-
గాజాలో ఆగని దాడులు.. భారతీయుడి మృతి
హమాస్ బలగాలను అంతం చేయటమే లక్ష్యంగా.. గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోంది. ఇజ్రాయెల్ సైన్యం దాడిలో ఐక్యరాజ్య సమితిలో పనిచేసే ఓ భారతీయ వ్యక్తి మృతి చెందినట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. ఆ వ్యక్తి తన వాహనంలో రఫాలోని యూరోపియన్ హాస్పటల్కు వెళ్తుతున్న క్రమంలో ఒక్కసారిగా జరిగిన దాడిలో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటుతో ఉన్న మరో వ్యక్తి కూడా తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఇక.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఐక్యరాజ్య సమితికి చెందిన తొలి వ్యక్తి మరణంగా మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.మరణించిన వ్యక్తి ఐక్యరాజ్య సమితిలోని సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విభాగానికి( DSS) చెందిన భారతీయ వ్యక్తిగా తెలుస్తోంది. మృతి చెందిన వ్యక్తి భారత దేశానికి చెందిన మాజీ ఆర్మీ సైనికుడని సమాచారం.Today a @UN vehicle was struck in Gaza, killing one of our colleagues & injuring another. More than 190 UN staff have been killed in Gaza.Humanitarian workers must be protected.I condemn all attacks on UN personnel and reiterate my urgent appeal for an immediate humanitarian…— António Guterres (@antonioguterres) May 13, 2024‘‘ఐక్యరాజ్య సమితి చెందిన డీఎస్ఎస్ విభాగంలోని సభ్యుడు మరణించటం చాలా బాధాకరం. ఈ ఘటనలో మరో సభ్యుడు కూడా తీవ్రంగా గాయపడ్డారు. రఫాలోని యూరోపియన్ ఆస్పత్రికి తమ వాహనంలో వెళ్తున్న క్రమంలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది’’ అని ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ అంటోనియో గుటెర్రెస్ ‘ఎక్స్’ వేదికగా తెలిపారు.ఈ దాడి ఘటనను యూఎన్ఓ జనరల్ సెక్రటరీ అధికార ప్రతినిధి ఫర్హాన్ హక్ తీవ్రంగా ఖండించారు. యూఎన్ఓ సిబ్బందిపై జరిగిన అన్ని దాడులపై దర్యాప్తు చేస్తామని అన్నారు. అదేవిధంగా డిఎస్ఎస్ విభాగానికి చెందని సభ్యుడి మరణం పట్ల యూఎన్ఓ జనరల్ సెక్రటరీ గుట్రెస్ సంతాపం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. -
Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
టెల్ అవీవ్: ఒకవైపు కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం తెలిపితే.. మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం దాడుల్ని కొనసాగించాలనే నిర్ణయించింది. మంగళవారం ఉదయం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) యుద్ధ ట్యాంకులు గాజావైపున ఉన్న రఫా క్రాసింగ్ను ఆక్రమించాయి. గాజా పోరులో ఈ ఆక్రమణ కీలక ఘట్టమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్న సంగతి తెలిసిందే.ఈ రఫా క్రాసింగ్ నుంచే ఆదివారం రాత్రి హమాస్ దళాలు దక్షిణ ఇజ్రాయెల్పై రాకెట్లు ప్రయోగించాయి. ఈ ఘటనలో నలుగురు సైనికులు మృతి చెందడంతో ఐడీఎఫ్ తన ఆపరేషన్ను ప్రారంభించింది. రఫా క్రాసింగ్ ఆక్రమణ విషయాన్ని ఇజ్రాయెల్ తమకు తెలియజేసిందని ఈజిప్టు అధికారి ఒకరు తెలిపారు. అయితే ఇజ్రాయెల్ మాత్రం దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు. అంతకు ముందు..రఫాపై సోమవారం ఇజ్రాయెల్ దాడులకు సిద్ధమవుతున్న వేళ.. హమాస్ సంస్థ కాల్పుల విరమణకు అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే ఆ విరమణ ఒప్పందం.. తమ కీలక డిమాండ్లకు అనుగుణంగా లేదంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తిరస్కరించారు. మరోవైపు కాల్పుల విరమణ కోసం కైరోలో జరుగుతున్న చర్చల్లో ఇజ్రాయెల్ యథావిధిగా పాల్గొంటోంది. కొసమెరుపు ఏంటంటే.. ఆ చర్చలు కొనసాగుతున్న వేళలోనే ఇజ్రాయెల్ యుద్ధ కేబినెట్ సమావేశమై రఫాపై మిలిటరీ ఆపరేషన్కు పచ్చజెండా ఊపింది. మరోవైపు ఇజ్రాయెల్ ఆక్రమణతో రఫా క్రాసింగ్ మీదుగా ఈజిప్టు నుంచి గాజాకు చేరుకుంటున్న మానవతా సాయం ఆగిపోయిందని పాలస్తీనా క్రాసింగ్స్ అథారిటీ ప్రతినిధి వేల్ అబు ఒమర్ తెలిపారు. ఈ పరిణామంపై ఐక్యరాజ్యసమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. అయితే అమెరికా మాత్రం ఇజ్రాయెల్ చర్యను పరిమితమైన ఆక్రమణగానే పేర్కొంటోంది. -
Israel-Hamas war: వర్సిటీల్లో 2,300 దాటిన అరెస్టులు
న్యూయార్క్: గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దాడులు ఆపాలంటూ అమెరికావ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతున్న నిరసనలు ఆగట్లేవు. పోలీసులు వర్సిటీల్లో ఆందోళనకారులను చెదరగొట్టి తాత్కాలిక శిబిరాలను ధ్వంసం చేస్తున్నారు. ఏప్రిల్ 17న కొలంబియా వర్సిటీలో మొదలై అమెరికాలో 44 విశ్వవిద్యాలయాలు/ కాలేజీలకు పాకిన ఈ విద్యార్థి ఉద్యమంలో ఇప్పటిదాకా 2,300 మందికిపైగా ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్చేశారు. శుక్రవారం న్యూయార్క్ యూనివర్సిటీలో టెంట్లను ఖాళీచేసి వెళ్లాలని నిరసనకారులను పోలీసులు హెచ్చరించారు. స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్లో 133 మందిని అరెస్ట్చేశారు. -
Israel-Hamas war: కాలిఫోర్నియా వర్సిటీలోకి పోలీసులు
లాస్ ఏంజెలిస్: గాజాలో తక్షణ కాల్పుల విరమణ డిమాండ్తో లాస్ ఏంజెలిస్ నగరంలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో తిష్టవేసిన పాలస్తీనా అనుకూల విద్యార్థులు, నిరసనకారుల తాత్కాలిక శిబిరాలను పోలీసులు చెల్లాచెదురుచేశారు. పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్ అనుకూల నిరసనకారులకు మధ్య ఘర్షణతో వర్సిటీలో బుధవారం ఉద్రిక్తత నెలకొన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున పోలీసులు వర్సిటీలోకి ప్రవేశించారు. టెంట్లను తొలగించి నిరసనకారులను చెదరగొట్టారు. దీంతో 1000 మందికిపైగా నిరసనకారులు పోలీసులను ప్రతిఘటించారు. ‘‘ జరిగింది చాలు శాంతించండి’’ అని వర్సిటీ చాన్స్లర్ జీన్ బ్లాక్ వేడుకున్నారు. డార్ట్మౌత్ కాలేజీలో టెంట్లు కూల్చేసి 90 మందిని పోలీసులు అరెస్ట్చేశారు. ఏప్రిల్ 17న కొలంబియాలో మొదలైన ఈ పాలస్తీనా అనుకూల నిరసన ఉదంతాల్లో అమెరికావ్యాప్తంగా 30 విద్యాలయాల్లో 2,000 మందికిపైగా అరెస్ట్చేసినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ‘అసమ్మతి ప్రజాస్వామ్యానికి కీలకం. అయితే శాంతిభద్రతలకు విఘాతం కల్గించేస్థాయికి అసమ్మతి పెరిగిపోకూడదు’’ అని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అన్నారు. బ్రిటన్లోని బ్రిస్టల్, లీడ్స్, మాంచెస్టర్, న్యూక్యాజిల్, షెఫీల్డ్ వర్సిటీల్లోనూ నిరసనకారుల శిబిరాలు వెలిశాయి. యూనివర్సిటీ కాలేజ్ లండన్లలో ఇప్పటికే నిరసనకారులు ఆందోళనలు మొదలెట్టారు. ఫ్రాన్స్, లెబనాన్, ఆ్రస్టేలియాలకూ నిరసనలు విస్తరించాయి. -
ఆందోళనలు ఉద్రిక్తం.. హార్వర్డ్ యూనివర్సిటీలో పాలస్తీనా జెండా
పాలస్తీనా అనుకూల నిరసనలతో అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీలు అట్టుడుకుతున్నాయి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా పలు విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు కొన్ని రోజులుగా ఆందోళనలను కొనసాగిస్తున్నారు. తరగతి గదులను బహిష్కరించి పాలస్తీనాకు సంఘీభావంగా, మద్దతుగా నిరసనల ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. దీంతో అనేక యూనివర్సిటీల్లో విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.తాజాగా ప్రఖాత్య హార్వర్డ్ యూనివర్సిలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు మిన్నంటాయి. హార్వర్డ్ యార్డ్లోని జాన్ హార్వర్డ్ విగ్రహంపై పాలస్తీనా జెండాను నిరసనకారులు ఎగువేశారు. అమెరికన్ జెండా కోసం కేటాయించిన స్థలంలో పాలస్తీనా జెండాను ఎగరేయడం గమనార్హం. ఐవీ లీగ్ స్కూల్ క్యాంపస్లో కొనసాగుతున్న తమ ఆందోళనలను ముగించేందుకు నిరాకరించడంతో శనివారం ఈ చర్యకు పాల్పడ్డారు. మరోవైపు నిరసనకారులతో పోలీసులు ఉక్కుపాదం మోన్నారు. గత వారం న్యూయార్క్లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో 100 మందికిపైగా నిరసనకారులను అరెస్ట్ చేసిన తర్వాత నిరసనలు తీవ్రతరమయ్యాయి. దీంతో నిరసనకారులను స్థానిక పోలీసులు ఎక్కడిక్కడ అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలిస్తున్నారు. గత పదిరోజుల వ్యవధిలో అమెరికా వ్యాప్తంగా ఉన్న వర్సిటీల్లో అరెస్ట్ల సంఖ్య 900కు చేరుకుంది. అమెరికా వ్యాప్తంగా కొనసాగుతోన్న ఆందోళనలపై అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఆందోళనలు శాంతియుతంగా ఉండాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
గాజాలో శిథిలాల తొలగింపునకు 14 ఏళ్లు?
