-
మళ్లీ చర్చలు!
వాషింగ్టన్/బీజింగ్/బీరూట్: పశ్చిమాసియాలో యుద్ధానికి తెర దించే దిశగా అమెరికా, ఇరాన్ నడుమ రెండో దఫా చర్చలు జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. అవి బహుశా వచ్చే రెండు రోజుల్లో జరగవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం న్యూయార్క్ పోస్ట్ వార్తా సంస్థతో పేర్కొన్నారు. తొలి దశ మాదిరిగానే ఈ చర్చలకు కూడా పాక్ రాజధాని ఇస్లామాబాదే వేదిక కానున్నట్టు వెల్లడించారు. పాక్ సైన్యాధిపతి అసీం మునీర్ కృషి వల్లే ఇది సాధ్యపడుతోదంటూ ట్రంప్ ప్రశంసించారు. ఆదివారం జరిగిన తొలి దఫా చర్చలు విఫలమవడం తెలిసిందే. ‘‘రెండో దఫా చర్చలకు ఇరాన్ కూడా అంగీకరించింది. ఆ దేశ ఓడరేవులన్నింటినీ అమెరికా దిగ్బంధించిన కారణంగానే దిగొచి్చంది’’ అని ఫాక్స్ న్యూస్ పేర్కొంది.గత 24 గంటల్లో హార్మూజ్ జలసంధితో పాటు ఆ దేశ రేవులన్నింటినీ పూర్తిగా దిగ్బంధించినట్టు యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఈ ఆపరేషన్లో 10 వేల మందికి పైగా సైనికులు, 18 యుద్ధ నౌకలు, 100కు పైగా యుద్ధ విమానాలు పాల్గొంటున్నట్టు తెలిపింది. అయితే చమురు, రసాయనాలను తీసుకెళ్తున్న రిచ్ స్టారీ అనే నౌక మంగళవారం హార్మూజ్ను దాటినట్టు సమాచారం. హార్మూజ్ జలసంధిని తెరిపించే లక్ష్యంతో శుక్రవారం పారిస్లో జరిగే సదస్సుకు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ అధ్యక్షత వహించనున్నారు.మరోవైపు హార్మూజ్ను అమెరికా దిగ్బంధించడాన్ని చైనా తీవ్రంగా తప్పుబట్టింది. దాన్ని ప్రమాదకరమైన, బాధ్యతారహిత చర్యగా అభివరి్ణంచింది. అమెరికా, ఇరాన్ తక్షణం పూర్తిస్థాయి కాల్పుల విరమణ పాటించాలని సూచించింది. ఇరాన్కు సైనికంగా సాయపడుతున్నామన్న ట్రంప్ ఆరోపణలను ఖండించింది. తమపై టారిఫ్లు పెంచితే దీటుగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించింది. పశ్చిమాసియాలో అన్ని దేశాల సార్వబౌమత్వాన్నీ, భద్రతను, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాల్సిన అవసరముందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అభిప్రాయపడ్డారు. పశ్చిమాసియా యుద్ధంపై ఆయన స్పందించడం ఇదే తొలిసారి. ఇజ్రాయెల్, లెబనాన్ చర్చలు ఇజ్రాయెల్, లెబనాన్ 33 ఏళ్ల అనంతరం తొలిసారి ప్రత్యక్ష చర్చలకు దిగాయి. అమెరికాలోని ఇరు దేశాల రాయబారులు మంగళవారం వాషింగ్టన్లో సన్నాహక చర్చలు జరిపారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఐరాసలో అమెరికా రాయబారి మైక్ వాల్జ్ కూడా వాటిలో పాల్గొన్నారు. నెల రోజులుగా లెబనాన్పై ఇజ్రాయెల్ భారీగా దాడులు చేస్తుండటం తెలిసిందే. వాటికి తెర దించడమే లక్ష్యంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే వాటి ఫలితాలకు కట్టుబడి ఉండబోనని లెబనాన్ సాయుధ మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లా ప్రకటించింది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు మంగళవారం కూడా కొనసాగాయి. ఇజ్రాయెల్పై ప్రతి దాడులకు దిగినట్టు హెజ్బొల్లా పేర్కొంది. -
లోక్సభ స్థానాలు 850కి పెంపు!
సాక్షి, న్యూఢిల్లీ: 2029 లోక్సభ ఎన్నికలకు ముందే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని, అందుకోసం లోక్సభ స్థానాలను భారీగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో లోక్సభలో స్థానాల సంఖ్య ప్రస్తుతమున్న 543 నుంచి 850 దాకా పెరిగే అవకాశముంది! వీటిలో అన్ని రాష్ట్రాల్లో కలిపి 815కు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గరిష్టంగా 35కు మించకుండా స్థానాలుంటాయి. మహిళలకు 33 శాతం లెక్కన వాటిలో గరిష్టంగా 280 నుంచి 281 స్థానాల దాకా రిజర్వు చేయనున్నారు. దీనికి వీలు కల్పించేందుకు ఉద్దేశించిన 3 బిల్లులను గురువారం నుంచి మూడు రోజుల పాటు జరగబోయే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టనుంది.2029కి ముందే మహిళా రిజర్వేషన్ల చట్టం అమలు, అందుకోసం లోక్సభ స్థానాల పెంపుకు వీలు కల్పించేలా రాజ్యాంగ (131వ)సవరణ బిల్లు–2026, దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేందుకు వీలుగా డీలిమిటేషన్ బిల్లు–2026, ఈ ప్రక్రియను ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, పుదుచ్చేరి అసెంబ్లీలకు కూడా వర్తింపజేసేందుకు కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు–2026 వీటిలో ఉంటాయి. ఈ మూడు బిల్లులకూ ఈ ప్రత్యేక సమావేశాల్లోనే పార్లమెంటు ఆమోదం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. వాటి ముసాయిదా ప్రతులను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంగళవారం ఎంపీలందరికీ పంపింది. లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కోసం త్వరలో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు కానుంది.లోక్సభ స్థానాల తుది సంఖ్యను పునర్విభజన కసరత్తు అనంతరం కమిషనే ఖరారు చేయనుంది. ఈ కారణంగానే పెరగనున్న లోక్సభ స్థానాల సంఖ్యను రాజ్యాంగ సవరణ బిల్లులో స్పష్టంగా పేర్కొనలేదు. ‘అన్ని రాష్ట్రాలకు కలిపి గరిష్టంగా 815కు మించకుండా, కేంద్రపాలిత ప్రాంతాల్లో 35కు మించకుండా లోక్సభ స్థానాలుండాలి’అని మాత్రమే తెలిపారు. లోక్సభతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో స్థానాల సంఖ్యను 50 శాతం పెంచాలని మోదీ సర్కారు నిర్ణయించడం తెలిసిందే.ఇందుకోసం 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటూ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ చేపట్టనున్నట్టు రాజ్యాంగ సవరణ బిల్లులో వెల్లడించారు. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పెంపుకు వీలుగా రాజ్యాంగంలోని పలు అధికరణలకు సవరణలను కూడా ప్రతిపాదించారు. నారీశక్తి వందన్ అధినియమ్గా పేర్కొనే మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణలకు పార్లమెంటు ప్రత్యేక భేటీలో ఆమోదం పొందనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే వెల్లడించడం తెలిసిందే. ఈ ప్రక్రియ ఆలస్యమైతే చట్టసభల్లో విధాన నిర్ణయ ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఆశిస్తున్న మహిళలందరికీ తీవ్ర అన్యాయం జరుగుతుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. 2029 నుంచే అమలయ్యేలా... మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని 2023లో పార్లమెంటు ఆమోదించడం తెలిసిందే. దీని ప్రకారం లోక్సభ, అసెంబ్లీల్లో 33 శాతం సీట్లను మహిళలకు ప్రత్యేకిస్తారు. అయితే ఈ చట్టం 2034కు ముందు అమల్లోకి వచ్చే పరిస్థితులు లేవు. మహిళా రిజర్వేషన్లు అమలవాలంటే ప్రస్తుతం కొనసాగుతున్న జనగణన–2027 ప్రక్రియ ముగిసి, ఆ లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పుననర్విభజన చేపట్టాల్సి ఉండటమే అందుకు కారణం. కానీ మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని 2029 నుంచే అమల్లోకి తేవాలని మోదీ సర్కారు భావిస్తోంది. ‘‘తదుపరి జనగణన, దాని తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియకు చాలా సమయం పడుతుంది.కానీ లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు మూడోవంతు రిజర్వేషన్లు వీలైనంత త్వరగా అమలయ్యేలా చూడటం చాలా ముఖ్యం. అందుకు అనుగుణంగా మహిళా రిజర్వేషన్ల చట్టానికి అవసరమైన సవరణలు చేపట్టడమే లక్ష్యం’’అని ప్రతిపాదిత రాజ్యాంగ సవరణ బిల్లు ముసాయిదాలో కేంద్రం పేర్కొంది. ఇందుకోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న, అంటే 2011 జనాభా లెక్కల ఆధారంగానే లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టనున్నట్టు వెల్లడించింది. లోక్సభ, అసెంబ్లీల్లో మహిళలకు రిజర్వు చేసే స్థానాలను రొటేషన్ పద్ధతిలో కేటాయిస్తారని తెలిపింది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు 15 ఏళ్ల పాటు అమల్లో ఉంటాయి. అనంతరం వాటి పొడిగింపుపై పార్లమెంటు నిర్ణయం తీసుకుంటుంది. మూడు బిల్లులపై 18 గంటల చర్చ మహిళా రిజర్వేషన్ల అమలుకు ఉద్దేశించిన మూడు కీలక బిల్లులను గురువారం లోక్సభలో కేంద్రం ప్రవేశపెట్టనుంది. రాజ్యంగ (131వ సవరణ) బిల్లు–2026, డీలిమిటేషన్ బిల్లు–2026, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు–2026పై గురు, శుక్రవారాల్లో సభలో చర్చ జరగనుంది. అందుకు 18 గంటల సమయం కేటాయించారు. అనంతరం వాటిపై ఓటింగ్ చేపడతారు. తర్వాత మూడు బిల్లులపై శనివారం రాజ్యసభలో 10 గంటల పాటు చర్చ, అనంతరం ఓటింగ్ జరుగుతాయి. గురు, శుక్రవారాల్లో రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ ఎన్నిక కూడా జరుగుతుందని పార్లమెంటు వర్గాలు వెల్లడించాయి.లోక్సభ స్థానాల పెంపులో దక్షిణాది రాష్ట్రాలకు లబ్ధి?లోక్సభ నియోజకవర్గాల పెంపులో దామాషా ప్రాతినిధ్య విధానాన్ని ప్రాతిపదికగా తీసుకోనున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లోక్సభ స్థానాలను గరిష్టంగా 850 దాకా పెంచాలని రాజ్యాంగ సవరణ బిల్లు–2026లో కేంద్రం ప్రతిపాదించింది. ‘‘వాటిని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించే విషయంలో దామాషా విధానాన్ని అనుసరించనున్నారు. దీనిద్వారా దక్షిణాది రాష్ట్రాలకే ఎక్కువ లబ్ధి చేకూరే అవకాశముంది’’అని కేంద్ర వర్గాలు వివరించాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం లోక్సభలో వెల్లడించే అవకాశమున్నట్టు తెలిపాయి.నియోజకవర్గాల పునర్విభజనకు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోనున్న విషయం తెలిసిందే. దక్షిణాది రాష్ట్రాలు కొన్ని దశాబ్దాలుగా కుటుంబ నియంత్రణను సమర్థంగా పాటిస్తూ వస్తున్నాయి. దాంతో ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే వాటిలో జనాభా పెరుగుదల తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు చేపడితే తమకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండటం తెలిసిందే. పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గి ఉత్తరాది రాష్ట్రాల ప్రాబల్యం పెరుగుతుందని విపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి.వాడీవేడిగా సమావేశాలు గురువారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ రాజకీయ లబ్ధి కోసమే మోదీ సర్కారు హడావుడిగా మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణలను తెరపైకి తెచి్చందని కాంగ్రెస్తో పాటు విపక్షాలన్నీ మండిపడుతున్నాయి. మరోవైపు డీలిమిటేషన్తో తమకు తీవ్ర అన్యాయం జరగనుందని దక్షిణాది రాష్ట్రాలు అభ్యంతరం లేవనెత్తుతున్నాయి. ఈ ప్రక్రియను పార్లమెంటులోనే సవాలు చేస్తామని ఇప్పటికే స్పష్టం చేశాయి.డీలిమిటేషన్ 2011 జనాభా లెక్కల ఆధారంగా కాకుండా తాజాగా జరుగుతున్న జనగణన ప్రాతిపదికన జరగాలని ఆప్, ఆర్జేడీ వంటి పార్టీలు డిమండ్ చేస్తున్నాయి. రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు ఆమోదానికి ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ఇందుకు విపక్షాల మద్దుతు మోదీ ప్రభుత్వానికి తప్పనిసరి. ఈ నేపథ్యంలో సమావేశాలు వాడీవేడిగా సాగడం ఖాయంగా కని్పస్తోంది. పార్లమెంటు సమావేశాలకు విధిగా హాజరు కావాలంటూ బీజేపీ, కాంగ్రెస్ ఇప్పటికే తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. డీలిమిటేషన్కు కమిషన్ ⇒ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వం ⇒ సభ్యులుగా కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు ⇒ ప్రతి రాష్ట్రం నుంచి 10 మంది సభ్యులులోక్సభ, అసెంబ్లీ స్థానాల పునర్ వ్యవస్థీకరణ కోసం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు కానుంది. దానికి సుప్రీంకోర్టు ప్రస్తుత, లేదా రిటైర్డ్ న్యాయమూర్తి చైర్మన్గా వ్యవహరిస్తారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్, లేదా ఎన్నికల కమిషనర్తో పాటు సంబంధిత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సభ్యులుగా ఉంటారు. ఈ ప్రక్రియలో రాష్ట్రాల భాగస్వామ్యం నిమిత్తం ప్రతి రాష్ట్రం నుంచి 10 మంది చొప్పున అసోసియేట్ సభ్యులను నియమిస్తారు. వీరిలో ఐదుగురు ఎంపీలను లోక్సభ స్పీకర్, ఐదుగురు ఎమ్మెల్యేలను రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు నామినేట్ చేస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధులు 1971 జనాభా లెక్కల ఆధారంగా ఉన్నాయి. కొన్ని దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు భారీగా వలసలు పెరగడం, జనాభా పెరుగుదల రేటులో మార్పులతో నియోజకవర్గాల మధ్య సమతుల్యత దెబ్బతిన్నదని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆరి్టకల్ 81, ఆరి్టకల్ 55కు కీలక సవరణలు చేస్తూ 2011 జనాభా లెక్కల ప్రాతిపదికగా నియోజకవర్గాలను పునర్ వ్యవస్థీకరించనున్నారు. -
'ఉత్త'రాదే.. కరువు ముప్పు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నైరుతి సీజన్ వానలు సాధారణ స్థితిలోనే ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దక్షిణ, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో సాధారణ స్థితిలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు.. కొన్నిచోట్ల మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షాలు కూడా నమోదు కావొచ్చని వివరించింది. గతేడాది సీజన్తో పోలిస్తే తక్కువ వర్షాలు కురుస్తాయని, కానీ ఉత్తర ప్రాంత జిల్లాల్లో మాత్రం వర్షాభావ పరిస్థితులు కనిపిస్తాయని, ఆయా జిల్లాల్లో లోటు వర్షపాతమే నమోదవుతుందని తెలిపింది. మరింత స్పష్టమైన అంచనాలను వచ్చే నెలాఖరులో విడుదల చేయనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో నైరుతి సీజన్కు సంబంధించిన ముందస్తు అంచనాలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం ఉదయం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఈసారి లోటు వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రాథమిక అంచనాల్లో స్పష్టం చేసింది. ఉత్తరాది జిల్లాలకు కరువు ముప్పు!రాష్ట్రంలోని ఉత్తర ప్రాంత జిల్లాలు కరువు బారిన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రుంభీమ్ ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నమోదు కావొచ్చని పేర్కొంది. కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో కూడా వర్షాభావ పరిస్థితులు ఉంటాయని, నాగర్కర్నూల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు నమోదు కావొచ్చని వివరించింది. ఈ మేరకు రైతులు పంటల సాగు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు. పెరిగిన భగ భగలు..రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. మెజార్టీ జిల్లాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదు కావడం గమనార్హం. కాగా ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు మరో మూడురోజుల పాటు నమోదైతే వడగాడ్పుల ప్రభావం ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. మంగళవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. ఆదిలాబాద్లో 43.3 డిగ్రీ సెల్సీయస్ అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత, నల్లగొండలో 23.6 డిగ్రీ సెల్సీయస్ అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్, మెదక్, నిజామాబాద్, రామగుండంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీ సెల్సీయస్ అధికంగా నమోదయ్యాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. రానున్న రెండ్రోజులు కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. -
పడవలో ఫైట్
గంగానదిలో శత్రువులతో వీరోచిత పోరాటం చేస్తున్నారు రుద్ర. విజువల్గా ఈ ఫైట్ ఏ లెవల్లో ఉంటుందనేది ‘వారణాసి’ సినిమాలో చూడొచ్చు. మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న టైమ్ ట్రావెల్ అండ్ యాక్షన్ అడ్వెంచరస్ సినిమా ‘వారణాసి’. ఈ సినిమాలో రుద్రగా, రాముడిగా మహేశ్బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారు. మందాకినిగా ప్రియాంకా చోప్రా, విలన్ కుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్, ఓ కీలక పాత్రలో ప్రకాశ్రాజ్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలో ఓ కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తున్నారు మేకర్స్.గంగానదిలో పడవలో ప్రయాణిస్తుండగా శత్రువులతో హీరో చేసే ఫైట్ ఇది. ఈ ఫైట్ సీక్వెన్స్లో మహేశ్బాబు పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత ‘వారణాసి’ టీమ్ విదేశాలకు వెళుతుందట. ఈ సంగతి ఇలా ఉంచితే... ఈ ఫైట్ సీక్వెన్స్ గురించి చిన్న వీడియో లీకై, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లీక్స్ పట్ల మహేశ్బాబు అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు. గతంలోనూ ‘వారణాసి’ షూట్కి సంబంధించిన విజువల్స్ లీకైన సంగతి గుర్తుండే ఉంటుంది. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది. -
కాలేయం కొవ్వెక్కుతోంది
సాక్షి, అమరావతి: మారుతున్న వాతావరణం పరిస్థితులు, ఆహార అలవాట్లు, జీవనశైలి వంటి కారణాలతో కాలేయ సంబంధిత వ్యాధుల వ్యాప్తి పెరుగుతోంది. మద్యపానం చేసే వారితోపాటు ఆ అలవాటు లేని వారిలోనూ ఫ్యాటీ లివర్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మూడు దశాబ్దాల్లో ఫ్యాటీ లివర్/మెటబాలిక్ డిస్ఫంక్షన్–అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్ (ఎంఏఎస్ఎల్డీ) బాధితుల సంఖ్య 143 శాతం పెరగడమే దీనికి నిదర్శనం. గ్యాస్ట్రో ఎంటరాలజీ, హెపటాలజీపై ఇటీవల ‘ది లాన్సెట్’ ప్రచురించిన అధ్యయనం మద్యపానం అలవాటు లేని వారిలో బీపీ, షుగర్, ఊబకాయం వంటి సమస్యలతో ఫ్యాటీ లివర్ సమస్యలు పెరుగుతున్నట్టు వెల్లడైంది. ఈ అధ్యయనం ప్రకారం భారత్లో 1990లో సగటున లక్ష మందిలో ఫ్యాటీ లివర్ కేసులు 10,191 ఉండగా.. 2023 నాటికి ఆ సంఖ్య 12,555కు పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 1990 నుంచి 2023 మధ్య ఫ్యాటీ లివర్ బాధితుల సంఖ్య 143 శాతం పెరిగినట్టు స్పష్టమైంది. దాదాపు ప్రతి ఆరుగురిలో ఒకరు ఫ్యాటీ లివర్ సమస్యతో సతమతమవుతున్నట్టు తేల్చారు.జీవనశైలి జబ్బులే ప్రధాన కారణంభారత్లో ఫ్యాటీ లివర్ సమస్య వేగంగా పెరుగుతుండటానికి బీపీ, షుగర్, ఊబకాయం వంటి జీవనశైలి జబ్బులే ప్రధాన కారణమని అధ్యయనం వెల్లడించింది. రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉండటం కాలేయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పట్టణీకరణ పెరిగి, శారీరక శ్రమలేని జీవనశైలి, జంక్, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగం అదికమవడంతో పట్టణాల్లో 32 శాతానికిపైగా ఈ వ్యాధితో బాధపడుతున్నట్టు నిపుణులు అభిప్రాయడ్డారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాధి అత్యంత వేగంగా పెరుగుతుండటంతో 2050 నాటికి దాదాపు 200 కోట్ల మంది బాధితులు ఉంటారని అంచనా వేశారు. 1990–2023 మధ్య 30 ఏళ్లలో చోటుచేసుకున్న వృద్ధి కంటే రెట్టింపు ఉండవచ్చని తెలుస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ అంచనాల ప్రకారం దేశంలో 11 శాతానికిపైగా జనాభా షుగర్, 35 శాతం బీపీ సమస్యతో బాధపడుతున్నారు. రాష్ట్ర వైద్య శాఖ ఎన్సీడీ సర్వేలో గుర్తించిన బీపీ, షుగర్ బాధితులు 60 లక్షల మందికి పైగానే ఉంటున్నారు. ఫ్యాటీ లివర్ సమస్య ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలను చూపదని.. ఈ దృష్ట్యా బీపీ, షుగర్, ఊబకాయ బాధితులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.ఆహారమే ఔషధందేశంలోని పెద్దల్లో 40 శాతం మంది, ఊబకాయం గల పిల్లల్లో 60 శాతం మందికి ఫ్యాటీ లివర్ ఉందని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. క్రమరహిత ఆహార అలవాట్లు, నిద్ర, శారీరక శ్రమ లేమి వంటి కారణాలు మద్యపానం అలవాటు లేని వారిలోనూ ఫ్యాటీ లివర్కు దారితీస్తోంది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరు జీవనశైలి, ఆహార అలవాట్ల మీద శ్రద్ధ పెట్టాలి. ఆహారాన్ని ఔషధంగా చూడాలి. తినే ఆహారంపై నియంత్రణ ఉంటే జబ్బుల బారినపడే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ప్రాసెస్డ్, జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ను పూర్తిగా విడనాడాలి. మనిషికి రోజుకు 1,600–1,800 క్యాలరీలు అవసరం. అంతకంటే ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారాన్ని తీసుకోకూడదు. వారానికి 150–180 నిమిషాలు శారీరక శ్రమ చేయాలి. రన్నింగ్, వాకింగ్, యోగా, జిమ్లో వ్యాయామం ఇలా ఏదో ఒక శారీరక శ్రమను జీవనశైలిలో భాగం చేసుకోవాలి.– డాక్టర్ కె.జగదీశ్వర్రెడ్డి, గ్యాస్ట్రో ఎంటిరాలజిస్ట్, ఒంగోలు -
'ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు': IMF రిపోర్ట్
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై.. ఇరాన్ - అమెరికా యుద్ధం ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందనే విషయాన్ని గురించి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) తన నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేసే అవకాశం ఉందని హెచ్చరించింది.ఐఎంఎఫ్ విడుదల చేసిన 'వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్' నివేదిక ప్రకారం.. 2026 సంవత్సరానికి గాను గ్లోబల్ ఆర్థిక వృద్ధి అంచనాను తగ్గించింది. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వృద్ధి సుమారు 3.1 శాతంగా ఉంటుంది పేర్కొంది. జనవరిలో ఇది 3.3 శాతం ఉంటుందని అంచనా వేసినప్పటికీ, మధ్యప్రాచ్యంలో యుద్ధం ప్రారంభమైన తరువాత పరిస్థితులు మారాయి.ఈ యుద్ధం ఇరాన్ - అమెరికా,ఇజ్రాయెల్ దాడుల మధ్య ఉద్రిక్తతలతో ప్రారంభమై.. ఆ ప్రాంతంలో తీవ్రస్థాయి ఘర్షణలకు దారితీసింది. ఈ పరిణామాల కారణంగా ముఖ్యంగా చమురు, గ్యాస్ ధరలు గణనీయంగా పెరిగాయి. ఇరాన్ హోర్ముజ్ జలసంధి వద్ద రవాణాను అడ్డుకోవడం వల్ల ప్రపంచ సరఫరా గొలుసుపై తీవ్ర ప్రభావం చూపింది. ఇంధన ధరల పెరుగుదలతో.. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం ఉంది. ఐఎంఎఫ్ ప్రకారం.. ఈ ఏడాది ద్రవ్యోల్బణం 4.4 శాతానికి చేరవచ్చని అంచనా. ఇది జనవరిలో చెప్పిన అంచనాల కంటే చాలా ఎక్కువ.అయితే.. 1970లలో జరిగిన చమురు సంక్షోభంతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని ఐఎంఎఫ్ పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచం పూర్తిగా చమురు మీద ఆధారపడటం తగ్గింది. పునరుత్పాదక శక్తి, అణుశక్తి వంటి ప్రత్యామ్నాయ శక్తి వనరులు పెరగడం వల్ల ఆర్థిక వ్యవస్థ కొంత స్థిరంగా నిలబడే అవకాశం ఉంది.యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే పరిస్థితి మరింత దిగజారవచ్చు. అప్పుడు గ్లోబల్ వృద్ధి రేటు 2.5 శాతం లేదా 2 శాతానికి కూడా పడిపోవచ్చు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ముప్పుగా మారుతుంది. ఈ ప్రభావం అన్ని దేశాలపై సమానంగా ఉండదని ఐఎంఎఫ్ తెలిపింది. అభివృద్ధి చెందుతున్న దేశాలు, పేద దేశాలు ఎక్కువగా దెబ్బతింటాయి. ముఖ్యంగా ఇంధనాన్ని దిగుమతి చేసుకునే దేశాల్లో ఆహార ధరలు పెరిగే అవకాశం ఉంది.ఇదీ చదవండి: భారత్కు ఇరాన్ చమురు.. ఏడేళ్లలో తొలిసారి!మధ్యప్రాచ్యం - మధ్య ఆసియా ప్రాంతాల్లో వృద్ధి రేటు గణనీయంగా తగ్గి 1.9 శాతానికి చేరవచ్చని అంచనా. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా కూడా ప్రభావితమవుతున్నాయి. అమెరికా వృద్ధి కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ, చైనాలో వృద్ధి కొంచెం మందగించనుంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. ప్రపంచంలోని చాలా దేశాలు ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఐఎంఎఫ్ స్పష్టం చేసింది. -
గోల్డ్ ఈటీఎఫ్లు మెరిశాయ్
న్యూఢిల్లీ: బంగారం ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్లు)కు మార్చి త్రైమాసికంలో ఇన్వెస్టర్ల నుంచి బలమైన ఆదరణ కనిపించింది. రూ.31,561 కోట్ల తాజా పెట్టుబడులను ఇవి ఆకర్షించాయి. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన పెట్టుబడులతో పోల్చితే ఆరు రెట్లు అధికం కావడం గమనార్హం. అంతేకాదు 2025–26 డిసెంబర్ త్రైమాసికంలో వచ్చిన రూ.23,132 కోట్ల పెట్టుబడులతో పోల్చి చూసినా 36 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసిన డేటా ప్రకారం.. మార్చి నెలలో మాత్రం పెట్టుబడుల రాక బలహీనపడింది.మార్చి నెలలో కేవలం రూ.2,266 కోట్ల పెట్టుబడులు గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి వచ్చాయి. ఈ ఏడాది జనవరిలో రూ.24,040 కోట్లు, ఫిబ్రవరిలో రూ.5,255 కోట్లతో పోల్చితే గణనీయంగా తగ్గినట్టు స్పష్టమవుతోంది. బంగారం ధరలు గత రెండేళ్లలో పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం తెలిసిందే. ఫలితంగా ఇన్వెస్టర్లు గోల్డ్ ఈటీఎఫ్లవైపు మొగ్గు చూపడం పెరిగింది. దీంతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు వీటిల్లోకి వచ్చాయి. ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి బంగారం, వెండి ధరలు అమ్మకాల ఒత్తిడికి కొంత తగ్గిన నేపథ్యంలో, ఈటీఎఫ్ పెట్టుబడులపై ఇది ప్రభావం చూపించనట్టు తెలుస్తోంది. రూ.1.71 లక్షల కోట్ల ఆస్తులు గోల్డ్ ఈటీఎఫ్ల నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) మార్చి చివరికి రూ.1.71 లక్షల కోట్లకు చేరాయి. 2025 మార్చి చివరికి వీటి విలువ రూ.58,888 కోట్లతో పోల్చితే మూడు రెట్లు పెరిగాయి. గోల్డ్ ఈటీఎఫ్ల ఫోలియోలు (ఒక ఈటీఎఫ్లో ఒక ఇన్వెస్టర్ పెట్టుబడికి గుర్తింపు సంఖ్య) గత ఆర్థిక సంవత్సరంలో 54.28 లక్షలు పెరిగాయి. దీంతో మొత్తం గోల్డ్ ఈటీఎఫ్ల ఫోలియోలు 1.24 కోట్లకు చేరాయి. ‘‘జనవరిలో పోర్ట్ఫోలియో రీబ్యాలన్స్ (మార్పులు, చేర్పులు), రిస్క్ తీసుకునే ధోరణి ఫలితంగా గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి పెట్టుబడులు అధికంగా వచ్చాయి.దీంతో తర్వాతి నెలల్లో పెట్టుబడులు బలహీనంగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ మార్చి నెలలో సానుకూల పెట్టుబడులు నమోదవడం అన్నది మార్కెట్లు, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల్లో బంగారాన్ని వైవిధ్యమైన పెట్టుబడి సాధనంగా ఇన్వెస్టర్లు చూస్తున్నారనేదానికి సంకేతం’’అని మారి్నంగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా సీనియర్ అనలిస్ట్ నేహల్ మెష్రామ్ పేర్కొన్నారు. బంగారంతో పోల్చితే ఈక్విటీల వ్యాల్యూషన్లు ఆకర్షణీయంగా మారినందున మార్చి నెలలో గోల్డ్ ఈటీఎఫ్ల్లో పెట్టుబడులు తగ్గడానికి కారణమని ద వెల్త్ కంపెనీ మ్యూచువల్ ఫండ్ సీఐవో (డెట్) ఉమేష్ శర్మ చెప్పారు. -
భారత్ వృద్ధికి... క్రూడ్ కోత!
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరింత పెరిగి బ్యారెల్కు 130 డాలర్లకు చేరితే భారత్ ఆర్థిక వృద్ధి రేటుపై 80 బేసిస్ పాయింట్ల (0.8 శాతం) మేర ప్రభావం పడొచ్చని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. బలమైన స్థూల ఆర్థిక పరిస్థితులు, పటిష్టమైన ఆర్థిక రంగంతో చమురు ధరల పెరుగుదలను భారత్ తట్టుకోగలదని పేర్కొంది. ‘‘చమురు ధరలు పెరిగితే ప్రభుత్వ ద్రవ్య లోటు లక్ష్యాలకు కొంత ఆటంకం కలగొచ్చు. కానీ భారత్ ‘సావరిన్ రేటింగ్’ పై తక్షణమే ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు’’అని ఎస్అండ్పీ స్పష్టం చేసింది. ఒకవేళ మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గి, చమురు సరఫరా సాధారణ స్థితికి వస్తే.. భారత్ తిరిగి పుంజుకుంటుందని నివేదిక పేర్కొంది. నివేదికలోని ఇతర అంశాలు.. ⇒ చమురు ధరల పెరుగుదల వల్ల గృహ వినియోగం, కార్పొరేట్ లాభాలు, బ్యాంకింగ్ రంగంపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల జీడీపీ వృద్ధి రేటు మందగించే అవకాశం ఉంది. ⇒ కంపెనీల ఎబిట్డా 2027 ఆర్థిక సంవత్సరంలో 15–25 శాతం తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా కెమికల్స్, రిఫైనింగ్ మరియు విమానయాన రంగాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ⇒ బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిలు (ఎన్పీఏలు) 3.5 శాతానికి పెరగొచ్చు. అయినప్పటికీ, భారతీయ బ్యాంకుల వద్ద తగినంత మూలధనం ఉండటం ఊరటనిచ్చే అంశం. ⇒ చమురు ధర ప్రతి 10 డాలర్ల పెరుగుదలతో దేశ కరెంట్ అకౌంట్ లోటు జీడీపీలో 0.4% పెరగవచ్చు. దీనివల్ల రూపాయి విలువపైనా ఒత్తిడి పడుతుంది. ⇒ భారతీయ కంపెనీలు గత కొన్నేళ్లుగా అప్పులను తగ్గించుకుంటూ రావడంతో వాటి బ్యాలెన్స్ షీట్లు బలంగా ఉన్నాయి. బ్యాంకుల వద్ద మెరుగైన మూలధనంతోపాటు తక్కువ స్థాయిలో ఎన్పీఏలు సానుకూలాంశాలు. -
ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్గా తయారయింది. ఈ నెల 16 నుంచి మూడు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి రెండు చట్టాలు, రాజ్యాంగ సవరణకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమైంది. 2029 సార్వత్రిక ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్లను అమలుపరిచే విషయంలో ఎవరికీ అభ్యంతరాలు లేవు. నియోజకవర్గాల పునర్విభజనను దానికి ముడిపెట్టడం, నియోజకవర్గాల సంఖ్య పెంపు ప్రతిపాదనలపైనే అభ్యంతరాలున్నాయి.చట్ట సభల్లో మహిళలకు మూడో వంతు స్థానాలు రిజర్వు చేయాలన్న ప్రతిపాదన దేశంలో దశాబ్దాలుగా నలుగుతోంది. చట్టం చేయాలన్న ఆలోచనలోనే పలు అవరోధాలు ఎదురై ఎట్టకే లకు 2023లో చట్టం ఏర్పడింది. అది కూడా 2024 సార్వత్రిక ఎన్ని కల వాకిట్లో ఆదరాబాదరాగా వచ్చిందే! అమలు ఎప్పట్నుంచి అన్న ప్రశ్న అప్పట్లోనే వివాదాస్పదమైంది. 2026 తర్వాత అందుబాటులో ఉండే తాజా జనాభా లెక్కలు, వాటి ఆధారంగా జరిగే నియోజక వర్గాల పునర్విభజన తర్వాతే మహిళా రిజర్వేషన్ అమలు పరచాలని నిర్ణయించి, దాన్నే చట్టంలో పొందుపరిచారు. కోవిడ్ కారణంగా 2021లో జరగని జనగణన 2025లో చేపట్టి ఏడాదిలో పూర్తి చేస్తారనీ, వెంటనే పునర్విభజన జరిపి 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు జరపొచ్చనీ భావించారు. కానీ, 2025లో జన గణన మొదలు కాలేదు. ఇప్పుడు చేపట్టినా వచ్చే సంవత్సరం మధ్య నాటికి పూర్తిచేయడం, ఆపై పునర్విభజన కమిషన్ ఏర్పరచి తాజా గణాంకాలతో ఆ ప్రక్రియను పూర్తిచేసి 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు కష్టమనే కొత్త అభిప్రాయం బలపడింది. దాంతో, ఇక రిజర్వేషన్ల అమలు 2034 ఎన్నికల్లోనే అనుకుంటు న్నారు. ఉన్నట్టుండి ‘లేదు లేదు, తాజా జనగణనతో నిమిత్తం లేకుండా పాత లెక్కలతోనే పునర్విభజన, మహిళా రిజర్వేషన్ అమలు చేసేద్దాం’ అని ఎన్డీయే పెద్దన్న బీజేపీ తీసిన కొత్త రాగమే భిన్నాభిప్రాయాలకు కారణమైంది.మహిళా ఓట్లపై గురిచట్ట సభల్లో మూడో వంతు సీట్లు మహిళలకు ఇప్పించడంలో మాకున్నంత పట్టుదల మరెవరికీ లేదని బీజేపీ నాయకత్వం చాటు కోవాలనుకుంటోంది. అందుకే తెలివిగా రిజర్వేషన్ అంశాన్ని పునర్విభజనతో ముడిపెట్టింది. 2023 మహిళా రిజర్వేషన్ చట్టంలో ఉన్నట్టుగా 2026 తర్వాత వచ్చే జనాభా లెక్కలు, వాటి ఆధారంగా జరిగే నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళా రిజర్వేషన్ అంటే అది తప్పనిసరిగా జాప్యమౌతుంది. 2029లో కాకుండా రిజర్వేషన్ల అమలు 2034కు వెళుతుంది. కానీ, 2029 లోపే అన్ని ప్రక్రియలు పూర్తి చేసి రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా 2029 సార్వత్రిక ఎన్నికల్లోనే కాకుండా అంతకుముందే జరిగే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్, ఛత్తీస్గఢ్, గోవా, కర్టాటక, తెలంగాణ – పది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్ని కల్లోనూ మహిళా ఓట్ల మొగ్గుతో లబ్ధి పొందవచ్చు అన్నది బీజేపీ ఎత్తుగడ. ఈ అంశంపై జరిగే చర్చ ద్వారా ఈ నెల 23, 29 తేదీల్లో ఎన్నికలు జరగాల్సివున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మహిళా ఓటర్లనూ మచ్చిక చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుందన్నది ఆశ! తాజా జనాభా లెక్కలు వచ్చాక, జనాభా ప్రాతిపదికన నియోజక వర్గాల సంఖ్యను పెంచితే ఉత్తరాది–దక్షిణాది రాష్ట్రాల వ్యత్యాసం మరింత పెరుగుతుంది. దానికి విరుగుడుగా, కేంద్రంలో అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడున్న లోక్సభ, అసెంబ్లీ స్థానాల సంఖ్యకు ఏకరీతిలో అంతటా 50 శాతం పెంచడం ద్వారా ఎవరికీ ఇబ్బంది ఉండదని ప్రచారం చేసేట్టు వ్యూహ రచన చేశారు. మరింత చర్చకు డిమాండ్పునర్విభజనలో నియోజకవర్గాల సంఖ్య పెంపుపై మరింత చర్చ జరగాలని విపక్షాలు పట్టుదలగా ఉన్నాయి. పెంపు వెంటనే చేపడితే మూడో వంతు సీట్లు (50 శాతం పెంపు ద్వారా) కొత్తగా వస్తాయి కనుక మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు పరచడంలో ఎవరికీ ఇబ్బందులుండవని పాలక పక్షం వివరిస్తోంది. అలా జరిగితే, తమకు రాజకీయంగా పట్టున్న అధిక జనాభా రాష్ట్రాలు, ముఖ్యంగా ఉత్తరాది సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగి ఆధిక్యత లభిస్తుంది. తక్కువ మోతాదులో సీట్లు పెరిగే దక్షిణా రాష్ట్రాల్లో తమకు ఎలాగూ పట్టు లేదు కనుక ఆయా రాష్ట్రాల్లో ఆధిపత్యం కోసం ఆరాటపడాల్సిన రాజకీయ అవసరం ఉండదనేది భరోసా! దీన్నే దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. జనాభా పెరుగుదలకు కారణమైన వారికి చట్టసభల్లో ప్రాతినిధ్యం పెంచి బహుమతినిస్తారా అని అవి ప్రశ్నిస్తున్నాయి.చట్టసభల్లో ఇప్పుడున్న సంఖ్యలోనే మూడో వంతు స్థానాలు మహిళలకు కేటాయిస్తూ రిజర్వేషన్ అమలు పరచాలని కాంగ్రెస్ అంటోంది. ఇందుకు పదిహేనేళ్లనాటి 2011 జనాభా లెక్కలు కాకుండా, వెంటనే జనగణన ముమ్మరం చేసి, 2027 మే నాటికి లభించే తాజా గణాంకాల్ని రిజర్వేషన్ల ఖరారుకు వాడుకోవాలని సూచిస్తోంది. ‘ఇండియా’ కూటమి అభిప్రాయం నేడు జరగనున్న వారి భేటీలో తేలవచ్చు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డీలిమిటేష న్ను జీఎస్డీపీకి లింక్ పెట్టాలని కొత్త ప్రతిపాదన తెచ్చారు. దీనికి ఇతర రాష్ట్రాలు, పార్టీలు ఏ మేరకు మద్దతిస్తాయో చూడాలి.ప్రత్యామ్నాయం పరిష్కారంనియోజకవర్గాల పెంపు విషయంలో ఏ పద్ధతి అనుసరించాల న్నది ప్రశ్నార్థకంగా మారింది. అందరు ఓటర్లు విలువ సమానంగా, ఒకటిగానే ఉండాలని మొదట్లో భావించారు. ప్రతి పదేళ్లకు ఒకసారి జరిగే జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల సంఖ్యను, భౌగో ళిక స్వరూపాలను మార్చాలని నిర్ణయించారు. ఇందుకుగానూ ప్రతి పదేళ్లకోసారి ‘పునర్విభజన కమిషన్ల’ ఏర్పాటు ప్రతిపాదించారు. 1951, 1962, 1972లో అలా కమిషన్లు ఏర్పడ్డాయి. లోక్సభ స్థానాల సంఖ్య 494 నుండి 522కు, 543కు పెరుగుతూ వచ్చింది. జనాభా ప్రాతిపదికగా నియోజక వర్గాల సంఖ్యను పెంచితే జనాభా నియంత్రణ లక్ష్యాలకు విరుద్ధంగా ఉంటుందనే ఆలోచన 1972 తర్వాత వచ్చింది. అందుకే నాటి లోక్సభ స్థానాల సంఖ్య 543కు కట్టడి విధించి, 2000 సంవత్సరం వరకు సంఖ్యను మార్చొ ద్దని నిర్ణయించారు. ఈ మేరకు 42వ రాజ్యాంగ సవరణ (1976)తో ఒకసారి, 84వ రాజ్యాంగ సవరణ (2002) ద్వారా మరోసారి సంఖ్యను పెంచకుండా 2026 వరకు కట్టడి చేయాల్సి వచ్చింది. 1913 నుండి ‘ప్రతినిధుల సభ’ సభ్యుల సంఖ్యను అమెరికాలో 435కి కట్టడి చేసినట్టు మన దగ్గర కూడా కట్టడి చేయడమో, మరో హేతుబద్ధమైన ప్రత్యామ్నాయ విధానాన్నో వెతకాలి. జనాభా ప్రాతిపదికన ఏకరీతి సర్దుబాటు లోక్సభ స్థానాల్లో జరిపి, జనాభా నియంత్రించిన వారికి ప్రోత్సాహాలిచ్చే పద్ధతి రాజ్యసభ స్థానాల్లో కల్పించవచ్చనే సూచన వస్తోంది. అంతే తప్ప, ఏపీ సీఎం చంద్ర బాబు చెబుతున్నట్టు ‘ఇబ్బడి ముబ్బడిగా పిల్లల్ని కనండి, మనకు నియోజక వర్గాలు పెరిగి ప్రాతినిధ్యం పెరుగుతుంది’ అన్నది పరి ష్కారం కాదు. అది తప్పు అవుతుంది.దిలీప్ రెడ్డివ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రిసెర్చి సంస్థ డైరెక్టర్ -
వస్తున్నాయ్... వస్తున్నాయ్.. నారీశక్తి రథచక్రాలు
నారీశక్తి రథచక్రాల్ వస్తున్నాయ్... వస్తున్నాయ్’... అవును... ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు ఈసారి చట్టరూపాన్ని తీసుకోనుంది. ‘మేముపాలిచ్చి పెంచినవాళ్లే మమ్మల్ని విభజించిపాలిస్తున్నారు’ అని గతంలో ఒక కవయిత్రి రాశారు.పాలిచ్చి పెంచగలిగే స్త్రీలకు ప్రజలనుపాలించడం తెలియదా? తెలుసు. మహిళల ప్రాతినిధ్యం పెరగడం ఎంత అవసరమో దాని వల్ల చట్టసభలలో స్త్రీ ప్రధాన, మానవీయ ప్రధాన అంశాలకు ఎంత చోటు దొరకగలదో అందరికీ తెలుసు. కాని ఆట కొనసాగింది. అయితే ఏ ఆటకైనా ముగింపు ఉండనే ఉంది.2026 అందుకు సాక్షిగా నిలవొచ్చు. మహిళా రిజర్వేషన్ బిల్లులో సహేతుకమైన సవరింపులు కూడా ఉన్నాయి. స్త్రీలకు ప్రాతినిధ్యం అన్నప్పుడు స్త్రీలలో ఉన్న అన్ని శ్రేణులకూ చోటు దక్కాలనుకోవడం ఒక న్యాయమైన ప్రతిపాదనే. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏప్రిల్ 16 నుంచి మూడు రోజులపాటు ప్రత్యేక చర్చ చేయనున్న సందర్భంగా వివిధ ఆలోచనాపరుల అబీప్రాయాలను ఇక్కడ అందిస్తున్నాం.ఓబీసీ కోటా అవసరంభారత రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్ అనేది ఒక ఎడతెగని చర్చ. ఈ ముప్ఫై ఏళ్లలో ప్రతిసారీ ఒకే ప్రశ్న దగ్గర మహిళా రిజర్వేషన్ బిల్లుకి పీటముడి పడి ఆగిపోతోంది. మారుతున్న కాలంలో స్త్రీలకు రిజర్వేషన్లు అంగీకరించే విషయంగా భావిస్తున్నప్పటికీ దానిలో ఇతర వెనుకబడిన కులాలకు కూడా కోటా వుండాలి అనే అంశం దగ్గరే సమస్యంతా వస్తోంది. ఎస్.సి., ఎస్.టి. కులాలకు ఉప రిజర్వేషన్ వుంటుంది కదా ఇంకా అంతకు మించి వుండటం అనవసరం అనే భావజాలమే ప్రధానంగా పనిచేస్తోంది. లోక్సభ, అసెంబ్లీలలో 33% మహిళలకు కేటాయించే రిజర్వేషన్లో ఓబీసీ మహిళలకు ప్రత్యేక కోటా లేదు. ఇలా ఎందుకు జరుగుతోందో సూటిగా చర్చించాలి.ఓబీసీ కోటా ఎందుకు అవసరం అంటే, ప్రజాస్వామిక రాజకీయాల్లో సమాన ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం అనేవి చాలా ముఖ్యమైన అంశం కాబట్టి! మన దేశంలో ఓబీసీ జనాభా అధికం అయినప్పటికీ రాజకీయ ప్రాతినిధ్యం మాత్రం తక్కువ, అందులో మహిళల శాతం మరీ తక్కువ. ఓబీసీ రిజర్వేషన్ కూడా ఉంటే గ్రామీణ మహిళలు కూడా రాజకీయ అవకాశాలలోకి, ప్రాతినిధ్యంలోకి రావటానికి ఊతం లభిస్తందనేది నిర్వివాదాంశం. స్త్రీలకు రాజకీయ అవకాశాలంటే అది కేవలం ఆధిపత్య కుల– వర్గ స్త్రీలకే అనే భావజాలం నుంచి బయటపడాల్సిన అవసరం ఎంతైనా వుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి చాలా విషయాలను అధిగమించాల్సి వుంది. దీనికి రాజ్యాంగ సవరణ అవసరం. 50% రిజర్వేషన్ పరిమితిని పరిష్కరించడంతోపాటు, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, సమగ్ర కులగణన, రాజకీయ అంగీకారం వంటి అనేక సీరియస్ అంశాలు దీనితో ముడిపడి వున్నాయి. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కోటా ఇవ్వడం ద్వారా సూత్ర్రపాయంగా సమానత్వం, మహిళా సాధికారతకు అడుగు ముందుకు పడుతుంది. అయితే కార్యాచరణలో ఇది అనేక సవాళ్లతో కూడుకున్న అంశం. – కె. సజయ, సామాజిక కార్యకర్తఈ బిల్లు అనివార్యంప్రపంచంలో ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో మొత్తానికి కొంచం ఆలస్యంగానయినా 128వ అమెండ్మెంట్ బిల్లుగా ‘మహిళా రిజర్వేషన్ బిల్’ లోక్సభలో పరిగణనకు రానుంది. ఈ బిల్లు ప్రతిపాదించే 33 శాతం మహిళా రిజర్వేషన్లో ఎస్.సి., ఎస్.టి.లకు 1/3 శాతం సీట్లు ప్రతిపాదించారు. వాస్తవానికి రెండుసభల్లో (లోకసభ, రాజ్యసభలో) 2/3 శాతం మెజారిటీ వస్తేనే బిల్లుపాస్ అవుతుంది. అన్నిపార్టీల మద్దతుతోనే అది సాధ్యం అనేది జగమెరిగిన సత్యం. అదే జరిగి బిల్పాస్ అయితే లోకసభలో 33 శాతం సీట్లు మహిళలకు దక్కుతాయి.ఉభయసభల్లో మహిళల ప్రాధాన్యత వల్ల ఎన్నో ఉపయోగాలు లేకపోలేదు. మహిళా సమస్యలను చట్టసభల్లో గట్టిగా వినిపించడానికి ఆస్కారం ఏర్పడుతుంది.పార్లమెంట్లో మహిళా బిల్లు పలుమార్లు ప్రతిపాదించడం, రిజెక్ట్ చెయ్యడం జరిగింది. 1996, 1998, 2002, 2003లోపార్లమెంట్లో రిజెక్ట్ చెయ్యడం జరిగింది. 2008లో రాజ్యసభలో ప్రతిపాదించినప్పుడు 186 ఓట్లతో ఆమోదం పొందింది కానీపార్లమెంట్లో ఆ బిల్ దురదృష్టవశాత్తు చర్చకు ఎప్పటికీ రానేలేదు. అంటే స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులయినా మహిళల ప్రాధాన్యతలో మార్పు పెద్దగా లేదని అర్థం. మన దేశంతో పోల్చినప్పుడు ఎంతో వెనకబడిన ఆఫ్రికన్ దేశం రువాండాలో చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం అత్యధికంగా 61.3 శాతం ఉంది. చిన్న దేశమయినా... క్యూబాలో 53.2 శాతం, నేపాల్ 32.7 శాతం, ఫ్రాన్స్, కొరియ, నేపాల్లలో మహిళలకు 50 శాతంపార్టీ కోటాపాస్ చెయ్యడం జరిగింది. ఇండియా ముందు అతి చిన్న దేశాలయినా అర్జెంటీనా, మెక్సికో, కోస్టరికా దేశాల్లో 36 శాతం మహిళా లెజిస్లేటివ్ మెంబర్స్ ఉండడం విడ్డూరం. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమయినా ఇండియాలో ప్రస్తుతం 14.4 శాతం మాత్రమే మహిళలకు ప్రాతినిధ్యం ఉండడం మనందరం సిగ్గు పడాల్సిన విషయం. మహిళా బిల్లు మన రాజ్యాంగంలోని సమానత్వపు హక్కుకు విరుద్ధంగా ఉండొచ్చేమో గాని మారిన కాలానికి అనుగుణంగా అదిపాస్ అవడం అనివార్యమే. మహిళా బిల్లు ఉభయ సభల్లో పూర్తి మెజారిటితోపాస్ అయితే అదొక కొత్త చరిత్రకు నాంది పలకొచ్చు. అందుకై ఆకాంక్షిస్తూ, మంచి మార్పును స్వాగతిస్తున్నాను. – నిశ్చల సిద్ధ రెడ్డి, హైకోర్టు న్యాయవాదివెంటనే అమలులోకి తేవాలిపార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో మహిళలకి సరయిన ప్రాతినిధ్యం కల్పించాలంటే ఏదో రకమైన రిజర్వేషన్లు తప్పనిసరి అన్నది 20వ శతాబ్దపు ప్రజాస్వామ్య చరిత్ర స్పష్టం చేసింది. మన దేశంలో గ్రామీణ పంచాయతీల్లోనూ, పట్టణపాలనా వ్యవస్థలోనూ దాదాపు 30 ఏళ్ల నుండి అమలవుతున్న రిజర్వేషన్ల కారణంగా అనేక మంది అణగారిన వర్గాల మహిళలు, దాని అమలులో ఎన్ని సమస్యలున్నా సరే, రాజకీయ అనుభవం గడించారు. గడిస్తున్నారు. ఇది మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తోంది. ఈ నేపథ్యంలో మూడు దశాబ్దాల పోరాటం తర్వాత 2023లో ఏకగ్రీవంగా అన్నిపార్టీలూపార్లమెంటులో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని ఆలస్యం చెయ్యకుండా వెంటనే అమలులోకి తేవాలి.ఈ మూడు దశాబ్దాల్లో ప్రపంచంలో అనేక దేశాల్లో ఏదో రూపంలో మహిళలకి రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయన్నది గుర్తు చేసుకోవాలి. దీన్ని వివాదాస్పదమయిన డీలిమిటేషన్తోనూ ముడిపెట్టటం అవసరమైన ప్రజాస్వామిక చర్చ లేకుండా ప్రభుత్వం తేవాలని అనుకుంటున్న మార్పులకి మహిళా రిజర్వేషన్లని వాడుకోవటం కిందే చూడాలి. జనాభా లెక్కలకి దీనికి కూడా సంబంధం లేదు. అయితే, ఈ చట్టంలో 33 శాతం ప్రాతినిధ్యం కల్పించిన దళిత, ఆదివాసీ మహిళలతోపాటు ఇతర వెనకబడిన, అణగారిన, అంచుల్లో వున్న అన్ని సమూహాలకు కూడా చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం కలిపించాల్సిన అవసరం గురించి ఈ సందర్భంలో చర్చించాలి. దీని గురించిన అన్ని సమూహాలూ పోరాటం చేస్తూనే ఉంటాయి. – ఎ. సునీత, సామాజిక వ్యాఖ్యాతచారిత్రక స్పృహతో చర్చ జరగాలిఐ.కె. గుజ్రాల్, దేవెగౌడ, వాజ్పేయి, మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రులుగా పనిచేసిన కాలంలో మహిళా రిజర్వేషన్ బిల్లుపార్లమెంట్లో వీగిపోయింది. మహిళల రిజర్వేషన్ చట్టంలో సమాంతర రిజర్వేషన్ (హారిజంటల్ రిజర్వేషన్స్)ల కోసం 1996లోపార్లమెంట్లో శరద్ యాదవ్, నితీష్ కుమార్లు గట్టిగా వాదనలు వినిపించారు. ఇప్పటిదాకా అట్టడుగు వర్గాలకు చెందిన స్త్రీలుపార్లమెంట్లో అడుగుపెట్టకుండా నిరోధించబడ్డారు...ఈ తప్పును సరిదిద్దాలని అంబేద్కర్ దృష్టి కోణం నుంచి వాదనలు జరిగాయి.2008లో జయంతి నటరాజన్ కమిటీకి ముందు ట్రాన్స్జెండర్ గ్రూప్లకు రిజర్వేషన్ ఉండాలనే డిమాండ్ ఉండేది. ఇది ఇంకా చర్చించ లేదు.పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రశంసించే క్రమంలో ప్రధాని మోదీ ‘మాతృశక్తి’ అనే పదాన్ని ఉపయోగించారు. 2010లో రాజ్యసభలో జరిగిన చర్చలో అన్నాడీయంకె సభ్యుడు డాక్టర్ మైత్రేయన్ ఉపయోగించిన పదం ఇది. మనకు ప్రాతినిధ్యం కావాలా, లేక గ్రేడెడ్ సొసైటీ(అంతరాల సమాజం)కి సమానమైన ప్రాతినిధ్యం కావాలా అనేది మన ముందు ఉన్న ప్రశ్న. దళిత్ హిస్టరీ మంత్ (ఏప్రిల్)లో మనం మాట్లాడుతున్నప్పుడు, న్యాయమైన ప్రాతినిధ్యం కోసం మనం ఇంకా ఎంతకాలం వేచి చూడాలి? మహిళా బిల్లుపై చారిత్రక స్పృహతో చర్చ జరగాలి. – కల్పన కన్నబిరాన్, స్త్రీవాద రచయితప్రభావ వంతమైన అడుగునేను నా జీవితమంతా పరుగులతోనే గడిపాను. మొదట కేరళలోని మట్టిదారులలో, ఆ తరువాత ప్రపంచ వేదికపై. ఇప్పుడు ప్రజాజీవనదారుల్లో అడుగులు వేస్తున్నాను. మహిళలకు రాజకీయాలలో స్థానం లేదని చెప్పే అడ్డంకులను ఎదుర్కొన్నాను. వాటిలో కొన్ని కంటికి కనిపించేవి. మరికొన్ని మాటల్లో చెప్పలేనివి. అడ్డంకులు తొలగితే వచ్చే ఫలితం ఏమిటో చూశాను. అవకాశం ఫలితాన్ని మారుస్తుంది. నమ్మకాన్ని పెంచుతుంది. అందుకే నారీ శక్తి వందన అధినియమ్ అనేది కేవలం ఒక శాసనపరమైన మైలురాయి మాత్రమే కాదు. నామమాత్రపు పని కూడా కాదు. మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచే ఒక ప్రభావవంతమైన అడుగు.– పి.టి.ఉష, క్రీడాకారిణి∙అంతర్జాతీయంగాజెండర్ కోటా లేకుండానే...జాతీయపార్లమెంట్లో మహిళల ప్రాతినిధ్యానికి సంబంధించి క్యూబా రెండో స్థానంలో నిలిచింది. మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడానికి ఎన్నో దేశాలు కోటాలను ఉపయోగిస్తుండగా, క్యూబా అవి లేకుండానే చట్టసభలలో మహిళా ప్రాతినిధ్యం విషయంలో అగ్రస్థానంలో ఉంది.కీలకపాత్రమహిళల రాజకీయ ప్రాతినిధ్యం విషయంలో లాటిన్ అమెరికా దేశాలు అగ్రగామిగా ఉన్నాయి. చట్టసభల ద్వారా లింగ సమానత్వాన్ని పెంచడానికి, బాలికలు, మహిళలపై హింసను నిరోధించడానికి చట్టసభలలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారు.అగ్రస్థానంలో రువాండాచట్ట సభల్లో మహిళా ప్రాతినిధ్యం ఎక్కువగా ఉన్న దేశాలలో రువాండా మొదటి స్థానంలో ఉంది. అక్కడి చట్టసభలలో 63.9 శాతం మహిళలు ఉండడం విశేషం. రువాండాలో 2003లో కొత్త రాజ్యాంగం ఏర్పాటు కావడం మహిళలకు సంబంధించి విప్లవాత్మకమైన సామాజిక మార్పుకు దారి తీసింది. ఈ కొత్త రాజ్యాంగం మహిళలకు, పురుషులకు సమాన అవకాశాలు కల్పించింది.జెండర్ కోటా... ఎంతో ఉపయోగం’యూఎన్ ఉమెన్ డేటా ప్రకారం 1 జనవరి 2026 నాటికి... క్యాబినెట్ మంత్రి పదవులలో 50 శాతం లేదా అంతకంటే ఎక్కువగా మహిళలు కలిగిన ఉన్న దేశాలు 14 మాత్రమే.⇒ ఐరోపా, ఉత్తర అమెరికాపార్లమెంట్లలో మహిళల ప్రాతినిధ్యం 33 శాతం ఉంది. ∙జెండర్ కోటాలు మహిళల రాజకీయ ప్రాతినిధ్యానికి గణనీయంగా తోడ్పడ్డాయి. కోటా లేని దేశాలతో పోల్చితే, ఉన్న దేశాలలో చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం ఏడు శాతం ఎక్కువగా ఉంది.మదర్ ఆఫ్ పార్లమెంట్లో...‘మదర్ ఆఫ్పార్లమెంట్’గా యూకేపార్లమెంట్కు పేరు. యూకే హౌస్ ఆఫ్ కామన్స్లో మహిళల ప్రాతినిధ్యం 40.6 శాతం ఉంది. యూకే రాజకీయాలలో లింగ సమానత్వం దిశగా జరుగుతున్న పురోగతి నెమ్మదిగా ఉన్నప్పటికీ ఆ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోందని గణంకాలు సూచిస్తున్నాయి.ఒక్కరూ లేరు!2026 సంవత్సరం ఆరంభం నాటికి చైనా ఉన్నత స్థాయి రాజకీయాలలో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. చైనా అత్యున్నతపాలక మండలి అయిన ఏడుగురు సభ్యుల పొలిటికల్ బ్యూరో స్టాండింగ్ కమిటీలో ఒక్కరు కూడా మహిళా లేరు. -
అడవిలో సవాల్
శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో డింపుల్ హయతి, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ రాజమహేంద్రవరంలో ఆరంభమైంది. ‘‘ఈ ఏడాది వరుస విజయాలతో దూసుకెళుతున్న శర్వానంద్ ‘భోగి’ చిత్రంతో హ్యాట్రిక్ సాధించేందుకు సిద్ధమవుతున్నారు.శర్వానంద్ కెరీర్లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ‘భోగి’ ఒకటిగా నిలిచేలా రూపొందిస్తున్నాం. ఈ సినిమాలోని అత్యంత కీలకమైన యాక్షన్ సన్నివేశాలను రంపచోడవరం అడవుల్లోని కఠినమైన, సవాల్తో కూడిన ప్రదేశాల్లో చిత్రీకరిస్తున్నాం. దిలీప్ సుబ్బరాయన్ పర్యవేక్షణలో పోరాట సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాం. ప్రధాన తారాగణంతో పాటు శర్వానంద్ కూడా ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు.1960లో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాని రక్షా బంధన్ సందర్భంగా ఆగస్ట్ 28న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: కిశోర్ కుమార్ అరోకియా. -
మీరొస్తామంటే... మేమొద్దంటామా..!
‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలతో తెలుగు సినిమా నెక్ట్స్ లెవల్కి వెళ్లింది. ఆస్కార్ అవార్డును కూడా తెచ్చింది. విదేశీ భాషల్లోనూ తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో ఇప్పుడు అందరి ఫోకస్ తెలుగు సినీ ఇండస్ట్రీపైనే ఉంది. అందుకే పరభాషా హీరోలు టాలీవుడ్ దర్శక–నిర్మాతలతో అసోసియేట్ అయి, సినిమాలు తీస్తున్నారు. సినిమా నచ్చితే తెలుగు ప్రేక్షకులు ఏ సినిమానైనా హిట్ చేస్తారు, ఏ హీరోకైనా స్టార్ స్టేటస్ ఇస్తారు. దీంతో తెలుగులో సినిమాలు చేసే పరభాషల హీరోల సంఖ్య ఎక్కువ అవుతోంది. తెలుగు దర్శక–నిర్మాతలు కూడా ‘మీరొస్తామంటే... మేమొద్దంటామా..!’ అంటూ సినిమాలను ఓకే చేస్తున్నారు. మరి... ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేస్తున్న కొందరు పరభాషా హీరోలపై ఓ లుక్ వేయండి.సల్మాన్ భాయ్ వచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్లో తిరుగు లేని నటుడు. అయితే తెలుగు దర్శకుడితో సినిమా చేసేందుకు సల్మాన్ ఖాన్ ఎప్పట్నుంచో ఆసక్తిగా ఎదురు చూశారు. కొంతమంది కమర్షియల్ దర్శకులు చెప్పిన కథలు కూడా ఉన్నారు. కానీ సల్మాన్ ఖాన్ను డైరెక్ట్ చేసే అవకాశం మాత్రం తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లికి దక్కింది. ఇటీవలే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. సల్మాన్ ఖాన్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలోని ఈ సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించనున్నారు.ఈ నెలాఖరులో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ముంబైలోని ఓ ప్రముఖ స్టూడియోలో ప్రస్తుతం సెట్ వర్క్ జరుగుతోంది. ఓ యాక్షన్ సీక్వెన్స్తో ఈ సినిమా షూటింగ్ను ఆరంభించాలని మేకర్స్ ప్లాన్ చేశారని తెలిసింది. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించనున్నారు. వచ్చే నెలలో ఆమె ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారని తెలిసింది. వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారని సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... చిరంజీవి హీరోగా నటించిన ‘గాడ్ఫాదర్’ చిత్రంలో సల్మాన్ ఖాన్ ఓ గెస్ట్ రోల్ చేశారు. ఈ సినిమాను తమిళ దర్శకుడు మోహన్రాజా డైరెక్ట్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది.హిట్ 4 అన్నయ్య సూర్య బాటలోనే కార్తీ నడుస్తున్నారు. సూర్య మాదిరిగానే కార్తీ సినిమాలన్నీ ఆల్మోస్ట్ తెలుగులో రిలీజ్ అవుతుంటాయి. సూర్యను ఓన్ చేసుకున్నట్లే కార్తీని కూడా తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు. నాగార్జున, కార్తీ హీరోలుగా వంశీ పైడిపల్లి డైరెక్షన్లో 2016లో ‘ఊపిరి’ సినిమా వచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ద్విభాషా చిత్రం ఇది. తెలుగులో కార్తీ చేసిన స్ట్రయిట్ ఫిల్మ్గా ‘ఊపిరి’ని చెప్పుకోవచ్చు. కార్తీతో సినిమాలు చేసేందుకు కొంతమంది తెలుగు దర్శకులు కూడా ఆసక్తి చూపించారు.‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్, ‘మ్యాడ్’ ఫేమ్ కల్యాణ్ శంకర్ వంటి దర్శకులు కథలు వినిపించారని తెలిసింది. ఈ చర్చలు ఇలా ఉండగానే... నాని నిర్మాతగా ‘హిట్’ ఫ్రాంచైజీ నుంచి ‘హిట్ 4’ సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. శైలేష్ కొలను దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో కార్తీ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా సెట్స్కు వెళ్లనుందని తెలిసింది. ఇక కార్తీ నటించిన ‘సర్దార్ 2’ సినిమా రిలీజ్కు సిద్ధంగా ఉండగా, ‘మార్షల్’ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.డబుల్ ధమాకా! ‘కాంతార, కాంతార: చాప్టర్ 2’ వంటి బ్లాక్బస్టర్ మూవీస్ తర్వాత రిషబ్ శెట్టి హీరోగా తెలుగులో సినిమాలు తెరకెక్కుతున్నాయి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా ప్రశాంత్ శర్మ దర్శకత్వంలో ‘జై హనుమాన్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్నారు. రానా మరో కీలక పాత్రలో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2027లో ఈ సినిమా రిలీజ్ కావొచ్చు.మరోవైపు అశ్విన్ గంగరాజు డైరెక్ట్ చేయనున్న ఓ హిస్టారికల్ యాక్షన్ డ్రామాలో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తారు. 18వ శతాబ్దం నేపథ్యంలో బ్రిటిష్ పరిపాలనా కాలంలోని బెంగాల్ ప్రావిన్స్ ప్లేస్లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఇందులో ఓ తిరుగుబాటు దళానికి చెందిన నాయకుడిగా రిషబ్ శెట్టి కనిపిస్తారట. ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. ‘జై హనుమాన్’తో రిషబ్ బిజీగా ఉన్నారు. సో... అశ్విన్ గంగరాజుతో రిషబ్ శెట్టి చేయనున్న సినిమా సెట్స్పైకి వెళ్లడానికి కొంత సమయం పడుతుందని ఊహించవచ్చు.నిశ్శబ్దం పెరిగేకొద్దీ... ‘నిశ్శబ్దం పెరిగేకొద్దీ... అంతటి ధ్వని రాబోతోంది’ అంటున్నారు ఎన్టీఆర్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్నీల్’ (వర్కింగ్ టైటిల్). ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అనిల్కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ మూవీకి ‘డ్రాగన్ ’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.ఈ సినిమా తాజా షెడ్యూల్ షూటింగ్ రద్దు అయిందంటూ ఇటీవల నెట్టింట వార్తలు హల్చల్ చేయడం.. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అంటూ చిత్ర నిర్మాణ సంస్థలు స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా జిమ్లో వర్కౌట్ చేస్తున్న ఓ ఫొటోని ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎన్టీఆర్ షేర్ చేసి, ‘నిశ్శబ్దం పెరిగేకొద్దీ... అంతటి ధ్వని రాబోతోంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కండలు తిరిగిన దేహంతో ఉన్న ఆయన ఫొటో వైరల్గా మారింది. ఈ మూవీ తర్వాతి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంగీతం: రవి బస్రూర్.హీరోగా హాస్యనటుడుచాలాకాలం హాస్య నటుడిగా కొనసాగిన సూరి మెల్లిగా హీరోగా సినిమాలు చేస్తున్నారు. సూరి హీరోగా తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమాను నిర్మించనుంది. ఆల్రెడీ ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఆర్. రవికుమార్ ఈ సినిమాకు దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ విధంగా తెలుగులో సూరి చేస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే అవుతుంది. ఫుల్ యాక్షన్ మూవీగా ఈ సినిమా రానుందని తెలిసింది.తెలుగులో బిజీ బిజీ ‘మహానటి, లక్కీభాస్కర్, కాంత’ వంటి చిత్రాలతో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యారు. ప్రస్తుతం ఆయన ‘ఆకాశంలో ఒక తార’ అనే తెలుగు సినిమా చేస్తున్నారు. పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో సాత్విక వీరవల్లి దర్శకురాలిగా పరిచయం అవుతుండగా ఇందులో శ్రుతీ హాసన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ సినిమాకు నిర్మాతలు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్ బాక్స్ మీడియా సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఈ ఏడాదే ఈ చిత్రం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. బలమైన ఎమోషన్స్ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చిన ఓ అమ్మాయి తన కలను నిజం చేసుకోవడానికి ఎంతటి సాహసం చేసిందనే అంశాన్ని ఈ సినిమాలో చాలా ఎమోషనల్గా చూపించనున్నారట దర్శకుడు పవన్. అలాగే రవి అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా చేస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు.ఈ సినిమా చిత్రీకరణ కూడా శరవేగంగా జరుగుతోంది. ఇంకా నాని నిర్మాతగా ‘కోర్ట్’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తీసిన రామ్ జగదీష్ డైరెక్షన్లో దుల్కర్ హీరోగా ఓ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. అయితే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇలా తెలుగు సినిమాలతో దుల్కర్ సల్మాన్ బిజీ బిజీగా ఉంటున్నారు. అటు మలయాళంలోనూ ఆయన హీరోగా ‘ఐ యామ్ ది గేమ్’ సినిమా రూపొందుతోంది. షూటర్ విశ్వనాథ్ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అంటే మన హీరోనే అని ఫీలవుతుంటారు తెలుగు ప్రేక్షకులు. అందుకే ఆయన హీరోగా నటించిన సినిమాలన్నీ తెలుగులో అనువాదం అవుతుంటాయి. ఇదిలా ఉంటే... సూర్య తెలుగులో స్ట్రయిట్గా ‘రక్త చరిత్ర 2’ (2010) అనే సినిమా చేశారు. మళ్లీ ఇప్పుడు పదిహేను సంవత్సరాల తర్వాత డైరెక్ట్గా మరో తెలుగు సినిమా చేస్తున్నారు. అదే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా. కోలీవుడ్ హీరో ధనుష్తో ‘సార్’, మలయాళ హీరో దుల్కర్ సల్మాన్తో ‘లక్కీ భాస్కర్’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన వెంకీ అట్లూరి, ఈ ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రంలో షూటర్ సంజయ్ విశ్వనాథ్గా సూర్య నటిస్తున్నారు. హీరోయిన్గా మమితా బైజు కనిపిస్తారు.రాధికా శరత్కుమార్, రవీనా టాండన్ ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. సంజయ్ విశ్వనాథ్ కన్నా వయసులో 20 సంవత్సరాలు చిన్నదైన అమ్మాయి అతన్ని ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతుంటుంది. ఈ సమస్య నుంచి సంజయ్ ఎలా బయటపడ్డాడు? అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా కథనం సాగుతుందని ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ స్పష్టం చేస్తోంది.సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాదే ఈ చిత్రం రిలీజ్ కానుంది. సూర్య హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ ‘వీరభద్రుడు’ మే 14న రిలీజ్ కానుంది. ఈ సినిమా విడుదల తర్వాత ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా ప్రమోషన్స్ ఊపందుకుంటాయని, రిలీజ్ డేట్పై కూడా స్పష్టత వస్తుందని ఊహించవచ్చు. ఇంకా... ‘కార్తికేయ, కార్తికేయ 2’ చిత్రాల ఫేమ్ చందు మొండేటి సైతం సూర్యను కలిసి, కథ వినిపించారని తెలిసింది.ఒకేసారి రెండు సినిమాలుఅల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో విలన్ బన్వర్ సింగ్ షెకావత్గా మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ తెలుగు ప్రేక్షకులను అలరించారు. పార్టీ లేదా పుష్ప అనే డైలాగ్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. అయితే ఫాహద్ ఫాజిల్ హీరోగా తెలుగులో రెండు స్ట్రయిట్ సినిమాల ప్రకటనలు వచ్చాయి. ఈ చిత్రాలు ‘డోన్ట్ ట్రబుల్ ది ట్రబుల్, ఆక్సిజన్’. ఈ రెండు చిత్రాలు రాజమౌళి సమర్పణలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ (రాజమౌళి తనయుడు) నిర్మిస్తున్నవే. ‘డోన్ట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రానికి శశాంక్ ఏలేటి దర్శకత్వం వహిస్తుండగా, ‘ఆక్సిజన్’ చిత్రానికి సిద్ధార్థ్ నాదెళ్ల దర్శకుడు. ఫ్యాంటసీ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా ‘డోన్ట్ ట్రబుల్ ది ట్రబుల్’ షూటింగ్ ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైంది. భావోద్వేగాలతో ముడిపడిన ‘ఆక్సిజన్’ సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని తెలిసింది.ఈసారి హీరోగా..! తమిళ నటుడు విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ‘ఉప్పెన, సైరా నరసింహారెడ్డి’ వంటి తెలుగు చిత్రాల్లో విజయ్ సేతుపతి నటించారు. కొంత కాలంగా ఆయన హీరోగా నటించిన తమిళ సినిమాలు కొన్ని తెలుగులో అనువాదమై రిలీజ్ అవుతున్నాయి. కాగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో విజయ్ సేతుపతి హీరోగా ‘స్లమ్డాగ్: 33 టెంపుల్ రోడ్’ అనే సినిమా తెరకెక్కింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో టబు, సంయుక్తా మీనన్, దునియా విజయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. పూరి జగన్నాథ్, చార్మి, జేబీ నారాయణ కొండ్రల్ల ఈ సినిమాను నిర్మించారు. త్వరలోను రిలీజ్ డేట్ను ప్రకటించనున్నారు మేకర్స్.యాక్షన్ థ్రిల్లర్తమిళంలో సూపర్ స్పీడ్తో దూసుకెళ్తున్నారు హీరో ప్రదీప్ రంగనాథన్. ఈ యంగ్ హీరో చేసిన ‘లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ వంటి సినిమాలు తెలుగులో విడుదలై, సూపర్ హిట్గా నిలిచాయి. ప్రదీప్ గత చిత్రం ‘డ్యూడ్’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రెండో తమిళ సినిమా ఇది. అయితే ఈసారి ఇదే నిర్మాణ సంస్థలో ప్రదీప్ హీరోగా ఓ తెలుగు సినిమా రానుందని ఫిల్మ్నగర్ సమాచారం. చంద్రశేఖర్ ఏలేటి ఓ యాక్షన్ థ్రిల్లర్ కథను రెడీ చేశారని, ఈ సినిమాలో హీరోగా ప్రదీప్ రంగనాథన్ పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఇప్పుడు చాలా సినిమాలు ఒక భాషలో తెరకెక్కి, ఇతర భాషల్లో అనువాదం అవుతున్నాయి. కొన్ని సినిమాలు ద్విభాషా చిత్రాలుగా కూడా ఉంటున్నాయి. ఈ రకంగా పరభాషా హీరోలు టాలీవుడ్లో సినిమాలు చేసినప్పుడు, ఈ చిత్రాలు ఆ హీరోల మాతృభాషలోనూ రిలీజ్ అవుతున్నాయి. ఇలా హీరోలకు రెండు విధాలా కలిసొస్తుంది. అలాగే తెలుగులో స్టార్ హీరోలందరూ ఒక సినిమాను పూర్తి చేసేందుకు దాదాపు రెండు సంవత్సరాల సమయం తీసుకుంటున్నారు. సినిమా భారీతనాన్ని బట్టి ఎక్కువ సమయం పడుతోందని ఊహించవచ్చు. పైగా ఒక సినిమా సెట్స్లో ఉండగా ఇంకో సినిమా చేసే వీలు కొందరు హీరోలకు ఉండటంలేదు. పరభాషల హీరోలతో తెలుగు ఫిల్మ్ మేకర్స్ అసోసియేట్ కావడానికి ఇదొక కారణం అనే ఊహాగానాలు ఉన్నాయి.– ముసిమి శివాంజనేయులు -
మళ్లీ యుద్ధ మేఘాలు!
చరిత్రాత్మకం అన్నారు. ఉన్నతస్థాయి చర్చలన్నారు. దౌత్యం పూర్తి స్థాయిలో పనిచేస్తోందన్నారు. శాంతికి పశ్చిమాసియా చేరువలో ఉందన్నారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామా బాద్లో 21 గంటలపాటు కొనసాగిన అమెరికా–ఇరాన్ ప్రతినిధి బృందాల చర్చలపై ఎప్పటికప్పుడు మీడియాలో వచ్చిన సమాచారం సారాంశమిది. తీరా బయటికొచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చర్చలు విఫలమయ్యాయని ప్రకటించి నిష్క్రమించారు. ఆ వెంటనే ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బెదిరింపు భాష మొదలైంది. అమెరికా ఏకపక్ష వైఖరివల్ల 47 సంవత్సరాల తర్వాత ఆ రెండు దేశాలమధ్యా నేరుగా సాగిన చర్చలు చివరికిలా నీరుగారాయి. వచ్చేవారం మరోసారి చర్చలుంటాయని చెబుతున్నారు. కానీ అమెరికా వైఖరి మారకపోతే ప్రయోజనం శూన్యం. ట్రంప్ వచ్చాక చర్చల అర్థమే మారిపోయింది. చర్చలంటే ఆయన శాసిస్తే ఎదుటిపక్షం శిరోధార్యంగా స్వీకరించటం తప్ప మరేంకాదు. అసలు ఈ యుద్ధంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న వాన్స్ నాయకత్వాన ప్రతినిధి బృందాన్ని పంపటంలోనే ఆయన నిజాయితీలేమి వెల్లడైంది. ఏ అధికారమూ లేని, సొంతంగా ఎలాంటి చొరవా తీసుకోలేని ఆ అశక్త బృందం చివరకు ఉత్త డొల్లగా మిగిలిపోయింది. ట్రంప్ తీరు 90వ దశకం మొదట్లో సోవియెట్ యూనియన్ కుప్పకూలిననాటి పరి స్థితుల్ని తలపిస్తోంది. అంతవరకూ సోవియెట్ భాగస్వామ్య రాష్ట్రాలుగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కడికక్కడ సమావేశాలు జరగటం, దేశంనుంచి విడిపోతున్నట్టు ప్రకటించటం రివాజై పోయింది. నిజంగా అలా ప్రకటించేవారి బలాబలాలేమిటో, ఆ తీర్మానాలు అమలయ్యే అవకాశం ఉందో లేదో తెలియని స్థితి. ఇలాంటి అనిశ్చితే ఇప్పుడు అమె రికాను ఆవరించింది. నరమేథాన్ని సాగిస్తూ ఘనవిజయాలుగా ప్రకటించుకోవటం, ఇరాన్ నాగరికత ఈ రాత్రితో అంతం కాబోతున్నదని ప్రకటించటం, అంతలోనే చర్చలకు రావాలంటూ బెదిరించటం ట్రంప్ అలవాటు చేసుకున్నారు. ఇజ్రాయెల్తోపాటు ఈ యుద్ధానికి లోపాయికారీగా మద్దతిచ్చిన దేశాలన్నీ ఇరాన్నుంచి శరపరంపరగా వచ్చి పడుతున్న క్షిపణుల ధాటికి బెంబేలెత్తినా, అక్కడ పెనువిధ్వంసం చోటుచేసుకుంటున్నా ట్రంప్ బడాయి మాటలు ఆగలేదు. ఆయన ప్రకటనలకు భిన్నమైన స్థితిగతులున్నాయని సైనికా ధికారులే మీడియాకు రహస్యంగా చెప్పటం అమెరికాలో కుప్పకూలుతున్న వ్యవస్థలకు ఆనవాలు. సోవియెట్ కనుమరుగయ్యే ముందు కూడా ఇలాంటి ధోరణులే కనబడ్డాయి. ఇతర దేశాల సహకారంతో హార్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తామని ట్రంప్ చెప్పిన కొన్ని గంటలకే, అందుకు తాము అంగీకరించబోమని నాటో భాగస్వామ్య దేశాలు బ్రిటన్, ఫ్రాన్స్లు ప్రకటించి గాలి తీశాయి. ‘హార్మూజ్ దిగ్బంధం’ అంటూ చేసిన ప్రకటనకు అర్థం ఇరాన్ నౌకాశ్రయాల దిగ్బంధమని అమెరికా సైన్యం ఆ వెంటనే తెలిపింది. సోమవారం నుంచి అమల్లోకి వచ్చిందని కూడా ప్రకటించారు. కానీ గల్ఫ్ దేశాలే దీన్ని నిరసిస్తున్నాయి. ట్రంప్ చర్య ఈ ప్రాంతం మొత్తాన్ని శాశ్వతంగా యుద్ధ ఊబిలోకి దించేస్తుందని సౌదీ అరేబియాతోసహా చాలా దేశాలు ఆందోళనపడుతున్నాయి. సౌదీ చమురు ఎగుమతులు యుద్ధానికి ముందు మాదిరే రోజుకు 70 లక్షల బ్యారెళ్లకు చేరు కున్నాయి. అవి ఎర్ర సముద్రం గుండా వెళ్తున్నాయి. కానీ అమెరికా దుందుడుకు చర్యకు దిగితే యెమెన్లోని హౌతీలు ఆ ఎగుమతుల్ని దెబ్బతీస్తారు. తన నాయకత్వాన ఇన్ని దశాబ్దాలుగా సాగిన ఏకధ్రువ ప్రపంచం కళ్లముందు కుప్పకూలుతున్న వైనాన్ని అమెరికా గ్రహించకపోతే పోయిందిగానీ... చైనా నాయకత్వంలో కొత్త అమరిక మొగ్గతొడుగుతోందన్న సంగతైనా అది తెలుసుకోవాలి. ఈ యుద్ధం తనకూ, ఇరాన్కూ మధ్య పంచాయతీ కాదు. అది పశ్చిమాసియాకు పరిమిత మైంది అంతకన్నా కాదు. ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని క్రమేపీ బలహీనపరుస్తున్న ఒక నిరర్థక యుద్ధం. అది చైనా నాయకత్వాన కొత్త కూటమికి పురుడు పోస్తున్న ప్రమాదకర యుద్ధం. ఆర్థికంగా, సైనికంగా ప్రపంచంలోనే తాము సర్వశక్తిమంతులమని ఇరాన్తో చర్చలకు చాన్నాళ్లముందు జేడీ వాన్స్ అన్నారు. ట్రంప్ ప్రభావం ఆయనపై ఎక్కువే ఉన్నట్టుంది. ఆ దృశ్యం మారుతున్న సంగతిని అమెరికా నాయకత్వం ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. -
మహిళా రిజర్వేషన్ బిల్లుకు శివసేన సపోర్ట్
2029లోపు లోక్సభ, రాష్ట్ర శాసనసభలలో మహిళా రిజర్వేషన్ను సమర్థవంతంగా అమలు చేసేందుకు నారీ శక్తి వందన అధినియమ్కు సవరణ చేసేందుకు తమ మద్దతును తెలుపుతూ శివసేన మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక లేఖ రాసింది.ప్రధాని మోదీకి రాసిన లేఖలో శివసేన అధినేత ఏక్నాథ్ షిండే, "ఈ బిల్లు శాసనసభలు, లోక్సభలో మహిళా రిజర్వేషన్ల సమర్థవంతమైన అమలుకు మార్గం సుగమం చేస్తుంది, భారత ప్రజాస్వామ్య ప్రస్థానంలో ఇది ఒక స్వర్ణ అధ్యాయం " అని పేర్కొన్నారు."ఈ చొరవ కేవలం శాసన సంస్కరణ మాత్రమే కాదు, పరిపాలన.. దేశ నిర్మాణంలో మహిళల నిర్ణయాత్మక భాగస్వామ్యాన్ని నిర్ధారించే దిశగా ఒక పరివర్తనాత్మక చర్య. ఇది న్యాయం, సమానత్వం, మహిళా సాధికారత పట్ల మీ (ప్రధాని మోదీ) అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తూ, మన సమ్మిళిత ప్రజాస్వామ్య పునాదిని మరింత బలోపేతం చేస్తుంది" అని ఆయన అన్నారు. -
తమిళంలోకి మాస్ ఎంట్రీ
లవర్ బాయ్గా తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న రాజ్ తరుణ్ ‘గాడ్స్ అండ్ సోల్జర్స్’ సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. రాజ్ తరుణ్, ఆరి అర్జునన్, అమ్ము అభిరామి, కిశోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. రఫ్ నోట్ ప్రోడక్షన్ సంస్థ తమిళ–తెలుగు భాషల్లో నిర్మించిన ఈ చిత్రం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి.ఈ సినిమాకి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయ్ మిల్టన్ మాట్లాడుతూ– ‘‘కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘గాడ్స్ అండ్ సోల్జర్స్’. వాస్తవిక కథనంతో పాటు వాణిజ్య అంశాలను మేళవించిన ఈ మూవీ ఆడియన్స్కి మంచి అనుభూతినిచ్చేలా ఉంటుంది. స్వతంత్ర సంగీత కళాకారుడు వేధన్ మా చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో నటించారు’’ అని పేర్కొన్నారు. -
జూ. ఎన్టీఆర్ 'డ్రాగన్' రూమర్స్కు చెక్ పెడతారా?
జూనియర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం 'డ్రాగన్'పై ఊహాగానాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సినిమా టైటిల్ నుంచి మొదలుకొని దాని కథ, షూటింగ్ షెడ్యూల్, నటీనటులు, ఇలా ఏ అంశంపై కూడా స్పష్టత లేకపోవడంతో అభిమానులు, సినీ వర్గాలు చర్చల్లో మునిగిపోయాయి. అసలు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు జరుగుతుందో, ఎప్పుడు వాయిదా పడుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఒక దశలో కథనే పూర్తిగా మార్చేశారంటూ వార్తలు వచ్చాయి. ఈ అనిశ్చితి మధ్య ఎన్టీఆర్ బాడీ బిల్డింగ్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే దానిపై కూడా విమర్శలు చెలరేగాయి.ఇటీవలే మళయాళ నటుడు టొవినో థామస్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న సంగతి అధికారికంగా బయటపడింది. అతడు ఎన్టీఆర్ సోదరుడి పాత్ర చేయాల్సిందని సమాచారం. అయితే తాజాగా ఆ పాత్ర కోసం బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ను సంప్రదిస్తున్నారనే కథనాలు వస్తున్నాయి. సినిమాలో మరో కీలక పాత్ర కోసం ఆలియా భట్ను కూడా సంప్రదించారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్-ఆలియా మధ్య ఓ పాట కూడా ఉంటుందనే ప్రచారం ఉంది. ఈ సినిమాను 'గోల్డెన్ ట్రయాంగిల్' నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. థాయ్లాండ్, మయన్మార్, లావోస్ కలిసే ప్రాంతాన్ని గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. ఒకప్పుడు ఇది మాదకద్రవ్యాల ఉత్పత్తికి అతిపెద్ద కేంద్రం. ఈ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని 'డ్రాగన్' వస్తోందని అంటున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సినిమా అప్డేట్స్ వస్తాయని ప్రచారం జరుగుతోంది. టీజర్ వస్తుందనే మాటలు వినిపిస్తున్నా, అభిమానులు మాత్రం టీజర్ సంగతి పక్కనపెడితే, కనీసం టైటిల్, రిలీజ్ డేట్ చెప్పండి చాలు అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. డ్రాగన్ చుట్టూ నడుస్తున్న ఊహాగానాలు, ప్రచారాల్లో కొన్నింటికి వచ్చే నెలలో తెరపడే అవకాశం ఉంది. ఎన్టీఆర్ బర్త్డే కానుకగా సినిమా టైటిల్, రిలీజ్ డేట్ లేదా టీజర్ రూపంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
రాత మారని కేకేఆర్.. సీఎస్కే విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) ఓటముల పరంపర కొనసాగుతూనే ఉంది. సీజన్లో కేకేఆర్ వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. మంగళవారం కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో సీఎస్కే 32 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. బౌలర్ల సమిష్టి ప్రదర్శనకు తోడు శాంసన్, బ్రెవిస్, ఆయుశ్ మాత్రేలు రాణించడంతో సీఎస్కే సునాయాస విజయాన్ని అందుకుంది. మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. శాంసన్ (48), బ్రెవిస్ (41), ఆయుశ్ మాత్రే (38) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా 2 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన కేకేఆర్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చిన కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులకు పరిమితమైంది. ఆఖర్లో పావెల్ (31 నాటౌట్), రమణ్దీప్ (35) పోరాడే ప్రయత్నం చేసినప్పటికీ చేయాల్సిన పరుగులు ఎక్కువగా ఉండడంతో లాభం లేకపోయింది. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ 3 వికెట్లు తీయగా, అన్షుల్ కాంబోజ్ 2 వికెట్లు పడగొట్టాడు. సీజన్లో సీఎస్కేకు ఇది రెండో విజయం కాగా, కేకేఆర్ నాలుగు పరాజయాలతో ఇప్పటికీ ఖాతా తెరవలేదు. -
మణిపూర్లో ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలు బంద్!
మణిపూర్ రాష్ట్రంలోని బిష్ణుపూర్ జిల్లాలో ఇటీవల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏప్రిల్ 7న జరిగిన బాంబు దాడిలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజలు భారీ నిరసనలు చేపట్టారు.ఈ నిరసనల సమయంలో.. కుకీ తిరుగుబాటు గ్రూపులకు చెందిన వ్యక్తులు ప్రయాణిస్తున్నారని అనుమానంతో ఒక కారును నిరసనకారులు ఆపి దానికి నిప్పంటించారు. ఈ ఘటనతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారి, నిరసనకారులు.. భద్రతా బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కారులో ఉన్నవారిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.నిరసనలు జిల్లా వ్యాప్తంగా విస్తరించాయి. చురాచాంద్పూర్కు వెళ్లే రహదారులు, అలాగే ఇంఫాల్ అంతర్జాతీయ విమానాశ్రయంకు వెళ్లే హైవేలను నిరసనకారులు బ్లాక్ చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.ఏప్రిల్ 7న బిష్ణుపూర్లోని ఒక గ్రామంలో.. ఐదేళ్ల బాలుడు, ఆరు నెలల చిన్నారి తమ ఇంట్లో నిద్రపోతుండగా బాంబు దాడి జరగడంతో మృతి చెందారు. ఈ ఘటన ప్రజల మనసులను కదిలించింది. ఆగ్రహంతో నిరసనకారులు CRPF శిబిరం ఎదుట కూడా నిరసనలు చేపట్టగా, అక్కడ జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు.ఈ దాడిలో ఐదేళ్ల బాలుడు, ఆరు నెలల చిన్నారి తమ ఇంట్లో నిద్రపోతుండగా బాంబు పేలడంతో మృతి చెందారు. ఈ ఘటన ప్రజల మనసులను కదిలించింది. ఆగ్రహంతో నిరసనకారులు CRPF శిబిరం ఎదుట కూడా నిరసనలు చేపట్టగా, అక్కడ జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు.పరిస్థితులు అదుపు తప్పకుండా ఉండేందుకు మణిపూర్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. బిష్ణుపూర్, ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, థౌబల్, కాక్చింగ్ జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. తప్పుడు సమాచార వ్యాప్తి, గుంపుల సమీకరణను అరికట్టడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశ్యం.ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పరిస్థితిని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రజల్లో శాంతి భద్రతలు పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోంది. ఈ సంఘటన మణిపూర్ రాష్ట్రంలో శాంతి, సామరస్యాల అవసరాన్ని మరోసారి గుర్తు చేసింది. -
కోహ్లికి గాయం.. లక్నోతో ఆడేది అనుమానమే!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లి గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లాడిన ఆర్సీబీ మూడు విజయాలతో పట్టికలోమూడో స్థానంలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో బుధవారం లక్నో సూపర్జెయింట్స్తో ఆర్సీబీ తలపడనుంది. ఈ మ్యాచ్లో కోహ్లీ ఆడేది అనుమానంగానే కనిపిస్తోంది. అయితే సోమవారం ట్రైనింగ్ సెషన్లో కోహ్లీ కాలికి బ్యాండేజ్తో కనిపించాడు. ప్రాక్టీస్ అనంరతం కోహ్లీ మాజీ క్రికెటర్ కేన్ విలియమ్సన్, కెప్టెన్ రిషబ్ పంత్లను నవ్వుతూ పలకరించాడు. దీనికి సంబంధించిన వీడియోను లక్నో ఫ్రాంచైజీ తమ ఎక్స్లో షేర్ చేసుకుంది. అయితే వీడియోలో కోహ్లీ కుంటుతూ నడుస్తున్నట్లుగా కనిపించింది. దీంతో చీలమండ గాయం నుంచి కోహ్లి ఇంకా కోలుకోలేదని క్లియర్గా తెలుస్తోంది. అందుకే లక్నోతో మ్యాచ్లో కోహ్లి ఆడుతాడా లేదా అన్నది అనుమానంగా మారింది. ఒకవేళ ఆడినా ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే అవకాశముంది. ఇక ఈ సీజన్లో కోహ్లి నాలుగు మ్యాచ్లు కలిపి 179 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్థసెంచరీలున్నాయి. ఇక ఆదివారం ముంబై ఇండియన్స్తో మ్యాచ్లోనూ కోహ్లీ కేవలం బ్యాటింగ్కే పరిమితమయ్యాడు.Yaari dosti 🥹🤌 pic.twitter.com/lgdcrCTITI— Lucknow Super Giants (@LucknowIPL) April 14, 2026చదవండి: ‘రుతురాజ్ నీకో దండం.. ఇకనైనా ఆయుశ్కు చాన్స్ ఇవ్వు’ -
తానా మిడ్ అట్లాంటిక్ నిర్వహణలో ఈస్టర్ ఎగ్ హంట్
ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం చిన్న పిల్లలకోసం ఈస్టర్ ఎగ్ హంట్ కార్యక్రమాన్ని ఏప్రిల్ 12వతేదీన కాలేజ్విల్లేలోని ఎవాన్స్బర్గ్ స్టేట్ పార్క్లో విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా వేర్వేరుచోట్ల నివసిస్తున్న తెలుగువాళ్లు తమ కుటుంబాలతో ఈ వేడుకల్లో పాల్గొని తమ ఆనందాన్ని అందరితో పంచుకున్నారు. ఈ వేడుక తెలుగువాళ్ళను ఒక వేదికపైకి తీసుకువచ్చిందని చెప్పవచ్చు. ఫుడ్, ఫన్, గేమ్స్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలోనే పిల్లలు, పెద్దలు పాల్గొన్నారు.తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి మద్దతుతో తానా మిడ్-అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి ఫణి కంతేటి, బెనిఫిట్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు సమన్వయంతో మిడ్ అట్లాంటిక్ తానా నాయకులు, కమ్యూనిటీ లీడర్లు, వలంటీర్ల సహకారంతో విజయవంతంగా జరిగింది.ఈస్టర్ ఎగ్ హంట్ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణ పిల్లల ఈస్టర్ ఎగ్ హంట్. రంగురంగుల గుడ్లు, ప్రత్యేక ‘గోల్డెన్ ఎగ్స’ కోసం పిల్లలు ఎంతో ఉత్సాహంగా వెతికారు. వారి నవ్వులు, కేరింతలు వేడుకల్లో అసలైన పండుగ వాతావరణాన్ని తలపింపజేసింది. ఈ కార్యక్రమానికి వచ్చిన పిల్లలందరికీ పిజ్జా వడ్డించారు, ఇది వేడుకలో మరింత ఉత్సాహాన్ని నింపింది.ఈవెంట్ కోఆర్డినేటర్లు దీప్తి కోకా, భవాని మామిడి అద్భుతమైన ప్రణాళికతో ఈ ఆటలను నిర్వహించి, కార్యక్రమం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు. వీరు పెద్దలకు, పిల్లలకు నిర్వహించిన ఆటలు అందరినీ అలరించాయి.మిడ్-అట్లాంటిక్ బాయ్స్ అండ్ గర్ల్స్ క్లబ్ వారు అందించిన సహకారం మరువలేనిది. ఫుడ్ స్టాల్స్, నిధుల సేకరణ కోసం ఆటలను నిర్వహించడంలో వీరి ఉత్సాహం మరియు టీమ్ వర్క్ ప్రశంసనీయమని తానా నాయకులు అన్నారు. వాలంటీర్లు, పాల్గొనేవారి చెక్-ఇన్, చెక్-అవుట్ ప్రక్రియను సురేష్ యలమంచి ఎంతో సులభతరం చేశారు. అలాగే ఎంసీ గా తన వ్యాఖ్యానంతో అందరినీ ఉత్తేజపరిచారు. విశ్వనాథ్ కోగంటి ఈ వేడుకలోని మధుర క్షణాలను తన కెమెరాలో ఎంతో చక్కగా బంధించారు. తానా ఈస్టర్ బన్నీతో పిల్లలు ఫోటోలు దిగుతూ, ఆడుకుంటూ గడిపిన సమయం కుటుంబాలకు తీపి జ్ఞాపకాలను మిగిల్చింది. కాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాలంటీర్లందరికీ వారి నిరంతర కృషికి గుర్తింపుగా ‘వాలంటీర్ అవర్ సర్టిఫికేట్లు’ అందజేశారు.ఈ కార్యక్రమంలో బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు కేవలం ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా, సమాజంతో మన సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయి. ఈ కార్యక్రమాన్ని ఇంతటి ఘనవిజయం చేసిన తానా ఫిలడెల్ఫియా టీమ్ కు వాలంటీర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. సేవ, సంతోషం మరియు సంఘీభావంతో మనం కలిaసి ముందుకు సాగుదామని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినవారందరికీ తానా నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు. -
Ai+ నోవా 2 అమ్మకాలు ఎప్పుడంటే?
నోవా సిరీస్లో భాగంగా తమ సరికొత్త డివైస్ 'నోవా 2' విక్రయాలు ప్రారంభమైనట్లు Ai+ స్మార్ట్ఫోన్ ప్రకటించింది. రోజువారీ వినియోగానికి అనుకూలంగా ఉండే ఈ ఫోన్ ఏప్రిల్ 14న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్కార్ట్, ఎంపిక చేసిన రిటైల్ ఔట్లెట్స్లో అందుబాటులో ఉంటుంది.Ai+ నోవా 2 ధరలు4జీబీ + 64 జీబీ: రూ.8,9996 జీబీ + 128 జీబీ: రూ.10,999మొదటిసారి అప్గ్రేడ్ అవుతున్న లేదా Ai+కి మారుతున్న వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ నోవా 2 ఉండనున్నాయి. ఇది నమ్మకమైన, విశ్వసనీయమైన రోజువారీ ఉపయోగానికి చాలా అనుకూలంగా ఉంటుందని Ai+ స్మార్ట్ఫోన్ సీఈఓ, నెక్స్ట్ క్వాంటం (NxtQuantum) షిఫ్ట్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు మాధవ్ సేథ్ అన్నారు.6000mAh బ్యాటరీతో కూడిన నోవా 2.. స్ట్రీమింగ్, బ్రౌజింగ్, గేమింగ్, మల్టీటాస్కింగ్కు సరిపోయేలా తయారైంది. ఇది నెక్ట్స్ క్వాంటం (NxtQuantum) OSతో కూడిన ఆండ్రాయిడ్ 16పై పనిచేస్తూ సున్నితమైన, ఆప్టిమైజ్ చేసిన అనుభూతి అందిస్తుంది. 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, HBM సపోర్ట్తో కూడిన 6.745 ఇంచెస్ HD+ డిస్ప్లేతో వినియోగదారులు కంటెంట్ను చూస్తున్నా లేదా రోజువారీ పనులు చేస్తున్నా, నోవా 2 స్పష్టమైన విజువల్స్, నిరంతరాయమైన స్క్రోలింగ్ అందిస్తుంది.ఈ స్మార్ట్ఫోన్లో అన్ని రకాల లైటింగ్ పరిస్థితులలోనూ కచ్చితమైన, సహజమైన ఫొటోలు తీయడానికి అనువైన 50MP బ్యాక్ కెమెరా, అలాగే స్పష్టమైన సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. IP64 రెసిస్టెన్స్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో కూడిన మెరుగైన నిర్మాణాన్ని నోవా 2 కలిగి ఉంది. ఇది పర్పుల్, గ్రీన్, పింక్, బ్లూ, బ్లాక్ అనే ఐదు విభిన్న రంగులలో లభిస్తుంది. -
‘రుతురాజ్ నీకో దండం.. ఇకనైనా ఆయుశ్కు చాన్స్ ఇవ్వు’
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్కింగ్స్ (సీఎస్కే) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. వరుసగా ఐదో మ్యాచ్లోనూ రుతురాజ్ తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. ఆరు బంతులు ఎదుర్కొన్న రుతురాజ్ ఏడు పరుగులు చేసి అనుకుల్ రాయ్ బౌలింగ్లో రోవ్మెన్ పావెల్కు క్యాచ్ ఇచ్చాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్ల్లో 12.6 సగటుతో 63 పరుగులు మాత్రమే చేశాడు. బ్యాటర్గానే గాక కెప్టెన్గానూ రుతురాజ్ ఫెయిలవుతున్నాడు. సీఎస్కే ఇప్పటివరకు 4 మ్యాచ్ల్లో ఒక్క విజయం మాత్రమే సాధించి మూడింట ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో రుతురాజ్ కెప్టెన్సీ సహా వ్యక్తిగత ప్రదర్శనపై విమర్శలు పెరిగిపోతున్నాయి. దీంతో రుతురాజ్ తన బ్యాటింగ్ ఆర్డర్ను మార్చుకుంటే బాగుంటుందని క్రీడా పండితులు సూచిస్తున్నారు. వన్డౌన్లో వస్తున్న ఆయుశ్ మాత్రేకు ప్రమోషన్ ఇచ్చి ఓపెనర్గా పంపితే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి రాబోయే మ్యాచ్ల్లోనైనా రుతురాజ్ తన బ్యాటింగ్ ఆర్డర్ను మార్చుకుంటాడేమో చూడాలి. మ్యాచ్ విషయానికొస్తే టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. శాంసన్ (48) టాప్ స్కోరర్గా నిలవగా, డెవాల్డ్ బ్రెవిస్ (41), ఆయుశ్ మాత్రే (38) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో కార్తిక్ త్యాగి 2 వికెట్లు తీయగా, వైభవ్ అరోరా, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్లు తలా ఒక వికెట్ తీశారు. View this post on Instagram A post shared by THE ADULT SOCIETY (@adultsociety) చదవండి: IPL 2026: నల్ల రిబ్బన్లతో బరిలోకి.. కారణమదే! -
పాకిస్థాన్లో 2 రోజుల్లో మళ్లీ..: ట్రంప్ కీలక ప్రకటన
వాషింగ్టన్: అమెరికా-ఇరాన్ మధ్య రెండు రోజుల్లో చర్చలు జరగనున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం రాత్రి ప్రకటించారు. ఈ చర్చలు కూడా పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగానే ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు. న్యూయార్క్ పోస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివరాలు తెలిపారు.“మీడియా అక్కడే ఉండాలి.. ఎందుకంటే వచ్చే 2 రోజుల్లో ఏదో జరిగే అవకాశం ఉంది. మేము అక్కడికి వెళ్లేందుకే ఆసక్తి చూపుతున్నాం” అని ట్రంప్ చెప్పారు. పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు, ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ ఈ చర్చల విషయంలో అద్భుతంగా పని చేస్తున్నారని ట్రంప్ కొనియాడారు. ఆయనో అద్భుతమైన వ్యక్తి అని, అందుకే తాము మళ్లీ అక్కడికి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. కాగా, శాంతి చర్చల కోసం అమెరికా, ఇరాన్ ప్రతినిధులు ఈ వారం చివరలో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్కు మళ్లీ రావచ్చని అంతర్జాతీయ మీడియా ఇవాళ మధ్యాహ్నం పేర్కొంది. ఇటీవల పాక్లో జరిగిన చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. దీంతో రెండో దశ చర్చలు జరపాలని అమెరికా-ఇరాన్ భావిస్తున్నాయి. తేదీని ఇంకా నిర్ణయించలేదని, కానీ ఈ వారం చివరలోనే అమెరికా-ఇరాన్ తిరిగి ఇస్లామాబాద్ రావచ్చని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇరు దేశాల ప్రతినిధి బృందాలు శుక్ర/శని/ఆదివారం చర్చల్లో పాల్గొనవచ్చని ఒక సీనియర్ ఇరాన్ అధికారి అన్నారు.పాకిస్థాన్లోని సోర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. రెండో దశ చర్చల గురించి అమెరికా-ఇరాన్తో పాక్ ప్రతినిధులు మాట్లాడుతున్నారు. “మేము ఇరాన్తో మాట్లాడాము. రెండో దశ చర్చలకు వారు సిద్ధంగా ఉన్నారని తెలిపేలా సానుకూల స్పందన వచ్చింది” అని పాకిస్థాన్ ప్రభుత్వ సీనియర్ అధికారి తెలిపారు.పాకిస్థాన్లో ఇటీవల జరిగిన చర్చలకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ మొహమ్మద్ బాగేర్ ఖలీబాఫ్ తమ తమ బృందాలకు నాయకత్వం వహించారు. హార్మూజ్ జలసంధి, ఇరాన్ అణు కార్యక్రమం, అంతర్జాతీయ ఆంక్షలు వంటి అంశాలు చర్చలకు అడ్డంకిగా మారాయి. -
వెలుగులోకి ‘లేడీ కెప్టెన్’ లీలలు.. టీసీఎస్లో సంచలనం
ముంబై: లైంగిక వేధింపులు, మత మార్పిడి ఆరోపణలతో ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ నాసిక్ క్యాంపస్ వ్యవహారం సంచలనంగా మారింది. తాజాగా ఈ ఘటనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. 2021 నుంచి టీసీఎస్లో దారుణాలు జరుగుతున్నాయని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. మహిళా ఉద్యోగులను మత మార్పిడి చేసుకునేలా ప్రోత్సహించిన ఆరుగురు ఉద్యోగులు అరెస్టయ్యారు. పరారీలో ఉన్న హెచ్ఆర్ మేనేజర్ కూడా ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెలుగులోకి వచ్చాయి. ఆమె సహచర ఉద్యోగులకు హిందూ మహిళా ఉద్యోగులను పెళ్లి చేసుకోవాలని ప్రోత్సహించేవారని సమాచారం. మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధించడం, మత మార్పిడిని ప్రోత్సహించడం, వారి బ్రెయిన్వాష్ చేసి మతం మార్చుకునేలా ఒత్తిడి చేయడం, అందుకు కావాల్సిన నిధులను సమకూర్చడం వంటి చర్యలు జరిగినట్లు తేలింది. హెచ్ఆర్ విభాగానికి చెందిన కొంతమంది ఉద్యోగులు కూడా ఈ వ్యవహారంలో భాగమయ్యారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.హెచ్ఆర్ మేనేజర్ మా సహచరులతో నిత్యం మాట్లాడేవారు. వారి మాటల్లో మతం ప్రస్తావన ఉండేది. హిందూ మహిళా ఉద్యోగులను ప్రేమలోకి దించమని, వారిని పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చేవారు. 2021 నుంచి ఇదే విధంగా జరుగుతోంది. మత మార్పిడిని ప్రోత్సహిస్తూ ఫండ్స్ సమకూర్చేవారు' అని సాక్షులు వివరించారు.ఓ నిందితుడు పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఓ ఉద్యోగినిని శారీరకంగా లోబర్చుకున్నాడు. పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు తప్పించుకుని తిరిగేవాడు. ప్రశ్నిస్తే బాధిత ఉద్యోగినిని బాడీషేమింగ్ చేస్తూ అసభ్యంగా మాట్లాడేవాడు. సంస్థలో ఇలా జరుగుతోందని హెచ్ఆర్ విభాగంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పైగా వారి చర్యలకు పరోక్షంగా సహకరించారు.నిందితులు పురుష ఉద్యోగులలో ఒకరిని నమాజ్ చేయమని బలవంతం చేసి, అతని మతాన్ని అవమానించాడు. బాధిత మహిళా ఉద్యోగులు కంపెనీ మహిళా హెచ్ఆర్ మేనేజర్కు ఫిర్యాదు చేస్తే..‘ఫిర్యాదు చేస్తే ఉద్యోగం నుండి తొలగిస్తాం’ అని బెదిరించేవారు ‘లేడీ కెప్టెన్’గా పేరున్న హెచ్ఆర్ మేనేజర్ నిదా ఖాన్ మహిళా ఉద్యోగులతో స్నేహం పెంచి, వారిని సౌకర్యంగా ఉంచి, క్రమంగా నమాజ్ చేయడం, హిజాబ్ ధరించడం వంటి ఆచారాలకు శిక్షణ ఇచ్చిందని ఆరోపణలు ఉన్నాయి. టీసీఎస్ నాసిక్ క్యాంపస్ ఘటన యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులపై చర్యలు తీసుకుంది. -
IPL 2026: నల్ల రిబ్బన్లతో బరిలోకి.. కారణమదే!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా 22వ మ్యాచ్లో సీఎస్కే, కేకేఆర్ తలపడుతున్నాయి. కాగా ఈ మ్యాచ్కు ఇరుజట్ల ఆటగాళ్లు నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగడం ఆసక్తి కలిగించింది. అయితే ఇరుజట్ల ఆటగాళ్లు ఏకకాలంలో నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగడం వెనుక ఒక కారణముంది. గత వారం (ఏప్రిల్ 9న) భారత అత్యంత వృద్ధ టెస్ట్ క్రికెటర్, చెన్నై క్రికెట్ దిగ్గజం దొరైస్వామి గోపీనాథ్ (96) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి సంతాపంగా సీఎస్కే, కేకేఆర్ ఫ్రాంచైజీలు నివాళి ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే గోపీనాథ్ మరణం పట్ల గౌరవసూచకంగా ఆటగాళ్లంతా నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు. కాగా 1951లో ఇంగ్లండ్పై అంతర్జాతీయ అరంగేట్రం చేసిన గోపీనాథ్ తన కెరీర్లో భారత్ తరపున 8 టెస్టులు ఆడారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మద్రాస్ తరపున ఆడన 83 మ్యాచ్లు ఆడారు. గోపీనాథ్ తన అరంగేట్ర మ్యాచ్లోనే మెరుపుగలు మెరిపించాడు. తన అరంగేట్ర టెస్టులో 8వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి మొదటి ఇన్నింగ్స్లో 50 (నాటౌట్), రెండో ఇన్నింగ్స్లో 42 పరుగులు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. మొత్తంగా ఆయన 8 మ్యాచ్లలో 242 పరుగులు చేశారు. .@ChennaiIPL and @KKRiders are wearing black armbands as a mark of respect to former India cricketer C.D. Gopinath, who breathed his last on April 9.#TATAIPL | #CSKvKKR pic.twitter.com/Zv9NxNjAp6— IndianPremierLeague (@IPL) April 14, 2026 -
'రష్మిక వెడ్డింగ్.. మాకు చాలా తక్కువ టైమ్ ఇచ్చింది'
టాలీవుడ్ హీరోయిన్ రష్మిక ఇటీవలే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో డేటింగ్లో ఉన్న ముద్దుగుమ్మ ఎట్టకేలకు ఈ ఏడాది తెలుగింటి కోడలిగా ఎంట్రీ ఇచ్చింది. రాజస్థాన్లో ఉదయ్పూర్లో వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ జరిగింది. ఈ పెళ్లి వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల కోసం హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు.అయితే ఈ పెళ్లిలో రష్మికను ముస్తాబు చేసిన మేకప్ ఆర్టిస్ట్ తన్వీ చెంబుర్కర్ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. తనకు ఎక్కువ మేకప్ వద్దని చెప్పిన రష్మిక.. మాకు చాలా తక్కువ సమయం ఇచ్చారని తెలిపింది. కేవలం 40 నిమిషాల్లో రెడీ చేయాలని సూచించారని వెల్లడించింది. కానీ రష్మిక ఇచ్చిన టైమ్లో మా పని పూర్తి కాలేదని.. దాదాపు 90 నిమిషాలు పట్టిందని తన్వీ వివరించింది.ఆమె అనుకున్న టైమ్ కన్నా ఆలస్యంగా రావడం వల్లే మాకు సమయం తగ్గించారని తన్వీ పేర్కొంది. పెళ్లిలో తాను చాలా సింపుల్గా, నేచురల్గా కనిపించాలని మాతో చెప్పిందని మేకప్ ఆర్టిస్ట్ వెల్లడించింది. కనీసం కాటుక కూడా పెట్టుకోవడానికి ఆమె ఇష్టపడలేదని తెలిపింది. మేము కూడా రష్మిక చెప్పనట్టే చేశామని.. కానీ ఇంతలా మాకు ప్రశంసలు వస్తాయని అనుకోలేదని చెప్పింది. రష్మిక హీరోయిన్ కావడంతో మేకప్, హెయిర్ స్టైల్పై ఆమెకు ఫుల్ క్లారిటీ ఉందని తన్వీ అన్నారు.ఇక రష్మిక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రణబాలితో పాటు మైసా అనే చిత్రంలో నటిస్తున్నారు. రణబాలిలో విజయ్ దేవరకొండ సరసన కనిపించనున్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరు జంటగా నటిస్తోన్న చిత్రమిదే కావడం విశేషం. ఈ మూవీని 1854- 1978 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబరు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
శ్రీమన్నారాయణ మహాయజ్ఞానికి వైఎస్ జగన్కు ఆహ్వానం
సాక్షి, తాడేపల్లి: ఆధ్యాత్మికత,ధార్మిక కార్యక్రమాలు సమాజానికి ఐక్యతను, సానుకూలతను తెస్తాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కృష్ణా జిల్లా కోడూరు మండలం ఉల్లిపాలెంలో ఈ నెల 19 నుంచి 29 వరకు శ్రీమన్నారాయణ మహాయజ్ఞం జరగనుంది.శ్రీమన్నారాయణ మహాయజ్ఞంలో పాల్గొనాలని కోరుతూ శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామి వైఎస్ జగన్ను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా ‘అభినవ మేల్కోట భక్తి గీతమాలిక’ సీడీని జగన్ ఆవిష్కరించారు. అనంతరం సంపత్కుమార రామానుజ జీయర్ స్వామిని సత్కరించారు. తరువాత వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘ఆధ్యాత్మికత, ధార్మిక కార్యక్రమాలు సమాజానికి ఐక్యతను, సానుకూలతను తెస్తాయి. ఇలాంటి మహాయజ్ఞాలు ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయి’ అని అన్నారు.కార్యక్రమంలో మాజీ మంత్రులు పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సింహాద్రి రమేష్బాబు తదితరులు పాల్గొన్నారు. -
మరోసారి నవ్వులపాలైన పాకిస్థాన్
ఇస్లామాబాద్: ఏప్రిల్ 10-12 మధ్య ఇరాన్-అమెరికా చర్చలకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, చర్చలకు ఆతిథ్యం ఇచ్చిన హోటల్ బిల్లులను చెల్లించడంలో పాక్ విఫలమైందని.. అంతర్జాతీయంగా తలవంపులు తెచ్చుకుందంటూ ప్రచారం జరుగుతోంది. పరిస్థితి చేయి దాటడంతో.. హోటల్ యజమాని స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చిందంటూ వార్తలు వస్తున్నాయి. హోటల్ బిల్లు కూడా పాక్ కట్టలేకపోవడంతో ఆ దేశ ఆర్థిక పరిస్థితిపై మరోసారి చర్చ జరుగుతోంది.అమెరికా-ఇరాన్ మధ్య రెండో రౌండ్ శాంతి చర్చలు ఈ వారంలోనే పాకిస్థాన్లో ప్రారంభం కానున్నాయి. అసలే ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న పాక్కు రాబోయే చర్చలకు ఆతిథ్యం ఇవ్వడం ఇప్పుడు సవాలుగా మారింది. వాషింగ్టన్- టెహ్రాన్ మధ్య ఉన్న రెండు వారాల కాల్పుల విరమణ ఏప్రిల్ 21తో ముగియనున్న నేపథ్యంలో ఏప్రిల్ 16న ఈ చర్చలు జరిగే అవకాశం ఉందని రాయిటర్స్ పేర్యొంది. అయితే, ఈసారి కూడా గతంలో వచ్చిన స్థాయి ప్రతినిధి బృందాలు వస్తాయా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.ఇరాన్, అమెరికా మధ్య యుద్ధాన్ని ఆపడానికి పాకిస్తాన్ మధ్యవర్తి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. పశ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు పలకడం ద్వారా అంతర్జాతీయస్థాయిలో కీర్తి శిఖరాలను అధిరోహించాలని పాకిస్తాన్ ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నిస్తోంది. అమెరికా-ఇరాన్ చర్చలకు ఆతిథ్యం ఇచ్చిన పాక్.. ఇస్లామాబాద్లోని హోటల్ సెరెనాలో ఏర్పాట్లు చేసింది. తీరా ఈ చర్చలు విఫలమవ్వడంతో.. చివరకు చెల్లింపులు లేవు, డీల్ లేదన్నట్లుగా పరిస్థితి మారింది. చివరికి హోటల్ బిల్లుల భారం మాత్రం మిగిలింది.మరోవైపు, ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాక్కు మరో సమస్య వచ్చి పడింది. యూఏఈ ఇచ్చిన $3 బిలియన్ డాలర్లు అప్పు పూర్తిగా తిరిగి చెల్లించాలని కోరడంతో ఎలా చెల్లించేది అనే సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. అసలే డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ ఈ అప్పులు ఎలా చెల్లించేదని ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం.మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం కారణంగా పెరుగుతున్న ముడిచమురు ధరల వల్ల పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారింది. ఇంతకాలంగా యూఏఈకి ఉన్న అప్పును పలు దపాలుగా పాకిస్థాన్ వాయిదా వేస్తో వచ్చింది.. అయితే ప్రస్తుతం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అప్పు చెల్లించాలని కోరడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. -
కో-ఆపరేటివ్ బ్యాంక్కు ఆర్బీఐ జరిమానా
నిబంధనల ఉల్లంఘన విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరోసారి కఠినంగా వ్యవహరించింది. తాజాగా హిమాచల్ ప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్పై రూ.7.50 లక్షల నగదు జరిమానాను విధిస్తూ కేంద్ర బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఖాతాల నిర్వహణ, భద్రతా ప్రమాణాల విషయంలో బ్యాంక్ వైఫల్యం చెందడమే ఇందుకు ప్రధాన కారణమని ఆర్బీఐ స్పష్టం చేసింది.తనిఖీలో వెలుగుచూసిన లోపాలునేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ (నాబార్డ్) 31 మార్చి 2025 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి నిర్వహించిన చట్టబద్ధమైన తనిఖీలో ఈ లోపాలు బయటపడ్డాయి. తనిఖీ నివేదిక ప్రకారం.. ఖాతాదారుల రిస్క్ ప్రొఫైల్ను కాలానుగుణంగా సమీక్షించే పటిష్టమైన వ్యవస్థను అమలు చేయడంలో బ్యాంక్ విఫలమైంది. ఆర్బీఐ నిర్దేశించిన కేవైసీ, ఇతర నియంత్రణ ప్రమాణాలను పాటించలేదు.ఆర్బీఐ చర్యల నేపథ్యంనిబంధనల ఉల్లంఘనపై వివరణ కోరుతూ ఆర్బీఐ ఇదివరకే సదరు బ్యాంకుకు నోటీసులు జారీ చేసింది. నోటీసుకు బ్యాంక్ ఇచ్చిన సమాధానం, వ్యక్తిగత విచారణలో ప్రతినిధులు చేసిన మౌఖిక వాదనలు, వారు సమర్పించిన అదనపు పత్రాలను ఆర్బీఐ క్షుణ్ణంగా పరిశీలించింది. అయితే, బ్యాంక్ వివరణ సంతృప్తికరంగా లేదని, ఆరోపణలు వాస్తవమని నిర్ధారణ కావడంతోనే ఈ జరిమానా విధిస్తున్నట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.‘ఈ చర్య కేవలం రెగ్యులేటరీ వ్యవస్థలో లోపాలపై తీసుకున్న నిర్ణయం మాత్రమే. దీనికి బ్యాంక్ తన కస్టమర్లతో కుదుర్చుకున్న ఒప్పందాలకు లేదా అది జరిపే లావాదేవీల చెల్లుబాటుకు ఎటువంటి సంబంధం లేదు. అలాగే, ఈ జరిమానా విధించడం వల్ల బ్యాంకుపై భవిష్యత్తులో తీసుకునే ఇతర చట్టపరమైన చర్యలకు ఎటువంటి ఆటంకం కలగదు’ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.ఇదీ చదవండి: ‘మధ్య తరగతి’ బండి సాగేదెలా? -
యుద్ధం వేళ మోదీకి ట్రంప్ ఫోన్.. ఏకంగా 40 నిమిషాలు..
న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఫోన్ చేశారు. మోదీతో ట్రంప్ సుమారు 40 నిమిషాలు మాట్లాడారు. ఇటీవల పాకిస్థాన్లోని ఇస్లామాబాద్లో జరిగిన అమెరికా–ఇరాన్ శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఒప్పందం కుదరలేదు. దీంతో అనిశ్చితి ఇంకా తొలగిపోలేదు. ఇరాన్ సముద్ర మార్గాలను అమెరికా దిగ్బంధనం చేసింది.యుద్ధానికి సంబంధించి పలు అంశాలపై ట్రంప్తో మోదీ కీలక చర్చలు జరిపారు. “నా స్నేహితుడు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఫోన్ కాల్ అందింది. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంతో సాధించిన గణనీయ పురోగతిని సమీక్షించాము. అన్ని రంగాల్లో మా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. పశ్చిమాసియా పరిస్థితి గురించి కూడా చర్చించాము. హార్మూజ్ జలసంధిని తెరిచి, భద్రంగా ఉంచడం, దాని ప్రాముఖ్యత గురించి మాట్లాడుకున్నాం” ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. Received a call from my friend President Donald Trump. We reviewed the substantial progress achieved in our bilateral cooperation in various sectors. We are committed to further strengthening our Comprehensive Global Strategic Partnership in all areas. We also discussed the…— Narendra Modi (@narendramodi) April 14, 2026కాగా, ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలు, యుద్ధం మళ్లీ పెరగకుండా నియంత్రించడం వంటి అంశాలపై మోదీ చర్చించినట్లు తెలుస్తోంది. అమెరికా-ఇరాన్ చర్చలు విఫలమైన తర్వాత తదుపరి దౌత్య చర్యలు ఎలా ఉండాలి అన్న అంశాలపై కూడా ఇరువురు నేతలు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఇది అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ తర్వాత ఇద్దరు నేతల మధ్య తొలిసారి జరిగిన చర్చ. ‘‘భారత ప్రజలు మిమ్మల్ని అభిమానిస్తారు” అని ఫోన్ కాల్ సమయంలో ట్రంప్కు మోదీ చెప్పారు. వారి మధ్య జరిగిన చర్చ విషయాలను అధికారికంగా వెల్లడించలేదు. అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య మోదీ, ట్రంప్ జరిపిన చర్చకు ప్రాధాన్యం సంతరించుకుంది. మోదీకి తాజా సమాచారం అందిస్తుంటారు: సెర్జియో ఇద్దరు నేతలు పశ్చిమాసియా పరిస్థితి, వాణిజ్యం వంటి అంశాలపై చర్చించినట్లు భారత్లోని అమెరికా రాయబారి సెర్జియో గోర్ తెలిపారు. “కొన్ని నిమిషాల క్రితమే వారు ఫోన్ సంభాషణ ముగిసింది. అధ్యక్షుడు ట్రంప్ చాలా యాక్టివ్గా ప్రధానమంత్రి మోదీకి తాజా సమాచారం అందిస్తారు. పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలపై అధ్యక్షుడు వివరాలు చెప్పారు. అలాగే అమెరికా, భారత్ మధ్య వాషింగ్టన్లో జరుగుతున్న కీలక అంశాలపై కూడా చర్చ జరిగింది” అని గోర్ చెప్పారు. -
ఊహించని దెబ్బ.. ఎస్ఆర్హెచ్ కీలక నిర్ణయం
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్పై గెలిచి రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. తాజాగా ఎస్ఆర్హెచ్ బౌలర్ బైడన్ కార్స్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. గాయంతో సీజన్ మొత్తానికి దూరమైన బ్రైడన్ కార్స్ స్థానాన్ని శ్రీలంక పేసర్ దిల్షాన్ మధుషంకతో భర్తీ చేస్తున్నట్లు తెలిపింది. పేస్ అటాక్లో కార్స్ కీలకం అవుతాడని భావించిన మేనేజ్మెంట్కు ఇది ఊహించని దెబ్బ. కానీ ఏమాత్రం ఆలస్యం చేయని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం మదుషంక రూపంలో బ్రైడన్ కార్స్కు సరైన ప్రత్యామ్నాయంగా ఎంచుకొంది. కాగా మధుషంకను ఎస్ఆర్హెచ్ రూ. 75 లక్షల బేస్ ప్రైస్కే జాయిన్ అవ్వనున్నాడు. ఈ నేపథ్యంలో దిల్షాన్ మధుషంకను ఎస్ఆర్హెచ్ క్యాంప్లోకి ఆహ్వానిస్తున్నట్లు తమ ఎక్స్లో పేర్కొంది. మధుషంక చేరికతో హైదరాబాద్ బౌలింగ్ దళం మరింత పటిష్టంగా మారిందనే చెప్పాలి. ఒక లెఫ్టార్మ్ పేసర్గా పవర్ప్లేలో బంతిని స్వింగ్ చేస్తూ వికెట్లు తీయగల నైపుణ్యం అతనికి ఉంది.గతంలో అంతర్జాతీయ క్రికెట్తో పాటు పలు లీగ్లలో కూడా తన మార్క్ చూపించిన ఈ లంక బౌలర్ రాకను అభిమానులు స్వాగతిస్తున్నారు. మధుషంక లంక తరఫున 28 వన్డేలు, 19 టీ20, ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు. ప్రఫుల్ హింగే, సాకిబ్హుస్సేన్ వంటి యంగ్ బౌలర్లకు తోడుగా మధుషంక జతవ్వడం జట్టుకు అదనపు బలం. మరి మధుషంక చేరికతో ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్ బలపడినట్లే.Dilshan Madushanka joins the squad as a replacement for Brydon Carse, who is ruled out due to injury.Welcome, Dilshan 🧡 pic.twitter.com/zJQWtbXVZt— SunRisers Hyderabad (@SunRisers) April 14, 2026 -
అల్లు- అట్లీ రాకా.. ఆ స్టార్ హీరో ఓకే చెప్పారా?
అల్లు అర్జున్-అట్లీ కాంబోలో వస్తోన్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ రాకా. ఇటీవల బన్నీ బర్త్ డే సందర్భంగా టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ లుక్లో ఐకాన్ స్టార్ తోడేలు లాంటి లుక్లో కనిపించారు. ఈ పోస్టర్ చూస్తుంటే విలన్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దాదాపు రూ.900 కోట్ల భారీ బడ్జెట్తో సన్ పిక్చర్ నిర్మిస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె హీరోయిన్గా కనిపించనుంది. అంతేకాకుండా రష్మిక, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా ఉన్నారని టాక్ వినిపిస్తోంది.ఇదిలా ఉండగా.. రాకాకు సంబంధించిన మరో క్రేజీ న్యూస్ వైరల్గా మారింది. అట్లీతో జతకట్టి సూపర్ హిట్ కొట్టిన షారూఖ్ ఖాన్ ఈ మూవీలో కనిపించనున్నారని లేటేస్ట్ టాక్. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లో షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఒక చిన్న పాత్ర చేయడానికి బాలీవుడ్ బాద్షా ఇప్పటికే అంగీకరించారని సమాచారం. అట్లీతో షారూక్కు ఉన్న అనుబంధం వల్లే రాకా మూవీకి ఓకే చెప్పారని ఓ నివేదికలో వెల్లడైంది. అట్లీ తెరకెక్కించిన జవాన్లో షారూక్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన సంగతి తెలిసిందే.అందువల్లే ఈ మూవీలో నటించడానికి షారూక్ ఖాన్ దాదాపు ఓకే చెప్పారని టాక్. ఇదే నిజమైతే జవాన్ తర్వాత మరోసారి అట్లీతో కలిసి పని చేయనున్నారు. ఈ విషయంపై షారుక్ టీమ్ కొందరు సంప్రదించగా.. వారి నుంచి మాత్రం ఇంకా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అయితే గతంలో అల్లు అర్జున్ 'జవాన్' చిత్రంలో ఒక అతిథి పాత్రలో నటించాల్సి ఉండగా.. పుష్ప: ది రూల్ సినిమా షెడ్యూల్ వల్ల కుదరలేదు. దీంతో 'రాకా' మూవీతోనైనా వీరిద్దరిని స్క్రీన్పై చూసే అవకాశం ఆడియన్స్కు దక్కనుంది. షారుక్ ఖాన్ రాకాలో అతిథి పాత్రలో కనిపిస్తే ఈ ప్రాజెక్ట్ క్రేజ్ మరింత పెరగనుంది. -
చారిత్రక నిర్ణయం.. మొట్టమొదటిసారి ఆర్మీ చీఫ్గా మహిళ
కాన్బెర్రా: ఆస్ట్రేలియా ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. మొట్టమొదటిసారి ఆర్మీ చీఫ్గా ఓ మహిళను నియమించింది. దేశ రక్షణ దళ నాయకత్వంలో మార్పుల్లో భాగంగా ఆర్మీకి ఒక మహిళ నాయకత్వం వహించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం జాయింట్ కెపాబిలిటీస్ చీఫ్గా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ సుసాన్ కాయిల్ జూలై నుంచి ఆర్మీ చీఫ్గా బాధ్యతలు చేపడతారని ప్రభుత్వం తెలిపింది. ఆమె లెఫ్టినెంట్ జనరల్ సైమన్ ఆండ్రూ స్టువర్ట్ స్థానంలోకి ఆర్మీ చీఫ్గా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆస్ట్రేలియా సైన్యంలో మహిళా అధికారుల సంఖ్యను పెంచే ప్రయత్నాల మధ్య కోయిల్ నియామకం జరిగింది. సైన్యంలో వ్యవస్థాపరమైన లైంగిక వేధింపులు, వివక్ష ఆరోపణలు ఎదురవుతున్నాయి.ఆస్ట్రేలియా ఆర్మీ 125 సంవత్సరాల చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ ఆర్మీ చీఫ్గా ఉండనున్నారని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్ అన్నారు. రక్షణ మంత్రి రిచర్డ్ మాట్లాడుతూ.. కోయిల్ నియామకాన్ని చరిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. “ప్రస్తుతం ఆస్ట్రేలియా రక్షణ దళంలో సేవ చేస్తున్న మహిళలకు, భవిష్యత్తులో చేరాలని ఆలోచిస్తున్న మహిళలకు ఇది ప్రేరణగా ఉంటుంది” అని తెలిపారు.కోయిల్కు 55 ఏళ్లు. 1987లో సైన్యంలో చేరి అనేక ఉన్నత కమాండ్ బాధ్యతలు నిర్వహించారు. సైన్యంలో ఏ శాఖకైనా నాయకత్వం వహించే తొలి మహిళగా నిలుస్తారని మార్లెస్ చెప్పారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా రక్షణ దళంలో మహిళలు సుమారు 21% మంది ఉండగా, ఉన్నత నాయకత్వ స్థానాల్లో 18.5% మంది ఉన్నారు. 2030 నాటికి మొత్తం 25% మహిళలు ఉండాలని ఆస్ట్రేలియా లక్ష్యంగా పెట్టుకుంది. మహిళను ఆర్మీ చీఫ్గా నియమించడానికి ప్రధాన కారణాలుసైన్యంలో మహిళల ప్రాతినిధ్యం పెంచడంమహిళా అధికారుల సంఖ్య తక్కువగా ఉండడంతో, నాయకత్వ స్థాయిలో మహిళను నియమించి ప్రోత్సాహం ఇవ్వాలనే లక్ష్యంలైంగిక వేధింపులు, వివక్ష ఆరోపణల నేపథ్యంలో మార్పు అవసరంసైన్యంలో వ్యవస్థపరమైన లైంగిక వేధింపులు, వివక్ష ఆరోపణలు రావడంతో, నాయకత్వంలో మార్పు ద్వారా సానుకూల సంకేతం ఇవ్వాలనే ఉద్దేశంసుసాన్ కోయిల్కు దీర్ఘకాల సైనిక అనుభవం, ఉన్నత కమాండ్ బాధ్యతలు నిర్వహించిన నేపథ్యం ఉందిమహిళలు కూడా ఉన్నత స్థాయికి చేరగలరని చూపించడం. ఇది ప్రస్తుత సైనిక మహిళలకు, భవిష్యత్తులో చేరే వారికి ప్రేరణ.దేశంలో 2030 నాటికి సైన్యంలో మహిళల భాగస్వామ్యం 25%కి పెంచాలనే లక్ష్యానికి ఇది ఒక వ్యూహాత్మక అడుగు -
పోలీసుల వ్యవహార శైలిపై మండిపడ్డ వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ బాణాల తనీష్ బాబు కలిశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను వేమూరు టీడీపీ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సమర్ధించడం ఎంతవరకు సమంజసం అంటూ తనీష్ బాబు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.దీనిపై ఎమ్మెల్యే కార్యాలయానికి చెందిన వ్యక్తి ఫిర్యాదుతో చినపులివర్రులో కొల్లూరు ఎస్ఐ ఏడుకొండలు, మరికొందరు పోలీసులు తెల్లవారుజామున మఫ్టీలో గోడదూకి తన ఇంట్లోకి చొరబడి తనను వెంట తీసుకెళ్ళేందుకు ప్రయత్నించారని వైఎస్ జగన్కు తనీష్ బాబు వివరించారు. ఎవరు మీరు, నా భర్తను ఎందుకు తీసుకెళుతున్నారని ప్రశ్నించిన తన భార్య అనూషపై, అడ్డుకున్న స్ధానికులపై దౌర్జన్యం చేసిన తీరును వైఎస్ జగన్కు ఆయన వివరించారు.తనీష్బాబును అక్రమంగా తీసుకెళుతున్న సమాచారం తెలుసుకుని అప్పటికప్పుడు తాను చినపులివర్రు వెళ్ళి పోలీసుల దౌర్జన్యాన్ని నిలదీసినట్లు వేమూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ వరికూటి అశోక్ బాబు తెలిపారు. సోషల్ మీడియా కేసులలో నోటీసులు ఇవ్వకుండా వీధిరౌడీల్లా అర్ధరాత్రి ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించడమేంటని ప్రశ్నించిన వైఎస్ జగన్.. పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణమని మండిపడ్డారు.తనీష్బాబుకు అవసరమైన న్యాయ సహాయం వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అందిస్తుందని.. తనీష్ కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ను కలిసిన వారిలో తనీష్ బాబు భార్య అనూష, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి, మాజీ ఎంపీపీ పెరికల పద్మారావు, చిలుమూరు రామ్మోహన్ రావు, సొంటి కామేశ్వరరావు, వసుమల్ల రోహిత్, అంబటి రామ్మోహన్ రావు ఉన్నారు. -
వాత్స్యాయన కామసూత్రాలకు కూచిపూడి నృత్యభాష్యం
లైంగిక అంశాలపై సమాజంలో అందరికీ ఆసక్తే. కానీ, లైంగిక విజ్ఞానమంటే పచ్చి బూతు, పరమ రోత అనుకొనే చిత్రమైన కుహనా విలువలతో కూడిన వ్యవస్థ మనది. విచిత్రం ఏమిటంటే, అసలు భారతీయ సమాజంలో లైంగిక విజ్ఞానం అనేక శతాబ్దాల క్రితం నుంచే ఓ అవిభాజ్యమైన భాగం. ధర్మ, అర్థ, కామములనే త్రివర్గాల ద్వారానే నాలుగో పురుషార్థమైన మోక్షాన్ని సాధించగలమని నమ్మిన సనాతన భారతీయ ధర్మం మనది. ధర్మ మార్గంలో అర్థాన్ని (ధనాన్ని) సంపాదించాలనీ, ఆ ధర్మబద్ధమైన అర్థం ద్వారా కామాన్ని (కోరికలను) తీర్చుకోవాలనీ, వెరసి ఆ త్రివర్గ సాధనే... మోక్షానికి మార్గమనీ మన ఋషిసత్తముల మాట. అలా క్రీ.శ. మూడో శతాబ్ద కాలంలోనే వాత్స్యాయనుడు ‘కామసూత్ర’ గ్రంథాన్ని అందించిన నేల మనది. అలాంటి కామసూత్ర విశేషాలను వేదికపై సంప్రదాయ కూచిపూడి నృత్య శైలిలో ప్రదర్శించే సాహసం చేస్తే?నాట్య, యోగశాస్త్రాల మేలు కలయికగా...హైదరాబాద్ రవీంద్రభారతి వేదికగా ఏప్రిల్ 13, సోమవారం సాయంత్రం అదే జరిగింది. ప్రసిద్ధ కూచిపూడి నాట్య కళాకారిణి, నాట్య గురువు స్వాతీ సోమనాథ్ తన శిష్య బృందంతో ‘అర్ధనారీశ్వరమ్’ (Ardhanareeswaram) పేరిట ఆ విలక్షణ సాహస ప్రయోగం చేశారు. ‘పద్మభూషణ్’ సుచిత్రా ఎల్లా, బీహెచ్ఈఎల్ మాజీ సీఎండీ బి.పి. రావు, ‘సులభ్ ఇంటర్నేషనల్’ ప్రెసిడెంట్ కుమార్ దిలీప్, కళాపోషకురాలు ప్రవీణా యజ్ఞంభట్, ప్రసిద్ధ కూచిపూడి నాట్యాచార్యులు భాగవతుల సేతురామ్, ‘యక్షగాన కంఠీరవ’ పసుమర్తి శేషుబాబు, దేవదాసీ సంప్రదాయ నాట్యంలో దిట్ట యశోదా ఠాకూర్, కేంద్ర సంగీత – నాటక అకాడెమీ అవార్డు గ్రహీత దీర్ఘాసి విజయభాస్కర్, ప్రముఖ జర్నలిస్ట్ మహమ్మద్ రఫీ సహా వివిధ రంగాలలోని పలువురు ప్రముఖులు ఈ ప్రదర్శనకు హాజరై, ప్రశంసించారు.ఆనందమయ జీవితం గడపాలంటే, లైంగిక జీవితం ఆహ్లాదంగా సాగాలన్నది మొదటి మెట్టు. అయితే, ఆ కోరికను సైతం ధర్మబద్ధమైన మార్గంలో తీర్చుకోవడమే అసలు కీలకం. ఆ విషయాన్నే వివరిస్తూ... స్త్రీ పురుషులు ప్రకృతి – పరమేశ్వరులకు ప్రతీకలని గుర్తు చేస్తూ, వారి సంయోగం అర్ధనారీశ్వర తత్త్వానికి ప్రతిబింబమంటూ సాగిన అపురూప కూచిపూడి నృత్య రూపకం ‘అర్ధనారీశ్వరమ్’. భరతుని ‘నాట్యశాస్త్రం’లోని నృత్తాన్ని ఆసరాగా చేసుకొని, అటు ‘వాత్స్యాయన కామసూత్రాల’లోని కొన్ని ప్రధానాంశాలనూ, ఇటు ‘పతంజలి యోగశాస్త్రం’లోని యోగ భంగిమలనూ సమ్మిళితం చేసి, భారతీయ శాస్త్రీయ సంగీతంలోని సప్తస్వరాలు ఆలంబనగా, కూచిపూడి నృత్య శైలిలో ఎంతో శ్రమించి, స్వాతీ సోమనాథ్ ఈ డ్యాన్స్ బ్యాలేను రూపొందించారు.రెంటాల వారి ఆ ప్రామాణిక రచనే ఆధారంగా...వాత్స్యాయన కామసూత్రాలంటే ((Vatsayana Kamasutra) అదో అశ్లీల గ్రంథంగా పొరబడుతుంటారు. లైంగిక విజ్ఞానాన్ని శాస్త్రీయంగా అందించిన ఆ ప్రాచీన కామశాస్త్రానికి ఉన్నవీ లేనివీ చేర్చి, చౌకబారు నకిలీ అనుకరణలతో వచ్చిన చిల్లర పుస్తకాలే ఆ అపప్రథకు కారణం. “ప్రముఖ అభ్యుదయ కవి, ద్విశతాధిక గ్రంథకర్త, జర్నలిస్టు స్వర్గీయ రెంటాల గోపాలకృష్ణ (1920 – 1995) మాత్రం వాత్స్యాయనుడు రాసిన సంస్కృత సూత్రాలను యథాతథంగా అందిస్తూ, సులభంగా అందరికీ అర్థమయ్యేలా 1980లలోనే ఈ కామశాస్త్ర గ్రంథాన్ని తేటతెలుగులో ‘వాత్స్సాయన కామసూత్రాలు’ పేరిట అందించారు. ఈ నాట్య రూపక రచనకు ప్రామాణికమైన ఆ రచననే ఆధారంగా చేసుకున్నాం. ప్రఖ్యాత రచయిత – చిత్రకారుడు బ్నిమ్ గారు అలా ఈ నృత్య రూపక రచన చేశారు” అని నృత్య దర్శకురాలైన స్వాతీ సోమనాథ్ వివరించారు.“సృష్టికి మూలం సంయోగ భోగం... ప్రకృతీ పురుషుల మధుర సంగమం” అని బ్నిమ్ అందంగా చెప్పిన ఈ సాహసోపేత ప్రయోగానికి గరిమెళ్ళ గోపాలకృష్ణ సంగీతం అందించగా, ఎన్. సురేశ్ ప్రసాద్ సంగీత సారథ్యం వహించారు.కూచిపూడి నాట్య కళాకారిణిగా స్వాతీ సోమనాథ్ (Swathy Somanath) మొదటి నుంచి రంగస్థలంపై ఓ అగ్గిబరాటా. ‘ద్రౌపది’, ‘ఆది శంకరాచార్య’ లాంటి వైవిధ్యభరితమైన అంశాలను ఎంచుకొని, ఎప్పటికప్పుడు ప్రేక్షకులలో ఆలోచన రేపాలనుకోవడం ఆమె శైలి. నిజానికి, ఇప్పటికి 23 ఏళ్ళ క్రితం 2003లోనే ఆమె తొలిసారిగా ఈ వాత్స్యాయన కామసూత్రాలను సశాస్త్రీయంగా, సంప్రదాయబద్ధంగా, కూచిపూడి నృత్యశైలిలో వేదిక మీదకు తెచ్చారు. ఆ ‘కామసూత్ర’ నృత్య రూపకం అప్పట్లో ఓ సంచలనం. ఇలాంటి శృంగారభరిత అంశాలను రంగస్థలంపై నర్తించవచ్చా, అది కళకూ – సమాజానికీ ఏ రకంగా మేలు చేస్తుందంటూ విమర్శలూ వెల్లువెత్తాయి. అయితే, అసభ్యతకు తావివ్వని తన నృత్య రూపకంతోనే ఆ విమర్శలకు దీటుగా బదులిస్తూ, దేశ విదేశాల్లో అనేక చోట్ల స్వాతి ఆ ‘కామసూత్ర’ను ప్రదర్శించారు. “అప్పట్లో ఈ నాటకానికి సుశిక్షితులైన కూచిపూడి పురుష కళాకారులు నాకు అందుబాటులో లేరు. దాంతో, సినీ – టీవీ నటులు జె.ఎల్. శ్రీనివాస్, హీరో జాకీ లాంటి వారితో ప్రదర్శించి, రక్తి కట్టించాం. ఇప్పుడు దానికే కొద్దిగా మార్పులు, చేర్పులు చేసి, మరింత అందంగా తీర్చిదిద్ది, అందరూ సుశిక్షితులైన కూచిపూడి కళాకారులతోనే ‘అర్ధనారీశ్వరమ్’ పేరిట అందించాం. శ్రీకాకుళంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెలకొల్పిన మా ‘సంప్రదాయం’ కూచిపూడి గురుకులం ట్రస్ట్లో నా వద్ద ఎనిమిదేళ్ళుగా శిక్షణ పొందిన యువ శిష్య బృందంతోనే ఈ డ్యాన్స్ బ్యాలేను ప్రదర్శించాం” అని స్వాతి వివరించారు.మద్రాసుకు నాటి ‘కళాక్షేత్ర’... మనకు నేటి ‘సంప్రదాయం’దక్షిణాదిన వివిధ రాష్ట్రాల్లో సంప్రదాయ లలిత కళా శిక్షణకు విశిష్ట కేంద్రాలున్నాయి. మన తెలుగు నాట అలాంటివి కొంత అరుదే. అయితే, తమిళనాట మద్రాసు (నేటి చెన్నై)లోని రుక్మిణీ అరండేల్ ‘కళాక్షేత్ర’, కేరళలోని ‘కళామండలం’ లాగా కొన్నేళ్ళ క్రితం ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న అపురూప లలితకళా కేంద్రం ‘సంప్రదాయం’. శ్రీకాకుళంలోని కళ్ళేపల్లి గ్రామం వద్ద బంగాళాఖాతానికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో, 12 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఉంటుందీ గురుకుల శిక్షణ సంస్థ. ప్రపంచంలో గురుకుల పద్ధతిలో కొనసాగుతున్న ఏకైక కూచిపూడి నృత్య శిక్షణ కేంద్రం ఇది. జిల్లా కలెక్టరే చైర్మన్గా, తిరుమల తిరుపతి దేవస్థానమ్ కార్యనిర్వహణాధికారి సహా పలువురు ట్రస్టీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. 2015 నుంచి సాగుతున్న ఈ యజ్ఞంలో భాగంగా శిక్షణ పొందిన తొలి బ్యాచ్ విద్యార్థినీ విద్యార్థులే ఇప్పుడీ ‘అర్ధనారీశ్వరమ్’ రూపకాన్ని ప్రదర్శించారు. వారంతా అరకు, సీతంపేట సహా చుట్టుపక్కలి ప్రాంతాల్లో ఉండే గిరిజన, వెనుకబడిన వర్గాలకు చెందిన బాలబాలికలే. దిగువ మధ్యతరగతికి చెందిన తల్లితండ్రులు ఎంతో నమ్మకంతో అప్పగించిన ఆ పిల్లల్ని చాలీచాలని నిధులు, పేరుకుపోయిన బకాయిల మధ్యనే ఆ కేంద్రం అద్భుతంగా తీర్చిదిద్దింది. సామాన్య స్థాయి నుంచి వచ్చి మెరికల్లా తయారైన ఆ పిల్లలు ఇప్పుడు కూచిపూడిలో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలిచ్చే స్థాయికి ఎదిగారు.ఆలుమగలను ఆనందతీరాలు చేర్చే సూత్రాలుఉత్తరాంధ్ర నుంచి వచ్చిన ఆ యువ కళాకారులు తాజాగా హైదరాబాద్లో సోమవారం చూపిన నృత్య కౌశల ప్రదర్శనే అందుకు సజీవ సాక్ష్యం. పెద్ద సంఖ్యలో ప్రేక్షకులతో నిండిన రవీంద్రభారతి ప్రాంగణం ఈ యువ కళాకారుల ‘అర్ధనారీశ్వరమ్’ ప్రదర్శనను ఆద్యంతం కరతాళ ధ్వనులతో అభినందించింది. “దాంపత్య ధర్మ నిర్దేశనం కామసూత్ర కథనం” అని పేర్కొంటూ, “ఇహమందు మోక్షమునిచ్చే సూత్రము... కామసూత్రమ”ని ఈ రూపకం ద్వారా రచయిత – నృత్య దర్శకులు ఢంకా బజాయించారు. “అధోగతికి చేర్చు వ్యామోహం ఇదే కదా” అంటూ వాత్స్యాయన మహర్షితో రాజు విభేదించి, కామశాస్త్ర అవసరమేమిటని సంవాదించినట్టుగా ఈ రూపకాన్ని మొదలుపెట్టారు. ధర్మం తప్పి కామంతో చరించిన రావణాసురుడు, కీచకుడు లాంటివారికి పట్టిన దుర్గతిని కళ్ళకు కడుతూ, సాక్షాత్తూ జగద్గురు ఆదిశంకరులు సైతం ఆధ్యాత్మిక జ్ఞానంలో ఓ భాగంగా కామాన్ని గుర్తించిన తీరును బ్యాలేలో ప్రస్తావించారు. “ఏమిది మైకము... ఏమిది తమకము... ఏదో తెలియని వ్యామోహము” అంటూ తృతీయ పురుషార్థ ప్రతిపాదన చేశారు. ఈ ధర్మార్థానంతర పురుషార్థ సాధనలో “ఆలుమగలను ఆనంద తీరాలు చేర్చే సూత్రాలు” కామసూత్రాలు అన్నది నిర్ద్వంద్వంగా స్పష్టం చేశారు. సమయ, సందర్భోచితంగా ‘భర్తృహరి శృంగార శతకం’లోని అంశాలను సైతం రూపకంలో చేర్చారు.“చంద్రహారాలు... ప్రేమ కలాపపు ప్రియచిహ్నాలు... మగని తలపించు తీయని గురుతులు”గా నఖ క్షతాలు, అలాగే దంత క్షతాలు, ఆలింగనాలు, సంయోగ భంగిమలను యువ కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారు. ‘ఉత్సాహానికి ఉత్పలకం’, ‘విశృంఖలతకు విజృంభితకం’, ‘ఇష్టరాగమునకు ఇంద్రాణికం’ తదితర సంక్లిష్టమైన సంభోగ బంధనాలను అంతే సమర్థంగా నర్తకులు చూపడం విశేషం. ఎక్కడా అసభ్యత, అశ్లీలం అనిపించకుండా ఇలాంటి సంక్లిష్టమైన అంశాలను ప్రేక్షకుల ముందుకు తేవడం కత్తి మీద సామే! దాన్ని ఓ సవాలుగా తీసుకొని, సంప్రదాయ శైలి నృత్య ముద్రలు, దరువులతో... నృత్య సంయోజనం చేయడంలో నాట్యాచారిణిగా స్వాతి తన అసమాన ప్రతిభ కనబరిచారు. అందరినీ మంత్రముగ్ధులను చేశారు. వాత్స్యాయనుడిగా రవితేజ, రాజుగా – శివుడిగా మెహర్ ప్రభాకర్, పార్వతిగా దూసి వైష్ణవి, సూత్రధారిణులుగా హేమాంజలి, శ్రుతి కొంజర్ల, గీతిక, యశస్విని, కవలలైన అక్కాచెల్లెళ్ళు భానుశ్రీ – భవ్యశ్రీ, తదితరులు ఉత్తమ ప్రదర్శన అందించారు.ఒక హీరో... ఇద్దరు హీరోయిన్లు... అద్భుత సమన్వయంముఖ్యంగా కథానాయకుడిగా అరకు ప్రాంతానికి చెందిన గిరిజన యువకుడు కొర్రా బలరామ్ అలుపూ సొలుపూ లేకుండా గంటన్నర పైగా ఈ అపురూప నాట్యవిన్యాసాలను అద్భుతంగా ప్రదర్శించారు. ఈ రూపకానికి మూలస్తంభంగా నిలిచారు. ఇంగ్లీషులో సాగిన నేపథ్య వ్యాఖ్యానం, రూపకంలో అడుగడుగునా సందర్భోచిత వాద్య సంగీతం, గాత్ర మాధుర్యం, వేణునాదం సహా పలు వాద్య పరికరాల వినియోగం... ప్రదర్శనను ఆసక్తిగా మలిచి, ఆహ్లాదభరితం చేశాయి.చదవండి: మనకు తెలియని మన భీముడి కోణంలో భారతం“సిగ్గే సుదతికి సింగారం... అది చెలికానికి ఆకర్షణం” అనే అంశంలో తొలి కథానాయికగా సీతంపేటకి చెందిన నిమ్మల అంజలి ముద్దరాలి సిగ్గును అభినయించిన తీరు ఆకట్టుకుంది. నాయికను ప్రేరేపించే సఖిగా లిఖిత అభినయం అంశానికి నిండుదనం తెచ్చింది. ఇక, ఈ రూపకంలో ద్వితీయ కథానాయికగా చేరడేసి కళ్ళు, చెరగని చిరునగవు మోముతో, అణువణువునా అభినయం నింపుకొని నర్తించిన యామినీ కసిరెడ్డి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి తీరాలి. నృత్యపరిశోధనకు పీహెచ్డీ ప్రవేశ పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానంలో నిలిచి, కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ఫెలోషిప్ పొందిన యామిని రానున్న రోజుల్లో నర్తకిగా మరింత రాణించడం ఖాయం.ఆద్యంతం లోపరహితంగా, అత్యంత సమన్వయంతో, అతి ప్రసన్న వదనంతో సాగిన ఈ నాయకా, నాయికల ముగ్గురి ప్రదర్శన నిస్సందేహంగా వారి పట్టుదల, కఠోరశ్రమ, నిత్యం గంటలకొద్దీ వారు చేసిన నిరంతర సాధన ఫలితమే. గూఢకమ్, బిందుమాల, ప్రవాళమణి, మణిమాల లాంటి పలు వాత్స్యాయన ప్రయోగాల ప్రదర్శన చూసి, ప్రేక్షకులు అచ్చెరువొందారంటే అతిశయోక్తి కాదు. నాట్య బృందమంతా కేవలం వేదికపై నటిస్తున్నట్టు కాకుండా, ఆ పాత్రలు తామే అయినట్టుగా ఇహం మరిచి ఆ క్షణంలో జీవించి, రససిద్ధి కలిగించడం ఈ ప్రదర్శనకు పంచప్రాణాలైంది. ఇలా ఈ శిష్యులందరినీ తీర్చిదిద్దడానికి సమస్త శక్తియుక్తులూ ధారపోసిన స్వాతీ సోమనాథ్ అంకితభావానికి పదే పదే వినిపించిన సభికుల హర్షధ్వానాలు తరగని కితాబులుగా నిలిచాయి.దాదాపు పాతికేళ్ళ క్రితమే... స్వాతి సంచలన ప్రయోగంఒకప్పుడు 1980లో రవీంద్రభారతి వేదికపైనే అరంగేట్రం చేసి, 2003లో తాను స్వయంగా అదే వేదికపై ‘కామసూత్ర’ డ్యాన్స్ బ్యాలే ప్రదర్శనతో సంచలనం రేపి, మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు తన శిష్యులతో దాన్నే ‘అర్ధనారీశ్వరమ్’గా అందించిన కళాకారిణి స్వాతీ సోమనాథ్కు ఇది అక్షరాలా ఓ ప్రత్యేకమైన సందర్భం. జీవితంలో మరపురాని అపురూప జ్ఞాపకం. “ఈ పిల్లల కౌశలం వెనుక ఎనిమిదేళ్ళ నిరంతర కృషి, సుదీర్ఘ సాధన దీని వెనక ఉంది. నిజానికి, ఈ ‘సంప్రదాయం’ ఏర్పాటుకు ముందు స్వాతి వేరు. తరువాతి స్వాతి వేరు. నా జీవితమే మొత్తం మారిపోయింది. పన్నెండేళ్ళుగా శ్రీకాకుళానికే పరిమితయ్యాను. అపరిమిత అవకాశాలకు కేంద్రమైన హైదరాబాద్ నగరాన్నీ, కుటుంబాన్నీ వదిలి శ్రీకాకుళానికి వెళ్ళి పనిచేయడం కష్టమే. ‘సంప్రదాయం’ ట్రస్ట్ వ్యవస్థాపనకు ప్రభుత్వ కృషిలో భాగమై, నాట్యగురువుగా అక్కడ జీతానికి పనిచేస్తున్నఇన్నేళ్ళుగా ఎన్నో అవస్థలు పడ్డాను. వ్యక్తిగతంగా మరెన్నో త్యాగాలూ చేశాను. కానీ, ఇవాళ అద్భుతంగా తయారై, నాట్యంలో పీహెచ్డీ చేసే స్థాయికి ఎదిగిన ఈ నవతరం పిల్లల్ని చూసినప్పుడు ఆ కష్టాలన్నీ మర్చిపోతుంటాను. కళాజీవితంలో నా కృషికి అర్థం, పరమార్థం సిద్ధించినట్టు భావిస్తుంటాను” అని నీళ్ళు నిండిన కళ్ళను అదుపు చేసుకుంటూ స్వాతీ సోమనాథ్ వ్యాఖ్యానించారు.అభివృద్ధిలో వెనుక.. అసమాన ప్రతిభలో ముందు... అర్ధనారీశ్వర స్తోత్రంతో నర్తకీ నర్తకులు ప్రస్తుతించగా, శివపార్వతుల కేళీ విలాసంతో ముగిసిన తాజా ‘అర్ధనారీశ్వరమ్’ నృత్యరూపక ప్రదర్శనను తిలకించేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని వివిధ ప్రాంతాలతో పాటు బెంగళూరు, ఢిల్లీ నుంచి కూడా ప్రేక్షకులు రావడం ప్రత్యేకించి గమనార్హం. ముఖ్య అతిథిగా హాజరైన ‘భారత్ బయోటెక్’ మేనేజింగ్ డైరెక్టర్ ‘పద్మభూషణ్’ సుచిత్రా ఎల్లా, తదితర ప్రముఖులు కళాకారులను అభినందించారు. తమిళనాట నైవేలిలో పుట్టి పెరిగి, మద్రాసులో చదువుకున్న తనకు బాల్యం నుంచి సంగీతం, నాట్యం తదితర లలితకళలతో ఉన్న అనుబంధాన్ని సుచిత్ర పంచుకున్నారు. “మా ఊరికి కేవలం గంట ప్రయాణంలో చిదంబరం పట్టణం, ప్రపంచానికి కేంద్రబిందువుగా భావించే చిదంబరం నటరాజస్వామి ఆలయం ఉంటాయి. ఇప్పటికీ ఆ ప్రాంతానికి వెళితే చిదంబరం దర్శిస్తుంటాను” అని ఆమె తెలిపారు. ఇలాంటి నృత్యరూపక ప్రదర్శనలు ప్రాచీన భారతీయ విజ్ఞానం, సంస్కృతి ఘనతను ప్రపంచానికి చాటతాయని అభిప్రాయపడ్డారు.ఇక, స్వాతి సమకాలికురాలు – కూచిపూడి శిక్షణలో ఒకప్పటి సహాధ్యాయి అయిన యశోదా ఠాకూర్, “పదం, జావళీలతో దేవదాసీ నృత్యం ద్వారా స్వయంగా శృంగార రసాభినయాన్ని విద్యార్థులకు బోధిస్తున్న నేను స్వాతికి వీరాభిమానిని. సాహసించి, ఎన్నో ప్రయోగాలు చేసే ఆమె నాకు అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ నిత్యస్ఫూర్తి” అని అభినందించారు. “ఆద్యంతం కళ్ళకూ, చెవులకూ విందు”గా బి.పి. రావు అభివర్ణించిన ఈ రూపకానికి మూలస్తంభాలుగా నిలిచిన వారంతా శ్రీకాకుళం ప్రాంత వాసులే కావడం విశేషం. స్వయానా శ్రీకాకుళం ప్రాంతమే పురిటిగడ్డ అయిన స్వాతీ సోమనాథ్తో పాటు ఆమె శిష్యబృందం, బ్యాలే ప్రదర్శనకు లైటింగ్, కాస్ట్యూమ్స్, సంగీతం అందించిన అందరూ ఆ ప్రాంతానికి చెందినవారే. అభివృద్ధిలోనే తప్ప అసమాన ప్రతిభలో ఉత్తరాంధ్ర వెనుకబడలేదనడానికి ఇది నిదర్శనమని అతిథులు అభిప్రాయపడ్డారు.కూచిపుడి నాట్యచరిత్రలో కొత్త అధ్యాయంస్వాతీ సోమనాథ్ తొలి గురువైన భాగవతుల రామకోటయ్య కుమారుడూ – కూచిపూడి సంప్రదాయంలోనే పుట్టి పెరిగి, స్వయంగా నాట్యాచార్యుడైన భాగవతుల సేతురామ్ అన్నట్టు, “కూచిపూడి నాట్యచరిత్రలో ఇది ఓ కొత్త అధ్యాయం”. సాహిత్యం, సంగీతం, నృత్యసంయోజనం త్రివేణీ సంగమమై, వేదికను రసప్లావితం చేసిన అరుదైన ఘట్టం. అదీ ఎక్కడో మారుమూల ఉత్తరాంధ్ర నుంచి, వెనుకబడిన ప్రాంతంగా భావించే చోట నుంచి, వెనుకబడిన గిరిజన వర్గాల నుంచి ఇలాంటి అపురూప ప్రతిభావంతులైన యువ కళాకారులు పైకి రావడం అపూర్వం. సముద్రపుటొడ్డున శాంతినికేతనంలా ఉండే ‘సంప్రదాయం’ కూచిపూడి గురుకుల ట్రస్ట్ చేసిన ఓ అద్భుతం. ఇలాంటి ప్రతిభా సుమాలు మరిన్ని పల్లవించాలంటే, ఆర్థికంగా ఇప్పటికీ అస్తుబిస్తుగా ఉన్న ‘సంప్రదాయం’కి ప్రభుత్వంతో పాటు కళాభిమానులు, దాతలు కాపుగా నిలవాలి. ‘అర్ధనారీశ్వరమ్’ లాంటి ప్రదర్శనలు ఊరూరా, ఇంకా చెప్పాలంటే ప్రపంచమంతటా అన్ని దేశాల్లో ప్రదర్శించాలి. సుచిత్రా ఎల్లా తదితరులు పేర్కొన్నట్టు, ‘మన తెలుగువారి కూచిపూడి ఘనతనూ, మన భారతీయ కళా, సాంస్కృతిక ప్రాభవాన్నీ ప్రపంచానికి చాటడానికి’ అదే సరైన మార్గం!- రెంటాల జయదేవ -
IPL 2026: కేకేఆర్పై సీఎస్కే విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్కింగ్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో సీఎస్కే 32 పరుగుల తేడాతో గెలుపొందింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. రమన్దీప్ సింగ్ (35) టాప్ స్కోరర్గా నిలిచాడు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్ 3 వికెట్లు తీయగా, అన్షుల్ కంబోజ్ 2 వికెట్లు పడగొట్టాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు సాధించింది. సీఎస్కేతో మ్యాచ్లో కేకేఆర్ కష్టాల్లో పడింది. నూర్ అహ్మద్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో కేకేఆర్ 85 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. తొలుత రహానే (28)ను బుట్టలో వేసుకున్న నూర్ మరుసటి బంతికి కామెరున్ గ్రీన్ను గోల్డెన్ డక్గా పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం కేకేఆర్ 12 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. రింకూ సింగ్ (5), పావెల్ (2) క్రీజులో ఉన్నారు.అంతకముందు కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 27 పరుగులు చేసిన అంగ్క్రిష్ రఘువంశీ అకిల్ హొసేన్ బౌలింగ్లో డెవాల్డ్ బ్రెవిస్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సునీల్ నరైన్ (24) రూపంలో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో షాట్కు యత్నించిన నరైన్ స్లిప్లో గుర్జన్పీత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ 6 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది.ఫిన్ అలెన్ ఔట్..193 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. అన్షుల్ కంబోజ్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించిన కేకేఆర్ ఓపెనర్ ఫిన్ అలెన్ (1) శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.కేకేఆర్ టార్గెట్ 193 పరుగులుఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా చెన్నై సూపర్కింగ్స్ కేకేఆర్ ముంగిట 193 పరుగుల లక్ష్యాన్ని విధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. శాంసన్ (48) టాప్ స్కోరర్గా నిలవగా, డెవాల్డ్ బ్రెవిస్ (41), ఆయుశ్ మాత్రే (38) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో కార్తిక్ త్యాగి 2 వికెట్లు తీయగా, వైభవ్ అరోరా, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్లు తలా ఒక వికెట్ తీశారు.16 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే 3 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. డెవాల్డ్ బ్రెవిస్ (37), సర్ఫరాజ్ (23) క్రీజులో ఉన్నారు. అంతకముందు శాంసన్ కార్తిక్ త్యాగీ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు.సంజు క్లీన్ బౌల్డ్111 పరుగుల వద్ద సీఎస్కే మూడో వికెట్ కోల్పోయింది. 11.2 ఓవర్లో కార్తిక్ త్యాగీ బౌలింగ్లో సంజు శాంసన్ క్లీన్ బ్లౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం సీఎస్కే స్కోరు 13 ఓవర్లకు 128 పరుగులు చేసి 3 వికెట్లను కోల్పోయింది. రెండో వికెట్ డౌన్కేకేఆర్తో మ్యాచ్లో సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. 38 పరుగులు చేసిన ఆయుశ్ మాత్రే వైభవ్ అరోరా బౌలింగ్లో వెనుదిరిగాడు. 6 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. శాంసన్ (23 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.రుతురాజ్ (7) ఔట్..కేకేఆర్తో జరుగుతున్న మ్యాచ్లో సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. ఫామ్లేమితో సతమతమవుతున్న కెప్టెన్ రుతురాజ్ (7) మరోసారి నిరాశపరుస్తూ అనుకుల్రాయ్ బౌలింగ్లో రోవ్మెన్ పావెల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్కే 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 31 పరుగులు చేసింది.టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. కేకేఆర్ ఈ మ్యాచ్కు ఒక మార్పుతో బరిలోకి దిగింది. నవదీప్ సైనీ స్థానంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి జట్టులోకి వచ్చాడు. సీఎస్కే మాత్రం ఎలాంటి మార్పు లేకుండా బరిలోకి దిగుతోంది.ముఖాముఖి పోరులో ఇరుజట్లు ఇప్పటివరకు 31 సార్లు తలపడగా సీఎస్కే 20 సార్లు, కేకేఆర్ 11 సార్లు విజయం సాధించాయి. 2022 నుంచి చూసుకుంటే ఈ రెండు జట్లు చెరో మూడు మ్యాచ్లు నెగ్గాయి.చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు: సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, ఖలీల్ అహ్మద్.కోల్కతా నైట్ రైడర్స్ తుది జట్టు: అజింక్యా రహానే(కెప్టెన్), కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ(వికెట్కీపర్), రోవ్మన్ పావెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, వరుణ్ చకరవర్తి, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి. -
భారత్ విద్యార్థిని.. ఆమె కోసం ఆరేళ్లుగా అమెరికా ఎందుకు వెతుకుతోంది?
వాషింగ్టన్: అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్బీఐ) . ఇప్పుడీ ఎఫ్బీఐకి భారతీయ విద్యార్థిని మయూషీ భగత్ కోసం ఆరేళ్లుగా అన్వేషిస్తుంది. అయినా ఆమె ఆచూకీ లభ్యం కాకపోవడంతో ప్రజల సాయం కోరుతూ ట్వీట్ చేసింది. మయూషీ భగత్ ఆచూకీ తెలపాలని, అందుకు బహుమానంగా 10వేల డాలర్లు బహుమతి ఇస్తామని ట్వీట్ చేసింది.అంతేకాదు, ఆమె ఆచూకీ ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా ఉంచుతున్న వారిని గుర్తించి కఠిన శిక్ష విధిస్తామని స్పష్టం చేసింది. గుజారాత్ వడోదరాకు చెందిన ఆయూషీ ఉన్నత చదువుల కోసం ఎఫ్-1 స్టూడెంట్ వీసా ద్వారా 2016లో అమెరికాకు వెళ్లింది. న్యూ హాంప్షైర్ యూనివర్సిటీలో చేరింది. ఆ తర్వాత న్యూయార్క్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి ట్రాన్స్ఫర్ చేయించుకుంది. ఆ సమయంలో నూజెర్సీలో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది.ఈ క్రమంలో ఏప్రిల్ 29,2019న ఆమె ఆచూకీ గల్లంతయ్యింది. ఆ తర్వాత ఆచూకీ కోసం ఆమె తల్లిదండ్రులు ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన కొన్ని గంటల వ్యవధిలో మయూషీ తండ్రి వాట్సప్ నెంబర్కు ఓ మెసేజ్ వచ్చింది. అందులో మే 3వరకు ఇంటికి రాదని,ఆమె సురక్షితంగా ఉన్నారనేది ఆ మెసేజ్ సారాంశం. నాటి నుంచి మయూషి భగత్ ఆచూకీ కోసం ఎఫ్బీఐ గాలింపు చర్యలు చేపడుతూనే ఉంది. ఇప్పటికీ మయూషీ జాడ కోసం జల్లెడ పడుతూనే ఉంది. The #FBI offers a reward of up to $10,000 for info leading to the location or recovery of Mayushi Bhagat, and the identification, arrest, and conviction of those responsible. She was last seen in the evening hours of April 29, 2019, leaving her Jersey City, NJ apartment:… pic.twitter.com/CDt1WJjLhM— FBI (@FBI) April 13, 2026 -
వార్న్ మరణంపై కుమారుడి సంచలన వ్యాఖ్యలు!
ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. 2022లో థాయ్లాండ్లో 52 ఏళ్ల వార్న్ హార్ట్ ఎటాక్తో మరణించాడు. అయితే తాజాగా నాలుగేళ్ల తర్వాత వార్న్ మరణంపై అతడి కుమారుడు జాక్సన్ వార్న్ స్పందించాడు. కోవిడ్ వాక్సిన్ వల్లే తన తండ్రి చనిపోయినట్లు జాక్సన్ వెల్లడించాడు. ‘టూ వరల్డ్స్ కొలైడ్’ పాడ్కాస్ట్కు ఇంటర్య్వూ ఇచ్చిన జాక్సన్ వార్న్ మాట్లాడుతూ.. ‘నాన్నకు నాలుగు కొవిడ్ టీకాలు ఇవ్వాల్సి వచ్చింది. అవి తీసుకోవడం ఆయనకు ఎంతమాత్రం ఇష్టం లేదు. కానీ అత్యవసర పరిస్థితుల్లో టీకాలు వేపించుకున్నారు. కొవిడ్ వ్యాక్సిన్ వల్లే ఆయన మరణించారేమో అని ఇప్పుడు అనిపిస్తోంది. ఆ వ్యాక్సిన్ ప్రభావం నాన్న ఆరోగ్యంపై పడింది. అయితే ఆయనకు అంతర్గతంగా కూడా అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఆయన మద్యం తాగేవారు, స్మోకింగ్ అలవాటు కూడా ఉంది. అవే అలవాట్లు ఉన్న చాలామంది ఇంకా ఎక్కువ కాలం జీవిస్తున్నారు. ఆ సమయంలో నాన్న ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నారు. కానీ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాతే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించారు. నాన్న మరణ వార్త విన్న తర్వాత ప్రభుత్వం, కొవిడ్ పరిస్థితులపై కోపం వచ్చింది’ అని జాక్సన్ వార్న్ తెలిపారు. అయితే వార్న్ చనిపోవడానికి ముందు 2021లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన హండ్రెడ్ టోర్నీలో కోవిడ్ బారిన పడ్డాడు. అయితే వార్న్ మరణించిన సమయంలో ఆయనకు ఎలాంటి అనారోగ్యం బారిన పడినట్లు రిపోర్ట్లో తేలడం అప్ప ట్లో ఆసక్తిగా మారింది.2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తొలి ఎడిషన్ను షేన్ వార్న్ నేతృత్వంలోని రాజస్తాన్ రాయల్స్ నెగ్గిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో వార్న్ 55 మ్యాచ్లాడి 57 వికెట్లు పడగొట్టాడు.చదవండి: ‘సోకులకే ఉన్నాడు తప్ప ఆడింది ఏమీ లేదు’ -
SRHకు అదిరిపోయే శుభవార్త
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు శుభవార్త. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ త్వరలోనే జట్టుతో చేరనున్నట్లు సమాచారం. కాగా వెన్నునొప్పి కారణంగా ఈ పేస్ బౌలర్ చాలాకాలంగా ఆటకు దూరమైన సంగతి తెలిసిందే.ఆస్ట్రేలియా కెప్టెన్గా ఇంగ్లండ్తో యాషెస్ సిరీస్లో జట్టును ముందుకు నడిపించాల్సిన కమిన్స్ (Pat Cummins).. ఫిట్నెస్ సమస్యల వల్ల ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. ఆ తర్వాత పూర్తిగా ఆటకు దూరమైపోయాడు. టీ20 ప్రపంచకప్-2026లో అతడు లేకుండానే బరిలోకి దిగిన ఆసీస్.. గ్రూప్ దశలోనే ఇంటిబాట పట్టి అవమానం పాలైంది.కమిన్స్ లేని లోటు సుస్పష్టంమరోవైపు.. సన్రైజర్స్ జట్టులో సైతం కమిన్స్ లేనిలోటు స్పష్టంగా కనిపిస్తోంది. కెప్టెన్, ప్రధాన పేసర్గా అతడు సేవలు అందిస్తాడన్న సంగతి తెలిసిందే. అయితే, ఐపీఎల్-2026లో కమిన్స్ గైర్హాజరీలో ఇప్పటికి ఐదు మ్యాచ్లు ఆడిన ఎస్ఆర్హెచ్ కేవలం రెండు మాత్రమే గెలిచింది.గెలుపు బాట తొలుత కోల్కతా నైట్ రైడర్స్పై గెలిచిన ఇషాన్ కిషన్ బృందం.. తాజాగా రాజస్తాన్ రాయల్స్పై సోమవారం జయభేరి మోగించింది. సొంతమైదానం ఉప్పల్లో రాయల్స్ను 57 పరుగుల తేడాతో చిత్తు చేసి గెలుపు బాట పట్టింది. ఇలాంటి తరుణంలో కమిన్స్కు సంబంధించిన అప్డేట్ అందడం ఎస్ఆర్హెచ్ శిబిరంలో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.ఆరోజే హైదరాబాద్కుక్రిక్బజ్ కథనం ప్రకారం.. కమిన్స్ బుధవారం (ఏప్రిల్ 15) ఆస్ట్రేలియాలో ఫిట్నెస్ టెస్టుకు హాజరుకానున్నాడు. పరీక్షలో పాసైతే గనుక ఏప్రిల్ 17 నాటికి అతడు హైదరాబాద్కు చేరుకుంటాడు. ఈ విషయం గురించి జట్టు సన్నిహిత వర్గాలు మాట్లాడుతూ.. ‘‘అతడు ఫిట్నెస్ టెస్టు క్లియర్ చేసి త్వరలోనే క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి నిరభ్యంతర పత్రం (NOC) పొందుతాడని ఆశిస్తున్నాం’’ అని తెలిపాయి. కాగా కమిన్స్ స్థానంలో టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ సన్రైజర్స్ను ముందుకు నడిపిస్తున్న సంగతి తెలిసిందే.చదవండి: SRH: షూ కోసం తల్లి నగలు అమ్మి.. ఎవరీ సాకిబ్ హుస్సేన్?BCCI: సూర్యకుమార్ యాదవ్పై వేటు! -
లుక్ మార్చిన మెగా కోడలు.. నల్ల చీరలో మృణాల్
చీరలో కాదు గ్లామరస్ లుక్స్లో లావణ్య త్రిపాఠితమిళ న్యూఇయర్.. అమృత అయ్యర్ వీడియోరాజస్థాన్ ట్రిప్లో రుక్మిణి వసంత్ హ్యాపీస్నల్ల చీరలో నవ్వుతూ మాయ చేస్తున్న మృణాల్కొంటె చూపులతో రచ్చ చేస్తున్న డింపుల్మత్తెక్కించేలా శ్రీముఖి పోజులు.. చూస్తూ అలా View this post on Instagram A post shared by Dimple Hyati (@dimplehayathi) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Vimala Raman (@vimraman) View this post on Instagram A post shared by Aparna Das💃🏻 (@aparna.das1) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Lavanya konidela Tripathi (@itsmelavanya) -
ప్రధాని మోదీకి సీఎం రేవంత్ బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: డీలిమిటేషన్పై ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. లోక్సభ సీట్ల పెంపుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లేఖలో మూడు అంశాలను రేవంత్రెడ్డి ప్రస్తావించారు. మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ను సీట్ల పెంపుతో కలపడం సరికాదన్న రేవంత్.. జనాభా ఆధారంగా సీట్లు పెంచితే దక్షిణాదికి నష్టం అన్నారు.ఆర్థిక, అభివృద్ధి ప్రమాణాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని రేవంత్ సూచించారు. హైబ్రిడ్ మోడల్ను అనుసరించాలన్నారు. అన్ని పార్టీలతో చర్చలు జరపాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. దేశ ఐక్యతకు న్యాయమైన ప్రతినిధిత్వం కీలకమన్న రేవంత్.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు పూర్తి మద్దతు ఇస్తామని చెప్పారు. ప్రస్తుత 543 సీట్లతోనే మహిళా రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్, సీట్ల పెంపు మూడు వేర్వేరు అంశాలు. డిలిమిటేషన్ను సీట్ల పెంపుతో కలపడం సరైంది కాదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.జనాభా ఆధారంగా సీట్లు పెంచితే దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని.. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలు నష్టపోతాయని రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తర రాష్ట్రాలకు అధిక రాజకీయ శక్తి వెళ్తుంది. దక్షిణ రాష్ట్రాల వాణి పార్లమెంట్లో తగ్గే ప్రమాదం ఉంది. ఆర్థికంగా ఎక్కువగా దేశానికి తోడ్పడుతున్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది. హైబ్రిడ్ మోడల్ ద్వారా సమతౌల్యం సాధించవచ్చు. సీట్లలో సగం జనాభా ఆధారంగా, మిగతా సగం ఆర్థిక ప్రమాణాల ఆధారంగా ఇవ్వాలి. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలతో చర్చలు జరపాలి. న్యాయం, సమాన ప్రతినిధిత్వం లేకపోతే దేశ ఐక్యత దెబ్బతింటుంది’’ అని సీఎం రేవంత్ లేఖలో పేర్కొన్నారు.తమిళనాడు సీఎంకు లేఖ: తమిళనాడు సీఎంకు కూడా రేవంత్రెడ్డి లేఖ రాశారు. లోక్సభ సీట్లను ప్రోరాటా పద్ధతిలో పెంచే ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాలు దీనికి వ్యతిరేకంగా నిలబడాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్కు లేఖ రాశారు సీఎం. మహిళల రిజర్వేషన్, డిలిమిటేషన్, లోక్సభ సీట్ల పెంపు అనే మూడు వేర్వేరు అంశాలను కలిపి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు.లోక్సభ సీట్లను 543 నుంచి 850కు పెంచి ప్రోరాటా పద్ధతిలో పంచితే దక్షిణ రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గిపోతుందని అప్రమత్తం చేశారు. దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకునే రాష్ట్రాలు నష్టపోతూ, జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు లాభపడే పరిస్థితి వస్తుందని అన్నారు. అందుకే అన్ని రాష్ట్రాలకు న్యాయం జరిగేలా హైబ్రిడ్ మోడల్ను పరిశీలించాలని, ఈ అంశంపై రాష్ట్రాలు ఐక్యంగా ముందుకు రావాలని ఆయన కోరారు. -
దురంధర్ ఫ్రాంచైజీ.. ఏ ఇండియన్ సినిమాకు సాధ్యం కాని రికార్డ్..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. మార్చి 19న రిలీజైన ఈ సీక్వెల్ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. గతేడాది విడుదలైన దురంధర్కు కొనసాగింపుగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా రిలీజైన 26 రోజుల్లోనే అరుదైన ఘనత సాధించింది. రెండు పార్ట్లు కలిపి రూ.3 వేల కోట్లు సాధించిన మొదటి చిత్రంగా అరుదైన రికార్డ్ సృష్టించింది.ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1712 కోట్లకు పైగా వసూళ్లతో ఇంకా రాణిస్తోంది. ఆదిత్య ధర్ డైరెక్షన్లో వచ్చిన దురంధర్ చిత్రాలు కలెక్షన్స్ రికార్డ్ సృష్టించాయి. ఈ రెండు సినిమాలు కలిపి బాహుబలి-2, పుష్ప-2 ఆల్టైమ్ కలెక్షన్స్ను దాటేశాయి. దురంధర్, దురంధర్-2 కలిపి బాక్సాఫీస్ వద్ద రూ.3 వేల కోట్ల మార్క్ సాధించాయి.గతేడాది డిసెంబర్ 5న విడుదలైన దురంధర్ ప్రపంచవ్యాప్తంగా రూ.1,307.35 కోట్లు రాబట్టింది. ఈ ఏడాది మార్చి 19న రిలీజైన దురంధర్ ది రివెంజ్ కేవలం 26 రోజుల్లోనే రూ. 1,712 కోట్లు వసూలు చేసింది. ఈ రెండు చిత్రాల వసూళ్లను కలిపితే రూ. 3,019.35 కోట్లతో అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాయి.గతంలో వచ్చిన టాలీవుడ్ బాహుబలి, పుష్ప సిరీస్ చిత్రాల మొత్తం వసూళ్లను దురంధర్ ఫ్రాంచైజీ ఎప్పుడో దాటేసింది. బాహుబలి పార్ట్-1కు రూ.650 కోట్లు రాగా.. బాహుబలి 2: రూ. 1,788 కోట్లు రాగా.. ఈ రెండు సినిమాల కలెక్షన్స్ రూ. 2,438 కోట్లుగా ఉంది. ఇక అల్లు అర్జున్ పుష్ప చిత్రాల విషయానికొస్తే పార్ట్-1 రూ. 350.10 కోట్లు రాబట్టగా.. పుష్ప 2: ది రూల్ మూవీ రూ. 1,742.10 కోట్ల సాధించింది. ఈ రెండు సినిమాల మొత్తం రూ. 2,092.20 కోట్లు వచ్చాయి.ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా ఫ్రాంచైజీ ప్రపంచవ్యాప్తంగా రూ. 3,000 కోట్ల మార్క్ దాటలేదు. ఈ విషయంలో దురంధర్ ఫ్రాంచైజీ రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా 'ధురంధర్' సిరీస్లోని రెండు చిత్రాలు కూడా రూ. 1,000 కోట్ల క్లబ్లో చేరిన మొట్ట మొదటి ఇండియన్ ఫ్రాంచైజీగా నిలిచింది. మూడు నెలల గ్యాప్లోనే రిలీజైన రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించాయి. మూడు వేల కోట్ల మార్క్తో సరికొత్త ఒరవడికి నాంది పలికాయి. మార్చి 19న థియేటర్లలోకి వచ్చిన ధురంధర్: ది రివెంజ్' చిత్రం బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి రాణిస్తోంది. చైనా, గల్ఫ్ దేశాల్లాంటి అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల కాకుండానే ఈ గణాంకాలను సాధించడం దురంధర్కే సాధ్యమైంది. ఈ లెక్కన భారతీయ సినిమా ముఖ చిత్రాన్ని దురంధర్ మార్చేసింని చెప్పొచ్చు. సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన దురంధర్ పేరు బాక్సాఫీస్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. -
ఆ హీరోయిన్ ఇంటికొస్తే.. నా కొడుకు భయపడేవాడు: అక్షయ్ కుమార్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇప్పుడు తన కొత్త సినిమా ‘భూత్ బంగ్లా’ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు. మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో తన కొడుకు ఆరవ్ కుమార్ గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. భూల్ భులయ్య సినిమా చూసి..ఆరేళ్ల పాటు విద్యాబాలన్కి దూరంగా ఉన్నాడని..ఆమె ఇంటికి వస్తే భయపడిపోయేవాడని చెప్పాడు.మంజులిక అనుకొని.. 2007లో విడుదలైన భూల్ భులయ్య సినిమా నా కొడుకుపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ సినిమా చూసిన తర్వాత ఆరేళ్ల పాటు అందులో నటించిన విద్యాబాలన్ని చూసి భయపడిపోయాడు. ఆమె మా ఇంటికి వచ్చినప్పుడల్లా..భయంతో వణికిపోయేవాడు. ఆమె కళ్లల్లోకి చూసేవాడు కాదు. అతను ఆమెలో మంజులిక(భూల్ భులయ్యలో విద్యాబాలన్ పోషించిన పాత్ర పేరు) చూసేవాడు. అందుకే ఆమె వస్తుందంటే భయంతో పారిపోయేవాడు. నేనే అతన్ని ఓదార్చి.. ఆమె మంజులిక కాదని, విద్యాబాలన్ అని..మంచి అమ్మాయి అని చెప్పాల్సి వచ్చింది. అయినా కూడా ఆరేళ్ల పాటు నమ్మలేకపోయాడు’ అని అక్షయ్ అన్నారు.అదే తేడాభూత్ బంగ్లా, భూల్ భులయ్యా చిత్రాల మధ్య తేడాలను వివరిస్తూ.. 'భూత్ బంగ్లా' ఒక హారర్ ఫాంటసీ; ఇది ఒక డిస్నీ సినిమా లాంటిది. 'భూల్ భులయ్యా' ఒక సైకలాజికల్ థ్రిల్లర్. అది మొదలైనప్పుడు, ఆమె దెయ్యం పట్టినట్లు కనిపిస్తుంది, కానీ తర్వాత అది ఒక మానసిక సమస్య అని తెలుస్తుంది. 'భూత్ బంగ్లా'లో , వధుసూర్(రాక్షసుడు) ఎలా వచ్చాడో, అతను ఎందుకు అలా చేస్తున్నాడో మేము వివరించాం. ఈ సినిమా చూసి పిల్లలను కూడా ఎంజాయ్ చేస్తారు’ అని అక్షయ్ చెప్పుకొచ్చాడు. -
బీవైడీ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) దిగ్గజం బీవైడీ ప్రధాన కార్యాలయం ఉన్న షెన్జెన్ పారిశ్రామిక వాడలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పింగ్షాన్ జిల్లాలోని కంపెనీ ప్రాంగణంలో ఉన్న ఒక మల్టీస్టోర్ పార్కింగ్ గ్యారేజీలో ఈ మంటలు చెలరేగాయి. అయితే, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారిక వర్గాలు ధ్రువీకరించాయి.ప్రమాదం జరిగిన తీరుసోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఫుటేజీ ప్రకారం.. బహుళ అంతస్తుల భవనంలోని ఒక విభాగం నుంచి దట్టమైన పొగ ఆకాశాన్ని కమ్మేసింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంపై బీవైడీ ప్రతినిధి స్పందిస్తూ, ‘మంటలు చెలరేగిన ప్రాంతం కేవలం పరీక్షలు పూర్తి చేసుకున్న, స్క్రాప్ చేసిన (పాత) వాహనాల కోసం కేటాయించిన పార్కింగ్ గ్యారేజీ మాత్రమే’ అని వివరించారు.ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన అంశాలుసాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు చెలరేగితే అవి బ్యాటరీ లోపం వల్లేననే ఆందోళన వ్యక్తమవుతుంటుంది. కానీ, ఈ ఘటనపై స్థానిక అగ్నిమాపక శాఖ, బీవైడీ జరిపిన ప్రాథమిక దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఈ ప్రమాదానికి బ్యాటరీ సెల్ఫ్-ఇగ్నిషన్ (స్వయంగా మంటలు అంటుకోవడం) లేదా నాణ్యత లోపాలు కారణం కాదని దర్యాప్తులో తేలింది.గ్యారేజ్ ప్రాంతంలో జరిగిన అశాస్త్రీయ బాహ్య నిర్మాణ కార్యకలాపాల వల్ల మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు.ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వాహనాలకు లేదా ఉత్పత్తిలో ఉన్న కొత్త వాహనాలకు దీనితో ఎలాంటి సంబంధం లేదని కంపెనీ భరోసా ఇచ్చింది.WATCH: Massive fire breaks out at Chinese electric vehicle company BYD’s parking garage in Shenzhen, China pic.twitter.com/hPMm61hHgu— Insider Paper (@TheInsiderPaper) April 14, 2026ఈవీలో మంటలు.. నిపుణుల హెచ్చరికసాధారణ పెట్రోల్/డీజిల్ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలను ఆర్పడం సవాలుతో కూడుకుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈవీ బ్యాటరీల్లో మంటలు ఒకసారి ఆరిపోయినట్లు అనిపించినా అవి మళ్లీ మళ్లీ రాజేసుకునే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. అందుకే వీటిని ఆర్పేందుకు ఎక్కువ సమయం పడుతుందని రాయిటర్స్ నివేదిక పేర్కొంది.ఈ తాజా ప్రమాదం సాంకేతిక లోపం కాదని తేలినప్పటికీ గతంలో బీవైడీ కొన్ని భద్రతా సమస్యలను ఎదుర్కొంది. సెప్టెంబర్ 2024లో స్టీరింగ్ కంట్రోల్ యూనిట్లో తయారీ లోపం కారణంగా సుమారు 97,000 ‘డాల్ఫిన్, యువాన్ ప్లస్’ మోడళ్లను రీకాల్ చేసింది. జనవరి 2025లో అగ్ని ప్రమాద ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలతో 6,843 ‘బావో 5’ హైబ్రిడ్ ఎస్యూవీలను రీకాల్ చేసింది.ఇదీ చదవండి: ‘మధ్య తరగతి’ బండి సాగేదెలా? -
బాయిలర్ పేలుడు.. 9 మంది మృతి, 40 మందికి గాయాలు
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ సింగ్హితరాయ్లో వేదాంత పవర్ ప్లాంట్లో భారీ బాయిలర్ పేలుడు సంభవించి తొమ్మిది మంది మృతి చెందారు. మరో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సక్తి జిల్లాలోని సింగ్హితరాయ్ గ్రామం ఉంటుంది.పేలుడు తర్వాత కార్మికులు సురక్షిత ప్రదేశాలకు పరుగులు తీసే ప్రయత్నం చేయడంతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది . గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు కారణం ఏంటన్న విషయాన్ని అధికారికంగా నిర్ధారించలేదు.సక్తి జిల్లా ఎస్పీ ప్రఫుల్ ఠాకూర్ మాట్లాడుతూ.. “సక్తి జిల్లా సింగ్హితరాయ్ ప్రాంతంలోని వేదాంత పవర్ ప్లాంట్లో బాయిలర్ పేలుడులో 9 మంది మృతి చెందారు. గాయపడిన వారిని రాయగఢ్ ఆసుపత్రికి తరలించాం” అని అన్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఎమర్జెన్సీ టీమ్స్, స్థానిక పరిపాలన అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ప్రమాదం మధ్యాహ్నం 2 గంటలకు జరిగింది. పేలుడు సమయంలో కార్మికులు ప్లాంట్లోపల పని చేస్తున్నారు. అకస్మాత్తుగా జరిగిన పేలుడుతో అక్కడి ప్రాంతం మొత్తం భయాందోళనలు సృష్టించింది. ప్రాథమిక నివేదికల ప్రకారం బాయిలర్ లోపల ట్యూబ్ పగిలిపోవడం పేలుడుకు కారణంగా ఉండవచ్చని తెలుస్తోంది. పరిస్థితి ప్రస్తుతం నియంత్రణలో ఉందని అధికారులు తెలిపారు. పేలుడుకు సంబంధించి కచ్చిత కారణం తెలుసుకునేందుకు విచారణ చేపట్టనున్నారు. -
KKR పేసర్పై రెండేళ్ల నిషేధం
జింబాబ్వే క్రికెటర్ బ్లెస్సింగ్ ముజర్బానీపై నిషేధం పడింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ఆడకుండా పాక్ క్రికెట్ బోర్డు అతడిపై రెండేళ్ల నిషేధం విధించింది. చాలా మంది ఆటగాళ్ల మాదిరే ముజర్బానీ ఇటు ఐపీఎల్.. అటు పీఎస్ఎల్ వేలంలో తన పేరు నమోదు చేసుకున్నాడు.కానీ రెండు లీగ్లకు సంబంధించిన ఫ్రాంఛైజీలలో ఒక్కటి కూడా ముజర్బానీని కొనుగోలు చూసేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో అతడు అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. అదే సమయంలో టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో జింబాబ్వే అదరగొట్టింది.ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడుఏకంగా ఆస్ట్రేలియాను ఓడించి సూపర్-8లో అడుగుపెట్టింది. ఇందులో ముజర్బానీది కీలక పాత్ర. ఆసీస్తో మ్యాచ్లో నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 17 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు కూల్చాడు. ఈ నేపథ్యంలో పీఎస్ఎల్ ఫ్రాంఛైజీ ఇస్లామాబాద్ యునైటెడ్ షమార్ జోసెఫ్ స్థానంలో ముజర్బానీతో ఒప్పందం కుదుర్చుకుంది.అయితే, అనూహ్యంగా ముజర్బానీకి ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) నుంచి ఆఫర్ వచ్చింది. భారత్- బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ ఆదేశాల మేరకు కేకేఆర్ తమ జట్టు నుంచి బంగ్లా స్టార్ ముస్తాఫిజుర్ను తొలగించింది. అతడి స్థానంలో మరో ఫాస్ట్బౌలర్ ముజర్బానీని జట్టులో చేర్చుకోవాలని భావించింది.పీఎస్ఎల్ను వీడి ఐపీఎల్లోఇందుకు సమ్మతించిన ముజర్బానీ.. పీఎస్ఎల్ను వీడి ఐపీఎల్లో కేకేఆర్తో చేరాడు. దీంతో పాక్ బోర్డు అతడిపై చర్యలు చేపట్టింది. ‘‘ఫ్రాంఛైజీ ఆధారిత క్రికెట్ ఆడేవాళ్లు పారదర్శకత ప్రదర్శించాలి. ప్రొఫెషనల్గా వ్యవహరించాలి.ఒకేసారి రెండు జట్లతో ఒప్పందం చేసుకోవడం.. ఒక జట్టు కోసం మరో జట్టును వీడటం సరికాదు. ఇలాంటి ప్రవర్తనను చూసీచూడనట్లు వదిలివేయలేము. ఫ్రాంఛైజీల విశ్వసనీయత దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ రెండేళ్ల నిషేధం విధిస్తున్నాం’’ అని పీఎస్ఎల్ పేర్కొంది. కాగా ముజర్బానీతో పాటు దసున్ షనక, స్పెన్సర్ జాన్సన్ కూడా ఈ ఏడాది పీఎస్ఎల్ను వీడి ఐపీఎల్లో చేరిన సంగతి తెలిసిందే. వీరిపై కూడా నిషేధం పడే అవకాశం ఉంది.చదవండి: BCCI: సూర్యకుమార్ యాదవ్పై వేటు! -
ఫిట్నెస్పై ఇంత క్రేజా?!
పట్టణాల్లో, నగరాల్లో మారథాన్, అధిక ఫోర్స్తో చేసే వర్కౌట్లు వంటి ఫిట్నెస్ ఈవెంట్ల పట్ల ప్రజల ఆదరణ ఏ రేంజ్లో ఉందో తెలిస్తే షాకవ్వుతారు. వాటిపై పెడుతున్న ఖర్చులకు మాటలు రావ్. అందుకు ఉదాహరణ బెంగుళూరు ఫిట్నెస్ సెంటర్ ఈవెంటే. ఏం జరిగిందంటే..బెంగళూరులో హైరాక్స్ ఫిట్నెస్ ఈవెంట్ ధరలు చూస్తూ కళ్లు బైర్లుకమ్ముతాయ్. అందుకు సంబంధించిన పోస్ట్ని అంకిత్ కేడియా అనే యూజర్ సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ పోస్ట్ ప్రకారం..అక్కడ జరిగిన ఫిట్నెస్ ఈవెంట్లో దాదాపు తొమ్మిది వేల మంది దాక పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ రూ. 9 వేలు చొప్పున ప్రవేశ రుసుము చెల్లించారు. అంటే ఒక్క రోజుల్లోనే సుమారుగా రూ. 8.1 కోట్లు వచ్చాయ్. మారథాన్లో కూడా ఇదో ధోరణి కనిపిస్తోంది. కేవలం ఒక రోజు పరుగుతీయడానికే రూ. 3 వేలు నుంచి రూ. 5 వేలు ఛార్జ్ చేస్తున్నారంటూ తన పోస్ట్లో రాసుకొచ్చారు కేడియా. ఈ పోస్ట్ని చూసి నెటిజన్లు ఇదంతా ఫిట్నెస్ కోసం కాదని, కేవలం గుర్తింపు కోసం జరుగుతున్న ఆరాటం అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. ఫిట్నెస్ అనేది ఒకరోజు ప్రదర్శన కాదు, అది జీవితాంతం కొనసాగే ప్రయాణం అని అబివర్ణిస్తున్నారు కొందరు ఫిట్నెస్ ప్రియులు. HYROX fitness event in Bengaluru saw around 9,000 participants.They charged ₹9,000 per person to participate, which comes to roughly ₹8.1 crore made in a single day.Same trend is showing up in marathons. People are paying ₹3,000–₹5,000 just to run for a day.Being fit is…— Ankit Kedia (@Ankittskedia) April 13, 2026 (చదవండి: World Art Day: చిన్న పెన్సిల్ కూడా గొప్ప కథను చెప్పగలదు..!) -
సామాన్యుడిపై ధరల భారం తప్పదా?
పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ముఖ్యంగా ఇంధన సరఫరా వ్యవస్థలో తలెత్తిన ఆటంకాలు ముడి చమురు ధరలను ఆకాశానికి చేర్చుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర ఇటీవలే 110 డాలర్ల మార్కును తాకడం భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఆందోళన కలిగిస్తోంది.దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు లేకపోయినప్పటికీ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు(ఓఎంసీ) భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తుంటే రాష్ట్ర ఎన్నికల అనంతరం సామాన్యుడిపై ఇంధన ధరల భారం పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.కంపెనీల నెత్తిన నష్టాల భారంఅంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్పీసీఎల్) సంస్థలు ఏప్రిల్ 2022 నుంచి రిటైల్ ధరలను సవరించలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్పుట్ ఖర్చులు పెరగడం, విక్రయ ధరలు స్థిరంగా ఉండటంతో ఈ సంస్థలు భారీగా నష్టపోతున్నాయి. పెట్రోల్పై నష్టం లీటరుకు సుమారు రూ.18, డీజిల్పై నష్టం లీటరుకు సుమారు రూ.35గా ఉందని అంచనా. ఓఎంసీలకు ఒక దశలో రోజుకు రూ.2,400 కోట్లుగా ఉన్న ఈ నష్టం ఎక్సైజ్ సుంకం తగ్గింపు తర్వాత ప్రస్తుతం రూ.1,600 కోట్లకు చేరింది.మాక్వారీ నివేదిక విశ్లేషణప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ మాక్వారీ (Macquarie) తాజా నివేదిక ప్రకారం, చమురు కంపెనీల ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో వచ్చిన స్వల్ప లాభాలను మార్చి నెల నష్టాలు తుడిచిపెట్టేశాయి. ‘అంతర్జాతీయంగా స్పాట్ ధరలు బ్యారెల్కు 135 - 165 డాలర్ల మధ్య ఉన్న తరుణంలో భారత్లో విక్రయ ధరలు పెంచకపోవడం వల్ల జనవరి-మార్చి త్రైమాసికంలో కంపెనీలు భారీ నష్టాలను ప్రకటించే అవకాశం ఉంది’ అని తెలిపింది. అంతేకాకుండా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే అంటే ఏప్రిల్ నెలాఖరులోగా ఇంధన ధరలు పెరిగే ప్రమాదం ఉందని ఈ నివేదిక హెచ్చరించింది.దిగుమతులపై ఆధారపడటం ఒక సవాల్భారతదేశం తన ముడి చమురు అవసరాలలో 88% దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది (2025 గణాంకాల ప్రకారం). మధ్యప్రాచ్యం, రష్యా, అమెరికాల నుంచి మనం చమురును సేకరిస్తున్నాం. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ధర 10 డాలర్లు పెరిగితే, దేశీయంగా లీటరుపై రూ.6 నష్టం అదనంగా పెరుగుతుంది. ప్రస్తుత ధరల ప్రకారం చమురు కంపెనీలు మనుగడ సాగించాలంటే బ్యారెల్ ధర 80-85 డాలర్ల మధ్య ఉండాలి, కానీ ఇప్పుడు అది 120 డాలర్ల వద్ద ఉండటం ఆందోళనకరం.అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గని పక్షంలో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత చమురు ధరల పెంపు అనేది అనివార్యంగా కనిపిస్తోంది. ఇది రవాణా రంగంపై ప్రభావం చూపి, తద్వారా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగేలా చేసే ప్రమాదం ఉంది.ఇదీ చదవండి: ‘మధ్య తరగతి’ బండి సాగేదెలా? -
‘సోకులకే ఉన్నాడు తప్ప ఆడింది ఏమీ లేదు’
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్పై మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో సోకులకే ఉన్నాడు తప్ప బ్యాట్తో పెద్దగా ఆడింది లేదంటూ ఘాటుగా విమర్శించాడు. కాగా సోమవారం ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ 57 పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ వరుసగా నాలుగు విజయాలు సాధించినప్పటికీ అందులో రియాన్ పరాగ్ పాత్ర శూన్యం. బ్యాటింగ్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కెప్టెన్గా ఉన్నాడు కాబట్టి జట్టులో ఉన్నాడు లేదంటే డగౌట్కే పరిమితం కావాల్సి వచ్చేదని విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో క్రిష్ శ్రీకాంత్ మాట్లాడుతూ... 'రియాన్ పరాగ్ జట్టులో ఫోజు కొట్టడానికే ఉన్నాడు. స్టైల్గా బ్యాటింగ్కు వచ్చి త్వరగా ఔటయ్యాడు. ప్రెజెంటేషన్ వేడుకలో మాట్లాడి వెళ్లిపోయాడు. అంతా ఫోజు కొట్టడం తప్పా మరేమీ చేయలేదు. జడేజా వంటి సీనియర్ బౌలర్కు బౌలింగ్ ఇవ్వలేదు. ఎందుకని అడిగితే.. రవి బిష్ణోయ్నే సన్రైజర్స్ బ్యాటర్లు చితక్కొట్టారని, లెఫ్టార్మ్ బ్యాటర్ అయిన ఇషాన్ కిషన్ మెరుగ్గా ఆడుతుండటంతో బౌలింగ్ ఇవ్వలేదని చెప్పాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్.. లెఫ్టార్మ్ బ్యాటర్కు బౌలింగ్ చేయకూడదనే రూల్ ఏమైనా ఉందా? ఇది అసంబద్దం. ఎస్ఆర్హెచ్ అద్భుత ప్రదర్శన కనబర్చింది. ముఖ్యంగా ప్రఫుల్ హింగే తొలి ఓవర్లోనే మ్యాచ్ను ముగించాడు. ఇషాన్ కిషన్ కెప్టెన్సీ కూడా చాలా బాగుంది. వారికి నలుగురు యువ బౌలర్లున్నారు. వారితోనే రాజస్థాన్ రాయల్స్ను ఆలౌట్ చేశారు. అద్భుతం.’అని కొనియాడాడు.చదవండి: షూ కోసం తల్లి నగలు అమ్మి.. ఎవరీ సాకిబ్ హుస్సేన్? -
చిరు సినిమాతో బాలనటిగా ఎంట్రీ.. పదేళ్లుగా ఇండస్ట్రీకి దూరం
సినిమాలోకి ఎంతోమంది వస్తుంటారు. అంతేమంది మెల్లగా తెరమరుగైపోతుంటారు. అయితే గుర్తింపు రాక సైడ్ అయిపోతే ఓకే గానీ ఫేమస్ అయినా సరే కొందరు మూవీస్ చేయడం తగ్గించేస్తుంటారు. ఈమె కూడా అలాంటిదే. ఎందుకంటే చిరంజీవి లాంటి స్టార్ హీరో సరసన నటించి నటిగా అరంగేట్రం చేసింది. ఇప్పుడు యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసింది. మరి ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? ఎవరో చెప్పేయమంటారా?(ఇదీ చదవండి: మౌళి-మైత్రీ మూవీస్.. ఇదేం టైటిల్?)పైన కనిపిస్తున్న నటి పేరు శ్రియ శర్మ. హిమాచల్ ప్రదేశ్కి చెందిన ఈమె ఐదారేళ్లకే పలు యాడ్స్ చేసింది. అలా దర్శకుల దృష్టిలో పడి ఎనిమిదేళ్లకే నటిగా మారింది. చిరు 'జై చిరంజీవ' సినిమాతో బాలనటిగా అరంగేట్రం చేసింది. తర్వాత తమిళ, కన్నడ, హిందీలోనూ పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. తెలుగులో అయితే మహేశ్ 'దూకుడు', రామ్ చరణ్ 'రచ్చ', నాని 'ఎటో వెళ్లిపోయింది మనసు' తదితర మూవీస్లో కనిపించింది.అయితే గాయకుడు, నిర్మలా కాన్వెంట్ సినిమాల్లో హీరోయిన్గా అదృష్టం పరీక్షించుకున్న శ్రియ.. ఇవి ఫ్లాప్ అయ్యేసరికి యాక్టింగ్ పక్కనబెట్టేసినట్లు తెలుస్తోంది. 2016లో చివరగా 'నిర్మలా కాన్వెంట్' మూవీలో కనిపించింది. అప్పటినుంచి కొత్తగా ఏ మూవీ లేదా యాడ్ గానీ చేయలేదు. ఇదే టైంలో రచయితగా మారి 'కర్మ బ్యాక్ ఫైర్డ్' అనే బుక్ రాసింది. రీసెంట్గా 29వ ఏడాదిలోకి అడుగుపెట్టిన ఈమె, తన ఫొటోలని పోస్ట్ చేసింది. అలా మరోసారి సోషల్ మీడియా డిస్కషన్లోకి వచ్చింది. 20 ఏళ్ల పాటు సినిమాలు చేసిన శ్రియ.. భారతీయ భాషల్లో 150కి పైగా యాడ్స్లో నటించడం విశేషం.(ఇదీ చదవండి: రాశీఖన్నా బ్లడీ యాక్షన్.. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్) View this post on Instagram A post shared by Shriya Sharma (@shriyasharma9) -
పాక్లో అమెరికా-ఇరాన్ మళ్లీ చర్చలు..! ఎప్పుడంటే?
వాషింగ్టన్: పశ్చిమాసియాలో శాంతి గురించి చర్చించడానికి అమెరికా, ఇరాన్ ప్రతినిధులు ఈ వారం చివరలో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్కు మళ్లీ రావచ్చని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. ఇటీవల ఇస్లామాబాద్లో జరిగిన చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. దీంతో రెండో దశ చర్చలు జరపాలని అమెరికా-ఇరాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తేదీని ఇంకా నిర్ణయించలేదని, కానీ ఈ వారం చివరలోనే అమెరికా-ఇరాన్ తిరిగి ఇస్లామాబాద్ రావచ్చని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇరు దేశాల ప్రతినిధి బృందాలు శుక్ర/శని/ఆదివారం చర్చల్లో పాల్గొనవచ్చని ఒక సీనియర్ ఇరాన్ అధికారి అన్నారు.అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఘర్షణకు పరిష్కారం కోసం చర్చల ప్రతిపాదనలు వస్తున్నాయి. ఇటీవల ఇరు దేశాల అధికారులు సమావేశమయ్యారు. దశాబ్దానికి పైగా కాలంలో అమెరికా, ఇరాన్ అధికారుల మధ్య జరిగిన తొలి ప్రత్యక్ష భేటీ ఇది. అలాగే 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత జరిగిన అత్యున్నత స్థాయి సంప్రదింపులు ఇవే.పాకిస్థాన్లోని సోర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. తదుపరి దశ చర్చల గురించి అమెరికా-ఇరాన్తో పాక్ ప్రతినిధులు మాట్లాడుతున్నారు. “మేము ఇరాన్తో మాట్లాడాము. రెండో దశ చర్చలకు వారు సిద్ధంగా ఉన్నారని తెలిపేలా సానుకూల స్పందన వచ్చింది” అని పాకిస్థాన్ ప్రభుత్వ సీనియర్ అధికారి తెలిపారు.పాకిస్థాన్లో ఇటీవల జరిగిన చర్చలకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ మొహమ్మద్ బాగేర్ ఖలీబాఫ్ తమ తమ బృందాలకు నాయకత్వం వహించారు. హార్మూజ్ జలసంధి, ఇరాన్ అణు కార్యక్రమం, అంతర్జాతీయ ఆంక్షలు వంటి అంశాలు చర్చలకు అడ్డంకిగా మారాయి. -
ఈవీకి పొల్యుషన్ సర్టిఫికెట్ లేదని ఫైన్
మనదేశంలో ఇటీవల కాలంలో విద్యుత్తు వాహనాల వినియోగం బాగా పెరిగింది. పర్యావరణానికి హాని కలిగించవనే ఉద్దేశంతో వినియోగదారులు ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే రాజస్థాన్లోని ఓ పోలీసు అధికారి ఈవీకి పొల్యుషన్ సర్టిఫికెట్ లేదని జరిమానా విధించిన వింత ఘటన వెలుగులోకి వచ్చింది. నాగౌర్ నగరంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.టాటా టియాగో ఎలక్ట్రిక్ కారు నడుపుతున్న వ్యక్తిని ఓ పోలీసు ఆపారు. కారుకు ఎడంపైపున ఉన్న ముందు సీటు విండోకు సన్షేడ్ అమర్చినందుకు వాహనాన్ని మొదట ఆపారు. దీనికి 200 రూపాయల జరినామా విధించారు. అక్కడితో ఆగకుండా పొల్యుషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికెట్ చూపించాలని వాహనదారుడిని పోలీసు అధికారి అడిగారు. అతడు చూపించకపోవడంతో మరో రూ.1500 ఫైన్ వేశారు. విద్యుత్ వాహనానికి పీయూసీ సర్టిఫికెట్ అవసరం లేదని ఎంత చెప్పినా సదరు పోలీసు పట్టించుకోలేదు. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం తాను చూశానని, అందుకే కారు ఆపానని మాట మార్చాడు. తాను ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయలేదని, సాక్ష్యం చూపించాలని కోరినా పట్టించుకోలేదు. తనకు అకారణంగా జరిమానా వేసినందుకు కోర్టులో వేస్తానని చెప్పినా ఆ పోలీసు అధికారి లెక్కచేయలేదు. ఈ తంతంగం మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజనులు స్పందిస్తున్నారు. పోలీసు అధికారు తీరును తప్పుబడుతూ కామెంట్లు పెడుతున్నారు. ఈవీకి పీయూసీ సర్టిఫికెట్ అడగడం హాస్యాస్పదంగా ఉందని.. ఇది కాలిక్యులేటర్ను వాతావరణం గురించి అడిగినట్టుగా ఉందని సెటైర్ వేశారు. తెలియని విషయాన్ని ఒప్పుకోకుండా పోలీసు అధికారి మొండిగా వాదించడాన్ని అజ్ఞానంతో కూడిన అహంకారంగా నెటిజనులు పేర్కొన్నారు. ఈవీకి పీయూసీ సర్టిఫికెట్ అవసరం లేదని చాలా మంది పోలీసులకు తెలియదని, ఇలాంటి విషయాలపై వారికి శిక్షణ తప్పనిసరి అని వ్యాఖ్యానించారు."ఇలాంటి పోలీసు అధికారుల వీడియోలు వైరల్ కావడం మరింత ముఖ్యం. ఎందుకంటే వారికి తెలియని విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించర''ని ఓ నెటిజన్ పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థలోని తెలివితక్కువ వారి వల్లే దేశం నాశనం అవుతుందని.. ఇలాంటి వారు లంచాల కోసం ఎంతకైనా దిగజారతారని మరో నెటిజన్ మండిపడ్డారు. ఈవీకి కచ్చితంగా పీయూసీ వర్తించదని, ఒకవేళ డ్రైవింగ్ సమయంలో కారు కిటికీలకు కర్టెన్లు వేసివుంటే చలానా విధించే అవకాశం ఉందని మరో నెటిజన్ అన్నారు. नागौर पुलिस ने नया कानून लागू किया है इलेक्ट्रिक कार की PUC करवाओ नहीं तो आपके भी PUC का चालान कटेगालो साहब ने काट दिया 1500 की चालान😳😲 pic.twitter.com/uYpFvT0If1— एक नजर (@1K_Nazar) April 8, 2026చదవండి: వాళ్ల తలల్ని 'తలారీ'కి అప్పజెప్పవద్దు! -
బావి నుంచి సింహ గర్జన.. చివరికి జరిగింది ఇదే..!
‘పదిహేను అడుగుల లోతు బావిలో పడ్డ సింహం.. గంటపాటు సాగిన సాహసోపేత రెస్క్యూ ఆపరేషన్..’ గుజరాత్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బావిలో చిక్కుకున్న ఒక సింహాన్ని అటవీ శాఖ అధికారులు దాదాపు గంటసేపు శ్రమించి సురక్షితంగా బయటకు తీశారు. ఏప్రిల్ 13న నవబందర్ అటవీ ప్రాంతం సమీపంలో ఈ ఘటన జరిగింది.అటవీ అధికారుల తెలిపిన వివరాలు ప్రకారం.. ఆ సింహం ఆహారం వేటలో తన నివాసం నుండి బయటకు వచ్చి.. ప్రమాదవశాత్తు నీటి బావిలో పడిపోయింది. బయటకు రాలేక.. తీవ్రంగా పోరాడింది. సింహం గర్జనలు చుట్టుపక్కల ప్రాంతాలకు వినిపించడంతో స్థానికులు అప్రమత్తమై.. అధికారులకు సమాచారం అందించారు. వెంటనే జసాధర్ అటవీ శాఖ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ కుల్దీప్ చౌహాన్ నేతృత్వంలో రెస్క్యూ టీమ్ను రంగంలోకి దిగింది. సింహం బావిలో పడిందన్న వార్త తెలియగానే గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.అటవీ సిబ్బంది బలమైన తాళ్లను బావిలోకి దించారు. సింహం వాటిని పట్టుకుంటుందని పైకి లాగడానికి వీలుగా ఉంటుందని భావించారు. అయితే, భయపడిపోయిన ఆ సింహం దూకుడుగా ప్రవర్తిస్తూ.. ఆ తాళ్లను పళ్లతో కొరికేసింది. దాదాపు 30 నిమిషాల పాటు రక్షణ సిబ్బందికి, సింహానికి మధ్య ఉత్కంఠభరిత పోరాటం సాగింది.A wild chase turned into a rescue mission in Gujarat.Near the forested stretch of Navabandar in Una taluka, a majestic lion, likely in search of prey, accidentally fell into an open farm well.What followed was a race against time.With swift coordination and remarkable… pic.twitter.com/Ssj7if76Hz— Harsh Sanghavi (@sanghaviharsh) April 13, 2026చివరకు శ్రమ, సమన్వయంతో అధికారులు ఒక తాడు ఉచ్చును ఉపయోగించి సింహాన్ని బంధించగలిగారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఖాళీ చేయించి.. బావి అంచున ఒక బోనును సిద్ధంగా ఉంచారు. ఆపై సిబ్బంది మొత్తం కలిసి సింహాన్ని పైకి లాగడం ప్రారంభించారు. బావి నుంచి పైకి రాగానే.. సింహం సహజంగానే పక్కనే ఉన్న బోనులోకి వెళ్లింది. వెంటనే సిబ్బంది బోను తలుపులు వేశారు. సింహం సురక్షితంగా బయటపడటంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.ఈ రెస్క్యూ వీడియోను గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. ‘‘సమన్వయం, అసాధారణమైన ధైర్యంతో, అటవీ శాఖ బృందం గంటపాటు అవిశ్రాంతంగా శ్రమించింది. వారి ప్రయత్నాలు ఫలించాయి. సింహానికి ఎటువంటి హాని కలగకుండా సురక్షితంగా రక్షించారు’’ అంటూ ఆయన పోస్ట్ చేశారు. -
సర్జరీ అని చెప్పి కిడ్నీలు తీసేసారు : తీవ్ర ఉద్రిక్తత
మధ్యప్రదేశ్లోని సత్నాలో దారుణం చోటు చేసుకుంది. ఒక ఆసుపత్రిలో కిడ్నీలో రాళ్లకు సర్జరీ చేయాల్సిన వైద్యుడు తప్పిదంగా కారణంగా ఏకంగా రెండు కిడ్నీలను తొలగించారు. చివరికి పరిస్థితి విషమించడంతో యువకుడు చనిపోయిన ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతతను రాజేసింది.పన్నా జిల్లాలోని దేవేంద్రనగర్కు చెందిన రవి రాజక్కు కిడ్నీలో రాళ్ల సమస్య ఉంది. అతని కుటుంబ సభ్యులు చికిత్స కోసం సత్నాలోని ముఖ్తియర్గంజ్లో ఉన్న ఆసుపత్రికి తీసుకువచ్చారు. పరీక్షల అనంతరం, వైద్యులు శస్త్రచికిత్స చేయాలని సూచించారు. ఏప్రిల్ 4న పాఠక్ నర్సింగ్ హోమ్లో సుమారు 5 గంటల పాటు శస్త్రచికిత్స జరిగింది. ఆపరేషన్ తర్వాత రోగి పరిస్థితి విషమించడంతో, అతడిని రేవాలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అధిక రక్తస్రావం, ఇన్ఫెక్షన్ కారణంగా వైద్యులు రెండవ మూత్రపిండాన్ని కూడా తొలగించాల్సి వచ్చింది. దీని తర్వాత రోగి పరిస్థితి నిరంతరం విషమించి, చివరికి మరణించాడు .మరోవైపు పొరపాటున కిడ్నీలను తొలగించామని డాక్టర్ కూడా ఒప్పుకున్నారు.ऑपरेशन के नाम पर दोनों किडनी निकाल ली..🚨मध्य प्रदेश के सतना में एक अस्पताल में एक बच्चे का पथरी का ऑपरेशन करने के नाम पर डॉक्टर साहब ने उस बच्चे की दोनों किडनी निकाल ली...डॉक्टर साहब अब कह रहे है कि गलती हो गई गलती से किडनी निकाल दी...अब उस बच्चे का क्या होगा इसकी… pic.twitter.com/Y8KMjGiT9Y— ᴋᴀᴛʏᴀʏᴀɴɪ (@ItsKtyni) April 14, 2026 > రేవాలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అక్షయ్ శ్రీవాస్తవ స్పందిస్తూ రోగిని యూరాలజీ విభాగంలో చేర్పించే సమయానికే అతని కిడ్నీ పనిచేసే స్థితిలో లేదని తెలిపారు. చికిత్స ఎక్కువ సత్నాలోనే జరిగిందని, రేవాలో కేవలం డయాలసిస్ మాత్రమే నిర్వహించినట్టు తెలిపారు.మరోవైపు వైద్యులు నిర్లక్ష్యమే తమ బిడ్డ మరణానికి కారణమని, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మృతుడి తండ్రి గిర్ధారిలాల్ రజక్ ఆరోపిస్తూ, తన కుమారుడికి కేవలం మూత్రపిండంలో రాయి సమస్య మాత్రమే ఉందని, కానీ చికిత్సలోనిర్లక్ష్యం కారణంగానే ప్రాణాలు కోల్పోయాడని అన్నారు. డాక్టర్ పుష్పేంద్ర సింగ్, డాక్టర్ రాజీవ్ పాఠక్ ,డాక్టర్ రాజీవ్ సింగ్ అనే ముగ్గురు వైద్యులపై కేసు నమోదు చేసి, వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రూ.20 కోట్ల నష్ట పరిహారం డిమాండ్ చేశారు.మృతదేహాన్ని కోల్గావాన్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉంచి హైవేను దిగ్బంధించారు. ఆ తర్వాత పాఠక్ ఆసుపత్రి బయట మరో నిరసన చేపట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి మూడు పోలీస్ స్టేషన్ల నుండి పోలీసులను మోహరించారు. సుమారు 4 గంటల పాటు సాగిన నిరసన అనంతరం వైద్యులు , మృతుడి కుటుంబ సభ్యుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. చివరగా, 5 లక్షల రూపాయల చెక్కు , 50 వేల రూపాయల తక్షణ నగదు సహాయం అందించే విషయమై ఒక ఒప్పందం కుదిరింది. దీనితో నిరసన ముగిసింది.రేవాలోని సంజయ్ గాంధీ ఆసుపత్రి నుండి పోస్ట్మార్టం నివేదిక అందిన తర్వాత, ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: అమెరికాకు చైనా వార్నింగ్ : నాలుగు కీలక ప్రతిపాదనలు -
వేసవిలో పిల్లలు హెల్దీగా ఉండాలంటే..!
అనాదిగా వేసవికీ బాల్యానికీ ఎనలేని సంబంధం ఉంది. పైగా పులి మీద పుట్రలా వేసవి సెలవులొకటి. తామూ ఒకప్పటి పిల్లలే అయినా తమ బాల్యాన్ని మరచిపోయి ఎండలో ఆడవద్దంటూ పిల్లలను గదమాయిస్తుంటారు పెద్దలు. కానీ... సూర్యుణ్ణి కంపాస్ బాక్స్లో ఉంచేసి, అది సరిపోనట్టు మళ్లీ దాన్ని స్కూల్ బ్యాగ్లో పెట్టిజిప్పు లాగేసినట్టుగా ఎండను లెక్కచేయకుండా పిల్లలంతా ఆడేస్తుంటారు. తరాలు గడుస్తున్నా ఇదో ఎప్పటికీ ఎడతెగని చైన్ రియాక్షన్. ఈ నేపథ్యంలో పిల్లలను వేసవి తీవ్రతతో వచ్చే ప్రమాదాలూ; తినిపించాల్సినవీ, తాగించాల్సినవీ, దూరం ఉంచాల్సినవీ అయిన ఆహారపదార్థాలూ; ఎండ నుంచి రక్షించుకోడానికి అనుసరించాల్సిన సూచనల వంటి అనేక అంశాలను తెలిపే కథనమిది.అప్పటివరకూ ఆరుబయట హాయిగా ఒళ్లెరగకుండా ఆడుతున్న చిన్నారి ఒళ్లు వెచ్చబడుతుంది. అకస్మాత్తుగా అమ్మాయి మేను నిప్పులు చెరుగుతోందేమో అనిపిస్తుంది. తల్లీదండ్రీ నుదురు తాకి చూసి, తటాలుమని చేయి వెనక్కు లాగేసుకుంటారు ఆ ఒంటి వేడి తట్టుకోలేక. ఇది దాదాపు ప్రతి చిన్నారి బాల్యంలో ఒక్కసారైనా ఎదుర్కొనే సంఘటన. ఇది ప్రతి తల్లిదండ్రుల జీవితంలో ఒక్కసారైనా చవిచూసే కాళరాత్రి. ఇలాంటి వేసవి తీవ్రత బారి నుంచి చిన్నపిల్లలను కాపాడుకోడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చూద్దాం.పిల్లలపై ఎండ దుష్ప్రభావం ఎందుకు ఎక్కువ? ఎండవేడిమి తీవ్రతకు పెద్దలూ, పిల్లలూ, వృద్ధులనే తేడా లేక΄ోయినప్పటికీ పెద్దలతో పోలిస్తే పిల్లల మీదే వేసవి ప్రతాపం ఎక్కువగా చూపిస్తుంటుంది. దీనికి కారణం ఉంది. పిల్లలంతా ఎండల్లో విపరీతంగా ఆటలాడుతూ ఉంటారు కాబట్టి పెద్దల కంటే వాళ్లకు చెమటలు పట్టడమూ, దాంతో వాళ్లు లవణాలు ఎక్కువగా కోల్పోతుండటం వల్ల ఎండతీవ్రతకు గురవుతుంటారనేది కొందరి అపోహ. కానీ అది వాస్తవం కాదు. విషయం ఏమిటంటే... పెద్దలతో పోలిస్తే పిల్లల్లో చెమట గ్రంథులు తక్కువ. అందుకే చెమటలు పట్టడం పెద్దవారిలోనే ఎక్కువ. అయితే పిల్లల చర్మంపైన వేసవి తీవ్రతను చల్లబరిచేందుకు అవసరమైన ప్రక్రియ... చెమట పట్టడమనేది తక్కువ. దాంతో ఎండ వేడిమి పిల్లలపై ఎక్కువ దుష్ప్రభావం చూపుతుంది. అందుకే పిల్లలెప్పుడూ చల్లగా ఉండే నీడపట్టునే ఉండేలా చూడాలి. ఎండా, వడగాడ్పులు తగ్గాకే వాళ్లను ఆరుబయటకు వెళ్లనివ్వాలి.ఎండ తీవ్రతతో ఎదుర్కొనే ఇబ్బందులివే...మజిల్ క్రాంప్స్ : పిల్లలెప్పుడూ ఎండను లెక్క చేయక ఆడుతూ ఉంటారు. ఇక సెలవుల్లో అయితే ఆటలే ఆటలు. దాంతో వారి దేహంలోని నీరు డీ–హైడ్రేషన్ కారణంగా బయటకు వెళ్లడమూ, ఆ నీటితో పాటు లవణాలూ తగ్గడం వల్ల... ఆ లవణాల అయాన్ల రూపంలో మెదడునుంచి కండరాలకు వచ్చే ఆదేశాలకు బ్రేక్ పడుతుంది. అందుకే ఒళ్లు డీ–హైడ్రేషన్కు గురి కాగానే... కండరాలు బిగుసుకు΄ోతుంటాయి. వీటినే మజిల్క్రాంప్స్ అంటారు. ఈ మజిల్క్రాంప్స్ పిల్లలతో పాటు పెద్దలకూ వస్తుంటాయి. ఇలా జరిగిన వెంటనే... వారికి చిటికెడు ఉప్పు, కాస్తంత చక్కెర వేసిన నీటిని వెంటనే తాగించాలి. కోల్పోయిన లవణాలను తిరిగి భర్తీ చేయడం వల్ల ఈ సమస్యను తేలిగ్గానే ఎదుర్కోవచ్చు.వడదెబ్బ : మనలో జీవక్రియలన్నీ సరిగా జరగడానికి దేహ ఉష్ణోగ్రత ఎప్పుడూ 98.4 డిగ్రీల ఫారెన్హీట్గా ఉంటుంది. అయితే వడదెబ్బకు గురైనవారి దేహ ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా పెరుగుతుంది. దాంతో దేహంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వడదెబ్బ కారణంగా దేహ ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతూ ప్రమాదకరస్థాయి అయిన 104 డిగ్రీ ఫారెన్హీట్కు చేరినప్పుడు ఆ వేడి దగ్గర మెదడు, గుండె, మూత్రపిండాలు, కాలేయం వంటి కీలకమైన అవయవాల పనితీరు తీవ్రంగా దెబ్బతినే అవకాశాలెక్కువ. అందుకే శరీర ఉష్ణోగ్రతను మళ్లీ నార్మల్కు తీసుకురావడం అవసరం.ఒంటి ఉష్ణోగ్రత 100 డిగ్రీల ఫారెన్హీట్ దాటుతోందని తెలియగానే పిల్లలను చల్లటి గాలి సోకేలా ఫ్యాన్ కింద ఉంచాలి. (ఒకవేళ ఫ్యాన్ కింద వేడిగాలి వస్తుంటే అలాంటి చోటకు తీసుకెళ్లినా లాభం ఉండదు. చిన్నారుల దుస్తులు వదులు చేసి, ఒంటికి చల్లగాలిని బాగా తగలనివ్వాలి. ఈ జాగ్రత్తల తర్వాత కూడా శరీర ఉష్ణోగ్రత తగ్గకపోతే పిల్లల చంకల కింద / గజ్జల వద్ద ఐస్ గడ్డలను ఉంచాలి. దాంతో ఒళ్లు చల్లబడుతుంది. అప్పటికీ శరీర ఉష్ణోగ్రత తగ్గకపోతే, దాన్ని మెడికల్ ఎమర్జెన్సీగా గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించాలి.వేసవిలో కొన్ని ఆహారాల పట్ల అపోహలుగుడ్డు : గుడ్లు తినడం వల్ల అవి వేడి చేస్తాయనే అ΄ోహ చాలామందిలో ఉంటుంది. అందుకే వేసవిలో గుడ్లను తినడానికీ, పిల్లలకు ఎక్కువగా ఇవ్వడానికి వెనకాడుతుంటారు. నిజానికి ఇది పూర్తిగా అ΄ోహ మాత్రమే. గుడ్లలో దాదాపు 75% నీళ్లే ఉంటాయి. పైగా ఇందులో ఖనిజలవణాలూ అన్నీ ఎక్కువే. అందుకే ఇవి చలవ చేయడంతో ΄ాటు ఒంటి నుంచి చెమట రూపంలో కోల్పోయే నీటినీ భర్తీ చేస్తాయి. అంతేకాదు... ఇందులోని లవణాల కారణంగా మజిల్క్రాంప్స్ వంటి సమస్యలూ నివారితమవుతాయి.పాలు : వేసవిలో పాలకు బదులుగా... పెరుగునూ... ఇక పెరుగుకు బదులుగా దాన్ని చిలికి మజ్జిగ రూపంలో తీసుకోవడమే మేలని చాలామంది అనుకుంటారు. నిజానికి వేసవిలో మజ్జిగ వాడటం చాలా మంచిదే అనడంలో సందేహం లేదు. అంతమాత్రాన వేసవిలో పాలు అంత మంచివి కావని అనుకోవడం ఓ దురభి్ర΄ాయం మాత్రమే. నిజానికి పాలలోనూ 90 శాతానికి పైగా ఉండేది నీళ్లే. ఈ నీటి మోతాదులతోసాటు దేహానికి శ్రమ కలగడం వల్ల కోల్పోయే ఖనిజలవణాలూ ఉంటాయి. అంటే పాలు తాగడం అంటే ఏకకాలంలో నీటినీ, ఖనిజలవణాలనూ భర్తీ చేయడం లాంటిది. అందుకే మధ్యమధ్యలో మజ్జిగ తాగిస్తున్నప్పటికీ... వేసవిలో చిన్నారులకు ప్రతి ఉదయం, రాత్రి వేళల్లో పాలు తాగిస్తుండటమూ మంచిదే.సూప్లు : వేసవిలో పిల్లలు ఆరుబయట ఎండల్లో చాలా ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు. దాంతో వారు చాలా వేగంగా నీళ్లనూ, లవణాలను కోల్పోతుంటారు. పైగా ఈ సీజన్లో ఘనాహారం తీసుకోవడం ఒకింత కష్టంగా ఉంటుంది. అందుకే పిల్లలు కోల్పోయే లవణాలను సూప్లూ, జావ రూపంలో తీసుకోవడం వల్ల అవి చాలా వేగంగా వారి దేహానికి అందుతుంటాయి.వెజిటబుల్ సూప్స్ : అన్ని రకాల సూప్లలోనూ దాదాపు 98 శాతం నీళ్లే ఉంటాయి. ఇక మిగతావి సూప్లలో ఉపయోగించే ఆకుకూరలు, కాయగూర (వెజిటబుల్స్)ల్లోంచి సూప్లోకి లవణాలు బాగా ఊరి, తేలిగ్గా ఒంటపడతాయి. అందుకే వేసవిలో అన్ని రకాల సూప్లు తీసుకోవడం మేలు చేసే అంశమే. టోమాటో, మొక్కజొన్న, దోసకాయ, ఆలూ (బంగాళదుంప), చిలగడదుంప (మోరంగడ్డ / గెణుసుగడ్డ), గ్రీన్పీస్, జ్యూషీనీ, అవకాడో, బీట్రూట్, పుదీనా, కొత్తిమీర, బ్రాకలీ, పుట్టగొడుగులు (మష్రూమ్స్)... ఇలా దాదాపు అన్ని రకాల ఆకుకూరలు/కాయగూరలతో సూప్లు తయారుచేసుకోవచ్చు. వేసవిలో ఈ సూపులన్నీ చిన్నారులకు ఖనిజలవణాలను చాలా వేగంగా ఒంటికి సమకూరేలా చేస్తాయి.పిల్లలకు జావ రూపంలో ఇచ్చేవి...జావ రూపంలోనూ లేదా పలచటి ఉప్మా (పారిజ్) రూపంలో రెసిపీలను తీసుకోవడం వల్ల ఒంటికి నీళ్లూ, లవణాలూ తక్షణం సమకూరతాయి. జావరూపంలో తీసుకునేందుకు రాగులు మేలైన ఆహారం. అందుకే వీటిల్లో రాగిజావ చాలా ఫేమస్. జావ/పారిజ్ రూపంలో తీసుకునేందుకు నూకలూ మంచివే. ఆర్గానిక్గా పండించిన పట్టుతీయని వరినూక, గోధమనూక చాలా మేలు చేస్తాయి. వీటిలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల పిల్లలకు ఇవి తేలిగ్గా జీర్ణం అవుతాయి. దాంతో వేసవిలో ఒళ్లు చాలా తేలిగ్గా ఉంటుంది. అన్నట్టు పెద్దలకూ, వృద్ధులకూ మంచివే.రకరకాల పానీయాలు...అన్నిటికంటే ముఖ్యమైనది నీరు దాహాన్ని తీర్చడానికి మంచినీటికి మించిన పానియం మరొకటి లేదు. ఎండలో ఇంటికి వచ్చినప్పుడు ఒక్క గ్లాసుడు నీరు తీసుకుంటే ప్రాణం లేచివచ్చినట్టు అవుతుంది. మంచినీరు ఎక్కువగా తాగుతూంటే డీ హ్రైడ్రేషన్కు దూరంగా ఉండవచ్చు. ఇక నీటి తర్వాత ఇవ్వదగ్గ పానియాలివి...నిమ్మ : పిల్లలు వేసవిలో పానియాలను తాగేందుకు బాగా ఇష్టపడతారు. సాధారణంగా వేసవిలో నిమ్మకాయరసాన్ని తీసుకొని అందులో కొద్దిగా పంచదార వేసి చేసుకునే పానియం చాలా త్వరగా తయారవుతుంది. చాలా చవగ్గా కూడా. బత్తాయి : బత్తాయిరసం, ఆరెంజ్ జ్యూస్ వంటివి పిల్లలు ఇష్టంగా తాగుతారు. సర్సపారిల్లా : ఇది భూమి కింద పెరిగే ఒక రకం వేరు. దీన్నే చాలా చోట్ల వేర్వేరు పేర్లతో పిలుస్తుంటారు. కొందరు సుగంధ అనీ, మరికొందరు మారేడు అనీ, నన్నారి అని దీన్ని పిలుస్తారు. దీని వేర్లతో ఎసెన్స్లో లేదా ఆ వేర్ల పౌడర్లో నీళ్లు లేదా సోడా కలపాలి. ఒక టీస్పూన్ నిమ్మరసం, కాస్తంత చక్కెరతో చాలా పరిమళభరితమైన వేసవి పానీయం తయారవుతుంది. ఇది చలవచేస్తుందీ, ఆరోగ్యానికీ మేలూ చేస్తుంది. ఇవీ కాకుండా ఈ వేసవిలో మామిడిపండ్లు ఎక్కువగా దొరుకుతుంటాయి. దాంతో ఆమ్పన్నా అనే సీజనల్ డ్రింక్ను తయారు చేసుకోవచ్చు. ఇవేకాకుండా... ఖస్ షర్బత్, ద్రాక్షాజ్యూస్, వెలగపండు షర్బత్, రోజ్ షర్బత్లూ మంచివి. ఇక వేసవిలో చెరుకురసాన్ని తాగడానికి చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు. అయితే ఇందులో కల్తీనీళ్లనుంచి తయారు చేసే ఐస్ కలవడమనే అంశం ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశమున్నందున... ఐస్ కలపకుండా తాగడమే మేలు.తీసుకోదగ్గ ఇతర పండ్లు, సలాడ్స్...పుచ్చకాయ...లో 80 శాతం కంటే ఎక్కువ నీరే ఉండటంతో డీహైడ్రేషన్ రాకుండా కాపాడుతుంది. వెజిటబుల్ చీజ్ సలాడ్స్... తక్కువ క్యాలరీలున్న చీజ్ను తరిగిన అనేక రకాల కూరలతో కలపటం వల్ల క్యాల్షియం, ప్రోటీన్ల పరిమాణాన్ని పెంచవచ్చు.కొవ్వులు తక్కువగా ఉండే పానీయాలు... పిల్లలు చల్లగా, తియ్యగా ఉండే కూల్డ్రింక్స్, సోడా, ఐస్క్రీమ్లను ఇష్టపడుతుంటారు. వీటికి బదులుగా మజ్జిగ, లస్సీ వంటివి ఇవ్వడం మంచిది. పండ్లతో తయారయిన డెజర్ట్స్... వేసవిలో ఆరోగ్యాన్నిచ్చే పండ్లతో తయారుచేసిన డెజర్ట్స్ని తీసుకోవడమే మంచిది. ఇవి ప్రోటీన్లు, క్యాల్షియంలను అందిస్తాయి. బెర్రీలు (స్ట్రాబెర్రీలు)... వేసవిలో ఈ బెర్రీ పళ్లను తినటం మంచిది. వీటిని పెరుగులోనూ, ఐస్క్రీంలాంటి వాటిలోనూ వాడవచ్చు. కుకుంబర్... పిల్లలు పెద్దగా ఇష్టంగా తిననప్పటికీ దోస వంటివి సహజంగానే చల్లగా ఉండి చలువ చేస్తాయి. అందుకే చల్లని తాజా దోసకాయ ముక్కలను సలాడ్స్లోనూ, కూరలలోనూ వాడుతూ పిల్లలకు ఇవ్వడం మంచిది. మామిడి... ఇవి వేసవిలోనే దొరుకుతాయి. ఇందులో బీటా కెరొటిన్, విటమిన్ సి, ఫైబర్లు ఉంటాయి. వాల్నట్స్... ఆక్రోట్ల (వాల్నట్)లో ఉండే ఒమేగా – 3 ఫ్యాటీయాసిడ్లు గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి.చేపలు... వేసవిలో వేటమాంసం కంటే చేపలు మంచి ఆహారం. అయితే వేయించిన చేపల కంటె ఉడకబెట్టిన లేదా గ్రిల్డ్ చేపలు ఇవ్వడం మేలు. ఎరుపు, ఆరంజ్, పసుపు రంగులలో ఉన్న కూరగాయలు... గుమ్మడి, బంగాళదుంప, చిలగడదుంప, బెల్పెప్పర్... వంటివాటిలో ఎ విటమిన్, సి విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. పాల ఉత్పత్తులు... లస్సీ, మజ్జిగ, ఫ్లేవర్డ్ మిల్క్, ఫ్రూట్ మిల్క్ షేక్లు (మ్యాంగో మిల్క్ షేక్) వంటివి పిల్లల శరీరానికి అవసరమయిన శక్తిని, ప్రోటీన్లను, క్యాల్షియమ్ను, ఫ్లూయిడ్లను అందిస్తాయి. పనీర్... ఇందులో ప్రోటీన్లు, క్యాల్షియం అధికంగా ఉంటాయి. గ్రిల్డ్ వెజిటబుల్స్ను పనీర్తో కలిపి ఇవ్వవచ్చు. లేదా పనీర్ రోల్స్ కూడా ఇవ్వవచ్చు. పిల్లల ఎదుగుదలకూ, ఎముకల పటిష్టతకు బాగా తోడ్పడతాయి.ఇంట్లో తయారుచేసిన ఐస్క్రీమ్లు, ఫ్రూట్ కస్టర్డ్స్, పుడింగ్స్, స్మూతీస్, ఐస్ గోల్స్... వంటివి పిల్లలకి పెట్టవచ్చు. ఎండ తాలూకు దుష్ప్రభావాల నివారణ ఇలా... ఎండవేళలల్లో పిల్లలు ఎండకు వెళ్లకుండా ఇంట్లోని చల్లటి జాగాల్లో ఆడుకునేలా ప్రోత్సహించాలి.ఎండవేళల్లో ఇన్డోర్ గేమ్స్కు మాత్రమే వారిని పరిమితం చేయాలి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారిని ఇంట్లోనే ఉండేలా చూడాలి. పిల్లలు నీడలో ఉన్నా... ఒకవేళ ఆ నీడ ఉన్న గది ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే నీడపట్టున ఉన్న పిల్లలకూ వడదెబ్బ తగలవచ్చు. అందుకే పిల్లలను ఒకింత చల్లగా ఉండే ప్రదేశంలోనే ఉంచాలి. ఆటల్లో పూర్తిగా నిమగ్నమైనొయిన పిల్లలు తరచూ మంచినీళ్లు తాగకపోవచ్చు. అందుకే తరచూ వారిని పిలుస్తూ కాస్త కాస్త మంచినీళ్లు పట్టిస్తూ ఉండాలి. ఓఆర్ఎస్ అందుబాటు లేక... ఒకవేళ కొబ్బరినీళ్లు అందుబాటులో ఉంటే అవి కూడా తాగించవచ్చు.కొన్ని జాగ్రత్తలు ఇవి... పిల్లలకు పల్చటి దుస్తులు వేయాలి. మందపాటి దుస్తులు తొడగకూడదు. ∙గొడుగు వాడటం మేలే అయినప్పటికీ పిల్లలు గొడుగువాడటాన్ని పెద్దగా ఇష్టపడరు. అందుకే పిల్లలకు నేరుగా ఎండ తగలకుండా క్యాప్ తొడిగిస్తుండాలి. పిల్లలకు వాడే క్యాప్ల కలర్ లేత రంగుల్లో ఉండటం మేలు. పిల్లలు ఆటల్లో పడి నీళ్లు తాగడం విస్మరిస్తుంటారు. అలా ఆడుతున్నప్పుడు వాళ్లకు గంటా, గంటన్నర వ్యవధిలో మాటిమాటికీ నీళ్లు తాగిస్తూ ఉండాలి.బయటకు వెళ్లే ముందే కనీసం రెండు మూడు గ్లాసుల మంచినీటిని తాగించాలి. ఎప్పుడూ వాటర్ బాటిల్ వెంట ఉంచుకునేలా ప్రోత్సహించాలి. నీళ్లను ప్లాస్టిక్ సీసాల్లో ఉంచడం అంత సరికాదు. బాటిల్ వేడెక్కి అందులోని నీళ్లు వేడెక్కడం వల్ల ప్లాస్టిక్ పదార్థాల నుంచి కొద్దికొద్ది మోతాదుల్లో ప్లాస్టిక్ వెలువడి నీటితోపాటు శరీరంలోకి వెళ్లే అవకాశాలెక్కువ. ఇలా ప్లాస్టిక్ అవశేషాలు శరీరంలోకి ఇంకిపోవడాన్ని ‘లీచింగ్’ అంటారు. దీనివల్ల ఆరోగ్యానికి ఎన్నో విధాల నష్టం చేకూరుతుంది. అందుకే ప్లాస్టిక్ బాటిల్కు బదులు మంచి గాజు బాటిల్ లేదా అంత త్వరగా వేడెక్కనివ్వని ఫ్లాస్క్లు, వాటర్బాటిల్స్నే మొదటినుంచీ పిల్లలకు అలవాటు చేయాలి. ∙ఆరుబయట తిరుగుతున్నప్పటికీ వారు చెట్టు నీడలాంటి దట్టమైన నీడ ఉండే ప్రదేశాలలోనే ఆడుకునేలా చూడటం మంచిది. ∙బయటకు అనుమతించడం అనేది ఉదయం 10 గంటలకు ముందూ... సాయంత్రం 5 తర్వాతనే జరిగేలా చూడాలి. ఎందుకంటే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఎండ వల్ల ఆరుబయట రేడియేషన్ ప్రమాదం ఎక్కువగా ఉండి పిల్లల లేత శరీరాలకు నష్టం చేస్తుంది. పిల్లలు తప్పనిసరిగా ఎండకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఎండ నుంచి చర్మాన్ని కాపాడుకోడానికి కనీస సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ 20 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ‘సన్ స్క్రీన్ లోషన్స్ / క్రీమ్స్’ను ఎండలోకి వెళ్లే కనీసం 20 నిమిషాల ముందర పిల్లల చర్మంపై రాయాలి. ఎండలో ఎక్కువసేపు ఉండాల్సి వస్తుంటే ప్రతి మూడు గంటలకోమారు మళ్లీ ఒకసారి ఈ క్రీమ్ రాస్తుండాలి. పిల్లలను కారులో ఉంచి షాపింగ్ చేయడం ప్రమాదకరం. అలా ఎప్పుడూ ఆగి ఉన్న కారులో పిల్లలను ఉంచి లాక్ చేయకూడదని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. పిల్లలకు ఇవ్వకూడనివి... దాహాన్ని పెంచడం, డీ–హైడ్రేషన్ కలిగించే గుణం ఉన్నందున వేసవిలో ఉప్పును సాధ్యమైనంత తక్కువగా తగ్గించాలి. అయితే నిమ్మ వంటి షర్బత్లలో చిటికెడు వేసుకోవచ్చు. పరిమితంగా తీసుకునే ఉప్పు మజిల్క్రాంప్స్ను తగ్గిస్తుంది. ఈ సీజన్లో కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని సాధ్యమైనంతగా తగ్గించాలి. అలాగే ఆయిల్స్ కూడా వీలైనంతగా తగ్గించాలి. కాఫీ, టీ, కూల్డ్రింక్స్లో కెఫిన్ మోతాదులు ఎక్కువ. వాటిని పిల్లలకు ఇవ్వడం సరికాదు. ప్రాసెస్ చేసిన మాంసం, కేకులు, బిస్కెట్ల వంటి వాటికి దూరంగా ఉంచాలి. వాటికి బదులు తాజా పండ్లముక్కలూ, ఫ్రూట్సలాడ్స్ వంటివి ఇవ్వవచ్చు. డాక్టర్ కంచన్ ఎస్ చన్నావర్కన్సల్టెంట్ పీడియాట్రీషియన్, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్నిర్వహణ: యాసీన్ (చదవండి: World Art Day: చిన్న పెన్సిల్ కూడా గొప్ప కథను చెప్పగలదు..!) -
తమిళ న్యూ ఇయర్.. బిడ్డ పేరు రివీల్ చేసిన జెర్సీ నటుడు
కోలీవుడ్ హీరో, పార్కింగ్ ఫేమ్ హరీశ్ కల్యాణ్ గతనెల తండ్రిగా ప్రమోషన్ పొందారు. కూతురు పుట్టిందన్న శుభవార్తను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. నా జీవితంలోని అద్భుతమైన విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉందన్నాకు. తన భార్య నర్మదకు మార్చి 2న పాప పుట్టిందని సోషల్ మీడియాలో పంచుకున్నారు.తాజాగా తమ ముద్దుల కూతురికి పేరు పెట్టారు హరీశ్ కల్యాణ్, నర్మద. తమ బిడ్డ పేరును క్రియగా నామకరణం చేశారు. తమిళ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ తన బిడ్డ పేరు రివీల్ చేశారు. తమ ముద్దుల బిడ్డను ముద్దాడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు హరీశ్ కల్యాణ్ దంపతులు. ఇది చూసిన అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు. కాగా..హరీశ్ కల్యాణ్- నర్మద ఉదయకుమార్ 2022 అక్టోబర్లో పెళ్లి చేసుకున్నారు.సినిమా కెరీర్.. 2010లో వచ్చిన సింధు సామావెల్లి చిత్రంతో కోలీవుడ్కు హీరోగా పరిచయమయ్యాడు. చందమామ, పొరియాలన్, ప్యార్ ప్రేమ కాదల్, లెట్స్ గెట్ మ్యారీడ్, పార్కింగ్, లబ్బర్ పండు, డీజిల్ సినిమాలు చేశాడు. తెలుగులో జై శ్రీరామ్, జెర్సీ సినిమాల్లో సహాయక పాత్రలు పోషించాడు. కెరీర్ తొలినాళ్లలో తమిళ బిగ్బాస్ మొదటి సీజన్లో పాల్గొని సెకండ్ రన్నరప్గా నిలిచాడు. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Harish Kalyan (@iamharishkalyan) -
ప్రైవేట్ కేసు వేద్దాం.. న్యాయ సాయం చేస్తాం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాంబొట్లవారి పాలెంకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త కృష్ణార్జునరెడ్డి మంగళవారం కలిశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాననే నెపంతో తనను చెరుకుపల్లి ఎస్ఐ అనిల్కుమార్ అక్రమంగా స్టేషన్లో నిర్భందించి, విచక్షణారహితంగా లాఠీలతో కొట్టాడని.. తన శరీరంపై గాయాలను వైఎస్ జగన్కు కృష్ణార్జునరెడ్డి చూపారు.టీడీపీ నాయకుల మెప్పు పొందడానికి కొంతమంది పోలీసు అధికారులు రెచ్చిపోతున్నారని, చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తున్న పోలీసు అధికారులపై హైకోర్టులో ప్రైవేట్ కేసు వేసి బాధితులకు న్యాయం జరిగేలా చూద్దామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. కృష్ణార్జునరెడ్డిని అక్రమంగా నిర్భందించి దాడిచేసిన ఎస్ఐ అనిల్పై చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా ఎస్పీ, డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు వైఎస్ జగన్కు వైఎస్సార్సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పీటా నాగమోహన్ కృష్ణ వివరించారు. కృష్ణార్జున రెడ్డికి అవసరమైన న్యాయసహాయం వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అందిస్తుందని, అతని కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. -
హర్మూజ్ జలసంధిని మూసివేస్తారా.. ట్రంప్నకు ఇరాన్ వార్నింగ్
టెహ్రాన్ : శాంతి చర్చలు విఫలమవడంతో ఇరాన్కు వచ్చే చమురు ఆదాయాన్ని తగ్గించే లక్ష్యంగా అమెరికా హర్మూజ్ జలసంధిని బ్లాక్ చేసింది. దీంతో చమరు కోసం ఇరాన్కు వెళ్లే నౌకలు సముద్రంలోని నిలిచిపోతున్నాయి. ఫలితంగా పశ్చిమాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ స్టైల్లో అభి తొహ్ సిర్ఫ్ ట్రైలర్ హాయ్, పిక్చర్ అభి బాకీ హాయ్ అంటూ ట్రంప్నకు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయం సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. అందులో ఇరాన్ నావికాదళం ఉపయోగించే చిన్న, వేగవంతమైన క్షిపణి పడవల గురించి ప్రస్తావిస్తూ.. అవును, ఆ వేగవంతమైన క్షిపణి పడవలు వేడెక్కుతున్నాయి. ఇరాన్ నావికాదళం ‘నాశనమైపోయింది’ అని ట్రంప్ పదేపదే చెప్పడం విచిత్రంగా ఉంది. ఇప్పుడు క్షిపణుల సమూహం మిమ్మల్ని ఎంత త్వరగా కట్టడి చేయగలదో తెలుసుకోబోతున్నారు’ అని పేర్కొంది. పశ్చిమాలో యుద్ధం కారణంగా ఇరాన్ రూ.25 లక్షల కోట్లు నష్టపోయింది. ఇరాన్ను మరింత ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేలా అమెరికా హోర్ముజ్ జలసంధిని దిగ్బంధించింది. ఇందుకోసం ఇరాన్ పోర్టులు, తీరప్రాంతాల చుట్టూ 15కు పైగా యుద్ధ నౌకలను మోహరించింది. అమెరికా నౌకాదళానికి అత్యంత శక్తివంతమైన యూఎస్ఎస్ అబ్రహీం లింకన్ కూడా ఇరాన్ తీరప్రాంతంలో ఉంది. పరిస్థితులు ప్రతికూలమైతే దాడికి దిగే అవకాశం ఉంది. ఇరాన్ అణ్వాయుధాల జోలికి వెళ్లదని, వాటి తయారీకి అవసరమైన పరికరాలను సేకరించబోదని వారి నుంచి మాకు ఒక కచ్చితమైన హామీ కావాలి. ఇదే ట్రంప్ ప్రధాన లక్ష్యం. అందుకు అనుగుణంగా పాకిస్థాన్లో ఇరాన్ -అమెరికా దేశాలు శాంతి చర్చలు జరిపాయి. ఆ చర్చలు విఫలం కావడంతో ఇరాన్కు వచ్చే చమురు ఆదాయాన్ని తగ్గించే లక్క్ష్యంగా అమెరికా హర్మూజ్ జలసంధిని బ్లాక్ చేసింది. దీంతో చమరు కోసం ఇరాన్కు వెళ్లే నౌకలు సముద్రంలోని నిలిచిపోతాయి. తద్వారా చమురు అమ్ముకుని ఆర్థికంగా బలంగా ఉన్న ఇరాన్కు అమెరికా తీసుకుంటున్న చర్యలతో సతమతమవుతోంది. -
సూర్యకుమార్ యాదవ్పై వేటు!
టీమిండియాకు టీ20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్గా భారత క్రికెట్ చరిత్ర పుటల్లో తన పేరును లిఖించుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. సొంతగడ్డపై అతడి సారథ్యంలో ఈ ఏడాది భారత్ వరల్డ్కప్ ట్రోఫీని ముద్దాడింది. తద్వారా మొత్తంగా మూడుసార్లు.. వరుసగా రెండుసార్లు.. స్వదేశంలో తొలిసారి పొట్టి క్రికెట్ వరల్డ్కప్ గెలిచిన తొలి జట్టుగా నిలిచింది.ఒలింపిక్స్-2028లో ఆడటమే లక్ష్యంఇక ఈ టోర్నీకి ఆరంభం ముందు నుంచే సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కెప్టెన్సీ గురించి వదంతులు వ్యాపించిన సంగతి తెలిసిందే. సారథిగా టీమిండియాకు తిరుగులేని విజయాలు అందించినప్పటికీ.. బ్యాటర్గా అతడి ప్రదర్శన దిగజారడం ఇందుకు కారణం. అయితే, సూర్య వరల్డ్కప్ విన్నింగ్ కెప్టెన్ కావడంతో ఇక అతడికి తిరుగులేదని అభిమానులు భావిస్తున్నారు.సూర్య సైతం తాను ఇప్పట్లో రిటైర్ కాబోనని.. ఒలింపిక్స్-2028లో ఆడటమే లక్ష్యమని తెలిపాడు. అయితే, టీమిండియా యాజమాన్యం ప్రణాళికలు మాత్రం వేరుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ పర్యటన తర్వాత సూర్యను కెప్టెన్గా తప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.స్ట్రైక్రేటు మరీ దారుణంకాగా ఒకప్పుడు ప్రపంచంలోనే నంబర్ వన్ టీ20 బ్యాటర్గా కొనసాగిన సూర్యకుమార్.. కెప్టెన్సీ చేపట్టిన తర్వాత ఆటగాడిగా విఫలమవుతున్నాడు. గతేడాది అతడి స్ట్రైక్రేటు మరీ దారుణంగా 120లోపు పడిపోగా.. ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు.ఇక 2026లో మొత్తంగా నాలుగు అర్ధ శతకాలు బాదిన సూర్య.. టీ20 ప్రపంచకప్లో అమెరికాపై సత్తా చాటాడు. అయితే పెద్ద జట్లైన సౌతాఫ్రికాపై 18, వెస్టిండీస్పై 18, సెమీ ఫైనల్లో ఇంగ్లండ్పై 11, ఫైనల్లో న్యూజిలాండ్పై 0 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు.ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఐపీఎల్-2026తో బిజీగా ఉన్న టీమిండియా ఆటగాళ్లు.. తదుపరి పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడేందుకు ఇంగ్లండ్కు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్లో సూర్య బ్యాటింగ్ ప్రదర్శనపైనే అతడి భవితవ్యం ఆధారపడి ఉందని తెలుస్తోంది.ఇంగ్లండ్లో విఫలమతే అంతే సంగతులుఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు PTIతో మాట్లాడుతూ.. ‘‘సూర్యనే కెప్టెన్. అయితే, బ్యాటర్గా అతడు నిలకడగా రాణించాల్సి ఉంది. ఈ విషయంలో సెలక్టర్లకు నమ్మకం కలిగించాలి. ఇంగ్లండ్ టూర్లో అతడే కెప్టెన్.అయితే, 2028 నాటికి అతడు జట్టుతో కొనసాగాలంటే కచ్చితంగా మంచి ప్రదర్శనలు ఇవ్వాల్సిందే’’ అని పేర్కొన్నాయి. కాగా వైభవ్ సూర్యవంశీ, ఆయుశ్ మాత్రే వంటి చిచ్చరపిడుగులు టీమిండియా టీ20 జట్టు వైపు దూసుకువస్తున్నారు. వీరితో పాటు ఇప్పటికే ఎంతో మంది తమను తాము నిరూపించుకున్నారు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ ఇటు కెప్టెన్గా.. అటు బ్యాటర్గా టీ20 ఫార్మాట్లో దుమ్ములేపుతున్నాడు. ఇలాంటి తరుణంలో సూర్య ఇకనైనా తన బ్యాటింగ్పై మరింతగా దృష్టి పెడితేనే జట్టులో కొనసాగే అవకాశం ఉంటుంది.చదవండి: రాయల్స్ వైఖరిపై అసంతృప్తిలో వైభవ్ -
చిన్న పెన్సిల్ కూడా గొప్ప కథను చెప్పగలదు..!
భారతీయ కళలు గురించి ఈ తరానికి ఎన్ని తెలుసు అని అడిగితే కచ్చితంగా నీళ్లు నములుతారు. మహా అయితే ఒకటో, రెండో చెబుతారు అంతే. కానీ ఈ చిన్నారి అంత చిన్న వయసులో ఎంత గొప్పగా ఆలోచించి..చేస్తున్న మహత్తర కార్యం గురించి తెలిస్తే..శెభాష్ అని అభినందించకుండా ఉండరు. ఎందుకంటే జస్ట్ నాల్గో తరగతికే ఆ చిన్ని మనసు ఎంతో బాధ్యతగా ఆలోచించ విధానం..అందుకోసం పడుతున్న తపన ప్రతి ఒక్కర్ని కదలిస్తుంది. రేపు ఏప్రిల్ 15న ప్రపంచ కళా దినోత్సవం సందర్భంగా ఆ చిన్నారి కళా వారసత్వం కోసం చేస్తున్న కృషి గురించి సవివరంగా చూద్దామా.ఆ అమ్మాయే మన భాగ్యనగరం బేగంపేట్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న శ్రేష్ట అక్షయ్. పిల్లలందరికి నచ్చినట్లుగానే అక్షయ్కు కూడా రంగురంగుల పెన్సిళ్లు అంటే మహా ఇష్టం. ఆ ఇష్టంతోనే కొత్త కార్టూన్ డిజైన్ల పెన్సిళ్ల కోసం తెగ వెతికేది. ఒక రోజు అమ్మని అడిగింది ఇతర దేశాల్లో తయారైన పెన్సిళ్లు, ఇతర దేశాల కార్టూన్లతో ఉండే పెన్సిళ్లను ఎందుకు వాడుతున్నాం అని అమాయకంగా ప్రశ్నించింది. ఆ సందేహమే తనను విలక్షణమైన చిన్నారిగా అందరిచేత ప్రశంసలందుకునేలా చేస్తుందని అక్షయ్గానీ, ఆమె తల్లిగానీ ఆరోజు ఊహించలేదు. ఆ ప్రశ్నతో మొదలైన ఆ చిన్నారి అక్షయ్ ఆలోచన..మన కళా రూపాలపై ఆసక్తిని పెంచుకునేందుకు దారితీసింది. మనదేశంలో ఉన్న ప్రముఖమైన కళా రూపాలతో పెన్సిళ్లు ఎందుకు ఉండకూడదు అనుకుంది. అంతేగాదు తానే ఎందుకు అలాంటి పెన్సిళ్లను తీసుకురాకూడదు అనుకుంది. దీనివల్ల తనలాంటి పిల్లలందరికి మన భారతదేశ కళలు, వాటి గొప్పదనం గురించి తెలుస్తుంది కదా అని అనుకుంది. అంతేగాదు మన అందమైన కళారూపాలైన..మధుబని కళ, గోండ్ కళ, పైట్కర్ కళ, పిథోరా కళ, వార్లీ కళ వంటి కళల పేర్లను పెన్సిళ్లపై రాస్తే, అవి ప్రత్యేకంగా కనిపించడమే కాకుండా, మన గొప్ప వారసత్వం గురించి తెలుసుకోగలుగుతారని భావించింది అక్షయ్. ఆ నేపథ్యంలోనే తల్లిదండ్రుల సహాయం తీసుకుని మరి బీహార్కు చెందిన మధుబని కళ, మహారాష్ట్రకు చెందిన వార్లీ కళ, రాజస్థాన్కు చెందిన పిచ్వాయి కళ, కర్ణాటకకు చెందిన కావి కళ, రాజస్థాన్కు చెందిన బ్లూ పాటరీ కళ, మధ్యప్రదేశ్కు చెందిన గోండ్ కళ, గుజరాత్కు చెందిన పిథోరా కళ, ఆంధ్రప్రదేశ్కు చెందిన కలంకారి కళ, తెలంగాణకు చెందిన చెరియల్ కళ, తదితర భారతీయ కళారూపాలను పెన్సిళ్లపైకి తీసుకువచ్చే పనిలో పడింది. ఆ క్రమంలో డిజైనింగ్, క్రాపింగ్, ప్రింటింగ్ ఎలా చేస్తారు, వాటిని ఇంట్లో, ప్రింటింగ్ షాపుల్లో ఎలా చేస్తారు వంటి చాలా విషయాలు నేర్చుకుంది. అలా తన పేరెంట్స్ సాయంతో సొంతంగా కళారూపాలతో కూడిన పెన్సిల్ బ్రాండ్ “ఆరా పెన్సిల్స్” ఏర్పాటు చేసి, దానికో www.aurapencils.com. అనే వెబ్సైట్ని కూడా క్రియేట్ చేసింది. అక్కడ ఆన్లైన్లో కళారూపల పెన్సిళ్లు ఆర్డర్ పెట్టుకుని కొనుగోలు చెయ్యొచ్చట. తన ఆలోచన గురించి తన స్నేహితులకు కూడా చెప్పాను వాళ్లంతా కూడా మెచ్చుకున్నారని సంతోషంగా చెబుతోంది. అంతేకాదండోయ్ మన భారతీయ కళారూపాల గురించి తెలుసుకునేలా చేయడమే కాకుండా భారతదేశంలో తయారై పెన్సిళ్లనే కొనుగోలు చేసేలా ప్రోత్సహించడమే తన లక్ష్యం అంటోంది ఈ చిన్నారి అక్షయ్.(చదవండి: ఆ గాయం ఆమె లైఫ్నే టర్న్ తిప్పింది..! డాక్టర్లే ఆశ్చర్యపోయేలా..) -
షూ కోసం తల్లి నగలు అమ్మి.. ఎవరీ సాకిబ్ హుస్సేన్?
ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో చిన్నప్పటి నుంచే గ్రౌండ్లో పరిగెత్తడం మొదలుపెట్టాడు. అలా పరిగెత్తే క్రమంలో స్పైక్ షూ ఉంటే మరింత బాగా పరిగెత్తగలవని ఎవరో చెబితే విన్నాడు. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండడంతో ఎక్కడ క్రికెట్ టోర్నీ జరిగినా అక్కడ వాలిపోయేవాడు. ఎందుకంటే వాళ్లిచ్చే 500 లేదా వెయ్యి రూపాయలు స్పైక్ షూ కొనుగోలుకు ఉపయోగపడుతాయని ఆ కుర్రాడి ఆరాటం. అయితే తల్లికి విషయం తెలిసి తనకున్న నగలు అమ్మి స్పైక్ షూ కొని కొడుకు కోరిక తీర్చింది. ఇలా కష్టాల సుడిగుండాలను చిన్నతనంలోనే అనుభవించి, ఇవాళ వాటిని దాటుకొని ఐపీఎల్లో అవకాశం దక్కించుకొని రైజింగ్ స్టార్ అయ్యాడు సాకిబ్ హుస్సేన్.ఐపీఎల్ 2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) రెండో విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. 217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ ఎస్ఆర్హెచ్ బౌలర్ల ధాటికి 159 పరుగులకే కుప్పకూలి పరాజయాన్ని మూటగట్టుకుంది. రాజస్తాన్ ఓటమికి ఇద్దరు బౌలర్లు ప్రధాన కారణంగా నిలిచారు. వారిలో ఒకరు ప్రఫుల్ హింగే అయితే.. రెండో వ్యక్తి సాకిబ్ హుస్సేన్. ఇద్దరికీ ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్ కావడం, ఈ ఇద్దరు చెరో నాలుగు వికెట్లు తీయడం విశేషం. అయితే ప్రఫుల్ హింగేతో పోలిస్తే ఎకానమీ పరంగా సాకిబ్ హుస్సేన్ ఒక మెట్టు పైనే ఉంటాడు. జైస్వాల్, ఆర్చర్, ఫెరీరా, బిష్ణోయ్ వికెట్లను ఖాతాలో వేసుకున్న సాకిబ్ హుస్సేన్ 4 ఓవర్లలో 24 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఇక ప్రఫుల్ హింగే 4 ఓవర్లలో 34 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అయితే ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే మూడు వికెట్లు తీసి సంచలన ప్రదర్శన చేసిన ప్రఫుల్ హింగే గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చించుకున్నారు. కానీ అతనితో సమానంగా సాకిబ్ హుస్సేన్ ప్రదర్శనను కూడా గుర్తించాల్సిన అవసరముంది.సైన్యంలో చేరాలనుకొని..బీహార్కు చెందిన అహ్మద్ హుస్సేన్, సుబుక్తారా ఖతాన్ దంపతులకు సాకిబ్ హుస్పేన్ 2004లో జన్మించాడు. వ్యవసాయ ఆధారిత కుటుంబం కావడంతో చిన్నప్పటి నుంచే సాకిబ్ తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. అయితే ఆర్మీలో జాయిన్ అయ్యి దేశానికి సేవ చేయాలని సాకిబ్ పరితపించేవాడు. సైన్యంలో చేరేందుకు సమీప గ్రౌండ్లో రన్నింగ్కు వెళ్లేవాడు. అప్పుడే క్రికెట్ ఆడడం మొదలుపెట్టాడు. రన్నింగ్ బాగా చేయాలంటే స్పైక్ షూ అవసరమని గుర్తించిన సాకిబ్ తన ఆర్థిక పరిస్థితి గురించి అవగాహన ఉండడంతో ఇంట్లోవాళ్లను అడగడం ఇష్టం లేక టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీల్లో పాల్గొనేవాడు. వారిచ్చే 500 లేదా వెయ్యి రూపాయలు దాచుకునేవాడు. తల్లి నగలు అమ్మి..అయితే స్పైక్ షూ కొనడానికి డబ్బులు చాలా కావాలని భావించిన సాకిబ్ తన మనసులోని మాటను కన్నతల్లికి చెప్పడం, ఆ తల్లి తనకున్న కొద్దిపాటి నగలు అమ్మి కొడుకు కోరికను తీర్చింది. ఆ తర్వాత పూర్తిగా క్రికెట్పై దృష్టి సారించడంతో సాకిబ్ హుస్సేన్కు 17 ఏళ్ల వయసులో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అవకాశం లభించింది. 2022-23 సీజన్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బీహార్ తరఫున రైట్ ఆర్మ్ పేసర్గా అరంగేట్రం చేశాడు. తన రెండో మ్యాచ్లోనే 20 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి సాకిబ్ అందరి దృష్టిని ఆకర్షించాడు.ఇక 2025-26 రంజీ సీజన్లో బీహార్ తరఫున ఆడిన సాకిబ్ అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యచ్లో 41 పరుగులకే 6 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఇక ఐపీఎల్ 2024 సీజన్కు ముందు తొలిసారి సాకిబ్ వేలంలోకి వచ్చినప్పటికీ అన్సోల్డ్గా మిగిలిపోయాడు. అయితే దేశవాలీ టోర్నీల్లో 140 ప్లస్కు తగ్గకుండా బౌలింగ్ వేస్తున్న విషయాన్ని గుర్తించిన కోల్కతా నైట్రైడర్స్ ఫ్రాంచైజీ అతడిని తీసుకుంది. కానీ ఒక్క మ్యాచ్ కూడా అవకాశం రాలేదు. 2025 మెగా వేలానికి ముందు కేకేఆర్ అతడిని వదిలిపెట్టింది. వరుణ్ ఆరోన్ దృష్టిలో పడి..అయితే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా తనను తాను మరింత సాన పెట్టుకునే ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లైనప్లో కుర్రాళ్లు కావాలని వరుణ్ ఆరోన్ తన వేటను ప్రారంభించాడు. రంజీ ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్పై 6 వికెట్ల సంచలన ప్రదర్శన నమోదు చేసిన సాకిబ్ హుస్సేన్ వరుణ్ ఆరోన్ను ఆకర్షించాడు. అలా గతేడాది మినీ వేలంలో సాకిబ్ హుస్సేన్ను ఎస్ఆర్హెచ్ రూ. 30 లక్షల బేస్ ప్రైస్కు దక్కించుకుంది. తాజాగా రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టి విజయంలో కీలకపాత్ర పోషించాడు సాకిబ్ హుస్సేన్.Another debutant making his mark ✅🎥 Glimpses of Sakib Hussain’s 4/24 in his first outing in #TATAIPL 🔥Updates ▶️ https://t.co/xGTDdKbXpY#KhelBindaas | #SRHvRR | @sunrisers pic.twitter.com/ByAMDOgJiB— IndianPremierLeague (@IPL) April 13, 2026A NIGHT FOR THE DEBUTANTS! 🤩Praful Hinge and Sakib Hussain giving #TATAIPL fans a game to remember 🤜🤛Watch Hussain's spell ▶️ https://t.co/pFEeR4dHxD#KhelBindaas | #SRHvRR | @SunRisers pic.twitter.com/YBpnrflB7o— IndianPremierLeague (@IPL) April 13, 2026చదవండి: తొలి బౌలర్గా రికార్డు.. ఎవరీ ప్రఫుల్ హింగే! -
అమెరికాకు చైనా వార్నింగ్ : నాలుగు కీలక ప్రతిపాదనలు
పశ్చిమ ఆసియా (Middle East) సంక్షోభాన్ని పరిష్కరించేందుకు చైనా దౌత్యపరమైన జోక్యాలను ముమ్మరం చేసింది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తాజాగా నాలుగు అంశాల ప్రణాళికను (Four-point framework) ప్రతిపాదించారు. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ చర్చలలో పురోగతి స్తంభించిపోయిన నేపథ్యంలో,ఉద్రిక్తతలను తగ్గించి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా చైనా ఈ ప్రతిపాదన చేసింది. చైనా నాలుగు సూత్రాల ప్రణాళిక,కీలక అంశాలుజిన్హువా వార్త నివేదిక ప్రకారం అమెరికా నేతృత్వంలోని జోక్యాలకు భిన్నంగా, పశ్చిమ ఆసియాలో తన దౌత్యపరమైన ఉనికిని విస్తరించుకోవడానికి చైనా చేస్తున్న విస్తృత ప్రయత్నాలకు ఈ ప్రతిపాదనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. యుఏఈ నాయకుడు ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో జరిగిన సమావేశంలో జిన్పింగ్ ఈ ప్రణాళికను సమర్పించారు.శాంతియుత సహజీవనం , సంయమనంసార్వభౌమాధికారానికి గౌరవం ఇవ్వడం మరో కీలకమైన స్తంభమని పేర్కొంది. దేశాలు ఒకరి అంతర్గత వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదని ఈ ప్రతిపాదన నొక్కి చెబుతోంది. ప్రాంతీయ శక్తులన్నీ శాంతికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఉద్రిక్తతలను పెంచే చర్యలకు దూరంగా ఉండాలని చైనా కోరుతోంది. గొడవలను పక్కన పెట్టి దేశాల మధ్య పరస్పర అవగాహన పెరగాలని సూచించింది.సార్వభౌమాధికారానికి గౌరవంఏ దేశం కూడా ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని చైనా నొక్కి చెప్పింది. ప్రతి దేశం స్వయంప్రతిపత్తిని గౌరవించాలని ఈ ప్రణాళికలో చైనా పేర్కొందిభద్రతతో కూడిన ఆర్థిక అభివృద్ధిసుస్థిరమైన శాంతి కావాలంటే ఆర్థిక వృద్ధి కూడా అంతే ముఖ్యమనిజిన్పింగ్ అభిప్రాయపడ్డారు. భద్రత మరియు ఆర్థిక అభివృద్ధిని కలిపి ముందుకు తీసుకెళ్లాలని, దీనికోసం దేశాల మధ్య సహకారం పెరగాలని ఆయన పిలుపునిచ్చారు.అంతర్జాతీయ చట్టాల అమలుచివరి అంశం అంతర్జాతీయ చట్టంపై కేంద్రీకృతమై ఉంది. అంతర్జాతీయ నిబంధనలను అందరూ సమానంగా పాటించాలని చైనా స్పష్టం చేసింది. ప్రపంచ నిబంధనలనుఎంపిక చేసుకుని పాటించడంపై జిన్పింగ్ హెచ్చరించారు. వాటిని అమలు చేయడంలో స్థిరత్వం పాటించాలని పిలుపు నిచ్చారు. "అంతర్జాతీయ చట్ట పాలనను కాపాడాలి. 'మనకు అనుకూలంగా ఉన్నప్పుడు వాడుకోవడం, లేనప్పుడు వదిలేయడం' కుదరదని చైనా స్పష్టం చేసింది. ప్రపంచం తిరిగి అరాచక చట్టాల వైపు మళ్లడానికి అనుమతించలేం అంటూ ఆయన ఘాటుగా స్పందించారు. ఇదీ చదవండి: రూ.90 లక్షలు ఇస్తేనే ఫస్ట్నైట్ : తీవ్ర ఘర్షణ, కట్ చేస్తే!అదే సమయంలో, హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) పరిణామాలపై చైనా తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. ఈ వ్యూహాత్మక జలమార్గంలో ఆంక్షలు విధించవద్దని చైనా అమెరికాను గట్టిగానే హెచ్చరించింది. ఇరాన్తో తమ సంబంధాలలో జోక్యం చేసుకోవద్దని, ఇరాన్తో తమకు ఉన్న వాణిజ్య, ఇంధన సంబంధాలను కొనసాగిస్తామని చైనా రక్షణ మంత్రి స్పష్టం చేశారు.పశ్చిమాసియా నుండి వచ్చే ఇంధనంపై చైనా ఎక్కువగా ఆధారపడుతుంది. అందుకే ఆ ప్రాంతంలో స్థిరత్వం ఉండటం చైనా ఆర్థిక ప్రయోజనాలకు అత్యవసరం.అమెరికా నాయకత్వంలోని దౌత్యం విఫలమవుతున్న తరుణంలో, తాము ఒక నమ్మకమైన ప్రత్యామ్నాయంగా ఎదగాలని చైనా ప్రయత్నిస్తోంది. ఈ ప్రతిపాదనలకు ఆదరణ లభిస్తుందా ? ఇతర దేశాల నుండి ఎలాంటి మద్దతు లభిస్తుందో వేచి చూడాలి. ఇదీ చదవండి: పండ్లు, చిప్స్ ప్యాకెట్లతో పెళ్లి కారు ముస్తాబు : నెటిజన్లు షాక్ -
ఓటీటీకి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్.. అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్
ఓటీటీకి మరో మలయాళ క్రైమ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ రానుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన సంభవం అధ్యాయం ఒన్ను మూవీ ఈ అర్ధరాత్రి నుంచే అందుబాటులోకి రానుంది. జీతూ సతీషన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓటీటీ ప్రియులను అలరించనుంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచే జియో హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో కేవలం మలయాళంలోనే రిలీజైన ఈ సినిమా.. ఓటీటీలో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఈ చిత్రాన్ని టైమ్లూప్ కాన్సెప్ట్తో తెరకెక్కించారు. తాజాగా ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. కాగా.. ఈ మూవీలో అస్కర్ అలీ, వినీత్ కుమార్, అస్సిమ్ జమాల్, సిద్ధార్థ్ భరత్ కీలక పాత్రల్లో నటించారు. మార్చి మొదటివారంలో మలయాళంలో విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. ఈ మిస్టరీ హారర్కు తోడు టైమ్ ట్రావెల్ పాయింట్ కథతో తీర్చిదిద్దడంతో ఆడియన్స్ ఫిదా అయ్యారు. Presenting the JioHotstar official trailer of Sambhavam Adhyayam Onnu starring Askar Ali, Vineeth Kumar and Sidharth Bharathan. Streaming exclusively on JioHotstar from April 15.#SambhavamAdhyayamOnnu #Trailer #Thriller #Mystery #Drama #MalayalaMovie #JioHotstar… pic.twitter.com/BFtGtdlRGb— JioHotstar Tamil (@JioHotstartam) April 11, 2026 -
డ్రాగన్కు యుద్ధం దెబ్బ!
ప్రపంచ ఆర్థిక గమనానికి దిక్సూచిగా భావించే చైనా వాణిజ్య రంగం ప్రస్తుతం మిశ్రమ ఫలితాలను చవిచూస్తోంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ డిమాండ్పై ప్రతికూల ప్రభావం చూపడంతో మార్చి నెలలో చైనా ఎగుమతుల వృద్ధి ఆరు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. అయితే, దీనికి విరుద్ధంగా దిగుమతులు మాత్రం గత నాలుగేళ్లలో ఎన్నడూ లేని విధంగా గరిష్ట వృద్ధిని నమోదు చేయడం విశేషం. చైనా కస్టమ్స్ విభాగం విడుదల చేసిన తాజా గణాంకాలు ఈ విషయాలను వెల్లడించాయి.ఎగుమతుల్లో బ్రేక్.. దిగుమతుల్లో జోరురాయిటర్స్ విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేస్తూ చైనా ఎగుమతులు మార్చిలో కేవలం 2.5% మాత్రమే వృద్ధి చెందాయి. ఏడాది మొదటి రెండు నెలల్లో నమోదైన 21.8% వృద్ధితో పోలిస్తే ఇది భారీ పతనం. విశ్లేషకులు కనీసం 8.6% వృద్ధిని ఆశించినప్పటికీ, అంతర్జాతీయంగా తగ్గిన డిమాండ్ డ్రాగన్ ఆశలపై నీళ్లు చల్లింది. మరోవైపు, దిగుమతుల రంగం అనూహ్యంగా పుంజుకుంది. గతేడాది మార్చి నెలతో పోలిస్తే ఈసారి దిగుమతులు 27.8% పెరిగాయి. నవంబర్ 2021 తర్వాత ఇదే అత్యధిక వృద్ధి కావడం గమనార్హం. 11.2% పెరుగుదల ఉంటుందన్న అంచనాలను మించి ఈ వృద్ధి నమోదు కావడం గమనార్హం.ఇంధన షాక్ను తట్టుకునే వ్యూహంమధ్యప్రాచ్య సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తీవ్రంగా ఊగిసలాడుతున్నాయి. హార్మూజ్ జలసంధి వంటి కీలక రవాణా మార్గాల్లో ఆటంకాలు ఎదురైతే ఎగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉంది. అయితే, ఈ ముప్పును ఎదుర్కోవడానికి బీజింగ్ పటిష్టమైన బఫర్ను సిద్ధం చేసుకుంది. చైనా వద్ద ప్రస్తుతం 120 రోజులకు పైగా సరిపడా వ్యూహాత్మక చమురు నిల్వలు ఉన్నాయి. కేవలం చమురుపైనే ఆధారపడకుండా బొగ్గు, ఇతర ప్రత్యామ్నాయ ఇంధన వనరులను చైనా వేగంగా అభివృద్ధి చేస్తోంది. పెరిగిన ఇంధన ధరల భారాన్ని వినియోగదారులపై వేయకుండా ప్రభుత్వం నియంత్రిస్తోంది.అమెరికాతో తగ్గిన వాణిజ్యం..అమెరికాతో పెరుగుతున్న సుంకాల యుద్ధం, ఉద్రిక్తతల ప్రభావం గణాంకాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మార్చిలో అమెరికాకు చైనా ఎగుమతులు ఏకంగా 26.5% పడిపోయాయి. ప్రపంచ సరఫరా గొలుసులో ఇబ్బందులు, ముడి పదార్థాల ధరల పెరుగుదల కారణంగా చైనా మొత్తం వాణిజ్య మిగులు 264.3 బిలియన్ డాలర్లకు (3% తగ్గుదల) పరిమితమైంది.ముందున్న సవాలుచైనా తన మొదటి త్రైమాసిక జీడీపీ గణాంకాలను గురువారం విడుదల చేయనుంది. విశ్లేషకుల అంచనా ప్రకారం ఇది 4.8% గా ఉండొచ్చు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడింట ఒక వంతు వాటా కలిగిన చైనా ఎగుమతులు మందగించడం రాబోయే రోజుల్లో అంతర్జాతీయ వాణిజ్య సమీకరణాలను ఎలా మారుస్తుందో వేచి చూడాలి.ఇదీ చదవండి: నోటీసు లేకుండానే 300 మంది తొలగింపు! -
మౌళి-మైత్రీ మూవీస్.. ఇదేం టైటిల్?
యూట్యూబర్గా అందరికీ తెలిసిన మౌళి.. 'లిటిల్ హార్ట్స్' సినిమాతో గతేడాది హీరోగా హిట్ కొట్టాడు. అద్భుతమైన కలెక్షన్స్ అందుకున్న ఈ మూవీ.. మౌళికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. దీంతో ఇతడు తర్వాత ఎవరితో ఎలాంటి చిత్రం చేస్తాడా అని అంతా అనుకున్నారు. ఇప్పుడు ఆ విషయంపై కాస్త క్లారిటీ వచ్చినట్లు కనిపిస్తోంది.(ఇదీ చదవండి: నువ్వు లేవనే నిజం బాధపెడుతూనే ఉంది: సింగర్ చిత్ర)టాలీవుడ్లో ప్రస్తుతం బడా హీరోలందరితోనూ సినిమాలు చేస్తున్న మైత్రీ మూవీస్.. మౌళి రెండో మూవీని నిర్మిస్తోందట. శ్రీను అనే కొత్త దర్శకుడు.. ఈ చిత్రాన్ని తీయబోతున్నాడు. అయితే ఈ ప్రాజెక్టుకి 'దొంగ నా కొడుకు' అనే టైటిల్ పెట్టాలని ఫిక్సయ్యారట. ఈ మేరకు రిజిస్టర్ కూడా చేయించినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం సోషల్ మీడియా జమానాలో ట్రెండీ జనరేషన్కి ఈ టైటిల్తో పెద్ద సమస్య లేకపోవచ్చేమో గానీ ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి ఈ టైటిల్కి ఆదరణ దక్కుతుందా అంటే సందేహమే. ఈ టైటిల్పైనా సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. మరి అంతా అనుకుంటున్నట్లు ఇదే టైటిల్ పెడతారా? లేదంటే ఏమైనా మారుస్తారా అనేది చూడాలి?(ఇదీ చదవండి: రాశీఖన్నా బ్లడీ యాక్షన్.. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్) -
‘తెరచాప’: మండుటెండలో చెప్పుల్లేకుండా షూటింగ్, చాలా కష్టపడ్డారు
నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు ముఖ్యపాత్రలో నటించిన తాజా చిత్రం ‘తెరచాప’. అనన్య క్రియేషన్స్ బ్యానర్ పై కైలాష్ దుర్గం నిర్మిస్తున్న ఈ చిత్రానికి జోయల్ జార్జ్ దర్శకత్వం వహిస్తున్నాడు. రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీష్ ప్రతాప్ బండారి, జబర్దస్త్ అశోక్, నాగి కీలకపాత్రలు పోషించారు. ఏప్రిల్ 17న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంగా తాజాగా ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీ కనకాల మాట్లాడుతూ..ఈ సినిమాలో నాతోపాటు ఎందరో సీనియర్ నటులు నటించారు. అలాగే కొత్త వారు కూడా నటించారు. మండుటెండలో సముద్ర తీరాన ఇసుకలో చెప్పులు లేకుండా నటించడం అనేది ఎంతో కష్టమైన పరిస్థితి. అటువంటి పరిస్థితులలో కూడా నవీన్ రాజ్ చాలా కష్టపడి నటించారు. శారీరకంగానే కాకుండా మానసిక ఒత్తిళ్లు ఎన్ని ఉన్నా కూడా ఆయన వాటిని ఎదిరించి నిలబడ్డారు. అంత కష్టపడి నటించినా ఈ సినిమాను తన తండ్రికి అంకితం చేస్తున్నాను అని నాతో అన్నప్పుడు నేను ఎంతో ఆనందపడ్డాను.ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.దర్శకుడు సముద్ర మాట్లాడుతూ... "సముద్రతీతంగా అటువంటి పరిస్థితులలో ఒక సినిమా తీయడం అనేది ఎంతో కష్టమైన విషయం. అటువంటి సినిమాను ఈ చిత్రం బృందం అంతా కలిసి ఎంతో పట్టుదలతో పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అందరూ వీరిని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను" అన్నారు.‘సినిమా కోసం మేము సముద్ర తీరాన ఎన్నో రోజులు ఎంతో కష్టపడి అక్కడ బ్రతికే మత్స్యకారుల జీవితాలను అర్థం చేసుకొని వారిలో ఒకరిగా కలిసిపోయి చిత్రీకరించాం. ఎంతోమంది ఎన్నో కలలు కని సినిమా తీసినట్లే మేము కూడా చేశాం. మా సినిమాను ప్రేక్షకులు అంతా ఆదరించి మంచి విజయం సాధించేందుకు తోడ్పడుతారని కోరుకుంటున్నాను’ అని హీరో నవీన్రాజ్ శంకరాపు అన్నారు. -
ఇండియాలోనే ఆ సంక్షోభం?.. పీసీబీ చీఫ్నకు చివాట్లు
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీపై భారతీయ నెటిజన్లు మండిపడుతున్నారు. ‘ఇంత తేలిగ్గా అబద్ధాలు చెప్పడానికి ఏమాత్రం సిగ్గులేదా’ అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్, భారత్పై పడి ఏడ్వటం మానేసి పాకిస్తాన్ సంగతి చూసుకుంటే బాగుంటుందని హితవు పలుకుతున్నారు.అసలు ఏం జరిగిందంటే.. ఐపీఎల్కు దరిదాపుల్లో కూడా లేకపోయినా పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)ను అదే స్థాయిలో ప్రమోట్ చేయాలని పీసీబీ చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. ఐపీఎల్కు పోటీగా మార్చిలోనే ఈ లీగ్ను నిర్వహిస్తుండగా.. ప్రసార హక్కుల విషయంలో ఈ రెండింటికీ నక్కకీ నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.నాలుగు సీజన్లకు సమానంఐపీఎల్లో కేవలం ఏడు మ్యాచ్ల మీడియా హక్కుల విలువ పీఎస్ఎల్ నాలుగు సీజన్లకు సమానంగా ఉంటుందంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ ఐపీఎల్తో పోలుస్తూ పాక్ మాజీ క్రికెటర్లు, పీసీబీ చీఫ్ నఖ్వీ పీఎస్ఎల్ను పొగుడుకుంటూ ఉంటారు.ఇక తాజా సీజన్పై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం గట్టిగానే పడింది. దీంతో పాక్లో చమురు సంక్షోభం తలెత్తగా ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ఫలితంగా స్టేడియాల్లో ప్రేక్షకులు లేకుండానే కేవలం కరాచీ, లాహోర్లో మాత్రమే పీఎస్ఎల్ మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. మరోవైపు.. ఐపీఎల్ అన్ని వేదికల్లోనూ సజావుగా మ్యాచ్లు సాగుతుండగా.. ప్రేక్షకులు స్టేడియాలకు పోటెత్తుతున్నారు.అర్థం చేసుకోవాలిఇలాంటి తరుణంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్లకు ప్రేక్షకులను స్టేడియానికి ఎప్పుడు అనుమతిస్తారు అనే ప్రశ్న ఎదురుకాగా.. మొహ్సిన్ నఖ్వీ ఇచ్చిన సమాధానం వైరల్ అవుతోంది. ‘‘ఈరోజే నేను పీఎస్ఎల్ జట్ల యజమానులు, ఆటగాళ్లతో మాట్లాడాను.కరాచీ కింగ్స్ కూడా ఈ విషయం గురించి మమ్మల్ని రిక్వెస్ట్ చేసింది. నేను ప్రధానిని కలిసి ఈ విషయంలో సానుకూలంగా స్పందించాల్సిందిగా కోరతాను. అయితే, ప్రస్తుతం చుట్టుపక్కల దేశాల్లో పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి.అంతటా ఇంధన సంక్షోభం ముదిరింది. ఓవైపు మా ప్రధాని మాత్రం ఇరాన్- అమెరికా యుద్ధానికి చరమగీతం పాడి శాంతివైపు మొగ్గుచూపేలా ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయి.ఇండియాలో పరిస్థితి ఘోరంగా ఉందిమా ప్రధాని అదే పనిమీద ఉన్నారు. ఇండియాలో పరిస్థితి ఘోరంగా ఉంది. అక్కడ చమురు సంక్షోభం ఎక్కువైంది. పెట్రోల్ పంపుల్లో బారులు తీసిన వాహనాలను చూస్తుంటే పరిస్థితిని అంచనా వేయొచ్చు’’ అని నఖ్వీ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో నెటిజన్లు అతడికి చురకలు అంటిస్తున్నారు.‘‘అవును.. పాకిస్తాన్లో అసలు ఎలాంటి సంక్షోభం లేదు. ఇండియాలో అయితే నేను ఈరోజు సాయంత్రం.. 45 లీటర్ల పెట్రోల్ కొట్టించుకోవడానికి మూడు నిమిషాలు పట్టింది. ఎంత పెద్ద సంక్షోభమో’’ అంటూ నఖ్వీకి కౌంటర్లు ఇస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. చదవండి: ఐసీసీ చైర్మన్గిరిపై నఖ్వీ అధికారిక ప్రకటనPakistan's effort is to establish peace. There is a petrol shortage in India, whereas there is no such issue in Pakistan. I will request the Prime Minister to allow spectators to attend the PSL matches." Mohsin Naqvi Chairman PCB#Pakistán #Cricket #PakistanShapesPeace #india pic.twitter.com/oxEJV9MvLY— Ali Hasan 🏅 (@AaliHasan10) April 13, 2026 -
ప్రభాస్ స్పిరిట్.. భారీ ధరకు ఓటీటీ డీల్..!
ప్రభాస్- యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తోన్న యాక్షన్ మూవీ స్పిరిట్. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీ ప్రభాస్ కెరీర్లో 25వ సినిమాగా నిలవనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ టాలీవుడ్లో వైరల్గా మారింది.రూ.250 కోట్ల ఆఫర్..!ఈ సినిమా డిజిటల్ రైట్స్కు సంబంధించిన క్రేజీ టాక్ వినిపిస్తోంది. స్పిరిట్ ఓటీటీ డీల్ భారీ ధరకు కుదిరినట్లు తెలుస్తోంది. డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ దాదాపు రూ.250 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ డీల్పై నిర్మాణ సంస్థ కానీ.. ఓటీటీ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.మరోవైపు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా దక్కించుకున్నట్లు సమాచారం. టాలీవుడ్ చరిత్రలోనే భారీ ధరకు ఈ సినిమా రైట్స్ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.కాగా.. ఈ చిత్రంలో ప్రభాస్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీని ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీని 2027 మార్చి 5న రిలీజ్ చేయనున్నట్లు ముందే ప్రకటించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు జపనీస్, కొరియన్ భాషల్లో కూడా స్పిరిట్ విడుదల కానుంది. -
బిహార్ కొత్త సీఎం ఈయనే.. అధికారిక ప్రకటన
పట్నా: బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ మంగళవారం రాజీనామా చేయడంతో కొత్త ముఖ్యమంత్రిగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సామ్రాట్ చౌదరి పేరును ఎన్డీఏ ప్రకటించింది. పట్నాలో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ శాసనసభ పక్ష నాయకుడిగా సామ్రాట్ చౌదరిని ఎన్నుకున్నారు.సామ్రాట్ చౌదరి బిహార్ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకోనున్నారు. త్వరలో గవర్నర్ను కలిసి తదుపరి ప్రభుత్వం ఏర్పాటుకు విజ్ఞప్తి చేయనున్నారు. బుధవారం (ఏప్రిల్ 15న) సీఎంగా సామ్రాట్ చౌదరి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.సామ్రాట్ చౌదరి ఎవరు? సామ్రాట్ చౌదరి 1968 నవంబర్ 16న ముంగేర్ జిల్లాలో జన్మించారు. ఆయనకు బలమైన రాజకీయ వారసత్వం ఉంది. ఆయన తండ్రి శకుని చౌదరి తారాపూర్ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తల్లి పార్వతీ దేవి 1998లో అదే స్థానంలో అప్పటి సమతా పార్టీ తరఫున గెలిచారు. గత 12 ఎన్నికల్లో 9 సార్లు తండ్రి, తల్లి, కుమారుడు కలిసి ఆ స్థానంలో గెలిచారు.సామ్రాట్ చౌదరికి 57 ఏళ్లు 1990లో రాజకీయ ప్రవేశం చేశారు. 1999లో లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి ప్రభుత్వం నడిపిన సమయంలో, బీజేపీ మిత్రపక్షంగా ఉన్నప్పుడు సామ్రాట్ వ్యవసాయ మంత్రి అయ్యారు. 2000, 2010 ఎన్నికల్లో పర్బట్టా అసెంబ్లీ స్థానంలో గెలిచారు. 2010లో బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చీఫ్ విప్గా ఉన్నారు. 2023 మార్చి నుంచి 2024 జూలై వరకు బీజేపీ బిహార్ యూనిట్ అధ్యక్షుడిగా పనిచేశారు. రాష్ట్రంలో క్రీడలు, ఆర్థిక, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి-గృహ నిర్మాణ శాఖల మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.సీఎం పదవికి అవసరమైన రాజకీయ, పరిపాలనా అనుభవం ఆయనకు ఉంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు వంటి అన్ని అంశాల్లో అనుభవం ఉంది. ఆయన కుశ్వాహా సామాజిక వర్గానికి చెందినవారు. ఇది రాష్ట్ర జనాభాలో సుమారు 4.3 శాతం. బిహార్లో యాదవుల తర్వాత అతిపెద్ద ఓబీసీ వర్గం ఇదే. -
లోక్సభ స్థానాలు 850కి పెంపు.. కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: 131వ రాజ్యాంగ సవరణకు కేంద్రం సిద్ధమైంది. ఇందులో భాగంగా లోక్సభ స్థానాలపై కీలక నిర్ణయం తీసుకుంది.లోక్సభ స్థానాలను 850కి పెంచాలని ప్రతిపాదించింది. ఇందులో రాష్ట్రాలకు 815, కేంద్ర పాలిత ప్రాంతాలకు 35 స్థానాలు కేటాయించేలా ప్రణాళిక రూపొందించింది. లోక్సభ స్థానాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించనుంది. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ప్రతిపాదనలను ఎంపీలకు తెలియజేసింది.ఈ నెల 16 నుంచి 18 వరకు ప్రత్యేక లోక్సభ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్పై చర్చ జరగనుంది.ప్రస్తుతం దేశంలో మొత్తం 543 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అందులో 530 స్థానాలు రాష్ట్రాలకు, 13 స్థానాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు కేటాయించబడ్డాయి. ఇప్పుడు ఆ మొత్తాన్ని పెంచేలా నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం ప్రతిపాదనలు ఎంపీలకు అందించింది. -
ఆ గాయం ఆమె లైఫ్నే టర్న్ తిప్పింది..! డాక్టర్లే ఆశ్చర్యపోయేలా..
ఏదైనా అనారోగ్యం లేదా గాయల పాలైతే భయపడిపోకుండా ధైర్యం కూడగట్టుకుని చికిత్స తీసుకోవాలి. అవసరమైతే స్నేహితులు, సన్నిహితుల మద్దతు తీసుకోవాలి. కానీ కొన్ని గాయాలు మనల్ని ఎంతగా కుంగదీస్తాయంటే..ఇక అయిపోయింది లైఫ్ అన్నట్లుగా ఉంటాయి. డాక్టర్లు కూడా చేతులెత్తేస్తారు. అలాంటి సమయంలో కూడా తెగువతో బతికిచూపడమే గాక..విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరుతెచ్చుకుంటోంది ఈ ధీర వనిత.ఆ ధైర్యవంతురాలే పల్లవి కుమార్ అగర్వాల్గా పిలిచే మీరా. ఆమె జీవితం ఎన్నో మలుపులు, ఎత్తుపల్లాలు చవిచూసింది. మీరా పాట్నాకి చెందిన మహిళ. ఆమె ఎక్కువగా విదేశాల్లో పర్యటిస్తుంటుంది. ఆ సమయంలో పూర్తి స్థాయి మాంసాహారి. ఫిట్నెస్, వ్యాయామాలపై విపరీతమై ఆసక్తి కూడా. ఆమె పెద్ద కార్పొరేషన్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్గా డిజైన్ అండ్ ప్రొడక్ట్ హెడ్గా అత్యంత ఒత్తిడితో కూడిన షెడ్యూల్ని నిర్వహిస్తూనే మారథాన్లలో పరిగెత్తేవారు. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పాటించేవారు. కానీ ఆ రోజు ఆమె మోకాలికి అయిన గాయం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసేలా ఓ మలుపు తిప్పింది. ఆ మోకాలి గాయం ఆమెను మళ్లీ జీవితంలో నడవనివ్వకుండా చేసింది. డాక్టర్లు కూడా చేతులెత్తేశారు. కొన్ని రకాల వ్యాయామాలు, మందులతో రెండు అడుగులు వేయొచ్చు అంతే తప్ప సరిగ్గా నడవడం గానీ పరిగెత్తడం వంటివి చేయలేవని తేల్చేశారు. దాంతో మీరా ఆ గాయం క్యూర్ అయ్యేలా పలు రకాల చికిత్సల కోసం లక్షలు లక్షలు ఖర్చు పెట్టింది, లెక్కలేనన్ని మందుల మింగింది. అప్పడు మీరా తీవ్ర నిరాశ నిస్ప్రుహలకు గురయ్యింది. జీవితమంతా వ్యాయామాలు చేసి ఎంతో హెల్దీగా ఉండే మీరాకి నడవలేవని చెబుతున్న మాటలను జీర్ణించుకోలేకపోయింది. అప్పుడే ఆమె తనలా తీవ్రమైన గాయాల బారినపడి తిరిగి అథ్లెట్లుగా దూసుకొచ్చిన మహిళల ఉదంతాలు చదవడం ప్రారంభించింది. అంతేగాదు ఆ మహిళల జీవితాలు, వారి లైఫ్స్టైల్ గురించి క్షణ్ణంగా చదివేది. 'ది గేమ్ ఛేంజర్స్' అనే నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ మీరాని ఎంతగానో ప్రభావితం చేసింది. దాంతో మీరా ఇదివరికటిలా యాక్టివ్గా మారింది. అంతేగాదు పాలు, మాంస ఉత్పత్తులను పూర్తిగా మానేసి..పూర్తిగా సాంప్రదాయ భారతీయ ఆహారానికి మారింది. తన భోజనంలో రాగి, కొబ్బరి, చిరుధాన్యాలు, పప్పులను చేర్చుకోవడం ప్రారంభించిది. చెప్పాలంటే పూర్తి శాకాహారిగా మారిపోయింది. అలాగే రకరకాల వంటకాలప ప్రయోగాలు ప్రారంభించి సొంతంగా రాగిపాలు, కొబ్బరి మజ్జిగను తయారు చేయడం ప్రారంభించింది. ఈ కొబ్బరి పానీయాన్ని తన కుటుంబసభ్యులు కూడా ఇష్టపడతారని అంటోంది. అంతేగాదు ఇవి క్రమం తప్పకుండా తీసుకుంటే రక్త పరీక్ష ఫలితాల్లో అద్భుతాన్నే చూడొచ్చని అంటోంది. గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని అంటోంది. వీటితోపాటు ఆహారంలో హలీమ్ లడ్డూలు, నట్స్, వివిధ సీడ్స్ వంటివి కూడా ఆహారంలో భాగం చేసుకుంది. అయితే బేకరీ స్వీట్లు, కేక్లు, కుకీలకు దూరమైపోయింది. ఆమెకు కాఫీ తోపాటు వాటిని తినే అలవాటు ఉండటంతో..మళ్లీ బేకరీ ఉత్పత్తులను హెల్దీగా చేయడంపై దృష్టి సారించి పలు రకాల వంటకాలు చేసింది. అవన్నీ పాలు, వెన్నకు బదులు, నట్ బటర్లు, కోల్డ్ప్రెస్ నూనెలు, శాకాహార పాలతోనే చేసేది. పైగా ఆమె వంటకాల రుచికి ఫిదా అవ్వతూ స్నేహితులు, బంధువులు బేకరీని ప్రారంభించమని ప్రోత్సహించారు. అలా 'ఇడున్' అనే బేకరీని ప్రారంభించింది. అయితే ఆమె ఏమి చెఫ్ స్పెషలిస్ట్ కాదు. అయినప్పటికీ కుకీలను ఎంతో రుచికరంగా, పోషకమైనవిగా తయారు చేయడం ఆమె స్పెషాల్టీ. అలాగే ఆయుర్వేదం చక్కెరను చెడ్డదిగా చెప్పదని, తీసుకోవాల్సిన విధంగా మితంగా తీసుకుంటే మంచిదేనని అంటోంది మీరా. ఆమె ఆయుర్వేద సూత్రాలు పాటిస్తూ..తిరిగి హెల్దీగా ఉండేలా కేర్ తీసుంటోంది కూడా. అంతేగాదు అక్కడితో మీరా ప్రస్థానం ఆగిపోలేదు. తిరిగి నడవలేవు అన్న డాక్టర్లే ఆశ్చర్యపోయేలా లడఖ్ మారథాన్లో పాల్గొని నిర్దేశించిన సమయాని కంటే ముందుగానే పూర్తి చేసి శెభాష్ అనిపించుకుంది. తన అవరోధాన్ని, పరిమితులను ధిక్కరించేలా ఎవరెస్టు బేస్ క్యాంప్లకు ట్రెక్కింగ్ చేయడం, ఆరు వేల మీటర్ల ఎత్తులో ఉన్న యూనం పర్వతాన్ని అధిరోహించడం, ఐదు వేల మీటర్ల ఎత్తులో ఉన్న ఫ్రెండ్షిప్ పీక్ను జయించడం వంటివి చేసింది. కష్టాలు, గాయాలు మనల్ని కోలుకోనీయకుండా చేయొచ్చేమో గానీ మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకూడదు, తిరిగి విధికే ఛాలెంజ్ విసిరేలా నిలదొక్కుకోవాలనే సారాంశం మీరా స్టోరీ చెబుతోంది కదూ..!.(చదవండి: అరుదైన 'కొడాలి కరుప్పూర్ చీర'లో కంగనా రనౌత్..! ఆ శారీ ప్రత్యేకతలివే..) -
రెండు లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు?: మార్గాని భరత్
సాక్షి, తాడేపల్లి: జయంతికి, వర్ధంతికి తేడా తెలియని వ్యక్తి నారా లోకేష్.. అలాంటి వ్యక్తి రెడ్బుక్ పేరుతో ఏపీలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ దుయ్యబట్టారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నోటికొచ్చినట్టు మాట్లాడవద్దంటూ మంత్రి పార్థసారథిని హెచ్చరించారు. అమరావతి కోసం వేలకోట్లు అప్పులు చేస్తారా?. నీళ్లు ఎత్తిపోసే రాజధాని ప్రపంచంలో అమరావతి మాత్రమే. రెండు లక్షల కోట్లు ఎక్కడ్నుంచి తెస్తారు?’’ అంటూ మార్గాని భరత్ ప్రశ్నించారు.‘‘అది అసాధ్యం కాబట్టే వైఎస్ జగన్ మావిగన్ ప్రతిపాదన తెచ్చారు. మంత్రులకు సింగపూర్లో శిక్షణా తరగతులు అంట. అవినీతి చేసి జైలు పాలయిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్తో శిక్షణ ఇప్పిస్తారా?. గతంలో అమరావతి రైతులను కూడా ఇలాగే సింగపూర్ తీసుకెళ్లారు. ఆ తర్వాత అమరావతిలో గ్రాఫిక్స్ చూపించి నట్టేట ముంచారు. రాధాకృష్ణ ఉన్మాదాన్ని సమర్థించిన వ్యక్తులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్. వీళ్లు మరింత ఉన్మాదంతో వ్యవహరిస్తూ వైఎస్ జగన్ కుటుంబ సభ్యుల మీద ట్రోల్స్ చేస్తున్నారు’’ అంటూ మార్గాని భరత్ దుయ్యబట్టారు.‘‘కొన్ని ఫేక్ ఛానల్స్తో ఉన్మాదపు ట్రోల్స్ చేస్తున్నారు. నారా లోకేష్.. అధికారం శాశ్వతం కాదు. మీరు చేసే ఆర్గనైజ్డ్ క్రైం మీకే ఇబ్బంది పెడుతుందని గుర్తించాలి. డైవర్షన్ రాజకీయాల కోసం ఏం చేసినా సహిస్తామనుకోవద్దు. మావిగన్ ప్రతిపాదనపై అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభిస్తోంది. రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసేకంటే మావిగన్ బెటర్ అన్న చర్చ జరుగుతోంది...అమరావతిలో రాజధాని కడితే నయా రాయపూర్, గాంధీనగర్ లాగ అవుతుంది. సాయంత్రం అయితే అధికారులు విజయవాడ, గుంటూరు వెళ్తారేగానీ అమరావతిలో ఎవరూ ఉండరు. జనంలేని అమరావతిలో రాజధాని కడతారా?. జనం ఉన్న మావిగన్లో రాజధాని నిర్మిస్తారా?. అమరావతి ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ తెలియదు. అసలు ఇప్పటితరం అమరావతిని చూడలేదు’’ అంటూ మార్గాని భరత్ వ్యాఖ్యానించారు. -
నోటీసు లేకుండానే 300 మంది తొలగింపు!
ఐటీ రంగంలో మానవీయ విలువలకు, గ్రామీణ ప్రతిభకు పెద్దపీట వేస్తుందని పేరున్న ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ‘జోహో’లోనూ లేఆఫ్స్ కలకలం రేపుతున్నాయి. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే దాదాపు 300 మంది ట్రైనీలను కంపెనీ ఒక్కసారిగా విధుల్లోంచి తొలగించినట్లు తెలుస్తోంది. టెక్ నిపుణుల వేదిక ‘బ్లైండ్’లో బాధిత ఉద్యోగి ఒకరు చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఏం జరిగింది? ఈ నిర్ణయానికి కారణమేంటి?బాధితుడి కథనం ప్రకారం.. కంపెనీలో అంతర్గతంగా జరిగిన కొన్ని పరిణామాలే ఈ తొలగింపులకు కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఒక సీనియర్ ఉద్యోగి, ‘మీరు మమ్మల్ని (అనుభవజ్ఞులను) తీసేసి తక్కువ జీతానికే వచ్చే ట్రైనీలతో ఖాళీలు భర్తీ చేయాలని చూస్తున్నారా?’ అని యాజమాన్యాన్ని ప్రశ్నించినట్లు సమాచారం. ఈ చర్చ జరిగిన కొద్ది రోజుల్లోనే ఫ్రెషర్లను భర్తీ చేస్తున్నారనే అపవాదు పోగొట్టుకోవడానికి కంపెనీ ఏకంగా 300 మంది ట్రైనీలను తొలగించిందని సదరు యూజర్ ఆవేదన వ్యక్తం చేశారు.ఫ్రెషర్ల ఆవేదన‘నేను ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం నుంచి వచ్చాను. ఈ ఉద్యోగం నాకు కెరీర్తోపాటు నా కుటుంబానికి జీవనాధారం. టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలను వదులుకుని జోహోలో చేరాను. అక్కడైతే కనీసం బెంచ్ మీద ఉన్నా భద్రత ఉండేది. ఇక్కడ కనీసం నోటీసు పీరియడ్ కూడా ఇవ్వకుండా రోడ్డున పడేశారు’ అని ఒక బాధిత యువకుడు ‘బ్లైండ్’లో వాపోయాడు.వెంబు మాటలకు, చేతలకు పొంతన లేదు!జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు తరచుగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, చిన్న పట్టణాల నుంచి ప్రతిభను వెలికితీయడం గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని బాధితులు విమర్శిస్తున్నారు. ‘చిన్న పట్టణాల నుంచి నియామకాలు చేపడుతున్నామని గొప్పగా చెప్పుకోవడం కాదు, వివరణ లేకుండా వందలాది మంది యువత భవిష్యత్తును దెబ్బతీయడం ఏ రకమైన సంస్కృతి?’ అని బాధితులు ప్రశ్నిస్తున్నారు.టెక్ వర్గాల్లో తీవ్ర నిరసనఈ వ్యవహారంపై గూగుల్, గోల్డ్మన్ సాక్స్, హెచ్పీ వంటి దిగ్గజ సంస్థల ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘300 మంది కెరీర్లతో ఆటలాడటం దారుణం. ఫ్రెషర్లను పావులుగా వాడుకుంటున్నారు’ అని గోల్డ్మన్ సాక్స్లో పనిచేసే ఒక ఉద్యోగి వ్యాఖ్యానించారు. ‘అంతర్గత రాజకీయాల క్రాస్ఫైర్లో ఎప్పుడూ అమాయక ఫ్రెషర్లే బలిపశువులవుతున్నారు’ అని మరొకరు పేర్కొన్నారు.కంపెనీ స్పందన కోసం నిరీక్షణఈ ఆరోపణలపై వివరణ కోరుతూ జోహో సంస్థకు కొన్ని మీడియా సంస్థలు ఈమెయిల్ పంపాయని తెలుస్తుంది. అయితే దీనిపై కంపెనీ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ అంశాలను కంపెనీ అధికారికంగా ధృవీకరించలేకపోయినా, సోషల్ మీడియాలో వస్తున్న వరుస పోస్టులు మాత్రం ఐటీ నిపుణుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.ఇదీ చదవండి: ‘మధ్య తరగతి’ బండి సాగేదెలా? -
పండ్లు, చిప్స్ ప్యాకెట్లతో పెళ్లి కారు ముస్తాబు : నెటిజన్లు షాక్
వివాహ వేడుక అనగానే పూలపందిరి, పట్టుబట్టలు, బాజీ భజంత్రీలు, ఫోటోలు, వీడియోలు ఇవన్నీచాలా కామన్.అలాగే పెళ్ళి పెళ్లి కారును రకరకాల పూలతో అందంగా అలంకరించుకోవడం కూడా సాధారణం. కానీ ఒక పెళ్లి కారును వెరైటీగా అలంకరించడం విశేషంగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట సందడిగా మారింది. అందరిలాగా మనమూ చేస్తే, మన స్పెషల్ ఏమిటి అనుకున్నారో ఏమోగానీ సాంప్రదాయ పూల అలంకరణలకు భిన్నంగా, ఒడిశాకు చెందిన ఒక వరుడు తమ పెళ్లి కారు అలంకరణలో ఒక కొత్త ట్రెండ్ సృష్టించారు. పూలతో పాటు తన కారును రంగురంగుల ద్రాక్ష గుత్తులు, ఆరెంజ్, పైనాపిల్, ఆపిల్స్ ఇలా రకరకాల పండ్లతో రంగు రంగులతో అదిరిపోయేలా ఎంతో శ్రద్ధగా అలంకరించారు. కారు విండ్షీల్డ్, బాడీ అంతా పండ్లతో నింపేశారు. రొటీన్గా పూలతో కాకుండా పళ్లతో అలంకరించిన పెళ్లి కారు ముస్తాబు చూసిన స్థానికులు తమ ఫోన్లలో వీడియోలు తీసుకున్నారు. ఈ వినూత్న ట్రెండ్ ఇప్పుడు ఇంటర్నెట్లో హాట్ టాపిక్గా మారింది. View this post on Instagram A post shared by FeelKarkeDekho (@feel_karkedekho) ఒక మేరకు పళ్లు వరకు ఒకే.. కానీ ఏకంగా స్నాక్స్ ప్యాకెట్లతో డెకరేట్ చేసిన వైనం కూడా మళ్లీ నెట్టింట సందడి చేస్తోంది. 2019లో ఒడిశాకు చెందిన వరుడు తన కారును వందలాది చిప్స్, కుర్కురే ప్యాకెట్లతో అలంకరించాడు. ఏదో పచారీ షాపులో వేలాడదీసినట్లుగా ఈ ప్యాకెట్లను వరుసగా అతికించారు. ఈ వీడియోలపై నెటిజన్ల స్పందన మిశ్రమంగా ఉంది. కొందరు ఫన్నీ కామెంట్స్ చేయగా, వెర్రి వేయిరకాలు అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. -
హైదరాబాద్లో ఘనంగా ఖాల్సా సాజ్నా దివస్
హైదరాబాద్: ఖాల్సా పంథ్ స్థాపనకు గుర్తుగా జరుపుకునే “వైశాఖి” పండుగను తెలంగాణ సిక్కు సమాజం మంగళవారం భక్తి, శ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించింది. అమీర్పేట్లోని గురుద్వారా సాహెబ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య కార్యక్రమాలను అమీర్పేట్లోని శ్రీ గురు గోబింద్ సింగ్ జీ క్రీడా మైదానంలో నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది సిక్కు భక్తులు, ఇతర మతాల ప్రజలు “విశాల్ దీవాన్” (మహా సభ)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ రాగీ జథాలు, కథాకారులు గురుబాణీ కీర్తనలు, ధార్మిక ఉపన్యాసాలు ఇచ్చారు.వారు గురు గ్రంథ్ సాహిబ్ బోధనలు, ఖాల్సా పంథ్ స్థాపన విశిష్టత, జీవన విలువల ప్రాముఖ్యతపై వివరించారు. జాతీయ ఐక్యత, సౌభ్రాతృత్వం, సామరస్యాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాయ్ ఎస్.గురుదేవ్ సింగ్ (ఆస్ట్రేలియా), జ్ఞాని గగన్దీప్ సింగ్ జీ (పట్నా సాహిబ్), భాయ్ ఎస్. మన్ప్రీత్ సింగ్ జీ (ఢిల్లీ), భాయ్ వీర్ సింగ్ (హైదరాబాద్) తదితర ప్రముఖులు గురుబాణీ కీర్తనలు, కథలు వినిపించారు.గురుద్వారా సాహెబ్ అమీర్పేట్ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ఎస్.దర్శన్ సింగ్, ప్రధాన కార్యదర్శి ఎస్. సురేందర్ సింగ్ రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులను ఆహ్వానించారు. కార్యక్రమం అనంతరం భక్తులందరికీ సంప్రదాయ “గురు కా లంగర్” (ఉచిత భోజనం) వడ్డించారు.రంగురంగుల నగర్ కీర్తన్ నిర్వహణసాయంత్రం గురుద్వారా సాహెబ్ అమీర్పేట్ నుంచి భారీగా నగర్ కీర్తన్ (పవిత్ర ఊరేగింపు) ఉంటుంది. ఈ ఊరేగింపు గ్రీన్లాండ్స్, బేగంపేట్, పంజాగుట్ట ప్రధాన మార్గాల మీదుగా తిరిగి గురుద్వారాకు చేరుకుంటుంది. ఈ సందర్భంగా శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ను అలంకరించిన వాహనంలో ప్రతిష్ఠాత్మకంగా తీసుకెళ్తారు. నిశాన్ సాహిబ్ పతాకదారులు ముందుండగా, యువత గట్కా (సిక్కు యోధ కళ) ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుంటాయి. కీర్తన బృందాలు శబ్ద కీర్తనలు ఆలపిస్తారు. బుధవారం (ఏప్రిల్ 15) రాత్రి 9 గంటల నుంచి ఉదయం 1.30 గంటల వరకు అమీర్పేట్లోని గురు గోబింద్ సింగ్ జీ క్రీడా మైదానంలో “వైశాఖి రేన్ సబాయ్ కీర్తన్ దర్బార్” నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ రాగీ జథాలు శబ్ద కీర్తనలు ఆలపించనున్నారు. -
రాశీఖన్నా బ్లడీ యాక్షన్.. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్
టాలీవుడ్ హీరోయిన్ రాశీఖన్నా ఓ వైపు సినిమాలు చేస్తున్నప్పటికీ మరోవైపు ఓటీటీలోనూ పలు వెబ్ సిరీస్లు చేస్తూ బిజీగానే ఉంది. గతంలో ఫర్జీ, రుద్ర సిరీస్ల్లో కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు క్రేజీ యాక్షన్తో అలరించేందుకు సిద్ధమైపోయింది. ఈ మేరకు స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఈ సిరీస్ సంగతేంటి? ఎప్పుడు ఎందులోకి రాబోతుంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)ర్యాపర్ కింగ్.. నటుడిగా పరిచయమవుతున్న సిరీస్ 'లుక్కే'. రాశీఖన్నా, పాలక్ తివారి, శివాంకిత్, లక్ష్య్ వీర్ శరణ్ తదితరుల ప్రధాన పాత్రలు చేస్తున్నారు. మ్యూజికల్ యాక్షన్ డ్రామాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. హిమాంక్ గౌర్ దర్శకుడు. పంజాబ్లోని ర్యాప్ కల్చర్, డ్రగ్ సిండికేట్, రివేంజ్ తదితర అంశాలతో దీన్ని తీశారు. వచ్చే నెల 8 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ కానుంది. తాజాగా రిలీజ్ డేట్ ప్రకటించారు. తెలుగులోనూ అందుబాటులోకి రావొచ్చు.రాశీఖన్నా టాలీవుడ్ కెరీర్ విషయానికొస్తే.. గతేడాది 'తెలుసు కదా' అనే మూవీ చేస్తే ఘోరంగా ఫ్లాప్ అయింది. గత నెలలో 'ఉస్తాద్ భగత్ సింగ్'తో వస్తే ఇది కూడా అదే ఫలితాన్ని అందుకుంది. పవన్ సినిమాలో హీరోయిన్గా చేస్తే అయినా ఫేట్ మారుతుందనుకుంటే.. ఈమె పాత్ర తీరుతెన్నులకు మరింత ట్రోలింగ్కి గురైంది. ఇప్పుడీ సిరీస్తో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: నువ్వు లేవనే నిజం బాధపెడుతూనే ఉంది: సింగర్ చిత్ర)ab rap aur badla bolega…out loud 🎤🔥#LukkheOnPrime, New Series, May 8 #King #RaashiKhanna #LakshvirSaran #PalakTiwarii #ShivankitParihar #NakulSahdev #KritikaBhardwaj @himankgaur #OptimystixEntertainment #WhiteGuerrilaLLP #VipulDShah @bahlrajesh #AgrimJoshi… pic.twitter.com/hEnvfRqdPN— prime video IN (@PrimeVideoIN) April 14, 2026 -
వాళా-2 సూపర్ హిట్.. పార్ట్-3 అధికారిక ప్రకటన
ఇటీవల విడుదలైన మలయాళ చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. సవిన్ దర్శకత్వంలో వచ్చిన వాళా-2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్ మూవీ రిలీజైన పది రోజుల్లోనే టాప్-6లో నిలిచింది. మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో ఆరో స్థానం సాధించింది. ఏప్రిల్ 2న రిలీజైన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 163.50 కోట్లు వసూలు చేసింది. ఈ కలెక్షన్స్తో ప్రముఖ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ 'ది గోట్ లైఫ్' మూవీని అధిగమించింది.ఈ నేపథ్యంలో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది నుంచి వాళా-3 మూవీని తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ అధికారికంగా వెల్లడించింది. ఈ మూవీకి వాళా-3.. ఏ బయోపిక్ ఆఫ్ బిలియన్ గర్ల్స్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రానికి విపిన్ దాస్ కథను అందించనుండగా.. విశ్వాస్ శ్రీజిత్ దర్శకత్వం వహించనున్నారు. హిట్ మూవీకి సీక్వెల్..2024లో వచ్చిన వాళా చిత్రానికి సీక్వెల్గా 'వాళా 2' వచ్చింది. 'బయోపిక్ ఆఫ్ బిలియన్ బ్రోస్' అనేది ఉపశీర్షిక. ఈ రెండు భాగాలకు కథ అందించింది విపిన్ దాస్ ఒక్కరే అయినా.. దర్శకులు మాత్రం మారారు. మొదటి భాగానికి ఆనంద్ మీనన్ దర్శకత్వం వహించగా.. రెండో భాగాన్ని సవిన్ డైరెక్ట్ చేశాడు. సీక్వెల్కు రూ.10 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఈ చిత్రానికి టాలీవుడ్ నుంచి సాహు గారపాటి నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు. #Vaazha3 - Biopic of a Billion Girls.The #Vaazha franchise continues its journey of introducing fresh talent and new voices to cinema. Production begins next year. pic.twitter.com/YcHanDL3Q6— Shine Screens (@Shine_Screens) April 14, 2026 -
బుమ్రాను కాదని.. సంజూకు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు
టీమిండియా స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అందించే ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. ఈ ఏడాది మార్చి నెలకు గానూ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ ఎంపికయ్యాడు. సహచర ఆటగాడు, ప్రపంచస్థాయి పేసర్ జస్ప్రీత్ బుమ్రాను కాదని ఈ అవార్డు సంజూను వరించడం విశేషం.ఆరంభంలో జట్టులో చోటే కరువుటీ20 ప్రపంచకప్-2026 టోర్నీ ఆరంభంలో సంజూకు భారత తుదిజట్టులో చోటు దక్కలేదన్న సంగతి తెలిసిందే. అయితే, సూపర్-8 మ్యాచ్లలో అనూహ్య రీతిలో మేనేజ్మెంట్ అతడికి అవకాశం ఇవ్వగా.. సద్వినియోగం చేసుకున్నాడు సంజూ. ముఖ్యంగా నాకౌట్ మ్యాచ్లలో వెస్టిండీస్పై 97*, ఇంగ్లండ్పై 89 పరుగులతో దుమ్ములేపాడు.ఫైనల్లోనూ ఇరగదీసిన సంజూఇక ఫైనల్లో న్యూజిలాండ్ మీద కూడా 89 పరుగులతో రాణించిన ఈ ఓపెనింగ్ బ్యాటర్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. మొత్తంగా మార్చిలో మూడు మ్యాచ్లలో కలిపి సంజూ 275 పరుగులు సాధించాడు. స్ట్రైక్రేటు 199.38. మరోవైపు.. బుమ్రా సైతం ఎనిమిది మ్యాచ్లలో కలిపి 14 వికెట్లు కూల్చి టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.సంజూకే దక్కిన అవార్డుఈ క్రమంలో సంజూ, బుమ్రాలతో పాటు సౌతాఫ్రికాకు చెందిన నయా ఆటగాడు కన్నార్ ఎస్తెరుజియెన్ కూడా మార్చి నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. అయితే, వీరిద్దరిని ఓడించి సంజూ శాంసన్ ఈ పురస్కారం గెలుచుకున్నాడు. ఇక మహిళల విభాగంలో న్యూజిలాండ్కు చెందిన అమేలియా కెర్ వుమెన్ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఎంపికైంది. చదవండి: రాయల్స్ వైఖరిపై అసంతృప్తిలో వైభవ్ -
యాపిల్ పెట్టుబడిపై నీలినీడలు!
‘ఒరాకిల్ ఆఫ్ ఒమాహా’గా పిలవబడే దిగ్గజ పెట్టుబడిదారు వారెన్ బఫెట్ బెర్క్షైర్ హాత్వే సీఈఓ బాధ్యతల నుంచి డిసెంబర్ 31న తప్పుకున్నప్పటి నుంచి యాపిల్ పెట్టుబడులపై నీలినీడలు కమ్ముకున్నాయి. తన అర్ధ శతాబ్దపు ప్రస్థానంలో బెర్క్షైర్ క్లాస్-ఏ షేర్లను ఏకంగా 61,00,000 శాతం వృద్ధి పథంలో నడిపించిన బఫెట్, ఆ పగ్గాలను ఇటీవల తన వారసుడు గ్రెగ్ అబెల్కు అప్పగించారు. అయితే, అబెల్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బెర్క్షైర్ అత్యంత కీలకమైన యాపిల్ పెట్టుబడి బఫెట్ నిర్దేశించిన ప్రాథమిక సూత్రాలనే ఉల్లంఘిస్తోందనే చర్చ ఆసక్తికరంగా మారింది.విలువే ప్రాణం.. కానీ..వారెన్ బఫెట్ పెట్టుబడి శైలిలో అత్యంత ముఖ్యమైన నియమం ‘వాల్యుయేషన్’. ఒక సంస్థకు తిరుగులేని మార్కెట్ పట్టు, సమర్థవంతమైన నాయకత్వం ఉన్నప్పటికీ ఆ సంస్థ షేరు ధర దాని అసలు విలువ కంటే ఎక్కువగా ఉంటే బఫెట్ అటువైపు చూడరు. గ్రెగ్ అబెల్ తాను రాసిన మొదటి వార్షిక లేఖలో యాపిల్ను తన ‘ఫరెవర్ హోల్డింగ్స్’ (ఎప్పటికీ కొనసాగించే పెట్టుబడులు) జాబితాలో చేర్చారు. కానీ ప్రస్తుత మార్కెట్ గణాంకాలను పరిశీలిస్తే యాపిల్ షేరు ధర బఫెట్ సూత్రాలకు విరుద్ధంగా చాలా ఖరీదుగా కనిపిస్తోంది.స్తంభించిన వృద్ధిఇటీవలి కాలంలో యాపిల్ అమ్మకాల వృద్ధి ఆశించిన స్థాయిలో లేదు. ఐఫోన్, ఐప్యాడ్, మాక్ వంటి ఉత్పత్తుల ఆదాయం మందగించింది. కేవలం సర్వీసెస్ విభాగం మాత్రమే స్వల్ప వృద్ధిని కనబరుస్తోంది. ఏప్రిల్ 10 నాటికి యాపిల్ షేర్లు తమ ఆర్జన కంటే 33 రెట్లు (33 రెట్లు ఈపీఎస్-ఎర్నింగ్ పర్ షేర్) ఎక్కువ ధరకు ట్రేడ్ అవుతున్నాయి. 2016లో బఫెట్ తొలిసారి యాపిల్లో వాటాలను కొనుగోలు చేసినప్పుడు, ఆ స్టాక్ కేవలం 10 నుంచి 15 రెట్ల పీఈ రేషియోలో లభించేది. బఫెట్ సీఈఓగా ఉన్న చివరి తొమ్మిది త్రైమాసికాల్లోనే యాపిల్లోని సుమారు 75 శాతం వాటాను (687.6 మిలియన్ షేర్లు) విక్రయించడం గమనార్హం. కేవలం వాల్యుయేషన్ పరంగా ఆకర్షణీయంగా లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.ఏఐ ఆశలు వర్కౌట్ అవుతాయా?యాపిల్ ఇంటెలిజెన్స్ ద్వారా కృత్రిమ మేధ రంగంలోకి కంపెనీ అడుగుపెట్టడం ఇన్వెస్టర్లలో కొంత ఉత్సాహాన్ని నింపినప్పటికీ అది తక్షణ ఆదాయ వృద్ధికి ఎంతవరకు దోహదపడుతుందనేది ప్రశ్నార్థకమే. యాపిల్ తన సొంత షేర్లను తిరిగి కొనుగోలు చేసే కార్యక్రమం(బైబ్యాక్) కోసం 2013 నుంచి 841 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినప్పటికీ ఆదాయ వృద్ధి లేకపోవడం పెద్ద లోపంగా కనిపిస్తోంది.ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించాలా?గ్రెగ్ అబెల్ యాపిల్ను దీర్ఘకాలిక సంపద సృష్టికర్తగా చూస్తున్నప్పటికీ బఫెట్ మార్గంలోనే నడిస్తే మాత్రం రాబోయే త్రైమాసికాల్లో బెర్క్షైర్ తన యాపిల్ వాటాను మరింత తగ్గించుకునే అవకాశం ఉంది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో కేవలం బ్రాండ్ విలువను చూసి పెట్టుబడి పెట్టడం కంటే, ఆ సంస్థ ఇచ్చే రాబడి, వాల్యుయేషన్ మధ్య సమతుల్యతను గమనించడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. యాపిల్ వంటి దిగ్గజ సంస్థలే వృద్ధి కోసం ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇన్వెస్టర్లు తమ పోర్ట్ఫోలియోను పునసమీక్షించుకోవడం ఉత్తమం.గమనిక: పై కథనం కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. షేర్ మార్కెట్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.ఇదీ చదవండి: ‘మధ్య తరగతి’ బండి సాగేదెలా? -
బిహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా
పట్నా: బిహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ మంగళవారం రాజీనామా చేశారు. బిహార్ గవర్నర్కు ఆయన రాజీనామా సమర్పించారు. క్యాబినెట్ను రద్దు చేస్తూ నితీశ్ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 21 ఏళ్ల పాటు సీఎం పదవిలో కొనసాగారు నితీశ్. ఇటీవలే ఆయన రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అన్ని వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం పని చేసిందని నితీశ్ కుమార్ రాజీనామా తర్వాత ఎక్స్లో తెలిపారు. “హిందువులు, ముస్లింలు, ఉన్నత వర్ణాలు, వెనుకబడిన వర్గాలు, అత్యంత వెనుకబడిన వర్గాలు, దళితులు, మహాదళితులు.. ఇలా ప్రతి ఒక్కరి కోసం మా ప్రభుత్వం పనిచేసింది. విద్య, ఆరోగ్యం, రహదారులు, విద్యుత్, వ్యవసాయం వంటి ప్రతి రంగంలో అభివృద్ధి పనులు జరిగాయి. మహిళలు, యువత కోసం ఎంతో చేశాం” అని నితీశ్ చెప్పారు. కాగా, నితీశ్ కుమార్ మంగళవారం క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. నితీశ్ కుమార్ క్యాబినెట్కు ఇదే చివరి సమావేశం. సీఎంగా సామ్రాట్ చౌదరి? బిహార్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సామ్రాట్ చౌదరి బుధవారం (ఏప్రిల్ 15న) బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఉంది. నితీశ్ శాసన మండలి సభ్యత్వానికి గత నెల 30న రాజీనామా చేశారు. ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయం ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసింది. కేంద్ర మంత్రి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను బిహార్లో శాసనసభ పక్ష నాయకుడిని ఎన్నుకునేందుకు కేంద్ర పరిశీలకుడిగా నియమించినట్లు తెలిపింది.జేడీయూ సీనియర్ నేత విజయ్ కుమార్ చౌదరి మాట్లాడుతూ.. “బీజేపీ సిఫారసుపై ఎన్డీఏ కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకుంటుంది, ఇందులో బీజేపీకి పెద్ద పాత్ర ఉంది” అని అన్నారు. జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్, రాజ్యసభ సభ్యుడు సంజయ్ కుమార్ ఝా ఇటీవల మాట్లాడుతూ.. నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవిలో లేకపోయినా, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన కృషి కొనసాగుతుందని తెలిపారు. గత బిహార్ ఎన్నికల్లో నితీశ్ కుమార్ నాయకత్వంలో, ఎన్డీఏ మద్దతుతో పార్టీ పోటీ చేసిందని తెలిపారు. కొత్త ప్రభుత్వం నితీశ్ విధానాలను, పాలనా మోడల్ను కొనసాగిస్తుందని అన్నారు. -
మూడు ఆపరేషన్లు : అయినా దక్కని ప్రాణం
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు చెంది విద్యార్థిని 23 ఏళ్ల నవ్య నీలకుడిటి అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. గతేడాది మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు ఆమె అమెరికా వెళ్లారు. జీవితం స్థిరపడుతుందని ఆశపడుతున్న తరుణంలో రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో తీరని దుఃఖాన్ని మిగిల్చింది.మిచిగాన్లో ఒక ఇంటర్వ్యూ ముగించుకుని తిరిగి వస్తుండగా పిట్స్బర్గ్లో నవ్య ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. తీవ్రంగా గాయపడిన నవ్యను పిట్స్బర్గ్లోని UPMC ప్రెస్బిటేరియన్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు మూడు ప్రధాన శస్త్రచికిత్సలు జరిగాయి. అయినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ ఏప్రిల్ 9న ఆమె మరణించారు.నవ్య భౌతికకాయాన్ని భారతదేశానికి తరలించేందుకు ఆసుపత్రి ఖర్చుల కోసం టెక్సాస్లో నివస్తున్న ఆమె సమీప బంధువు శిరీష నీలకుడిటి నిధుల సేకరణ (Fundraising) చేపట్టారు. ఇప్పటివరకు దాదాపు 85వేల డాలర్లు పైగా సాయం అందింది. నవ్య తల్లిదండ్రులు సాధారణ రైతులు. కుమార్తె ఉన్నత చదువుకోసం తమ దగ్గర ఉన్నదంతా ఖర్చు చేశారు. మంచి ఉద్యోగం సంపాదించి తన కుటుంబాన్ని ఆదుకోవాలని ఆశపడిన ఆమె కలలు ఆవిరై పోవడంతో కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది.కాగా ఇటీవల అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన తెలుగు విద్యార్థుల అకాల మరణం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మరో విషాదకర సంఘటనలో, 26 ఏళ్ల సింగిరెడ్డి సాయి శ్రీ హరికృష్ణ అనే యువకుడు మిస్సౌరీలో మరణించారు. ఇంజనీరింగ్లో మాస్టర్స్ చేస్తున్న హరికృష్ణ, ఏప్రిల్ 11న తన పుట్టినరోజు వేడుకల కోసం వెళ్లి ప్రమాదవశాత్తూ మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. చదువుకుని ఉన్నత స్థితికి చేరుతారనుకున్న బిడ్డలు ఇలా విదేశీ గడ్డపై ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది.ఇదీ చదవండి: రూ.90 లక్షలు ఇస్తేనే ఫస్ట్నైట్ : తీవ్ర ఘర్షణ, కట్ చేస్తే! -
భోపాల్లో 'బ్లడ్ కిక్' కలకలం
భోపాల్: భోపాల్లో 'బ్లడ్ కిక్' కలకలం రేపుతోంది. నగరంలో ఒక భయంకరమైన కొత్త వ్యసనానికి అలవాటు పడుతున్నారు. మద్యం, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధం లేదు.. కానీ అంతే వేగంగా ప్రాణాలను తీసే కొత్త వ్యసనం వెలుగులోకి వచ్చింది. దీనిని "బ్లడ్ కిక్" అని పిలుస్తున్నారు. యువకులు తమ సొంత రక్తాన్ని తీసి, తిరిగి తమ శరీరంలోకే ఎక్కించుకునే (ఇంజెక్ట్) ఈ వింత ధోరణి ఆందోళన కలిగిస్తోంది.విదేశాల్లో మొదలైన ఈ వికృత ధోరణి ఇప్పుడు నిశ్శబ్దంగా మధ్యప్రదేశ్ రాజధానిలోకి ప్రవేశించింది. ఇది వైద్యులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఈ ఏడాది(2026) జనవరి నుంచి గాంధీ మెడికల్ కాలేజీలో ఐదు కేసులు వెలుగులోకి వచ్చాయి. బాధితులందరూ 18 నుండి 25 ఏళ్ల మధ్య వయస్సు గలవారే. తల్లిదండ్రులు వారి ప్రవర్తనలో మార్పును గమనించి.. వారిని అదుపు చేయడానికి ప్రయత్నించినప్పుడు వారు తీవ్ర ఆగ్రహంతో గొడవలకు దిగుతున్నారు. చివరకు దిక్కుతోచని స్థితిలో కుటుంబ సభ్యులు వారిని సైకియాట్రీ విభాగానికి తీసుకువస్తున్నారు.మాదక ద్రవ్యాలు తీసుకోరు. వీరిలో మద్యం వాసన కానీ.. డ్రగ్స్ ఆనవాళ్లు గానీ కనిపించవు. బదులుగా, శరీరంపై ఇంజెక్షన్లు తీసుకున్న గుర్తులు ఉంటాయి. ఇలాంటి వింత పరిస్థితి గతంలో ఎన్నడూ చూడలేదని హమీడియా ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. తమ రక్తాన్ని తిరిగి శరీరంలోకి ఎక్కించుకోవడం వల్ల తక్షణ శక్తి, ప్రశాంతత, నియంత్రణ లభిస్తుందని వ్యసనానికి అలవాటుపడిన యువకులు నమ్ముతున్నారు. కానీ ఇది చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. -
టాక్సిక్ మరోసారి వాయిదా.. మేకర్స్ ఏమన్నారంటే?
కన్నడ హీరో యశ్.. గీతూ మోహన్ దాస్ డైరెక్షన్లో నటిస్తోన్న చిత్రం ‘టాక్సిక్’ (Toxic). ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను మెప్పించింది. టీజర్ కాస్తా బోల్డ్గా ఉండడంతో మేకర్స్పై విమర్శలొచ్చాయి. అయినప్పటికీ ఈ టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ఈ సినిమా నుంచి ఓ సాంగ్ను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా విడుదల ఇప్పటికే ఓ సారి వాయిదా పడింది.ఈ నేపథ్యంలోనే టాక్సిక్ మరోసారి వాయిదా పడుతుందన్న వార్తలొస్తున్నాయి. ఈ మూవీ జూన్ 4వ తేదీన రిలీజ్ కానుందని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు మూవీ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఈ సినిమా రిలీజ్కు కేవలం 40 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఈ సినిమా వాయిదా పడుతుందని ఫ్యాన్స్లో మరో ఆందోళన కలిగిస్తోంది.తాజాగా వాయిదా వార్తలను టాక్సిక్ టీమ్ ఖండించింది. చెప్పిన ప్రకారం జూన్ 4వ తేదీనే విడుదల కానుందని స్పష్టం చేసింది. ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోషన్స్ చేయనున్నట్లు తెలిపింది. మరోవైపు యష్ ప్రస్తుతం అమెరికాలో 'రామాయణం' ప్రచార కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.కాగా.. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయన తార, హూమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. కేవీఎన్ ప్రోడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్పై వెంకట్ కె.నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, కన్నడ భాషల్లో నేరుగా, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. -
పశ్చిమాసియా సంక్షోభం.. మామిడి ప్రియులకు గుడ్న్యూస్
ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చిందనేది తాతల కాలం నాటి సామెత... కానీ ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు అది అక్షర సత్యం కూడా. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా అది ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న సాంకేతిక యుగంలో యుద్ధం లాంటి పరిస్థితులు మరింత ప్రభావాన్ని చూపిస్తాయని ప్రస్తుత పశ్చిమాసియా సంక్షోభం నిరూపిస్తోంది. నెలలుగా కొనసాగుతున్న పశ్చిమ ఆసియా సంక్షోభం ఓ వైపు గ్యాస్ పెట్రోల్ వంటి అత్యవసరాలకు ఇబ్బందులు సృష్టిస్తుంటే మరోవైపు మామిడి పండ్ల ప్రియులకు తీపి కబురు తెస్తోంది.పశ్చిమాసియా పరిస్థితుల కారణంగా ఏటా ఆకాశంలో చక్కర్లు కొట్టే మామిడి పండ్ల ధరలు ఈ సీజన్లో నేల చూపులు చూడనున్నాయి. దీనికి కారణం యుద్ధం నేపధ్యంలో విదేశాలకు ఎగుమతులు గణనీయంగా తగ్గడం. ప్రస్తుతం జనాదరణ పొందిన బెనిషాన్ రకం మామిడి పండు కిలోకు రూ. 150–200 మధ్య అమ్ముడవుతోంది. అలాగే తీపి, రసభరితమైన రుచికి ప్రసిద్ధి చెందిన రసాలు హైదరాబాద్లో కిలోకు రూ. 100–150కి లభిస్తున్నాయి. ఇంకా ఇప్పుడిప్పుడే సీజన్ ప్రారంభం కాబట్టి అంతగా తెలియకున్నా రాబోయే రోజుల్లో మామిడి ధరలు బాగా తగ్గే అవకాశం ఉందని పండ్ల వ్యాపారులు అంచనా వేస్తున్నారు.ప్రతి సంవత్సరం, తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ దేశాలకు మామిడి పండ్లు భారీగానే ఎగుమతి అవుతాయి. మరీ ముఖ్యంగా యూఏఈ, యూఎస్ కెనడాలకు మన దగ్గర నుంచి మామిడి పండ్ల ఎగుమతి ఎక్కువ. సగటున ప్రతి సంవత్సరం, భారతదేశం సుమారు 30 వేల మెట్రిక్ టన్నుల మామిడి పండ్లను ఎగుమతి చేస్తుంది, వాటిలో అత్యధిక వాటా అంటే దాదాపుగా 10 వేల మెట్రిక్ టన్నులకు పైగా ఒక్క యూఏఈకి వెళుతుంది.అయితే ఎడతెగని యుద్ధం, తద్వారా యుఏఈలో ఏర్పడిన సంక్షోభ పరిస్థితుల కారణంగా, మామిడి ఎగుమతులకుు డిమాండ్ తగ్గింది. అందుబాటులో ఉన్న ఒక నివేదిక ప్రకారం, ఇప్పటికే మామిడి ఎగుమతులు 20–30 శాతం తగ్గుదలను నమోదు చేస్తున్నాయి. ఆ ప్రాంతంలో నెలకొన్న అనిశ్చితితో పాటు బాగా పెరిగిన ఎగుమతి వ్యయం కూడా దీనికి దోహదం చేస్తోంది. రవాణా ఛార్జీలు పెరగడం వల్ల యూఎస్ కెనడా వంటి ఇతర గమ్యస్థానాలకు ఎగుమతులు కూడా దెబ్బతిన్నాయి.ఏతావాతా ఇది భారతీయ నగరాల్లో మామిడి ధరలు తగ్గడానికి దారితీయవచ్చునని అంచనా. దేశీయ మార్కెట్లో ధరలు తగ్గినప్పటికీ, అత్యుత్తమ నాణ్యత గల కొన్ని రకాల ఖరీదైన పండ్ల విక్రయాలకు ఎగుమతులే ఆధారం వాటి ఎగుమతులు పడిపోయినప్పటికీ వాటికి స్థానికంగా కొనుగోలుదారులు దొరుకుతారో లేదోనని కూడా ఎగుమతిదారులు సందేహిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఎగుమతిదారులు ప్రస్తుతం పరిస్థితి సాధారణ స్థితికి రావాలని ఎదురుచూస్తున్నారు. -
నువ్వు లేవనే నిజం బాధపెడుతూనే ఉంది: సింగర్ చిత్ర
దగ్గరవాళ్లు చనిపోతే ఆ బాధ అనుభవించడం కష్టం. అలాంటిది కడుపు పుట్టిన పిల్లలు చనిపోతే తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం. సింగర్ చిత్ర కూడా అలాంటి వేదనని గత 15 ఏళ్లుగా అనుభవిస్తూనే ఉన్నారు. ప్రతి ఏడాది తన కూతురు ఇక లేదనే విషయాన్ని గుర్తుచేసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు కూడా కుమార్తెని తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. సోషల్ మీడియాలో తన బాధని పోస్ట్ రూపంలో చిత్ర పంచుకున్నారు.(ఇదీ చదవండి: కుమారస్వామి కథతో ఎన్టీఆర్ సినిమా.. టైటిల్ ఫిక్సయిందా?)'నువ్వు మాతో పాటు లేవనే నిజం నన్ను బాధపెడుతూనే ఉంది. కానీ మళ్లీ మనం కలుసుకునేంత వరకు నువ్వు నా గుండెల్లో ఎప్పటికీ ఉండిపోతావ్' అని కుమార్తె నందన ఫొటోని చిత్ర.. బాధతో పోస్ట్ చేశారు.కేరళకు చెందిన చిత్ర.. భారతీయ భాషల్లో 25 వేలకు పైగా పాటలు పాడారు. ఇప్పటికీ పాడుతూనే ఉన్నారు. విజయ్ శంకర్తో వివాహమైన చాలా ఏళ్ల తర్వాత ఈమెకు 2002లో కూతురు పుట్టింది. ఆమెకు నందన అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. కానీ విధి కన్నుకుట్టిందో ఏమో గానీ పాపకు ఎనిమిదేళ్ల వయసున్నప్పుడు అంటే 2011లో దుబాయిలో జరిగిన ఓ ప్రమాదంలో ఈత కొలనులో పడి నందన చనిపోయింది. అప్పటినుంచి వేదన అనుభవిస్తున్నప్పటికీ.. మరోవైపు గాయనిగానూ చిత్ర కొనసాగుతున్నారు. ఇప్పుడు పోస్ట్ పెట్టి కూతురిని చిత్ర మరోసారి గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు.(ఇదీ చదవండి: మృణాల్ కొత్త సినిమా.. 'ఏఐ'తో ఫస్ట్ లుక్ టీజర్) View this post on Instagram A post shared by K S Chithra (@kschithra) -
ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్వేను ప్రారంభించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఢిల్లీ-డెహ్రాడూన్ మధ్య ఎక్స్ప్రెస్వే(Delhi-Dehradun Expressway)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. సుమారు 11,868 కోట్లతో చేపట్టిన ఆ ప్రాజెక్టులో భాగంగా 212 కిలోమీటర్ల మేర ఎక్స్ప్రెస్ వే నిర్మించారు. ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్గా కూడా పిలుస్తున్న ఈ మార్గం చార్ధామ్ యాత్రికులకు కీలకమార్గం కానున్నది. ఢిల్లీ-డెహ్రాడూన్ ఆర్థిక కారిడార్ ఢిల్లీ, డెహ్రాడూన్ మధ్య ప్రయాణ సమయాన్ని 6 గంటలకు పైగా నుండి సుమారు 2.5 గంటలకు తగ్గిస్తుంది. మానవ-జంతు సంఘర్షణను గణనీయంగా తగ్గించే లక్ష్యంతో దీనిని అనేక అత్యాధునిక ఫీచర్లతో రూపొందించారు. ఈ ప్రాజెక్టులో 12 కిలోమీటర్ల పొడవైన వన్యప్రాణుల ఎలివేటెడ్ కారిడార్ కూడా ఉంది. ఇది ఆసియాలోనే అత్యంత పొడవైన వాటిలో ఒకటి. దీని ప్రారంభోత్సవానికి ముందు ప్రధానమంత్రి డెహ్రాడూన్ సమీపంలోని మా దాత్ కాళీ ఆలయాన్ని సందర్శించి, అక్కడ ప్రార్థనలు చేశారు.వేగవంతమైన ప్రయాణం, మెరుగైన కనెక్టివిటీ ఫీచర్లతో కొత్తగా ప్రారంభించిన ఈ కారిడార్ ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ ,ఉత్తరాఖండ్ గుండా వెళుతుంది. ఆరు లేన్ల ఎక్స్ప్రెస్వేగా నిర్మించిన ఈ కారిడార్ సులభమైన, హై-స్పీడ్ ప్రయాణాన్ని అందిస్తుంది. #WATCH | Dehradun, Uttarakhand: Prime Minister Narendra Modi inaugurates the Delhi–Dehradun Economic Corridor.The corridor will reduce travel time between Delhi and Dehradun from over 6 hours to around 2.5 hours. It has been designed with several features aimed at significantly… pic.twitter.com/JZj6J4UUbT— ANI (@ANI) April 14, 2026 -
పోలీస్ అధికారినంటూ.. ఏకంగా 67 పెళ్లిళ్లు..
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నకిలీ సీఐఎస్ఎఫ్ అధికారి బాగోతం వెలుగులోకి వచ్చింది. సీఐఎస్ఎఫ్ దుస్తులు వేసుకొని తాను సీఐఎస్ఎఫ్లో పనిచేస్తున్నానంటూ శ్రీకాకుళానికి చెందిన బాలకృష్ణ బురిడీ కొట్టిస్తున్నాడు. ఇప్పటివరకు 67 మంది మహిళలను పెళ్లిళ్ల పేరుతో మోసం చేసిన బాలకృష్ణ.. మ్యాట్రిమొనీ డాట్కామ్లో పోలీస్ అధికారుల వేషంతో యువతులకు వల వేసి మోసం చేస్తున్నాడు.కొన్ని రోజులుగా సీఐఎస్ఎఫ్ యూనిఫాం ధరించి ఎయిర్పోర్ట్లో హల్చల్ చేస్తోన్న శ్రీకాకుళానికి చెందిన బాలకృష్ణను అధికారులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు దర్యాప్త చేస్తున్నారు.కాగా, డబ్బుల కోసం పెళ్లి చేసుకొని మహిళలను మోసం చేస్తోన్న నిత్య పెళ్లికొడుకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. గత ఏడాది(2025) నవంబర్లో కూడా ఓ నిత్య పెళ్లి కొడుకుని భువనగిరి పట్టణ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఏపీలోని కడప పట్టణానికి చెందిన సోమవరపు సురేంద్ర తనకు మైనింగ్, పెట్రోల్బంక్, కన్సల్టెన్సీలు ఉన్నాయని చెబుతూ పలువురు మహిళలను నమ్మించి వివాహం చేసుకున్నాడు. క్రిస్టియన్ మ్యాట్రిమోనీ ద్వారా ఓ మహిళకు పరిచయమయ్యాడు. ఆమెను పెళ్లి చేసుకొని ఆమె వద్ద నుంచి రూ.15లక్షలు, 30 తులాల బంగారు నగలు తీసుకొని మోసం చేశాడు.అంతకు ముందు మరో మహిళను వివాహం చేసుకొని ఆమె నుంచి రూ.12 లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత రూ.7లక్షలు ఇచ్చి ఆమెతో రాజీ చేసుకున్నారు. దాంతో పాటు మధ్యవర్తి జూపల్లి కిరణ్కుమార్ ద్వారా మరో మహిళ శైలజ వద్ద నుంచి పెళ్లి పేరుతో రూ.2.50 లక్షలు తీసుకొని మోసం చేశాడు. విజయవాడకు చెందిన రత్నకుమారిని కూడా పెళ్లి చేసుకొని రూ.2 లక్షలు ఇచ్చి వదిలించుకున్నాడు. నిందితుడు కరీంనగర్కు చెందిన మహిళను 2017లో వివాహం చేసుకొని 2020లో ఆమెకు విడాకులు ఇచ్చినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. -
రాకా.. బన్ని కెరీర్లోనే తొలిసారి!
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇప్పుడు ఆయనకు తెలుగులోనే కాదు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వారందరిని మెప్పించే కథలపైనే బన్నీ ఫోకస్ పెట్టాడు. అందులో ఒకటి రాకా. అల్లు అర్జున్ – అట్లీ కాంబోలో రూపుదిద్దుకొంటున్న తొలి సినిమా ఇది. రూ. 900 కోట్ల భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ మొదలైనప్పటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక బన్నీ బర్త్డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ రివీల్ ఆ అంచనాలను మరింత పెంచేశాయి. ఇందులో బన్నీ హీరోగా, విలన్గా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పుడు బయటకు వచ్చిన లుక్ విలన్ది. హీరో పాత్రకు సంబంధించిన లుక్ చాలా స్టైలీష్గా ఉంటుందట. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలు మొత్తం నలుగురు హీరోయిన్లు ఉంటారు. ఇప్పటికే ఒక హీరోయిన్గా దీపికా పదుకొణె పేరు బయటకు వచ్చింది. మరో ముగ్గురు హీరోయిన్లలో రష్మిక, మృణాల్, జాన్నీ కపూర్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరిలో రష్మిక అల్రేడీ బన్నీతో కలిసి పుష్ప, పుష్ప 2 చిత్రాల్లో నటించింది. మృణాల్, జాన్వీలు తొలిసారి బన్నీతో స్క్రీన్ చేసుకుంటున్నారు. ఇలా ఒకే సినిమాలో నలుగురు హీరోయిన్లతో కలిసి నటించడం బన్నీ కెరీర్లోనే తొలిసారి. కథ డిమాండ్ మేరకే నలుగురిని తీసుకున్నారట. అంతేకాదు ఈ నలుగురి పాత్రలు కూడా సినిమాలో కీలకం అట. ఒకవైపు కావాల్సినంత గ్లామర్ని చూపిస్తూనే.. మరోవైపు కథలో కీలకంగా వ్యవహరించేలా వీరి పాత్రలను తీర్చిదిద్దినట్లు సమాచారం. ఈ నలుగురూ బన్నీతో ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే మాత్రం ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఖాయం. -
కావ్యా మారన్ను ఇలా ఎప్పుడు చూసి ఉండరు!
వరుస ఓటముల తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎట్టకేలకు గెలుపు బాట పట్టింది. సొంతమైదానం ఉప్పల్లో రాజస్తాన్ రాయల్స్ను చిత్తుగా ఓడించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 216 పరుగులు సాధించింది.ఇషాన్ కిషన్ (44 బంతుల్లో 91) కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరవగా.. హెన్రిచ్ క్లాసెన్ (40), నితీశ్ కుమార్ రెడ్డి (28), సలీల్ అరోరా (24 నాటౌట్) రాణించారు. అయితే, ప్రస్తుత ఫామ్ దృష్ట్యా లక్ష్య ఛేదనలో రాజస్తాన్ రాయల్స్ నుంచి సన్రైజర్స్కు గట్టిపోటీ తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.అయితే, అనూహ్య రీతిలో సన్రైజర్స్ పేసర్ ప్రఫుల్ హింగే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఆది నుంచే దూకుడు చూపిస్తూ రాజస్తాన్ బ్యాటింగ్ టాప్ ఆర్డర్ను కుదేలు చేశాడు. ముఖ్యంగా రాజస్తాన్ విధ్వంసకరవీరుడు వైభవ్ సూర్యవంశీని గోల్డెన్ డకౌట్గా వెనక్కి పంపడంలో ఎస్ఆర్హెచ్ శిబిరంలో సంబరాలు అంబరాన్నంటాయి.ఆ సమయంలో సన్రైజర్స్ జట్టు యజమాని కావ్యా మారన్ సైతం పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రఫుల్ ఊహించని రీతిలో బ్రేక్ ఇవ్వడంతో ఆమె పట్టరాని సంతోషంలో మునిగిపోయారు. ఇదసలు నమ్మశక్యంగా లేదు అన్నట్లుగా తొలుత ఆశ్చర్యపోయిన కావ్యా మారన్.. ఆ తర్వాత లేచి నిలబడి కరతాళ ధ్వనులు చేస్తూ నవ్వులు చిందించారు. కావ్యా వైల్డ్ సెలబ్రేషన్స్కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.Kavya Marian reaction on Vaibhav Sooryavanshi Wicket 😭❤️#SRHvsRR #IPL2026 #TATAIPL #CricketTwitter #IPLMatchDay #CricketFever #Wickets #IPLDrama pic.twitter.com/aMqj8XP2Ay— Rushikesh Vadolkar (@RVadolkar) April 13, 2026ఇక వైభవ్తో పాటు రాజస్తాన్ కీలక బ్యాటర్లు ధ్రువ్ జురెల్ (0), లువాన్ డ్రి ప్రిటోరియస్ (0), కెప్టెన్ రియాన్ పరాగ్ (4)లను కూడా ప్రఫుల్ హింగే వచ్చీ రాగానే పెవిలియన్కు పంపించాడు. రవీంద్ర జడేజా (45), డొనోవాన్ ఫెరీరా (69) కాసేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది.సన్రైజర్స్ బౌలర్ల ధాటికి 19 ఓవర్లలో 159 పరుగులు చేసి రాజస్తాన్ ఆలౌట్ అయింది. దీంతో 57 పరుగుల తేడాతో రైజర్స్ జయభేరి మోగించింది. ఫలితంగా హైదరాబాద్ ఖాతాలో రెండో విజయం చేరగా.. రాజస్తాన్ తొలి ఓటమిని చూవిచూసింది. కాగా ఈ రెండు జట్లు ఇప్పటికి ఐదేసి మ్యాచ్లు పూర్తి చేసుకున్నాయి.It's all Orange in Hyderabad 🧡A dominant victory by 5⃣7⃣ runs for @SunRisers ✌️They end #RR's unbeaten streak this season 👏Updates ▶️ https://t.co/xGTDdKbXpY#TATAIPL | #KhelBindaas | #SRHvRR pic.twitter.com/ZRdkxcW2jh— IndianPremierLeague (@IPL) April 13, 2026 -
యుద్ద నష్టం ఇన్ని లక్షల కోట్లా..? ఇరాన్ సంచలన ప్రకటన
పశ్చిమాసియా యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై భారీ స్థాయిలో దాడులు చేసిన సంగతి తెలిసిందే. రెండు దేశాలు కలిసి ఇరాన్ మౌళిక సదుపాయాలతో పాటు ఆర్మీ బేస్, విద్యుత్ ప్లాంట్లపై క్షిపణులు వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ యుద్ధం వల్ల తమ దేశానికి కలిగిన నష్టాన్ని అధికారికంగా ప్రకటించింది.ఇరాన్ ప్రభుత్వం యుద్ధం వల్ల ఇప్పటి వరకూ జరిగిన నష్టంపై ప్రాథమిక అంచనా విడుదల చేసింది. టెహ్రాన్పై జరిపిన దాడులలో ఇప్పటి వరకూ దాదాపు రూ. 25 లక్షల కోట్లు నష్టం ఇరాన్కు వాటిల్లిందని తెలిపింది. ఇది కేవలం ప్రాథమిక అంచనా మాత్రమేనని ఈ సంఖ్య మరింతగా పరిగే అవకాశం ఉందని తెలిపింది. ఇంత పెద్ద మెుత్తంలో తమ దేశ ఆస్తిని ధ్వంసం చేసిన వారినే పరోక్షంగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలని పరిహారం చెల్లించాల్సిందిగా కోరుతామని తెలిపింది.అయితే ఇరాన్ తొలుత నుంచి అమెరికాను పరిహారం చెల్లించాల్సిందిగా కోరింది. ఇటీవల ఇస్లామాబాద్లో జరిగిన చర్చల్లోనూ యుద్ద నష్టపరిహరం తన డిమాండ్లలో ఉంచింది. ఇంత పెద్దమెుత్తంలో ఆస్తి నష్టం జరగడంతో ఒక వేళ పరిహారం చెల్లించకపోతే ఇరాన్ ఆర్థికంగా నిలదొక్కుకోవడం చాలా కష్టం. అయితే దీనిపై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇప్పటి వరకూ ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. -
ఆయన విగ్రహం లేని ఖండం లేదు!
అంబేడ్కర్ ఒక సజీవ ప్రభాతం. సాంస్కృతిక రాజకీయ దార్శనికుడు. ప్రపంచ పరిణామానికి ఆయువు పోసిన జ్ఞాని. ఆకాశపుటంచులు దాటిన కీర్తి పతాక. కేవలం ఒక నాయకుడిగానే కాదు, ప్రపంచ పరిణామాన్ని ప్రవహింపజేసిన జ్ఞాన సింధువుగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. అంబేడ్కర్ మరో బుద్ధుడు. నవయాన బోధిసత్వుడు. ప్రపంచ వైతాళికుడు. ప్రపంచ గమనానికి నిర్దేశకుడు.ఆయన సంఖ్య మూలాన్ని తెలుసుకున్న జ్ఞాని. సమాజంలో సంఖ్యలన్నీ నిస్తేజమై, నిర్వీర్యమై, అబద్ధాలతో నిండిన వేళ... సత్యపూర్ణమైన సంఖ్య కోసం వెతికి పట్టుకొని, ఆ గణాంకాలను పేర్చి రాజ్యాంగ హక్కుల్ని రూపొందించారు. నిజానికి భారత రాజ్యాంగం ఒక గణిత శాస్త్రం. 1931లో ఉన్న జనాభా లెక్కలే కాకుండా, 2025 నాటికి జనాభా నిష్పత్తి ఎలా ఉండబోతుందో అప్పుడే అంచనా వేయగలిగిన అద్భుత ప్రణాళికాకర్త ఆయన. మనుషులను ప్రభావితం చేసే శక్తులు, వారిని నిర్జీవం చేసే శక్తుల మధ్య జరిగే యుద్ధాన్ని శాస్త్రీయంగా విశ్లేషించిన గణితజ్ఞుడు.భారత స్త్రీ వ్యక్తిత్వ శిల్పాన్ని అపురూపంగా చెక్కి, ప్రతిభను వెలికి తీసి, హిందూ కోడ్ బిల్లు ద్వారా వారికి హక్కులు పొందుపర్చిన మహోన్నతుడు. నేటి ఐటీ రంగంలో ఒక వ్యక్తి వంద మంది చేసే పనిని ఎలా చేయగలడో, ఆనాడు అంబేడ్కర్ ఒక పక్క రాజ్యాంగ రచన, మరోపక్క రాజకీయ నిర్మాణం, ఇంకోవైపు బౌద్ధ సంస్కృతి వికాసం ద్వారా నిరూపించి చూపారు. మరాఠీ, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, పాళీ, పారశీకం, గుజరాతీ, జర్మన్, ఫ్రెంచ్ వంటి భాషలపై పట్టు సాధించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు.నేడు ఆయన వేసిన బాటలో నడుస్తూనే దళితులు, అణగారిన వర్గాల వారు ఐటీ రంగంలో, ఐఐటీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఎదుగుతున్నారు. సామాజిక అడ్డంకులను ఎదుర్కొంటూ, అక్షరాన్నే ఆయుధంగా మలచుకుని దేశ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అంబేడ్కర్ అక్షరం ఒక ‘అణు విచ్ఛేదన కేంద్రం’. ఎన్నో చీకటి గుహల్లాంటి జీవితాల్లో ఆయన ఆలోచనలు వెలుగులు నింపుతున్నాయి. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, ఇంగ్లాండ్ నుండి జర్మనీ వరకు... ఆయన విగ్రహం లేని ఖండం లేదు. నేటి కాలంలో సమాచారం అంటే ఒక భ్రమగా, టెక్నాలజీ ఒక అల్లికగా మారుతోంది. ఈ మాయాజాలం నుండి సత్యాన్ని వెలికితీసి, అంకెకు, అక్షరానికి సత్యనిష్ఠను అద్ది... మనల్ని బతికించిన మహోన్నతుడు అంబేడ్కర్. భారత దేశానికి స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సౌభ్రాతృత్వ భావనలను పరిచయం చేసిన మరో రూసో. హెగెల్ శిష్యుడిగా ఆజన్మాంతం కుల, మత నియంతృత్వాలను ఎదిరించిన యోధుడు.చదవండి: వాళ్ల తలల్ని 'తలారీ'కి అప్పజెప్పవద్దు!‘జై భీమ్’ అనేది కేవలం నినాదం కాదు. శక్తితో నడవడం, స్వచ్ఛమైన జీవితంతో సాగడం, సంపదను సృష్టించడం. అయితే అంబేడ్కర్ ఆలోచనలకు భిన్నంగా ఈనాడు రిజర్వేషన్లను దళితులకు పూర్తిగా చెందకుండా చేయడమే గాక వారి ప్రతిభపైనా, ఉనికిపైనా నిరంతర దాడులు చూస్తున్నాము. డీలిమిటేషన్ పేరుతో దక్షిణ భారతంలో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు తగ్గించి రాజకీయాల్లో వీరిని నామమాత్రం చెయ్యాలనే భావనలు కూడా అంబేడ్కర్ ఆలోచనలకు వ్యతిరేకం. అంబేడ్కర్ ఒక్కొక్క సందర్భంలో ప్రతివాదిగా, విప్లవ కారుడిగా, పోరాట వీరుడిగా, మహర్ బిడ్డగా, రాజనీతిజ్ఞుడిగా మనకు స్ఫూర్తినిస్తున్నాడు. ఆయన జీవితమే మనకు అధ్యయన కేంద్రం. ఈనాడు బహుజన రాజ్యాధికారాన్ని కుల నిర్మూలనా సిద్ధాంత దీక్షతో సాధించాలి. ఇదే అంబేడ్కర్ జయంతికి ఇచ్చే ఘనమైన నివాళి.డాక్టర్ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు(నేడు అంబేడ్కర్ జయంతి) -
అరుదైన 'కొడాలి కరుప్పూర్ చీర'లో కంగనా రనౌత్..! ఆ శారీ ప్రత్యేకతలివే..
సెలబ్రిటీల కారణంగా అంతరించిపోతున్న కొన్ని అరుదైన వస్త్రాలు, నేతలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకరకంగా వారివల్ల రానున్న తరాలు మన హస్తకళాకారుల వైభవం, నాటి రాజుల వస్త్రాలంకరణ గురించి తెలుసుకునే అవకాశం దక్కుతోంది. అలాంటి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న అరుదైన చీర గురించి నటి కంగనా రనౌత్ పుణ్యమా అని అందరూ తెలుసుకునే అవకాశం దొరికింది. ఇంతకీ ఆమె ఎలాంటి చీర ధరించారు, దాని ప్రత్యేకలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.ఒకప్పుడు తంజావురు రాజకుటుంబీకులు కోసం మాత్రమే ప్రత్యేకించి హస్తకళకారులు నేసేవారట. అవే కొడాలి కరుప్పూర్ చీరలు. చిత్రలేఖనం , రెసిస్ట్ డైయింగ్ల కలయికలతో ఉంటుంది ఈ శారీ. ఇది 800 ఏళ్లనాటి చరిత్ర కలిగిన అరుదైన వస్త్రం అట. ఇప్పుడిప్పుడే మళ్లీ దీన్ని పునరుద్ధరిస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని చీరల నమునాలను మ్యూజియంలో భద్రపరిచారు కూడా. దీని గురించి భారతదేశ చేనేత, హస్తకళలపై కంటెంట్ సృష్టించే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ రాయ్ చౌధురి ఈ అరుదైన చీరను గురించి నెట్టింట షేర్ చేయడంతో మరోసారి ఈ శారీ వెలుగులోకి వచ్చింది. ఆమె నటి ఎంపీ కంగనా రనౌత్ తమిళనాడుకు చెందిన కొడాల కరుప్పూర్ చీరను ధరించడం గురించి మాట్లాడారు. ఈ చీరలు 1787 నుంచి 1832 మధ్య మరాఠా పాలకుడు సర్ఫోజీ రాజా భోంస్లే చత్రపతిII పోషణలో రూపుదిద్దుకున్నట్లు తెలిపారు. 19వ శతాబ్దం వరకు తంజావురు రాణుల కోసం నేసేవారట ఈ చీరలను. "వీటిని తంజావూరు జిల్లాలోని కుంభకోణం సమీపంలో ఉన్న కోడాలి కరుప్పూర్ గ్రామంలో ఉత్పత్తి చేసేవారు. ఆ నేత కార్మికుల పూర్వీకులు సౌరరాష్ట్ర, మధురై, సేలం, కాంచీపురానికి వలస వచ్చిన సుమారు 400 నుంచి, 500 కుటుంబాలకు చెందినవారు. దీనిని 'ఖిల్లాత్' లేదా "గౌరవ వస్త్రాలు"గా కూడా ఉపయోగించేవారు. ఇది ఆలయ ఆచారాలలో ఒక ముఖ్యమైన భాగంగా ఉండేదట. ఒకే వస్త్రాన్ని నేయడంలో బహుళ పద్ధతులను ఉపయోగించడమే ఈ వస్త్రాన్ని ప్రత్యేకంగా నిలుపుతుంది. "కరుప్పూర్ వస్త్రాల నమూనా ప్రక్రియలో మొదటి దశ బంగారం లేదా వెండి జరీతో జందానీ నేత. దానిపై కలంకారి మాదిరిగా మైనపు నిరోధక రంగు, మోర్డెంట్రంగు చిత్రలేఖనాన్ని ఉపయోగించి నమునాను సృష్టిస్తారని పోస్ట్లో వెల్లడించారు రాయ్.స్పెషాల్టీ..కేవలం నేతపై ఆధారపడే కాంచీపురం పట్టుకు లేదా ప్రధానంగా చిత్రలేఖనంతో కూడిన కలంకారికి భిన్నంగా, ఈ కొడాలి కరుప్పూర్ చీర ఒకే వస్త్రంలో నేత, నిరోధక రంగు అద్దకం, చేతి చిత్రలేఖనాన్ని ప్రత్యేకంగా మిళితం చేస్తుంది. వాస్తవానికి వీటిని స్వచ్ఛమైన పత్తితో నేసేవారు. అయితే మ్యూజియంలో భద్రపరిచినవి మాత్రం 'దొరుఖా' రకానికి చెందినవట, అంటే రెండు వైపులా ఒకేలా కనిపించే కళ ఇది. కొన్ని చీరల్లో రంగు చిత్రలేఖనానికి బదులుగా ముద్రణ కోసం బ్లాకులను కూడా ఉపయోగిస్తారట. బ్రిటిష్ వారు తంజావూరును స్వాధీనం చేసుకున్న తర్వాతే ఈ చీర ఉత్పత్తి క్షీణించడం మొదలైందని చెబుతున్నారు చరిత్రకారులు. సంక్లిష్టమైన రెసిస్ట్ డైయింగ్ పద్ధతి, కష్టతరమే నేత ప్రక్రియ దీనికి తోడు ఆయా హస్తకళాకారుల లేకపోవడం వంటి కారణంగా ఈ చీరలు అంతరించిపోయాయని అంటున్నారు. అసలైన కొడాలి కరుప్పూర్ చీర కేవలం మ్యూజియంలోనే చూడగలమట. ఇప్పుడు వస్తున్న కరుప్పూర్ చీరలు దాని మాదిరి నేత చీరలే తప్ప అసలైనవి కావట. ఈ అరుదైన వస్త్రం మరింతగా రావాలంటే..హస్తకళాకారులు దీనిపై దృష్టిసారించి నాటి చీరల్లా రూపొందించాలి, అలాగే ఉత్పత్తికి తగ్గట్టుగా మంచి ఆదాయం వారికి లభిస్తే ఈ అరుదైన చీరలకు మళ్లీ నాటి వైభవం లభించే అవకాశం ఉందని చెబుతున్నారు సాంస్కృతిక నిపుణులు. ఇక కంగనా చీర తమిళనాడులోని చెన్నైలో ఉన్న అక్ష్ వీవ్స్ అండ్ క్రాఫ్ట్స్కు చెందినది. కళాక్షేత్ర ఫౌండేషన్లోని క్రాఫ్ట్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఈ చీరను పరిరక్షించడానికి కృషి చేస్తోంది. అయితే అవి నాటి తంజావురు రాజవంశికులు ధరించిన చీరల మాదిరిగా ఉండవనేది చాలామంది అభిప్రాయం. View this post on Instagram A post shared by Diya Roychowdhury (@vastrakathaxdiya) (చదవండి: 40 వేల మంది విద్యార్థులు అలా..! భావోద్వేగంలో నికితా పోర్వాల్) -
మత్స్యకారులకు అండగా వైఎస్ జగన్: సీదిరి అప్పలరాజు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో ఉన్న ఫిషింగ్ హర్బర్లను మత్స్యకారులకు దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. జువ్వలదిన్నె(కావలి) హార్బర్ను ప్రైవేట్పరం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మొదటి నుంచి మత్స్యకారులకు తోడుగా, అండగా నిలిచింది వైఎస్ జగన్ మోహన్రెడ్డినే. వైఎస్సార్సీపీ హయాంలో పది ఫిషింగ్ హర్బర్ల నిర్మాణం జరిగింది. తద్వారా ఆయన మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపారు. కానీ, కూటమి ప్రభుత్వం మళ్లీ మత్స్యకారులను జీవితాలను చీకట్లోకి నెట్టేస్తోంది. కూటమి పని తీరుపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మత్స్యకారులు ఆలోచన చేయాలి.. ఆంధ్రా మత్స్యకారులు పాక్, బంగ్లా జైళ్లలో మగ్గిపోవడం చూశాం. ఇప్పుడు ఫిషింగ్ హార్బర్లను ప్రైవేటీకరణ చేయాలనే కుట్ర చేస్తున్నారు. జువ్వలదిన్నె హార్బర్ను ప్రైవేట్పరం చేయాలనుకోవడం దుర్మార్గం. అసలు ఫిషింగ్ హర్బర్లలోకి మత్స్యకారులు వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు?. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో మత్స్యకారుల జీవితాలను తాకట్టు పెడతారా? అని చంద్రబాబు ప్రభుత్వాన్ని సీదిరి ప్రశ్నించారు. మత్స్యకారులు ఉద్యమించి.. గళమెత్తాల్సిన సమయం ఆసన్నమైందని సీదిరి పిలుపు ఇచ్చారు. ఫిషింగ్ హార్బర్ల ప్రైవేటీకరణ అంశంపై కూటమిని ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు నోరు తెరవకపోతే మరింత అన్యాయం జరుగుతుంది. మిగతా ఫిషింగ్ హార్బర్లనూ ప్రైవేటీకరణ చేస్తారు. అందుకే శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ఉన్న మత్స్యకారులు ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి. ప్రైవేటీకరణ వద్దు.. హర్బర్లు ముద్దు అని నినాదాలు చేయాలి. మత్స్యకారులకు వైఎస్జగన్ అండగా ఉన్నారు. కాబట్టి రేపటి ఆయన జువ్వలదిన్నె పర్యటన విజయవంతం చేయాలి’’ అని సీదిరి అప్పరాజు కోరారు. -
ఈ నెలలోనే ఆర్టీసీ సమ్మె సైరన్
-
‘మధ్య తరగతి’ బండి సాగేదెలా?
భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి మధ్యతరగతి ప్రజలే కీలకం. దేశంలో తయారయ్యే సగటు వస్తువులను అధికంగా కొనేది వీరే. ప్రభుత్వానికి సింహభాగం పన్నులు కట్టేదీ వీరే. కానీ, ప్రస్తుతం వారు ఆర్థికంగా, సామాజికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం పేదల కోసం పథకాలు ఇస్తోంది. ధనికుల కోసం ప్రోత్సాహకాలు అందిస్తోంది. కానీ, ఈ రెండింటి మధ్య ఉన్న మధ్యతరగతి ప్రజల కష్టాలను మాత్రం విస్మరిస్తోంది.వచ్చే జీతం చాలడం లేదుమునుపటితో పోలిస్తే ఇప్పుడు వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ సామాన్యుడి జీతం మాత్రం పెరగడం లేదు. దాదాపు 10 ఏళ్ల క్రితం ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్కో లేదా ఆఫీస్ ఉద్యోగికో వచ్చే ప్రారంభ జీతం ఎంత ఉందో, నేటికీ దాదాపు అంతే ఉంది. కానీ, అప్పటితో పోలిస్తే ఇళ్ల అద్దెలు, పెట్రోల్, కూరగాయల ధరలు రెట్టింపు అయ్యాయి. మన దేశంలో 70 శాతం మంది సంపాదన దేశ సగటు ఆదాయం కంటే తక్కువగానే ఉంది. అంటే, కొద్దిమంది ధనికులు రోజురోజుకు మరింత ధనవంతులు అవుతుంటే మెజారిటీ ప్రజలు మాత్రం బతుకు బండి అంతంతమాత్రంగానే నెట్టుకొస్తున్నారు.చదువు, వైద్యం, ఇల్లుమధ్యతరగతి బడ్జెట్ను ఈ మూడు అంశాలు పూర్తిగా చిన్నాభిన్నం చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత లేక, ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు భరించలేక తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. ఏటా ప్రైవేట్ రంగంలో ఫీజులు 10-20% పెరుగుతున్నాయి. పిల్లల భవిష్యత్తు కోసం సొంత అవసరాలను త్యాగం చేసి మరీ ఫీజులు కడుతున్నారు. మరోవైపు పెరిగిన వైద్య ఖర్చుల దృష్ట్యా ఒక్కసారి ఆసుపత్రిలో చేరితే లక్షల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. ఇన్సూరెన్స్ ఉన్నా అది అన్నింటికీ సరిపోవడం లేదు. వైద్యం కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. నగరాల్లో అద్దెలు విపరీతంగా పెరిగిపోయాయి. సొంత ఇల్లు కొందామంటే బ్యాంక్ వడ్డీలు భయం పుట్టిస్తున్నాయి. దీంతో సంపాదనలో సగం అద్దెకో లేదా ఈఎంఐకో సరిపోతోంది.‘ప్రభుత్వం లెక్కించే ధరల పెరుగుదల పాత పద్ధతిలో ఉంది. అది పప్పులు, ఉప్పుల ధరల మీద దృష్టి పెడుతుంది కానీ, మనం ఎక్కువగా ఖర్చు చేసే స్కూల్ ఫీజులు, హాస్పిటల్ ఖర్చులను సరిగ్గా లెక్కలోకి తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. అందుకే ప్రభుత్వ లెక్కల్లో ధరలు తక్కువగా ఉన్నా సామాన్యుడికి మాత్రం ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి’పొదుపు మాయం.. అప్పులే శరణ్యంఒకప్పుడు మధ్యతరగతి వారు భవిష్యత్తు కోసం డబ్బు దాచుకునేవారు. కానీ ఇప్పుడు నెలవారీ జీతం క్షణాల్లో అయిపోతోంది. దాచుకోవడానికి రూపాయి మిగలడం లేదు. అవసరాల కోసం అప్పులు చేయడం, క్రెడిట్ కార్డులు వాడటం పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా ప్రజల పొదుపు తగ్గిపోయి, అప్పులు పెరగడం ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరం.ఆశలు నీరుగారుతున్నాయిమధ్యతరగతి వారు కష్టపడి పైకి రావాలని కోరుకుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాల్లో ప్రమోషన్లు లేవు. కొత్త ఉద్యోగం చూద్దామంటే రిస్క్ ఎక్కువగా ఉంది. కొత్త టెక్నాలజీలు సంప్రదాయ కొలువులకు గొడ్డలిపెట్టుగా మారుతున్నాయి. కొంతమంది సంపన్నులకే మంచి చదువు దొరుకుతుండటంతో పేద/దిగువ మధ్యతరగతి వారు పైకి రావడం ఒక యుద్ధంలా మారింది.‘మధ్యతరగతి వారు కేవలం పన్నులు కట్టే యంత్రాలు కాదు. దేశం ఆర్థికంగా బలంగా ఉండాలంటే ఈ వర్గం కూడా బలంగా ఉండాలి. పెరిగిన పన్నుల భారం తగ్గించి విద్య, వైద్యం వంటి ప్రాథమిక అవసరాలు సామాన్యుడికి అందుబాటులోకి వచ్చేలా ఏ ప్రభుత్వమైనా చర్యలు తీసుకోవాలి. లేకపోతే దేశ ప్రగతి ప్రమాదపు అంచులకు చేరుతుంది’ఇదీ చదవండి: ఆరోగ్య బీమా.. ఆదుకునే కవచమా? చక్రవ్యూహమా? -
భారత్తో సిరీస్.. సౌతాఫ్రికా జట్టు ప్రకటన
టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకాల్లో భాగంగా సౌతాఫ్రికా మహిళా జట్టు స్వదేశంలో భారత జట్టుతో తలపడేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 17- 27 మధ్య ఇరుజట్ల మధ్య టీ20 సిరీస్ జరుగనుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ సౌతాఫ్రికా (CSA) భారత్తో తలపడే తమ జట్టును ప్రకటించింది.పదిహేను మంది సభ్యులకు చోటుఈ జట్టులో పదిహేను మంది సభ్యులకు చోటు ఇచ్చినట్లు CSA తెలిపింది. ఇందుకు సంబంధించి తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. భారత మహిళా జట్టుతో సిరీస్ కోసం టొబొగొ మచికేను తొలిసారి జాతీయ జట్టుకు ఎంపిక చేసినట్లు తెలిపింది. గాయపడిన కరాబో మెసో స్థానంలో 25 ఏళ్ల మచికేకు అవకాశం ఇచ్చినట్లు వెల్లడించింది.తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికఅదే విధంగా మసబటా క్లాస్ స్థానాన్ని ఎలిజ్ మేరీ మార్క్స్ భర్తీ చేసిందన్న CSA.. టీ20 ప్రపంచకప్ టోర్నీని దృష్టిలో పెట్టుకునే ఈ మేరకు ఇద్దరు కొత్త ప్లేయర్లకు అవకాశం ఇచ్చినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రొటిస్ మహిళా జట్టు హెడ్కోచ్ మండ్లా మషింబియ్ మాట్లాడుతూ.. ‘‘టీ20 ప్రపంచకప్ టోర్నీకి సమయం ఆసన్నమవుతోంది.ఎలిజ్, టొబొగొలను జట్టుకు ఆడించడం కోసం మేము ఆతురతగా ఎదురుచూస్తున్నాం. వాళ్లిద్దరు గొప్పగా ఆడతారని విశ్వసిస్తున్నాం. కొత్త ముఖాలకు చోటు ఇవ్వాల్సిన సమయం వచ్చింది. యువ ఆటగాళ్లు జట్టుతో ఉంటే నూతనోత్సాహంతో ముందుకు సాగగలం’’ అని పేర్కొన్నారు. కాగా భారత్తో టీ20 సిరీస్కు లారా వొల్వర్ట్ సౌతాఫ్రికా జట్టుకు సారథ్యం వహించనుంది.భారత్తో టీ20 సిరీస్కు సౌతాఫ్రికా మహిళా జట్టులారా వొల్వర్ట్ (కెప్టెన్), అనికె బాష్, తజ్మిన్ బ్రిట్స్, నదినె డి క్లెర్క్, ఆనెరి డెర్క్సన్, అయాండా హ్లుబి, సినాలో జాఫ్తా, అయబోంగా ఖాక, సునె లుస్, టొబొగొ మచికె, ఎలిజ్ మేరీ మార్క్స్, నొంకులులెకో మలబ, కాయ్లా రెయ్నికె, తుమి సెఖుఖునె, క్లో ట్రియాన్.సౌతాఫ్రికా- భారత్ మహిళా జట్ల టీ20 సిరీస్ షెడ్యూల్- 5 మ్యాచ్లు👉తొలి టీ20- ఏప్రిల్ 17- డర్బన్👉రెండో టీ20- ఏప్రిల్ 19- డర్బన్👉మూడో టీ20- ఏప్రిల్ 22- జొహన్నస్బర్గ్నాలుగో టీ20- ఏప్రిల్ 25- జొహన్నస్బర్గ్👉ఐదో టీ20- ఏప్రిల్ 27- బెనోని.చదవండి: సన్రైజర్స్ చేతిలో ఓటమి తర్వాత రియాన్ పరాగ్ వ్యాఖ్యలు -
అసంతృప్తిలో వైభవ్
ఐపీఎల్ 2026లో సంచలన ప్రదర్శనలతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ సొంత జట్టు వైఖరిపై అసంతృప్తిగా ఉన్నాడని తెలుస్తుంది. ఈ విషయాన్ని జట్టు అసిస్టెంట్ కోచ్ ట్రెవర్ పెన్నీ స్వయంగా వెల్లడించారు. రాయల్స్కు ఫీల్డింగ్ కోచ్ కూడా అయిన పెన్నీ నిన్న (ఏప్రిల్ 13) సన్రైజర్స్తో మ్యాచ్ సందర్భంగా మాట్లాడుతూ.. వైభవ్కు ఫీల్డింగ్ అంటే చాలా ఇష్టం. కానీ డొనోవన్ ఫెరియెరా ఫిట్నెస్ పాస్ చేశాడు. అతను గన్ ఫీల్డర్. అందుకే అతనిని మెయిన్ XIలో ఉంచాం. వైభవ్ దీని పట్ల సంతోషంగా లేడు. ఈ విషయంలో జట్టు ఉద్దేశం వైభవ్ మంచి ఫీల్డర్ కాదని కాదు. ప్రస్తుతానికి ఫెరియెరా ఫీల్డింగ్ అత్యుత్తమంగా ఉంది. ఆ ఉద్దేశంతోనే వైభవ్ను ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడిస్తున్నామని అన్నాడు.కాగా, ప్రస్తుత ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ గత కొద్ది మ్యాచ్లుగా ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగుతున్నాడు. తాజాగా ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లోనూ అతను ఇంపార్ట్ సబ్స్టిట్యూట్గా (బ్యాటర్గా మాత్రమే) ఆడాడు. రాయల్స్ మొదట బౌలింగ్ ఎంచుకోవడంతో అతను డగౌట్కే పరిమితమయ్యాడు. 217 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో యశస్వి జైస్వాల్తో కలిసి ఓపెనర్గా బరిలోకి దిగి గోల్డెన్ డకౌటయ్యాడు. ఎస్ఆర్హెచ్ అరంగేట్రం పేసర్ ప్రఫుల్ హింగే అద్భుతమైన బంతితో వైభవ్ను బోల్తా కొట్టించాడు. ఈ మ్యాచ్లో హింగే వైభవ్తో పాటు మరో ముగ్గురిని కూడా ఔట్ చేసి ఎస్ఆర్హెచ్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. తొలి ఓవర్లోనే హింగే వైభవ్తో పాటు జురెల్, ప్రిటోరియస్లను కూడా డకౌట్ చేసి ఐపీఎల్ చరిత్రలో తొలి ఓవర్లోనే ముగ్గురిని ఔట్ చేసిన తొలి బౌలర్గా చరిత్ర సృష్టించాడు.ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఎస్ఆర్హెచ్ మ్యాచ్కు ముందు వైభవ్ అత్యుత్తమ ఫామ్లో ఉన్నాడు. 5 మ్యాచ్ల్లో సగటు 40, స్ట్రైక్ రేట్ 263.16తో 200 పరుగులు చేసి, లీడింగ్ స్కోరర్గా ఉన్నాడు. సీఎస్కే, ఆర్సీబీపై 15 బంతుల్లో హాఫ్ సెంచరీలు చేసి సంచలనం సృష్టించాడు. -
ఈసారి వానలు తక్కువే: ఐఎండీ
న్యూఢిల్లీ: ఈ ఏడాది వర్షాలు సాధారణం కంటే తక్కువగానే కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. దాదాపు మూడేళ్ల తర్వాత ఎల్ నినో పరిస్థితులు జూన్లో ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని, దీని ప్రభావం నైరుతి రుతు పవనాలపై పడనుందని అంచనా వేసింది. సాధారణంగా జూన్ నుంచి సెపె్టంబర్ వరకు సాధారణ వర్షపాతం సరాసరిన 87 సెంటీమీటర్ల కాగా, ఈసారి 80 సెంటీమీటర్ల వర్షపాతమే నమోదయ్యే అవకాశముందని ఐఎండీ చీఫ్ మహాపాత్ర పేర్కొన్నారు. దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో ఇవే పరిస్థితులుంటాయన్నారు. అయితే, ఈశాన్య, వాయువ్య, దక్షిణ భారతంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం, అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. -
యూఏఈ సంచలన కామెంట్స్
యూఏఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. హర్ముజ్ జలసంధి మీద అధికారం కేవలం ఒక్క ఇరాన్కే లేదని తెలిపింది. అది ఏమి టెహ్రాన్ ఆస్తి కాదని తెలిపింది. హర్ముజ్ జలసంధిని విముక్తి చేయడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు యుఏఈ మద్దతిస్తుందని ప్రకటించింది.ప్రస్తుతం పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా హర్మూజ్ను బ్లాకేడ్ చేయడంతో చమురు సరఫరా పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉంది. దీంతో గల్ఫ్ దేశాలు అమెరికాను రిక్వెస్ట్ చేస్తున్నాయి. హర్ముజ్ దిగ్భందనం తొలగించాలని సౌదీఅరేబియా అమెరికాను కోరింది.ఈ నేపథ్యంలో యూఏఈ ఇరాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. హర్ముజ్ జలసంధి కేవలం ఇరాన్ సొత్తు కాదని తెలిపింది. హర్మూజ్ను విముక్తి చేయడానికి చేస్తున్న ప్రయత్నాలకు గల్ఫ్ దేశాలు అండగా నిలుస్తాయని పేర్కొంది. ఈ అంశమై బహ్రెయిన్ రాజుతో యూఏఈ అధ్యక్షుడు సమావేశమైనట్లు తెలుస్తోంది.దేశ సమస్యలను చర్చలతో పరిష్కరించుకోవాలి గానీ ఇటువంటి దిగ్భందనాలు చేయడటం మంచిది కాదని యూఏఈ పేర్కొంది. ఈ విషయమై ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో యూఏఈ సంప్రదింపులు జరిపినట్లు పేర్కొంది. అయితే అమెరికా విపరీత డిమాండ్ల వల్లనే చర్చలు విఫలమయ్యాయని ఆయన యూఏఈతో తెలిపినట్లు సమాచారం.ప్రస్తుతం అమెరికా సైతం హర్ముజ్ను బ్లాకేడ్ చేయడంతో పరిస్థితులు మరింత దిగజారాయి. ఇరాన్ పోర్టుల నుండి నౌకలు ఎటు కదలడం లేదు. దీంతో రోజుకు సరాసరిన రూ. 4 వేల కోట్ల రుపాయల నష్టం జరుగుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
కేంద్రానికి ఇదే నా చివరి హెచ్చరిక: సీఎం స్టాలిన్
సాక్షి, చెన్నై: డీలిమిటేషన్ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. పార్లమెంట్లో గనుక డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందితే, తమిళనాడులో ఇప్పటివరకు చూడని స్థాయిలో భారీ ఉద్యమాన్ని చేపడతానని ఆయన స్పష్టం చేశారు.మంగళవారం తన సోషల్ మీడియాలో స్వయంగా సీఎం స్టాలిన్ ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ‘‘అదే గనుక జరిగితే నా రాష్ట్ర ప్రజలతో కలిసి రోడ్డుపై బైఠాయిస్తాను. 1960 నాటి డీఎంకే ఉద్యమాన్ని మళ్లీ పరిచయం చేస్తాను. కేంద్రానికి, ప్రధానికి ఇదే నా చివరి హెచ్చరిక’’ అని ప్రకటించారాయన. ఆయన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.డీలిమిటేషన్ అంటే పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన. ఈ ప్రక్రియలో దక్షిణ రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని, ఉత్తర రాష్ట్రాలకు అధిక ప్రాతినిధ్యం లభిస్తుందని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో.. తమిళనాడు ప్రజల హక్కులను కాపాడేందుకు తాను వెనుకాడబోనని సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు.డీలిమిటేషన్ అంశంపై తమిళనాడులో ఇప్పటికే డీఎంకే కార్యకర్తలు, మిత్రపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. స్టాలిన్ హెచ్చరికతో ఉద్యమానికి మరింత ఊపిరి లభించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.Hon’ble Prime Minister, this is Tamil Nadu’s final warning.மாண்புமிகு பிரதமர் அவர்களே, இது தமிழ்நாட்டின் இறுதி எச்சரிக்கை!#TNwillFightTNwillWin pic.twitter.com/v9wkYYM6MO— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) April 14, 2026 -
కొత్త జంటకు ప్రధాని మోదీ క్షమాపణ.. వైరల్ వీడియో
సిలిగురి: దేశ ప్రధాని స్థాయి వ్యక్తి, ఒక సామాన్య కొత్త జంటకు స్వయంగా క్షమాపణలు చెప్పడం ఎప్పుడైనా చూశారా? పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో సరిగ్గా ఇదే జరిగింది. ఒక వైపు కట్టుదిట్టమైన భద్రత, మరోవైపు పెళ్లి సందడి.. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఒక చిన్న పని ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారింది.రిసార్ట్లో అనూహ్య ఘటనపశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సిలిగురిలోని మయ్ఫెయిర్ టీ రిసార్ట్కు చేరుకున్నారు. అదే సమయంలో అక్కడ శ్రేయ, అక్షయ్ అనే యువజంట వివాహ వేడుకలు జరుగుతున్నాయి. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల కారణంగా ఆ పెళ్లి సందడికి కొంత అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని గమనించిన మోదీ, ఊహించని విధంగా ఆ కొత్త జంట వద్దకు వెళ్లి, వారికి కలిగిన అసౌకర్యానికి స్వయంగా క్షమాపణలు తెలియజేశారు. A heartfelt moment from PM Shri @narendramodi ji in Siliguri.He personally apologised to newlyweds Shreya and Akshay, whose wedding celebrations at Mayfair Tea Resort were affected due to heightened security during his visit.𝐀 𝐬𝐦𝐚𝐥𝐥 𝐠𝐞𝐬𝐭𝐮𝐫𝐞, 𝐛𝐮𝐭 𝐢𝐭… pic.twitter.com/JjJGUE86ru— BJP (@BJP4India) April 13, 2026నెట్టింట వైరల్గా మారిన వీడియోదేశ అత్యున్నత నేత తమ వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పడంతో ఆ జంటతో పాటు అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ తమ అధికారిక ‘ఎక్స్’ఖాతాలో పంచుకోగా, అది క్షణాల్లో వైరల్ అయింది. ఏప్రిల్ 23, 29 తేదీల్లో జరగనున్న రెండు దశల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ సిలిగురిలో పర్యటిస్తున్నారు. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 4న జరగనుంది. 2021 ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 213 స్థానాలతో ఘన విజయం సాధించగా, బీజేపీ 77 స్థానాలతో బలమైన ప్రతిపక్షంగా ఎదిగింది. -
మృణాల్ కొత్త సినిమా.. 'ఏఐ'తో ఫస్ట్ లుక్ టీజర్
రీసెంట్ టైంలో భారీ బడ్జెట్ విజువల్ ఎఫెక్ట్స్ సినిమాల నుంచి ప్రమోషనల్ కంటెంట్ ఏమైనా రిలీజ్ అయిందంటే చాలు.. తమ చిత్రంలో ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ)ని ఉపయోగించలేదని హీరోలు చెప్పుకోవాల్సిన పరిస్థితి. అయితే అవసరాన్ని బట్టి ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో తప్పులేదు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ తన కొత్త మూవీ కోసం ఏఐని అధికారికంగా వాడేశాడు. తాజాగా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేయగా అందులో ఈ టెక్నాలజీతో చేసిన ఔట్పుట్ దర్శనమిచ్చింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)వరుణ్ ధావన్, పూజా హెగ్డే, మృణాల్ ఠాకుర్ జంటగా నటించిన లేటెస్ట్ హిందీ సినిమా 'హే జవానీ తో ఇష్క్ హోనా హై'. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లని ప్రేమించే వ్యక్తిగా హీరో కనిపిస్తాడు. సదరు హీరోయిన్లకు పుట్టిన పిల్లలిద్దరూ మాట్లాడుకునే సీన్స్ అన్ని ఏఐలో సృష్టించారు. వాటినే తాజాగా వదిలిన ఫస్ట్ లుక్ టీజర్ వీడియోలో చూపించారు. ఇది ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో మరిన్ని హిందీ, తెలుగు, పాన్ ఇండియా చిత్రాల్లో ఈ టెక్నాలజీని అధికారికంగానే ఉపయోగించేయనున్నారు.(ఇదీ చదవండి: కుమారస్వామి కథతో ఎన్టీఆర్ సినిమా.. టైటిల్ ఫిక్సయిందా?) -
షోకాజు నోటీసులు జారీ చేసిన బీసీసీఐ
ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్ జట్టు మేనేజర్ రోమీ భిందర్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) షాకిచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా అతడు డగౌట్లో మొబైల్ ఫోన్ వాడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ అవినీతి, భద్రత నిరోధక విభాగం రోమీ భిందర్కు షోకాజు నోటీసులు జారీ చేసింది. డగౌట్లో మొబైల్ ఫోన్ ఎందుకు వాడారో 24 గంటల్లోపు వివరణ ఇవ్వాలని ఈ నోటీసులో బీసీసీఐ పేర్కొంది.వైభవ్ సూర్యవంశీ కూడా...కాగా శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుతో గువాహటిలో జరిగిన మ్యాచ్ సందర్భంగా రోమీ భిందర్ మొబైల్ ఫోన్ వాడాడు. ఆ సమయంలో రాజస్తాన్ ఓపెనింగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కూడా అతడి పక్కనే ఉన్నాడు. వీరిద్దరు మొబైల్లోకి చూస్తున్నట్లుగా ఉన్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. కాగా ఐపీఎల్ పాలక మండలి నిబంధనల ప్రకారం జట్టు మేనేజర్కు మొబైల్ ఫోన్ వాడే వెసులుబాటు ఉన్నా... డగౌట్లో మాత్రం ఉపయోగించడానికి వీలు లేదు.తొలి ఓటమిఇదిలా ఉంటే.. వరుస విజయాలతో దుమ్ములేపుతున్న రాజస్తాన్ రాయల్స్ జోరుకు సన్రైజర్స్ హైదరాబాద్ అడ్డుకట్ట వేసింది. ఉప్పల్ వేదికగా సోమవారం నాటి మ్యాచ్లో రాయల్స్ను 57 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచిన రాయల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా సన్రైజర్స్ బ్యాటింగ్కు దిగింది.నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 216 పరుగులు సాధించింది సన్రైజర్స్. లక్ష్య ఛేదనలో రాయల్స్ 19 ఓవర్లలో 159 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. సన్రైజర్స్ బౌలర్ ప్రఫుల్ హింగే ఆకాశమే హద్దుగా చెలరేగి ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (0)తో పాటు వన్డౌన్లో వచ్చిన ధ్రువ్ జురెల్ (0), లువాన్ డ్రి ప్రిటోరియస్ (0), కెప్టెన్ రియాన్ పరాగ్ (4)లను అవుట్ చేసి ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. ఇక ఇప్పటికి ఐదు మ్యాచ్లు పూర్తి చేసుకున్న రాయల్స్ నాలుగు గెలిచింది. చదవండి: సన్రైజర్స్ చేతిలో ఓటమి తర్వాత రియాన్ పరాగ్ వ్యాఖ్యలు -
'ధురంధర్-2' హిట్ రీమిక్స్ వీడియో సాంగ్ విడుదల
బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్- దర్శకుడు ఆదిత్య ధర్ కాంబినేషన్ సినిమా ధురంధర్-2.. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. తాజాగా ఈ మూవీ నుంచి వివాదస్పదమైన రీమిక్స్ సాంగ్ వీడియో వర్షన్ను విడుదల చేశారు. ధురంధర్-2 సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్దేవ్ కంపోజ్ చేసిన ‘హమ్ ప్యార్ కర్నే వాలే’ (Hum Pyar Karne Wale) సాంగ్ బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే, ఈ సాంగ్ త్రిదేవ్(1989) చిత్రంలోని పాటనే రీమిక్స్ చేశారని త్రిమూర్తి ఫిల్మ్స్ ఆరోపిస్తూ కోర్టులో దావా వేసింది. ఈ సాంగ్కు సంబంధించిన పూర్తి హక్కులు తమ వద్దే ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం తుది తీర్పు కోసం వేచి చూస్తున్నారు. -
రూ.90 లక్షలు ఇస్తేనే ఫస్ట్నైట్ : తీవ్ర ఘర్షణ, కట్ చేస్తే!
ఆగ్రాలో జరిగిన ఒక వింత సంఘటన పెళ్లి చేసుకున్న మొదటి రోజే ఆ కొత్త పెళ్లికొడుకు ఆశలను అడియాశలు చేసింది. పెళ్లిలో మూడు ముళ్ల ముచ్చటను పూర్తి చేసుకొని ఫస్ట్నైట్ ముచ్చట కోసం ఎదురు చూస్తున్న వరుడుకి భారీ షాక్ తగిలింది. చివరికి ఇది ఘర్షణకు, ఆ తరువాత పోలీస్ కేసు వరకు దారి తీసింది. విషయం ఏమిటంటే..ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ. 90 లక్షల డిమాండ్ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో జగదీష్పురా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తొలి రాత్రే వధువు తన భర్తను రూ. 90 లక్షలు డిమాండ్ చేసిన ఘటన వైరల్గా మారింది. ఆగ్రాలోని జగదీష్పురా ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి (ఒక డాక్టర్ తమ్ముడు), హత్రాస్కు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి వేడుకలు ఘనంగా ముగిసాయి. సాంప్రదాయం ప్రకారం దంపతులు శోభనం గదిలోకి వెళ్లారు. ఈ వేడకలో భాగంగా వధువు కొంగున ఎంతో కొంత బంగారం మూట గట్టడం ఆనవాయితీ. కానీ ఈ వధువు తనకు ఏకంగా రూ. 90 లక్షల నగదు కావాలని డిమాండ్ చేసింది. అది ఇస్తేనే శారీరక సంబంధానికి అంగీకరిస్తానని భర్తతో చెప్పింది. దీంతో షాకైన భర్తఅందుకు నిరాకరించడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.పెళ్లికొడుకు కుటుంబ సభ్యులు ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు, కానీ వధువు తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రప్పించింది. దీంతో వారొచ్చి నానా హంగామా సృష్టించడంతో వివాదం మరింత ముదిరింది. తీవ్ర ఘర్షణకు దారి తీసింది. వరుడి ఇంటిపై దాడి చేసిన వస్తువులను ధ్వంసం చేశారు.అక్కడితో ఆగలేదు... పెళ్లికొడుకు కుటుంబాన్ని లోపల ఉంచి బయట నుంచి తాళం వేశారు.ఇంట్లో ఉన్న పీఎన్జీ (PNG) గ్యాస్ పైప్లైన్ను పగులగొట్టి, గ్యాస్ లీక్ చేసి ఇంటికి నిప్పు పెట్టాలని చూశారని ఆపోపణలు. మొత్తానికి పొరుగువారి సహాయంతో వరుడి కుటుంబం ప్రాణాలతో బయటపడింది. దీంతో నిందితులు, వధువు అక్కడినుంచి పారిపోయారు. పోతూ పోతూ, వధువు తనతో పాటు అత్తగారి నగలను, విలువైన వస్తువులను తీసుకుని ఉడాయించింది.ఈ ఘటనపై వరుడి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వధువు, ఆమె కుటుంబ సభ్యులపై తీవ్ర ఆరోపణలు చేసింది. అసలు ఆమె ఉద్దేశం పెళ్లి కాదని, కేవలం డబ్బు సంపాదించడమేనని ఆమె లక్ష్యమని బాధితులు తమ ఫిర్యాదులో తెలిపారు. ఈ విషయాన్నివధువు స్వయంగా ఒప్పుకుందని కూడా వారు పేర్కొన్నార. అలాగే గ్యాస్ పేల్చి, అందరినీ చంపేయాలని చూశారని బాధితులు ఆరోపించారు. తొలుత పోలీసులు స్పందించకపోవడంతో, వరుడి కుటుంబం కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు జగదీష్పురా పోలీసులు వధువు, ఆమె తండ్రి , ఇతరులపై కేసు నమోదు చేశారు.ఎట్టకేలకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. ఈ పెళ్లి కుదిర్చిన మధ్యవర్తి కోసం కూడా గాలిస్తున్నారు. ఇది అసలైన మోసమా లేక వరకట్న వేధింపుల కేసు నుంచి తప్పించుకోవడానికి ముందుగా ప్లాన్ చేసిన గొడవా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
రషీద్ ఖాన్కు కీలక పదవి
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆటగాడు రషీద్ ఖాన్కు కీలక పదవి దక్కింది. ప్రపంచ క్రికెటర్స్ అసోసియేషన్ (WCA) ప్లేయర్ అడ్వైజరీ బోర్డులో సభ్యుడిగా నియమితులయ్యాడు. ఈ విషయాన్ని WCA సీఈవో ఇవాళ (ఏప్రిల్ 14) ప్రకటించారు. WCA ప్లేయర్ అడ్వైజరీ బోర్డులో రషీద్తో పాటు చమారి ఆటపట్టు, డారిల్ మిచెల్, వేన్ మాడ్సెన్, మాడీ గ్రీన్ కూడా చోటు దక్కింది. ఈ పదవిలో రషీద్ తదితరులు గ్లోబల్ క్రికెట్లో జరిగే విషయాలపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తారు. WCA బోర్డు 2018లో ఏర్పడింది. ఐసీసీ ఈవెంట్లు, షెడ్యూలింగ్, కమర్షియల్ అంశాలపై ఆటగాళ్ల అభిప్రాయాలను ప్రతిబింబించడం ఈ బోర్డు ప్రధాన లక్ష్యం. ఇందులో 17 ప్రధాన క్రికెట్ దేశాల ఆటగాళ్లకు ప్రాతినిథ్యం ఉంది.కొత్త బోర్డు సభ్యుల నియామకం తర్వాత WCA సీఈవో మాట్లాడుతూ.. ఆటగాళ్లు క్రికెట్ భవిష్యత్తుపై శ్రద్ధ చూపుతున్నారు. 2028 ఒలింపిక్స్లో క్రికెట్ పాల్గొనడం వంటి అంశాలపై చర్చలు జరిగాయి. ఆటగాళ్ల హక్కులు, అవకాశాలు, క్రికెట్ అభివృద్ధి కోసం వారు కలసి పనిచేయాలని కోరుకుంటున్నారని అన్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం రషీద్ ఖాన్ ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్నాడు. ఈ సీజన్లో అతను ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో 5 వికెట్లు తీశాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్పై (4-0-17-3) మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేసి, గతకొంతకాలంగా లేని ఫామ్ను దొరకబుచ్చుకున్నాడు. 2024లో వెన్ను శస్త్రచికిత్స తర్వాత రషీద్ ప్రభావం కాస్త తగ్గింది. ఈ సీజన్లో గుజరాత్ తమ తదుపరి మ్యాచ్లో కేకేఆర్తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 17న జరుగనుంది. -
బీజేపీ మేనిఫెస్టోలో ఊహించని వరాలు.. ప్రత్యర్థులకు షాక్!
చెన్నై: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతున్న భారతీయ జనతా పార్టీ ఓటర్లపై వరాల వర్షం కురిపించింది. చెన్నై వేదికగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. మహిళలు, రైతులు, సామాన్యులే లక్ష్యంగా.. ప్రజా సంక్షేమం, మెరుగైన వైద్యం, ఆర్థిక స్థిరత్వమే మహా మంత్రంగా రూపొందించిన ఈ మేనిఫెస్టో ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్గా మారింది.మహిళలకే అగ్రపీఠంబీజేపీ తన మేనిఫెస్టోలో మహిళా సాధికారతకు పెద్దపీట వేసింది. కుటుంబ యజమానురాళ్లకు ప్రతి నెలా రూ. 2,000 ఆర్థిక సాయం, ప్రతి ఇంటికి ఉచిత ఎల్పీజీ సిలిండర్లు, అర్హులైన మహిళలకు ఈ-స్కూటర్ కొనుగోలుకు రూ. 25,000 సాయం ఇస్తామని ప్రకటించింది. ఇల్లు కొనుగోలు చేసే మహిళలకు స్టాంప్ డ్యూటీలో మూడు శాతం రాయితీ, ప్రతి కుటుంబానికి ఏకకాలంలో రూ. 10,000 ఆర్థిక సాయం అందిస్తామని తెలిపింది. స్వయం సహాయక సంఘాలు, ఎంఎస్ఎంఈ లకు రూ. 50 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని తెలిపింది.జల్లికట్టుకు జైవిద్యార్థినులు, మహిళల భద్రత కోసం బస్సులు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుతో పాటు జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని పటిష్టంగా అమలు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. నేరాల సత్వర విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ఇక తమిళుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ‘జల్లికట్టు’కు పూర్తి మద్దతు ప్రకటిస్తూ.. ఎద్దులను పెంచే వారికి నెలకు రూ. 2,000 సాయం, ఒకవేళ ఆటలో పాల్గొనే వ్యక్తి మరణిస్తే రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని ప్రకటించడం సంచలనంగా మారింది.రైతులకు కేంద్ర సాయానికి అదనంగా మరో రూ. 3,000 (మొత్తం రూ. 9,000) ఇస్తామని తెలిపింది. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, కే అన్నామలై, తమిళసై సౌందరరాజన్ తదితరుల సమక్షంలో విడుదలైన ఈ మేనిఫెస్టో.. ఎన్నికల ప్రచారంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా, మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. 🔴LIVE | பாஜக தாமரை வாக்குறுதி 2026 | தமிழக சட்டமன்றத் தேர்தலுக்கான பாஜகவின் தேர்தல் அறிக்கை வெளியீட்டு விழா#தாமரை_வாக்குறுதி #TNBJPManifesto https://t.co/mHA6ezpAnk— BJP Tamilnadu (@BJP4TamilNadu) April 14, 2026 -
నిరాశలో హింగే.. ఈ వజ్రాన్ని సానబెట్టింది ఎవరంటే?
‘ఈ మ్యాచ్తో ప్రఫుల్ హింగే ఐపీఎల్లో అరంగేట్రం చేస్తున్నాడు’... పంజాబ్ కింగ్స్తో గత మ్యాచ్ టాస్ సమయంలో సన్రైజర్స్ కెప్టెన్ ఇషాన్ కిషన్ చెప్పిన మాట ఇది. రైజర్స్ బౌలింగ్ సమయంలో ఇంపాక్ట్ సబ్గా హింగే రావాల్సింది. నిరాశకు లోనైన హింగేదురదృష్టవశాత్తూ జట్టు వ్యూహాల్లో భాగంగా చివరి నిమిషంలో అతడిని కాదని జయదేవ్ ఉనాద్కట్ను రైజర్స్ ఆడించింది. దీంతో హింగే తీవ్ర నిరాశకు లోనయ్యాడు. తొలి ఐపీఎల్ మ్యాచ్ చాన్స్ వచ్చిన ఆనందం అతనిలో ఆవిరైంది. ఒక 24 ఏళ్ల యువ ఆటగాడికి మానసికంగా ఇది ఎంతో ఇబ్బంది కలిగించే అంశం. Hang it in the Louvre 🤌pic.twitter.com/3VbpYVQumP— SunRisers Hyderabad (@SunRisers) April 13, 2026అయితే ఈ బాధతో వచ్చిన కసిని అతను తాజా మ్యాచ్లో చూపించినట్లున్నాడు. రాజస్తాన్ రాయల్స్ డేంజరస్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (0)తో పాటు వన్డౌన్లో వచ్చిన ధ్రువ్ జురెల్ (0), లువాన్ డ్రి ప్రిటోరియస్ (0), కెప్టెన్ రియాన్ పరాగ్ (4)లను అవుట్ చేసి.. ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బకొట్టాడు.దేశవాళీలో విదర్భ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ప్రఫుల్ 2024–25 సీజన్తోనే రంజీ ట్రోఫీలో అడుగు పెట్టాడు. ఎరుపు బంతితోనే బాగా ప్రభావం చూపించగల పేసర్గా గుర్తింపు పొందిన అతను 10 ఫస్ట్క్లాస్ మ్యాచ్లలో 27 వికెట్లు పడగొట్టాడు. కేవలం 6 వన్డేలే ఆడిన ప్రఫుల్కు ఐపీఎల్కు ముందు ఒకే ఒక టి20 మ్యాచ్ ఆడిన అనుభవం మాత్రమే ఉంది. ఉమేశ్ యాదవ్ను అభిమానించే ప్రఫుల్ అభిమాన బౌలర్ ప్యాట్ కమిన్స్. నాగ్పూర్కు చెందిన ప్రఫుల్ ఒక్కసారిగా సీన్లోకి రాలేదు. ఈ వజ్రాన్ని సానబెట్టింది ఎవరంటే?2022 నుంచి హింగే చెన్నైలోని ప్రతిష్టాత్మక ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్లో శిక్షణ పొందుతున్నాడు. భవిష్యత్తు కోసం ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తూ సానబెట్టే బీసీసీఐ ప్రక్రియలో భాగంగా ఎంపిక చేసిన ఆటగాళ్లలో ప్రఫుల్ కూడా ఉన్నాడు. 2024లో బ్రిస్బేన్లో జరిగిన పేస్ బౌలర్ల ప్రత్యేక శిక్షణా శిబిరంలో కూడా అతను పాల్గొన్నాడు. విదర్భ టి20 లీగ్లో నెకో మాస్టర్ బ్లాస్టర్స్ జట్టు విజేతగా నిలవడంలో అతను కీలకపాత్ర పోషించాడు. సన్రైజర్స్ ట్రయల్స్లో జట్టు బౌలింగ్ కోచ్ ప్రఫుల్ ప్రతిభను గుర్తించాడు. వేలంలో అతని కనీస ధర రూ. 30 లక్షలకు సన్రైజర్స్ తీసుకుంది. మరోవైపు.. బిహార్కు చెందిన పేసర్ సాకిబ్ హుస్సేన్ కూడా ఈ మ్యాచ్తోనే ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. 2024లో కోల్కతా టీమ్లో ఉన్నా మ్యాచ్ ఆడే అవకాశం రాకపోగా, ఈసారి రైజర్స్ రూ. 30 లక్షలకు ఎంచుకుంది. చదవండి: ఘోర ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన రాజస్థాన్ రాయల్స్ -
కుమారస్వామి కథతో సినిమా.. టైటిల్ ఫిక్సయిందా?
ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్తో 'డ్రాగన్' చేస్తున్నాడు. లెక్క ప్రకారం ఈ ఏడాదిలోనే రిలీజ్ కావాలి. కానీ ఇప్పట్లో రావడం కష్టమే అనిపిస్తుంది. ఒకవేళ వచ్చేలా ఉంటే దానికి తగ్గట్లు రూమర్స్, హింట్స్ వచ్చేవి. అలాంటివేం లేవంటే వచ్చే ఏడాదే థియేటర్లలోకి రావొచ్చేమో అనిపిస్తుంది. వచ్చే నెలలో బయటకొచ్చే గ్లింప్స్, ఫస్ట్ లుక్ బట్టి రిలీజ్పై క్లారిటీ రావొచ్చు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)తారక్ పుట్టినరోజునే మరో ప్రాజెక్టుపై కూడా పూర్తి క్లారిటీ వచ్చేలా కనిపిస్తుంది. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో కొన్నాళ్ల క్రితం ఓ సినిమాని ప్రకటించారు. కుమారస్వామి కథతో దీన్ని తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం వెంకటేశ్తో 'ఆదర్శ కుటుంబం' తీస్తున్న దర్శకుడు త్రివిక్రమ్.. ఇది పూర్తవగానే ఎన్టీఆర్తో చేయాల్సిన సినిమాపై దృష్టి పెట్టనున్నారు. అయితే ఈ చిత్రానికి 'షణ్ముఖుడు' అనే టైటిల్ రిజిస్టర్ చేయించారని తెలుస్తోంది. వచ్చే నెలలో ఎన్టీఆర్ బర్త్ డే నాడు ఈ టైటిల్ ప్రకటించొచ్చని టాక్.ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ అయితే తారక్తో సినిమాలు చేయడం పక్కా. తర్వాత లైనులో ఎవరున్నారనేది మాత్రం తెలియాల్సి ఉంది. తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ పేరు వినిపించింది కానీ దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పుడు వినిపిస్తున్న రూమర్స్ అన్నింటికీ తారక్ పుట్టినరోజున క్లారిటీ ఇస్తారేమో చూడాలి?(ఇదీ చదవండి: తెలుగు బిగ్ పాన్ ఇండియా సినిమాలో అలియా భట్) -
కోటిన్నర కట్నం కోసం మధు మాస్టర్ ప్లాన్!
నల్గొండ జిల్లా : తాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినంటూ నమ్మించి పెళ్లి పేరుతో యువతి కుటుంబ సభ్యుల నుంచి రూ.కోటిన్నర కట్నం పొందాలని చూసిన మోసగాడి నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మాడుగులపల్లి మండలం చెరుపల్లి గ్రామానికి చెందిన పనస వెంకటయ్య, సుజాత దంపతుల కుమారుడు పనస మధు తాను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్సీఐ) ఉద్యోగినని నమ్మించి నల్లగొండకు చెందిన యువతితో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు. అబ్బాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కావడంతో యువతి కుటుంబ సభ్యులు భారీ కట్నం ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే ప్రీ వెడ్డింగ్ షూట్ సాకుతో మధు యువతిని హైదరాబాద్కు పిలి పించాడు. అక్కడ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి వేధింపులకు గురిచేశాడు. బాధితురాలు కుటుంబ సభ్యులకు విషయం తెలపడంతో వారు హైదరాబాద్లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టగా.. మధు అసలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కాదని, అతడు చూపించిన ఐడీ కార్డు నకిలీదని, కట్నం కోసమే ఇదంతా ప్లాన్ చేసినట్లు నిర్ధారణ అయ్యింది. మధు తన స్నేహితులను సైతం తాను ఎఫ్సీఐ ఉద్యోగినంటూ నమ్మించినట్లు సమాచారం. మధుతో పాటు అతడి తల్లిదండ్రులు సైతం పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలిసింది. -
113 కిలో మీటర్ల సాహస యాత్రకు నరేశ్ రెడీ
జనగామ : హిమాలయాల్లో జరగనున్న సూర్య దేవభూమి చాలెంజ్ 2.0లో భాగంగా బద్రీనాథ్–కేదార్నాథ్ మార్గంలో 113 కిలోమీటర్ల హై ఆల్టిట్యూడ్ అల్ట్రా రన్కు జనగామ జిల్లా చీటకోడూరు గ్రామానికి చెందిన యువ అథ్లెట్ ఐతరాజు నరేశ్ అర్హత సాధించారు. భారత సైన్యం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కఠిన ఎండ్యూరెన్స్ రేస్లో పాల్గొంటూ నరేశ్ భవిష్యత్లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అల్ట్రా ట్రైల్డు మౌంట్ బ్లాంక్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. ఇందుకోసం ఇంటర్నేషనల్ ట్రైల్ రన్నింగ్ అసోసియేషన్ (ఐటీఆర్ఏ) గుర్తింపు పొందిన ఈవెంట్లలో పాయింట్లు సాధిస్తూ, అంతర్జాతీయ వేదికపై భారత ప్రతినిధిగా నిలవాలనే సంకల్పంతో కృషి చేస్తున్నాడు. 113 కిలో మీటర్లకు రెడీ..దేశంలో అత్యంత కఠిన అల్ట్రా రన్నింగ్ ఈవెంట్లలో ఒకటైన ‘సూర్య దేవభూమి ఛాలెంజ్ 2.0’ను ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రం హిమాలయ పర్వత శ్రేణుల్లో నిర్వహించనున్నారు. బద్రీనాథ్–కేదార్నాథ్ మార్గంలో జరిగే ఈ హై ఆల్టిట్యూడ్ ఎండ్యూరెన్స్ రన్ మొత్తం 113 కిలోమీటర్ల దూరం కవర్ చేయనుంది. ఈ ప్రతిష్టాత్మక పోటీలో దేశవ్యాప్తంగా ఎంపికైన రన్నర్లు పాల్గొంటుండగా, జనగామ జిల్లాకు చెందిన యువ అథ్లెట్ ఐతరాజు నరేశ్ కూడా ఈ సవాల్ను స్వీకరించనున్నారు. భారత సైన్యం ఆధ్వర్యంలో..ఈ ఈవెంట్ను భారత సైన్యం ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్ టూరిజం సహకారంతో నిర్వహిస్తున్నారు. సైనికులు, సాధారణ పౌరులు కలిసి పాల్గొనే ఈ రేస్ దేశ ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోంది. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా జీరో ప్లాస్టిక్, ఎకో ఫ్రెండ్లీ విధానాలతో ఈ పోటీని నిర్వహించడం విశేషం. కాగా, సాహసం, ఫిట్నెస్, దేశభక్తి కలయికగా నిలిచే ఈ రేస్లో నరేశ్ ప్రతిభ చాటాలని జిల్లా వాసులు ఆకాంక్షిస్తున్నారు.యాత్రకు ఆర్మీ సహకారంసూర్యదేవ భూమి 2.0లో సత్తా చాటేందుకు పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ అయ్యా. యూటీఎంబీ లక్ష్యంగా ముందుకు సాగుతా. మా సాహస యాత్రకు ఇండియన్ ఆర్మీ పూర్తి సహకారం అందిస్తుంది. 113 కిలో మీటర్ల యాత్రకు సంబంధించి పూర్తి రూట్ మ్యాప్ పంపించారు. ఈ నెల 13 మధ్యాహ్నం వరకు రన్ నిర్వహించే ప్రదేశానికి చేరుకుంటా. లక్ష్యం చేరుకుని జనగామ జిల్లా పేరును మరింత ఇనుమడింపజేస్తా- ఐతరాజు నరేశ్, సూర్య దేవభూమి చాలెంజ్కు ఎంపికైన జిల్లా వాసి -
తమిళిసై మైలాపూర్ ‘మహారాణి’.. వేచి చూడాలి!
చెన్నై: ఆధ్యాత్మికతకు, చారిత్రక వారసత్వానికి చిరునామా అయిన మైలాపూర్ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఒకవైపు అధికార డీఎంకే బలం, మరోవైపు మాజీ గవర్నర్, బీజేపీ ఫైర్ బ్రాండ్ తమిళిసై సౌందరరాజన్ దూకుడుతో ఈ ‘టెంపుల్ టౌన్’లో రాజకీయ సెగలు పుడుతున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో గెలుపోటములను శాసించే అసలైన శక్తి మాత్రం మహిళా ఓటర్లే.‘లేడీ పవర్’ ఎవరి వైపు?మైలాపూర్లో పురుషుల కంటే మహిళలే అధికం అని గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం 2,70,568 మంది ఓటర్లలో మహిళా ఓటర్లు 1,39,349, పురుష ఓటర్లు 1,31,179. ఈ నియోజకవర్గంలో మహిళా ఓటర్లు అధికంగా ఉండటం తమిళిసైకి అతిపెద్ద ప్లస్ పాయింట్గా మారిందని విశ్లేషకులు అంటున్నారు. ఒక మహిళా నాయకురాలిగా, ఒక వైద్యురాలిగా, మాజీ గవర్నర్గా ఆమెకున్న క్లీన్ ఇమేజ్ మహిళా ఓటర్లను ఆకర్షిస్తోందని చెబుతున్నారు. ఇంటింటి ప్రచారంలో మహిళలతో ఆమె మమేకమవుతున్న తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కమలం వికసిస్తుందా?గత చరిత్రను చూస్తే మైలాపూర్ ఏ పార్టీకీ శాశ్వత చిరునామా కాదు. 2016లో అన్నాడీఎంకేను ఆదరించిన ప్రజలు 2021లో డీఎంకే అభ్యర్థి ధా వేలుకు పట్టం కట్టారు. ప్రస్తుతం డీఎంకే సిట్టింగ్ ఎమ్మెల్యే ధా.వేలుపై వ్యతిరేకత ఉందా? లేక పి.వెంకటరమణన్ (టీవీకే), ఆర్ఎల్ అరుణ్ అయ్యంగార్ (ఎన్టీకే)లు ఓట్లను చీల్చుతారా? అన్నది పక్కన పెడితే.. తమిళిసై మాత్రం ‘మహిళా శక్తి’ మీదనే తన ఆశలన్నీ పెట్టుకున్నారు. మహిళా ఓటర్లు కరుణిస్తే మైలాపూర్ గడ్డపై కమలం వికసించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.బహుముఖ పోరులో ఉత్కంఠతత్వవేత్త తిరువళ్లువర్ జన్మించిన ఈ పవిత్ర నేలపై తనదైన ముద్ర వేయాలని తమిళిసై గట్టి పట్టుదలతో ఉన్నారు. అయితే మైలాపూర్ మహిళా ఓటర్లు ఎవరికి పట్టం కడతారో? ఈ ‘టెంపుల్ టౌన్’ పోరులో చివరకు విజేతగా ఎవరు నిలుస్తారో వేచి చూడాలి. ఇది కూడా చదవండి: నోయిడాలో కార్మిక రణరంగం: ఎవరీ మేధా రూపమ్? -
విజయ్కి బిగ్ షాక్.. లోకల్ ఛానల్లో ‘జననాయగన్’
తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ చీఫ్, నటుడు విజయ్కు నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సుమారు ఐదు నిమిషాల నిడివి గల కీలక దృశ్యాలు, పాటలు ఇంటర్నెట్లో లీక్ కాగా, తాజాగా ఓ లోకల్ ఛానల్ ఏకంగా సినిమా మొత్తాన్ని ప్రసారం చేసింది. ఇంకా థియేటర్స్లో కూడా విడుదల కానీ ఈ సినిమా.. టీవీలో ప్రసారం చేయడం చిత్రబృందాన్ని షాక్కు గురి చేసింది.కోయంబత్తూరు సమీపంలోని కరుమత్తంపట్టిలో ‘రాశి కేబుల్ టీవీ’ నెట్వర్క్ను నిర్వహిస్తున్న పళనిసామి అనే వ్యక్తి తన లోకల్ ఛానెల్లో ఏప్రిల్ 11 రాత్రి ఈ చిత్రాన్ని ప్రసారం చేశారు. ఇంకా థియేటర్స్లో విడుదల కాని సినిమా ఏకంగా టీవీలో ప్రసారం కావడాన్ని చూసి విజయ్ అభిమానులు, టీవీకే పార్టీ కార్యకర్తలు షాకయ్యారు. ఈ సినిమా ప్రసారాన్ని నిలిపివేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పళనిసామిని అరెస్ట్ చేసి ప్రసారానికి వాడిన కంప్యూటర్, హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే అప్పటికే సినిమా మొత్తం సదరు ఛానల్లో ప్రసారం అయిందని టీవీకే నేతలు చెబుతున్నారు. మరోవైపు ఈ సినిమా ఆన్లైన్ లీకేజీకి సంబధించిన కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు.సైబర్ క్రైమ్ విభాగం ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేసింది. -
ఆరోగ్య బీమా.. ఆదుకునే కవచమా? చక్రవ్యూహమా?
ఆరోగ్య బీమా అనేది ఆపద సమయంలో ఆదుకునే ఒక రక్షా కవచం. కానీ, అవసరానికి ఆ కవచం పనిచేయకపోతే పరిస్థితి ఏమిటి? ప్రస్తుతం దేశంలో ఇలాంటి సంఘటనలే ఎక్కువగా జరుగుతున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగి ఆసుపత్రి ఖర్చుల కోసం క్లెయిమ్ చేస్తే.. ఇన్సూరెన్స్ కంపెనీలు ఏదో ఒక కారణంతో తిరస్కరించడం లేదా సగం డబ్బులే ఇవ్వడం వంటివి సాధారణమయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారిక గణాంకాలు, నిపుణుల విశ్లేషణతో రూపొందించిన ప్రత్యేక కథనం మీ కోసం..క్లెయిమ్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది?వైద్య ఖర్చులు ఆకాశాన్నంటుతున్న తరుణంలో సామాన్యుడికి ఆరోగ్య బీమా కొండంత అండ. అయితే, క్లెయిమ్ సెటిల్మెంట్ విషయంలో పాలసీదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం, 2026 ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో ‘బీమా భరోసా’ పోర్టల్లో నమోదైన ఫిర్యాదులు, 2025 ఆర్థిక సంవత్సరం మొత్తం ఫిర్యాదుల సంఖ్యను మించిపోయాయి. ఫిబ్రవరి 2026 నాటికి ఈ పోర్టల్లో సుమారు 73,729 ఫిర్యాదులు నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇందులో దాదాపు 69% ఫిర్యాదులు కేవలం క్లెయిమ్ తిరస్కరణ లేదా జాప్యానికి సంబంధించినవే కావడం గమనార్హం.క్లెయిమ్ తిరస్కరణకు ప్రధాన కారణాలుబీమా సంస్థలు క్లెయిమ్లను తిరస్కరించడానికి నిబంధనలతోపాటు పాలసీదారుల అవగాహన లోపం కూడా ఒక కారణం. క్లెయిమ్ రిజెక్ట్ కావడానికి ప్రధానంగా ఐదు కారణాలు కనిపిస్తున్నాయి.ముందస్తు వ్యాధులను చెప్పకపోవడం..పాలసీ తీసుకునేటప్పుడు బీపీ, షుగర్ వంటి పాత జబ్బుల గురించి దాచడం అతిపెద్ద తప్పు. 36 నెలల నిరీక్షణ కాలం (మారటోరియం పీరియడ్) ముగియకముందే ఇలాంటివి బయటపడితే కంపెనీలు క్లెయిమ్ను నేరుగా తిరస్కరిస్తాయి.వెయిటింగ్ పీరియడ్కొత్తగా పాలసీ తీసుకున్న వెంటనే అన్ని వ్యాధులకు కవరేజీ ఉండదు. సాధారణంగా మొదటి 30 రోజులు (ప్రమాదాలు మినహా) నిర్దిష్ట వ్యాధులకు (హెర్నియా, క్యాటరాక్ట్.. వంటివి) 2-4 ఏళ్ల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఈలోపు క్లెయిమ్ చేస్తే అది రిజెక్ట్ అవుతుంది.వైద్య అవసరం లేకుండానే ఆసుపత్రిలో చేరికకేవలం డయాగ్నోస్టిక్ పరీక్షల కోసం లేదా ఇంట్లోనే చికిత్స పొందే అవకాశం ఉన్న జబ్బులకు ఆసుపత్రిలో చేరితే క్లెయిమ్ రాదు. కనీసం 24 గంటల ఆసుపత్రి చేరిక తప్పనిసరి (డే కేర్ చికిత్సలు మినహా).కాస్మెటిక్ సర్జరీలు, దంత చికిత్సలు, విటమిన్ సప్లిమెంట్స్ వంటివి చాలా పాలసీల్లో కవర్ కావు. మీరు పాలసీ తీసుకునే ముందే వీటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి.ఆసుపత్రిలో చేరిన 24-48 గంటల్లోపు బీమా సంస్థకు సమాచారం ఇవ్వాలి. రీయింబర్స్మెంట్ విషయంలో డిశ్చార్జ్ అయిన 15-30 రోజుల్లోపు పత్రాలు సమర్పించకపోతే సమస్యలు ఎదురవుతాయి.పాలసీ కొనే ముందు చెక్ చేయాల్సినవి..పాలసీ డాక్యుమెంట్ అనేది కేవలం కాగితాల కట్ట కాదు, అది ఒక చట్టపరమైన ఒప్పందం. కొనే ముందు కీలక అంశాలపై స్పష్టత తెచ్చుకోవాలి.గది అద్దెపై పరిమితి ఉందో లేదో చూడండి. గది అద్దె పరిమితి మించితే, మొత్తం బిల్లులో కంపెనీ కోత విధిస్తుంది.బిల్లులో కొంత శాతం మీరే చెల్లించాలనే నిబంధన(కో-పేమెంట్) ఉంటే ప్రీమియం తగ్గుతుంది కానీ, క్లెయిమ్ సమయంలో మీ జేబుకు చిల్లు పడుతుంది.మీ ఇంటికి దగ్గరలో ఉన్న ప్రముఖ ఆసుపత్రులు ఆ బీమా నెట్వర్క్లో ఉన్నాయో లేదో సరిచూసుకోండి.ఒకే ఏడాదిలో ఒకటికంటే ఎక్కువసార్లు అనారోగ్యం పాలైతే బీమా మొత్తం (సమ్ అస్యూర్డ్) తిరిగి రీఛార్జ్ అయ్యే సౌకర్యం ఉందో లేదో చూడండి.ఇన్సూరెన్స్ ఏజెంట్ చెప్పే మాటల కంటే పాలసీలోని ‘కీ ఫీచర్స్ డాక్యుమెంట్’ చదవడం ఉత్తమం. ఏదైనా ఫిర్యాదు ఉంటే మొదట బీమా సంస్థకు, అక్కడ పరిష్కారం లభించకపోతే ఐఆర్డీఏఐ ‘బీమా భరోసా’ పోర్టల్ లేదా ఇన్సూరెన్స్ అంబడ్స్మన్ను ఆశ్రయించవచ్చు.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు -
అంబేద్కర్ పేరును పలకడం కాదు.. ఆశయాల ఆచరణే ముఖ్యం
సాక్షి, తాడేపల్లి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయాల కొనసాగింపుపై ఆయన చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.‘‘అంబేద్కర్ని గుర్తు చేసుకోవడం అంటే ఆయన వారసత్వాన్ని అనుసరించడం కాదు.. ఆ ఆశయాలను ఆచరణలో పెట్టడం. ఆయన పేరును ఎన్ని సార్లు పలుకుతామన్నది కాదు.. ఆయన విజన్ను ఎంత స్థిరంగా ముందుకు తీసుకెళ్తామన్నదే ముఖ్యం. అదే ఆయనకు ఇచ్చే నిజమైన గౌరవం’’ అని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన ఒక ఆంగ్ల పత్రిక కోసం తాను రాసిన వ్యాసాన్ని కూడా పంచుకున్నారు. ఆ వ్యాసంలో అంబేద్కర్ వారసత్వాన్ని కేవలం జ్ఞాపకార్థకంగా కాకుండా.. సమానత్వం, న్యాయం, రాజ్యాంగ విలువలను పాలనలో ఆచరణలో పెట్టడం ద్వారానే ఆయనకు నిజమైన నివాళి అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.To remember Babasaheb Ji is not to ritualise his legacy, but to apply it. The measure of our commitment lies not in how often we invoke his name, but in how consistently we advance his vision.#AmbedkarJayanti#StatueOfSocialJusticehttps://t.co/RtKG4gUOmU pic.twitter.com/QN9y6qb2ll— YS Jagan Mohan Reddy (@ysjagan) April 14, 2026 -
మరో టెన్షన్.. నార్త్ కొరియా క్షిపణుల ప్రయోగం
ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఉత్తర కొరియా మరో ప్రయోగం చేసింది. తమ దేశానికి చెందిన “చోయ్ హ్యోన్” అనే యుద్ధనౌక నుంచి రెండు స్ట్రాటజిక్ క్రూయిజ్ క్షిపణులు, మూడు యాంటీ-వార్షిప్ క్షిపణులను ప్రయోగించింది. ఈ ప్రయోగాన్ని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్జోంగ్ స్వయంగా పరిశీలించారు.ఈ క్షిపణి పరీక్షలు విజయవంతమైనట్లు ఉత్తర కొరియా అధికారిక మీడియా తెలిపింది. క్రూయిజ్ క్షిపణులు సుమారు 7,869 నుంచి 7,920 సెకన్లపాటు ప్రయాణించగా, యాంటీ-షిప్ క్షిపణులు 1,960 నుంచి 1,973 సెకన్లపాటు గాల్లో ప్రయాణించాయని పేర్కొంది. ఎల్లో సీ మీదుగా ముందుగా నిర్దేశించిన మార్గంలో ప్రయాణించి అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించాయని తెలిపింది.ఈ విన్యాసం యెుక్క ప్రధాన లక్షం సమీకృత ఆయుధ నియంత్రణ వ్యవస్థను మరియు మెరుగైన యాంటీ-జామింగ్ నావిగేషన్ వ్యవస్థను పరీక్షించడం, అలాగే సిబ్బందికి ప్రయోగంపై అవగాహన కల్పించడమనంది. కాగా ఇటీవల నార్త్ కొరియా ప్రపంచానికి తన ఆయుధ శక్తిని ప్రదర్శించేలా తరచుగా క్షిపణులు ప్రయోగం చేపడుతుంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ దాదాపుగా 10కి పైగా క్షిపణులను ప్రయోగించింది. వీటిలో అధికంగా బాలిస్టిక్, క్రూయిజ్, మరియు హైపర్సోనిక్ క్షిపణులు అధికంగా ఉన్నాయి. -
40 వేల మంది విద్యార్థులు అలా..! భావోద్వేగంలో నికితా పోర్వాల్
రాబోయే మిస్వరల్డ్ పోటీల కోసం సన్నద్ధమవుతున్న మిస్ ఇండియా నికితా పోర్వాల్కు ఘనంగా వీడ్కోలు పలికారు కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ విద్యార్థులు. ఏకంగా 40 వేల మంది విద్యార్థులు మానవ సముహాలుగా ఏర్పడి మిస్వరల్డ్గా ప్రదర్శించిన తీరు హైలెట్గా నిలిచింది. ఈ కార్యక్రమం అపూర్వమైన స్థాయిలో జరిగింది. ఈ అందాల పోటీలకు వెల్లువెత్తుత్ను మద్ధతు చూసి నికితా ఆశ్చర్యపోయింది. ఆశీర్వాదాల సంద్రం..ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలను ఏప్రిల్ 13న 'ది పేజెంట్ జర్నీ' ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకుంది. వేలాదిమంది విద్యార్థులు ఐక్యతను ప్రదర్శిస్తూ..మైదానంలో ఏకమైన అద్భుతమైన దృశ్యం చూస్తే కళ్లు ఆర్పడం మర్చిపోతాం. గగనతలం నుంచి చూస్తే పచ్చదనంతో కూడిన మైదానంలో 'మిస్ వరల్డ్' అని అక్షరాల ఏరియల్ వ్యూస్లా కనిపించే మానవ నిర్మాణం అత్యంత ఆకర్షణీయంగా నిలిచింది. ఇక ఈ కార్యక్రమంలో హై-నెక్, స్లీవ్లెస్ సిల్హౌట్తో కూడిన మెరిసే గులాబీ రంగు గౌనులో మిస్ ఇండియాగా కనిపించారు నికితా పోర్వాల్. ఆమె భారీ జనసముహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడూ..ఆ గౌనుపై ఉన్న మెరిసే డిజైన్ కాంతిలో మిస్ ఇండియా కిరిటంతో దివి నుంచి భువికి వచ్చిన దేవతలా కనిపించింది. అక్కడున్న దాదాపు 40 వేల మంది విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. "భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె ఒడిశా ఆధ్యాత్మిక శక్తి గురించి మాట్లాడారు. ఒడిశాలో నా కిరీటాన్ని ఇచ్చేస్తానేమో అనుకున్నా కానీ ఏమి ఇవ్వడం లేదు..కానీ నాతో ఈ 40 వేల మంది ఆశీస్సులను తీసుకువెళ్తున్నా. ఈ రోజు మనం ముంబై నుంచి బాబా జగన్నాథ్ నగరానికి వచ్చాం. ఇదేమి యాదృచ్ఛికం కాదు. మీరంతా ఈ దేశపు భూమి పుత్రికలు. మీ అందరికి ధన్యావాదాలు". అని తన ప్రసంగాన్ని ముగించారామె. సుమారు 130 దేశాలు పాల్గొంటున్న ఈ చారిత్రాత్మక మిస్ వరల్డ్ పోటీ కోసం నికితా వియత్నాంకు బయలుదేరుతుండటంతో ఆమెపై అంతకంతకు అంచనాలు పెరిగిపోతున్నాయి. అదీగాక ఈ ఏడాది మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ 75వ వార్షికోత్సవం కూడా. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని మునుపెన్నడూ లేనంత భారీ స్థాయిలో చేసేలా ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఇక మిస్ వరల్డ్ 2026 ఫైనల్ సెప్టెంబర్ 5, 2026న జరగనుంది. వియత్నాంలోని హనోయి, హూచి మిన్ వంటి నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. కాగా, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్కు చెందిన నికితా పోర్వాల్ బలమైన వారసత్వాన్ని కలిగి ఉన్నారు. 60కి పైగా నాటకాలలో నటించిన రంగస్థల కళాకారిణి టీవీ యాంకర్ కూడా ఆమె. అంతేగాదు నికితా అందం తోపాటు అపారమైన తెలివితేటలు ఉన్న వ్యక్తిగా ప్రశంసలు అందుకుంటున్నారామె. View this post on Instagram A post shared by THE PAGEANT JOURNEY™ (@thepageantjourney) (చదవండి: Asha Bhosle: 'ఆశా తాయ్' మహారాష్ట్ర ఫ్యాషన్ ఐకాన్..!) -
ఐసీసీ చైర్మన్గిరిపై నఖ్వీ అధికారిక ప్రకటన
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మోహిసిన్ నఖ్వీ, ఐసీసీ చైర్మన్గా జై షా స్థానాన్ని భర్తీ చేస్తాడని గత కొద్ది రోజులుగా సోషల్మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై నఖ్వీ తాజాగా స్పందించాడు. ఈ ప్రచారంలో వాస్తవం లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే తనకు చాలా బాధ్యతలు ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. వాటి పనిభారమే అధికంగా ఉందని తెలిపాడు. ఐసీసీ చైర్మన్గిరిపై ఆలోచన కూడా లేదని స్పష్టం చేశాడు.ఇదే సందర్భంగా పాకిస్తాన్ సూపర్ లీగ్కు సంబంధించిన పలు విషయాలను కూడా వెల్లడించాడు. పీఎస్ఎల్లో ప్రేక్షకుల అనుమతి విషయం ప్రధానితో చర్చిస్తానని తెలిపాడు. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, ఇంధన సంక్షోభం కారణంగా పాక్ ప్రభుత్వం ఖర్చులు తగ్గించేందుకు పీఎస్ఎల్ మ్యాచ్లకు ప్రేక్షకులను అనుమతించని విషయం తెలిసిందే. కాగా, ఐసీసీ చైర్మన్గా నఖ్వీ వస్తాడన్న ప్రచారాన్ని భారత క్రికెట్ అభిమానులు ముందే తోసి పుచ్చారు. నఖ్వీకు అంత సీన్ లేదని లైట్ తీసుకున్నారు. అతనికి ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్గిరినే చాలా ఎక్కువని అన్నారు. జై షాను పక్కకు పెట్టి నఖ్వీని ఐసీసీ పీఠంపై కూర్చోబెడతారని అనుకోవడం మూర్ఖత్వమని ఎద్దేవా చేశారు. ఆనుకున్నట్లుగానే నఖ్వీనే ముందుకు వచ్చి తనకు అంత సీన్ లేదని చెప్పడంతో పాక్ అభిమానులు తోకముడిచారు.జై షా పదవీకాలం ఇంకా ఉందిఐసీసీ అధ్యక్షుడిగా జై షా 2024 డిసెంబర్ 1న బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిలో అతను మూడేళ్ల పాటు ఉంటారు. ఈ విషయం కూడా తెలియకుండానే పాక్ అభిమానులు నఖ్వీ త్వరలో ఐసీసీ పీఠాన్ని అధిరోహిస్తాడని డబ్బాలు కొట్టుకున్నారు. తీరా నఖ్వీనే ప్రకటన చేసే సరికి మిన్నకుండిపోయారు. -
టాలీవుడ్ బిగ్ పాన్- ఇండియా సినిమాలో అలియా భట్
బాలీవుడ్ ప్రముఖ నటి అలియా భట్ మరోసారి టాలీవుడ్కు రానుందని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో పలు కథనాలు బాలీవుడ్ మీడియాలో రావడం విశేషం. రాబోయే పాన్-ఇండియా తెలుగు చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం అలియా భట్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇది ఖరారైతే ఇండస్ట్రీలో సంచలనంగా మారనుంది. ఆపై ఈ ప్రాజెక్ట్కు దేశవ్యాప్తంగా బలమైన ప్రచారం జరుగుతుంది. అయితే, ఏ సినిమాలో అలియా నటించనున్నారనే అంశం చాలామందిలో ఆసక్తి నెలకొంది.ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్).. ఈ ప్రాజెక్ట్లో అలియా భట్ కీలకపాత్రలో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో హీరోయిన్గా రుక్మిణి వసంత్ నటిస్తున్న విషయం తెలిసిందే.. అయితే, ఆలియా కోసం ఒక కీలకమైన, పవర్ఫుల్ పాత్రను దర్శకుడు ప్రశాంత్ నీల్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది . ఆలియా భట్ గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో సీతగా కనిపించిన విషయం తెలిసిందే.ఆలియా భట్, శార్వరీ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘ఆల్ఫా’ లో కూడా ఆమె పవర్ఫుల్ పాత్రలో నటిస్తుంది. ఇందులో అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ‘ది రైల్వేమెన్’ ఫేమ్ శివ్ రైవల్ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించారు. వైఆర్ఎఫ్ (యశ్ రాజ్ ఫిల్మ్స్) స్పై యూనివర్స్లో భాగంగా రూపొందిన సినిమా ఇది. ఈ చిత్రంలో ఆలియా, శార్వరీ స్పై రోల్స్లో నటించారు. ఈ సినిమాను ఈ ఏడాది జూలై 10న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. -
భార్యతో అక్రమ సంబంధం.. స్నేహితుడిని చంపిన భర్త!
చివ్వెంల(సూర్యాపేట) : తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని యువకుడిని హత్య చేసిన వ్యక్తిని, అతడికి సహకరించిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం సూర్యాపేట రూరల్ సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండలం ఎంజీనగర్ తండాకు చెందిన రత్నావత్ మణిభార్గవ్, రత్నావత్ సాయిదుర్గ ఆటో డ్రైవర్లుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరు స్నేహితులు. సాయిదుర్గ భార్య సాయిశ్రీతో మణిభార్గవ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం గ్రామంలో అందరికీ తెలియడంతో మణిభార్గవ్కు ఈ నెల 9న రాత్రి సాయిదుర్గ ఫోన్ చేసి గ్రామ శివారులోని అడవికుంట చెరువు వద్దకు రమ్మని చెప్పాడు. దీంతో మణిభార్గవ్ చెరువు వద్దకు వెళ్లాడు. అప్పటికే అక్కడి చేరుకున్న సాయిదుర్గ, అతడి భార్య సాయిశ్రీ కలిసి మణిభార్గవ్తో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో మణిభార్గవ్ను సాయిదుర్గ కిందపడేసి ఛాతిపై బలంగా కొట్టడంతో అతడు స్పృహ కోల్పోయాడు. అనంతరం ఆటో స్టార్ట్ చేసే తాడును మణిభార్గవ్ మెడకు గట్టిగా బిగించడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం సాయిదుర్గ, సాయిశ్రీ దంపతులు అక్కడి నుంచి పరారయ్యారు. మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో దురాజ్పల్లి గ్రామ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా.. హైదరాబాద్కు వెళ్తున్న సాయిదుర్గ, సాయిశ్రీ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకుని సోమవారం రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. నిందితుల నుంచి ఆటో, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. -
జువ్వలదిన్నెకు వైఎస్ జగన్.. కూటమిలో ఉలిక్కిపాటు
సాక్షి, నెల్లూరు రూరల్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జువ్వలదిన్నె పర్యటన కూటమి ప్రభుత్వంలో వణుకు పుట్టిస్తోంది. గత నెల రోజులుగా తీరప్రాంతంలో పరిస్థితులు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. ఇప్పుడేమో.. రేపటి జగన్ పర్యటనతో తారాస్థాయికి చేరిన ప్రభుత్వ వ్యతిరేకత బయటపడుతుందన్న ఆందోళనలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. మత్స్యకారుల విషయంలో టీడీపీ పెద్దల వ్యవహారంతో ఆ పార్టీ పునాదులే కూలిపోతున్నాయి. తీర ప్రాంతంలో టీడీపీ జెండా పీకేసేందుకు మత్స్యకారులు సన్నద్ధమవుతున్నారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను ప్రైవేట్ కంపెనీకి అప్పగించడం, తమను దోచుకుంటున్న పాండిచ్చేరి మెకనైజ్డ్ బోట్లను వదిలేయడం వంటి ఘటనలు మత్స్యకారుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపాయి. పైగా టీడీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు ఈ కుట్రలకు కారణమని ఆరోపణలు రావడంతో, ఆయనను తీరప్రాంతంలో నిషేధిస్తూ, ఆయనతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడితే భారీ జరిమానా విధించేలా మత్స్యకార పెద్దలు తీర్మానించడం(దురాయి విధింపు) సంచలనం సృష్టించింది. ఈ తరుణంలో.. జగన్ రాక మత్స్యకారుల పోరాటానికి మరింత బలం చేకూర్చే అవకాశం కనిపిస్తోంది. ఫిషింగ్ హర్బర్ను సందర్శించడంతో పాటు ఆయన మత్స్యకారులతో ముఖాముఖి కానున్నారు. తమ ప్రభుత్వం వచ్చాక న్యాయం చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అదే అదనుగా జగన్ ఇచ్చే భరోసాతో మత్స్యకారులు తమ పోరాటాన్ని మరింత ఉదృతం చేయాలని భావిస్తున్నారు. తమ భవిష్యత్ బతుకులకు వెన్నుపోటు పొడిచి ఛిద్రం చేస్తున్న వాళ్లను వదిలే ప్రసక్తే లేదని మత్స్యకారులు అంటున్నారు. జగన్ పర్యటన తర్వాత కావలి నియోజకవర్గంలోని మత్స్యకార గ్రామాలు తమ భవిష్యత్ కార్యాచరణపై ఓ నిర్ణయం తీసుకోనున్నాయి. తెలుగు దేశం పార్టీని తీర ప్రాంతంలో సమూలంగా నిషేధించడంతో పాటు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని గంగలో కలిపేస్తామని తీర్మానం చేయబోతున్నాయట. జగన్ రాకతో ఉమ్మడి నెల్లూరుతో పాటు ప్రకాశం, గుంటూరుల నుంచి కూడా భారీగా మత్స్యకారులు తరలి రావొచ్చని అంచనాలున్నాయి. ఈ పరిణామాలను నిశీతంగా పరిశీలిస్తున్న కూటమి ప్రభుత్వం.. జగన్ పర్యటనకు మత్స్యకారులు స్వచ్చందంగా తరలి రాకుండా తమదైన కుట్రలను ప్రయోగించే అవకాశం లేకపోలేదు. -
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
సాక్షి, తాడేపల్లి: భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకోని వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకలో వైఎస్సార్సీపీ నేతలు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, పార్టీ నేతలు టీజేఆర్ సుధాకర్ బాబు, జూపూడి ప్రభాకర్, మొండితోక అరుణ్ కుమార్, రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి సహా పలువురు దళిత నేతలు హాజరయ్యారు. ‘అంబేద్కర్ ఆశయాలను వైఎస్ జగన్ కొనసాగిస్తున్నారని అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శ జూపూడి ప్రభాకర్ అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ వికేంద్రీకరణకే కోరుకున్నారని ఆయన ఆశయాల అనుగుణంగానే వైఎస్ జగన్ మావిగన్ ప్రతిపాదన తెచ్చారన్నారు.పలు జిల్లాల్లో.. రాష్ట్రవ్యాప్తంగా అంబేద్కర్ జయంతిని వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. మచిలీపట్నంలోని వైసీపీ నియోజకవర్గ కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మచిలీపట్నం నియోజకవర్గం ఇంఛార్జ్ పేర్ని కిట్టు హాజరయ్యారు. సమాజంలో అంటరానితనాన్ని ,అస్పృశ్యతను రూపుమాపేందుకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన కృషి ఎనలేనిదని అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చూపిన బాట ఆదర్శనీయమని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మనువాదులు మతఛాందసంతో మహనీయుడు అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు.విశాఖలో పార్టీ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు, ఎమ్మెల్సీలు కుంభ రవి బాబు, వరుదు కళ్యాణి, వాసుపల్లి గణేష్ , మోల్లి అప్పారావు, మాజీ మేయర్ హరి వెంకట కుమారి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు హజరయ్యారు.అనకాపల్లి వైఎస్సార్సీపీ కార్యాలయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ప్రసాద్, మాజీ ఎంపీ బీశెట్టి సత్యవతి పాల్గొన్నారు. కృష్ణాజిల్లాలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మాజీఎమ్మెల్యే వల్లభనేని వంశీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. -
నోయిడాలో కార్మిక రణరంగం: ఎవరీ మేధా రూపమ్?
