయంత్రం 6 గంటల తర్వాత కంపెనీ కోసం 60 నిమిషాల పాటు ఉచితంగా 'ఫోకస్ టైమ్' (Unpaid Focus Time) కేటాయించాల్సి ఉంటుంది. If your management writes policies like this, don't be surprised when your best employees write resignation emails. pic.twitter.com/3v5jZGA3XS— Nalini Unagar (@NalinisKitchen) June 22, 2026 ఒకవేళ 31 నిమిషాలు లంచ్ బ్రేక్ తీసుకుంటే, సాయంత్రం 6 గంటలకు వెళ్లాల్సిన వాళ్లు 7:00 గంటల వరకు ఆఫీసులోనే ఉండాలి. అందుకే "త్వరగా తినండి" (Eat faster) అంటూ నోటీసు చివరలో ఘాటు హెచ్చరిక కూడా ఉండటం గమనార్హం. ఇదీ చదవండి: ఆస్తి తగాదా : నటుడు సోదరుడికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమంనెటిజన్ల తీవ్ర ఆగ్రహంనెటిజన్లు కంపెనీ వైఖరిపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది చట్టవిరుద్ధమని, అనాగరికమని విమర్శిస్తున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైతే గంట సేపు ఉచితంగా పని చేయడం, ఓకే మరి, ఆఫీస్ సమయం ముగిసిన తర్వాత ఉద్యోగి ఒక్క నిమిషం ఎక్కువ పనిచేసినా ఒక గంట అదనపు జీతం ఇస్తారా . సాయంత్రం 6:01 వరకు ఉంటే గంట జీతం ఇవ్వాలి అంటూ కొంతమంది కౌంటరిచ్చారు.ఇదీ చదవండి: డీఏ పెంపు, లక్ష ఉద్యోగాలు : బెంగాల్లో బీజేపీ తొలి బడ్జెట్లో వరాల జల్లుఇలాంటి వేధింపుల వల్లే తాము రిమోట్ ఉద్యోగాల (Work from home) వైపు మొగ్గు చూపుతామని, ఆఫీస్ ఉద్యోగాలను వదులుకుంటామని మరికొందరు పేర్కొన్నారు. కొందరు మాత్రం వ్యాపార యజమానులు కూడా రాత్రింబగళ్లు కష్టపడతారని, ఉద్యోగులలో క్రమశిక్షణ కోసమే ఇలాంటివి పెడతారంటూ యజమానులు కొంతమంది స్పందించారు. ఇదీ చదవండి: ఆ పిక్స్ అందుకే పోస్ట్ చేయలేదు, కానీ బీచ్లో బికినీ కాక..?నోటీసు నిజమేనా?ఈ నోటీసుపై కంపెనీ పేరు గానీ, ఎలాంటి లోగో గానీ లేకపోవడంతో ఇది నిజమైనదేనా లేక కేవలం సోషల్ మీడియాలో లైకులు, అటెన్షన్ కోసం క్రియేట్ చేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. "ఒకవేళ 5 నిమిషాలు త్వరగా లంచ్ ముగించుకుని వస్తే.. 5 గంటల లీవ్ ఇస్తారా?" అంటూ కొందరు జోకులు పేలుస్తున్నారు. -
ఆధార్ హోల్డర్లకు ఊరట.. ఆరు నెలల పాటు ఈ సేవ ఫ్రీ!
