-
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో మహిళలకు అకౌంట్లలో నెలకు 2500 రూపాయలు వేస్తున్నామని రాహుల్ గాంధీ నిసిగ్గుగా నిర్మల్ సభలో చెప్పుకోవడాన్నితీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. రాహుల్ గాంధీ మాటలు రాజు గారు దేవతా వస్త్రాల కథను గుర్తుకు తెస్తున్నాయని ఎక్స్(ట్విటర్)లో హరీశ్రావు ట్వీట్ చేశారు.‘తెలంగాణ రాష్ట్ర వ్యవహారాలపై రాహుల్ గాంధీకి కనీస అవగాహన లేదు. ఆయన దొంగలకు సద్ది కడుతున్నారు. గ్యారెంటీలకు గ్యారెంటీగా ఉండాల్సిన రాహుల్ గాంధీ కంచే చేను మేసేలా ప్రవర్తిస్తే ఎట్లా? అమలు కానీ గ్యారెంటీలు అమలవుతున్నట్టు ప్రకటించిన రాహుల్ గాంధీ తక్షణమే తప్పు జరిగింది అని క్షమాపణ చెప్పాలి.తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి లేదా తన మాట నిజమే అయితే గ్యారెంటీల అమలు పై నాతో బహిరంగ చర్చకు రావాలి’ అని హరీశ్రావు డిమాండ్ చేశారు. -
Ts: ప్రభుత్వానిది వైట్ పేపర్ కాదు.. ఫాల్స్పేపర్: హరీశ్రావు
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి కేఆర్ఎంబీకి అప్పగించబోని బీఆర్ఎస్ చెప్పించిందని, ఇది బీఆర్ఎస్ పార్టీ విజయమని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం మీడియాపాయింట్లో హరీశ్రావు మాట్లాడారు. తాము గొంతు విప్పాకే అసెంబ్లీలో కేఆర్ఎంబీపై ప్రభుత్వం తీర్మానం చేసిందని చెప్పారు. ‘ఆరు గ్యారెంటీల అమలు విషయంలో ప్రభుత్వ వైఖరిపై నిలదీశాం. ప్రతిపక్షం మీద దాడి చేసే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. వారి ప్రెజెంటేషన్లన్నీ తప్పుల తడకలుగా ఉన్నాయి. మేము కూడా ఫ్యాక్ట్ షీట్ విడుదల చేస్తున్నం. మీడియా ప్రచారం చేయాలి. వాస్తవాలు తెలియజేయాలి.మీరు చెప్పింది తప్పు అని ప్రొటెస్ట్ చెప్తామంటే వినడం లేదు. కాగ్ పనికి రాదు అని మేము అనలేదు. మాజీ ప్రధాని మీ మన్మోహన్ సింగ్ గారే కాగ్ నివేదిక తప్పుల తడక అన్నారు. గతంలో సీఎంలుగా పనిచేసిన వైఎస్రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి కాగ్ను తప్పుపట్టారు. ఇదే కాగ్ మమ్మల్ని ఎన్నో సార్లు మెచ్చుకున్నది. ప్రాణహిత టెండర్లు కూడా వేయకుండా పనులు ప్రారంభించారని కాగ్ మిమ్మల్ని తిట్టింది. ప్రభుత్వం పెట్టింది వైట్ పేపర్ కాదు ఫాల్స్ పేపర్. నాలుగు ఎంపీ సీట్ల కోసం చిన్న పొరపాట్లను భూతద్దం పెట్టీ చూపే ప్రయత్నం చేస్తున్నారు. రైతుల సంక్షేమం చూడాలి. లేదంటే ఆగం అవుతారు. మీకు పుట్టగతులు ఉండవు. పరిపాలన మీద దృష్టి పెట్టాలి. మమల్ని ఇరికించబోయి సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక మేడిగడ్డ అంటున్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మీ హయాంలో నీళ్ళు, కరెంట్, రైతు బంధు రావడం లేదు. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా. ఏనాటికైనా కంచు కంచే. మేము ప్రజల మధ్య ఉన్నాం. మంద బలంతో తిట్టించే ప్రయత్నం చేశారు. నేను సభలో మాట్లాడితే 8 మంది మంత్రులు అడ్డుకున్నరు. ప్రజలు చూశారు. మీదగ్గర సమాధానం లేక తప్పించుకున్నారు. వాస్తవాలు బయటికి రాకుండా అడ్డుకున్నారు. సభలో అడ్డుకున్నా ప్రజల్లో అడ్డుకోలేరు’ అని హరీశ్రావు మండిపడ్డారు. ఇదీ చదవండి.. కాంగ్రెస్లో చేరిక.. బీజేపీ నేత ఈటల క్లారిటీ -
ఆటోడ్రైవర్లకు బీఆర్ఎస్ సంఘీభావం
సాక్షి, హైదరాబాద్: ఆటో డ్రైవర్లను ఆదుకునే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుక్రవారం అసెంబ్లీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టి తెచ్చే లక్ష్యంతో హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తూ చేరుకున్నారు. సుమారు 20కి పైగా ఆటోల్లో మాజీ మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, సబిత, సునీత లక్ష్మారెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి తదితరులు అసెంబ్లీకి వచ్చారు. ప్లకార్డులతో అసెంబ్లీకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పబ్లిక్ గార్డెన్స్ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆటోలను లోపలికి అనుమతించేందుకు పోలీసులు అభ్యంతరం చెప్పడంతో బీఆర్ఎస్ సభ్యులు వాగ్వాదానికి దిగారు. ప్లకార్డులను లాక్కునే క్రమంలో కేపీ వివేకానందతో జరిగిన తోపులాటలో కారు అద్దం పగిలింది. ఆటో కార్మి కుల కుటుంబాలను ఆదుకోవాలని నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభకు, ఎమ్మెల్సీలు శాసనమండలికి కాలినడకన చేరుకున్నారు. నల్ల కండువాలతో శాసనమండలిలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడంపై ఎమ్మెల్సీలు శేరి సుభాశ్రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. -
Ts: బీఏసీ మీటింగ్ వివాదం.. హరీశ్రావు కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాల తొలిరోజు గురువారం మాజీ మంత్రి హరీశ్రావుకు అసెంబ్లీలో వింత అనుభవం ఎదురైంది. బీఏసీ సమావేశానికి హాజరయ్యే విషయంలో ఏర్పడిన గందరగోళంపై హరీశ్రావు మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. ‘గతంలో లేని సంప్రదాయాలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువస్తోంది. జాబితాలో పేర్లు ఉన్న వారు మాత్రమే బీఏసీ సమావేశానికి రావాలని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు అంటున్నారు. కడియం శ్రీహరితో పాటు హరీశ్రావు బీఏసీకి వస్తారని నిన్ననే స్పీకర్కు బీఆర్ఎస్ఎల్పీ లీడర్ కేసిఆర్ తెలియజేశారు. స్పీకర్ రమ్మన్నారు కాబట్టే వెళ్ళాను. ఒక్క ఎమ్మెల్యే ఉన్న సీపీఐని బీఏసీ సమావేశానికి పిలిచారు’ అని హరీశ్రావు మీడియాకు తెలిపారు. అంతకుముందు బీఏసీ సమావేశానికి వెళ్లిన హరీశ్రావు సమావేశం మధ్యలో నుంచే బయటికి వచ్చేశారు. జాబితాలో పేరున్న కేసీఆర్కు బదులుగా పేరున్న హరీశ్రావు బీఏసీకి వెళ్లారు. హరీశ్రావు బీఏసీ సమావేశానికి రావడంపై శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు అభ్యంతరం తెలపడంతో హరీశ్రావు మధ్యలోనే బయటికి వచ్చినట్లు తెలిసింది. దీనిపై మంత్రి శ్రీధర్బాబు స్పందించారు. తాము ఎవరినీ వ్యక్తిగతంగా బీఏసీ నుంచి బయటికి వెళ్లమని కోరలేదన్నారు. స్పీకర్ నిర్ణయం మేరకే బీఏసీ నడిచిందని, పార్టీల నుంచి ముందుగా ప్రతిపాదించిన సభ్యులే బీఏసీకి రావాలని స్పీకర్ కోరారని చెప్పారు. జాబితాలో పేరున్న కేసీఆర్కు బదులుగా హరీశ్రావు వస్తారని బీఆర్ఎస్ తెలిపిందన్నారు. గవర్నర్ ప్రసంగంలో గ్యారెంటీల జాడ లేదు అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై చేసిన ప్రసంగంపై అసెంబ్లీ మీడియా పాయింట్లో హరీశ్రావు స్పందించారు. ఒక విజన్లా ఉండాల్సిన గవర్నర్ ప్రసంగం అందరినీ నిరాశపరిచిందన్నారు. వచ్చే ఏడాది ప్రభుత్వం ఏం చేస్తుందో గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా లేదని విమర్శించారు. ‘కొత్త ఆసరా పెన్షన్లు, మహిళలకు నెలకు రూ. 2500 ఎప్పుడిస్తారో తెలియని ప్రసంగం నిరాశపరిచింది. రైతులకు బోనస్, రైతు బంధు ఎప్పుడు ఇస్తారో చెప్పలేదు. నిరుద్యోగ భృతి ప్రస్తావన లేనేలేదు. ప్రజావాణి కార్యక్రమం తుస్సుమంది. మంత్రులు, ఐఏఎస్లు తీసుకోవాల్సిన అప్లికేషన్లు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తీసుకుంటున్నారు. గవర్నర్ ప్రసంగంలో చెప్పినట్టు 2 గ్యారెంటీలు అమలవ్వడం లేదు. త్వరలో ఎన్నికల కోడ్ అమలవనుంది. అప్పుడు ఈ కొత్త హామీలు ఎలా అమలు చేస్తారు’ అని హరీశ్రావు ప్రశ్నించారు. ఇదీచదవండి.. ప్లీజ్ కేటీఆర్..కాంట్రవర్సీ వద్దు -
నెల రోజుల్లో కేంద్రం ఆధీనంలోకి ప్రాజెక్టులు: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులను నెల రోజుల్లో కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్(కేఆర్ఎంబీ)కి అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. ఈ అంశంపై సోమవారం ఆయన తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో జరిగిన కేఆర్ఎంబీ రెండో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కేఆర్ఎంబీ రెండో మీటింగ్ మినట్స్లోనే ఉన్నాయన్నారు. తాము నిలదీశాకే ప్రాజెక్టులపై ఢిల్లీకి లేఖ రాశారన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో కృష్ణాపై ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించలేదని, కేవలం రెండు నెలల పాలనలోనే రేవంత్ సర్కారు ఆ పని చేసిందని విమర్శించారు. తప్పులను కప్పి పుచ్చుకునేందుకే సర్కారు పెద్దలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఢిల్లీకి ప్రాజెక్టులు అప్పగించి తెలంగాణను అడుక్కునే స్థితికి తీసుకువచ్చారని మండిపడ్డారు. రాజకీయాలు కాదు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగేలా వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేశారు. ఆదివారం మీడియా సమావేశంలో రేవంత్రెడ్డి అర్థ సత్యాలు, అసత్యాలు మితి మీరిన భాష కనిపించాయన్నారు. ఉదయం పద్మ అవార్డుల గ్రహీతల సభలో హుందాగా మాట్లాడాలని చెప్పిన రేవంత్రెడ్డి మధ్యాహ్నానికి మాట మార్చారని, నీచమైన భాషతో కేసిఆర్ను దూషించారన్నారు. ప్రాజెక్టులు అప్పగించేది లేదని సీఎం అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. ఇక నుంచి ప్రాజెక్టులపైకి వెళ్లాలంటే సీఆర్పీఎఫ్ అనుమతి తప్పనిసరన్నారు. ప్రాజెక్టుల అప్పగింత వల్ల ఏపీ లాభం జరుగుతుందని పత్రికలో వచ్చినా ఈ ముఖ్యమంత్రి నుంచి ఉలుకు పలుకు లేదని హరీశ్రావు మండిపడ్డారు. ఇదీచదవండి.. లిక్కర్ స్కాం కేసు.. కవిత పిటిషన్పై విచారణ వాయిదా -
TS: బీఆర్ఎస్ ‘స్వేద పత్రం’లో ఏముంది?
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ రిలీజ్ చేయనున్న స్వేద పత్రం ఆసక్తి రేపుతోంది. తమ తొమ్మిదేళ్ల తమ పాలనలో తెలంగాణలో అభివృద్ధి చేసిన ఆస్తులు, అప్పులపై గులాబీ పార్టీ కాసేపట్లో స్వేదపత్రం పేరిట వైట్పేపర్ రిలీజ్ చేయనుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషేన్ ద్వారా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆస్తులు, అప్పులను వివరించనున్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలకు కౌంటర్గా బీఆర్ఎస్ ఈ స్వేద పత్రం విడుదల చేయనుంది. తొమ్మిదేళ్లలో ప్రభుత్వంలో తాము,తెలంగాణప్రజలు కలిసి చెమటోడ్చి ఆస్తులు సృష్టించుకున్నందునే వైట్పేపర్కు స్వేదపత్రం అని పేరు పెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆస్తుల సృష్టికే అప్పులు చేశామని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకే ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. నిజానికి శనివారమే స్వేదపత్రం రిలీజ్ చేస్తామని ప్రకటించినప్పటికీ కేటీఆర్ బిజీ షెడ్యూల్ కారణంగా కార్యక్రమానికి నేటికి వాయిదా వేశారు. స్వేదపత్రం రిలీజ్ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీశ్రావు సహా బీఆర్ఎస్ ముఖ్య నేతలు పలువురు హాజరవనున్నారు. ఇదీచదవండి..లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్! -
రేవంత్ ప్రసంగానికి అడ్డు తగిలిన బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో బీఆర్ఎస్ సభ్యులు పలుమార్లు అడ్డుతగిలారు. రేవంత్రెడ్డి తన ప్రసంగంలో బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ ప్రభుత్వంపైన విమర్శలు చేస్తుండటంతో రెండుసార్లు మాజీ మంత్రి హరీశ్రావు నేతృత్వంలో పలువురు బీఆర్ఎస్ సభ్యులు వెల్లోకి వెళ్లి నిరసన తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను ప్రస్తావిస్తూ మాజీ మంత్రి కేటీఆర్ను ఉద్దేశిస్తూ ‘సిగ్గుతో తలదించుకోవలసిందే’నని రేవంత్ వ్యాఖ్యానించగా హరీశ్రావు, పాడి కౌశిక్రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, మాగంటి గోపీనాథ్, పల్లా రాజేశ్వర్రెడ్డి, కాలేరు వెంకటేశ్ తదితరులు వెల్లోకి వెళ్లి నిరసన తెలిపారు. మీకు కూడా మాట్లాడేందుకు అవకాశం ఇస్తానని స్పీకర్ ప్రసాద్కుమార్ తెలపడంతో సీట్లలో కూర్చున్నారు. ► రేవంత్ ప్రసంగంలో బీఆర్ఎస్ను, కేసీఆర్ను విమర్శిస్తున్నప్పుడు సభ్యులు పాడి కౌశిక్రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ పలుమార్లు అరుస్తూ అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. ► రేవంత్ మాటలకు కౌశిక్రెడ్డి అడ్డు తగులుతుంటే స్పీకర్ ప్రసాద్కుమార్ జోక్యం చేసుకుంటూ ‘కౌశిక్రెడ్డి.. కొత్త సభ్యుడివి. సభ నాయకుడు మాట్లాడుతుంటే వినాల్సిందే’అని స్పష్టం చేశారు. ► డ్రగ్స్ మాఫియా గురించి రేవంత్ మాట్లాడుతూ యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్ గురించి మాట్లాడుతుంటే సపోర్ట్ చేసేందుకు మనసు రాలేదా అని ప్రశ్నించగా, ‘వుయ్ సపోర్ట్ యూ’అని పాడి కౌశిక్రెడ్డి అరిచారు. దానికి రేవంత్ స్పందిస్తూ ‘ఆయనకు తెలియక మాట్లాడుతున్నాడు. తరువాత ఆయన కష్టాలు ఆయనకుంటాయి’అని వ్యాఖ్యానించారు. కాగా తమ ప్రభుత్వ హయాంలో కూడా డ్రగ్స్ కట్టడికి సీవీ ఆనంద్ నేతృత్వంలో చర్యలు తీసుకున్నామని మాజీ మంత్రి కేటీఆర్ బదులిచ్చారు. ► రేవంత్ మాటలకు కౌశిక్రెడ్డి అడ్డు తగిలిన సమయంలో ‘గట్టిగా అరుస్తున్న ఆయన కూడా మేనేజ్మెంట్ కోటానే’అని వ్యాఖ్యానించారు. -
కరెంట్ కావాలా..కాంగ్రెస్ కావాలా: హరీశ్రావు
సాక్షి, నారాయణఖేడ్: బీఆర్ఎస్ ర్యాలీకి హాజరైన ప్రజలను చూస్తే కాంగ్రెస్ వాళ్లకు గుండెలో గుబులు పుడుతోందని మంత్రి హరీశ్రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణ ఖేడ్ రోడ్ షోలో హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇక్కడ భూపాల్ రెడ్డి 50 వేల మెజారిటీతో గెలుస్తారని చెప్పారు. కర్ణాటకలో 9 గంటలు ఉన్న కరెంటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 3 గంటలకు వచ్చిందని ఎద్దేవా చేశారు. బ్రిటీష్ వాళ్లు వెళ్లేటపుడు స్వాతంత్రం ఇచ్చిపోయారని, కాంగ్రెస్ పార్టీ నుంచి దేశానికి ప్రధానమంత్రి అయ్యారంటే అది బ్రిటీష్ వాళ్ల భిక్షేనన్నారు. ‘కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా తేల్చుకోండి. కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదు. కర్ణాటకలో ఖజానా ఖాళీ అయింది. కరెంట్ బంద్ అయ్యింది. కేసీఆర్ వచ్చిన తరువాత తెలంగాణలో కర్ఫ్యూ లేదు. 30 వ తేదీన కాంగ్రెస్ వాళ్ళకు దిమ్మ తిరగాలె. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన భూములను పట్టా భూములుగా మారుస్తాం. కాంగ్రెస్ వాళ్లు అధికారంలో ఉంటే ,ప్రభుత్వ ఆస్పత్రులు మూతపడతాయి. ప్రైవేట్ ఆస్పత్రులు ఓపెన్ అవుతాయి. నారాయణఖేడ్ మున్సిపాలిటీ లో పెరిగిన టాక్స్లను తగిస్తాం. బీఆర్ఎస్ పవర్లోకి వస్తే తెల్లకార్డుపై సన్నబియ్యం ఇస్తాం’ అని హరీశ్రావు తెలిపారు. ఎల్లారెడ్డి రోడ్ షోలో మాట్లాడుతూ.. ‘ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి అమెరికా నుంచి వచ్చి సంతలో పశువులను కొన్నట్టు నాయకులను కొంటున్నాడు. కర్ణాటకలో 5 గ్యారెంటీలు అని ఊదర గొట్టారు. ఇప్పుడు అక్కడ జనాలు లబో దిబో మొత్తుకుంటున్నారు. రెండు మూడు గంటలు మించి అక్కడ కరెంట్ రావటం లేదట. రేవంత్రెడ్డి 10 హెచ్పీ మోటార్ పెడితే 3 గంటల కరెంట్ చాలంటున్నాడు. 10 హెచ్పీ ఆయన తాత కొనిస్తాడ రైతులకు. కాంగ్రెస్ వాళ్లు రైతు బంధు కాపీ కొట్టిండ్రు. ఖర్గే కర్ణాటకలో నీ ఊళ్ళో మంచి నీళ్లు వస్తున్నయా? యువశక్తి కింద ఒక్క రూపాయి ఇస్తున్నవా? కబర్దార్ నోరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు’ అని హరీశ్రావు హెచ్చరించారు. ఇదీచదవండి..కొల్లాపూర్లో ఉద్రిక్తత.. పోలీస్ స్టేషన్ వద్ద నిరసనలు -
సీఎం కేసీఆర్, హరీశ్రావులపై ఈసీకి ఫిర్యాదు
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్కు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వారిపై చర్యలు తీసవుకోవాలని కోరింది. ప్రజా ఆశీర్వాద సభల పేరిట బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో కాంగ్రెస్ పార్టీని కించపరిచే విధంగా కేసీఆర్ వ్యాఖ్యలున్నాయని ఫిర్యాదులో పేర్కొంది. వరంగల్ బహిరంగ సభలో కాంగ్రెస్ను దోకేబాజి పార్టీ అన్న కేసీఆర్ వ్యాఖ్యలు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కిందికి వస్తాయని ఫిర్యాదులో కాంగ్రెస్ పార్టీ తెలిపింది. కాంగ్రెస్ మేనిఫెస్టోను 420 మేనిఫెస్టో అంటూ హరీష్ రావు విమర్శలు చేశారని, ఇది కూడా కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుందని కంప్లయింట్లో తెలిపింది. కాగా, ఇటీవలే టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రేవంత్రెడ్డి బహిరంగ సభల్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని సీఈవోకు బీఆర్ఎస్ లీగల్ సెల్ కంప్లయింట్ ఇచ్చింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. ఇంతేగాక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అడ్వర్టైజ్మెంట్లపైనా బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. ఈ అడ్వర్టైజ్మెంట్లలో కేసీఆర్ను కించపరుస్తున్నారని పేర్కొంది. ఇప్పటికే ఈ యాడ్లు ఆపాలని ఈసీ ఆదేశాలిచ్చింది. ఇదీచదవండి.. ఆయన రేవంత్ రెడ్డి కాదు..రైఫిల్ రెడ్డి : సీఎం కేసీఆర్ ఫైర్ -
సీతక్కకు ప్రచారం ఎక్కువ..పని తక్కువ: హరీశ్రావు
