-
శ్రీరామనవమికి సర్వాంగ సుందరంగా.. ముస్తాబవుతున్న భద్రాద్రి (ఫొటోలు)
-
ఇదొక్కటే ‘ఆధారం’!
భైంసాటౌన్/భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల కోసం ప్రజాపాలన పేరిట దరఖాస్తులు స్వీకరిస్తున్న నేపథ్యంలో ఏ సంక్షేమ పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నా ఆధార్కార్డే ప్రధానంగా మారిపోయింది. అయితే ఆధార్ కార్డుల్లో ఏపీకి బదులు తెలంగాణ ఉండాలని, పేర్లలో ఏమైనా తేడాలుంటే సరి చేసుకోవాలనే ప్రచారం జోరందుకుంది. దీంతో కొత్తగా ఆధార్ నమోదు, కార్డుల్లో సవరణల కోసం ఈ–సేవ ఆధార్ కేంద్రాల వద్దకు ప్రజలు వెళ్తుండటంతో అక్కడ సందడి నెలకొంది. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఈ–సేవ ఆధార్ కేంద్రం వద్ద అయితే గురువారం ఉదయం 5 గంటల నుంచే దరఖాస్తుదారులు బారులు తీరారు. చిన్నపిల్లలతో వచ్చిన మహిళలు, వృద్ధులు గంటల తరబడి క్యూలో నిల్చోలేక చెప్పులను వరుసలో ఉంచారు. రెండురోజులుగా కేంద్రం తెరువకముందే టోకెన్ల కోసం వేచి ఉంటున్నారు. ముథోల్, తానూర్, దిలావర్పూర్, కడెం మండల కేంద్రాల్లోని ఆధార్ ఆపరేటర్ల ఐడీలు తాత్కాలికంగా డియాక్టివ్ చేయడంతో ఈ సమస్య నెలకొందని ఈడీఎం నదీం పేర్కొన్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్లో ఆధార్కార్డు అప్డేట్కు స్థానిక ఏపీజీవీ బ్యాంక్లో ఒక్కటే కేంద్రం ఏర్పాటు చేశారు. ఆ సెంటర్లో రోజుకు 30 మందికి మాత్రమే ఆధార్ అప్డేట్ చేస్తున్నారు. దీంతో మండల వాసులు తెల్లవారుజామున 3 గంటల నుంచే చలిలో ఇబ్బంది పడుతూ బ్యాంక్ ఎదుట పడిగాపులు కాస్తున్నారు. ఆయా మండల కేంద్రాల్లో తాత్కాలికంగా మూతపడిన ఆధార్ కేంద్రాలను త్వరగా తెరిపించాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. -
స్వామీజీల ముసుగులో గంజాయి రవాణా
భద్రాచలం అర్బన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సోమవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో రూ.1.21 కోట్ల విలువైన 484 కేజీల గంజాయి స్వాదీనం చేసుకున్నారు. కాషాయ వ్రస్తాలు ధరించి, వాహనంలో దేవతామూర్తుల విగ్రహాలతో తిరుగుతూ భిక్షాటన ద్వారా జీవనం సాగిస్తున్నట్లు నమ్మిస్తున్న కొందరు వ్యక్తులు అదే వాహనంలో గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డారు. భద్రాచలం టౌన్ సీఐ నాగరాజురెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. స్వామీజీల వేషధారణలో కొందరు వాహనంలో ఇంటింటికీ వెళ్లి భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి వాహనంలో గంజాయి రవాణా చేస్తున్నారనే సమాచారంతో భద్రాచలం బ్రిడ్జి సెంటర్ వద్ద టాస్క్ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరియాణా రాష్ట్రానికి చెందిన మున్షీరాం, భగత్, గోవింద్ పట్టుబడ్డారు. సులువుగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో బల్వన్ అనే వ్యక్తి ప్రోద్బలంతో వీరు ఆటో కొనుగోలు చేసి దేవుడి ప్రచార రథంలా మార్చారు. ఏపీ–ఒడిశా సరిహద్దు ప్రాంతమైన కలిమెలిలో గంజాయిని కొనుగోలు చేసి హరియాణాలో విక్రయించేందుకు వీరు బయలుదేరారని సీఐ తెలిపారు. -
ఆయన అహంకారమేంటో అర్థం కావడం లేదు: కేసీఆర్
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఎన్నికలు వచ్చాయని ఆగం కావొద్దని.. అభ్యర్థి గుణగణాలు కూడా చూడాలని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. సోమవారం అశ్వరావుపేట నియోజకవర్గ పరిధిలోని దమ్మపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ(రెండో విడత సభలు)కు హాజరైన ప్రజానీకాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘‘మనదేశంలో ప్రజాస్వామ్య పరిణతి పూర్తిస్థాయిలో రాలేదు. ఎన్నికలు రాగానే కొన్ని పార్టీలు పచ్చి అబద్ధాలు చెబుతున్నాయి. అలవికాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారు. ఎన్నికల్లో మంచి చెడులను ఆలోచించాలి. ఎన్నికలు నేతలు కాదు.. ప్రజలే గెలవాలి. పార్టీ వెనుక ఉన్న చరిత్ర కూడా చూడాలి.. .. తెలంగాణను, తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసింది కాంగ్రెస్ పార్టీ కాదా?. 2004లో ఇవ్వాల్సిన తెలంగాణను పదేళ్లు ఆలస్యం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలోని చాలా జిల్లాల నుంచి ప్రజలు వలస వెళ్లేవారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఒక్కో సమస్యను పరిష్కరించాం. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే మొత్తం ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుంది. గతంలో రైతుల్ని ఆదుకోవాలని ఏ ప్రభుత్వం అనుకోలేదు. గతంలో కరెంట్ ఉండేది కాదు.. వలసలు పోయి బతికేవారు. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా బీజేపీ 24 గంటలు కరెంట్ ఇవ్వడం లేదు.. ..బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని గమనించండి. ఎలాంటి అలజడులు లేకుండా రాష్ట్రం క్రమబద్ధంగా ముందుకు పోతోంది తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఉచిత కరెంట్ ఇస్తోంది. 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇస్తోంది. నీటి ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా.. రైతుల కోసం రైతు బంధు తీసుకొచ్చాం. రైతు చనిపోతే రైతుబీమా కింద రూ.5 లక్షలను వారంలోనే చెల్లిస్తున్నాం. ధరణితోనే రైతు బంధు సొమ్ము రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ధరణితో రైతులకే అధికారం ఇచ్చాం. అలాంటిది ధరణిని తీసేయాలంటూ కొందరు మాట్లాడుతున్నారు. ధరణి తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యమే వస్తుంది’’.. అని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారాయన. ‘‘..