-
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం పక్కా ప్రణాళిక
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ప్రతి ఒక్కరి కల. దీన్ని సాధిస్తే తమ జీవితానికి, భవిష్యత్తుకు ఇక ఢోకా ఉండదనుకుంటారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి అహోరాత్రులు కష్టపడుతుంటారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించింది. ఒకేసారి 1.34 లక్షల సచివాలయాల ఉద్యోగాలను భర్తీ చేసి రికార్డు సృష్టించింది. లంచాలకు, సిఫారసులకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా, వేగంగా నియామకాలు చేసి అభ్యర్థుల ప్రశంసలు అందుకుంది. ఇందులో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)కి ప్రశ్నాపత్రం రూపకల్పన బాధ్యతలు అప్పగించింది. ఇక ఏపీపీఎస్సీ ద్వారా నేరుగా వివిధ విభాగాల్లో 6,296 పోస్టులను భర్తీ చేసింది. ఇందుకు మొత్తం 78 నోటిఫికేషన్లను ఇచ్చింది. అంతేకాకుండా ఇటీవల గ్రూప్–1, గ్రూప్–2, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. వీటి ద్వారా 1,446 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీంతో ఉద్యోగార్థులు అందరూ రెట్టించిన ఉత్సాహంతో ప్రభుత్వ కొలువును దక్కించుకోవడానికి ఉద్యుక్తులవుతున్నారు. నిరుద్యోగుల మేలుకు ఎన్నో చర్యలు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు మేలు చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాలనను నేరుగా ప్రజల ముంగిటకే తీసుకెళ్లి.. వారి సమస్యలను స్థానికంగా అక్కడికక్కడే పరిష్కరించేలా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సచివాలయాల్లో పనిచేయడానికి ఒకేసారి 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించారు. ఇంత పెద్ద స్థాయిలో ఉద్యోగాల భర్తీ దేశ చరిత్రలో ఎప్పుడూ లేకపోవడం గమనార్హం. అంతేకాకుండా ఒక్క వైద్యశాఖలోనే దాదాపు 55 వేల పోస్టులను భర్తీ చేశారు. ఇందులో వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్లు, వైద్యులు, నర్సింగ్, పారామెడికల్ పోస్టులు ఉన్నాయి. చంద్రబాబు సీఎంగా ఉండగా నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఎన్నికల ముందు ప్రయోజనం పొందాలనే దురుద్దేశంతో 2018 డిసెంబర్లో 32 నోటిఫికేషన్లు జారీ చేసి వదిలేశారు. వాటి భర్తీకి పరీక్షలు కూడా నిర్వహించలేదు. ఈ పరీక్షలను కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే నిర్వహించి, పోస్టులను భర్తీ చేసింది. ఎప్పటి ఖాళీలు అప్పుడే భర్తీ.. నిరుద్యోగ యువతకు మేలు చేసేలా ప్రభుత్వం వివిధ శాఖల వారీగా ఉన్న ఖాళీలను ఎప్పటికప్పుడు సేకరిస్తోంది. ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ చేయడానికి వీలుగా ఏపీపీఎస్సీతో సమన్వయం చేసుకుంటోంది. నోటిఫికేషన్ ఇచ్చే ముందే ఎలాంటి వివాదాలకు తావులేకుండా కమిషన్ చర్యలు తీసుకుంటోంది. గత నాలుగేళ్లల్లో మొత్తం 78 నోటిఫికేషన్లను ఒక్క కోర్టు వివాదం లేకుండా, ఒక్క నిరుద్యోగికీ అన్యాయం జరగకుండా 6,296 పోస్టులను భర్తీ చేయడం విశేషం. ఇంత పక్కాగా ఉద్యోగాల భర్తీ గత ప్రభుత్వంలో ఎప్పుడూ జరిగింది లేదు. నాడు అలా.. నేడు ఇలా.. గత టీడీపీ ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇచ్చినా పరీక్షలు ఎప్పుడు జరిగేది, నియామకాలు ఎప్పుడు పూర్తయ్యేదీ అంతా అగమ్యగోచరంగా ఉండేది. అంతేకాకుండా ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్పైనా అనేక వివాదాలు.. కోర్టు కేసులు తలెత్తేవి. ఇలా పలు కారణాలతో నియామక పరీక్షలు నిలిచిపోవడమో లేక రద్దు కావడమో జరిగేది. అలాంటిది గత నాలుగేళ్లల్లో ఏపీపీఎస్సీ 78 నోటిఫికేషన్లు ఇచ్చి 6,296 ఉద్యోగాలను ఎలాంటి వివాదాలు లేకుండా అత్యంత పారదర్శకంగా భర్తీ చేసింది. అంతేకాకుండా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి న్యాయ వివాదాల్లో చిక్కుకున్నవాటిని సైతం పరిష్కరించింది. ఆ పోస్టులను భర్తీ చేసి అభ్యర్థులకు న్యాయం చేసింది. ఇలా గ్రూప్–1, గ్రూప్–2 వంటి గెజిటెడ్ పోస్టులతో పాటు వివిధ శాఖల్లో అసిస్టెంట్ ఇంజనీర్లు, అగ్రికల్చరల్ ఆఫీసర్లు, మరెన్నో నాన్ గెజిటెడ్ పోస్టుల నియామకాలు చేపట్టింది. -
బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే నిరుద్యోగులది అడవి బాటే
సాక్షి, వరంగల్/జనగామ/ సాక్షి, కామారెడ్డి: తెలంగాణ సాధన పేరిట అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్కు మరోసారి పట్టం గడితే రాష్ట్రంలోని నిరుద్యోగులు అడవి బాట పట్టడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. ఉద్యోగాల కోసం పరీక్షల యుద్ధం చేస్తున్న నిరుద్యోగ యువత దిక్కుతోచక అటవీబాట పట్టే పరిస్థితి వస్తే, నక్సలైట్ ఉద్యమం పునరావృతమైతే.. ఈ ప్రభుత్వంలో ఒక్కరూ మిగిలే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. 1,200 మంది యువత ఆత్మ బలిదానాలకు చలించి కాంగ్రెస్ పార్టీ మిగులు బడ్జెట్తో ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందని, కానీ కేసీఆర్ కుటుంబ పాలనలో రాష్ట్రం దోపిడీకి గురైందని ఆరోపించారు. రాష్ట్రం వస్తే తమకు ఉద్యోగాలు వస్తాయని ముందు వరుసలో ఉండి పోరుసల్పిన నిరుద్యోగులు..తెలంగాణ వచ్చినా ఉద్యోగ నియమాకాలు లేక వయోపరిమితి మించిపోయి, చివరకు పెళ్లిళ్లు కూడా చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ పరీక్షల రద్దు, పేపర్లీక్ల వంటి దుష్పరిణామాలతో ఆత్మస్థైర్యం కోల్పోతున్న నిరుద్యోగులు ఆత్మహత్యల వైపు పయనిస్తున్నారన్నారు. ప్రజలు కాంగ్రెస్ను గెలిపించకపోతే నిజాం పాలనను కేసీఆర్ పునరావృతం చేస్తారని ఆరోపించారు. గజ్వేల్ భూములు కొల్లగొట్టి ఇప్పుడు కామారెడ్డికి వస్తున్నారని, దేశమంతా కామారెడ్డి ప్రజల తీర్పు కోసం ఎదురుచూస్తోందని అన్నారు. మంగళవారం జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్, వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోని లక్ష్మీపురంలో జరిగిన విజయభేరి సభల్లో, కామారెడ్డి జిల్లాలో పలు కార్నర్ మీటింగుల్లో ఆయన మాట్లాడారు. మీ కరెంట్ ఊడగొడతాం..ఫ్యూజులే ఉండవు ‘త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ దొర కాళ్ల కింద నలిగిపోతోంది, నీళ్లు, నిధులు, నియామకాలు అని తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చెప్పిండు. కానీ కాళేశ్వరం పూర్తి కాకముందే మేడిగడ్డ కుంగింది, అన్నారం పగిలింది, సుందిళ్లకు దిక్కులేదు. లక్ష కోట్లు దిగమింగి పేక మేడలు కట్టిండు. నిజంగా ప్రమాదంతోనే ప్రాజెక్టు కూలితే ప్రజలకు ఎందుకు చూపించవు? కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని కేసీఆర్ అంటుండు. మూడోసారి మాకు అవకాశం ఇవ్వండి.. మా మనడిని మంత్రి చేసేది ఉందని అంటుండు.. బిడ్డా కాంగ్రెస్ రాగానే నీతో పాటు కేటీఆర్, హరీశ్, సంతోష్, దయాకర్రావు, కవితారావుల కరెంట్ ఊడగొడతాం...మీకు ఫ్యూజ్లే ఉండవు.మీ మోటార్లు కాలుతాయ్.. మీ ట్రాన్స్ఫార్మర్లు పేలుతాయ్..’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. పులిని షికారు చేసేందుకు వచ్చిన వేటగాన్ని.. ‘పేదలు నివాసం ఉండేందుకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వని కేసీఆర్.. గజ్వేల్లో 600 గదులతో గడీని నిర్మించుకుండు. జన్వాడలో 100 ఎకరాలలో కోట్లు ఖర్చు పెట్టి ఒక గడీని కట్టుకుండు. ప్రజల రక్తాన్ని తాగుతున్న పులిని షికారు జేసేందుకు వచ్చిన వేటగాన్ని నేను. గజ్వేల్ భూములను కొల్లగొట్టిన కాలకేయ ముఠా ఇప్పుడు కామారెడ్డి మీద కన్నేసింది. ఇక్కడి ప్రజలకు చెందిన విలువైన భూములను కొల్లగొట్టేందుకు వస్తున్నరు. వాళ్ల బారి నుంచి కాపాడేందుకు ఇక్కడికి వచ్చిన. మీరు అండగా నిలవండి. మీ భూములకు రక్షకుడిగా నేనుంటా. కామారెడ్డి ప్రాంత ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డా ఏనాడూ పట్టించుకోని కేసీఆర్కు ఎలక్షన్లు రావడంతో తల్లి ఊరు గుర్తుకువచ్చింది. గజ్వేల్లో ఓడిపోతా అనుకుంటే సిద్దిపేటకో, సిరిసిల్లకో పోకుండా కామారెడ్డికి రావడంలోనే మతలబు ఉంది. ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కామారెడ్డి రైతుల భూములపై కన్నేస్తే, కనుగుడ్లను పీకి గోలీలాడుతాం..’ అని హెచ్చరించారు. కేసీఆర్ పండించిన వడ్లకు రూ.4,250? ‘రాష్ట్రంలో రైతులు పండించిన వడ్లను క్వింటాల్ రూ.2 వేలకు కొనే దిక్కులేదు. అదే సీఎం కేసీఆర్ ఫాం హౌస్లో పండించిన వడ్లను క్వింటాల్కు రూ.4,250 చొప్పున ఓ సీడ్స్ కంపెనీ తీసుకుంది. దీనిపై రాజరాజేశ్వర స్వామి గుడిలో ప్రమాణం చేసేందుకు సిద్ధమా.?’ అని రేవంత్ సవాల్ చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలంటే కామారెడ్డిలో కేసీఆర్ను ఓడించాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆయా సభల్లో ఏఐసీసీ అబ్జర్వర్ అరవింద్ కుమార్ బాల్వి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మాజీ ఎమ్మెల్యే యూసుఫ్అలీ, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, శోభారాణి, ఎరబ్రెల్లి స్వర్ణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రపంచవ్యాప్తంగా నైపుణ్య యువతకు డిమాండ్
-
యువతకు ఉపాధి... అమరులకు ఆదరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిరుద్యోగ యువత, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మహిళలు, అమరవీరుల కుటుంబాలు, గల్ఫ్ కార్మికులను ఆకట్టుకునేలా కాంగ్రెస్ పార్టీ ‘హైదరాబాద్ యూత్ డిక్లరేషన్’ను ప్రకటించింది. మొత్తం ఐదు అంశాలతో కూడిన 17 హామీలను ప్రకటించింది. సోమవారం సరూర్నగర్లో జరిగిన సభలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ సమక్షంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఈ డిక్లరేషన్ వివరాలను వెల్లడించారు. ఆ అంశాలివీ.. అమరవీరులు, ఉద్యమకారుల త్యాగాలకు గుర్తింపు ► తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో ప్రాణాలర్పించిన యువతీ, యువకులకు ఉద్యమ అమరవీరులుగా గుర్తింపు. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతోపాటు కుటుంబానికి నెలకు రూ.25 వేల పింఛన్. ► ఉద్యమంలో పాల్గొన్నవారిపై నమోదైన కేసుల ఎత్తివేత. జూన్ 2న వారికి తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు. పారదర్శకంగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ► కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. ► తొలి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ. ► ఏటా జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ కేలండర్ ప్రకటన. ఉద్యోగ పరీక్షలు నిర్వహించి సెప్టెంబర్ 17న నియామక పత్రాల అందజేత. ► నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే వరకు ప్రతి నెలా రూ.4,000 నిరుద్యోగ భృతి చెల్లింపు. ► ప్రత్యేక చట్టం ద్వారా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరహాలో నియామకాలు. నిరుద్యోగ నిర్మూలన ► తెలంగాణను నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ‘సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్’ ఏర్పాటు. ఎంప్లాయ్మెంట్ ఎక్సే్ఛంజీ ఏర్పాటు. ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా శిక్షణ. ► ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రైవేట్ కంపెనీల్లో తెలంగాణ యువతకు 75% రిజర్వేషన్లు. ► విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, కమిషన్ల తరహాలో యూత్ కమిషన్ ఏర్పాటు. ఆ కమిషన్ ద్వారా రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణ సదుపాయం. ► ప్రత్యేక గల్ఫ్ విభాగం ఏర్పాటుతో గల్ఫ్ ఏజెంట్ల నియంత్రణ. గల్ఫ్ దేశాల్లో మెరుగైన ఉపాధి కల్పనతోపాటు కార్మికుల సంక్షేమానికి తగిన చర్యలు. ఫీజు రీయింబర్స్మెంట్ ► ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు. రూ.4 వేల కోట్ల బకాయిల చెల్లింపు. ► పాలమూరు, తెలంగాణ, మహాత్మాగాంధీ, శాతవాహన వర్సిటీలను ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలుగా మార్చడంతోపాటు.. ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్లలో నూతన ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీల ఏర్పాటు. ► బాసరలో ట్రిపుల్ఐటీ తరహాలో మరో నాలుగు ట్రిపుల్ ఐటీల ఏర్పాటు. ► అమెరికాలోని ఐఎంజీ తరహాలో అన్ని వసతులతో కూడిన ప్రపంచస్థాయి క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం. ► పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కోసం వరంగల్, హైదరాబాద్లలో రెండు ప్రత్యేక విద్యాలయాలు. 6వ తరగతి నుంచి పట్టభద్రులయ్యేంత వరకు నాణ్యమైన విద్య. యువ మహిళా సాధికారత ► మహిళా సాధికారత కోసం ప్రత్యేక కార్యక్రమాలు, పథకాలు ► 18 ఏళ్లు పైబడిన చదువుకునే యువతులకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు. -
స్కిల్ హబ్స్ ద్వారా నిరుద్యోగులకు వివిధ కోర్సుల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ
-
తోలు పరిశ్రమల జాడేదీ?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: నిరుపేద దళితులకు ఉపాధి, స్థానికంగానే తోలు ఉత్పత్తులు తయారుచేసి ఎగుమతి చేయాలనే లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో దళితులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలను ఎంపికచేసి మినీ లెదర్ పార్కులు స్థాపించాలని ప్రణాళికలు చేశారు. లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (లిడ్క్యాప్) నిరుద్యోగ యువతకు చెప్పుల తయారీలో శిక్షణ సైతం ఇచ్చింది. శిక్షణ తీసుకున్న వాళ్లు రాష్ట్రవ్యాప్తంగా వేలాదిగా ఉన్నారు. 2003 నుంచే లెదర్ పార్కుల ఏర్పాటుకు బీజం పడినా నేటికీ ఉత్పత్తి ప్రారంభం కాకపోవడంతో వేలాది మంది నిరుద్యోగ దళితులు ఎదురుచూస్తున్నారు. లెదర్ ఉత్పత్తులకు అవకాశం మేక, గొర్రె, గేదెల వంటి పశువుల తోళ్లతో స్థానికంగానే ప్రముఖ బ్రాండ్లకు చర్మంతో చెప్పులు, ఇతర ఉత్పత్తులు తయారుచేసే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఉమ్మడి రాష్ట్రం నుంచే లిడ్క్యాప్, రాష్ట్రం ఏర్పడ్డాక టీఎస్ఎల్ఐపీసీ (తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్) «ఆధ్వర్యంలో పనులు సాగాయి. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లో మెగాపార్కు, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో లెదర్ క్లస్టర్, మరో ఆరుచోట్ల 25 ఎకరాల చొప్పున స్థలాలు కేటాయించారు. ‘మలుపు’స్వచ్ఛంద సంస్థ నిరుద్యోగులకు శిక్షణనిచ్చింది. చెన్నైకి చెందిన లెదర్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్తో ఒప్పందం చేసుకొని ప్రముఖ బ్రాండ్ల చెప్పులు, బూట్లు ఇతర ఉత్పత్తులు ఈ పార్కుల్లో తయారు చేయాలని భావించారు. ఆయా కంపెనీలతో ఒప్పందం చేసుకొనేలా టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు జరిగాయి. మౌలిక సదుపాయాలు, షెడ్డుల నిర్మాణాలు, శిక్షణ, యంత్రాలు వచ్చాయి. కొన్నిచోట్ల తయారీ మొదలైంది. ఆ తర్వాత నిధుల లేమితో ఆశయం నీరుగారింది. నిధులు విడుదలవక.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక మరోమారు పార్కుల స్థాపనకు ప్రయత్నాలు జరిగాయి. కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంస్థ కింద రాష్ట్ర ప్రభుత్వ చొరవతో వీటిని అభివృద్ధి చేయాలనుకున్నారు. 2016లో జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లో మెగాపార్కుకు రూ.270 కోట్లతో 2 వేల మందికి ఉపాధి కల్పించాలనే అంచనాతో రూ.105 కోట్ల కేంద్ర సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కానీ ఇప్పటికీ నిధులు విడుదలవలేదు. ఇటీవల ఆర్మూర్ పార్కులో స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకున్నా పూర్తిస్థాయిలో నిధులు విడుదలవక ఉత్పత్తి మొదలు కాలేదు. కబ్జాలకు గురవుతున్న భూములు పార్కుల కోసం కేటాయించిన భూములు ఏళ్లుగా ఖాళీగా ఉండటంతో కబ్జాకు గురవుతున్నాయి. మంచిర్యాల జిల్లా మందమర్రిలో అక్కడ ఇన్చార్జి అధికారే ఆ భూమిలోని మట్టిని అమ్ముకున్నారు. కరీంనగర్ జిల్లా రుక్మాపూర్లో భూములను ఓ సంస్థకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్మూర్లో పార్కు కోసం కేటాయించిన స్థలం చుట్టూ కబ్జాల నిరోధానికి ప్రహరీ నిర్మిస్తున్నారు. కొన్నిచోట్ల స్థానిక ప్రజాప్రతినిధులు ఈ స్థలాలను పల్లె ప్రకృతి వనాలు, శ్మశానవాటికలు, క్రీడాప్రాంగణాలకు కేటాయిస్తుండటంతో దళితులు ఆందోళన చెందుతున్నారు. నాయకులకు చిత్తశుద్ధి లేదు ఏళ్లుగా ఉపాధి పేరుతో నిరుద్యోగులను మభ్యపెడుతున్నారు. ఇప్పటికైనా లెదర్ పార్కులు ఏర్పాటుచేసి నిరుపేదలకు పని కల్పించాలి. – కొలుగూరి విజయ్కుమార్, చర్మకార హక్కుల పరిరక్షణ కమిటీ, జిల్లా అధ్యక్షుడు, మంచిర్యాల -
రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ సర్వే
సాక్షి, అమరావతి: నిరుద్యోగ యువతకు ఆసక్తిగల కోర్సుల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా వారికి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సర్వే నిర్వహిస్తోంది. వలంటీర్లు ఇంటింటి సర్వేచేసి నిరుద్యోగ యువత పేర్లను ప్రత్యేక యాప్లో నమోదు చేస్తున్నారు. అభ్యర్థికి ఆసక్తిగల కోర్సు, ఏ ప్రాంతంలోని స్కిల్ హబ్లో శిక్షణ పొందాలనుకుంటున్నారో కూడా నమోదు చేస్తున్నారు. ఈ డేటా ఆధారంగా అభ్యర్థుల వివరాలు అందుబాటులో ఉండటంతోపాటు అవసరమైనచోట వారి సేవలను వినియోగించుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 27,655 మంది పేర్లను స్కిల్ హబ్స్ అప్లికేషన్లో నమోదు చేశారు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 13,056 మంది అభ్యర్థుల పేర్లు స్కిల్ హబ్స్ అప్లికేషన్లో నమోదయ్యాయి. ఈ సర్వేకి సంబంధించి విస్త్రత ప్రచారం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు సూచించింది. స్కిల్ డెవలప్మెంట్ సర్వే పురోగతిని ప్రతి గురువారం కలెక్టర్లతో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ సమీర్శర్మ సమీక్షిస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ సర్వే పూర్తిచేయించాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. -
‘రామగుండం’లో కొలువుల స్కాం!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్)లో జరిగిన నియామకాల వివాదం చినికిచినికి గాలివానలా మారుతోంది. ఫ్యాక్టరీలో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వందలాది మంది నిరుద్యోగుల నుంచి రూ. కోట్లు వసూలు చేశారన్న ఆరోపణలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ వ్యవహారంలో స్థానిక ఎమ్మెల్యే హస్తం ఉందంటూ ఆరోపణలు రావడంతో రామగుండంలో రాజకీయం వేడెక్కుతోంది. ఇటీవల ఆర్ఎఫ్సీఎల్ నుంచి ఉద్యోగులు తమ డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ పలువురు నిరుద్యోగులు నిరసనలకు దిగడం.. పలు కార్మిక సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు వారికి అండగా నిలవడంతో ఈ ఆందోళన తీవ్రరూపం దాలుస్తోంది. అసలేం జరిగింది? ఆర్ఎఫ్సీఎల్ ఎరువుల కర్మాగారం గతేడాది పునఃప్రారంభమైంది. కర్మాగారంలో పనిచేసేందుకు వందలాది మంది సిబ్బందిని నియమించారు. ఒక ప్రముఖ కంపెనీ ఏడాది కోసం మ్యాన్పవర్ను సరఫరా చేసే కాంట్రాక్టు పొందింది. వారి నుంచి మరో కంపెనీ సబ్కాంట్రాక్ట్ సంపాదించింది. ఈ సంస్థ ఫ్యాక్టరీ ప్రారంభమైన సమయంలో 798 మందిని లోడింగ్, అన్లోడింగ్ కోసమని నియమించుకుంది. వారికి 798 గేట్పాసులు కూడా ఇచ్చింది. ఏడాది తరువాత సదరు సంస్థ కాంట్రాక్టు పూర్తవడంతో మరో కంపెనీ కాంట్రాక్టు దక్కించుకుంది. కొత్తగా వచ్చిన సంస్థ అవసరానికి మించి కార్మికులు ఉన్నారని వందలాది మందిని తప్పించింది. దీంతో కొలువులు కోల్పోయిన వారంతా ఆందోళన ప్రారంభించారు. ఈ ఉద్యోగాల కోసం కొందరు నాయకులు తమ వద్ద రూ. లక్షలు వసూలు చేశారని తీరా ఇప్పుడు రోడ్డున పడేస్తే ఎలా? అంటూ నిరసనలకు దిగుతున్నారు. నిరుద్యోగులు ఏమంటున్నారు? అధికార పార్టీ నేతలుగా చెప్పుకున్న కొందరు దళారులు ఈ నియామకాల్లో చక్రం తిప్పారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్మాగారంలో టెక్నికల్ ఉద్యోగాలు ఇస్తామని, అవి శాశ్వత కొలువులని, కుటుంబాలకు క్వార్టర్, కుటుంబ సభ్యులకు ఉచిత విద్య, వైద్యం సదుపాయాలు, నెలనెలా రూ. 25 వేల వేతనం ఉంటాయని నమ్మబలికారని వాపోతున్నారు. ఉద్యోగం చేసినంత కాలం స్కిల్డ్ లేబర్ కింద రోజుకు రూ. 610 చెల్లించారని, తీరా ఏడాది తర్వాత సిబ్బంది అధికంగా ఉన్నారని చెప్పి 498 మందిని తప్పించారని వాపోతున్నారు. ఇప్పుడు కేవలం 300 మందే మిగిలారని, వారికి అన్స్కిల్డ్ లేబర్ కింద రోజుకు రూ.440 మాత్రమే చెల్లిస్తున్నారని వివరించారు. 498 మందిలో దాదాపు 400 మంది కార్మికులు అధికార పార్టీకి చెందిన పలువురు నేతలకు రూ. 9 లక్షల నుంచి రూ. 12 లక్షల చొప్పున ముట్టజెప్పారని ఆర్ఎఫ్సీఎల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు అంబటి నరేశ్ ఆరోపిస్తున్నారు. రోడ్డున పడ్డ ఉద్యోగులంతా ఆర్ఎఫ్సీఎల్ బాధితుల సంఘంగా ఏర్పడ్డారు. క్రమంగా నిరసనలను ముమ్మరం చేస్తున్నారు. త్వరలోనే గవర్నర్ను కూడా కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్యేపై విమర్శలతో! మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్య నారాయణ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కోరుకంటి చందర్పై విమర్శలు చేయడం వివాదం కొత్తమలుపు తిరిగింది. ఆయ నకు ఈ వ్యవహారంతో సంబంధముందని ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియా లో పెట్టిన పోస్టులు వైరల్గా మారాయి. ఈ వ్యవహారంలో నిజానిజాలను నిగ్గు దేల్చేందుకు ఎమ్మెల్యే 18 మందితో కూడిన నిజనిర్ధారణ కమిటీని వేశారు. మరోసారి ఇలాంటి ఆరోపణలు చేసినా, అసత్యాలు ప్రచారం చేసినా, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్పష్టం చేశారు. మరోవైపు బాధితులు గవర్నర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. డబ్బు లిచ్చి మోసపోయా మంటున్న వారిలో సుమారు 240 మంది వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. తమ నుంచి వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించేదాకా ఉద్యమం కొనసాగిస్తామని తేల్చిచెబుతున్నారు. -
Agnipath Protests: పేద యువతను నిందించగలమా?
అగ్నిపథ్ పథకంపై రాజకీయ దుమారం ఇక చాలంటూ... ‘ప్రభుత్వం సదుద్దేశంతో చేపట్టిన పథకాలకు రాజకీయరంగు పులమటం దేశ దౌర్భాగ్యం. ఇప్పుడు బాధాకరంగా తోచినా దీర్ఘ కాలిక ప్రయోజనాలున్నాయనీ, దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకో వాల’నీ ప్రధాని మోదీ వివరించారు. ఈ పథకాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు అని సైనికాధికార్లు స్పష్టం చేశారు. సైన్యం దేశ రక్షణ లక్ష్యంతో పని చేస్తుందనీ, నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం కాదనీ సూటిగా చెప్పారు. ప్రతిపక్షాలు రాజకీయంగా ప్రశ్నించటం సహజమే అని మరోసారి నిరూపించాయి. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపాదించిన వాటినే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించటం అవకాశవాదం. నిజానికీ పథకం 1989 నుంచి పెండింగులో ఉన్నదని అధికారికంగా చెప్పారు. బీజేపీ కూడా ఇలాగే వ్యవహరించింది కదా. దేశభక్తి పేరిట రాజకీయం తగదు. కపట రాజకీయాలకు దేశభక్తి ముసుగు పరిపాటి అయింది. అధికార పార్టీల ఈ అవకాశవాదాన్ని స్వతంత్ర మేధావులు ఎత్తిచూపాలి; ప్రజలు తిరస్కరించాలి. రైళ్ళు, బస్సుల వంటి ప్రజల ఆస్తుల ధ్వంసం; ప్రయాణికుల పార్సెళ్ల దహనం... రేపు సైన్యంలో చేరాలనుకుంటున్న యువతరం చేయాల్సిన పనులేనా ఇవని వారిని మాత్రమే నిందిస్తే లాభం లేదు. కలుషిత రాజకీయాల పర్యవసానమే ఇది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? సెల్ టవర్సుని ధ్వంసం చేసే నక్సల్స్కీ, వివిధ పార్టీలు ప్రోత్సహిస్తున్న అరాచకత్వానికీ తేడా ఏముంది? కొన్ని అగ్రవర్ణ మూకలు గుజరాత్లో తమకు రిజర్వేషన్లు కావాలని చేసిన హింసాకాండ సందర్భంగా అన్ని పార్టీలు పాటించిన మౌనాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పేరిట విధ్వంసం తాజా ఉదాహరణ! ఆందోళనంటే ఇలా, అలా చేయకపోతే ప్రభుత్వాలు స్పందించవు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. గోరక్షణ పేరుతో మానవ హత్యలను ప్రోత్సహిస్తున్న వాతావరణంలో... కేవలం ఆ నిరుద్యోగ పేద యువకులు భవిష్యత్ పట్ల ఉన్న భయంతో పాల్పడిన హింసను నిందించగలమా? కఠినంగా శిక్షించాలని, వారికి ఆర్మీలో ఉద్యోగాలివ్వడం అసాధ్యమని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఎవరో ఏదో తప్పు చేశారని చెప్పి, మర్నాడే బుల్డోజర్లతో వారి ఇళ్లను యూపీలో ఆదిత్యనాథ్ ప్రభుత్వం కూల్చి వేసింది. తెలంగాణను నిందిస్తూ, ఇక్కడా బుల్డోజర్ ప్రభుత్వం రావాలని బీజేపీ నేతలు బాహాటంగా ప్రకటిస్తున్నారు. వారిని ఖండించకుండా కేంద్ర నాయకుల పరోక్ష మద్దతు! యధా రాజా తథా ప్రజా! మన దేశరక్షణను మన అవసరాలకూ వనరులకూ తగిన రీతిలో నిర్వహించుకోవాలి. అమెరికాలో ఇజ్రాయెల్లోనూ ఇలాగే చేస్తున్నారంటూ... ప్రభుత్వమూ, జాతీయవాద అధికార పార్టీ అగ్నిపథ్ను సమర్థించటం విడ్డూరం. టెక్నాలజీ అవసరమే కానీ మానవ వనరులే ప్రధానంగా ఉన్న మన దేశానికి ఆయా విధానాల్ని తగిన రీతిలో అన్వయించుకోవడం అవసరమనేది గుర్తించాలి. దేశరక్షణ కేవలం భారీ డిఫెన్స్ బడ్జెట్తో పటిష్టం కాజాలదు. బడ్జెట్, టెక్నాలజీ... రెండిటా నంబర్వన్ అయిన అమెరికా సైన్యం వియత్నాం, ఆఫ్గానిస్తాన్లో అధర్మ యుద్ధాల్లో ఘోర పరాజయం పొందింది. విదేశీ వ్యవహారాల్లో శాంతి లక్ష్యం, సరైన దౌత్యం లేకపోతే ఎవరికైనా అంతే. ఈ అన్ని సంగతులనూ దృష్టిలో పెట్టుకుని అన్ని పక్షాలూ అగ్నిపథ్ ఉచితానుచితాలను ఆలోచించాలి. (క్లిక్: కేసుల్లో ఇరుక్కున్న యువకుల భవిష్యత్తు మాటేంటి?) - డాక్టర్ ఎం. బాపూజీ సీఎస్ఐఆర్ విశ్రాంత శాస్త్రవేత్త -
Agnipath Scheme: స్వార్థపర శక్తులతో జాగ్రత్త!
ఒక్క క్షణం సహనం, కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే... ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది – స్వామి వివేకా నంద దేశంలో రోజు రోజుకూ మారుతున్న పరిణామాల కారణంగా అమాయకులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొందరు స్వార్థపరులు ఆడుతున్న క్రీడలో పలువురు అనవసరంగా పావులుగా మారుతున్నారు. అగ్నిపథ్ పథకంపై నిరసనల్లో పాల్గొని కేసుల పాలైన నిరుద్యోగ యువత ఉదంతం ఇందుకు తాజా ఉదాహరణ. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ రక్షణకు ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ‘అగ్నిపథ్’ పథకాన్ని తీసుకువచ్చింది. అయితే వాస్తవాలూ, పూర్తి వివరాలూ తెలుసు కోకుండానే స్వార్థ రాజకీయ నాయకులూ, కోచింగ్ సెంటర్ల యజమానులూ కుట్రపూరితంగా అమాయక నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి హింసకు పాల్పడేలా చేస్తున్నారు. వీరి మాటలు విన్న యువత రెచ్చి పోయి కేసుల్లో ఇరుక్కుంటూ తమ బంగారు భవిష్యత్ను నాశనం చేసుకుంటున్నారు. ఈ అగ్నిపథ్ కింద... 18 నుంచి 23 ఏళ్ల యువకులు నాలుగేళ్లపాటు నెలకు 30 నుంచి 40 వేల జీతంతో దేశ సేవ చేసిన తర్వాత... వారికి రూ. 11.71 లక్షల సేవా నిధి అందు తుంది. సైన్యంలో పొందిన క్రమశిక్షణ, ఆత్మస్థైర్యంతో బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునే అవకాశం యువతకు లభిస్తుంది. కానీ ఈ వాస్తవాల గురించి తెలుసుకుని పూర్తి అవగాహన పెంపొందించుకునే అవకాశాన్ని స్వార్థపర శక్తులు యువతకు ఇవ్వకుండా వారిని భయాందోళనకు గురిచేశారు. వారి మాటలను నమ్మి విధ్వంసానికి పాల్పడి కేసుల్లో ఇరుక్కున్న యువకుల భవిష్యత్తు మాటేంటి? అగ్నిపథ్నే కాదు అంతకుముందూ స్వార్థ రాజకీయ శక్తులు మోదీ తలపెట్టిన సంస్కరణలను వ్యతిరేకించాయి. రైతులకు మేలుచేసే నూతన వ్యవసాయ చట్టాలు తెస్తే రైతులను రెచ్చగొట్టి వాటిని వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తెచ్చారు. నోట్ల రద్దును పదేపదే విమర్శించేవారు మోదీ నిర్ణయం తర్వాత తీవ్రవాద చర్యలు ఎందుకు తగ్గుముఖం పట్టాయన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేరు. మోదీ ప్రభుత్వం డిజిటల్ మనీ విధానాన్ని ప్రవేశపెట్టిన కొత్తలో మార్కెట్కు వెళ్ళి కిలో ఆలుగడ్డలు కొనడానికి డిజిటల్ మనీ కావాలా అని ఎద్దేవా చేసిన మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం లాంటి వారికీ గంగిరెద్దుల వారు కూడా ఫోన్ పే, గూగుల్ పేల ద్వారా భిక్షం స్వీకరించటం చెంపపెట్టులాంటిది కాదా? గతంలో కూడా ఇలాంటి విమర్శలకు భయపడి అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు నిలిపివేసి ఉంటే పలు దేశాలలాగా మన దేశం కూడా ఆర్థికమాంద్య పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చేది. మోదీ ప్రభుత్వ 8 ఏళ్ల పరిపాలన చూసి కూడా... ఇంకా స్వార్థపరుల మాటలు వింటూ సహాయ నిరాకరణ, ఆందోళనలు చేస్తే మన చేతితో మన కంటిని మనమే పొడుచుకున్న వారమవుతాం. గతంలో ఎన్నో ప్రభుత్వాలను చూసిన మనం ఎవరి పరిపాలన బాగుంది, ఎవరికి మద్దతుగా నిలబడాలి అని తులనాత్మకంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసిన సమయం ఆసన్నమైంది. - శ్యామ్ సుందర్ వరయోగి బీజేపీ నాయకుడు -
సర్కారీ కొలువుల జాతర
కొత్తగా పది లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించినట్టు వెలువడిన కథనం చిరకాలంగా కొలువుల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగ యువతలో ఉత్సాహాన్ని నింపింది. ఈ నిర్ణయం పర్యవసానంగా వచ్చే ఏడాదిన్నరకాలంలో 77 మంత్రిత్వశాఖల పరిధిలోని వివిధ విభా గాల నుంచి వరస నోటిఫికేషన్లు హోరెత్తుతాయి. కొత్తగా ఉద్యోగాలిస్తే జీతాల కోసం అదనంగా ప్రతి నెలా రూ. 4,500 కోట్లు వ్యయమవుతుందని ఒక అంచనా. అంటే ఏటా ప్రభుత్వానికి రూ. 54,000 కోట్ల అదనపు ఖర్చుంటుంది. ఈ ఉద్యోగులకు ఇచ్చే శిక్షణ వగైరాలకయ్యే వ్యయం అదనం. వీరందరికీ మున్ముందు పదోన్నతులు ఇవ్వాల్సివచ్చినప్పుడు ఎదురయ్యే సమస్యలు సరేసరి. అసలు ఇంత తక్కువ వ్యవధిలో ఈ స్థాయి రిక్రూట్మెంట్ ఆచరణలో సాధ్యమేనా అన్న సందేహం కూడా వస్తుంది. ఒక క్రమపద్ధతిలో అవసరానికనుగుణంగా ఉద్యోగాలు భర్తీ చేస్తే సమస్యలుండవు. ఆ విభాగాలు ఎలాంటి అంతరాయమూ లేకుండా సేవలందించడం సాధ్యమవుతుంది. అలా కాకుండా ఒకేసారి జాతర మాదిరిగా ఉద్యోగాల భర్తీ చేపడితే నిరుద్యోగులకూ ఇబ్బందే. ఏ ఉద్యోగం వస్తుందో, ఏది రాదో తెలియక అన్ని పరీక్షలకూ హాజరుకావాల్సి వస్తుంది. తాము అధికారంలో కొచ్చాక ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని బీజేపీ వాగ్దానం చేసింది. ఆ విషయంలో అడపా దడపా విమర్శలు వస్తున్నా కేంద్రంలోని పెద్దలు పట్టించుకోలేదు. ఉద్యోగాలంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగాలేనా అని కొందరు సచివులు ఎదురు ప్రశ్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి. నిరుద్యోగ పెనుభూతం యువతరాన్ని ఎంతగా పీడిస్తున్నదో తెలియడానికి కేంద్రం ప్రకటించిన ‘అగ్నిపథ్’ పథకంపై బిహార్, హరియాణా, మధ్యప్రదేశ్, గురుగ్రామ్ తదితరచోట్ల వెల్లువెత్తుతున్న ఆగ్రహావేశాలే నిదర్శనం. రైల్వే ఆస్తులను, బస్సులను ధ్వంసం చేయడం, రహదారుల దిగ్బంధం వంటి ఘటనలు చూస్తుంటే యువత ఎంతగా నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయారో అర్ధమవు తుంది. 1994 గణాంకాల ప్రకారం కేంద్రంలో 41.76 లక్షల ఉద్యోగాలుండేవి. 2014 నాటికి వాటి సంఖ్య 39.9 లక్షలు. 2021 లెక్కల ప్రకారం కేంద్ర సిబ్బంది 34.5 లక్షల మంది. వీరుగాక చిన్నా చితకా ఉద్యోగాలతో సహా కేంద్రంలో 24.30 లక్షలమంది కాంట్రాక్టు నియామకాల కింద పనిచేస్తు న్నారు. కేంద్ర సిబ్బందిలో 92 శాతం మంది కేవలం ఐదు మంత్రిత్వ శాఖల్లో ఉంటారని చెబుతారు. ఇందులో 40 శాతం వాటాతో రైల్వేలు అగ్రభాగాన ఉంటే... హోంశాఖలో 30 శాతం, రక్షణ (పౌరవిభాగం)లో 12 శాతం సిబ్బంది ఉంటారు. నిజానికి బయట దొరికే ఉద్యోగాలతో పోలిస్తే ప్రభుత్వ ఉద్యోగాల శాతం చాలా తక్కువ. మన జీడీపీ ఘనంగా కనబడటానికి తోడ్పడుతున్న సేవారంగంలో ఉద్యోగాలకు ప్రత్యేక నైపుణ్యాలు అవసరమవుతాయి. పైగా అక్కడా సాంకేతికత పెరిగి గతంతో పోలిస్తే ఉద్యోగావకాశాలు క్షీణిస్తున్నాయి. ఏటా కొత్తగా ఉద్యోగ మార్కెట్లోకి వచ్చేవారు కోటీ 20 లక్షలమంది అని ఒక అంచనా. వీరిలో ఎందరికి ఉద్యోగాలు దొరుకుతాయి? వీరికన్నా చాలా ఏళ్లముందునుంచీ ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారి మాటేమిటి? పాశ్చాత్య దేశాల్లో ప్రభుత్వోద్యోగాల కోసం ఎగబడే ధోరణి కనబడదు. అక్కడ రెండు రంగాల్లో లభించే వేతనాలకూ పెద్దగా వ్యత్యాసం ఉండదు. కానీ మన దేశంలో వేరు. ప్రభుత్వ సిబ్బందికి నిర్ణీత వ్యవధిలో వేతన సవరణ సంఘాల సిఫార్సులు వస్తాయి. కాస్త వెనకో ముందో వాటిని అమలు చేస్తారు. ఇవిగాక ప్రైవేటు రంగంతో పోలిస్తే ఇతరత్రా సదుపాయాలు, క్రమం తప్పకుండా వచ్చే పదోన్నతులు అదనం. ప్రైవేటు రంగ సిబ్బంది యాజమాన్యాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండాలి. కార్మికసంఘాలు బలహీనపడ్డాయి గనుక ఉద్యోగులకు దినదినగండంగా ఉంటున్నది. లేబర్ కోర్టులు వగైరాలవల్ల పెద్దగా ఒరిగేది ఉండదు. ప్రైవేటు రంగంలో కూడా మెరుగైన పరిస్థితు లుండేలా చర్యలు తీసుకుంటే ప్రభుత్వాలపై ఒత్తిడి తగ్గుతుంది. ఆ దిశగా తీసుకుంటున్న చర్యలు లేకపోగా... రేపో మాపో అమల్లోకి రానున్న లేబర్ కోడ్ వల్ల పరిస్థితులు మరింత అధ్వాన్నమవు తాయని బీజేపీ అనుకూల కార్మికసంఘంతో సహా అన్ని సంఘాలూ ఆరోపిస్తున్నాయి. ఈ కారణాల వల్లే ప్రభుత్వోద్యోగాల కోసం ఎగబడేవారు నానాటికీ పెరుగుతున్నారు. నిరుద్యోగంపై కేవలం కేంద్రాన్ని మాత్రమే తప్పుబట్టడం కుదరదు. ఏ పార్టీ అధికారంలో ఉందన్నదానితో నిమిత్తం లేకుండా 90వ దశకం మధ్యనుంచీ అన్ని రాష్ట్రాల్లోనూ సర్కారీ కొలువులు తగ్గిపోయాయి. తాను అధికారంలోకొస్తే యువతకు ఉద్యోగాలిస్తాననీ, లేనట్టయితే నిరుద్యోగ భృతి ఇస్తాననీ 2014 ఎన్నికల్లో వాగ్దానం చేసిన చంద్రబాబు తాను పాలించిన ఐదేళ్లూ ఉద్యోగాలూ ఇవ్వలేకపోయారు, నిరుద్యోగ భృతిని కూడా అందించలేకపోయారు. చివరకు 2019లో అధికారం లోకొచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం భారీయెత్తున యువతకు ఉద్యోగాలిచ్చింది. కేంద్ర స్థాయిలో క్రమం తప్పకుండా నియామకాలు చేపట్టే ప్రధాన సంస్థల్లో యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ ప్రధానమైనవి. వీటిద్వారా గత ఐదేళ్లలో నాలుగున్నర లక్షలమందిని తీసుకున్నట్టు కేంద్రం చెబుతున్నది. ఇవిగాక ప్రస్తుతం వివిధ విభాగాల్లో పది లక్షల ఉద్యోగాలు ఖాళీగా పడివున్నాయి. కొలువుల భర్తీపై కేంద్రం తాజా ప్రకటనను విపక్షాలు తప్పుబడుతున్నాయి. రానున్న ఎన్నికల కోసమే ఈ ఆర్భాటమంటున్నాయి. కావొచ్చు... ఉద్దేశాలు ఏమైనప్పటికీ యువతకు ఉద్యోగ కల్పన నిర్ణయాన్ని హర్షించాల్సిందే. -
