-
ఉత్పత్తికి సిద్ధమైన మరో భారీ ఫార్మా యూనిట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో భారీ ఫార్మా సంస్థ ఉత్పత్తికి సిద్ధమైంది. చైనా నుంచి ఫార్మా దిగుమతులను తగ్గించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్ఐ) స్కీం కింద లిఫియస్ పేరుతో అరబిందో గ్రూపు పెన్సులిన్ జి తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. పెన్సులిన్ తయారీలో కీలక ముడిపదార్థంగా పెన్సులిన్ జి వినియోగిస్తారు. కాకినాడ సమీపంలోని తొండంగి వద్ద 250 ఎకరాల్లో సుమారు రూ.2,205 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ శరవేగంగా నిర్మాణాన్ని పూర్తి చేసుకొని, ఉత్పత్తి ప్రారంభానికి సిద్ధమైంది. ఈ కర్మాగారంలో ఏటా 15,000 టన్నుల పెన్సులిన్ జి యూనిట్, 2,000 టన్నుల సామర్ధ్యంతో 7–ఏసీఏ యూనిట్ను అరబిందో గ్రూపు ఏర్పాటు చేసింది. ఈ యూనిట్లో 3,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ఈ ప్లాంట్ వాణిజ్య ఉత్పత్తికి సిద్ధమవడంతో లిఫియస్ ఉద్యోగ నియామకాలు చేపట్టింది. బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్ (బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ) కోర్సులు పూర్తి చేసిన వారిని వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నట్లు లిఫియస్ ప్రకటించింది. ఈ నెల 22న హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్టు వద్ద ఉన్న మనోహర్ హోటల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఫెర్మిటేషన్స్లో ప్రొడక్షన్, మైక్రోబయోలజీ రంగాల్లో నియామకాలకు తాజాగా కోర్సు పూర్తి చేసిన వారి (ఫ్రెషర్స్) దగ్గర నుంచి 10 ఏళ్ల అనుభవం ఉన్నవారికి అవకాశం కల్పిస్తోంది. వాటర్ ట్రీట్మెంట్ అసిస్టెంట్ పోస్టులకు కనీసం రెండేళ్ల అనుభవం నుంచి పదేళ్ల వారికి అవకాశం కల్పిస్తోంది. మరో రెండు ఫార్మా యూనిట్లు లిఫియస్కు సమీపంలోనే పీఎల్ఐ స్కీం కింద మరో రెండు ఫార్మా యూనిట్లు ఏర్పాటవుతున్నాయి. అరబిందో గ్రూపు క్యూలే పేరుతో సుమారు రూ.2,000 కోట్ల పెట్టుబడితో 159 ఎకరాల్లో ఎరిత్రోమైసిన్ థియోసేనేట్ యూనిట్ని ఏర్పాటు చేస్తోంది. దీని ఉత్పత్తి సామర్థ్యం 1,600 టన్నులు. దీనికి సమీపంలోనే దివీస్ సంస్థ ఓ ఫార్మా యూనిట్ ఏర్పాటు చేస్తోంది. దీని పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మూడు యూనిట్లతో కాకినాడ మేజర్ ఫార్మా హబ్గా ఎదగనుంది. -
అదిరిపోయే దివాలీ గిఫ్ట్: సంబరాల్లో కంపెనీ ఉద్యోగులు
హర్యానాలోని ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ తన ఉద్యోగులకు రానున్న దీపావళికి కార్లను బహుమతిగా ఇచ్చింది. తన ఆఫీస్ హెల్పర్తో సహా 12 మంది ఉద్యోగులకు సరికొత్త టాటా పంచ్ కార్లను గిఫ్ట్గా అందించింది కంపెనీ. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్ అయింది. అంతేకాదు తన ఉద్యోగులే తనకు సెలబ్రిటీలు అని పేర్కొనడం విశేషంగా నిలిచింది. హర్యానా, పంచకులలోని ఫార్మాస్యూటికల్ కంపెనీ మిట్స్కార్ట్ ఛైర్మన్ కార్లను కానుకగా ఇచ్చారు. అంతేకాదు తమ సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు. ఛైర్మన్ ఎంకె భాటియా. వారి అంకితభావం, కృషి తనను ముగ్ధుడ్ని చేసిందనీ, అందుకే వారికి ప్రత్యేక బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కంపెనీ ఎన్నో ఒడిదుడుకులను చవి చూసింది అయినా ఉద్యోగులు తమతోనే ఉండి కంపెనీ ఎదుగుదలకు సహకరించారని పేర్కొన్నారు. వాళ్లే తమ స్టార్స్ అంటూ భాటియా సంతోషం వ్యక్తం చేశారు. దీంతో అటు ఉద్యోగుల సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. కారు తాళాలను ఉద్యోగులిస్తున్న వీడియోను లింక్డ్ఇన్ పోస్ట్ చేశారు. కంపెనీ పట్ల వారి నిబద్ధతకు, విశ్వాసానికి గుర్తుగా నెల రోజుల క్రితమే కార్లు అంద జేశానని, అంతేకానీ దీపావళి సందర్బంగా ప్లాన్ చేసింది కాదంటూ వివరించారు. ఈ సమయంలో వార్తలు రావడం యాదృచ్చిక మన్నారు. అలాగే సమీప భవిష్యత్తులో మరో 38 మందికి కూడా ఈ గిప్ట్ ఇవ్వాలని యోచిస్తున్నట్లు మిట్స్కార్ట్ యాజమాన్యం తెలిపింది. ఇదిలా ఉంటే కలలో కూడా ఊహించని కార్లను బహుమతిగా అందుకోవడం పట్ల ఉద్యోగులు ఆశ్చర్యానికి లోనయ్యారు.. వారిలో కొందరికి డ్రైవింగ్ కూడా తెలియదట. టాటా పంచ్ టాటా మోటార్స్కు చెందిన టాటా పంచ్ 2021 లో లాంచ్ అయింది. టాటా పంచ్ అనేది ఎంట్రీ-లెవల్ మైక్రో SUV. ఈ వెహికల్ ప్రారంభ ధర సుమారు రూ. 6లక్షలు -
AP: సాగర తీరంలో ఐటీ వెలుగులు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: ఐటీ సేవల హబ్గా మారేందుకు విశాఖపట్నానికి అన్ని అవకాశాలు, సామర్థ్యాలు పుష్కలంగా ఉన్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. విశాఖలో ఇన్ఫోసిస్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాలు పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. టైర్ 1 సిటీగా విశాఖ రూపాంతరం చెందేందుకు ఇన్ఫోసిస్ రాక దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు 20 వేల మంది నేవీ ఉద్యోగులతో తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంగా ఉన్న విశాఖ ఎడ్యుకేషన్ హబ్గా కూడా నిలిచిందని గుర్తు చేశారు. ఇక్కడ ఇప్పటికే రెండు పోర్టులున్నాయని త్వరలోనే మూడో పోర్టు సమీపంలోని శ్రీకాకుళంలో రానుందని తెలిపారు. మరో రెండేళ్లల్లో పూర్తిస్థాయి అంతర్జాతీయ పౌర విమానాశ్రయం కూడా సిద్ధం కానుందని చెప్పారు. పరిశ్రమలకు ఏ సహాయం కావాలన్నా ఒక్క ఫోన్ కాల్ దూరంలో అందుబాటులో ఉంటామని పారిశ్రామికవేత్తలకు హామీ ఇచ్చారు. సోమవారం విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పర్యటన సందర్భంగా విశాఖలో ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ను సీఎం జగన్ ప్రారంభించారు. ఫార్మా కంపెనీల నాలుగు యూనిట్లకు ప్రారంభోత్సవాలు, రెండు యూనిట్లకు శంకుస్థాపనలు నిర్వహించారు. మొత్తం రూ.1,646 కోట్ల విలువైన ఐటీ కార్యాలయాలు, ఫార్మా యూనిట్ల ఏర్పాటుతో 3,450 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. విశాఖలో సముద్ర తీరం శుభ్రత కోసం జీవీఎంసీ సిద్ధం చేసిన ఆరు బీచ్ క్లీనింగ్ యంత్రాలను కూడా ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో సీఎం జగన్ ఏమన్నారంటే.. విశాఖకు విశేష సామర్థ్యం.. విశాఖ నగరానికి విశేషమైన సామర్ధ్యం ఉంది. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై తరహాలో విశాఖపట్నం కూడా ఐటీ హబ్గా మారబోతోంది. ఆ స్ధాయిలో ఈ నగరానికి సహకారాన్ని అందిస్తున్నాం. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ తరహా మెట్రో నగరం ఆంధ్రప్రదేశ్లో లేదు. ఐటీ, ఐటీ సేవలకు సంబంధించిన పరిశ్రమలు గతంలో విశాఖలో ఏర్పాటు కాలేదు. వాస్తవానికి ఆ కంపెనీల ఏర్పాటుకు కావాల్సిన అన్ని అర్హతలు, సామర్ధ్యం నగరానికి ఉన్నప్పటికీ అవన్నీ అప్పటి రాజధాని హైదరాబాద్లోనే ఏర్పాటయ్యాయి. ఏపీలో విశాఖ అతిపెద్ద నగరం. టైర్ 1 సిటీగా ఎదగడానికి కావాల్సిన అన్ని అర్హతలు, సామర్ధ్యం ఈ నగరానికి ఉన్నాయి. ప్రథమశ్రేణి నగరంగా ఎదగడానికి అవసరమైన తోడ్పాటును ఇన్ఫోసిస్ అందించగలదని నేను బలంగా నమ్ముతున్నా. దాదాపు 3.28 లక్షల మంది ఉద్యోగులు, 18.5 బిలియన్ డాలర్ల రెవెన్యూ సామర్ధ్యం కలిగిన ఇన్ఫోసిస్తో పాటు టీసీఎస్, విప్రో లాంటి సంస్ధలు నగర ఐటీ స్వరూపాన్ని, ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చి వేస్తాయి. విశాఖకు ఇప్పుడు ఇన్ఫోసిస్ వచ్చింది. రానున్న రోజుల్లో మిగిలిన ఐటీ కంపెనీలు కూడా ఆ జాబితాలో చేరనున్నాయి. విశాఖలో ఆదానీ డేటాసెంటర్ కూడా రాబోతుంది. సబ్మెరైన్ ఇంటర్నెట్ కేబుల్ మనకు ప్రత్యేకంగా సింగపూర్ నుంచి వస్తుంది. రాబోయే రెండేళ్లలో డేటా సెంటర్ రానుంది. క్లౌడింగ్తో పాటు ఐటీ రంగంలో చాలా మార్పులు రానున్నాయి. ఇవన్నీ సాకారం కానున్నాయి. నీలాంజన్, నీలాద్రిప్రసాద్, సురేష్, రఘు లాంటి ఐటీ నిపుణులతో మాట్లాడిన తర్వాత వీరంతా విశాఖ ఐటీలో కచ్చితంగా ఒకరోజు అద్భుతాలు సృష్టిస్తారని బలంగా విశ్వసిస్తున్నా. నాకు ఆ నమ్మకం ఉంది. ఇవాళ 1,000 మందితో ఇక్కడ ప్రారంభమైన ఇన్ఫోసిస్ రానున్న రోజుల్లో మరింత విస్తరించాలని ఆకాంక్షిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వ సహకారం, ఇన్ఫోసిస్తో కలసి ఐటీ రంగంలో విశాఖ బహుముఖ ప్రగతిని సాధిస్తుందన్న విశ్వాసం నాకుంది. రానున్న రోజుల్లో విశాఖలో పెట్టుబడులకు అనేక మంది ముందుకొచ్చే అవకాశాలున్నాయి. అందుకు అనుగుణంగా పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. ఇప్పటికే ఎడ్యుకేషన్ హబ్ విశాఖలో ఇప్పటికే అత్యంత ప్రతిష్టాత్మక సంస్ధలు ఏర్పాటయ్యాయి. 14 ఇంజనీరింగ్ కాలేజీలు, 8 యూనివర్సిటీలు, 4 మెడికల్ కాలేజీలు, 12 డిగ్రీ కాలేజీలతో విశాఖ ఎడ్యుకేషన్ హబ్గా ఉంది. ఇక్కడి నుంచి ఏటా దాదాపు 12 వేల నుంచి 15 వేల మంది ఇంజనీర్లు డిగ్రీ పూర్తి చేసుకుని వస్తున్నారు. వీటితో పాటు ఐఐఎం, నేషనల్ లా యూనివర్సిటీ లాంటి అత్యంత ప్రతిష్టాత్మక సంస్ధలు కూడా విశాఖలో ఉన్నాయి. ఇదీ విశాఖ సామర్ధ్యం. ఇక్కడే ఐవోసీతోపాటు తూర్పు నౌకా దళం ప్రధాన కేంద్రం కూడా ఉంది. విశాఖ, గంగవరం లాంటి రెండు బలమైన పోర్టులు కూడా ఉన్నాయి. వీటితో పాటు శ్రీకాకుళంలో మూడో పోర్టు వస్తోంది. మధురవాడ ఐటీ హిల్స్లో ఇన్ఫోసిస్ గన్నవరం నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ తొలుత మధురవాడ ఐటీ హిల్స్లో రూ.35 కోట్లతో ఏర్పాటైన ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ని ప్రారంభించారు. సంస్థ ప్రాంగణమంతా పరిశీలించారు. అనంతరం గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) సముద్రతీర ప్రాంత శుభ్రత కోసం రూ.15 కోట్లతో ఏర్పాటు చేసిన 6 బీచ్ క్లీనింగ్ యంత్రాలను ప్రారంభించారు. క్లీనింగ్ యంత్రాలపైకి ఎక్కి అవి ఎలా పనిచేస్తాయన్న వివరాలను ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఆ తరువాత పరవాడ చేరుకుని రూ.500 కోట్లతో ఫార్మాసిటీలో 19.34 ఎకరాల్లో ఏర్పాటైన అరబిందో ఫార్మా అనుబంధ సంస్థ యూజియా స్టెరిలైజ్ యూనిట్ను ప్రారంభించారు. ఈ సంస్థ ఏటా 420 మిలియన్ సామర్థ్యం కలిగిన జనరల్ ఇంజెక్టబుల్స్ను తయారు చేయనుంది. అనంతరం అచ్యుతాపురంలో లారస్ సంస్థ రూ.440 కోట్లతో నిర్మించిన ఫార్ములేషన్ బ్లాక్ను, రూ.191 కోట్లతో ఏర్పాటైన యూనిట్–2ను సీఎం ప్రారంభించారు. లారస్ రూ.240 కోట్లతో 450 మందికి ఉపాధి కల్పించేలా నిర్మించనున్న యూనిట్–3తో పాటు మరో రూ.240 కోట్లతో ఇదే సంస్థ పరవాడ వద్ద నిర్మించనున్న యూనిట్–7కు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఫార్మా ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా పరిపాలన రాజధానిగా శరవేగంగా ముస్తాబవుతున్న విశాఖకు అక్టోబర్కే తరలి వెళ్లాల్సి ఉన్నా కార్యాలయాలు ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాకపోవడం, విస్తృత భద్రతా కారణాల దృష్ట్యా అధికారుల సూచనల మేరకు డిసెంబర్లో వెళ్లే అవకాశం ఉందని సీఎం సమావేశంలో చెప్పారు. ఈ కార్యక్రమాల్లో ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నీలాంజన్ రాయ్, వైస్ ప్రెసిడెంట్ నీలాద్రి ప్రసాద్ మిశ్రా, లారస్ సీఈవో సత్యనారాయణతో పాటు డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, ఆదిమూలపు సురేష్, విడదల రజని, మేయర్ హరివెంకటకుమారి, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, డా.సత్యవతి, గొడ్డేటి మాధవి, ఉత్తరాంధ్ర వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, కలెక్టర్ డా.మల్లికార్జున, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. 40 శాతం మహిళా ఉద్యోగులే 1981లో ఏర్పాటైన ఇన్ఫోసిస్ భవిష్యత్తు డిజిటల్ సేవలు, కన్సల్టింగ్లో ప్రపంచవ్యాప్తంగా అగ్రగామిగా ఉంది. 