నోయిడా: ఉత్తరప్రదేశ్లోని పారిశ్రామిక హబ్ నోయిడా ప్రస్తుతం నిప్పుల కొలిమిలా మారింది. గత కొద్ది రోజులుగా వేతనాల పెంపుదల కోసం కార్మికులు చేస్తున్న ఆందోళన సోమవారం నాడు హింసాత్మకంగా మారడంతో దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అందరి కళ్లు ఇప్పుడు గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లా కలెక్టర్ మేధా రూపమ్ పైనే నిలిచాయి. పరిస్థితిని చక్కదిద్దడంలో యంత్రాంగం విఫలమైందనే విమర్శలు వస్తున్న వేళ, అసలు ఎవరీ మేధా రూపమ్? ఆమె నేపథ్యం ఏంటి? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.సివిల్స్లో టాప్ 10 ర్యాంకర్మేధా రూపమ్ కేవలం ఒక ఉన్నతాధికారిణి మాత్రమే కాదు, అత్యంత ప్రతిభావంతురాలైన విద్యార్థిని కూడా. ఆమె నేపథ్యం పరిశీలిస్తే.. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుండి ఎకనామిక్స్లో పట్టా పొందారు. 2013 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ఆల్ ఇండియా 10వ ర్యాంకు సాధించి, సంచలనం సృష్టించారు. 2014 బ్యాచ్కు చెందిన యూపీ కేడర్ ఐఏఎస్ అధికారిణిగా విధుల్లో చేరారు. ఆమె తండ్రి జ్ఞానేష్ కుమార్ ప్రస్తుతం దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.వివాదాలు.. వరుస సవాళ్లు2025 జూలై 29న గౌతమ్ బుద్ధ్ నగర్ డీఎంగా బాధ్యతలు చేపట్టిన మేధా రూపమ్నకు వరుస సవాళ్లు ఎదురవుతున్నాయి. గతంలో ఒక ఇంజనీర్ వర్షపు నీటి గుంతలో పడి మరణించిన ఘటనలో ఆమె విమర్శలు ఎదుర్కోగా, ఇప్పుడు కార్మిక లోకం భగ్గుమనడం ఆమె సమర్థతకు పెద్ద పరీక్షగా మారింది. కాగా కార్మికుల ఆందోళన తీవ్రం కావడంతో మేధా రూపమ్ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. కార్మికుల డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని పారిశ్రామిక వర్గాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.అదనపు పని గంటలు (ఓటీ), ఆదివారాలు పనిచేసే వారికి రెట్టింపు జీతం ఇవ్వాలి. ప్రతి నెలా 10వ తేదీలోపు శాలరీ స్లిప్పులతో పాటు పూర్తి జీతం ఖాతాల్లో జమ కావాలి. నవంబర్ 30 లోపు బోనస్ మొత్తాన్ని నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేయాలని మేధా రూపమ్ ఆదేశించారు. ప్రతి ఫ్యాక్టరీలో మహిళా నేతృత్వంలో ‘లైంగిక వేధింపుల నివారణ కమిటీ’లను ఏర్పాటు చేయడంతో పాటు ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రస్తుతం నోయిడా వీధుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇది కూడా చదవండి: సీనియర్ జర్నలిస్ట్ సంచలన నిర్ణయం.. పోస్ట్మ్యాన్గా మారి.. -
రెమిటెన్సులకు యుద్ధం సెగ
పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో భారత్కు వచ్చే రెమిటెన్స్ ప్రవాహం తగ్గే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ అభిప్రాయపడింది. ప్రవాస భారతీయుల నుంచి వచ్చే మొత్తం రెమిటెన్స్ల్లో సుమారు మూడో వంతు గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాల నుంచే వస్తుందని పేర్కొంది. అక్కడి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగితే ఈ ప్రవాహం మందగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రవాస భారతీయుల ఆదాయాలు తగ్గితే కరెంట్ ఖాతా లోటు (సీఏడీ)పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే వాణిజ్య లోటు ఒత్తిడిలో ఉన్న సమయంలో రెమిటెన్స్ తగ్గుదల ఆర్థిక సమతౌల్యంపై మరింత ప్రభావం చూపవచ్చని పేర్కొంది. ప్రవాసుల నుంచి రెమిటెన్స్లు అత్యధికంగా పొందుతున్న దేశంగా భారత్ ప్రపంచంలో ముందంజలో ఉంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో దేశానికి ఈ రూపంలో 135 బిలియన్ డాలర్లకు పైగా వచ్చాయి. ఎగుమతుల వృద్ధిపై ఒత్తిడిపశ్చిమాసియా ఘర్షణల కారణంగా గ్లోబల్ వాణిజ్య ప్రవాహాల్లో అంతరాయం, ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమనం వల్ల భారత ఎగుమతుల వృద్ధిపై ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉందని క్రిసిల్ తెలిపింది. అయితే అమెరికా సుంకాలు తగ్గడం కొంతమేర మద్దతు ఇస్తుందని పేర్కొంది. మరోవైపు ముడి చమురు ధరలు సంవత్సరానికి 8–9% పెరగడం వల్ల దిగుమతి బిల్లు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. లాజిస్టిక్ సమస్యలు, సరఫరా గొలుసు పునర్వ్యవస్థీకరణ కారణంగా పశ్చిమాసియాకు ఎగుమతులు ప్రభావితమవుతున్నాయని తెలిపింది. ఎగుమతులు ఇలాజీసీసీ దేశాలకు భారత్ 57 బిలియన్ డాలర్లు (మొత్తం ఎగుమతుల్లో 13%), ఇతర పశ్చిమ ఆసియా దేశాలకు 9 బిలియన్ డాలర్లు (2%) ఎగుమతులు చేసింది. బాస్మతి బియ్యం (70% పైగా), బోవైన్ మీట్ (30%), సిరామిక్ ఉత్పత్తులు (25%), పెట్రోలియం ఉత్పత్తులు (15%), రత్నాలు – ఆభరణాలు (20%) వంటి ఉత్పత్తుల్లో ఆ ప్రాంతానికి అధిక ప్రాధాన్యం ఉందని నివేదిక వెల్లడించింది. రవాణా సమస్యలు, సరఫరా విధానాల్లో మార్పుల కారణంగా పశ్చిమాసియాకు ఎగుమతులు తగ్గడం లేదా ఆలస్యం కావచ్చని క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు -
మహిళలకూ ఉండాలి టర్మ్ పాలసీ
మరింత మంది మహిళలు ఉద్యోగాల్లోకి చేరుతున్న నేపథ్యంలో వారికి కూడా టర్మ్ ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ ప్రణాళికల ఆవశ్యకత నెలకొందని ఇన్సూరెన్స్ ఎవేర్నెస్ కమిటీ (ఐఏసీ–లైఫ్) సభ్యులు రుషభ్ గాంధీ, పరాగ్ రాజా తెలిపారు. కుటుంబ సంరక్షణ బాధ్యతలు నిర్వర్తించేందుకు వారు తాత్కాలికంగా గానీ శాశ్వతంగా గానీ ఉద్యోగాలకు దూరం కావడం వల్ల పొదుపు, రిటైర్మెంట్ నిధిపై ప్రభావం పడుతుందన్నారు.పురుషులతో పోలిస్తే మహిళల జీవితకాలం సగటున నాలుగేళ్లు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారికి తమతో పాటు తమపై ఆధారపడే వారి కోసం కూడా దీర్ఘకాలికమైన, మెరుగైన పొదుపు ప్రణాళికలు అవసరమవుతాయని తెలిపారు. ఆదాయార్జన వ్యవధి తక్కువగా ఉండటం, జీవితకాలం అధికంగా ఉండటమనేది మహిళలు ఎదుర్కొనే విశిష్టమైన సవాలని వివరించారు. ఈ నేపథ్యంలో ఆర్థిక అక్షరాస్యత దన్నుతో వారు ఆర్థిక ప్రణాళికల్లో చురుగ్గా పాల్గొంటున్నారని తెలిపారు. యాన్యుటీలు, గ్యారంటీడ్ ఇన్కం ప్లాన్లు వారు స్థిరమైన ఆదాయాన్ని అందుకునేందుకు తోడ్పడతాయని వారు చెప్పారు. తమ ఆర్థిక ఆరోగ్యాన్ని సంరక్షించుకునేలా మహిళల్లో స్ఫూర్తి నింపేందుకు బీమా పరిశ్రమ నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు -
దీర్ఘకాలిక ప్రణాళికలకు దక్షిణాది ఓటు
దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికల విషయంలో దక్షిణాది వారు ముందుంటున్నారు. రిటైర్మెంట్ ప్లాన్ల విషయంలో స్పష్టతతో ఉంటున్నారు. ఇప్పటికే మూడింట రెండొంతుల మంది ఇందుకు సంబంధించిన ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. ఇఫ్సాస్ ఇండియా భాగస్వామ్యంతో హెచ్డీఎఫ్సీ లైఫ్ నిర్వహించిన రెడీ టు లైఫ్ ఇండెక్స్ సూచీలో దక్షిణాది రెడీనెస్ స్కోరు జాతీయ సగటైన 59కి మించి 60 స్థాయిలో నమోదైంది.ఈ నివేదిక ప్రకారం బీమా భద్రతపై అవగాహన ఉన్నప్పటికీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే వారి సంఖ్య తక్కువగానే ఉంటోంది. తక్షణ రాబడి ఉండదని, చర్చించడానికి కొంత ఇబ్బందికరమైనదని, ఎటువంటి క్లెయిమ్ తలెత్తకపోతే నిష్ప్రయోజనమనే భావన ఇందుకు కారణమని నివేదికలో వెల్లడైంది. దక్షిణాది వారి పొదుపు ప్రాధాన్యతల్లో పిల్లల చదువు, సొంత ఇల్లు, ఆకస్మిక ప్రణాళికలు మొదలైనవి అగ్రస్థానంలో ఉన్నాయి. అత్యవసర నిధి విషయంలో దక్షిణాది అగ్రస్థానంలోనే ఉన్నప్పటికీ మూడింట ఒక వంతు మంది సదరు నిధి ఒక నెలకు మాత్రమే సరిపోతుందని పేర్కొన్నారు. ఆర్థిక ప్రణాళిక, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సన్నద్ధత, ఆరోగ్యం, పదవీ విరమణ వ్యూహాలపై అవగాహన–సన్నద్ధత మధ్య అంతరాలను పూరించడం లక్ష్యంగా నిర్వహించిన ఈ సూచీ సంబంధిత అధ్యయనంలో 25–55 ఏళ్ల వయస్సు గల 1,836 మంది పాల్గొన్నారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు -
వైభవ్ను ఔట్ చేయడంపై హింగే సంచలన వ్యాఖ్యలు
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 13) జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై సన్రైజర్స్ హైదరాబాద్ 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ అరంగేట్రం పేసర్లు ప్రఫుల్ హింగే (4-0-34-4), సకిబ్ హెస్సేన్ (4-0-24-4) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ముఖ్యంగా హింగే పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడ్డాడు. తొలి ఓవర్లోనే 3 వికెట్లు తీసి రాయల్స్ టాపార్డర్ను కుప్పకూల్చాడు. తద్వారా 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో తొలి ఓవర్లోనే 3 వికెట్లు తీసిన తొలి బౌలర్గా చరిత్ర సృష్టించాడు.తొలి ఓవర్లో హింగే ఔట్ చేసిన ముగ్గురు బ్యాటర్లు (వైభవ్ సూర్యవంశీ, ధృవ్ జురెల్, ప్రిటోరియస్) డకౌట్ కావడం విశేషం. వీరిలో వైభవ్ వికెట్ చాలా ప్రత్యేకం. ఎందుకంటే, ఈ మ్యాచ్కు ముందు వైభవ్పై అతి భారీ అంచనాలు ఉండేవి. ఈ సీజన్లో అతను తొలి మ్యాచ్ నుంచి విధ్వంసం సృష్టిస్తున్నాడు. దీంతో ఈ మ్యాచ్లోనూ ఎస్ఆర్హెచ్ బౌలర్లపై దండయాత్ర తప్పదని అంతా అనుకున్నారు.అయితే వైభవ్ విషయంలో హింజ్ ప్లాన్స్ వేరేలా ఉన్నాయి. సూపర్ ఫామ్లో ఉన్న వైభవ్ను అతను రెండో బంతికే ఔట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. హింగే సంధించిన అద్భుతమైన డెలివరీ కారణంగా వైభవ్ గోల్డెన్ డకౌటయ్యాడు. హింగే వేసిన బౌన్సర్ను ఆడే క్రమంలో బంతి వైభవ్ బ్యాట్ టాప్ ఎడ్జ్ తీసుకొని వికెట్కీపర్ సలీల్ అరోరా చేతుల్లోకి వెళ్లింది.వైభవ్ వికెట్పై మ్యాచ్ అనంతరం హింగే మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నేను ముందే ప్లాన్ చేశాను. వైభవ్కి బౌన్సర్ వేసి ఔట్ చేస్తానని 2–3 మందికి చెప్పాను. నా తొలి మ్యాచ్లో నాలుగైదు వికెట్లు తీస్తానని గతేడాదే రాసుకున్నాను. పవర్ప్లేలో ఆధిపత్యం చూపుతానని ఊహించాను. అదే నిజమైంది అని అన్నాడు. హింగే వ్యాఖ్యలను బట్టి చూస్తే.. అతని అరంగేట్రంపై ముందే ప్రణాళిక కలిగి ఉన్నాడని స్పష్టమవుతుంది. నిన్నటి మ్యాచ్లో ప్లాన్ ప్రకారమే వైభవ్ను ఔట్ చేసిన విషయమూ తెలుస్తుంది. తన అద్భుత ప్రదర్శనకు గానూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అందుకున్న హింగే రాబోయే మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్కు కీలక బౌలర్గా మారిపోయాడు. రాత్రిరాత్రే స్టార్ డమ్ సంపాదించి హీరో హైప్ తెచ్చుకున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్, ఇషాన్ కిషన్ (91) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. క్లాసెస్ (40) ఓ మోస్తరుగా రాణించగా.. ఆఖర్లో సలీల్ అరోరా (24 నాటౌట్), నితీశ్ కుమార్ రెడ్డి (28) బ్యాట్ ఝులిపించారు.అనంతరం లక్ష్య ఛేదనలో హింగే, సకిబ్ ధాటికి విలవిలలాడిపోయిన రాయల్స్ అతికష్టం మీద 19 ఓవర్లలో 159 పరుగులు చేసి ఆలౌటైంది. 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన రాయల్స్ను రవీంద్ర జడేజా (45), డొనొవన్ ఫెరియెరా (69) ఆదుకున్నారు. ఆఖర్లో తుషార్ దేశ్పాండే (25) సైతం బ్యాట్ ఝులిపించాడు. అయితే అప్పటికే రాయల్స్ ఓటమి ఖరారైపోయింది. -
ఫ్లెక్సిబుల్ ఐటీ ఉద్యోగాల్లో మహిళల జోరు
ఐటీ, ఐటీ ఆధారిత రంగాల(ఐటీఈఎస్) రంగంలో కాంట్రాక్ట్, ఫ్లెక్సిబుల్ ఉద్యోగాల్లో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరిగిందని టాలెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ కెరీర్ నెట్ నివేదిక తెలిపింది. ఆర్థిక సంవత్సరం 2025–26 ముగిసే నాటికి ఇది 40 శాతానికి చేరిందని వెల్లడించింది. ఎఫ్వై 2026లో కాంట్రాక్టు ఉద్యోగాల్లో జరిగిన 3,000 నియామకాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్లు పేర్కొంది. ఎఫ్వై22 – ఎఫ్వై26 మధ్య మహిళల నియామకాలు 10 శాతం పాయింట్లు పెరిగి ఎఫ్వై26లో 40 శాతానికి చేరుకున్నాయని తెలిపింది. గత నాలుగు ఆర్థిక సంవత్సరాల గణాంకాలతో దీనిని పోల్చి ట్రెండ్లను విశ్లేషించినట్లు వెల్లడించింది. కెరీర్నెట్ నివేదికలోని ముఖ్యాంశాలుఫైనాన్స్–అకౌంటింగ్లో (43%) విభాగంలో మహిళల ప్రాతినిధ్యం అత్యధికంగా ఉంది. డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్ (34%), యూఎక్స్, డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్ (31%), ఐటీ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ (29%), ఇంజినీరింగ్–సాఫ్ట్వేర్, క్యూఏ (27%) రంగాలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. కన్సలి్టంగ్లో మహిళల ప్రాతినిధ్యం 20 శాతంతో తక్కువగా ఉంది. ఈ విభాగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఇంకా విస్తృత అవకాశాలు ఉన్నాయని నివేదిక సూచించింది.మహిళల భాగస్వామ్యం మెట్రో నగరాల్లోనే అధికంగా కేంద్రీకృతమై ఉంది. బెంగళూరు (21%), హైదరాబాద్ (20%), పుణే (17%) ముందుండగా, ఢిల్లీ ఎన్సీఆర్ (13%), చెన్నై (9%) తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ముంబై (7%), కోల్కతా (2 శాతం) చివరి స్థానాలతో సరిపెట్టుకున్నాయి. టైర్–2 నగరాల్లో మహిళల భాగస్వామ్యం 11 శాతంగా మాత్రమే ఉన్నట్లు నివేదిక తెలిపింది.కెరీర్ వ్యవధి పరంగా చూస్తే.., మహిళల భాగస్వామ్యం ‘ప్రారంభ, మధ్య దశ’ల్లో గణనీయంగా ఉంది. రెండేళ్లలోపు అనుభవం ఉన్న ‘ప్రారంభ దశ’ ఉద్యోగుల్లో మహిళల వాటా 30%గా ఉంది. 5 నుంచి 8 ఏళ్ల అనుభవం ఉన్న ‘మధ్య దశ’లో అది 31% గా నమోదైంది. సీనియర్ స్థాయిల్లో మహిళల భాగస్వామ్యం తగ్గుతోంది. 9–14 సంవత్సరాల అనుభవం ఉన్నవారి వాటా 13 శాతంగా, 14 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్నవారి వాటా కేవలం 4 శాతంగా నమోదైంది. ఇది మహిళలను ఉద్యోగాల్లో నిలుపుదల (రిటెన్షన్) చేయడం, ఉన్నత స్థాయిలకు ఎదగడంలో (అడ్వాన్స్మెంట్) ఇంకా లోటుపాట్లు ఉన్నాయని నివేదిక సూచిస్తోంది.‘‘గత ఐదేళ్లలో ఐటీ/ఐటీఈఎస్ రంగంలో మహిళల భాగస్వామ్యం కేవలం సంఖ్యలకే పరిమితం కాకుండా, వారు ఎంపిక చేసుకుంటున్న ఉద్యోగాల స్వరూపంలో కూడా గణనీయమైన మార్పు చోటుచేసుకుంది. ఫైనాన్స్– అకౌంటింగ్ విభాగం ముందంజలో ఉండటం, మహిళలు ఇకపైనా ప్రాధాన్యం లేని పాత్రల్లో మాత్రమే కాకుండా కీలక రంగాల్లోకి అడుగు పెడుతున్నారనే సంకేతాలను సూచిస్తోంది. వ్యాపార ఫలితాలపై నేరుగా ప్రభావం చూపే ప్రధాన విభాగాల వైపు మహిళలు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు’’ అని కెరీర్ నెట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ నీలభ్ శుక్లా తెలిపారు. ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు -
ఎవరి కోసం బతకాలె కొడుకా
కరీంనగర్ జిల్లా: అనారోగ్యంతో భర్త దూరమైనా ఒక్కగానొక్క కొడుకే సర్వస్వంగా భావిస్తూ ఆ తల్లి కూలీనాలీ చేసుకుంటూ పోషించుకుంది. భర్త దూరమైన దుఃఖం నుంచి తేరుకోకముందే కొడుకు వెన్నెముక వ్యాధి బారిన పడ్డాడు. ఆపరేషన్కు రూ.లక్షలు అవసరం కాగా.. ఎలాగోలా సొమ్ము పోగు చేసుకుంది. ఇక కొడుక్కు ఏ బాధ లేదనుకున్న సమయంలో విధి మరోసారి ఆ కుటుంబాన్ని వెక్కిరించింది. సైకిల్పై వెళ్తున్న బాలుడు కింద పడడంతో మెదడులో రక్తం గడ్డకట్టింది. ఆపరేషన్ చేయగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటనతో కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం శంషాబాద్లో తీవ్ర విషాదం నెలకొనగా.. ఆ తల్లి దుఃఖాన్ని ఆపడం ఎవరితరం కాలేదు.. స్థాని కుల కథనం ప్రకారం.. శంశాబాద్ గ్రామానికి చెందిన బాకారపు రాజేశ్వరి– కుమార్ దంపతుల కొడుకు అక్షిత్(11) ఐదో తరగతి చదువుతున్నాడు. కుమార్ ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించగా రాజేశ్వరీ కూలీ పనులు చేసుకుంటూ కొడుకును పోషించుకుంటోంది. అక్షిత్ కొద్ది నెలల నుంచి వెన్నెముక సమస్యతో బాధపడుతున్నాడు. ఆపరేషన్కు రూ.16 లక్షలు అవసరం కాగా.. రూ.9లక్షలు పోగు చేశారు. ఇటీవల అక్షిత్ సైకిల్ నుంచి పడగా మెదడులో రక్తం గడ్డకట్టింది. కుటుంబ సభ్యులు కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా వైద్యులు శస్త్రచికిత్స చేశారు. మెరుగైన చికిత్సకు హైదరాబాద్ తరలించారు. కొద్దిరోజులు అక్కడ చికిత్స పొందగా.. రక్తకణాలు పెరుగుతూ, తగ్గుతున్నాయని కరీంనగర్లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించి సోమవారం బాలుడు చనిపోయాడు. ‘నన్ను ఒంటరి చేసి వెళ్లిపోయావా బిడ్డా’ అంటూ అంత్యక్రియల్లో తల్లి రోదించిన తీరు గ్రామస్తులను కలచివేసింది. సర్పంచ్ మెరుగు కళావతి సంపత్ రూ.3,016 ఆర్థికసాయం అందించారు. -
జస్ట్ ఆరు నెలల్లో 32 కిలోలు..! యంగ్లుక్లో 48 ఏళ్ల వ్యక్తి..
బరువు పెరగడం అనేది ముమ్మాటికి అధికంగా తినడం వల్ల మాత్రమే కాదు. ఉరుకుల పరుగుల జీవన విధానానికి తోడు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దాన్ని అధిగమించే క్రమంలో చెడు ఆహారపు అలవాట్లకు బానిస అవ్వడంతో అధిక బరువుకి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలానే ఇక్కడొక వ్యక్తి ఊబకాయం బారినపడి రోజువారీ పనులు చేసుకోలేక పలు అవస్థలు పడ్డాడు. కనీసం ఫ్లైట్ జర్నీ సైతం కష్టంగా మారింది. అక్కడ చైర్లు తన భారీకాయాని సరిపోక ఇబ్బందులు, వార్డ్రోబ్లో బట్టలన్నీ డబుల్ఎక్స్ఎల్ సైజులే. కనీసం తనకు నచ్చిన డ్రెస్ తనసైజులో దొరకక పడే కష్టాలతో విసుగెత్తిపోయాడు. చివరికి బరువు తగ్గి స్మార్ట్గా మారాలని గట్టిగా నిశ్చయించుకుని మరి ఎవ్వరూ గుర్తుపట్టలేనంతగా తగ్గిపోయి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అది కూడా ఆరు నెలల వ్యవధిలోనే ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గడం విశేషం. అదెలాగో ఆ వ్యక్తి మాటల్లోనే సవివరంగా చూద్దామా..!.ఆ వ్యక్తే 48 ఏళ్ల డేవిడ్. అతడు ఆరు నెలల క్రితం సుమారు 128 కిలోల బరువు ఉండేవాడు. 48 ఏళ్ల వయసులో చాలా చురుకుగా ఉండేవాడు, చక్కగా వ్యాపారాన్ని రన్ చేసేవాడు. తన పిల్లల బాస్కెట్బాల్, సాకర్ జట్లకు కోచ్గా వ్యవహరించాడు. కానీ అతడు తన ఆరోగ్యం పట్ల చాలా చాలా ఆసంతృప్తిగా ఉన్నాడు. రోజువారీ పరిస్థితులు ఒత్తిడితో కూడుకున్నవిగా మారాయి. ప్రయాణాలకు సామాన్లు సర్దుకోవడం ఒక పెద్ద పనిగా అనిపించేది. విమాన సీట్లు చాలా అసౌకర్యంగా ఉండేవి అతడికి. ఆఖరికి సరిగ్గా సరిపోయే బట్లలు దొరకడం ఓ సవాలుగా ఉండేది. దీనికి కారణం పని ఒత్తిడి. ఆ స్ట్రెస్ కారణంగా జంక్ఫుడ్కి బానిసయ్యాడు. అది కాస్తా అతడి రూపురేఖల్ని మార్చేసేలా అధిక బరువుకి దారితీసింది. ఇకలాభం లేదు ఇలా ఉంటే..రాను రాను తన కదలికలే భారంగా మారపోతాయేమో అనేంత భయం వేసింది. దాంతో బరువు తగ్గాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి ఫిట్నెస్ కోచ్ కెవ్ని సంప్రదించాడు. అతడి మార్గదర్శంకలో సరైన జీవనశైలిని అవలంబించి కేవలం ఆరు నెలల్లోనే 32 కిలోలు తగ్గాడు. ఇంతకుముందు బట్టలు సర్దుకోవడం, జర్నీలకు వెళ్లడం ఎంత భారంగా ఫీలయ్యాడో..ఇప్పుడు చాలా ఆత్మవిశ్వాసంగా తేలిగ్గా చేసేస్తున్నాడు. అంతేగాదు కొలరాడోకు విమాన ప్రయాణంలో సౌకర్యవంతంగా వెళ్తున్నట్లు చెప్పుకొచ్చాడు డేవిడ్. అంత సులభంగా, వేగవంతంగా బరువు ఎలా తగ్గాడో..తన వెయిట్లాస్ జర్నీ ఎలా సాగిందో అతడి ఫిట్నెస్ కోచ్ కెవ్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేసుకున్నాడు. పైగా అతడు ఎలాంటి ఫుడ్ తీసుకునేవాడో కూడా వివరించాడు.బరువు తగ్గేందుకు పాటించాల్సినవి..స్థిరంగా బరువు తగ్గాలంటే..ప్రోటీన్ల కోసం ఆహారంలో చికెన్ బ్రెస్ట్, సిర్లోయిన్ స్టీక్, సాల్మన్, గుడ్లు, టర్కీ బేకన్, రొయ్యలు, గ్రీక్ యోగర్ట్, కాటేజ్ చీజ్ తదితరాలు తీసుకోవాలి. కార్బోహైడ్రేట్ల కోసం తెల్లటి అన్నం, కెవ్ బ్రోకలీ, ఆస్పరాగస్, మిరపకాయలు, పాలకూర, పచ్చి బీన్స్ తదితరాలను సిఫార్సు చేస్తున్నారు. అంతేగాదు క్రియేటివ్ మెగ్నీషియం, ఎలక్ట్రోలైట్స్ వంటి సంప్లిమెంట్లను కూడా జోడించినట్లు తెలిపారు కోచ్ కెవ్.ఫుడ్ ప్లాన్..ప్రణాళికతో కూడిన భోజనం, అది కూడా సమతుల్యం ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.భోజనం 1: ప్రోటీన్ షేక్తో గ్రీక్ యోగర్ట్, లేదా టర్కీ బేకన్తో 3 గుడ్లు, లేదా అధిక ప్రోటీన్ యోగర్ట్తో కాటేజ్ చీజ్.భోజనం 2: అన్నం, బ్రోకలీతో చికెన్, చిలగడదుంప, కూరగాయలతో మటన్, లేదా అన్నం, ఆకుకూరలతో సాల్మన్ ఉన్నాయి.భోజనం 3: బంగాళదుంపలు, ఆస్పరాగస్తో చికెన్ లేదా కాలీఫ్లవర్ రైస్ విత్ మిరపకాయలు, కూరగాయలతో రొయ్యలుతినమని కోచ్ కెవ్ సిఫార్సు చేసినట్లు తెలిపారు.మెరుగైన ఫలితాల కోసం..సత్వరమే మార్పులు పొందాలంటే సక్రమైన విధంగా దినచర్యను అనుసరించాల్సి ఉంటుంది.ఉదయం 5:30 గంటలకు నిద్రలేచి, రాత్రి 10 గంటలకల్లా పడుకోవాలి.మద్యపానానికి దూరంగా ఉండటం, రాత్రి 7 గంటల తర్వాత తినడం ఆపడంప్రతిరోజూ కనీసం 8 వేల అడుగులు నడవాలివారానికి 3–4 సార్లు 45 నిమిషాల పాటు తీవ్రమైన శక్తి శిక్షణ వ్యాయామాలు చేయడం.ఉదయం 30 నిమిషాలు సూర్యరశ్మిలో గడపడం, రెండుసార్లు బయట నడవడంప్రతిరోజూ కనీసం 150 గ్రాముల ప్రోటీన్ తీసుకోవడంనీరు, ఎలక్ట్రోలైట్లతో శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోండిప్రతిరోజూ 5 గ్రాముల క్రియేటిన్, నిద్రపోయే ముందు 400mg మెగ్నీషియం తీసుకోండిఈ విధమైన దినచర్యతో ఆరు నెలల్లో 129 కిలోల నుంచి 96 కిలోలుకు చేరుకుని యువకుడి మాదిరిగా తన శరీరాకృతిని మార్చుకున్నాడు. సంకల్పం ఎంత బలంగా ఉంటే అంత తొందరగా పరివర్తన వస్తుందనడానికి డేవిడ్ వెయిట్లాస్ స్టోరీనే ఉదాహరణ.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. David lost 70lbs in 6 months at 48 years old.He came to us at 283 lbs.Active guy. Runs a business. Coaches his kids' basketball and soccer teams.But he wasn't where he wanted to be with his health and knew he needed to make a change.He knew what was wrong. He just… pic.twitter.com/zTiabcWAt7— Coach Kev - Belly Fat Pro (@AskCoachKev) April 10, 2026 (చదవండి: గొప్ప డాక్టర్ని అవ్వాలనుకున్నా..కానీ ఆ ఒక్క రీజన్..!) -
కార్మికుల వేతనాలు పెంపు
ఉత్తరప్రదేశ్లోని పారిశ్రామిక రంగంలో గత కొన్ని రోజులుగా నెలకొన్న అశాంతికి తెరదించుతూ అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వివిధ వర్గాల కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సవరించిన ఈ కొత్త వేతన రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి ఇస్తాయని తెలిపింది. నోయిడాలో వేలాది మంది ఫ్యాక్టరీ కార్మికులు వేతనాలు పెంచాలని, పని పరిస్థితులు మెరుగుపరచాలని సోమవారం చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ దిద్దుబాటు చర్యలు చేపట్టింది.సవరించిన వేతనాల వివరాలుగౌతమ్ బుద్ధ నగర్ (నోయిడా) జిల్లా మేజిస్ట్రేట్ మేధా రూపమ్ మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడిస్తూ, ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సుల మేరకు ముఖ్యమంత్రి ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపారని పేర్కొన్నారు.గౌతమ్ బుద్ధ నగర్, ఘజియాబాద్ఈ కీలక పారిశ్రామిక ప్రాంతాల్లో వేతనాలు అత్యధికంగా ఉన్నాయి. నైపుణ్యం లేని కార్మికులకు నెలకు రూ.13,690 (గతంలో రూ.11,313), సెమీ స్కిల్డ్ వర్కర్లకు రూ.15,059, నైపుణ్యం కలిగిన కార్మికులకు రూ.16,868 వేతనం నిర్ణయించారు.ఇతర మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో..నైపుణ్యం లేని వారు: రూ. 13,006సెమీ స్కిల్డ్: రూ. 14,306నైపుణ్యం కలిగిన వారు: రూ.16,025మిగిలిన జిల్లాల్లో..నైపుణ్యం లేని వారు: రూ.12,356సెమీ స్కిల్డ్: రూ.13,591నైపుణ్యం కలిగిన వారు: రూ.15,224సమతుల్య విధానం - ప్రభుత్వ వివరణయజమానుల సంఘాలు, కార్మిక సంస్థలతో సుదీర్ఘ సంప్రదింపుల తర్వాతే ఈ సమతుల్య, ఆచరణాత్మక నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవైపు కార్మికుల డిమాండ్లు న్యాయమైనవే అయినప్పటికీ, మరోవైపు పరిశ్రమలు ఎదుర్కొంటున్న ప్రపంచ ఆర్థిక సవాళ్లు, పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు, పడిపోతున్న ఎగుమతులను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.తప్పుడు ప్రచారాలను నమ్మొద్దుసోషల్ మీడియాలో కార్మికులకు నెలకు రూ.20,000 ఏకరీతి కనీస వేతనం నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది. జాతీయ స్థాయిలో ‘ఫ్లోర్ వేజ్’ నిర్ణయించే ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉందని, ఇప్పటి వరకు అటువంటి నోటిఫికేషన్ ఏదీ జారీ చేయలేదని స్పష్టం చేసింది.యాజమాన్యాలకు ముఖ్యమంత్రి విజ్ఞప్తిముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరిశ్రమల యజమానులకు పలు సూచనలు చేశారు. వాటి ప్రకారం.. సకాలంలో వేతనాలు చెల్లించాలి. అదనపు పని గంటలకు(ఓటీ) సరైన పరిహారం ఇవ్వాలి. బోనస్, వారపు సెలవులు, సామాజిక భద్రతా ప్రయోజనాలను అమలు చేయాలి. ముఖ్యంగా మహిళా కార్మికులకు అత్యంత సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించాలి. త్వరలోనే పూర్తిస్థాయి వేతన బోర్డును ఏర్పాటు చేసి, దాని సిఫార్సుల మేరకు తుది వేతన నిర్ణయ ప్రక్రియను ప్రారంభిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఇండెక్సేషన్ ఆధారంగా మధ్యంతర పెంపును కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపింది.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు -
ఆశా భోంస్లేకి నివాళి.. పాకిస్తాన్ ఛానల్కు నోటీసులు!
ప్రముఖ గాయని ఆశా భోంస్లే మరణించారంటూ తప్పుడు వార్తను ప్రసారం చేయడమే కాకుండా, ఆ సందర్భంగా భారతీయ వీడియో క్లిప్పింగులను ప్రదర్శించినందుకు పాకిస్తాన్కు చెందిన ప్రముఖ వార్తా సంస్థ 'జియో న్యూస్' చిక్కుల్లో పడింది. ఈ ఘటనపై పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (PEMRA) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు ఛానల్కు నోటీసులు జారీ చేసింది.తప్పుడు వార్తలు ప్రసారంలెజెండరీ సింగర్ ఆశా భోంస్లే ఆదివారం మరణించిన సంగతి తెలిసిందే. శనివారం తీవ్ర ఆస్వస్థతకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చెర్పించారు. చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు. సోమవారం ఆమె అంతక్రియలు జరిగాయి. అయితే ఆమె అస్వస్థతతో ఆస్పత్రిలో చేరగానే.. ఆశా భోంస్లే మరణించారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కొన్ని న్యూస్ ఛానెళ్లు కూడా ఆ తప్పుడు వార్తను ప్రసారం చేశాయి. పాకిస్తాన్కు చెందిన 'జియో న్యూస్' కూడా ఈ పుకార్లను ఆధారంగా చేసుకుని ఒక కథనాన్ని ప్రసారం చేసింది.పాటలతో పాటు వీడియో క్లిప్పింగులుఆశా భోంస్లే మరణవార్తను కవర్ చేసే క్రమంలో ఆమె పాడిన సూపర్ హిట్ పాటలను ప్లే చేసింది. అలాగే భారతీయ సినిమాలకు సంబంధించిన వీడియో క్లిప్పింగులను కూడా ఛానల్లో ప్రసారం చేశారు. పాకిస్తాన్ మీడియా నిబంధనల ప్రకారం భారతీయ కంటెంట్ను ప్రసారం చేయొద్దు. తప్పుడు వార్తను ప్రసారం చేయడమే కాకుండా, నిబంధనలకు విరుద్ధంగా భారతీయ వీడియోలను ప్రదర్శించడంపై పెమ్రా సీరియస్ అవుతూ.. సదరు న్యూస్ ఛానల్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.దీనిపై ఏడు రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని జియో న్యూస్ యాజమాన్యాన్ని పెమ్రా ఆదేశించింది. ఒకవేళ నిర్ణీత సమయంలోగా సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకుంటే ఛానల్పై భారీ జరిమానా లేదా లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. తప్పేముంది?పెమ్రా నోటీసులపై జియో న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ అజార్ అబ్బాస్ స్పందిస్తూ.. భారతీయ పాటలను ప్రసారం చేయడాన్ని సమర్థించుకున్నారు. ఒక కళాకారుడి జీవితంపై వార్తలు రాసేటప్పుడు, వారు సాధించిన విజయాలను గుర్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ‘ప్రముఖ కళాకారుల గురించి వార్తలు రాసేటప్పుడు, వారి కృషిని పునఃపరిశీలించి, కీర్తించడం ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోంది. నిజానికి, ఆశా భోస్లే వంటి గొప్ప కళాకారిణికి సంబంధించి, ఆమె కాలాతీతమైన, చిరస్మరణీయమైన పాటలను మనం పంచుకున్న దానికంటే ఇంకా ఎక్కువగా పంచుకోవాల్సింది. అయినప్పటికీ పెమ్రా (PEMRA), దీనిని పరిమితం చేయాలని నిర్ణయించుకుంది’ అని అబ్బాస్ ట్వీట్ చేశారు. భారతీయ కంటెంట్ను ప్రసారం చేశారన్న సాకుతో నోటీసులు ఇవ్వడాన్ని పలువురు జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు తప్పుబడుతున్నారు. కళాకారులకు నివాళులర్పించడాన్ని కూడా నేరంగా చూడటం ఏంటని సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. భారతీయ సంస్కృతి, కంటెంట్ పట్ల పాక్ ఆర్మీకి ఉన్న భయానికి ఇది నిదర్శనమని విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. PEMRA has issued a show-cause notice to Geo News for airing content related to the legendary subcontinent singer Asha Bhosle.It has always been customary to revisit and celebrate the work of iconic artists when reporting on them. In fact, for an artist of Asha Bhosle’s stature,… pic.twitter.com/AuhFPyGZCL— Azhar Abbas (@AzharAbbas3) April 13, 2026 -
ట్రంప్ కొత్త టార్గెట్.. ప్రపంచ దేశాల్లో వణుకు..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ఒక్క వ్యాఖ్య ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ప్రస్తుతం ఇరాన్ తో తీవ్ర స్థాయి ఘర్షణ వాతావరణం నెలకొన్న వేళ.. ‘ఇరాన్ వ్యవహారం పూర్తయిన తర్వాత క్యూబా వైపు వెళ్తాం’ అంటూ ట్రంప్ చేసిన హెచ్చరిక అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో గుబులు రేపుతోంది. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే ఓవల్ ఆఫీస్ బయట ఆయన చేసిన ఈ ఆకస్మిక వ్యాఖ్యలు.. అమెరికా తదుపరి లక్ష్యం క్యూబానేనా అనే తీవ్ర ఉత్కంఠకు తెరతీశాయి.ఇరాన్ తర్వాత క్యూబాపై గురిప్రస్తుత ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో మిడిల్ ఈస్ట్లో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది. ఈ పరిస్థితులను చక్కదిద్దిన తర్వాత అమెరికా దృష్టి క్యూబాపై పడుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఓవల్ ఆఫీస్ వెలుపల మీడియాతో అనధికారికంగా మాట్లాడుతూ.. ‘ఇరాన్ తో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ముగియగానే తాము క్యూబా వ్యవహారాన్ని చూసుకుంటామని’ ఆయన పేర్కొన్నారు. దీనిపై శ్వేతసౌధం నుంచి ఎలాంటి అధికారిక వ్యూహం కానీ, సైనిక చర్యల కచ్చితమైన సమయం కానీ వెలువడకపోయినప్పటికీ, ఈ వ్యాఖ్యలు ప్రపంచ దేశాలను నివ్వెరపరుస్తున్నాయి.దారుణమైన పాలన.. విఫల దేశంక్యూబా దశాబ్దాలుగా తీవ్రమైన రాజకీయ, ఆర్థిక సంక్షోభాల్లో కూరుకుపోయిందని ట్రంప్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దానిని ఒక ‘విఫల దేశం’గా అభివర్ణించిన ఆయన, పాత కాస్ట్రో శకంలో జరిగిన పరిపాలనా లోపాలను ఎత్తిచూపుతూ.. ఆ దేశం ఎన్నో ఏళ్లుగా అత్యంత దారుణమైన పాలనలో ఉందని అన్నారు. అమెరికా విదేశాంగ విధానంలో క్యూబా ఎప్పుడూ ఒక ప్రత్యేక అంశంగానే ఉంటుందని వ్యాఖ్యానించిన ట్రంప్, భవిష్యత్తులో తీసుకోబోయే నిర్దిష్ట దౌత్య లేదా ఆర్థిక చర్యల గురించి మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఉత్కంఠ1959 నాటి క్యూబా విప్లవం, ప్రచ్ఛన్న యుద్ధం సమయం నుంచి అమెరికా-క్యూబా మధ్య సంబంధాలు ఎప్పుడూ ఉప్పు-నిప్పులాగే ఉన్నాయి. ఆర్థిక ఆంక్షలు, ప్రయాణ నిబంధనల వంటివి నేటికీ కొనసాగుతున్నాయి. ఇలాంటి సున్నితమైన సమయంలో అదీ ఇరాన్ వ్యవహారంలో ప్రపంచం అట్టుడుకుతున్న వేళ, ట్రంప్ క్యూబా పేరును ప్రస్తావించడం గ్లోబల్ మార్కెట్లలో, లాటిన్ అమెరికా దేశాల్లో తీవ్ర అనిశ్చితికి దారితీస్తోంది. ప్రస్తుతానికి క్యూబా అధికారుల నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాకపోయినా, ఈ పరిణామం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఇది కూడా చదవండి: సీనియర్ జర్నలిస్ట్ సంచలన నిర్ణయం.. పోస్ట్మ్యాన్గా మారి.. -
దళిత మహిళపై టీడీపీ నేతల అసభ్య పదజాలం
సాక్షి, అనంతపురం: అంబేద్కర్ జయంతి సందర్భంగా నగరంలో రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఓ దళిత నేతను టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుని అసభ్యపదజాలంతో దూషించారు. దీంతో ఆమె కంటతడి పెడుతూ నిరసనకు దిగారు. అనంతపురం సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం జయంతి వేడుకలు జరిగాయి. ఆ సమయంలో.. వైఎస్సార్సీపీ నేత, ఏపీఎస్ఆర్టీసీ రీజినల్ మాజీ ఛైర్మన్ మంజుల అక్కడికి వచ్చారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసేందుకు ఆమె ప్రయత్నించగా.. టీడీపీ నేతలు అడ్డుపడుతూ తీవ్రంగా దూషించారు. టీడీపీ నేతల దౌర్జన్యంతో మంజుల కంటతడి పెట్టి అక్కడే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దళితుల గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాలను తాము సహించబోమని నినాదాలు చేశారు.ప్రత్యక్ష్య సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా ఆమెను అవమానించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇలా దళిత నేతను అవమానించడం బాధాకరమని పేర్కొన్నారు. -
ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. నిన్నటి మార్కెట్లో తగ్గిన ధరలు ఈరోజు ఒక్కసారిగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
న్యాయం చేయండి.. తప్పు చేస్తే శిక్షించండి.. సజ్జనార్తో మంగ్లీ
ప్రముఖ సింగర్ మంగ్లీ, న్యాయవాది సుబ్బారావు వివాదం అనేక మలుపులు తిరుగుతుంది. ఈ క్రమంలో ఆమె తాజాగా CP సజ్జనార్ను కలిశారు. ఇదే కేసులో పంజగుట్ట పోలీస్స్టేషన్లో ఇప్పటికే హైడ్రామా చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మైక్రోఫైనాన్స్ పేరుతో మంగ్లీ, ఆమె తమ్ముడు మోసం చేశారంటూ న్యాయవాది సుబ్బారావు భాధితులతో కలిసి ఆధారాలు సమర్పించేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చారు. తన మాటతీరు చూసి పోలీసులు ఆల్కహాల్ టెస్ట్ నిర్వహించారు. సుబ్బుకు 27 రీడింగ్ రావడంతో అందరూ షాక్ అయ్యారు.మైక్రోఫైనాన్స్ పేరుతో తాను డబ్బులు వసూలు చేశానని న్యాయవాది సింగపోగు సుబ్బు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని మంగ్లీ ఇప్పటికే పోలీస్స్టేషన్కు వెళ్లి తెలిపారు. ఆయన చెప్పిన దానిలో వాస్తవం ఉంటే అధారాలు చూపించాలని కోరారు. ఈ క్రమంలోనే తాజాగా CP సజ్జనార్ను ఆమె కలిశారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే తన మీద దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని, అందకు కారణమైన అడ్వకేట్ సుబ్బరావ్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. అదే సమయంలో మైక్రోఫైనాన్స్ పేరుతో మోసపోయిన బాధితులకి న్యాయంచేయాలని కోరింది. డబ్బు కాజేసిన అసలు వ్యక్తులను పట్టుకోవాలని మంగ్లీ కోరడంతో నెటిజన్లు కూడా ఆమెకు మద్ధతుగా నిలుస్తున్నారు.నాకు ఎలాంటి వ్యాపారం లేదుతనకు పాటల ప్రపంచం పాటలు తప్ప వేరే వ్యాపారం లేదని మంగ్లీ తెలిపారు. న్యాయవాది అని చెప్పుకునే సింగపోగు సుబ్బు డబ్బు డిమాండ్ చేయడమే కాకుండా, తనతో అసభ్యంగా ప్రవర్తించాడని అతడు, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని సత్యవతి ముడావత్ అలియాస్ మంగ్లీ పంజగుట్ట పోలీసులకు తన న్యాయవాదితో కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తన పేరు చెప్పుకొని ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. డబ్బుల వసూలులో తన పాత్ర ఉందంటే తాను ఏ పోలీస్, కోర్టు మెట్లు ఎక్కేందుకైనా సిద్ధమే అన్నారు. డబ్బుల కట్టలు ఉన్న వీడియోలో డబ్బు లెక్కపెట్టేది తన సోదరుడు కాదని, అనవసరంగా అతన్ని ప్రచారం చేస్తున్నారని అన్నారు. న్యాయవాది సుబ్బుకు భరతనాట్యం వస్తుందని, అతను బిగ్బాస్ వెళ్లాలని, ఫేమస్ కావాలని ఇప్పటికే ఫేమస్గా ఉన్న తనను వాడుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. గత నెల 22వ తేదీన న్యాయవాది సుబ్బు అతని అనుచరులు తనను కలిసి సామాజిక మాధ్యమాల్లో తనకు వ్యతిరేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చిన వీడియోలు డిలీట్ చేయాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని, దానికి తాను ఒప్పుకోకపోవడంతో తనను బెదిరించడం, వేధించడం చేశారన్నారు. View this post on Instagram A post shared by Mangli 🎙️ (@iammangli) -
సీనియర్ జర్నలిస్ట్ సంచలన నిర్ణయం.. పోస్ట్మ్యాన్గా మారి..
వృత్తిలో ఎదుగుదల లేదా? చాలీచాలని జీతంతో సతమతమవుతున్నారా? అయితే అమెరికాకు చెందిన ఈ సీనియర్ జర్నలిస్ట్ కథ మీకోసమే.. 30 ఏళ్ల పాటు పత్రికా రంగంలో పనిచేసిన ‘జిమ్ లెక్సా’ తన 53వ ఏట తీసుకున్న ఓ నిర్ణయం అతని జీవితాన్నే మార్చేసింది. జర్నలిజం వదిలేసి ఓ సాధారణ పోస్ట్మెన్గా మారిన అతను ఇప్పుడు ఏకంగా తన పాత జీతం కంటే మూడు రెట్లు అధికంగా సంపాదిస్తూ, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.పత్రికా రంగంలో కష్టాలు.. తగ్గిన జీతం1984లో టెక్సాస్లో స్పోర్ట్స్ రిపోర్టర్గా కెరీర్ ప్రారంభించిన జిమ్ లెక్సా, అంచెలంచెలుగా ఎదిగి, డెస్క్ బాధ్యతలు చేపట్టాడు. అయితే తదనంతర కాలంలో వార్తాపత్రికల మనుగడ కష్టంగా మారడంతో ఆ రంగంలో సంక్షోభం మొదలైంది. దీంతో అతని జీతం భారీగా తగ్గిపోయింది. కిరాణా సరుకులు కొనేందుకు, కనీసం పెంపుడు జంతువుల వైద్య ఖర్చులకు కూడా డబ్బులు సరిపోక ఆయన తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. తక్కువ జీతం, నిరంతర డెడ్లైన్ల ఒత్తిడితో విసిగిపోయిన జిమ్, 2015లో తన జర్నలిజం వృత్తికి శాశ్వతంగా స్వస్తి పలికాడు.పోస్ట్మెన్గా కొత్త జీవితం.. మూడింతల ఆదాయంజర్నలిజం వదిలేశాక ఇల్లినాయిస్లో పెయింటింగ్, క్లీనింగ్ వంటి పనులు చేసిన ఆయన.. అదే ఏడాది యూఎస్ పోస్టల్ సర్వీస్లో క్లర్క్గా చేరాడు. అతి తక్కువ కాలంలోనే అంచెలంచెలుగా ఎదిగి, న్యూయార్క్లో ఫుల్-టైమ్ లెటర్ క్యారియర్గా (పోస్ట్మెన్) ప్రమోషన్ పొందాడు. ప్రస్తుతం తన పాత జీతం కంటే దాదాపు మూడు రెట్లుకు పైగా ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. ఇప్పుడు భార్యతో కలిసి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా, వీలైనప్పుడు విహారయాత్రలు చేస్తూ సంతోషంగా కాలం గడుపుతున్నాడు.ఆర్థిక స్థిరత్వంతో పాటు అద్భుతమైన ఆరోగ్యంఈ వృత్తి మార్పు జిమ్ లెక్సాకు కేవలం ఆర్థిక స్థిరత్వాన్నే కాదు.. మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన ఆరోగ్యాన్ని కూడా ఇచ్చింది. పోస్ట్మెన్గా విధులు నిర్వర్తించే క్రమంలో ఆయన ప్రతిరోజూ 12 నుంచి 18 మైళ్ల దూరం (దాదాపు 40,000 అడుగులు) నడుస్తున్నాడు. దీంతో 63 ఏళ్ల వయసులోనూ ఎంతో ఫిట్గా, ఉల్లాసంగా ఉన్నానని ఆయన ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. తక్కువ ఒత్తిడి, ఆకర్షణీయమైన జీతం, మంచి ప్రయోజనాలు.. వెరసి తన నిర్ణయం నూటికి నూరు శాతం సరైనదేనని నిరూపించాయని జిమ్ గర్వంగా చెబుతున్నాడు.ఇది కూడా చదవండి: నేడు అంబేద్కర్ జయంతి: ఏవి ఓపెన్? ఏవి క్లోజ్? -
ఆ ఇద్దరు మావోలు ఎక్కడ?
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ ఉద్యమం.. మావోయిస్టు ఉద్యమాల్లో మెతుకుసీమది కీలకపాత్ర. నక్సల్స్, పీపుల్స్వార్, జనశక్తి, మావోయిస్టు ఉద్యమాలతో సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల ప్రాంతాలకు విడదీయరాని బంధం ఉంది. దుబ్బాక, నర్సాపూర్, గిరాయిపల్లి, ఇందుప్రియాల్, భూపతి, పద్మక్క దళాలుగా ఇక్కడ పీపుల్స్వార్ పనిచేసింది. అదే విధంగా కూడవెల్లి, మంజీర దళాలతో జనశక్తి సైతం కొనసాగింది. డీజీపీ ఇటీవల ప్రకటించిన వారిలో రాష్ట్రానికి చెందిన ఐదుగురు మావోయిస్టులు మాత్రమే ఉన్నారని ప్రకటించారు. అందులో ప్రకటించిన రూపీ ఎన్కౌంటర్లో మృతిచెందారు. డీజీపీ ప్రకటించని మరో ఇద్దరు ఎక్కడ ఉన్నారోనని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.కానరాని అరుణ, స్వరూపజిల్లా నుంచి ముగ్గురు మావోయిస్టులు ఉండగా అందులో ఒకరు మిరుదొడ్డి మండలం ధర్మారానికి చెందిన భాగ్య అలియాస్ రూపీ ఛత్తీస్గఢ్ మాచపల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో సోమవారం మృతి చెందినట్లు అక్కడి పోలీసులు ప్రకటించారు. పోలీసుల లెక్కల ప్రకారం ఎవరు అజ్ఞాతంలో లేనట్లే. అరుణ, స్వరూపలు అజ్ఞాతంలోకి వెళ్లి 25 ఏళ్లు దాటిపోయింది. అక్కన్నపేట మండల కేంద్రానికి చెందిన కాశబోయిన స్వరూప 25ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లారు. దండకారణ్యం సభ్యురాలిగా ఉన్న ఆమైపె రూ.3లక్షల వరకు రివార్డు ఉన్నట్లు గతంలో పోలీసులు పేర్కొన్నారు. తన చిన్ననాడే తల్లిదండ్రులు చనిపోతే నానమ్మ, తాత వద్ద పెరిగారు. పదో తరగతి చదువుతున్నప్పుడే ఉద్యమానికి ఆకర్షితురాలై అడవి బాట పట్టారు. ఆమె నానమ్మ, తాత చనిపోగా గ్రామస్తులే చందాలు వేసి అంత్యక్రియలు చేశారు. ప్రస్తుతం తనకు చెల్లె మాత్రమే ఉంది. ఇక నంగునూరు మండల కేంద్రానికి చెందిన రంగు అరుణ అలియాస్ పద్మక్క 20 ఏళ్లుగా మావోయిస్టుల్లో ఉన్నారు. ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీలో యాక్షన్ టీం మెంబర్గా ఉన్న పద్మక్కపై రూ.3లక్షల రివార్డు ఉన్నట్లు అప్పట్లో పోలీసులు పేర్కొన్నారు. ఎక్కడ ఉందో ఎలా ఉందో ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.లొంగిపోయారా..? లేదా? అక్కన్నపేటకు చెందిన కాశబోయిన స్వరూప, నంగునూరుకు చెందిన రంగు అరుణల ఆచూకీ తెలియరావడం లేదు. పోలీసులు సైతం వీరి గురించి స్పష్టంగా చెప్పడం లేదు. వీరు అజ్ఞాతంలోనే ఉన్నారా? ఉంటే ఎక్కడ? లేక లొంగిపోయారా?.. లొంగిపోతే ఎక్కడ జీవనం గడుపుతున్నారు? లేకపోతే ఎప్పుడైనా ఎన్కౌంటర్లో తమ ప్రాణాలు కోల్పోయారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీరి కుటుంబ సభ్యులకు కూడా ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. అయితే తమ బిడ్డలు క్షేమంగా ఉన్నారా?.. లేదా? అనే ఆవేదనతో ఉన్నారు. -
ధరలు.. ఇంకాస్త పైకి
న్యూఢిల్లీ: మార్చిలో నిత్యావసరాల ధరలు మరింత పెరిగాయి. రిటైల్ ధరల ఆధారిత సూచీ (రిటైల్ ద్రవ్యోల్బణాన్ని సూచించే ) 3.4 శాతానికి పెరిగింది. ఫిబ్రవరిలో ఇది 3.21 శాతంగా ఉంది. ముఖ్యంగా మార్చి నెలలో బంగారం, వెండి ఆభరణాలు, కొబ్బరి, టమాటా, క్యాలిఫ్లవర్ ధరలు పెరిగాయి. ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, వెల్లుల్లి, కందిపప్పు, శనగపప్పు ధరలు తగ్గినట్టు జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) విడుదల చేసిన డేటా ఆధారంగా తెలుస్తోంది. అయినప్పటికీ మార్చి నెల ద్రవ్యోల్బణం ఆర్బీఐ లక్ష్యమైన 4 శాతానికి దిగువనే ఉండడం గమనార్హం. ఈ గణాంకాలు 2024 బేస్ ఇయర్ ఆధారంగా రూపొందించినవి. విద్యుత్, గ్యాస్, ఇతర ఇంధన విభాగంలో ద్రవ్యోల్బణం 1.65 శాతం నమోదైంది. ఫిబ్రవరిలో ఇదే విభాగం ద్రవ్యోల్బణం 1.52 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 3.63 శాతం, పట్టణ ప్రాంతాల్లో 3.11 శాతం చొప్పున మార్చి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం నమోదైంది. దేశవ్యాప్తంగా చూస్తే అత్యధిక ద్రవ్యోల్బణం తెలంగాణలో 5.83 శాతంగా ఉంది. అత్యల్పంగా మిజోరాంలో 0.66 శాతం నెలకొంది. పశ్చిమాసియా ప్రభావం.. పశ్చిమాసియా ఘర్షణల ప్రభావం కొంత మేర ద్రవ్యోల్బణంలో కనిపించినట్టు ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ పేర్కొన్నారు. ప్రధానంగా ఆహారం, విద్యుత్, గ్యాస్ ధరల పెరుగుదలతో నెలవారీగా ద్రవ్యోల్బణం ఎగసినట్టు చెప్పారు. -
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ క్షిప్రా మృతి
బెంగళూరు: రోడ్డు ప్రమాదంలో యువ టెక్కీ దుర్మరణం చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో జరిగింది. దక్షిణ కన్నడ జిల్లా సుళ్యకు చెందిన టెక్కీ క్షిప్రా (27) మృతి చెందింది. మంగళూరుకు చెందిన శశి కళాభట్కు ఏకైక కూతురు క్షిప్రా. బెంగళూరులో ప్రైవేట్ కంపెనీలో టెక్కీగా పని చేస్తోంది. రాయచూరు జిల్లాలో స్నేహితురాలి పెళ్లి ఉండడంతో సహ ఉద్యోగులతో కలిసి ఆనందంగా కారులో కర్నూలు పర్యటనకు వెళ్లారు. ఆదోని పట్టణం వద్ద కారు డ్రైవర్కు నిద్ర మత్తు వచ్చి చెట్టును ఢీన్నాడు. ఈ ప్రమాదంలో క్షిప్రాకు బలమైన గాయాలై అక్కడే చనిపోయింది. మరో యువకుడు, ఇద్దరు యువతులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆస్పత్రిలో చేర్చి చికిత్సలు అందిస్తున్నారు. క్షిప్రా ఎంటెక్ చేసింది, కొన్నేళ్ల కిందట తండ్రి చనిపోగా, ఆమెను తల్లి కంటికి రెప్పలా చూసుకుంటోంది. తల్లీ కూతురు బెంగళూరులోనే నివసిస్తున్నారు. ఇంతలో ఏకైక ఆధారంగా ఉన్న కూతురు కూడా మరణించడంతో తల్లి శోకసంద్రంలో మునిగిపోయింది. బంధువులు మృతదేహాన్ని సొంతూరికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేశారు. -
అమరావతి అవినీతి చూసి దేవుళ్లు కూడా భయపడతారు
సాక్షి, కర్నూలు: అమరావతి గురించి పదే పదే మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల గురించి ఏనాడైనా మాట్లాడారా? అని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. కేవలం అమరావతి డిజైన్ల పేరిట వందల కోట్ల అవినీతి జరుగుతోందని అంటున్నారాయన. మంగళవారం కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడారు. మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం వద్ద రూ.5 వేల కోట్లు కూడా లేవా?. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించడానికి జీతాలకు డబ్బులు లేవని మీరే(చంద్రబాబును ఉద్దేశించి..) అంటారు. అమరావతిలో మాత్రం లక్షల కోట్లు పెట్టాలంటారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అమరావతిలోనే నిర్మాణ ఖర్చులు ఎక్కువ. కేవలం డిజైన్ల పేరుతోనే రూ.400 కోట్ల అవినీతి జరుగుతోంది. అమరావతి గురించి చంద్రబాబు పదే పదే మాట్లాడుతున్నారు. మరి రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల గురించి ఏనాడైనా మాట్లాడారా?. కనీసం ఆలోచన అయినా చేశారా?. అమరావతికి లక్షల కోట్లు అవసరమైతే.. మావిగన్కు కేవలం రూ. 10-20 వేల కోట్లు చాలు. అమరావతి పనుల్లో అంతులేని అవినీతి జరుగుతోంది. రైతులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. జరుగుతున్న అవినీతి చూసి దేవుళ్లు కూడా భయపడతారు’’ అని బుగ్గన అన్నారు. టీడీపీ, జనసేన ప్రధాన కార్యాలయాలు ఉండేది నేషనల్ హైవే పక్కనే కదా!. శ్రీబాగ్ ఒడంబడికి అంటే టీడీపీ నేతలకు తెలుసా?. పెద్ద మనుషుల ఒప్పందం అంటే చంద్రబాబుకి తెలుసా?. రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు అనేవి ఉంటాయి. కనీసం చంద్రబాబుకి వాటి గురించైనా తెలుసా?. మావిగన్, వికేంద్రీకరణ అంటే చంద్రబాబుకి ఎందుకు కోపం?. కేంద్రం 2014 ఏప్రిల్ 25న శివరామకృష్ణన్ కమిటీ వేసింది. ఇప్పుడు ఉన్న అమరావతి ప్రాంతం రాజధానికి పనికి రాదని ఆ కమిటీ చెప్పింది కదా’’ అని బుగ్గన గుర్తు చేశారు. -
చిరంజీవి వారసత్వం, పిల్లల పెంపకంపై చరణ్ వ్యాఖ్యలు
మెగా హీరో రామ్ చరణ్ తాజాగా ప్రముఖ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ కవర్ పేజీపై స్టైలీష్గా కనిపించారు. ఈ క్రమంలోనే వారికి ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. అందులో తన సినిమాలతో పాటు కుటుంబ విషయాలను పంచుకున్నారు. గతంలో ఇదే మ్యాగజైన్లో జూనియర్ ఎన్టీఆర్ మెరిశారు. తర్వాత ఆ గౌరవాన్ని అందుకున్న నటుడిగా చరణ్ రికార్డ్ క్రియేట్ చేశారు.పిల్లలను స్ట్రాంగ్గా పెంచుతానురామ్ చరణ్- ఉపాసన దంపతులకు మొదట క్లింకార జన్మించగా రీసెంట్గా కవలలు (ఒక బాబు, ఒక పాప) కలిగిన విషయం తెలిసిందే.. శివ రామ్ కొణిదెల, అన్వీర దేవి కొణిదెల అని నామకరణం కూడా చేశారు. అయితే, పిల్లల పెంపకంపై చరణ్ ఇలా చెప్పుకొచ్చారు. 'ఇంట్లో పిల్లలు చేసే అల్లరిని చూసి వాళ్లను మరింత ఎంకరేజ్ చేస్తాను. వారి విషయంలో నేను కాస్త రఫ్గానే ఆలోచిస్తాను. పిల్లలను దూకనిస్తాను.. వారు పడిపోయినప్పటికీ మళ్లీ నిలబడేలా చూస్తాను. మట్టిలో ఆటలాడినా.. ఎత్తుపల్లాలు ఎక్కినా నేను అసలు భయపడను. వాళ్లు చిన్నతనం నుంచే ధైర్యంతో పాటు సాహసం నింపుకొని పెరగాలని ఆశిస్తాను. కానీ, వాళ్ల అమ్మ చాలా సున్నితంగా చూసుకుంటుంది. పిల్లల విషయంలో ఎక్కువ కంగారుపడుతుంది. అయితే, వాళ్ల అమ్మ ఎప్పుడైనా తిట్టినప్పుడు క్లీంకార నా దగ్గరకు వచ్చేస్తుంది.' అని తెలిపారు.నాన్న చెప్పడంతోనే అయ్యప్ప దీక్షఅయ్యప్ప దీక్ష గురించి కూడా రామ్ చరణ్ పలు విషయాలు పంచుకున్నారు. నాన్న (చిరంజీవి) సూచనతో 17ఏళ్ల వయసులో తొలిసారి అయ్యప్ప దీక్ష ప్రారంభించినట్లు చరణ్ గుర్తుచేసుకున్నారు. తన ఆలోచనలతో పాటు క్రమశిక్షణను అయ్యప్ప దీక్ష పెంచిందని ఆయన అన్నారు. చిరంజీవి వారసత్వంతో పాటు కష్టపడి పనిచేయడం కూడా తాను తీసుకున్నట్లు పేర్కొన్నారు. -
ఐలాపూర్ హైడ్రా కూల్చివేతలపై గందరగోళం
సాక్షి, హైదరాబాద్/సంగారెడ్డి: అమీన్పూర్ మండలం ఐలాపూర్లో హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై తీవ్ర గందరగోళం నెలకొంది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత దాకా ఆపరేషన్ నిలిపివేయాలని తెలంగాణ హైకోర్టు స్పష్టంగా ఆదేశించింది. అయినప్పటికీ కూల్చివేతలు కొనసాగిస్తామని హైడ్రా అంటోంది. ఐలాపూర్లో ఓ భారీ భవనంపై కూల్చివేతపై కోర్టు సోమవారం స్టే ఆర్డర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. భవనం పూర్తిగా కూల్చకుండా వదిలేసింది హైడ్రా. కూల్చకుండా వదిలేస్తే పక్కన ఉన్న భవనంపై పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో పూర్తిగా కూల్చాల్సిందేనని అంటున్నారు. కానీ.. హైడ్రా చర్య కోర్టు ధిక్కరణ(కంటెంప్ట్ ఆఫ్ కోర్టు) కిందకే వస్తుందని బాధితులు చెబుతున్నారు. ఒకవేళ మొండిగా కూల్చివేతలు మొదలుపెడితే మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెబుతున్నారు. ఏం జరిగిందంటే.. శనివారం అమీన్పూర్ మండల పరిధిలో పలు చోట్ల అక్రమ కట్టడాలను కూల్చేసింది హైడ్రా. ఆ సమయంలోనూ విపరీతమైన గందరగోళం నెలకొంది. కోర్టు ఆదేశాలతో కూల్చివేత ఆగిందని కాసేపు.. హైడ్రానే కావాలని కాసేపు కూల్చివేతలు ఆపిందని.. ఇలా రకరకాల ప్రచారం జరిగింది. ఈలోపు ఐలాపూర్ కూల్చివేతలపై ఓ వృద్ధుడు హైకోర్టును ఆశ్రయించారు. మధ్యంతర ఉత్తర్వులు ఉన్నా కూడా పట్టించుకోకుండా కూల్చివేతకు దిగారని పేర్కొన్నారు. అయితే.. హైడ్రా తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) వాదిస్తూ.. కోర్టు ఇచ్చిన డిక్రీని అడ్డుపెట్టుకుని ఐలాపూర్లో పలు సర్వే నంబర్లలోని వెయ్యి ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని.. హైడ్రా కూల్చివేసిన భవనం ప్రభుత్వ భూమిలో నిర్మించిందేనని.. పైగా ఆ భవనానికి విద్యుత్, నిర్మాణ అనుమతులు లేవని వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు.. తాము తదుపరి ఆదేశాలిచ్చే వరకు జలాశయాలు, నాలాలు, పార్కులు, ఆక్రమణల తొలగింపు, ప్రజా రహదారుల పునరుద్ధరణ మినహా అనధికార నిర్మాణాల కూల్చివేత లేదంటే తొలగింపునకు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టవద్దని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది. -
వైభవ్ టీమిండియా ఎంట్రీ ఖరారు
భారత క్రికెట్కు సంబంధించి ఓ సంచలన వార్త అందుతోంది. ఐపీఎల్ 2026 వీరలెవెల్లో రెచ్చిపోతున్న, యువ చిచ్చరపిడుగు, రాజస్థాన్ రాయల్స్ కెరటం వైభవ్ సూర్యవంశీ త్వరలో టీమిండియా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఐపీఎల్ తర్వాత జరిగే ఐర్లాండ్, జింబాబ్వే టీ20 సిరీస్లలో అతను బరిలోకి దిగడం ఖరారైంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన మాత్రమే వెలువడాల్సి ఉంది.15 ఏళ్ల వైభవ్ ఎంపికపై సెలెక్టర్లు తొలుత ముల్లగుల్లాలు (వయసు రిత్యా) పడినప్పటికీ.. ఆతర్వాత ప్రతిభే కొలమానంగా ఎంపికే చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. వైభవ్ ఎంపిక కేవలం ఐపీఎల్ ఆధారంగానే కాకుండా అండర్-19 జట్టు తరఫున ప్రదర్శనలు కూడా పరిగణలోకి తీసుకొని చేయనున్నట్లు సమాచారం.వైభవ్ ఈ ఏడాది అండర్-19 ప్రపంచకప్లో విశేషంగా రాణించాడు. ముఖ్యంగా ఇంగ్లండ్తో జరిగిన ఫైనల్లో ఆకాశమే హద్దుగా చెలరేగి భారీ విధ్వంసకర శతకం బాదాడు. ఫలితంగా భారత్ జగజ్జేతగా అవతరించింది. వైభవ్ ఇటీవలే దేశవాలీ క్రికెట్లోకి (బిహార్ తరఫున) కూడా అరంగేట్రం చేసి, అక్కడ కూడా సత్తా చాటాడు. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొన్న భారత సెలెక్టర్లు, వైభవ్ టీమిండియా ఎంపికకు ముహూర్తం ఖరారు చేశారు.ఐపీఎల్ 2026 తర్వాత టీమిండియా ఐర్లాండ్, జింబాబ్వేల్లో పర్యటించనుంది. ఈ సిరీస్లకు వైభవ్ను ఎంపిక చేసి టీమిండియాకు గ్రాండ్గా పరిచయం చేయాలని భారత సెలెక్టర్లు భావిస్తున్నారు. ఈ సిరీస్లలో వైభవ్కు జతగా మరో చిచ్చరపిడుగు అభిషేక్ శర్మ ఉండవచ్చు. ఒకవేళ ఈ ఇద్దరు బరిలోకి దిగితే పసికూనలైన ఐర్లాండ్, జింబాబ్వే పరిస్థితి ఊహించుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది. వైభవ్-అభిషేక్ జోడీ టీ20 ఫార్మాట్లో అత్యంత భయంకరమైన ఓపెనింగ్ జోడీగా మారవచ్చని అంచనాలు ఉన్నాయి. చరిత్ర సృష్టిస్తాడుఐర్లాండ్, జింబాబ్వే పర్యటనల్లో వైభవ్ టీమిండియా అరంగేట్రం జరిగితే సరికొత్త చరిత్ర అవుతుంది. అతి చిన్న వయసులో టీమిండియా అరంగేట్రం చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. వైభవ్ జూన్ 26న ఐర్లాండ్పై తొలి టీ20 ఆడితే, ఆ సమయానికి అతని వయసు 15 సంవత్సరాలు 91 రోజులు అవుతుంది. ఒకవేళ ఆ మ్యాచ్ కాకపోయినా, ఐర్లాండ్, జింబాబ్వే సిరీస్ల్లో ఏ మ్యాచ్లో అరంగేట్రం చేసినా చరిత్రే అవుతుంది. ఎందుకంటే, భారత్ తరఫున అతి చిన్న వయసులో అరంగేట్రం చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 16 సంవత్సరాలు 205 రోజుల వయసులో టీమిండియా ఎంట్రీ ఇచ్చాడు. ఈ లెక్కన వైభవ్-సచిన్కు చాలా గ్యాప్ ఉంటుంది.ఆకాశమే హద్దుప్రస్తుత ఐపీఎల్ ఎడిషన్లో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో సగటు 40, స్ట్రైక్ రేట్ 263.16తో 200 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్లలో ఒకడిగా చలామణి అవుతున్నాడు. ఈ ఎడిషన్లో వైభవ్.. జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్ లాంటి ప్రపంచ మేటి బౌలర్లకు సైతం చుక్కలు చూపిస్తున్నాడు. -
అప్పులతో పాక్ సతమతం..?
ఇస్లామాబాద్: ఆర్థిక సంక్షోభంతో తల్లడిల్లిపోతున్న పాక్కు మరో ఇబ్బంది వచ్చి పడింది. UAE ఇచ్చిన $3 బిలియన్ డాలర్లు అప్పు పూర్తిగా తిరిగి చెల్లించాలని కోరడంతో ఎలా చెల్లించేది అనే సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. అసలే డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ ఈ అప్పులు ఎలా చెల్లించేదని ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం.మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం కారణంగా పెరుగుతున్న ముడిచమురు ధరల వల్ల పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారింది. ఇంతకాలంగా యూఏఈకి ఉన్న అప్పును పలు దపాలుగా పాకిస్థాన్ వాయిదా వేస్తో వచ్చింది అయితే ప్రస్తుతం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అప్పు చెల్లించాలని కోరడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ విషయమై పాక్ ఆర్థిక శాఖ మంత్రి జౌరంగజేబ్ స్పందించారు. మేము సమకూర్చుకోవాల్సిన నిధులను ద్వైపాక్షిక మార్గాలు, రుణాల ద్వారా సమకూర్చుకునే యత్నం చేస్తున్నాం. అప్పు చెల్లించడానికి ఉన్న అన్ని మార్గాలను పరిశీలిస్తున్నాం అన్నారు. ఎట్టిపరిస్థితుల్లో యుఏఈకి ఉన్న అప్పును చెల్లిస్తామని స్పష్టం చేశారు . అయితే అప్పుకోసం చైనా,లేదా సౌదీ అరేబియాలను సంప్రదిస్తున్నారా అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు పాక్ మంత్రి సమాధానం దాటవేశారు.కాగా ప్రస్తుతం ప్రస్తుతం పాక్ వద్ద $ 16.4 బిలియన్ల విదేశీ మారక నిల్వలు ఉండగా అవి ఆ దేశ దిగుమతులకు మూడునెలల వరకూ సరిపోతాయని కథనాలు పేర్కొన్నాయి. అయితే పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధన ధరలు భారీగా పెరగడంతో ఆదేశంలో లాక్ డౌన్ విధించారు. ఇంధన వినియోగం తగ్గించడం కోసం షాపింగ్ మాల్స్, బజార్లు అన్ని రాత్రి 8 గంటల వరకే క్లోజ్ చేసేలా ఆదేశాలిచ్చారు. -
‘మా బాబును రాష్ట్రపతి తెగ పొగిడేశారు తెలుసా!’
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని గాలికొదిలేసి.. ప్రచార ఆర్భాటాల కోసం టీడీపీ బృందం హస్తిన బాట పట్టింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సోమవారం విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, టీడీపీ కూటమి ఎంపీల బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ బిల్లుకు ఆమోదం తెలిపినందుకు వారంతా రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు. బాబును పొగిడారంటూ ప్రచారం భేటీ అనంతరం టీడీపీ వర్గాలు తమదైన శైలిలో ప్రచారాన్ని మొదలుపెట్టాయి. సీఎం చంద్రబాబును రాష్ట్రపతి ‘ఇంటెలిజెంట్, విజనరీ’ అని ప్రశంసించారని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. రాజధాని కోసం అమరావతి రైతులు 33 వేల ఎకరాలు ఇవ్వడం గొప్ప విషయమని రాష్ట్రపతి అన్నట్టుగా లోకేశ్ బృందం ప్రచారం చేస్తోంది. రాష్ట్రపతితో భేటీ అనంతరం టీడీపీ ఎంపీ అప్పలనాయుడు మీడియాతో మాట్లాడారు. ఎప్పటి మాదిరిగానే వైఎస్సార్సీపీపైన, మాజీ సీఎం వైఎస్ జగన్ పైన విమర్శలు గుప్పించారు. అమరావతిలో అవినీతి జరుగుతోందని వైఎస్సార్సీపీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాజధాని బిల్లు ఆమోదాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఐదు కోట్ల ఆంధ్రులను అవమానిస్తోందంటూ అక్కసు వెళ్లబోశారు. -
దళపతి ‘మాయ’.. షాకిస్తున్న ‘హోలోగ్రామ్ విజయ్’
చెన్నై: తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటాయి. అయితే ఈసారి ఎన్నికల ప్రచారంలో దళపతి విజయ్ సరికొత్త ట్రెండ్ సృష్టించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో స్వయంగా పర్యటించడం అసాధ్యం కావడంతో, ఆయన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) ఒక అద్భుతమైన ఐడియాతో ముందుకొచ్చింది. ఏఐ సాంకేతికతతో సృష్టించిన విజయ్ 3డీ హోలోగ్రామ్లు ఇప్పుడు వీధుల్లో అదరగొడుతున్నాయి. ప్రజలను ఈ హైటెక్ ప్రచారం ఎంతగానో ఆకర్షిస్తోంది.ప్రచార బరిలో ‘3డీ విజయ్’ హవాకుంభకోణం టీవీకే అభ్యర్థి వినోద్ రవి ఈ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రచార రథంపై అభ్యర్థితో పాటు నిల్చున్న విజయ్ 3డీ హోలోగ్రామ్.. అచ్చం ఆయన లాగే కనిపిస్తూ, ఆయన గొంతుతోనే ప్రసంగిస్తోంది. ‘విజిల్ వేయడానికి సిద్ధమా? ఓటు మన హక్కు, దాన్ని ఎవరూ తీసుకోలేరు. మన ఓటు విజిల్ (టీవీకే గుర్తు)కే వేయాలి. మనం ఎవరి మాటలకూ మోసపోం’ అని హోలోగ్రామ్ విజయ్ చెబుతుంటే.. అభిమానులు, ఓటర్లు ఆశ్చర్యంతో చూస్తూ అక్కడే ఉండిపోతున్నారు. ఈ డిజిటల్ దళపతి భౌతికంగా ఆయన అక్కడే ఉన్నారన్న భ్రమను కల్పిస్తూ విశేషంగా ఆకట్టుకుంటోంది. TVK candidate in Kumbakonam uses a full hologram of Vijay…. pic.twitter.com/eWooTr2EKk— Vasudha Venugopal (@Vasudha156) April 13, 2026విద్యార్థి మేధస్సుకు ప్రతిరూపంమొత్తం 234 స్థానాల్లో పోటీ చేస్తున్న పార్టీ.. అన్ని చోట్లా విజయ్ సందేశాన్ని చేర్చాలనే ఉద్దేశంతో ఈ వ్యూహం అమలు చేసింది. తంజావూరు జిల్లా టీవీకే కోశాధికారి విజయ్ చంద్రన్ ఆలోచన మేరకు, ప్రవీణ్ అనే 20 ఏళ్ల ఏఐ, డేటా సైన్స్ విద్యార్థి ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశాడు. కేవలం మూడు రోజుల్లోనే ఏఐ సాయంతో విజయ్ ప్రసంగాన్ని 50 సెకన్ల వీడియోగా మార్చి, దానిని హోలోగ్రామ్ ద్వారా ప్రదర్శించారు. ఈ ప్రయోగం ఆన్లైన్లో వైరల్ కావడంతో పాటు, క్షేత్రస్థాయిలో విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా దీనిని విస్తరించే పనిలో పార్టీ బిజీగా ఉంది.డూప్ల నుంచి డిజిటల్ దాకా..ఏప్రిల్ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం టీవీకే శ్రేణులు చేయని ప్రయత్నం లేదు. హోలోగ్రామ్ల కంటే ముందు తిరువెరుంబూర్ అభ్యర్థి నావల్పట్టు విజి.. విజయ్ మైనపు బొమ్మను (మ్యాన్విన్) ప్రచారానికి వాడారు. అలాగే సీఎం స్టాలిన్పై పోటీ చేస్తున్న కొలత్తూరు అభ్యర్థి వీఎస్ బాబు సైతం, అచ్చం విజయ్లా ఉన్న డూప్లతో ప్రచారం చేయించారు. చెన్నై ఆఫీసులో వందల కొద్దీ విజయ్ బొమ్మలు ఉన్నాయన్న వార్తలు కూడా వచ్చాయి. ఇలా డూప్లు, బొమ్మలతో మొదలైన వారి ప్రచారం.. ఇప్పుడు ఏఐ, 3డీ హోలోగ్రామ్ల స్థాయికి చేరి, రాజకీయ ప్రచార రూపురేఖలనే మార్చేస్తోంది.ఇది కూడా చదవండి: నేడు అంబేద్కర్ జయంతి: ఏవి ఓపెన్? ఏవి క్లోజ్? -
ఒక రాధ ఇద్దరు కృష్ణులు!
వివాహ వేడుక జరగాల్సిన ఆ వేదిక యుద్ధరంగంలా మారింది. ఆ అమ్మాయిని నేను చేసుకుంటానంటే నేను చేసుకుంటానంటూ ఇద్దరు పెళ్లి కొడుకులు ఊరేగింపుతో వచ్చారు. ఇరువైపులా పెద్దలు వాగ్వాదానికి దిగడంతో వధువు కుటుంబం తలలు పట్టుకుంది. గొడవ ముదిరి తన్నుకునేదాకా పోవడంతో పంచాయతీ పోలీస్ స్టేషన్కు చేరుకుంది.ఉత్తర ప్రదేశ్ అమ్రోహా జిల్లాలో ఓ వివాహ వేడుకలో విచిత్రమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఓ పెళ్లి మండపం వద్దకు ఇద్దరు వ్యక్తులు బారాత్లతో, కుటుంబ సభ్యులు.. బంధువులతో చేరుకోవడంతో గందరగోళం నెలకొంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ అవుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వధువు కుటుంబం సంభల్కు చెందిన ఓ వ్యక్తితో తమ బిడ్డకు వివాహం నిశ్చయించారు. పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్న టైంలో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. దీంతో తాము నష్టపోకూడదని భావించిన పెళ్లి కూతురు తండ్రి.. మొరాదాబాద్కు చెందిన మరో వ్యక్తితో తమ బిడ్డకు పెళ్లి ఫిక్స్ చేశారు.అయితే.. సంభల్కు చెందిన కుటుంబం పెళ్లి విషయంలో వెనకడుగు వేయలేదు. ఆమె తనకు నచ్చిందని.. తననే పెళ్లి చేసుకుంటానని యువకుడు చెప్పడంతో ఏర్పాట్లు చేసుకుని.. బారాత్తో ఊరేగింపుగా పెళ్లి మండపం వద్దకు చేరుకుంది. అదే సమయంలో మొరాదాబాద్ పెళ్లి కొడుకు కుటుంబం కూడా వేదిక వద్దకు బారాత్తో చేరుకుంది. ఇరువర్గాల లౌడ్ మ్యూజిక్, డ్యాన్సులతో పరిణామంతో అక్కడ గందరగోళం నెలకొంది. కాసేపటికి ఇరు వైపులా కొట్టుకున్నంత పని చేశారు. దీంతో వధువు కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. పరిస్థితి అర్థం చేసుకున్న పోలీసులు.. నిర్ణయాన్ని వధువుకు, ఆమె కుటుంబానికే వదిలేశారు. దీంతో మూడు కుటుంబాలు చర్చలు జరిపాయి. చివరకు సంభల్కు చెందిన యువకుడికే ఇచ్చి వివాహం జరపాలని నిర్ణయించారు. దీంతో చేసేది లేక మొరాదాబాద్ పెళ్లి కొడుకు కుటుంబం అక్కడి నుంచి వెనుదిరగ్గా.. వివాహం ఘనంగా జరిగింది. స్థానికంగా ఈ ‘డబుల్ బారాత్’ గురించి చర్చ జరగ్గా.. అది నెట్టింటకు చేరింది. -
ఓటీటీలో ఇన్వెస్టిగేటివ్ కోర్ట్రూమ్ డ్రామా సినిమా
నటి తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా 'అస్సీ' (Assi). హిందీ వర్షన్లో ఈ ఏడాది ఫిబ్రవరి 20న విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. అనుభవ్ సిన్హా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఇంటెన్సివ్ కోర్ట్రూమ్ డ్రామాను థియేటర్స్లో ప్రేక్షకులను మెప్పించింది. మహిళలపై లైంగిక వేధింపుల నేపథ్యంలో సాగే కఠినమైన సామాజిక కథాంశంతో అస్పీని తెరకెక్కించారు. ఇందులో తాప్సీ ధైర్యంతో కూడిన న్యాయవాదిగా నటించింది. మలయాళ నటి కని కుస్రుతి అత్యాచార బాధితురాలిగా కన్నీళ్లు తెప్పించే పాత్రలో కనిపించింది.'అస్సీ' (Assi) చిత్రం 2026 ఏప్రిల్ 17 నుండి ZEE5లో స్ట్రీమింగ్ కానుంది. అయితే, కేవలం హిందీ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఈ చిత్రం పితృస్వామ్యం, సామాజిక ఉదాసీనత, బాధితులను నిందించడం, లైంగిక దాడి వల్ల కలిగే దీర్ఘకాలిక మానసిక క్షోభ వంటి ఇతివృత్తాలను అన్వేషిస్తుంది. ఈ చిత్ర కథను గౌరవ్ సోలంకి, అనుభవ్ సిన్హా రచించి నిర్మించారు. -
నేడు అంబేద్కర్ జయంతి: ఏవి ఓపెన్? ఏవి క్లోజ్?
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నేడు (ఏప్రిల్ 14, 2026) దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజిటెడ్ హాలిడే ప్రకటించింది. దీనితో దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, కీలకమైన ఆర్థిక సంస్థల కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. అయితే ఈ రోజు ముఖ్యమైన పనుల కోసం బయటకు వెళ్లే ముందు, ఏ సేవలు అందుబాటులో ఉంటాయి? ఏవి మూతపడతాయో తెలుసుకోవడం అత్యంత అవసరం..విద్యాసంస్థలు, ప్రభుత్వ ఆఫీసులకు సెలవుదేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఈ రోజు మూతపడతాయి. అలాగే దాదాపు అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు సైతం సాధారణ సెలవు వర్తిస్తుంది. దీనివల్ల ప్రభుత్వ పరిపాలనా సేవలకు నేడు అంతరాయం కలగనుంది. ప్రైవేట్ ఆఫీసులు, ఐటీ కంపెనీలు మాత్రం వారి అంతర్గత నిబంధనల మేరకు పనిచేస్తాయి. అలాగే రిటైల్ దుకాణాలు, చిన్న వ్యాపారాలు యధావిధిగా కొనసాగుతాయి.బ్యాంకులు, స్టాక్ మార్కెట్లు బంద్రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం నేడు బ్యాంకులకు సెలవు. బ్రాంచ్లలో నగదు డిపాజిట్లు, చెక్ క్లియరెన్స్ వంటి సేవలు ఉండవు. కానీ మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ , ఏటీఎంలు వంటి డిజిటల్ సేవలు యధావిధిగా పనిచేస్తాయి. మరోవైపు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లలో ట్రేడింగ్ పూర్తిగా నిలిచిపోనున్నది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) ఉదయం పూట మూసివేసి, కేవలం సాయంత్రం సెషన్కు మాత్రమే తెరుచుకుంటుంది.వీటికి ఎలాంటి ఆటంకం లేదుప్రభుత్వ సేవలు, బ్యాంకులు మూతపడినప్పటికీ, సామాన్యులకు ఇబ్బంది కలగకుండా అత్యవసర సేవలైన ఆసుపత్రులు, మందుల దుకాణాలు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎప్పటిలాగే తెరచివుంటాయి. మరోవైపు ఏప్రిల్ 14న తమిళ నూతన సంవత్సరాది, బోహాగ్ బిహు వంటి పలు ప్రాంతీయ పండుగలు కూడా జరుపుకుంటుండటంతో చెన్నై, బెంగళూరు తదితర నగరాల్లో పండుగ వాతావరణం నెలకొంది. డిజిటల్ ప్లాట్ఫారమ్లు అన్నీ పనిచేస్తుండటంతో, అత్యవసర ఆర్థిక లావాదేవీలకు ఎలాంటి ఆటంకం ఉండదు.ఇది కూడా చదవండి: ‘బాలెన్’ మార్క్: ప్రధాని మోదీతో దోస్తీ.. నేపాల్ వ్యవస్థకు సర్జరీ! -
నోయిడా కార్మికుల నిరసనల్లో బిగ్ ట్విస్ట్..!
లక్నో: వేతనాలు పెంచాలంటూ నిన్న ( సోమవారం) గ్రేటర్ నోయిడా (యూపీ)లో కార్మికులు ఆందోళన చేపట్టిన హింసాత్మకంగా మారింది. అయితే నిరసనలపై యూపీ కార్మిక శాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆందోళనల వెనుక పాకిస్థాన్ హస్తం ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. ఈ అంశంపై లోతైన విచారణ చేపడుతున్నామని తెలిపారు.గ్రేటర్ నోయిడాలో కార్మికులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఫేజ్ 2 పారిశ్రామిక ప్రాంతంలో వరుసగా నాలుగో రోజు జరుగుతున్న ఈ నిరసనలు ఒక్కసారిగా హింసాత్మకంగా మారాయి. ఆగ్రహంతో రగిలిపోయిన కార్మికులు పోలీసుల వాహనాలను బోల్తా కొట్టించి, రాళ్ల దాడికి దిగడంతో ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. అదుపు తప్పుతున్న పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించారు ఆందోళనకారులు పలు కంపెనీల ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు, ఒక వాహనానికి నిప్పు పెట్టారు. ఈ ఘటనపై యూపీ మంత్రి స్పందించారు.ఆయన మాట్లాడుతూ "నోయిడాలో జరిగిన నిరసనలు రాష్ట్ర అభివృద్ధికి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఉద్దేశ్యంతోనే జరిగినట్లు కనిపిస్తోంది. కొద్దిరోజుల క్రితం, మీరట్ నోయిడాలలో నలుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వీరికి పాకిస్థాన్లోని హ్యాండ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో, రాష్ట్రంలో అస్థిరత సృష్టించేందుకు కుట్ర జరిగిందనే అవకాశాలు బలపడుతున్నాయి. ఏజెన్సీలు ఈ మొత్తం విషయంపై తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నాయి," అని రాజ్భర్ అన్నారు.కాగా నిన్న జరిగిన నిరసనలపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నిరసనల్లో హింసను సృష్టించిన దాదాపు 300 మందిని ఇప్పటివరకూ అరెస్టు చేసినట్లు తెలిపింది. మరో వందమందికి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ముజఫర్ నగర్లో ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో దానికి ఇబ్బందులు కలిగించడానికి ఈ ప్రయత్నాలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ కార్మికులందరూ సంయమనం పాటించాలని ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు ప్రభావితం కాకూడదని విజ్ఞప్తి చేశారు. -
సన్రైజర్స్ చేతిలో ఓటమి తర్వాత రియాన్ పరాగ్ వ్యాఖ్యలు
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 13) జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో 57 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ ఓటమి రాయల్స్కు ఈ సీజన్లో మొదటిది. రాయల్స్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో నాలుగింట గెలిచి, తాజా ఓటమి తర్వాత కూడా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.ఈ ఓటమి తర్వాత రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీజన్లో తొలి ఓటమి కావడంతో అతనిలో పెద్దగా సీరియస్నెస్ కనిపించలేదు. తప్పిదాలను ఒప్పుకుంటూనే ఓటమిని లైట్గా తీసుకున్నట్లు మాట్లాడాడు. సింగిల్ డిజిట్ స్కోర్కే సగం వికెట్లు కోల్పోయినా, బ్యాటింగ్ డెప్త్ అంటూ గొప్పలు పోయాడు. జడేజాకు బౌలింగ్ ఇవ్వకపోవడాన్ని, పిచ్ను అంచనా వేయలేకపోవడాన్ని సమర్దించుకునే ప్రయత్నం చేశాడు. సన్రైజర్స్ అరంగేట్రం సీమర్లను ప్రశంసించాడు.అతని మాటల్లో.. వికెట్లు త్వరగా కోల్పోవడం మేము వరుసగా వికెట్లు కోల్పోయాం. వారు బాగా బౌలింగ్ చేశారు. కొన్ని లెక్కలు తప్పాయి. దీన్ని ఒక చిన్న మినహాయింపుగా తీసుకుంటాం. ఎక్కువగా ఆలోచించం. 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినా 159 పరుగులు చేయడం మా బ్యాటింగ్ లోతుకు నిదర్శనం.పిచ్ పరిస్థితులు కొత్త బంతి కాస్త స్టికిగా అనిపించింది. షైనింగ్ తగ్గాక స్లో అయ్యింది. ఓ రకంగా ఆలోచిస్తే, మొదట బ్యాటింగ్ చేయడం మంచిదై ఉండేది. ఏదిఏమైనా మేమే ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. కొత్త సీమర్లపై ప్రశంస సన్రైజర్స్ తరఫున అరంగేట్రం చేసిన సీమర్లు ఫ్రఫుల్ హింజ్, సకిబ్ హుస్సేన్కు నా అభినందనలు. వారు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ప్రేక్షకుల ఒత్తిడి ఉన్నప్పటికీ, మొదటి నాలుగు–ఐదు ఓవర్లలో చాలా బాగా బౌలింగ్ చేశారు. నేను వారిని ఎక్కువగా చూడలేదు. కానీ ఈ ప్రదర్శన అద్భుతం. జడేజాకు బౌలింగ్ ఇవ్వకపోవడం అప్పటికి ఇషాన్ బాగా ఆడుతున్నాడు. జడ్డూ భాయ్కి బౌలింగ్ ఇవ్వకపోవడానికి కారణాలు లేవు. బిష్ణోయిని నమ్మాను. వారు మేము అనుకున్న దానికంటే 30 పరుగులు ఎక్కువ చేశారు. ఈ ఓటమిని ఇక్కడితో వదిలిపెట్టి, తదుపరి మ్యాచ్లో మంచి ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధమవుతాం. మొత్తంగా రియాన్ మాటలను బట్టి చూస్తే.. ఈ ఓటమిని లైట్గా తీసుకున్నట్లు స్పష్టమవుతుంది. -
ఐఏఎస్ రోహిణికి సుప్రీంకోర్టులో ఊరట
బనశంకరి: మైసూరు కలెక్టర్గా ఉన్న కాలంలో బట్ట బ్యాగుల కొనుగోలులో అక్రమాలు జరిగాయనే కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరికి సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. ఆమెపై నమోదైన కేసులో విచారణకు అనుమతివ్వాలని రాష్ట్ర హైకోర్టు ఇటీవల ప్రభుత్వాన్ని ఆదేశించడం తెలిసిందే. హైకోర్టు ఆదేశాలను ప్రశి్నస్తూ రోహిణి సింధూరి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు ఆదేశాలపై స్టే జారీ చేసింది. -
42 ఏళ్ల వివాహితతో సంబంధం.. బాడీబిల్డర్ ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: బెంగళూరులో జిమ్ ట్రైనర్లు మహిళలను మోసం చేయడమో, లేదా వారి చేతిలో మోసపోయి ఆత్మహత్య చేసుకోవడమో పెరిగిపోయింది. ఇటీవలే ఓ యువతి ప్రేమించి, చివరకు తిరస్కరించడంతో ఓ జిమ్ శిక్షకుడు ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ఇంతలోనే హనీట్రాప్లో చిక్కుకున్న బాడీ బిల్డర్ మహిళ బెదిరింపులకు భయపడి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాద ఘటన నెలమంగల తాలూకా వాజరహళ్లిలో వెలుగుచూసింది. జిమ్ ట్రైనర్ దిలీప్ (28)కు, రోజూ జిమ్కు వస్తున్న వివాహిత (42)తో పరిచయమైంది. అతడు బాడీబిల్డర్గా రాష్ట్రంలో ఎన్నో పోటీల్లో రాణించాడు. ఇద్దరూ సన్నిహితంగా మెలిగేవారు, తరువాత ఆమె డబ్బు, అతని ఆస్తులు కావాలని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించిందని దిలీప్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆదివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ముందు దిలీప్ ఆమెకు కాల్ చేసి చెప్పాడు. దీంతో ఆమె అతని తమ్మునికి ఇన్స్టాలో మెసేజ్ చేసింది. కానీ అంతలోనే దిలీప్ ప్రాణాలు పోయాయి. నెలమంగల టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మోసగత్తెను కఠినంగా శిక్షించాలని దిలీప్ కుటుంబీకులు డిమాండ్ చేశారు. -
హర్ముజ్ బ్లాకేడ్తో భారత్పై తీవ్ర ప్రభావం!
హర్ముజ్ జలసంధిని అమెరికా సైన్యం దిగ్బంధించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. సౌదీ అరేబియా సహా పలు దేశాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు రిక్వెస్ట్లు చేస్తున్నాయి. చైనా సహా ఇంకొన్ని దేశాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి. అదే సమయంలో.. ఈ బ్లాకేడ్ ప్రభావంతో ప్రపంచ ఇంధన మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఈ పరిణామం భారత్పై కూడా తీవ్ర ప్రభావం చూపే చాన్స్ కనిపిస్తోంది.గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధర ప్రస్తుతం 99 డాలర్ల వద్ద ఉంది. హర్ముజ్ బ్లాకేడ్ కొనసాగితే అది 150 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్ గల్ఫ్ దేశాలపై అధికంగా ఆధారపడుతుంది. చమురు ధరలు పెరగడం వల్ల దిగుమతి బిల్లులు పెరగడం, ద్రవ్యోల్బణం పెరగడం, వాణిజ్య లోటు పెరిగే అవకాశం లేకపోలేదు. పైగా జలసంధి ద్వారా రోజుకు 12 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు సరఫరా జరుగుతుంది. ఈ మార్గం మూసుకుపోతే భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తీవ్ర తరం కావొచ్చు. అలాగే పెరిగిన ఇంధన ధరలు నేరుగా రవాణా, విద్యుత్, ఆహార ధరలపై ప్రభావం చూపెట్టొచ్చు. హర్ముజ్ బ్లాకేడ్పై భారత్ ఇంకా స్పందించాల్సి ఉంది.అదంతా ఉత్త ప్రచారమే!భారత నౌకలకు హర్ముజ్ జలసంధి మార్గాన్ని ఇరాన్ మూసేసిందని ఒక ప్రచారం నడుస్తోంది. అయితే అది ఉత్తదేనని ఇరాన్ అంటోంది. న్యూఢిల్లీలో ఇరాన్ రాయబారి మొహమ్మద్ ఫతాలి ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘భారతదేశం మా స్నేహపూర్వక దేశం. హర్ముజ్ మార్గం భారత నౌకలకు తెరిచే ఉంటుంది. అమెరికా ఈ బ్లాకేడ్తో తప్పు లెక్కలు వేసింది. ఈ చర్య అంతర్జాతీయ చట్టాలను ధ్వంసం చేస్తుందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుంది’’ అని హెచ్చరించారు.మొత్తంగా, హోర్ముజ్ బ్లాకేడ్ భారత్కు ఇంధన భద్రతా సంక్షోభం తెచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. ఇరాన్ ఇచ్చిన హామీ కొంత ఉపశమనం కలిగిస్తోంది. కానీ ధరల పెరుగుదల, సరఫరా అంతరాయం వంటి సమస్యలు భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాలుగా మారే అవకాశం లేకపోలేదు. -
‘బాలెన్’ మార్క్: ప్రధాని మోదీతో దోస్తీ.. నేపాల్ వ్యవస్థకు సర్జరీ!
ఖాట్మాండు: ఒకవైపు స్వదేశంలో పరిపాలనా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ.. మరోవైపు పొరుగు దేశాలతో దౌత్య సంబంధాలకు పదును పెడుతూ నేపాల్ ప్రధాని బాలేంద్ర ‘బాలెన్’ షా సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతున్నారు. అత్యంత సాహసోపేతమైన ‘100 అంశాల ఎజెండా’ను ప్రకటించి దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఆయన, అదే సమయంలో భారత్లో తన తొలి అధికారిక పర్యటనకు సిద్ధమవుతూ, ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నారు.భారత్తో సరికొత్త బంధంప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ప్రత్యేక ఆహ్వానం మేరకు నేపాల్ ప్రధాని బాలెన్ షా త్వరలో భారత్లో పర్యటించనున్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన చేపడుతున్న తొలి అతిపెద్ద దౌత్యపరమైన అడుగు ఇదే కావడం గమనార్హం. ఇరు దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖలు ఈ పర్యటనకు సంబంధించిన సన్నాహాలు చేస్తున్నాయి. వాణిజ్యం వృద్ధి, కనెక్టివిటీ పెంపు, ప్రాంతీయ సహకారం తదితర కీలక అంశాలపై ఈ పర్యటనలో ప్రధానంగా చర్చలు జరగనున్నాయి.వీఐపీ కల్చర్కు బ్రేక్దౌత్య సంబంధాలను బలపరుస్తూనే, స్వదేశంలో బాలెన్ షా సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. నేపాల్ పరిపాలన, సామాజిక ముఖచిత్రాన్ని మార్చేసే దిశగా ‘100 అంశాల ఎజెండా’ను ప్రకటించారు. ముఖ్యంగా దశాబ్దాలుగా పాతుకుపోయిన వీఐపీ సంస్కృతిని నిర్మూలించడం, సంస్థల్లో రాజకీయ జోక్యాన్ని పూర్తిగా తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. పరిపాలనలో జాప్యాన్ని నివారించి, వేగం పెంచేందుకు కేంద్ర మంత్రిత్వ శాఖల సంఖ్యను తగ్గించడంతో పాటు, ప్రభుత్వ యంత్రాంగంలో రాజకీయ అనుబంధాలను నిషేధించేలా కఠిన చర్యలకు శ్రీకారం చుట్టారు.విద్యాసంస్థల్లో పాలిటిక్స్ బ్యాన్విద్యాసంస్థల్లో రాజకీయాలను పారద్రోలేలా బాలెన్ సర్కార్ కఠిన నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లోని పార్టీ అనుబంధ విద్యార్థి సంఘాలను 90 రోజుల్లోగా పూర్తిగా రద్దు చేసి, వాటి స్థానంలో స్వతంత్ర ప్రాతినిధ్యం కల్పించేలా ‘వాయిస్ ఆఫ్ స్టూడెంట్స్’ కౌన్సిల్లను ఏర్పాటు చేయనున్నారు. ఇకపై బడులు, కాలేజీలు కేవలం అభ్యాస కేంద్రాలుగానే పనిచేస్తాయని ప్రధాని స్పష్టం చేశారు. వీటితో పాటు, నిరుపేదలకు ఉచిత వైద్యం, మహిళలకు రవాణా భద్రత, ఒత్తిడి లేని విద్యా వాతావరణం, ప్రభుత్వ సేవలను వేగవంతంగా అందించడం వంటి ప్రజా సంక్షేమ చర్యలను ఈ బ్లూప్రింట్లో ప్రధాన అంశాలుగా చేర్చారు.ఇది కూడా చదవండి: బెంగాల్ ఎన్నికలు: అభిషేక్ బెనర్జీ సరికొత్త ప్రకంపనలు -
బతికే భాగ్యమున్నా.. నమ్మిన సిద్ధాంతం కోసం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/సాక్షి, సిద్దిపేట/ మిరుదొడ్డి: రాష్ట్రం నుంచి అజ్ఞాతంలో ఉన్న చివరి మహిళా మావోయిస్టు రంగనబోయిన భాగ్య అలియాస్ రూపీ చివరకు ప్రాణాలు కోల్పోయింది. ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఎన్కౌంటర్లో ఆమె చనిపోయింది. అబూజ్మాడ్ అడవిలోని చోటేబెటియా–పర్తాపూర్ పోలీస్స్టేషన్ ఏరియా పరిధి మచ్పల్లి దగ్గర మావోయిస్టు కమాండర్ రూపీ నేతృత్వాన దళం సంచరిస్తోందనే సమాచారంతో ఆదివారం రాత్రి నుంచి భద్రతా దళాలు కూంబింగ్ చేపట్టాయి. సోమవారం చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో రూపీ మరణించినట్టు కాంకేర్ ఎస్పీ నిఖిల్ రఖేచా వెల్లడించారు. ఘటనాస్థలి నుంచి ఒక తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. మరో 12మంది మావోయిస్టులు ఘటనాస్థలం నుంచి తప్పించుకున్నట్టు సమాచారం. దీంతో మచ్పల్లి అడవుల్లో కూంబింగ్ కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు.చివరి వరకు అక్కడే...ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా, లొంగిపొమ్మని ఎందరు చెప్పినా నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు పోరాడుతానని చెప్పిన రూపీ అలాగే కొనసాగింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీ లక్ష్యంగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ ప్రభావంతో దండకారణ్యంలో మావోయిస్టులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. నలువైపులా ఒత్తిడి పెరగడం, కనీసం తినడానికి తిండి, తాగడానికి నీరు కూడా దళ సభ్యులకు లభించని గడ్డు పరిస్థితులు ఉన్నాయి. రహస్య శిబిరం నుంచి కాలు బయటపెడితే ఎన్కౌంటర్ కావడం తథ్యమనే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆ పార్టీకి చెందిన కేంద్ర కమిటీ సభ్యులు సైతం లొంగుబాట పట్టారు. ఈ క్రమంలోనే రూపీని సైతం లొంగిపోవాలని కోరుతూ కాంకేర్ ఎస్పీ రెండుసార్లు పత్రికా ప్రకటన విడుదల చేశారు. లొంగుబాటుకు మార్గం సుగమం చేస్తామని అక్కడి విలేకరులు సైతం ఆమెకు మూడుసార్లు లేఖలు పంపించారు. అయితే, ఈ ప్రతిపాదనలను ఆమె తిరస్కరించినట్టు స్థానిక మీడియా ద్వారా తెలిసింది. ఆఖరి వరకు ఉద్యమంలోనే ఉంటానంటూ మధ్యవర్తుల ద్వారా సమాధానం పంపినట్టు తెలిపారు. అన్నట్టుగానే చివరకు రూపీ ఎన్కౌంటర్లోనే ప్రాణాలు కోల్పోయారు. శారీరక దివ్యాంగురాలైన రూపీ పట్టుదలతో రెండు దశాబ్దాలకు పైగా అజ్ఞాత జీవితం గడిపింది. కగార్ నిర్బంధం మధ్య, కేంద్రం విధించిన గడువు దాటే వరకు భద్రతా దళాల కంట పడకుండా ఆమె రహస్య జీవితం గడపడం విశేషం.2002లో అజ్ఞాతంలోకి...సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన రంగనబోయిన ఎల్లవ్వ–నర్సయ్య దంపతులకు పెద్ద కూతురైన భాగ్య 2002లో మావోయిస్టుల కార్యకలాపాలకు ఆకర్షితురాలై అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి స్వగ్రామానికి తిరిగి రాలేదు. తొమ్మిదేళ్ల క్రితం తండ్రి నర్సయ్య చనిపోయినా, కడసారి చూపు కోసం భాగ్య రాలేదు. ఎన్కౌంటర్లో భాగ్య మృతి చెందినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందటంతో ధర్మారం శోకసముద్రంలో మునిగిపోయింది. భాగ్య మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు గ్రామ సర్పంచ్ చెప్యాల శ్రీనివాస్ నేతృత్వంలో గ్రామస్తులు బయలుదేరి వెళ్లారు.శవమై వస్తున్నవా బిడ్డా....‘లొంగిపోయి ప్రాణాలతో వస్తావనుకున్న బిడ్డా.. చివరకు మాకు దు:ఖాన్ని మిగిల్చి శవమై వస్తున్నవా బిడ్డా..వృద్ధాప్యంలో నేనే చనిపోతే నువ్వు వస్తవో రావో అనుకున్నా బిడ్డా.. ఇప్పుడు నీ శవాన్ని చూసి ఎలా తట్టుకోవాలి బిడ్డా... మీ అయ్య సచ్చినా నువ్వు రాలేదు బిడ్డా’అంటూ... మావోయిస్టు భాగ్య అలియాస్ రూపీ తల్లి ఎల్లవ్వ రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఎన్కౌంటర్లో అక్క మృతి చెందిన విషయం తెలిసి భాగ్య చెల్లెళ్లు కవిత, మమత, తమ్ముడు కుమార్లు బోరున విలపించారు. -
అమ్మా లే.. నాన్నా లే!
తాండూరు రూరల్: వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసు కొచ్చిన లారీ స్కూటీని ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తాండూరు రూరల్ సీఐ ప్రవీణ్కుమా ర్రెడ్డి, బంధువుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణం శాంతినగర్కు చెందిన జాళ్ల కవికుమార్ (40), పావని (35) దంపతులు. వారికి కార్తీక్, కీర్తన (9) పిల్లలు ఉన్నారు. మే ఒకటి న పావని సోదరుడు రాజ్కుమార్కు పెళ్లి నిశ్చయ మైంది. దీంతో సంప్రదాయం ప్రకారం ఆడపడుచు పుట్టింటి గడపకు పసుపు పూసి బొట్టు పెట్టి పూజలు చేయాలి. అందుకోసం పావని భర్త, పిల్లలతో కలిసి స్కూటీపై ఆదివారం మధ్యాహ్నం జిల్లాలోని పెద్దే ముల్ మండలం రుక్మాపూర్కు వచ్చింది. పుట్టింట్లో కార్యక్రమం ముగించుకొని సోమవారం ఉదయం 5:15 గంటలకు జహీరాబాద్కు తిరిగి స్కూటీపై కుటుంబమంతా బయలుదేరింది. పెద్దేముల్ మండలం తట్టేపల్లి వద్దకు రాగానే జహీరాబాద్ నుంచి వస్తున్న లారీ వీరి స్కూటీని ఢీకొట్టింది. దీంతో కవికుమార్, పావని లారీ చక్రాల కింద నలిగి అక్కడికక్కడే మృతిచెందగా కీర్తన రోడ్డుపై పడటంతో మృతిచెందింది. కార్తీక్ మాత్రం ఈ ప్రమాదం నుంచి గాయాలతో బయటపడ్డాడు. కళ్ల ముందే తల్లిదండ్రులు, చెల్లెలు మృతిచెందడంతో కార్తీక్ వారి మృతదేహాల వద్ద విలపిస్తూ అమ్మానాన్న లను లేవాలంటూ బతిమిలా డటం చూపరు లను కంటతడి పెట్టించింది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ మహమ్మద్ షరీఫ్ పెద్దేముల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోగా అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య తెలిపారు. బాలుడిని హైదరాబాద్కు తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. -
ఇరాన్-అమెరికా మళ్లీ చర్చలుంటాయా?
ఇటీవల పాకిస్థాన్లో జరిగిన అమెరికా- ఇరాన్ చర్చలు విఫలమైన నేపథ్యంలో మరో కీలక ముందడుగు పడే అవకాశముంది. జెనీవా వేదికగా త్వరలో రెండో విడత చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇది వరకే ఈ అంశమై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మరో విడత చర్చలకు అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధంలో సీజ్ ఫైర్ ఒప్పందం నడుస్తోంది. అయితే హర్ముజ్ను దిగ్భందించింది. దీంతో అమెరికా ఇరాన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్ పోర్టుల వైపు వెళ్లకుండా అమెరికా నౌకలును అడ్డగిస్తూ బ్లాక్డేను ప్రారంభించింది. అయితే దీనిపై ఇరాన్ సైతం గుర్రుగానే ఉంది. ఈ నేపథ్యంలో యుద్ధంపై అమెరికా ఉపాధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు.జేడీవాన్స్ మాట్లాడుతూ" ఇరాన్తో చర్చలకు ఇంకా ఆస్కారం ఉంది. యుద్ధం ఆగడం మా చేతుల్లో లేదు. బంతి ఇంకా ఇరాన్ కోర్టులోనే ఉంది. ఇరాన్ దిగిరావాలి. ఇంకా సరళమైన ధోరణి ప్రదర్శించాలి". అని అన్నారు. జలసంధిలో ఇరాన్ నౌకలను అడ్డుకోవడం ఆర్థిక ఉగ్రవాదమేనని పేర్కొన్నారు. ఒకవేళ ఇరాన్ కనుక అలా చేస్తే వారి నౌకలను బయిటకి వెళ్లకుండా చేస్తామని హర్ముజ్ వద్ద ఇరాన్ చర్యలను అడ్డుకుంటాం" అన్నారు. హర్ముజ్ విషయంలో ట్రంప్ నాయకత్వంలో అమెరికా తగిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. కాగా అమెరికా మీడియా కథనాల ప్రకారం ట్రంప్ సైతం చర్చలకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. సీజ్ఫైర్ ఒప్పందం ముగిసే లోగా మరోదశ చర్చలు జరపాలని భావిస్తోన్నట్లు సమాచారం. కొన్ని అంతర్జాతీయ కథనాల ప్రకారం ఈ నెల 16 (గురువారం) నాడు ఇరు దేశాల భేటీ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇరాన్ ఇంతవరకూ స్పందించలేదు. -
ఘోర ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన రాజస్థాన్ రాయల్స్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 13) జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ప్రఫుల్ హింజ్ (4-0-34-4), సకిబ్ హెస్సేన్ (4-0-24-4) అనే ఇద్దరు అరంగేట్రం పేసర్లు రాయల్స్ జైత్రయాత్రను బ్రేక్ చేసి సన్రైజర్స్కు అద్భుత విజయాన్నందించారు. ఈ క్రమంలో హింజ్ ఓ చారిత్రక రికార్డు నమోదు చేశాడు. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో తొలి ఓవర్లోనే 3 వికెట్లు తీసిన తొలి బౌలర్గా రికార్డు నెలకొల్పాడు.హింజ్ ధాటికి రాజస్థాన్ రాయల్స్ తొలి ఓవర్లోనే మూడు వికెట్లు కోల్పోయింది. అతనికి సకిబ్ కూడా జత కావడంతో రాయల్స్ 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి చారిత్రక పతనం దిశగా సాగింది. అయితే రవీంద్ర జడేజా (45), డొనొవన్ ఫెరియెరా (69) అనూహ్యంగా ప్రతిఘటించి ఆ పతనాన్ని వాయిదా వేశారు. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ ఓ చారిత్రక రికార్డు నెలకొల్పింది.ఐపీఎల్ చరిత్రలో మొదటి 5 వికెట్లు 20 పరుగుల లోపే కోల్పోయిన తర్వాత కూడా జట్టు స్కోర్ 150 పరుగుల మార్క్ను దాటిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. సన్రైజర్స్ నిర్దేశించిన 217 పరుగుల లక్ష్య ఛేదనలో జడేజా, ఫెరియెరా ప్రతిఘటించడంతో రాయల్స్ 159 పరుగులకు ఆలౌటై, 57 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ లెక్కన రాయల్స్ ఓటమిలోనూ చరిత్ర సృష్టించింది.ఈ సీజన్లో రాయల్స్కు ఇదే తొలి ఓటమి. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆ జట్టుకు సన్రైజర్స్ తమ సొంతగడ్డపై బ్రేకులు వేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్.. ఇషాన్ కిషన్ (91) శివాలెత్తడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. క్లాసెస్ (40) ఓ మోస్తరుగా రాణించగా.. ఆఖర్లో సలీల్ అరోరా (24 నాటౌట్), నితీశ్ కుమార్ రెడ్డి (28) బ్యాట్ ఝులిపించారు.అనంతరం లక్ష్య ఛేదనలో హింజ్, సకిబ్ ధాటికి విలవిలలాడిపోయిన రాజస్థాన్ రాయల్స్ అతికష్టం మీద 19 ఓవర్లలో 159 పరుగులు చేసి ఆలౌటైంది. హింజ్, సకిబ్కు ఎషాన్ మలింగ (4-0-31-2) కూడా సహకరించాడు. రాయల్స్ తరఫున ఆఖర్లో తుషార్ దేశ్పాండే (25) సైతం బ్యాట్ ఝులిపించాడు. అయితే అప్పటికే రాయల్స్ ఓటమి ఖరారైపోయింది. -
సింగర్ మంగ్లీ కేసులో హైడ్రామా
హైదరాబాద్: సింగర్ మంగ్లీ కేసులో పంజగుట్ట పోలీస్స్టేషన్లో సోమవారం హైడ్రామా చోటు చేసుకుంది. న్యాయవాది సుబ్బారావు అలియాస్ సుబ్బు సోమవారం పంజగుట్ట పోలీస్స్టేషన్కు భాధితులతో కలిసి ఆధారాలు సమర్పించేందుకు రాగా అతని నుంచి ఆల్కహాల్ వాసన వస్తుందని పోలీసులు ఆల్కహాల్ టెస్ట్ నిర్వహించారు. సుబ్బుకు 27 రీడింగ్ రావడంతో డ్రైవింగ్ చేసేందుకు అనుకూలమే కాని మద్యం తాగి వచ్చారని పోలీసులు పేర్కొన్నారు. దీంతో పోలీసులకు, న్యాయవాదికి మధ్యలో వాగ్వాదం చేటుచేసుకుంది. ఆర్థిక లావాదేవీలపై తనకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పంజగుట్ట ఇన్స్పెక్టర్ రామకృష్ణ పేర్కొన్నారు. గత వారం మధు అనే వ్యక్తి, సింగర్ మంగ్లీ తమ్ముడు తనను బెదిరించారని న్యాయవాది సుబ్బారావు ఫిర్యాదు చేశారని అయితే ఆధారాలు సమరి్పంచాలని కోరినా ఆయన స్పందించలేదన్నారు. అయితే సత్యవతి అలియాస్ మంగ్లీ తనను బెదిరిస్తున్నారని, డబ్బులు డిమాండ్ చేశారని ఆదివారం ఫిర్యాదు చేశారని.. దీనిపై లీగల్ ఒపీనియన్ తీసుకుని కేసు నమోదు చేస్తామని తెలిపారు. -
గ్యాస్ కొరత తీవ్రం.. కొత్త కనెక్షన్ల జారీ నిలిపివేత!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ పరిణామాలు సామాన్యుల వంటగదిలో అగ్గి రాజేస్తున్నాయి. ఎల్పీజీ దిగుమతుల్లో నెలకొన్న అనిశ్చితి నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరోవైపు గ్యాస్ కొరత, రీఫిల్ బుకింగ్ గడువు పెంపు ప్రభావం కొత్త కనెక్షన్ల డిమాండ్ను ఒక్కసారిగా పెంచేసింది. అయితే చమురు సంస్థలు డొమెస్టిక్ కనెక్షన్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని కొత్త కనెక్షన్ల జారీపై అప్రకటిత నిషేధాన్ని విధించాయి. ఎల్పీజీ దిగుమతుల్లో సుమారు 90 శాతం హర్మూజ్ జలసంధి మార్గం ద్వారానే రావాలి. కానీ, ప్రస్తుత యుద్ధ ఉద్రిక్తతల వల్ల ఆ మార్గంలో నౌకల రాకపోకలు స్తంభించాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 10,611 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నప్పటికీ, వాటిని కేవలం పాత వినియోగదారులకు ప్రాధాన్యం ఇచ్చి సర్దుబాటు చేయాలని చమురు సంస్థలు నిర్ణయించాయి. కొత్త కనెక్షన్లు ఇవ్వడం వల్ల డిమాండ్ మరింత పెరిగి నిల్వలు సరిపోక సిస్టమ్ ‘కొలాప్స్’అయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నాయి. కొత్త కనెక్షన్ల అప్లికేషన్ల ప్రక్రియను ఏజెన్సీలస్థాయిలో నిలిపేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి కుటుంబాల్లో ‘గ్యాస్’గుబులు గతంలో సిలిండర్ బుక్ చేసిన 15 రోజులకు మరో బుకింగ్కు వెసులుబాటు ఉండగా, ప్రస్తుతం అర్బన్లో 25 రోజులకు, రూరల్ ప్రాంతాల్లో 45 రోజులకు పెరిగింది. బుక్ చేసిన తర్వాత డెలివరీకి మరో 10 నుంచి 15 రోజులు పడుతోంది. ఉమ్మడి కుటుంబాల్లో ఒక్క కనెక్షన్ సరిపోని పరిస్థితి నెలకొంది. దీంతో ఇంట్లోని ఇతర సభ్యుల పేర్ల మీద కొత్త కనెక్షన్ల కోసం దరఖాస్తులు చేస్తున్నారు. కొత్తగా విడిపోయిన చిన్న కుటుంబాలు, విద్యార్థులు, వలస కారి్మకుల నుంచి కూడా దరఖాస్తుల తాకిడి సాధారణం కంటే మూడు రెట్లు పెరగడం కొత్త కనెక్షన్ల నిలుపుదలకు ప్రధాన కారణమైంది. సాధారణంగా రాష్ట్రవ్యాప్తంగా నెలకు 40 వేల దరఖాస్తులు వస్తుండగా, ప్రస్తుతం కేవలం పది రోజుల్లోనే ఆ సంఖ్య దాటిపోయినట్లు తెలుస్తోంది.డబుల్ సిలిండర్ కోసం క్యూ సింగిల్ సిలిండర్ ఉన్న వినియోగదారులు ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సిలిండర్ ఖాళీ అయితే నెలరోజుల వరకు కొత్తది వచ్చే పరిస్థితి లేకపోవడంతో రెండో సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇవి సాధారణంగా వచ్చే దరఖాస్తులు కంటే ఐదింతలు దాటాయి. అయితే, నిల్వల కొరత సాకుతో వీటిని కూడా ఏజెన్సీలు పెండింగ్లో పెడుతున్నాయి. -
బెంగాల్ ఎన్నికలు: అభిషేక్ బెనర్జీ సరికొత్త ప్రకంపనలు
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రచారంలో కేంద్ర బిందువుగా మారిన యువ నేత, కీలక వ్యూహకర్త అభిషేక్ బెనర్జీ సరికొత్త రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. పదునైన విమర్శలు, ప్రతిపక్షాలపై సూటి ప్రశ్నలు, క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటనలతో ఆయన తన ప్రచార శైలికి మరింత పదునుపెట్టారు. ఒకవైపు ప్రతిపక్షాల వ్యూహాలను ఎండగడుతూనే, పార్టీ మూలాలను బలోపేతం చేసే దిశగా ఆయన వేస్తున్న అడుగులు బెంగాల్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.ఈసీ తీరుపై సంచలన ఆరోపణలువరుస ప్రజా సభలు, సమావేశాల్లో పాల్గొంటున్న అభిషేక్ బెనర్జీ.. ఎన్నికల నిర్వహణ, రాజ్యాంగ సంస్థల తటస్థతపై తీవ్రస్థాయిలో ప్రశ్నలు సంధించారు. ఎన్నికల సంఘం (ఈసీ) తీరు పక్షపాతంగా మారిందని, ఎన్నికల ప్రక్రియలో అందరికీ సమాన అవకాశాలు లేకుండా పోయాయని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. వ్యవస్థాగత లోపాలను ఎత్తిచూపుతూనే, టీఎంసీ శ్రేణుల్లో విశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్షాలు, ఇతర సంస్థలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, 2021 అసెంబ్లీ ఎన్నికల కంటే ఈసారి తృణమూల్ కాంగ్రెస్ మరింత భారీ మెజారిటీతో విజయం సాధించి తీరుతుందని అభిషేక్ బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు.‘ప్రతిపక్షాలది అపవిత్ర కలయిక’రెజీనగర్లో జరిగిన ఓ భారీ బహిరంగ సభలో ప్రతిపక్షాలపై అభిషేక్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ, ఏజేయూపీ, ఐఎస్ఎఫ్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కేవలం అవకాశవాదంతో ఏకమయ్యాయని, అదొక అపవిత్ర కలయిక అని ఆయన అభివర్ణించారు. వివిధ పార్టీలకు చెందిన కుళ్టిన మూలకాలను కలపడం వల్ల రాష్ట్రంలో కేవలం అస్థిరత మాత్రమే ఏర్పడుతుందని, ఆ కూటమికి ఎలాంటి సైద్ధాంతిక నిబద్ధత లేదని విమర్శించారు. ఇదే క్రమంలో, ఏజేయూపీ నేత హుమాయున్ కబీర్కు సంబంధించిన వివాదాస్పద వైరల్ వీడియో వ్యవహారాన్ని కూడా ప్రస్తావించారు. పలు పార్టీల సీనియర్ నేతలు, కేంద్ర సంస్థల ప్రమేయంతో భారీ స్థాయిలో రాజకీయ డీల్ జరిగినట్లు ఆ వీడియో స్పష్టం చేస్తోందని ఆరోపించి బెంగాల్ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించారు.క్షేత్రస్థాయి వ్యూహాలు.. భవిష్యత్ నాయకత్వంకేవలం మాటలకే పరిమితం కాకుండా, అభిషేక్ బెనర్జీ జిల్లాల స్థాయిలో విస్తృత పర్యటనలు చేస్తూ క్షేత్రస్థాయి కార్యకర్తలతో నేరుగా మమేకమవుతున్నారు. పౌరసత్వం తదితర కీలక అంశాలపై మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలో ‘జాతీయ పౌర పట్టిక’(ఎన్ఆర్సీ) అమలును బెంగాల్ ఎంత కఠినంగా వ్యతిరేకించిందో ఆయన ప్రజలకు గుర్తుచేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ అత్యధిక సీట్లు గెలుస్తుందని పదేపదే చెప్పడం ద్వారా క్యాడర్లో నూతనోత్సాహాన్ని నింపుతున్నారు.‘దీదీ’ శిష్యరికంలో రాటుదేలి..పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీతో ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి ఉన్న బంధం కేవలం కుటుంబపరమైనది మాత్రమే కాదు. టీఎంసీలో తిరుగులేని అగ్ర నాయకురాలిగా మమతా బెనర్జీ కొనసాగుతుండగా, ఆమె మార్గదర్శకత్వంలో ఎదిగిన అభిషేక్ ప్రస్తుతం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ప్రధాన వ్యూహకర్తగా, అప్రకటిత ‘నెంబర్ 2’గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. యువతను ఏకం చేస్తూ, ఆధునిక సాంకేతిక ప్రచార వ్యూహాలతో సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేస్తున్నారు.ఇది కూడా చదవండి: బెంగాల్ బరిలో నలుగురు రిపోర్టర్లు -
‘దమ్ముంటే పట్టుకోరా’.. ఓఆర్ఆర్పై జంటల బైక్ స్టంట్స్
మణికొండ: ఔటర్రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)పై రెండు జంటలు ద్విచక్ర వాహనాలపై హల్చల్ చేశాయి. ఓఆర్ఆర్ నిర్వహణ సంస్థ నిర్వాహకులకు, ట్రాఫిక్, శాంతిభద్రతల పోలీసులకు సవాల్ విసిరాయి. వాస్తవానికి ఓఆర్ఆర్పై ద్విచక్ర వాహనాలకు అనుమతి ఉండదు. కానీ, నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలోని పోలీస్ అకాడమీ వైపు నుంచి పుప్పాలగూడ(నానక్రాంగూడ) టోల్గేట్ వైపు రెండు ద్విచక్ర వాహనాలపై రెండు జంటలు సోమవారం రాత్రి ప్రయాణిస్తుండగా అటుగా వెళుతున్న వారు వీడియో తీసి ‘ఎక్స్’లో పోస్ట్ చేయటంతో అది వైరల్ అయింది. దానికి అనేకమంది అనేక రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్’అనే కామెంట్కు అత్యధిక లైక్లు వచ్చాయి. దాంతో ఓఆర్ఆర్ నిర్వహణ సంస్థతోపాటు నార్సింగి ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. వీడియో ఆధారంగా రెండు వాహనాల నెంబర్లను గుర్తించి చర్యలకు ఉపక్రమించారు. అక్కడున్న టోల్గేట్ సిబ్బంది ఎందుకు ఆపలేదనే విషయాన్ని వ్యవస్థలు పరిశీలిస్తున్నాయి. వాహదారులతోపాటు టోల్ గేట్ సిబ్బందిపైనా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. View this post on Instagram A post shared by SuryaChandraTimes (@suryachandratimes) -
హర్ముజ్ బ్లాకేడ్.. అమెరికాకు చైనా తీవ్ర హెచ్చరికలు
ఇరాన్ పోర్టులకు నౌకలు చేరకుండా హర్ముజ్ జలసంధిని అమెరికా దిగ్బంధించింది. సముద్రంలో భారీ నౌకలను మోహరించి పహారా కాస్తోంది. ఒకవైపు అమెరికా సైన్యం.. మరోవైపు ఇరాన్ సైన్యం మోహరింపుతో ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ నెలకొన్నాయి. అయితే ఈ పరిణామం మరోవైపు అమెరికా-చైనాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది. జలసంధిపై అమెరికా నేవీ బ్లాకేడ్ ప్రారంభించడంతో చైనా తీవ్రంగా స్పందించింది. ఇరాన్తో తప్ప ఒప్పందాలను అడ్డుకోవడం ఏమాత్రం సరికాదని వ్యాఖ్యానించింది. చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్ మీడియా ద్వారా మాట్లాడుతూ.. ‘‘మాకు ఇరాన్తో వాణిజ్య, ఇంధన ఒప్పందాలు ఉన్నాయి. మా వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకోవద్దని మేము ఆశిస్తున్నాం. ఇది ఇలాగే కొనసాగితే పరిణామాలు మరోలా ఉంటాయి’’ అని హెచ్చరించారు. అయితే అమెరికా చర్యను వ్యతిరేకించిన ఆయన.. హర్ముజ్ చైనాకు తెరిచే ఉంటుందని ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం బ్లాకేడ్ ప్రకటన చేశారు. ఇరాన్ పోర్టులకు వచ్చే–వెళ్లే అన్ని నౌకలను అమెరికా సెంట్కామ్ తనిఖీ చేస్తుందని.. అనుమతి లేకుండా ప్రవేశించే నౌకలను అడ్డుకోవడం, దారి మళ్లించడం, స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం నుంచే హర్ముజ్ దిగ్బంధనం ప్రారంభమైంది. అయితే ఈ బ్లాకేడ్ చైనీస్ యువాన్(కరెన్సీ) వినియోగాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా కూడా ఉండి ఉండొచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హర్ముజ్ జలసంధి ద్వారా చైనాకు 40 శాతం చమురు, 30 శాతం ఎల్ఎన్జీ సరఫరా జరుగుతోంది. అందుకే హర్ముజ్ గూండా నిర్బంధం లేని రవాణా అంతర్జాతీయ సమాజానికి అవసరమని చైనా మొదటి నుంచి చెబుతోంది. ఈ క్రమంలోనే కాల్పుల విరమణకు మద్దతు కూడా ప్రకటించింది. అమెరికా, చైనా ఇరాన్పై విభిన్న వైఖరులు అవలంబిస్తున్నాయి. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ జరిపిన దాడితో పశ్చిమాసియా యుద్ధం మొదలైంది. ఈ దాడుల్ని చైనా ఖండించింది. అయితే రహస్యంగా ఈ యుద్ధంలో చైనా నుంచి ఇరాన్కు ఆయుధాలు సరఫరా అవుతున్నాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే 50% టారిఫ్లు విధిస్తామని హెచ్చరించారు. చైనా మాత్రం తాము ఎలాంటి ఆయుధాలు సరఫరా చేయడం లేదని మొత్తుకుంటోంది. -
నితీశ్ కుమార్ రాజీనామా.. కొత్త సీఎం ఆయనేనా?
పాట్నా: బిహార్ సీఎం ఎవరు అనే అంశం నేడు తేలనుంది. ఈ రోజు ఏన్డీఏ కూటమి అధికారిక సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారు. ఈ అంశమై ఇదివరకే కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ని పరిశీలకుడిగా బీజేపీ పార్టీ నియమించింది. అయితే ఆ రాష్ట్రానికి ఎంతో కాలంగా ముఖ్యమంత్రిగా సేవలందించిన నితీశ్ కుమార్ ఈ రోజు సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు.బిహార్ రాష్ట్రంలో నూతన శకం ఆవిష్కృతం కాబోతుంది. బీజేపీ నాయకుడు తొలిసారిగా ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ అంశమై నేడు జరిగే ఎన్డీఏ సమావేశంలో శాసన సభ పక్ష నేతను ఎన్నుకుంటారు. అనంతరం రేపు (బుధవారం) కొత్త పార్టీ ఎన్నుకున్న అభ్యర్థి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. తప్పుకోనున్న నితీశ్బిహార్ రాజకీయాల్లో నితీశ్ కుమార్ తనదైన ముద్ర వేశారు. సీఎంగా దాదాపు 10 సార్లు ప్రమాణ స్వీకారం చేసి ఆ రాష్ట్రానికి అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన వ్యక్తిగా రికార్డు సాధించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా వెళ్లనున్నారు. దీంతో జేడీయూ నేతలు ఒకింత భావోద్వేగానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. అయితే గతేడాది జరిగిన ఎన్నికల్లో ఆరాష్ట్రంలోని 243 సీట్లకు 202 స్థానాలు సాధించి ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. బీజేపీ 89 సీట్లు, జేడీయూ 85 స్థానాలు సాధించింది. దీంతో బిహార్ ముఖ్యమంత్రిగా పదోసారి ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్ ప్రస్తుతం రాజీనామా చేయనున్నారు.ముఖ్యమంత్రి రేసులో?బిహార్ ముఖ్యమంత్రి రేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బీజేపీ నేత సామ్రాట్ చౌదరి. 1990లో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన సామ్రాట్ చౌదరి.. 2000లో జరిగిన బీహార్ శాసనసభ ఎన్నికల్లో పర్బత్తా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికై రబ్రీ దేవి మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా పని చేశారు. అనంతరం ప్రభుత్వ విఫ్గా 2014లో ఆర్జేడీ పార్టీ తిరుగుబాటు వర్గంలో చేరి జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని జనతా దళ్(యూ)లో చేరి 2 జూన్ 2014న పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 2023లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. చాలా వరకూ సామ్రాట్ చౌదరినే సీఎంగా ఎన్నుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి. మరోవైపు దళిత నేతను సీఎంగా ఎన్నుకునే అవకాశాలు లేకపోలేదు. -
నటి త్రిషకు వార్నింగ్.. రంగంలోకి దిగిన పోలీసులు
ఇటీవల సినీ సెలబ్రిటీ ఇళ్లలో బాంబు బెదిరింపు కాల్స్ అధికం అవుతున్నాయనే చెప్పాలి. రెండు రోజుల క్రితం స్థానిక పోయస్ గార్డెన్లోని నటుడు రజనీకాంత్, ధనుష్ ఇళ్లలో బాంబు పెట్టినట్లు చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయం సమీపంలోని పోలీస్ స్టేషన్కు ఆగంతకుడి నుంచి ఫోన్ వచ్చింది. దీంతో హుటాహూటిన పోలీసులు తమ టీమ్తో పాటు పోయస్ గార్డెన్కు వెళ్లి సర్చింగ్ చేశారు. కొన్ని గంటల పాటు నటుడు రజనీకాంత్, ధనుష్ ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. అయితే ఎక్కడ బాంబులు పెట్టిన జాడ తెలియకపోవడంతో అది బాంబు బూచి అని తెలిసింది. తాజాగా స్థానిక తేనాంపేటలోని నటి త్రిష ఇంట్లో బాంబు పెట్టినట్లు డీజీపీ కార్యాలయానికి ఫోన్కాల్ వచ్చింది. దీంతో స్థానిక తేనాంపేట పోలీసులు, బాంబు స్క్వాడ్ నిపుణులు, డాగ్స్తో పాటు నటి త్రిష ఇంటికి వెళ్లి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. బాంబులు కనిపించకపోవడంతో తప్పుడు సమాచారం ఇచ్చిన ఆగంతకుడి కోసం గాలిస్తున్నారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇలాంటి ఫేక్ కాల్స్ చేసిన వారిని పట్టుకునేపనిలో ఉన్నారు. -
ఆశా భోంస్లేకు కన్నీటి వీడ్కోలు
భారత సంగీత శిఖరం, లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే అంత్యక్రియలు మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో సోమవారం ముగిశాయి. శనివారం తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు ముంబైలోని బ్రీచ్క్యాండీ ఆస్పత్రిలో చేర్పించారు. గుండె, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అభిమానులు, ప్రజల సందర్శనార్థం ఆశా భోంస్లే భౌతికకాయాన్ని సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ముంబైలోని లోయర్ పారెల్లోని ఆమె నివాసంలో ఉంచారు. మహారాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే, మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ శిండే, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, నటులు ఆమిర్ ఖాన్, రణ్వీర్ సింగ్, వివేక్ ఒబెరాయ్, విక్కీ కౌశల్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, ‘శివ సేన’ పార్టీ ఆధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే వంటి వారితో పాటు పలువురు సినిమా, పొలిటికల్, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ఆమె భౌతికకాయం వద్ద నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఆశా భోంస్లే నివాసం నుంచి దాదర్లోని శివాజీ ΄పార్క్ శ్మశాన వాటిక వరకు భారీ జనసందోహం నడుమ ఆమె అంతిమయాత్ర కొనసాగింది. ఆశా భోంస్లేని కడసారి చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ‘ఆశా భోంస్లే అమర్ రహే’ అనే నినాదాలతో, అశ్రునయనాల నడుమ ఆమెకు కన్నీటి వీడ్కోలు పలికారు. తల్లి ఆశా భోంస్లేకు కుమారుడు ఆనంద్ భోంస్లే అంత్యక్రియలు నిర్వహించారు. -
రజనీకాంత్, కమల్ హాసన్.. కథ మళ్లీ మొదటికొచ్చిందా?
రజనీకాంత్ 173వ చిత్రం గురించి ఏ ముహూర్తాన అనుకున్నారో గాని అది ఇప్పటి వరకు సెట్ కావడం లేదు. రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వం జైలర్–2 చిత్రాన్ని పూర్తిచేశారు. ఈ చిత్రం జూలై నెలలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. తదుపరి నటుడు కమలహాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనున్న చిత్రంతో పాటు, కమలహాసన్తో కలిసి నటించే చిత్రానికి రజనీకాంత్ కమిట్ అయ్యారు. కమల్, రజినీ కలిసి నటించే చిత్రానికి దర్శకుడు నెల్సన్ పేరు ఖరారు అయ్యింది. అయితే దానికి ముందు రజనీకాంత్ హీరోగా కమలహాసన్ నిర్మించనున్న చిత్రానికే దర్శకుడు ఇంకా నిర్ణయం కాలేదు. మొదట ఈ చిత్రానికి సుందర్.సి పేరు ఖరారైంది. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. అలాంటిది ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి వైదొలగినట్లు దర్శకుడు సుందర్.సి ప్రకటించి షాక్ ఇచ్చారు. దీంతో రజనీకాంత్ తనకు కథ పూర్తిగా సంతృప్తి కలిగిన తరువాతే షూటింగ్కు వెళ్తామని కమలహాసన్ ప్రకటించారు. దీంతో కథ సెట్ కాకపోవడంతోనే సుందర్.సి ఈ చిత్రం నుంచి వైదొలగినట్లు అర్థమైంది. ఆ తరువాత ఈ చిత్రానికి డాన్ చిత్రం ఫేమ్ సిబి.చక్రవర్తి దర్శకత్వం వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం కథ సింగిల్ విన్న రజనీకాంత్, కమలహాసన్ బాగుందని ఈ దర్శకుడికి పచ్చజెండా ఉంటారని సమాచారం. ఈ చిత్రం అందరినీ సంతృప్తి పరుస్తుందని దర్శకుడు సిబి.చక్రవర్తి ఇటీవల లవ్ టుడే చిత్ర వేదికపై బలంగా చెప్పారు. అంతే కాకుండా ఈ చిత్రం మే నెలలో సెట్ పైకి వెళుతుంద న్న ప్రచారం జరుగుతోంది. అలాంటిది పరిస్థితుల్లో ఈ చిత్రం నుంచి సిబి.చక్రవర్తి కూడా వైదొలగినట్లు తాజాగా సామాజిక మాధ్యమాల్లో ప్రచా రం వైరల్ అవుతోంది.అంతే కాదు ఈ చిత్రానికి డ్రాగన్ చిత్రం ఫేమ్ అశ్వద్ మారి ముత్తు దర్శకత్వం వహిస్తారనే ప్రచారం హల్చల్ చేస్తోంది. ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది. -
బెంగాల్లో బాబ్రీ మసీదు కట్టనివ్వం
రాణిగంజ్: టీఎంసీ చీఫ్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ చీఫ్ హుమాయూన్ కబీర్ ఇద్దరూ ఒక్కటేనని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. బెంగాల్లో బీజేపీ గెలిస్తే హుమాయూన్ ప్రకటించినట్లుగా బాబ్రీ మసీదును నిర్మించనివ్వబోమని స్పష్టం చేశారు. సోమవారం ఆయన బీర్భూమ్, పశ్చిమ్ బర్దమాన్ జిల్లో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు. అప్పట్లో అయోధ్యలో రామాలయం నిర్మాణాన్ని మమతా బెనర్జీ వ్యతిరేకించగా.. ఆమె పార్టీ మాజీ నేత ఇప్పుడు అయోధ్యలో కూల్చిన బాబ్రీ మసీదును నిర్మించేందుకు చూస్తున్నారన్నారు. ‘550 ఏళ్లుగా టెంట్ కిందే ఉంటున్న రామ్ లల్లాను అలా ఉంచేందుకే కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఎస్పీ, బీఎస్పీలు మద్దతు తెలిపాయి. తిరుగులేని మెజారిటీతో గెలిచిన మోదీ ప్రభుత్వం మాత్రమే అయోధ్యలో రామాలయాన్ని నిర్మించింది. మమతా బెనర్జీ మాదిరిగా ఆలోచించే హుమాయూన్ ఇప్పుడు బెంగాల్లో బాబ్రీ మసీదు కట్టాలనుకుంటున్నారు’అని అమిత్ షా వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బాబ్రీ మసీదు నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదని స్పష్టం చేశారు. బాంబులు, బుల్లెట్లకు బెంగాల్ ప్రజలు ఓట్లతోనే సమాధానం చెబుతారన్నారు. టీఎంసీ ప్రభుత్వాన్ని సాగనంపండి, ఆ వెంటనే సిండికేట్ కట్మనీ ముఠాదార్లను, వారి మద్దతుదార్లను తలకిందులుగా వేలాడదీసి, తాము దారికి తెస్తామని హెచ్చరికలు చేశారు. టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీకి టాటాబైబై చెప్పి, బీజేపీకి అధికారమిచ్చేందుకు ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారన్నారు. బీజేపీ కార్యకర్తలను చిత్రహింసలు పెట్టేందుకు టీఎంసీ నేరగాళ్లకు ఆశ్రయం కల్పిస్తోందంటూ మండిపడిన అమిత్ షా..మే 5న ఓట్ల లెక్కింపు తర్వాత కాషాయ పార్టీ కార్యకర్తలు ఈ నేరగాళ్లను బయటకు లాగి, చట్టం ముందు నిలబెడతారని స్పష్టం చేశారు. అందుకే టీఎంసీ గూండాలు మొదటి దశ పోలింగ్ జరిగే 23న ఇళ్లలోనే ఉండిపోవాలని సలహా ఇచ్చారు. రాష్ట్రంలోని మెజారిటీ మతస్తులను మమతా బెనర్జీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ ఆయన.. ఈ ఎన్నికల్లో ప్రధాన అంశం చొరబాటుదార్లను వెళ్లగొట్టడమేనన్నారు. -
రేపట్నుంచి డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు రంగం సిద్ధమైంది. ఈనెల 15 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుంది. ఇందుకు సంబంధించి డిగ్రీ ఆన్లైన్ సర్విసెస్–తెలంగాణ (దోస్త్–2026) నోటిఫికేషన్ను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి సోమవారం అధికారికంగా విడుదల చేశారు. రాష్ట్రంలో 11 విశ్వవిద్యాలయాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లోని సీట్లను దోస్త్ ద్వారా భర్తీ చేస్తారు. మొత్తం 969 కాలేజీలు దోస్త్ పరిధిలోకి వస్తాయి.వీటిల్లో 4,40,107 సీట్లున్నాయి. గత ఏడాది 2,05,140 సీట్లు భర్తీ అయ్యాయి. ఈ ఏడాది కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నామని, దీనివల్ల డిగ్రీలో అడ్మిషన్లు పెరుగుతాయని బాలకిష్టారెడ్డి ఆశాభావం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో మండలి వైస్ చైర్మన్లు ప్రొ.ఎస్కే మహమూద్, ప్రొ.ఇటికాల పురుషోత్తం, కార్యదర్శి ప్రొ.శ్రీరామ్ వెంకటేశ్ పాల్గొన్నారు. దోస్త్ మూడు దఫాలుగా..: ఈ ఏడాది కూడా డిగ్రీ కోర్సుల్లో సీట్లను మూడు విడతల్లో భర్తీ చేస్తారు. మొదటి విడత రిజిస్ట్రేషన్ బుధవారం నుంచి ప్రారంభమవుతుంది. విద్యార్థులు రూ. 200 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వచ్చే నెల 14న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. రెండో, మూడో విడత రిజిస్ట్రేషన్ చేసుకునే వారు రూ.400 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మూడు విడతల్లో సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 20 నుంచి 27 వరకు కాలేజీల్లో నేరుగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. జూన్ 29, 30న కాలేజీల్లో విద్యార్థులకు ఓరియంటేషన్ను నిర్వహిస్తారు. డిగ్రీ మొదటి సెమిస్టర్ క్లాసులు జూలై 1 నుంచి ప్రారంభమవుతాయి. -
శిఖరాగ్రం నుంచి శిథిలావస్థకు
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల పోరు ప్రధానంగా అధికార తృణమూల్ కాంగ్రెస్, విపక్ష బీజేపీ మధ్యే కేంద్రీకృతమైంది. రాష్ట్రాన్ని 30 ఏళ్ల పాటు అప్రతిహతంగా పాలించిన కాంగ్రెస్ ఇప్పుడు ఉనికి కోసం పోరాడాల్సిన దురవస్థకు చేరింది. 50 ఏళ్లుగా అధికారానికి దూరమైన కుర వృద్ద పార్టీ ఈసారి ఖాతా తెరిచేందుకే కిందా మీదా పడే పరిస్థితికి చేరుకుంది...! 1977 నుంచి మొదలైన పతనం స్వాతంత్య్రానంతరం నుంచి బెంగాల్ను కాంగ్రెస్ 1977 దాకా పాలించింది. బిదాన్ చంద్రరాయ్, ప్రఫుల్ల చంద్రసేన్, అజయ్ ముఖర్జీ, సిద్ధార్థ శంకర్ రే వంటి దిగ్గజ నేతలు ముఖ్యమంత్రులుగా చేశారు. 1977లో రాష్ట్రంలో కాంగ్రెస్ పతనం మొదలైంది. ఆ ఏడాది జ్యోతిబసు నాయకత్వంలోని కమ్యూనిస్టులు రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. కాంగ్రెస్తో విభేదించి 1998లో మమతా బెనర్జీ సొంత కుంపటి పెట్టుకోవడంతో బెంగాల్లో పార్టీ పరిస్థితి మరింత కునారిల్లుతూ వచ్చింది. అప్పటినుంచీ క్రమంగా ప్రాధాన్యతను కోల్పోయింది. 2011లో బెంగాల్లో తృణమూల్ తొలిసారిగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కాంగ్రెస్ పరిస్థితి మరీ దయనీయంగా మారింది. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో 21 సీట్లు సాధించిన కాంగ్రెస్ 2011లో 42, 2016లో 44 సీట్లు నెగ్గింది. కానీ గత ఐదేళ్లలో బెంగాల్లో బీజేపీ పుంజుకోవడంతో కాంగ్రెస్ భారీగా నష్టపోయింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా నెగ్గలేకపోయింది! ఓట్ల శాతంలోనూ సింగిల్ డిజిట్కు పరిమితమైంది. 2016లో కేవలం 3 అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకున్న బీజేపీ 2021లో ఏకంగా 77 సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్ష హోదా చేజిక్కించుకుంది. కార్యాలయాల్లోనూ కన్పించని సందడి ప్రస్తుతం బెంగాల్వ్యాప్తంగా ప్రతి మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో తృణమూల్, బీజేపీ జెండాలతో ఎన్నికల కోలాహలం కనబడుతుంటే కాంగ్రెస్లో మాత్రం చడీచప్పుడే లేదు. చాలా జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను సైతం తెరిచే పరిస్థితి లేదు! పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో హస్తంజెండా పట్టుకునే కార్యకర్తే కరువైన పరిస్థితి! 2021 అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకొంటే అన్ని పార్టీలూ ‘సున్నా’చుట్టాయి. దాంతో కాంగ్రెస్ ఈసారి మొత్తం 294 అసెంబ్లీ స్థానాల్లోనూ ఒంటరిగా పోటీ చేస్తోంది. బెహ్రాంపూర్ నుండి అధిర్ రంజన్ చౌదరి, మాలతీపూర్ నుంచి మౌసమ్ నూర్, సుజాపూర్ నుంచి అబ్దుల్ హన్నన్ తదితరులు బరిలో ఉన్నారు.పతనానికి కారణాలెన్నో బెంగాల్లో కాంగ్రెస్ పతనానికి అనేక కారణాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అధికార పార్టీలకు వ్యతిరేకంగా భారీ ఉద్యమాలు నడపడంలో మూడు దశాబ్దాలుగా పార్టీ విఫలమైంది. తొలుత లెఫ్ట్ ఫ్రంట్కు దన్నుగా ఉన్న మధ్య, ఉన్నత తరగతి ఓటర్లు ఆ తర్వాత టీఎంసీ వైపు మళ్లారు. బీజేపీ ఎదుగుదలతో గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు దాదాపుగా గండి పడింది. రాష్ట్రంలో 30 శాతమున్న ముస్లింలు పూర్తిగా తృణమూల్ వైపు వెళ్లారు. -
కోర్టుకు ఇచ్చిన హామీ ఉల్లంఘన శిక్షార్హమే..!
సాక్షి, అమరావతి: కోర్టుకిచ్చిన హామీ ఉల్లంఘన ఎంతమాత్రం క్షమార్హం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి ఉల్లంఘనకు పాల్పడిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి నెల రోజుల సాధారణ జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధించింది. దీంతోపాటు రూ.10వేలు ఖర్చులు విధించింది. ఈ మొత్తాన్ని ఏపీ హైకోర్టు న్యాయసేవల కమిటీకి జమ చేయాలని ఆదేశించింది. న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరీ, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం ఈ మేరకు ఇటీవల తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళితే ఆస్తి వివాదానికి సంబంధించి సాఫ్ట్వేర్ ఉద్యోగి నగతం ముకుందరెడ్డి, మరికొందరిపై నగతం సునీత, మరో ముగ్గురు 2009లో తిరుపతి ఐదో అదనపు జిల్లా కోర్టులో దావా వేశారు.విచారణ జరిపిన తిరుపతి కోర్టు, ఆస్తిలో 1/4 వాటా సునీత తదితరులకు చెందుతుందని 2017లో డిక్రీ జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ ముకుందరెడ్డి తదితరులు హైకోర్టులో అప్పీల్ చేయడంతో తీర్పు అమలు ఆగిపోయింది. కాగా తిరుపతి కోర్టులో తాము దాఖలు చేసిన తమ ఆస్తి ఒరిజినల్ డాక్యుమెంట్లను వెనక్కి ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ముకుందరెడ్డి హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ డాక్యుమెంట్లను బ్యాంకు తాకట్టు పెట్టడం గానీ, ఆస్తిపై మూడో పక్షానికి హక్కులు సృష్టించడం గానీ చేయబోమని హైకోర్టుకు హామీ ఇచ్చారు.దీంతో ఈ మేరకు 2021లో హైకోర్టు సానుకూల ఆదేశాలు ఇచ్చింది. అయితే ముకుందరెడ్డి కోర్టు నుంచి తీసుకున్న ఆస్తి ఒరిజినల్ డాక్యుమెంట్లను తాకట్టు పెట్టారని, ఆ ఆస్తిని థర్డ్ పార్టీకి విక్రయించి రిజిస్ట్రేషన్ చేశారని, ఇది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేంటూ సునీత మరికొందరు 2025లో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ తిల్హరీ ధర్మాసనం ఇటీవల తుది విచారణ జరిపింది. ముకుందరెడ్డి ఉద్దేశపూర్వకంగా తమ ఆదేశాలను ఉల్లంఘించారని, ఇది కోర్టు ధిక్కారమేనని తేల్చింది. -
కూటమి నేతల వేధింపులు తాళలేక వ్యక్తి ఆత్మహత్య
గంగాధర నెల్లూరు: టీడీపీ కూటమి నేతల వేధింపులు తాళలేక ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం రామానాయుడుపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రామానాయుడుపల్లికి చెందిన వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు బాబు (50) సోమవారం ఉదయం తన ఇంటివద్ద పురుగు మందు తాగి దగ్గుతుండగా గ్రామస్తులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు.చికిత్స పొందుతుండగా బాబు మృతిచెందాడు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి స్థానిక నేతలు తనను వేధిస్తున్నట్టు సూసైడ్ నోట్లో రాసి ఉంది. గ్రామంలో ఓ భూ వివాదంపై అధికార పార్టీ నేతలు తనపైన, మరికొందరిపైన పలు కేసులు నమోదు చేయించారని నోట్లో మృతుడు పేర్కొన్నారు. తాను వైఎస్సార్సీపీ సానుభూతిపరుడిని కావడం వల్లే కేసులు నమోదు చేసి పోలీస్ స్టేషన్లు, కోర్టులచుట్టూ తిప్పుతుండటంతో ఆ వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడుతున్నట్టు ఆ లేఖలో బాబు వివరించాడు. -
నాడు రక్షణ వలయం.. నేడు ప్రైవేటు నిలయం
మత్స్యకారుల సంక్షేమం, ఉపాధి కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తే దానిని ప్రైవేటుకు కట్టబెట్టేందుకు చంద్రబాబు సర్కారు సిద్ధపడడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రత్యేకంగా గంగపుత్రుల కోసం నిరి్మంచిన హార్బర్లో ప్రైవేటు పెత్తనానికి అనుమతించడం ఏమిటనే ప్రశ్న ఎదురవుతోంది. 2019లో వైఎస్ జగన్ సీఎం అయ్యాక రెండేళ్లు కరోనా వెంటాడినా నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు జువ్వలదిన్నెతోపాటు పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.ఇందులో నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ 76.89 ఎకరాల్లో రూ.289 కోట్లతో పూర్తయింది, మిగతావి అనేక దశల్లో ఉన్నాయి. ఇవన్నీ అందుబాటులోకి వస్తే.. మత్స్యకార కుటుంబాలు సుసంపన్నం అయ్యేవి. అయితే చంద్రబాబు కూటమి సర్కారు మత్స్యకారుల జీవితాలను అంధకారంలోకి నెట్టేసేలా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను నిర్వీర్యం చేస్తూ.. సాగర్ డిఫెన్స్ పరిశ్రమ పేరుతో ప్రైవేట్ పరం చేసేందుకు సిద్ధపడింది. దీనిపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను 76.89 ఎకరాల్లో రూ.289 కోట్లతో వైఎస్ జగన్మోహన్రెడ్డి అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు. 25,000 మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం కల్పించేలా, ఏకకాలంలో 1250 మోటరైజ్డ్, మెకనైజ్డ్ బోట్లు నిలిపేలా సిద్ధం చేశారు. ఈ హార్బర్ ద్వారా ఏటా 41,250 టన్నుల మత్స్య సంపద అదనంగా అందుబాటులోకి వస్తుందనే అంచనాతో హార్బర్లోనే కోల్డ్ చైన్, ఐస్ ప్లాంటు, చిల్ రూమ్ వంటి మౌలిక వసతులు, బోట్ రిపేర్ వర్క్ షాపులు, నెట్ మెండింగ్ షెడ్లు వంటి సౌకర్యాలు కల్పించారు.వైఎస్ జగన్ సీఎం అయ్యాక రెండేళ్లు కరోనా వెంటాడినా.. మిగిలిన మూడేళ్ల అవకాశాన్ని అందిపుచ్చుకుని శరవేగంగా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను పూర్తి చేసి మత్స్యకారులకు అంకితం చేయాలని భావించారు. 2024 మార్చి 12న వర్చువల్గా ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇంతటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ను నేరుగా మత్స్యకారుల సమక్షంలోనే ప్రారంభించాలని భావించి ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఆ వెంటనే ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. అయితే అదే ఏడాది ఆగస్టు 31న ప్రధానమంత్రి నరేంద్రమోదీ మహారాష్ట్ర నుంచి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను వర్చువల్గా ప్రారంభించారు. మత్స్యకారుల భవితవ్యం.. వైఎస్ జగన్ సంకల్పం మత్స్యకారుల జీవనోపాధి మెరుగుకూ వైఎస్ జగన్ చర్యలు చేపట్టారు. ఇతర ప్రాంతాలకు వలసలను నిరోధించేందుకు 1250 బోట్లను 50 శాతం సబ్సిడీపై అందించేందుకు చర్యలు చేపట్టారు. తొలి దశలో జిల్లాలోని వైఎస్సార్ మత్స్యకార భరోసా అందుకుంటున్న లబ్ధిదారులకు.. ఆ తర్వాత మిగతా వారికి బోట్లు ఇచ్చేందుకు ప్రణాళిక రచించారు. ప్రతి బోటుకు 12 నుంచి 15 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశించారు. బోటు విలువలో 10 శాతం లబ్ధిదారుల వాటాగా చెల్లిస్తే.. మిగతా 90 శాతం బ్యాంకు రుణం అందించేలా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం అందించే సబ్సిడీ పోను మిగతా 40 శాతం అప్పును మత్స్యకారులే చెల్లించేలా విధివిధానాలు రూపొందించారు. వైఎస్ జగనే ఇప్పటికీ సీఎంగా ఉండి ఉంటే.. ఇప్పటికే ప్రతి మత్స్యకారుడూ మెకనైజ్డ్ బోటుకు యజమానై ఉండేవాడు. ఫిషింగ్ హార్బర్కు అనుబంధంగా మత్స్యకార మహిళలకు మత్స్య సంపద ప్యాకింగ్, మార్కెటింగ్, ఫుడ్ కోర్టుల ద్వారా సమృద్ధిగా ఉపాధి లభించేది. అభివృద్ధిని బుగ్గి చేసేందుకు బాబు సిద్ధం చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక మత్స్యకారుల అభివృద్ధిని బుగ్గిచేసే కార్యక్రమాలు చేపట్టింది. ఫిషింగ్ హార్బర్లను నిర్వీర్యం చేసి అక్కడి భూములను ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టి వారి భవిష్యత్ను నాశనం చేసేందుకు ప్రయోగాత్మకంగా జువ్వలదిన్నెతోనే సాగర్ డిఫెన్స్ పేరిట కుట్రలకు తెరతీశారు. మత్స్యకారుల నుంచి వ్యతిరేకత రాకుంటే.. దశల వారీగా రాష్ట్రంలోని తీరం వెంబడి నిర్మాణంలో ఉన్న మిగతా ఫిషింగ్ హార్బర్లను ప్రైవేట్ పరం చేయడానికి బరితెగించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్సీపీ పాలనలో సంక్షేమం, అభివృద్ధి వైఎస్ జగన్ పాలనలో మత్స్యకార కుటుంబాల అభివృద్ధికి చర్యలు చేపట్టారు. 2014–19 మధ్య టీడీపీ పాలనలో వేట నిషేధ కాలంలో రూ.4వేల అరకొర పరిహారం అందిస్తే.. వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ మత్స్యకార భరోసా ద్వారా 19 వేల మందికి ఏకంగా రూ.10 వేలు చొప్పున అందించారు. ఇక డీజిల్పై సబ్సిడీని రూ.9కు పెంచి అందరికీ ఇచ్చారు. వేట సమయంలో మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.10 లక్షల బీమా వర్తింపజేసి వెన్నుదన్నుగా నిలిచారు. దశాబ్దాల కలను నెరవేర్చిన వైఎస్ జగన్ వైఎస్ జగన్ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మించి మా దశాబ్దాల కలను నెరవేర్చారు. అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చి సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ ప్రైవేట్ సంస్థకు హార్బర్ భూమిని కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది. మా కడుపులు కొడుతోంది. ప్రైవేటుకిస్తే మత్స్యకారులకు హార్బర్లోకి ప్రవేశం ఉండదు. ప్రైవేట్ కంపెనీకి భూమి మరో ప్రాంతంలో ఇవ్వాలి. – కొండూరు శ్రీనివాసులు, మత్స్యకార నాయకుడు, ఇస్కపల్లి హార్బర్ భూమిని ప్రైవేట్పరం కానివ్వం జువ్వలదిన్నె హార్బర్ భూమిని ఎట్టిపరిస్థితుల్లో ప్రైవేటుపరం కానివ్వబోం. వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టాం. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక సాగర్ డిఫెన్స్ కంపెనీకి అప్పనంగా భూమి అప్పజెప్పేందుకు యత్నించడం దారుణం. – రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్సీపీ పాలనలో సంక్షేమం, అభివృద్ధి వైఎస్ జగన్ పాలనలో మత్స్యకార కుటుంబాల అభివృద్ధికి చర్యలు చేపట్టారు. 2014–19 మధ్య టీడీపీ పాలనలో వేట నిషేధ కాలంలో రూ.4వేల అరకొర పరిహారం అందిస్తే.. వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ మత్స్యకార భరోసా ద్వారా 19 వేల మందికి ఏకంగా రూ.10 వేలు చొప్పున అందించారు. ఇక డీజిల్పై సబ్సిడీని రూ.9కు పెంచి అందరికీ ఇచ్చారు. వేట సమయంలో మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.10 లక్షల బీమా వర్తింపజేసి వెన్నుదన్నుగా నిలిచారు. దశాబ్దాల కలను నెరవేర్చిన వైఎస్ జగన్ వైఎస్ జగన్ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మించి మా దశాబ్దాల కలను నెరవేర్చారు. అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చి సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ ప్రైవేట్ సంస్థకు హార్బర్ భూమిని కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది. మా కడుపులు కొడుతోంది. ప్రైవేటుకిస్తే మత్స్యకారులకు హార్బర్లోకి ప్రవేశం ఉండదు. ప్రైవేట్ కంపెనీకి భూమి మరో ప్రాంతంలో ఇవ్వాలి. – కొండూరు శ్రీనివాసులు, మత్స్యకార నాయకుడు, ఇస్కపల్లి హార్బర్ భూమిని ప్రైవేట్పరం కానివ్వం జువ్వలదిన్నె హార్బర్ భూమిని ఎట్టిపరిస్థితుల్లో ప్రైవేటుపరం కానివ్వబోం. వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టాం. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక సాగర్ డిఫెన్స్ కంపెనీకి అప్పనంగా భూమి అప్పజెప్పేందుకు యత్నించడం దారుణం. – రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే -
ఫార్మా వృద్ధికి పరిశోధనలు కీలకం
న్యూఢిల్లీ: బయోలాజిక్స్, బయోసిమిలర్స్, స్పెషాలిటీ మెడిసిన్పై మరింతగా దృష్టి పెడుతూ అంతర్జాతీయంగా ఫార్మా రంగానికి సారథ్యం వహించేలా భారత్ పటిష్టమైన స్థితిలో ఉందని కేంద్ర రసాయనాలు, ఎరువులు శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఇందుకోసం పరిశోధనలు–అభివృద్ధి (ఆర్అండ్డీ) కార్యకలాపాలను బలోపేతం చేయడం, పెట్టుబడులు పెరగడం మొదలైన అంశాలు కీలకమని ఆయన పేర్కొన్నారు. ఇండియా ఫార్మా 2026 కార్యక్రమానికి పంపిన వీడియో సందేశంలో మంత్రి ఈ విషయాలు చెప్పారు. నాయకత్వ సామర్థ్యాలు, అందుబాటు ధరలో జనరిక్ ఔషధాలతో అనేక సంవత్సరాలుగా ప్రపంచానికి ఫార్మసీగా భారత్ గుర్తింపు పొందిందని మంత్రి వివరించారు. ప్రస్తుతం గ్లోబల్ ఫార్మా పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయని బయోలాజిక్స్, బయోసిమిలర్స్, స్పెషాలిటీ మెడిసిన్పై ఫోకస్ పెరుగుతోందన్నారు. దీనికి అనువుగా భారత్ తనను తాను మల్చుకోవడంతో పాటు సారథ్యం కూడా వహించేందుకు స్థితిలో ఉందని నడ్డా వివరించారు. దేశీ ఫార్మా పరిశ్రమను గ్లోబల్ లీడరుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని, అయిదేళ్ల వ్యవధి కోసం రూ. 10,000 కోట్లతో బయోఫార్మా శక్తి కార్యక్రమాన్ని కూడా ప్రకటించినట్లు చెప్పారు. బల్క్ డ్రగ్ పార్కుల అభివృద్ధి, బల్క్ డ్రగ్స్ స్కీము, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్ఐ)లాంటి కార్యక్రమాలతో దేశీయంగా తయారీ కార్యకలాపాలకు ఊతమిస్తున్నట్లు నడ్డా పేర్కొన్నారు. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ని (సీడీఎస్సీవో) పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు, 1,500 మంది నిపుణులతో సైంటిఫిక్ సమీక్ష కోసం బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. -
గోద్రెజ్ చైర్మన్గా పిరోజ్షా
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ నాయకత్వ మార్పిడికి సన్నాహాలు ప్రారంభించింది. ప్రస్తుత చైర్పర్శన్, బంధువు నాదిర్ నుంచి ఈ ఏడాది ఆగస్ట్లో పిరోజ్షా గోద్రెజ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. తదుపరి నాదిర్ గోద్రెజ్ కంపెనీ గౌరవ చైర్మన్గా సేవలు అందించనున్నట్లు గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ పేర్కొంది. తరాలవారీ నాయకత్వ మార్పిడి ప్రణాళిక ప్రకారం ఇతర ఎంపికలు సైతం చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఇది ఇటు అధికారం, అటు బాధ్యతల సమయమని పిరోజ్షా పేర్కొన్నారు. తరతరాలుగా నిర్మించుకున్న గ్రూప్ వారసత్వ సంపదతోపాటు విలువలను నిలుపుకుంటూనే ముందుకు సాగవలసి ఉంటుందని వ్యాఖ్యానించారు. 2026 ఆగస్ట్లో నాదిర్ వయసు 75ఏళ్లకు చేరనుండటంతో పదవీ విరమణ చేయనున్నారు. ఫలితంగా గ్రూప్లోని గోద్రెజ్ ఇండస్ట్రీస్, ఆగ్రోవెట్, కన్జూమర్ ప్రొడక్ట్స్సహా గోద్రెజ్ ప్రాపర్టీస్ బోర్డుల నుంచి తప్పుకోనున్నారు. సోమవారం(13) నుంచి ఆస్టెక్ లైఫ్సైన్సెస్ కంపెనీ చైర్మన్, నాన్ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాధ్యతలకు టాటా చెప్పారు. కొత్త తరంతో.. తదుపరి తరం నాయకత్వంలో గోద్రెజ్ గ్రూప్ మరింత పటిష్ట వృద్ధిని అందుకోనున్నట్లు ఈ సందర్భంగా నాదిర్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. గోద్రెజ్ గ్రూప్నకు పలు దశాబ్దాలుగా నాదిర్ సేవలు అందిస్తున్న విషయం విదితమే. నాదిర్ సోదరుడు ఆది, పరమేశ్వర్ గోద్రెజ్ కుమారుడు పిరోజ్షా గోద్రెజ్ ఆగస్ట్ 14 నుంచి గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్, గోద్రెజ్ ఇండస్ట్రీస్కు చైర్పర్శన్గా బాధ్యతలు చేపట్టనున్నారు. గోద్రెజ్ ఆగ్రోవెట్ చైర్మన్గా నాదిర్ కుమారుడు బుర్జీస్ గోద్రెజ్ ఆగస్ట్ 14న బాధ్యతలు స్వీకరించడంతోపాటు.. గోద్రెజ్ ఇండస్ట్రీస్ బోర్డులో నాన్ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా చేరనున్నారు. ఆస్టెక్ లైఫ్సైన్సెస్ ఎండీ పదవి నుంచి వెనువెంటనే తప్పుకుని బోర్డులో నాన్ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కొనసాగనున్నారు. ఆస్టెక్ లైఫ్ చైర్పర్శన్గా గోద్రెజ్ కెమికల్స్ సీఈవో విశాల్ శర్మ వెనువెంటనే బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆస్టెక్ లైఫ్ ప్రస్తుత సీవోవో ఆరిజిత్ ముఖర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎంపికయ్యారు. -
తెలుగుదేశం గ్రాఫ్ పడిపోయింది.. ‘రాయచోటి’లో అభ్యర్థుల్లేరు
సాక్షి అమరావతి: ‘టీడీపీ గ్రాఫ్ పడిపోయింది. రాయచోటి మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీచేసేందుకు పదుల వార్డుల్లో మనకు అభ్యర్థులే లేరు. కూటమికి సానుకూల వాతావరణం ఉన్న గత సార్వత్రిక ఎన్నికల్లోనే 89 పోలింగ్ బూత్లలో మైనస్ కనిపించింది. ఇతర పార్టీలతో పొత్తు టీడీపీని దెబ్బతీస్తోంది..’ అంటూ మంత్రి రాంప్రసాద్రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేకెత్తించాయి. రాయచోటిలో ఆదివారం జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమలు చేయలేని హామీలతో అధికారంలోకి రావడంతోపాటు పాలనలో అన్ని విధాలుగా విఫలమయ్యారంటూ ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి. మహిళలకు రక్షణ కరువైంది. ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. అమరావతి పేరుతో లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ప్రచారం క్షేత్రస్థాయికి చేరడంతో ఆ పార్టీ నాయకులకే భయం పట్టుకుంది. ఇదే సమయంలో స్థానిక సంస్థలకు సిద్ధంగా ఉండాలన్న అధినేతల సూచనలు మంత్రులు, ఎమ్మెల్యేల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న వ్యతిరేకత స్థానిక సంస్థల ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపనుందని గ్రహించిన మంత్రులు, ఎమ్మెల్యేలు ముందుగానే చేతులెత్తేసే దశకు చేరుకుంటున్నారు. రాష్ట్ర రవాణా, క్రీడా, యువజనశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పార్టీ కార్యకర్తల సమావేశంలోనే రాయచోటి మున్సిపాలిటీలో పదుల సంఖ్యలో వార్డుల్లో పోటీచేయడానికి పార్టీకి అభ్యర్థులే లేరంటూ వ్యాఖ్యానించడమే దీనికి ఉదాహరణ. 2024లో జరిగిన సాధారణ ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో పొత్తువల్లే భారీ మెజారిటీతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిందని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఇంతకంటే మెజార్టీ ఎప్పుడూ రాలేదని, ఇకపై రాదని కూడా పేర్కొన్నారు. అలా గెలిచిన నియోజకవర్గాల్లో రాయచోటి కూడా ఉందన్నారు. అదే సమయంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కొన్ని బూత్లలో చెత్తగా ఫలితాలు వచ్చాయని నిషూ్టరంగా మాట్లాడుతూనే ఇక్కడ (ముస్లింలు, దళితులు, క్రిస్టియన్) కులాలు, మతాలకు ఇంకా ఓ పార్టీ (వైఎస్సార్సీపీ)తో ప్రేమలు చావలేదంటూ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. కొన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల చాలా పోలింగ్ కేంద్రాల్లో దెబ్బతిన్నామంటూ పరోక్షంగా బీజేపీని విమర్శించారు. ఆ పార్టీ కారణంగానే 89 బూత్లలో టీడీపీకి తక్కువ ఓట్లు పడ్డాయని చెప్పారు. మన పార్టీ వారే శత్రువులుగా తయారయ్యారు అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చడంతో రాయచోటిలో టీడీపీ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని చెప్పారు. సొంత పార్టీ వారే శత్రువులుగా తయారయ్యారంటూ పరోక్షంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్బాబుపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. రాయచోటి మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి అన్ని వార్డులకు అభ్యర్థులు ముందుకొచ్చేలా సిద్ధం చేయాలని పార్టీ నాయకులకు సూచించారు. పార్టీ ఓడిపోతే వచ్చే కష్టాలను ఊహించుకుని కార్యకర్తల్లో చిత్తశుద్ధిని పెంచాలని కోరారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తనకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ అభ్యర్థిని గెలిపించాలన్నారు. టీడీపీ నేతల్ని కలవరపరుస్తున్న ప్రజావ్యతిరేకత రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకత టీడీపీ నేతల్లో కలవరం కలిగిస్తోంది. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలన్న నేతల పిలుపుతో మరింత ఆందోళన చెందుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు తమకు అనుకూలంగా ఉండవనే స్పష్టమైన అంచనాకు వచ్చిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా స్థానిక ఎన్నికల బాధ్యత నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. -
నేటి అర్ధరాత్రి నుంచి వేటకు విరామం
సాక్షి, అమరావతి: చేపల పునరుత్పత్తి కోసం 61 రోజులపాటు అమలు చేయనున్న వేట నిషేధం మంగళవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తుంది. తూర్పు తీర భారత ప్రాదేశిక జలాల్లో జూన్ 15 వరకు ఈ నిషేధం అమలులో ఉంటుంది. సముద్రంలో మత్స్య సంపద వృద్ధి, పరిరక్షణ, నిర్వహణకైఏటా క్రమం తప్పకుండా ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నారు. ఈ సమయంలో మోటారు వినియోగించని సాంప్రదాయ బోట్లకు వేట నిషేధం నుంచి మినహాయింపు ఉంది.కాగా మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లపై మాత్రం లోతు జలాల్లో వేట నిషేధం. నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే బోట్లతో సహా అందులో ఉండే మత్స్య సంపదను స్వాదీనం చేసుకోవడంతోపాటు ఆయా బోట్ల యజమానులు ఏపీ సముద్ర మత్స్య క్రమబద్దికరణ చట్టం 1994 సెక్షన్ (4)కింద శిక్షార్హులు. నిషేధం పక్కాగా అమలు చేసేందుకు మత్స్యశాఖ, కోస్ట్గార్డు, కోస్టల్ సెక్యురిటీ, నేవీ, రెవెన్యూ అధికారులతో బృందాలను ఏర్పాటు చేశారు. -
టీడీపీలో ‘రాజ్య’కాంక్ష
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి చెందిన నాలుగు రాజ్యసభ ఎంపీ స్థానాలు త్వరలో ఖాళీ అవుతుండడంతో వాటిలో తమకు వచ్చే స్థానాల కోసం టీడీపీ నేతలు పోటీ పడుతున్నారు. ఒక స్థానం ఏడాది క్రితమే ఆ పదవి దక్కించుకున్న సానా సతీష్బాబు (కాల పరిమితి ముగియనుంది)కు రెన్యువల్ చేయడం ఖాయమనే ప్రచారం ఆ పార్టీ నేతల్లో జోరుగా జరుగుతోంది. చినబాబుకు అత్యంత సన్నిహితమైన వ్యక్తి కావడంతోపాటు ఆయన వ్యవహారాలన్నీ చక్కబెడుతుండడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. గతంలోనే పార్టీలోని సూపర్ సీనియర్లను కాదని ఆ పదవిని సానాకి కట్టబెట్టిన ముఖ్య నేత ఇప్పుడు ఆయన్ను పక్కనపెట్టే అవకాశం లేశ మాత్రం కూడా లేదనే అభిప్రాయాలు పార్టీలోనే వ్యక్తమవుతోంది. మరో స్థానంపై మాత్రం విస్తృతంగా చర్చ నడుస్తోంది. ఈ స్థానాన్ని ఎలాగైనా సరే తన అనుయాయుడికే ఇస్తానని చినబాబు స్పష్టం చేస్తున్నారు. ఆ అనుయాయుడు ఇప్పటికే ప్రభుత్వంలో చినబాబు తరఫున అన్ని విషయాలు చూసుకుంటూ సూపర్ బాస్గా మారిపోయారు. ఆయనకు మరింత ‘రాజసం’ కల్పించేందుకు రాజ్యసభ ఎంపీ పదవి కావాల్సిందేనని తద్వారా తన మనిషిగా ఎటువంటి ఆటంకాలు లేకుండా అటు ఢిల్లీలోనూ, ఇటు రాష్ట్రంలోనూ అన్ని వ్యవహారాలు చూసుకుంటాడని చినబాబు భావిస్తున్నట్లు తెలిసింది. దీనిపై సీనియర్ నేతలు మండిపడుతూ అనుచరుడిగా ఉన్న వ్యక్తికి అంత పెద్ద పదవి కట్టబెడితే ఇక తాము ఎందుకని ప్రశ్నిస్తున్నారు. పార్టీ కోసం అనేక సంవత్సరాలుగా పని చేస్తున్న తమను కాదని ఎన్నికల్లో డబ్బు సమకూర్చిన వారికి, తమ పనులు చేసే వారికి పదవులు ఇవ్వడం ఎంతమాత్రం సమంజసం కాదని వాపోతున్నారు. ఈ విషయాన్ని పలువురు చంద్రబాబుకే చెప్పినా ఆయన కూడా ఆర్థికంగా అండదండలు అందించిన వారిని కాదనలేమని అంటున్నట్లు తెలిసింది. దీంతో సీనియర్ నాయకులు రగిలిపోతున్నారు.జయదేవ్ లాబీయింగ్మరోవైపు రాజ్యసభ స్థానం కోసం మాజీ ఎంపీ గల్లా జయదేవ్ తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో గుంటూరు ఎంపీ సీటును వదులుకుని తప్పు చేశానని మదనపడుతున్న ఆయన ఎలాగైనా సరే మళ్లీ పార్లమెంటులో అడుగుపెట్టాలనే పట్టుదలతో చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. గత ఎన్నికల్లో గుంటూరు ఎంపీ సీటు ఆశించి భంగపడిన భాష్యం రామకృష్ణ కూడా ఎన్నికల్లో అండగా నిలిచాను కాబట్టి రాజ్యసభకు పంపాలని కోరుతూ ఆ దిశగా యత్నాలు చేస్తున్నారు. చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే సీనియర్ నేత కంభంపాటి రామ్మోహనరావు, మరో సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ తదితరులు రాజ్యసభ స్థానంపై కన్నేసి చంద్రబాబుపై పలు రకాలుగా ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఆయన మాత్రం ఎవరికీ మాట ఇవ్వకుండా చూద్దాం అని చెబుతుండడంతో వారు రగిలిపోతున్నారు. తమను అన్ని రకాలుగా పార్టీ కోసం ఉపయోగించుకుని ఇప్పుడు తమను పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.జనసేన తరఫున లింగమనేని పేరు జనసేనకు ఈసారి ఒక స్థానం దక్కుతుందని అది లింగమనేని రమేష్కి ఇస్తారనే ప్రచారం చాలారోజులుగా జరుగుతోంది. ఆయన అటు చంద్రబాబుకు ఇటు పవన్ కళ్యాణ్కి సన్నిహితమైన వ్యక్తి కావడంతో ఆయన పేరు ఖరారైనట్లేనని చెబుతున్నారు. ఒకవేళ చివరి నిమిషంలో ఏదైనా మారితే తప్ప జనసేనకు ఒక స్థానం కేటాయిస్తే అది రమేష్కి ఖరారవుతుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలాఉండగా ఖాళీ అయ్యే నాలుగు ఎంపీ స్థానాల్లో కూటమిలో ఏ పార్టీ ఎన్ని సీట్లు తీసుకోవాలనే దానిపైనా మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. చంద్రబాబు, లోకేష్ తరచూ చేసే ఢిల్లీ పర్యటనలు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీల్లో దీనిపై మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. నాలుగింటిలో ఒక్కోటి బీజేపీ, జనసేనకు వదిలినా రెండు కచ్చితంగా టీడీపీకి దక్కుతాయనే ప్రచారం జరుగుతోంది. అయితే తమకు మూడు స్థానాలు ఇస్తే బాగుంటుందని ముఖ్య నేత అడుగుతున్నా అందుకు బీజేపీ సుముఖంగా లేదనే వాదన వినిపిస్తోంది. -
‘మావిగన్’తో కలవరం
సాక్షి, అమరావతి: మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు కారిడార్గా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం మావిగన్ ప్రకటనతో టీడీపీ, చంద్రబాబు బెంబేలెత్తిపోతున్నారని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. ఈ అంశంపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుండటం వల్లే తనకెప్పుడూ అలవాటైన రీతిలో చంద్రబాబు తన మంత్రుల ద్వారా తిట్ల దండకం చదివిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అనాలోచిత నిర్ణయాలు, అంతులేని అవినీతి, అత్యాశల కారణంగా అమరావతి అనేది రాష్ట్రానికి మోయలేని గుదిబండగా మారిందన్నారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసి భవిష్యత్ తరాలను అంధకారంలోకి నెట్టేస్తున్నారని వైఎస్ జగన్ అద్భుతంగా వివరించారని చెప్పారు. జగన్ ప్రతిపాదనను ఎందుకు అంగీకరించడం లేదో చెప్పకుండా, లెక్కలతో వివరించకుండా చంద్రబాబు తన మంత్రులు, ఎమ్మెల్యేలకు బూతు పాఠాలు రాసిచ్చి వారితో మాట్లాడిస్తున్నాడని నిప్పులు చెరిగారు.మంత్రులుగా ఉండి బాధ్యతగా వ్యవహరించాల్సిన అచ్చెన్నాయుడు, అనిత, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, సత్యకుమార్, సవితలతోపాటు ఎమ్మెల్యే ధూళిపాళ్ల, ఎంపీ కలిశెట్టి, టీడీపీ నాయకుడు పట్టాభి వంటి వారిని వైఎస్ జగన్ మీదకు ఉసిగొల్పి బూతులు, అసత్యాలతో వ్యక్తిత్వ హననం చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లంతా మావిగన్పై చర్చ జరగకుండా జగన్ను ట్రోల్ చేశామని సంబరపడిన 48 గంటల్లోనే వారి ఆశలు ఆవిరైపోయాయన్నారు. ఈ అంశం ప్రజల్లోకి శరవేగంగా దూసుకెళ్లిందని చెప్పారు. ఈ సందర్భంగా పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే..వీళ్లంతా చంద్రబాబును ఎంత ఘోరంగా తిట్టారో..కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా ఉన్నప్పుడు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలు తీసుకొచ్చి వైఎస్ జగన్ వ్యక్తిత్వం గురించి చంద్రబాబు తప్పుడు ప్రచారం మొదలు పెట్టాడు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ అప్పట్లో చంద్రబాబును ఘోరాతి ఘోరంగా తిట్టాడు. గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం, అభినవ ఔరంగజేబు చంద్రబాబు, పశువుకున్న విశ్వాసం కూడా చంద్రబాబుకి లేదు.. అని దుమ్మెత్తిపోశారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తన వైపు లాక్కున్నాడని చెప్పాడు. నా మీద పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికి నా ప్రభంజనంలో కొట్టుకుపోయిన చిన్న మిడత చంద్రబాబు.. నమ్మించి ముంచిన నంగనాచి, బాబు నా కన్నా పెద్ద నటుడు. ఇలా 73 ఏళ్ల వయసులో చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు.ఆయన తిట్టిన తిట్లకు ఇంకెవరన్నా అయితే ఏదైనా అఘాయిత్యం చేసుకునేవాళ్లు. ఇవన్నీ ఎంపీ కలిశెట్టి మీడియాకు చూపించాలి. చంద్రబాబు ఊసరవెల్లి. వాడుకుని వదిలేయడం చంద్రబాబు నైజం. మళ్లీ అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తాడని ఆయన వద్ద ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న వాళ్లే అన్నారు. ఇప్పుడు చంద్రబాబుకు పార్టనర్గా ఉన్న పవన్ కళ్యాణ్ సైతం నాడు చంద్రబాబు, లోకేశ్ల అవినీతిని తీవ్రంగా విమర్శించారు. బాబు మళ్లీ సీఎం అయితే అవినీతిని ప్రోత్సహించినట్టే అన్నాడు. చంద్రబాబు కేబినెట్లో ఉన్న సగం మంది మంత్రులు ఒకప్పుడు ఆయన్ను తిట్టిన వీడియోలు చాలా ఉన్నాయి.164 మంది ఎమ్మెల్యేల్లో చంద్రబాబుని తిట్టిన వారి లెక్క వందకు పైనే. చంద్రబాబుని మోడీ, మోడీని చంద్రబాబు దూషించుకున్నారు. చంద్రబాబును దగ్గుబాటి పురందేశ్వరి ఎన్నిసార్లు తిట్టిందో లెక్కే లేదు. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏకంగా చంద్రబాబు గురించి పుస్తకాలే రాశాడు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకాలను టీడీపీ శిక్షణ తరగతుల్లో పంచి పెట్టగలరా? ఈ ప్రాంతాల్లో రూపాయి ఖర్చు చేశారా? చంద్రబాబు చెప్పే అమరావతి కాన్సెప్టులో బలముంటే మావిగన్ పేరెత్తితే ఎందుకంత భయం? మావిగన్ అనేది సీఆర్డీఏ పరిధిలో ఎప్పుడో ఉందని 2014 డిసెంబర్ 30 నాటి జీవో చూపిస్తున్నారు. మరి ఎనిమిదేళ్లలో ఈ ప్రాంతాలకు మాస్టర్ ప్లాన్ ఎందుకు సిద్ధం చేయలేదు? వైఎస్ జగన్ మావిగన్ పేరెత్తే వరకు అమరావతి అంటే 29 ఊర్లే. ఆయన ఎప్పుడైతే మావిగన్ కాన్సెప్టు తీసుకొచ్చారో అప్పుడు హడావుడిగా విజయవాడ రూరల్, పెనమలూరు, ఇబ్రహీంపట్నం, పమిడిముక్కల, నూజివీడు, గుడివాడ, గన్నవరం, ఉంగుటూరు, పామర్రు, ఘంటసాల, పెదపారుపూడి మండలాలకు కన్సల్టెంట్లను పంపించాడు.రూ.51 వేల కోట్లకు టెండర్లు పిలిచామని చెప్పే మంత్రి నారాయణ అందులో ఒక్క కోటి రూపాయలైనా ఈ ఊర్లలో ఎందుకు వెచ్చించలేదు? మాస్టర్ ప్లాన్ ఇంత వరకు ఎందుకు రూపొందించలేదు? మా ప్రాంతాల్లో ఒక్క ఆఫీసు ఉందా? ఐదు టవర్లలో ఒక్కటైనా ఉందా? జడ్జి బంగ్లాలు, ఎమ్మెల్యే క్వార్టర్లు లేకుండా మేం రాజధాని పరిధిలో ఉన్నామని ఎలా ఫీలవ్వాలో చెప్పాలి. 8 ఏళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేశామని మంత్రి నారాయణ చెబుతున్నాడు. కానీ అందులో రూ.5 వేల కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సులే ఉన్నాయి. ఏ లెక్కన ఎకరం రూ.10 కోట్లు అంటున్నారు?జమ్మూ కశ్మీర్లో కాలేజీ పెట్టిన నారాయణ నష్టమొచ్చిందని ఎలా మూసేస్తున్నాడో, రాష్ట్రానికి అమరావతి గుదిబండగా మారిందని తెలిశాక ఆపేస్తేనే భవిష్యత్తు తరాలకు మంచిది. రాజధాని మీద ఇంత అప్పు చేస్తున్నప్పుడు ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదా? ఈ అప్పులు ఎక్కడికి చేరుకుంటాయో కనీస అంచనా కూడా ప్రభుత్వం వద్ద లేదు. 2029 నాటికి బేసిక్ కేపిటల్ (సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు) పూర్తి చేస్తామని చెబుతున్నారు. బేసిక్ కేపిటల్కే రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తే, ల్యాండ్ పూలింగ్లో రైతుల నుంచి తీసుకున్న ప్లాట్లు డెవలప్మెంట్కు ఇంకెంత ఖర్చు చేయాలి? అమరావతిలో ఎకరం విలువ రూ.10 కోట్లు ఉందని, భవిష్యత్తులో రూ.20 కోట్లకు చేరుతుందని బోగస్ ప్రచారం మొదలుపెట్టారు.వాస్తవం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. చంద్రబాబు తన ఇంటి నిర్మాణం కోసం వెలగపూడి ప్రాంతంలో 25 వేల చదరపు గజాలు (5 ఎకరాలు) గజం రూ.7,500 చొప్పున కొనుగోలు చేశాడు. ఆ మొత్తం 5 ఎకరాల స్థలాన్ని ఏడాది క్రితం రూ.18.75 కోట్లకు కొనుగోలు చేసినట్టు సేల్ డీడ్లో స్పష్టంగా పేర్కొన్నారు. దీని ప్రకారం చంద్రబాబు ఎకరం రూ.3.63 కోట్లకు కొన్నాడు. అది కూడా కొత్తగా నిర్మించబోతున్న సచివాలయానికి ఎదురుగా ఉండే ప్రైమ్ ల్యాండ్లో. ఇంటి వెనుక హైకోర్టు వస్తుంది.అలాంటిది ఎకరం రూ.10 కోట్లు పలుకుతుందని మంత్రి నారాయణ చెప్పేవన్నీ అబద్ధాలే కదా? ఈ లెక్కన ప్రభుత్వం వద్ద ఉన్న 5 వేల ఎకరాలు అమ్మినా వచ్చే ఆదాయం రూ.18,150 కోట్లు అవుతుంది. ఈ లెక్కలన్నీ వివరిస్తే వైఎస్ జగన్ను తూలనాడుతున్నారు. 4,800 గజాల్లో వైఎస్ జగన్ తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటేనే ప్యాలెస్ అంటే, చంద్రబాబు ఐదెకరాల్లో కడుతున్న ఇంటిని ఏమనాలి? బాబు చెబుతున్న లెక్కల ప్రకారం అసలు, వడ్డీ కలిపి ఏడాదికి రూ.19,500 కోట్ల నుంచి రూ.22 వేల కోట్ల చొప్పున 20 ఏళ్లపాటు కట్టాలి.రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు?ప్రజల ఆకాంక్ష మేరకు ఇప్పుడైనా మావిగన్ గురించి ఆలోచించండి. రూ.10 వేల కోట్లతో అద్భుతమైన రాజధాని అవుతుంది. మీరు చెప్పినట్లే విశాలంగా 10 లక్షల చదరపు అడుగుల చొప్పున హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ కూడా కట్టొచ్చు. కోకాపేటలో ఎకరా రూ.100 కోట్లకు వేలంలో పాడి అద్భుతమైన సదుపాయాలతో ఇళ్లు పూర్తి చేసి, చదరపు అడుగు రూ.10 వేలకు అమ్ముతున్నారు. ఇదే విషయం మిమ్మల్ని ప్రశ్నిస్తే వైఎస్ జగన్ను నోటికొచ్చినట్లు దూషిస్తున్నారు. హైదరాబాద్ శంకరపల్లి, కోకాపేట, నియోపోలీస్ ఏరియాలో కూడా చదరపు అడుగు ఎంతో తెలుసుకోండి. మంత్రి నారాయణ ఇళ్లు, కార్యాలయం చదరపు అడుగు రూ.16 వేలతో కట్టారా? చంద్రబాబు ఇంటికి ఇంతే పెడుతున్నారా? ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? నేను అగ్రిమెంట్ రాస్తాను.మీరు చెబుతున్నట్టు 10 లక్షల చదరపు అడుగుల చొప్పున సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ కేవలం రూ.10 వేల కోట్లలో కట్టి చూపిస్తాం. కేంద్రమంత్రి పెమ్మసాని అమరావతిలో లక్ష జనాభా లేరని, హోటల్ కట్టినా ఎవరూ రారని చెబుతున్నారు. మరోవైపు చంద్రబాబు మాత్రం 2035 నాటికి 50 లక్షల జనాభా అవుతుందని చెబుతున్నారు. ఎంత మోసం? అమరావతి బిల్లు పెట్టినప్పుడు చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా మిగిలిన ప్రాంతాల ప్రజలను మభ్యపెట్టడానికి ఏయే జిల్లాలకు ఏం చేయబోతున్నాడన్నది హామీ ఇచ్చాడు.అనంతపురం కరువు నివారణకు 100 శాతం డ్రిప్, ఉద్యాన యూనివర్సిటీ, ఎయిమ్స్కు అనుబంధంగా ఆసుపత్రి, నూతన పారిశ్రామిక నగరం, హిందూపూర్లో స్మార్ట్ సిటీ, ఎలక్ట్రానిక్ పార్కు, పుడ్ పార్కు, ఎలక్ట్రానిక్ హార్డ్ వేర్ క్లస్టర్, సోలార్–విండ్ పవర్ ప్లాంట్, పెనుగొండలో ఇస్కాన్ ప్రాజెక్టు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఆధ్యాత్మిక నగరంగా పుట్టపర్తి, ఎయిర్ పోర్ట్, అనంతపురంలో విమాన మరమ్మత్తుల కేంద్రం, హంద్రీ–నీవా ప్రాజెక్టు, స్టీల్ ప్లాంటు ఇవన్నీ అనంతపురం జిల్లాకే చేస్తామన్నాడు. ఇందులో ఒక్కటైనా చేశారా చంద్రబాబూ?ఏ సమస్య వచ్చినా చంద్రబాబు చేసేది డైవర్షనే⇒ ఏ సమస్య వచ్చినా దానికి చంద్రబాబు దగ్గర ఉన్న పరిష్కారం డైవర్షన్ రాజకీయం. జగన్ను వ్యక్తిత్వ హననం చేస్తూ తిట్టించడం. చంద్రబాబు దోపిడీ, విలాసాలకు ఒక హద్దుపద్దు లేకుండా పోయింది. రాష్ట్రాని సర్వనాశనం చేస్తున్నారు. రెండేళ్లు తిరక్కుండానే చంద్రబాబు రూ.3.57 లక్షల కోట్లు అప్పులు చేశాడు. ఇంత డబ్బు తెచ్చికూడా సంక్షేమం కరువైంది. అభివృద్ధి అటకెక్కింది. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతిలో రోడ్లు, కరెంటు, నీళ్లు, డ్రైనేజీ లాంటి సదుపాయాలకే రూ.2 లక్షల కోట్లు పెట్టే స్తోమత రాష్ట్రానికి ఉందా? ⇒ ప్రాక్టికల్ కాని అమరావతి మీద లక్షల కోట్లు పెడితే, ప్రజల పట్ల, రాష్ట్రం నిర్వర్తించాల్సిన బాధ్యతల సంగతి ఏమిటి? ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థులు చదువులు మానేస్తున్న పరిస్థితి. 2026–27 ఆర్థిక సంవత్సరంతో కలుపుకొని రూ.10 వేల కోట్లు ఇవ్వాలి. అసెంబ్లీ సమావేశాలకు ముందు లోకేశ్ బీఆర్ కాపీలు చూపుతూ రూ.1,200 కోట్లు ఇస్తున్నామని చెప్పాడు. ఇప్పటికీ పూర్తిగా ఇవ్వలేదు. ⇒ ఆరోగ్య శ్రీ పూర్తిగా పడకేసింది. దాదాపు రూ.3,200 కోట్లు నెట్వర్క్ ఆస్పత్రులకు ఇవ్వాలి. చివరకు పేద రోగుల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆరోగ్యశ్రీ డబ్బులు కూడా దోచుకుంటున్నారు. మా పథకాలన్నీ రద్దయ్యాయి. మీరిస్తామన్న సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ లేదు. ఆడ బిడ్డ నిధి కింద నెలకు రూ.1500 ఇస్తానన్న దానికీ అతీగతీ లేదు. 40 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నెలకు రూ.4 వేల పెన్షన్కు దిక్కులేదు. నిరుద్యోగ భృతి కింద ఒక్క రూపాయి లేదు. ⇒ స్కూళ్లలో, ఆస్పత్రుల్లో నాడు–నేడు ఆపేశారు. ఆస్పత్రుల్లో మందులకు, దూదికీ దిక్కులేదు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించేస్తున్నారు. మత్స్యకారుల కోసం మేం కట్టిన ఫిషింగ్ హార్బర్లు వారికి అప్పగించకుండా, ప్రైవేటు వారికి అమ్మేస్తున్నారు. మేం ప్రారంభించిన మూడు ప్రభుత్వ పోర్టుల్లో పనులన్నీ ఆపేశారు. వీటన్నింటినీ పట్టించుకోకుండా నిత్యం అమరావతి పాట పాడుతున్నారు. ఎందుకంటే ఆ పేరిట స్కామ్లు, వాటి ద్వారా చంద్రబాబుకు వస్తున్న ఆదాయాలే కారణం. ఆయన స్కాముల కోసం ప్రజల్లో భ్రమలు కల్పిస్తున్నారు. రాష్ట్రానికి కేపిటల్ అనేది లేకుండా చేస్తున్నారు.ఇప్పటికైనా ఆలోచించండి⇒ ఏ రోజైనా విజయవాడ వెస్ట్ బైపాస్ ఆలోచన చేశారా? జగన్ ఈస్ట్ బైపాస్ అనుమతులు తీసుకొస్తే.. అవుటర్ రింగ్ రోడ్డు పేరుతో దాన్ని కూడా రద్దు చేశారు. ఈ అవుటర్ రింగ్ రోడ్డు ఎప్పటికి పూర్తి అవుతుంది? రాజధాని లోపలకి వెళ్లడానికి రోడ్డే ఇంతవరకు పూర్తి కాలేదు. చంద్రబాబు ఇంటి వద్దే ఎకరం రూ.3.63 కోట్లు ఉంటే అమరావతి మారుమూల ప్రాంతాల్లో ఎంత రేటు ఉంటుంది? అలాంటప్పుడు వైఎస్ జగన్ చెప్పిన మావిగన్ ప్రతిపాదన తప్పేంటి? ⇒ ఇండియా–పాకిస్తాన్ మ్యాచ్కు ఎవరు డబ్బులు కట్టారో చెప్పకుండా విమానంలో వెళ్లి మ్యాచ్ చూసి రావడం గొప్పకాదు లోకేశ్.. ఫీజు రీయింబర్స్మెంట్ నయా పైసలతో కట్టి మాట్లాడండి. ఆరోగ్యశ్రీ లేక ప్రజలు అల్లాడుతుంటే మీరు మాత్రం విలాసాల్లో మునిగారు. భార్య చనిపోతే భర్తకు, భర్త చనిపోతే భార్యకు పెన్షన్ ఇవ్వడం లేదు. కొత్త పెన్షన్ లేవీ లేవని మీ స్పీకరే చెబుతున్నాడు. పంట నష్ట పరిహారం ఇస్తున్నారా అని అసెంబ్లీలో అడిగితే స్పష్టమైన సమాధానం లేదు. ⇒ అమరావతి పేరుతో చేస్తున్న అప్పుల కారణంగా అన్ని పనులను నిలిపివేశారు. అమరావతిలో బ్లాక్–1 తప్ప ఎక్కడ లిఫ్ట్లు కూడా పనిచేయవు. ఉన్న అసెంబ్లీని బాగు చేయవచ్చు. అందరినీ తాకట్టు పెట్టి లక్షల కోట్లు అప్పు చేస్తే అది ఎప్పటికీ తీరేది కాదు. మీ తప్పడు ఆలోచనలు మానండి. బూతులు తిట్టడం ఆపండి. మీకు దమ్ముంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుతో అమరావతిని పోల్చండి. ⇒ ఎప్పటికి అమరావతిని పూర్తి చేస్తారు? రైతులకు ప్లాట్లు ఎప్పుడిస్తారు? రోడ్లు ఎప్పుడు వేస్తారు? అప్పు ఎంత చేస్తారు? ఎలా అప్పు తీరుస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతే మావిగన్ గురించి ఆలోచించండి. ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని లోకేశ్ పిలుపు ఇస్తే 29 గ్రామాల్లో ఎక్కడా ప్రజలు దీపాలు పెట్టలేదు. దీన్ని బట్టే ప్రజల మనోగతం అర్థమవుతోంది. -
ఎలక్ట్రిక్ బైక్.. రయ్ రయ్!
