-
తెలంగాణ ఈఏపీసెట్లో ఏపీ ప్రభంజనం
సాక్షి, హైదరాబాద్/కొమరాడ/పాలకొండ/బలిజిపేట/గుంటూరు ఎడ్యుకేషన్/కర్నూలు సిటీ: తెలంగాణలో బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు దుమ్ము లేపారు. ఇంజనీరింగ్, అగ్రి–ఫార్మా.. రెండు విభాగాల్లోనూ మొదటి ర్యాంకులు సాధించి సత్తా చాటారు. ఇంజనీరింగ్ విభాగంలో పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండకు చెందిన సతివాడ జ్యోతిరాదిత్య, అగ్రికల్చర్–ఫార్మసీ విభాగంలో అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన ఆలూరు ప్రణీత ఫస్ట్ ర్యాంకులతో ప్రభంజనం సృష్టించారు. రెండు విభాగాల్లోనూ టాప్ టెన్లో ఐదుగురు చొప్పున ఏపీ విద్యార్థులు ర్యాంకులు దక్కించుకోవడం విశేషం. తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలను శనివారం ఆ రాష్ట్ర విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఆన్లైన్ ద్వారా సీట్ల భర్తీ! టీఎస్ ఈఏపీసెట్ ఈ నెల 7 నుంచి 11 వరకు జరిగింది. ఇంజనీరింగ్ విభాగానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 2,54,750 మంది దరఖాస్తు చేశారు. వీరిలో 2,40,618 మంది పరీక్ష రాయగా 1,80,424 మంది అర్హత సాధించారు. అలాగే అగ్రికల్చర్–ఫార్మా విభాగంలో రెండు రాష్ట్రాల నుంచి 1,00,432 మంది దరఖాస్తు చేస్తే 91,633 మంది పరీక్ష రాశారు. వీరిలో 82,163 మంది అర్హత సాధించారు. ఈ ఏడాది రెండు విభాగాలు కలిపి 3,32,251 మంది రాస్తే.. ఇందులో 2,62,587 (74.98 శాతం) మంది అర్హత సాధించారు. వారం రోజుల్లో కౌన్సెలింగ్ తేదీలను ప్రకటిస్తామని బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ ఏడాది ఆన్లైన్ ద్వారా సీట్లను భర్తీ చేసే ఆలోచన చేస్తున్నామన్నారు. మంచి ర్యాంకు సాధించడమే లక్ష్యంగా.. మాది పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం చిలకలపల్లి. అమ్మానాన్న కృష్ణవేణి, నారాయణరావు వ్యవసాయం చేస్తున్నారు. మంచి ర్యాంకు సాధించాలనే పట్టుదలతో చదివా. నా కష్టం ఫలించింది. –నగుడసారి రాధాకృష్ణ, టీఎస్ ఈఏపీసెట్ సెకండ్ ర్యాంకర్ (అగ్రికల్చర్–ఫార్మా విభాగం) ఐఐటీ బాంబేలో చదవడమే నా లక్ష్యం.. మా స్వస్థలం కర్నూలు జిల్లా పంచలింగాల. నాన్న సూర్యకుమార్ యాదవ్ కమ్యూనికేషన్ విభాగంలో ఎస్పీగా పనిచేస్తున్నారు. నేను 10వ తరగతిలో 9.2 జీపీఏ సాధించాను. ఇంటర్లో 951 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్లో అఖిల భారత స్థాయిలో 311వ ర్యాంకు వచి్చంది. ప్రస్తుతం జేఈఈ అడ్వాన్స్డ్కు సన్నద్ధమవుతున్నా. ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్ చేయడమే నా లక్ష్యం. – గొల్లలేఖ హర్ష, టీఎస్ ఈఏపీసెట్ సెకండ్ ర్యాంకర్ (ఇంజనీరింగ్ విభాగం) ఐఏఎస్ అధికారినవుతా.. మాది కర్నూలు జిల్లా ఆదోని. నాన్న రామసుబ్బారెడ్డి, అమ్మ రాజేశ్వరి ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. 8వ తరగతి నుంచి హైదరాబాద్లో చదువుతున్నా. నాకు ఇంటర్లో 987 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్లో 252వ ర్యాంకు వచి్చంది. జేఈఈ అడ్వాన్స్డ్లో మంచి ర్యాంకు తెచ్చుకుని ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదువుతా. తర్వాత సివిల్స్ రాసి ఐఏఎస్ అధికారినవుతా. – భోగాలపల్లి సందేశ్, టీఎస్ ఈఏపీసెట్ నాలుగో ర్యాంకర్ (ఇంజనీరింగ్ విభాగం) ఐఐటీ బాంబేలో సీఎస్ఈ చదువుతా మాది కర్నూలు. నాన్న ఎం.రామేశ్వరరెడ్డి చిరు వ్యాపారి. అమ్మ గృహిణి. ఇంటర్లో నాకు 980 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్లో అఖిల భారత స్థాయిలో 36వ ర్యాంకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 6వ ర్యాంకు వచ్చాయి. జేఈఈ అడ్వాన్స్డ్లో మంచి ర్యాంకు తెచ్చుకుని ఐఐటీ బాంబేలో చదవాలనుకుంటున్నా. – మురసాని సాయి యశ్వంత్రెడ్డి, టీఎస్ ఈఏపీసెట్ ఐదో ర్యాంకర్ (ఇంజనీరింగ్ విభాగం) ర్యాంకుల శ్రీ‘నిధి’ మాది పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం దళాయిపేట. అమ్మానాన్న సుశీల, శ్రీనివాసరావు ఇద్దరూ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. నాకు జేఈఈ మెయిన్లో అఖిల భారత స్థాయిలో 261వ ర్యాంకు, ఓబీసీ విభాగంలో 35వ ర్యాంకు వచ్చాయి. –ధనుకొండ శ్రీనిధి, టీఎస్ ఈఏపీసెట్ పదో ర్యాంకర్ (ఇంజనీరింగ్ విభాగం) తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే.. మాది పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం యరకరాయపురం. నాన్న మోహనరావు సాంఘిక సంక్షేమ శాఖలో సీనియర్ అసిస్టెంట్గా, అమ్మ హైమావతి ఆర్టీసీలో పనిచేస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే తెలంగాణ ఈఏపీసెట్లో మొదటి ర్యాంకు సాధించగలిగాను. – సతివాడ జ్యోతిరాదిత్య, టీఎస్ ఈఏపీసెట్ ఫస్ట్ ర్యాంకర్ (ఇంజనీరింగ్ విభాగం) గుండె వైద్య నిపుణురాలినవుతా.. మాది అన్నమయ్య జిల్లా మదనపల్లి. నాన్న శ్రీకర్ హోమియో మెడికల్ ప్రాక్టీషనర్గా, అమ్మ కల్యాణి ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నారు. అక్క సంవిధ కాగ్నిజెంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకు పదో తరగతిలో 600కి 589, ఇంటర్ బైపీసీలో 1000కి 982 మార్కులు వచ్చాయి. ఎయిమ్స్ న్యూఢిల్లీలో ఎంబీబీఎస్ చేసి వైద్యురాలిని కావడమే నా లక్ష్యం. కార్డియాక్ సర్జన్గా స్థిరపడాలన్నదే నా ఆకాంక్ష. –ఆలూరు ప్రణీత, టీఎస్ ఈఏపీసెట్ ఫస్ట్ ర్యాంకర్ (అగ్రికల్చర్–ఫార్మా విభాగం) -
రూ. 25,813 కోట్ల పెట్టుబడులు.. 56,171 ఉద్యోగాలు
న్యూఢిల్లీ: ఫార్మా రంగానికి ఉద్దేశించిన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద రూ. 25,813 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి. కొత్తగా 56,171 ఉద్యోగాల కల్పన జరిగింది. కేంద్ర ఫార్మా విభాగం (డీవోపీ) వార్షిక సమీక్షలో ఈ విషయాలు వెల్లడించింది. స్కీముకు ఎంపికైన సంస్థలు రూ. 1,16,121 కోట్ల మేర విక్రయించినట్లు డీవోపీ తెలిపింది. దేశీయంగా ఔషధాల తయారీని మరింతగా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫార్మా పీఎల్ఐ స్కీము ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 2020–2021 నుంచి 2028–2029 మధ్య కాలంలో ఇది అమల్లో ఉంటుంది. ఈ పథకం కింద 55 సంస్థల దరఖాస్తులు ఆమోదం పొందాయి. నాణ్యమైన ఔషధాలను అందుబాటు ధరలో అందించేందుకు తలపెట్టిన ’ప్రధాన మంత్రి భారతీయ జనఔషధి పరియోజన’ కింద ఈ ఏడాది 10,000 రిటైల్ అవుట్లెట్స్ ప్రారంభించాలన్న లక్ష్యం కూడా డీవోపీ పూర్తయినట్లు పేర్కొంది. పీఎంబీజేపీ కింద 1,965 ఔషధాలు, 293 సర్జికల్ పరికరాలు ఉన్నాయి. -
India-US CEO Forum: ఫార్మా బంధం బలోపేతం
న్యూఢిల్లీ: ఫార్మా, సెమీకండక్టర్లు, కీలక లోహాలు, వర్ధమాన టెక్నాలజీలు తదితర అంశాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, అమెరికా నిర్ణయించుకున్నాయి. అలాగే, పర్యవరణ అనుకూల సాంకేతికతలను కలిసి అభివృద్ధి చేయడం, క్రిటికల్ టెక్నాలజీల్లో భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకోవడం వంటి అంశాలపై చర్చించాయి. భారత్–అమెరికా సీఈవో ఫోరం వర్చువల్ భేటీలో భాగంగా కేంద్ర వాణిజ్య మంత్రి పియుష్ గోయల్, అమెరికా వాణిజ్య మంత్రి జినా రైమండో సమావేశంలో ఈ అంశాలు చర్చకు వచి్చనట్లు కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ఫోరం సభ్యులు సూచించిన సిఫార్సుల అమలుపై దృష్టి పెట్టాలని సీఈవో ఫోరంనకు రైమండో సూచించారు. అలాగే ఫోరంలో అమెరికాకు చెందిన దిగ్గజాలు హనీవెల్, ఫైజర్, కిండ్రిల్, వయాశాట్ చేరికను ప్రకటించారు. సెమీకండక్టర్ సరఫా వ్యవస్థ, ఇన్నోవేషన్ హ్యాండ్õÙక్ వంటి వేదికల ద్వారా పరిశ్రమ అవకాశాలను అందిపుచ్చుకోవాలని గోయల్ పేర్కొన్నారు. 2014లో ఫోరంను పునరుద్ధరించిన తర్వాత నుంచి ఇది ఎనిమిదో సమావేశం. వచ్చే ఏడాది తొలినాళ్లలో తదుపరి భేటీ నిర్వహించనున్నారు. భారత్, అమెరికా దిగ్గజ సంస్థల చీఫ్ ఎగ్జిక్యూటివ్లు సభ్యులుగా ఉన్న ఈ ఫోరంనకు టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, లాక్హీడ్ మారి్టన్ ప్రెసిడెంట్ జేమ్స్ టైస్లెట్ సారథ్యం వహిస్తున్నారు. -
మధుమేహానికి గ్లెన్మార్క్ కాంబినేషన్ డ్రగ్
హైదరాబాద్: టైప్–2 మధుమేహానికి గ్లెన్ మార్క్ ఫార్మా తొలి ట్రిపుల్ కాంబినేషన్ డ్రగ్ను దేశీ మార్కెట్లో ప్రవేశపెట్టింది. టైప్–2 మధుమేహం చికిత్సలో వినియోగించే టెనేలిగ్లిప్టిన్, డాపాగ్లిఫ్లోజిన్, మెట్ఫారి్మన్ కలయికతో కూడిన ఫిక్స్డ్ డోసేజ్ కాంబినేషన్ (ఎఫ్డీసీ) ఔషధాన్ని ‘జిటా’ పేరుతో విడుదల చేసింది. మధుమేహంతోపాటు, ఇతర అనారోగ్య సమస్యలున్న వారిని దృష్టిలో పెట్టుకుని దీన్ని తీసుకొచి్చంది. ఇందులో టెనేలిగ్లిప్టిన్ 20 ఎంజీ, డాపాగ్లిఫ్లోజిన్ 10ఎంజీ, మెట్ఫార్మిన్ ఎస్ఆర్ (500/1000ఎంజీ) రూపంలో ఉంటాయి. వైద్యుల సిఫారసు మేరకు ఈ ఔషధాన్ని రోజుకు ఒక్కసారి తీసుకోవాల్సి ఉంటుందని గ్లెన్మార్క్ ఫార్మా తెలిపింది. హెచ్బీఏ1సీ అధికంగా ఉండి, బరువు పెరగడం తదితర ఇతర సమస్యలతో బాధపడే వారిలో ఈ ఔషధం గ్లైసిమిక్ కంట్రోల్ను మెరుగుపరుస్తుందని గ్లెన్మార్క్ ఫార్మా ఇండియా ఫార్ములేషన్స్ హెడ్ అలోక్ మాలిక్ తెలిపారు. -
ఏపీలో పెట్టుబడుల పరుగులు..
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం కృషి ఫలితంగా విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో మరో రూ.1,624 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రానున్నాయి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం విశాఖ, అనకాపల్లి జిల్లాల పర్యటనలో పలు ఐటీ, ఫార్మా కంపెనీల ప్రారం¿ోత్సవాలు, భూమిపూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రధానంగా విశాఖలో ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ను లాంఛనంగా ప్రారంభించడంతో పాటు ఐజియా స్టెరిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, లారస్ సింథసిస్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, లారస్ ల్యాబ్లను ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 4,160 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఇక సీఎం సోమవారం ప్రారంభించే, భూమి పూజ నిర్వహించే యూనిట్ల వివరాలివీ.. ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్.. విశాఖపట్నంలోని మధురవాడ ఐటీ హిల్ నెంబర్–2లో ఇన్ఫోసిస్ ఒక కొత్త డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటుచేసింది. సుమారు రూ.41 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేసిన ఈ సెంటర్ను భవిష్యత్తులో మరింత విస్తరించనున్నారు. ఇది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్గా పనిచేస్తుంది. దీని ఇంటీరియర్ డిజైన్ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైబ్రీడ్ వర్క్ప్లేస్గా రూపొందించారు. దాదాపు వెయ్యిమంది ఈ సెంటర్ నుంచి పనిచేయనున్నారు. గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలకు అనుగుణంగా ఈ కార్యాలయాన్ని తీర్చిదిద్దారు. అత్యంత అధునాతన సదుపాయాలతో విశాలమైన ఆడియో, వీడియో కాన్ఫరెన్స్ హాల్స్, అధునాతన కేఫ్టేరియా, విశాలమైన పార్కింగ్ సౌకర్యాలతో ఈ సెంటర్ను నిరి్మంచారు. దీని ప్రారంభోత్సవం అనంతరం ఇన్ఫోసిస్, వివిధ కంపెనీల ఐటీ ప్రతినిధులతో సీఎం సంభాషిస్తారు. . విశాఖలోని ఇన్ఫోసిస్ కార్యాలయం ఇజియా స్టెరిల్స్ ప్రైవేట్ లిమిటెడ్.. ఫార్మా, బయోటెక్ ఉత్పత్తులకు సంబంధించి రూ.300.78 కోట్లతో పరవాడ ఫార్మాసిటీలో నిరి్మంచిన అరబిందో ఫార్మా అనుబంధ సంస్థ ఇజియా (ఈయూఐజీఐఏ) యూనిట్ను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. ఈ యూనిట్ ద్వారా 800 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. లారస్ సింథసిస్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్.. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ (ఏపీఐ) ఉత్పత్తులకు సంబంధించి రూ.421.70 కోట్లతో అచ్యుతాపురంలో నిరి్మంచిన ఈ యూనిట్ను సీఎం ప్రారంభిస్తారు. దీని ద్వారా 600 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాల కల్పన జరగనుంది. ఇదే కంపెనీ మరో 15 ఎకరాల్లో రూ.407.40 కోట్లతో ఏర్పాటుచేసే యూనిట్ నిర్మాణ పనులకు కూడా సీఎం భూమిపూజ చేస్తారు. విశాఖపట్నంలోని రిషికొండలో ఐటీ సెజ్ లారస్ ల్యాబ్స్ లిమిటెడ్.. ఇక అచ్యుతాపురం ఏపీ సెజ్లోని లారస్ ల్యాబ్స్లో నిర్మించిన అదనపు భవన సముదాయాన్ని, యూనిట్–2 ఫార్ములేషన్ బ్లాక్ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. రూ.460 కోట్లతో ఏర్పాటుచేసిన ఈ యూనిట్ ద్వారా 1,200 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. దీంతోపాటు రూ.407.40 కోట్లతో లారస్ ల్యాబ్స్ కొత్త పరిశ్రమకు కూడా సీఎం భూమిపూజ చేస్తారు. బీచ్ క్లీనింగ్ కోసం జీవీఎంసీ కొనుగోలు చేసిన ప్రత్యేక వాహనాల్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. సీఎం పర్యటన ఇలా.. సోమవారం ఉదయం ఇన్ఫోసిస్ డెవలప్ మెంట్ సెంటర్ ప్రారంభోత్సవం అనంతరం సీఎం హెలికాప్టర్లో అనకాపల్లి జిల్లా పరవాడకు చేరుకుంటారు. రాంకీ ఫార్మాసిటీలోని అరబిందో ఫార్మా అనుబంధ సంస్థ ఇజియా (ఈయూఐజీఐఏ) స్టెరిలీస్ ప్రైవేట్ లిమిటెడ్లో నూతన యూనిట్ను ప్రారంభిస్తారు. ►అక్కడి నుంచి హెలికాప్టర్లో అచ్యుతాపురం సెజ్కు చేరుకుని లారెస్ ఫార్మా ల్యాబ్లో యూనిట్–2 ఫార్ములేషన్ బ్లాక్, ఎల్ఎస్పీఎల్ యూనిట్–2ని ప్రారంభిస్తారు. ►హెలికాప్టర్ ద్వారా విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుని విజయవాడకు బయల్దేరతారు. ►ఈ నేపథ్యంలో.. మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా అధికారులతో కలిసి ఆదివారం రుషికొండ ఐటీ సెజ్లో ఏర్పాట్లను పరిశీలించారు. బీచ్ యంత్రాలు ప్రారంభించే ప్రాంతంతో పాటు హెలిప్యాడ్ను సందర్శించిన మంత్రి.. అక్కడి ఏర్పాట్లు గురించి ఆరా తీశారు. -
Dhruvi Panchal: వన్స్మోర్ వంటలు
అహ్మదాబాద్లోని ఒక హెల్త్కేర్ కంపెనీలో మంచి జీతంతో పనిచేస్తున్న ధృవీ పాంచల్కు వంటలు చేయడం అంటే చాలా ఇష్టం. ఆ పాషన్ తనను ఎక్కడిదాకా తీసుకెళ్లిందంటే వీధి పక్కన ఫుడ్ స్టాల్ స్టార్ట్ చేసేంత వరకు! అలా అని ఆమె ఉద్యోగానికి రాజీనామా చేయలేదు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే సాయంత్రం ఆరు నుంచి రాత్రి పదకొండు వరకు ఫుడ్ స్టాల్ నడుపుతోంది. సోషల్ మీడియాలో షేర్ చేసిన పాంచల్ వీడియో వైరల్ అయింది. ‘చక్కగా ఉద్యోగం చేసుకోకుండా ఎందుకమ్మా ఈ కష్టం’ అన్న వాళ్లు అతి కొద్దిమంది అయితే... ‘ఈ వీడియో మమ్మల్ని ఎంతో ఇన్స్పైరింగ్ చేసింది’ అన్నవాళ్లు ఎక్కువ. -
ఫార్మా, డ్రోన్లు, టెక్స్టైల్స్ పీఎల్ఐలో మార్పులు
న్యూఢిల్లీ: ఫార్మాస్యూటికల్స్, డ్రోన్లు, టెక్స్టైల్స్ రంగాలకు సంబంధించి ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం(పీఎల్ఐ) కింద కేంద్రం మార్పులు చేయనుంది. ఈ రంగాల్లో తయారీ, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు వీలుగా రాయితీలను పెంచనుంది. ఈ విషయాన్ని ఓ సీనియర్ అధికారి అనధికారికంగా వెల్లడించారు. 2021 నుంచి ఇప్పటివరకు 14 రంగాలకు పీఎల్ఐ పథకం కింద కేంద్రం ప్రోత్సాహకాలు ప్రకటించి, దరఖాస్తులను సైతం స్వీకరించింది. మంత్రిత్వ శాఖల మధ్య అంతర్గతంగా కొనసాగిన సంప్రదింపుల్లో భాగంగా ఈ రంగాలకు సంబంధించి సవరణలు చేయాల్సిన అవసరాన్ని గుర్తించినట్టు సదరు సీనియర్ అధికారి తెలిపారు. దీనికి త్వరలోనే కేబినెట్ ఆమోదం పొందనున్నట్టు పేర్కొన్నారు టెక్నికల్ టెక్స్టైల్స్కు నిర్వచనం మార్చనున్నట్టు చెప్పారు. అలాగే, డ్రోన్లు, డ్రోన్ల విడిభాగాలకు కేటాయించిన రూ.120 కోట్లను పెంచనున్నట్టు వెల్లడించారు. వైట్ గూడ్స్ (ఏసీ, ఎల్ఈడీ లైట్లు) రంగాలకు పీఎల్ఐ కింద నగదు ప్రోత్సాహకాలను ఈ నెల నుంచే విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. 2023 మార్చి నాటికి రూ.2,900 కోట్లను ఇవ్వాల్సి ఉందన్నారు. పీఎల్ఐ కింద వైట్ గూడ్స్, వైద్య పరికరాల తయారీ, ఆటోమొబైల్స్, స్పెషాలిటీ స్టీల్, ఆహారోత్పత్తులు తదితర 14 రంగాలకు కేంద్రం రూ.1.97 లక్షల కోట్లను ప్రకటించింది. అయితే, కొన్ని రంగాలకు సంబంధించి పెద్దగా పురోగతి కనిపించలేదు. దీంతో కొన్ని రంగాలకు సంబంధించి మార్పులు చేయాల్సి రావచ్చని కేంద్ర వాణిజ్య శాఖ అధికారి లోగడ సంకేతం ఇవ్వడం గమనార్హం. ముఖ్యంగా అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) బ్యాటరీలు, టెక్స్టైల్స్ ఉత్పత్తులు, స్పెషాలిటీ స్టీల్ రంగాల్లో పీఎల్ఐ పట్ల పెద్దగా స్పందన లేకపోవడంతో మార్పులకు కేంద్రం పూనుకున్నట్టు తెలుస్తోంది. -
మాన్యుఫాక్చరింగ్ హబ్గా విశాఖ
సాక్షి, విశాఖపట్నం: అంతర్జాతీయ వాణిజ్య కార్యకలాపాలకు వేదికగా విశాఖపట్నం మారుతోంది. మాన్యుఫాక్చరింగ్, ఫార్మా, ఐటీ, కార్గో... ఇలా భిన్నమైన రంగాలకు సంబంధించిన పరిశ్రమలు ఒక్కొక్కటిగా విశాఖకు విస్తరిస్తున్నాయి. తాజాగా విశాఖపట్నం స్పెషల్ ఎకనమిక్ జోన్ (వీసెజ్)లో మరో మూడు మాన్యుఫాక్చరింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఆమోదం లభించింది. రూ.500 కోట్లకు పైగా పెట్టుబడులతో రెండు బయో డీజిల్ కంపెనీలు, ఒక ఫార్మా కంపెనీ ఏడాదిలోపు ఏర్పాటు కానున్నాయి. వీటి ద్వారా 1,200 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మరోవైపు తొలి త్రైమాసికంలో గతేడాదితో పోలిస్తే ఉత్పత్తుల ఎగుమతుల్లో 34 శాతం వృద్ధి కనబరిచిన వీసెజ్... అర్ధ సంవత్సరానికి 50 శాతం వృద్ధి నమోదు దిశగా ముందుకు సాగుతోంది. యూఎస్, కెనడాకు ఎగుమతులే లక్ష్యంగా... ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన మూడు యూనిట్లు విశాఖ సెజ్లోనే ఏర్పాటు కానున్నాయి. ఇందులో బయోడీజిల్ తయారీ సంస్థ అద్వైత్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్, బయోకాన్ లిమిటెడ్, ఫార్మాసూ్యటికల్ ఉత్పత్తుల తయారీ సంస్థ గ్రాన్యూల్స్ సీజెడ్ఆర్వో సంస్థలు ఉన్నాయి. ఈ కంపెనీలు ఏడాదిలోపు తమ కార్యకలాపాలు ప్రారంభించాలని వీసెజ్ నిబంధన విధించింది. అయితే... ఈ సంస్థలన్నీ ఆరు నుంచి పది నెలల్లోపే ఉత్పత్తుల తయారీని మొదలు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని వీసెజ్ అధికారులు చెబుతున్నారు. ఈ మూడు కంపెనీలు ప్రధానంగా కెనడా, యూఎస్కు ఎగుమతులే లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. రికార్డు స్థాయిలో ఎగుమతులు ఏపీ, తెలంగాణకు వస్తున్న పరిశ్రమలు వీలైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు చేపట్టాం. దువ్వాడ వీసెజ్ పరిధిలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సెజ్లు, యూనిట్ల ద్వారా రికార్డు స్థాయి ఎగుమతులు సాధించాం. 2023–24 మొదటి త్రైమాసికంలో రూ.50,195 కోట్ల విలువైన వస్తువులు, సేవలను ఎగుమతి చేశాం. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 34 శాతం వృద్ధి రేటు సాధించాం. వివిధ వస్తువులను ఉత్పత్తి చేయడం ద్వారా రూ.35,992 కోట్లు, సేవారంగం ఎగుమతుల్లోనూ 36 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు గణాంకాలను పరిశీలిస్తే రూ.1,04,961 కోట్ల పెట్టుబడులు వీసెజ్ ద్వారా రాగా... మొత్తం 6,61,579 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. – ఎం.శ్రీనివాస్, వీసెజ్జోనల్ డెవలప్మెంట్ కమిషనర్ -
ఇంటర్ ఫెయిల్, రూ.500తో అమెరికాకి పయనం.. కట్ చేస్తే 47 వేల కోట్లకు అధిపతి!
ఏదో సాధించాలనే తపన..ఏమీ సాధించలేదేనన్న నిరాశ.. ఇంకేమీ సాధించలేమోనన్న నిస్పృహ.. ఇలాంటి స్థితిలోనే ఎంతోమంది నిండు జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి ఎన్నో ఉన్నత శిఖరాల ఎత్తు ఎదగాల్సిన విద్యార్థులు పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని,ఫెయిల్ అయ్యామని మరొకరు ఇలా.. చిన్న చిన్న సమస్యలకే కుంగిపోయి బలవన్మరణాలకు పాల్పడుతుంటుంటారు. అలాంటి వారు ఆత్మహత్యలకు పాల్పడే ముందు ఒక్క క్షణం ఆగి, తమను తాము ప్రశ్నించుకుంటే ఎన్నో జీవితాలు నిలబడతాయి. తిరిగి పచ్చగా కళకళలాడతాయని అంటున్నారు మురళి దివి. నాడు ఇంటర్ రెండు సార్లు ఫెయిల్ అయ్యారు. చేతిలో రూ. 500తో అమెరికాకు వెళ్లారు. కట్ చేస్తే నేడు వేల కోట్ల అధిపతిగా ఎదిగారు. ఇంతకీ ఆయన ఎవరని అనుకుంటున్నారా? ఆయన మరెవరో కాదు దివిస్ లేబరేటరీస్ అధినేత దివి మురళి కృష్ణ ప్రసాద్. చదవండి👉 ఈ చెట్టు లేకపోతే ప్రపంచంలో కూల్డ్రింక్స్ తయారీ కంపెనీల పరిస్థితి ఏంటో? మురళి దివి ఎవరు? ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మచిలీపట్నం మురళి దివి స్వస్థలం. ఆయన తండ్రి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. తనకు వచ్చే 10 వేల రూపాయల పెన్షన్తో 13 మంది పిల్లల్ని పోషించేవారు. అయినప్పటికీ తన కష్టాన్ని పిల్లలకు తెలియనీయకుండా పెంచారు. వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని శ్రమించారు. కానీ మురళి దివికి ఇంగ్లీష్ అంటే చాలా భయం. ఆ భయమే ఆయనను ఇంటర్మీడియట్లో రెండు సార్లు ఫెయిల్ అయ్యేలా చేసింది. వృద్దిలోకి వస్తారనుకున్న కొడుకు ఇలా ఫెయిల్ కావడంతో తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అప్పుడే శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుందనే సూక్తిని గట్టిగా నమ్మారు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని కుంగిపోలేదు. ప్రయత్నించారు. చివరికి విజయమే మురళి దివికి బానిసైంది. అందరూ సంపన్నులే.. కానీ తాను మాత్రం ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అప్పటికే మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతున్న తన సోదరుడి వద్దకు పంపారు. అదే ఆయన జీవితాన్ని కీలక మలుపు తిప్పింది. కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్లో బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ కోర్సులో చేరారు. అంతర్జాతీయ యూనివర్శిటీ కావడంతో దేశ, విదేశీ విద్యార్ధులు అందులోనూ సంపన్నులు. కానీ తన కుటుంబ నేపథ్యం అందుకు విభిన్నం. ఉన్నత చదువుల కోసం నాన్న, తోబుట్టువులు చేసిన మేలు మరిచిపోలేదని ఓ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఎలాగైనా వారి కష్టానికి ప్రతిఫలంగా ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని అప్పుడే నిశ్చయించుకున్నారు. రేయింబవళ్లు శ్రమించారు. అలా బ్యాచిలర్ డిగ్రీలో యూనివర్సిటీలోనే గోల్డ్ మెడలిస్ట్ సంపాదించారు. అదే యూనివర్సిటీలో బెస్ట్ స్డూడెంట్గా గోల్డెన్ అవార్డ్స్తో మాస్టర్స్ను పూర్తి చేశారు. జీతం రూ.250లే పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగం వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చారు. వార్నర్స్ హిందుస్థాన్ కంపెనీలో రూ. 250 జీతంతో కెరీర్ ప్రారంభించారు. ఆ సమయంలో, అమెరికాలో ఫార్మసిస్ట్లకు మంచి డిమాండ్ ఉంది. రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్లు అమెరికా వీసా పొందడం సులభం. అలా అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించారు. యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ కావడంతో వీసా దొరికింది. వెంటనే గ్రీన్ కార్డ్ సంపాదించారు. చదవండి👉 దేశంలోని ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్.. డబుల్ శాలరీలను ఆఫర్ చేస్తున్న కంపెనీలు! చలో అమెరికా కానీ వీసా ఆమోదం తర్వాత మురళికి అమెరికా వెళ్లడానికి 9 నెలలు పట్టింది. 1976-77 సమయంలో తన భార్య, కుమారుడితో కలిసి చేతిలో రూ.500లతో అమెరికాకు పయనమయ్యారు. టెక్సాస్లోని శాన్ ఆంటోనియోలో సైంటిస్ట్గా పనిచేశారు. తర్వాత కాస్మోటిక్ ఫార్మాస్యూటికల్ ప్లాంట్ సూపరింటెండెంట్ అయ్యారు. ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతు ఆ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్గా, డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. జీతం నెలకు రూ.నాలుగున్నర లక్షలకు పెరిగింది. జీవిత భాగస్వామి అంగీకారంతో అంతా సవ్యంగా సాగిపోతున్న సమయంలో మురళికి ఓ ఆలోచన వచ్చింది. నేను నా కుటుంబ సభ్యులకు, నన్ను కన్న నా దేశానికి దూరంగా ఉంటూ ఇక్కడే ఎందుకు పనిచేయాలి? అని తనని తాను ప్రశ్నించుకున్నారు. వెంటనే భారత్కు వచ్చేయాలని అనుకున్నారు. చివరికి జీవిత భాగస్వామి అంగీకారంతో మురళి భారత్కు వచ్చారు. చదవండి👉 ఇద్దరు ఉద్యోగుల కోసం.. యాపిల్, గూగుల్ సీఈవోల పోటీ.. చివరికి ఎవరు గెలిచారంటే? డాక్టర్ అంజిరెడ్డితో పాటు తిరిగి వచ్చిన తర్వాత, ఏం చేయాలో తెలియదు. వ్యాపారం ప్రారంభించాలంటే అంత డబ్బు కూడా లేదు. అమెరికాలో సైంటిస్ట్గా సంపాదించిన అనుభవాన్నే ఆస్తిగా మరల్చుకున్నారు. డాక్టర్ రెడ్డీస్ వ్యవస్థాపకులు డాక్టర్ అంజి రెడ్డిని సంప్రదించారు. తాను భారత్లో ఓ కంపెనీని పెట్టాలని అనుకుంటున్నట్లు తన ఐడియాను వివరించారు. ఆ ఆలోచనకు అంజిరెడ్డి సైతం అకర్షితులయ్యారు. అతని సహకారంతో 'కెమినార్' అనే కంపెనీని కొనుగోలు చేశారు. దేశంలోని ప్రముఖ ఫార్మా తయారీ కంపెనీలలో ఒకటిగా తీర్చిదిద్దేందుకు పెట్టుబడులు భారీగా పెట్టారు. కానీ ప్రయాణం అంత సులభం కాదు. అయితే, ధైర్యం, 'సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్' (బలవంతులదే మనుగడ) నినాదంతో ముందుకు సాగారు. చేసి చూపించారు. ఆ సమయంలో ప్రముఖ వ్యాపార వేత్తలలో ఒకరిగా నిలిచారు. దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్ముతూ దేశంలోని డిమాండ్లను తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్లో ప్లాంట్లను ప్రారంభించారు. ఆ అనుభవంతో, సొంతంగా కంపెనీ పెట్టాలనే కోరికతో 1990లో హైదరాబాద్లో ‘దివీస్ లేబొరేటరీస్’ ప్రారంభించారు. ఏఐపీఐలు, ఇంటర్మీడియట్ల తయారీకి, వ్యాపారానికి అనుగుణంగా అభివృద్ది చేయడం ప్రారంభించారు. అలా 1995లో మురళి దివి తెలంగాణలోని చౌటుప్పల్లోని తన తొలి తయారీ కేంద్రాన్ని, 2002లో విశాఖ సమీపంలో రెండో యూనిట్ ప్రారంభించారు. బిలియనీర్గా ఎదిగారు.. దివీస్ ల్యాబ్స్ స్థాపించిన 23 సంవత్సరాల తరువాత, 2013లో మురళి బిలియనీర్ అయ్యారు. 2018-19లో అతను భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందిన ఫార్మాస్యూటికల్ ఎగ్జిక్యూటివ్గా నిలిచారు. దివీస్ ల్యాబ్స్ స్టాక్ విలువ భారీగా పెరిగింది. అలానే కేంద్రం ప్రారంభించిన ఆత్మ నిర్భర్ అభియాన్, మేక్ ఇన్ ఇండియా మద్దతు.. కోవిడ్ -19 మహమ్మారి వల్ల ఫార్మా ఉత్పత్తుల అవసరం పెరగడంతో దివిస్ ల్యాబ్స్ మరింత ఎదిగింది. ఫోర్బ్స్ ఇండియా ప్రకారం, మురళీ దివి నికర సంపద 5.9 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోని 448వ ధనవంతులుగా నిలిచారు. చదవండి👉 యాపిల్ కంపెనీలో వందల కోట్ల మోసం.. భారతీయ ఉద్యోగికి 3 ఏళ్ల జైలు శిక్ష! -
ఎగుమతులు @ 447 బిలియన్ డాలర్లు
రోమ్: భారత్ వస్తు ఎగుమతులు 2022–23 ఆర్థిక సంవత్సరంలో 2021–22తో పోల్చితే 6 శాతం పెరిగి 447 బిలియన్ డాలర్లకు చేరినట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇదే సమయంలో దేశ దిగుమతులు 16.5 శాతం ఎగసి 714 బిలియన్ డాలర్లకు చేరినట్లు వెల్లడించారు. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య వాణిజ్యలోటు 267 బిలియన్ డాలర్లకు చేరింది. పెట్రోలియం, ఫార్మా, రసాయనాలు, సముద్ర ఉత్పత్తుల రంగాల నుంచి ఎగుమతుల్లో మంచి వృద్ధి నమోదయినట్లు ఆయన వెల్లడించారు. ఫ్రాన్స్, ఇటలీల్లో ఏప్రిల్ 11 నుంచి 13వ తేదీ వరకూ పర్యటించిన గోయల్ ఈ సందర్భంగా పలు కంపెనీల సీఈఓలతో భేటీ అయ్యారు. ఆయా దేశాలతో వాణిజ్య, పెట్టుబడుల సంబంధాలు మరింత పురోగమించడం లక్ష్యంగా ఈ పర్యటన సాగింది. ఈ సందర్భంగా ఆయన విలేకరులకు తెలిపిన అంశాల్లో ముఖ్యమైనవి... ► వస్తు, సేవలు కలిపి ఎగుమతులు కొత్త రికార్డులో 14 శాతం వృద్ధి నమోదయ్యింది. విలువలో 770 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఒక్క సేవల ఎగుమతులు చూస్తే, 27.16 శాతం పెరిగి 323 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇక విభాగాల దిగుమతులు 892 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ భారత్ ఎకానమీ క్రియాశీలత, పురోగమనానికి సూచికలుగా ఎగుమతి–దిగుమతి గణాంకాలు ఉన్నాయి. ► అన్ని దేశాలతో పటిష్ట వాణిజ్య సంబంధాలు నెరపడానికి భారత్ కృషి సల్పుతోంది. ► ఇన్వెస్టర్ల పెట్టుబడులకు భారత్ అత్యంత ఆకర్షణ ప్రదేశంగా ఉంది. ఎకానమీ పరంగా చూస్తే, భారత్ ఎంతో పటిష్టంగా ఉంది. వస్తు, సేవల పన్ను వసూళ్లు భారీగా నమోదవుతున్నాయి. ఎగుమతులు బాగున్నాయి. ద్రవ్యోల్బణం దిగివస్తోంది. విదేశీ మారకద్రవ్య నిల్వలు పటిష్టంగా 600 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. విదేశాల నుంచి భారత్కు పంపుతున్న రెమిటెన్సులు 100 బిలియన్ డాలర్లుపైగానే ఉంటున్నాయి. పెట్టుబడుల ప్రవాహం బాగుంది. ► ఎగుమతుల భారీ వృద్ధి లక్ష్యంగా సమర్థవంతమైన విదేశీ వాణిజ్య పాలసీ (ఎఫ్టీపీ)ని భారత్ ఇప్పటికే ఆవిష్కరించింది. 2030 నాటికి దేశ ఎగుమతులను ఏకంగా 2 ట్రిలియన్ డాలర్లకు చేర్చడంతో పాటు రూపాయిని గ్లోబల్ కరెన్సీగా చేయాలని పాలసీలో నిర్దేశించడం జరిగింది. -
డా.రెడ్డీస్ చేతికి ‘మేనే’ అమెరికా జెనరిక్ ప్రిస్క్రిప్షన్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో
సాక్షి,హైదరాబాద్: దేశీయ ఫార్మా దిగ్గజం 'డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్' ఆస్ట్రేలియాకు చెందిన మేనే(Mayne) ఫార్మా గ్రూప్ అమెరికా జెనరిక్ ప్రిస్క్రిప్షన్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా కంపెనీ 15 మిలియన్ డాలర్ల ఆకస్మిక చెల్లింపులు, 90 మిలియన్ డాలర్ల మేర నగదు చెల్లింపులు చేయనుంది. నిజానికి మేనే ఫార్మా అమెరికా జెనరిక్స్ ప్రిస్క్రిప్షన్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోలో సుమారు 85 జెనరిక్ ఉత్పత్తులు ఉన్నాయి. ఇందులో 45 వాణిజ్య ఉత్పత్తులు కాగా, మిగిలిన 40 ఆమోదించబడిన నాన్-మార్కెటెడ్ ఉత్పత్తులు. కంపెనీ ఉత్పత్తులలో మహిళల ఆరోగ్యంపై దృష్టి సారించే ఔషధాలు ఉన్నాయి. ఇప్పటికే ఆమోదం పొందింని ఈ ఉత్పత్తుల్లో హార్మోనల్ వెజినల్ రింగ్, బర్త్ కంట్రోల్ పిల్, కార్డియో ప్రోడక్ట్ వంటి అధిక విలువలు కలిగిన ఉత్పత్తులు ఉన్నాయి. వీటితో పాటు ఫెంటోరా, నటాజియా, ప్రోలెన్సా వంటి కీలకు ఔషధాలు కూడా ఉన్నాయి. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ చేతికి మేనే ఫార్మా దక్కడంతో రోగులకు తక్కువ ధరలకే మందులను అందించడానికి, అంతే కాకుండా అవసరమైన మందులు వేగవంతంగా అందించడానికి సహాయపడుతుంది. ఈ సందర్భంగా డాక్టర్ రెడ్డీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎరెజ్ ఇజ్రాయెలీ మాట్లాడుతూ బలమైన బ్యాలెన్స్ షీట్ బేస్ వ్యాపారాన్ని బలోపేతం చేయడానికి, దీర్ఘకాలిక వృద్ధి ప్రాముఖ్యత కలిగిన ఉత్పత్తులను పొందేందుకు వీలు కల్పిస్తుందన్నారు. -
ఫార్మాస్యూటికల్స్ వృద్ది అంతంతే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత ఫార్మాస్యూటికల్స్ మార్కెట్ 2023 జనవరిలో 2.3 శాతం వృద్ధి చెందింది. 2022 జూన్ నుంచి పోల్చితే ఇదే అత్యల్పం కావడం గమనార్హం. గతేడాది గరిష్ట అమ్మకాలు నమోదు కావడం, కాలానుగుణ ప్రభావం ఇందుకు కారణమని ఇండియా రేటింగ్స్, రిసర్చ్ తెలిపింది. ఇప్పటికే ఉన్న ఉత్పత్తులపై తీసుకున్న ధరల పెంపు గత నెలలో మొత్తం మార్కెట్ పనితీరుకు కీలకంగా ఉంది. అయితే పరిమాణాలు క్షీణించాయని వివరించింది. ఆల్ ఇండియన్ ఒరిజిన్ కెమిస్ట్స్, డిస్ట్రిబ్యూటర్స్ ప్రకారం 2022 జనవరిలో పరిశ్రమ 14.1 శాతం, డిసెంబర్లో 10.4 శాతం దూసుకెళ్లింది. గతేడాది ధరలు 5.8 శాతం పెరిగితే, జనవరిలో ఇది 5.9 శాతంగా ఉంది. కొత్త ఉత్పత్తుల రాక 1.8 శాతం పెరిగింది. 2022లో ఇది 2.8 శాతం. పరిమాణం 5.5 నుంచి 5.4 శాతానికి క్షీణించింది. భారత ఫార్మాస్యూటికల్స్ మార్కెట్ 2021లో 14.9 శాతం, 2022లో 8 శాతం దూసుకెళ్లింది. 2023–24లో పరిశ్రమ 8–10 శాతం వృద్ధికి ఆస్కారం ఉంది. 2023 జనవరిలో డెర్మటాలాజికల్, గైనకాలాజికల్ విభాగం ఔషధాల అమ్మకాలు వరుసగా 11, 10 శాతం పెరిగాయి. విటమిన్స్ విక్రయాలు అతి తక్కువగా 0.3 శాతం అధికం అయ్యాయి. -
హెటిరో నుంచి కోవిడ్ -19 డ్రగ్.. డబ్ల్యూహెచ్ఓ ఆమోద ముద్ర
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం హెటిరోకి చెందిన ’నిర్మాకామ్’ (నిర్మాట్రెల్విర్) నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రీక్వాలిఫికేషన్ (డబ్ల్యూహెచ్వో పీక్యూ) ఆమోదముద్ర లభించింది. ఈ ఔషధాన్ని మరింత మందికి అందుబాటులోకి తెచ్చే దిశగా ఇది కీలక మైలురాయని కంపెనీ ఎండీ వంశీ కృష్ణ బండి తెలిపారు. భారత్తో పాటు 95 అల్పాదాయ, మధ్య స్థాయి ఆదాయ దేశాల్లో నిర్మాకామ్ను మరింత వేగంగా, చౌకగా అందుబాటులోకి తెచ్చేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. కోవిడ్–19 చికిత్సలో ఉపయోగించే ఫైజర్ ఔషధం ప్యాక్స్లోవిడ్కు ఇది జనరిక్ వెర్షన్. నిర్మాట్రెల్విర్ 150 మి.గ్రా.(2 ట్యాబ్లెట్లు), రిటోనావిర్ 100 మి.గ్రా.(1 ట్యాబ్లెట్) అనే 2 యాంటీవైరల్ ఔషధాలు ఈ ప్యాక్లో ఉంటాయి. దీని తయారీ, విక్రయానికి సంబంధించి మెడిసిన్స్ పేటెంట్ పూల్ (ఎంపీపీ) నుంచి స్వచ్ఛంద లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు హెటెరో తెలిపింది. ఈ లైసె న్స్ కింద జనరిక్ వెర్షన్ను రూపొందించిన తొలి సంస్థ హెటిరో కావడం ప్రశంసనీయమని ఎంపీపీ ఈడీ చార్లెస్ గోర్ తెలిపారు. దేశీయంగా అత్యవసర వినియోగం కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి ఇప్పటికే అనుమతులు పొందినట్లు వివరించింది. -
యాడ్వెంట్ చేతికి సువెన్ ఫార్మా
ముంబై: దేశీ హెల్త్కేర్ కంపెనీ సువెన్ ఫార్మాస్యూటికల్స్లో మెజారిటీ వాటాను గ్లోబల్ పీఈ దిగ్గజం యాడ్వెంట్ ఇంటర్నేషనల్ సొంతం చేసుకోనుంది. ప్రమోటర్లు జాస్తి కుటుంబం నుంచి 50.1 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు యాడ్వెంట్ అధికారికంగా ప్రకటించింది. ప్రమోటర్ల నుంచి 12.75 కోట్ల షేర్లను కొనుగోలు చేసేందుకు యాడ్వెంట్ రూ. 6,313 కోట్లు వెచ్చించనున్నట్లు సువెన్ బీఎస్ఈకి తెలియజేసింది. దీనిలో భాగంగా సువెన్ వాటాదారులకు యాడ్వెంట్ ఓపెన్ ఆఫర్ను ప్రకటించనున్నట్లు పేర్కొంది. షేరుకి రూ. 495 ధరలో పబ్లిక్ నుంచి 26 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. వెరసి పబ్లిక్ నుంచి 6,61,86,889 షేర్ల కోసం యాడ్వెంట్ రూ. 3,276 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేయనుంది. ప్రస్తుతం సువెన్లో జాస్తి కుటుంబీకులకు మొత్తం 60 శాతం వాటా ఉంది. తాజా డీల్తో ఈ వాటా 9.9 శాతానికి పరిమితంకానుంది. విలీనానికి ఆసక్తి పోర్ట్ఫోలియో కంపెనీ కోహేన్స్ను సువెన్లో విలీనం చేసేందుకున్న అవకాశాలను అన్వేషించనున్నట్లు యాడ్వెంట్ పేర్కొంది. తద్వారా విలీనం సంస్థ ఎండ్ టు ఎండ్ కాంట్రాక్ట్ డెవలప్మెంట్, తయారీ దిగ్గజంగా ఆవిర్భవించనున్నట్లు తెలియజేసింది. వీటితోపాటు ఏఐపీ తయారీని సైతం కలిగి ఉన్న కంపెనీ ఫార్మా, స్పెషాలిటీ కెమికల్ మార్కెట్లలో సర్వీసులందించనున్నట్లు వివరించింది. ఐదారు నెలల్లో డీల్ పూర్తయ్యే వీలున్నట్లు సువెన్ ఫార్మా ఎండీ జాస్తి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. వ్యూహాత్మక అవకాశాలు, వాటాదారులకు లబ్ధి చేకూర్చడం వంటి అంశాల ఆధారంగా విలీన అంశాన్ని బోర్డు చేపట్టనున్నట్లు తెలియజేశారు. షేర్ల మార్పిడి తదితరాలపై కసరత్తు జరుగుతున్నట్లు చెప్పారు. కాగా.. మిగిలిన 9.9% ప్రమోటర్ల వాటాను 18 నెలలపాటు విక్రయించకుండా లాకిన్ పిరియడ్ వర్తిస్తుందని జాస్తి చెప్పారు. వాటాదారులతోపాటు ఈ వాటాకు తగిన విలువ చేకూరే వరకూ విక్రయించే యోచన లేదని స్పష్టం చేశారు. 2020లో విభజన.. మాతృ సంస్థ సువెన్ లైఫ్ సైన్సెస్ నుంచి 2020లో సువెన్ ఫార్మాస్యూటికల్స్ విడివడింది. గత నాలుగేళ్లలో ఆదాయం 20 శాతం స్థాయిలో వృద్ధి చూపింది. 43 శాతానికి మించిన నిర్వహణ లాభ మార్జిన్లు సాధిస్తోంది. ఇక 2021–22లో కోహేన్స్ రూ. 1,280 కోట్ల టర్నోవర్ అందుకుంది. 2007 నుంచీ దేశీయంగా దృష్టి పెట్టిన యాడ్వెంట్ విభిన్న రంగాలకు చెందిన 14 కంపెనీలలో 3.2 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. ఈ వార్తల నేపథ్యంలో సువెన్ ఫార్మా షేరు దాదాపు 5% పతనమై రూ. 473 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 520–470 మధ్య ఊగిసలాడింది. ముఖ్య సలహాదారుగా.. డీల్ పూర్తయ్యాక కంపెనీ ఎండీ పదవి నుంచి తప్పుకోనున్నట్లు జాస్తి తెలియజేశారు. అయితే ప్రధాన సలహాదారుగా కన్సల్టెన్సీ సర్వీసులను అందించనున్నట్లు వెల్లడించారు. హెల్త్కేర్లో లోతైన నైపుణ్యం, అంతర్జాతీయంగా వృత్తి నిపుణులుగల యాడ్వెంట్ తమకు అనుగుణమైన కీలక భాగస్వామిగా పేర్కొన్నారు. తద్వారా సువెన్ తదుపరి దశ వృద్ధిలోకి ప్రవేశిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కోహెన్స్తో విలీనం ద్వారా విభిన్న సర్వీసులు సమకూర్చగలుగుతామని, ఇది రెండు సంస్థలకూ లబ్ధిని చేకూర్చుతుందని వివరించారు. సువెన్ కొనుగోలు ద్వారా బిలియన్ డాలర్ల(సుమారు రూ. 8,600 కోట్లు) విలువైన గ్లోబల్ కంపెనీకి తెరతీసే వీలున్నట్లు యాడ్వెంట్ ఎండీ పంకజ్ పట్వారీ పేర్కొన్నారు. సువెన్ సామర్థ్యాలను వినియోగించుకోవడం ద్వారా సీడీఎంవో విభాగంలోని గ్లోబల్ కంపెనీలలో ఒకటిగా తీర్చిదిద్దనున్నట్లు తెలియజేశారు. -
ఫార్మాకు ఎగుమతి ప్రోత్సాహకాలు
న్యూఢిల్లీ: ఫార్మా తదితర ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించే దిశగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పన్ను రీఫండ్ స్కీము ఆర్వోడీటీఈపీని రసాయనాలు, ఫార్మా, ఇనుము .. ఉక్కు ఉత్పత్తులకు కూడా నిర్దిష్ట కాలం పాటు వర్తింపచేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది డిసెంబర్ 15 నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకూ ఈ రంగాలకు ఆర్వోడీటీఈపీ వర్తిస్తుంది. కొత్తగా చేర్చినవి కూడా కలిపితే పన్ను రీఫండ్ ప్రయోజనాలు దక్కే ఎగుమతి ఐటమ్ల సంఖ్య 8,731 నుంచి 10,342కి చేరుతుంది. స్కీమును విస్తరించడం వల్ల రూ. 1,000 కోట్ల మేర ఆర్థిక భారం ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. అక్టోబర్లో ఎగుమతుల వృద్ధి 16.65 శాతం మేర మందగించిన నేపథ్యంలో కేంద్రం నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. -
అమ్మకానికి సువెన్ ఫార్మా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంపెనీ అమ్మకం లేదా మెజారిటీ వాటా విక్రయానికి సువెన్ ఫార్మాస్యూటికల్స్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. మెజారిటీ వాటా అమ్మకం విషయమై సలహా కోసం ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ను నియమించు కున్నట్టు తెలుస్తోంది. కంపెనీని విక్రయించేందుకు ప్రైవేట్ ఈక్విటీ, వ్యూహాత్మక సంస్థలతో చర్చలు జరుగుతున్నాయి. సువెన్ ఫార్మాస్యూటికల్స్లో ప్రమోటర్లకు 60 శాతం వాటా ఉంది. డీల్ ద్వారా వచ్చే మొత్తాన్ని సువెన్ లైఫ్ సైన్సెస్లో ఔషధాల అభివృద్ధికి ఖర్చు చేయనున్నారు. ఇప్పటి వరకు సువెన్ ఫార్మా నుంచి డివిడెండ్ రూపంలో సమకూరిన మొత్తాన్ని ప్రమోటర్లు ఇందుకోసం వ్యయం చేశారు. సువెన్ లైఫ్ నుంచి 2020లో సువెన్ ఫార్మా విడిపోయింది. క్రితం ముగింపుతో పోలిస్తే సువెన్ ఫార్మాస్యూటికల్స్ షేరు ధర బీఎస్ఈలో బుధవారం 1.52 శాతం ఎగసి రూ.491.10 వద్ద స్థిరపడింది. -
‘స్టాన్ఫోర్డ్’ టాప్ సైంటిస్టుల జాబితాలో భారతీయుడికి చోటు
ఉమ్మడి వరంగల్కి చెందిన ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ సాంబారెడ్డికి అరుదైన గౌరవం లభించింది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ తాజాగా ప్రకటించిన ప్రకటించిన టాప్ సైంటిస్టుల జాబితాలో ఆయనకు చోటు దక్కింది. ప్రస్తుతం ఆయన టెక్సాస్లోని ఏ ఏండ్ ఎం యూనివర్సిటీ కాలేజ్ ఆప్ మెడిసన్లో ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ప్రొలిఫిక్ మెడికల్ ఇన్వెంటర్, ఫార్మా రీసెర్చర్గా గుర్తింపు పొందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల మండలం చర్లపల్లిలో డాక్టర్ దూదిపాల సాంబారెడ్డి జన్మించారు. ఆ తర్వాత కాకతీయ వర్సిటీలో ఫార్మాసీ విద్యాను పూర్తి చేసి ఉన్నత విద్యకోసం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఫార్మా రంగంలో ఆనేక ఆవిష్కరణలను ఆయన చేశారు. న్యూరోథెరాప్యూటిక్స్లో ఆయన గ్లోబల్ లీడర్గా ఉన్నారు. ఇప్పటి వరకు 215 సైంటిఫిక్ పేపర్లను ప్రచురించగా 100 మందికి పైగా స్కాలర్లకు గైడ్గా వ్యవహరించారు. అంతేకాదు 400ల వరకు ప్రెజెంటేషన్లకు ఆయన సహాకారం అందించారు. న్యూరోథెరాప్యూటిక్స్లో విభాగంలో విశేష కృషి చేసిన డాక్టర్ సాంబారెడ్డి బ్రెయిన్ డిసార్డర్లకు న్యూరో స్టెరాయిడ్ థెరపీని అభివృద్ధి చేశారు. మెదడు సంబంధిత వ్యాధులకు సంబంధించిన చికిత్సను మెరుగుపరచడంలో ఈ న్యూరో స్టెరాయిడ్ థెరపీ ఎంతగానో ఉపకరించింది. పోస్టపార్టమ్ డిప్రెషన్కి సంబంధించి డాక్టర్ సాంబారెడ్డి అభివృద్ధి చేసిన బ్రెక్సానోలెన్ ఔషధం అమెరికా తరఫున ఎఫ్డీఏ అనుమతి పొందిన తొలి మెడిసిన్గా గుర్తింపు పొందింది. అదే విధంగా ఎపిలెప్పీకి సంబంధించి గానాక్సోలోన్ కూడా ఉంది. న్యూరో సంబంధిత విభాగంలో చేసిన కృషికి గాను డాక్టర్ సాంబారెడ్డికి అనేక అవార్డులు వరించాయి. చదవండి: అటార్నీగా భారత సంతతి మహిళ.. నామినేట్ చేసిన బైడెన్ -
‘ఫార్మా’లిటీస్ కోసం పాట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఫార్మసీ కాలేజీల్లో హడావుడి మొదలైంది. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) గురువారం నుంచి తనిఖీలు ప్రారంభించనుండటంతో కాలేజీ యాజ మాన్యాలు నానా హైరానా పడుతున్నాయి. పీసీఐ నిబంధనలకు అనుగుణంగా ఫ్యాకల్టీ, మౌలిక వసతులు ఉన్నాయని చూపించేందుకు రకరకాల మార్గాలను అనుసరిస్తున్నాయి. దీనికోసం రికార్డులను కూడా తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. పీసీఐ సిబ్బంది ప్రతి కాలేజీనీ పరిశీలించి వాస్తవ పరిస్థితిపై నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. దీని ఆధారంగానే కాలేజీలకు గుర్తింపు ఇస్తుంటారు. గత రెండేళ్లు కరోనా వల్ల పెద్దగా తనిఖీలు జరగలేదు. ఈసారి ప్రత్యక్ష తనిఖీలను పకడ్బందీగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు కాలేజీలకు అధికారికంగా ఆదేశాలు కూడా జారీ చేశారు. అద్దె లేబొరేటరీలు చాలా ఫార్మసీ కాలేజీల్లో ఇప్పటికీ పీసీఐ నిబంధనల ప్రకారం లేబొరేటరీలు లేవనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో లేబొరేటరీల తనిఖీపై పీసీఐ ప్రధానంగా దృష్టి పెట్టింది. దీంతో ఇప్పటికప్పుడు కెమికల్ లేబొరేటరీలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. లేబొరేటరీలు ఉన్న కాలేజీలతో మాట్లాడుకొని, తనిఖీ సమయంలో వాటిని తీసుకొచ్చి కాలేజీలో అమర్చుకుని తర్వాత తిరిగిచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని యాజమాన్యాలకు ఒక టి కన్నా ఎక్కువ కాలేజీలున్నాయి. వీళ్లు ఏదో ఒక కాలేజీలోనే లేబొరేటరీని కలిగి ఉన్నారు. ఇలాంటి వాళ్లు తనిఖీ సమయంలో మాయ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫ్యాకల్టీ కోసం పాట్లు చాలా కాలేజీల్లో సబ్జెక్టులో నిష్ణాతులైన అధ్యాపకులను నియమించట్లేదని ఆరోపణలున్నాయి. రికార్డుల్లో పీజీ, పీహెచ్డీ చేసిన అధ్యాపకులు అని పేర్కొంటున్నా విద్యార్థులకు బోధించే అధ్యాపకులు మాత్రం తక్కువ విద్యార్హతలు ఉన్నవాళ్లు ఉంటున్నారని విమర్శలున్నాయి. కాలేజీలో ఎవరు పనిచేస్తున్నారు, వారి అర్హతలేంటో పీసీఐ తనిఖీ చేయాల్సి ఉంది. దీని కోసం అన్ని రికార్డులు, ఫ్యాకల్టీ అందుబాటులో ఉండా లని తెలియజేసింది. దీంతో కాలేజీల యాజమాన్యాలు రికార్డుల్లో పేర్కొన్న వ్యక్తులను తనిఖీ సమయంలో రావాలని చెప్పినట్టు తెలిసింది. దీని కోసం కొంత ముట్టజెప్పేందుకు ఒప్పందమూ చేసుకున్నాయని సమాచారం. ఫ్యాకల్టీ పాన్ కార్డు ఆధారంగా వాళ్లు ఇంకెక్కడైనా ఉపాధి పొందుతున్నారా అని వివరాలు సేకరిస్తే కాలేజీల అసలు బాగోతం బయటపడుతుందని నిపుణులు చెబుతున్నారు. నిబంధనల అమలేదీ? ఫార్మా కాలేజీలు నిలువు దోపిడీ చేస్తున్నాయి. పీసీఐ నిబంధనలు ఎక్కడా అమలు కావట్లేదు. వేతన సంఘం జీతాలు కాదు కదా కనీసం రూ. 20 వేలు ఇచ్చే అవకాశం లేదు. కరోనా సమయంలో ఉద్యోగుల జీతాలు ఇప్పటికీ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. అలాంటప్పుడు డిజిటల్ చెల్లింపులు ఎలా చూపిస్తారు. చిత్తశుద్ధితో తనిఖీలు చేస్తే అవకతవకలు వెలుగు చూస్తాయి. – అయినేని సంతోష్కుమార్, ప్రైవేటు సాంకేతిక కాలేజీల అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు -
లైఫ్సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: కరోనా సంక్షోభం నేపథ్యంలో లైఫ్సైన్సెస్ (జీవశాస్త్ర) రంగానికి ప్రాధాన్యత మరింత పెరిగిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ రంగంలో ప్రపంచ స్థాయి పోటీని తట్టుకుని నిలబడేందుకు భారత్లో విప్లవాత్మకమైన సంస్కరణలు అవసరమని అన్నా రు. భారత్లో ఈ రంగం పురోగతికి అవసరమైన విధానాలకు అంతగా మద్దతు లభించడం లేదని చెప్పారు. అదే సమయంలో లైఫ్సైన్సెస్ రంగానికి హైదరాబాద్ రాజధానిగా మారిందని తెలిపారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భాగంగా లైఫ్సైన్సెస్ రంగానికి సంబంధించి.. ‘తెలంగాణ: ఆసియాలో పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలకు కీలక స్థానం’అనే అంశంపై సోమవారం జరిగిన చర్చలో కేటీఆర్ పాల్గొన్నారు. ఐటీ, ఫార్మా రంగాలు కలిసి పనిచేయాలి తెలంగాణలో లైఫ్సైన్సెస్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ ‘హైదరాబాద్ ఫార్మా సిటీ’ఏర్పాటు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన మద్దతు లభించడం లేదని మంత్రి విమర్శించారు. కొత్త ఆవిష్కరణలకు ఊతమివ్వడం ద్వారానే ఈ రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. భవిష్యత్తులో లైఫ్సైన్సెస్ రంగంలో కొత్త ఆవిష్కరణలు ప్రయోగశాలను దాటి డిజిటల్ డ్రగ్ డిస్కవరీ (ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త ఔషధాల ఆవిష్కరణ) వైపు పయనిస్తాయని అన్నారు. ఈ నేపథ్యంలో ఐటీ, ఫార్మా రంగాలు కలిసి పనిచేయాల్సిన అవసరముందని సూచించారు. సులభతర విధానాలు అవసరం భారత్లో పరిశోధన, అభివృద్ధి రంగాల్లో విదేశీ పెట్టుబడులకు వీలుగా సులభతర విధానాలు అవసరమని, ఈ విషయంలో కేంద్రం చొరవ తీసుకోవాలని కేటీఆర్ అన్నారు. వచ్చే దశాబ్దం పాటు భారత్ లైఫ్సైన్సెస్ రంగం అభివృద్ధి పథంలో నడిచే అవకాశముందని, ఔషధ తయారీ సంస్థలు ప్రస్తుతమున్న మందుల తయారీకే పరిమితం కాకుండా, కొత్త మందులను తయారు చేసే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారత్లో నైపుణ్యానికి కొదవలేదని, లైఫ్సైన్సెస్ రంగంలో పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలకు ప్రాధాన్యతనిస్తూ భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరముందని అన్నారు. తెలంగాణలో లైఫ్సైన్సెస్ రంగంలోని ఔత్సాహిక పరిశోధకులకు సహకారం అందించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో ఉన్న ప్రముఖ సంస్థలతో కలిసి పనిచేస్తోందని తెలిపారు. ఈ చర్చాగోష్టిలో కేటీఆర్తో పాటు డాక్టర్ రెడ్డీస్ సంస్థకు చెందిన జీవీ ప్రసాద్రెడ్డి, పీడబ్ల్యూసీకి చెందిన మహమ్మద్ అథర్ పాల్గొన్నారు. -
హైదరాబాద్లో ఏరో, ఫార్మా వర్సిటీలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏరోనాటికల్, ఫార్మా విశ్వవిద్యాలయాలు రాబోతున్నాయి. వీలైనంత త్వరగా హైదరాబాద్లో వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. వర్సిటీల ఏర్పాటుకు సంబంధించి సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రిని ఇటీవల ప్రభుత్వం ఆదేశించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సీఎం కేసీఆర్ స్వయంగా ఈ ప్రతిపాదనను తెరమీదకు తెచ్చినట్టు ఉన్నత విద్య వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో దాదాపు 185 ఫార్మా కాలేజీలుండగా, ఇవి కేవలం బోధనకే పరిమితమవుతున్నాయి. అదీగాక, దేశంలో ఔషధ తయారీలో పరిశోధన చేసే వారి సంఖ్య కూడా తక్కువగా ఉందని ప్రభుత్వం భావిస్తోంది. కరోనా సమయంలో హైదరాబాద్ టీకా తయారీలో కీలక భూమిక పోషించింది. ఇక్కడే వ్యాక్సిన్ తయారవ్వడం, అనేక కీలక పరిశోధనలకు భాగ్యనగరం వేదికగా నిలవడాన్ని కేసీఆర్ ప్రస్తావించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో పరిశోధనకు ప్రత్యేకంగా వర్సిటీ ఉండాలన్నది కేసీఆర్ మనోభీష్టంగా అధికారులు భావిస్తున్నారు. యూనివర్సిటీ ఏర్పాటైతే పరిశోధకులను భారత్కు అందించడంతోపాటు, తెలంగాణ దేశంలోనే నంబర్ వన్గా ఉంటుందని సీఎం అన్నట్టు తెలిసింది. సరికొత్త అన్వేషణలు: ఏరోనాటికల్ విభాగంలో భారత్లో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. భవిష్యత్లో ఈ సెక్టార్లో మరిన్ని ఆవిష్కరణలకు ఆస్కారం ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రపంచవ్యాప్తంగా ఏరోనాటికల్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పరిశోధనలను పెంచాలని ముఖ్యమంత్రి ఉద్బోధించినట్టు ఉన్నత విద్యామండలి అధికారులు చెబుతున్నారు. ఏరో, ఫార్మా రంగాలకు సంబంధించిన యూనివర్సిటీల ఏర్పాటుకు కావల్సిన మౌలిక వసతులు, తక్షణమే చేపట్టాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక రూపొందించే పనిలో అధికారులున్నారు. ఇది పూర్తయిన తర్వాత నేరుగా ముఖ్యమంత్రితో అధికారులు భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మంచి పరిణామమే ఫార్మా, ఏరోనాటికల్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ ఆసక్తిగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన నివేదిక కూడా కోరారు. ఇవి రూపుదాలిస్తే తెలంగాణ మంచి పరిశోధన కేంద్రంగా గుర్తింపు పొందడమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. వీలైనంత త్వరగా దీనిపై సమగ్ర వివరాలు సేకరించి నివేదిక రూపొందిస్తాం. ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి,ఉన్నత విద్యామండలి చైర్మన్ -
‘పాజిటివ్’లను పట్టేస్తున్న ఫార్మా యాప్!
కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కోవిడ్–19 ఫార్మసీ యాప్ సత్ఫలితాలనిచ్చింది. 2020లో తొలి దశ వైరస్ వ్యాప్తి సమయంలో వైద్య, ఆరోగ్య శాఖ ఈ యాప్ను ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇది 4,534 పాజిటివ్ కేసులను పసిగట్టింది. సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తి ప్రారంభంలో కొందరు అనుమానిత లక్షణాలున్నా పరీక్షలు చేయించుకోకుండా మెడికల్ షాపుల్లో మందులు కొని సొంత వైద్యం చేసుకునే వారు. దీంతో ఇతర కుటుంబ సభ్యులకు వైరస్ వ్యాప్తి చెందడంతో పాటు, సరైన సమయంలో వైద్యం అందక ప్రాణాల మీదికొచ్చేది. ఇలాంటి పరిస్థితులకు చెక్ పెట్టడం కోసం ప్రభుత్వం ఫార్మా యాప్ను ప్రవేశపెట్టింది. జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి వంటి కరోనా అనుమానిత సమస్యలకు మందులు కొనుగోలు చేస్తున్న వారి వివరాలు.. పేరు, చిరునామా, ఫోన్ నంబర్ వంటివి యాప్లో నమోదు చేయాలని మెడికల్ షాపులకు ఔషధ నియంత్రణ శాఖ ఆదేశాలిచ్చింది. ఇలా నమోదు చేసిన సమాచారం ఆధారంగా స్థానిక వలంటీర్, ఏఎన్ఎం, ఆశావర్కర్తో పాటు ఇతర సిబ్బంది స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి పరిశీలిస్తారు. సాధారణ సమస్యగా భావిస్తే తగిన జాగ్రత్తలు సూచిస్తారు. కరోనాగా అనుమానం వస్తే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారమిచ్చి పరీక్షలు చేయిస్తారు. మొత్తం 10.94 లక్షల పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా 12,391 మెడికల్ షాపులు ఫార్మా యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాయి. గడిచిన వారం రోజుల్లో కరోనా అనుమానిత లక్షణాలకు మందులు కొనుగోలు చేసిన 47,666 మంది వివరాలను రాష్ట్ర వ్యాప్తంగా యాప్లో నమోదు చేశారు. ఇలా తొలి దశ నుంచి ఇప్పటి వరకూ 19,83,767 మంది వివరాలను నమోదు చేశారు. ఆ వివరాల ఆధారంగా ఫోన్లో మాట్లాడటం, నేరుగా ఇళ్లకు వెళ్లి పరిశీలించడం ద్వారా అందరి ఆరోగ్య పరిస్థితిపై ఆరోగ్య సిబ్బంది ఆరా తీశారు. 10,94,942 మందికి వైద్య పరీక్షలు అవసరమని గుర్తించి, నమూనాలు సేకరించి పరీక్షలు చేయగా, 4,534 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ప్రెగ్నెన్సీ కిట్ల తరహాలో ఇంట్లోనే కరోనా నిర్ధారణ చేసుకునే కిట్లు మార్కెట్లోకొచ్చాయి. ఈ నేపథ్యంలో కరోనా అనుమానిత లక్షణాలున్న వారు రాష్ట్ర వ్యాప్తంగా 35,174 కిట్లను కొనుగోలు చేశారు. వీరి వివరాలను ఫార్మా యాప్లో నమోదు చేయడంతో ఆరోగ్య సిబ్బంది వారి ఆరోగ్యంపై వాకబు చేశారు. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 4,791, అనంతపురంలో 4,216, విశాఖపట్నంలో 4,133 మంది కిట్లు కొనుగోలు చేశారు. -
కొత్త ఏడాదిలో అతిపెద్ద నష్టం
ముంబై: ట్రేడింగ్ ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన స్టాక్ సూచీలు చివరి గంటలో లాభాల స్వీకరణతో మంగళవారం భారీ నష్టాలను చవిచూశాయి. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సూచీలు ఈ కొత్త ఏడాది(2022)లో అతిపెద్ద నష్టాన్ని నమోదు చేశాయి. సెన్సెక్స్ 554 పాయింట్లు పతనమై 60,755 వద్ద నిలిచింది. నిఫ్టీ 195 పాయింట్లు క్షీణించి 18,113 వద్ద స్థిరపడింది. ఆటో, ఐటీ, టెలికాం, కన్జూమర్, మెటల్, రియల్టీ రంగాల చిన్న, మధ్య తరహా షేర్లు అత్యధికంగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు వరుసగా రెండున్నర శాతం, రెండు శాతం క్షీణించాయి. సెన్సెక్స్ సూచీలోని 30 షేర్లకు గానూ 23 షేర్లు నష్టపోయాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 33 పైసలు క్షీణించి 74.58 వద్ద స్థిరపడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1255 కోట్ల షేర్లను దేశీయ ఇన్వెస్టర్లు రూ.220 కోట్ల షేర్లను అమ్మేశారు. ఆసియా, యూరప్ దేశాల స్టాక్ సూచీలు ఒకటి నుంచి ఒకటిన్నర శాతం పతనమయ్యాయి. అమెరికా ఫ్యూచర్లు సైతం అరశాతం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నష్టాలు ఎందుకంటే..? అరబ్ దేశాల్లో అల్లర్లు చెలరేగడంతో సరఫరా ఆందోళనలు తెరపైకి వచ్చి అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడాయిల్ ధర ఏడేళ్ల గరిష్ట స్థాయి 87 డాలర్లను తాకింది. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచేందుకు సిద్ధమైన నేపథ్యంలో ట్రెజరీ బాండ్లపై రాబడులు పెరుగుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లతో పాటు గత రెండు ట్రేడింగ్ సెషన్ల నుంచి దేశీయ ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడ్డారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆకస్మిక సమావేశానికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ వరుసగా మూడోరోజూ 33 పైసలు క్షీణించింది. ఈ పరిణామాలు దేశీయ ఈక్విటీ మార్కెట్లో అమ్మకాలను ప్రేరేపించాయి. రూ.3.71 లక్షల కోట్లు ఆవిరి స్టాక్ సూచీల భారీ నష్టంతో ఇన్వెస్టర్లు మంగళవారం ఒక్కరోజే రూ. 3.71 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. తద్వారా బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ (విలువ) రూ.276.30 లక్షల కోట్లకు చేరింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ♦డిసెంబర్ క్వార్టర్లో రెండింతల బుకింగ్స్ను సాధించినట్లు ప్రకటించడంతో ప్రెస్టేజ్ ఎస్టేట్స్ షేరు బీఎస్ఈలో మూడు శాతం లాభంతో రూ. 530 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఎనిమిది శాతం బలపడి ఏడాది గరిష్ట స్థాయి రూ.555 వద్ద స్థిరపడింది. ♦టెలికాం గేర్ మేకర్ హెచ్ఎఫ్సీఎల్ షేరు ఏడు శాతం క్షీణించి రూ.89 వద్ద ముగిసింది. మూడో క్వార్టర్లో ఆదాయం ఏడు శాతం క్షీణించడం షేరు పతనానికి కారణమైంది. ♦స్టాక్ మార్కెట్లో అనిశ్చితిని సూచించే వీఐఎక్స్ ఇండెక్స్ ఆరుశాతం ఎగసి 17.78 స్థాయికి చేరుకుంది. -
ఫిబ్రవరి 11–13 తేదీల్లో క్రెడాయ్ ప్రాపర్టీ షో
సాక్షి, హైదరాబాద్: కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) ప్రాపర్టీ షో మరోసారి నగరవాసుల ముందుకు రానుంది. ఫిబ్రవరి 11 –13 తేదీల్లో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ 11వ ఎడిషన్ స్థిరాస్తి ప్రదర్శన జరగనుంది. మూడు రోజుల ప్రదర్శన లేఅవుట్ను క్రెడాయ్ ప్రతినిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ పీ రామకృష్ణ రావు మాట్లాడుతూ.. ఐటీ, ఫార్మా హబ్గా పేరొందిన హైదరాబాద్లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), సేవల రంగాలలో స్థిరమైన ఉపాధి కారణంగా ఆదాయంలో వృద్ధి నమోదవుతుందని తెలిపారు. దీంతో యువతరంలో ఆకాంక్షలు పెరుగుతున్నాయని ఇది రియల్ ఎస్టేట్ మార్కెట్కు దోహదమవుతుందని పేర్కొన్నారు. రియల్టీ రంగంలో పెట్టుబడులు పెట్టే కొనుగోలుదారుల సగటు వయస్సు 35 ఏళ్లుగా ఉంటుందని చెప్పారు. గత కొన్ని దశాబ్దాలలో 50 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న కొనుగోలుదారుల జనాభా తక్కువగా ఉందని వివరించారు. కరోనా తర్వాతి నుంచి హైబ్రిడ్ పని విధానంతో అపార్ట్మెంట్ సైజ్లు క్రమంగా పెరుగుతున్నాయని చెప్పారు. టీఎస్ రెరా అనుమతి పొందిన ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, హరిత భవనాల ప్రాజెక్ట్లు మాత్రమే ప్రదర్శనలో ఉంటాయని జనరల్ సెక్రటరీ వీ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. కరోనా నిబంధనలను పాటించే విధంగా ప్రదర్శనలో స్టాల్స్, ఎగ్జిబిషన్ లేఅవుట్ను రూపొందించామన్నారు. నిర్మాణ సంస్థలతో పాటూ మెటీరియల్ వెండర్లు, తయారీ కంపెనీలు, కన్సల్టెంట్లు, ఆర్థిక సంస్థలు కూడా ఈ ప్రదర్శనలో స్టాల్స్ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్లు జి. ఆనంద్ రెడ్డి, కే రాజేశ్వర్, ఎన్ జైదీప్ రెడ్డి, బీ జగన్నాథ రావు, ట్రెజరర్ ఆదిత్యా గౌర, జాయింట్ సెక్రటరీలు కే రాంబాబు, శివరాజ్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. -
Covid: యాంటీ వైరల్ ఔషధం మోల్నుపిరావిర్’.. ఒక్క మాత్ర రూ.63
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ చికిత్సకు అద్భుతమైన ఔషధంగా పేర్కొంటున్న ‘మోల్నుపిరావిర్’ను ప్రముఖ ఔషధ దిగ్గజ సంస్థ ఆప్టిమస్ ఫార్మా గురువారం మార్కెట్లోకి తీసుకొచ్చింది. బంజారాహిల్స్ హోటల్ పార్క్హయత్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ ఎండీ శ్రీనివాసరెడ్డి వివరాలు వెల్లడించారు. మోల్నుపిరావిర్ 3 దశల్లో క్లినికల్ ట్రయల్స్ ముగించుకుని, ఇటీవలే డీసీజీఐ అనుమతి పొందిందన్నారు. 5 రోజుల్లోనే వైరస్లోడును పూర్తిగా అదుపులోకి తెస్తుందన్నారు. మోల్ను పిరావిర్ టాబ్లెట్లను ఆవిష్కరిస్తున్న ఆప్టిమస్ ఫార్మా సీఎండీ డాక్టర్ శ్రీనివాస్రెడ్డి తదితరులు ఒక్కో ప్యాకెట్లో 5 స్ట్రిప్లు ఉంటాయని, వీటిలో 40 మా త్రలు ఉంటాయన్నారు. ఒక్కో మాత్ర 200 ఎంజీ డోసుతో తయారైందని వెల్లడించారు. ఈ మాత్ర రోజుకు రెండు చొప్పున తీసుకోవాలని తెలిపారు. ఒక్కోమాత్ర ఖరీదు రూ.63 ఉంటుందని తెలిపారు. ఈ మందులు పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆప్టిమస్ ఫార్మా జీఎం శ్రీధర్, మేనేజర్ అంకూర్, డాక్టర్ ముఖర్జీ పాల్గొన్నారు. చదవండి: చాలా మంది అగ్ర సీఈవోల వేతనం ఒక డాలరే.. ఎందుకు? -
వైద్యశాస్త్రం విస్తుపోయేలా.. చనిపోయే కొడుకు కోసం..తండ్రే స్వయంగా మందు కనిపెట్టాడు!!