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆధార్ వినియోగదారులను ఊరటను ఇచ్చే ప్రకటన చేసింది. ప్రస్తుతం ఆధార్లో ఈమెయిల్ అడ్రస్ అప్డేట్ చేసుకోవడానికి వసూలు చేస్తున్న రూ.75 ఫీజును, ఆరు నెలల పాటు పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది.యూఐడీఏఐ ప్రకారం.. ఈ సదుపాయం 2026 జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది. దీంతో ఆధార్ మొబైల్ యాప్ ద్వారా ఈమెయిల్ చిరునామాను ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం లభించింది.ఆధార్కు ఈమెయిల్ ఐడీ లింక్ చేసి ఉంటే, ఆధార్కు సంబంధించిన ముఖ్యమైన నోటిఫికేషన్లు, అప్డేట్స్, సర్వీసులకు సంబంధించిన సమాచారాన్ని వెంటనే పొందవచ్చు. వినియోగదారుల సౌలభ్యం కోసం, ఇటీవల ప్రారంభించిన ఆధార్ మొబైల్ యాప్లో మొబైల్ నెంబర్ అప్డేట్, అడ్రస్ అప్డేట్, బయోమెట్రిక్ లాక్/అన్లాక్, ఈ ఆధార్ డౌన్లోడ్, అథెంటికేషన్ హిస్టరీ చెక్ వంటి అనేక సేవలు అందుబాటులో ఉన్నాయి.ఉచిత ఈమెయిల్ అప్డేట్ సదుపాయం కేవలం ఆధార్ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంది. ఆన్లైన్లో ఈమెయిల్ను ధృవీకరించుకోవడానికి ఆధార్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ వంటి వివరాలను నమోదు చేసి.. వెరిఫై ఈమెయిల్ అడ్రెస్స్ ఎంపికను ఎంచుకోవాలి.అయితే.. ఆరు నెలల తర్వాత ఈ ఫీజు మినహాయింపును కొనసాగించాలా? లేదా మళ్లీ ఫీజు అమలు చేయాలా అనే విషయంపై యూఐడీఏఐ నిర్ణయం తీసుకోనుంది. అయితే ప్రస్తుతానికి ఈమెయిల్ ఐడీ అప్డేట్ చేయనివారు నిర్ణీత సమయం లోపల ఉచితంగానే అప్డేట్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: ప్రయాణికులకు అలర్ట్.. అమల్లోకి రైల్వే కొత్త రూల్స్! -
కంపెనీని అమ్మేసి ఉద్యోగులను కోటీశ్వరులను చేశాడు!
సాధారణంగా కార్పొరేట్ ప్రపంచంలో మానవత్వానికి చోటు ఉండదు అనుకుంటాం. కానీ కరుణామయులైన వ్యాపారవేత్తలూ కొందరుంటారు. అలాంటి పారిశ్రామికవేత్త ఒకరు తన కంపెనీని అమ్మేసి ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులను కోటీశ్వరులను చేశారు. ఎవరాయన.. ఎక్కడ.. ఆ కంపెనీ ఏంటి.. చూద్దాం ఈ కథనంలో..అమెరికాలోని లూసియానా రాష్ట్రానికి చెందిన కుటుంబ యాజమాన్య సంస్థ ఫైబర్బాండ్ (Fibrebond) తీసుకున్న ఒక నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. విద్యుత్ పరికరాలు, డేటా సెంటర్ మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేక నిర్మాణాలను తయారు చేసే ఈ సంస్థను పవర్ మేనేజ్మెంట్ దిగ్గజం ఈటన్ (Eaton) 1.7 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.16,045 కోట్లు) కొనుగోలు చేసింది. అయితే ఈ ఒప్పందంలో అత్యంత విశేషమైన అంశం ఏమిటంటే.. సంస్థ మాజీ యజమాని గ్రాహం వాకర్ ఉద్యోగుల కోసం 240 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2,265 కోట్లు) కేటాయించాలనే షరతును పెట్టడం.ఈ నిర్ణయంతో సంస్థలో పనిచేస్తున్న 540 మంది పూర్తి కాల ఉద్యోగులు ఈ మొత్తాన్ని పంచుకోనున్నారు. అంటే సగటున ఒక్కో ఉద్యోగికి 4.43 లక్షల డాలర్లు (సుమారు రూ.4.18 కోట్లు ) లభించనున్నాయి. కంపెనీలో వాటాలు లేకపోయినా, సంస్థ ఎదుగుదలలో ఉద్యోగుల పాత్రను గుర్తించి ఈ బహుమతిని ఇవ్వాలని వాకర్ నిర్ణయించారు.