న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రిక్ మోటార్సైకిల్స్పై డిమాండ్ పెరుగుతోంది. వాహన్ డేటా ప్రకారం 2025–26 ఆర్థిక సంవత్సరంలో 17,173 వాహనాలు అమ్ముడయ్యాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో నమోదైన 13,430 యూనిట్లతో పోలిస్తే 28 శాతం పెరిగాయి. పరిమాణం తక్కువగానే ఉన్నప్పటికీ, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఉండేలా పాత, కొత్త సంస్థలు మార్కెట్లోకి ఆకర్షణీయమైన కొత్త వాహనాలను ప్రవేశపెట్టడంలో పోటీపడుతుండటంతో కస్టమర్లలో వీటిపై ఆసక్తి పెరుగుతోంది. ఒబెన్ ఎలక్ట్రిక్, రివోల్ట్ మోటార్స్, అ్రల్టావయోలెట్ ఆటోమోటివ్, మ్యాటర్ మోటార్లాంటి సంస్థలు ముఖ్యంగా పనితీరు, టెక్నాలజీ, విశిష్టమైన రైడింగ్ అనుభూతిపై దృష్టి పెడుతూ వినూత్నమైన మోడల్స్ని అందిస్తున్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ కూడా ఫ్లయింగ్ ఫ్లీతో రంగంలోకి దిగింది. సంప్రదాయ ఇంజిన్ల మోటార్సైకిల్స్నే ఇష్టపడే రైడర్లు క్రమంగా ఎలక్ట్రిక్ ఆప్షన్లను కూడా పరిశీలిస్తున్నారని మ్యాటర్ మోటార్ వ్యవస్థాపకుడు మోహల్ లాల్భాయ్ తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనానికి మళ్లడాన్ని, పనితీరు విషయంలో రాజీపడటంలాగా కాకుండా అప్గ్రేడ్ కావడంగా పరిగణిస్తున్నారని వివరించారు. నిర్వహణ ఖర్చు తక్కువ.. వాహన కొనుగోలు, నిర్వహణ వ్యయాలు మొదలైన వాటికి సంబంధించిన టోటల్ కాస్ట్ ఆఫ్ ఓనర్íÙప్ (టీసీవో) అనేది సాధారణ మోటార్సైకిల్స్, ఈ–బైక్స్కి దాదాపు సరిసమాన స్థాయికి చేరుతోందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. రన్నింగ్ వ్యయాలు, నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండటమనేది ఈ–మోటార్సైకిల్స్కి ఆదరణ పెరగడానికి తోడ్పడుతోందని వివరించాయి. రోజుకు 30–50 కి.మీ. రైడ్ చేసే వారు, పెట్టిన పెట్టుబడి 18–24 నెలల్లో తిరిగి వచ్చేయగలదని పేర్కొన్నాయి. పనితీరు, ఆదాకి సంబంధించి రెండింటి మధ్య ఏదో ఒక దాని విషయంలో రాజీపడాల్సిన అవసరం ఉండటం లేదని తెలిపాయి. అయితే, డిమాండ్–సరఫరా మధ్య అంతరాలు, నాణ్యతను కూడా పాటిస్తూ భారీగా ఉత్పత్తి చేయడం, ముడి వస్తువుల ధరల్లో హెచ్చుతగ్గులు, పటిష్టమైన నెట్వర్క్ని నిర్మించుకోవడంలాంటివి పరిశ్రమకు సవాళ్లుగా ఉంటున్నాయని లాల్భాయ్ తెలిపారు. తయారీ సామర్థ్యాలు, చార్జింగ్ సదుపాయాలు మెరుగుపడటంలాంటి అంశాలతో ఎలక్ట్రిక్ టూ–వీలర్ల సెగ్మెంట్ స్థిరంగా వృద్ధి చెందుతోందని ప్రైమస్ పార్ట్నర్స్ ఎండీ అనురాగ్ సింగ్ తెలిపారు. ఊహించిన దానికంటే వృద్ధి నెమ్మదిగానే ఉన్నా మరింత స్పష్టతతో పురోగమిస్తోందన్నారు. అయితే, మరో ఐదేళ్ల పాటు సంప్రదాయ ఇంజిన్ ద్విచక్ర వాహనాలకు ఆదరణ ఉంటుందని చెప్పారు.ఓలా కొత్త స్కూటర్ ఎస్1 ఎక్స్ ప్లస్320 కి.మీ రేంజ్ ధర రూ.1,29,999 ముంబై: ఓలా ఎలక్ట్రిక్ కొత్తగా ఎస్1 ఎక్స్ ప్లస్ 5.2 కేడబ్ల్యూహెచ్ అనే కొత్త స్కూటర్ ను విడుదల చేసింది. దీని ధరను రూ.1,29,999గా నిర్ణయించింది. ఇందులో కంపెనీ సొంతంగా అభివృద్ధి చేసిన 4680 భారత్ సెల్ టెక్నాలజీని వినియోగించింది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 320 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ తెలిపింది. ఇందులో 11 కేడబ్ల్యూ మిడ్–డ్రైవ్ మోటార్, ఇంటిగ్రేటెడ్ మోటార్ కంట్రోల్ యూనిట్ (ఎంసీయూ) ఉన్నాయి. దీని గరిష్టం వేగం 125 కి.మీ. ఇందులో బ్రేక్–బై–వైర్ టెక్నాలజీతో పాటు ఫ్రంట్ డిస్క్ బ్రేక్లు ఉన్నాయి. ఇవి రోజువారీ వినియోగంలో మెరుగైన కంట్రోల్, భద్రతను అందిస్తాయి. ప్రీమియం మోడల్స్లో మాత్రమే ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీని ప్రతి భారతీయుడికి అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని ఓలా ప్రతినిధి చెప్పారు. -
సుపరిపాలనపై ఏపీ మంత్రులకు సింగపూర్లో శిక్షణ
సుపరిపాలనపై ఏపీ మంత్రులకు సింగపూర్లో శిక్షణ -
కన్నబిడ్డ కాఠిన్యం బాబు పాలన దౌర్భాగ్యం
పెడన: ఇటు కన్నబిడ్డ పట్టించుకోక... అటు వస్తున్న పింఛను ఆగిపోవడంతో ఓ పండుటాకు విలవిల్లాడుతోంది. కృష్ణాజిల్లా పెడన మండలం నేలకొండపల్లిలో అందరినీ కంటతడిపెట్టించింది. ఈ చిత్రంలో కనిపిస్తున్న ఈమె పేరు లింగం రంగమ్మ(87). ఊరు పెడన మండలం చోడవరం. కొడుకు కుటుంబరావు పట్టించుకోవడం మానేయడంతో ఆమెను సోదరి కుమారుడు ఉండే నేలకొండపల్లిలోని ఓ పాకలో ఉంచారు. ఎండనకా.. వాననకా.. ఆ పాకలోనే కాలంవెళ్లదీస్తున్న ఆమెకు పింఛనే ఆధారం.. చంద్రబాబు సర్కారు వచ్చాక వేలిముద్రలు, ఐరిస్ పడడం లేదని ఆమెకు 2025 సెప్టెంబర్ నుంచి పింఛన్ నిలిపేశారు. ఎంపీడీఓ అథెండిఫికేషన్తో పింఛన్ ఇచ్చే అవకాశం ఉన్నా.. ఆ పని చేయలేదు.దీంతో అప్పటి వరకు పింఛన్ సొమ్ము తీసుకుని ఆమె బాగోగులు చూసిన సోదరి కొడుకూ పట్టించుకోవడం మానేశాడు. అన్నపానీయాలు లేక పాకలోనే అవస్థలు పడుతున్న ఆ మాతృమూర్తి దయనీయ స్థితిని చూసి చలించిపోయిన స్థానికులు మూడునెలల కిందట పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోయింది. దీంతో సోమవారం బందరు ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పెడన ఇన్చార్జి తహసీల్దారు కె.అనిల్కుమార్ సిబ్బందిని పంపించి వృద్ధురాలి బాగోగులు రెండురోజులు చూడాలని ఆమె చెల్లెలి కొడుకుకు అప్పగించారు. ఆమె సొంత కుమారుడిని పిలిపించి మాట్లాడతామని, పింఛన్ మంజూరుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
భారత్లో మళ్లీ ఫార్ములావన్ రేసుకు ప్రయత్నాలు!
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది భారత్లో ఫార్ములావన్ రేసు నిర్వహించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. గ్రేటర్ నోయిడాలో2011, 2012, 2013లలో ఇండియన్ గ్రాండ్ప్రి పేరుతో ఎఫ్1 రేసులు జరిగాయి. అనంతరం ట్యాక్స్ చెల్లింపు రాయితీలు ఇవ్వకపోవడం, ఇతరత్రా కారణాలతో 2014 నుంచి ఎఫ్1 రేసులు భారత్లో కొనసాగించేందుకు ఫార్ములావన్ నిర్వాహకులు ఆసక్తి చూపలేదు. ‘వచ్చే ఏడాది భారత్లో ఎఫ్1 రేసు నిర్వహించేందుకు మూడుసంస్థలు ఆసక్తిగా ఉన్నాయి. విధివిధానాలు ఖరారు చేయడానికి ఆరు నెలలు పడుతుంది. భారత్లో ఎఫ్1 పునరాగమనం చేసేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. పన్ను రాయితీలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని మాండవీయ తెలిపారు. -
మావిగన్ వారియర్స్.. అమరావతి గ్రాఫిక్స్!
సాక్షి, అమరావతి: మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదించిన ఆచరణ సాధ్యమైన రాజధాని ‘మావిగన్’ ఓవైపు... ముఖ్యమంత్రి చంద్రబాబు అరచేతిలో వైకుంఠంగా చూపిస్తున్న రాజధాని అమరావతి మరోవైపు..! రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి గ్రోత్ ఇంజన్గా మావిగన్... రాజధాని ముసుగులో చంద్రబాబు ముఠా అవినీతికి వేదికగా అమరావతి...! రాష్ట్ర రాజధాని అంశం రాష్ట్రంలో రాజకీయ వేడి పుట్టిస్తోంది. ఆకాశంలో మబ్బులు చూసి ముంతలో నీళ్లు పారబోసుకోవడం అవివేకమని ప్రజలు గుర్తిస్తుండటం తాజా పరిణామం. ఆచరణ సాధ్యం కాని అమరావతి కంటే అతివేగంగా సాకారమయ్యే మావిగన్ వైపు ప్రజాభిప్రాయం మొగ్గుతోందన్నది స్పష్టమవుతుండటం ఆసక్తికరంగా మారింది. దాంతో బెంబేలెత్తుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి తన శకుని మార్కు కుతంత్రాలకు బరి తెగించారు. రాజధాని అంశంలో టీడీపీ కుట్రలు బెడిసికొట్టడంతో తనదైన డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు చెబుతున్న అమరావతి ఆచరణ సాధ్యం కాదని... మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపాదించిన రాజధానిగా ‘మావిగన్’ అందుబాటులో ఉన్న ఏకైక పరిష్కారమనే నిశ్చితాభిప్రాయం రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. ప్రజల మనోగతం వెల్లడి కావడంతో బెంబేలెత్తుతున్న టీడీపీ కూటమి పెద్దలు దీని నుంచి దృష్టి మళ్లించేందుకు దిగజారుడు రాజకీయాలకు తెర తీశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు. వాస్తవాలను వక్రీకరిస్తూ... అభూత కల్పనలను జోడిస్తూ పచ్చ మీడియా ప్రాపగాండాతో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు పన్నాగం పన్నుతున్నారు. చంద్రబాబు కుట్రలను వైఎస్సార్సీపీ సమర్థంగా తిప్పికొడుతోంది. రాజధానిగా ‘మావిగన్’ ఏ విధంగా మెరుగైనదో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు దుర్బుద్ధి, కుట్రలను ఎండగడుతూ ఆయన మామ ఎన్టీ రామారావుతోపాటు ఆయన తోడల్లుడు దగ్గుబాటి, బావమరిది నందమూరి హరికృష్ణతోపాటు పలువురు నేతలు స్వయంగా చెప్పిన మాటలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న పవన్ కళ్యాణ్, ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్థసారథి తదితరులు గతంలో చంద్రబాబునుద్దేశించి చేసిన విమర్శలను ప్రస్తావిస్తున్నారు. ‘అమరావతి’ అవినీతిపై సమాధానం చెప్పలేకే... టీడీపీ కూటమి సర్కారు రెండేళ్ల పాలనపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతుండడంతో చంద్రబాబు బెంబేలెత్తుతున్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను అమలు చేయలేక చంద్రబాబు చేతులెత్తేశారు. సున్నా వడ్డీ పథకానికి అతీ గతీ లేదు.. నాడు – నేడు పథకం అటకెక్కింది. ఆరోగ్యశ్రీ ఆగిపోయింది. పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎగ్గొట్టారు. తల్లికి వందనం పథకం పచ్చి మోసంగా మారింది. అటు సంక్షేమ పథకాలు నిలిచిపోవడం, ఇటు అభివృద్ధి కార్యక్రమాలే లేకపోవడంతో ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. దాంతో ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు హఠాత్తుగా రాజధానిగా అమరావతి తీర్మానాన్ని తెరపైకి తెచ్చారు. తద్వారా తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చాలన్నది ఆయన ఎత్తుగడ. అయితే రాజధానిగా అమరావతి ఏ విధంగా ఆచరణ సాధ్యమో చెప్పాలంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. కేవలం రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికే రూ.2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని నిలదీశారు. ఇక మాస్టర్ ప్లాన్ ప్రకారం రాజధాని నిర్మాణానికి ఏ రూ.10 లక్షల కోట్లు అవుతుందో అంతే చిక్కడం లేదన్నారు. చంద్రబాబు 2014–19లో, 2024 నుంచి ఇప్పటివరకు రాజధాని కోసం ఖర్చు చేసింది కేవలం రూ.8 వేల కోట్లేనని గుర్తు చేశారు. దీన్నిబట్టి ఆయన చెబుతున్న అమరావతి రానున్న 30 ఏళ్లలో కూడా సాధ్యం కాదన్నారు. ఇక అమరావతి నిర్మాణం పేరిట యథేచ్ఛగా పాల్పడుతున్న అవినీతిని వైఎస్ జగన్ సాక్ష్యాధారాలు, గణాంకాలతో సహా ఎండగట్టారు. బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఇటాలియన్ మార్బుల్స్తో అధునాతనంగా నిర్మించే భవనాలకే చ.అడుగుకు రూ.4,500 ఖర్చు అవుతోంది. కానీ అమరావతిలో మాత్రం చ.అడుగుకు ఏకంగా రూ.14 వేలు దాకా చెల్లిస్తూ పనులు ఎందుకు కట్టబెడుతున్నారని ప్రశ్నించారు. కేంద్ర జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్హెచ్ఏఐ) దేశంలో కి.మీ.కు రూ.20 కోట్ల చొప్పున ఆరు లేన్ల రహదారులు నిర్మిస్తుంటే... అమరావతిలో మాత్రం కి.మీ.కు రూ.53 కోట్ల చొప్పున టెండర్లు ఖరారు చేయడం ఏమిటని నిలదీశారు. అమరావతి దోపిడీ కుట్రలో భాగస్వాములైన ఈనాడు కిరణ్ వియ్యంకుడు, చంద్రబాబు బినామీ బలుసు శ్రీనివాసరావు తదితరులకు మొబిలైజేషన్ అడ్వాన్స్ల రూపంలో భారీగా ప్రజాధనాన్ని దోచిపెడుతున్న తీరును ఎండగట్టారు. ఈ నేపథ్యంలో అమరావతి నిర్మాణం ఏ విధంగా ఆచరణ సాధ్యమో తెలపాలని.. రాజధాని పేరుతో సాగుతున్న అవినీతిపై వైఎస్ జగన్ సంధించిన ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానమే లేకుండా పోయింది. దాంతో రాజధాని అమరావతి నిర్మాణం పేరిట చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని ప్రజలకు స్పష్టమైంది. అమరావతి పేరిట భారీగా అవినీతికి పాల్పడుతున్నారన్నది బహిర్గతమైంది. ‘మావిగన్’కు ప్రజామోదం.. రాష్ట్ర రాజధానిగా వైఎస్ జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ పట్ల రాష్ట్రవ్యాప్తంగా సానుకూల అభిప్రాయం బలపడుతోంది. పారిశ్రామిక, వ్యవసాయ, సేవా రంగాల పరంగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ‘మావిగన్’ గ్రోత్ ఇంజన్గా నిలుస్తుందని స్పష్టం చేస్తున్నారు. అభివృద్ధి చెందిన 110 కి.మీ. అర్బన్ ప్రాంతం, అంతర్జాతీయ విమానాశ్రయం, బందరు పోర్టు, పూర్తి కనెక్టివిటీ ఉన్న జాతీయ రహదారులు, ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉన్నత విద్యా సంస్థలతో మావిగన్ రాజధానిగా అత్యంత అనుకూలమనే ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. అమరావతిలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికే రూ.2 లక్షల కోట్లు కావాల్సి ఉండగా... కేవలం రూ.20వేల కోట్లతో మావిగన్ను పూర్తిస్థాయి రాజధానిగా తీర్చిదిద్దవచ్చన్నది స్పష్టమవుతోంది. ‘మావిగన్’కు వ్యతిరేకంగా టీడీపీ తమ సోషల్ మీడియా విభాగం ద్వారా చేసిన అవహేళన, దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టింది. దాంతో ఉలిక్కిపడ్డ చంద్రబాబు తనదైన శైలిలో మరోసారి క్రెడిట్ చోరీకి యత్నించి భంగపడ్డారు. తాము ప్రతిపాదించిన అమరావతిలో మావిగన్ ఒక భాగమని నమ్మించేందుకు యత్నించారు. కానీ కూటమి ప్రభుత్వం గాలిలో మేడలు కడుతున్న అమరావతి వేరు... వైఎస్ జగన్ ప్రతిపాదించిన ఆచరణ సాధ్యమైన మావిగన్ వేరని ప్రజలు గుర్తించారు. చంద్రబాబు మాటలను ఏమాత్రం విశ్వసించడం లేదని నిఘావర్గాలు కూడా ప్రభుత్వానికి నివేదికలు సమర్పించినట్లు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. అందుకే చంద్రబాబు ‘దుష్ప్రచార’ కుతంత్రం... అమరావతిపై తన కట్టుకథలు బెడిసికొడుతుండటం... మావిగన్కు అనుకూలంగా ప్రజాభిప్రాయం బలపడుతుండటంతో చంద్రబాబు తన మార్కు కుతంత్రాలకు పదును పెట్టారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన కపట నైజాన్ని గుర్తు చేస్తున్నాయి. ‘2009 ఎన్నికల అనంతరం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ.. ‘నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తాను..!’ అని హెచ్చరించడం గమనార్హం. అనంతరం అనుమానాస్పద రీతిలో హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖరరెడ్డి దుర్మరణం చెందడం సందేహాలను బలపరుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు మరోసారి తన మార్కు దుర్బుద్ధిని ప్రదర్శించారు. అమరావతి పేరిట తాము సాగిస్తున్న అవినీతి బట్టబయలు కావడంతో మరోసారి తన పన్నాగానికి పదును పెట్టారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని కించపరుస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడేందుకు దుష్ప్రచారానికి తెగబడ్డారు. వాస్తవాలను వక్రీకరిస్తూ... అభూత కల్పనలను జోడిస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు టీడీపీ దుష్ప్రచారానికి తెరతీసింది. మంత్రి అచ్చెన్నాయుడు మొదటగా ఈ కుట్రను లేవనెత్తగా... మంత్రులు నిమ్మల రామానాయుడు, అనిత, టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు ఆ కుట్రలో పాత్రధారులుగా మారారు. చంద్రబాబు రాజకీయ స్వార్థం, కుట్రలు, కుతంత్రాలు, దిగజారుడు రాజకీయాలు, బరితెగించి సాగించిన అవినీతి గురించి గతంలో పలువురు చేసిన విమర్శలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. సొంత మామ ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వైస్రాయ్ కుట్ర ఉదంతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబు గురించి ఎన్టీ రామారావు, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బావమరిది నందమూరి హరికృష్ణ, సొంత తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడులతోపాటు పలువురు సీనియర్ నేతలు గతంలో చేసిన విమర్శలను సామాన్యులు సైతం చర్చించుకుంటున్నారు. బాబు నైచ్యానికిదే నిదర్శనం! 2009 ఆగస్టులో వైఎస్ను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన నైచ్యానికి అద్దంపడుతున్నాయని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ‘‘నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తాను’’ అని చంద్రబాబు హెచ్చరించడం, ఆ తర్వాత రోజే అనుమానాస్పద రీతిలో వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందడాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు డర్టీయెస్ట్ పొలిటీషియన్తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ దేశంలోనే డర్టీయెస్ట్ రాజకీయ నాయకుడు.. ఆయన నాయకుడు కాదు.. మేనేజర్ మాత్రమే.. కాపీ క్యాట్..! ఆయనకు ఆదర్శాలు లేవు.. స్వార్థం మాత్రమే ⇒ డిసెంబర్ 30, 2018 ప్రెస్ మీట్లో ‘హైదరాబాద్ను ప్రపంచ మ్యాప్పై పెట్టానని చంద్రబాబు అంటాడు.. మెంటల్..! అంత సమర్థుడైతే అమరావతి ఎందుకు కట్టలేదు? గ్రాఫిక్స్ తప్ప నిజమైన భవనాలు ఏవీ రాలేదు. ⇒ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో నవంబర్ 25, 2018 పరిగి (వికారాబాద్) బహిరంగ సభ, ప్రెస్మీట్లో.. హత్యా రాజకీయాలే బాబు బ్రాండ్!ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హత్యా రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబే అన్నది నిర్వివాదాంశమని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. టీడీపీ అక్రమాలకు అడ్డుగోడగా ఉన్నారనే 1988లో అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగాను హత్య చేయించారని, ఇందుకు నాటి హోంమంత్రి కోడెల శివ ప్రసాద్ ద్వారా కుట్ర పన్నారని చెబుతున్నారు. రంగా హత్యలో స్వయంగా పాల్గొన్న వెలగపూడి రామకృష్ణకు 2009లో, 2024లో చంద్రబాబు విశాఖ తూర్పు నియోజకవర్గ టికెట్ ఇవ్వడాన్ని గుర్తు చేస్తున్నారు. 1985లో ఎన్టీఆర్పై హత్యాయత్నం చేసిన మల్లెల బాబ్జీ.. విజయవాడలో అనుమానాస్పద స్థితిలో చనిపోవడం వెనుక వేళ్లన్నీ చంద్రబాబు వైపే చూపుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ కుట్రలో సూత్రధారులు పేర్లు బయట పడకూడదనే మల్లెల బాబ్జీని అంతం చేశారని స్పష్టం చేస్తున్నారు. టీడీపీ అక్రమాలను ప్రశ్నిస్తున్న ప్రముఖ పాత్రికేయుడు పింగళి దశరథ రామ్ను విజయవాడలో నడిరోడ్డుపై హత్య చేయడం వెనుక కుట్రదారు చంద్రబాబేనని సోషల్ మీడియాలో ఇప్పటికీ తిరుగుతూనే ఉంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే వైఎస్ రాజారెడ్డిని 1998లో టీడీపీ వర్గీయులు హత్య చేశారు. ఆ కేసులో నిందితులు ఇప్పటికీ టీడీపీలోనే ఉన్నారు. వైఎస్ రాజారెడ్డి హత్య అనంతరం నిందితులకు చంద్రబాబు ప్రభుత్వమే హైదరాబాద్లో నెల రోజులపాటు ఆశ్రయం ఇవ్వడం గమనార్హం. 2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రెడ్బుక్ అరాచకం బీభత్సం సృష్టిస్తోంది. 21 నెలల్లోనే 21 రాజకీయ హత్యలకు తెగబడ్డారని, చంద్రబాబు అధికారం చేపట్టాక రాష్ట్రంలో 710 హత్యలు జరగడం దారుణంగా దిగజారిన శాంతిభద్రతల దుస్థితికి నిదర్శనమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు తిరుపతి రైల్వే స్టేషన్లో జేబులు కొట్టేవాడు..!-నాదెండ్ల భాస్కర్రావు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చి అవినీతిపరుడు. దిగజారుడు వ్యక్తి. రాజకీయాల్లోకి రాకముందు తిరుపతి రైల్వే స్టేషన్లో జేబులు కొట్టేవాడని మాకు రిపోర్ట్ వచ్చింది. అటువంటి వ్యక్తి ఇక రాజకీయాల్లోకి వస్తే ఎంతగా దిగజారి ప్రవర్తిస్తాడో ఊహించుకోండి. చంద్రబాబు అలానే దిగజారుడు, అవినీతి రాజకీయాలే లక్ష్యంగా పని చేస్తున్నాడు.చంద్రబాబు ప్రభుత్వం అవినీతిమయం...-పవన్ కళ్యాణ్, టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి(గతంలో చంద్రబాబుపై చేసిన విమర్శలు) చంద్రబాబు ప్రభుత్వం అవినీతిమయంగా మారింది. రాజధాని అమరావతి, కోస్టల్ కారిడార్ పేరుతో అవినీతికి పాల్పడుతోంది. రాష్ట్రంలో భూములు, గనులు, ఇసుక కుంభకోణాలు పెచ్చుమీరుతున్నాయి. లోకేశ్ నా తల్లిని దూషించారు. ఖబడ్దార్...! చంద్రబాబు ఔరంగజేబ్... గొడ్డుకన్నా హీనం... గాడ్సే కన్నా ఘోరం: ఎన్టీరామారావు‘రాజ్యాధికారం కోసం తండ్రిని జైల్లో పెట్టిన, సోదరుడిని హత్య చేసిన ఔరంగజేబ్ వంటి వాడు చంద్రబాబు. తెలుగు జాతి చరిత్రలో అభినవ ఔరంగజేబ్ చంద్రబాబు. నాతోనే ఉంటూ పథకం ప్రకారం వెన్నుపోటు పొడిచాడు. గుండెల మీద తన్నాడు. చంద్రబాబు గొడ్డుకన్నా హీనం... గాడ్సే కన్నా ఘోరం. చంద్రబాబు దశమ గ్రహం. కుటుంబాన్నీ, ప్రజలను మోసం చేసిన కుట్రదారు చంద్రబాబు -దగ్గుబాటి వెంకటేశ్వర రావు‘అడ్డదారిలో అధికారాన్ని దక్కించుకునేందుకు చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారు. అందుకోసం 1995లో వైస్రాయ్ హోటల్ కుట్ర ద్వారా ఇటు కుటుంబాన్ని, అటు రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. అధికారం, అవినీతే చంద్రబాబు లక్ష్యాలు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కాంట్రాక్టర్లు, బడా పారిశ్రామికవేత్తలకు నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులు ఇప్పించి యథేచ్చగా అవినీతికి పాల్పడేవారు. 1985ృ89 ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో మద్యం డిస్టిలరీల లైసెన్సు ఇప్పిస్తానని తమిళనాడుకు చెందిన ఓ వ్యాపారి గోనె సంచిలో కోట్ల రూపాయలు తీసుకువచ్చి ఇచ్చారు. విద్యుత్ ప్లాంట్ల లైసెన్సుల మంజూరులో అవినీతికి పాల్పడితే ఎన్టీ రామారావు తీవ్రంగా మందలించారు. అయినా సరే గోతికాడ నక్కలా కాచుకుని వెన్నుపోటు పొడిచారు. రంగా హత్య వెనుక చంద్రబాబు-మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య(‘అరవై వసంతాల నా రాజకీయ ప్రస్థానం’ పుస్తకంలో పేర్కొన్నారు) ప్రజా నాయకుడు, విజయవాడ ఎమ్మెల్యేగా ఉన్న వంగవీటి మోహన రంగా హత్య వెనుక ప్రధాన కుట్రదారు చంద్రబాబే. ఆయన ప్రోద్బలంతోనే రంగాను హత్య చేశారు. రంగా జీవించి ఉంటే టీడీపీకి మనుగడ ఉండదని భావించారు. అందుకే రంగా హత్యకు పచ్చ జెండా ఊపారు.’ చంద్రబాబు అరాచక శక్తి-దేవినేని నెహ్రూ, మాజీ మంత్రి‘అధికారం కోసం చంద్రబాబు ఎంతటి అరాచకానికైనా పాల్పడతారు. 1994లో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావును, ఆయన కుమారుడు హరికృష్ణను మా ముందే పచ్చి బూతులు తిట్టారు. ఇక వైస్రాయ్ హోటల్ కుట్రతో ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారు. గతంలో ప్రతిపక్షంలో ఉండగా పార్టీ నిర్వహించే ధర్నాల సందర్భంగా బస్సులను దహనం చేయాలని కార్యకర్తలను ఆదేశించారు. సామాన్య ప్రయాణికులు చనిపోతారని కార్యకర్తలు చెప్పినా సరే ఆయన వినిపించుకునేవారు కాదు. సామాన్యులు చనిపోతే మనకేం... బస్సులు తగలబెట్టకపోతే పార్టీ కార్యక్రమాలు విజయవంతం అయినట్టు కాదు అని చంద్రబాబు చెప్పేవారు. అంతటి అరాచక శక్తి చంద్రబాబు. అవినీతి, అక్రమాల్లోనే చంద్రబాబు సీనియర్-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి(2019 ఎన్నికల సందర్భంగా గుంటూరు, రాజమహేంద్రవరం, విశాఖపట్నం ఎన్నికల సభల్లో ప్రసంగిస్తూ) ‘అద్భుతమైన రాజధాని అంటూ చంద్రబాబు అక్రమ సంపాదన ఆర్జనలో బిజీ అయిపోయారు. ఆయన చేస్తోంది రాజధాని నిర్మాణం కాదు.. కూలి పోతున్న టీడీపీ నిర్మాణం. అమరావతి, పోలవరం ప్రాజెక్టు సహా అన్నింటిలోనూ చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ దోపిడీకి పాల్పడుతున్నారు. సొంత హెరిటేజ్ కంపెనీ కోసమే ఆయన తపన అంతా. పోలవరం ప్రాజెక్టును తన అవినీతికి ఏటీఎంగా చేసుకున్నారు. ప్రజల్ని మోసగించేందుకు డేటా చోరీకి పాల్పడ్డారు. చంద్రబాబు తాను సీనియర్నని చెప్పుకుంటారు. కానీ సొంత మామకే వెన్నుపోటు పొడవటంలో ఆయన సీనియర్. తెలుగు ప్రజలను మోసం చేయడంలో సీనియర్. నేడు తిట్టిన పార్టీ ఓళ్లోనే రేపు కూర్చోవడంలో సీనియర్. కేంద్ర పథకాలను తనవిగా స్టిక్కర్ వేసుకోవడంలోనే సీనియర్.’ -
ప్రఫుల్ ప్రచండ రూపం
217 పరుగుల లక్ష్యఛేదన... అందరి కళ్లూ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీపైనే... ఎన్ని సిక్సర్లు కొడతాడు, రాజస్తాన్ ఎంత వేగంగా విజయం సాధిస్తుందనేదానిపైనే చర్చ... కానీ సన్రైజర్స్ పేసర్ ప్రఫుల్ హింగే ఒక్కసారిగా దూసుకొచ్చాడు. రెండో బంతికే వైభవ్ డకౌట్... నాలుగో బంతికి జురేల్ డకౌట్... చివరి బంతికి ప్రిటోరియస్ డకౌట్... ఐపీఎల్ చరిత్రలో తొలి ఓవర్లోనే 3 వికెట్లు పడటం మొదటిసారి కాగా, అరంగేట్ర మ్యాచ్లోనే ఈ ఘనత సాధించిన తొలి బౌలర్గా ప్రఫుల్ చరిత్రకెక్కాడు. ఆపై రాజస్తాన్ స్కోరు 3 ఓవర్లలో 9 పరుగులకే 5 వికెట్లు. అంతే... అక్కడే సన్రైజర్స్ మ్యాచ్ గెలిచేసింది... మిగతా ఆటంతా ఇక లాంఛనంగానే మిగిలింది. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ తాజా సీజన్లో రెండు సార్లు 200కుపైగా స్కోరు చేసి కూడా ఓటమిని మూటగట్టుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ ఈసారి భారీ స్కోరును కాపాడుకుంది. అయితే జట్టు బలహీనతగా కనిపించిన బౌలింగ్ విభాగం ఇప్పుడు మ్యాచ్ను గెలిపించింది. సోమవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన పోరులో ఇషాన్ కిషన్ బృందం 57 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (44 బంతుల్లో 91; 8 ఫోర్లు, 6 సిక్స్లు) చెలరేగగా... హెన్రిచ్ క్లాసెన్ (26 బంతుల్లో 40; 1 ఫోర్, 3 సిక్స్లు) రాణించాడు. అనంతరం రాజస్తాన్ 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటైంది. డొనొవాన్ ఫెరీరా (44 బంతుల్లో 69; 7 ఫోర్లు, 3 సిక్స్లు), రవీంద్ర జడేజా (32 బంతుల్లో 45; 5 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. వీరిద్దరు ఆరో వికెట్కు 72 బంతుల్లో 118 పరుగులు జోడించి పోరాడినా అది సరిపోలేదు. కీలక భాగస్వామ్యం... అభిషేక్ శర్మ (0) వెనుదిరిగిన తర్వాత ట్రవిస్ హెడ్ (18) కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అయితే ఇషాన్ మెరుపు బ్యాటింగ్ను ప్రదర్శించాడు. ఆర్చర్ ఓవర్లో 4, 6 కొట్టిన అతను బర్గర్, సందీప్ ఓవర్లలో ఒక్కో సిక్స్ బాదాడు. పవర్ప్లేలో జట్టు 51 పరుగులు చేయగలిగింది. ఇషాన్, క్లాసెన్ భాగస్వామ్యంలో రైజర్స్ ఇన్నింగ్స్ దూసుకుపోయింది. వీరిద్దరు మూడో వికెట్కు 39 బంతుల్లోనే 88 పరుగులు జోడించారు. బిష్ణోయ్ ఓవర్లో సిక్స్తో 30 బంతుల్లో కిషన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత తుషార్ వేసిన ఓవర్లో మూడు ఫోర్లు, సిక్స్తో చెలరేగిపోయిన కిషన్... ఆ తర్వాత ఆర్చర్ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదాడు. అయితే సెంచరీకి చేరువలో అతని ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత కొద్ది సేపటికే క్లాసెన్ కూడా అవుట్ కాగా, నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 28; 4 సిక్స్లు) దూకుడుతో స్కోరు 200కు చేరువైంది. చివర్లో సలీల్ అరోరా (13 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) మరికొన్ని కీలక పరుగులు జోడించాడు. అభిషేక్ మళ్లీ డకౌట్... సన్రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ హైదరాబాద్ అభిమానులను మరోసారి తీవ్రంగా నిరాశపర్చాడు. సొంత మైదానంలో అతని మెరుపు బ్యాటింగ్ను చూసేందుకు ఎంతో ఉత్సాహంతో మైదానానికి వచ్చిన ఫ్యాన్స్ రెండో మ్యాచ్లోనూ డకౌట్ను చూడాల్సి వచ్చింది. లక్నోతో జరిగిన గత మ్యాచ్లో రెండో బంతికి సున్నా చుట్టిన అభిషేక్ ఈసారి తొలి బంతికే పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. నితీశ్ మళ్లీ మూడు సిక్స్ల మోత... హైదరాబాద్లో లక్నోతో జరిగిన మ్యాచ్లో దిగ్వేశ్ రాఠీ వేసిన ఒకే ఓవర్లో మూడు సిక్స్లు బాదిన నితీశ్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్లోనూ అదే ఫీట్ను పునరావృతం చేశాడు. సందీప్ శర్మ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో లాంగాన్ మీదుగా రెండు వరుస సిక్స్లు బాదిన అతను అదే ఓవర్ చివరి బంతికి డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్లెగ్ దిశగా మరో సిక్స్తో తన ధాటిని ప్రదర్శించాడు. స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) బిష్ణోయ్ (బి) ఆర్చర్ 0; హెడ్ (సి) ఫెరీరా (బి) పరాగ్ 18; ఇషాన్ కిషన్ (సి అండ్ బి) సందీప్ 91; క్లాసెన్ (సి) పరాగ్ (బి) తుషార్ 40; నితీశ్ (సి) జురేల్ (బి) ఆర్చర్ 28; సలీల్ (నాటౌట్) 24; అనికేత్ (రనౌట్) 6; దూబే (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 216. వికెట్ల పతనం: 1–0, 2–55, 3–143, 4–162, 5–195, 6–209. బౌలింగ్: ఆర్చర్ 4–0–37–2, బర్గర్ 4–0–31–0, సందీప్ 4–0–52–1, తుషార్ 4–0–55–1, పరాగ్ 1–0–5–1, బిష్ణోయ్ 3–0–35–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) నితీశ్ (బి) సాకిబ్ 1; వైభవ్ (సి) అరోరా (బి) ప్రఫుల్ హింగే 0; జురేల్ (బి) ప్రఫుల్ హింగే 0; ప్రిటోరియస్ (సి) నితీశ్ (బి) ప్రఫుల్ హింగే 0; పరాగ్ (సి) అభిషేక్ (బి) ప్రఫుల్ హింగే 4; జడేజా (సి) అరోరా (బి) ఇషాన్ మలింగ 45; ఫెరీరా (బి) సాకిబ్ 69; ఆర్చర్ (సి) ప్రఫుల్ హింగే (బి) సాకిబ్ 2; తుషార్ (సి) కిషన్ (బి) ఇషాన్ మలింగ 25; బిష్ణోయ్ (సి) కిషన్ (బి) సాకిబ్ 0; బర్గర్ (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 10; మొత్తం (19 ఓవర్లలో ఆలౌట్) 159. వికెట్ల పతనం: 1–1, 2–1, 3–1, 4–2, 5–9, 6–127, 7–129, 8–140, 9–140, 10–159. బౌలింగ్: ప్రఫుల్ హింగే 4–0–34–4, సాకిబ్ 4–0–24–4, ఇషాన్ మలింగ 4–0–31–2, శివాంగ్ 3–0–28–0, నితీశ్ 2–0–19–0, హర్ష్ దూబే 2–0–22–0. -
అధికారులపై వృద్ధురాలి ప్రతీ‘కారం’!
గాందీనగర్(విజయవాడసెంట్రల్): విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం పీజీఆర్ఎస్ జరుగుతున్న సమయంలో ఓ వృద్ధురాలు కలకలం సృష్టించింది. కలెక్టరేట్ భూసేకరణ విభాగం కార్యాలయంలోకి ప్రవేశించి అక్కడి అధికారులపై కారం చల్లేందుకు యత్నించింది. ఈ ఘటనతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నందిగామ మండలం అనాసాగరం గ్రామంలో జాతీయ రహదారి విస్తరణలో భాగంగా 65 ఏళ్ల మల్లెంపూడి లక్ష్మీతులసి భూమిని 2003లో అప్పటి ప్రభుత్వం సేకరించింది. ఇందుకు సంబంధించి ఆమెకు 2022వ సంవత్సరంలో రూ.6,51,821 నష్టపరిహారం చెల్లించారు.అయితే తన నుంచి సేకరించిన భూమి మొత్తానికి సంబంధించి పరిహారం ఇవ్వలేదని, కొంత భాగానికి మాత్రమే ఇచ్చారని లక్ష్మీతులసి కలెక్టరేట్ అధికారుల చుట్టూ తిరుగుతోంది. ఇతరులకు ఎక్కువ విస్తీర్ణానికి పరిహారం చెల్లించారని ఆరోపించింది. పరిహారం కోసం తాను కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో తన చేయి విరిగిందని కన్నీరు పెట్టుకుంది. భూ సేకరణ విభాగంలో పనిచేస్తున్న అధికారి తనను ఇబ్బంది పెట్టాడని వాపోయింది. ఈ క్రమంలో సోమవారం పీజీఆర్ఎస్ జరగుతున్న సమయంలో కలెక్టరేట్కు చేరుకుంది.అక్కడ భూ సేకరణ విభాగంలోకి వెళ్లి తన వెంట తెచ్చుకున్న కారం ప్యాకెట్ విసిరింది. కారం అంతా బల్లలపై, కుర్చిలపై పడింది. అక్కడ నుంచి బయటకు వచ్చి ఆవరణలో బైఠాయించింది. తనకు న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమైంది. దీనిపై అధికారులు వివరణ ఇస్తూ.. లక్ష్మీతులసికి చెందిన 28 చదరపు మీటర్లు మాత్రమే భూమి సేకరించామని, అందుకు ఆమెకు రూ.6,51,821 పరిహారం కూడా చెల్లించామని కలెక్టర్ జి.లక్ష్మీశకు డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం నివేదించారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా ఈ విషయాన్ని పునః పరిశీలించాలని నందిగామ తహసీల్దార్ను ఆదేశించారు. ఈ మేరకు డీఆర్వో ప్రకటన విడుదల చేశారు. -
పోలింగ్ కేంద్రాల్లో బయోమెట్రిక్ అమలు చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: పోలింగ్ కేంద్రాల్లో దొంగ, నకిలీ, డూప్లికేట్ ఓట్ల బెడదను పూర్తిగా అరికట్టే లక్ష్యంతో ఫింగర్, ఐరిస్ బయోమెట్రిక్ వ్యవస్థను అమలుచేయాలని సుప్రీంకోర్టులో న్యాయవాది అశ్వినీకుమార్ ఉపాధ్యాయ్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలుచేశారు. ఓటింగ్ ప్రక్రియలో అత్యంత పారదర్శకతను కోరుతూ దాఖలైన ఈ పిటిషన్ను విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చిల ధర్మాసనం స్వీకరించింది. ఓటు వేసే ముందు ఓటర్ల వేలిముద్రలు, ఐరిస్, ముఖ గుర్తింపు (బయోమెట్రిక్, ఫేషియల్ రికగ్నిషన్) తనిఖీని తప్పనిసరి చేయాలని, వీటిని అమలుచేసేలా కేంద్రప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘాలను ఆదేశించాలని ధర్మాసనాన్ని పిటిషనర్ కోరారు. పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ నేత, న్యాయవాది ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో నకిలీ, దొంగ ఓట్లు, ఒకరి బదులు మరొకరు ఓటేయడం, నగదు ప్రలోభాల వంటి ఘటనలు ఎక్కువయ్యాయి. పాత ఓటర్ ఐడీ కార్డులు, వాటిపై సరిగా కన్పించని ముఖాలు, కార్డుల్లో టైపింగ్ తప్పిదాలు, రియల్టైమ్తో అనుసంధానంకాని పాత సమాచారం వంటి లోపాలు దొంగ, నకిలీ ఓట్ల వ్యవస్థ తిష్టవేయడానికి కారణమవుతున్నాయి. ఫింగర్, ఐరిస్తో ఇలాంటివన్నీ ఆగిపోతాయి. పోలింగ్ వ్యవస్థలో లోపాలను అరికట్టేందుకు బయోమెట్రిక్ అనేది అత్యంత అవసరం. ‘ఒక పౌరుడికే ఒకే ఓటు’అనే రాజ్యాంగ స్ఫూర్తిని బయోమెట్రిక్ విధానం కాపాడుతుంది. ప్రజాప్రాతినిధ్య చట్టం–1950 కింద ఆధార్ను ఇప్పటికే సరైన గుర్తింపు కార్డుగా పరిగణిస్తున్నారు. అదే తరహాలో పోలింగ్ బూత్లలో బయోమెట్రిక్ను అమలుచేయవచ్చు’’అని ఆయన కోర్టులో వాదించారు. ‘‘మార్చి 28న ఈసీకి వినతిపత్రం ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వాస్తవానికి రాజ్యాంగంలోని 324 అధికరణం ద్వారా సంక్రమించిన సర్వాధికారాలతో ఈసీ ఇలాంటి అత్యంత పారదర్శకమైన విధానాలను స్వీయనిర్ణాయాధికారాలతో అమలుచేయవచ్చు’’అని ఆయన గుర్తుచేశారు. తర్వాత కోర్టు స్పందించింది. ‘‘బయోమెట్రిక్ తనిఖీల విధానాన్ని పోలింగ్ కేంద్రాల్లో తీసుకురావాలంటే ప్రస్తుత ఎన్నికల నిబంధనల్లో భారీ మార్పులు చేయాల్సి ఉంటుంది. అధునాతన సాంకేతికతను దేశవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో అమలుచేయాలంటే కేంద్రప్రభుత్వ ఖజానాపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుంది. ఇప్పుడు జరగబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఫింగర్, బయోమెట్రిక్ ఐరిస్ను అమలుచేయాలని ఆదేశించలేం. ఏర్పాట్లన్నీ అయిపోయిన ఈ దశలో ఇప్పటికిప్పుడు వినూత్న విధానం అమలు అసాధ్యం. తదుపరి సార్వత్రిక ఎన్నికలు లేదా శాసనసభల ఎన్నికల నాటికి ఈ బయోమెట్రిక్ విధానం అమలు సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేయాల్సి ఉంది’’అని ధర్మాసనం పేర్కొంది. బయోమెట్రిక్ విధానం అమలుపై మీ స్పందన తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం, పలు రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. -
ఫీజుల వసూళ్ల పేరుతో వడ్డీ వ్యాపారమా!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కార్పొరేట్ విద్యాసంస్థలు ఫైనాన్స్ కంపెనీలతో కుమ్మక్కై విద్యార్థుల తల్లిదండ్రులతో వడ్డీ వ్యాపారం చేస్తున్నాయని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర మండిపడ్డారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది చదువులు పూర్తి కాకుండానే నిబంధనలకు విరుద్ధంగా వచ్చే విద్యా సంవత్సరానికి మొదటి టర్మ్ ఫీజులు వసూలు చేస్తున్నా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు.నిర్ణీత సమయంలో ఫీజులు చెల్లించకపోతే వడ్డీ చెల్లించాల్సి వస్తుందని మెసేజ్లు పంపి మరీ విద్యార్థుల తల్లిదండ్రులను బెదిరిస్తున్నా ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. చైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ విద్యాసంస్థలు 6, 9 నెలల కాలపరిమితితో విద్యార్థులకు రుణాలు ఇప్పిస్తూ ఈఎంఐల రూపంలో అసలుతోపాటు వడ్డీ కూడా వసూలు చేస్తున్నాయన్నారు. విద్యా సంస్థల ముసుగులో ఫైనాన్స్ వ్యాపారం మొదలుపెడితే ప్రభుత్వానికి పట్టదా? అని నిలదీశారు.వైఎస్సార్సీపీ హయాంలో ఫీజుల నియంత్రణకు పర్యవేక్షణ కమిటీ వేసి ఇలాంటివి జరగకుండా అడ్డుపడిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ.. టీడీపీ కూటమి ప్రభుత్వంలో విద్యను వ్యాపారం చేసి ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న లోకేశ్కి విద్యాశాఖపై ఏమాత్రం నియంత్రణ, అవగాహన లేదని.. ఆయన తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
హంగరీలో విక్టర్ 16 ఏళ్ల పాలనకు తెర
బుడాపెస్ట్: నాటో కూటమిలో ఉంటూ యూరప్కు పక్కలో బల్లెంలా తయారైన హంగరీ ప్రధానమంత్రి విక్టర్ ఆబన్ 16 ఏళ్ల నిరంకుశ పాలనకు హంగరీయన్లు తెరదించారు. ఇటీవల జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో విక్టర్ సారథ్యంలోని ఫీదెస్ పార్టీని ఓటర్లు చిత్తుగా ఓడించారు. సోమవారంనాటికి 98 శాతం ఓట్ల లెక్కింపు పూర్తవ్వగా ఇప్పటిదాకా వెల్లడైన ఫలితాల ప్రకారం విక్టర్కు చెందిన ఫీదెస్ పార్టీ కేవలం 55 చోట్ల గెలిచింది. యువనేత పీటర్ మాగ్యా సారథ్యంలోని టీసా పార్టీకి జనం బ్రహ్మరథంపట్టారు. మూడింట రెండొంతుల స్థానాల్లో టీసా పార్టీ విజయంసాధించింది. దీంతో విక్టర్ ఆబన్ పాలనాశకం అంతమైంది. పీటర్ పార్టీ ఏకంగా 138 చోట్ల విజయం సాధించింది. అవర్ హోంల్యాండ్ పార్టీకి కేవలం ఆరు సీట్లు దక్కాయి. యూరప్ సభ్యదేశంగా ఉంటూ నాటోకు దన్నుగా నిలబడాల్సిందిపోయి రష్యా అధ్యక్షుడు పుతిన్కు గట్టి మద్దతునిస్తూ ఆబన్ ఐరోపా దేశాలకు కంట్లో నలుసులా తయారయ్యాడు. యుద్ధంలో రష్యాను దెబ్బతీసేందుకు ఉక్రెయిన్కు భారీస్థాయిలో సైనిక సాయం చేయాలని నాటో సభ్య దేశాలు భావించిన ప్రతిసారీ విక్టర్ తన వీటో అధికారంతో ఏకాభిప్రాయానికి మోకాలడ్డి విమర్శలపాలయ్యారు. పశ్చిమాసియా యుద్ధంలో తనతో కలిసిరాని నాటో దేశాలపై గుర్రుగా ఉన్న ట్రంప్తోనూ విక్టర్కు సత్సంబంధాలున్నాయి. అమెరికా ఎన్నికల్లో జేడీ వాన్స్ తరఫున సైతం విక్టర్ ప్రచారంచేశారు. గత 16 ఏళ్లుగా హంగరీలో విక్టర్ తన బంధువులు, అనుచరులు, మిత్రులకు కీలక పదవులు అప్పగించి పాలనను అనుకూలంగా మార్చుకున్నారు. కుదేలైన ఆర్థికవ్యవస్థ, అప్రజాస్వామిక విధానాలతో దేశం పరువును మంటగలిపారు. తర్వాతి పాలకులు తన పరిపాలనా నిర్ణయాలను మార్చేయకుండా రాజ్యాంగ సవరణ చేశారు. రాజ్యాంగ ధర్మాసనం అధికారాలను పరిమితంచేశారు. తనకు అనువైన వ్యక్తులకు జడ్జీలుగా పదవులు కట్టబెట్టారు. మీడియాపై ఆంక్షలు విధించి ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాయకుండా అడ్డుకున్నారు. విక్టర్ అస్తవ్యస్థ పాలన ఎట్టకేలకు అంతమైందని గెలిచిన యువనేత పీటర్ మాగ్యా ఆదివారం రాత్రి డాన్యూబ్ నదీతీరంలో పార్లమెంట్ ప్రాంగణంలో వేలాది మంది కార్యకర్తల సమక్షంలో ప్రసంగించారు. దేశంలో నూతన శకం ఆరంభమైందన్నారు. విక్టర్ ఓటమి వార్త తెలిసి లక్షలాది మంది జనం వీధుల్లోకి వచ్చి సంబరాలుచేసుకున్నారు. సోమవారం తెల్లవారుజాముదాకా సంబరాలు కొనసాగాయి. విక్టర్ పాలన ముగియడాన్ని పలు యూరప్ దేశాలు స్వాగతించాయి. దేశంలో అవినీతిని అంతమొందిస్తానని, యూరో కరెన్సీని తీసుకొస్తానని పీటర్ ఎన్నికల్లో వాగ్దానంచేశారు. ఎన్నికల్లో గెల్చిన పీటర్కు భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. -
ఆరునెలలుగా జీతాలు ఇవ్వడం లేదు
తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో తెలుగుదేశం పార్టీనేత, రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణ సంస్థ చైర్మన్ శావల దేవదత్ నిర్వహిస్తున్న అమరావతి ఆస్పత్రి ఎదుట ఆస్పత్రి సిబ్బంది సోమవారం ధర్నా చేశారు. తమకు నెలల తరబడి పెండింగులో ఉన్న జీతాలు చెల్లించాలంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఆరు నెలలుగా 30 మందికి జీతాలు చెల్లించకుండా ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి అనుసరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్కరికి సుమారు రూ.60 వేల వరకు జీతం బకాయిలు రావాలని వివరించారు.వేతనాలు లేక కుటుంబ పోషణ భారమైందని, పిల్లల ఫీజులు కట్టలేక, కుటుంబం గడవక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని ఆక్రోశించారు. ఈ విషయమై తాము కలెక్టరుకు, లేబర్ కమిషనర్కు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ఇప్పటికి పలుమార్లు చర్చలు జరిపినా, ఆస్పత్రి యాజమాన్యం వేతనాల చెల్లింపునకు ముందుకు రానందున 1936 వేతనాల చెల్లింపు చట్టం ప్రకారం ప్రభుత్వానికి అప్పీలు చేసుకోవాలని కార్మిక శాఖ డెప్యూటీ కమిషనర్ ధనలక్ష్మి ఇటీవల సూచించారని, తమకు ఎవరు న్యాయం చేస్తారని ఆస్పత్రి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.కాగా, వేతనాల కోసం శావల దేవదత్ వద్దకు వెళ్లిన సిబ్బందిని ఆయన స్పందించిన తీరు తీవ్ర మనోవేదనకు గురిచేసింది. ‘మీడియాకు ఎక్కి పరువు తీస్తే జీతాలు ఇస్తారా? మీరు ఎమ్మెల్యేకి, ఎంపీకి, మంత్రి లోకేశ్కి చెప్పుకున్నా నాకేమీ ఇబ్బంది లేదు’ అని దేవదత్ సిబ్బందితో బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. ఇంటికి వెళ్లి కొలికపూడిని కొడతా: దేవదత్తాను ఎన్నికల్లో టికెట్ కోసం ఎంపీ చిన్నికి డబ్బులిచ్చానని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఆయన అనుచరులు చేస్తున్న ప్రచారాన్ని దేవదత్ ఖండించారు. తన ఆస్పత్రి సిబ్బంది ఆందోళన చేయడానికి తెరవెనుక ప్రోత్సహించే వారెవరో తెలుసని, ఇటువంటి చర్యలకు పాల్పడే వారిని వదలబోనని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును హెచ్చరించారు. ఇలాంటివి ఆపకపోతే ఆయన ఇంటికి వెళ్లి కొడతానని దేవదత్ హెచ్చరించారు.రాష్ట్రవ్యాప్తంగా బెల్ట్షాపులే..! ఇక్కడే ఉన్నట్టు చెప్పడానికి నువ్వెవడివి? తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడిపై ధ్వజమెత్తిన టీడీపీనేత దేవదత్ ‘రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో బెల్టు షాపులు ఉన్నాయి.. ఒక్క తిరువూరు నియోజకవర్గంలో ‘బెల్టు షాపులు ఉన్నట్టు చెప్పడానికి నువ్వెవడివయ్యా?.. నీకేంటి నొప్పి’ అంటూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై టీడీపీ నేత, రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణ సంస్థ చైర్మన్ శావల దేవదత్ విరుచుకుపడ్డారు. నియోజకవర్గంలో బెల్టు దుకాణాలు అధికంగా ఉండడంతో ప్రజలు మద్యానికి బానిసై ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా నష్టపోతున్నారని ఎమ్మెల్యే కొలికపూడి చేసిన ఫిర్యాదుపై టీడీపీ నేత శావల దేవదత్ తీవ్రంగా స్పందించారు.ఆదివారం రాత్రి తిరువూరులో విడుదల చేసిన వీడియోలో ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు. ‘నీ చేతకాని తనంతో పార్టీపై ఆరోపణలు చేయద్దు.. నీ వల్ల ఏమైనా అవుతుందా? పల్లె కన్నీరు కారుస్తోందంటున్నావు. నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు’ అంటూ ఎమ్మెల్యేపై దేవదత్ ధ్వజమెత్తారు. కూర్చుని సోషల్ మీడియాలో అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదంటూ దేవదత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నారీ శక్తికి పట్టం కట్టేందుకే!
న్యూఢిల్లీ: చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం కోసం మహిళల దశాబ్దాల ఎదురుచూపులకు అతి త్వరలో తెర పడనుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. లోక్సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను 2029 నుంచే అమలు చేసేలా నారీ శక్తి వందన్ అధినియమ్కు రాజ్యాంగ సవరణ చేపట్టనున్నట్టు గుర్తు చేశారు. ఇందుకోసం గురువారం నుంచి పార్లమెంటు మూడు రోజుల పాటు సమావేశం కానుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఢిల్లీలో జరిగిన ‘నారీ శక్తి వందన్’సదస్సును ఉద్దేశించి మోదీ మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ల రూపంలో ఈ శతాబ్దిలోకెల్లా అతి ముఖ్యమైన నిర్ణయాన్ని భారత్ అతి త్వరలో తీసుకోబోతోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దాన్ని నారీ శక్తికే అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. ‘‘మహిళా రిజర్వేషన్ల చట్టానికి రాజ్యాంగ సవరణ ద్వారా మన పార్లమెంటు కొత్త చరిత్ర సృష్టించనుంది. మనందరి జీవితకాలంలో దేశ చరిత్రలోనే అతి ముఖ్యమైన నిర్ణయంగా ఇది మిగిలిపోనుంది. మహిళా సాధికారతకు నిదర్శనంగా, వారి శక్తియుక్తులకు నిజమైన నివాళిగా నిలవనుంది. భారత్లో స్త్రీ పురుష సమతావాదం, సామాజిక న్యాయం కేవలం నినాదాలు కావని, రోజువారీ పని సంస్కృతి మొదలుకునిఅత్యున్నత నిర్ణయ ప్రక్రియ దాకా అన్నింట్లోనూ అవి విడదీయలేని భాగమని నిరూపించనుంది. భారత మహిళలు ఇప్పటికే పాలనలో అన్ని స్థాయిల్లోనూ నిర్ణాయక పాత్ర పోషిస్తూ తమను తాము నిరూపించుకుంటున్నారు. మున్ముందు మరిన్ని పెద్ద బాధ్యతలను సమర్థంగా నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నారు’’అంటూ కొనియాడారు. లోక్సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు 2027 జనగణనతో ముడిపడి ఉన్నాయి. దాంతో ప్రస్తుత చట్టం ప్రకారం వాటిని 2034 నుంచి మాత్రమే అమలు చేయడం వీలు పడుతుంది. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్లను 2029 నుంచే అమలు చేసేందుకు వీలుగా రాజ్యాంగ సవరణ చేసేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. లోక్సభ స్థానాల సంఖ్యను 816కు పెంచనున్న నేపథ్యంలో 273 స్థానాలు మహిళలకు రిజర్వు కానున్నాయి. అత్యున్నత పదవుల్లో ‘ఆమె’ స్వాతంత్య్ర సంగ్రామం మొదలుకుని రాజ్యాంగ పరిషత్తు దాకా మహిళలు కీలక పాత్ర పోషిస్తూ వచ్చారని మోదీ గుర్తు చేశారు. స్వతంత్ర భారతానికి పునాదిరాయి వేయడంలో వారి పాత్ర ఎనలేనిదన్నారు. ‘‘దేశ నిర్మాణంలో కీలకమైన పాత్రలు పోషించే అవకాశం దొరికిన ప్రతిసారీ అద్భుత పనితీరుతో భారత మహిళలు నిత్యం తమను తాము నిరూపించుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రపతి నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి దాకా అత్యున్నత బాధ్యతలను అద్భుతంగా నెరవేరుస్తున్నారు. విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారం వంటి రంగాల్లో మహిళ భాగస్వామ్యం చురుగ్గా ఉన్నచోట మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 14 లక్షల మందికి పైగా మహిళలు స్థానిక పాలనలో తమదైన ముద్ర వేస్తున్నారు. 21 రాష్ట్రాల్లోని పంచాయతీల్లో మహిళల భాగస్వామ్యం దాదాపు 50 శాతానికి చేరింది. ఈ ఘనతను చూసి ప్రపంచమే విస్తుపోతోంది’’అంటూ ప్రధాని హర్షం వెలిబుచ్చారు. అన్ని పార్టీలదీ అదే ఆకాంక్ష మహిళా రిజర్వేషన్ల బిల్లును 2023లో పార్లమెంటులో అన్ని పార్టీలూ ఏకగ్రీవంగా ఆమోదించాయని, 2029లోపే దాన్ని అమలు చేయాలని ఆకాంక్షించాయని మోదీ గుర్తు చేశారు. చర్చలు, పరస్పర సహకారం ద్వారా దీన్ని పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ‘‘దీనిపై దేశవ్యాప్తంగా మహిళల్లో పట్టరాని ఉత్సాహం కనిపిస్తోంది. లోక్సభ, అసెంబ్లీల్లో పెద్ద సంఖ్యలో కాలు పెట్టేందుకు వారు ఎంతో ఉత్సుకతతో ఉన్నారు. ఆ కలలకు ఇప్పుడిక రెక్కలు రానున్నాయి’’అని అభిప్రాయపడ్డారు.గృహస్తును కాకపోయినా సాదకబాధకాలు తెలుసు! మహిళల ఆర్థిక సాధికారత వల్ల కుటుంబాల్లో వారికి గౌరవాదరాలు పెరిగాయని మోదీ అభిప్రాయపడ్డారు. తాను గృహస్తును కాకపోయినా ఇంటిని నడపడంలోని సాదకబాధకాలు బాగా తెలుసని ఆయన చెప్పడంతో సమావేశంలో పాల్గొన్న మహిళలంతా పెద్దపెట్టున చప్పట్లతో హర్షధ్వానాలు చేశారు! ‘‘ఇల్లు మొదలుకుని వాహనం దాకా కుటుంబ ఆస్తులన్నీ గతంలో ప్రధానంగా పురుషుల పేర్లతోనే ఉండేవి. పీఎం ఆవాస్ యోజన తదితరాలతో పరిస్థితి మారింది. ఆస్తులకు మహిళలు యజమానులవుతున్నారు. గత 11 ఏళ్లలో 3 కోట్ల మందికి పైగా మహిళలు ఇంటి యజమానులయ్యారు’’అని ప్రధాని అన్నారు. ‘‘గతంలో ఇళ్లలో తండ్రీ కొడుకులు వ్యాపారం గురించి చర్చించుకుంటుంటే మహిళలు వారికి చాయ్ బిస్కట్లు ఇచ్చేందుకే పరిమితమయ్యేవారు. మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించడంతో ఇప్పుడు పరిస్థితులు మారాయి. వ్యాపార నిర్ణయాలకు సంబంధించి అమ్మతో కూడా చర్చిద్దామని కొడుకులు తండ్రులతో అంటున్నారు’’అని చెప్పుకొచ్చారు. -
పోప్ దుర్బలుడు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చివరికి పోప్ను కూడా వదలడం లేదు. ఇరాన్పై యుద్ధాన్ని తప్పుబడుతూ పోప్ లియో–14 చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. లియో ఓ బలహీన పోప్ అంటూ దుయ్యబట్టారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టడమే గాక మీడియాతో మాట్లాడుతూ కూడా పోప్పై పదునైన విమర్శలకు దిగారు. అసలు తనవల్లే ఆయనకు పోప్ పదవి దక్కిందని చెప్పుకొచ్చారు! ఈ విమర్శలపై పోప్ కూడా దీటుగా స్పందించారు. శాంతి సందేశాన్ని విన్పించే విషయంలో ట్రంప్ యంత్రాంగానికి తాను భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ‘‘దైవ సందేశాన్ని ట్రంప్ అర్థం చేసుకోవడం లేదు. నేను ఆయన్నో, ఇంకెవరినో నేరుగా విమర్శించడం లేదు. ట్రంప్తో వాదనకూ దిగదలచుకోలేదు. కానీ వాస్తవాలు చెప్పేందుకు మాత్రం ఎప్పుడూ వెనకాడబోను. ఒక్కటి మాత్రం నిజం. శాంతి స్థాపకులు మాత్రమే ఆశీర్వాదానికి పాత్రులు’’అన్నారు. వారి మాటల యుద్ధం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది! అమెరికా అధ్యక్షులకు, పోప్ స్థానంలో ఉన్నవారికి నడుమ అభిప్రాయ భేదాలు కొత్తేమీ కాకున్నా ఈ స్థాయి వాద ప్రతివాదాలు మాత్రం ఇదే తొలిసారి. ఇలాంటి పోప్ నాకొద్దు! పోప్గా లియో–14 సరిగా పని చేయడం లేదని ట్రంప్ ఆదివారం ట్రూత్ సోషల్ పోస్టులో ఆక్షేపించారు. ‘‘నేరాలపై స్పందించడంలో మరీ బలహీనుడు. ఇక ఆయన విదేశాంగ విధానమైతే మరీ దారుణం! ఇరాన్ వద్ద అణ్వాయుధమున్నా పర్లేదనుకునే, వెనెజువెలాపై అమెరికా దాడి చేయొద్దనుకునే, ఇలా అమెరికా అధ్యక్షుడినే విమర్శించే పోప్ నాకొద్దు! ఆయన మితిమీరిన ఉదారవాదం కనబరుస్తున్నారు. నేరాలను ఇష్టపడే వ్యక్తిలా కూడా కన్పిస్తున్నారు. ఇప్పటికైనా కాస్త ఇంగిత జ్ఞానం వాడాలి. వామపక్షవాదానికి దన్నుగా నిలవడం మానుకోవాలి. లియో తీరు ఆయనకే గాక క్యాథలిక్ చర్చికి కూడా చాలా చేటు చేస్తోంది. ఆయన ఇప్పటికైనా రాజకీయ నాయకునిగా ప్రవర్తించడం మాని గొప్ప పోప్గా రాణించడంపై దృష్టి పెడితే మంచిది! నేనైతే పోప్ లియోకు అస్సలు అభిమానిని కాను. నావల్లే ఆయనకు పోప్ పదవి దక్కింది. లియో పేరు తొలుత చర్చి పరిశీలనలో కూడా లేదు. నన్ను ఎదుర్కోవాలంటే ఆ పదవిలో ఒక అమెరికన్ ఉండాలనే భావనతోనే పోప్గా నియమించింది’’అంటూ తూర్పారబట్టారు. ఇరాన్పై ట్రంప్ యుద్ధాన్ని పోప్ తీవ్రంగా తప్పుబడుతూ వస్తున్నారు. ‘‘తాము సర్వశక్తిమంతులమని కొందరిలో నెలకొన్న భ్రమలే ఇరాన్పై యుద్ధానికి కారణం. కానీ యుద్ధాలకు దిగేవారి ప్రార్థనలను దేవుడు ఆలకించడు’’అని గతంలోనూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ నాగరికతనే నాశనం చేస్తామన్న ట్రంప్ బెదిరింపులను కూడా తీవ్రంగా తప్పుబట్టారు. క్రీస్తు మాదిరిగా దివ్య శక్తులతో అమెరికాకు తాను హీలింగ్ చేస్తున్నట్టుగా ఉన్న ఈ ఏఐ ఆధారిత ఫొటోను ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో కాసేపటికే దాన్ని డిలీట్ చేశారు. -
ఎంత చెప్పినా మారరా..?
సాక్షి టాస్క్ ఫోర్స్: చంద్రబాబు సర్కార్లో వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి పెద్దల మెప్పు పొందాలన్న పోలీసుల దాష్టికం మరోసారి బట్టబయలైంది. చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘర్షణ కేసులో 19 మంది వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టిన పోలీసులు.. వీరిలో 13 మందిని అరెస్ట్చేసి తిరుపతి 2వ అదనపు మున్సిప్ కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా పోలీసులు హైడ్రామా నడిపారు. వీరిని తీవ్రంగా హింసించడమే దీనికి కారణం. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కోర్టుముందు హాజరుపరిచినప్పుడు, తమను పోలీసులు రెండు రోజుల పాటు నిర్బంధించి విచక్షణా రహితంగా కొట్టారని ఆరుగురు నిందితులు తెలిపారు. తమ శరీరంపై వున్న గాయాలను న్యాయమూర్తికి చూపించారు. దీంతో న్యాయమూర్తి పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీకు ఎంత చెప్పినా మారరా? ఇష్టం వచ్చినట్లు కేసులు కడతారా..? అడగకుంటే నాపైన కూడా హత్యాయత్నం కేసు పెడతారా..? ఏ కేసు తెచ్చినా హత్యాయత్నం కేసు కింద పెడతారా ? ఇప్పుడు మీరు పెట్టిన హత్యాయత్నం కేసులో మీకు ఫిర్యాదు చేసిన వ్యక్తి గాయపడినట్లు వూండ్ (గాయాల) సర్టిఫికెట్ ఎక్కడ..? ఇలాగైతే మీపైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.. పోలీస్ స్టేషన్లో నిర్బంధించి కొట్టడమేంటి..? కొట్టే హక్కు మీకు ఎవ్వరు ఇచ్చారు..? ఆ ఎస్సై సస్పెన్షన్కు సిఫార్సు చేస్తాం.. సీఐకి మెమో ఇవ్వమని ఆదేశిస్తాం..’ అంటూ న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరించాలే తప్ప తప్పుడు కేసులు పెడితే ఎవ్వరూ ఏమీ చేయలేరు అనుకోవడం పొరపాటు. అరెస్టు చేసిన 24 గంటల్లో కోర్టు ముందు హాజరు పరచాలి. ఎప్పుడో పట్టుకుంటారు. 24 గంటల ముందు పట్టుకున్నట్టు రికార్డుల్లో నమోదు చేస్తారు. ఇదంతా మాకు తెలియదు అనుకుంటున్నారా..? తప్పుడు కేసులతో మీరు ఏం సాధిస్తారో అర్థం కావడం లేదు. ఇప్పుడు తెచ్చిన కేసులో కూడా గాయాలను ధ్రువీకరించే సర్టీఫికెట్ లేదు. అయినా 19 మంది మీద హత్యాయత్నం కేసు పెట్టారు.. ఇలా చేయడం ఎంత వరకు న్యాయం’’ అంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు.నిందితుల వైద్య పరీక్షలకు ఆదేశంపోలీసులు కొట్టడంతో చేతులు, కాళ్లకు గాయాలైనట్టు న్యాయమూర్తికి చూపించిన ఆరుగురు నిందితుల నుంచి వాంగ్మూలం తీసుకున్న న్యాయమూర్తి, మరొక్కసారి వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి సీల్డు కవర్లో రిపోర్టులు పంపించాలని ఆదేశించారు. ఆసుపత్రికి తరలించే బాధ్యతను నిందితులపై కేసు పెట్టిన తిరుచానూరు పోలీసులకు కాకుండా తిరుపతి వెస్ట్ పోలీసులకు అప్పగించారు. దీంతో సోమవారం రాత్రి తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాత నిందితులను తిరిగి న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. అనంతరం 13 మంది నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయమూర్తి వారిని కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు.ప్రత్యరి్థవర్గంపై బెయిలబుల్ కేసు నమోదు ఈ వ్యవహారంలో ప్రత్యర్థి వర్గంపై పోలీసులు నామమాత్రపు కేసులు బనాయించి చేతులు దులుపుకున్నారు. ఈ కేసులో ఫిర్యాదు దారుగా వచ్చిన దుర్వాసులు రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదుచేసిన పోలీసులు, ఆయనపై దాడికి పాల్పడిన ప్రత్యర్థి వర్గంపై బెయిలబుల్ కేసులు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు: బాధిత కుటుంబాలు పోలీసు అధికారులపై ప్రైవేటు కేసు వేయడంతో పాటు జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు ఫిర్యాదు చేయనున్నట్టు బాధిత కుటుంబీకులు వెల్లడించారు. ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చిన వారిని కూడా హత్యాయత్నం కేసులో ఇరికించిన ఆధారాలను హైకోర్టుకు నివేదించనున్నట్టు తెలిపారు. -
'అలా చేస్తే చైనాకు సమస్యలు వస్తాయి': ట్రంప్ హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇటీవల చైనాతో తమకు ఉన్న సంబంధాలపై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాను చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ప్రత్యక్షంగా మాట్లాడలేదని.. అయినప్పటికీ, అమెరికా - చైనా మధ్య చాలా మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.వైట్ హౌస్లో విలేకరులతో మాట్లాడుతూ.. పశ్చిమాసియా ఆసియా ప్రాంతంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులపై కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆ ప్రాంతంలో ఉన్న ఉద్రిక్తతలు త్వరగా ముగియాలని షీ జిన్పింగ్ కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. ఇది చైనా కూడా శాంతి స్థాపనకు ఆసక్తి చూపుతున్నదని సూచిస్తుంది.చైనా ఇరాన్కు సైనిక సహాయం అందిస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. “అలా చేస్తే చైనాకు పెద్ద సమస్యలు వస్తాయి” అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అమెరికా-చైనా మధ్య ఎలాంటి సంబంధం ఉందో స్పష్టం చేస్తుంది.ట్రూత్ సోషల్లో ఒక వివరణాత్మక పోస్ట్లో, ట్రంప్ సవరించిన షెడ్యూల్ను ధృవీకరించి, వాషింగ్టన్ - బీజింగ్ మధ్య పరస్పర దౌత్య సంబంధాల ప్రణాళికలను వివరించారు. "ఇరాన్లో మా సైనిక చర్య కారణంగా మొదట వాయిదా పడిన కారణంగా, జిన్పింగ్తో నా సమావేశం తిరిగి షెడ్యూల్ చేయడం జరిగిందని.. ఇది మే 14, 15 తేదీలలో బీజింగ్లో జరుగుతుందని అన్నారు''.ఈ సందర్భంగా ఆయన తన భార్య మెలానియా ట్రంప్తో కలిసి చైనాకు వెళ్లనున్నారు. అలాగే భవిష్యత్తులో షీ జిన్పింగ్ దంపతులను అమెరికాలో ఆతిథ్యం ఇవ్వాలని కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న సైనిక చర్యల కారణంగా ఈ సమావేశం ఆలస్యమైందని ఆమె తెలిపారు. ఈ పరిస్థితిని షీ జిన్పింగ్ అర్థం చేసుకున్నారని చెప్పారు. -
హార్మూజ్ దిగ్బంధం
కైరో/దుబాయ్: పశ్చిమాసియా ఉద్రిక్తతలు మళ్లీ తీవ్ర రూపు దాలుస్తున్నాయి. చర్చల వైఫల్యంపై మండిపడుతున్న అమెరికా మరోసారి ఇరాన్పై తీవ్ర చర్యలకు దిగుతోంది. సోమవారం సాయంత్రం నుంచి హార్మూజ్ జలసంధితో పాటు ఇరాన్కు చెందిన ఓడరేవులన్నింటినీ దిగ్బంధించింది. హార్మూజ్ గుండా ఇరాన్ ఓడల రాకపోకలను కూడా అడ్డుకుంటోంది. చర్చలు విఫలమైతే హార్మూజ్ను దిగ్బంధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారమే హెచ్చరించడం తెలిసిందే. అమెరికా నావికా దళం సోమవారం సాయంత్రమే రంగంలోకి దిగింది. ఇరాన్ తీర ప్రాంతాలన్నింటినీ పూర్తిస్థాయిలో పహారా కాస్తోంది. ఏ దేశానికి చెందిన నౌకలూ ఇరాన్ రేవుల్లోకి రాకపోకలు జరపడానికి వీల్లేదని యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అయితే, ఇరానేతర రేవుల నుంచి వచ్చే నౌకలను మాత్రం హార్మూజ్ గుండా వెళ్లేందుకు అనుమతిస్తామని వెల్లడించడం విశేషం! ఇరాన్ ‘ఫాస్ట్ అటాక్’షిప్లు గనక తమ నావికా దళం దిగ్బంధించిన ప్రాంతాల సమీపంలోకి వస్తే మరో ఆలోచనే లేకుండా వాటిని తక్షణం పేల్చేస్తామని ట్రంప్ అల్టిమేటమిచ్చారు. అమెరికా తాజా చర్యతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు విపరీతంగా పెరిగేలా కన్పిస్తున్నాయి. అంతేగాక ట్రంప్ ప్రకటించిన రెండు వారాల కాల్పుల విరమణ కూడా బుట్టదాఖలయ్యేలా కన్పిస్తోంది. దాని గడువు ఏప్రిల్ 22 దాకా ఉంది. ఇరాన్ ఓడరేవుల దిగ్బంధం ద్వారా అమెరికా సాధించబోయేది ఏమిటో అర్థం కావడం లేదంటూ అంతర్జాతీయ నిపుణులు పెదవి విరుస్తున్నారు. అగ్ర రాజ్యం తాజా చర్యలపై ఇరాన్ మండిపడింది. గల్ఫ్ ప్రాంతంలోని ఓడరేవులన్నింటినీ పూర్తిస్థాయిలో లక్ష్యం చేసుకుని దాడులకు దిగుతానని తీవ్రంగా హెచ్చరించింది. ‘‘పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్ర ప్రాంత రక్షణ బాధ్యత ఈ ప్రాంతంలోని ప్రతి దేశానిదీ. మాపై దాడులు, దిగ్బంధాలు జరిగితే ఈ ప్రాంతంలోని ఏ రేవూ సురక్షితం కాబోదు’’అని ఇరాన్ సైన్యం, రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) స్పష్టం చేశాయి. హార్మూజ్ ఇప్పటికీ పూర్తిగా ఇరాన్ అదుపులోనే ఉన్నట్టు చెప్పుకొచ్చాయి. ‘ట్రంప్కు యుద్ధమే కావాలనుకుంటే మేం సిద్ధమే’అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ గలీబాఫ్ స్పష్టం చేశారు. అంతేగాక ‘ఆటలో ఇప్పటిదాకా వాడని సరికొత్త ‘వ్యూహా’లను ఇకపై బయటికి తీస్తా’మంటూ ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి ఎబ్రాహీం రజెయ్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియా నుంచి అమెరికా ఖాళీ చేతులతో వెనుదిరగాల్సిందేనని ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ విభాగం చీఫ్ ఎస్మాయిల్ ఖానీ ఎద్దేవా చేశారు. గత వారం కాల్పుల విరమణ మొదలైనప్పటి నుంచి 40 వాణిజ్య నౌకలు హార్మూజ్ను దాటాయి. అమెరికా, ఇరాన్ నడుమ యుద్ధానికి తెర దించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్టు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు.ఇరాన్ గమ్మత్తైన ‘గణిత’పోస్టు హార్మూజ్ను దిగ్బంధిస్తామన్న ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ ఎద్దేవా చేసింది. ఈ మేరకు గమ్మత్తైన గణిత సమీకరణాలతో ఎక్స్లో పోస్టు పెట్టింది. ‘‘హార్మూజ్ దిగ్బంధంతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిపోతాయి. తర్వాత జరిగే చైన్ రియాక్షన్ వల్ల చూస్తుండగానే అవి చుక్కలనంటుతాయి’’అంటూ వాటి అర్థాన్ని కూడా వివరించింది!‘హార్మూజ్’పై భేటీ.. బ్రిటన్, ఫ్రాన్స్ వెల్లడి లండన్/పారిస్: పశ్చిమాసియా యుద్ధానికి తెర దించి హార్మూజ్ జలసంధిని తక్షణం తెరిపించే ప్రయత్నాలను బ్రిటన్, ఫ్రాన్స్ ముమ్మరం చేశాయి. అందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ వారంలో సమావేశం నిర్వహించనున్నట్టు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ వెల్లడించారు. ఈ అంశంపై వారిద్దరూ ఫోన్లో చర్చలు జరిపారు. అమెరికా చేపట్టిన హార్మూజ్, ఇరాన్ రేవుల దిగ్బంధానికి బ్రిటన్ మద్దతివ్వబోదని స్టార్మర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.100 మంది హెజ్బొల్లా ఫైటర్ల మృతి! బీరూట్: ఇజ్రాయెల్ సైన్యం, హెజ్బొల్లా దళాలు సోమవారం లెబనాన్లో పరస్పర దాడులకు దిగాయి. దక్షిణాదిన వ్యూహాత్మకంగా కీలకమైన కొండ ప్రాంత పట్టణం బింట్ బెల్ వద్ద ఇజ్రాయెల్ సైన్యంపై హెజ్బొల్లా తీవ్రవాదులు రాకెట్లతో దాడి చేశారు. అయితే పట్టణంపై ఇజ్రాయెల్ సైన్యం పట్టు సాధిస్తున్నట్టు లెబనాన్ మీడియా తెలిపింది. బింట్ బెల్ వద్ద కనీసం 100 మంది హెజ్బొల్లా తీవ్రవాదులను మట్టుబెట్టినట్టు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. లెబనాన్ మాత్రం దీన్ని ధ్రువీకరించలేదు. రాజధాని బీరూట్పై దాడులకు ఇజ్రాయెల్ విరామం ఇచ్చింది. మంగళవారం ఇజ్రాయెల్, లెబనాన్ నడుమ ప్రత్యక్ష చర్చలు జరగనుండటం తెలిసిందే. అమెరికాలోని ఇరు దేశాల రాయబారులు వాషింగ్టన్లో చర్చలు జరపనున్నారు. అయినా లెబనాన్పై దాడులు మాత్రం ఆగబోవని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. చర్చలకు సిద్ధమే: ఇరాన్న్యూఢిల్లీ: అమెరికాతో మరో దఫా చర్చలకు ఇరాన్ సిద్ధమేని భారత్లో ఆ దేశ రాయబారి మొహమ్మద్ ఫతాలీ ప్రకటించారు. అయితే, ‘అమెరికా అక్రమ డిమాండ్లు చేయరాదు. ఇరాన్ షరతులకు అంగీకరించాలి’అని పేర్కొన్నారు. తమ శక్తి ఏమిటో అమెరికాకు బాగా తెలుసని ఆయనన్నారు. హార్మూజ్ ఇరాన్దేనని స్పష్టం చేశారు. ఇరాన్ చమురు విక్రయాలపై తీవ్ర చర్యలు: అమెరికా ఇరాన్కు చెందిన నిషేధిత చమురును కొనుగోలు చేసినా, విక్రయించినా తీవ్ర చర్యలు తప్పవని అమెరికా హెచ్చరించింది. అలాంటి వ్యక్తులు/దేశాలను కోర్టుల్లో నిలబెట్టి తీరుతామని అమెరికా తాత్కాలిక అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచె ప్రకటించారు. -
హైదరాబాద్ – తిరుపతి... విమానయానం సామాన్యుడికి గగనమే
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్– తిరుపతి మార్గంలో విమాన చార్జీల పెంపుపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఉడాన్’ లక్ష్యాల్లో ఒకటైన ‘సామాన్యుడికి విమానయానం’ ఆశయానికి విరుద్ధంగా ఈ చార్జీల బాదుడు కొనసాగుతోందని మండిపడ్డారు. పెరిగిన విమాన చార్జీలపై దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకి ఎంపీ లేఖ రాశారు. లేఖలో ముఖ్యాంశాలు.. దేశంలోని ఇతర ప్రధాన నగరాల కంటే తిరుపతికి వెళ్లే విమాన ప్రయాణం అత్యంత ఖరీదుగా మారింది.దీనిప్రకారం హైదరాబాద్ నుంచి గోవా (రూ.3,000–రూ.6,500), ఢిల్లీ (రూ.3,900–రూ.7,000), చెన్నై (రూ.2,500–రూ.4,000)కు ఉన్న చార్జీల కంటే తిరుపతి రూట్లోనే అత్యధికంగా వసూలు చేస్తున్నారు. హైదరాబాద్–తిరుపతి మధ్య కనీస చార్జీ రూ.6,000 నుంచి ప్రారంభమై రూ.9,500 వరకు ఉంటోంది. కొన్ని సందర్భాల్లో ఇది రూ.14,500కు చేరుతోంది. ఇక 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు 13,367 విమానాల్లో దాదాపు 11.84 లక్షల మంది ప్రయాణికులు హైదరాబాద్–తిరుపతి రూట్లో ప్రయాణించారు.కేవలం మార్చి 2026లోనే 864 విమాన సర్విసుల ద్వారా 88 వేల మందికిపైగా ప్రయాణించారు. రోజుకు ఈ రూట్లో 16 నుంచి 17విమానాలు నడుస్తున్నాయంటే డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత డిమాండ్ ఉన్నప్పటికీ విమానయాన సంస్థలు తెలివిగా పెద్ద విమానాల సంఖ్యను తగ్గించి, చిన్న విమానాలను నడుపుతూ సీట్ల కొరతను సృష్టిస్తున్నాయి. తద్వారా చార్జీలు పెంచి భక్తులను దోచుకుంటున్నారు. పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తుల్లో అత్యధికులు మధ్యతరగతి వారు, వృద్ధులు ఉంటారు. వారిపై ఆరి్థక భారం మోపడం అన్యాయం. -
రొయ్యల చెరువులో విషప్రయోగం
అత్తిలి: గుర్తుతెలియని వ్యక్తులు రొయ్యల చెరువులో విష ప్రయోగం చేయడంతో రొయ్యలు మృతిచెందిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం ఆరవల్లిలో జరిగింది. దీనిపై బాధితుడు అత్తిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరవల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ వెలగల అమ్మిరెడ్డి, ఆయన సోదరులు స్కిన్నెరపురం, కంచుమర్రు గ్రామాల సరిహద్దులో ఉన్న 4.20 ఎకరాల చెరువును లీజుకు తీసుకుని కొన్నేళ్లుగా రొయ్యల సాగు చేస్తున్నారు. చెరువులో 3 లక్షల పిల్లలను వేయగా ప్రస్తుతం 94 కౌంట్కు చేరుకున్న రొయ్యలను మరో వారం రోజుల్లో పట్టుబడి పట్టనున్నారు.ఈ తరుణంలో రొయ్యల చెరువులో విష ప్రయోగం జరగడంతో సుమారుగా ఆరు టన్నుల రొయ్యలు మృతిచెందినట్లుగా చెబుతున్నారు. వీటి విలువ సుమారుగా రూ.15.90 లక్షలు ఉంటుందని బాధితుడు వెలగల అమ్మిరెడ్డి వెల్లడించారు. దీనిపై ఆయన అత్తిలి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు చెరువును పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. దీనిపై వెలగల అమ్మిరెడ్డి మాట్లాడుతూ ఆరవల్లిలో తనను రాజకీయంగా ఎదుర్కోలేకే తన కుటుంబానికి చెందిన రొయ్యల చెరువులో గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకులు విషం కలిపారని ఆరోపించారు. -
జీవ వనరుల కేంద్రాల స్థాపనపై శిక్షణ
రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించటానికి.. తెగుళ్ల నియంత్రణ, నేల/మొక్కల ఆరోగ్య నిర్వహణ కోసం రసాయనేతర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించటానికి హైదరాబాద్ రాజేంద్రనగర్లోని జాతీయ మొక్కల ఆరోగ్య యాజమాన్య సంస్థ (ఎన్ఐపీహెచ్ఎం) వివిధ తక్కువ ఖర్చుతో కూడిన సాంకేతికతలు, ఉత్పాదకాలను అభివృద్ధి చేసింది. కేంద్ర వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఈ సంస్థ ఏర్పాటైంది. దేశంలో సేంద్రియ / ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించటంలో భాగంగా రైతులకు నాణ్యమైన జీవన ఎరువులు, ద్రావణాలు, కషాయాలు వంటి జీవ ఉత్పాదకాలను అందించే జీవ వనరుల కేంద్రాల (బీఆర్సీల) స్థాపనపై సంపూర్ణ అవగాహన కలిగించటానికి ఎన్ఐపీహెచ్ఎం ఈ నెల 21 నుంచి 23 వరకు మూడు రోజుల రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనుంది. తక్కువ ఖర్చుతో కూడిన జీవ ఉత్పాదకాలు, వాటి ఉత్పత్తి సాంకేతికతల గురించి అవగాహన కలిగిస్తారు. ప్రగతిశీల రైతులు, ఎఫ్పీఓలు / స్వయం సహాయక బృందాలు/ కృషి సఖిలు, విస్తరణ అధికారులు, సేంద్రియ/ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న గ్రామీణ యువ పారిశ్రామికవేత్తలు ఈ శిక్షణ పొందడానికి అర్హులు. ఫీజు, భోజన, వసతి సదుపాయాల వివరాల కోసం ఎన్ఐపీహెచ్ఎం వెబ్సైట్ చూడొచ్చు లేదా ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు: dirphmniphm-ap@nic.in - damodar.kammari@gov.in
