ఫ ఎన్నికల ప్రచారంలో సింహభాగం సోషల్ మీడియాదేఫ ప్రత్యేకంగా ఉద్యోగుల నియామకంఫ ఎన్నికల కమిషన్కు సైతం సోషల్ మీడియా సహకారం
సాక్షి, అమలాపురం/కాకినాడ సిటీ: కాలం మారుతున్నట్టుగానే ఎన్నికల ప్రచారం, పోలింగ్ నిర్వహణ వంటి వాటిలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆధునితక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం అధికమవుతోంది. ఈసారి సార్వత్రిక ఎన్నికల వేళ బహిరంగంగా జరిగిన సభలు, సమావేశాలు, ర్యాలీలతో పాటు.. సామాజిక మాధ్యమాలు సైతం అభ్యర్థుల ప్రచారంలో కీలక పాత్ర పోషించాయి. ఒకప్పుడు ఇంటర్నెట్ వినియోగం అంతంత మాత్రంగానే ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. పల్లెపల్లెనా దాదాపు అందరి చేతుల్లోనూ ఇంటర్నెట్ సౌకర్యంతో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు ఈసారి వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. ఇంటింటా ప్రచారం ఒకవైపు.. ప్రచార రథాల మీద ర్యాలీలు మరోవైపు చేస్తూనే.. సోషల్ మీడియాలో ప్రచారానికి ప్రత్యేకంగా ఉద్యోగులను, బృందాలను నియమించుకున్నారు.
సూటిగా.. సుత్తి లేకుండా..
ఫ ముఖ్యంగా వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్ (ట్విట్టర్), ఇన్స్ట్రాగాం, యూట్యూబ్ ద్వారా ప్రచారాలు జోరుగా సాగించారు. ఆయా సామాజిక మాధ్యమాల్లో తమ పేరిట ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేసుకుని మరీ తమ అనుచరులకు సమాచారం చేరవేయడంతో పాటు, ఆసక్తి కలిగించే రీతిలో ప్రచారాలు నిర్వహించారు. అభ్యర్థులతో పాటు, వారి ముఖ్య అనుచరులు కూడా సామాజిక మాధ్యమాలను ఎన్నికల ప్రచారానికి విస్తృతంగా వినియోగించుకున్నారు.
ఫ ఎక్స్ వంటి వాటిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, విపక్ష కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ వంటి వారు వినియోగిస్తూండగా.. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, వాట్సాప్ వంటి వాటిని అధికంగా ఉపయోగించుకుంటున్నారు.
ఫ ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, యూట్యూబ్లలో రీల్స్, షార్ట్స్ ప్రచారం అధికంగా సాగింది. చూసిన వారికి విషయం సూటిగా అర్థమయ్యేలా.. ఎటువంటి సాగదీత లేకుండా చిన్నచిన్న వీడియోలుగా ఈ రీల్స్, షార్ట్స్ రూపొందించారు.
ఫ కొన్ని కొన్ని రీల్స్ ప్రచారంలో పాపులర్గా చొచ్చుకుపోయాయి. పార్టీల అధినేతల ప్రసంగాల బిట్లు, పంచ్ డైలాగులను పదేపదే చూసేవారు, ఆసక్తిగా చదివే వారు అధికంగా ఉంటున్నారు. దీంతో ఈ తరహా పోస్టుల తయారీకి ఇప్పుడు గిరాకీ ఏర్పడింది.
ఫ ఆయా పార్టీల అనుకూల పోస్టులు, ప్రత్యర్థి వ్యతిరేక పోస్టులను షేర్ చేయడం, కొత్తకొత్త పోస్టులు తయారు చేయడానికి ఆయా పార్టీలు ప్రత్యేకంగా సోషల్ మీడియా సైన్యాన్నే తయారు చేసుకున్నాయి.
ఫ దీనికోసం కొంత మంది అభ్యర్థులు ప్రత్యేకంగా ఉద్యోగులను నియమించుకుంటున్నారు.
ఫ మరికొంత మంది యువత, సాంకేతిక అనుభవం ఉన్న వ్యక్తులను బృందాలుగా ఏర్పాటు చేసుకుంటున్నారు.
చేసిన మంచి చెప్పుకొంటూ..