పీసీసీ అధ్యక్షుడు అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు రైతులకు మూడు గంటల కరెంట్చాలని అంటున్నారు. మూడు గంటల కరెంట్తో ఎకరానికి నీరు పారుతుందా? ఆయన అహంకారం ఏంటో అర్థం కావడం లేదు. 24 గంటల కరెంట్ కావాలా? 3 గంటల కరెంట్ కావాలా?. కాంగ్రెస్ నేతలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. అధికారం ఇస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని అంటున్నారు. కాంగ్రెస్ వస్తే ధరణిని తీసేస్తారు’’ అని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దు బూర్గంపాడు ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘పినపాక నియోజకవర్గంలో గిరిజనులు, దళిత వర్గాల ప్రజలు ఎక్కువగా ఉన్నారు. వారి బతుకులు ఏమాత్రం బాగాలేవు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పరిస్థితి ఎలా ఉండేదో మీకు తెలుసు. ఎన్నో సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అయ్యాం. ఈ పదేళ్ల కాలంలో రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించుకున్నాం. ఇవాళ తెలంగాణలో జరిగిన అభివృద్ధి మీ అందరికి కనిపిస్తోంది. తెలంగాణ ఏర్పాటు నాటికి అన్నదాతలు అప్పుల్లో కూరుకుపోయారు. వారిలో ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు. ధరణి ఉండటం వల్ల ప్రభుత్వం వేసే డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లోనే పడుతున్నాయి. ధరణి ఉండాలో.. వద్దో.. ప్రజలు ఆలోచించాలి. కాంగ్రెస్ నేతల గోల్మాల్ మాటలు నమ్మి మోసపోవద్దు’’ అని కేసీఆర్ సూచించారు. దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ.. నర్సంపేట సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘దేశం లేదా రాష్ట్రాలు అభివృద్ధిలో ఎక్కడ ఉన్నాయి అనేది నిర్ణయించే వాటిలో తలసరి ఆదాయం ముఖ్యమైనది. తెలంగాణ వచ్చినప్పుడు తలసరి ఆదాయంలో మనం 18వ స్థానంలో ఉండేవాళ్లం. ఇవాళ మనం అగ్రస్థానంలో ఉన్నాం. ఇదే కాదు.. అన్ని రంగాల్లోనూ తెలంగాణ అగ్రస్థానంలో దూసుకుపోతోంది. మనం ఇప్పుడు మూడు కోట్ల టన్నుల ధాన్యం పండిస్తున్నాం. మరో 2 ప్రాజెక్టులు పూర్తయ్యే స్థాయిలో ఉన్నాయి. వాటిని కూడా పూర్తి చేస్తే నాలుగు కోట్ల టన్నుల ధాన్యం పండించేందుకు వీలుంటుంది. అప్పుడు దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ అవతరిస్తుంది’’ అని కేసీఆర్ అన్నారు. -
మిగతా వరిరకాలతో పోలిస్తే బ్లాక్ రైస్ కు మంచి ధర
-
చికెన్ షాపులో కొండచిలువ.. షాకైన యజమాని.. తర్వాత ఏం జరిగిందంటే?
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: రోజు అడవిలో ఎలుకలు, ఉడతలు తిని తిని బోర్ కొట్టిందో ఏమో ఒక కొండచిలువ చికెన్ షాప్లో దూరింది. చక్కగా అత్తారింటికి వచ్చిన అల్లుడిలా దర్జాలు వలకబోసి బాగా బలిసిన బ్రాయిలర్ కోళ్లను చూసి తన పంట పండిందనుకుంది. చక్కగా ఓ రెండు కోళ్లను గుటుక్కున మింగి సేదతీరింది. తెల్లారే వచ్చి చూసిన చికెన్ షాపు యజమానికి కొత్త అల్లుడిలా కోళ్ల ఫామ్ లో కొండచిలువు కనిపించింది. వెంటనే ఫారెస్ట్ వారికి సమాచారం ఇవ్వగా వచ్చిన సిబ్బంది తిన్న కోళ్లు కక్కించి బుద్ధిగా ఉండమని మళ్లీ అడవికి పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం వినాయకపురంలో జరిగింది ఘటన. చదవండి: Telangana: నేడు, రేపు వర్షాలు -
తెలంగాణ నర్సుకు నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు.. 27 ఏళ్లుగా సేవలు
వృత్తే దైవంగా,సేవే పరమార్థంగా భావించిన తేజావత్ సుశీలకు ఈ యేడాది ప్రతిష్టాత్మక ‘ఫ్లారెన్స్ నైటింగేల్’ అవార్డు దక్కింది.తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం, ఎర్రగుంట ప్రాథమిక వైద్యశాలలోఏఎన్ఎంగా సేవలందిస్తున్న సుశీల గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా 27 ఏళ్ల తన కెరీర్ గురించి సుశీల ‘సాక్షి’తో పంచుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్రగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన తేజావత్ సుశీల జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును అందుకున్నారు. దేశవ్యాప్తంగా నర్సులు చేస్తున్న ఉత్తమ సేవలకుగాను జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను ఏటా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్నారు. గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 2022, 2023 సంవత్సరాలకుగాను జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అందించారు. ఇందులో 2022కుగాను ఏఎన్ఎమ్ కేటగిరీలో తెలంగాణకు చెందిన నర్సు తేజావత్ సుశీల రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్రగుంట సమీపంలో కనీసం రహదారి సదుపాయం కూడా లేని మారుమూల ప్రాంతంలో ఉండే గుత్తికోయలకు అందించిన సేవలకు గుర్తుగా నైటింగేల్ అవార్డును అందించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. 1973 నుంచి ఈ ఏడాది వరకు మొత్తం 614 మంది నర్సులు ఉత్తమ నర్సులకు నైటింగేల్ అవార్డులు అందుకున్నారని కేంద్రం తెలిపింది. ‘‘ఉమ్మడి ఖమ్మం జిల్లాలలోని వీ వెంకటాయపాలెం అనే గ్రామం మా సొంతూరు. 1996లో ఏఎన్ఎంగా తొలి పోస్టింగ్ మణుగూరులో వచ్చింది. ఆ తర్వాత సుజాతనగర్లో కొన్నాళ్లు పని చేశాను. 2010 నుంచి ఏజెన్సీ ప్రాంతమైన ఎర్రగుంట పీహెచ్సీలో పని చేస్తున్నాను. 