-
కొత్త సంవత్సరం నాటికి ఉల్లి ఘాటు తగ్గుతుంది..!
కొత్త సంవత్సరం నాటికి ఉల్లి ఘాటు తగ్గుతుంది..! -
తగ్గని ఉల్లి ధర
హైదరాబాద్: ఉల్లి గడ్డ ధర సామాన్యులను కంగుతినిపిస్తోంది. దాదాపు నెల రోజులుగా కిలో రూ.60 నుంచి 70 పైనే ఉంది. దీంతో రేటు తగ్గుతుందని ఎదురు చూస్తున్న మధ్యతరగతి ప్రజలు నిరాశ చెందుతున్నారు. వాస్తవంగా కొత్త పంట వస్తుండడంతో రేటు తగ్గుతుందని భావించినా పరిస్థితి మారలేదు. దీనికి కారణం కమీషన్ ఏజెంట్ల, వ్యాపారుల మాయాజాలం కూడా కారణమని ఆరోపణలు విన్పిస్తున్నాయి. వీరంతా ఒక్కటై ఉల్లి కృత్రిమ కొరత సృష్టిస్తూ ఉల్లి ధరలు పెంచేస్తున్నారని అంటున్నారు. తెలంగాణ జిల్లాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ నుంచి కూడా మలక్పేట్ మార్కెట్కు ఉల్లిగడ్డ దిగుమతి పెరిగింది. రోజుకుదాదాపు 70–80 లారీల ఉల్లి దిగుమతి అవుతోంది. గతేడాది నవంబర్తో పోలిస్తే ఈ ఏడాది లారీ సంఖ్య ఎక్కువగా ఉందని మలక్పేట్ మార్కెట్ లెక్కలు చెబుతున్నాయి. గతేడాది ఇప్పటికే ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయి. కానీ ఈ ఏడాది నగరానికి ఉల్లి రాక పెరిగినా ధరలు మాత్రం తగ్గడం లేదని రిటైల్ వ్యాపారులు అంటున్నారు. గతేడాది నవంబర్లో కిలో ఉల్లిగడ్డ ధర రూ.30 ఉండగా ఈ ఏడాది రూ.60 పైనే పలుకుతోంది. వారం రోజులుగా మహారాష్ట్ర నుంచి భారీగా ఉల్లి సరఫరా పెరిగింది. ఈ నేపథ్యంలో కొందరు వ్యాపారులు మహారాష్ట్ర వ్యాపారులతో కలిసి సిండికేట్గా మారి ఉల్లి ధరలు తగ్గించడం లేదని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. జంట నగరాల మార్కెట్లలో ఉల్లిగడ్డ నిల్వచేయడానికి తగిన గోదాముల వసతి లేక పోవడంవల్లే ఈ పరిస్థితి వస్తోందని వారంటున్నారు. -
పండగ వేళ కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి ధరలు
ప్రతి ఏటా ఉల్లి ధరలు భారీగా పెరగడం, తగ్గడం జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం కూడా పండుగ సీజన్లో ఉల్లి ధరలు గణనీయంగా పెరిగాయి. కొన్ని నెలల క్రితం కేజీ ఉల్లి ధరలు రూ. 10 నుంచి రూ. 20 వరకు మాత్రమే ఉండగా.. ప్రస్తుతం అదే ఉల్లి ఢిల్లీలో రూ.70కి చేరింది. రానున్న రోజుల్లో ఇది రూ. 100కి చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉల్లి ధరల పెరుగుదలకు కారణం ఏంటి? దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఉల్లి ధరల పెరుగుదలకు చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో మొదటిది డిమాండ్. డిమాండ్ పెరిగినప్పుడు అవసరమైనన్ని అందుబాటులో లేనప్పుడు తప్పకుండా ధరలు పెరుగుతాయి. అంతే కాకుండా కొందరు రైతులు తమ పంటను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయడం వల్ల, దేశంలో ఉల్లి కొరత ఏర్పడి ధరలు పెరుగుతాయి. ఉల్లి ధరలు పెరగటానికి మరో ప్రధానమైన కారణం పంట ఆలస్యం. ఖరీఫ్ పంట ఆలస్యం వల్ల సాగులో జాప్యం ఏర్పడుతుంది. అప్పుడు చేతికి అందాల్సిన సమయానికి పంట రాకపోతే కొరత ఏర్పడుతుంది. తద్వారా ధరలు పెరుగుదల జరుగుతుంది. ఉల్లి ధరలు తగ్గించడానికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే? ఉల్లి ధరలు అందుబాటు ధరలు ఉంచాలనే ఉద్దేశ్యంతో గత ఆగస్టు నుంచి పెద్ద మొత్తంలో ఉల్లిపాయలను మార్కెట్లోకి విడుదల చేసినట్లు వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి 'రోహిత్ కుమార్ సింగ్' వెల్లడించారు. ధరల పెరుగుదలను నివారించడానికి ప్రభుత్వం రిటైల్ పంపిణీని కూడా పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: ప్రపంచంలో ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్న పాపులర్ యాప్స్ ఇవే! మీకు తెలుసా? నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ (ఎన్సిసిఎఫ్), నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (నాఫెడ్) ద్వారా కేజీ ఉల్లి ధరలను రూ. 25కే అందుబాటులో ఉంచుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ 5 లక్షల టన్నుల ఉల్లి స్టాక్ను నిర్వహిస్తోంది, రాబోయే రోజుల్లో అదనంగా 2 లక్షల టన్నుల ఉల్లిపాయలను సేకరించాలని భావిస్తున్నట్లు సమాచారం. -
ఉల్లి.. ఘాటెక్కింది మళ్లీ..!
సదాశివపేట (సంగారెడ్డి): కోస్తుంటేనే కన్నీళ్లు తెప్పించే ఉల్లి.. ఇప్పుడు కొంటుంటే ఘాటెక్కుతోంది. బహిరంగ మార్కెట్లలో ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రిటైల్ మార్కెట్లోనూ ఉల్లి ధరలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సరిగ్గా దసరా పండుగకు ఇరవై రోజుల క్రితం సదాశివపేట పట్టణ వీధుల్లో వాహనాల్లో ఉల్లిగడ్డ తీసుకొచ్చి వందకు ఆరు, పదు కిలోల చొప్పున విక్రయించారు. రిటైల్గా రూ 20 కిలో చొప్పున అమ్మారు. దసరా పండుగకు ముందు అమాంతంగా ధర పెరగడంతో వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు, హోటళ్లు, తినుబండారాలు, ఆహారాల దుకాణాల వారు ఉల్లిధర పెరగడంతో వాటి వినియోగాన్ని తగ్గించారు, సదాశివపేటకు వచ్చిన గ్రామీణులు ఉల్లిధర విని అమ్మో అంటున్నారు, మరో నెల రోజుల తర్వాత గాని ఉల్లిధరలు తగ్గుముఖం పట్టదని డీలర్లు పేర్కొంటున్నారు. జూలై నుంచి అక్టోబర్ మధ్య ఉల్లి ధరలను పోల్చి చూస్తే ధరలో దాదాపు 50 శాతం పెరిగింది. జూలైలో రూ.20 ఉండగా అక్టోబర్, నవంబర్లో 50 నుంచి 80కి పెరిగింది. ఈ విధంగా చూస్తే ఉల్లి సగటు ధరలు 50 శాతం పెరిగాయి, మహారాష్ట్రంలోని హోల్సెల్ ఽమార్కెట్లో కూడా ఉల్లిధరలు భారీగా పెరగడంతో దాదాపు 30 శాతం మేర ఉల్లిని విక్రయిస్తున్నారని సమాచారం. సాగు విస్తీర్ణం తగ్గడంతోనే.. మహారాష్ట్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి తెలంగాణకు ఉల్లి దిగుమతి అవుతుంటాయి. గత వానా కాలం సీజన్లో ఆయా రాష్ట్రాల్లో ఉల్లిసాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ఉల్లికి కొరత ఏర్పడి ధరలు పెరిగిపోతున్నాయని వ్యాపారాలు చెబుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో 2,596 ఎకరాల్లో ఉల్లి సాగు చేస్తున్నారు. జిల్లాలోని నారాయణఖేడ్, మనూరు, కంగ్టి, సదాశివపేట, కొండాపూర్, సంగారెడ్డి, కంది, మునిపల్లి, జహిరాబాద్ తదితర మండలాల్లో ఉల్లి పంటను ఎక్కువగా సాగు చేస్తుంటారు. నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలో అత్యదికంగా వెయ్యి ఎకరాల వరకు సాగు చేస్తున్నారు, సదాశివపేట మండలం అరూర్, నందికంది, పెద్దాపూర్తో పాటు కొండాపూర్ మండలం గొల్లపల్లి, మునిదేవునిపల్లి, మన్సాన్పల్లి, మల్లేపల్లి, అనంతసాగర్, మారేపల్లి, గంగారం, గ్రామాల్లో ఉల్లి సాగుచేస్తారు. సాధారణంగా ఉల్లిని అధిక భాగం దేశంలోని మహారాష్ట్ర, కర్నాటక తర్వాత ఏపీలోని కర్నూలు జిల్లాల్లో సాగవుతుంది, అయితే ఈ ఏడాది కర్నూలు జిల్లాలో రుతుపవనాలు అలస్యంగా రావడం, వచ్చిన అసమానంగా ఉండటం, తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, పంటలు రాక ఆలస్యమవడంతో ఉల్లి లభ్యత తగ్గింది. దీంతో ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. అధికారులు చర్యలు తీసుకుని ఉల్లిధరలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు కొరుతున్నారు. -
కంటతడి పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. నెల రోజులు ఇదే పరిస్థితి.. కిలో ఎంతంటే!
సాక్షి, హైదరాబాద్: ఉల్లి ధర వారం రోజుల నుంచి ఆకాశాన్నంటుతోంది. రాష్ట్రంలో ఉల్లి ధరలు అంతకంతకూ పెరుగుతూ.. సామాన్యులకు కంటనీరు రప్పిస్తోంది. క్రమేపీ పెరుగుతున్న ఉల్లి ధరలతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు నెల రోజుల క్రితం క్వింటాల్ రూ.3000–3500 ఉండగా, ఒక్కసారిగా రూ. 6000 నుంచి 7500 వరకు పెరిగింది. మలక్పేట వ్యవసాయ మార్కెట్కు వివిధ రాష్ట్రాల నుంచి రోజుకు 30 వేల బస్తాలు దిగుమతి అవుతుండగా, ఇప్పుడు రోజుకు 8వేల బస్తాలు మాత్రమే దిగుమతి అవుతోంది. మహారాష్ట్రలో వర్షపాతం తక్కువగా ఉండటంతో పంట వేయలేదని, అందుకే దిగుమతి తక్కువగా ఉంటోందని అధికారులు చెప్పారు. వర్షాల కారణంగా ఏపీలో రైతులు ఉల్లికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయడంతో ఆంధ్రా నుంచి ఉల్లి దిగుమతి తక్కువైందన్నారు. విదేశాలకు ఎగుమతి చేసేందుకు అనుమతి ఇవ్వడం కూడా ఉల్లి ధర పెరుగుదలకు కారణమని వ్యాపారులు తెలిపారు. అక్రమార్కులపై నిఘా: కొత్తపంట వచ్చే వరకు ఉల్లి క్వింటాల్కు రూ. 6,000 నుంచి 8,000 వరకు ధర ఉంటుంది. నెల రోజులపాటు ఉల్లి ధర కిలో రూ.60 నుంచి 90 మధ్య ఉంటుంది. అక్రమ వ్యాపారులపై నిఘా పెట్టాం. -రవీందర్రెడ్డి, గ్రేడ్–3 కార్యదర్శి -
ఉల్లిపాయలు అడిగారట!
ఉల్లిపాయలు అడిగారట! -
మనం కూడా కొనే పరిస్థితి లేదండీ.. నేను వేయలేదు!
మనం కూడా కొనే పరిస్థితి లేదండీ.. నేను వేయలేదు! -
పెరుగుతున్న ఉల్లి ధరలు.. కేంద్రం కీలక నిర్ణయం
దేశంలో ఉల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా లభ్యతను పెంచేందుకు ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకాన్ని విధించింది. ఉల్లిపై కేంద్రం ఎగుమతి సుంకం విధించడం ఇదే తొలిసారి. వంటల్లో ప్రధానంగా ఉపయోగించే ఉల్లి ధర ప్రస్తుతం (ఆగస్ట్ 19) ఢిల్లీలో కిలోకు రూ. 37కి చేరింది. 2023 డిసెంబర్ 31 వరకు ఉల్లిపాయలపై 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ కస్టమ్స్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 4 వరకు భారత్ నుంచి 9.75 లక్షల టన్నుల ఉల్లి ఎగుమతులు జరిగాయి. విలువ పరంగా చూస్తే వీటిని అత్యధికంగా దిగుమతి చేసుకున్న మొదటి మూడు దేశాలు బంగ్లాదేశ్, మలేషియా, యూఏఈ. రానున్న పండుగ సీజన్ను దృష్టిలో ఉంచుకుని దేశీయ మార్కెట్లో ఉల్లి లభ్యతను పెంచేందుకు ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకం విధించాలని నిర్ణయించినట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. వినియోగదారుల వ్యవహారాల శాఖ లెక్కల ప్రకారం.. ఆగస్ట్ 19న దేశంలో ఉల్లి సగటు రిటైల్ ధర కిలోకు కనిష్టంగా రూ. 30గా ఉంది. ఇది గరిష్టంగా రూ. 63, కనిష్టంగా రూ. 10లుగా ఉంది. ఇదీ చదవండి: Revised I-T rules: ఉద్యోగులకు గుడ్న్యూస్: ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనల్లో మార్పులు.. భారీగా పన్ను ఆదా! -
Hyderabad: సగానికి పడిపోయిన ఉల్లి ధరలు.. కిలో రూ. 10
సాక్షి, హైదరాబాద్: ఉల్లిగడ్డ ధరలు దిగొస్తున్నాయి. రోజురోజుకు రేట్లు తగ్గుతున్నాయి. గత పదిహేను రోజులతో పోలిస్తే ధరలు సగానికి పడిపోయాయి. ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లి భారీ మొత్తంలో మలక్పేట్ మార్కెట్కు దిగుమతి అవుతోంది. అక్కడ అధిక పంట దిగుబడి, నిల్వ చేసిన సరుకును మన రాష్ట్రానికి తరలిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఉల్లి క్వింటాల్కు రూ.600 నుంచి 700 వరకు మాత్రమే పలుకుతోంది. మార్కెట్లో కిలో ధర రూ.10 నుంచి 15 వరకు పలుకుతోంది. పెరిగిన దిగుమతి.. హైదరాబాద్లోని మలక్పేట గంజ్ మార్కెట్ ఉల్లిగడ్డకు పేరు గాంచింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఇక్కడి నుంచే ఉల్లి సరఫరా అవుతుంది. ప్రధానంగా మహబూబ్ నగర్, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీలోని కర్నూల్ ప్రాంతాల నుంచి గంజ్ కు ఎక్కువగా సరుకు వస్తుంది. వారం రోజులుగా మార్కెట్కు నిత్యం 70 నుంచి 120 ట్రక్కుల్లో 30 వేల బస్తాల వరకు సరుకు దిగుమతి అవుతోంది -
Onion : ఉల్లిఘాటు.. ‘ముందే కొని పెట్టుకోండి’!
దేశవ్యాప్తంగా కురిసిన వర్షాల ఎఫెక్ట్ మరి కొద్ది రోజుల్లో వంటిల్లుని ఘాటెక్కించనుంది. రాబోయే రోజుల్లో ఉల్లి రేటు రెట్టింపు కావడం ఖాయమంటూ ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ క్రిసిల్ హెచ్చరించింది. నెలకు 13 లక్షల టన్నులు ఇండియాలో ప్రతి నెల సుమారు 13 లక్షల టన్నుల ఉల్లిపాయల వినియోగం జరగుతోంది. ఇందులో సగానికి పైగా పంట మహారాష్ట్ర నుంచే దేశంలోని ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతోంది. మహారాష్ట్ర తర్వాత కర్నాటక, ఆంధ్రప్రదేశ్లలోనూ ఉల్లి ఎక్కువగానే పండిస్తున్నారను. అయితే తౌటౌ తుఫాను ఎఫెక్ట్తో మహారాష్ట్ర, కర్నాటకలలో ఉల్లి సాగు చేయడంలో ఆలస్యమైంది. దీనికి తోడు ప్రస్తుతం కురుస్తున్న వానలతో ఉల్లి పంట చేతికందడం ఆలస్యం అవుతోందని క్రిసిల్ అభిప్రాయపడింది. ఖరీఫ్పై ప్రభావం దేశ ఉల్లి అవసరాల్లో 75 శాతం పంట ఖరీఫ్ సీజన్ నుంచే వస్తుంది. అయితే ఈ సీజన్కి సంబంధించిన ఉల్లి పంట చేతికి రావడానికి మరింత సమయం పట్టవచ్చని క్రిసిల్ చెబుతోంది. పంట చేతికి రావడం.. ప్రాసెసింగ్.. సరఫరా తదితర కారణాల వల్ల ఉల్లి మార్కెట్కి రావడానికి పట్టే సమయం పెరగవచ్చని చెబుతోంది. గత మూడేళ్లుగా ఉల్లి ఉత్పత్తి, సరఫరా, మార్కెట్ తదితర విషయాలను పరిగణలోకి తీసుకుంటే రాబోయే రోజుల్లో ఉల్లి ధరలు రెట్టింపు కావడం ఖాయమని చెబుతోంది. రబీ పైనా ప్రభావం ఖరీఫ్ సీజన్ పంట చేతికి రావడంలో ఆలస్యమైనా రబీలో వచ్చిన ఉత్పత్తి బఫర్ స్టాక్గా అందుబాటులో ఉంటుంది. అయితే ఆగస్టు, సెప్టెంబరులో వర్షాల కారణంగా వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటంతో ఉల్లి త్వరగా పాడవుతుంది. వెరసి బఫర్ స్టాక్ సైతం తగ్గిపోయే ప్రమాదంముందని క్రిసిల్ అంటోంది. నాసిక్లో కరువు మహారాష్ట్రలో విస్తారంగా వానలు పడినా ఉల్లిపంట ఎక్కువగా పండే నాసిక్లో గత మూడేళ్లుగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఉల్లి రైతులు క్రమంగా నర్సరీలవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఉల్లి దిగుబడి సైతం తగ్గనుందని క్రిసిల్ అంచనా వేసింది. మొత్తంగా దసరా, దీపావళి సీజన్ నాటికి ఉల్లి ధరలు పెరుగుతాయని చెబుతోంది. ఉల్లి ఉత్పత్తిలో తేడాలను ఆసరాగా చేసుకుని కృత్రిమ కొరత సృస్టించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. చదవండి : ఎమర్జెన్సీ ఫండ్స్.. ఈ అలవాటు మీకుందా? ఎలా మెయింటెన్ చేయాలో తెలుసుకోండి -
తెలంగాణలో ఉల్లి దిగుతోంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉల్లి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. తెలంగాణలో ఈ సీజన్లో ఉల్లి సాగు అసలు లేకపోయినా... పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా దిగుమతి అవుతుండటంతో ధరలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా విస్తృతి నేపథ్యంలో ప్రధాన పట్టణాల్లో మార్కెట్లలో తగ్గిన డిమాండ్తో అక్కడి వ్యాపారులంతా రాష్ట్రానికి ఉల్లిని తెస్తుండటంతో ధర తగ్గుతోంది. నిజానికి రాష్ట్రంలో యాసంగి సీజన్లో ఉల్లి సాధారణ సాగు విస్తీర్ణం 21 వేల ఎకరాల మేర ఉండగా, ఈ ఏడాది ఒక్క ఎకరాలోనూ సాగు జరగలేదు. ఉల్లి విత్తనాలకు రాయితీ కల్పించకపోవడం, మద్దతు ధర లేకపోవడం, సరైన మార్కెటింగ్ సౌకర్యాలు లేకపోవడంతో ఉల్లి సాగుపై ఆసక్తి చూపించలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉల్లి ధరలు విపరీతంగా పెరుగుతాయని అంతా అంచనా వేశారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో సాధారణంగానే ఉల్లి ధర హోల్సేల్ మార్కెట్లోనే రూ.40–45 మధ్య ఉంటుంది. రాష్ట్రంలో అసలే సాగు లేకపోవడంతో ప్రస్తుతం సైతం ధరలు పెరగుతాయని భావించినా పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా వస్తుండటంతో ధరలు తక్కువగా ఉన్నాయి. వారం కిందటి వరకు మలక్పేట్ మార్కెట్లో మేలురకం ఉల్లి ధర కిలో రూ.35–45 మధ్య ఉండగా, అది ఇప్పుడు రూ. 25–30కు పడిపోయింది. కిలోకు ఏకంగా రూ.15–20 మేర తగ్గింది. ఇక రిటైల్లోనూ మొన్నటి వరకు కిలో రూ.50 అమ్మిన వ్యాపారులు ప్రస్తుతం కిలో రూ.35 వరకు అమ్ముతున్నారు. ఇక సాధారణ రోజుల్లో మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల నుంచి 6 వేల నుంచి 7 వేల క్వింటాళ్ల మేర ఉల్లి దిగుమతి అవుతుండగా, ఆదివారం రోజులుగా 8 వేల క్వింటాళ్ల నుంచి 9 వేల క్వింటాళ్లకు పెరిగింది. శుక్రవారం వ్యాపారుల భారత్ బంద్ ఉన్నప్పటికీ శనివారం ఏకంగా 9,600 క్వింటాళ్ల ఉల్లి రాష్ట్రానికి వచ్చింది. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచే 5–6 వేల క్వింటాళ్ల మేర ఉల్లి వస్తోంది. మహారాష్ట్రలో కరోనా ఉధృతితో హోటళ్లు, రెస్టారెంట్లు పెద్దగా నడవకపోవడంతో సరుకును రాష్ట్రానికి తరలిస్తున్నారు. లాసల్గావ్ మార్కెట్లో క్వింటాల్ మొన్నటివరకు రూ.4,500 వరకు ఉండగా, అది ప్రస్తుతం రూ.3,000కు తగ్గింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఉల్లి ధరలు అదుపులో ఉన్నాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. -
ఉల్లి కోసం బారులు
-
550 కిలోల ఉల్లిని కొట్టేశారు..
ముంబై : దేశంలో ఒక్కసారిగా ఉల్లిధరలు పెరగడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. వారం రోజుల కిందట చౌకగా లభించిన ఉల్లి.. ఇప్పుడు సామాన్యుడి కొనలేని రేటుకు వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు దాదాపు 550 కిలోల ఉల్లిని దొంగతనం చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణేలో చోటుచేసుకుంది. నిందితులను సంజయ్ పరాది, పొపట్ కాలేలుగా గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసిన నారాయణ్ గావ్ పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈసారి వర్షాల కారణంగా పంటలు దెబ్బతినడంతో సరఫరాకు కూడా అంతరాయం కలుగుతోంది.ఉల్లిగడ్డ ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా మారింది. ఇక, ఉల్లితో పాటు ఇతర కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. గతంలో కూడా ధరలు పెరిగిన సందర్భాల్లో పలుచోట్ల ఉల్లి దొంగతనాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఉల్లి కోసం గొడవలు కూడా జరిగాయి. ధరల విషయంలో వినియోగదారులు, అమ్మకపుదారులు ఘర్షణకు దిగారు. -
ఉల్లి విషయంలో ఏపీ ప్రభుత్వం తీపి కబురు
సాక్షి, విజయవాడ : సామాన్యుడి రేటుకు అందకుండా పోయి కంటనీరు తెప్పిస్తున్న ఉల్లిగడ్డ విషయంలో ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. రైతు బజార్ల ద్వారా రాయితీపై రూ.40కే కిలో ఉల్లిపాయలు రేపట్నుంచే అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. గురువారం విజయవాడలో కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ..పెరిగిన ఉల్లి ధరలను నియంత్రించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు ఆదేశాలిచ్చారన్నారు.5 వేల టన్నుల ఉల్లిని నాఫెడ్ ద్వారా దిగుమతి చేసుకుంటున్నామని.. తక్షణమే వెయ్యి టన్నులు మార్కెట్లోకి తీసుకువచ్చి రైతుబజార్లలో విక్రయిస్తామన్నారు. తొలి దశలో అన్ని ప్రధాన పట్టణాల్లోనూ రైతు బజార్ల ద్వారా కేజీ రూ.40లకు విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. నాణ్యమైన ఉల్లిపాయలను ప్రతి కుటుంబానికి ఒక కేజీ వంతున రొటేషన్ పద్దతిలో ఇవ్వాలని నిర్ణయించామన్నారు. భారీ వర్షాల వల్ల మన రాష్ట్రంలో కర్నూలు సహా ఇతర రాష్ట్రాలైన తమిళనాడు,కర్నాటక, కేరళ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పంట నష్టం జరగడంతో ఉల్లిరేటుకు రెక్కలొచ్చాయన్నారు. కాగా రాష్ట్రంలో 28 వేల హెక్టార్లలో ఉల్లిసాగు జరుగుతోందని.. మరో నెలలో కొత్త పంట కొంత అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రతి ఏటా ఈ సీజన్లో 12 వేల క్వింటాళ్లు కర్నూలు ఉల్లి మార్కెట్లకు వచ్చేదని.. ఇప్పుడు 15 వందల నుంచి 2వేల క్వింటాళ్లు మాత్రమే వస్తోందన్నారు. గతంలో మహారాష్ట్ర నుంచే అత్యధికంగా ఉల్లి దిగుమతులు జరిగేవని.. కానీ అక్కడ భారీ వర్షాలు కురవడంతో పంట దిగుబడి బాగా తగ్గిపోయిందన్నారు. రేపటి నుంచి ఉల్లి విక్రయాలు మొదలుపెట్టి క్రమంగా అన్ని ప్రాంతాల రైతుబజార్లకు విక్రయాలు విస్తరిస్తామన్నారు. గతంలో కూడా ఉల్లి ధరలు పెరిగినప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని సబ్సిడీపై అందించినట్లు కన్నబాబు పేర్కొన్నారు. -
ఘాటెక్కిన ఉల్లి.. కిలో @110
సాక్షి, చెన్నై: మార్కెట్లో ఉల్లి మళ్లీ కన్నీళ్లు పెట్టిస్తోంది. దిగుమతి తగ్గడంతో అమాంతంగా రేటు పెరిగింది. మంగళవారం కిలో ఉల్లి రూ.110 పలికింది. ఈ ధర మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు వ్యాపారులు పేర్కొంటున్నారు. రాష్ట్రానికి ఎక్కువగా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఉల్లి దిగుమతి అవుతుంది. అతిపెద్ద సైజు కల్గిన ఉల్లిపై రెండు రాష్ట్రాల నుంచి, చిన్న సైజు రకం ఆంధ్రా నుంచి ఇక్కడికి సరఫరా అవుతుంటాయి. కొద్ది రోజులుగా వర్షాలు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రా, తెలంగాణలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుండడంతో ఉల్లి సరఫరా ఆగింది. దిగుమతి ఆగడంతో మంగళవారం ఉల్లి ఘాటెక్కింది. మున్ముందు ధర అమాంతంగా పెరుగుతూ కన్నీళ్లు పెట్టించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. చెన్నైలో అతి పెద్ద మార్కెట్గా ఉన్న కోయంబేడుకు రోజుకు 150 లారీలు రావాల్సి ఉండగా తాజాగా 50 లారీలు మాత్రమే వచ్చాయి. దీంతో ధర అమాంతంగా పెరిగింది. కిలో రూ.100కు పై మాటే.. రాష్ట్రంలో ఉల్లి కొన్ని చోట్ల రూ.100, రూ.110 అంటూ ధర పలికింది. ఉల్లి ఘాటు మరింతగా పెరగనున్న నేపథ్యంలో పాలకులు స్పందించారు. ప్రభుత్వ తోట పచ్చదనం దుకాణాల ద్వారా ఉల్లిని తక్కువ ధరకు అందించేందుకు సిద్ధమయ్యారు. అలాగే డిమాండ్కు తగ్గ ఉల్లిని దిగుమతి చేయించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా ప్రజల్ని ఉల్లి ఘాటు నుంచి గట్టెక్కించేందుకు ‘తోట, పచ్చదనం, వినియోగదారుల దుకాణం’ల ద్వారా కిలో రూ.45కు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకున్నామని సహకార మంత్రి సెల్లూరు కే రాజు తెలిపారు. అలాగే పెరుగుతున్న ఉల్లి ధరను పరిగణించి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఉల్లి కొనుగోలు చేసి, ప్రజలకు తమ పరిధిలోని దుకాణాల ద్వారా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలి పారు. ఎవరైనా టోకు వర్తకులు ఉల్లి నిల్వ ఉంచుకుని ఉంటే, చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం ఈజిప్టు ఉల్లి 27 టన్నులు కోయంబేడుకు వచ్చి చేరడం కాస్త ఊరట. -
కొండెక్కిన కోడిగుడ్డు ధరలు..
