-
జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం
-
నిన్నే నమ్ముకున్నాం సారూ.. మరొక్కమారు నాకు చాన్స్ ఇవ్వరూ ప్లీజ్..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం అర్బన్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వైకుంఠం ప్రభాకర్చౌదరికి పార్టీ అధిష్టానం చుక్కలు చూపిస్తోంది. 2014లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచిన ఆయన 2019లో ఘోరంగా ఓడిపోయారు. ఇప్పుడు మళ్లీ పోటీచేయాలని తీవ్రంగా యత్నిస్తున్న చౌదరికి పార్టీ అధినేత చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ రాలేదు. టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రభాకర్ చౌదరికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇన్నేళ్లుగా పార్టీకి కష్టపడిన తనకు ఈ దుస్థితి ఏమిటని కార్యకర్తల దగ్గర వాపోయినట్టు తెలుస్తోంది. ఇప్పుడు గనుక టికెట్ ఇవ్వకపోతే ప్రభాకర్ చౌదరి రాజకీయాలకు గుడ్బై చెప్పాల్సి వస్తుందని అనుచరులు వాపోతున్నారు. పరిగణనలోకి కూడా తీసుకోలేదు గత రెండు మాసాలుగా టికెట్ కోసం యత్నిస్తున్న ప్రభాకర్ చౌదరికి ఏ దశలోనూ హామీ లభించలేదు. పైగా ఈయన్ను పరిగణనలోకి తీసుకున్న దాఖలాలు కూడా లేవు. అర్బన్ నియోజకవర్గంలో పాతిక వేలకు పైగా బలిజ సామాజిక వర్గం ఓట్లు ఉన్నట్టు అంచనా. దీంతో జనసేనకు ఇస్తే బావుంటుందనేది చంద్రబాబు ఆలోచన. 2019 నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గంలో టీడీపీ కోసం కృషి చేస్తే ఉన్నట్టుండి జనసేనకు టికెట్ ఇస్తే తన పరిస్థితి ఏమిటని చౌదరి ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు గనుక టికెట్ తెచ్చుకోలేకపోతే రాజకీయ సన్యాసం తప్పదేమోనన్న భయం ఆయన్ను వెంటాడుతోందని తెలుస్తోంది. తేల్చుకునేందుకు విజయవాడకెళ్లిన చౌదరి వాడుకుని వదిలేయడమంటే చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య అనేది అందరికీ తెలిసిందే. ఈ కోవలోనే బీకే పార్థసారథి, జితేందర్గౌడ్ లాంటి వాళ్లందరూ బలయ్యారు. తాజాగా ప్రభాకర్ చౌదరి వంతు వచ్చినట్లు తెలుస్తోంది. ఓ వైపు సొంత పార్టీలోనే ప్రభాకర్ చౌదరిని వ్యతిరేకించే వాళ్లు తానా అంటుంటే.. వీరికి వంతపాడుతూ అధిష్టానం తందానా అంటోంది. జేసీ దివాకర్రెడ్డి అనుచరులు ప్రభాకర్ చౌదరిపై ఏదో ఒక రకంగా రోజూ వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు దీన్ని ఎదుర్కోలేక తంటాలు పడుతుంటే మరోవైపు అధిష్టానం నుంచి ఎలాంటి హామీ లేదు. ఇప్పుడాయన పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా ఉంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ కేడర్ పరిస్థితి గందరగోళంగా ఉంది. పొత్తులో ఏ పార్టీకి సీటిస్తారో, ఎవరు అభ్యర్థో అర్థం కాక సతమతమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో అధిష్టానంతో తాడో పేడో తేల్చుకునేందుకు ప్రభాకర్ చౌదరి విజయవాడకు బయలుదేరినట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. -
తళుకుమను తార...
‘బాహుబలి’ ప్రభాకర్ లీడ్ రోల్లో పాలిక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రౌద్ర రూపాయ నమః’. రావుల రమేష్ నిర్మించిన ఈ సినిమా పోస్ట్ప్రోడక్షన్ జరుపుకుంటోంది. జాన్ భూషణ్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘తళుకు తళుకుమను తార.. కులుకులొలుకు సితార...’ అంటూ సాగే సెకండ్ లిరికల్ వీడియో సాంగ్ని నటుడు సాయి కుమార్ రిలీజ్ చేశారు. ఈ పాటను సురేష్ గంగుల రచించారు. ‘‘రౌద్ర రూపాయ నమః’’ చాలా పవర్ఫుల్ టైటిల్. ఈ సినిమా విజయం సాధించి, యూనిట్కి మంచి పేరు రావాలి’’ అన్నారు సాయికుమార్ అన్నారు. ‘‘మా సినిమాని ప్రేక్షకులు హిట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు రావుల రమేష్. ‘‘ప్రభాకర్గారి నటన మా చిత్రానికి ఆయువుపట్టు’’ అన్నారు పాలిక్. ఈ కార్యక్రమంలో నటుడు రఘు, రచయిత తోటపల్లి సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మూవీకి కెమెరా: గిరి–వెంకట్. -
నా గర్ల్ఫ్రెండ్ వల్ల భార్య చాలా బాధపడింది: సీరియల్ నటుడు ప్రభాకర్
సీరియల్ యాక్టర్ ప్రభాకర్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత కొన్నేళ్ల నుంచి పలు ఛానెల్స్లో సీరియల్స్తో అలరిస్తున్నాడు. తాజాగా ఓ షోకి భార్యతో సహా వచ్చిన ప్రభాకర్.. తన ప్రేమ-పెళ్లి విషయాల గురించి మాట్లాడాడు. తన గర్ల్ఫ్రెండ్ వల్ల భార్య బాధపడిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నాడు. ఇంతకీ అసలేం జరిగింది? ఏం జరిగింది? ప్రముఖ ఛానెల్లో ప్రసారమైన ఈ షోలో ప్రభాకర్-మలయాజ పెళ్లి ఫొటోల్ని స్క్రీన్పై ప్లే చేయగానే.. తమది దొంగపెళ్లి అని, ఆర్య సమాజ్లో ఏడడుగులు వేశామని అన్నాడు. అయితే ఖమ్మం నుంచి వచ్చిన తన ఫ్రెండ్.. పెళ్లిలో కన్యాదానం చేశాడని అప్పటి సంగతుల్ని ప్రభాకర్ గుర్తుచేసుకున్నాడు. (ఇదీ చదవండి: 'బిగ్బాస్ 7' ఎలిమినేషన్లో ట్విస్ట్.. ఒకేసారి ఇద్దరు ఔట్!) గర్ల్ఫ్రెండ్ వల్ల భార్య.. 'నాకు ఓ గర్ల్ఫ్రెండ్ ఉండేది. ఆ విషయంలో నా భార్య చాలా బాధపడింది. ఆ సందర్భాన్ని ఎలాగోలా సరిచేసుకుని మనస్ఫూర్తిగా నా భార్యకు సారీ చెప్పాను. అయితే నేను సారీ చెప్పడం గొప్పకాదు. తను నన్ను క్షమించడం గొప్ప విషయం' అని భార్య మలయజ గురించి చెప్పాడు. ఆ తర్వాత ఆమె బుగ్గపై అందరూ చూస్తుండగానే ముద్దుపెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ షో ప్రోమో వైరల్గా మారింది. ఇకపోతే ప్రభాకర్ పలు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉండగా, అతడి భార్య మలయజ స్వతహాగా యాక్టర్ కానప్పటికీ షార్ట్ ఫిల్మ్స్లో నటిస్తూ ఉంటుంది. సొంత యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. అలానే ప్రభాకర్ కొడుకు సుహాస్ ఆటిట్యూడ్ స్టార్ గా ఇప్పటికే చాలామందికి పరిచయం. కూతురు దివిజ కూడా పలు సినిమాల్లో నటించింది. (ఇదీ చదవండి: 'బిగ్బాస్'లోకి వెళ్లొచ్చాక నా భార్యకి అలాంటి మెసేజులు: హీరో వరుణ్ సందేశ్) -
సుర సుర సుర అసుర!
‘బాహుబలి’ ఫేమ్ ప్రభాకర్ ప్రధాన పాత్రలో పాలిక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రౌద్ర రూపాయ నమః’. రావుల రమేష్ నిర్మించారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ని,చిత్రంలోని మొదటి లిరికల్ (సుర సుర సుర అసురసురసుర...) వీడియోను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేసి, ఈ చిత్రం విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘మా సినిమాని త్వరలో విడుదల చేస్తాం’’ అన్నారు రావుల రమేష్. ‘‘మా చిత్రానికి జాన్ భూషణ్ సంగీతం, సురేష్ గంగుల సాహిత్యం బాగా కుదిరాయి’’ అని పాలిక్ అన్నారు. -
వైఎస్సార్సీపీ నేతపై టీడీపీ మూకల దాడి
పుంగనూరు(చిత్తూరు జిల్లా) : టీడీపీ శ్రేణులు మళ్లీ బరితెగించాయి. వైఎస్సార్సీపీ నేత ఇంట్లోకి జొరపడి రాళ్లు, కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయర్చాయి. పుంగనూరు మండల వైస్ ఎంపీపీ సరోజమ్మ, ఆమె భర్త ప్రభాకర్నాయక్ మండలంలోని పాళ్యెంపల్లెలో ఉంటున్నారు. ఈ నెల 4న చంద్రబాబు పర్యటనలో టీడీపీ శ్రేణులు పోలీసులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. ఈ కేసులో మండలంలోని జెడీ తాండాకు చెందిన టీడీపీ నేత కృష్ణానాయక్, ఆయన కుమారులు నిందితులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు ప్రభాకర్నాయక్ తమ ఆచూకీ తెలిపి ఉంటారన్న అనుమానంతో కృష్ణానాయక్ ఆయన కుమారుడు శ్రీనివాసనాయక్, వారి అనుచరులు కలిసి పథకం ప్రకారం ఆదివారం రాత్రి 10:30 గంటల సమయంలో ప్రభాకర్నాయక్ ఇంటిపై దాడి చేసి, భయానక వాతావరణం సృష్టించారు. ప్రభాకర్నాయక్పై రాళ్లు, కత్తులతో దాడి చేసి గాయపరిచారు. అడ్డు వచ్చిన ఆయన బావమరిది మునీంద్రనాయక్పైనా దాడి చేశారు. గ్రామస్తులు రావడంతో నిందితులు పరారయ్యారు. గాయపడిన ప్రభాకర్నాయక్ను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ మోహన్కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి నిందితులపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. కాగా, ప్రభాకర్నాయక్ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించి ధైర్యం చెప్పారు. -
‘రాజుగారి కోడిపులావ్’ మూవీ రివ్యూ
టైటిల్: రాజుగారి కోడిపులావ్ నటీనటులు: శివ కోన, ప్రభాకర్, కునాల్ కౌశిక్, నేహా దేష్ పాండే, ప్రాచీ థాకేర్, అభిలాష్ బండారి, రమ్య దినేష్ తదితరులు నిర్మాణ సంస్థలు : ఏఎమ్ఎఫ్, కోన సినిమా నిర్మాతలు : అనిల్ మోదుగ, శివ కోన దర్శకత్వం : శివ కోన సంగీతం : ప్రవీణ్ మని సినిమాటోగ్రఫి : పవన్ గుంటుకు ఎడిటర్ : బసవా- శివ కోన విడుదల తేది: ఆగస్ట్ 4, 2023 ‘రాజుగారి కోడిపులావ్’కథేంటంటే.. రాజుగారు(ప్రభాకర్) ఓ హోటల్ రన్ చేస్తూ కోడిపులావ్ తో ఎంతో ఫేమస్ అవుతారు. ఆ చుట్టు పక్కల ఏరియా ప్రజలు రాజుగారి కోడిపులావ్ కోసం ఎగబడేవారు. ఇలా వ్యాపార పరంగా రాజుగారు సంతోషంగా ఉన్నప్పటికీ.. వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా బాధగా ఉండేవాడు. దానికి కారణం తనకు కొడుకు పుడుతాడు అనుకుంటే కూతురు పుట్టడం, అలాగే తన భార్య తన మాట వినడం లేదని అసంతృప్తి. ఈ రెండు కారణాల వల్ల రాజుగారు తరచూ మద్యం సేవిస్తూ ఉండేవాడు. ఓ ప్రమాదంలో అతని రెండు కాళ్లు విరిగిపోవడంతో ఇంటికే పరిమితం అవుతాడు. కట్ చేస్తే.. కొన్నేళ్ల తర్వాత మూడు జంటలు డ్యాని(శివ కోన)- క్యాండీ (ప్రాచి కెథర్), బద్రి(కునాల్ కౌశిక్)-ఆకాంక్ష(నేహాదేష్ పాండే), షారుఖ్(అభిలాష్ బండారి)-ఈషా(రమ్య దినేష్) రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తారు. వీరిలో క్యాండీ, ఆకాంక్ష, బద్రి, ఫారుఖ్ కాలేజీ స్నేహితులు. ఈషా ఐటీ ఎంప్లాయ్. వీరంతా కలిసి కారులో ట్రిప్కి బయలుదేరగా మార్తమధ్యలో కారు పాడవుతుంది. దీంతో అడవిలో వీరంతా నడవాల్సి వస్తుంది. అలా ప్రయాణం సాగిస్తున్న ఈ మూడు జంటల్లో అనూహ్యంగా క్యాండీ మరణిస్తుంది. తన మరణానికి కారణం తెలియదు. ఆ మరుసటి రోజే ఈషా కపిపించకుండా పోతుంది. మిగిలిన నలుగురు భయంతో తిరిగి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. కానీ అడవిలో వీరికి దారి దొరక్క తిరుగుతూనే ఉంటారు. చివరకు వీరికి ఆ దట్టమైన అడవిలో ఓ ఇల్లు కనిపిస్తుంది. అందులోకి వెళ్లిన తర్వాత అసలు ట్విస్ట్ మొదలవుతుంది. అసలు క్యాండి ఎలా మరణించింది? డ్యానీ ఎవరు? ఫారుఖ్, ఆకాంక్షల మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది? అసలు రాజుగారికి ఈ మూడు జంటలకు ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్లో ‘రాజుగారి కోడిపులావ్’సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. రాజుగారి కోడిపులావ్ హోటల్ సీన్తో కథ ఆసక్తికరంగా ప్రారంభం అవుతుంది. అయితే కాసేపటికే కథ వేరే మలుపు తీసుకుంటుంది. మూడు జంటల పరిచయం.. వారి ఫారెస్ట్ ట్రిప్ ప్లాన్తో ఆసక్తికరంగా సాగుతుంది. కథ మొదలైన పది నిమిషాలకే ఆకాంక్ష, ఫారుఖ్ ల మధ్య ఉన్న రిలేషన్ రివీల్ అవుతుంది. అయితే వారు ఎందు ఒకరికోకరు అట్రాక్ట్ అయ్యారో కన్విన్సింగ్ గా ఉంటుంది. గైనకాలజిస్ట్ గా పరిచయం అయిన క్యాండీ లవర్ డ్యాని చాలా హుషారుగా కనిపించే పాత్ర ప్రథమార్థం అంతా చాలా కూల్ గు వెళ్తుంది. ఇక అడవిలోకి వీరు ఎంటర్ అయిన తరువాత కారు ఆగిపోవడంతో అప్పటి వరకు ఉన్న జోష్ మూడ్ ఒక్కసారిగి టెన్షన్ వాతావరణంలోకి వస్తుంది. ఏదో జరగబోతుందనే ఉత్కంఠత ప్రేక్షకుడిలో ఏర్పడుతుంది. ఒక చెట్టుపైన పెద్ద పెద్ద కోడికాళ్ల అచ్చులు చూపించడంతో దాని వెనక ఏదో నేపథ్యం ఉంటుందని అర్థమవుతుంది. క్యాండీ చనిపోయిన తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. అలాగే కొన్ని సంభాషణలు, సన్నివేశాలు ప్యామిలీ ఆడియన్స్ని ఇబ్బందికి గురి చేస్తుంది. డ్యానీ కనిపించకుండా పోవడంతో కథపై మరింత ఆసక్తి పెరుగుతంది. కానీ సెకండాఫ్లో ఆ ఆసక్తిని కంటిన్యూ చేయడంలో దర్శకుడు కాస్త విఫలం అయ్యాడు.అసలు కథకు రాజుగారికి ఉన్న ట్విస్ట్ సినిమాకు హైలెట్. అలాగే డ్యానీ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఆసక్తికరంగా ఉంటాయి. ఇక క్లైమాక్స్ థ్రిలింగ్కు గురిచేస్తుంది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో డ్యాని బాగా హైలెట్ అయింది. డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న ఈ పాత్రలో శివ కోన ఒదిగిపోయాడు. దర్శకుడిగా, నిర్మాతగా ఇంత పెద్ద బాధ్యత తీసుకున్నప్పటికీ నటన పరంగా ఎక్కడా తగ్గలేదు. శివ తర్వాత బాగా పండిన పాత్ర ప్రాచి కెథర్. క్యాండి పాత్రలో ప్రాచీ థాకర్ జీవించేసింది.యాక్టింగ్ పరంగా మెచ్యుడ్ గా ఫర్ఫార్మెన్స్ చేసింది. ఆకాంక్ష పాత్రని నేహా న్యాయం చేసింది.కునాల్ కౌశిక్ బద్రి పాత్రలో చాలా బాగా చేశారు. కాస్త కన్నింగ్ ఉన్న పాత్ర. చాల సహజంగా నటించారు. రెండు మూడు వేరియేషన్లు చూపించే పాత్రలో ప్రేక్షకులని మెప్పిస్తుంది. అలాగే రమ్య దినేష్ తన పాత్ర మేరకు బాగా చేసింది. ఇక రాజుగారి పాత్రలో ప్రభాకర్ తెరపై కనిపించేది కాసేపే అయినా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే..దర్శకుడికి ఇది తొలి సినిమానే అయినా చక్కగా హ్యాండిల్ చేశాడు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ను ఎలా చూపించాలో అంతే గ్రిప్పింగ్ గా చూపించాడు. ప్రవీన్ మణీ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ పాయింట్. సినిమాటో గ్రఫర్ పవన్ గుంటుకు మంచి విజువల్స్ అందించారు. అడవి లోకేషన్లు అందంగా చూపించారు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
'రాజుగారి కోడిపులావ్'.. కొత్త రిలీజ్ డేట్
ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం 'రాజుగారి కోడిపులావ్' కుటుంబ కథా 'వి'చిత్రం అనేది ట్యాగ్. ఈ సినిమాతో శివ కోన దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే విడుదలైన పాటలు అందరి దృష్టిని ఆకట్టుకొన్నాయి. ట్రైలర్ అయితే 1 మిలియన్ వ్యూస్ మార్క్ దాటేసింది. ప్రేక్షకులు సినిమా విడుదల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. రాజు గారి కోడి పులావ్ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా "వాట్ ద ఫ* ఈజ్ ఆఫ్ కోడిపులావ్" అనే మరో ఇంట్రెస్టింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ మూవీలో అందరూ కొత్త నటులే అయినప్పటికీ వారి పెర్ఫామెన్స్ తో సినిమాపై ఆసక్తి పెంచుతున్నాడు. ప్రభాకర్ ఈ చిత్రంలో టైటిల్ రోల్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ 'A' సర్టిఫికెట్ జారీ చేసింది. తొలుత జూలై 29న రిలీజ్ ప్లాన్ చేశారు కానీ ఎందులో ఇందులో మార్పు చేశారు. ఆగస్టు 4న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు కొత్త విడుదల తేదీని ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: 'రంగబలి' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఆ రోజే) -
అమెరికాలో ప్రొఫెసర్గా వరంగల్ ఆదివాసీ
వరంగల్: కడు పేదరికం.. తినడానికి అన్నం కూడా దొరకని పరిస్థితి. తండ్రి పని చేస్తేనే పూటగడిచేది. లేనిపక్షంలో పస్తులుండడమే. పైగా మారుమూల గ్రామం.. అందులో పాఠశాల కూడా లేని కుగ్రామం. ఇలాంటి తరుణంలో ఎవరికైనా చదువుకోవాలనే ఆలోచనే రాదు. ఏదైనా పని చేసుకుని బతకాలని భావిస్తారు. కానీ అలాంటి వారికి ఈ యువకుడు పూర్తిగా విరుద్ధం. చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించాడు. ఒక పక్క సమస్యలతో సహవాసం చేసూ్తనే.. మరో పక్క అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని పలువురికి ఆదర్శంగా నిలిచాడు. ఆయననే మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మారుమూల ఏజెన్సీ ఆదివాసీ గ్రామం దొరవారివేంపలి్లకి చెందిన ఈక ప్రభాకర్. తాను ఎంచుకున్న విద్యలో ఖండాంతరాలు దాటి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ అయోవాలో ప్రొఫెసర్గా పని చేసేందుకు ఎంపికయ్యారు. ఎర్ర బస్సు కూడా ఎరగని ఈ గ్రామం నుంచి అమెరికాకు వెళ్లడంపై గ్రామస్తుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈక పాపమ్మ–సమ్మయ్య దంపతుల ప్రథమ సంతానం ప్రభాకర్. తన ఎదుగుదల గురించి ఆయన మాటల్లోనే.. ‘పోడు వ్యవసాయం ఆధారంగానే మా కుటుంబ పోషణ గడిచేది. తినడానికే ఇబ్బంది పడే పరిస్థితి. గ్రామంలో పాఠశాల కూడా లేదు. 1989లో అప్పటి ఐటీడీఎ పీఓ బెస్ట్ అవైలెబుల్ పాఠశాలలకు విద్యార్థులను ఎంపిక చేస్తున్నారు. హాస్టల్కు వెళ్తే కనీసం అన్నం అయినా సరిగా దొరుకుతుందనుకునే పరిస్థితి ఉండేది. ఈ పరిస్థితిలోనే రాజేంద్ర కాన్వెంట్ హై స్కూల్లో సీటు వచ్చింది. పాఠశాల చదువులోనే మా తల్లి పాపమ్మ 1997లో మృతి చెందింది. ఈ ఘటనను దిగమింగుకుని పదో తరగతి పూర్తి చేశా. అనంతరం ఇంటర్ ఎల్బీ కళాశాల వరంగల్లో, కర్నూలు సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాలలో బీజెడ్సీ గ్రూపులో డిగ్రీ పూర్తి చేశా. వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్సిటీలో బయో టెక్నాలజీలో పీజీ పూర్తి చేశా. బెస్ట్ అవైలెబుల్ స్కీం పూర్తయిన తరువాత ఐటీడీఏ నుంచి స్కాలర్ షిప్కు ఎంపికయ్యా. ఆ స్కాలర్ షిప్తోనే డిగ్రీ, పీజి పూర్తయింది. 2006 నుంచి 2013 వరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డి పూర్తి చేశా. 2013 నుంచి 2017 వరకు సీఎస్ఐఆర్ఆర్ఏలో రీసెర్చ్ అసోసియేట్గా పని చేశా. ఇదే సమయంలో మండలంలోని ఈశ్వరగూడెం గ్రామానికి చెందిన రవళితో వివాహమైంది. పీహెచ్డీ ఫెలోషిప్లో భాగంగా‘టాటా ఇన్స్టిట్యూట్ ఫండమెంటల్ రిసెర్చ్’లో సంవత్సరం పని చేశా. అనంతరం గీతం యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరాను. అక్కడ ప్రొఫెసర్గా పని చేసూ్తనే గత సంవత్సరం అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ అయోనాలో ప్రొఫెసర్గా అప్లికేషన్ చేశాను. నాలుగు దఫాలుగా జరిగిన ఇంటర్వూ్యల ఆధారంగా నన్ను ఎంపిక చే సి వీసా ఇచ్చారు. ఈనెల 28న అమెరికాకు వెళ్తు న్నా. ఖండాతరాలు దాటి ప్రొఫెసర్గా పనిచేసే అ వకాశం వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది’. -
బిగ్బాస్ 7లో బుల్లితెర ప్రభాకర్? రచ్చ రచ్చే!
బిగ్బాస్ 7 టైటిల్ ప్రోమో రాకతోనే సోషల్ మీడియాలో సందడి మొదలైపోయింది. బిగ్బాస్ వచ్చేస్తున్నాడోచ్ అంటూ బుల్లితెర ప్రేక్షకులు సంబరపడుతున్నారు. ఎక్కువసార్లు బిగ్బాస్ సెప్టెంబర్ మొదటి వారంలోనే ప్రారంభమైంది. అయితే ఈ సారి మాత్రం అప్పటివరకు ఆగేదే లేదంటూ ప్రీపోన్ అవుతోందట! అంటే ఆగస్టు నెలలోనే బిగ్బాస్ 7 షురూ అయిపోనుందని వార్తలు వినిపిస్తున్నాయి. జూలై నెలాఖరు లేదా ఆగస్టు ప్రారంభంలో షో స్టార్ట్ చేసి సడన్ సర్ప్రైజ్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు! ఇప్పటికే ప్రోమో షూట్ కూడా పూర్తవగా, కంటెస్టెంట్ల ఎంపిక ఫైనలైపోయిన వెంటనే బిగ్బాస్ 7 గ్రాండ్గా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ షో కోసం బ్యాంకాక్ పిల్ల శ్రావణి.. థాయ్లాండ్ నుంచి ఇండియాకు వచ్చేసింది. బిగ్బాస్ కోసమే ఆమె ఇక్కడికి వచ్చిందన్నది నెటిజన్ల అభిప్రాయం. ఈమె పేరు కచ్చితంగా లిస్ట్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ జాబితాలో ప్రముఖంగా వినిపిస్తున్న మరో పేరు బుల్లితెర ప్రభాకర్. టీవీలో ప్రసారమయ్యే ఎన్నో సీరియల్స్లో ప్రభాకర్ నటించాడు. వెండితెరపై కొన్ని చిత్రాల్లోనూ మెరిశాడు. 25 ఏళ్లుగా అతడు టాప్ నటుడిగా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. ఇతడిని అభిమానులు ప్రభాకర్ను బుల్లితెర మెగాస్టార్ అని పిలుచుకుంటారు. ఇతడుగానీ హౌస్లో అడుగుపెడితే రచ్చ రచ్చే అంటున్నారు ఫ్యాన్స్. ఒకవేళ ప్రభాకర్ నో చెప్తే తన స్థానంలో అతడి కొడుకు చంద్రహాస్ వచ్చినా ఓకే అంటున్నారు. చంద్రహాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు ఇప్పటికే రెడీ అయిన సంగతి తెలిసిందే! ఇతడి టాలెంట్ చూసి మొదటి సినిమా రిలీజ్ అవ్వకముందే మరో రెండు సినిమాల ఆఫర్ వచ్చాయని చెప్పాడు. ఇకపోతే తొలి చిత్రం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో చంద్రహాస్ ప్రవర్తన చూసిన జనాలు అతడికి ఆటిట్యూడ్ స్టార్ అన్న ట్యాగ్ కట్టబెట్టారు. ఇతగాడు కానీ వస్తే మీమర్స్కు కావాల్సినంత కంటెంట్ దొరకడం ఖాయం! మరి ఈ తండ్రీకొడుకుల్లో ఎవరైనా ఒకరు వస్తారా? లేదా? అనేది చూడాలి! చదవండి: ఆ హీరో ఇంటికి రమ్మన్నాడు.. వెళ్లకుండా తప్పు చేశా: హీరోయిన్ ఆదిపురుష్ కంటే చంద్రయాన్ 3 బడ్జెట్ తక్కువే! -
వడ్డించడానికి రెడీగా ఉన్న 'రాజుగారి కోడిపులావ్'..!
ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం 'రాజు గారి కోడిపులావ్' కుటుంబ కథా 'వి'చిత్రం అనేది శీర్షిక. ఈ సినిమాకు శివ కోన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సస్పెన్స్ థ్రిల్లర్తో పాటు ప్రేమకథ చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 29న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రిలీజైన పాటలు, వీడియోలు విపరీతంగా ఆకట్టుకున్నాయి. (ఇది చదవండి: కల్యాణ్ రామ్ 'డెవిల్' గ్లింప్స్ రిలీజ్.. కానీ డైరెక్టర్ మిస్సింగ్!) 'రాజు గారి కోడిపులావ్' చిత్రంలో నిర్మాతగా, డైరెక్షన్ బాధ్యతలు వహిస్తూనే శివ కోన ఈ చిత్రంలో డ్యాని పాత్రలో నటించారు. అలాగే అందరికి సుపరిచితుడు అయిన బుల్లితెర నటుడు ప్రభాకర్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. వీరితోపాటు నేహా దేశ్ పాండే, కునాల్ కౌశల్, ప్రాచీ కెథర్, రమ్య దేష్, అభిలాష్ బండారి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ప్రవీణ్ మనీ సంగీతమందించారు. (ఇది చదవండి: అభిమానుల్ని మోసం చేస్తున్న స్టార్ హీరోలు!) -
ఓ వయ్యారి వన్నెలాడి..
శివ కోన, ప్రభాకర్, కునల్ కౌశల్, నేహా దేశ్ పాండే ముఖ్య తారలుగా, ప్రాచి కెథర్, అభిలాష్ బండారి, రమ్య దినేష్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘రాజుగారి కోడిపులావ్’. శివకోన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఇది. అనిల్ మోదుగ మరో నిర్మాత. కాగా ఈ సినిమాలోని ‘సునో సునామీ’ పాట లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘ఔరౌర కన్నె కోడి.. ఓ వయ్యారి వన్నెలాడి’ అంటూ ఈ పాట సాగుతుంది. సంగీత దర్శకుడు ప్రవీణ్ మని స్వరపరచిన ఈ పాటకు మల్లిక్ వల్లభ లిరిక్స్ అందించగా ఎన్సీ కారుణ్య, వైశాలి శ్రీ ప్రతాప్ పాడారు. -
ఏనుగు పిల్లని బలి ఇస్తారా?
బాహుబలి ప్రభాకర్ ప్రధాన పాత్రలో కె.శరవణన్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న విభిన్నాత్మక చిత్రం `పోయే ఏనుగు పోయే`. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే విడుదలై యూట్యూబ్లో మంచి వ్యూస్ రాబట్టుకుని సినిమాపై అంచనాలు పెంచాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూన్ 9న గ్రాండ్గా విడుదలవుతోంది. (ఇదీ చదవండి: చెప్పులు లేకుండా ఫ్యాన్స్ను ఎందుకు కలుస్తానంటే: అమితాబ్) ఈ సందర్భంగా దర్శక నిర్మాత కె.శరవణన్ మాట్లాడుతూ... 'బాహుబలి ప్రభాకర్ పాత్ర సినిమాకు హైలెట్గా ఉంటుంది. కొంత మంది నిధిని దక్కించుకోవడానికి ఒక ఏనుగు పిల్లని బలి ఇవ్వాలనుకుంటారు... దాన్ని ఒక కుర్రాడు ఎలా ఆపాడు? తన తల్లి దగ్గరకు ఎలా చేర్చాడు అన్నది కథాంశం. ప్రతి సీన్ అడ్వెంచరస్గా ఆహ్లాదకరంగా ఉంటుంది. అద్భుతమైన గ్రాఫిక్స్తో విజువల్ వండర్గా సినిమాను తీర్చి దిద్దాము. ఈ నెల 9న విడుదలవుతోన్న మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా' అన్నారు. (ఇదీ చదవండి: శ్రీవారి ఆలయం ముందు హీరోయిన్కు ముద్దు పెట్టిన ఆదిపురుష్ డైరెక్టర్) -
యూత్ని ఆకట్టుకునేలా ‘రాజుగారి కోడిపులావ్’
శివా కోన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘రాజు గారి కోడిపులావ్’. కుటుంబ కథా 'వి'చిత్రం అనేది శీర్షిక. ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మించే ఈ చిత్రంలో బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శివ కోన, కునల్ కౌశల్, నేహా దేష్ పాండే, ప్రాచి కెథర్, అభిలాష్ బండారి, రమ్య దినేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా రాజు గారి కోడిపులావ్ సినిమాలోని క్యారెక్టర్లను పరిచయం చేస్తూ అలాగే సినిమా ఔట్ లైన్ కూడా తెలిపే ఒక వీడియోను విడుదల చేశారు. ‘రీయూనిన్ తో కలిసిన 6 మంది స్నేహితులు.. సరదాగా గడపడానికి ఒక అడవి ప్రాంతానికి వెళ్తారు. అక్కడ ఊహించని సంఘటనలు ఎదురైతాయి. ఆ సంఘటనల నుంచి తమ ప్రాణాలు కాపాడుకోవడానికి వారు చేసే పోరాటమే ‘రాజుగారి కోడిపులావ్’. యూత్ని ఆకట్టుకునే అంశాలతో ఈ మూవీని గ్రాండ్గా తెరకెక్కించాం’అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
ఆ స్టార్ హీరో మూడు పెళ్లిళ్ల విషయం దాచి నాతో పెళ్లి, గర్భం..: నటి
చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ ఆరంభించిన అంజు తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ సినిమాలు చేసింది. హీరోయిన్గానూ చేసిన ఆమె తర్వాత బోల్డ్ పాత్రల్లో ఎక్కువగా నటించింది. 17 ఏళ్ల వయసులో ఆమె తీసుకున్న నిర్ణయం తన జీవితాన్నే తలకిందులు చేసింది. తన కంటే 31 ఏళ్లు పెద్దవాడైన నటుడిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? ఎందుకు విడిపోయారు? వంటి కారణాల గురించి తాజా ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చింది. 'మా అమ్మ నేను ఏడాదిన్నర వయసున్నప్పుడు నన్ను వెంటపెట్టుకుని ఓ సినిమా వంద రోజుల ఫంక్షన్కు వెళ్లింది. అక్కడ డైరెక్టర్ మహేంద్రన్ సర్ చూసి నన్ను సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా తీసుకున్నాడు. అలా నా కెరీర్ మొదలైంది. ఇప్పుడు సీరియల్స్ చేస్తున్నాను. కానీ అమ్మానాన్నకు నేను సినిమాల్లోకి రావడం ఇష్టం లేదు. నా పెళ్లి అనుకోకుండా జరిగిపోయింది. అప్పుడు నేను కన్నడ సినిమా చేయడానికి బెంగళూరు వెళ్లాను. అప్పుడు కన్నడ స్టార్ హీరో టైగర్ ప్రభాకర్ నన్ను చూసి ఇష్టపడ్డారు. నా ముందు పెళ్లి ప్రపోజల్ పెట్టారు. ఆయనకు అప్పటికే భార్యాపిల్లలు ఉన్నారు. కానీ ఆ విషయం దాచిపెట్టాడు. అప్పుడు నా వయసు 17 ఏళ్లు మాత్రమే! నేనిప్పుడు పెళ్లికి రెడీగా లేనని చెప్పాను. అయినా సరే నా వెంటపడ్డాడు. దీంతో అమ్మానాన్నను అడిగి చెప్తానన్నాను. ప్రభాకర్ వయసు దాదాపు 50 ఏళ్లు ఉంటుంది.. అతడిని చూడగానే అమ్మానాన్న ఈ పెళ్లే వద్దన్నారు. కానీ వాళ్ల మాట వినకుండా ప్రభాకరనే కావాలంటూ ఇంట్లో చెప్పాపెట్టకుండా తన దగ్గరికి వెళ్లిపోయాను. తనను ఎంతో నమ్మాను. తీరా ఆయన ఇంటికి వెళ్లాక అప్పటికే ప్రభాకర్కు మూడు పెళ్లిళ్లు అయిపోయి పిల్లలు ఉన్నారని తెలిసింది. దాని గురించి ప్రశ్నించినందుకు నేను చెడ్డదాన్ని అయిపోయాను. నాకు చాలా బాధేసింది. తప్పుడు నిర్ణయం తీసుకున్నానని కుంగిపోయాను. పైగా నేను గర్భిణిని. అయినా సరే అతడితో కలిసి ఉండటం ఇష్టం లేక ఇంటికి వచ్చేశాను. నా బంగారం కూడా అక్కడే లాకర్లో పెట్టి ఒంటిచేత్తో తిరిగొచ్చేశాను. ఆ ఇంట్లో నుంచి వెళ్లేపోయేటప్పుడు ప్రభాకర్తో ఒక్కటే మాట చెప్పాను.. నన్ను చాలా బ్యాడ్ చేశావు. ఈ ఇంటి నుంచి వెళ్లిపోతున్నాను. ఇంకెన్నడూ ఈ ఇంటి గడప తొక్కను. నువ్వు చచ్చినా నీ ముఖం చూడను అని చివరిసారిగా మాట్లాడి అక్కడి నుంచి వచ్చేశాను. ఆ తర్వాత చాలా కాలంపాటు డిప్రెషన్లో ఉండిపోయాను. నెమ్మదిగా దాని నుంచి తేరుకుని తిరిగి ఇండస్ట్రీలో అడుగుపెట్టి కొనసాగుతున్నాను' అని చెప్పుకొచ్చింది అంజు. -
వేముల ప్రభాకర్కు కీర్తి పురస్కారం
జగిత్యాల: పట్టణానికి చెందిన ప్రముఖ కవి రచయిత వేముల ప్రభాకర్కు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం ప్రకటించింది. వేముల ప్రభాకర్ శ్రీవరకవి భూమాగౌడుశ్రీ నవల రచనకు గాను కీర్తి పురస్కారం ప్రకటించగా ఈనెల 28న అందుకోనున్నారు. ఇప్పటివరకు మూడు నవలలు, ఒక కథ సంపుటి, ఆరు కవిత సంపుటిలు, స్వీయరచనతో పాటు రెండు సాహితీ గ్రంథాలు, ఒక మాసపత్రిక వారి సంపాదకత్వంలో వెలువడ్డాయి. ఈ సందర్భంగా వేముల ప్రభాకర్ను సాహితీవేత్తలు, విద్యావేత్తలు, రచయితలు అభినందించారు. -
మళ్లీ పిలిపించే అవసరం రాకుండా చూసుకోండి! బతుకుజీవుడా అని బయటపడ్డా!
ఏ ప్రభుత్వానికైనా ఆబ్కారి ఆదాయం ముఖ్యమైందే. తెలుగు రాష్ట్రాల్లో కల్లుగీత అనుమతులు, అమ్మకాలు మొదట్లో వేలం ద్వారా జరిగేవి. తర్వాత కల్లుగీత సహకార సంఘాలు ఏర్పాటుచేసారు. అవి కూడా సక్రమంగా పని చేయడం లేదని వాటిని కుదించి దున్నే వాడికే భూమి అన్నట్లుగా గీసేవాడికే చెట్టు Tree for Tapper అన్నారు. పథకం ఏదైనా, ఏ పార్టీ అధికారం లోనున్నా ప్రభుత్వ ఆదాయం దెబ్బతినకుండా చూసే పని చేసేది ఎక్సైజ్ శాఖ, వాళ్ళ పనితీరుకు అదే గీటురాయి. ప్రభుత్వ ఖజానా నిండినంత కాలం ఆ శాఖ అవినీతి గురించి పాలకులు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. అబ్కారి శాఖలో మామూళ్లు మామూలే! కాదు కూడదు అంటే తప్పు చేసినా చేయకున్నా కల్తీకల్లు కేసులు తప్పవని గీత కార్మికులకు తెలుసు. హైదరాబాద్ నగర శివార్లలో ముఖ్యంగా దూల్ పేట ప్రాంతంలో విచ్చలవిడిగా గుడుంబా తయారీ, అమ్మకాలు జరిగిన రోజుల్లో తమ కల్లు అమ్మకాలు పూర్తిగా దెబ్బతింటున్నాయని గీత సంఘాలు రోడ్డెక్కిన రోజుల్లో మాచర్ల జగన్నాధం గారి' పరిశ్రమ' పత్రికలో ' కల్తీ సారా కల్పతరువు రాజధానిలో దూల్ పేట ' పేర నేనొక వ్యాసం రాస్తూ అబ్కారి శాఖ, స్థానిక పోలీస్ సిబ్బంది అవినీతి గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. అది 22 అక్టోబర్ 1974 సంచికలో ప్రచురితమై, అంచెలంచెలుగా ఆనాటి ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లోనున్న అధికారులు అనధికారుల దృష్టిలో పడి చివరికి విచారణకు దారితీసింది. నేనా రోజుల్లో హైదరాబాద్ లోని ఒక సహకార సంస్థలో ఉద్యోగం చేస్తూ చాదర్ ఘాట్ ప్రాంతంలో ఉండేవాణ్ణి. తెల్లవారక ముందే ఒక పోలీస్ జవాన్ నన్ను వెతుక్కుంటూ వచ్చి గిట్టనివాడు గుడ్ మార్నింగ్ చెప్పినట్టు నాకు సమ్మన్స్ ఇచ్చి పోలీస్ కమీషనర్ స్థాయి అధికారి ముందు హాజరు కమ్మని చెప్పి వెళ్ళాడు. నేను అద్దెకుంటున్న ఇంటి యజమానే కాదు కొత్తగా కాపురానికి వచ్చిన మా ఆవిడ కూడా భయపడిపోయింది నేనేం నేరం చేసానో? అని. నిజం చెప్పాలంటే నేనూ గాబరాపడిపోయాను, ఎందుకంటే అవి ఎమర్జెన్సీ రోజులు. కేంద్రంలో ఇందిరా గాంధి రాష్ట్రంలో జలగం వెంగలరావు గారల పాలన నడుస్తున్న కాలం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ ఒక్క మాట మాట్లాడినా జైలుకూడు తినాల్సిన పరిస్థితులు. ఎందుకైనా మంచిదని సలహా కోసం ముందుగా పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఒక బంధువు దగ్గరికి వెళ్ళాను. అతను అంతా విని 'అబ్కారి శాఖ ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెడుతుంది, పోలీస్ ప్రభుత్వ పీఠాలను కాపాడుతుంది. ఈ రెండు శాఖలను విమర్శించడానికి మీకు ఎన్ని గుండెలండీ 'అన్నాడు. నాకున్న ఒక్క గుండె అయన మాటలతో దడదడలాడిపోయింది. 'లాభంలేదు, ఎవరన్నా లీడర్ను తీసుకొని వెళ్ళండి, రోజులు బాగాలేవు! 'అని చివరగా సలహా కూడా ఇచ్చి పంపాడు. అసలు నాయకులే లేని రోజులవి, ఉన్నవాళ్లు జైలు ఊచలు లెక్కబెడుతున్నారాయె. అధికారి మంచివాడైతే ఆయనే అర్థం చేసుకుంటాడని పోలీస్ కమీషనర్ గారి కార్యాలయంలో ఒక్కణ్ణే విచారణకు హాజరయ్యాను. ఆయనో యువఅధికారి, అదృష్టవశాత్తు సౌమ్యుడు కూడా. ఒక ఫైల్ తీసి నా ముందు పెట్టాడు. అందులో దూల్ పేట గుడుంబా వ్యాసమే కాకుండా అదే పరిశ్రమ పత్రికలో నేను రాసిన 'దేశ రాజధానిలో నల్లమందు వ్యాపారం విచ్చలవిడి (ఆనంద ఉగాది సంచిక )' మత్తు పదార్థాలకు బానిసలవుతున్న మన విద్యార్థులు (18జూన్ 1974 సంచిక ), పోలీసులను దొంగలుగా మారుస్తున్న తమిళనాడు ప్రోహిభిషన్ చట్టం (31డిసెంబర్ 1974 సంచిక )కాక మరో మూడు వ్యాసాల పేపర్ కటింంగ్స్ ఉన్నాయి. ' మీరు హైదరాబాద్ లో ఉన్నారు, దూల్ పేట వ్యాపారం గురించి తెలిసుండొచ్చు, గీత కార్మికుల కుటుంబం నుండి వచ్చారు, కల్లు గురించి రాసుంటారు కానీ డ్రగ్స్ గురించి ఎలా రాస్తున్నారు?' అన్నాడాయన. జాతీయ స్థాయి పత్రికల్లో వచ్చిన వార్తలే నా వ్యాసాలకు ఆధార మన్నాను. 'చట్ట సభల్లో ప్రభుత్వ అవినీతి గురించి ప్రజా ప్రతినిధులు ఎన్ని ఆరోపణలు చేసినా వాళ్లకు రక్షణ ఉంటుంది,కానీ జర్నలిస్ట్ రచనలు పక్కా ఆధారాలు లేందే రాస్తే ఇబ్బందుల్లో పడతారు 'అన్నాడు. నిజమే కానీ జర్నలిస్టులు పూర్తి స్థాయి దర్యాప్తు చేయలేరు కదా! వాళ్ళిచ్చిన క్లూను ప్రభుత్వం వాడుకొని సమగ్ర విచారణ చేస్తే వాస్తవాలు బయటికొస్తాయి అన్నాను నేను. ' మీ వ్యాసల్లోనున్న సామాజిక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విచారణ ను ఇంతటితో ముగిస్తున్నాను, మళ్ళీ ఇంకోసారి మిమ్మల్ని పిలిపించే అవసరం రాకుండా చూసుకొండి 'అన్నాడు. నేను బతుకుజీవుడా! అని బయట పడ్డాను. -వేముల ప్రభాకర్ -
గ్రాండ్ సాంగ్.. భారీ ఫైట్
‘బాహుబలి’ ప్రభాకర్ ప్రధాన పాత్రలో పాలిక్ (పాలిక్ శ్రీనివాసా చారి) దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. రమేష్ రావుల నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ‘బాహుబలి’ ప్రభాకర్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నా పాత్ర కొత్తగా ఉంటుంది. ప్రస్తుతం ఫైట్ సీన్ షూటింగ్ జరుగుతోంది’’ అన్నారు. ‘‘సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా రూపొందిస్తున్నాం. ప్రభాకర్పై ఓ పాటను గ్రాండ్గా చిత్రీకరించాం. ఇప్పుడు రవి మాస్టర్ సారథ్యంలో ప్రభాకర్పై భారీ ఫైట్ చిత్రీకరిస్తున్నాం. వింద్యా రెడ్డి మంచి కథ అందించారు. జాన్ భూషణ్ మూడు అద్భుతమైన పాటలిచ్చారు’’ అన్నారు పాలిక్. ‘‘మార్చిలో చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అన్నారు రమేష్ రావుల. -
Telangana: ఆ కవుల గురించి మీకు తెలుసా?
'ఎంతో మంది చనిపోతున్నారు అందులో కొద్ది మంది మాత్రమే తమలోని అధ్బుతమైన ఆలోచనలు ఈ లోకానికి పంచిపోతున్నారు ' అంటాడు టాడ్ హెన్రీ (Die Empty ) తమ వ్యక్తిగత జీవితంలో ఎన్ని కష్టనష్టాలైనా భరించి అలా సమాధిలోకి వెళ్ళడానికి ముందే రచనల ద్వారా తమలోని ప్రతిభా ఉత్పత్తులను పంచిపోయిన కవులు రచయితలు తెలంగాణలో ఎందరో ఉన్నారు. వేల సంవత్సరాలు గడిచినా ప్రజల్లో ఈనాటికీ ఆ సాహిత్యం నిలిచివున్నా వారి జ్ఞాపకాలే చెదిరిపోతున్నాయి,వారి సమాధులు కూడా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. కన్నడ ఆదికవి అనిపించుకున్న పంప ( 902-975 AD) అంతటి కవి సమాధి నిజామాబాదు బోధన్లో నామమాత్రంగా మిగిలిపోయింది. తెలుగు ఆదికవి అంటున్న నన్నయ కాలానికే చెందినవాడుగా, కరీంనగర్ వేములవాడ ప్రాంతీయుడుగా భావిస్తున్న చాటుపద్య కవి వేములవాడ భీమకవికి అక్కడ చిన్న స్మారకం కూడా పెట్టకుండా చాటుకే ఉంచేసారు. కాకతీయుల కాలంనాటి శాసనకవి నగునూరు పాలకుడు ఎన్నో దేవాలయాలు నిర్మించిన వెల్లంకి గంగాధరుడిని పట్టించుకున్న వారే లేరు. తెలుగులో తొలి వచన కావ్యకర్త, వచన సంకీర్తనా వాంజ్ఞయానికి మూలపురుషుడు అనిపించుకున్న సింహగిరి వచనాల కృష్ణమాచార్య సంతూరు తెలంగాణ వాడే అయినా ఆయన పేరిట ఏదీ ఎక్కడా లేదు. మహా పండితుడు,సంస్కృత పంచ మహాకావ్యాలకు వ్యాఖ్యానాలు రాసి ప్రసిద్ధుడైన కోలాచలం మల్లినాధ సూరి (14వ శతాబ్దం) మెదక్ జిల్లా కొలిచెలమ /కొల్చారం వాడే అయినా ఆయనను తలుచుకునే పని ప్రభుత్వం చేసింది లేదు. భాగవతకర్త పోతన అంతటి మహానుభావుడికి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడో బమ్మెరలో తలపెట్టిన 'పోతన స్మృతివనం' రూపురేఖలు ఇప్పటికీ అస్పష్టంగానే ఉన్నాయని ఇటీవల ఆ గ్రామానికి వెళ్ళివచ్చిన సాహితీ మిత్రుడు తుమ్మూరి రామ్మోహన్ రావు గారు వాపోయారు. తుమ్మూరి స్వగ్రామం కరీంనగర్ జిల్లా ఎలగందులకు చెందిన పూర్వకవి, పోతనామాత్యుని శిష్యుడు, భాగవతంలోని ఏకాదశ ద్వాదశ స్కందాలను రచించిన వెలిగందుల నారయకవి స్మారకం వంటిదేదీ ఆ గ్రామంలో ఈనాటికీ లేదని వారు చెబుతుంటే అశ్చర్యం వేసింది. ప్రతియేటా మాతృభాషా దినోత్సవాలు మొక్కుబడిగా జరపడం కాదు ఆ భాషను నిలబెట్టడానికి తమ ప్రాణాలను దారపోసిన కవులు రచయితలను తలుచుకోవడం అవసరం. -వేముల ప్రభాకర్, అమెరికా నుంచి -
భక్త రామదాసు నేలకొండపల్లిలో ప్రాచీన బౌద్ధ క్షేత్రం!
భక్త రామదాసు అనగానే ముందుగా అందరూ చెప్పేది ఆయన శ్రీ రాముని ఆలయం నిర్మించిన (1664) భద్రాద్రి గురించి. రామదాసుగా ప్రసిద్ధుడైన కంచెర్ల గోపన్న (1620-1688) పుట్టిన ఊరు నేలకొండపల్లిలో వారి స్వగృహం (ఇప్పుడు ధ్యాన మందిరంగా మార్చారు) వారి ఇష్టదైవం శ్రీరాజగోపాలస్వామి గుడి ఉన్నాయి. రామదాసు జగమెరిగిన రామ భక్తుడు, ఆయన కీర్తనల్లో, దాశరథి శతకంలో వినబడేది రామకథనే, కాని వారి ఊరు మాత్రం మహాభారత కథతో (విరాట్రాజు దిబ్బ, కీచకగుండం లాంటివి ) ముడిపడి ఉండడం విశేషం. అంతేకాదు నేలకొండపల్లి క్రీ శ2-6 శతాబ్దుల మధ్య కాలంలో ప్రసిద్ధమైన బౌద్ధమత కేంద్రం కావడం మరో విశేషం. ఆ కాలంలో ముడి ఇనుముతో, పంచలోహలతో ఇక్కడ తయారైన బుద్ధ విగ్రహాలు దక్షిణ భారత మంతా పంపిణీ చేయబడేవట. నేలకొండపల్లి ఎర్రమట్టిదిబ్బలో 1976 లో జరిగిన పురావస్తు తవ్వకాల్లో బయటపడిన అమరావతి కన్నా పెద్దదిగా భావించబడే బౌద్ధస్తూపం ఈ గ్రామ చరిత్రనే మార్చేసింది. ఈ చక్రాకార స్తూపం చుట్టూ 180 ఎత్తు 16మీ గా 2 ఎకరాల స్థలంలో నిర్మించబడింది. దీనిపైనున్న బ్రాహ్మి లిపి శాసనాన్ని క్రీ శ 3-4 శతాబ్దులదిగా భావిస్తున్నారు. స్తూప పరిసరాల్లోని దాదాపు నూరు ఎకరాల్లో మజ్జుగూడెం వరకు బౌద్ధ బిక్షుల నివాసాలు, నల్లదిబ్బ ప్రాంతంలో చైత్యాలు, మట్టిబొమ్మలు,నీటితొట్టెలు, బైరాగిగుట్ట వద్ద విగ్రహాల తయారీ కేంద్ర శిథిలాలు బయట పడ్డాయట. ఇక్కడున్న బాలసముద్రం సరస్సులో ఒక జాలరి వలకు చిక్కిన బుద్ధుని పంచలోహ విగ్రహం చాలా విలువైనదట. బాదనకుర్తి, ఫణిగిరి,ధూళికట్ట బౌద్ధ క్షేత్రాల్లా దీన్ని నిర్లక్ష్యం చేయకుండా పురావస్తు శాఖవారు శిథిలమైన నేలకొండపల్లి బౌద్ధ స్తూపానికి పూర్వరూపం తేవడంతో ఇది దేశ విదేశ బౌద్ధ యాత్రికులను ఆకర్శించడం సంతోషకరం. -వేముల ప్రభాకర్ -
న్యాయవాదులకు వరం ‘లా నేస్తం’
సాక్షి, అమరావతి: ఏపీ అమలు చేస్తోన్న డాక్టర్ వైఎస్సార్ లా నేస్తం, న్యాయవాదుల సంక్షేమ నిధి పథకాలు న్యాయవాదులను ముఖ్యంగా జూనియర్ న్యాయవాదులను ఆదుకుంటున్నారని న్యాయశాఖ కార్యదర్శి జి.సత్యప్రభాకర్రావు చెప్పారు. మంగళవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. లా నేస్తం, సంక్షేమ నిధి పథకాలతో న్యాయవాదులు పొందుతున్న ప్రయోజనాలను ఆయన వివరించారు. ప్రస్తుత పోటీ పరిస్థితుల్లో జూనియర్ న్యాయవాదులు న్యాయవాద వృత్తిలో నిలదొక్కుకోవడం కష్టమని, అలాంటి వారిని ఆదుకునేందుకే లా నేస్తం పథకానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారన్నారు. 2019 అక్టోబర్ నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఈ పథకం కింద జూనియర్ న్యాయవాదికి నెలకు రూ.5 వేల చొప్పున మూడేళ్ల పాటు స్టైఫండ్ చెల్లిస్తున్నట్లు చెప్పారు. గత మూడున్నర ఏళ్లలో 65,537 మంది న్యాయవాదులకు రూ.34.39 కోట్లను స్టైపెండ్ రూపంలో చెల్లించామని చెప్పారు. న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్ల కార్పస్ఫండ్తో సంక్షేమ నిధిని ఏర్పాటు చేశామన్నారు. ఈ సంక్షేమ నిధి నుంచి అర్హులైన న్యాయవాదులకు వైద్య ఖర్చులు, లా పుస్తకాలు, మేజర్ ఆపరేషన్లు, ఇన్సూరెన్స్ వంటి అత్యవసరాలకు నిధులను కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఈ నిధి ద్వారా ఇప్పటివరకు 7,733 మంది న్యాయవాదులకు రూ.25 కోట్ల మేర సాయం చేసినట్లు చెప్పారు. -
సిర్నాపల్లి సంస్థానాన్ని అభివృద్ధి పథంలో నడిపిన రాణి కథ తెలుసా? 1905లోనే..
రాజులైనా, సంస్థానాధిపతులైనా, ప్రజాస్వామ్యంలోనైనా పాలకులు చేసిన మంచిని ప్రజలు ఎంత కాలమైనా మరిచిపోరనడానికి నిజామాబాద్కు 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న సిర్నాపల్లి గ్రామాన్ని ఉదాహరణగా చెప్పవచ్చు. చుట్టుముట్టు దట్టమైన అడవి వున్నా ఒకప్పుడు దాదాపు వంద గ్రామాల సంస్థానంగా వెలుగు వెలిగిన గ్రామం సిర్నాపల్లి. దాన్ని బహుకాలం(1859-1920) ఏలిన రాణి శీలం జానకీ బాయి. రాణిగారు తవ్వించిన చెరువులు, కుంటలు, కాలువల వల్ల ఈ ప్రాంతంలో వ్యవసాయం అభివృద్ధి చెందిందని, ఆమె పట్టుదల వల్లనే ఆనాటి నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ 1899 లో తలపెట్టిన హైదరాబాద్-బోధన్ -మన్మాడ్ రైల్వే లైన్ను సిర్నాపల్లి, ఇందూర్(నేటి నిజామాబాద్ )ల వైపు తిప్పారని, ఫలితంగా తమకు 1905లోనే రైలు సౌకర్య భాగ్యం కలిగిందని, ఇందల్వాయి రామాలయాన్ని ఆమెనే నిర్మించిందని గ్రామస్తులు ఇప్పటికీ జ్ఞాపకం చేసుకుంటుంటారు. పోలీస్ చర్య తర్వాత భారత్లో విలీనమైపోయిన హైదరాబాద్ రాజ్యంతో పాటు నాటి సంస్థానాలు 14 కూడా తమ అధికారాన్ని వదులుకున్నాయి. తెలంగాణ సాయుధ పోరాట తాకిడితో సిర్నాపల్లి రాణిగారి వారసులు గ్రామాన్ని విడిచిపెట్టక తప్పలేదు. ఆ తర్వాతి కాలంలో వచ్చిన నక్సలైట్ ఉద్యమంతో దాదాపు 5 ఎకరాల్లో విస్తరించివున్న సిర్నాపల్లి కోటగడి ప్రభుత్వ బడిగా మారిపోయింది. రాణి జానకీబాయి (1859-1920) వేల్పూర్ రేకులపల్లిలోని ఒక సామాన్య రైతు కుటుంబం నుండి వచ్చిందంటారు. వేటకు వచ్చి అడవిలో తప్పిపోయి, ప్రమాదకర పరిస్థితుల్లోనున్న ఒక నవాబుకు, అడవిలోకి వంటచెరుకు కోసం వచ్చిన ఒక 12 సంవత్సరాల బాలిక దారి చూయించి ఆదుకున్నదని, అతను ఆమె ధైర్య సాహసాలను నిజాం దృష్టికి తీసుకుపోవడంతో రాజు జానకీ బాయి అనే ఆ బాలికను సంస్థాన పాలకరాలుగా నియమించాడన్నది ప్రచారంలో నున్న ఒక కథ. అయితే భర్త అకాల మరణంతో అధికారాన్ని చేపట్టిన జానకీ బాయి సంస్థానాన్ని పాపన్నపేట రాణి శంకర్మమ్మలా సమర్థవంతంగా నడిపి 'మషాల్ దొరసాని'గా (పగలే దివిటీలు వెలగడం ) పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందని చరిత్ర. రాణిగారికి సంస్థాన పాలనలో లింగన్న అనే పట్వారి కీలక పాత్ర పోషించాడని చెప్పుకుంటారు. పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి శీలం రాంభూపాల్ రెడ్డి గారు, INTACH అనబడే సాంస్కృతిక వారసత్వ సంస్థ కన్వీనర్ అనురాధా రెడ్డి గారు రాణి జానకీ బాయి వారసులేనట. తెలంగాణ నయాగరాగా పేరొందిన సిర్నాపల్లి వాటర్ ఫాల్స్ రాణి జానకీ బాయి పేరుతో పిలువబడడం ఆమెకున్న ప్రజాదరణను తెలుపుతుంది. -వేముల ప్రభాకర్, అమెరికా డల్లాస్ నుంచి చదవండి: వేదామృతం.. గీతామృతం.. ఏదైనా నీరా ప్రియం! -
బండ సొరికలలో గుండుకు వెలిసిన కొమురెల్లి మల్లన్న!
మాదిరాజు- మాదమ్మ దంపతుల సంతానంగా చెప్పబడే మల్లికార్జునుడిని పరమశివుడి అవతారంగా భావించి కొలవడం వీర శైవ సంప్రదాయం. సికింద్రాబాద్ నుంచి కరీంనగర్ వెళ్లే మార్గంలో సిద్ధిపేట సమీపంలో నున్న కొమురవెల్లిలో మల్లికార్జునుడు 'బండ సొరికలలో గుండుకు వెలిసిన మల్లన్నదేవుడి' గా ఇరుపక్కల గొల్ల కేతమ్మ, లింగబలిజ మేడలమ్మ దేవేరులతో పూజలందుకుంటున్నాడు. ఈ క్షేత్రానికి ప్రధానంగా వచ్చే భక్తులు యాదవ, గొల్ల, కురుమ, లింగబలిజలని చెప్పవచ్చు. కొమురవెల్లికి దాదాపు 20 కి మీ దూరంలోనున్న' కొండ పోచమ్మ'ను మల్లన్న స్వామి అక్కగా భావించి భక్తులు అక్కడికీ వెళ్తుంటారు. ప్రతియేటా సంక్రాతి నుండి ఉగాది వరకు జరిగే ఈ జాతరలో మొదటి ఆదివారం 'లష్కర్ బోనాల'కు హైదరాబాద్ నుంచి యాదవులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. గంగరేణి చెట్టు కింద పట్నాలు మల్లన్న ఆలయం ముందున్న గంగరేణి చెట్టు కింద జరిగే పట్నాలు అనబడే ముగ్గు పూజలు విశేషమైనవి. పసుపు రంగు బట్టలు వేసుకొని, జగ్గువాద్యం పట్టుకున్న ఒగ్గు పూజారులు విశాలమైన ముగ్గులు వేసి మధ్యలో స్వామిని పెట్టి, ఆవాహనం చేసి పూజలు చేస్తుంటారు. బహు పాత్రాభినయం చేస్తూ, గ్రామీణుల భాషలో, పిట్ట కథలు జోడించి, ఆడుతూ పాడుతూ ఒగ్గులు చెప్పే కథలు విన సొంపుగా ఉంటాయి. జాతర చివరలో కామదహనం ఈ కళలో ప్రసిద్దులైన వారు, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అసలు సిసలు తెలంగాణ కళాకారులు వరంగల్కు చెందిన చుక్క సత్తయ్య ( 1935-2017), కరీంనగర్ మిద్దె రాములు( 1941-2010) లాంటివారు. కొమురెల్లి జాతర చివరలో కామదహనం ఉంటుంది. అగ్ని ప్రతిష్ఠ చేసి, కణకణ మండే నిప్పులు తొక్కుతూ అగ్ని గుండాలు దాటడం వీరశైవ ఆచారం. 'శివసత్తుల' ఆచారం మల్లన్న ఆలయ ప్రాంగణంలోనే వున్న చిన్న ఉపాలయం రేణుకా చార్యుడిది. వీర శైవ సంప్రదాయం లోని పంచాచార్యులలో రేణుకాచార్య ప్రధముడు. వీర శైవులు పవిత్ర గ్రంధంగా భావించే 'శ్రీ సిద్ధాంత శిఖామణి'ని బోధించింది వీరే నంటారు. తెలుగు రాష్ట్రాల్లోని వృత్తి కులాలవారు చాలా మంది శైవ సంప్రదాయికులే కావడం, ముఖ్యంగా తెలంగాణలో యాదవ కులాలవారు ఆ రోజుల్లనే వీరశైవం వైపు ఆకర్శించబడడం, 'శివసత్తుల' ఆచారం వంటి అంశాలు ఆసక్తికరం, పరిశోధకులు దృష్టి పెట్టాల్సిన విషయాలు. 'మల్లన్నసాగర్ ' పేరిట కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించిన జలాశయానికి 'మల్లన్నసాగర్ 'అని పేరు పెట్టడమే కాకుండా,గత సంవత్సరం ఫిబ్రవరిలో ఆ నీటితోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వామి పాదాలు కడిగితే, అదేయేడు డిసెంబర్లో రాష్ట్ర మంత్రి హరీష్ రావు ప్రభుత్వం తరపున కోటి రూపాయలు విలువైన బంగారు కిరీటాన్ని మల్లన్న కల్యాణ వేడుకల్లో సమర్పించారు. -వేముల ప్రభాకర్, అమెరికా నుంచి -
అనంతగిరిలో విశ్రాంతి తీసుకుంటున్న శ్రీ పద్మనాభ స్వామి!
శ్రీ వైష్ణవ సంప్రదాయానికి చెందిన, ఆళ్వార్ల రచనల్లో ప్రస్థావించబడిన, లక్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువుకు సంబందించిన దివ్య దేశాలు 108 కాగా ఇందులో భారత్లో ఉన్నవి 105 మాత్రమే, ఒకటి నేపాల్ లో ఉండగా మిగతా రెండు ఈ భూలోకంలో కాదు అక్కడెక్కడో, అల వైకుంఠపురంలో ఉన్నాయంటారు. ఇందులో ఎక్కువ కెక్కువ ఉన్నది తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో. ఆంధ్రప్రదేశ్లో నున్న రెండు ఆలయాలు తిరుమల, అహోబిలంలు. భారత్లోనే అత్యంత సంపన్నవంతమైన దేవాలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీ అనంత పద్మనాభ పెరుమాళ్ ఆలయం కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉంది. ఈ లెక్కలోకి రాకున్నా హైదరాబాద్కు 75 కిమీ దూరంలో వికారాబాద్ అనంతగిరి కొండల్లోని ప్రశాంత వాతావరణంలో మనకూ ఒక అనంత పద్మనాభ స్వామి ఉన్నాడు. ఆది శేషునిపై పవలించిన విష్ణువు, ఎడమ వైపు లక్మీ దేవి కూర్చున్నట్లుగా ఉన్న ఈ ఆలయానికి దాదాపు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉందంటారు. నిజాం ప్రభుత్వం లో ప్రధాన మంత్రిగా ( 18931901)పనిచేసిన నవాబ్ సర్ వికారుల్ ఉమ్రా బహదూర్ జాగీర్ కావడం వల్ల దీనికి ’వికారాబాద్’ అన్న పేరు వచ్చిందట. అంతకు పూర్వం ఇది గంగవరంగా పిలువబడిందట. హైదరాబాద్ గుండా ప్రవహించే మూసీ నది పుట్టింది వికారాబాద్ అడవుల్లోనే. వికారాబాద్ చల్లటి ప్రాంతం కావడం, అక్కడ లోయలు, కొండలతో మంచి అడవి ఉండడం, వర్షా కాలంలో అందమైన జలపాతాలు ప్రత్యక్ష మవడం వల్ల నిజాం నవాబులు ఆ రోజుల్లోనే దీన్ని విశ్రాంతి కేంద్రంగా వాడుకున్నారట. ఇక్కడున్న వనాలు వాటిలోని ఔషద గుణాలు గమనించి 1946లోనే ఇక్కడ క్షయ వ్యాధిగ్రస్తుల కోసం ఒక టీబీ సానెటోరియం పెట్టడం విశేషం. ఓ సారి అడవుల్లోకి వేటకు వచ్చి అలసిసొలసి పడుకున్న నిజాం (మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ ) కలలోకి వచ్చిన స్వామి తన ఆలయాన్ని పునరుద్దరించమన్నాడని, ఆ ఆదేశాన్ని రాజు గారు పాటించారని చెబుతారు. -వేముల ప్రభాకర్, అమెరికాలోని డల్లాస్ నుంచి చదవండి: ఉజ్జయిని మహంకాళి ఆలయానికి ఊపిరులూదిన అప్పయ్య బోయీ! -
ఉజ్జయిని మహంకాళి ఆలయానికి ఊపిరులూదిన అప్పయ్య బోయీ!
ప్రభువెక్కిన పల్లకి కాదోయి అది మోసిన బోయీలెవ్వరు అన్నాడు శ్రీ శ్రీ. రాజులూ రాణుల పల్లకిలే కాదు యుద్దాలు జరిగినప్పుడు గాయపడ్డ సైనికులను చికిత్స కోసం శిబిరాలకు చేర్చడానికి కూడా రాజులు బోయీల సేవలను వాడుకున్నారు. అలా అంగ్లేయుల పాలనా కాలంలో సికింద్రాబాద్ మిలిటరీ బటాలియన్లో ఒక 'బోయీ'గా పని చేసినవాడు సూరిటి అప్పయ్య. 1813 వ సంవత్సరంలో హైదరాబాద్, సికింద్రాబాదులలో ప్లేగు మహమ్మారి విజ్రుoభించి వేలాది మంది జనం కుప్ప తెప్పలుగా చనిపోతున్న కాలంలో బెటాలియాన్తో పాటు మధ్య భారత్ లోని ఉజ్జయినికి బదిలీ పై వెళ్లిపోయాడు అప్పయ్య. అంతేకాదు అక్కడున్న మహంకాళి ఆలయానికి వెళ్లి తనకోసమో తన కుటుంబం కోసమో కాదు అందరికోసం తల్లీ! ఈ మహా విపత్తు నుండి మానవాళిని కాపాడుమని, అదే జరిగితే సికింద్రాబాద్ లో ఉజ్జయిని అమ్మవారి విగ్రహం పెడతానని, గుడి కడతానని మొక్కుకున్నాడు. 'ఈ సామాన్య బోయీతో అది అయ్యే పనేనా, అయినా సరే భక్తుడిని పరీక్షిద్దా' మనుకుందో ఏమో అన్నట్లుగా ఆ వ్యాధి తగ్గుముఖం పట్టడం, అప్పయ్య సికింద్రాబాద్కు బదిలీ అయి రావడం జరిగిపోయింది. సూరిటి అప్పయ్య తన మాట తప్పకుండా సహచరుల సహాయం కూడా తీసుకొని కర్రతో చేసిన ఉజ్జయిని అమ్మవారి విగ్రహాన్ని నాటి లష్కర్ లోని ఓ ఖాళీ ప్రదేశంలో (1815 జులైలో) ప్రతిష్టించి, చిన్న గుడి కూడా కట్టించాడట. ఆ నిర్మాణ సమయంలో అక్కడున్న ఒక పాత బావిని బాగు చేస్తున్నప్పుడు దొరికిన మాణిక్యాలమ్మ విగ్రహాన్ని కూడా ఆ గుడిలోనే ప్రతిష్టించాడని చెబుతారు. అప్పయ్యనే భక్తుల సహకారంతో (1864 లో )కర్ర విగ్రహం స్థానంలో రాతి విగ్రహం పెట్టించాడంటారు. ఆ తర్వాతి కాలంలో అప్పయ్య కుమారుడు సంజీవయ్య (1900) ఆయన కుమారుడు మేస్త్రి లక్ష్మయ్య ( 1914), అతని వారసుడు కిష్టయ్య వరసగా ఉజ్జయిని మహంకాళి ఆలయ అభివృద్ధికి కృషి చేశారట. ఇంతా జరిగాక 'చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైనయట్లు' అన్నట్లుగా పలుకుబడి గల పెద్దల కమిటీలు రంగ ప్రవేశం చేసి, పూజారి వర్గాన్ని తెచ్చి, చివరికి దేవాదాయ శాఖవారికి ఈ ఆలయాన్ని( 1947 లో ) అప్పగించారట. ఎట్లయితేనేమి,తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాల సందర్బంగా లక్షలాది మంది భక్తులు వచ్చే ఒక ఆలయానికి ప్రభుత్వ అజమాయిషీ అవసరమే కాదనడం లేదు, కానీ అసలు సిసలు ధర్మకర్తలను, ఈ ఆలయాన్ని స్థాపించిన సామాన్యులను ఎవరూ లెక్క చేయక పోవడమే విచారకరం. శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం సికింద్రాబాద్ వారి అధికారిక వెబ్ సైట్ లో , తెలంగాణ ప్రభుత్వ టూరిజం వారి సమాచారంలో 'సూరిటి అప్పయ్య డోలి బేరర్'అని ఒక్క మాట అనేసారే గాని ఈ ఆలయ ఏర్పాటు కోసం అయన పడ్డ పాట్లను చెప్పలేదు, ఈ గుడి కోసం చెమటోడ్చిన అప్పయ్య మూడు తరాల మేస్త్రి వారసుల ప్రస్తావన అసలే తేలేదు. అంతా పల్లకి నెక్కిన ప్రభువులను కొనియాడే వారే, అది మోసిన బోయీల సేవలను గుర్తించే దెవరు? బోనాల పండగ మరుసటి రోజు 'భవిష్య వాణి' కోసం మాతంగి స్వర్ణలత చుట్టూ మూగేవారే అందరూ కానీ తరతరాలుగా ఆ భాగమ్మలు జోగమ్మలు పడుతున్న బాధలు పట్టించుకునేదెవరు? -వేముల ప్రభాకర్, అమెరికాలోని డల్లాస్ నుంచి చదవండి: కొండగట్టు ఆంజనేయుని ‘వెనకనున్న’ ఆ దంపతులు ఎవరో తెలుసా!
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
కౌంటింగ్ నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు
తంబళ్లపల్లెలో వైఎస్సార్సీపీదే గెలుపు!
ముగిసిన తెప్పోత్సవాలు
పోలీసుల అదుపులో ఒడిశా వేటగాళ్లు
పిడుగుపాటుకు యువకుడికి గాయాలు
తిమ్మాపురంలో విజయ్ దేవరకొండ సందడి
అప్పన్నకు రెండవ విడత చందనం సమర్పణ
ఫ్లైఓవర్పై లారీ బోల్తా
ఇసుకకొండకు పోటెత్తిన భక్తులు
కమనీయం.. కల్యాణోత్సవం
తప్పక చదవండి
- వీడియో: కేదార్నాథ్ ఆలయం వద్ద తృటిలో తప్పిన ప్రమాదం
- T20: బంగ్లాదేశ్కు ఊహించని షాకిచ్చిన పసికూన.. సిరీస్ సొంతం
- రైసీ హెలికాఫ్టర్ క్రాష్: ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో ఏముందంటే..
- ఆపరేషన్ కంబోడియాపై విశాఖ సీపీ కీలక వ్యాఖ్యలు
- తళుకుల మాటున కల్తీమాయ!
- ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, కారు ఢీ.. ముగ్గురి మృతి
- ఉమామహేశ్వరరావు లెక్క ఇంకా తేల్చాల్సి ఉంది!
- తగ్గిన ప్లేస్మెంట్లు.. ఐఐటియన్లకు ఉద్యోగాలు కరువు
- Hyd Viral: మండదా అన్నా.. మండదా అక్కా!
- పచ్చమూక అరాచకం.. ఆనవాళ్లివిగో..
Advertisement