పోలీసు జాబ్స్ వయోపరిమితి పెరిగేనా?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ముందుగా పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడతాయనే ప్రచారంతో నిరుద్యోగ యువత ఎక్కువగా ఈ కొలువులకే సన్నద్ధమవుతోంది. అత్యధిక పోస్టులు ఉండటంతోపాటు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ అర్హత కావడంతో వీటికి అత్యధిక ప్రాధాన్యం ఏర్పడింది. ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. వయోపరిమితి విషయంలో నెలకొన్న అస్పష్టతతో చాలామంది నిరుద్యోగులు ప్రభుత్వ నిర్ణయం కోసం వేచిచూస్తున్నారు. అధిక సంఖ్యలో నియామకాలు చేపట్టే కానిస్టేబుల్ ఉద్యోగానికి గరిష్ట వయోపరిమితి 22 ఏళ్లు ఉండగా, ఎస్సై పోస్టులకు 25, డీఎస్పీకి 28, ఎక్సైజ్ సూపరింటెండెంట్కు 26 ఏళ్లు ఉంది. దీంతో గరిష్ట వయోపరిమితి పెంపుపై నిరుద్యోగ యువత గంపెడాశలు పెట్టుకుంది. వయోపరిమితి పెంచితేనే.. పోలీసు శాఖలో వివిధ కేటగిరీల్లో 16,587 కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులను భర్తీ చేసేందుకు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. అదేవిధంగా గ్రూప్–1లో డీఎస్పీ, ఎక్సైజ్ సూపరింటెండెంట్, రీజినల్ ట్రా న్స్పోర్ట్ ఆఫీసర్ విభాగాల్లో 120 ఉద్యోగాలున్నాయి. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్న నేపథ్యంలో ఇతర ఉద్యోగాలకు వయోపరిమితి సడలింపు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ యూనిఫాం కొలువులపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. రిజర్వేషన్ అభ్యర్థులకు కాస్త సడలింపు ఉన్నప్పటికీ జనరల్ కేటగిరీలో సడలింపు కోసం ఎదురుచూస్తున్నారు. ఒకవేళ జనరల్ కేటగిరీలో గరిష్ట వయోపరిమితి పెంచితే రిజర్వ్డ్ అభ్యర్థులకు మరింత ఉపశమనం కలుగుతుందనే ఆశ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లో కనిపిస్తోంది. వయోపరిమితిపై ప్రభుత్వం ముం దుగానే నిర్ణయం ప్రకటించాలని, నోటిఫికేషన్ విడుదలయ్యాక సడలింపు జఠిలమవుతుందని అభ్యర్థులు చెబుతున్నారు. పొరుగున 35 ఏళ్లు గ్రూప్–1 కేటగిరీలో యూనిఫాం ఉద్యోగాలు డీఎస్పీ, ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఆర్టీఓ ఉన్నాయి. వీటిలో జనరల్ కేటగిరీలో డీఎస్పీకి గరిష్ట వయోపరిమితి 28, ఎక్సైజ్ సూపరింటెండెంట్కు 26 ఏళ్లు ఉంది. అయితే, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఈ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి 35 సంవత్సరాలుగా ఉంది. ఇక్కడా వయోపరిమితి పెంచాలని, లేనిపక్షంలో చాలామంది ఆశలు గల్లంతవుతాయని నిరుద్యోగులు అంటున్నారు. -
పరాయి దేశాల్లో పడరాని పాట్లు
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టికి చెందిన 24 మంది, కేదారిపురం గ్రామానికి చెందిన 13 మంది, ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామాలకు చెందిన మరో ఏడుగురు నిరుద్యోగులు గత ఏడాది డిసెంబర్లో ఓ ప్రకటన చూసి ‘అరౌండ్ ద వరల్డ్’ అనే ట్రావెల్ ఏజెన్సీని సంప్రదించారు. డిసెంబర్ 18, 20, 22 తేదీల్లో గాజువాక గ్రాన్ ఆపిల్ హోటల్లో దుబాయ్ డ్రాగన్ కంపెనీ, అబుదాబీ శాంసంగ్ కంపెనీల్లో వెల్డర్, ఫిట్టర్, స్టోర్మెన్ ఉద్యోగాలకు ఎంపిక చేశారు. వీసా, పాస్పోర్ట్, విమానం టికెట్ల కోసం రూ.45వేలు నుంచి రూ.55వేలు వరకు వసూలుచేశారు. ఈ ఏడాది జనవరి 24న ముంబై చేరుకోవాలని, అక్కడ నుంచి 28న విమానంలో విదేశాలకు వెళ్లాలంటూ చెప్పిన ట్రావెల్ ఏజెంట్లు ఆ తర్వాత ఆఫీసుకు తాళాలు వేసి ఉడాయించారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: .. ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి శ్రీకాకుళం జిల్లాలో ఈ తరహా మోసాలు సర్వసాధారణం. ఇక్కడి ఉద్దానం ప్రాంతంతో పాటు జిల్లాలో వందలాది మంది యువత తరచూ ఈ తరహా మోసాలకు గురవుతున్నారు. వివిధ శిక్షణా సంస్థలకు లక్షల్లో ముట్టజెప్పి లబోదిబోమంటున్నారు. తీరా విదేశాలకు వెళ్లాక చెప్పిన ఉద్యోగం చూపించకపోవడం, టూరిస్ట్ వీసాలంటూ వెనక్కి పంపడం.. నకిలీ ఆర్డర్లతో ఉద్యోగాలే ఇవ్వకపోవడంతో యువకులు పరాయి దేశంలో పడరాని పాట్లు పడుతున్నారు. మోసం జరుగుతోందిలా.. సిక్కోలు (శ్రీకాకుళం) జిల్లాకు చివర్లో ఉన్నటువంటి ఉద్దానం ప్రాంతంలో ఎటువంటి ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఇక్కడి నిరుద్యోగ యువకులకు పలు సంస్థలు విదేశీ ఉద్యోగాల ఎరచూపి దోపిడీకి పాల్పడుతున్నాయి. గ్రామాల్లో ఉద్యోగ ప్రకటనను అతికించి కొంతమంది, మధ్యవర్తుల ద్వారా కార్మికులను మాయమాటలతో నమ్మించి మరికొందరూ మోసాలకు పాల్పడుతుంటే.. సైబర్ నేరగాళ్లు ఆన్లైన్లో.. ఆకర్షణీయమైన జీతాలు అందిస్తామంటూ నిరుద్యోగ యువతకు ఎరవేస్తూ లక్షలాది రూపాయలు లాగేస్తున్నారు. ఏసీ గదుల్లో ఇంటర్వ్యూలు ఏర్పాటుచేసి పెద్దలతో మాట్లాడుతున్నట్లు ఫోన్చేసి కళ్లెదుటే సినిమా చూపిస్తారు. తీరా డబ్బులు చేతికి అందాక చుక్కలు చూపిస్తున్నారు. మోసపోతున్నదిక్కడే.. ఇచ్ఛాపురం నియోజకవర్గం పరిధిలో ఇచ్ఛాపురం, కంచిలి ప్రాంతాలతోపాటు, ఒడిశా సరిహద్దుల్లో ఉన్న సుర్లారోడ్, బరంపుర్, ఛత్రపూర్ వంటి ప్రాంతాల్లో వెల్డింగ్ ఇన్స్టిట్యూట్లను ఏర్పాటుచేసి, నిరుద్యోగ యువతకు శిక్షణనిచ్చి, విదేశాల్లో ప్ల్లంబింగ్, ఎలక్ట్రీషియన్, రిగ్గర్, టిగ్ అండ్ ఆర్క్ వెల్డర్, ఫిట్టర్, గ్యాస్ కట్టర్, ఫ్యాబ్రికేటర్ తదితర పోస్టులను బట్టి రూ.50వేల నుంచి రూ.3లక్షలు వసూలుచేస్తున్నారు. సింగపూర్, మలేసియా, దుబాయ్, మస్కట్, ఖతార్, కువైట్, అబుదాబి, ఒమెన్, ఇరాక్, సౌదీ అరేబియా, సూడాన్, రష్యా, పోలండ్ తదితర ప్రాంతాలు ఇక్కడి నిరుద్యోగుల యువత కష్టాలకు కేంద్రంగా మారాయి. నా భర్త ఏమయ్యాడో.. నా పేరు పుచ్చ అనుసూయమ్మ. మాది వజ్రపుకొత్తూరు మండలం పెద్దబొడ్డపాడు పంచాయతీ కొల్లిపాడు గ్రామం. నా భర్త కుర్మారావు 2019లో సౌదీకి ఉపాధి కోసం వెళ్లాడు. అల్ మసాలిక్ కంపెనీలో చేరాడు. రెండు నెలలుగా అచూకీలేదు. నా భర్తకు ఏమైందో, అసలు ఉన్నాడో లేడో కూడా తెలీడంలేదు. ఎస్పీ, జిల్లా కలెక్టర్లను ఆశ్రయించాం. చివరికి నా భర్త పనిచేస్తున్న కంపెనీని మెయిల్ ద్వారా సమాచారం కోరాం. ఎలాంటి సమాచారంలేదు. మన వారిని చూసి కన్నీళ్లొచ్చాయి.. విదేశాల్లో మనవారు పడుతున్న కష్టాలు చూసి కన్నీళ్లు వచ్చాయి. టూరిస్ట్ వీసాలతో మోసపోయి సుమారు 60 మంది దుబాయ్లో అనేక కష్టాలుపడ్డారు. కడుపు నింపుకోవడం కోసం ప్రతీ శుక్రవారం మసీదుల వద్ద ఉచితంగా అందించే రొట్టెలు, పండ్లు కోసం క్యూ కట్టేవారు. రాత్రి సమయంలో ఇసుక తిన్నెలపై పడుకునేవారు. పోలీసుల కంటపడకుండా బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇవన్నీ కళ్లారా చూసి చలించిపోయా.. – హెచ్చర్ల కుమారస్వామి, బాధితుడు, సీతాపురం, వజ్రపుకొత్తూరు మండలం. ఉద్యోగాలివ్వకుండా మోసం.. సింగపూర్లోని రొమేనియాలో ఉద్యోగాలిప్పిస్తామని కంచిలి మండల పరిధి కత్తివరం రోడ్డులోగల శ్రీ గణేష్ వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ యజమాని బసవ వెంకటేష్ మోసం చేశాడు. మా వద్ద ఒక్కొక్కరి నుంచి రూ.65వేలు చొప్పున వసూలుచేశాడు. డబ్బులు కట్టినప్పటికీ ఉద్యోగాలకు పంపించలేదు. రెండేళ్లుగా మేం కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడుగుతున్నప్పటికీ ఇవ్వడంలేదు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాం. మోసగాడు తప్పించుకు తిరుగుతున్నాడు. – దుంగ తారకేశ, ఇన్నీసుపేట, ఈరోతు తారకేశ్వరరావు, సన్యాసిపుట్టుగ, సంగారు సురేష్, కపాసుకుద్ది మోసాలు అనేకం.. మచ్చుకు కొన్ని.. ► ఇటీవల వజ్రపుకొత్తూరు మండలం పూండిలో ఓ ఏజెంట్ 150 మంది నుంచి దాదాపు రూ.2కోట్లు వసూలు చేసి రష్యా స్టాంపుతో నకిలీ వీసాలిచ్చి మోసం చేశాడు. వాస్తవానికి వీసా అనేది పాస్పోర్టుపై అతికించి ఇవ్వాలి. కానీ, ఈ ఏజెంట్ 150 మందిని పట్టుకుని ఢిల్లీ ఎయిర్పోర్టుకు తీసుకెళ్లగా అక్కడ భారత ఎంబసీ ఇమ్మిగ్రేషన్ అధికారులు నకిలీ వీసాలుగా తేల్చి వెనక్కి పంపించేశారు. ► కంచిలి మండల పరిధిలోని కత్తివరం రోడ్డులో శ్రీ గణేష్ వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు సుమారు 150 మంది నిరుద్యోగ యువకులకు విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి మోసంచేసి, ఒక్కొక్కరి నుంచి రూ.60 వేల నుంచి 70 వేలు చొప్పున వసూలు చేసి, దుకాణం మూసేశారు. బాధితుల్లో ఇన్నీసుపేట, సన్యాసిపుట్టుగ, కపాసుకుద్ది, ఒడిశా సరిహద్దు గ్రామాలకు చెందిన వారున్నారు. ► అలాగే, ఇదే మండలంలోని డోలగోవిందపురం గ్రామానికి చెందిన మట్ట దున్నయ్య అనే వ్యక్తి డోలగోవిందపురం, గంగాధరపురం, ఒడిశాకు చెందిన నరేంద్రపురం తదితర గ్రామాలకు చెందిన ఆరుగురి నుంచి రూ.65వేలు చొప్పున వసూలుచేసి, మరో ఏజెంటు ద్వారా వీరికి శ్రీలంకలో నెలకు రూ.18,500 చొప్పున జీతంతోపాటు, ఓటీ, భోజనం, వసతి సౌకర్యం కల్పించే ఉద్యోగం ఇస్తానని చెప్పి నమ్మబలికి, తీరా యువకులను శ్రీలంక పంపించి, అక్కడ కేవలం రూ.12వేలు మాత్రమే జీతం ఇచ్చే ఉద్యోగాలు ఇప్పించాడు. దీంతో ఆయా యువకుల కుటుంబసభ్యులు లబోదిబోమంటున్నారు. ఒక ఉద్యోగం అని చెప్పి.. వేరే ఉద్యోగం ఇచ్చి.. శ్రీలంకలో నెలకు రూ.18,500 చొప్పున జీతంతోపాటు ఓటీతో కలిపి రూ.25వేలు వరకు వచ్చే ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.65వేలు చొప్పున వసూలుచేశారు. తీరా వారం రోజుల క్రితం శ్రీలంకకు వెళ్లి అక్కడి గమేజ్ ట్రేడింగ్ కంపెనీలో నెలకు రూ.12వేలు మాత్రమే జీతం ఇచ్చే ఉద్యోగాలిచ్చి మోసంచేశారు. ఏజెంట్ చెప్పిన ప్రకారం ఏదిలేదు. మాకు జరిగిన మోసంపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. మేం కట్టిన డబ్బులు తిరిగి ఇప్పించాలి. – శ్రీలంక నుంచి బాధితులు పురుషోత్తం, బినోద్ నాయక్, శివ -
తెలంగాణ వచ్చినా.. ఆత్మహత్యలా!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా ఉద్యోగాల్లేక యువతీయవకులు ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఉద్యోగ ఖాళీల భర్తీ.. నిరుద్యోగ భృతి కోసం బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన ‘కోటి సంతకాల’సేకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఆదివారం పార్టీ కార్యాల యంలో మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీజీకి నివాళులు అర్పించిన అనంతరం తొలి సంతకం చేసి ఈ కార్యక్రమానికి సంజయ్ శ్రీకారం చుట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ఇచ్చిన హామీ లేవీ సీఎం అయ్యాక అమలు చేయకుండా నిరుద్యోగులను నిలువునా మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 2014లో అసెంబ్లీలో కేసీఆర్.. 1.07 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ‘ఏడున్నరేళ్ల నుంచి ఒక్క గ్రూప్–1 ఉద్యోగం లేదు.. మూడేళ్ల నుంచి ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయలేదు’అని పేర్కొన్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలను సీఎం చేసిన హత్యలుగానే బీజేపీ భావిస్తోందని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. ‘నిన్నొకాయన లక్షన్నర ఉద్యోగాలిచ్చామంటూ పచ్చి అబద్ధాలు చెబుతుండు.. దమ్ముంటే ఆ జాబితాను విడుదల చేయాలి’అని సంజయ్ సవాల్ విసి రారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. -
ప్రైవేటు ఉద్యోగం చేసిన వాళ్లు మనుషులు కారా? అంటూ లేఖ రాసి..