కుమ్మింగ్: తమ పిల్లలు అనారోగ్యం కారణంగా మరికొద్ది రోజుల్లో చనిపోతున్నారంటే తల్లిదండ్రులు ఎవరైన తట్టుకోగలరా. పైగా ఆ బిడ్డను రక్షించుకొనేందుకు తిరగని ఆసుపత్రి ఉండదు. అంతేకాదు ఖర్చుకు కూడా వెనకడుగు వేయరు. అయితే తల్లిదండ్రులు పిల్లల్ని కాపాడుకోవటం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారని అందరకీ తెలుసు. కానీ ఇక్కడొక తండ్రి తన బిడ్డకు వచ్చిన అరుదైన వ్యాధికి మందు లేకపోవడంతో తానే స్వయంగా మందు కనిపెట్టి తన బిడ్డను కాపాడుకోవాలని తాపత్రయపడతాడు. (చదవండి: బల్గేరియాలో దారుణం..బస్సు ప్రమాదంలో 48 మంది మృతి) అసలు విషయంలోకెళ్లితే... చైనాలోని జు వీ అనే వ్యక్తికి హయోయాంగ్ అనే రెండేళ్ల కొడుకు ఉన్నాడు. అతడు ‘మెంకేస్ సిండ్రోమ్’ అనే జన్యు పరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. జు వీ కొడుకు హయోయాంగ్ని పరీక్షించిన వైద్యులు అతడు కొద్ది నెలల మాత్రమే బతుకుతాడు అని తెలిపారు. పైగా ఈ వ్యాధి నాడివ్యవస్థను ప్రభావితం చేయడంతో కదలలేని స్థితిలో మంచానికే పరిమితమౌతాడన్నారు. నిజం చెప్పాలంటే ఈ వ్యాధితో పోరాడే బాధితులు ఎలాంటి భావోద్వేగాన్ని తెలియజేయలేరు పైగా మూడు సంవత్సరాల వయసుకు మించి జీవించడమనేది అసాధ్యం అన్నారు వైద్యులు. అయితే చైనాలో ఈ అరుదైన వ్యాధికి ఇంతవరకు ఎలాంటి మందు కనిపెట్టలేదని ఆ పిల్లాడి తండ్రి జు వీ తెలుసుకుంటాడు. మరోవైపు ఈ కరోనా మహమ్మరీ కారణంగా చికిత్స నిమిత్తం దేశాలు దాటి వెళ్లడం అసాధ్యం. దీంతో ఆ పిల్లాడి తండ్రి జువీ తానే ఈ వ్యాధికి మందు కనిపెట్టాలని నిర్ణయించుకుటాడు. అనుకున్నదే తడువుగా కుమ్మింగ్లో ఉన్న తన అపార్ట్మెంట్ని ప్రయోగశాలగా మారుస్తాడు. అయితే జువీ కేవలం హైస్కూల్ చదువు మాత్రమే చదువుకున్నాడు. అంతేకాదు జు వీ తన కొడుకు అనారోగ్యానికి గురికాక మునుపు ఆన్లైన్ వ్యాపారం చేస్తుండేవాడు. ఎప్పుడైతే తన కొడుకు ఈ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడని తెలుసుకున్నాడో అప్పటి నుంచి అతను పరిశోధనలతోనే గడుపుతుంటాడు. ఈ మేరకు జు వీ ఈ వ్యాధి నయం చేయలేనిదని కేవలం మందులతో ఈ వ్యాధి లక్షణాలను తగ్గించగలమనే విషయాన్ని తెలుసుకుంటాడు. అంతేకాదు ఫార్మాకి సంబంధించిన విషయాలను ఆంగ్లంలో ఉండటంతో వాటిని అనువాద సాఫ్టవేర్ సాయంతో విశ్లేషించడం మొదలుపెడతాడు. ఈ క్రమంలో ఈ వ్యాధి లక్షణాలను తగ్గించడంలో కాపర్ హిస్టాడిన్(రాగి) సహాయం చేయగలదని కనుగొంటాడు. కాపర్ క్లోరైడ్ డైహైడ్రేట్ను హిస్టిడిన్, సోడియం హైడ్రాక్సైడ్, నీరు కలిస్తే కాపర్ హిస్టాడిన్ని తయారువుతుందని తెలుసుకుంటాడు. అంతేకాదు ఈ మందు తయారు చేయడానికి ఒక ప్రత్యేక పరికరాన్ని కూడా ఏర్పాటు చేశాడు. అయితే జు వీ తన కొడుకు హయోయాంగ్ తాను స్వయంగా తయారు చేసిన మందును ఇవ్వడం ప్రారంబిస్తాడు. ఈ మేరకు జు వీ తన కొడుకుకి తను స్వయంగా తయారు చేసిన మందుతో చికిత్స చేయడం ప్రారంభించిన రెండు వారాల తర్వాత చేసిన రక్తపరీక్షల్లో రక్తం సాధారణ స్థాయిలో ఉన్నట్లు రసాయన శాస్రవేత్తలు గుర్తిస్తారు. అంతేకాదు పిల్లవాడు మాట్లాడలేడు కానీ తన తండ్రి ఆ పిల్లవాడి తల మీద చేయవేయంగానే చిరు నవ్వుతో తన భావోద్వేగాన్ని తెలియజేశాడని ఆ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ మెంకేస్ సిండ్రోమ్ బాలికల కంటే అబ్బాయిల్లోనే ఎక్కువగా ఉంటుందని పైగా ప్రపంచవ్యాప్తంగా సుమారు ప్రతి లక్ష మంది శిశువులలో ఒకరు ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మేరకు ఆ పిల్లాడి తండ్రి జు వీ మాట్లాడుతూ..."తాను తయారు చేసిన కాపర్ హిస్తాడిన్ మందుని మొదట కుందేళ్లపై ప్రయోగించాను. అవి బాగానే ఉన్నాయి కాబట్టి నా కొడుకుకి ఏం కాదు అని నిర్థారించుకున్నా. అంతేకాదు ఈ చికిత్స కోసం ఇతర తల్లిదండ్రులు నన్ను సంప్రదించారు కానీ నా కొడుకుకి మాత్రమే బాధ్యత వహించగలనని చెప్పాను. పైగా నా కొడుకుకి తాను ఏ చికిత్స చేసిన హెల్త్ అధికారులు జోక్య చేసుకోరు" అని కూడా చెబుతాడు. ఈ క్రమంలో ఫ్రాన్స్లోని టూర్స్ యూనివర్శిటి హాస్పిటల్లోని అరుదైన వ్యాధుల నిపుణుడు ప్రొఫెసర్ అన్నీక్ టౌటెన్ మాట్లాడుతూ... "ఒక వైద్యుడిగా జు కేసు గురించి విని "సిగ్గుపడుతున్నాను" . అభివృద్ధి చెందుతున్న దేశంగా అటువంటి కుటుంబాలకు మెరుగైన సహాయం చేయడానికి మన వైద్య వ్యవస్థను మెరుగుపరచగలం. అంతేకాదు ఆ పిల్లాడి తండ్రి జువీతో కలిసి మెంకేస్ సిండ్రోమ్ జన్యు చికిత్స పరిశోధనను ప్రారంభిస్తున్నాం" అని అన్నారు. (చదవండి: వెర్రి వేయి రకాలు.. కుక్కని బుక్ చేసేందుకు...మరీ అలా చేయాలా?)
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- ప్రైవేట్ బస్సు బోల్తా.. ఇద్దరు బాలికల మృతి
- Rahul Gandhi: మహిళలంటే చిన్నచూపు!
- శెభాష్ కామ్య..!
- టీడీపీ రీపోలింగ్ ఎందుకు కోరలేదు?
- Lok Sabha Election 2024: సిట్టింగ్ సీట్లలో గట్టి పోటీ
- Lok Sabha Election 2024: బిహార్లో ఆరో విడత... బీజేపీకి అగ్నిపరీక్ష!
- Lok Sabha Election 2024: ఢిల్లీ బరిలో స్వతంత్రుల సందడి
- కేవలం రూ.4 కోట్ల సినిమా.. నెల రోజుల్లోనే యానిమల్ను దాటేసి!
- ఎంటర్ప్రెన్యూర్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్గా మారిన లాయర్! ఏకంగా ఆరుసార్లు కేన్స్..!
- బాయ్ఫ్రెండ్తో బ్రేకప్.. తొలిసారి క్లారిటీ ఇచ్చిన శృతిహాసన్!
Advertisement