బోనస్ చెల్లింపులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే పూర్తి మొత్తాన్ని పొందాలంటే ఉద్యోగులు ఐదేళ్లపాటు సంస్థలో కొనసాగాల్సి ఉంటుంది. 65 ఏళ్లు దాటిన ఉద్యోగులకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ ప్రకటన వెలువడినప్పుడు చాలా మంది ఉద్యోగులు తొలుత నమ్మలేకపోయారని, కొందరు ఇది సరదా ప్రకటనేమోనని భావించారని అమెరికా మీడియా పేర్కొంది.అగ్నిప్రమాదం నుంచి ఏఐ బూమ్ వరకు...1982లో క్లాడ్ వాకర్ స్థాపించిన ఫైబర్బాండ్ ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంది. 1998లో ఫ్యాక్టరీ అగ్నిప్రమాదం, డాట్కామ్ సంక్షోభం, ఆర్థిక మందగమనం కారణంగా ఒక దశలో ఉద్యోగుల సంఖ్య 900 నుంచి 320కు పడిపోయింది. అయినప్పటికీ సంస్థ ఉద్యోగులను కాపాడుకునేందుకు యాజమాన్యం కృషి చేసింది.తరువాత డేటా సెంటర్ రంగంలో సుమారు 150 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడం సంస్థకు టర్నింగ్ పాయింట్గా మారింది. కోవిడ్ అనంతరం క్లౌడ్ సేవలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్లకు భారీ డిమాండ్ ఏర్పడటంతో ఫైబర్బాండ్ వ్యాపారం వేగంగా విస్తరించింది. కేవలం ఐదేళ్లలో కంపెనీ అమ్మకాలు దాదాపు 400 శాతం పెరిగాయి.ఉద్యోగుల జీవితాల్లో కొత్త వెలుగులుఈ భారీ బోనస్తో అనేక మంది ఉద్యోగుల జీవితాలు మారిపోయాయి. కొందరు గృహ రుణాలను పూర్తిగా తీర్చగా, మరికొందరు చిన్న వ్యాపారాలు ప్రారంభించారు. 1995లో గంటకు కేవలం 5.35 డాలర్ల వేతనంతో కంపెనీలో చేరిన ఉద్యోగిని లెసియా కీ తన ఇంటి రుణాన్ని క్లియర్ చేసి దుస్తుల దుకాణం ప్రారంభించింది. మరో ఉద్యోగి హాంగ్ బ్లాక్వెల్ పదవీ విరమణ చేసి తన కుటుంబ అవసరాలకు ఈ మొత్తాన్ని వినియోగించింది.కంపెనీ విక్రయం ద్వారా వాకర్ కుటుంబానికి 1 బిలియన్ డాలర్లకు పైగా లభించినప్పటికీ, ఆ సంపదలో కొంత భాగాన్ని ఉద్యోగులతో పంచుకోవడం కార్పొరేట్ ప్రపంచంలో అరుదైన ఉదాహరణగా నిలిచింది. ఉద్యోగులను కేవలం సిబ్బందిగా కాకుండా సంస్థ విజయానికి భాగస్వాములుగా భావించిన ఈ నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. -
విమాన ఛార్జీలు తగ్గించిన ఎయిర్ ఏషియా ఎక్స్
మలేషియాకు చెందిన తక్కువ ఖర్చుతో విమాన సర్వీసులు అందించే ఎయిర్ఏషియా ఎక్స్ (AirAsia X) ప్రయాణికులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. జెట్ ఇంధన ధరలు తగ్గుముఖం పట్టడంతో జూన్ 15 నుంచి విమాన టికెట్ ఛార్జీలను సుమారు 5 శాతం మేర తగ్గించినట్లు సంస్థ సీఈఓ బో లింగం వెల్లడించారు. ఇంధన ధరల మార్పులను ప్రతి వారం సమీక్షిస్తూ అవసరానికి అనుగుణంగా ఛార్జీలను సవరించనున్నట్లు ఆయన తెలిపారు.గత కొద్ది నెలలుగా మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, ముఖ్యంగా అమెరికా–ఇరాన్ ఘర్షణల ప్రభావంతో జెట్ ఇంధన ధరలు భారీగా పెరిగి విమానయాన రంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. దీంతో ఎయిర్ఏషియా ఎక్స్ కొన్ని మార్గాల్లో సర్వీసులను తగ్గించడంతో పాటు ఇంధన సర్చార్జీలు విధించి, టికెట్ ధరలను కూడా పెంచాల్సి వచ్చింది. ఏప్రిల్లో కొన్ని రూట్లలో ఛార్జీలు 30–40 శాతం వరకు పెరిగినట్లు సంస్థ ప్రకటించింది.