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమై ఏడు నెలలవుతోంది. ఈ కాలంలో ఇజ్రాయెల్.. గాజా స్ట్రిప్పై బాంబులు వేసి, ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేసింది. దీంతో ఎక్కడ చూసినా శిథిల భవనాల కుప్పలే కనిపిస్తున్నాయి. దీనిపై ఐక్యరాజ్యసమితి మైన్ యాక్షన్ సర్వీస్ (యూఎంఎన్ఏఎస్) సీనియర్ అధికారి పిహార్ లోధమ్మర్ మీడియాతో మాట్లాడుతూ గాజా స్ట్రిప్లో శిధిలాలను తొలగించడానికి సుమారు 14 ఏళ్లు పట్టవచ్చని ప్రకటించారు. జెనీవాలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన యుద్ధం కారణంగా 37 మిలియన్ టన్నుల శిథిలాలు పేరుకుపోయాయని తెలిపారు.ఏడు నెలలుగా నిరంతర ఇజ్రాయెల్ దాడులు చేస్తుండటంతో జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లోని పలు భవనాలు నేలమట్టమయ్యాయని పేర్కొన్నారు. దాడిలో ఉపయోగించిన 10 శాతం షెల్స్ పేలి ఉండకపోవచ్చని, ఇవి భవిష్యత్తులో ముప్పుగా మారవచ్చని అన్నారు. ఈ షెల్స్ భవన శిథిలాల కింద కూరుకుపోయి ఉండవచ్చని పేర్కొన్నారు. గాజా స్ట్రిప్లో ప్రతిరోజు 100 ట్రక్కుల శిథిలాలను తరలిస్తున్నారని, ఇక్కడి ప్రతి చదరపు మీటరులో దాదాపు 200 కిలోల శిధిలాలు ఉన్నాయని వివరించారు.యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (యూఎన్ఆర్డబ్ల్యుఏ) ఒక ప్రకటనలో గాజాలో జీవన పరిస్థితులు మరింతగా క్షీణిస్తున్నాయని, రాఫా నగరంలో అధిక ఉష్ణోగ్రతలు, నీటి కొరత కారణంగా ప్రజల్లో అంటు వ్యాధులు ప్రభలుతున్నాయన్నారు. ఇజ్రాయెల్.. గాజా స్ట్రిప్పై జరిపిన దాడిలో 34 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు. 77 వేల మంది గాయపడ్డారు. -
Israel-Hamas war: పాలస్తీనియన్లకు అమెరికా విద్యార్థుల సంఘీభావం
వాషింగ్టన్: గాజాలోని పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ సైన్యం దాడులను వ్యతిరేకిస్తూ అమెరికాలో విద్యార్థుల నిరసనలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. గాజాలో మారణహోమాన్ని వెంటనే ఆపాలని, ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ విశ్వవిద్యాలయాల్లో ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. వందలాది మంది ర్యాలీల్లో పాల్గొంటున్నారు. పాలస్తీనియన్లకు సంఘీభావం తెలియజేస్తున్నారు. ముందస్తుగా అనుమతి లేకుండా వర్సిటీ ప్రాంగణాల్లో శిబిరాలు ఏర్పాటు చేసుకొని, నిరసనల్లో పాల్గొంటున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. తాజాగా యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోరి్నయా యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో ఒక్కరోజే 100 మందికిపైగా విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో గతవారం విద్యార్థుల ఆందోళన ప్రారంభమైంది. క్రమంగా దేశవ్యాప్తంగా ఇతర యూనివర్సిటీలకు వ్యాపించింది. -
మానవతకు 200 రోజుల మచ్చ
ఒకటీ, రెండూ కాదు... ఆరు నెలలు దాటింది. మంగళవారంతో ఏకంగా రెండు వందల రోజులు గడిచిపోయాయి. అయినా, పాలెస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు ఆగడం లేదు. సంక్షోభానికి పరిష్కా రమూ కనిపించడం లేదు. సామూహిక సమాధులు, కూలిన ఆస్పత్రులు, శిథిలాల కుప్పగా మారిన భవనాలు, ప్రాణాలు పోయిన వేలాది జనం, ప్రాథమిక వసతులు పూర్తి విధ్వంసంతో పాలెస్తీనా బావురుమంటోంది.తీవ్రవాద హమాస్ బృందం తమపై ఆకస్మికంగా దాడి చేసి, 250 మందిని బందీలుగా చేసుకొని, 1200 మంది ప్రాణాలు తీసినందుకు బదులుగా గత అక్టోబర్ 7న సైనిక చర్యకు దిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగిస్తూనే ఉంది. గాజాలోని 23 లక్షల జనాభాలో దాదాపు 85 శాతం మంది ఇళ్ళు వదిలి పారిపోయారు. హమాస్ ఏరివేతకని చెబుతూ మొదలుపెట్టిన ఈ పాశవిక, ప్రతీకార దాడిలో ఇప్పటికి 14 వేల పైచిలుకు పసిపిల్లలతో సహా 34 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని లెక్క. నిజానికి, ఆ సంఖ్య ఇంకా ఎక్కువేనని సహాయక సంస్థల అంచనా. గాజా భూఖండపు ఉత్తర ప్రాంతంపై ఇటీవల ఎన్నడూ లేనంతగా శతఘ్నుల వర్షం కురిపిస్తూ, అక్కడ నుంచి జనాల్ని ఖాళీ చేయమంటున్న ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంత ప్రధాన నగరమైన రాఫాపై దాడికి సర్వసన్నద్ధమవుతుండడం తాజా విషాద పరిణామం. పశ్చిమాసియాలోని ఈ సంక్షోభం అంతకంతకూ పెద్దదవుతూ వచ్చింది. ఇరాన్ సైతం ఇటీవల ఇజ్రాయెల్తో ఢీ అనడం పర్యవసానాలపై ప్రపంచం భయపడాల్సిన పరిస్థితి తెచ్చింది. పాలెస్తీనా శరణార్థులకు ఉద్దేశించిన ఐరాస సహాయ సంస్థ (యూఎన్ఆర్డబ్ల్యూఏ) ఉన్నా దానికిప్పుడు నిధులు లేని దుఃస్థితి.ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన దాడికి ఆ సంస్థ సిబ్బంది కొందరు సహకరించారని ఇజ్రాయెల్ ఆరోపించింది. దాంతో ఆ సంస్థకు సహాయం అందిస్తున్న 16 దాతృత్వ దేశాలు నిధులు నిలిపివేశాయి. పర్యవసానంగా 45 కోట్ల డాలర్ల మేర నిధుల లోటు ఏర్పడి, వేలాది పాలెస్తీనియన్లు ఈ యుద్ధకాలంలో ఆకలిదప్పులతో అలమటిస్తున్నారు. అయితే ఇజ్రాయెల్వి నిరాధార ఆరోపణలని స్వతంత్ర పరిశీలనలో ఈ వారమే తేలింది. అమెరికా సహా ఇతర దేశాలు మానవతా అవసరంగా గుర్తించి, నైతిక బాధ్యతతో యూఎన్ ఆర్డబ్ల్యూఏకు ఆర్థిక సాయం పునరుద్ధరించాలని అరబ్ లీగ్ తాజాగా డిమాండ్ చేస్తున్నది అందుకే. ఇజ్రాయెల్ భీకర దాడుల అనంతరం గాజాలోని ప్రధాన ఆస్పత్రుల వద్ద 300కు పైగా మృతదేహాలతో బయటపడ్డ సామూహిక భారీ సమాధుల దృశ్యాలు సహజంగానే అంతర్జాతీయ ప్రపంచాన్ని కుదిపివేస్తున్నాయి. ఇజ్రాయెలీ సైనికుల దాడుల్లో అంతర్జాతీయ మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగిందడానికి సమాధుల్లో కట్టేసిన చేతులతో, వివస్త్రంగా కనిపిస్తున్న శవాలే ప్రత్యక్ష సాక్ష్యం. అనుమానాలకు తావిస్తున్న ఈ సమాధులపై పారదర్శకంగా, స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఐరాస ఇప్పటికే డిమాండ్ చేసింది.యూరోపియన్ యూనియన్ సైతం బుధవారం అదే అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. ఆగని ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో బాధిత పక్షం వైపు అంతర్జాతీయంగానూ క్రమంగా మొగ్గు కనబడుతోంది. పాలెస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించడమే ప్రస్తుత సమస్యకు సత్వర పరిష్కారమని భావిస్తున్నవారి సంఖ్యా పెరుగుతోంది. గాజా సమస్య అంతకంతకూ మానవతా సంక్షోభంగా పరిణమిస్తుండడంతో తాజాగా జమైకా ప్రభుత్వం పాలెస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తున్నట్టు ప్రకటించడం విశేషం. పరస్పర గౌరవం, శాంతియుత సహజీవనమనే ఐరాస నియమావళి పట్ల నిబద్ధతే ఈ నిర్ణయానికి ప్రేరణ అని జమైకా పేర్కొంది. ప్రతి 10 నిమిషాలకూ ఓ పసివాడు చనిపోవడమో, గాయపడడమో జరుగుతున్న పాలెస్తీనాలో, ఇప్పటికి కనీసం 75 వేల టన్నుల పేలుడు పదార్థాల తాకిడికి గురై 62 శాతం ఇళ్ళు ధ్వంసమైన భూభాగంలో, ఆహార కరవుతో 11 లక్షల మంది అన్నమో రామచంద్రా అని అలమటిస్తూ రోజూ పదుల సంఖ్యలో ప్రాణాలు విడుస్తున్న ప్రాంతంలో... సత్వరమే సంక్షోభాన్ని పరిష్కరించి, శాంతి స్థాపన జరపకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. ఒకప్పటి కీలకపాత్రధారి ఐరాస ప్రస్తుతం మాటలే తప్ప చేతలు లేక చేష్టలుడిగి చూస్తోంది.కాల్పుల విరమణకై ఈ ఆరునెలల్లో ఐరాస 4సార్లు తీర్మా నాలు చేసినా, అవన్నీ అగ్రరాజ్యాలు మోకాలడ్డడంతో వీగిపోవడం దురదృష్టం. ఐరాసలో అండగా నిలవడమే కాక, ఇజ్రాయెల్కు ఆయుధాలిస్తున్న అమెరికా ఆ దేశానికి ఇటీవలే 2600 కోట్ల డాలర్ల సాయం మంజూరు చేసి, శరణార్థులకేమో మొండిచేయి చూపడం పెద్దన్న ద్వంద్వనీతికి దర్పణం. గాజా పోరులో అమెరికా అధ్యక్షుడి విధానాలపై స్వదేశంలోనే నిరసనలు పెరిగాయి. పాలెస్తీనాకు అనుకూలంగా అమెరికాలోని అనేక విశ్వవిద్యాలయాల్లో వేలాది విద్యార్థులు వీధికెక్కడం విశేషం.పశ్చిమాసియాలో సమస్య పరిష్కారానికి అమెరికా, దాని భాగస్వాములు పాత కథ వదిలి, మళ్ళీ మథనం చేయాలి. భద్రత పరంగా ఇజ్రాయెల్కు ఉన్న ఆందోళనల్ని పోగొడుతూనే, పాలెస్తీనా ప్రజల ప్రత్యేక రాజ్య ఆకాంక్షను నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయత్నాలు సఫలమయ్యేలా అటు ఇరాన్నూ భాగస్వామిని చేసి, శాశ్వత పరిష్కారానికై పాశ్చాత్య ప్రపంచం కృషి చేయాలి.ఇరాన్ సైతం పశ్చిమాసియాలో తన ప్రభావాన్ని విస్తరించుకోవడం కోసం లెబనాన్, గాజా, సిరియా, యెమన్లలో పరోక్ష శక్తులకు ఆయుధాలు సమకూర్చి, అండగా నిలిచే పని మానుకోవాలి. ఇలా పాముల్ని పాలుపోసి పెంచడం ఉద్రిక్తతల్ని పెంచే పాపమని గుర్తించాలి. ఈ ప్రాంతంలో 90 లక్షల మంది మన ప్రవాసులున్నందు భారత్ సైతం ఇజ్రాయెల్, అరబ్ దేశాలతో సత్సంబంధాల రీత్యా కీలక భాగస్వాముల్ని ఒక దగ్గరకు చేర్చి, పరిష్కారానికి యత్నించాలి. వాణిజ్యంలో, ఇంధన సరఫరాలో కీలకమైన పశ్చిమాసియాలో శాంతి నెలకొంటేనే... ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది. -
ముసుగులో గుద్దులాట కొనసాగేనా?
