NTR
-
దేవుడి భూమి స్వాధీనం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎట్టకేలకు మచిలీపట్నంలోని గొడుగుపేట వేంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన భూమిని దేవదాయశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడకు కూత వేటు దూరంలో గొల్లపూడిలో ఎకరం రూ.10కోట్ల విలువ చేసే39.99 ఎకరాలు, అంటే రూ.400కోట్ల విలువైన భూమిని స్వాధీనం చేసుకున్నామని ఆలయ ఈవో గోపాలరావు ధ్రువీకరించారు. మే నెల 22వ తేదీన సాక్షి దినపత్రికలో ‘ఇక దేవుడే దిగిరావాలేమో’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో దేవదాయశాఖ అధికారులు స్పందించారు. భూమికి నలువైపులా ‘బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ స్థలం గొడుగుపేట వేంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన భూమిగా సర్వే నంబర్ల సహా పేర్కొన్నారు. ఈ భూమి పరిరక్షణ కోసం చుట్టూ ఫెన్సింగ్ వేసేందుకు మే నెల 26నే షార్ట్ టెండర్లు పిలిచామని ఈవో తెలిపారు. టెండర్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందన్నారు. తక్కువ ధర రూ.10లక్షలకు కోట్ చేసిన కాంట్రాక్టర్ పని అప్పజెప్పామని, రెండు, మూడు రోజుల్లో ఫెన్సింగ్ ఏర్పాటు పనులు ప్రారంభమవుతాయన్నారు. దీంతో ధార్మిక సంస్థల పేరుతో పార్లమెంటు ప్రజా ప్రతినిధి భూమి స్వాధీనం చేసుకొనే కుట్రలకు కూడా తెరపడినట్లు అయ్యింది. కాగా కోర్టు ఉత్తర్వుల ప్రకారం భూమిలో 4నుంచి 6 అడుగుల మేర వేసిన మట్టిని త్వరిత గతిన తొలగించాలని పలు సంఘాలవారు దేవదాయశాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. -
కలలు విరిసే.. కనులు మెరిసే
వైద్య విద్యార్థుల్లో స్నాతకోత్సాహంలబ్బీపేట(విజయవాడతూర్పు): డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం 29, 30వ వార్షిక స్నాతకోత్సవాన్ని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో యూనివర్సిటీ చాన్స్లర్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, వీసీ డాక్టర్ పి. చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ టి. సాయిసుధీర్ పాల్గొని ప్రతిభ చూపిన విద్యార్థులకు మెడల్స్ అందజేశారు. తొలుత రాష్ట్ర గవర్నర్ చేతుల మీదగా 29వ స్నాతకోత్సవంలో ఐదుగురికి, 30వ స్నాతకోత్సవంలో నలుగురికి డాక్టరేట్స్ ప్రదానం చేశారు. అలాగే సూపర్స్పెషాలిటీ కోర్సులు చేసిన వారికి 29వ స్నాతకోత్సవంలో ఆరుగురికి, 30వ స్నాతకోత్సవంలో ఐదుగురికి గవర్నర్ చేతుల మీదగా గోల్డ్మెడల్స్ అందజేశారు. ఒక్కడికే ఎనిమిది గోల్డ్ మెడల్స్.. అతిథులు, వీసీ డాక్టర్ పి. చంధ్రశేఖర్లు 29వ స్నాతకోత్సవంలో 62, 30వ స్నాతకోత్సవంలో 61 గోల్డ్మెడల్స్ ప్రదానం చేశారు. కాకినాడకు చెందిన సాయి అనిరుథ్ అత్యధికంగా 8 గోల్డ్మెడల్స్ అందుకోగా, కర్నూలుకు చెందిన పెరిగెల నమ్రత 6 బంగారు పతకాలు అందుకున్నారు. తిరుపతికి చెందిన ఆయుర్వేద విద్యార్థిని ఆర్ఎస్వీ సరిత రెండు గోల్డ్, రెండు సిల్వర్ మెడల్స్ అందుకోగా, విజయవాడకు చెందిన ఆయుర్వేద విద్యార్థిని సీహెచ్ తులసీ అర్చన లక్ష్మి రెండు గోల్డ్, మూడు సిల్వర్ మెడల్స్ అందుకున్నారు. గుంటూరుకు చెందిన కవలలు ఐ.సుమన, ఐ.సంజన స్నాతకోత్సవాలలో ఒక్కొక్కరు రెండు బంగారు పతకాలు సాధిండం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. బీడీఎస్ చదువుతున్న ఈ ఇద్దరు ప్రతిష్టాత్మకమైన పీఎఫ్ఏ ఇంటర్నేషనల్ అవార్డు, డాక్టర్ ఆర్ అహ్మద్ నేషనల్ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. ప్రసుతం ఎండీఎస్ చదువుతున్న వీరు పేదలకు వైద్య సేవలు అందించడమే లక్ష్యమన్నారు.హెల్త్ యూనివర్సిటీ 29, 30వ స్నాతకోత్సవాల్లో 123 మందికి మెడల్స్ సాయి అనిరుథ్కు 8, నమ్రతకు 6 గోల్డ్ మెడల్స్ పలువురికి డాక్టరేట్ల ప్రదానం -
ప్రజలందరికీ వెన్నుపోటు
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రజలకు చేసిందేమీ లేదని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. తన 40 ఏళ్ల అనుభవంతో వైఎస్ జగన్ కంటే మంచి పాలన అందిస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. ఈ నెల 4 నుంచి 12 వరకూ చేపట్టనున్న ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమాల పోస్టర్లను మంగళవారం గుణదలలోని కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా మేనిఫెస్టో దహన కార్యక్రమాలు మండల, పట్టణ, జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తామన్నారు. కూటమి హయాంలో ఏ నష్టాలు జరిగాయో ప్రజలకు వివరిస్తామని, టీడీపీ, జనసేన, బీజేపీలకు బుద్ధి వచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తామన్నామన్నారు. మోసాల చంద్రబాబు.. ప్రజలను ఇప్పటికీ ప్రభుత్వం మోసం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జి నల్లగట్ల స్వామిదాసు అన్నారు. నిరుద్యోగ భృతి ఒక్కరికీ ఇవ్వడం లేదని, మెగా డీఎస్సీతో దగా చేశారన్నారు. వృద్ధులకు 50 ఏళ్లకే పింఛన్ అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని, తల్లికి వందనం పేరుతో వేల మందికి ఎగనామం పెట్టారన్నారు. మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ కూటమి రెండేళ్ల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. మహిళలకు 18 ఏళ్లు నిండితే నెలకు రూ.1500 అన్నారని, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. చేతకాని మాటలు చెబుతూ ప్రభుత్వం పబ్బం గడుపుతోందని మండిపడ్డారు. మాజీ జెడ్పీ చైర్ పర్సన్ నల్లగట్ల సుధారాణి, రాష్ట్ర సీనియర్ నాయకుడు కడియాల బుచ్చిబాబు, బండి పుణ్యశీల, సర్నాల తిరుపతిరావు, రాష్ట్ర, జిల్లాస్థాయి నాయకులు, డివిజన్ ప్రెసిడెంట్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
డిగ్రీ.. డీగ్రేడ్!
అస్తవ్యస్తంగా ఉన్నత విద్యా వ్యవస్థవన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉమ్మడి జిల్లాలో సాధారణ డిగ్రీ విద్యాసంవత్సరం అస్తవ్యస్తంగా మారింది. సాధారణంగా విద్యా సంవత్సరం అనగానే జూన్ మాసంలో ప్రారంభమై మార్చి లేదా ఏప్రిల్ మాసాంతానికి పూర్తి కావటం పరిపాటి. కానీ 2025–2026 డిగ్రీ కోర్సులో చేరిన మొదటి ఏడాది విద్యార్థుల విద్యా సంవత్సరం జూన్ వచ్చినా పూర్తి కాకపోవటంతో గందరగోళంగా మారింది. గడిచిన విద్యా సంవత్సరంలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ తదితర సాధారణ డిగ్రీ మొదటి సంవత్సరం చేరిన వారు సెమిస్టర్ విధానంలో ఇప్పటి వరకూ తమ కోర్సు తొలి ఏడాదిలో కావాల్సిన సెమిస్టర్లు పూర్తికాకపోవటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. కృష్ణా వర్సిటీలో మరీ దారుణం.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఉన్న కళాశాలలు కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలో కొనసాగుతుంటాయి. వర్సిటీ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసి తదనుగుణంగా అందులో పరీక్ష ఫీజు చెల్లింపు, పరీక్ష జరిగే తేదీను ప్రకటిస్తుంది. ఈ క్రమంలో జూన్ 27 నుంచి సుమారుగా సెకండ్ సెమిస్టర్ థియరీ పరీక్షలు ఉండవచ్చని, ఏప్రిల్ 20వ తేదీ వరకూ పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు ఇస్తున్నట్లు ప్రకటించింది. అలాగే థియరీ పరీక్షలు ముగిసిన తరువాత ప్రాక్టికల్స్ సైతం ఉంటాయని ఆ షెడ్యూల్లో ప్రకటించింది. అయితే పరీక్షల తేదీలను మాత్రం నిర్ధిష్టంగా ప్రకటించకపోవడం గమనార్హం. అంటే జూన్, జూలై మాసాంతం వరకూ ఈ పరీక్షలు జరిగినా, ద్వితీయ ఏడాది విద్యాసంవత్సరం ఆగస్టు చివర లేదా సెప్టెంబర్ మాసాల్లో ప్రారంభమయ్యే అవకాశముంది. డిసెంబర్ వరకూ అడ్మిషన్లు.. గడిచిన రెండు మూడేళ్లుగా డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియను డిసెంబర్ వరకూ కొనసాగించటంతో ఈ అస్తవ్యస్తమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. ఏప్రిల్ లేదా మే మాసంలో ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలు వెలువడుతున్నాయి. ఆ ఫలితాలు వచ్చిన వెంటనే డిగ్రీ కోర్సులకు అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించాల్సిన ఉన్నత విద్యాశాఖ ఆ దిశగా సకాలంలో చర్యలు చేపట్టకపోవటంతో ఈ విధమైన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇంజినీరింగ్ తదితర ఇతర కోర్సుల అడ్మిషన్లు ప్రక్రియ పూర్తయిన తరువాత సాధారణ డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్ ప్రకటించటం, డిసెంబర్ వరకూ అడ్మిషన్లను నిర్వహించటంతో ఈ గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయని విద్యావేత్తలు చెబుతున్నారు. దయనీయంగా అధ్యాపకుల పరిస్థితి విద్యా సంవత్సరం ఏటా సకాలంలో పూర్తికాకపోవటంతో అధ్యాపకుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సెకండ్ సెమిస్టర్ పరీక్షలు మార్చి లేదా ఏప్రిల్లో జరగకపోవటంతో ఆయా కళాశాలల యాజమాన్యాలు మేలోనూ విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నాయి. విశ్వవిద్యాలయం సెలవులు ప్రకటించినా అటానమస్ కళాశాలలు మాత్రం పని చేస్తుండటంతో అధ్యాపకులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. ప్రధానంగా ఉన్నత విద్యామండలి, విశ్వవిద్యాలయం ప్రకటించిన షెడ్యూల్ అనుసరించాల్సిన అటానమస్ కళాశాలలు తమకు వాటితో సంబంధం లేదంటూ ఇష్టారాజ్యంగా తరగతుల నిర్వహణ చేస్తుండటంతో మంచి వేసవిలోనూ విద్యార్థులు, అధ్యాపకులు తరగతులకు హాజరుకావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సరిదిద్దాలి.. కరోనా సమయంలో తలెత్తిన పరిస్థితులతో విద్యా సంవత్సరంలో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ రెండుమూడేళ్లు మాత్రం ఇబ్బందులు తతెత్తి విద్యాసంవత్సరం ఆలస్యమైంది. అయితే ఆ పరిస్థితుల నుంచి బయట పడినప్పటికీ ఇతర కోర్సుల సీట్లు నిండిన తరువాత సాధారణ డిగ్రీ కోర్సుల అడ్మిషన్ల షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి ప్రకటిస్తుంది. దాంతో పరిస్థితులు తారుమారవుతున్నాయి. ఇప్పటికైనా దిగజారు తున్న పరిస్థితుల దృష్ట్యా షెడ్యూల్ సరిదిద్దాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో అనేక అటానమస్ డిగ్రీ కళాశాలలు కొనసాగుతున్నాయి. ఆయా కళాశాలలన్నీ ఉన్నత విద్యామండలి ఆదేశాలకు అనుగుణంగా సొంతంగా సెమిస్టర్ పరీక్షలను నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తుంటాయి. అయితే ఉమ్మడి కృష్ణాజిల్లాలోని అన్ని అటానమస్ కళాశాల్లోనూ దాదాపుగా సెకండ్ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కాలేదు. ఆ కళాశాలలన్నీ జూన్ లేదా జూలై మాసాల్లో 2025–2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన డిగ్రీ మొదటి ఏడాది విద్యార్థులకు సెకండ్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నాయి. దాంతో ఏ విద్యాసంవత్సరంలో తాము ఉన్నామో అర్థం కాక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. -
ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని షామియానా, టెంట్ హౌస్ రంగాన్ని చిన్న తరహా పరిశ్రమగా (స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ) గుర్తించి, ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ టెంట్ హౌస్ అండ్ డెకరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాషా ప్రభుత్వాన్ని కోరారు. నగరంలోని ఓ ఫంక్షన్ హాలులో ఆంధ్రప్రదేశ్ టెంట్ హౌస్ అండ్ డెకరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర సర్వసభ్య సమావేశం జరిగింది. అసోసియేషన్ విజయవాడ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రతినిధులు పాల్నొన్నారు. ఈ సందర్బంగా షేక్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తమ రంగంలో నాలుగు లక్షల మంది వరకూ ఉపాధి పొందుతున్నట్లు తెలిపారు. అయితే సీజన్ లేని సమయంలో పనులు లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం తమ రంగానికి రాయితీపై రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నూతన కార్యవర్గం ఎన్నిక.. అసోసియేషన్ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా షేక్ బాషా, కార్యదర్శిగా సీహెచ్వీ సుబ్బారావు, కోశాధికారిగా లక్ష్మీనరసారెడ్డి, ఇతర సభ్యులను ఎన్నుకున్నారు. అసోసియేషన్ ప్రతినిధి సుబ్బారావు, విజయవాడ వర్తక సంఘం అధ్యక్షుడు జీఎల్ మల్లికార్జునరావు, కార్యదర్శి టీవీ రమణ, కోశాధికారి సన్నపు లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏపీ టెంట్ హౌస్ అండ్ డెకరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ -
దుర్గమ్మ ఆలయానికి రూ. 2.25లక్షల విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పెనమలూరుకు చెందిన కిలారు రామ్మోహనరావు కుటుంబం మంగళవారం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులను కలిసిన రామ్మోహనరావు తన భార్య విశాలక్ష్మి పేరిట ఉచిత ప్రసాద వితరణకు రూ.1.25లక్షలు, మల్లేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి రూ. 50వేలు, గోసంరక్షణ పథకానికి రూ. 50వేలను అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. పామర్రు: కృష్ణాజిల్లా పామర్రు మండలం ఉండ్రపూడి–పోలవరం అడ్డరోడ్డు వద్ద ఉన్న శ్రీ వీరాంజనేయస్వామి ఆలయానికి దాతలు వెండి కిరీటాన్ని మంగళవారం సమర్పించారు. ఉండ్రపూడికి చెందిన మేకా శ్రీహరి రావు, నున్న రాంబాబు మనవడు మేకా అర్జున్ సాన్విక్ స్వామివారికి 975 గ్రాముల బరువుగల వెండి కిరీటం సమర్పించారు. కిరీటం విలువ సుమారు రూ.3లక్షలు ఉంటుందని ఆలయ కమిటీ చైర్మన్ తాడిశెట్టి వెంకటేశ్వరరావు తెలిపారు. దాతలకు శేష వస్త్రాలను అందించి సత్కరించారు. అలాగే దేవిరెడ్డి సుదర్శన్రెడ్డి హైమావతి దంపతులు, తోట సుధారాణి, జువ్వనపూడి శోభన్రాజు, కోటేశ్వరమ్మ దంపతులు కలిసి స్వామివారికి 25 కేజీల పులిహోరను ప్రసాదంగా అందజేశారని ఈవో పీవీఎన్వీ ప్రసాదరావు తెలిపారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): సమాజ సేవలో యువత భాగస్వాములు కావాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ పిలుపునిచ్చారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో యూత్ టైమ్ బ్యాంక్ పేరుతో రోగులకు విద్యార్థులు అందిస్తున్న సేవలను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ యూత్ టైం బ్యాంక్ ద్వారా యువత తమ సమయాన్ని సమాజానికి అంకితం చేస్తూ సేవా దృక్పథాన్ని చాటుతున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా ఇంద్రకీలాద్రిపై కూడా సేవలు విస్తరించాలంటూ యువజన సంక్షేమ శాఖ జిల్లా ముఖ్య కార్యనిర్వాహణాధికారి కొల్లేటి రమేష్ను ఆదేశించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్, ఆర్ఎంవో తదితరులు పాల్గొన్నారు. చిలకలపూడి(మచిలీపట్నం): ఎల్నినో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రకృతి వ్యవసాయ కార్యాచరణకు సంబంధించిన పుస్తకాన్ని కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం ఆయన చాంబర్లో ఆవిష్కరించారు. 2026– 27 సంవత్సరంలో వాతావరణ పరిస్థితులను బట్టి వివిధ పంటలను ప్రకృతి వ్యవసాయం సాగు పద్ధతులు, పరిష్కార మార్గాలను పుస్తకంలో ప్రచురించినట్లు కలెక్టర్ తెలిపారు. దీనిని వ్యవసాయశాఖ సిబ్బంది, రైతు సాధికార సంస్థ సిబ్బంది, రైతులకు పూర్తిగా అవగాహన కల్పిస్తారన్నారు. జిల్లా వ్యవసాయాధికారి జ్యోతి రమణి, ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ పార్థసారథి, వ్యవసాయ సహాయ సంచాలకులు ఎన్.మణిధర్ ఉన్నారు. -
అర్జీ పునరావృతమైతే అధికారులదే బాధ్యత
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సమగ్ర సమాచారంతో, అర్జీదారుడి సంతృప్తే లక్ష్యంగా స్పష్టతతో పరిష్కారం చూపాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ నందు పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం జరిగింది. కలెక్టర్ అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, సమగ్ర సమాచారంతో నిర్దేశించిన గడువులోగా పరిష్కరించేలా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నిబంధనలను పాటిస్తూ అర్జీదారుడు సంతృప్తే లక్ష్యంగా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. పునరావృతమయ్యే అర్జీలకు సంబంధిత జిల్లా స్థాయి అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు లోపు అర్జీలను పరిష్కరించాల్సిందేనని, పరిష్కారం సంబంధిత అధికారులు పరిధిలో ఉండి కూడా పెండింగ్ ఉంటే చర్యలు తప్పవన్నారు. అర్జీల వివరాలు ఇవి.. పీజీఆర్ఎస్ ద్వారా మొత్తం 167 అర్జీలు అందాయని కలెక్టర్ తెలిపారు. వీటిలో ఎంఏ యూడీ–36, రెవెన్యూ– 22, పంచాయతీరాజ్– 21, పోలీస్–16, ఏపీఎస్డబ్ల్యూఐఆర్ఈఎస్ –7, హెల్త్ –7, పౌర సరఫరాలు–6, ఇరిగేషన్ –6, విద్య –5, డీఆర్డీఏ –4, టెక్నికల్ ఎడ్యుకేషన్ –3, హౌసింగ్–3, ఆర్డబ్ల్యూఎస్ –3, ఏపీఎస్ ఆర్టీసీ–3 డ్వామా–2, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ –2, ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్–2, మహిళా, శిశు సంక్షేమం–2, పశుసంవర్ధక శాఖ –2, సోషల్ వెల్ఫేర్–2, ఏపీసీపీడీసీఎల్ –2, క్రీడలు, ఆర్ అండ్బీ, ఉద్యానవనం, బ్యాంకు సంబంధిత, విభిన్న ప్రతిభావంతులు, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయం, సహకార సంఘాలు, ఎండో మెంట్స్, ఎకై ్సజ్, కార్మిక శాకలకు సంబంధించి ఒక్కొక్క అర్జీ వచ్చిందని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహ, డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు ప్రత్యేక అధికారి జి.జ్యోతి, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణా జిల్లా వ్యవసాయాధికారిగా జ్యోతిరమణి
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా వ్యవసాయాధికారిగా కె. జ్యోతిరమణి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యవసాయాధికారిగా పనిచేసిన ఎన్. పద్మావతి శనివారం పదవీవిరమణ చేశారు. ఈ స్థానంలో కృష్ణాజిల్లా వనరుల కేంద్రం డెప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తూ ఉద్యోగోన్నతిపై మార్క్ఫెడ్ జనరల్ మేనేజర్గా ఇటీవల బదిలీ అయిన రమణిను నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆమె సోమవారం కలెక్టర్ డీకే బాలాజీని మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. -
దగా డీఎస్సీపై దద్దరిల్లిన కలెక్టరేట్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో జరిగిన అవకతవకలపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక నిరసన కార్యక్రమం సోమవారం జరిగింది. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కొరివి చైతన్య ఆధ్వర్యంలో యువత భారీగా కలెక్టరేట్కు చేరుకున్నారు. తొలుత కోర్టు సముదాయం సమీపంలోని రమాక్లాత్ సెంటర్ వద్ద నుంచి కలెక్టరేట్కు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. మెగా లీక్.. దగా డీఎస్సీ, మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి, డీఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాలి.. అంటూ ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శన చేశారు. ఆంక్షలు.. అడ్డంకులు.. శాంతియుతంగా ర్యాలీ చేస్తూ కలెక్టరేట్కు చేరుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు, యువతను పోలీసులు గేటు వద్దనే అడ్డుకున్నారు. కలెక్టరేట్ లోపలికి వెళ్లనీకుండా గేట్లు మూసివేశారు. ఆ సమయంలో పోలీసులు, వైఎస్సార్ సీపీ నాయకులకు మధ్య స్వల్పంగా వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు యువతను తోసివేశారు. తోపులాటలో యువత చొక్కాలు చిరిగిపోయాయి. కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేసేందుకు కొద్దిమందిని అనుమతించారు. పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్రావు, తిరువూరు ఇన్చార్జ్ నల్లగట్ల స్వామిదాసు, జగ్గయ్యపేట ఇన్చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కొరివి చైతన్యతో పాటు మరికొందరు నాయకులు కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం కలెక్టరేట్లో వైఎస్సార్ సీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కార్యక్రమంలో నగర మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, అవుతు శ్రీనివాసరెడ్డి, పోతిన మహేష్, ఏ రవిచంద్ర, విద్యార్థి, యువజన, అనుబంధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఎంపికై న, ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థులు చెబుతున్నారు. వారిలో చాలా మందికి ఒక్కరికీ ఉద్యోగాలు రాలేదు. పరీక్ష నిర్వహణలో పారదర్శకత లోపించింది. లక్షలాది రూపాయలకు ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరవాలి. నిరుద్యోగులు, యువతకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. – నలగట్ల స్వామిదాసు, వైఎస్సార్ సీపీ ఇన్చార్జి, తిరువూరు రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో దగా డీఎస్సీ నిర్వహించింది. నిరుద్యోగులను నిండా ముంచింది. ఈ అక్రమాలపై ప్రశ్నిస్తే నిర్బంధించింది. కలెక్టరేట్లోకి ప్రవేశం లేకుండా చేసింది. యువతను అడ్డుకుని చొక్కాలు చించివేశారు. పోలీసులు దౌర్జన్యం చేశారు. డీఎస్సీలో అన్ని దశల్లో అక్రమాలు జరిగాయి. వీటిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. – తన్నీరు నాగేశ్వరరావు, ఇన్చార్జి, జగ్గయ్యపేట -
పారదర్శకంగా జరగలేదు..
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగాలు లక్షల్లో ఇచ్చాం. ఎక్కడా అవకతవకలు జరగలేదు. పూర్తి పారదర్శకంగా జరిగాయి. ఈ ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేసింది. అన్యాయం జరిగిన అభ్యర్థులు కోర్టుకు వెళ్లినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. డీఎస్సీ నియామకాలు పారదర్శకంగా జరిగాయి అన్న నమ్మకం మీకుంటే వాస్తవాలు బయటపెట్టాలి. – మొండితోక జగన్మోహన్రావు, మాజీ ఎమ్మెల్యే -
మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేసింది. ఎన్నికల సమయంలో లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను పూర్తిగా మోసం చేసింది. మెగా డీఎస్సీ కాస్త దగా డీఎస్సీగా మార్చింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డీఎస్సీలో చోటుచేసుకున్న అవకతవకలపై ప్రజలకు, నిరుద్యోగ యువతకు సమాధానం చెప్పాలి. డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. – దేవినేని అవినాష్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు -
బయోగ్యాస్ సరఫరాకు పాయింట్ల పరిశీలన
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వాస్పత్రిలో వంటగ్యాస్ అవసరమైన ప్రాంతాల్లో బయో గ్యాస్లైన్ వేసేందుకు జిల్లా పౌర సరఫరాల అధికారి వాణి సోమవారం పరిశీలించారు. అందులో భాగంగా రోగులు, డ్యూటీ వైద్యులకు ఆహారం సిద్ధం చేసే డైట్ క్యాంటీన్, వైద్య విద్యార్థుల యూజీ, పీజీ హాస్టల్స్, నర్సింగ్ స్కూల్, నర్సింగ్ కాలేజ్లలో డైట్లను ఆమె పరిశీలించారు. ప్రభుత్వాస్పత్రి సమీపంలో బయోగ్యాస్ లైన్ ఉన్నందున, ఆస్పత్రిలో అవసరమైన ప్రాంతాలకు సరఫరా లైన్ వేసేందుకు పాయింట్లు గుర్తించారు. తొలుత ఆస్పత్రి, హాస్టల్స్కు బయోగ్యాస్ లైన్ వేసిన తర్వాత, ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న ప్రైవేటు హోటల్స్, కాఫీ స్టాల్స్కు కూడా సరఫరా చేసేందుకు ఆస్పత్రి అధికారులతో చర్చించారు. ఆమె వెంట అసిస్టెంట్ డైరెక్టర్ (అడ్మిన్) జె. లక్ష్మీకుమారి తదితరులు ఉన్నారు. చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో అమలవుతున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని ప్రజాఉద్యమంగా తీర్చిదిద్దేందుకు ప్రతి అధికారి కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో వివిధ ప్రభుత్వశాఖల అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పరిశుభ్రమైన సమాజ నిర్మాణంలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరమన్నారు. ప్రతిరోజు ఉదయం వాకింగ్ చేసే సమయంలో కనీసం అరగంట సమయం కేటాయించి ఒక వీధిని ఎంపిక చేసుకుని అక్కడ కనిపించే వ్యర్థాలను తొలగించేలా చూడాలన్నారు. జిల్లా అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, యువత ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని ఆదర్శంగా నిలవాలన్నారు. కార్యక్రమానికి సమన్వయకర్తగా జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఫణిధూర్జటి కార్యక్రమ లక్ష్యాలు, అమలు విధానం, అధికారుల భాగస్వామ్యం తదితర అంశాలపై అధికారులకు వివరించారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పవిత్ర సంగమం వద్ద 5వ తేదీ నుంచి ప్రారంభించే కృష్ణమ్మ హారతుల ఏర్పాట్లను దుర్గగుడి ఈవో శీనానాయక్, ఆలయ వైదిక కమిటీ సభ్యులు, ఇంజినీరింగ్ అధికారులు సోమవారం పరిశీలించారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్కు చేరుకున్న అధికారులు ఏర్పాట్ల గురించి చర్చించారు. సంగమం వద్ద హారతుల నిర్వహణకు అవసరమైన సామగ్రిని భద్రపరుచుకునేందుకు తగినన్ని ఏర్పాట్లు చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. 5వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు నవహారతులు ప్రారంభమవుతాయని అధికారులు పేర్కొన్నారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో దుర్గగుడి స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ఏసీ రంగారావు, ఈఈ ఎల్.రమా, వైదిక కమిటీ సభ్యులు ఉన్నారు. తిరువూరు పీఎస్ ఎదుట బాలిక కుటుంబం ఆత్మహత్యాయత్నం తిరువూరు: బాలికతో సచివాలయ ఉద్యోగి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పోలీసులు స్పందించకపోవడంతో ఆ బాలిక కుటుంబసభ్యులు సోమవారం తిరువూరు పోలీసుస్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేశారు. బాధితుల కథనం ప్రకారం.. కొమ్మిరెడ్డిపల్లిలోని సచివాలయ ఉద్యోగి బంకా మధు బాలికతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని గతనెల 17న బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోజూ పోలీసుస్టేషన్ చుట్టూ తిరిగినా కేసు నమోదు చేయకపోవడంతో మనస్తాపానికి గురైన బాలిక తల్లి, అమ్మమ్మ, నాయనమ్మ, అక్క సోమవారం రాత్రి తిరువూరు పోలీసుస్టేషన్ ఎదుట పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. బాధితులను పోలీసులు తిరువూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. టీడీపీకి చెందిన నాయకుల ఒత్తిడి మేరకు ఎస్ఐ శాతకర్ణి కేసు నమోదు చేయకుండా నిందితుడికి కొమ్ము కాస్తున్నారని బాధితులు వాపోయారు. -
సుస్థిరాభివృద్ధికి వినూత్న కార్యక్రమాలు
విజయవాడలో ప్రారంభమైన ఎస్సీఐఏపీ సదస్సులో వక్తలుపటమట (విజయవాడ తూర్పు): పట్టణాల సుస్థిరాభివృద్ధి కోసం స్థానికసంస్థలు వినూత్న కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని విజయవాడ నగరపాలక సంస్థ (వీఎంసీ) కమిషనర్ ధ్యాన్చంద్ర చెప్పారు. విజయవాడ నగరపాలక సంస్థ సహకారంతో ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (యునిడో), గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ (జీఈఎఫ్), కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (ఎన్ఐయూఏ) సంయుక్త ఆధ్వర్యంలో సస్టైనబుల్ సిటీస్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ పైలట్ (ఎస్సీఐఏపీ) అంశంపై విజయవాడలో ఏర్పాటు చేసిన రెండు రోజుల సదస్సును సోమవారం కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ డైరెక్టర్ సురభి మాలిక్ ప్రారంభించారు. ● వీఎంసీ కమిషనర్ ధ్యాన్చంద్ర మాట్లాడుతూ నగరపాలక సంస్థ స్వచ్ఛత, ఘనవ్యర్థాల నిర్వహణ, ఇంటింటి చెత్త సేకరణ, పునరుత్పాదక ఇంధన వినియోగం వంటి రంగాల్లో ఉత్తమ విధానాలను అమలు చేస్తోందన్నారు. ● యునిడో సీనియర్ టెక్నికల్ అడ్వైజర్ డాక్టర్ నంద్పాల్ సింగ్, నేషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ దీపికా లేలే ఎస్సీఐఏఈ చేస్తున్న సేవలను తెలిపారు. ● వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ డీకార్బనైజింగ్ సిటీస్ అంశంపై నిర్వహించిన ప్యానెల్ చర్చలో నిపుణులు పట్టణ ఘనవ్యర్థాల నిర్వహణ, కార్బన్ ఉద్గారాల తగ్గింపు, తక్కువ కార్బన్ ఆధారిత అభివృద్ధి విధానాలపై చర్చించారు. ● ఎన్ఐయూఏ డైరెక్టర్ డాక్టర్ డెబోలినా కుండు, ఎన్ఐయూఏ రిసోర్స్ అండ్ వేస్ట్ విభాగాధిపతి పరమితా దత్తా డే, ఐసీఎల్ఈఐ సౌత్ ఏషియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇమాని కుమార్, గుంటూరు మునిసిపల్ కమిషనర్ కె.మయూర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
అభిమానుల కోసం రక్తమైనా చిందిస్తా : రామ్చరణ్
పెద్ది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో సోమవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా రామ్చరణ్ మాట్లాడుతూ.. విజయవాడ నా అదృష్టమైన నగరం. ఇక్కడే ‘ఇంద్ర’, ‘ఖైదీ నంబర్ 150’ సెలబ్రేషన్స్ చేశాం. ఆర్టిస్ట్గా నేను ఎన్నో కథలు వింటాను. అందులో కొన్ని నచ్చుతాయి. ఇంకొన్ని ఆశ్చర్యపరుస్తాయి. కానీ ఈ కథ విన్నప్పుడు హృదయానికి హత్తుకుంది. ఈ కథ విన్నప్పుడు హృదయానికి హత్తుకుంది. నాన్నగారు చెప్పినట్లు ఇలాంటి కథ పదేళ్లకు ఒకసారి మాత్రమే వస్తుంది. ఇంతమంచి కథను నా దగ్గరకు తీసుకొచ్చిన సుకుమార్గారికి ధన్యవాదాలు. బుచ్చిబాబు దీనిని ఒక సినిమా కథలా చెప్పలేదు. ఒక వ్యక్తి ప్రయాణంలా చెప్పారు. నా సినిమాల లైబ్రరీలో ఈ చిత్రం టాప్లో నిలుస్తుంది. ఈ సినిమాని చాలా ఇష్టం, ప్రేమతో చేశాను. ఇలాంటి కథ కోసం కాకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం? ఇది పడి లేచిన మనిషి ప్రయాణం. ఈ చిత్రంతో బుచ్చిబాబు ఇండియాలో టాప్ డైరెక్టర్స్ జాబితాలో నిలుస్తారు. అభిమానుల కోసం చేతులు విరగొట్టుకుని పనిచేయడమే కాదు. రక్తమైనా చిందిస్తా. నాకు తెలిసిందల్లా సినిమాయే. నేను చనిపోయే వరకూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా అంటూ చరణ్ తన అభిమానులపై ప్రేమను వ్యక్తం చేశారు. హీరోయిన్ జాన్వీకపూర్ తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్నారు. ప్రేక్షకులే దేవుళ్లు అని అమ్మ శ్రీదేవి తనకు చెప్పేదని గుర్తుచేసుకున్నారు. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలోని డైలాగ్ను యాంకర్ సుమ జాన్వీతో చెప్పించారు. హిందీ నటుడు దివ్వేందు కూడా తెలుగులో మాట్లాడి అబ్బురపరిచారు. నిర్మాత కిలారు వెంకట సతీష్ మాట్లాడుతూ తన సొంతూరు పెనమలూరు అని, ఇక్కడ ఈ వేడుక జరగడం ఆనందంగా ఉందన్నారు. ఏఆర్ రెహమాన్ నిర్వహించిన లైవ్ మ్యూజికల్ నైట్ సంగీత ప్రియులను అలరించింది. పెద్ది సినిమాలోని పాటలను ఆయన స్వయంగా పాడటమే కాకుండా స్టెప్పులు కూడా వేశారు. చికిరి చికిరి పాటకు ప్రేక్షకులతో నృత్యాలు చేయించారు. కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, దర్శకుడు బుచ్చిబాబు పాల్గొన్నారు. అనంతరం ఈనెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) పోస్టర్ను ఈవెంట్ వేదికపై ఆవిష్కరించారు. ఎంపీ కేశినేని శివనాథ్, ఏపీఎల్లో ఆడే జట్ల కెప్టెన్లు పాల్గొన్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా జూన్ 4న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
నారా లోకేశ్కు తప్ప ఈ విషయం ఎవరికీ తెలియదు: పేర్ని నాని
విజయవాడ: కూటమి సర్కారు తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. విద్యాశాఖలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన నోటిఫికేషన్లో మరిన్ని పోస్టులు కలిపి మెగా డీఎస్సీ ఇచ్చారని తెలిపారు. పేర్ని నాని విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మెగా డీఎస్సీలో తప్పులే కనిపిస్తున్నాయి. ప్రభుత్వంలో అన్ని పారదర్శకం అని చెబుతారు.. కానీ అన్నీ గుట్టుగానే జరుగుతున్నాయి. కలెక్టర్ కార్యాలయంలో పేర్లు, ర్యాంకులతో లిస్టులు పెట్టాలి. కలెక్టర్ కార్యాలయంలో మెరిట్ లిస్ట్ లు పెట్టాలి. ఆన్లైన్లో చూసిన ప్రతిసారి లిస్టులు మారిపోతున్నాయి. చదువు రానివాడు చూసినా అర్ధమయ్యే రితీలో ఆన్ లైన్లో ఉండాలి. గుడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని చట్టం ఎంత కష్టంగా ఉంటుందో డీఎస్సీ కూడా అలాగే ఉంది.నారా లోకేశ్కి తప్ప డీఎస్సీ గురించి ఎవరికీ తెలియదు. స్పోర్ట్స్ కోటా తనకు తెలియదని విద్యాశాఖ కార్యదర్శి చెబుతాడు. సమాచార శాఖ హక్కు చట్టం ప్రకారం స్పార్ట్స్ కోటాలో కొన్ని ప్రశ్నలు అడిగాం. మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో రిక్యూట్ మెంట్ కింద ఎంతమందిని తీశారు? ఎంత పర్సెంట్ కి ఎన్ని పోస్టులు తీశారు? ఏ జీవో, ఏ సర్క్యూలర్ కింద పోస్టులు తీశారు? 16 వేల పోస్టుల్లో ఎన్ని పోస్టులు తీసుకున్నారు? జిల్లాలో ఏ కేటగిరీ కింద పోస్టులు తీసుకున్నారు. అర్హతకి ఆధారాలు ఏంటీ? సెలక్షన్ ప్రోసిజర్ ఎంటీ? జిల్లా మెరిట్ లిస్ట్, పైనల్ లిస్ట్ కావాలి. స్పోర్ట్స్ కేటగిరీలో వివరాలు అడుగుతున్నాం. స్పోర్ట్స్ కోటాలో ఏ కేటగిరి కింద సెలక్షన్ ఆధారాలు అడిగాం? సెలక్షన్ కమిటీ వివరాలు అడిగాం. స్పోర్ట్ కోటా కింద ఎంతమందిని రిజెక్ట్ చేశారు? ఎందుకు రిజెక్ట్ చేశారు? వంటివి అడిగాం. అభ్యర్థనలు ఏంటీ? అనే కూడా వివరాలు అడిగాం.. డీఎస్సీలో రిక్యూట్ మెంట్ చేయడానికి ప్రభుత్వ అనుమతులు, ఇతర వివరాలు అడిగాం. సందేహాలు వచ్చినప్పుడు, అనుమానాలు వచ్చినప్పుడు తీర్చాల్సిన బాద్యత ప్రభుత్వానిది. టెట్ పేపర్ ఎవరు తయారు చేశారు? ఏ ప్రాతిపదికనా వాళ్లను నియమించారు? వాళ్ల సహయకులు ఎవరు అనేది అడిగాం? పైనల్ లిస్ట్ తయారు చేసిన దాంట్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారా? వాళ్ల పేర్లు ఇవ్వాలని అడిగాం. 16 అంశాల మీద ఆర్టీఐ వేశాం. చంద్రబాబు, లోకేశ్ ఎక్స్ (ట్విట్టర్)లో రెచ్చిపోవడం, సొల్లు కబుర్లు చెప్పడం కాదు. పాత స్పోర్ట్ కోటా జీవో మార్పు చేసి 29 నుండి 67గా ఎందుకు మార్పు చేశారు? రెండు శాతం నుండి 3శాతం వరకు ఎందుకు పెంచారు?పరీక్ష పూర్తి అయిన తరువాత ఎందుకు జీవో మార్పు చేశారు. యువగళంలో పాల్గొని, లోకేశ్తో నడిచిన వాళ్లకు హెరిటెజ్ లో ఉద్యోగాలు ఇచ్చినట్లే ఉద్యోగాలు ఇచ్చేశారు. దొడ్డి దారిన స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చేశారు. నిజం నిలకడగానే తెలుస్తుంది.. డీఎస్సీలో తప్పుడు ఇప్పుడు బయటపడ్డాయి. చంద్రబాబుకు, లోకేశ్కు దమ్ములేదు. మమ్మల్ని తిట్టే టీచర్లు ప్రెస్ మీట్ పెట్టి స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ బయటపెట్టండి. విద్యాశాఖ మంత్రి శాఖను పక్కన పెట్టి.. తప్పుడు పనులకు ప్రయారిటీ ఇస్తున్నారు. కూటమి నేతల పాపాల చిట్టా.. చాలా పెద్దగా ఉంది. తెలంగాణలో కూకట్పల్లి సీటు హరికృష్ణ కూతురుకు ఇచ్చే బదులు రాజ్యసభ సీటు ఇవ్వండి. డబ్బున్న వాళ్లకే ఇస్తారా? డబ్బులేని నందమూరి ప్యామిలీని వాడుకొని వదిలేస్తారా?’’ అని నిలదీశారు. -
లారీ బోల్తా
తప్పిన పెనుప్రమాదం మధురానగర్(విజయవాడసెంట్రల్): రామవరప్పాడు నుంచి కండ్రిక వైపు వెళ్తున్న లారీ ప్రమాదవశావత్తూ బోల్తాపడింది. ఘటనలో అదృష్టవశావత్తూ ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏపీ 05 టీఎఫ్ 1839 లారీ రామవరప్పాడు మొదటి ఫ్లైఓవర్ ఎక్కుతుండగా డ్రైవర్ నిర్లక్ష్యంతో ఇన్ హోటల్ బ్యాక్సైడ్ పుట్ఫాత్ మీదుగా విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టాడు. లారీ పెద్ద శబ్దం చేస్తూ బోల్తాపడింది. అదృష్టవశావత్తూ అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న గుణదల పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. క్రేన్ సాయంతో లారీను తొలగించి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో లారీ బోల్తాపడటంపై స్థానికులు, వాహనచోదకులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. -
ఆర్టీజీఎస్తో మిస్సింగ్ కేసు ఛేదన
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): సాంకేతిక పరిజ్ఞానంలో భాగమైన రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ(ఆర్టీజీఎస్) ఉపయోగించి అదృశ్యమైన ఓ వ్యక్తి ఆచూకీని అజిత్సింగ్నగర్ పోలీసులు కనుగొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సింగ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న నల్లమిల్లి యోహాన్ (40) గత నెల 20వ తేదీ అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో క్రైమ్ నంబర్ 157/2026 గా కేసు నమోదు చేసిన పోలీసులు తమ ప్రత్యేక బృందాల సాయంతో గాలింపు చర్యలు చేపట్టినా ఆ తప్పిపోయిన వ్యక్తి ఆచూకీ లభించలేదు. అనంతరం యోహాన్ ఫొటోను ఆర్టీజీఎస్ వ్యవస్థలో అప్లోడ్ చేయగా ఏలూరు జిల్లా కామవరపుకోట పరిసర ప్రాంతంలోని కెమెరాల్లో అదృశ్యమైన అతను కనిపించినట్లు అలర్ట్ అందింది. దీంతో పోలీసు బృందాలు ఆ ప్రాంతానికి వెళ్లి సీసీ టీవీ పుటేజీలను పరిశీలించారు. తప్పిపోయిన వ్యక్తిని గుర్తించి క్షేమంగా నగరానికి తీసుకువచ్చి అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కేసును చేధించిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు. -
వెంటిలేటర్పై వైద్యారోగ్యం!
పేదలకు పెద్దన్నలా సేవలందించాల్సిన ప్రభుత్వాస్పత్రికి పెద్ద రోగం వచ్చిందా అనే అనుమానం కలుగుతోంది. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి వస్తే బాగుపడతాం అనే నమ్మకం ప్రజల్లో క్రమంగా సన్నగిల్లుతోంది. ఇటీవల కాలంలో ఆస్పత్రిలో సేవలు సక్రమంగా అందడం లేదన్న భావన వ్యక్తమవుతోంది. అందుకు ఆస్పత్రిలో ఇటీవల చోటుచేసుకుంటున్న మరణాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఒక్క మే నెలలోనే ఏకంగా 570 మరణాలు సంభవించడం భయాందోళనలు రేకెత్తిస్తోంది. అమ్మో.. పెద్దాస్పత్రి అంటున్న రోగులులబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ సర్వజన ఆస్పత్రిలో డెత్రేట్ పెరుగుతూ వస్తోంది. ఒకప్పుడు రోజుకు 12 నుంచి 15 వరకూ మరణాలు నమోదయ్యాయి. ఇప్పుడు అవి 20కి పెరిగాయి. అంతేకాదు ఒక్క మే నెలలోనే ఏకంగా 570 మరణాలు నమోదు కాగా, ఎండలు అధికంగా ఉన్న ఒక్కరోజే 42 మరణాలు సంభవించాయి. ప్రభుత్వాస్పత్రిలో వైద్య సేవలు దిగజారుతున్నాయనేందుకు ఇవే నిదర్శనంగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నిపుణులైన వైద్యులు ఉన్నా, మెరుగైన వైద్యం అందించేందుకు కనీస సౌకర్యాలు కొరవడినట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి. దీంతో ప్రాణాపాయ స్థితిలో వచ్చిన వారికి మెరుగైన వైద్యం అందించలేక పోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సౌకర్యాల లేమితోనేనా? ప్రభుత్వాస్పత్రిలో అత్యవసర సమయంలో ప్రాణ వాయువు అందించే వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉంది. ఒకప్పుడు వెంటిలేటర్లు 80 వరకూ ఉండేవి, వాటిలో చాలా వరకూ పాడైపోవడంతో వాటిని పక్కన పెట్టేశారు. ప్రస్తుతం 35 వరకూ ఉన్నాయి. వాటిలో ఎన్ని సక్రమంగా పనిచేస్తున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇటీవల ఎంపీ నిధుల నుంచి నాలుగు వెంటిలేటర్లు అందజేశారు. వాటిని ట్రామాకేర్ వార్డులో ఏర్పాటు చేశారు. ఇంకా ఐసీయూల్లో తీవ్ర మైన కొరత ఉంది. ప్రాణాపాయంతో వచ్చిన వారిని ఉంచేందుకు వెంటిలేటర్లు అందుబాటులో ఉండని పరిస్థితి తలెత్తుతోంది. ఎక్కువ మరణాలు సంభవించడానికి అది కూడా ఒక కారణమనే అనుమానాలు ఉన్నాయి. గతంలో ఖరీదైన అత్యవసర ఇంజెక్షన్స్ను ముందుగానే కొనుగోలు చేసి ఉంచేవారు. ఇప్పుడు అవి అవసరమైనప్పుడు అత్యవసరంగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో కొంత జాప్యం జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా డెత్రేట్ పెరగడానికి అనేక కారణాలున్నట్లు అంచనా వేస్తున్నారు. పర్యవేక్షణాలేమి కూడా.. ఆస్పత్రిలో వైద్య సిబ్బందిలో జవాబుదారీతనం కొరవడినట్లు ఆరోపణలు ఉన్నాయి. రోగి ప్రాణాలు పోతున్నాయని చెప్పినా, వార్డుల్లో ఉండే సిబ్బంది పట్టించుకోని పరిస్థితి నెలకొంది. కనీసం కుర్చీలో నుంచి రోగి వద్దకు వచ్చే పరిస్థితి కూడా సిబ్బందిలో కనిపించడం లేదు. మరోవైపు కొందరు వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసుపైనే మక్కువ చూపుతున్నారు. మొక్కుబడిగా రావడం. ఎఫ్ఆర్ఎస్ వేయడం, వెళ్లిపోవడం జరుగుతోంది. ఇలా వైద్యం అందించడంలో నిర్లక్ష్యం కూడా రోగుల ప్రాణాల మీదకు వస్తోంది. ఇప్పటికై నా అధికారులు, వైద్యులు, సిబ్బందిలో జవాబుదారీతనం వచ్చేలా చూడాలనే డిమాండ్ పెరుగుతోంది. జనాలు పిట్టల్లా రాలిపోతున్నా పట్టని సర్కారు ఒక్క రోజే 42మంది మృతిప్రభుత్వాస్పత్రిలో రోగులు పిట్టల్లా రాలుతున్నారు. 2026లో జనవరిలో 523, ఫిబ్రవరిలో 524, మార్చిలో 417, ఏప్రిల్లో 484, మేలో 570 మరణాలు అధికారికంగా నమోదయ్యాయి. అంతేకాదు మే నెలలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న మూడు రోజుల్లో ఒకరోజు 42 మరణాలు నమోదు కాగా, మరోరోజు 39 మరణాలు, ఇంకోరోజు 36 మరణాలు నమోదయ్యాయి. మొత్తంగా ఏప్రిల్ 25 నుంచి మే 25 వరకూ 570 మరణాలు సంభవించాయి. అందుకు ప్రధాన కారణం అధిక ఉష్ణోగ్రతలుగా చెబుతున్నారు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. అంతేకాదు ఆస్పత్రికి వచ్చేసరికే మరణించిన వారు మరో 15 నుంచి 20 మంది ఉంటారని అంచనా. ఈ బ్రాట్ డెత్లు ఆస్పత్రి రికార్డుల్లో నమోదు కావు. విజయవాడ జీజీహెచ్లో ఒక్క నెలలోనే 570 మరణాలువైద్య రంగం పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం తగదు. ప్రభుత్వాస్పత్రులకు వచ్చేది ఎక్కువగా పేద ప్రజలే. వారికి నాణ్యమైన వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆస్పత్రిలో వెంటిలేటర్ల కొరత ఉందని రెండేళ్లుగా చెబుతున్నా ప్రభుత్వానికి చెవికెక్కడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆస్పత్రిలో మెరుగైన సౌకర్యాలు కల్పించి, నాణ్యమైన సేవలు అందించేందుకు కృషి చేయాలి. – దేవినేని అవినాష్, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ -
కారుపై అకస్మాత్తుగా విరిగిపడిన భారీ వృక్షం
భవానీపురం(విజయవాడపశ్చిమ): ప్రయాణిస్తున్న ఒక కారుపై రోడ్డు పక్కన ఉన్న భారీ వృక్షం అకస్మాత్తుగా విరిగిపడిన సంఘటన ఆదివారం సాయంత్రం విద్యాధరపురంలో చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు కారు నడుపుతున్న వ్యక్తి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. సేకరించిన సమాచారం మేరకు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. విద్యాధరపురం సితార జంక్షన్ నుంచి కుమ్మరిపాలెం సెంటర్ వైపు వెళుతున్న ఏపీ 39డబ్ల్యూఎన్ 4335 నంబర్ గల వెర్టిగ కారు చెరువు సెంటర్ సమీపంలో రోడ్ పక్కనే ఉన్న చిన్న సాయిబాబా గుడి వద్దకు వచ్చేసరికి కొన్నేళ్లనాటి పురాతన భారీ వృక్షం ఒక్క సారిగా విరిగి కారుపై పడింది. దీంతో స్థానికులతోపాటు వాహనచోదకులు భయభ్రాంతులకు గురయ్యారు. అప్రమత్తమైన స్థానికులు భవానీపురం పోలీసులకు, నగరపాలక సంస్థ అధికారులకు సమాచారాన్ని అందించారు. హుటాహుటిన వచ్చిన వారు స్థానికుల సహకారంతో కారులో ఇరుక్కుపోయిన వ్యక్తిని అతికష్టంపై బయటకు తీశారు. స్వల్ప గాయాలతో బయటపడిన అతనికి ప్రాథమిక చికిత్స చేయించారు. పోలీసుల సమాచారం మేరకు గుంటూరు జిల్లా తాడేపల్లి నులకపేట రాజీవ్ కాలనీకి చెందిన కొక్కిలిగడ్డ రాజశేఖర్ (45) ట్రావెల్స్ కారు నడుపుతూ ర్యాపిడో నిమిత్తం విజయవాడకు వచ్చారు. ప్యాసింజర్ను దింపేసి తిరిగి తాడేపల్లి వెళిపోతున్న క్రమంలో ప్రమాదం జరిగినట్లు తెలిసింది. కారు డ్రైవ్ చేస్తున్న రాజశేఖర్ స్వల్ప గాయాలతో బయటపడటంతో అక్కడ అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే కారుపై పడింది పెద్ద వృక్షం కావడంతో కారుకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్ నుంచి సితార జంక్షన్కు వెళ్లే ఈ అంబేడ్కర్ రోడ్లో నిత్యం ప్రజల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ రహదారిలో కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న భారీ వృక్షాలను తొలగించాల్సిన అవసరం ఉందని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. -
నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోండి
వత్సవాయి: ఆయా పంటల సాగులో రైతులు నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయాధికారి డీఎంఎఫ్ విజయకుమారి సూచించారు. ఆదివారం మండల కేంద్రం వత్సవాయిలోని విత్తనాల షాపులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు నమ్మకమైన షాపులో నాణ్యమైన విత్తనాలను తీసుకుని సాగు చేసినట్లయితే ఇబ్బందులు ఉండవన్నారు. రైతులు విత్తనాలను కొనుగోలు చేసిన తరువాత తప్పకుండా రశీదులు తీసుకుని వాటి మీద బ్యాచ్ నంబర్ ఉండేటట్లు చూసుకోవాలన్నారు. తీసుకున్న రశీదులను పంట పూర్తమ్యే వరకు జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలని తెలిపారు. ఒకవేళ విత్తనాలలో లోపం ఉన్నట్లయితే సదరు రశీదుతో షాపుల మీద కేసు పెట్టుకునే అవకాశం ఉంటుదని తెలిపారు. కార్యక్రమంలో ఏవో జి. సత్యనారాయణ పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న ఉచిత ప్రసాద వితరణ పథకానికి విజయవాడ లబ్బీపేటకు చెందిన ఎం. నరేంద్ర జ్యోతి రూ. 1,00,116ల విరాళాన్ని అందజేశారు. అలాగే అమ్మవారి నిత్యాన్నదానానికి సికింద్రాబాద్ సికింద్రాబాద్ వెంకటాపురానికి చెందిన వి. కల్కి చరణ్, శివానిల పేరిట కుటుంబ సభ్యులు రూ. లక్ష విరాళాన్ని అధికారులకు అందించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో దర్శనం కల్పించి ప్రసాదాలు, శేషవస్త్రం, అమ్మవారి చిత్రపటం అందచేశారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల(ఎస్ఎంసీ), గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో పలు పోస్టుల భర్తీకి స్వీకరించిన దరఖాస్తుల్లో ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విడుదల చేసినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు ఒక ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగా ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, స్టెచ్చర్ బేరర్స్, జనరల్ డ్యూటీ అటెండెంట్స్, నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులకు సంబంధించి ప్రొవిజనల్ జాబితాపై అభ్యంతరాలను జూన్ 1 నుంచి 3 వరకూ స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు. మెరిట్ జాబితా జిల్లా అధికారిక వెబ్సైట్ ntr.ap.gov.inలో పరిశీలించవచ్చని ఆయన తెలిపారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు ఆదివారం అర కిలో వెండిని కానుకగా సమర్పించారు. విజయవాడకు పేరువీటి స్వరూప రాణి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. రూ.1.36లక్షల విలువైన అరకిలో వెండిని చైర్మన్ బొర్రా రాధాకృష్ణకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం ఇవ్వగా.. దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. ఉత్సాహంగా క్రికెట్ టోర్నీతాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని బ్రహ్మానందపురంలో నిర్వహిస్తున్న ఫ్యాక్టరీ ప్రీమియర్ లీగ్ సీజన్–2 క్రికెట్ టోర్నమెంట్లో 50 జట్లు తలపడగా.. ఆదివారం సులోచన, మొబిన్ సీసీ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. బహుమతి ప్రదానోత్సవానికి ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ హాజరై గెలుపొందిన మొబిన్ సీసీ జట్టుకు కప్ ప్రదానం చేశారు. ఆయన మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిచారు. ఈగల్ ఎస్పీ నగేష్బాబు, డీఎస్పీ శాంతరాజ్ పాల్గొన్నారు. -
రైల్వే ఉద్యోగుల కనీస వేతనం పెంచాలి
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): రైల్వే అభివృద్ధిలో భాగస్వామ్యం అయిన ఉద్యోగులకు కనీస వేతనం రూ.69వేలుగా ఉండాలని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ (ఎన్ఎఫ్ఐఆర్) జాతీయ అధ్యక్షుడు మర్రి రాఘవయ్య డిమాండ్ చేశారు. విజయవాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మే 19న హైదరాబాద్కు వచ్చిన వేతన సంఘ ప్రతినిధులకు రైల్వే ఉద్యోగులు, సిబ్బంది సమస్యలను ఎంప్లాయీస్ సంఘ్ ఆధ్వర్యంలో ప్రతిపాదనలు అందజేసినట్లు తెలిపారు. ఇందులో నూతన పెన్షన్ స్కీమ్ను రద్దు చేయాలని, ఫిట్మెంట్ 3.83 శాతంగా ఉండాలని, కనీస వేతనం రూ.69వేలుగా నిర్ణయించాలని, అదే విధంగా ఇంటి అద్దె అలవెన్సులు మార్చాలని, ఇంక్రి మెంట్ పెంపు ఐదు శాతం ఉండాలని, మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని, విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న రైల్వే ఉద్యోగులు, కార్మికులకు ప్రత్యేక అలవెన్సులు అందజేయాలని సూచించినట్లు పేర్కొన్నారు. -
బియ్యం బకాసురులు!
రేషన్ దుకాణాలకు రాకముందే పక్కదారి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రేషన్ దుకాణాలకు రాకుండానే దారి మళ్లుతోంది. గతంలో బియ్యాన్ని పాలిథీన్ సంచుల్లోకి మార్చి తరలించేవారు. ఇపుడు ఏకంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ముద్రలతో ఉన్న గన్నీ బ్యాగులను యథాతథంగా ఉంచి పక్కదారి పట్టిస్తున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయాల్సి ఉంటుంది. కానీ ఒకటో తేదీ లోపే కొన్ని రేషన్ దుకాణాల్లో బియ్యం మాయమవుతోంది. ప్రభుత్వం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఎన్ని నిబంధనలు విధించినా అక్రమార్కులు శత ‘కోటి’ ఉపాయాలు ఆలోచించి చాక చక్యంగా దారి మళ్లిస్తున్నారు. ఈ తంతు అధికారులకు తెలిసినప్పటికీ నామమాత్రపు దాడులతో సరిపెడుతున్నారు. జిల్లాలో పరిస్థితి.. జిల్లాలో మొత్తం 957 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 5,96,378 మంది కార్డుదారులు ఉన్నారు. నెల నెలా 8,339 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ జరుగుతోంది. ఇందులో 80శాతం వరకు దారిమళ్లుతోంది. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. బియ్యం మాఫియాకు కాసులు కురిపిస్తోంది. రేషన్ డీలర్లు కొందరు రింగ్గా ఏర్పడి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. డీలర్ల నుంచి సేకరించి బడా వ్యాపారులకు విక్రయిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు రేషన్ బియ్యం అక్రమ రవాణాను ఆదాయ వనరుగా మార్చుకున్నారు. మామూళ్ల మత్తులో.. బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న విషయం తెలిసినప్పటికీ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అప్పుడప్పుడు అధికారులు నామమాత్రపు దాడులతో సరిపెడుతున్నారు. బియ్యం వ్యాపారులు నెలనెలా అధికారులకు మామూళ్లు పంపుతున్నామంటూ బాహాటంగానే చెబుతున్నారు. ఒక్కో రేషన్ షాపు నుంచి ఇంత మొత్తం అని రేటు నిర్ణయించి అధికారులకు మామూళ్లు ముట్టజెబుతున్నారు. ఒకరిద్దరు డీలర్లు డబ్బులు ఇచ్చేందుకు నిరాకరిస్తే వారిని నాయకుల ద్వారా, అధికారుల ద్వారా భయపెట్టి దారికి తెచ్చుకుంటున్నారు. కేసులు బనాయిస్తామని, రేషన్ షాపు రద్దు చేస్తామని వారిని వేధింపులకు గురిచేస్తున్నారు. విజయవాడ నగరంలో ఒక్కో రేషన్ షాపు నుంచి అధికారులకు రూ.1750 నుంచి రూ. 2వేల వరకు రేషన్ డీలర్లే వసూలు చేసి అధికారులకు ముట్టజెపుతున్నట్లు సమాచారం. ఆ డీలర్ కనుసన్నల్లోనే మాఫియా.. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని ఓ రేషన్ డీలర్ కనుసన్నల్లోనే రేషన్ అక్రమ రవాణా జరుగుతోంది. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో డీలర్లంతా ఇతనికే బియ్యం విక్రయించాలని అధికారులతో ఒత్తిడి చేయిస్తున్నారు. కూటమి నేతల అండదండలతోనే బియ్యం అక్రమ రవాణా సాగిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయం పౌర సరఫరా శాఖలో ప్రతి అధికారికి తెలిసినప్పటికీ అతని వైపు కన్నెత్తి చూడడం లేదు. ప్రతినెలా 20వ తేదీ నుంచి ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా అవుతోంది. ఒకటే తేదీ నుంచి కార్డుదారులకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. కానీ ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రేషన్ దుకాణానికి చేరిన బియ్యం పంపిణీకి ముందే అక్రమ రవాణా జరుగుతోంది. వయో వృద్ధులకు ఒకటో తేదీ కంటే ముందు నుంచే బియ్యం సరఫరా చేయాలన్న నిబంధన ఉంది. దీన్ని అడ్డుపెట్టుకుని ఒకటో తేదీన బియ్యం పంపిణీ ప్రారంభానికి ముందే అక్రమంగా తరలిస్తున్నారు. వయో వృద్ధులతో పాటు ఇతర కార్డుదారులకు పంపిణీ చేయాల్సిన మొత్తం అక్రమంగా తరలిపోతోంది. అధికారులు తనిఖీ చేస్తే వృద్ధులకు పంపిణీ చేశామని చెబుతున్నారు. రెండు రోజుల క్రితం జిల్లా జేసీ రేషన్ డీలర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. రేషన్ బియ్యం అక్రమంగా తరలించే వారిపై అవసరమైతే పీడీ యాక్ట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. జేసీ ఆదేశాల నేపథ్యంలో రెండు రోజులుగా విజయవాడ నగరంతో పాటు జిల్లాలోనూ రేషన్ షాపులపై దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఒకటో తేదీ నుంచి పంపిణీ చేయాల్సిన బియ్యం ఇప్పటికే దుకాణాల నుంచి తరలివెళ్లినట్లు తెలిసింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రేషన్ షాపులు తనిఖీ చేయగా స్టాక్ వ్యత్యాసాలు బయటపడ్డాయి. 4 షాపులను అధికారులు తనిఖీ చేయగా ఇందులో రెండు షాపుల్లో సరుకు తరలిపోయినట్లు గుర్తించారని సమాచారం. ఆయా షాపులు నిర్వహిస్తున్నట్లు డీలర్లు తాము అందుబాటులో లేమంటూ చెప్పడంతో షాపులకు తాళాలు వేసినట్లు తెలిసింది. పశ్చిమంలో బినామీ పేరుతో నడుస్తున్న షాపునకు అధికారులు తాళం వేశారు. ఇక్కడ మాఫియాగా మారిన రేషన్ డీలర్ కింది స్థాయి అధికారుల ద్వారా సర్దుబాటు చేస్తున్నట్లు తెలిసింది. -
గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో విజయవాడ విద్యార్థి
వన్టౌన్(విజయవాడపశ్చిమ): గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కోసం నిర్వహించిన కీ బోర్డు సంగీత వాయిద్య బృందంలో విజయవాడకు చెందిన చిన్నారికి స్థానం లభించింది. నగరంలోని సెయింట్ జాన్స్ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న మైఖల్ డేవిడ్ మందా ఫిబ్రవరిలో హైదరాబాద్లో జోరాస్ట్రియన్ క్లబ్లో గిన్నిస్ బుక్ ప్రతినిధుల సమక్షంలో కీబోర్డ్ సంగీత వాయిద్య పోటీల్లో పాల్గొన్నాడు. 22 దేశాల నుంచి సుమారు 2000 మంది కీబోర్డ్ వాయిద్యకారులు హాజరై ఏకంగా గంట సమయం వరకు ఆగకుండా ప్రదర్శన చేశారు. 777 మంది ఎంపిక కాగా ఈ ప్రదర్శనకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో స్థానం లభించింది. ఈ సందర్భంగా హల్లెల్ మ్యూజిక్ స్కూల్ అధినేత అగస్టిన్ దండింగి చేతుల సర్టిఫికెట్ ప్రదానోత్సం ఈ నెల 29వ తేదీన హైదరాబాద్లో జరిగింది. మైఖల్ డేవిడ్ మందా సర్టిఫికెట్ను అందుకున్నారు. -
వైభవంగా ఇంద్ర‘గిరి ప్రదక్షిణ’
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అధిక జ్యేష్ఠ పౌర్ణమి నేపథ్యంలో ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ ఆదివారం వైభవంగా సాగింది. తెల్లవారు జామున 5.55 గంటలకు దుర్గగుడి ఘాట్రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం వద్ద శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చకులు, ఈవో దంపతులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తొలుత ప్రత్యేకంగా అలంకరించిన పూల వాహనాన్ని ఆది దంపతులు అధిరోహించగా, ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు. ఆదిదంపతులతో పాటు దేవస్థాన ప్రచార రథం ముందుకు సాగగా మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కోలాట నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాల మధ్య గిరిప్రదక్షిణ కనుల పండువగా సాగింది. ఒకే నెలలో రెండు పర్యాయాలు గిరి ప్రదక్షిణ జరగడం విశేషం. మే 1వ తేదీ వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకొని గిరి ప్రదక్షిణ జరగగా, మే 31వ తేదీ అధిఖ జ్యేష్ఠ పౌర్ణమి రావడంతో మరోమారు ఆదివారం గిరిప్రదక్షిణ జరగింది. ప్రదక్షిణ ఇలా.. దుర్గగుడి నుంచి ప్రారంభమైన గిరిప్రదక్షిణ ఊరేగింపు కుమ్మరిపాలెం, విద్యాధరపురం, సితారా, కబేళా, పాల ప్రాజెక్టు, కేఎల్రావునగర్, చిట్టినగర్, కేటీరోడ్డు, బ్రహ్మణ వీధి మీదగా ఆలయానికి చేరుకుంది. పెద్ద ఎత్తున భక్తులు, ఉభయదాతలు, సేవా సిబ్బంది, ఆలయ అధికారులు, సిబ్బంది కుటుంబ సమేతంగా గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. తమ ఇంటి ముంగిటకు విచ్చేసిన ఆది దంపతులకు భక్తులు పూజా సామగ్రి సమర్పించి ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు దేవస్థానం కుంకుమతో పాటు పులిహోర ప్రసాదాలను పంపిణీ చేసింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం -
గుట్కా, ఖైనీకి యువత దూరంగా ఉండాలి
నో టుబాకో డే ర్యాలీలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశలబ్బీపేట(విజయవాడతూర్పు): ఊపిరితిత్తులు, క్యాన్సర్ వ్యాధులకు కారణమైన పొగాకు, గుట్కా, ఖైనీ వంటి మత్తుపదార్థాలకు యువత దూరంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేలా ప్రజలను చైతన్యవంతులను చేసి, పొగాకు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్న సంకల్పంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈగల్ టీమ్, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక కలెక్టరేట్ నుంచి ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం వరకూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ పొగాకు వినియోగంతో మన శరీరంలోని ప్రధాన అవయవాలకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. యువతే లక్ష్యం.. యువతను లక్ష్యంగా చేసుకుని పొగాకు పరిశ్రమలు అనుసరిస్తున్న ప్రచార వ్యూహాలను గుర్తించి వాటిని ఎదుర్కొనేందుకు సమాజంలోని అన్ని వర్గాలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఈగల్ ఐజీ ఆకే రవి కృష్ణ అన్నారు. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కార్యక్రమం ద్వారా విద్యాసంస్థల పరిసరాల్లోని అక్రమ పొగాకు విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. నేషనల్ టుబాకో కంట్రోల్ ప్రోగ్రామ్ రాష్ట్ర అధికారులు డాక్టర్ గీతాపద్మజ, డాక్టర్ సౌజన్యలక్ష్మిలతో పాటు రెడ్క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ జి. సమరం, ఇన్చార్జి డీఎంహెచ్ఓ డాక్టర్ జె. ఇందుమతీదేవి పాల్గొన్నారు. -
జూన్ నుంచి అందుబాటులోకి అన్నదాన, లడ్డూపోటు భవనాలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: దుర్గమ్మ సన్నిధిలోని నూతనంగా నిర్మించిన అన్నదానం, ప్రసాదాల పోటులను జూన్ నెల నుంచి వినియోగించాలని ఆలయ కమిటీ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ నిర్ణయించారు. దుర్గగుడిలో చేపట్టిన అభివృద్ధి పనుల తీరుపై ‘సాక్షి’ ఈ నెల 14న ‘నత్తేనయం’ శీర్షికతో కథనాన్ని ప్రచురించింది. దుర్గగుడి మాస్టర్ ప్లాన్లో చేపట్టిన అభివృద్ధి పనుల ఆలస్యం, భక్తుల ఇబ్బందులను ఈ కథనం కళ్లకు కట్టినట్లు వివరించింది. శనివారం బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి ఆవరణలో దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సమావేశం జరగగా ఆలయ చైర్మన్, ఈవో ఈ కథనంలో వెల్లడించిన దుర్గగుడి అభివృద్ధి పనులపైనే ప్రధానంగా చర్చించారు. గత ఏడాది దసరా ఉత్సవాలు, భవానీ దీక్ష విరమణల సమయంలోనే అన్నదానం, లడ్డూపోటు భవనాల పనులు తుది దశకు చేరుకొన్న విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటి వరకు ఎందుకు అందుబాటులోకి తీసుకురాలేదని ఆలయ అధికారులను ప్రశ్నించారు. ప్రస్తుతం అన్నదాన భవనంలో వెలుపల తుది పనులు జరుగుతున్నాయని, మరో పక్షం రోజుల్లో పూర్తి చేస్తామని ఈవో పేర్కొన్నారు. మరో వైపున జూలై 15 నుంచి ఆషాఢ మాసోత్సవాలు ప్రారంభం కానుండటంతో అప్పటిలోగా అన్నదానాన్ని నూతన భవనంలోకి తరలించేలా చూడాలని సూచించారు. సారె సమర్పించిన ప్రతి భక్తుడికి అన్న ప్రసాదం ప్రస్తుతం మహా మండపం రెండో అంతస్తులో రోజూ సుమారు 5 వేల మందికి అన్న ప్రసాదం పంపిణీ చేస్తుండగా, నూతన అన్నదాన భవనంలో పది వేల మందికి అందించేలా నిర్మాణం జరిగింది. సారె సమర్పించిన ప్రతి ఒక్కరికీ అన్న ప్రసాదం అందాలంటే నూతన భవనంలోనే సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు. మరో వైపున లడ్డూ పోటు దాదాపు పూర్తి కాగా ఆ భవనంలో కూడా లడ్డూ తయారీకి అవసరమైన గ్యాస్ పొయ్యిలు, ఇతర మిషనరీని సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులు ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. ఉత్సవాల సమయంలో లడ్డూలను కనకదుర్గానగర్లోని ప్రసాదాల కౌంటర్లోకి తరలించడం పెద్ద సమస్యవుతోంది. కొత్త భవనం అందుబాటులోకి వస్తే ఆసమస్య పరిష్కరం కానుంది. అర్జున వీధిలో దేవస్థాన కాటేజీ ప్రతిపాదనలు సిద్ధం దుర్గమ్మ భక్తుల సౌకర్యార్థం అర్జున వీధిలో నూతన కాటేజీ నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని రాధాకృష్ణ పేర్కొన్నారు. కనకదుర్గనగర్, అర్జున వీధిల్లో ఉన్న షెడ్డుతో పాటు పక్కనే ఉన్న ప్రయివేటు స్థలాన్ని తీసుకుని దేవస్థానం నూతన కాటేజీలను నిర్మించాలని ప్రతిపాదనలు చేసిందన్నారు. రెండో ఘాట్ రోడ్డు పనులు కూడ త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు. దుర్గమ్మకు చెందిన ఆస్తులు, పొలాలు, భూములను రక్షించేందుకు ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులతో కలిపి ఓ బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ట్రస్ట్ బోర్డులో మొత్తం 25 అంశాలు చర్చకు వచ్చాయి. -
మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మాదక ద్రవ్యాల మత్తుతో యువత విలువైన జీవితం చిత్తు కాకూడదని, వాటి నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ, సీపీ ఎస్వీ రాజశేఖరబాబు అన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ఏర్పాటు చేసిన నషా ముక్త్ భారత్ అభియాన్ నార్కో కోఆర్డినేషన్ సెంటర్ జిల్లా స్థాయి సమన్వయం సమావేశం శనివారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో డ్రగ్స్పై దండయాత్ర విజయం, జిల్లాలో నిర్వహిస్తున్న విస్తృత అవగాహన కార్యక్రమాలు, ఈగల్ ఆపరేషన్స్, డీ అడిక్షన్ కేంద్రం సేవలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, హాట్స్పాట్స్ తనిఖీలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్, సీపీ మాట్లాడుతూ డ్రగ్స్ తీసుకుంటే కలిగే నష్టాలను వివరించారు. జిల్లాలోని గుర్తించిన సుమారు 150 హాట్ స్పాట్ల్లో కీలకమైన ప్రాంతాల్లో రాత్రిపూట కూడా అత్యాధునిక నైట్ విజన్ డ్రోన్లతో నిఘా ఉంచాలని సూచించారు. 1972 టోల్ఫ్రీ నంబరు గురించి ప్రజలకు తెలియజేసేలా విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరముందన్నారు. ఈ సందర్భంగా ఫోరం ఫర్ చెల్డ్ రైట్స్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నివారణపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ కేజీవీ సరిత, జిల్లా విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ అధికారి ఎం.ఫణి ధూర్జటి, డీఈవో చంద్రకళ. ఈగల్ అధికారులు ఎం.రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు -
తిరుపతమ్మ హుండీ ఆదాయం రూ.91.95 లక్షలు
పెనుగంచిప్రోలు: గ్రామంలోని శ్రీతిరుపతమ్మకు భక్తులు హుండీల ద్వారా రూ.91.95 లక్షలకు పైగా నగదును కానుకలు, మొక్కు బడిగా సమర్పించారు. వీటిని శనివారం అమ్మవారి మండపంలో లెక్కించారు. 60 రోజులకు ఆలయంలో మొత్తం హుండీల్లోని కానుకలు లెక్కించగా నగదు రూపంలో రూ.91,95,850, మిశ్రమ బంగారం 25 గ్రాములు, వెండి 380 గ్రాములు వచ్చినట్లు ఆలయ ఈఓ బి.మహేశ్వరరెడ్డి పేర్కొన్నారు. యూఎస్ఏ డాలర్లు 123, లండన్ పౌండ్స్ 30, బ్రెజిల్ 20 డాలర్లు, సెంట్రల్ బ్యాంక్ 6 లిబియా దినార్స్ వచ్చాయన్నారు. కానుకలను ఆలయ సిబ్బందితో పాటు పరిటాలకు చెందిన ఉమ సేవా సమితి సభ్యులు, గ్రామానికి చెందిన భక్తులు లెక్కించారు. కానుకల లెక్కింపును ఈఓ, ఉత్సవ కమిటీ మాజీ సభ్యులు చుంచు రమేష్బాబు, గ్రూప్ టెంపుల్స్ ఈఓలు సీహెచ్ జయప్రకాష్, బీవీ సుబ్బారావు పర్యవేక్షించారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్ (మెన్ అండ్ ఉమెన్) చాంపియన్షిప్లో తమ యూనివర్సిటీ నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు ఒంగోలు శారద కాలేజ్ ఆఫ్ ఫిజియో థెరపీకీ చెందిన విద్యార్థి ఎం.రమేష్ను ఎంపిక చేశామని ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్స్ స్పోర్ట్స్ బోర్డ్ డైరెక్టర్ డాక్టర్ త్రిమూర్తి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 120 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగం పోటీల్లో రమేష్ పాల్గొంటారని పేర్కొన్నారు. పోటీలు చైన్నెలో వచ్చే నెల 3 నుంచి 8వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ పి.చంద్రశేఖర్, రిజిస్ట్రార్ టి.సాయిసుఽధీర్, అధ్యాపకులు.. రమేష్ను శనివారం యూనివర్సిటీ ఆవరణలో అభినందించారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): క్రీడలతో ఆరోగ్యం, ఐక్యతాభావం పెంపొందుతాయని ఎన్టీఆర్ జిల్లా క్రీడాభివృద్థి అధికారి (డీఎస్డీవో) కె.కోటేశ్వరరావు చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా క్రీడా విభాగం ఆధ్వర్యంలో వేసవి సందర్భంగా ఈ నెల 1వ తేదీ నుంచి జిల్లాలో పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాల ముగింపు కార్యక్రమం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆవరణలో శనివారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ సమ్మర్ కోచింగ్ క్యాంపుల్లో శిక్షణ పొందిన వారు క్యాంపులు ముగిసిన తర్వాత కూడా ఆయా క్రీడల్లో శిక్షణను కొనసాగించాలని సూచించారు. ఏపీ క్రీడా ప్రాథికార సంస్థ(శాప్) డైరెక్టర్ సంతోష్, యూత్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎన్టీఆర్ జిల్లా అధికారి డాక్టర్ కొల్లేటి రమేష్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లా ప్రతినిధులు దుర్గారావు, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): సైబర్ మోసాలపై సామాన్యులకు అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించడమే ఎన్టీఆర్ పోలీస్ ఖాకీ స్టూడియో లక్ష్యమని పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అన్నారు. నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే, జరగక ముందే ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్కు ఐదు రోజుల ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. శనివారం ముగిసింది. సీపీ మాట్లాడుతూ శిక్షణ పొందిన సిబ్బంది సైబర్ నేరాలు, వివిధ ఆన్లైన్ మోసాలు, ఓఎల్ఎక్స్ యాప్ ద్వారా జరిగే మోసాలు వంటి వాటిపై ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. తక్కువ మాటలతో ఎక్కువ సందేశాన్ని ఇచ్చేలా సామాన్యులకు అర్థమయ్యే రీతిలో అవగాహన కలిగించాలని సూచించారు. కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ సరిత, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాఆదివారం శ్రీ 31 శ్రీ మే శ్రీ 20267లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్జిల్లా డీఎంహెచ్ఓ సుహాసిని పదవీ విరమణ చేయడంతో, డెప్యూటీ డీఎంహెచ్ఓగా ఉన్న ఇందుమతిదేవి ఇన్చార్జిగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాలు వచ్చాయి .పెనమలూరు: యనమలకుదురు శ్రీరామలింగేశ్వరస్వామి దేవాలయం వద్ద భక్తులు శనివారం గిరిప్రదక్షిణ చేశారు. ఆలయంలో భక్తులు తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించారు.భవానీపురం: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో సోమవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్న స్నాతకోత్సవాల ఏర్పాట్లను వైస్ చాన్సలర్ చంద్రశేఖర్ శనివారం పరిశీలించారు. -
డాక్టర్ సుహాసిని సేవలు స్ఫూర్తిదాయకం
ఉద్యోగ విరమణ సభలో పలువురు వక్తలులబ్బీపేట(విజయవాడ తూర్పు): ఎన్టీఆర్ జిల్లా డీఎంహెచ్ఓగా డాక్టర్ మాచర్ల సుహాసిని అందించిన సేవలు యువ వైద్యులకు స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు. ఉమ్మడి కృష్ణాజిల్లా డీఎంహెచ్ఓగా 18 నెలల పాటు పనిచేసిన ఆమె, ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటైన నాటి నుంచి నాలుగేళ్ల రెండు నెలల పాటు సమర్థంగా సేవలు అందించారని పలువురు ప్రశంసించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ సుహాసిని ఉద్యోగవిరమణ సభ శనివారం గవర్నర్పేటలోని ఐవీ ప్యాలెస్లో జరిగింది. సభలో జేసీ ఇలక్కియతో పాటు, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ కె.పద్మావతి, గుంటూరు డీఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, జాయింట్ డైరెక్టర్ గణపతిరావు, స్టేట్ ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ డాక్టర్ దేవితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సుహాసిని సుదీర్ఘకాలం పాటు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం, డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఇందుమతిదేవి, డీఐఓ డాక్టర్ శరత్బాబు, ఎన్హెచ్ఓ డీపీఎంఓ డాక్టర్ నవీన్, ఆర్బీఎస్కే అధికారి డాక్టర్ మాధవీనాయుడు, స్టాటికల్ ఆఫీసర్ లక్ష్మోజీ, జిల్లాలోని వైద్యాధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కోడూరు: హంసలదీవి సాగరతీరం అల్లకల్లోలంగా మారింది. వాతావరణ మార్పులతో రెండు రోజుల నుంచి అలలు ఉధృతి ఎక్కువగానే ఉంది. శనివారం మరింత అధికమైంది. సముద్ర అలలు సుమారు మూడు మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్నాయి. తీరంలోని ఇసుకతిన్నెలు సైతం భారీగా కోతకు గురయ్యాయి. పౌర్ణమి ఘడియలు కావడంతో సముద్రుడి హోరుతో తీరప్రాంతం ప్రతిధ్వనిస్తోంది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో అటవీ అధికారులు ముందు జాగ్రత్తగా తీరం గేట్లను మూసివేశారు. -
ఏపీ డీఎస్సీ అక్రమాలు.. ఈ ప్రశ్నలకు బదులేదీ?
సాక్షి, విజయవాడ: డీఎస్సీపై మీడియా సమావేశం నిర్వహించిన విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్.. డీఎస్సీ అక్రమాల ఆరోపణలపై సమాధానాలు దాటవేశారు. కీలకమైన ఆరోపణలకు ఆయన సమాధానం ఇవ్వలేదు. ఎస్ఈఆర్టీలో పనిచేసే నవీవ్కి టాప్ ర్యాంక్పై మీడియా ప్రశ్నించగా.. కోన శశిధర్ మూడు రకాలుగా సమాధానం చెప్పారు. అనుమతి తీసుకోలేదు కాబట్టి పక్కనపెట్టామన్న శశిధర్.. మరోసారి కౌన్సిలింగ్కి రాలేదు కాబట్టి పక్కన పెట్టామంటూ చెప్పుకొచ్చారు. అతను రెండు పరీక్షలు రాశాడంటూ మరో సమాధానం చెప్పారు. 6 వేల ప్రశ్నలు గుర్తుపెట్టుకుని చేసేశాడంటే నమ్మశక్యమా? అంటూ కోన శశిధర్ వింత సమాధానం ఇచ్చారు.నవీన్ లాగిన్ని ఎందుకు బ్లాక్ చేశారని మీడియా ప్రశ్నించగా.. దానిపై కూడా కోన శశిధర్ సమాధానం చెప్పలేదు. స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్లపై తప్పించుకునే ధోరణి ప్రదర్శించారు. స్పోర్ట్స్ కోటా అంతా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్నే అడగండంటూ దాటవేశారు. రెగ్యులర్, స్పోర్ట్స్ కోటా ఒకేసారి ఎందుకు చేయలేదో స్పష్టత ఇవ్వని శశిధర్.. స్పోర్ట్స్ కోటా జీవోలు మార్పుపై తనకు సంబంధం లేదని దాటవేశారు.స్పోర్ట్స్ పాలసీ ప్రకారం మేము అనుసరించాం. ఆ రోజు స్పోర్ట్స్ పాలసీ ప్రకారం పరీక్ష లేకపోయినా ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నాం. తర్వాత పాలసీని మార్చారు. స్పోర్ట్స్ పాలసీపై చర్చ వాళ్లనే అడగాలి. స్పోర్ట్స్ ది సెపరేట్గా హ్యాండిల్ చేద్దాం. జీఏడీ ఇచ్చిన జీవో ప్రకారం మేం చేశాం’’ అంటూ శశిధర్ చెప్పుకొచ్చారు. స్పోర్ట్స్ కోటాలో అక్రమాల ఆరోపణలపై ప్రభుత్వం ఇప్పటికీ స్పందించలేదు. టెట్, డీఎస్సీకి ఒకే కన్వీనర్ నియమాకాన్ని శశిధర్ సమర్థించుకున్నారు. -
ఒకటో తేదీ నుంచి యోగా ఉత్సవాలు
పెనమలూరు: కానూరులో యోగా శక్తి సాధనసమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని సంస్థ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. ఆయన శుక్రవారం కానూరులో వివరాలు తెలుపుతూ జూన్ 1వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కానూరు అశోక్నగర్ ఇండియన్ ఓం కార్యాలయంలో ఉత్సవాలు ప్రారంభించి నిర్వహిస్తామన్నారు. ఉత్సవాలలో భాగంగా అవగాహన సదస్సులు, ఆరోగ్య శిబిరాలు, వైద్య కార్యక్రమాలు చేపడతామని వివరించారు. ముఖ్యంగా నొప్పులకు శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే విజయవాడ, పిఠాపురం, రేపల్లె, గుడివాడ, ఉయ్యూరు, బాపట్ల, విశాఖపట్నం ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలలో పాల్గొనే వారు 9000347369కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాలని మాకాల సత్యనారాయణ సూచించారు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): కృష్ణానదిలో గుర్తు తెలియని మృతదేహం కొట్టుకు వచ్చిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం బ్యారేజీ 56వ కానా వద్ద మృతదేహం ఉన్నట్లు వన్టౌన్ పోలీసులకు సమాచారమందింది. దానిపై పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుని వద్ద ఎటువంటి గుర్తింపు కనపడలేదు. మృతుని వయస్సు సుమారు 55 నుంచి 60 ఏళ్ల మధ్య ఉంటుందని గుర్తించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. వన్టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జౌళి రంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపేందుకు కృషి
కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ హనుమాన్జంక్షన్ రూరల్: జౌళి పరిశ్రమ రంగంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాల కృషి చేస్తామని కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలోని ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో మోహన్ స్పిన్టెక్స్ ఫ్యాక్టరీని శుక్రవారం ఆయన సందర్శించారు. రాష్ట్ర బీసీ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత, మోహన్ స్పిన్టెక్స్ ఎండీ వల్లభనేని సుధాకర్ చౌదరి ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆయన మల్లవల్లి పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించారు. ఏపీలో విస్తృత అవకాశాలు.. ఆంధ్రప్రదేశ్లో జౌళి పరిశ్రమ రంగంలో ఎదిగేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం జౌళి రంగానికి రూ.10,860 కోట్లు మేర ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ప్రకటించిందన్నారు. ఈ ప్రొత్సాహాకాల్లో ఏపీ అత్యధిక వాటాను సొంతం చేసుకోవాలని సూచించారు. అనంతరం మోహన్ స్పిన్టెక్స్ పరిశ్రమ ప్రాంగణంలో ఆయన మొక్క నాటారు. అక్కడ ఉన్న పుంగనూరు ఆవులు, దూడలను పరిశీలించారు. రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి, కలెక్టర్ డీకే బాలాజీ, కేంద్ర సిల్క్ బోర్డ్ సభ్య కార్యదర్శి శివకుమార్, డైరెక్టర్ గిరీష, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి నీరబ్కుమార్, కేంద్ర జౌళి కార్పోరేషన్ గుంటూరు డివిజన్ డెప్యూటీ డైరెక్టర్ ధనశేఖరన్, చేనేత, జౌళి శాఖ ఏడీలు పాల్గొన్నారు. విద్యుత్ తీగలే.. యమపాశాలై.. పమిడిముక్కల: విద్యుత్ షాక్కు గురై ఇంటర్ విద్యార్థిని ముళ్లపూడి అంకిత(17) మృతి చెందిన ఘటన శుక్రవారం లంకపల్లిలో చోటు చేసుకొంది. స్థానికుల కథనం ప్రకారం.. ఉదయం నిద్రలేచిన అంకిత స్నానం చేసేందుకు లంకపల్లి మెయిన్ పాఠశాల వద్ద పంపు వద్దకు నీటి కోసం వెళ్లింది. గురువారం రాత్రి వీచిన ఈదురుగాలులకు పంపుపై చెట్టు కొమ్మలు, విద్యుత్ తీగలు తెగి పడి ఉన్నాయి. ఇది గమనించని అంకిత నీరు పట్టేందుకు ప్రయత్నించగా.. తెగిపడిన వైర్లలో విద్యుత్ ప్రవహించడంతో షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు కర్రలతో విద్యుత్ వైర్లను పక్కకు జరిపి చూడగా అప్పటికే అంకిత మృతి చెందింది. దీంతో అంకిత తల్లిదండ్రులు ఇశ్రాయేలు, నాగమణి కన్నీరుమున్నీరుగా విలపించారు. కూలీపనులు చేసుకొంటూ కుమార్తెను చదివించుకొంటున్నామని ఆవేదన చెందారు. అంకిత మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకొన్నాయి. సమాచారం అందిన వెంటనే ఎన్ఐ బి.శ్రీను, విద్యుత్ ఏడీ సుందరరావు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ప్రమాద వివరాలు అడిగి తెలుసుకొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీను తెలిపారు. పెనమలూరులో మరో యువకుడు మృతి పెనమలూరు: చెత్త సేకరించి అమ్ముకునే యువకుడు ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటనపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటనారాయణ తెలిపిన వివరాల ప్రకారం పటమట జేడీనగర్కు చెందిన ఏసురాణి, కొండయ్యలకు ముగ్గురు పిల్లలు. వారి కుమారుడు చల్లా శ్రీను(17)తో కలిసి చెత్త ఏరుకొని జీవనం కొనసాగిస్తున్నారు. కాగా శుక్రవారం ఏసురాణి, కొండయ్య చెత్త సేకరణ కొసం రామవరప్పాడుకు వెళ్లగా శ్రీను కానూరు కొత్త ఆటోనగర్కు వచ్చాడు. అయితే మధ్యాహ్నం 12గంటలకు చెత్త కొట్టు యజమాని ఏసురాణికి ఫోన్ చేసి కొత్త ఆటోనగర్ రెండో లైన్లో కరెంట్ ఆఫీస్ పక్కన శ్రీను చనిపోయి ఉన్నాడని సమాచారం తెలపటంతో ఘటనా స్థలం వద్దకు ఏసురాణి, భర్త కొండయ్య వెళ్లారు. డ్రెయినేజీలో విద్యుత్ తీగలు పడి ఉండగా ప్రమాదవశాత్తూ శ్రీను విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈ ఘటనపై తల్లి ఏసురాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
అధికారుల నిర్లక్ష్యంతోనే నిండు ప్రాణాలు బలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వంలో అధికారులు మొద్దు నిద్ర పోతున్నారని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపించారు. ముఖ్యంగా విద్యుత్ శాఖ అధికారులు ప్రజలకు నిర్లక్ష్యంగా సమాధానాలు చెబుతున్నారన్నారు. అప్రకటిత విద్యుత్ కోతలతో వృద్ధులు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నామని ఫోన్లు చేస్తే అధికారులు స్పందించడం లేదన్నారు. ఆ శాఖ నిర్లక్ష్యం కారణంగానే రెండు నిండు ప్రాణాలు బలి అయ్యాయన్నారు. విద్యుత్ షాక్తో మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని, అప్రకటిత విద్యుత్ కోతలు ఆపాలని కోరుతూ వైఎస్సార్ సీపీ నేతలు ఎస్ఈ కార్యాలయంలో శుక్రవారం వినతి పత్రం అందజేశారు. నిర్లక్ష్యమే కారణం.. అవినాష్ మాట్లాడుతూ విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా హోంగార్డు జానీ చనిపోయారన్నారు. అలాగే ఈట్స్ట్రీట్లో ప్రైవేటు వ్యక్తులు జనరేటర్, గ్యాస్, వాటర్ పేరిట దందా చేస్తున్నారని ఆరోపించారు. రోజుకు ఒక్కో షాపు నుంచి రూ. వెయ్యి నుంచి రూ. 1500 వసూలు చేస్తున్నారన్నారు. ప్రైవేటు వ్యక్తుల జనరేటర్ దందా కారణంగా ఈట్ స్ట్రీట్లో సూర్యప్రకాష్ అనే వ్యక్తి మృత్యువాత పడ్డాడన్నారు. కూటమి ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుని మృతుల కుటుంబాలకు చెరో రూ.50లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నగరంలో అప్రకటిత విద్యుత్ కోత కొనసాగుతోందన్నారు. కొండ ప్రాంతాలు, కరకట్ట ప్రాంతాలు, కాలనీల్లో రాత్రి 9 గంటలకు విద్యుత్ నిలిచిపోతే మరుసటి రోజు ఉదయం 6గంటలకు సరఫరా ఇస్తున్నారన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం పెద్దలు, అధికారులు బుద్ది తెచ్చుకుని ప్రజానీకానికి మంచి చేయాలన్నారు. తక్షణమే బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలన్నారు. లోపించిన జవాబుదారీతనం.. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ విజయవాడ నగరంలో విద్యుత్ శాఖ ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న కరెంట్ కష్టాలు, ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. అధికారులు విద్యుత్ కోతలు లేవని చెబుతున్నారని, కానీ సమయం, సందర్భం లేకుండా రెండు, మూడు గంటల పాటు అర్ధరాత్రి వేళల్లో విద్యుత్ కోతలు పెడుతున్నారన్నారు. నగరపాలక సంస్థ, విద్యుత్ శాఖ పూర్తిగావిఫలమయ్యాయన్నారు. జవాబు దారీతనం లోపించిందన్నారు. గాలి వానలకు ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫల మైందన్నారు. ఇవి ప్రభుత్వ హత్యలే.. మాజీ మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ కొద్దిపాటి గాలివానకే విజయవాడ నగరంలో అతలాకుతలం అవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా ఒక్కరోజే రెండు నిండు ప్రాణాలు బలైపోయాయన్నారు. ఇవి పూర్తిగా ప్రభుత్వ హత్యలేనన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. -
నేడు దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సమావేశం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థాన ట్రస్ట్ బోర్డు సమావేశం శనివారం ఉదయం 10గంటలకు బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి ఆవరణలో జరగనుంది. ట్రస్ట్ బోర్డు చైర్మన్ బోర్రా రాధాకృష్ణ అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశానికి ట్రస్ట్ బోర్డు సభ్యులతో పాటు ఆలయ ఈవో శీనానాయక్, ఇంజినీరింగ్ అధికారులు, ఏఈవోలు హాజరుకానున్నారు. 31న గిరి ప్రదక్షిణ.. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ 31వ తేదీన జరగనుందని వైదిక కమిటీ పేర్కొంది. 31వ తేదీ తెల్లవారుజామున 5.55 గంటలకు దుర్గగుడి ఘాట్రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులతో గిరిప్రదక్షిణ ప్రారంభిస్తారు. అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమయ్యే గిరి ప్రదక్షిణ కుమ్మరి పాలెం, నాలుగు స్తంభాల సెంటర్, సితారా జంక్షన్, కబేళా, పాలప్రాజెక్టు, కేఎల్రావునగర్, చిట్టినగర్, కేటీరోడ్డు, బ్రాహ్మణ వీధి మీదగా తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. 3న కానుకల లెక్కింపు.. దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు భక్తులు హుండీల ద్వారా సమర్పించే కానుకలు, ముడుపులు, మొక్కబడులను జూన్ 3వ తేదీన లెక్కించనున్నారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు మహా మండపం ఆరో అంతస్తులో కానుకల లెక్కింపు ప్రారంభం కానుంది. లెక్కింపును దేవస్థానం సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించడంతో పాటు ఆలయ అధికారులు, పోలీసు, ఎస్పీఎఫ్ సిబ్బంది బందోబస్తు మధ్య లెక్కింపు జరగనుంది. -
పరిహారం వచ్చాకే పనులు ప్రారంభించాలి
చిలకలపూడి(మచిలీపట్నం): మచిలీపట్నం నార్త్ మండలం పొట్లపాలెం పంచాయతీ పరిధిలోని కొత్తపూడి గ్రామ దళిత, పేద రైతుల పొలాల్లో ముందస్తు సమాచారం లేకుండా హైటెన్షన్ విద్యుత్ లైన్ల ఏర్పాటు కోసం రెవెన్యూ అధికారులు మార్కింగ్ ఇవ్వటం పట్ల మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ లైన్ల ఏర్పాటుకు సంబంధించి గ్రామస్తులు గురువారం నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి మద్దతు పలికేందుకు వచ్చిన ఆయన మాట్లాడుతూ రైతులకు తాను అండగా ఉంటానన్నారు. 1994–95లో అప్పటి ప్రభుత్వం ఈ ప్రాంతంలోని దళిత, పేద కుటుంబాలకు జీవనాధారంగా తలొక ఎకరం భూమి పట్టాలు ఇచ్చిందన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆ పేదల కలలను నిజం చేస్తూ పట్టా భూములన్నింటికి సర్వ హక్కులతో కూడిన ప్రైవేటు ఆస్తులుగా (ప్రీ హోల్డ్) మార్చటం జరిగిందన్నారు. కాని నేడు మచిలీపట్నం పోర్టు అవసరాల పేరుతో ఆ భూములను నిలువునా ముంచేందుకు అధికారులు సిద్ధమయ్యారని ఆరోపించారు. హైటెక్ విద్యుత్ లైన్లతో భూమి విలువ పతనం... ఈ హైటెక్ విద్యుత్ వైర్లు ఏర్పాటు చేస్తే రైతులకు ఆత్మహత్యలే శరణ్యమని పేర్ని నాని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా, సమాచారం ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు వచ్చి పొలాల మధ్యలో హెవీ విద్యుత్ టవర్ల కోసం మార్కింగ్ చేయటంపై రైతులు కన్నీరు, మున్నీరవుతున్నారన్నారు. లైన్ల ఏర్పాటు వల్ల భూమి విలువ శూన్యంగా మారుతుందని, భవిష్యత్తులో ఆ భూమిని ఎవరు కొనలేరని కనీసం బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకోవడానికి కూడా పనికిరాకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎన్నో కష్టాల్లో ఉన్న కుటుంబాలకు ఈ ఎకరం భూమే జీవనాధారమని దీనిని కూడా కోల్పోతే వారి బతుకులు అంధకారమవుతాయన్నారు. అత్యుత్తమ పరిహారం అందించాలి... విద్యుత్లైన్ల ఏర్పాటు కోసం పూర్తి భూసేకరణ జరపాలని, విద్యుత్ టవర్లు వేసి వదిలేయటం కుదరదని పేర్ని నాని తేల్చి చెప్పారు. ఆలైన్లు వెళ్లే పొలాలను ప్రభుత్వం కొనుగోలు చేసి భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో మాదిరిగా రైతులు సంతోషపడేలా అత్యుత్తమ పరిహారాన్ని అందించాలని కోరారు. రైతులు చిరునవ్వుతో భూములను అప్పగించేలా నష్టపరిహారం చెల్లించిన తరువాతే పనులను ప్రారంభించాలని సూచించారు. పేద రైతుల పొలాల్లో బలవంతంగా పనులు చేపడితే తాము ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మట్టా మోహననాంచారయ్య, వన్నెంరెడ్డి రామకృష్ణ, గాజుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సమాచారం లేకుండా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు తగదు బలవంతంగా పనులు చేపడితే ఊరుకోబోం రైతులకు మద్దతు పలికిన మాజీ మంత్రి పేర్ని నాని -
రారు.. రానని అనరు!
బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం ముస్లింలు ప్రత్యేక నమాజ్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మసీదులతో పాటు, ఖాళీ ప్రాంగణాల్లో సామూహిక ఈద్ నమాజ్ నిర్వహించారు. త్యాగం, విధేయత, దాతృత్వం, సోదరభావం వంటి గొప్ప సందేశాలను ఈ పర్వదినం ప్రపంచానికి తెలియజేస్తోందని ముస్లిం పెద్దలు వివరించారు. ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరిగిన సామూహిక ఈద్ నమాజ్లను చిత్రాల్లో చూడొచ్చు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆలయాల పరిపాలనను ప్రభుత్వం గాలికి వదిలేసిందని సర్వత్రా విమర్శలొస్తున్నాయి. ఆలయాల పరిరక్షణతో పాటుగా నిత్యం జరిగే వైదిక కార్యక్రమాలు, భక్తులకు కల్పించాల్సిన వసతులు.. ఇలా ఆయా దేవుని సన్నిధిని పర్యవేక్షించాల్సిన దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులు వాటిని పూర్తిగా గాలికొదిలేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆలయాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని, వాటి ఆధ్వర్యంలో ఉన్న ఆస్తులను అధికార పార్టీ నేతలకు అందించే కార్యక్రమంలో మాత్రం బిజీగా ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే అధికారులు తమకిష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలొస్తున్నాయి. వారంలో ఒక్కరోజూ రారు.. ఉమ్మడి జిల్లాలో చాలా మంది కార్యనిర్వహణాధికారులకు ఒకటి, రెండు లేదా ఇంకా ఎక్కువ ఆలయాల బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు. వారివారి లాబీయింగ్తో పాటుగా రాష్ట్ర స్థాయి అధికారుల సహాయ సహకారాలతో వీలైనన్ని ఎక్కువ ఆలయాల బాధ్యతలు చూస్తుంటారు. అయితే వారంలో ఒక రోజైనా ఆయా ఆలయాలకు వెళ్లాల్సి ఉంటుంది. కనీసం ముఖ్యమైన రోజుల్లోనైనా భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆయా ఆలయాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. కానీ నెల మొత్తం మీద మూడు నాలుగు రోజులు కూడా ఆయా ఆలయాలకు వెళ్లని అధికారులు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా విజయవాడలో ఒక్క ఆలయంలో విధులు నిర్వహిస్తున్నా, నాలుగైదు రోజులకు ఒకసారి కూడా అక్కడ కనిపించని వారు చాలా మంది ఉన్నారని పలువురిపై ఆరోపణలు ఉన్నాయి. వారికే కీలక బాధ్యతలు.. ఆరోపణలు ఉన్న వారికి ఏసీ కార్యాలయంలో బాధ్యతలు సహాయ కమిషనర్ కార్యాలయంలో డెప్యూటేషన్పై ఇతర ఆలయాలు సత్రాల నుంచి వచ్చిన అధికారులపై పలు ఆరోపణలు ఉన్నట్లు ఆ శాఖ సిబ్బంది చెబుతున్నారు. ముఖ్యంగా గతంలో కొన్ని కీలకమైన అంశాలకు సంబంధించిన దస్త్రాలు మాయం చేసిన వారు, భూముల విక్రయించటం, హుండీ చోరీ తదితర ఆరోపణలు ఉన్న వ్యక్తులు సహాయ కమిషనర్ కార్యాలయంలో ఎలా విధులు నిర్వర్తిస్తారని దేవదాయ శాఖ ఉద్యోగులు సైతం ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఉమ్మడి జిల్లాలోని పలు ఆలయాల ఆస్తులకు సంబంధించి అధికార పార్టీ నేతలకు సహాయ మందించే లక్ష్యంతో కొంతమంది పని చేస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. దేవదాయ శాఖకు చెందిన వివిధ స్థాయిల్లోని అధికారుల తీరుపై భక్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మచిలీపట్నం గొడుగుపేట వేంకటేశ్వరస్వామి దేవస్థానం భూముల వ్యవహారంతో పాటుగా గుడివాడలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానం స్వామి వారి కిరీటం అంశంపై అధికారుల తీరుపై మండిపడుతున్నారు. పైకి కనిపించే అంశాలు కొన్ని మాత్రమే అని ముడుపులతో చాలా విషయాలు బయటకు రాకుండా అధికారులు తొక్కిపెడుతున్నారని ఉద్యోగులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం విధానాల ఫలితంగానే దేవదాయ శాఖ అధికారులు సైతం దారుణంగా వ్యవహరిస్తున్నారని సర్వత్రా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవదాయ ధర్మదాయ శాఖ పరిధిలో ఉన్న పలు ఆలయాలకు సంబంధించి పని చేస్తున్న అధికారులు ఒక చోట జీతం తీసుకుంటూ మరో చోట పని చేయటంపై భక్తులు మండి పడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఆ శాఖ సహాయ కమిషనర్ కార్యాలయంలో లక్ష్మీనారాయణశెట్టి సూపరింటెండెంట్గా పని చేస్తున్నారు. జిల్లాలోని వేలాది ఆలయాల పర్యవేక్షణకు సంబంధించిన విధులను నిర్వర్తించాల్సిన ఆయన.. పెద్ద అవుటుపల్లి గ్రూప్ టెంపుల్స్కు కార్యనిర్వహణాధికారిగా సైతం వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా సత్యనారాయణపురం శివాలయంలో బి. గంగాధర్ గ్రేడ్–2 కార్యనిర్వహణాధికారిగా పని చేస్తున్నారు. ఆయనే జిల్లా సహాయ కమిషనర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా డెప్యూటేషన్పై పని చేస్తున్నారు. జి.కొండూరు గ్రూప్ టెంపుల్స్కు గ్రేడ్–2 కార్యనిర్వహణాధికారిగా కె. నాగరాజు కొనసాగుతున్నారు. నాగరాజు ఆ బాధ్యతలతో పాటుగా సహాయ కమిషనర్ కార్యాలయంలోనూ డెప్యూటేషన్పై పని చేస్తున్నారు. పాతబస్తీలోని చల్లంరాజు వారి సత్రం కార్యనిర్వహణాధికారిగా సుబ్బారెడ్డి పని చేస్తున్నారు. ఆయన సైతం సహాయ కమిషనర్ కార్యాలయంలో డెప్యూటేషన్పై విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదే రీతిలో చాలా మంది తమతమ ఆలయాలు, సత్రాల నిర్వహణను వదిలేసి సహాయ కమిషనర్ కార్యాలయంలో డెప్యూటేషన్పై పని చేయటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. వారంలో ఒక్కరోజూ ఆలయాలకు రాని వైనం గాడి తప్పుతోన్న పాలన ఇటీవల పలు ఆలయాల్లో ఘటనలతో ఇబ్బందికర పరిస్థితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు -
కానూరు సబ్స్టేషన్ అప్గ్రేడ్నకు చర్యలు
పెనమలూరు: కానూరు కొత్తఆటోనగర్ సబ్స్టేషన్ను అప్గ్రేడ్ చేయటానికి ఏపీసీడీసీఎల్ చైర్మన్ ఆండ్ మేనేజింగ్ డైరెక్టర్ పి.పుల్లారెడ్డి ఆమోదించారని ఈఈ ఆపరేషన్స్ పి.హరిబాబు తెలిపారు. ఈ మేరకు గురువారం సీఎండీ పుల్లారెడ్డి, ప్రాజెక్ట్స్ డైరెక్టర్ వీఎస్ఎన్.మూర్తి ఆటోనగర్ సబ్స్టేషన్ను పరిశీలించారన్నారు. ఈ ఈ హరిబాబు వివరాలు తెలుపుతూ కానూరు ఆటోనగర్ 33/11 కేవీ సబ్స్టేషన్ పై విపరీతంగా లోడ్ పడుతున్నందున సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకోని రూ 125 కోట్లతో కానూరు ఆటోనగర్ సబ్స్టేషన్ను 132 కేవీ సబ్స్టేషన్ను అప్గ్రేడ్ చేస్తామన్నారు. దీంతో గంగూరులో ఉన్న 132 కేవీ సబ్స్టేషన్పై లోడ్ గణనీయంగా తగ్గుతుందన్నారు. పెనమలూరు, పోరంకి, తాడిగడప తదితర ప్రాంతా లోడ్ తగ్గి నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతుందని వివరించారు. కాగా పెదపులిపాక కరకట్ట దిగువున 33/11 కేవీ సబ్స్టేషన్ నిర్మించటానికి అధికారులు స్థలం పరిశీలించారు.పెదపులిపాక, యనమలకుదుఉఉ గ్రామాలకు మెరుగైన విద్యుత్ సరఫరా చేయటానికి నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ హనుమయ్య, విద్యుత్ శాఖ డీఈలు,ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు. -
దోచుకొచ్చి.. దొరల్లా అమ్మేస్తున్నారు!
సాక్షి, టాస్క్ఫోర్స్: దొంగ బంగారం కొనుగోలుకు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట కేంద్రంగా మారింది. రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో యథేచ్ఛగా దందా సాగుతోంది. కొందరు స్థానిక వ్యాపారులు ఈ దొంగ బంగారాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ నేరగాళ్లకు సహకరిస్తున్నారు. భారీగా బంగారం వ్యాపారం.. రాష్ట్ర స్థాయిలోనే జగ్గయ్యపేటలో బంగారం, వెండి వస్తువులు తయారీ, కొనుగోళ్లకు ఎంతో ప్రసిద్ధి. వందేళ్లుగా ఇక్కడ క్రయ విక్రయాలు కోట్ల రూపాయల్లో జరుగుతాయి. పట్టణంలో 95కి పైగా బంగారు, వెండి దుకాణాలు ఉన్నాయి. ప్రతిరోజు బంగారం మూడు కేజీలు, వెండి 5 నుంచి 10 కేజీల వరకు కొనుగోళ్లు జరుగుతాయి. ప్రతి నెలలో 25 రోజుల పాటు 80 నుంచి 100 కేజీల బంగారం, వెండి 100 నుంచి 200 కేజీల వ్యాపార అమ్మకాలు జరుగుతాయి. దీంతో దుకాణాలు నిత్యం వినియెగదారులతో కళకళలాడతాయి. దొంగలకు పేట అడ్డా.. తెలంగాణకు సరిహద్దుగా జగ్గయ్యపేట ప్రాంతం ఉండటంతో దొంగలు దోచుకున్న బంగారాన్ని అమ్ముకునేందుకు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కోదాడ, సూర్యా పేట, హుజుర్నగర్, మల్లారెడ్డిగూడెం, ఏపీలోని గుంటూరు, పల్నాడుజిల్లా పరిధిలోని పిడుగురాళ్ల, సత్తెనపల్లి, మాచర్ల, నరసరావుపేట, ప్రాంతాల్లో అపహరించిన బంగారం వస్తువులను ఈ ప్రాంతంలోని కొన్ని బంగారు దుకాణాలకు విక్రయిస్తున్నారు. ఇలా ప్రతినెల సూమారు 500 గ్రాముల నుంచి కిలో వరకు అపహరించిన బంగారు వస్తువులను అమ్మకాలు చేస్తుంటారు. ఇందుకు యజమానులు కూడా సంబంధించిన బిల్లులను కూడా చూడకుండా వస్తువులను కొనుగోలు చేసి వాటికి బదులుగా నగదును చెల్లిస్తున్నారు. మఫ్టీలో పోలీసులు.. పేట పట్టణానికి పోలీసులు అధికంగా రికవరీ కోసం వస్తున్నారు. ప్రతినెలలో కనీసం 10 నుంచి 15 సార్లు దొంగతనానికి గురైన బంగారాన్ని రికవరీ చేసేందుకు నల్గొండ, గుంటూరు, దాచేపల్లి మిర్యాలగూడకు చెందిన పాలీసులు మఫ్టీలో దుకాణాల వద్దకు బంగారం అమ్మిన వ్యక్తులను తీసుకుని వస్తుంటారు. నామమాత్రంగా రికవరీలు.. గడిచిన రెండేళ్లలో ఏపీ–తెలంగాణ పోలీసులు నామమాత్రంగా రికవరీలు చేస్తున్నారు. 2025లో ఏప్రిల్లో కోదాడలో 100గ్రాముల బంగారం అపహరించిన కేసులో పోలీసులు పట్టణంలోని ఓ దుకాణంలో విక్రయించగా అపహరించిన దొంగ సమాచారం మేరకు యజమానిని అరెస్ట్ చేశారు. అదే ఏడాది నేల కొండపల్లిలో మూడు తులాల బంగారాన్ని ఓ దుకాణంలో రికవరీ చేశారు. తాజాగా ఈ నెల 19న పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీసులు వచ్చి ఓ దుకాణంలో 100గ్రాముల బంగారం రికవరీ చేసేందుకు దొంగను బేడీలతో దుకాణానికి తీసుకువచ్చి విచారించారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు.. జగ్గయ్యపేటలో కోట్లాది రుపాయల బంగారు క్రయ విక్రయాలు జరుగుతున్నప్పటికీ ఉన్నతాధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. ఇక్కడ బంగారం ఎక్కడి నుంచి వస్తోంది? అందుకు సంబంధించిన రికార్డులు, అనుమతులు ఉన్నయో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దొంగ బంగారం కొనుగోలుకు కేంద్రంగా జగ్గయ్యపేట నేరగాళ్లకు సహకరిస్తున్న కొందరు వ్యాపారులు రాష్ట్ర సరిహద్దు కావడంతో యథేచ్ఛగా దందా తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధికంగా రికవరీ కేసులు పట్టణంలో వరుసగా ఇటువంటి సంఘటనలు జరుగుతుండటంతో యజమానులకు, దొంగలకు మధ్య బలమైన బంధం ఉందనే విమర్శలు వస్తున్నాయి. రికవరీకి పోలీసులు దుకాణాలకు వస్తే కొందరు వర్తక సంఘ నాయకులు వారితో మాట్లాడి, సెటిల్మెంట్ చేసి పంపించి వేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో దొంగిలించిన బంగారాన్ని రికవరీ చేసుకోవడం, కేసును క్లోజ్ చేయడం వరకూ పోలీసులు పరిమితం అవుతుండగా.. బంగారం కొనుగోలు చేస్తున్న వ్యాపారులపై ఎలాంటి కేసులు నమోదు కావడం లేదు. -
కారు భైక్ ఢీ.. యువకుడు దుర్మరణం
ఎ.కొండూరు: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొన్న ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం గోపాలపురంలో గురువారం ఉదయం చోటు చేసు కుంది. సేకరించిన వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం పెనుబల్లి మండలం సూరయ్యబంజర గ్రామానికి చెందిన మాలావతు నాగు (26)కు భార్య, కుమారుడు ఉన్నారు. నాగు గురువారం రేపూడి గ్రామం నుంచి బయలుదేరి సూరయ్య బంజరు వెళ్తున్న క్రమంలో మణుగూరు నుంచి విజయవాడ వెళ్తున్న కారు బైక్ను బలంగా ఢీ కొట్టింది. దీంతో నాగు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే బైక్ పూర్తిగా దగ్దమైంది. సమాచారం అందుకున్న పోలీసులు కారును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కుట్రలను తిప్పి కొట్టండి
జాబితాలను సరిచూడండి.. ● వైఎస్సార్ సీపీ బీఎల్ఏలతో మాజీ మంత్రి పేర్ని నాని ● పామర్రులో ఎస్ఐఆర్, జాబితా మ్యాపింగ్పై అవగాహన పామర్రు: వైఎస్సార్ సీపీకి చెందిన ప్రతి బూత్ లెవెల్ ఏజెంట్(బీఎల్ఏ) తన పరిధిలో ఉన్న బూత్ లెవెల్ ఆఫీసర్(బీఎల్వో)ల నుంచి మ్యాపింగ్ కాని లిస్టులను తీసుకుని, ఈనెల 30 తేదీ నాటికి వాటిని మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య(నాని) చెప్పారు. స్థానిక ఆరేపల్లి కల్యాణ మండపంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ(ఎస్ఐఆర్)పై బీఎల్ఏలకు అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నాని మాట్లాడుతూ ఇంతకు ముందే టీడీపీ నేతలు తమ వారికి మ్యాపింగ్ చేశారని, మిగిలిన 35శాతం మాత్రమే బీఎల్వోల వద్ద మ్యాపింగ్ కాకుండా లిస్టులో ఉందని అన్నారు. ఈ లిస్టులను ప్రతి బీఎల్ఏలు తీసుకుని దానిలో ఉన్న పార్టీ సభ్యులతో పాటు పార్టీ సానుభూతిపరుల పేర్లను కూడా తీసుకుని వాటికి కూడా మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఇది చాలా కీలకమన్నారు. పామర్రులోని 243 బూత్లలోని బీఎల్ఏలకు వారికి సంబంధించిన బీఎల్వోల ఫోన్ నంబర్లు, పేరులను మీకు అందజేస్తామని చెప్పారు. అధికార పార్టీ నాయకులు ఇప్పుడు హైబ్రీడ్ మీటింగ్లను ఏర్పాటు చేసి, రెండు రోజుల పాటు ‘జయము జయము లోకేష్’ అంటూ భజన చేస్తూ కాలక్షేపం చేస్తున్నారే తప్ప.. రాష్ట్ర అభివృద్ధి గురించి కాని రాష్ట్రానికి పనికి వచ్చే ఒక్క మాట మాట్లాడిన పరిస్థితి లేదని విమర్శించారు. ● రాష్ట్ర పోలింగ్ బూత్ వింగ్ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను డిజిటల్ స్క్రీన్పై వివరించామని తెలిపారు. గతంలో 2002లో స్పెషల్ సమ్మర్ రివిజన్ సర్వే నిర్వహించారని, ప్రస్తుతం 2025డేటా ఆధారంగా ఈ సర్వే ప్రక్రియను నిర్వహిస్తున్నారని, బీఎల్ఏలు ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉండాలన్నారు. ● ఎస్ఐఆర్ జోన్ ఇన్చార్జి వరికూటి అశోక్బాబు మాట్లాడుతూ ప్రతి బీఎల్ఏ ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. గ్రామాల్లోని ఓట్ల పోకుండా తగు విధమైన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ● పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లైనా నియోజకవర్గంలో ఏవిధమైన అభివృద్ధి చేయకుండా డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే సైకిల్పై తిరుగు తూ తప్పులు కప్పిపుచ్చుకుంటున్నారన్నారు. పామర్రు నియోజకవర్గ పరిశీలకుడు వేములకొండ తిరుపతిరావు, పామర్రు ఎంపీపీ దాసరి అశోక్ కుమార్, జెడ్పీటీసీ జొన్నల రామ్మోహన్రావు, నియోజకవర్గంలోని ఐదు మండలాల అధ్యక్షులు కాకర్ల వెంకటేశ్వరరావు, యలమంచిలి గణేష్బాబు, రాజులపాటి రాఘవరావు, కళ్లం వెంకటేశ్వరరెడ్డి, గోగం సురేష్, బూత్ వింగ్ అధ్యక్షుడు సమ్మెట ఆంజనేయులు, వైస్ ఎంపీపీలు ఆరేపల్లి శ్రీనివాసరావు, ఆరుమళ్ల రమాదేవి, కొడమంచిలి మహేష్, పామర్రు పట్టణ అధ్యక్షుడు నందిపాటి సురేష్రెడ్డి, ట్రేడ్ యూని యన్ జిల్లా అధ్యక్షుడు తాడిశెట్టి శ్రీనివాసరావు, బీసీ సెల్ అధ్యక్షుడు ఆళ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
పనుల్లో నిర్లక్ష్యం.. పర్యవేక్షణ లోపం
కంకిపాడు: ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులు ప్రహసనంగా సాగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా పనులు అడ్డగోలుగా జరుగుతున్నాయి. ఈ కారణంగా రూ.కోట్ల నిధులు వెచ్చించినా అవి నిరుపయోగంగా మారుతున్నాయి. కృష్ణాజిల్లా వ్యాప్తంగా 25 మండలాల్లో 486 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2026–27 సంవత్సరానికి గానూ 31.54 లక్షల పనిదినాలు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. 3.09 లక్షల జాబ్కార్డులు ఉండగా 1.40 మంది కార్డుదారులను ఉపాధి పనులకు వచ్చే వారిగా గుర్తించారు. ఈ ఏడాది 1.22 లక్షల మందితో ఉపాధి హామీ అధికారులు ఇండెంట్ పెట్టారు. 1.77 లక్షల పనులను గుర్తించగా, 198 పనులు ఇప్పటికే పూర్తి చేశారు. మిగిలిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ పనులకు గానూ ఈ ఏడాది మే నెల 5వ తేదీ వరకూ వేతనాలు చెల్లింపులు జరిగాయి. రూ 70.86 కోట్లు వేతనాల రూపంలో కూలీలకు చెల్లింపులు చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అస్తవ్యస్తంగా పనులు... లక్ష్యం భారీగా నిర్దేశించుకున్నా ఆశించిన స్థాయిలో పనులు జరగటం లేదు. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఉపాధి పనులు అస్తవ్యస్తంగా జరుగుతున్నాయి. ఈ సీజన్లో పంట బోదెల తవ్వకాలు, చెరువుల పూడికతీత పనులను చేపట్టారు. ఉద్యానశాఖ పనులకు కార్యాచరణ రూపొందించారు. అయితే రైతులకు ఉపయుక్తంగా ఉండేలా ఈ సీజన్లో పంట బోదెల తవ్వకాలు చేపట్టారు. నిర్దేశిత లోతు, వెడల్పున తవ్వకాలు చేపడుతున్నారు. కానీ పనులు మాత్రం నిబంధనలకు అనుగుణంగా సాగటం లేదు. బోదెల తవ్వకంలో వచ్చిన మట్టిని కూలీలు బోదెల గట్లపైన పడేయాలి. కానీ కూలీలు బోదె అంచులు లోపలి వైపునే మట్టిని పడేస్తున్నారు. కొన్ని చోట్ల నేలను పారలతో చెక్కుకుంటూ, కాలువ అంచులను సైతం నిర్దేశిత లోతు కనిపించేలా చెక్కుతూ చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం.. ఉపాధి పనుల్లో అధికారుల పర్యవేక్షణ లోపం ప్రధానంగా కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో కూలీలు, మేట్ల పనితీరుపై పర్యవేక్షణ కొరవడటంతో పనులు నిరుపయోగంగా మారుతున్నాయి. కాలువలకు నీరు విడుదల చేసిన సమయంలో కాలువల అంచుల్లో మట్టి కరిగి బోదెలు పూడుకుపోయే పరిస్థితి నెలకొంది. తద్వారా కాలువ చివరి భూములకు సాగునీరు చేరాలనే లక్ష్యం నెరవేరకుండా పోతోంది. ఉపాధి పనులు నిర్వహించినా మట్టి గట్ల మీద వేయకుండా పనులు చేసుకుంటూ పోతే ప్రయోజనం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఒకే పని రెండు సార్లు.. గతంలో నిర్వహించిన సామాజిక తనిఖీల్లో తనిఖీ బృందాలు ఒకే కాలువ పూడికతీత రెండు పర్యాయాలు చేపట్టారని, కొలతల్లో వ్యత్యాసాలు ఉన్నాయంటూ అనేక సభల్లో సమస్య లేవనెత్తారు. దీనికి ఉన్నతాధికారులు మండల స్థాయి అధికారుల నుంచి సొమ్ము రికవరీ చర్యలూ తీసుకున్నారు. దీన్ని బట్టి అధికారుల పనితీరు క్షేత్రస్థాయిలో ఏ మేరకు సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రహసనంగా ఉపాధి హామీ పనులు రూ.కోట్ల నిధులు వెచ్చించినా నిష్ప్రయోజనం సాగునీటి సరఫరా సమయంలో తిరిగి యథాస్థితికి కాలువలు ఉపాధి పనుల్లో నిబంధనలు పాటించాల్సిందే. నిబంధనలకు అనుగుణంగా పనులు జరగకపోతే అధికారులుపై చర్యలు ఉంటాయి. నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలి. పనుల్లో లోపాలు తలెత్తితే సహించేది లేదు. ఉపాధి పనులు ఉపయుక్తంగా సాగాలి. అప్పుడే లక్ష్యం నెరవేరుతుంది. ఉపాధి పనులపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు. శివప్రసాద్ యాదవ్, డ్వామా పీడీ, కృష్ణాజిల్లా -
నిత్యాన్నదానానికి విరాళం
విజయవాడరూరల్: జనగణన–2027 ప్రక్రియకు సంబంధించి జిల్లాలో ఇళ్ల జాబితా, ఇళ్లగణన (హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్)కార్యక్రమం అత్యంత పారదర్శకంగా బాధ్యతాయుతంగా జరుగుతోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. దేశ ప్రగతికి, సమగ్ర ప్రణాళిక రూపకల్పనకు జనగణన గణాంకాలు కీలక పునాదిగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. గురువారం విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లిలో కొనసాగుతున్న ఇళ్ల జాబితా, గృహ గణన ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జనగణన సిబ్బంది ఇంటింటికి వెళ్లే సమయంలో ప్రజలు సరైన, పూర్తి వివరాలను తప్పనిసరిగా అందించాలని విజ్ఞప్తి చేశారు. అత్యంత కచ్చితత్వంతో, దోషరహితంగా డేటాను నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ ముగింపు దశలో ఉన్నందున కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడించారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): గ్రామీణ స్థాయి నుంచి యువ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి టాటా స్టీల్ లిమిటెడ్ వంటి సంస్థల సహకారం అందించడం మంచి పరిణామమని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.భరణీ చెప్పారు. నగరంలోని బందరురోడ్డులో ఉన్న ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం ఆవరణలో శాప్ లీగ్స్కు సంబంధించిన టాటా స్టీల్ ఆధ్వర్యంలో ఫ్రెండ్లీ మ్యాచ్ గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఎస్.భరణీ మాట్లాడుతూ రాష్ట్రంలోని యువ ఫుట్బాల్ క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు జంషెడ్పూర్లోని టాటా ఫుట్బాల్ అకాడమీలో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు టాటా స్టీల్ లిమిటెడ్తో శాప్ భాగస్వామ్యం కుదుర్చుకుందన్నారు. టాటా స్టీల్ లిమిటెడ్ స్పోర్ట్స్ చీఫ్ ముకుల్ చౌదరి మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో ఉన్న ప్రతిభను గుర్తించి వారిలో నైపుణ్యాలకు పదును పెట్టేందుకు తమ సంస్థ శాప్తో భాగస్వామ్యం అయ్యిందన్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్నికలకు ముందు ఆటో కార్మికులకు హామీలు గుప్పించిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి ఊసేత్తడం లేదని ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. రామకృష్ణ విమర్శించారు. ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం 10వ నగర మహాసభ గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఆర్. కనకారావు, కె. రవీంద్ర అధ్యక్షతన జరిగింది. ముందుగా ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం జెండాను రామకృష్ణ ఎగురవేశారు. ఇఫ్టూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.వి.రమణ, జీఆర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆటో కార్మికుల పాలిట శాపంలా మారిన జీవో నంబర్ 20ను రద్దు చేయాలన్నారు. నూతన కార్యవర్గం ఎన్నిక.. ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం నగర అధ్యక్ష, కార్యదర్శులుగా టి. శ్రీను, ఆర్. కనకారావు, గౌరవాధ్యక్షులుగా ఎం. రామకృష్ణ, ఉపాధ్యక్షులుగా భాస్కర్, సహాయ కార్యదర్శిగా ఎన్. శ్రీను, కోశాధికారిగా కె. నాని ఎన్నికయ్యారు. వీరితో పాటు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. -
పెట్రోల్, డీజిల్పై అదనపు వ్యాట్, సెస్లను రద్దు చేయాలి
కృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజల్లపై వసూలు చేస్తున్న అదనపు వ్యాట్, రోడ్డు డెవలప్మెంట్ సెస్లను తక్షణమే రద్దు చేయాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వి.సాంబిరెడ్డి, ఎం.వి.ఆంజనేయులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆర్ధికశాఖా మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలకు మెమొరాండాలను ఈ మెయిల్ ద్వారా పంపినట్లు పేర్కొన్నారు. గవర్నర్పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అమెరికా ఆదేశించిందని రష్యా వద్ద చౌకగా లభించే ఆయిల్ను కొనకపోవడం, 2002లో నాటి ఎన్డీఏ ప్రభుత్వం నియంత్రిత ధరల విధానాన్ని రద్దు చేయటం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులు పెట్రోల్, డీజల్ ధరలు పెరగటానికి ప్రధాన కారణాలని అన్నారు. ప్రభుత్వరంగంలోని ప్రతి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ఏటా వేల కోట్ల రూపాయల లాభాలు ఆర్జిస్తున్నాయని వాటి వార్షిక నివేదికలు తెలియజేస్తున్నాయని, అయినా నష్టాలలో ఉన్నాయని జరుగుతున్న ప్రచారం తప్పు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు కూడా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు కారణమవుతున్నాయని చెప్పారు. పెట్రోల్, డీజల్లపై పన్నులు, సెస్లు, డివిడెండ్ల రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాలకు రూ.7.57లక్షల కోట్లు చేరుతున్నాయని, అందులో కేంద్ర ఖజానాకు రూ.4.24లక్షల కోట్లు, రాష్ట్ర ఖజానాకు రూ.3.33 లక్షల కోట్లు చేరుతున్నాయని వివరించారు. మన రాష్ట్రంలో పెట్రోల్పై 31 శాతం వ్యాట్, డీజిల్పై 22.5 శాతం వ్యాట్ ఉందని, అదనపు వ్యాట్ పెట్రోల్పై లీటరుకు రూ.4, డీజిల్పై రూ.3.07, రోడ్డు డెవలప్మెంట్ సెస్ పేరుతో లీటరుకు ఒక రూపాయి, దానిపై మరల వ్యాట్ వసూలు చేస్తున్నారని, వీటి ద్వారా ఏటా సుమారు రు.25 వేల కోట్లు రాష్ట్ర ఖజానాకు చేరుతుందన్నారు. వీటిలో కొంత తగ్గించినా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్లపై ఉన్న అదనపు వ్యాట్ను, రోడ్డు డెవలప్మెంట్ సెస్ను పూర్తిగా రద్దుచేయాలని,పెట్రోల్, డీజిల్లపై వసూలు చేస్తున్న 31శాతం, 22.5శాతం వ్యాట్ను కనీసం 20 శాతానికి తగ్గించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్లపై కేంద్రం విధిస్తున్న పన్నులను కొంతమేరైనా తగ్గించటం, నియంత్రిత ధరల విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టడం వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టాక్స్ పేయర్స్ అసోసియేషన్ కోశాధికారి వి.సుందర రామరాజు, పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి అవనిగడ్డ పున్నారావు పాల్గొన్నారు. నియంత్రిత ధరల విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలి టాక్స్ పేయర్స్ అసోసియేషన్ డిమాండ్ -
ఘాట్ రోడ్డు మరమ్మతులు వాయిదా
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడి ఘాట్రోడ్డు మరమ్మతు పనులు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో క్షేత్ర స్థాయిలో కార్మికులు పని చేయడం కష్టతరమని, అదే సమయంలో రోడ్డు రిపేరు పనులకు ఉపయోగించే రసాయనాల మిక్సింగ్లో సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆర్అండ్బీ అధికారులు తేల్చి చెప్పారు. గురువారం దుర్గగుడి ఈవో శీనానాయక్, ఆర్అండ్బీ విభాగం అఽధికారులు ఘాట్రోడ్డును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఎండల తీవ్రత, వడగాడ్పుల ప్రభావం అధికంగా ఉండటంతో రోడ్డు పగుళ్లు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. ప్రస్తుతానికి ఘాట్రోడ్డు మరమ్మతు పనులను నిలిపివేసి, భక్తుల రాకపోకలతో పాటు వాహనాల రాకపోకలకు అనుమతించాలని దేవస్థానం నిర్ణయించింది. శుక్రవారం నుంచి ఘాట్రోడ్డుపైకి భక్తుల రాకపోకలను అనుమతిస్తారు. 5 నుంచి సంగమం వద్ద పవిత్ర హారతులు ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద కృష్ణమ్మ నదీ హారతులను జూన్ 5వ తేదీ నుంచి తిరిగి ప్రారంభించేందుకు దుర్గగుడి అధికారులు నిర్ణయించారు. సంగమం వద్ద హారతులను తిరిగి ప్రారంభించేందుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను 2వ తేదీ నాటికి పూర్తి చేయాలని దుర్గగుడి ఈవో ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. నవహారతులను శాస్త్రోక్తంగా, ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన సూచనలను ఇవ్వాలని వైదిక కమిటీని కోరారు. -
మహానాడుకు రండి.. చీరలు అందుకోండి
టీడీపీ నేతల వ్యూహం భవానీపురం(వియవాడపశ్చిమ): మాయ మాటలు, తాయిలాల పంపిణీతో ప్రజలను ఆకట్టుకోవడంలో తమకు తామే సాటి అని నిరూపించుకుంటున్నారు టీడీపీ నేతలు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పార్టీ మీటింగ్లకు జనాల్ని ఎలా రప్పించుకునేందుకు సకల విద్యలు ప్రయోగిస్తున్నారు. ఇదే ఆనవాయితీ గురువారం మైలవరం నియోజకవర్గం గొల్లపూడి గ్రామ పార్టీ నాయకులు కూడా కొనసాగించారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని పార్టీ తలపెట్టిన మహానాడు కార్యక్రమాన్ని రెండు రోజులపాటు గొల్లపూడిలోని పద్మావతి కల్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. ఆ మీటింగుకు జనాలను రప్పించేందుకు స్థానిక నేతలు మీటింగ్కు హాజరయ్యే వారికి రూ.300, బిర్యానీ, మహిళలకు చీరల పంపిణీ ఉంటుందని ప్రచారం చేసి రప్పించారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ నగరంలో గురువారం రాత్రి 10 గంటల సమయంలో కురిసిన గాలివానకు విద్యుత్ షాక్కు గురై ఒకరు మృతి చెందారు. నగరానికి చెందిన వ్యక్తి ఇందిరాగాంధీ స్టేడియం పక్క రోడ్డులోని ఫుడ్ కోర్ట్ ఫుడ్ కోర్టుకు వచ్చాడు. ఆకస్మికంగా గాలివాన రావడంతో విద్యుత్ తీగలు తెగిపడి తగలడంతో షాక్ కు గురయ్యాడు. వెంటనే అప్రమత్తమైన వ్యాపారులు సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. సమాచారం అందుకున్న సూర్యారావుపేట పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరిస్తున్నారు. మృతుని వివరాలు తెలియ రాలేదు. -
చదరంగంతో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెంపు
ఈగల్ టీమ్ చీఫ్ ఎ.రవికృష్ణ మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): చదరంగంఆడటం వల్ల ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని ఈగల్ టీమ్ చీఫ్ ఎ.రవికృష్ణ చెప్పారు. హరియాణాకు చెందిన గ్రాండ్మాస్టర్ హిమాన్షు శర్మ ఆధ్వర్యంలో గుణదలలోని నెక్ట్స్జెన్ స్కూల్ ఆవరణలో జరుగుతున్న జరుగుతున్న ఫ్రీ చెస్ కోచింగ్ క్యాంప్ను రవికృష్ణ గురువారం సందర్శించారు. హిమాన్షుతో కలిసి కొద్దిసేపు చెస్ ఆడారు. చెస్ ఆటలో నెక్ట్స్ లెవల్కు వెళ్ళడానికి ఇలాంటి క్యాంపులు దోహదం చేస్తాయని రవికృష్ణ చెప్పారు. ఉచితంగా క్యాంప్ నిర్వహిస్తున్న చెస్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై శుక్రవారం విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో గోగినేని రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ఖమ్మం నుంచి విజయవాడ వస్తూన్న నవజీవన్ ఎక్స్ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతన్ని గుర్తించిన విధుల్లోని సిబ్బంది విజయవాడ జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించడంత హెడ్కానిస్టేబుల్ రాజా సిబ్బందితో కలసి ఘటన స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. మృతుని వయస్సు సుమారు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని, వంటిపై మెరున్ కలర్ షర్ట్, బ్లూ కలర్ జీన్స్ ఫ్యాంట్ ధరించి ఉన్నాడని, ఇతర ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆచూకీ తెలిసిన వారు విజయవాడ జీఆర్పీ స్టేషన్లో సంప్రదించాల్సిందిగా కోరారు. గృహోపకరణాలు అగ్నికి ఆహుతి జగ్గయ్యపేట అర్బన్: విద్యుత్ శాఖ వైఫల్యం కారణంగా హై వోల్టేజ్ విద్యుత్ సరఫరా కావడంతో అగ్ని ప్రమాదం జరిగి రూ.4 లక్షల విలువైన గృహోపకరణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటన జగ్గయ్యపేట పట్టణంలో గురువారం జరిగింది. స్థానిక బలుసుపాడు రోడ్లోని శ్రీకనకదుర్గమ్మ ఆలయం ఆర్చ్ ఎదురుగా ఉన్న గోనుగుంట్ల ధనుంజయ గృహంలో తెల్లవారు జామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పడకగదిలో నిద్రిస్తున్న ధనుంజయ తండ్రి మీద నిప్పులు పడి బట్టలు కాలిపోవడంతో తేరుకుని ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఏసీ, టీవీ, కబోర్డులు, కరెంట్ వైరింగ్, కరెంట్ సామాన్లు పూర్తిగా దగ్దం అయి, గోడలు ధ్వంసం అయ్యాయి. కరెంట్ హై వోల్టేజ్ వలన ప్రమాదం జరిగిందని గుర్తించే లోగా నష్టం జరిగిపోయింది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు. -
విద్యుదాఘాతంతో చిన్నారి మృతి
భవానీపురం(విజయవాడపశ్చిమ): విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో చిన్నారి ప్రాణాలు విడిచిన టన విజయవాడ రూరల్ జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. చల్ల ఏసుబాబు, నాగలక్ష్మి దంపతులు వైఎస్సార్ కాలనీలో బ్లాక్ నంబర్ 240 ఎఫ్ఎఫ్ 2లో నివసిస్తున్నారు. రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పిల్లలిద్దరూ నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం పెద్ద కుమార్తె చల్లా మాధవి (5) ఇతర పిల్లలతో ఆడుకుంటూ కాలనీలోని రోడ్డుకు అవతల ఉన్న బ్లాక్ నంబర్ 224 వద్దకు వెళ్లింది. అక్కడ చేతికి అందే ఎత్తులో ఉన్న విద్యుత్ బార్ వద్ద ఆడుకుంటుంది. ఆ సమయంలో విద్యుత్ బాక్స్లో ఏర్పాటు చేసిన వైర్లు చేతికి తగలటంతో కరెంట్ షాక్ కొట్టి చిన్నారి చనిపోయింది. తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని విగతజీవిగా పడి ఉన్న చిన్నారిని చూసి భోరున విలపించారు. రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని సీపీఎం డిమాండ్.. విషయం తెలుసుకుని కాలనీకి చేరుకున్న సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బోయి సత్యబాబు మాట్లాడుతూ రక్షణ లేకుండా ఏర్పాటు చేసిన విద్యుత్ బార్ కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని పలు మార్లు ఫిర్యాదు చేశామని, అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహించడం వలనే చిన్నారి బలైందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి కుటుంబానికి విద్యుత శాఖ రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఈవీ నారాయణ, నగర కార్యదర్శివర్గ సభ్యులు కె.సూరిబాబు, కె.రవి, జి.వీరయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
విజయవాడ: ఏపీలో అకాల వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. రోహిణి కార్తె ప్రారంభానికి ముందే ఏపీలో పలు చోట్ల వర్షం బీభత్సం సృష్టించగా, మళ్లీ ఏపీకి భారీ వర్ష సూచనలు కనిపిస్తున్నారు. ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ కేంద్ర అధికారులు. ప్రధానంగా పల్నాడు, ప్రకాశం,. నెల్లూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే గంటకు 50కి.మీ నుంచి 60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. దాంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రెండు రోజుల క్రితం చిత్తూరు, తిరుపతి, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షం పడింది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడగా, విజయనగరం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. గంటలకు 50 కి.మీ నుంచి 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచాయి. అనకాపల్లి జిల్లాలో భారీ ఈదురు గాలలతో వర్షం పడింది. గంటకు పైగా భీకరమైన గాలులు వీయడంతో ప్రజలు భయాందోళనలకు లోనయయారు. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
ఏపీలో జరిగింది.. దగా డీఎస్సీ: పేర్ని నాని
సాక్షి, కృష్ణా జిల్లా: నారా లోకేష్ చిత్ర విచిత్రాలు, టక్కుటమార విద్యలు ప్రదర్శిస్తున్నాడంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని మండిపడ్డారు. ఆయన శాఖను గాలికి వదిలేసి మిగిలిన అన్ని శాఖల్లో వేలు పెట్టి ఉద్ధరిస్తున్నానని చెబుతున్నాడు. గురువుల నియామకంలో విద్యాశాఖ చేసిన చేసిన తప్పుడు పనులు అన్నీ ఇన్నీ కాదు’’ అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు.‘‘99 పైసలుకే భూములు ఇచ్చి బాగానే పోగేసుకుంటున్నారు కదా. అమరావతిలో అడుగుకు రూ. 20 వేల రూపాయలకు కాంట్రాక్టులు ఇచ్చి పోగేసుకుంటున్నారు కదా. గురువుల నియామకంలో కూడా తప్పుడు పనులు చేయడమేనా?. సమాజానికి నష్టం చేస్తున్నామనే పాపభీతి కూడా ఉండదా మీకు?. 16 వేలపై చిలుకు టీచర్ పోస్టుల భర్తీ పేరుతో మెగా డీఎస్సీ పేరుతో దగా చేశారు. చంద్రబాబు, లోకేష్ నీచాతి నీచాలకు పాల్పడ్డారు. మెగా డీఎస్సీ నిజంగానే పారదర్శకంగా నిర్వహిస్తే మెరిట్ లిస్ట్ ఎందుకు ఇవ్వరు’’ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.‘‘మెరిట్ లిస్టు ఇవ్వరు.. ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో చెప్పరు. ఫోన్లకు మాత్రం మెసేజ్లు పెడతారంట. ఎంత సొమ్ము కొడితే అంత ర్యాంకు ఇస్తారా?. సిగ్గు లేకుండా విద్యాశాఖ నుంచి ప్రకటన ఇచ్చారు. విద్యాశాఖ నుంచి ప్రకటన ఇచ్చిన వాళ్లు అన్నమేనా తినేది. డీఎస్సీ మీద ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతామంటున్నారు. తప్పుడు పనులు చేయడం మిమ్మల్ని ప్రశ్నిస్తే జైల్లో వేస్తారా?. ప్రతీ ప్రభుత్వ సంస్థలో నియామకాలు చేసినపుడు స్పోర్ట్స్ కోటాలో రెండు శాతం ఇవ్వాలని 2012లో జీవో ఇచ్చారు. 2024 ఏప్రిల్ 19న జీవో నెంబర్ 47, జీవో నెంబర్ 4ను విడుదల చేశారు..డీఎస్సీ, టెట్ పరీక్ష రాయకుండానే 3 శాతం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చేస్తారంట. 29 ఆటలను 67 ఆటలుగా మార్చారు. బచ్చాలు, గోళీలాటలు తప్ప అన్ని ఆటలు పెట్టారు. దొడ్డిదారిన 421 మందిని వ్యాయామ ఉపాధ్యాయుల కింద నేరుగా రిక్రూట్మెంట్ చేసుకున్నారు. ఇది తప్పుకాదా... ఇంతకంటే నీచం మరొకటి ఉందా?. ఏపీలో దగా డీఎస్సీ.. అతిపెద్ద మెగా స్కామ్. స్పోర్ట్స్ కోటాలో ఎంపికైనా 421 మంది సర్టిఫికెట్లను బయటపెట్టే దమ్ముందా ఇదే నా ఛాలెంజ్...బోత్ ఆర్ నాట్ సేమ్ అని సినిమా డైలాగ్లు కొట్టడం కాదు. ఖలేజా ఉంటే.. నిజాయితీగా రిక్రూట్మెంట్ జరిపితే 421 మంది వివరాలు బయటపెట్టండి. మెరిట్ లిస్ట్, స్పోర్ట్స్ కోటా వివరాలు బయటపెట్టేలేనోళ్లకు మీకెందుకు సినిమా డైలాగ్లు. బాలకృష్ణ సినిమాలు చేసి డబ్బులు తీసుకుంటాడు. లోకేష్ స్కామ్లు చేసి డబ్బులు తీసుకుంటాడు. మెగా డీఎస్సీ స్కామ్పై సీబీఐ ఎంక్వైరీ చేయాలి. నిజాయితీగా రిక్రూట్మెంట్ చేశారనే నమ్మకం ఉంటే మెరిట్ లిస్ట్ బయటపెట్టండి. డీఎస్సీపై ప్రశ్నిస్తే కేసులు పెడతారా?’’ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు. -
‘మా ఇళ్లే అడ్డొచ్చాయా..? మమ్మల్ని ఒకసారే చంపేయండి’
విజయవాడ: పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండిలో పేదల ఇళ్లు కూల్చివేతలకు నిరసనగా విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. రొయ్యల చెరువులకు తమ ఇళ్లు అడ్డువస్తున్నాయని చెప్పి కూల్చివేశారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తాము ఎంతో కష్టపడి కట్టుకున్న ఇళ్లను ఇలా అర్థంలేని కారణంతో గంటలో కూల్చివేయడం తాము పేదలం కాబట్టే చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పేదల ఇల్లు కూల్చివేతకు నిరసనగా విజయవాడలో గురువారం(మే 28వ తేదీ) రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం కెవిపిఎస్ వృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దీని కోసం విజయవాడకు వచ్చిన బాధితులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఇళ్లు కూల్చివేత మానుకోవాలని, కూల్చిన ప్రతి ఇంటికి లెక్కగట్టి పరిహారం ఇవ్వాలని అంటున్నారు బాధితులు. సర్వం కోల్పోయిన తమకు న్యాయం చేయడమే కాకుండా రఘరామ కృష్ణంరాజు పై చంద్రబాబు చర్యలు తీసుకోవాలని పట్టుబడుతున్నారు. ఉందూరు మండలానికి చెందిన పద్మ అనే బాధితురాలు మాట్లాడుతూ.. ‘ 72 ఇల్లు కూల్చేశారు. 70 ఏళ్ళ నుండి అక్కడే ఉంటున్నాం. రొయ్యల చెరువులు పిటిషన్ పెట్టారని కూల్చారు. అందరికి పిటిషన్ పెట్టాం..కనీసం కనికరం చూపించలేదు. నడిరోడ్డు మీద ఇప్పుడు నిలబడ్డం. ఇల్లు కట్టుకొని సంవత్సరం అయ్యింది. రఘురామ కృష్ణం రాజు భార్య గారిని అడిగాం. ఆవిడా కూడా దారుణంగా మాట్లాడారు. అక్వా రైతులకు అడ్డం గా ఉన్నామని కూల్చేశారు. కలెక్టర్, లోకేష్, చంద్రబాబు ఇంటికి వెళ్ళాం. చంపేస్తే ఒకసారే చంపేయండి. కూలీపనులు చేసుకొని ఒకసారే ఇల్లు కట్టుకోగలం..అలాంటి ఇళ్లను కూర్చేశారు. పెద్దల గెస్ట్ హౌస్లు అడ్డం రాలేదు.. మా ఇల్లులు అడ్డం వొచ్చాయా?’ అని నిలదీశారు. -
ప్రభుత్వమే ఆ పొలాలకు నష్టపరిహారం ఇవ్వాలి: పేర్ని నాని
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నం కొత్తపూడి గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. రైతుల అనుమతి లేకుండా పోర్ట్ పేరుతో విద్యుత్ టవర్ల ఏర్పాటుకు అధికారులు మార్కింగ్ చేశారు. ఇవాళ(మే 28, గురువారం) వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని.. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘1994-95లో కొత్తపూడి గ్రామంలోని దళిత, పేద కుటుంబాలకు ప్రభుత్వం పట్టాల రూపంలో భూమి ఇచ్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆ పట్టాలన్నింటినీ ఫ్రీ హోల్డ్ గా మార్పు చేశారు. పోర్టు అవసరాల కోసం ఆ పొలాల్లో హెవీ విద్యుత్ లైన్ టవర్లను వేయడానికి అధికారులు మార్కింగ్ చేశారు. రైతులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేశారు. హై ఓల్టేజ్ విద్యుత్ లైన్ల వల్ల తమ భూమికి విలువ లేకుండా పోతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు’’ అని పేర్ని నాని పేర్కొన్నారు.‘‘విద్యుత్ లైన్ టవర్లు వేయాలనుకుంటే ఈ పొలాలన్నింటినీ పూర్తిగా కొనుగోలు చేసి నష్టపరిహారం ఇవ్వాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అసైన్డ్ భూములను సేకరించినా రైతులకు సంతోషకరమైన పద్ధతిలోనే పరిహారాన్ని అందించాం. కొత్తపూడి గ్రామ రైతులకు కూడా ప్రభుత్వం పరిహారం చెల్లించిన తర్వాతే పనులు ప్రారంభించాలి’’ అని పేర్ని నాని డిమాండ్ చేశారు. -
జూన్ 15 నుంచి సర్ సర్వే
వైద్య కళాశాల పనులను త్వరగా పూర్తిచేయాలి చిలకలపూడి(మచిలీపట్నం): మచిలీపట్నం ప్రభుత్వ వైద్యకళాశాల భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలని కృష్ణా కలెక్టర్ డి.కె.బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం మచిలీపట్నంలోని ప్రభుత్వ వైద్య కళాశాలను కలెక్టర్ సందర్శించి వివిధ భవనాల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. కళాశాల పరిపాలనా విభాగం తరగతి గదులు, భోజన శాల విద్యార్థుల వసతి గృహాలు తదితర నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. భవన నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వేగవంతంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కలెక్టర్ వెంట ప్రభుత్వ వైద్య కళాశాల ఇన్చార్జ్ వైస్ప్రిన్సిపాల్ డాక్టర్ ఆషాలత, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఎంఎస్ఎంఈ బలోపేతానికి యువశక్తి కృషి లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థాపకత శిక్షణ, మార్గదర్శక కార్యక్రమాన్ని (ఈటీఎంపీ) ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఎంఈడీసీ)తో భారతీయ యువ శక్తి ట్రస్ట్ (బీవైఎస్టీ) ఒక ఆసక్తి పత్రంపై సంతకాలు చేసింది. విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళా వేదికలో జరిగిన ‘ఒక కుటుంబం – ఒక వ్యవస్థాపకుడు ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026’ సందర్భంగా ఈ ఆసక్తి పత్రాలను పరస్పరం మార్చుకున్నట్లు మేనేజింగ్ ట్రస్టీ లక్ష్మీ వెంకటరామన్ వెంకటేశన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా క్రమబద్ధమైన శిక్షణ, మార్గదర్శకత్వం, డిజిటల్ లెర్నింగ్, పర్యావరణ వ్యవస్థ నిర్మాణ చర్యల ద్వారా నానో సూక్ష్మ పరి శ్రమలను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. అధికారిక వెబ్సైట్లో ఎస్ఎస్సీ మార్కుల మెమోలు మచిలీపట్నంఅర్బన్: కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, ప్రైవేట్ హైస్కూళ్ల విద్యార్థులకు సంబంధించిన ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల మార్కుల మెమోలను అధికా రిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు జిల్లా విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత పాఠశాలల లాగిన్లలో షార్ట్ మెమోలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వాటిని డౌన్లోడ్ చేసి పాఠశాల ముద్ర, సంతకంతో విద్యార్థులకు అందజేయాలని సూచించారు. విద్యార్థుల పేరు, ఇంటిపేరు, జన్మతేదీ తదితర వివరాలను విద్యార్థులు, తల్లిదండ్రులతో సమ గ్రంగా పరిశీలించి ధ్రువీకరించాలని పేర్కొన్నారు. అధికారిక వెబ్సైట్లో స్కూల్ లాగిన్ సవరణల ఆప్షన్ ఈ నెల 29వ తేదీ నుంచి జూన్ నాలుగో తేదీ వరకు అందుబాటులో ఉంటుందని సూచించారు. అవసరమైన సవరణలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు తమ పరిధిలోని పాఠశాలలకు తగిన సూచనలు జారీ చేసి పర్యవేక్షించాలని డీఈఓ సూచించారు. -
కౌలు రైతుల రక్షణకు నూతన చట్టం తేవాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కౌలు రైతుల రక్షణకు నూతన చట్టం తేవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఎన్నికల వాగ్దానం మేరకు కౌలు రైతులకు తక్షణమే గుర్తింపు కార్డులు జారీ చేయాలని, వాటి ఆధారంగానే వ్యవసాయ, ఉద్యాన, బ్యాంకు, మార్కెట్ తదితర పథకాలన్నీ వర్తింపజేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. విజయవాడలోని దాసరి భవన్లో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర సమితి విస్తృత సమావేశం సంఘం అధ్యక్షుడు ఎ.కాటమయ్య అధ్యక్షతన బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈశ్వరయ్య మాట్లాడుతూ.. కౌలు రైతులపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కౌలు రైతుల రక్షణకు నూతన చట్టం కావాలన్నారు. రెండేళ్లుగా ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని కౌలు రైతులకు వర్తింపజేయకపోవడం దారుణమన్నారు. ఆర్బీఐ నిబంధనల మేరకు కేవలం పంట హామీపైనే రూ.2 లక్షల వరకు రుణాలు ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలున్నా, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ.. గ్రామ సభలు నిర్వహించి భూ యజమాని ప్రమేయం లేకుండానే కౌలురైతులను గుర్తించి, గుర్తింపు కార్డులు జారీ చేయా లని డిమాండ్ చేశారు. దేవాలయ భూములు సాగు చేస్తున్న కౌలు రైతులకు సైతం గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. కౌలు రైతుల సమస్యలపై జూన్ ఒకటో తేదీన కలెక్టరేట్ల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్నీడి యలమందారావు, కౌలు రైతుల సంఘం రాష్ట్ర నాయకులు దొంత కృష్ణ, నేలపాల రామకృష్ణ, పి.వి. జగన్నాథం, వి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం చంద్రబాబుది క్రెడిట్ చోరీ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతి వనంలోని కన్వెన్షన్ సెంటర్ను సీఎం చంద్రబాబు ప్రారంభించి క్రెడిట్ చోరీకి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. అంబేడ్కర్ స్మృతి వనంలోని కన్వెన్షన్ సెంటర్ను వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి ఆయన బుధవారం సందర్శించారు. కన్వెన్షన్ సెంటర్ వద్ద సెల్ఫీ దిగారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014–19 మధ్య చంద్రబాబు అమరావతిలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చి విస్మరించారని గుర్తుచేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడ నడిబొడ్డున రూ.400 కోట్లు ఖర్చు చేసి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనం, 200 అడుగుల అంబేడ్కర్ విగ్రహం, కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారని గుర్తుచేశారు. బీఆర్ అంబేడ్కర్ జీవిత చరిత్రను భావితరాలకు తెలిపేలా డిజిటల్ మ్యూజియం, మల్టీపర్పస్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేశారని పేర్కొ న్నారు. కన్వెన్షన్ సెంటర్ చాలా బాగుందని చంద్రబాబు సైతం బేషరతుగా మెచ్చుకున్నారని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో చేపట్టిన ప్రతి కార్యక్రమం తనదేనని చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడటంపై మండిపడ్డారు. ఈ రెండేళ్లలో ఏం చేశారో ప్రకటించాలి వైఎస్ జగన్ కంటే ఎక్కువ చేస్తామని చెప్పి కూటమి అధికారంలోకి వచ్చిందని, ఈ రెండేళ్లలో ఆయన కంటే ఎక్కువ ఏం చేశారో మహానాడు వేదికగా ప్రకటించాలని సీఎం చంద్రబాబును మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసి లబ్ధిపొందాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. తన రెండేళ్ల పరిపాలన గురించి ప్రజల ముందుకు వచ్చి చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. రెండేళ్ల పాలనలో ఏం చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘వంగవీటి మోహన రంగాను ఎవరు హత్య చేశారో మీకు తెలియదా? రంగా హత్య తర్వాత మీ మంత్రులు ఎందుకు రాజీనామా చేశారో’ సమాధానం చెప్పా లని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు గుండె సుందర్ పాల్, గుడిసె శ్యామ్బాబు, మాతా మహేష్, వెంకటరామిరెడ్డి, తోపుల వరలక్ష్మి, పేరం త్రివేణి, పసుపులేటి కోటేశ్వరరావు, డాక్టర్ రాంబాబు, సురేష్, మనోహర్, మజ్జి రాము తదితరులు పాల్గొన్నారు. -
మత్స్యకారుల నిరసన
పాలకాయతిప్పలో ● టూరిజం బోటు తరలింపును అడ్డుకున్న గంగపుత్రులు ● పర్యాటకం పేరుతో జీవనోపాధిపై దెబ్బకొడుతున్నారని ఆగ్రహం కోడూరు: సముద్ర వేటపై ఆధారపడి జీవనం సాగించే పాలకాయతిప్ప మత్స్యకారులు అటవీ అధికారులపై నిరసనకు దిగారు. పర్యాటక అభి వృద్ధి పేరుతో అటవీ అధికారులు సముద్ర శింకు వద్ద నుంచి సాగర సంగమం వరకు బోటు టూరిజం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేపట్టారు. ఇందులో భాగంగా బుధవారం ప్రత్యేక ట్రాలీపై టూరిజం బోటును అధికారులు సముద్రతీరానికి తీసుకువచ్చారు. దీనిని గమనించిన పాలకాయతిప్ప మత్స్యకారులు కరకట్ట వద్దే బోటు ఉన్న ట్రాలీని అడ్డుకొని శింకు వద్దకు వెళ్లడానికి వీలు లేదంటూ వాహనం ముందు బైఠాయించారు. జీవనోపాధికే ప్రమాదమంటూ భావోద్వేగం తరతరాలుగా సముద్ర శింకు వద్దే తమ వేట పడవలను నిలిపి, ఇక్కడే నుంచే సముద్ర వేటకు బయలుదేరి వెళ్తామని మత్స్యకారులు తెలిపారు. తుపాన్లు, అలల ప్రభావం ఎక్కువగా ఉండే సమయంలో కూడా ఈ ప్రాంతమే తమకు భద్రత కల్పించిందని, అలాంటి ప్రదేశాన్ని ఇప్పుడు టూరిజం అవసరాల కోసం వినియోగించాలనే ప్రయత్నం, తమ జీవనోపాధిపై ప్రభావం చూపు తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘సముద్రం మా జీవితం.. పడవ మా ఆస్తి.. ఈ శింకే మా ఆశ్రయం’ అంటూ మత్స్యకారులు భావోద్వేగానికి లోన య్యారు. గ్రామపెద్దలు, మత్స్యకార సంఘాల నేలతో చర్యలు జరపకుండా అటవీ అధికారులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వేట పడవలను వేరే ప్రాంతానికి తరలించాలని అధికారులు సూచించడం అసాధ్యమని, అటవీ అధికారులే టూరిజం స్పాట్ను వేరే ప్రాంతానికి మార్చుకోవాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు. గతంలో ఈ విషయాలను పాలకులకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని మత్స్యకారులు వాపోయారు. వివాదాన్ని సద్దుమణిచిన పోలీసులు టూరిస్ట్ బోటును తీసుకువస్తున్న ప్రత్యేక ట్రాలీని మత్స్యకారులు అడ్డుకోవడం అటవీ అధికారులు పోలీసులకు సమాచారమిచ్చారు. అవనిగడ్డ సీఐ యువకుమార్, ఎస్ఐ చాణిక్య ఘటనాస్థలానికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. మత్స్యకారులతో మాట్లాడి వారి అభ్యంతరాలను తెలుసుకున్నారు. అనంతరం బోటును దింపకుండా తిరిగి అదే లారీలో వెనక్కి పంపించడంతో ఉద్రికత్త సద్దుమణిగింది. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాగురువారం శ్రీ 28 శ్రీ మే శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 32,1710 టీఎంసీలుగా నమోదైంది. దిగువకు 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.గుడ్లవల్లేరు: మండలంలోని డోకిపర్రులో కొలువైన శ్రీ భూసమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవ స్థానజ వార్షికోత్సవాలు బుధవారం వైభవంగా జరిగాయి. ప్రత్యేక పూజలు నిర్వహించారు. జక్కంపూడి వైఎస్సార్ కాలనీ రోడ్డులోని ఎస్కేపీవీవీ డోకుపర్తి ఉపేంద్ర హైస్కూల్లో తొమ్మిది జిల్లాల ఎన్సీసీ విద్యార్థులకు రైఫిల్ షూటింగ్ శిక్షణ బుధవారం ప్రారంభమైంది. 7 -
నిధులు దోచుకో.. పరికరాలు దాచుకో!
● వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో పిల్లలకు అందని పౌష్టికాహారం, క్రీడా పరికరాలు ● విడుదలైన రూ. 5.78 లక్షల నిధులు ఏమైనట్టో.. ● ఈ నెల 31తో ముగియనున్న వేసవి క్రీడా శిక్షణ ● అధికారుల తీరుపై విమర్శల వెల్లువ మచిలీపట్నంఅర్బన్: క్రీడలకు విడుదల చేసిన నిధులు దోచుకుంటూ, ప్రభుత్వం అందించిన క్రీడా పరికరాలు దాచుకుంటున్న జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారుల తీరు విస్మయానికి గురి చేస్తోంది. ఉచిత వేసవి శిక్షణా శిబిరాల కోసం ప్రభుత్వం రూ. 5,78,860 విడుదల చేసింది. అందులోనే రూ.1.53 లక్షలు అవసరమైన ఆట పరికరాల కొనుగోలు, ఒకొక్క కోచ్కు రూ. 2 వేలతో పాటు రవాణా ఖర్చులకు రూ. వెయ్యి, శిక్షణకు హాజరయ్యే ప్రతి విద్యార్థికి రోజుకు రూ.10 చొప్పున పౌష్టికాహారం అందించేందుకు జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ ఖాతాకు నిధులు అందాయి. పిల్లలకు ఇచ్చే రూ.10లో రూ.4 విలువైన చిక్కీ, మిగిలిన రూ.6తో ఇతర పౌష్టికాహారం అందించాలని ఉంది. అయితే శిబిరాల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించిన దాఖలాలు లేవు. ప్రభుత్వం పంపిం చిన చిక్కీలు సైతం పంపిణీ చేసిన పరిస్థితి లేదు. కేవలం శిక్షణ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ, పిల్లలకు అందాల్సిన సదుపాయాలను నిర్లక్ష్యం చేస్తూ నిధులు దోచుకుంటున్నారనే విమర్శలు మూటగట్టుకుంటున్నారు అధికారులు. వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు: అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, హ్యాండ్బాల్, హాకీ తదితర క్రీడలకు సంబంధించిన పరికరాలతో పాటు, అదనపు కొనుగోళ్ల కోసం రూ.1.53 లక్షల నిధులు జిల్లాకు విడుదలయ్యాయి. క్షేత్రస్థాయిలో మాత్రం హర్డిల్స్ మినహా ఇతర పరికరాలు ఇప్పటివరకు శిక్షణ కేంద్రాలకు చేరలేదు. విడుదలైన నిధులతో అవసరమైన పరికరాల కొనుగోలు ప్రక్రియ కూడా ప్రారంభం కాలేదు. ప్రతి ఏడాది ఇదే పరిస్థితి కొనసాగుతోందని, వేసవి శిబిరాల పేరుతో నిధులు పక్కదారి పడుతున్నాయని క్రీడావర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కొనుగోలు ప్రతిపాదనలు ఇలా: జిల్లాలో ప్రస్తుతం 16 వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు మాత్రమే నిర్వహిస్తుండగా, వాటిలో 18 రకాల క్రీడలకు సంబంధించిన శిక్షణ అందుబాటులో ఉంది. అయితే జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మాత్రం 55 రకాల క్రీడా పరికరాల కొనుగోలుకు ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనలపై క్రీడా వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిర్వహిస్తున్న క్రీడల సంఖ్యకు మించి పరికరాల కొనుగోలు ప్రతిపాదనలు ఎందుకన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఖేలో ఇండియా కేంద్రాల నిర్వహణ: జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో మచిలీపట్నంలో ఈత కొలను, బాక్సింగ్, హాకీ క్రీడలకు జిల్లా స్థాయి ఖేలో ఇండియా శిక్షణా కేంద్రాలను కొనసాగిస్తున్నారు. ఖేలో ఇండియా కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వం వార్షికంగా రూ.5 లక్షల పునరావృత గ్రాంట్తో పాటు, రూ.5 లక్షల వన్టైమ్ గ్రాంట్ను అందిస్తోంది. కృష్ణాజిల్లాలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్ఏ) ఆధ్వర్యంలో స్విమ్మింగ్కు సంబంధించి ఖేలో ఇండియా కేంద్రం కొనసాగుతున్నప్పటికీ, గత రెండేళ్లుగా స్విమ్మింగ్, హాకీ కోచ్లు లేకపోవడం విమర్శలకు దారితీస్తోంది. కోచ్లు పేరుతో నిధులు డ్రా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ నిర్వహణ కూడా సరిగా లేదని, నీటిని సమయానికి మార్చకపోవడం, పరిశుభ్రత లోపించడం వంటి కారణాలతో పిల్లలు ఈత కొలనుకు రావడం లేదు. -
మహిళ హత్యకేసులో నిందితుడు అరెస్టు
● వివాహేతర సంబంధంలో ఉన్న వ్యక్తే నిందితుడు ● మృతురాలిది కై కలూరు మండలం వింజరం ● నిందితుడిని అరెస్టు చేసిన కంకిపాడు పోలీసులు కంకిపాడు: మహిళ హత్య కేసులో నిందితుడిని కంకిపాడు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. స్థానిక పోలీసుస్టేషన్లో సీఐ జె.మురళీకృష్ణ మీడియా సమావేశం నిర్వహించి హత్యకేసు వివరాలను వెల్లడించారు. మురళీకృష్ణ మాట్లాడుతూ... ఏలూరు జిల్లా కై కలూరు మండలం వింజరం గ్రామానికి చెందిన జొన్నాదుల మేరీ (33) కృష్ణాజిల్లా పెడన మండలం షేరివత్తర్లపల్లి గ్రామానికి చెందిన తోకల వినోద్బాబు అలియాస్ వినోద్కుమార్తో వివాహేతర సంబంధం నడుపుతోంది. ఇటీవల వీరిద్దరూ తెన్నేరు గ్రామంలోని ఇటుకల బట్టీల వద్ద పనులకు వచ్చారు. జొన్నాదుల మేరీ శివకుమార్ భార్యాభర్తలు. అయితే కై కలూరులోని ఓ హోటల్లో మేరీ పనిచేస్తూ ఉండేది. అక్కడికి ట్రాక్టరు నడిపే పనులకు వచ్చిన వినోద్బాబుతో పరిచయం ఏర్పరుచుకుంది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. అదే క్రమలో వినోద్బాబు, మేరీలు తెన్నేరులో ఇటుకల బట్టీల పనులకు వచ్చారు. అనుమానంతో గొంతు నులిమి చంపేశాడు.. మేరీ తాను పనిచేసిన హోటల్లో వంట మేసీ్త్రతో చనువుగా మాట్లాడటం వినోద్బాబుకు నచ్చలేదు. ఈ విషయమై ఇరువురు మధ్య తరచూ వాగ్వాదం జరిగేది. ఈనెల 24వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో నైట్ ప్యాంటుతో మేరీ మెడకు బిగించి ఊపరాడకుండా చేసి హత్యచేసి పరారయ్యాడు. ఘటనపై మృతురాలి భర్త శివకుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో ప్రత్యేక బృందాలు ఏర్పడి నిందితుడు వినోద్బాబు కోసం విస్తృతంగా గాలించారు. నిందితుడిని కంకిపాడు సమీపంలో అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. సమావేశంలో ఎస్ఐ డి.సందీప్, ఉయ్యూరు రూరల్ఎస్ఐ కె.సురేష్ పాల్గొన్నారు. కేసు దర్యాప్తులో క్రియాశీలకంగా వ్యవహరించిన సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. -
ఇంద్రకీలాద్రిపై కొండచిలువ కలకలం
● ఉడతను నోట కరచుకొని చెట్టుపై నుంచి పడిన సర్పం ● భయంతో మెట్ల పూజలను నిలిపివేసిన భక్తులు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో పాత మెట్ల మార్గంలో బుధవారం ఉదయం కొండచిలువ కలకలం రేపింది. ఈ మార్గంలో వినాయకుడి గుడి, ఆంజనేయ స్వామి ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయాలకు పక్కనే చెట్టు ఉంది. బుధవారం తెల్లవారుజామున ఆరున్నర గంటల సమయంలో చెట్టుపై నుంచి సుమారు ఐదు అడుగుల పొడవైన కొండ చిలువ కింద పడింది. ఉడతను పట్టుకునే క్రమంలో అది కింద పడటంతో ఆ సమయంలో ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న అర్చకుడు బెంబేలెత్తిపోయి కేకలు వేశారు. అమ్మవారి మెట్లకు పూజలు నిర్వహించేందుకు వచ్చిన మహిళలు సైతం కంగారు పడి కిందకు దిగిపోవడం కనిపించింది. ఈ విషయాన్ని సెక్యూరిటీ సిబ్బందికి తెలిపిన అర్చకుడు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని కోరాడు. ఇంతలో ఘటనా స్థలానికి చేరుకున్న శానిటేషన్ సిబ్బంది కొండ చిలువను పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. పది రోజుల కిందట ఇదే మెట్ల మార్గంలో శ్లాబ్ పెచ్చులు ఉడి పడి చిన్నారి గాయపడింది. మంగళవారం క్యూలైన్ మార్గంలో భక్తుడికి కుక్క కరిచింది. ఇప్పుడు తాజాగా బుధవారం కొండ చిలువ కనిపించడం చర్చనీయాంశంగా మారింది. -
సూపర్ ప్రెజర్ బెలూన్ ఆవిష్కరణ
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్పేస్ టెక్నాలజీపై యువత ఆసక్తి పెంచుకుని పరిశోధనల వైపు దృష్టి పెట్టాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్నాయుడు సూచించారు. విజయవాడలోని ఇందిరాగాంఽధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం ఆవరణలో ఏరో స్పేస్ స్టార్టప్ కంపెనీ రెడ్ బెలూన్ పేరుతో రూపొందించిన సూపర్ ప్రెజర్ బెలూన్ను బుధవారం ఆయన ఎగురవేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ స్పేస్ టెక్నాలజీ ద్వారా సేకరించిన సమచారం రైతులు, ప్రజలు, వ్యాపారులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. సూపర్ ప్రెజర్ బెలూన్ భూమి నుంచి 25 కిలో మీటర్లపైకి వెళుతుందని తెలిపారు. ఏరో స్పేస్ స్టార్టప్ కంపెనీ సహా వ్యవస్థాపకుడు కిరణ్ మాట్లాడుతూ అనుకోని ప్రమాదం జరిగినప్పుడు మూలాలను తెలుసుకోవడానికి సూపర్ ప్రజర్ బెలూన్లో అమర్చిన సాంకేతిక వ్యవస్థ దోహదపడుతుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలకు చౌకగా టెలికమ్యూనికేషన్, ఇంటర్నెట్ కనెక్టవిటీని ఈ బెలూన్ ద్వారా అందించవచ్చునని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీలు కేశినేని శివనాథ్, లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. -
గాలి వీస్తే విద్యుత్ కట్కట
ఉమ్మడి కృష్ణా జిల్లాలో అనధికార విద్యుత్ కోతలు సాక్షి ప్రతినిధి, విజయవాడ: అనధికార విద్యుత్ కోతలు ఉమ్మడి కృష్ణా జిల్లా వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చిన్నపాటి గాలులు వీస్తే చాలు ఆ ప్రాంతంలో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. మండుతున్న ఎండలు, ఉక్కపోతకు అనధికార విద్యుత్ కోతలు తోడవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. దీనికి ప్రధాన కారణం నిర్వహణ లోపమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 220 కేవీ / 132 కేవీ ఈహెచ్టీ (ఎక్స్ట్రా హై టెన్షన్) లైన్లు, వాటి కింద ఉన్న ఫీడర్లలో ఓవర్లోడ్ పడితే ఆ ప్రాంతాల్లో అనధికార కోతలు విధిస్తు న్నారని సమాచారం. ఓవర్ లోడ్ నమోదయ్యే ప్రాంతాల్లో ప్రభుత్వం ముందుగా కొత్త లైన్లు వేయకపోవడం, ఉన్న లైన్లను అప్గ్రేడ్ చేయకపోవడం, ఈహెచ్టీ సబ్స్టేషన్ నిర్మాణాలు చేపట్టనందు వల్లే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గుణదల నుంచి ఆటోనగర్, గుణదల నుంచి గంగూరు, తాడికొండ నుంచి తాడేపల్లి 132 కేవీ లైన్ల పరిధిలో ఓవర్ లోడ్ కారణంగా వాటి పరిధిలోని ఫీడర్లలో అనధికారి కంగా విద్యుత్తు కోతలు విధిస్తున్నట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకు, రాత్రి పది నుంచి 12 గంటల వరకు కోతలు విధిస్తున్నారు. జనవరిలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో గరిష్ట వినియోగం రోజుకు 18 మిలియన్ యూనిట్లు. మంగళవారం విద్యుత్ వినియోగం 27.54 మిలియన్ యూనిట్లకు పెరిగింది. ఈ పెరుగుదలను ముందుగా అంచనా వేసి, దానికి అనుణంగా చర్యలు తీసుకోవడంలో విద్యుత్ శాఖ యంత్రాంగం పూర్తిగా విఫలం కావడంతో అనధికార కోతలు తప్పడం లేదు. గుణదల విద్యుత్ సబ్స్టేషన్ ఆవరణలో మంగళవారం ఎగసిపడుతున్న మంటలువిజయవాడ నగరంలో ఆదివారం సాయంత్రం వీచిన ఈదురు గాలులకు వైర్లు తెగి ఏడు ఫీడర్ల పరిధిలో గంటల తరబడి విద్యుత్ లేకుండా పోయింది. మంగళవారం రాత్రి గుణదలలో లైన్లు లూజుగా ఉండి, నిప్పురవ్వలు రాలి, గడ్డి తగలబడటంతోపాటు, ఆ ప్రాంతంలో ఉన్న విద్యుత్ పరికరాలు దగ్ధమయ్యాయి. దీంతో గన్నవరం, గూడవల్లి, గుణదల, పాలిటెక్నికల్ కాలేజీ, ఎనికేపాడు ప్రాంతాల్లో మూడు గంటలకు పైగా విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగింది. ఈ నెల 22వ తేదీనే గుణదలలో లైన్ల నుంచి నిప్పురవ్వలు పడినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో మంగళవారం ప్రమాదం జరిగింది. మైలవరం, జగ్గయ్యపేట, చిల్లకల్లు ప్రాంతాల్లో ఈదురు గాలుల కారణంగా సోమవారం నాలుగు గంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మంగళవారం రాత్రి వీచిన గాలులకు మచిలీపట్నం, అవనిగడ్డ, పెడన నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో ఫీడర్లు ట్రిప్పయ్యి రెండు, మూడు గంటల పాటు విద్యుత్ నిలిచిపోయింది. -
‘ఎస్కేపీవీవీ’లో ఎన్సీసీ రైఫిల్ షూటింగ్ శిక్షణ
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఆంధ్ర బెటాలియన్ 17(ఎ) నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) కాకినాడ పరిధిలోని తొమ్మిది జిల్లాల ఎన్సీసీ విద్యార్థులకు రైఫిల్ షూటింగ్లో శిక్షణ ఇచ్చేందుకు విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి వైఎస్సార్ కాలనీ రోడ్లోని ఎస్కేపీవీవీ డోకుపర్తి ఉపేంద్ర హైస్కూల్ కమిటీ ముందుకు వచ్చింది. కోస్తా ఆంధ్రాలోని ఎన్సీసీ క్యాడెట్లకు ఆయుధాలను ఉపయోగించడం, గురి చూడటం, కాల్పులు జరపడంలో శిక్షణ ఇచ్చేందుకు ఫైరింగ్ క్యాంప్ ఏర్పాటు చేసిన మొట్టమొదటి హైస్కూల్ ఇది. బుధవారం హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్కూల్ ఇన్చార్జ్ సెక్రటరీ/కరస్పాండెంట్ తూనుకుంట్ల శ్రీనివాసు మాట్లాడుతూ విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంపుతోపాటు క్యాడెట్లలో ధైర్యం, ఏకగ్రతను పెంచడమే ఫైర్ రేంజ్ ఏర్పాటు మఖ్య ఉద్దేశమన్నారు. దేశానికి సేవలు అందించే ఆర్మీ, అగ్నివీర్లలో చేరేందుకు ఎన్సీసీ ద్వారా అవకాశాలు మెండుగా ఉంటాయని తెలిపారు. శిక్షణ జేసీఓ సుబేదార్ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ నేషనల్ క్యాడెట్ కార్ఫ్స్ వార్షిక శిక్షణలో భాగంగా క్యాడెట్లకు అబ్ట్పాకిల్ ట్రైనింగ్, ఫైరింగ్ ప్రాక్టీస్, టెంట్ పిచింగ్, ఫిజికల్ ట్రైనింగ్, డ్రిల్, వెపన్ ట్రైనింగ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ తదితర అంశాలలో సమగ్ర శిక్షణ ఇస్తామని వివరించారు. బెటాలియన్ పరిధిలోని 537 మంది క్యాడెట్లకు ఈ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. టెక్నాలజీపై గెస్ట్ లెక్చర్స్.. ఎస్కేపీవీవీ హిందూ హైస్కూల్స్ కమిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి.నారాయణరావు మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజన్స్ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ, డ్రోన్ టెక్నాలజీ వంటి అంశాలపై నిపుణులతో గెస్ట్ లెక్చర్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. పాఠశాల ప్రిన్సిపాల్ పి.శ్యామల మాట్లాడుతూ క్యాడెట్లలో దేశభక్తి, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ పెంపొందించేందుకు ఈ ఫైరింగ్ క్యాంప్ దోహదపడుతున్నారు. కార్యక్రమంలో క్యాంప్ కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ అజిత్ సింగ్ తోమర్, సుబేదార్ మేజర్ అనిల్ కుమార్ దహియ, కెప్టెన్ కేపీటీ విజయభాస్కర్ పాల్గొన్నారు. -
దేదీప్యమానంగా డోకిపర్రు
ఘనంగా శ్రీ వేంకటేశ్వరుని దేవస్థాన వార్షికోత్సవాలు డీఎంహెచ్వో డాక్టర్ మాచర్ల సుహాసిని లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (అభ) ఐడీని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని, దానితో అనేక ప్రయోజనాలు ఉన్నట్లు ఎన్టీఆర్ జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని అన్నారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ అభ ఐడీపై ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగించాలని వైద్య సిబ్బందికి ఆదేశించినట్లు తెలిపారు. అభ ఐడీతో హెల్త్ రికార్డులు డిజిటల్గా భద్రంగా ఉంటాయని, ఒక్కసారి ఐడీ క్రియేట్చేసి, మనం ఎప్పుడు టెస్ట్లు చేయించుకున్నా, ఆ ఐడీలో రికార్డు అవుతాయన్నారు. గతంలో ఫైల్స్ను భద్రపర్చాల్సిన అవసరం ఉండదని ఆమె తెలిపారు. ల్యాబ్ రిపోర్టులు, వైద్యుని ప్రిస్క్రిప్షన్ వంటి ఆరోగ్య సమాచారాన్ని డిజిటల్ గా పొందవచ్చున్నారు. ధ్రువీకరించిన హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ద్వారా టెలి కన్సల్టేషన్ సేవలు పొందవచ్చునని పేర్కొన్నారు. కాబట్టి 14– అంకెల ప్రత్యేక హెల్త్ ఐడెంటి నెంబర్, అభను పొందండి డిజిటల్ అవ్వండి అనే నినాదంతో అవగాహన కలిగిస్తున్నట్లు తెలిపారు. -
వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందాలి
● 1912 టోల్ ఫ్రీ నంబర్ ఎల్లప్పడూ అందుబాటులో ఉండాలి ● ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విద్యుత్ సరఫరా వ్యవస్థను సమర్థంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ వవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ పి.పుల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. విజయవాడ గుణదలలోని ఏపీసీపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం నుంచి మంగళవారం సర్కిల్ పరిధిలోని జిల్లాల సూపరింటెండెంట్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (ఆపరేషన్స్)తో వర్చువల్ విధానంలో సమీక్షించారు. విద్యుత్ అంతరాయాలకు సంబంధించి ముందుగానే ప్రజలకు సమాచారం తెలియజేయాలని సూచించారు. టోల్ ఫ్రీ నంబర్ 1912, 83309 11912 వాట్సప్ నంబర్ సేవలను మరింత పటిష్టంగా అందించాలన్నారు. ప్రతి సర్కిల్ పరిధిలో కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. వర్షాలు, ఈదురుగాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తినా వెంటనే పునరుద్ధరణకు చర్యలు చేపట్టి, వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని సూచించారు. నిర్మాణంలో సబ్ స్టేషన్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఏపీసీపీడీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ ఆవుల మురళీకృష్ణ యాదవ్, సీజీఎం సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాబుధవారం శ్రీ 27 శ్రీ మే శ్రీ 2026u8లో అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,1710 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. 7ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు మంగళవారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. గాంధీనగర్: జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రూపొందించిన పోస్టర్ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ మంగళవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. -
అధిక ఉష్ణం.. జనాలకు అదే కష్టం!
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఉమ్మడి జిల్లాలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ, ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, చందర్లపాటు ప్రాంతాల్లో మంగళవారం అత్యధిక ఉష్ణోగ్రత 47.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఎ. కొండూరులో 44.1 డిగ్రీలు నమోదైంది. కాగా కృష్ణాజిల్లాలోని కంకిపాడు, పెనమలూరులో అత్యధికంగా 45.8 డిగ్రీల నమోదు కాగా, ఘంటసాల, పమిడిముక్కలలో 45.5. మచిలీపట్నంలో 45.1 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఈ ఉష్ణోగ్రతలు మరో నాలుగైదు రోజులు కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పని ఉంటేనే ఇంటి నుంచి బయటకు రావాలని చెబుతున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల్లోపు ఎండలో తిరగవద్దని సూచిస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎండల తీవ్రత దృష్ట్యా కార్మికులు, కర్షకులు వడగాడ్పులకు గురై మృత్యువాత పడుతున్నారు. జిల్లాలో మంగళవారం సైతం వడదెబ్బ మరణాలు జరిగాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎండ తీవ్రతకు గురికాకుండా ఉండటం, ఎక్కువగా మంచినీరు తాగడంతో పాటు, కొబ్బరినీళ్లు, ఓఆర్ఎస్ ద్రావణం, మజ్జిగ సేవించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 47.3, కృష్ణాలో 45.8 డిగ్రీలు నమోదు -
భయపెడుతున్న బుడమేరు ఆక్రమణలు
●ఆదాయ వనరుగా మారిపోయిన ‘ఆపరేషన్ బుడమేరు’● సెంట్రల్ నియోజకవర్గ ప్రజాప్రతినిధి అండదండలతో దందా! ● ‘మామూళ్ల’ మత్తులో కన్నెత్తి చూడని అధికారులు ● వరదొస్తే ప్రళయం తప్పదని స్థానికుల ఆందోళన సాక్షిప్రతినిధి,విజయవాడ: బుడమేరు.. ఈ పేరు వింటే నే విజయవాడ నగర ప్రజలు నేటికీ వణికిపోతుంటారు.. రెండేళ్ల క్రితం బుడమేరు వరదలు సృష్టించిన బీభత్సం స్థానిక ప్రజల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తూనే ఉంది.. కొద్దిపాటి చినుకులు పడినా.. తుపాను వస్తోందనే హెచ్చరిక వినినా.. ఎటు నుంచి ఏ వరద ముంపు తమను ముంచేస్తుందోనంటూ ఆందోళన చెందుతూనే ఉన్నారు. వేలాది మంది ప్రజలు రోడ్డున పడినా.. వందల సంఖ్యలో ఇళ్లు నీట మునిగినా.. పదుల సంఖ్యలో అమాయక ప్రజలు అసువులు బాసినా.. ప్రభుత్వ పాలకులు, సంబంధిత అధికారులు అవేవి తమకు పట్టవన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రజాప్రతినిధి అండదండలతో.. స్థానిక ప్రజాప్రతినిధి అండదండలతో బుడమేరులో యథేచ్ఛగా ఆక్రమణలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. బుడమేరులో మట్టి, రాళ్లు పోసేసి పూడ్చేయడం.. వాటిని ప్లాటుగా మార్చేసి.. దొంగ సర్వే నంబర్లతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం.. నిబంధనలకు విరుద్ధంగా బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను చేపట్టడం చేస్తున్నారనే విమర్శ లు గుప్పుమంటున్నాయి. ప్రజాప్రతినిధికి ప్రధాన అనుచరుడిగా చెప్పుకునే ఇద్దరు వ్యక్తులు బుడమేరు ఆక్రమణల్లో చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. మామూళ్ల మత్తులో.. స్థానిక ప్రజాప్రతినిధి నుంచి ఒత్తిళ్లు రావడం.. ఆక్రమణ దారుల నుంచి ముడుపులు అందుతుండటంతో బుడమేరులో ఇంత యథేచ్ఛగా ఆక్రమణలు జరుగుతున్నా సంబంధిత ఇరిగేషన్, రెవెన్యూ, కార్పొరేషన్ టౌన్ప్లానింగ్, నీటి పారుదల శాఖ అధికారులెవ్వరూ కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదని విమర్శలు వస్తున్నాయి. బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని చెబుతున్నా, ఫిర్యాదులు అందు తున్నా ‘మామూళ్ల’ మత్తులో అస్సలు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధి అనుచరుడైన వ్యక్తితో కొంతమంది టౌన్ప్లానింగ్ అధికారులు కుమ్మక్కయ్యారనే విమర్శలు న్నాయి. కొంతమంది ఇరిగేషన్ అధికారులకు కూడా పెద్ద మొత్తంలో ఆమ్యామ్యాలు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవే నిదర్శనాలు.. స్థానిక న్యూరాజరాజేశ్వరీపేట, ఇందిరానాయక్నగర్, రామకృష్ణాపురం, సన్సిటీ కాలనీ, భరతమాత మందిర చివర భాగం, అయోధ్యనగర్ నుంచి న్యూఆర్ఆర్పేటకు వెళ్లే దారి, రాఘవేంద్ర థియేటర్ సమీపంలోని బుడమేరులో యథేచ్ఛగా ఆక్రమణలు జరుగుతున్నాయి. బుడమేరును పూడ్చేసి ప్లాట్లుగా మార్చడమే కాకుండా.. ఇక్కడ బఫర్ జోన్లలో భవనాలు, షెడ్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు బుడమేరులో ఆక్రమణలకు అడ్డుకట్ట వేసి శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. బుడమేరు వరదల్లో మేమంతా ఆర్థికంగా చాలా చితికిపోయాం. ఆ ప్రభావం నుంచి నేటికీ కోలుకోలేదు. వరదలు వచ్చి రెండేళ్లు గడుస్తున్నా నేటికీ ఆక్రమణలను తొలగించకపోగా కొత్తగా అడుగడుగునా బుడమేరును పూడ్చేస్తున్నారు. ఇలా అయితే కొద్దిపాటి వర్షం వచ్చినా కూడా బుడమేరు కదిలే మార్గం లేక మళ్లీ ముంపు సమస్య వస్తుంది. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరిచి మా కన్నీటి ఘోషను ఆలకించి బుడమేరును, మా కుటుంబాలను కాపాడాలని కోరుకుంటున్నాం. – ఎస్.దుర్గారావు, న్యూఆర్ఆర్పేట -
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
పటమట(విజయవాడతూర్పు): పటమట పీఎస్ పరిధిలోని నిర్మల జంక్షన్ దగ్గరలో సర్వీస్ రోడ్డులోని ఎంపైర్ హోటల్ ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్ కింద సుమారు 50 సంవత్సరాలు వయసు కలిగిన వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని పటమట సీఐ పవన్ కిషోర్ తెలిపారు. మంగళవారం ఉదయం స్థానికులు సమాచారంతో అక్కడికి చేరుకున్న పటమట పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారన్నారు. మృతుని శరీరంపై షర్టు లేకుండా బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడని, అతని పేరు వివరాలు తెలియ రాలేదని, వివరాలు తెలిసినవారు పటమట పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని పేర్కొన్నారు. -
అప్పులు.. అభాసుపాలు!
గుడ్లవల్లేరు: చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన ‘స్వర్ణ పంచాయతీ’ సైట్తో అవస్థలు తప్పడం లేదు. దీని కారణంగా జిల్లాలోని చాలా పంచాయతీలు అప్పుల్లో కూరుకుపోతున్నాయి. కృష్ణా జిల్లాలో 486గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో ఎన్నో పంచాయతీలకు బిల్లులు కాకపోవటంతో పరిపాలన కుంటు పడుతోంది. జిల్లాలోని పంచాయతీరాజ్ శాఖలో ఉన్నతాధికారుల అండదండలున్న కొంతమంది గ్రామ కార్యదర్శులకు మాత్రం భారీ మొత్తంలో బిల్లులు సత్వరమే విడుదల చేసేందుకు కొన్ని శక్తులు సహకరిస్తున్నాయి. కానీ మైనర్ పంచాయతీల్లో కనీసం చాటింపు వేయించేందుకు రూ.500 డ్రా చేయాలన్నా కష్ట సాధ్యమవుతోంది. లక్ష్యాలకు దూరంగా.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తూ స్వచ్ఛపథం, స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర పథకాల లక్ష్యాన్ని పంచాయతీలకు అప్పగించింది. కానీ ఆ లక్ష్యాన్ని చేరేందుకు ఆయా పంచాయతీలు నానా అగచాట్లకు గురవుతున్నాయి. ● మేజర్, మైనర్ పంచాయతీల పరిధిలోని రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నా.. సీఆర్డీఏకు జమ అవుతున్నాయే తప్ప అందులో పంచాయతీలకు రావలసిన నిధులు అందడం లేదు. ● ఎన్నో ఏళ్లగా గ్రామ పంచాయతీలకు సర్కార్ ఇవ్వవలసిన స్టాంప్ డ్యూటీ నిధులను ఇవ్వటం లేదు. కేవలం పంచాయతీలకు వచ్చే నాన్ ట్యాక్స్, ఇంటి పన్నులు, నీటి పన్నులకు సంబంధించిన అరకొర నిధులతోనే పాలనా కాలాన్ని వెలిబుచ్చుతున్నారు. ● దీంతో నెలాంతపు ఖర్చులు, సిబ్బంది జీతాలు తలకు మించిన భారంగా మారాయి. ● మంచినీటి మోటార్ల రిపేర్లు, మురుగు కాల్వల్లో పూడికతీత వంటి పనులకు, పని వారికి వెంటనే డబ్బును అప్పటికప్పుడే చెల్లించకపోవటంతో ఆ పనులు చతికలబడిపోతున్నాయి. ● జిల్లా ఉన్నతాధికారుల అనుమతి లేనిదే చెత్త చేరవేసే వాహనాలకు సైతం కనీసం పెట్రోల్, డీజిల్ కూడా ఉండటం లేదు. ● రోజువారీ అవసరాల్ని బట్టి పంచాయతీల పరిధిలో పని చేసే మిషనరీలతో పాటు పని వారికి సొమ్ము చెల్లించలేక పోతున్నారు. ● కొన్ని పంచాయతీల్లో గత మార్చి వరకు చేయించిన పనులకు బిల్లులు చెల్లించవలసి ఉంది. ఏప్రిల్ నుంచి ఎం బుక్ ద్వారా చెల్లించవలసిన బిల్లులు కూడా కొన్ని పంచాయతీల్లో చెల్లించవలసి ఉంది. ● ఇదంతా ఏప్రిల్ నుంచి వచ్చిన నూతన స్వర్ణ పంచాయతీ సైట్లో సవరణలే కారణమని పంచాయతీలు భావిస్తున్నాయి. అప్పులూ కరువు.. బిల్లుల ఫ్రీజింగ్ వల్ల పంచాయతీలకు పెట్టుబడులు పెట్టే నాథులు కూడా కరువయ్యారు. గతంలో ఇలాంటి ఇబ్బందులు వచ్చినపుడు గ్రామ కార్య దర్శులే ఖర్చు పెట్టేవారు. ఇపుడు వారికి అప్పులు ఇచ్చేవారు కూడా కరువయ్యారు. పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం పూర్తి కావటంతో ప్రత్యేకాధికారులు ఆ స్థానే వచ్చారు. కానీ వారు కూడా ఈ ఖర్చులను పెట్టేందుకు ససేమిరా అంటున్నారు. స్వర్ణ పంచాయతీ సైట్తో తిప్పలు బిల్లులు రాక కార్యదర్శులు సతమతం బ్లీచింగ్, పైపులైన్ల రిపేర్లకు నిధులు లేవు అప్పుల్లో కూరుకుపోతున్న పంచాయతీలు పారిశుద్ధ్య కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లకు వేతనాలను విడుదల చేస్తున్నామని చెప్పుకునే జిల్లా అధికారులు.. చర్యలు మాత్రం కంటి తుడుపుగా ఉంటున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. తూతూమంత్రంగానే కొన్ని పంచాయతీలకే బిల్లులు ఆమోదిస్తున్నారనే వాదనలు వస్తున్నాయి. కొన్ని పంచాయతీలకై తే కనీసం బ్లీచింగ్కు బిల్లులను చెల్లించటంలో కూడా విఫలమవుతున్నారు. మంచినీటి పథకానికి చెందిన పైపులైన్ల రిపేర్ల ఖర్చుల బిల్లులకు మోక్షం లేకుండా పోయింది. నెలాంతపు ఖర్చుల బిల్లులు రాక నెలల తరబడి నానా ఇబ్బందుల్లో పంచాయతీలు ఉన్నాయి. -
చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ(పీసీ–పీఎన్డీటీ) చట్టాన్ని ఉల్లంఘించే స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తప్పవని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ హెచ్చరించారు. సమన్వయ శాఖల అధికారుల బృందాలు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు, డెకాయ్ ఆపరేషన్లను ముమ్మరం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్లో గర్భస్థ పిండలింగ నిర్ధారణ నిషేధ చట్టం, ఏఆర్టీ–సరోగసీ చట్టాల అమలుపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం జరిగింది. కమిటీ సభ్యులు, సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కమ్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జ్ సునీల్ కుమార్ హాజరైన సమావేశంలో కమిటీ చైర్మన్, కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడారు. పటిష్టంగా చట్టం అమలు..జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ఫిర్యాదులు వస్తే వాటిని త్వరితగతిన విచారించి, తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. జిల్లాలో అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రస్తుతమున్న స్కానింగ్ కేంద్రాలకు అదనంగా కొత్త రిజిస్ట్రేషన్లకు, రెన్యువల్ దరఖాస్తులు, మార్పుచేర్పుల (మోడిఫికేషన్) దరఖాస్తులను కమిటీ పరిశీలించి, ఆమోదం తెలిపింది. సరోగసీకి సంబంధించిన ఆరు దరఖాస్తులకు ఆమోదం తెలిపింది. సమావేశంలో డీఎంహెచ్వో డాక్టర్ ఎం.సుహాసిని, వాసవ్య స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి జి.రేష్మీ, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ పద్మజ, ఎన్హెచ్ఎం డీపీఎంవో డాక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
గన్నవరం ఎయిర్ పోర్టులో ఎబోలా అలర్ట్
సాక్షి, కృష్ణా జిల్లా: ఎబోలా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇంటర్నేషనల్ పాసింజర్స్కు స్క్రీనింగ్ టెస్ట్లు నిర్వహిస్తున్నారు. కాంగో, ఉగాండా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ విస్తృతి, కేసులు, మరణాల నమోదు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టారు.కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో గన్నవరం ఎయిర్ పోర్టులో ప్రయాణికులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. సింగపూర్ నుంచి 185 మంది ప్రయాణికులతో విమానం రాగా, వారికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుల ద్వారా వచ్చే ప్రయాణికులు, పర్యాటకుల ట్రావెల్ హిస్టరీ ఆధారంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. -
‘పది’ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జిల్లాలో సోమవారం తెలుగు పరీక్షతో ప్రారంభమయ్యాయి. జిల్లాలో 25 పరీక్ష కేంద్రాల్లో సోమవారం 1,680 మంది విద్యార్థులను కేటాయించారు. అందులో 1,298 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్షకు విద్యార్థుల హాజరు శాతం 77.3గా ఉంది. జిల్లాలోని పలు పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాశాఖాధికారి ఎల్. చంద్రకళ సోమవారం పరిశీలించారు. పటమట కేబీసీజెడ్పీ బాలుర హైస్కూల్, సత్యనారాయణపురంలోని ఏకేటీపీఎం హైస్కూల్, ముత్యాలంపాడులోని జీఎస్ఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాల తదితర పరీక్ష కేంద్రాలను ఆమె తనిఖీ చేసి పరిశీలించారు. అలాగే మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 15 పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. సోమవారం ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని అధికారులు ప్రకటించారు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): కృష్ణానదిలో దూకి యువకుడు మృతి చెందిన సంఘటన వన్టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుర్తు తెలియని యువకుడు కృష్ణానదిలో కనిపించటంతో సోమవారం ఉదయం బ్యారేజీ సమీపంలోని వ్యక్తులు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు ఆ మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించగా ఆదివారం రాత్రి నదిలో దూకి ఆత్మహత్య చేసుకొని ఉన్నట్లుగా స్థానికులు పేర్కొన్నారు. దీనిపై వన్టౌన్ పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాలు తెలిసిన వారు వన్టౌన్ పోలీసులకు సమాచారమందించాలని అధికారులు కోరారు. గుణదల(విజయవాడ తూర్పు): మద్యం మత్తులో చేతికందిన కత్తితో తన స్నేహితుడి పై దాడి చేసిన ఘటనలో ఓ వ్యక్తిని మాచవరం పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాచవరం మసీదు వీధికి చెందిన బండి వంశీబాబు(31) పెయింటింగ్ పనిచేస్తుంటాడు. ఈ నెల 24వ తేదీ రాత్రి పని ముగించుకుని తన స్నేహితులైన రాజు, వెంకట్లతో కలసి స్థానికంగా ఉన్న ఓ బార్ వద్ద మద్యం తాగారు. ఈ సమయంలో వంశీబాబుకు రాజుల మధ్య వాగ్వివాదం తలెత్తింది. క్షణికావేశానికి గురైన వంశీ కూరగాయలు తరిగే కత్తితో రాజుపై దాడికి దిగాడు. ఈ ఘటనలో రాజు తీవ్రంగా గాయపడ్డాడు. బార్ యజమాని మాచవరం పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాజును వైద్యం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది. ఉద్రేకంలో కత్తితో దాడి చేసిన వంశీబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు సోమవారం అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. -
దుర్గమ్మ పంచహారతుల సేవలో కలెక్టర్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేలా ఆలయ ప్రాంగణంలో మరిన్ని వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ దుర్గగుడి అధికారులకు సూచించారు. కలెక్టర్ లక్ష్మీశ సోమవారం దుర్గమ్మ పంచహారతుల సేవలో పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు కలెక్టర్ లక్ష్మీశ ఆలయ ప్రాంగ ణానికి చేరుకోగా, ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. పంచహారతుల సేవలో పాల్గొన్న అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ ఈవో శీనానాయక్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద దేవస్థాన ఆధ్వర్యంలో నడుపుతున్న ఆరోగ్య శిబిరాన్ని పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు పొందుతున్న భక్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాజగోపురం ఎదుట ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ట్రస్ట్ బోర్డు సభ్యులతో మాట్లాడారు. దుర్గగుడి ఈఈ ఎల్. రమా, ఇతర ఆలయ అధికారులు పాల్గొన్నారు. -
వివాహేతర సంబంధమే ప్రాణం తీసింది!
తెన్నేరు మహిళది హత్యేనని తేల్చిన పోలీసులు కంకిపాడు: వివాహేతర సంబంధమే ప్రాణం తీసింది. ఉంచుకున్నోడే అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేల్చారు. అనుమానాస్పద మృతిని పోలీసులు హత్యకేసుగా నమోదు చేశారు. ఘాతుకానికి పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. కలిసి వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంది.. ఏలూరు జిల్లా కై కలూరు మండలం వింజరం గ్రామానికి చెందిన జొన్నాదుల మేరీ(33) తనతో వివాహేతర సంబంధం నడుపుతున్న తోకల వినోద్కుమార్ అనే వ్యక్తితో పది రోజులు క్రితం తెన్నేరు గ్రామంలోని ఇటుక బట్టీల వద్దకు పనికి వచ్చింది. తరచూ వీరు ఇక్కడికి పనులకు వస్తుంటారు. అదే విధంగా ఇద్దరూ ఇటుక బట్టీలకు వచ్చారు. ఈనెల 24వ తేదీన బట్టీల వద్ద ఎవరూ లేని సమయంలో వారు ఉండే పాకలో మేరీ, వినోద్కుమార్లకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో వినోద్కుమార్ మెడకు గుడ్డతో బిగించి హత్య చేసినట్లు మృతు రాలి భర్త శివకుమార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యా దులో పేర్కొన్నాడు. ఘటనాస్థలాన్ని సందర్శించిన కంకిపాడు సీఐ జె.మురళీకృష్ణ, ఎస్ఐ సందీప్, సిబ్బంది వివరాలు సేకరించి హత్యకేసు నమోదు చేశారు. అనుమానమే కారణమా? గత కొద్ది రోజులుగా మేరీ వేరే వ్యక్తులతో మాట్లాడుతుండటంతో అనుమానం పెంచుకుని ఇదే విషయమై వినోద్కుమార్ తరచూ గొడవలు పడేవాడని స్థానికులు చెబుతున్నారు. హత్యకు ఇది కూడా కారణంగా పోలీసులు భావిస్తున్నారు. లేక మరేదైనా కారణం అయ్యి ఉంటుందా? అన్న కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీసుల అదుపులో.. హత్యకు పాల్పడ్డ ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు వినోద్కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు సమాచారం. మేరీ మృతి అనంతరం అక్కడి నుంచి కంకిపాడు వచ్చిన వినోద్కుమార్ భోజనం పార్సిల్ను ఓ మిత్రుడికిచ్చి మేరీకి ఇవ్వమని చెప్పి అక్కడి నుంచి ఉడాయించినట్లు తెలుస్తోంది. భోజనం ఇచ్చేందుకు వెళ్లిన వ్యక్తి ద్వారా హత్య జరిగిన ఘటన వెలుగు చూసిందని స్థానికులు చెబుతున్నారు. ప్రాథమిక సమాచారం ద్వారా నిందితుడిని గుడివాడ పరిసరాల్లో అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం కంకిపాడు స్టేషన్కు ఉంచినట్లు సమాచారం. -
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
గన్నవరం: ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటనపై గన్నవరం పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. స్థానిక శ్రీనగర్కాలనీలో కాజ రజితకుమారి(58) జ్యోతి పేరిట పిండిమరను నడుపుతున్నారు. ఏడేళ్ల క్రితం ఆమె భర్త మృతి చెందగా, ఆమె ఇరువురు కుమార్తెలు అమెరికాలో ఉంటున్నారు. దీంతో ఆమె స్థానిక దావాజీగూడెం రోడ్డు పక్కన ఉన్న జీకేఆర్ అపార్ట్మెంట్లో ఒంటరిగా నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఇంటి పనులు చేసేందుకు వచ్చిన పని మనిషి బెడ్రూమ్లో మంచం పక్కన రజితకుమారి కింద పడి మృతి చెంది ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ శ్రీధర్ నేతృత్వంలో అక్కడికి చేరుకున్న సిబ్బంది మృతురాలి నోరు, ముక్కు వద్ద రక్తం ఉండటంతో అనుమానాస్పద మృతిగా భావించి దర్యాప్తు చేపట్టారు. అపార్టుమెంట్లోని సీసీ కెమెరా ఫుటేజ్లను పరిశీలించారు. పోలీసుల అదుపులో అనుమానితురాలు.. ఆదివారం రాత్రి 10.30గంటల సమయంలో నాలుగు నెలలు క్రితం రజితకుమారి పాత ఇంట్లో అద్దెకు ఉండి వెళ్లిన సుష్మ, ఆమె కుమారుడు అజయ్ ప్లాట్కు వచ్చినట్లుగా నిర్ధారించారు. అంతే కాకుండా రాత్రి 11 గంటల సమయంలో తల్లీకొడుకులు హడావుడిగా గేటు దూకి వెళ్లే ప్రయత్నంలో అపార్టుమెంట్ వాచ్మెన్ గమనించినట్లుగా విచారణలో తేలింది. రజితకుమారి మెడలోని బంగారు గొలుసు, ఆమె బ్యాగ్లోని నగదు మాయమైనట్లుగా గుర్తించారు. దీంతో డబ్బు, నగలు కోసమే రజితకుమారిని హత్యచేసి ఉండవచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే సుష్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ శ్రీధర్ తెలిపారు. క్లూస్ టీమ్ను కూడా రంగంలోకి దింపి నిందితుల వేలిముద్రలను సేకరించారు. అమెరికాలో ఉన్న కుమార్తెలు వచ్చే వరకు రజిత మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. నగదు, నగల కోసం హత్య చేశారా? అనుమానితులను విచారిస్తున్న పోలీసులు -
మరికొన్ని రోజులు ఇదే తీవ్రత..
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎండల తీవ్రత కొనసాగుతూనే ఉంది. విజయవాడతో పాటు పలు రూరల్ ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం కొద్దిపాటి వర్షం కురిసినప్పటికీ, సోమవారం ఉదయం నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు వడగాడ్పులు తోడవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వడగాడ్పుల ప్రభావానికి గురైన చాలామంది పిట్టల్లా రాలుతున్నారు. బయటకు వచ్చిన వారే కాదు, ఇళ్లలో ఉన్న వారు సైతం హీట్స్ట్రోక్కు గురవుతున్నారు. అలాంటి వారు తీవ్రమైన తలనొప్పి, వికారం, వాంతుల వంటి సమస్యలతో ఆస్పత్రుల దారి పడుతున్నారు. వడదెబ్బ మృతుల్లో అధికంగా శ్రమ జీవులు, యాచకులే ఉంటున్నారు. పెనమలూరు: జార్ఖండ్ రాష్ట్రం హజారీబాగ్కు చెందిన తులసిరాణా(60) పోరంకిలో అపార్టుమెంట్లో కార్పెంటర్ పనికి వచ్చాడు. అతను శుక్రవారం పని చేస్తున్న సమయంలో ఎండ తీవ్రత తట్టుకోలేక వడదెబ్బకు గురై అపస్మారకస్థితికి చేరుకున్నాడు. అతనిని చికిత్సకై ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న తులసి రాణా ఆదివారం మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి అల్లుడు మనోజ్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెనమలూరు పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఉయ్యూరు మండలం కలవపాముల గ్రామానికి చెందిన తంగిరాల వినోద్బాబు(34) భవన నిర్మాణ పనుల్లో భాగంగా టైల్స్ వేస్తుంటాడు. ఆదివారం పనికి వెళ్లిన వినోద్బాబు సాయంత్రం ఇంటికి వచ్చిన కొద్ది సేపటికే స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో అతడిని కుటుంబ సభ్యులు ఉయ్యూరులోని సామాజిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో విజయవాడ జీజీహెచ్కి తీసుకువచ్చారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం వేకువ జామున మృత్యువాత పడ్డాడు. కాగా వినోద్బాబుకు తొలుత వైద్యుల పోస్టుమార్టం నిర్వహిస్తామని చెప్పారని, తర్వాత పోస్టుమార్టం చేయకుండానే పంపించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కాగా మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్థానిక సిద్ధార్థ జంక్షన్ సమీపంలోని నివాసం ఉంటున్న వెల్డింగ్ పనులు చేసే కార్మికుడు గొంగటి చంటి(45) వడదెబ్బతో మృతి చెందాడు. చంటి భార్య గతంలోనే చనిపోవడంతో తల్లి యశోదమ్మతో కలిసి సిద్ధార్థ జంక్షన్ సమీపంలో నివాసం ఉంటున్నాడు. మధ్యాహ్నం వేళ చికెన్ తీసుకువస్తానని చెప్పి చంటి బయటకు వెళ్లాడు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో సిద్ధార్థ కళాశాల చెట్టు కింద మీ అబ్బాయి స్పృహతప్పి పడిపోయాడని స్థానికులు చంటి తల్లి యశోదమ్మకు సమాచారం ఇచ్చారు. ఆమె వెంటనే వచ్చి 108లో నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆసుపత్రికి వెళ్లిన కొద్దిసేపటికే చంటి మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. ● విజయవాడ సూర్యారావుపేటలో హోటల్ కార్మికుడు, హనుమాన్పేటలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద ఇద్దరు వ్యక్తులు వడదెబ్బకు గురై మృతి చెందారు. తిరువూరురూరల్: మండలంలోని వావిలాలలో వడదెబ్బకు ఇరువురు మృతిచెందారు. ఆదివారం రాత్రి షేక్ షఫీ కమృన్(87) అస్వస్థతకు గురికాగా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించేలోపు మృతిచెందారు. వడదెబ్బకు ఆమె మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అదే గ్రామానికి చెందిన టైలరింగ్ వృత్తి నిర్వహించే షేక్ నాగుల్మీరా (52) శనివారం విధినిర్వహణలో ఉండగా వడదెబ్బకు గురయ్యారు. 108 అంబులెన్సులో తిరువూరు ఏరియా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో విజయవాడ తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం షేక్ నాగుల్మీరా మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇరువురు సంతానం. ఇబ్రహీంపట్నం: మండుతున్న ఎండలకు తట్టుకోలేక వడదెబ్బ సోకి ఆవు మృతి చెందిన ఘటన ఇబ్రహీంపట్నం ఖాజీమాన్యంలో సోమవారం జరిగింది. ఇప్పటి వరకూ కొండపల్లి మునిసిపాలిటీలో ఎండవేడి గాలులకు మూడు ఆవులు చనిపోయాయి. మృతి చెందిన ఆవును కొండపల్లి మున్సిపల్ కమిషనర్ బి.శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పారిశుద్ధ్య కార్మికులు ట్రాక్టర్పై తీసుకెళ్ల్లి సమాధి కార్యక్రమం నిర్వహించారు. పశువులు వడదెబ్బకు గురైతే సకాలంలో వైద్య సేవలు అందించేందుకు టోల్ఫ్రీ నెంబర్ 1962కు ఫోన్ చేయాలని పశు వైద్యాధికారులు సూచించారు. గన్నవరం: ఉంగుటూరుకు చెందిన షేక్ మౌలాలి(42) స్థానిక బుద్ధవరం రోడ్డులోని ఫీడ్ మిక్చర్ తయారీ కర్మాగారంలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో కర్మాగారం ఆవరణలో సోమవారం పనిచేస్తుండగా వడదెబ్బకు గురై మౌలాలి ఒక్కసారిగా కుప్ప కూలిపోయి మృతి చెం దాడు. స్థానిక వెంకటేశ్వర థియేటర్ కాంప్లెక్స్లో టైలరింగ్ షాపులో పనిచేస్తున్న తాళ్లూరి విజయ్ కూడా వడదెబ్బకు గురై షాపులో మృతి చెందాడు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): అంబాపురం తోటమూల సెంటర్ వద్ద రోడ్డు మీద ఒక వ్యక్తి మృతి చెంది ఉండటాన్ని స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు అక్కడకు చేరుకొని ఆరా తీయగా సదరు మృతుడి వివరాలు ఎవరికీ తెలియదని సమాధానమొచ్చింది. అలాగే ఎండ వేడి తాళలేక మృతి చెంది ఉండవచ్చని స్థానికులు పేర్కొన్నారు. దానిపై కొత్తపేట పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జగ్గయ్యపేట: మండలంలోని బలుసుపాడుకు చెందిన బండ్ల శాంతమ్మ (80) ఉపాధి హామీ పథకం పనులకు వెళ్తుంటుంది. ఎప్పటి మాదిరిగానే పనులకు వెళ్లి మధ్యాహ్న సమయంలో రావటంతో వడదెబ్బ తగిలి అస్తస్థతకు గురవటంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. మండలంలోని కె.అగ్రహారం గ్రామానికి చెందిన బొడ్డు శ్రీను(47) వ్యవసాయ పనులు చేస్తుంటాడు. ఆదివారం కూడా పొలం పనులకు వెళ్లి రాత్రికి ఇంటికి చేరాడు. దీంతో రాత్రి స్పృహ తప్పటంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృత్యువాత పడ్డాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. వీరులపాడు: మండలంలోని జుజ్జూరు గ్రామానికి చెందిన కోపూరు మోషే (70) రిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. రోజూ మాదిరిగానే ఆదివారం కూడా తన పనులకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి రాగానే అలసటగా ఉందని కుటుంబ సభ్యులకు తెలపటంతో గ్రామంలోని వైద్య సేవలందించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున మృతి చెందాడు. మృతునికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 14 మంది మృతి మృతుల్లో కష్టజీవులు, యాచకులే అధికం పీఎం చేస్తేనే వడదెబ్బగా గుర్తింపు ఆస్పత్రుల్లో పీఎం చేయకుండానే పంపేస్తున్న వైనం ఉమ్మడి కృష్ణాలో మరో ఐదు రోజుల పాటు ఎండలు ఇదే తీవ్రత కొనసాగే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు ఎవరూ ఉదయం 10 గంటల తర్వాత, సాయంత్రం 4 గంటల్లోపు బయటకు రావద్దని సూచిస్తున్నారు. అత్యవసరమైతే తగిన జాగ్రత్తలు తప్పని సరిగా తీసుకోవాలంటున్నారు. ముఖ్యంగా వడగాడ్పుల ప్రభావానికి వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు, మద్యం తాగిన వారు త్వరగా గురయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. వడదెబ్బగా నమోదు ఎలా?వడదెబ్బకు మృతి చెందినట్లు అధికారుల లెక్కల్లోకి ఎక్కాలంటే పోస్టుమార్టం రిపోర్టు తప్పనిసరి అని చెబుతున్నారు. కానీ జిల్లాలో వడదెబ్బ మృతులకు పోస్టుమార్టం నిర్వహించకుండానే మృతదేహాలను బంధువులకు ఇచ్చేస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో వడగాడ్పులకు మృతి చెందిన వారిని తొలుత ప్రభుత్వాస్పత్రికి తరలిస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వాస్పత్రిలో మృతి చెందిన వారికి కూడా పోస్టుమార్టం నిర్వహించడం లేదు. మరి వడదెబ్బగా ఎలా నమోదు అవుతుందో అధికారులకే తెలియాలి. -
వడదడ!