నల్లగొండ : కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఉల్లి ఘాటెక్కిస్తుండగా.. గుడ్డు కొండెక్కి కూర్చుంది. ఈ రెండింటి ధరలు లాక్డౌన్ కాలంతో పోలిస్తే.. ప్రస్తుతం రెట్టింపయ్యాయి. కరోనాను ఎదుర్కోవాలంటే వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుడ్డు, ఉల్లి తప్పని సరిగా తినాల్సిన పరిస్థితి. దీంతో వీటికి డిమాండ్ బాగా పెరిగింది. దానికి అనుగుణంగా సరఫరా లేకపోవడంతో రెట్టింపు అయిన ధరలతో పేదలు కొనలేకపోతున్నారు. (‘భగీరథ’ ప్రయత్నం.. ఫ్లోరైడ్ మాయం) లాక్డౌన్ కాలంలో అందుబాటులో ధరలు లాక్డౌన్ సందర్భంలో ఉల్లి, గుడ్డు ధరలు భారీగా పడిపోయాయి. ఆ సమయంలో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడడంతో.. అప్పట్లో ఉల్లి కేజీ ధర రూ.పది నుంచి రూ.12 ఉంది. ఆ సమయంలో గుడ్డు పేపర్ ధర రూ.2.50 మాత్రమే ఉండగా.. బయట రూ.3.50 పలికింది. పౌల్ట్రీ రైతులు నష్టాలు భరించి తక్కువ ధరకు అమ్మారు. కొత్తగా కోడిపిల్లల పెంపకాన్ని నిలిపివేశారు. ఇప్పుడు ఉన్న కోళ్లతోనే గుడ్లు తీస్తుండడంతో ఉత్పత్తి తగ్గింది. వర్షాలతో దెబ్బతిన్న ఉల్లిపంట.. మన ప్రాంతానికి ఎక్కువగా మహారాష్ట్ర నుంచే ఉల్లి దిగుమతి అవుతుంది. పైన పడిన వర్షాలతో ఉల్లి పంట చాలా వరకు దెబ్బతిన్నది. దీంతో దిగుబడి తగ్గింది. మార్కెట్లో ప్రస్తుతం తెల్ల ఉల్లి రూ.45 పలుకుతుండగా ఎర్ర ఉల్లి రూ.40 పలుకుతోంది. గుడ్డుకు పెరిగిన డిమాండ్... కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలన్నా.. కరోనా సోకిన వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరగాలన్నా.. రోజూ గుడ్లు తినాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో చాలామంది రోజూ తప్పనిసరిగా గుడ్డు తింటున్నారు. ఈ నేపథ్యంలో వీటికి డిమాండ్ భారీగా పెరిగింది. అందుకు తగిన ఉత్పత్తి లేకపోవడంతో కొరత ఏర్పడింది. దీంతో ఒక్కో గుడ్డు ధర రూ.6 వరకు పెరిగింది. -
టమాటా, ఉల్లి ధరలు పడిపోతే వెంటనే చర్యలు
న్యూఢిల్లీ: టమాటా, ఉల్లిపాయలు, ఆలుగడ్డల ధరలు ఉన్నట్టుండి పతనమైతే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసేందుకు రూపొందించిన పోర్టల్ (వెబ్సైట్)ను కేంద్ర ఆహార శుద్ధి శాఖా మంత్రి హర్సిమ్రత్కౌర్ బాదల్ బుధవారం ఢిల్లీలో ఆవిష్కరించారు. ‘‘ప్రజలు అధికంగా వినియోగించే ఈ మూడు కూరగాయల టోకు ధరలను ఈ పోర్టల్ తెలియజేస్తుంది. అధిక సరఫరా కారణంగా ధరలు పడిపోతే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తుంది. దీంతో ‘ఆపరేషన్స్ గ్రీన్’ పథకం కింద ప్రభుత్వం సకాలంలో స్పందించి.. అధికంగా ఉన్న ఉత్పత్తిని కోల్డ్ స్టోరేజ్లకు తరలించేందుకు వీలుగా రైతులకు సబ్సిడీ ఇస్తుంది. లేదా మిగులు ఉత్పత్తిని డిమాండ్ ఉన్న చోటుకు తరలించేందుకు సాయమందిస్తుంది’’ అని మంత్రి బాదల్ తెలిపారు. క్రితం ఏడాది అదే కాలంతో పోలిస్తే ధరలు 50 శాతం పతనమైనా, మూడేళ్ల కనిష్ట స్థాయికి ఈ మూడు కూరగాయల ధరలు క్షీణించినా ప్రభుత్వం రూపొం దించిన ‘మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ (ఎంఐఈడబ్ల్యూఎస్) అనే పోర్టల్ హెచ్చరికలు పంపుతుంది. దేశవ్యాప్తంగా 1,200 మార్కెట్లలో వీటి ధరలను ఈ పోర్టల్ తెలియజేస్తుందని నాఫెడ్ అడిషనల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్కే సింగ్ తెలిపారు. -
' ఉల్లి 'ఉపశమనం
సాక్షి, సిటీబ్యూరో: మొన్నటిదాకా కన్నీరు పెట్టించింది. ధరతో దడ పుట్టించింది. వంటింట్లో వణికించింది. వినియోగదారులను బెంబేలెత్తించింది. మరి ఇప్పుడో.. ఉపశమనం కలిగిస్తోంది. నేలకు దిగిన ధరతో సామాన్యులకు చేరువగా మారింది. అదేమిటని ఆలోచిస్తున్నారా? అదేనండి.. ఉల్లి. మార్కెట్కు ఆశించినస్థాయి కంటే ఎక్కువ మొత్తంలో ఉల్లి దిగుమతులు పెరగడంతో ధరలు నేలకు దిగి వస్తున్నాయి. గురువారం మలక్పేట్ ఉల్లి హోల్సేల్ మార్కెట్లో క్వింటాల్ ధర రూ.2,900 నుంచి రూ.2,500 పలికింది. కొన్నాళ్ల క్రితం క్వింటాలుకు 16వేల నుంచి 18వేల రూపాయల వరకు పలికిన ఉల్లి.. అన్ని వర్గాల ప్రజలపై ప్రభావం చూపింది. సామాన్య ప్రజలు ఉల్లిని కొనాలంటేనే వణికిపోయారు. ప్రత్యేకించి హోటళ్లు, మెస్లలో వినియోగ దారులకు ఉల్లి లేని వంటకాలే వడ్డించాయి. సామాన్య ప్రజలు చాలా మంది ఉల్లికి ప్రత్యామ్నాయంగా క్యాబేజీని వాడారు. ఇలా ఉల్లిపేరు వింటేనే ఉలిక్కిపడిన వారంతా ప్రస్తుతం ధరలు తగ్గడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. రూ.100కు 4 కిలోలు.. మలక్పేట్ ఉల్లి హోల్సేల్ మార్కెట్లకు మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు, ఏపీ, తెలంగాణ జిల్లాల నుంచి దిగుమతులు భారీగా వస్తున్నాయి. హోల్సేల్ మార్కెట్లో మొదటి రకం ఉల్లి కిలో రూ.29 ఉండగా, రెండో రకం రూ.25 నుంచి 24 వరకు పలుకుతున్నట్లు ఉల్లి వ్యాపారులు చెబుతున్నారు. కొందరు వ్యాపారులు ఏకంగా వంద రూపాయలకు మూడు కిలోలు అమ్ముతున్నారు. మరికొందరు వ్యాపారులు వందకు నాలుగు కిలోలు కూడా