శామీర్పేట్(హైదరాబాద్)/ధన్వాడ: ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న తల్లిదండ్రుల కోరిక తీర్చలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే... నారాయణపేట జిల్లా ధన్వాడ మండలంలోని పాతపల్లికి చెందిన పద్మమ్మ, కృష్ణయ్య దంపతుల చిన్న కుమారుడు నరసింహ (23) బీఎస్సీ (బయో టెక్నాలజీ) పూర్తి చేశాడు. కొద్దికాలంగా శామీర్పేటలోని ఓ రూంలో మరో ఇద్దరు మిత్రులతో కలిసి ఉంటున్నాడు. ఎంత ప్రయత్నించినా ప్రభుత్వ ఉద్యోగం సాధించలేకపోవడంతో నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యో గం చేస్తున్నాడు. అయితే నరసింహ స్వగ్రామానికి వెళ్లిన ప్రతిసారి తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగం ఎప్పుడు సాధిస్తావు అంటూ అడుగుతుండటంతో మనస్తాపానికి గురయ్యాడు. గత కొంతకాలంగా తల్లిదండ్రుల కోరిక తీర్చలేకపోయానంటూ బాధపడుతున్నాడు. ప్రభుత్వ ఉద్యో గం చేసిన వాల్లే మనుషులా..ప్రైవేటు ఉద్యోగం చేసిన వాళ్లు మనుషులు కారా? అంటూ లేఖ రాసి గత నెల 27న ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. రాత్రి వరకు తిరిగి రాకపోవడంతో తోటి మిత్రులు వెంటనే తల్లిదండ్రులకు సమాచారమిచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు సోమవారం ఉదయం లాల్గడి మలక్పేట గ్రామంలోని మల్క చెరువులో అతడి మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
1.62 లక్షల మంది విద్యార్థులకు మైక్రో‘సాఫ్ట్’ స్కిల్స్
సాక్షి, అమరావతి: డిగ్రీ విద్యార్ధుల సాఫ్ట్ స్కిల్స్ నైపుణ్యాలను పెంపొందించి ఉద్యోగావకాశాలు మెరుగుపరచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ప్రపంచంలో అగ్రశ్రేణి సంస్థగా ఉన్న మైక్రోసాఫ్ట్ ద్వారా రాష్ట్రంలో 1.62 లక్షల మంది విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్ నైపుణ్యాలపై శిక్షణ ఇప్పించేందుకు సన్నద్ధమైంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి ప్రత్యేక చొరవ చూపి ఈమేరకు ఇప్పటికే మైక్రోసాఫ్ట్తో ఎంవోయూ కుదుర్చుకోగా గడువు తేదీని వచ్చే ఏడాది డిసెంబర్ చివరి వరకు పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. ఒప్పందం ప్రకారం గడువు ఈ ఏడాది డిసెంబర్ ఆఖరుతో ముగుస్తున్నప్పటికీ కరోనాతో విద్యాసంస్థలు దీర్ఘకాలం మూతపడటం, విద్యార్థులు నెలల తరబడి కాలేజీలకు దూరం కావడంతో ఒప్పందం గడువును పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 300 కాలేజీల పరిధిలో చదువుతున్న విద్యార్ధులు, నిరుద్యోగ యువతకు మైక్రోసాఫ్ట్ వివిధ కోర్సులలో ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30.79 కోట్లను వెచ్చిస్తోంది. ఆన్లైన్ ద్వారా అత్యంత నాణ్యమైన కొత్త కరిక్యులమ్ ద్వారా మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇస్తుంది. బ్రాండ్ వాల్యూ ఉన్న మైక్రోసాఫ్ట్ అందించే ఈ కోర్సులకు ప్రపంచవ్యాప్తంగా కంపెనీల గుర్తింపు ఉన్నందున విద్యార్ధులకు ఎంతో మేలు జరగనుంది. శిక్షణ ప్రాజెక్టు అమలు కోసం పర్యవేక్షణ, మూల్యాంకన కమిటీని ప్రభుత్వం నియమించింది. 40 కోర్సులలో శిక్షణ మైక్రోసాఫ్ట్ సంస్థ అధునాతన సాఫ్ట్వేర్ అంశాలపై విద్యార్ధులకు శిక్షణ ఇవ్వనుంది. ప్రత్యేక డొమైన్ ద్వారా 40 సర్టిఫికేషన్ కోర్సులలో విద్యార్థులకు శిక్షణ ఉంటుంది. ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్ సంస్థ రూ.7,500 (100 యూఎస్ డాలర్లు) విలువ గల ‘అజూర్పాస్’ను ప్రతి విద్యార్థికి సమకూర్చనుంది. దీని ద్వారా 1.62 లక్షల మంది విద్యార్థులు క్లౌడ్ టెక్నాలజీ ద్వారా శిక్షణాంశాలను సులభంగా పొందగలుగుతారు. సర్టిఫికేషన్ కోర్సులతో పాటు అదనంగా ‘లింకిడ్ ఇన్ లెర్నింగ్’ ద్వారా బిజినెస్, క్రియేటివిటీ, టెక్నికల్ విభాగాలకు సంబంధించిన 8,600 కోర్సులు విద్యార్ధులు నేర్చుకునేందుకు అందుబాటులోకి వస్తాయి. అజూర్ ల్యాబ్స్ ద్వారా విద్యార్ధులకు యాప్ల అభివృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్డేటా లాంటి 25 ఫ్రీ అజూర్ సర్వీసులు అందుతాయి. శిక్షణ కార్యక్రమాలకు మైక్రోసాఫ్ట్ లెర్న్ (ఎంఎస్ లెర్న్) ముఖ్యమైన ప్లాట్ఫాంగా ఉంటుంది. సెల్ఫ్పేస్డ్, డిజిటల్ లెర్నింగ్ వనరుల ద్వారా విద్యార్ధులు నూతన సాంకేతిక అంశాలపై శిక్షణ పొందుతారు. పరిశ్రమలకు అవసరమైన సర్టిఫికేషన్ కోర్సులు ముఖ్యంగా ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ తదితర విభాగాల్లో మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇస్తుంది. ప్రాజెక్టు పర్యవేక్షణకు ఉన్నత కమిటీ 1.62 లక్షల మంది విద్యార్ధులకు మైక్రోసాఫ్ట్ ద్వారా సర్టిఫికేషన్ కోర్సుల ప్రాజెక్టు అమలు, పురోగతి పరిశీలనకు ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. విద్యాశాఖ మంత్రి ఛైర్మన్గా, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి సభ్యుడిగా, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కన్వీనర్గా మరో నలుగురితో కమిటీ ఏర్పాటైంది. మైక్రోసాఫ్ట్తో ఉన్నత విద్యామండలి ఒప్పందం గడువు ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగియనుండగా కరోనా వల్ల ప్రాజెక్టు అమలులో జాప్యం జరిగినందున 2022 డిసెంబర్ 31 వరకు పొడిగించారు. శిక్షణలో భాగంగా మైక్రోసాఫ్ట్ గుర్తించిన సంస్థల ద్వారా మాక్ టెస్టులు, పరీక్షలు ఇతర కార్యక్రమాలు చేపడతారు. విద్యార్ధులకు మైక్రోసాఫ్ట్ అందించే సర్టిఫికెట్లను డిజి లాకర్లో భద్రపరుస్తారు. ఎంతో ప్రయోజనకరం విద్యార్ధులకు సాఫ్ట్ స్కిల్స్ నైపుణ్యాల శిక్షణపై మైక్రోసాఫ్ట్ ఎడ్యుకేషన్ విభాగం డైరెక్టర్ ప్రతిపాదనలు అందించిన అనంతరం ప్రభుత్వం సంబంధిత నిపుణుల అభిప్రాయాలను సేకరించింది. మైక్రోసాఫ్ట్ ప్రతిపాదనలతో రాష్ట్ర విద్యార్ధులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి వివిధ యూనివర్సిటీలు, కాలేజీల ద్వారా స్టేక్హోల్డర్ల నుంచి కూడా అభిప్రాయాలను తీసుకుంది. మైక్రోసాఫ్ట్ శిక్షణతో పలు రకాలుగా మేలు జరుగుతుందని విద్యారంగ నిపుణులు పేర్కొన్నారు. అన్ని విశ్వవిద్యాలయాల వీసీలతో నిర్వహించిన సమావేశానికి మైక్రోసాఫ్ట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఓమ్జివాన్ గుప్తా తదితరులు హాజరై ప్రతిపాదనలను వివరించారు. అకడమిక్ ప్రోగ్రామ్స్లో మైక్రోసాఫ్ట్ శిక్షణ కార్యక్రమాలను చేర్చడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని, సర్టిఫికేషన్ కోర్సులతో ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని వీసీలు పేర్కొన్నారు. -
నిరుద్యోగులకు అండగా నిలిస్తే అరెస్టులా?
చందుర్తి (వేములవాడ): నిరుద్యోగ యువతకు అండగా నిలిస్తే ప్రభుత్వం అరెస్ట్ చేయించడం సిగ్గుచేటు అని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి మండిపడ్డారు. చందుర్తిలో శనివారం గాంధీ విగ్రహ ఆవిష్కరణకు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్గౌడ్, పీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్లతో కలిసి ఆయన హాజరయ్యారు. అనంతరం కాంగ్రెస్ చేపట్టిన జంగ్ సైరన్ కార్యక్రమానికి జీవన్రెడ్డి వెళ్తున్నారనే సమాచారంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్చేశారు. దీంతో కార్యకర్తలు పోలీసుల వైఖరికి నిరసనగా వాహనానికి అడ్డుగా బైఠాయించారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్ ఆధ్వర్యంలో పోలీసులు కార్యకర్తలను అడ్డు తొలగించి జీవన్రెడ్డి, ప్రభాకర్గౌడ్, డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్, శ్రీనివాస్ను చందుర్తి పోలీస్స్టేషన్కు తరలించారు. అనంతరం ఠాణాలో విలేకరుల సమావేశంలో జీవన్రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగులకు కాంగ్రెస్ అండగా నిలుస్తుందని హామీఇచ్చారు. జెడ్పీటీసీ కుమార్, నాయకులు రాం రెడ్డి, ముకుందరెడ్డి, లింగారెడ్డి, రామస్వామి, ఫీర్ మహ్మద్ పాషా, 100 మంది నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. -
పోస్టులు భర్తీ చేయకుంటే మిలియన్ మార్చ్
సిరిసిల్ల: దీపావళి పండుగలోగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వకుంటే మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని, నిరుద్యోగులకు బీజేపీ అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లెలో శనివారం ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బహిరంగసభను నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగమిస్తామన్న కేసీఆర్, ఏడేళ్లలో ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీపావళి తరువాత నిర్వహించే మిలియన్మార్చ్ ఉద్యమంతో టీఆర్ఎస్ ప్రభుత్వం కొట్టుకుపోతుందని, ఇదే చివరి ఉద్యమం అవుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నిరుద్యోగికి రూ.లక్ష చొప్పున బాకీ ఉందన్నారు. కేసీఆర్ కేవలం ఒక్క రైతుబంధు ఇస్తూ.. అన్ని సబ్సిడీ పథకాలను ఎత్తివేశారన్నారు. ఇక గల్ఫ్ బాధితులను ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదన్నారు. కేంద్రం నిధులు ఇస్తే.. వాడుకుంటూనే ఏం ఇవ్వడం లేదని కేసీఆర్ చెబుతున్నారని సంజయ్ ఆరోపించారు. కాగా, గ్రామాల్లో ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ఎన్నో సమస్యలు తెలుస్తున్నాయని కేంద్ర మంత్రి పురుషోత్తమ్ రూపాలా అన్నారు. బండి సంజయ్ వెంట ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న ఆయన అంకిరెడ్డిపల్లెలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని అన్నారు. అన్నీ ఆయన కుటుంబానికే... తెలంగాణ వస్తే నీళ్లు.. నిధులు.. నియామకాలు వస్తాయని అందరూ భావించారని, కానీ ఏడేళ్లలో అన్నీ సీఎం కేసీఆర్ కుటుంబానికే వచ్చాయని బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి విమర్శించారు. అంకిరెడ్డిపల్లె బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ, ఉపాధి కల్పించకుండా కేసీఆర్ యువతను మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ను గద్దె దించి బీజేపీని గెలిపించాలని కోరారు. -
భలే ఫిష్.. ఆల్ ఫ్రెష్
పెదగంట్యాడ (గాజువాక): వినియోగదారులకు నాణ్యమైన చేపలను తక్కువ ధరకే అందించాలనే ఉద్దేశంతో ఫిష్ ఆంధ్ర మినీ అవుట్లెట్ల ఏర్పాటుకు రాష్ట్ర మత్స్యశాఖ శ్రీకారం చుట్టింది. నాణ్యమైన చెరువు చేపలు, సముద్రంలో పెరిగే మత్స్య రాశులను విక్రయించేందుకు రంగం సిద్ధం చేసింది. సీఎం వైఎస్ జగన్ సూచనల మేరకు రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం బీసీ రోడ్డులోని మార్వెల్ స్కూల్ ఎదుట వినాయక చవితి రోజున దీనిని ప్రారంభించారు. మత్స్యశాఖ జాయింట్ సెక్రటరీ బాలాజీ, కమిషనర్ ఆఫ్ ఫిషరీస్ కె.కన్నబాబు, మత్స్యశాఖ సంయుక్త సంచాలకుడు లక్ష్మణరావుమతదితరులు అవుట్ లెట్ను ప్రారంభించారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో అందుబాటులోకి తేనున్నారు. అందుబాటులో ఉండే చేపలివే.. సముద్రంలో పెరిగే వంజరం, చందువా, రొయ్యలు, పీతలు, పండుగొప్ప.. చెరువుల్లో పెరిగే శీలావతు, బొచ్చె, రూప్చంద్, మోసు, కొర్రమీను, రాగండి, కట్ల తదితర చేపలు. ప్రభుత్వమే ఈ అవుట్ లెట్లకు చేపలను సరఫరా చేస్తోంది. నిరుద్యోగ యువతకు ఉపాధి నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కొత్తగా మినీ ఫిష్ ఆంధ్ర అవుట్లెట్లను తీసుకువచ్చింది. మన చేప–మన ఆరోగ్యం కింద ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో లబ్ధిదారుడు కేవలం రూ.30 వేలు డిపాజిట్ చేస్తే మిగిలిన సొమ్మును బ్యాంకులు అందజేస్తాయి. దీంతో అవుట్లెట్ పెట్టుకుని సొంతంగా వ్యాపారం చేసుకోవచ్చు. -
యువతకు ప్రభుత్వ బాసట
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువతీ, యువకుల్లో నైపుణ్యాలను పెంపొందించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా పట్టణ ప్రాంత యువతకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో దీన్దయాల్ అంత్యోదయ యోజన–జాతీయ పట్టణ జీవనోపాదుల పథకం(డీఏవై–ఎన్యూ ఎల్ఎం) మార్గదర్శకాల మేరకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. తొలి దశలో 35 మునిసి పాలిటీల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికి మెప్మా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 14 రంగాలలో 28 కోర్సులు పట్టణ ప్రాంతాల్లో ఏడో తరగతి నుంచి డిగ్రీ సమాన విద్యార్హత కలిగిన 18 నుంచి 35 సంవత్సరాలలోపు యువతీ, యువకులు శిక్షణకు అర్హులు. విద్యార్హత, అభ్యర్థుల అభిరుచులకు అనుగుణంగా 14 రంగాల్లో 28 కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. రెండు నుంచి నాలుగు నెలల పాటు శిక్షణ ఇచ్చిన అనంతరం అభ్యర్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఫోర్, ఫైవ్ స్టార్ రేటింగ్ శిక్షణ కేంద్రాలతో యువతకు శిక్షణ ఇవ్వడానికి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్(ఎన్ఎస్డీసీ) ద్వారా ఫోర్, ఫైవ్ స్టార్ రేటింగ్ పొందిన నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే 69 ఉత్తమ శిక్షణ కేంద్రాలను ఎంపిక చేశారు. -
కేసీఆర్.. మొద్దు నిద్ర వీడాలి: షర్మిల
వనపర్తి/గోపాల్పేట: స్వరాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని భావించిన నిరుద్యోగ యువత ఆశలను సీఎం కేసీఆర్ ఆవిరి చేసి, మోసం చేశారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. నోటిఫికేషన్లు లేక.. ఉద్యోగం రాక ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వనపర్తి జిల్లా తాడిపర్తి గ్రామానికి చెందిన కొండల్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించా రు. నిరుద్యోగ ఆత్మహత్యల విషయంలో మొద్దు ని ద్రలో ఉన్న కేసీఆర్ను నిద్రలేపేందుకంటూ.. తాడిపర్తిలో షర్మిల ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో మరో నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునే వరకు, ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసే వరకు ప్రతి మంగళవారం ఇలాంటి నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. గత ఎన్నికల ప్రచార సమయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే 50 వేల ఉద్యోగాలంటూ హామీలిచ్చారని, అవి ఎందుకు భర్తీ చేయలేదో ప్రజలకు చెప్పాలన్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు దీక్ష చేశారు. మృతుడు కొండల్ మిత్రుడు రఘు నిమ్మరసం ఇచ్చి షర్మిలతో దీక్ష విరమింపజేశారు. అనంతరం గ్రామంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లి నివాళ్లు అర్పించారు. -
ప్రతి మంగళవారం షర్మిల నిరుద్యోగ దీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు వెన్నుదన్నుగా నిలిచేందుకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నడుంబిగించింది. ఉద్యోగం లేక నిరాశా నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న యువతకు భరోసా కల్పించేందుకు ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపట్టనున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ తెలిపారు. శనివారం లోటస్పాండ్లోని పార్టీ కార్యాలయంలో ఆమె పార్టీ అడహక్ కమిటీ సభ్యులు పిట్టా రాంరెడ్డి, భూమిరెడ్డి, సాహితీ, ఆయూబ్ ఖాన్, కృష్ణమోహన్ తదితరులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. నిరుద్యోగ యువత కోసం ఏప్రిల్ 15 నుంచి 72 గంటల పాటు షర్మిల దీక్ష చేసినప్పటికీ ప్రభుత్వంలో స్పందన కానరాలేదన్నారు. కేవలం ఎన్నికల సమయంలో వరాలు కురిపించే సంస్కృతిని మాని, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతతో ఉద్యోగ నోటిఫికేషన్ కేలండర్ రూపొందించాలని డిమాండ్ చేశారు. -
ఇంటింటికీ రేషన్ తరహాలోనే..
