రాహుల్ గాంధీ యాత్రపై సస్పెన్స్.. మణిపూర్ సీఎం కీలక వ్యాఖ్యలు
Published
Wed, Jan 10 2024 8:58 AM
ఢిల్లీ: లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభంపై సస్పెన్స్ నెలకొంది. ఈనెల 14వ తేదీ మణిపూర్ నుంచి ప్రారంభించాలనుకున్న రాహుల్ యాత్రకు అనుమతి లేనట్టు సమాచారం. అయితే, తాజాగా మణిపూర్లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో రాహుల్ యాత్రపై సీఎం బీరెన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
వివరాల ప్రకారం.. మణిపూర్లోని సరిహద్దు పట్టణం మోరేలో తాజాగా మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇండో-మయన్మార్ సరిహద్దుల్లో మణిపూర్ పోలీసులు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు చోటుచేసుకోవడంతో మోరేలో పరిస్థితి ఉద్రిక్తకరంగా మారింది. భద్రతా బలగాలపై దాడులకు పాల్పడిన సాయుధ సిబ్బందిని పట్టుకునేందుకు అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, రాష్ట్ర పోలీసుల ఉమ్మడి ప్రయత్నం ద్వారా ప్రస్తుతం కూబింగ్ కార్యక్రమం జరుగుతోందని మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ సింగ్ తెలిపారు. ఇదే సమయంలో రాహుల్ గాంధీ యాత్రపై బీరెన్ సింగ్ స్పందించారు. రాహుల్ యాత్రకు అనుమతి అంశంలో పరిశీలనలో ఉంది. ఈ విషయంపై వివిధ భద్రతా సంస్థల నుండి నివేదికలు తీసుకుంటున్నాము. వారి నుండి నివేదికలు అందిన తర్వాత ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటామన్నారు.
మరోవైపు, రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్ర జనవరి 14న ఇంఫాల్ తూర్పు జిల్లాలోని హట్టా కాంగ్జేబుంగ్ నుంచి ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా 110 జిల్లాలు, 100 లోక్సభ స్థానాలు, 337 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ యాత్ర కొనసాగనుంది. 66 రోజుల ప్రయాణంలో 6,713 కిలోమీటర్లు యాత్ర కొనసాగనుంది. చివరకు భారత్ న్యాయ్ యాత్ర మార్చి 20వ తేదీన ముంబైలో ముగియనుంది. ఇక, రాహుల్ యాత్ర సందర్భంగా ఈశాన్య రాష్ట్రాల్లో స్థానిక నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఫ్లెక్సీలతో ప్రచారం ప్రారంభించారు.
Bharat Jodo Nyay Yatra Preparation in full swing. Visuals from Assam.
Nyay Ka Haq Milne Tak! pic.twitter.com/hd6AudvmU8