● మొదటిసారి ఓటు వినియోగించుకున్న యువత ● నిజాయతీగా ఓటేయడం గర్వంగా ఉందంటున్న పౌరులు
ప్రజాస్వామ్యం విజయవంతం కావడంలో ఓటుహక్కు ఎంతో కీలకం. ముఖ్యంగా ఈ విషయంలో యువత బాధ్యతగా ఓటు వేయాల్సి ఉంటుంది. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు ఎన్నికల కమిషన్ ఓటుహక్కు కల్పించడంతో పార్లమెంట్ ఎన్నికల్లో తొలిసారిగా ఓటు వేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి మొదటిసారి ఓటువేసి కొత్త అనుభూతి పొందారు. ఈ సందర్భంగా మొదటిసారి ఓటు వేసిన పలువురు యువతీ యువకుల అభిప్రాయాలు వారి మాటల్లోనే...
ఓటేసిన కవలలు
మంచిర్యాలటౌన్: పట్టణంలోని హైటెక్సిటీ కాలనీకి చెందిన కవలలు ఆది శ్రీజ ఎంబీబీఎస్, శ్రీకర్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. దేశాన్ని పాలించే వారిని ఎన్నుకునేందుకు ఓటు ఒక ఆయుధమని, అందుకే తాము ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి వచ్చామన్నారు.
– ఆది శ్రీజ, ఆది శ్రీకర్, మంచిర్యాల