-
దసరాకు తండేల్!
దసరా పండక్కి థియేటర్స్లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారట ‘తండేల్’. హీరో నాగచైతన్య, దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ఇది. ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తున్నారు. జాలరి రాజు పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి కనిపిస్తారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ``కాగా ‘తండేల్’ సినిమాను ఈ ఏడాది దసరా సందర్భంగా విడుదల చేసే ఆలోచన చేస్తున్నారట దర్శకుడు చందు మొండేటి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన వెల్లడికానుందని సమాచారం. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
ప్రయోగాలు చేసే సమయం ఇది!
‘‘నా కెరీర్లో ఎప్పుడూ విభిన్నమైన సినిమాలు, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించాలనుకుంటాను’’ అని హీరోయిన్ కీర్తీ సురేశ్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకు.. ‘దసరా’, ‘మామన్నన్ ’ సినిమాల విజయాల తర్వాత కథ ఎంపికలో మీ ఆలోచనలు ఏవైనా మారాయా? అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు కీర్తీ సురేశ్ బదులిస్తూ.. ‘‘నేను నటించిన సినిమా హిట్టు అయిందనో, ఫ్లాప్ అయిందనో అప్పటికప్పుడు కథల ఎంపికలో నా ఆలోచనా విధానం మారదు. అయితే నేనెప్పుడూ భిన్నంగా చిత్రాలు చేయాలనుకుంటా. ఎందుకంటే నాకిది ప్రయోగాలు చేసే సమయం. అందుకు తగ్గట్టే కథలను ఎంపిక చేసుకుంటున్నా. నా వద్దకు వస్తున్న కథలు, పాత్రలు నా ఊహలకు, కలలకు మించిన విధంగా ఉంటున్నాయి. అలాంటప్పుడు మళ్లీ కథల గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఏముంటుంది? ఆ ప్రయాణాన్ని బాగా ఆస్వాదించాలనే దానిపైనే దృష్టిపెడితే సరిపోతుంది’’ అన్నారు. కాగా కీర్తీ సురేశ్ ప్రస్తుతం ‘సైరెన్ , రఘు తాత, రివాల్వర్ రీటా’ చిత్రాలు, ‘అక్క’ అనే వెబ్సిరీస్లో నటిస్తున్నారు. -
వైభవంగా బతుకమ్మ, దసరా పండగ వేడుకలు
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ పోర్ట్లాండ్ సిటీ చార్టర్ ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా పండగల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకలను చార్టర్ ప్రెసిడెంట్ శ్రీని అనుమాండ్ల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మహిళలు, చిన్నారులు సహా పలువురు తెలుగు వాళ్లంతా సందడిగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తెలుగు సాంప్రదాయ దుస్తుల్లో తెలుగుదనం ఉట్టి పడేలా ముస్తాబై రంగుల బతుకమ్మలతో సందడి చేశారు. బతుకమ్మ నిమజ్జనం తర్వాత దసరా ఉత్సవాన్ని పురస్కరించుకొని షమీ స్తోత్రం చదివి జమ్మి (బంగారం) ఇచ్చి పుచ్చికొని అలయ్బలయ్ చేసుకున్నారు. ఇక బతుకమ్మ, రాఫెల్ డ్రా విజేతలకు టీడీఫ్ టీం బహుమతులను అందజేశారు. వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలందరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
మరింత మెరిసిన బంగారం! దసరా అమ్మకాలు అదుర్స్..
Dussehra Gold Sales: పండుగ వేళ బంగారం మరింత మెరిసింది. ఓ వైపు గాజాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, భారత్లో పండుగ సీజన్లో పసిడి అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఎకనమిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, పీఎన్జీ జ్యువెలర్స్, సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ వంటి ప్రముఖ జ్యువెలర్స్ ఈ దసరా-నవరాత్రి సమయంలో అమ్మకాలు గతేడాది కంటే 30 శాతం వరకు పెరిగినట్లుగా పేర్కొన్నాయి. ధరలు పెరుగుతున్నా.. ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం చెలరేగినప్పటి నుంచి బంగారం ధరలు 5.5 శాతం పెరిగినప్పటికీ అమ్మకాలు మాత్రం తగ్గలేదు. ఇక అధిక్ మాసం కాలం (జులై-ఆగస్టు) నుంచి వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. హమాస్ దాడులకు ముందు రూ.57,415 ఉన్న 10 గ్రాముల బంగారం ధర గత రెండు వారాల్లో రూ.60,612కి చేరింది. శ్రాద్ధ మాసం నుంచి బంగారం అమ్మకాలలో పురోగతి కనిపిస్తోందని, నవరాత్రుల సమయంలో మరింత జోరందుకుందని పీఎన్జీ జువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ గాడ్గిల్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 30 శాతం మేర అమ్మకాలు పెరిగినట్లు ఆయన అంచనా వేశారు. టైటాన్ ఆభరణాల విభాగం జులై నుంచి సెప్టెంబరు వరకు అమ్మకాలలో 19 శాతం పెరుగుదలను చూసింది. ఈ దసరా సందర్భంగా మునుపటి సంవత్సరంతో పోలిస్తే 18 శాతం అమ్మకాలు పెరిగాయని మలబార్ గోల్డ్ నివేదించింది. బలమైన వినియోగదారుల డిమాండ్, స్థిరమైన రిటైల్ విస్తరణ ఈ వృద్ధికి కారణమని మలబార్ గోల్డ్ చైర్మన్ అహమ్మద్ చెప్పారు. ధరల సున్నితత్వం ఉండే తూర్పు ప్రాంతాల్లో సెంకో గత దసరాతో పోలిస్తే బంగారు ఆభరణాల అమ్మకాల్లో 10-15 శాతం వృద్ధిని సాధించింది. వజ్రాభరణాల అమ్మకాలు 20 శాతం పెరిగాయని సెన్కో మేనేజింగ్ డైరెక్టర్ సువంకర్ సేన్ తెలిపారు. ఇదీ చదవండి: Gold Prices: మిస్డ్ కాల్ ఇస్తే చాలు.. మొబైల్కే బంగారం ధరలు! -
Bhavani Devotess In Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై భవానీ భక్తుల రద్దీ (ఫోటోలు)
-
నేటినుంచి మళ్లీ బడులు
సాక్షి, హైదరాబాద్: దసరా సెలవుల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు గురువారం నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ నెల 13వ తేదీ నుంచి విజయదశమి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఎన్నికల వేడి నెలకొనడంతో ప్రభుత్వ పాఠశాలల్లో బోధనపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఇప్పటికే సిలబస్ అనుకున్న మేర పూర్తవ్వలేదు. చాలా స్కూళ్లల్లో 40 శాతం సిలబస్ కూడా పూర్తవ్వలేదు. దీంతో ఎన్నికల లోపు సిలబస్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు పాఠశాల విద్యాశాఖ సూచించింది. రాష్ట్రంలో దాదాపు 80 శాతం మంది టీచర్లు పోలింగ్ విధులకు హాజరవ్వాల్సి ఉంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర స్థాయి శిక్షణ కూడా ఎన్నికల కమిషన్ పూర్తి చేసింది. ఇప్పుడు జిల్లాల వారీగా శిక్షణ ఇస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత మండల స్థాయిలో టీచర్లకు శిక్షణ ఇస్తారు. అంటే మరో 15 రోజుల్లో ఉపాధ్యాయులు పూర్తిగా ఎన్నికల శిక్షణలోనే పెద్ద సంఖ్యలో పాల్గొనే వీలుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సిలబస్ పూర్తి చేసేందుకు కచ్చితమైన ప్రణాళిక సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. ముఖ్యంగా టెన్త్ పరీక్షలను దృష్టిలో ఉంచుకోవాలని స్పష్టం చేశారు. పబ్లిక్ పరీక్షలు కావడంతో సిలబస్ కోసం అదనపు క్లాసులు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే, ఎన్నికల తర్వాత డిసెంబర్లో ఈ ప్రక్రియ చేపట్టే వీలుందని చెబుతున్నారు. దసరా వరకూ 70 శాతం సిలబస్ పూర్తవ్వాల్సి ఉంటుంది. ఈ దిశగా చర్యలు చేపట్టాలని, మిగిలిన సిలబస్ను డిసెంబర్లో ప్రత్యేక క్లాసుల ద్వారా చేపట్టాలని భావిస్తున్నారు. దశల వారీగా అల్పాహారం.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం పూట అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి దసరా తర్వాత దీన్ని అమలు చేయాలని భావించినా, ఎన్నికల షెడ్యూల్డ్ వస్తుందని తెలియడంతో ముందే ప్రారంభించారు. పూర్తి స్థాయిలో అన్ని స్కూళ్ళల్లో దసరా తర్వాత ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని అనుకున్నారు. కానీ ఇందుకు అవసరమైన ప్రణాళిక పూర్తవ్వలేదని అధికారులు చెబుతున్నారు. ప్రతీ స్కూలులో వంట సామాగ్రి, బడ్జెట్ అంశాలపై స్పష్టత లేదంటున్నారు. దీంతో తొలి రోజు మండలానికి ఒక స్కూల్లో సీఎం అల్పాహారం పథకం అమలు చేయాలనిఅధికారులు నిర్ణయించారు. ప్రతీ వారం ప్రతీమండలంలో ఒక్కో స్కూల్ చొప్పున, దశలవారీగా విస్తరించబోతున్నట్టు అధికారులు తెలిపారు. -
విచ్ఛిన్న శక్తులను ఏరేద్దాం
న్యూఢిల్లీ: మత, ప్రాంతీయవాదాలతో దేశాన్ని విభజించాలని చూస్తున్న విచ్చిన్న శక్తులను తుదముట్టించాలని ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దసరా సందర్భంగా మంగళవారం ఢిల్లీలో దసరా వేడుకల్లో పాల్గొని అక్కడి వారినుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. కేవలం రావణ దిష్టిబొమ్మల దహనానికే పరిమితం కాకుండా, దేశాభివృద్ధిని గాలికొదిలి స్వీయ ప్రయోజనాల సాధనకు తాపత్రయపడే సిద్ధాంతాలనూ దహనం చేయాలని హితవు పలికారు. విభజన శక్తులపై దేశభక్తి సాధించిన విజయంగా దసరాను జరుపుకోవాలన్నారు. విలక్షణ ఇండియా కూటమిని ఉద్దేశించే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. వివక్ష, సామాజిక రుగ్మతలను నిర్మూలించాల్సి ఉందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. అయోధ్యలో రామాలయ వచ్చే రామనవమి నాటికి పూర్తవుతుందని ప్రకటించారు. శతాబ్దాల ఎదురుచూపుల తర్వాత రాముడు అయోధ్యలో కొలువుదీరనున్నాడని చెప్పారు. దసరా సందర్భంగా ప్రతి ఒక్కరూ కనీసం పది మంచి పనులు చేస్తామని ప్రతిజ్ఞ చేయాలన్నారు. సామాజికంగా కనీసం ఒక పేద కుటుంబాం పైకి ఎదిగేందుకు చేయూత ఇవ్వాలని హితవు పలికారు. మన సరిహద్దులను ఎలా కాపాడుకోవాలో తమకు బాగా తెలుసన్నారు. ‘దసరా నాడు ఆయుధ పూజ జరుగుతుంది. భారత్ ఎప్పుడూ ఆయుధాలను స్వీయ రక్షణకే ఉపయోగిస్తుంది‘ అని స్పష్టంచేశారు. -
దసరా ఉత్సవాల్లో సనాతన ధర్మం విమర్శకులపై పోస్టర్లు
ఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరుగుతున్న దసరా వేడుకల్లో దిష్టిబొమ్మలకు సనాతన ధర్మ వ్యతిరేకులపై పోస్టర్లు వెలిశాయి. 'సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించేవాళ్లు నశించిపోతారు', 'సనాతన ధర్మ విమర్శకులు అంతరించిపోతారు' అని పేర్కొన్న పోస్టర్లను దిష్టిబొమ్మలకు అంటించారు. కానీ వేడుకల ప్రారంభానికి ముందే వాటన్నింటిని తొలగించారు. కాగా ఈ ఏడాది ఎర్రకోటలో జరుగుతున్న దసరా ఉత్సవాలకు బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా హాజరుకానున్నారు. 50 ఏళ్లుగా జరుగుతున్న ఎర్రకోట ఉత్సవాల చరిత్రలో తొలిసారి ఓ మహిళ కంగనా రనౌత్ ఈ సారి దిష్టిబొమ్మను దహనం చేయనుంది. ఎర్రకోట వద్ద జరుగుతున్న ఉత్సవాల్లో రావణ, కుంభకర్ణ, మేఘనాథ్ ల దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. రావణ దహనం పేరుతో జరుగుతున్న ఈ కార్యక్రమం దసరా వేడుకల్లో ఓ సాంప్రదాయంగా వస్తోంది. చెడుపై మంచి విజయానికి గుర్తుగా ఈ వేడుకలను జరుపుతున్నారు. సనాతన ధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదం దేశవ్యాప్తంగా పెద్ద రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూ వంటి రోగాలతో పోలుస్తూ ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ మండిపడింది. దేశంలో మతసామరస్యాన్ని దెబ్బతీసే చర్యగా పరిగణించింది. ఇదీ చదవండి: మొసలితో రైతుల వినూత్న నిరసన.. కేటీఆర్ రియాక్షన్ ఇది..! -
రావణునికి కంగన నిప్పు.. చరిత్రలో తొలిసారి!
దేశవ్యాప్తంగా విజయ దశమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయ దశమి రోజున పలు ప్రాంతాల్లో రావణుని దిష్టిబొమ్మను దహనం చేసి, చెడుపై మంచి విజయం సాధించిందనే సందేశాన్ని అందిస్తారు. రావణ దహన వేడుకల సందర్భంగా ఢిల్లీలో జరిగే ‘లవకుశ రామ్లీల’ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఈసారి విజయ దశమి వేడుకల్లో ఓ మహిళ రావణుని దిష్టిబొమ్మను దహనం చేయనుంది. ఇది రామ్లీల చరిత్రలో కొత్త అధ్యాయమని పలువురు చెబుతున్నారు. లవకుశ రామ్లీలలో రావణుని దహనం చేసేది మరెవరో కాదు నటి కంగనా రనౌత్. కంగన తదుపరి చిత్రం తేజస్పై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. కంగనా రనౌత్ ఢిల్లీలోని లవకుశ రామ్లీలలో రావణ దహనానికి సంబంధించిన సమాచారం ఇచ్చారు. ఆమె తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశారు. వీడియోలో కంగనా రనౌత్ తాను రావణ దహనం చేయడానికి ఢిల్లీకి వస్తున్నట్లు తెలిపారు. View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) ఈ వీడియోలో నటి తన తేజస్ సినిమాను కూడా ప్రమోట్ చేశారు. ‘ఎర్రకోటలో ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ కార్యక్రమ 50 ఏళ్ల చరిత్రలో ఒక మహిళ రావణుని దిష్టిబొమ్మను దహనం చేయడం ఇదే మొదటిసారి. జై శ్రీరామ్’ అని కంగన క్యాప్షన్లో రాశారు. కంగనా రనౌత్కి పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కంగన రనౌత్ నటించిన తేజస్ చిత్రం అక్టోబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది. ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ విజయదశమి శుభాకాంక్షలు -
కులులో ఘనంగా అంతర్జాతీయ దసరా ఉత్సవాలు
విపత్తుల నుంచి కోలుకున్నమూడు నెలల తర్వాత హిమాచల్లోని కులులో దసరా సందడి నెలకొంది. అంతర్జాతీయ కులు దసరా వేడుకలు నేటి నుంచి(మంగళవారం) ధాల్పూర్ మైదానంలో ప్రారంభం కానున్నాయి. అక్టోబరు 30 వరకూ ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఈ దసరా ఉత్సవాలు కులు-మనాలిలో పర్యాటకానికి మరింత ప్రోత్సాహకరంగా మారనున్నాయి. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు రఘునాథుని రథయాత్రతో మహాకుంభ్ పేరుతో ఈ దసరా ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. రఘునాథుని రథాన్ని లాగడానికి వేలాది మంది భక్తులు తరలిరానున్నారు. రథమైదాన్ నుండి రథయాత్ర ‘జై సియారామ్’ నినాదాలతో రఘునాథ్ ధాల్పూర్కు చేరుకోనుంది. అనంతరం జిల్లా నలుమూలల నుంచి తీసుకువచ్చిన దేవతా మూర్తుల విగ్రహాలను ఆయా మండపాల్లో కొలువుదీర్చనున్నారు. 14 దేశాలకు చెందిన సాంస్కృతిక బృందాలు ఈ ఉత్సవంలో వివిధ ప్రదర్శనలు ఇవ్వనున్నాయి. దసరా చరిత్రలో తొలిసారిగా మలేషియా, రష్యా, దక్షిణాఫ్రికా, కజకిస్తాన్, రొమేనియా, వియత్నాం, కెన్యా, శ్రీలంక, తైవాన్, కిర్గిజిస్తాన్, ఇరాక్, అమెరికా తదితర దేశాలకు చెందిన సాంస్కృతిక బృందాలు ఇక్కడ ప్రదర్శనలు ఇవ్వనున్నాయని పార్లమెంటరీ చీఫ్ సెక్రటరీ సుందర్ సింగ్ ఠాకూర్ తెలిపారు. కులు దసరా వేడుకలు 1660 నుండి జరుగుతున్నాయి. ఇది కూడా చదవండి: రామరావణ యుద్ధానికి నేతలు, ప్రముఖులు -
రామరావణ యుద్ధానికి నేతలు, ప్రముఖులు
న్యూఢిల్లీ: దేశరాజధాని న్యూఢిల్లీలో దసరా సందర్భంగా నేడు నిర్వహించే రామ్లీలను సందర్శించేందుకు నేతలు, ప్రముఖులు తరలిరానున్నారు. ఎర్రకోట మైదానంలో ధార్మిక లీల కమిటీ, లవకుశ రామలీల కమిటీలతో పాటు వివిధ కమిటీల నేతలు రామ్లీల నిర్వహణకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ వస్తారని ధార్మిక్ లీల కమిటీ అధికార ప్రతినిధి రవి జైన్ తెలపగా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సినీ నటి కంగనా రనౌత్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరవుతారని లవకుశ రామ్లీల కమిటీ చైర్మన్ అర్జున్ కుమార్ తెలిపారు. సోనియా గాంధీ కూడా తమ ఆహ్వానం మేరకు వస్తున్నారని నవశ్రీ రిలీజియస్ లీల కమిటీ అధికార ప్రతినిధి రాహుల్ శర్మ అన్నారు. శ్రీరామ్లీలా కమిటీ చైర్మన్ అజయ్ అగర్వాల్ మాట్లాడుతూ కేంద్రమంత్రి మీనాక్షి లేఖి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. జవహర్లాల్ నెహ్రూ మైదానంలో రామ్లీలను నిర్వహిస్తున్న శ్రీరామ్ ధార్మిక రామ్లీల కమిటీ చైర్మన్ సతీష్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ హాజరుకానున్నారని తెలిపారు. దేరావాల్ నగర్లోని నవశ్రీ మానవ్ ధరమ్ రామ్లీల కమిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, ఎంపీ మనోజ్ తివారీ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. అలాగే రాష్ట్ర బీజెపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా తాము నిర్వహిస్తున్న కార్యక్రమానికి హాజరు కానున్నారని ఇంద్రప్రస్థ రామ్లీల కమిటీ ప్రతినిధి సురేష్ బిందాల్ చెప్పారు. ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్లో రెండు రైళ్లు ఢీ.. 20 మంది మృతి -
ఈ రోజే ఎందుకు విజయదశమి జరుపుకుంటున్నాం?
మంగళవారం రోజున లేని శ్రవణ నక్షత్రం శమీ పూజకు ప్రధానం శ్రవణా నక్షత్రం అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా విజయదశమి ఏ రోజున అనే విషయంలో దోబూచులాడుతుంది. ధర్మశాస్త్ర గ్రంథాలైన నిర్ణయ సింధు, ధర్మసింధు ప్రకారము విజయదశమి 23న సోమవారం రోజు జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అసలు కారణం ఏమిటి? విజయదశమి పండగ ఏ రోజున అనే విషయమై గందరగోళ పరిస్థితులను తెరదించే ప్రయత్నంలో భాగంగా విజయదశమి పండుగపై పూర్తి వివరణ ఇది... ఎందుకీ గందరగోళం.. విజయదశమి పండుగకు ప్రధానంగా కావలసినది దశమితో కూడిన శ్రవణా నక్షత్రం... ఈ శ్రవణా నక్షత్రం సమయంలోనే శమీ పూజ జరపవలసి ఉంటుంది. శమీ పూజకు అత్యంత ప్రాధాన్యమైనది. శ్రవణా నక్షత్రం 22వ తారీకు ఆదివారం సాయంత్రం గంటలు 3:35 నిమిషములకు వచ్చి తెల్లవారి సోమవారం 23వ తేదీ సాయంత్రం గంటలు 3:35 నిమిషముల వరకు ఉంటుంది. మంగళవారం నాడు ధనిష్ట నక్షత్రం చొరబడుతుంది.ధనిష్ట నక్షత్రం విజయదశమి పండుగకు విరుద్ధం. ఈ ప్రకారంగా సోమవారంనాడు అపరాహ్ణ ముహూర్తం లో దశమి పగలు గంటలు 2:29 నిమిషములకు ప్రారంభమవుతోంది. అపరాహ్ణ కాలము(మధ్యాహ్నాం) పగలు గంటలు 1:00 నుంచి మధ్యాహ్నము 3: 28 వరకు శ్రవణా నక్షత్రం ఉంటుంది. .అంటే ఈ సమయంలో శ్రవణా నక్షత్రముతో దశమి కూడితే అది విజయదశమి అవుతుంది. కనుక దశమితో శ్రవణ నక్షత్రం కూడినందున అక్టోబర్ 23 సోమవారం రోజున దసరా లేదా విజయదశమి పండుగ జరుపుకుంటున్నాం. అందుకే ఈ రోజునే శమీ పూజ నిర్వహించాలని పండుతులు నిర్ణయించారు. శృంగేరిలో కూడా.. శృంగేరి పీఠంలో కూడా విజయదశమి శమీ పూజ సోమవారము నిర్వహిస్తున్నట్లు పీఠం నిర్వాహకులు వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని పలు దేవస్థానాలలో 23వ తారీఖున జరుపుకోవాలని చెబుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 23 సోమవారం నాడే విజయదశమిని ఆచరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ పంచాంగం అనుసరించి విజయవాడ కనకదుర్గ దేవాలయంలో కూడా 23 సోమవారం రోజున దసరా పండగ అని వేద పండితులు నిర్ణయించారు. పంచాంగ కర్తలందరూ కలసి గత మాసంలోనే విజయదశమి 23 సోమవారం జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. అందువల్ల 23వ తేది సోమవారం రోజున దసరా పండుగ శమీ జరుపుకోవడం అందరికీ శ్రేయస్కరం. (చదవండి: స్త్రీ శక్తి విజయం విజయ దశమి) -
తెలుగు రాష్ట్రాల్లో ఉత్సాహంగా దసరా వేడుకలు
-
బతుకమ్మ పండుగ విశిష్టత..
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే గొప్ప పండుగ బతుకమ్మ. ఏ పండుగకు కలవకున్నా ఈ పండుగకు మాత్రం ఆడపడుచులంతా కలుసుకుంటారు. బతుకమ్మ పండుగ వస్తోందంటే ప్రకృతి అంతా పూలవనంగా మారిపోతుంది. చెరువులు, కుంటలు, జలాశయాలు నిండుకుండలా దర్శనమిస్తాయి. తెలంగాణలో పండుగల్లో పాట నేర్పింది బతుకమ్మనే. పువ్వులతో బతుకమ్మను పేర్చి పువ్వులనడుమ పుప్పొడిని, పసుపుముద్దను అలంకరిస్తారు. ఈ పండుగ జరుగుతున్నన్ని రోజులూ పల్లెలు, పట్టణాలు పూలవనాలయిపోతాయి. ఆరాధనలో పూలకున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. తెలంగాణలోనైతే, ఆ పూలనే పూజించడం ఒక విలక్షణ సంస్కృతిగా కనిపిస్తోంది. ప్రకృతిలో భాగమైన పూలు స్త్రీల ముత్తయిదు తనానికి ప్రతీక కావడం గొప్ప విశేషం. స్త్రీల ప్రాతినిధ్యమే ప్రధానమైనప్పటికీ సమాజంలో సమిష్టితత్వానికి దోహదపడే పండుగ ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వమానవాళికి భిన్నత్వంలోని అందాన్ని అందించి ఐక్యంగా ఉండాలనే అవసరాన్ని చాటి చెప్తుంది. శాస్త్రీయంగా చెప్పాలంటే సమాజానికి మేలు కూర్చే విషయాలెన్నో బతుకమ్మ కూర్పులో, ఆటలో, పాటలో ఆత్మీయత పంచుకోవడంలో కనబడతాయి. తెలంగాణలో బతుకమ్మ పండుగ 9 రోజులు జరుపుకునే వేడుకగా ప్రసిద్ధి పొందింది. మొదటి రోజు భాద్రపద బహుళ అమావాస్యనాడు పారంభమవుతుంది. ఈ అమావాస్యను పితృ అమావాస్య అంటారు. ఆనాడు చేసే బతుకమ్మ పేర్పును ఎంగిలిపువ్వుల బతుకమ్మగా పిలుస్తారు. ఆనాడు గౌరమ్మకు సాధారణంగా తెలంగాణ ప్రజలు తినే ఆహారాన్ని, పిండివంటలను నైవేద్యంగా సమర్పించుకొంటారు. తొలిపూజ బతుకమ్మకు కాబట్టి పల్లె ప్రజలు ఎంగిలిపూల బతుకమ్మని అంటారు, స్త్రీలు భుజించిన తర్వాత చేసుకొంటారు కాబట్టి ఎంగిలి బతుకమ్మనే పేరొచ్చింది. బతుకమ్మను పూజించిన తర్వాత పుణ్య స్త్రీలు తమ మాంగల్యాలకు తాకించుకుంటారు. ఆ పూజనే మంగళగౌరి అని మాంగల్య గౌరి అని భావిస్తారు. బతుకమ్మ కథనాలు ఎట్లా ఉన్నా ముత్తయిదుతనమనేదే అంతర్లీనంగా కనిపిస్తోంది. సాంప్రదాయంగా పçసుపు గౌరమ్మను చేస్తుంటారు. తంగేడు పూలు పసుపుతనానికి ప్రతీకగా నిలుస్తాయి. ఈ గౌరమ్మను చేయడంలో గొప్ప ఆచారం కనబడుతుంది. అర్ధనారీశ్వరునికి సంకేతంగా బతుకమ్మను నిలుపుకొంటారు. శివపార్వతులు ప్రకృతి– పురుషులు. నిజంగా గౌరమ్మ అనగానే పూలతో ఒక గోపురంలా పేర్చడం ఒకటే కాదు, ఆ గోపురం నడుమ ఒక నొక్కు (గుమ్మడి) ని పెట్టి ఒక పసుపు ముద్దను రెండు గోపురాలుగా రూపొందేటట్లు పూలను పేరుస్తారు. అంటే గౌరమ్మే అర్ధనారీశ్వర స్వరూపం అన్నమాట. ఇందులో ప్రత్యేకంగా గౌరీ ఆరాధన కనిపిస్తుంది. కొందరు గౌరమ్మను తమలపాకుల్లో పెడతారు, మరికొందరు చిక్కుడు ఆకుల్లో పెట్టి పూజ చేస్తుంటారు. ‘చిక్కుడు ఆకుల్లో ఉయ్యాలా... సద్దులు కట్టి ఉయ్యాలో... అని పాటలు పాడుతూ బతుకమ్మ ఆడతారు. అందుకే స్త్రీల మనోభావాలను అనుసరించే బతుకమ్మను పేర్చడం జరుగుతోంది. అందులో స్త్రీల కళాతృష్ణ ఎంత గొప్పదో విదితమవుతుంది.ఎన్ని పూలతో బతుకమ్మను పేర్చినా ప్రతి వరుసకు తంగేటిపూలు ఉండడాన్ని విస్మరించరు. తంగేడు ముతై ్తదుతనం ఇవ్వడమేగాదు, ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదిస్తుందని నమ్మకం. అందుకే, ‘శ్రీలక్ష్మి నీమహిమలూ గౌరమ్మ చిత్రమై తోచునమ్మ’ అని జానపదం పాడుకుంటారు. సద్దుల బతుకమ్మనాడు ఆడపడుచులకు వొడిబియ్యం పోసి సాగనంపినట్లు బతుకమ్మను సాగనంపుతారు. బతుకమ్మను పేర్చడంలోని తీరొక్క పువ్వుకు తీరొక్క శాస్త్రీయత కనబడుతుంది. ప్రకృతిలోని పూలన్నింటికి ఔషధ గుణాలుంటాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. బతుకమ్మను చెరువులోగానీ కుంటలోగాని నిమజ్జనం చేసినప్పుడు రోగ నిరోధక శక్తితో నీరు ఔషధ గుణాలు పొందుతుంది. అలాగే గుమ్మడి పూలు, గునుగుపూలలో జలచరాల్లోని అనారోగ్యాన్ని దూరం చేసే గుణాలున్నాయి. పుప్పొడి, పసుపులో గాలిలోని కాలుష్యాన్ని కడిగేసే గుణాలున్నాయి. అన్నింటికీ మించి కులమతాల కతీతంగా, పేద, గొప్ప భేదం లేకుండా బతుకమ్మ ఆటల్లో పాల్గొనడంలో సామాజిక ప్రయోజనముంది. బృహత్ శివలింగానికీ బతుకమ్మకూ సంబంధం? తెలంగాణ సంస్కృతిలో ప్రధాన భాగమైన బతుకమ్మ పండుగను పరిశీలిస్తే, ఆ సంస్కృతి విశిష్టత, చారిత్రకత విశదమౌతుంది. విశ్వవిఖ్యాతి చెందిన తంజావూరులోని రాజరాజేశ్వర ఆలయంలోని మహా శివలింగం వేములవాడకు చెందిందనడానికి ఆధారాలున్నాయి. ఈ దేవాలయాన్ని నిర్మించిన చోళరాజైన రాజరాజు, కరీంనగర్లోని వేములవాడ నుంచి బృహత్ శివలింగాన్ని అంటే మహా శివలింగాన్ని తంజావూరు తరలించి, బృహదీశ్వరాలయంలో ప్రతిష్ఠింపజేశాడు. తెలంగాణ ప్రజలు దీనికి బాధపడినా, పార్వతీ అమ్మవారిని ఊరడించే ప్రయత్నంలో పూలతో మేరుపర్వతంలా పేర్చి, దానిపై పసుపుతో గౌరీదేవిని రూపొందించి, దసరా సందర్భంలో ఆటపాటలతో తిరిగి రమ్మని ప్రార్థిస్తున్నారని చారిత్రక పరిశోధకుల అభిప్రాయం. -
Dussehra 2023: విజయ దశమి విశిష్టత ఏంటంటే.?
ముక్తి కోసం సాధన చేసేందుకు ఉపకరించే దక్షిణాయనంలో వచ్చే పండుగలలో దసరా ఒకటి. ఆధ్యాత్మిక శక్తిని పెంపొందింపచేసే సాధనతో, దైవ ఉపాసనతో కూడిన పండుగ దసరా. ఆసేతు హిమాచలం అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగలలో ఒకటైన ఈ దసరా గురించి... దసరా అంటే పది జన్మల పాపాలను, పది రకాలైన పాపాలను పోగొట్టేది అనే అర్థం కూడా వ్యాప్తిలో ఉంది. ఈ పది రోజుల పండుగని ‘నవరాత్ర వ్రతం‘ అనీ, ‘దేవీ నవరాత్రులు‘, ‘శరన్నవరాత్రులు‘ అని వ్యవహరిస్తాం. తొమ్మిది రోజులు నియమ నిష్ఠలతో జగన్మాతను పూజించే వ్రతం ఈ శరత్కాలంలో చేసే శరన్నవరాత్ర వ్రతం. తొమ్మిది సంఖ్య పూర్ణత్వానికి సంకేతం. నవరాత్రులు ఆరాధించటమంటే పరమాత్మను పరిపూర్ణంగా ఆరాధించటం. నవరాత్రి అంటే నూతనమైన రాత్రి లేదా కొత్త రాత్రి అని అర్థం. తొమ్మిది రోజుల దీక్ష వలన పదవరోజు విజయం లభిస్తుంది. అంటే తొమ్మిది రోజుల దీక్షకు ఫలం లభిస్తుంది. కనుక పదవ రోజును ‘విజయదశమి‘ పేరిట పండుగ జరుపుకుంటాము. జగన్మాత ఆదిపరాశక్తి గొప్పదనాన్ని, మహిమను గురించి, దేవీ భాగవతం, మార్కండేయ పురాణం మొదలైన అనేక పురాణాలు, ఉపనిషత్తులు వివరిస్తాయి, త్రిపురా రహస్యంలో విపులమైన వివరణ కనిపిస్తుంది. అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మగా కొలవబడుతున్న జగన్మాత దుర్గమ్మ అనంతమైన నామాలతో పూజలందుకుంటోంది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, దుర్గ, పార్వతి, హైమవతి, అపరాజిత, భవాని, లలిత, జయంతి, మంగళ, భద్రకాళి, కాపాలిని, క్షమా, శివదూతి, స్వాహా, స్వధా, చాముండి, విష్ణుపత్ని, ఈశ్వరి ఇటువంటి అనేకమైన నామాలతో ఆరాధనలందుకుంటోంది. మనలోని శక్తిని, శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన శక్తిని జాగృత పరిచే, దైవ అనుగ్రహంతో, మంత్ర శక్తితో, నియమబద్ధమైన జీవితంతో జాగృత పరిచే ఒక వ్రతం ఈ నవరాత్ర వ్రతం. అందుకే దసరా నవరాత్రులలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు పది రోజులు ఈ జగన్మాతను బాలా త్రిపురసుందరిగా, గాయత్రీ మాతగా, అన్నపూర్ణాదేవిగా, శ్రీ మహాలక్ష్మి దేవిగా, శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా, శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా, సప్తమి రోజున శ్రీ మహా సరస్వతీ దేవిగా, అష్టమి నాడు దుర్గామాతగా, నవమి నాడు మహిషాసుర మర్దినిగా, దశమినాడు జయా విజయా సహిత అపరాజితా దేవిగా – రాజరాజేశ్వరీ దేవిగా ఆరాధిస్తాం. తొమ్మిది రోజులు కఠినమైన శారీరక, మానసిక, ఆధ్యాత్మికమైన నియమాలను పాటిస్తూ, నామ మంత్ర జపం, నామ పారాయణ చేస్తూ, కీర్తనలతో, భజనలతో కొలుస్తూ, ఉపవాస నియమాలను, నక్త వ్రతముల వంటి వాటిని పాటిస్తూ దశమినాడు చక్కగా జగన్మాతను షోడశోపచారాలతో పూజించి, అనేక విధాలైన పిండివంటలు తయారు చేసి, నైవేద్యం పెట్టి అమ్మను ఆరాధిస్తాం. ఆ పిండి వంటలను ప్రసాదంగా బంధుమిత్రులందరికీ పెట్టి, ఆరగిస్తాం. ఆదిపరాశక్తిని లక్ష్మీ, గాయత్రీ, సరస్వతీ, రాధ, దుర్గా అనే ఐదు పరిపూర్ణ మూర్తులుగా ఆరాధిస్తారు. యా దేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా ! నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః!! పరమేశ్వరుని సంకల్ప శక్తి జగన్మాత. ఆ సంకల్పం వల్లే సృష్టి స్థితి లయలన్నీ జరుగుతున్నాయి. ఆదిపరాశక్తి ప్రకృతి అయితే, పరమాత్మ పురుషుడు. ప్రకృతి పురుషుల కలయిక వల్లే సృష్టి యేర్పడుతుంది. అంటే శివపార్వతుల చిద్విలాసం యావద్విశ్వం. ఈశ్వరుడని కొలిచినా, విష్ణువు అని కొలిచినా, జగన్మాత అంబిక అని కొలిచినా ఉన్న శక్తి ఒక్కటే అని మనకి ఉపనిషత్తులు బోధిస్తున్నాయి. ఒక్కటిగా ఉన్న ఆ శక్తిని, చిచ్ఛక్తినే మనం అమ్మవారిగా, జగన్మాతగా ఆరాధిస్తున్నాము. చండీ సప్తశతిలో జగన్మాత మహాకాళిగా, మహాలక్ష్మిగా, మహా సరస్వతిగా దుష్ట రాక్షసులను దునుమాడిన వైనాన్ని కీర్తించారు. అమ్మవారు దేవతలకు – ఎప్పుడు దుష్ట రాక్షసుల నుంచి బాధలు కలిగినా, తాను అవతరించి, దుష్ట శిక్షణ చేస్తానని అభయమిచ్చారు. జగన్మాత, యోగ నిద్రలో ఉన్న శ్రీమహావిష్ణువును జాగృత పరిచి, మధు కైటభులనే రాక్షసులను సంహరింపజేసింది. మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను జయించి స్వర్గాన్ని ఆక్రమించగా, దేవతలు బ్రహ్మదేవునితో కలిసి శ్రీ మహావిష్ణువు, రుద్రుల దగ్గరికి వెళ్ళి మహిషాసురుని ఆగడాలను గురించి చెప్పారు. ఆ మాటలు వినగానే శివకేశవులకు ధర్మాగ్రహం కలిగింది. ఆ క్రోధం ఒక ఆకృతి దాల్చి, వెలుగు రూపంలో బయటకొచ్చింది. దేవతలందరి ముఖాల నుంచి తేజస్సు బయటికి వచ్చి, ఆ సమష్టి తేజస్సు ఒక మహాద్భుత రూపం దాల్చి, అష్టభుజాలతో మహాలక్ష్మీదేవిగా, ఆదిపరాశక్తి ్తగా భాసించింది. ఈ తల్లిని దేవతలు ‘అమ్మా! నీవే సర్వకారణభూతురాలివి, కార్య కారణ రూపిణివి, క్రియా రూపిణివి, నీవు లేనిదే ఏదీ లేదు, అంతా నీలోనే ఉంది తల్లి అంటూ కీర్తించారు. శక్తి లేకపోతే శివుడు కూడా ఏమీ చేయలేడు. కనీసం స్పందించను కూడా లేడట. శక్తి లేకపోతే, చలనం, స్పందన ఉండదు అని జగద్గురువు శ్రీ ఆదిశంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అమ్మవారి గురించి ప్రస్తుతించారు. ఆమె మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించి మహిషాసురమర్దినిగా కీర్తించబడింది. జగన్మాతే ధూమ్రాక్షుడిని, రక్తబీజుడిని, చండ, ముండులను, శుంభ, నిశుంభులనే రాక్షసులను సంహరించింది. ఈ రాక్షసులందరూ బ్రహ్మదేవుని గురించి, పరమేశ్వరుని గురించి తపస్సులు చేసి వరాలు పొందినటువంటి వారు. దేవతల నుంచి ఎటువంటి భయాలు లేకుండా వరాలు పొందారు. కానీ స్త్రీ అంటే చులకన. ఆడవారు మననేం చేస్తారులే! అనే చులకన భావన స్త్రీల మీద! కనుకనే అమ్మవారు ఈ రాక్షసులందరినీ తనలో నుంచి బ్రాహ్మీ , వైష్ణవి, మహేశ్వరి, కౌమారి, ఐంద్రీ, వారాహి, నారసింహీ, చాముండా, శ్యామలా, కాళీ మొదలైన దేవతాగణాలను ఉద్భవింపజేసి, వారితో కలిసి రాక్షసులతో యుద్ధం చేసి, దానవులందరినీ సంహరించింది. ఈ దుష్ట రాక్షసులందరినీ జగన్మాత ఈ నవరాత్రులలో సంహరించినందున నవరాత్రులలో జగన్మాత వివిధ రూపాలను, అవతారాలను మనం కీర్తిస్తాం, ఆరాధిస్తాం. విజయదశమి నాడు, జగన్మాత దుష్ట రాక్షసులను సంహరించి విజయం సాధించిన రోజు కాబట్టి మనమంతా విజయదశమి పండుగను వేడుకగా జరుపుకుంటాం. విజయదశమి జరుపుకోవటంలో ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి భేదం ఉండవచ్చు కానీ హైందవులందరూ ఈ పండుగ జరుపుకుంటారు. విజయదశమి పండుగ దుష్టత్వం పైన దైవత్వం పొందిన విజయంగా జరుపబడుతున్నది. మానవులలోనే దైవీ గుణాలుంటాయి, ఆసురీ గుణాలు ఉంటాయి. మనలోని ఆసురీ గుణాలను పోగొట్టుకుని, దైవీ గుణాలను వృద్ధి పరచుకోవాలి.ఈ విజయదశమి పండుగ జరుపుకోవడానికి మనకు అనేక కారణాలు కనిపిస్తాయి. కాలంలో వచ్చే మార్పులను బట్టి దైవ శక్తిని ఆరాధించటం ఒక భావన అయితే, మనలోని దైవ శక్తిని వృద్ధిపరచుకోవటం, సమాజం లో అందరితో అన్యోన్యంగా సహకరిస్తూ ఉండటం అన్నది మరొక అంశం. ఈ విజయదశమినాడే అర్జునుడు ఉత్తర గోగ్రహణంలో కౌరవుల మీద విజయం సాధించి విజయుడు అయ్యాడు. శమీ వృక్షం మీద పెట్టిన తమ ఆయుధాలలో నుంచి తన గాండీవాన్ని తీసుకుని యుద్ధం చేసి విజయం సాధించాడు కనుక మనం ఈనాడు విజయదశమి పండుగ జరుపుకుంటున్నాం. ఈనాడు శమీవృక్షాన్ని పూజిస్తాం. ‘శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశినీ! అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియ దర్శిని’ అని చెప్తూ శమీ వృక్షానికి ప్రదక్షిణలు చేసి నమస్కరిస్తాం. ఈ విజయదశమి పండగనాడు అందరూ కూడా ఈ శమీ పత్రాలను – శమీ వృక్షపు ఆకులను పెద్దలకు ఇచ్చి నమస్కరిస్తారు. పెద్దలు వాటిని తీసుకుని పిల్లలను ఆశీర్వదిస్తారు. ఈ విజయదశమి రోజునే శ్రీరామచంద్రుడు రావణాసురుని సంహరించినందున, విజయదశమి రోజున ‘రామలీల‘ను ప్రదర్శిస్తారు. రావణ దహనం చేస్తారు. జగన్మాత ఆరాధన వలన, దుర్జనుల వలన సంఘానికి చేటు కలగకుండా, అధివ్యాధుల సమస్యలు లేకుండా దేశానికి భద్రత కలుగుతుంది. అందుకే సాక్షాత్తూ ఆ జగజ్జనని మనని పాలిస్తూ ఉన్నట్లుగా.. ఆమె పాలనలో మనందరం క్షేమంగా.. సుఖంగా ఉన్నట్లు భావించుకుందాం. పూజించుకుందాం. ‘‘అఖిలాండేశ్వరీ... చాముండేశ్వరీ.. పాలయమాం గౌరీ... పరిపాలయమాం గౌరీ...’’ అని ప్రార్థిస్తూ... మనల్ని పాలించమని అమ్మను వేడుకుందాం. మహిషం అంటే దున్నపోతు, జంతువు. మహిషాసురుడు అంటే జంతు తత్వం కలిగినటువంటి వాడు. రాజస తామస గుణాలకు ప్రతీకలు రాక్షసులు. మహిషాసురుడిని, చండ ముండులను, శుంభ, నిశుంభులను జగన్మాతసంహరించింది అంటే, మనలోనే ఉన్న కామ క్రోధాది అరిషడ్వర్గాలను, లోభ మోహాలను, అహంకారాన్ని నశింప చేసుకోవాలి అని గ్రహించాలి. చండ ముండాది రాక్షసులు దుర్మార్గమైన, ధర్మ విరుద్ధమైన బలదర్పాలకు ప్రతీకలు. కనుక అటువంటి బలహీనతలను జయించాలి. మనలోని రజోగుణాలను, తమో గుణాలను అరికట్టి, సత్వగుణాన్ని వృద్ధి పరచుకుని, శుద్ధ సత్వ గుణాన్ని పొందడానికి సాధన చేయాలి. అది ఈ జగన్మాతను నవరాత్రులలో ఆరాధించడం వలన సాధ్యపడుతుంది. శుద్ధ సత్వ గుణాన్ని వృద్ధి చేసుకుంటే దైవత్వాన్ని దర్శించగలుగుతాము, పొందగలుగుతాము. మథు, కైటభులు అనే రాక్షసులు అహంకార మమకారాలకు ప్రతీకలు. నేను, నాది అనే భావాలకు ప్రతీకలు. మధువు అంటే తేనె. అన్నింటి కంటే మనకు ఇష్టమైనది, తీయనైనది ఎవరికి వారే! ఒక్క నేను అనేది ఉంటే, అనేకమైన నావి, నా వారు, నా బంధువులు, నా అధికారం, నా పదవులు వంటి అనేకమైనవి బయలుదేరతాయి. ఒక్క తేనె చుక్క ఉంటే, అనేకమైన కీటకాలు చుట్టూ చేరినట్లుగా, ఒక్క నేనుకి, అనేకమైన – నావి అనేవి బయలుదేరతాయి. ఈ నేను, నాది అనే అహంకార, మమకార భావాలను సంహరించటమే మధుకైటభములను సంహరించటం. ధూమ్రాక్షుడు లేక ధూమ్రలోచనుడు అంటే పొగ బారిన, మసకబారిన కన్నులు కలవాడు, అంటే అజ్ఞానంలో ఉన్నటువంటి వాడు అని అర్థం. కళ్ళు మసకబారినప్పుడు యదార్థం కనిపించదు. అలాగే అజ్ఞానం వలన జ్ఞానం బహిర్గతం కాదు. వివేక జ్ఞానం ఉదయించదు. కనుక మనలోని ఆ అజ్ఞానాన్ని సంహరించాలి. రక్తం అంటే రాగం, మోహం. రక్తబీజుడు అంటే ఎంత వద్దనుకున్నా మోహం ఆనే బీజం మొలకెత్తుతూనే ఉంటుంది. అందుకే కాళికాదేవి తన పెద్ద నాలుకను చాపి, ఆ రక్తబీజుని శరీరం నుంచి కారే రక్తబిందువులను మింగేసి, ఇంక మళ్ళీ రక్తబీజులు పుట్టే అవకాశం లేకుండా చేసింది. అప్పుడు జగన్మాత వాడిని సంహరించింది. అలాగే మనలోని రాగద్వేషాలను పూర్తిగా ఎప్పుడైతే మనం జయిస్తామో, అప్పుడు జగన్మాత దర్శనం మనకు ప్రాప్తిస్తుంది. విజయదశమి దుష్టత్వం పైన దైవత్వం పొందిన విజయంగా జరుపుకుంటున్న పండగ. ఇప్పుడు రాక్షసులు లేకపోవచ్చు కానీ, మానవులలోనే దైవీ గుణాలుంటాయి, ఆసురీ గుణాలు ఉంటాయి. మనలోని ఆసురీ గుణాలను పోగొట్టుకుని, దైవీ గుణాలను వృద్ధి పరచుకోవాలి. – డా. తంగిరాల విశాలాక్షి, విశ్రాంత ఆచార్యులు -
రాష్ట్ర ఉద్యోగులకు డీఏ విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మరో రెండు హామీలను నెరవేర్చారు. దసరా పండుగకు 3.64 శాతం డీఏను విడుదల చేయడంతోపాటు రాష్ట్ర విభజన నాటికి ప్రభుత్వ శాఖల్లో నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం రెండు వేర్వేరు ఉత్తర్వులను జారీ చేసింది. ఉద్యోగులకు వారి బేసిక్ పేలో 22.75 శాతం నుంచి 26.39 శాతానికి పెంచిన కరువు భత్యాన్ని 2022 జూలై 1 నుంచి అమల్లోకి తీసుకొస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పెరిగిన కరువు భత్యం నవంబర్ 2023 నుంచి అమల్లోకి వస్తుందని, పెరిగిన డీఏను నగదు రూపంలో డిసెంబర్ జీతంలో అందుకుంటారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2022 జూలై1 నుంచి ఈ ఏడాది అక్టోబర్31 వరకు ఉన్న బకాయిలను మూడు దఫాలుగా జనరల్ ప్రావిడెంట్ ఫండ్లో జమ చేయనున్నట్టు తెలిపారు. సీపీఎస్ ఉద్యోగులకు బకాయిల్లో 10 శాతం ప్రాన్ అకౌంట్లో జమ చేసి మిగిలిన 90 శాతం మూడు దఫాలుగా అందజేస్తారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలల్లో ఈ బకాయిలను జమ చేస్తారు. జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు, మునిసిపాల్టీలు, నగరపాలక సంస్థలు, అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సమితులు, రివైజ్డ్ పేస్కేల్ 2022 కింద రెగ్యులర్గా జీతాలు అందుకుంటున్న వారు, ఎయిడెడ్ పాలిటెక్నిక్ కాలేజీలతో పాటు అన్ని ఎయిడెడ్ విద్యాసంస్థల్లోని బోధన, భోధనేతర సిబ్బంది, యూనివర్సిటీల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బందికి ఈ డీఏ పెంపు వర్తిస్తుంది. ఈ మేరకు ట్రెజరీ సిబ్బంది తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్ర విభజన జరిగిన తేదీ 2–6–2014కు ముందు వివిధ ప్రభుత్వ శాఖల్లో నియమితులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను ఆయా శాఖల్లో ఖాళీల ఆధారంగా భర్తీ చేయాల్సిందిగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేవలం ప్రభుత్వ శాఖల్లోని నియామకాలకే ఇది వర్తిస్తుందని వివిధ పథకాలు, ప్రాజెక్టులు కింద పనిచేసే వారికి ఇది వర్తించదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయా శాఖాధిపతులు నిబంధనల ప్రకారం అర్హత కలిగిన కాంట్రాక్ట్ ఉద్యోగులను గుర్తిస్తూ ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తూ డీఏతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఛైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కాగా.. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై ఏపీ స్టేట్ కాంట్రాక్ట్ ఫార్మాసిస్ట్స్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.రత్నాకర్బాబు, ప్రధాన కార్యదర్శి వీఎన్వీఆర్ కిషోర్ హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాల బానిసత్వానికి విముక్తి కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. -
సరదా.. దసరా..
బాలీవుడ్లో దసరా సందడి జోరు బాగా కనిపిస్తోంది. ప్రతి ఏడాదీ కొందరు స్టార్స్ ప్రముఖ ఏరియాల్లో అమ్మవారిని ప్రతిష్ఠించే చోటుకి వెళ్లి, పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా కాజోల్, రాణీ ముఖర్జీ తప్పకుండా వెళుతుంటారు. ఈ ఏడాది కూడా ఈ ఇద్దరూ అమ్మవారిని దర్శించుకున్నారు. కాజోల్ తన తనయుడు యుగ్తో కలిసి వెళ్లారు. ఇంకా హేమా మాలిని, ఆమె కుమార్తె ఈషా డియోల్ తన తల్లి దులారీ ఖేర్తో కలిసి అనుపమ్ ఖేర్ తదితరులు దుర్గా మాత ఆశీస్సులు అందుకున్నారు. -
రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ దసరా శుభాకాంక్షలు
తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని ఆకాంక్షించారు. ‘ముగ్గురమ్మల మూలపుటమ్మ అనుగ్రహం కోసం.. నవరాత్రుల్లో తొమ్మిది రోజులపాటు అత్యంత భక్తిశ్రద్ధలతో దుర్గామాతను పూజిస్తారు చెడుపై.. మంచి, దుష్ట శక్తులపై.. దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగే విజయదశమి. ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలి. రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు సిద్ధించాలని, ఆ కనకదుర్గమ్మ అమ్మవారి దీవెనలు, ఆశీస్సులు ఉండాలి’ అని సీఎం జగన్ ఆకాంక్షించారు. -
శోభాయమానంగా ఇంద్రకీలాద్రిపై శ్రీ దేవీ శరన్నవరాత్రులు (ఫొటోలు)
-
25 నుంచి 27 వరకు హైకోర్టుకు దసరా సెలవులు
సాక్షి, అమరావతి: హైకోర్టుకు దసరా సెలవులు ప్రకటించారు. ఈ నెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు సెలవులు ఇస్తూ హైకోర్టు రిజ్రిస్టార్ జనరల్ వై.లక్ష్మణరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హైకోర్టు కార్యకలాపాలు తిరిగి ఈ నెల 30న ప్రారంభమవుతాయి. ఈ సెలవుల్లో అత్యవసర కేసులను విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి వెకేషన్ బెంచ్లను ఏర్పాటు చేశారు. న్యాయమూర్తులు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ ఏవీ రవీంద్ర బాబు, జస్టిస్ ప్రతాప వెంకట జ్యోతిర్మయి వెకేషన్ కోర్టు జడ్జిలుగా వ్యవహరిస్తారు. ఇందులో జస్టిస్ వెంకటేశ్వర్లు, జస్టిస్ రవీంద్రబాబు ధర్మాసనంలో కేసులను విచారిస్తారు. జస్టిస్ జ్యోతిర్మయి సింగిల్ జడ్జిగా కేసులను విచారిస్తారు. హెబియస్ కార్పస్, బెయిల్స్, ముందస్తు బెయిల్స్, ఇతర అత్యవసర వ్యాజ్యాలపై మాత్రమే వెకేషన్ జడ్జిలు విచారణ జరపాల్సి ఉంటుంది. ఈ సెలవుల్లో అత్యవసర కేసులు దాఖలు చేయాలనుకునే వారు ఈ నెల 25న దాఖలు చేయాల్సి ఉంటుంది. అలా దాఖలైన వ్యాజ్యాలను న్యాయమూర్తులు ఈ నెల 27న విచారిస్తారు. -
పోటెత్తిన దసరా రద్దీ
హైదరాబాద్: దసరా రద్దీ పోటెత్తింది. రైల్వేస్టేషన్లు, బస్టేషన్లు, నగర శివారు కూడళ్లలో శుక్రవారం ప్రయాణికుల రద్దీ నెలకొంది. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరే రైళ్లు, బస్సులు కిక్కిరిశాయి. సొంత వాహనాలపైనా నగరవాసులు పెద్ద సంఖ్యలో బయలుదేరి వెళ్లారు. ఆదివారం సద్దుల బతుకమ్మ, సోమవారం దసరా కావడంతో సొంతూరి బాట పట్టారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో మహాత్మాగాంధీ, జూబ్లీబస్స్టేషన్ల వద్ద పెద్ద ఎత్తున రద్దీ కనిపించింది. ఉప్పల్, ఎల్బీనగర్, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లో జిల్లాలకు వెళ్లే బస్సులు కిక్కిరిసి బయలుదేరాయి. ఆర్టీసీ 5,250కి పైగా ప్రత్యేక బస్సులు.. దసరా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ 5,250కి పైగా బస్సులను నడిపేందుకు ప్రణాళికలను రూపొందించింది. రోజువారీ రాకపోకలు సాగించే సుమారు 3,500 బస్సులతో పాటు ఇప్పటి వరకు 1,700కు పైగా బస్సులను అదనంగా నడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మరో మూడు రోజుల పాటు ప్రయాణికుల రద్దీ కొనసాగనుంది. నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరే రైళ్లు కూడా కిటకిటలాడాయి. రెగ్యులర్ రైళ్లలో చాలా రోజుల క్రితమే రిజర్వేషన్లు బుక్ కావడంతో చాలామంది జనరల్ బోగీలను ఆశ్రయించారు. దీంతో దూరప్రాంతాలకు వెళ్లే సాధారణ బోగీలు సైతం ప్రయాణికులతో నిండిపోయాయి. అదనంగా 600 రైళ్లు.. సాధారణంగా ప్రతి రోజు సుమారు 85 ఎక్స్ప్రెస్ రైళ్లు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. మరో వంద ప్యాసింజర్ రైళ్లు నడుస్తాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సంక్రాంతి వరకు సుమారు 600 సర్వీసులను అదనంగా నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే మార్గాలను గుర్తించి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి కాకినాడ, నర్సాపూర్, తిరుపతి, కర్నూలు, విశాఖ, భువనేశ్వర్ తదితర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు సుమారు 1.85 లక్షల మంది రైళ్లలో ప్రయాణం చేస్తారు. పండుగ సెలవుల దృష్ట్యా గత మూడు రోజులుగా ప్రతి రోజు సుమారు 25వేల మంది అదనంగా ప్రయాణం చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రైవేట్ బస్సుల దోపిడీ.. ప్రయాణికుల రద్దీని సొమ్ము చేసుకొనేందుకు ప్రైవేట్ బస్సులు రంగంలోకి దిగాయి. ఆర్టీసీ బస్సులు, రైళ్లలో రిజర్వేషన్లు లభించని దూరప్రాంతాలకు చెందిన ప్రయాణికులు ప్రైవేట్ బస్సుల్లో వెళ్తున్నారు. దీంతో సాధారణ రోజుల్లో విధించే చార్జీలను రెట్టింపు చేసి వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా హైదరాబాద్ నుంచి విశాఖకు రూ.980 వరకు చార్జీ ఉంటే రూ.1600కు పైగా వసూలు చేస్తున్నారు. విజయవాడకు రూ.450 నుంచి రూ.800కు పెంచారు. ఒక్కో ట్రావెల్ సంస్థ ఒక్కో విధమైన చార్జీ వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రైవేట్ బస్సుల్లో చార్జీలపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. సొంత వాహనాల్లోనూ.. బస్సులు, రైళ్లతో పాటు కార్లు, బైక్లు వంటి సొంత వాహనాల్లోనూ నగరవాసులు పల్లెబాట పట్టారు. టాటాఏస్, మ్యాక్సీ క్యాబ్లు భారీగా బయలుదేరాయి. దీంతో పలు టోల్ప్లాజాల వద్ద వాహనాలు పెద్ద ఎత్తున బారులు తీరాయి. గంటలతరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. మరో రెండు, మూడు రోజుల పాటు ఇదే రద్దీ కొనసాగనుంది. రహదారులపై వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని వాహనదారులు జాగ్రత్తగా నడపాలని ఆర్టీఏ అధికారులు సూచించారు. -
Vijayawada: దసరా శరన్నవరరాత్రులు ఇంద్రకీలాద్రిలో భక్తుల రద్దీ (ఫొటోలు)
-
దసరాకు ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: దసరా సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ మేరకు సికింద్రాబాద్–సంత్రాగచ్చి (07645/07646) స్పెషల్ ట్రైన్ ఈ నెల 20న ఉదయం 8.40కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.40కి సంత్రాగచ్చి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 21వ తేదీ మధ్యాహ్నం 12.20కి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్–నర్సాపూర్ (07062) ఈ నెల 22వ తేదీ రాత్రి 10.05 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.10 కి నర్సాపూర్ చేరుకుంటుంది. నాందేడ్–కాకినాడ (07055/07056) స్పెషల్ ట్రైన్ 21వ తేదీ మధ్యాహ్నం గం.3.25కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.30కు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 22వ తేదీ రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు నాందేడ్ చేరుకుంటుంది. విశాఖపట్టణం–కర్నూల్ (08585/08586) స్పెషల్ ట్రైన్ ఈ నెల 24, 31, నవంబర్ 7, 14 తేదీల్లో సాయంత్రం 5.35కు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.35కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 25, నవంబర్ 1, 8, 15 తేదీల్లో మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.50 కి విశాఖ చేరుకుంటుంది. -
సకల కోరికలు నెరవేర్చే మాత కనకదుర్గమ్మ
-
దసరా పండగ.. ఒకప్పుడు అలా చేసుకునేవారు, కాలం మారిందిగా
దసరా అంటే సెలవులు. దసరా అంటే అయ్యవార్లతో పిల్లలు కలిసి వెళ్లి పాడే పాటలు. దసరా అంటే పగటి వేషాలు. దసరా అంటే బతుకమ్మలు.దసరా అంటే బొమ్మల కొలువులు. దసరా అంటే ఊళ్ల నుంచి విచ్చేసే బంధువులు.జేబు నుంచి తీసి ఇవ్వాల్సిన ఆత్మీయ మామూళ్లు. దసరా అంటే స్త్రీ, పురుషులకు ఉల్లాసం.పిల్లలకు ఆటవిడుపు. కాలం చాలా మారింది. నాటి దసరా ఎలా ఉంటుందో నేటి తరాలకు పదే పదే చెప్పాల్సిన అవసరం ఏర్పడింది.పెద్దలకు గుర్తు చేయాల్సిన బాధ్యత కూడా. ‘ఏ దయా మీ దయా మా మీద లేదు ఇంత నిర్లక్ష్యమా ఇది మీకు తగదు పావలా అర్ధయితే పట్టేది లేదు ముప్పావులా అయితే ముట్టేది లేదు హెచ్చు రూపాయయితే పుచ్చుకుంటాము అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవారికి చాలు పప్పు బెల్లాలు’... ఒకప్పుడు దసరా వస్తే పిల్ల దండును వెంట బెట్టుకుని అయ్యవార్లు బయలుదేరేవారు. ఇంటింటికి తిరిగేవారు. మామూళ్లు స్వీకరించేవారు. ఆ రోజుల్లో ఊళ్లలో బడి కొత్త. చదువు కొత్త. అయ్యవార్లకు జీతాలు అంతంత మాత్రం. సంవత్సరంలో నేర్పిన విద్య దసరా సెలవుల్లో పెద్దల ముందు అయ్యవార్లు పిల్లల చేత ప్రదర్శింపచేసేవారు. పిల్లల తెలివితేటలు చూసి పెద్దలు ముచ్చట పడేవారు. బడికి చందాలు, అయ్యవార్లకు మామూళ్లు ఇచ్చేవారు. ఆ సమయంలో ఇలా పైన రాసిన పాట పాడేవారు. ఇంతకీ వరహా అంటే మూడున్నర రూపాయి. దసరా కోసం పిల్లలు ఎదురు చూసేవారు. ఆ సమయంలో పిల్లల్ని బంధువుల వద్దకు పంపుతామనే హామీ ఉండేది. అవ్వా, తాతల దగ్గరికో, బాబాయి దగ్గరికో, మేనత్త ఊరికో నాలుగు జతలు పెట్టుకుని పిల్లలు ఉత్సాహంగా వెళ్లేవారు. దసరా సెలవులు హాయిగా గడిపేవారు. దసరా వేషాలు దసరాలో పిల్లలకు, పెద్దలకు ఆసక్తి దసరా వేషాలు. చాలామంది కళాకారులు పురాణ వేషాలు కట్టి ఇళ్ల ముందుకు వచ్చి కానుకలు స్వీకరించేవారు. పిల్లలకు ఈ వేషాలు చూడటం మహా సరదా. సీతారాములు, హనుమంతుడు, నారదుడు, శివుడు, అర్ధ నారీశ్వరుడు... ఇక పులి వేషాలు తప్పనిసరి. ఆ రోజుల్లో పులిని చూడటం అరుదు కాబట్టి (సినిమాల్లో తప్ప) మనిషే పులి రూపు కట్టి ఎదురు పడితే అబ్బురపడేవారు. తప్పెట్ల మోతకు వేషగాళ్లు లయబద్ధంగా ఆడుతుంటే నోరు తెరిచి చూసేవారు. నేలన పడేసిన రూపాయి కాసునో నిమ్మకాయనో పులి వేషగాడు నోట కరవడం ఒక ఘట్టం. దసరా నవరాత్రులు వైభవంగా జరుగుతాయి కదా. అలా ఎవరైనా ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటే ‘దసరా బుల్లోడు’ అనడం ఆనవాయితీ. బొమ్మల కొలువులు ఇక బొమ్మల కొలువు పెట్టి ఆనందించడం ఆడపిల్లల వంతు. బొమ్మల కొలువును ఎప్పుడూ బేసి సంఖ్య మెట్ల మీద ఏర్పాటు చేస్తారు. ఇంటి ఆచారాన్ని బట్టి ఇంటి ఆడపిల్ల చేత పార్వతీ పరమేశ్వరులను గాని, సీతారాములను గాని, రాధాకృష్ణులను గాని, లక్ష్మీ సరస్వతులను గాని పెట్టిస్తారు, అమ్మాయి మొదటి దేవతామూర్తిని పెట్టాక, ఆ యేడు కొన్న కొత్త బొమ్మను తల్లి కూడా పట్టుకుని పెట్టిస్తుంది. ప్రతి ఏడు ఒక కొత్త బొమ్మ తప్పనిసరిగా కొనడం ఆచారం. ఈ క్రమంలోనే, కొండపల్లి బొమ్మలు, నక్కపల్లి బొమ్మలతో పాటు దేశదేశాల బొమ్మలు సేకరించి బొమ్మల కొలువులో పెట్టడం వ్యాప్తి లోకి వచ్చింది. అందంగా, కళాత్మకంగా అమర్చిన బొమ్మల కొలువు పేరంటానికి బంధు మిత్రులను పిలిచి తొమ్మిది రోజులూ పేరంటం చేస్తారు. పేరంటానికి పిల్లలూ పెద్దలూ కూడా వస్తారు. బొమ్మలకు హారతి ఇచ్చి ప్రసాదం పంచిపెడతారు. బతుకమ్మ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండగ బతుకమ్మ. బతుకమ్మ పండగ వస్తుందంటే తెలంగాణ పల్లెల్లో నూతన ఉత్సాహం వెల్లి విరుస్తుంది. అది ఒక పెద్ద సంబరంగా భావిస్తారు. ఇళ్ళు శుభ్రపరుస్తారు. చక్కగా అలంకరించు కుంటారు. ఆడపిల్లల్ని పుట్టింటికి తీసుకు వస్తారు. అత్తగారింట్లో వుండే ప్రతి ఆడపిల్లా పుట్టింటికి వెళ్లడం కోసం ఎదురు చూస్తుంటుంది. రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే.. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ బతుకమ్మలను నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తారు. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వేగవంతంగా ధాన్యం కొనుగోళ్లు
అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలి
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ముగ్గురు డిబార్
ఫలించిన ఎన్నికల సంఘం చర్యలు..
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే..
మెరుగైన ఫలితాలు సాధించాలి
వేరుశనగ క్వింటా రూ.6,410
అక్రమ నిర్మాణం తొలగింపు
జూన్ 4న కూటమికి ఏం జరుగుతుంది ?..విజయ్ బాబు సూటి ప్రశ్న
నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- కొడుకు, కూతుళ్ల నిర్వాకం.. తల్లికి అంత్యక్రియలు జరపకుండా..
- కొన్నేళ్లుగా పోలీసుల రక్షణలో సూర్య ఇల్లు.. కారణం ఇదే
- రెండు రోజులుగా బెంబేలెత్తించిన బంగారం.. నేడు కాస్త..
- తీహార్ జైల్లో కవితతో ఆర్ఎస్పీ, సుమన్ ములాఖత్
- షుగర్ పేషంట్లకు శుభవార్త.. మందుల ధరలు తగ్గింపు
- బదిలీల తర్వాతే హింస!
- రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
- నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
- టీడీపీ చెప్పినట్లు ఆడినందుకే
- IPL 2024: ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ ఔట్..
Advertisement