మాన్యుఫాక్చరింగ్‌ హబ్‌గా విశాఖ | Sakshi
Sakshi News home page

మాన్యుఫాక్చరింగ్‌ హబ్‌గా విశాఖ

Published Wed, Aug 30 2023 3:57 AM

Green signal for setting up 3 more units in Visage - Sakshi

సాక్షి, విశాఖపట్నం: అంతర్జాతీయ వాణిజ్య కార్యకలాపాలకు వేదికగా విశాఖపట్నం మారుతోంది. మాన్యుఫాక్చరింగ్, ఫార్మా, ఐటీ, కార్గో... ఇలా భిన్నమైన రంగాలకు సంబంధించిన పరిశ్రమలు ఒక్కొక్కటిగా విశాఖకు విస్తరిస్తున్నాయి. తాజాగా విశాఖపట్నం స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ (వీసెజ్‌)లో మరో మూడు మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు ఆమోదం లభించింది.

రూ.500 కోట్లకు పైగా పెట్టుబడులతో రెండు బయో డీజిల్‌ కంపెనీలు, ఒక ఫార్మా కంపెనీ ఏడాదిలోపు ఏర్పాటు కానున్నాయి. వీటి ద్వారా 1,200 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మరోవైపు తొలి త్రైమాసికంలో గతేడాదితో పోలిస్తే ఉత్పత్తుల ఎగుమతుల్లో 34 శాతం వృద్ధి కనబరిచిన వీసెజ్‌... అర్ధ సంవత్సరానికి 50 శాతం వృద్ధి నమోదు దిశగా ముందుకు సాగుతోంది.

యూఎస్, కెనడాకు ఎగుమతులే లక్ష్యంగా...
ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన మూడు యూనిట్లు విశాఖ సెజ్‌లోనే ఏర్పాటు కానున్నాయి. ఇందులో బయోడీజిల్‌ తయారీ సంస్థ అద్వైత్‌ బయోఫ్యూయల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, బయోకాన్‌ లిమిటెడ్, ఫార్మాసూ్యటికల్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ గ్రాన్యూల్స్‌ సీజెడ్‌ఆర్‌వో సంస్థలు ఉన్నాయి.

ఈ కంపెనీలు ఏడాదిలోపు తమ కార్యకలాపాలు ప్రారంభించాలని వీసెజ్‌ నిబంధన విధించింది. అయితే... ఈ సంస్థలన్నీ ఆరు నుంచి పది నెలల్లోపే ఉత్పత్తుల తయారీని మొదలు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని వీసెజ్‌ అధికారులు చెబుతున్నారు. ఈ మూడు కంపెనీలు ప్రధానంగా కెనడా, యూఎస్‌కు
ఎగుమతులే లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి.

రికార్డు స్థాయిలో ఎగుమతులు
ఏపీ, తెలంగాణకు వస్తున్న పరిశ్రమలు వీలైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు చేపట్టాం. దువ్వాడ వీసెజ్‌ పరిధిలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సెజ్‌లు, యూనిట్ల ద్వారా రికార్డు స్థాయి ఎగుమతులు సాధించాం. 2023–24 మొదటి త్రైమాసికంలో రూ.50,195 కోట్ల విలువైన వస్తువులు, సేవలను ఎగుమతి చేశాం. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 34 శాతం వృద్ధి రేటు సాధించాం.

వివిధ వస్తువులను ఉత్పత్తి చేయడం ద్వారా రూ.35,992 కోట్లు, సేవారంగం ఎగుమతుల్లోనూ 36 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడాది జూన్‌ 30వ తేదీ వరకు గణాంకాలను పరిశీలిస్తే రూ.1,04,961 కోట్ల పెట్టుబడులు వీసెజ్‌ ద్వారా రాగా... మొత్తం 6,61,579 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి.
– ఎం.శ్రీనివాస్, వీసెజ్‌జోనల్‌ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌

Advertisement
Advertisement