27 ఏళ్ల కెరీర్లో పనిలోనే సంతృప్తి వెతుక్కుంటూ వస్తున్నాను. మా ఇల్లు, నాకు కేటాయించిన గ్రామాలు తప్ప పెద్దగా బయటకి పోయిందీ లేదు. హైదరాబాద్కు కూడా వెళ్లడం తక్కువే. చదువుకునేప్పటి నుంచి ఈ రోజు వరకు... ఏనాటికైనా ఢిల్లీని చూస్తానా అనుకునేదాన్ని. కానీ ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ వరకు నా ప్రయాణం ఉంటుందని అనుకోలేదు. దేశ ప్రథమ మహిళ చేతుల మీదుగా అవార్డు అందుకున్న క్షణాలు మరువలేనివి. రెండు ప్రయాణాలు 2010 సమయంలో ఛత్తీస్గడ్ నుంచి గుత్తి కోయలు తెలంగాణకు రావడం ఎక్కువైంది. నా పీహెచ్సీ పరిధిలో మద్దుకూరు సమీపంలో గుత్తికోయలు వచ్చి మంగళబోడు పేరుతో ఓ గూడెం ఏర్పాటు చేసుకున్నట్టు అక్కడి సర్పంచ్ చెప్పాడు. ఆ గ్రామానికి తొలిసారి వెళ్లినప్పుడు ఎవ్వరూ పలకరించలేదు. నేనే చొరవ తీసుకుని అన్ని ఇళ్లలోకి తలుపులు తీసుకుని వెళ్లాను. ఓ ఇంట్లో ఓ మహిళ అచేతనంగా పడుకుని ఉంది. పదిహేను రోజుల కిందటే ప్రసవం జరిగిందని చెప్పారు. తీవ్ర రక్తస్రావం కావడంతో మనిషి నీరసించిపోయి ఉంది. ఒళ్లంతా ఉబ్బిపోయి ఉంది. వెంటనే ఆ గ్రామ సర్పంచ్ను బతిమాలి ఓ సైకిల్ ఏర్పాటు చేసి అడవి నుంచి మద్దుకూరు వరకు తీసుకొచ్చాను. అక్కడి నుంచి ఆటోలో కొత్తగూడెం ఆస్పత్రికి వచ్చాం. పరిస్థితి విషమించడంతో వరంగల్ తీసుకెళ్లాలని సూచించారు. 108లో ఆమెను వెంటబెట్టుకుని వరంగల్కు తీసుకెళ్లాను. 21 రోజుల పాటు చికిత్స అందించిన తర్వాత ఆ తల్లిబిడ్డలు ఇద్దరూ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఈ ఘటన తర్వాత అక్కడున్న వలస గుత్తి కోయలకు నాపై నమ్మకం కలిగింది. ఏదైనా సమస్య ఉంటే సంకోచం లేకుండా చెప్పుకోవడం మొదలు పెట్టారు. రక్తం కోసం బతిమాలాను ఓసారి గుత్తికోయగూడెం వెళ్లినప్పుడు పిల్లలందరూ నా దగ్గరకు వచ్చారు కానీ జెమిలీ అనే ఏడేళ్ల బాలిక రాలేదు. ఏమైందా అని ఆరా తీస్తూ ఆ పాప ఇంట్లోకి వెళ్లాను. నేలపై స్పృహ లేని స్థితిలో ఆ పాప పడుకుని ఉంది. బ్లడ్ శాంపిల్ తీసుకుని టెస్ట్ చేస్తే మలేరియా పాజిటివ్గా తేలింది. వెంటనే పీహెచ్సీకి అక్కడి నుంచి కొత్తగూడెం తీసుకువస్తే పాప పరిస్థితి చాలా సీరియస్గా ఉందని డాక్టర్లు చెప్పారు. ఖమ్మం తీసుకెళ్లమన్నారు. ఆక్కడకు వెళ్తే వరంగల్ పొమ్మన్నారు. కానీ డాక్టర్లను బతిమాలి అక్కడే వైద్యం చేయమన్నాను. ఆ పాపది ఓ-నెగెటివ్ గ్రూప్ రక్తం కావడంతో చాలా మందికి ఫోన్లు చేసి బతిమాలి రెండు యూనిట్ల రక్తం సంపాదించగలిగాను. చివరకు ఆ పాప ప్రాణాలు దక్కాయి. మరోసారి ఓ గ్రామంలో ఓ బాలింత చంటిపిల్లకు ఒకవైపు రొమ్ము పాలే పట్టిస్తూ రెండో రొమ్ముకు పాలిచ్చేందుకు తంటాలు పడుతున్నట్టు గమనించాను. వెంటనే ఇన్ఫెక్షన్ గుర్తించి ఆస్పత్రికి తరలించాను. అర్థం చేసుకోవాలి మైదానం ప్రాంత ప్రజలకు ఒకటికి రెండు సార్లు చెబితే అర్థం చేసుకుంటారు. వారికి రవాణా సదుపాయం కూడా బాగుంటుంది. కానీ వలస ఆదివాసీల గుత్తికోయల గూడేల్లో పరిస్థితి అలా ఉండదు. ముందుగా వారిలో కలిసిపోవాలి. ఆ తర్వాత అక్కడి మహిళలను ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే భర్త/తండ్రి తోడు రావాలి. వాళ్లు పనులకు వెళితే సాయంత్రం కానీ రారు. వచ్చే వరకు ఎదురు చూడాలి. వచ్చినా పనులు వదిలి ఆస్పత్రికి వచ్చేందుకు సుముఖంగా ఉండరు. ఆస్పత్రి కోసం పని వదులుకుంటే ఇంట్లో తిండికి కష్టం. అన్నింటికీ ఒప్పుకున్నా.... ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే అడవుల్లో ఉండే గుత్తికోయ గ్రామాలకు రవాణా కష్టం. క్షేత్రస్థాయిలో ఉండే ఈ సమస్యలను అర్థం చేసుకుంటే అత్యుత్తమంగా వైద్య సేవలు అందించే వీలుంటుంది. కోవిడ్ సమయంలో మద్దుకూరు, దామరచర్ల, సీతాయిగూడెం గ్రామాలు నా పరిధిలో ఉండేవి. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ఈ మూడు గ్రామాల్లో కలిపి ఓకేసారి 120 మందిని ఐసోలేçషన్లో ఉంచాను. ఇదే సమయంలో మా ఇంట్లో నలుగురికి కోవిడ్ పాజిటివ్గా తేలింది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని గ్రామాలు తిరుగుతూ ప్రాణనష్టం రాకుండా సేవలు అందించాను. నా పరిధిలో ఉన్న గ్రామాల్లో ఏ ఒక్కరూ కోవిడ్తో ఇంట్లో చనిపోలేదు. వారి సహకారం వల్లే వృత్తిలో మనం చూపించే నిబద్ధతను బట్టి మనకంటూ ఓ గుర్తింపు వస్తుంది. ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకప్పుడు అర్థరాత్రి ఫోన్ చేసినా డాక్టర్లు లిఫ్ట్ చేసి అప్పటికప్పుడు సలహాలు ఇస్తారు. అవసరాన్ని బట్టి హాస్పిటల్కు వచ్చి కేస్ అటెండ్ చేస్తారు. అదే విధంగా నాతో పాటు పని చేసే ఇతర సిబ్బంది పూర్తి సహకారం అందిస్తారు. ఇక ఆశా వర్కర్లు అయితే నా వెన్నంటే ఉంటారు. ఏదైనా పని చెబితే కొంత ఆలçస్యమైనా ఆ పని పూర్తి చేస్తారు. వీరందరి సహకారం వల్లే నేను ఉత్తమ స్థాయిలో సేవలు అందించగలిగాను. ఈ రోజు నాకు దక్కిన గుర్తింపుకు డాక్టర్ల నుంచి ఆశావర్కర్ల వరకు అందరి సహకారం ఉంది’’ అని వివరించారు సుశీల. – తాండ్ర కృష్ణగోవింద్ సాక్షి,భద్రాద్రి కొత్తగూడెం -
దేశంలోనే ఉత్తమ పల్లె జగన్నాథపురం