అయితే ఇటీవల అమెరికా–ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం కుదరడంతో అంతర్జాతీయ మార్కెట్లో జెట్ ఇంధన ధరలు గణనీయంగా తగ్గాయి. మార్చి చివర్లో బ్యారెల్కు 242 డాలర్ల వరకు ఎగిసిన సింగపూర్ జెట్ ఫ్యూయల్ ధర ప్రస్తుతం సుమారు 112 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ పరిణామం విమానయాన సంస్థలకు కొంత ఊరటనిచ్చిందని బో లింగం పేర్కొన్నారు.ఇంధన వ్యయాల పెరుగుదల కారణంగా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఎయిర్ఏషియా ఎక్స్ నష్టాలను నమోదు చేసింది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా కొన్ని నష్టదాయక మార్గాలను నిలిపివేయడం, విమానాల వినియోగాన్ని తగ్గించడం, సరఫరాదారులు, లీజింగ్ భాగస్వాములతో ఒప్పందాలను పునఃసమీక్షించడం వంటి చర్యలు చేపట్టింది.సామర్థ్య పునరుద్ధరణ దిశగా అడుగులు వేస్తున్న సంస్థ ఆగస్టు నాటికి కార్యకలాపాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే పాత విమానాలను దశలవారీగా విరమించి, ఇంధన సామర్థ్యం ఎక్కువగా ఉన్న కొత్త ఎయిర్బస్ A321LR విమానాలను వచ్చే ఏడాది నుంచి సేవల్లోకి తీసుకురానుంది. 2027 చివరి నాటికి తొలి ఎయిర్బస్ A220 జెట్లను అందుకోవాలని కూడా సంస్థ భావిస్తోంది. -
జీఎస్టీ ఎఫెక్ట్.. పెరుగనున్న కార్ల అమ్మకాలు!
స్థిరంగా కొనసాగుతున్న డిమాండ్, జీఎస్టీ రేట్ల తగ్గింపుతో పెరిగిన కొనుగోలు సామర్థ్యం, యుటిలిటీ వాహనాలకు లభిస్తున్న ఆదరణ తదితర కారణాలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27)లో ప్యాసింజర్ వాహనాల (పీవీ) విక్రయాలు 4–6 శాతం మేర వృద్ధి చెందే అవకాశం ఉందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ‘ఇక్రా’ తన నివేదికలో తెలిపింది.గత ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వాహనాల టోకు అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 27 శాతం వృద్ధితో 4.4 లక్షల యూనిట్లకు చేరాయి. అదే సమయంలో వినియోగదారుల నుంచి లభించిన భారీ డిమాండ్, కొత్త మోడళ్ల విడుదల, సుదీర్ఘ వివాహాల సీజన్ కారణంగా రిటైల్ విక్రయాలు 33 శాతం పెరిగాయి. అయితే, పెరుగుతున్న ఇంధన, కమొడిటీ ధరలతో పాటు బలహీనమైన రుతుపవనాలపై ఆందోళనలు రాబోయే కాలంలో నిశితంగా గమనించాల్సిన కీలక అంశాలుగా ఉన్నాయని ఇక్రా పేర్కొంది.యుటిలిటీ వాహనాల ఆధిపత్యం ‘‘ప్యాసింజర్ వాహనాల విభాగంలో యుటిలిటీ వాహనాల ఆధిపత్యం కొనసాగుతోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో జరిగిన మొత్తం ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో ఇవి దాదాపు 68 శాతం వాటాను దక్కించుకున్నాయి. అలాగే, గత ఏడాది సెపె్టంబర్లో జీఎస్టీ రేట్ల తగ్గింపుతో మినీ, కాంపాక్ట్ కార్ల విభాగాల్లోనూ డిమాండ్ పుంజుకుంది’’ అని ఇక్రా నివేదిక స్పష్టం చేసింది.పెరిగిన ఎగుమతులు.. ఈవీల జోరుదేశీయ వాహన తయారీ కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్లలో తమ సరఫరాను ముమ్మరం చేయడంతో, ఈ ఏడాది మే నెలలో ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 13 శాతం వృద్ధిని సాధించాయి. ఇదే సమయంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగం కూడా పుంజుకుంది. 2027 ఆర్థిక సంవత్సర ఆరంభంలో ప్యాసింజర్ వాహనాల విభాగంలో ఈవీల వాటా దాదాపు 6 శాతానికి చేరినట్లు ఇక్రా నివేదిక వెల్లడించింది. -
ప్రయాణికులకు అలర్ట్.. అమల్లోకి రైల్వే కొత్త రూల్స్!