56 దేశాలలో 274 చోట్ల సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ డీలర్స్ ఆటోమేటెడ్ కొటేషన్స్ (నాస్డాక్) జాబితాలో భారత తొలి ఐటీ కంపెనీగా ఇన్ఫోసిస్ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు 71.01 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇన్ఫోసిస్లో ప్రపంచవ్యాప్తంగా 3,50,000 మంది ఉద్యోగులు పని చేస్తుండగా వీరిలో 40 శాతం మంది మహిళా ఉద్యోగులే కావడం గమనార్హం. 2023లో ప్రపంచంలో అత్యంత నైతికత (ఎథికల్) సంస్థలలో ఒకటిగా ఇన్ఫోసిస్ గుర్తింపు పొందింది. టైమ్ మ్యాగజైన్ టాప్ 100 ప్రపంచ అత్యుత్తమ సంస్థలు 2023 జాబితాలో ఉన్న ఏకైక భారతీయ సంస్థగా ఇన్ఫోసిస్ నిలిచింది. గ్లోబల్ టాప్ ఎంప్లాయర్ 2023 సర్టిఫికేషన్ను సొంతం చేసుకుంది. అలల ప్రేరణతో కార్యాలయం టాలెంట్ స్ట్రాటజీలో భాగంగా ప్రతిభా కేంద్రాలకు దగ్గరగా డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఇన్ఫోసిస్ నిర్దేశించుకుంది. మంగళూరు, మైసూర్, త్రివేండ్రం, నాగ్పూర్, ఇండోర్, జైపూర్, హుబ్లీ, చండీగఢ్, భువనేశ్వర్, కోయంబత్తూర్ లాంటి టైర్ 2 నగరాల్లో డెలివరీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. తాజాగా విశాఖలో సేవలను ప్రారంభించింది. మధురవాడలోని ఐటీ హిల్ నం.2లో ఉన్న సిగ్నిటివ్ టవర్స్లో లీజుకు తీసుకున్న బిల్డ్ అప్ స్థలంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. విశాఖకు సహజ అందాలను తీసుకొచ్చిన సముద్రపు అలల ప్రేరణతో కార్యాలయంలోని ఇంటీరియర్ డిజైన్ రూపొందించారు. జావా, జే2ఈఈ, శాప్, డేటాసైన్స్, డేటా అనలటిక్స్ లాంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎనర్జీ – యుటిలిటీ, రిటైల్ సహా బహుళ పరిశ్రమలకు ప్రపంచవ్యాప్తంగా క్లెయింట్స్ సేవలను ఈ కేంద్రం నుంచి అందిస్తారు. ఇక్కడ పనిచేసే ఉద్యోగులలో సింహభాగం విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం పరిసర ప్రాంతాలకు చెందినవారే ఉన్నారు. కాగా మరింత మంది నియామకం కోసం విశాఖలోని వివిధ కళాశాలలతో ఇన్ఫోసిస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇన్ఫోసిస్ రాక విశాఖలో ఐటీ పరిశ్రమ వృద్ధిపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. ఇప్పటికే ఉన్న బీపీవో/కేపీవో పరిశ్రమలతో పాటు కోర్ ఐటీ కంపెనీలతో కలసి ఎమర్జింగ్ టెక్నాలజీ హబ్గా విశాఖ అడుగులు వేసేందుకు దోహదం చేయనుంది. -
కంపెనీలు తేవడం ఆషామాషీ కాదు
సాక్షి, హైదరాబాద్ / శామీర్పేట / మర్కూక్ (గజ్వేల్): రాష్ట్రానికి కొత్త కంపెనీలు తీసుకురావడం అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కొన్నేళ్లుగా తెలంగాణకు అనేక దేశ, విదేశీ కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయంటే, దానివెనుక రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, మంత్రులు పడే శ్రమ చాలా ఎక్కువని ఆయన అన్నారు. హైదరాబాద్లోని జినోమ్ వ్యాలీలో గురువారం ఫార్మా కంపెనీ భారత్ సిరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ కర్మాగారానికి శంకుస్థాపన చేసిన మంత్రి మాట్లాడుతూ జీవశాస్త్ర రంగ అభివృద్ధికి, ప్రోత్సాహానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్న ఫలితమే కొత్త కొత్త కంపెనీల రాక అని చెప్పారు. పది ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటవుతున్న బీఎస్వీ కర్మాగారం ద్వారా మహిళల ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడే ఉత్పత్తులు తయారు కానుండటం హర్షణీయమైన అంశమన్నారు. జినోమ్ వ్యాలీలో అంచనాలకు మించి వృద్ధి చెందుతోందని, ఈ నేపథ్యంలో దీనిని మరింత విస్తరించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఇప్పటికే 130 ఎకరాల భూమి అదనంగా సేకరించగా, 250 ఎకరాలతో మలిదశ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ ఉపాధ్యక్షుడు ఈవీ నరసింహారెడ్డి, తెలంగాణ లైఫ్ సైన్సెస్ సీఈఓ శక్తి నాగప్పన్, బీఎస్వీ ఎండీ, సీఈఓ సంజీవ్ నవన్గుల్ పాల్గొన్నారు. యూరోఫిన్స్ కేంద్రం ప్రారంభం బెల్జియం కేంద్రంగా పనిచేస్తున్న యూరోఫిన్స్ బయో ఫార్మా సర్విసెస్ హైదరాబాద్లోని జినోమ్ వ్యాలీలో తన కేంద్రాన్ని గురువారం ప్రారంభించింది.వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులతో సిద్ధమైన ఈ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. అంతర్జాతీయ స్థాయి ఫార్మా కంపెనీలకు బయో అనలిటికల్ సర్విసెస్, ఫార్ములేషన్ డెవలప్మెంట్, సేఫ్టీ టాక్సికాలజీ, డిస్కవరీ కెమిస్ట్రీ అండ్ డిస్కవరీ బయాలజీ వంటి సేవలు అందించే యూరోఫిన్స్ కేంద్రం 15 ఎకరాల్లో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యూరోఫిన్స్ కేంద్రం ద్వారా రానున్న కాలంలో రెండు వేల మందికిపైగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా 33 శాతం వ్యాక్సిన్లు హైదరాబాద్ జినోమ్ వ్యాలీలోనే తయారు అవుతున్నాయని, ప్రపంచానికి వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ మారిందని ఎక్కడికెళ్లినా ధైర్యంగా చెబుతానన్నారు. ఇక్కడ ఏడాదికి 900 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతున్నాయని, వచ్చే ఏడాది నుంచి 1400 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతాయని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో యూరోఫిన్స్ రీజనల్ డైరెక్టర్ నీరజ్ గార్గ్, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. -
మాన్యుఫాక్చరింగ్ హబ్గా విశాఖ
సాక్షి, విశాఖపట్నం: అంతర్జాతీయ వాణిజ్య కార్యకలాపాలకు వేదికగా విశాఖపట్నం మారుతోంది. మాన్యుఫాక్చరింగ్, ఫార్మా, ఐటీ, కార్గో... ఇలా భిన్నమైన రంగాలకు సంబంధించిన పరిశ్రమలు ఒక్కొక్కటిగా విశాఖకు విస్తరిస్తున్నాయి. తాజాగా విశాఖపట్నం స్పెషల్ ఎకనమిక్ జోన్ (వీసెజ్)లో మరో మూడు మాన్యుఫాక్చరింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఆమోదం లభించింది. రూ.500 కోట్లకు పైగా పెట్టుబడులతో రెండు బయో డీజిల్ కంపెనీలు, ఒక ఫార్మా కంపెనీ ఏడాదిలోపు ఏర్పాటు కానున్నాయి. వీటి ద్వారా 1,200 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మరోవైపు తొలి త్రైమాసికంలో గతేడాదితో పోలిస్తే ఉత్పత్తుల ఎగుమతుల్లో 34 శాతం వృద్ధి కనబరిచిన వీసెజ్... అర్ధ సంవత్సరానికి 50 శాతం వృద్ధి నమోదు దిశగా ముందుకు సాగుతోంది. యూఎస్, కెనడాకు ఎగుమతులే లక్ష్యంగా... ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన మూడు యూనిట్లు విశాఖ సెజ్లోనే ఏర్పాటు కానున్నాయి. ఇందులో బయోడీజిల్ తయారీ సంస్థ అద్వైత్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్, బయోకాన్ లిమిటెడ్, ఫార్మాసూ్యటికల్ ఉత్పత్తుల తయారీ సంస్థ గ్రాన్యూల్స్ సీజెడ్ఆర్వో సంస్థలు ఉన్నాయి. ఈ కంపెనీలు ఏడాదిలోపు తమ కార్యకలాపాలు ప్రారంభించాలని వీసెజ్ నిబంధన విధించింది. అయితే... ఈ సంస్థలన్నీ ఆరు నుంచి పది నెలల్లోపే ఉత్పత్తుల తయారీని మొదలు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని వీసెజ్ అధికారులు చెబుతున్నారు. ఈ మూడు కంపెనీలు ప్రధానంగా కెనడా, యూఎస్కు ఎగుమతులే లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. రికార్డు స్థాయిలో ఎగుమతులు ఏపీ, తెలంగాణకు వస్తున్న పరిశ్రమలు వీలైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు చేపట్టాం. దువ్వాడ వీసెజ్ పరిధిలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సెజ్లు, యూనిట్ల ద్వారా రికార్డు స్థాయి ఎగుమతులు సాధించాం. 2023–24 మొదటి త్రైమాసికంలో రూ.50,195 కోట్ల విలువైన వస్తువులు, సేవలను ఎగుమతి చేశాం. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 34 శాతం వృద్ధి రేటు సాధించాం. వివిధ వస్తువులను ఉత్పత్తి చేయడం ద్వారా రూ.35,992 కోట్లు, సేవారంగం ఎగుమతుల్లోనూ 36 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు గణాంకాలను పరిశీలిస్తే రూ.1,04,961 కోట్ల పెట్టుబడులు వీసెజ్ ద్వారా రాగా... మొత్తం 6,61,579 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. – ఎం.శ్రీనివాస్, వీసెజ్జోనల్ డెవలప్మెంట్ కమిషనర్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
కూటమి కక్కిన విషం.. నలుగురు వృద్ధులు మృతి
తొడలు కొట్టే నేత.. ప్రజాసేవలో తొండాట
ఏపీలో జగన్తోనే ముస్లిం రిజర్వేషన్లు: అసదుద్దీన్ ఒవైసీ
ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించండి: ఎంపీ బండి సంజయ్
తీరం మారింది
నిర్మాత బండ్ల గణేష్పై కేసు నమోదు
ఢిల్లీ సుల్తాన్లను ఎదిరిస్తాం: సీఎం రేవంత్రెడ్డి
బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
హస్తిన ‘దండు’యాత్ర
హార్సిలీహిల్స్ ఘాట్రోడ్డుపై తలకిందులైన కారు
తప్పక చదవండి
- Bobbili: వాటీజ్ దిస్ ‘బేబీ’?
- ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించండి: ఎంపీ బండి సంజయ్
- బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
- జయరాం.. రాం!
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
- రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
Advertisement