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు మంచినీటి వనరుల విభాగంలో మరో జాతీయ అవార్డు లభించింది. దేశంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జగన్నాథపురం గ్రామం నిలిచింది. ఉత్తమ జిల్లాల కేటగిరీలో ఆదిలాబాద్ జిల్లా దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. దీంతోపాటు హైదరాబాద్లోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం క్యాంపస్లను సరిగ్గా వినియోగించుకున్న విద్యాసంస్థల కేటగిరీలో రెండో స్థానాన్ని పొందింది. ఈ నెల 17న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. తెలంగాణ మరోసారి జాతీయ స్థాయిలో అవార్డు సాధించడంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హర్షం వ్యక్తం చేశారు. అవార్డు ప్రకటించిన కేంద్రానికి, ఈ అవార్డులు రావడానికి ప్రేరణగా నిలిచిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. జగన్నాథపురం గ్రామ పంచాయతీకి, పాలకవర్గం, సిబ్బంది, అధికారులను మంత్రి అభినందించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 11 కేటగిరీలలో 41 మంది విజేతలను ప్రకటించింది. ఇందులో ఉత్తమ రాష్ట్రంగా మధ్యప్రదేశ్, ఉత్తమ జిల్లాగా ఒడిశాలోని గంజాం, ఉత్తమ గ్రామ పంచాయతీగా తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జగన్నాథపురం నిలిచాయి. నీటి వనరుల నిర్వహణకు... జలవనరులు, నదుల అభివృద్ధి గంగా పునరుజ్జీవన శాఖ అధ్వర్యంలో 2018 నుంచి జల, నీటి వనరుల నిర్వహణ అవార్డులను అందజేస్తున్నారు. ’జల సంపన్న భారత్’అనే ప్రభుత్వ దార్శనికతను సాకారం చేసేందుకు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న డ్రైవ్లో భాగంగా జాతీయ నీటి అవార్డులు వివిధ వ్యక్తులు, సంస్థలు చేసిన మంచి పని, ప్రయత్నాలను ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తాయి. ఇది నీటి ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పనకు, ఉత్తమ నీటి వినియోగ పద్ధతులను అవలంబించేలా వారిని ప్రేరేపించడానికి దోహదపడుతుంది. -
‘గూడెం’లో నేడే ప్రజాగర్జన
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భారత కమ్యూనిస్టు పా ర్టీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించనున్న ప్రజాగర్జన బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. సాయంత్రం పట్టణంలోని ప్రకాశం స్టేడియంలో జరిగే సభకు పార్టీ జాతీయ కార్యదర్శి డి.రాజా ముఖ్య అతి థిగా హాజరు కానున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కో రుతూ ఈ ఏడాది ఏప్రిల్ 14న సీపీఐ ఆధ్వర్యంలో ప్రజాపో రు యాత్రలు చేపట్టి గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికక్కడ సభలు, సమావేశాలు నిర్వహించారు. పోడు సాగుదారులకు పట్టాల పంపిణీ, సింగరేణి ప్రైవేటీకరణ, రాజ్యాంగ, లౌకిక వ్యవస్థల పరిరక్షణ తదితర అంశాలపై విస్తృతంగా ప్రచారం చేశారు. ఎర్ర జెండా రెపరెపలతో..: ప్రజాగర్జన బహిరంగ సభ నేపథ్యంలో కొత్తగూడెం పట్టణం ఎరుపెక్కింది. ప్రకాశం స్టేడియంలో భారీ వేదిక ఏర్పాటు చేశారు. బహిరంగ సభకు లక్ష మంది జన సమీకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి తగ్గట్టే గత నెలరోజులుగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు నేతృత్వంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. బెల్లంపల్లి నుంచి ప్రత్యేక రైలు..: కొత్తగూడెంలో నిర్వహించే బహిరంగ సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ప్రధా నంగా జన సమీకరణ చేయాలని నిర్ణయించారు. ఇందుకో సం వెయ్యి బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి కూడా 300 చొప్పున బస్సుల్లో కార్యకర్తలు తరలివస్తారని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని తెలిపారు. ఒక్క కొత్తగూడెం నియోజకవర్గం నుంచే 25 వేల మందికి పైగా ప్రజలను తరలించేందుకు వాహనాలను సిద్ధం చేశామని, భద్రాచలం, పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేట నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో తరలిరానున్నారని చెప్పా రు. సింగరేణి ప్రభావిత ప్రాంతాలైన ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి వేలాదిగా కార్మికులు వచ్చేందుకు బెల్లంపల్లి నుంచి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసిన ట్లు తెలిపారు. ఉమ్మడి నల్లగొండ, వరంగల్ జిల్లాల నుంచి కూడా కార్యకర్తలు పెద్దఎత్తున తరలివస్తారని వివరించారు. హాజరుకానున్న రాజా..: ఈ సభకు జాతీయ కార్యదర్శి డి.రాజాతో పాటు సీపీఐ జాతీయ నాయకులు కె.నారాయణ, అజీజ్ పాషా, చాడ వెంకట్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్రెడ్డి, వాసిరెడ్డి సీతారామయ్య, ప్రముఖ కళాకారులు గోరటి వెంకన్న, వందేమాతరం శ్రీనివాస్ తదితరులు హాజరుకానున్నారు. -
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: తెలంగాణ హెల్త్ డైరెక్టర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాయత్తు మహిమతోనే ఈ స్థాయిలో ఉన్నానంటూ వ్యాఖ్యానించారు. డాక్టర్లు చేయలేని పని తాయత్తు చేసిందని డీహెచ్ శ్రీనివాస్ అన్నారు. కొత్తగూడెం ఇఫ్తార్ విందులో తాయత్తు గురించి ప్రస్తావించారు. కాగా, హెల్త్ డైరెక్టర్ కాంట్రవర్సీలో ఇరుక్కోవడం ఇదేం తొలిసారి కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు పితృ సామానులని ఆయన పాద పద్మాలు తాకడం నా అదృష్టంగా భావిస్తున్నానంటూ గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది.. కొత్తగూడెం శ్రీనగర్ కాలనీ డీఎస్ఆర్ క్యాంపు కార్యాలయంలో సినిమా పాటకు డ్యాన్స్ చేశారు. డీజే టిల్లు పాటకు బతుకమ్మ ముందు స్టెప్పులేశారు. దీనిపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రంగా భావించే బతుకమ్మ సంబరాల్లో సినిమా పాటలకు స్టెప్పు లేయడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఇంతకముందు ఓ తండాలో నిర్వహించిన పూజ కార్యక్రమంలో పాల్గొనడంతో శ్రీనివాసరావు క్షుద్ర పూజలు నిర్వహించినట్లు ప్రచారం జరిగింది. చదవండి: ఓయో రూమ్స్ మేనేజర్ ఆత్మహత్య -
భద్రాద్రి రామయ్య పట్టాభిషేకం కార్యక్రమం.. హాజరైన గవర్నర్
భద్రాచలం: శ్రీరామనవమి వసంత ఉత్సవాల్లో భాగంగా భద్రాద్రి రామయ్యను గవర్నర్ తమిళసై దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం భద్రాద్రి రామయ్య దర్శించుకోవడానికి వెళ్లిన గవర్నర్ తమిళసైకు ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి హాజరైన గవర్నర్ తమిళసై స్వామి వారికి తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. భద్రాచలం మిధిలా స్టేడియంలో రామయ్య పుష్కర పట్టాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. దేశంలోని వివిధ పవిత్ర పుణ్యక్షేత్రం నుంచి రుత్వికులు తీసుకొచ్చిన 12 నది జలాలతో స్వామివారికి పట్టాభిషేకం నిర్వహించారు. ఈ క్రమంలోనే రామయ్య పుష్కర పట్టాభిషేక కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. నేటి భద్రాద్రి వేడుకలకు మంత్రి సత్యవతి రాథోడ్, కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్లు హాజరయ్యారు. -
సీతారామ కల్యాణం.. కమనీయం
సాక్షి, భద్రాద్రి: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో.. సీతారామకల్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతోంది. అభిజిత్ లగ్నముహూర్తాన మాంగల్యధారణ జరిగింది. భద్రాద్రి నుంచి ప్రత్యక్ష ప్రసారం.. ► తెలంగాణ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు సమర్పించారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ► ప్రతీ ఏడాది కంటే ఈసారి భిన్నంగా శ్రీరామ నవమి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈసారి సువర్ణ ద్వాదశ వాహనాలపై సీతారాముల్ని ఊరేగించారు. భక్తరామదాసు కాలంలో ఇలా సువర్ణ ద్వాదశ ఊరేగింపు కార్యక్రమం జరిగింది. ► భద్రాద్రి సీతారాముల కళ్యాణం కోసం లక్ష మందికి పైగా భక్తులు హాజరుకానున్నట్లు అంచనా. అందుకు తగ్గట్లే ఉదయం నుంచి భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. ►మిథిలా స్టేడియంలో జరగనున్న సీతారామా కల్యాణం కోసం.. రామ భక్త జనసంద్రం తరలి వచ్చింది. ► కల్యాణం వీక్షించేందుకు వీఐపీతో పాటు 26 సెక్టార్లు.. ఎల్ఈడి తెర లు ఏర్పాటు చేశారు. ► చిన్నజీయర్ స్వామి ఇతర ప్రముఖులు కల్యాణ మహోత్సవానికి హాజరయ్యారు. ► భక్తులకు మూడు లక్షల మంచినీరు ,లక్ష మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ కి సిద్దం చేశారు. ► భక్తులకు అందుబాటులో రెండు లక్షల లడ్డు ప్రసాదాలు, 200 క్వింటాల తలంబ్రాలు.. వాటి పంపిణీకి 70 కౌంటర్స్ ఏర్పాటు చేశారు. ► మొదట గర్భగుడిలో రామయ్య మూలవిరాట్కు లఘుకల్యాణం నిర్వహిస్తారు. ► ఆపై అభిజిత్ లగ్నంలో వేలాది మంది భక్తుల నడుమ మధ్యాహ్నం 12 గంటల సమయంలో కల్యాణం జరగనుంది. ► రేపు(శుక్రవారం) స్వామివారికి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ► భద్రాద్రి రాములోరి కల్యాణాన్ని వీక్షించడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భద్రాదికి తరలివచ్చారు భక్తులు. -
జట్టీ కట్టి.. 5 కి.మీ. మోసుకొచ్చి..
చర్ల: ఆదివాసీ పల్లెల్లో కనీస సౌకర్యాల లేమికి ఈ ఘటనే సజీవ సాక్ష్యం. గ్రామం ఏర్పడి 30 ఏళ్లు కావస్తున్నా నేటికీ సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో మంగళవారం ఓ నిండు గర్భిణిని గ్రామస్తులు ఐదు కిలోమీటర్ల దూరం జట్టీ ద్వారా మోసుకొచ్చి అంబులెన్స్ ఎక్కించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం రాళ్లాపురం గ్రామానికి చెందిన నూపా సిద్దు భార్య లిల్లీ నిండు గర్భిణి. మంగళవారం లిల్లీ ప్రసవ వేదన పడుతుండగా కొందరు యువకులు హుటాహుటిన మొబైల్ సిగ్నల్ వచ్చే ప్రాంతానికి వెళ్లి 108కు ఫోన్ చేశారు. అయితే ఆ గ్రామానికి వాహనం వచ్చేందుకు దారి లేదని, తిప్పాపురం వరకు వస్తే అక్కడి నుంచి ఆస్పత్రికి తరలిస్తామని 108 సిబ్బంది తెలిపారు. దీంతో చేసేదేమీ లేక సిద్దు బంధువులు జట్టీ కట్టి ఆమెను అటవీ మార్గం గుండా తిప్పాపురం సమీపంలోని ప్రధాన రహదారి వరకు మోసుకొచ్చారు. అప్పటికే అక్కడికి చేరుకున్న అంబులెన్స్లో కొయ్యూరు వైద్యశాలకు తరలించారు. ఆస్పత్రిలో లిల్లీ ఆడబిడ్డకు జన్మనివ్వగా తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. -
ఇల్లందులో వేడెక్కిన రాజకీయం
-
సీతా రాముల కల్యాణానికి ముహూర్తం
భద్రాచలం: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీ సీతారాముల కల్యాణం, పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారైంది. మార్చి 30వ తేదీ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీ సీతారాముల తిరుకల్యాణోత్సవం నిర్వహణకు ముహూర్తం నిశ్చయించారు. కాగా, 12 ఏళ్లకు ఒకసారి జరిగే పుష్కర పట్టాభిషేకం మార్చి 31న జరగనుండగా, బ్రహ్మోత్సవాలు, పట్టాభిషేక మహోత్సవం షెడ్యూల్ను వైదిక కమిటీ, ఆలయ ఈవో శివాజీ సోమవారం ప్రకటించారు. ఉగాది పర్వదినాన... మార్చి 22 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాలు, మార్చి 22 నుంచి మార్చి 31 వరకు పుష్కర పట్టాభిషేక ప్రయుక్త ద్వాదశ కుండాత్మక చతుర్వేద సహిత శ్రీరామాయణ మహాక్రతువు ఉత్సవాలను జరపనున్నారు. మార్చి 22న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పుష్కర పట్టాభిషేకం క్రతువుకు అంకురార్పణ జరగనుంది. 26న ఉత్సవమూర్తులకు విశేష స్నపనం, బ్రహ్మోత్సవాలకు అంకురారోపణం, 27న గరుడ ధ్వజపట భద్రక మండల లేఖనం, గరుడాధివాసం, 28న అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణం, 29న ఎదుర్కోలు ఉత్సవం, గరుడ వాహన సేవలను జరుపుతారు. 30న శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీ సీతారాముల కల్యాణమహోత్సవం, శ్రీరామపునర్వసు దీక్షా ప్రారంభం, చంద్రప్రభ వాహనసేవ, 31న పుష్కర పట్టాభిషేక మహోత్సవం, శ్రీరామాయణ మహాక్రతువు పూర్ణాహుతి, రథోత్సవం ఉంటాయి. ఏప్రిల్ 5న చక్రతీర్థం, పూర్ణాహుతి, ధ్వజావరోహణం, ద్వాదశ ప్రదక్షిణ, శ్రీ పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు సమాప్తి కానున్నాయి. కాగా, బ్రహ్మోత్సవాల సమయాన రోజువారీ ప్రత్యేక పూజలు నిలిపివేయనున్నారు. ఈ ఏడాది పుష్కర పట్టాభిషేకం భద్రా చలం పుణ్యక్షేత్రంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంతోపాటు మరుసటి రోజే జరిగే రామయ్య పట్టాభిషేకానికి ఎంతో విశిష్టత ఉంది. రాముడికి భద్రాచలంలో ప్రతీ 60 ఏళ్లకు ఒక్కసారి మహాసామ్రాజ్య పట్టాభిషేకం జరుగుతుంది. ఈ పట్టాభిషేక మహోత్సవం భద్రాచలంలో 1927, 1987ల్లో జరగగా, మళ్లీ 2047లో మాత్రమే కళ్లారా చూసేందుకు అవకాశముంది. ఇది కాకుండా ప్రతీ 12 ఏళ్లకోసారి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం జరుపుతారు. 1999, 2011లో ఈ పుష్కర పట్టాభిషేకం నిర్వహించగా, ఈ ఏడాది మార్చి 31న జరగనుంది. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు, వైదిక కమిటీ బాధ్యులు స్వామివారి వాహన సేవలకుగాను నూతన వాహనాలను తయారు చేయిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో నలుగురి దుర్మరణం
ఇల్లెందు/ఇల్లెందు రూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు సమీపంలోని జెండాలవాగు వద్ద శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు మృతి చెందారు. ప్రాథమిక సమాచారం మేరకు.. మృతులది హన్మకొండ జిల్లాలోని కమలాపురం మండలంగా తెలుస్తోంది. వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్లుగా పని చేస్తున్న రాము, అరవింద్ ఏపీలోని చింతూరు మండలం మోతెలో జరిగే ఓ వెడ్డింగ్ షూట్లో పాల్గొనేందుకు కమలాపురం నుంచి కారు(టీఎస్ 03 ఎఫ్సీ 9075)లో బయల్దేరారు. హన్మకొండలో స్నేహితులు రుషి, కల్యాణ్, రణధీర్ జత కలిశారు. ఐదుగురూ కలిసి మహబూబాబాద్ మీదుగా మోతె వెళ్తుండగా ఇల్లెందు సమీపాన జెండాలవాగు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీని కారు బలంగా ఢీకొట్టింది. ప్రమాద ధాటికి కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా.. ముగ్గురు ప్రమాద స్థలిలోనే మరణించారు. ఆ మార్గంలో వెళ్తున్న వారు కారులో గాయపడిన ఇద్దరిని కాపాడేందుకు ప్రయత్నించారు. 108కు సమాచారం ఇచ్చి తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఇల్లెందు ఆస్పత్రికి తీసుకు వచ్చారు. వీరిలో ఒకరు ఆస్పత్రిలో మృతి చెందగా, తీవ్ర గాయాల పాలైన రణధీర్ను 11:30 గంటలకు ఖమ్మం తరలించారు. ఇతని పరిస్థితి విషమంగానే ఉంది. ప్రమాద స్థలిలో రెండు మృతదేహాలను పోలీసులు కట్టర్ల సాయంతో కారును కట్ చేసి బయటకు తీయాల్సి వచ్చింది. -
జరిమానా చెల్లించలేదని కుల బహిష్కరణ
ములకలపల్లి: కుల పెద్దలు విధించిన జరిమానా కట్టలేదనే నెపంతో ఓ కుటుంబాన్ని బహిష్కరించడమే కాక తాగునీటి పైపులైన్ తొలగించి, వారి ఇంటికి ఎవరూ వెళ్లొద్దని చాటింపు వేయించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం రాచన్నగూడెంలో ఈ ఘటన జరిగింది. రాచ న్న గూడెంకు చెందిన గిరిజనుడు పెనుబల్లి శ్రీనివాస్.. తన తల్లిదండ్రులు, తమ్ముడు, తాత పోతరాజుతో కలసి ఉంటున్నాడు. ఆయనకు దమ్మపేట మండలం ఎర్రగుంపు గ్రామా నికి చెందిన శారదతో వివాహం జరిగింది. అయితే, భా ర్యాభర్తల మధ్య మనస్పర్థలతో శారద ఏడాది కిందట పుట్టింటికి వెళ్లిపోయింది. కాగా, నెల క్రితం శ్రీనివాస్ కూడా అక్కడికే వెళ్లి కూలీ పనులు చేసుకుంటున్నాడు. ఈనెల 10వ తేదీన శ్రీనివాస్ తాత కన్ను మూయగా.. భార్య శారదతో కలసి అతను రాచన్నగూడెంలోని ఇంటికి వచ్చాడు. కుల పెద్దలకు చెప్పకుండా భార్య వద్దకు వెళ్లడం, ఏడాది క్రితం వెళ్లిపోయిన ఆమెను తీసుకువచ్చాడని శ్రీనివాస్ తాత అంత్యక్రియలు ముగియగానే కులపంచాయితీ పెట్టారు. శ్రీనివాస్ రూ.1.5 లక్షల జరిమానా కట్టాలని పెద్దలు తీర్పు చెప్పారు. కానీ పేదలమైనందున రూ.20 వేలు చెల్లిస్తామని శ్రీను తెలపడంతో కులపెద్దల సమక్షంలోనే కొందరు అతని కుటుంబీకులపై దాడి చేసి డబ్బు మొత్తం చెల్లించాలని హుకుం జారీ చేశారు. అలాగే ఇంటి తాగునీటి పైపులైన్ తొలగించారు. కరెంట్ కూడా నిలిపివేస్తామని హెచ్చరించి.. శ్రీను ఇంటికి ఎవరూ వెళ్లొద్దని చాటింపు వేయించారు. దీంతో బాధిత కుటుంబం బుధవారం పోలీసులను ఆశ్రయించగా సర్పంచ్కు చెప్పి తాగునీటి సరఫరాను పునరుద్ధరించారు. కానీ గురువారం చిన్నకర్మ చేస్తుండగా, వచ్చిన గ్రా మస్తులు మళ్లీ నీటి సరఫరా నిలిపివేశారు. దీంతో బాధిత కుటుంబం శుక్రవారం మరోసారి పోలీస్స్టేషన్కు రాగా, పండుగ తర్వాత మాట్లాడుదామని చెప్పి పంపించారని శ్రీనివాస్ వాపోయాడు. ఈ విషయమై ఎస్సై సురేశ్ను వివ రణ కోరగా శనివారం విచారణ చేపడతామని తెలిపారు. -
భద్రాద్రి: భద్రాచలంలో బూజుపట్టిన లడ్డూలు.. భక్తుల కౌంటర్ నిరసన
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో మరోసారి బూజు పట్టిన లడ్డూల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్వామివారి దర్శనం అనంతరం లడ్డూ ప్రసాదం కొనుగోలు చేసిన కొందరు భక్తులకు షాక్ తగిలింది. లడ్డూలు వాసన వస్తుండడంతో సిబ్బందిని నిలదీశారు భక్తులు. బూజు పట్టిన లడ్డూలు ఎలా విక్రయిస్తారని కౌంటర్ సిబ్బందిని నిలదీశారు భక్తులు.ఈ క్రమంలో.. ‘ఇచ్చట బూజు పట్టిన ప్రసాదం లడ్డూలు ఇస్తారు’’ అని పేపర్ మీద రాసి లడ్డూ కౌంటర్కి అతికించి నిరసన వ్యక్తం చేశారు. గతంలో లడ్డూలు మాయం కావడంపై తీవ్ర దుమారం రేగి.. చర్చ నడిచి దర్యాప్తు దాకా వెళ్లింది. తాజా ఘటనతో.. లడ్డూల నాణ్యత వ్యవహారంపై చర్చ నడుస్తోంది. ఈ వ్యవహారంపై సిబ్బంది స్పందించాల్సి ఉంది. -
వాళ్లు ఏం పాపం చేశారు.. దేవుడా ఎందుకిలా చేశావయ్యా..
చిన్నతనంలోనే వారిద్దరూ తల్లిదండ్రుల్ని కోల్పోయారు. పేరెంట్స్ను కోల్పోయిన అన్నాచెల్లెలిని.. పెదనాన్న, నానమ్మలే పెంచి పెద్దచేశారు. స్వయంకృషితో చదవి అన్న ఉద్యోగం చేస్తుండగా.. చెల్లి మరో రెండు రోజుల్లో ఉద్యోగంలో చేరాల్సి ఉంది. ఇంతలోనే రోడ్డు ప్రమాదం వారిని మృత్యువు రూపంలో వెంటాడింది. ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ఇల్లెందులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. చుంచుపల్లి మండలం ఎన్.కె.నగర్ పంచాయతీకి చెందిన మరికంటి నీరజ్(27), నిహారిక(22)లు అన్నాచెల్లెలు. తల్లిదండ్రులు విజయ్కుమార్, లలితలు వీరి చిన్నతనంలోనే మృతిచెందారు. ఈ క్రమంలో పెద్దదిక్కును కోల్పోవడంతో పెద్దనాన్న అశోక్, నాయనమ్మల వద్దే వారిద్దరూ పెరిగారు. కాగా, ఇంటర్ పూర్తి చేసిన నీరజ్.. స్థానికంగా ఓ కార్ల షోరూంలో సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. నిహారిక డిగ్రీ చదివి హైదరాబాద్లోని ఓ కంపెనీలో ఇటీవల ఉద్యోగం సంపాదించింది. రెండు రోజుల్లో కొలువులో చేరేందుకు వెళ్లాల్సి ఉంది. దీంతో, వారు జీవితంలో సెటిల్ అయ్యారని ఎంతో సంతోషించారు. ఈ సందర్భంగా నిహారిక.. సోదరుడు నీరజ్, స్నేహితురాలు మేరీతో పార్టీ కోసం బైక్పై పాల్వంచ బయలుదేరారు. ఒక ధాబాలో డిన్నర్ చేసి రాత్రి తిరుగు పయనమయ్యారు. రేగళ్ల క్రాస్రోడ్డు సమీపంలో వీరి వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ముగ్గురూ కిందపడ్డారు. తలలకు తీవ్ర గాయాలై నీరజ్, నిహారికలు అక్కడికక్కడే మృతిచెందారు. మేరీ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. దీంతో, ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
భద్రాద్రిలో రాష్ట్రపతి పర్యటన.. 144 సెక్షన్ విధింపు
సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి జిల్లాలో దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి హైదరాబాద్కు విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేపు(బుధవారం) ఆమె భద్రాచలం ఆలయానికి రానున్నారు. బుధవారం భద్రాచలం శ్రీసీతారాముడిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా.. భద్రాచలంలో 144 సెక్షన్ విధించారు. ఉదయం ఏడు గంటల నుంచి 144 సెక్షన్ అమలులోకి రానుంది. రాకపోకల నిలిపివేత ఉంటుంది. సుమారు 2 వేల మంది పోలీసులతో, 350 అధికారులు రాష్ట్రపతి భద్రతను పర్యవేక్షించనున్నారు. అలాగే.. రాష్ట్రపతి రాక నేపథ్యంలో సారపాక బీపీఎల్ స్కూల్లో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు అధికారులు. హెలిప్యాడ్ నుంచి ఆలయం చుట్టూ ప్రోటోకాల్ కాన్వాయ్ ట్రయల్ నిర్వహించారు. ఉదయం పది గంటల ప్రాంతంలో సీతారాములను దర్శించుకుంటారు. దేశ ప్రథమ పౌరురాలి రాక సందర్భంగా.. ఉదయం 8 గంటల నుంచి 11.30గం. దాకా అన్ని దర్శనాలు బంద్ కానున్నాయి. ఇక తెలంగాణలో మూడు రోజులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటిస్తారు. ఈ నెల 28న అంటే బుధవారం భద్రాచలం సీతారాములను దర్శించుకుంటారు. ఈ నెల 29న ముచ్చింతల్ సమతా స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. ఈ నెల 30న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు. -
ఐదుగురు మావోయిస్టు మిలీషియా సభ్యుల అరెస్టు
కొత్తగూడెం టౌన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో నిషేధిత మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యులు ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఏ) వారోత్సవాల సందర్భంగా వాటిని విజయవంతం చేయాలని మావోయిస్టులు ఇప్పటికే ప్రకటనలు విడుదల చేశారు. మరోపక్క ఆదివాసీలను మావోయిస్టులు వేధిస్తున్నారంటూ ఊరూరా పోస్టర్లు వేయించిన పోలీసులు ఇంకో పక్క కూంబింగ్ ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఐదుగురు మిలీషియా సభ్యులు పట్టుబడగా, వివరాలను కొత్తగూడెంలోని తన కార్యాలయంలో శనివారం ఎస్పీ డాక్టర్ వినీత్ వెల్లడించారు. చర్ల మండలం ఎర్రంపాడు ఆటవీప్రాంతంల్లో పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బందితోపాటు స్పెషల్ పార్టీ, 81, 141 బెటాలియ¯న్ల సిబ్బంది ఉదయం కూంబింగ్ చేపట్టారని, ఈ సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా మిలీషియా సభ్యులని తేలిందని చెప్పారు. వీరిలో ఛత్తీస్గఢ్లోని పోలీసు కిష్టారాం నిమ్మలగూడెంకు చెందిన బెడమ బీమయ్య, సోడి మూయా, పోడియం అడమయ్య, పూనం నగేశ్, జట్టపాడుకు చెందిన మడకం నగేశ్ ఉన్నారని తెలిపారు. వీరు రెండేళ్లుగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. కాగా, తెలంగాణ ప్రజలు, ఆదివాసీలు వివేకంతో ఆలోచించి అభివృద్ధి నిరోధకులైన మావోయిస్టులను తరిమివేయగా, ఛత్తీస్గఢ్కు పారిపోయి ఇక్కడ ఇన్ఫార్మర్ల సాయంతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఎస్పీ ఆరోపించారు. మావోయిస్టులకు ఎవరైనా ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ సహకరిస్తే చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. సమావేశంలో ఓఎస్డీ సాయి మనోహార్, భద్రాచలం ఏఎస్పీ ఆకాం„Š యాదవ్, చర్ల సీఐ అశోక్, బెటాలియన్ల అధికారులు కమల్వీర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
అటవీ ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సిందే
