మీ ఇంటికే వస్తున్నామమ్మా.. | Sakshi
Sakshi News home page

మీ ఇంటికే వస్తున్నామమ్మా..

Published Thu, May 9 2024 10:15 AM

మీ ఇం

కందుకూరు: ప్రశాంతంగా దైవ దర్శనాన్ని చేసుకున్నారు. తిరుగు ప్రయాణంలో కాసేపట్లో తమ కుమార్తె ఇంటికి చేరుకుంటామని ఆ భార్యాభర్తలు మురిసిపోయారు. కానీ లారీ రూపంలో వచ్చిన మృత్యువు భర్తను కబళించగా, భార్యను తీవ్ర గాయాల పాలు చేసింది. ఈ సంఘటన కందుకూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు బుధవారం చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం షేక్‌మహ్మద్‌పేటకు చెందిన చింతలపూడి దుర్గాప్రసాద్‌(65) భార్య సరోజతో కలిసి హైదరాబాద్‌ మలక్‌పేటలో నివసిస్తున్నారు. దుర్గాప్రసాద్‌ ప్రభుత్వ ఆడిట్‌ డిపార్టుమెంట్‌లో పని చేసి రిటైరయ్యారు. కుమారుడు అమెరికాలో సెటిల్‌ అవగా.. కుమార్తె తుక్కుగూడ మున్సిపల్‌ పరిధిలోని రాంకీ విల్లా వెంచర్‌లో ఉంటున్నారు. గత సోమవారం దుర్గాప్రసాద్‌ దంపతులు కారులో దైవ దర్శనానికి శ్రీశైలం వెళ్లారు. తిరిగి బుధవారం ఉదయం ఇంటికి బయలుదేరారు. కందుకూరు వద్దకు రాగానే సమీపంలో ఉన్న కూతురుకు ఫోన్‌ చేసి ‘మీ ఇంటికే వస్తున్నామమ్మా’ అని చెప్పారు. మరికొద్ది క్షణాల్లో గమ్యం చేరుకోవాల్సి ఉండగా.. శ్రీశైలం రహదారిపై పెద్దిరెడ్డి వెంచర్‌– కొత్తూర్‌ వాగు మధ్య ఎదురుగా వస్తున్న లారీ వీరి కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డ్రైవింగ్‌ సీటులో ఉన్న దుర్గాప్రసాద్‌ తీవ్రంగా గాయపడి ఇరుక్కుపోయారు. సరోజకు తీవ్ర గాయాలు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వాహనంలో ఇరుక్కుపోయిన దుర్గాప్రసాద్‌ను, సరోజను స్థానికులు అతికష్టంగా బయటకు తీసి 108 అంబులెన్స్‌ వాహనంలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే దుర్గాప్రసాద్‌ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సరోజ చికిత్స పొందుతోంది. ఈ మేరకు సీఐ మక్బూల్‌జానీ ఆధ్వర్యంలో ఎస్‌ఐ సైదులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

కూతురుకు ఫోన్‌చేసి చెప్పిన తల్లిదండ్రులు

ఆతర్వాత కొద్ది క్షణాలకే రోడ్డు ప్రమాదం

కారును ఢీకొట్టిన లారీ

తండ్రి దుర్మరణం, తీవ్ర గాయాలపాలైన తల్లి

మీ ఇంటికే వస్తున్నామమ్మా..
1/1

మీ ఇంటికే వస్తున్నామమ్మా..

Advertisement

తప్పక చదవండి

Advertisement