-
పిల్లలో చురుకుదనాన్ని పెంచే ఆటలివే..!
పిల్లలు పొద్దస్తమానం చదివితేనే అనేక విషయాలు తెలుస్తాయని, వారి పరిజ్ఞానం పెరుగుతుందని, వారు భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదుగుతారని సాధారణంగా తల్లిదండ్రులు అనుకుంటారు. అయితే పిల్లల మెదడు మరింత చురుగ్గా పనిచేయాలన్నా, ఏకాగ్రతతో, క్రమశిక్షణతో మెలగాలన్నా వారికి తగినంత శారీరక శ్రమ తప్పనిసరని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల ఆలోచనా శక్తికి, బుర్రకు పదును పెట్టే కొన్ని ఆటల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. టెన్నిస్పిల్లలు గానీ, పెద్దలు గానీ టెన్నిస్ ఆడితే అది శరీరానికి మంచి వ్యాయామం అవుతుంది. టెన్నిస్ ఆడినప్పుడు శరీరంలోని కండరాలన్నీ కదులుతాయి. శారీరక సామర్థ్యం మరింతగా పెరుగుతుంది. ముఖ్యంగా చురుకైన కంటి చూపు, వేగంగా లక్ష్యాన్ని చేరుకోవడం లాంటి లక్షణాలు అలవాటవుతాయి. దీంతో చురుగ్గా నిర్ణయాలు తీసుకునే తత్వం ఏర్పడుతుంది. ఎదుటివారి ఆలోచనలను అంచనావేయడం, సమయస్ఫూర్తి వంటివి పెంపొందుతాయి. బంతాటబంతాట అంటే చిన్నారులకు ఎంతో ఇష్టం. అయితే వారికి ఊరికే ఏదో బాల్ ఇచ్చి ఆడుకోమని వదిలేయకుండా, ఇంట్లో అందుబాటులో ఉన్న వస్తువులతో బాస్కెట్బాల్ రింగ్ తయారు చేసి, కొన్ని బంతులను వారికి ఇచ్చి, ఆడుకోమని చెప్పాలి. ఒక్కో బంతిని తీసి, ఆ రింగ్లో వేయమని వారికి సూచించాలి. ఈ విధంగా చేయడం వల్ల పిల్లల్లో చేతికి, కళ్లకు మధ్య సమన్వయం మరింత మెరుగవుతుంది. తద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. సైక్లింగ్సైక్లింగ్ చేసేప్పుడు పిల్లలు కింద పడకుండా ప్రయత్నించే క్రమంలో బ్యాలెన్సింగ్ నైపుణ్యాలను చక్కగా నేర్చుకుంటారు. పోటీతత్వం, ప్రణాళికాబద్ధంగా లక్ష్యాలను చేరుకోవడం వంటివి సైక్లింగ్ సాయంతో మరింతగా తెలుసుకుంటారు. సైక్లింగ్ శరీరానికీ మంచి వ్యాయామం అని నిపుణులు చెబుతుంటారు. ఈతచిన్నారులు క్రమశిక్షణతో మెలగాలంటే వారికి స్విమ్మింగ్ నేర్పించాలని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. స్విమ్మింగ్ మెదడును ఏకాగ్రతగా ఉంచడంలో సహాయపడుతుంది. వేగంగా దూసుకెళ్లే తత్వాన్ని నేర్పిస్తూ, ఆత్మవిశ్వాసం పెరిగేలా చేస్తుంది. కరాటే, కుంగ్ ఫూకరాటే, కుంగ్ ఫూ మొదలైనవి శారీరక సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా, వ్యక్తిగత క్రమశిక్షణ అలవడేలా చేస్తాయి. ఏకాగ్రత, అవతలివారిని గౌరవించడం, అవసరమైనప్పుడు తమని తాము కాపాడుకోవడం, పట్టుదల, మానసిక పరిపక్వత మొదలైన లక్షణాలెన్నో కరాటే, కుంగ్ ఫూ వలన అలవడుతాయి. -
సమ్మర్లో పిల్లలకు ఇలా చేసి పెడితే, ఇష్టంగా తింటారు, బలం కూడా!
వేసవి అంటే పిల్లలకు ఆటవిడుపు కాలం. పరీక్షలు పూర్తయ్యిన తరువాత ఆనందంగా ఆడుకునే కాలం. ఎండా, కొండా లెక్క చేయకుండా హాయిగా తోటి స్నేహితులతో కలిసి చెంగు చెంగున గెంతులేస్తూ ఉత్సాహంగా గడిపే కాలం. మరి ఇలాంటి సమయంలో వారికి మంచి పోషకాహారాన్ని ఇవ్వాలి. ముఖ్యంగా ప్యాకేజ్డ్ ఫుడ్, జంక్ఫుడ్కు దూరంగా ఉంటూ.. ఇంట్లోనే రుచికరంగా తయారు చేసి పెట్టాలి. తాజా ఆకుకూరల్ని, కూరగాయల్ని, పండ్లను డైట్లో ఉంచాలి. మంచి పోషకాహారమే వారికి అసలైన దివ్యౌషధం. మొలకలొచ్చిన గింజ ధాన్యాలు శనగలు, పెసలతోపాటు మొలకలు వచ్చిన గింజలతో క్యారట్ లాంటి కూరగాయ ముక్కల్ని కలిపి సలాడ్లా పెడితే కాల్షియం, ఇతర ప్రొటీన్లు లభిస్తాయి. దీంతో వారి ఎముకలు, కండరాలు దృఢంగా పెరుగుతాయి. ఎదుగుదల అద్భుతంగా ఉంటుంది. ఉడికించిన శనగలు ఉడికించిన శనగలు రెగ్యులర్గా తీసుకుంటే రక్త హీనతకు చెక్ చెప్పవచ్చు. ఇందులోని ఐరన్ కంటెంట్ శరీరానికి అంది రక్త వృద్ధి జరుగుతుంది.రోగ నిరోధక శక్తి రెట్టింపు అవుతుంది. మెదడు చురుగ్గా, వేగంగా పని చేస్తుంది.అలసట, నీరసం వంటి సమస్యలుండవు. పిస్తా, బాదం, జీడిపప్పుతో పాటు పల్లీలు, కుసుమలు. లాంటి గింజలను ఆహారంలో చేరిస్తే చిన్నారుల ఇమ్యూనిటీ పెరుగుతుంది. బల వర్ధకంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినిపించటం వల్ల పిల్లల మెదడు చురుకుగా పని చేస్తుంది. ప్రతిరోజూ కాల్షియం కోసం పాలు, పౌష్టికాహారం కోసం కోడిగుడ్లు లాంటివి సరైన సమయంలో వారికందేలా చేస్తే తొందరగా వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. బలవర్ధకమైన సలాడ్ ఉడికించిన శనగలు, ఉడికించిన బొబ్బర్లు, ఉడికించిన పెసలు, ఉల్లిపాయ, టమాటా ముక్కలు, యోగర్ట్, కొద్దిగా కొత్తిమీర, తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ముందుగానేఉడికించి పెట్టుకున్నగింజలు, ఉల్లిపాయ, టమాటా ముక్కలు వేసి బాగాకలపాలి. దీనికి తాజా యోగర్ట్, కొద్దిగా ఉప్పు, మిరియాలు వేసి కలపాలి. దీనిపైన సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తమీద చల్లి, చల్లచల్లగా అందిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. పిల్లల ఇష్టాఇష్టాలను బట్టి, ఇందులో కొబ్బరి, వేయించిన పల్లీలు, స్వీట్కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది బలవర్ధక ఆహారం కూడా. -
మోడ్రనే కానీ, నాకు అలా బిడ్డను కనే ధైర్యం లేదు : మసాబా వ్యాఖ్యలు వైరల్
మసాబా గుప్తా ఫ్యాషన్ పరిశ్రమలో పెద్దగా పరిచయం అవసం లేదు. రెడ్ కార్పెట్ ఈవెంట్ల నుండి వివాహాలు , ఫోటోషూట్ల వరకు పాపులర్ డిజైనర్గా పాపులర్ అయింది. తన క్రియేటివిటీ అందర్నీ కట్టిపడేసింది. అంతేకాదు తన జీవిత కథ ఆధారంగా రూపొందించిన డాక్యు-సిరీస్ మసాబాతో నటిగా అవతరించింది. ఇటీవల నటుడు సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకుంది. తాజాగా తాను తల్లికాబోతున్నానని ఇన్స్టా ద్వారా ప్రకటించింది. ‘‘మా జీవితాల్లోకి రెండు బుల్లి బుల్లి అడుగులు రాబోతున్నాయి.. మమ్మల్ని ఆశీర్వ దించండి, అలాగే మీ ప్రేమను, కొద్ది బనానా చిప్స్ను(plain salted ONLY)’’ అంటూ తాను తల్లికాబోతున్న విషయాన్ని ఫ్యాన్స్తో షేర్ చేసింది. అంటే తనకు బనానా చిప్ప్ తినాలనిపిస్తోందని చెప్పకనే చెప్పింది. కొన్ని ఎమోజీలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా గతంలో మసాబా వ్యాఖ్యలు వైరల్గా మారాయి. చెప్పినట్టే చేసిందంటూ ఫ్యాన్స్ కమెంట్స్ చేశారు. View this post on Instagram A post shared by Masaba 🤎 (@masabagupta) సింగిల్ పేరెంటింగ్ అనే కాన్సెప్ట్ మోడ్రన్గా ఉన్నా, పెళ్లి కాకుండానే బిడ్డను కనడం నార్మల్గా మారినా, , తాను అలా చేయకూడదనుకుంటున్నానని ఆమె వెల్లడించింది. ‘ఆధునిక మహిళగా పెళ్లి చేసుకుని బిడ్డనుకనే ధైర్యం ఉందా? అంటే .అస్సలు లేదు. ఎందుకంటే అంత ఒత్తిడిని తీసుకోవాలని లేదు. అలాంటి వాతావరణంలో బిడ్డను ఉంచాలని తాను భావించడం లేదని గతంలో ఒక ఇంటర్వ్యలో పేర్కొంది. పెళ్లి కాకుండా పుట్టిన తనకి చాలా మోడ్రన్ అనే ట్యాగ్ వేశారు. ఆధునికంగా ఉండటం చాలా అద్భుతమే కానీ తాము చాలా అవమానాల్ని ఎదుర్కొన్నామని గుర్తు చేసుకుంది. కాగా బాలీవుడ్ నటి, నీనా గుప్తా , వెస్ట్ ఇండియన్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ ప్రేమ కథ అందరికి సుపరిచితమే.ఈ జంటకు ప్రేమ ఫలితమే మసాబా గుప్తా. అయితే పెళ్లికాకుండానే నీనా బిడ్డను కనడం అప్పట్లో పెద్ద సంచలనం. నీనా, రిచర్డ్స్ని పెళ్లి చేసుకోలేదు. కానీ ఒంటరిగానే తన కుమార్తె మసాబాను పెంచి పెద్ద చేసి ప్రయోజకురాల్ని చేసింది. -
200 కోట్ల ఆస్తిని దానం చేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు
గాంధీ నగర్ : వాళ్లిద్దరూ భార్యభర్తలు. వ్యాపార సామ్రాజ్యం. వందల కోట్లలో ఆస్తులు. సమాజంలో బోలెడంత పలుకుబడి. కానీ పైవేవి వాళ్లిద్దరికి సంతృప్తినివ్వలేదు. అందుకే ఇప్పటికే సన్యాసం స్వీకరించిన కొడుకు, కుమార్తెల బాటలోనే నడిచేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు ఈ కుబేరుల నిర్ణయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గుజరాత్ సబర్కాంత జిల్లా వాసి భావేష్ భండారి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. కొద్ది మొత్తం పెట్టుబడితో వ్యాపారంలోకి అడుగుపెట్టారు. రోజులు గడుస్తున్నాయి. వ్యాపారం ఊపందుకుంది. ఊహించనంత లాభాల్ని కళ్ల జూశారు. ఆస్తుల్ని కూడబెట్టుకున్నారు. కానీ ఈ ఆస్తి పాస్తులు, వ్యాపారం ఆ దంపతులకు ఏ మాత్రం సంతృప్తి నివ్వలేదు. పిల్లల బాటలో తల్లిదండ్రులు చివరికి భావేష్ బండారి దంపతులిద్దరి 19 ఏళ్ల కుమార్తె , 16 ఏళ్ల కుమారుడు బాటలో నడిచేందుకు సిద్ధమయ్యారు. పిల్లలిద్దరూ 2022లో సన్యాసం తీసుకున్నారు. వారి నుంచి ప్రేరణ పొందిన భావేష్ బండారి దంపతులు.. తమ పిల్లలులాగే తాము కూడా భౌతిక అనుబంధాలను త్యజించి, సన్యాసి మార్గంలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. 200 కోట్లు విరాళం సన్యాసానికి సంబంధించి ఫిబ్రవరిలో జరిగిన ఓ వేడుకలో భావేష్ భండారి, అతని భార్య తమ సంపద రూ.200 కోట్ల మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. ఏప్రిల్ 22న జరిగే కార్యక్రమంలో అధికారికంగా సన్యాసం తీసుకోనున్నారు. మోక్షం పొందేదుకు యాత్రకు బయలుదేరాలని ప్లాన్ చేస్తున్నారు. చెప్పులు లేకుండా భండారీ దంపతులు, మరో 35 మందితో కలిసి నాలుగు కిలోమీటర్ల మేర ఊరేగింపుగా బయలు దేరనున్నారు. అక్కడ వారు తమ యావదాస్తుల్ని వదిలేయనున్నారు. ఆ తర్వాత రెండు తెల్లని వస్త్రాలు ధరిస్తారు. భిక్ష కోసం ఒక గిన్నె తీసుకుని దేశం అంతటా చెప్పులు లేకుండా ప్రయాణిస్తారు. భిక్షతో మాత్రమే జీవిస్తారు. -
టేస్టీగా ఉన్నాయని పిల్లలకు చిప్స్ అలవాటు చేస్తున్నారా?