కంకిపాడు @ 48.2 డిగ్రీలుభానుడి భగభగలకు పిట్టల్లా రాలుతున్న జనంఉమ్మడి కృష్ణాలో సోమవారం కూడా అధిక ఉష్ణోగ్రతలు కొనసాగాయి. కాగా రాష్ట్రంలోనే అత్యధికంగా కృష్ణాజిల్లా కంకిపాడు, పెనమలూరులో అత్యధికంగా 48.2 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు ఉయ్యూరులో 46.6డిగ్రీలు, తోట్లవల్లూరు, పమిడిముక్కల, ఉంగుటూరుల్లో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎన్టీఆర్ జిల్లాలో ఇబ్రహీంపట్నంలో 46.3, నందిగామలో 45.9, వీరులపాడులో 45.7, విజయ వాడలో 44.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. వచ్చే నాలుగు రోజుల్లో కూడా వడగాడ్పులు విజృంభిస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. -
కనుమురుగు కష్టం!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: నగరంలో డ్రెయినేజీ అస్తవ్యస్తంగా మారింది. అవుట్ ఫాల్, స్ట్రామ్ వాటర్ డ్రెయిన్లు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వర్షాలు వచ్చినప్పుడు మంత్రులు, అధికారులు హడావుడీ చేయడం తప్ప క్షేత్ర స్థాయిలో సమస్య పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు శూన్యం. చిన్నపాటి వర్షానికే రోడ్లు చెరువులుగా మారిపోతున్నాయి. ఇక భారీ వర్షం పడితే గంటల తరబడి రోడ్లపైనే మురుగు తిష్టవేస్తోంది. వర్షం పడినప్పుడు కొన్ని రోడ్లలో ప్రయాణించాలంటే ప్రజలు వణుకుతున్నారు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించి అష్టకష్టాలు పడుతున్నారు. వర్షాకాలానికి ముందే మురుగు కాలువల్లో పూడికతీత చేపట్టాల్సిన నగర పాలక సంస్థ అధికారులు నామ మాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. పూడికతీత అంతంత మాత్రమే.. మురుగునీరు, వర్షపు నీటి పారుదలకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో 142 కిలోమీటర్ల మేర మేజర్ అవుట్ ఫాల్ డ్రెయిన్లు, 302 కిలో మీటర్ల మేర మైనర్ డ్రెయిన్లు ఉన్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని జెండా చెట్టు, కేఎల్రావు నగర్, కబేళా, నైజాంగేటు సెంటర్ అవుట్ ఫాల్ డ్రెయిన్లు బుడమేరు కాలువలో కలుస్తాయి. డ్రెయిన్లలో సక్రమంగా పూడిక తీయకపోవడంతో మురుగునీటితో పలు ప్రాంతాలు ముంపు బారిన పడుతున్నాయి. సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్నగర్, ప్రకాష్నగర్, శాంతినగర్, రాజీవ్ నగర్, ఉడా కాలనీ, కండ్రిక ప్రాంతాల నుంచి వచ్చే నీరు కండ్రిక పంపింగ్ స్టేషన్ వాగు ద్వారా బుడమేరులో కలుస్తుంది. ఈ నియోజకవర్గంలో అవుట్ ఫాల్ డ్రెయిన్ వ్యవస్థ సక్రమంగా లేక ఇబ్బందులు తప్పడం లేదు. వరద నీరు డ్రెయిన్ల ప్రవహించకపోగా వెనక్కి తన్ని కాలనీలు, రోడ్లు ముంపుబారిన పడుతున్నాయి. డ్రెయినేజీ అస్తవ్యస్తంగా ఉండటంతో వల్లే రెండేళ్ల కిందట వచ్చిన భారీ వర్షాలకు బుడమేరు పొంగి నగరంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకోకుండా ప్రధాన డ్రెయిన్లయిన గుంటతిప్ప, పుల్లేరు, బుడమేరులో పూడిక నామమాత్రంగా తీశారు. తూర్పు నియోజకవ ర్గంలో పుల్లేటి కాలువ, గుంటతిప్ప డ్రెయిన్లు ప్రధానమైనవి. ఎల్అండ్టీ అవుట్ పాల్ డ్రెయిన్లు ఉన్నా పనిచేయటం లేదు. మొగల్రాజపురంలో కొండ ప్రాంతాల నుంచి వచ్చే వర్షపు నీరు రోడ్ల పైనే తిష్టవేస్తోంది. ప్రధాన డ్రెయిన్లు ప్రవహించే లబ్బీపేట, పిన్నమనేని పాలిక్లినిక్, గాయత్రీనగర్, ఎల్ఐసీ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, గుణదల, భారతీనగర్, గురునానక్ కాలనీ, మరుతి కో–ఆపరేటివ్ కాలనీ, ఆటోనగర్, అజిత్సింగ్ నగర్, మధురానగర్, పాయకాపురం, బెంజిసర్కిల్, పంటకాలువ రోడ్డు, తోటవారి వీధి, ఊర్మిళా నగర్, నిర్మల కాన్వెంట్ రోడ్డు, కృష్ణవేణి రోడ్డు, రమేష్ ఆస్పత్రి ప్రాంతాల్లో కొద్దిపాటి వర్షానికే రోడ్లపై మురుగు, వర్షపునీరు పొంగి ప్రవహించి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రోడ్డు ఎక్కడ ఉందో డ్రెయిన్ ఎక్కడ ఉందో తెలియక పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన అవుట్ ఫాల్ డ్రెయిన్లలో ఎప్పటికప్పుడు సిల్టు, వ్యర్థాలను తొలగించడంలో నరగపాలక సంస్థ అధికారులు విఫలం అవుతున్నారు. ప్రభుత్వం దీనిపైన దృష్టి సారిస్తే తప్ప సమస్య పరిష్కరం అయ్యే మార్గం కనిపించటం లేదు. రూ.7.25 కోట్లతో పనులు ఈ ఏడాది మేజర్ మురుగు కాలువలు, డ్రెయిన్లలో పూడికతీత పనుల కోసం నగరంలోని మూడు సర్కిళ్ల పరిధిలో రూ.7.25 కోట్లతో 128.91 కిలో మీటర్ల మేర పూడికతీత పనులను చేపట్టారు. మేజరు డ్రెయిన్లు 480.02 కిలోమీటర్లు, మీడియం డ్రెయిన్లు 245.01 కిలో మీటర్ల మేర మరమ్మతులు తూతూ మంత్రంగా సాగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వర్షాకాలం సమీపిస్తోంది. డ్రెయిన్లలో పూడికతీత పూర్తిస్థాయిలో జరగడంలేదు. ఈ నేపథ్యంలో ఈ వర్షాకాలంలో నగర వాసులకు మురుగు కష్టాలు తప్పేలా లేవని పలువురు పేర్కొంటున్నారు. నగరంలో ఎక్కడా పూడికతీత పనులు జరుగుతున్నట్లు కనిపించడం లేదు. రైతు బజార్లలో, టీ స్టాల్ వద్ద, ప్రధాన కూడళ్లలో స్వచ్ఛభారత రేటింగ్ కోసం ఓటీపీల నమోదు ప్రక్రియ మాత్రం భారీగా జరుగుతోంది. వేసవి తాపం వల్ల పారిశుద్ధ్య పనులకు కార్మికుల హాజరు తగ్గింది. అనుకున్నంత స్థాయిలో అదనపు సిబ్బందిని నియమించిన దాఖలాలు లేవు. రుతు పవనాలు త్వరలో ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా పూడికతీత పనులు జరగడంలేదని భావిస్తున్నా. – బుద్దె రాజా, ప్రధాన కార్యదర్శి, విజయవాడ మునిసిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) -
అర్జీలను ప్రత్యేక దృష్టితో పరిష్కరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా అందుతున్న ప్రతి అర్జీపైనా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని, అర్జీదారులు సంతృప్తి చెందేలా ఆయా సమస్యలను పరిష్కరించాలని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ ఆదేశించారు. కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం సోమవారం జరిగింది. జాయింట్ కలెక్టర్ ఇలక్కియ. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.లక్ష్మీ నరసింహంతో కలిసి అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ మాట్లాడుతూ.. ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్దే శించిన గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. నిబంధనలను పాటిస్తూ అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 124 అర్జీలు అందాయన్నారు. వీటిలో పోలీస్ శాఖకు సంబంధించి అత్యధికంగా 24 అర్జీలు అందాయి. రెవెన్యూ శాఖకు సంబంధించి 23, ఎంఏయూడీ 14, పంచాయతీ రాజ్ 11, సాంఘిక సంక్షేమం 9, విద్య 8, పౌర సరఫరాలు 6, డీఆర్డీఏ 5, ఉపాధికల్పన 4, ఏపీ సీపీడీసీఎల్ 3, హెల్త్ 2, గ్రామీణ నీటి సరఫరా 2, విభిన్న ప్రతిభావంతులు 2, సహకార 2, కార్మిక 2, హౌసింగ్, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్ ఇంజినీర్, అటవీ, వక్ఫ్ బోర్డు, ప్రజా రవాణా, దేవదాయ శాఖలకు సంబంధించి ఒక్కో అర్జీ స్వీకరించినట్లు జేసీ తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఇలక్కియ -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లామంగళవారం శ్రీ 26 శ్రీ మే శ్రీ 2026ఆక్రమణలు ఇలా... అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,1710 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడి ఆలయ పూర్వ ఈఓ డి.భ్రమరాంబ అమ్మవారి అన్నదానానికి సోమవారం రూ.1.01 లక్షల విరాళం సమర్పించారు.లబ్బీపేట(విజయవాడతూర్పు): సైబర్ నేరాల నియంత్రణకు అత్యాధునిక ఏఐ సాంకేతికతను వినియోగించేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసు శాఖ శ్రీకారం చుట్టింది. నేరాలు జరగకముందే ప్రజలను అప్రమత్తం చేయడమే లక్ష్యంగా ఖాకీ స్టూడియోను ప్రారంభించింది. అందులో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్కు ఐదు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణ కార్యక్రమం సోమ వారం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు మాట్లాడుతూ.. సాంకేతికత ఎంత వేగంగా అభి వృద్ధి చెందుతుందో, అంతకంటే వేగంగా సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ సాంకేతికంగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ, సరికొత్త మోసాలు నిరంతరం పుట్టుకొస్తూనే ఉన్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే.. నేరం జరగకముందే ప్రజల్లో అవగాహన కల్పించడం మిన్న అనే కోణంతో సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అందులో భాగంగా ఎన్టీఆర్ పోలీస్ ఖాకీ స్టూడియో కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. సమాజంలో సైబర్ భద్రత, మహిళల భద్రత, పిల్లల సంరక్షణ, రోడ్డు భద్రతపై ఒక బలమైన బాధ్యతాయుతమైన సంస్కృతిని నిర్మించాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు షిరీన్బేగం, కె.జి.వి. సరిత, కె.కృష్ణప్రసన్న, లక్ష్మీనారాయణ, పలువురు సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి హైదరాబాద్కు చెందిన శ్రీరామ రాజేష్, భాను దంపతులు సోమ వారం రూ.1,00,116 విరాళం సమర్పించారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వారు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావుకు ఈ విరాళాన్ని అందజేశారు. దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఆలయ అధికారి బర్మా ప్రసాద్, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బస్టాండ్(విజయవాడ పశ్చిమ): విజయవాడ పండిట్ నెహ్రూ బస్టేషన్ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ సొమవారం సాయంత్రం తనిఖీ చేశారు. బస్టేషన్లోని ఎరైవల్ బ్లాక్, డిపార్చర్ బ్లాక్, సిటీ టెర్మినల్లోని వివిధ ప్లాట్ఫాంలను పరిశీలించారు. వేపవిలో ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యలపై ఆర్టీసీ అధికారుల నుంచి వివరాలు సేకరించారు. మంచినీటి సౌకర్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరిన్ని చొట్ల తాగునీటి కూలర్లును ఏర్పాటు చేసి ప్రయాణికులకు తాగు నీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడా లని ఆదేశించారు. బస్సుల కోసం నిరీక్షించే ప్రయాణికులకు ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితిల్లో ఉన్న ప్రయాణికులకు వైద్య సేవలు అందించే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డెప్యూటీ సీటీఎం పవన్కుమార్, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యులు కచ్చితంగా సమయపాలన పాటించాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని ఆదేశించారు. జిల్లాలో పీహెచ్సీల్లో కొత్తగా చేరిన వైద్యులు, యూపీహెచ్సీల్లో పనిచేస్తున్న వైద్యులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలోని ఐఎంఏ హాలులో నిర్వహించిన ఈ సమావేశంలో కొత్తగా చేరిన వైద్యులకు విధులపై దిశా నిర్దేశం చేశారు. ఆస్పత్రికి వచ్చే ప్రతి ఒక్కరికీ అభ ఐటీ (ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్) క్రియేట్ చేయా లని, మొదటిగా స్టాఫ్నర్సు లాగిన్లో ఎంటర్ చేసి, వైద్యాధికారి లాగిన్ ద్వారా వారిని పరీక్షించాలని సూచించారు. ఈ సదస్సులో ఉప జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఇందుమతీదేవి, డీఐఓ డాక్టర్ శరత్బాబు, డీపీఎంఓ డాక్టర్ నవీన్, ఆర్బీఎస్కే అధికారి డాక్టర్ మాధవి నాయుడు, డీపీఓ మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ఘాట్రోడ్డును ఆలయ అధికారులు మంగళవారం నుంచి మూసివేయనున్నారు. ఘాట్రోడ్డులో జూన్ 12వ తేదీ వరకు మరమ్మతులు కొనసాగనున్నాయి. ఆర్అండ్బీ శాఖ పర్యవేక్షణలో ఈ పనులను చేపట్టినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఘాట్ రోడ్డుపైకి ఎటు వంటి వాహనాలను అనుమతించేది లేదని ఆలయ ఈఓ శీనానాయక్ ప్రకటించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు మహామండపం మెట్లు, లిఫ్టు మార్గం ద్వారా కొండపైకి చేరుకోవాలని ఆలయ అధికారులు సూచించారు. అమ్మవారి దర్శనం అనంతరం మహామండపంతో పాటు మల్లేశ్వర స్వామి వారి ఆలయ మెట్ల మార్గం ద్వారా కొండ దిగువకు చేరుకోవాలని పేర్కొన్నారు. ఘాట్ రోడ్డు అభివృద్ధిలో భాగంగా చేపట్టిన పనుల నేపథ్యంలో భక్తులు దేస్థానానికి సహకరించాలని కోరారు. జి.కొండూరు: నాగార్జున సాగర్ కాలువకు వాటా ప్రకారం సాగు నీరు తీసుకురావడంలో పాలకులు విఫలమయ్యారు. కాలువలను కాపాడాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరిస్తున్నారు. ఇదే అదునుగా పంటపొలాలకు జీవజలం అందించాల్సిన కాలువలను కబ్జాదారులు ఆక్రమిస్తున్నారు. కాలువలను పూడ్చి వెంచర్లలో కలిసేస్తున్నారు. మైనర్, సబ్ మైనర్ కాలువలు పూర్తిగా మాయమైపోతుండగా మేజర్ డిస్ట్రిబ్యూటర్ కాలువలు ఆక్రమణకు గురై రియల్ ఎస్టేట్ వెంచర్లకు ప్రధాన రహదారులుగా మారుతున్నాయి. పూర్వ వైభవం లేక... నాగార్జున సాగర్ ఎడమ ప్రధాన కాలువగా పిలవబడే లాల్ బహుదార్ కాలువ తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, ఖమ్మం జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి కృష్ణాజిల్లాలోని చివరి ఆయకట్టు వరకు 179 కిలో మీటర్లు మేర ఉంది. ఈ ప్రధాన కాలువ కింద ఉమ్మడి కృష్ణాజిల్లాలో 4,04,760 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ప్రధాన కాలువ నుంచి మేజర్ డిస్ట్రిబ్యూటర్లు, మైనర్లు, సబ్ మైనర్ కాలువలు తిరువూరు నియోజకవర్గంలో 92 కిలోమీటర్ల మేర, మైలవరం నియోజకవర్గంలో 66.802 కిలోమీటర్లు, జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో 174 కిలోమీటర్లకు మేర విస్తరించి ఉన్నాయి. అయితే రాష్ట్ర పునర్విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాటా కింద రావాల్సిన సాగునీరు సక్రమంగా అండంలేదు. దీంతో పాటు జోన్–3లో ఉన్న చివరి ఆయకట్టుకు ఆసలు నీరే రాకపోవడంతో ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఉన్న జోన్–2,3 పరిధిలో కాలువలు దశాబ్దాలుగా నిరుపయోగంగా మారాయి. ఈ కాలువల నిర్వహణను సైతం ప్రభుత్వం గాలికొదిలేసింది. దీంతో నిరుపయోగంగా ఉన్న కాలువలను రియల్టర్లు, కాలువలను ఆనుకొని ఉన్న రైతులు ఆక్రమించడంతో అవి కనుమరుగువుతున్నాయి. భవిష్యత్తు ప్రశ్నార్థకమే... సాగర్ కాలువలు మాయమైపోతే భవిష్యత్తులో సాగునీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉంది. సాగర్ కాలువ జోన్–3 పరిధిలోని తిరువూరు, విస్సన్నపేట, గంపలగూడెం, ఎ.కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం, విజయవాడరూరల్, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, కంచిక చర్ల, వీరులపాడు మండలాల్లో ఎక్కువగా సాగర్ కాలువలు మాయమైపోతున్నాయి. ఒకవేళ చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తయితే జోన్–3 కింద ఉన్న ఈ మండలాల పరిధిలోని సాగుభూమికి ఈ కాలువల ద్వారానే సాగునీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ కాలువలు కనుమరుగైపోవడం వల్ల మళ్లీ కాలువలు తవ్వాల్సి వస్తే అదనంగా ఖర్చుతో పాటు నీటి సరఫరా మరింత ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది. భద్రాచలం నేషనల్ హైవేపై బైఠాయించి ఆందోళన చేస్తున్న రైతులు ఎ.కొండూరు: దీర్ఘకాలంగా రైతులు సాగుచేసుకుంటున్న భూములను ఎంఎస్ఎంఈలకు ఏకపక్షంగా ఇవ్వడాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. ఎ.కొండూరు మండలం రామచంద్రాపురంలో సోమవారం జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. మండలంలోని చీమలపాడు రెవెన్యూలోని రామచంద్రాపురం పంచాయతీ పరిధిలో ఉన్న 318 ఎకరాలకు పైగా రైతుల భూములను దొడ్డిదారిన ఎంఎస్ఎంఈలకు పంపిణీ చేయడాన్ని నిరసిస్తూ ఈ ఆందోళన చేపట్టారు. మూడు నెలలుగా తమకు ఎలాంటి సమాచారం లేకుండా, ఆన్లైన్లో భూములను తొలగిస్తూ, సర్వే నంబ ర్లను మార్చేస్తూ అధికారులు తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నారని రైతులు మండిపడ్డారు. రామ చంద్రాపురం సమీపంలోని రిజర్వు అటవీ భూమిలో చెట్టుపట్టాల కింద సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమ నుంచి బలవంతంగా భూములు లాక్కునేందుకు అధికారపార్టీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. రికార్డుల్లో అటవీ భూమిగా ఉన్నప్పటికీ ఎంఎస్ఎంఈలకు అక్రమంగా ఎలా కేటా యిస్తారని ప్రశ్నించారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో అటవీ భూమిని రెవెన్యూ భూమిగా మార్పు చేసి ఎంఎస్ఎంఈలకు కట్ట బెట్టేందుకు రికార్డులు తారుమారు చేశారని విమర్శించారు. హడావుడిగా శంకుస్థాపనకు ఏర్పాట్లు ఎంఎస్ఎంఈ సంస్థలకు భూములు పంపిణీ చేసి, ఆ సంస్థల ఏర్పాటుకు శంకుస్థాపన చేసేందుకు ఆదివారం సాయంత్రం అధికారులు హడావుడిగా ఏర్పాట్లు చేయడంతో రైతులు ఆందోళనకు దిగారు. అర్ధరాత్రినుంచే శంకుస్థాపన ఏర్పాట్లను అడ్డుకు న్నారు. అయినప్పటికీ భూములను పంపిణీ చేసేందుకు సోమవారం ఉదయం యత్నించడంతో భద్రాచలం జాతీయ రహదారిపైకి చేరుకొని బైఠాయించి దిగ్బంధించారు. దీంతో అధికారులు ఎంఎస్ఎంఈలకు భూకేటాయింపు వాయిదా వేశారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘ జిల్లా నాయకుడు ఆంజనేయులు, జిల్లా కౌలురైతు సంఘం ప్రధాన కార్యదర్శి జెట్టి వెంకటేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పి.ఆనంద రావు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు సీహెచ్. సుధాకర్, రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎ.అమ్మిరెడ్డి రైతులకు సంఘీభావంగా నిలిచారు.● మండుటెండ.. ప్రొటోకాల్ తంటా అసలే బెజవాడలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతతో ఎండ మంటలు పుట్టిస్తోంది. సోమవారం మిట్ట మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బందరు రోడ్డులో పోలీసులు ప్రొటోకాల్ పేరుతో ట్రాఫిక్ను నిలిపేశారు. సీఎం చంద్రబాబు ఓ కార్యక్రమంలో పాల్గొని వెళ్తుండగా.. ఆయన ప్రయాణిస్తున్న మార్గంతోపాటు రెండో వైపునా వాహనాలను ఆపేశారు. మండుటెండలో వాహనచోదకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. – కిషోర్, సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ 7జాయింట్ కలెక్టర్ ఇలక్కియసాగర్ కాలువలను కనుమరుగు కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. జోన్–3లో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న చివరి ఆయకట్టుకు కొన్నేళ్లుగా సాగర్ జలాలు రావడంలేదు. కాలువల నిర్వహణ కూడా సక్రమంగా లేదు. ఇప్పటికే పలు చోట్ల కాలువలు పూర్తిగా మాయమయ్యాయి. కాలువలు పూర్తిగా కనుమరుగైతే భవిష్యత్లో ఆయకట్టు ప్రమాదంలో పడుతుంది. – ఏలూరి శివాజీ, వైఎస్సార్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు, ఎన్టీఆర్ జిల్లా -
వాళ్లంతా నరకయాతన అనుభవిస్తున్నారు: పేర్ని నాని
విజయవాడ: చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. విజయవాడలో పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు వైద్యం కావాలంటే ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు నిర్వహించింది మెగా DSC కాదని, దగా DSC అని విమర్శించారు. రాజధాని పేరు చెప్పి రైతులను చంద్రబాబు నట్టేట ముంచారని ఆరోపించారు. భూములు ఇచ్చిన రైతుల ఫ్లాట్స్ ఎక్కడో ఈ రోజుకీ తెలియదని అన్నారు. పరిశ్రమలకు భూముల పేరుతో దగా చేస్తున్నారని చెప్పారు. రూపాయికి ఎకరం భూమి ఇస్తా అని లోకేశ్ అంటున్నారని, కనీసం భయం, బాధ్యత లేదని విమర్శించారు.‘‘ఓటు వేసిన, ఓటు వేయించిన టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వం వల్ల మోసపోయామని బాధ పడుతున్నారు. డబ్బులు ఇవ్వందే పని జరగడం లేదని టీడీపీకి మద్దతుగా నిలిచిన NRIలు నరకయాతన అనుభవిస్తున్నారు. మంగళగిరిలో వారం వారం దుకాణం అన్నారు.. దర్బార్ అన్నారు. ఎన్నికల ముందు జనసేన అధ్యక్షుడు అర్జీలు తీసుకున్నారు.. ఇప్పుడు ఎందుకు తీసుకోవడం లేదు. రెండేళ్లు నిండింది ఇంతకన్నా దివాలా కోరు ప్రభుత్వం ఎక్కడైనా ఉందా?సమాజానికి మంచి పౌరులను తయారు చేసే విద్యా వ్యవస్థలోనూ అవినీతి చేశారు. DSC కాంట్రాక్ట్ ఉద్యోగం చేసే వాడికి 1ST ర్యాంక్ వస్తుంది. DSC మెరిట్ లిస్ట్ ఎందుకు ప్రకటించడం లేదు. మెరిట్ లిస్ట్ ప్రకటించకుండా మెరిట్ పరీక్షలు నిర్వహించడం ఏంటి? మెగా DSC కాదు మెగా స్కాం ఇది. సంపద సృష్టిస్తాం.. సంపద మొత్తాన్ని ప్రజలకు పంచుతాం అన్నారు. టీడీపీ మానిఫెస్టో ఎక్కడ? ఏమైంది? సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్నారు. ఏది సూపర్ హిట్ ఎక్కడ ఉంది. చంద్రబాబు నాయుడు ఒకప్పుడూ PPP అనేవాడు ఇప్పుడేమో P4 అంటున్నాడు. PPP అయిపోయింది. ఇప్పుడు P4 కూడా అయిపోయింది అంటున్నాడు. బీపీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ లోన్లు ఎత్తేశారని తెగ గోల చేశారు.. మరి అధికారంలోకి రాగానే ఇచ్చారా? గుది బండగా అమరావతిని తయారు చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ అని డబ్బాలు కొట్టుకున్నారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు. కేంద్రం పెంచితే మాకు ఏ సంబంధమూ లేదని అంటున్నారు కింద, పైన ప్రభుత్వాలు ఎవరివి? జనాన్ని తాకట్టు పెట్టి అప్పులు చేశారు’’ అని తెలిపారు.ఎక్కువ మందిని కనాలా? పిల్లలను ఎక్కువ మందిని కనాలన్న అంశంపై ఎవరిది వాదన వాళ్లదని పేర్ని నాని అన్నారు. ‘‘విజన్ నాయకుడిగా చెప్పుకునే చంద్రబాబు ఎక్కువ మందిని కనాలని చెప్తున్నారు. చంద్రబాబు ఏ రోజూ నిజాలు చెప్పలేదు.. నిజం చెప్పినా అది అమలు అవ్వదు. 1993లో రామారావును గద్దె దింపిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అన్ని యూ టర్న్ లే. 2004లో మోదీ దుర్మార్గుడు అన్నారు. 2014లో మోదీ అచ్చాహై అన్నాడు. 2018లో మోదీకి భార్య లేదు కుటుంబం లేదు మోదీ టెర్రరిస్ట్ అన్నాడు. 2024 కు మోదీ ప్రపంచ నాయకుడు అంటూ చంద్రబాబు కీర్తిస్తున్నాడు. ఇప్పుడేమో నేను హిందూ, జగన్ నువ్వు క్రిస్టియన్ అంటాడు. చంద్రబాబు ఎన్నికల ముందు నేను మారాను అంటాడు, నమ్మండి అంటాడు. చంద్రబాబు ప్రకటనతో వాళ్ల అబ్బాయి, వాళ్ల కోడలే కన్విన్స్ అవ్వరు.. రాష్ట్ర ప్రజలు కన్విన్స్ అవుతారా? ఇరాన్, ఇజ్రాయిల్ వార్కు పిల్లలకు ఇచ్చే పాఠ్య పుస్తకాలకు ఏంటి సంబంధం? దివాలా కోరు దిక్కుమాలిన ప్రభుత్వం ఇది. లక్షలాది మంది పిల్లలను కంటే చికిత్స అందించడానికి ఆసుపత్రులు ఉన్నాయా? ఉప ముఖ్యమంత్రి ముక్కులో కణితి వస్తే హైదరాబాద్ వెళ్లి ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పిస్తున్న వారు ఒక్కరైనా ఉన్నారా?’’ అని నిలదీశారు. -
పర్యావరణానికి ముప్పు
గ్రీనరీని అభివృద్ధి చేయకండా నగరం కాంక్రిట్ జంగిల్లా ఉంటే, రానున్న రోజుల్లో పర్యావరణానికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇప్పుటికే అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో అనువైన ప్రాంతాల్లో మొక్కలు పెంచాలి. గ్రీన్ హైవేస్ పాలసీ ఆధారంగా జాతీయ రహదారుల వెంబడి ఎన్హెచ్ఏఐ మార్గదర్శకాలకు అనుగుణంగా కిలోమీటర్కు 333 మొక్కలను పెంచాల్సి ఉంది. మొక్కలు పెంచడంతో పక్షుల జాతులను కాపాడుకొని, జీవ వైవిధ్యానికి ముప్పలేకుండా చూడవచ్చు. – డాక్టర్ తుమ్మల శ్రీకుమార్, పర్యావరణ నిపుణులు -
అనుమానాస్పద స్థితిలో బిహార్ వాసి మృతి
చిట్టేల(వత్సవాయి): అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిచెందిన ఘటన ఆదివారం గ్రామ శివారులోని రైస్మిల్లు వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు బిహార్ రాష్ట్రానికి చెందిన రామ్కిషన్మహతి(42) నెల రోజుల క్రితం రైస్మిల్లులో హమాలీగా పని చేయడానికి వచ్చాడు. నెల రోజులు పనిచేసిన తరువాత వేరే చోట పనికి వెళ్లాడు. మరలా తిరిగి శనివారం సాయంత్రం మరలా చిట్టేల గ్రామంలో గతంలో పనిచేసిన రైస్మిల్లు వద్దకే వచ్చాడు. రాత్రి 9 గంటల సమయం వరకు తోటి కూలీలతో పని చేసి భోజనం కూడా చేశాడు. కాగా ఆదివారం సాయంత్రం రైస్మిల్లు సమీపంలోని చెట్టు కింద రామ్కిషన్మహతి మృతదేహాం ఉండడాన్ని తోటి కూలీలు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. జగ్గయ్యపేట ఎస్ఐ శంకర్నాయక్ ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్య పేట ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసునమోదు చేశారు. అయితే మృతదేహంపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. -
పెట్రోల్ ధరల విషయంలో చంద్రబాబు హామీ ఏమైంది
పెనుభారం ఎన్నికల ప్రచారంలో ఆకాశమే హద్దుగా చంద్రబాబు అబద్ధాలు చెప్పారు. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ రోజు ప్రజలపై అసలైన బాదుడును మొదలుపెట్టారు. రోజుకో రూపాయి చొప్పున పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజలపై పెనుభారం మోపుతున్నారు. ఎన్నికల ముందు చెప్పిందొకటి ఇప్పుడు చేస్తోందకటి. పెంచిన ధరలు తగ్గించాలి. – కామరాజ్హరీష్, బీసీ నేత పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల విషయంలో మోదీ మోసం సరే.. చంద్రబాబు హామీ ఏమైంది? వీటి ధరలను వరుసగా పెంచడం దేశ ప్రజలను మోసం చేయడమే. ప్రభుత్వం సీఎన్జీ ధరలను రెండుసార్లు, పెట్రోల్, డీజిల్ ధరలను మూడుసార్లు పెంచింది. ఎన్నికలకు ముందు పెట్రోల్ ధరల గురించి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్లలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించకపోగా వరుసగా పెంచుతున్నారు. రాష్ట్రం విచ్చలవిడిగా పన్నులు విధించడమే ధరల పెరుగుదలకు కారణం. అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయి. ధరలు తగ్గించాలి. –దాది శ్రీనివాసరావు, ఇఫ్టూ -
విద్యుదాఘాతంతో రామాలయం ట్రస్ట్ కార్యదర్శి మృతి
పెనమలూరు: పోరంకి శ్రీనగర్కాలనీలో ఉన్న శ్రీకోదండరామాలయం ట్రస్ట్ కార్యదర్శి చక్రహరి కనకరాజు(75) విద్యుదాఘాతానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 19న కనకరాజు ఇంటి వద్ద భవన నిర్మాణ కార్మికుడు వెంకటశివరామ్ ఇనుప రాడ్లను భవనం పై అంతస్తుకు తరలిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు ఇనుప రాడ్లు తగిలాయి. వెంటనే అతను రాడ్లు వదిలేయటంతో కింద ఉన్న కనకరాజుపై పడ్డాయి. ఈ ఘటనలో కనకరాజు విద్యుదాఘాతానికి గురై ఒళ్లు కాలి గాయపడ్డారు. ఆయనను వెంటనే స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సకై తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. కనకరాజు పోరంకి శ్రీనగర్కాలనీలో కోదండ రామాలయం నిర్మాణంలో విశేష కృషి చేశారు. అదే విధంగా రామాలయంలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆయనకు భార్య ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కనకరాజు మృతికి ట్రస్ట్ సభ్యులు, స్థానికులు ప్రగాఢ సంతాపం తెలిపి నివాళులర్పించారు. కంకిపాడు: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన సంఘటన మండలంలోని తెన్నేరు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాలు, పోలీసుల కథనం మేరకు.. కై కలూరు మండలం ఇంజరం ప్రాంతానికి చెందిన జొన్నాదుల మేరీ(33), వినోద్తో కలిసి తెన్నేరులో ఇటుక బట్టీల వద్ద పనిచేసేందుకు 10 రోజుల క్రితం వచ్చింది. ఆదివారం మేరీ ఇటుక బట్టీల వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హత్యా.. ఆత్మహత్యా.. మేరీ మృతిపై పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. మేరీ కలిసి ఉంటున్న వ్యక్తి వినోద్ ఎవరు, అతని నేపథ్యం ఏంటి? అనే కోణంతో పాటుగా ఆత్మహత్యకు పాల్పడిందా, లేదా హత్యకు గురైందా ?, అయితే అందుకు గల కారణాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కంకిపాడు సీఐ జె.మురళీకృష్ణ, ఎస్ఐ సందీప్ సమాచారం సేకరిస్తున్నారు. హనుమాన్జంక్షన్రూరల్: బాపులపాడు మండలం కోడూరుపాడులో నిర్వహిస్తున్న మట్టి అక్రమ తవ్వకాల్లో ఆదివారం ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామంలోని రాళ్లకుంట చెరువు నుంచి మట్టి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అతి వేగంతో నడపటంతో అదుపు తప్పి బోల్తా కొట్టింది. దీంతో ట్రాక్టర్ నడుపుతున్న డ్రైవర్ చందు వరుణ్(21) తీవ్రంగా గాయపడ్డాడు. ట్రాక్టర్ నుంచి కింద పడిన వరుణ్ కాలు విరగటంతో చికిత్స నిమిత్తం హుటాహుటినా విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇటీవలే ఇంజినీరింగ్ కోర్సు పూర్తి చేసుకున్న వరుణ్ తన తండ్రికి చేదోడువాదోడుగా ఉండేందుకు ట్రాక్టర్ నడుపుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. -
ప్రశాంతంగా ముగిసిన యూపీఎస్సీ పరీక్ష
వన్టౌన్(విజయవాడపశ్చిమ): యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. జిల్లాలోని విజయవాడలో 23 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. 10,119 మంది అభ్యర్థులను కేటాయించారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు, పరీక్ష అబ్జర్వర్లు కాటమనేని భాస్కర్, వాకాటి కరుణ నగరంలోని వివిధ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకూ, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకూ జరిగింది. ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకూ అభ్యర్థ్ధులను లోపలకు అనుమతించారు. 10,119 మంది అభ్యర్థులకు ఉదయం పేపర్–1కు 6,137 (60.65 శాతం) మంది, మధ్యాహ్నం పేపర్–2కు 6,073 (60.02 శాతం) మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. జేసీ ఇలక్కియపరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. అన్ని కేంద్రాల వద్ద వసతులు ఏర్పాటు చేశారు. సమయం దాటడంతో గేట్ వద్ద యువతి నిలిపివేత నిబంధనల ప్రకారం పరీక్ష ప్రారంభమయ్యే అరగంట ముందుగా గేట్లను మూసివేయాలని యూపీఎస్సీ ఆదేశించింది. ఆ ప్రకారం విజయవాడలోని కేబీఎన్ కళాశాల వద్ద అధికారులు సరిగ్గా తొమ్మిది గంటలకు గేట్ మూసివేశారు. కొద్ది సేపటికి గుంటూరుకు చెందిన యువతి గేట్ వద్దకు చేరుకుంది. నిబంధనల ప్రకారం గేట్ తీయడానికి లేదని అధికారులు ప్రకటించారు. దాంతో ఆ యువతి తీవ్ర నిరాశకు గురైంది. అయితే ఆమె గంట ముందుగానే అక్కడకు చేరుకొని కారులో చదువుకుంటూ ఉండిపోయిందని తెలిసింది. -
జాతీయ స్థాయి నాటకోత్సవాలు ప్రారంభం
గుడివాడటౌన్: కృష్ణా ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ గుడివాడ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న జాతీయ స్థాయి నాటకోత్సవాలు ఆదివారం ఎస్పీఎస్ హైస్కూల్ గ్రౌండ్స్లో ప్రారంభమయ్యాయి. 26వ తేదీ వరకు నాటకోత్సవాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. 24వ తేదీ మహాపురుషుడు మండలి, 25న కపిరాజు, సహన, 26వ తేదీ అమ్మచెక్కిన బొమ్మ, ఖడ్గ తిక్కన నాటికలు ప్రదర్శిస్తారన్నారు. ఏపీతోపాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణకు చెందిన ప్రముఖ నాటక సంస్థలు ఇందులో పాల్గొంటాయన్నారు. ప్రతిరోజూ సాయంత్రం 6.30 నుంచి ప్రదర్శనలు ప్రారంభమవుతాయని తెలిపారు. గుడివాడ టౌన్: రిజిస్ట్రార్ ఆఫ్ కో–ఆపరేటివ్ సొసైటీ కమిషనర్ బాబు.ఎ పాలనలో వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వ్యవసాయ పరపతి సహకార సంఘాల ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కృష్ణారావు అన్నారు. స్థానిక బస్స్టాండ్ సమీపంలోని కోడె ఫంక్షన్ హాలులో ఆదివారం అసోసియేషన్ జిల్లా సభ జరిగింది. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ విభజించు – పాలించు విధానం అమలు చేస్తూ ఆయన ఉద్యోగుల మధ్య, సహకార సంఘాల బ్యాంకులకు చెందిన అనేక మంది మేనేజర్లు, సూపర్ వైజర్ల మధ్య చిచ్చుపెడుతున్నారన్నారు. ఉద్యోగుల ఐక్యతను దెబ్బతీస్తున్నారని చెప్పారు. పాత కంప్యూటర్లను ఉద్యోగులకు ఇచ్చి డిజిటలైజేషన్ అంటూ ఇబ్బందులపాల్జేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఖాతాల్లో ఎక్కువ వడ్డీ చూపించి వారికి రుణాలు భారంగా ఉండేలా చేస్తున్నారన్నారు. దీంతో రైతులు సహకార సంఘాల ఉద్యోగస్తులను నమ్మే ప్రసక్తి లేదన్నారు. ప్రభుత్వం జీవో నంబర్ 322ను వెంటనే రద్దు చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రామాంజనేయులు, ఉపాధ్యక్షుడు హనుమంతరావు, జిల్లా కార్యదర్శి ఎస్.రమేష్బాబు, కోశాధికారి నాగరాజు, సుజాత తదితరులు పాల్గొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): బక్రీద్ సందర్భంగా జంతువుల అక్రమ రవాణా, వధ వంటి నేరాలను అరికట్టేందుకు పోలీస్శాఖ నుంచి నోడల్ అధికారిగా అదనపు డీసీపీ జి. రామకృష్ణను నియమించారు. ఈ మేరకు సీపీ రాజశేఖరబాబు ఆదేశాలు జారీ చేశారు. జంతు పరిరక్షణ చట్టాలను అమలు పరిచే దిశగా హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ తరఫున ఈ నియామకం చేసినట్లు తెలిపారు. నగరంలో ఎక్కడైనా జంతువులపై జరుగుతున్న నేరాలు, హింసపై నోడల్ అధికారి 94904 93192కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అన్ని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే ఉమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ విజయవాడ డివిజన్ ఆధ్వర్యాన ఆదివారం నగరంలోని రైల్వేస్టేషన్లో హైడ్రేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ వర్షా సోనాకియా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వలంటీర్లతో కలసి 1వ నంబర్ ప్లాట్ఫాంలో మజ్జిగ పంపిణి చేశారు. ఆమె మాట్లాడుతూ వేసవిలో ప్రయాణికులు, సిబ్బంది డీహెడ్రేషన్కు గురయ్యే అవకాశం ఉందన్నారు. వారి ఆరోగ్యం దృష్ట్యా రైళ్లలోని ప్రయాణికులు, సిబ్బందికి మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ సెక్రటరీ నిహారిక, జాయింట్ సెక్రటరీ జ్ఞానప్రసూన, విజయవాడ రైల్వే పీఆర్వో నుస్రత్ మండ్రుప్కర్ తదితరులు పాల్గొన్నారు. -
కార్తికేయుని ఆలయంలో భక్తుల రద్దీ
మోపిదేవి: స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు ఆదివారం రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచే క్యూలైలన్నీ భక్తులతో నిండిపోయాయి. ఆలయ ప్రాంగణం భక్తజనంతో కిటకిటలాడింది. నాగపుట్ట, నాగమల్లి వృక్షం, పొంగళశాల వద్ద భక్తుల రద్దీ ఏర్పడింది. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ అధికారులు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. హనుమాన్జంక్షన్రూరల్: చైన్నె – కోల్కతా జాతీయ రహదారిపై హనుమాన్జంక్షన్ శివారులోని షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఓ కారు ప్రమాదానికి గురైంది. సినిమా స్టంట్స్ను తలపించేలా కారు ఒక్కసారిగా భారీ శబ్దంతో గాల్లో పైకి లేచి, మూడు పల్టీలు కొట్టి రోడ్డుపై పడింది. ఏలూరు వైపు వెళ్తున్న కారు హైవే మధ్యలోని డివైడర్ను దాటుకుని అవతల వైపు రోడ్డుపై పడటంతో అటుగా వెళ్తున్న వాహనదారులు ఉలిక్కిపడ్డారు. కారు నుజ్జునుజ్జకావటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇంతటి ఘోర ప్రమాదం జరిగి కారు ధ్వంసమైనప్పటికీ డ్రైవర్కు స్వల్ప గాయాలు మినహా, ఆ కారులోని మిగిలిన ప్రయాణికులకు ఒక్క దెబ్బ కూడా తగలలేదు. పల్టీలు కొట్టిన కారులో నుంచి అందరూ సురక్షితంగా ప్రాణాలతో బయటకు రావటం ప్రమాద ఘటన చూసిన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. నెల్లూరు నుంచి ఏలూరు వెళ్తున్న ఈ కారు టైర్ పంక్చర్ కావటంతో ప్రమాదం జరిగింది. కర్ణాటకలో విజయవాడ టెక్కీ మృతి యశవంతపుర: సరదాగా వీకెండ్ గడుపుదామనుకున్న టెక్కీ మృతి చెందారు. నదిలో రబ్బరు బోటులో వేగంగా విహరించే సమయంలో అనూహ్యంగా విద్యుత్ షాక్ కొట్టి ఐటీ ఇంజినీర్ మృతి చెందిన ఘటన కర్ణాటకలో ఉత్తర కన్నడ జిల్లా జోయిడా తాలూకా గణేశగుడి వద్ద కాళీ నదిలో ఆదివారం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన మహేశ్ (27) మృతుడు. ఈయన బెంగళూరులో టెక్కీగా పనిచేసేవాడు. వీకెండ్ కావడంతో నలుగురు స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఓ రిసార్ట్లో బస చేసి, అక్కడే నదిలో రాఫ్టింగ్ చేయడానికి వెళ్లారు. నదిలో నుంచి పడవలోకి ఎక్కుతుండగా పక్కనే రిసార్టుకు చెందిన పెద్ద పంపుసెట్టు నుంచి విద్యుత్ నీటిలో ప్రసారమైంది. దీంతో మహేశ్కు షాక్ తగిలి నీట మునిగి మరణించాడు. మిగతా వారికి కూడా షాక్ తగిలింది కానీ అంత ప్రభావం చూపించలేదు. అతడి మృతదేహాన్ని సమీప ఆస్పత్రికి తరలించారు. రాఫ్టింగ్ చేసే ప్రాంతాలలో ఇలాంటి పంపుసెట్ల అమర్చవద్దని స్థానికులు హెచ్చరించినా రిసార్ట్ యాజమాన్యం పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు. -
వాన.. ఉపశమనం
లబ్బీపేట(విజయవాడతూర్పు): వారం రోజులుగా తీవ్రమైన ఎండలతో నిప్పుల కొలిమిలా మారిన నగరం ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో పాటు, ఈదురు గాలులు వీయడంతో ఒక్కసారిగా చల్లపడింది. అప్పటి వరకూ బయటకు రావడానికి సాహసించని నగర ప్రజలు ఒక్కసారిగా ఉపశమనం పొందారు. వారం రోజులుగా జిల్లాలో ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ వరకూ నమోదవుతున్నాయి. పడమటి గాలులు వీయడంతో పలువురు వడదెబ్బకు గురయ్యారు. కొందరు ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందగా, మరికొందరు మృత్యువాత పడ్డారు. రాత్రి 10 గంటల వరకూ వేడి గాలులు వీస్తూనే ఉండటంతో బయటకు వచ్చేందుకు ప్రజలు సాహసించలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం కురిసిన చిరుజల్లులతో వాతావరణం ఒక్కసారిగా చల్ల బడి ప్రజలకు ఊరట కలిగింది. అయితే ఈదురు గాలులతో పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగాయి. కస్తూరిభాయిపేటలో విద్యుత్ వైర్లు తెగడంతో కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. -
బండి తీయాలంటే భయం
గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): పెట్రోల్, డీజిల్ ధరల బాదుడుతో సామాన్యుడు బండి తీయా లంటే భయపడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ప్రజల ఆదాయం పెరగకున్నా ఇంధన ధరలు ౖపైపెకి ఎగబాగుతున్నాయి. కేవలం వారం రోజుల వ్యవధిలో మూడు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ రూ.114.40, లీటర్ డీజిల్ ధర రూ.102.13కు చేరింది. ధరల ప్రభావం నిత్యావసరాలు, వ్యవసాయ, రవాణా రంగంపై తీవ్రంగా ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో 186, కృష్ణాలో 175 బంకులు ఎన్టీఆర్ జిల్లాలో పలు కంపెనీల పరిధిలో 186 బంకులు పని చేస్తున్నాయి. వీటితో ప్రతి రోజూ 8 లక్షల లీటర్ల డీజిల్, 6 లక్షల లీటర్ల పెట్రోల్ సరఫరా అవుతోంది. కృష్ణా జిల్లాలో 175 బంకులు ఉన్నాయి. డీజిల్ 3.30 లక్షల లీటర్లు, పెట్రోలు 2.30 లక్షల లీటర్లు విక్రయిస్తున్నారు. బాదుడుకు తెర తీసింది ఈ నెల 15న ప్రభుత్వం తొలిసారిగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది. ఆ తర్వాత 19న మరోసారి పెంచింది. శనివారం ఉదయం ఇంకోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి బాదుడుకు తెరతీసింది. మూడు విడతల్లో లీటర్ పెట్రోల్పై రూ. 5.20, లీటర్ డీజిల్పై రూ. 5.05 వరకు ధర పెరిగింది. ఈ ధరల పెరుగుదల ఇంతటితో ఆగుతుందన్న నమ్మకం లేదని, రాబోయే రోజుల్లోనూ పెరిగే అవకాశం ఉందని బంక్ల యాజమాన్యం చెబుతోంది. నెలవారీ ఆదాయం పెరగడం లేదని, ఖర్చులు అధికమవుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. నెలకు సగటున 30 లీటర్ల పెట్రోల్ వినియోగించే సామాన్యుడిపై ధరల పెరుగుదల కారణంగా డైరెక్ట్గా రూ. 150 భారం పడుతుంది. మొత్తంగా ధరల పెంపు కారణంగా జిల్లాలో వాహనచోదకులపై ఏటా రూ. 250 కోట్ల పై చిలుకు అదనపు భారం పడుతుంది. ఆకాశన్నంటుతున్న నిత్యావసరాలు పెట్రోల్, డీజిల్ ధరలు రవాణా రంగంపై ప్రత్యక్షంగా ప్రభావం చూపడంతో నిత్యావసరల ధరలు పెరిగిపోయాయి. కూరగాయల ధరలు అధికమయ్యాయి. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతోంది. చిరు ఉద్యోగులు అవస్థ పడుతున్నారు. ఆదాయంలో అధిక భాగంగా గ్యాస్, నిత్యావసరాలు, కూరగాయలకే ఖర్చవుతుందని సామాన్యులు వాపోతున్నారు. ఆటో, మోటారు కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ పనులన్నీ యంత్రాలతోనే చేయాల్సిన పరిస్థితి. ప్రతి పనికి ట్రాక్టర్ వినియోగించాల్సి రావడం.. డీజిల్ ధర పెరగడంతో పొలాలు దుక్కులు, పంటల సాగుకు సిద్ధం చేసేందుకు అధికంగా పెట్టుబడి అవుతుందని ఆందోళన చెందుతున్నారు. గతేడాది గిట్టుబాటు ధరలు లేని పరిస్థితి చూశామని, తొలకరి ప్రారంభానికి ముందే డీజిల్ ధరలు పెంచితే వ్యవసాయం చేయడం ఎలా అని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ నెల 14వ తేదీ వరకు పెట్రోల్ ధర రూ. 109.21 డీజిల్ ధర రూ. 97.07 గా ఉంది తేదీ పెట్రోల్ డీజిల్ 15న 112.50 100.22 19న 113.45 101.17 23న 114.40 102.13 -
మొక్కలతో పర్యావరణానికి మేలు
మొక్కలు పర్యావరణాన్ని రక్షిస్తే, అది మనల్ని కాపాడుతుంది. ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచడం బాధ్యతగా గుర్తించాలి. నేను పదేళ్లుగా మొక్కలు పంపిణీ చేస్తున్నా. వర్షాకాలం ప్రారంభంలో తమ ఆస్పత్రికి వచ్చే ప్రతిరోగికి ఒక పండ్ల మొక్కను అందజేస్తా. అంతేకాదు గ్రామాలు, కాలనీల్లో మొక్కలు పెంచేందుకు ఉచితంగా అందజేస్తున్నా. పర్యావరణం బాగుంటేనే వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా జీవిస్తాం. – డాక్టర్ కె. వేణుగోపాలరెడ్డి, మధుమేహ నిపుణులు -
వృక్ష విలాపం!
ఒకప్పుడు కృష్ణమ్మ ఒడిలో పచ్చని చెట్లు, చల్లని గాలులతో కళకళలాడిన విజయవాడ నేడు కాంక్రీట్ జంగిల్లా మారిపోయింది. అభివృద్ధి, రోడ్ల విస్తరణ పేరుతో మహా వృక్షాలను కూల్చేస్తున్నారు. దీని ఫలితమే నగరంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. స్వచ్ఛమైన గాలి కరువై ఊపిరి పీల్చడం కష్టమవుతోంది. లబ్బీపేట(విజయవాడతూర్పు): పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉన్న విజయవాడ నేడు కాంక్రీట్ జంగిల్లా మారిపోయింది. ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ రణగొణ ధ్వనులే. జనాభా పెరుగుతున్న కొద్దీ పచ్చదనం మాయమవుతోంది. ఉన్న కొద్దిపాటి చెట్లు కూడా ఎక్కువగా స్థానికేతర జాతులే. ఈ సంఖ్య తగ్గే కొద్దీ నగరంలో జీవ వైవిధ్యంపై ప్రభావం పడుతుంది. పరోక్షంగా భూగర్భ జలాలు, వర్షపాతం తగ్గడం, అధిక ఉష్ణోగ్రతలకు కారణమవుతోందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. జనవాస ప్రాంతాల్లో కనీసం 20 శాతం మేర మొక్కలు ఉండాల్సి ఉండగా, నగరంలో అత్యంత తక్కువ నాలుగు శాతమే ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. నగరంలో ప్రతి వృక్ష విలాపంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. అరకొరగానే.. ఒకప్పుడు ఎంజీ రోడ్డు, కార్ల్మార్క్స్ రోడ్లతోపాటు, ఇతర ప్రాంతాల్లో రహదారులకు ఇరువైపులా పచ్చని చెట్లు ఉండేవి. ట్రాఫిక్ పెరగడంతో రోడ్ల విస్తరణ పేరుతో వాటిని కొట్టేశారు. నగరపాలక సంస్థ ఉద్యానశాఖ గతంలో నిర్వహించిన సర్వేలో కేవలం 22,407 చెట్లు మాత్రమే ఉన్నట్లు తేలాయి. చిన్నా చితకా కలిపి మరో 30 వేలు వరకూ ఉండొచ్చని అంచనా. నగరం 60 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంది. దీనికి తగ్గట్లుగా మొక్కలు లేవు. స్థానిక జాతులైన మర్రి, రావి, మేడి, వేప, మారేడు, వెలగ, గానుగ, తుమ్మ, జువ్వి, గంగరావి, నేరేడు, ఉసిరి, కుంకుడు, కొబ్బరి, తాటి, మద్ది వంటి వాటి సంఖ్య తక్కువగా ఉన్నట్లు తేలింది. ఎర్రతురాయి, పచ్చతురాయి, నిద్రగన్నేరు, జామాయిల్, అశోక, బురుగుడు వంటివి స్థానికేతర రకాల కిందకు వస్తాయి. దెబ్బతింటున్న జీవ వైవిధ్యం స్థానిక వృక్షజాతులతో చాలా ప్రయోజనాలు ఉన్నట్లు పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. వీటిపైనే పక్షులు ఎక్కువగా వాలతాయి. సీతాకోక చిలుకలు, తేనెటీగలు, తదితర వాటిని ఇవి ఆకర్షిస్తుంటాయి. వీటి సంఖ్య తగ్గేకొద్దీ జీవవైవిధ్యం దెబ్బతింటుంది. నగరంలో గతంలో కనిపించే ఎన్నో పక్షులు నేడు మచ్చుకై నా లేవు. పిచ్చుకల్లో ఐదు రకాలు ఉండేవని, వాటిలో ఒకటి మాత్రమే కనిపిస్తోందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. అవీ నగర శివారు ప్రాంతాల్లోనే అంటున్నారు. గుణదల కొండపై గతంలో రాబందులు ఉండేవంటున్నారు. ఒకప్పుడు నగరంలో విహ రించే నేత పక్షి, నేడు దివిసీమకే పరిమితమైంది. పక్షిజాతులు అంతరించి జీవవైవిధ్యం దెబ్బతింటున్నట్లు పర్యావరణ నిపుణులు చెపుతున్నారు. -
పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక
మధురానగర్(విజయవాడసెంట్రల్): రైల్వే మిక్స్డ్ హైస్కూల్ పూర్వ విద్యార్ధుల 25 వసంతాల సిల్వర్ జూబ్లీ వేడుకలు ఆదివారం సత్యనారాయణపురం రైల్వే కమ్యూనిటీ హాల్లో ఘనంగా జరిగాయి. దేశ విదేశాలలో వివిధ హోదాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, సేవా రంగాలలో స్థిరపడిన 2000–2001 బ్యాచ్ విద్యార్థులు ఒకే వేదికపై కలుసుకుని తమ అనుభవాలను పంచుకున్నారు. 25 సంవత్సరాల తరువాత కలుసుకోవటంతో ఒకింత ఆనందం, ఉద్వేగానికి లోనయ్యారు. విద్యార్థి దశలో కలిసి చదివిన స్నేహితులు పాత జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేసుకుంటూ ఆనందోత్సాహాల మధ్య పూర్వ విద్యార్థులు సందడి చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. విద్యార్థి దశలో ఏర్పడిన స్నేహబంధాలు జీవితాంతం నిలిచిపోతాయని పేర్కొన్నారు. కాలం మారినా అనుబంధాలు మారవని, ఇలాంటి కలయికలు మానసిక ఆనందాన్ని నూతన ఉత్తేజం కలిగిస్తాయని అభిప్రాయపడ్డారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను వేదికపై ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, ఆటపాటలు ఉత్సాహంగా జరిగాయి. 25 వసంతాల స్నేహబంధాన్ని గుర్తు చేసుకుంటూ సిల్వర్ జూబ్లీ కేక్ కట్ చేసి మిఠాయిలు, జ్ఞాపికలు పంపిణీ చేశారు. సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించిన పూర్వ విద్యార్థులు డాక్టర్ నోవా సందీప్, లక్ష్మీకాంత్, రాజేంద్ర, ధరన్, సాయి శివలను అభినందించారు. -
గుణదల కొండకు పోటెత్తిన భక్తజనం
గుణదల(విజయవాడ తూర్పు): వేసవి సెలవుల నేపథ్యంలో గుణదల మేరీమాత పుణ్యక్షేత్రానికి ఆదివారం భక్తజనం పోటెత్తారు. ఓ వైపు భానుడి ప్రతాపానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నా 43 డిగ్రీల ఎండ తీవ్రతను సైతం లెక్క చేయకుండా యాత్రికులు తమ భక్తి ప్రపత్తులను చాటుతున్నారు. క్రైస్తవ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న గుణదల మేరీమాత పుణ్యక్షేత్రానికి యాత్రికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు పుణ్యక్షేత్రానికి తరలివచ్చారు. మరియమాతను దర్శించుకుని తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. కాలినడకన కొండ శిఖరాగ్రానికి చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సాధారణ రోజుల్లో.. దేశంలో రెండో అతి పెద్ద క్రైస్తవ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన గుణదల ఆలయంలో ప్రతీ రోజు భక్తులు వేలాదిగా వస్తుంటారు. కొండ ఎగువన ఉన్న మరియమాతను దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటారు. కొబ్బరికాయలు కొట్టడం, చెట్లకు ఉయ్యాలలు కట్టడం, కొవ్వొత్తులు వెలిగించడం, పసిపిల్లలకు నామకరణాలు వంటి కార్యక్రమాలు ప్రతి నిత్యం జరుగుతుంటాయి. ఆలయానికి వచ్చిన భక్తుల కోసం పుణ్యక్షేత్ర గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తుంటారు. ప్రధానాలయంలో సైతం సమష్టి దివ్యబలి పూజలు, దివ్య సత్ప్రసాద ఆరాధనలు జరుగుతుంటాయి. పుణ్యక్షేత్రానికి వచ్చిన యాత్రికులంతా తప్పని సరిగా కొండ శిఖరాగ్రానికి చేరుకుని అక్కడ ఉన్న ఏసుక్రీస్తు శిలువను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. ప్రతి ఏటా ఫిబ్రవరి నెలలో జరిగే మేరీమాత ఉత్సవాలు దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. వేసవి సెలవుల కారణంగా.. విద్యార్థులకు పరీక్షలు పూర్తయిన నేపథ్యంలో ప్రస్తుతం సెలవులు ఉన్న కారణంగా సుదూర ప్రాంతాల నుంచీ యాత్రికులు గుణదల పుణ్యక్షేత్రానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఆదివారం సెలవు దినాల్లో భక్తుల సంఖ్య మరింత గణనీయంగా పెరుగుతుంది. సాధారణ రోజుల్లో, వాతావరణం అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో యాత్రికుల రాకపోకలు చెప్పుకోదగిన విధంగా ఉంటాయి. కానీ ఈ ఏడాది ఎండలు మండిపోతున్న క్రమంలో ప్రజలు వేసవి తాపానికి ఇబ్బందులు పడుతున్నారు. ఏసీ గదులకే పరిమితమై ఎండ తీవ్రత నుంచీ తమను తాము రక్షించుకుంటున్నారు. ఈ పరిస్థితులలో గుణదల మేరీమాత పుణ్యక్షేత్రానికి రికార్డు స్థాయిలో యాత్రికులు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మండుటెండల్లో సైతం గుణదల కొండకు భక్తులు పోటెత్తుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వహణ.. వేసవి తీవ్రతకు భక్తులు ఇబ్బందులు పడకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పుణ్యక్షేత్ర ప్రధానాలయ పరిసరాల్లో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. పుణ్యక్షేత్ర ప్రాంగణాలన్నింటితో పాటు కొండ ఎగువ ప్రాంతాలలో సైతం తాగునీటి వసతి కల్పించారు. ఎండ తీవ్రతకు అనారోగ్యానికి గురికాకుండా యాత్రికుల కోసం పుణ్యక్షేత్ర ఆవరణలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో రద్దీ మండుటెండను సైతం లెక్కచేయని భక్తులు కొండ శిఖరాగ్రాన ప్రత్యేక ప్రార్థనలు వేసవి సెలవుల కారణంగా గత నెల రోజులుగా గుణదల మేరీమాత ఫుణ్యక్షేత్రానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆదివారాలు, సెలవు రోజుల్లో భక్తుల సంఖ్య మరింతగా ఎక్కువగా ఉంది. ఎండలను దృష్టిలో ఉంచుకుని పుణ్యక్షేత్రానికి చేరుకునే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. తాగునీరు, చలువ పందిళ్లు సిద్ధం చేశాం. ఆలయానికి వచ్చిన భక్తుల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నాం. – యేలేటి విలియం జయరాజు, పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ -
ఏపీ హైకోర్టు పరీక్షకు 541 మంది హాజరు
పెడన: మండలంలోని నందమూరు శ్రీవాసవి ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో ఆదివారం ఏపీ హైకోర్టు పరీక్ష–2026 ప్రశాంతంగా జరిగినట్లు కళాశాల ప్రిన్సిపాల్, చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ బీఆర్ఎస్ రెడ్డి, అడ్మిన్ పి. అశోక్కుమార్ తెలిపారు. మూడు షిప్టులలో జరిగిన ఈ పరీక్షకు 540 మందికి 364 మంది హాజరవ్వగా 176 మంది ఆబ్సెంట్ అయ్యారన్నారు. ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు జరిగిన పరీక్షకు 180 మందికి 120 మంది హాజరవ్వగా 60 మంది రాలేదని తెలిపారు. మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు జరిగిన పరీక్షకు 180 మందికి 118 మంది హాజరవ్వగా 62 మంది ఆబ్సెంట్ అయ్యారని పేర్కొన్నారు. సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు జరిగిన పరీక్షకు 180 మందికి 126 మంది హాజరవ్వగా 54 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. మచిలీపట్నంఅర్బన్: స్థానిక వైజేఆర్ డీఎంఎస్ ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన ఏపీ హైకోర్టు సర్వీసెస్ పరీక్ష–2026 ప్రశాంతంగా జరిగిందని సెంటర్ హెడ్ ఎండీ నజీబ్ అహ్మద్ తెలిపారు. మొత్తం 300 మంది అభ్యర్థులు పరీక్షకు నమోదు చేసుకోగా, 177 మంది హాజరై పరీక్ష రాశారని, 123 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు. మొదటి షిప్ట్ ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు నిర్వహించగా, 100 మందికి 65 మంది హాజరై, 35 మంది గైర్హాజరయ్యారు. రెండో షిఫ్ట్లో 100 మందికి 52 మంది హాజరై, 48 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. మూడో షిఫ్ట్లో 100 మందికి 60 మంది హాజరై, 40 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. -
బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్ష
గుడివాడరూరల్: బైండోవర్లో ఉన్న వ్యక్తి మళ్లీ నేరానికి పాల్పడటంతో జైలుకు పంపిన సంఘటన జిల్లాలో తొలిసారి చోటు చేసుకుందని గుడివాడ డీఎస్పీ పాలా శ్రీనివాస్ తెలిపారు. స్థానిక వన్టౌన్ పోలీస్స్టేషన్లో సీఐ కొండపల్లి శ్రీనివాస్తో కలసి ఆదివారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ స్థానిక వాంబేకాలనీకి చెందిన గొల్లపల్లి పోతురాజు గతంలో పలు నేరాల్లో నిందితుడన్నారు. భవిష్యత్లో నేరాలకు పాల్పడకుండా సెక్షన్ 129(ఈ) బీఎన్ఎస్ఎస్ ప్రకారం ఏడాది పాటు బైండోవర్ చేశామని చెప్పారు. 444 మందిపై బైండోవర్ కేసులు.. పోతురాజు పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఈనెల 15న మళ్లీ నేరానికి పాల్పడటంతో కేసు నమోదు చేసి బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన విషయాన్ని మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్(తహసీల్దార్)కు నివేదించామన్నారు. ష్యూరిటీ, డబ్బు కట్టలేకపోవడంతో డిటెన్షన్ ఉత్తర్వుల జారీ కాగా వన్టౌన్ సీఐ కొండపల్లి నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి జైలుకు తరలించారని చెప్పారు. గుడివాడ సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటి వరకు 444 మంది నిందితులపై బైండోవర్ కేసులున్నాయన్నారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు ఆదేశాల మేరకు పట్టణ ప్రజల శాంతిభద్రలకు విఘాతం కలిగించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. బైండోవర్లో ఉన్న వ్యక్తులు మళ్లీ నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికి ఇది గుణపాఠమని, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు. ● ఈ నెల 13న కారు ప్రమాదంలో తల్లి గంగాభవాని మృతి ● శోకసంద్రంలో కుటుంబ సభ్యులు కిలేశపురం(ఇబ్రహీంపట్నం): కిలేశపురం గ్రామంలో ఈనెల 13న జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గుంటుపల్లి వెంకట జితేంద్ర (22) చికిత్స పొందుతూ విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. ఈనెల 13న తన తల్లి గుంటుపల్లి గంగాభవానీతో కలిసి ఇంటికొచ్చిన బంధువులకు శుభశకునం కోరుతూ కారుకు ఎదురొచ్చిన సమయంలో మరో కారు ప్రమాదంలో తల్లి ఆరోజే మృత్యువాత పడగా కుమారుడు వెంకట జితేంద్ర తీవ్రమైన గాయాలతో చికిత్స కోసం వైద్యశాలలో చేర్చారు. 10 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు తుదిశ్వాస విడిచాడు. పోస్ట్మార్టం నిర్వహించిన అనంతరం యువకుడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. 10 రోజుల వ్యవధిలో తల్లి కుమారుడిని కోల్పోయిన ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. బీటెక్ చదువుతున్న కుమారుడు ప్రయోజకుడై కుటుంబానికి బాసటగా నిలుస్తారనే తండ్రి రమేష్ ఆశించిన తరుణంలో భార్యతో పాటు కుమారుడిని కోల్పోవడంతో అతనిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. శోకసంద్రంలో నిండిన ఆ కుటుంబం గ్రామస్తులతో కలసి అశ్రునయనాలతో వెంకట జితేంద్ర మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. -
వడగాడ్పులకు ప్రజలు విలవిల
లబ్బీపేట(విజయవాడతూర్పు): వేసవి తీవ్రత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. వడడ్పులు ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. కూలీ పనులకు వెళ్లి కొందరు, యాచకులు మరికొందరు, అత్యవసర పనులపై తిరిగే ఇంకొందరు వడగాడ్పుల ప్రభావంతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు రోజుల్లో దాదాపు 28 మంది మృతికి వడదెబ్బ కారణంగా భావిస్తున్నారు. శనివారం విజయవాడ నగరంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురిని ప్రభుత్వాస్పత్రి క్యాజువాలిటీకి తీసుకురాగా, అప్పటికే వారు మృతి చెందినట్లు నిర్ధారించారు. విజయవాడ వన్టౌన్లో ఒకరు, సత్యనారాయణపురంలో ఒకరు, బస్టాండ్లో మరో ఇద్దరు, ఇబ్రహీంపట్నంలో ఒకరు, గంపలగూడెం మండలం గాదెవారిగూడెంలో ఒకరు, గంపలగూడెం పడమట దళితవాడలో ఒకరు మృతిచెందారు. శుక్రవారం సైతం వడ గాడ్పుమరో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20 మంది మృత్యువాత పడ్డారు. విజయవాడ నగరంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలను సైతం పోలీసులు మార్చురీకి తరలిస్తున్నారు. వీటిని పోస్టుమార్టం నివేదిక అనంతరమే వడదెబ్బ మరణాలుగా నిర్ధారిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. రెండు రోజుల్లో 30 మంది వరకూ... ఉమ్మడి జిల్లాలో రెండు రోజుల్లో 30 మంది వరకూ వడదెబ్బతో మృత్యువాడ పడ్డారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనే తొమ్మిది మంది ఉన్నారు. వారిలో సత్యనారాణపురం స్టేషన్ పరిధిలో శనివారం ఒకరు మృతి చెందగా, శుక్రవారం సీతారామపురం, కస్తూరి భాయిపేట, రాఘవయ్యపార్కు, బీసెంటు రోడ్డు, ఎల్ఐసీ భవనం, సింగ్నగర్ తదితర ప్రాంతాల్లో ఎనిమిది మంది మృతి చెందారు. ఇబ్రహీంపట్నం మండలం కేతన కొండలో 32 ఏళ్ల పఠాన్ నాగుల్మీరా కూలి పనులకు వెళ్లి వడదెబ్బకు గురై మృత్యువాడ పడ్డాడు. విజయవాడ తూర్పులో రెండు రోజుల్లో గుణదలలో 44 ఏళ్ల శరత్బాబుతో పాటు, ప్రభుత్వాస్పత్రి వద్ద 60 ఏళ్ల వృద్ధురాలు మృత్యువాత పడింది. వారితో పాటు శనివారం ప్రభుత్వాస్పత్రి క్యాజువాలిటీకి వచ్చిన మరో ముగ్గురు మృతిచెందారని వైద్యులు నిర్ధారించారు. విజయవాడ పశ్చిమలో శుక్రవారం ముగ్గురు, శనివారం ఒకరు మృత్యువాత పడ్డారు. కృష్ణాజిల్లాలో పెనమలూరు, పెడన, గుడివాడ, వేకనూరు, తోట్లవల్లూరు, మోపిదేవిలో ఒక్కో మరణం నమోదైంది. ఇలా మొత్తం ఉమ్మడి కృష్ణాలో ఇప్పటి వరకూ 30 మంది వరకూ ఎండల తీవ్రతతో మరణించారు. ఉమ్మడి జిల్లాలో శనివారం కూడా వడగాడ్పులు కొనసాగాయి. ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా నందిగామలో 44.6 డిగ్రీలు, కంచికచర్లలో 44.3, రెడ్డిగూడెంలో 43.6, జగ్గయ్యపేటలో 43.7, విజయ వాడలో 43.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో సైతం 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. విజయవాడ నగరంలో మధ్యాహ్నం నుంచి వడ గాడ్పుల ప్రభావం పెరిగింది. దీంతో ప్రజలు బయటకు వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
కాలువల్లో అవినీటి ప్రవాహం
పనులు చేయకుండానే నిధులు మింగేసేందుకు సన్నాహాలు సాక్షి ప్రతినిధి, విజయవాడ: సాగు నీటితో కళకళలాడాల్సిన పంటకాలువల్లో అవి‘నీటి’ ప్రవాహం జోరందుకుంది. ఫలితంగా వచ్చే ఖరీఫ్ సీజన్లో శివారు పొలా లకు నీటి తడులు అందక ‘పానీ’పట్టు యుద్ధాలు తప్పేలా లేవు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పంట కాలువలు, ఇరిగేషన్ డ్రెయిన్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. కృష్ణా డెల్టా పరిధిలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కృష్ణా తూర్పు డెల్టా పరిధిలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించి 5.62 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి. కాలువలు అన్నీ పూడిక, గుర్రపు డెక్క, తూటి కాడ, పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. పూడిక, గుర్రపు డెక్క, తూటికాడ తొలగించడంతోపాటు అక్కడక్కడా కాంక్రీట్ పనులు, లాకుల షట్టర్లకు మరమ్మతులు చేయాల్సింది. ఇటీవల కాలువల్లో 833 పనులు చేపట్టేందుకు రూ.37.9 కోట్లు మంజూరు చేశారు. పనుల కేటాయింపునకు స్థానిక నియోజకవర్గ ప్రజాప్రతినిధులు ముందుగానే 30 శాతం నిధులు కమీషన్ కింద ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. మే నెలలోనే సాగు నీరు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాలువలకు సాగునీరు విడుదల చేస్తే మరమ్మతులు చేయకుండానే కాంట్రాక్టర్లు నిధులు మింగేసే అవకాశం ఉండటంతో పచ్చనేతలు కమీషన్ల కోసం పట్టు పడుతున్నారు. ఫలితంగా కాలువల నిర్వహణ కోసం కేటాయించిన పనుల్లో అవినీతి ఊట ప్రవహిస్తోంది. గత ఏడాదీ ఇదే తంతు... గత ఏడాది కాలువల నిర్వహణ పనులను సకాలంలో మంజూరు చేయలేదు. కాలువలకు సాగు నీరు విడుదల చేసిన తరువాత రూ.25 కోట్ల విలువైన 666 పనులను మంజూరు చేశారు. ఎక్కువ శాతం పనులను తూతూ మంత్రంగానే జరిగాయి. ఫలితంగా సాగునీరు పుష్కలంగా ఉన్నా చివరి ఆయకట్టు రైతులు నీరు అందక ఇబ్బందిపడ్డారు. గత ఏడాది జూన్ 18 తేదీన కాలువులకు సాగునీరు వదలగా, జూలై చివరి వరకు మరమ్మతులు జరుగుతూనే ఉన్నాయి. కాలువల్లో నీటి ప్రవాహంతో చాలా వరకు తూటి కాడ దిగువకు కొట్టుకుపో కాంట్రాక్టర్లకు తొలగించినట్టు బిల్లులు చేసుకున్నారు. దీంతో పెడన, అవనిగడ్డ, నియోజకవర్గాలో శివారు రైతులకు సాగు నీరు అందలేదు. కోడూరు మండలంలోని బసవానిపాలెం, ఊటగుండం, రామకృష్ణాపురం గ్రామాలకు వెళ్లే 14వ నంబర్ కాలువ డెక్క, తూటుకాడతో అధ్వానంగా మారింది. స్వతంత్య్రపురం, ఉల్లిపాలెం, హరిపురం గ్రామాలకు సాగు, తాగునీరు అందించే 11వ నంబర్ కాలువ మొత్తం గుర్రపు డెక్కతో నిండిపోయింది. పులిగడ్డ నుంచి దివిసీమకు వచ్చే అవనిగడ్డ ప్రధాన పంట కాలువ, అవనిగడ్డ నుంచి దిగువకు సాగు నీందించే కోడూరు, నాగాయలంక ప్రధాన పంట కాలువల్లో రెండేళ్ల నుంచి పూడికతీత పనులు చేయలేదు. దీంతో ఈ కాలువలు అన్నీ పూడికతో మేట వేశాయి. ఫలితంగా పులిగడ్డ ఎగువన ప్రధాన పంటకాలువ పొంగిపొర్లుతున్నా దిగువ పొలాలకు సాగు నీరు అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇరిగేషన్ డ్రెయిన్ల దుస్థితి ఇదీ.. చంద్రయ్య, కొమరవోలు డ్రెయిన్ల మరమ్మతులకు గత ఏడాది డిసెంబర్లోనే రూ.33 కోట్లు మంజూరైనా, స్థానిక ప్రజాప్రతినిధులు కమీషన్ల కోసం కాంట్రాక్టర్లపై ఒత్తిడి తేవడంతో పనులు ముందుకు సాగలేదు. ఏప్రిల్ 11వ తేదీన కొమరవోలు డ్రెయిన్ మరమ్మతులను రూ.7.72 కోట్లతో ఇద్దరు ప్రజాప్రతినిధులు ప్రారంభించినా, రెండు రోజులపాటు మాత్రమే తూతూ మంత్రంగా ఈ పనులు జరిగాయి. ఈ నిధులను తినేసేందుకు రంగం సిద్ధమైందని విమర్శలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. దీంతో డ్రెయిన్ల పరిస్థితి అధ్వానంగా మారింది. మరో వైపు బుడమేరుకు పడిన గండ్లను ఇప్పటికీ పూడ్చలేదు. ప్రధాన పంట కాలువల్లో పూడిక మేట వేసి చాలా చోట్ల మట్టిదిబ్బలుగా దర్శనమిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా పలుచోట్ల ప్రధాన పంట కాలువల్లో గుర్రపుడెక్క, తూడు పెరిగిపోయాయి. వీటిని తొలగించకుండా, పూడిక తీయకుండా కాలువలకు సాగునీరు వదిలినా పంట పొలాలకు సక్రమంగా చేరే పరిస్థితి లేదు. – బీమా బాబూరావు, రైతు, తిప్పపాలెం, నాగాయలంక మండలం దివిసీమలోని నాగాయలంక, కోడూరు, మంచిలీపట్నం, కృత్తివెన్ను మండలాల్లో దెబ్బతిన్న అవుట్ఫాల్ స్లూయిస్లను ఆధునికీకరిస్తామని డెప్యూటీ సీఎం పవన్కల్యాణ్ గత ఏడాది అక్టోబర్లో హామీ ఇచ్చారు. వీటికి సంబంధించి రూ.50 కోట్లతో డీపీఆర్ పంపినా నిధులు మంజూరు కాలేదు. దీంతో ఈ ఏడాదీ అవుట్ఫాల్ స్లూయిస్లకు మరమ్మతులు, ఆధునికీకరణ పనులు లేనట్టేనని రైతులు వాపోతున్నారు. కొద్దిపాటి వర్షాలు పడినా 1.30 లక్షల ఎకరాలు ముంపు బారిన పడతాయని ఆందోళన చెందుతున్నారు. వేసవిలోనే పంట కాలువలకు మరమ్మతులు చేపట్టాలి. వర్షాలు పడితే పనులు సక్రమంగా జరగవు. పంట కాలువలు, ఇరిగేషన్ డ్రెయిన్లు, పంట బోదెల్లో పూడిక తీతపనులు చేపట్టాలి. ఈ పనులను సక్రమంగా నిర్వహిస్తేనే పంట పొలాలలకు సాగునీరు సక్రమంగా అందుతుంది. త్వరిత గతిన పనులు పూర్తి చేసి ఖరీఫ్ సీజన్కు సాగునీరు సక్రమంగా అందేలాచూడాలి – కె.ఎస్.ఆర్.దాసు, రైతు జమీదగ్గుమిల్లి -
విద్యా కానుక కిట్లు అందించలేరా?
వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులపై చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. గుణదలలోని పార్టీ కార్యాలయంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. విద్యార్థులకు ఏటా విద్యా సంవత్సర ప్రారంభంలో అందించే విద్యా కానుక కిట్ను ఈ సారి సమయానికి ఇవ్వలేమని ప్రభుత్వం ప్రకటించడం దారుణ మన్నారు. యూనిఫామ్, షూస్, బ్యాగులు ఇవ్వలేమని ప్రభుత్వం చేతులెత్తేయడం ఏమిటని ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని విమర్శించారు. జూన్ 12వ తేదీన పాఠశాలలు ప్రారంభం కానున్నాయని, ఆలోగా విద్యా కానుక అందించలేమని సమగ్ర శిక్ష అధికారులు ప్రకటించడం బాధాకర మని పేర్కొన్నారు. పాఠ్యపుస్తకాల పంపిణీపై కూడా స్పష్టత లేకపోవడం ప్రభుత్వ వైఫల్యాన్ని తెలియజేస్తోందన్నారు. పుస్తకాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామనే స్థాయికి ప్రభుత్వం దిగజారడం దౌర్భాగ్యకరమని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ పాలనలో పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజే విద్యా కానుక కిట్లు విద్యార్థుల చేతికి అందే వని గుర్తుచేశారు. కూటమి రెండేళ్ల పాలనలో సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రభుత్వ విద్యావ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. రెండేళ్లుగా మనబడి నాడు–నేడు పనులను నిలిపివేసి పాఠశాలలను నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు ప్రభుత్వం, ఇప్పుడు విద్యార్థుల విద్యా కానుక పథకానికే ఎగనామం పెట్టిందని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తో ఆటలాడకుండా వెంటనే విద్యా కానుక కిట్, పాఠ్యపుస్తకాలు పూర్తి స్థాయిలో అందించాలని ప్రభుత్వాన్ని దేవినేని డిమాండ్ చేశారు. -
పోలీసుల అదుపులో గంజాయి విక్రయిస్తున్న యువకులు
జి.కొండూరు: గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను జి.కొండూరు పోలీసులు శనివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు మండల పరిధి వెలగలేరు గ్రామానికి చెందిన బొమ్మనబోయిన శివాజీ, ఏలూరు జిల్లా ఆగిరిపల్లికి చెందిన రాణిమేకల వెంకటేశ్వర్లు, అటుపాక సుబ్రహ్మణ్య చారిలు ముగ్గురు ఒక ముఠాగా ఏర్పడ్డారు. గంజాయి తీసుకొని వచ్చి విక్రయించేందుకు చెవుటూరు గ్రామ శివారులో శనివారం సాయంత్రం వేచి ఉన్నారు. ముందస్తు సమాచారంతో జి.కొండూరు ఎస్ఐ–2 గిరిజామణి తన సిబ్బందితో వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరకేజీ గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. -
చోరీ కేసులో ముగ్గురు నిందితులు అరెస్టు
హనుమాన్జంక్షన్ రూరల్: స్థానిక తారకరామ కాలనీలో ఈ నెల 18వ తేదీన జరిగిన చోరీ కేసును హనుమాన్జంక్షన్ పోలీసులు నాలుగు రోజుల వ్యవధిలోనే ఛేదించారు. చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయటంతో పాటు 173 గ్రాముల బంగారు ఆభరణాలు, మూడు ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను శనివారం హనుమాన్జంక్షన్ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో గన్నవరం ఇన్చార్జి డీఎస్పీ పి.శ్రీనివాస్ మీడియాకు వివరించారు. ఈ నెల 18వ తేదీన తారకరామ కాలనీకి చెందిన వడ్లమూడి ఆంజనేయులు ఇంటికి తాళం వేసి పొరుగూరు వెళ్లారు. దుండగులు ఇంటి తాళాలను ధ్వంసం చేసి బీరువాలో భద్రపర్చిన 169 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరించినట్టు బాధితుడు ఆంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. సంఘటనాస్థలంలో నిందితుల వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించటంతో పాటుగా దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజ్, సాంకేతిక అంశాల ఆధారంగా విజయవాడలోని ఆంజనేయవాగు సెంటర్కు చెందిన పాత నేరస్తులు వేములవాడ సురేంద్ర, సురా అర్జున్, కె.వాసు చోరీకి పాల్పడినట్లుగా గుర్తించారు. వీరి నుంచి మొత్తం 173 గ్రాముల బంగారు ఆభరణాలు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు దుండగులపై కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఐదు దొంగతనం కేసులు, ప్రకాశం జిల్లాలో మరో కేసు నమోదయినట్లుగా డీఎస్పీ తెలిపారు. కేసు ఛేదించిన సీఐ ఎల్.రమణ, ఎస్ఐ ఎం.శ్రీనివాస్, కానిస్టేబుళ్లు సోమ వెంకటేష్, మోహన్, కె.సంపత్, నబీలను డీఎస్పీ శ్రీనివాస్ అభినందించారు. బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనాలు స్వాధీనం -
రేపటి నుంచి ఆపరేషన్ క్లీన్ స్వీప్
చిలకలపూడి(మచిలీపట్నం): అన్ని మున్సిపాలిటీలలో ఈ నెల 25వ తేదీ నుంచి ఆపరేషన్ క్లీన్స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించి ఎక్కడా చెత్తా చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్సు హాలులో శనివారం మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నాలుగు వారా ల్లో వారానికి ఒక ఉద్దేశంతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ పేరుతో అన్ని పురపాలక సంఘాల్లో చేపట్టాలన్నారు. ప్రభు త్వం జారీ చేసిన మార్గదర్శకాలు ప్రకారం కచ్చితంగా అమలు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఎం ఫణిధూర్జిటి, కమిషనర్లు బాపిరాజు, మనోహర్, కొండయ్య, సుభాష్చంద్రబోస్ తదితరులున్నారు. -
కేంద్ర పథకాలను కచ్చితంగా అమలు చేయాలి
చిలకలపూడి(మచిలీపట్నం): కేంద్ర ప్రభుత్వ పథకాలను కృష్ణా జిల్లాలో కచ్చితంగా అమలు చేయాలని మచిలీపట్నం ఎంపీ వల్లభునేని బాలశౌరి అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశం హాలులో శనివారం జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్, వెనిగండ్ల రాము, కలెక్టర్ డి.కె.బాలాజీతో కలిసి కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు పురోగతిని ఎంపీ సమీక్షించారు. ఎంపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించి స్వయం ఉపాధి పెంపొందించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో శ్మశాన వాటికల నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని తీర ప్రాంతాల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. కౌలు రైతులకు పంట రుణాలు ఇచ్చేలా బ్యాంకర్లు ముందుకు రావాలన్నారు. మునిసిపల్ కమిషనర్పై ఎంపీ ఆగ్రహం ఈ సమావేశంలో పాల్గొన్న మచిలీపట్నం మునిసిపల్ కమిషనర్ బాపిరాజుపై ఎంపీ ఆగ్రహం వ్యక్తంచేశారు. మచిలీపట్నంలోని కొబ్బరితోటలో జనసేన కార్యకర్త ఇంటిని కూల్చివేసిన ఘటనపై బాపిరాజును నిలదీశారు. ‘ఏ అధికారంతో ఇంటిని కూల్చారు? హైకోర్టు లేదా మీ పై ఉన్నతాధికారులు ఆదేశాలు ఏమైనా ఇచ్చారా? ఉంటే చూపండి. అది ప్రభుత్వ, మున్సిపాలిటీకి సంబంధించి భూమి కాదు, ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న తగదా వల్ల ఎటువంటి సంబంధం లేని మీరు ఎందుకు ఆ ఇంటిని కూల్చారు?’ అంటూ ప్రశ్నించినా మునిసిపల్ కమిషనర్ మాత్రం తలదించుకుని మౌనంగా ఉండిపోయారు. ఈ సమావేశంలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, జెడ్పీ సీఈఓ జె.అరుణ, డ్వామా పీడీ ఎన్.వి.శివప్రసాద్, డీఎంహెచ్ఓ ఆర్.యుగంధర్, జిల్లా పశుసంవర్ధక శాఖా ధికారి చిన్న నరసింహాలు, ఎల్డీఎం రవీంద్రారెడ్డి, పంచా యతీ రాజ్ ఎస్ఈ రమణారావు తదితరులు పాల్గొన్నారు. -
బడి ఈడు పిల్లలు పాఠశాలల్లోనే ఉండాలి
వత్సవాయి: బడి ఈడు పిల్లలందరూ తప్పని సరిగా పాఠశాలల్లోనే ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. మండలంలోని భీమవరం, మక్కపేట గ్రామాల్లో ఆయన శని వారం పర్యటించారు. ‘బడి పిలుస్తోంది’లో భాగంగా విద్యార్థుల ఇళ్లకు కలెక్టర్ స్వయంగా వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను వివరించారు. మండలంలో 563 మంది బడి బయట ఉన్న చిన్నారులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఆ చిన్నారులను పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలల్లో జరుగుతున్న పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు. అనంతరం లింగాలలో ఇటీవల అభివృద్ధిచేసిన డొంకరోడ్లను ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘరాం, మాజీ ఎమ్మెల్సీ టి.డి.జనార్దన్తో కలిసి ప్రారంభించారు. డీఈఓ చంద్రకళ, మండల ప్రత్యేకాధికారి విజయకుమారి, ఎంపీడీఓ ఎన్.రాంబాబు, ఎంఈఓ ఎల్.నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్నకు శ్రీకారం పటమట(విజయవాడతూర్పు): రాష్ట్రాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మునిసిపల్ వ్యవహారాల శాఖ నాలుగు వారాల ప్రత్యేక స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేస్తోందని ఆ శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. విజయవాడ సాంబమూర్తి రోడ్డులోని కూర్మయ్య బ్రిడ్జి వద్ద శనివారం ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని మంత్రి నారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, మునిసిపల్ వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ బి.అనిల్ కుమార్రెడ్డి, మునిసిపల్ ధ్యానచంద్ర, ఆపరేషన్ క్లీన్ స్వీప్ బ్రాండ్ అంబాసిడర్ డాక్టర్ జి.సమరం తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ దృష్ట్యా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఏపీసీపీడీసీఎల్ ప్రాజెక్ట్స్ హెచ్ ఆర్ డైరెక్టర్ టి.వి.ఎస్.ఎన్.మూర్తి సూచించారు. శనివారం 132 కేవీ విజయవాడ ఆటోనగర్ సబ్స్టేషన్ను ఏపీసీపీడీసీఎల్ ప్రాజెక్ట్స్ – హెచ్ఆర్ డైరెక్టర్ మూర్తి సందర్శించి లోడ్స్ మానిటరింగ్ నిర్వహించారు. సబ్స్టేషన్లోని ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్లు, లోడ్ పంపిణీ పరిస్థితులను పరిశీలించి, ఓవర్లోడ్ సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ఇంజినీర్లు , విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యవర్గం పెనమలూరు: కృష్ణాజిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ (కేడీఎఫ్ఏ)కార్యవర్గం ఎన్నిక కానూరులో శనివారం జరిగింది. తొలుత జనరల్బాడీ సమావేశం నిర్వహించారు. ఎన్నికల అధికారిగా హైకోర్టు న్యాయవాది స్టాలిన్, ఒలంపిక్ అసోసియేషన్ పరిశీలకుడు మహేష్, ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ పరిశీలకుడు జి.పవన్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రకియ నిర్వహించారు. అధ్యక్షుడిగా జి.అనిల్కుమార్, ఉపాధ్యక్షులుగా ఆర్.సురేష్బాబు, మక్కె సురేష్, జి.రాధమ్మ, కోశాధికారిగా నరహర వెంకట రవికుమార్, సభ్యులుగా బ్యూలారాణి, కన్యాకుమారి, తిరుపతమ్మ, కె.మణిబాబు, మస్తాన్, కె.రాజా, రాజు, డి.రాజేష్, మధు, సైపుల్లా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఏపీఎఫ్ఏ ట్రెజరర్ విజయ్, పల్నాడు జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, కోనసీమ జిల్లా అధ్యక్షుడు నీలాద్రి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు శేషగిరి తదితరులు పాల్గొన్నారు. -
మండుతున్న ఎండలు.. ఆగుతున్న గుండెలు
సాక్షి నెట్వర్క్: జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. వడగాడ్పుల ధాటికి జనం గుండెలు ఆగిపోతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో శనివారం పది మంది మత్యువాత పడ్డారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని కేతనకొండ గ్రామానికి చెందిన పఠాన్ నాగుల్ మీరా (32) తన సోదరుల భాగస్వామ్యంతో చికెన్ షాపు నిర్వహిస్తాడు. షాపులో శుక్రవారం అంతా పనిచేశాడు. సాయంత్రానికి తీవ్రమైన జ్వరం రావడంతో జూపూడిలోని వైద్యశాలలో చేర్చించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. గంపలగూడెం మండలం గాదెవారిగూడెం గ్రామానికి చెందిన పసుపులేటి నరసింహారావు(64) శనివారం తన దిన చర్యలో భాగంగా గ్రామంలో తన సమకాలికులతో గడిపి 11 గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. దడగా ఉందంటూ కుటుంబసభ్యులను మజ్జిగ అడిగి తాగాడు. మంచంపై పడుకున్న కొద్దిసేపటికి పరిస్థితి విషమించడంతో ఆర్ఎంపీ వైద్యుడ్ని రప్పించేలోగా మృతి చెందాడు. మృతునికి భార్య, ముగ్గురు కుమారులున్నారు. గంపలగూడెం పడమట దళివాడకు చెందిన కోట ప్రవీణ్(35) శనివారం ఉదయం మామిడి కోతకని కుటుంబసభ్యులకు చెప్పి వెళ్లాడు. మధ్యాహ్నం మూడున్నర సమయంలో పంచాయతీ కార్యాలయం సమీపాన గల మంచినీటి ట్యాప్ వద్ద పడిపోయి ఉన్నట్లు స్థానికులు గమనించారు. సమాచారం తెలిసి కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. కొటికలపూడిలో దివ్యాంగురాలు.. ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి గ్రామానికి చెందిన దివ్యాంగురాలు మేకా నిర్మల (55) భర్త లేకపోవడంతో కూలి పనులు చేసుకుంటూ తన కుమారుడి వద్ద ఉంటోంది. ఇటీవల ఆరోగ్యం సహకరించక ఇంటి వద్దనే ఉంటోంది. శనివారం మధ్యాహ్నం ఊపిరాడటం లేదని కుటుంబ సభ్యులకు చెప్పింది. జ్వరం కూడా ఉండటంతో ఇబ్రహీంపట్నంలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందింది. వడదెబ్బతోనే మరణించినట్లు బంధువులు తెలిపారు. కూర్చున్న చోటే కుప్పకూలిన యాచకులు... విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఇద్దరు గుర్తుతెలియని యాచకులు వడదెబ్బతో మృతి చెందారు. సేకరించిన వివరాల ప్రకారం.. గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు బస్టాండ్ పరిసరాలలో యాచన చేసి జీవనం సాగిస్తున్నారు. వీరు శనివారం సాయంత్రం 43, 44 ప్లాట్ఫామ్ వద్ద వడదెబ్బ వల్ల కూర్చున్న చోటే కుప్ప కూలిపోయారు. వీరి వయస్సు ఒకరికి 55, మరొకరి 60 సంవత్సరాలు ఉండవచ్చని భావిస్తున్నారు. కృష్ణలంక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆధారాలు లభించకపోవడంతో మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కంచికచర్ల మండలంలో మరో వృద్ధురాలు.. కీసరలో ఉంటున్న ఓ వృద్ధురాలు శనివారం వడదెబ్బకు మృతి చెందింది. వీరులపాడు మండలం నందలూరు గ్రామానికి చెందిన ఎన్ రాజమ్మ(62) కొంతకాలంగా కంచికచర్ల మండలంలోని కీసర ప్రధాన సెంటర్ వద్ద ఉంటోంది. శుక్రవారం ఆమె ఎండవేడికి తట్టుకోలేక ఓ టైలర్ షాపు వద్ద కుప్ప కూలిపోయింది. గమనించిన ప్రవేటు ఎలక్ట్రీషియన్ శ్రీకాంత్ 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. 108 అంబులెన్స్ వాహన సిబ్బంది వచ్చి ఆమెను పరీక్షించి ప్రథమ చికిత్స అందజేశారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ మృతి చెందింది. తారాపేటలో గుర్తుతెలియని వ్యక్తి... విజయవాడ వన్టౌన్ తారాపేట రాజకుమారి థియేటర్ సమీపంలోని ఓ అరుగుపై గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు శనివారం పోలీసులకు సమాచారం అందింది. వన్టౌన్ పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వద్ద ఎటువంటి గుర్తింపు లభించలేదు. ఎండకు తాళలేక మృతి చెందినట్లు స్థానికులు పేర్కొన్నారు. పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరు కాకుండా శనివారం విజయవాడ సత్యనారాయణపురంలో ఒకరు, జీజీహెచ్లో కూడా ఒక యాచకుడు వడదెబ్బ కారణంగా మృతి చెందినట్టు తెలిసింది. మృతి చెందిన యాచకులు ఎన్టీఆర్ జిల్లాలో వడదెబ్బకు పది మంది మృతి -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాఆదివారం శ్రీ 24 శ్రీ మే శ్రీ 2026విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 523.90 అడుగులకు చేరింది. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకు 900 క్యూసెక్కులు విడుదలవుతోంది.హనుమాన్జంక్షన్లో ఇటీవల జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, 173 గ్రాముల బంగారు ఆభరణా లను స్వాధీనం చేసుకున్నారు. గంపలగూడెం: బడి పిలుస్తోంది ప్రచార రథం శనివారం తిరువూరు సాయిబాబా గుడి వద్ద ప్రారంభమైంది. అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో సదుపా యాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. 7 -
బిగ్ అలర్ట్.. ఏపీలో రేపు ఈ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు
సాక్షి, విజయవాడ: ఏపీలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. ఇవాళ(శనివారం, మే 23) రాష్ట్రంలోనే అత్యధికంగా కృష్ణా జిల్లా కానుమోలులో 45.8 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరం, పల్నాడు జిల్లా శ్రీనగర్ లో 45, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడులో 44.6, తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 44.3, విశాఖ రూరల్లో 42.8, అల్లూరి జిల్లా రామరాజుపాలెం, కాకినాడ జిల్లా కోటనందూరులో 42.6, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 42.5, ప్రకాశం జిల్లా కొండపిలో 42.4, గుంటూరు జిల్లా రాయపూడిలో 42.3డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.రేపు(మే 24, ఆదివారం) 21 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 214 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 - 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42- 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 - 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మన్యం, అల్లురి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. -
గ్రామ స్థాయిలోనే పరిష్కారానికి కృషి
రెడ్డిగూడెం: జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న రెవెన్యూ సంబంధిత సమస్యలను గ్రామ స్థాయిలోనే వేగంగా పరిష్కరించి, రెవెన్యూ సమస్యల రహిత గ్రామాల నిర్మాణం లక్ష్యంగా పనిచేస్తున్నామని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఆయన శుక్రవారం రెడ్డిగూడెంలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)తో పాటు ఒక నెల–ఒక గ్రామం–నాలుగు సందర్శనలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి సత్వర పరిష్కారానికి ఆదేశాలిచ్చారు. కార్యక్రమంలో మొత్తం 57 అర్జీలు రాగా వీటిలో రెవెన్యూకు సంబంధించి 23 అర్జీలు, గృహ నిర్మాణం, పంచా యతీ రాజ్ శాఖకు సంబంధించి ఆరు చొప్పున అర్జీలు అందాయి. ఆర్అండ్బీకి సంబంధించి 5 అర్జీలు, విద్యాశాఖ 3, మైనింగ్, పోలీసు, డీఆర్డీఏ శాఖలకు ఆరు చొప్పున అర్జీలు వచ్చాయి. తహసీల్దార్ సుశీలాదేవిపై సీరియస్... రెడ్డిగూడెం మండలం నాగులూరు తండాకు చెందిన బాణావత్ వనజ తనకు చెందిన డి.పట్టా భూమిని అడంగల్లో నమోదు చేయడం లేదని కలెక్టర్కు మొరపెట్టుకోగా కలెక్టర్ తహసీల్దార్ సుశీలాదేవిని పిలిచి ఆ భూమిపై వారు పెట్టుకున్న అర్జీలను చూపాలని అడిగారు. తహసీల్దార్ సరైన పత్రాలు చూపించకపోవడంతో కలెక్టర్ ఆమైపె మండిపడ్డారు. సరైన పట్టాలు ఉన్నప్పటికీ ఎందుకు తాత్సారం చేస్తున్నారని తహసీల్దార్ను సీరియస్గా ప్రశ్నించి, పక్కనే ఉన్న ఆర్డీవోను ఈ పట్టా భూమిని పరిశీలించి ఆమెకు తగు న్యాయం చేయాలని సూచించారు. ఒకానొక సందర్భంలో పక్కనే ఉన్న తిరువూరు ఆర్డీఓ ఎ.కుమార్తో వెంటనే తహసీల్దార్ సస్పెన్షన్ ఆర్డర్ తయారు చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామానికి చెందిన చింతిరాల శివ చెట్టు మీద నుంచి పడి వెన్నుపూస దెబ్బతిని లేవలేని పరిస్థితి లో ఉన్నాడని కలెక్టర్కు తెలుపగా, అతడిని పరామర్శించి పెన్షన్ అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో తిరువూరు ఆర్డీవో ఎ. కుమార్, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి జ్యోతి, తహసీల్దార్ జె.సుశీలాదేవి, ఎంపీడీఓ జె.ప్రభాకరరావు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. డి.పట్టా భూమిని పరిశీలించిన అధికారులు రెడ్డిగూడెం మండలం నాగులూరు తండాకు చెందిన బాణావత్ వనజ డి.పట్టా భూమిని తిరువూరు ఆర్డీఓ ఎ.కుమార్, ఎస్ఐ ఎస్.శ్రీను, తహసీల్దార్ జె.సుశీలాదేవి పరిశీలించారు. వనజ భూమిని పరిశీలించి కొలతలు వేసి కలెక్టర్కు నివేదిక పంపనున్నట్లు ఆర్డీఓ కుమార్ తెలిపారు. కలెక్టర్ లక్ష్మీశ -
దుర్గమ్మ సన్నిధిలో భక్తుల తాకిడి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వేసవి సెలవులు, శుక్రవారం నేపథ్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తుల తాకిడి పెరిగింది. తెల్లవారుజామున నుంచి ప్రారంభమైన రద్దీ మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు, సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు కొనసాగింది. రద్దీ నేపఽథ్యంలో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి అంతరాలయ దర్శనాన్ని ఆలయ అధికారులు నిలిపివేశారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. వేసవి సెలవులు మరికొద్ది రోజుల్లో ముగియనుండటం, నూతనంగా కళాశాలలు, విద్యాలయాల్లో అడ్మిషన్లు పొందిన వారు అమ్మవారిని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. తెల్లవారుజామునే పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి కొండపైకి చేరుకుంటున్నారు. ఘాట్రోడ్డుతో పాటు మహా మండపం లిఫ్టు, మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకుని సర్వ దర్శనం, రూ.100, రూ.300 టికెట్ క్యూలైన్ల ద్వారా ఆలయానికి చేరుకుంటున్నారు. ఉదయం 9 గంటల కల్లా అన్ని క్యూలైన్లు భక్తులతో నిండటంతో అంతరాలయ దర్శనాన్ని రద్దు చేశారు. రూ. 300 టికెటు కొనుగోలు చేసిన భక్తులతో పాటు వీఐపీ, సిఫార్సు లేఖలపై విచ్చేసిన భక్తులకు బంగారు వాకిలి దర్శనం కల్పించారు. మధ్యాహ్నం వేళ సాధారణ రద్దీ.. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో మధ్యాహ్నం వేళ రద్దీ సాధారణంగా కనిపించింది. ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు భక్తుల తాకిడి కనిపించగా, రెండు గంటల నుంచి అన్ని క్యూలైన్లు ఖాళీగా కనిపించాయి. సాయంత్రం ఆరు గంటల నుంచి భక్తుల రద్దీ తిరిగి ప్రారంభమై 9.30 గంటల వరకు కొనసాగింది. -
పీహెచ్సీల్లో ప్రసవాలు పెరగాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డెలివరీ (ప్రసవాలు) పెరగాలని వైద్యాధికారులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని సూచించారు. ఆమె శుక్రవారం ఎన్టీఆర్ జిల్లాలోని రెడ్డిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో రోగుల కోసం ఏర్పాటు చేసిన తాగునీటి సౌకర్యాన్ని పరిశీలించారు. ప్రతిరోజూ ఆస్పత్రికి వచ్చే అవుట్ పేషెంట్స్ వివరాల అడిగి తెలుసుకోవడంతో పాటు, రికార్డులు తనిఖీ చేశారు. వైద్యాధికారితో పాటు, సిబ్బంది హాజరు. పనితీరు, ప్రగతి నివేదికలను పరిశీలించారు. స్టాఫ్ నర్సును పిలిచి ఆస్పత్రికి వచ్చే గర్బిణుల వివరాలు, ప్రతినెలా జరిగే పీఎంఎస్ఎంఏ కార్యక్రమానికి హాజరవుతున్నారా లేదా అనే అంశాలను తెలుసుకున్నారు. ఈ పీహెచ్సీ పరిధిలో ఈ వారంలో జరిగే కాన్పు వివరాలు పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యాధికారితో పాటు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని -
ఉచిత శిక్షణ పేరుతో వసూళ్ల దందా?
మచిలీపట్నంఅర్బన్: పిల్లల్లో క్రీడా నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసిన ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు జిల్లాలో వివాదాస్పదంగా మారుతున్నాయి. ఉచితం అంటూ ఆన్లైన్లో నమోదు చేపట్టి, అనంతరం వివిధ పేర్లతో వేల రూపాయలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. మచిలీపట్నం ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న షటిల్, స్కేటింగ్, క్రీడా ప్రాధికారిక సంస్థ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈత కొలను ఉచిత శిక్షణ శిబిరాలపై చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉచిత శిక్షణ పేరుతో వసూళ్లపై ఇండోర్ స్టేడియం వద్ద పిల్లల తల్లిదండ్రులు శుక్రవారం నిరసన వ్యక్తంచేశారు. చిన్నారుల నుంచి వసూళ్లు.. జిల్లా వ్యాప్తంగా సుమారు 1200 మంది విద్యార్థులు సమ్మర్ క్యాంప్ కోసం ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే శిక్షణ ప్రారంభమైన తర్వాత ఫీజుల పేరుతో భారీగా వసూళ్లు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మే 5 నుంచి ప్రారంభమైన స్కేటింగ్ శిక్షణకు సుమారు 90 మంది పిల్లలు హాజరవుతుండగా, ఒక్కో విద్యార్థి నుంచి రూ.2 వేల వరకు ఫీజు, అదనంగా స్కేటింగ్ బూట్ల కోసం రూ.1700 చొప్పున వసూలు చేసినట్లు తల్లిదండ్రు లు చెబుతున్నారు. ఈ మొత్తాలను ప్రభుత్వ సంస్థ ఖాతాలకు కాకుండా వ్యక్తిగత మొబైల్ నంబర్లకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా జమ చేయించుకున్నారని ఆరోపిస్తున్నారు. రసీదులు లేవు...లెక్కలు లేవు ఇక్కడ తీసుకున్న డబ్బులకు ఎలాంటి రసీదులు ఇవ్వడం లేదని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. వసూలు చేస్తున్న డబ్బులు నిజంగా ప్రభుత్వ ఖాతాలకు వెళ్తున్నాయా? లేక వ్యక్తుల చేతుల్లోకే చేరుతున్నాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక తల్లి తన కుమారుడిని స్కేటింగ్ శిక్షణకు చేర్పించేందుకు వెళ్లగా, సిబ్బంది ఇచ్చిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రూ.1000 చెల్లించారు. తర్వాత అది కోచ్ వ్యక్తిగత ఖాతా అని తెలుసుకుని అధికారులను ప్రశ్నించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.నిరసన వ్యక్తం చేసిన తల్లిదండ్రులు -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశనివారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2026కొండల గుండెల్లో అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.2126 టీఎంసీలు. భానుడి ప్రతాపానికి జనం తల్లడిల్లి పోతున్నారు. వదాన్యులు ఏర్పాటుచేసిన చలివేంద్రాలు దాహార్తిని తీరుస్తున్నాయి. పెట్టుబడిదారులకు అండగా ప్రత్యేకంగా ఏర్పాటు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా చేయూతనందించేందుకు కలెక్టరేట్లో ప్రత్యేకంగా ఇన్వెస్టర్స్ డెస్క్ ను అందుబాటులోకి తెచ్చినట్లు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్లోని శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్లో ఇన్వెస్టర్స్ డెస్క్ – సింగిల్ విండో సెల్ ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా చేయూతనందిస్తామన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులు, లైసెన్సులు, శాఖల సమన్వయం వంటి అంశాలలో సులభతర సేవలు అందించడంతో పాటు, వివిధ రకాల సేవలకు మార్గనిర్దేశనం చేస్తామన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అందుబాటులో ఉన్న వివిధ పథకాలు, ప్రోత్సాహకాలు వంటి సమాచారాన్ని అందించడంతో పాటు పారిశ్రామిక యూనిట్లను విజయవంతంగా నడిపించేందుకు మార్గదర్శనం లభిస్తుందని వివరించారు. పరిశ్రమలు నడపటంలో ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే వాటి పరిష్కారానికి చేయి పట్టి నడిపిస్తామన్నారు. జిల్లాలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తూ, కొత్త పరిశ్రమల స్థాపనకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందన్నారు. జిల్లాలో పరిశ్రమలు స్థాపించాలనుకునే పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలకు అనువైన, అవసరమైన భూమిని సమకూర్చడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. మరిన్ని వివరాలకు డీఐసీ జనరల్ మేనేజర్ ఎం.మధు (98857 29555), ఇన్వెస్టర్ డెస్క్ ఇన్చార్జ్ డాక్టర్ సుమన్ (94943 75951)ను సంప్రదించవచ్చని తెలిపారు. జి.కొండూరులో సీబీజీ ప్లాంటు ఎన్టీఆర్ జిల్లాలో ఐవోసీ–జీపీఎస్ సంస్థ స్థాపించనున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంటు ప్రతిపాదనకు ఆమోదం లభించిందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఈ పరిశ్రమ జి.కొండూరు మండలంలోని కడింపోతవరం గ్రామ పరిధిలో రానుందని, ఈ పరిశ్రమ ద్వారా జిల్లాకు రూ.120 కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు, 200 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ వివరించారు. 7విస్సన్నపేట: ఆర్యవైశ్య మహాసభ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా విస్సన్నపేటకు చెందిన కుక్కడపు వెంకట నాగేశ్వరరావునియమితులయ్యారు. ఎత్తైన కొండలు. కొండలను చుట్టుకుని మెలికలు తిరిగే పోలవరం కాలువ. ప్రకృతి సోయగాలు. ఎన్నో రకాల వన్య ప్రాణులు. పశు పక్ష్యాదులు. పచ్చటి పంట పొలాలు, పండ్ల తోటలతో అలరారే గ్రామం కొత్తూరు తాడేపల్లి. ఆ ప్రకృతి సౌందర్యమే ఇప్పుడా గ్రామానికి శాపంగా మారింది. గ్రావెల్, మట్టి పేరుతో పర్యావరణ విధ్వంసం జరుగుతోంది. అక్రమార్కులు గ్రావెల్ కోసం కొండలు, గుట్టలను బాంబులతో పేల్చేస్తున్నారు. బాంబుల ధాటికి చుట్టు పక్కల పంట పొలాలు, తోటల్లోకి రాళ్లు ఎగిరి పడుతున్నాయి. దుమ్ము, మట్టి పంట పొలాలను కప్పేస్తున్నాయి. గ్రామస్తులు గ్రావెల్ దందాపై పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. అభివృద్ధి పేరిట పర్యావరణ విధ్వంసం గ్రావెల్ కోసం కొండలు, గుట్టలు పేల్చివేత అనుమతి లేకుండా ఎక్స్ప్లోజివ్స్ వాడకం బాంబుల ధాటికి ఎగిరిపడుతున్న రాళ్లు దుమ్ము, మట్టితో పంట చేలు నాశనం కన్నెత్తి చూడని అధికారులు భయభ్రాంతులకు గురవుతున్న గ్రామాల ప్రజలు -
ఆవకాయ్.. అధరహో..
పెనుగంచిప్రోలు: పచ్చడి మామిడి కాయల ధరలు, పచ్చడి తయారీ ముడి సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆవకాయ పచ్చడి జాడీలోకి చేరే పరిస్థితులు కనపడటం లేదు. ధనిక, పేద అనే వ్యత్యాసాలు లేకుండా మామిడి కాయ పచ్చడి పెట్టే ఇళ్లు లేదంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా తెలుగువారు ఏటా ఈ సీజన్లో మామిడి కాయ పచ్చడి పెట్టే సంప్రదాయం ఉంది. ఆవకాయ రుచి చూస్తే గుర్తు వచ్చేది ఆంధ్రులే. ఈ పచ్చడి తయారు చేసే సమయంలో నియమ నిష్టలతో చేయక పోతే నిల్వ ఉండదనే నానుడి కూడా ఉంది. గతంలో ఒకొక్క కుటుంబం 100 నుంచి 200 కాయలు వరకు పచ్చళ్లు పెట్టేవారు. రానురాను అది 50 నుంచి 25 కాయలకు పరిమితమైంది. అయితే ప్రస్తుతం పది కాయలు పెడితే చాలని ప్రజలు అనుకుంటున్నారు. తెగుళ్ల బెడద... ఈఏడాది మామిడి సీజన్ ప్రారంభంలో తేనెమంచు పురుగు ఆశించి పూత రాలి పోయింది. కొన్ని చెట్లకు పలుచగా కాయలు కాసినా వాటికి మంగు రావటంతో పాటు పలు రకాల తెగుళ్లు ఆశించటం, గాలివానకు కాయ రాలింది. దీంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది. గతంలో చిన్న రసం, పెద్ద రసం కాయలు చెట్టుకు 1000కి పైగా కాసేవి. ఈ ఏడాది ప్రతాకూల పరిస్థితుల నేపథ్యంలో కొన్ని చెట్లు కాయకపోగా మరికొన్ని చెట్లకు పలుచగా ఉన్నాయి. మంగు వచ్చిన మామిడి కాయలు పచ్చడికి పనికి రాకుండా పోవటంతో ఉన్న కొద్దిపాటి కాయలకు డిమాండ్ పెరిగింది. పెరిగిన కాయల, సరుకుల ధరలు మామిడి కాయ పచ్చడి పెట్టే కాయల ధరలు కూడా డిమాండ్ కారణంగా బాగాపెరిగాయి. చిన్న రసాలు కాయ ఒకటికి రూ.20, పెద్ద రసాలు రూ.30, తెల్ల గులాబీ రూ.30, నాటుకాయలు ఒకటికి రూ.15 పలుకుతున్నాయి. ఇక కిలో వేరు శనగ నూనె రూ.185, ఎండు మిరపకాయలు రూ.250 నుంచి రూ.300, ఆవాలు రూ.200, మెంతులు రూ.130, వెల్లుల్లి రూ.220, ఉప్పు కిలో రూ.20 చొప్పున పలుకుతున్నాయి. పెరిగిన ధరలతో పచ్చడి మానుకుంటేనే బాగుంటుందని సామాన్య, మధ్య తరగతి ప్రజలు అనుకుంటున్నారు. పెరిగిన ధరలు ప్రకారం ఓఇంటికి అవసరమైన ఆవకాయ పచ్చడి పెట్టాలంటే రూ.3 వేల వరకు ఖర్చు అవుతుంది. గతంతో పోలిస్తే రెట్టింపు ఖర్చు అవుతోందని వినియోగదారు అంటున్నారు. అటు మామిడి కాయలు, ఇటు సరుకుల ధరలు మండుతుండటంతో ఈసీజన్లో మామిడి పచ్చడికి చాలామంది దూరంగా ఉంటున్నారు. భారంగా మారిన ఆవకాయ పచ్చడి తయారీ మండుతున్న పచ్చడి ముడి సరుకుల ధరలు మార్కెట్లో అరకొరగానే మామిడి కాయలు పచ్చడి పెట్టే పరిస్థితి లేదు పెరగిన మామిడికాయలు, దినుసుల ధరలతో ఈఏడాది పచ్చడి పెట్టే పరిస్థితి లేదు. గతంలో 50 కాయలు పచ్చడి పెట్టే వాళ్లం. అయితే పచ్చడి లేదనిపించుకోకుండా 10 కాయలు పచ్చడి పెడదామని అనుకుంటున్నాం. బంధువులు వచ్చినా ఆవకాయ రుచి చూపించే పరిస్థితి లేకుండా పోతోంది. – డి.మహాలక్ష్మి, గృహిణి, పెనుగంచిప్రోలు -
అక్రమ మట్టి తవ్వకాలపై కలెక్టర్ కన్నెర్ర..?
