లాభాలు ఒకరోజుకే పరిమితం | Sakshi
Sakshi News home page

లాభాలు ఒకరోజుకే పరిమితం

Published Sat, Mar 16 2024 6:25 AM

Stock Market: Nifty around 22,000, Sensex falls 454 points - Sakshi

సెన్సెక్స్‌ 454 డౌన్‌

నిఫ్టీకి 123 పాయింట్లు నష్టం

ఆయిల్‌ అండ్‌ గ్యాస్, ఐటీ, ఫైనాన్స్‌ షేర్లలో అమ్మకాలు  

ముంబై: స్టాక్‌ మార్కెట్‌ లాభాలు ఒక రోజుకే పరిమితమయ్యాయి. అమెరికా వడ్డీరేట్ల తగ్గింపు వాయిదా ఆందోళనలతో ఫైనాన్షియల్, ఆటో, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. స్మాల్, మిడ్‌ క్యాప్‌ ఫండ్ల నిర్వహణ సామర్థ్యాలను పరీక్షించేందుకు స్ట్రెస్‌ టెస్ట్‌ నిర్వహించాలని సెబీ ఆదేశాలు జారీ చేసింది. ఆ ఫలితాలూ ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 454 పాయింట్లు పతనమై 72,643 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 123 పాయింట్లు నష్టపోయి 22,024 వద్ద నిలిచింది.

ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 612 పాయింట్లు క్షీణించి 72,485 వద్ద, నిఫ్టీ 215 పాయింట్లు పతనమై 21,932 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.849 కోట్ల షేర్లను విక్రయించారు. ఆయిల్‌ అండ్‌ గ్యాస్, ఇంధన, క్యాపిటల్‌ గూడ్స్, వినిమయ షేర్లూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.682 కోట్ల షేర్లు అమ్మేశారు. వారం మొత్తంగా సెన్సెక్స్, నిఫ్టీ 2% చొప్పున నష్టపోయాయి. బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌ సూచీ 6%, మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 4% క్షీణించాయి.

Advertisement
Advertisement