చండ్రుగొండ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు శివారు ఎర్రబోడులో నివాసం ఉంటున్న గొత్తికోయలు అటవీ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ అధికారులు ఆదివారం నోటీసులు జారీ చేశారు. ఎర్రబోడుకు చెందిన ఇద్దరు గొత్తికోయలు ఈనెల 22న చేసిన దాడిలో ఎఫ్ఆర్ఓ చలమల శ్రీనివాసరావు మృతి చెందిన ఘటనతో తీవ్రస్థాయిలో నిరసన పెల్లుబికింది. ఈ క్రమంలో బెండాలపాడు పంచాయతీ పాలకవర్గం సైతం గొత్తికోయలను ఈ ప్రాంతం నుంచి బహిష్కరిస్తూ తీర్మానం చేసింది. ఇక ఆదివారం ఎఫ్డీఓ అప్పయ్య అధ్వర్యంలో వివిధ రేంజ్ల అధికారులు, సిబ్బంది సుమారు 50 మంది.. గొత్తికోయల ఇళ్ల వద్దకు వెళ్లి ఖాళీ చేయాలంటూ నోటీసులు ఇచ్చారు. కాగా తమ ఇళ్ల ముందు నోటీసులు అంటించి, ఫొటోలు తీసుకుని అనంతరం వాటిని తొలగించారని గొత్తికోయలు చెబుతున్నారు. వాస్తవానికి ఈ వ్యవహారాన్ని తొలుత అటవీ అధికారులు గోప్యంగా ఉంచారు. ఈ ఘటనపై ఎఫ్డీఓ అప్పయ్యను ‘సాక్షి’ వివరణ కోరగా.. అడవి నుంచి ఖాళీ చేయాలని గొత్తికోయలకు నోటీసులు ఇచ్చిన విషయం వాస్తవమేనన్నారు. ఎఫ్ఆర్వో హత్యతో అడవిలో విధులు నిర్వర్తించేందుకు అధికారులు, సిబ్బంది భయపడుతున్నారని చెప్పారు. 2005 అటవీ హక్కుల చట్టం ప్రకారం వారు అడవుల్లో ఉండేందుకు అనర్హులని పేర్కొన్నారు. ఒకరిద్దరు తప్పు చేస్తే అందరికీ శిక్షా ? మా గూడెంలోని ఇద్దరు వ్యక్తులు చేసిన దుర్మార్గపు చర్యకు మా అందరికీ శిక్ష విధిస్తారా. ఛత్తీస్గఢ్లో శాంతిభద్రతల పరిస్ధితి అధ్వానంగా ఉండగా ప్రాణభయంతో జీవనోపాధి కోసం 20 ఏళ్ల క్రితం ఈ ప్రాంతానికి వచ్చాం. పోడు వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నాం. మా తెగకు చెందిన పొడియం తుల, మడకం నంగా రేంజర్ శ్రీనివాసరావుపై దాడి చేసి హతమార్చడాన్ని మేము కూడా ఖండిస్తున్నాం. వారు చేసిన తప్పునకు మేమంతా ఎందుకు శిక్ష అనుభవించాలి. మాకు ఇక్కడ రేషన్కార్డులు, ఆధార్కార్డులు, ఉపాధి పనుల కార్డులు ఇచ్చారు. ఓటుహక్కు కూడా కల్పించారు. మా పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో పిల్లలతో మేం ఎక్కడికి వెళ్ళాలి. తెలంగాణ ప్రభుత్వం మాపై కనికరించాలి. – రవ్వ రమేశ్, గొత్తికోయ కులపెద్ద, ఎర్రబోడు -
ఎఫ్ఆర్వో దారుణ హత్య.. గుత్తికోయల బహిష్కరణ!
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావుపై దాడి.. హత్య ఘటనను తీవ్రంగా ఖండిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు పంచాయతీ ఇవాళ కీలక తీర్మానం చేసింది. గుత్తి కోయలందర్నీ గ్రామం నుంచి బహిష్కరించాలని బెండాలపాడు గ్రామసభ తీర్మానించింది. సాక్షి, భద్రాద్రి జిల్లా: ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు మృతికి కారణమై గుత్తి కోయలను బహిష్కరిస్తూ శనివారం బెండాలపాడు గ్రామసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య ఘటనను ఈ సందర్భంగా గ్రామసభ ముక్తకంఠంతో ఖండించింది. బెండలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని ఎర్రబోడు నుంచి అక్కడ నివసిస్తున్న గుత్తి కోయలను బహిష్కరిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాదు.. వాళ్లను వాళ్ల స్వరాష్ట్రమైన ఛత్తీస్గఢ్కు పంపాలంటూ ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ సందర్భంగా.. బెండాలపాడు గ్రామస్తులు గుత్తి కోయలపై పలు ఆరోపణలు చేశారు. గుత్తి కోయలు రోజూ గంజాయి, నాటుసారా సేవిస్తూ విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొంది. గుత్తి కోయల తీరు చాలా ప్రమాదకరంగా ఉందని, మారణాయుధాలు ధరించి తిరుగుతున్నారని, వాళ్ల వల్ల తమకూ ప్రాణహాని పొంచి ఉందని ఆ తీర్మానంలో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గుత్తి కోయలను వాళ స్వస్థలమైన ఛత్తీస్గఢ్కు తరలించాల్సిందేనని సభ తీర్మానించింది. పోడు సాగుకు అడ్డొస్తున్నారని చంద్రుగొండ రేంజ్ ఎఫ్ఆర్వో చలమల శ్రీనివాసరావు(45)ను గొత్తికోయలు దారుణంగా దాడి చేసి హతమార్చిన విషయం తెలిసిందే. -
20మంది జెడ్పీ హైస్కూలు విద్యార్థులకు అస్వస్థత
చండ్రుగొండ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం పోకలగూడెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 20 మంది సోమవారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు దగ్గు, గొంతు నొప్పితో బాధపడుతుండగా, మధ్యాహ్న భోజనం కలుషితమైనట్లు అనుమానిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 111 మంది విద్యార్థులు భోజనం చేయగా, సాయంత్రం 20 మందికి పైగా విద్యార్థులు దగ్గు, గొంతు మంటతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో హెచ్ఎం జుంకీలాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసి వారిని చండ్రుగొండ పీహెచ్సీకి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగానే ఉందని చికిత్స అందిస్తున్న డాక్టర్ వెంకట్ ప్రకాష్ తెలిపారు. డీఎంహెచ్ఓ దయానందస్వామి వచ్చి విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా తీశారు. -
చనిపోయిన వ్యక్తికి కరోనా టీకా!
భద్రాచలం అర్బన్: లక్ష్యం చేరడంలో ఆలస్యమవుతుందని అనుకుంటున్నారో ఏమో నాలుగు నెలల క్రితం చనిపోయిన వ్యక్తి కూడా వ్యాక్సిన్ వేయించుకున్నట్లుగా వైద్యారోగ్య శాఖ మెసేజ్లు పంపిస్తోంది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని రెవెన్యూ కాలనీకి చెందిన చుక్కా సూర్యప్రకాశరావు జూలైలో మరణించగా, ఆయన కుటుంబీకులు మరణ ధ్రువీకరణ పత్రం కూడా తీసుకు న్నారు. అయితే ఆయన కుమారుడు, న్యాయ వాది అంబేడ్కర్ ఫోన్కు శుక్రవారం సూర్య ప్రకాశరావు కరోనా బూస్టర్ డోస్ వేయించుకున్నట్లు ఆ మెసేజ్ రావడంతో కుటుంబసభ్యులు అవాక్కయ్యారు.
Pagination
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఏడో విడతలో టఫ్ ఫైట్
- త్వరలోనే టీమిండియాలో నా ఎంట్రీ: ఐపీఎల్ స్టార్
- తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు: కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డి వ్యక్తిగత ఆహ్వానం
- పిన్నెల్లి పిటిషన్పై సీఈసీకి హైకోర్టు ఆదేశం
- కుల్దీప్ యాదవ్కు ఊహించని షాక్!
- పచ్చ పార్టీ నేతల కళ్లు బైర్లు కమ్మడం ఖాయమేనా?
- ఎవరు పడితే వాళ్లు కోచ్ కాలేరు?.. గంగూలీ పోస్ట్ వైరల్
- అందాల హీరోయిన్ వెజిటబుల్ సూప్ రెసిపీ, నెటిజన్లు ఏమన్నారంటే!
- ఇది కదా జగన్ అంటే.. ఆ రికార్డ్ ఆయనకే సొంతమవుతుంది.!
- క్యాష్లెస్ చికిత్సపై గంటలోనే నిర్ణయం..ఐఆర్డీఏఐ ఆదేశాలు
Advertisement