ఒకవైపు ఇజ్రాయెల్... మరోవైపు ఇరాన్, దాని భాగస్వాములు, ప్రచ్ఛన్న ప్రతినిధుల మధ్య సాగుతున్న ముసుగులో గుద్దులాటను ఒక స్థాయి వరకే కొనసాగించవచ్చు. ఏప్రిల్ 13 రాత్రి ఇజ్రాయెల్ వైపుగా కమికేజ్ డ్రోన్లు, క్షిపణులను ఇరాన్ ప్రయోగించడంతో ఆ తెర తొలగింది. తన ‘జియోనిస్ట్ శత్రువు’కు వ్యతిరేకంగా నాలుగున్నర దశాబ్దాల ఆవేశపూరిత వాగాడంబరం సాగించిన ఇరాన్ నిజానికి ఇజ్రాయెల్ భూభాగంపై దాడి చేయడం ఇదే మొదటిసారి. దీంతో లక్ష్మణరేఖను దాటినట్లయింది. ఇజ్రాయెల్ ప్రతీకారదాడి ఈ ప్రాంతాన్ని అగాథంలోకి తోస్తుంది. కానీ నిజంగా పరిస్థితి అలా ఉందా? మనం చాలా కాలంగా చూస్తున్న ముసుగులో గుద్దులాట నాటకంలో సరికొత్త అంకాన్ని చూస్తున్నామా అనేది ప్రశ్న. ప్రస్తుతం ఏడవ నెలలో అడుగుపెట్టిన గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం, ఏ సమయంలో అయినా విస్తృతమైన ప్రాంతీయ పెనుమంటగా మారే ప్రమాదాన్ని కలిగివుంది. అయితే, పాలస్తీనా సమస్య పరిష్కారానికి మద్దతుగా ఇరాన్ తరచుగా చేసే తీవ్రమైన బెదిరింపుతో కూడిన ఆగ్రహ ప్రకటనలు, ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్న ఒక అంతర్లీన వాస్తవాన్ని దాచిపెడుతున్నాయి. దాని అత్యున్నత నాయకుడైన అయతొల్లా అలీ ఖొమేనీ నేతృత్వంలోని ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వం వాస్తవానికి చాలా జాగ్రత్తగానూ, ప్రమాదాన్ని కోరి ఆహ్వానించని తత్వంతోనూ సాగుతోంది. పైగా ముఖాముఖి ఘర్షణకు అది పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దాడి నిరోధం దిశగా ఇరాన్ ఇష్టపడే విధానం ఏమిటంటే, స్నేహపూర్వకంగా లేని దేశాలకు హెచ్చరికలను పంపడానికి తన ప్రతినిధుల (ప్రాక్సీలు) ద్వారా అసమాన యుద్ధంలో దాని అధునా తన సామర్థ్యాలను అమలు చేయడమే. ఒక పాత హిందీ పాటలోలా ‘అర్థమయ్యేవాళ్లకు అర్థమైంది’ అనేది దాని కార్యచరణ సూత్రం. తెహ్రాన్ లేదా దాని ఖుద్స్ బలగాలను హమాస్ దాడులతో అనుసంధానించడానికి తగిన నిర్ధారిత సాక్ష్యాధారం లేనప్పటికీ, అక్టోబరు 7న హమాస్ చేసిన దాడి వెనుక ఇరాన్ హస్తం ఉందని చాలామంది ఊహించారు. గాజాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ తన విధ్వంసక దాడిని ప్రారంభించినప్పుడు, లెబనాన్ నుండి ఇజ్రాయెల్ భూభాగాలను లక్ష్యంగా చేసుకోవడానికి హెజ్బొల్లాకు చెందిన యుద్ధంలో రాటుదేలిపోయిన క్యాడర్లను ఇరాన్ పంపుతుందనే ఆందోళన వాస్తవంగానే ఉండింది. అలాగే, గాజాలోని తన హమాస్ మిత్రపక్షానికి మద్దతు ఇవ్వడానికి ఇరాన్ రెండవ ఫ్రంట్ను ప్రారంభించవచ్చని కూడా భావించారు. ఏమైనప్పటికీ, ఆరు నెలల తరువాత కూడా, ఇరాన్, హెజ్బొల్లా రెండూ ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులోని లెబనాన్లో తమ హద్దులలోనే కొనసాగుతూ అసౌకర్యమైన సమ తౌల్యాన్ని కొనసాగించాయి. హెజ్బొల్లా వద్ద ఉన్న మారణాయుధాలు ప్రధానంగా ఉత్తర ఇజ్రాయెల్లో ఇప్పుడు జనాభా లేని గ్రామాలు, స్థావరాలకు వ్యతిరేకంగా ఉపయోగించబడ్డాయి. దక్షిణాన కొన్ని మైళ్ల దూరంలో ఉన్న సైనిక, పౌర లక్ష్యాలు హెజ్బొల్లా క్షిపణుల పరిధిలో ఉన్నప్పటికీ వాటిని తాకలేదు. వివాదాన్ని హెజ్బొల్లా తీవ్రతరం చేస్తే లెబనాన్ పై భయంకరంగా స్పందిస్తానని ఇజ్రాయెల్ హెచ్చరించింది. లెబనాన్, సిరియాలోని అగ్రశ్రేణి హెజ్బొల్లా సముదాయం, సైనిక సంపత్తి లక్ష్యంగా వైమానిక దాడులు చేసింది. అయితే హెజ్బొల్లాపై నేరుగా దాడి చేయడానికి ఇజ్రాయెల్ సైతం దూరంగానే ఉంది. సంవత్సరాల తరబడి ఇరాన్ చే జాగ్రత్తగా పోషించబడిన మరొక ప్రచ్ఛన్న శక్తి యెమెన్లోని హౌతీలు. ఎర్ర సముద్రంలోని సముద్ర మార్గాలలో వాణిజ్య నౌకలతో విధ్వంస క్రీడ ఆడటానికి తమ డ్రోన్ లను, క్షిపణులను హౌతీలు సానబెట్టారు. హౌతీల ఆయుధ నిల్వలు, శిక్షణ, వ్యూహాల మూలాల గురించి పెద్ద సందేహమేం లేదు. అయితే రింగ్మాస్టర్గా ఉండటంలోనే ఇరాన్ సంతృప్తి చెందుతూ, పశ్చిమ దేశాలు తనపట్ల శత్రు వైఖరితో కొనసాగితే విఘాతం కలిగించగలిగే ప్రభావాన్ని నిశ్శబ్దంగా నొక్కిచెప్పింది. అయితే, ఏప్రిల్ 1న డమాస్కస్లోని ఇరాన్ రాయబార కార్యా లయానికి చెందిన కాన్సులర్ భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిపి... సిరియా, లెబనాన్ లలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్కు చెందిన ఖుద్స్ బలగాల అధిపతి హసన్ మహ్దవీని చంపినప్పుడు ఆ పెళుసైన సమతుల్యత దెబ్బతింది. అత్యంత కచ్చితంగా తలపెట్టిన ఈ దాడి మహ్దవీతో పాటు ఆరుగురు స్వదేశీయులను కూడా మట్టు బెట్టడం, ఇరాన్ ప్రభుత్వాన్ని మండించింది. 2023 డిసెంబర్లో కూడా సిరియాలో ఇరాన్ సీనియర్ కమాండర్ అయిన సయ్యద్ రజీ మౌసావీని ఇజ్రాయెల్ హతమార్చింది. తెహ్రాన్ లోని అతివాదుల నుంచి తీవ్రమైన ఒత్తిడి పెరిగింది కాబట్టే నాయకత్వం చేసే తీవ్రమైన ప్రతీకార బెదిరింపులు ఇప్పుడు గట్టి చర్యతో సరిపోలాల్సి ఉంది మరి. చివరికి ఏప్రిల్ 13న తాను తలపెట్టదలచిన సైనిక చర్య గురించి దాదాపు రెండు వారాల పాటు టెలిగ్రాఫ్ ద్వారా ఇరాన్ ప్రభుత్వం సూచిస్తూనే వచ్చింది. ఈద్–ఉల్–ఫితర్ ఉత్సవాలు ముగిసిన వెంటనే దాడి జరుగనున్నట్లు విçస్తృతమైన అంచనాలు వెలువడ్డాయి. అలాగే జరిగింది కూడా. ఈ ప్రాంతంలోని దేశాలకు 72 గంటల నోటీసు ఇచ్చామనీ, విమానాలను నిలిపివేయడానికీ, వారి పౌరులకు హెచ్చరి కలు జారీ చేయడానికీ భారత్ సహా ఇతర దేశాలకు తగినంత సమయం ఇచ్చామనీ ఇరాన్ ధ్రువీకరించింది. ఇరాన్ ప్రయోగించిన ‘99 శాతం’ డ్రోన్లు, క్షిపణులను... బలీయమైన ఇజ్రాయెల్ ఐరన్ డోమ్, ఇతర వైమానిక రక్షణ వ్యవస్థలు, అలాగే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్ ్స, ఆఖరికి జోర్డాన్ తో సహా అనేక మిత్రదేశాలు విజయవంతంగా అడ్డుకోవడంలో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. 80కి పైగా డ్రోన్లు, ఆరు బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన ప్రకటన ధ్రువీకరించింది. నెగెవ్ ఎడారిలోని ఒక ఇజ్రాయెలీ వైమానిక స్థావరంలో స్వల్పంగా నష్టం వాటిల్లింది. ప్రస్తుతానికి, ఈ దాడి ఇరాన్ సామర్థ్యాలకు నిజమైన ప్రతిబింబం కాదు లేదా ఇజ్రాయెల్ వైమానిక రక్షణకు నిజమైన పరీక్ష కాదు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహుకు ఇంతకంటే మంచి సమయం ఉండదు. గత వారాంతం వరకు, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి మిత్రదేశాలు గాజాలో జరుగుతున్న అనాలోచిత విధ్వంసం గురించీ, అక్కడి ప్రజల బాధల గురించీ తీవ్రంగా విమర్శిస్తున్నాయి. కానీ ఇరాన్ దాడి జరిగిన కొన్ని గంటల్లోనే, అమెరికా యంత్రాంగం ఇజ్రాయెల్కు తన ‘గట్టి మద్దతు’ను పునరుద్ఘాటించింది. భవిష్యత్ ప్రమాదాలను నిరోధించడానికి బ్రిటన్, ఫ్రాన్స్ తమ నావికా సంపత్తిని మోహరించాయి. శత్రుదుర్భేద్యమైనదని పేరొందిన ఇజ్రాయెల్ రక్షణ శక్తుల ఖ్యాతి అక్టోబరు 7న హమాస్ దాడితో కాస్త దెబ్బ తిన్నప్పటికీ, తాజాగా ఇరాన్ ప్రయోగించిన డ్రోన్ లను, క్షిపణులను అధిక సంఖ్యలో తటస్థీకరించడంలో విజయం సాధించడం ద్వారా మళ్లీ తన్ను తాను నిలబెట్టుకోగలిగింది. గాజా ప్రస్తుతానికి మీడి యాలో పతాక శీర్షికలకు దూరంగా ఉంది. అంతేకదా! అమెరికా, భారత్, ఇతర దేశాలు తిరుగుదాడి పట్ల సంయమనం పాటించాలనీ, లేకుంటే అది మరింతగా పెరుగుతుందనీ హెచ్చరించడంతో నెత న్యాహు మళ్లీ కేంద్ర స్థానంలోకి చేరుకున్నారు. తన షాడో–బాక్సర్లు బలంగా పంచ్లు విసిరినందున, దాడుల నుంచి వైదొలగడానికి సిద్ధంగా ఉన్నాననీ, అయితే ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలకు దిగినట్లయితే తాను గట్టిగా ప్రతిస్పందిస్తాననీ ఇరాన్ సూచించింది. ఇక, ఇజ్రాయెల్లో రాజకీయ పార్టీలు నిలువునా చీలిపోయాయి. ప్రమాదకరమైన గీతను దాటినందుకు ఇరాన్ కు తగిన గుణపాఠం చెప్పాలని రైట్ వింగ్ నాయకులు కోరుతున్నారు. ఇజ్రాయెల్ ప్రతిఘటనను ప్రారంభించడానికి ‘వెంటనే కదలాలి’ అని జాతీయ భద్రతా మంత్రి బెన్–గ్విర్ సూచించారు. మధ్యప్రాచ్యంలో భావితరాలు కూడా గుర్తుంచుకునేలా ఇజ్రాయెల్ గట్టిగా ప్రతిస్పందించాలని ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోత్రిచ్ పిలుపునిచ్చారు. బెన్నీ గాంట్జ్, రక్షణ మంత్రి యోవ్ గాలంట్ వంటి మితవాదులు తీవ్రమైన ప్రతి చర్యకు వ్యతిరేకంగా సలహా ఇచ్చారు. బదులుగా ఇరాన్కు వ్యతిరేకంగా వ్యూహాత్మక భాగస్వామ్యం పెంచుకోవాలని సూచించారు. దేశ రాజకీయాలకు వ్యతిరేకంగా అమెరికా పెడుతున్న ఒత్తిడిని బేరీజు వేసుకుని, తీవ్ర పర్యవసానాలు కలిగివుండే ఒక ప్రతిస్పందనను నెతన్యాహు రూపొందించనున్నందున రాబోయే కొద్ది రోజులు కీలకం కానున్నాయి. నవదీప్ సూరి వ్యాసకర్త ఈజిప్ట్, యూఏఈల్లో భారత మాజీ రాయబారి (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ప్రమాదపుటంచున...
ఇప్పటి దాకా ముసుగులో గుద్దులాటగా ఉన్న వ్యవహారం బట్టబయలైంది. ఏప్రిల్ 13 రాత్రి ఇజ్రాయెల్పై ఇరాన్ పెద్దయెత్తున సాగించిన డ్రోన్, క్షిపణì దాడితో ఆ రెండు దేశాల మధ్య నాలుగు దశా బ్దాల పైగా లోలోపల సాగుతున్న కుమ్ములాట బయటపడింది. ముందుగా ఏప్రిల్ 1న సిరియా రాజధాని డెమాస్కస్లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ జరిపిన దాడి, ఒక జనరల్ సహా పలువురు సైనికాధికారుల మృతితో అగ్గి రాజుకుంది. ప్రతీకారంగా గత శనివారం ఇరాన్ పంజా విసరడంతో వ్యవహారం ముదిరింది. యుద్ధం ఊసెత్తకపోయినా దెబ్బకు దెబ్బగా టెహరా న్పై తగిన చర్య చేపడుతామంటోంది టెల్ అవీవ్. అసలే అస్థిరతలో మునిగిన పశ్చిమాసియా ఈ శరవేగ పరిణామాలు, వ్యాఖ్యలతో ఏ క్షణమైనా పూర్తిస్థాయి యుద్ధంలో చిక్కుకుపోవచ్చు. చాలాకాలంగా ఇరాన్ తన వ్యూహాత్మక లక్ష్యాలకై పరోక్ష సహకారం అందిస్తూ ప్రాంతీయ తీవ్రవాద సంస్థలను ఇజ్రాయెల్ పౌరులపైన, వివిధ దేశాల్లోని ఇజ్రాయెల్ ఆస్తులపైన ప్రయోగిస్తూ వచ్చింది. అయితే, ఇజ్రాయెల్తో ఎన్నడూ నేరుగా ఘర్షణకు దిగలేదు. తెర వెనుక నుంచి తాను చేసినవి ఒప్పుకోనూ లేదు. ఇజ్రాయెల్దీ అదే పంథా. మూడేళ్ళ క్రితం ఇరాన్కు చెందిన ముగ్గురు అణుశాస్త్రవేత్తల హత్యలో తన పాత్రను ఆ దేశమూ అంగీకరించ లేదు, అలాగని ఖండించనూ లేదు. ఈ పరిస్థితుల్లో గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడులతో గాజా భూఖండం సంక్షోభంలో పడింది. సదరు హమాస్ దాడుల వెనుక ఇరాన్ పాత్ర గురించి కథలు కథలుంటే, అదే అదనుగా పాలెస్తీనీయుల గాజాను ఇజ్రాయెల్ సమూలంగా ధ్వంసం చేసేసింది. ఐరాస సహా ఎవరెన్ని చెప్పినా నెలల తరబడి ఇజ్రాయెల్ ఆగలేదు, గాజాపై దాడులు ఆపనూ లేదు. ఈ నేపథ్యం నుంచి తాజా ఘటనల్ని చూడాలి. చివరకిప్పుడు ఇరాన్ నేరుగా తన గడ్డ మీద నుంచే ఇజ్రాయెల్పై దాడికి దిగింది. కొన్ని దశాబ్దాలుగా పశ్చిమాసియాలో ఎన్నడూ లేనంతటి ఉద్రిక్తతను పెంచింది. ఇరాన్ ప్రయోగించిన 360 క్షిపణుల్లో చాలావాటిని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జోర్డాన్ల సహకారంతో ఇజ్రాయెల్ నిలువరించగలిగింది. రాయబార కార్యాలయంపై దాడికి ప్రతిగా స్వీయ రక్షణ కోసమే తాము దాడి చేశామనీ, విషయం ఇంతటితో ముగిసిందనీ ఇరాన్ అంటోంది. ఇక, క్షిపణి దాడిని సమర్థంగా అడ్డుకున్నందున సంయమనం పాటించి, పరిస్థితి ప్రాంతీయ యుద్ధానికి దారి తీయకుండా చూడాలని అమెరికా సహా ఇతర మిత్రదేశాలు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను అభ్యర్థిస్తున్నాయి. ఇజ్రాయెల్ సరేనన్నట్టు ఉంటూనే, ఇరాన్కు తగిన బదులిస్తామంటోంది. ఏమైనా ఇరాన్, ఇజ్రాయెల్లు దేనికది మధ్యప్రాచ్యంలో తమదే పై చేయి అని చూపేందుకు యత్నిస్తున్నాయి. అందులో భాగమే రెండు దేశాలూ ఇప్పుడు దాదాపు నేరుగా కయ్యానికి దిగడం! పశ్చిమాసియాలో పరిస్థితికి ఇరు దేశాల బాధ్యతా ఉంది. ఇజ్రాయెల్ నిస్సిగ్గుగా పాలెస్తీనా భూభాగాల్ని బలవంతాన దిగ్బంధించి, కథ నడుపుతుంటే ప్రపంచపు పెద్దన్నలెవరూ ఎన్నో ఏళ్ళుగా పెదవి విప్పలేదు. పట్టించుకోకుండా వదిలేశారు. నిరుడు హమాస్ దాడితో ఇజ్రాయెల్ అహం దెబ్బ తిని, గాజాలో సామూహిక ఊచకోతకు దిగినప్పుడూ అమెరికా సహా ఎవరూ దాన్ని ఆపలేక పోయారు. ఇరాన్ సంగతికొస్తే, అదీ ఇష్టానుసారం వ్యవహరించింది. హెజ్బుల్లా, హమాస్, హౌతీల లాంటివన్నీ అది పరోక్షంగా పోషిస్తున్న పాములే. కొన్నేళ్ళుగా ఇరాక్, లెబనాన్, సిరియా, యెమన్ లలో ఇరాన్ పరోక్ష సహకారంతో నడుస్తున్న ప్రాంతీయ తీవ్ర వాద మూకలను నిలువరించడమే ఇజ్రాయెల్, అమెరికాల పని అయింది. వెరసి, ఇరాన్, ఇజ్రాయెల్ల తప్పిదాలు, స్వార్థంతో పక్కన చేరిన దేశాలతో పశ్చిమాసియా చిక్కుల్లో పడింది. తాజా ఘటనలతో యుద్ధం అంచున నిల్చుంది. ప్రతి యుద్ధం ప్రపంచంలో అనిశ్చితిని పెంచేదే. మరీ ముఖ్యంగా, ప్రపంచానికి ఇంధన భాండా గారం లాంటి పశ్చిమాసియా యుద్ధక్షేత్రంగా మారితే ఇక చెప్పేదేముంది! తీవ్ర పరిణామాలు తప్పవు. ఇరాన్ – ఇజ్రాయెల్ల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణంతో ప్రస్తుతం ప్రపంచమంతటా ఉత్కంఠ నెలకొన్నది అందుకే! వ్యవహారాన్ని తెగేదాకా లాగి, ప్రపంచం రెండు శిబిరాలుగా చీలితే కష్టం. ఇరాన్ దాడితో పని లేకుండా గాజాలో యుద్ధం కొనసాగిస్తామని ఇజ్రాయెల్ అంటోంది. అంటే, ఇరాన్ – ఇజ్రాయెల్ సంక్షోభం ముగియనే లేదని స్పష్టమవుతోంది. తక్షణమే అంతర్జాతీయ సమాజం బరిలోకి దిగి, ముందు గాజాలో దాడులు, పాలెస్తీనాలో అమాయక పౌరుల మరణాలు ఆగేలా చూడాలి. ఇజ్రాయెల్కు 66 శాతం మేర ఆయుధాలిస్తున్న అమెరికా, అలాగే ఇతర ఆయుధ సరఫరా దేశాలు తమ సరఫరాలు తగ్గించగలిగితే మేలు. అంతకంతకూ అంతర్జాతీయంగా తాను ఒంటరి అవుతున్నానని ఇజ్రాయెల్ గుర్తించాలి. ‘అబ్రహమ్ ఒడంబడికల’ ద్వారా మితవాద అరబ్ దేశాలు నెయ్యానికి ముందుకు రావడంతో దానికి కలి గిన ప్రయోజనం పోతుంది. అయినా, ఇంతకు ముందు, ఇకపైన కూడా మధ్య ప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్లు రెండు ప్రధాన సైనిక శక్తులు. ఇరుపక్షాలూ లక్ష్మణరేఖ దాటాయి. వాటి మధ్య ఘర్షణ చివరకు యుద్ధంగా పర్యవసిస్తే అది రెంటికీ నష్టమే. కాబట్టి, మంకుపట్టు వీడి, వెనక్కు తగ్గాలి. ప్రస్తుత ఉద్రిక్తతను చల్లార్చాలి. పొంచివున్న పెను యుద్ధం ముప్పును నివారించాలి. పశ్చిమాసి యాలో ఉద్రిక్తతలు కొనసాగితే, ప్రపంచ చమురు సరఫరాలు సైతం అస్తవ్యస్తమై, ధరలు పెరుగు తాయి. రష్యా నుంచి చమురు సరఫరా కోసం ఎర్రసముద్రంపై ఆధారపడే మన దేశానికీ ఇబ్బందే. భారత్ సూచించినట్టు మళ్ళీ దౌత్యమార్గాన్ని ఆశ్రయించడమే అన్ని వివాదాలకూ పరిష్కారం. -
ఇరాన్తో ఉద్రిక్తతల వేళ.. గాజాపై ఇజ్రాయెల్ దాడులు
గాజా: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఇజ్రాయెల్ సైన్యం పాలస్తీనాలోని సెంట్రల్ గాజాలో దాడులు చేసింది. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంలో కాల్పుల విరమణ చర్చలు ప్రారంభమవుతున్న వేళ ఇజ్రాయెల్ గాజాలో భీకర కాల్పులకు దిగడం చర్చనీయాంశంగా మారింది. సెంట్రల్ గాజాలోని నో సైరాట్ ప్రాంతంలో శుక్రవారం వైమానిక దాడులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ వైమానిక దాడుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా 25 మంది దాకా తీవ్ర గాయపడినట్లు తెలిపారు. మొత్తంగా గాజాలోని వివిధ ప్రాంతాల్లో కలిపి సుమారు పదుల సంఖ్యలో ప్రాణ నష్టం జరిగినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. ఇదీ చదవండి.. ఇరాన్, ఇజ్రాయెల్ హైటెన్షన్.. భారతీయులకు కేంద్రం అలర్ట్ -
శిథిలాల కుప్ప ‘ఖాన్ యూనిస్’.. తిరిగి వస్తున్న ‘గాజా’ వాసులు
జెరూసలెం:పాలస్తీనా దక్షిణ గాజాలో ఉన్న ఖాన్ యూనిస్ ప్రాంతం నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. భీకర యుద్ధం కారణంగా కొంత కాలంగా తమ ప్రాంతానికి దూరంగా తలదాచుకున్న ఖాన్ యూనిస్ వాసులు ఇంటిబాట పట్టారు. సైకిళ్లు వేసుకుని, కాలి నడకన తమ సొంత ప్రాంతానికి తిరిగి వస్తున్నారు. అయితే వారికి అక్కడ ఏమీ మిగల లేదు. భవనాలన్నీ ధ్వంసమై శిథిలాల కుప్పలు మిగిలాయి. ఒకప్పుడు భారీ భవంతులతో కళకళలాడిన ఖాన్ యూనిస్ నగరం ప్రస్తుతం శిథిలాల కుప్పలతో నిండిపోవడాన్ని చూసిన వారు తమ నగరం ఇలా అయిపోయిందేంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో ఎక్కడ చూసిన బాంబులు దర్శనమిస్తున్నాయి. ఒకప్పుడు ఖాన్యూనిస్ జనాభా 14 లక్షలు. గతేడాది అక్టోబర్ 7న ప్రారంభమైన ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో భాగంగా డిసెంబర్లో ఖాన్ యూనిస్ నగరంపైకి సేనలను ఇజ్రాయెల్ తన సైన్యాన్ని పంపింది. హమాస్ ఉగ్రవాదులకు కేంద్రమైన నగరాన్ని మొత్తం ఇజ్రాయెల్ సైన్యం ధ్వంసం చేసింది. ఉగ్రవాదుల జాడ కోసం మొత్తం జల్లెడ పట్టారు. దాడులతో లక్షలాది మంది ఖాన్ యూనిస్ వాసులు నగరం విడిచి వెళ్లిపోయారు. మరో వైపు ఖాన్యూనిస్పై జరిపిన దాడుల్లో వేల మంది హమాస్ ఉగ్రవాదులను హత మార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇదీ చదవండి.. సూర్య గ్రహణం ఎఫెక్ట్.. అమెరికాలో భారీగా రోడ్డు ప్రమాదాలు -
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం.. నెతన్యాహు సంచలన ప్రకటన
జెరూసలెం: ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం ప్రారంభమై ఆదివారం(ఏప్రిల్ 7)తో సరిగ్గా ఆరు నెలలు గడిచిన వేళ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. హమాస్ వద్ద బంధీలుగా ఉన్న తమ పౌరులను విడుదల చేసేదాకా గాజాలో కాల్పుల విరమణకు ఒప్పుకునేలేదని తేల్చిచెప్పారు. ఆదివారం జరిగిన ఇజ్రాయెల్ క్యాబినెట్ సమావేశానికి ముందు బెంజమిన్ నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ దేశాల ఒత్తిడి తమపై పెరుగుతున్నప్పటికీ హమాస్ గొంతెమ్మ కొరికలకు తాము ఒప్పుకోబోమని తేల్చిచెప్పారు. కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఈజిప్టులో తాజా రౌండ్ చర్చలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో నెతన్యాహు వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కాగా, గతేడాది అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్పై పాలస్తీనాకు చెందిన మిలిటెంట్ గ్రూపు హమాస్ మెరుపుదాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో వందల మంది ఇజ్రాయెల్ పౌరులను చంపడమే కాకుండా కొంత మంది పౌరులను హమాస్ ఉగ్రవాదులు తమ వెంట బంధీలుగా తీసుకువెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్ పాలస్తీనాలోని పలు ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. గాజాను పూర్తిగా చిధ్రం చేసింది. ఇజ్రాయెల్ దాడులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇదీ చదవండి.. ఆరు నెలల మారణహోమం.. వేల మరణాలు -
గాజా ఓటింగ్: అమెరికాపై ఇజ్రాయెల్ గుర్రు!
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ కోసం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జరిగిన ఓటింగ్కు అమెరికా దూరంగా ఉండడంపై ఇజ్రాయెల్ రగిలిపోతోంది. ఈ క్రమంలో శాంతి నెలకొల్పేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుపుల్ల పడింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రతిపాదించిన డిమాండ్ను అమెరికా వీటో ఉపయోగించి వీగిపోయేలా చేయాలని ఇజ్రాయెల్ ఆర్మీ ముందు నుంచే కోరింది. కానీ, అమెరికా పూర్తిగా ఓటింగ్కు దూరంగా ఉండిపోయింది. దీంతో అగ్రరాజ్యంపై ఇజ్రాయెల్ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో శాంతి చర్చల కోసం తమ బృందాన్ని అమెరికాకు పంపించాలనుకున్న నిర్ణయంపై ఆ దేశ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ వెనక్కి తగ్గారు. దక్షిణ గాజా నగరమైన రఫాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు సంబంధించి చర్చల కోసం తమ దేశానికి రావాల్సిందిగా అమెరికా ఇజ్రాయెల్ను ఆహ్వానించింది. అయితే తాజా పరిణామాలతోనే ఇజ్రాయెల్ ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ తీర్మానం వల్ల ఇజ్రాయెల్తో సంబంధాలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని యుఎస్ ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. ఇరాన్తో సహా పలు దేశాలకు దాడులకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ భద్రత, రక్షణ కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన పూర్తి మద్దతును తెలియజేస్తున్నారని వైట్హౌస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులేవన్ స్పష్టం చేశారు. ఇక.. గాజా కాల్పుల విమరణను తక్షణమే అమలు చేయాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సోమవారం డిమాండ్ చేసింది. భద్రతా మండలిలోని సమావేశానికి 14 దేశాల సభ్యులు హాజరుకాగా.. అందులో పదిమంది సభ్యులు ఈ తీర్మానాన్ని ప్రతిపాదించాయి. దీంతో ఇజ్రాయెల్కు చెందిన బంధీలను వెంటనే విడిచిపెట్టాలని తెలిపింది. అయితే ఈ సమావేశంలో అమెరికా తీర్మానాన్ని ప్రతిపాదించకుండా ఓటింగ్కు దూరం ఉంది. అయితే కాల్పుల విరమణ చేపట్టాలని మాత్రం కోరింది. మొత్తంగా.. ఆమెరికా వ్యవహరించిన తీరుపై ఇజ్రాయెల్ అసంతృప్తి వ్యక్తం చేసింది. -
గాజా కాల్పుల విరమణకు ఐరాస భద్రతా మండలి డిమాండ్
ఇజ్రాయెల్, పాలస్తీనా సంబంధించిన హమాస్ మిలిటెంట్ల మధ్య తక్షణం కాల్పుల విరమణ అమలు చేయాలని ఐక్యరాజ్య సమితి భద్రతామండలి (యూఎన్ఎస్సీ) డిమాండ్ చేసింది. ఇలా భద్రతా మండలి డిమాండ్ చేయటం తొలిసారి. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇజ్రాయెల్కు చెందిన బంధీలందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని యూఎన్ఎస్సీ పేర్కొంది. ఈ సమావేశానికి శాశ్వత సభ్యదేశం అమెరికా హాజరుకాకపోవటం గమనార్హం. భద్రతా మండలిలో 14 మంది సభ్యులు హాజరు కాగా.. అందులో 10 మంది సభ్యులు ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. ‘గాజా ప్రజలు తీవ్రంగా బాధ పడుతున్నారు. ఈ దాడులు సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏమాంత్ర ఆలస్యం కాకుండా ఈ దాడులకు ముగింపు పలుకడమే మన బాధ్యత’ అని భద్రతా మండలి సమావేశం తర్వాత ఐక్యరాజ్యసమితిలో అల్జీరియా రాయబారి అమర్ బెండ్ జామా తెలిపారు. మరోవైపు.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానంపై అమెరికా వీటో ప్రయోగించాలని ఇజ్రాయెల్ ఆర్మీ కోరింది. అయితే పవిత్ర రంజామ్ మాసంలో గాజాలో కాల్పుల విరమణ జరగటం కోసమే అమెరికా భద్రతా మండలి సమావేశానికి గైర్హాజరు అయినట్లు తెలుస్తోంది హమాస్ను అంతం చేయటమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇప్పటివరకు 32 వేల మంది మరణించారు. ఇక.. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై చేసిన మెరుపు దాడిలో 1160 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందారు. మొత్తం 250 మంది ఇజ్రాయెల్ పౌరులను హమాస్ మిలిటెంట్లు బంధీలుగా తీసుకువెళ్లగా.. వారి చేతిలో ఇంకా 130 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు హమాస్ చేతిలో బంధీలుగా ఉన్న 33 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందారు. ఇటీవల గాజాలో తక్షణ కాల్పుల విరమణ పాటించాలని, హమాస్ వద్ద బంధీలుగా ఉన్నవారిని విడుదల చేయాలని ఐక్యారజ్యసమితి(యూఎన్) భద్రతా మండలిలో అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయిన విషయం తెలిసిందే. చైనా, రష్యా వీటో చేయడంతో తీర్మానం వీగిపోయింది. -
గాజాలో కాల్పుల విరమణ.. ‘యూఎన్’లో వీగిన అమెరికా తీర్మానం
న్యూయార్క్: గాజాలో తక్షణ కాల్పుల విరమణ పాటించాలని, హమాస్ వద్ద బంధీలుగా ఉన్నవారిని విడుదల చేయాలని ఐక్యారజ్యసమితి(యూఎన్) భద్రతా మండలిలో అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. చైనా, రష్యా వీటో చేయడంతో తీర్మానం వీగిపోయింది. యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లోని 15 సభ్య దేశాల్లో 11 తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. తీర్మానానికి అల్జేరియా వ్యతిరేకంగా ఓటు వేయగా గుయానా ఓటింగ్లో పాల్గొనలేదు. ఆకలితో అలమటిస్తున్న గాజా యుద్ధ బాధితులు మానవతా సాయం పొంందేందుకు వీలుగా ఆరు వారాల పాటు కాల్పుల విరణమణ పాటించాలని అమెరికా తీర్మానం ప్రవేశపెట్టింది. అయితే దీనికి ప్రత్యామ్నాయ తీర్మానంపై ఓటింగ్ కోసం ఐక్యరాజ్యసమితి భద్రతామండలి శనివారం మళ్లీ సమావేశం కానుంది. తీర్మానంలోని చైనా, రష్యాలకు అభ్యంతరమున్న పదాలను మార్చినట్లు తెలుస్తోంది. రంజాన్ సందర్భంగా గాజాలో తాత్కాలిక కాల్పుల విరమణ పాటించాలని తాజా తీర్మానంలో పొందుపరిచినట్లు సమాచారం. ఇదీ చదవండి.. మాస్కోలో ఐసిస్ మారణహోమం -
వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్కు ఇజ్రాయెల్ కౌంటర్
గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దళాలు జరిపిన మారణకాండకు ప్రతికారంగా ఆ దేశం.. గాజాపై దాడులు చేస్తోంది. కాల్పుల విరమణ చేసి.. పాలస్తీనా ప్రజలకు మానవతా సాయం అందిచాలని ఆమెరికాతో పాటు పలు దేశాలు ఇజ్రాయెల్పై ఒత్తిడి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. కొన్ని దేశాలు ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని వ్యతిరేకిస్తున్నాయి. అయితే తాజాగా ఇజ్రాయెల్ పాస్పోర్ట్ కలిగిన ప్రజలను ఈ జాబితాలోని దేశాలు.. తమ దేశంలోకి అనుమతించవని వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్‘ఎక్స్’(ట్విటర్)లో పోస్ట్ చేసింది. ఆ జాబితాలో అల్జేరియా, బంగ్లాదేశ్, బ్రూనై, ఇరాన్, ఇరాక్, కువైట్, లెబనాన్, లిబియా, పాకిస్తాన్ దేశాలు ఉన్నాయి. అయితే ఇజ్రాయెల్ చట్టాల ప్రకారం.. లెబనాన్, సిరియా, ఇరాక్, యెమెన్, ఇరాన్ దేశాలు శత్రు దేశాలు జాబితాలో ఉన్నాయి. ఈ అయితే ఈ దేశాలకు ఇజ్రాయెల్ పౌరులు.. వెళ్లాలంటే ఇజ్రాయెల్ మంత్రిత్వ శాఖ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సిందే. అయితే మధ్యప్రాచ్య దేశాల్లో ఇజ్రాయెల్కు వీసా ఫ్రీ దేశంగా కేవలం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఉండటం గమనార్హం. We’re good pic.twitter.com/GmiwEzZGck — Israel ישראל 🇮🇱 (@Israel) March 14, 2024 అయితే దీనికి సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇజ్రాయెల్ పౌరులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దేశంలో ఓ రాష్ట్ర అధికారిక ట్విటర్ హ్యాండిల్ కౌంటర్ ఇచ్చింది. ‘మేం బాగున్నాం’ అని ‘ఎక్స్’లో రీట్వీట్ చేసింది. ఇక..2024 నాటికి ప్ఇజ్రాయెల్ దేశం రపంచంలో 171 దేశాల్లో వీసా రహిత లేదా వీసా ఆన్ అరైవల్ యాక్సెస్ను కలిగి ఉంది. అదేవిధంగా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఇజ్రాయెల్ పాస్పోర్టు 20వ స్థానంలో ఉంది. అదేవిధంగా ఇజ్రాయెల్ పాస్పోర్ట్ కలిగిన పౌరులు చాలా యురోపీయన్ దేశాలుకు ఎటువంటి అడ్డంకులు లేకుండా వెళ్తారు. అదేవిధంగా లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలకు కూడా ఇజ్రాయెల్ ప్రజలు తమ పాస్పోర్టు ద్వారా సందర్శిస్తారు. ఇదీ చదవండి: స్వలింగ వివాహం చేసుకున్న విదేశాంగ మంత్రి! -
యుద్ధం వేళ.. పాలస్తీనాకు కొత్త ప్రధాని
ఇజ్రాయెల్తో యుద్ధం వేళ.. పాలస్తీనాకు కొత్త ప్రధాని నియమితులయ్యారు. మొహమ్మద్ ముస్తఫాను కొత్త ప్రధానిగా నియమిస్తూ తాజాగా ఆ దేశ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ నిర్ణయం తీసుకున్నారు. ముస్తఫా చాలాకాలంగా అధ్యక్షుడు అబ్బాస్ వద్ద సలహాదారునిగా పని చేస్తుండడం గమనార్హం. అయితే.. ఈ ఎంపికపై పాలస్తీనాలో మిశ్రమ స్పందన వినిపిస్తోంది. ఇజ్రాయెల్పై దాడి అనంతరం.. ప్రధానిగా ఉన్న మొహమ్మద్ శతాయే ఫిబ్రవరిలో రాజీనామా చేశారు. అప్పటి నుంచి అధ్యక్షుడు అబ్బాసే ప్రధాని పేషీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు నమ్మకస్తుడు ముస్తఫాకు ప్రధాని బాధ్యతలు అప్పగించారు. పాలస్తీనా అథారిటీలో సంస్కరణలు చేపట్టాలని ఒత్తిడి నెలకొన్న నేపథ్యంలోనే ఈ నియామకం చేపట్టినట్లు అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ప్రకటించారు. అయితే.. అమెరికా ఒత్తిళ్లతోనే అధ్యక్షుడు ఈ నియామకం చేపట్టినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ముస్తఫా నేపథ్యానికి వస్తే.. అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీలో చదువుకున్నారు. పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్లో సభ్యుడిగా ఉన్నారు. ఆర్థికవేత్తగా.. ప్రపంచ బ్యాంకులో పలు హోదాల్లో పనిచేశారు. 2014లో గాజాపై ఇజ్రాయెల్ దాడి తర్వాత పునర్నిర్మాణ పనుల్లో ముస్తఫా భాగం కావడం గమనార్హం. అయితే.. కొత్త ప్రధాని అధికారాలు ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్బ్యాంక్లో చాలా పరిమితంగానే ఉండనున్నాయి. ధ్వంసమైన గాజా స్ట్రిప్ పునర్నిర్మాణం, పలు వ్యవస్థల సంస్కరణల బాధ్యతలను ప్రధానికి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. 2007 నుంచి గాజా స్ట్రిప్ హమాస్ నియంత్రణలోకి వెళ్లగా, వెస్ట్బ్యాంక్లో పాలస్తీనా అథారిటీ అధికారంలో ఉంది. గాజాలోని పరిస్థితుల్ని అమెరికా ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నది తెలిసిందే. ఇక గత అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన మారణకాండలో 1,200 మంది చనిపోయిన విషయం తెలిసిందే. సుమారు 250 మందిని మిలిటెంట్లు బందీలుగా చేసుకున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ భీకర దాడుల్లో పాలస్తీనా భూభాగంలో 31,000పైగా ప్రజలు మృతి చెందారు. -
సరైన కార్యాచరణ ఎక్కడ?!
