ఇండిగో ఫౌండర్ల విభేదాలు : షేరు పతనం | Sakshi
Sakshi News home page

ఇండిగో ఫౌండర్ల విభేదాలు : షేరు పతనం

Published Thu, May 16 2019 11:42 AM

IndiGo Promoters Bhatia Gangwal differ over airline Control Performance - Sakshi

సాక్షి,ముంబై : జెట్‌ ఎయిర్‌వేస్‌ సంక్షోభం వివాదం ఇంకా ఒక కొలిక్కిరాకముందే మరో దేశీ అతిపెద్ద విమానయాన సంస్థ ఇంటర్‌లో విభేదాలు భగ్గుమన్నాయి. ఇండిగో కో ఫౌండర్లు రాహుల్ భాటియా, రాకేష్ గంగ్వాల్  మధ్య ఆధిపత్య పోరుపై మార్కెట్‌ వర్గాల్లో వార్తలు గుప్పుమన్నాయి. 

విస్తరణ వ్యూహాలు, వాటాదారుల ఒప్పందం అంశాలపై ప్రమోటర్లిద్దరి మధ్యా తీవ్ర విభేదాల పొడసూపాయి. నిర్వహణ, నియంత్రణకు సంబంధించిన అంశంతోపాటు షేర్‌ హోల్డర్స్‌ ఒప్పందంలో కొన్ని క్లాజెస్‌ విషయంలో భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయట మరోవైపు జెట్ ఎయిర్‌వేస్‌ మూసివేసిన తరువాత ఇబ్బందుల్లో ఉన్న భారతీయ వైమానిక రంగానికి భారత్‌లో అతిపెద్ద ఎయిర్‌లైన్‌ మార్కెట్‌ కలిగిన ఇండిగో సంక్షోభం ప్రమాదకరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రధానంగా గత ఏడాది కంపెనీ సీఈవోగా ఆదిత్య ఘోష్‌ నియామకం తర్వాతనుంచి వీరి మధ్య  వ్యవహారం చెడినట్టు సమాచారం. కీలక ఎగ్జిక్యూటివ్‌ల నియామకాలతోపాటు నిర్వహణ స్థానాల్లోని ప్రవాస భారతీయుల నియామకాలపై  విభేదాలున్నాయట.  అంతేకాదు ఈ వ్యవహారం బహిర్గతం కాకమందే పరిష్కరించుకునే దిశగా జెఎస్‌ఏలా, ఖైతాన్ & కో సంస్థలను నియమించుకున్నారని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. వార్తలపై ఇండిగో ఫౌండర్లు రాహుల్‌, గంగ్వాల్‌ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఈ వార్తలతో గురువారంనాటి మార్కెట్‌లో ఇండిగో షేరు 7శాతం పతనమైంది. 

మార్చి 31 నాటికి ఇండిగో మాతృ సంస్థ ఇంటర్‌ గ్లోబ్‌ ఏవియేషన్‌లో రాహుల్ భాటియాకు, 38 శాతం వాటా, గాంగ్వాల్‌కు 37 శాతం వాటా ఉంది. 2006 లో భాటియా, గాంగ్వాల్ ఇండిగోను స్థాపించారు, 2013లో కంపెనీ లిస్టింగ్‌ నాటికి  ఇండిగోలో ప్రమోటర్లిద్దరూ 99 శాతం వాటాను కలిగి ఉన్నారు. కాగా సీఈఓగా ఆదిత్య ఘోష్‌ ఇండిగోను వీడిన ఎనిమిది నెలల తర్వాత ఈ ఏడాది జనవరిలో ఇండిగో సంస్థకు నూతన సీఈఓగా రొణొజాయ్‌ దత్తా  నియమితులయ్యారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement