-
సత్య నాదెళ్లకు షాక్.. కార్పొరేట్ వ్యవహారాల శాఖ కొరడా!
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు గట్టి షాక్ తగిలింది. కంపెనీల చట్టం, 2013 ప్రకారం ముఖ్యమైన బెనిఫిషియల్ ఓనర్ (SBO) నిబంధనలను ఉల్లంఘించినందుకు లింక్డ్ఇన్ ఇండియా, దాని మాతృ సంస్థ మైక్రోసాఫ్ట్, సీఈవో సత్య నాదెళ్ల, ర్యాన్ రోస్లాన్స్కీతో సహా పలువురు కీలక వ్యక్తులపై కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూ.27 లక్షల జరిమానా విధించింది.ఈ మేరకు జరిమానాలు వివరిస్తూ 63 పేజీల ఆర్డర్ను రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (RoC) జారీ చేసింది. లింక్డ్ఇన్ ఇండియాతోపాటు ప్రమేయం ఉన్న వ్యక్తులు ఎస్బీఓ రిపోర్టింగ్ నిబంధనలను పాటించడంలో విఫలమయ్యారని ఆర్ఓసీ ఆర్డర్ పేర్కొంది. ప్రత్యేకించి, చట్టంలోని సెక్షన్ 90(1) ప్రకారం అవసరమైన లాభదాయకమైన యజమానులుగా తమ స్థితిని మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల, లింక్డ్ఇన్ కార్పొరేషన్ సీఈవో ర్యాన్ రోస్లాన్స్కీ నివేదించలేదని పేర్కొంది.రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ప్రకారం, లింక్డ్ఇన్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (లింక్డ్ఇన్ ఇండియా), సత్య నాదెళ్ల, రోస్లాన్స్కీ, మరో ఏడుగురు వ్యక్తులపై మొత్తంగా రూ.27,10,800 జరిమానా విధించింది. ఇందులో లింక్డ్ఇన్ ఇండియాపై రూ.7 లక్షలు, సత్య నాదెళ్ల, రోస్లాన్స్కీ ఒక్కొక్కరికీ రూ. 2 లక్షల చొప్పున జరిమానా ఎదుర్కొంటున్నారు. ఇక జరిమానా విధించిన ఇతర వ్యక్తుల్లో కీత్ రేంజర్ డాలివర్, బెంజమిన్ ఓవెన్ ఒర్న్డార్ఫ్, మిచెల్ కాట్టి లెంగ్, లిసా ఎమికో సాటో, అశుతోష్ గుప్తా, మార్క్ లియోనార్డ్ నాడ్రెస్ లెగాస్పి, హెన్రీ చినింగ్ ఫాంగ్ ఉన్నారు. -
‘భళా భారత్’.. జపాన్ కంపెనీ సీఈఓ ప్రశంసల వర్షం
భారత్ సంస్కృతి, సంప్రదాయాలకు జపాన్ టెక్ కంపెనీ కోఫౌండర్ ఫిదా అయ్యారు. భారత్ భళా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించే సత్తా ఈ దేశానికే ఉందంటూ లింక్డిన్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.టెక్ జపాన్ కంపెనీ కోఫౌండర్, సీఈఓ నౌటకా నిషియామా.. తన వ్యాపార కార్యకలాపాల్ని భారత్లో విస్తరించాలని భావించారు. ఇందుకోసం ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాల్ని అర్ధం చేసుకునేందుకు గత నెలలో సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరుకు వచ్చారు.ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లే సత్తా ఈ నేపథ్యంలో భారత్పై ప్రశంసలు కురిపిస్తూ ఓ పోస్ట్ పెట్టారు. ఈ రోజు ప్రపంచం నివసించడానికి అస్తవ్యస్తమైన ప్రదేశంగా ఉందని అన్నారు. అయితే అనేక విషయాల్లో అపార అనుభవం ఉన్న భారత్ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లే సత్తా ఉందన్నారు. ఆశ్చర్యపోయా‘ప్రపంచానికి భారతీయ నాయకత్వం అవసరం. నేను భారతదేశానికి వచ్చి నెలరోజులైంది. దేశంలోని విలువల వైవిధ్యాన్ని చూసి మరోసారి ఆశ్చర్యపోయాను’ అని లింక్డిన్ పోస్ట్లో పేర్కొన్నారు.సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్లు.. వివిధ మతాలు, జాతులు, విలువలతో కూడిన పెద్ద దేశంగా ఉన్నప్పటికీ భారతదేశం ఒకే దేశం కావడం ఒక అద్భుతం. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ల విజయాల్ని ఉదహరించారు. భారత్ పోటీ, సహకారం రెండింటినీ మూర్తీభవించిందని.. ప్రపంచ సంస్థలో నాయకత్వం వహించే సామర్థ్యాన్ని కలిగి ఉందని నిషియామా అన్నారు. వ్యాపార రంగంలో, సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల రెండవ తరం అమెరికన్లు కాదు. వారు ఇక్కడే (భారత్) జన్మించారు. ఇక్కడే చదువుకున్నారు. ఆపై గ్రాడ్యుయేట్ కోసం అమెరికాకు వెళ్లారు. వాళ్లే టెక్ రంగాల్ని శాసిస్తున్నారంటూ భారత్ను కొనియాడుతూ పోస్ట్ చేశారు. నౌటకా నిషియామా పోస్ట్పై నెటిజన్లు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. -
రూ.14వేలకోట్లతో డేటా సెంటర్లు ప్రారంభం.. ఎక్కడంటే..
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల ఇండోనేషియా ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేయడానికి 1.7 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటాంచారు. ఈ ఇన్వెస్ట్మెంట్తో కృత్రిమ మేధ, క్లౌడ్ కంప్యూటింగ్లో కీలక మార్పులు తీసుకురాబోతున్నట్లు తెలిపారు. మంగళవారం సత్యనాదెళ్ల ఆర్చిపెలాగో సంస్థ అధ్యక్షుడు జాన్ఫ్లడ్తో సమావేశం తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు.ఇండోనేషియా ఆగ్నేయాసియాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. దాదాపు 28 కోట్ల జనాభా కలిగిన ఈ దేశంలో ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు డిమాండ్ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. దాంతో కంపెనీ ఈ చర్యలకు సిద్ధమైనట్లు తెలిసింది. ఇండోనేషియా పర్యటనలో భాగంగా సత్యనాదెళ్ల జకార్తా అధ్యక్షుడు జోకో విడోడోతో చర్చలు జరిపారు.ఈ సందర్భంగా సత్య మాట్లాడారు. ‘ఇండోనేషియాలో దాదాపు 1.7 బిలియన్ డాలర్లతో డేటా సెంటర్లు, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేయబోతున్నాం. తరువాతి తరం ఏఐ మౌలిక సదుపాయాలు భవిషత్తులో ఎంతో ఉపయోగపడనున్నాయి. ఇండోనేషియాలోని ప్రతి సంస్థ లార్జ్ ఏఐను సద్వినియోగం చేసుకోవాలి. సమీప భవిష్యత్తులో సంస్థ వేలమందికి ఏఐ శిక్షణ ఇవ్వబోతుంది. 2025 నాటికి ఏషియా ప్రాంతంలో దాదాపు 2.5 మిలియన్ల మందికి ఇందులో శిక్షణ ఇవ్వబోతున్నాం’ అని అన్నారు.ఇదీ చదవండి: టెకీలకు శుభవార్త.. ఈ ఏడాది 10వేల మందికి ఉద్యోగాలుగ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ కెర్నీ చేసిన పరిశోధనలో 2030 నాటికి ఆగ్నేయాసియా జీడీపీలో ఏఐ ద్వారా 1 ట్రిలియన్ డాలర్లు సమకూరుతాయని అంచనా వేసింది. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇటీవల ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ దేశంలో తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు యాపిల్ దృష్టి సారిస్తోందని టిమ్ చెప్పారు. -
టైమ్స్ జాబితాలో 'సత్య నాదెళ్ల'కు చోటు
ప్రపంచంలోనే 100 మంది ప్రభావశీలుర జాబితా-2024లో మన దేశానికి చెందిన పలువురు ప్రముఖులు చోటు సంపాదించారు. వీరిలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియా భట్, రెజ్లర్ సాక్షి మాలిక్, నటుడు దేవ్ పటేల్ తదితరులు ఉన్నారు. టైమ్ మ్యాగజైన్ బుధవారం ఈ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు ప్రత్యేక స్థానం ఉంది. టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో మైక్రోసాఫ్ట్ వినియోగదారులకు మెరుగైన సేవలిందించేందుకు కృషిచేస్తోంది. సత్య సీఈవోగా బాధ్యతలు చేపట్టి ఈ ఏడాది ఫిబ్రవరితో పదేళ్లు ముగిసింది. ఈ కాలంలో చాలా మార్పులు తీసుకొచ్చారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ(ఏఐ)పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి కార్యకలాపాలను పరుగు పెట్టించారు. దీంతో మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ పెరిగింది. గత పదేళ్ల కాలంలో మైక్రోసాఫ్ట్ వాటాదార్ల సంపద దాదాపు 3 ట్రిలియన్ డాలర్లకు చేరింది. సత్య నాదెళ్ల సీఈఓగా బాధ్యతలు చేపట్టిన నాడు 10,000 డాలర్లు పెట్టి మైక్రోసాఫ్ట్ షేర్లు కొనుగోలు చేస్తే, ప్రస్తుతం వాటి విలువ 1,13,000 డాలర్లు అయ్యేది. ఈ సమయంలో ‘అజూర్’ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ను ఆవిష్కరించారు. ఒక చిన్న అంకుర సంస్థకు మైక్రోసాఫ్ట్తో అవసరం ఉండదు, కానీ అటువంటి సంస్థలన్నింటినీ ఓపెన్ ఏఐ ద్వారా అజూర్ ప్లాట్ఫామ్ మీదకు తీసుకురాగలిగారు. దీంతో గూగుల్, అమెజాన్లతో పోల్చితే మైక్రోసాఫ్ట్ పైచేయి సాధించే అవకాశం ఏర్పడింది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద లభించే రాయల్టీపై ఆధారపడటాన్ని తగ్గించారు. ఇదీ చదవండి: గూగుల్లో రూ.10వేలకోట్ల ప్రాజెక్ట్ నిలిపేయాలని డిమాండ్.. పేరు: సత్య నారాయణ నాదెళ్ల తండ్రి: బుక్కాపురం నాదెళ్ల యుగంధర్ తల్లి: ప్రభావతి భార్య: అనుపమ నాదెళ్ల పిల్లలు: ముగ్గురు కుమారుడు: జైన్ నాదెళ్ల కుమార్తెలు: దివ్య నాదెళ్ల, తారా నాదెళ్ల జన్మస్థలం: హైదరాబాద్ వయసు: 56 (2024) జాతీయత: భారతీయుడు పౌరసత్వం: యూఎస్ఏ చదువు: మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ; యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మిల్వాకీ; చికాగో యూనివర్సిటీ వృత్తి: ఇంజినీర్, కంప్యూటర్ సైంటిస్ట్ డెజిగ్నేషన్: మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో -
ఐఏఎస్ ఆఫీసర్ కుమార్తె, బిలియనీర్ భార్య, కానీ బిడ్డలు మాత్రం.. ఎవరీమె?
ఐఏఎస్ ఆఫీసర్ కుమార్తె, హైదరాబాద్లోనే చదువుకుంది. టెక్ దిగ్గజం భార్య. భర్తకు 450 కోట్ల జీతం. ఆమె స్వయంగా ఆర్కిటెక్చర్ గ్రాడ్యుయేట్. అయినప్పటికీ, ఉద్యోగంలో రాణించేందుకు అన్ని అర్హతులున్నా పిల్లలు, భర్త కోసం ఇంటికే పరిమితమైంది. వారి బాధ్యతలే ప్రధానంగా భావించింది. ఇంతకీ ఎవరీమె? తెలుసుకుందాం రండి! అమె మరెవ్వరో కాదు ప్రపంచంలోనే దిగ్గజ సాఫ్ట్ వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సతీమణి అనుపమ ప్రియదర్శిని నాదెళ్ల. అనుగా పాపులర్ అయిన ఈమె.. ఐఏఎస్ అధికారి కేఆర్ వేణుగోపాల్ కుమార్తె. అనుపమ ప్రాథమిక విద్యాభ్యాసం హైదరాబాద్లోనే జరిగింది. తరువాత మణిపాల్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్కిటెక్చర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సత్య నాదెళ్ల తండ్రి, అనుపమ తండ్రి కేఆర్ వేణుగోపాల్ ఇద్దరూ బ్యాచ్మేట్స్. వీరిద్దరి స్నేహం వియ్యానికి దారి తీసింది. సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్లో చేరిన ఏడాదిలోనే (1992)అనుపమ నాదెళ్లను వివాహం చేసుకున్నారు. పెళ్లి నాటికే సత్యనాదెళ్ల అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్. అయినా అనుపమ వీసా దరఖాస్తును యుఎస్ తిరస్కరించింది. దీంతో పర్యాటక వీసాతో కొంతకాలం కలసి ఉండాల్చి వచ్చింది. అయితే అనుపమను అమెరికా తీసుకెళ్లేందుకు, ఇమ్మిగ్రేషన్ వ్యవహరాలను సులభంగా పూర్తి చేసుకుందుకుగాను గ్రీన్ కార్డును వదులుకొని, తిరిగి హెచ్-1బీ వీసా తీసుకున్నారు. చివరికి ఇద్దరూ అక్కడ శాశ్వత నివాసితులయ్యారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. బిడ్డల కోసం అత్యసవరస్థితిలో సిజేరియన్ ద్వారా తొలి చూరు కాన్పులో మగబిడ్డ జైన్కు జన్మనిచ్చింది. కానీ ఈ దంపతుల సంతోషం ఎంతో కాలం నిలవ లేదు. గర్భాశయ శ్వాసలోపం కారణంగా శిశువుగా ఎదగలేదు, తీవరమైన సెరిబ్రల్ పాల్సీ, స్పాస్టిక్ క్వాడ్రిప్లెజియాతో జైన్ బాధపడుతున్నట్లు వైద్యులు తేల్చారు. తరువాత ఇద్దరు కుమార్తెలు తారా,దివ్య పుట్టారు. వీరిలో కూడా ఒకరి లెర్నింగ్ సమస్యలు తలెత్తాయి. దీంతో బిడ్డల కోసం ఆర్కిటెక్ట్గా తన కెరీర్ నుండి తప్పుకుంది. ఇలాంటి ప్రత్యేక పరిస్థితులతో బాధపడుతున్న పిల్లల జీవితాలను అనుపమ నాదెళ్ల సానుకూలంగా తీర్చిదిద్దుకున్నారు. కానీ దురదృష్టవశాత్తూ 2022లో 26 ఏళ్ల కుమారుడు జైన్ మరణం వారి జీవితాల్లో పెద్ద విషాదం. అప్పటినుంచి ఆమె సీటెల్ చిల్డ్రన్స్ హాస్పిటల్, భాగస్వామ్యంతో పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కార్యక్రమాలపై దృష్టి సారించారు. అంతేకాదు భర్త సత్యకు దీర్ఘకాల భాగస్వామిగా, నాదెళ్ల కుటుంబానికి పెద్ద అండగా నిలబడ్డారు. సమస్యలతో ఉన్న బిడ్డల్ని సాదుకుంటూ, వారిని ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ వారి అభివృద్ధికి కృషి చేశారు. మైక్రోసాఫ్ట్ బిలియనీర్ సీఈవో భార్యగా ప్రపంచంలోనే అత్యత్తుమ కంపెనీ సీఈవో భార్యగా భర్తకు వెన్నంటి ఉంటూ ఆయన విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మైక్రోసాఫ్ట్ జనవరి 11న 2.87 ట్రిలియన్లడాలర్ల మార్కెట్ విలువతో ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. 2024 ఫిబ్రవరి నాటికి సత్య నాదెళ్ల నికర విలువ 974 మిలియన్ డాలర్లు. కాగా కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో పని కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతన్నలు, రైతు కూలీలను ఆదుకునేందుకు అనుపమ పెద్ద మనసు చాటుకున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా రైతులు, వ్యవసాయ కూలీల అదనపు ఉపాధి కోసం అనుపమ 2 కోట్ల రూపాయిల విరాళం ప్రకటించారు. అనంతపురం కేంద్రంగా నడుస్తోన్న యాక్షన్ ఫ్రేటార్నా ఎకాలజీ సెంటర్కు ఈ విరాళాన్ని అనుపమ అందచేసిన సంగతి తెలిసిందే. -
మస్క్, జుకర్బర్గ్ ఎలాంటి వారంటే! చెన్నై నుంచి వెళ్లిన తరువాత..
చెన్నైలో పుట్టి అమెరికాలోని అగ్ర కంపెనీలలో పనిచేసిన 'శ్రీరామ్ కృష్ణన్' ఇటీవల యూఏఈలో జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్లో ఫేస్బుక్ సీఈఓ 'మార్క్ జుకర్బర్గ్', మైక్రోసాఫ్ట్ సీఈఓ 'సత్య నాదెళ్ల', ఎక్స్ (ట్విటర్) అధినేత 'ఇలాన్ మస్క్'తో సహా టాప్ సిఇఓలతో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు. యుక్త వయసులోనే కోడింగ్ నేర్చుకున్నట్లు, అదే తనను టెక్నాలజీ వైపు అడుగులు వేసేలా చేసిందని శ్రీరామ్ కృష్ణన్ వెల్లడించారు. 2007లో మైక్రోసాఫ్ట్లో చేరి కొన్ని సంవత్సరాల పాటు సత్య నాదెళ్లతో కలిసి పనిచేశారు, అప్పటికే సత్య నాదెళ్ల సీఈఓ కాలేదు. మైక్రోసాఫ్ట్ కంపెనీలో పనిచేసిన తరువాత ఫేస్బుక్లో చేరి 'మార్క్ జుకర్బర్గ్'తో కూడా కలిసి పనిచేశారు. ఇలాన్ మస్క్ ఎక్స్ (ట్విటర్) కొనుగోలు చేసిన సమయంలో శ్రీరామ్ అక్కడే పనిచేసినట్లు వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఆండ్రీసెన్ హోరోవిట్జ్లో భాగస్వామిగా ఉన్నట్లు వెల్లడించారు. ఇలాన్ మస్క్, జుకర్బర్గ్లు చిన్న చిన్న విషయాలను సైతం వారే చూసుకుంటారని, ఇతరులకు అప్పగించరని చెబుతూ.. మెటా సీఈఓ ప్రతి అంశం మీద ప్రత్యేక దృష్టి సారిస్తారని, ఒక ప్రాజెక్టు తీసుకున్న తరువాత అందులో పనిచేసే ఉద్యోగుల కంటే ఆయనే ఎక్కువ తెలుసుకుంటారని శ్రీరామ్ చెప్పారు. నా భార్య కూడా కొన్ని సంవత్సరాల క్రితం మెటాలో పనిచేసింది, జుకర్బర్గ్ ఇప్పటికీ అదే విధంగా ఉన్నారని ఆమె నాకు చెప్పిందని అన్నారు. ఇలాన్ మస్క్ విషయానికి వస్తే.. అందరూ అనుకున్నట్లు ఎక్కువ సమయంలో ఎక్స్(ట్విటర్)లో పోస్టులు చేయడానికి సమయం కేటాయించరని, ఆయనతో నేను ఉన్నప్పుడు 95 శాతం మీటింగులు జూనియర్ ఇంజనీర్లతో జరిగాయని తెలిపారు. ఆయన ప్రతి పనిని ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తారని అన్నారు. చెన్నైలో జన్మించిన శ్రీరామ్ కృష్ణన్ (2001-2005) వరకు ఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కాలేజ్, అన్నా యూనివర్సిటీల నుంచి బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. అనంతరం మైక్రోసాఫ్ట్లో విజువల్ స్టూడియో విభాగంలో ప్రోగ్రాం మేనేజర్గా తన కెరియర్ను ప్రారంభించారు. చెన్నైలో పుట్టిన నాకు సిలికాన్ వ్యాలీకి మారినప్పుడు కల్చర్ మొత్తం చాలా భిన్నంగా అనిపించినట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: మరో కంపెనీ కీలక ప్రకటన.. వందలాది ఉద్యోగుల నెత్తిన పిడుగు! -
సత్య నాదెళ్ల జీతం ఆస్తులు ఎంతో తెలుసా..?
-
Generative AI: ఏఐలో అమెరికాను ఢీకొట్టేది భారతీయులే..!
ఐటీ, సాఫ్ట్వేర్ రంగంలో భారతీయుల ప్రతిభా పాటవాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రపంచంలోని పలు టెక్నాలజీ దిగ్గజాలకు అధితులుగా భారతీయులే ఉండి నడిపిస్తున్నారు. అత్యాధునిక సాఫ్ట్వేర్ ఉత్పత్తులు, పరిష్కారాలను రూపొందించడంలో ఇండియన్ డెవలపర్ కమ్యూనిటీ కీలక పాత్రను మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల తాజాగా ప్రస్తావించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తోంది. భవిష్యత్తు అంతా ఈ టెక్నాలజీతోనే ముడిపడింది. జనరేటివ్ ఏఐ ప్రాజెక్ట్లు ఇప్పటికే అనేకం వస్తున్నాయి. వీటిలో ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతోంది. ముఖ్యంగా ఉత్పాదక ఏఐ ప్రాజెక్ట్ల్లో అగ్రగామిగా ఉన్న అమెరికాకు భారత డెవలపర్లు గట్టి పోటీ ఇస్తున్నారు. 2027 నాటికల్లా.. మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని సాఫ్ట్వేర్ కొలాబరేషన్ అండ్ ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్ అయిన గిట్హబ్ (GitHub)లో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్గా ఉంది. 1.32 కోట్ల మంది డెవలపర్లు ఈ ప్లాట్ఫారమ్ను ఉపయోగిస్తున్నారు. 2027 నాటికి గిట్హబ్లో భారత్ అతిపెద్ద డెవలపర్ కమ్యూనిటీగా అమెరికాను అధిగమిస్తుందని భావిస్తున్నారు. గిట్హబ్లో అత్యధిక సంఖ్యలో జనరేటివ్ ఏఐ ప్రాజెక్ట్లను కలిగి ఉన్న అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ డెవలపర్ల కార్యకలాపాలు, పనితీరును తరువాతి తరం ఏఐ పూర్తిగా మార్చేస్తోందని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అన్నారు. భారత డెవలపర్ కమ్యూనిటీ మన టెక్నాలజీ, టూల్స్తో భారత్తోపాటు ప్రపంచ భవిష్యత్తు కోసం కృషి చేస్తుండటంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. -
భారత్లో మైక్రోసాఫ్ట్ సీడబ్ల్యూబీ ప్రోగ్రాం..
బెంగళూరు: మైక్రోసాఫ్ట్ తమ ‘కోడ్ వితౌట్ బ్యారియర్స్’ (సీడబ్ల్యూబీ) ప్రోగ్రాంను భారత్లోనూ ప్రవేశపెట్టింది. దీని కింద ఈ ఏడాది 75,000 మంది మహిళా డెవలపర్లకు శిక్షణ కలి్పంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ చీఫ్ సత్య నాదెళ్ల తెలిపారు. క్లౌడ్, కృత్రిమ మేధ, డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో లింగ అసమానతలను తొలగించడంలో తోడ్పడే ఉద్దేశంతో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని తొమ్మిది దేశాల్లో 2021లో ఈ ప్రోగ్రాంను ఆవిష్కరించినట్లు ఆయన చెప్పారు. దీని కింద మహిళా డెవలపర్లు, కోడర్స్కు శిక్షణ, నెట్వర్కింగ్ అవకాశాలు కల్పిస్తున్నట్లు సత్య నాదెళ్ల వివరించారు. మైక్రోసాఫ్ట్ ఏఐ టూర్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాలు చెప్పారు. మరోవైపు శిక్షణ ఫౌండేషన్, మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న శిక్షా కోపైలట్ ప్రోగ్రాం.. ప్రధానంగా ఉపాధ్యాయులకు సాధికారత కలి్పంచేందుకు ఉద్దేశించినదని సత్య నాదెళ్ల తెలిపారు. అజూర్ ఓపెన్ఏఐ మోడల్ తోడ్పాటుతో పాఠ్యాంశాలను విద్యార్థులు మరింత సులభంగా అర్థం చేసుకునేలా పాఠ్యప్రణాళికలను రూపొందించేందుకు శిక్షా కోపైలట్ ప్రోగ్రాం ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రస్తుతం బెంగళూరులోని 30 గ్రామీణ, పట్టణ పాఠశాలల్లో ఉపయోగిస్తున్న ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు కృషి చేస్తున్నట్లు సత్య నాదెళ్ల వివరించారు. -
Microsoft: 20 లక్షల మందికి ఏఐలో శిక్షణ
ముంబై: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతపై రెండేళ్లలో 20 లక్షల మంది భారతీయులకు నైపుణ్యం కల్పిస్తామని అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల బుధవారం తెలిపారు. శ్రామికశక్తి అభివృద్ధి చెందడానికి నైపుణ్యాలను పెంపొందించడం అనేది ఒక సంస్థ చేయగలిగే అత్యంత ముఖ్యమైన విషయమని అన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా నాదెళ్ల భారత్లో అడుగుపెట్టారు. కన్సల్టెన్సీలు, చట్టపర సంస్థలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలకు చెందిన వ్యాపారవేత్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఏఐపై నిబంధనలను రూపొందించడంలో భారత్, యూఎస్ సహకరించుకోవడం అత్యవసరం అని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. కొత్త తరం సాంకేతికత వృద్ధిని సమానంగా పంపిణీ చేయగలదని అన్నారు. శక్తివంతమైన సాధారణ ప్రయోజన సాంకేతికతగా ఏఐని పేర్కొన్న ఆయన.. ఏఐ నిబంధనల విషయంలో ఏకాభిప్రాయం బహుపాక్షిక స్థాయిలలో కూడా చాలా అవసరమని నాదెళ్ల తెలిపారు. జీడీపీ వృద్ధిలో ఏఐ.. సాంకేతికత వేగంగా విస్తరించడం వల్ల ఆర్థిక వృద్ధిలో సమాన పంపిణీకి సహాయపడుతుందని సత్య నాదెళ్ల అన్నారు. జీడీపీ వృద్ధిని పెంచడంలో ఏఐ సహాయపడుతుందని చెప్పారు. భారత్ను ప్రపంచంలోని అత్యధిక వృద్ధి మార్కెట్లలో ఒకటిగా పేర్కొన్నారు. 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల జీడీపీలో ఏఐ జీడీపీ 500 బిలియన్ డాలర్లుగా ఉంటుందన్న మినిస్ట్రీ ఆఫ్ ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నివేదికను ఈ సందర్భంగా ఆయన ఉటంకించారు. పునరుత్పాదక వనరుల నుంచి విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, భారత్ కూడా గ్రిడ్ స్థిరత్వంపై దృష్టి సారించాల్సి ఉందని చెప్పారు. సాంకేతికత కూడా ఇందులో కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు. భారత పర్యటనలో భాగంగా టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ను తాను కలిశానని, ఎయిర్ ఇండియా ఏఐ వినియోగాన్ని ప్రారంభించిందని గుర్తు చేశారు. ఐటీసీ, అరవింద్, లాభాపేక్ష లేని ఇతర భారతీయ సంస్థలు, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ వంటి ఐటీ కంపెనీలు అనేక సంస్థాగత కార్యక్రమాల కోసం ఏఐ సాధనాలను ఉపయోగిస్తున్నాయని నాదెళ్ల వివరించారు. -
నాదెళ్ల పదేళ్ల ప్రయాణం..
ప్రపంచ ఐటీ టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ షేర్ ధర గత పదేళ్లలో దాదాపు వెయ్యిశాతం పెరిగింది. ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు 3 ట్రిలియన్ డాలర్లకు చేరింది. గడిచిన దశాబ్దకాలంలో ఎన్నో మార్పులు.. విజయాలు. కొన్ని విభాగాల్లోనైతే అనూహ్య వృద్ధి. వీటన్నింటికి మూలం భారత సంతతికి చెందిన సత్య నాదెళ్లేనని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఆయన బాధ్యతలు ఇటీవల పదేళ్లు పూర్తి చేసుకున్నారు. సత్య నాదెళ్ల సీఈఓగా బాధ్యతలు నిర్వర్తించడానికి ముందు మైక్రోసాఫ్ట్ కార్యకలాపాటు మందగమనంతో సాగాయి. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ(ఏఐ)పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి కార్యకలాపాలను పరుగు పెట్టించారు. దీంతో మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ కూడా శరవేగంగా పెరిగింది. గత పదేళ్ల కాలంలో మైక్రోసాఫ్ట్ వాటాదార్ల సంపద దాదాపు 3 ట్రిలియన్ డాలర్లకు చేరింది. సత్య నాదెళ్ల సీఈఓగా బాధ్యతలు చేపట్టిన నాడు 10,000 డాలర్లు పెట్టి మైక్రోసాఫ్ట్ షేర్లు కొనుగోలు చేస్తే, ప్రస్తుతం వాటి విలువ 1,13,000 డాలర్లు అయ్యేది. ఐటీ పరిశ్రమ ఎప్పటినుంచో ఉన్న సంప్రదాయానికి బదులుగా సంస్కరణలను నమ్ముతుంది. అందులో భాగంగా పరిశోధనలను అందిపుచ్చుకుంటుదని సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పుడు సత్య మైక్రోసాఫ్ట్ ఉద్యోగులతో తెలిపారు. ఆయన బాధ్యతలు చేపట్టినప్పటికే 22 ఏళ్లుగా మైక్రోసాఫ్ట్లో పని చేస్తున్నారు. ఇన్నేళ్లుగా కంపెనీలోనే ఉన్నారు కదా..కొత్తగా ఏమి ఆవిష్కరిస్తారని చాలామంది అనుమానించారు. బిల్ గేట్స్, స్టీవ్ బామర్ తర్వాత మైక్రోసాఫ్ట్కు సీఈఓ కావడం అంటే పెద్ద సవాలే. సత్య నాదెళ్ల చేసే ప్రతి పనిని, ప్రతి కదలికను ఆ ఇద్దరితో పోలుస్తారు. కానీ అందరి అపనమ్మకాలను తుడిచేస్తూ మైక్రోసాఫ్ట్ను శరవేగంగా అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తున్నారు. ‘అజూర్’ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ను ఆవిష్కరించారు. ఒక చిన్న అంకుర సంస్థకు మైక్రోసాఫ్ట్తో అవసరం ఉండదు, కానీ అటువంటి సంస్థలన్నింటినీ ఓపెన్ ఏఐ ద్వారా అజూర్ ప్లాట్ఫామ్ మీదకు తీసుకురాగలిగారు. దీంతో గూగుల్, అమెజాన్లతో పోల్చితే మైక్రోసాఫ్ట్ పైచేయి సాధించే అవకాశం ఏర్పడింది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద లభించే రాయల్టీ మీద ఆధారపడటాన్ని తగ్గించారు. సెల్ఫోన్ల వ్యాపారంలో రాణించాలనే ఆకాంక్షకు కళ్లెం వేశారు. నోకియా ఫోన్ల వ్యాపారాన్ని ఆయన కంటే ముందు సీఈఓగా ఉన్న స్టీవ్ బామర్ 7.3 బి.డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అప్పటిదాకా అంతర్గతంగా ఉత్తమ ఫలితాలు సాధించడం కంటే, ప్రజలు-పరిశ్రమలో బ్రాండ్ బిల్డింగ్ వైపు మైక్రోసాఫ్ట్ ఎక్కువగా మొగ్గుచూపేది. ఆ వైఖరిని ఆయన పూర్తిగా మార్చారు. పేరు: సత్య నారాయణ నాదెళ్ల తండ్రి: బుక్కాపురం నాదెళ్ల యుగంధర్ తల్లి: ప్రభావతి భార్య: అనుపమ నాదెళ్ల పిల్లలు: 3 కుమారుడు: జైన్ నాదెళ్ల కుమార్తెలు: దివ్య నాదెళ్ల, తారా నాదెళ్ల జన్మస్థలం: హైదరాబాద్ వయసు: 56 (2024) జాతీయత: భారతీయుడు పౌరసత్వం: యూఎస్ఏ చదువు: మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ; యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మిల్వాకీ; చికాగో యూనివర్సిటీ వృత్తి: ఇంజినీర్, కంప్యూటర్ సైంటిస్ట్ డెజిగ్నేషన్: మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో -
డీప్ఫేక్ ఆందోళనకరం
వాషింగ్టన్: ప్రముఖుల ఫొటోలు, వీడియోలను దురి్వనియోగం చేస్తూ కృత్రిమ మేథ(ఏఐ)తో సృష్టిస్తున్న డీప్ ఫేక్ నకిలీ ఫొటోలు, వీడియోల ధోరణి అత్యంత భయంకరమైనదని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వ్యాఖ్యానించారు. ప్రఖ్యాత పాప్ గాయని టైలర్ స్విఫ్ట్ నకిలీ అసభ్య ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీనిపై ఒక ఇంటర్వ్యూలో సత్య నాదెళ్ల ఆవేదన వెలిబుచ్చారు. ‘‘ప్రముఖుల డీప్ ఫేక్ ఫొటోలు, వీడియోల సృష్టి, వ్యాప్తికి అడ్డుకట్ట పడాల్సిందే. ప్రభుత్వాల, సోషల్మీడియా సంస్థల తక్షణ స్పందన అవసరం. సురక్షితమైన, వాస్తవిక సమాచారం మాత్రమే ఆన్లైన్లో లభించేలా సాంకేతికతను, రక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలి. ప్రభుత్వాలు నిబంధనలను సవరించి కట్టుదిట్టంచేయాలి. ఇది మనందరి బాధ్యత’’ అని అన్నారు. -
త్వరలో భారత పర్యటన..మోదీతో భేటీ కానున్న మైక్రోసాఫ్ట్ సీఈఓ!
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల భారత్లో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 7, 8 రెండు రోజుల పర్యటనలో కీలకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో పాటు, ఈ టెక్నాలజీ వినియోగంతో వచ్చే అవకాశాల గురించి మాట్లాడనున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ నిపుణులు ఈ రెండు రోజుల పర్యటనలో సత్యనాదెళ్ల ఏఐ గురించి ఏం మాట్లాడుతారా? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే వెలుగులోకి వచ్చిన మైక్రోసాఫ్ట్ ఇండియా, సౌత్ ఆసియా ప్రెసిడెంట్ పునీత్ చాందక్ ఇంటర్నల్ మెయిల్స్ ఆధారంగా ‘మైక్రోసాఫ్ట్ భారత్లో ఆయా టెక్నాలజీల వినియోగం, అవకాశాల్ని మరింత విస్తరించనుందని’ తెలుస్తోంది. సీఈఓలతో ప్రధాని మోదీ భేటీ 2023లో భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా టెక్ దిగ్గజ కంపెనీలైన యాపిల్ సీఈఓ టిమ్కుక్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోస్టాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో భేటీ అయ్యారు. ఆ భేటీలో భారత్ టెక్నాలజీ వినియోగం, అవకాశాల గురించి సీఈఓలతో మోదీ మాట్లాడారు. ఆ చర్చలకు కొనసాగింపుగా.. భారత్లో పర్యటించనున్న సత్యనాదెళ్ల ప్రధాని మోదీతో భేటీ అవుతారంటూ మైక్రోసాఫ్ట్ విడుదల చేసిన స్టేట్మెంట్లో తెలిపింది. వీరిరువురి భేటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, భారతదేశ సామర్థ్యాల గురించి చర్చకు వస్తాయని పేర్కొంది. టెక్నాలజీలో భారత్ భళా ‘భారతీయుల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడేందుకు ఉపయోగపడే టెక్నాలజీలలో కృత్రిమ మేధస్సు ఒకటి. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన డెవలపర్, స్టార్ట్-అప్ పర్యావరణ వ్యవస్థలకు నిలయం. మైక్రోసాఫ్ట్ భారతీయ సాంకేతికత వృద్ధికి కట్టుబడి ఉంది. ఇది భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లను ప్రభావితం చేస్తుంది’ మైక్రోసాఫ్ట్ ప్రకటనలో హైలెట్ చేసింది. ఏడాది క్రితం భారత్లో పర్యటన ఏడాది క్రితం మైక్రోసాఫ్ట్ సీఈఓ నాదెళ్ల భారత్లో నాలుగు రోజుల అధికారిక పర్యటన చేశారు. తన పర్యటనలో కస్టమర్లు, స్టార్టప్లు, డెవలపర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులను కలిశారు. భవిష్ అగర్వాల్ సైతం పలు నివేదికల ప్రకారం.. భారత్ పర్యటకు రానున్న సత్యనాదెళ్లతో ముంబై, బెంగళూరుకు చెందిన ఏఐ స్టార్టప్స్ ఫౌండర్లు ఆయనతో భేటీ కానున్నారు. వారిలో సర్వం ఏఐ సంస్థ అధినేతలు, ఏఐ స్టార్టప్ కృత్తిమ్ ఫౌండర్ భవిష్ అగర్వాల్లు ఉన్నట్లు సమాచారం. -
ఆ రోజు మీటింగ్లో కూడా సత్య నాదెళ్లకు అదే ధ్యాస..
ఇటీవల జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూడటానికి దిగ్గజ పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు ఏకంగా అహ్మదాబాద్ స్టేడియానికి వెళ్లారు. మరికొందరు టీవీలకు, స్మార్ట్ఫోన్లకు అతుక్కుపోయి లైవ్ చూడటం మొదలెట్టసారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ 'సత్య నాదెళ్ళ' (Satya Nadella) సైతం మ్యాచ్ మిస్ చేసుకోలేదని తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టెక్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగే రోజు ఏఐ ప్రాజెక్టుకి సంబంధించి ఒక ముఖ్యమైన మీటింగ్లో ఉన్నారు, అయినప్పటికీ మధ్య మధ్యలో ఫైనల్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడం, విరాట్ కోహ్లీ ప్రదర్శన ఎలా ఉందనే విషయాలను తెలుసుకుంటూనే ఉన్నట్లు ఆంగ్ల మీడియా సంస్థ న్యూయార్కర్ వెల్లడించింది. న్యూజిలాండ్, భారత్ మధ్య జరిగిన వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ను కూడా రాత్రంగా మేల్కొని మరీ చూసినట్లు సత్య నాదెళ్ల ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇదీ చదవండి: మొన్న విప్రో.. నేడు హెచ్సీఎల్ - ఎందుకిలా? ఈ ఇంటర్వ్యూలోనే టీమ్ ఇండియా ఓటమికి ప్రతీకారంగా ఆస్ట్రేలియాను కొంటారా? అంటూ సత్య నాదెళ్లను ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ఓపెన్ఏఐని కొనుగోలు చేయడం, ఆస్ట్రేలియాను కొనడం రెండూ ఒకటి. ఈ రెండింటీలో ఏదీ సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఓపెన్ఏఐతో భాగస్వామిగా ఉండటంతోపాటు ఆసీస్ క్రికెట్ను కూడా ఆస్వాదిస్తామంటూ సమాధాన మిచ్చారు. దీంతో భారతీయ క్రికెట్ ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోయారు. Next time you think your job is more important than cricket, remember that this man had $12 billion on the line and the potential for a very public egg-on-his-face, but that didn’t stop him from updating an uncomprehending audience about Kohli’s batting https://t.co/dSZP9Wn9Dk pic.twitter.com/EPspe36BwU — Sriram (@sriramin140) December 2, 2023 -
ఆస్ట్రేలియాను ఇపుడు కొంటారా? సత్య నాదెళ్ల షాకింగ్ స్పందన
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కూడా క్రికెట్ అభిమాని. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చాలాసార్లు పలు వేదికల మీద ప్రకటించారు. క్రికెట్ పట్ల తనకున్న ప్రేమ, తనకు టీం కృషిని, నాయకత్వాన్ని నేర్పిందని, అది కార్పొరేట్ ప్రపంచంలో కీలక మలుపులను అధిగమించడంలో సహాయపడిందని పేర్కొన్నారు. టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ను, అంతకు ముందు న్యూజిలాండ్తో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్ను కూడా వీక్షించారు. రాత్రంతా మేల్కొని మరీ మ్యాచ్ చూశాంటూ ఇండియా విజయాన్ని ఎంజాయ్ చేశారు. కానీ ఫైనల్లో ఇండియా ఓటమి కోట్లాదిమంది అభిమానులను నిరాశపర్చింది. ఈ సందర్భంగా టైటిల్ చేజార్చుకున్న రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు కృషిని ప్రశంసించిన నాదెళ్ల కప్ గెలుచుకున్న ఆసీస్ను అభినందించారు. అలాగే అయితే తాజాగా ఒక పోడ్కాస్ట్లో సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు చేశారు. కారా స్విషర్ పోడ్కాస్ట్లో మాట్లాడిన సత్య నాదెళ్ల పలు విషయాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా భారతదేశం ఓడిపోయిన తర్వాత ఆస్ట్రేలియాను కొనుగోలు చేయాలనుకుంటున్నారా అని కారా సరదాగా ప్రశ్నించాడు. దీనికి నాదెళ్ల మాట్లాడుతూ ఓపెన్ఏఐని కొనుగోలు చేయడం, ఆస్ట్రేలియాను కొనడం రెండూ ఒకటి. ఈ రెండింటీలో ఏదీ సాధ్యం కాదు. అయితే ఓపెన్ఏఐతో భాగస్వామిగా ఉండటంతోపాటు ఆసీస్ క్రికెట్ను కూడా ఆస్వాదిస్తామంటూ సమాధాన మిచ్చారు. దీంతో భారతీయ క్రికెట్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఇది ఇలా ఉంటే చాట్జీపీటీ సృష్టికర్త శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన AI పరిశోధనా సంస్థ OpenAI, సామ్ ఆల్ట్మన్ను ఆకస్మికంగా తొలగించింది. దీంతో ఆల్ట్మాన్ ఆహ్వానం పలికిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ళ ఆయన మైక్రోసాఫ్ట్లో చేరుతున్నారని, అడ్వాన్స్డ్ ఏఐ రీసెర్చ్ టీమ్ను ముందుండి నడిపిస్తారని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
మరో కీలక పరిణామం, ‘ఓపెన్ఏఐ’లోకే శామ్ ఆల్ట్మన్?
ప్రముఖ ఏఐ సంస్థ ఓపెన్ఏఐలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగంలో పనిచేయడం కంటే శామ్ ఆల్ట్మన్ ఓపెన్ఏఐకి వెళ్లడమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల ఓపెన్ఏఐ మాజీ సీఈఓ శామ్ ఆల్ట్మన్ని తొలగించడం.. ఆ తర్వాత ఆయన భవితవ్యంపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల బ్లూమ్బెర్గ్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘ఓపెన్ఏఐలో ఆల్ట్మన్ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు. నేను అతనిమీద, అతని నాయకత్వం, సామర్థ్యంపై నమ్మకంగా ఉన్నాను. కాబట్టే మేం అతనిని మైక్రోసాఫ్ట్లోకి స్వాగతించాలనుకుంటున్నాము’ అని సత్యనాదెళ్ల ఇంటర్వ్యూలో చెప్పారు. ఆల్ట్మన్ తమ కంపెనీ కొత్త ఏఐ రీసెర్చ్ బృందంలో చేరనున్నారని వెల్లడించారు. ఆయనతో పాటు ఓపెన్ఏఐ నుంచి బయటకు వచ్చిన గ్రెగ్ బ్రాక్మన్ సైతం మైక్రోసాఫ్ట్తో కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు. అయితే, ఓపెన్ఏఐలోని పెట్టుబడి దారులు శామ్ ఆల్ట్మన్ని సంస్థలోకి తీసుకోవాలని బోర్డ్ సభ్యులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ తరుణంలో శామ్ ఆల్ట్మన్ మైక్రోసాఫ్ట్లో చేరడం కంటే, తిరిగి ఓపెన్ఏఐకి వెళితే బాగుండేదన్న సంకేతాలిచ్చారు సత్యనాదెళ్ల. మరి ఈ వరుస పరిణామాలు ఎటు దారి తీస్తాయో చూడాల్సి ఉంది. చదవండి👉సంచలనం.. రాజీనామాలో 500 మంది ఉద్యోగులు, ఓపెన్ఏఐకి ఎదురు దెబ్బ! -
అప్పుడు షాక్కి గురయ్యా..! ఇంటర్వ్యూలో సత్య నాదెళ్ల..
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓ 'సత్య నాదెళ్ల' (Satya Nadella) 2014లో సీఈఓ అవుతానని తెలిసినప్పుడు ఎలా అనిపించిందో ఇటీవల బెర్లిన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 2023 యాక్సెల్ స్ప్రింగర్ అవార్డు అందుకున్న సత్య నాదెళ్ల తన కెరీర్ గురించి, నాయకత్వం గురించి చాలా విషయాలను ఇంటర్వ్యూలో వెల్లడించాడు. మైక్రోసాఫ్ట్లో స్టీవ్ బాల్మెర్ కంపెనీ నుంచి బయటకు వెళ్తున్నట్లు తెలుసుకుని షాక్కి గురైనట్లు, ఆ తరువాత మైక్రోసాఫ్ట్ బోర్డు సీఈఓ పదవికి ఎంపికైన నలుగురు టాప్ అభ్యర్థుల్లో నాదెళ్ల కూడా ఉన్నట్లు తెలిపాడు. బోర్డు సభ్యులలో ఒకరు నన్ను మీరు CEO అవ్వాలనుకుంటున్నారా? అని అడిగిన విషయం స్పష్టంగా గుర్తుందని.. నేను ఎప్పుడూ సీఈఓ కావాలనుకునే విషయం గురించి ఆలోచించలేదని, అయితే నా మీద నమ్మకంతో సీఈఓ బాధ్యతలు అప్పగించారని వివరించారు. ఇదీ చదవండి: ఉద్యోగుల పనిగంటల రిపోర్ట్ - భారత్ ప్రపంచంలోనే.. ఇంజినీరింగ్ నైపుణ్యాలు, వ్యాపార దృక్పథం, ఉద్యోగులను ఏకతాటిపైకి తీసుకురాగల సామర్థ్యం కలిగిన సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్కు నాయకత్వం వహించడానికి సరైన వ్యక్తి అని బిల్ గేట్స్ ప్రకటించాడు. ఆ తరువాత సత్య నాదెళ్ల నాయకత్వంలో మైక్రోసాఫ్ట్ ఎన్నో విజయాలను సొంతం చేసుకోగలిగింది. ఇదీ చదవండి: వచ్చే ఏడాది ఈ రంగాల్లో 9.8 శాతం జీతాలు పెరగనున్నాయ్.. 1975లో మైక్రోసాఫ్ట్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కంపెనీకి నాయకత్వం వహించిన ముగ్గురు వ్యక్తులలో తెలుగు తేజం సత్య నాదెళ్ల ఒకరు కావడం గర్వించదగ్గ విషయం. అంతకు ముందు బిల్ గేట్స్, స్టీవ్ బాల్మర్ ఈ కంపెనీ బాధ్యతలు నిర్వహించారు. -
గూగుల్ - యాపిల్ మధ్య భారీ డీల్.. సత్యనాదెళ్ల పోరాటం ఫలించేనా?
ఆన్లైన్ సెర్చింగ్ విభాగంలో ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ యాంటీ ట్రస్ట్ కేసుల్ని ఎదుర్కొంటుంది. ఇతర సంస్థల్ని ఎదగనీయకుండా గూగుల్ గుత్తాదిపత్యం వహిస్తుందన్న ఆరోపణలపై అమెరికా న్యాయశాఖ విచారణ జరుపుతుంది. ఓ వైపు ఆ అంశానికి సంబంధించి విచారణ జరుగుతుండగా.. ఐఫోన్లలో డీపాల్ట్ సెర్చ్ ఇంజిన్గా ఉండేలా గూగుల్ మరో టెక్ దిగ్గజం యాపిల్తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే? యాపిల్ వెబ్బ్రౌజర్ సఫారీలో డీఫాల్ట్ సెర్చ్ ఇంజిన్గా గూగుల్ ఉంచేందుకు గాను గూగుల్ యాజమాన్యం 10 బిలియన్ డాలర్ల నుంచి 20 బిలియన్ డాలర్ల మధ్య చెల్లించనున్నట్లు తెలుస్తోంది. అయితే న్యూయార్క్ టైమ్స్ మాత్రం ఆ డీల్ విలువ 18 బిలియన్ డాలర్లు అంటూ ఓ నివేదికను విడుదల చేసింది. 2021లో గూగుల్ ఈ మొత్తాన్ని యాపిల్కు చెల్లించిందని స్పష్టం చేసింది. స్పాట్లైట్తో పాటు సఫారీలో సైతం రెండు దిగ్గజ టెక్ కంపెనీల మధ్య ఒప్పందం పూర్తయితే.. యాపిల్ సంస్థ తయారు చేసే ఐమాక్లలో స్పాట్లైట్ అనే ఫీచర్ ఉంది. ఆ ఫీచర్లో గూగుల్ సెర్చింజన్ ఆప్షన్ కనిపించడంతో పాటు, మనం ఏదైనా సమాచారం కోసం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయో.. అలాంటి ఫలితాలే యాపిల్ బ్రౌజర్ సఫారీ యూజర్లకు కనిపిస్తాయి. యాపిల్ భయపడుతోంది ఐఫోన్ల కోసం తన సొంత వెర్షన్ను విడుదల చేయడం ద్వారా స్పాట్లైట్ వినియోగాన్ని తగ్గించే మార్గాల్ని గూగుల్ అన్వేషిస్తుంది. యాపిల్ సఫారీ బ్రౌజర్కి బదులు ఐఫోన్ యూజర్లు గూగుల్ సెర్చ్ ఇంజిన్ను వినియోగించేలా ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తుంది. ఇదే అంశంపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల న్యూయార్క్ టైమ్స్(nyc)తో మరో విధంగా స్పందించారు. గూగుల్ తన సెర్చ్ టెక్నాలజీని మెరుగుపరిచేందుకు చేస్తున్న ప్రయత్నాలపై యాపిల్ ఆందోళన వ్యక్తం చేస్తుందని అన్నారు. యాపిల్ యూజర్లు గూగుల్ క్రోమ్ని వినియోగించేలా గూగుల్ జీమెయిల్తో పాటు ఇతర సేవల్ని ఉపయోగించడంపై యాపిల్ భయపడుతుందని అర్ధం వచ్చేలా నాదెళ్ల వ్యాఖ్యలు చేశారు. మేం 15 బిలియన్ డాలర్లు చెల్లిస్తాం మేము (మైక్రోసాఫ్ట్) సైతం యాపిల్ డివైజ్లలో డిఫాల్ట్ బ్రౌజర్గా ఉండాలని కోరుకుంటున్నట్లు సత్యనాదెళ్ల తెలిపారు. కానీ భారీ మొత్తంలో చెల్లించేందుకు తాము సంసిద్ధంగా లేమని న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. యాపిల్ డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్గా మారేందుకు మైక్రోసాఫ్ట్ 15 బిలియన్ల వరకు చెల్లించడానికి సిద్ధంగా ఉందని న్యూ యార్క్ టైమ్స్ నివేదిక హైలెట్ చేసింది. గూగుల్ పై సత్యనాదెళ్ల న్యాయపోరాటం ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే? గూగుల్ - యాపిల్ మధ్య జరిగిన ఈ ఒప్పందం గతంలో యాపిల్- మైక్రోసాఫ్ట్ల మధ్య జరిగింది. కానీ గూగుల్ తన గుత్తాధిపత్యంతో మైక్రోసాఫ్ట్ను వద్దనుకుని తనతో పనిచేసేలా పావులు కదిపింది. చివరికి అనుకున్నది సాధించింది. మైక్రోసాఫ్ట్ను వద్దనుకున్న యాపిల్ .. గూగుల్తో జతకట్టింది. ఇప్పుడు ఇదే అంశంపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల యూఎస్లోని ఓ కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నారు. అమెరికా ప్రభుత్వం, గూగుల్ మధ్య జరుగుతున్న యాంటిట్రస్ట్ విచారణలో ఆయన తన వాదన వినిపించారు. సెర్చింజన్ మార్కెట్లో గూగుల్ ఆధిపత్యం వల్ల ప్రత్యర్థి సంస్థలు ఎదగడం చాలా కష్టంగా మారిందని సత్య నాదెళ్ల ఆరోపించారు. ఈ క్రమంలో గూగుల్ అనుసరిస్తున్న వ్యాపార పద్ధతులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మరి ,గూగుల్పై సత్యనాదెళ్ల చేస్తున్న న్యాయ పోరాటం ఎలాంటి ఫలితాల్ని ఇస్తుందో వేచి చూడాలి. చదవండి👉 ‘మీ థ్యాంక్యూ మాకు అక్కర్లేదు’..సత్య నాదెళ్లపై గుర్రుగా ఉన్న ఉద్యోగులు! -
నేను చేసిన పెద్ద తప్పు అదే..మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల
ప్రపంచ దిగ్గజ సంస్థల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓ సత్య నాదెళ్ల తను తీసుకున్న కష్టమైన నిర్ణయం ఏమిటో చెప్పారు. ఇటీవల బిజినెస్ ఇన్సైడర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మొబైల్ ఫోన్ వ్యాపారం నుంచి కంపెనీ నిష్క్రమించినందుకు బదులుగా దాన్ని మరింత మెరుగ్గా నిర్వహించవచ్చని అంగీకరించారు. ఫోన్ కేటగిరీపై దృష్టి సారించడం ద్వారా కంపెనీ మరింత మెరుగ్గా పని చేసే అవకాశం ఉండేదని తెలిపారు. మైక్రోసాఫ్ట్ సంస్థ మొబైల్ కేటగిరీ నుంచి వైదొలగడంపై సీఈఓను అడిగినపుడు ఆయన స్పందించారు. సత్యనాదెళ్ల తను సీఈఓ అయినప్పుడు తీసుకున్న అత్యంత కష్టమైన నిర్ణయాలలో అది ఒకటన్నారు. గతంలో మొబైల్ఫోన్లో కంప్యూటర్ మాదిరి కార్యాకలాపాలకు అవకాశం ఉంటుందని భావించామన్నారు. అందుకే మైక్రోసాఫ్ట్ మొబైల్ను ఆవిష్కరించినట్లు తెలిపారు. అయితే దాన్ని మరింత మెరుగ్గా నిర్వహించాల్సిందని చెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల అదిప్రజల్లో ఆదరణ పొందలేదు. 2014లో మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ స్టీవ్ బాల్మెర్ నుంచి నాదెల్లా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత ఏడాది నోకియా ఫోన్ వ్యాపారాన్ని కొనుగోలు చేయడానికి సంబంధించిన దాదాపు రూ.63వేలకోట్ల ఒప్పందాన్ని కంపెనీ రద్దు చేసుకుంది. తర్వాత కొన్ని ఏళ్లకు విండోస్ ఫోన్ కనుమరుగయింది. మైక్రోసాఫ్ట్ గత పదేళ్ల నుంచి ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్లను అభివృద్ధి చేయడం వైపు దృష్టి సారించింది. ఆండ్రాయిడ్, ఐఫోన్లను విండోస్కి కనెక్ట్ చేయడానికి కంపెనీ ప్రయత్నిస్తుంది. -
‘మీ థ్యాంక్యూ మాకు అక్కర్లేదు’..సత్య నాదెళ్లపై గుర్రుగా ఉన్న ఉద్యోగులు!
ఆర్థిక మాంద్యం భయాలు మొదలైనప్పటి నుంచి ఐటీ రంగం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. చాలా వరకు ప్రాజెక్టులు తగ్గిపోయాయి. క్లయింట్స్ తగ్గిపోయారు. ఇదే సమయంలో ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గణనీయమైన లాభాల్ని సాధించింది. స్టాక్ మార్కెట్లో కంపెనీ స్టాక్స్ సరికొత్తగా ఆల్టైమ్ గరిష్ఠానికి చేరుకున్నాయి. ఫలితంగా కంపెనీ విలువ 2.5 ట్రిలియన్ డాలర్ల వద్దకు చేరుకుంది. కానీ ఉద్యోగులే జీతాలు పెంచడం లేదని సంస్థపై, సంస్థ సీఈవో సత్య నాదెళ్లపై గుర్రుగా ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల మైక్రోసాఫ్ట్ సాధించిన ఫలితాలపై సత్య నాదెళ్ల ఉద్యోగులకు ఇంటర్నల్ మెసేజ్ పంపించారు. అందులో ఈ ఏడాదిలో ఉద్యోగుల పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించారు. సంస్థ సాధించిన ఫలితాలకు ఉద్యోగుల వినూత్నం, సృజనాత్మకత వల్లే సాధ్యమైందని కొనియాడారు. క్లయింట్లను, భాగస్వాములను సైతం అభినందనలతో ముంచెత్తారు. వచ్చే ఏడాది సైతం మెరుగైన ఫలితాలు సాధించేలా కలిసి పనిచేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కంపెనీ నిర్ధేశించుకున్న లక్ష్యాల్ని అధిగమించేలా అందరూ బాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. థ్యాంక్యూ నోట్పై అసహనం సత్యనాదెళ్ల పంపిన ఈ ఇంటర్నల్ మెసేజ్ను 2లక్షల మందికి పైగా వీక్షించే అవకాశం ఉంది. అయితే, సీఈవో తమకి అభినందనలు తెలపడంపై 130కి మంది ఉద్యోగులు సానుకూలంగా స్పందించారు. మరికొంత మంది సీఈవో థ్యూంక్యూ నోట్పై అసహనం వ్యక్తం చేశారు. కృతజ్ఞతలు తెలపడం అంటే ఇలాగేనా ఉద్యోగుల పట్ల కృతజ్ఞత చూపడం అంటే జీతాలు పెంచకుండా ఉండటం కాదని ఓ ఉద్యోగి అంటుంటే..సంస్థ గడించిన లాభాల గురించి మాట్లాడుతూ.. జీతాలు పెంచకుండా అడ్డుకున్న సీనియర్ స్థాయి ఉద్యోగులపై సదరు ఉద్యోగి విమర్శలు గుప్పించారు. కంపెనీ, ఉన్నతస్థాయి ఉద్యోగులు రికార్డ్ స్థాయిలో లాభాలను ఆర్జిస్తున్నప్పుడు ఉద్యోగులు మాత్రం వేతనాల కోతను ఎదుర్కొంటున్నారని ఓ ఉద్యోగి పేర్కొన్నారు. ఇది సరికాదు, వేరే మార్గం లేదా? అని ప్రశ్నించారు. సంస్థను నమ్ముకుంటే మిగిలేది ఇదే.. పెరగకుండా స్తబ్దుగా ఉన్న వేతనాల గురించి ప్రస్తావిస్తూ మండిపోతున్న ధరలు.. పెరిగిపోతున్న ఖర్చులతో అల్లాడుతుంటే సంస్థ భారీ లాభాల్ని మూటగట్టుకోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. కంపెనీ పట్ల అంకితభావంతో ఉన్నప్పటికీ తమకు పెరగాల్సి జీతాలు పెరగలేదని అన్నారు. ‘రికార్డు లాభాలు ఎక్కడ నుండి వస్తాయని ఆశ్చర్యపోతున్నాను? ఇక్కడ (ఆఫీస్లో) అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా గంటల తరబడి కష్టపడి పనిచేసినందుకు నాకు ఎలాంటి ప్రతిఫలం దక్కలేదని వాపోయాడు మరో ఉద్యోగి. జాబ్కు రిజైన్ చేస్తాం.. సత్యనాదెళ్ల పంపిన థ్యాంక్యూ మెసేజ్పై ఉద్యోగులు అసంతృప్తిని వ్యక్తం చేయడంపై మైక్రోసాఫ్ట్ యాజమాన్యం సందిగ్ధంలో పడినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు ఉద్యోగుల మధ్య జరిగిన ఇంటర్నల్ పోల్ సంభాషణల్లో ఎక్కువ మంది..తాము కోరుకున్న ఉద్యోగం దొరికితే..మైక్రోసాఫ్ట్ను వదిలివెళ్లేందుకు సిద్ధపడ్డట్లు నివేదికలు హైలెట్ చేశాయి. అయితే, ఉద్యోగుల అసంతృప్తి, రిజైన్ల అంశంపై మైక్రోసాఫ్ట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. చదవండి👉 ‘అదే నన్ను సాధారణ ఉద్యోగి నుంచి మైక్రోసాఫ్ట్ సీఈవోని చేసింది’ -
ధోనీ ఎంత పని చేశాడు: సత్య నాదెళ్ల ‘క్రష్’ కూడా అదేనట!
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ప్రముఖ గేమ్ క్యాండీ క్రష్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కూడా చాలా మందిలాగే క్యాండీ క్యాష్ ఆడతానని వెల్లడించారు. ఇటీవల భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంస్ ధోని విమానంలో ఆడుతున్న వీడియో నెట్టింట్ వైరల్ కావడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. అసోసియేటెడ్ ప్రెస్ (AP) నివేదిక ప్రకారం, యాక్టివిజన్ బ్లిజార్డ్ అనే వీడియో గేమింగ్ కంపెనీ కొనుగోలుకు సంబంధించిన కేసు విచారణలో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టులో ఈ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. అదేమిటంటే క్యాండీ క్రష్ గేమ్ గురించి అభిప్రాయం ఏమిటని సత్య నాదెళ్లను న్యాయమూర్తి అడిగారు. దీనికి స్పందించిన నాదెళ్ల ధోనీలాగానే తాను కూడా ఈ గేమ్ను ఆస్వాదిస్తానని, దీంతో పాటు కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్ ఆడుతుంటానని చెప్పారు. దీంతోపాటు కన్సోల్ గేమ్స్, పీసీ గేమ్స్ అంటే ఇష్టమని, ప్రత్యేకంగా మొబైల్ గేమ్స్ అంటే చాలా ఇష్టమని నాదెళ్ల చెప్పుకొచ్చారు. దీంతో కోర్టు హాలులో నవ్వుల పువ్వులు పూసాయి. (ఆధార్-ఫ్యాన్ లింక్ చేశారుగా? ఐటీ శాఖ కీలక ప్రకటన) వరల్డ్ వైడ్గా క్యాండీ క్రష్ గేమ్కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. గత కొన్నేళ్లుగా ఈ సాగా కొనసాగుతూ వస్తోంది. ఇటీవల ధోనీ క్యాండీ క్రష్ దెబ్బకి కేవలం మూడే మూడు గంటల్లోనే మూడున్నర లక్షలమంది డౌన్ లోడ్స్ చేసుకోవడం విశేషంగా నిలిచింది. ఈ వైరల్ వీడియోలో, ఇండిగో ఎయిర్ హోస్టెస్ ధోనీకి విమానంలో చాక్లెట్లు, స్వీట్లను అందించడం, ధోనీ సీరియస్గా గేమ్లో మునిగి పోవడం చూడొచ్చు. దీంతో ధోనీ క్యాండీ క్రష్లో మునిగిపోయాడని నెటిజన్లు కమెంట్స్ చేశారు. అంతే క్షణాల్లో ఈ గేమ్ ట్విటర్లో ట్రెండింగ్ టాపిక్గా మారిపోయిన సంగతి తెలిసిందే. -
టెక్ బుడగ పేలుతోందా?