నటన ఒక స్థాయికి మించితే బెడిసికొడుతుంది. తెరపై అతిగా నటిస్తే ఓవరాక్షన్ అంటారు. ఆ పనే నిజజీవితంలో చేస్తే వంచన అంటారు. గాజాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణకాండ 157 రోజులుగా అంతూ దరీ లేకుండా సాగుతోంది. ముస్లింలు ఎంతో పవిత్రంగా పరిగణించే రంజాన్ మాసం మొదలైనా మారణకాండ, విధ్వంసం ఆగటంలేదు. ఆకలితో అల్లాడుతున్న ప్రజానీకం అడపాదడపా వచ్చిపడుతున్న క్షిపణులకూ, బాంబులకూ పిట్టల్లా రాలుతున్నారు. ఇప్పటికి 31,000 మంది పౌరులు ఈ దాడుల్లో మరణించారని పాలస్తీనా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు చెబుతుండగా అందులో 13,000 మంది ఉగ్రవాదులున్నారని ఇజ్రాయెల్ ప్రకటిస్తోంది. ‘సంపూర్ణ విజయం’ సాధించేవరకూ విశ్రమించబోమని ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ చెబుతున్నారు. నిరుడు అక్టోబర్ 7న ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించిన హమాస్ మిలిటెంట్లు 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులను హతమార్చి, 250 మంది పౌరులను అపహరించినప్పటినుంచీ గాజాపై దాడులు సాగుతూనేవున్నాయి. కిడ్నాప్ చేసినవారిలో 150 మందిని హమాస్ విడుదలచేసింది. ఇంకా 100 మంది వారి చెరలోనేవున్నారు. ఈ మానవ హననాన్ని నిలువరించటానికి తన పలుకుబడిని వినియోగించాల్సిన అగ్రరాజ్యం అమెరికా అందుకు భిన్నంగా ద్విపాత్రాభినయం చేస్తూ తన నటనావైదుష్యాన్ని ప్రదర్శిస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో గాజాపై దాడులు నిలపాలనీ, కనీసం రంజాన్ మాసంలోనైనా కాల్పుల విరమణకు అంగీ కరించాలనీ నెతన్యాహూను కోరారు. మంచిదే. కానీ ఆయన లక్ష్యపెట్టిందెక్కడ? తన మాటకు విలువీయని దేశానికి బైడెన్ ఆయుధ సరఫరా ఎలా కొనసాగిస్తున్నారు? అమెరికాయే కాదు... దాని మిత్రదేశాలు కూడా ఈ ద్విపాత్రాభినయాన్ని అలవాటు చేసు కున్నాయి. ఇదే సమయంలో యుద్ధం ఆపాలంటూ వర్ధమాన దేశాలు తీసుకొస్తున్న తీర్మానాలకు భద్రతామండలిలో అమెరికా తన వీటో అధికారంతో గండికొడుతోంది. నెతన్యాహూపై బైడెన్ తరచు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రఫాపై దాడికి పూనుకుంటే లక్ష్మణరేఖ దాటినట్టేనని హెచ్చరిస్తున్నారు. ఎవరిని వంచించటానికి ఈ హెచ్చరికలు? గాజా ప్రజల క్షేమంపై ఆయనకు నిజంగా ఆందోళనవుంటే దాని పొరుగు దేశమైన ఈజిప్టును ఒప్పించి గాజా పౌరులు సరిహద్దుదాటి తలదాచుకునేందుకు అనుమతించమని అడగొచ్చు. కానీ ఆయన ఆ పని చేయటం లేదు. ఈజిప్టుకు ఏటా అమెరికా 103 కోట్ల డాలర్ల విలువైన సైనిక సాయాన్ని అందిస్తోంది. ఆ దేశాధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసితో బైడెన్కు మంచి సంబంధాలున్నాయి. అయినా ఈ ప్రతిపాదన చేయరు. ఇందుకు బదులు ఆహార పొట్లాలు అందించటం మొదలెట్టారు. ఆ ఉద్దేశం వెనకున్న ఆంతర్యాన్ని కూడా అనేకులు తప్పుబడుతున్నారు. దేశప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో గాజాలో పోర్టు నిర్మాణాన్ని మొదలుపెడతామని బైడెన్ ప్రకటించారు. ఇది ఆహార సరఫరా సులభం చేయటం కోసమని ఆయన చెబుతున్నా ఆ వంకన అక్కడ తిష్టవేయటమే అమెరికా లక్ష్యమన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇజ్రా యెల్కు ఆత్మరక్షణ చేసుకునే హక్కుందని బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ మాట్లాడే మాటలు 31,000 మంది మరణించాక కూడా చెల్లుబాటవుతాయా? అయిదు నెలలు గడిచాక కూడా ఇంకా హమాస్ను అంతం చేయటమే లక్ష్యమంటూ ఇజ్రాయెల్ సాగిస్తున్న నరమేథాన్ని అమెరికా చూసీ చూడనట్టు వదిలేయటం సరైందేనా? హమాస్ తన దుందుడుకు చర్యలతో గాజా ప్రజలకు తీరని నష్టం చేసింది. దానిపై దాడి పేరుతో అదే పని ఇజ్రాయెల్ కూడా కొనసాగిస్తోంది. కానీ ఒకరి దాడిని ఉగ్రవాదంగా చిత్రీకరిస్తూ మరొకరిని అనునయిస్తూ, వేడుకుంటూ అదే సమయంలో వారికి కావల సిన ఆయుధ సామగ్రి అందిస్తూ కాలం గడపటం సరైందేనా? గాజాలో నాగరిక సమాజాలు ఏమాత్రం అంగీకరించటం సాధ్యంకాని ఉదంతాలు చోటుచేసు కుంటున్నాయి. గాజా పౌరులు ఆకలికి తట్టుకోలేక ఆకులు అలములు తింటున్నారు. కడుపు నింపు కోవటానికి పశుదాణా సైతం వినియోగిస్తున్నారు. నెలలు నిండకమునుపే గర్భిణులకు ప్రసవాలవు తున్నాయి. ఆ నవజాత శిశువులకు అవసరమైన సంరక్షణ కూడా సాధ్యం కావటం లేదు. అధిక రక్తస్రావంతో తల్లులు కన్నుమూస్తున్నారు. సకాలంలో మేల్కొని ఆపకపోతే ఇజ్రాయెల్తోపాటు అమెరికా కూడా దోషిగా నిలబడాల్సివస్తుంది. రష్యా సాగిస్తున్న దురాక్రమణ యుద్ధంలో దినదిన గండంగా బతుకుతున్న ఉక్రెయిన్కు ఇంతవరకూ అమెరికా ఒక్కటే 7,500 కోట్ల డాలర్ల సాయం అందించింది. నాటో సభ్య దేశాలు తమ వంతుగా మరింత సాయం అందిస్తున్నాయి. ఇందువల్ల రష్యా ఎక్కడా తగ్గిన దాఖలా లేదు. అటు ఉక్రెయిన్కు కూడా ఒరిగేదేమీ వుండటం లేదు. లాభపడేది అమెరికా రక్షణ ఉత్పత్తుల కంపెనీలే. సాయం పేరుతో అందించేదంతా తిరిగి ఆ కంపెనీలకు చేరుతోంది. ఉక్రెయిన్ ఆ డబ్బుతో అమెరికా ఆయుధాలు, క్షిపణులు వగైరాలు కొంటున్నది. అటు ఉక్రెయిన్, ఇటు గాజా ఏకకాలంలో శ్మశానాలను మరపిస్తుండగా... రక్షణ ఉత్పత్తుల కంపెనీలు మాత్రం పచ్చగా వెలుగుతున్నాయి. పోనీ అమెరికా అయినా ప్రశాంతంగా వుంటున్నదా? కొన్ని దశాబ్దాలక్రితం పౌరహక్కుల కోసం చేతులు కలిపిన నల్లజాతీయులు, యూదులు ఇప్పుడు పరస్పరం దూషించుకుంటున్నారు. యూదులపై అక్కడక్కడ దాడులు కూడా జరుగుతున్నాయి. దీన్నంతటినీ ఆపాలంటే గాజాతోపాటు ఉక్రెయిన్లోనూ ప్రశాంతత నెలకొనాలి. అది అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేతుల్లోనేవుంది. ఇప్పుడు కావాల్సింది నటన కాదు... సరైన కార్యాచరణ. -
ఆస్కార్ రెడ్ కార్పెట్: ఆ స్టార్ల రెడ్ పిన్ కథేమిటి?
ఆస్కార్ 2024 సంరంభం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రపంచ సినిమా రంగంలో నోబెల్ అవార్డులుగాభావించే ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో హాలీవుడ్ తారలు రెడ్ కార్పెట్పై ప్రత్యేకంగా కనిపించారు. 96వ అకాడమీ అవార్డుల కార్యక్రమంలో పలువురు సెలబ్రిటీలు స్టార్లు అంతా రెడ్ పిన్లు ధరించడం విశేషంగా నిలిచింది. వీరి ఫోటోలు వైరల్ గా మారాయి. భీకర బాంబుల దాడులతో దద్దరిల్లిన గాజాలో తక్షణ, శాశ్వత కాల్పుల విరమణ కోసం పిలుపునిస్తూ వారంతా రెడ్ పిన్లను ధరించారు. అలాగే కాల్పుల విరమణకు పిలుపు నివ్వమని అమెరికా అధ్యక్షుడు బిడెన్ను కోరుతూ ఒక బహిరంగ లేఖపై సంతకం చేశారు. ఇజ్రాయెల్, గాజాలో హింసను అరికట్టడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ యుద్ధంలో వేలాదిమంది, ముఖ్యంగా చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. గాజాలో శాంతిని కోరుతూ ఈ నిర్ణయం తీసుకున్నామని 'పూర్ థింగ్స్' నటుడు రమీ యూసఫ్ తెలిపారు. ప్రతి ఒక్కరి భద్రతకో పిలుపునిస్తున్నామనీ, పాలస్తీనా ప్రజలకు శాశ్వత న్యాయం , శాంతి కలిగేలా చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నామన్నారు. అరచేతిలో ఒక నల్ల రంగు గుండెతో డిజైన్ చేసిన ఈ రెడ్ పిన్నులను ఆర్టిస్ట్4సీజ్ఫైర్ అనే సంస్థ తయారు చేసింది. -
నెతన్యాహూతో ఇజ్రాయెల్కు నష్టమే: బైడెన్
విలి్మంగ్టన్: గాజాలో హమాస్పై యుద్ధం పేరిట ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తన సొంత దేశానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విమర్శించారు. నెతన్యాహూ అనాలోచిత చర్యల వల్ల ఇజ్రాయెల్కు లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతోందని అన్నారు. గాజాలో సాధారణ పౌరుల మరణాలను నియంత్రించడంలో నెతన్యాహూ దారుణంగా విఫలమవుతున్నారని ఆక్షేపించారు. బైడెన్ శనివారం మీడియాతో మాట్లాడారు. తిరుగుబాటుతో సంబంధం లేని పాలస్తీనియన్ల ప్రాణాలు కాపాడాలని, ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఇజ్రాయెల్కు సూచించారు. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్లు చేసిన దాడిని తాము ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. హమాస్ను వేటాడే హక్కు ఇజ్రాయెల్కు ఉందని వెల్లడించారు. కానీ, సాధారణ ప్రజలపై దాడి చేయడం సరైంది కాదని తేల్చిచెప్పారు. గాజాలో మరణాల సంఖ్య ఇజ్రాయెల్ చెబుతున్నదానికంటే ఎక్కువగానే ఉన్నట్లు తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. గాజాలో అమాయకుల మరణాలు ఇంకా పెరిగితే ఇజ్రాయెల్ అంతర్జాతీయ మద్దతును కోల్పోతుందని బైడెన్ కొన్ని రోజుల క్రితం హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
ఎర్రసముద్రంలో హౌతీ దాడులు.. ఇద్దరి మృతి
దుబాయ్: గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ మారణకాండకు తీవ్రంగా తప్పుబడుతూ అందుకు ప్రతిగా ఎర్రసముద్రంలో వాణిజ్యనౌకలను లక్ష్యంగా చేసుకున్న హౌతీ తిరుగుబాటుదారులు తమ దాడులను ఉధృతం చేశారు. దీంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. హౌతీ దాడుల్లో మరణాలు సంభవించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఎర్ర సముద్ర పరిధిలోని గల్ఫ్ ఆఫ్ ఆడెన్ వద్ద ఈ ఘటన జరిగింది. బుధవారం గ్రీస్ దేశానికి చెందిన బార్బడోస్ జెండాతో వెళ్తున్న వాణిజ్యనౌక ‘ట్రూ కాని్ఫడెన్స్’పై హౌతీలు మిస్సైల్ దాడి జరపగా నౌకలోని ఇద్దరు సిబ్బంది చనిపోయారు. ఇతర సిబ్బంది పారిపోయారు. నౌకను వదిలేశామని, అది తమ అదీనంలో లేదని చెప్పారు. తమ యుద్ధనౌకలపైకి హౌతీ రెబెల్స్ నౌక మిస్సైళ్లు, డ్రోన్లను ప్రయోగించడంతో అమెరికా విధ్వంసక నౌకలు రెచి్చపోయాయి. హౌతీలు ఉంటున్న యెమెన్ భూభాగంపై దాడి చేసి హౌతీ క్షిపణులు, డ్రోన్లను ధ్వంసంచేసింది. హౌతీల దాడుల్లో మరణాలు నమోదవడంతో ఆసియా, మధ్యప్రాచ్యం, ఐరోపాల మధ్య సముద్ర రవాణా రంగంలో సంక్షోభం మరింత ముదిరింది. హౌతీలపై అమెరికా దాడులపై ఇరాన్ మండిపడింది. అమెరికా ఇంధన సంస్థ షెవ్రాన్ కార్ప్కు చేరాల్సిన కువైట్ చమురును తోడేస్తామని హెచ్చరించింది. రూ.414 కోట్ల విలువైన ఆ చమురును తీసుకెళ్తున్న నౌకను ఇరాన్ గతేడాది హైజాక్ చేసి తమ వద్దే ఉంచుకుంది. -
‘హమాస్’ అత్యాచారాలు.. యూఎన్ సంచలన నివేదిక
జెరూసలెం: గతఏడాది అక్టోబర్7న ఇజ్రాయెల్పై పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ చేసిన దాడులకు సంబంధించి ఐక్యరాజ్యసమితి(యూఎన్) సంచలన విషయాలు వెల్లడించింది. అక్టోబర్ 7 దాడిలో ఇజ్రాయెల్పై దాడి సమయంలో అక్కడి మహిళలపై అత్యాచారాలు జరిగాయనేందుకు కచ్చితమైన, ఆధారలతో కూడిన సమాచారం ఉందని యుద్ధంలో జరిగిన లైంగిక దాడులపై యూఎన్ నియమించిన ప్రమీల పాటెన్ బృందం తేల్చింది. హమాస్ బంధీలుగా తీసుకెళ్లిన ఇజ్రాయెల్ మహిళలపై ఇప్పటికీ అత్యాచారాలు జరుగుతున్నాయని యూఎన్ బృందం తన నివేదికలో తెలిపింది. ఫిబ్రవరిలో పాటెన్తో పాటు నిపుణుల బృందం ఇజ్రాయెల్, వెస్ట్బ్యాంక్లో పర్యటించారు. గాజా సరిహద్దులోని ఇజ్రాయెల్కు చెందిన మూడు ప్రాంతాలు నోవా మ్యూజిక్ ఫెస్టివల్ సైట్,రోడ్ 232, కిబుట్జ్ రెమ్లలో ఇజ్రాయెలీలపై రేప్లతో పాటు గ్యాంగ్ రేప్లు జరిగినట్లు రిపోర్టు వెల్లడించింది. చాలా వరకు కేసుల్లో ముందు రేప్ చేసి తర్వాత హత్య చేశారని తెలిపింది. చనిపోయిన మహిళల మృతదేహాలపైన కూడా రెండు చోట్ల అత్యాచారాలు జరిగినట్లు ఐక్యరాజ్యసమితి బృందం తేల్చింది. ఈ అత్యాచారాలపై సాక్ష్యం చెప్పాల్సిందిగా బృందం కోరినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. అత్యాచార ఘటనలపై యూఎన్ బృందం సభ్యులు మొత్తం 5వేల ఫొటోలు, 50 గంటల సీసీ టీవీ ఫుటేజ్ను పరిశీలించడంతో పాటు రేప్కు గురైన బాధితులతో మాట్లాడారు. హమాస్ వద్ద బంధీలుగా ఉండి విడుదలైన వారిని పలువురిని ఇంటర్వ్యూ చేశారు. కాగా, అక్టోబర్ 7న ఇజజ్రాయెల్పై పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాద సంస్థ మెరుపు దాడులు జరిపి వందల మంది ఇజ్రాయెల్ పౌరులను చంపి కొంత మందిని బంధీలుగా తమ వెంట తీసుకెళ్లింది. దీనికి ప్రతీకారంగా అప్పటి నుంచి ఇజ్రాయెల్ సైన్యం పాలస్తీనాపై భీకర దాడులు చేస్తోంది. గాజాను మొత్తం చిధ్రం చేసింది. అమెరికా కోరినప్పటికీ ఇజ్రాయెల్ దాడులు ఆపడం లేదు. ఇదీ చదవండి..హైతీలో తీవ్ర అరాచకం -
తక్షణమే కాల్పుల విరమణకు కమలా హారిస్ పిలుపు
గాజాలో ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగుతున్నాయి. యుద్ధం కారణంతో గాజాలో తీవ్ర ఆహార కోరత ఏర్పడింది. అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పందిస్తూ.. తక్షణమే గాజాలో కాల్పుల విరమణ చేపట్టాలని ఇజ్రాయెల్కు పిలుపునిచ్చింది. పాలస్తీనాలోని ప్రజలు అమానవీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారని.. మానవతా సాయం పెంచాలని ఇజ్రాయెల్కు విజ్ఞప్తి చేశారు. అలబామాలోని సెల్మాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కమలా హారిస్.. ‘గాజాలోని ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. అక్కడి పరిస్థితులు అమానవీయంగా ఉన్నాయి. మానవత్వం మమ్మల్ని చర్య తీసుకోవడానికి బలవంతం చేస్తోంది. గాజాలోని ప్రజలకు సహయం పెంచడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం కృషి చేయాలి’ అని కమలా హారిస్ అన్నారు. ‘హమాస్ కాల్పుల విరమణను కోరుకుంటుంది. కాల్పుల విరమణ ఒప్పందానికి హమాస్ ఒప్పుకోవడానికి సిద్ధం ఉంది. కాల్పుల విరమణ డీల్ చేసుకోండి. బంధీలను వారి కుటుంబాలకు వద్దకు చేర్చండి. అదేవిధంగా వెంటనే గాజా ప్రజలకు కూడా శాంతి, సాయం అందించండి’ అని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తెలిపారు. ఇక.. తమ వద్ద సజీవంగా ఉన్న ఇజ్రాయెల్ బంధీల పేర్లు వెల్లడించడానికి హమాస్ తిరస్కరించినట్లు ఇజ్రాయెల్ స్థానిక మీడియా పేర్కొంటోంది. ఆదివారం కైరోలో జరిగిన గాజా కాల్పుల విరమణ చర్చలను ఇజ్రాయెల్ బాయ్కాట్ చేయటం గమనార్హం. -
Israel-Hamas war: గాజాకు అమెరికా మానవతా సాయం
వాషింగ్టన్: ఒకవైపు ఇజ్రాయెల్ భీకర దాడులు.. మరోవైపు ఆహారం దొరక్క ఆకలి కేకలు.. గాజాలో లక్షలాది మంది పాలస్తీనియన్ల దుస్థితి ఇది. వారికి సాయం అందించేందుకు అగ్రరాజ్యం అమెరికా ముందుకొచి్చంది. బాధితులకు మానవతా సాయం పంపిణీని ప్రారంభించింది. ఆకలి తీర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అమెరికా సైన్యానికి చెందిన సి–130 సరుకు రవాణా విమానాల ద్వారా శనివారం ఉదయం గాజాలో 38 వేల ఆహార ప్యాకెట్లను జారవిడిచారు. 66 పెద్ద బండిళ్లలో ఈ ప్యాకెట్లను భద్రపర్చి, బాధితులకు చేరేలా కిందికి జారవిడిచారు. ఇందుకోసం జోర్డాన్ సహకారంతో మూడు విమానాలను ఉపయోగించినట్లు అమెరికా సైనికాధికారులు తెలిపారు. గాజాలో విమానం ద్వారా ఆహార పదార్థాలు అందించిన అనుభవం జోర్డాన్కు ఉంది.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఓటెత్తిన జనం!
వెనుదిరిగిన ఓటర్లు
సీపీ సుడిగాలి పర్యటన
ఓటేసిన ప్రముఖులు
● ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం ● ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ● జిల్లాలో 66.53శాతం ఓటింగ్ నమోదు ● అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తగ్గిన ఓటింగ్
లెక్కలేస్తున్న అభ్యర్థులు
సంతోషంగా ఉంది
ప్రశాంత వాతావరణంలో పోలింగ్
తొలిసారి ఓటేసిన యువత
ఓటేసిన ట్రాన్స్జెండర్లు
తప్పక చదవండి
- తెలుగు సినిమాతో పరిచయమైన హీరోయిన్.. గుర్తుపట్టారా?
- సౌత్ ఇండస్ట్రీలో బడా ఆఫర్.. ఒక్కరోజు కాంప్రమైజ్ అని కండీషన్!
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
- అందుకే నాకు పిల్లలు వద్దు: నిఖిల్ కామత్ సంచలన వ్యాఖ్యలు
- గాజాలో ఆగని దాడులు.. భారతీయుడి మృతి
- అందుకే విడిపోతున్నాం.. జీవీ ప్రకాష్-సైంధవిల ప్రకటన
- జనసేన కార్యకర్తల దౌర్జన్యం
- ముంబైలో ఘోరం.. హోర్డింగ్ కూలి 14 మంది మృతి
- నగరం బాట పట్టిన ఆంధ్రా ఓటర్లు.. దారులన్నీ రద్దీ!
Advertisement