అధికార వైఎస్సార్ సీపీకి ఎన్నికల్లోనే కాకుండా సోషల్ మీడియా ప్రచారంలో కూడా సామాన్యులు, పేదలే స్టార్ క్యాంపైనర్లుగా మారారు. రీల్స్లో వారిదే అగ్రస్థానం. పింఛన్ తీసుకున్న వారితో పాటు వైఎస్సార్ ఆసరా, చేయూత, చేదోడు, గృహ నిర్మాణం, రైతు భరోసా, నేతన్న నేస్తం, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం వంటి పథకాల లబ్ధిదారులే ప్రభుత్వానికి, సీఎం జగన్కు ప్రచారకర్తలుగా మారారు. సీఎం జగన్ పలు ప్రచార సభల్లో చెబుతున్నట్టుగా ‘మంచి చేస్తే గెలిపించండి’ అనే నినాదాన్ని మారుమూల ప్రాంతాలకు కూడా చేరడంలో సామాన్యుల మాధ్యమాల ప్రచారమే కారణమైంది. యువతీ యువకులు, నాడు–నేడు, అమ్మ ఒడి, యూనిఫాం, మధ్యాహ్న భోజనం, ఇంగ్లిష్ మీడియం వంటి ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి సోషల్ మీడియాలో విద్యార్థులు సైతం ప్రధాన ప్రచారకర్తలుగా మారారు. ప్రత్యర్థులపై విమర్శలకన్నా చేసిన సంక్షేమం, అభివృద్ధిని చెప్పుకుంటూ పాజిటివ్ ప్రచారానికి వైఎస్సార్ సీపీ శ్రీకారం చుట్టింది. ఇదే సమయంలో చంద్రబాబు ఆధ్వర్యంలో విపక్ష కూటమి అధికారంలోకి వస్తే జరిగే నష్టాలను సైతం వివరించింది. 2014–19 మధ్య చంద్రబాబు హామీలు అటకెక్కిన తీరును ప్రశ్నించడం కూడా ఓటర్లను ఆలోచింపజేస్తోంది.
తప్పుడు ప్రచారంతో..
వైఎస్సార్ సీపీ పాజిటివ్ ప్రచార పంథాను ఎక్కువగా అనుసరిస్తే.. మిత్రపక్షాలై టీడీపీ, బీజేపీ, జనసేనలు దీనికి భిన్నమైన పంథాను ప్రచారంలో ఎంచుకున్నారు. మేధావులు సైతం అసాధ్యమని భావిస్తున్న సూపర్ సిక్స్కు మరో నాలుగు పథకాలు కలిపిన మొత్తం పది పథకాలను ప్రకటించగా.. వాటిని జనం నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో వాటిపై పెద్దగా ప్రచారం చేయకుండా.. సీఎం జగన్, వైఎస్సార్ సీపీ అభ్యర్థులపై తప్పుడు ప్రచారానికే సోషల్ మీడియాను అధికంగా వాడుకుంటున్నారు. వీరి ప్రచారంలో బుల్లితెర నటీనటులతో పాటు పెయిడ్ ఆరిస్టుల ప్రభావం అధికంగా ఉంది. ఈ తప్పుడు ప్రచారం పలుచోట్ల తేలిపోతున్నా విపక్ష కూటమి ఇదే పంథాను అనుసరిస్తోంది.ఈసీకి సైతం సోషల్ మీడియానే..
మరోవైపు ఎన్నికల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఇటు ఎన్నికల కమిషన్ (ఈసీ) సైతం సోషల్ మీడియానే ఆయుధంగా ఉపయోగిస్తూండటం విశేషం. ఎన్నికల నిఘా, ప్రజలకు ఓటు విలువపై అవగాహన కల్పించేందుకు సోషల్ మీడియానే వేదికగా వాడుకుంటోంది. సామాన్య పౌరులను సైతం భాగస్వాములను చేస్తూ ఈసీ ఈసారి పలు రకాల యాప్లను అందుబాటులోకి తెచ్చింది. సీ–విజిల్, సువిధ, అబ్జర్వర్, సాక్ష్యం, కేవైసీ, నేషనల్ గ్రీవెన్స్ సర్వీస్, ఓటర్ హెల్ప్లైన్ యాప్లను అందుబాటులోకి తీసుకుని వచ్చారు. ఎన్నికలకు సంబంధించిన సమాచారం, కోడ్ ఉల్లంఘనపై ఫిర్యాదులతో పాటు, ఎన్నికల నియమావళి, ఓటర్లకు అవసరమైన సాయం, ఎన్నికల ఖర్చు, పోలింగ్ బూత్ల సమాచారం వంటివి తెలుసుకునేందుకు ఉపయోపడేలా ఈ యాప్లను రూపొందించారు.