వేసవి వచ్చిందంటే పిల్లలకు ఆటవిడుపు. రోజంతా ఏదో ఒకటి తినాలని ఆశపడుతూ ఉంటారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ ఇష్టపడి తినే స్నాక్స్లో చిప్స్ ఒకటి. మన నోటికి నచ్చే చాలా ఆహారాలు, శరీరానికి హాని చేస్తాయి. ముఖ్యంగా కరకరలాడే చిప్స్ గుండెకు చెక్ పెడతాయి. ముఖ్యంగా పిల్లల్లో అనేక ఆరోగ్య సమస్యలకుదారి తీస్తాయి. రకరకాల రంగుల కవర్స్తో ఆకర్షణీయంగా ప్యాక్ చేసిన చిప్స్ను చిన్నారులు ఎంతో ఇష్టపడి తింటుంటారు. అయితే చిప్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలు తెలిస్తే మాత్రం ఇకపై వాటిని తినాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే. చిప్స్ తీసుకోవడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకుందాం ♦ చిప్స్లో ఎక్కువ కాల నిల్వ ఉంచేందుకు ఇందులో సోడియంను ఎక్కువగా ఉపయోగిస్తారు. సోడియం ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల రక్తపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అలాగే వీటి తయారీలో ఉపయోగించే నూనె కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మరీ ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ♦ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు చిప్స్లో సోడియంను ఎక్కువగా ఉపయోగిస్తారు.సోడియం ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల రక్తపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అలాగే వీటి తయారీలో ఉపయోగించే నూనె కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మరీ ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యాన్ని చిప్స్ క్రమంగా దెబ్బతీస్తాయి. ♦ చిప్స్లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్ కొలెస్ట్రాల్ను పెంచుతుంది. ధమనుల్లో రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. దీంతో ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. ♦ శరీరంలో అనారోగ్యకరమైన కొవ్వు పెరగడానికి గల కారణాలలో చిప్స్ ముఖ్య కారణం. దీనివల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా చిన్నారుల్లో ఊబకాయానికి చిప్స్ కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ♦ చిప్స్లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం ఒక్కసారిగా బరువు పెరుగుతుంది. చిప్స్లో ఫైబర్ కంటెంట్ అనేది అస్సలు ఉండదు. దీంతో చిన్నారుల్లో ఇది మలబద్ధకానికి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది మరెన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ♦ చిప్స్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. వంధ్యత్వానికి దారి తీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. బరువు పెరుగుతారు. కడుపులో గ్యాస్, జీర్ణ సంబంధిత సమస్యలకు చిప్స్ కారణమవుతుందని చెబుతున్నారు. రోగ నిరోధక శక్తి బలహీన పడి వైరస్లు, బ్యాక్టీరియా దాడులు పెరుగుతాయని చెబుతున్నారు. నోట్: పిల్లలకు జంక్ ఫుడ్ ఇచ్చే విషయంలో పెద్దలు ఒకటి రెండు ఆలోచించాల్సిందే. చిరుతిండ్లకోసం సాధ్యమైనంతవరకు ఇంట్లో తయారు చేసిన పిండి వంటలు వాడటం బెటర్. ముఖ్యంగా బెల్లంతో చేసిన పల్లీ, నువ్వుల ఉండలు. మినుములు,మిల్లెట్స్తో చేసిన తీపి లడ్డూలు, జంతికలు లాంటివి ఇంకా మంచిది. వీటితోపాటు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, మొలకెత్తిన గింజలతో చేసిన వంటకాలు, పచ్చి కూరగాయలతో చేసిన సలాడ్స్ వంటివి అలవాటు చేయడం మంచిది. -
Holi 2024: జాలీగా, హ్యాపీగా...ఇంట్రస్టింగ్ టిప్స్, అస్సలు మర్చిపోవద్దు!
పిల్లా పెద్దా అంతా సరదగా గడిపే రంగుల పండుగ హోలీ సమీపిస్తోంది. హోలీ రంగుల్లో తడిసి ముద్దవుతూ, స్నేహితులతో, బంధువులతో ఉత్సాహం గడుపుతారు. కానీ ఈ సంబరంలో కొన్ని జాగ్రత్తలు మర్చిపోకూడదు. ప్రతి సంవత్సరం, నిర్లక్ష్యం లేదా అవగాహన లేమి కారణం కంటి గాయాలకు గురవుతున్న అనేక సంఘటనలు జరుగుతాయి.అందుకే ఈ సేఫ్టీ టిప్స్ మీకోసం. మన ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని కాపాడుకోవాలంటే రసాయనమందులకు దూరంగా ఉండాలి. మార్కెట్లో విరివిగా లభించే రంగుల్లో హాని కారక రసాయనాలను గమనించాలి. వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లు, జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా చర్మం, కళ్లు సంరక్షణ చాలా అవసరం. చర్మపు సమసయలు, అలెర్జీలు, కంటి సమస్యలు , ముఖ్యంగా పిల్లలకు శ్వాసకోశ సమస్యలు వంటి అనేక సమస్యలకు దారితీస్తుంది. రసాయన రంగుల్లో సీసం, పాదరసం, క్రోమియం, కాడ్మియం , ఆస్బెస్టాస్ వంటి ప్రమాదకర రసాయనాలను కలిగి ఉంటాయి.ఇవి ఉబ్బసం, బ్రోన్కైటిస్ లాంటి వ్యాధులకుదారి తీయవచ్చు అందుకే ముందు జాగ్రత్త అవసరం. సహజరంగులకే ప్రాధాన్యత: ఇంట్లో తయారు చేసుకునే సేంద్రీయ, సహజ రంగులకేప్రాధాన్య ఇవ్వాలి. ఇలా చేయడం అనేక చర్మ సమస్యలు ఇరిటేషన్ ఇతర ప్రమాదాలనుంచి తప్పించుకోవచ్చు. పర్యావరణానికి ఎలాంటి ముప్పు జరగదు. పిల్లల్ని ఒక కంట: కంటి భద్రత , ప్రాముఖ్యత గురించి హోలీ ఆడటానికి వెళ్లే ముందే పిల్లలకు అవగాహన కల్పించాలి. ముఖ్యంగా చిన్నపిల్లల చెవుల్లో, ముక్కుల్లో, రంగు నీళ్లు, ఇతర నీళ్లు పోకుండా జాగ్రత్తపడాలి ఒకవేళ పోయినా వెంటనే పొడి గుడ్డతో శుభ్రం చేయాలి. ఎలా ఆడుకుంటున్నదీ ఒక కంట కనిపెడుతూ, వారి సేఫ్టీని పర్యవేక్షించాలి. లోషన్ లేదా నూనె : హోలీ ఆడటానికి వెళ్లే కొబ్బరి నూనెను లేదంటే కొబ్బరి, బాదం, ఆలివ్ నూనె లాంటి ఇతర సహజమైన నూనెను ముఖానికి, శరీరానికి, జుట్టుకు అప్లయ్ చేసుకోండి. పురుషులైతే, గడ్డం, జుట్టుకు బాగా నూనె రాయండి. అలాగే మాయిశ్చరైజర్ను మొత్తం బాడీకి అప్లయ్ చేసుకోవచ్చు. దుస్తులు: హోలీ రంగులు ముఖంతో పాటు మీ చేతులు, కాళ్ళ చర్మానికి హాని చేస్తాయి. ఫుల్ స్లీవ్ షర్ట్లు, కుర్తాలు ధరించాలి. నీళ్లలో జారి పడకుండే ఉండేందుకు షూ వేసుకుంటే మంచిది. కళ్లు,చర్మ రక్షణ: గులాల్, ఇతర రంగులు చర్మానికి అంటుకుని ఒక్క పట్టాన వదలవు. దీని స్కిన్కూడా పాడువుతుంది. అలా కాకుండా ఉండాలంటే హోలీ ఆడటానికి ఒక గంట ముందు సన్స్క్రీన్ రాసుకోవాలి. కళ్లల్లో పడకుండా అద్దాలు పెట్టుకోవడం అవసరం. సింథటిక్ రంగులు లేదా వాటర్ బెలూన్లలో ఉండే హానికరమైన రసాయనాలవల్ల కళ్లకు హాని. రంగులనుఎలా కడుక్కోవాలి: హోలీ ఆడిన తరువాత రంగులు వదిలించుకోవడం పెద్ద పని. సబ్బుతో లేదా ఫేస్ వాష్తో కడుక్కోవడం లాంటి పొరపాటు అస్సలు చేయొద్దు. రెండు మూడు రోజులలో హోలీ రంగులు క్రమంగా కనిపించకుండా పోతాయి నూనె పూసుకుని, సహజమైన సున్నిపిండితో నలుగు పెట్టుకోవచ్చు. స్నానం తరువాత బాడీలో రసాయన రహిత క్రీమ్స్, మాయిశ్చరైజర్ రాసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగడం: ఎండలో తిరగడం వల్ల పిల్లలు డీ హైడ్రేట్ అయిపోతారు. అందుకే నీళ్లు ఎక్కువ తాగాలి రంగు పొడులను పీల్చడం వల్ల తలెత్తే శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. నోట్ : ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఏదైనా అనుకోనిది జరిగితే తక్షణమే వైద్యులను సంప్రదించాలి. ఎలాంటి అవాంఛనీయ ప్రమాదాలు లేదా గాయాలు లేకుండా హోలీ వేడుక సంతోషంగా జరుపుకోవాలిన కోరుతూ హ్యాపీ హోలీ. -
కలిసి మీరూ రాయండి
ఒకరోజు తేడాతో ఇంటర్మీడియెట్ పరీక్షలు రెండు రాష్ట్రాలలో మొదలయ్యాయి. పిల్లలు కొంత ఆందోళనగా, కొంత హైరానాగా ఉంటారు. ఈ సమయంలో పిల్లలు రాయాల్సిన వారుగా తాము రాయించే వారుగా తల్లిదండ్రులు ఉండరాదు. పిల్లల పరీక్షాకాలంలో తాము కూడా తోడుగా ఉన్న భావన కలిగించాలి. అలా కలిగించాలంటే వారిని వీలున్నంత సౌకర్యంగా ఉంచాలి. భయపెట్టని ప్రోత్సాహం అందించాలి. నిపుణుల సమగ్ర సూచనలు. తండ్రి ఆఫీసులోఎనిమిది గంటలు పని చేయగలడు. మధ్యలో విరామాలు ఎన్నో ఉంటాయి. అమ్మ ఇంట్లో మూడు పూట్లా పని చేస్తుంది. మధ్యలో ఆమెకూ విరామాలుంటాయి. కాని పరీక్షలు వచ్చినప్పుడు మాత్రం విరామం లేకుండా పిల్లలు చదువుతూనే ఉండాలంటారు తల్లిదండ్రులు. పిల్లలకు ధారణశక్తి డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి పిల్లవాడికీ అది మారుతుంది. కొందరు ఒక అంశాన్ని అలా కళ్లతో చూసి గుర్తు పెట్టుకోగలరు. కొందరు అరగంట సేపు చూసి నేర్చుకోగలరు. మరికొందరు గంట చదివితే తప్ప గ్రహించలేరు. వీరు ముగ్గురూ పుస్తకం పట్టుకుని మాత్రమే కనిపించాలని పరీక్షల సమయంలో తల్లిదండ్రులు ఆశిస్తే ‘చదివిందే ఎంతసేపు చదవాలి’ అని మొదటి రెండు రకాల పిల్లలు విసుక్కుంటారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల చేత పరీక్షలు రాయించడమంటే వారిని పూర్తిగా అర్థం చేసుకుంటూ వారికి సహకరిస్తూ, విరామాలిస్తూ, ప్రోత్సహిస్తూ చదివించడమే. వాళ్ల ప్లానింగ్ని వినాలి పిల్లలు పరీక్షల టైమ్ టేబుల్ రావడానికి ముందే వాళ్లదైన పద్ధతిలో ఎలా చదవాలో ప్లాన్ చేసుకుంటారు. అంటే వాళ్లు వీక్గా ఉన్న సబ్జెక్ట్ను ముందే చదువుకుంటారు. స్ట్రాంగ్గా ఉన్న సబ్జెక్ట్ను ఉపేక్షిస్తారు. మేథ్స్ పరీక్షకు ఒక్క రోజు మాత్రమే టైమ్టేబుల్లో విరామం వస్తే తెలుగు/సంస్కృతం పేపర్లో స్ట్రాంగ్గా ఉండే పిల్లలు మరో రెండు రోజుల్లో తెలుగు పేపర్ ఉందనగా కూడా మేథ్స్ చేసుకుంటూ కనిపించవచ్చు. వారిని బలవంతంగా తెలుగు చదివించాల్సిన పని లేదు. వారి ప్లానింగ్ని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. కొన్ని పేపర్లకు మూడు రోజుల గ్యాప్ రావచ్చు. ఆ మూడు రోజుల్లో మొదటి రోజును ఇంకో పేపర్ సిలబస్ కోసం కొందరు పిల్లలు కేటాయిస్తే కంగారు పడాల్సిన పని లేదు. ఆ రాయాల్సిన పరీక్షకు వారి ఉద్దేశంలో రెండు రోజులు చాలనే. ఇలాంటివి పిల్లలు చెప్పినప్పుడు మన మొండితనంతో ఇలాగే చదవాలని తల్లిదండ్రులు బలవంతం చేయకపోవడం మంచిది. బయటి తిండి వద్దు పరీక్షలు అయ్యేంత వరకూ తల్లిదండ్రులకు వీలున్నా లేకపోయినా బయటి ఆహారం అది బ్రేక్ఫాస్ట్ అయినా గాని ఇవ్వకపోవడం తప్పనిసరి. బయటి పదార్థాలు పొట్టని పాడు చేస్తే పరీక్ష రాయడం చాలా ఇబ్బంది అవుతుంది. పరిశుభ్రమైన ఇంటి తిండి పిల్లలకు అందించాలి. ఆకుకూరలు, కాయగూరలతో పాటు గుడ్డు తినే పిల్లలకు తినిపించాలి. బొప్పాయి, సపోటా మంచివి. పిల్లలు చదువుకునే డెస్క్ మీద, పరీక్ష హాలులో వాటర్ బాటిల్ ఉండేలా చూసుకోవాలి. పిల్లలు హైడ్రేట్గా ఉండేలా మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు ఇస్తుండాలి. తోడు వెళ్లండి పిల్లలతో పాటు తల్లిదండ్రులు ఎవరో ఒకరు పరీక్షా కేంద్రానికి వెళితే పిల్లలకు ధైర్యంగా ఉంటుంది. పరీక్ష అయ్యే వరకూ బయటే ఉండి తీసుకొస్తాం అనంటే వారు లోపల ధైర్యంగా రాస్తారు. అలాగే పరీక్షలు అయ్యేంత వరకూ పిల్లలను ఒంటరిగా పనుల మీద బయటకు పంపరాదు. వెహికల్స్ నడపనివ్వరాదు. ఈ సమయంలో చిన్న ప్రమాదం కూడా పెద్ద నష్టానికి దారి తీస్తుంది. పరీక్షలు అయ్యేంత వరకూ పిల్లలు పెద్దల అజమాయిషీలోనే బయటకు వెళ్లాలి. వారితో వాక్ చేయండి పరీక్ష రాసి వచ్చాక, తర్వాతి పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు పిల్లలతో సాయంత్రాలు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు అరగంట సేపు వాకింగ్కు వెళ్లండి. ఆ సమయంలో వారితో ఏవైనా కబుర్లు చెప్పండి. ఆ సమయంలో కూడా చదువు గురించి కాకుండా ఏవైనా సరదా విషయాలు మాట్లాడండి. వారికి బ్రేక్ ఇచ్చినట్టూ ఉంటుంది... వ్యాయామమూ జరిగినట్టుంటుంది. సిన్సియర్గా చదవమనండి: తమను తాము మోసం చేసుకోకుండా, తల్లిదండ్రులను మోసం చేయకుండా ఉన్న తెలివితేటలను బట్టి మేక్సిమమ్ ఎంత చదవగలరో అంతా సిన్సియర్గా చదివి పరీక్ష రాయమనండి. రాసిన దానిపై వాస్తవిక అంచనాతో ఉండమనండి. ఆ అంచనా ఎంతైనాగాని చెప్పమనండి. నిజాయితీగా రాయడమే తమ దృష్టిలో ముఖ్యమని, ఫలితాల సంగతి తర్వాత చూద్దామని చెప్పండి. వారు కొంత రిలీఫ్గా, మరింత శ్రద్ధగా పరీక్ష రాస్తారు. -
పిల్లల కోసం ఎల్ఐసీ కొత్త స్కీమ్.. ఎన్నో బెనిఫిట్స్
ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ పిల్లల కోసం అమృత్ బాల్ పేరిట ఓ కొత్త పాలసీని పరిచయం చేసింది. పిల్లల ఉన్నత విద్య, ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకుని వ్యక్తిగత, సేవింగ్స్, జీవిత బీమా, నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్ను అందుబాటులోకి తెచ్చినట్లు ఎల్ఐసీ అధికారికంగా వెల్లడించింది. ఈ పాలసీ మెచ్యూరిటీ కనీస వయస్సు 18 ఏండ్లు. గరిష్ఠం 25 సంవత్సరాలు. షార్ట్ ప్రీమియం పేమెంట్ టర్మ్ 5, 6 లేదా 7 ఏండ్లు. కనీస పాలసీ టర్మ్ కోసం లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ 10 ఏండ్లు చెల్లించాలి. ఇక సింగిల్ ప్రీమియం పేమెంట్ కోసం 5 ఏండ్లు. మినిమం సమ్ అష్యూర్డ్ రూ.2 లక్షలు. గరిష్ఠ బేసిక్ సమ్ అష్యూర్డ్ కోసం పరిమితి లేదు. షరతులకు లోబడి పాలసీ వ్యవధిలో రుణ సదుపాయం లభిస్తుంది. హై బేసిక్ సమ్ అష్యూర్డ్, ఆన్లైన్ సేల్ కింద పూర్తయిన ప్రతిపాదనకు రిబేటు. మెచ్యూరిటీ మొత్తాన్ని పొందేందుకు 5, 10 లేదా 15 ఏండ్ల వాయిదాల్లో సెటిల్మెంట్ ఆప్షన్లు. మెచ్యూరిటీ తేదీ, మెచ్యూరిటీ సమ్ అష్యూర్డ్లపై పాలసీ వ్యవధిలో గ్యారంటీడ్ అడిషన్స్ ఉంటాయి. పూర్తి సమాచారం కోసం ఎల్ఐసీ అధికారిక వెబ్ సైట్ను సందర్శించాల్సి ఉంటుంది. -
Ridhi Khosla Jalan: మన జీవితానికి మనమే డిజైనర్లం..
సొంతంగా ఇంటి అలంకరణ లో ఎదుర్కొన్న ఇబ్బందులు పిల్లల కోసం కొత్తగా ఏదైనా సృష్టించాలనే ఆలోచన రిధి ఖోస్లా జలాన్ని ఈ రోజు ఉన్నతంగా నిలబెట్టింది. హోమ్ డెకార్లో డిజైన్ ఇన్ఫ్లుయెన్సర్గా పేరొందిన రిధి పిల్లల కోసం లిటిల్ నెస్ట్ పేరుతో ఏర్పాటు చేసిన డిజైన్ స్టోర్తో మార్కెట్లో ఆమెను వ్యాపారవేత్తగా మార్చింది. ముంబై నుంచి ఇటీవల హైదరాబాద్లోని ఫిక్కీ వైఎఫ్ఎల్ఓ ఏర్పాటు చేసిన సెషన్లో పాల్గొన్న ఈ యంగ్ ఎంట్రప్రెన్యూర్ తన జీవితాన్ని ఎలా డిజైన్ చేసుకుందో వివరించింది. ‘మనలో ఉన్న అభిరుచి ఏంటో తెలుసుకుని, దానిని అమలులో పెడితే విజయం మన వెన్నంటే ఉంటుంది’ అంటుందామె. స్ఫూర్తివంతమైన ఆమె మాటలు... సాధారణ గృహిణిగా ఉన్న రిధి తన జీవితాన్ని ఈ రోజు ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఎలాంటి మలుపులు తిప్పిందో వివరించింది. ఇంటీరియర్ డిజైనర్ నుండి కిడ్స్ ఫర్నీచర్ స్టోర్ యజమాని వరకు రిధి పేరొందింది. ‘‘ఫైనాన్స్, మార్కెటింగ్లో బ్యాచిలర్ డిగ్రీ చేశాక పెళ్లవడంతో ముంబై వెళ్లిపోయాను. మొదటి బిడ్డ పుట్టాక నాలో తన కోసం ప్రత్యేకమైన డిజైనింగ్ రూమ్ ఉంటే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. అంతేకాదు పిల్లల బట్టలు, వారికి కావల్సిన వస్తువుల విషయంలోనూ ఆలోచన పెరిగింది. అప్పుడే ఇంటీరియర్ డిజైన్కు సంబంధించిన కోర్సు చేయాలనుకున్నా. రెండవసారి ప్రెగ్నెంట్ అయిన టైమ్లోనే ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సులో చేరాను. అలా ఆ అభిరుచే వృత్తిగా మారింది. నా లైఫ్లో ఇదొక స్పెషల్ జర్నీ అని చెప్పవచ్చు. పిల్లల గదులను డిజైన్ చేయడం అనే నా హాబీ నన్ను చాలామందికి చేరువ చేసింది. మొదట ఈ రంగంలో పెరుగుతున్న డిమాండ్ను గుర్తించాను. ఫర్నీచర్, డెకార్ వస్తువుల కోసం ఎక్కడ షాపింగ్ చేయాలనే దానిపై స్నేహితులు తరచూ సలహాలు అడుగుతుండేవారు. వ్యక్తిగతంగానూ, నా స్నేహితులు పడుతున్న కష్టాన్ని గమనించినప్పుడు నా డిజైనింగ్లో ఎలాంటి మార్పులు ఉంటే బాగుంటుందో స్వయంగా తెలుసుకున్నాను. స్నేహితులకు సూచనలు ఇచ్చే క్రమంలో నాకూ చాలా విషయాల పట్ల అవగాహన పెరిగింది. కిడ్స్ డెకార్ బ్రాండ్ను ప్రారంభించడానికి ముందు మార్కెట్ పోకడలను గమనించాను. అప్పుడు ‘లిటిల్ నెస్ట్’ పేరుతో స్టోర్ ప్రారంభించాను. ఈ క్రియేటివ్ డిజైన్ నన్ను చాలా మందికి చేరువ చేసింది. ముందు కుటుంబమే నాకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని, చేస్తున్న వర్క్ప్రోగ్రెస్ను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంటాను. ఒక ప్రశ్న– సమాధానంతో సోషల్ మీడియా వీడియోను ప్రారంభించాను. ఏడాది లోపు ఐదు లక్షలకు పైగా ఫాలోవర్లకు చేరువయ్యాను. ప్రజలు కోరుకునే సమాచారాన్ని అందించడంపై పెట్టే దృష్టి నన్ను ఇంతమందికి చేరువ చేసింది. అయితే, ఇల్లే నా మొదటి ప్రాధాన్యత. ఇంటిని మేనేజ్ చేయగలగితే చాలు, బయట అన్ని పనులను సులువుగా చక్కబెట్టవచ్చు. ఇందుకు నా పిల్లల సాయం కూడా ఉంటుంది. నా బిజీ వర్క్, ప్లానింగ్ చూస్తూ పెరుగుతున్న నా పిల్లలు కూడా వారి పనులు వారు చేసుకుంటారు. నా వర్క్ వల్ల సోషల్గా అందరితోనూ అంతగా కలిసే సమయం ఉండదు. మొదట్లో అన్నీ బ్యాలెన్స్ చేయగలిగాను. కానీ, డెకార్ వర్క్, కంటెంట్ క్రియేటివ్కు ఎక్కువ టైమ్ పడుతుంది. ఇదొక డైనమిక్ జర్నీ అవడంతో నా ముందున్న మార్పులను కూడా ఉత్సాహంగా చేసుకుంటూ వెళుతున్నాను. గ్లోబల్ డిజైన్ మ్యాప్లో మన దేశం నుంచి నేను ఉండాలన్నది నా కల. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎంతోమందికి చేరవయ్యాను. ఆఫ్లైన్లో వ్యక్తిగతంగా చాలా మందికి రీచ్ కావాలని కోరుకుంటున్నాను. రెండు వారాలకు ఒకసారి.. ఎంత పని ఉన్నా రెండు వారాలకు ఒకరోజు పూర్తి విశ్రాంతి తీసుకుంటాను. నా కోసం నేను అన్నట్టుగా ఉంటాను. ఆ రోజులో ఎక్కువ సమయం బుక్స్ చదవడానికి సమయాన్ని కేటాయిస్తాను. రోజువారీ పనితో ఏ మాత్రం సంబంధం లేని పనులను చేస్తాను. దీంతో మరింత ఉత్సాహంగా మారిపోతాను’’ అని తన విజయానికి వేసుకున్న బాటలను ఇలా మన ముందు ఉంచారు రిధి. అప్డేట్గా ఉంటాను.. ఇంటీరియర్ డిజైన్ స్టూడియో మెయింటెయిన్ చేయాలంటే ఎప్పుడూ అప్డేట్గా ఉండాలి. ప్రతిరోజూ నాలుగు పేజీల షెడ్యూల్ని వేసుకుంటాను. ఇల్లు, వర్క్స్పేస్, అప్డేట్స్, నా వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేవి ప్రోత్సాహాన్ని కలిగించే కోట్స్ నోట్ చేసుకుంటాను. దీని వల్ల ప్రతిదీ ఏ రోజు కా రోజు ప్లానింగ్గా జరిగిపోతుంటుంది. భవిష్యత్తు గురించి అంటే మరో ఐదేళ్లలో నా ప్రాజెక్ట్స్ గ్లోబల్ లెవల్కి వెళ్లాలి. ప్రపంచంలోని అత్యుత్తమ డిజైన్ ఇన్ ఫ్లుయెన్సర్లలో ఒకరిగా ఉండాలన్నదే నా లక్ష్యం. – నిర్మలారెడ్డి -
పిల్లల్లో ఆ భయం పోగొట్టేలా..
డాక్టర్: నీ టెడ్డీబేర్కు ఏమైంది? చిన్నారి: కాలు నొప్పి డాక్టర్: ఎక్కడ? చిన్నారి: ఇక్కడ డాక్టర్: ఏం కాదు... తగ్గిపోతుంది... ఇలాంటి క్లినిక్లు ఇప్పుడు మంగళూరులోని స్కూళ్లలో నిర్వహిస్తున్నారు డాక్టర్లు. యు.కె.జి. నుంచి 2వ తరగతిలోపు పిల్లల్లో హాస్పిటల్ భయం పోవడానికి వారి ఆరోగ్య సమస్యలు బయటకు చెప్పడానికి ఈ క్లినిక్లు ఉపయోగపడుతున్నాయి. పేషెంట్లుగా సొంత టెడ్డీబేర్లను తెమ్మనడంతో పిల్లలు వాటిని తీసుకుని ధైర్యంగా వస్తున్నారు. దేశంలోని అన్ని పల్లెల్లో ‘బొమ్మల ఆస్పత్రి’ పేరుతో ఇలాంటి క్లినిక్లు నిర్వహించాల్సిన అవసరం ఉంది. మూడేళ్ల లోపు చంటిపిల్లలను హాస్పిటల్లో చూపించడం తల్లులకు కష్టం కాదు. కాని ఐదారేళ్లు వచ్చాక పిల్లలకు హాస్పిటల్ అంటే భయం వస్తుంది. డాక్టర్ని చూడటం, వ్యాక్సిన్ కోసం సూది వేయించుకోవడం, జ్వరాలకు సిరప్లు తాగాల్సి రావడం వారికి హాస్పిటల్ అంటే భయం వేసేలా చేస్తుంది. 5 ఏళ్ల నుంచి 8 ఏళ్ల లోపు పిల్లలు ఈ భయంతో ఏదైనా ఇబ్బంది ఉన్నా తల్లిదండ్రులకు చెప్పకపోవచ్చు– హాస్పిటల్కు వెళ్లాల్సి వస్తుందని. అంతేకాదు హాస్పిటల్కు తీసుకెళితే డాక్టర్కి చూపించి బయటకు వచ్చేంత వరకూ ఏడుస్తూనే మారాం చేస్తూనే ఉంటారు కొందరు పిల్లలు. దీని వల్ల తల్లిదండ్రులకే కాదు... క్లినిక్కు వచ్చిన ఇతర పిల్లలు, పెద్దలు కూడా ఇబ్బంది పడతారు. అందుకే వీరికి క్లినిక్లంటే భయం పోగొట్టాలి. దానికి ఏం చేయాలి? టెడ్డీ బేర్ క్లినిక్స్ యూకేలో ఇటీవల కాలంలో ‘టెడ్డీ బేర్’ క్లినిక్స్ నిర్వహిస్తున్నారు. 5 నుంచి 8 ఏళ్ల లోపు పిల్లలు తమ సొంత టెడ్డీ బేర్లను పేషెంట్లకు మల్లే తెచ్చి డాక్టర్లకు చూపించడం కాన్సెప్ట్. ఇందుకోసం నిజమైన డాక్టర్లు నిర్దేశిత స్కూల్కు టీమ్గా వస్తారు.. లేదా ఏదైనా చిల్డ్రన్స్ హాస్పిటల్లో దీనిని నిర్వహిస్తారు. క్లినిక్స్ అంటే భయం పోగొట్టడమే ముఖ్యోద్దేశం. క్లినిక్స్లో ఎంత చక్కగా టెడ్డీ బేర్లకు వైద్యం జరుగుతుందో చూశాక తమకు కూడా అంతే ఈజీగా వైద్యం చేస్తారు అనే భావన పిల్లల్లో కలుగుతుంది. మంగుళూరులో ట్రెండ్ గత సంవత్సరం జూలై నుంచి మంగుళూరులోని చాలా స్కూళ్లల్లో విడతల వారీగా టెడ్డీబేర్ క్లినిక్స్ నడుస్తున్నాయి. ఇందుకు స్కూళ్ల యాజమాన్యాలు సహకరిస్తున్నాయి. ప్రయివేట్ ఆస్పత్రులు తమ ప్రచారం కోసమే కావచ్చు... లేదా పిల్లల పట్ల బాధ్యతతోనే కావచ్చు... చాలా ప్రొఫెషనల్గా ఈ క్లినిక్స్ను నిర్వహిస్తున్నారు. క్లినిక్ స్కూల్లో నడిపే రోజున పిల్లలు తమ సొంత టెడ్డీ బేర్ను కాని లేదా మరేదైనా ఆటబొమ్మను (మనిషి, పెట్) తీసుకురావాలి. తమ పేషెంట్ పేరును అచ్చు హాస్పిటల్లో ఎలా రిజిస్టర్ చేయిస్తారో అలా చేయించాలి. ఆ తర్వాత ఓ.పీ.కి వెళ్లాలి. ఓ.పీ.లో డాక్టర్లు టెడ్డీబేర్కు ఏం ఇబ్బంది ఉందో అడుగుతారు. వైద్యం చేయాలంటే పొడవు, ఎత్తు చూడాలని చెప్పి చూస్తారు, పిల్లలు సాధారణంగా తమకున్న ఇబ్బందులే టెడ్డీబేర్కు ఉన్నట్టుగా చెబుతారు. టెడ్డీబేర్ను చూస్తున్నట్టుగా పిల్లల్ని కూడా వారి మూడ్ను బట్టి డాక్టర్లు చూస్తారు. పిల్లల హెల్త్ అసెస్మెంట్ను స్కూల్ సాయంతో పేరెంట్స్కు పంపుతారు. కంటి, పంటి పరీక్ష చిన్న పిల్లల్లో కంటి, పంటి పరీక్షలు ముఖ్యమైనవి. టెడ్డీబేర్ క్లినిక్స్ పేరుతో పిల్లలను ఉత్సాహపరిచి వారికి కంటి, పంటి పరీక్షలు కూడా డాక్టర్లు నిర్వహిస్తున్నారు. సాధారణ చెకప్ల ద్వారా వారిలో తగిన పోషక విలువలు ఉన్నాయా, వారు బలహీనంగా ఉన్నారా అనేవి కూడా చూస్తారు. ఏమైనా డాక్టర్ల పరిశీలన ఆ వయసు పిల్లలకు ప్రతి మూడు నెలలకు అవసరం. మంగుళూరు స్కూళ్లలో ఇదే జరుగుతూ ఉంది. మిగతా రాష్ట్రాల్లో కూడా పల్లెల్లో చిన్నారులకు ఈ ‘బొమ్మల ఆస్పత్రు’లు నడపడం చాలా బాగుంటుంది. పల్లె పిల్లలు డాక్టర్లకు చూపించుకునే వీలుండదు చాలాసార్లు. తల్లిదండ్రులు తీసుకెళ్లరు. ఆస్పత్రులంటే భయపడేవారు కూడా ఎక్కువ మందే ఉంటారు. అందుకోసమే బొమ్మల ఆస్పత్రుల ఐడియాను ప్రభుత్వాలు అందిపుచ్చుకుంటే చిన్నపిల్లల ఆరోగ్యస్థాయి, వారి సాధారణ అనారోగ్య సమస్యలు అంచనాకొస్తాయి. -
చికెన్ నూడుల్స్ ఇలా చేస్తే..పిల్లలేంటి...పెద్దోళ్లు కూడా!
చికెన్ సూప్ మీద మనసుపోతే రెస్టారెంట్కి వెళ్లాల్సిందేనా? ఫైవ్స్టార్ హోటల్ రేంజ్లో చికెన్ టిక్కా ఇంట్లో చేయలేమా? పిల్లలు సరదా పడే నూడుల్స్కి చికెన్ని జోడించలేమా? పిల్లలు ఎంతో ఇష్టంగా ఆరగించే వీటన్నింటినీ ఎలా చేసిపెడితే..పిల్లలేంటి, పెద్దవాళ్లు కూడా చికు బుకు చికు బుకు... చికెనే! అంటూ లాంగించేస్తారు.. మరి ఇంకెందుకు ఆలస్యం..పోషకాల కూరగాయల ముక్కలతోపాటు చికెన్ నూడల్స్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి! చికెన్ నూడుల్స్ కావలసినవి: చికెన్ – 200 గ్రాములు (బోన్లెస్); నూడుల్స్ – 150 గ్రాములు; నూనె – 2 టీ స్పూన్లు; ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచిని బట్టి; మారినేట్ చేయడానికి .... మిరియాల పొడి– అర టీ స్పూన్; ఉప్పు – పావు టీ స్పూన్; సోయా సాస్ – టీ స్పూన్; గరం మసాలా పౌడర్ – టీ స్పూన్; పోపు కోసం .... వెల్లుల్లి – 2 రేకలు (సన్నగా తరిగినవి); ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు; క్యాప్సికమ్ ముక్కలు – పావు కప్పు; క్యారట్ ముక్కలు – పావు కప్పు; క్యాబేజ్ తరుగు – పావు కప్పు; ఉల్లికాడల ముక్కలు – ΄ావు కప్పు; చిల్లీసాస్– టేబుల్ స్పూన్; సోయాసాస్ – టేబుల్ స్పూన్; ఉప్పు – రుచికి తగినంత. తయారీ: ∙చికెన్ను సన్నని పొడవు ముక్కలుగా కట్ చేసి శుభ్రం చేసి ఒక పాత్రలో వేసి అందులో మిరియాల ΄÷డి, ఉప్పు, సోయాసాస్, గరం మసాలా పొడి కలిపి మూత పెట్టి పక్కన ఉంచాలి. ∙ఒక పెద్ద పాత్రలో రెండు లీటర్ల నీటిని మరిగించి అందులో నూడుల్స్ వేసి ఉడికించాలి. నూడుల్స్ ఉడుకుతున్నప్పుడే ఆ నీటిలో టీ స్పూన్ నూనె కలపాలి. నూనె కలిపితే నూడుల్స్ తీగలు ఒకదానితో మరొకటి అతుక్కోకుండా విడివడుతుంటాయి. నూడుల్స్ ఉడికిన తరవాత నీటిని వడ΄ోసి నూడుల్స్లో మరో టీ స్పూన్ నూనె వేసి కలిపి పక్కన ఉంచాలి. క్యాప్సికమ్, క్యారట్, క్యాబేజ్, ఉల్లిపాయ ముక్కలను ఉడికించి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి బాణలి పెట్టి టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. అందులో వెల్లుల్లి తరుగు, మారినేట్ చేసి సిద్ధంగా ఉంచిన చికెన్ ముక్కలు వేసి మీడియం మంట మీద వేయించాలి. చికెన్ ఉడికేలోపు నూనె తగ్గిపోయినట్లయితే అరకప్పు నీటిని పక్కన వేడి చేసి చికెన్లో కలపాలి. చికెన్ ఉడికిన తరవాత ఆ పాత్రను పక్కన ఉంచాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో బాణలి పెట్టి మిగిలిన నూనె వేడి చేసి ఉల్లికాడల ముక్కలు వేసి వేయించాలి. అవి వేగిన తరవాత ఉడికించి పక్కన పెట్టిన కూరగాయల ముక్కలన్నీ వేసి నిమిషం పాటు వేయించి నూడుల్స్, చికెన్ ముక్కలు, చిల్లీసాస్, సోయాసాస్, ఉప్పు వేసి కలిపి వేడెక్కిన తర్వాత స్టవ్ ఆపేయాలి. అంతే వేడి వేడి చికెన్ నూడుల్స్రడీ..! -
బర్త్ ఆర్డర్ కూడా వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది!
‘మా పెద్దోడు చాలా బాధ్యతగా ఉంటాడు. కానీ చిన్నోడికే అస్సలు బాధ్యత లేదు. ఏం చెప్పినా పట్టించుకోడు. వాడిని ఎలా మార్చాలో అర్థం కావట్లేదు. మీరేమైనా హెల్ప్ చేస్తారని వచ్చాను’ అన్నారు సుబ్బారావు. ‘మా పెద్దపాప ఇంట్లో అన్ని పనులూ అందుకుంటుంది. కానీ చిన్నపాప మాత్రం ఎప్పుడూ డాన్స్, స్పోర్ట్స్ అంటూంటుంది. దాన్ని ఎలా దారిలో పెట్టాలో అర్థం కావడంలేదు’ చెప్పారు కోమలి. ఇంటికి పెద్ద బిడ్డ యజమాని లాంటి వాడు, బాధ్యతగా ఉంటాడు. రెండో బిడ్డ ప్రశాంతంగా ఉంటాడు. చివరివాడు బాధ్యతలేకుండా అల్లరిచిల్లరగా తిరుగుతుంటాడు.. ఇలాంటి మాటలు మీరు వినే ఉంటారు. ఇది నిజమేనని నమ్మేవాళ్లూ ఉంటారు.. ఇదంతా ట్రాష్ అని కొట్టేసేవాళ్లూ ఉంటారు. దీనిపై సైకాలజిస్టులు కూడా అధ్యయనం చేశారు. ప్రముఖ ఆస్ట్రియన్ సైకాలజిస్ట్ ఆల్ఫ్రెడ్ అడ్లర్ 20వ శతాబ్దం ప్రారంభంలో బర్త్ ఆర్డర్ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. కుటుంబంలో జన్మించిన క్రమం బిడ్డ ప్రవర్తన, భావోద్వేగాలు, ఇతర వ్యక్తులతో సంబంధాలపై శాశ్వత ప్రభావాన్ని చూపుతుందని ఈ సిద్ధాంతం సూచిస్తుంది. మొదటి బిడ్డలు ఎక్కువ శ్రద్ధ (బాధ్యత), మధ్యస్థ శిశువులు తక్కువ శ్రద్ధ (ఎక్కువ స్వాతంత్య్రం)ను పొందుతారనే ఆలోచనలో కొంత నిజం ఉండవచ్చు. చివరి బిడ్డలకు ఎక్కువ స్వేచ్ఛ (తక్కువ క్రమశిక్షణ) లభిస్తాయి. అయితే బర్త్ ఆర్డర్ ఒక ఫ్యాక్టర్ మాత్రమే. తల్లిదండ్రులు, తోబుట్టువులతో సంబంధాలు, జన్యువులు, పర్యావరణం, సామాజిక.. ఆర్థిక స్థితి వంటి అంశాలు కూడా పిల్లల వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తాయి. పేరెంటింగ్ స్టైల్ అనేది పిల్లల వ్యక్తిత్వాన్ని అమితంగా ప్రభావితం చేస్తుందనేది అనేక పరిశోధనల సారాంశం. అడ్లర్ సిద్ధాంతం ప్రకారం ఏ పిల్లలు ఎలా ఉంటారో తెలుసుకుందాం. మొదటి బిడ్డ అడ్లర్ బర్త్ ఆర్డర్ సిద్ధాంతం ప్రకారం, తొలి సంతానం.. వారి తల్లిదండ్రుల నుంచి ఎక్కువ శ్రద్ధ, సమయాన్ని పొందుతారు. కొత్త తల్లిదండ్రులు అప్పుడే పిల్లల పెంపకం గురించి నేర్చుకుంటున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా, కొన్నిసార్లు కఠినంగా, కొన్నిసార్లు న్యూరోటిక్గా కూడా ఉండవచ్చు. మొదటి సంతానం టైప్ A వ్యక్తిత్వాలతో బాధ్యతాయుతమైన నాయకులుగా ఉంటారు. కుటుంబంలోకి రెండో బిడ్డ వచ్చినప్పుడు తనకు కేటాయించే సమయం తగ్గడంవల్ల రెండో బిడ్డను చూసి అసూయపడతారు. ఆ తర్వాత తన తోబుట్టువుల పోషణ బాధ్యత తీసుకోవాల్సి రావడం వల్ల ఆదర్శంగా నిలిచేందుకు ప్రయత్నిస్తారు. మొదట జన్మించిన పిల్లలు అధునాతన అభిజ్ఞాభివృద్ధిని కలిగి ఉంటారని పరిశోధన కనుగొంది, ఇది చదువులో మంచి ఫలితాలను సాధించేందుకు ఉపయోగపడుతుంది. మిడిల్ చైల్డ్ తనకన్నా పెద్ద బిడ్డకు, చిన్న బిడ్డకు మధ్య విభేదాలకు మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరం ఉన్నందున, మధ్య పిల్లలు కుటుంబంలో శాంతిని కలిగించేవారుగా ఉంటారని అడ్లర్ సూచించాడు. పేరెంట్స్ పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల వారి దృష్టిని ఆకర్షించేందుకు, ఆదరణ పొందేందుకు వారిని ఆహ్లాదపరచేలా ప్రవర్తిస్తారు. తోబుట్టువులతో నిరంతరం పోటీలో ఉన్నట్లు అనిపించవచ్చు. వీరిలో అభద్రతా భావం, తిరస్కరణ భయం, బలహీనమైన ఆత్మవిశ్వాసం ఉండవచ్చు. తిరస్కరణ పట్ల సున్నితంగా ఉంటారు. తోబుట్టువులకు భిన్నంగా నిలబడాలనుకున్నప్పుడు తిరుగుబాటు లక్షణాలను కలిగి ఉంటారు. మధ్య పిల్లలు తమ తల్లులతో సన్నిహితంగా ఉండే అవకాశం తక్కువగా ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఆఖరి బిడ్డ చివరి బిడ్డ పుట్టే కాలానికి తల్లిదండ్రులకు పిల్లల పెంపకంలో అనుభవం ఉండటం వల్ల కొన్నిసార్లు తక్కువ కఠినంగా ఉంటారు. చివరి బిడ్డ అని గారాబంగా పెంచడంవల్ల, మిగతావారితో పోల్చినప్పుడు చెడిపోయినట్లు కనిపిస్తారు. చిన్నపిల్లలుగా దొరికే స్వేచ్ఛవల్ల కలివిడిగా, స్నేహంగా, చార్మింగ్గా ఉంటారు. అయితే ఈ పిల్లలు తక్కువ స్వీయ–నియంత్రణ నైపుణ్యాలను కలిగి ఉండవచ్చు. ఇతరులపై ఎక్కువ ఆధారపడవచ్చు. మేనిప్యులేటివ్గా, అపరిపక్వంగా, సెల్ఫ్ సెంటర్డ్గా కనిపిస్తారు. ఏకైక సంతానం కుటుంబంలో ఏకైక సంతానంగా ఉన్నవారు తల్లిదండ్రుల దృష్టిని, వనరులను తోబుట్టువులతో పంచుకోవాల్సిన అవసరం లేదు. పెద్దలతో ఎక్కువగా సంభాషిస్తారు కాబట్టి, వయసుకు మించి పరిణతి చెందినట్లు కనిపిస్తారు. క్రియేటివ్ ఆలోచనలతో ఏకాంత సమయాన్ని ఆస్వాదిస్తారు. తన ప్రవర్తనపై నియంత్రణ కలిగి ఉంటారు. తల్లిదండ్రుల అధిక అంచనాల కారణంగా అన్నీ ఫర్ఫెక్ట్గా ఉండాలనే ధోరణి కలిగి ఉంటారు. జీవితంలో ఉన్నతమైనదాన్ని సాధించాలనే కోరిక ఉంటుంది. సాధిస్తారు. స్వావలంబన, ఊహాత్మక ధోరణి ఉంటుంది. సెన్సిటివ్గా ఉంటారు. సైకాలజిస్ట్ విశేష్, psy.vishesh@gmail.com -
ఏడు టీకాలతో 7-స్టార్ రక్షణ : పిల్లల టీకాలపై జీఎస్కే ప్రచారం
ప్రముఖ ఫార్మా సంస్థ గ్లాక్సో స్మిత్క్లైన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (GSK) పిల్లలకు క్లిష్టమైన రక్షణను అందించే టీకాల గురించి అవగాహన కల్పిస్తోంది. ఒకటి నుండి రెండేళ్ల మధ్య వయస్సున్న పిల్లలకు అందించాల్సిన టీకాలపై జనవరి 25 నుంచి ప్రచారాన్ని ప్రారంభించింది. 1-2 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఏడు కీలకమైన టీకాల ద్వారా '7-స్టార్ ప్రొటెక్షన్' అందించాలంటూ తల్లిదండ్రులను కోరుతోంది. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (IAP) పిల్లలకు ఏడు టీకాలును సిఫార్సు చేస్తోంది, చికెన్పాక్స్ హెపటైటిస్ ‘ఏ’ తొలి డోస్ , ఎంఎంఆర్ (MMR) మెనింజైటిస్ రెండో డోస్, పీసీవీ DTP Hib IPV బూస్టర్ డోస్, ఫ్లూ వార్షిక మోతాదు ప్రధానంగా ఉన్నాయి. పలు రకాల ఇన్ఫెక్షన్లనుంచి కాపాడి, రోగ నిరోధక వ్యవప్తను బలోపేతం చేసే టీకాలు వేయవలసిన అవసరంపై తల్లిదండ్రుల్లో అవగాహన కల్పిస్తోంది. బిడ్డ పుట్టిన తొలి ఏడాదిలో టీకాలపై ఎక్కువ ఆసక్తి ఉన్నప్పటికీ, రెండో సంవత్సరంలో టీకాలు వేయించుకోని వారి సంఖ్య పెరుగుతోందని జీఎస్కే తెలిపింది. దీంతో పాక్షికంగా టీకాలు తీసుకుంటున్న పిల్లల సంఖ్య దేశంలో బాగా పెరుగుతోందని పేర్కొంది. అంటే తొలి ఏడాది శ్రద్దగా వాక్సీన్లు వేయించిన తల్లిదండ్రులు, రెండో ఏడాదికి వచ్చేసరికి మునుపటి శ్రద్ధ చూపించడలేదు. అలా కాకుండా క్రమంగా తప్పకుండా పిల్లలకు టీకాలు వేయిస్తే వారి ఆరోగ్య భవిష్యత్తుకు బంగారు బాట వేసినట్టు అవుతుందనే సందేశంతో జీఎస్కే ఈ ప్రచారాన్ని చేపట్టింది. పాక్షికవ్యాక్సినేషన్ వల్ల పిల్లల్ని తీవ్రమైన సమస్యలకు గురి చేస్తుందని జీఎస్కే చెబుతోంది. అందుకే రెండో సంవత్సరంలో కూడా క్రమం తప్పకుండా టీకాలు వేయించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది. ఇది పిల్లల్ని చాలా రోగాల నుంచి పిల్లలను కాపాడుతుందంటోంది. అలాగే రెండో ఏడాదిలో టీకాలను తీసుకోని పిల్లలు స్వయంగా ప్రమాదంలో పడటంతోపాటు, ఇంట్లో వారి మిగిలిన తోబుట్టువులను, అమ్మమ్మ తాత,నానమ్మ తదితర వృద్ధులకు ఇన్ఫెక్షన్ వ్యాపించి వారిని మరింత ప్రమాదంలో పడేసే అవకాశం ఉందని కంపెనీ పత్రికా ప్రకటన తెలిపింది. టీకాలతో నివారించగలిగే చికెన్పాక్స్, మీజిల్స్ , ఫ్లూ వంటి వ్యాధులు గత మూడేళ్లలో దేశంలో బాగా వ్యాపించాయని జీఎస్కే ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ , మెడికల్ అఫైర్స్, డాక్టర్ రష్మీ హెగ్డే తెలిపారు. పిల్లల అభివృద్ధిపై టీకాల దీర్ఘకాలిక ప్రభావాన్ని నొక్కి వక్కాణించిన ఆయన సంబంధిత టీకాలను పూర్తి చేయడం ద్వారా ఆరోగ్య కరమైన సంతోషకరమైన బాల్యం అందించినట్టు అవుతుందన్నారు. రెండేళ్ల వయసున్న పిల్లల ఎదుగుదలకు భరోసా ఇచ్చే టీకాల గురించి తెలిదండ్రులకు అవగాహన కల్పించడమే తమ ప్రచార లక్ష్యమని హెగ్డే వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న పిల్లల వైద్యుల క్లినిక్లలో టెలివిజన్, సోషల్ మీడియా, పోస్టర్లు వంటి బహుళ ఛానెల్లలో ప్రచారాన్ని ప్రారంభించింది. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకా వివరాలపై మరింత సమాచారం కోసం శిశు వైద్యులను సంప్రదించాలి. 7 కీలకమైన VPDల గురించి అదనపు సమాచారాన్ని MyVaccinationHub.inలో కూడా పొందవచ్చు. -
కాలిఫోర్నియాలో కలిపిరాత మస్ట్... ఎందుకంటే?
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఇప్పుడు కర్సివ్ రైటింగ్.. అదేనండి గొలుసుకట్టు రాత, కలిపిరాత అని చెబుతూంటారే అదన్నమాట తప్పనసరి! అసలు చేతిరాతనే పూర్తిగా మర్చిపోతున్న ఈ కాలంలో కలిపిరాత గోలేమిటని అనుకుంటున్నారా? ఈ రకమైన రాతతో పిల్లలకు ఎన్నో ప్రయోజనాలున్నాయట. అందుకే 2010లో పూర్తిగా పక్కన బెట్టిన కలిపి రాతను ఈ ఏడాది నుంచి తప్పనిసరి చేసింది కాలిఫోర్నియా. పరిశోధనలు, నిపుణుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఇప్పుడు కాలిఫోర్నియా మాత్రమే కాదు...అమెరికాలోని దాదాపు 24కు పైగా రాష్ట్రాలలో దీన్ని తిరిగి అమలు చేసే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఇంతకీ కర్సివ్ రైటింగ్ లేదా కలిపిరాతతో పిల్లలకు వచ్చే ప్రయోజనాలేమిటి? కర్సివ్ రైటింగ్ని ‘కర్సివ్ - జాయిన్ ఇటాలిక్స్’ అని కూడా పిలుస్తారు. దీనిపై అనేక న్యూరోసైన్స్ పరిశోధనలు జరిగాయి. ఫలితంగా కలిపి రాత అనేది మెదడుకు చాలా మంచిది అని తేలింది. కాలిఫోర్నియాకు చెందిన న్యూరో సైంటిస్ట్ క్లాడియా అగ్యుర్రే ప్రకారం టైప్రైటింగ్తో పోల్చితే, అక్షరాలను కర్సివ్లో రాయడం వల్ల నేర్చుకోవడంలో, భాషాభివృద్ధిలోనూ ఉపయోపడటంతోపాటూ, నిర్దిష్ట నాడీ మార్గాలను యాక్టివేట్ చేస్తుంది. పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో ఆక్యుపేషనల్ థెరపీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కెల్సే వోల్ట్జ్-పోరెంబా, చిన్నపిల్లలు కర్సివ్ను నేర్చుకోవడం, అనుకరించడం చాలా సులభం అని చెప్పారు. తద్వారా పిల్లల్లో స్వయంప్రతిపత్తి పెరుగుతుంది. అధునాతన, మెరుగైన విజువల్ స్కిల్స్ను అలవర్చుకోవడంతోపాటు తొందరగా నేర్చుకుంటారని కూడా ఆమె చెప్పారు. మాన్యువల్ చేతివ్రాత ప్రయోజనాలు స్పష్టంగా ఉన్నప్పటికీ, పిల్లల అభివృద్ధికి ప్రింట్ కంటే కర్సివ్ ప్రత్యేకంగా మంచిదా? కాదా? అనే దానిపై భిన్నమైన అభిప్రాయాలున్నాయి. ఆధునిక ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించుకోవడం అనేది తప్ప కర్సివ్ వల్ల ఎదుగుతున్న పిల్లల్లో ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. ఇండియానా యూనివర్శిటీలో సైకలాజికల్ అండ్ బ్రెయిన్ సైన్సెస్ ప్రొఫెసర్ కరిన్ జేమ్స్ (ప్రింట్ ఓవర్ కర్సివ్) పరిశోధన చేశారు. నాలుగు నుండి ఆరు సంవత్సరాల పిల్లలతో కలిసి చేపట్టిన ఈ రీసెర్చ్లో చేతితో రాయడం ద్వారా అక్షరాలు నేర్చుకుంటున్నప్పుడు మెదడులోని నెట్వర్క్ల యాక్టివ్ కావడం గమనించారు. అయితే కీబోర్డ్పై టైప్ చేసినపుడు మాత్రం ఇలా జరగలేదు. యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్లోని ఎడ్యుకేషనల్ సైకాలజీలో ప్రొఫెసర్ వర్జీనియా బెర్నింగర్ చేసిన ఇతర పరిశోధనలు కూడా చేతితో రాయడం వలన జ్ఞాపకశక్తి, ఓపిక, ఏకాగ్రతలు పెరుగుతాయి. యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్లోని ఎడ్యుకేషనల్ సైకాలజీలో ప్రొఫెసర్ వర్జీనియా బెర్నింగర్ చేసిన ఇతర పరిశోధనలు కూడా ఇదే అంశాన్ని వెల్లడించాయి. అమెరికా పిల్లలు వెనుకబడి ఉండబోతున్నారా? పెన్మాన్షిప్ అండ్ రీడింగ్ అచీవ్మెంట్ ఒక కచ్చితమైన కారణం కానప్పటికీ కొంతమంది విద్యావేత్తలు కర్సివ్ను వదిలివేయడం వల్ల విద్యా ఫలితాలలో అమెరికా వెనుకబడిందని భయపడుతున్నారు. ఇటాలియన్ పరిశోధకుల ఒక చిన్న అధ్యయనం ప్రకారం, ప్రాథమిక పాఠశాల మొదటి సంవత్సరంలో విద్యార్థులకు కర్సివ్ బోధన వారి పఠనా నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. పశ్చిమ ఐరోపాలో కర్సివ్ రైటింగ్ ఇప్పటికీ విస్తృతంగా నేర్పిస్తున్నారు. యూకే ప్రభుత్వ ఆఫ్స్టెడ్ పరిశోధన సమీక్ష ప్రకారం పిల్లలు కర్సివ్ రైటింగ్ కంటే ముందు విడిఅక్షరాలను నేర్చుకోవాలి. ఆ తరువాత డయోగ్నల్, హారజెంటల్ స్ట్రోక్లను నేర్చుకోవాలి అనేది జాతయ జాతీయ పాఠ్యప్రణాళికలో ఉండాలి. స్పెయిన్, ఇటలీ, పోర్చుగల్ ఫ్రాన్స్ ఇదే సంప్రదాయాన్ని పాటిస్తున్నాయి. కెనడా కూడా కర్సివ్ను తొలగించడానికి ప్రయత్నించింది. గత ఏడాది అంటారియో విద్యా మంత్రిత్వ శాఖ కర్సివ్ చేతివ్రాత సూచన అవసరాన్ని పునరుద్ధరించడం గమనార్హం. అయితే ఎలాంటి పాఠాలను గురించి ఆసక్తిగా ఉంటారు? ఆ సూచనలను ఎలా అందించాలి? ఎంతకాలం పాఠాలు ఉండాలి? ఎంత తరచుగా అభ్యాసం చేయాలి? అనే దానిపై ఇక్కడి టీచర్లు ఇంకా కుతూహలంగానే ఉన్నారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (OECD) ప్రోగ్రాం ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్ (PISA) 2022 గ్లోబల్ ర్యాంకింగ్స్తో పోల్చి చూస్తే, అమెరికా 9వ స్థానంలో ఉంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్ (STEM) లో సింగపూర్తో పోలిస్తే అమెరికన్ విద్యార్థులు ఇంకా వెనుకబడి ఉన్నారు. -
డబ్బు కోసం తన ముగ్గురు పిల్లలను కిడ్నాప్ చేసిన తండ్రి
జడ్చర్ల: తాగుడు, జల్సాలకు అలవాటు పడిన ఓ తండ్రి తన ముగ్గురు బిడ్డలను అమ్మకానికి హైదరాబాద్కు తీసుకెళ్లగా.. పోలీసులు తల్లి చెంతకు చేర్చిన ఘటన జడ్చర్లలో చోటు చేసుకుంది. సీఐ రమేశ్బాబు కథనం ప్రకారం.. స్థానిక నిమ్మబావిగడ్డకు చెందిన హబీబున్నీసాకు భూత్పూర్ మండలం తాడిపత్రికి చెందిన రఫీక్తో వివాహం జరిగింది. వీరికి ఆరేళ్ల రుమానాబేగం, మూడేళ్ల రమీజ్, ఏడాది షోయబ్ పిల్లలున్నారు. ఈ కుటుంబం కొంతకాలంగా గౌరీశంకర్కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. రఫీక్ తాగుడు, జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం ఆదివారం తన ముగ్గురు పిల్లలను దుస్తులు కొనిస్తానంటూ నమ్మబలికి బైక్పై హైదరాబాద్కు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి భార్యకు ఫోన్చేసి పిల్లలను కిడ్నాప్ చేశానని, తనకు డబ్బులు కావాలని డిమాండ్ చేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. రఫీక్ ఫోన్ ట్రాక్చేసి హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించగా.. చంచల్గూడ సమీ పంలో అదుపులోకి తీసుకున్నారు. తండ్రి ఇచ్చి న ఆధారాలతో యాకుత్పురాలో ఓ కారులో పిల్లలను పోలీసులు, బంధువులు గుర్తించారు. కారులో ఉన్న వారిని ప్రశ్నించగా రఫీక్ తమకు రూ.9 లక్షలు ఇవ్వాల్సి ఉందని.. డబ్బులు తీసుకొస్తానంటూ పిల్లలను అప్పగించి వెళ్లాడని చెప్పి పరారయ్యారు. కాగా.. తన పిల్లలను రూ.9 లక్షలకు విక్రయించే ప్రయత్నం చేశాడని భార్య ఆరోపించింది. గోవాలో ఉంటున్న తన భర్త రఫీక్ అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వేధిస్తుంటాడని వాపోయింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. -
Hyderabad : కిడ్స్ & పెట్స్ ఎగ్జిబిషన్ (ఫొటోలు)
-
మీ బద్ధకం అమ్మకు భారమే
చలికాలం ముసుగు తన్ని పడుకుంటే ఎంత బాగుణ్ణు. బెడ్ దగ్గరకు పొగలు గక్కే టీ వస్తే ఎంత బాగుణ్ణు. టిఫిన్లూ, సూప్లు, సాయంత్రం ఉడకబెట్టిన పల్లీలు... ఎంత బాగుణ్ణు. అన్నట్టు రగ్గులు, బొంతలు భలే శుభ్రంగా, పొడిగా ఉండాలండోయ్. చలికాలం ఎవరికీ పని చేయబుద్ధేయని కాలం. కాని అమ్మకు తప్పుతుందా? అమ్మ వెచ్చని రగ్గు కప్పుకుని టీవీ చూస్తూ ‘టీ తెండి’ అని అరిస్తే ఒకరోజైనా ఇస్తారా ఎవరైనా? చలికాలంలో ఇంటి సభ్యులు ఏం చేయాలి? స్కూల్ టైమ్ మారదు. ఉదయం 8 లోపు బస్సొచ్చి ఆగుతుంది. పిల్లలకు బాక్స్ కట్టివ్వడమూ తప్పదు. ఏడున్నరకంతా కట్టాల్సిందే. టిఫిన్ తినిపించాల్సిందే. ఎంత చలి ఉన్నా, ఎంత మంచు కమ్ముకున్నా, ఎంత బద్ధకంగా ఉన్నా, ఎంత ముసుగుతన్ని నిద్రపోవాలని ఉన్నా అమ్మకు తప్పుతుందా? అమ్మ లేవకుండా ఉంటుందా? వంట గదిలో వెళ్లకుండా ఉంటుందా? నాన్న అరగంట లేటుగా లేవొచ్చు. వాకింగ్ ఎగ్గొట్టి అమ్మ ఇచ్చిన టీని చప్పరిస్తూ పేపర్ను చదువుతూ ఉండొచ్చు. కాని అమ్మ మాత్రం అదే వంట చేయాల్సిందే. రోజువారీ అంట్లు, బట్టల ఉతుకుడు చూడాల్సిందే. ఆమెకు ఇంట్లో నుంచి ఎలాంటి సాయం అందుతున్నదో ఆలోచించామా ఎప్పుడైనా? బద్ధ్దకమైన కాలం ఇది చలికాలం బద్ధకం కాలం. తలుపులు కిటికీలు మూసుకుని అరచేతులు రుద్దుకుంటూ కూచోమని చెప్పే కాలం. బబ్బుంటే బాగుండు అనిపించే కాలం. అమ్మకు ‘ఈ పూట ఎవరైనా వంట చేసి పెడితే బాగుండు’ అనిపించినా అలా చేసేవారు ఎవరు? ‘రోజూ వండుతున్నావ్ కదా ఇవాళ బజారు నుంచి వేడి ఇడ్లీ తెస్తానులే’ అని బండి తాళం అందుకునే నాన్నలు ఎందరు? పాలల్లో కొన్ని చాకోస్ వేసివ్వు చాలు అనే పిల్లలు, బ్రెడ్ ఆమ్లేట్ చేసుకుని తింటాలే అనే భర్తలు ఉన్న ఇల్లు ఇల్లాలి శ్రమను గుర్తించే ఇల్లు. ‘కాసేపు పడుకోలే’ అని లేచి పేపర్లు లోపల పడేసి, పాలు ఫ్రిజ్లో పెట్టి, ఒక ప్యాకెట్ గిన్నెలో వేడి చేసి, కాఫీ కలిపి భార్యను లేపితే ఎంత బాగుంటుంది. మగవాళ్లు బట్టలు ఎలాగూ ఉతకరు. ‘చెమ్మగా ఉన్నాయి’ అని విసుక్కునే బదులు కనీసం ఎండ తగిలే తీగ దాకానో, డాబా మీదనో తీసుకెళ్లి ఆరేసే సాయం చేయరు. ఇలాంటి సమయంలో ‘బట్టలు ఆరేయడం’ అనే చిన్న పని కూడా చాలా పెద్ద సాయం కిందకు వస్తుంది.ఈ రోజుల్లో ప్రత్యామ్నాయ టిఫిన్లు, ఇన్స్టంట్ టిఫిన్లు ఎన్నో మార్కెట్లో ఉన్నాయి. యూట్యూబ్లో కొడితే వందలాది వీడియోలు ఉన్నాయి. తెచ్చిపెట్టే స్విగ్గి, జొమాటోలు ఉన్నాయి. ఈ శీతాకాలంలో ఉదయపు వంట చెర నుంచి అమ్మకు ఏ విధంగా ఉపశమనం ఇవ్వొచ్చో తప్పక ఆలోచించాలి. ఇంట్లో పెద్దవారు ఉంటే? అమ్మమ్మో, నానమ్మో ఇంట్లో ఉంటే వారి గురించి ఇల్లంతా మరింత శ్రద్ధ పెట్టాలి. మంచి షాల్, రగ్గు వారికి ఏర్పాటు చేయాలి. నేలకు పాదాలు తాకి జిల్లు మనకుండా ఇంట్లో తిరగడానికి మంచి స్లిప్పర్లు ఇవ్వాలి. స్లిప్పర్లలోనే తిరగమని చెప్పాలి. చలికి ఆకలి ఎక్కువ. పెద్దవారు పసిపిల్లల్లా మారి నోటికి హితంగా వేడివేడిగా అడుగుతారు. వారికి ఏదో ఒకటి చేసి పెట్టాలి. ఆ పనిలో కూడా అమ్మకు భర్త, పిల్లలు ఏదో ఒక మేరకు సాయం చేయాలి. వారికి వెచ్చని గది కేటాయించాలి. లేదా ఇంట్లోని వెచ్చని ప్రదేశమైనా. శుభ్రత అందరిదీ శీతాకాలం ఇల్లు మబ్బుగా ఉంటుంది. ఇటు పుల్ల అటు పెట్టబుద్ధి కాదు. కాని ప్రయత్నం చేసి ఇల్లు ప్రతి రోజూ సర్దుకునే పడుకోవాలి. హాల్లో బెడ్రూముల్లో కిచెన్లో కుటుంబ సభ్యులంతా నిద్రకు ముందు వీలైనంత శుభ్రంగా, సర్ది పడుకుంటే ఉదయాన్నే అమ్మ లేచినప్పుడు చిందర వందర లేకుండా పనిలో పడబుద్ధి అవుతుంది. పక్క బట్టలు మడవడం కూడా కొంతమంది చేయరు. అలాంటి వారిని తప్పక గాడిలో పెట్టాలి. చలికాలం అమ్మకి పని తేలిక చేద్దాం. చలికాలాన్ని ఎంజాయ్ చేసేలా చూద్దాం. అమ్మకు కావాలి వెచ్చని దుస్తులు సాధారణంగా ఇళ్లల్లో నాన్నకు హాఫ్ స్వెటర్లు ఉంటాయి. ఎప్పుడూ వేసుకునే ఉంటాడు. అమ్మకు మాత్రం ఎందుకనో స్వెటర్ ఉండదు. కొని తేవాలని ఎవరికీ అనిపించదు. చాలా ఇళ్లల్లో అమ్మలు పాతబడిన స్వెటర్లతోనే తిరుగుతూ ఉంటారు ఈ సీజన్లలో. ఒక రంగురంగుల కొత్త స్వెటర్ కొనుక్కోవాలని వారికి ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నా, గృహిణి అయినా తాను కొనుక్కునే చొరవకు ఎప్పుడూ అమ్మ దూరంగానే ఉంటుంది. స్వెటర్ లేకుండానే చలికాలం గడిపేస్తుంది. ఆమెకు స్వెటర్, సాక్సులు, స్కార్ఫ్లు కావాలి. ఉన్నాయా గమనించండి. ఆమె అడగదు. తెచ్చి పెట్టండి. శీతాకాలంలో స్త్రీలు తమ శరీరం గురించి ఆలోచన చేస్తారు. చర్మాన్ని, శిరోజాల్ని కాపాడుకోవడానికి వారికి కొన్ని వస్తువులు అవసరం. క్రీములు, నూనెలు, సబ్బులు... ఏర్పాటు చేయాలి. చర్మ సమస్యలు కొందరిలో రావచ్చు. వాటిని చిట్కాలతో సరిపుచ్చుతూ బాధ పడాల్సిన పని లేదు. వైద్యుల దగ్గరకు వెళ్లాలి. తీసుకువెళ్లాలి. ఇక ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉంటే చలికాలం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రోజువారీ చాకిరీ నుంచి దాదాపుగా తప్పించాలి. -
ఏఐతో పనిచేసే పక్షులు వచ్చేస్తున్నాయ్!
రంగు రంగుల సీతాకోక చిలుకలు ఎగురుతున్న దృశ్యం పిల్లలకే కాదు, పెద్దలకూ సంబరంగానే ఉంటుంది. అలాగని సీతాకోక చిలుకలు ఎప్పుడంటే అప్పుడు కనిపించవు. కాంక్రీట్ కీకారణ్యాల్లాంటి నగరాల్లోనైతే, సీతాకోక చిలుకలు కనిపించడం మరీ అరుదు. మరి పిల్లలకు సీతాకోక చిలుకల సరదా తీరేదెలా? అందుకే, అమెరికన్ టాయ్ కంపెనీ ‘జింగ్’ ఎప్పుడంటే అప్పుడు ఎగరవేయగలిగే సీతాకోక చిలుకలను ‘గో గో బర్డ్’ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. రంగు రంగులతో అచ్చం అసలు సిసలు సీతాకోక చిలుకల్లా కనిపించే ఈ బొమ్మ సీతాకోక చిలుకలను రిమోట్ కంట్రోల్ సాయంతో కోరుకున్నప్పుడల్లా ఇంచక్కా ఎగరేయవచ్చు. డ్రోన్ మాదిరిగా ఎగిరే ఈ సీతాకోక చిలుకలను రాత్రిపూట చీకటిపడిన తర్వాత కూడా ఎగురవేయవచ్చు. వీటిలోని ఎల్ఈడీ లైట్లు రంగు రంగుల్లో వెలుగుతూ చీకట్లో మిరుమిట్లు గొలుపుతాయి. ఇవి రీచార్జబుల్ బ్యాటరీల సాయంతో పనిచేస్తాయి. ఈ ‘గో గో బర్డ్’ సీతాకోక చిలుక ధర 12.99 డాలర్లు (రూ. 1,083) మాత్రమే! -
విస్తరిస్తున్న మిస్టీరియస్ న్యుమోనియా: ఏంటీ వైట్ లంగ్ సిండ్రోమ్?
ప్రపంచవ్యాప్తంగా అంతుచిక్కని బ్యాక్టీరియల్ న్యుమోనియా వ్యాప్తి ప్రపంచ దేశాలను భయపెడుతోంది. ఇటీవల చైనాలో ఆందోళన రేపిన చిన్నపిల్లలో న్యుమోనియా కేసులు తరహాలోనే ముఖ్యంగా అమెరికా మసాచుసెట్స్ ఒహియోలోని కొన్ని ప్రాంతాల్లో పెరుగుతునట్టు నివేదికల ద్వారా తెలుస్తోంది. వైట్ లంగ్ సిండ్రోమ్గా పిలుస్తున్న శ్వాసకోశ వ్యాధి ప్రధానంగా పిల్లల్లో ఎక్కువగా వ్యాపిస్తోంది. మూడునుంచి ఎనిదేళ్ల వయస్సున్న పిల్లల్లోఈ న్యుమోనియా వ్యాపిస్తోంది. దీనికి కచ్చితమైన కారణాలు ఇంకా వెలుగులోకి రానప్పటికీ ఈ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు సాధారణ బాక్టీరియా మైకోప్లాస్మానే కారణం కావచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. వైట్ లంగ్ సిండ్రోమ్ అంటే ఏమిటి? వైట్ లంగ్ సిండ్రోమ్ అనేది ప్రభావితమైన పిల్లలలో ఛాతీ ఎక్స్-కిరణాలపై విలక్షణమైన తెల్లటిపొరలా ఏర్పడుంది. అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్, పల్మనరీ అల్వియోలార్ మైక్రోలిథియాసిస్, సిలికా సంబంధిత పరిస్థితులులాంటి పలు శ్వాసకోశ వ్యాధులు ఉన్నాయి.శ్వాస ఆడకపోవడం, దగ్గు, ఛాతీ నొప్పి, జ్వరం , అలసట లాంటివి ప్రధాన లక్షణాలు. అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ARDS) అనేది ఊపిరితిత్తుల్లో నీరు చేరినపుడు సంభవించే తీవ్ర పరిస్థితి. దీంతో శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. న్యుమోనియా, సెప్సిస్ , ట్రామా వంటి అనేక కారణాల వల్ల ARDS సంభవించవచ్చు. ఊపిరితిత్తుల అల్వియోలార్ మైక్రోలిథియాసిస్ (PAM) అనేది ఊపిరితిత్తులలోని గాలి సంచులలో కాల్షియం పేరుకుపోవడం సంభవించే అరుదైన ఊపిరితిత్తుల వ్యాధి. దీనివల్ల ఊపిరి ఆడకపోవడం, దగ్గు, ఛాతీ నొప్పి వస్తుంది. సిలికోసిస్ అనేది సిలికా ధూళిని పీల్చడం వల్ల వచ్చే ఊపిరితిత్తుల వ్యాధి. సిలికా దుమ్ము ఇసుక, రాయి, ఇతర ఇతర పదార్థాలలో కనిపిస్తుంది. సిలికోసిస్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు మరియు ఛాతీ నొప్పికి కారణమవుతుంది. మూల కారణం వైట్ లంగ్ సిండ్రోమ్ మూలకారణాలు ఏంటి అనేది ఇంకా పరిశోధనలోఉంది. అయితే ఇది బాక్టీరియా, వైరల్ , పర్యావరణ కారకాల కలయిక వల్ల వస్తోందనేది అంచనా. ఇన్ఫ్లుఎంజా లేదా COVID-19 వంటి వైరస్లు ఊపిరితిత్తుల గాలి సంచులను దెబ్బతీయడం ద్వారా తెల్ల ఊపిరితిత్తుల సిండ్రోమ్ను కలిగిస్తాయి. మైకోప్లాస్మా న్యుమోనియా వంటి బాక్టీరియా, ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ కలిగించడం ద్వారా వైట్ లంగ్ సిండ్రోమ్కు కారణం కావచ్చు. సిలికా ధూళి, ఇతర కాలుష్య కారకాలను పీల్చడం వంటి పర్యావరణ కారకాలు, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ద్వారా వైట్ లంగ్ సిండ్రోమ్ వ్యాధి వస్తోంది. దీంతో మరో కోవిడ్-19 మహమ్మారి విస్తరిస్తోందా అనే ఆందోళన నెలకొంది. దీనికి చికిత్స వ్యాధి తీవ్రత, రోగి పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. యాంటీబయాటిక్స్, యాంటీవైరల్, ఆక్సిజన్ థెరపీ, మెకానికల్ వెంటిలేషన్, కార్టికో స్టెరాయిడ్స్ ద్వారా చికిత్సగా భావిస్తున్నారు. చైనాలో శ్వాసకోశ వ్యాధుల వ్యాప్తి ఆందోళన నేపథ్యంలో చైనా పొరుగు దేశాలైన తైవాన్, నేపాల్ , అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా వైట్ లంగ్ సిండ్రోమ్' వ్యాప్తి అమెరికాకు ముందు నెదర్లాండ్స్ , డెన్మార్క్ కూడా న్యుమోనియా కేసులు పెరుగుతున్నాయి. వీటిలో చాలా వరకు మైకోప్లాస్మా కారణంగా భావిస్తున్నారు.ప్రతి లక్షమంది పిల్లలలో 80 మంది న్యుమోనియా సోకింది. నాలుగు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో కేసులు కూడా పెరుగుతున్నాయి. న్యుమోనియా కేసులు 'అంటువ్యాధి' స్థాయికి చేరుకున్నాయని డానిష్ ఆరోగ్య ముఖ్యులు కూడా ప్రకటించారు. గత ఐదు వారాల్లో ఈ సంఖ్య మూడు రెట్లు పెరిగిందని డెన్మార్క్ స్టాటెన్స్ సీరమ్ ఇన్స్టిట్యూట్ (SSI) వెల్లడించింది. -
చేతబడి చేయించిందనే కోపంతో భార్య తలపై సిలిండర్తో బాది..
పెంట్లవెల్లి: భార్య తలపై సిలిండర్తో బాది భర్త హతమార్చిన ఘటన మండలంలోని జటప్రోల్లో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ సురేష్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన యాదగిరికి కల్వకోల్కు చెందిన సువర్ణ (32)తో 10 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉండగా హైదరాబాద్లో ఉంటూ జీవనం సాగించేవారు. భార్యాభర్తలు పలుమార్లు గొడవ పడగా పెద్దలు జోక్యం చేసుకొని సర్దిచెప్పారు. 5 నెలల కిందట సువర్ణ భర్తతో గొడవపడి పిల్లలతో కలిసి జటప్రోల్కు వచ్చి ఇక్కడే కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను పాఠశాలలకు పంపిస్తూ ఉండేది. శుక్రవారం తెల్లవారుజామున ఇంటికొచ్చిన యాదగిరి తన తమ్ముడికి పెళ్లి కాకుండా, కుటుంబం సంతోషంగా ఉండకూడదని చేతబడి చేయించావంటూ భార్యతో గొడవపడి చితకబాదాడు. చివరకు సిలిండర్తో తలపై బలంగా బాదడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందింది. ఈ విషయాన్ని పెద్ద కుమార్తె పోలీసులు, చుట్టుపక్కల వారికి తెలియజేసింది. అనంతరం యాదగిరి ఇద్దరు పిల్లలతో పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. ఠాణాకు చేరుకున్న బంధువులు పిల్లలకు న్యాయం చేయాలని, నేరస్తుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఘటన స్థలాన్ని సీఐ యాలాద్రి, ఎస్ఐ సురేష్ పరిశీలించి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. -
పిల్లల చదువు కోసం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిది!
నేను సావరీన్ గోల్డ్ బాండ్లలో (ఎస్జీబీలు) ఇన్వెస్ట్ చేశాను. కాల వ్యవధి ముగిసిన తర్వాత వీటిని విక్రయించాలా..? లేక ఆ మొత్తం నా ఖాతాలో జమ అవుతుందా? – వేదవ్యాస్ విశ్వరూప్ ఎస్జీబీల కాల వ్యవధి ఎనిమిదేళ్లు. గడువు ముగియడానికి నెలరోజుల ముందు బాండ్ల మెచ్యూరిటీ తేదీ గురించి ఇన్వెస్టర్లకు సమాచారం వస్తుంది. గడువు ముగిసిన తర్వాత ఆ మొత్తం బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఇన్వెస్టర్ పెట్టుబడి పెట్టే రోజున ఇచ్చిన బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. గడువు ముగిసిన రోజు నాటి ముందు మూడు రోజుల బంగారం సగటు ధరను పరిగణనలోకి తీసుకుంటారు. ఇండియా బులియన్ అండ్ జ్యుయెలర్స్ అసోసియేషన్ ప్రకటించే 999 స్వచ్ఛత బంగారం ధరలను ఇందుకు ప్రామాణికంగా పరిగణిస్తారు. ఆ ప్రకారం ఇన్వెస్టర్కు చెల్లింపులు చేస్తారు. ఎస్జీబీ సర్టిఫికెట్లోనూ బ్యాంక్ ఖాతా వివరాలు నమోదై ఉంటాయి. ఒకవేళ సార్వభౌమ బంగారం బాండ్లను ట్రేడింగ్ ఖాతా ద్వారా సెకండరీ మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తే అవి డీమ్యాట్ ఖాతాలో ఉంటాయి. కనుక మెచ్యూరిటీ ముగిసిన అనంతరం డీమ్యాట్ ఖాతాకు అనుసంధానమైన ఇన్వెస్టర్ బ్యాంక్ ఖాతాకు ఆ మొత్తం జమ అవుతుంది. స్టాక్ మార్కెట్లో ఎస్జీబీల ట్రేడింగ్ ధర హెచ్చు, తగ్గులుగా ఉండొచ్చు. అయినప్పటికీ గడువు తీరే నాటి ముందు మూడు పనిదినాల సగటు ధర ప్రకారమే చెల్లింపులు చేస్తారు. బంగారంలో పెట్టుబడులకు ఎంతో సౌకర్యవంతమైన మార్గం ఎస్జీబీలు అని తప్పక చెప్పాలి. పెట్టుబడిపై ఏటా 2.5 శాతం వడ్డీ ఇందులో లభిస్తుంది. ఎనిమిదేళ్ల పాటు పెట్టుబడిని కొనసాగిస్తే వచ్చే లాభంపై ఎలాంటి పన్ను లేదు. పిల్లల ఉన్నత విద్య కోసం ఏకమొత్తంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇందుకు అనుకూల సాధనాలు ఏవి? – శరవణన్ పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేయాలని చాలా మంది తల్లిదండ్రులు భావిస్తారు. ఇందుకోసం పలు మార్గాలు ఉన్నాయి. సాధారణంగా ఈ మొత్తాన్ని పిల్లల ఉన్నత విద్య కోసం ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే అందుకు, పదేళ్లకు పైగా కాల వ్యవధి ఉంటుంది. అటువంటప్పుడు ఈక్విటీలకు మించి మెరుగైన సాధనం లేదనే చెప్పాలి. అందులోనూ ఫ్లెక్సీక్యాప్ విభాగం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్లెక్సీక్యాప్ పథకాలు పెట్టుబడులను డైవర్సిఫై చేస్తాయి. అన్ని రంగాల పరిధిలో, భిన్న మార్కెట్ క్యాప్ కలిగిన (డైవర్సిఫైడ్) కంపెనీల్లో ఫండ్ మేనేజర్ పెట్టుబడులు పెడతారు. ఒకవేళ పన్ను ప్రయోజనం కోరుకుంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్)ను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి కూడా ఫ్లెక్సీక్యాప్ మాదిరే పనిచేస్తుంటాయి. అన్ని రంగాలకు చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా రిస్క్ తగ్గించే విధంగా ఈఎల్ఎస్ఎస్ పథకాల పనితీరు ఉంటుంది. ఈ పథకాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం పొందొచ్చు. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ ఐదేళ్ల కాలంలో సగటున 12 శాతానికి పైనే వార్షిక రాబడులు ఇచ్చాయి. ఈ రాబడి రేటు ప్రకారం ఎవరైనా రూ.లక్షను పదేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేస్తే.. రూ.3.14 లక్షలు సమకూరుతుంది. ఈక్విటీలు సహజంగానే అస్థిరలతో ఉంటాయి. కనుక ఫ్లెక్సీక్యాప్ పథకాల్లోనూ ఇదే కనిపిస్తుంది. అందుకనే ఈక్విటీల్లో ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం కాకుండా, తమ దగ్గరున్న పెట్టుబడులను కొన్ని విడతలుగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల కొనుగోలు ధర సగటుగా మారి, మార్కెట్లు గరిష్టాల వద్ద ఉన్నప్పుడు రిస్క్ను తగ్గిస్తుంది. కనుక మీరు పెట్టుబడి మొత్తాన్ని ఒకే సారి కాకుండా.. డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి.. అక్కడి నుంచి ప్రతి నెలా సిప్ రూపంలో మూడేళ్ల కాలంలో పెట్టుబడులు పెట్టుకోవడం అన్నది తగిన విధంగా ఉంటుంది. దీనివల్ల మార్కెట్ల ర్యాలీ, కరెక్షన్లలోనూ ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది. -
బాల ఫోటో గ్రాఫర్లకోసం అదిరిపోయే కెమెరా..ఫీచర్లు ఏంటంటే ?
-
పలుకే బంగారమాయెనా!!..కోవిడ్ తర్వాతే అధికం..
వయసు పలికే పదాలు మొదటి సంవత్సరం దాదాపు 10 పదాలు రెండో సంవత్సరం 50 నుంచి 60 పదాలు మూడో సంవత్సరం కనీసం 150 పదాలు.. ఆ పైన కెనడాకు చెందిన ఓ సంస్థ దీనిపై అధ్యయనం చేసింది. 6 నెలల నుంచి రెండేళ్లలోపున్న 900 మంది చిన్నారులను పరీక్షించింది. 20 శాతం మంది చిన్నారులు ప్రతిరోజూ సగటున 28 నిమిషాల సేపు స్మార్ట్ఫోన్లను చూస్తున్నట్లు తేలింది. 30 నిమిషాల డిజిటల్ స్క్రీనింగ్ వల్ల చిన్నారులకు ‘స్పీచ్ డిలే’ రిస్క్ 49 శాతం పెరుగుతుందని వెల్లడయ్యింది. ఏం చేయాలి? ముందుగా చిన్నారుల చెంతకు స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు దరిచేరకుండా చూసుకోవాలి.పిల్లలకు అసలు స్మార్ట్ఫోన్లు ఇవ్వవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం సూచించింది. పిల్లలతో వీలైనంత ఎక్కువ సమయం గడపాలి. వారి నవ్వులకు, అరుపులకు ప్రతిస్పందించాలి. చిన్నారులను ముఖానికి దగ్గరగా తీసుకొని మాటలో, పాటలో, కథలో చెబుతూ..మీకు కనెక్ట్ అయ్యేలా చూసుకోవాలి. స్నానం చేయించేటప్పుడు, పాలు తాగించేటప్పుడు, ఆహారం తినిపించేటప్పుడు.. చేసే పని గురించి వారికి వివరిస్తూ ఉండాలి. ఎలాంటి శబ్ధాలు చేస్తుంటాయి? తదితరాలన్నీ అడుగుతూ, అనుకరిస్తుండాలి. పిల్లలు ఏ వస్తువు చూస్తుంటే.. దాని గురించి వివరిస్తుండాలి. తద్వారా పిల్లలు కూడా మిమ్మల్ని అనుకరించేందుకు ప్రయత్నిస్తూ.. క్రమంగా మాట్లాడుతారు. విజయవాడకు చెందిన రాజేశ్, ఉష దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ పిల్లాడిని బుజ్జగించేందుకు..పుట్టిన ఏడాది గడిచేసరికల్లా స్మార్ట్ఫోన్లో వీడియోలు చూపించడం మొదలుపెట్టారు. ఏడుపు ఆపాలన్నా.. భోజనం చేయాలన్నా.. ఫోన్లోని వీడియోలు చూడాల్సిందే. ఇలా.. ఆ చిన్నారి క్రమంగా స్మార్ట్ఫోన్కు బానిస అవ్వగా.. ఆ తల్లిదండ్రులు నాలుగేళ్లయినా ‘అమ్మా, నాన్న’ అనే పిలుపులకు నోచుకోలేక పోయారు. చివరకు స్పీచ్ థెరపిస్ట్లను ఆశ్రయించి.. పిల్లలకు చికిత్స అందించాల్సి వచి్చంది. – గుండ్ర వెంకటేశ్, ఏపీ సెంట్రల్ డెస్క్ ఒకప్పుడు చిన్న పిల్లలు ఏడిస్తే.. వారిని లాలించేందుకు తల్లిదండ్రులు జోలపాటలు పాడేవాళ్లు. ఎత్తుకొని ఆరుబయట తిప్పుతూ చందమామను చూపించి కబుర్లు చెప్పేవాళ్లు. అమ్మ, నాన్న.. అనే పదాలను చిన్నారుల నోటి వెంట పలికించడానికి ప్రయత్నించేవాళ్లు. వారు ఆ పదాలను పలకగానే విని మురిసిపోయేవాళ్లు. కానీ ఇప్పుడు సిరులొలికించే ‘చిన్ని’ నవ్వులు.. చిన్నబోతున్నాయి. చీకటి ఎరుగని ‘బాబు’ కన్నులు.. క్రమంగా మసకబారిపోతున్నాయి. చిట్టిపొట్టి పలుకుల మాటలు మాయమైపోతున్నాయి. మొత్తంగా స్మార్ట్ఫోన్లలో చిక్కుకొని ‘బాల్యం’ విలవిల్లాడిపోతోంది. చిన్నారుల నోటి వెంట వచ్చే ‘అమ్మ, నాన్న..’ అనే పిలుపులతో కొందరు తల్లిదండ్రులు పులకించిపోతుంటే.. మరికొందరు తల్లిదండ్రులు ఆ ‘పలుకుల’ కోసం నెలలు, సంవత్సరాల పాటు ఎదురుచూడాల్సి వస్తోంది. పునాది పటిష్టంగా ఉంటేనే.. ప్రతి ఒక్కరి జీవితంలో ‘మాట్లాడటం’ అనేది చాలా ముఖ్యమైన విషయం. చిన్నారులు ఎదుగుతున్నకొద్దీ మెల్లగా మాటలు నేర్చుకుంటూ ఉంటారు. మనం ఎలా మాట్లాడిస్తే అలా అనుకరిస్తూ ముద్దుముద్దుగా ఆ పదాలను పలుకుతుంటారు. ముఖ్యంగా చిన్నారి పుట్టిన మొదటి రెండేళ్లు లాంగ్వేజ్ డెవలప్మెంట్కు చాలా కీలకం. అప్పుడు సరైన పునాది పడితేనే.. మూడో ఏడాదికల్లా మంచిగా మాట్లాడగలుగుతారు. ‘స్మార్ట్’గా చిక్కుకుపోయారు.. సాధారణంగా చిన్నారులు ఏదైనా త్వరగా నేర్చుకుంటారు. మొదటి రెండేళ్లలో ఇది ఎక్కువగా ఉంటుంది. వారు తమ చుట్టుపక్కల ఎవరైనా మాట్లాడుతూ ఉంటే.. వారి పెదాల కదలికను చూస్తూ అనుకరిస్తుంటారు. కానీ చుట్టుపక్కల అలాంటి వాతావరణం లేకపోతే వారిలో బుద్ధి వికాసం లోపిస్తుంది. కొందరు తల్లిదండ్రులు వారి పనుల ఒత్తిడి వల్ల తమకు తెలియకుండానే పిల్లలకు సెల్ఫోన్లను అలవాటు చేస్తున్నారు. పిల్లల ఏడుపును ఆపించడానికో, భోజనం తినిపించడానికో, నిద్రపుచ్చేందుకో ఫోన్లలో ఆ సమయానికి ఏది దొరికితే ఆ వీడియో చూపిస్తున్నారు. క్రమంగా అది అలవాటుగా మారి.. పిల్లలు బాహ్య ప్రపంచంతో సంబంధం కోల్పోతున్నారు. వాటిలోనే లీనమైపోయి.. తల్లిదండ్రుల పిలుపులకు సరిగ్గా స్పందించలేకపోతున్నారు. తమ భావాలను మాటల రూపంలో వ్యక్తం చేయలేకపోతున్నారు. మరికొందరైతే గతంలో తాము నేర్చుకున్న పదాలను కూడా మర్చిపోయారు. ఫోన్లలో చూపించే కార్టూన్లు, గేమ్స్ వల్ల పిల్లలకు ఎలాంటి ఉపయోగం ఉండదు. అందులోని శబ్ధాలు, మాటలను వింటారు. కానీ.. వాటికి, నిజజీవితానికి చాలా తేడా ఉండటంతో ఆ శబ్ధాలు, మాటలను అనుకరించలేకపోతున్నారు. అదే సమయంలో తల్లిదండ్రుల మాటలను కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. దీని వల్ల పిల్లల్లో ‘స్పీచ్ డిలే’ సమస్య వస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ తర్వాతే అధికం చిన్నారుల్లో ‘స్పీచ్ డిలే’ సమస్య కోవిడ్ తర్వాత అధికమైందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి కేసుల సంఖ్య 15 రెట్లు పెరిగిందని పేర్కొంటున్నారు. లాక్డౌన్లో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అలాంటి సమయంలో అనుబంధాలు పెరగాలి. కానీ, ఆ సమయంలో చుట్టుపక్కలవారికి, బంధువులకు దూరంగా ఉండటం వల్ల అందరూ స్మార్ట్ఫోన్లకు అంకితమైపోయారు. చిన్నారులను లాలించడానికి కూడా ఫోన్లను ఉపయోగించారు. దీనివల్ల 9 నెలల నుంచి మూడేళ్లలోపు వయసున్న కొందరు చిన్నారులు తమ కీలక సమయాన్ని కోల్పోయారు. వేరే పిల్లలతో కలవకపోవడం, తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల పిల్లల్లో ‘స్పీచ్ డిలే’ సమస్య అధికమైందని వైద్యులు చెబుతున్నారు. కోవిడ్కు ముందు వారానికి ఐదు కేసులు వస్తే.. కోవిడ్ తర్వాత 20 వరకు కేసులు వస్తున్నాయని పిల్లల వైద్యులు వెల్లడించారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ ముఖ్యం చిన్నారులు ఫోన్కు అడిక్ట్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. చిన్నారుల వద్ద ఫోన్ పెట్టేసి.. ఒంటరిగా వదిలేయవద్దు. అలాగే తల్లిదండ్రులు కూడా సెల్ఫోన్ను అనవసరంగా వినియోగించడం మానుకోవాలి. వీలైనంత ఎక్కువ సేపు పిల్లలతో గడుపుతూ.. వారి వైపే చూస్తూ కబుర్లు చెప్పాలి. పిల్లలను ఆలోచింపజేసేలా కుటుంబసభ్యులు, వస్తువులు, జంతువుల గురించి వర్ణిస్తూ మాట్లాడాలి. తద్వారా పిల్లలు సులభంగా మాటలు నేర్చుకునే అవకాశం ఉంది. – డాక్టర్ ఇండ్ల విశాల్రెడ్డి, మానసిక వైద్య నిపుణుడు, విజయవాడ -
ఘనాపాటీలు! అసామాన్యమైన కళతో మతాబుల్లా వెలిగిపోతున్న చిచ్చరపిడుగులు!
సాధారణంగా పిల్లలు.. రేపటి కలలను కంటూ పెరుగుతారు. కానీ కొందరు పిల్లలు మాత్రం తమలోని కళలను బయపెడుతూ నేడే ఆ కలలను నిజం చేసుకుంటున్నారు. లక్ష్యాలు, విజయాలతో మతాబుల్లా వెలిగిపోతున్న ఆ చిచ్చరపిడుగులను పరిచయం చేసుకుందాం.. వాళ్లు సాధించిన ఘనతలేంటో తెలుసుకుందాం.. లిసిప్రియ కంగుజంమణిపూర్, బషిఖోంగ్ గ్రామంలో.. 2011లో పుట్టిన లిసిప్రియ.. ప్రపంచంలోనే అతి పిన్న పర్యావరణవేత్తల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. తన ఐదేళ్ల వయసు నుంచే గ్లోబల్ వార్మింగ్, నిరక్షరాస్యత వంటి సమస్యలపై గొంతెత్తింది. 2019లో స్పెయిన్ లోని మాడ్రిడ్లో జరిగిన ఐక్యరాజ్య సమితి ‘వాతావరణ మార్పు సదస్సు’లో ప్రపంచ నాయకులతో మాట్లాడి మెప్పించింది. లిడియన్ నాదస్వరం తమిళ సంగీత దర్శకుడు వర్షన్ సతీష్ రెండో కుమారుడే ఈ లిడియన్ నాదస్వరం. సంగీతకారుడిగా, పియానిస్ట్గా, కీబోర్డ్ ప్లేయర్గా పేరు తెచ్చుకున్న లిడియన్.. తన రెండేళ్ల వయసు నుంచి డ్రమ్స్ వాయించడం మొదలుపెట్టాడు. 8 సంవత్సరాల వయస్సులో పియానో నేర్చుకున్నాడు. 2019లో తన 14వ ఏట.. అమెరికన్ టెలివిజన్ íసీబీఎస్ నిర్వహించిన టాలెంట్ షోలో రెండు పియానోలను ఒకేసారి అద్భుతంగా వాయించాడు. దానిలో విజేతగా నిలిచి.. 1 మిలియన్ ఫ్రైజ్ మనీ సాధించాడు. మొన్నటికి మొన్న కడప వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరుకు చెందిన 6 నెలల బాబు ప్రజ్వల్.. పలు జంతువులు, పండ్లు, వాహనాలు, నంబర్లు ఇలా చాలావాటిని గుర్తుపట్టి.. ఆశ్చర్యపరిచాడు. తన గ్రాహక శక్తితో ‘నోబుల్ వరల్డ్ రికార్డ్’ సాధించాడు. అలాగే హైదరాబాద్, మల్కాజిగిరికి చెందిన 8 నెలల పాప ఆద్యశ్రీ.. తన గ్రాహక శక్తితో నోబుల్æవరల్డ్ రికార్డ్లో తన పేరు నమోదు చేసుకుంది. సుమారు 300 ఫొటోలను, వస్తువులను గుర్తించగల ఆధ్య.. 30 దేశాల జాతీయ జెండాలను గుర్తించి ఈ రికార్డ్ సాధించింది. ఇలా ఎందరో పిల్లలు వయసుకు మించిన విజయాలతో దూసుకుపోతున్నారు. చరిత్ర సృష్టిస్తున్నారు. తనిష్క భూపతిరాజు ఆంధ్రప్రదేశ్, భీమవరానికి చెందిన తనిష్క.. తన ఆరేళ్ల వయసులోనే విల్లును ఎక్కుపెట్టి.. ఆసియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో పేరు సంపాదించింది. 16 నిమిషాల 50 సెకన్ల వ్యవధిలో 100 బాణాలను 40 సెంటీమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని తాకేలా ఆర్చరీలో అద్భుతమైన ప్రతిభను చాటుకుంది. హర్పిత పాండియన్ వీరు చెన్నైకి చెందిన కవలలు. చిన్న వయసులోనే వ్యాపారవేత్తలుగా ఎదిగి ప్రపంచం దృష్టిని తమవైపు తిప్పుకున్నారు. వీరు ‘స్పెల్లింగ్ బీ ట్విన్స్ ్’గా గుర్తింపు తెచ్చుకున్నారు. క్లాస్మైండ్స్ అనే ఉఛీఖ్ఛీఛిజి కంపెనీని స్థాపించి.. ఎందరో విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ను పెంచేందుకు విశేషంగా కృషి చేస్తున్నారు. ఇది ఆన్ లైన్ మౌఖిక స్పెల్లింగ్ బీ పోటీ. విద్యార్థులు తమ ఆత్మవిశ్వాసం, నాయకత్వ సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి, వారి స్పెల్లింగ్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి తర్ఫీదునిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భాషా నైపుణ్యాలను పెంపొందించుకోవడంలో ఈ ట్విన్స్.. తాము చేసిన విశేషకృషికి ఎన్నో అవార్డులు అందుకున్నారు. 10కి పైగా దేశాల నుంచి వేల మంది విద్యార్థులు ఇందులో రిజిస్టర్ అవుతుంటారు. విజేతలుగా నిలుస్తుంటారు. అద్వైత్ కోలార్కర్ పుణేకి చెందిన అద్వైత్.. 8 నెలల వయసులోనే పెయింటింగ్స్ వేయడం మొదలుపెట్టాడు. రెండేళ్లకే పుణేలోని ఆర్ట్2డే గ్యాలరీలో తన మొదటి సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించాడు. ఇటీవల తను వేసిన ఒక పెయింటింగ్ 16,800 డాలర్లకు అమ్ముడు పోయింది. ఇప్పటి వరకూ అతడు వేసిన పెయింటింగ్స్ అన్నీ కలిపి.. 3,00,000 డాలర్లకు మించి అమ్ముడుపోయాయి. ఇప్పటికే 19కి పైగా సోలో ప్రదర్శనలు ఇచ్చి.. ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నాడు. (చదవండి: చిన్నారులే నడుపుతున్న న్యూస్ చానెల్! వాళ్లే రిపోర్టింగ్, యాంకరింగ్..) -
చిన్నారులే నడుపుతున్న న్యూస్ చానెల్!
బాలల కోసం బాలలే నడిపిస్తున్న చానల్ ఇది. బ్రిటన్కు చెందిన ‘స్కై చానల్’లో భాగంగా ‘ఎఫ్వైఐ’– ఫ్రెష్ యూత్ ఇనీషియేటివ్ వారానికి ఒకరోజు ప్రతి శుక్రవారం బాలల కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. ఇందులో రిపోర్టింగ్, యాంకరింగ్ వంటి పనులన్నీ బాలలే చేస్తారు. వీరు ఆరితేరిన రిపోర్టర్లు, యాంకర్లకు దీటుగా ప్రముఖులను ఇంటర్వ్యూలు చేస్తుండటం విశేషం. ఈ బాల జర్నలిస్టులు బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ సహా ఎందరో ప్రముఖులను ఇంటర్వ్యూలు చేశారు. వారం రోజుల్లో జరిగిన ముఖ్య పరిణామాలపై ‘వీక్లీ న్యూస్ షో’, పిల్లలతో మాటామంతి కార్యక్రమం ‘కిడ్వర్జేషన్’, ‘బిగ్ ఏంబిషన్’, ‘మ్యాన్ వర్సెస్ చైల్డ్’ కార్యక్రమంలో బాలల వంటల విశేషాలు వంటి కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఉక్రెయిన్, గాజా ప్రాంతాల్లో యుద్ధాల వల్ల బాధితులైన బాలల గురించి కూడా ఈ బాల జర్నలిస్టులు ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేశారు. (చదవండి: హైటెక్ డాన్స్మ్యాట్! ఈజీగా నేర్చుకోవచ్చు!)
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
పటిష్ట బందోబస్తు
72 ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు
● రామగుండం కమిషనరేట్లో పర్యవేక్షణ కేంద్రం ● మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మరింత అప్రమత్తం ● నిరంతరం పర్యవేక్షణ చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులు
నేడే లోక్సభ పోలింగ్
రంగంపల్లిలో ఓటు వేయనున్న కలెక్టర్
ఉరుములు.. మెరుపులు
బైక్ నడిపి.. చాయ్ తాగి
ఓటరూ.. ఒక్క నిమిషం..!
పకడ్బందీగా సిద్ధం
నేడే లోక్సభ పోలింగ్
తప్పక చదవండి
- ఉద్దానానికి ఊపిరి
- పర్యాటకం కళకళ
- పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
- సీఎం వైఎస్ జగన్ చేయూత.. పారిశ్రామికవేత్తలుగా మహిళలు
- RRRకి కమ్మటి దెబ్బ.. పరువు తీసేసిన బీజేపీ!
- దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?
Advertisement