-
టీటీడీ వార్షిక బడ్జెట్ రూ.5,141.74 కోట్లు
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానములకు సంబంధించి 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.5,141.74 కోట్లతో వార్షిక బడ్జెట్ను ఆమోదించినట్లు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. చైర్మన్ అధ్యక్షతన సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. వార్షిక బడ్జెట్తోపాటు పలు కీలక నిర్ణయాలకు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపినట్లు భూమన వెల్లడించారు. దాదాపు 30ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న టీటీడీ ఉద్యోగుల కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి టీటీడీ పాలకమండలి కృతజ్ఞతలు తెలియజేస్తూ తీర్మానం చేసిందని చెప్పారు. టీటీడీలోని వివిధ విభాగాల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్నవారికి, శిల్పులకు వేతనాలు, వేదపారాయణదారులకు పెన్షన్, కాంట్రాక్టు అర్చకులు, సంభావన అర్చకులు, వేద పాఠశాలల్లోని సంభావన అధ్యాపకుల వేతనాలను, క్రమాపాఠీలు, ఘనాపాఠీలకు సంభావనలు పెంచినట్లు వివరించారు. టీటీడీ నిర్వహిస్తున్న 26 స్థానిక ఆలయాలు, విలీనం చేసుకున్న 34 ఆలయాల్లో 515 పోస్టులు సృష్టించేందుకు ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించినట్లు తెలిపారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో టీటీడీ వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన నగదు, బంగారం ద్వారా వడ్డీ రూ.1,167 కోట్లు వస్తుందని భావిస్తున్నట్లు వివరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో శ్రీవారి హుండీ ద్వారా సుమారు రూ.1,611 కోట్లు, ప్రసాదాల ద్వారా రూ.600 కోట్లు, దర్శనం ద్వారా రూ.338 కోట్లు వస్తాయని అంచనా వేసినట్లు చెప్పారు. అదేవిధంగా పరికరాల కొనుగోలు కోసం రూ.751కోట్లు, కార్పస్, ఇతర పెట్టుబడుల కోసం రూ.750 కోట్లను బడ్జెట్లో కేటాయించామని, మానవ వనరుల ఖర్చు రూ.1,733 కోట్లు ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపారు. హిందూ ధర్మ ప్రచారానికి రూ.108.50కోట్లు కేటాయించినట్లు భూమన వివరించారు. టీటీడీ ఉద్యోగుల ఇళ్లస్థలాల కోసం వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం వద్ద అదనంగా కేటాయించిన 132.05 ఎకరాల స్థలంలో గ్రావెల్ రోడ్డు ఏర్పాటు టెండరుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఈ సమావేశంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, పలువురు పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. మహిళలకు శ్రీవారి ఆశీస్సులు అందించిన మంగళ సూత్రాలు సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా హిందువుల ఆరాధ్యదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందించిన మంగళసూత్రాల(తాళిబొట్లు)ను మహిళలకు అందించాలని టీడీపీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. స్వామి వారికి భక్తులు సమర్పించిన బంగారంతో వివిధ ఆచారాలు అనుసరించి మంగళసూత్రాలు తయారు చేయిస్తారు. ఆ మంగళసూత్రాలను శ్రీవారి పాదాల చెంత ఉంచి పూజలు చేసి లాభ, నష్టాలు లేని ధర నిర్ణయించి విక్రయిస్తారు. నాలుగైదు డిజైన్లలో తయారు చేసే ఈ మంగళ సూత్రాలు 5 గ్రాములు, 10 గ్రాముల బరువుతో ఉంటాయి. ఇప్పటికే వివాహం అయినవారు, వివాహం చేసుకోబోయే వధువులు ఈ తాళిబొట్లను ధరించడం వల్ల దీర్ఘసుమంగళిగా ఉంటారని భక్తుల విశ్వాసం. భూమన కరుణాకరరెడ్డి గతంలో టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో నిర్వహించిన కల్యాణమస్తు (సామూహిక వివాహాలు) ద్వారా సుమారు 32వేల మంది వధువులకు స్వామివారి ఆశీస్సులు అందించిన మంగళసూత్రాలు ఉచితంగా అందించారు. -
జలమండలి ఉద్యోగులకు 30% పీఆర్సీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజి బోర్డు (జలమండలి)లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 30 శాతం వేతన సవరణ అమలు చేస్తూ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు నిర్ణయం తీసుకున్నారు. తద్వారా దాదాపు నాలుగు వేల మంది వాటర్ బోర్డు ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నది. మెట్రో వాటర్వర్క్స్ యూనియన్ అధ్యక్షుడు జి.రాంబాబుయాదవ్, ఇతర నేతలు సీఎం కేసీఆర్ను ప్రగతిభవన్లో కలిసి ధన్యవాదాలు తెలిపారు. -
ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగినులకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్
సాక్షి, అమరావతి: ప్రభుత్వంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు మహిళా ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వారికి ఐదు ప్రత్యేక సాధారణ సెలవులను కల్పిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. రెగ్యులర్ మహిళా ఉద్యోగులకు ప్రత్యేక ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అదనంగా ఐదు ప్రత్యేక సాధారణ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ సౌకర్యాన్ని ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగినులకు కూడా కల్పించాలన్న ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తికి సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించి ఆమోదం తెలిపారు. దీంతో ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగినులకు కూడా ఐదు ప్రత్యేక సాధారణ సెలవులను మంజూరు చేస్తూ ఆరి్థకశాఖ జీవో నంబర్ 39 జారీచేసింది. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు మహిళా ఉద్యోగులకు ఐదు ప్రత్యేక సాధారణ సెలవులు మంజూరుచేసిన సీఎం జగన్మోహన్రెడ్డికి ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం తరఫున సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: అడ్డంగా దొరికినా అడ్డదారిలోనే! -
పరీక్షల నిర్వహణ యథాతథం
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్దేశించిన తేదీల్లోనే అర్హత పరీక్షలు నిర్వహించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. కష్టపడి ఉద్యోగాలు సాధించాలన్న తపనతో లక్షలాది మంది నిరుద్యోగులు సిద్ధమవుతున్నారు. వారికి ఏమా త్రం అన్యాయం జరగకూడదనేదే మా లక్ష్యం. వాస్త వ పరిస్థితులకు భిన్నంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలు జరుగుతున్నాయి. తొందరపడి వాటిని నమ్మి అభ్యర్థులు సమయాన్ని వృథా చేసుకోవద్దు’అని టీఎస్పీఎస్సీ చైర్మన్ బి.జనార్ధన్రెడ్డి స్పష్టం చేశారు. గత 4–5 రోజుల పరిణామాల దృష్ట్యా ఆయన మంగళవారం టీఎస్పీఎస్సీ కార్యాలయంలో కమిషన్ సభ్యులు, కార్యదర్శితో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల రద్దు, ఇతరత్రా అంశాలపై పలు ప్రచారాల నేపథ్యంలో అభ్యర్థులకు స్పష్టత ఇచ్చేందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. 17 వేల పోస్టులు... 26 ప్రకటనలు... ‘వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీకి అప్పగించింది. 17,134 కొలువులకు సంబంధించి ఏడాది కాలంలో 26 ప్రకటనలు జారీ చేశాం. ఇందులో 6 రకాల అర్హత పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాం. గత ఏడేళ్లలో 35 వేల ఉద్యోగాల భర్తీ జరిగితే కేవలం ఏడాదిలోనే 17 వేల కొలువులకు ప్రకటనలు జారీ చేశాం. మరో 10 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో ప్రకటనలు జారీ చేయనున్నాం. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసిన క్రమంలో అంతర్గత సమాచారం అందింది. దీంతో వెంటనే ఆ రెండు పరీక్షల నిర్వహణను వాయిదా వేశాం. వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 5న నిర్వహించిన అర్హత పరీక్ష ప్రశ్నపత్రం లీకైందని గుర్తించాం. ఇది ఎందరికి చేరింది... ఏయే సమాచారం ఎవరెవరికి చేరిందనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. సాంకేతికత ఆధారంగా లీకేజీని గుర్తించేందుకు ఫోరెన్సిక్, సైబ ర్ భద్రతా విభాగాలు ప్రయత్నిస్తున్నాయి. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్షపై బుధవారం మళ్లీ సమీక్షించాక నిర్ణయాన్ని ప్రకటిస్తాం’అని జనార్దన్రెడ్డి వివరించారు. కార్యాలయానికి కొత్త సాంకేతికత... ప్రస్తుతం టీఎస్పీఎస్సీ కార్యాలయంలో సాంకేతికతను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నాం. కంప్యూటర్ల మార్పుతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా కొత్తగా తయారు చేసేందుకు చర్యలు మొదలుపెట్టాం. అతిత్వరలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. మరోవైపు టౌన్ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ అర్హత పరీక్షల ప్రశ్నపత్రాలను తిరిగి రూపొందించాలని నిర్ణయించాం. అతిత్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి చేసి పరీక్షలు నిర్వహిస్తాం. ఏప్రిల్ 4న నిర్వహించే హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష నుంచి అన్ని రకాల పరీక్షలను నిర్దేశించిన తేదీల్లోనే నిర్వహిస్తాం. అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు. అత్యంత పారదర్శకతతో అర్హతలున్న వారిని ఎంపిక చేయడయే మా పని’అని జనార్దన్రెడ్డి తెలిపారు. నమ్మించి గొంతు కోసినట్లుగా... ‘ఒక కార్యాలయం అన్నాక ఎంతో మంది ఉద్యోగులుంటారు. ప్రతి సమాచారాన్ని గోప్యంగా ఉంచేందుకే ప్రయత్నిస్తాం. అదే సమయంలో సహోద్యోగులకు వివిధ బాధ్యతలు అప్పగించి కార్యక్రమాలను సజావుగా సాగేలా చూస్తాం. ప్రవీణ్కుమార్ ఇక్కడ ఏళ్లుగా పనిచేస్తున్నాడు. రాజశేఖర్ రెడ్డి ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఏడేళ్లుగా పనిచేస్తున్నాడు. ప్రతి ఉద్యోగి ఎలాంటివాడు? అతని నేప థ్యం ఏమిటని ఆరాతీసే పరిస్థితి ఉండదు. కార్యాలయంలో పనిచేసే వ్యక్తి.. ఏళ్లుగా నమ్మకంతో ఉన్నందున వివిధ బాధ్యతలు అప్పగించాం. రాజశేఖర్రెడ్డి నెట్వర్క్ విభాగంలో పనిచేస్తున్నా డు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే నమ్మించి గొంతుకోసిన చందంగా ఉంది. ప్రవీణ్ శాఖా పరంగా అనుమతి తీసుకొని గ్రూప్–1 ప్రిలిమిన రీ పరీక్ష రాశాడు. 103 మార్కులు వచ్చినట్లు తెలిసింది. కానీ పేపర్ కోడ్ సరిగ్గా వేయలేదని అనర్హుడైనట్లు సమాచారం. అయితే గ్రూప్–1 ప్రిలిమిన రీ అర్హుల్లో అత్యధిక మార్కులు 103 కంటే ఎక్కు వ. ప్రిలిమినరీ పరీక్షలో ర్యాంకులను పరిగణనలోకి తీసుకోం. దీంతో ఎక్కడా మార్కులు వెల్లడించలేదు. అభ్యర్థులకు మాత్రం వారి మార్కు లు చూసుకొనే వెసులుబాటు కల్పిస్తూ ఓఎంఆర్ పత్రాలను స్కాన్ చేసి వెబ్సైట్లో అందుబాటులో ఉంచాం. ఈ పరీక్ష లీకేజీపై ఇప్పటివరకు ఎలాంటి ఆధారాల్లేవు. సామాజిక మాధ్యమాల్లో అనవసర రాద్ధాంతాన్ని పరిగణించొద్దు. ఒక్క అభ్యర్థికి కూడా అన్యాయం జరగదు. వాస్తవ పరిస్థితులను కనిపెట్టేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తులో తేలిన అంశాల ప్రకారం చర్యలుంటాయి’అని జనార్దన్రెడ్డి స్పష్టం చేశారు. -
ప్రైవేటుకే ఉపాధి కల్పన.. ఉద్యోగాల నియామకాలకు జాబ్ మేళాలు
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ ఉపాధి కల్పనా శాఖ కార్పొరేట్, ప్రైవేటు రంగాలకు కల్పతరువుగా మారింది. ఆయా సంస్థల కోసం జాబ్ మేళాలను నిర్వహిస్తూ ఉద్యోగులను వెతికి పెడుతోంది. ఒకప్పుడు నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఈ శాఖ ప్రస్తుతం ప్రైవేటు ఉద్యోగాల భర్తీలో బిజీగా మారింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం విద్యార్హతలతో సహా పేర్లు నమోదు చేసుకున్న నిరుద్యోగులు లక్షల్లో ఉన్నా.. వయోపరిమితి దాటిపోయే వరకు ఒక్క ఉద్యోగం కూడా కలి్పంచలేని పరిస్థితి నెలకొంది. కనీసం ప్రభుత్వ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలో ఏజెన్సీ ఎంప్యానల్మెంట్కే పరిమితమైంది. పొరుగు సేవల్లో అంతంతే.. ► ఉపాధి కల్పనా శాఖ ప్రైవేటుపై దృష్టి సారించింది. సాధారణంగా కార్పొరేట్, ప్రైవేటు సంస్థలు వ్యాపార ఆర్థిక లావేదేవీలను బట్టి ఉద్యోగుల సంఖ్యను కుదించడం, పెంచడం చేస్తుంటాయి. కరోనా నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. సాధారణ పరిస్థితులు ఏర్పడగానే తిరిగి నిపుణులైన ఉద్యోగుల కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఉపాధి కల్పనా శాఖ ఆయా సంస్థలకు ఉద్యోగులను వెతికిపెట్టే బాధ్యతను భుజానా ఎత్తుకుంది. జాబ్ మేళాలు నిర్వహిస్తూ చిరు ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగుల ఎంపిక కోసం సంధాన కర్తగా వ్యవహరిస్తోంది. ► ప్రభుత్వ శాఖల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం కేవలం ఏజెన్సీల నమోదుకు పరిమితమైంది. కొత్త ఉద్యోగ భర్తీ లేక పొరుగుసేవల కింద నియామకాలు జరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం ఉపాధి కల్పన కేంద్రంలో నమోదు చేసుకున్న నిరుద్యోగుల్లో అర్హులైన వారికి సమాచారం అందించి ఎంపిక చేయాలి. ఇందు కోసం ఏర్పాటు చేసిన కమిటీకి ఉపాధి కల్పనా శాఖ అధికారి కో కనీ్వనర్గా వ్యవహరించాలి. పొరుగుసేవల ఉద్యోగాలు నియామకాలు సాగుతున్నా.. అవి ఉపాధి కల్పనా శాఖ ద్వారా ఎంపిక జరిగిన దాఖలాలు మాత్రం లేవు. ఫలితంగా ఏజెన్సీలు తమకు నచ్చిన వారిని ఎంపిక చేస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. అచేతనంగా.. రెండు దశాబ్దాల వరకు ఉపాధి కల్పనా శాఖ నిరుద్యోగుల పాలిట కల్పతరువుగా వెలిగి ప్రస్తుతం అచేతనంగా తయారైంది. అప్పట్లో ఏ శాఖకు లేని ప్రతిష్ట ఈ శాఖ ఉండేది. సర్కారు కొలువులకు ఉపాధి కల్పన శాఖలో నమోదు తప్పనిసరిగా ఉండేది. దీంతో నిరుద్యోగులు ఈ ఆఫీస్కు క్యూ కట్టి నమోదు చేసుకున్నారు. అభ్యర్థులకు సీనియారిటీ ప్రకారం విద్యార్హతలను బట్టి ఆయా శాఖల్లో ఉన్న ఉద్యోగాల ఇంటర్వ్యూల కోసం వర్తమానం అందేది. ప్రభుత్వ నోటిఫికేషన్ విధానం అందుబాటులో రావడంతో శాఖకు వన్నె తగ్గినట్లయింది. ప్రస్తుతం కేవలం అభ్యర్థుల పేర్లు నమోదు, పునరుద్ధరణ, ప్రైవేటు సేవలకు పరిమితమైంది. ఆశల్లోనే అభ్యర్థులు.. ఉపాధి కల్పనా శాఖపై అభ్యర్థుల్లో ఆశలు సన్నగిల్లలేదు. సర్కారు కొలువుపై ఆశతో నమోదు, పునరుద్ధరణ కొనసాగుతూనే ఉంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత అభ్యర్థుల నమోదు కొంత మేరకు పెరిగింది. రాష్ట్రం మొత్తం మీద 2014 జూన్ నుంచి ఇప్పటి వరకు సుమారు 2,72,124 మంది అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు ఆ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో పురుషులు 1,62,928 ఉండగా, మహిళా అభ్యర్థులు 1,09,196 ఉన్నారు. ఒక్క కాల్ లెటర్ రాలేదు ప్రభుత్వ ఉద్యోగంపై ఆశతో ఉపాధి కల్పనా శాఖలో విద్యార్హతతో పేరు నమోదు చేసుకున్నా.. ఒక్క కాల్ లేటర్ రాలేదు. కేవలం ప్రైవేటు ఉద్యోగాల జాబ్ మేళాలకే ఉపాధి కల్పనా శాఖ పరిమితమైంది. సర్కారు కొలువుల్లో ప్రాధాన్యం ఇవ్వాలి – సీలం దీపిక, హైదరాబాద్ అవుట్ సోర్సింగ్లో ప్రాధాన్యం ఇవ్వాలి అవుట్సోర్సింగ్ లోనైనా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వాలి. సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగాలకు అవకాశం కలి్పంచి నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలి. – పి.ప్రవీణ్ కుమార్ చదవండి: సమ్మోహన తీరం.. సరికొత్తగా హుస్సేన్ సాగర్ -
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి వెయిటేజీ
సాక్షి, హైదరాబాద్: వైద్యారోగ్యశాఖ నియామకాల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బందికి వెయి టేజీ ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ మంగళవారం మార్గదర్శకాలు జారీచేశారు. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ఎంహెచ్ఎస్ఆర్బీ) ద్వారా ఎంపిక ఉంటుందని తెలిపారు. వివిధ విభా గాల్లో 10,028 ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీచేస్తారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు వంటి స్పెషలిస్టు వైద్యులు.. ఎంబీబీఎస్ అర్హతతో సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ట్యూటర్లు, స్టాఫ్నర్సులు, ఎంపీహెచ్ఏ (స్త్రీ)/ఏఎన్ఎం పోస్టులను భర్తీ చేస్తారు. ►స్పెషలిస్ట్ వైద్యులను పోస్ట్ గ్రాడ్యుయేట్/సూపర్ స్పెషాలిటీ పరీక్షలో పొందిన మార్కుల శాతం ఆధారంగా గరిష్టంగా 80 పాయింట్లు కేటాయిస్తారు. మార్కులు ఇవ్వని విశ్వవిద్యాలయాల్లో చదివినవారికి గ్రేడ్లు, మార్కుల మధ్య సమానత్వ సూత్రాన్ని అనుసరిస్తారు. గ్రేడ్ ఏలో 60%, ఆపై మార్కులుంటే ఎక్సలెన్స్.. బీగ్రేడ్లో 55%, ఆపై ఉంటే ‘గుడ్’.. 50%, అంతకంటే తక్కువ ఉంటే పాస్ గ్రేడ్గా నిర్ధారిస్తారు. ►సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ట్యూటర్లు, జీడీఎంఓ ఎస్ తదితర పోస్టులకు ఎంబీబీఎస్లో పొందిన మార్కుల ఆధారంగా 80 పాయింట్లను నిర్ధారిస్తారు. ఎంబీబీఎస్లో అన్ని సంవత్సరాల్లో పొందిన మొత్తం మార్కులను కలిపి 80%కి మార్చుతారు. ►విదేశాల్లో మెడికల్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసినవారికి సంబంధించి.. నేషనల్ మెడికల్ కమిషన్ నిర్వహించే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామ్ (ఎఫ్ఎంజీఈ)లో పొందిన మార్కుల ఆధారంగా 80వరకు పాయింట్లను నిర్ధారిస్తారు. ►స్టాఫ్నర్సులు, ఏఎన్ఎంలకు రాతపరీక్షలో పొందిన మార్కులకు 80 పాయింట్లు ఇస్తారు. ►అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్, ట్యూటర్లు, జీడీఎంఓఎస్, ఆయుష్ వైద్యాధికారులు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎం, ఎంపీహెచ్ఏ (స్త్రీ), ల్యాబ్–టెక్నీషియన్ గ్రేడ్– ఐఐ, ఫార్మసిస్ట్ గ్రేడ్– ఐఐ, రేడియోగ్రాఫర్, పారామెడికల్ ఆప్తాల్మి క్ ఆఫీసర్, ఫిజియో థెరపిస్ట్ పోస్టులన్నింటిలో.. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ అభ్యర్థులకు 20 పాయింట్ల వరకు వెయిటేజీ ఇస్తారు. ►అభ్యర్థులు వారు దరఖాస్తు చేస్తున్న నిర్దిష్ట కేటగిరీలో అన్ని పోస్టులకు ప్రాధాన్యాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ధ్రువీకరణ తీసుకుని.. వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ అనుభవమున్న అభ్యర్థులు సంబంధిత అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. అధికారులు ఈ దరఖాస్తులను 15 రోజుల్లోగా ఆమోదించి ధ్రువీకరణ పత్రం జారీ చేయాలి లేదా తిరస్కరించాలి. అభ్యర్థులు ఈ ధ్రువీకరణ పత్రంతో పాటు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఆరునెలల అనుభవానికి.. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు అభ్యర్థులకు వారు సేవలు అందించిన ప్రతి ఆరునెలల అనుభవానికి వెయిటేజీ పాయింట్లను కేటాయిస్తారు. గిరిజన ప్రాంతాల్లో అయితే 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో అయితే 2 పాయింట్ల చొప్పున ఇస్తారు. వారు కనీసం 6 నెలల సర్వీసు పూర్తి చేసుకుని ఉంటేనే వెయిటేజీ వర్తిస్తుంది. ఏ సేవ అందిస్తే.. అదే కేటగిరీ ఉద్యోగానికి మాత్రమే వెయి టేజీ పాయింట్లు వర్తిస్తాయి. ►కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు అనుభవ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తున్నప్పుడు ఈఎస్ఐ, ఈపీఎఫ్, హాజరు రిజిస్టర్లు వంటి రికార్డులను సూచించవచ్చు. వాటి కాపీలను జత చేయవచ్చు. ►సబ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో పనిచేసే వారికి అనుభవ ధ్రువీకరణను జిల్లా వైద్యాధికారులు ఇవ్వొచ్చు. సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్సీ), ఏరియా, జిల్లా ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో పనిచేసేవారికి జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు ధ్రువీకరణ ఇవ్వాలి. -
300 మందికి పైగా ఔట్సోర్సింగ్ జేపీఎస్లకు ఉద్వాసన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 300 మందికి పైగా జూనియర్ పంచాయతీ సెక్రటరీలు (జేపీఎస్) ఉద్వాసనకు గురయ్యారు. ఇటీవల వివిధ జిల్లాల్లో జీవో 317 ద్వారా బదిలీ చేసిన, మెటర్నిటీ లీవ్, లాంగ్ స్టాండింగ్ లీవ్ నుంచి వచ్చిన రెగ్యులర్ పంచాయతీ సెక్రటరీలకు పోస్టింగ్లు ఇచ్చేందుకు ఔట్ సోర్సింగ్ సెక్రటరీలను ఆయా జిల్లాల్లోని డీపీవో (జిల్లా పంచాయతీ అధికారి)లు అకస్మాత్తుగా తప్పించారు. టీఎస్పీఆర్ఈ పోటీ పరీక్ష ద్వారా ర్యాంకు సాధించినా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో జేపీఎస్లుగా నియమితులవడంతో ఈ పరిస్థితి తప్పలేదు. ఖాళీలను నింపేందుకు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో.. 2021 ఏప్రిల్ 12న జేపీఎస్లుగా 9,355 మందికి పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చారు. వీరిలో 1,200 మంది ఆయా పోస్టింగ్లకు అసలు రిపోర్ట్ చేయలేదు. విధుల్లో చేరిన 8,200 మందిలో గత మూడేళ్లలో వెయ్యి మందికి పైగా వివిధ కారణాలతో రాజీనామా చేయడమో లేదా బాధ్యతలను మధ్యలోనే వదిలేయడమో చేశారు. అయితే ప్రతి పంచాయతీకి ఓ సెక్రటరీని నియమించాలనే లక్ష్యంతో.. భర్తీ కానీ జేపీఎస్ పోస్టుల్లో ఆయా జిల్లాలు, మండలాల వారీగా గతంలో పోటీ పరీక్షలో ఉత్తీర్ణులైన తర్వాతి ర్యాంకుల వారీగా ఔట్ సోర్సింగ్ పద్ధతుల్లో నియామకాలు చేపట్టారు. వీరికి పీఎఫ్, ఈఎస్ఐ మినహాయించి ఒక్కో జిల్లాలో ఒక్కోలా రూ. 10 వేల నుంచి రూ. 13 వేల దాకా జీతం ఇస్తున్నారు. ఇవి కూడా ఏ నెలకు ఆ నెల అందట్లేదని విమర్శలున్నాయి. పరీక్ష రాసి ఎంపికైనా తిప్పలే! జాతీయ స్థాయిలో యూపీఎస్సీ తరహాలో డిగ్రీ కనీస అర్హతగా నెగెటివ్ మార్కింగ్ (మైనస్ మార్కులు) పద్ధతితో పోటీ పరీక్ష రాసి ఎంపికైనా తమకు కష్టాలు తప్పట్లేదని ఔట్ సోర్సింగ్ జేపీఎస్లు అంటున్నారు. ప్రస్తుతం ఖాళీగా చూపుతున్న 800 పంచాయతీ సెక్రటరీ పోస్టులను తాజాగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీకి నోటిఫై చేశారు. దీంతో కొత్త రిక్రూట్మెంట్ జరిగాక తమకూ ఉద్వాసన తప్పదేమోనని మిగతా జేపీఎస్లకు భయం పట్టుకుంది. -
ఔట్సోర్సింగ్ సెక్రటరీలను విధుల్లోకి తీసుకోవాలి’
సుందరయ్య విజ్ఞానకేంద్రం (హైదరాబాద్): రాష్ట్రప్రభుత్వం తొలగించిన ఔట్సోర్సింగ్ జూనియర్ పంచాయతీ సెక్రటరీలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో తెలంగాణ ఔట్సోర్సింగ్ పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. కృష్ణయ్య మాట్లాడుతూ 2018లో పరీక్ష రాసి మెరిట్ లిస్టుతోపాటు రోస్టర్ పద్ధతి ద్వారా ఎంపికైన 370 మంది జూనియర్ పం చాయతీ కార్యదర్శులను తొలగించడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. నిరుద్యోగులంతా రోడ్డుపై తిరుగుతుంటే రిటైర్మెంట్ అయినవారికి ఎక్కువ జీతాలిచ్చి నియమించడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్ అధ్యక్షురాలు అనసూర్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అసోసియేట్ ప్రెసిడెంట్ షేక్ హిమామ్ వల్లీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, యువజన విభాగం అధ్యక్షుడు నీల వెంకటేశ్ పాల్గొన్నారు. -
నకిలీల ‘అవుట్ సోర్సింగ్’
వరంగల్ జిల్లాలో ఉన్న ఓ ఏకలవ్య మోడల్ స్కూల్లో క్రాఫ్ట్ టీచర్గా ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి పనిచేస్తున్నాడు. వాస్తవానికి ఆ వ్యక్తి పదోతరగతి మాత్రమే చదవగా.. డిగ్రీ, అనుబంధ కోర్సులో ఉత్తీర్ణత సాధించినట్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించాడు. తర్వాత అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా క్రాఫ్ట్ టీచర్ ఉద్యోగం సంపాదించాడు. ఇలా ఒకరిద్దరు కాదు.. గిరిజన గురుకుల విద్యా సంస్థల సొసైటీ, ఏకలవ్య మోడల్ పాఠశాలల్లోని పలు విభాగాల్లో పదుల సంఖ్యలో నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు పొందారు. సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విభాగాల్లో తాత్కాలిక పద్ధతిలో నియమించే అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకూ ‘నకిలీ’చీడ పట్టింది. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని గురుకుల విద్యా సంస్థలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పెద్ద సంఖ్యలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో ‘నకిలీలు’ఉ న్నట్లు తెలుస్తోంది. వారికి అర్హత లేకున్నా ఇంటర్మీ డియట్, డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లను తప్పుడు పద్ధతిలో సృష్టించి వాటి ద్వారా అవుట్ సోర్సింగ్ కొలువులు సంపాదించుకున్నట్లు తెలిసింది. ఈ అంశం జిల్లా స్థాయిలో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినప్పటికీ ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. బోగస్ సర్టిఫికెట్లతో బురిడీ.. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను జిల్లా స్థాయిలో ఒక ప్రైవేటు ఏజెన్సీ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ ఏజెన్సీల ద్వారా వచ్చే అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలించి, ఆమోదం తెలిపిన అనంతరం వారిని ఉద్యోగంలో చేరనిస్తారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెలవారీ జీతాలను ప్రభుత్వం నేరుగా కాకుండా ఏజెన్సీల ద్వారా చెల్లిస్తారు. ఈ క్రమంలో ఏజెన్సీల్లోని కొందరు నిర్వాహకులు ఒకరిద్దరు అధికారులతో మిలాఖత్ అయ్యి నకిలీ సర్టిఫికెట్లున్న అభ్యర్థులకు కొలువులు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని గురుకుల విద్యాసంస్థలు, కాలేజీలతో పాటు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో పెద్ద సంఖ్యలో తప్పుడు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు వందకు పైగా ఉద్యోగులను ఇలా ఎంపిక చేసినట్లు వెల్లడైంది. సబార్డినేట్ పోస్టులే ఎక్కువ.. గిరిజన గురుకుల సొసైటీతో పాటు ఏకలవ్య మోడల్ స్కూళ్లలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసిన ఉద్యోగాల్లో అత్యధికం సబార్డినేట్ పోస్టులే ఉన్నట్లు సమాచారం. వాటితో పాటు కొన్నిచోట్ల బోధన సిబ్బందిని సైతం ఇలాగే భర్తీ చేసినట్లు తెలుస్తోంది. ల్యాబ్ అసిస్టెంట్, అటెండర్ పోస్టులతో పాటు మెస్ మేనేజర్, క్రాఫ్ట్ టీచర్, ఆర్ట్ టీచర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టుల్లో ఇలాంటి ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. సబార్డినేట్ పోస్టులకు సంబంధించి ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లు నకిలీవి సృష్టించగా, బోధన సిబ్బంది కేటగిరీలో డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లను తప్పుడు పద్ధతిలో సృష్టించారు. ఈ వ్యవహారానికి సంబంధించి విచారణ జరపాలని ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదులు అందినట్లు తెలిసింది. పూర్తిస్థాయిలో విచారణ జరిపితే అక్రమాల గుట్టు తెలుస్తుందని అంటున్నారు. -
సీనరేజి వసూళ్లకు రాజస్థాన్ మోడల్
సాక్షి, అమరావతి: గనులు, భూగర్భ శాఖలో సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బూజు పట్టిన పాత విధానాలకు స్వస్తి పలికి కొత్త విధానాలను అమల్లోకి తీసుకు రాబోతోంది. దీనిపై ఇప్పటికే పూర్తిస్థాయి అధ్యయనం, కసరత్తు చేసింది. లాంఛనాలన్నీ పూర్తిచేసి కొత్త విధానాన్ని త్వరలో ఆచరణలో పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. మూడు అంశాలకు సంబంధించి ప్రస్తుతం అమలవుతున్న విధానాలను పూర్తిగా మార్చివేయాలని నిర్ణయించింది. మారనున్న సీనరేజి వసూళ్ల తీరు చిన్నతరహా గనుల సీనరేజి వసూళ్ల విధానం మారనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 6,388 గనుల లీజులు ఉండగా.. వాటినుంచి సీనరేజిని గనుల శాఖ అధికారులే వసూలు చేస్తున్నారు. భారీ సంఖ్యలో ఉన్న గనుల నుంచి సీనరేజి వసూళ్లు, జరిమానాలు వంటి పనులన్నీ పరిమిత సంఖ్యలో ఉన్న ఉద్యోగులు, అధికారులు నిర్వహించడం కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో అనధికారిక మైనింగ్, అక్రమ రవాణా వల్ల ఖజానాకు వచ్చే ఆదాయం తగ్గిపోతోంది. దీనిని అధిగమించే క్రమంలో సీనరేజి వసూళ్లను మిగిలిన రాష్ట్రాల్లో ఎలా చేస్తున్నారనే దానిపై గనుల శాఖ అధికారులు అధ్యయనం చేశారు. రాజస్థాన్లో అనుసరిస్తున్న అవుట్సోర్సింగ్ విధానం శాస్త్రీయంగా ఉందని నిర్థారించి.. అదే విధానాన్ని మన రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయించారు. దీని ప్రకారం జిల్లాల వారీ సీనరేజి వసూళ్ల బాధ్యతను అవుట్ సోర్సింగ్కు అప్పగించనున్నారు. ఇసుక తప్ప అన్ని చిన్నతరహా గనులకు ఈ విధానాన్ని వర్తింపచేయాలని నిర్ణయించారు. దీనివల్ల 25 నుంచి 40 శాతం ఎక్కువ ఆదాయం ఖజానాకు వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రైవేటు ఏజెన్సీలు సీనరేజి వసూలు చేయడం వల్ల అక్రమ రవాణా, అనధికారిక మైనింగ్ కూడా తగ్గినట్టు రాజస్థాన్ మోడల్లో స్పష్టమైందని.. ఇక్కడా అదే జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. బరువును బట్టి సీనరేజీ నిర్థారణ కీలకమైన రెండో అంశం సీనరేజి ఎంత కట్టాలో నిర్థారించేది. ప్రస్తుతం మెటీరియల్ విలువ ఆధారంగా (వాల్యూ మెట్రిక్) సీనరేజిని నిర్థారిస్తున్నారు. రకరకాల సైజుల్లో ఉండే గ్రానైట్ ఇతర ఖనిజాల వాస్తవ విలువ ఎంతో అంచనా వేసి లెక్కించడం ఇబ్బందికరంగా మారింది. దీనికి బదులు బరువును కొలవడం ద్వారా శాస్త్రీయంగా సీనరేజిని నిర్థారించాలని నిర్ణయించారు. గనుల సమీపంలో వే బ్రిడ్జిలు ఏర్పాటు చేసి ఖనిజం బరువు కొలుస్తారు. దీనివల్ల 10 నుంచి 15 శాతం ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రతి వాహనాన్ని గనుల శాఖతో అనుసంధానం చేసి వే బ్రిడ్జి దగ్గర అందులో ఉన్న బరువును కొలవడం ద్వారా కచ్చితమైన విలువ తెలుస్తుంది. అక్కడ ఏర్పాటు చేసే సీసీ కెమెరాలు, తనిఖీల వల్ల అక్రమ రవాణా కూడా తగ్గి మరో 15 నుంచి 20 శాతం ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒడిశా, రాజస్థాన్, గుజరాత్లో అమల్లో ఉన్న ఈ విధానాన్ని ప్రకాశం జిల్లాలో గ్రానైట్ మైనింగ్పై ప్రయోగాత్మకంగా అమలు చేశారు. దీనివల్ల 25 శాతం ఆదాయం పెరిగినట్టు తేల్చారు. ఈ–వేలం ద్వారా చిన్నతరహా గనుల లీజులు మూడో అంశంగా.. చిన్నతరహా గనుల లీజులు కేటాయించేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న మొదట వచ్చిన వారికే మొదటి ప్రాధాన్యం (ఫస్ట్ కమ్ ఫస్ట్) స్థానంలో ఈ–వేలాన్ని ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుత విధానం వల్ల సమర్థులైన, అర్హులైన పారిశ్రామికవేత్తలు క్వారీ లీజులు పొందలేకపోతున్నారు. దీనికి బదులు ఈ–వేలం ప్రవేశపెట్టి లీజులను ఆలస్యంగా లేకుండా జారీ చేయడం, అర్హులకు లీజుకివ్వడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాత విధానంలో 1,156 లీజుల్లో ఉన్న వ్యక్తులు మైనింగ్ జరపకపోవడం వల్ల ప్రభుత్వానికి రూ.136 కోట్ల నష్టం వస్తోంది. కొత్త విధానంలో ఈ సమస్యలను పరిష్కరించి ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తున్నారు. చాలాకాలంగా మైనింగ్ చేయకుండా ఉన్న గనుల లీజులను కూడా రద్దు చేసి, వాటికి కూడా ఈ–ఆక్షన్ నిర్వహించనున్నారు. ఆదాయం పెంపే లక్ష్యంగా కొత్త విధానం గండి పడుతున్న ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా కొత్త విధానాన్ని రూపొందించాం. సీనరేజి వసూళ్లు, బరువు ఆధారిత కొలత, మైనింగ్ మినరల్స్ ఈ–వేలం ద్వారా ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నాం. దీని అమలుకు న్యాయ సలహా తీసుకుంటున్నాం. త్వరలో ఆచరణలోకి తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – వీజీ వెంకటరెడ్డి, డైరెక్టర్, గనులు, భూగర్భ శాఖ -
ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందికి.. వేతన పెంపు ఎలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాల పెంపును ఎలా వర్తింపజేయాలన్న విషయంలో ఆర్థికశాఖ తర్జనభర్జన పడుతోంది. ఈ విషయంలో మరింత స్పష్టత తీసుకున్నాకే ముందుకు సాగాలని భావిస్తోంది. కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల పెంపు విషయంలోనూ ఆదే అభిప్రాయంతో ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 58,128 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది, 66,239 మంది కాంట్రాక్టు ఉద్యోగులు వివిధ శాఖల్లో పని చేస్తున్నారు. కనిష్టంగా రూ.12 వేల నుంచి మొదలుకొని గరిష్టంగా రూ.40,270 వరకు వీరికి వేతనాలు ఉన్నాయి. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందికి పీఆర్సీ కొత్తగా కనీస వేతనాలను నిర్ధారించింది. అయితే పీఆర్సీ సిఫారసు చేసిన వేతనాలను వర్తింపజేయాలా? ప్రస్తుతం ఇస్తున్న వేతనాలపై 30 శాతం పెంపును అమలు చేయలా? అన్న విషయంలో ఆర్థికశాఖ ఆలోచనలో పడింది. ఫిట్మెంట్పై సోమవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేస్తూ... ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు సహా అన్నిరకాల ఉద్యోగులకు వేతన పెంపును వర్తింపజేస్తామని చెప్పారు. అంతకుమించి వివరాల్లోకి వెళ్లలేదు. దాంతో వీరికి పీఆర్సీ సిఫారసులను అమలు చేస్తారా? లేదా? అనే విషయంలో స్పష్టత కరువైంది. తక్కువ వేతనాలు ఉన్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది మాత్రం తమకు ప్రస్తుతం ఇస్తున్న వేతనాలపై 30 శాతం పెంపు కాకుండా, పీఆర్సీ సిఫారసు చేసిన కనీస వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమకు పెద్దగా ప్రయోజనం చేకూరదని వాపోతున్నారు. మూడు కేటగిరీలుగా ఔట్సోర్సింగ్ ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది మూడు కేటగిరీల్లో ఉన్నారు. వారిలో గ్రూపు–4 కేటగిరీలో పని చేస్తున్న ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్, మాలీ, కావుటి, కుక్, సైకిల్ ఆర్డర్లీ, చౌకీదార్, ల్యాబ్ అటెండర్, దఫేదార్, జమేదార్, జిరాక్స్ ఆపరేటర్, రికార్డు అసిస్టెంట్, ష్రాఫ్/క్యాషియర్, లిఫ్ట్ ఆపరేటర్లు ప్రస్తుతం నెలకు రూ. 12 వేలు మాత్రమే పొందుతున్నారు. వీరికి కనీస వేతనం రూ. 19 వేలు చేయాలని పీఆర్సీ కమిషన్ సిఫారసు చేసింది. మరోవైపు రూ. 13 వేల నుంచి రూ.15,030 వరకు కనీస మూల వేతనం పొందుతున్న ఔట్సోర్సింగ్ సిబ్బందికి కూడా బేసిక్ పే రూ. 19 వేలు చేయాలని సిఫారసు చేసింది. అయితే నెలకు రూ.12 వేలు మాత్రమే పొందుతున్న కిందిస్థాయి ఔట్సోర్సింగ్ సిబ్బంది తమకు పీఆర్సీ సిఫారసు చేసిన రూ. 19 వేల కనీస వేతనం కంటే ఎక్కువ ఇవ్వాలని, లేదంటే దానినైనా కచ్చితంగా అమలు చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం వస్తున్న వేతనాలపై 30 శాతం పెంపుతో వేతన స్థిరీకరణ చేస్తే ఒనగూరే ప్రయోజనం చాలా తక్కువగా ఉంటుందని, దాని వల్ల తమకు న్యాయం జరగదని అంటున్నారు. గ్రూపు–3 కేటగిరీలోని డ్రైవర్లు, జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ స్టెనో, టైపిస్టు, టెలిఫోన్ ఆపరేటర్, స్టోర్ కీపర్, ఫొటోగ్రాఫర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఫిట్టర్, ల్యాబ్ అసిస్టెంట్, సినిమా/ఫిలిం/ఆడియోవిజువల్/డాటా ఎంట్రీ ఆపరేటర్, సూపర్వైజర్, లైబ్రేరియన్, మేనేజర్ కేటగిరీల్లో నెలకు రూ. 15 వేలు మాత్రమే వేతనం ఉంది. వారికి కనీస వేతనం రూ.22,900 చేయాలని పీఆర్సీ సిఫారసు చేసింది. మరోవైపు ఇదే కేటగిరీలో రూ. 19,500 వరకు వేతనం పొందుతున్న వారికి కూడా కనీస వేతనం రూ. 22,900 చేయాలని పీఆర్సీ సిఫారసు చేసింది. వారు తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు. గ్రూపు–3ఏ కేటగిరీలోని సీనియర్ అసిస్టెంట్, సీనియర్ స్టెనో, సీనియర్ అకౌంటెంట్, ట్రాన్స్లేటర్, కంప్యూటర్ ఆపరేటర్/డీపీవోలకు ప్రస్తుతం ఆయా శాఖలు రూ. 17,500 ఇస్తున్నాయి. వారికి రూ. 31,040 కనీసం వేతనం ఇవ్వాలని పీఆర్సీ సిఫారసు చేసింది. తమకు ప్రస్తుతం వస్తున్న వేతనంపై 30 శాతం పెంపు కాకుండా పీఆర్సీ సిఫారసు చేసిన మొత్తాన్నే చెల్లించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇక కాంట్రాక్టు ఉద్యోగుల్లోనూ ప్రస్తుతం నెలకు రూ. 12 వేల నుంచి రూ. 40,270 పొందుతున్న ఉద్యోగులు ఉన్నారు. వీరందరికీ పీఆర్సీ కొత్త వేతనాలను సిఫారసు చేసింది. తక్కువ వేతనాలున్న ఉద్యోగులు ఇపుడు తమకు వస్తున్న వేతనాలపై కాకుండా పీఆర్సీ సిఫారసు చేసిన మొత్తాన్ని చెల్లించాలని, అప్పుడే తమకు న్యాయం జరుగుతుందని పేర్కొంటున్నారు. మరోవైపు రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో ప్రస్తుతం 3,687 వుంది జూనియర్ లెక్చరర్లు ఉన్నారు. వారికి ఇపుడు రూ. 37,100 వేతనం వస్తోంది. పీఆర్సీ వీరికి రూ. 54,220 కనీస వేతనం ఇవ్వాలని సిఫారసు చేసింది. 435 మంది పాలిటెక్నిక్ లెక్చరర్లకు, 926 మంది డిగ్రీ లెక్చరర్లకు నెలకు రూ.40,270 వేతనంగా ఇస్తున్నారు. వీరికి రూ. 58,850 కనీస వేతనంగా చేయాలని పీఆర్సీ సిఫారసు చేసింది. అయితే వీరికి వేతనాల పెంపును ఎలా చేయాలనే విషయంలో ఆర్థికశాఖ తర్జనభర్జన పడుతోంది. ఉన్నతస్థాయిలో సంప్రదింపులు జరిపాకే ముందుకు సాగాలని భావిస్తోంది. -
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్: పీఆర్సీ కీలక సిఫారసులు
సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తీసుకునే విషయంలో సీఆర్ బిస్వాల్ నేతృత్వంలోని వేతన సవరణ కమిషన్ ప్రభుత్వానికి కీలక సిఫారసులు చేసింది. తోచిన వారిని విధుల్లోకి తీసుకునే విధానానికి స్వస్తి పలకాలని సూచించింది. వయసు, విద్యార్హతల ఆధారంగా ఉపాధి కల్పన కార్యాలయాల్లో నిర్వహించే జాబితా తరహాలో నిర్వహించి, వారిని కామన్ టెస్ట్ కోసం ఏజెన్సీలు ప్రతిపాదించాలని పేర్కొంది. ప్రభుత్వం ఏయే విభాగాల్లో ఏయే కేటగిరీల్లో ఎన్ని పోస్టులు వీరితో భర్తీ చేయాల్సి ఉంటుందో ఖాళీలు తెలుపుతూ నోటిఫై చేయాలని సూచించింది. ఆయా విభాగాల వారీగా అభ్యర్థులను తీసుకునే ముందు ప్రభుత్వం పరీక్ష నిర్వహించాలని, రాష్ట్ర స్థాయిలో జీఏడీ (సాధారణ పరిపాలన శాఖ)ఆధ్వర్యంలో, జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి ఖాళీల భర్తీ వేగంగా జరిగేలా చూడాలని తెలిపింది. పరీక్షల ఆధారంగా.. 1: 3 పద్ధతిలో అభ్యర్థుల వివరాలతో కూడిన తుది జాబితాలను ఆయా విభాగాలకు పంపి ఎంపికైన వారితో న్యాయబద్ధంగా ఒప్పందం కుదుర్చుకోవాలని పేర్కొంది. చదవండి: (ఫిట్మెంట్ 7.5%.. అంత తక్కువైతే.. మాకొద్దు) రెమ్యునరేషన్ సిఫారసులు ఇలా.. ►గ్రూప్–4 స్థాయిలోకి వచ్చే ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్, మాలీ, కామాటి, కుక్, చౌకీదార్, ల్యాబ్ అటెండర్, డఫేదార్, జమేదార్, జిరాక్స్ ఆపరేటర్, రికార్డ్ అసిస్టెంట్, క్యాషియర్, లిఫ్ట్ ఆపరేటర్లకు 2014 పీఆర్సీలో రెగ్యులర్ ఉద్యోగులకు రూ.13,000 నుంచి రూ.46,060 స్కేల్ పరిధిలో ఉంటే, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రస్తుతం నెలకు రూ.12 వేలు ఉండగా, దాన్ని రూ.19 వేలకు పెంచాలి. ►గ్రూప్–3 పరిధిలోకి వచ్చే డ్రైవర్, జూనియర్ అసిస్టెంట్, జూ.స్టెనో, టైపిస్ట్, టెలిఫోన్ ఆపరేటర్, స్టోర్ కీపర్, ఫొటోగ్రాఫర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఫిట్టర్, ల్యాబ్ అసిస్టెంట్, సినిమా/ఫిల్మ్/ఆడియో విజువల్/డేటా ఎం ట్రీ ఆపరేటర్, సూపర్వైజర్, లైబ్రేరియన్, మేనేజర్లకు పీఆర్సీ–2014 ప్రకారం రూ. 15,460–రూ.58330 పేస్కేల్ ఉన్న రెగ్యులర్ ఉద్యోగులకు తత్సమాన పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రస్తుతం నెలకు రూ.15,000లు ఉండగా, దాన్ని రూ.22,900లకు పెంచాలి. ►గ్రూపు–3(ఏ) కేటగిరీ పరిధిలోకి వచ్చే సీనియర్ అసిస్టెంట్, సీనియర్ స్టెనో, సీనియర్ అకౌంటెంట్, ట్రాన్స్లేటర్, కంప్యూటర్ ఆపరేటర్/డీపీవోలకు ఆర్పీఎస్–2014 ప్రకారం రూ.21,230–రూ.77,030 పేస్కేల్ పరిధిలో ని కేటగిరీలకు ప్రస్తుతం నెలకు రూ.17,500 చెల్లిస్తుండగా, దాన్ని రూ.31,040లకు పెంచాలి. వీరికి భవిష్యత్తులో పే స్కేల్ రివిజన్ జరిగే వరకు సంవత్సరానికి రూ.వెయ్యి చొప్పున పెంచాలి. ప్రభుత్వ ఉద్యోగుల పరిధిలోకి రానందున ఇది హోం గార్డులకు కూడా వర్తిస్తుంది. ఎర్న్డ్ లీవ్స్ తప్ప రెగ్యులర్ ఉద్యోగుల తరహాలో ఇతర వసతులు వర్తిస్తాయి. 6 నెలల ప్రసూతి సెలవు వర్తిసుంది. ఈపీఎఫ్, ఈఎస్ఐలు కూడా వర్తింపజేయాలి. -
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అండగా ఏపీ ప్రభుత్వం
-
హమ్మయ్య.. సమ్మె విరమించారు
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రి అవుట్ సోర్సింగ్ నర్సింగ్ సిబ్బంది సమ్మె విరమించారు. ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్తో జరిపిన చర్చలు ఫలవంతం కావడంతో విధులకు హాజరైనట్టు అవుట్ సోర్సింగ్ స్టాఫ్నర్సుల యూనియన్ ప్రతినిధులు తెలిపారు. దశలవారీగా హామీలను నెరువేరుస్తామని మంత్రి హామీయిచ్చారని వెల్లడించారు. పదమూడేళ్లుగా గాంధీ ఆస్పత్రిలో 212 మంది స్టాఫ్నర్సులు అవుట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం గాంధీ ఆస్పత్రిని కోవిడ్ నోడల్ కేంద్రంగా ప్రకటించడంతో వారంతా ప్రాణాలకు తెగించి విధులకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో రెగ్యులరైజ్ చేయాలని లేకుంటే ప్రభుత్వం తరపున కాంట్రాక్టు పద్ధతిలోనైనా తమను తీసుకోవాలని కోరుతూ ఈనెల 15 నుంచి సమ్మె బాట పట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధుల బృందం నర్సింహ, మేఘమాల తదితరులు గురువారం మంత్రి ఈటల రాజేందర్ను కలిశారు. తమ డిమాండ్లపై మంత్రి సానుకూలంగా స్పందించారని భేటీ అనంతరం వారు ప్రకటించారు. ఈనెల 1న తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ 6 ద్వారా 1,640 నర్సింగ్ సిబ్బందిని అవుట్సోర్సింగ్ ద్వారా తీసుకోవాలని, వారికి నెలకు రూ.25 వేలు వేతనం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. కరోనా రేగుల మధ్య విధులకు నిర్వహిస్తున్న తమకు కేవలం రూ.750 మాత్రమే ప్రోత్సాహం వస్తోందని, ఒక నెల జీతం ఇన్సెంటివ్గా ప్రకటించాలని మంత్రిని కోరగా సానుకూలత వ్యక్తం చేశారని వెల్లడించారు. నర్సులు సమ్మె విరమించడంతో వైద్యులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: కరోనా.. మరో రెండేళ్లు ఇదే కథ -
ఔట్సోర్సింగ్ ఉద్యోగాల్లో లంచాలకు తావుండదు
ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే ఉద్యోగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నాం. లంచాలకు తావు లేకుండా ఉద్యోగాలిస్తాం. నేరుగా వారి జీతాలు వాళ్లకే అందిస్తాం. సాక్షి, అమరావతి: ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వీలైనంత వరకు ప్రయోజనం కలిగించడం, కోతలు లేకుండా వారి వేతనాలు వారికి పూర్తిగా చెల్లించడంతో పాటు.. ఎక్కడా అవినీతి, లంచాలకు తావు లేకుండా చేసేందుకే ఏపీ ఔట్సోర్సింగ్ సర్వీసుల కార్పొరేషన్ ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. ఇంతకంటే పారదర్శకంగా, గొప్పగా ఎక్కడా ఉండదని, చాలా స్పష్టంగా మార్గదర్శకాల్లో రాస్తే ఎక్కడా లేని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇన్చార్జ్ మంత్రులను పెట్టి ఉద్యోగులను తీసేసే కార్యక్రమాలు చేస్తున్నామని నీచమైన ఆరోపణలు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి పారదర్శకంగా ఈ ప్రక్రియ చేపట్టినా విపక్ష సభ్యులు బురద చల్లుతున్నారని, ప్రతీది రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్షం నిత్యం దిక్కుమాలిన రాజకీయాలు చేస్తూ.. అసత్యాలు చెబుతున్నారని, అందుకే ఈ అంశంపై ప్రివిలేజ్ మోషన్కు వెళ్తామని తెలిపారు. రాష్ట్రంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల అంశంపై మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ఒక గొప్ప ఆలోచనతో ఈ కార్పొరేషన్ను ఏర్పాటు చేశామన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. ఈ వ్యవస్థలో మార్పు కోసమే.. ‘‘ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వడం కోసం లంచాలు, తర్వాత జీతాలు ఇవ్వాలంటే మాకింత ఇస్తేనే అంటూ వసూళ్లు.. మొత్తంగా ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ నష్టపోతున్న పరిస్థితి గత ప్రభుత్వంలో చూశాం. ఈ పేరుతో చివరకు గుళ్లలో శానిటేషన్ పనుల (క్లీనింగ్) కాంట్రాక్ట్ కూడా చంద్రబాబునాయుడు బంధువు భాస్కరనాయుడుకు ఇచ్చారు. మొత్తం మీద వాళ్లకు సంబంధించిన వాళ్లను పెట్టుకుని పూర్తిగా దోచేసే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు ఈ వ్యవస్థ నడిపితే ఈ వ్యవస్థలో మార్పు తీసుకువచ్చే విధంగా మేం కార్పొరేషన్ ఏర్పాటు చేశాం’’. -
ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు మరో ఛాన్స్!
సాక్షి, ఒంగోలు : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకానికి సంబంధించి జిల్లాలో భర్తీ కాని ఉద్యోగాలకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మరో ఛాన్స్ లభించింది. కటాఫ్ 5 మార్కులు తగ్గించడంతో వెయ్యి మందికిపైగా ఉద్యోగాలు లభించే అవకాశం ఏర్పడింది. ఇప్పటి వరకు జిల్లాలో జరిగిన ఉద్యోగ నియామక ప్రక్రియలో రోస్టర్ పాయింట్ల విడదీత పొరపాట్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఓపెన్ కేటగిరిలో మార్కులు సాధించినా రిజర్వేషన్ కేటగిరిలో ఉద్యోగాలు భర్తీ చేశారు. దీనిపై అర్హత కలిగిన అభ్యర్థులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎస్సీ, ఎస్టీల్లో ఓపెన్ కేటగిరిలో మార్కులు సాధించిన అబ్యర్థులను ఓపెన్ కేటగిరిలో చేర్చారు. దీంతో రిజర్వేషన్లో ఖాళీలు ఏర్పడ్డాయి. సర్టిఫికెట్ల పరిశీలన చివరిరోజు సుమారు 40 మంది ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ల ద్వారా అవకాశం కల్పించారు. అంతేగాకుండా సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకాని వారిని కూడా తొలగించి ఆ తర్వాత మార్కులు వచ్చిన వారికి అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ తెలిపారు. ఈ మేరకు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగా మరోసారి భర్తీ చేసేందుకు అనుమతి లభించింది. ఎస్సీ, ఎస్టీల్లో ఉన్న ఖాళీలను పూరించేందుకు ప్రభుత్వం కటాఫ్ మార్కులను తగ్గించి అన్ని కేటగిరిల్లో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే పలు శాఖల్లో కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్న అభ్యర్థులకు సంబంధించి వెయిటేజ్ మార్కుల పరిశీలన అనంతరం తగ్గించిన కటాఫ్ మార్కులతో మెరిట్ జాబితా జిల్లా కలెక్టర్కు చేరింది. ఆ మేరకు ఉద్యోగ నియామకాలపై కసరత్తు ప్రారంభించారు. రెండో విడతలో మరో వెయ్యిమందికి పైగా ఉద్యోగాలు పొందవచ్చని జిల్లా కలెక్టర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే దాదాపు 5,500 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియ వేగవంతంగా చేస్తున్నట్లు తెలిపారు. -
గురుకుల నియామకాల్లో ‘ఔట్సోర్సింగ్’ అవినీతి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విభాగాల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నియామక సమయంలో అభ్యర్థుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గత రెండు, మూడేళ్లలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో అత్యధికంగా ఉద్యోగులు గురుకుల పాఠశాలల్లోనే నియామకమయ్యారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల విద్యాలయాల్లో దాదాపు 8 వేల మంది ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా నియమితులయ్యారు. కాంట్రాక్టు సిబ్బందికి సొసైటీలే నేరుగా పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి నియమించుకోగా.. వంట సిబ్బంది, వాచ్మెన్, జూనియర్ అసిస్టెంట్, డాటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ అసిస్టెంట్ తదితర కేటగిరీల్లోని పోస్టులన్నీ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారానే భర్తీ చేశారు. ఫిర్యాదులతో కదిలిన సొసైటీలు ఈ నియామకాల క్రమంలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు భారీగా అవకతవకలకు పాల్పడినట్లు ఇటీవల గురుకుల సొసైటీలకు ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై స్పందించిన సొసైటీ యంత్రాంగం ఒకట్రెండు చోట్ల క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టగా పలు విషయాలు వెలుగు చూశాయి. ప్రతి కేటగిరీలో 2 నెలల నుంచి 6 నెలల వేతనాన్ని ముందస్తుగా వసూలు చేసినట్లు తేలింది. దీంతో కంగుతిన్న యంత్రాంగం ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంది. కొత్త గురుకుల పాఠశాలల్లో నియమించిన ప్రతి ఉద్యోగి నుంచి సమాచారం సేకరించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. అలాగే ప్రభుత్వ అనుమతితో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. రూ.లక్ష వరకు వసూలు గురుకుల పాఠశాలల్లో ఉద్యోగాల భర్తీ క్రమంలో ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు పెద్దమొత్తంలో వసూళ్లు చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. వేర్వేరు జిల్లాలకు చెందిన దాదాపు 12 మంది ఉద్యోగులు ఇలా సొసైటీ కార్యదర్శులకు లేఖలు సమర్పించారు. రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసినట్లు వారు అందులో పేర్కొన్నారు. కొంత మంది కిందిస్థాయి (వాచ్మెన్) ఉద్యోగుల దగ్గర 3 నెలల వేతనం, మరికొందరి దగ్గర 6 నెలల వేతనాన్ని ముందస్తుగా వసూలు చేసినట్లు పేర్కొన్నారు. దీంతో ఉద్యోగుల ఫిర్యాదులపై సొసైటీ అధికారులు ప్రాథమికంగా విచారణ చేపట్టగా పై అంశాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణ చేపడితే అక్రమాల తంతు బయటపడే అవకాశముంది. -
ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా?
సాక్షి, హైదరాబాద్: ‘ఇప్పుడు ఎక్కడ చూసినా ఔట్సోర్సింగే. ఆఖరికి హైకోర్టులో కూడా. శాశ్వత ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేయకుండా ఇలా ప్రతీ శాఖలోనూ ఔట్సోర్సింగ్ పద్ధతిని అనుసరిస్తూ పోతుంటే సగం పాలన ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే ఉంటుంది. అవసరాన్ని బట్టి ఔట్సోర్సింగ్ ద్వారా ఉద్యోగులను నియమించుకోవడం బాగానే ఉంది. మరి ఆ ఉద్యోగుల బాగోగులు, చట్ట నిబంధనల ప్రకారం వారికి దక్కాల్సిన ప్రయోజనాల గురించి మాట్లాడని ఔట్సోర్సింగ్ ఏజెన్సీల సంగతేంటి.. వారిని ప్రశ్నించే వారెవరు.. ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తాల్లో డబ్బు తీసుకుని, ఔట్సోర్స్ ఉద్యోగులకు చాలీచాలని జీతాలిస్తుంటే నిలదీసే వారెవరు.. గొప్పగొప్ప కార్మిక నేతలంతా కన్నుమూశారు. ఔట్సోర్స్ ఉద్యోగుల విషయంలో ఏజెన్సీల వ్యవహారశైలిని చూస్తుంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా.. అన్న అనుమానం కలుగుతోంది..’ హైకోర్టు ధర్మాసనం ఔట్సోర్సింగ్ ఉద్యోగుల హక్కులు, వారికి చట్ట ప్రకారం దక్కాల్సిన ప్రయోజనాలు తదితర విషయాలపై పూర్తిస్థాయిలో వాదనలు వినాల్సిన అవసరముందని హైకోర్టు అభిప్రాయపడింది. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసం ఓ విధానాన్ని రూపొందించాల్సిన అవసరముందంది. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రప్రభుత్వ వైఖరి కూడా తెలుసుకుంటామని, అందువల్ల ఈ వ్యాజ్యంలో కేంద్ర కార్మికశాఖను కూడా ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్కు స్పష్టం చేసింది. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం కోసం ఏమేమి చేయొచ్చో తెలపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తేల్చి చెప్పింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డిల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో ఏజెన్సీలు దారుణంగా వ్యవహరిస్తున్నాయని, కనీస వేతనాలు, సెలవులు ఇవ్వడం లేదని, అలాగే పెద్ద ఎత్తున ఆ ఏజెన్సీలు ఆదాయ పన్ను ఎగవేస్తున్నాయని, వీటన్నింటిపై విచారణ జరిపి, తప్పు చేసిన ఏజెన్సీలను బ్లాక్లిస్ట్లో పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర టూరిజం కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. ఇది చాలా విస్తృతమైన అంశమని తెలిపింది. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలపై ప్రభుత్వానికి ఎటువంటి నియంత్రణ లేదంది. ఏజెన్సీలు చేతులెత్తేస్తే పరిస్థితేంటి? ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో ఏజెన్సీలు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా.. అన్న సందేహం కలుగుతోందని కోర్టు వ్యాఖ్యానించింది. ఔట్సోర్సింగ్ ఇప్పుడు ఓ పెద్ద వ్యాపారంగా మారిపోయిందని, ఉద్యోగులను సరఫరా చేసినందుకు ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని, అందులో నామమాత్రపు మొత్తాన్ని ఆ ఉద్యోగులకు ఇస్తున్నారంది. ఆస్పత్రి, ప్రభుత్వ కార్యాలయం, హైకోర్టు.. ఇలా ఎక్కడ చూసినా ఔట్సోర్సింగ్ ఉద్యోగులే కనిపిస్తున్నారంది. వీరికి జీతాలు చెల్లించకుండా ఏజెన్సీలు చేతులెత్తేస్తే పరిస్థితి ఏమిటనే దానిపై ఎవ్వరూ ఆలోచన చేయడం లేదని తెలిపింది. ఇటువంటి వాటి గురించి ప్రశ్నించేందుకు గతంలో గొప్ప గొప్ప కార్మిక నేతలు ఉండేవారని, వారిలో ఇప్పుడు ఎవరూలేరంది. నిచ్చెనలుండవు.. కోరలు చాచిన పాములే ‘వైకుంఠపాళి ఆటలోలాగా ఈ ఔట్సోర్స్ ఉద్యోగులు నిచ్చెన ఎక్కాలని చూస్తుంటారు. కానీ ఏజెన్సీలు పాముల్లా మింగేసేందుకు కాచుకుని ఉంటాయి. వాస్తవానికి ఈ ఔట్సోర్స్ వైకుంఠపాళిలో నిచ్చెనలు అసలే ఉండవు. కోరలు చాచిన పాములు తప్ప..’అని హైకోర్టు వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఔట్సోర్స్ ఉద్యోగుల విషయంలో జరుగుతున్న చట్ట ఉల్లంఘనలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, వీరి సంక్షేమం కోసం ఓ విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తిస్థాయి వాదనలు వినాల్సిన అవసరం ఉందన్న ధర్మాసనం.. తదుపరి విచారణను వాయిదా వేసింది. -
సర్కారీ కొలువులకు కోత
న్యూఢిల్లీ: అగ్రవర్ణాల్లోని పేదలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించిన కేంద్రం ప్రభుత్వం.. ఏటా వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని మాత్రం పట్టించుకోవడం లేదు. 2014 నుంచి ఏటికేడు సర్కారీ కొలువులు తగ్గుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఇలా 78 వేలకు పైగా ఉద్యోగాల్లో కోత పడగా కొత్తగా ప్రవేశపెట్టిన 10శాతం రిజర్వేషన్ వల్ల ఒరిగేదేమిటన్న ప్రశ్న యువజనుల మదిని తొలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఏటా బడ్జెట్లో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను వెల్లడిస్తూ.. వచ్చే ఏడాది ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయనున్నదీ చెబుతుంది. కేంద్ర ప్రభుత్వంలో మొత్తం 55 మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఉన్నాయి. రైల్వే ఉద్యోగులను కూడా కేంద్ర సిబ్బందిగానే పరిగణిస్తారు. అయితే, రక్షణ దళాల సిబ్బందిని వీరితో కలపరు. 2018–19 బడ్జెట్ ప్రకారం మొత్తం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 32 లక్షల 52వేలు. 2014 మార్చి 1వ తేదీ నాటికి వీరి సంఖ్య 33 లక్షల 30 వేలు. అంటే, ఈ నాలుగేళ్లలో సుమారు 78 వేల ఉద్యోగాలు తగ్గి పోయాయన్న మాట. ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా వచ్చే ఏడాదికి ఉద్యోగాలను 35 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చింది. అయితే, కేంద్రం ఈ హామీని ఏ ఒక్క ఏడాది కూడా నెరవేర్చలేదు. ప్రభుత్వం కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇవ్వడమే సర్కారీ కొలువుల కోతకు కారణం. కేంద్రం గత కొన్నేళ్లుగా పెద్ద సంఖ్యలో కాంట్రాక్టు ఉద్యోగుల్ని నియమించుకుంటోంది. ముఖ్యంగా ప్యూన్లు, డ్రైవర్లను ఈ పద్ధతిలో నియమిస్తోంది. మరోవైపు పదవీ విరమణ చేసిన ఉద్యోగుల స్థానాలను చాలా ఏళ్లుగా భర్తీ చేయడం లేదు. ఇదికూడా ఉద్యోగాల సంఖ్య తగ్గడానికి కారణమవుతోంది. రైల్వేలో 2010లో ఎంత మంది ఉద్యోగులు ఉన్నారో 2018 నాటికి కూడా అంతమందే ఉన్నారు. 2016 నాటికి రైల్వేలో 13.31 లక్షల మంది ఉండగా, 2017లో 23వేల మందిని తొలగించారు. ఆ లోటు ఇప్పటికీ భర్తీ చేయలేదు. అయితే, పోలీసు శాఖలో ఉద్యోగుల సంఖ్య 10.24 లక్షల నుంచి 11.25 లక్షలకు పెరిగింది. అలాగే, ప్రత్యక్ష పన్నుల విభాగంలో ఉద్యోగులు 45 వేల నుంచి 80 వేలకు పెరిగారు. కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ విభాగాల్లో కూడా 54 వేల నుంచి 93 వేలకు పెరిగారు. కొన్ని విభాగాల్లో పెరిగినా మొత్తం మీద చూస్తే ఉద్యోగాల్లో తగ్గుదలే స్పష్టంగా కనబడుతోంది. -
బతుక్కి ‘భద్రత’ లేదు!
సాక్షి, హైదరాబాద్: పేరుకు వారు భద్రతా సిబ్బంది.. కాని నిత్యం అభద్రతాభావంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఓ అధికారి ఆగడాలకు అల్లాడిపోతున్నారు. ఆ అధికారికి మామూళ్లు ఇవ్వకుంటే బదిలీలు.. మాట్లాడితే సస్పెన్షన్.. ప్రశ్నిస్తే డిస్మిస్కు గురవుతున్నారు. ఇదీ ఆర్టీసీలోని భద్రతా సిబ్బంది దుస్థితి. ఆ అధికారి ఆగడాలు రోజురోజుకు శ్రుతిమించుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఆర్టీసీలో ఉత్తర తెలంగాణకు సంబంధించి నిఘా బాధ్యతలు చూసే ఓ అధికారి రిటైర్డ్ అయి తిరిగి అదేపోస్టులో ఔట్సోర్సింగ్ పద్ధతిలో విధుల్లో చేరాడు. అతనికి సిబ్బంది నెలవారీ మామూళ్లు సమర్పించుకోవాల్సిందే. ఇవ్వకపోతే కక్ష కట్టి ఎడాపెడా ట్రాన్స్ఫర్లు చేస్తున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ఆ అధికారికి మామూళ్లు ఇచ్చిన వారు ఉదయం, సాయంత్రం మాత్రమే వచ్చి సంతకాలు చేసి వెళ్లిపోతారు. వీరంతా బయట ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు’అని ఆరోపిస్తున్నారు. అందుకే, ఆర్టీసీలో నిఘా బాధ్యతలను పర్యవేక్షించాల్సిన కొంతమంది సిబ్బంది ఈ అధికారి అండ చూసుకుని ఏమాత్రం బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని అంటున్నారు. ఈ అధికారి హైదరాబాద్లో ఉంటూ వారంలో ఒక్కరోజు మాత్రమే విధులకు హాజరవుతారని, అత్యవసర ఫైల్స్పై సంతకం చేయాల్సి ఉంటే హైదరాబాద్కే తెప్పించుకుంటారన్నారు. ఆ అధికారి సస్పెండ్ చేసిన సిబ్బంది ఇప్పటికే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని, మరికొందరు మానసిక వేదనకు గురవుతున్నట్లు వాపోతున్నారు. అతనికి అధికారాలే లేవు వాస్తవానికి ఔట్ సోర్సింగ్ కింద పనిచేసే వారికి కార్మికులను డిస్మిస్ చేసే అధికారాలు లేవని పలువురు సిబ్బంది వాపోతున్నారు. నిజంగా ఆ అధికారికి అధికారాలు ఉంటే... ఆర్టీసీ బోర్డు స్వయంగా అతనికి ప్రత్యేకంగా అధికారాలు కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు అతని వద్ద ఉండాలని, కాని అవి ఆయన వద్ద లేవని సిబ్బంది వాదిస్తున్నారు. తెలంగాణకు ప్రత్యేకంగా బోర్డే పూర్తిస్థాయిలో ఏర్పడలేదని, అలాంటపుడు ఇతనికి డిస్మిస్ చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నిస్తున్నారు. బోర్డుకు పూర్తిస్థాయి ఎండీ లేడన్న ధీమాతోనే ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సస్పెన్షన్కు గురైన సిబ్బంది ఆ అధికారి వ్యవహారంపై రవాణా మంత్రి మహేందర్రెడ్డి, ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మ, డీజీపీ మహేందర్రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించారని, ఆయనపై చర్యల విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారని బాధితులు తెలిపారు. -
ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ రాజ్యమేలుతోంది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సర్వీసులు ఉండవన్న ప్రభుత్వం మాటలు ఆచరణకు నోచుకోవడం లేదు. 2011 తరువాత ఆర్టీసీలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎలాంటి పోస్టులు భర్తీ కాకపోవడం గమనార్హం. ప్రభుత్వం ఇటీవల 5,000 పోస్టుల భర్తీకి సూత్రప్రాయ ఆమోదం తెలిపినా.. ఇంతవరకూ ఈ విషయంలో ఎలాంటి ముందడుగు పడలేదు. దీంతో ఉన్న సిబ్బందిపై పనిభారం పెరుగుతోంది. వివిధ విభాగాల్లో ఔట్సోర్సింగ్ విధానం కొనసాగుతుం డటంతో పనిలో నాణ్యత కొరవడుతుండగా, ఔట్ సోర్సింగ్ విభాగాల కాంట్రాక్టర్లు శ్రమదోపిడీకి పాల్పడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి, 2011లో చివరిసారిగా? ఆర్టీసీలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరిగి దాదాపు ఎనిమిదేళ్లు కావొస్తోంది. ఆ తరువాత ఎలాంటి రిక్రూట్మెంట్లు లేవు. ఇకపోతే.. 2009, 2010, 2011లో కాంట్రాక్టు పద్ధతిలో రిక్రూట్ అయిన డ్రైవర్లు, కండక్టర్లను దాదాపుగా 18,000 మందిని సంస్థ రెగ్యులరైజ్ చేసింది. ఆ సమయంలో కావాల్సిన అర్హతలు లేని కారణంగా 4,000 మంది క్రమబద్ధీకరణకు నోచుకోలేకపోయారు. కొందరు 2015 సమ్మె సందర్భంగా రెగ్యులరైజ్ అయినా, దాదాపు 570 మంది రెగ్యులరైజ్ కావాల్సి ఉంది. పెరుగుతున్న పనిభారం! ఆర్టీసీలో 2011 తరువాత ఆరు వేలకుపైగా ఉద్యోగులు పదవీ విరమణ చేశారు. ఇందులో 5,000 పోస్టులను భర్తీ చేసేందుకు ఇటీవల జూన్లో మంత్రుల కమిటీ అంగీకారం తెలిపింది. ఇంత వరకూ ఈ విషయంలో ఎలాంటి అడుగు పడలేదు. మరోవైపు సంస్థాగతంగా ప్రమోషన్లు లేకపోవడం కార్మికులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఔట్సోర్సింగ్ దయనీయం.. డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేకపోవడంతో ఔట్సోర్సింగ్ (పొరుగుసేవలు) కింద పలువురిని భర్తీ చేసు కున్నా రు. మెకానిక్లు, ఆర్టిజెన్స్ (వడ్రంగి, ఎలక్ట్రీషియన్లు తదితరులు)తోపాటు కీలకమైన సెక్యూరిటీ సిబ్బంది లోనూ ఔట్సోర్సింగ్ సిబ్బందే పనిచేస్తున్నారు. వీరికి నామమాత్రం జీతాలే ఇస్తుండగా, ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తామంటూ.. కార్మికుల వద్ద కొందరు ఔట్సోర్సింగ్ కాంట్రాక్టర్లు వేలకువేలు వసూలు చేస్తున్నారు. తమ ఉద్యోగాలు రెగ్యులరైజ్ అవు తాయన్న ఆశతో అప్పుచేసి కాంట్రాక్టర్ల చేతిలో పోసి ఔట్ సోర్సింగ్ సిబ్బంది మరన్ని ఇబ్బందులు పడుతున్నారు. -
వేతనాల్లేవ్..ఇక ఏడుపే
పాల్వంచ: జిల్లాలోని ఐటీడీఏ పరిధిలో గల గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులకు గత ఏడు నెలలుగా వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారు. ఇచ్చే అరకొర జీతం కూడా ప్రతి నెలా అందకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలు 86 ఉండగా వాటిలో 450 మంది కార్మికులు (స్వీపర్లు, కుక్లు, వాచ్మెన్లు, హెల్పర్లు, స్కావెంజర్లు) పనిచేస్తున్నారు. వీరికి రావాల్సిన వేతనాలు రూ.60 లక్షల మేర పేరుకు పోయాయి. అంతేగాక 2016లో వేసవి శిబిరాల సమయంలో పనిచేసిన వేతనాలు కూడా ఇప్పటివరకు రాకపోవడం గమనార్హం. ఆ సమయంలో పనిచేసిన సబ్జెక్టు ఉపాధ్యాయులకు ఈఎల్స్(సంపాదిత సెలవులు) ఇచ్చారు. సీఆర్టీలకు కూడా వేతనాలు అందించారు. వారితో పాటు పనిచేసిన కార్మికులకు మాత్రం ఇంత వరకూ అతీగతీ లేదు. వేతనాలు అందించాలని ప్రపోజల్స్ పంపి నెలలు గడుస్తున్నా ఉన్నతాధికారులు కనికరించడం లేదని కార్మికులు వాపోతున్నారు. ఎప్పుడు వస్తాయో కూడా తెలియడం లేదని ఆందోళన చెందుతున్నారు. వెట్టి కష్టాలు ఇంకెన్నాళ్లో.. ఏజెన్సీ, నాన్ ఏజెన్సీ, మున్సిపాలిటీల పరిధిలో గల ఆశ్రమ పాఠశాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులందరిదీ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. రెండు, మూడు దశాబ్దాలకు పైగా ఐటీడీఏ పరిధిలోనే పనిచేసున్న వారు అనేక మంది ఉన్నారు. వీరిని పర్మనెంట్ చేయాలని కోరుతున్నా పట్టించుకునే వారు లేరు. మరోవైపు జీతాలు కూడా సకాలంలో అందక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. పెరిగిన పనిభారం.. హాస్టళ్లు, పాఠశాలల్లో పనిచేస్తున్న కార్మికులకు పనిభారం పెరిగింది. గతంలో ఉన్న మెనూకు, ప్రస్తుత మెనూకు చాలా తేడా ఉంది. విద్యార్థులకు ఉదయం రకరకాల టిఫిన్లు, భోజనం, వెజ్, నాన్ వెజ్ వంటలు పెడుతున్నారు. పాఠశాలల్లో తరగతి, వసతి గదులు కూడా పెరిగాయి. వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడంతో పాటు ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా విధులు నిర్వహించాలి. ఇలా పనిభారం నానాటికీ పెరుగుతున్నా వేతనాలు మాత్రం పెరగడం లేదు. సెలవులు వస్తే జీతాల్లో కోత విధిస్తున్నారని, ఆరోగ్యం సరిగా లేక సెలవులు తీసుకున్నా వేతనాలు తగ్గించి ఇస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఐటీడీఏ డీడీ సీహెచ్.రామ్మూర్తిని వివరణ కోరేందుకు పలుమార్లు ప్రయత్నించినా అందుబాటులో లేరు. జీతాలు సకాలంలో రావడం లేదు. జీతాలు సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్నాం. రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు మావి. ప్రతి నెలా జీతాలు ఇస్తే బాగుంటుంది. కానీ ఐదారు నెలలకు కూడా ఇవ్వక పోతే కుటుంబాల పోషణ ఇబ్బందిగా ఉంది. – కాంతమ్మ, హెల్పర్ పనిభారం పెరిగింది గతం కంటే ఆశ్రమ హాస్టళ్లలో పనిభారం పెరిగింది. ఇప్పుడు మెనూ కూడా పెంచారు. అయినా కష్టపడి విద్యార్థులకు సమయానికి వండి పెడుతున్నాం. పనిభారం ఎక్కువైనా వేతనాలైతే పెరగలేదు. ఇన్ని నెలల పాటు జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నాం. – రాంబాయి, హెల్పర్ పర్మనెంట్ కాక ఇబ్బందులు రెండు, మూడు దశాబ్దాల కాలంగా పనిచేస్తున్న వారికి కూడా పనిభద్రత కరువైంది. ఐటీడీఏను నమ్ముకుని పనిచేస్తున్న మాకు పర్మనెంట్ చేసి వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించాలి. కష్టానికి తగిన ఫలితం లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. – సరోజిని, హెల్పర్ -
ఔట్సోర్సింగ్ ఏజెన్సీల దోపిడీకి చెక్!
సాక్షి, హైదరాబాద్ : ఔట్సోర్సింగ్ కాంట్రాక్టర్ల దోపిడీకి త్వరలో బ్రేక్ పడనుంది. రాష్ట్రంలోని పురపాలికల్లో పని చేస్తున్న వేలాది మంది పారిశుధ్య కార్మికులకు వేతనాల చెల్లింపులతోపాటు ఈఎస్ఐ, పీఎఫ్ నిధుల విషయంలో చేతివాటం ప్రదర్శిస్తున్న ఔట్సోర్సింగ్ కాంట్రాక్టర్లను ఇకపై నియమించరాదని రాష్ట్ర పురపాలక శాఖ నిర్ణయించింది. ప్రస్తుత ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ఒప్పంద కాలం ముగిసిన తర్వాత కొత్త ఏజెన్సీల నియామకం కోసం టెండర్లు నిర్వహించరాదని అన్ని పురపాలికలను ఆదేశించింది. ఔట్సోర్సింగ్ ఏజెన్సీల స్థానంలో పారిశుధ్య కార్మికుల సంఘాలు(సానిటేషన్ వర్కర్స్ గ్రూప్స్/ఎస్డబ్ల్యూజీ) ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ కార్మిక సంఘాలను రిజిస్ట్రర్ చేయించి వాటి ద్వారా ప్రస్తుతం పని చేస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలు వినియోగించుకోవాలని కోరింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో ఇప్పటికే గ్రూపులను ఏర్పాటు చేసి వాటి ద్వారానే పారిశుధ్య కార్మికుల సేవలను వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలోని మిగిలిన 73 పురపాలికల్లోనూ కార్మిక సంఘాలు ఏర్పాటు చేయాలని రాష్ట్రస్థాయి సలహా సంఘం చేసిన సిఫారసుల మేరకు పురపాలక సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీని మినహాయిస్తే మిగిలిన 73 పురపాలికల్లో సుమారు 16 వేల మంది ఔట్సోర్సింగ్ కార్మికులు పని చేస్తున్నారు. తాజా నిర్ణయంతో వీరందరికీ ఔట్సోర్సింగ్ కాంట్రాక్టర్ల వేధింపులు తప్పనున్నాయి. ఒక్కో గ్రూపులో ఏడుగురు ప్రతి ఏడుగురు పారిశుధ్య కార్మికులతో గ్రూపు ఏర్పాటు చేసి సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం కింద రిజిస్టర్ చేయాలని పురపాలక శాఖ సూచించింది. 2017 జూన్ నాటికి హాజరు పట్టికలో పేర్లున్న వారితోనే ఈ గ్రూపులు ఏర్పాటు చేయాలని, ఒక గ్రూపులో ఒకే కుటుంబం నుంచి ఒకరిని మించి నియమించరాదని కోరింది. సొసైటీల రిజిస్ట్రేషన్ విషయంలో పారిశుధ్య కార్మికులకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఉద్యోగులు సహకారం అందించాలని సూచించింది. గ్రూపులోని కార్మికులందరూ ఒకే పనివేళకు చెందిన వారై ఉండాలని స్పష్టం చేసింది. కార్మికులకు జీతాలను బ్యాంకు ఖాతాల్లో వేయాలని, ఆధార్తో అనుసంధానం చేసి బయోమెట్రిక్ విధానంలో హాజరు నమోదు చేయాలని కోరింది. కార్మికుల ఈఎస్ఐ, పీఎఫ్ ఖాతాల్లో నిధులు జమ చేసే ప్రక్రియను నోడల్ ఏజెన్సీల ద్వారా జరపాలని సూచించింది. వారంలో 6 రోజులు గ్రూపులోని ఏడుగురు కార్మికుల్లో రోజూ ఆరుగురికి పని కల్పించడంతోపాటు ఒకరికి సెలవు ఇవ్వాలని పురపాలక శాఖ కోరింది. కార్మికుల మధ్య పరస్పర అవగాహనతో వారి అవసరాల కోసం సెలవులను మార్పు చేసుకునే అవకాశాన్ని కల్పించాలని తెలిపింది. మరోవైపు కార్మికుల గ్రూపులకు పని అప్పగింత విషయంలో స్పష్టమైన లెక్కలు ఇచ్చింది. 60 అడుగుల వెడల్పు కలిగిన రోడ్డును 500 మీటర్ల పొడవున ఊడ్చే పనిని ఒక్కో కార్మికుడికి అప్పగించాలని కోరింది. 80 అడుగుల వెడల్పు ఉన్న రోడ్డయితే 350 మీటర్ల పొడవున, 40 అడుగుల వెడల్పు రోడ్డయితే 750 మీటర్ల పొడవున ఊడ్చే పనిని ఒక్కొక్కరికి అప్పగించాలని తెలిపింది. వేతన కష్టం రాష్ట్రంలోని మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం రూ.11,473 వేతనం చెల్లిస్తుండగా, ఈఎస్ఐ, పీఎఫ్, కాంట్రాక్టర్ కమీషన్, సర్వీస్ ట్యాక్స్ పోగా రూ.8,300 చేతికి అందుతోంది. నగర పంచాయతీల కార్మికులకు రూ.10,091 వేతనం చెల్లిస్తుండగా, కోతలన్నీ పోగా కార్మికుల చేతికి రూ.7,300 మాత్రమే అందుతున్నాయి. కార్మికుల వేతనాల్లో 7.5 శాతాన్ని ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు కమీషన్గా పొందుతున్నాయి. దీంతో చాలీచాలని ఈ వేతనాలను పెంచాలని కార్మికులు మూడేళ్లుగా ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం ఔట్సోర్సింగ్ ఏజెన్సీల విధానాన్ని విరమించుకోవడంతో వారికి అందిస్తున్న 7.5 శాతం కమీషన్ పురపాలికలకు మిగిలిపోనుందని అధికార వర్గాలు తెలిపాయి. -
ఉద్రిక్తత మధ్య వక్ఫ్ బోర్డు పాలకవర్గ భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వక్ఫ్ బోర్డు పాలకవర్గ సమావేశం సందర్భంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. శనివారం ఉదయం 11 గంటలకు హజ్ హౌస్లోని మొదటి అంతస్తులో సమావేశం ప్రారంభం కాగానే.. పలు స్వచ్ఛంద సంస్థలు, మసీదు కమిటీల సభ్యులు సమావేశ మందిరంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. వక్ఫ్ చట్టం ప్రకారం కాకుండా బోర్డు ఇష్టానుసారం వక్ఫ్ కమిటీలను ఏర్పాటు చేస్తోందని ఆరోపిస్తూ ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యారు. కమిటీలు, వక్ఫ్ నిర్వాహకుల నియామకాలతోనే సమావేశాలు ముగుస్తున్నాయని, వక్ఫ్ ఆస్తులు, భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. కాన్ఫరెన్స్ హాల్ ఎదుట బైఠాయించడానికి ప్రయత్నం చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు.. సమావేశం జరుగుతున్న ప్రదేశానికి ఎవరినీ అనుమతించలేదు. హజ్ హౌస్లో రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయంతో పాటు మైనార్టీ సంక్షేమ శాఖకు సంబంధించినఇతర కార్యాలయాలు ఉన్నాయి. దీంతో వాటికి వచ్చే వారికి ఇబ్బందులు ఎదురయ్యాయి. చివరికి ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోకుండానే సమావేశం వాయిదా పడింది. మొక్కుబడిగా సమావేశం.. సమావేశం అనంతరం బోర్డు చైర్మన్ సలీం మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని మసీదు, పలు సంస్థల పాలకవర్గ కమిటీలకు అనుమతులు ఇచ్చామన్నారు. ముస్లింల మ్యారేజ్ సర్టిఫికెట్ల ఆన్లైన్ ప్రక్రియ వాయిదా పడిందన్నారు. వక్ఫ్ కార్యకలాపాలు వేగవంతం చేయడానికి 50 మంది యువకులను ఔట్సోర్సింగ్ విధానంలో నియామకంపై వచ్చే పాలకవర్గ సమావేశంలో చర్చిస్తామ న్నారు. 2018కి బడ్జెట్ నివేదిక ఇంకా సిద్ధం కాలేదని, దీన్ని వచ్చే సమావేశంలో ప్రవేశపెడతామని చెప్పారు. వచ్చే నెల 10న మళ్లీ పాలకవర్గ సమావేశం నిర్వహిస్తామన్నారు. -
కొనుగోల్మాల్!
జిల్లాలోని భువనగిరి, ఆలేరులో ఏర్పాటు చేసిన హాకా కందుల కొనుగోలు కేంద్రాల్లో గోల్మాల్ జరుగుతోంది. రైతులు తెచ్చిన కందులను వెంటనే కొనకుండా వివిధ అడ్డంకులు సృష్టిస్తూ దళారులు తెచ్చిన కందులను క్షణాల్లోనే కొనేస్తున్నారు. దీంతో వ్యవసాయ మార్కెట్ యార్డులు అక్రమాలకు అడ్డాలుగా మారాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కందుల కొనుగోళ్ల విషయంలో దందా సాగుతున్నా.. ఎవరూ పర్యవేక్షించడం లేదు. ఫలితంగా జిల్లాలోని కందుల కొనుగోలు కేంద్రాలు ప్రజాప్రతినిధులు, అధికారులు, దళారులకు సిరులు కురిపిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, యాదాద్రి : జిల్లాలోని భువనగిరి, ఆలేరు వ్యవసాయ మార్కెట్లలో ఐదురోజుల క్రితం కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే పాలకవర్గాలు.. దళారులతో కుమ్మక్కై వారినుంచి టన్నుల కొద్దీ కందులను కొంటున్నారు. ఆరుగాలం శ్రమించి రైతు పండించిన కందులను మాత్రం కొనకుండా రేపుమాపు అంటూ కేంద్రాలకు తిప్పుకుంటూ దళారులు తేగానే క్షణాల్లో కొనేస్తున్నారు. ఇందంతా అధికారుల కనుసన్నల్లోనే కొనసాగుతోంది. ఇందుకు ఉదాహరణ ఆలేరులో ఐదు రోజుల క్రితం కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభించగా అదేరోజు ఆలేరు మండలానికి చెందిన ఓ రైతు 30 సంచుల కందులను తెచ్చాడు. ఆ రైతు తెచ్చిన కందులను ఈ రోజు వరకు కొనుగోలు చేయలేదు. ప్రతిరోజు కార్యాలయం చుట్టూ అధికారుల చుట్టూ తిరిగిపోతున్నా.. స్పందన లేదు. మరోవైపు సోమవారం వరకు ఆలేరు మార్కెట్లో 1,400 క్వింటాళ్ల కందులు కొనుగోలు చేశారు. భువనగిరిలో 1,100 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. ఇప్పటివరకు జరిగిన ఈ మొత్తం కొనుగోళ్లపై విచారణ జరిపిస్తే భారీ కుంభకోణం బయటపడుతుందని రైతులు చెబుతున్నారు. తాజా ఘటన ఇలా.. మంగళవారం అనంతపురం జిల్లా నుంచి లారీలో తెచ్చిన కందులను భువనగిరి కొత్త మార్కెట్ యార్డులో విక్రయిస్తుండగా రెవెన్యూ అధికారులు పట్టుకోవడంతో దళారుల దందా వెలుగు చూసింది. ఈ కందులు అనంతపురం నుంచి వచ్చాయా లేక స్థానిక దళారులు తెచ్చినవా అన్న కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. కాగా మార్కెట్ కమిటీ పాలకవర్గం, అధికారుల కనుసన్నలలో అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. గత సంవత్సరం కూడా కందుల కొనుగోలులో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేపట్టింది. కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. కందులు కొనుగోలు చేయడానికి పట్టాదారు పాస్ పుస్తకాలు, బ్యాంక్ అకౌంట్లు, వీఆర్వోల ధ్రువీకరణలతో వందలాది క్వింటాళ్ల కందులు మార్కెట్ యార్డ్ల్లో కొనుగోలు జరుగుతోంది. రూ.5,450 మద్దతు ధర.. జిల్లాలోని భువనగిరి, ఆలేరు, మార్కెట్యార్డ్లలో హాకా ద్వారా ప్రభుత్వం కందులను కొనుగోలు చేస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.5250, బోనస్ రూ.200 కలిపి ప్రతి క్వింటాల్కు రూ.5450 చెల్లిస్తున్నారు. సకాలంలో కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రకరకాల కొర్రీలతో కొనుగోలు చేయకుండా రైతులను తిప్పుకోవడంతో విసిగిపోయిన రైతులు గ్రామాల్లో దళారులకు క్వింటాల్ రూ.3500నుంచి రూ.4000 వరకు అమ్ముకుంటున్నారు. వీటిని దళారులు తిరిగి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రూ.5,450లకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఆ కందులు ఎక్కడివి! ఆంధ్రప్రదేశ్లోని అనంతపురానికి చెందిన లారీలో 17 టన్నుల కందులు భువనగిరి మార్కెట్కు భువనగిరి మండలం పచ్చర్లబోడుతండాకు ఇస్మాయిల్ ఉదయం లారీలో తెచ్చాడు. సుమారు 7 టన్నుల వరకు కందులను లారీలోంచి మార్కెట్లో దించారు. విషయం గమనించిన రైతులు విషయం తెలుసుకున్న భువనగిరి రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవీందర్రెడ్డి, బొల్లేపల్లి వీఆర్ఓ లక్ష్మినర్సయ్యను పిలిపించి లారీలోంచి దించుతున్న కందులను అడ్డుకున్నారు. ఇదేలారీ మార్కెట్ నుంచి మాయమై రాత్రి వరకు భువనగిరి పట్టణ శివారులోని ఓ పెట్రోల్ బంక్ వద్ద సుమారు నాలుగు గంటల పాటు నిలిపివేశారు. అనంతరం అక్కడినుంచి ఆ లారీ వెళ్లిపోయింది. కానీ అది ఎక్కడికి వెళ్లిందో.. ఆ లారీ ఏమైనట్లో ఎవరికీ తెలియదు. అలాగే ఆలేరు వ్యవసాయ మార్కెట్ యార్డులో స్థానిక దళారులతో కలిసి కందుల విక్రయాలు జరుగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. తాము పండించిన కందులను కొనుగోలు చేయడానికి ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. గత సంవత్సరం భువనగిరి మార్కెట్ యార్డ్లో గడ్డం శ్రీనివాస్ అనే వ్యాపారి విక్రయించిన 30 క్వింటాళ్ల కందులపై విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేశారు. కొనుగోళ్ల బాధ్యత ఔట్సోర్సింగ్ సిబ్బందిదే.. మార్కెట్ యార్డుల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బందే ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారు. మార్కెట్ కార్యదర్శులు, ఇతర శాఖల అధికారులు కొనుగోలు బా«ధ్యతలను ఔట్సోర్సింగ్ సిబ్బందికి అప్పగిస్తున్నారు. ఉన్నతాధికారులు వచ్చినప్పుడు మాత్రమే అధికారులు కనిపిస్తున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న ఔట్సోర్సింగ్ సిబ్బందిపై నిఘా లేకుండాపోయింది. ఇప్పటికైనా ఈ వ్యవహారంపై అధికారులు దృష్టి సారించి తమకు నాయ్యం జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ లండన్ పర్యటన
వ్యక్తి దుర్మరణం
కొనసాగిన ఈ – కంటెంట్ జనరేషన్పై శిక్షణ
‘నన్నయ’ వర్సిటీ అభివృద్ధికి ‘న్యూయోమ్’ సహకారం
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
భూతదయకు ప్రా‘ధాన్యం’
రెండు బైక్లు ఢీకొని వ్యక్తి మృతి
అబ్బుర పర్చిన డాగ్ షో
సమ్మర్లో చదివేద్దాం
వాహనం ఢీకొని వ్యక్తి మృతి
తప్పక చదవండి
- ‘నన్ను పాస్ అవమంటారు.. మరి నాన్నేం చేశారు?’
- తెలంగాణ ఈఏపీ సెట్లో ఏపీ విద్యార్థి సత్తా
- ఆగ్రాలో మరో ‘వాహ్ తాజ్’.. పర్యాటకులు క్యూ
- అనంతలో ఘోర ప్రమాదం: పెళ్లి షాపింగ్ చేసి తిరిగొస్తుండగా..
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
- టీడీపీ దాష్టీకానికి పరాకాష్ట
- చివరి బెర్త్ ఎవరిదో?
Advertisement