ఒక్క మైక్రోసాఫ్ట్ మాత్రమే కాదు... అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ వంటి అనేక దిగ్గజ ఐటీ కంపెనీల తాజా పరిస్థితి సైతం ఇదే. వరుసగా ఉద్యోగాల్లో కోతలు పెడుతున్నాయి. ఒక్కసారిగా వేలాది మందిని తొలగిస్తున్నాయి. కోవిడ్ కాలంలో శరవేగంగా విస్తరించిన ఐటీ, ఆన్లైన్ సేవలతో లాభాలు పిండుకున్న టెక్ కంపెనీల అభివృద్ధి బుడగ ఇప్పుడు పేలడానికి సిద్ధంగా ఉందా? బేజారెత్తిన టెక్ కంపెనీల పరిస్థితికి కారణం ఏమిటి? భవిష్యత్తులో వాటి పునరుద్ధరణ జరిగే అవకాశం ఉందా? ‘‘రెండో డిజిటల్ విప్లవానికి నాంది పడింది. ప్రతి కంపెనీ, ప్రతి పరిశ్రమ ఆన్లైన్ సేవల వైపు మొగ్గుతోంది. ఇది మా కంపెనీకి లాభాలను ఒనగూర్చుతోంది’’ – ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ ఆంక్షల వేళ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల్ల వ్యాఖ్య ‘‘కోవిడ్ తర్వాత పరిస్థితులను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుకోవడం కోసం 10 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకాల్సి వస్తోంది’’ - కోవిడ్ వ్యాప్తి తగ్గిన ప్రస్తుత తరుణంలో సత్య నాదెళ్ల చేసిన తాజా ప్రకటన ఉద్వాసనల పర్వం.. కోవిడ్ కాలంలో అనుకోకుండా వచ్చి పడిన అవకాశంతో అభివృద్ధి పుంతలు తొక్కిన టెక్ సంస్థలు శరవేగంగా విస్తరణపర్వం మొదలుపెట్టాయి. ప్రపంచం నలుమూలలకు విస్తరించే క్రమంలో లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చాయి. అమెజాన్ ఒక్కటే 2022 సెప్టెంబర్ నాటికి ఏడాది మొత్తం 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చింది. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటాతోపాటు మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి ఐటీ దిగ్గజాలు కూడా లక్షలాది ఉద్యోగాలు కల్పించాయి. గతేడాది చివరికి వచ్చే సరికి పరిస్థితులు మారడం మొదలైంది. లాభాల్లో కోత పడతుండటంతో కంపెనీలు ఉద్యోగులను తొలగించడం మొదలుపెట్టాయి. ఒక్క 2022లోనే టెక్ కంపెనీలన్నీ కలిపి 1,64,411 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు లేఆఫ్స్ ఎఫ్వైఐ అనే సంస్థ సేకరించిన సమాచారంలో వెల్లడైంది. ఈ సంస్థ లెక్క ప్రకారం ఈ ఏడాది ఇప్పటికే 658 టెక్ కంపెనీలు 1,91,416 మంది ఉద్యోగులను తొలగించాయి. కేవలం టెక్ స్టార్టప్ కంపెనీలకు మాత్రమే నిధులు సమాకూర్చే సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) ఈ ఏడాది మార్చిలో కుప్పకూలడం ఐటీ కంపెనీలకు మరో శరాఘాతంగా పరిణమించింది. నిధుల కొరతతో అనేక కంపెనీలు మూతపడటమో, ఉద్యోగాలను తొలగించడమో చేశాయి. గతేడాది నవంబర్లో 11,000 ఉద్యోగాల కోతపెట్టిన మెటా... మళ్లీ ఈ ఏడాది మార్చిలో మరో 10 వేల మందిని తొలగించింది. అమెజాన్ 2022 నవంబర్లో 10,000 మంది, 2023 జనవరిలో 8 వేల మంది, మార్చిలో 9 వేల మంది ఉద్యోగులను తొలగించింది. యాక్సెంచర్ ఈ ఏడాదిలో ఇప్పటికే తన ఉద్యోగుల్లో 2.5 శాతం అంటే దాదాపు 19 వేల మందిని తొలగించింది. ట్విట్టర్ను కైవశం చేసుకున్న తర్వాత ఆ సంస్థలోని 80 శాతం మంది ఉద్యోగులను తొలగించామని ఎలాన్ మస్క్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే దాదాపు 6 వేల మంది ఉద్యోగులను తొలగించారు. కాగ్నిజెంట్ ఈ నెల 4న 3,500 మందిని తొలగించింది. మైక్రోసాఫ్ట్ గత ఐదేళ్లతో పోలిస్తే ఈ ఏడాది మొదటి క్వార్టర్లో అత్యల్ప ఆదాయం ఆర్జించింది. అమ్మకాలు 14 శాతం పడిపోయినట్లు సత్య నాదెళ్ల వెల్లడించారు. (వారెవ్వా టెక్నాలజీ.. ఫ్యూచర్ స్మార్ట్ఫోన్లు ఇలా ఉంటాయా?) ఎందుకీ పరిస్థితి టెక్ కంపెనీల తిరోగమ నానికి ఒక్కసారిగా వచ్చిపడ్డ అనేక పరిణామాలు కారణం. కృత్రిమ మేధ, ఆటోమేషన్ ఒక కారణమైతే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, ఆర్థిక మాంద్యం, డాలర్ విలువ పెరగడం, అధిక వడ్డీలు, స్థాయికి మించిన ఉద్యోగుల సంఖ్య వంటి కారణాలు టెక్ ప్రపంచాన్ని ఇప్పుడు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో మొదలైన ఆర్థిక మాంద్యం ఛాయలు క్రమేణా విస్తరిస్తూ ద్రవ్యోల్బణానికి ఆపై అధిక వడ్డీలకు దారితీశాయి. ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్న తరుణంలోనే కృత్రిమ మేధ, ఆటోమేషన్ ఉప్పెనలా వచ్చిపడి టెక్నాలజీ సంస్థల అభివృద్ధికి గండికొడుతున్నాయి. ఏఐ అత్యంత నాణ్యమైన, నమ్మకమైన ప్రత్యామ్నాయాలను సృష్టిస్తూ శరవేగంగా అన్ని రంగాలను కమ్ముకుంటోంది. ఇంతవరకు మానవ సంపదపై ఆధారపడి పనిచేస్తున్న టెక్ కంపెనీల ఉత్పాదనలను కృత్రిమ మేధ క్షణాల్లో అతిచౌకగా రూపొందిస్తుడటంతో ఆయా కంపెనీల ఆదాయంపై దెబ్బపడుతోంది. దాంతో గత్యంతరం లేక కంపెనీలు ఉద్యోగులను భారీగా తగ్గించుకొని ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. టెక్ ప్రపంచాన్ని వేధిస్తున్న మరో కారణం ద్రవ్యోల్బణం. ప్రస్తుత ధరల స్థాయి గత 40 ఏళ్లలోనే అత్యధికం. పెరుగుతున్న వస్తువులు, సేవల ధరలతో వినియోగదారులు టెక్ కంపెనీల ఉత్పాదనలు, సేవలను భరించలేని స్థాయికి చేరుకుంటున్నారు. ధరలను అదుపు చేయడానికి ప్రభుత్వాలు వడ్డీ రేట్లను పెంచుతుండటం టెక్ కంపెనీలకు దెబ్బమీద దెబ్బగా పరిణమిస్తోంది. అమ్మకాలు తగ్గి ఆదాయం పడిపోతుండటం కంపెనీలు నడపడానికి రుణాలు తీసుకోలేక ఉద్యోగుల ఉద్వాసనకు ఉపక్రమించాయి. కరోనా వేళ మార్కెట్ను సరిగ్గా అర్థం చేసుకోలేక, తమ అభివృద్ధి శాశ్వతమని భావించి అడ్డగోలుగా ఉద్యోగులను తీసుకున్నామని మెటా అధిపతి జుకర్బర్గ్, సేల్స్ఫోర్స్ అధినేత మార్క్ బెన్యాఫ్ ఒప్పుకున్నారు. టెక్ దిగ్గజాలకు భిన్నంగా యాపిల్ కంపెనీ మాత్రం ఉద్యోగ నియామకాల్లో సంయమనం పాటించింది. కోవిడ్ కాలంలో ఉద్యోగుల సంఖ్యను కేవలం 20 శాతమే పెంచుకుంది. దాంతో ఇంతవరకు ఉద్యోగులను తొలగించని టెక్ దిగ్గజం యాపిల్ ఒక్కటే. టెక్ ప్రపంచంలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు పాతికేళ్ల నాటి డాట్కామ్ బుడగను గుర్తుచేస్తోందని నిపుణులు అంటున్నారు. ఏమిటీ డాట్కామ్ బుడగ? గత శతాబ్దం చివర్లో ఇంటర్నెట్ వినియోగంలోకి వచ్చిన తరుణంలో దాని ఆధారంగా పుట్టుకొచ్చిన కంపెనీలు ఊహించని రీతిలో వృద్ధి చెందాయి. పేరు చివర డాట్కామ్ ఉన్న ప్రతి కంపెనీ విలువ వేలం వెర్రిగా పెరిగిపోయింది. 1995 నుంచి 2000 వరకు ఆన్లైన్ సేవల పేరిట వెలిసిన కంపెనీలన్నీ ఇబ్బడిముబ్బడిగా పెరిగి శతాబ్దం చివరికి వచ్చే సరికి గాలిబుడగలా పేలిపోయాయి. (Ravindra Jadeja వారెవ్వా జడేజా..అందుకో అప్రీషియేషన్ సూపర్ పిక్స్ వైరల్ ) ముందున్న కాలమంతా డాట్కామ్ కంపెనీలదే అని నిమ్మన వ్యక్తులు, సంస్థలు ఆయా కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఉదాహరణకు 1994లో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఏర్పడిన నెట్స్కేప్ అనే సంస్థ 1995లో అంటే కేవలం ఏడాది తరువాత పబ్లిక్ ఫండింగ్కు వెళ్తే ఒక్క రోజులోనే దాని మార్కెట్ క్యాప్ 278 కోట్ల డాలర్లకు చేరుకుంది. జనరల్ మోటార్స్కు ఈ విలువ సాధించడానికి 40 ఏళ్లు పట్టింది. 2001 వచ్చే సరికి ఈ డాట్కామ్ కంపెనీల విలువ కేవలం ఊహాజనితమని అర్థమై అందరూ పెట్టుబడులు ఉపసంహరించుకోవడంతో ఈ కంపెనీలన్నీ కుప్పకూలిపోయాయి. న్యూయార్క్ స్టాక్ ఎక్సే్ఛంజ్ ‘నాస్డాక్’లో 1995 నుంచి 2000 వరకు క్రమేపీ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ 800 శాతం పెరిగితే 2002 వచ్చే సరికి పెరిగిన మొత్తంలో 790 శాతం పడిపోయి దాదాపు మొదటికి వచ్చింది. దాంతో డాట్కామ్ బుడగ పేలిపోయింది. (ఇలాంటి టెక్ వార్తల కోసం చదవండి సాక్షిబిజినెస్) - దొడ్డ శ్రీనివాసరెడ్డి -
‘AI’ వల్ల ఉద్యోగాలు ఉంటాయా? ఊడతాయా?.. సత్య నాదెళ్ల ఏమన్నారంటే?
కృత్తిమ మేధ ఆధారిత టూల్స్ చాట్జీపీటీ, గూగుల్ బార్డ్ల వినియోగంతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నాయనే అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. టెక్నాలజీ ఆధారిత నిపుణులతో పాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు సైతం మానవ వినాశనం కోరే కృత్తిమ మేధస్సు వినియోగాల్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. ఈ తరుణంలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై స్పందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతాయంటే ఎవరూ నమ్మలేదు. కానీ ఎప్పుడైతే చాట్జీపీటీ, బార్డ్ వంటి టూల్స్ వినియోగంలోకి వచ్చాయో అప్పటి నుంచి అందరూ దీన్ని నమ్మడం మొదలుపెట్టారు. చాట్జీపీటీ వల్ల ఏఐ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది. దీని వల్ల ఉన్న ఉపయోగాలను పక్కనబెడితే.. వేర్వేరు రంగాలకు చెందిన కోట్లాది మంది ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో సీఎన్బీసీ ఇంటర్వ్యూలో సత్యనాదెళ్ల మాట్లాడుతూ.. ఏఐలాంటి అధునాతన టెక్నాలజీ వినియోగం ఉద్యోగాలపై ప్రభావం ఉంటుంది. అలాగే ఉద్యోగాలకు స్థాన భ్రంశం కలుగుతుంది. అదే సాంకేతికత భవిష్యత్తులో కొత్త ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యాన్ని కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని అన్నారు. అంతేకాదు మనుషులు రాసిన కంటెంట్ని చదవడం, సవరించడం, ఆమోదించడం వంటి విభాగాలకు కొత్త టెక్నాలజీ అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయా రంగాల్లో పనిచేస్తున్న వారికి ఏఐ’ సంతృప్తిని ఇస్తుంది. కొత్త ఉద్యోగాల్ని సృష్టిస్తుంది. ఉత్పాదకత పెరిగి కంపెనీల ప్రణాళికలతో ఉద్యోగుల జీతాలు పెరుగుతాయని చెప్పారు. చదవండి👉 ఇంట్లో ఇల్లాలు.. 200 కోట్ల ఆస్తికి యజమాని! -
ఇంద్రభవనం లాంటి సత్య నాదెళ్ల ఇల్లు.. చూసారా?
మైక్రోసాఫ్ట్ సీఈఓ 'సత్య నాదెళ్ల' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జన్మించి అగ్రరాజ్యంలో ఉన్నత స్థాయిలో ఉన్న మైక్రోసాఫ్ట్ కంపెనీ పగ్గాలు చేతపట్టుకుని భారతదేశానికి గొప్ప కీర్తి తెచ్చారు. గతంలో సత్య నాదెళ్ల జాబ్, ఆస్తులను గురించి కొన్ని కథనాల ద్వారా తెలుసుకున్నాం.. అయితే ఇప్పుడు బెల్లేవ్లోని సత్య నాదెళ్ల ఇంటి గురించి తెలుసుకుందాం. 1967 ఆగస్టు 19న హైదరాబాద్లో జన్మించిన నాదెళ్ల బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) పరీక్షలో ఉత్తీర్ణులయ్యే ప్రయత్నంలో విఫలమై ఆ తరువాత 1988లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ పొందాడు. విస్కాన్సిన్ మిల్వాకీ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్.. యూనివర్శిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి MBA చేశారు. (ఇదీ చదవండి: బిట్కాయిన్తో మహీంద్రా కార్లు కొనొచ్చా? ఆనంద్ మహీంద్రా సమాధానం ఏంటంటే..?) మైక్రోసాఫ్ట్ సీఈఓ అయిన సత్య నాదెళ్ళ బెల్లేవ్లో ఒక విలాసవంతమైన ఇంట్లో ఉంటున్నారు. ఈ ఇంటి విలువ దాదాపు 7.5 మిలియన్ డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 60 కోట్ల కంటే ఎక్కువ అని తెలుస్తోంది. ఇందులో రెండు అంతస్తుల లైబ్రరీ, హోమ్ థియేటర్, పెద్ద అవుట్డోర్ డెక్, హాట్ టబ్తో సహా అనేక సౌకర్యాలు మాత్రమే కాకుండా వైన్ సెల్లార్ కూడా ఉంది. ఆధునికమైన, అధునాతన సదుపాయాలు కలిగిన ఈ విలాసవంతమైన ఇంట్లో పెద్ద ఫ్లాట్ స్క్రీన్ టీవీలు, సౌకర్యవంతమైన సీటింగ్ సౌకర్యాలు, అద్భుతమైన బెడ్రూమ్లు, పెరట్లో కొలను, గేమ్ రూమ్ వంటి అనేక సదుపాయాలు ఉన్నాయి. మొత్తానికి సత్యనాదెళ్ళ ఇల్లు భూలక స్వర్గాన్ని తలపిస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. -
ఊహించని విధంగా.. 90 శాతం తగ్గిన అమెజాన్ సీఈవో వేతనం!
ప్రపంచంలో అత్యదిక వేతనం తీసుకుంటున్న సీఈవోల జాబితా ఉన్న అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ స్థానం మరింత దిగజారింది. స్వచ్ఛంద సంస్థ ‘As You Sow’ ఏడాదికి అత్యధిక జీతం తీసుకుంటున్న 100 మంది సీఈవోల జాబితా -2022 (100 Most Overpaid CEOs) ను విడుదల చేసింది. అందులో ఆండీ జెస్సీ స్థానం కిందకు పడిపోయింది. 2021లో 212 మిలియన్ డాలర్లతో 9వ స్థానంలో ఉన్నారు. ఈ మొత్తం అమెజాన్ ఉద్యోగులకు ఇచ్చే యావరేజీ శాలరీ కంటే 6,474 రెట్లు ఎక్కువ. అయితే, 2022లో 99 శాతం వేతనం కోతను ఎదుర్కొన్నారు. కాబట్టే మోస్ట్ ఓవర్ పెయిడ్ సీఈవోలా జాబితాలో తన స్థానాన్ని కోల్పోయారు. 99 శాతం తగ్గింది 2021లో ఆండీ జెస్సీ శాలరీ 212 మిలియన్ల నుండి 2022 నాటికి 1.3 మిలియన్లకు (సుమారు రూ. 10 కోట్లు) తగ్గిందని అమెజాన్ ఇటీవల దాఖలు చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. అయినప్పటికీ, జెస్సీ బేస్పే (జీతం మినహా ఇతర బెన్ఫిట్స్ ఉండవు) 175,000 డాలర్ల నుంచి 317,500తో 80 శాతం పెరిగింది. ఆండీ వేతనం తగ్గడానికి 2022లో స్టాక్ గ్రాంట్ అందకపోవడమే కారణమని తెలుస్తోంది. అంతేకాకుండా, 2021లో అందించిన అతని షేర్లలో కొంత భాగం ఈ సంవత్సరం అమెజాన్ అందించనుంది. మిగిలిన షేర్లను 2026 నుంచి 2031 చివరి నాటికి ఇవ్వనున్నట్లు సమాచారం. ఇతర టెక్ దిగ్గజాల సీఈవోల వేతనాలను పరిశీలిస్తే మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల గత ఏడాది 55 మిలియన్లు పొందగా, యాపిల్ సీఈవో టిమ్ కుక్ సుమారు 99.4 మిలియన్లు, 2020లో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వార్షిక వేతనం 2 మిలియన్ డాలర్లుగా ఉంది.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ప్రశాంతంగా జాతర జరుపుకోవాలి
నేరచరిత లేనివారిని బైండోవర్ చేయొద్దు
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
టమాట సీజన్ ప్రారంభం
No Headline
కూడేరులో జూనియర్ కాలేజ్ ఏర్పాటు
బాధ్యతగా విధులు నిర్వర్తించండి
ఆ ఇద్దరు టీచర్లపై విద్యాశాఖ ప్రేమ
ఆకట్టుకున్న మాక్డ్రిల్
27 నుంచి విజయవాడ రైలు రద్దు
తప్పక చదవండి
- అందుకే నా పేరుకి బ్లూ చేర్చా: ‘పుష్ప పుష్ప..’ సింగర్
- ‘బీజేపీ చేయలేని పని రాహుల్ చేస్తున్నారు’
- అంబానీల అతిథులకు కరీంనగర్ కానుకలు
- కన్హయ్యకు రూ. 52 లక్షలు? ఎవరెవరిచ్చారు?
- తెలుగు రాష్ట్రాల్లో డెత్ ట్రావెల్స్
- ఛాన్స్ వచ్చినా మోదీ బయోపిక్లో నటించను: సత్యరాజ్
- భారత సంతతి శాస్త్రవేత్తకు ‘షా’ అవార్డ్
- Daily Horoscope: ఈ రాశి వారు ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం
- మరీ ఇంత ‘పచ్చ’పాతమా!
- రాయల్స్ ముందుకు...చాలెంజర్స్ ఇంటికి...
Advertisement