● పెరుగుతున్న ధరలతో సాగుకు ఆసక్తి చూపుతున్న రైతులు
● ఎక్కడ చూసినా టమాట సాగే..
ఆత్మకూరు: కొన్ని రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు టమాట సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో 15 కిలోల బాక్సు ధర ఏకంగా రూ.500 వరకు పలుకుతోంది. గత ఏడాది వర్షాలు సరిగా కురవక, పంటలు అనుకున్న విధంగా చేతికి రాక నష్టం వాటిల్లింది. ప్రస్తుతం సకాలంలో వర్షాలు కురుస్తుండడంతో చాలా మంది రైతులు టమాట సాగు చేస్తున్నారు. చిన్న, సన్న కారు రైతులు ఎక్కువగా ఈ పంటపై ఆధారపడుతున్నారు. గత ఏడాది ఈ సీజన్లో 215 హెక్టార్లలో టమాట సాగైంది. ఈ ఏడాది విస్తీర్ణం బాగా పెరగవచ్చని వ్యవసాయ సిబ్బంది తెలిపారు.
నర్సరీల్లో డిమాండ్
మార్కెట్లో టమాట నారకు డిమాండ్ పెరిగింది. ఎకరాకు 15 వేల నుంచి 20 వేల మొక్కల వరకూ సాగు చేస్తారు. ప్రస్తుతం ఒక మొక్క 50 పైసల వరకూ పలుకుతోంది. జిల్లాలో 150 నర్సరీలకు పైగానే ఉన్నాయి. ఒక ఎకరాలో టమాట పంట పెట్టేందుకు రూ.20 వేల వరకూ పెట్టుబడి వస్తుందని రైతులు తెలియజేస్తున్నారు.
అనుకూలిస్తే ఆకాశానికి.. పడితే పాతాళానికే
టమాట లాభాలు లాటరీల్లా ఉన్నట్లు ఉంటాయి. ధర లేకపోతే రైతులు తమ పంటను ఎక్కడ అమ్ముకోవాలో తెలియక, రోడ్డు పక్కన పడేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గత ఏడాది 15 కిలోల బాక్సు ధర దాదాపు రూ.2 వేల వరకు పలికింది. అయితే, ఆ సమయంలో ఎక్కువగా పంట చేతికి రాకపోవడం గమనార్హం. అయితే, ఏది ఎలా ఉన్నా, టమాట ధరల్లో అనిశ్చితి కొనసాగుతున్నా, రైతులు మాత్రం ఎంతో ఆశతో పంట సాగు చేస్తూనే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment