Sakshi News home page

లిక్కర్‌ స్కాం కేసు: కేజ్రీవాల్‌ దక్కని ఊరట

Published Wed, Mar 27 2024 10:22 AM

CM Kejriwal Petitetion Hearing In Delhi High Court Over Liquor Scam - Sakshi

సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు నిరాశే ఎదురైంది. లిక్కర్‌ పాలసీ కుంభకోణం కేసులో ఈడీ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆయనకు మధ్యంతర బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. అలాగే కేజ్రీవాల్‌ పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని కోరుతూ ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై ఏప్రిల్‌ 2 లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 3కు వాయిదా వేసింది.

ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఇరువర్గాలకు చెందిన న్యాయవాదుల మధ్య వాడీవేడిగా వాదనలు కొనసాగాయి. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజు, కేజ్రీవాల్‌ తరఫున అభిషేక్‌ సింఘ్వీ వాదనలు వినిపించారు. 

లిక్కర్‌స్కాం కేసు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేసి కస్టడీలోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలో ఉన్నారు. తన అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్‌ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాను. పిటిషన్‌పై విచారణ సందర్భంగా వాడీవేడి వాదనలు జరిగాయి.

ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ తరుపున అభిషేక్‌ మనుసింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. కేజ్రీవాల్‌ను వెంటనే ఈడీ కస్టడీ నుంచి విడుదల చేయాలి. నేరాన్ని నిర్ధారించడంలో ఈడీ విఫలమైంది. లిక్కర్ కేసులో అప్రూవర్లుగా మారిన వారిని నమ్మడానికి లేదు. కేజ్రీవాల్ అరెస్ట్‌లో ఈడీకి ముందస్తు ఆలోచన.. రాజకీయపరమైందన్నారు. అనంతరం.. కేజ్రీవాల్  అరెస్ట్, మధ్యంతర ఉపశమన పిటిషన్లపై ప్రత్యుత్తరం దాఖలు చేయడానికి సమయం ఇవ్వాలని ఈడీ కోరింది. ఈ నేపథ్యంలో పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసింది. ఈరోజు సాయంత్రం తీర్పును వెల్లడించనుంది.

లాయర్లపై హైకోర్టు సీరియస్‌..
మరోవైపు కేజ్రీవాల్‌ అరెస్టును నిరసిస్తూ ఆప్‌ లీగల్‌ సెల్‌ కోర్టు ప్రాంగణాల్లో ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీనిపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ అంశంపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘కోర్టుల్లో నిరసనలు చేపడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. న్యాయస్థానాల కార్యకలాపాలను ఆపకూడదు. అలా ఎవరైనా చేస్తే అది ప్రమాదకర చర్యే. ఈ అంశంపై గురువారం విచారణ చేపడుతాం’’ అని కోర్టు వెల్లడించింది.

ఇదిలా ఉండగా.. ఈ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన కస్టడీ రేపటితో (మార్చి 28) ముగియనుంది. గురువారం దర్యాప్తు అధికారులు ఆయనను కోర్టులో హాజరుపర్చనున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement