-
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా శ్రీ సీతారామ కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో తెలుగువారు తరలివచ్చారు. ఉదయం శుభకార్యాలతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు మధ్యాహ్నం ఆశీర్వాదం, వందన సమర్పణతో ముగిశాయి. ఈసందర్భంగా సీతారాముల వారికి నిర్వహించిన పల్లకీసేవలో పిల్లలు, మహిళలు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఎస్వీబీటీసీసీ ట్రస్టీలు డాక్టర్ రాములు దాసోజు, భాస్కర్ నీల, కమలా కొచ్చెర్లకోట, ప్రవీణ్కుమార్ యాదవ్, సురేష్ గోపతి, సురేష్రెడ్డి గడ్డం, పావనిరెడ్డి, కేకే చివుకుల, కార్యవర్గ సభ్యులు విశ్వేశ్వర్, తుకారాం రెడ్డి, రాఘవేందర్, గౌతమ్ శాస్త్రి, రవి వాసా, గోపి కొల్లూరు, రవికుమార్, వంశీ వుల్చి, వంశీ బోగిరెడ్డి, గోవర్దన్ హృదయపూర్వక కృతజ్ఞతలు,సంతోషాన్ని వ్యక్తం చేశారు .ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తమకు స్వచ్ఛంద సేవకులు, దాతలు ఎంతగానో సహకరించారని కొనియాడారు. బ్రాక్నెల్లో కొత్తగా ప్రారంభించిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని భక్తులు దర్శించుకొని స్వామి వారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఇందుకోసం www.svbtcc.orgలో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చన్నారు. ఈ వేడుకల నిర్వహణలో ఎస్వీబీటీసీసీ సభ్యుల భక్తి,సేవానిరతనిఇ ప్రతిబింబించడమే కాకుండా వాలంటీర్ల అంకితభావం, నిబద్ధత కీలక పాత్రను పోషించాయని నిర్వాహకులు తెలిపారు. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా శ్రీ సీతారామ కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో తెలుగువారు తరలివచ్చారు. ఉదయం శుభకార్యాలతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు మధ్యాహ్నం ఆశీర్వాదం, వందన సమర్పణతో ముగిశాయి. ఈసందర్భంగా సీతారాముల వారికి నిర్వహించిన పల్లకీసేవలో పిల్లలు, మహిళలు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఎస్వీబీటీసీసీ ట్రస్టీలు డాక్టర్ రాములు దాసోజు, భాస్కర్ నీల, కమలా కొచ్చెర్లకోట, ప్రవీణ్కుమార్ యాదవ్, సురేష్ గోపతి, సురేష్రెడ్డి గడ్డం, పావనిరెడ్డి, కేకే చివుకుల, కార్యవర్గ సభ్యులు విశ్వేశ్వర్, తుకారాం రెడ్డి, రాఘవేందర్, గౌతమ్ శాస్త్రి, రవి వాసా, గోపి కొల్లూరు, రవికుమార్, వంశీ వుల్చి, వంశీ బోగిరెడ్డి, గోవర్దన్ హృదయపూర్వక కృతజ్ఞతలు,సంతోషాన్ని వ్యక్తం చేశారు .ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తమకు స్వచ్ఛంద సేవకులు, దాతలు ఎంతగానో సహకరించారని కొనియాడారు. బ్రాక్నెల్లో కొత్తగా ప్రారంభించిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని భక్తులు దర్శించుకొని స్వామి వారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఇందుకోసం www.svbtcc.orgలో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చన్నారు. ఈ వేడుకల నిర్వహణలో ఎస్వీబీటీసీసీ సభ్యుల భక్తి,సేవానిరతనిఇ ప్రతిబింబించడమే కాకుండా వాలంటీర్ల అంకితభావం, నిబద్ధత కీలక పాత్రను పోషించాయని నిర్వాహకులు తెలిపారు. -
తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఉగాది సంబరాలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) వారు నిర్వహించిన 2024 ఉగాది వేడుకలలో ప్రముఖ ఆకర్షణగా నిలిచింది "జయంత విజయం" పద్యనాటకం. ఓర్లాండో ప్రవాసాంధ్రులను మంత్రముగ్ధులను చేసింది. మహాభారతంలో అత్యంత కీలకమైన విరాటపర్వం ఘట్టాన్ని కేంద్రీకరించుకుని నాటి, నేటి తరాలను అలరించే విధంగా రూపొందించారు. ఈ రంగస్థల దృశ్యకావ్యం, భారతీయ పురాణాలు, ఇతిహాసాల ధార్మికత్వాన్ని చాటి చెప్పేలా ప్రేక్షకులను అలరించింది. తటవర్తి గురుకులం వారి పద్యకల్పద్రుమంలో భాగంగా, తటవర్తి కళ్యాణ చక్రవర్తి రచించిన ఈ నాటకం, తిక్కన విరాటపర్వంలో పద్యాలను సులభమైన తెలుగు నేపథ్యంతో మేళవించి, సుమారు వేయి మందికి పైగా హాజరైన ప్రేక్షకులను విస్మయులయ్యేలా చేసింది. అత్యంత సందోహ సంతోష సంబరంగా వెలసిన "క్రోధి" నామ సంవత్సర ఉగాది వేడుకలలోప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓర్లాండో తెలుగు సంఘం అద్యక్షుడు కిశోర్ దోరణాల సమన్వయంతో, చెరుకూరి మధుగారి దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన ఈ నాటకంలో వెంకట శ్రీనివాస్ పులి, దీకొండ జయశ్రీ, నిడమర్తి కృష్ణ, యఱ్ఱాప్రగడ శాయి ప్రభాకర్, కసిరెడ్డి ఇంద్రసేన, శీలం గోపాల్, నిడమర్తి అరుణ, ఏనపల్లి మహేందర్, దివాకర్ల పవన్ కుమార్ మరియు దివాకర్ల ప్రసూన ముఖ్య పాత్రధారులు కాగా, శ్రీధర్ ఆత్రేయ అందించిన నేపధ్య సంగీతం RJ మామ మహేష్ కర్టెన్ రైజర్ వాయిస్ ఓవర్ ప్రత్యక్ష ఆకర్షణగా నిలిచాయి. -
Ugadi 2024: ఆన్లైన్లో ఆటా సాహిత్య వేదిక ఉగాది వేడుకలు
అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఉగాది సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఏప్రిల్ 14న అంతర్జాలం వేదికగా శారద సింగిరెడ్డి సారథ్యంలో నిర్వహించిన శ్రీ క్రోధి నామ సంవత్సర "తెలుగు వసంతం" సాహితీ ప్రియులను, తెలుగు భాషాభిమానులను ఆకట్టుకుంది. త్రిభాషా మహాసహస్రావధాని , ప్రణవ పీఠాధిపతులు వద్దిపర్తి పద్మాకర్, తెలుగు శాఖ ఉస్మానియా విశ్వవిద్యాలయం జాతీయ సాహిత్య పరిషత్తు ప్రాంత అధ్యక్షులు ఆచార్య కసిరెడ్డి వెంకట రెడ్డి, శృంగేరి శారదా పీఠ ఆస్తాన పౌరాణికులు డా. గర్రెపల్లి మహేశ్వర శర్మ, అవుసుల భానుప్రకాష్ అవధాని , అధ్యక్షులు సాహితీ గౌతమి కరీంనగర్ శ్రీ నంది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. గణనాథుని కీర్తనతో రాలీ,నార్త్ కరోలీనా నుండి వైభవ్ గరిమెళ్ళ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా , విశిష్ఠ అతిథుల వినోదభరిత విజ్ఞాన విశ్లేషణ, చతురత ఇమిడిన బోధన , సంస్కార సాంప్రదాయ సమ్మిళిత సుభాషిత సందేశాలతో రాశి ఫలాలు , పంచాంగ శ్రవణం, పద్య గద్య గాన ప్రసంగాదులతో ఆద్యంతం హృద్యంగా సాగిన ఈ సాహితీ కార్యక్రమం ప్రేక్షకుల ప్రత్యేక మన్ననలందుకుంది. కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ మధు బొమ్మినేని పేరు పేరునా ప్రత్యేక అభినందనలను తెలిపారు. అలాగే 2024 సంవత్సరం అట్లాంటా లో జూన్ 7,8,9 తేదీలలో జరుగ నున్న18వ ఆటా కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్కు అందరికీ పేరుపేరున సాదర ఆహ్వానాన్ని పలికారు. సుమారు మూడు గంటలపాటు సాగిన ఈ కార్యక్రమానికి నంది శ్రీనివాస్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా అతిథులందరూ ఉత్సాహంగా గడిపారు. చివరిగా ఆటా లిటరరీ సభ్యులు మాధవి దాస్యం విశిష్ఠ అతిథులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
దివ్యం.. భవ్యం.. రమ్యం రామచరితం
పితృవాక్పాలన, ధర్మవర్తన, సదా సత్యమే పలకడం, ప్రజానురంజకమైన పాలనను అందించడం.. వంటి ఎన్నో లక్షణాలను బట్టి అందరి గుండెల్లో దేవుడిగా కొలువు తీరాడు రాముడు. అయితే మన నిత్యజీవితంలో అసలు రామ శబ్దం లేనిదెప్పుడు? చిన్నప్పుడు లాల పోసి శ్రీరామ రక్ష చెప్పడం దగ్గరనుంచి ‘రామాలాలీ.. మేఘశ్యామాలాలీ’ అనే జోలపాటతో బిడ్డలను నిద్ర పుచ్చడం వరకు... అందరి జీవితాలలో రాముడు ఒక భాగంగా మారిపోయాడు. నేడు ఆ జగదభిరాముడు ఇలపై పుట్టినరోజు.. అంతేనా... ఆదర్శదంపతులుగా పేరు ΄పొందిన సీతారాముల పెళ్లిరోజు కూడా. ఈ సందర్భంగా ఆ పురుషోత్తముడి గురించి... ఆయన ఇక్ష్వాకు కుల తిలకుడు. దశరథ మహారాజ తనయుడు. తండ్రి మాటను నిలబెట్టడం కోసం రాజ్యంతోబాటు సర్వ సంపదలనూ, అన్నిసుఖాలనూ విడనాడి నారదుస్తులు ధరించి పదునాలుగేళ్లపాటు అరణ్యవాసం చేశాడు. ఎన్ని కష్టాలొచ్చినా వెరవలేదు. తాను నమ్మిన సత్య, ధర్మమార్గాలనే అనుసరించాడు. ఒక మంచి కొడుకులా, అనురాగాన్ని పంచే భర్తలా, ఆత్మీయతను అందించే అన్నలా, ప్రజలను కన్నబిడ్డల్లా పాలించే రాజులా ... అందరితో అన్ని విషయాలలోనూ వినమ్రతతో మెలిగే మర్యాద పురుషోత్తముడిలా... ఇలా ఎవరితో ఏవిధంగా ఉండాలో ఆ విధంగానే నడుచుకున్నాడు. అన్నివేళలా ధర్మాన్నే పాటించాడు. ఆపన్నులకు స్నేహహస్తాన్ని అందించాడు. ఆత్మీయులకు, మిత్రులకు అండగా నిలిచాడు. తాను అవతార పురుషుడినని అనలేదు. అనుకోలేదు కూడా... దేవుడినని ఎన్నడూ చెప్పుకోలేదు. ఎవరికీ ఏ ధర్మాన్నీ బోధించలేదు. తాను ఆచరించినదే ధర్మం – అనుకునే విధంగా వ్యవహరించాడు. అందుకే ధర్మం రూపు దాల్చితే రాముడిలా ఉంటుందేమో అనుకునేలా ప్రవర్తించాడు. సంపూర్ణావతారం ధర్మ పరిరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాలన్నింటిలోనూ సంపూర్ణమైనవి రామావతారం, కృష్ణావతారాలే. మిగిలినవి అంశావతారాలు. అంటే అప్పటికప్పుడు ఆవిర్భవించినవి. మత్స్య, కూర్మ, హయగ్రీవ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, కల్కి అవతారాలు. మానవాళిని సత్యవాక్య పాలకులుగా తీర్చిదిద్ది, సన్మార్గంలో నడిపించడం కోసం మానవుడిలా పుట్టాడు. అందరిలాగే ఎన్నో కష్టనష్టాలను అనుభవించాడు. అయితేనేం, ధర్మాన్ని ఎక్కడా తప్పలేదు. అందుకే కదా... అతి సామాన్యులనుంచి అసామాన్యుల వరకు అందరికీ ఆరాధ్య దైవమయ్యాడు. ఉత్తమ మానవుడు ఎలా ఉండాలో తన నడవడిక ద్వారా నిరూపించి, సకల గుణాభిరాముడయ్యాడు. కల్యాణ వైభోగం ఆ శ్రీహరి రామునిగా ఇలపై అవతరించిన పుణ్యతిథి శ్రీరామ నవమి. ఈ పండుగను తొమ్మిది రోజులు జరుపుతారు. చైత్ర శుక్ల పాడ్యమి నుంచి శ్రీరామనవమి వరకూ పూజాదికాలు, రామనామ పారాయణం చేస్తారు. అసలు చైత్ర మాసప్రారంభం నుంచే ఇంటింటా, వాడవాడలా, వీధివీధినా చలువ పందిళ్లు, మామిడాకు తోరణాలు... ఇలా ప్రతిచోటా కళ్యాణోత్సవ సంరంభాలు మొదలవుతాయి. కంచర్ల గోపన్న భక్తరామదాసుగా శ్రీరామసేవా దీక్షను స్వీకరించాడు. ప్రతి సంవత్సరం శ్రీరామ జన్మదినోత్సవమైన శ్రీరామనవమి నాడు శ్రీసీతారాములకు తిరుకల్యాణ మహోత్సవాన్ని జరిపించే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టాడు. సిరికల్యాణ తిలకంతో, మణిమయ బాసికాలతో ఆణిముత్యాలే తలంబ్రాలుగా జాలువారే ముగ్ధమోహనమైన, మనోరంజకమైన సీతారాముల పెళ్ళి వేడుక జగదానందకారకమై భాసిస్తుంది. శ్రీరామనవమి మరుసటి రోజు దశమినాడు శ్రీరామ పట్టాభిషేకాన్ని నిర్వహిస్తారు. పుట్టినరోజునే పెళ్లి వేడుకలా.!? శ్రీరాముడు జన్మించిన పుణ్యతిథి చైత్రశుద్ధ నవమి, పునర్వసు నక్షత్రం, కర్కాటక రాశి, కర్కాటక లగ్నం. ఆనాడు రాముని జన్మదిన వేడుకలు జరిపించాలి. అయితే శ్రీ సీతారామకళ్యాణం జరిపించడంలోని అంతరార్థం ఏమిటనేదానికి పురుషోత్తమ సంహిత అనే ఆగమ శాస్త్ర గ్రంథం ఏమి చెబుతోందంటే– ఆ పరమాత్ముడు అవతారమూర్తిగా ఏ రోజున ఈ పుణ్యపుడమిపై అవతరిస్తే ఆ రోజునే కళ్యాణం జరిపించాల్సి ఉందనీ, ఒకవేళ ఆ తిథి తెలియకపోతే ఏకాదశి రోజున కళ్యాణం జరిపించడం సంప్రదాయమని పేర్కొంది. అందుకే లోక కళ్యాణం కోసం సీతారాములకు çపుణ్యక్షేత్రమైన భధ్రాచలంలో ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమినాడు అభిజిత్ లగ్నంలో పెళ్లి వేడుకలు జరిపిస్తున్నారు. శ్రీరామ నవమినాడు ఏం చేయాలి? ఈరోజు రామునితోబాటు సీతాదేవి ని, ఆంజనేయుని, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులను కూడా పూజించాలి. రామునికి జన్మనిచ్చిన కౌసల్యను, దశరథుని కూడా స్తుతించడం సత్ఫలితాలనిస్తుంది. సీతారామ కళ్యాణం జరిపించడం, ఆ వేడుకలలో పాల్గొనడం, చూడడం, శ్రీరామ నవమి వ్రతాన్ని ఆచరించడం, విసన కర్రలు దానం చేయడం మంచిది. సమర్పించవలసిన నైవేద్యం పానకం, వడపప్పు, చలిమిడి, మామిడిపండ్లు, చక్కెర ΄పొంగలి, చెరకు, విప్పపూలు నివేదించాలి. సీతారామ కళ్యాణ తలంబ్రాలను ధరిస్తే ఆటంకాలు తొలగి సత్వరం వివాహం అవుతుందని పెద్దలంటారు. నిత్యజీవితంలో రాముడు... లాల పోసేటప్పుడు శ్రీరామ రక్ష, జోలపాడేటప్పుడు రామాలాలీ మేఘ శ్యామాలాలీ... ఓదార్పుగా అయ్యోరామ... అనకూడని మాట వింటే రామ రామ... పద్దు పుస్తకాలనుప్రారంభిస్తూ శ్రీరామ... కూర్చునేటప్పుడు లేచేటప్పుడూ రామా... ఇలా ఆయన అందరి నాలుకలమీదా నర్తిస్తూనే ఉన్నాడు... ఉంటాడు. అల్లరి చేస్తే కిష్కింద కాండ, కఠినమైన ఆజ్ఞ ఇస్తే సుగ్రీవాజ్ఞ విశాలమైన ఇంటి గురించి చెప్పేటప్పుడు లంకంత ఇల్లు పాతవాటి గురించి చెప్పాలనుకుంటే ఇక్ష్వాకుల కాలం నాటిది... సామెతలు: రామాయణంలో పిడకల వేట; రామాయణమంతా విని రాముడికి సీత ఏమవుతుందన్నట్టు... చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు ఆకారం గురించి చెప్పాలంటే రాముడిలా ఆజానుబాహువంటారు. ఎంతకీ చూడ్డానికి రాబోతే సీతకన్నేశావంటారు. సైన్యంలా వస్తే రామదండు అంటారు. చక్కని జంటను సీతారాముల్లా ఉన్నారంటారు. ఎవరైనా కొట్టుకుంటే రామరావణ యుద్ధమంటారు. అందరిళ్లలోని గిల్లి కజ్జాలను ఇంటంటి రామాయణమంటారు. రాముడు మనకు విలువలను, వ్యక్తిత్వాన్నీ నేర్పితే రామాయణం మనకు జీవిత పాఠాలు బోధిస్తుంది. రామచంద్ర ప్రభువు చల్లని చూపులు మనందరిమీదా ప్రసరించాలని కోరుకుంటూ.... – డి.వి.రామ్ భాస్కర్ తారక మంత్రం ‘శ్రీరామ రామరామేతి రమే రామే మనోరమే .. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే’ అనే శ్లోకం విష్ణుసహస్ర నామంతో సమానమైనదంటారు. మోక్షాన్ని ప్రసాదించే మహామంత్రాలు ఓం నమో నారాయణాయ, ఓం నమశ్శివాయల నుంచి తీసుకున్న అక్షరాల కలయిక అయిన రామనామాన్ని జపిస్తే ఈ రెండు మంత్రాలను జపించడం వల్ల కలిగే ఫలితం కంటె ఎక్కువ ఫలం కలుగుతుంది. మన పెదవులు రామనామంలోని ‘రా’ అనే అక్షరాన్ని పలికినపుడు మనలోని పాపాలన్నీ బయటకు వెళ్లిపోతాయి. ‘మ’ అనే అక్షరాన్ని ఉచ్చరించినప్పుడు అవి లోపలకు రాకుండా మూసుకుంటాయి. కాబట్టి ‘రామ’ అనే రెండక్షరాల తారక మంత్రాన్ని సదా స్మరిస్తుండడం వల్ల పాపాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయని కబీరుదాసు, భక్త రామదాసు, తులసీదాసు వంటి మహాభక్తులు ఉవాచించారు. శుభప్రదం... రామచరిత పారాయణం రాముని కాలంలో ధర్మం నాలుగు పాదాలా నడిచింది. దేశం సుభిక్షంగా ఉంది. అందుకే నేటికీ ప్రజలు రాముని వంటి రాజుకొసం– రామరాజ్యం నాటి పాలన కోసం పరితపిస్తుంటారు. తులసీదాసు, రామదాసు, కబీరుదాసు వంటి వారందరూ ...‘‘అంతా రామ మయం.... ఈ జగమంతా రామమయం’’ అని వేనోళ్ల స్తుతించారు. ఆ పురాణ పురుషుని పుణ్యచరితమైన రామాయణాన్ని విన్నా, చదివినా, అందులోని శ్లోకాలను, ఘట్టాలను మననం చేసుకున్నా, శుభం కలుగుతుందని ప్రతీతి. 12 గంటలకు ఎందుకు? రాముడు త్రేతాయుగంలో వసంత రుతువు, చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నం, అభిజిత్ ముహూర్తం అంటే మధ్యాహ్నం సరిగ్గా 12:00 గంటలకు జన్మించాడు. అందుకే చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరాముడి వివాహం, పదునాలుగు సంవత్సరాల అరణ్యవాసం, రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడు అయిన రోజు కూడా చైత్ర శుద్ధ నవమి. శ్రీరామ నవమి రోజున ప్రతి శ్రీరాముని దేవాలయాలలో సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించి సాయంత్రం వీధులలో ఊరేగిస్తారు. శ్రీరాముడు మధ్యాహ్నం 12:00 గంటలకు పుట్టాడు కాబట్టి శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేస్తే శ్రీరామానుగ్రహంతో కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. ఏటా చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రంలో అభిజిత్ లగ్నంలో పాంచరాత్ర ఆగమం ప్రకారం శ్రీసీతారామచంద్రస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవాన్ని భద్రాద్రిలో అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలను తిలకించేందుకు దేశం నలు మూలల నుంచి భక్తులు తరలివస్తారు. తానీషా గోల్కొండ నవాబుగా ఉన్న కాలం నుంచి– ఆనాటి సాంప్రదాయం మేరకు నేటికీ భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా సమర్పించడం ఆనవాయితీ -
Rama Navami 2024: శ్రీరాముని కటాక్షం, ఇశ్వర్యం, ఆరోగ్యం కావాలంటే..
Sri Rama Navami 2024 చైత్ర మాసం శుక్ల పక్ష నవమి రోజున శ్రీరామనవమి అత్యంత భక్తి శ్రద్దలతో జరుపు కుంటారు. ఈ సందర్బంగా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించడంఆనవాయితీ. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాల్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతాయి. బెల్లంతో చేసిన పానకం, వడ పప్పును దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ పవిత్రమైన రోజున శ్రీరాముడిని పూజించి కొన్ని నియమాలు పాటిస్తే సుఖ సంతోషాలు, సిరి సంపదలతో అందరి జీవితాలు విరాజిల్లుతాయని పెద్దలు చెబుతారు. శ్రీరామనవమి రోజు ఇలా చేస్తే.. ఇంట్లో శాంతి, సంతోషం ఉండాలంటే శ్రీ రామ నవమి రోజున రాముని కటాక్షంతో ఐశ్వర్యం పొందాలంటే రాముడిని శంఖం, పసుపు రంగు గవ్వలను పూజించాలి. అమ్మవారికి తామర పూలను, ఎర్రని రంగు గల పువ్వులను సంపర్పించడం ద్వారా కూడా ఆర్ధిక ఇబ్బందుల నుంచి విముక్తి పొందవచ్చని పండితులు చెబుతున్నారు. గ్రహ దోషాలు తొలగిపోవాలంటే, ఐదు గవ్వలను ఎర్రటి గుడ్డలో కట్టి ఒక పాత్రలో ఉంచి, తులసి మొక్క వద్ద ఉంచడం వలన గ్రహ దోషాలు తొలగిపోయే అవకాశం ఉందట. రామాయణాన్ని పఠించడం, హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల కూడా సంతోషం కలుగుతుందట. సంపద, శ్రేయస్సు వృద్ధి అవుతుంది. నవమి రోజున దుర్గ అమ్మవారిని కూడా పూజిస్తారు. దుర్గా సప్తశతి పారాయణం చేస్తే మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని నమ్ముతారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నవారు దుర్గా దేవిని పూజించి ఆగ్నేయ మూలలో నెయ్యి దీపం వెలిగిస్తే వ్యాధుల నుంచి ఉపశమనం కలిగి ఆరోగ్యాన్ని పొందవచ్చని చెబుతారు. రామాలయానికి కుంకుమ జెండాను దానం చేయడంతోపాటు, దేవతలకు పసుపు ఆహారాన్ని సమర్పిస్తారు. శ్రీరాముడికి కుంకుమ కలిపిన పాలతో అభిషేకం చేస్తే ధనలాభం కలుగుతుందని విశ్వాసం. ప్రధానంగా రామమందిరంలో 'శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే.. సహస్తనామతత్తుల్యం శ్రీరామ నామ వరాననే'ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే అంతా మంచి జరుగుతుందని రామభక్తుల విశ్వాసం. రామనవమి రోజున దేవుడికి పసుపు బట్టలు సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే పేదలకు అన్న దానం, వస్త్రదానం చేస్తారు. ఈ రోజు హనుమంతుని విగ్రహం దగ్గర చందనం తీసుకుని.. సీతమ్మవారి పాదాలకు పూస్తే కోరిన కోరికలు నెరవేరతాయట. -
Sri Rama Navami 2024: శ్రీరామనవమి ముహూర్తం, ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
తెలుగువారి తొలి పండుగ ఉగాది తరువాత వచ్చే మరో విశిష్టమైన పండుగ శ్రీరామ నవమి. శ్రీమహావిష్ణువు ఏడో అవతారమైన శ్రీరాముని జన్మదినాన్ని రామ నవమిగా జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా కూడా శ్రీరామ నవమి వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. భక్తి శ్రద్ధలతో రాముణ్ని పూజిస్తారు. సీతారాముల కళ్యాణం జరిపిస్తారు. శ్రీరామనవమి విషిష్టత ఏంటో తెలుసుకుందాం. అయోధ్య రాజు దశరథ మహారాజు రాణి కౌసల్య దంపతులకు శ్రీరాముడు జన్మించిన శుభ సందర్భమే శ్రీరామ నవమి. త్రేతా యుగంలో చైత్ర శుద్ధ నవమి రోజున వసంత ఋతువు కాలంలో పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల పుట్టాడు. అందుకే ఈ పవిత్రమైన రోజున శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటారు. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ,పట్టాభిషేకాన్ని ఘనంగా నిర్వహిస్తారు. 2024లో రామ నవమి ఎప్పుడు? చైత్ర నవరాత్రులు ఈ సంవత్సరం ఏప్రిల్ 9, మంగళవారం ప్రారంభమయ్యాయి.ఏప్రిల్ 17 న రామ నవమి పండుగతో ముగుస్తాయి. రామ నవమి శుభ ముహూర్తం రామ నవమి, ఏప్రిల్ 17,బుధవారం. ముహూర్తం - ఉదయం 11:03 -మధ్యాహ్నం 01:38 వరకువ్యవధి - 02 గంటల 35 నిమిషాలు అని పండితులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా రామనవమిని ఉత్సాహంగా జరుపుకుంటారు. ముఖ్యంగా రామజన్మభూమిగా భావించే అయోధ్యలో, శ్రీరాముని జన్మదినోత్స వేడుకలు కోలాహలంగా ఉంటాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు అయోధ్యకు వస్తారు.ఈ ఏడాది ప్రాణ ప్రతిష్ట చేసుకున్న రామజన్మభూమి దేవాలయంలో రామ్ లల్లా తొలి వేడుకులు ప్రాధాన్యతను సంతరించుకోనున్నాయి. సీతారామకళ్యాణం ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి మొదలు అంటే ఉగాది నుంచి శ్రీరామనవమి వరకూ శ్రీరామ కల్యాణ ఉత్సవాలను నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం ఆజానుబాహుడు, అరవింద నేత్రుడు అయిన శ్రీరాముడికి - అందాల సీతమ్మకు ఈ రోజునే పెళ్లి జరిగింట. అందుకే ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున సీతారాముల కల్యాణాన్ని ప్రతి రాముడి ఆలయంలోనూ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అలాగే పద్నాలుగేళ్లు అరణ్యవాసం తరువాత శ్రీరాముడు అయోధ్యకు పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఇదేనని భక్తుల విశ్వాసం. చాలామంది ఆ రోజు ఉపవాసం ఉంటారు. రామ భక్తులు రామాయణం భాగవత గ్రంథాలను పఠిస్తారు. సీతారామ లక్ష్మణులతోపాటు హనుమంతుడిని కూడా పూజిస్తారు. వడపప్పు, పానకం పానకం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైందట. అందుకే శ్రీరాముడిని పూజించిన తరువాత కొత్తకుండలో మిరియాలు, బెల్లంతో చేసిన పానకం, వడపప్పు నైవేద్యంగా పెడతారు. పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు వసంత రుతువులో వచ్చే గొంతు సంబంధిత వ్యాధులకు ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది ఔషధంలా పనిచేస్తాయని ఆయుర్వేదం చెపుతుంది. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
"వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం” , “శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్” సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాల వేదికపై “ఉగాది కవి సమ్మేళనము” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. "శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని, కేవలం విదేశాలలో నివసిస్తున్న తెలుగు కవుల కొరకు ప్రత్యేకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో 11 దేశాల నుండి సుమారు 40 మంది కవులు కవయిత్రులు పాల్గొనడం చాలా సంతోషదాయకమని, త్వరలో ఈ ఈ కవితలు అన్నిటినీ ఒక సంపుటిగా ప్రచురిస్తామని" నిర్వాహకులు, వంశీ వ్యవస్థాపకులు డా. వంశీ రామరాజు . 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' సింగపూర్ వ్యవస్థాపకులు కవుటూరు రత్నకుమార్ తెలియజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పూర్వ రాజ్యసభ సభ్యులు, సాహితీవేత్త పద్మభూషణ్ డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ దేశాల కవులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమం ఆసాంతం వీక్షించి, ఆంగ్ల వ్యామోహంలో తెలుగును దూరం చేసుకోకూడదని, యువతరం కవులను రచయితలను ప్రోత్సహించే మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలని సందేశాన్నిచ్చారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న ప్రముఖ సినీ గేయకవి, రచయిత భువనచంద్ర గీతం అందరినీఆహ్లాదపరిచింది. ఆత్మీయ అతిథిగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు డా. వంగూరి చిట్టెన్ రాజు పాల్గొని సభను, నిర్వాహకులను అభినందించారు. రాధిక మంగిపూడి సభా నిర్వహణలో, కవులందరూ “నా బాల్యంలో ఉగాది” అనే శీర్షికతో తమ చిన్ననాటి ఉగాది పండుగ జ్ఞాపకాలను, తాము పెరిగిన సొంత ఊరి పరిస్థితులను తలచుకుంటూ, వర్ణిస్తూ కవితలను వినిపించడం అందరినీ మరింత విశేషంగా ఆకట్టుకుంది. అందరూ ఒకే శీర్షికతో రాసిన కవితలైనా, వివిధ ప్రాంతాలలో ఉగాది వేడుకల తీరుతెన్నులు, వివిధ మనోభావాల ద్వారా ప్రకటించబడుతూ, దేనికి అదే ప్రత్యేకంగా నిలిచాయి. అమెరికా, కెనడా, న్యూజిలాండ్, సింగపూర్, మలేసియా, ఇండోనేసియా, ఖతార్, ఒమాన్, యూఏఈ, పోలాండ్, యూకే దేశాల నుండి 40మంది ఈ కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. వంశీ అధ్యక్షరాలు డా తెన్నేటి సుధాదేవి, మేనేజింగ్ ట్రస్టీ సుంకరకపల్లి శైలజ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమం, కల్చరల్ టీవీ & శ్రీ సాంస్కృతిక కళాసారథి యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. -
Eid 2024 ఘుమ ఘుమల షీర్ కుర్మా టేస్టీ అండ్ హెల్దీగా ఇలా..!
ఈద్ 2024: ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అత్యంత ముఖ్యమైన పండుగ పవిత్ర రంజాన్. నెలరోజుల ఉపవాస దీక్ష తరువాత చంద్ర దర్శనంతో ఈద్-ఉల్-ఫితర్ ఉత్సాహంగా జరుపుకుంటారు. నెలవంకతో ప్రారంభమై 30 రోజుల కఠిన ఉపవాస దీక్షలు తదుపరి నెల నెలవంకతో ముగుస్తాయి. రంజాన్ పండుగ చేసుకుంటారు. దీన్నే ఈద్ అని కూడా అంటారు. ఈ రోజున ముస్లిం సోదరులు కొత్త దుస్తులు ధరించి, ఒకరికొకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. తీపి విందు చేసుకుంటారు. ముఖ్యగా రంజాన్ అనగానే అందరికీ గుర్తు వచ్చేది ఒకటి హలీం. రెండోది షీర్ ఖుర్మా. షీర్ ఖుర్మా అనేది దక్షిణ ఆసియా నుండి వచ్చిన రుచికరమైన, వెల్వెట్ డెజర్ట్. సేవయాన్ అని పిలిచే సున్నితమైన సెమోలినా నూడిల్. ఏలకులు , కుంకుమపువ్వు వంటి సుగంధ ద్రవ్యాలు, రోజ్ వాటర్, వివిధ రకాల గింజలు, డ్రైఫ్రూట్స్తో ఎంతో రుచికరంగా తయారు చేస్తారు. మరి షీర్ ఖుర్మా రెసిపీని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందామా..! షీర్ ఖుర్మాకు కావాల్సిన పదార్థాలు: చిక్కని పాలు, సేమియా, చక్కెర, బాదం, జీడి పప్పు, పిస్తా, ఖర్జూరం, కిస్మిస్, నెయ్యి, కోవా, రోజ్ వాటర్, కుంకుమ పువ్వు తయారీ: ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులోకొద్దిగా నెయ్యి వేసి.. డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకొని పక్కన పెట్టు కోవాలి. అదే కడాయిలో సేమియాను కూడా వేసి జాగ్రత్తగా వేయించాలి. ఆ తరువాత మరో గిన్నెలో పాలు పోసి బాగా మరిగించాలి. చిక్కగా మరిగాక మంట సిమ్లో పెట్టుకొని, ఇంకొంచెం మరిగాక పంచదార పొడి, కోవా వేసి బాగా కలపాలి. మధ్య మధ్యలో అడుగంట కుండా కలుపుతూ ఉండటం మర్చిపోకూడదు. ర్వాత సన్నగా తరిగి ఉంచుకున్న ఖర్జూరాలను, సేమియాలను వేయాలి. ఇపుడిక ఊరికే కలపకూడదు. రోజ్ వాటర్ కూడా వేసి మెల్లిగా కలపాలి. కొద్దిగా చిక్కగా అయిన తరువాత దింపేసుకోవాలి. తరువాత ముందే వేయించి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్, కుంకుమ పువ్వు రేకలతో గార్నిష్ చేసుకోవాలి. అంతే.. ఘుమఘుమలాడే టేస్టీ అండ్ హెల్దీ షీర్ కుర్మా సిద్ధం. *సాక్షి పాఠకులందరికీ రంజాన్ శుభాకాంక్షలు* -
Ugadi 2024 : సుమ ‘ఘమ’ల పులిహోర!
దేశవ్యాప్తంగా శ్రీక్రోధి నామ ఉగాది వేడుకల సందడి నెలకొంది. తెలుగు ముంగిళ్లు మామిడి తోరణాలతో.. బంతి, చేమంతులపూల దండలతో ముస్తాబైనాయి. కొంగొత్త ఆశలు, ఆశయాలతో ఈ ఏడాదంతా శుభం జరగాలని కోరుకుంటూ తమ ఇష్టదైవాలకు మొక్కుకునే శుభ తరుణమిది. దీంతో దేవాలయ్యాన్నీ ముస్తాబైనాయి. ప్రత్యేకపూజలు ప్రార్థనలతో భక్తులు మునిగి తేలతారు. ఈ క్రమంలో పాపులర్ యాంకర్ సుమ ఒక వీడియోను షేర్ చేసింది. పండగంటే పులిహోర లేకుండా ఎలా పులిహోర రడీ చేస్తున్న వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. గలగల మాట్లాడుతూ, సందర్భోచితంగా పంచ్లు వేస్తూ, ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ సుమ. దశాబ్దాలు తరబడి యాంకరింగ్ చేస్తున్నా బోర్ కొట్టని మాటల మూట సుమ. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) -
Ugadi 2024: లంగావోణీ, లెహెంగా, బెనారసీ.. ఆ సందడే వేరు!
ఉగాది 2024 హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం కొత్త ఏడాదికి ఆరంభం. ఉగాది. 'యుగ' అంటే వయస్సు,'ఆది' ఉగాది అనే రెండు సంస్కృత పదాల నుండి వచ్చిందే ఉగాది. ఉగాది అనగానే ఇల్లంగా శుభ్రం చేసుకోవడం, మామిడి ఆకుల తోరణాలు, బంతిపూల మాలలతో అలంకరించుకోవడం ఆనవాయితీ. అలాగే రకరకాల పిండి వంటలు, ఉగాది పచ్చడితో విందు చేసుకోవడం ఒక సంప్రదాయంగా వస్తోంది. ఇంకా ఉగాది అనగానే కవితా పఠనాలు, పంచాంగ శ్రవణాలు, దానధర్మాలు కూడా చేస్తారు. కొంగొత్త ఆశయాలకు అంకురార్పణ చేసే శుభదినమే ఉగాది పర్వదినం. శిశిరం తర్వాత వసంతం వస్తుంది. అందుకే అంతా కొత్త.. కొత్తగా కళకళలాడుతూ ఉండాలనీ, ఉగాది పండగ వచ్చిందంటే సంప్రదాయ రీతిలో కొత్త దుస్తులు ధరించాలని కూడా పెద్దలు చెబుతారు. కన్నెపిల్లలైతే అందమైన లంగా ఓణీలు, లెహంగాలతో సీతాకోక చిలుకల్లా ముస్తాబవుతారు. ఇక మహిళల ప్రాధాన్యత చీరలకే. ప్రస్తుతం నారాయణ పట్టు, కాటన్,చేనేత లెహంగాలు ట్రెండింగ్లో ఉన్నాయి. కాలం మంచితనంతో నేసిన ఆనందాలే మన వేడుకలు. నలుగురు కలిసే చోట.. నవ్వుల విందులు వేసే చోట.. సంబరాలు నట్టింట కొలువుండే చోట .. పండగ కాంతి దేదీప్యంగా వెలగాలంటే మన చేనేతలతో మరింత కొత్తగా సింగారించుకోవాలి ఏడాది పొడవునా ఇంటింటా శుభాలు నిండాలి. పదహారణాల లంగావోణీ తెలుగింటి మగువల సంప్రదాయ ఆహార్యం లంగావోణీ. పదహారణాల పోలికతో హృదయాల్లో కొలువుండే అందమైన రూపం. అందుకే మార్కెట్లోకి ఎన్ని డిజైనర్ డ్రెస్సులు వచ్చినా లంగా– ఓణీ ప్రాభవం ఇసుమంతైనా తగ్గలేదు. ఈ ప్రకృతి పండగ మరింత శోభాయమానంగా జరపుకోవడానికి సిద్ధంగా ఉంటున్నాయి మన చేనేతలు. చేనేత చీరలు పచ్చని సింగారం కంచిపట్టు సంప్రదాయ వేడుక ఏదైనా కంచిపట్టు లేకుండా పూర్తవదు అనేది మనందరికీ తెలిసిందే. సాధారణంగా లంగాబ్లౌజ్ ఒక రంగు కాంబినేషన్ తీసుకొని దుపట్టా కాంట్రాస్ట్ కలర్ వాడుకుంటే బెటర్. మనసు దోచే ఇకత్ ప్లెయిన్ ఇకత్ ఫ్యాబ్రిక్ను లెహంగాకు తీసుకున్నప్పుడు బార్డర్, ఎంబ్రాయిడరీ లెహెంగాను ఇపుడుఫ్యాషన్ బ్లౌజ్ ప్యాటర్న్ కూడా అదేరంగు ఇకత్తో డిజైన్ చేసి, కాంట్రాస్ట్ ఓణీ జతచేస్తే అమ్మాయిలకు ఎవర్గ్రీన్ కాన్సెప్ట్. మంచి కాంట్రాస్ట్ కలర్స్తో ఇక్కత చీర ఏ మహిళకైనా నిండుదనాన్ని తీసుకొస్తేంది చల్ల..చల్లగా గొల్లభామ తెలంగాణకే ప్రత్యేకమైన గొల్లభామ చేనేతకు అంతర్జాతీయంగానూ పేరుంది. కాటన్ మెటీరియల్ అనగానే పెదవి విరిచేవారికి కూడా సరైన ఎంపిక అవుతుంది. గొల్లభామ కాటన్ మెటీరియల్తో డిజైన్ చేసిన లెహెంగా, దీని మీదకు కలంకారీ దుపట్టాను ఉపయోగించాను. తక్కువ ఖర్చుతో హ్యాండ్లూమ్స్ని పార్టీవేర్గానూ ఉపయోగించవచ్చు అనడానికి ఇదో ఉదాహరణ. సింపుల్ అనిపించే ఫ్యాబ్రిక్స్ని కూడా భిన్నమైన లుక్ వచ్చేలా హైలైట్ చేసుకోవచ్చు. గొల్లభామ చీరలు కూడా నిండుగా, ఈ వేసవిలో చల్లగా ఉంటాయి. గ్రాండ్గా గద్వాల్, బెనారసీ పట్టు వివాహ వేడుకల్లో అమ్మాయి అలంకరణ గ్రాండ్గా కనిపించాలంటే పట్టు లంగా ఓణీ సరైన ఎంపిక అవుతుంది. పెద్ద జరీ అంచు ఉన్న మెటీరియల్ను ఇందుకు ఎంచుకోవాలి. అలాగే ఓణీ కూడా జరీ బార్డర్తో ఉన్నది ఎంచుకుంటే కళగా కనిపిస్తారు. ఇక మగువలు గద్వాల్, కంచి, బెనారసీ పట్టు చీరల్లోమహారాణుల్లా మెరిసిపోతారు. ఈ ఉగాదిని గ్రాండ్గా సెలబ్రేషన్ల కోసం మీకు ఇష్టమైన సెలబ్రిటీల ఫ్యాషన్ దుస్తులను చూసి కూడా నచ్చింది ఎంపిక చేసుకోవచ్చు. అందరికీ శ్రీ క్రోధి నామ ఉగాది శుభాకాంక్షలు. -
Ugadi 2024: క్రోధిని కార్యసాధనంగా మలచుకుందాం!
ఉగాది తెలుగువారి తొలిపండుగ. ప్రభవతో మొదలు పెట్టి అక్షయ వరకు తెలుగు సంవత్సరాలు 60. ఈ వరుసలో ఇప్పుడు మనం జరుపుకుంటున్న ఉగాదికి క్రోధి నామ సంవత్సర ఉగాది అని పేరు. క్రోధి అంటే కోపం కలవారని సామాన్యార్థం. క్రోధి అనే పదానికి కొన్ని నిఘంటువులు కోప స్వభావులైన కుక్క, దున్న΄ోతు అని అర్థం చెప్పినప్పటికీ, దానిని పరిగణనలోకి తీసుకోనక్కరలేదు. అన్ని స్వభావాల లాగే మనిషికి కోపం లేదా క్రోధం కూడా అవసరమే. మనకు ఎంత అవసరమో, అంతవరకు మాత్రమే కోపాన్ని ఉంచుకోవాలి. మిగిలిన దానిని నిగ్రహించుకోవాలి. ధర్మమూర్తి అయిన శ్రీరామచంద్రుడు కూడా కొన్ని సందర్భాలలో కోపించాడు. అలా మన జీవితాలకు అవసరమైన మేరకు మాత్రమే కోపాన్ని ఈ ఉగాది ఇస్తుందని, ఇవ్వాలనీ ఆశిద్దాం. ఉగాదితో చాంద్రమాన సంవత్సరం మొదలవుతుంది. పౌర్ణమిచంద్రుడు చిత్త లేదా చిత్ర నక్షత్రంతో కూడి ఉన్న మాసాన్ని చైత్రమాసంగా పిలుస్తారు. చైత్రమాసం తొలిరోజు అంటే చైత్రశుక్ల పాడ్యమి రోజు ఉగాది అవుతుంది. చంద్రుడు ఒక నక్షత్రంతో మొదలుపెట్టి, భూమి చుట్టూ తిరిగి మళ్లీ ఆ నక్షత్రం దగ్గరకు రావడానికి పట్టే కాలం నక్షత్రమాసం అవుతుంది. ఆ రోజు పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. కాలానికి సూర్య, చంద్ర గమనాలుప్రాతిపదిక కాబట్టి ఈ మేరకు చాంద్ర–సౌర సంవత్సరం అవుతుంది. వ్యావహారిక శకానికి పూర్వం తొలిదశలో సప్తఋషులు నక్షత్ర సంవత్సరాన్ని, చాంద్ర–సౌర సంవత్సరాన్ని కలిపి పంచాంగాన్ని అమలులోకి తెచ్చారు. మూడు, ఐదు సంవత్సరాలలో వచ్చే అధికమాసాలను కలుపుకుని ఐదు సంవత్సరాలతో ఒక యుగం అని పంచాంగ పరంగా అమలు చేశారు. అప్పట్లో ఆ యుగం ఆరంభం శరత్ విషువత్, శరత్ ఋతువు లో ఉండేది. ఈ ఐదు సంవత్సరాల యుగంలో మొదటి సంవత్సరంలో మొదటి రోజు యుగాది అయింది; అదే ఉగాది అయింది. ఈ యుగం జ్యోతిష శాస్త్రానికి అనుగుణం గా కూడా రూపొందింది. ‘జ్యోతి’ అంటే నక్షత్రం అనీ ‘షం’ అంటే సంబంధించిన అనీ అర్థం. జ్యోతిషం అంటే నక్షత్రానికి సంబంధించినది అని అర్థం. చాంద్ర– సౌర గమనాలప్రాతిపదికన మన పంచాంగం నిర్మితమైంది. పంచాంగం ప్రకారం మనకు ఉగాది నిర్ణీతమైంది. విశ్వామిత్ర మహర్షి పంచాంగంలోనూ, కాలగణనంలోనూ కొన్ని ప్రతిపాదనలను, మార్పులను తీసుకు వచ్చాడు. ఆ తరువాత కాలక్రమంలో జరుగుతూ వచ్చిన ఖగోళమార్పులకు తగ్గట్లు గర్గ మహాముని సంవత్సరాదిని వసంత విషువత్కు మార్చాడు. ఆర్యభట్టు, వరాహమిహిరుడు దాన్నే కొనసాగించారు. అదే ఇప్పటికీ కొనసాగుతోంది. సాంప్రదాయిక సంవత్సరాన్ని లేదా ఆచార వ్యవహారాల కోసం సంవత్సరాన్ని చైత్రమాసంతో మొదలుపెట్టారు. వసంతం, వసంతంతోపాటు ఉగాది... ఈ రెండు ప్రాకృతిక పరిణామాల్ని మనం మన జీవితాలకు ఆదర్శంగా తీసుకోవాలి, వసంత ఋతువు రావడాన్ని వసంతావతారం అని కూడా అంటారు. వసంతావతారం సంవత్సరానికి ఉన్న అవతారాలలో గొప్పది, ఆపై శోభాయామానమైంది. సంవత్సరానికి శోభ వసంతం. వసంతం మనకు వచ్చే ఋతువుల్లో ప్రధానమైంది లేదా కేంద్రభాగం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, చెట్లకు కొత్త చివుళ్లు, కోయిలల గానాలు, పచ్చదనం, పువ్వుల కళకళలను తీసుకు వచ్చేది వసంతమే. అందుకే వసంతంలో ఎక్కువ వేడి, చలి ఉండవు. వాతావరణం ఉల్లాసకరంగా ఉంటుంది. వసంతం శ్రేష్ఠమైంది కాబట్టే శ్రీకృష్ణుడు భగవద్గీతలో తాను ఋతువుల్లో వసంతాన్ని అని చె΄్పాడు. నాటి కవులు, పండితులు మొదలుకొని కళాకారుల వరకు అందరికీ వసంత రుతువంటేనే మక్కువ. వసంతాన్ని కుసుమాకరం అనీ, కుసుమాగమం అనీ అంటారు. కుసుమానికి పుష్పం, పండు, ఫలం అని అర్థాలు ఉన్నాయి. ఈ మూడూ మనకు ఎంతో అవసరం అయినవి. తప్పకుండా మనం వీటిని పొందాలి. మన జీవితాలు కూడా నిండుగా పుష్పించాలి, పండాలి, ఫలవంతం అవ్వాలి. వసంతాన్ని ప్రకృతి ఇస్తున్న సందేశంగా మనం గ్రహించాలి. వసంతం ఒక సందేశం దాన్ని మనం అందుకోవాలి, అందుకుందాం. సంవత్సరంలో ఉండే మంచితనం వసంతం. వసంతం ప్రకృతి నుంచి మనకు అందివచ్చే మంచితనం. ‘...సంతో వసంతవల్లోకహితం చరంతః ...‘ అని వివేక చూడామణిలో జగద్గురు ఆదిశంకరాచార్యులవారు అన్నారు. అంటే మంచివాళ్లు వసంతంలాగా లోకహితాన్ని ఆచరిస్తారు అని అర్థం. వసంతం వంటి హితం. హితం వంటి వసంతం మనకు, సంఘానికి, దేశానికి, ప్రపంచానికి ఎంతో అవసరం. శుభానికి తొలి అడుగుగా, మంచితనానికి మారు పేరుగా అన్ని ఆరంభాలకూ ఆది అయిన తొలి పండుగగా ఉగాదికి విశిష్టత ఉంది. ఇతర పండుగలలా కాకుండా ఉగాది కాలానికి, ప్రకృతికి సంబంధించిన పండుగ. మనిషి కాలానికి, ప్రకృతికి అనుసంధానం అవ్వాలని తెలియజెప్పే ఒక విశిష్టమైన పండుగ. ఆరు ఋతువులకు ఆదిగా వచ్చేది ఈ పండుగ. సంవత్సరంలోని ఆరు ఋతువులకు ప్రతీకలుగా తీపి, కారం, చేదు, వగరు, ఉప్పు, పులుపుల్ని తీసుకుని ఆ రుచుల కోసం కొత్త బెల్లం, మిరియాల΄÷డి, వేపపువ్వు, మామిడి పిందెలు, ఉప్పు, కొత్త చింతపండు కలిపి తయారు చేసిన ఉగాది పచ్చడిని మనం తీసుకుంటున్నాం. నింబకుసుమ భక్షణం అని దీనికి పేరు. ఇది ఉగాది పండుగలో ముఖ్యాంశం. మరో ముఖ్యాంశం పంచాంగశ్రవణం. ఆదిలోనే ఎవరి రాశి ప్రకారం వారికి సంవత్సరంలో జరగడానికి అవకాశం ఉన్న మేలు, కీడులను ఆయా రాశి గల వ్యక్తులకు సూచన్రపాయంగా పంచాంగం తెలియచెబుతుంది. పంచాంగ శ్రవణానికి ముందుగా మనం అభ్యంగన స్నానం చేసి, మామిడి తోరణాలతో, పుష్పాలతో ఇళ్లను అలంకరించుకుని దైవపూజ చెయ్యాలి. ప్రకృతి ఇచ్చిన సందేశాలుగా అందివచ్చిన ఉగాదిని, వసంతాన్ని ఆకళింపు చేసుకుని, ఆదర్శంగా తీసుకుని, మనం మనకు, ఇతరులకు ఈ ఏడాదిలోని అన్ని ఋతువుల్లోనూ హితకరం అవుదాం. కాలం ఒక ప్రవాహం కాలం నదిలాంటిది. ముందుకు ప్రవహిస్తుందే కానీ, వెనక్కి తిరగదు. అలా ముందుకు ప్రవహించే నదిలో ఎన్నో సెలయేర్లు, వాగులు, వంకలు కలిసి ఉన్నట్టే... కాలవాహినిలో తృటి, క్షణం, ముహూర్తం, దినం మొదలైన కాలగతి సూచికలు మిళితమై ఉంటాయి. వీటిన్నింటి మేలు కలయికే కాల ప్రవాహం. ఇటువంటి కాలాన్ని ఉగాది రూపంలో ఆరాధించాలన్నదిప్రాచీనుల నిర్దేశ్యం. ప్రతి కొత్త సంవత్సరం శుభపరంపరలతో కొనసాగాలని కోరుకోవడంతోపాటు శుభాచరణకు మనల్ని మనం సమాయత్తం చేసుకుంటూ ముందుకు సాగుదాం. ఆరు రుచులలో అనేక అర్థాలు ఉగాదికి సంకేతంగా చెప్పుకునే ఆరు రుచుల కలయికలో అనంతమైన అర్థముంది. ప్రకృతి లేనిదే జీవి లేదు. జీవి లేని ప్రకృతి అసంపూర్ణం. కాబట్టి సరికొత్త ప్రకృతి అందించే తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు రుచుల సమ్మేళనంతో తయారయ్చే ఉగాది పచ్చడి సేవనం ఆరోగ్యదాయకం. జీవితమంటే కేవలం కష్టాలు లేదా సుఖాలే కాదు, అన్ని విధాలైన అనుభవాలూ, అనుభూతులూ ఉంటాయి, ఉండాలి! అలా ఉన్నప్పుడే జీవితానికి అర్థం పరమార్థం. ఈ సత్యాన్ని బోధిస్తూనే ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది ఉగాది పచ్చడి. పంచాంగ శ్రవణ ఫలమేమిటి? ఉగాదినాటి పంచాంగ శ్రవణం గంగాస్నాన ఫలంతో సమానమని శాస్త్రం చెబుతోంది. అంతేకాదు. ఉగాది పంచాంగ శ్రవణం వల్ల. భూమి, బంగారం, ఏనుగులు, గోవులతో కూడిన సర్వలక్షణ లక్షితమైన కన్యను యోగ్యుడైన వరునకు దానం చేస్తే కలిగే ఫలంతో సమానమైన ఫలాన్నిస్తుందని శాస్త్రోక్తి. వీటితోపాటు సంవత్సరానికి అధిపతులైన రాజాది నవనాయకుల గ్రహఫలితాలను శాస్త్రోక్తంగా వినడం వల్ల గ్రహదోషాలు నివారితమై , వినేవారికి ఆరోగ్యాన్ని, యశస్సును, ఆయుష్షునూ వృద్ధి చేసి, సంపదతో కూడిన సకల శుభఫలాలనూ ఇస్తుందంటారు పెద్దలు. కాబట్టి ఉగాదినాడు పంచాంగ ఫలాలను తెలుసుకోవడం వల్ల భవిష్యత్ కార్యాచరణను చేపట్టవచ్చు. నూతనత్వానికి నాంది బ్రహ్మదేవుడు సృష్టినిప్రారంభించినదీ, ప్రజానురంజకంగా పాలించిన శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగినదీ, వెయ్యేళ్లపాటు రాజ్యపాలన చేసిన విక్రమార్క చక్రవర్తి రాజ్యాన్ని చేపట్టినదీ, శకకారుడైన శాలివాహనుడు కిరీట ధారణ చేసినదీ, కౌరవ సంహారం అనంతరం ధర్మరాజు హస్తిన పీఠాన్ని అధిష్ఠించిందీ ఉగాదినాడేనని చారిత్రక, పౌరాణిక గ్రంథాలు చెబుతున్నాయి. కాబట్టి నూతనకార్యాలుప్రారంభించడానికి ఉగాదిని మించిన శుభతరుణం మరొకటి లేదనే కదా అర్థం. – డి.వి.ఆర్. భాస్కర్ -
Ugadi 2024: ఉగాది పచ్చడి ఇలా ఎపుడైనా ట్రై చేశారా?
#Ugadi 2024 తెలుగువారి తొలి పండుగ ఉగాది అంటేనే ఆనందం. ఉత్సాహం. కొత్తకు నాంది అనే సంబరం. ముఖ్యంగా ఉగాది అనగానే తీపి, చేదు, లాంటి షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి అందరికీ గుర్తొస్తుంది. ప్రతి పదార్ధం జీవితంలోని విభిన్న అనుభవాలకు గుర్తుగా అమృతం లాంటి జీవితాన్ని ఆస్వాదించే కొత్త ఉత్సాహాన్నిస్తుంది. ఉగాది పచ్చడికి అంత ప్రాధాన్యత. గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. కొత్తగా ఆరంభించ డానికి ఇది శుభతరుణమని భావిస్తారు. ఉగాదికి పులిహోర, బొబ్బట్లు, పూర్ణం బూరెలతోపాటు ఉగాది పచ్చడి చేయడం అనవాయితీ. అయితే ఈ ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పచ్చడి ఇలా.. పచ్చి మామిడికాయ – ఒకటి (మీడియం సైజు) వేప పువ్వు – టేబుల్ స్పూన్ (తొడిమలు ఒలిచినది) కొత్త చింతపండు – నిమ్మకాయంత (రసం చిక్కగా తీసుకోవాలి) బెల్లం తురుము – 2 టేబుల్ స్పూన్లు ఉప్పు – పావు టీ స్పూన్ మిరియాలు లేదా మిరియాల పొడి అర టీ స్పూన్ లేదా రెండు చిన్న పచ్చిమిర్చి తయారీ: పచ్చి మామిడి కాయను శుభ్రంగా కడిగి చెక్కు తీయకుండా సన్నగా ముక్కలు తరగాలి. ఇందులో వేప పువ్వు, చింతపండు రసం, బెల్లం తురుము, ఉప్పు, పచ్చిమిర్చి వేసి కలపాలి. షడ్రుచుల ఉగాది పచ్చడి రెడీ. రుచి కోసం టేబుల్ స్పూన్ కొబ్బరి కోరు, ఒక అరటి పండు గుజ్జు కూడా కలుపుకోవచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్ ఉగాది పచ్చడి.స్పూన్తో అరచేతిలో వేసుకుని తినేటట్లు చిక్కగా ఉంటుంది. తెలంగాణలో తెలంగాణలో ఇదే మోతాదులో తీసుకున్న దినుసులను ఒక పెద్ద పాత్రలో వేసి ముప్పావు వంతు నీటిని పోసి కలపాలి. గ్లాసులో పోసి తాగేటట్లు జారుడుగా ఉంటుంది. పిల్లలు మెచ్చేలా..! ఉగాది పచ్చడి ప్రాశస్త్యాన్ని పిల్లలకు చెబుతూనే , వారికి నచ్చే విధంగా ఉగాది పచ్చడిని ఫ్రూట్ సలాడ్లా కూడా చేసుకోవచ్చు. ఉగాది పచ్చడిలో వేసే ఆరు రకాల పదార్థాలతో సంప్రదాయ బద్ధంగా ఉగాది పచ్చడిని చేసుకొని, అందులోనే అరటిపండు, యాపిల్, ద్రాక్ష చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కలుపుకోవచ్చు. దీనికి కొద్దిగా తేనెను కూడా యాడ్ చేసుకుంటే మరీ జారుగా కాకుండా, చక్కగా స్పూన్తో తినేలా ఫ్రూట్ సలాడ్లా భలేగా ఉంటుంది. పిల్లలు కూడా ఇంట్రస్టింగ్గా తింటారు. శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది మన అందరి జీవితాల్లో శాంతిని, సుఖ సంతోషాలను కలగ చేయాలని, అందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుందాం.! -
Ugadi 2024: శుభముహూర్తాలు, శుభ ఘడియల వివరాలివిగో..!
హిందూ మతంలోని ప్రధాన పండుగల్లో ఉగాది ఒకటి. తెలుగు క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం చైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉగాది అంటేనే కొత్త ఆశలకు పునాది. కొత్త కార్యక్రమాలను ఉత్సాహంగా ప్రారంభించుకునేందుకు మంచి ముహూర్తం. ఈ సందర్భంగా ఈ ఏడాది ముహూర్తాలు, శుభ ఘడియలు ఎలా ఉన్నాయో చూద్దాం. చైత్ర మాసం (జనవరి) 09/04 శుద్ధ పాడ్యమి మంగళ అశ్వినీ వత్సరాది త్వేన నూతన వస్త్రాభరణ ధారణాదులకు మిథునం ప.గం.11:00 నుండి 11:45. 10/04 విదియ బుధ అశ్విని వ్యాపారాదులకు మేషం ఉ.6:50. భరణి, కృత్తికలు శుభ కార్య నిషేధం. 12/04 చవితి శుక్ర రోహిణి, అన్న, వ్యాపార, మేషం ఉ.గం.7:05. సీమంతం మిథునం ప.గం.10:20. 13/04 షష్ఠి శని మృగశిర సీమంతం వశ్చికం రా.గం.8:30ల 9:00వ. 14/04 షష్ఠి ఆది ఆర్ద్ర నక్షత్ర సంబంధ కర్మలకు వృషభం ఉ.గం.8.25. మిథునోపి ప.గం.11:19. 15/04 సప్తమి సోమ పునర్వసు అన్న, అక్షర, ఉప, సీమంత, వ్యాపార, పుంసవన, దేవాలయ కర్మలు, బోరింగ్, శంఖు, వషభం ఉ.గం.8:24 విశేషం. 17/04 శ్రీరామనవమి కళ్యాణములకు కర్కాటక లగ్నం ప.గం.11:34కు ప్రారంభం. 18/04 దశమి గురు మఘ వివాహం కర్కాటకం ప.గం.12:01. అగ్ని పంచకం 8 కు ఏకాదశీ వృశ్చికము వివాహముకు విశేషం రా.గం.8:54. 19/04 ఏకాదశీ శుక్ర మఘ వివాహము మిథునం ఉ.గం.11:00 విశేషం. 20/04 ద్వాదశీ శని ఉత్తర వివాహం, గర్భ, వ్యాపారం, వృశ్చికం (సగ్రహ) రా.గం.8:30. (గృప్రలకు శనివారం) సీమంతం రా.గం.8:00ల 8:30. త్రయోదశీ శని/ఆది ఉత్తర వివాహం, అత్యవసర గృప్ర మకరం రా.గం.1:10. 21/04 త్రయోదశీ ఆది ఉత్తర అత్యవసర విషయా లకు మిథునం అగ్నిపంచకం ఉ.గం.10:50. హస్త వివాహ, వ్యాపార, సీమంతం వృశ్చికం రా.గం.8:21 (సగ్రహ చంద్ర) ధనురపి రా.గం.11:32. 22/04 చతుర్దశీ సోమ హస్త అన్న వ్యాపార, సీమంత, సమస్త వాస్తుకర్మలు, సమస్త దేవాలయ పనులు మిథునం ప.గం.10:47. చిత్త గప్ర, గర్భాదానాదులకు ధనస్సు రా.గం.11:29. సీమంత వేడుకలకు రా.గం.8:00ల 8:30. 24/04 బ.పాడ్యమి బుధ స్వాతి అన్న, వ్యాపార, వృషభం ఉ.గం.7:47. అన్న, శంకు, వ్యాపార, సీమంత, బోరింగ్, దేవాలయ పనులు, మిథునం ఉ.గం.10:38. ధనుర్లగ్నం రాత్రి 10:30 అత్యవసరం. 26/04 తదియ శుక్ర అనురాధ సమస్త వాస్తు, దేవాలయ పనులకు వివాహ, సీమంత, వ్యాపార, ఉప, అక్షర, అన్న మిథునం ఉ.గం.10:30. (6చం). వివాహ గప గర్భాదానం ధనస్సు రా.గం.10:30. 27/04 చవితి శని జ్యేష్ఠ అత్యవసర విషయములకు మిథునం ప.గం.9:30. 28/04 పంచమి ఆది మూల వివాహం ధనస్సు రా.గం.11:50. లగ్న చంద్ర. సీమంత వేడుకలకు వృశ్చికం రా.గం.7:30ల 8:00 (6శుక్ర). సూచన 28 రాత్రి తెల్లవారితే 29 శుక్ర మూఢమి ప్రారంభం. 02/05 నవమి గురు ధనిష్ఠ అన్న, సీమంత మిథునం ఉ.గం.9:01. 03/05 దశమి శుక్ర శతభిష అన్న, సీమంత మిథునం ఉ.గం.10:01. 05/05 ద్వాదశీ ఆది ఉత్తరాభాద్ర అన్న సీమంత మిథునం ఉ.గం.9:50. 06/05 త్రయోదశీ సోమ రేవతి అన్న సీమంత మిథునం ఉ.గం.9:45 వైశాఖ మాసం (ఫిబ్రవరి) 10/05 తదియ శుక్ర రోహిణి అన్న, సీమంత, డోలా రోహణ మిథున ఉ.గం.9:30. 12/05 పంచమి ఆది పునర్వసు సీమంతాదులకు వృశ్చిక రా.గం.7:30ల 8:00. 13/05 షష్ఠి సోమ పునర్వసు అన్న, సీమంతాదులకు డోలారోహణం మిథున ఉ.గం.9:15. పుష్యమి సీమంతం వృశ్చికం రా.గం.7:30. 18/05 దశమి శని ఉత్తర అన్న, సీమంత, ఊయల, బోరింగ్, మిథునం ఉ.గం.8:55. సీమంతం వృశ్చికోగ్నిః రా.గం.7:00ల 7:30. 19/05 ఏకాదశీ ఆది హస్త మిథునం ఉ.గం.8:30. 20/05 ద్వాదశీ సోమ చిత్త అన్న, సీమంత, ఊయల, బోరింగ్ మిథునం ఉ.గం.8:50. 23/05 పౌర్ణిమ గురు అనురాధ అన్న, సీమంత, ఊయల, బోరింగ్ కర్కాటకం ప.గం.11:01. సీమంతాదులకు ధనస్సు రా.గం.8:30. 24/05 పాడ్యమి శుక్ర అనురాధ అన్న, బోరింగ్, సీమంతం, ఊయల మిథునం ఉ.గం.7:30 (6చం) 26/05 తదియ ఆది మూల అన్న, బోరింగ్, సీమంతం, ఊయల మిథునం ఉ.గం.8:10. 27/05 చవితి సోమ ఉ.షాఢ అన్న, బోరింగ్, సీమంత ధనుః ఉ.గం.10:45. 29/05 షష్ఠి బుధ శ్రవణం మిథునం ఉ.గం.8:01. సప్తమి ధనిష్ఠ సీమంతం ధనస్సు రా.8:00. 30/05 సప్తమి గురు శతభిషం అన్న, బోరింగ్, సీమంతం కర్కాటకం ఉ.గం.9:01 (8 చం,శ) 01/06 దశమి శని ఉత్తరాభాద్ర కటకం ఉ.గం.8:50. 02/06 ఏకాదశీ ఆది రేవతి కటకం ఉ.గం.8:50. జ్యేష్ట మాసం (మార్చి) 07/06 పాడ్యమి శుక్ర మృగశిర కర్కాటకలగ్నం ఉ.గం.10:01 (8 శని) 09/06 తదియ ఆది పునర్వసు అన్న, సీమంత, బోరింగ్ మిథునం ఉ.గం.7:40. 10/06 చవితి సోమ పుష్యమి అన్న, సీమంత, బోరింగ్ కర్కాటకం ఉ.గం.8:34 (8 శని) 13/06 సప్తమి గురు పుబ్బ కర్కాటకం ఉ.గం.8:30 (8 శని) 14/06 అష్టమి శుక్ర ఉత్తర కర్కాటకం ఉ.గం.8:22 (సంక్రమణం) 15/06 నవమి శని హస్త కర్కాటకం ఉ.గం.8:22 (సంక్రమణం) 17/06 ఏకాదశీ సోమ చిత్త కర్కాటకం ఉ.గం.8:01. అన్న, సీమంత, స్వాతి సీమంతం మకరం రా.గం.8:30ల 9:30. 19/06 త్రయోదశీ బుధ అనురాధ సా.గం.6:40. గోధూళి 20/06 చతుర్దశీ గురు అనురాధ కర్కాటకం అన్న, సీమంత కటకం ఉ.8:35. 21/06 పౌర్ణిమ శుక్ర మూల సీమంతం మకరం రా.గం.8:15ల 8:30. 22/06 పాడ్యమి శని మూల అన్న, సీమంతం కర్కాటకం ఉ.8:25. 23/06 విదియ ఆది ఉత్తరాషాఢ సీమంత మకరం రా.గం.8:15ల 8:20. 24/06 తదియ సోమ ఉత్తరాషాఢ అన్న, సీమంతం కర్కాటకం ఉ.8:15. సీమంతం మకరం రా.8:01 (6శుక్ర) 26/06 పంచమి బుధ ధనిష్ఠ అన్న, సీమంతం కర్కాటకం ఉ.8:08. 27/06 షష్ఠి గురు శతభిషం అన్న, సీమంతం కర్కాటకం ఉ.8:04. 29/06 అష్టమి శని ఉ.భా. అన్న, సీమంత కర్కాటకం ఉ.8:00. 30/06 నవమి ఆది రేవతి కర్కాటకం ఉ.గం.8:00. 01/07 దశమి సోమ అశ్విని కర్కాటకం ఉ.8:00. 03/07 ఏకాదశీ బుధ రోహిణి కర్కాటకం ఉ.8:00. ఆషాఢ మాసం (ఏప్రిల్) 06/07 పాడ్యమి శని పునర్వసు వృశ్చిక సా.గం.4:01. 07/07 విదియ ఆది పుష్యమి అన్న, సీమంత కర్కాటకం ఉ.గం.7:01. సీమంతం మకరం రా.గం.7:30ల 8:30. 11/07 పంచమి గురు పుబ్బ కర్కాటకం ఉ.గం.7:30. షష్ఠి ఉత్తర సీమంతం రా.గం.7:30ల 8:00. మూఢమి వెళ్ళి ఉత్తరాయనం వున్న కారణంగా దేవాలయ కార్యములు 16 వరకు గ్రాహ్యము. 12/07 సప్తమి శుక్ర హస్త సీమంతం మకర రా.గం.7:30. 13/07 అష్టమి శని చిత్త సీమంత మకరం రా.గం.7:30. 14/07 అష్టమి ఆది చిత్త అన్న, సీమంత కర్కాటకం ఉ.గం.7:30. నవమి సీమంతం మకరం రా.గం.7:30. 15/07 నవమి సోమ స్వాతి అన్న, అక్షర, సీమంత, దేవాలయ ముహూర్తములు కటకం ఉ.7:30. 17/07 ఏకాదశీ బుధ అనురాధ తుల ప.గం.1:30 (8 కుజ) వృశ్చికం సా.4:01. సీమంతాదులకు ధనస్సు సా.5:30. 19/07 త్రయోదశి శుక్ర మూల సీమంతం ధనుః రా.గం.6:01. 21/07 పాడ్యమి ఆది ఉత్తరాషాఢ సీమంతం ధనస్సు సా.గం.4:30. 22/07 పాడ్యమి సోమ శ్రవణం అన్న, సీమంతం తుల ప.గం.12:01. విదియ సీమంత ధనుః రా.గం.5:30. 24/07 చవితి బుధ శతభిషం సీమంతం ధను సా.గం.5:30. 26/07 షష్ఠి శుక్ర ఉత్తరాభాద్ర అన్న, సీమంత తుల ప.గం.12:01. 27/07 సప్తమి శని రేవతీ అన్న, సీమంత తుల ప.గం.12:01. ధనస్సు సా.గం.4:45ల 5:00. 31/07 ఏకాదశి బుధ రోహిణి అన్న, సీమంత తుల ప.గం.11:30. ధనస్సు సా.గం.4:45ల 5:00. 01/08 ద్వాదశీ గురు మగశిర అన్న, సీమంత తుల ప.గం.11:30. 02/08 చతుర్దశీ శుక్ర పునర్వసు ధనస్సు సా.గం.5:01. శ్రావణ మాసం (మే) 05/08 విదియ సోమ మఘ మేషం రా.గం.11:39. 07/08 చవితి బుధ ఉత్తర వివాహం, గర్భాదానం మేషం రా.గం.11:34. బుధ/గురు వివాహం, గప్ర మిథునం తె.గం.2:30. 08/08 చవితి గురు ఉత్తర సీమంతం, వ్యాపారం ధనస్సు ప.గం.4:45. పంచమి గురు హస్త వివాహం, గప్ర మేషం రా.గం.11:27. గురు/శుక్ర మిథునం వివాహం, శంకు తె.గం.3:45. 09/08 పంచమి శుక్ర హస్త అన్న, సీమంత తుల ప.గం.11:01 (8 కు) సీమంతం ధనుః సా.గం.4:45. వివాహ, గర్భా మేషం రా.గం.11:23. షష్ఠి చిత్త శంకు గృప్ర మిథునం తె.గం.3:41. 10/08 షష్ఠి శని చిత్త సీమంతం, వ్యాపారం ధనుః సా.గం.4:00ల 4:30. సప్తమి శని/ఆది స్వాతి మిథునం తె.గం.3:44 విశేషం. 11/08 సప్తమి ఆది స్వాతి అన్న, అక్షర, సీమంతా దులకు తుల ప.గం.12:01 (8 కు) గర్భ, వివాహం మేషం రా.గం.11:19. ఆది సోమ మి«థునం తె.గం.3:01. 15/08 ఏకాదశీ గురు మూల తుల ప.గం.12:01 (8 కుజ) సీమంతం ధనస్సు సా.గం.4:15. వివాహం మేషం రా.గం.10:58. గురు/శుక్ర వివాహం, శంకు, మిథునం, వాస్తు కర్మలు వివాహం తె.గం.3:14. 17/08 త్రయోదశీ శని ఉత్తరాషాఢ సీమంత, వ్యాపార ధనుః ప.గం.3:50. వివాహం మేషం రా.గం.10:55. మిథునం తె.గం.3:10. 18/08 చతుర్దశి ఆది శ్రవణం సమస్త శుభాలకు తుల ప.గం.11:39. శ్రవణం మేషం రా.గం.10:51. వివాహం మిథునం తె.గం.5:06. కర్కాటక సంబంధిత కార్యములు తె.గం.4:30. 19/08 పౌర్ణిమ సోమ ధనిష్ఠ వివాహం మేషం రా.గం.10:47. సీమంతం, వ్యాపారం మకరం సా.గం.5:10ల 5:30. 22/08 తదియ గురు ఉత్తరాభాద్ర తుల ప.గం.11:23 (8 కుజ). వ్యాపారం ధనస్సు ప.గం.2:30. సీమంతాదులకు మకరం ప.గం.5:15. చవితి వివాహం, గర్భ, మేషం రా.గం.10:32. గురు/శుక్ర వివాహ, గృప్ర మిథునం తె.గం.2:50. కర్కాటకం తె.గం.4:30. 23/08 చవితి శుక్ర రేవతి తుల ప.గం.11:19 (8 కుజ) వ్యాపారం, సీమంత పంచమి మకరం సా.గం.5:11. వివాహం మేషం రా.గం.10:28. అశ్విని శుక్ర/ శని శంకు, గృప్ర మిధునం తె.గం.2:46. కర్కాటక తె.గం.4:30. 24/08 షష్ఠి శని అశ్విని వ్యాపారాదులకు ధనస్సు 2:00ల 3:00. మేషం రా.గం.10:17 వివాహం. 28/08 దశమి బుధ మృగశిర సమస్త శుభాలకు, దేవాలయ పనులకు, వాస్తు కర్మలకు తుల ప.గం.11:00. భాద్రపద మాసం (జూన్) 04/09 విదియ బుధ ఉత్తర అన్న, సీమంత వ్యాపారం తుల ఉ.గం.10:28. 05/09 విదియ గురు హస్త అన్న, సీమంత తుల ఉ.గం.9:01. 06/09 తదియ శుక్ర చిత్త అన్న, సీమంత తుల ప.గం.10:25. 07/09 చవితి శని చిత్త అన్న, సీమంత తుల ప.గం.10:21. గణేశ చతుర్థి. 08/09 పంచమి ఆది స్వాతి అన్న, సీమంత తుల ప.గం.10:17. 09/09 షష్ఠి సోమ అనురాధ మకరం ప.గం.4:00ల 4:30 సీమంతం. 12/09 నవమి గురు మూల మకరం ప.గం.4:00ల 4:30 సీమంతం 14/09 ఏకాదశి శని ఉత్తరాషాఢ మకరం ప.గం.4:00. 15/09 ద్వాదశీ ఆది శ్రవణం అన్న, సీమంతం తుల ఉ.గం.9:49. 16/09 త్రయోదశి సోమ ధనిష్ఠ అన్న, సీమంతం తుల ఉ.గం.9:45. మహాలయ పక్షం 18 ప్రారంభం. శుభకార్య నిషేధం. ఆశ్వీయుజ మాసం (జూలై) 03/10 పాడ్యమి గురు హస్త కలశస్థాపనాది సర్వములకు తుల ఉ.గం.7:00 ప్రా. 04/10 విదియ శుక్ర చిత్త అన్న, అక్షర, సీమంత, దేవాలయ పనులకు, బోరింగ్ తుల ఉ.గం.7:30. వ్యాపారాదులకు మకరం ప.2:00ల 3:00. స్వాతి మేషం రా.గం.7:33. వృషభం రా.గం.8:30. 05/10 తదియ శని స్వాతి అన్న, అక్షర, సీమంత, వ్యాపారం, దేవాలయ పనులకు, బోరింగ్ తుల ఉ.గం.8:30. మేషం సా.గం.6:30ల 7:00. 07/10 పంచమి సోమ అనురాధ అన్న, అక్షర, సీమంత, వ్యాపారం, దేవాలయ పనులకు, బోరింగ్ తుల ఉ.గం.8:20. వ్యాపారాదులకు మకరం ప.గం.2:30. మేషం రా.గం.7:35. 09/10 సప్తమి మూల బుధ మకరం ప.గం.2:11. మేషం సా.గం.7:00. 10/10 అష్టమి గురు పూర్వాషాఢ యంత్ర పూజలు మకరం ప.గం.2:00ల 2:30. 11/10 నవమి శుక్ర ఉత్తరాషాఢ యంత్ర పూజ, వాహన పూజలు తుల ఉ.గం.7:00ల 8:00. మకరం ప.గం.2:00ల 2:15. 12/10 విజయదశమి సందర్భంగా మకరం ప.గం.2:00ల 2:15. 13/10 ఏకాదశీ ఆది ధనిష్ఠ అన్న, అక్షర వైశ్యోపనయన, వివాహ, శంకు, బోరింగ్, దేవాలయ పనులు, వ్యాపారం తుల ఉ.గం.7:57. మకరం వ్యాపారం ప.గం.1:37. వివాహం మేషం రా.గం.7:06. శతభిషం కర్కాటకం రా.గం.1:10. 14/10 ద్వాదశీ సోమ శతభిషం మకరం ప.గం.10:34. మేషం రా.గం.7:02. 16/10 చతుర్దశీ బుధ ఉత్తరాభాద్ర వ్యాపారాదులకు మకరం 1:27. మేషం వివాహాదులకు సా.గం.6:35. వివాహ, గృప్ర, గర్భాదానం వృషభం రా.గం.8:24. 17/10 పౌర్ణమి గురు రేవతి సమస్త శుభాలకు మకరం ప.గం.12:30ల 1:00. అశ్విని వివాహం వషభం రా.8:20. 20/10 చవితి ఆది రోహిణి వృషభం రా.గం.8:15. వివాహ, గప్ర, గర్భాదానాదులకు మిథునం రా.గం.10:59. 21/10 చవితి సోమ మృగశిర మకరం ప.గం.1:30. గృప్రలకు వషభం రా.గం.8:12 మిధునం రా.గం.10:55. అన్న, అక్షర, గృప్ర, వృశ్చికం ఉ.గం.8:25. 23/10 సప్తమి బుధ పునర్వసు మిథునం రా.గం.9:30. 24/10 అష్టమి గురు పుష్యమి మకరం ప.గం.12:15ల 12:30. మిథునం రా.గం.10:30. 26/10 దశమి శని మఘ వివాహం మిథునం రా.గం.10:35. 27/10 ఏకాదశీ ఆది మఘ వివాహం వృశ్చికం ఉ.గం.8:11. మకరం ప.12:15. కార్తీక మాసం (ఆగస్టు) 03/11 విదియ ఆది అనురాధ అన్న, అక్షర వైశ్యో పనయన, వివాహ, దేవాలయ పనులు, వాస్తు కర్మలు, సీమంత, పుంసవన, ఊయల, నామకరణం, జాతకర్మ మకరం ప.గం.11:59. వివాహం గృప్ర వృషభ రా.7:12. గర్భ, గృప్ర, వివాహం మిధునం రా.గం.10:03 (6శు) 04/11 తదియ సోమ జ్యేష్ఠ వృశ్చికం ఉ.గం.7:33. 07/11 షష్ఠి గురు ఉత్తరాషాఢ వృషభం రా.గం.7:30ల 8:00 సీమంతం, వివాహం మిథునం రా.గం.9:50. 08/11 సప్తమి శుక్ర ఉత్తరాషాఢ సమస్త శుభాలకు వృశ్చికం ఉ.గం.7:20. 09/11 అష్టమి శని శ్రవణం వృశ్చికం ఉ.గం.8:15. నవమి ధనిష్ఠ వివాహాదులకు వృషభం రా.గం.6:53. నవమి వివాహం మిథునం రా.9:46. 10/11 నవమి ఆది ధనిష్ఠ సమస్త శుభాలకు, వైశ్యోపనయన, వాస్తుకర్మలు, దేవాలయ పనులకు వృశ్చికం 7:20. విశేషం. శతభిషం వృషభం రా.6:30. దశమి ఆది మిథునం రా.గం.9:40. 11/11 ఏకాదశి సోమ పూర్వాభాద్ర మిథునం రా.గం.8:00ల 8:30. 13/11 ద్వాదశీ బుధ రేవతి వృశ్చికం సమస్త కార్యములు ఉ.6:54. 14/11 త్రయోదశీ గురు అశ్విని సమస్త శుభాలకు వృశ్చికం ఉ.6:50. 17/11 విదియ ఆది రోహి వివాహం, గర్భ, గృప్ర, వ్యాపార, సీమంతాదులకు మిథునం రా.గం.7:30ల 8:00. పుష్కరాంశ 9:07. విదియ ఆది రోహిణి ధనస్సు ఉ.గం.9:30 (8 కు) శంకు వివాహం తుల తె.5:42. 18/11 తదియ సోమ మృగశిర వ్యాపారం, సీమంతం సా.5:00. 20/11 షష్ఠి బుధ పుష్యమి గృప్ర, గర్భదానం, వ్యాపారం మిథునం రా.8:53. 22/11 అష్టమి శుక్ర/శని మఘ వివాహం తుల తె.గం.5:22. 24/11 దశమి ఆది/సోమ ఉత్తర వివాహం, శంకు, బోరింగ్ తుల తె.గం.5:14. 25/11 దశమి సోమ ఉత్తర గర్భ, గృప్ర, మిథునం రా.గం.8:33. 28/11 త్రయోదశీ బుధ స్వాతి మిథునం రా.8:28. మార్గశిర మాసం (సెప్టెంబరు) 02/12 విదియ సోమ మూల మేషం ప.గం.4:01. మిథునం రా.గం.7:30ల 8:00. 04/12 చవితి బుధ ఉత్తరాషాఢ వివాహం గర్భ, గృప్ర, మి«థునం రా.గం.8:04. 05/12 పంచమి గురు ఉత్తరాషాఢ వ్యాపారం మేషం ప.గం.3:50. శ్రవణం వివాహం, గర్భ మి«థునం రా.గం.7:49. గురు/శుక్ర శంకుస్థాపన, వ్యాపారం తుల తె.గం.4:30. 06/12 షష్ఠి శుక్ర శ్రవణం వ్యాపారం మేషం ప.గం.3:45. ధనిష్ఠ సీమంతాదులకు మిధునం రా.గం.7:00ల 7:30. శుక్ర/శని వివాహం, శంకు, బోరింగ్ తుల తె.గం.4:30. 07/12 సప్తమి శని శతభిషం వివాహ గృప్ర మిథునం రా.గం.7:46. వ్యాపారం మేషం ప.గం.3:41. శంఖు, బోరింగ్, వివాహం తుల తె.గం.4:26. 09/12 నవమి సోమ ఉత్తరాభాద్ర మిథునం రా.గం.7:39. 14/12 చతుర్దశి శని రోహిణి మేషం ప.గం.3:08 వ్యాపారాదులకు. పౌర్ణమి శని రోహిణి వివాహం, గృప్ర, గర్భాదానం మిథునోగ్ని రా.గం.7:26. శంకు, బోరింగ్, వివాహం, వ్యాపారం తుల తె.గం.3:55 (కోరల పౌర్ణిమ) 15/12 పాడ్యమి ఆది మృగశిర వ్యాపారం మేషం ప.గం.3:04. 18/12 చవితి బుధ/గురు రోహిణి తుల రా.తె.గం.3:01. 20/12 షష్ఠి శుక్ర/శని మఘ వివాహం తుల రా.తె.గం.3:30. 22/12 అష్టమి ఆది/సోమ ఉత్తర వృశ్చికం తె.గం.4:19 సమస్త శుభాలకు. 24/12 దశమి మంగ/బుధ చిత్త వృశ్చికం తె.గం.4:11 శంకు. 25/12 ఏకాదశీ బుధ/గురు స్వాతీ వివాహ, శంకు, బోరింగ్ వృశ్చికం తె.గం.4:08లకు. పుష్య మాసం (అక్టోబర్) 01/01 విదియ బుధ ఉత్తరాషాఢ మేషం ప.గం.12:55. 02/01 తదియ గురు శ్రవణం మేషం ప.గం.12:55. వృషభం ప.గం.4:00. 03/01 చవితి శుక్ర ధనిష్ఠ మేషం ప.గం.12:50. వృషభం ప.గం.3:10. 04/01 పంచమి శని శతభిషం మేషం ప.గం.12:50. వృషభం ప.గం.3:10. 06/01 సప్తమి సోమ ఉత్తరాభాద్ర మేషం ప.గం.12:30. 08/01 నవమి బుధ అశ్విని మేషం ప.12:30. 11/01 త్రయోదశి శని రోహిణి మేషం ప.12:10. 12/01 చతుర్దశి ఆది మృగశిర మేషం ప.12:10. ఉత్తరాయనం అనుసరించి దేవాలయ పనులు అనుష్ఠించవచ్చు. 19/01 షష్ఠి ఆది ఉత్తర అన్న, అక్షర, సీమంత, దేవాలయ పనులకు మేషం ప.గం.12:01. 20/01 సప్తమి సోమ, హస్త, అన్న, అక్షర, సీమంత, దేవాలయ పనులకు, అత్యవసర ఉపనయన, శంకు మేషం ప.గం.12:01. 24/01 దశమి శుక్ర అనురాధ అన్న, అక్షర, సీమంత, దేవాలయ పనులకు అత్యవసర ఉపనయన / శంకు మేషం ప.గం.12:01. 26/01 ద్వాదశీ ఆది మూల మేషం ప.12:01. మాఘ మాసం (నవంబర్) 30/01 పాడ్యమి గురు ధనిష్ఠ అన్న, సీమంత, వ్యాపారం మేషం ప.గం.11:59. 31/01 విదియ శుక్ర శత అన్న, అక్షర, సీమంత, దేవాలయ పనులు, వాస్తు కర్మలు, వివాహం, అత్యవసర ఉపనయనం, వ్యాపారం, ఊయల మేషం ప.గం.11:55. 02/02 చవితి ఆది ఉత్తరాభాద్ర అన్న, అక్షర, సీమంత, వ్యాపార, అత్యవసర ఉపనయన, వివాహం దేవాలయ పనులు, వాస్తు కర్మలు, ఊయల, వ్యాపారం మేషం ప.గం.11:51. 03/02 షష్ఠి సోమ రేవతి అన్న, అక్షర వాస్తు కర్మలు, దేవాలయ పనులు, వ్యాపారం, ఊయల, సీమంత మేషం ప.గం.11:47. 07/02 దశమి శుక్ర రోహిణి అన్న, అక్షర, వాస్తు కర్మలు, దేవాలయ పనులు, వ్యాపారం, వివాహం, అత్యవసర ఉపనయనం, సీమంతం, ఊయల మేషం ప.గం.11:43. 08/02 ఏకాదశి శని మృగశిర అన్న, అక్షర, వాస్తు కర్మలు, దేవాలయ పనులు, వ్యాపారం, వివాహం అత్యవసర ఉపనయనం, ఊయల, సీమంతం ప.గం.11:39. గృప్ర. వృషభం ప.గం.12:15. 10/02 త్రయోదశీ సోమ పునర్వసు అన్న, అక్షర, ఉప, వాస్తు కర్మలు, దేవాలయ పనులు, వ్యాపారం, సీమంతం, ఊయల మేషం ప.గం.11:34. వృషభోపి ప.12:01. 13/02 బ.పాడ్యమి గురు మఘ వివాహం వృషభం ప.గం.12:01. 14/02 తదియ శని ఉత్తర ఉపనయనం (వారదోషం), అన్న, అక్షర, సీమంత, వాస్తుకర్మలు, దేవాలయ పనులు, ఊయల, వ్యాపారం, వివాహం మేషం ఉ.గం.11:01. 15/02 చవితి హస్త ఆది వృషభం ప.గం.11:59. 17/02 పంచమి సోమ చిత్త అన్న, అక్షర, సీమంత, వాస్తు కర్మలు, దేవాలయ పనులు, వ్యాపారం మేషం ఉ.గం.10:45. 18/02 సప్తమి మంగళ/బుధ స్వాతి మకరం తె.గం.5:45. 20/02 అష్టమి గురు అనురాధ మేషం ప.గం.10:01. వృషభం ప.గం.11:59. 21/02 నవమి శుక్ర అనురాధ సమస్త శుభకర్మలు, వాస్తు కర్మలు, దేవాలయ పనులు, వ్యాపార పనులకు మేషం ఉ.గం.10:38 వషభం ప.గం.12:01. 23/02 దశమి ఆది మూల సమస్త శుభములకు మేషం ఉ.గం.10:01. వషభం ప.గం.12:01. ఫాల్గుణ మాసం (డిసెంబర్) 01/03 తదియ శని/ఆది ఉత్తరాభాద్ర వివాహం, శంకు, వ్యాపారం మకరం తె.గం.4:30. 02/03 తదియ ఆది అన్న అక్షర, సీమంత, వ్యాపార, ఊయల, ఉప, వివాహం, దేవాలయ పనులు, వాస్తుకర్మలు మేషం ప.గం.9:58 విశేషం. వృషభం ప.గం.11:29. చవితి ఆది/సోమ రేవతి శంకు, వివాహం మకరం తె.గం.4:28. 03/03 చవితి సోమ రేవతి సమస్త శుభాలకు, వాస్తు కర్మలకు మేషం ఉ.గం.9:51. వృషభం అశ్విని ప.గం.11:20. 06/03 సప్తమి గురు రోహిణి అన్న, అక్షర, సీమంత, ఉప, వ్యాపార, దేవాలయ కర్మలు, వాస్తు కర్మలు మేషం ఉ.గం.9:12. వృషభం ఉ.గం.11:30. 09/03 ఏకాదశీ ఆది/సోమ పుష్యమీ శంకు మకరం తె.గం.3:56. 10/03 ఏకాదశీ సోమ పుష్యమి అన్న, అక్షర, ఊయల, సీమంత, శంకు, బోరింగ్, దేవాలయ పనులు, వ్యాపారం మేషం ఉ.గం.8:40. 14/03 పౌర్ణమి శుక్ర ఉత్తర వృషభం ఉ.గం.10:30. 15/03 పాడ్యమి శని హస్త వృషభం ఉ.గం.10:30. అన్న, సీమంత, ఊయల. 16/03 విదియ ఆది హస్త వృషభం ఉ.గం.9:50. 17/03 తదియ సోమ చిత్త అన్న, సీమంత, ఊయల వృషభం ఉ.గం.10:15. 20/03 షష్ఠి గురు అనురాధ అన్న, సీమంత, ఊయల వృషభం ఉ.గం.10:15. 22/03 అష్టమి శని మూల వృషభం ఉ.గం.10:08. 24/03 దశమి సోమ ఉత్తరాషాఢ వృషభం ఉ.గం.10:00. ఇవి చదవండి: శ్రీ క్రోధి నామ సంవత్సర రాశి ఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉందంటే.. -
'చెట్టునీడ నీకెందుకు బాబూ.. నీ నీడలో నువ్వు సేద తీర్చుకో'..
ఒకరోజు జ్ఞాని దగ్గరకు కోటీశ్వరుడు వెళ్లి స్వామి నా దగ్గర కోటానుకోట్ల డబ్బు ఉన్నది. పూర్తి ఆరోగ్యవంతుడిని. ఇక నేను ఎవరిపైనా ఆధారపడవల్సిన అవసరం లేదు. ఎవరినీ సహాయం చేయమని అర్థించాల్సిన అవసరం లేదని చాలా గొప్పగా చెప్పుకున్నాడు. ఆ మాటలు విన్నాక జ్ఞాని నవ్వుతూ ‘‘బాబు నాతో కాస్త దూరం నడవగలవా’’ అని అడిగాడు. అయన ఆలా అడగడంతో నిరాకరించడం బాగుండదని తలచిన ఆ వ్యక్తి జ్ఞానితో కలిసి అడుగులు వేశాడు. అలా నడుస్తూ నడుస్తూ అలసిపోయిన వ్యక్తి దరిదాపులలో ఏదైనా చెట్టు కనిపిస్తుందేమో... ఆ చెట్టు నీడలో కాసేపు సేద తీరాలని చుట్టూ చూసాడు. ఎక్కడా ఏ చెట్టూ కనిపించలేదు. ఇది గమనించిన జ్ఞాని ‘‘ఏంటి బాబూ... వెతుకుతున్నావు?’’ అని అడిగాడు. ‘‘అయ్యా చాల దూరం వచ్చాము. కాసేపు చెట్టునీడలోకి వెళ్లి సేదతీర్చుకుని ఆ తర్వాత తిరిగి ముందుకు సాగుదాం’’అని చెప్పాడు. అతడి మాటలకు ఆ జ్ఞాని ‘‘చెట్టునీడ నీకెందుకు బాబూ... నీ నీడలో నువ్వు సేద తీర్చుకో’’ అన్నాడు. ‘‘నా నీడలో నేను ఎలా ఉండగలను స్వామీ! ఏం మాట్లాడుతున్నారు మీరు?’’ అని కాస్తంత ఆశ్చర్యంగా మరికాస్త నిష్ఠురంగానూ అడిగాడు ఆ వ్యక్తి. అందుకు ఆ జ్ఞాని, చిరునవ్వుతో అతడివైపు చూస్తూ... అదేంటి, నీ నీడలో నువ్వు తల దాచుకోలేవా? నువ్వే కదా బాబూ, నాదగ్గర అన్నీ ఉన్నాయి. నేను ఎవరిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు అన్నావు, చూశావా! ఇప్పుడు నీ నీడ సైతం నీకు ఉపయోగపడలేదు’’ అన్నారు. ఇప్పుడు ఆ ఐశ్వర్యవంతుడికి నిజంగా జ్ఞానోదయం అయింది ఏ చెట్టు కిందకూ వెళ్లకుండానే. అందుకే పెద్దలన్నారు... అహంకరించవద్దు అని. ఎంత ధనవంతులైనా, వారికి ఎన్ని ఉన్నా ఎప్పుడు ఎవరికీ ఏది అవసరం అవుతుందో తెలియదు ఈ లోకంలో. అన్నింటికీ మించి మనపైన మనకు నమ్మకం ఉండాలి అహం ఉండకూడదు. మనపైన మనకు ఆత్మవిశ్వాసం ఉండాలి. అంతేకానీ, ఇతరులపైన ఏమాత్రం చులకన భావం ఉండకూడదు.. మనసులోకి రాకూడదు. ఇవి చదవండి: Ugadi Festival: నిండుగ వెలుగునిచ్చే.. 'తెలుగు పండుగ' ఇది.. -
Ugadi Festival: నిండుగ వెలుగునిచ్చే.. 'తెలుగు పండుగ' ఇది..
‘ఉగాది’ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది అది మన తెలుగు పండుగ అని! ఉగాది నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని ప్రారంభించారని నమ్ముతారు. మత్సా్యవతారం ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. బ్రహ్మదేవుడు చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా ఈ జగత్తును సృష్టించాడంటారు. ‘ఉగాది’, ‘యుగాది’ అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. ‘ఉగ’ అనగా నక్షత్ర గమనం. నక్షత్రగమనానికి ‘ఆది’.. ‘ఉగాది’. అంటే సృష్టి ఆరంభమైన దినమే ‘ఉగాది’. ఉగాది పండుగ రోజున త్వరగా నిద్రలేచి ఇంటి ముందర ముగ్గులు వేసి వసంత లక్ష్మిని స్వాగతిస్తారు. తలంటు స్నానాలు చేస్తారు. కొత్త బట్టలు ధరిస్తారు. గుమ్మాలకు మామిడాకుల తోరణాలు కడతారు. షడ్రుచు లతో కూడిన ఉగాది ప్రసాదాన్ని పంచాంగానికి, దేవతలకు నైవేద్యం చేసి తమ భవిష్యత్ జీవితాలు ఆనందంగా సాగాలని కోరుతూ ఉగాది పచ్చడి తింటారు. ఉగాది పచ్చడికి మనశాస్త్రాలలో ‘నింబ కుసుమ భక్షణం’; ‘అశోక కళికా ప్రాశనం’ అని వ్యవహరించేవారు. "త్వామష్ఠ శోక నరాభీష్ట మధుమాస సముద్భవ నిబామి శోక సంతప్తాం మమ శోకం సదా కురు" ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెప్తు న్నాయి. ఉగాది పచ్చడి ఆహారంలో ఉండే ఔషధ గుణాన్ని, వృక్షసంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికీ – ఆహారానికీ గల సంబంధాన్ని చెప్పడమే కాక పండుగలకు, ఆచారాలకు, సముచిత ఆహారానికి గల సంబంధాన్ని చాటి చెప్తుంది. ఉగాది రోజున తినే పచ్చడిలో కొత్త చింతపండు, లేత మామిడి చిగుళ్ళు, అశోక వృక్షం చిగుళ్ళు, కొత్త బెల్లం, వేపపూత, మామిడి కాయముక్కలు, చెరకు ముక్కలు, జీలకర్ర లాంటివి ఉపయోగించాలి. ఈ పచ్చడి శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతో శ్రేష్ఠమని ఆయుర్వేదం పేర్కొంటోంది. ఈ పచ్చడిని ఖాళీపొట్టతో తీసుకున్నప్పుడు ఆరోగ్యానికి మంచిదంటారు. బెల్లం – తీపి(ఆనందం), ఉప్పు (జీవితంలో ఉత్సాహం), వేప పువ్వు – చేదు (బాధ కలిగించే అనుభవాలు), చింతపండు – పులుపు (నేర్పుగా వ్యవహరించ వలసిన పరిస్థితులు), మామిడి – వగరు (కొత్త సవాళ్లు), కారం (సహనం కోల్పోయే స్థితి) గుణాలకు సంకేతాలు అంటారు. ఉదయంవేళ, లేదా సాయంత్రం సమయాలలో పంచాంగ శ్రవణం చేస్తారు. పంచాంగం అంటే అయిదుఅంగాలని అర్థం చెపుతారు. ఉగాదికి సాహితీవేత్తలు ప్రత్యేకంగా ‘కవి సమ్మేళనం‘ నిర్వహిస్తారు. ఒక్క తెలుగు సంప్రదాయంలోనే కాక దేశంలోని పలు ప్రాంతాల్లో వివిధ పేర్లతో ఉగాది జరుపుతారు. తెలుగు వారిలానే చాంద్రమానాన్ని అనుసరించే మరాఠీలకు కూడా ఉగాది చైత్రశుద్ధ పాడ్యమి నాడే వస్తుంది. వారి సంవత్సరా దిని ’గుడి పడ్వా’గా (పడ్వా అంటే పాడ్యమి) వ్యవహరిస్తారు. తమిళుల ఉగాదిని (తమిళ) ‘పుత్తాండు’ అంటారు. వారిది సౌరమానం. ఏప్రిల్ 14న సంవత్సరాదిని చేసుకుంటారు. బెంగాలీల నూతన సంవత్సరం వైశాఖ మాసంతో మొదలవుతుంది. వారి కాలమానం ప్రకారం వైశాఖశుద్ధ పాడ్యమినాడు ఉగాది వేడుకలు చేసుకుంటారు. వ్యాపారులు ఆ రోజున పాత ఖాతా పుస్తకాలన్నింటినీ మూసి, సరికొత్త పుస్తకాలు తెరుస్తారు. – నందిరాజు రాధాకృష్ణ ‘ వెటరన్ జర్నలిస్ట్ 98481 28215 (రేపు ఉగాది పర్వదినం సందర్భంగా) -
Ugadi 2024 : ఈ ఏడాది ఉగాది పేరేంటి? ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
ఉగాది అనేది హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం తొలి రోజు జరుపుకునే తొలి పండుగ. తెలుగువారికి తెలుగు కొత్త సంవత్సరం ఆరంభం. హిందూ క్యాలెండర్ నెల చైత్ర మొదటి రోజు సాధారణంగా గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది. 2024లో ఉగాది ఏప్రిల్ 9వ తేదీన (మంగళవారం) వస్తుంది. "యుగాది" అనే పదం రెండు పదాల కలయిక - "యుగం" (వయస్సు) , "ఆది" (ప్రారంభం) ఒక శుభ సందర్భం అని అర్థం. పంచాంగం ప్రకారం ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు ఉంటుంది. ఏప్రిల్ 9 నుంచి క్రోధి నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఏప్రిల్ 9 న క్రోధి అర్థం కోపం కలిగించేదని. మహారాష్ట్రలో ఉగాది పండుగను గుడి పడ్వాగా జరుపుకుంటారు. బెంగాల్, కేరళ, అసోం, పంజాబ్ రాష్ట్రాలతో పాటు అనేక ప్రాంతాల్లోను ఈ పండుగ జరుపు కుంటారు. బెంగాలీలు “పోయిలా భైశాఖ్”, సిక్కులు “వైశాఖీ”, మలయాళీలు “విషు” అనే పేరుతో ఉగాది పండుగను జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా పలు దేవాలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతాయి. మత్స్యావతారం ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చిందని పురాణప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే కాలగణనాన్ని గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది పెద్దల భావన. అంతేకాదు, వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకొంటారు. ఇతర విశేషాలు ఈ రోజు కొత్తగా పనులు మొదలు పెట్టడం, కొత్తగా కార్యక్రమాలు ప్రారంభించడం మంచిది కృతయుగంలో కార్తీకశుద్ధ అష్టమి రోజున ఉగాది జరుపుకునేవారు. త్రేతా యుగంలో వైశాఖ శుద్ధ తదియ రోజున ఉగాది జరుపుకునేవారు. ద్వాపరయుగంలో మాఘశుద్ధ అమావాస్య రోజున ఉగాది జరుపుకునే వారు. శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషిక్తులయినది చైత్ర శుద్ధ పాడ్యమి రోజుననే. వరాహమిహిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసింది చైత్ర శుద్ధ పాడ్యమి రోజుననే. వారం రోజుల ముందు నుంచే సందడి ఉగాదికి వారం రోజుల ముందునుంచే ఇల్లంతా శుభ్రం చేసుకోవడం, అలంకరించుకునే పనులతో సందడి మొదలవుతంది. రంగురంగుల రంగువల్లులతో ఇంటి ముంగిళ్లు ముస్తాబవుతాయి. మామిడి ఆకుల తోరణాలతో గుమ్మాలను అలంకరించడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, దానధర్మాలు చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. వంటలు, ఉగాది పచ్చడి, నైవేద్యాలు సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి గుమ్మానికి మామిడాకుల తోరణాలు కట్టాలి. తలకు నువ్వుల నూనె పట్టించి నలుగు పెట్టుకుని స్నానం చేసి, కొత్త బట్టలు లేదా శుభ్రమైన దుస్తులు ధరిస్తారు. పాలు పొంగించి, పిండి వంటలు సిద్ధం చేసి. ఇష్టదైవాన్ని పూజిస్తారు. పులిహోర, పాయసం, బొబ్బట్లు ఇలా ఎవరికికి నచ్చినట్టు వారు తయారు చేసుకున్న వంటకాలను నైవేద్యంగా అందిస్తారు. ఏడాదంతా మంచి జరగాలని తొలి పండుగగా తెలుగువారు ఉత్సాహంగా జరుపుకుంటారు. ఏడాది మొత్తం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని గుర్తు చేసే పండగ ఉగాది. కుటుంబమంతా ఆనందంగా గడుపుతారు. కొత్తమామిడి కాయలు, వేపపువ్వు, బెల్లం, పులుపు,కారం, ఇలా షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడితో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజు ఏదైనా మంచి కార్యం తలపెడితే శుభం జరుగుతుందని నమ్ముతారు. బంగారం, కొత్త వస్తువులు,కొత్త వాహనాలు, కొత్త ఇళ్లు లాంటివి కొనుగోలు చేస్తారు.కొత్త వ్యాపారానికి కూడా శుభతరుణంగా భావిస్తారు. పంచాంగ శ్రవణం ఉగాది రోజున పంచాంగ శ్రవణం వింటే మంచిదని పెద్దలు చెబుతారు. ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితీ. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద చేరి, పురోహితుడిని రప్పించి, తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది? గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి? వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు. ఉగాది రోజున కవి సమ్మేళనాలు, కవి సన్మానాలు అంటూ కవులు, రచయితలు సందడి సందడిగా ఉంటారు. -
Ugadi 2024 అచ్చంగా ఆరు : జీవితానికి ఎన్నో లాభాలు
త్వరలో ఉగాది వస్తోంది. ఆరు రుచులున్న ఉగాది పచ్చడిని ఈ రోజు తప్పనిసరిగా సేవించడం ఈ పండగ ఆచారం. ఉగాది రోజున షడ్రుచుల సమ్మేళనం అయిన ఉగాది పచ్చడి సేవిస్తే ఆయా రుచుల్లాగే సంవత్సరమంతా మనకు ఆయా ఫలాలు అందుతాయని, అలా రకరకాల అనుభవాలూ, అనుభూతులను ఆస్వాదించడమే జీవితమని పెద్దలు చెబుతారు. అయితే అలా కేవలం ఉగాది నాడు మాత్రమే కాదు, వీలయితే ప్రతిరోజూ ఆరు రుచుల ఆహారాలను తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండచ్చని ఆయుర్వేదం చెబుతోంది. ఏయే రుచులు ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం. 1. తీపి శరీరంలోని వాత, పిత్త దోషాలను ఈ రుచి సమం చేస్తుంది. తీపి పదార్థాలను తీసుకోవడం వల్ల ఆయుర్దాయం పెరుగుతుంది, శరీరం దృఢంగా మారుతుంది. శక్తి అందుతుంది. శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. అయితే వీటిని చాలా తక్కువగా తినాలి. లేదంటే శరీరంలో కఫ దోషం పెరుగుతుంది. ఫలితంగా అధిక బరువు, స్థూలకాయం, డయాబెటిస్ వంటి వ్యాధులు వస్తాయి. కనుక ఈ రుచి ఉన్న ఆహారాలను నిత్యం తక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యంగాఉండవచ్చు . 2. పులుపు వాత దోషాలను పులుపు తగ్గిస్తుంది. పులుపు రుచి ఉన్న ఆహారాలను తినడం వల్ల ఆకలి పెరుగుతుంది. జీర్ణ సమస్యలు ఉండవు. నిమ్మ, చింతకాయ వంటి పులుపు ఉన్న ఆహారాలను నిత్యం పరిమితంగా తీసుకోవచ్చు. అయితే ఎక్కువగా తీసుకుంటే పిత్త, కఫ దోషాలు పెరుగుతాయి. కనక పులుపు ఆహారాలను కూడా తక్కువగా తీసుకోవాలి. 3. ఉప్పు ఉప్పు ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల వాత దోషం తగ్గుతుంది. ఉప్పు అధికమైతే పిత్త, కఫ దోషాలు పెరుగుతాయి. ఉప్పు ఉన్న ఆహారాల వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది. కణాలు శుభ్రమవుతాయి. ఉప్పు ఉన్న పదార్థాలను కూడా తక్కువగా తీసుకోవాలి. ఎక్కువైతే బీపీ పెరుగుతుంది. గుండె జబ్బులు వస్తాయి. 4. కారం కారపు రుచి గల ఆహారాలను తీసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది. ఆకలి వేస్తుంది. కణాలు శుభ్రమవుతాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. కఫ దోషం తగ్గుతుంది. కారం ఎక్కువైతే పిత్తదోషం పెరుగుతుంది. అందువల్ల కారాన్ని నిత్యం తక్కువగానే తీసుకోవాలి. 5. చేదు చేదుగా ఉన్న పదార్థాలను తినడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. పిత్త, కఫ దోషాలు తగ్గుతాయి. చేదుగా ఉన్న పదార్థాలను నిత్యం కొద్దిగా ఎక్కువ మోతాదులో తీసుకున్నా పెద్దగా సమస్యలు ఉత్పన్నం కావు. 6. వగరు వగరు ఉన్న పదార్థాలను కూడా నిత్యం తినాలి. కానీ వీటిని తక్కువగా తీసుకోవాలి. లేదంటే జీర్ణాశయంలో గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇక పిత్త దోషం ఉన్న వారికి ఈ రుచి ఉన్న పదార్థాలు ఎంతగానో మేలు చేస్తాయి. పచ్చి అరటి పండ్లు, క్రాన్ బెర్రీలు, గ్రీన్ బీన్స్ వంటివి ఈ రుచి ఉన్న పదార్థాలకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. అయితే భోజనం చేసేటప్పుడు ఒకేసారి ఆరు రుచులు కలిసిన పదార్థాలను తినాల్సిన పనిలేదు. రోజులో మొత్తంగా చూసుకుంటే ఈ ఆరు రుచులు ఉన్న పదార్థాలను తిన్నామా లేదో అని చెక్ చేసుకుంటే చాలు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లో ఈ ఆరు రుచుల నుంచి ఏవైనా రెండు రుచులు కలిగిన ఆహారాలను ఎంచుకుని తింటే చాలు. అంటే ఉదయం చేదు, కారం, మధ్యాహ్నం తీపి, వగరు, రాత్రి పులుపు, ఉప్పు.. ఇలా రెండేసి రుచులు ఉండేలా ఆహారాలను తీసుకుంటే చాలు. ఇవే తినాలని ఏమీ లేదు. ఎవరికి నచ్చినట్లు వారు ఆహారాలను ఎంచుకుని ఆరు రుచులు కవర్ అయ్యేలా చూసుకుంటే చాలు. -
Ugadi 2024: కవి పలికిన ఉగాది
చిన్నప్పుడు వీధిబడిలో చదివిన పిల్లలకు తెలుగు ఋతువులు, వాటి ధర్మాలు నోటి మీద వుంటాయ్. సాయంత్రం పూట అన్ని తరగతుల్ని ఒకచోట మళ్లేసి, చైత్ర వైశాఖాలు, ప్రభవ విభవలు చెప్పించేవారు. అందులో జ్ఞాపకమే – ‘చైత్ర వైశాఖాలు వసంత ఋతువు, చెట్లు చిగిర్చి, పూలు పూయును’ అనే మాటలు. తెలుగు నెలల్లో ఫాల్గుణం పన్నెండోది. చైత్రం మొదటిది. మొదటి నెల మొదటి రోజునే ఉగాది అని, యుగాది అని అన్నారు. ప్రాచీన సాహిత్యంలో వసంత శోభలు వెల్లివిరుస్తాయి గాని, ఉగాది పండుగ ప్రస్తావనలు రావు. కవులు ప్రకృతిని అక్షరాలలో నిక్షిప్తం చేయడానికి తమ శక్తి సామర్ధ్యాలను ధారపోశారు. కొత్త చిగుళ్లతో పొటమరించే మొగ్గలలో ప్రతి చెట్టూ దీప స్తంభమై వెలుగుతుంది. కవిత్రయ కవి ఎర్రన – ‘ఎందున పుష్పసౌరభమే ఎందును మంద మాదాలిఝంకృతుల్ ఎందును సాంద్ర పల్లవము లెందునుకోకిల కంఠ కూజితం’ అని వర్ణించాడు. ఋతు సంహార కావ్యంలో కాళిదాసు: పుంస్కోకిలః చూత రసాస వేన మత్తః ప్రియాం చుమ్బతి రాగహృష్ణః అన్నారు. ఎవరే భాషలో అన్నా కోయిలలు, తుమ్మెదలు శృంగార క్రీడలో మునిగి తేలుతున్నాయనే కవి హృదయం. ఉగాది అనగానే గుర్తొచ్చేది పంచాంగాలు, అందులో మన కందాయ ఫలాలు, సంవత్సర ఫలితాలు. భవిష్యత్తు గురించి తెల్సుకోవడంలో ఎవరికైనా వుత్సుకత, వుత్సాహం వుంటుంది. షడ్రుచుల ఉగాది ప్రసాదం తర్వాత పంచాంగ శ్రవణం యీ రెండే ప్రస్తావనకి వస్తాయి. ఆరు రుచులకు ఆరు స్వారస్యాలు చెబుతారు. ఆరోగ్య రహస్యాలు వివరిస్తారు. ఊగిపోయే చెరకు తోటలు ఊహల్లో తీపి నింపుకోమంటాయ్. విరబూసిన వేపపూతలు పచ్చి నిజాల్లోని చేదుని గ్రహించ మంటున్నాయ్. ఈ తరుణంలో లేచిగుళ్లు తింటూ పచ్చని చెట్టుకొమ్మల్లోంచి కోయిల మధుర మధురంగా పాడుతుంది. కొండా కోనా కూహూ రావాలతో ప్రతిధ్వనిస్తాయి. మనం రెట్టిస్తే ‘కూహూ’ అని మరింత ధాటిగా కోయిల జవాబిస్తుంది. కవులు వసంత వర్ణనల్లో కోయిలకు అగ్రస్థానం యిచ్చారు. కోయిల స్వరానికి తిరుగులేని స్థాయి వుంది. అందుకని కవికోకిలలుగా వ్యవహారంలోకి వచ్చారు. వీణ చిట్టిబాబు కోయిలని అద్భుతంగా పలికించేవారు. అయితే, శ్రోతల్ని వూరించేవారు. ఇంత గొప్ప గౌరవం ఇచ్చినందుకు మనం వసంత రుతువులో గళం విప్పకపోతే ఏమాత్రం మర్యాదకాదని కవులు ఉగాదికి కవితలల్లడం మొదలుపెట్టారు. అది క్రమంగా ఆచారంగా మారింది. ఆకాశవాణిలో ఉగాది కవిసమ్మేళనం ఉండి తీరాల్సిందే. దువ్వూరి రామిరెడ్డికి, గుర్రం జాషువాకి ‘కవి కోకిల’ బిరుదు ఉంది. హేమా హేమీలతో వాసిగల కవులందరితో కావ్యగోష్ఠి జరుగుతోంది. విశ్వనాథ, జాషువా, కాటూరి ప్రభృతులున్నారు. ‘నిర్వాహకులు ఇక్కడ గుర్రాన్ని గాడిదని ఒక గాటన కట్టేశారు’ అన్నారట విశ్వనాథ ప్రారంభోపన్యాసంలో. ‘నాకూ అదే అనిపిస్తోంది’ అన్నారు గుర్రం జాషువా. అంతరార్థం తెలిసిన సభ చప్పట్లతో మార్మోగింది. బెజవాడ ఆకాశవాణి కేంద్రంలో ఉగాది కవి సమ్మేళనం ఆహూతుల సమక్షంలో జరుగుతోంది. సంగీత సాహిత్యాల మేలు కలయిక. బాలాంత్రపు రజనీకాంతరావు నాటి స్టేషన్ డైరెక్టర్. పేరున్న కవులంతా నాటి సమ్మేళనంలో ఉన్నారు. సుప్రసిద్ధ పత్రికా సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావుకి అధ్యక్షపీఠం కట్టబెట్టారు. విశ్వనాథ గురించి మాట్లాడుతూ నార్ల ‘నాకూ వారికీ అభిప్రాయ భేదాలున్నప్పటికీ ప్రతిభ విషయంలో నాకెప్పుడూ గౌరవమే’ అన్నారు. ప్రేక్షక శ్రోతల్లో వొదిగి కూర్చున్న రజనీకి గుండెల్లో రాయి పడింది. విశ్వనాథ మైకు ముందుకొస్తే ఏదో అనకమానడు, రచ్చరచ్చ అవుతుందని భయపడుతున్నారు. విశ్వనాథ వంతు రానే వచ్చింది. ‘మిత్రుడు నార్ల అభిప్రాయ భేదాలున్నప్పటికీ అన్నాడు. మాకు సొంత అభిప్రాయాలు ఏడిస్తే అప్పుడూ భేదాలుండేవి. ఆయన కారల్ మార్క్స్ అభిప్రాయాలు పట్టుకు వేలాడుతున్నాడు, నేను శంకరాచార్యని పట్టుకు అఘోరిస్తున్నా’ అనగానే సభ నిలబడి కరతాళ ధ్వనులు చేసింది. ఒక్కసారి ప్రాచీనుల్ని పరామర్శిస్తే ఆదికవి నన్నయ్య భారతం ఆదిపర్వంలో వసంతకాలాన్ని వర్ణిస్తూ ఎన్నో పద్యాలు చెప్పాడు. వసు చరిత్రలో రామరాజ భూషణుడి పద్యాలు లయాత్మకంగా ఉంటాయని చెబుతారు. వసంత వర్తనలో–‘లలనా జనాపాంగ వలనా వసదనంగ తులనాభిగాభంగ దోప్రసంగ మలయానిల విలోలదళ సాసవరసాల ఫలసాదర’ అని సాగే ఈ పద్యాన్ని వీణ మీద వాయించగా విన్నవారున్నారు. జానపదుల జీవన స్రవంతిలో ఉగాది ఉన్నట్టు లేదు. ఎక్కడా మన సామెతల్లో ఈ పండగ ప్రసక్తి కనిపించదు, వినిపించదు. సంకురాత్రి, శివరాత్రి సామెతల్లో కనిపిస్తాయ్. పూర్వం గ్రామ పురోహితుడు ఈ పండగనాడు వేప పూత ప్రసాదం ఇంటింటా పంచేవాడు. వారు ధనధాన్యాల రూపంలో చిరుకానుకలు సమర్పించేవారు. ఉగాదినాడు వ్యక్తులవే కాదు దేశాల రాష్ట్రాల జాతకాలు కూడా పంచాంగం ద్వారా పండితులు నిర్ధారిస్తారు. ‘ఖగోళంలో కూడా క్యాబినెట్ ఉంటుందండీ. సస్యాధిపతిగా ఫలానా గ్రహం వుంటే పంటలు బాగుంటాయి. అలాగే వర్షాలకి హర్షాలకి అధిపతులుంటారు. పంచాంగమంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలే కాదు చోర అగ్ని యుద్ధ ప్రమాదాల్ని కూడా ఢంకా బజాయించి చెబుతాయ్’ అంటారు పంచాంగవేత్తలు. ఆ ఢంకా సంగతి అట్లా వుంచితే, ప్రస్తుత కాలంలో మాత్రం పంచాంగాల్ని బహుముఖంగా ప్రదర్శింపచేస్తున్నారు. ఏ పార్టీ కార్యాలయానికి వెళితే ఆ పార్టీకి అనువుగా పంచాంగ ఫలితాలుంటాయి! పార్టీ అధినాయకులు కూడా చక్కగా సమయానికి తగుమాటలాడే వారినే పిలిచి పీట వేస్తారు. పంచాంగం మీద పట్టు కంటే లౌకికజ్ఞానం ప్రధానం. పేరులో విళంబి వుంది కాబట్టి నిదానంగా హిందుస్థానీ శాస్త్రీయ సంగీత గోష్ఠిలా సాగుతుందని అనకోవద్దు. కాలానికి ఒక వేగం వుంటుంది. అది చచ్చినా మారదు. తెలుగు సంవత్సరాల పేర్లకి వాటి లక్షణాలకి మాత్రం సంబంధం లేదు. ఈ మధ్య కొత్త సంవత్సరమంటే ఉగాది మాత్రమేనని, జనవరి ఒకటి కానేకాదని ఒక సిద్ధాంతం లేవనెత్తారు. ముఖ్యంగా దేవాలయాలు తెలుగుకి కట్టుబడి వుండాలన్నారు. ఉన్న సమస్యలకి కొత్తవి తగిలించుకోవడమంటే యిదే! మన ఆడపడుచులు పుట్టినరోజుని ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అత్తారింటోనూ, తెలుగు లెక్కన పుట్టింట్లోనూ జరుపుకుంటున్నారు. అన్నీ డబల్ డబల్... ఆనందం కూడా డబల్. జీవితాన్ని సాల్వా దాళ్వాలతో పండించు కోవడమంటే యిదే. ఒక పెద్దాయన దగ్గర ఉగాది ప్రస్తావన తెస్తే, మాకు మార్చిలో బోనస్లు వచ్చేవి. సంవత్సరాదీ అప్పుడే వచ్చేది. ఇప్పుడే వుంది, మార్చి వచ్చిందంటే, ఐ.టి.రిటర్న్స్ దిగులు తప్ప అన్నాడు. ఇంకో సీనియర్ సిటిజెన్ ఆ నాటి ఆంధ్రవారపత్రిక ఉగాది సంచికల్ని తల్చుకున్నాడు. ‘కునేగా మరి కొళుందు’ సెంటు కొట్టుకుని ఘుమ ఘుమలతో వచ్చేది. ఇప్పుడు ఏ పరిమళమూ లేదని చప్పరించేశాడు. ‘మీకు తెలియదండీ, విజయవాడ రేడియో కవి సమ్మేళనలో అద్భుతమైన కవితలు వినిపించేవి. ఓ సంవత్సరం ఆరుద్ర, వేదంలా ప్రవహించే గోదావరి/ వెన్నెల వలె విహరించే కృష్ణవేణి అంటూ కవిత చదివారు. ఆ తర్వాత పాతికేళ్లకి ‘ఆంధ్ర కేసరి’ సినిమాకి పాట రాస్తూ వేదంలా ఘోషించే గోదావరి/ అమరధామంలా వెలుగొందే రాజమహేంద్రి అని రాశారు. నేను చెన్నపట్నం ఆరుద్ర ఫోన్ నెంబర్ తీసుకుని చేశా. మీరప్పుడు చదివిందే యిప్పుడు మళ్ళీ రాశారని నిలదీశా. ఆరుద్ర స్టన్ అయిపోయి మీకున్నంత జ్ఞాపకశక్తి నాకు లేకపోయింది. మన్నించండని ఫోన్ పెట్టేశాడు. మనకేంటి భయం?’ అని లోకల్ పొయెట్ నాకు వివరించారు. ఒకళ్లేమో ‘రారా ఉగాదీ’ అనీ, ఇద్దరేమో ‘రావద్దు ఉగాదీ’ అని మొదలుపెడతారు. యీ కవి గోష్ఠులలో ఏదో ఒకటి తేల్చండి పాపం అన్నాడొకాయన అసహనంగా. పిలుపులు రాని కవులకు కొంచెం అలకగానే ఉంటుంది. ఒక్కోసారి యీ అలక కవులంతా ఓ వేదిక మీదకు చేరుతారు. అవి పి.క.సమ్మేళనాలవుతాయ్. ఉగాది నాడు పిలుపొస్తే ఏడాది పొడుగునా మైకు అందుబాటులో ఉంటుందని ఓ నమ్మకం. ‘మాకుగాదులు లేవు, మాకుష్షస్సులు లేవు’ అని కోపం కొద్దీ అన్నారే గాని కృష్ణశాస్త్రి వసంతాన్ని దోసిళ్లకెత్తుకున్నాడు. ‘మావి చిగురు తినగానే.. ’ లాంటి పాటలెన్నో రాశారు. సుఖదుఃఖాలు చిత్రంలో ‘ఇది మల్లెల వేళయనీ, ఇది వెన్నెల మాసమనీ తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ’ పాట హిట్టున్నర హిట్టు. తర్వాత ఎవరో అడిగారట వెన్నెల మాసమేమిటి, వెన్నెల పక్షం ఉంటుంది గాని అని. నేను మల్లెల మాసమనీ, వెన్నెల వేళయనీ రాయాలని మనసులో అనుకున్నా కాని కాయితం మీదకి అలా వచ్చింది అన్నారట. మిగతా సంగతులు ఎట్లా వున్నా ఉగాది మార్కెట్లోకి మల్లెపూలు తీసుకువస్తుంది. వేసవి చెమటల్ని పరిహరిస్తూ మల్లెలు పరిమళిస్తాయ్. ఈ కాలం యువత ఇతర వత్తిళ్లలో పడిపోయి దాంపత్య వత్తిళ్లు మర్చిపోతున్నారు. ఇంటికి వెళ్తూ ధరకి వెరవకుండా రెండుమూరల మల్లె మొగ్గులు తీసికెళ్లండి. ఆ మల్లెవాసనలు వుత్తేజకరమైన ఆలోచనలు పుట్టిస్తాయి. వచ్చిన వసంతాన్ని అందిపుచ్చుకుని ఆనందించాలి గాని జారిపోనీకూడదు. ప్రతీరాత్రి వసంతరాత్రి కావాలని కాంక్షిస్తూ– – శ్రీరమణ (2018లో ఉగాది సందర్భంగా దివంగత రచయిత, కవి శ్రీరమణ అందించిన ప్రత్యేక వ్యాసం ఇది) -
గుడ్ ఫ్రైడే' 2024: ప్రాముఖ్యత ఏంటి.. ‘హ్యాపీ గుడ్ ఫ్రైడే' విషెస్ చెప్పకండి!
క్రైస్తవ సోదరులకు గుడ్ ఫ్రైడే పవిత్ర దినం. బైబిలు ప్రకారం గుడ్ ఫ్రైడ్ అంటే మానవాళి పాపాలకు జీసస్ శిలువపై ప్రాణాలను పణంగా పెట్టిన రోజు. అందుకే ఏసుక్రీస్తు జ్ఞాపకార్థం ఈ రోజును పవిత్ర శుక్రవారం, లేదా బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. శిలువ వేయబడిన మూడు రోజుల తరువాత యేసు పునరుత్థానాన్ని ఆదివారం రోజు ఈస్టర్ గా పాటిస్తారు. గుడ్ ఫ్రైడే రోజున క్రైస్తవులు ఉపవాసం ఉండి దేవున్ని తలచుకుంటారు. జీసస్ ప్రార్థనలో గడుపుతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థనలు చేస్తూనే ఉంటారు. ప్రవచనాలు, ప్రార్థనలు, ధ్యానం వంటివి జరుగుతూనే ఉంటాయి. కొంతమంది నల్లటి వస్త్రాలు ధరించి తమ బాధను వ్యక్తపరుస్తారు. గుడ్ ఫ్రైడే విషెస్ యేసు మరణానికి త్యాగానికి గుర్తుగా సంతాపాన్ని తెలియజేయడానికి దీన్ని నిర్వహించు కుంటారు. అందుకే గుడ్ ఫ్రైడే వస్తే మాత్రం ఏ ఒక్కరూ హ్యాపీ గుడ్ ఫ్రైడే అని ఒకర్ని ఒకరు విష్ చేసుకోరు. మిగిలిన వారు కూడా ఎవరూ అలాంటి మెసేజ్లు పంపుకోరు. చర్చిలలో ఆనందోత్సాహాల మధ్య ఈ వేడుకలు జరగవు. ఏసు ప్రభు ప్రజల పాపాలకోసం త్యాగ చేసి మానవాళికి మంచి చేశాడని, అందుకే ఫ్రైడేకి ముందు గుడ్ అనే పదం చేరిందని నమ్ముతారు. గుడ్ ఫ్రైడేను... హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే, గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలుచుకుంటారు. శిలువ వేయడం అనేది యేసు జీవితంలో చిట్టచివరి ఘట్టమనీ, క్రైస్తవ సోదరుల విశ్వాసం. అందుకే గుడ్ ఫ్రైడే రోజు ఎన్నో చర్చిలలో ఈ నాటికను ప్రదర్శిస్తారు. అలాగే గుడ్ ఫ్రైడేకి ముందు లెంట్ డేస్ మొదలవుతాయి. దాదాపు 46 రోజులు పాటు కొనసాగుతాయి. ఆ రోజుల్లో ఉపవాసాలను పాటిస్తారు. -
Holi 2024 యాంకర్ సుమ వీడియో: చెప్పులు కూడా మారిస్తే ఇంకా బావుండేదట!
యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యాంకరింగ్, యాక్టింగ్, స్టేజ్ షోలు,సినిమాలు.. ఇలా ప్రతీ అంశంలోనూ నా స్టయిలే వేరు అన్నట్టు దూసుకుపోవడం సుమకు వెన్నతో పెట్టిన విద్య. దాదాపు ప్రతీ పండుగకు ఒక సందేశంతో ప్రాంక్ వీడియోలను చేయడం అలవాటు. ఫన్నీగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడం ఆమె స్టయిల్. తాజాగా హోలీ సందర్భంగా కూడా ఒక వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) ముఖ్యంగా నీటిని వేస్ట్ చేయొద్దు అనే సందేశంలో ఈ వీడియోను షేర్ చేయడం విశేషం. ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. మీకు తప్ప ఎవరికి ఇలాంటి ఐడియాస్ రావు సుమ గారు ఒకరు కామెంట్ చేయగా, ఇలాంటి వీడియోలు చేయడం మీకే సాధ్యం మేడమ్.. హ్యాపీ హోలీ శుభాకాంక్షలు అందించారు ఇంకొందరు. అయితే చెప్పులు కూడా మారిస్తే ఇంకా బావుండు మరొకరు ఫన్నీగా కామెంట్ చేయడం గమనార్హం. -
Holi 2024: మన దేశంలో ఇక్కడ హోలీ సంబరాలుండవు, ఎందుకో తెలుసా?
రంగుల పండుగ హోలీ అంటే దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. చిన్నా పెద్దా అంతే రంగుల్లో మునిగి తేలతారు. కానీ దేశంలో హోలీ జరుపుకోని కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. హోలీ ఎందుకు ఆడరో..ఆ కారణాలేంటో ఒకసారి చూద్దాం.. ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలోని క్విలీ, కుర్జాన్, జౌడ్లా మూడు గ్రామాలలో కూడా హోలీ పండుగను జరుపుకోరు. తమ ఇష్టమైన దేవత త్రిపుర సుందరి దేవి. ఒకటిన్నర శతాబ్దం క్రితం, ప్రజలు ఈ గ్రామంలో హోలీ జరుపుకోవడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో గ్రామంలో కలరా మహమ్మారి వ్యాపించింది. ఇక అప్పటినుంచి ఇక్కడి ప్రజలు హోలీ జరుపుకోవడానికి ఇష్టపడరు.ఇక్కడి త్రిపుర సుందరి దేవతకి శబ్దాలు నచ్చవని స్థానికులు చెబుతారు.హోలీ తమకు అచ్చి రాదని భావిస్తారట. అందుకే 150 ఏళ్లుగా హోలీ సంబరాలు చేసుకోరట. జార్ఖండ్: జార్ఖండ్లోని బొకారోలోని కస్మార్ బ్లాక్ సమీపంలోని దుర్గాపూర్ గ్రామంలో సుమారు 100 ఏళ్లకు పైగా ఇక్కడ హోలీ జరుపుకోవడం లేదు. ఒక శతాబ్దం క్రితం హోలీ రోజున ఇక్కడ ఒక రాజు కుమారుడు మరణించాడు. ఆ తర్వాత ఊరిలో హోలీ సంబరాలు చేసుకుంటే అరిష్టమని భావిస్తారు. కానీ కొంతమంది మాత్రం పొరుగూరికి హోలీ పండుగ చేసుకుంటారు. గుజరాత్: గుజరాత్లోని బనస్కాంత జిల్లా రంసాన్ గ్రామంలో కూడా ప్రజలు హోలీని జరుపుకోరు. కొంతమంది సాధువులచే శాపగ్రస్తమైందట ఈ గ్రామం. అందుకే అప్పటి నుండి హోలీ జరుపుకోవడానికి భయపడతారు ప్రజలు . మధ్యప్రదేశ్: 125 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్లోని బైతుల్ జిల్లా ముల్తాయ్ తహసీల్లోని దహువా గ్రామంలో, బావిలో బాలుడు నీటిలో మునిగి చనిపోయాడట. ఈ విషాద ఘటనతో హోలీ ఆడటం తమకు చెడు శకునంగా భావించారు. దీంతో ఇక్కడ ఎవరూ హోలీ ఆడరని చెబుతారు. తమిళనాడు: దక్షిణ భారత రాష్ట్రం తమిళనాడు చాలా దేవాలయాలకు ప్రసిద్ధి. ఇక్కడ భక్తి కూడా ఎక్కువ అని చెబుతారు. కానీ ఉత్తర భారతంతో జరుపు కున్నంతగా హోలీని ఇక్కడ జరుపుకోరు. హోలీ పౌర్ణమి రోజున వస్తుంది కాబట్టి, తమిళులు మాసి మాగంగా జరుపుకుంటారు. పవిత్ర నదులు, చెరువులు, సరస్సులలో స్నానం చేయడానికి ,పూర్వీకులు భూమిపైకి వచ్చే పవిత్రమైన రోజు అని నమ్ముతారు. అందుకే ఇక్కడ ఆ రోజు హోలీ ఆడరు. అయితే పుదుచ్చేరి లాంటి టూరిస్ట్ ప్రదేశాలలో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతాయి. -
Ramzan: సుర్మాతో.. కంటి సంబంధిత వ్యాధులకు చెక్!
ముస్లింలు పవిత్ర మాసంగా భావించే రంజాన్ మాసంలో ‘సుర్మా’ ఆద్యంతం ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతూ ప్రత్యేకత చాటుతోంది. ఈ మాసంలో ముస్లింలు వయోభేదం లేకుండా త్రికరణ శుద్ధితో ఉపవాసం(రోజా)ఉంటారు. ఖురాన్ పఠిస్తూ ఐదు పూటలా నమాజ్ ఆచరిస్తారు. మహ్మద్ ప్రవక్త బాటను అనుసరిస్తూ నిష్టగా ఉంటారు. ఈ క్రమంలో ఈ మాసంలో ముస్లింల నేత్రాలకు అలంకరించే సుర్మాకు ఎంతో విశిష్టత ఉంది. విధిగా కళ్లకు సుర్మా అలంకరించడం పవిత్ర కార్యంగా భావిస్తారు. సువాసన వెదజల్లే అత్తర్లకు ప్రాధాన్యమిస్తారు. ఇదీ.. సుర్మా ప్రశస్తి.. నిత్యం అల్లాహ్ నామస్మరణలో గడిపే దైవప్రవక్త హజ్రత్ మూసా అలైహిసలా తుస్సలాంకు అల్లా ప్రసన్నం పొంది అతడిని అల్లా ఎక్కడున్నాడో చూపించమని అనునయులు కోరుతారు. దీంతో ఈజిప్టు, సిరియా ప్రాంతాలకు చెందిన పెద్దలను సమీపంలోని కోహితూర్ పర్వతం వద్దకు తీసుకెళ్తారు. అక్కడ ఒక్కసారి అల్లాహ్ నూర్ (ఓ వెలుగు)ప్రత్యక్షంకావడం చూసి ఆశ్చర్యానికి గురవుతారు.అప్పుడే కోహితూర్ పర్వతం భస్మమై బూడిదగా(చూర్ణంగా) మారుతుంది. దైవసంకల్పం కళ్లెదుట సాక్షాత్కరించడంతో తమలోని భక్తి ఉప్పొంగి ఆ చూర్ణాన్ని వారు కళ్లకు అద్దుకుంటారు. ఈ సమయంలో తమ కళ్లకు సుదూరంలోని చీమల కదలికలను సైతం పసిగట్టే విధంగా ప్రకాశవంతం కావడం గమనించి అల్లాహ్ కృపవల్లనే సాధ్యపడిందని భావిస్తారు. అప్పటి నుంచి కోహితూర్ పర్వతానికి చెందిన రాళ్ల చూర్ణమే క్రమంగా సుర్మాగా రూపాంతరం చెందిందనేది ముస్లింల ప్రగఢ నమ్మకం. కళ్లకెంతో మేలు..! భక్తితోపాటు వైద్యపరిభాషలోనూ ఈ సుర్మాకు ఆరోగ్యప్రదాయినిగా పేరుంది. కంటికి సంబంధించిన వ్యాధులకు నివారణగా, కళ్లకు చలువగా పనిచేస్తుంది. నమాజ్ చేయడానికి ముందు వజూ ఆచరించాక మహ్మద్ప్రవక్త కంటికి సుర్మా పెట్టుకునే వారని ప్రతీతి. రాత్రివేళ నిద్రపోయేముందు కళ్లకింద సుర్మ రాసుకోవడం సంప్రదాయంగా వస్తోంది. సుర్మాతో కంటికి సంబంధించిన వ్యాధులు రావని నిరూపి తం కావడంతో ఇతరులు కూడా సుర్మాను రా సుకోవడానికి ఆకర్షితులవుతున్నారు. మహిళలు కళ్లకు కాటుక బదులు సుర్మా వాడడానికి ఇష్టపడుతున్నారు. అతిథులకు సుర్మ, అత్త ర్లు పూయడం ద్వారా గౌరవించే సంప్రదాయాన్ని ముస్లింలు కొనసాగిస్తున్నారు. సుర్మ, అత్తర్ల విక్రయాలు..! అనేక గ్రామాల్లో రంజాన్ సందర్భంగా అత్తర్లు, సుర్మా విక్రయాలకు గిరాకీ ఉంటుంది. దీనికోసం జిల్లాలో పలు అత్తర్లు, సుర్మా అమ్మకాల దుకాణాలు వెలిశాయి. సుర్మా కిలో పొడి ధర రూ.175 నుంచి రూ.550 వరకు ఉంటుంది. వీటిని చిన్న సీసాల్లో నింపి విక్రయిస్తుంటారు. ఇవి రూ10 నుంచి రూ . 100 విక్రయిస్తున్నారు. కంపెనీని బట్టి వీటి ధరలు నిర్ణయిస్తున్నారు. సుర్మాను భద్రపరచడానికి ఆకర్షణీయమైన ఆకారాల్లో సుర్మేన్లు (భరిణె) మార్కెట్లో ఉన్నాయి. వీటి ధర రూ.50 నుంచి రూ.300 వరకు అందుబాటులో ఉన్నాయి. ఇవి చదవండి: HOLI 2024: జీవితం వర్ణమయం -
ఈ పండుగ కొందరికి హోలీ అయితే.. మరి కొందరికి ‘హోలా మొహల్లా’..
ఏటా వసంతాగమన వేళ వచ్చే హోలీ హిందువులకు రంగుల పండుగ. సిక్కులకు మాత్రం ఇది రంగుల పండుగ మాత్రమే కాదు, వీరవిద్యల వేడుక కూడా. హోలీ నాటితో మొదలై మూడు రోజులు కొనసాగే ఈ వేడుకను ‘హోలా మొహల్లా’ అంటారు. సిక్కుల గురువు గురు గోబింద్ సింగ్ ఈ వేడుకను జరుపుకొనే ఆనవాయితీని ప్రారంభించారు. హోలీ వేడుకల్లో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడమే కాకుండా, ఆరుబయట మైదానాల్లోకి చేరి యువకులు సంప్రదాయ వీరవిద్యలను ప్రదర్శిస్తారు. జోడు గుర్రాల మీద నిలబడి స్వారీ చేయడం, గుర్రపు పందేలు, ఒంటెల పందేలు నిర్వహిస్తారు. ‘హోలా మొహల్లా’ అంటే ఉత్తుత్తి యుద్ధం అని అర్థం. ఈ వేడుకల్లో కత్తులు, బరిసెలతో ఉత్తుత్తి యుద్ధాల్లో పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. తొలిసారిగా ‘హోలా మొహల్లా’ వేడుకలు 1701లో ఆనంద్పూర్ సాహిబ్లో జరిగాయి. అదే సంప్రదాయ ప్రకారం ఇప్పటికి కూడా ఆనంద్పూర్ సాహిబ్లో ఈ వేడుకలు ఆర్భాటంగా జరుగుతాయి. పంజాబ్, హర్యానాలతో పాటు పాకిస్తాన్లో కూడా సిక్కులు ఈ వేడుకను సంప్రదాయబద్ధంగా జరుపుకొంటారు. ఉదయం వేళ రంగులు చల్లుకోవడం, వీరవిద్యా ప్రదర్శనలు, ఆయుధ ప్రదర్శనలు; సాయంత్రం వేళలో ఆధ్యాత్మిక సంకీర్తనలు, సంగీత నృత్య ప్రదర్శనలు, కవి సమ్మేళనాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. వేడుకల్లో పాల్గొనడానికి భారీ సంఖ్యలో వచ్చే జనాలకు సంప్రదాయక వంటకాలతో ఆరుబయట విందుభోజనాలను ఏర్పాటు చేస్తారు. ఇవి చదవండి: నాజూగ్గా ఉండే శిల్పాశెట్టి ఇంతలా ఫుడ్ని లాగించేస్తుందా..! -
Holi 2024: జాలీగా, హ్యాపీగా...ఇంట్రస్టింగ్ టిప్స్, అస్సలు మర్చిపోవద్దు!
పిల్లా పెద్దా అంతా సరదగా గడిపే రంగుల పండుగ హోలీ సమీపిస్తోంది. హోలీ రంగుల్లో తడిసి ముద్దవుతూ, స్నేహితులతో, బంధువులతో ఉత్సాహం గడుపుతారు. కానీ ఈ సంబరంలో కొన్ని జాగ్రత్తలు మర్చిపోకూడదు. ప్రతి సంవత్సరం, నిర్లక్ష్యం లేదా అవగాహన లేమి కారణం కంటి గాయాలకు గురవుతున్న అనేక సంఘటనలు జరుగుతాయి.అందుకే ఈ సేఫ్టీ టిప్స్ మీకోసం. మన ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని కాపాడుకోవాలంటే రసాయనమందులకు దూరంగా ఉండాలి. మార్కెట్లో విరివిగా లభించే రంగుల్లో హాని కారక రసాయనాలను గమనించాలి. వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లు, జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా చర్మం, కళ్లు సంరక్షణ చాలా అవసరం. చర్మపు సమసయలు, అలెర్జీలు, కంటి సమస్యలు , ముఖ్యంగా పిల్లలకు శ్వాసకోశ సమస్యలు వంటి అనేక సమస్యలకు దారితీస్తుంది. రసాయన రంగుల్లో సీసం, పాదరసం, క్రోమియం, కాడ్మియం , ఆస్బెస్టాస్ వంటి ప్రమాదకర రసాయనాలను కలిగి ఉంటాయి.ఇవి ఉబ్బసం, బ్రోన్కైటిస్ లాంటి వ్యాధులకుదారి తీయవచ్చు అందుకే ముందు జాగ్రత్త అవసరం. సహజరంగులకే ప్రాధాన్యత: ఇంట్లో తయారు చేసుకునే సేంద్రీయ, సహజ రంగులకేప్రాధాన్య ఇవ్వాలి. ఇలా చేయడం అనేక చర్మ సమస్యలు ఇరిటేషన్ ఇతర ప్రమాదాలనుంచి తప్పించుకోవచ్చు. పర్యావరణానికి ఎలాంటి ముప్పు జరగదు. పిల్లల్ని ఒక కంట: కంటి భద్రత , ప్రాముఖ్యత గురించి హోలీ ఆడటానికి వెళ్లే ముందే పిల్లలకు అవగాహన కల్పించాలి. ముఖ్యంగా చిన్నపిల్లల చెవుల్లో, ముక్కుల్లో, రంగు నీళ్లు, ఇతర నీళ్లు పోకుండా జాగ్రత్తపడాలి ఒకవేళ పోయినా వెంటనే పొడి గుడ్డతో శుభ్రం చేయాలి. ఎలా ఆడుకుంటున్నదీ ఒక కంట కనిపెడుతూ, వారి సేఫ్టీని పర్యవేక్షించాలి. లోషన్ లేదా నూనె : హోలీ ఆడటానికి వెళ్లే కొబ్బరి నూనెను లేదంటే కొబ్బరి, బాదం, ఆలివ్ నూనె లాంటి ఇతర సహజమైన నూనెను ముఖానికి, శరీరానికి, జుట్టుకు అప్లయ్ చేసుకోండి. పురుషులైతే, గడ్డం, జుట్టుకు బాగా నూనె రాయండి. అలాగే మాయిశ్చరైజర్ను మొత్తం బాడీకి అప్లయ్ చేసుకోవచ్చు. దుస్తులు: హోలీ రంగులు ముఖంతో పాటు మీ చేతులు, కాళ్ళ చర్మానికి హాని చేస్తాయి. ఫుల్ స్లీవ్ షర్ట్లు, కుర్తాలు ధరించాలి. నీళ్లలో జారి పడకుండే ఉండేందుకు షూ వేసుకుంటే మంచిది. కళ్లు,చర్మ రక్షణ: గులాల్, ఇతర రంగులు చర్మానికి అంటుకుని ఒక్క పట్టాన వదలవు. దీని స్కిన్కూడా పాడువుతుంది. అలా కాకుండా ఉండాలంటే హోలీ ఆడటానికి ఒక గంట ముందు సన్స్క్రీన్ రాసుకోవాలి. కళ్లల్లో పడకుండా అద్దాలు పెట్టుకోవడం అవసరం. సింథటిక్ రంగులు లేదా వాటర్ బెలూన్లలో ఉండే హానికరమైన రసాయనాలవల్ల కళ్లకు హాని. రంగులనుఎలా కడుక్కోవాలి: హోలీ ఆడిన తరువాత రంగులు వదిలించుకోవడం పెద్ద పని. సబ్బుతో లేదా ఫేస్ వాష్తో కడుక్కోవడం లాంటి పొరపాటు అస్సలు చేయొద్దు. రెండు మూడు రోజులలో హోలీ రంగులు క్రమంగా కనిపించకుండా పోతాయి నూనె పూసుకుని, సహజమైన సున్నిపిండితో నలుగు పెట్టుకోవచ్చు. స్నానం తరువాత బాడీలో రసాయన రహిత క్రీమ్స్, మాయిశ్చరైజర్ రాసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగడం: ఎండలో తిరగడం వల్ల పిల్లలు డీ హైడ్రేట్ అయిపోతారు. అందుకే నీళ్లు ఎక్కువ తాగాలి రంగు పొడులను పీల్చడం వల్ల తలెత్తే శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. నోట్ : ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఏదైనా అనుకోనిది జరిగితే తక్షణమే వైద్యులను సంప్రదించాలి. ఎలాంటి అవాంఛనీయ ప్రమాదాలు లేదా గాయాలు లేకుండా హోలీ వేడుక సంతోషంగా జరుపుకోవాలిన కోరుతూ హ్యాపీ హోలీ.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
16, 17 తేదీల్లో జూనియర్ ఇంటర్లో ప్రవేశానికి కౌన్సెలింగ్
రేపు బాస్కెట్బాల్ జిల్లా జట్ల ఎంపిక
వరంగల్ పార్లమెంట్ పరిధిలో 2009 నుంచి 2024 వరకు నమోదైన ఓట్లు, పోలింగ్ శాతం...
పథకాలు పారదర్శకంగా అందించాలి
No Headline
రైతులు ధైర్యంగా ఉండాలి
వరంగల్ స్ట్రాంగ్రూంకు ఈవీఎంలు
వాతావరణం
ఓటుకు దూరంగా..
రేవణ్ణ అరెస్ట్ వెనుక కుట్ర: కుమార
తప్పక చదవండి
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
Advertisement