సాక్షి,హైదరాబాద్ : ములుగు ఎమ్మెల్యే సీతక్క సోషల్ మీడియాలో మాత్రమే ఉంటారని, ఆమెకు పని తక్కువ ప్రచారం ఎక్కువ అని మంత్రి హరీశ్రావు విమర్శించారు. తెలంగాణభవన్లో ములుగుకు చెందిన బీజేపీ నేత రాములు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు హరీశ్రావు కండువా కప్పి ఆహ్వానించారు. చేరికల సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ ‘ నిరుపేద అమ్మాయి నాగజ్యోతి. ములుగులో ఈసారి ఆమెను గెలిపించాలని కోరుతున్న. ఓడిపోతున్నానని తెలిసి కోపంతో సీతక్క ఇష్టం వచ్చినట్లు నోరు జారుతోంది. ఆమె ఓటమి ఖాయం. 5 గంటల కరెంట్ ప్రచారంతో అబాసుపాలైంది. ఉచిత కరెంట్ను ఉత్త కరెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? వ్యవసాయానికి ఎంత హెచ్పీ మోటార్ వాడుతారో కూడా తెలియని అజ్ఞాని రేవంత్ రెడ్డి. కర్ణాటక లో రెండు గంటల కరెంట్ కూడా రావటం లేదని అక్కడి మాజీ సీఎం కుమార స్వామి చెప్తున్నాడు. వంద అబద్ధాలు ఆడైనా సీఎం కుర్చీ దక్కించుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. 11సార్లు అవకాశం ఇచ్చినా కనీసం బిందె నీళ్ళు ఇవ్వడం కాంగ్రెస్కు చేతకాలేదు. బీఆర్ఎస్ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టడం పక్కా. కేసీఆర్ను కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. మేం తిట్టలేమా’ అని హరీశ్రావు ఫైర్ అయ్యారు. ఇదీ చదవండి.. నా భర్తపై దాడిని ఖండిస్తున్నా: ఎమ్మెల్యే గువ్వల భార్య -
ఆ పార్టీ మాయమాటలు నమ్మొద్దు! : మంత్రి హరీశ్రావు
సాక్షి, మెదక్: ముఖ్యమంత్రి కేసీఆర్పై రాష్ట్ర ప్రజలకు నమ్మకం ఉందని, కాంగ్రెస్కు ఓటేస్తే ఆగమవుతారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్రావు అన్నారు. శుక్రవారం నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సునీతారెడ్డి మంత్రి హరీశ్రావుతో కలిసి నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు భారీ ర్యాలీతో వెళ్లారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటే వంచన.. మోసమని, కేసీఆర్ అంటే నమ్మకం అని పేర్కొన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే రాష్ట్రం ఆగమైతదని, ఆ పార్టీ నాయకులు మాయ మాటలు చెప్తారని విమర్శించారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ కట్ అవుతుందని విమర్శించారు. కొడంగల్లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని గతంలో చెప్పిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. 2018లో కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే తాను గడ్డం తీసుకోనని ఆ పార్టీ నాయకుడు ఉత్తంకుమార్రెడ్డి ప్రకటించి మాట తప్పారని విమర్శించారు. మాట తప్పే నాయకులు కావాలా మాట మీద ఉండే కేసీఆర్ అవసరమా ఆలోచించాలని కోరారు. రేవంత్రెడ్డి పట్టపగలు రూ.50లక్షలు లంచం ఇస్తూ దొరికారని ఆరోపించారు. రైతులను కేసీఆర్ రాజులుగా చేస్తే రైతు బంధు బిచ్చమేసినట్లుగా ఉందని రేవంత్రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఉత్తదేనని, కేసీఆర్ మాట మీద ఉంటారని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ డకౌట్ అవుతుందని, కాంగ్రెస్ రనౌట్ అవుతుందని, కేసీఆర్ సెంచరీ చేస్తారని హరీశ్ జోస్యం చెప్పారు. నర్సాపూర్ను మరింత అభివృద్ధి చేస్తాం! నర్సాపూర్ను మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి హరీశ్రావు అన్నారు. రైతులు ఈలవేస్తే కొండపోచమ్మ గేట్లు ఎత్తి నీళ్లు అందిస్తున్నారని, హల్దీవాగు నిండటంతో ఎకరం పొలం ఎండటం లేదన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి సునీతారెడ్డి మంత్రిగా పనిచేశారని, ఆమెను గెలిపిస్తే నర్సాపూర్ అభివృద్ధి చెందుతుందన్నారు. సీఎం కేసీఆర్ నర్సాపూర్ వచ్చినప్పుడు పట్టణ అభివృద్ధికి రూ.65 కోట్లు విడుదల చేశారని గుర్తుచేస్తూ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి ఇంతవరకు గ్రామ పంచాయతీ వార్డు మెంబరుగా గెలవలేదని, ఆయన ఏమి చేస్తారని ప్రశ్నించారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు, నాయకులు సమష్టిగా సునీతారెడ్డి గెలుపు కోసం కృషి చేయాలన్నారు. నర్సాపూర్లో సునీతారెడ్డిని గెలిపిస్తే అక్కడ కేసీఆర్ సీఎం అవుతారన్నారు. రాబోయే ఎంపీ ఎన్నికల్లో ఎమ్మెల్యే మదన్రెడ్డిని ఎంపీగా పోటీ చేయిస్తామని చెప్పారు. సునీతారెడ్డిని 60 వేల మెజారిటీతో గెలిపించే బాధ్యత మదన్రెడ్డితో పాటు నియోజకవర్గంలోని కార్యకర్తలదన్నారు. అలాగే ఎంపీ ఎన్నికల్లో నర్సాపూర్లో లక్ష మెజార్టీ తేవాల్సిన బాధ్యత సునీతారెడ్డిపై ఉంటుందన్నారు. తాను సిద్దిపేటలో లక్ష మెజార్టీ ఇస్తానని ప్రకటించారు. అనంతరం సునీతారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం సేవ చేస్తానన్నారు. ర్యాలీలో ఎమ్మెల్యే మదన్రెడ్డి, రాష్ట్ర కార్మిక బోర్డు చైర్మన్ దేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రాం రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. ఇవి చదవండి: కాంగ్రెస్కు ఓటేస్తే బీఆర్ఎస్కు వేసినట్లే.. : ఎంపీ బండి సంజయ్కుమార్ -
హుజురాబాద్లో బీజేపీకి మూడో స్థానమే : హరీశ్రావు
సాక్షి, హుజురాబాద్ : హుజురాబాద్లో సర్వేలన్నీ కౌశిక్ రెడ్డికి మొదటి స్థానాన్ని ఇస్తున్నాయని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇక్కడ కాంగ్రెస్ రెండవ స్థానంలో ఉందని, బీజేపీ అయితే మూడో స్థానానికి పడిపోయిందని చెప్పారు. హుజురాబాద్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కౌశిక్ రెడ్డి ప్రజా జీవితంలో ఆల్ రౌండర్. కౌశిక్ రెడ్డి అంటే ముఖ్యమంత్రికి చాలా ఇష్టం. కౌశిక్ రెడ్డి గెలిచిన తర్వాత సీఎం వద్దకు వెళ్లి నియోజకవర్గ కోసం నిధులు తీసుకొస్తాడు. ఉప ఎన్నికల్లో గెలుపొందిన ఈటల గెలిచిన నియోజకవర్గంలో తట్టెడు మన్ను కూడా పోయలేదు. ఇక్కడి ప్రజలను పూర్తిగా విస్మరించాడు. కాంగ్రెస్, బీజేపీల్లో ఏ పార్టీ గెలిచినా తెలంగాణ మరోసారి అంధకారంలోకి వెళ్లిపోతుంది. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో సౌభాగ్య లక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు 3వేల రూపాయలు అందిస్తాం. ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి 15 లక్షలకు పెంచుతాం. గ్యాస్ సిలిండర్ను కేవలం రూ. 400కు అందిస్తాం. కేసీఆర్ ధీమా ఇంటింటికి బీమా కింద రేషన్ కార్డు ఉన్న కుటుంబంలో ఎవరైనా మరణిస్తే 5 లక్షలు ఇస్తాం. ఇదీ చదవండి..సీబీఐ, ఈడీ విచారణకు కేసీఆర్ సిద్ధమా?: రేవంత్ సవాల్ హుజురాబాద్లో పేదలకిచ్చిన అసైన్ భూములన్నిటికీ బీఆర్ఎస్ గెలిచిన తర్వాత పట్టాలు ఇస్తాం. కాంగ్రెస్ పార్టీకి ఏది కావాలన్నా ఢిల్లీ దగ్గర మోకరిల్లాల్సిందే. మొన్న కర్ణాటక నుంచి డీకే శివకుమార్ వచ్చి అక్కడ రోజుకు 5 గంటల కరెంటు ఇస్తున్నాం అని చెప్పాడు. డీకేకు తెలంగాణలో 24 గంటల కరెంటు ఉన్నది అనే విషయం కూడా తెలియదు. తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ వస్తే మోటర్లు జీపులో వేసుకొని పోతారు. దొంగ రాత్రి కరెంటు వస్తుంది. కాంగ్రెసోళ్లు కర్ణాటకలో ఆరు నెలలు గడవకముందే ఇచ్చిన హామీలను ఎగ్గొడుతున్నారు. కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్కుమార్ రెడ్డి రైతుబంధు దుబారా అని మాట్లాడారు. రైతుకు రైతుబంధు ఇవ్వడం దుభారా అవుతుందా.. అలాగే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చే రైతు బంధును బిచ్చమేస్తున్నాం అన్నాడు. రైతుబంధు తీసుకునే రైతులను బిచ్చగాళ్ళ తో పోలుస్తూ మాట్లాడటం సిగ్గుచేటు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే ప్రజల పరిస్థితి అధోగతి పాలవుతుంది’ అని హరీశ్ రావు హెచ్చరించారు. ఇదీ చూడండి.. మిషన్ తెలంగాణ -
ప్రతిపక్షాలవి చిల్లర రాజకీయాలు
రాంగోపాల్పేట్ (హైదరాబాద్): ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి కత్తిదాడికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉంటే ప్రతిపక్ష నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు మండిపడ్డారు. మంగళవారం ఆయన సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి వచ్చి వైద్యులతో మాట్లాడి ప్రభాకర్రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆయనతో కొద్దిసేపు ముచ్చటించి ధైర్యం చెప్పారు. అనంతరం హరీశ్రావు విలేకరులతో మాట్లాడుతూ.. కత్తితో పొడవడంతో కత్తి 3 అంగుళాలు లోపలికి వెళ్లగా 4 చోట్ల చిన్నపేగుకు గాయమైందన్నారు. 15 సెం.మీ. చిన్న పేగును తొలగించి, మూడున్నర గంటలపాటు వైద్యులు శస్త్ర చికిత్స చేశారని చెప్పారు. ఇటువంటి సమయంలో సీనియర్ నాయకులు కూడా దీన్ని అపహాస్యం చేసేలా కోడి కత్తి అంటూ మాట్లాడటం దురదృష్టకరమన్నారు. దివాళాకోరు రాజకీయాలు చేస్తున్న పార్టీలకు ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. వ్యక్తులను నిర్మూలించి రాజకీయాలు చేయాలనుకోవడం తెలంగాణలో ఎప్పుడూ లేదని, తాము అధికారంలో ఉన్న ఏ రోజూ పగతో వ్యవహరించలేదన్నారు. పగతో రాజకీయాలు చేస్తే గతంలో హౌజింగ్ స్కీముల్లో స్కాములు చేసిన కాంగ్రెస్ నాయకులు, ఓటుకు నోటుకు కేసులో దొరికిన వాళ్లు ఎప్పుడో జైలుకు వెళ్లేవారని చెప్పారు. రాష్ట్రంలో ఏదోరకంగా అల్లర్లు చేయాలని, ప్రజలను భయబ్రాంతులకు గురిచేయాలని ప్రతిపక్ష నాయకులు చూస్తున్నారని, ప్రజలు వీటిని గమనించాలని సూచించారు. ప్రచారంలో ఉన్న అభ్యర్థులపై ఇలాంటి దాడులు జరుగుతున్నాయని, అభ్యర్థులకు భద్రత పెంచాలని ఎన్నికల కమిషన్ను కోరారు. ఈ కేసులో కుట్రకోణం రెండు మూడు రోజుల్లో బయటకు వస్తుందని, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ప్రభాకర్రెడ్డిని పరామర్శించిన వారిలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మర్రి జనార్ధన్రెడ్డి తదితరులు ఉన్నారు. మరో నాలుగు రోజులు ఐసీయూలో మరో నాలుగు రోజుల పాటు ప్రభాకర్రెడ్డిని ఐసీయూలోనే ఉంచి చికిత్స అందించాల్సి ఉంటుందని సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి హెడ్ డాక్టర్ విజయ్కుమార్, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు ప్రసాద్బాబు తెలిపారు. ప్రస్తుతం ఆయన స్పృహలోనే ఉన్నాడని, మరో మూడు నాలుగు రోజులు గడిస్తేనే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందో లేదో చెప్పగలమన్నారు. -
‘నిమ్స్ ది గ్రేట్’ : మంత్రి హరీష్రావు ప్రశంసలు..!
హైదరాబాద్: అవయవ మార్పిడి ఆపరేషన్లలో నిజాం వైద్య విజ్ఞాన సంస్ధ(నిమ్స్) తన ప్రత్యేకతను మరోసారి చాటి చెప్పింది. గతంలో ఎన్నో విజయాలను పదిలపర్చుకున్న నిమ్స్ తాజాగా మారో అరుదైన రికార్డు సృష్టించి వైద్య రంగాలలోనే సంచలనం సృష్టించింది. ఈ ఏడాది ఎనిమిది నెలల్లోనే 100 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లను విజయవంతంగా చేసి అరుదైన రికార్డును వైద్యులు సొంతం చేసుకున్నారు. ఇందులో 61 లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయగా, 39 దాతల ద్వారా సేకరించినవి.. గ్రహీతల్లో 11, 12 ఏళ్ల వయసువారు కూడా ఉండడం చెప్పుకోదగ్గ అంశం. శుక్రవారం వందో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసిన వైద్య బృందంలో యూరాలజీ వైద్యనిపుణులు ప్రొఫెసర్ రామ్రెడ్డి, విద్యాసాగర్, రామచంద్రయ్య, తదితరులు ఉన్నారు. వీరంతా యూరాలజీ హెచ్ఓడీ డాక్టర్ రాహుల్ దేవరాజ్ ఆధ్వర్యంలో శస్త్ర చికిత్స మార్పిడిలు చేస్తున్నారు. గత నెలలో రూ.32 కోట్లతో సమకూర్చుకున్న అడ్వాన్స్డ్ పరిజ్ఞానం ఉన్న రోబోటిక్స్ సాయంతో యూరాలజీ, సర్జికల్ ఆంకాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాల్లో అత్యంత సంక్లిష్టమైన నెల రోజుల వ్యవధిలోనే 30 అపరేషన్లను చేశారు. గాల్బ్లాడర్, హెర్నియా, ఆచలాసియా కార్డియా సర్జరీలను చిన్న రంధ్రంతో సులువుగా సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తున్నారు. సాధారణ పద్దతుల్లో చేసే సర్జరీలతో పోల్చితే రోబోటిక్ సర్జరీలు కూడా చాలా కచ్చితంగా జరుగుతున్నాయి. ఆపరేషన్ జరిగిన మూడు రోజుల్లోనే రోగి డిశ్చార్జి కావడం విశేషం. హరీష్రావు మంత్రి ప్రశంసలు.. అత్యధిక మార్పిడి ఆపరేషన్లు చేసి నిమ్స్ వైద్యులు చెప్పుకోదగ్గ రికార్డును నెలకొల్పారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్రావు ప్రశంసించారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్ల్లో రికార్డు బ్రేక్ చేసి యూరాలజీ వైద్యులను మంత్రి ఎక్స్(ట్విట్టర్)లో అభినందించారు. ఈ అసాధారణ అవయవ మార్పిడి ద్వారా ప్రాణాలను కాపాడాలనే తమ అచంచలమైన నిబద్ధతను హైలైట్ చేస్తోందన్నారు. ఎంత పెద్ద శస్త్రచికిత్స అయినా.. ఎంత పెద్ద శస్త్రచికిత్సనైనా సులువుగా చేయవచ్చు. రోబోటిక్ సర్జరీలను ప్రారంభించిన అనతికాలంలోనే పెద్ద సంఖ్యలో విజయవంతంగా ఆపరేషన్లు చేయడం నిమ్స్ వైద్యుల ప్రతిభకు తార్కాణం. ఇప్పడు ఆస్పత్రిలో నొప్పి తక్కువతో.. ఇన్ఫెక్షన్లకు తావులేకుండా చేస్తున్నాం. – ప్రొఫెసర్ నగరి బీరప్ప, సంచాలకులు, నిమ్స్ -
పిల్లలు తక్కువుంటే విలీనమే..!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతి గృహాలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మెస్ చార్జీల పెంపునకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం... విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వసతిగృహాలను క్రమబద్దీకరించే అంశాన్ని పరిశీలిస్తోంది. హాస్టళ్ల వారీగా విద్యార్థుల సంఖ్యను సమీక్షించడంతో పాటు సమీపంలో ఉన్న హాస్టళ్లలో సర్దుబాటు చేసే అవకాశాలపై నివేదిక తయారు చేయాల ని సంక్షేమ శాఖలను ఆదేశించింది. రెండ్రోజుల క్రితం సంక్షేమ వసతిగృహాలు, గురుకుల వి ద్యా సంస్థలతో పాటు రెసిడెన్షియల్ పద్ధతిలో కొనసాగుతున్న విద్యా సంస్థల్లో డైట్ చార్జీల పెంపుపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రు లు సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్ పా ల్గొన్నారు. డైట్ చార్జీలను 25 శాతం పెంచాలని ప్రభుత్వానికి సూచిస్తూ కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదనలు పంపింది. ఇదే క్రమంలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న హాస్టళ్లను సమీపంలోని హాస్టళ్లలో విలీనం చేసి మెరుగైన వసతులు కల్పించే అంశంపైనా చర్చించారు. కనీసం 50 మంది విద్యార్థులుంటే.. సగటున ఒక సంక్షేమ హాస్టల్లో కనీసం 50 మంది విద్యార్థులుండాలి. దాదాపు వంద మందికి వసతులు కల్పిస్తూ హాస్టల్ను అందుబాటులోకి తెచ్ఛినప్పటికీ... అందులో కనీసం సగం మంది పిల్లలుంటేనే మెరుగైన సర్విసులు కల్పించవచ్చు. అలాకాకుండా 15 నుంచి 25 మంది విద్యార్థులుంటే ఖజానాపైనా భారం అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో పిల్లల సంఖ్య తక్కువగా ఉన్న హాస్టళ్లను గుర్తించాలని, అదేవిధంగా వాటిని సమీప హాస్టళ్లలో విలీనం చేసే అంశాలపై పూర్తిస్థాయి నివేదికను జిల్లాల వారీగా రూపొందించాలని మంత్రులు ఆదేశించారు. ఏప్రిల్ నెలాఖరు కల్లా జిల్లాల వారీగా నివేదికలు తయారు చేసి రాష్ట్ర కార్యాలయాలకు పంపించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,550 సంక్షేమ వసతిగృహాలున్నాయి. పోస్టుమెట్రిక్ హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య సంతృప్తికరంగా ఉన్నప్పటికీ చాలాచోట్ల ప్రీమెట్రిక్ హాస్టళ్లలో మాత్రం విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది. దీంతో కొన్ని జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వ అనుమతితో ప్రీమెట్రిక్ హాస్టళ్లను పోస్టుమెట్రిక్ హాస్టళ్లుగా మార్పు చేశారు. ఇంకా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న వాటిని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే అంశంపై జిల్లా స్థాయిలో ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని మంత్రులు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. -