టికెట్ లేకుండా లేదా చెల్లుబాటు కాని టికెట్తో ప్రయాణించే ప్రయాణికులపై మరింత కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఇండియన్ రైల్వే సిద్ధమైంది. జన్ విశ్వాస్ చట్టం ప్రకారం కొత్త రూల్స్ జులై 1నుంచి అమల్లోకి రానున్నట్లు భారతీయ రైల్వే వెల్లడించింది.కొత్త నిబంధనల ప్రకారం, టికెట్ లేకుండా ప్రయాణిస్తే ఇకపై కనీస జరిమానా రూ.250 నుంచి రూ.500కు పెంచారు. అంటే, ఎవరైనా సరైన టికెట్ లేకుండా ప్రయాణిస్తే వారికి టికెట్ ఛార్జీతో పాటు అదనంగా కనీసం రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన తప్పుడు టికెట్తో ప్రయాణించేవారికి కూడా వర్తిస్తుంది.అంతేకాకుండా.. టికెట్లో పేర్కొన్న కోచ్ లేదా క్లాస్ కాకుండా ఇతర కోచ్లో ప్రయాణిస్తే కూడా జరిమానా విధించడం జరుగుతుంది. ఉదాహరణకు, జనరల్ టికెట్తో స్లీపర్ లేదా ఏసీ కోచ్లో ప్రయాణించడం, లేదా అనుమతించిన దూరం (దిగాల్సిన స్టేషన్) కంటే ఎక్కువ ప్రయాణించడం వంటి వాటిపై కూడా అదనపు చార్జీలు విధిస్తారు.మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇతరుల టికెట్ను ఉపయోగించి ప్రయాణించడం కూడా నేరంగా పరిగణించడం జరుగుతుంది. ఇలా ప్రయాణిస్తే.. టికెట్ రద్దు చేయడమే కాకుండా, రూ.500 జరిమానా కూడా విధిస్తారు. ఒకవేళ ప్రయాణికుడు ఈ జరిమానాలు చెల్లించడానికి నిరాకరిస్తే, రైల్వే అధికారులు కోర్టులో కేసు వేయవచ్చు. అప్పుడు కోర్టు ఆదేశాల ప్రకారం బకాయిలు వసూలు చేయడం జరుగుతుంది.ఇదీ చదవండి: అమెరికా వీసా నిబంధనల్లో మార్పు.. కొత్త విధానం ఇలా!ప్రయాణికుల్లో అవగాహన పెంచాలని లక్ష్యంతో ఈ కొత్త నిబంధనలను రైల్వే శాఖ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో పశ్చిమ రైల్వే, మధ్య రైల్వే వంటి విభాగాలు సోషల్ మీడియా, ఇతర ప్రకటనల ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేశాయి. సరైన టికెట్తో మాత్రమే ప్రయాణించాలని, రైల్వే నియమాలను తప్పకుండా పాటించాలని సూచిస్తున్నాయి. -
సంపదలో సగం సమాజానికే ఇవ్వండి: మెలిండా గేట్స్
ఇటీవల స్పేస్ఎక్స్ ఐపీఓ విజయవంతంగా పూర్తికావడంతో ఎందోమంది కోటీశ్వరులు, బిలియనీర్లుగా మారారు. భవిష్యత్తులో ఓపెన్ఏఐ, ఆంథ్రోపిక్ వంటి ప్రముఖ టెక్ కంపెనీలు కూడా ఐపీఓకు వచ్చే అవకాశాలు ఉండటంతో మరింత మంది ధనవంతులు అవుతారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రపంచ ప్రఖ్యాత దాతృత్వవేత్త 'మెలిండా ఫ్రెంచ్ గేట్స్' (Melinda French Gates) ఓ కీలక సందేశాన్ని ఇచ్చారు.మెలిండా ఫ్రెంచ్ గేట్స్ అభిప్రాయం ప్రకారం.. పెద్ద మొత్తంలో సంపద సంపాదించే అవకాశం లభించినవారు తమ సంపదలో కనీసం సగం భాగాన్ని సమాజానికి తిరిగి ఇవ్వాలని ఇప్పటి నుంచే నిర్ణయించుకోవాలి. ఐపీఓల ద్వారా కోట్లాది డాలర్ల సంపద పొందగలిగే స్థితిలో ఉన్నవారికి, అదే స్థాయిలో దానం చేసే సామర్థ్యం కూడా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. సంపద అనేది కేవలం వ్యక్తిగత విజయానికి గుర్తు మాత్రమే కాదు, సమాజం పట్ల ఉన్న బాధ్యతకు కూడా ప్రతీక అని ఆమె పేర్కొన్నారు.అమెరికాలో బిలియనీర్లుగా ఎదిగిన వారు దేశం అందించిన అవకాశాలను గుర్తుంచుకోవాలని మెలిండా సూచించారు. మంచి విద్యా వ్యవస్థ, ఆరోగ్య సేవలు, రహదారులు, సమాచార మౌలిక వసతులు వంటి ప్రజా వనరుల వల్లే పెద్ద కంపెనీలు అభివృద్ధి చెందగలిగాయని ఆమె వివరించారు. అందువల్ల సమాజం నుంచి లభించిన అవకాశాలను తిరిగి సమాజ అభివృద్ధికే ఉపయోగించాల్సిన బాధ్యత ధనవంతులపై ఉందని ఆమె చెప్పారు.మెలిండా ఫ్రెంచ్ గేట్స్ వ్యక్తిగత సంపద సుమారు 19 బిలియన్ డాలర్లుగా అంచనా. ఆమె 2010లో వారెన్ బఫెట్, ఆమె మాజీ భర్త బిల్ గేట్స్తో కలిసి గివింగ్ ప్లెడ్జ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచంలోని అత్యంత ధనవంతులు తమ సంపదలో ఎక్కువ భాగాన్ని జీవితకాలంలో గానీ, మరణానంతరం గానీ దానం చేయాలని ప్రతిజ్ఞ చేస్తారు.ఇప్పటివరకు 250 మందికి పైగా ప్రముఖ దాతలు ఈ కార్యక్రమంలో చేరారు. వీరిలో మెకెంజీ స్కాట్, కాన్వా సహ వ్యవస్థాపకులు మెలానీ పెర్కిన్స్, క్లిఫ్ ఓబ్రెచ్ట్, ఎయిర్బీఎన్బీ సహ వ్యవస్థాపకుడు బ్రియాన్ చెస్కీ వంటి ప్రముఖులు ఉన్నారు.గేట్స్ ఫౌండేషన్ నుంచి వైదొలిగిన తరువాత, మెలిండా తన స్వతంత్ర సంస్థ పివోటల్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల మహిళల మధ్యవయస్సు ఆరోగ్యం, మెనోపాజ్ సంబంధిత సమస్యల కోసం 215 మిలియన్ డాలర్ల నిధులను ప్రకటించారు.ధనవంతుల ప్రవర్తన గురించి అడిగినప్పుడు, సంపదను ఆడంబరంగా ప్రదర్శించడం తనకు నచ్చదని మెలిండా స్పష్టం చేశారు. అవసరమైన మంచి వస్తువులు కొనుగోలు చేయడంలో తప్పేమీ లేదు, కానీ సంపదను ప్రదర్శిస్తూ ఇతరులను ఆకర్షించే ప్రయత్నం చేయడం సమాజానికి ఎలాంటి మేలు చేయదని ఆమె అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: భారత్ - ఈయూ ఒప్పందం: పీయూష్ గోయల్ కీలక ప్రకటన!