● గ్రామ పంచాయతీ అనుమతి లేనిదే చెరువుల్లో మట్టి తవ్వకాలు నిషిద్ధం ● నిబంధనలు అతిక్రమిస్తే పోలీసు కేసులు నమోదు చేయాలి ● ఎస్పీతో కలిసి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ● పామర్రు, పెడన, గుడివాడల్లో ఆగిన మట్టి తవ్వకాలు సాక్షి ప్రతినిధి, విజయవాడ: అక్రమ మట్టి తవ్వకాలపై కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కన్నెర్ర చేశారు. జిల్లాలోని గ్రామ పంచాయతీ చెరువుల్లో అనుమతి లేనిదే తవ్వకాలు జరపరాదని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే పోలీసు కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ‘చెరువుల్లో తోడేళ్లు..!’ అనే కథనంపై ఆయన స్పందించారు. ఎస్పీ విద్యాసాగర్తో కలిసి ఆయన బుధవారం సంబంధిత అధికారులు డీపీఓ ధనలక్ష్మి, పంచాయతీరాజ్ ఎస్ఈ రమణారావు, డీఎస్పీలు, ఎంపీడీవోలు, పంచా యతీ కార్యదర్శులతో గ్రామ పంచాయతీ చెరువుల్లో అక్రమ తవ్వకాలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెరువుల్లో పూడిక మట్టిని చెరువు కట్ట పటిష్టతకు ఉపయోగించాలని, మిగిలింది ఏమైనా ఉంటే వేలం వేయాలన్నారు. వచ్చిన మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని చెప్పారు. ఇటువంటి పద్ధతులను అనుసరించకుండా ఇటీవల కొందరు రాత్రి వేళల్లో గ్రామ పంచాయతీ చెరువుల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయన్నారు. ఇది సరికాదని స్పష్టం చేస్తూ ఇకపై అధికారులందరూ అప్రమత్తంగా ఉండి ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మట్టి తవ్వకాలు జరిపితే అందుకు బాధ్యులైన వారిపై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చి కేసు నమోదు అయ్యేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ చెరువుల్లో చెరువు తవ్వకం జరపాలంటే తప్పనిసరిగా గ్రామ పంచాయతీ అనుమతి ఉండాలని స్పష్టం చేశారు. గృహ నిర్మాణ లేఅవుట్లకు మట్టి కావలసి వస్తే దానికి కూడా అనుమతి తప్పనిసరి అని చెప్పారు. దీంతో పామర్రు, పెడన, గుడివాడలో విచ్చల విడిగా సాగుతున్న అక్రమాలకు తెరపడింది. అక్రమ మట్టి తవ్వకాలపై ‘సాక్షి’లో వచ్చిన కథనానికి స్పందించి తవ్వకాలను నిలిపి వేసి నందుకు కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్లకు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి కైలే అనిల్కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అవసరాలు, కమ్యూనిటీ అవసరాలకు మట్టి తవ్వకాలు చేసుకున్నా అభ్యంతరం లేదని, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా వ్యాపార ధోరణిలో అక్రమ మట్టి తవ్వకాలు జరిపి కోట్లు ఆర్జిస్తున్నారన్నారు. భవిష్యత్తులో కూడా అక్రమ మట్టి తవ్వకాలు జరగకుండా గట్టి నిఘా కొనసాగించాలని కై లే కోరారు. -
ఈవీఎం, వీవీ ప్యాట్ గోదాముకు పటిష్ట భద్రత
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశభవానీపురం(విజయవాడపశ్చిమ): ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు (ఈవీఎం), వీవీప్యాట్ల గోదాముకు పటిష్ట భద్రత కల్పించినప్పటికీ నిరంతర పర్యవేక్షణతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సమన్వయ శాఖల అధికారులను ఆదేశించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా నెలవారీ తనిఖీల్లో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో కలిసి శుక్రవారం ఆయన విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని ఈవీఎం, వీవీప్యాట్ల గోదామును పరిశీలించారు. భద్రతా చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ కెమేరాల పనితీరుతోపాటు అగ్నిమాపక పరికరాలను తనిఖీ చేశారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈసీఐ మార్గదర్శకాల ప్రకారం ఈవీఎం, వీవీప్యాట్లను భద్రపరుస్తున్న గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎప్పటికప్పుడు సమగ్ర నివేదికను అందిస్తున్నామని తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గోదాము వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సీసీ కెమేరాల పర్యవేక్షణతో గట్టి నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. ఈవీఎం, వీవీప్యాట్ల తనిఖీలో కలెక్టర్ లక్ష్మీశతోపాటు డీఆర్ఓ ఎం.లక్ష్మీనరసింహం పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉన్నారు. -
దుర్గమ్మకు పలువురు విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శుక్రవారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల సమీపంలోని మహాదేవపురానికి చెందిన తుంపాటి లక్ష్మీవెంకటపతి కుటుంబసభ్యులతో అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి అన్నదానానికి రూ. 1.20 లక్షల విరాళాన్ని అందచేశారు. అదేవిధంగా హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారు రూ. 3 లక్షల విరాళాన్ని ఆలయ అధికారులకు అందచేశారు. అన్నదానానికి పొట్లూరి వనజాక్షి పేరిట రూ. లక్ష, పొట్లూరి పూర్ణచంద్రరావు పేరిట మరో రూ. లక్ష విరాళాన్ని అందించగా.. కాట్రగడ్డ సునీల్కుమార్, వెంకట్ల పేరిట దుర్గమ్మ గోసంరక్షణ పథకానికి రూ. లక్ష విరాళాన్ని అందించారు. అనంతరం భక్తులకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. -
లారీ ఢీకొని మెకానిక్ దుర్మరణం
కంచికచర్ల: బ్రేక్ డౌన్ అయిన క్రేన్కు మరమ్మతులు చేస్తుండగా వెనుక నుంచి వేగంగా వస్తున్న లారీ బలంగా ఢీ కొనటంతో క్రేన్ మెకానిక్ మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం కంచికచర్ల మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ పి.విశ్వనాధ్ కథనం మేరకు... తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాకు చెందిన ఉత్కం స్వామి (61) హైడ్రాలిక్ క్రేన్ మెకానిక్గా పని చేస్తున్నాడు. విజయవాడ వైపునకు వెళ్తున్న ఓ క్రేన్ మరమత్తులకు గురయి ఈ నెల 21 రాత్రి వేళ మండలంలోని కీసర సమీపంలోని ఇన్వెంటా కెమికల్స్ కర్మాగారం వద్ద సమయంలో ఆగిపోయింది. మెకానిక్ ఉత్కం స్వామి వచ్చి రోడ్డు పక్కన క్రేన్కు మరమ్మతు పనులు చేస్తుండగా హైదకాబాద్ వైపు నుంచి విజయవాడ వైపు వెళ్లుతున్న ఓ లారీ వేగంగా వచ్చి బలంగా స్వామిని ఢీకొంది. ఈ ఘటనలో స్వామి తలకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న నేషనల్ హైవే అంబులెన్స్ వాహన సిబ్బంది ఘటనా స్ధలానికి చేరుకుని బాదితుడిని వైద్య చికిత్స కోసం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం శుక్రవారం తెల్లవారుజామున విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు స్వామి కుమారుడు ఉత్కం మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
దుర్గమ్మకు కానుకగా పచ్చల హారం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు నంద్యాలకు చెందిన భక్తులు సుమారు రూ.2 లక్షల విలువైన బంగారు పచ్చల హారాన్ని కానుకగా సమర్పించారు. నంద్యాల నందిపల్లికి చెందిన వి.ఉదయ భాస్కర్రెడ్డి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణను కలిసి సుమారు రూ.2 లక్షలు వెచ్చించి 22 గ్రాముల బంగారం, పచ్చ రాళ్లతో తయారు చేయించిన హారాన్ని అమ్మవారికి సమర్పించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ చైర్మన్, అర్చకులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. గుడివాడ టౌన్: స్థానిక వాసవిచౌక్ లో ఉన్న శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కిరీట వివాదానికి శుక్రవారం తెర పడింది. తాకట్టు పెట్టిన కిరీటాన్ని ట్రస్ట్ సభ్యులు విడిపించి ఆలయానికి అందజేశారు. శనివారం సంప్రోక్షణ చేసిన అనంతరం స్వామి వారికి అలంకరింపచేస్తామని చైర్మన్ పోకూరి మోహనరావు అన్నారు. ఈ సందర్భంగా మోహనరావు మాట్లాడుతూ కల్యాణమండపం నిర్మాణం ఆగిపోయిందని, అందు కోసం దీనిని కుదువ ఉంచాల్సి వచ్చిందన్నారు. ఆలయానికి సంబంధించి ధూప, దీప నైవేద్యాల నుంచి అన్ని ఖర్చులు కల్యాణ మండపం భరిస్తూ వచ్చిందని, ట్రస్ట్ సభ్యుల ఏకగ్రీవ తీర్మానంతో తాకట్టు పెట్టామని ఆయన వివరించారు. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల డిమాండ్ మేరకు ఇప్పటి వరకు ప్రత్యేక రైలుగా నడుస్తున్న చర్లపల్లి–భువనేశ్వర్ న్యూ రైలును రెగ్యులర్ వారాంతపు రైలును నడిపేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. చర్లపల్లి–భువనేశ్వర్ న్యూ (17067) రైలు ఈ నెల 25 నుంచి ప్రతి సోమవారం, అదే విధంగా భువనేశ్వర్ న్యూ– చర్లపల్లి (17068) రైలు ఈ నెల 26 నుంచి ప్రతి మంగళవారం నడవనున్నాయి. ఈ రెండు మార్గాలలో ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, కై కలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బ్రహ్మపూర్, ఖుర్ధారోడ్డు, భువనేశ్వర్ స్టేషన్లలో ఆగుతుంది. -
హే భగవాన్!
ఉమ్మడి జిల్లాపై భానుడి నిప్పుల వర్షంఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు వడగాడ్పులు కూడా వీస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వేడి గాలుల ప్రభావంతో వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా దీర్ఘకాలిక రోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వడదెబ్బ తగిలితే ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి తరలించాలి. ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకుంటే మేలు. – డాక్టర్ మాచర్ల సుహాసిని, డీఎంహెచ్ఓ, ఎన్టీఆర్ జిల్లా లబ్బీపేట(విజయవాడతూర్పు): భానుడి భగభగలతో జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. కృష్ణా జిల్లా నందివాడలో ఏకంగా 47.5డిగ్రీల ఉష్ణోగ్రత గురువారం నమోదైంది. విజయవాడలోనూ 45 డిగ్రీలు దాటింది. ఉదయం 8 గంటలకే వడగాడ్పులు ప్రారంభం కాగా, రాత్రి 10 గంటల వరకూ వేడి తగ్గని పరిస్థితి. దీంతో వృద్ధులు, చిన్నారులే కాదు, యువత కూడా రోడ్డు మీదకు రావాలంటే భయపడుతున్నారు. మధ్యాహ్నం వేళల్లో రోడ్లు జనం లేక వెలవెలబోయాయి. మరోవైపు ఎండల తీవ్రత మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా.. జిల్లాలో గురువారం అత్యధికంగా నందివాడలో ఏకంగా 47.5, తిరువూరులో 46డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆ తర్వాత విజయవాడ, గన్నవరంలలో 45.2 డిగ్రీలు, జగ్గయ్యపేట, నందిగామల్లో 44 డిగ్రీలు, గన్నవరంలో గుడివాడల్లో 43 డిగ్రీలు, మచిలీపట్నం, పెడనలో 42 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. కాగా వేడి తీవ్రత మరో 5 డిగ్రీల అధికంగా చూపుతున్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు రాత్రి ఉష్ణోగ్రతలు సైతం 32 డిగ్రీల సెల్సియస్గా నమోదవుతుండగా, రాత్రి 10 గంటల సమయంలో కూడా బయటకు రాలేని పరిస్థితి కనిపించింది. ఈ తీవ్రత మరో వారం రోజులు కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మధ్యాహ్నం వేళ బయటకు రావొద్దు.. ఎండలు ఎక్కువగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల్లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావడం మంచిది కాదంటున్నారు. ముఖ్యంగా రక్తపోటు, మధుమేహం థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఇలాంటి వారు వడగాడ్పులకు త్వరగా డీ హైడ్రేషన్కు గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. మరోవైపు గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లల విషయంలోనూ అప్రమత్తత అవసరం అంటున్నారు. ఇంట్లో ఉన్నా హీట్స్ట్రోక్కు గురవుతారని అంటున్నారు. ఇంట్లోకి వేడిగాలులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే మేలు.. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు మద్యం తాగడం, కూల్ డ్రింక్స్ సురక్షితం కాదంటున్నారు. రోడ్లపై అమ్మే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని, నీళ్లు, పళ్లరసాలు ఎక్కువగా తీసుకోవాలంటున్నారు. తెల్లని, లేతవర్ణం, కాటన్ దుస్తులు ధరిస్తే మంచిదని సూచిస్తున్నారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో పరిస్థితి, (ఇన్సెట్లో) వాహనదారుల పాట్లు -
ఇక దేవుడే దిగిరావాలేమో?
సాక్షి ప్రతినిధి, విజయవాడ: గొడుగుపేట వేంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన భూమిని దేవదాయశాఖ అధికారులు స్వాధీనం చేసుకొనే విషయంలో కాలయాపన చేస్తున్నారు. గతేడాది నవంబర్ 2వ తేదీకే భూమికి సంబంధించి ఎగ్జిబిషన్ సొసైటీకి ఇచ్చిన 56 రోజుల లీజు గడువు ముగిసినా అధికారులు పట్టించుకోవడం లేదు. విజయవాడకు కూత వేటు దూరంలో గొల్లపూడిలో ఎకరం రూ.10కోట్లకు పైన విలువ చేసే, 39.99ఎకరాలు.. అంటే రూ.400కోట్ల విలువైన భూమి విషయంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఏం జరిగిందంటే.. గత ఏడాది ఈ భూమిపై కన్నేసిన ఓ పార్లమెంట్ ముఖ్యనేత వరల్డ్ క్లాస్ గోల్ఫ్ ప్రాక్టీస్ రేంజ్ అండ్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ పేరుతో 5 ఎకరాలు, ఏటా విజయవాడ ఉత్సవాల నిర్వహణ పేరుతో 34.99 ఎకరాలను లీజు ముసుగులో మొత్తం 39.99 ఎకరాలను సొంతం చేసుకొనే దిశగా పావులు కదిపారు. ఈ విషయమై ‘సాక్షి’లో వచ్చిన వరుస కథనాలతో ఆ ప్రతిపాదనలకు బ్రేక్ పడింది. ఈ విషయంలో వేర్వేరుగా రెండు పిటీషన్లు హైకోర్టులో దాఖలు అయ్యాయి. అప్పటికే ఎలాంటి అనుమతి లేకుండా వరి పంట పండే పొలంలో విజయవాడ ఉత్సవాల నిర్వహణ కోసం అంటూ 4నుంచి6 అడుగుల మట్టి తోలి చదును చేశారు. ఈ విషయమై కోర్టు సీరియస్ అయ్యింది. వ్యవసాయ భూమిని యథా పూర్వ స్థితికి తీసుకొని రావాలని, 35 ఎకరాల్లో వేసిన గ్రావెల్ తొలగించాలని ఆదేశించింది. అయితే సుప్రీం కోర్టుకు వెళ్లి తాత్కాలికంగా 56 రోజుల పాటు ఉత్సవాలు జరుపుకొనేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ అనుమతి తెచ్చుకొంది. అక్కడ కూడా స్పష్టంగా భూమిలో వేసిన మట్టి తీసేసి, భూమి పూర్వ స్థితికి తేవాలని కోర్టు పేర్కొంది. కోర్టు ఆదేశించినా.. దేవదాయశాఖ అధికారులు కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేశారు. ఇప్పటికీ ఆ భూమిని స్వాధీనం చేసుకోలేదు. దానిలో వేసిన మట్టి తొలగింపు దిశగా చర్యలు తీసుకోకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో వేసిన మట్టిని కూడా పార్లమెంటు ముఖ్యనేత ఆధ్వర్యంలో అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా తోలారు. ఆ మట్టి ఎక్కడ నుంచి ఇక్కడికి తోలారో విజిలెన్స్ ద్వారా విచారణ జరిపిస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దొరికిందల్లా దోచుకోవడం, మీకింత నాకింత పంచుకు తినడాన్ని అలవరుచుకొన్న నేతలు.. కోర్టు అక్షింతలు వేసినా ఎలాగైనా గొడుగు పేట వేంకటేశ్వర స్వామి భూమిని కొట్టేయాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా పార్లమెంటు ముఖ్యనేత దేవదాయశాఖ అధికారులను తన గుప్పెట్లో పెట్టుకొని, చట్టంలోని లొసుగులను ఉపయోగించుకొని, భూమి కాజేసేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ధార్మిక సంస్థలకు భూమి కేటాయింపు పేరుతో ఫైలు సిద్ధం చేయించారు. ఆ ఫైలు సైతం దేవదాయ శాఖ ఉన్నతాధికారులకు చేరినట్లు చర్చ సాగుతోంది. భూమిని స్వాధీనం చేసుకొని మట్టి తొలగింపు చేపట్టకుండా ఉండటం వెనుక పార్లమెంటు ముఖ్యనేత ఒత్తిడితో పాటు, కుట్ర దాగి ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేఫథ్యంలో దేవదాయ శాఖ అధికారులు స్పందించి, వెంటనే భూమిని స్వాధీనం చేసుకొని బోర్డు, ఫెన్సింగ్, ఏర్పాటు చేయడంతోపాటు మట్టి తొలగింపు చర్యలు తీసుకొని, దేవుడి భూమిని పార్లమెంటు ముఖ్య నేతతో పాటు పచ్చనేతల చెర నుంచి కాపాడాలని భక్తులు కోరుతున్నారు. -
పెరుగుతున్న ధరలతో సామాన్యుడు బెంబేలు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): మొన్న గ్యాస్, నిన్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో మొత్తం మార్కెట్ ప్రభావితమవుతోంది. రవాణా వ్యవస్థ భారంగా నడుస్తోంది. ఫలితంగా నిత్యావసరాల ధరలు ఒక్కొక్కటిగా ఆకాశాన్నంటుతున్నాయి. పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. ధరలను అదుపు చేయలేని ప్రభుత్వ అసమర్ద విధానాలు తమ బతుకును చిన్నాభిన్నం చేస్తోందంటూ సామాన్యుడు విలవిల్లాడుతున్నాడు. పెట్రోల్, డీజిల్ ధరలే ప్రధాన కారణం.. పెట్రో ఉత్పత్తుల ధరలతోనే మొత్తం మార్కెట్ అస్తవ్యస్తంగా మారిందని నిపుణులు చెబుతున్నారు. గృహావసరాలకు వినియోగించే గ్యాస్ రూ.60 పెరగగా.. యుద్ధం పేరుతో పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవటంతో భారీగా బ్లాక్మార్కెట్లో విక్రయాలు జరుగుతున్నాయి. అలాగే కమర్షియల్ గ్యాస్ ధర డిసెంబర్లో రూ.1,776 ఉండగా అది దాదాపుగా రెట్టింపు అయ్యింది. దాంతో మార్కెట్లో ఏమి తినాలన్నా వాటి ధరలను అమాంతం పెంచేసి సామాన్యుడిపై భారీగా భారం మోపుతున్నారు. తాజాగా పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గ్యాస్ ధరలను సైతం పెంచటంతో వాటి ప్రభావం మొత్తం రవాణా వ్యవస్థపై పడింది. ధరలు ఆకాశానికి.. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నూనె ధరలు సలసల మండిపోతున్నాయంటూ ప్రజలు వాపోతున్నారు. ప్రధానంగా యుద్ధం, కొంత ప్రభుత్వ అసమర్దతతో కొంత ధరలు పెరిగి సామాన్యుల కొనుగోలు శక్తిని దిగజార్చాయని పలువురు చెబుతున్నారు. కందిపప్పు, మినపప్పు, మిర్చి, చింతపండు, పెసరపప్పు ఇలా ప్రతి వస్తువు కిలో రూ.10 నుంచి రూ.40 వరకూ గడిచిన నెల రోజుల్లో పెరిగిపోయాయి. నూనె ధరల గడిచిన ఆరు మాసాల్లో దాదాపుగా రూ.50కు పైగా పెరిగిందని వ్యాపారులు వివరిస్తున్నారు. ఇది ఒకవైపు అయితే చిన్న హోటల్ నుంచి ఒక మాదిరిగా ఉండే రెస్టారెంట్ వరకూ ఐటమ్కు రూ.10 నుంచి రూ.200 వరకూ పెంచి వాటి యజమానులు కస్టమర్ చేతికి బిల్లు అందిస్తున్నారు. దిగజారిన ఆదాయం, కొనుగోలు శక్తి.. ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ అసమర్ద విధానాల ఫలితంగా ప్రజల ఆదాయం భారీగా దిగజారిందని పలు సర్వేలు వివరిస్తున్నాయి. ప్రధానంగా అన్ని రంగాలు కొనుగోళ్లు, అమ్మకాల పరిస్థితి చూస్తే దారుణంగా పడిపోయాయి. దాంతో సామాన్యులకు వచ్చే ఆదాయం సైతం ప్రభావితమవుతోందని నిపుణులు చెబుతున్నారు. ఆదాయం పడిపోవటంతో చిరువ్యాపారులు, ప్రైవేట్ రంగంలో పని చేసే చిరు ఉద్యోగులు, రోజువారీ వేతన జీవుల పరిస్థితి దయనీయంగా మారిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తత్ఫలితంగా వారిలో కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సామాన్యుల కొనుగోలు శక్తి బాగా ఉన్నప్పుడు మార్కెట్ ఉత్సాహంగా ఉంటుందని అయితే నేడు ఆ పరిస్థితులు లేవని పలువురు విశ్లేషిస్తున్నారు. దిగజారుతున్న జీవన ప్రమాణాలు.. పెరిగిన ధరలు జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే ఆదాయంలో ఇంటి అద్దెలు, పిల్లల ఫీజులు, విద్యుత్ చార్జీలు, పెట్రోల్ భారాలు ఇలా నిర్ధిష్టంగా ఉండే ఖర్చులను తగ్గించుకునే పరిస్థితి ఉండదు. ఇక తినే తిండి, వైద్యం, ఇతర వినోదం వంటి అంశాలను అనివార్యంగా తగ్గించుకోవాల్సి వస్తోంది. తత్ఫలితంగా మానవ జీవనం ఇబ్బందుల పాలు కాక తప్పదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ధరల పెరుగుదలతో పాటు సరిపడనంత ఆదాయం లభించకపోతే సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని నిపుణులు చెబుతున్నారు. -
సిటీ ఆర్మ్డ్ గ్రౌండ్స్లో నూతన భవనం ప్రారంభం
లబ్బీపేట(విజయవాడతూర్పు): సిటీ ఆర్మ్డ్ గ్రౌండ్స్లో నిర్మించిన నూతన భవనాన్ని గురువారం పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు లాంఛనంగా ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన భవనంలో సిటీ సెక్యూరిటీ వింగ్ బాంబ్ డిటెక్షన్ – డిస్పోజల్ స్క్వాడ్, స్టోర్ రూమ్, వర్క్షాప్, డాగ్ హ్యాండ్లర్స్ రెస్ట్ రూంలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. నగర రక్షణ, భద్రతలలో సిటీ సెక్యూరిటీ వింగ్, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ విభాగాలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయని సీపీ చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వీటి వల్ల సిబ్బంది పనితీరును మరింత మెరుగుపడుతుందన్నారు. డీసీపీలు కృష్ణకాంత్ పటేల్, షిరీన్బేగం, తిరుమలేశ్వరరెడ్డి, కేజీవీ సరిత, బి. లక్ష్మీనారాయణ, కృష్ణప్రసన్న, ఎస్వీడీ ప్రసాద్, ఏసీపీలు పాల్గొన్నారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్), భారత క్రీడా ప్రాధికార సంస్థ సంయుక్తంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నిర్వహిస్తున్న ఖేలో ఇండి యా స్పోర్ట్స్ సెంటర్లలోని వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని శాప్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.భరణి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మేనేజర్, ఆర్చరీ హెడ్ కోచ్, న్యూట్రీషనిస్ట్, ఫిజియోథెరపిస్ట్ పోస్టులు ఒక్కొక్కటి చొప్పున, పురుషులు, మహిళలకు వేర్వేరుగా మసాజర్ పోస్టులు ఉన్నాయని వివరించారు. అర్హత, వేతనాల వివరాల కోసం స్పోర్ట్స్.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో సందర్శించాల్సిందిగా కోరారు. ఆసక్తి, అర్హతలు ఉన్న అభ్యర్థులు జూన్ ఏడో తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా తమ బయోడేటాను కేఐఎస్సీఈ.ఏపీఎట్దిరేట్జీమెయిల్.కామ్కు పంపాలని, ఇతర వివరాలకు 0866–2499699 ఫోన్ నంబరులో సంప్రదించాల్సిందిగా కోరారు. గుడివాడ టౌన్: స్థానిక వాసవీ చౌక్లో వేంచేసియున్న శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తులు సమర్పించుకున్న బంగారు కిరీటం వ్యవహారంపై దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ విచారణ చేపట్టారు. గురువారం దేవదాయ శాఖ సిబ్బందితో కలిసి ఆలయ పూజారిని విచారించారు. ట్రస్ట్బోర్డు నిర్ణయం మేరకు కిరీటాన్ని రూ. 38 లక్షలకు తాకట్టు పెట్టినట్లు సమాచారం ఉన్నట్లు అసిస్టెంట్ కమిషనర్ లలిత గుర్తించారు. దీనిపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ట్రస్ట్కు చెందిన 31 మందికి ఫోన్ చేయగా వారు అందుబాటులో లేమని అనడం హాస్యాస్పదంగా ఉందని ఆమె అన్నారు. ముందుగానే వారికి సమాచారం ఇచ్చామన్నారు. ఇది ట్రస్ట్ బోర్డు కనుక దేవదాయ శాఖ నేరుగా వారిపై చర్యలు తీసుకోలేదని చెప్పారు. దీనిపై నివేదిక ఇవ్వాలని, పూర్తి వివరాలు సేకరించే వరకూ ఆలయంలోనే ఉంటామని ఆమె తెలిపారు. అనంతరం ఆలయ అర్చకుడు, కిరీటం దాత, ముగ్గురు కమిటీ సభ్యుల వద్ద నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో పలువురిని నియమించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఐటీ వింగ్ సెక్రటరీగా అలవాల రవీంద్రారెడ్డి (మైలవరం), రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శులుగా షేక్ రహంతున్నీసా, బత్తిన నాగపావని (విజయవాడ వెస్ట్) నియమితులయ్యారు. ● కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గానికి చెందిన మైల రత్నకుమారి పార్టీ ప్రచారం విభాగం జోన్–3 వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. -
పటమటలో కార్ల బీభత్సం
యువతి కోసం స్నేహితుల మధ్య వివాదం పటమట(విజయవాడతూర్పు): ఓ యువతి కోసం ఇద్దరు స్నేహితులు మధ్య రగిలిన వివాదం సినీ ఫక్కీ లో ఒకరిపై ఒకరు కార్లతో ఢీకొనే వరకు వెళ్లింది. విజయవాడ పటమట హెచ్టీ (హై టెన్షన్)లైన్ రోడ్డులో రెండు మహేంద్ర థార్ వాహనాలు ఢీకొట్టుకుని యువకులు వీధి కొట్లాటకు దిగటంతో స్థానికులు భయాందోళనకు గురికావాల్సి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ నగరానికి చెందిన బొల్లా ఓం (20), లింగమనేని రోహిత్ (19) ఇద్దరు చిన్ననాటి నుంచి ఒకే స్కూల్లో చదువుకున్న స్నేహితులు. వీరిరువురి మధ్య ఓ యువతి వ్యవహారంలో గురువారం సాయంత్రం వివాదం తలెత్తింది. లబ్బీపేటలో మొదలైన ఈ వివాదం ఒకరిపై మరొకరు చాలెంజ్ చేసుకుని పటమట హెచ్టీలైన్ రోడ్డుకు చేరింది. రాత్రి 9 గంటల సమయంలో ఇరువురు ఎదురెదురుగా వారి కార్లతో ఢీకొట్టుకోగా రెండు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. అనంతరం ఇరువురూ కార్లలో ఉన్న ఇనుప రాడ్లను తీసుకుని కార్లపై దాడి చేసుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈరోడ్డులో ఒక్కసారిగా భీకరమైన శబ్దాలు రావటం, యువకులు దాడులు చేసుకోవటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనలో బొల్లా ఓంను పోలీసులు అదుపులోకి తీసుకోగా రోహిత్ పరారీలో ఉన్నాడు. ఓం తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారని, రోహిత్ తండి ఓ ప్రైవేటు ట్రాన్స్పోర్టు నిర్వహిస్తున్నాడని పోలీసులు తెలిపారు. -
AP: భానుడి భగభగలు.. అల్లాడిపోతున్న జనం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అంతకంతకూ ఎండ తీవ్రత పెరిగిపోయి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు బయటకు అడుగుపెట్టాలంటేనే బాబోయో ఎండ అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురిపిస్తున్నాడా అన్నట్లుగా ఉష్ణోగ్రతలు రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఈరోజు(గురువారం, మే 21వ తేదీ) రాష్ట్రంలో పలుచోట్ల రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్కాపురం జిల్లా కనిగిరిలో అత్యధికంగా 48.3 డిగ్రీలు నమోదు కాగా, కృష్ణా జిల్లా కంకిపాడులో 47.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏలూరు జిల్లా చింతలపూడిలో 47.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు, పల్నాడు జిల్లా అచ్చంపేటలో 47.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 47.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు, ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు, బాపట్ల జిల్లా ఇంకొల్లులో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి.బయటకు వెళ్లాలంటే భయం..భానుడి భగభగలతో జనం ఇంటి నుంచి కాలు బయటపెట్టడానికి భయపడుతున్నారు. ఏమైనా అత్యవసర పరిస్థితి ఎదురైనా ఎండలకు హడలిపోతున్నారు. గత వారం నుంచి ఉదయం మొదలు కొని సాయంత్రం వరకూ తీవ్రమైన ఉక్కపోతతో పాటు సెగలు కక్కే ఎండే కనిపిస్తూ ఉండటంతో సాధారణమైన పనులు చేసుకోవడానికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ ఎండలకు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఏసీలు ఉన్న వారు ఏసీ చాటను, ఫ్యాన్లు ఉన్నవారు ఫ్యాన్ల మాటునే సేద తీరుతూ ఊపిరి పీల్చుకుంటున్నారు. సాయంత్రం ఆరు దాటితే గానీ ఎండ తీవ్రత తగ్గకపోవడంతో ఈ ఎండల నుంచి ఎప్పుడు ఉపశమనం పొందుతామా అని ఎదురుచూస్తున్నారు ప్రజలు. -
జలధార పనుల పరిశీలన
విజయవాడ రూరల్: మండలంలోని పాతపాడు గ్రామంలో ఉపాధి పథకం అనుసంధానంతో చేపట్టిన జలధార పనులను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ బుధవారం పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యత, శ్రామికుల హాజరు తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కూలీలతో మాట్లాడి వారికి అందు తున్న వేతనాలు, తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స వంటి సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం కూలీలకు సగటు వేతనం రూ.307 అందేలా కృషి చేస్తున్నామని తెలి పారు. నీటి భద్రత లక్ష్యంగా జలధార కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇన్చార్జి ఎంపీడీఓ కె.పార్థసారథి, డ్వామా పీడీ రాము పాల్గొన్నారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆరోగ్యకరమైన సమాజానికి క్రీడలు దోహదం చేస్తాయని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) డైరెక్టర్, అర్జున, ద్రోణాచార్య అవార్డు గ్రహిత రమణరావు పేర్కొన్నారు. నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం ఆవరణలో ఎన్టీఆర్ జిల్లా స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు బుధవారం జరిగాయి. రమణరావు మాట్లాడుతూ.. క్రీడాకారులు క్రమశిక్షణ, పట్టు దలతో సాధన చేస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించొచ్చని సూచించారు. శాప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లీగులు క్రీడాకారులు తమ ప్రతిభను నిరూపించుకోడానికి వేదికలన్నారు. ఎన్టీఆర్ జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ శ్రీలత మాట్లాడుతూ.. పట్టుదలతో ప్రయత్నం చేస్తే సాధ్యం కానిది లేదన్నారు. ఎన్టీఆర్ జిల్లా యువజన సంక్షేమ అధికారి కొల్లేటి రమేష్ మాట్లాడుతూ.. యువత క్రీడలపై దృష్టి పెట్టడం వల్ల ఆరోగ్యం తోపాటుగా ప్రభుత్వ ప్రోత్సాహకాలతో ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చని పేర్కొన్నారు. డీఎస్డీఓ కె.కోటేశ్వరరావు మాట్లాడుతూ.. జిల్లా స్థాయిలో వెయింట్ లిప్టింగ్ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామని, వారు రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్యం కోసం పీహెచ్సీలకు వచ్చిన రోగులకు ఆభ ఐడీలు రూపొందించి, వారి వివరాలను వందశాతం ఆన్లైన్ చేయాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని ఆదేశించారు. ఆమె బుధవారం జి.కొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు మంచినీటి సౌకర్యం, మందుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో కాన్పుకోసం వచ్చిన మహి ళతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రం వైద్యాధికారితో పాటు, సిబ్బంది పాల్గొన్నారు. గుడివాడ టౌన్: స్పోర్ట్స్ అథారిటీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(శాప్) కృష్ణాజిల్లా స్థాయి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుల ఎంపిక పోటీలు బుధవారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో జరిగాయి. ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన 36 మంది వెయిట్ లిఫ్టర్లు వివిధ విభాగాలల్లో పాల్గొన్నారు. మూడు కేటగిరీల్లో జరిగిన ఈ పోటీలలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన నాగసాయి, కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన కె.నిఖిల్ కుమార్, జి. నాగసాయి అజయ్వర్మ మొదటి స్థానం సాధించారని నిర్వాహకులు తెలిపారు. విజేతలకు ఎన్టీఆర్ స్టేడియం కమిటి ఉపాద్యక్షుడు యలవర్తి శ్రీనివాసరావు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో శాప్ కృష్ణజిల్లా ప్రతినిధి ఝాన్సీలక్ష్మి, వెయిట్ లిఫ్టర్ శిరోమణి, ఎం.త్రినాథ్, కోచ్ మారెళ్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
రెవెన్యూ లక్ష్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను నిరంతరం సరఫరా చేస్తూనే సర్కిల్ వారీగా నిర్దేశించిన రెవెన్యూ వసూళ్లు సాధించేలా విద్యుత్ సిబ్బంది దృష్టి పెట్టాలని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీ సీపీ డీసీఎల్) సీఎండీ పి.పుల్లారెడ్డి ఆదేశించారు. గుణదలలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా సర్కిల్ పరిధిలోని విద్యుత్ అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రెవెన్యూ కలెక్షన్ గురించి, విద్యుత్ సబ్స్టేషన్ల పనుల పురోగతి వివరాలను అధికారులను పుల్లారెడ్డి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరాలో లైన్ లాసెస్ తగ్గింపుపై సిబ్బంది దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రధాన మంత్రి సూర్య ఘర్, ప్రధాన మంత్రి కుసుమ పథకాల అమలు వివరాలపై ఆరా తీశారు. ఎల్టీ నెట్వర్క్ అభివృద్ధి అంశాలపై సమీక్ష చేశారు. విద్యుత్ సరఫరా, విద్యుత్ బిల్లు పరమైన సమస్యలతో పాటుగా కొత్తగా విద్యుత్ కనెక్షన్ కోసం వచ్చిన దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు. ఏపీసీపీడీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ ఎ.మురళీకృష్ణ యాదవ్, ప్రాజెక్ట్స్ డైరెక్టర్ టి.వి.ఎస్.ఎన్.మూర్తి, ఫైనాన్స్ డైరెక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు, ఎన్టీఆర్ జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్ హనుమయ్య, ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా అఽధికారులతో ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి -
నదుల్లో ఇసుకాసుల వేట
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ నేతల ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. కూటమి అధికారంలోకి వచ్చింది మొదలు పార్ల మెంట్ ముఖ్యనేత, ఆయా నియోజకవర్గాల ప్రజా ప్రతినిధుల అనుచరులు ప్రకృతి వనరులపై కన్నేశారు. నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఇసుక రీచ్ల గడువు ముగిసినా ఉచిత ఇసుక పథకం మాటున నదీ గర్భాన్ని గుల్లగుల్లగా తవ్వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గతంలో అనుమతిచ్చిన 12 రీచ్లకు గడువు ముగియడంతో అవి మూతబడ్డాయి. అయితే వాటిలోని కాసారబాద, వేములపల్లి రీచ్లను తెరిచి ఇసుక తవ్వేస్తున్నారు. లారీ లోడింగ్ రూ.10 వేలు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. పేరుకే ఉచితమని, ఇసుక కావాలంటే డబ్బులు చెల్లించాల్సిందేనని ప్రజలు వాపోతున్నారు. హైదారాబాద్కు తరలించే ఇసుకకు టన్నుకు రూ.2 వేలు చొప్పున 40 టన్నులకు రూ.80 వేలు వసూలు చేస్తున్నారు. ఖమ్మం తరలించేందుకు టన్నుకు రూ.1200 చొప్పున దండుకుంటున్నారు. ఇసుక దందా వెనుక అధికార పార్టీ నేతలు ఉండటంతో అధికారులు సైతం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇసుక దందాకు పోలీసులు, మైనింగ్, రెవెన్యూ అధికారులు కొందరు వత్తాసు పలుకుతున్నారు. టీడీపీ నేతలకు డబ్బు ముట్టజెబితే చాలు అధికంగా ఇసుక లోడు చేస్తున్నారు. తెలంగాణ పక్కనే ఉండటంతో.. జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. మునేరు నుంచి పగలు ట్రాక్టర్లతో ఇసుక తరలించి డంప్ చేసి, రాత్రి వేళ తెలంగాణకు లారీల్లో తరలిస్తున్నారు. చెక్ పోస్టులను తప్పించి అడ్డదారుల్లో తెలంగాణ తరలిస్తున్నారు. వత్సవాయి మండలం నుంచి ఖమ్మంనకు పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తున్నారు. జగ్గయ్యపేట, నందిగామ ప్రాంతం నుంచి లారీకి 50 టన్నులకు పైగా లోడ్ చేస్తూ రూ.లక్షలు దండుకొంటున్నారు. ఇసుక రీచ్ల్లో యంత్రాల ద్వారా ట్రాక్టర్ లోడింగ్కు అధికార పార్టీ నాయకులు రూ.500 నుంచి రూ.600 అక్రమంగా వసూలు చేస్తున్నారు. ఇటీవల పెనుగంచిప్రోలు పోలీసులు అక్రమంగా హైదరాబాద్కు ఇసుక రవాణా చేస్తున్న తెలంగాణాకు చెందిన మూడు లారీలను పట్టుకున్నారు. లారీలకు ఎస్కార్ట్గా ముందు ఒక వాహనం ఉన్నట్లు గుర్తించారు. వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లో పెనుగంచిప్రోలుతో పాటు కొళ్లికూళ్ల, సుబ్బాయి గూడెం, వెంగనాయకునిపాలెం, గుమ్మడిదుర్రు, శనగపాడు, పోలంపల్లి, ఇందుగుపల్లి, కన్నెవీడు, శింగవరం, ఆళ్లూరుపాడు గ్రామాల నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనిగండ్ల పాడు రీచ్ నుంచి రాత్రి సమయాల్లో ట్రాక్టర్లలో తెలంగాణకు ఇసుక తరలిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పచ్చనేతలు ఇసుకను ఆర్థిక వనురుగా మార్చుకున్నారు. ఇబ్రహీంపట్నం మండలం ఫెర్రీ వద్ద కృష్ణా నదిలో 20 డ్రెడ్జింగ్ యంత్రాలతోకూడిన పడవలతో నది గర్భంలో ఉన్న ఇసుకను తవ్వి తరలిస్తున్నారు. కృష్ణానదిలో డ్రెడ్జింగ్ యంత్రాలతో ఇసుక తవ్వేందుకు వాల్టా చట్టం కింద అనుమతులు అవసరం. స్థానిక సచివాలయంలో సైతం అనుమతి పొందాలి. అయితే ఎటువంటి అనుమతులూ లేకుండా భారీ యంత్రాలతో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. భారీసైజు పడవల్లో లోడింగ్ చేసి ఒడ్డుకు తరలిస్తున్నారు. ఒడ్డుకు చేరిన పడవల నుంచి సుమారు 18 మ్యావల్ క్రేన్లతో ట్రాక్టర్లకు లోడింగ్ చేస్తున్నారు. ఫెర్నీ నుంచి రోజుకు సుమారు 500 ట్రాక్టర్ల వరకు ఇసుక రవాణా జరుగుతోంది. ఒక్కొక్క ట్రాక్టర్ ఇసుక లోడింగ్కు రూ.800 చొప్పున వసూలు చేస్తున్నారు. పరిసర గ్రామాలతో పాటు గుంటుపల్లి, గొల్లపూడి, భవానీపురం వరకు ఇక్కడి నుంచి ఇసుకు తరలిస్తున్నారు. ఈ లెక్కన రోజుకు సుమారు రూ.4 లక్షల వరకు అక్రమంగా సంపాదించి వెనకేసుకుంటున్నారు. ఈ తవ్వకాల వల్ల నదీ గర్భంలో ఏర్పడిన భారీ గోతుల వల్ల పలువురు ప్రమాదాలబారిన పడుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వం అనుమతించిన రేవుల నుంచి మాత్రమే ఇసుక తవ్వకాలు జర పాలి. పచ్చనేతలు ప్రభుత్వ ఆదేశాలను బేఖా తరు చేస్తూ ఇసుక తవ్వి ట్రాక్టర్ల ద్వారా తర లించి సొమ్ము చేసుకుంటున్నారు. ఏడాది క్రితం మైనింగ్ అధికారులు ఫెర్రీ ఇసుక రేవులో ఆకస్మిక దాడులు నిర్వహించి 24 ట్రాక్టర్లు, 18 క్రేన్లు, 10 పడవలను సీజ్ చేశారు. అప్పుడు ఓ నెల రోజులు ఇసుక దందా ఆపినా ఆ తరువాత యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఇబ్రహీంపట్నంతో పాటు దాములూరు, కొటికలపూడి గ్రామాల్లో సైతం కూటమి నాయకులు జేసీబీలతో ఇసుకను తవ్వి ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తరలించి అమ్ముకుంటున్నారు. -
వైద్య విద్యలో నాణ్యత పెంచేందుకు కృషి
హెల్త్ వర్సిటీ వీసీ డాక్టర్ చంద్రశేఖర్లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్య విద్యలో నాణ్యత పెంచేందుకు కృషి చేస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి.చంద్రశేఖర్ తెలిపారు. అందులో భాగంగా వైద్య కళాశాలల కోసం నూతనంగా నాక్ ఎంబీజీఎల్ అక్రెడిటేషన్, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాకింగ్స్ తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో బుధవారం ఆ రెండు అంశాలపై ఆన్లైన్ సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్లో యూనివర్సిటీ పరధిలోని అన్ని వైద్య కళాశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. ఎంబీజీఎల్ అక్రెడిటేషన్, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్కు సంబంధించి తాజా మార్పులు, విధానాలపై చర్చించారు. వాటి ద్వారా కేవలం మూల్యాంకన పద్ధతులు మాత్రమే కాకుండా, వైద్య విద్యలో నాణ్యతను పెంపొందించేందుకు ప్రేరణగా పనిచేస్తాయన్నారు. ఈ సెమినార్కు రిసోర్స్ పర్సన్గా హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్వాలిటీ అక్రెడిటేషన్ సీఈఓ టి.రవీంద్రరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాణ్యత ప్రమాణాలు, డాక్యుమెంటేషన్ విధానాలు, అవుట్ కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్, పరిశోధన ప్రాముఖ్యత వంటి విధానాలను వివరించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ టి.సాయిసుధీర్, పబ్లికేషన్స్ డైరెక్టర్ కె.సుధ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రాభివృద్ధికి కార్మికులు, యాజమాన్యం రెండు కళ్లు
భవానీపురం(విజయవాడపశ్చిమ): రాష్ట్రాభివృద్ధిలో కార్మికులు, యాజమాన్యం రెండు కళ్లులా భావిస్తూ సమతుల్యంగా ముందుకు సాగుతున్నామని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం జరిగిన శ్రమ శక్తి ఉత్తమ యాజమాన్య పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. కార్మికుల సంక్షేమం, భద్రత, ఉపాధి, ఆరోగ్యానికి అత్యంత ప్రాధానం ఇస్తున్నామని తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా లేబర్ అడ్డాస్ ఏర్పాటు చేసి ఉపాధి, విశ్రాంతి, వాష్ రూమ్స్, భోజనం, శిక్షణ సదుపాయాలను కల్పిస్తున్నామని వివరించారు. కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్లు, ఇన్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ కార్యదర్శి ఎం.వి.శేషగిరి బాబు మాట్లాడుతూ.. సాఫ్ట్వేర్ పరంగా లేబర్ కోడ్స్ ద్వారా కార్మికులకు కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకు కార్మిక శాఖ చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ – శ్రమ్ బీఓసీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలను మరింత విస్తృతం చేయడానికి చర్యలు తీసుకుటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డ్ చైర్మన్ వి.మల్లికార్జునరావు (బాబ్జి), ఎన్జీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, కార్మిక శాఖ కమిషనర్ గంధం చంద్రుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాచర్ల కేసీపీ సిమెంట్ ఐఎన్టీయూసీ యూనియన్ జనరల్ సెక్రటరీ జి.లక్ష్మీనారాయణ శ్రమ శక్తి అవార్డ్ అందుకున్నారు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ -
కార్మికుల మోముపై జలహాసం
జి.కొండూరు: నాలుగు దశాబ్దాలుగా వలస కార్మికుల కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలు చూపే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. 40 ఏళ్ల క్రితం పొట్టకూటి కోసం ఎల్లలు దాటి వచ్చి అటవీ ప్రాంతానికి ఆనుకొని నివసిస్తున్న ఒడిశా కార్మికుల దుర్భర జీవనంపై ఈ నెల 17వ తేదీన ‘నరక కూపాలు’ శీర్షికన సాక్షలో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి అధికార యంత్రాంగం స్పందించింది. తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక అవస్థలు పడుతున్ను కార్మికుల కుటుంబాల గొంతు తడిపే చర్యలు ప్రారంభమయ్యాయి. జి.కొండూరు మండలంలోని గడ్డమణుగు శివారు లోయ, పినపాక శివారు కడింపోతవరం పరిధిలోని అటవీ ప్రాంతంలో 35 ఒడిశా కార్మికుల కుటుంబాలు 40 ఏళ్లుగా మాస్టర్ క్యాంపు, 32 కుటుంబాలు గాంధీ క్యాంపుగా ఏర్పడి నివసిస్తున్నాయి. అయితే తమ ప్రాంతాల్లో కనీస మౌలిక వసతులు లేక ఆ కుంటుంబాల వారు నరకయాతన పడుతున్నారు. గుక్కెడు తాగునీరు అందక వారు పడుతున్న ఇబ్బందిని వివరిస్తూ ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనానికి స్పందించిన అధికారులు గడ్డమణుగు పంచాయతీ నుంచి మాస్టర్ క్యాంపునకు, పినపాక పంచాయతీ నుంచి గాంధీ క్యాంపునకు రోజుకు ఐదు వేల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకర్లను మంగళవారం రాత్రి నుంచి పంపుతున్నారు. ఈ నీరు క్యాంపుల్లో నివాసం ఉండే కుటుంబాలు తాగేందుకు వినియోగించుకోను న్నారు. ఇకపై తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు ఒక్కొక్క క్యాంపులో ఒకటి చొప్పున సంపులు నిర్మించి ట్యాంకర్ల ద్వారా తరలించిన నీటిని వాటిలో నింపనున్నారు. త్వరలో పైపులైను ఏర్పాటు ఈ రెండు క్యాంపుల్లో ఉన్న రెండు బోర్లలో నీరు కలుషితమై పసుపు రంగులో వస్తోంది. కార్మిక కుటుంబాలు వారు ఇంటి, వ్యక్తిగత అవసరాలకు ఇదే నీటిని వినియోగించి అలర్జీల బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ఈ రెండు క్యాంపులకు 600 మీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ బోరు నుంచి నీటిని సరఫరా చేసేందుకు పైపులైను ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. అతి త్వరలో ఈ పైపులైను కూడా ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో నీటి సమస్యకు పరిష్కారం లభించినట్లేనని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఔషధం బంద్
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆన్లైన్లో మందుల విక్రయాలను వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ దేశ వ్యాప్తంగా 24 గంటల బంద్కు పిలుపునిచ్చారు. ఆ మేరకు ఎన్టీఆర్, కృష్ణాజిల్లాల్లోని ఔషధ వ్యాపారులు బుధవారం బంద్ పాటించారు. దీంతో మందుల షాపులు తెరుచుకోలేదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. మూతపడిన షాపులు ఉమ్మడి కృష్ణాజిల్లాలో హోల్సేల్ రిటైల్ కమిటీ 4500 వరకూ మందులు షాపులు ఉన్నాయి. వాటిలో 2600 వరకూ ఎన్టీఆర్జిల్లాలోనే ఉన్నాయి. అవన్నీ బుధవారం మూతపడ్డాయి. మధ్యాహ్నం 12 గంటల వరకూ ఒక్కషాపు కూడా తెరుచుకోలేదు. అనంతరం కొన్ని షాపులను తెరిచారు. నగరంలో భారీ ర్యాలీ ఎన్టీఆర్ జిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అందులో భాగంగా సూర్యారావుపేట నక్కలరోడ్డులోని సిద్ధార్థ మెడికల్స్ వద్ద ప్రారంభమైన ర్యాలీ ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్, ఏఎస్ రామారావు రోడ్డు, డోర్నకల్ రోడ్డులోనుంచి ఏలూరు రోడ్డులో కలిసి తిరిగి నక్కల రోడ్డు నుంచి ప్రారంభమైన చోటుకి చేరుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డీవీఆర్ సాయికుమార్ మాట్లాడుతూ ఆన్లైన్లో మందుల విక్రయాలు జరపడమంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమే నన్నారు. ప్రిస్కిప్షన్ లేకుండా మందులు ఇవ్వడమే కాకుండా, ప్రిస్కిప్షన్ కూడా ఆన్లైన్లోనే రూపొందించడం గమనార్హం అని అన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు సాధుప్రసాద్, జి శ్రీహరిరావులతో పాటు పెద్ద సంఖ్యలో కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ పాల్గొన్నారు. -
47 మందికి రూ.4.75 లక్షలు జరిమానా
మద్యం తాగి వాహనాలు నడిపిన 10 మందికి జైలు శిక్ష కృష్ణలంక(విజయవాడతూర్పు): మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 10 మంది వాహనదారులకు న్యాయస్థానం జైలు శిక్ష విధించినట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం పర్యవేక్షణలో నగరంలోని రెండు, మూడు, ఐదు, ఆరో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారని చెప్పారు. ఈ సందర్భంగా 57 మంది మద్యం తాగి వాహనాలు నడిపిన వాహన చోదకులను గుర్తించి సంబంధిత న్యాయస్థానాలలో ప్రవేశపెట్టగా, న్యాయమూర్తులు వారిలో 10మందికి ఒక్కొక్కరికి రెండు రోజులు చొప్పున జైలు శిక్ష, 47 మందికి రూ.4.75 లక్షలు జరిమానా విధించారన్నారు. ప్రతి రోజు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహించి పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేస్తామని సీపీ తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నలుగురికి జరిమానా చిలకలపూడి(మచిలీపట్నం): మద్యం తాగి వాహనాలను నడిపిన నలుగురు వ్యక్తులకు జరిమానా విధిస్తూ మెజిస్ట్రేట్ భూపతి శ్రీనివాసరావు బుధవారం తీర్పు చెప్పారు. మచిలీపట్నం నగరంలోని రాబర్ట్సన్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో నలుగురు వ్యక్తులు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు ధ్రువీకరించారు. వారిని బుధవారం ఉదయం కోర్టుకు హాజరుపరచగా, న్యాయమూర్తి విచారణ చేసి ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానా విధించారు. అన్ని వర్గాల అభ్యున్నతే మోదీ ప్రభుత్వ లక్ష్యం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు టీఎన్వీ మాధవ్ పెనుగంచిప్రోలు: అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు టీఎన్వీ మాధవ్ అన్నారు. స్థానిక మునేరు అవతల కంఠంనేని గార్డెన్స్లో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ ఎన్టీఆర్ జిల్లా రెండు రోజుల శిక్షణ తరగతులు బుధవారం ప్రారంభమయ్యాయి. ముందుగా జ్యోతి ప్రజ్వలన నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల్లో మాధవ్ మాట్లాడుతూ దేశం ముందు.. పార్టీ తరువాత.. వ్యక్తిగతం చివర అనే సిద్ధాంతంతో బీజేపీ పనిచేస్తుందన్నారు. హిందూ జీవన దృష్టి అంటే అందరినీ సమానంగా చూసే దృష్టి అన్నారు. ప్రపంచ గందర గోళానికి సమాధానం మన ఆధ్యాత్మికం ద్వారా దొరుకుతుందన్నారు. పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ బీజేపీకి కమలం గుర్తు పెట్టారని, కమలం బురదలో నుంచి వికసిస్తుందని, కమలానికి బురద అంటదన్నారు. కమలం పువ్వులోని రేకలు ప్రజాస్వామ్యం, సమానత్వం, సర్వధర్మ భావన, విలువలతో కూడిన రాజకీయం, జాతి జాతీయత వంటి పంచ నిష్టలతో ఏర్పడిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సబ్ కా సాథ్, సబ్కా వికాస్ అనే నినాదంతో పరిపాలన సాగిస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ ఇంధన పొదుపు పాటించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అబ్బూరి శ్రీరామ్, దక్షిణాది రాష్ట్రాల ప్రశిక్షణ కమిటీ కన్వీనర్ కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు ఉప్పాలపాటి శ్రీనివాసరావు, నాగలక్ష్మి, సయ్యద్ బాషా, మువ్వల సుబ్బయ్య, గణేష్, జిల్లా నాయకులు కల్లూరి శ్రీవాణి, అన్నెపాక ప్రపుల్ల శ్రీకాంత్, స్థానిక నాయకులు నరసింహారావు, స్వామి, తునికిపాటి రామాచారి, తదితరులు పాల్గొన్నారు. -
డీఆర్డీఏ పీడీ వేధింపులతో ఏపీడీ అదృశ్యం
విజయవాడరూరల్: ఎన్టీఆర్ జిల్లా డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ అనుమల నాగ వెంకట నాంచారావు వేధింపులు తాళలేక తాను చనిపోతున్నట్టు లేఖ రాసి విజయవాడ రూరల్ మండల ఏపీఎం గంధం చంద్రశేఖర్ అదృశ్యమయ్యారు. ఈ విషయం డీఆర్డీఏ వర్గాల్లో సంచలనం కలిగించింది. పీడీకి పంపిన లేఖ లోని సారాంశం ఈ విధంగా ఉంది. గొల్లపూడి క్లస్టర్ ఎంఎస్సీసీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గొల్లపూడి బ్రాంచి, కొన్ని ఇతర బ్యాంకులలో కూడా ఫేక్ డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేయడమే గాక రుణాలు ఇప్పించి, అందిన కాడికి డబ్బులు వసూలు చేశారని గత ఏడాది అక్టోబర్ నెల 6వ తేదీన రిపోర్ట్ సబ్మిట్ చేశారు. రిపోర్ట్ అందిన రెండు రోజులకు అనగా 8వ తేదీన డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ చంద్రశేఖర్ను సస్పెండ్ చేశారు. తాను ఎటువంటి ఆర్థిక అవకతవకలకు పాల్పడలేదని తనను సస్పెండ్ చేసి 8 నెలలుగా పోస్టింగ్ ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయారు. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజాప్రతినిధులకు తెలియచేసి వారితో పీడీకి ఫోను చేయించినా వారం రోజుల్లో పోస్టింగ్ ఇస్తానని చెప్పి ఇవ్వలేదని, తన ఆర్థిక పరిస్థితి, తన కుటుంబ పరిస్థితిని తెలియచేసినా పోస్టింగ్ ఇవ్వలేదన్నారు. దీంతో తాను తీవ్ర మానసిక వేదనకు లోనై చనిపోవాలని నిర్ణయం తీసుకొన్నట్లు ఏపీఎం గంధం చంద్రశేఖర్ ఆ లేఖలో పేర్కొన్నారు. చంద్రశేఖర్ అదృశ్యంపై భవానీపురం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): డీఆర్డీఏలో ఔట్సోర్సింగ్ విధానంలో ఏపీఎంగా పనిచేస్తూ ఇటీవల సస్పెండ్ అయిన వ్యక్తి అదృశ్యమైన ఘటన భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు... జగ్గయ్యపేట మండలం షేర్మహమ్మద్పేటకు చెందిన గంధం చంద్రశేఖర్ డీఆర్డీఏలో ఔట్సోర్సింగ్ విధానంలో ఏపీఎంగా పనిచేస్తున్నాడు. గొల్లపూడి కార్యాలయానికి దగ్గర్లోనే నివాసం ఉంటున్నాడు. 8 నెలల క్రితం ఆఫీసులో జరిగిన అవకతవకల నేపథ్యంలో సస్పెండ్ అయ్యాడు. అప్పటి నుంచి మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉంటున్నాడు. తనను తిరిగి విధులలో చేర్చుకోవాలని డీఆర్డీఏ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అక్కడి అధికారులు కొంత సమయం వేచి ఉండాలని సూచించారు. దీంతో మనస్తాపానికి గురైన చంద్రశేఖర్ ఇంటి నుంచి డీఆర్డీఏ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ నుంచి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి కనిపించకుండా వెళ్లిపోయాడు. దీనిపై చంద్రశేఖర్ తల్లి గంధం అంజమ్మ భవానీపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
పలు దొంగతనాల కేసుల్లో నిందితులు అరెస్ట్
రూ.10 లక్షల విలువైన 75 గ్రాముల బంగారు ఆభరణాలు, బైక్ స్వాధీనం కృష్ణలంక(విజయవాడతూర్పు): పలు దొంగతనం కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు రూ.10 లక్షల విలువైన 75 గ్రాముల బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కృష్ణలంక ఎస్ఐ ఎస్.గిరిధర్ బాబు తెలిపారు. బస్టాండ్లోని పోలీసు అవుట్పోస్ట్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టి కేసుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. విజయనగరం జిల్లా ధర్మపురి బీసీ కాలనీకి చెందిన 25 సంవత్సరాల వయస్సు కలిగిన ఉప్పలాడ రాము చిన్నప్పటి నుంచే చెడు వ్యసనాలకు అలవాటు పడి, జల్సాలకు బానిసగా మారాడు. రోజువారీ కూలి పనులు చేసి సంపాదించే ఆదాయం సరిపోక సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నాడు. ఈ క్రమంలో విజయనగరం ప్రాంతంలో పలు మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడి వాటిని విక్రయించి వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడు. అనంతరం విజయవాడకు వచ్చి ఎన్ఆర్ఐ హోమ్కేర్ సర్వీసెస్ సంస్థలో ఉద్యోగిగా చేరాడు. నిందితుడు కావాలనే వృద్ధులు మాత్రమే నివసించే ఇంట్లో పని కల్పించాలని సంస్థ నిర్వాహకులను కోరాడు. వారు కూడా ఇతని నేర చరిత్ర గురించి తెలుసుకోకుండా తమ కమిషన్ కోసం బృందావన్ కాలనీలో నివసిస్తున్న ఫిర్యాదిదారుల ఇంటిలో నెలకు రూ.20వేలు జీతంపై కేర్టేకర్గా నియమించారు. విధుల్లో చేరిన రెండు రోజులకే సుమారు 32 గ్రాముల బంగారు గొలుసును అపహరించి ఉద్యోగాన్ని మానేశాడు. అనంతరం ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ నెల 13వ తేదీ తెల్లవారుజామున ఉదయం 3 గంటల సమయంలో అతని స్నేహితుడు రామలింగేశ్వరనగర్కు చెందిన బోలు మణికంఠ అలియాస్ నేరంతో కలిసి ఇంటి వద్దకు చేరుకున్నాడు. రాము ఒక్కడే రహస్యంగా ఫిర్యాదిదారుని ఇంట్లోకి ప్రవేశించాడు. ఇల్లు మొత్తం వెతికినా విలువైన వస్తువులు దొరకలేదు. దీంతో ఆగ్రహానికి గురైన నిందితుడు వంటగదిలో ఉన్న కత్తిని తీసుకొని బెడ్రూమ్లో నిద్రిస్తున్న ఫిర్యాదిదారుని చంపుతానని భయపెట్టి అతని మెడలో ఉన్న సుమారు 5 తులాల బంగారు గొలుసును అపహరించి అక్కడి నుంచి నేరంతో కలిసి పరారయ్యాడు. బాధితుని ఫిర్యాదుపై వెంటనే అప్రమత్తమై నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించామని ఎస్ఐ గిరిధర్ తెలిపారు. సీపీ రాజశేఖర బాబు ఆదేశాల మేరకు తమ సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ముమ్మరం చేశామన్నారు. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించి లొకేషన్ ఆధారంగా నిందితుడు రాము విశాఖపట్నం వెళుతున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు. విచారణలో అపహరించిన బంగారు గొలుసును మింగినట్లు ఒప్పుకున్నాడు. వెంటనే నిందితునికి వైద్య పరీక్షలు, స్కానింగ్ నిర్వహించి వైద్యుల సహాయంతో అతని కడుపులో నుంచి బంగారు గొలుసును బయటకు తీశామన్నారు. దానితో పాటు అదే ఇంటిలో దొంగతనం చేసిన మరో బంగారు గొలుసును కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. అతని వద్ద నుంచి రూ.10లక్షల విలువైన 75 గ్రాముల బంగారు నగలతో పాటు ఒక బజాజ్ పల్సర్ 220 బైక్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడి గత చరిత్ర, అతనిపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను పరిశీలించకుండా పోలీసు ధ్రువీకరణ చేపట్టకుండానే ఉద్యోగంలో నియమించిన సంస్థ నిర్వాహకులను కూడా కేసులో చేర్చామన్నారు. నిందితునికి సహాయం చేసిన నేరంను కూడా అరెస్ట్ చేశామన్నారు. ప్రజలు తమ ఇళ్లలో పని కోసం వ్యక్తులను నియమించుకునే ముందు తప్పనిసరిగా పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ముక్త్యాల(జగ్గయ్యపేట): అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఓ వ్యక్తి మృతదేహాన్ని బుధవారం గ్రామస్తులు గుర్తించారు. వివరాలలోకి వెళితే మండలంలోని కె.అగ్రహారం గ్రామానికి చెందిన దార్ల కృష్ణ (46) తాపీ పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్నాడు. రోజూ మాదిరిగానే మంగళవారం కూడా పనికి వెళ్లి రాత్రికి ఇంటికి రాలేదు. బుధవారం ఉదయం గ్రామ సమీపంలోని సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద మృతి చెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చిల్లకల్లు ఎస్ఐ తోట సూర్య శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుని భార్య ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందగా ఇద్దరు పిల్లలతో నివాసముంటున్నాడు. -
జీవితాన్ని నాశనం చేసుకోవద్దు
లబ్బీపేట(విజయవాడతూర్పు): డ్రగ్స్ వంటి వాటికి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు యువతకు సూచించారు. తప్పుడు మార్గాలు ఎంచుకోవడం సులభమే కావచ్చునని, కానీ వాటి వలన కలిగే నష్టం ఒక వ్యక్తితో ఆగిపోదని, అది కుటుంబాలను, సమాజాన్ని చిన్నాభిన్నం చేస్తుందన్నారు. విజయవాడ నార్త్ డివిజన్ పరిధిలో డ్రగ్స్పై దండయాత్ర 2.0 కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన తనిఖీలలో పాజిటివ్ వచ్చిన యువకులకు అలవాటు మానుకుని మంచి మార్గంలో నడిచే విధంగా మార్పుకు మరో అవకాశం అనే నినాదంతో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ స్వయంగా కౌన్సెలింగ్ కు వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడారు. వారికి ఉన్న సోషల్ మీడియా అకౌంట్ల గురించి, వారి చేతులపై ఉన్న పచ్చబొట్లు, కోతలు, వివిధ అంశాలను గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ నేటి యువత తెలిసీ తెలియక తప్పుడు అలవాట్లకు, డ్రగ్స్ (గంజాయి) వంటి వ్యసనాలకు బానిసలై తమ విలువైన భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారన్నారు. నగరంలో శాంతిభద్రతలను కాపాడటమే కాకుండా, బాధ్యత గల పౌరులను తయారుచేయాలనే సత్సంకల్పంతో మహాన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. జీరో టాలరెన్స్ టు డ్రగ్స్ అనే నినాదంతో యువతను, సమాజాన్ని మత్తు పదార్ధాల నుంచి పూర్తిగా దూరం చేయడమే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీసీపీ కేజీవీ సరిత, ఏడీసీపీ జి.రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
వేద పరిరక్షణ ట్రస్ట్కు రూ.లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలోని వేద పరిరక్షణ ట్రస్ట్కు హైదరాబాద్కు చెందిన భక్తులు బుధవారం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. హైదరాబాద్ ఈసీఐఎల్కు చెందిన వేదాంతం షణ్ముఖ రామకృష్ణ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారిని కలిసి వేద పరిరక్షణ ట్రస్ట్కు రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. అక్రమ మద్యం కేసులో రిమాండ్ పొడిగింపు విజయవాడలీగల్: అక్రమ మద్యం కేసులో నిందితుల రిమాండ్ బుధవారం ముగియడంతో గుంటూరు జైలులో రిమాండ్లో వున్న ప్రణోయ్ప్రకాష్ను పోలీసులు సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. ప్రణోయ్ప్రకాష్ రిమాండ్ను వచ్చే నెల 3వ తేదీవరకు పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. అనంతరం ప్రణోయ్ ప్రకాష్ను గుంటూరు జైలుకు తరలించారు. బెయిల్పై ఉన్న నిందితుల్లో వాసుదేవరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, వెంకటేష్నాయుడు, బాలాజీ కుమార్యాదవ్, నవీన్కృష్ణ న్యాయస్థానంలో హాజరుకాగా, మిగతా నిందితులు న్యాయస్థానంలో హాజరుకాలేక న్యాయవాదుల ద్వారా గైర్హాజరు పిటిషన్లు దాఖలు చేశారు. శాంతి మధ్యంతర బెయిల్పై విచారణ పూర్తి అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణపై నమోదైన కేసులో విజయవాడ జిల్లా జైలులో జ్యుడీషియల్ రిమాండ్లో వున్న దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ కె.శాంతికి మధ్యంతర బెయిల్ కోరుతూ న్యాయవాది గోలి నరసింహారావు పిటీషన్ దాఖలు చేశారు. పిటీషన్పై బుధవారం న్యాయస్ధానంలో వాదనలు వినిపిస్తూ శాంతి కుమార్తెకు ఊటీలో 6వ తరగతి చేర్పించేందుకు ఈనెల 23 నుంచి 28 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇరు పక్షాల వాదనలు పూర్తవ్వడంతో ఇన్చార్జి సీబీఐ న్యాయమూర్తి తీర్పును గురువారానికి వాయిదా వేశారు. అభినయ్ దర్శన్పై కఠినచర్యలు తీసుకోవాలి పటమట(విజయవాడతూర్పు): క్రైస్తవ ప్రచారకుడి ముసుగులో తనపై దాడి, హత్యాయత్నం జరిగిందంటూ ఫేక్ డ్రామాపై రక్తికట్టిస్తున్న పాస్టర్ అభినయ్ దర్శన్పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ లీడర్స్ ఫోరం (ఏపీసీఎల్ఎఫ్) స్టేట్ ప్రెసిడెంట్ ఆలివర్ రాయ్ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పాస్టర్ అభినయ్ దర్శన్ క్రైస్తవ సమాజానికి తలవంపు తెచ్చే కట్టు కథలకు స్వస్తి పలకాలని, ఆయన చేస్తున్న తప్పుడు కథలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పాస్టర్ అభినయ్ మే 18న అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం, నిరుతోటపాలెం గ్రామంలో మతోన్మాదులు తనపై హత్యాయత్నం చేశారని ఫేక్ డ్రామా సృష్టించారని విమర్శించారు. తన అనుచరులతోనే దాడి చేయించుకొని కట్టుకథలు అల్లుతున్నాడని, పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించి పాస్టర్ దర్శన్ అనుచరులను ప్రశ్నించటంలో అసలు కట్టు కథ బట్టబయలయిందన్నారు. రక్షణ కరువైన శిక్షణ నాగాయలంక: నాగాయలంకలోని కృష్ణానది తీరంలో రాష్ట్రప్రభుత్వ జలక్రీడల శిక్షణ అకాడమీ (వాటర్ స్పోర్ట్స్ అకాడమీ) ఆధ్వర్యంలో ఈనెల 1వతేదీ నుంచి బాలలతో వేసవి జల క్రీడల శిక్షణ సందడిగా కొనసాగుతోంది. గ్రామానికి చెందిన నాయుడు గాయత్రి, కన్నా కుమార్, మరి కొందరు క్రీడాకారులు జాతీయ స్థాయిలో పతకాలు సాధించి ఇక్కడి వాటర్ స్పోర్ట్స్ అకాడమీకి కీర్తి తెచ్చారు. ఈ ఏడాది సమ్మర్ కోచింగ్ క్యాంప్–2026 ఈనెల 31వరకు కొనసాగుతుందని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(శాప్) అధికారులు చెప్పారు. వాటర్ స్పోర్ట్స్ అకాడమీ కింద శాప్ నేతృత్వంలో ఎంపిక చేసిన 50 మంది బాలలకు గ్రామానికి చెందిన జాతీయ జల క్రీడాకారులు నాగిడి గాయత్రి, కన్నా కుమార్ శిక్షణ ఇస్తున్నారు. ఉదయం 6 నుంచి గం.8.30 గంటల వరకు, సాయంత్రం 4.30 నుంచి 6.30 గంటల వరకు శిక్షణ ఇస్తున్నారు. ఆన్లైన్లో ఎవరూ నమోదు చేసుకోకపోవడంతో శిక్షణ కేవలం స్థానిక బాలలకే పరిమితమైంది. రక్షణ చర్యలు ఏవీ... వేసవి శిక్షణ అయితే ఇస్తున్నారు కానీ బాలలకు సరైన రక్షణ చర్యలను ప్రభుత్వ అధికారులు సమకూర్చలేదు. లైఫ్ జాకెట్లు కనిపించలేదు సరికదా బాలలు ఫిట్నెస్ వ్యాయామాలు చేసేందుకు క్రీడాశాఖ కనీస మ్యాట్లు కూడా ఇవ్వకపోవడంతో చిన్నారులు ఘాట్లోని రాతి నేలపైనే వ్యాయామ శిక్షణ పొందాల్సి వస్తోంది. ఈ విషయమై వివరణ కోరగా జిల్లా క్రీడా సంస్థ అధికారి ఝాన్సీ మాట్లాడుతూ ఆన్లైన్లో పిల్లలు నమోదు చేసుకోలేక పోతున్నారని అన్నారు. పిల్లలకు చిక్కీలు ఇస్తున్నామని చెప్పారు. చిన్న చిన్న ఆట వస్తువులు సమకూర్చామని, అవి నాగాయలంకకు పంపించాల్సి ఉందని, తనకు ఆరోగ్యం బాగుండక వెళ్లలేక పోయానన్నారు. నిధులు కేటాయించాల్సిన పరిస్థితి ఉందనేది వాస్తవమేనని అంగీకరించారు. -
బ్యాంకింగ్ మోసాల నివారణపై వర్క్ షాప్
పటమట(విజయవాడతూర్పు): మారుతున్న కాలంతో పాటు సైబర్ నేరగాళ్లు సరికొత్త పద్ధతుల్లో బ్యాంకింగ్ మోసాలకు పాల్పడుతున్నారని, వీటిని అరికట్టడానికి బ్యాంక్ సిబ్బంది, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు అన్నారు. బుధవారం పోలీస్ కమిషరేట్లో బ్యాంకింగ్ మోసాల పై ఐసీఐసీఐ బ్యాంకు ప్రతినిధులతో ఆయన వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్యాంకింగ్ మోసాలు జరిగినప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులను ఎలా గుర్తించాలి, త్వరితగతిన నిధులను ఎలా ఫ్రీజ్ చేయాలి, కేసుల దర్యాప్తులో పాటించాల్సిన చట్టపరమైన వ్యూహాలపై ఐసీఐసీఐ బ్యాంక్ నిపుణులతో కలిసి చర్చించారు. సేవింగ్స్ ఖాతాల నుంచి కరెంట్ ఖాతాలకు మార్పిడి జరిగే సమయంలో కస్టమర్ల వివరాలను పూర్తిగా పరిశీలించాలని, అనుమానాస్పద లావాదేవీలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. బ్యాంకులు, పోలీసులు కలిసికట్టుగా పనిచేస్తేనే బాధితులకు న్యాయం చేయగలమన్నారు. ప్రజలు కూడా అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే వాట్సాప్ లేదా వీడియో కాల్స్ నమ్మి ’డిజిటల్ అరెస్ట్’ భయానికి లోనుకావద్దని, ఎలాంటి ప్రభుత్వ సంస్థ కూడా డబ్బులు డిమాండ్ చేయదని గ్రహించాలన్నారు. ఎవరైనా బ్యాంకింగ్ లేదా సైబర్ మోసానికి గురైతే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు నమోదు చేయాలని, మోసం జరిగిన మొదటి గంట (గోల్డెన్ అవర్) లో ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న సొమ్మును తిరిగి రాబట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సైబర్ క్రై మ్ డీసీపీ కె.కృష్ణ ప్రసన్న, డీసీపీలు కృష్ణకాంత్ పటేల్, షిరీన్ బేగం, డాక్టర్ కె.తిరుమలేశ్వర రెడ్డి, కేజీవీ సరిత, ఏబీటీఎస్. ఉదయరాణి, ఏసీపీలు, సీఐలు, ఎస్ఐ లతో పాటు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రతినిధులు నీలేష్ దేశ్ పాండే, రజనీష్ ఖన్నా, సందీప్ మెహర, అన్నాజీ తదితరులు పాల్గొన్నారు. -
రైతులను ఇబ్బంది పెట్టొద్దు
యూరియా సరఫరాపై సమావేశంలో కలెక్టర్ డీకే బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళిక ప్రకారం యూరియా పంపిణీ చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశం హాలులో మంగళవారం ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, జేసీ నవీన్లతో కలిసి వ్యవసాయశాఖాధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకుని యూరియాను పకడ్బందీగా పంపిణీ చేయాలన్నారు. ప్రతి రైతుకు వరి పంటకు అవసరమైన యూరియాను ఒకేసారి కాకుండా మూడుదశలతో సరఫరా చేయాలన్నారు. ఆ మేరకు మాత్రమే యూరియాను రైతు సేవా కేంద్రాలు, సహకార పరపతి సంఘాలలో అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతి రైతుకు ఈ పంట నమోదు ప్రకారం ఎకరానికి రెండు బస్తాలు చొప్పున అందజేయాలన్నారు. చిన్న,సన్నకారు రైతులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ మాట్లాడుతూ జిల్లాలోని 326 రైతు సేవా కేంద్రాలు, 185 సహకార సంఘాలున్నాయన్నారు. ప్రస్తుతం జిల్లాలో 4,600 మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో ఉందన్నారు. జిల్లా వ్యవసాయశాఖాధికారి ఎన్. పద్మావతి, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ మురళీ కిషోర్, జిల్లా ఉద్యాన శాఖాధికారి జె. జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
మ్యూజియం డే వేడుకలు విజయవంతం
అధికారులను అభినందించిన కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గతంలో ఎన్నడూలేని విధంగా అంతర్జాతీయ మ్యూజియం డే వేడుకలను విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైన అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అభినందించారు. మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ లక్ష్మీశను ఆర్కియాలజీ అండ్ మ్యూజియమ్స్ శాఖ కమిషనర్ పి.సరేష్, డెప్యూటీ డైరెక్టర్ రామసుబ్బారెడ్డి, ఏడీలు ఎస్.వెంకటరావు, కె.నరసింహనాయుడు, ఆర్.శివకుమార్, ఇ.భాస్కర్ నాయక్, జి.గంగాధర తదితరులు కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. సికింద్రాబాద్–నహర్లాగన్ మధ్య వేసవి వారాంతపు రైలు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో విజయవాడ, గుంటూరు నగరాల మీదుగా సికింద్రాబాద్ – నహర్లాగన్ మధ్య ప్రత్యేక వారాంతపు రైళ్లను నడపనున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్ఓ నుస్రత్ మండ్రుప్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ – నహర్లాగన్ (07046) ప్రత్యేక రైలు ఈ నెల 29 నుంచి జూన్ 26 వరకు ప్రతి శుక్రవారం ఉదయం 8.30 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరి, ఆదివా రం సాయంత్రం నాలుగు గంటలకు నహర్లాగన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు జూన్ ఒకటి నుంచి 29 వరకు ప్రతి సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు నహర్లాగన్లో బయలుదేరి, బుధవారం రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. రెండు మార్గాలలో చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళంరోడ్డు, పలాస, బ్రహ్మపూర్ స్టేషన్లలో ఆగుతుంది. -
ఆలయాల్లో ఆన్లైన్ సేవలు పెంచాలి
భవానీపురం(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలోని ఆలయాల్లో భక్తులకు కల్పించే సౌకర్యాల విషయంలో రాజీ పడవద్దని దేవదాయ శాఖ ఎక్స్అఫిషియో కార్యదర్శి డాక్టర్ ఎం.హరి జవహర్లాల్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గొల్లపూడిలోని రాష్ట్ర దేవదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో ఆర్జేసీ, డీసీ కేడర్కు చెందిన 22 ప్రధాన ఆలయాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లతో మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టారు. భక్తులకు మరింత సులభంగా, వేగంగా సేవలు అందించేందుకు ఆలయాల్లో ఆన్లైన్ సేవలను పెంచాలని సూచించారు. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా నూతన ఆర్జిత సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ఈవోలను ఆదేశించారు. రూప్ టాప్ వాటర్ హార్వెస్టింగ్ ఏర్పాటు చేయాలి.. భూగర్భ జలాల పెంపుదలకు అన్ని ఆలయాల భవనాలపై ‘రూఫ్ టాప్ వాటర్ హార్వెస్టింగ్’ (వర్షపు నీటి సంరక్షణ) పద్ధతులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కమిషనర్ రామచంద్ర మోహన్ పేర్కొన్నారు. ఆలయాల్లో సూయజ్, సల్లేజ్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని, తద్వారా నీటిని శుద్ధి చేసి పునర్వినియోగంలోకి తీసుకురావాలని చెప్పారు. రానున్న నెల రోజుల్లోగా అన్ని దేవాలయాల్లో పైప్డ్ గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు పూర్తి కావాలని స్పష్టం చేశారు. సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ఆలయాల్లో సంప్రదాయేతర విద్యుత్ వనరులను ప్రోత్సహించాలన్నారు. రాష్ట్ర దేవదాయ శాఖ ఎక్స్అఫీషియో కార్యదర్శి హరిజవహర్లాల్ -
పిల్లలకు పురుగుల చిక్కీలు!
మచిలీపట్నంఅర్బన్: పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల నిర్వహణలో నిర్లక్ష్యం వెలుగు చూసింది. వేసవి శిబిరాల్లోని పిల్లలకు నాసిరకం చిక్కీలను పంపిణీ చేస్తూ వారి ఆరోగ్యంతో చెలగాటం ఆడుతోంది. చిక్కీలను సరైన విధంగా నిల్వ చేయకపోవడం, గడువు ముగిసిన వాటిని పంపిణీ చేయడం, నాణ్యత లేని పదార్థాలను తయారీలో వినియోగించడం వంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సమ్మర్ క్యాంపులు ఇలా.. జిల్లాలోని 40 సమ్మర్ క్యాంపుల్లో 22 రకాల క్రీడలను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపులకు మొత్తం 1,283 మంది క్రీడాకారులు నమోదు చేసుకోగా, వారిలో 494 మంది బాలికలు, 789 మంది బాలురు ఉన్నారు. కోచ్లు అందుబాటులో ఉన్న చోట వారి పర్యవేక్షణలో, కోచ్లు లేని ప్రాంతాల్లో సీనియర్ క్రీడాకారుల సహకారంతో సమ్మర్ క్యాంపులు జరుగుతున్నాయి. వీరికి పోషకాహారం నిమిత్తం చిక్కీలను పంపిణీ చేస్తున్నారు. మంగళవారం హాకీ క్రీడాకారులు, చిన్నారులకు పంపిణీ చేసిన బెల్లం–పల్లీ చిక్కీలలో పురుగులు కనిపించాయి. వాటిని చూసిన పిల్లలు షాక్కి గురయ్యారు. ఎక్స్పైరీ తేదీపై సందేహాలు.. పంపిణీ చేస్తున్న చిక్కీ ప్యాకెట్లపై స్పష్టమైన ఎక్స్పైరీ తేదీలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ‘బెస్ట్ బిఫోర్’ అనే ముద్రతో మాత్రమే సరుకులను పంపిణీ చేస్తూ నిబంధనల్లో లొసుగులు వినియోగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో నిల్వలో ఉన్న పాత సరుకే పిల్లలకు అందుతున్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆట పరికరాల కొరత.. మే 1 నుంచి మే 31 వరకు జిల్లాలో సమ్మర్ క్రీడా కోచింగ్ క్యాంపులు జరుగుతున్నాయి. జిల్లాలో 1,283 మంది క్రీడాకారులు నమోదు చేసుకున్నప్పటికీ, ఆట పరికరాల కొరత కారణంగా రోజువారీ హాజరు సుమారు 600 నుంచి 700 వరకు ఉంటుందని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. ఉదయం, సాయంత్రం జరిగే శిక్షణకు సగానికి పైగా క్రీడాకారులు ఆసక్తి చూపడం లేదు. మే 30తో క్యాంపులు ముగియనున్నప్పటికీ ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో క్రీడా పరికరాలు అందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పిల్లలకు పౌష్టికాహారం అందించాల్సిన వ్యవస్థలో నిల్వలు, సరఫరాలపై పర్యవేక్షణ లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. పోషకాహారం పేరుతో నాసిరకం, పాత పదార్థాలను పంపిణీ చేస్తే ప్రభుత్వ పథకాల లక్ష్యమే ప్రశ్నార్థకమవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు నిల్వలపై సమగ్ర తనిఖీలు నిర్వహించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సమ్మర్ క్యాంపుల్లో పంపిణీ చేసిన చిక్కిల్లో పురుగులు ఉన్నాయన్న ఆరోపణలు మా దృష్టికి రాలేదు. ఫ్రెష్ స్టాక్నే పంపిణీ చేశాం. కొన్ని పరికరాలను ప్రభుత్వం ఇప్పటికే అందించింది. మిగతా అవసరమైన క్రీడా పరికరాల కొనుగోలుకు అనుమతులు ఇచ్చి, ఇందుకు అవసరమైన నిధులను కూడా విడుదల చేసింది. కలెక్టర్ అనుమతితో అవసరమైన ఆటపరికరాలను కొనుగోలు చేస్తాం. – ఝాన్సీ లక్ష్మి, జిల్లా స్పోర్ట్స్ అభివృద్ధి అధికారి, మచిలీపట్నం -
ద్వీపం!
విజయవాడ సిటీఎన్టీఆర్ జిల్లాబుధవారం శ్రీ 20 శ్రీ మే శ్రీ 2026కొడిగట్టిన కళావిహీనంగా ప్రకృతి వరప్రదాయిని జగ్గయ్యపేట: తిరుమలగిరిలోని వేంకటేశ్వర స్వామి నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన ఆలపాటి సాంబశివరావు దంపతులు రూ. 1,00,116ను విరాళంగా అందించారు.మోపిదేవి: శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయం భక్తులతో కోలాహలంగా మారింది. మంగళవారం వివిధ సేవా టికెట్ల ద్వారా రూ. 8.08లక్షల ఆదాయం వచ్చింది.జగ్గయ్యపేట: బలుసుపాడులోని గురుధాం క్షేత్రాన్ని కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ మంగళవారం సందర్శించారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ: అందాలతో కనువిందు చేసే భవానీ ద్వీపం కళా విహీనంగా మారింది. పచ్చదనానికి తోడు, పారిశుద్ధ్యం లోపించింది. పర్యాటకులను ఆకర్షించే యాక్టివిటీస్ కరువయ్యాయి. దీంతో ద్వీపాన్ని సందర్శించే పర్యాటకులు నిరుత్సాహంతో వెనుదిరుగుతున్నారు. కొరవడిన ప్రభుత్వ పర్యవేక్షణ తీరుపై మండిపడుతున్నారు. వరదలకు దెబ్బతిని.. కృష్ణమ్మకు 2024 సెప్టెంబరు నెలలో భారీ ఎత్తున వరద వచ్చింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 11లక్షల క్యూసెక్కులకు పైగా వచ్చిన వరద నీరు రావడంతో భవానీ ద్వీపం తీవ్రంగా దెబ్బతింది. పూర్తిగా దాని స్వరూపమే మారిపోయింది. అప్పటి నుంచి ప్రభుత్వం ద్వీపం అభివృద్ధి గురించి పట్టించుకోకపోవడంతో, అందాల ద్వీపంలో కాంతులు కనుమరుగయ్యాయి. మరోవైపు చంద్రబాబు సర్కారు టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని గొప్పలు చెబుతోంది. లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేస్తున్న ఈవెంట్లపై ఉన్న శ్రద్ధను, భవానీ ద్వీపంపై పెట్టకపోగా, దీనిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే విధంగా పావులు కదుపుతోంది. చంద్రబాబు నివాసానికి కూతవేటు దూరంలో ఉండే భవానీ ద్వీపం దుస్థితి చూసి, ద్వీపాన్ని సందర్శించే పర్యాటకులు బాబు మాటలు అన్నీ మాయ మాటలే అని పెదవి విరుస్తున్నారు. పట్టించుకోని బీఐటీసీ.. ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ (ఏపీటీడీసీలో భాగంగా భవానీ ఐలాండ్ టూరిజం కార్పొరేషన్ (బీఐటీసీ)ఆధ్వర్యంలో ద్వీపం ఉంటుంది. వరద వచ్చి వెళ్లి దాదాపు రెండేళ్లు గడుస్తున్నా, ద్వీపం పునరుద్ధరణ గురించి బీఐటీసీ పట్టించుకోలేదు. దీంతో ఇప్పటికే ఇసుక మేటలు వేసి, చెట్లు నేలకొరిగి కళా విహీనంగానే ఉంది. శని, ఆదివారాలు, వేసవి సెలవుల్లో పెద్ద ఎత్తున భవానీ ద్వీపం సందడి ఉండేది. సెలవు రోజుల్లో 70వేల నుంచి 80 వేల మంది భక్తులు దుర్గమ్మను దర్శనం చేసుకొంటారు. దర్శనానికి వచ్చిన విజయవాడలో భక్తులను ఆకర్షించే ఏకై క పర్యాటక ప్రదేశం భవానీ ద్వీపం. ఏపీటీడీసీ ఆధ్వర్వంలో బోట్లు బెరంపార్కు నుంచి బయలుదేరి ద్వీపానికి వెళ్తాయి. శని, ఆదివారాలతో రోజు రెండు నుంచి మూడు వేల మందికి పైగా పర్యాటకులు, కృష్ణమ్మ పరవళ్లు, భవానీ ద్వీపం అందాలు తిలకించేందుకు వెళ్తారు. భవానీ ద్వీపంలో ఎటువంటి యాక్టివిటీస్ లేకపోవడంతో పర్యాటకుల సంఖ్య రోజు రోజుకూ గణనీయంగా తగ్గుతోంది. గతంలో సందర్శించిన పర్యాటకులే ప్రస్తుతం భవానీ ద్వీపం దుస్థితి చూసి పెదవి విరుస్తూ, అక్కడ సౌకర్యాలు లేక ఇబ్బంది పడి, రెండు, మూడు గంటల లోపే వెనుతిరిగి వచ్చేస్తున్నారు. భవానీ ద్వీపంలో మూతబడిన రోబోటిక్ జురాసిక్ పార్క్ 7భవానీ ద్వీపంలో ఆడుకునేందుకు యాక్టి విటీస్ ఏమీ లేవు. చూసేందుకు కూడా ఏమీ లేవు. మొత్తం అధ్వానంగా ఉంది. వరద వచ్చి వెళ్లి రెండేళ్లు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఒకప్పుడు ద్వీపంలోకి వెళ్లేందుకు ఉత్సాహ పడేవాళ్లం. ఇప్పుడు చూస్తే మళ్లీ వెళ్లకూడదని అనిపిస్తోంది. ద్వీపంలో ఏమీ లేవని తెలిసి కూడా పర్యాటకులను బురిడీ కొట్టిస్తున్నారు. – కృష్ణమూర్తి, పర్యాటకుడు భవాని ద్వీపాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దవచ్చు. ఇందులో వన్యప్రాణుల ఉంచవచ్చు. పెద్ద పిల్లలు, ఆనందంగా గడిపే విధంగా అన్ని హంగులతో తీర్చిదిద్దాలి. ప్రస్తుతం ద్వీపంలో పచ్చదనం కూడా కరువు అవుతోంది. ఎండిన చెట్లు, పేరుకు పోయిన చెత్త దర్శనం ఇస్తోంది. – కె.జయప్రకాశ్రెడ్డి, పర్యాటకుడు -
ప్రతి చెరువుకూ ప్రత్యేక కార్యాచరణ
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలోని ప్రతి చెరువు పరిస్థితిని పరిశీలించి, అవసరానికి అనుగుణంగా పూడికతీత, బండలు బలపరిచే పనులు, కాలువలు శుభ్రపరిచే కార్యక్రమాలు, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే చర్యలు చేపట్టాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. జిల్లాలో చేపడుతున్న జలధార పనులను వేగవంతం చేసి, నిర్ధేశిత లక్ష్యాలకు అనుగుణంగా సమయపాలనతో పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన మంగళవారం కలెక్టరేట్లో డ్వామా, జల వనరులు తదితర సమన్వయ శాఖల అధికారులతో జలధార– జలహారతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. చెరువుల అభివృద్ధి పనులతో పాటు గొలుసు కట్టు చెరువుల పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, రైతులకు సాగునీటి అందుబాటు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని జలధార కార్యక్రమాన్ని ప్రాధాన్యంగా అమలు చేయాలని సూచించా రు. జిల్లాలో మొత్తం 766 పనులు మంజూరు కాగా 578 పనులు ప్రారంభమై పురోగతిలో ఉన్నాయన్నారు. సమావేశంలో డ్వామా పీడీ ఎ.రాము తదితరులు పాల్గొన్నారు. 22న జాబ్మేళా గన్నవరం: స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 22న ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్మేళా నిర్వహించనున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్మేళాలో ఎఫ్ట్రానిక్స్, ఫస్టోర్స్ సొల్యూషన్స్, హెటిరో ల్యాబ్స్, టాటా ఎలక్ట్రానిక్స్, ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్స్, ముత్తూట్ ఫైనాన్స్, జోయాలుక్కాస్, కురాకు ఫైనాన్షియల్ సర్వీ సెస్, యూనివర్సల్ ప్రింట్ సిస్టమ్స్, టెక్నోటాస్క్ బిజినెస్ సొల్యూషన్స్, వరుణ్ మోటర్స్ వంటి ప్రముఖ కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన 18 నుంచి 35 ఏళ్లలోపు అభ్యర్థులు ఈ జాబ్మేళాకు అర్హులుగా పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నైపుణ్యం వెబ్సైట్లో పూర్తి వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్ పి. నరేష్కుమార్ సూచించారు. ఇతర సమాచారం కోసం 9676708041, 9494005725లో సంప్రదించాలని పేర్కొన్నారు. 24 నుంచి జాతీయ స్థాయి నాటకోత్సవాలు గుడివాడ టౌన్: కృష్ణా ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ గుడివాడ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయ స్థాయి నాటకోత్సవాలను జయప్రదం చేయాలని నిర్వాహకులు కోరారు. స్థానిక ఎస్పీఎస్ హైస్కూల్ ప్రాంగణంలో మంగళవారం నాటకోత్సవాల బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు పీవీ సత్యనారాయణ మాట్లాడుతూ ఈనెల 24, 25, 26 తేదీలలో గుడివాడ ఎస్పీఎస్ గ్రౌండ్స్లో ఈ నాటకోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. మొదటి రోజు మహా పురుషుడు మండలి, రెండో రోజు సాహస, కపిరాజు నాటికలు, మూడో రోజు అమ్మ చెక్కిన బొమ్మ, ఖడ్గ తిక్కన వంటి ప్రదర్శనలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో రంగస్థల దర్శకుడు గంగోత్రి సాయి, అసోసియేషన్ కన్వీనర్ ఆర్వీఎల్ నరసింహారావు, కార్యదర్శి ఏఎస్వీ ప్రసాద్, ఆర్థిక కార్యదర్శి డి.చంద్రశేఖర్, సభ్యులు పాల్గొన్నారు. 14 మంది విద్యుత్ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటుచిలకలపూడి(మచిలీపట్నం): విద్యుత్ ఉద్యోగుల సహకార పరపతి సంఘంలో భారీగా అవకతవకలు జరిగాయని ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ‘వెలుగు నిధులపై కమ్ముకున్న చీకట్లు’ అనే కథనానికి విద్యుత్ శాఖాధికారులు స్పందించారు. ఇందుకు సంబంధించి అవకతవకలకు కారణమైన 14 మంది విద్యుత్ ఉద్యోగులపై వేటు పడింది. విద్యుత్ ఉద్యోగుల సహకార పరపతి సంఘంలో సభ్యులు దాచుకున్న రూ.100కోట్ల మేర సొమ్ము దుర్వినియోగం చేసినట్లు వచ్చిన వార్తా కథనంపై సోమవారం రాత్రి సహకార శాఖాధికారులు ఇచ్చిన సంఘ సభ్యుల పేర్లు ఆధారంగా వారిని సస్పెండ్ చేశారు. వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. -
కృష్ణా కలెక్టర్ బాలాజీకి అరుదైన గౌరవం
చిలకలపూడి(మచిలీపట్నం): కలెక్టర్ డీకే బాలాజీకి అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ రేటింగ్ మ్యాగ్జైన్ ఫేమ్ ఇండియా నిర్వహించిన దేశవ్యాప్త సర్వేలో 100 మంది జిల్లా కలెక్టర్లను అత్యుత్తమ, ఉత్తమ పనితీరు కనబరిచిన పరిపాలన అధికారులుగా పేర్కొంది. వారిలో అత్యంత ప్రతిభావంతులైన 25 మంది కలెక్టర్లను 2026 ఎడిషన్లో ప్రచురించనుంది. ఏషియా పోస్టు సహకారంతో నిర్వహించిన ఈ సర్వే దేశవ్యాప్తంగా 800 జిల్లాలను పరిశీలించి నిపుణుల అభిప్రాయాలు, క్షేత్రస్థాయి నివేదికలు, మీడియా విశ్లేషణ ఆధారంగా వంద మంది పేర్లను ఎంపిక చేసింది. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఎంపికయ్యారు. ఈ అరుదైన గౌరవం కలెక్టర్ బాలాజీకి దక్కిన నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్తో పాటు పలువురు జిల్లా అధికారులు కలెక్టర్ చాంబర్లోని కలెక్టర్ బాలాజీని మంగళవారం ఘనంగా సత్కరించారు. -
మత్స్యకారుల సంక్షేమానికి ప్రాధాన్యం
మంత్రి కొల్లు రవీంద్ర చిలకలపూడి(మచిలీపట్నం): మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎకై ్సజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం ‘మత్స్యకారుల సేవలో’ కార్యక్రమానికి సంబంధించి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 18,157 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ రూ.20వేలు చొప్పున రూ.36.31కోట్లను అందజేశామన్నారు. మత్స్యకారులు వేట నిషేధ సమయంలో జీవన భృతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నగదును అందజేస్తున్నామన్నారు. పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ మత్స్యకారులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిధులను వారి ఖాతాలలో జమ చేస్తున్నామని పేర్కొన్నారు. కలెక్టర్ డీకే బాలాజీ, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, మత్స్యశాఖ జేడీ ఎ. నాగరాజు, బందరు మార్కెట్ యార్డు చైర్మన్ కుంచె నాని తదితరులు పాల్గొన్నారు. -
సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ అరుణ్ రిచర్డ్ బాధ్యతల స్వీకారం
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): సెంట్రల్ జీఎస్టీ గుంటూరు కమిషనరేట్ నూతన కమిషనర్గా అరుణ్ రిచర్డ్ మంగళవారం గుంటూరు కన్నావారితోటలోని ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 2007 సివిల్ సర్వీసెస్ బ్యాచ్కి చెందిన అరుణ్ రిచర్డ్ విశాఖపట్నం జీఎస్టీ, కస్టమ్స్ జోన్లోని ఐదు కమిషనరేట్లకు అప్పిలేట్ అథారిటిగా, సెంట్రల్ ట్యాక్స్, కస్టమ్స్ అప్పీల్స్ కమిషనర్గా పనిచేస్తూ గుంటూరు జీఎస్టీకి బదిలీపై వచ్చారు. కమిషనర్ మాతృబాష తెలుగు అయినప్పటికీ, తెలుగు రాష్ట్రాలలో పనిచేయడం ఆయనకు ఇదే మొదటిసారి. బాధ్యతలు స్వీకరించిన అరుణ్ రిచర్డ్ను అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు కలిసి, పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. తొలుత కమిషనర్కు అడిషనల్ కమిషనర్ బి.లక్ష్మీనారాయణ, జాయింట్ కమిషనర్ దేవ్కుమార్, పీఆర్ఓ ఆర్.పి.పి కుమార్లు ఘనమైన స్వాగతం పలికారు. సిబ్బంది మార్చ్ఫాస్ట్ నిర్వహించారు. మొగల్రాజపురం(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా వైఎస్సార్ జిల్లా పుట్లంపల్లిలో నిర్వహిస్తున్న డాక్టర్ వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్లో 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని శాప్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.భరణి ఓ ప్రకటనలో తెలిపారు. 4 నుంచి 9వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. ఆసక్తి ఉన్న వారు జూలై 2వ తేదిలోగా దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు ఏపీస్పోర్ట్స్స్కూల్.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. నాగాయలంక: స్థానిక శ్రీరామ పాదక్షేత్రం ఘాట్లోని శ్రీగంగ పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి మండపంలో మంగళవారం రాత్రి స్వామివారి శివలింగానికి 100 కేజీల మల్లె పువ్వులతో మహార్చన వైభవంగా జరిపారు. పరమేశ్వరుడి జన్మనక్షత్రం ఆర్థ్ర విశిష్టత పురస్కరించుకుని బ్రహశ్రీ అంబా సాయికిరణ్ శర్మ నేతృత్వంలో భక్తులు సమర్పించిన మల్లెలతో అర్చన నిర్వహించారు. మల్లె పూలతో స్వామిని వారే స్వయంగా అభిషేకించుకున్నారు. అనంతరం అభిషేక పూజ, అలంకరణను శర్మ శోభాయమానంగా తీర్చిదిద్దారు. అవనిగడ్డకు చెందిన భక్తుడు మండలి వెంకటేశ్వరరావు 70 కేజీల మల్లెలను వితరణ చేశారు. అర్చకుడి మిత్ర బృందం, ఇతర భక్తులు మరో 30 కేజీలు మల్లెలను సమర్పించారు. క్షేత్రం కమిటీ చైర్మన్ ఆలూరి శ్రీనివాసరావు, నిర్వహణకర్త తలశిల రఘుశేఖర్, ఉప్పల లీలాకృష్ణప్రసాద్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మచిలీపట్నంఅర్బన్: టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు– మే 2026కు సంబంధించిన హాల్ టికెట్లను విడుదల చేసినట్లు కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావు మంగళవారం తెలిపారు. సంబంధిత పాఠశాలల లాగిన్ల ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. అదేవిధంగా విద్యార్థులు ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారిక వెబ్సైట్ bre.ap.gov.in నుంచి తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించామన్నారు. విద్యార్థుల సౌకర్యార్థంమనమిత్ర యాప్/సేవ 95523 00009తో కూడా హాల్ టికెట్లు పొందవచ్చని చెప్పారు. కృష్ణలంక(విజయవాడతూర్పు): ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (ఏఐఓసీడీ) పిలుపు మేరకు బుధవారం దేశవ్యాప్త బంద్ జరగనుందని, ఈ నేపథ్యంలో అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయని ఎన్టీఆర్ జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ పి.శ్రీరామ్మూర్తి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్, ది కృష్ణా జిల్లా హోల్సేల్ డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ ఈ ఒక్క రోజు బంద్లో పాల్గొంటున్న నేపథ్యంలో ప్రజలకు మందుల సరఫరాలో ఇబ్బంది లేకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. జిల్లాలోని ముఖ్య కేంద్రాల్లోని గుర్తించిన మెడికల్ షాపులు, ఆస్పత్రులు, క్లినిక్లు, నర్సింగ్ హోమ్స్లోని మెడికల్ షాపులు, ప్రభుత్వాస్పత్రుల ఆవరణలో పనిచేస్తున్న జనరిక్ మెడికల్ షాపులు, జిల్లాలో పనిచేస్తున్న అన్ని మెడ్ప్లస్ స్టోర్లు బంద్ రోజు కూడా తెరిచి ఉంటాయని, అన్ని రకాల మందుల విక్రయాలు జరుగుతాయని వివరించారు. ప్రజలకు మందుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని జిల్లా పరిధిలోని అన్ని డ్రగ్స్ ఇన్స్పెక్టర్లను ఆదేశించామని తెలిపారు. ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవద్దని, అవసరమైన మందులు నిరంతరంగా అందుబాటులో ఉండేలా తగిన ఏర్పాట్లు చేశామన్నారు. అత్యవసర మందుల అవసరాల కోసం 99512 77333, 99669 67701 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
● 4031 మద్యం సీసాలు, 2422 బీర్ బాటిళ్లు పట్టివేత ● జనార్దనపురంలో ముగ్గురి అరెస్ట్
కృష్ణలంక(విజయవాడతూర్పు): మద్యం సేవించి ట్రావెల్స్ బస్సు నడుపుతున్న డ్రైవర్పై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి బస్సును సీజ్ చేశారు. ఐదో ట్రాఫిక్ సీఐ కృష్ణమోహన్ తెలిపిన వివరాల మేరకు విజయనగరం జిల్లాలోని రాజాం నుంచి శ్రీ విజయలక్ష్మి ట్రావెల్స్ బస్సు 40 మంది యాత్రికులతో షిరిడీ వెళ్లింది. తిరిగి అక్కడ నుంచి రాజాం బయలుదేరింది గుంటూరు నుంచి వారధి మీదుగా కనకదుర్గ అమ్మవారి దర్శనానికి బయలుదేరారు. మంగళవారం రాత్రి వారధి వద్ద ట్రాఫిక్ పోలీసులు బస్సును ఆపి బస్సు డ్రైవర్ సురేష్కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా మద్యం సేవించినట్లు తెలిసింది. డ్రైవర్పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి బస్సును సీజ్ చేశారు. ఆ బస్సులో ప్రయాణిస్తున్న 40 మందిని మరో బస్సులో రాజాం పంపించేశారు. పాయకాపురం(విజయవాడరూరల్): పాయకాపురం ఫైర్ స్టేషన్ రోడ్డులో 35 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని మంగళవారం స్థానిక వీఆర్వో చొక్కా కమల్కుమార్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఫైర్స్టేషన్ రోడ్డు నుంచి రాజీవ్నగర్ వెళ్లే రోడ్డులో మొబైల్షాపు పక్కన ఓ వ్యక్తి చనిపోయి ఉన్నాడని స్థానికులు చెప్పిన సమాచారంతో వీఆర్వో కమల్ కుమార్ సంఘటనా ప్రాంతానికి వచ్చి పంచనామా నిర్వహించారు. చనిపోయిన వ్యక్తి మద్యం సేవించి వడదెబ్బ తగిలి పడిపోయి చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి కాఫీకలర్ ప్యాంట్, గ్రీన్ కలర్ పుల్హ్యాండ్ టీ షర్టు ధరించి ఉన్నాడు. మృతుని జేబులో ఆధార్కార్డుపై రాహుల్ సాయికియ, తండ్రి నబిన్, అసోం రాష్ట్రం గోగముఖ్ పోస్టు అని ఉంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతనికి సంబంధించిన వారు నున్న పోలీసు స్టేషన్లో సంప్రదించాలని పోలీసులు తెలిపారు. -
ప్రైవేట్ టీచర్లకు అడ్మిషన్ల సెగ
పెనుగంచిప్రోలు: ప్రైవేట్ టీచర్లకు అడ్మిషన్ల అగచాట్లు తప్పటం లేదు. ఒక పక్క మండే ఎండలకు తోడు ఉక్కపోతతో అల్లాడుతుంటే మరో పక్క అడ్మిషన్ల టార్గెట్లు మరింత వేడిని పుట్టిస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు టార్గెట్లు విధించి మరీ ఉపాధ్యాయులను ఇళ్ల వెంట పరుగులు పెట్టిస్తున్నాయి. మరికొన్ని పాఠశాలల యాజమాన్యాలు తమ వద్ద పనిచేస్తున్న టీచర్లను బస్సుల్లో పల్లెలకు తీసుకెళ్లి కరపత్రాల ద్వారా ప్రచారం చేయించటంతో పాటు అడ్మిషన్లు చేయించేలా ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు లేక జీవనం సాగించటానికి ఎంతో మంది పీజీ, డిగ్రీ, బీఈడీలు చేసిన వారు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పెనుగంచిప్రోలు, వత్సవాయి, జగ్గయ్యపేట మండలాల్లో సుమారుగా 50 వరకు ప్రైవేటు పాఠశాలలు, 12 కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. వీటిలో వెయ్యి మంది వరకు సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల, కళాశాలల యాజమాన్యాలు గత నెల నుంచి ఆయా పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఇంటింటికీ పంపిస్తున్నాయి. వారు ప్రతి ఇంటికి వెళ్లి ‘మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నారా? ఏం చదువుతున్నారు? మా పాఠశాలలో, కళాశాలలో చేర్పించండి’ అంటూ బతిమలాడుతున్నారు. తమ వద్ద ఎన్నో వసతులు ఉన్నాయని, ఉత్తమ విద్యాబోధన అందుతుందని, మెరుగైన ఫలితాలు తెప్పిస్తామంటూ తల్లిదండ్రులను ప్రలోభపెడుతున్నారు. సతమతమవుతున్న సిబ్బంది ఒకవైపు బోధన, మరోవైపు టార్గెట్ను పూర్తిచేసే పనిలో ప్రైవేటు, కార్పొరేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు తీవ్ర వత్తిడికి లోనై మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడుతున్నారని విద్యావేత్తలు చెబుతున్నారు. తమ వేదనను ఎవరికీ చెప్పుకోలేక లోలోపల కుమిలి పోతున్నారు. చాలీచాలని జీతాలతో జీవితాలను నెట్టుకొస్తున్న సమయంలో ఉన్న ఉద్యోగాన్ని వదులుకోలేక, అక్కడే కొనసాగలేక ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు యాజమాన్యాలు చాలీచాలని వేతనాలిస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నాయని ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఇచ్చిన అడ్మిషన్ల టార్గెట్లు పూర్తి చేస్తేనే సెలవుల్లో జీతాలు ఇస్తామని, ఆపై సంవత్సరం ఉద్యో గంలో కొనసాగిస్తామని కొన్ని కార్పొరేట్ పాఠశాలలు నిబంధనలు పెడుతున్నాయి. ఒక్కొక్కరు కనీసం 10 నుంచి 15 మంది పిల్లలను పాఠశాలల్లో చేర్పించాల్సిందేనని స్పష్టంచేస్తున్నాయి. అలా చేర్పించిన తరువాత కూడా సెలవుల అనంతరం పాఠశాల తెరిచిన తరువాత ఉద్యోగం ఉంటుందో, ఊడుతుందో గ్యారెంటీ లేదు. ఇచ్చే అరకొర జీతాలు నిలిపి వేస్తారనే భయంతో ఉపాధ్యాయులు, సిబ్బంది నానాతంటాలు పడుతుంటారు. భగభగ మండే ఎండల్లో ఇంటింటికి తిరుగుతూ విద్యార్థుల కోసం జల్లెడపడుతున్నారు. అడ్మిషన్ల కోసం కొన్ని పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు నోటికి ఏది వస్తే అది మాట్లాడి తమ మనోభావాలు దెబ్బతీస్తున్నాయని ఉపాధ్యాయులు వాపోతున్నారు.