రద్దుల ఘనత బీజేపీది.. పద్దుల ఘనత టీఆర్ఎస్ది: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: చేనేత రంగానికి, కార్మికులకు గత ప్రభుత్వాలు ఇచ్చిన వెసులుబాటులు, వారి కోసం ప్రవేశపెట్టిన పథకాలను రద్దు చేసిన ఘనత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు విమర్శించారు. కేంద్రం చేనేత రంగాన్ని విస్మరిస్తూ అన్నీ రద్దు చేస్తుంటే.. రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం పద్దులు ఇస్తూ ఆ రంగాన్ని ఆదుకుంటోందని చెప్పారు. బుధవారం హైదరాబాద్ నారాయణగూడలోని వీవర్స్భవన్లో తెలంగాణ చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్గా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో హరీశ్రావుతో పాటు మంత్రి కేటీఆర్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. చేనేత రంగంపై కేంద్రం చూపుతున్న వివక్షను ఎండగట్టారు. కేంద్రానివి అన్నీ రద్దులే... 1992లో అప్పటి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు, ఆల్ ఇండియా హ్యాండిక్రాఫ్ట్స్ బోర్డు, పవర్లూమ్ బోర్డులను 2020లో బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని హరీశ్రావు తెలిపారు. దేశంలోని స్పిన్నింగ్ మిల్స్లో ఉత్పత్తి అయ్యే నూలులో 40 శాతం చేనేత రంగానికి ఇవ్వాలనే నిబంధన ఉండగా, దానిని బీజేపీ ప్రభుత్వం 15 శాతానికి కుదించిందని చెప్పారు. ఆసరా పెన్షన్ కింద తాము రూ.2,016 ఇస్తుంటే దీనిలో కేంద్రానిది ఒక్క రూపాయి వాటా కూడా లేదన్నారు. మెగా టెక్స్టైల్ పార్క్ పెట్టుకుంటున్నామని చెప్పినా ఒక్క రూపాయి ఇవ్వలేదని విమర్శించారు. రద్దులు చేసిన వారివైపు ఉండాలా? పద్దులు ఇచ్చిన వారివైపు ఉండాలా? అనేది పద్మశాలీలు ఆలోచించుకోవాలని హరీశ్ అన్నారు. ఇదేనా మేక్ ఇన్ ఇండియా? ‘మీరు ఏ ఒక్క రంగాన్నైనా అభివృద్ధి చేశారా? ఒక్క నాడైనా చేనేత గురించి మాట్లాడారా?’అని కేంద్రమంత్రి కిషన్రెడ్డిని నిలదీశారు. మేక్ ఇన్ ఇండియా అంటూ గొప్పలు చెప్పిన ప్రధాని మోదీ.. జాతీయ జెండాలను చైనా నుంచి తెప్పించారని మండిపడ్డారు. ‘ఆ జెండాల తయారీని దేశంలోని చేనేత రంగానికి ఇస్తే బాగుండేది కదా? ఇదేనా మోదీ మేక్ ఇన్ ఇండియా?’అంటూ ఎద్దేవా చేశారు. చేనేతకు రాష్ట్రం చేయూత చేనేత రంగంపై, కార్మికులపై అభిమానం కలిగిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని హరీశ్ పేర్కొన్నారు. రాష్ట్రం వచ్చాక నేతన్న ఎంత నేస్తే అంత బట్టని ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ నష్టాన్ని భరిస్తోందన్నారు. చేనేత మిత్ర పథకం ద్వారా 40 శాతం సబ్సిడీతో నూలును అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 40 వేల మరమగ్గాలు ఉన్నాయని, రూ.350 కోట్ల విలువైన బతుకమ్మ చీరల ఆర్డర్ను కార్మికులకే ఇచ్చి వారిని యజమానులను చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదని చెప్పారు. నేతన్నలకు రూ.5 లక్షల బీమాను అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. -
ఏడున్నరేళ్లు..742 ఆపరేషన్లు
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం నిమ్స్లో రికార్డు స్థాయిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. తెలంగాణ రాకముందు 25 ఏళ్లలో కేవలం 649 మాత్రమే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరగ్గా, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడున్నరేళ్లలో ఏకంగా 742 ఆపరేషన్లు జరగడం గమనార్హం. ఇప్పటికే ప్రభుత్వాస్పత్రుల్లో అధునాతన వైద్య పరికరాలను, తగినంత వైద్య సిబ్బందిని అందుబాటులోకి తేవడంతో శస్త్రచికిత్సలు పెరిగాయ ని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఒక్కో శస్త్రచికిత్సకు రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ ఏడాదిలో జరిగిన వంద కిడ్నీ మార్పిడి చికిత్సలో 97 ప్రభుత్వమే ఉచితంగా నిర్వహించగా, అందు లో 90 ఆరోగ్యశ్రీ ద్వారానే నిర్వహించడం గమనార్హం. జీవితాంతం ఉచితంగా మందులు... ప్రభుత్వం అవయవదానాన్ని ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 7,800 మంది అవయవాల మార్పిడి కోసం జీవన్దాన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఎదురుచూస్తున్నారు. అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయడంతోపాటు అనంతరం అవసరమయ్యే మందులను జీవితకాలానికి ప్రభుత్వమే ఉచితంగా అందిస్తోంది. ఇలా ఉచితం గా మందులు అందించే రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనని వైద్య వర్గాలు వెల్లడించాయి. అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలకు అవసరమైన మౌలిక సదుపాయాలను, యంత్రాలను గాంధీ, నిమ్స్, ఉస్మానియా ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో ఉంచింది. కార్పొరేట్కు దీటుగా వైద్య సేవలు: హరీశ్రావు ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత శ్రద్ధగా వ్యవహరిస్తోందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కలలుగన్న ఆరోగ్య తెలంగాణగా మన రాష్ట్రం మారుతోందన్నారు. కిడ్నీ మార్పిడి చికిత్సలు చేయడంలో రికార్డు సాధించామని, ఇదే స్ఫూర్తితో మరిన్ని శస్త్రచికిత్సలు నిర్వహించి రోగులకు ప్రాణదానం చేయాలని వైద్యులకు సూచించారు. ప్రభుత్వ రంగంలోని ఆస్పత్రులు కార్పొరేట్ ఆస్పత్రులతో పోటీ పడేలా వైద్య సేవలుండాలన్నారు. అందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు, అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి తెస్తుందన్నారు. ప్రభుత్వ వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని, ఆ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. -
సంజయ్వి క్షుద్ర రాజకీయాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము చర్యలు తీసుకుంటుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ క్షుద్ర, స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. పదవుల కోసం రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలు దెబ్బతీసేలా చేయడం దారుణమని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్ర జలశక్తి శాఖ అన్ని అనుమతులు ఇచ్చేవరకు పర్యావరణ, అటవీ అనుమతులు ఇవ్వొద్దని, ఇందుకు ఓ ప్రత్యేక చట్టాన్ని తెలంగాణ కోసం తీసుకురావాలని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్కు బండి సంజయ్ లేఖ ఇచ్చారని పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలో జలవనరుల శాఖ పద్దుపై చర్చకు సమాధానమిస్తూ.. బండి సంజయ్ రాసిన లేఖను సభలో చూపించారు. జల శక్తి శాఖ మంత్రి షెకావత్కు కూడా మరో లేఖ ఇచ్చారని తెలిపారు. ఏ రాష్ట్రానికి లేని నిబంధనను, అవసరమైతే చట్టాన్నే తెలంగాణ కోసం తీసుకురావాలని అడిగితే రాష్ట్ర ప్రాజెక్టులు ఎలా ముందుకు సాగుతాయని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాలు ప్రాజెక్టులను వేగంగా కట్టుకోవా అని అడిగారు. తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీయడమేంటని మండిపడ్డారు. రాష్ట్రంపై