సాక్షి, అమరావతి: ఇంటింటికీ రేషన్ బియ్యం, ఇతర సరుకుల పంపిణీ కార్యక్రమం ద్వారా వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన విధానంలోనే.. వివిధ కార్పొరేషన్ల సంక్షేమ పథకాల అమలుతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిరుద్యోగ యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఐడీసీ)ను తిరిగి క్రియాశీలకం చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సందర్భంలో లబ్ధిదారుల ఇళ్ల వద్దకే బియ్యం పంపిణీ కార్యక్రమం అమలు బాధ్యతను సైతం ఏపీఐడీసీకే అప్పగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ జీవో జారీ చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా 1960లో ఏపీఐడీసీ ఏర్పాటైంది. ఆ తర్వా త సంస్థ నామమాత్రంగా తయారైంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ కార్పొరేషన్ల ద్వారా వేలాది మంది నిరుద్యోగ యువతకు 60 శాతం సబ్సిడీ, 30 శాతం బ్యాంకు రుణం, 10 శాతం లబ్ధిదారుని వాటాగా నిరుద్యోగులకు వాహనాలను సమకూర్చి ఇంటింటికీ బియ్యం పంపిణీ కార్యక్రమం బాధ్యతలను వారికి అప్పగించిన విషయం తెలిసింది. ఈ తరహాలోనే ఇతర ప్రభుత్వ పథకాల అమలులో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు చేపట్టే బాధ్యతను ఏపీఐడీసీకే ప్రభుత్వం అప్పగించింది. సంబంధిత శాఖలు, ఏపీఐడీసీ కలిపి ఎప్పటికప్పుడు వేర్వేరుగా విధివిధానాలు ఖరారు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదే సమయంలో కొత్తగా సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటులోనూ నిరుద్యోగ యువతకు తగిన తోడ్పాటు అందించే బాధ్యతను ప్రభుత్వం ఏపీఐడీసీకి అప్పగించింది. -
నైపుణ్యాభివృద్ధిరస్తు.. ఉపాధి మస్తు
సాక్షి, అమరావతి: ఏపీలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే చర్యల్లో భాగంగా ‘మీకు ఏ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులు కావాలో చెప్పండి. మేమే శిక్షణ ఇచ్చి నైపుణ్యంతో కూడిన మానవ వనరుల్ని సమకూరుస్తాం’ అంటూ సీఎం వైఎస్ జగన్ వివిధ కంపెనీలకు ఆహ్వానం పలికారు. స్థానిక యువతకు పారిశ్రామిక నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చి.. వారిని మెరికల్లా తయారు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ ఆలోచన మంచి సత్ఫలితాలిస్తోంది. 7 నెలల కాలంలోనే 4,413 మందికి వివిధ బహుళజాతి సంస్థల్లో ఉపాధి పొందడమే దీనికి నిదర్శనం. ఇందుకోసం రాష్ట్ర పరిశ్రమల శాఖ, ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) సంయుక్తంగా నిరుద్యోగులను గుర్తించి నైపుణ్య శిక్షణ అందిస్తున్నాయి. పారిశ్రామిక సమగ్ర సర్వే ద్వారా.. పారిశ్రామిక సమగ్ర సర్వే ద్వారా వివిధ సంస్థలకు కావాల్సిన నైపుణ్యం కలిగిన మానవ వనరుల అవసరాన్ని పరిశ్రమల శాఖ గుర్తించగా.. దానికి అనుగుణంగా ఏపీ ఎస్ఎస్డీసీ కోర్సులను నిర్వహిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్స్ ట్రైనింగ్ పోగ్రాం (ఐసీఎస్టీపీ)ను ఏపీ ఎస్ఎస్డీసీ నిర్వహిస్తోంది. బహుళజాతి సంస్థలు, కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యంతో వారికి కావాల్సిన కోర్సులకు అనుగుణంగా ఐసీఎస్టీపీ నిరుద్యోగ యువతకు శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. ఐసీఎస్టీపీలో భాగస్వామ్యం అయ్యేందుకు ఇప్పటి వరకు 276 కంపెనీలు ముందుకు రాగా.. అందులో ఇప్పటికే 156 కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలను శిక్షణ తరగతుల ద్వారా యువతకు అందించి ఉపాధి కల్పించినట్టు ఏపీ ఎస్ఎస్డీసీ అధికారులు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డికి వివరించారు. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఈ విధంగా మొత్తం 4,413 మందికి శిక్షణ ఇవ్వగా.. కోర్సు పూర్తి చేసిన వెంటనే వారందరికీ ఆయా సంస్థలు నేరుగా ఉద్యోగాలు కల్పించినట్టు తెలిపారు. వివిధ సంస్థలకు ఇలా.. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, కాంగ్నిజెట్, కియా, డాక్టర్ రెడ్డీస్, అరబిందో, రాంకీ ఫార్మా, నేషనల్ ఆకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని వారికి అవసరమైన కోర్సుల్లో ఏపీఎస్ఎస్డీసీ యువతకు శిక్షణ ఇస్తోంది. ఇందుకోసం ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్, డిప్లొమా చదువుతున్న విద్యార్థులు, ఫ్రెషర్స్ను ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నారు. ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్, సాఫ్ట్వేర్ ట్రైనీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్, బిజినెస్ ఎనలిస్ట్, ఇంటర్నేషనల్ వాయిస్ సపోర్ట్ వంటి కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. ఇలా కోర్సులు పూర్తి చేసి ఉపాధి పొందిన వారికి ప్రారంభ వార్షిక వేతనం కనిష్టంగా రూ.2 లక్షల వరకు ఉంటోందని ఏపీ ఎస్ఎస్డీసీ అధికారులు పేర్కొన్నారు. -
కొబ్బరి దింపు.. ఉండదిక జంకు
సాక్షి, అమరావతి: కొబ్బరి చెట్టు నుంచి కాయల్ని కోసి నేలకు దించే (కొబ్బరి దింపు) విషయంలో రైతులు పడే వెతలు అన్నీఇన్నీ కావు. కొబ్బరి దింపు కార్మికులకు ఆదాయం తక్కువగా ఉండటం.. దింపు సమయంలో తరచూ ప్రమాదాల బారిన పడుతుండటంతో ఈ వృత్తిలోకి కొత్తగా వచ్చే వారు ఉండటం లేదు. దీనివల్ల రైతులకు కొబ్బరి దింపు తలకు మించిన భారంగా మారింది. దశాబ్దాలుగా వేధిస్తున్న ఈ సమస్యకు వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని అంబాజీపేట ఉద్యాన పరిశోధనా కేంద్రం పరిష్కారం చూపుతోంది. గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గం చూపుతోంది. ‘కొబ్బరి వృక్షమిత్ర’ పేరిట శిక్షణ కొబ్బరి చెట్టుపైకి సునాయాసంగా ఎక్కగలిగే పరికరాన్ని కొబ్బరి అభివృద్ధి బోర్డు (సీబీడీ) రూపొందించింది. ఈ పరికరం ఆధారంగా కొబ్బరి చెట్లు ఎక్కడం, కాయల్ని కోసి దించడంపై అంబాజీపేట ఉద్యాన పరిశోధన కేంద్రం ‘కొబ్బరి వృక్షమిత్ర’ పేరిట శిక్షణ ఇస్తోంది. 18–45 ఏళ్ల మధ్య వయసు కలిగి 7వ తరగతి వరకు చదివిన యువతీ, యువకులను కొబ్బరి వృక్ష మిత్రలుగా తీర్చిదిద్దుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ చెట్లు ఎక్కడం, కాయలు దెబ్బతినకుండా నేలకు దించడం, కొబ్బరి తోటల్లో తెగుళ్ల నివారణ, ఎరువులు, పురుగుల మందుల ఉత్తమ యాజమాన్య పద్ధతులపై తర్ఫీదు ఇస్తున్నారు. ఒక్కో బ్యాచ్లో 20 మందికి చొప్పున 6 రోజుల పాటు ఇస్తున్న శిక్షణ కోసం ఉద్యాన వర్సిటీ రూ.1,06,500 ఖర్చు చేస్తోంది. శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్తో పాటు రూ.2,500 విలువ గల చెట్టు ఎక్కే పరికరాన్ని ఉచితంగా ఇస్తున్నారు. ఇప్పటివరకు 26 బ్యాచ్లుగా ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన యానాం పట్టణానికి చెందిన 520 మందికి ఇక్కడ శిక్షణ ఇచ్చారు. తాజాగా అంబాజీపేట పరిశోధనా కేంద్రం సహకారంతో శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస, విశాఖ జిల్లా అచ్యుతాపురం, చిత్తూరు జిల్లా కలికిరి, కృష్ణా జిల్లా గరికిపాడు, పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని కృషి విజ్ఞాన కేంద్రాల్లో కూడా (కేవీకే) శిక్షణ కార్యక్రమాలు చేపట్టారు. దింపు కార్మికులకూ పెరుగుతున్న ఆదాయం సాధారణంగా సంప్రదాయ కొబ్బరి దింపు కార్మికులు రోజుకు 30నుంచి 40 చెట్ల కాయల్ని దించగలరు. అదే శిక్షణ పొందిన వృక్ష మిత్రలైతే 70నుంచి 80 చెట్ల కాయలను దించగలుగుతున్నారు. సంప్రదాయ దింపు కార్మికులు రోజుకు రూ.300 సంపాదిస్తుండగా.. వృక్షమిత్రలు రోజుకు రూ.500 కంటే ఎక్కువ సంపాదించగలుగుతున్నారు. శిక్షణ పొందాలనుకుంటే.. ఆసక్తి గల నిరుద్యోగులు ఎంతమంది ముందుకొచ్చినా శిక్షణ ఇచ్చేందుకు ఉద్యాన విశ్వవిద్యాలయం సిద్ధంగా ఉంది. శిక్షణ పొందగోరే అభ్యర్థులు అంబాజీపేటలోని ఉద్యాన పరిశోధన కేంద్రం ల్యాండ్లైన్ ఫోన్ నంబర్ 08856–243847 లేదా ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎన్బీవీ చలపతిరావు (సెల్: 83095 38808)ను సంప్రదించవచ్చు. అభ్యర్థులకు సమీపంలో గల కృషి విజ్ఞాన కేంద్రంలో శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తారు. స్థానికంగా ఉపాధి పొందగోరే యువత మాత్రమే కాకుండా కొబ్బరి తోటలు పెంచే రైతులు సైతం శిక్షణ పొందవచ్చు. నేనే దింపు తీసుకుంటున్నా నాకు మూడెకరాల కొబ్బరితోట ఉంది. దింపు సమస్యతో చాలా ఇబ్బందిపడే వాడిని. అంబాజీపేట కేంద్రంలో శిక్షణ పొందా. ఇప్పుడు కార్మికులపై ఆధారపడకుండా నా తోటలో నేనే స్వయంగా కాయలు దింపుకోగలుగుతున్నా. దీనివల్ల నెలకు రూ.2 వేలకు పైగా మిగులుతోంది. – మట్టపర్తి వెంకట సుబ్బారావు, శిక్షణ పొందిన రైతు రోజుకు రూ.500 సంపాదిస్తున్నా నేను కూలీ పనులు చేసుకునే వాడిని. రోజూ రూ.300కు మించి ఆదాయం వచ్చేది కాదు. అంబాజీపేట కేంద్రంలో శిక్షణ తీసుకున్నాను. ఉచితంగా ఇచ్చిన పరికరం సాయంతో సులభంగా కొబ్బరిచెట్లు ఎక్కి కాయల్ని దింపు తీస్తున్నాను. రోజుకు రూ.500 వరకు సంపాదిస్తున్నా. – నెల్లి నవీన్, కొబ్బరి వృక్షమిత్ర, గంగలకుర్రు, తూర్పు గోదావరి సమయం.. పెట్టుబడి కలిసొస్తుంది. నాకు పదెకరా>ల కొబ్బరి తోట ఉంది. దశాబ్దాలుగా దింపు సమస్య ఎదుర్కొన్నా. శిక్షణ పొందిన కొబ్బరి వృక్షమిత్రలు రావడంతో దింపు కోసం ఇబ్బంది లేకుండా పోయింది. ఇప్పుడు సమయం, పెట్టుబడి కూడా కలిసి వస్తోంది. – చేకూరి సూర్యనారాయణ, డైరెక్టర్, కృషివల కోకోనట్ ప్రొడ్యూసర్స్ సొసైటీ దింపు సమస్యకు శాశ్వత పరిష్కారం విశ్వవిద్యాలయం ద్వారా అంబాజీపేట పరిశోధనా కేంద్రంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయి. శిక్షణ సందర్భంగా సాగులో యాజమాన్య మెళకువలపైనా తర్ఫీదు ఇస్తున్నాం. కొబ్బరి వృక్ష మిత్రల రాకతో కొబ్బరి దింపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. – డాక్టర్ టి.జానకిరామ్, వైస్ చాన్సలర్, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీ
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- బ్యాంక్ల్లో ఇబ్బందులా?, ఆర్బీఐకి ఫిర్యాదు చేయండిలా..
- ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి అఖిలేష్?
- మరో ఎంపీ లండన్లో ఉన్నా.. నన్ను టార్గెట్ చేశారు: స్వాతి మలివాల్
- మాకంటే ఎక్కువ ఉద్యోగాలిచ్చుంటే రాజీనామా చేస్తా
- Malaysia Masters 2024: ఫైనల్లో పీవీ సింధు
- రాజ్కోట్లో పెను విషాదం
- ‘లైఫ్ ట్యాక్స్’కు ఎగనామం!
- Mallikarjun Kharge: చైనా ఆక్రమణలపై మోదీ మౌనం
- మీ ఇంటిని చక్కదిద్దుకోండి..!
- కలిసికట్టుగా ముందుకు..
Advertisement