అమ్ముతున్నారు. కొత్త పంట రావడంతో మార్కెట్కు ఉల్లి ముంచెత్తుతోంది. రానున్న రోజుల్లో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. నాఫెడ్ వద్ద మిగిలిన ఈజిప్టు ఉల్లి మార్కెట్కు ఉల్లి దిగుమతులు తగ్గడంతో నెల రోజుల క్రితం కిలో ఉల్లి రూ.100 నుంచి రూ.120 వరకు పెరిగాయి. దీంతో మార్కెటింగ్ శాఖ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ద్వారా వంద మెట్రిక్ టన్నుల ఉల్లిని రూ.65కు కొని సబ్సిడీపై నగరంలోని రైతు బజార్లలో కిలో రూ.40కి విక్రయించారు. దీంతో మార్కెటింగ్ శాఖ తీసుకున్న ఉల్లి మొత్తం విక్రయించారు. నేషనల్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఈజిప్లు ఉల్లి ముంబై నుంచి నగరానికి వచ్చింది. ఉల్లి ధరలు తగ్గడంతో ఈజిప్టు నుంచి కొన్న ఉల్లి.. ప్రస్తుతం ధరలు తగ్గడంతో సనత్నగర్లోని గోదాంలో మిగిలిపోయింది. దీంతో నేషనల్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ అధికారులు ఉల్లి విక్రయించడానికి ప్రణాళికలు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. మార్కెటింగ్ శాఖ కొనుగోలు చేసిన ఉల్లి నెలరోజుల కిత్రమే మొత్తం అమ్ముడుపోయిందన్నారు. కొత్త పంటవస్తుండటంతోనే.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది లోకల్ కొత్త ఉల్లి పంట మార్కెట్కు ఎక్కువగానే దిగుమతయ్యే అవకాశం ఉంది. గత ఏడాది మహారాష్ట్ర ఉల్లిపై ఆధారపడి ఉండాల్సి వచ్చింది. ఈ ఏడాది ప్రారంభ నుంచే మెదక్, మహబూబ్నగర్, కర్నూల్ నుంచి ఉల్లి ఎక్కువగా దిగుమతులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం పెద్ద ఉల్లిగడ్డ కిలో రూ.29 వరకు ధర పలుకుతోంది. చిన్న గడ్డకు రూ.14 వరకు ఉంది. ఈ ఏడాది ఉల్లి ధరలు ఎక్కువగా పెరగవు. కొత్త పంట రావడంతో ధరలు అదుపులోకి వచ్చాయి.– వెంకటేశం, స్పెషల్ గ్రేడ్ సెక్రెటరీ, మలక్పేట్ మార్కెట్ -
దిగొస్తున్న ఉల్లి ధర
సాక్షి, హైదరాబాద్: ఉల్లి ధరలు క్రమంగా దిగొ స్తున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి సరఫరా పెరగడంతో ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. నిన్న, మొన్నటివరకు కిలో రూ.130 వరకు ఉన్న ఉల్లి ధర రూ.20 వరకు తగ్గింది. గత కొద్ది రోజులుగా కర్ణాటక నుంచి ఉల్లి సరఫరా పూర్తిగా నిలిచిపోగా, మహారాష్ట్ర నుంచి 6 వేల నుంచి 7 వేల బస్తాల మేర మాత్రమే ఉల్లి సరఫరా జరిగింది. దీంతో హోల్సేల్ ధర రూ.110 నుంచి రూ.120 వరకు పలికింది. ఇది రిటైల్ మార్కెట్కు వచ్చే సరికి రూ.130–140 మధ్య పలికింది. అయితే సోమవారం మలక్పేట మార్కెట్కు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఏకంగా 16,650 బస్తాల ఉల్లి వచ్చింది. దీంతో కిలో ఉల్లి ధర రూ.80–90 మధ్య పలికింది. ఇది రిటైల్ మార్కెట్కు వచ్చే సరికి రూ.100–110 మధ్య పలికింది. ఉల్లి సరఫరా పెరిగితే జనవరి మొదటి వారానికి రిటైల్ మార్కెట్లో ధర రూ.70–80 వరకు తగ్గుతాయని అంటున్నాయి. రాష్ట్రానికి ఈజిప్టు నుంచి రావాల్సిన ఉల్లి ఇంకా రాలేదు. అయితే మలక్పేట మార్కెట్లో మాత్రం ప్రతిరోజూ మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు ఈజిప్టు నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చిన ఉల్లిని విక్రయిస్తున్నారు. సోమవారం సైతం మార్కెట్లో లారీ ఈజిప్టు ఉల్లిని మహారాష్ట్ర వ్యాపారి ఒకరు కిలో రూ.70కి విక్రయించడం గమనార్హం. -
రైతును కోటీశ్వరుణ్ని చేసిన ఉల్లి
సాక్షి, బెంగళూరు: దేశమంతటా సామాన్యులు ఉల్లిని కొనలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతుండగా కర్ణాటకకు చెందిన ఓ రైతు మాత్రం ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఉల్లికి ఏర్పడిన భారీ డిమాండ్ కర్ణాటకకు చెందిన రైతు మల్లికార్జున (42)ను కోటీ శ్వరుణ్ని చేసింది. పంట వేయడం కోసం తీసుకున్న అప్పు చెల్లించడమేగాక భూమి కొనుగోలుకు, ఇల్లు కట్టుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. చిత్రదుర్గ జిల్లాలోని దొడ్డసిద్ధవ్వనహళ్లికి చెందిన ఆయన తనకున్న 10 ఎకరాలతో పాటు మరో 10 ఎకరాలను లీజుకు తీసుకొని ఉల్లి సాగు చేశారు. దీనికి రూ. 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. దాదాపు రూ. 5 నుంచి 10 లక్షల లాభం వస్తుందని అంచనా వేశారు. అయితే నవంబర్ నుంచి అమాంతంగా పెరిగిన ఉల్లి ధరలు ఆయనకు భారీ లాభం వచ్చేలా చేశాయి. దాదాపు 240 టన్నుల ఉల్లిని ఆయన అమ్మారు. ఉల్లి ధర కిలో రూ. 200 దాకా వెళ్లడంతో రాత్రికిరాత్రే ఆయన కోటీశ్వరుడు అయ్యారు. అయితే దీని కోసం బాగా శ్రమించాల్సి వచ్చిందని, 50 మంది పనివారిని పెట్టి పంట పండించామని చెప్పారు. ఉల్లి డిమాండ్ పెరిగినపుడు దొంగల బారిన పడకుండా కుటుంబమంతా కాపలాగా ఉన్నామని చెప్పారు. అక్టోబర్లో ధరలు అంతంత మాత్రంగా ఉన్నప్పుడు భయపడ్డామని చెప్పారు. అయితే తర్వాత క్వింటాల్ ఉల్లి ధర రూ. 7 వేల నుంచి 12 వేలకు పెరగడంతో పరిస్థితులు మారిపోయాయని చెప్పారు. -
ఉల్లి... ఎందుకీ లొల్లి!
గత మార్చి నుంచి ఇప్పటివరకు ఉల్లి ధరలు 400 శాతం పెరిగాయి. దేశంలో చాలా చోట్ల కేజీ ఉల్లి ధర రూ.150 నుంచి రూ.200 వరకు చేరుకుంది. ధరాఘాతం కేవలం ఉల్లికే పరిమితం కాలేదు. గత నాలుగు నెలల కాలంలో దాదాపు 20 నిత్యావసర వస్తువుల ధరలు రెట్టింపయ్యాయి. బియ్యం, గోధుమలు, పప్పు దినుసులు, కూరగాయలు, నూనె, బెల్లం వంటి సరుకుల రేట్లు ఆకాశాన్నంటాయి. అయినా ఉల్లి గురించే దేశవ్యాప్తంగా రచ్చ జరుగుతోంది. మిగిలిన వాటి ధరలు పెరిగినా పట్టించుకోని జనం.. ఉల్లి ధరపై ఎందుకింత తల్లడిల్లిపోతున్నారు? ఇదే సండే స్పెషల్.. ఇది మొఘల్స్ ఘాటు ఇప్పుడంటే ఉల్లి కోసం అందరూ ఎగబడుతున్నారు కానీ ఒకప్పుడు ఉల్లికి మన సమాజంలో చోటే లేదు. మొఘలాయిలు మన దేశంలోకి అడుగుపెట్టక ముందు ఉల్లి, వెల్లుల్లికి బదులుగా భారతీయులు వంటల్లో అల్లం ఎక్కువగా వాడేవారని చరిత్రకారులు చెబుతున్నారు. 2 వేల ఏళ్ల కింద ఆయుర్వేద వైద్యుడు చరకుడి చరక సంహితలో ఉల్లి గురించి చాలా గొప్పగా రాశారు. కూరల్లో ఉల్లిని వాడితే మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయని, జీర్ణక్రియకు దోహదపడుతుందని పేర్కొన్నారు. అప్పట్లో ఉల్లి వాడకం బాగా ఉండేది. కానీ కొన్ని దశాబ్దాల తర్వాత ఆయుర్వేదంలో ఉల్లిని నిషేధించారు. ఉల్లిని తమోగుణాన్ని పెంచే వస్తువుగా చూసేవారు. ఉల్లి తింటే శారీరక వాంఛలు పెరుగుతాయని తేల్చారు. దీంతో ఉల్లి అనేది కొన్ని కులాలకు మాత్రమే పరిమితమైంది. వితంతువులు ఉల్లి తినకూడదని ఆంక్షలు విధించారు. క్రీస్తుశకం 7వ శతాబ్దంలో భారత్ను సందర్శించిన చైనా యాత్రికుడు హ్యూయన్త్సాంగ్ పుస్తకాల్లో.. భారత్లో ఉల్లిపై నిషేధం ఉందని, దాన్ని వాడేవారిని ఊరి నుంచి వెలివేశారని రాశారు. క్రీ.శ.1526లో మొఘలాయిలు భారత్లో అడుగు పెట్టిన తర్వాత ఉల్లి వాడకం ఇంటింటికీ పాకింది. వాళ్లు చేసే బిర్యానీ, ఇతర వంటకాల్లో మసాలాలు, ఉల్లి లేనిదే రంగు, రుచి వచ్చేది కాదు. అలా కాలక్రమంలో ఉల్లి లేనిదే వంటలు చేయలేని పరిస్థితి వచ్చింది. అయితే జైనులు ఉల్లిపాయ, వెల్లుల్లికి ఎప్పుడూ దూరమే. ఒకప్పుడు బ్రాహ్మణ కుటుంబాల్లో కూడా ఉల్లి వాడేవారు కాదు. కానీ రానురానూ ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదన్న సత్యాన్ని గ్రహించి ఉల్లి వాడకాన్ని మొదలు పెట్టారు. ఉల్లి ఉల్లికో కథ సామాన్యుల నుంచి కోట్లకు పడగలెత్తిన వారి వరకు ఉల్లి లేనిదే అసలు ముద్దే దిగదు. ఏ వంట చేయాలన్నా ఉల్లి తప్పనిసరి. సలాడ్స్ నుంచి మాంచి మసాలాలు దట్టించిన కుర్మాలు, చికెన్, మటన్ వరకు ఉల్లి లేకుండా వంటలకి రుచే రాదు. శాకాహారులు ఎక్కువగా తినే సాంబార్లో చిన్న ఉల్లిపాయలు వాడకుండా టేస్ట్ తేలేరు. నిరుపేదలకు గంజన్నం, ఉల్లిపాయ ఉంటే చాలు అదే పంచభక్ష పరమాన్నం. -
హెరిటేజ్ పేరెత్తగానే.. టీడీపీ వాకౌట్!
సాక్షి, అమరావతి: శాసనమండలిలో గురువారం ఉల్లి ధరలపై జరిగిన స్వల్పకాలిక చర్చలో.. హెరిటేజ్ పేరెత్తగానే సభ నుంచి టీడీపీ సభ్యులు నిష్క్రమించారు. ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ సభలో మాట్లాడుతూ.. రైతు బజార్ల ద్వారా ఉల్లిపాయలను సబ్సిడీ కింద కేవలం రూ. 25కే పంపిణీ చేస్తున్నామని.. రేపటి నుంచి మార్కెట్ యార్డులో కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఉల్లి ధర హెరిటేజ్ మార్కెట్లో రూ.150 ఉందని చెబుతుండగా.. ఒక్కసారిగా తెలుగుదేశం సభ్యులు ఉలిక్కిపడ్డారు. ఇక హెరిటేజ్ సంస్థకు, తమ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని నారా లోకేష్ అనడంతో సభలో రభస నెలకొంది. హెరిటేజ్ పేరెత్తగానే ఎందుకు పారిపోతారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు.. టీడీపీ సభ్యులను ఎద్దేవా చేశారు. ఉల్లిపాయలు మెడలో వేసుకుని పొర్లుదండాలు పెట్టినా తెలుగుదేశాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరని.. పబ్లిసిటీ కోసం టీడీపీ సభ్యులు మెడలో వేసుకొచ్చిన ఉల్లిపాయలు కూడా ప్రభుత్వం సబ్సిడీ కింద ఇచ్చినవే అని హేళన చేశారు. పేదలకు చెందాల్సిన ఉల్లిపాయలను ఇటీవల తెలుగుదేశం నాయకులు దుర్వినియోగం చేశారంటూ దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా ఉల్లి సాగు గణనీయంగా తగ్గడంతో.. ధరలు పెరిగాయని ఈ సందర్భంగా మంత్రి మోపిదేవి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం 101 రైతు బజార్ల ద్వారా ఉల్లిపాయలను ఇరవై ఐదు రూపాయలకే పంపిణీ చేస్తోందని పేర్కొన్నారు. గతంలో రాజధాని ప్రాంతంలో ఉల్లి సాగు ఎక్కువగా ఉండేదని.. ఇప్పుడు తగ్గిపోయిందని అన్నారు. ఉల్లిపాయలు తక్కువ ధరకే అందిస్తున్నందుకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించిందని మంత్రి సభలో పేర్కొన్నారు. ఉల్లిపాయల కొరతపై ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రెడ్డి నాలుగు సార్లు సమీక్ష నిర్వహించారని, ఎంత ఖర్చయినా సరే.. ప్రజలకు మాత్రం రూ.25కే ఉల్లి అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. ఇప్పటివరకు 42,096 క్వింటాళ్ల ఉల్లిని దిగుమతి చేసుకుని ప్రజలకు సబ్సిడీ కింద పంపిణీ చేశామని.. దీని కారణంగా ప్రభుత్వంపై రూ. 22 కోట్ల భారం పడిందని అన్నారు. -
సంక్రాంతికే ఉల్లి దిగొచ్చేది!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఉల్లి ధరలు మరో నెల రోజుల పాటు ఆకాశంలోనే ఉండే పరిస్థితి కనిపిస్తోంది. దేశీయ మార్కెట్లో ఉల్లి డిమాండ్ ఎక్కువగా ఉండటం, సరఫరా లేకపోవడంతో ఇప్పట్లో ధరలు సాధారణ స్థాయికి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. అయితే ఉల్లి ధర, డిమాండ్ నేపథ్యంలో మహారాష్ట్రతో సహా ఇతర రాష్ట్రాల్లో ప్రస్తుత యాసంగి సీజన్లో సాగు పెరగడం, మరో పదిపదిహేను రోజుల్లో కేంద్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉల్లి రానుండటంతో సంక్రాంతి నాటికి ఉల్లి కిలో ధర వంద రూపాయల దిగువకి వచ్చే అవకాశం ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫిబ్రవరికే సాధారణ ధర దేశ వ్యాప్తంగా విస్తారంగా కురిసిన వర్షాలతో ఉల్లికి తీవ్ర కొరత ఏర్పడింది. రోజువారీ ఉల్లి సరఫరా గత ఏడాది 3 లక్షల నుంచి 3.5 లక్షల క్వింటాళ్ల మేర ఉండగా.. ఈ ఏడాది 1.17 లక్షల క్వింటాళ్లకు పడిపోయింది. దీంతో దేశీయంగా ధర రూ.180–220కి చేరగా, రాష్ట్రంలోనూ రూ.160–180 పలుకుతోంది. అయితే ఉల్లి ధరలు పెరగడం, యాసంగికి నీటి లభ్యత పుష్కలంగా ఉండటంతో మహారాష్ట్రలో ఈ సీజన్లో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఖరీఫ్లో 2.50 లక్షల హెక్టార్లలో సాగు జరగ్గా, ఈ సీజన్లో 4 లక్షల హెక్టార్లకు మించి సాగైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. సాగైన ఉల్లి దిగుబడులన్నీ జనవరి మాసాంతం వరకు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఆలోగానే కేంద్రం టర్కీ నుంచి దిగుమతి చేసుకుంటున్న 11 వేల మెట్రిక్ టన్నులు, ఈజిప్టు నుంచి దిగుమతి చేసుకుంటున్న 6,090 మెట్రిక్ టన్నుల ఉల్లిగడ్డ విదేశాల నుంచి జనవరి రెండో వారంలోగా దేశానికి పూర్తిగా చేరుకుంటుంది. అప్పటివరకు విదేశాల నుంచి విడతలవారీగా ఉల్లి దేశానికి చేరినా ధరలు కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. వచ్చే పదిహేను ఇరవై రోజుల్లో ఉల్లి ధర రూ.80–110 వరకు తగ్గే అవకాశం ఉందని హోల్సేల్ వ్యాపారులు చెబుతున్నారు. సంక్రాంతి నాటికి ఉల్లి ధర రూ.50–80 మధ్య, ద్వితీయార్ధంలో రూ.35–60 మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక ఫిబ్రవరిలో మహారాష్ట్ర నుంచి ఉల్లి సరఫరా పెరిగే అవకాశాలు ఉండటం.. నారాయణఖేడ్, వనపర్తి వంటి ప్రాంతాల నుంచి ఉల్లి మార్కెట్కు వచ్చే అవకాశాలు.. కర్నూలు, కర్ణాటక నుంచి దిగుమతులు పెరగనున్న నేపథ్యంలో ఫిబ్రవరిలో రాష్ట్రంలో ఉల్లి ధర రూ.20–30కి సాధారణ స్థాయికి చేరుకుంటుందని అంటున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హైదరాబాదీ బిర్యానీకి కూడా ఉల్లి సెగ తగిలింది. చాలా హోటళ్లు బిర్యానీలో ఉల్లి వాడకాన్ని బాగా తగ్గించాయి. ప్రముఖ హోటళ్ల బిర్యానీలు సైతం రుచిని కోల్పోయాయని పలువురు ఆహార ప్రియులు పేర్కొంటున్నారు. ఉల్లి లేకుండా బిర్యానీ వండాల్సిన పరిస్థితి రావడం ఇదే తొలిసారి అని హోటళ్ల నిర్వాహకులు పేర్కొంటున్నారు. -
తెలంగాణలో ఉల్లి @170
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ‘ఉల్లి బాంబ్’ పేలింది! గత కొంతకాలంగా సామాన్యులను బెంబేలెత్తిస్తూ ఎగబాకుతున్న ధర తాజాగా ‘ఆల్టైం హై’ను తాకింది. ఇప్పటివరకు సెంచరీ మార్కుకు అటు ఇటుగా పలికిన ధర గురువారం ఒక్కసారిగా ఆకాశాన్నం టింది. హైదరాబాద్లోని మలక్పేట మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేనం తగా మొదటి రకం ఉల్లి హోల్సేల్లో క్వింటాలుకు ఏకంగా రూ.14,500 పలికింది. అంటే హోల్సేల్లోనే కిలో రూ. 145కు చేరింది. ఈ పరిస్థితిని సొమ్ము చేసుకునేందుకు వ్యాపారులు మరింతగా రేట్లను పెంచడంతో రిటైల్ మార్కెట్లో ధర రూ. 160 నుంచి రూ.170 మధ్య పలుకుతూ మధ్యతరగతి ప్రజలు ఉల్లి పేరెత్తాలంటేనే జంకేలా చేస్తోంది. రెండో రకం ఉల్లి కిలో రూ. 120, మూడో రకం ఉల్లి రూ. 80 పలుకుతుండగా నాసిరకం ఉల్లి సైతం రూ.70 పలుకుతోంది. దీంతో కిలో నుంచి 2కిలోల వరకు ఉల్లి కొందామని మార్కె ట్కు వెళ్తున్న వారు అరకిలోతో సరిపెట్టుకుంటున్నారు. గతేడాది ఇదే సీజన్లో ఉల్లి ధరలు రూ.30 దాటలేదని హోల్సేల్ వ్యాపారులు చెబుతుండటం గమనార్హం. ఈసారి దేశవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు పంట దెబ్బతినడం, పొరుగు రాష్ట్రాల నుంచి డిమాండ్కు తగ్గట్లుగా సరఫరా లేకపోవడం, విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉల్లి రాకకు మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో ధర ఇప్పట్లో దిగొచ్చే పరిస్థితి కనిపించట్లేదు. దీనికితోడు మహారాష్ట్ర వ్యాపారులతో స్థానిక వ్యాపారులు కుమ్మక్కు కావడం, నిల్వలపై నిఘా కొరవడడం మార్కెట్లో మరింతగా రేట్ల అగ్గిని రాజేస్తోంది. పొరుగున తగ్గిన సాగు వల్లే ఉల్లి ఘాటు... తెలంగాణలో ఉల్లిసాగు ఎక్కువగా లేకపోవడంతో పొరుగు రాష్ట్రాలపైనే రాష్ట్రం ఆధార పడుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్,కర్ణాటక రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రత్యేకించి మహారాష్ట్ర నుంచి వచ్చే దిగుమతులే రాష్ట్ర ప్రజల అవసరాలను తీరుస్తున్నాయి. దేశంలో 60–70 శాతం ఉల్లి దిగుబడికి మహారాష్ట్రే కేంద్రంకాగా అక్కడ ఈసారి సాగు గణనీయంగా తగ్గిపోయింది. గతేడాది 4 లక్షల హెక్టార్లలో సాగు జరగ్గా ఈ ఏడాది కేవలం రెండున్నర లక్షల హెక్టార్లకు సాగు పడిపోయింది. దీనికితోడు ఆగస్టు నుంచి మూడు నెలలపాటు కురిసిన భారీ వర్షాలతో వేసిన పంటంతా దెబ్బతిన్నది. దీంతో ప్రస్తుత ముంబై, పుణేలోనే ఉల్లి కిలో గత 2–3 నెలలుగా రూ. 90 నుంచి రూ. 100 మధ్య పలుకుతోంది. సాధారణంగా మహారాష్ట్రలో ఉల్లి కొరత ఉంటే అక్కడి వ్యాపారులు పాకిస్తాన్, ఈజిప్ట్, చైనా, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ల నుంచి దిగుమతి చేసుకుంటారు. అయితే ప్రస్తుతం పాక్ నుంచి ఉల్లి దిగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించడంతో అక్కడి నుంచి సరఫరా ఆగిపోయింది. బంగ్లాదేశ్ను ముంచెత్తిన వరదల కారణంగా అక్కడి నుంచి సరఫరా లేదు. దీంతో ఈజిప్ట్, టర్కీ నుంచి ఉల్లి దిగుమతి చేసుకుంటున్నారు. ఉల్లి దిగుమతి కోసం కిలోకు రూ. 6–8 ఖర్చు వస్తుండటంతో మహారాష్ట్రలోనే కిలో రూ. 110 వరకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. మరోవైపు కర్ణాటక నుంచి సైతం ఉల్లి రాకపోవడంతో ధరలు ఏమాత్రం దిగిరావడం లేదు. ఈ నెల 2న 6,471 క్వింటాళ్ల మేర ఉల్లి రాష్ట్రానికి రాగా గురువారానికి అది 3 వేల క్వింటాళ్లకు తగ్గింది. దీంతో మూడు నాలుగు రోజుల కిందటి వరకు కిలో ఉల్లి రూ. 90–100 మధ్య ఉండగా గురువారం మలక్పేట మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఉల్లి క్వింటాల్ ధర రూ.14,500 పలికింది. ఇది బహిరంగ మార్కెట్కు వచ్చేసరికి రూ.160 నుంచి రూ.170కి విక్రయిస్తున్నారు. కర్నూలు ఉల్లికి పెరిగిన డిమాండ్... రాష్ట్రానికి కర్నూలు జిల్లా నుంచి కూడా ఉల్లి దిగుమతి జరుగుతోంది. కర్నూలులో ఏటా 87,500 ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తుండగా ఈ ఏడాది అది 50 వేల ఎకరాలకు పడిపోయింది. దీనికితోడు ఈ ఏడాది విస్తారంగా కురిసిన వర్షాలతో జిల్లాలో పంట పూర్తిగా దెబ్బతిన్నది. మరోవైపు సాగు చేసిన పంటలోనూ ఎకరానికి 60 క్వింటాళ్ల మేర రావాల్సిన దిగుబడి 35–40 క్వింటాళ్లకు పడిపోయింది. దీంతో అక్కడే ధరలు అమాంతం పెరిగాయి. సెప్టెంబర్లో క్వింటాల్ ధర గరిష్టంగా రూ. 4,500కు, అక్టోబర్లో రూ. 4,600కు నవంబర్లో రూ. 5,250 పలికింది. సాగు, దిగుబడులు తగ్గడం, స్థానిక డిమాండ్ అధికంగా ఉండటంతో కర్నూలు మార్కెట్కు గతంలో రోజూ 5–6 వేల క్వింటాళ్ల ఉల్లి పంట వచ్చేది. కానీ ప్రస్తుతం అది రోజుకు వెయ్యి క్వింటాళ్లకు తగ్గింది. దీంతో అక్కడి నుంచి రాష్ట్ర అవసరాల మేరకు ఉల్లి రావట్లేదు. మరోవైపు ప్రజలకు రాయితీపై కిలో ఉల్లి రూ. 25కే సరఫరా చేసేందుకు ఎంత ధరకైనా కొనుగోళ్లు జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారులకు సూచించడంతో మార్కెట్ యార్డు అధికారులు, వ్యాపారులు పోటీ పడి కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో ఉల్లి ధరలకు అమాంతం డిమాండ్ పెరిగి ధరలు నింగినంటుతున్నాయి. కర్నూలు మార్కెట్లో గత బుధవారం మధ్యాహ్నానికి క్వింటాలు ఉల్లి ధర గరిష్టంగా రూ. 12,510 పలికింది. ఈ ప్రభావం తెలంగాణపై పడి ఇక్కడి ధరల పెరుగుదలకు కారణమైంది. ‘మహా’ సిండికేట్... రాష్ట్రంలో డిమాండ్ తగ్గట్టుగా లేని ఉల్లి సరఫరాను వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. తెలంగాణలో ఉల్లి నిల్వలకు కోల్డ్ స్టోరేజీలు లేకపోవడంతో పూర్తిగా మహారాష్ట్రపై ఆధారపడుతున్న రాష్ట్ర వ్యాపారులు అక్కడి వ్యాపారులతో సిండికేట్ అయ్యారు. కొనుగోలు చేసిన ఉల్లిని రాష్ట్రానికి తీసుకురాకుండా అక్కడే నిల్వ చేసి కృతిమ కొరత సృష్టిస్తున్నారు. అదీగాక తక్కువ బరువు తూగే పాత స్టాక్కు ధర ఉండదన్న ఉద్దేశంతో దాన్ని తీసుకురాకుండా ఎక్కువ బరువుండే తాజా స్టాక్నే తీసుకొస్తున్నారు. మహారాష్ట్ర నుంచి 10 లారీలు వస్తుంటే అందులో 3 పాత స్టాక్ లారీలయితే 7 కొత్త స్టాక్వి ఉంటున్నాయి. కొత్త స్టాక్కు ధర పెంచేసి విక్రయాలు చేస్తున్నారు. ఉల్లి అక్రమ నిల్వలను అరికట్టేందుకు రిటైలర్లు 100 క్వింటాళ్లు, హోల్సేల్ వ్యాపారులు 500 క్వింటాళ్లకు మించి నిల్వ చేసుకోరాదని కేంద్రం స్పష్టం చేసినా ఎక్కడా దీనిపై నిఘా ఉన్నట్లు కనిపించట్లేదు. ఈజిప్టు ఉల్లే దిక్కు.. దేశంలో ఆకాశాన్నంటిన ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్రం గత నెల చివరి వారంలో టర్కీ నుంచి 11 వేల మెట్రిక్ టన్నులు, ఈజిప్ట్ నుంచి 6,090 మెట్రిక్ టన్నుల ఉల్లిగడ్డలను దిగుమతి చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈజిప్ట్ ఉల్లి ఈ నెల రెండో వారానికల్లా ముంబై చేరుతుందని కేంద్రం ప్రకటించింది. ఈజిప్ట్ ఉల్లిలోంచి తమకు వారానికి 100 టన్నులకు తగ్గకుండా సరఫరా చేయాలని ఇప్పటికే రాష్ట్రం కేంద్రానికి లేఖ రాసింది. ఈజిప్ట్ నుంచి వచ్చే స్టాక్ ఈ నెల 10కల్లా ముంబై పోర్టుకు చేరే అవకాశం ఉందని, ఆ తర్వాత మూడు రోజుల్లో రాష్ట్రానికి ఉల్లి చేరొచ్చని మార్కెటింగ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కనీసం 500 టన్నుల ఈజిప్టు ఉల్లి తెలంగాణకు దిగుమతి అవుతుందని, అప్పడే ధరలు తగ్గుతాయని చెబుతున్నారు. రాష్ట్రంలో నారాయణఖేడ్ సహా ఇతర ప్రాంతాల్లో సాగు చేసిన ఉల్లి పంట ఫిబ్రవరి ఆఖరు లేదా మార్చిలో మార్కెట్లోకి వస్తుందని, అప్పటివరకు ధరాఘాతం తప్పదని చెబుతున్నారు. ఆనియన్ దోశ.. పకోడిలు బంద్! ఉల్లి ధరల దెబ్బకు హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో ఉల్లి సంబంధిత వంటకాలను హోటళ్లు, తోపుడు బండ్లపై వ్యాపారులు చాలా వరకు తగ్గించేశారు. ముఖ్యంగా ఉల్లి దోశ, పకోడి, మిర్చి, పానీపూరీల్లో ఉల్లి వాడకంపై స్వీయ ఆంక్షలు పెట్టుకున్నారు. తోపుడు బండ్ల వద్ద ‘ఉల్లి మళ్లీ అడగరాదు’ అని బోర్డులు పెడుతున్నారు. ఇక బిర్యానీల్లో ఉల్లి వాడకం జరుగుతున్నా వాటితోపాటు ఇచ్చే సలాడ్లో ఉల్లి స్థానంలో కీరా, క్యారెట్లను ఇస్తున్నారు. వినియోగదారులు ఉల్లి అడిగితే సలాడ్కు రూ. 20–30 వసూలు చేస్తున్నారు. ఈ ప్రభావం పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలపైనా పడుతోంది. హైదరాబాద్లోని 10 రైతు బజార్లకు మలక్పేట మార్కెట్ నుంచి 30 క్వింటాళ్లను కొనుగోలు చేసి సరఫరా చేసినట్లు అధికారులు తెలిపారు. ఉల్లి ధర తగ్గే వరకు రైతు బజార్లకు ఉల్లి సరఫరా చేస్తామని చెప్పారు. -
ఉల్లి దొంగలు వస్తున్నారు జాగ్రత్త!
సాక్షి, చెన్నై : దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఉల్లి కోస్తేనే కాదు కొనాలంటే కూడా కన్నీళ్లు వస్తున్నాయి. చాలా చోట్ల కిలో ఉల్లిగడ్డల ధర రూ.100 ను దాటాయి. ఉల్లిగడ్డల్ని బంగారం లాగా దాచుకుంటున్నారు. అదే సమయంలో ఉల్లి గడ్డల దొంగలు కూడా దేశవ్యాప్తంగా హల్చల్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్లో పొలంలో పంటల మీద ఉన్న ఉల్లిపాయల్ని ఎత్తుకెళ్లిన ఘటన మరవక ముందే అదే తరహా దొంగతనం తమిళనాడులో చోటు చేసుకుంది. ఓ రైతు పంట వేయడానికి తెచ్చుకున్న 350 కిలోల ఉల్లిని దొంగలు ఎత్తుకెళ్లారు. పెరంబలూర్ జిల్లాలోని కూత్తనూర్ గ్రామంలో ముత్తుక్రిష్ణన్ (40)అనే రైతు జీవిస్తున్నాడు. అతను ఉల్లి పంటలు వేసి జీవనం సాగిస్తున్నాడు. అయితే తన మూడు ఎకరాల పొలంలో ఉల్లి పంట సాగుచేసేందుకు 350 కిలోల చిన్న ఉల్లిపాయలను 15 బుట్టలలో ఉంచి పొలం దగ్గర ఉంచాడు. అయితే ఆ ప్రాంతాంలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నందున నాలుగైదు రోజులుగా ఆయన పొలం వైపు వెళ్లలేదు. బుధవారం ఉదయం పొలం వెళ్లి చూసిన ముత్తు క్రిష్ణన్ షాక్ అయ్యాడు. పొలంలో ఉంచిన ఉల్లిని ఎవరో గుర్తుతెలియని దుండగులు దొంగిలించారు. దీంతో ముత్తుక్రిష్ణన్లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఓటెత్తిన జనం!
వెనుదిరిగిన ఓటర్లు
సీపీ సుడిగాలి పర్యటన
ఓటేసిన ప్రముఖులు
● ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం ● ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ● జిల్లాలో 66.53శాతం ఓటింగ్ నమోదు ● అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తగ్గిన ఓటింగ్
లెక్కలేస్తున్న అభ్యర్థులు
సంతోషంగా ఉంది
ప్రశాంత వాతావరణంలో పోలింగ్
తొలిసారి ఓటేసిన యువత
ఓటేసిన ట్రాన్స్జెండర్లు
తప్పక చదవండి
- సౌత్ ఇండస్ట్రీలో బడా ఆఫర్.. ఒక్కరోజు కాంప్రమైజ్ అని కండీషన్!
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
- అందుకే నాకు పిల్లలు వద్దు: నిఖిల్ కామత్ సంచలన వ్యాఖ్యలు
- గాజాలో ఆగని దాడులు.. భారతీయుడి మృతి
- అందుకే విడిపోతున్నాం.. జీవీ ప్రకాష్-సైంధవిల ప్రకటన
- జనసేన కార్యకర్తల దౌర్జన్యం
- ముంబైలో ఘోరం.. హోర్డింగ్ కూలి 14 మంది మృతి
- నగరం బాట పట్టిన ఆంధ్రా ఓటర్లు.. దారులన్నీ రద్దీ!
- Today Horoscope: ఈ రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది
Advertisement