ప్రేమ ఉంటే, చేతనైతే జాతీయ ప్రాజెక్టులు తీసుకురావాలని లేదా జాతీయ హోదా తేవాలని సవాల్ విసిరారు. ఎవరైనా రాష్ట్ర ప్రాజెక్టులకు తొందరగా అనుమతులు ఇవ్వాలని అడగాలే తప్ప ఇలాంటివి చేయడమేంటని ప్రశ్నించారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుందా అని ఆవేదన వ్యక్తం చేశారు. చేతనైతే సాయం చేయాలి కానీ.. రాష్ట్ర రైతుల నోట్లో మట్టి కొట్టడమేంటని దుయ్యబట్టారు. బీజేపీ నేతల స్వరాష్ట్ర భక్తి ఎక్కడికి పోయిందంటూ ఎద్దేవా చేశారు. వారికి రాజకీయ భుక్తిపైనే దృష్టి తప్ప రాష్ట్ర భక్తి లేదని మండిపడ్డారు. డీపీఆర్ ఇవ్వకుండా సెంట్రల్ వాటర్ కమిషన్, పర్యావరణ శాఖ, 18 డైరెక్టరేట్ల టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఎలా అనుమతులు ఇస్తాయని ప్రశ్నించారు. ఏపీ ప్రాజెక్టులపై ఫిర్యాదు చేశాం.. ఏపీ సర్కారు కడుతున్న ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం న్యాయపోరాటం కొనసాగిస్తోందని హరీశ్రావు వెల్లడించారు. వివిధ పద్దులపై చర్చ అనంతరం సీఎం తరఫున సాగునీటి పద్దులపై హరీశ్రావు సమాధానం ఇచ్చారు. ఏపీ ప్రభుత్వ ప్రాజెక్టుల విషయంలో స్వయంగా సీఎం అపెక్స్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లారని, కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేశారని, కేంద్రం దృష్టికి తీసుకెళ్లారని, సుప్రీంకోర్టులో కేసు వేశారని గుర్తుచేశారు. గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసి ఉత్తర్వులు తెచ్చామని, అయినా ఏపీ ప్రాజెక్టు ఆపకపోతే ధిక్కరణ కేసు వేశామని, దానిపై గ్రీన్ ట్రిబ్యునల్ కమిషన్ వేసినట్లు చెప్పారు. 2007లో ప్రాణహిత చేవెళ్లకు రూ.17,875 కోట్లతో జీవో ఇస్తే 19 నెలల తర్వాత రూ.38,500 కోట్లకు చేరిందని, 2010లో రూ.40,300 కోట్లతో కేంద్రానికి డీపీఆర్ పంపినట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 1 లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని, వీలైతే ఎక్కువే ఇవ్వాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఆయకట్టు 6.64 లక్షల ఎకరాలు ఉంటే రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి, రీడిజైన్ చేసుకొని, కొత్తవి చేపట్టి 44.37 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణను సాధించామన్నారు. ఐఏఎస్లకు శిక్షణలో పాఠ్యాంశంగా రాష్ట్ర ప్రాజెక్టులు మారాయంటే అంతకంటే గౌరవం ఏముంటుందని పేర్కొన్నారు. కాగా, టీఎస్పీఎస్సీ ద్వారా చేపట్టే ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్షల్లో ఉర్దూలో రాసే అవకాశాన్ని కల్పిస్తామన్నారు. -
నిబంధనల మేరకే అప్పులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులన్నీ కేంద్రం, రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు లోబడే ఉన్నాయని ఆర్థిక మంత్రి టి.హరీశ్రావు పేర్కొన్నారు. రాష్ట్ర జీఎస్డీపీకి అనుగుణంగా కేంద్రం నిర్దేశించిన పరిమితుల మేరకే అప్పులున్నాయని స్పష్టం చేశారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో.. అప్పుల్లో తెలంగాణ 25వ స్థానంలో ఉందని తెలిపారు. అతి తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా ఉందని చెప్పారు. దేశ జీడీపీతో పోలిస్తే కేంద్రం అప్పులు 62.2 శాతం ఉండగా, రాష్ట్ర అప్పులు కేవలం 22.8 శాతంగానే ఉన్నాయని వెల్లడించారు. వచ్చే ఏడాదిలో అప్పులు, వడ్డీలు కలిపి రూ.50 వేల కోట్లు ఉంటాయన్న కాంగ్రెస్ పక్ష నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యలని ఖండించిన హరీశ్.. వచ్చే ఏడాది అప్పులు, వడ్డీలు కలిపి చెల్లించేది రూ.26,624 కోట్లేనని స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర బడ్జెట్పై చర్చలో మంత్రి హరీశ్ సుదీర్ఘ సమాధానమిచ్చారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు.. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని.. ఆయా రంగాల్లో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని హరీశ్ చెప్పారు. ప్రభుత్వ కీలక రంగాల్లో జాతీయ సగటు కన్నా తెలంగాణలో నిధుల కేటాయింపు తక్కువగా ఉందంటూ భట్టి చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చిన మంత్రి.. శాఖల వారీగా చేసిన కేటాయింపులను వివరించారు. విద్యారంగంలో గత ఆరేళ్లలో 14.15 శాతం నిధుల వెచ్చింపు జరగ్గా, వ్యవసాయ రంగంలో 11.4 శాతం, విద్యుత్ రంగంలో 7.3 శాతం, ఇరిగేషన్ రంగంలో 8.4 శాతం, హౌసింగ్లో 1.8 శాతం మేర నిధులను ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. జాతీయ సగటు కన్నా ఎక్కువగానే నిధుల ఖర్చు జరుగుతోందన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం సైతం జాతీయ సగటు కన్నా రెట్టింపు ఉందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కువగా ఉందంటూ భట్టి సభను తప్పుదారి పట్టించారని, అయితే సీఎంఐఈ సర్వే ప్రకారం 2019–20లో జాతీయ స్థాయిలో సగటు నిరుద్యోగం 7.63 శాతమైతే.. తెలంగాణలో 4.53 శాతంగా ఉందన్నారు. 2020–21లో జాతీయ సగటు 10.35 శాతం కాగా, తెలంగాణలో 6.15 శాతంగా ఉందని వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాంగ్రెస్, బీజేపీలు అమ్ముతూ పోతుంటే, ఆర్టీసీ, విజయ డెయిరీ వంటి సంస్థలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటూ రాష్ట్రం నమ్మకం కలిగిస్తోందని వెల్లడించారు. నీతి ఆయోగ్ చెప్పినా కేంద్రం ఇవ్వలేదు.. ఇదే సమయంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధుల అంశాన్ని హరీశ్ ప్రస్తావించారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను కేంద్రం 30 రోజుల్లో ఇస్తోందంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఎక్కడ, ఎప్పుడు ఇచ్చిందో చెప్పాలని సూచించారు. ‘మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లు, భగీరథకు రూ.19,205 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ ఇవ్వాలని చెప్పినా కేంద్రం ఇవ్వలేదు.. 13వ ఆర్థిక సంఘం నుంచి ఆరేళ్లుగా రూ.1,129 కోట్లు, 14వ ఆర్థిక సంఘం నుంచి రెండేళ్లుగా రూ.817 కోట్లు రాలేదు. విభజన చట్టంలో పేర్కొన్న వెనకబడిన ప్రాంతాల నిధి కింద రూ.350 కోట్లు రాలేదు. 15వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి ప్రత్యేక గ్రాంటుగా రూ.2,350 కోట్లు ఇవ్వాలని చెప్పినా రాలేదు. మొత్తంగా కేంద్రం నుంచి రూ.28,225 కోట్లు రావాల్సి ఉంది. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఈ నిధులపై మాట్లాడాలి..’అని అన్నారు. కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకుంటామని, అయితే రాష్ట్రానికి అన్యాయం జరిగితే మాత్రం ఊరుకోమని వెల్లడించారు. -
శంకర్ పల్లికి భారీగా పెట్టుబడులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: శంకర్ పల్లి మండలం కొండకల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి బుధవారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, సబితారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ‘జిల్లాకు రూ.800 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీని ద్వారా వందలాది మందికి ఉద్యోగావకాశాలు కలగనున్నాయి. జిల్లా ఫార్మా, ఐటీ, సాప్ట్వేర్ కంపెనీలకు నెలవుగా మారనుంది. నిర్మాణ, రియల్ ఎస్టేట్ రంగాల్లోనూ ఘనత సాధించింది. ఐటీ, సాఫ్ట్వేర్ కంపెనీలు, ఫార్మాసిటీ, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, హార్డ్వేర్ పార్కులతో పాటుగా ఉన్నత విద్యా సంస్థలు, వర్శిటీలు, పర్యాటకరంగాలకు కేంద్ర బిందువుగా రంగారెడ్డి జిల్లా మారింది. పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఔత్సాహికులు ఆసక్తి చూపిస్తున్నారు. టెక్స్టైల్ పరిశ్రమ రైలు కోచ్లు, డీజిల్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ల తయారీదారు కంపెనీ మేధా సర్వో డ్రైవ్స్ రూ.800 కోట్ల పెట్టుబడితో శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామంలో తమ యూనిట్ను నెలకొల్పనున్నది. ఇందుకోసం 2017లోనే ప్రభుత్వంతో మేధా ఒప్పందం కుదుర్చుకోవడంతో టీఎస్ఐఐసీ వంద ఎకరాల భూ సేకరణ చేపట్టింది’ అని తెలిపారు. చదవండి: సోషల్ మీడియా పోస్టు; గీత దాటితే చర్యలు తప్పవు! -
