అనంతపురం కార్పొరేషన్: సూపర్ సిక్స్ హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ మంగమ్మ ధ్వజమెత్తారు. శనివారం నగర శివారులోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ఆమె మాట్లాడారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై టీడీపీ చేస్తున్న ఆరోపణలపై స్పందించారు. దేవదేవుడు కొలువైన తిరుమలను కూడా రాజకీయాలకు వాడుకోవడం దారుణమన్నారు. సూపర్సిక్స్ హామీలపై ప్రజలు నిలదీస్తారనే శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు దుష్ప్రచారానికి తెరలేపారన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించడం దారుణమన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఇప్పటికే చంద్రబాబు విఫలమయ్యారన్నారు. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తామనడం పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు.ఇలాంటి తరుణంలో ప్రజలను ఏదో విధంగా తప్పుదోవ పట్టించాలనే నీచ రాజకీయాలకు తెరతీశారన్నారు. పవిత్రమైన తిరుమల దేవస్థానం ప్రతిష్టకు భంగం కల్గేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణను ఓర్వలేకనే కూటమి ప్రభుత్వం దుశ్చర్యలకు పాల్పడుతోందన్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో తప్పక బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment