కంపెనీ మారే ఆలోచనలో ఉద్యోగి.. స్వయంగా రంగంలోకి గూగుల్ కోఫౌండర్
Published
Thu, Mar 28 2024 5:00 PM
Google employee: ఖర్చులు తగ్గించుకునే నెపంతో టెక్నాలజీ కంపెనీలు లేఆఫ్ల పేరుతో వేలాదిగా ఉద్యోగులను వదిలించుకోవడం చూస్తున్నాం. అదే సమయంలో ప్రతిభ ఉన్న ఉద్యోగులు ఇతర సంస్థలకు వెళ్లకుండా వారికి కావాల్సింది ఇచ్చి కాపాడుకుంటున్నాయి కొన్ని కంపెనీలు.
ఇలాగే కంపెనీ మారే ఆలోచనలో ఉన్న ఓ ఉద్యోగిని కాపాడుకునేందుకు నేరుగా గూగుల్ కోఫౌండర్ రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. ఓపెన్ ఏఐ కంపెనీ కోసం గూగుల్ను వీడేందుకు సిద్ధమైన తమ ఉద్యోగికి గూగుల్ కోఫౌండర్ సెర్గీ బ్రిన్ వ్యక్తిగతంగా ఫోన్ చేశారు. ఉద్యోగిని పోస్ట్లో కొనసాగేలా ఒప్పించేందుకు అదనపు వేతనం ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. కాగా కంపెనీ మారేందుకు సిద్ధమైన ఆ ఉద్యోగి గూగుల్లో చాలా కాలంగా ఏఐ రీసెర్చర్గా పనిచేస్తున్నట్లు తెలిసింది.
సదరు గూగుల్ ఉద్యోగి తమకు స్నేహితుడని, అతనికి కోసం స్వయంగా కంపెనీ కోఫౌండర్ సెర్గీ బ్రిన్ రంగంలోకి దిగడం బిగ్ టెక్ కంపెనీల్లో ఏఐ టాలెంట్కు ఉన్న డిమాండ్ ట్రెండ్ను సూచిస్తోందని ఓ అజ్ఞాత వ్యక్తి తెలిపారు. ప్రస్తుతం అధునాతన ఏఐ నైపుణ్యాలకు డిమాండ్ బిగ్ టెక్ కంపెనీల్లో అత్యధికంగా ఉంది.