సీఎం కేసీఆర్ లక్ష్యం అదే..: హరీశ్రావు
సాక్షి, సిద్ధిపేట: రైతు సంస్కరణలలో సిద్ధిపేట ఆదర్శం కావాలని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. నియంత్రిత పంటల సాగుపై శుక్రవారం జరిగిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, ఒడితెల సతీష్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీలు రఘోత్తం రెడ్డి, బొడకుంట వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. (వివాదంగా మారిన ఎమ్మెల్యే బర్త్డే వేడుకలు) పంట మార్పిడితో రైతులకు మేలు.. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పంటల మార్పిడి ద్వారా దిగుబడి పెరిగి రైతుకు మేలు జరుగుతుందని తెలిపారు. ప్రజల మేలు కోసమే ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రానికి ఒక తండ్రిలాగా రైతుల సంక్షేమానికి పరితపిస్తున్నారని చెప్పారు. రైతులను సంఘటిత శక్తిగా మార్చడమే సీఎం లక్ష్యమని పేర్కొన్నారు. మార్కెట్, అంతర్జాతీయంగా పంటలకు ఉన్న డిమాండ్ ఆధారంగా సాగు చేయాలని ఆయన సూచించారు. (పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల) ప్రభుత్వం ఉద్దేశ్యం అది కాదు.. రైతు బంధు పథకం ఆపాలని ప్రభుత్వ ఉద్దేశం కాదని, ప్రతి రైతుకు రైతు బంధు అందిస్తామని హరీశ్రావు స్పష్టం చేశారు. రైతు బంధు కోసం రూ.7 వేల కోట్లు బడ్జెట్ లో పెట్టామని చెప్పారు. వానాకాలం లో మొక్కజొన్న దిగుబడి బాగా తగ్గుతుందని.. అందుకే ఇతర పంటలపై దృష్టి పెట్టాలని ఆయన వివరించారు. యాసంగిలో వరికి రాళ్ళ వానతో నష్టం జరుగుతుందని.. అదే మొక్కజొన్న అయితే ఎలాంటి నష్టం ఉండదన్నారు. మొదటి పంటలో రైతుకు లాభం జరగడమే లక్ష్యంగా సర్కార్ పని చేస్తోందన్నారు. ఇది రైతులపై బలవంతంగా రుద్దడం కాదని స్పష్టం చేశారు. కొత్త వంగడాలు వచ్చాయి.. కందిలో కొత్త వంగడాలు వచ్చాయని.. ఆరు నెలలకే పంట కాలం పూర్తయి దిగుబడి పెరుగుతుందన్నారు. ఆ తరువాత రెండో పంటగా మొక్కజొన్న సాగు చేసుకోవచ్చన్నారు. సిద్దిపేట రిజర్వాయర్ల ఖిల్లా అని.. వాగులు, వంకలు, చెరువులు, కుంటలు ఏడాది కాలం జలకళను సంతరించుకుంటాయన్నారు. తెలంగాణలో ఎరువులు, విత్తనాలు, నీళ్లకు కొరత లేదన్నారు. గోదావరి జలాలపై ఆధారపడి పంటల సాగు చేస్తామన్నారు. పత్తికి డిమాండ్ పెరిగింది.. కరోనా నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా మాస్క్ ల తయారీకి భారీ డిమాండ్ పెరిగిందని, పత్తికి డిమాండు ఎక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 6.3 ఎంఎం పొడవు ఉన్న ధాన్యానికి అంతర్జాతీయంగా డిమాండ్ ఉందన్నారు. సిద్ధిపేట జిల్లాలో 9,500 ఎకరాల్లో కూరగాయల పంటలు సాగు చేస్తున్నారన్నారు. ఖమ్మం జిల్లాలో ఫామ్ ఆయిల్ సాగు ఎక్కువగా చేస్తారన్నారు. వారి మాటలు రైతులు విశ్వసిస్తారా..? జిల్లాలో సాగుకు భూసార పరీక్షలు, సర్వే చేయించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డిని కోరామని తెలిపారు. కంది పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. రైతుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని విపక్షాల మాటలు రైతులు విశ్వసిస్తారా అని మంత్రి ప్రశ్నించారు. దేశానికి అన్నం పెట్టే రైతుకు సేవ చేస్తే దేశానికి సేవ చేసినట్లేనని మంత్రి హరీష్రావు పేర్కొన్నారు. -
‘రైతుల మేలుకే కొత్త విధానం’
సాక్షి, సంగారెడ్డి: రైతులకు మేలు కలిగించేందుకు కొత్త వ్యవసాయ విధానం అమలు చేస్తున్నామని, వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం ఆయన మంత్రి నిరంజన్ రెడ్డితో పటాన్చెరువు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు మాట్లాడుతూ... పదవి రావడం గొప్పకాదు, పదవి నిర్వహించడం గొప్ప. రైతులకు మేలు జరిగేందుకు కొత్త వ్యవసాయం విధానం అమలు చేస్తున్నాం. వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకే విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత సంగారెడ్డి జిల్లాలో కొత్తగా రెండు వ్యవసాయ మార్కెట్లు ఏర్పాటు చేశాం అని తెలిపారు. (కందిపప్పు.. ఇక్కడ నచ్చకుంటే అమరావతికి వెళ్లు!) ఇక మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ... హైదరాబాద్ మహానగర అవసరాలు తీర్చేలా పటాన్ చెరువు మార్కెట్ను అభివృద్ధి చెయ్యాలి. దేశంలోనే అత్యుత్తమ మార్కెట్గా పటాన్ చెరువు మార్కెట్ను మార్చాలి. మార్కెట్ వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇంట్లో కూర్చొనే కావల్సిన వస్తువులను కొనుగోలు చేస్తున్నాం.మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టంలోని నిబంధనలు సైతం మార్చుతాం. ఆన్లైన్ మార్కెట్ ప్రజలకు సౌకర్యవంతంగా మారింది. హైదరాబాద్ మహానగరానికి నలుదిక్కులా సమీకృత మార్కెట్లు అభివృద్ధి చేస్తాం. సిద్ధిపేట మార్కెట్లు రాష్ట్రానికి ఆదర్శంగా ఉన్నాయి. సిద్దిపేట మార్కెట్లను చూసే నా నియోజకవర్గంలో మార్కెట్లను అభివృద్ధి చేశాను. రాబోయే పరిస్థితులను దృష్టిలో ఉంచుకొనే వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకొచ్చాం. ఒకప్పుడు తినడానికి సరిపోయే పంట కూడా పండని పరిస్థితి రాష్టంలో ఉండేది. అరేళ్లలో ఆ పరిస్థితిని అధిగమించాం. ప్రస్తుతం నిల్వ చేయడానికి గోదాముల లేని స్థాయిలో పంటలు పండుతున్నాయి. ఈ సంవత్సరం 39 లక్షల 40 వేల ఎకరాల్లో వరి పంట పండింది. జనాభా అవసరాలకు అనుగుణంగా ఏ పంటలు ఏ స్థాయిలో అవసరమో, విశ్వవిద్యాలయాలతో సర్వే చేయించాం. ప్రస్తుతం కేరళ, తమిళనాడు మాత్రమే బియ్యం కోసం మనపై ఆధారపడ్డాయి. కొత్త వ్యవసాయ విధానాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు, పండిన పంటకు కొనుగోలుకు హామీ ఇవ్వాలి. ప్రస్తుత పరిస్థితి కంటే మెరుగైన పరిస్థితి రావాలి అన్న లక్ష్యంతో కొత్త విధానం రూపొందిస్తున్నాం. ఒక పంట పండిన తర్వాత అది ఆహారంగా మారే వరకు వందల మందికి ఉపాధి దొరుకుతుంది. జిన్నారం, గుమ్మడిదళ గోదాములకు నిధులు మంజూరు చేశాం అని తెలిపారు. (మీ బిడ్డలకోసమైనా.. తీరు మార్చుకోండి) -
అందరికీ ఆరోగ్య కార్డులు
సాక్షి, సంగారెడ్డి: రాష్ట్రం లోని ప్రతి ఒక్కరికీ ఆరోగ్య కార్డులు అందించేందుకు ప్రభుత్వం యోచిస్తోందని ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రూ.3.5 కోట్లతో ఏర్పాటు చేసిన కార్డియాలజీ, యూరాలజీ విభాగాలను బుధవారం ఆయన ప్రారంభిం చారు. సంబంధిత విభాగాలను పరిశీలించి ఆస్పత్రి సూపరింటెండెంట్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రజలందరికీ నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికీ హెల్త్ కార్డులు అందించాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని చెప్పారు. త్వరలో ఈ కార్యక్రమం కార్యరూపం దాల్చనుందని తెలిపారు. ప్రపంచంలోని ఒక్క అమెరికాలోనే ఈ తరహా హెల్త్ కార్డుల విధానం అమలులో ఉందని, తెలంగాణలో కూడా ప్రవేశపెట్టాలని సీఎం భావిస్తున్నారని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామన్నారు. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలోనే కార్డియాలజీ, యూరాలజీ విభాగాల ఏర్పాటుతో జిల్లాలోని మారుమూల ప్రాంతాలైన జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోల్ల ప్రజలను హైదరాబాద్కు తరలించకుండా ఇక్కడే మెరుగైన వైద్యం అందించ్చవచ్చన్నారు. మరణాలు తగ్గి ప్రసవాలు పెరిగాయి.. కేసీఆర్ కిట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి మాతా శిశు మరణాలు తగ్గాయని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు గణనీయంగా పెరిగాయని మంత్రి హరీశ్రావు తెలిపారు. గతంలో సాధారణ ప్రసవాలు 30 నుంచి 35% మాత్రమే జరిగేవని, ప్రస్తుతం అవి 65 నుంచి 70 శాతానికి పెరిగాయన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
చెట్టుని కూల్చినందుకు రూ. 9,500 జరిమానా
సాక్షి, హైదరాబాద్: హరితహారంలో భాగంగా పెరిగి పెద్దదైన చెట్టును తన వాహనంతో ఢీకొట్టి కూల్చివేసిన వాహనదారుడికి రూ. 9,500 జరిమానా విధించారు. సోమవారం సిద్దిపేట పట్టణంలోని వైద్య కళాశాల వద్ద హరితహారంలో భాగంగా పెరిగిన చెట్టును తన వాహనంతో రాకేశ్ ఢీ కొట్టడంతో పడిపోయింది. దీన్ని గమనించిన పోలీసులు హరితహారం అధికారి ఐలయ్యకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న ఆయన.. రాకేశ్కి జరిమానా విధించారు. హరితహారంలో భాగంగా పెంచుతున్న మొక్కలకు నెలకు లక్షల రూపాయలు వెచ్చించి కాపాడుతున్నామని, వాటికి ఎవరు హాని కలిగించినా జరిమానా చెల్లించాల్సిందేనని ఐలయ్య తెలిపారు. మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు సిద్దిపేటని హరిత సిద్దిపేటగా మార్చడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. హరితహారం చెట్ల భద్రత విషయంలో ప్రత్యేకంగా సహకరిస్తున్న సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ శాఖ ఉన్నతాధికారులకు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్, డీఈలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
అమీన్పూర్కు పండుగ రోజు
సాక్షి, పటాన్చెరు: అమీన్ పూర్కు ఈ రోజు నిజమైన పండుగ రోజని మంత్రి హరీశ్రావు అన్నారు. బీరంగూడ– కిష్టారెడ్డిపేట రోడ్డు పనులను ప్రారంభిస్తూ శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత రూ.61 కోట్లతో నిర్మించిన రిజర్వాయర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాను అమీన్ పూర్కు వచ్చినప్పుడు స్థానికులు మంచినీటి సమస్య ఉందని చెప్పారని గుర్తు చేశారు. రెండు వేల ఫీట్ల లోతు వరకు బోరు వేసినా నీరు రాని పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గోదావరి జలాలు ఇంటింటికీ అందిస్తున్నామన్నారు. అమీన్ పూర్లోని 67 కాలనీలకు లాభం చేకూర్చే విధంగా నిర్మించిన 30 లక్షల లీటర్ల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ఓహెచ్ఎస్ఆర్ను ప్రారంభించామని చెప్పారు. పటాన్ చెరు నియోజకవర్గంలో 20 ఏళ్ల వరకు జనాభా పెరిగినా ఇబ్బంది లేని విధంగా మిషన్ భగీరథ పనులు కొనసాగుతున్నాయన్నారు. మహిళలకు నీటి కష్టాలు ఎక్కువగా తెలుస్తాయంటూ అమీన్ పూర్ మహిళలకు నీటి కష్టాలు తప్పుతాయన్నారు. ఎమ్మెల్యే కోరిన ఒకే కోరిక.. బీరంగూడ నుంచి కిష్టారెడ్డిపేట వరకు రోడ్డు కావాలని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి చాలా కాలంగా అడుగుతూ వస్తున్నారని తెలిపారు. ఎన్నికల ప్రచారం కేసీఆర్ పటాన్ చెరుకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే కోరిన ఒకే కోరిక బీరంగూడ నుంచి కిష్టారెడ్డిపేట మీదుగా సుల్తాన్ ఫూర్ వరకు రోడ్డు మాత్రమేనని హరీశ్రావు గుర్తు చేశారు. ఇప్పటికే పటాన్ చెరులో అన్ని ప్రధాన రోడ్లు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతే నిర్మించామని ఆయన తెలిపారు. అయితే అమీన్ పూర్లోని బీరంగూడ కమాన్ నుంచి సుల్తాన్పూర్ జంక్షన్ వరకు రూ.49 కోట్లతో రోడ్డు నిర్మాణానికి కేసీఆర్ సూచనలతో కేటీఆర్ మంజూరు చేశారని మంత్రి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ రోడ్డు పనులను ప్రారంభించామని, త్వరలోనే ఆ రోడ్డు నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. పటాన్ చెరులో రోడ్డుపై అంగడి జరిగేదని, ఆ సమస్యను పరిష్కరించినట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యేకు డబుల్ ధమాకా పటాన్ చెరు నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తవుతున్నాయని తెలిపారు. త్వరలోనే పటాన్ చెరులోని పేదలకు ఇళ్లను ఇస్తామన్నారు. పటాన్ చెరు జీహెచ్ఎంసీ పరిధిలో ఉందని, దాంతో ఎమ్మెల్యేకు డబుల్ ధమాకాలా రెండు కోటాలు దక్కాయని మంత్రి చమత్కరించారు. నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి రావాల్సిన డబుల్ బెడ్రూంకోటాతోపాటు, జీహెచ్ఎంసీ కోటా కింద కూడా ఈ ప్రాంతానికి ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. అధికారులకు అభినందనలు మిషన్ భగీరథ పనులు నిర్వహిస్తున్న అధికారులను మంత్రి హరీశ్రావు అభినందించారు. రాత్రింబవళ్లు కష్టపడి పని చేస్తున్నారని గుర్తు చేశారు. రెండున్నరేళ్లలోనే ప్రతీ ఇంటికి యావత్ రాష్ట్రంలో నీటిని అందించే కార్యక్రమానికి అధికారులు గొప్పగా సేవలందించారని హరీశ్రావు వారిని అభినందించారు. ఇదిలా ఉండగా అమీన్పూర్లో మండల్ లెవల్ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ బిల్డింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం పది ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ జారీ అయిన ఉత్తర్వులను మంత్రి ఆర్డీఓకు అందించారు. అలాగే అమీన్ పూర్లో డంప్ యార్డు ఏర్పాటుకు కూడా మరో పది ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ జారీ అయిన ఉత్తర్వులను కమిషనర్ వేమనరెడ్డికి అందించారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి మాట్లాడుతూ బీరంగూడ రోడ్డు మంజూరు నిధులు ఇచ్చిన ప్రభుత్వానికి, దాని పనుల ప్రారంభించేందుకు వచ్చిన మంత్రి హరీశ్రావుకు పాదాభివందనం చేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, సంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్మంజుశ్రీ,, సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు, వాటర్ వర్క్స్ ఎండీ దాన కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
జగన్నాథుడి జైత్రయాత్ర తథ్యం..కూటమి కుట్రలు పారలేదు
ఫేస్బుక్, ఇన్స్టా డౌన్.. యూజర్ల గగ్గోలు
కేతిరెడ్డి పెద్ద రెడ్డి ఇంట్లో పోలీసుల వీరంగం
వైఎస్సార్సీపీ గెలుపుతో చంద్రబాబు రథచక్రాలు విరిగిపోతాయి...
కియారాకు అరుదరైన అవకాశం
రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. ముఖ్యమైన సూచనలు ఇవే..
గవర్నమెంట్ పాజిటివ్ వోట్ ముఖ్యంగా మహిళలు..గ్రాఫ్ చూస్తే..!
సూపర్ మామ్స్! రికార్డుల సృష్టించిన తల్లులు
ఎమ్మెల్యే ఇంట్లోకి చొరబడి.. తాడిపత్రిలో పోలీసుల ఓవరాక్షన్
ఏపీలో రికార్డ్ స్థాయిలో పోలింగ్..
తప్పక చదవండి
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- చైనాకు ఒకేసారి రెండు దెబ్బలు.. షాకిచ్చిన బైడెన్, ట్రంప్!
- అతనితో 16 రోజులే ఉన్నాను.. రెండో పెళ్లి చేసుకోవాలని ఉంది: ఎస్తర్
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- మనీష్ సిసోడియా జ్యుడిషీయల్ కస్టడీ పొడగింపు
- కెనడాలో ఘనంగా పదేళ్ల తెలంగాణ ఉత్సవాలు!
- పాడెపై వెళ్లి నామినేషన్! గోరఖ్పూర్లో విచిత్రం
- రామ్-పూరీ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ ఎలా ఉందంటే?
- సీజన్ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్ రాహుల్
- 100 విమానాలు కొనుగోలు చేయనున్న ఇండిగో.. ఎందుకంటే..
Advertisement