France to Soon Start Using India UPI Payment Mechanism - Sakshi
Sakshi News home page

UPI in France: ఫ్రాన్స్‌లోకి అడుగు పెట్టిన ‘యూపీఐ’.. ఈఫిల్‌ టవర్‌ నుంచే చెల్లింపులు

Published Sat, Jul 15 2023 4:43 AM

France to soon start using India UPI payment mechanism  - Sakshi

న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపుల్లో భారత్‌ మేటి ఆవిష్కరణ అయిన ‘యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌’ (యూపీఐ) ఫ్రాన్స్‌లోకి ప్రవేశించింది. భారత పర్యాటకులు ఈఫిల్‌ టవర్‌ నుంచి యూపీఐ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌ పర్యటన సందర్భంగా ప్రకటించారు. ‘‘భారతీయులు యూపీఐ సాధనం వినియోగించే విధంగా ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదిరింది. ఇది ఈఫిల్‌ టవర్‌ నుంచే ప్రారంభమవుతుంది. ఇప్పుడు భారత పర్యాటకులు ఈఫిల్‌ టవర్‌ నుంచే యూపీఐ ద్వారా రూపాయిల్లో చెల్లింపులు చేసుకోవచ్చు’’అని ప్రధాని తెలిపారు.

యూపీఐ విషయంలో భారత్‌ సాధించిన మరో ఘనతగా దీన్ని చెప్పుకోవాలి. ఇప్పటికే భారత్‌–సింగపూర్‌ మధ్య యూపీఐ ద్వారా సీమాంతర చెల్లింపులకు ఒప్పందం కుదరడం గమనార్హం. అంతేకాదు యూఏఈ, భూటాన్, నేపాల్‌ సైతం యూపీఐ చెల్లింపుల వ్యవస్థాను అనుమతించాయి. యూఎస్, ఐరోపా దేశాలు, పశి్చమాసియా దేశాలతోనూ యూపీఐ సాధనం విషయమై భారత్‌ చర్చలు నిర్వహిస్తోంది. యూపీఐ వినియోగం ఇప్పటి వరకు భారత్‌లోనే ఉండగా, అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నట్టు ఎన్‌పీసీఐ సీఈవో రితేష్‌ శుక్లా తెలిపారు. యూపీఐని అభివృద్ధి చేసింది ఎన్‌పీసీఐ అని తెలిసిందే.  

ఎలా పనిచేస్తుంది?
ఫ్రాన్స్‌కు చెందిన చెల్లింపుల పరిష్కారాలను అందించే లైరా నెట్‌వర్క్స్‌తో ఎన్‌పీసీఐ 2022లోనే ఒప్పందం చేసుకుంది. దీంతో ఫ్రాన్స్‌ను సందర్శించే భారత విద్యార్థులు, పర్యాటకులతోపాటు ఎన్‌ఆర్‌ఐలు ఇక నుంచి లైరా నెట్‌వర్క్‌ ఆధారిత అన్ని చెల్లింపుల టెరి్మనళ్ల వద్ద యూపీఐతో చెల్లింపులు చేసుకోవడం సాధ్యపడుతుంది. అంతర్జాతీయ టెలిఫోన్‌ నంబర్లను ఇందుకు వినియోగించుకోవచ్చు. భారత్‌లో బ్యాంక్‌ ఖాతా, దానితో అనుసంధానించిన యూపీఐ ఐడీ ఉండాలి. అలాగే ఫోన్‌లో భీమ్‌ లేదా యూపీఐ ఆధారితే ఏదో ఒక అప్లికేషన్‌ ఉంటే దాని ద్వారా లావాదేవీలు చేసుకోవచ్చు. దీంతో కరెన్సీ మారక ఖర్చులు గణనీయంగా ఆదా అవుతాయి. రెండు దేశాల మధ్య రెమిటెన్స్‌ ఖర్చులు సైతం తగ్గుతాయి.  

రోజుకు 100 కోట్ల లావాదేవీలు  
యూపీఐ ఇప్పుడు అంతర్జాతీయంగా విస్తరిస్తుండడంతో రానున్న రోజుల్లో చెల్లింపుల లావాదేవీల సంఖ్య గణనీయంగా పెరగనుంది. అంతేకాదు సీమాంతర చెల్లింపులు మరింత వేగంగా, సులభంగా చేసుకోవడం సాధ్యపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జూన్‌ నాటికి రోజువారీ లావాదేవీల సంఖ్య 9.33 కోట్లుగా ఉంది. 2025 నాటికి రోజువారీ బిలియన్‌ లావాదేవీలకు (100 కోట్లు) చేరుకుంటామని శుక్లా విశ్వాసం వ్యక్తం చేశారు. నేడు యూకే, నేపాల్, భూటాన్, సింగపూర్, ఆ్రస్టేలియా, ఒమన్, ఫ్రాన్స్‌లో యూపీఐ లావాదేవీలకు అవకాశం ఏర్పడినట్టు చెప్పారు. భారత్‌ 13 దేశాలతో అవగాహన ఒప్పందం చేసుకుందని, అవన్నీ తమ దేశంలో డిజిటల్‌ చెల్లింపులకు యూపీఐని వినియోగించుకోవాలని అనుకుంటున్నట్టు కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 13న ప్రకటించడం గమనార్హం. 

Advertisement
 
Advertisement
 
Advertisement